cloud అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు 16thFeb 2025


అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.

'ఉగ్రవాదము' అను పదము అందరికీ సుపరిచయమైనదే,
ఉగ్రవాదములో హింస, మారణహోమము తప్ప ఏమీ లేదని అందరికీ
తెలుసు. నేడు కొంతమంది మనుషులలో మాత్రము ఉగ్రవాదమున్నది.
అయితే రేపు అందరిలో కూడా రావచ్చును. ఉగ్రవాదము ఎప్పుడు
ఎంతమందిలోనికి ప్రాకుతుందో కూడా చెప్పలేము. ఒకప్పుడు
ఉగ్రవాదమునకు భయపడు మనిషి, తనలోయున్న అజ్ఞానముచేత తానే
ఉగ్రవాదిగా మారిపోగలడు. అందువలన భవిష్యత్తులో ఎవరు ఎట్లు
మారగలరో చెప్పలేము. ఉగ్రవాదము ఒక బీజములాంటిది. అది
మొలకెత్తుటకు అనుకూలమైన భూమి మనిషిలోని అజ్ఞానమే. మనిషిలో
అజ్ఞానమున్నప్పుడు ఉగ్రవాద బీజము అతనిలో మొలకెత్తి చివరికి మహా
వృక్షము కాగలదు. అందువలన ఎందరో పేరు పొందిన ఉగ్రవాదులు
అనేక దేశములలో తయారయినారు. ఉగ్రవాదము ఒక దేశమునకో,
ఒక మతమునకో పరిమితమైనదిగానీ, సంబంధించినదిగానీ కాదు.
ఉగ్రవాదము అజ్ఞానమున్న ప్రతి దేశములోనూ, ప్రతి మతములోనూ
ఉద్భవించగలదు. దైవజ్ఞానమును బట్టి ఎక్కడయితే అజ్ఞానమున్నదో అక్కడ
ఉగ్రవాద బీజములు మొలకెత్తుటకు అవకాశమున్నందున, ఉగ్రవాదమును
గురించి సమగ్రముగా తెలియాలంటే ముందు దైవజ్ఞానమంటే ఏమిటో,
అజ్ఞానమంటే ఏమిటో, తెలియవలసిన అవసరమున్నది.

దైవజ్ఞానమంటే ఏమిటో తెలియుటకు ప్రయత్నిస్తే, దేవుని చేత
చెప్పబడినది లేక దేవుని చేత ప్రకటింపబడిన దానిని దైవజ్ఞానము
అంటాము. మనుషులచేత ప్రకటింపబడునది ప్రపంచ జ్ఞానమనీ, దేవుని
చేత ప్రకటింపబడిన దానిని దేవుని జ్ఞానము లేక దైవజ్ఞానము అనీ
చెప్పవచ్చును. దేవుని జ్ఞానము దేవునికి తప్ప మరి ఇతర ఏ మానవునికీ
తెలియదు, కావున దేవునికి సంబంధించిన జ్ఞానమంతయూ దేవుడే
స్వయముగా చెప్పవలసియున్నది. అయితే ఇక్కడొక చిన్న సంశయము
కొందరికి రావచ్చును. అదేమనగా! రామాపురము అను ఊరిలో దేవుడని
నమ్మిన నరసింహస్వామి గుడిలోని నరసింహుడు, పూనకము వచ్చి ఆ
ఊరిలోని ప్రజలకు కొన్ని మాటలు చెప్పి, నేను చెప్పినట్లు నడుచుకొమ్మని
చెప్పాడట. ఆయన చెప్పిన మాటలలో కొన్నింటిని చూస్తే ఇలా కలవు.
"ఆదివారము తూర్పుకు ప్రయాణము చేయవద్దండి. సోమవారము
మాంసము తినవద్దండి. మంగళవారము అప్పు చేయవద్దండి.
బుధవారము తల స్నానము చేయవద్దండి. గురువారము గుడికి పోవద్దండి.
శుక్రవారము తెల్లని దుస్తులు ధరించండి. శనివారము నన్ను భక్తితో
పూజించండి” అని చెప్పాడు. ఆ ఊరి ప్రజలందరికీ నరసింహస్వామి
వారి ఆరాధ్యదైవమగుట వలన, ఆయన చెప్పిన మాటలను ముఖ్యమైన
వచనములుగా నమ్మి అలాగే ఆచరించెడివారు. రామాపురము ప్రక్కనే
తురకపల్లె అను ఊరు కలదు. ఆ ఊరిలో గ్రామ దేవత అయిన పెద్దమ్మ
ఆరాధ్యదైవముగాయుండెను.

