pss దేవుని ముద్ర 29th Nov 2024 part1 and part2 telugu text.

 దేవుని ముద్ర.


యోగీశ్వరుల వారి రచనల సారాంశము.

1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.

త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,

పరమాత్మ సమాచారము ఉన్నది.

2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.

త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.

3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.

త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.

4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత

గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు

ఈశ్వరుడైన యోగీశ్వరుడు.

5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.

త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక

భయపడిపోతాయి.

6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.

త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా

యోగీశ్వర్లు చెప్పారు.

7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.

త్రైత సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.

8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన

త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.

9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను

చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.

10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని

మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.

11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.

అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.

12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా

హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లుగానీ ఆ విషయము

తెలియదు.



'దేవుడు' అంటే తెలియబడనివాడు అని అర్థము. దేవునికి

నిర్వచనము చెప్పితే ‘దేవులాడబడేవాడు దేవుడు' అని చెప్పవచ్చును. ఇంకా

వివరముగా చెప్పుకొంటే వెతకబడేవాడు ఎవడో అన్నట్లుండును. దేవునికి

పేరు లేదు, ఫలానావాడని చెప్పుటకు ఆకారము లేదు. అందువలన

ఆయనను 'దేవుడు' అని అంటున్నాము. అటువంటి దేవుని పక్షములో

నేను ఉన్నాను అని ఇతరులకు చెప్పుటకు అతనికి వ్యక్తిత్వము లేదు, పేరు

లేదు, ఆకారము లేదు. అటువంటప్పుడు ఎలా చెప్పాలి? అనునది ప్రశ్నగా

మిగిలిపోవుచున్నది. ఎలా చెప్పాలో దారి చూపవలసిన వాడు దేవుడే.

నేను దేవుని పక్షములో యున్నానని ఎలా చెప్పాలో తెలియుటకు ప్రశ్నగా

మిగిలిపోయిన దానికి జవాబును తెలుపమని తెలియని దేవున్నే

కోరుకొనుటకు ఆయన ఎవరితోనూ మాట్లాడడు. ఏ పని చేయడు.

ఎవరితోనూ మాట్లాడనివాడు నాకుగానీ, నీకు గానీ సమాధానము చెప్పడనేగా

అర్థము.


దేవుడు మాట్లాడడు అనేదానికి సాక్ష్యముగా దేవునికి సంబంధించిన

అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా 42, ఆయత్ 51లో ఇలా కలదు

చూడండి. (42-51) “దేవుడు ఏ మానవునితోనూ ప్రత్యక్షముగా

మాట్లాడడు" అని ఉంది. ఇదే వాక్యములోనే "దేవుడు మూడు విధముల

తన జ్ఞానమును తెలియజేయును" అని ఉన్నది. దేవుడు నేరుగా ఎవరితోనూ

మాట్లాడకపోయినా వేరు విధానముల ద్వారా తన జ్ఞానమును తెలియజేయు

నని ఉన్నది కదా! ఇప్పుడు జ్ఞానము అంటే ఏమిటో తెలుసుకొందాము.

సగటు సమాధానముగా చెప్పితే “ప్రతి ప్రశ్నకు జవాబుగా ఉండునదే

జ్ఞానము”. నిర్వచనముగా చెప్పితే 'జ్ఞప్తి' అను శబ్దమునుండి ‘జ్ఞానము’

అను శబ్దము ఉత్పత్తి అయినది. జ్ఞప్తి అనగా 'ఎరుక' అని అర్థము.


ఎరుక అనగా తెలియబడు సత్యము అని అర్థము. చివరకు సత్యము

ఏదయితే ఉందో అదే జ్ఞానము అని చెప్పవచ్చును. ఇప్పుడు అసలు

విషయానికి వస్తాము. విషయానికి వచ్చి చూస్తే దేవుడు తెలియబడడు.

ఆయనకు రూపము, పేరు, పని లేదని చెప్పుకొన్నాము. తెలియబడని

దేవున్ని గురించిన సత్యము ఏదయితే ఉన్నదో దానిని తెలియడమును

దేవుని జ్ఞానమును తెలిసినట్లగును.


దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడడు, జ్ఞానమును చెప్పడుగానీ,

పరోక్షముగా తనను గురించిన సత్యమును తెలియజేయును. అయితే

మనిషికి దేవున్ని గురించి తెలియాలను శ్రద్ధ యున్నప్పుడు, దేవుడు

పరోక్షముగా తెలిపినది ఏదో అది సత్యముగా తెలియబడును. శ్రద్ధ లేకపోతే

దేవుడు తెలియజేసిన సత్యము అసత్యముగా అర్థమగును. దేవుడు

పరోక్షముగా తెలియజేసినది మూడు గ్రంథముల రూపములో అందరికీ

తెలిసేటట్లు యున్నది. మూడు దైవగ్రంథములని పేరుగాంచిన తౌరాతు,

ఇంజీలు, ఖుర్ఆన్ అను మూడు దైవ గ్రంథములలో దేవుడు ఇతరుల

ద్వారా పరోక్షముగా తెలియజేసిన సత్యము (జ్ఞానము) కలదు. వాక్యము

రూపములో వ్రాయబడిన జ్ఞానము శ్రద్ధలేని మనిషికి అర్థమయినట్లే

ఉండునుగానీ అది అసత్యముగా అర్థమయివుండును. వాక్యము

శ్రద్ధయుంటేనే సత్యముగా అర్థమగును. అనగా చెప్పబడిన వాక్యములోని

జ్ఞానము అర్థమగును. శ్రద్ధ లేకపోతే చెప్పినది జ్ఞానమే అయినా అది

అజ్ఞానముగా అర్థమగును.



ప్రశ్న :- మీరు చెప్పునది వినేదానికి బాగానే ఉందిగానీ, ఆచరణలో

అనుభవానికి దూరముగాయున్న విషయమును మీరు చెప్పుచున్నట్లు

అర్థమగుచున్నది. నా ప్రశ్న ఏమి అంటే ఒకడు బాగా చదువున్నవాడు


ఉన్నాడు. అతడు చదువులో మేథావి, జ్ఞాపకశక్తి ఎక్కువ గలవాడు. అతను

ఈ మధ్యలోనే కలెక్టర్ ఉద్యోగములో చేరాడు. కలెక్టర్ ఉద్యోగము రావాలంటే

అతను చదివిన చదువులో ఎంతో అవగాహన ఉంటేగానీ I.A.S పాస్

కాలేడు. అటువంటి మేథాశక్తి (మైండ్పవర్) యున్న వ్యక్తి భగవద్గీతను

చదివి అందులో గుణత్రయ విభాగయోగములో చదివిన శ్లోకములకు

వ్యతిరేఖముగా, పురుషోత్తమ ప్రాప్తియోగములో శ్లోకములోని భావమును

అర్థము చేసుకోవడము జరిగినది. అలాగే జ్ఞాన యోగములో చదివిన

శ్లోకములకు భావమును సత్యసమేతముగా తెలియలేకపోయాడు.

ప్రపంచములో ఎంతో తెలివైనవాడు దేవుని విషయములో అసత్య భావమును

అర్థము చేసుకొన్నాడు. అతని విషయము అట్లుండగా, అదే ఊరిలో

ఐదవ తరగతి చదివిన వ్యక్తి కూడా భగవద్గీతను నిదానముగా చదివాడు.

ఒక దినము ఇద్దరూ ఒకచోట కలిసినప్పుడు భగవద్గీత విషయమును

మాట్లాడారు. మేథావి అయిన వ్యక్తి “దేవుడు భగవంతునిగా వస్తే

దుర్మార్గులను లేకుండా సంహరిస్తాడు” అని చెప్పగా, ఐదవ తరగతి చదువు

కొన్న వ్యక్తి “దేవుడు ఎప్పుడూ ఎవరినీ సంహరింపడు. సంహరించకుండా

అతని భావమును మార్చివేసి మొదటి భావమున్న వ్యక్తిగా లేకుండా

చేయును. అప్పుడు అదే మనిషే మారిన భావముగల మనిషిగా క్రొత్తగా

తయారగును. అప్పుడు మొదటివాడు లేడనియే చెప్పాలి. చెడ్డవాడు

పోయి మంచివాడు వచ్చాడని చెప్పాలి. అదే విషయమును తెలియజేస్తూ

చెడ్డవారిని లేకుండా చేసి, మంచి వారిని తయారు చేస్తానని చెప్పాడు.

దానినే “వినాశాయచ దుష్కృతామ్” అన్నాడు. దాని అర్థము చెడు వారిని

చంపుతానని కాదు. చెడువారిని మంచివారిగా మార్చి చెడువారిని లేకుండా

చేస్తానన్నాడు” అని చెప్పాడు.


ఎంతో గొప్ప చదువు చదువుకొన్నవాడు తెలియాలను శ్రద్ధతో

భగవద్గీతను చదివినా అతనికి సరిగా శ్లోకములోని భావము తెలియలేదు.

చదువు కొద్దిగా చదివినవాడు శ్రద్ధపెట్టక ఎప్పుడో ఒకమారు చదివినా

అతనికే బాగా అర్థమయినది. ఇక్కడ ప్రతి రోజు చదివేవానికి అర్థము

కాకుండా పోవడము, ఎప్పుడో ఒకరోజు చదివేవానికి చదివినది బాగా

తెలియడము జరుగుట వలన, ఇక్కడ శ్రద్ధనుబట్టి జ్ఞానము తెలియునని

తెలియడము లేదు కదా! దీనికి మీరేమంటారు?


జవాబు :- శ్రద్ధ అనునది సూక్ష్మమైనది. అది పైకి కనిపించునది కాదు.

ఎక్కువ చదువున్న వానిలోగానీ, ప్రతి దినము చదివేవానిలో గానీ శ్రద్ధ

ఉందని అనుకోవడము పొరపాటు. అట్లే తక్కువ చదువున్న వానిలోగానీ,

ఎప్పుడో ఒకమారు చదువువానిలోగానీ శ్రద్ధలేదు అనుకోవడము కూడా

పొరపాటేయగును. పెద్ద చదువు చదివి కలెక్టర్గా యున్నవానికి ప్రతి

దినము చదివే అవకాశము ఉండవచ్చును. అలాగే తక్కువ చదువు

గలవానికి పనులు ఎక్కువయుండి చదివే అవకాశము తక్కువయుండ

వచ్చును. చాలామార్లు చదివేది, తక్కువమార్లు చదివేది అను దానికి శ్రద్ధకు

సంబంధము లేదు. శ్రద్ధ అనునది మనిషి తలలో గుణముల మధ్య

ఉండును. శ్రద్ధ అనగా ఇష్టము అని కూడా చెప్పవచ్చును. చదివే చదువు

ఇష్టమైనది కావచ్చును, ఇష్టము లేనిది కావచ్చును. తాను భగవద్గీత చదివాను

అని ఇతరులు తెలియుటకు చదివితే అది శ్రద్ధలేనిది అగును. అట్లుకాకుండా

నేను భగవద్గీతలోని సమాచారమును తెలియాలను ఇష్టముతో (శ్రద్ధతో)

చదివితే అది అర్థమగును. మనిషికి ఒక విషయము మీద శ్రద్ధ యున్నప్పుడు

ఆ విషయములో మనిషి తన బుద్ధిని వినియోగించి అక్కడగల

సమాచారమును తెలియగలడు. బుద్ధిని కేంద్రీకరించకుండా తన ధ్యాసను


ఎక్కడో పెట్టుకొని చదివినదిగానీ, విన్నదిగానీ, ఏదీ సరిగా అర్థము కాదు.

ఎప్పుడయితే మనిషిలో విషయమును తెలియాలను శ్రద్ధకల్గి చదివినప్పుడు

ప్రతి చిన్న విషయములోనూ బుద్ధి యొక్క సహకారముతో తెలిసి చదువుట

వలన ఆ విషయము సక్రమముగా అర్థమగును.


చదివే విషయము మీద శ్రద్ధ లేనప్పుడు అతను ఇతరులు

తెలియుటకు మాత్రమే చదువుచున్నాడుగానీ తాను తెలియుటకు కాదు.

అటువంటి వానికి చదివే విషయము మీద శ్రద్ధయుండదు. శ్రద్ధ లేనప్పుడు

బుద్ధి కూడా దానిని గురించి తెలియదు. అప్పుడు చదివినా ప్రయోజనము

లేదు. చదివిన విషయము మనిషికి అర్థము కాదు. అందువలన పరమాత్మ

విషయముగానీ, ప్రపంచ విషయముగానీ అర్థమగుటకు శ్రద్ధ అవసరము.

శ్రద్ధలేని వానికి ఏదీ తెలియదు. ప్రపంచ విషయములలో శ్రద్ధయుంటే

చదివే విషయము మాత్రము అర్థము కాగలదు. పరమాత్మ విషయములో

అయితే గ్రంథములోని జ్ఞానము అర్థమవడమే కాకుండా జ్ఞానములోని

శక్తి కూడా లభించును. శక్తి లభించుటకు కూడా ఒక కొలమానము

శాస్త్రబద్ధముగా కలదు. ఆ విషయమును “అంతిమ దైవగ్రంథము వజ్ర

వాక్యములు" అను గ్రంథములో వ్రాయడము జరిగినది. అక్కడ చదివితే

శ్రద్ధ ఎంతగా ఉపయోగపడుచున్నదో అర్థము కాగలదు.


ప్రశ్న :- మీరు “దేవుని చిహ్నము” అని ఒక గ్రంథమును వ్రాసి అందులో

నాలుగు చక్రముల వివరమును తెలియజేశారు. ఇప్పుడు “దేవుని ముద్ర”

అని ప్రత్యేకముగా చెప్పుచున్నారు. దేవుని చిహ్నము అనినా దేవుని ముద్ర

అనినా రెండూ ఒకటేనని మేము అనుకొంటున్నాము. మామాట వాస్తవమా,

కాదా?


జవాబు :- మీ మాట వాస్తవమే! 'దేవుని చిహ్నము' అని ఇంతకు ముందు

వ్రాసిన మాట వాస్తవమే. దేవుని చిహ్నము ఇంకా బాగా అర్థమగుటకు

వివరించి వ్రాయదలచి దానికి ప్రత్యేకించి 'దేవుని ముద్ర' అను పేరుతో

వ్రాయుచున్నాము. దేవుని చిహ్నమునకు, దేవుని ముద్రకు గల తేడా

ఏమిటో వివరించి చెప్పదలచుకొన్నాము. అందువలన 'దేవుని ముద్ర’

అను పేరుతో గ్రంథమును వ్రాయడము జరుగుచున్నది. ముఖ్యముగా

చెప్పితే దేవుని చిహ్నము, దేవుని ముద్ర రెండు పేర్లు వేరుగాయున్నా

అర్థములో రెండూ ఒక్కటే. దేవుని చిహ్నమును ముందు వ్రాసిన

గ్రంథములో వివరించాము. ఇప్పుడు అదే చిహ్నమునే దేవుని ముద్ర

అను పేరుతో వివరించదలచుకొన్నాము. అలా ఎందుకు రెండుమార్లు

చెప్పుచూ రెండు గ్రంథములుగా వ్రాయవలసి వచ్చినది అంటే దానికి

కొంత కారణము గలదు. అదేమనగా! మన శరీరములో ఆత్మ యున్నది.

ఆత్మ దేవునిలోని భాగమైయున్నది. దేవుని నుండి ఆత్మ, జీవాత్మ విడువడి

వేరుగా యున్నవని చెప్పవచ్చును. ఆత్మ, జీవాత్మ దైవఅంశ కల్గినవై యున్నా

ఆత్మ పని చేయును, జీవాత్మ పని చేయదు. జీవాత్మకు, ఆత్మకు ఎంతో

తేడా గలదు. ఆత్మ దేవునివలె ప్రవర్తించుచూ అందరికీ అధిపతియైయున్నది.

అధిపతిగా ఉండడమే కాక కార్యకర్తగా పనులు చేయుచున్నది. ఒక

విధముగా ఆత్మ శరీరమునకు, జీవునకు అధిపతిగా ఉంటూ ఈశ్వరుడు

అని పేరుగాంచినది. దేవుని చేత అధికారము పొంది, సర్వులకు దేవుడుగా

యున్నది ఆత్మయే. జీవుని కార్యములను చేయుచూ దేవుని హోదాలో

ఆత్మయున్నదని ఆత్మజ్ఞానము తెలిసిన ఏ మనిషి అయినా ఒప్పుకోక

తప్పదు. ఆత్మ ఎంతో గొప్ప స్థాయిలో దేవునివలె దేవుని చేత అధికారము

పొంది గొప్పగాయుంటున్నది. నేను చెప్పుమాట మీకు అర్థము కాకపోతే



నమ్మకము లేకపోతే ఈ విషయమును ద్వితీయ దైవగ్రంథములో యోహాన్

సువార్తయందు 5వ అధ్యాయములో 20వ వాక్యము నుండి 27వ వాక్యము

వరకు చెప్పియున్న దానిని గమనించితే నేను చెప్పిన మాట సత్యమని

తెలియగలదు.


(యోహాన్ 5-20 నుండి 27 వరకు).


(5-20) “తండ్రి, కుమారుని ప్రేమించుచూ, తాను చేయువాటి

నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా

చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప

కార్యములను ఆయనకు అగపరచును".

(5-21) "తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే

కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును.”

(5-22) “తండ్రి యెవనికి తీర్పు తీర్చడుగానీ"

(5-23) “తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని

ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి

అప్పగించియున్నాడు, కుమారుని ఘనపరచనివాడు ఆయనను

పంపిన తండ్రిని ఘనపరచడు".

(5-24) “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాస

ముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక

మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో

నిశ్చయముగా చెప్పుచున్నాను”.


(5-25) "మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ

వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు

జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను".

(5-26) “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై

యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై

యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను".

(5-27) "మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక

తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను".


ఈ వాక్యములలో తండ్రియని దేవున్ని, కుమారుడుయని ఆత్మను

చెప్పడమైనది. దేవుడు ఆత్మకు తనవలెనుండుటకు అన్ని విధముల

అధికారమిచ్చెనని చెప్పబడియున్నది. అంతేకాక మనిషి చనిపోతే తిరిగి

కర్మను నిర్ణయించి జన్మలకు పంపు అధికారము ఆత్మకు ఇవ్వబడినది.

దేవునితో సమానముగా ఆత్మను ఆరాధించిన వానికి, గౌరవించిన వానికి

జన్మలు లేకుండా మోక్షము కల్గునని చెప్పడమైనది. ఇంకా దేవునివలె

ఆత్మ కూడా నిత్య జీవము కలదిగా జనన మరణములు లేనిదిగా ఉన్నట్లు

దేవుడు ఆత్మకు అధికారమిచ్చినట్లు కలదు. మనుషులు ఆత్మను దేవునివలె

గౌరవించవలెనని కూడా చెప్పడమైనది. ఇదంతా చూచిన తర్వాత ఆత్మ

మనుషులందరికీ దేవుడుగా యున్నదని చెప్పుచున్నాము. దేవునితో

సమానముగా యున్న ఆత్మ మనిషికి కార్యకర్తగా పని చేసిపెట్టుచున్నదంటే

ఎవరయినా నమ్మగలరా? ఒకవైపు ఎంతో ఉన్నతముగా కనిపించు ఆత్మ

జీవునికి సేవకునిగా కార్యములు చేసి పెట్టడమా! అని ఆశ్చర్యపోక తప్పదు.

నా మాట నమ్మకపోతే అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా


ఆరునందు, ఆయత్ 102లో ఏమి చెప్పారో ఒకమారు చూడండి.

(6–102) “ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. ఆయన తప్ప వేరొక

ఆరాధ్య దైవము లేదు. ఆయనే సర్వానికి సృష్టికర్త. కావున

మీరు ఆయననే ఆరాధించండి. అంతేకాక ఆయన ప్రతి దానికి

కార్యకర్త".


ఇది 'దివ్య ఖుర్ఆన్ సందేశము' తెలుగు అనువాదములో

చెప్పబడినది. ఈ వాక్యమును చదివిన చాలామంది అల్లాహ్ అంటే

దేవునిగానే అర్థము చేసుకొని ఆత్మను వదలివేయు అవకాశము గలదు.

ఇక్కడ 'దేవుడు' అను పదమును ఆత్మగా అర్థము చేసుకోవలెను. అట్లు

కాదు అల్లాహ్ (దేవుని) విషయమునే ఆ వాక్యములో చెప్పాడు అని కొందరు

వాదించవచ్చును. నాకు వాదనతో పనిలేదు, ఉన్న సత్యమును చెప్పడమే

నా వంతు. అల్లాహ్ అనగా దేవుడే అయితే ఆయన సాక్షిగా ఉండేవాడు

అని మాత్రమే తెలియవలెను. దేవుడు మనిషికి పని చేయు పనిమనిషిగా

లేడు. దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడు అని జ్ఞాపకముంచుకోవలెను.

దేవుడు సాక్షిగా ఉన్నాడు అని అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా

50, ఆయత్ 21లో చెప్పియున్నారు చూడండి.


(50-21) “ప్రతి జీవాత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చే

వాడితో సహా వస్తుంది".


ఈ వాక్యము గ్రంథములో చిన్న వాక్యమైనా అత్యంత ప్రాధాన్యత

గల వాక్యము. దైవ గ్రంథములు మూడు ఈ వాక్యముతో ముడివేయబడి

ఉన్నాయి. ముఖ్యముగా ముగ్గురు ఎవరో తెలియుటకే దైవగ్రంథములు


మూడు చెప్పబడినాయి. ప్రథమ దైవగ్రంథము తౌరాతు (భగవద్గీత)

గ్రంథములో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని చెప్పగా, ద్వితీయ దైవ

గ్రంథము ఇంజీలు (బైబిల్)లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని చెప్పగా,

అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో త్రోలబడేవాడు, త్రోలేవాడు, సాక్షిగా

ఉండేవాడు అని చెప్పబడినది. ఈ మూడు వాక్యములు గ్రంథములకు

మూలాధారమను విషయము మేము చెప్పు వరకు ఎవరికీ తెలియకుండా

పోయినది.


మనిషిలో ఉండే శ్రద్ధనుబట్టి బుద్ధి విచక్షణరాగా, బుద్ధి విచక్షణతో

దైవగ్రంథ వాక్యము అర్థము కాగలదు. ఖుర్ఆన్ గ్రంథములో సూరా

ఐదు ఆయత్ 68లో మూడు దైవ గ్రంథములు చదువనిదే మీరు ఏ

ధర్మములోనూ లేనట్లేయని చెప్పారు చూడండి.


(5-68) “ఓ గ్రంథ వాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును,

మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన ఖుర్ఆన్ గ్రంథమును

మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే”.


ఇక్కడ చెప్పినట్లు మూడు దైవగ్రంథములను చదివినప్పుడే దేవుని

జ్ఞానము అర్థము కాగలదు. అప్పుడు నీవు ఒక ధర్మములో ఉన్నట్లగును.

అట్లుకాకుండా మధ్యలో వచ్చిన మతమును పట్టుకొని మొదటి నుండి

యున్న దేవున్ని మరచి నా గ్రంథము, నా మతము అనడము వలన మనిషి

దేవుని జ్ఞానమును సత్యస్వరూపముగా తెలియలేక పోవుచున్నాడు. వాస్తవ

జ్ఞానమును తెలియగలిగితే దేవుడు పని చేయువాడు కాదు. దేవుడు తన

ఆత్మను ప్రజలకు దేవునిగా మరియు సేవకునిగా (కార్యకర్తగా నియమించి

ప్రక్కన చూస్తూయున్నాడు. ఆత్మయే దేవునివలె ఉన్నది. కావున (6-102)


వాక్యములో చెప్పినట్లు ఆయన (ఆత్మ)యే మనుషులకు దేవునిగా ఆత్మ

యుంటూ మరియు ఆత్మే మనుషులకు కార్యకర్తగాయుంటూ జీవునికి

సుఖదుఃఖములను అందించుచున్నది. ఈ విధముగా ఆత్మ మనిషి యెడల

రెండు రకములుగా యున్నదని చెప్పవచ్చును.


'ఆత్మ' దేవునిగా ఉన్నదని చెప్పాము కదా! ఇప్పుడు దేవుని ముద్రను

గురించి చెప్పుచున్నాము అంటే అది 'ఆత్మ ముద్ర' గురించి చెప్పుచున్నా

మనియే అర్థము చేసుకోవలెను. ఏ మనిషి అయినా ఆత్మను దేవునిగా

చెప్పుకోకపోతే దేవుని మాటను అతిక్రమించినట్లగును. దేవునికి మనిషి

మీద కోపము కలుగవచ్చును. 'కుమారుడయిన ఆత్మను ఘనపరచని వాడు

దేవున్ని కూడా ఘనపరచడని' బైబిలులో చెప్పిన వాక్యమును మరువకూడదు.

అందువలన ప్రతి మనిషి తండ్రియైన దేవున్ని గురించి ఆలోచించక,

కుమారుడయిన ఆత్మను గురించే ఆలోచించాలి. ఆత్మనే దేవునిగా తలువాలి.

ఆత్మను దేవునిగా ఆరాధించాలి. ఈ మాటలన్నీ దేవుడే స్వయముగా

యోహాన్ సువార్తలో చెప్పియున్నాడు. మనుషులకు ఆత్మ దేవుడుగా గొప్ప

స్థితిలోయున్నా, అత్యున్నత స్థితిలో యున్నా మరియొక విధముగా ఆత్మే

మనిషికంటే తక్కువగా, మనిషికి సేవకునిగా, పని మనిషిగా కూడా

యున్నదని చెప్పవచ్చును. ఇట్లు ఆత్మ మనిషి యెడల రెండు విధములుగా

యున్నదని, అసలయిన దేవుడు అనగా ఆత్మకు తండ్రిగా యున్న దేవుడు,

మనకు (జీవునికి) తాతగా యున్న దేవుడు మనుషులతో సంబంధము

లేకుండా ప్రక్కన సాక్షిగాయున్నాడు. ఆయన మనుషుల పరిధిలో లేడు.

అందువలన తాత అయిన దేవున్ని తెలియుటకు తండ్రియైన ఆత్మను దేవునిగా

తలచవలెను. దేవునిగా గౌరవించవలెను. దేవునిగా ఆరాధించవలెను.


మనకు దేవుడయిన ఆత్మ మనుషుల ఎడల రెండు రకములుగా

ప్రవర్తించుట ఇప్పుడు తెలిసిపోయినది. అందువలన దేవుని గుర్తును దేవుని

చిహ్నము అని ఒక రకము, దేవుని ముద్రయని మరొక రకముగా చెప్పు

కొంటున్నాము. ఇంతకుముందు దేవుని గుర్తును “దేవుని చిహ్నము” అను

గ్రంథముగా వ్రాసి చూపించాము. ఆ గ్రంథములో దేవుని గుర్తును ఒక

విధమైన భావముతో పూర్తిగా వివరించాము. ఆ గుర్తును భగవద్గీతయందు

అక్షర పరబ్రహ్మయోగము అను అధ్యాయములో నుండి కనుగొన్నాను అని

చెప్పాము. "దేవుని చిహ్నము" అను గ్రంథములో దేవుని చిహ్నమును

గురించి సంపూర్ణముగా చెప్పుచూ దేవుని చిహ్నమును దేవునితో

సమానముగా గౌరవించవలెను కనుక దానిని “తలమీద నొసలు భాగములో

ధరించితే ఇతరులు చూచుటకు దానిని తలమీద పెట్టుకొని మోసినట్లు

కనిపించును” అను భావముతో అందరూ దేవుని చిహ్నమును నొసలు

భాగమున ధరించవలెనని చెప్పాము. ఆనాడు ఒక్క హిందువులకే కాక

అన్ని మతముల వారికి అది దేవుని గుర్తుగా యుండుట వలన అన్ని

మతముల మనుషులు దానిని గౌరవ భావముతో చూడడమే కాక దేవునితో

సమానముగా చూడవలెనని కూడా చెప్పాము.


మేము చెప్పిన తర్వాత అర్థము చేసుకొన్న వారందరూ దేవుని

చిహ్నమును పాల భాగమున (నొసలు భాగమున) ధరించడము జరిగినది.

నా మాటను అర్థము చేసుకున్న హిందువులే కాక ముస్లీమ్లు, క్రైస్థవులు

కొందరు ధరించడము జరిగినది. వాస్తవముగా దేవుని చిహ్నమునకు

హిందువులకు ఏమాత్రము సంబంధము లేదు. అది మూడు మతముల

వారికి సంబంధించినది. పుట్టిన ప్రతి మనిషి, దేవుడు అను భావముకల

ప్రతి మనిషి దానిని ధరించి తీరవలెను. అయితే క్రైస్థవులకు, ముస్లీమ్లకు



ముఖము మీద ఏమీ ధరించు అలవాటు లేదు. వారి మత నియమముల

ప్రకారము ముఖము మీద హిందువులవలె ఏదీ ధరించకూడదని

చెప్పియున్నారు. ముందు పుట్టిన హిందువులను చూచి వెనుక పుట్టిన

మతముకు ప్రాధాన్యత కొరకు అలా చెప్పారని, అది కేవలము మత

నియమమనీ, దేవుని జ్ఞానము కాదని అర్థమగుచున్నది. దేవుని విషయము

మూడు దైవ గ్రంథములలో ఒకటిగా యున్నా అది మనుషులకు అర్థముకాక

పోవడము వలన దైవ గ్రంథములోని జ్ఞానమును వదలి, మత నియమమునకే

మనిషి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చుచున్నాడు.


మూడు దైవ గ్రంథములలో దేవుని చిహ్నమును గురించి వ్రాయబడి

యున్నది. భగవద్గీతలో సూక్ష్మముగా అక్షర పరబ్రహ్మయోగమున దేవుని

చిహ్నమును గురించి చెప్పియుండగా, బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథము

లోనూ స్థూలముగా కనిపించు వాక్యములనే చెప్పియున్నారు. గీతలో

సూక్ష్మముగాయున్న దానిని మేము చెప్పగా, హిందువులు గ్రహించి వెంటనే

దేవుని ముద్రను నొసలు భాగమున ధరించారు. క్రైస్తవులు, ముస్లీమ్లు

మా మాటను వెంటనే అర్థము చేసుకోలేక పోయారు. కొంత అర్థమయినా

మతమునకు భయపడి వారు నొసలు మీద దేవుని ముద్రను ధరించలేదు.

తర్వాత కొంత కాలమునకు వారు దేవుని జ్ఞానమును అర్థము చేసుకొన్నారు.

వారి గ్రంథములలో ప్రత్యక్షముగా ఉన్న దేవుని వాక్యములను గౌరవించు

నిమిత్తము ముందు ముస్లీమ్లు దేవుని ముద్రను ధరించగా, తర్వాత

క్రైస్థవులు దేవుని ముద్రను ముఖము మీద ధరించారు. దేవుని చిహ్నమును

గురించి అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా ఐదు, ఆయత్ రెండు

లోనూ, మరియొక చోట సూరా 22, ఆయత్ 32 లోనూ స్థూలముగా

చెప్పియున్నారు. ఇప్పుడు (22-32) వాక్యమును చూద్దాము.


“ఎవడైతే అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తాడో అది

నిశ్చయముగా వారి హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే"


అని వ్రాయబడి యున్నది. అయితే అక్కడ చెప్పిన విషయము చాలామంది

ముస్లీమ్లకు అర్థము కాలేదు. వారికి అర్థమయినది తప్పు మార్గము. దేవుడు

సూక్ష్మమైన వాడు, దేవుని జ్ఞానము కూడా సూక్ష్మతతో కూడుకొని యుండును.


దేవుడు తన చిహ్నమును గురించి చెప్పితే మనిషి ప్రకృతి సంబంధ

గుర్తులను దేవుని చిహ్నములుగా చెప్పడము పొరపాటు కాదా! దేవుడు

వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి సంబంధము ఏదిగానీ దేవుని గుర్తులుగా

ఉండుటకు వీలులేదు. దేవునికి ప్రత్యర్థిగాయున్నది ప్రకృతి. ప్రకృతి

వలన తయారయినది ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ ఐదింటిని

ప్రకృతియని అంటాము. ప్రకృతి వలననే మన శరీరములోని గుణములు

కూడా పుట్టాయి. అందువలన గుణములు ప్రకృతి జనితములు అంటాము.

గుణములనే మాయ అని భగవద్గీతలో చెప్పారు. మాయనే సాతాన్ అని

సైతాన్ అని ఇబ్లీసు అని చెప్పుచున్నాము. అందువలన ప్రకృతిని

దేవునిలోనికి కలుపరాదు. బయట ప్రపంచములో భూమియందు పుట్టిన

సఫా, మర్వాలను రెండు పర్వతములను దేవుని గుర్తుగా కొందరు చెప్పినా

అది ఏమాత్రము సత్యము కాదు. అంతేకాక ప్రకృతితో తయారయిన

శరీరము గల పశువులను దేవుని చిహ్నముగా చెప్పారు. అది కూడా

సత్యముకాదు. పశువులు, పర్వతములు ప్రకృతిలోని భాగములుగా యున్నవి.

ప్రకృతిలో భాగము కాకుండా దేవుని జ్ఞానముతో కూడుకొనియున్నవే

దేవుని చిహ్నములగును. ప్రకృతితో కూడుకొనియున్నవి ఎప్పటికీ దేవుని

చిహ్నములు కావు.



భగవద్గీతలోని జ్ఞానమును అనుసరించి మరియు ఖుర్ఆన్

గ్రంథములో అల్లాహ్ చెప్పిన జ్ఞానమును అనుసరించి ముందు మేము

వ్రాసిన “దేవుని చిహ్నము” గ్రంథములో వ్రాయడము జరిగినది. అప్పుడు

బైబిలు గ్రంథములోని వాక్యమును ఏమాత్రము మేము చెప్పలేదు. ఇంజీలు

గ్రంథములో దేవుని చిహ్నమును గురించి ప్రత్యేకముగా వాక్యమున్ననూ

దానిని అక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు. అప్పుడు రెండు దైవగ్రంథముల

లోని వాక్యములను చెప్పినా ప్రత్యక్షముగా యున్న వాక్యము ఖుర్ఆన్

గ్రంథములోనిదే. భగవద్గీతా గ్రంథములో ప్రత్యక్ష వాక్యముగా దేవుని

చిహ్నమును గురించి లేదు. పరోక్షముగా ఉన్నదని చెప్పాముగానీ

ప్రత్యక్షముగా వాక్యమును చూపలేదు. ప్రత్యక్షముగా ఖుర్ఆన్ వాక్యమునే

చూపాము. అంతేకాక “దేవుని చిహ్నము” అను గ్రంథములో దేవుని

చిహ్నమును గురించి సవివరముగా చెప్పాను. దేవుని చిహ్నము నాలుగు

చక్రముల గుర్తుగా ప్రతి శరీరములో ఉన్నదని చెప్పాము. ప్రతి శరీరములో

నొసలు భాగమునకు సమతలమున తల మధ్య భాగములో దేవుని చిహ్నము

ఉందని చెప్పడమే కాక, దేవుని చిహ్నము బ్రహ్మ, కాల, కర్మ, గుణ

చక్రములుగా యున్నదని చెప్పుచూ ప్రతి చక్రమునకు జ్ఞాన సంబంధమైన

వివరమును చెప్పాము. ఆ ప్రకారము మనిషి అయిన ప్రతి వానికీ, శరీరము

ధరించిన ప్రతి జీవికి దేవుని చిహ్నము జీవితమును నియమించి నడుపు

సారాంశమైన చిహ్నముగా యున్నది. దేవుని చిహ్నములో ఖుర్ఆన్

గ్రంథములో చెప్పిన జ్ఞానము మరియు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము ఇమిడి

యున్నది. దేవుని జ్ఞానమును మేము చెప్పినట్లు అర్థము చేసుకోగలిగితే

ప్రథమ, అంతిమ దైవగ్రంథములలో ఉన్న జ్ఞాన సారాంశము దేవుని

చిహ్నములో కనిపించగలదు. మనిషి చేసుకొనుచున్న కర్మను గురించి,


మనిషి అనుభవించు అనుభవముల గురించి, మనిషి తెలియు జ్ఞానము

గురించి, మనిషి అనుభవించు కాలమును గురించి, మనిషిలో గుణ

రూపములోయున్న మాయ గురించి దేవుని చిహ్నములో తెలియుచున్నదని

మేము వ్రాసిన గ్రంథములో వ్రాయడము జరిగినది.


మేము దాదాపు సంవత్సరము క్రిందట వ్రాసిన దేవుని చిహ్నములో

దేవుని చిహ్నము గురించి సంపూర్ణ జ్ఞానమును తెలియజేయడమైనది.

సంపూర్ణముగా సంశయము లేకుండా తెలియవలసినది ఏమీ లేకుండా

చెప్పినప్పుడు ఇప్పుడు మీరే ఇంకా దేవుని చిహ్నమును గురించి

చెప్పవలసినది చాలాయున్నదని ప్రత్యేకించి ఒక గ్రంథమునే వ్రాయుచున్నారు

కదా! ఇప్పుడు దేనిని గురించి వ్రాయుచున్నారు? అని మీరు ప్రశ్నించ

వచ్చును. దానికి నా వద్ద జవాబు కలదు, అది ఏమనగా! దేవున్ని

గురించి గుర్తుగా యున్న దానినే దేవుని చిహ్నము అనీ, దేవుని ముద్రయనీ

అంటున్నాము. దేవుని ముద్ర దేవునితో సమానమైన సారాంశము కలది

గానూ, దేవుని జ్ఞానమునకు గుర్తుగానూ ఉంటున్నదని చెప్పవచ్చును.

మనుషులమైన మనము దేవుడు అని అసలయిన దేవున్ని అనకూడదు.

అనగా తాతగా యున్న దేవున్ని, లేక తండ్రికి తండ్రిగా యున్న దేవున్ని

కొంతసేపు ప్రక్కనపెట్టి ఆత్మనే దేవునిగా చెప్పుకొందాము. ఆత్మను దేవుడని

చెప్పుట తప్పు కాదు. సృష్టికర్త అయిన దేవుడే తన కుమారుడైన ఆత్మను

తన వలె గొప్పగా చెప్పవలెనని, ఆరాధించవలెననీ, గౌరవించవలెననీ

ధర్మసమ్మతము చేసి ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలులో చెప్పిన మాటను

మరువకూడదు. ఆత్మను ఘనపరచనివాడు ఆయనను పంపిన దేవున్ని

కూడా ఘనపరచడు అని దేవుడే స్వయముగా చెప్పినమాటను మరువ

కూడదు.


దేవున్ని ఘనపరచువాడు, దేవుని కుమారుడైన ఆత్మను కూడా

ఘనపరచవలెను. దేవుని స్థానములో ఆత్మను దేవునిగా మనుషులమైన

మనము చెప్పాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. ఆత్మ మనుషుల

యెడల రెండు విధముల ప్రవర్తించుచున్నది. ఒకటి దేవునిగా, రెండు

కార్యకర్తగా ఉండుట వలన ఆత్మను రెండు విధముల గుర్తులతో చెప్పవలెను.

దేవుని గుర్తు (ఆత్మ గుర్తు) ఒక్కటే అయినా రెండు విధముల అర్థముతో

కూడుకొనియున్నది. ఆత్మ ఒక్కటే అయినా రెండు విధముల ప్రవర్తించుట

వలన దేవుని గుర్తును రెండు విధముల అర్థముతో చెప్పవలసి యున్నది.

ఒకే గుర్తునే దేవుని చిహ్నము అని ఒక విధముగా, దేవుని ముద్ర అని

మరొక విధముగా చెప్పుచున్నాము. చిహ్నము అనినా, ముద్ర అనినా

రెండూ దేవుని గుర్తేయని తెలియవలెను. ఇంతకుముందు గ్రంథములో

‘దేవుని చిహ్నము' అను పేరుతో దేవుని కార్యకర్త విధానమును చెప్పాము.

ఇప్పుడు దేవుని ఆధిపత్య విధానమును గురించి చెప్పుకొందాము. దేవుని

నిజ స్వరూపము దేవుని ఈశ్వర తత్త్వమే, అనగా దేవుని గొప్పతనమే.

దేవుడు సర్వులకు అధిపతిగా యున్నాడు కావున, ఆయన ఆధిపత్యమునకు

గుర్తుగా దేవుని ముద్రను గురించి ఇప్పుడు చెప్పుకోవలసి యున్నది.


ప్రశ్న :- ప్రపంచము పుట్టినప్పటినుండి దేవుడు ఒక్కడేయని సర్వమానవులు

నమ్ముచున్నారు. ఒక్క హిందూమతములోని వారు కొందరు దేవుడు అనే

అంశమునే తీసుకోక దేవతలను అందరినీ నమ్మి ఆరాధించుచున్నారు.

హిందువులలో కూడా కొందరు ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను

చదివి దైవజ్ఞానమును తెలిసినవారై దేవతల భక్తిని వదలి దేవుని భక్తిని

ఆచరించుచున్నారు. మిగతా క్రైస్తవములోగానీ, ముస్లీమ్లలోగానీ మిగతా

వారిని ఎవరినీ నమ్మక తమ విశ్వాసమును దేవుని మీద మాత్రమే


ఉంచుకొని దేవున్ని ఒక్కనినే ఆరాధించుచున్నారు. ప్రజలను పాలించువాడు

ప్రజలకు అధిపతిగాయున్నవాడు ఒక్క దేవుడేయని తాము నమ్మడమేకాక

ఇతరులకు కూడా బోధించుచున్నారు. తమ నమ్మకము ప్రకారము దేవుడు

ఒక్కడే కలడని దేవున్ని ఒక్కనినే ఆరాధించుచున్నారు. అందరి మనస్సులో

ఒకే దేవుని జ్ఞాపకము కలదు. అందరి బుద్ధిలో ఒకే దేవుని భావము

కలదు. దేవుడు తన గ్రంథములలో తనను ఒక్కడినే ఆరాధించమని చెప్పినట్లు

గలదు. దేవున్ని గురించి ఎందరో జ్ఞానులు తమ జ్ఞానము ప్రకారము

‘ఏకో నారాయణ' అని హిందువులు, 'అల్లాహ్ మాలిక్ (దేవుడే యజమాని)’

యని ముస్లీమ్లు, ‘దేవుడు ఒక్కడేయని' క్రైస్థవులు చెప్పుచుండగా, ఇంత

కాలము జ్ఞానులలో యున్న నమ్మకమును కాదని దేవుడు ఒక్కడు కాదు

ఇద్దరు అని చెప్పడమేకాక, అసలయిన దేవుడు మీకు తాతయగును, మీకు

దేవుడు తండ్రిగాయున్నాడు అని మీరు తప్ప ఎవరూ చెప్పలేదు. నీవు

ఒక్కనివి చెప్పిన మాటను మేమెందుకు నమ్మాలి? మా దేవుడు ఒక్కడే,

అతనే మా యజమాని, అతనే మమ్ములనందరినీ పుట్టించిన తండ్రియని

నమ్ముచున్నాము. అదే నమ్మకముతో జీవిస్తాము. అదే నమ్మకమునే

కొనసాగించుకొంటాము. మీరు చెప్పిన మాటను విని మధ్యలో మేము

చెడిపోము అని అంటున్నాము. ఇంతమందికి దేవుడు ఒక్కడే కనిపిస్తే

నీకు ఒక్కనికే దేవుడు రెండుగా ఎలా కనిపించాడు? అని అడుగుచున్నాము.


జవాబు :– ఇంతవరకు మీరు నమ్మిన దేవున్ని నేను కాదనలేదు. ఇంతవరకు

అందరూ తండ్రియని ఏ దేవున్ని అంటున్నారో అదే దేవున్ని నేను కాదనలేదు.