ప్రతి మంగళవారము తురకపల్లెలో పెద్దమ్మ గుడికి పోవు
వారందరూ పెద్దమ్మనే గొప్ప దేవతగా భావించి పూజించెడివారు. అయితే
ఆ ఊరి ప్రజలందరూ సుఖముగా బ్రతుకుటకు, రోగాలు రాకుండుటకు
పెద్దమ్మ దేవత పూనకము వచ్చి, అక్కడున్న భక్తులతో మాట్లాడుచూ కొన్ని
మాటలు చెప్పడము జరిగినది. "ఆదివారము ఎక్కడా ప్రయాణించవద్దు.
సోమవారము క్రొత్త గుడ్డలు కట్టవద్దు. మంగళవారము తలస్నానము
చేయవద్దు. బుధవారము గుడికి పోవద్దు. గురువారము మాంసము
తినవద్దు. శుక్రవారము ఇల్లు శుభ్రము చేసుకొని దేవతాపూజ చేయి.
శనివారము అప్పు చేయవద్దు” అని చెప్పింది. ఈ విధముగా
రామాపురములో నరసింహ స్వామి కొన్ని నియమములు పెట్టగా, తురకపల్లి
పెద్దమ్మ కొన్ని నియమములు పెట్టింది. రామాపురము ప్రజలు
నరసింహస్వామియే నిజమైన దేవుడని పూజించుచూ, ఆయన చెప్పినదే
దైవవాక్కులుగా భావించి ఆ వాక్యములనే తప్పనిసరిగా ఆచరించుచూ,
మిగతా గ్రామముల ప్రజలను కూడా ఆచరించమని చెప్పుచుండిరి. అదే
విధముగా తురకపల్లెవారు కూడా తమ గ్రామదేవతయిన పెద్దమ్మ చెప్పిన
వాక్యములనే పూర్తిగా దైవ వాక్యములుగా లెక్కించి వారు ఆచరించడమేకాక
మిగతా చుట్టుప్రక్కల గ్రామముల ప్రజలను కూడా ఆచరించమనీ, అలా
ఆచరించుట వలన మనిషికి ఎటువంటి కష్టములు రావనీ, అదే నిజమైన
జ్ఞాన ఆచరణ అనీ చెప్పుచుండిరి. ఇట్లు రామాపురమువారు ఆచరించు
ఆచరణలే నిజ జ్ఞానమని ప్రచారము చేయగా, తురకపల్లెవారు కూడా
తమ దేవత చెప్పినదే నిజ జ్ఞానమని చెప్పుకొనుచుండిరి.

రామాపురము వాళ్ళు ఆదివారము తూర్పుకు ప్రయాణము చేయ
కుండగా, తురకపల్లెవారు ఏ దిశకూ పోయెడివారు కాదు. రామాపురము
వాళ్ళు సోమవారము మాంసము తినకపోగా, తురకపల్లెవారు గురువారము
తినకుండావుండిరి. ఈ విధముగా ఎవరికివారు తమది గొప్ప దైవజ్ఞానము
అని ప్రచారము చేయుచూ, రామాపురము వారు తురకపల్లెవారు చెప్పినది
ఒప్పుకోకపోగా, తురకపల్లెవారు రామాపురము వారు చెప్పినది ఒప్పుకోక
తమదే గొప్ప ఆచరణయని చెప్పుచుండిరి. ఇలా ఎవరికి వారు తమదే
గొప్ప జ్ఞానమని వాదించుకొనుచుండిరి. కొంతకాలమునకు రామాపురము
లోని నరసింహస్వామి దేవుడేకాదనీ, తురకపల్లెలోని తమ పెద్దమ్మే నిజమైన
శక్తిగల దేవతయని తురకపల్లెవారు అనగా! తురకపల్లెలోని పెద్దమ్మ
దేవతేకాదనీ, రామాపురములోని తమ నరసింహస్వామియే నిజమైన దేవుడనీ
రామాపురము వారు అనుచుండిరి.

ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! దేవుని
జ్ఞానము దేవునికే తెలుసు, కావున దేవుని జ్ఞానమును దేవుడే
చెప్పాలి అను మాట వాస్తవమే. అయితే ఏది దేవుని మాట? ఎవరు
దేవుడు? అని ముందు తెలిస్తే తర్వాత దైవజ్ఞానమును సులభముగా
ఆశ్రయించవచ్చును. ముందు 'ఎవరు దేవుడు?" అని తెలియకనే ఇది
దేవుని మాటయని నిర్ణయించి చెప్పుటకు వీలులేదు. అట్లని ఎవరినో
దేవుడుకాని వారిని దేవుడని నమ్మితే, వారిలో దైవత్వము లేనప్పుడు
వారిమాట దైవవాక్కు అని చెప్పబడదు. అటువంటి వారు చెప్పిన మాటలు
దేవుని జ్ఞానమే కాదని చెప్పవచ్చును. ఇక్కడ మనము చెప్పుకొన్న దాని
ప్రకారము రామాపురము వారికి నరసింహస్వామి దేవుడయితే, తురకపల్లె
వారికి పెద్దమ్మ దేవునిగా భావించబడినది. అయితే వారిద్దరిలో దైవత్వము
లేనప్పుడు వారిమాటలు దైవవాక్కులు కాదు. వారిది దైవజ్ఞానము కాదు.
అటువంటి సందర్భములో దేవుడు కానిదానిని దేవుడని నమ్మిన ప్రతి మనిషి
మోసపోవును. దైవజ్ఞానము కాని దానిని దైవజ్ఞానమని నమ్మిన ప్రతి
మనిషి మోసపోయినట్లేయగును. నరసింహస్వామి చెప్పిన మాటలుగానీ,
పెద్దమ్మ చెప్పిన మాటలుగానీ రెండూ ప్రపంచమునకు సంబంధించినవే
యగును. మొత్తము మీద ప్రయాణ విషయము ప్రపంచ సంబంధమైనదే
గానీ దైవసంబంధమైనది కాదు. తల స్నానము చేయడముగానీ, క్రొత్త
గుడ్డలు ధరించడముగానీ, మాంసము తినడముగానీ, ఇల్లు శుభ్రము
చేసుకోవడముగానీ, అప్పు చేయడముగానీ అలాగే అన్యదేవతారాధన
చేయడముగానీ అన్నీ ప్రపంచ విషయములే అగును.

ప్రపంచ విషయములను చెప్పువారిని ప్రపంచ సంబంధముగానే
భావించాలి. దైవ విషయములను చెప్పువారిని దైవ సంబంధముగానే
భావించాలి. ఇక్కడ నరసింహస్వామి మరియు పెద్దమ్మ చెప్పిన మాటలను
బట్టి వారిద్దరినీ దేవునిగా లెక్కించుటకు వీలులేదు. అయితే రామాపురము
వారు, తురకపల్లెవారు అందరూ దేవుడుకాని దేవున్ని, దైవత్వములేని
దేవతలను వారు దేవునిగా విశ్వసించడము జరిగినది. విషమును తెలియక
తినే ఆహారమే అని నమ్మి తినినా విషము తన పనిని తాను చేయును.
విషమును ఆహారమని నమ్మినా అది వృథా నమ్మకమగును. అలాగే
దేవుడు కాని వారిని దేవుడని ఎవరు నమ్మినా వారి నమ్మకము
వృథాయగును. వారు దేవునితో సమానముగానీ, దేవుడుగానీ కాదు.
దేవుని విధానము తెలియని వారందరూ “దేవుడు ఎవరు?” అని తెలియక
దేవుడు కానివారిని దేవుడని నమ్మి మోసపోవడము జరుగుచున్నది. వారి
జీవితములను దేవుడు కాని అన్యదేవతల భక్తిలో వృథా చేసుకోవడము
జరుగుచున్నది. నేడు భూమిమీద ప్రతిమనిషీ ఏదో ఒక దేవున్ని, ఏదో
ఒక జ్ఞానమును నమ్మి, వారు నేర్చుకొన్న జ్ఞానము ప్రకారము నడుచు
కొంటున్నారు. ఆ సూత్రము ప్రకారము ఉగ్రవాది కూడా తాను నమ్మిన
జ్ఞానము ప్రకారము, తాను నేర్చిన జ్ఞానము ప్రకారము తాను చేయు
ఉగ్రవాదము సరియైనదేయని అనుకొంటున్నాడు. ఈ విధముగా ప్రతి
మనిషి తనకు తెలిసిన జ్ఞానము ప్రకారము నడుచుకొనుచూ, అదే నిజమైన
జ్ఞానమనీ, తాను నమ్మినదే నిజమైన దేవుడని అనుకోవడము జరుగుచున్నది.
ఒక మనిషి నమ్ముకొన్నది నిజమైన దైవము అయినప్పుడు అతను

నిజమైన దైవజ్ఞానము ప్రకారమే నడుచుకొనును. అలా
నడుచుకొన్నవాని ద్వారా సమస్య ఏమాత్రముండదు. దేవుడుకాని
వానిని దేవుడని నమ్మిన వానితోనే భూమిమీద సమస్యలు
ఏర్పడుచున్నవి.