ఇంతవరకు దేవుడు ఒక్కడేయని ఏ దేవున్ని మీరు అంటున్నారో ఆ దేవున్ని

నేను కాదని చెప్పలేదు. అందరి నమ్మకము ఏ దేవుని మీద యున్నదో ఆ



దేవున్నే నేను దృఢపరచుచున్నాను. ఏ దేవున్ని అయితే ముస్లీమ్లు ఒక్కడేయని

అంటున్నారో, ఒక్కడేయని క్రైస్తవులు అంటున్నారో ఆ ఆ దేవున్నే నేను

ధృవీకరించి చెప్పుచున్నాను. అయితే ఇంతవరకు ఎవరూ చెప్పని

మరొకమాట కూడా చెప్పుచున్నాను. మీరు చెప్పుచున్న దేవుడు, మీరు

నమ్మిన దేవుడు వాస్తవమే అయితే ఆయన ఎవడయితే దేవునిగా యున్నాడో

ఆయనకు తండ్రి ఒకడున్నాడని మనకు తెలియదు. నిజమైన దేవున్ని

గురించి ఎవరికీ తెలియదు. నిజమైన దేవుడు మనకు తండ్రియైన వానికి

తండ్రిగా యున్నాడు. ఆయన ఆరు రోజులు తన సృష్టిని సృష్టించి ఏడవ

రోజు ఏడవ ఆకాశములో విశ్రాంతి తీసుకొంటున్నాడని అంతిమ దైవ

గ్రంథములో చెప్పిన మాటను మరచి మీరు మాట్లాడుచున్నారు. దేవుడు

నామ, రూప, క్రియారహితుడు అను మాటను విడిచిపెట్టి మీరు దేవుడు

అనగా దేవులాడబడేవాడు అని నిర్వచనమున్నది. దేవుడు ఎవరి ఊహకు

అందనివాడు. ఆయనను ఎవరూ ఫలానావాడని చెప్పలేరు. ఆయన

అన్ని పనులకు అతీతుడు, ఏ కార్యమును చేయనివాడు, సాక్షిగా

చూస్తూయున్నవాడు. మనిషిని పుట్టించడములోనూ, పాలించడములోనూ,

మరణింపజేయడములోనూ ఏ ప్రమేయము లేనివాడు. దేవున్ని ఎంత

ప్రయత్నించిననూ ఎవరూ కనుగొనలేరు. అందరికీ తెలియని అత్యంత

రహస్యము ఒకటి గలదు, అదేమనగా! దైవ గ్రంథములలో దేవునికి

సంబంధించిన జ్ఞాన విషయములు ఎన్నియున్నా అందులో కేవలము

పది శాతము పరమాత్మను గురించి చెప్పిన జ్ఞానముండును. మిగతా

తొంభైయి (90) శాతము జ్ఞాన విషయములు ఆత్మకు సంబంధించినవి 

ఉ౦డును.


దైవ గ్రంథములలో అత్యంత ప్రాముఖ్యమైన జ్ఞాన సమాచారము


దేవుడు మూడు విధముల ఉన్నాడని చెప్పడమే కాక, చెప్పకుండానే దేవుడు

నాల్గు విధములుగా యున్నాడని తన గ్రంథములలో తెలియజేశాడు. దేవుడు

ఒక్కడేయని తెలిసిన మీకు వాస్తవముగా, సత్యబద్దముగా, శాస్త్ర సమ్మతముగా

మూడు+ఒకటి=నాల్గు విధముల ఉన్నాడని మేము చెప్పడము అందరికీ

కొరుకుడు పడని విషయము అని నాకు తెలుసు. అయినా సత్య ప్రకటన

ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు చెప్పక తప్పదు. ఆ

ఏర్పాటు అంతయూ దేవుని నిర్ణయములోనే ఉండును. దేవుని నిర్ణయము

మనిషిని తనవైపు రప్పించుటకయినా ఉండును, లేక తనకు దూరముగా

పంపుటకైనా ఉండును. దేవుడు అంతిమ దైవగ్రంథములో చాలామార్లు

అల్లాహ్ అనుకుంటే మనిషిని సన్మార్గములో అయినా పంపును. అలాగే

అపమార్గములో అయినా పంపును. అల్లాహ్ తనను విశ్వసించిన వారిని

సన్మార్గములోనూ, తనను విశ్వసించని వానిని అపమార్గము (అజ్ఞాన

మార్గము) లోనూ పంపగలడు అని చెప్పియున్నాడు. మనిషికి దేవుని

జ్ఞానము అర్థము కావాలంటే దేవుని ఇష్టము మీద ఆధారపడియుండును.

మనిషి విశ్వాసమును బట్టి దేవుని నిర్ణయము ఉండును.


పై విషయములన్నీ చెప్పినవాడు సర్వులకు తండ్రియైన దేవుడేయని

తెలియాలి. సర్వులకు తాతయైన దేవుడు ఏమీ చెప్పలేదు. ఆయన ఏమీ

చెప్పువాడు కాడు. ఆయన మౌనముగా అన్నీ చూస్తూ యుండువాడు

మాత్రమే. ఇంతవరకు మేము దేవుని జ్ఞానము తెలిసిన వారము అనుకొన్న

జ్ఞానులందరికీ మేము ఒక సత్యమును చెప్పి కొంత గందరగోళానికి గురి

చేసియుండినా నన్ను మీరు సత్యము చెప్పువానిగా గ్రహించవలెను. సత్యము

కొంత చేదుగాయున్నా సత్యము ఎప్పటికీ సత్యమే. అందువలన

శాశ్వతముగా, సత్యముగా యున్న విషయమును చెప్పితే దేవుడు ఒక్కడే



అయినా మొత్తానికి నాలుగు భాగములుగాయున్నాడు. వాస్తవమును చెప్పితే

దేవుడు ఎప్పటికీ దేవుడుగా యున్నాడు, దేవునిగా యున్న ఆత్మ ఒకటి

గలదు. తర్వాత మూడవదిగా జీవాత్మ గలదు. ఈ మూడు కానిది

ప్రకృతియని ఒకటి కలదు. ఈ నాలుగు భాగములు ఒక్క దేవునిలోనివే,

ఆ ఒక్క దేవుడే తాతయైన దేవుడు. తండ్రికి తండ్రియైన దేవుడు. మీకు

విపులముగా అర్థమగుటకు ఇప్పుడు ఒక కథలాంటి సమాచారమును

చెప్పెదను జాగ్రత్తగా వినండి.


నేను సాధారణ మనిషిగాయుంటూ ఏ జ్ఞానము తెలియని యుక్త

వయస్సులోనే అప్పుడప్పుడు ఇతరులతో దేవుని విషయములను గురించి

మాట్లాడేవాడిని. అప్పుడు భగవద్గీతను చదివిన తర్వాత దేవుడు త్రైత

సిద్ధాంతముగా ఉన్నాడని తెలిసినది. అయితే విశేషమేమంటే నేను

భగవద్గీతను చదవని కాలములో కూడా, భగవద్గీత విషయము

తెలియనప్పుడు కూడా దేవుడు మూడు భాగములుగా ఉన్నాడు అని

చెప్పేవాడిని. భగవద్గీత చదివిన తర్వాత దేవుడు మూడు ఆత్మలుగా

యున్నాడని అర్థమయినది. దానినే నేను మొదటినుండి చెప్పడము చేత

అది నా సిద్ధాంతముగా, ప్రజలకు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి చెప్పాను.

అయితే త్రైత సిద్ధాంతము ముందే భగవద్గీతలో కృష్ణుడు చెప్పియున్నాడు.

అయినా అది ఇప్పటివరకు ఎవరికీ తెలియని దానివలన ఆ సిద్ధాంతమును

నేను ప్రచారము చేశాను. విచిత్రము ఏమంటే భగవద్గీతను చదివిన

తర్వాత మూడు ఆత్మల విషయము తెలిసినా క్షరుడు, అక్షరుడు,

పురుషోత్తముడు అని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16,

17 శ్లోకములలో వ్రాసియున్నా, ప్రత్యక్షముగా శ్లోకముల రూపములో

మూడు ఆత్మల విషయమున్నా, పరోక్షముగా దేవుడు నాల్గు భాగములుగా


ఉన్నాడని భగవద్గీత మొత్తము మీద తెలిసినది. అయితే ఆ విషయము

నాకు బాగా అర్థమయినా నేను మొదట చెప్పిన త్రైత సిద్ధాంతమునే చెప్పుచూ

వచ్చాను. మధ్యలో రెండవ మారు నాల్గు భాగములుగా దేవుడున్నాడని

చెప్పి వారిని గందరగోళ పరచకూడదనుకొన్నాను. కొన్ని సంవత్సరములు

గడచిన తర్వాత చాలామంది నావద్దకు వచ్చి నేను చెప్పే జ్ఞానమును

వినేవారు. అప్పుడు నేను జ్ఞానమును చెప్పడమే కాకుండా, ప్రతి నెలా

వారికి జ్ఞాన పరీక్ష నిర్వహించేవాడిని. జ్ఞాన పరీక్షలో చాలామంది

పాల్గొనెడివారు. ప్రతి నెల జరుగు పరీక్షలలో పది ప్రశ్నలను చెప్పి, వాటికి

జ్ఞానమును జవాబుగా వ్రాయమని చెప్పేవాడిని బహుశ 2001 లేక

2002వ సంవత్సరములో జరిగిన జ్ఞాన పరీక్షలో పది ప్రశ్నలలో మొదటి

ప్రశ్న నాకు బాగా జ్ఞాపకమున్నది. అది ఏమనగా! “సృష్టి ఆదిలో ఒకే

దేవుడు ఎన్ని భాగములుగా విభజింపబడ్డాడు?" అని అడిగాము.

ప్రశ్న “ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు" అను మా గ్రంథములో

మీకు లభ్యము కాగలదు. ఆనాడు ఆ ప్రశ్నకు మేము జ్ఞానము చెప్పినట్లు

“మూడు ఆత్మలుగా విభజింపబడ్డాడు" అని వ్రాశారు. “దేవుడు ఎన్ని

ఆత్మలుగా విభజింపబడ్డాడు?” అని నేను అడిగియుంటే ఆ జవాబు

సరిపోతుంది. అలాగే "దేవుడు ఎన్ని భాగములుగా ఉన్నాడు?" అని అడిగినా

కొంతవరకు జవాబు సరిపోయేది. అయితే ఇక్కడ ప్రశ్నలో ఒక ప్రత్యేకత

కలదు. ఆ ప్రత్యేకతను ఎవరూ గమనించకుండా వ్రాయడము వలన ఆ

జవాబును సత్యముగా లెక్కించలేదు. ఆ జవాబును అసత్య జవాబుగా

పరిగణించాము. ఆ ప్రశ్నలోని ప్రత్యేకత ఏమంటే "సృష్టి ఆదిలో దేవుడు

ఎన్ని భాగములుగా విభజింపబడ్డాడు?" అన్నది ప్రశ్న.


ఆ ప్రశ్న సృష్ఠికంటే పూర్వము అనిగానీ, సృష్ఠి మొదటిలో అనిగానీ

అర్థమునిచ్చుచున్నది. సృష్ఠి పూర్వము లేక సృష్ఠి ఆదిలో ఏమీ లేని స్థితిగా



ప్రపంచమే లేని స్థితిగా యున్నదని చెప్పవచ్చును. విశ్వమే లేని ఆ స్థితిలో

దేవుడు తప్ప ఎవరూ లేరు. అప్పుడున్నది ఒకే దేవుడు, రెండవ దేవుడు

అంటూ ఎవరూ లేరు. దేవుడు అప్పుడు విశ్వమును సృష్టించదలచాడు.

ఉదాహరణగా చెప్పుకొంటే ఒకే నీరును, ఏ రుచి లేని నీరును, కొంత

చక్కర కలిపి కొన్ని నీళ్ళను తియ్యగా చేయవచ్చును. అట్లే కొన్ని నీళ్ళకు

కొంత ఉప్పు కలిపి కొన్ని నీళ్ళను ఉప్పునీరుగా మార్చవచ్చును. ఒకే

నీటిని మూడు విధముల ఉప్పుగ, తియ్యగ, చప్పగా ఉంచినా ఆ మూడు

నీళ్ళను నిలువయుంచుటకు ముందు ఒక కుండ అవసరము. నీటిని

ఉప్పగా, తియ్యగా మార్చకముందే నీటిని నిలువయుంచుటకు కావలసిన

పాత్రను లేక బిందెను తయారుగా ఉంచుకోవలెను. అదే విధముగా దేవుడు

ఒక్కడు వర్షపు నీరువలె మొదట యుండెను. వర్షపు నీరు రంగు, రుచి,

వాసన ఏమీ ఉండక స్వచ్ఛమయిన నీరుగా ఉండును. అలాగే దేవుడు

దేవునిగానే ఒక్కడు స్వచ్ఛమయిన వాడుగా యుండెను. అలా ఉన్న దేవుడు

తన సంకల్పము చేత దేవుడు స్వయముగా సృష్టిని తయారు చేయు

కార్యమును చేశాడు. మీరు బాగా జ్ఞాపకము పెట్టుకోండి. సృష్ఠి లేకపూర్వము

దేవుడు కార్యమును చేశాడు. సృష్ఠి తర్వాత ఆయన ఏ కార్యమును చేయలేదు.

సృష్ఠికి పూర్వము రూప, నామ, క్రియలు గల దేవుడు సృష్ఠి తర్వాత ఆ

మూడు లేకుండా రూప, నామ, క్రియా రహితుడయ్యాడు.


దేవుడు సృష్ఠి తయారయిన తర్వాత ప్రజలకు తన ఉనికిని తెలియ

కుండా దాచుటకు తాను అందులో మూడు ఆత్మలుగా విభజింపబడి

యుండుటకు నీటికి పాత్ర ఎలా అవసరమయినదో, దేవునికి ప్రకృతి అలా

అవసరమైనది. ఒక బిందెను ఆధారము చేసుకొని మూడు రుచుల

నీరుండునట్లు, ఒక ప్రకృతితో తయారయిన శరీరమును ఆధారము చేసుకొని


దేవుడు మూడు ఆత్మలుగా ప్రకృతిలో ఇమిడిపోయాడు. ప్రకృతిలో కనిపించక

యున్న దేవుడు ఎవరికీ ఏ విధముగా తెలియడు. కావున తనను

తెలియుటకు కావలసిన జ్ఞానమును కూడా దేవుడు సృష్ఠి తర్వాత తెలియ

చేశాడు. ఇప్పుడు సృష్ఠి మొదటిలో జరిగిన విషయమును తెలుసుకొందాము.

సృష్టికి పూర్వము దేవునికి రూపము, నామము, క్రియ మూడు ఉండేవి.

అయితే అవి ఎలాగుండేవో ఏ మానవునకు తెలియదు. సృష్ఠి పూర్వము

యొక్క విషయమైనందున ఎవరుగానీ తెలియుటకు అవకాశము లేదు.

ఏదీ లేనినాడు ఒక్కడుగా యున్న దేవుడు తాను మనుషులను సృష్టించ

దలచాడు. ఒక్కడుగా యున్న దేవుడు, రూప, నామ, క్రియలు గల దేవుడు

సృష్టింపబడే మనిషికి తెలియకుండా ఉండుటకు ప్రకృతియను దుప్పటిని

తీసుకొని (తయారు చేసుకొని) అందులో తనను మూడు విధములుగా

విభజించి దాచుకున్నాడు. అలా చేయుటకు మొట్టమొదట ప్రకృతియను

కనిపించు దానిని తయారు చేశాడు. ప్రకృతిని సృష్టించిన దేవుడు దానిని

తర్వాత ఐదు భాగములుగా చేశాడు.


దేవుడు ఆదిలో మొట్టమొదట ప్రకృతిని తననుండే తయారు చేశాడు.

అనగా తనలోని కొంత భాగమును బయటికి తీసి దానికి 'ప్రకృతి'యని

పేరు పెట్టాడు. దీనిని బట్టి ప్రకృతి దేవునిలోని ఒక భాగమేయని చెప్ప

వచ్చును. ఆ విధముగా మొదట తననుండి ప్రకృతిని బయటికి తీసిన

దేవుడు ప్రకృతిని ఐదు భాగములుగా విభజించి వాటికి వరుసగా ఆకాశము,

గాలి, అగ్ని, నీరు, భూమి యని పేరు పెట్టాడు. ఆ ఐదు భాగములను

ఒక్కొక్క దానిని ఐదు భాగములుగా తయారు చేసి ఒక దానితో ఒకటి

కలిపి మానవ శరీరమును తయారు చేశాడు. మానవ శరీరము

తయారయిన తర్వాత తననుండి కొంత భాగములను బయటికి తీసి



దానికి ‘ఆత్మ'యని పేరు పెట్టాడు. తనను ఆత్మకంటే వేరుగా యుండునట్లు,

తనను 'పరమాత్మ'యన్నాడు. తర్వాత ఆత్మవలె కొంత భాగమును బయటికి

తీసి 'జీవాత్మ'యని పేరు పెట్టాడు. ఈ విధముగా తాను దేవుడుగానే

ఉంటూ తననుండి ప్రకృతిని, రెండు ఆత్మలను విభజించడము వలన

దేవుడు మొదట సృష్ఠి ఆదిలో నాలుగు భాగములుగా విభజింపబడినాడని

చెప్పవచ్చును. అందువలన దేవుడు మూడు భాగములుగా విభజింపబడి

నాడని జవాబు వ్రాసినా దానిని తప్పుగా లెక్కించాము. దానికి సరియైన

జవాబు నాలుగు భాగములని చెప్పవలెను.


దేవుడు సృష్ఠికి పూర్వము ఒక విధముగా, సృష్ఠి తర్వాత మరొక

విధముగా ఉన్నాడు. దైవ గ్రంథములలో సృష్టికి పూర్వమున్న రూప,

నామ, క్రియలు గల దేవున్ని గురించి కేవలము పది శాతము మాత్రమే

చెప్పారు. మిగతా శాతము సృష్ఠి తర్వాత నామ, రూప, క్రియలు వున్న

దేవున్ని గురించి చెప్పారు. అందువలన మీరు ఇంతవరకు జ్ఞానము వలన

తెలిసిన దేవుడు సృష్ఠి తర్వాత దేవున్నే కావున మీరు చెప్పే దేవుడు, నేను

చెప్పే దేవుడు ఇద్దరూ ఒక్కరే. అందువలన మీరు విశ్వసించిన దేవున్నే

నేను చెప్పుచున్నానని ముందే చెప్పాను. సృష్టికి పూర్వమున్న దేవున్ని

గురించి తెలియనవసరము లేదు. దేవుని ధర్మముల ప్రకారము, దైవ

గ్రంథముల ప్రకారము మనిషి విశ్వసించవలసినది సృష్ఠి తర్వాత దేవున్నే.

దైవగ్రంథములలో సృష్టికి పూర్వము, సృష్ఠి తర్వాత యున్న దేవున్ని వేరువేరుగా

చెప్పియున్నారు. అయినా ఇంతవరకు వారి వ్యత్యాసమునుగానీ, దైవ

గ్రంథములలో చెప్పిన విధానమునుగానీ ఎవరూ తెలియలేకపోయారు.

అందువలన ఇప్పుడు మేము చెప్పు సత్యము అసత్యముగా కనిపించుచున్నది.

నేను చెప్పునది సత్యము అని తెలియుటకు దైవగ్రంథములలో దేవుడు


చెప్పిన వాక్యములను సందర్భానుసారము చూస్తాము.


అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో 112వ సూరా “అల్

ఇఖాస్” లో గల నాలుగు వాక్యములను చూస్తే అక్కడ చెప్పినది సృష్ఠికి

పూర్వముగల దేవున్ని గురించియని సులభముగా తెలిసిపోగలదు.

(112-1,2,3,4)


1)ఓ ప్రవక్త ఇలా అను “ఆయనే అల్లాహ్ (దేవుడు) ఏకైకుడు".


2)అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు.


3)ఆయనకు సంతానము లేదు మరియు ఆయన ఎవరికీ

సంతానము కాదు.


4)సర్వలోకములలో ఆయనతో పోల్చతగినది ఏదీ లేదు.


ఈ నాలుగు వాక్యములు “దివ్య ఖుర్ఆన్ సందేశము” తెలుగు

అనువాదములోనివి. ఇతర తెలుగు అనువాదములలో కూడా ఇవే నాలుగు

వాక్యములే భాషలో కొంత తేడాగా వ్రాసియున్నా, అన్నిటిలో భావము

మాత్రము ఒక్కటేయుండును అని తెలియవలెను.


మొదటి వాక్యమును చూస్తే “ఆయన ఏకైక దేవుడు” అని

వ్రాసియున్నారు. ఈ మాటను మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ ముహమ్మద్

ప్రవక్తగారికి చెప్పాడు. అందువలన ప్రవక్త ఇలా చెప్పు “దేవుడు ఒక్కడే,

ఆయనకంటే ఇతర దేవుడు లేడు” అని చెప్పియున్నారు. సృష్ఠి

ఆదిలో సృష్టికంటే ముందుగల దేవున్ని గురించి చెప్పిన జ్ఞానవాక్యము

అయినందున ఈ మాట పూర్తి సత్యమని చెప్పవచ్చును. ఎందుకనగా!


సృష్టికంటే ముందు దేవుడు ఒక్కడే కలడు. దేవుడు తప్ప ఇతరము ఎవరూ

లేరు. సృష్ఠి పూర్వము మనుషులుగానీ, దేవతలుగానీ లేరు. మొత్తానికి

విశ్వమే లేదు. అటువంటప్పుడు దేవుడు ఒక్కడు ఏకైకముగా ఉన్నాడని

ఆయన తప్ప ఇతర దేవుడనే వాడుగానీ, ఇతర మనిషి అనేవాడుగానీ

ఎవడూ లేడు. అందువలన అప్పుడు దేవుడు ఒక్కడేయున్నాడనీ, ఆయన

తప్ప ఇతరులు ఎవరూ లేరని చెప్పారు. సృష్ఠి తర్వాత దేవుడే ప్రకృతి

ద్వారా జీవరాసుల శరీరములను సృష్టించి, ఆ శరీరములలో ఒక్కడుగా

యున్న దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడి ఒకటి జీవాత్మగాయుండగా,

రెండవది ఆత్మగా యుండగా, మూడవది పరమాత్మగానే (దేవునిగానే)

యున్నది. సృష్ఠి ముందుగల ఒక్కడే, సృష్ఠి తర్వాత నాలుగు భాగములుగా

యున్నాడని చెప్పవచ్చును. సృష్ఠి పూర్వము దేవుడు ఒక్కడేయుండగా సృష్ఠి

తర్వాత ఒక్కడుగా లేడు. ప్రకృతి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా యున్నాడు.

జీవాత్మ, ఆత్మ ఎలా పరమాత్మలో భాగమో అలాగే ప్రకృతి కూడా

పరమాత్మలో ఒక భాగముగా యున్నది. ప్రకృతి మొదట ఐదు భాగములుగా

తయారైనది. తర్వాత ఒక్కొక్కటి ఐదు భాగములుగా తయారయి, మొత్తము

శరీర భాగములు తయారయి జీవుడు నివసించుటకు యోగ్యముగా

తయారైనది. ప్రకృతి వలన తయారయిన శరీరములో జీవాత్మ చేరి

అందులో నివాసముండగా, జీవునికి సుఖదుఃఖములను అందించుటకు

ఆత్మ శరీరమును కదలించుచూ పని చేయించుచున్నది. ఆత్మ శరీరము

ద్వారా అవయవములను కదలించుచూ పనిని చేయగా, ఆ పనిలో గల

సుఖదుఃఖములను జీవాత్మ అనుభవించుచున్నది. ఆత్మ ఎల్లవేళలా

శరీరములో పనిచేయగా, జీవుడు సుఖదుఃఖ అనుభవములను అనుభవిస్తూ

ఆ పనిని తానే చేశానని అనుకొనుచున్నాడు. శరీరములో ఆత్మ పని


చేయడమును, జీవాత్మ తానే చేసినట్లు అనుకోవడమును, పరమాత్మ

శరీరములోనే యుండి సాక్షిగా చూస్తూ యున్నాడు.


సృష్ఠి తర్వాత దేవుడున్నా దేవుడు ఒక్కడుగా లేడు. దేవునిలో

భాగమైన ఆత్మ దేవునిగా చలామణి అగుచున్నది. దేవుడు సృష్ఠి తర్వాత

స్థబ్దతగా ఉండిపోయాడు. తాను చేయవలసిన పనులన్నీ తన ఆత్మకు

చెప్పి తనంతటివాడుగా ఉండునట్లు చేశాడు. సృష్ఠి తర్వాత జరుగవలసిన

కార్యములన్నిటిని దేవునిగా చలామణి అగుచున్న ఆత్మయే చేయుచున్నది.

దేవుడు మాత్రము సృష్ఠి తర్వాత అన్నీ చూస్తూ సాక్షిగాయుండగా, దేవుని

చేత అధికారము పొంది దేవునిగా యున్న ఆత్మ అన్నిటికీ అధిపతిగా

యుంటూ, ఒక వైపు ప్రకృతికి సూచనలు ఇస్తూ, ఒకవైపు భూతములు

గ్రహములయిన పాలనా రంగములోని వారికి ఎక్కడ ఏమి చేయాలో,

ఎప్పుడు సునామీలు సృష్టించాలో, ఎక్కడ తుఫానులు వరదలు తేవాలో,

ఎక్కడ ప్రమాదములు కలుగచేయాలో, ఎక్కడ రోగములు విస్తరించాలో

చెప్పుచూ, అందరికీ అధికారిగా యుంటూ మానవుని శరీరములో

కార్యకర్తగా పనిని చేయుచున్నాడు. శరీరములో ఆత్మ పనిని చేయుచూ

కార్యకర్తగా యుండకపోతే మనిషి శరీరములో ఏ చిన్న కార్యము జరుగదు.

శరీరము ద్వారా జరిగెడి బయటి కార్యములుగానీ, శరీరము లోపల జరుగు

కార్యములయిన గుండె కొట్టుకోవడము, శ్వాస ఆడడము, మూత్రపిండములు

మూత్రమును వడగట్టడము మొదలగు అనిచ్ఛాధీన కార్యములన్నియూ

నిలచిపోవును. ఆత్మ కార్యకర్తగా పని చేయకుండా ఒక్క నిమిషమున్నా

మానవ శరీరము బ్రతికే అవకాశమే లేదు. అందువలన మనిషి శరీరములో

మనిషికి తెలియకుండా శరీరాంతర్గతముగా ఆత్మ ఎల్లవేళలా పని చేయుట

వలన మనిషి జీవించగలుగుచున్నాడు. లేకపోతే మనిషి జీవించే అవకాశమే


లేదు. సృష్టికి పూర్వము గల దేవుడు ఈ పనులన్నీ ఆత్మకు అప్పజెప్పి,

ఆత్మనే దేవునిగా ఉండునట్లు నియమించి తాను సాక్షిగా అన్ని చూస్తూ

శరీరము లోపల, శరీరము బయట గలడు. అయితే ఆత్మ దేవునిగా

యుంటూ శరీరము లోపలనే యున్నదిగానీ, శరీరము బయటలేదు.

శరీరము బయట, శరీరము లోపల గల దేవుడు సృష్ఠి పూర్వమునుండి

ఉండే దేవుడు. శరీరము లోపల మాత్రముండి శరీరమునకు, జీవునకు

అధిపతిగాయున్న ఆత్మ శరీరము లోపలే దేవుడుగా యున్నాడు అని తెలియ

వలెను. నేడు శరీరము లోపల యుండే దేవున్ని గురించి దైవగ్రంథములలో

ఎక్కువ వ్రాయబడియున్నది. సృష్ఠి పూర్వము గల దేవుడు స్థబ్దతగా ఎవరికీ

తెలియకుండా, ఏమీ చేయకుండా సాక్షిగా మాత్రముండుట వలన ఆయనకు

ఎక్కువ ప్రాధాన్యత లేదు. అందువలన తాతయైన దేవుని గురించి దైవ

గ్రంథములలో తక్కువ చెప్పడమైనది. శరీరములో దేవునిగా ఉంటూ ఒకవైపు

అధికారిగా, ఒకవైపు కార్యకర్తగాయున్న దేవున్ని గురించి గ్రంథములో కూడా

ఎక్కువగా చెప్పడమైనది ఈ విషయమును ఖుర్ఆన్ గ్రంథములో సూరా

ఆరు ఆయత్ 102లో ఇలా చెప్పారు చూడండి.


(6–102) “ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. ఆయన తప్ప వేరొక

ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వులకు సృష్టికర్త. కావున మీరు

ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త"


ఈ వాక్యమును ఇక్కడ రెండవ మారు చెప్పాము. దేవుడుగా

ఆత్మ ఉంటూ అందరినీ సృష్టించినవాడు ఆత్మయిన దేవుడే. అందరూ

ఆయననే ఆరాధించవలెనని పరమాత్మయిన దేవుడు ఇక్కడ చెప్పడమేకాక

ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలులో యోహాన్ సువార్త 5వ అధ్యాయము

21 నుండి 24వ వాక్యము వరకు చెప్పియున్నాడు.


మనకు తండ్రియైన ఆత్మనే దేవునిగా ఆరాధించవలెనని గ్రంథము

లలో చెప్పబడియున్నది. దైవగ్రంథములో పరమాత్మయైన దేవున్ని గురించి

ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాయందు నాల్గు వాక్యములు గలవు.

నాల్గు వాక్యములు తాతయైన దేవున్ని గురించి చెప్పియున్నారు. ఇకపోతే

అదే దైవగ్రంథములోనే తండ్రియైన దేవుని వాక్యములు ఎలా ఉన్నాయో

చూడండి.


(3-18) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా

దేవుడు, దేవుని దూతలు మరియు జ్ఞాన సంపన్నులైనవారు

సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయన సామత్యము, సమతూకముతో

ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి

అయిన దేవుడు తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు”.

(22-66) “మీకు జీవనమును ఇచ్చినవాడు ఆయనే. ఆయనే

మరణమును ఇస్తాడు. మళ్లీ ఆయనే మిమ్ములను తిరిగి బ్రతికిస్తాడు.

అయినా మానవుడు దేవుని మేలును మరచేవాడే”.

(29-44) “అల్లాహ్ ఆకాశములను, భూమిని సత్యబద్దముగా

సృష్టించాడు. ఆకాశాలను, భూమిని పరమార్థముతో సృష్టించాడని

తెలిసితే ఇందులో గొప్ప నిదర్శనము దొరుకుతుంది.

(2-255) “దేవుడు మాత్రమే నిజమైన ఆరాధ్యదైవము, ఆయన

తప్ప ఇంకొక ఆరాధ్యుడు లేనేలేడు". ఆయన సజీవుడు, ఆయన

అన్నిటికీ మూలాధారము. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ

రాదు. భూమి, ఆకాశములలో యున్న సమస్తము ఆయన


ఆధీనములో యున్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన

సమక్షములో సిఫారసు చేయగలవాడు ఎవడూ లేడు. వారికి

ముందు వెనుక యున్న సమస్త సమాచారము మొత్తము ఆయనకు

తెలుసు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ

విషయము వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ

వైశాల్యము భూమి, ఆకాశములను చుట్టుముట్టి ఉంది.

భూమ్యాకాశాలను రక్షించడానికి ఆయన ఎప్పుడూ అలసిపోడు".


ఇప్పుడు నాలుగు వాక్యములను నమూనాకు ఇక్కడ వ్రాసి

చూపించడము జరిగినది. ఇంతకుముందు 112వ సూరాలోని నాలుగు

వాక్యములను వ్రాసి చూపించాము. ఆ నాలుగు వాక్యములు తండ్రికి

తండ్రియైన అనగా తాతగాయున్న దేవునికి సంబంధించిన వాక్యములని

చెప్పాను. అందులో మొదటి వాక్యమునకు వివరమును కూడా ఇచ్చాము.

ఇంకా మూడు వాక్యములకు వివరమును చెప్పవలసియున్నది. అంతలోనే

మీకు అర్థమగుటకు తండ్రియైన దేవున్ని గురించిన నాలుగు వాక్యములను

చెప్పాము. ఈ నాలుగు వాక్యములు 2,3,22,29 సూరాలలోని

వాక్యములను చెప్పాము. ముందు చెప్పిన 112వ సూరాలో నాలుగు

వాక్యములు మాత్రమే యున్నవి. ఆ నాలుగు వాక్యములు తాతయైన

దేవునివి. తాతయైన సృష్టి పూర్వము దేవున్ని గురించి గ్రంథములో ఎక్కువగా

చెప్పలేదు. అందువలన 112వ సూరాలో నాలుగు వాక్యములు మాత్రమే

గలవు. ఆ నాలుగు వాక్యములను మేము చెప్పడమైనది. మిగతా

గ్రంథమంతా అన్ని సూరాలలో ఎన్నో వాక్యములు తండ్రియైన దేవున్ని

గురించి చెప్పినవి గలవు. రెండవ సూరాలో 286 ఆయత్లు, మూడవ

సూరాలో 200 ఆయత్లు, 22వ సూరాలో 78 ఆయత్లు, 29వ సూరాలో


69 ఆయత్లు గలవు. ఈ వాక్యములన్నీ ఇంచుమించు తండ్రియైన దేవున్ని

గురించి చెప్పిన వాక్యములు. ఖుర్ఆన్ గ్రంథము మొత్తము మీద 6236

వాక్యములుండగా, అందులో కేవలము 36 వాక్యములు కూడా తాతయైన

దేవున్ని గురించి చెప్పినవి లేవు.


మీరు బాగా గమనించగలిగితే 112వ సూరాలో చెప్పిన నాలుగు

ఆయత్లలోని సమాచారమునకు తర్వాత చెప్పిన (2-255), (3-18),

(22-66), (29-44) వాక్యములకు ఎంతో తేడా కనిపించగలదు. ఇంతకు

ముందు మొదటి వాక్యములోని తేడాను గురించి చెప్పుకొన్నాము. ఇప్పుడు

తాతయైన దేవుడు వేరు, తండ్రియైన దేవుడు వేరని ఇంకా కొంత వివరమును

తెలుసుకొందాము. తండ్రియైన దేవుడే సమస్త మానవులకు అవసరమైన

ఆరాధ్యుడు. అందువలన తండ్రియైన దేవున్ని గురించి వేల వాక్యములను

చెప్పి తాతయైన దేవున్ని గురించి రెండు మూడు చోట్ల కొన్ని వాక్యములను

చెప్పారు. పది, పదిహేనుకంటే మించి వాక్యములు లేవనుకుంటాను.

ఇంతవరకు ఎవరికిగానీ తండ్రియైన దేవుని గురించిగానీ, తాతయైన దేవుని

గురించి విడదీసి తెలియదు. ఏమీ చేయనివాడని అని ఒకచోట చెప్పి,

అన్నీ చేయువాడు అని ఇంకొక చోట చెప్పినప్పుడు ఆ తేడాను మనుషులు

ఎందుకు గ్రహించలేదో! బుద్ధి విచక్షణ ఎందుకు పని చేయలేదో! నేను

ఎవరికీ సంతానమును కాను నాకు ఎవరూ సంతానము లేరు అని

చెప్పినప్పుడు, సమస్తమును నేనే సృష్ఠించుచున్నాను అని చెప్పినప్పుడు, ఆ

తేడాను ఎంతో బుద్ధి గల మనుషులు సహితము తెలియలేకపోయారు.

నా కుమారున్ని ఆరాధించినవాడు నన్ను ఆరాధించినట్లేయని ద్వితీయ

దైవగ్రంథములో చెప్పినవాడు, తృతీయ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో

ఆరాధించదగిన దేవుడు ఒక్కడేయన్నప్పుడు ఆ తేడాను ఎందుకు గ్రహించ


లేదో! ఈ విధముగా చెప్పుచూపోతే సృష్ఠి పూర్వము గల దేవుడు, సృష్ఠి

తర్వాత దేవుడు అను తేడాను గ్రంథములో చెప్పినా మనుషులు గ్రహించ

లేకపోయారు.


ఇంజీలు గ్రంథములో “నా తండ్రి నేను ఏకమైయున్నాము”

అని చెప్పినమాట చదివేదానికే పరిమితమైనదిగానీ తండ్రి యెవరు? తాను

ఎవరు? అని తెలియలేకపోయారు. అలాగే “నా కుమారున్ని ఘనపరచిన

వాడు నన్ను ఘనపరచినట్లే, నా కుమారున్ని ఆరాధించనివాడు నన్ను

ఆరాధించనట్లేయని, కుమారున్ని ఘనపరచనివాడు ఆయనను పంపిన

తండ్రిని ఘనపరచడు” అన్న మాటను ఏ విధముగా క్రైస్థవులుగా యున్నవారు

అర్థము చేసుకొన్నారో! ఇంజీలులోనూ, ఖుర్ఆన్లోనూ చెప్పిన వాక్యములు

రెండూ ఒక్కటేయని తెలియక మా గ్రంథము వేరు, వారి గ్రంథము వేరను

భావమున్నప్పుడు గ్రంథములో చెప్పిన దేవునికి సంబంధించిన వాక్యములు

ఎవరికీ అర్థము కావు. అంతెందుకు ఒకే గ్రంథములో చెప్పిన తండ్రిని

గురించి కుమారున్ని గురించి కూడా అర్థము కాలేదని, అట్లే ఒకే గ్రంథములో

చెప్పిన సంతతిలేని దేవున్ని, సంతతి యున్న దేవున్ని తెలియలేకపోయారు.

దేవుడు రెండు విధములుగా యున్నాడని ప్రస్తుతము నడిపించు దేవుడు

ఒకడనీ, ఆయననే ఆరాధించవలెననీ, ఆయన తర్వాత సాక్షిగా పరలోకముగా

కూడా దేవుడే యున్నాడనీ చాలామంది తెలియలేకపోయారు.


“సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు” అనుమాటను

మొదటిమారు వినుచున్న కొందరికి, వారి ఇరువురు తెలియుటకు దైవ

గ్రంథములో ఖుర్ఆన్ఆయందు గల రెండు రకముల వాక్యములను

చెప్పుకొన్నాము. 112వ సూరాలో సృష్ఠి పూర్వము గల దేవుడు ఎలా

ఉన్నాడో నాలుగు వాక్యములలో చెప్పియున్నారు. అందులో రెండవ


వాక్యమును చూస్తే (12-2) “దేవుడు ఏ అక్కర లేనివాడు"

సృష్ఠి పూర్వము ఏదీ లేదు. ఇప్పుడున్న ప్రపంచమే లేదు. ఏదీ లేనప్పుడు

ఆయన దేని అవసరము లేనివాడై యున్నాడు. సృష్ఠి తర్వాత ఆయనకు

జగతిని పాలించు అవసరము ఏర్పడినది. అప్పుడు సృష్ఠి తర్వాత దేవుడు

అయిన ఆయన పనిని చేయదలచుకోలేదు. అందువలన సృష్టికి పూర్వము

ఉన్న ఆకారమును, పేరును, కార్యములు చేయు విధానమును లేకుండా

చేసుకొన్నాడు. అయితే తానే సృష్టించిన ప్రపంచమును ఎటూ కాకుండా

వదలి వేయలేదు. సృష్ఠి పూర్వముకంటే సృష్ఠి తర్వాత భిన్నముగా ఉండ

దలచిన దేవుడు తనవలె అధికారిగా అనగా దేవునిగా ఉండుటకు,

ప్రపంచమును పాలించుటకు, దానికి తగిన కార్యములు చేయుటకు

అవసరమైన దేవున్ని సృష్టించి, తన అధికారమునంతటినీ ఆయనకే ఇచ్చి

దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడై సృష్ఠి తర్వాత మౌనముగా

సాక్షిభూతుడుగా నిలిచిపోయాడు. దేవునికి సృష్ఠి తర్వాత అవసరము

ఏర్పడినదిగానీ, సృష్ఠి పూర్వము ఆయనకు ఏ అవసరము లేదనియే

చెప్పవచ్చును. అదే విషయమునే రెండవ వాక్యములో చెప్పారు. సృష్ఠి

తర్వాత ఏర్పడిన అవసరమును కూడా లేకుండా చేసుకొనుటకు ఇంకొక

దేవున్ని సృష్టించాడు. సృష్ఠి తర్వాత దేవుడు నియమించిన పనులను ఆత్మే

దేవునిగా చేయుచున్నది. ఈ విషయమునంతటినీ బుద్ధిని ఉపయోగించి

చూస్తే అర్థము కానిది ఏమీ లేదు. అయితే సృష్ఠి పూర్వము, సృష్ఠి తర్వాత

ఉన్న సత్యము ఎందుకు తెలియలేదో?


(12-3) “దేవునికి సంతానము లేదు, ఆయన ఎవరికీ

సంతానము కాదు” అని కలదు. ఈ మాట సృష్ఠి పూర్వము దేవునికి


వర్తించును. అప్పుడు ఆయనకు ఏ అవసరము లేదు కావున, ఆయనకు

కుమారుని అవసరము కూడా లేదు. అప్పుడు నిరామయుడుగా ఉండేవాడు.

“సృష్ఠి తర్వాత దేవునికి సంతానము లేదు' అను పదము వర్తించదు. ఆయన

జన్మ లేనివాడు కావున, సృష్ఠి తర్వాతగానీ ఆయనకు తండ్రి లేడు అని

చెప్పవచ్చును, ఆయన ఎవరికీ పుట్టలేదని చెప్పవచ్చును. సృష్ఠిని సృష్టించిన

సృష్టికర్త విశ్వమును సృష్టించినప్పుడే తండ్రిగా మారిపోయాడు. తర్వాత

ప్రత్యేకమయిన దేవునిగా తన కుమారుడైన ఆత్మను నియమించుట వలన

ఆయన తండ్రియైన దేవుడయ్యాడు. సృష్ఠి లేక పూర్వము దేవుడు నిజముగా

ఎవరికీ తండ్రి కాదు. అట్లే ఆయనకు ఎవరూ తండ్రి కాదు.


(112-4) “దేవునికి సమానము ఏదీ లేదు" ఈ మాట సృష్టికి

పూర్వమున్న దేవునికి వర్తించును. అదే దేవునికి ఈ మాట సృష్ఠి తర్వాత

ఏమాత్రము వర్తించదు. సృష్ఠి పూర్వము ఏదీ లేదు. విశ్వములేదు,

మనుషులుగానీ, జంతువులుగానీ, గ్రహాలుగానీ, భూతములుగానీ ఏవీ

లేనప్పుడు ఆయనతో సాటిగా (సమానముగా) పోల్చి చెప్పుటకు వీలుకాదు.

అందువలన వాక్యములో ఆయనకు సమానము ఏదీ లేదని చెప్పారు. సృష్ఠి

తర్వాత దేవుడు తనకు సమానముగా తన కుమారునికి అధికారమిచ్చి

తనతో సమానముగా ఉండునట్లు, తనతో సమానముగా ప్రపంచ

కార్యములను చేయునట్లు, తనకు సమానముగా దేవునివలె ఉండుటకు

అధికారమిచ్చాడు. అప్పటినుండి దేవుడు సాక్షిగా నిలిచిపోగా, దేవునితో

సమానముగా ఆత్మే మారిపోయి దేవునిగా ఉండుటయేకాక, 6-102

వాక్యములో చెప్పినట్లు దేవుడు అన్నిటికీ అధిపతిగాయున్నాడు మరియు

కార్యకర్తగా యున్నాడు అని చెప్పడము జరిగినది.


దేవునితో సమానముగా మరియొక దేవునిగా దేవుడే తన ఆజ్ఞ

చేత ఆత్మను దేవునిగా చేసియున్నాడు. దేవునితో సమానముగా యున్న

దేవుడు వచ్చిన తర్వాత ముందున్న దేవుడు కదలక మెదలక స్థబ్దతగా

నిలిచిపోవడము వలన, ప్రజలందరూ దేవునిగా యున్న వానినే దేవునిగా

చెప్పుచూ ఆయననే విశ్వసించారు. మనుషులందరికీ దేవునితో సమానముగా

యున్న దేవుడు తెలియునుగానీ, అసలయిన తాతయైన దేవుడు

తెలియబడలేదు. నేడు గ్రంథములలో వ్రాసుకొన్నది, విశ్వసించినది,

ఆరాధించినది, గొప్పగా చెప్పుకొనునదీ నేడు ప్రపంచములో కార్యకర్తగా,

అధిపతిగా యున్న దేవున్నేయని తెలియవలెను. ఈ దేవుడే అందరినీ

సృష్ఠించిన దానివలన నేడు మనకు తెలిసిన, మనము చెప్పుకొనుచున్న

దేవున్ని తండ్రియని చెప్పవచ్చును. తండ్రియైన దేవున్ని సృష్టించిన, సృష్ఠి

పూర్వమున్న దేవున్ని, నేడు మౌనముగా యున్న దేవున్ని, మన శరీరములోనే

సాక్షిగాయున్న దేవున్ని, తాతయని చెప్పవచ్చును. మన తండ్రికి తండ్రియైన

దేవున్ని ఎవరయినా తాతయని చెప్పవలసిందే. విశ్వమంతా వ్యాపించి,

శరీరములో కూడా యున్న తాతయైన దేవుడు, శరీరములో సాక్షిగా

యుండుట వలన ఆయనకు సృష్ఠి పూర్వము ఆయనకు సాటియైన వారు

ఎవరూ లేరని చెప్పవచ్చును.


నేను చాలామార్లు బహిరంగముగానే నాకు ఖుర్ఆన్ గ్రంథములో

112వ సూరా బాగా ఇష్టమైన సూరాయని చెప్పాను. అంతేకాక అందులోని

నాలుగు ఆయత్లు ఎంతో విలువైనవిగా చెప్పాను. అయితే తాతయైన

దేవుడు ముఖ్యమైతే తండ్రియైన దేవుడు నీకు ముఖ్యము కాదా!యని

కొందరు ప్రశ్నించవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! తాతయైన

దేవుడే మాయచేసి తండ్రియైన దేవునిగా కూడా ఉన్నాడని నాకు తెలుసు.


అందువలన ఆయన ఈయన ఇద్దరూ ఒక్కటేయని నాకు బాగా తెలుసు.

దేవుడు ఒక్కడే కలడు. ఆయన మారువేషములో తన ఆత్మ అను పేరుతో

తానే వచ్చాడు. అందువలన చూచుటకు, చెప్పుటకు వేరువేరుగా యున్నా

తండ్రి, కుమారుడు ఇద్దరూ ఒక్కటే. అందువలన ఇంజీలు గ్రంథములో

యోహాను సువార్త 10వ అధ్యాయములో ఇలా చెప్పారు చూడండి.


(యోహాన్ 10-30) “నేనును తండ్రియును ఏకమై

యున్నామని వారితో చెప్పెను".


ఇంకనూ 14వ అధ్యాయములో ఇలా చెప్పారు చూడండి.


(యోహాన్ 14-10) “తండ్రియందు నేనును, నా

యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా! నేను

మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పుట

లేదు. తండ్రి నాయందు నివసించుచూ తన క్రియలు

చేయుచున్నాడు.”


ఈ మాటలు విన్న తర్వాత ఇద్దరు దేవుళ్లున్నారని నమ్మకపోయినా

తప్పే. ఇద్దరు దేవుళ్లు ఒక్కరేయని తెలియక పోయినా తప్పేయగును. ఈ

విషయము తెలియనంత వరకు మనిషి అజ్ఞానములోనే ఉన్నాడని

చెప్పవచ్చును. దేవుని విషయము అనగా జ్ఞానము చాలా కష్టమైనది.

దేవుని జ్ఞానము సులభముగా అర్థము కాదు. దేవుడు 112వ సూరాలో

తన నాల్గు వాక్యముల ద్వారా తన పూర్వపు స్థితిని తెలియజేశాడు. అలాగే

జిబ్రయేల్ ద్వారా సృష్ఠి తర్వాత తాను మాయగా ఎవరికీ తెలియకుండా


ఎలా యున్నాడో కూడా అంతిమ దైవగ్రంథములో ఎన్నో వాక్యములలో

చెప్పియున్నాడు. ఎన్నో వందల వాక్యముల నుండి కేవలము నాలుగు

వాక్యములను నమూనాగా తీసుకొన్నాము. ఆ నాలుగు వాక్యములను

గురించి వివరించుకొని చూచినట్లయితే దేవుడు సృష్ఠి తర్వాత ఎలా

యున్నాడో తెలియగలదు.


ఇప్పుడు సూరా 3 ఆయత్ 18లో యున్న విషయమును చూస్తాము.

(3-18) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడనీ,

స్వయముగా దేవుడు, దేవుని దూతలు మరియు జ్ఞాన

సంపన్నులైనవారు సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయన

సామత్యము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి

యుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన

దేవుడు తప్ప మరొకరు ఎవరూ ఆరాధనకు అర్హులు

కారు".  ఈ వాక్యములో దేవుడు ఒక్కడే పూజింపదగినవాడు అని చెప్పుచూ

ఆయనే గొప్ప వివేచనాశాలియని చెప్పారు. 'వివేచనాశాలి' యనగా బుద్ధి

సామత్యము గొప్పగాయున్నవాడనీ, అన్నిటికీ అధిపతియని చెప్పడమైనది.

చెప్పినవారు దేవుడు, దేవదూతలు, జ్ఞాన సంపన్నులుయని కూడా చెప్పారు.

'అల్లా తప్ప వేరే ఆరాధ్యదైవము లేడని' దేవదూతలు చెప్పవచ్చును,

జ్ఞానమున్నవారు చెప్పవచ్చును. దేవుడు కూడా స్వయముగా 'దేవుడు

ఒక్కడే ఆరాధ్యుడని' ఎలా చెప్పును? అలా చెప్పాడు అంటే ఒక దేవుడు

ఇంకొక దేవున్ని గురించి గొప్పగా చెప్పినట్లే కదా! ముమ్మాటికి అంతే!

వాక్యములోని సూక్ష్మ భావమును చూస్తే మొదటి దేవుడు రెండవ దేవున్ని

గురించి చెప్పాడనియేగా అర్థము. 'దేవుడే నిజమైన ఆరాధ్య దైవమని’



తనను గురించి తాను ఏ దేవుడు చెప్పడు. అలా చెప్పాడు అంటే అతను

ఇంకొక దేవుడేయని తప్పక చెప్పవచ్చును. దైవ గ్రంథములో వ్రాసిన

వాక్యము ప్రకారము సృష్ఠి పూర్వమున్న దేవుడు, సృష్ఠి తర్వాత తాను తయారు

చేసిన దేవున్ని గురించి చెప్పాడని అర్థమగుచున్నది. ఈ విధముగా మిగతా

వాక్యములు కూడా సృష్ఠి పూర్వమున్న దేవునికి భిన్నముగా ఉండుట వలన

మొదటి దేవుడు వేరు, తర్వాత దేవుడు వేరని అర్థమగుచున్నది. రెండవ

దేవున్నే ఆరాధించమనీ, ఆయనే గొప్పవాడనీ గ్రంథములో అనేకచోట్ల

ఉండుట వలన రెండవ దేవుడే ప్రపంచమంతా ప్రచారమైనాడుగానీ,

మొదటి దేవుడు ప్రచారము చేసిన దేవుడే మూడు మత గ్రంథములలో

ఆరాధించదగిన దేవునిగా చెప్పబడ్డాడు. మా రచనలలోని "విశ్వే

విద్యాలయము" అను గ్రంథములో కూడా మొదటనున్న దేవున్ని అలంకార

ప్రాయముగా పెట్టి ఆయన ప్రపంచములోని విషయములను జోక్యము

చేసుకోలేదని ప్రపంచమును మరియు ప్రతి మనిషిని నడుపు దేవుడు

ప్రత్యేకముగా ఉన్నాడనీ, ప్రపంచమును నడుపుటకు మొదటి దేవుడే రెండవ

దేవున్ని తయారు చేసి, ఆయనే మీకు ఆరాధ్య దైవమని చెప్పాడని వ్రాశాము.

అదే విషయమే అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా మూడులో 18వ

ఆయత్నందు స్వయముగా దేవుడే ప్రజల ఆరాధ్య దైవమును చూపించి

చెప్పినట్లు కలదు. అదే విషయమునే నేను కూడా చెప్పాను. మొదటి

దేవుడు అన్ని అధికారములను రెండవ దేవునికి ఇచ్చి ఆయననే ఆరాధించ

మన్నప్పుడు మొదటి దేవునితో పనేమి అనియూ, ఆయన ఉన్నా లేనట్లే

కదా!యనీ, అటువంటప్పుడు తాతయైన మొదటి దేవుడు శరీరములో

సాక్షిగా ఉండవలసిన అవసరము ఏమి వచ్చింది? అని కూడా మేమే ప్రశ్న

వేసి, మొదటి దేవుని అవసరమును కూడా చెప్పాము.


నేడు ప్రపంచ వ్యాప్తముగా జ్ఞానము, భక్తియని అంటే అదంతయూ

అందరికీ తండ్రియైన రెండవ దేవుని మీదే కలదు. మూడు దైవ గ్రంథములు

కూడా అందరికి తండ్రిగాయున్న దేవున్ని గురించే చెప్పబడినాయి. తాతయైన

దేవుని విషయము ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. మూడు దైవ

గ్రంథములలో తాతయైన దేవున్ని గురించి బహుకొద్దిగా సమాచారము

ఉన్నప్పటికీ అది ప్రత్యేకించిన సమాచారమనీ, మొదటి దేవునికి

సంబంధించిన జ్ఞాన విషయమని ఎవరూ తెలియలేక పోయారు. మేము

మూడు మతములలోని జ్ఞానులను గమనించి చూచాము. నేడు ఎంత

పెద్ద స్వామీజీలుగానీ, ఎంత పెద్ద మత పెద్దలుగానీ, గురువులుగా యున్న

వారు, బోధకులుగా యున్నవారుగానీ రెండవ దేవున్నే చెప్పుచున్నారు.

సృష్ఠి తర్వాత దేవున్ని చెప్పుచున్నారు. సృష్ఠి మొదటి దేవున్ని గురించి

చెప్పడము లేదు. అందువలన వారందరికీ మొత్తము మీద మూడు మతముల

వారికీ ‘దేవుడు’ అను విషయము తెలుసు, దేవుడు ఒక్కడేయను విషయము

తెలుసు, ఆ ఒక్క దేవున్నే ఆరాధించవలెనని తెలుసు. అయితే ఆ దేవుడు

సృష్ఠి పూర్వమున్న వాడా!, సృష్ఠి తర్వాత వాడా!! అను విషయము మాత్రము

తెలియదు. సృష్ఠి పూర్వమున్న దేవుడు తానే స్వయముగా ఆత్మను దేవునిగా

ప్రకటించి, ఆత్మకు తనకున్న అన్ని అధికారములు ఇచ్చి, తనతో సమానముగా

చేసి మానవులందరికీ దేవుడుగా యుండునట్లు చేశాడని తెలియలేక

పోయారు.


ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో 700 శ్లోకములు గలవు.

అందులో దాదాపు వంద శ్లోకములు మొదటి దేవున్ని గురించి చెప్పగా,

మిగతా శ్లోకములన్నీ రెండవ దేవున్ని గురించి చెప్పినవే గలవు. ఎక్కువ

శాతము రెండవ దేవున్ని గురించి యుండగా వాటిని చూచిన వారు


మొదటి దేవున్ని గురించి చెప్పిన శ్లోకములను కూడా రెండవ దేవుని

శ్లోకములుగానే లెక్కించుకొన్నారు. భగవద్గీతలో మొదటి దేవున్ని రెండవ

దేవుని గురించి యున్నట్లే, ఇంజీలు అను బైబిలు గ్రంథములో కూడా

ఎక్కువ వాక్యములు రెండవ దేవున్ని గురించి యుండగా తక్కువ వాక్యములు

మొదటి దేవున్ని గురించి గలవు. అదే విధముగా అంతిమ దైవగ్రంథములో

కూడా కేవలము పది, పదిహేను వాక్యములకంటే ఎక్కువ మొదటి దేవున్ని

గురించి చెప్పలేదని ముందే చెప్పాము. ఉదాహరణకు ఖుర్ఆన్లో 112వ

సూరాలో ప్రథమ దేవున్ని గురించిన నాలుగు వాక్యములను చెప్పి వాటి

వివరమును కూడా చెప్పాము. అట్లే రెండవ దేవున్ని గురించిన నాలుగు

వాక్యములను కూడా చూపించాను. అందులో ఒక వాక్యమును (3-18)

మాత్రము వివరించి చెప్పాము. ఈ వాక్యములో స్వయముగా మొదటి

దేవుడే "రెండవ దేవుడు ఒక్కడే ఆరాధ్యునిగా అర్హుడు" అని చెప్పినట్లున్నదని

చూపించాము.


(22-66) “మీకు జీవనము ప్రసాదించిన వాడు మరియు

ఆయనే మీకు మరణమును ఇస్తాడు. ఆయనే మిమ్ములను

తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు దేవుని మేలును

మరచేవాడు”.


ఈ వాక్యములో దేవుడు మనిషికి జీవనము ప్రసాదించుటకు

పుట్టించడము తర్వాత తానే మరణింపజేయడము, తిరిగి పుట్టించడము

అను కార్యమును చక్రమువలె మాటి మాటికి జరుగునట్లు చేస్తున్నాడని

చెప్పడము వలన శరీరములో కార్యకర్తవలె పనిని చేయువానిని రెండవ

దేవుడని సులభముగా గ్రహించవచ్చును. మొదటి దేవుడు ఏ కార్యమును


చేయడు అనీ, ఆయన చూస్తూ సాక్ష్యముగా ఉండువాడేయని చెప్పుకొన్నాము.

అందువలన ఈ వాక్యము మొదటి దేవునిది కాదనీ సులభముగా గ్రహించ

వచ్చును. ఈ విధముగా కార్యములను చేయువాడు రెండవ దేవుడని

వాడు కార్యములను చేయనివాడికి మొదటి దేవుడని గ్రహించవలెను. మొదటి

దేవుడు రెండవ దేవున్ని తయారు చేసి, అధికారములన్నీ రెండవ దేవునికి

ఇచ్చి అందరూ ఆయననే ఆరాధించమని చెప్పాడు. అట్లు ఆరాధించక

పోతే నన్ను ఆరాధించనట్లేయనీ, నేను చెప్పినట్లు విని రెండవ దేవున్ని

ఆరాధించితే నన్ను ఆరాధించినట్లేయని, దానివలన అతనికి మోక్షము

లభించునని చెప్పియున్నాడు. రెండవ దేవుడు మీ శరీరములో యుండి

మీకు జననమును తర్వాత మరణమును ఇవ్వడమేకాక, మరణించిన వానికి

వెంటనే జీవనమును కల్గించుచున్నాడని చెప్పాడు. అంత కార్యమును

చేసినా, దేవుని మేలును కొందరు మరచిపోయి దేవున్ని ఏమాత్రము తలచక

అన్య దేవతలను ఆరాధించుచూ, వారినే పొగడుచున్నారు అని దేవుడు

తెల్పి యున్నాడు. ఇప్పుడు ఇంకొక వాక్యమును చూస్తాము.


(29-44) “అల్లాహ్ ఆకాశములను, భూమిని సత్యబద్దముగా

సృష్ఠించాడు. ఆకాశములను భూమిని పరమార్థముతో

సృష్టించాడని తెలిసితే ఇందులో గొప్ప నిదర్శనము గలదు”.


ఈ వాక్యము కూడా తండ్రియైన రెండవ దేవున్ని ఉద్దేశించి చెప్పినదే

యని తెలియవలెను. మీకు అర్థమగుటకు "రెండవ దేవుడు” అని

చెప్పుచున్నాను. అయినా అందరూ ఆరాధించేది రెండవ దేవున్నే.

తాతగాయున్న మొదటి దేవుడు ఆదిలో ఆకాశమును మొదలుకొని భూమి

వరకు ప్రపంచమును సృష్టించాడు కదా! అటువంటప్పుడు ఆకాశమును



భూమిని సత్యబద్దముగా సృష్టించిన వాడు మొదటి దేవుడగును కదా!యని

అందరూ అడుగవచ్చును. అలా అయితే ఈ వాక్యము మొదటి దేవునికి

సంబంధించినదే కదా! మీరు రెండవ దేవున్ని వాక్యములో చెప్పుచున్నారే

యని ప్రశ్నించవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! మొదట

ప్రపంచమును సృష్టించినది తాతయైన మొదటి దేవుడే. సృష్ఠి తర్వాత

ప్రపంచమును, ప్రపంచములోని జీవరాశులను నడుపుచున్నది తండ్రియైన

రెండవ దేవుడే. ఇక్కడ ఈ వాక్యములో బాగా గమనించితే “ఆకాశములను,

భూమిని పరమార్థముతో సృష్టించాడు” అని యున్నది. అల్లాహ్

ఆకాశములను భూమిని సత్యబద్దముగా సృష్టించాడని చెప్పడమే కాకుండా

పరమార్థముతో సృష్టించాడని చెప్పియున్నాడు. అంతటితో ఆపకుండా

తెలిసితే ఇందులో గొప్ప నిదర్శనము కలదని కూడా చెప్పాడు. అందువలన

ఈ వాక్యమును గురించి కొంత లోతుగా ఆలోచన మరియు లోచన కూడా

చేయవలసి వచ్చినది. ఆ విధముగా లోతుగా పోయి చూస్తే ఈ వాక్యము

తండ్రియైన దేవున్ని గురించి చెప్పినదేగానీ, తాతయైన దేవున్ని గురించి

చెప్పలేదని తెలిసి పోయినది.


ఈ వాక్యములో ఆకాశములను, భూమిని అని చెప్పాడు కదా!యని

కొందరు అడుగవచ్చును. ఆకాశములను, భూమిని అని చెప్పినమాట

నిజమే! అది సృష్ట్యాదిలో సృష్టించిన ప్రపంచమునయితే 'ఆకాశము' అని

ఏకవచనముగా చెప్పియుండేవాడు. అలా చెప్పక బహువచనములో

“ఆకాశములు భూమిని సత్యబద్దముగా లేక పరమార్థముగా సృష్టించాడు”

అని అంటే ఇది బయటి ఆకాశముగానీ, బయటి భూమిగానీ కాదని

తెలిసిపోవుచున్నది. ఇందులో నిదర్శనమున్నది అని చెప్పడము వలన

మనకు బయట కనిపించే భూమిగానీ, ఆకాశముగానీ కాదని అర్థమగు


చున్నది. 'దర్శనము' అనగా కనిపించడము అని అర్థము. 'ని' అనగా

కాదు, లేదు అని అర్థము. నిదర్శనము అనగా కనిపించేది కాదని వాక్యము

చివరిలో చెప్పడమైనది. ఇన్ని ఆధారములను వాక్యములో చూపినా మనిషి

బయటి ఆకాశమును, బయటి భూమిని గురించి చెప్పాడు అని అనుకొంటే

వాడు పూర్తి అజ్ఞానియే అని చెప్పవచ్చును. వాస్తవ జ్ఞానము ప్రకారము

చూస్తే ఆకాశములు, భూమి అను రెండు మనిషి శరీరములోనే గుప్తముగా

తెలియకుండా యున్నవి. ఇంకొక ఆయత్లో (వాక్యములో) "భూమి,

ఆకాశములు మరియు వాటి మధ్యన గల సమస్తమును దేవుడు

సృష్టించాడని” ఉన్నది. అక్కడ కూడా ఆకాశములు అని బహువచనము

గలదు. గొప్ప నిదర్శనము కలదు అని అంటే కనిపించని భావము

కలదనియే కదా, అర్థము. అందువలన కనిపించకుండా సూక్ష్మమైన జ్ఞానము

ఏముందని చూస్తే, మాకు తేట తెల్లముగా కంటికి నిదర్శనముగా, బుద్ధికి

దర్శనముగా తెలియునది ఏమనగా! మనిషి శరీరములోని క్రింది పాదములు

భూమిగా, పైన తలను ఆకాశములుగా తెలియుచున్నది. శరీర

అంతర్భాగములో బ్రహ్మనాడియందు గల ఏడు నాడీ కేంద్రములను, ఏడు

ఆకాశములుగా చెప్పవచ్చును. తల ఏడవ ఆకాశముగా యున్నది.

తలనుండి పాదముల వరకు ఏడవ ఆకాశము నుండి భూమివరకు అని

అర్థము చేసుకోవలెను. మానవ శరీరమును ఆకాశములు, భూమియని

దేవుడు చెప్పియున్నాడు. మానవ శరీరమును ఇప్పుడు తయారు చేయువాడు

తండ్రియైన దేవుడే. తాతయైన దేవుడు ఏమీ చేయక సాక్షిగా యున్నాడు.

29-44 వ వాక్యము కూడా బయటి స్థూల శరీరమునకు చెప్పిన

విషయమైనా చెప్పడములో సూక్ష్మజ్ఞానము చేత చెప్పియున్నారు. అందువలన

“నిదర్శనము” అను పదమును వాక్యములో చెప్పారు. నిదర్శనము అనగా


బయటికి కనిపించునది కాదని మరొకమారు జ్ఞాపకములో ఉంచుకోవలెను.

ఈ వాక్యమును ఎన్ని విధముల చూచినా మనిషి శరీరమును సృష్టించడము

అని కలదు. మనిషి శరీరమును సృష్టించువాడు మనిషికి జనన మరణములు

కలుగజేయువాడు, అన్ని కార్యములు చేయువాడు తండ్రియైన దేవుడేయని

తెలియవలెను. నేడు హిందువులు భగవద్గీతను, క్రైస్తవులు బైబిలు

గ్రంథమును, ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథమును చదువుచున్నా అందులోని

జ్ఞానమును పూర్తిగా గ్రహించలేకున్నారు. ఏ వాక్యము తండ్రియైన దేవునిది,

ఏ వాక్యము తాతయైన దేవునిది అని తెలియలేకున్నారు.


రెండవ దేవునికి సంబంధించిన ఆయత్లను ఇంతవరకు వివరించి

చెప్పుకొన్నాము. ఇప్పుడు నాల్గవ ఆయత్ను గురించి చెప్పుకొందాము.

సూరా రెండు, ఆయత్ 255లో ఉన్న విషయమును చూస్తాము.


(2-255) “దేవుడు మాత్రమే నిజమైన ఆరాధ్య దైవము.

ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన

సజీవుడు, ఆయన అన్నిటికీ మూలాధారుడు. ఆయనకు

కునుకుగానీ, నిద్రగానీ రాదు. భూమ్యాకాశములలో

ఉన్నది సమస్తము ఆయన ఆధీనములోయున్నది. ఆయన

అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫారసు

చేయువాడు ఎవడూ లేడు. వారికి ముందు వెనుక యున్న

సమాచారము మొత్తము ఆయనకు తెలుసు. ఆయన

కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయమూ

వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము

భూమి, ఆకాశములను చుట్టుముట్టి ఉంది. భూమ్యాకాశా


లను రక్షించడానికి ఆయన ఎప్పుడూ అలసిపోడు".


ఈ వాక్యమును చూస్తూనే నేను చెప్పకనే మీరే, చెప్పినది ఏ

దేవునికయినది తేల్చి చెప్పగలరు. ఇక్కడ ఈ వాక్యములో గమనించితే

మొదటనే దేవుడు ఒక్కడు మాత్రమే నిజమైన ఆరాధ్య దైవము అని

చెప్పియున్నాడు గానీ, ఏ దేవుడు ఆరాధ్య దైవముగా యున్నాడని తేల్చి

చెప్పకపోవడము వలన దేవుడు ఒక్కడేయని అందరూ అనుకున్నారు తప్ప

మనుషులతో సంబంధము లేకుండా ఇంకొక దేవుడు సృష్ఠి పూర్వమునుండి

యున్నాడని ఎవరూ తెలియలేకపోయారు. దేవుడు ఒక్కడే మనుషులకు

ఆరాధ్య దైవము అని దేవుడే స్వయముగా ఇంకొక దేవున్ని గురించి చెప్పాడని

(3-18) వాక్యములో యున్నా దానిని గ్రహించలేకపోయారు. వారి బుద్ధికి

తెలిసినది, ఇతరులు చెప్పగా విన్నదే సత్యమని నమ్మి దేవుడు ఒక్కడే

గలడను నమ్మకముతో యున్నారు. తాతయైన దేవుడు కూడా తండ్రియైన

ఒకే దేవుని మీద భక్తి కల్గియుండమని వాక్యములో చెప్పియున్నాడు.


(2-255) వాక్యములో పని చేయుచున్న దేవున్నే చెప్పియున్నారు.

చివరిలో భూమ్యాకాశాలను రక్షించటానికి ఆయన ఎప్పుడూ అలసిపోడు

అని యుండుట వలన ఆయన పని చేయు దేవుడని, పని చేసినా ఆయనకు

అలసట లేదని తెలియుట వలన ఈ వాక్యము ఎవరిని గురించి చెప్పినది

సులభముగా తెలిసిపోవుచున్నది. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ రాదు

అన్నారు. తాతయైన దేవున్ని గురించి దైవ గ్రంథములో కొన్ని వాక్యములే

చెప్పారు. ఎన్ని వాక్యములు చెప్పినా ఆయన విషయము ఎవరికీ ఏమీ

అర్థము కాలేదు. అర్థము కావలసిన అవసరము కూడా లేదు. ఆ దేవుని

వలన ఉపయోగము లేదు, లాభము లేదు, నష్టము లేదు. పని చేయని


తాతయైన దేవుడు స్థబ్దతగా శరీరములో యున్నా జీవునితో సంబంధము

లేదు. జీవునితో సంబంధమున్న వాడు, జీవుడు నివసించు శరీరమును

రాత్రింబవళ్ళు శ్వాసను ఆడించుచూ, శరీరములోనే కనిపించని ఎన్నో

కార్యములను చేయుచూ శరీరములో జీవుని జీవనము సాగునట్లు

చేయుచున్నాడు. ప్రతి సెకండు కాలము శరీరములో అప్రమత్తముగా

ఆత్మయిన దేవుడు పని చేయడము వలన శరీరము ఆరోగ్యముగా యున్నది.

అందువలన తండ్రియైన దేవునికి కునుకుగానీ, నిద్రగానీ లేదని వాక్యములో

చెప్పారు.


అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో తాతయైన దేవున్ని గురించిన

నాలుగు వాక్యములను 112వ సూరాలో చూశాము. అట్లే అదే గ్రంథములో

తండ్రియైన దేవున్ని గురించి చెప్పిన వాక్యములు అనేకమున్నా కేవలము

నాలుగు వాక్యములనే తీసుకొన్నాము. అవి (3-18), (22-66),

(29-44), (2-255) వాక్యములను తీసుకొని వివరించుకొన్నాము.

ఎనిమిది వాక్యముల వలన సృష్ఠి పూర్వము దేవుడు మరియు సృష్ఠి తర్వాత

దేవుడు ఉన్నట్లు తెలియబడినది. ఒక్క ఖుర్ఆన్ గ్రంథములోనే కాకుండా

మిగతా రెండు గ్రంథములలో కూడా సృష్ఠి పూర్వమున్న దేవున్ని, సృష్ఠి

తర్వాతగల దేవున్ని గురించి చెప్పియున్నారు. భగవద్గీతలో కూడా మనము

ఆరాధించ వలసిన దేవున్ని గురించి, ఆరాధించక తెలియవలసిన దేవున్ని

గురించి చెప్పియున్నారు. సృష్ఠి పూర్వమున్న దేవున్ని గురించి నాలుగు

శ్లోకములు, సృష్ఠి తర్వాత గల దేవున్ని గురించి అనేక శ్లోకములున్నా కేవలము

మూడు శ్లోకములను తీసుకొని వివరించుకొందాము.


రాజవిద్యా రాజగుహ్య యోగములో పదకొండవ శ్లోకమును చూస్తాము.


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం !

పరం భావ మజానంతో మమభూత మహేశ్వరమ్ ॥

(పరమాత్మ సాకారము)


భావము :- “మనుషులకు దేవునిగా యున్న నేను నర శరీరమును ధరించి

మనుషుల మధ్యలోనికి వస్తే నా యొక్క నిజస్థితిని తెలియని మనుషులు నన్ను

ఒక మనిషిగా తలచి అందరివలె నన్ను అవమానించుచున్నారు" అని

చెప్పియున్నారు. ఈ శ్లోకములో చెప్పినది రెండవ దేవున్ని కాదు. మొదటి

దేవుడయిన పరమాత్మను గురించి చెప్పారు. సృష్ఠి తర్వాత అన్ని కార్యములను

తండ్రియైన దేవుడు చేయుచుండగా తాతయైన దేవుడు మౌనముగా

ఉంటూ ఎప్పుడయితే భూమిమీద దైవజ్ఞానము తెలియకుండాపోయి,

ధర్మములకు ముప్పు కల్గినప్పుడు మాత్రము మనిషివలె భూమిమీద

ఉద్భవించి తన ధర్మములను పునరుద్ధరించి పోవును. భూమిమీద

మనుషులకు దేవుని ధర్మములు తెలియబరచువారు ఎవరూ లేని దాని

వలన, దేవుని ధర్మములు దేవునికి తప్ప ఇతరులెవరికీ తెలియని దానివలన

తాతయైన దేవుడే మనిషివలె వచ్చి మనుషులకు తన ధర్మములను తెలిపి

పోవును.


ప్రశ్న :- మీరు ఇంతకు ముందే "సృష్టికంటే ముందున్న దేవుడు ఏ పనిని

చేయనివాడుగా సృష్ఠి తర్వాత ఉండిపోయాడు” అని చెప్పారు. ఇప్పుడేమో

అదే దేవుడే మనిషి ఆకారములో వచ్చి మనుషులకు తన జ్ఞానమును

బోధించునని చెప్పుచున్నారు. సృష్టికంటే ముందున్న దేవుడు సృష్ఠి తర్వాత

పదవీ విరమణ చేసినట్లు తాను పనిని మానివేసి ఏమాత్రము పనిచేయని

వానిగా ఉంటానని నిర్ణయించుకొని తన పనిని, లేక పదవిని, లేక హోదాను



తన తర్వాతనున్న తన కుమారునికి అప్పజెప్పి, తనవలె తన కుమారుడైన

ఆత్మ తన పదవియైన దేవునిగా ఉండగా, ప్రజలకు తాను తాతగా యుండగా

తన కుమారుడైన ఆత్మ తండ్రిగా యున్నాడు. పరమాత్మయైన తాను

ప్రజలందరికీ తాతకాగా, తన కుమారుడు ప్రజలందరికీ ఒకవైపు దేవునిగా

యుంటూ, మరొక వైపు ప్రజల కార్యకర్తగా యున్నాడని అర్థమయినది.

ప్రజలందరికీ ఆత్మ తండ్రిగా యుండగా, పరమాత్మ తాతగా యున్నాడని

మీరే చెప్పారు. తాతగాయున్న పరమాత్మయైన దేవుడు ఏ పనిని

చేయనివాడైనప్పుడు తిరిగి మనిషిగా పుట్టి తన ధర్మములను తెలియచేయును

అని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు. అలా చేస్తే తాతయైన దేవుడు కూడా

అనగా పరమాత్మ కూడా పని చేసినట్లగును కదా! అటువంటప్పుడు 'పని

చేయని వాడు' అని పరమాత్మను ముందు ఎందుకు చెప్పారు? 'క్రియా

రహితుడని' చెప్పిన మీరే, అదే దేవున్నే 'క్రియాసహితుడని', 'పని చేయువాడని'

చెప్పడము తప్పు అగును కదా! దీనికి మీరేమంటారు?


జవాబు :- తాతయైన దేవుడు 'పని చేయడు' అని చెప్పిన మాటకు అప్పుడే

కాదు ఇప్పుడు కూడా కట్టుబడియున్నాము. మీకు నేను రెండు విధముల

మాట్లాడినట్లు, అసత్యమును చెప్పినట్లు అర్థమయి ఉండును. అయితే

నేను ఎప్పుడూ అసత్యమును మాట్లాడక సత్యమునే మాట్లాడినట్లు మరొక్క

మారు చెప్పుచున్నాను. శరీరములో కార్యకర్తయైన ఆత్మయైన దేవునికి

ఒక్క క్షణము కూడా తీరిక లేకుండా పనియున్నది. అంతేకాక ఆయన

ప్రతి మనిషి కర్మప్రకారము వానిని నడిపించుచున్నాడు. పరమాత్మయైన

దేవుడు తన కుమారుడైన ఆత్మ శరీరములలో పనిచేయుచుండుట చూస్తూనే

ఉన్నాడు. ఆత్మ జీవాత్మ కర్మప్రకారము నడిపించవలెనను నియమము

ప్రకారము నడిపించడములో అజ్ఞానము ప్రకారము మనిషిని అజ్ఞానములోనే


నడిపించవలసి యున్నది. మనిషి శ్రద్ధనుబట్టి వాడు చేసుకున్న కర్మను

బట్టి మనిషి అజ్ఞానమార్గములో, అజ్ఞాన పనులయందే, అజ్ఞానిగా

నడుచుచుండును. అలా ఆత్మే వానిని నడిపించుచున్నది. ఎప్పుడుగానీ,

ఏ సందర్భములో గానీ ఆత్మ స్వయముగా నడిపించక వాని శ్రద్ధనుబట్టి,

కర్మను బట్టి వానిని ఏ మార్గములో నడిపించవలెనో ఆ మార్గములోనే

నడిపించుచూ, కష్టసుఖములను పొందునట్లు చేయుచున్నది. ఈ విధముగా

మనిషి భావమును బట్టి, వాని కర్మనుబట్టి ఎక్కువగా అజ్ఞానములోనే

ఆత్మయైన దేవుడు లేక తండ్రియైన దేవుడు నడిపించడము జరుగుచున్నది.

మనిషి జీవించడములో తండ్రియైన దేవుని ప్రమేయము తప్ప, తాతయైన

పరమాత్మ ప్రమేయము ఏమీ లేదు. ఆత్మ మనిషి కర్మను బుద్ధి ఇష్టతను

(శ్రద్ధను) బట్టి నడిపించడము వలన ఆత్మయైన దేవుడే స్వయముగా మనిషిని

అజ్ఞానము వైపు నడిపించవలసి వచ్చుచున్నది. అలా నడిపించడము వలన

కొంత కాలమునకు మనిషికి దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియకుండా

పోవుచున్నది. అలా జ్ఞానము తెలియక పోవడము వలన భూమిమీద

దేవుని ధర్మములు అడుగంటి పోవును. ఎప్పుడయితే దేవుని ధర్మములు

తెలియకుండా పోయినవో అప్పుడు వాటిని తెలుపువాడు ఎవడూ లేకుండా

పోవుచున్నాడు. దేవుడుగా యున్న ఆత్మ మానవుల జీవన పాలనలోనే

లగ్నమై ఒక్క క్షణము కూడా తీరిక లేకయున్నది. అంతేకాక మనిషిని

అజ్ఞానము వైపు నడిపించు ఆత్మే దైవ ధర్మములకు వ్యతిరేఖముగా

మనుషులను నడిపించుచున్నది. అలా తయారయిన మనిషి జన్మ జన్మకు

పూర్తి అధోగతికే పోవడము వలన కాలము గడచుకొలది అధర్మము

ప్రభావము ఎక్కువగుచుండును. అట్లే ధర్మములు ఏవని తెలియని మనిషి

ధర్మములు పూర్తిగా మరచిపోవును. దానివలన అధర్మ ఆచరణ ఎక్కువగును,

ధర్మాచరణ ఏమాత్రము లేకుండా పోవును.



అటువంటి స్థితిలో ఆత్మ ధర్మములను తెలుపదు. అప్పుడు

అంతవరకు పనిలేని పరమాత్మే తన ధర్మములను గురించి మనుషులకు

తెలుపవలసిన అవసరమున్నది. ఆ పని కొరకే దేవుడు ప్రక్కన ఉన్నాడని

లేకపోతే పరమాత్మయైన దేవుడు ఉండవలసిన పనిలేదనీ, మనుషులకు

కూడా దేవునితో అవసరమే లేదని చెప్పవచ్చును. అయితే తాతయైన

పరమాత్మ దేవుడు పనిని చేయనివాడుగా యున్నాడు, కావున దేవుడు చేసినట్లు

ఎవరికీ తెలియకుండా దేవుడే తన జ్ఞానమును, తన ధర్మములను భూమిమీద

మనుషులకు చెప్పవలసియున్నది. దేవుని ధర్మములను దేవుడు తప్ప

ఇతరులు ఎవరూ తెలియరు. అందువలన ఇతరులుకాక దేవుడే చెప్పవలసి

యున్నది. దేవుడు ఏ పనినీ చేయడు, ఎవరితోనూ మాట్లాడడు అని

ముందే చెప్పుకొన్నాము. అటువంటప్పుడు ఎలా తెలియజేయునన్నది

ప్రశ్నగా మిగిలిపోయినది. ఇటువంటి సమస్యను అధిగమించుటకు దేవుడు

ముందే ఒక పథకమును తయారు చేసిపెట్టుకొన్నాడు. ఆ పథకము

ఏమనగా! తాను చెప్పినట్లు ఎవరికీ తెలియకుండా తానే మారువేషములో

వచ్చి తన విషయములను చెప్పిపోవడమే మార్గముగా పెట్టుకొన్నాడు. ఆ

మార్గమును అవలంభించినప్పుడు తాను మనుషులలో కలిసిపోవునట్లు

మనిషిగా మారువేషములో వస్తే తనకు తప్ప ఎవరికీ తెలియని ధర్మములను

తానే స్వయముగా చెప్పవచ్చును. అలా మారువేషములో చెప్పడము వలన

తాను చెప్పినట్లు ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియనప్పుడు తాను

మాట్లాడినట్లుండదు.


ప్రశ్న :- సాక్షిగా శరీరములో స్థబ్దతగా యున్న దేవుడు మనిషి అవతారములో

నికి భగవంతుడుగా వస్తే అప్పుడు పరమాత్మయైన దేవుడు శరీరములో

సాక్షిగా లేనట్లే కదా! అప్పుడు శరీరములో మొత్తము మూడు ఆత్మలు


కాకుండా జీవాత్మ, ఆత్మ రెండు ఆత్మలే ఉండును కదా! పరమాత్మ

ఉండడు కదా! అటువంటప్పుడు ప్రతి శరీరములోనూ ఎప్పటికీ ఎల్లవేళలా

మూడు ఆత్మలుండునని చెప్పిన మీ మాట అసత్యమగును కదా!యని

అడుగుచున్నాము. దీనికి మీరేమంటారు?


జవాబు :- మీరు సందర్భానుసారము అడుగవలసిన ప్రశ్ననే అడిగారు.

దానికి నేనేమనుచున్నానంటే, దేవుడు దొంగగా భగవంతునిగా శరీరమును

ధరించివచ్చాడు. ఒక శరీరమును ధరించి వచ్చుటకు దేవుని యొక్క

కోట్లాది అంశములలో ఒక అంశ చేతనే దేవుడు మనిషి శరీరము ధరించ

వచ్చును. దేవుడు మనిషి శరీరమును ధరించి మనిషివలె పనులు

చేయుచుండుట వలన ఆయనను భగవంతునిగా గుర్తు పట్టుటకు వీలుపడదు.

దేవుడు మనిషివలె వచ్చినప్పుడు ఆ మనిషిని 'భగవంతుడు' అని

అనవచ్చును. భగవంతుడు 25 భాగములుగల శరీరముతో యున్నవాడు,

కనుక ఆయనను దేవుడు అనుటకు వీలులేదు. దేవుని కోట్లాది అంశలలో

ఒకే అంశతో వచ్చిన భగవంతుడు దేవుడు కాదని, అనేక అంశలున్న

పరమాత్మ ఒకే అంశము గల భగవంతుడు కాడని చెప్పవచ్చును.

అందువలన పరమాత్మ పరమాత్మగానే ఉంటూ భగవంతునిగా భూమిమీదకు

వచ్చి మాట్లాడి తన ధర్మములను తెలియజేయుచున్నాడు. అలా చేయుట

వలన పరమాత్మ శరీరములోనే ఉన్నాడని చెప్పవచ్చును. సముద్రము

సముద్ర స్థానములోనే ఉంటుంది. అయితే సముద్రమునుండి నీటి బిందువు

గాలికి నీటితుంపరగా వచ్చి బయటపడింది అనుకొందాము. అప్పుడు ఆ

నీటి బిందువును సముద్రము అని అనము. నీటి బిందువే అని ప్రత్యేకమైన

పేరుతో పిలుస్తాము. అయితే ఆ బిందువు మొదట సముద్రములోనిదే

తర్వాత బయటకు వచ్చి నీటి బిందువుగా పలుకబడుచున్నది. ఆ నీటి


బిందువు ఏదో ఒక రకముగా సముద్రములో కలిసిపోతే అప్పుడు అది

సముద్రముగానే పిలువబడును. సముద్రములో ఉన్నది నీరే, నీటి

బిందువులోనూ నీరే అయిన దానివలన వాటిని వేరువేరుగా యున్నప్పుడు

కూడా రెండిటిని నీరేయని చెప్పవచ్చును. నీటి బిందువు అయినంత

మాత్రమున దానికి, సముద్రములోని నీటికి ఒకే ధర్మము కలదని

చెప్పవచ్చును. అదే విధముగా తాతయైన దేవునికి ఆయననుండే బయటికి

మారువేషములో మనిషి శరీరమును ధరించి వచ్చిన భగవంతునికి

ఏమాత్రము తేడా లేదని, ఇద్దరూ ఒక్కరేయని చెప్పవచ్చును. నీరు ఒక్కటే

అయినా సముద్రము వేరు, నీటి బిందువు వేరు అన్నట్లు పరమాత్మ

భగవంతుడు వేరువేరుగా యున్నా, ఇద్దరు ఒక్కటేయని తెలియవలెను.

సముద్రము నీటి బిందువును ఉదాహరణగా తీసుకొన్నట్లు పరమాత్మను

భగవంతున్ని వేరువేరుగా చెప్పవచ్చును. నీటి బిందువు వేరుగా యున్నప్పుడు

కూడా సముద్రము ఉన్న స్థానములో ఉన్నట్లే పరమాత్మ (దేవుని) నుండి

భగవంతుడు బయటికి వచ్చియున్నప్పుడు కూడా పరమాత్మ తన స్థానములోనే

ఉన్నాడు. అందువలన ధర్మ సంస్థాపన నిమిత్తము పరమాత్మ భగవంతునిగా

వచ్చినా ఆయన పరమాత్మగానే శరీరములో సాక్షిగా ఉండును. అప్పుడు

మనుషులు ఆయనను గుర్తింగలిగితే గొప్ప అదృష్టవంతులే యని

చెప్పవచ్చును. ఎందుకనగా! తాతయైన దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు

ఆయనను మనుషులు కనుగొనుట దుర్లభము. అంత కష్టమైన పనిని,

ఎవరికీ సాధ్యముకాని భగవంతున్ని గుర్తించడము జరిగితే ఆ జన్మలోనే

వానికున్న కర్మంతయూ కాలిపోయి సులభముగా మోక్షము లభించును.

ఈ విషయమును భగవద్గీతలో జ్ఞానయోగమందు తొమ్మిదవ శ్లోకమున

ఈ విధముగా చెప్పారు చూడండి.


 శ్లోకము 9.

జన్మకర్మదమే దివ్యమేవం యో వేత్తి తత్వతః |

త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున!

(సాకారము, నిరాకారము).


భావము :- “నేను మనిషి అవతారములో భూమిమీదికి వచ్చినప్పుడు నా

దివ్యమైన పనులను తెలిసి, నేను భగవంతునిగా వచ్చానని గ్రహించినవాడు

మరణించిన తర్వాత వేరే జన్మకు పోడు. వాడు నేరుగా నాలోనికి ఐక్యము

కాగలడు".


ఈ విధముగా దేవుడే భగవంతునిగా ఉన్నప్పుడు స్వయముగా

చెప్పాడు. ఇక్కడే కాక మిగతా రెండు దైవగ్రంథములలో కూడా సూచన

ప్రాయముగా ఈ విషయమును చెప్పియున్నాడు. ఈ శ్లోకమును బాగా

గమనించిన, కనిపించే భగవంతుడుగా వచ్చినవాడు తాతయైన దేవుడేయని

తెలిసినప్పుడు తప్పనిసరిగా ఆయనను నమస్కరింతురు. తెలిస్తే మోక్షము

లభించగలదని పై శ్లోకములో చెప్పారు. ఇక్కడ చెప్పిన దానిని బట్టి సృష్ఠి

పూర్వమున్న దేవుడు స్వయానా భూమిమీదికి అవతరించి తన జ్ఞానమును

చెప్పిపోవుచున్నాడని అర్థమగుచున్నది. ఆయన అలా స్వయముగా జ్ఞానమును

చెప్పిపోయినా ఆయన భగవంతునిగానే తెలియబడుచున్నాడు. కావున

దేవుడు వచ్చి బోధించే పనిని చేశాడని చెప్పుటకు ఆధారము లేదు.