హిందూమతములో ఎంతోమంది దేవతలను ఆశ్రయించినవారు
కలరు. వారిలో ఎవరు నమ్మిన దేవున్ని వారు గొప్పవాడని చెప్పుకోవడము
జరుగుచున్నది. ఒకడు రామున్ని దేవుడని పూజిస్తే, రామునికంటే
ఆంజనేయుడే గొప్పవాడని నమ్మువారు కొందరు గలరు. తిరుపతి
వెంకటేశ్వరుడు గొప్పవాడు, ఆయనే నిజమైన దేవుడు అని ఒకడు అంటే,
మరియొకడు నరసింహస్వామియే గొప్పవాడు అని ఆయనను మించిన
దేవుడు లేడని అంటున్నాడు. ఇట్లు ఒక హిందూ మతములో దేవుని
విషయములో ఏకాభిప్రాయములేక ఎవరికి తోచినట్లు వారు ఇతనే దేవుడని
వేరువేరు అభిప్రాయములతో వేరువేరు దేవుళ్ళను చెప్పుచున్నారు. ఇక
ఇతర మతముల విషయములోనికి వస్తే ఒక మతమువారు నిర్ణయించి
చెప్పిన దేవున్ని మరొక మతము వారు ఒప్పుకోవడము లేదు. ఒక్కొక్క
మతమువారు ఒక్కొక్క దేవున్ని మా దేవుడే నిజమైన దేవుడని చెప్పడము
జరుగుచున్నది. మొత్తము ప్రపంచములో పన్నెండు మతములుండగా
అందులో పెద్దవి, ముఖ్యమైనవి, శాస్త్రబద్ధ దైవజ్ఞానము గలవి మూడు
మాత్రమే గలవు. ఆ మూడు మతముల పేర్లను చెప్పితే హిందూ, క్రైస్తవ,
ఇస్లామ్ మతములుగా చెప్పవచ్చును. ఈ మూడు మతములు కూడా
ఒకరు చెప్పిన దేవున్ని మరొకరు ఒప్పుకోవడము లేదు. ఈ విధముగా
పన్నెండు మతములు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గములో నడవను మొదలుపెట్టి,
ఒక్కొక్కరు ఒక్కొక్క దేవున్ని వారి మతములలో ప్రతిపాదించి చెప్పుచున్నారు.
ముఖ్యమైన హిందూ, క్రైస్తవ, ఇస్లామ్ మతములలో వేరువేరు దేవుళ్ళను
తమ దేవుడుగా చెప్పుకొనినా, వారి మార్గములో అభిప్రాయబేధములు
గలవు. ఇస్లామ్ మతములో అల్లాయే దేవుడని అందరూ చెప్పినా, వారు
నడుచుకొను మార్గములో, ఆచరించు విధానములో వేరువేరు గుంపులుగా
తయారయి పోయి మాదే సరియైన మార్గమని వారి మతములో వారే
వాదించు కోవడము జరుగుచున్నది. అల్లానే దేవుడని చెప్పు ఇస్లామ్లో
ఒక విధముగా చెప్పితే రెండు రకముల చీలికలున్నాయని చెప్పవచ్చును,
మరొక రకముగా చెప్పితే 73 రకముల చీలికలున్నాయని చెప్పవచ్చును.
ఒకే దేవున్ని నమ్మినవారు 73 రకములుగా ఉన్నారంటే విచిత్రమే కదా!

మనిషికి నేటివరకు సంపూర్ణముగా అర్థముకాని దైవజ్ఞానము
సృష్ట్యాదిలోనే దేవుడు ఆకాశవాణి ద్వారా చెప్పాడు. అప్పటికి అర్థమయినా
తర్వాత కాలములో వచ్చిన మనుషులకు జ్ఞానము ధర్మయుక్తముగా తెలియ
కుండాపోయినది. అధర్మములతో కూడిన జ్ఞానము తెలియుట వలన
అసలయిన దేవుడు ఎవరో మనుషులకు తెలియకుండా పోయింది. ఇక్కడ
కొందరికి ఒక ప్రశ్నరావచ్చును అదేమనగా! దేవుడు సృష్ట్యాదిలో
సంపూర్ణముగా జ్ఞానమును చెప్పినప్పుడు అప్పుడు దైవజ్ఞానము
కొందరికయినా తెలిసియుండును కదా! ఒక్కమారు తెలిసిన జ్ఞానము ఆ
జన్మతోనే అంతము కాకుండా రెండవ జన్మకు కూడా జ్ఞానము వచ్చును
కదా! అలాంటప్పుడు ఒకమారు దైవజ్ఞానము ధర్మయుక్తముగా ఉండడము
జరిగితే ఎప్పటికీ ఎన్ని జన్మలకయినా అలాగే ఉండును కదా! ఆ విధముగా
ఉన్నప్పుడు ఒకమారున్న దైవజ్ఞానము తర్వాత కాలములో మనుషులవద్ద
ఎందుకు లేకుండా పోయిందనీ, ఎందుకు అధర్మముగా మారిపోయిందనీ

ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఇలాగున్నది. భగవద్గీతలో
ఇటువంటి ప్రశ్ననే అర్జునుడు అడిగినప్పుడు “ఒకమారు జ్ఞానమును
తెలిసినవారు పూర్తి మోక్షము పొందకపోతే, తిరిగి అదే
జ్ఞానముతో జ్ఞానుల ఇంటిలోగానీ, యోగుల ఇంటిలోగానీ
జన్మించుదురు” అని చెప్పియుండుట వలన నేర్చిన దైవజ్ఞానము
మరణముతోపోదు, తర్వాత జన్మకు కూడా వచ్చును. జ్ఞానము
పొందినవాడు కర్మ మిగిలి జన్మకు పోతే అట్లు జరుగును. ఒకవేళ అదే
జన్మలోనే మోక్షమును పొందితే అతను తిరిగి పుట్టడు. అతని జ్ఞానము
అతనిని దేవునివద్దకు చేర్చును. ఒకవ్యక్తి దైవజ్ఞానమును తెలిసి మోక్షమును
పొందితే అతను భూమిమీద లేకుండా పోవును. అలా జ్ఞానులందరూ
మోక్షమును పొందితే మిగిలిన వారు అజ్ఞానులే ఉందురు. అప్పుడు
ధర్మములతో కూడిన జ్ఞానమును తెలిసినవారు లేకుండా పోయి దైవజ్ఞానము
తెలియని వారుండుట చేత అధర్మములతో కూడిన జ్ఞానము వృద్ధి
చెందగలదు. అందువలన భూమిమీదున్న జ్ఞానులు మోక్షము పొందినప్పుడు,
మిగిలిన అజ్ఞానులలో అధర్మములతో కూడిన జ్ఞానము అభివృద్ధి
చెందుచున్నది. అప్పుడు దేవుడు తిరిగి తన జ్ఞానమును ధర్మయుక్తముగా
బోధించవలసియున్నది.

మనిషి దైవజ్ఞానమును తెలియనివాడై, తనకు తెలిసినదే
దైవజ్ఞానమని అనుకోవడము వలన అధర్మజ్ఞానము వృద్ధి చెందుచున్నది.
దైవజ్ఞానమును దేవుడు సృష్ట్యాదిలోనే సంపూర్ణముగా బోధించియున్నా,
అది కొందరికి మాత్రమే అర్థమగుట వలన మిగతావారికి తెలియదనియే
చెప్పవచ్చును. అర్థమయిన వారు మోక్షమును పొందగా, అర్థముకాని

అజ్ఞానులు మేము జ్ఞానులమని వారికి తెలిసిన జ్ఞానమును వారు చెప్పుట
వలన అజ్ఞానము సులభముగా అభివృద్ధి చెందుచున్నది. అలా అభివృద్ధి
చెందిన అజ్ఞానమును లేకుండా చేసి తిరిగి జ్ఞానమును ప్రతిష్ఠించుటకు
ప్రతి యుగమునందు దేవుడు ప్రయత్నించుచునే ఉండును. అయితే
దేవుడు ప్రత్యక్షముగా ఏ మానవునికీ తన జ్ఞానమును చెప్పలేదు, జరుగబోవు
కాలములో కూడా చెప్పడు. దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడుగా
ఉండుట వలన ఏ మనిషితోనూ నేరుగా మాట్లాడుటకు వీలులేదు. దేవుని
జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియదు. అందువలన దేవుని
జ్ఞానమును దేవుడే చెప్పవలసియున్నది. దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ
మాట్లాడడు, కనుక దేవుడు తన జ్ఞానమును పరోక్షముగా మనుషులకు
చెప్పుటకు ఏర్పాటు చేసుకొన్నాడు. ఒకమారు సృష్ట్యాదిలో ఆకాశవాణి
ద్వారా జ్ఞానమును చెప్పడము జరిగినది. దేవుడు తన జ్ఞానమును
మనుషులకు మూడు విధములు బోధించాలనుకొన్నాడు. ఆ మూడు
విధానములలో ఒక విధానము ఆకాశవాణి ద్వారా చెప్పడము జరిగినది.
అదికాక ఇంకా రెండు విధానముల ప్రకారము దేవుడు మనిషికి తన
జ్ఞానమును తెలియజేయును. అందులో ఒకటి తెరచాటునుండి చెప్పడము,
రెండవది ప్రత్యక్షముగా కనిపించు ఒక ఆకారముతో చెప్పడము.
తెరచాటునుండి అనగా చెప్పువాడు కనిపించకయుండి చెప్పడముకాగా,
ప్రత్యక్షముగా తాను ధరించిన ఆకారము ద్వారా చెప్పించడము మూడవ
విధానముగాయున్నది. జరిగిపోయిన చరిత్రలో ఈ మూడు రకముల
బోధలు అయిపోయాయి.