ఆధారమును ఎవరికీ చూపలేము. ఒకవేళ వచ్చినవాడు తాతయైన

దేవుడేయని తెలిసినా ఇతరులకు చెప్పి నమ్మించలేము. ఈ శ్లోకము

తాతయైన పరమాత్మను గురించి చెప్పినది. తండ్రియైన దేవున్ని గురించి

చెప్పినది కాదు. ఈ విధముగా తాతయైన పరమాత్మను గురించి చెప్పిన

శ్లోకములు కొన్ని మాత్రమే గలవు. ఇప్పుడు మనము నాలుగు శ్లోకములను



చెప్పదలచుకొన్నాము. అందులో ఒక శ్లోకమును గురించి చెప్పాను. ఇప్పుడు

భగవద్గీత జ్ఞానయోగములోని 7, 8వ శ్లోకములను చెప్పుకొందాము.


 శ్లోకము 7.

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ! |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥

(నిరాకారము, సాకారము).


భావము :- “ఎప్పుడు భూమిమీద ధర్మములకు హాని ఏర్పడి అధర్మములు వృద్ధి

చెందుచున్నవో అప్పుడు నేను అవతరించుచున్నాను".


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ |

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥

(సాకారము).


భావము :- “సాధుజనులను అభివృద్ధి చేయుటకు దుష్టజనులను అనగా

అజ్ఞానులను లేకుండా చేయుటకు, చెడువారిని మార్చి మంచివారిగా

చేయుటకు ధర్మసంస్థాపనము చేయుటకు యుగయుగములోను నేను

రావలసియున్నది”.


ఈ విధముగా తాతయైన పరమాత్మయనబడు దేవుడు తాను చెప్పిన

తౌరాతు గ్రంథములో (భగవద్గీత గ్రంథములో) బోధించి యున్నాడు. ఈ

విధముగా బయట మనిషిగా అవతరించి బోధించువాడు సృష్ఠి పూర్వమున్న

దేవుడేయని తెలియుచున్నది. సృష్ఠి తర్వాత దేవుడు శరీరములో కార్యములను

నిర్వర్తించుటకు, తనను దేవునిగా ఆరాధించిన వాని కర్మలను క్షమించుటకు,

తీసివేయుటకు మాత్రమే ఉన్నాడు తప్ప ఆయన అవతరించి బోధించు

పనిని చేయడము లేదు. పరమాత్మయైన దేవుడే రెండు విధముల పాత్రను


పోషించుచున్నాడు. ఆత్మయైన దేవుడు శ్రద్ధకల్గిన వానికి శరీరములోనే

జ్ఞానమును అర్థమగునట్లు చేయుచున్నాడు. అంతేకాక శ్రద్ధలేని వానికి

అజ్ఞాన మార్గములో పోవునట్లు చేయుచున్నాడు. శరీరములలో ఉన్న

జీవులను బట్టి విధులను (పనులను) నిర్వహించుట వలన స్వయముగా

ఆయనే అజ్ఞానమును అభివృద్ధి చేసినట్లున్నది. అజ్ఞానము మనుషులలో

అభివృద్ధి అయ్యేకొద్దీ అధర్మ ఆచరణ ఎక్కువయి పోవును. ఆ లెక్కప్రకారము

శరీరములోని తండ్రియైన దేవుడు మనిషి యొక్క అభీష్టమును బట్టి

అజ్ఞానమును పెంపొందించగా దానివలన అధర్మములు తయారగుచున్నవి.

వాటిని కాదని ఖండించి ధర్మములను బోధించుటకు తాతయైన దేవుని

అవసరమున్నది. అట్లు ధర్మసంస్థాపన చేయు పని లేకపోతే ప్రజలు

అధర్మములను వదలి రారు. వారికి దేవుని ధర్మములు తెలియవు.


శరీరములోని అత్మయైన దేవుడు శరీరములో తన పనిని

నిర్వర్తించడము తప్ప బయట ధర్మములను తెలియజేయడము, జ్ఞానమును

బోధించడము చేయలేదు. తండ్రియైన దేవుడు శరీరములలో మనుషుల

కర్మనుబట్టి ప్రవర్తించుచూ జీవునికి కష్టసుఖములను అందించుచుండును.

అట్లే వాని శ్రద్ధను బట్టి జ్ఞానమునుగానీ, అజ్ఞానమునుగానీ అందించు

చుండును. మనుషుల శ్రద్ధ జ్ఞానము మీద తక్కువ, అజ్ఞానము మీద

ఎక్కువ ఉండుట వలన తన కర్తవ్యము ప్రకారము వారి శ్రద్ధనుబట్టి

వారికేది ఇష్టమైతే దానినే అందించుచుండును. మనుషుల శ్రద్ధ అజ్ఞానము

మీదనే ఉండుట వలన, ఆత్మయైన దేవుడు అజ్ఞానమునే అందించును.

మనిషి అజ్ఞానము వలన అధర్మములు అభివృద్ధి అగుచున్నవి. ఒక లెక్కలో

చెప్పితే తండ్రియైన దేవుడే మనిషి అభీష్టమునుబట్టి అధర్మములు అభివృద్ధి

అగునట్లు చేయుచున్నాడు. అంతవరకు ఏమాత్రము పనిలేని తాతయైన



దేవుడు ఆత్మచేత అభివృద్ధి అయిన అధర్మములను లేకుండా చేయవలసిన

బాధ్యతను చేపట్టి ఎవరికీ తెలియకుండా భూమిమీదికి మనిషివలె

అవతరించి తిరిగి ధర్మప్రతిష్టాపన చేయుచున్నాడు. ఇదంతా ఒక వింతగా

యున్నది కదా!


మనకు ఎట్లున్నా జరిగే పని మాత్రము అదియే. ఇక్కడ చెప్పిన

నాలుగు శ్లోకములు పరమాత్మను గురించి అనగా తాతయైన దేవున్ని గురించి

చెప్పినవేయని తెలియవలెను. ఇటువంటి శ్లోకములు తాతయైన దేవున్ని

గురించి చెప్పిన శ్లోకములు భగవద్గీతలో కూడా కొన్నే కలవు. తండ్రియైన

దేవున్ని గురించి చెప్పిన శ్లోకములు ఎక్కువ గలవు. తండ్రి తాత

తారతమ్యమును తెలియుటకు తండ్రియైన దేవున్ని గురించి చెప్పిన

శ్లోకములను మూడింటిని ఇక్కడ చూస్తాము.


పురుషోత్తమ ప్రాప్తి యోగములో 14వ శ్లోకము...

శ్లో॥ 14

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ |

(ఆత్మ).


భావము :- నేను సకల జీవరాసుల శరీరములలో అగ్ని దేవుడనైయుండి, వారు

తిను నాల్గు రకముల ఆహారమును, ఆహారములోని పోషక పదార్థములను

అరిగిపోవునట్లు చేయుచున్నాను.


మోక్ష సన్న్యాస యోగములో 61, 65 శ్లోకములు...


ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశార్జునతిష్ఠతి |

భామయన్ సర్వభూతాని యానా రుఢాని మాయయా॥

(పరమాత్మ).


భావము :- సర్వ జీవరాసుల శరీరములందు ఆ శరీరములకు, జీవులకు

అధిపతిగా వారి హృదయస్థానములో ఉన్నాను. అయస్కాంతములోని శక్తి

కనిపించకయుండి సూదిని కదలించుచున్నట్లు, శరీరములో యున్న నేను

కనిపించకయుండి సకల జీవులను కదలించుచున్నాను. అందువలన

శరీరముల ద్వారా అనేకమైన పనులు జరుగుచున్నవి.


శ్లో॥ 65.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే |

(గీతా సారాంశము).


భావము :- నన్నే తలంచుము. నీవు నాకు భక్తునిగాయుండుము. నన్ను

మాత్రము మ్రొక్కుము. నాకే పూజ చేయి. అట్లు చేయుట చేత నీవు నన్నే

పొందుదువు. ఈ మాటను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.


ఈ విధముగా ఆత్మయిన దేవుడు శరీరములో ఉండి, తాను చేయు

పనులను గురించి చెప్పడమే కాక తనను నమ్మి, తననే ఆరాధించిన

వానిని చివరి మరణ సమయములో తనయందే కలిసిపోవునట్లు చేయునని

చెప్పాడు. మనిషి ఆరాధించవలసినది శరీరములోని తండ్రియైన ఆత్మ

దేవున్నే. అదే విషయమునే శ్లోకములో చెప్పడము జరిగినది. జీవాత్మ

సక్రమముగా జ్ఞానమును తెలిసి ధర్మము ప్రకారము నడువగల్గినప్పుడు

వానికున్న సంచిత కర్మంతయూ కాలిపోవును. జ్ఞానమను అగ్నిచేత

కర్మంతయూ కాలిపోగా, వాడు కర్మలేని మనిషిగా మిగిలిపోవును. కర్మలేని

మనిషి చనిపోయిన తర్వాత వాడు మరొక జన్మకు పోడు. "జనన మరణ

సిద్ధాంతము" అను గ్రంథములో మేము ముందే 1980వ సంవత్సరమే

వ్రాసియున్నట్లు, చివరి మరణములో జీవుడు జన్మలకు పోకుండా



శరీరములోని తన ఆత్మయందే ఐక్యమై పోవును. జీవాత్మతో కలిసియున్న

ఆత్మ ప్రత్యేకముగా తయారైనదై పరమాత్మలో కలిసిపోవుచున్నది. ఈ

విధముగా శరీరములో ఆత్మగాయున్న దేవుడు జీవాత్మకు పరమాత్మకు

మధ్యవర్తిగా యుండి తనలోనికి చేరిన వానిని పరమాత్మలోనికి చేర్చును.

అందువలన ఆత్మ “నా ద్వారానే జీవాత్మ పరమ్మాతను చేరవలెనని”

దైవ గ్రంథములో ఒకచోట చెప్పియున్నారు. ఇట్లు శ్లోకములను భగవద్గీతలో

చూస్తే శరీరములో ఆత్మగాయున్న దేవున్ని గురించి చెప్పిన విషయము

తెలియును.


భగవద్గీతలో మిగతా శ్లోకములన్నిటిలో ఆత్మయైన దేవున్ని గురించి

చెప్పినవే గలవు. అయితే వాటిని మనిషి గుర్తించలేకపోయాడు. అట్లే

బహు తక్కువగాయున్న పరమాత్మ శ్లోకములను గురించి కూడా తెలియలేక

పోయాడు. అందువలన రెండు రకముల భగవద్గీత శ్లోకములను, ఖుర్ఆన్

గ్రంథములోని ఆయత్లను వివరించి చెప్పాము. బైబిలు గ్రంథములోని

వాక్యములను మొదటిలోనే చెప్పాము. యోహాను సువార్త ఐదవ

అధ్యాయములో 20 నుండి 27వ వాక్యము వరకు గల సమాచారమును

చెప్పి అక్కడ తండ్రి, కుమారుడు అని ప్రారంభమైన వాక్యములను గురించి

చెప్పి, వాటికి సాక్ష్యముగా మిగతా రెండు గ్రంథములలోని వాక్యములను

చెప్పుకొన్నాము. ఈ విధముగా లోతుగా జ్ఞానమును తెలియగలిగితే సృష్ఠి

పూర్వము దేవుడు ప్రపంచమును తయారు చేసిన తర్వాత ప్రపంచములో

జీవరాశులను సృష్టించుటకు తననుండి ఆత్మను, జీవాత్మను తయారు చేశాడు.

తన ప్రకృతిని, తన ఆత్మ, జీవాత్మను కలిపి విశ్వము, విశ్వములోని

జీవరాసులను సృష్టించాడు. ఈ విధముగా దేవుడు మొదట విశ్వమును

తయారు చేయుటకు 1) ప్రకృతి, 2) పరమాత్మ, 3) ఆత్మ, 4) జీవాత్మలుగా


విభజింపబడ్డాడు. అందులో ఒకటి జఢమైన జీవము లేని ప్రకృతి తయారు

కాగా, మూడు చైతన్యవంతములయిన ఆత్మలు తయారయినవి. అందువలన

సృష్ట్యాదిలో దేవుడు నాల్గు భాగములుగా తయారయినాడని చెప్పవచ్చును.

సృష్ఠికి పూర్వమున్న దేవుడు వేరుగా, సృష్ఠి తర్వాత యున్న దేవుడు వేరుగా

ఉన్నట్లు, దైవ గ్రంథములలో తెలియబడినది. సృష్ఠి పూర్వమున్న పరమాత్మ

స్వయముగా సృష్ఠి తర్వాత వచ్చిన, అతన్నే దేవునిగా గౌరవించవలెననీ,

ఆరాధించవలెననీ చెప్పినట్లు ఇంజీలు గ్రంథములో యోహాన్ సువార్త 20

నుండి 27 వరకు గల వాక్యములలో గలదు. అంతేకాక అంతిమ

దైవగ్రంథము ఖుర్ఆన్లో సూరా 3 ఆయత్ 18లో కూడా స్వయముగా

అల్లాహ్ యే “ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవము లేడని” చెప్పియున్నాడు.

అల్లాహ్ యే తనకంటే వేరుగాయున్న దేవున్ని ఆరాధించమనీ, ఆయనే

మనుషులకు నిజమైన దేవుడని (3-18) వాక్యములో చెప్పినట్లు

అర్థమగుచున్నది. ఇంజీలు గ్రంథములో యోహాన్ 5-20 నుండి 27

వరకు, అట్లే ఖుర్ఆన్ 3–18 వాక్యములోనూ మరియు భగవద్గీతలో రాజ

విద్యా రాజగుహ్య యోగమున 25, 34 శ్లోకములయందును శరీరమున

అధిపతిగాయున్న ఆత్మనే దేవునిగా ఆరాధించవలెనని స్వయముగా దేవుడే

చెప్పియున్నాడు.


మనుషులు మొత్తము 12 మతములుగా విభజింపబడియున్నా

అందులో ముఖ్యమైనవి, పెద్దవి మూడు మాత్రమే. అవియే హిందూ

(ఇందూ), క్రైస్తవ, ఇస్లామ్ మతములని చెప్పబడుచున్నవి. ఈ మూడు

మతముల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథమును తమ మత గ్రంథమని

చెప్పుకొంటున్నారు. వాస్తవముగా ఆ మూడు గ్రంథములు మత గ్రంథములు

కావు. ఆ మూడు దైవగ్రంథములు. అవి ఏ ఒక్క మతమునకు సంబంధము



లేవు. మూడు దైవ గ్రంథములు సమస్త మానవులకు సంబంధించినవని

చెప్పవచ్చును. మూడు దైవగ్రంథములలో దేవుని జ్ఞానము సంపూర్ణముగా

యున్నది. సృష్ఠిని సృష్టించిన దేవుడు సృష్టిని పాలించుటకు దేవున్ని

నియమించి ఆయననే ఆరాధించమనీ, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడని

చెప్పడము జరిగినది. సృష్ఠి పూర్వమున్న దేవుడు, సృష్ఠి తర్వాత ఆయన

పని చేయక తనకు బదులుగా తనకు పుట్టి, తన కుమారుడైన తన ఆత్మనే

దేవునిగా నియమించి సర్వ అధికారములు ఆయనకే ఇచ్చి ఆయనే అందరికీ

దేవుడని ఆయననే ఆరాధించవలెనని చెప్పడమైనది. అలా చెప్పి విశ్వమంతా

వ్యాపించియున్న పరమాత్మ ఊరక సాక్షిగా ఉండిపోయాడు. ఆయన ఎవరికీ

ఏ అవసరము లేనివాడయినా దైవ ధర్మములకు ముప్పు కలిగి అధర్మములు

చెలరేగినప్పుడు పరమాత్మయైన దేవుడు మనిషివలె అవతరించి తన

ధర్మములను తిరిగి మనుషులకు తెలియజేయును. మానవ రూపమున

మానవులకు తన ధర్మములను తెలిపిన భగవంతుడు తిరిగి పరమాత్మగానే

మారిపోవును.


ఇంతవరకు భూమిమీద ఉన్న జ్ఞానులకు దేవున్ని గురించి కొంత

జ్ఞానము తెలిసియున్నా సృష్ఠి పూర్వమున్న దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు

అను రెండు రకముల దేవుడు తెలియడు. నేడు అన్ని మతములవారు

“దేవుడు ఒక్కడే” అను మాటను అనుచుందురు. తాము ఒక్క దేవున్ని

ఆరాధించుచుండినా, పరమాత్మ దేవున్నా? లేక ఆత్మ దేవున్నా? అను

విషయము తెలియదు. దేవుడు తాత దేవుడుగా, తండ్రి దేవుడుగా రెండు

విధముల విభజింపబడియున్నాడని జ్ఞానులు అన్నా, మూడు మతముల

వారికి తెలియదు. ఈ విషయము మూడు దైవ గ్రంథములలో చెప్పియున్నా

ఎవరి గ్రాహితమునకు రాలేదు. ఈ విషయమును బయటికి విపులముగా


చెప్పు వారిలో, అనగా వివరించి చెప్పువారిలో బహుశా మేమే మొదటి

వారమవుతామని అనుకొంటున్నాను. నా మాటను ఎవరూ ఖండించుటకు

వీలు లేకుండా నా భావమునకు సరిపడు వాక్యములు దైవగ్రంథములలో

ముందే వ్రాసియుండుట వలన ధైర్యముగా నేను ఈ విషయమును బయటికి

చెప్పుచున్నాను. ఇంతవరకు దేవుళ్ళు ఇద్దరనీ, ఒకరు పని చేయని దేవుడనీ,

రెండవ వాడు పనిగల దేవుడనీ చెప్పడమేకాక సృష్ట్యాది తర్వాత దేవుడు

తననుండి ఒక ప్రకృతిని, రెండు ఆత్మలను తయారు చేశాడని కూడా

చెప్పాము. సృష్ఠి తర్వాత దేవుడు తననుండి విడివడిన ప్రకృతి, ఆత్మ,

జీవాత్మలను మరియు తనను కలుపుకొని నాలుగు భాగములుగా తయారయి

ఉన్నాడు.


సృష్ఠికి పూర్వము దేవుడు దేవుడుగానే ఒక్కడే ఉండేవాడు. అప్పుడు

విశ్వము లేదు అనగా ప్రకృతి లేదు. తాను ఒక్కడుగా దేవుడున్నప్పుడు

ఆయనకు పేరు, రూపము, పని ఉండేది. అప్పుడు మనము లేము.

కావున దేవుని రూపము ఏదో ఎట్లుండేదో ఎవరి ఊహకు కూడా తెలియదు.

అట్లే పేరు ఏమని ఉండేదో ఎవరికీ తెలియదు. ఫలానా పేరు ఉండవచ్చు

అని చెప్పుటకు వీలులేదు. ఆయన పనిని మాత్రము చెప్పవచ్చును. సృష్ఠిని

తయారు చేసిన వాడు కనుక దేవున్ని సృష్టికర్తయని అనవచ్చును. సృష్ఠిని

తయారు చేసిన తర్వాత తాను తయారు చేసిన ఆత్మకంటే వేరుగా యున్నాడు

కావున పరమాత్మయని గుర్తుగా అంటున్నాము. అలాగే నేడు పరమాత్మ

అయిన దేవునికి రూపముగానీ, పేరుగానీ, పనిగానీ లేదని చెప్పుచున్నాము.

సృష్ఠి తర్వాత పరమాత్మ అయిన దేవుడు నామ, రూప, క్రియారహితుడుగా

యున్నాడని చెప్పుచున్నాము.



చైతన్యవంతమయిన ప్రపంచమును చైతన్యవంతమైన దేవుడే

నడపాలి. అయితే సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్ఠి తర్వాత చైతన్యము

లేనివానిగా మారిపోయాడు. అలాగే దృశ్యరూపమైన ప్రపంచమును

నడుపుటకు దృశ్యరహితమైన వాడు పనికి రాడు. దృశ్యమైనవాడు అనగా

ఆకారమున్నవాడు కావలెను. అయితే సృష్టికర్తయైన దేవుడు తాను రూపము

లేనివాడుగా మారిపోయాడు. అలాగే కార్యరూపమైన ప్రపంచమును

నడుపుటకు కార్యములు చేయువాడు కావలెను. అయితే సృష్టికర్తయైన

దేవుడు కార్యరహితునిగా మారిపోయాడు. అందువలన రూప, నామ,

క్రియలు గల ప్రపంచమును రూప, నామ, క్రియలు గల దేవుడే నడపాలి.

అందువలన సృష్టికర్తయైన దేవుడు తప్పనిసరిగా ప్రపంచమును నడుపుటకు

మరొక దేవున్ని ప్రపంచమును తయారుచేసినట్లే తయారుచేశాడు. తననుండి

విడదీసిన ఆత్మను ప్రపంచమును నడుపుటకు సరియైన దేవునిగా

నిర్ణయించాడు. ఆత్మను తయారు చేసిన సృష్టికర్త ఆత్మకంటే వేరుగా

పరమాత్మగా యుండుట వలన పరమాత్మ ప్రపంచముతో సంబంధము

లేని దేవునిగా తయారైనాడు. ప్రపంచమునకు సంబంధమైన దేవునికంటే

వేరుగాయుంటూ ప్రపంచములోని మనుషులందరికీ 'నా కుమారుడైన

ఆత్మే దేవుడుగానీ, నేను ఏమాత్రము మీకు దేవున్ని కాదని' చెప్పాడు.

ప్రపంచములో యున్న మనిషి ఎవడయినా ప్రపంచమునకు దేవుడయిన

వానినే ఆరాధించాలిగానీ పరమాత్మను ఆరాధించకూడదని కూడా తెలిపాడు.

పరమాత్మ ప్రపంచముతో సంబంధము లేనివాడైనందున పరమాత్మ

విషయము ఏ మానవునికీ తెలియదు. పరమాత్మ తండ్రిగా యుండగా,

ఆత్మ కుమారుడుగా యున్నాడు. కుమారుడు, తండ్రి ఇద్దరు దేవుళ్లనియే

చెప్పవచ్చును. దానినే ఇంతవరకు 'సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత


దేవుడు' అని చెప్పుకొన్నాము. నీటికి పాత్ర ఆధారమైనట్లు ఆత్మకు జీవాత్మకు,

నీరుకు పాత్రలాగ, ప్రకృతి గలదు. నీటికి ఆధారమైన పాత్ర అవసరమును

గ్రహించిన దేవుడు ఆత్మ, జీవాత్మలను తయారు చేయుట కంటే ముందే

ప్రకృతిని తయారు చేశాడు. అందువలన దేవుని నుండి ముందు ప్రకృతి

తర్వాత ఆత్మ, ఆ తర్వాత జీవాత్మ తయారైనవి. దేవుడు మూలకర్తగాయుండి

మొదట పాత్రయిన ప్రకృతిని, తర్వాత పాత్రలో నీరుగా నిలబడు ఆత్మను,

జీవాత్మను తయారుచేశాడు.


ప్రశ్న :- దేవుడు మొదట పాత్రగాయున్న ప్రకృతిని తయారు చేశాడు కదా!

ఆ పాత్రను ఆధారము చేసుకొని ఉండుటకు అవసరమైన జీవాత్మయను

నీరును తయారు చేసియుంటే సరిపోవును కదా! అట్లుకాక ఆత్మను కూడా

తయారు చేసి జీవాత్మతోపాటు పాత్రలోనే ఉంచాడు. అప్పుడు ఒకే పాత్రలో

జీవాత్మ, ఆత్మ రెండు గలవు. సృష్టికర్తయైన పరమాత్మ కూడా నీరుగానే

ఉన్నాడు కావున మూడు ఆత్మలు ఏర్పడుచున్నవి. ఒకటి పరమాత్మ, రెండు

ఆత్మ, మూడు జీవాత్మ. మూడు ఆత్మలు ఒక ప్రకృతి విశ్వములో ఉన్నవి.

ఇవి నాలుగు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ప్రకృతి జీవము లేనిది కాగా,

జీవమున్న వాడు జీవాత్మ. ప్రకృతికి జీవాత్మకు స్వయంశక్తి లేదు. ప్రకృతిని,

జీవున్ని కదిలించుటకు చైతన్యమునిచ్చుటకు జీవాత్మను ప్రకృతిలో

ఆడించుటకు ఆత్మయను దేవుడు అవసరమైనాడు. ఆత్మను దేవునిగా

పరమాత్మ చేసి తాను ముగ్గురిని చూస్తూ సాక్షిగా ఉండిపోయాడు. ఇక్కడ

ఆత్మ అవసరము ఎందుకు వచ్చినది? పరమాత్మయే ఆత్మ పనిని చేసి

యుండవచ్చును కదా! అన్నది ప్రశ్న, దీనికి మీరేమంటారు?

జవాబు :- ఈ ప్రశ్నను సులభముగా ఎవరయినా అడుగవచ్చును. ఇది



సమయానుకూలముగా అడుగవలసిన ప్రశ్నయే. అయితే దీనికి మా జవాబు

ఏమనగా! ఒక ఆట ఆడవలసి వచ్చినప్పుడు దానికి ఒకవైపు కొందరు,

మరియొకవైపు కొందరు ఉండుట సహజము. ఒక ఫుట్బాల్ ఆటగానీ,

క్రికెట్ ఆటగానీ, ఏ ఆటలోగానీ సమఉజ్జీలుగా రెండువైపుల ఆటగాళ్లు

ఉండడము సహజము. 'విశ్వము' అను మైదానములో 'జగత్తు' అను ఆట

ఆడుటకు ఒకవైపు ఇద్దరు మరొక వైపు ఇద్దరు మొత్తము నలుగురు ఆట

గాళ్ళు అవసరము. ఉదాహరణకు నలుగురు కలిసి టెన్నీస్ ఆట ఆడడము

చూస్తుంటాము. అలాగే 'జగత్ నాటకము' అను ఆటలో నలుగురు ఆట

గాళ్లున్నారు. వారిలో ప్రకృతి పరమాత్మ ఒకవైపు, ఆత్మ, జీవాత్మ మరొవైపు

ఉన్నారు. ఈ ఆటలో ఒకవైపు గల ప్రకృతి పరమాత్మలలో ప్రకృతి

ముందు గలదు. ప్రకృతి వెనుకే పరమాత్మ గలడు. అందువలన ప్రకృతే

కనిపిస్తూ ఉంటుంది, వెనుకగల పరమాత్మ కనిపించడు. ఇంకొకవైపు

జీవాత్మ ఆత్మ జోడిగా యున్నారు. ఆటలో ముందున్నవాడు జీవాత్మ వెనుక

యున్నవాడు ఆత్మ. అందువలన జీవాత్మే కనిపిస్తాడు ఆత్మ కనిపించదు.

ఈ జగత్ అను ఆటలో ముందున్నవారు కనిపిస్తారు, వెనుకయున్నవారు

కనిపించరు.


ప్రకృతి వెనుకయున్న పరమాత్మ పని చేయడుగానీ దేవుని

సంకల్పము ప్రకారము ప్రకృతి పని చేయగలదు. జీవుని వెనుకయున్న

ఆత్మ, జీవుళ్లందరికీ దేవుడైయున్నా మరొక విధముగా ఆత్మే అన్ని పనులు

చేయుచున్నది. ఆత్మ చేయు పనులన్నీ జీవాత్మ చేయునట్లు బయటికి

కనిపించగా తన వెనుక ఆత్మే పని చేయుచున్నాడని తెలియని జీవాత్మ

తానే అన్ని పనులు చేయునట్లు భ్రమించుచున్నాడు. వెనుక ఆడించువాడు

ఆడువాడు ఆత్మయిన దేవుడని జీవుడు తెలియలేకపోయాడు. విశ్వము


అను మైదానములో జగతియను నాటకములో ప్రకృతివైపు తాతయైన దేవుడు

కలడు. అలాగే జీవునివైపు తండ్రియైన దేవుడు గలడు. ఒక వైపుగల

ప్రకృతి పరమాత్మలలో పరమాత్మను ప్రకృతి తన భర్తగా చెప్పుకోవడము

జరుగుచున్నది. దాని ప్రకారము పరమాత్మకు ప్రకృతి భార్యగా యున్నదని

చెప్పవచ్చును. మరొకవైపు గల ఆత్మ జీవాత్మలలో జీవాత్మ ఆత్మను తండ్రిగా

చెప్పుకోవడము జరుగుచున్నది. అట్లే ఆత్మ జీవాత్మకు తండ్రిగా గలడు.

ఇది ఏ వైపు ఉన్నవారికి ఆ వైపు బాంధవ్యమును తెలిపాము. ఇప్పుడు

అవతలి వారికి, ఇవతలివారు ఏమవుతారో, ఇవతలివారికి అవతలివారు

ఏమవుతారో తెలుసుకొందాము.


ప్రకృతి వైపునుండి రెండవ వైపుగల జీవాత్మ ప్రకృతికి కొడుకు

కావలెను. అలాగే పరమాత్మకు ఆత్మ కుమారుడు అగును. తండ్రియైన

పరమాత్మకు ఇష్టమైన కుమారుడు ఆత్మకాగా, ప్రకృతికి ఇష్టమైన కొడుకు

జీవాత్మయని తెలియవలెను. భగవద్గీత గుణత్రయ విభాగ యోగమున

మూడు, నాలుగు శ్లోకములలో ఇదే విషయమును చెప్పారు చూడండి...


శ్లో॥ 3. మమ యోని ర్మహద్భహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |

సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత ! ॥

(ప్రకృతి, పరమాత్మ).


భావము :- ఈ అచేతన ప్రకృతి నాకు భార్యగా యుండగా, దానికి

నేను బీజదాతనయిన భర్తగాయున్నాను. మా ఇరువురికి సకల జీవరాసులు

ఉద్భవించుచున్నవి.

శ్లో॥ 4. సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః ॥

తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ॥

(ప్రకృతి, పరమాత్మ).


భావము :- అనేక గర్భములయందు పుట్టుచున్న సకల జీవరాసులకు తల్లి

ప్రకృతికాగా, బీజదాతనయిన నేను తండ్రిగా యున్నాను అని తెలియుము.


ఈ రెండు శ్లోకముల వలన సకల జీవులకు తండ్రి తల్లి పరమాత్మ

ప్రకృతియని తెలిసిపోవుచున్నది. అయితే ప్రకృతియైన తల్లి పోలికలు,

తల్లి లక్షణములు జీవాత్మకు ఎక్కువగా యుండుట వలన ప్రకృతి మాతకు

ఇష్టమైన కొడుకు జీవాత్మయని చెప్పవచ్చును. అట్లే పరమాత్మ లక్షణములు,

పోలికలు ఆత్మకు ఎక్కువగా యుండుట వలన పరమాత్మకు ఇష్టమైన కొడుకు

ఆత్మయని చెప్పవచ్చును. ఆత్మ తన తండ్రి పరమాత్మయని చెప్పుచున్నది.

అయితే జీవాత్మ తండ్రి ఎవరో తెలియదు. తల్లి ప్రకృతియని తెలుసు.

అందువలన తన తండ్రిని గురించి తెలియనివాడై యున్నాడు. కేవలము

తల్లి ప్రకృతియని మాత్రము తెలుసు. ఇది ప్రస్తుతము ప్రపంచములో

ఆత్మ, పరమాత్మలకు జీవాత్మ ప్రకృతికిగల బంధుత్వమని తెలిసినది.

ఇదంతయూ ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీత ద్వారా తెలియబడు

జ్ఞానము. అదే భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగములోని జ్ఞానము

వలన మరియు క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అను అధ్యాయములోని జ్ఞానము

వలన తెలియబడు ప్రకృతిని పరమాత్మను, ఆత్మను జీవాత్మను నలుగురినీ

కలిపి ఒక చిత్రముగా చూపవచ్చును. విశ్వము అను వేదిక మీద జగత్తు

అను నాటకములో పాత్రలు, పాత్రధారులు తెలిశారు కదా! అది

అర్థమగుటకు మనిషి శరీరములో తెలియబడిన జ్ఞానము ప్రకారము

చిత్రించుకొని చూచిన అది జ్ఞానముతో సమానముగా కనిపించును. మూడు

ఆత్మలు, ఒక ప్రకృతిని చిత్రించి చూపవచ్చును. ఆ చిత్రమును “దేవుని

చిహ్నము” అని చెప్పవచ్చును. దేవుని చిహ్నమునే “దేవుని గుర్తు”, “దేవుని

ముద్ర”యని కూడా చెప్పవచ్చును.


గతములో 'దేవుని చిహ్నము' అను గ్రంథమును వ్రాసి

యున్నాము. అందులో మూడు ఆత్మలను ఒక ప్రకృతిని చిత్రించి

చూపాము. ఆ చిత్రము నేడు గత నలభై సంవత్సరములనుండి అర్థమగునట్లు

చిత్రపటముగా చెప్పుచున్నాము, చూపుచున్నాము. నేను రెండు

సంవత్సరముల క్రితము 'దేవుని చిహ్నము' అను పేరుతో వ్రాసిన గ్రంథములో

'దేవుని చిహ్నము' అను చిత్రపటము అందరికీ క్రొత్తగా కనిపించినది.

అయినా కొందరికి అందులో ఇమిడిన సారాంశము గొప్పగా కనిపించినది.

‘దేవుని చిహ్నము’, ‘దేవుని ముద్ర' రెండూ ఒక్కటేయని మేము చాలామార్లు

చెప్పాము. దేవుని చిహ్నము అనగా దేవునికి ఉన్నంత విలువగలది యని

అర్థము. దేవుని ముద్ర లేక దేవుని చిహ్నములో దేవుని నాలుగు భాగములు

మరియు దానికి అనుబంధమైన కర్మ, గుణములు, కాలము అన్నియూ

తెలియబడునట్లు ఉండును.


దేవుని జగత్ నాటకములో దేవుడు ప్రకృతి ఒకవైపు కాగా, ఆత్మ

జీవాత్మ రెండు మరొక వైపు ఉన్నవని చెప్పుకొన్నాము. దేవునివైపు దేవుడు

కనిపించలేదు ప్రకృతి కనిపించుచున్నదని, ఆత్మవైపు ఆత్మ కనిపించడము

లేదు జీవాత్మ ఉన్నట్లు తెలియుచున్నది. ఈ విధముగా విశ్వవేదిక మీద

జగత్ నాటకము ఒక ఆటగాయున్నది. ఈ ఆటలో రెండు వైపులా

అధిపతులున్నారు. ప్రకృతివైపు పరమాత్మ అధిపతికాగా, జీవునివైపు ఆత్మే

అధిపతిగా యున్నది. పరమాత్మ భాగములో ప్రకృతి యుండగా, ఇప్పుడు

నీవు అనగా జీవాత్మవు ఆత్మవైపు ఉన్నావు. నీకు అధిపతిగా నీ వైపు

ఆత్మయున్నది. అటువైపు యున్న పరమాత్మ విషయము జీవునికి ఏమాత్రము

తెలియదు. జీవునికి (నీకు) ఎదురుగానున్న ప్రకృతి మాత్రము కనిపించు

చున్నది. అట్లే నీ వెనుక (జీవునికి వెనుక) యున్న ఆత్మ కూడా జీవునికి



కనిపించక పోవడము వలన ఒకవైపు నేనే ఉన్నానని జీవుడు

అనుకొంటున్నాడు. అటువైపు ప్రకృతి వెనుకయున్న పరమాత్మ తెలియలేదు.

తనవైపు తన వెనుకయున్న ఆత్మ కనిపించలేదు. ఎదురుగా ప్రకృతి జఢముగా

కనిపించుచున్నది. ఇటువైపు తాను ఒక్కడే పని చేయునట్లు జీవుడు

అనుకొంటున్నాడు. తనవైపు అన్ని కార్యములను ఆత్మే చేయుచున్నాడని

జీవునికి తెలియలేదు. తన ప్రమేయము లేకుండా పనులు జరుగుచున్నవని,

ఆత్మే అన్నీ చేయుచున్నదని తెలియకపోవడము వలన తనకు సంబంధము

లేని కార్యములనన్నిటినీ తానే చేసినట్లు అనుకొంటున్నాడు.


జగత్ నాటకము అను ఆటలో పక్షము, ప్రతి పక్షము అను రెండు

వైపులలో ఒకవైపు పరమాత్మ ప్రకృతి కలదని చెప్పుకొన్నాము. ప్రకృతి

వెనుకయున్న దేవుడు అనగా పరమాత్మ ఏమాత్రము పని చేయనివాడై

యున్నాడు. ఆ ప్రక్కన గల ప్రకృతి గ్రహాలు, భూతాల ద్వారా పని

చేయుచున్నది. పరమాత్మ పని చేయనివాడై అవసరమైనప్పుడు ప్రకృతికి

సూచనలిచ్చువాడుగా యున్నాడు. ప్రపంచములో మానవులకు, జంతువులకు

సకల జీవరాసులకు ఆత్మే దేవుడుగా యున్నాడు. ఆత్మను దేవుడుగా

యున్నట్లు పరమాత్మయే నిర్ణయించి ఆత్మకు అధికారమును ఇచ్చాడు.

అందువలన మూడు దైవగ్రంథములలోనూ ఆత్మనే దేవునిగా వర్ణించారు.

నేడు ముస్లీమ్లు అల్లాహ్ అని చెప్పునది, క్రైస్తవులు యెహోవా అని చెప్పునది,

హిందువులు దేవుడు అని చెప్పునది ఆత్మ అయిన దేవున్నే. ఇదంతయూ

తెలియుటకు వ్రాసుకొన్న చిత్రపటమును దేవుని చిహ్నము లేక దేవుని

ముద్ర అని అంటున్నాము. దేవుని ముద్రను వివరముగా తెలియగలిగితే

దేవుడయిన ఆత్మ విషయము జీవుని విషయము తెలియవచ్చును. అట్లే

మరొకవైపు గల ప్రకృతి పరమాత్మల విషయమును కూడా తెలియవచ్చును.


అందువలన దేవుని ముద్రను తెలియుటకు ప్రయత్నిద్దాము.


గతములో “దేవుని చిహ్నము” అను గ్రంథమును వ్రాశారు కదా!

అందులోని జ్ఞానమును సంపూర్ణముగా చెప్పారు కదా!యని ఇప్పుడు

మళ్లీ క్రొత్తగా చెప్పునదేమున్నది? యని కొందరు అడుగవచ్చును. దానికి

నా సమాధానము ఏమనగా! నీ శరీరములోని ఆత్మే నీకు, సకల జీవులకు

మానవులందరికీ దేవుడుగా యున్నది. అంతేకాక అదే ఆత్మే మనుషులకు

కార్యకర్తగా కూడా యున్నది. ఆత్మ నీకు యజమానిగా (ఈశ్వరుడుగా)

అధిపతిగా ఉన్నది. అదే ఆత్మే ఇంకొక విధముగా నీకు సేవకుడుగా,

కార్యకర్తగా, పని మనిషిగా యున్నది. ఆత్మ అధిపతిగాయుండి సేవకుడిగా

ఉండడము ఆశ్చర్యమే అయినా వాస్తవముగా జరుగుచున్నది, ఉన్నది

అంతేనని తెలియవలెను. ఆత్మ, జీవాత్మ వైపునుండి తెలుసుకొంటే కాలము,

కర్మమును అనుసరించి ఆత్మ దేవునిగా యున్నది. అలాగే కర్మను

ఆచరించుచూ ఆత్మ సేవకునిగా ఉన్నదని తెలియునట్లు, ఆ విధముగా

ఆత్మజ్ఞానము అర్థమగునట్లు గీచిన చిత్రమే దేవుని చిహ్నము. 'దేవుని

చిహ్నము' అను గ్రంథములో శరీర అంతర్భాగమున ఏడు స్థానములు

లేక ఖురాన్లో చెప్పిన ఏడు ఆకాశములు మొదలుకొని కర్మమును

కర్మచక్రముగా, కాలమును కాలచక్రముగా, ఆత్మను బ్రహ్మనాడిగా,

పరమాత్మను ఏడవ స్థానములోగల బ్రహ్మచక్రముగా, జీవుడు జీవునికి

అంటుకొనియున్న గుణములను గుణచక్రముగా చూపడము జరిగినది.

ఈ నాలుగు చక్రముల చట్రమును బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రములుగా



గీచి చూపడమైనది. అలా చూపిన చిత్రపటమును దేవుని చిహ్నము యని

పేరు పెట్టి చెప్పడమైనది. “దేవుని చిహ్నము” అను పేరుతో వ్రాసిన

గ్రంథములో నాల్గు చక్రముల వివరము సంపూర్ణముగా కలదు. నాలుగు

చక్రముల వివరములో ఆత్మసంబంధమైన మూడు ఆత్మలు గలవు. అట్లే

ప్రకృతి సంబంధమైన కాల, కర్మ, గుణముల వివరములు గలవు.

బ్రహ్మనాడిలో ఆత్మ వివరము చెప్పడమేకాక, ఏడు ఆకాశములుగా బ్రహ్మనాడి

కలదని దానినే ఏడు నాడీకేంద్రములుగా కూడా చెప్పుచున్నామని వివరించి

చెప్పడమైనది. ఈ నాల్గు చక్రముల చిత్రపటము అనగా దేవుని చిహ్నము

అనునది సృష్ట్యాదినుండి లేదు. ఇప్పుడే క్రొత్తగా చెప్పడము వలన

నమ్మశక్యము కాకుండా ఉండవచ్చును. అందువలన కొందరు దీనికి

శాస్త్రాధారము ఉందా?యని అడుగవచ్చును. దానికి నా సమాధానము

ఏమనగా! దైవగ్రంథము అయిన ఖుర్ఆన్లో సూరా ఐదు, ఆయత్ రెండులో

దేవుని చిహ్నములను గురించి మహాజ్ఞాని జిబ్రయేల్ చెప్పియున్నారు. అక్కడ

ఒక్కచోటే కాకుండా 22వ సూరాలో 32వ ఆయత్నందు కూడా

చెప్పియున్నారు అని ఇంతకుముందు వ్రాసిన “దేవుని చిహ్నము”

గ్రంథములోనే వ్రాశాను. దేవుని చిహ్నమును గురించి దైవ గ్రంథములో

చెప్పియున్నా దానిని ముస్లీమ్లు గానీ, ఇతరులుగానీ గ్రహించుకోలేదని

చెప్పాము. అందరూ గ్రహించుకొనునట్లు మేము వ్రాసిన “దేవుని చిహ్నము”

గ్రంథములో వ్రాశాము. అంతిమ దైవగ్రంథములో వ్రాసినది చూస్తాము.

(5–2) “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ చిహ్నాలను గానీ,

ఏ నిషిద్ధ మాసాన్ని గానీ అగౌరవపరచకండి" (22-32) “ఇది

కూడా తెలుసుకోండి. అల్లాహ్ చిహ్నాలను ఎవరయినా

గౌరవిస్తున్నారంటే అది వారి హృదయములలోని భక్తి భావన

వలననేయని తెలియండి." ఈ వాక్యాలను అనుసరించి, ఈ వాక్యములను


ఆధారముగా చేసుకొని "దేవుని చిహ్నము” అను గ్రంథములో దేవుని

చిహ్నముల చిత్రపటములను గీచి చూపించాను. వాస్తవము చెప్పితే నేను

ఖుర్ఆన్ గ్రంథములో ఈ వాక్యములను చూచినది బహుశా ఆరు నెలల

క్రితమే అయితే, ఈ చిహ్నముల బొమ్మలను వ్రాసినది దాదాపు 40

సంవత్సముల క్రితము. ఈ వాక్యములను చూడనిదే అప్పుడు ఎలా వ్రాశారు?

అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ప్రథమ దైవగ్రంథములో

అక్షర పరబ్రహ్మ యోగము అను అధ్యాయములో సూక్ష్మముగా పరోక్షముగా

దేవుని చిహ్నమును గురించి కనిపించగా, అక్కడ తెలిసిన దానిని నా మొదటి

గ్రంథమయిన “ప్రబోధ" అను గ్రంథములో 1980వ సం॥లో అచ్చు

వేయించడము జరిగినది. దీనినిబట్టి 36 సంవత్సరముల క్రితమే “దేవుని

చిహ్నము” అను చిత్రము యొక్క నమూనా అచ్చయినదని తెలియుచున్నది.

అదే చిత్రముతో అదే పేరుతో దాదాపు సంవత్సరము క్రిందట

గ్రంథమును వ్రాయడము జరిగినది. ఆ గ్రంథములోని ఒక్క విషయము

కూడా ఇంతవరకు ఈ గ్రంథములో వ్రాయలేదు. ఇంతవరకు ఈ

గ్రంథములో వ్రాసినది ఆ గ్రంథములోని విషయముకంటే వేరుగా యున్నది.

అక్కడ వ్రాసిన విధానము వేరు, ఇక్కడ వ్రాసిన విధానము వేరుగా యున్నది.

ఆ గ్రంథమును ఒకమారు చదివి చూడండి. అక్కడ దేవుని చిహ్నమును

తండ్రియైన దేవునికి సంబంధించి వర్ణించి వ్రాయడము జరిగినది. ఇప్పుడు

“దేవుని ముద్ర” యను పేరుతో వ్రాసిన సమాచారము అంతయూ తాతయైన

దేవున్ని గురించి వ్రాసినది కలదు. తండ్రియైన దేవున్ని అందరూ

ఆరాధించడము వలన, మనము తెలిసిన జ్ఞానమంతయూ తండ్రియైన

దేవునిదే అయినందు వలన, మేము మొదట తండ్రియైన దేవుని విధానము

తెలియునట్లు దేవుని చిహ్నమును చిత్రించడము, ఆ చిత్రమును తండ్రియైన



దేవునికి సంబంధించిన కాల, కర్మములను, ఆయన పని విధానమును

తెల్పునట్లు వివరించి చెప్పడము జరిగినది. ఆ గ్రంథములో దేవుని చిహ్నము

యొక్క చిత్రపటమును అక్కడ చెప్పిన అర్థమును (వివరమును) ఆ

గ్రంథములో నుండి సేకరించి ఇక్కడ మీకు చూపడము జరుగుచున్నది.

ఇది చూచిన తర్వాత తాతయైన దేవున్ని గురించిన వివరమును అదే

చిహ్నమునుండి చూపడము జరుగుచున్నది. ఈ గ్రంథములో చెప్పిన

రెండు విధానములను జాగ్రత్తగా గ్రహించవలెనని తెలుపుచున్నాను.


ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. 29-44వ వాక్యములో

(29-44) “అల్లాహ్ భూమిని, ఆకాశములను సత్యబద్దముగా సృష్టించాడు.

ఆకాశములను భూమిని పరమార్థముతో సృష్టించాడని తెలిసితే ఇందులో

గొప్ప నిదర్శనము దొరుకుతుంది” అని కలదు. అయితే ఇందులో 'భూమి,

ఆకాశములను' అని అన్నప్పుడు భూమి ఆకాశము స్థూలమైన కంటికి

కనిపించు విషయమే కదా! అని ఎవరయినా అనుకొను అవకాశము గలదు.

అక్కడ చెప్పినది ఒక్క ఆకాశమునుగాదు 'ఆకాశములు' అని చెప్పాడు.

మనకు ‘ఆకాశము’ కనిపించుచున్నదిగానీ, 'ఆకాశములు' కనిపించలేదు.

ఈ మాటతోనే ఇందులో కనిపించని జ్ఞానమున్నదని తెలిసిపోవుచున్నది.

మనము బాగా ఆలోచిస్తే ఖురాన్ గ్రంథము తౌరాత్ గ్రంథము యొక్క

ఆధారముతో చెప్పబడినది. ఆ విషయము ఖురాన్ గ్రంథములోనే కలదు.

తౌరాత్ గ్రంథమును ఖురాన్ గ్రంథము ధృవీకరించుచున్నదని చెప్పినప్పుడే

తౌరాత్ గ్రంథములోని జ్ఞానమే ఖురాన్లో కలదని తెలిసిపోవుచున్నది.

తౌరాత్ గ్రంథములో చెప్పిన వాక్యములన్నియూ శరీర అంతరంగములోనే

చెప్పడము జరిగినది. చివరికి దేవుడు మనిషి శరీరములో కూడా కలడని

చెప్పడమైనది. అదే జ్ఞానమునే ఖురాన్లో చెప్పుట వలన ఖురాన్లోని


ఆయత్లు శరీరములో దాగియున్న జ్ఞానమునే చెప్పాయని తెలియవచ్చును.

భగవద్గీత ప్రకారమైనా, ఖురాన్ ప్రకారమైనా 29-44లో ఉండే జ్ఞానము

సూక్ష్మమైనదనీ, శరీరములో దాగియున్న జ్ఞానమని తెలిసిపోవుచున్నది.

'భూమి, ఆకాశములను వాటి మధ్యలోయున్న సమస్తమును దేవుడు

సృష్టించాడు' అనుట సత్యమే అయినా ముందు ఆకాశములను గురించి

తెలుసుకోవాలి. ఆ ప్రయత్నములో ఖురానాయందే సప్త ఆకాశములని

చాలాచోట్ల చెప్పబడినది. దానినిబట్టి ఏడు ఆకాశములున్నాయనీ, ఏడు

ఆకాశములు బయట ప్రపంచములో లేవనీ, లోపలి ప్రపంచమయిన

శరీరములోనే కలవని అర్థము చేసుకోవాలి. ఈ మాటకు మూలము

భగవద్గీతయందుగల విభూతి యోగమను అధ్యాయమున ఆరవ శ్లోకములో

కలదని తెలియుచున్నది. “మహర్షయ సప్త” అను పదమును తీసుకొని

చూస్తే మన శరీరములోగల ఏడు ఆకాశముల వివరము తెలియగలదు.


సూరా 29-44వ ఆయత్ ప్రకారము ఏడు ఆకాశములు బయట

ఎక్కడా లేవు. అయితే ఏడు ఆకాశములనబడు విధానము శరీరము లోపల

యున్నది. శరీరములోపల తల మొదలుకొని గుదస్థానము వరకుగల

వెన్నెముకలో వెన్నుపాము అనబడు పెద్ద నరము కలదు. వెన్నుపాము

అనబడు పెద్దనరము మెదడునుండి బయలుదేరి వెన్నుపాములో వ్యాపించి

నడుము క్రింద చివరిపూస వరకు ఉండును. అలా వ్యాపించిన నరము

మొత్తము ఏడు భాగములుగా విభజింపబడియున్నది. వెన్నుపాము

పైభాగమయిన మెదడు పెద్ద నాడీకేంద్రముగా ఉన్నది. మిగతా ఆరు

స్థానములలో వెన్నుపాము అనబడు నరమునందు మిగతా ఆరుచోట్ల ఆరు

నాడీకేంద్రములు కలవు. మొత్తము వెన్నుపాము ఏడు నాడీకేంద్రములుగా

విభజింపబడియున్నది. ఈ ఏడు నాడీకేంద్రముల ద్వారా శరీరములోని


మొత్తము పనులు జరుగునట్లు ఏడు కేంద్రముల నుండి చిన్నచిన్న నరములు

శరీరమంతా వ్యాపించియున్నవి. ఏడు నాడీ కేంద్రములలో ఆత్మశక్తి

యుండగా ఏడవ కేంద్రమందు పరమాత్మ శక్తి (దేవుడు) నిలయమై

యున్నాడు. ఈ విధముగా ఒక సజీవ శరీరములో ఏడు ఆకాశములనబడు

ఏడు నాడీకేంద్రములు గలవు. ఈ ఏడు నాడీ కేంద్రములనే ఏడు

ఆకాశములని ఖురాన్ గ్రంథములో అనేకమార్లు చెప్పబడినది. దీనిని

డిజైన్ చేసినవాడు, తయారు చేసినవాడు అల్లానే (దేవుడే). అందువలన

(29-44) ఆయత్లో “అల్లాహ్ ఆకాశములను భూమిని సత్యబద్దముగా

సృష్ఠించాడు” అని చెప్పాడు. అదే వాక్యములోనే ఉన్న ఏడు ఆకాశములను

కాక భూమి ఏమిటని యోచించితే, నాడీకేంద్రముల నుండి శక్తి ప్రవహించు

శరీరమంతయూ భూమిగానే లెక్కించబడుచున్నది. శరీరమను భూమిని,

నాడీకేంద్రములను ఆకాశములను దేవుడు సృష్టించాడని నేరుగా చెప్పక,

ఆకాశములను, భూమిని అల్లాహ్ సృష్టించాడని అందులో నిదర్శనమున్నదని

చాటుగా చెప్పాడు. భూమి ఏదయినదీ, ఆకాశములు ఏవయినవీ

తెలియడమే పరమార్థము అన్నారు. శరీరములో ఎంతో గొప్పదైన జ్ఞానము

ఇమిడియుండుట వలన సత్యబద్దముగా తయారు చేశానని చెప్పాడు.

శరీరములో ఆకాశములు భూమి కనిపించకయుండుట వలన 'నిదర్శనము’

అని కూడా చెప్పారు.


ఇప్పుడు తెలియబడు విషయమును గ్రహించలేకపోతే, అటువంటి

వారు పరమార్థమును తెలియలేరు, నిదర్శనమునూ తెలియలేరు. దేవుడు

ఈ విషయమును అనగా తన జ్ఞాన విషయమును ముందుగానే తెలియ

జేస్తూ, ఖురాన్ గ్రంథములో సూక్ష్మ జ్ఞాన విషయములు కలవనీ, అటువంటి

సూక్ష్మజ్ఞానము బుద్ధి, శ్రద్ధయున్న వారు మాత్రమే గ్రహించగలరని తెలిపి

యున్నాడు. అంతేకాక సూక్ష్మ విషయముల జ్ఞానము దేవునికి తప్ప ఏ


మానవునికీ తెలియదని ముందే చెప్పాడు. శరీరములో స్మృతి, జ్ఞానము,

ఊహ దేవుని వలననే కల్గునని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున

15వ శ్లోకమందు చెప్పియున్నాడు చూడండి.


సర్వస్య చాహం హృది సన్ని విష్ణో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనంచ

వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాంత కృద్వేదవి దేవ చాహమ్।।


భావము :- “నేను సఖల జీవరాసుల హృదయము అను బ్రహ్మనాడి లేక

వెన్నుపాములో ఉన్నాను. నా వలననే స్మృతి, జ్ఞానము, ఊహ కల్గును.

వేదంబులన్నీ నన్నే తెలుపుచున్నవి. వేద ఫలదాతను కూడా నేనే” అని

దేవుడు తన శ్లోకములో చెప్పియున్నాడు. దీనినిబట్టి అవసరమొచ్చినప్పుడు

మనిషి శరీరమునుండి దేవుడే తన జ్ఞానమును అందించునని తెలియు

చున్నది. ఇప్పుడు కూడా దేవుడు నాకు అందించు జ్ఞానమునే మీకు

చెప్పుచున్నాము. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతర మానవులకు ఎవరికీ

తెలియదని ఖురాన్ గ్రంథములో సూరా 3, ఆయత్ 7లో తెలియజేశాడు.

ఏ మానవమాత్రుని మీద నా జ్ఞానమును ప్రసరింపజేయలేదని సూరా 6,

ఆయత్ 91లో కూడా తెలియజేశాడు. దేవుని జ్ఞానము దేవుడు తెలియజేస్తేనే

మనుషులయిన మనకు తెలుస్తుంది. సూరా 29, ఆయత్ 44లో గల

సమాచారము పూర్తి సూక్ష్మజ్ఞానముతో కూడుకొన్నదైయున్నది. ఇక్కడగల

జ్ఞాన విషయము శరీర అంతర్భాగములలో కనిపించక ఉండుట వలన

ఇది నిదర్శన జ్ఞానమని వాక్యములో చెప్పారు. కనపడు భూమి, ఆకాశముల

కంటే వేరయిన అర్థముతో కూడుకొనియుండుట వలన పర+అర్థము =

పరమార్థముతో కూడుకొనియున్నదని చెప్పారు.


పరమార్థము అనగా మీరు అనుకున్న అర్థము కాదనీ, స్పష్టముగా

తెలిసిపోవుచున్నది. దానిప్రకారము మనము అనుకొన్న ఆకాశము కాదు,


అలాగే మనము అనుకొన్న భూమి కాదు అని తెలిసిపోయినది. అదేదో

మన శరీరములోని చిదంబర రహస్యమని తెలిసిపోయినది. చిదంబర

రహస్యమను “బట్టబయలు”ను దృశ్యరూపముగా చూపించినట్లు మనము

కూడా మన శరీరములోని దేవుడు చెప్పిన రహస్యమును ఉన్నది ఉన్నట్లు

దృశ్యములాగా చిత్రించుకొని క్రింది పటములో చూస్తాము.

దేవుడు తన జ్ఞానములో మొదటిగా తన సృష్టిని గురించి చెప్పాడు.

తర్వాత తన జ్ఞానమును చెప్పాడు. మొదట ఏడు ఆకాశములను ఎలా

సృష్ఠించాడో నిదర్శన రూపముగా ఉన్న జ్ఞానమును దర్శనముగా చేసి




బ్రహ్మ నాడి లేక వెన్నుపాము 87 పేజీ లో చిత్రమును చూడండి. 



చూచుకొన్నాము. సృష్ఠి తర్వాత ముఖ్యమైన జ్ఞానముగా చెప్పినది మూడు

ఆత్మల విషయము. మూడు ఆత్మల విషయమును, మూడు దైవ గ్రంథము

లలో చెప్పడమైనది. తౌరాత్ (భగవద్గీత) గ్రంథములో పురుషోత్తమ ప్రాప్తి

యోగమున చెప్పిన మూడు ఆత్మల విషయమును మిగతా రెండు గ్రంథముల

యందు కూడా చెప్పడము జరిగినది.


1) క్షరుడు

(జీవాత్మ)


అక్షరుడు

(ఆత్మ)


పురుషోత్తముడు

(పరమాత్మ)

అను ముగ్గురు  పురుషులయినవారు ప్రతి మనిషి శరీరములో గలరు.

(భగవద్గీతలో, పురుషోత్తమ ప్రాప్తి యోగము 16, 17 శ్లోకములను చూడండి.)


2) కుమారుడు

(జీవాత్మ)


తండ్రి

(ఆత్మ)


పరిశుద్ధాత్మ

(పరమాత్మ)


అను ముగ్గురు తెలియనివారు ప్రతి మనిషి శరీరములో గలరు.


(బైబిలులో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19,20 వాక్యములను చూడండి.)

3) తోలబడేవాడు 

(జీవాత్మ),

అను ముగ్గురు.


తోలేవాడు,

(ఆత్మ),

కనిపించనివారు


సాక్షిగా చూచేవాడు

(పరమాత్మ)

ప్రతి మనిషి శరీరములో గలరు.

(అంతిమ దైవగ్రంథము ఖురాన్లో సూరా 50, ఆయత్ 21 ని చూడండి.)


దేవుడు చెప్పిన జ్ఞానములో మొదటిది సృష్ఠికాగా, రెండవది సృష్ఠిలో

యున్న మూడు ఆత్మల జ్ఞానము. మూడు ఆత్మల గురించి మూడు దైవ

గ్రంథములలో చెప్పియున్నారు. తర్వాత ముఖ్యమైన జ్ఞానము మనుషులు

చేసుకొన్న పాపపుణ్యములనబడు కర్మను గురించి తెలుసుకొను జ్ఞానము.

కర్మను గురించి మూడు దైవగ్రంథములలో ఎంతో వివరణ ఇచ్చారు. కర్మ



మనిషి శరీరములోనే పర్యవేక్షకుని చేత వ్రాయబడుచున్నదని అంతిమ

దైవగ్రంథమయిన ఖురాన్లో చెప్పారు. కర్మలిఖితమును 'కర్మపత్రమని’

చెప్పడమేకాక కర్మ ఒక దివ్యగ్రంథమందు నమోదు చేయబడుచున్నదని

కూడా చెప్పారు. కర్మను అనుభవించక ఎవరూ తప్పించుకోలేరని

చెప్పడమేకాక, దేవుడు ఒక్కడే దానిని క్షమించు క్షమాశీలుడని కూడా చెప్పారు.

కర్మ మన శరీరములో ఎట్లున్నదీ, ఎక్కడున్నదీ రహస్య జ్ఞానముగా ఖురాన్

లోనూ, భగవద్గీతలోనూ చెప్పారు.


దేవుడు మొదట సృష్ఠిని గురించిన జ్ఞానము చెప్పాడు. తర్వాత మూడు

ఆత్మలను గురించిన జ్ఞానము చెప్పాడు. ఆ తర్వాత జీవుడు కర్మచేత

నడుపబడుచున్నాడని, కర్మలను గురించి జ్ఞానమును చెప్పాడు. చివరిగా

ప్రతి కర్మకు, ప్రతి పనికి ఒక గడువు ఉన్నదనీ, ప్రతి గడువు కాలములో

నిర్ణయించబడియున్నదని దేవుడు తన జ్ఞానములో చెప్పాడు. ఈ విధముగా

దేవుని జ్ఞానమును నాలుగు ముఖ్యమైన పాయలుగా (భాగములు) గా

చెప్పాడు. మూడు దైవగ్రంథములలో ఈ నాలుగు జ్ఞానములే ముఖ్యముగా

చెప్పబడినవి. ఈ నాలుగు భాగముల జ్ఞానమును దర్శనముగా చేసుకో

గలిగితే అదే దేవుని చిహ్నమగును. దేవుని జ్ఞానము అదృశ్యరూపములో

పరమార్థముగా ఉన్నది. అటువంటి పరమార్థమును అర్థము చేసుకోగలిగితే,

నిదర్శన జ్ఞానమును దర్శనరూపముగా చేసుకోగలిగితే, దర్శనమిచ్చునదే

దేవుని చిహ్నమగును. దేవుని చిహ్నము అత్యంత శక్తివంతమైనది, అటువంటి

దేవుని జ్ఞానమును ఎలా దృశ్యరూపమైన చిహ్నముగా (గుర్తుగా) చేసుకోవాలో

ఇప్పుడు వివరించుకొందాము. దేవుడు మొదట భూమినీ, ఏడు ఆకాశము

లను సృష్టించాడు. దానిని దృశ్యరూపముగా చేసుకొన్నప్పుడు శరీరము

భూమిగా, ఏడు ఆకాశములు శరీరములోగల శరీరమును నడుపు ఏడు


నాడీ కేంద్రములుగా చెప్పుకొన్నాము. ఏడవ నాడీకేంద్రము పైన దేవుని

సింహాసనమున్నట్లు, దేవుడు అక్కడ ఉన్నట్లు ఖురాన్ గ్రంథములో చెప్పారు.

దానిని దృశ్యరూపములో చూచుకోమని చెప్పారు. అలా జ్ఞానదృష్టితో చూస్తే

దేవుని సృష్టియందు ఏమయినా లోపముందో లేదో నీకే తెలుస్తుంది కదా!

అన్నాడు. ఆ విషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 67, ఆయత్ 3లో

(67-3) “ఆయన ఏడు ఆకాశములను ఒకదానిపై ఒకటి నిర్మించాడు.

నీవు ఎటు చూచినా కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎటువంటి లోపము

తెలియలేవు. కావాలంటే మరోసారి దృష్టిని సారించి చూడు, నీకేమయినా

లోపము కనిపిస్తుందేమో!”


ఈ ఆయత్ లో నీవు ఎటు చూచినా ఒక దృశ్యమును చూచినట్లు

చెప్పారు కదా! దేవుని సృష్టిని “కావాలంటే మరోమారు దృష్టిని సారించి

చూడు నీకేమయినా లోపము కనిపిస్తుందేమో” అని చెప్పడము కూడా

జరిగినది. దీనినిబట్టి దేవుని సృష్టిని దృశ్యరూపములో చూడమని, ఏదయినా

లోపము కనిపిస్తుందేమోనని చెప్పారు కదా! ఇక్కడ సృష్ఠిని దృశ్యరూపముగా

చూడమనేగా చెప్పినది. ఇక్కడ దేవుడు చెప్పినట్లు సృష్టిని దృష్ఠిరూపములో

నికి మార్చుకొని దృశ్యముగా చూడగలిగితే ఏడు ఆకాశములు ఇలా

ఉన్నవని ముందే ఒక విధముగా చిత్రించి చూచుకొన్నాము. ఇప్పుడు

ఏడు ఆకాశముల మీద దేవుని ఉనికి ఎట్లున్నదో చిత్రించుకొని తర్వాత

పేజీలో చూద్దాము.


ఏడు ఆకాశములపైన దేవుని నిలయమును దృశ్యరూపముగా

చేసుకొన్నాము. దేవుడు నివశించు నివాసమును బ్రహ్మచక్రము అంటాము.

బ్రహ్మచక్రము అనగా దేవుని చక్రమని అర్థము. దేవుని చక్రము రెండు

భాగములుగా ఉన్నది. ఒక భాగము దేవుని పగలు, మరొక భాగము

దేవుని రాత్రి. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమున 17వ శ్లోకమున



(దేవుని ముద్ర చిత్రమును 91 పేజీ లో చూడండి. )


వేయియుగములు దేవునికి ఒక పగలు, అట్లే వేయియుగములు దేవునికి

ఒక రాత్రి అని చెప్పారు. దేవుని చక్రము ఒక చుట్టు తిరుగుటకు రెండు

వేల యుగముల కాలము పట్టునని తెలియుచున్నది. అనగా దేవునికి ఒక

రోజు అంటే రెండువేల యుగముల కాలమని అర్థము. దేవుని యొక్క

పగలు రాత్రిని గ్రహించగలిగితే ఎంతో ఉన్నతమైన జ్ఞానమును మనిషి

తెలియగలడు. ఇదే విషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 24, ఆయత్

44లో ఈ విధముగా ఉన్నది చూడండి. (24-44) “అల్లాహ్ రేయింబవళ్ళను

మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వానికి ఇందులో గొప్ప గుణపాఠము కలదు.”


ఇక్కడ బాగా జాగ్రత్తగా వివరించుకొని చూస్తే కళ్ళున్నవానికి ఇందులో

గుణపాఠము కలదని చెప్పారు కదా! దీనినిబట్టి దేవుని పగలు రాత్రిని

చిత్రపటముగా చూచువానికి అందులోని రహస్య జ్ఞానము తెలియగలదని

అర్థమగుచున్నది. అందువలన మేము దేవుని నివాసమును రాత్రి పగలుగా


విభజించి ఏడు ఆకాశముల పైనగల బ్రహ్మచక్రమును చూపాము. కొందరికి

మేము చెప్పునది ఏమాత్రము అర్థము కాకపోవడము వలన మమ్ములను

అజ్ఞానులుగా పోల్చి దూషించుచూ, అజ్ఞానమును బోధించుచున్నాడని

అనవచ్చును. వారికి మేము చెప్పునదేమనగా! మేము ఎక్కడా స్వయముగా

బోధించక దైవగ్రంథమును ఆధారము చేసుకొనియే చెప్పుచున్నాము.

కొందరు తాము అజ్ఞానములో వుండి అల్లాహ్ నిదర్శనములు దర్శన

రూపమైనప్పుడు, నిదర్శనాల విషయములో మొండిగా మాట్లాడుచున్నారు.

ఇదే విషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 40, ఆయత్ 35లో మొండి

వాదులను గురించి ఇలా చెప్పియున్నాడు చూడండి. (40-35) “వారు

తమవద్దకు వచ్చిన ఏ ప్రమాణమూ లేకుండానే అల్లాహ్ నిదర్శనాల

విషయములో మొండిగా వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్ వద్ద

మరియు విశ్వాసులవద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ

విధముగా గర్విష్ఠి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయముపై అల్లా

ముద్ర వేసేస్తాడు.”


మేము జ్ఞానదృష్ఠి లేనివారికి కూడా అర్థమగులాగున, సూక్ష్మమైన దేవుని

జ్ఞానమును స్థూలమైన గుర్తుగా, అందరికీ తెలియునట్లు దృశ్య రూపముగా

చూపుచున్నాము. మేము ప్రతీదీ దైవగ్రంథముల ఆధారముతోనే

చూపుచున్నాము. ఇక్కడ కొందరికి ఒక అనుమానము వచ్చి ఇలా ప్రశ్నించ

వచ్చును. సూక్ష్మమైన దేవుని జ్ఞానము బోధల రూపములో ఉండగా, దృశ్య

రూపములో చూచుటకు సాధ్యమగునా? అని అడుగవచ్చును. దానికి

జవాబుగా మేము ఇలా చెప్పుచున్నాము. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి

యోగము అను అధ్యాయములో 10, 11 శ్లోకములలో ఈ విధముగా

ఉన్నది చూడండి.


10వ శ్లో॥

ఉత్కామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్|

విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞాన చక్షుషః ॥


11వ శ్లో॥

యతన్తో యోగిన జైనం పశ్యన్త్యాత్మ వ్యవస్థితమ్ ।

యతన్తో ప్రకృతాత్మానో నైనం పశ్యన్య చేతసః ||


భావము :- "జీవాత్మ గుణములుడై శరీరములో నివాసముండును.

గుణముల మధ్యలోవుంటూ విషయ సుఖములను అనుభవించుచుండును.

ఈ విధానమును మూఢులు తెలియలేరు. జ్ఞాననేత్రులు మాత్రము చూడ

గల్గుదురు.”


"శరీరములోయున్న ఆత్మను, జీవాత్మను ప్రయత్నము చేయు

యోగులు తెలియగలరు (చూడగలరు). మూఢులైనవారు ఎంత ప్రయత్నించి

ననూ శరీరములోని తతంగమును దైవయంత్రాంగమును చూడలేరు.”


ఖురాన్ గ్రంథములో నిదర్శనముగాయున్న దానిని చూడగలరన్నట్లు

భగవద్గీత గ్రంథములో 5000 సంవత్సరముల పూర్వమే, శరీరములోని

జీవుడు గుణముల మధ్యలో ఎట్లున్నదీ యోగులు తెలియగలరనీ, అజ్ఞానులు

తెలియలేరని చెప్పారు.


దైవగ్రంథములలో ప్రమాణములుగా చెప్పినట్లు నిదర్శనమును

దర్శనముగా చేసుకొనిన, ఏడు ఆకాశములు మన శరీరములో ఎట్లున్నదీ

తెలిసిపోయినది. తర్వాత ఏడు ఆకాశముల మీద దేవుని స్థానము ఎట్లున్నదీ

గుర్తించగలిగాము. అదే విధానముతో దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము

మూడు ఆత్మల విధానము, కర్మవిధానము, కర్మయొక్క గడువు విధానమును

దృశ్యరూపములో చూచుటకు ప్రయత్నిద్దాము. మొదట జీవాత్మ నివాసమును

గురించి భగవద్గీత శ్లోకము ప్రకారము మరియు ఖురాన్ వాక్యము ప్రకారము

చూచుటకు ప్రయత్నిద్దాము. ఏడు ఆకాశముల పైన పరమాత్మ ఉన్నట్లు


అక్కడే ఏడు ఆకాశముల మీదనే జీవాత్మ కూడా కలదు. జీవాత్మ పరమాత్మ

స్థానముకంటే కొద్దిగా క్రింద నివాసముండును. దానినే దృశ్యముగా

చిత్రించుకొని క్రింది పటములో చూద్దాం.


ఈ చిత్రములో ఏడవ ఆకాశము మీదగల బ్రహ్మచక్రములో రెండు

భాగములయందు దేవుడు కలడు. ఏడు ఆకాశముల పొడవునా ఆకాశము

మధ్యలో అనగా బ్రహ్మనాడి మధ్యలో ఏడవ ఆకాశమునుండి ఒకటవ

ఆకాశము వరకు ఆత్మ గలదు. ఏడవ స్థానములోనే అనగా! ఏడవ

ఆకాశములోనే బ్రహ్మచక్రము క్రింద మూడవ చక్రముగాయున్న గుణ

చక్రమందు జీవుడు నివాసమున్నాడు. ఏడవ స్థానములో గల నాలుగు

చక్రములలో పైది బ్రహ్మచక్రముకాగా క్రిందిది గుణచక్రముగా ఉన్నది.


బ్రహ్మనాడి  94 పేజి లో చిత్రమును చూడండి.


గుణచక్రము మూడు భాగములుగా ఉన్నది. మూడు భాగములలో ఏదో

ఒకచోట జీవాత్మ ఉండడము జరుగుచున్నది. ఈ విధముగా ఏడవ

ఆకాశములోనే అల్లాహ్ (దేవుని) కంటే క్రింద గుణచక్రములో జీవాత్మ

ఉండగా, ఏడు ఆకాశముల పొడవునా బ్రహ్మనాడియందు ఆత్మ కలదు.

ఈ విధముగా మూడు ఆత్మల నివాసము తేలిపోయి దర్శనరూపములోనికి

వచ్చినది.


ఇప్పటికి ఏడు ఆకాశములు, మూడు ఆత్మల జ్ఞానము యొక్క

నిదర్శనము, పరమార్థము తెలిసిపోయింది. ఇక తెలియవలసింది కర్మము,

గడువులతో కూడుకొన్న కాలము. ఇప్పుడు కర్మను గురించి చూస్తే ఇలా

తెలియగలదు.


కర్మచక్రము 12 భాగములుగా కలదు. అందులో 1,5,9

స్థానములలో పుణ్యము నిలువవుండును. అలాగే 3,7,11 స్థానములలో

పాపము నిలువయుండును. మిగతా 2,4,6,8,10,12 స్థానములలో

పాపపుణ్యములు రెండు గలవు. మనిషి చేసుకున్న పాపములు పుణ్యములు

కర్మచక్రములో ఆయా స్థానములయందు ఆత్మ చేత నమోదగుచుండును.

అలాగే ఆత్మ చేతనే అనుభవింప చేయబడుచుండును. అయితే కర్మచక్రము

కంటే క్రిందగల గుణచక్రముతో కర్మచక్రమునకు సంబంధ ముండును.

కర్మచక్రములోని కర్మ (పాపపుణ్యములు) క్రిందిచక్రమయిన గుణచక్రము

మీద ప్రసరించడము వలన అక్కడున్న జీవుడు దానిని అనుభవించును.

ఇదే విషయమును ఖురాన్ గ్రంథములో ఎవని కర్మ వాడే అనుభవించవలెనని

సూరా 2, ఆయత్ 134లో చెప్పియున్నారు. (2-134) “అది గతించిన

ఒక సమూహము. వారు చేసుకొన్నది వారికే చెందుతుంది. మీరు చేసినది

మీకు చెందుతుంది. ఇతరుల కర్మల గురించి మీరు ప్రశ్నింపబడరు” అని

గలదు. దీనినిబట్టి పైన కర్మచక్రములో ఏమి నమోదయివుంటే క్రింది




చక్రములో గల జీవునికి అదే అనుభవమునకు వచ్చును. ఇతరుల కర్మతో

జీవునికి సంబంధమే లేదు. దాని ప్రక్రియలో గుణచక్రములోని గుణములు

జీవుని మీద ప్రయోగించబడును. గుణచక్రమును బాగా పరిశీలించిన ఈ

విధముగా కలదు. తర్వాత పేజీ పటములో చూడండి.


96 పేజి లో చిత్రమును చూడండి .


గుణచక్రము మూడు భాగములుగా కలదు. ఒక్కొక్క భాగమున

వేరువేరు పేర్లుగల పన్నెండు గుణములుగలవు. ఒక్కొక్క భాగములోగల

గుణములకు ఒక్కొక్క పేరున్నది. పై భాగములో గల గుణములను తామస

భాగ గుణములని చెప్పుచుందురు. అట్లే మధ్యలోయున్న దానిని రాజస

గుణ భాగము అని అంటాము. అట్లే మూడవ దానిని సాత్విక గుణభాగము



తామస గుణభాగము,

రాజస గుణభాగము,

సాత్త్విక గుణభాగము,

ఆత్మ,

తామసములో జీవుడు,

గుణచక్రము  97 పేజి లో చిత్రమును చూడండి.


అంటాము. మధ్యలో గుండ్రముగాయున్న భాగము బ్రహ్మనాడిగా ఉన్నది.

దానిని గుణరహిత భాగము (గుణములేని భాగము) అని అంటాము. ఈ

మూడు గుణ భాగములలోనూ గుణములు గలవు. ఒక్కొక్క భాగములో

12 గుణములు కలవు. అందులో ఆరు మంచి గుణములు, ఆరు చెడు

గుణములు గలవు. చెడు గుణములు వరుసగా కామ, క్రోధ, లోభ, మోహ,

మద, మత్సరము అని అంటారు. మంచి గుణములను వరుసగా దాన,

దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అని అంటారు. చెడు గుణములలో

జీవుడు చేరితే పాపము వచ్చును. మంచిగుణములలో జీవుడు చేరితే

పుణ్యము వచ్చును. జీవుడు తామస, రాజస, సాత్త్విక అను మూడు గుణ

భాగములయందు తిరుగుచుండును. ఏ ఒక్క గుణభాగములో కూడా

శాశ్వతముగా ఉండడు. అయితే ఎక్కువ కాలము ఏ భాగములో గడిపితే

ఆ భాగము యొక్క పేరు వానికి వచ్చుచుండును. తామసములో ఎక్కువ

కాలముయున్న వానిని తామసుడనీ, రాజసములో ఎక్కువ కాలమున్న వానిని


రాజసుడనీ, సాత్త్వికములో ఎక్కువ కాలమున్న వానిని సాత్వికుడని

అంటాము.


క్రింద గుణచక్రముండగా దానిపైన కర్మచక్రముండును. గుణ

చక్రములోని జీవుడు చేసుకొన్న పాత పాపపుణ్యములను కర్మచక్రమునుండి

ఆత్మ అనుభవింపజేయును. అట్లే ప్రస్తుత కాలములో చేసుకొన్న

పాపపుణ్యములను ఆత్మే కర్మచక్రములో నమోదు చేయుచున్నది.

గుణచక్రమునకు పైనగల కర్మచక్రమునుండి కర్మ దిగి అనుభవమునకు

వస్తున్నది. అలాగే జీవుడు క్రొత్తగా చేసుకొన్న కర్మ కర్మచక్రములోనికి

ఎక్కుచున్నది. దేవుడు ఏడవ స్థానము (ఏడవ ఆకాశము)న ఉండి క్రిందికి

దిగే కర్మను, పైకి ఎక్కే కర్మను చూస్తున్నాడు. దేవుడు సాక్షిగా మాత్రమున్నాడు.

రెండవ ఆత్మ మాత్రము శరీరములో కార్యములన్నీ చేయుచున్నది. ప్రతి

విషయములో జీవున్ని కర్మబద్ధున్ని చేసి కర్మను అనుసరించి నడుపుచున్నది.

దేవుడు మాత్రము ఏమీ చేయక దిగే కర్మను ఎక్కే కర్మను చూస్తున్నాడు.

ఇదే విషయమునే ఖురాన్ గ్రంథమందు సూరా 34, ఆయత్ లో ఇలా

వుంది చూడండి. (34–2) “భూమిలోనికి వెళ్ళేది, దానినుండి

వెలువడేది, ఆకాశమునుండి దిగేది, అందులోనికి (ఆకాశము

లోనికి) ఎక్కిపోయేదీ అంతా ఆయనకు (దేవునికి) తెలుసు. ఆయన

అపార కరుణా ప్రదాత, క్షమాశీలి" అని కలదు.


దేవుని జ్ఞానము ప్రకారమే కర్మ జీవుని మీదికి దిగేది, జీవుని

నుండి కర్మచక్రములోనికి నమోదు అయ్యేది, ఖచ్చితముగా మనము దృశ్య

రూపము చేసుకొన్నాము. కర్మచక్రము పైన కాలచక్రము కలదు. కాల

చక్రములో ప్రతి దానికి కాల గడువు నిర్ణయించబడియుండును. కాల

చక్రములో నిర్ణయించిన కాలము యొక్క గడువు ప్రకారము క్రింద కర్మ



చక్రములోని కర్మ జరుగుచుండును. అందువలన ఎప్పుడు చనిపోవలసిన

వాడు అప్పుడే చనిపోవును. జరుగవలసిన కార్యమేదయినాగానీ ఒక్క

సెకండు కూడా తేడా లేకుండా జరుగును. అది కాలచక్రములోని కాలము

యొక్క నిర్ణయమును ఎవరూ మార్చలేరు. కాలచక్రమును క్రింద దృశ్య

రూపముగా చూచుకొందాము.


కాలచక్రము మొత్తము పన్నెండు భాగములుగా యున్నది. ఒక్కొక్క

భాగము ఒక్కొక్క పేరుతో కలదు. ప్రతి భాగమునందు రెండు గంటల

కాలముండును. ఆ కాలచక్రము, కర్మచక్రము, గుణచక్రము ఒకదానితో

ఒకటి సంబంధపడియుండి తిరుగుట వలన, వేరువేరు సమయములలో,

వేరు కర్మలను, వేరువేరు అనుభవములుగా జీవుడు అనుభవించుచుండును.

దేవుడు తన జ్ఞానము ప్రకారమే మనిషిని సృష్టించి, తన జ్ఞానము ప్రకారమే


కాలచక్రము 99 పేజి లో చిత్రమును చూడండి.


నడుచునట్లు చేశాడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయనకు

తెలియకుండా ఏమీ జరుగవు. దేవుని జ్ఞాన పరమార్థమును, నిదర్శనమును

పూర్తి దర్శనముగా చూచుకొంటే క్రిందగల పటములో చిత్రించిన విధముగా

కలదు చూడండి.


మనిషి శరీరములో మనిషికి మూలమైన ఈ చక్రము ఉండుట

వలన, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున మొదటి శ్లోకములోనే

“ఊర్ధ్వమూల” అని చెప్పియున్నారు. ఆ మాటకు పైన మూలమున్నదని

అర్థము.


దేవుని గ్రంథములలో గల దేవుని జ్ఞానమును దృశ్యరూపము

అది దేవునికి సంబంధించిన ముద్రయగును. ( 100 పేజి లో చిత్రమును చూడండి).

---

రాజు శాసనములకు గుర్తుగా రాజముద్ర ఉన్నట్లు, దేవుని ధర్మములకు గుర్తుగా

దేవుని ముద్ర లేక దేవుని చిహ్నము కలదు. దేవుని చిహ్నము, దేవుని

జ్ఞానమునకు ప్రతిరూపముగా ఉండుట వలన అందులో దైవశక్తి కలదని

చెప్పవచ్చును. దైవశక్తి ఎక్కడవుండునో అక్కడ కర్మ కాలిపోవును. అగ్ని

ఎక్కడుంటే అక్కడ మండే వస్తువులు ఏవున్నా అగ్నిచేత కాలిపోవునట్లు,

దైవశక్తి ఉన్నచోట ఏ కర్మలున్నా జ్ఞానాగ్నికి అంటుకొని కాలిపోవును.

ప్రశ్న :- మీరు దృశ్యరూపముగా చూపిన దేవుని చిహ్నమునకు నిజముగా

దైవశక్తి ఉంటుందంటారా?


జవాబు :– దైవ జ్ఞానములోని ముఖ్యమైన వాటిలో (1) భూమి ఆకాశముల

సృష్ఠి విషయము. 2) మూడు ఆత్మల విషయము. 3) కర్మల యొక్క

విషయము. 4) కాల నిర్ణయము యొక్క విషయ జ్ఞానములు ఉండుట

వలన దేవుని గుర్తుకు దేవుని శక్తి అంటుకొనియున్నది. ఈ నాలుగు

జ్ఞానముల మినహా ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. దేవుని జ్ఞానములో ఏది

చెప్పినా ఈ నాలుగు అంశముల జ్ఞానమే ఉండును. ఆధ్యాత్మిక జ్ఞానములో

పై నాలుగు జ్ఞానములే ముఖ్యమైనవగుట వలన, దేవుని ముద్రగా చూపబడిన

చిత్రమునకు లేక ఆకారమునకు దైవశక్తియుండునని చెప్పుచున్నాము.


ఇప్పుడు “దేవుని చిహ్నము” అను పేరుతో కాకుండా "దేవుని

ముద్ర” అను పేరుతో చెప్పు విధానమును చూడండి. దేవుని చిహ్నముగా

యున్న బొమ్మను చూచారు కదా! ఇక్కడ అదే బొమ్మనే దేవుని ముద్రగా

చెప్పుచున్నాము. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే. అదే

విషయమును ఖుర్ఆన్ గ్రంథములో సూరా మూడులో, ఆయత్ 18లో

అల్లాహ్ యే స్వయముగా “ఈయనే మీరు ఆరాధించవలసిన దేవుడు” అని

తనకంటే వేరుగాయున్న వానిని చూపించాడు. ఆరాధించవలసిన దేవుడు



ఒక్కడేయని ఆ ఒక్కనిని చూపించినవాడు స్వయముగా అల్లాహ్.

ముస్లీమ్లు అందరూ ఆరాధించ వలసినది ఒక్క అల్లాహ్ను మాత్రమే కదా!

అటువంటప్పుడు అల్లాహ్ ఎవరిని చూపాడు? అను విషయమునే ఇంతవరకు

ఈ గ్రంథములో వివరించాము. అల్లాహ్ మనుషులకు తండ్రిగాయున్నాడు

మరియు తాతగాయున్నాడు. తాతగా యున్న అల్లాహ్, తండ్రిగాయున్న

అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే. అయితే అల్లాహ్ ఇంకా దగ్గరగా అర్థమగుటకు

అలా విడదీసి చూపించవలసి వచ్చినది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములోని

సూరా 3, ఆయత్ 18లో అల్లాహ్ చెప్పిన వాక్యమును మరువకూడదు.

జ్ఞాన సంపన్నులైనవారు, దేవదూతలు మరియు స్వయముగా అల్లాహ్

చెప్పినది ప్రతి మనిషి తప్పనిసరిగా ఒప్పుకోవలసియున్నది. ఎవడయినా

ఒప్పుకోకపోతే వాడు అల్లాహ్ మాటనే ధిక్కరించిన వాడగును. అప్పుడు

వాడు అల్లాహ్కు (దేవునికి) ఎట్లు విశ్వాసియగును? అల్లాహ్ ఎడల నిజమైన

విశ్వాసి ఎవడయితే యున్నాడో వాడు తప్పనిసరిగా అల్లాహ్ మాటను

(ఆయత్ను) వినును.


'దేవుని చిహ్నము' కంటే వేరుగా యున్నది 'దేవుని ముద్ర' అను

గ్రంథము. దేవుని ముద్ర గ్రంథములోని ప్రతి విషయము దేవుని చిహ్నము

లోని విషయముకంటే వేరుగా చెప్పుచూ వచ్చినా 'దేవుని చిహ్నము' అను

చిత్రము అట్లే 'దేవుని ముద్ర' అను చిత్రము రెండూ ఒక్కటే. అయితే

దేవుని చిహ్నము చిత్రపటమును ఆ గ్రంథములో ఎట్లున్నది ఈ గ్రంథములో

చూపాము. దేవుని చిహ్నము బొమ్మను దానికి సంబంధించిన

సమాచారమును ఆ గ్రంథమునుండి తీసి చూపాము. అలా చూపడము

వలన దేవుని ముద్ర, దేవుని చిహ్నము రెండూ ఒక్కటేయని ప్రత్యక్షముగా

అర్థమగును. 'దేవుని చిహ్నము' అను గ్రంథమునుండి దేవుని చిహ్నము


యొక్క చిత్రపటమును చూడడమేకాక అందులోని కొంత సమాచారమును

కూడా చూచారు. ఆ సమాచారము ఇంతవరకు వ్రాసిన దేవుని ముద్ర

గ్రంథములోని సమాచారము అంతా వేరుగా యున్నట్లు తెలిసిపోయినది.

సమాచారము ఎట్లు వేరుగా యున్నదో అట్లే దేవుని చిత్రపటము యొక్క

అర్థము కూడా వేరుగా యుండును. ఇప్పుడు దేవుని ముద్ర యొక్క

వివరమును తెలుసుకొందాము.


సృష్ట్యాదిలో మొట్టమొదట దేవుడు ఎన్ని భాగములుగా విభజింప

బడ్డాడు? అను ప్రశ్నకు చాలామంది మూడు భాగములని జీవాత్మ, ఆత్మ,

పరమాత్మయని వ్రాశారు. దేవుడు మూడు ఆత్మలుగా తయారయినది

వాస్తవమే. అయితే మొదట ప్రపంచము తయారయిన తర్వాత దేవుడు

మూడు ఆత్మలుగా చీలిపోయాడు. అందువలన మొట్టమొదట దేవుని

నుండి ప్రపంచము అను ప్రకృతి బయటికి వచ్చినది. ప్రకృతిచేత పంచ

భూత నిర్మితమైన ప్రపంచము ఏర్పడిన తర్వాత దేవుని నుండి రెండు

ఆత్మలు బయటికి వచ్చాయి అని ఆ విధముగా మొట్టమొదట దేవుడు

నాలుగు భాగములుగా విభజింపబడ్డాడు అని గ్రంథ ప్రారంభములోనే

చెప్పుకొన్నాము. మొదట పుట్టిన ప్రకృతి మూడు ఆత్మల నివాసమునకు

ఆధారమైనది. ఒక పాత్రను ఉదాహరణగా చెప్పుకొని మొదట పాత్ర

తీసుకొని అందులో మూడు రకముల నీళ్ళను పోసినాము. ఆ మూడు

రకముల నీళ్ళకు పాత్ర ఆధారముగా యున్నదని చెప్పుకొన్నాము. దానిని

దృశ్యరూపములో చిత్రించుకొని చూస్తాము. దేవుని నుండి బయల్పడిన

మొదటి భాగమయిన ప్రకృతిని తర్వాత పేజీలో చిత్రరూపము చూడండి.