దేవునికి రూపముండదు, అయినా దేవుడు రూపమును ధరించి
మారువేషములో వచ్చి తన జ్ఞానమును తానే చెప్పును. మారువేషములో
వచ్చిన వానిని ఎవరూ గుర్తుపట్టలేరు, కావున మారువేషములో యున్నవానిని
దేవుడని చెప్పలేము. వాణిద్వారా జ్ఞానమును చెప్పినా అప్పుడు కూడా
దేవుడు జ్ఞానమును చెప్పాడని ఎవరూ కనుగొనలేరు. ఇకపోతే ఒక పేరు
గలిగిన వాడుగాయుండి, కనిపించక మాట్లాడు వ్యక్తితో జ్ఞానమును
చెప్పించినా, అది ఆ పద్ధతి ద్వారా దేవునినుండి చెప్పబడిందని ఎవరూ
అనుకోరు. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో మనుషులకు జ్ఞానము
తెలియకుండా పోయినప్పుడు నేనే వచ్చి జ్ఞానమును చెప్పెదనను దేవుని
మాట తెలిసింది. అంతిమ దైవగ్రంథమను ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు
దేవునిగా ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడక, పరోక్షమైన మూడు పద్ధతుల
ద్వారా తన జ్ఞానమును మనుషులకు తెలియజేయునని చెప్పబడియున్నది.
మాకు తెలిసిన చరిత్రలో ఆకాశవాణి ద్వారా ఒకమారు, కనిపించక తెర
వెనుకనుండి ఒకమారు చెప్పడము జరిగినది. కనిపించే మనిషిగాయుండి
తాను శరీరములేని దేవునిగా కాకుండా, కనిపించే శరీరమున్న
భగవంతునిగా మాట్లాడి జ్ఞానము చెప్పిన సందర్భములు ఎన్నోయున్నా,
వాటిని దేవుడే చెప్పాడని ఎవరూ గ్రహించలేకపోయారు. ఈ విధముగా
దేవుడు మూడు విధముల తన జ్ఞానమును భూమిమీద తెలియజేయు
చున్నాడు. జరిగిన చరిత్రలో దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లు తన జ్ఞానమును
తెలియజేశాడో ఎవరికీ తెలియకుండా పోయినదనియే చెప్పవచ్చును.
అందువలన ఎవడయినా తెలిసినవాడు “దేవుడు ఫలానా సమయములో,
ఫలానా చోట, ఫలానా ఆకారముతో తన జ్ఞానమును చెప్పాడు” అని
చెప్పినా ఆ మాటను మనిషి విశ్వసించలేక పోవుచున్నాడు.
ఎవరు విశ్వసించినా, ఎవరు విశ్వసించకపోయినా దేవుడు ఇప్పటికే
తన మూడు విధానముల ద్వారా జ్ఞానమును చెప్పడము జరిగినది. దేవుడు
తన అంతిమ దైవగ్రంథములో ప్రకటించినట్లు ఆకాశవాణి ద్వారా
ఒకమారు, కనిపించని వ్యక్తిగా మాట్లాడుచూ ఒకమారు, కనిపించే వ్యక్తిగా
అనేకమార్లు భూమిమీద జ్ఞానమును చెప్పడము జరిగినది. అయితే కనిపించే
వ్యక్తిగా వచ్చినా అతను సాధారణ మనిషికాదు, ప్రత్యేకమయిన మనిషి
అనీ, అతను మనిషిగాయున్న భగవంతుడనీ చెప్పవచ్చును. అందువలన
“ఏ మనిషి దేవుడుగా మాట్లాడలేడుగానీ, దేవుడు మనిషిగా
కనిపించి మాట్లాడును" అని చెప్పవచ్చును. అలా దేవుడు మనిషిగా
మాట్లాడి జ్ఞానమును చెప్పునప్పుడు, ఆ మనిషిని సాధారణ మనిషి అని
అనకూడదు. అసాధారణ మనిషి అయిన అతనిని భగవంతుడు అని
చెప్పవచ్చును. అయితే 'దేవుడు మనిషిగా వస్తాడు' అనుమాటను
ఒక్క హిందూమతములో తప్ప ఇస్లామ్ మతములోనూ, క్రైస్తవ
మతములోనూ ఎవరూ నమ్మడములేదు. దైవజ్ఞానము ఒకటే అయినా
మూడు మతముల వారికి మూడు విధములుగా అర్థమయినది. ఇక్కడ
కొందరికి ఒక ప్రశ్న రావచ్చును “దేవుడు చెప్పిన జ్ఞానము ఒకటే
అయినప్పుడు, ఒకేజాతి మనుషులకు మూడు విధములుగా ఎందుకు
అర్థమయినది? వారు మూడు మతములుగా ఎందుకు మారిపోయారు?”
అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఈ విధముగా కలదు.

మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడేయనుమాట
పూర్తి సత్యము. మానవజాతియంతయూ ఒకే అవయవములతో ఒకే
విధమైన శరీరముతో జీవించుచున్నది. తిండి, నిద్ర, మెలుకువ అను
ఒకే జీవన విధానము కల్గిన మానవజాతియంతయూ ఒకే విధమైన మనస్సు,
బుద్ధి, జీవము కల్గి బ్రతుకుచున్నవి. జీవన విధానములోనూ, లోపలి
అవయవములలోనూ, బయటి అవయవములలోనూ ఎటువంటి తేడాలేని
మనుషులు తమను తయారు చేసిన ఏకైక దేవుని విషయములో మాత్రము
పూర్తి తేడాకల్గి, మూడు భాగములుగా విడిపోయి, మూడువర్గములుగా
చెప్పుకొంటున్నారు. ఆ మూడు వర్గముల పేర్లే హిందూ, క్రైస్తవ, ఇస్లామ్
మతములని చెప్పబడుచున్నవి. దేవుడు ఒక్కడే, ఆయన సృష్ఠి ఒక్కటే.
సమస్త సృష్ఠి ఎన్నో భాగములుగా, ఎన్నో జీవరాసులుగా ఉండగా, అందులో
మానవులు మాత్రము తమను సృష్ఠించిన దేవుని విషయములో
విభేదించుకొని దేవున్ని మూడు రకములుగా చీల్చి వేరువేరుగా చెప్పు
కొనుచూ, మా దేవుడు పెద్దయని కొందరనగా, కాదు మా దేవుడే పెద్దయని
మరికొందరంటున్నారు. దేవుడు తనను మనిషి తెలియుటకు అవసరమైన
జ్ఞానమును ఒకమారు చెప్పితే అర్థము కాలేదని అదే జ్ఞానమునే తిరిగి
మూడుమార్లు, మూడు ప్రదేశములలో రెండు పద్ధతులలో చెప్పడము
జరిగినది. సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా చెప్పిన జ్ఞానమును తిరిగి
చెప్పుటకు ఒకమారు ద్వాపరయుగము చివరిలో అనగా కలియుగము
మొదటిలో, తర్వాత రెండవమారు కలియుగము మూడువేల సంవత్సరములు
(3000) గడచిన తర్వాత, మూడవమారు కలియుగము గడచిన 3600
సంవత్సరములప్పుడు చెప్పడము జరిగినది. మనకు తెలిసిన ఈ బోధలలో
మొదట సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా చెప్పగా, తర్వాత కలియుగము
మొదటిలో మనిషి అవతారములోనూ, కలియుగము 3000
సంవత్సరములు గడచిన తర్వాత కూడా మనిషి అవతారములోనే జ్ఞానమును
చెప్పడము జరిగినది. ఆ తర్వాత 3600 సంవత్సరములు కలియుగము
గడచిన తర్వాత అనగా దాదాపు 1400 సంవత్సరముల పూర్వము
తెరచాటునుండి కనిపించని వ్యక్తి ద్వారా జ్ఞానమును చెప్పడమైనది. ఈ
విధముగా సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమును దేవుడు మూడుమార్లు చెప్పగా,
అది అర్థముకాని ప్రజలు మూడు విధముల అర్థము చేసుకొని మూడు
వర్గములుగా చీలిపోయి, తమను తాము మూడు మతములుగా చెప్పు
కొంటున్నారు.