మొదట ప్రకృతి తయారుకాగా అది మూడు ఆత్మలకు నిలయము

కాకముందే ప్రకృతి ఏడు రంగులుగా కనిపించినది. దానినే ఇంద్రధనస్సు




దేవుని ముద్ర చిత్రమును 104  పేజీ లో చూడండి.  


రంగులని నేడు ప్రత్యక్షముగా కనిపించే రంగులను చెప్పుచుంటాము.

ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉండడము సహజము. ఏడు రంగులను

బట్టి ఏడు దినముల పేర్లను తయారు చేయడము జరిగినది. జీవాత్మ

ఆత్మ తయారు కాకముందే దేవుడు కాలస్వరూపుడుగా యుండుట వలన

ప్రకృతి పుట్టినప్పుడే కాలమున్నది. ఆదిలో ప్రకృతి పుట్టినప్పుడున్న దేవుడు

కాలముగాయుంటూ ప్రకృతిలో ఏడు పేర్లుగా పిలువబడ్డాడు. ఆ ఏడు

పేర్లే ఏడు వారములుగా మనకు పరిచయమైనవి. దీనినిబట్టి ప్రకృతి

పుట్టిన తర్వాత ఏ జీవరాసి పుట్టకముందే కాలమున్నది, కాలమునకు

ఏడు వారముల పేర్లు ఉన్నవి. కాలము ఆదివారముతో మొదలయినది.

మొదట ప్రకృతి, తర్వాత జీవుల ఉత్పత్తి ఆత్మతో సహా జరిగినది. జీవుల

మొదటి పుట్టుక దినము ఆదివారమేనని తెలియవలెను. అందువలన

జీవరాసులు ఆదివారముతో మొదలయినవని చెప్పుచున్నాము. ఆదివారము

దినమున జీవుల ఉత్పత్తి ప్రారంభమయినది. అందువలన దృశ్యరూపములో


యున్న ప్రకృతి, ఆకర చిత్రములో ఏడు వారములను గుర్తించడము

జరిగినది. మనిషి శరీరములో ప్రకృతియను చక్రముండగా, పైన ప్రకృతి

చక్రము రెండు భాగములుగా చర, అచర ప్రకృతియని తయారయినది.

శిరస్సులోని మెదడు రెండు భాగములుగా యున్నది. శరీరము ప్రకృతితో

తయారయినది కావున మెదడు రెండు భాగములుగా, రెండు భాగముల

చక్రమువలె కనిపించుచున్నది. రెండు భాగములుగా యున్న మెదడు

నుండి ప్రారంభమయిన బ్రహ్మనాడి లేక వెన్నుపాము అను నరము పై

నుండి క్రింది వరకు ఏడు భాగములుగా యున్న విషయము అందరికీ

తెలిసినదే.


సృష్ట్యాదిలో పరమాత్మనుండి ప్రకృతి పుట్టగా పరమాత్మ, ప్రకృతి

రెండు ‘నాటకము’ అను ఆటలోనికి ఒక ప్రక్కకే సరిపోవుదురు. అందువలన

రెండవ ప్రక్క ఇద్దరు ఉండునట్లు తలచిన పరమాత్మ ఆత్మను, జీవాత్మను

తన నుండి బయటికి తీశాడు. అప్పుడు మొత్తము నలుగురు కనిపించారు.

మూడు ఆత్మలు ఒక ప్రకృతి తయారయినది. మొదట తయారయిన

ప్రకృతి దేవుని ముద్ర అను బొమ్మలో లేక చిత్రపటములో పై భాగమున

రెండు భాగములుగా చర, అచర ప్రకృతిగా యున్నది. దానిక్రింద పరమాత్మ

దాచిపెట్టుకొన్నట్లు ప్రకృతి వెనుక భాగములో అనగా ప్రకృతియను చక్రము

క్రింద రెండవ చక్రముగా ఇమిడి పోయినది. ప్రకృతిగానీ, పరమాత్మగానీ

ఒకచోట ఆగువారు కాదు. ఎప్పటికీ చక్రమువలె ముందుకు దొర్లుచూ

పోవుచుందురు. ఇవి రెండు ఎంత కాలమయినా దొర్లవచ్చును, ఎంత

కాలమయినా గడువవచ్చును. ఒకచోట ఆగునవి కావు అయినందున

ప్రకృతిని, పరమాత్మను చక్రమువలె చిత్రపటములో చూపించడము జరిగినది.

కాలము గమనముతో (చలనముతో) కూడుకొన్నది. అందువలన ప్రకృతి,



పరమాత్మ ఎల్లప్పుడు ముందుకు పోవు 'గమనులు'గా చెప్పబడుచుందురు.

అందువలన వీరిని చక్రములుగానే చిత్రించడము జరిగినది. ఈ విషయము

నకు సంబంధించిన సమాచారము భగవద్గీత రాజవిద్యా రాజ గుహ్య

యోగమున 10వ శ్లోకమందు ఇలా చెప్పారు చూడండి.


శ్లో॥ 10.

మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ |

హేతునా నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే ॥

(పరమాత్మ)


భావము :- “ప్రకృతికి నేను అధ్యక్షత వహించుట వలన ప్రపంచములో

జీవరాసులన్నియు పుట్టుచున్నవి. నేను ఇరుసుగా యుండగా ప్రకృతి

చక్రములో చావుపుట్టుకల జగత్తు చక్రమువలె తిరుగుచున్నది". అలా

పరమాత్మ ప్రకృతి క్రింద చాటుగా దేవుని ముద్రయను చిత్ర

పటములో కనిపించుచుండుటను ప్రత్యక్ష బొమ్మగా చూస్తాము.

చూపుతో చూడుట వలన కొంతవరకు దేవుని విధానము మనిషికి అర్థము

కావచ్చును. ఆదివారము బ్రహ్మనాడిలో ఎక్కడ గలదో అక్కడే ప్రకృతి

చక్రము గలదు. అట్లే సోమవారము ఎక్కడగలదో అక్కడే పరమాత్మ చక్రము

గలదు.


దేవుని ముద్రలో రెండు చక్రములను చూడవచ్చును. దేవుని ముద్ర

మొత్తము నాల్గుచక్రములుగల చిత్రపటము. అయితే ప్రకృతి పరమాత్మల

వరకు అలా ఉండేది. సృష్ఠి కార్యములో వెంటనే పరమాత్మనుండి ఆత్మ,

జీవాత్మ రెండూ బయటికి రావడము జరిగినది. ఆ రెండు ఆత్మలు రెండు

చిత్రములుగా తయారయి ప్రకృతి సంబంధ బ్రహ్మనాడిని ఆశ్రయించినవి.

అప్పుడు చూచు దృశ్యము తర్వాత పేజీలో చూపబడినది చూడండి.





దేవుని ముద్ర చిత్రమును 107  పేజీ లో చూడండి.  


ఈ విధముగా దేవుని ముద్ర తయారు చేయబడినది. దేవుని

చిహ్నములో పై నుండి బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రములు దృశ్యరూపముగా

ఉండగా దేవుని ముద్రలో పై నుండి ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మలు

నాల్గు చక్రములుగల దృశ్య రూపముగా యున్నవి. దేవుని చిహ్నము,

దేవుని ముద్రలోని తేడాలను గమనించవలెను.


దేవుని చిహ్నములో నాలుగు చక్రముల పేర్లు పై నుండి క్రిందికి

వరుసగా బ్రహ్మచక్రము, కాలచక్రము, కర్మచక్రము, గుణచక్రము అని

చెప్పుచున్నాము. అదే చిత్రపటమునే దేవుని ముద్రగానే చెప్పితే దేవుని

ముద్రలో కూడా అదే చిత్రపటమున్నా, అందులో కూడా నాలుగు

చక్రములున్నా, ఆ నాలుగు చక్రములను పై నుండి క్రిందికి వరుసగా ఇలా

చెప్పవచ్చును. పైన ఉన్నది ప్రకృతికి గుర్తు, తర్వాత యున్నది పరమాత్మకు

గుర్తు, ఆ తర్వాత మూడవది ఆత్మకు గుర్తు, చివరిలో క్రిందగల నాల్గవ

చక్రము జీవాత్మకు గుర్తుగా కలదు. బ్రహ్మనాడి శరీరమునకు (ప్రకృతికి)


దేవుని ముద్ర చిత్రమును 108  పేజీ లో చూడండి.  


గుర్తుగా యున్నదని చెప్పవచ్చును. ఇక్కడ దేవుని ముద్రగాయున్న

నాల్గుచక్రములను లోతుగా గమనించితే పైకి గల ప్రకృతి చక్రము, చర

అచర ప్రకృతి అను రెండు భాగములుగా యున్నది. దానికంటే క్రింద

పరమాత్మ గుర్తు అయిన రెండవ చక్రము 12 భాగములుగా యున్నది.

అదే దేవుని చిహ్నములో కాలచక్రముగా చెప్పబడినది. అందులోని 12

భాగములను పన్నెండు నెలలకు గుర్తుగా చెప్పుకొన్నాము. ఇక్కడ అదే

చక్రమే దేవుని ముద్ర పేరులో పరమాత్మకు గుర్తుగా చెప్పబడినది. దానికంటే

క్రిందగల మూడవ చక్రము ఆత్మకు గుర్తుగా చెప్పడమైనది. పరమాత్మ

గుర్తుగా యున్న రెండవ చక్రము, ఆత్మకు గుర్తుగా యున్న మూడవ

చక్రము రెండూ 12 భాగములుగా యుండడము తెలిసిన విషయమే. ఈ

పన్నెండు భాగములు దేవుని చిహ్నములో కాల, కర్మచక్రముల విభజన

ప్రకారము కాలచక్రములోని పన్నెండు భాగములు పన్నెండు నెలలకు,

కర్మచక్రములోని పన్నెండు భాగములు మనిషి యొక్క పన్నెండు కర్మ రాశు



లకు సరిపడు విభజనలాగా కలవు. అదే దేవుని ముద్రయందు పరమాత్మ,

ఆత్మ రెండు చక్రములలో పైన క్రింద పన్నెండు భాగములు ఉండుట వలన

పరమాత్మతో సమానమైనవాడు ఆత్మయని తెలియబరచబడుచున్నది. దేవుడు

స్వయముగా తనవలె తన ఆత్మను అధికారిగా నిర్ణయించాడు. కావున

పైనగల భాగములే క్రిందకలవని అర్థము చేసుకోవచ్చును.


ఒక సంపూర్ణ బిందువు 360 డిగ్రీల కోణములో ఉండును. అనగా

ఒక చక్ర ఆకారము ఏదయినా 360 డిగ్రీల వృత్తముగా ఉండును. దేవుడు

అయిన పరమాత్మను ఒక చక్రముగా చూపడమైనది. ఆ చక్రమును అనగా

ఆ వృత్తమును 30 డిగ్రీల కోణముగా 12 భాగములను చేయుట వలన

360 డిగ్రీల కోణము సరిపోవుచున్నది. దేవుడు మూడు ఆత్మలుగా

యుండుట వలన మూడు పదుల డిగ్రీలను ఒక కోణముగా విభజించి 12

భాగములను చేసి 12x30=360 డిగ్రీల వృత్తము సరిపోవునట్లు ఉన్నదని

చెప్పవచ్చును. పైనగల పరమాత్మ చక్రము, క్రిందగల ఆత్మచక్రము రెండూ

సమాన భాగములుగా ఉండుట వలన రెండూ సమానముగా ఉన్నవని

చెప్పవచ్చును. చూచుటకు చెప్పుటకు వేరువేరు చక్రములుగా యున్నా

రెండూ ఒక్కటిగానే యున్నవి. రెండూ ఒకే అధికారము గలవిగా యున్నవి.

రెండు అన్నిటియందు సమాన అధికారము కలవిగా యుండుట వలన

రెండింటినీ ఒకటిగా చెప్పవచ్చును. అందువలన ఇంజీలు (బైబిలు)

జ్ఞానములో యోహాను సువార్త 10వ అధ్యాయములో 30వ వచనములో

ఇలా చెప్పబడియున్నది చూడండి.


(యోహాను 10-30) “నేనును నా తండ్రియును ఏకమై

యున్నామని వారితో చెప్పెను."


ఈ వాక్యమును గమనించితే నా తండ్రి (12) పన్నెండు అయితే

నేను పన్నెండుగానే యున్నానని, “నేను నా తండ్రి ఏకమైయున్నాము”

అన్నాడు, “ఒకటిగానే యున్నాము” అని అన్నాడు. మధ్యలో రెండు

చక్రములుగా యున్న తండ్రి కుమారుడు ఇద్దరూ సమానముగా యుండుట

వలన రెండు చక్రములయందు పన్నెండు భాగములనే చూపారు. క్రింద

నాల్గవ చక్రము జీవాత్మకు గుర్తుగా యున్నది. క్రిందగల జీవాత్మ పైన

మోక్షముగాయున్న పరమాత్మను చేరాలంటే మధ్యలో గల ఆత్మచక్రము

ద్వారానే పోవలసి యున్నది. అందువలన ఇంజీలులో యోహాన్ 14వ

అధ్యాయము ఆరవ వాక్యములో ఇలా చెప్పియున్నారు చూడండి.

(యోహాన్ 14-6) “యేసు నేనే మార్గమును, సత్యమును,

జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు”.

ఇక్కడ దేవుని ముద్ర చిత్రపటమును చూచిన ఈ వాక్యమునకు సరిపడు

జ్ఞానము కలదని తెలియుచున్నది. దేవుని చిహ్నము అను చిత్రపటమును

భగవద్గీతనుండి గ్రహించి మేము దాదాపు 40 సంవత్సరముల క్రిందటే

వ్రాశాము. ఆ దేవుని చిహ్నమును గురించి రెండు ఆయత్ల (5-2),

(22-32) ప్రత్యక్షముగా “దేవుని చిహ్నము” అని పేరు పెట్టి చెప్పడమైనది.

అంతేకాక పరోక్షముగా ఖుర్ఆన్ వాక్యములలో ఎక్కువ చోట్ల దేవుని

చిహ్నమును గురించి చెప్పబడినది. ప్రత్యక్షముగా 22వ సూరాలో 32వ

ఆయత్నందు గల వాక్యములో “దేవుని చిహ్నమును గౌరవించండి” అని

ప్రత్యక్షముగా చెప్పియున్నా, ముస్లీమ్లకు నేటి వరకు దేవుని చిహ్నమును

గురించి తెలియదనియే చెప్పవచ్చును. దేవుని చిహ్నమును గురించి దైవ

గ్రంథమయిన ఖుర్ఆన్లో చెప్పియున్నా అది ఏమిటో ప్రత్యక్షముగా గానీ,

పరోక్షముగాగానీ అర్థము కాలేదు.



దేవుని చిహ్నమును గురించి అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్

గ్రంథములో ఎక్కువగా చెప్పియున్నట్లు, దేవుని ముద్ర గురించి దైవ

గ్రంథమయిన ఇంజీలు గ్రంథములో ఎక్కువ చెప్పినట్లు కలదు. బైబిలు

(ఇంజీలు) గ్రంథములో పరోక్షముగా కొన్నిచోట్ల, ప్రత్యక్షముగా కొన్నిచోట్ల

చెప్పియున్నారు. అదే ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో దేవుని

ముద్రను లేక దేవుని చిహ్నమును గురించి ప్రత్యక్షముగా లేదుగానీ

పరోక్షముగా చెప్పబడియున్నది. మొదట నేను భగవద్గీతలో పరోక్షముగా

యున్న విషయమును చూచి 'దేవుని చిహ్నము' యొక్క చిత్రపటమును

అందరూ కళ్ళతో చూచునట్లు దాని ఆకారమును మేము వ్రాసి

చూపించడము జరిగినది. మేము చూపించిన దేవుని చిహ్నము బొమ్మనే

(చిత్రమునే) ఖుర్ఆన్ గ్రంథములో (22-32) లో “దేవుని చిహ్నమును

గౌరవించవలెను” అని వ్రాసినా ఎలా గౌరవించవలెనో వారు ఆలోచించ

లేకపోయారు. దేవుని చిహ్నము నాల్గు చక్రముల ఆకారముగా యున్నదని

కూడా గ్రహించలేకపోయారు. వారు వారి పెద్దలు చెప్పిన ప్రకృతి

జంతువులను, ప్రకృతి దృశ్యములను దేవుని చిహ్నములుగా పోల్చుకొన్నారు.

దేవుడు చెప్పినది ప్రకృతి సంబంధమైనది కాదని తెలియలేకపోయారు.


ఇంజీలు గ్రంథములో అనగా బైబిలు గ్రంథములోని నాలుగు

సువార్తలలో పరోక్షముగా దేవుని ముద్రను గురించి చెప్పడమైనది. మేము

దేవుని చిహ్నముగా చెప్పిన గుర్తునే దేవుని ముద్రగా ఇప్పుడు వ్రాయడమైనది.

దేవుని ముద్రను గురించి బైబిలు గ్రంథములోని సువార్తలలో పరోక్షముగా

చెప్పడమేకాక, గ్రంథము చివరిలో గల యోహాను వ్రాసిన 'ప్రకటన గ్రంథము’

అను దానిలో తొమ్మిదవ అధ్యాయమున నాల్గవ వచనము నుండి ఆరవ

వచనము వరకు ప్రత్యక్షముగా 'దేవుని ముద్ర' అను పేరుతోనే చెప్పడమైనది.


ఆ విషయమును ఇప్పుడు చూస్తాము. (ప్రకటన 9-4,5,6)

" నా సళ్లయందు దేవునిముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపై

నున్న గడ్డివైనను, ఏ మొక్కలకైననూ మరి ఏ వృక్షమున కైననూ

హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు

వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదుగానీ ఐదు నెలల

వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్య బడెను. వాటి

వలన కలుగు బాధ తేలు మనుష్యునికి కుట్టినప్పుడుండు బాధవలె

ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు

గానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు

గానీ మరణము వారి వద్దనుండి పారిపోవును".


యోహాన్ ప్రకటన గ్రంథములోగల మూడు వాక్యములను చూస్తే

దేవుని ముద్ర ఎంత గొప్పదో, దేవుని ముద్ర నొసళ్ళ మీద ధరించడము

వలన ఎంతటి విపత్తు తొలగిపోవునో, ఆ విపత్తుల వలన మనుషులు

ఎంత బాధపడవలసియుండునో గమనించిన, దేవుని ముద్రను ధరించక

ఎందుకు ఇంత అజ్ఞానములో ఉన్నామనిపిస్తుంది. యోహాన్ ప్రకటన

గ్రంథములో వ్రాసినట్లు అలా పీడించు దేవదూతలున్నారాయని అనుమానము

రావచ్చును. ఈ మాటను నమ్మకుండా ఉండిపోవుటకు, దేవుని ముద్రను

గౌరవించకపోవుటకు అవకాశము గలదు. అందువలన ఇంతవరకు చెప్పిన

దేవుని ముద్రను, ఒకమారు ప్రక్క పేజీలో చూచి తర్వాత దానిమీద గల

ఉద్దేశ్యమును చెప్పుకొందాము.


ఇప్పుడు మీకు చూపిన నాలుగు చక్రములు ప్రకటన గ్రంథములో

చెప్పిన అసలయిన దేవునిముద్ర యగును. దేవుని ముద్రను ధరించని

మనుష్యులను కాకుండా వృక్షములు, గడ్డి మొక్కలకు హాని కలుగజేయ



దేవుని ముద్ర చిత్రమును 113  పేజీ లో చూడండి.  


కూడదని ఆజ్ఞ ఇవ్వబడెను అని ఉన్నది. ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? ఎవరికి

ఇచ్చారు? అను విషయము కొంత అర్థమయితే పైన చెప్పబడిన వాక్యముల

మీద నమ్మకము ఏర్పడును. అప్పుడు దేవుని ముద్రను ఎవరయినా

గౌరవింతురు మరియు ధరింతురు. దేవుని ముద్ర జ్ఞానరీత్యా విడదీసి

చెప్పుకొన్నాము. అట్లే దేవుని చిహ్నమును జ్ఞానపద్ధతిలో వివరించి

చెప్పుకొన్నాము. ఇంతవరకు మేము చెప్పిన దేవుని చిహ్నము లేక దేవుని

ముద్రను గురించి ఇటు ముస్లీమ్లకు గానీ, అటు క్రైస్థవులకుగానీ తెలియదు.

హిందువుల విషయానికి వస్తే వారు ధరించే నామాలు, విభూతి రేఖలు,

కుంకుమ బొట్లు ఈ ముద్రకు ఏమాత్రము సంబంధము లేనివి. అందువలన

హిందువులకు కూడా దేవుని ముద్రను గురించి ఏమాత్రము తెలియదు.

ఇంతవరకు ఈ ముద్ర ఏ మతముల వారికి తెలియదు. దేవుని ముద్రను

గురించి ముఖ్యముగా మూడు మతముల వారికి తెలిసి యుండవలసినది.


అయితే ఇందూ, ఇస్లామ్, క్రైస్థవులు ముగ్గురు ఈ ముద్రను గురించి

ఏమాత్రము తెలియనివారైయున్నారు. ఈ ముద్ర మూడు మతములకు

సంబంధించినదై యున్ననూ, దేవుడు తన మూడు గ్రంథములలో ఈ

ముద్రను గురించి చెప్పియున్ననూ, మూడు మతముల వారు దేవుని

ముద్రను విస్మరించారు. దేవుడు చెప్పిన బోధను మనుషులే కాక

మనుషులతో పాటు పుట్టిన దేవుని పరిపాలనలోని పాలకులుగాయున్న

మహా భూతములు, భూతములు, గ్రహములు, ఉపగ్రహములు మొదలయిన

వారందరూ దేవుని జ్ఞానమును తెలుసుకొంటున్నారు. దేవుని పాలనలోని

వారందరూ దేవుని జ్ఞానమును ఎంతో ఇష్టముతో తెలుసుకోవడమేకాక

తమకు వచ్చు ఆజ్ఞలను తప్పనిసరిగా నెరవేర్చుచున్నారు. ఇక్కడ వాక్యములో

'ఆజ్ఞ ఇవ్వబడింది' యని చెప్పారు కదా! ఆజ్ఞను దేవుని పాలకులయిన

వారికి ఇవ్వబడినది. ఇచ్చిన వారు ఎవరు? అన్నది ఇప్పుడు మనకు

ముఖ్యమైన ప్రశ్న. ఆజ్ఞ ఇచ్చిన వారిని గురించి తెలియుటకు ముందు

ఆజ్ఞను గ్రహించి ఆజ్ఞను అమలు చేయు పాలకులు ఎంతమంది యున్నారు?

ఎట్లుయున్నారు? అను విషయము మనుషులకు కొంత అర్థము

కావలసియున్నది. అందువలన ముందు పాలకుల విషయము సూచన

ప్రాయముగా తెలుసుకొందాము.


భూమిమీద రెండు రకముల జీవరాసులు గలవు. ఒకటి పాలించ

బడువారు, రెండు పాలించువారు. పాలించబడువారు మనుషులు మరియు

సమస్త జీవరాసులు. పాలించువారు భూతములు, గ్రహములు అను రెండు

రకముల వారు గలరు. పాలించబడు మనుషుల, జీవరాసుల ఆకారములు

పేర్లు కొంతవరకు తెలిసే ఉన్నాయి. అయితే పాలించు భూతములు,

గ్రహములు, ఉపగ్రహముల ఆకారములు ఏమాత్రము మనుషులకు


తెలియవు. వారి ఆకారములను సమగ్రముగా కాకుండా సూచన

ప్రాయముగా చెప్పదలచాము. పాలకుల సంఖ్య భూతములుగా,

గ్రహములుగా, ఉపగ్రహములుగా మూడు రకముల వారు కొన్ని కోట్ల

సంఖ్యలో ఉంటారని చెప్పవచ్చును. కోట్లాదిగా యున్న గ్రహములుగానీ,

భూతములుగానీ ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. వాటి ఆకారము

జంతువులను, కీటకములను, పక్షులను, మనుషులను, సర్పములను కలిపి

చేసినట్లుండును. మనుషులు జంతువులు కలిసి పుట్టినట్లు కొన్నియుండగా,

జంతువులు పక్షులు కలిసి పుట్టినట్లు కొన్ని ఉండును. పక్షులు సర్పములు

కలిసి పుట్టినట్లు కొన్ని గలవు. ఇట్లు మనుషుల ఊహకు అందని

రూపములలో పాలకులున్నారని చెప్పవచ్చును. కొందరు పాలకులు రెండు

మూడు జాతులు కలిసి పుట్టిన ఆకారములుండగా, కొందరు పాలకులు

ఒకే ఆకారముతో పుట్టియున్నారు. ఏవి ఏ ఆకారములో యున్నా అవి

కొన్ని వందల కోట్లలో వేల కోట్లలో ఉన్నాయని చెప్పవచ్చును. భూమిమీద

ప్రస్తుత జనాభా 700 కోట్లమంది యుండవచ్చుననుకొందాము. 700

కోట్లమందికి 7000 కోట్ల పాలకులుండవచ్చునని అంచనా గలదు.



ఒక్క మనిషికి దాదాపు పదిమంది పాలకులయితే మిగతా

జీవరాసులన్నిటికీ కలిపి ఎంతమంది పాలకులుందురో చెప్పుటకు శక్యము

కాదు. మనుషులను పాలించు వారి వరకు అర్థము చేసుకొనినా మనిషి

ఎంతో జ్ఞానమును సంపాదించినట్లగును. మనుషులను పాలించు పాలకులు

దైవజ్ఞానములో మొదటి జ్ఞానులుగాయున్నారు. వారికి దేవుడంటే మహా

ఇష్టము. దేవున్ని దూషించు వారన్నా, దేవుని జ్ఞానమును దూషించు వారన్నా

చాలా కోపము. అయినా వారు తమకు ఇవ్వబడిన ఆజ్ఞప్రకారము పని

చేస్తారు. జ్ఞాన విషయములలో అజ్ఞానముగా నడచువారుగానీ, దేవున్ని


గౌరవించక దేవతలను, మనుషులను గౌరవించువారు, పూజించు వారి

మీద కూడా కోపముగా యుందురు. అయినా వారి ఇష్టానుసారముగా

పని చేయక వారికి ఇవ్వబడిన ఆజ్ఞప్రకారము పని చేయుదురు. ముఖ్యముగా

వారి ఆకారములను గురించి చెప్పితే మా మాటను నమ్మని వారుండవచ్చును.

అలాగే యుందురని చెప్పుటకు ఆధారమేమియని కూడా అడుగవచ్చును.

దానికి మా సమాధానము ఈ విధముగా కలదు. నేను ప్రత్యక్షముగా

ఎవరినీ చూడలేదుగానీ కొంత నాకున్న జ్ఞానము వలన, దైవగ్రంథములలో

చెప్పిన ఆధారముల వలన మాత్రమే చెప్పాను.


దేవుని పాలకులలో గ్రహముల క్రింద ఉపగ్రహములుగా యున్న

వారి ఆకారమును అదే ప్రకటన గ్రంథములో వ్రాసిన విధానమును చూచి

అర్థము చేసుకొందాము. ప్రకటన 9వ అధ్యాయము, ఏడవ వచనము

నుండి పదవ వచనము వరకు చూస్తాము. (యోహాన్ ప్రకటన 9-7,

8, 9, 10) “ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచ

బడిన గుఱ్ఱములను పోలియున్నవి. బంగారమువలె మెరయు

కిరీటములవంటివి వాటి తలల మీద యుండెను. వాటి

ముఖములు మనుష్యుల ముఖముల వంటివి. స్త్రీల తల

వెంట్రుకల వంటి తల వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి

పండ్లు సింహపు కోరలవలె నుండెను. ఇనుప మైమరువులవంటి

మైమరువులు (కవచములు) వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని

యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల

ధ్వనివలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలును, కొండ్లును వాటికి

ఉండెను. ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు

హాని చేయుటకు వాటికి అధికారముండెను". ఈ విధముగా


మనుష్యులను బాధించు దూతల ఆకారములను గురించి కొద్దిగా ఇక్కడ

చెప్పబడినది. నేను గతములో చాలామార్లు దేవుని పాలనలోని పాలకుల

గురించి చెప్పియున్నాను. వారికి వందల వేల చేతులు కూడా ఉన్నాయని

ఎక్కువ చేతులుగల పాలకులను గురించి కూడా చెప్పియున్నాము. వారి

ఆకారములు ఇక్కడ చెప్పినట్లు మిశ్రమ ఆకారములుగా యున్నవి. వాటి

బలమును అంచనా వేయలేము. దేవుని జ్ఞానము ఎడల ఎంతో ఇష్టతతోనూ,

భక్తితోనూ ఉన్న పాలకులు అయినందున వారి ముందు దేవున్నిగానీ,

దేవుని జ్ఞానమునుగానీ దూషించిన వారిని శిక్షించుటకు ఆజ్ఞ కోసము

చూచుచుందురు.


దేవుని పాలనలో గల ఎన్నో కోట్ల సంఖ్యలో యున్న పాలకులు

తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించక తమకు వచ్చు ఆజ్ఞ ప్రకారమే నడుచు

కొందురని తెలియుచున్నది. (ప్రకటన 9-5) లో "వారిని చంపుటకు

అధికారము ఇవ్వబడలేదుగానీ ఐదు నెలల వరకు బాధించుటకు

వాటికి అధికారము ఇయ్యబడెను". అట్లే పదవ వాక్యములో కూడా

“మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను” అని

చెప్పబడియున్నది. దీనిప్రకారము పాలకులందరు తమకు ఇవ్వబడిన ఆజ్ఞ

ప్రకారము పని చేయుచుందురని తెలియుచున్నది. కొన్ని సందర్భములలో

మనుషులు చేసుకొన్న పాపములను బట్టి వారిని చంపుటకు కూడా ఆజ్ఞ

ఇవ్వబడుచుండును. తమకు వచ్చిన ఆజ్ఞ ప్రకారము పాలకులుగా

యున్నవారు పని చేయుచుందురు. పాలకులు అనేక రూపములలో యున్నా,

అనేక చేతులతో యున్నా ఎక్కడగానీ, ఏ సందర్భములోగానీ మనుషులకు

కనిపించిన దాఖలాలులేవు. అందువలన మనుషులు పాలకుల వలన

శిక్షలు అనుభవించుచున్నా ఎవరి వలన వారికి ఆ బాధలు ఏర్పడుచున్నవని


తెలియదు. గొప్ప రోడ్డు ప్రమాదములకు కారకులు పాలకులే అయినా

ఆ విషయము మనుషులకు తెలియదు. అనేక రోగములకు కారకులు

పాలకులేయని చాలామందికి తెలియదు. చిన్న సంఘటనలు మొదలుకుని

పెద్ద పెద్ద తుఫానుల వరకు, సునామీల వరకు, భూకంపముల వరకు

అనేక ప్రకృతి విపత్తులుగా వచ్చు ప్రమాదములు కూడా పాలకులవల్ల

కల్గుచున్నవేయను విషయము చాలామందికి తెలియదు. ఇదంతా

మనుషులు చేసుకొన్న పాపముల వలననే జరుగుచున్నవి. మనుషుల

పాపములనుబట్టి పాలకులకు ఆజ్ఞ ఇవ్వబడుచున్నది. పాలకులకు వచ్చిన

ఆజ్ఞప్రకారము దేవుని సైనికులుగా యున్న పాలకులు వారి పనిని వారు

చేయుచుందురు. ఈ తతంగమంతా తెలియుటకు దైవజ్ఞానము అవసరమని

చెప్పుచున్నాము.


పాలకులు ఆకాశమునుండి భూమివరకు యున్నారు. వారు

ఎక్కడికయినా పోగలరు, ఎక్కడయినా ఉండగలరు. మనుషులను పాలించు

పాలకులు బయట ప్రపంచములో కొన్ని వందల కోట్లలో యున్ననూ

మనుషులకు వారి విషయము తెలియదు. ప్రకృతియంతా తిరుగుచూ

మనుషుల కర్మలనుబట్టి ప్రవర్తించుటకు ప్రకృతి చేతనే ఆజ్ఞలు ఇవ్వబడు

చున్నవి. ప్రకృతి నుండి వచ్చు ఆజ్ఞను పాలకులుగా యున్న గ్రహములు,

భూతములు నెరవేర్చుచున్నవి. ప్రకృతి వెనుకయుండి ప్రకృతిని

నడిపించువాడు పరమాత్మ. పరమాత్మ ప్రకృతికి ఎలా తన సూచనలను

తెల్పునో మనకు తెలియదు. ప్రకృతి దేవుని సూచన ప్రకారము పాలకులకు

ఆజ్ఞ ఇవ్వగా, పాలకులు అట్లే పని చేయుచున్నారు. మనిషి పుట్టినప్పటినుండి

చనిపోవు వరకు రెండు విధముల పాలించబడుచున్నాడు. ఒకటి బయటి

పాలన ద్వారా, రెండు లోపలి పాలన ద్వారాయని చెప్పవచ్చును. లోపలి,



బయట అనడములో శరీరము బయట, శరీరము లోపలయని చెప్పవచ్చును.

శరీరము బయట ప్రకృతిచే ఆజ్ఞలురాగా, ఆ ఆజ్ఞల మేరకు పాలకులు పని

చేయగా, శరీరము లోపల స్వయముగా ఆత్మే మనిషిని కష్టసుఖములు

అనుభవింపజేయుచున్నది. బయట ప్రకృతి తప్ప పరమాత్మ పని చేయడు.

ప్రకృతి నుండి వచ్చు ఆజ్ఞలు స్వయముగా ప్రకృతి ఇచ్చునట్లే యుండును.

అయినా గౌరవప్రదముగా ప్రకృతికి పరమాత్మ సూచనల ద్వారా ప్రకృతి

ఆజ్ఞలను ఇచ్చుచున్నదని చెప్పుచున్నాము. అయినా ప్రకృతికి పరమాత్మ

సూచన చేయుచున్నాడని చెప్పుటకు శాస్త్రాధారము ఏమీ లేదు.


శరీరములో ఆత్మ దేవుడుగాయుంటూ మరియు కార్యకర్తగా

యుంటూ రెండు విధముల పని చేయుచూ జీవులను పాలించుచున్నాడు.

ఆత్మ శరీరములో ఒకవైపు దేవుడుగాయున్నా మరొకవైపు కార్యకర్తగా అనగా

గుమస్తావలె పని చేయువాడుగా యుండి, పని చేయుచూ జీవరాసులను

(మనిషిని) కష్టసుఖములను అనుభవింపజేయుచున్నాడు. శరీరములో గల

జీవుడు చేసుకొన్న ప్రారబ్ధ కర్మప్రకారము కష్టసుఖములను అనుభవింప

జేయుటకు శరీరములోని ఆత్మే స్వయముగా పనిని చేయుచు కష్టసుఖ

అనుభవములను పొందునట్లు చేయుచున్నాడు. కర్మప్రకారమే నడుచు

ఆత్మ కర్మప్రకారమే జీవున్ని నడుపుచున్నది. అట్లే కర్మప్రకారమే జీవున్ని

చంపుచున్నది. అట్లే జీవున్ని మరొక శరీరములో పుట్టించుచున్నది.

కష్టసుఖములను, చావు పుట్టుకలను కలుగజేయు ఆత్మ జీవుని శ్రద్ధనుబట్టి

జ్ఞానమును కల్గించుచున్నది. మనిషి ఇష్టమునుబట్టి జ్ఞానమును కల్గించినట్లే,

అయిష్టమునుబట్టి అజ్ఞానమును కూడా కల్గించుచున్నది. శరీరములోపల

ఆత్మ పాలించగా, శరీరము బయట పాలకులు పాలించుచూ జీవున్ని

నడుపుచున్నారు. శరీరము బయట పాలకులు పెట్టు ఇబ్బందులను, కష్ట


సుఖములను ఓర్చుకోలేక మనిషి అయిన వాడు చావును వెదకుకొనును

అని గలదు. కర్మ ప్రకారమే అన్నీ జరుగును కనుక వాడు అనుభవించవలసి

యున్నది, అనుభవించక తప్పదు. అందువలన బాధలకు తట్టుకోలేక

మరణము కొరకు వెదకినా మరణము రాదు. శరీరములో ఆత్మే అన్నీ

చేయుచున్నది. కావున ఆత్మకు తెలియకుండా చావురాదు. శరీరములో

పరిపాలన క్షణక్షణము జరుగుచుండగా, శరీరము బయట పాలన

అప్పుడప్పుడు జరుగుచుండును. బయట అనుభవమునకు అయినా, లోపలి

అనుభవమునకు అయినా కర్మే కారణమయి ఉండుట వలన అన్నీ కర్మ

వలననే కర్మప్రకారమే జరుగుచున్నవి. అయితే మనిషి లోపలి ఆత్మ పాలనను

తెలియగలిగితే, తర్వాత కొద్దికొద్దిగా బయటి పాలన అర్ధము అగును.


శరీరములో ఆత్మే దేవుడు, ఆత్మే పాలకుడు, ఆత్మే కార్యకర్తగా

యున్నాడు. బయట దేవుడు పరమాత్మయున్నా ఆయన లేనట్లే ఉన్నాడు.

పరమాత్మ ఏమీ చేయకున్నా బయటనే యున్న ప్రకృతియే బయటనే గల

పాలకుల చేత మనిషిని పాలించుచున్నది. దేవుడు అయిన పరమాత్మ

ప్రకృతి వెనుకయుండి ఎవరికీ తెలియకుండా యున్నాడు. మూలకర్త,

ఆది దేవుడు పరమాత్మే అయినా మనుషులందరికీ శరీరములో గల ఆత్మనే

దేవునిగా ప్రకటించి, తనకున్న అధికారములన్నీ ఆత్మకు ఇచ్చి, ప్రజలకు

ఆరాధ్యదైవముగా ఉండునట్లు స్వయముగా దేవుడే నిర్ణయించాడని ఖుర్ఆన్

గ్రంథములో (3-18) లో చెప్పడమైనది. ఒక్క ఖుర్ఆన్ గ్రంథములోనే

కాకుండా మిగతా భగవద్గీతలోనూ, బైబిలులోనూ ఆత్మనే ఆరాధ్యదేవుడుగా

చెప్పియున్నారు. ఆత్మ దేవుడేకాక, శరీరములో కార్యకర్తగా కూడా యున్నదని

అదే ఖుర్ఆన్ గ్రంథములో (6-102) వ వాక్యములో చెప్పియున్నారు.

ఆత్మ మనిషి చేసుకొన్న కర్మప్రకారము పనిచేయుచూ పాపపుణ్యములను



అనుసరించి కష్టసుఖములను కలుగజేయుచుండును. ఆత్మ శరీరములో

కలుగజేసిన ప్రతి పాపమునుగానీ పుణ్యమునుగానీ జీవుడు అనుభవిస్తున్నాడు.

అయితే బయట ప్రపంచములో ప్రకృతి తన పాలకుల చేత మనిషిని

కొన్ని ప్రమాదములకు గురి చేయునట్లు తెలుసుకొన్నాము. అది కూడా

మనిషి చేసుకున్న పాపము వలన జరుగునదే కదా! శరీరములో యున్న

ఆత్మ పాపపుణ్యములను తన శరీరమునందే పాలించగా బయట

అనుభవించ వలసిన పాపపుణ్యములను బయటి దేవుడయిన పరమాత్మ

ప్రకృతికి సూచనలివ్వగా, ప్రకృతి పాలకులకు సూచనలు ఇవ్వగా, పాలకులు

మనిషిని కష్టసుఖములకు గురి చేయుచున్నారు.


మనిషి శరీరము బయట అనుభవించినా, శరీరము లోపల

అనుభవించినా మనిషి తలలో కర్మచక్రములోగల కర్మప్రకారమే అనుభవ

ముండును. బయట అనుభవించవలెనని ముందే నిర్ణయించబడి యున్న

కర్మలను ప్రకృతి బయట అనుభవింపజేయును. శరీరము లోపల

అనుభవించవలసిన కర్మలను ఆత్మ బయట అనుభవించునట్లు చేయును.

శరీరము బయట పాలకులయిన భూతములు, గ్రహములు తమకు వచ్చిన

ఆజ్ఞప్రకారము కర్మను అనుభవింపజేయడమేకాక కర్మను అనుభవింప

చేయకుండా కర్మను లేకుండా చేయగల సామర్థ్యము గలవిగా యున్నవి.

దేవుని మీద విశ్వాసమున్న వాని కర్మలను ఆత్మ శరీరములో క్షమించును

అని తెలుసుకొన్నాము. భగవద్గీతలో చెప్పిన ప్రకారము జ్ఞానముగల మనిషికి

జ్ఞానశక్తి యుండుననీ, జ్ఞానశక్తియే జ్ఞానాగ్నిగా మారి మనిషిలోని కర్మను

దహించి వేయుచున్నదని చెప్పారు. భగవద్గీతలో జ్ఞానయోగము అను

అధ్యాయమున 37వ శ్లోకమున ఈ విషయమును చెప్పారు చూడండి.


శ్లో। యధంసి సబట్టోగ్ని రససాత్కురుతేర్జున

జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా |


(కర్మయోగము, బ్రహ్మయోగము).


భావము :- “అగ్నిలో ఎన్ని కట్టెలైనాగానీ కాలి బూడిద అయినట్లు జ్ఞానమను

అగ్నిలో సర్వకర్మలు కాలిపోవును. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు.”

అని చెప్పియున్నారు. ఆ మాట ప్రకారము శరీరము లోపల అనుభవమునకు

వచ్చు కర్మలు శరీరములోనే జ్ఞానము చేత క్షమించబడును. దానినే

కాలిపోవును అని అర్థమగునట్లు చెప్పారు. శరీరములో గల ఆత్మే

శరీరములోని కొన్ని కర్మలను క్షమించి వేయుచున్నాడు. అనగా లేకుండా

చేయుచున్నాడు. ఏ మనిషి అయినా దేవుని సత్యమైన జ్ఞానమును తెలిసి

ఆచరించిన ఎడల, స్వచ్ఛమయిన దేవుని జ్ఞానము తెలిసి అదే భావము

కల్గియుండడము వలన అతని కర్మలు లేకుండా పోవును, అనగా క్షమించ

బడును. దైవజ్ఞానము గల మనిషి లోపల అనుభవించవలసిన కర్మలనుగానీ,

బయట అనుభవించవలసిన కర్మలనుగానీ అనుభవించకుండా శరీరము

లోపల ఆత్మయిన దేవుడు చేయుచున్నాడు. శరీరము బయట పరమాత్మయైన

దేవుడే చేయుచున్నాడు. అయితే ఆయన పని చేయనివాడైనందున తాను

స్వయముగా ఏదీ చేయక తన పాలకుల చేత చేయించును. అందువలన

దేవుడు క్షమాశీలుడు, కరుణామయుడు అని దైవగ్రంథములలో చెప్పారు.

దేవున్ని విశ్వసించిన వానికి, దేవుని జ్ఞానమును తెలిసిన వానికి దేవుడు

క్షమాశీలుడు, కరుణా మయుడు. అంతేతప్ప అందరికీ దేవుడు క్షమాశీలుడు

కాడు. పాపమును క్షమించుటలోనే ఆయనకు కరుణయున్నది

కరుణామయుడుగానీ, అజ్ఞానులు యెడల కరుణామయుడు కాదని

తెలియవలెను.



దైవగ్రంథముల ప్రకారము జ్ఞానమును తెలియగలిగి అదే

భావములో యుండువానికి వాని శరీరములోని ఆత్మే వాని కర్మలను

కాల్చి వేయుచున్నది. శరీరము బయట అనుభవించవలసిన కర్మలను

శరీరము బయటగల పాలకులే అనుభవింపజేయుటకుగానీ, అనుభవించ

కుండా కర్మను లేకుండా చేయుటకుగానీ అర్హులుగాయున్నారు. శరీరము

లోపల ఆత్మ చేయు పనిని, శరీరము బయట ప్రకృతిలోని పాలకులు

శిక్షించడముగానీ, క్షమించడముగానీ చేయుచున్నారు. ఇదంతయూ కంటికి

కనిపించు విషయము కాదు. జ్ఞానమునకు మాత్రమే తెలియు విషయము.

అందువలన జ్ఞానముగలవారే ఈ విషయములను సులభముగా గ్రహించ

గలరు. జ్ఞానము లేనివారు, దేవుని మీద విశ్వాసము లేనివారు మేము

చెప్పిన విషయములను నమ్మలేరు. మీరు చెప్పేదానికి ఆధారమున్నదా,

శాస్త్రాధారమున్నదా? యని ప్రశ్నింతురు. భగవద్గీతలో జ్ఞానయోగమున చెప్పిన

37వ శ్లోకము యొక్క ఆధారముతో మేము ఈ మాట చెప్పుచున్నామనినా,

అదే మాకు శాస్త్రాధారము అని చెప్పినా ప్రత్యక్షముగా మేము చూస్తేగానీ

నమ్మము అనువారు గలరు.


అటువంటి వారికి శరీరము లోపల జరుగు కర్మ క్షమాపణ ఎటూ

తెలియదు. అందువలన బయట జరుగు కర్మ క్షమాపణ విషయములోనే

ప్రత్యక్షముగా కనిపించునట్లు చేయాలని మనకు తాతయైన పరమాత్మ

అనుకోవడము వలన అజ్ఞానులు సహితము విశ్వసించునట్లు, వారు కూడా

జ్ఞానులుగా మారునట్లు, హేతువాదులను, నాస్తికవాదులను ఆలోచింప

జేయునట్లు, పాలకులచేత పాపక్షమాపణ జరుగుచుండడము నేడు

ప్రత్యక్షముగా కనిపించునట్లు దేవుడు చేశాడని చెప్పవచ్చును. బయటి

దేవుడు ఏమీ చేయక స్థబ్దతగాయుంటూ అన్నీ తన కార్యకర్తలైన ప్రకృతిలో


పాలకులుగా యున్న వారిచేత చేయించుచున్నాడు. బయట పాలకులు

ఎన్నో కోట్లమంది యుంటూ, పెద్ద ప్రమాదములను ఒకరికి ఇద్దరికికాక

సామూహికముగా మనుషులున్న చోట కలుగజేసి, వందలు వేలమందిని

మరణించునట్లు చేయుచున్నారని చెప్పుకొన్నాము. వారికి కర్మను

పాలించడమే కాక కర్మను కాల్చివేయడము కూడా చేయుచున్నారు. దేవుని

మీద, దేవుని జ్ఞానము మీద విశ్వాసమున్న వారికి బయట పాలకులు

కర్మను ఎలా కాల్చివేశారో (లేకుండా చేశారో) ఒక ప్రత్యక్ష సంఘటన

ద్వారా తెలుసుకొందాము. శరీరము లోపల ఆత్మ దేవుడు కర్మను లేకుండా

చేసినా అది ఎవరికీ అర్థము కాదు. అది ఇలా జరిగిందియని తెలియదు.

తగలబోయే దెబ్బ తగలకుండా పోయినా, వచ్చిన రోగము నెలరోజులు

పీడించునది ఒక రోజులో లేకుండా పోయినా అదంతా సహజంగానే

జరిగింది అనుకుంటారు. ఒకనికి శరీరములో కడుపునొప్పి నెలరోజులు

అనుభవించు కర్మ అమలుకు వచ్చినది. అయితే వాడు దేవుని ఆశ్రయించి

(దేవుని జ్ఞానమును ఆశ్రయించి) ఉండడము వలన అతనికి కడుపునొప్పి

ఒక రోజు మాత్రము ఉండి మిగతా 29 రోజులు లేకుండా పోయినది.

అప్పుడు అతను తనకున్న జ్ఞానము ప్రకారము అది పోయిందనిగానీ,

శరీరము లోపల దేవుడు తన కర్మను క్షమించాడని గానీ అనుకొనే దానికి

వీలులేదు. అతను వాడిన మాత్రతో కడుపునొప్పి తగ్గిపోయినదని

అనుకొనును. అతనికి ప్రత్యక్షముగా మింగిన టాబ్లెట్ (మాత్ర) కనిపించును

తప్ప జ్ఞానము వలన క్షమాపణ జరిగినదని అనుకొను వీలేలేదు.

అదియునూగాక అతనికి తన కడుపునొప్పి నెల రోజులు అనుభవించ

వలసియున్నదను విషయము కూడా తెలియదు. అందువలన తన నొప్పి

ఒక గంటలో పోయినా లేక ఒక దినములో పోయినా మన లెక్కలో అది

కర్మ క్షమాపణ లేక కర్మదహనము అని చెప్పవచ్చును. ఆ విషయము


కడుపునొప్పియున్న వానికి తెలియదు. అతడు తననొప్పి తాను మింగిన

టాబ్లెట్ (మాత్ర) ద్వారా పోయింది అనుకొనును. తాను నమ్మిన జ్ఞానము

ద్వారా పోయింది అనుకోడు.


ఈ విధముగా కర్మ దహనము జరిగినా అది మనిషికి తెలియుటకు

అవకాశము లేదు. అందువలన దేవుని మాట అసత్యముగా కనిపించు

అవకాశము గలదు. అట్లే శరీరము బయట కర్మలు పాలకులు శిక్షించకుండా

దహించివేసినా, అవి దేవుడు క్షమించుట వలన పోయాయి అనిగానీ, దైవ

గ్రంథములో చెప్పినట్లు కర్మ దహించబడినదని గానీ అనుకొనుటకు

వీలులేదు. తనకున్న కర్మ కొంతేయని అనుకొంటాడు. ఈ విధముగా

సత్యము తెలియకుండా పోవుటకు అవకాశము గలదు. మనిషి ప్రత్యక్షముగా

స్థూలముగా ఉన్న దానినే గమనిస్తాడుగానీ, పరోక్షముగా సూక్ష్మముగా జరుగు

విషయములను గ్రహించలేడు. దానివలన మనిషి జ్ఞానములోనికి వచ్చు

అవకాశము తగ్గిపోవును. అజ్ఞానులుగా మారుటకే అవకాశము ఎక్కువ

ఉండును. అటువంటప్పుడు స్థూలముగా జరుగు కర్మదహనము

మనుషులకు తెలియునట్లు చేయమని కోరాము. అలా తెలియుట వలన

మనిషి కర్మదహనమును గ్రహించి భగవద్గీత జ్ఞానయోగము 37వ

శ్లోకములో చెప్పిన 'కర్మదహనము' అనుమాట సత్యమని తెలియును. అలాగే

బైబిలు గ్రంథములో చెప్పిన 'పాపక్షమాపణ' అను వాక్యమును నమ్మును.

అట్లే ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన 'దేవుడు క్షమాశీలుడు' అనుమాటను

విశ్వసించును.


మానవుడు దేవుని జ్ఞానమును తెలియునట్లు కర్మదహన విషయము

సూక్ష్మముగా కాకుండా స్థూలముగా తెలియునట్లు దేవుడు చేయదలచాడని

అందువలన కర్మదహనము స్థూలముగా జరుగునట్లు దానిని మనిషి


గ్రహించునట్లు చేశాడు. తమ కర్మనుండి బయటపడినట్లు తెలిసిన కొందరు

దేవుడు తమ కర్మను క్షమించాడనీ, తమ కర్మను లేకుండా చేశాడని

చెప్పుకోవడము చూచి మేము ఎంతో సంతోషించాము. మనిషి ప్రపంచ

సంబంధ కోర్కెలను కోరకుండా దైవ సంబంధ కోర్కెలను కోరవచ్చును.

దైవికమైన కోర్కెలు కోరువారినే దేవుడు ఇష్టపడును. నేను కర్మ దహనము

స్థూలముగా తెలిస్తే బాగుంటుంది, మనుషులకు జ్ఞానము యొక్క విలువ,

పవిత్రత తెలుస్తుంది. ఆ విషయము దేవునికి కూడా తెలుసు కావున నా

కోర్కెను ఆలకించిన దేవుడు బయట కర్మలు దహించడము స్థూలముగా

తెలియునట్లు చేశాడు. స్థూలముగా ఎలా తెలియును? అని కొందరు ప్రశ్నించ

వచ్చును. అందువలన నాకు తెలిసిన, నేను చూచిన ఒక యదార్థ సంఘటన

గురించి ఇప్పుడు చెప్పుకొందాము. అంతకు ముందు నేను కొన్ని వందల

సంఘటనలను గురించి ఇతరులు నాకు చెప్పగా విన్నానుగానీ, ప్రత్యక్షముగా

నేను చూడలేదు. చాలామంది నాకు చెప్పుటకంటే దృశ్యరూపముగా చూపుట

మంచిదని వీడియో చిత్రములు, ఫోటోలు తెచ్చి చూపారు. అయితే నేను

దానిని గురించి ఎక్కువ ఆలోచించ లేకపోయాను. నేను ఎక్కువ కాలము

గ్రంథరచనలో గడుపుట వలన నేను చూచిన వీడియో చిత్రములను గురించి,

ఫోటో చిత్రముల గురించి కారణమునుగానీ, శాస్త్రీయతనుగానీ, వాస్తవికతను

గానీ ఆలోచించలేకపోయాను. ఒక దినము ఒక ముస్లీమ్ వ్యక్తి నాకు

పరిచయమున్న మరొక మనిషితో కలిసి రావడము జరిగినది. వచ్చిన

ముస్లీమ్ వ్యక్తి ఐదు రోజులుగానీ లేక తొమ్మిది రోజులుగానీ ఇక్కడే ఉండి

పోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడన్నది నాకు ఇప్పుడు జ్ఞాపకము లేదు.

బహుశా ఐదు రోజులే అనుకుందాము.


శరీర ఆరోగ్యములు సరిగా లేనివారు, అనేక ఆరోగ్య సమస్యలున్న


వారు కృష్ణమందిరములో 3, 5, 9 రోజులు నిద్ర చేసి పోవుచుందురు.

కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ పని సేవరూపములో చేయుట వలన

వారి ఆరోగ్య సమస్యలు లేకుండా పోవునని నమ్మకము. అదే నమ్మకముతో

ముస్లీమ్ కుటుంబము అనగా దాదాపు 60 సంవత్సరములున్న అతను,

అతని భార్య ఇద్దరూ రావడము జరిగినది. అప్పుడు నేను మందిరములోనే

యున్నా నా గదిలో నేను ఉంటాను. నా వద్దకు ఎవరూ రారు. నేను

బయటికి పోను. ముస్లీమ్ వ్యక్తిని పిలుచుకొని వచ్చిన వ్యక్తి నాతో కలిసి

మాట్లాడుటకు అనుమతిని అడుగగా నేను అనుమతి ఇవ్వడము, ఆయన

నా దగ్గరకు వచ్చి మాట్లాడడము జరిగినది. అప్పుడు అతని వెంట వచ్చిన

ముస్లీమ్ను గురించి చెప్పడము జరిగినది. నా దగ్గరకు వచ్చిన వ్యక్తి

ఉన్నత పాఠశాల (హైస్కూలు) లో టీచర్గా పని చేయుచున్నాడు. అతని

వెంట వచ్చిన అతనిది కూడా టీచర్ ఉద్యోగమే, అదే స్కూల్లో చేయుట

వలన ఇద్దరికి పరిచయమున్నది.


ఆ ఇద్దరు టీచర్లు నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో ఉద్యోగము

చేయుచున్నారు. ముస్లీమ్కు దాదాపు కొన్ని సంవత్సరముల నుండి కడుపులో

క్యాన్సర్ రోగమున్నట్లు, అతను మూడు, నాలుగు సంవత్సరములనుండి

అనారోగ్యముతో బాధపడుచూ ఆస్పత్రులలో చికిత్స చేయించుకోవడము,

ఇప్పటికి దాదాపు 15 లక్షల రూపాయలు అయిపోయాయని, అయినా

అది నయము కాలేదని అతను స్కూల్కు వచ్చి కూర్చొనే ఓపిక లేక

పడుకొని పోయేవాడని, అతని పరిస్థితి చూచిన అందరూ ఆయనకు

సహకరించే వారనీ, స్కూల్కు వచ్చి పోయినా అటెండెన్స్ వేసి జీతము

ఇచ్చేవారనీ, ఆయన రోగముతో బాధపడుచుంటే చూడలేక నావద్దకు

వచ్చిన మనిషి నేను వ్రాసిన ఒక గ్రంథమును అతనికి బాధయున్న చోట


కడుపు మీద పెట్టగా, ఆ గ్రంథము పొట్టకు అతుక్కొని పోయిందని చెప్పారు.

కడుపుకు అంటుకొని పోయిన గ్రంథము ఏకధాటిగా ఎనిమిది గంటలసేపు

అతుక్కోవడము జరిగినది. ఎనిమిది గంటల తర్వాత అతనికి కడుపులో

నొప్పి పోయినది. కడుపు నొప్పి పోయిన తర్వాత గ్రంథము కడుపునుండి

ఊడి వచ్చినది. అదంతా గ్రంథము ఇచ్చిన సుధాకరాచారికి, గ్రంథము

అంటుకొన్న ముస్లీమ్కు ఆశ్చర్యముగా కనిపించినది. ప్రతి దినము క్యాన్సర్

రోగముతో బాధపడే మహబూబ్ భాషా గారికి అప్పటినుండి కడుపులో

నొప్పి రాలేదట. ప్రత్యక్షముగా గ్రంథము కడుపు మీద ఏకధాటిగా ఎనిమిది

గంటలు అతుక్కొని యుండి లోపల బాధగాయున్న కర్మను లేకుండా

చేయడము వారికి ఆశ్చర్యము మరియు అద్భుతముగా కనిపించినది. అతని

కడుపుకు నా గ్రంథము అంటుకొని యున్న ఫోటోను నాకు చూపారు.


కడుపులోని బాధ కనిపించకుండా పోయిన నెల తర్వాత వారు

ఆశ్రమములో నిద్రచేస్తే మంచిదని ఇక్కడకు రావడము జరిగినది.

విషయమంతా నావద్దకు వచ్చి మాట్లాడిన వ్యక్తి చెప్పగా నేను విన్నాను.

తర్వాత అతను తిరిగి తన ఊరికి పోవు దినమున అతనిని పిలిచి

మాట్లాడాను. అప్పుడు అతని పేరు మహబూబ్ భాషాయని చెప్పి తనకు

జరిగిన విషయమంతయూ చెప్పాడు. దానితో వారు చెప్పినదంతా వాస్తవమని

నాకు అర్థమయినది. అంతవరకు ఆ విషయము మీద దృష్టి సారించని

నేను కొంత ఆలోచన, కొంత లోచన చేయగా మరికొంత యోచనగా

తెలిసినది. ముస్లీమ్ నాకు చూపిన ఫోటో మాటిమాటికి గుర్తుకు వచ్చేది.

అందువలన నేను ఆ విషయమును లోచన యోచన వరకు తీసుకుపోయాను.

ఆ ఫోటోను 129వ పేజీలో మొదటనే చూడవచ్చును. 129వ పేజీ నుండి

144వ పేజీ వరకు మరికొన్ని ఫోటోలను కూడా మీరు చూడవచ్చును.


నేను చూచిన ఫోటో ఒక ముస్లీమ్, తగులుకొన్న గ్రంథము

హిందువులది. దేవునికి మతములేదు. మనుషులమయిన మనము

మతమును పెట్టుకొన్నాము. మనుషులందరూ దేవుని దృష్ఠిలో ఒక్కటే.

దేవుడు మనుషుల మతమును చూడలేదు. వారి విశ్వాసమును చూస్తున్నాడు.

ఒక ముస్లీమ్ దేవుని మీద విశ్వాసముతో దేవుని జ్ఞానముగల గ్రంథమును

తన కడుపుకు ఆనించుకోగా, అది బంకవేసి అతికించినట్లు అతుక్కొన్నది.

అది అందరికీ కనిపించు దృశ్యమే. అలా కనిపించు దృశ్యములలో మూడు

మతములవారి ఫోటోలు కలవు. ఇది ఒక గ్రంథము మనిషికి అతుక్కోవడము

వరకే అయితే దానిని మంత్రమో, తంత్రమోయని సరి చేయవచ్చును.

అలా అతుక్కోవడమే కాక ఆ కార్యము వెనుక ఆధ్యాత్మిక రహస్యము

ఇమిడియున్నది. ఏ మనిషికయితే గ్రంథము అంటుకొని అలాగే

నిలిచిపోయినదో ఆ దృశ్యము వెనుక అందరి బుద్ధికి అందని ఒక ఘన

కార్యము జరుగుచున్నది. గ్రంథము అతుక్కోవడము బయటి ప్రపంచములో

ఒక విచిత్రమే. చిన్న గ్రంథమయితే ఏదో అనుకోవచ్చును. అట్లు కాకుండా

800 పేజీల గ్రంథములు కనీసము ఒక కేజీ నుండి దాదాపు రెండు కేజీల

బరువుండు గ్రంథములు భూమి ఆకర్షణకు క్రిందపడకుండా,

భూమ్యాకర్షణకు వ్యతిరిక్తముగా నిలబడడము ఎవరికయినా ఆశ్చర్య

విషయముగా కనిపించును. దీనికి హేతువాదులను నాస్తికవాదులు

మోసము, దగాయనియో ప్రచారము కొరకు దేని చేతనో అతికించి చూపు

చున్నారని అనుకోవచ్చును. సరే వారి మాటప్రకారమే కనిపించే దృశ్యము

మోసము, దగా కావచ్చును. అయితే అక్కడ కనిపించక జరుగు కార్యమును

గురించి ఎవరూ ఏ వివరణ ఇవ్వలేరు. అక్కడ కనిపించక జరుగు

కార్యమును గురించి మేమే స్వయముగా ఆలోచించడము జరిగినది. మా


గ్రాహితశక్తి లోచన యోచనవరకు పోతేగానీ మాకే అర్థము కాలేదు.

అందువలన ఈ విషయమును ఎవ్వరూ ఆరోపించలేరు.


ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. ఈ విషయమును

నేను వినినా కొన్ని ఫోటోలు చూచినా తేలికగా తీసుకొని, దానిని గురించి

ఆలోచించలేదు. ఇప్పుడు పరమతస్థుడని చెప్పుకొను మహబూబ్ భాషా

గారు అనారోగ్యమును గురించి, తాను ఖర్చుపెట్టిన దానిని గురించి

వివరముగా చెప్పగా నాకు కొంత వరకు దానిమీద ధ్యాస కల్గినది. కొన్ని

సంవత్సరముల నుండి యున్న రోగము ఒక ఆధ్యాత్మిక గ్రంథము అంటుకొని

కొన్ని గంటల వరకు వదలకపోవడము తర్వాత అతని రోగము లేకుండా

పోవడమునుబట్టి దీనివెనుక కనిపించని విధానము ఏమి జరుగుచున్నదని

చూడవలసి వచ్చినది. ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమనగా!

ఇక్కడ మాచే వ్రాయబడిన గ్రంథములు, మేము విడుదల చేసిన గ్రంథములు

మాత్రము అలా చేయుచున్నవి. మేము వ్రాసిన గ్రంథము ఏ మతమునకు

సంబంధించినదిగానీ, బాధపడు వ్యక్తి ఏ మతస్థుడయినాగానీ అతని ఎడల

ఆ గ్రంథము స్పందించి అతని కర్మ నివారణకు, కర్మ క్షమాపణకు, కర్మ

దహనమునకు పని చేయుచున్నది. మీరు ఫోటోలో చూచిన మహబూబ్

భాషా గారు తన అనుభవమును చెప్పగా విన్నాను. అంతవరకు ఆ

విషయమును గురించి చూడని మేము లోతుగా చూడవలసివచ్చినది.

ఈ విషయము నేను తెలిసినా తెలియకపోయినా ఫరవాలేదు. అయితే

ఇతరులకు ఏమి జరుగుచున్నదని తెలియుట అవసరము. మూడు దైవ

గ్రంథములలో దేవుడు కర్మ ఎడల ఎలా క్షమించును? అను విషయము

జ్ఞానరీత్యా అందరికీ తెలియవలెనంటే ఇందులో అందరికీ తెలియకుండా

జరుగు ప్రక్రియ యొక్క రహస్యమును విడదీసి అర్థమగులాగున చెప్పవలెను.



ఇంతకు ముందు వ్రాసిన వ్రాతలో మనిషి దేవుని మీద, దేవుని

జ్ఞానము మీద విశ్వాసము కల్గి యుంటే శరీరము లోపల, శరీరము బయట

పాపక్షమాపణ జరుగునని చెప్పాము. శరీరము బయట దేవుని రాజ్యమయిన

ప్రకృతిలో పాలకులుగా యున్న భూతములు, గ్రహములు ప్రత్యేకశక్తులు

కల్గి, ప్రత్యేకమయిన ఆకారములు కల్గియుండి కర్మలను అనుభవింప

చేయడమేకాక దేవున్ని, దేవుని జ్ఞానమును నమ్మిన వారి పాపకర్మలను

క్షమించి అనుభవానికి రాకుండా దహించివేయు స్థోమత, అధికారము

కల్గియున్నారని చెప్పాము. అయితే ఆ విధానము జరిగినా నమ్మదగినదిగా

లేదని అది ప్రత్యక్షముగా స్థూలముగా జరిగితే బాగుండునని అందరూ

దైవశక్తిని అర్థము చేసుకొనుటకు అవకాశముండునని దేవున్ని కోరడము

జరిగినది. నేను కోర్కెలు కోరువాడను కాను. అయితే నేను కోరినది

నాకు సంబంధించిన కోర్కె కాదు. దేవునికి సంబంధించిన జ్ఞానము ఇతరులు

సులభముగా తెలియు విధానమును కోరాను. అందువలన ఇది ప్రజలందరి

కోర్కెయనీ, దేవున్ని విశ్వసించు వారందరి కోర్కెయని తలచాము. ఇది నా

ఒక్కనిది కాదని భక్తులందరి కోర్కెయని తలచిన దేవుడు నా కోర్కెను నా

వద్దనే, నా గ్రంథముల వద్దనే చూపించడము, నెరవేర్చడము జరిగినది.

ఇది ప్రపంచ విషయము కాదు, దేవుని విషయము. అందువలన నా

కోర్కె నా గ్రంథములని చెప్పాను.


ప్రకృతియంతటా ఆకాశమునుండి భూమివరకు వ్యాపించిన

భూతములు గ్రహములలో ముఖ్యులయిన కొందరు వచ్చి నా వద్ద

ఉంటారు. నా హస్తము ద్వారా వ్రాయబడిన జ్ఞానము గల గ్రంథము

పూర్తిగా తయారయిన తర్వాత, ఆ గ్రంథము మొదటి ప్రతి నావద్దకు

వచ్చినప్పుడు నేను ఒకమారు ఆ గ్రంథమును చూచిన తర్వాత, నా


వద్దయున్న పాలకులు మొదట నేను చూచిన ప్రతియందు ప్రవేశించుదురు.

తర్వాత మిగతా వారందరూ నా వద్ద తయారయిన ప్రతి గ్రంథములోనూ

ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథములో ప్రవేశింతురు. ఈ తతంగము 1980వ

సంవత్సరమునుండి జరుగుచున్నా ఈ విషయము నాకు వాస్తవముగా

తెలియదు. ఒక గ్రంథము వేయి ప్రతులు తయారయితే వేయిమంది

పాలకులు వచ్చి గ్రంథములలో ప్రవేశించడము జరుగుచున్న కార్యమే.

2008వ సంవత్సరము "దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు” అను

గ్రంథమును వ్రాసి ఐదువేల ప్రతులను తయారు చేయడము జరిగినది.

అప్పుడు ఐదువేల మంది పాలకులు ఒక్కమారుగా ఆ గ్రంథములలో

చేరిపోవడము జరిగినది. అప్పుడు ఆ గ్రంథము ఎవరి ఇంటిలో చేరినా

ఎవరు చదివినా చదివిన వారికి అంతవరకున్న దీర్ఘకాల రోగములు

సహితము నయము కావడము జరిగినది. ఆ ఇంటిలో ఆరోగ్య సమస్యలు

కొన్ని తీరిపోయేవి. అప్పుడే చాలామంది ఈ విషయమును చెప్పుచూ

వచ్చారు. కొన్ని ముఖ్యమైన కర్మ నివారణ జరిగిన విషయములను నేను

వినినా అప్పుడు ఆ విషయముల మీద శ్రద్ధ చూపలేదు. నేను గ్రంథ

రచనల మీద లగ్నమయి ఉండడమే దానికి కారణము కావచ్చును.


ఈ మధ్యకాలములో మహబూబ్ భాషా, బహుశా మూడు

సంవత్సరములప్పుడు నాతో కలిసి మాట్లాడినప్పుడు పొందిన సంతోషమును

వ్యక్తము చేయగా వెనుక కాలములో చాలామంది తమ రోగములు పోయిన

విధానమును చెప్పిన విషయములన్నియూ నాకు జ్ఞాపకము రాసాగాయి.

ఈ మధ్యకాలములో గ్రంథములు అతుక్కొన్నది వీడియోలోనూ, ఫోటోల

లోనూ చూడడము తప్ప ప్రత్యక్షముగా చూడలేదు. అయితే నా ముందరే

మెడ నొప్పితో బాధపడు మనిషి మెడ క్రింది భాగములో



“మంత్రము-మహిమ” అను గ్రంథమును పెట్టగా అది అతుక్కోవడము

జరిగినది. మీరు చూచిన 32 ఫోటోలలో ఆ ఫోటో కూడా ఒకటి కలదు.

వీపు పై భాగమున మెడ క్రింది భాగమున సిద్ధాంతకర్తలు బొమ్మ పైకి

కనిపించు గ్రంథము అతుక్కోగా, దానిని నేను క్రింది భాగములో పట్టుకొని

లాగాను. అది ఊడి రాలేదు. మొదట కొద్దిగా లాగినవాడిని, తర్వాత

కొంతగట్టిగా లాగాను. అయినా రాలేదు. గ్రంథము అంతగట్టిగా అంటు

కోవడమేమిటని బహుశా 50 కేజీల బరువును ఎత్తే బలమును ఉపయోగించి

అనగా నా చేతులకున్న బలమంతయూ ఉపయోగించి క్రిందికి లాగాను.

గోడకు ఉడుము కరచుకొన్నట్లు అది అంటుకొని యున్నది గానీ అంత

బలము ఉపయోగించి లాగినా అది ఊడి రాలేదు. మొదటిమారు

అంతగట్టిగా గ్రంథము శరీరమునకు అంటుకోగా చూచి నాకే ఆశ్చర్యము

అయినది. ముందే చెప్పాము 'గ్రంథములలో పాలకులు ప్రవేశించారని',

వారి బలము చేత అది క్రిందికి పెరికినా (లాగినా) రాలేదని తెలిసినది.

ఇంకొక రకముగా గ్రంథమును శరీరమునుండి పైకి తీస్తే సులభముగా

మన చేతిలోనికి వస్తున్నది. పెట్టేటప్పుడు ఎలా పెట్టామో అలాగే తీస్తే ఏ

శ్రమలేకుండా శరీరమునుండి వేరయి వస్తున్నది. క్రిందికి లాగితే మాత్రము

చేతి వ్రేళ్ళనుండి గ్రంథము జారిపోవుచ్నుది గానీ అది మాత్రము క్రిందికి

దారము మందము కూడా జరుగలేదు. గతములో కూడా అలా క్రిందికి

లాగిన వారు కలరు. అప్పుడు కూడా ఎంత బలము ఉపయోగించినా

కొద్దిగా కూడా ఉన్న స్థలమునుండి కదలలేదన్నారు. క్రిందికి లాగితే రాని

గ్రంథము బయటికి తీస్తే సులభముగా ఊడి వస్తున్నది.


మరొక విచిత్రము ఏమనగా! కొందరికి కడుపు మీద అతుక్కొన్న

గ్రంథము శరీరములోని నొప్పి పైకి జరిగిపోతుంటే గ్రంథము కూడా


జరిగిపోయిన సంఘటనలు గలవు. క్రిందినుండి పోయి గొంతుకు

ఆనుకొన్నట్లు కూడా కొందరు చెప్పారు. కొందరికి శరీరములో నొప్పి

ప్రక్కకు కదలిపోయే కొద్దీ, గ్రంథము కూడా దానంతట అదే జరిగిపోవడము

జరుగుచున్నదని చాలామంది చెప్పారు. మోకాళ్ళ నొప్పులు గలవారు

మోకాళ్ళకు గ్రంథమును ఆనించగా అది అట్లే అంటుకొన్న దృశ్యములను

గ్రంథములో గల ఫోటోలలో చూడవచ్చును. వీపులకు, చేతులకు,

కడుపులకు, మెడలకు, తలలకు, చెంపలకు అంటుకొన్న గ్రంథముల

దృశ్యములు కనిపించుచున్నవి. మరియొక విచిత్రము ఏమనగా! ముఖాన

పెట్టుకొను 'దేవుని ముద్ర' (దేవుని చిహ్నము) యొక్క అచ్చు కూడా

నొసలు భాగములో అంటుకొని అలాగే ఉండిపోయిన దృశ్యము కూడా

కలదు. దానిని అంటించుకొన్న వ్యక్తి ఒక క్రైస్థవ మతస్థుడు అని ఫోటోలోనే

అర్థమగుచున్నది. మీరు గ్రంథములో మూడు మతస్థులకు గ్రంథములు

అంటుకొనియున్న దృశ్యములను చూడవచ్చును. అలా కనిపించిన

దానివలన దేవున్ని మనుషులు ఎవరయినా విశ్వసించవచ్చుననీ, తనను,

తన జ్ఞానమును విశ్వసించిన వాడు ఏ మతమునకు చెందినవాడయినా

దేవుని పాలకులు వాని కర్మను లేకుండా చేయుదురని తెలియుచున్నది.

గ్రంథములోని ఫోటోలలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు,

హిందువులు మొదలుకొని క్రైస్తవులు, ముస్లీమ్లు కూడా కనిపించుచున్నారు.

దీనినిబట్టి వ్యక్తికి భక్తి భావముంటే చాలు లేక కొద్దిగా విశ్వాసమున్నా

చాలు, వారు చిన్న వయస్సు వారుగానీ, పెద్ద వయస్సు వారుగానీ అలాగే

ఏ కులము, ఏ మతమువారయినా వారి కర్మలను పాలకులు దహించి

వారి బాధలనుండి విముక్తి పొందించి దేవుడు క్షమాశీలుడు, కర్మదహనుడు

అని నిరూపించుచున్నారు. ముఖ్యముగా గమనించవలసిన విషయమే



మనగా! మా చేతినుండి వెలువడిన, మా జ్ఞానముతో నిండుకొన్న

గ్రంథములన్నీ అలాగే యున్నవని చెప్పుచున్నాము. మా నుండి వ్రాయబడిన,

మా నుండి వెలువడిన, నేను ముట్టుకొని ఒకమారు చూచిన గ్రంథములోనికి

దైవ పాలకులు వచ్చి చేరిపోవుచున్నారని చెప్పుచున్నాను.


మీరు గ్రంథములో 129వ పేజీ నుండి 144వ పేజీ వరకు ఉన్న

ఫోటోలలో చిన్నపిల్లలు, మధ్యవయస్సు వారు, వృద్ధులు మూడు రకముల

వయస్సున్న వారిని చూడవచ్చును. అలాగే హిందూ, ఇస్లామ్, క్రైస్థవులను

చూడవచ్చును. అట్లే మూడు మతముల వారికి సంబంధించిన గ్రంథములను

చూడవచ్చును. నేను మూడు మతముల జ్ఞానమును ఏకముగా

చెప్పుచున్నాను. అందువలన కొందరు నన్ను "త్రిమత ఏకైక గురువు"

అని అంటున్నారు. కొందరు మతఛాందసవాదులకు మా విధానము

అనగా మూడు దైవ గ్రంథముల జ్ఞానమును చెప్పడము సరిపోక పోవచ్చును.

అయినా నేను చేయునది మంచి పనేయని నేను అనుకొంటున్నాను. నేను

అనుకోవడము కాదు మీరు నా గ్రంథాలను చదవండి, అప్పుడు నా

గ్రంథములలో ఉండే రుచి ఏమిటో తెలుస్తుంది. గ్రంథముల ఎడల

ప్రత్యక్షముగా దేవుని గొప్పతనము కనిపించుచున్నా, మతము వెంటబడి

నన్ను దూషించు వారికి పాపక్షమాపణ యుండదు. నేను ఏమి

దూషించకున్నా పాలకులు శిక్షించుదురని నా అనుభవముతో

చెప్పుచున్నాను. చాలామంది శిక్షకు గురియైన వారిని చూచాను కావున

చెప్పాను.


ఇప్పటికి ఈ గ్రంథముతో నేను వ్రాసినవి ఎలభై నాలుగు (84)

గ్రంథములు. తర్వాత మా వద్ద ప్రచురణ జరిగిన, మా భక్తులు మా

జ్ఞానమును అనుసరించి వ్రాసిన గ్రంథములు కూడా కొన్ని గలవు.   ఆ


గ్రంథములలో కొన్నిటిని నేను చూడడము, వాటిని నా చేతి ద్వారా విడుదల

చేయడము జరిగినది. అలా నా వద్దనుండి వచ్చిన గ్రంథములకు కూడా

దైవశక్తి ప్రాకినది. పాలకులు అందులో చేరారని చెప్పుచున్నాను.

అటువంటివి ఐదారు గ్రంథములు గలవు. నా గ్రంథములు ఇప్పటికి 84

కాగా, రాబోవు కాలములో వంద గ్రంథములు పైన రావలెనని దేవుని

సంకల్పము గలదు. రాబోవు గ్రంథములలో ఇప్పటినుండి ప్రత్యేకమైన

పాలకులు రాగలరని అనుకొంటున్నాను. మేము చెప్పు విషయములను

చూచి కొందరు అసూయ పడి హేళనగా మాట్లాడవచ్చు. నేను చెప్పునదంతా

ప్రత్యేకముగా ఉండుట వలన కొందరు భక్తితో వినవచ్చును, కొందరు

అసూయతో మాట్లాడుట సహజమే. అర్థము కాకపోతే ఇంకొకమారు

చదివి తెలుసుకోవచ్చును లేకపోతే ఊరక ఉండడము ఉత్తమమైన

పనియగును. మేమెందుకు ఊరక ఉంటామని నన్ను దూషించితే ఆ

సమయములో, ఆ ప్రాంతములో కనిపించని గ్రహములుగానీ,

భూతములుగానీ అక్కడ ఉండి వారు వింటే దూషణ చేసిన వారిని ఊరక

వదలరు. ఇప్పటికి చాలామంది రోగముల పాలైనవారు గలరు. అట్లే

కారణము లేకుండా చనిపోయిన వారు గలరు. తర్వాత డాక్టర్లు హార్టు ఫెయిల్

అనడము సహజము. ఏ కారణము లేకపోతే చెప్పేది అదే. అంత

పనియెందుకు విని, ఊరక అయినా ఉండు లేక తెలుసుకొనే దానికయినా

ప్రయత్నించు. ఏదీకాక నిష్కారణముగా మాట్లాడుట వలన కారణము

లేని అవస్థలు, కారణములేని మరణములు జరిగిన వాటిని మేము

చూచాము. మేము వ్రాసిన "దయ్యాల - భూతాల యదార్థ

సంఘటనలు" అను గ్రంథములోనూ, "శ్రీకృష్ణుడు దేవుడా!

భగవంతుడా!!" అను గ్రంథములోనూ ఇటువంటి విషయములు



వ్రాయబడి యున్నవి. అందువలన మీ మేలు కొరకు మేము చెప్పునది

ఏమనగా! మేము ఇంతవరకు చెప్పిన విషయములు నమ్మశక్యము కానివిగా

ఉన్నవని నేనే స్వయముగా చెప్పుచున్నాను కదా! నా మాటనుబట్టి

తెలుసుకొనే దానికి ప్రయత్నించండి. లేకపోతే ఏమీ అంటనట్లు ఊరక

ఉండిపోండి.


ప్రశ్న :- మీరు “మేము వ్రాయబోవు గ్రంథములలో ప్రత్యేకమైన పాలకులు

వస్తారు” అని చెప్పియున్నారు. మీ గ్రంథాలలో పాలకులు ఉన్నారని

చెప్పడమే పెద్ద ప్రత్యేకత. ప్రపంచములో ఎక్కడాలేని విధానమును

ఇంతవరకు చెప్పారు. ఇప్పుడేమో రాబోవు గ్రంథములలో ప్రత్యేకమైన

పాలకులు వస్తారని చెప్పడము మాకు అర్థముకాని విషయమై పోయినది.

ఈ విషయమై మాకు అర్థమగునట్లు వివరముగా చెప్పవలెనని కోరు

చున్నాము?


జవాబు :- మేము దేవుని కర్మల నిర్మూలన మరియు పాలన పద్ధతిని

స్థూలముగా తెలియజేయాలని కోరినది ధర్మసమ్మతమైన విషయము.

అందువలన శరీరము బయట దేవుని పాలకులు కర్మను ఎలా పాలించు

చున్నది సూక్ష్మముగా అర్థమయినా, ఎలా నిర్మూలించుచున్నది స్థూలముగా

తెలియునట్లు చేశాడు. అది కూడా ఎక్కడో కాకుండా మా గ్రంథముల

ద్వారానే జరుగుచున్నదని చెప్పాము. గ్రంథములు శరీరమునకు

అంటుకోవడము స్థూలముగా కనిపించినా అది ఎలా జరుగుచున్నదో మాకు

కొంతవరకు అర్థమయినది. దానిని వివరముగా చెప్పితే ఇలా కలదు.

దేవుని పాలకులు రెండు రకములుగా యున్నారు. వారినే ఒకటి

భూతములు, రెండు గ్రహములు అని చెప్పవచ్చును. భూతములు,



గ్రహములు రెండు పాలకులే అయినా గ్రహములకంటే భూతములు కొంత

ప్రత్యేకత కల్గియున్నవి. గ్రహములకున్న శక్తికంటే భూతముల శక్తి మరీ

ఎక్కువగా ఉండును. గ్రహములనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు,

బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలగు గ్రహముల వారసత్వము

కల్గియున్నవి. గ్రహములకు ఏడు గ్రహములు వారసత్వ గ్రహములు. అలాగే

భూతములనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు మహా

భూతములు వారసత్వము కల్గియున్నవి. ప్రకృతిలోని భాగములయిన ఐదు

శక్తులకు సంతతివలె వారసత్వము కల్గినవి. భూతములు, ఉపభూతములు

గలవు. ఐదు మహా భూతముల సంబంధ భూతముల జాతి కొన్ని వందల

కోట్లు గలవు. అట్లే ఏడు గ్రహముల సంబంధ గ్రహముల జాతి భూతముల

కంటే రెట్టింపుగా కొన్ని వందల కోట్లు గలవు. అంతేకాక వేయికి రెండు

వందల ప్రకారము గ్రహముల పాలకులలో కొన్ని కోట్లమంది ఎవరికీ

తెలియని, ఆకారములు లేని ఉపగ్రహములు కూడా కలవు. ఇదంతా

దేవుని పాలకుల వివరము కాగా, ఎల్లవేళలా మనుషుల శరీరములోనూ,

శరీరము బయట పాలన సాగుచునేయున్నది. శరీరము లోపల ఆత్మే

ఒకవైపు దేవుడైయుండి, మరొకవైపు కార్యకర్తయై యున్నది.


శరీరము బయట దేవుడు పరమాత్మయైనా తాను ఊరక ఉండి

పోయి తన ప్రకృతికి అప్పజెప్పి తాను ఏమీ చేయక ఊరక కూర్చున్నాడు.

ప్రకృతి ఐదు భాగములుగా ఉంటూ తన వారసత్వ పాలకులను నియమించు

కోగా, ఏడు గ్రహముల వారసత్వ గ్రహములను కూడా నియమించి పాలన

సాగించడము చేయుచున్నది. ప్రకృతి పరమాత్మ చేయవలసిన కార్యములు

చేయుచూ పరమాత్మకు పని లేకుండా చేసినది. ప్రకృతికి సంబంధించినవి

భూతముల జాతి పాలకులు, భూతములనుండి తయారయినవి గ్రహములు.



దీనినిబట్టి గ్రహములకంటే భూతములు కొంత ప్రత్యేకత కల్గియున్నాయని

చెప్పాము. గ్రహములు ప్రకృతి యొక్క ఆజ్ఞతోనే పనిచేయుచుండును.

వారికి అనగా గ్రహములకు 'బాధించు అధికారము' మాత్రమే కలదు గానీ

మనుషులను 'చంపు అధికారము' లేదు. ఒకమారు మనిషిని పట్టుకొంటే

ఐదు నెలల వరకు బాధించు అధికారమున్నదని, తేలు విషమువలె బాధ

వరకు బాధించు అధికారము కలదని బైబిలు ప్రకటన గ్రంథములో కూడా

చెప్పినట్లు కలదు. మనిషిని బాధించు ఏ బాధనయినా ప్రకృతి అనుమతి

లేనిదే గ్రహములు మనిషిని బాధించవు. ఇంతవరకు దాదాపు 80

గ్రంథముల వరకు మా గ్రంథములలో పాలకులయిన గ్రహములు మాత్రమే

గలరు. 80 గ్రంథముల నుండి ఇప్పుడు రాబోయే గ్రంథములలో కూడా

గ్రహములు కాకుండా ప్రత్యేకించి భూతములు ప్రవేశించునని చెప్పు

చున్నాము. భూతములు స్వయముగా ప్రకృతి వారసత్వమే అయినందున

పంచభూతములకున్న అధికారములు కొన్ని యుండును. అందువలన

ప్రకృతి ఆజ్ఞ కోసము ఎదురుచూడక అవసరమొచ్చినప్పుడు 'స్వయం

నిర్ణయము’ తీసుకొను అధికారము గలవిగా ఉండును. మనుషుల కర్మను

బట్టి గ్రహములవలె కాక, మనుషులను చంపు అధికారము కూడా

భూతములు కలవిగా ఉండును. మనుషులను బాధించుట తప్ప, చంపు

అధికారము గ్రహములకు లేదు. భూతములు అట్లు కాకుండా అవసరమును

బట్టి నిర్ణయము తీసుకోవడము, అవసరమును బట్టి చంపడము చేయు

అధికారము కలవిగా యున్నవి. ఇంతకుముందు మాకు వ్యతిరేఖముగా

మాట్లాడిన వారిని రెండవ రోజే భూతములు చంపిన విషయము కొందరికి

తెలుసు. ఆ రోజు దూషించిన వాని మరణమునకు కారణము భూతములే

యని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రంథములోనికి కూడా

భూతములే ప్రవేశించబోతున్నాయి.


భూతములు, గ్రహములు దేవుని పాలనను సమన్వయముగా

నిర్వర్తించుచున్నవి. భూతములకు, గ్రహములకు ప్రకృతి వెనుకయున్న

దేవుడు తెలియడు. అయినా ప్రకృతి ఎంతగా దేవుని మీద భక్తి కల్గియున్నదో

అంతగానే భూతములు, గ్రహములు భక్తికల్గి దేవుని జ్ఞానముయందు

శ్రద్ధకల్గి జ్ఞానమును సంపూర్ణముగా కల్గియున్నవి. ఇప్పటికి 38 సంవత్సరము

లప్పుడు 'దేవుని చిహ్నము'ను గుర్తించి దాని ఆకారమును తయారు చేసి

చూపించిన తర్వాత మనుషులకంటే ముందు తమ నుదిటి భాగమున

‘దేవుని చిహ్నము'ను లేక 'దేవుని ముద్ర'ను ధరించిన వారు భూతములు

మరియు గ్రహములు. అప్పటి నుండి నిత్యము దేవుని చిహ్నము యొక్క

అర్థము, దేవుని ముద్ర యొక్క అర్థము రెండు విధముల అర్థములు తెలిసి

ధరించుచున్నారు. భూమిమీద మనుషులకంటే గొప్ప జ్ఞానులుగా యున్నారు.

భూమిమీద మనుషులుగా యున్న స్వామీజీలు, పండితులు, మతపెద్దలు

అనువారిలో ఎంతవరకు నిజమైన జ్ఞానమున్నదో గ్రహించి వారి జ్ఞాన

స్థోమత ఎంతో ఖచ్చితముగా కొలత వేయువారు పాలకులు. బయట

మనుషులలో ఎంతో పెద్ద జ్ఞానియని పేరున్నా, అతని వద్ద సరియైన జ్ఞానము

లేకపోతే వానిని ఏమాత్రము గౌరవించరు. వానిని గొప్పగా చూడరు.

వాని కర్మప్రకారము అనుభవింపజేతురు.


ప్రశ్న :- “పాలకులయిన భూతములు ఒక్కొక్కప్పుడు ప్రకృతి ఆజ్ఞ ఇవ్వక

ముందే స్వయం నిర్ణయం తీసుకొందురు” అని చెప్పారు. అటువంటి

నిర్ణయములు ఎక్కడయినా తీసుకొన్నట్లు మీకు ఎలా తెలుసు? ఎక్కడ

అలాంటి నిర్ణయాలు తీసుకొన్నారో కొంత వివరముగా చెప్పండి?


జవాబు :- నాకు ఎలా తెలుసునో నీకు చెప్పినా ప్రయోజనము లేదు.



ఒకవేళ చెప్పినా నీకు అర్థము కాదు. మీకు అర్థము కావాలంటే ముందు

భూతములంటే ఏమిటి? గ్రహములు అంటే ఏమిటి? అని ముందు తెలిసి

యుండవలెను. భూతములు అంటే దయ్యాలు కదా! యని కొందరు నన్ను

అడుగుచున్నారు. వారికి అలాగే అర్థమవుతుంది. అటువంటి వారికి

“అయ్యా! భూతములు అంటే అది ప్రత్యేకమైన జాతి అనుకో. దయ్యాలకు,

భూతాలకు ఏమాత్రము సంబంధము లేదు” అని నేను చెప్పితే నా మాట

పూర్తి అయిపోకముందే “మీరు “దయ్యాలు, భూతాలు" అను గ్రంథమును

వ్రాశారు కదా! అప్పుడు రెండూ ఒక్కటేయని అర్థము కదా!”యని

అంటున్నారు. నేను అక్కడ వ్రాసినది దయ్యాలు వేరు, భూతాలు వేరని

తెల్పుటకే అలా వేరువేరుగా ‘దయ్యాలు, భూతాలు' అని వ్రాసినట్లు చెప్పితే

“దయ్యాలన్నా, భూతాలన్నా ఒక్కటేయని మా పెద్దలు చెప్పారు” అని

అంటున్నారు. ఈ విషయము వారికిగానీ, వారి పెద్దలకుగానీ తెలియదను

విషయము వారికే తెలియదు.


గ్రహములకు మనుషులను బాధించు అధికారము ఇవ్వబడినది

తప్ప, చంపు అధికారము లేదు. అయితే బయట ప్రపంచములో కొన్ని

రోడ్డు ప్రమాదములలో కొంతమంది చనిపోవడము జరుగుచున్నది. అప్పుడు

వారిని ఎవరు చంపారు? అని ఆలోచిస్తే గ్రహములు మాత్రము కావుయని

చెప్పవచ్చును. అప్పుడు అక్కడ చంపినది భూతములేయని స్పష్టముగా

తెలియుచున్నది. భూతములకు ఆజ్ఞ ఇవ్వకున్నా అవి అలా చేయుచున్నవని

చెప్పాము. ఎందుకు అలా చేయుచున్నవనగా! భూతములు ప్రకృతి సంబంధ

మైనవే యగును. ప్రకృతిలో ఉండు నిర్ణయమును ప్రకృతి తమకు చెప్పకనే

గ్రహించుకొను స్థోమత కల్గియున్నవి. ప్రకృతియే భూతములుగా

విభజింపబడి భూతముల రూపములో యుండుట వలన ప్రకృతి నుండి


ప్రత్యేకించి ఆజ్ఞ అవసరము లేకుండానే చెప్పబోవు నిర్ణయమునకు సరిగా

సరిపోవు నిర్ణయమునే భూతములు తీసుకోవడము జరుగుచున్నది. అన్ని

వేళలా అట్లే జరుగలేదు. కొన్ని సందర్భములలో మాత్రము అట్లు

చేయుచున్నారు. కేవలము అజ్ఞానుల ఎడల మాత్రము భూతములు అలా

ప్రవర్తించుచున్నవి. జ్ఞానుల ఎడల అట్లే అజ్ఞానుల ఎడల భూతముల

ప్రవర్తన వేరువేరుగా యుండును. జ్ఞానుల విషయములో భూతములు

స్వయం నిర్ణయమును తీసుకోవు. జ్ఞానుల విషయములో ప్రకృతి ఎలా

నిర్ణయిస్తే అలా చేయును. అజ్ఞానుల విషయములో భూతములు ప్రకృతి

నిర్ణయము వరకు కాచుకొని ఉంటాయను నమ్మకము లేదు. అక్కడ

మాత్రము భూతాల స్వయం నిర్ణయములు జరుగుచున్నవి.


భూమిమీద దేవుని జ్ఞానమును తెలిసి మూడు గ్రంథముల

ప్రకారము దైవ ఆచరణ కల్గియున్న వానిని జ్ఞానిగా భూతములు,

గ్రహములు లెక్కించి వానిని గౌరవించుచున్నవి. వాని ఎడల గౌరవ భావము

కల్గియున్నవి. దైవజ్ఞానము లేనివారి ఎడల దేవుని పాలకులు విముఖత

కల్గి గౌరవభావము లేనివారై యుందురు. అజ్ఞానులయిన వారు అంతటితో

ఆగక దేవున్ని శరీరమందు గానీ, శరీరము బయటగానీ ఏమాత్రము

తెలియకపోగా, తెలియుటకు ప్రయత్నము చేయక, చిల్లర దేవుళ్ళను అనగా

దేవుడు సృష్టించిన అనేకమంది దేవతలను ఆశ్రయించి మ్రొక్కువారిని చూస్తే

గ్రహములకు, భూతములకు విపరీతమైన కోపమని చెప్పవచ్చును. ఇతర

దేవుళ్ళ దర్శనార్థము పోవువారిని మాత్రము ఎదుర్కొని రోడ్డు ప్రమాదములను

గ్రహములు, భూతములు కలుగచేయుచున్నవి. దేవతలకు పోవు

ప్రయాణములు పాలకులకు సరిపోదు. తమను పుట్టించిన దేవున్ని వదలి

దేవతలను ఆరాధించడము, దర్శించడము కొరకు చేయు ప్రయాణములే



ఎక్కువగా ప్రమాదమునకు గురియగుచున్నవి. ప్రమాదము చేసినవారు

భూతములయితే మనుష్యులను చంపడము, కేవలము గ్రహములే అయితే

చంపకుండా దెబ్బలు తగలడము వరకు చేయును. ప్రయాణములు ఎన్ని

జరుగుచున్నా ఎక్కువ శాతము దేవతల దర్శనమునకు పోవువారివే

జరిగియుండును.


దేవతల ప్రయాణమే కాకుండా తర్వాత ఎక్కువ రోడ్డు

ప్రమాదములు జరుగునది పెళ్లిల్ల విషయములోనే పెళ్లి కార్యము

అంతయూ దైవ సంబంధమైనదై యున్నది. ఆ విషయము మేము "ఇందూ

సాంప్రదాయములు" అను గ్రంథములో వ్రాసియున్నాము. పెళ్లిలో ప్రతి

కార్యము దేవుని జ్ఞానమునకు సంబంధించినదిగా యుండగా, నేడు ఎవరూ

ఆ విధముగా జ్ఞానపద్ధతిగా, జ్ఞానము తెలిసి పెళ్లిల్లు చేయడము లేదు.

అందువలన పెళ్లి కార్యములకు ముందుగానీ, పెళ్లిలోగానీ, పెళ్లి తర్వాత

గానీ, ప్రయాణము చేయునప్పుడుగానీ లేక మిగతా సమయములలోగానీ

దేవుని పాలకులు ప్రమాదములను కలుగజేయవలెనని చూచుచుందురు.

ఎప్పుడు అవకాశమొస్తే అప్పుడు ప్రమాదములను కలుగజేయుదురు. ఎక్కువ

పెళ్లికి సంబంధించిన, పెళ్లి వ్యవహారములో రోడ్డు ప్రమాదములు ఎక్కువ

జరిగినట్లు తెలియుచున్నది. ఇదంతా చూస్తే “మనుషులకు జ్ఞానము

లేకుండా పోవడమే మొదటి కారణము” అని తెలియుచున్నది. పెళ్లి

కార్యములోగానీ, పెళ్లి ప్రయాణములోగానీ ఎవరయినా జ్ఞాని అయిన

వాడుయుంటే అది పాలకులకు జ్ఞానము తెలియును కనుక జ్ఞానిని

గౌరవించి, అక్కడ ప్రమాదములు చేయకుండా ఉందురు. నుదిటి భాగమున

దేవుని గుర్తును ధరించి యున్నవారున్నా అక్కడ ప్రమాదము తప్పిపోవును.

దేవుని జ్ఞానమంటే పాలకులకు ఎంతో అభిమానము, గౌరవము. అట్లే


అజ్ఞానము అంటే పాలకులకు ఏవగింపు అలాంటి వారిని చూస్తే శత్రువులను

చూచినట్లే ఉండును.


దేవుని గుర్తు ధరించని వారినే బాధించమని, దేవుని ముద్రను

ధరించని చెట్లనుగానీ, గడ్డిని గానీ బాధించవద్దని ప్రకృతినుండి అనగా

ప్రకృతి వెనుకయున్న దేవుని నుండి ఆజ్ఞ ఉన్నదని బైబిలు ప్రకటన

గ్రంథములో 9వ అధ్యాయమున 4వ వచనమున చెప్పియున్నమాటను

వినియున్నారు కదా! ఈ మాటను బట్టి దేవుని ముద్రను ధరించని వారిని

చూస్తే ప్రకృతికే సరిపోదని ఒక విధముగా అర్థమవుచున్నది. అట్లు కాకపోతే

దేవుని ముద్ర ధరించడము వలన వాని పాపము క్షమించబడుచున్నదని

అందువలన వారిని బాధించవద్దని చెప్పినట్లు గలదు. దీనినంతటినీ

గమనించితే దేవునికి (ప్రకృతికి) దేవుని పాలకులకు దేవుని ముద్ర అంటే

ఇష్టమని తెలియవలెను. ఇది దయ్యములకు లేక సూక్ష్మ శరీరములకు

అగ్నిగుండములాగా వేడిని వెదజల్లుచుండును. అందువలన చనిపోయిన

తర్వాత అనగా అకాల మృత్యువు పొందిన వారు దేవుని ముద్రను ధరించిన

వారిని చూచి భయపడి దూరముగా ఉందురు. దయ్యములుగా యున్నవారు

అజ్ఞానులుగా యుంటే దేవుని ముద్ర వేడి తగులుచుండును. దయ్యములుగా

యున్నవారు కొంతయినా దేవుని జ్ఞానము తెలిసియుంటే వారికి దేవుని

చిహ్నము వలన ఎటువంటి బాధ యుండదు.


దేవుని ముద్రను ధరించిన వారిని చూస్తే భయపడడము వలన,

దయ్యములు దేవుని ముద్ర ధరించిన వారిలోనికి చేరలేరు. ముందే వారి

శరీరములో దయ్యములున్నా, వారు దేవుని ముద్రను ధరించడము వలన

వారి శరీరములోని దయ్యమునకు ఇబ్బందిగా ఉండును. అందువలన

క్రొత్తగా ఆరునెలలు లేక సంవత్సరమునుండి ఉన్న దయ్యములయితే


శరీరమును వదలి పారిపోవును. సంవత్సరముకంటే ఎక్కువ కాలము

నుండి దయ్యములున్న వారికి వారి శరీరములనుండి దయ్యము బయటికి

పోలేక ఇబ్బంది పడుచుండును. సంవత్సరముకంటే ఎక్కువ కాలమునుండి

యున్న వారి పరిస్థితి శరీరములో అలాగయుండును. శరీరములో చిక్కుకొని

పోయి ఉండుట వలన వారు పోవాలని అనుకొన్నా పోలేని పరిస్థితిలో

ఉందురు.


దేవుని ముద్ర అనినా, దేవుని చిహ్నము అనినా రెండు ఒకటిగానే

చూడవలెను. మనిషి శరీరములో గల దేవుడు, శరీరము బయటి దేవుడు

అని రెండు విధముల జ్ఞానము తెలియవలసియున్నది. అయితే ఎవరికయినా

శరీరములోగల దేవుడే ఆరాధ్య దేవుడనీ, అతనొక్కడే ఆరాధ్య దైవమని

మూడు దైవగ్రంథములలో చెప్పబడినది. దేవుని జ్ఞానము సంపూర్ణముగా

తెలియగలిగితే, సృష్ఠి పూర్వమున్న దేవుడయిన పరమాత్మ, సృష్ఠి తర్వాత

దేవుడయిన ఆత్మయని రెండు విధములు గలడు. స్వయానా పరమాత్మయిన

దేవుడు ఆత్మయిన దేవున్నే ఆరాధించమని తెలిపియున్నాడు. అంతేకాక

మూడు దైవగ్రంథములలో శరీరములో గల ఆత్మయిన దేవున్నే ఆరాధ్య

దైవమని చెప్పియున్నట్లు గలదు. ఈ విధముగా యుండుట వలన సృష్ఠి

ఆది దేవుడనీ, సృష్ఠి తర్వాత దేవుడని ఒకే దేవున్నే చెప్పుకొంటున్నాము.

ఒకే దేవున్నే అలా చెప్పవలసి వచ్చినది. అందువలన ఒకే గుర్తునే రెండు

పేర్లతో చెప్పినా అవి రెండు ఒక్కటేయని తెలియవలెను. జ్ఞాన వివరము

కొరకు శరీరములోయుండే దేవుని నిమిత్తము ‘దేవుని చిహ్నము' అనియూ,

శరీరము బయట ఉండే దేవుని నిమిత్తము 'దేవుని ముద్ర'యని చెప్పు

చున్నాము. అయితే హిందువులు ముఖ్యముగా ముందు దేవుని చిహ్నమును,

తర్వాత దేవుని ముద్ర రెండూ తెలియవలసియున్నది. క్రైస్తవుల విషయానికి


వస్తే వారు దేవుని ముద్రను ఎక్కువగా తెలియవలసియున్నది. ఇక ముస్లీమ్ల

విషయానికి వస్తే వారు దేవుని చిహ్నమును తెలియవలసియున్నది.


ముస్లీమ్లు తమ గ్రంథమని చెప్పుకొను ఖుర్ఆన్ గ్రంథములో

ఐదవ సూరా, రెండవ ఆయత్ (5-2) లో మరియు (22-32) లో “దేవుని

చిహ్నము” అను పేరుతో వాక్యములు గలవు. అందువలన ముస్లీమ్లు

ముందు దేవుని చిహ్నమును గురించి తెలియవలెను. దేవుని చిహ్నమును

గురించి అర్థము చేసుకొన్న తర్వాత అదే చిత్రపటమును దేవుని ముద్రగా

కూడా తెలుసుకోవలసియున్నది. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్థవులు

తమ గ్రంథమని చెప్పుకొంటున్న బైబిలు గ్రంథములో 'ప్రకటన గ్రంథము’

అను పాఠములో 'దేవుని ముద్ర'యని చెప్పబడి యుండుట వలన క్రైస్థవులు

దేవుని ముద్రను గురించి ముందు తెలిసి తర్వాత దేవుని చిహ్నమును

గురించి తెలియవలెను. హిందువుల భగవద్గీతలో దేవుని చిహ్నము అనిగానీ,

దేవుని ముద్రయనిగానీ ఎక్కడా పేరు పెట్టి వ్రాయబడలేదు. అయితే ఇక్కడే

రెండు విధానములను గురించి మాకు తెలియబడినది. మూడు మతముల

వారికి, మూడు గ్రంథములలో సమానమైన జ్ఞానము చెప్పబడియున్నది.

అంతేకాక ఏ గ్రంథము ప్రత్యేకించి ఏ మతముది కాదు. ఏ గ్రంథమయినా

అన్ని మతముల వారికి అని చెప్పబడియున్నది గానీ ఫలానా మతము

వారికి అని చెప్పియుండలేదు. అందువలన మూడు మతముల వారు

ఒకే దేవుని జ్ఞానమును తెలియుచున్నారు. ఒకే దేవుని జ్ఞానమునే దైవ

గ్రంథములలో చెప్పినట్లు రెండు రకముల గుర్తుగా చెప్పియున్న దేవుని

ముద్ర, దేవుని చిహ్నము యొక్క జ్ఞానము తెలిస్తే సంపూర్ణ జ్ఞానులయినట్లే.

ఆకాశములోనూ, భూమిమీదను వ్యాపించిన దేవుని పాలకులయిన

భూతములు, గ్రహములు ఇద్దరూ రెండు గుర్తులను తెలిసినవారై వారు

దేవుని గుర్తును ధరించుచున్నారు.



మొట్టమొదట భూమిమీద రెండు వేల సంవత్సరములప్పుడు

‘మతము' అను పేరుపెట్టుకొని పుట్టినది క్రైస్థవము. అంతవరకు సృష్ట్యాది

నుండి యున్న హిందూ సమాజము, క్రైస్థవ మతము పుట్టిన తర్వాత

హిందూమతముగా మారిపోయినది. క్రైస్థవ సమాజమును తమను క్రైస్థవ

మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతా మతములకు అంకురార్పన

జరిగినది. నేడు భూమిమీద మొత్తము పన్నెండు మతములుండగా అందులో

పెద్దవి, ముఖ్యమైన జ్ఞానము గలవి మూడు మాత్రమే. అవే ఇందూ,

ఇస్లామ్, క్రైస్థవము అను మూడు మతములుగా యున్నవి. మూడు మతముల

వారు దేవుడు చెప్పిన జ్ఞానమును మతముల గ్రంథములుగా చీల్చుకొన్నారు.

ఎవరు ఎట్లు చెప్పుకొనినా, మూడు గ్రంథములలోనూ ఒకే దేవుడు, ఒకే

జ్ఞానము కలదు. మూడు గ్రంథములలోనూ మూడు ఆత్మలను చెప్పినదే

ముఖ్యమైన జ్ఞానముగా యున్నది. మూడు గ్రంథములలో గ్రంథమునకు

ఆధారమైన ముఖ్య జ్ఞానముగా మూడు ఆత్మల జ్ఞానమే కలదు. మూడు

గ్రంథములలోనూ గ్రంథముల మధ్యభాగమున మూడు ఆత్మలను గురించి

చెప్పారు. బాగా ఆలోచిస్తే మూడు గ్రంథములలో ఏ గ్రంథమునకయినా

ముఖ్య సూత్రము, ఆధారిత జ్ఞానము మూడు ఆత్మలను గురించి చెప్పిన

జ్ఞానమే. మూడు ఆత్మలకు సంబంధించిన అనుబంధ జ్ఞానమే మిగతా

గ్రంథమంతా యుండుట గమనించవచ్చును. ఈ మూడు ఆత్మలను

ఆధారము చేసుకొని దేవుని చిహ్నమును, అట్లే దేవుని ముద్రను చెప్పారని

తెలియుచున్నది. మూడు గ్రంథములలోనూ సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి

తర్వాత దేవుడు రెండు రకముల విభజింపబడి కనిపిస్తున్నాడు. ఆ రెండు

రకముల దేవుళ్ళను గురించి వ్రాసి చూపినవే “దేవుని చిహ్నము”,

“దేవుని ముద్ర” అని తెలియవలెను.


మనుషులకు దేవుడు ప్రసాదించిన మూడు దైవగ్రంథములలోనూ

మనిషి తిరిగి దేవున్ని చేరుకొను విధానమున్నా దానిని మనిషి గ్రహించ

లేకపోయాడు. అయితే మూడు మతముల వారు ఎవరికి వారు దేవున్ని

గురించి చెప్పుచున్నారు. మేము దేవుని మార్గములో అందరికంటే ముందు

ఉన్నామని చెప్పుకొంటున్నారు. వాస్తవముగా మూడు మతములవారు

దేవుని వైపే ప్రయాణము చేయుచున్నా, వారు ముందు వెనుక యున్నారని

చెప్పవచ్చును. హిందువులకంటే క్రైస్తవులు మేము దేవుని మార్గములో

ముందున్నామని చెప్పుకొంటున్నారు. అట్లే ముస్లీమ్లు హిందూ క్రైస్తవుల

కంటే మా జ్ఞానమే గొప్పది, వారికంటే మేమే నిజమైన జ్ఞానము కలవారము,

వారి దేవుళ్ళకంటే మా అల్లాహ్ గొప్ప అంటున్నారు. ఎవరికి వారు

గొప్పయని చెప్పుకోవడము సహజమే అయినా నిజముగా మూడు మతముల

వారిలో ఎవరు ముందున్నారని మనము చూచినట్లయితే ఇలా తెలియు

చున్నది. దేవుని జ్ఞానమునకు ఆధారము, ఇరుసు అన్నీ మూడు ఆత్మలే.

దేవుడు మూడు ఆత్మల రూపముగానే యున్నాడు, కావున జ్ఞానమంతయూ

మూడు ఆత్మలను ఆధారము చేసుకొనియే ఉండును. మూడు ఆత్మలను

ఆధారము చేసుకొనియున్న జ్ఞానమే మూడు దైవగ్రంథములయందు గలదు.


నేడు మూడు మతముల వారు వారివారి మత ఆచారముల మీద

చూపిన శ్రద్ధను దేవుడు గ్రంథములో చెప్పిన జ్ఞానము మీద చూపలేదు.

అందువలన సంపూర్ణమైన జ్ఞానము మూడు గ్రంథములలో యున్నా దానిని

మనుషులు తెలియలేకపోయారు. హిందూమతములో 'దేవుడు' అనే

పదమును మరచిపోయి, 'దేవతలు' అనే పదములో ఇమిడిపోయారు.

వారికి భగవద్గీతలో చెప్పిన ముగ్గురు పురుషుల జ్ఞానమే తెలియకుండా

పోయినది. దేవుని మీద విశ్వాసములో అందరికంటే ముందు గలవారు



ముస్లీమ్లో అయినా వారికి మూలాధారమైన ఆత్మజ్ఞానము తెలియదు.

ముస్లీమ్లలో ప్రార్థన, విశ్వాసము రెండూ గట్టిగా ఉన్నాయి. గమ్యము

తెలియని ప్రయాణములాగా వారు దేవుడు ఒక్కడేయని దేవుని మీద

విశ్వాసముతో దేవుని ప్రార్థన చేయుచుండినా వారు తమ గ్రంథములో

చెప్పిన జ్ఞానమును వదలి ఎంతకాలము ప్రార్థన చేసినా వృథా శ్రమ

యగును. ఇంటికి పోవాలని నడుస్తున్నా దారి తెలియనప్పుడు స్మశానానికి

పోయినట్లుండును. దైవజ్ఞానమునకు మూలాధారమైన వాక్యము ఖుర్ఆన్

గ్రంథములో సూరా 50, ఆయత్లో 21లో యున్న మూడు ఆత్మల

విషయము తెలియలేకపోవుట వలన వారిలో కూడా ఎవరూ సార్థకత

పొందలేక పోయారు. అయినా ఆ విషయము వారికి తెలియదు. మేము

అందరికంటే జ్ఞానులుగా ఉన్నామని అనుకొంటున్నారు. వారు ఏమాత్రము

వెనుతిరిగి చూచుకోలేదు.


మూడు ఆత్మల జ్ఞానము సకల జ్ఞానమునకు మూలాధారముగా

యున్నది. భగవద్గీతలో చెప్పిన క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు

తెలియనప్పుడు వారు ఎంత గొప్ప జ్ఞాని అయినా ఏమీ ప్రయోజనము

ఉండదు. అలాగే బైబిలు గ్రంథములో చెప్పిన తండ్రి, కుమారుడు,

పరిశుద్ధాత్మను గురించి తెలియని క్రైస్తవులు దారి తప్పి నడచినట్లగును.

ఎంత ప్రార్థన చేసినా ఫలితము లేకుండా పోవును. అయితే మిగతా

రెండు మతముల వారు మూడు ఆత్మల విషయము తలచకున్నా, ఒక్క

క్రైస్థవ మతము వారు మాత్రము మూడు ఆత్మల పేర్లు చెప్పుకొంటున్నారు.

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని మూడు ఆత్మల పేర్లను చెప్పుట

వరకే పరిమితమయ్యారు. అదియు మత్తయి సువార్తలో 28వ

అధ్యాయములో 19వ వచనములో ఈ మూడు పేర్లు ఉన్నాయని చెప్పు


చుందురు. ఒక దినము ఒక క్రైస్తవ బోధకున్ని కలిసినప్పుడు అతనిలో

మూడు ఆత్మల విషయమును గురించి కొంతసేపు మాట్లాడడము జరిగినది.

ఆ విషయమును ఇప్పుడు చూడండి.


నేను :- మీరు క్రైస్థవ బోధకులు కదా! మీరు చెప్పే జ్ఞానమునే మిగతా

క్రైస్థవులందరూ వినుచుందురు. మీరు ఏసును మనుష కుమారుడు అని

అనుచుందురు కదా! ఏసు మనుష కుమారుడేనా? దేవుని కుమారుడు

కాదా!


బోధకుడు :- ఏసు మనము చూడంగా మనుష కుమారుడే. ఆయనను

మనము మనుష్య కుమారుడనియే చెప్పాలి. అయితే ఏసు కొన్ని

సందర్భములలో తనను తాను దేవుని కుమారునిగా చెప్పాడు.

నేను :- ఏసు దేవుని కుమారుడు కాదా?

బోధకుడు :- మనకు తెలిసినంత వరకు ఆయన తల్లి తండ్రి కలవానిగా

పుట్టాడు. అందువలన మనుష్య కుమారుడు అన్నాము.

నేను :- తండ్రి అంటే ఎవరు? ఏసుకు తండ్రి ఎవరు?

బోధకుడు :- ఏసుకు తండ్రి దేవుడేయని చెప్పాలి. తండ్రియని దేవున్నే

అనాలి.

నేను :- పరిశుద్ధాత్మ అంటే ఎవరు

బోధకుడు :- దేవుడనియే చెప్పాలి.

నేను బోధకునితో జరిపిన సంభాషణలో తండ్రి, కుమారుడు, పరిశు

ద్ధాత్మ అను పదములకు అర్థము అతను ఏమాత్రము పొంతన లేకుండా

చెప్పాడు. తండ్రి, పరిశుద్ధాత్మ ఇద్దరూ ఒక్కటేయని చెప్పాడు. మనము

ఎలా చెప్పుకొన్నా ఫరవాలేదు. అయితే చెప్పినది సత్యమా కాదా!యని


చెప్పినవారు, విన్నది సత్యమా కాదా!యని విన్నవారు చూచుకోవడము

మంచిది. బోధకుడు కొంత హెచ్చుతగ్గులు చెప్పినా క్రైస్థవులలోనే మూడు

ఆత్మలను గురించి చెప్పుకోవడమైనా ఉన్నది. మిగతా రెండు మతములలో

మూడు ఆత్మలను మచ్చుకైనా అనుకోవడము లేదు. ఆధ్యాత్మికమునకు

మూలాధారము మూడు ఆత్మలయినప్పుడు, వాటిని తెలియకపోతే

ఆధ్యాత్మికము ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును.


ఏసు శిలువ వేయబడిన తర్వాత, బాహ్య దృష్ఠికలవారు ఏసు

చనిపోయిన శిలువను, ఏసుకు గుర్తుగా పెట్టుకోవడము జరిగినది. ఏసును

పెట్టుకొంటే అది హిందువులవలె ఏసును దేవతలలోనికి కలిపినట్లవుతుందని

ఆయన గుర్తుగా శిలువను పెట్టుకోవడము జరిగినది. మేము ఏసు భక్తులము

అని శిలువను ధరించిన వారు కలరు. అట్లే ఇది ఏసు ప్రార్థనాలయము

అని తెలియునట్లు చర్చీల మీద శిలువను ఉంచడము కలదు. ఎక్కడయినా

శిలువ అంటే క్రైస్థవము అనీ, క్రైస్థవము అంటే శిలువయని తెలియునట్లు

చేశారు. ఇదంతా బాహ్యచూపు కలవారు చేసినది. కొంత సూక్ష్మ జ్ఞానము

గలవారు గ్రంథములోని జ్ఞానమును గ్రహించినవారై బైబిలు గ్రంథములో

చెప్పిన సారాంశమైన జ్ఞానమును, మూలాధారమైన జ్ఞానమును తెలిసినవారై,

తెలిసిన జ్ఞానమునకు గుర్తుగా దేవుని ముద్రను తయారు చేసి చర్చీల

ముందర, చర్చీల పైన పెట్టారు. కొందరు క్రైస్తవులు ఏసు చనిపోయిన

శిలువను ఏసుకు గుర్తుగా పెట్టగా, కొందరు మాత్రము దేవుని ముద్రను

పెట్టడమైనది. ఎక్కువమంది బాహ్యచూపు కలవారు 90 శాతము శిలువనే

పెట్టుకోగా, కేవలము పదిశాతము మంది దేవుని ముద్రను చర్చీల దగ్గర

పెట్టడమైనది. ఎక్కువమంది పెట్టిన శిలువ ఆకారము అందరికీ తెలుసు.

అయితే సూక్ష్మజ్ఞానముతో ఇమిడియున్న దేవుని ముద్ర చాలామందికి


తెలియదు. ఒకమారు శిలువకు, దేవుని ముద్రకు ఆకార నిర్మాణమును

క్రింద చూస్తాము.


శిలువ దేవునిముద్ర   చిత్రమును 168 పేజీ లో చూడండి. 


శిలువ రూపమును, దేవుని ముద్ర రూపమును చూచినట్లయితే

శిలువ బాహ్య అర్థముతో కూడుకొని యున్నది. ఏసును శిలువ ఆకారమున్న



మొద్దుమీద పెట్టి కాళ్ళకు, చేతులకు ములుకులు కొట్టారని చెప్పుచుందురు.

శిలువమీద గుర్తులు చూపిన చోట కాళ్ళకు, చేతులకు ములుకులు కొట్టారని

చెప్పుచుందురు. కొన్ని శిలువల మీద ఏసు శరీరము శిలువకు వ్రేలాడినట్లు

చూపియుందురు. కొన్ని శిలువలకు ఏసు లేకుండా దానిని చూస్తే ఆయనను

చూచినట్లు గుర్తుగా చెప్పుచుందురు. శిలువలో జ్ఞానము ఏమీ లేదు.

అదే క్రిందగల దేవుని ముద్రలో ఎంతో సారాంశమైన జ్ఞానము కలదు.

మొదట కొందరు బాహ్యార్థముగల శిలువలను చర్చీల దగ్గరపెట్టగా అందులో

జ్ఞానము ఏమీ లేదని కొందరు జ్ఞానులు మత్తయి సువార్త 28వ

అధ్యాయములో 19వ వచనములో గల తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ

యను అర్ధముతో కూడుకొన్న గుర్తును పెట్టారు.


మొదట జ్ఞానులయిన వారు దేవుని ముద్రలో మొదట పుట్టిన

ప్రకృతిని చేర్చి దేవుడు నాలుగు భాగములుగా యున్నాడని వివరముగా

తెలియునట్లు పెట్టారు. తర్వాత కొందరు జ్ఞానము తెలిసినవారు వాక్యములో

యున్న మూడు ఆత్మలనే గుర్తించి పెట్టితే ఆత్మల విషయమే ముఖ్యముగా

తెలియును, జ్ఞానములో ముఖ్యమైనవి, మూలాధారమైనవి మూడు ఆత్మలే

యని పైనగల మొదటి ప్రకృతిని తీసివేసి మూడు గుర్తులను మాత్రము

ఉంచారు. దేవుని ముద్ర మొదటగల సంపూర్ణమైన ఆకారమును ప్రక్కన

పేజీలో చూడండి.


చివరకు కొన్నిచోట్ల మాత్రము మిగిలినది మూడు చక్రముల గుర్తు.

బహుశా బ్రెజిల్ మరియు కొన్ని దేశములలో నేడు కూడా చర్చీల దగ్గర

శిలువలను ఉంచక మూడు గుర్తులు గల దేవుని ముద్రను గుర్తుగా

ఉంచడము జరుగుచున్నది. క్రైస్తవులలో ఎక్కువ సంఖ్య వారు ఏసు


దేవుని ముద్ర చిత్రమును పేజీ లో  170 చూడండి. 


ప్రభువు చనిపోయిన శిలువ గుర్తును ఏసుకు గుర్తుగా పెట్టుకొనుచుండగా

కొన్ని దేశములలో కొంతమంది మాత్రము మూడు చెక్కల గుర్తును చర్చీల

ఉంచడము జరుగుచున్నది. క్రైస్తవులలో ఎక్కువ సంఖ్య వారు ఏసు

దగ్గర ఉంచడమైనది. కాలము గడువగా అర్థములు తెలియకుండా పోయి


ఆకారమునకు మాత్రము కొన్నిచోట్ల మిగిలి ఉన్నాయి. ముఖ్యముగా చెప్పితే

నేడు కూడా క్రైస్థవులకు పెద్దగాయున్న వాటికన్ సిటీలోని పోప్ కూడా

మూడు గీతలు గల గుర్తునే పట్టుకొని ఉండడము నేను ఒక ఫోటోలో

చూచాను. మూడు గీతల గుర్తుకు మూడు ఆత్మల పేర్లనే వ్రాసుకోవడము

విశేషము. దీనినిబట్టి మూడు ఆత్మల జ్ఞానము క్రైస్థవులలోనే అదియూ

కొన్నిచోట్ల మాత్రము కనిపిస్తున్నది. వాటికన్ సిటీలో పోప్ భుజము మీద

పెట్టుకొన్న నాల్గు చక్రముల గుర్తును చూడండి.


నేడు భూమిమీద మిగిలియున్న గుర్తులు ఇవి. వీటితో అయినా

గ్రంథములోని వాక్యము కొద్దిగా దృశ్యరూపములోనికి వచ్చినది. వీటితో


సంతృప్తి చెందక సంపూర్ణమైన నాల్గుచక్రములు దేవుని ముద్రను నుదిటి

భాగమున పెట్టుకొన్నవాడు నిజమైన క్రైస్తవుడుగా దేవుని దృష్ఠిలో లెక్కించ

బడును. దేవుడు, దేవుని జ్ఞానము మన శరీరములో యున్నది. అందువలన

దేవుని ముద్రను శరీరము మీదనే పెట్టుకొని దానిని గౌరవించవలెను.

"మేము క్రైస్తవులము నొసలు మీద గుర్తులు పెట్టుకొంటే హిందువులవలె

కనిపిస్తామేమో!” అని అనుకోకూడదు. ప్రతి క్రైస్థవుడు నొసలు మీద

నాలుగు చక్రముల గుర్తును ధరించవలెను. నొసలు మీద ధరించమనే

(ప్రకటన 9-4) లో దేవుడే చెప్పియున్నాడు. నీవు ధరించే దేవుని చిహ్నము

ప్రతి మనిషికీ సంబంధించినదిగాయున్నది. అందువలన దేవుని జ్ఞానము

ఎడల సిగ్గుపడకూడదు. ఇంతవరకు చెప్పిన మూడు ఆత్మల జ్ఞానమును

భయము కల్గి, భక్తి కల్గి తెలియవలెను. తెలియకపోతే తెలుసుకొనుటకు

ప్రయత్నించు. దేవుని ముద్రను ధరించు. దేవుని క్షమాశీలతను పొంది,

దేవునిలోనికే చేరిపోవలెనని దానికి “దేవుని ముద్ర” దారియని

చెప్పుచున్నాము.


మనుషులు సృష్ట్యాది నుండి ఉన్నారు. ఎన్నో లక్షల సంవత్సరములు

గడచిపోగా, దాదాపు రెండువేల సంవత్సరములనుండి 'మతము' అనునది

మనుషులలో చేరిపోయినది. మనిషి మొదటినుండి ఉన్న జ్ఞానమును

వదలి మతమును గట్టిగా పట్టుకొన్నాడు. 'ముందు మతము తర్వాత జ్ఞానము’

అను పద్ధతిలో ఉండిపోయాడు. ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథము మాదియని

చెప్పినా, వారు ఖుర్ఆన్కంటే హదీసు గ్రంథములకే ఎక్కువ ప్రాధాన్యత

నిచ్చుచున్నారు. ప్రతి మతములోనూ మతాచారములు దైవ జ్ఞానమును

వెనక్కి నెట్టివేయుచున్నవి. లేదు మేము జ్ఞానానికే విలువ నిచ్చుచున్నామని

బుకాయించువారు కూడా కలరు. నేడు ఏ మతములోగానీ మతము, మత


సాంప్రదాయములకు ఎక్కువ విలువను ఇచ్చుచున్నారుగానీ, దైవజ్ఞానమునకు

విలువ నివ్వలేదు. పైకి మేము జ్ఞానులము అనినా, వానిలో మతము 90

శాతము, దైవజ్ఞానము 10 శాతము మాత్రమే యున్నది. కొన్నిచోట్ల

పది శాతము కూడా కనిపించడము లేదు.


ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరాలో 28వ ఆయత్

నుండి 31 వరకు చూస్తాము. ఈ వాక్యములు చూచిన తర్వాత వారు

మతమునకు ఎంత శాతము, దేవుని జ్ఞానమునకు ఎంత శాతము విలువ

నిచ్చుచున్నారో తెలుస్తుంది. (15-28, 29, 30, 31) "నీ ప్రభువు

దేవ దూతలతో ఇలా అన్నాడు. "నిశ్చయముగా నేను మ్రోగేమట్టి,

రూపాంతరము చెందిన జిగట బురదతో మానవున్ని సృష్టించ

బోతున్నాను. (29) ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి

అతనిలోనికి నా ఆత్మనే ఊదినప్పుడు మీరంతా అతని ముందు

సాష్టాంగ పడండి. (30) దూతలందరూ సాష్టాంగపడ్డారు. (31)

ఒక్క ఇట్లసు సాష్టాంగ పడేవారిలో చేరటానికి నిరాకరించాడు".

ఈ విధముగా అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడి

యున్నది. దేవుడు స్వయముగా 'నేను ఒక మనిషిని తయారు చేసి

పంపుతాను. ఆ మనిషిలో నా ఆత్మనే నింపి పంపుతాను' అని చెప్పినప్పుడు

వచ్చే వ్యక్తి గొప్పవాడనే కదా! అర్థము. దేవుడు తన ఆత్మనే ఊది పంపుట

వలన దేవుని శక్తి యున్నవాడే వచ్చును. దేవుని ప్రతినిధి వచ్చుచున్నాడని

నన్ను గౌరవించినట్లే నా ప్రతినిధికి సాష్టాంగ నమస్కారము చేయమని

దేవుడే చెప్పినప్పుడు, దేవదూతలందరూ సాష్టాంగ నమస్కారము

చేసినప్పుడు, మనిషిలో ఇగ్లీషు (మాయ) ఉండడము వలన దేవుని వద్దనుండి

వచ్చినవానికి మనిషి నమస్కారము చేయలేదు. ఇగ్లీషు (మాయ) ఉన్నవాడు



దేవుని ప్రతినిధియైన భగవంతునికి మనిషి గర్వము చేత నమస్కారము

చేయకపోయాడు. నేడు ముస్లీమ్లు నమస్కరించక పోవడమును సమర్థించు

చున్నారు. “తాము దేవునికి తప్ప ఇతరులకు నమస్కరించము” అని

అంటున్నారు.


దేవుడు సాధారణ మనుషులకు నమస్కారము చేయమని చెప్పలేదు.

'తాను పంపిన తన ప్రతినిధికి' అని చెప్పియున్నాడు. ఖుర్ఆన్ గ్రంథము

చెప్పబడి 1400 సంవత్సరములు అయినది. అప్పుడు 'నేను ఒక మానవున్ని

తయారు చేసి పంపుదును' అని అంటే అది ఖుర్ఆన్ చెప్పిన తర్వాతేనని

అర్థమగుచున్నది. 'దేవుడు అవతరించడు' అని ముస్లీమ్లు చెప్పుచున్నారు.

'నేను అవతరిస్తాను' అని (89-21, 22) లో చెప్పియున్నాడు. అంతేకాక

దేవుడు ప్రత్యక్షముగా ఎక్కడికీ రాడు. తన ప్రతినిధిగా తానే వస్తాడని ఈ

వాక్యములలో తెలిసిపోవుచున్నది. తన ప్రతినిధియంటే దాదాపు దేవుని

శక్తి కల్గియున్నవాడే అని కదా! అర్థము. అప్పుడు కూడా మేము

నమస్కరించము అంటే ఇబ్లీసు ప్రభావమేయని అనుకోక తప్పదు.

దేవుడు స్వయముగా నమస్కరించమని చెప్పాడు. దేవదూతలు కూడా

నమస్కరించారు. అయినా మనిషి నమస్కరించను అని అంటే అది

అజ్ఞానము కాదా! కొందరు ముస్లీమ్లు మా మత షరియత్ ప్రకారము

మేము ఎవరికీ నమస్కరించము అంటే దైవ గ్రంథములో దేవుడు

చెప్పినమాటను కూడా లెక్కచేయడము లేదనేగా అర్థము. గ్రంథములో

నా ప్రతినిధికి సాష్టాంగ నమస్కారము చేయమని చెప్పగా మనిషిలోని

దైవజ్ఞానమును చూచి అతనికి సాధారణ నమస్కారమయినా చేయకపోతే,

ఇది మా మత షరియత్ అంటే మతముతో దేవుని మాటను ధిక్కరించినట్లు

కాదా! దేవున్ని అగౌరవపరచినట్లు కాదా!


దీనినిబట్టి మనిషి మతమునకు ఎక్కువ గౌరవమునిచ్చుచున్నాడా

లేక దేవుని మాటకు గౌరవమునిచ్చుచున్నాడాయని ప్రత్యక్షముగా తెలియు

చున్నది. ఒక్క ముస్లీమ్ మతములో షరియత్ అనేకాదు, అన్ని మతముల

లోనూ మత ప్రాబల్యము ఎక్కువగా యున్నది. అందువలన మత

సాంప్రదాయములనే ఆచరించడములో తప్పిపోకూడదు అని దేవుని మాటను

గాలికి వదలివేస్తున్నారు. క్రైస్తవులలో కూడా ముఖము మీద దేవుని ముద్రను

ధరించకపోతే శిక్ష తప్పదని దేవుడు చెప్పినా, దేవుని ముద్ర అని తన

పేరును చెప్పుకొన్నా "మేము మా మతమునకు కట్టుబడియున్నాము.

మా మత సాంప్రదాయము ప్రకారము నొసలు మీద ఏ గుర్తును ధరించము”

అని అంటే దేవుని మాటను ధిక్కరించినట్లు కాదా! దైవగ్రంథములోని

దేవుని వాక్యమును అగౌరవపరచినట్లు కాదా! ఎవరంతకు వారు 'మతము’

అని దేవుని మాటను లెక్కచేయకపోతే దేవుడు మనుషులను ఏమీ అనకుండా

మౌనముగా ఉండినా, దేవుని పాలకులు ఊరకయుండరు. గ్రహములయితే

తేలుకుట్టిన బాధయంత ఐదు నెలలు బాధింతురు. భూతములయితే పూర్తిగా

చంపకమానవు. అందువలన మనుషులు మతమును వదలి, దేవుని మాట

ప్రకారము ఆచరించమని చెప్పుచున్నాము. "దేవుని మార్గమునకు

ఆటంకమయిన కన్నునైనా పెరికివేయి, చేయినయినా నరికివేయి” అని

దేవుడే చెప్పినప్పుడు నీ మత ఆచారములను వదలుకోలేవా? ఆలోచించుకో,

వాక్యము ప్రకారము దేవుని ముద్రను ధరిస్తావో! మతము అని అంటావో!!

పాలకులు చూస్తారు.


ఇట్లు,

యోగీశ్వర్.








Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024