దేవుడు మూడుమార్లు చెప్పిన జ్ఞానము మూడు గ్రంథములుగా
వ్రాయబడియున్నది. మూడుమార్లు చెప్పిన జ్ఞానము ఒకటే అయినదాని
వలన, దేవుడు చెప్పిన జ్ఞానముగల గ్రంథమును “దైవగ్రంథము” అని
అంటున్నాము. దేవుడు సృష్ట్యాదిలో తన జ్ఞానమును చెప్పినప్పుడు అది
గ్రంథరూపము కాలేదు. తర్వాత మూడుమార్లు రెండు విధముల చెప్పిన
జ్ఞానము గ్రంథరూపములోనికి వచ్చినది. కలియుగము ఆదిలోనూ,
కలియుగము మూడవేల (3000) సంవత్సరములు గడచిన తర్వాత చెప్పిన
జ్ఞానము మానవ ఆకారముతో చెప్పబడిన జ్ఞానముకాగా, కలియుగము
మూడువేల ఆరువందల (3600) సంవత్సరములు గడచిన తర్వాత వచ్చిన
జ్ఞానమును కనిపించని తన పాలకుని ద్వారా దేవుడు చెప్పించాడు.
రెండుమార్లు మనిషివలెయుండి, మనిషికంటే వేరుగా భగవంతునిగాయుండి,
ప్రత్యక్షముగా కనిపిస్తూ ప్రజలకు తెలిసిన భాషలో చెప్పిన జ్ఞానము రెండు
గ్రంథముల రూపములో తయారయినది. సృష్ట్యాదిలో ఆకాశవాణిద్వారా
చెప్పిన జ్ఞానమునే ద్వాపరయుగములో చెప్పగా, అప్పుడు వెంటనే కొన్ని
దినములకే అది వేదవ్యాసుని ద్వారా భగవద్గీతయను గ్రంథరూపమయినది.
తర్వాత మూడువేల (3000) సంవత్సరములకు దేవుడు భగవంతుడను
రూపములో మొదట చెప్పిన జ్ఞానమునే కొంత మార్పుతో తిరిగి మనిషి
రూపములోనే చెప్పడము జరిగినది. కలియుగము మొదటిలో చెప్పిన
జ్ఞానము ఒక్కరోజు, ఒక్కమారు, ఒక్క సమయములో, ఒక్క సందర్భములో
చెప్పగా, మూడువేల (3000) సంవత్సరముల తర్వాత మనిషిరూపములోనే
చెప్పిన జ్ఞానము అనేక సందర్భములలో, అనేక సమయములలో, మూడు
సంవత్సరముల కాలము చెప్పడము జరిగినది. అప్పుడు చెప్పిన వ్యక్తి
చనిపోయిన తర్వాత (పూర్తి చనిపోక తాత్కాలిక మరణమును పొందిన
తర్వాత) ఆయన చెప్పిన జ్ఞానమును నలుగురు వ్యక్తులు గ్రంథముగా
వ్రాయడము జరిగినది. నలుగురు వ్యక్తులు నాలుగు సువార్తల రూపములో
వారివారి పేర్ల మీద వ్రాయడము జరిగినది. అవియే వరుసగా మత్తయి
సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తగా యున్నవి.
కలియుగము ప్రారంభము తర్వాత మూడువేల ఆరువందల (3600)
సంవత్సరములకు దేవుడు కనిపించని తన పాలకుని చేత, తన జ్ఞానమును
చెప్పించాడు. అప్పుడు చెప్పిన జ్ఞానము వరుసగా 23 సంవత్సరములు
అనేకమార్లు మక్కాలోను, మదీనాలోనూ చెప్పబడినది. అలా చెప్పబడిన
జ్ఞానము “ఖుర్ఆన్” అను పేరుగల గ్రంథముగా తయారయినది.

దేవుడు మూడు సమయములలో మూడుమార్లు చెప్పిన ఒకే
జ్ఞానము మూడు గ్రంథములుగా తయారగుట వలన మనిషి తన తెలివి
తక్కువతో మూడు గ్రంథములను వేరువేరు జ్ఞానములుగా అర్థము చేసుకొని,
ఆ మూడు గ్రంథముల ఆధారముతో మూడు మతములను ఏర్పరుచు
కోవడము జరిగినది. ఇప్పటికి 1400 సంవత్సరములప్పుడు అనగా
కలియుగము మొదలై 3600 సంవత్సరములు గడచినప్పుడు తయారయిన
ఖుర్ఆన్ గ్రంథమును “అంతిమ దైవగ్రంథము” అని చెప్పబడినది. దీనిని
బట్టి అంతకు ముందు రెండుమార్లు చెప్పిన జ్ఞానము యొక్క గ్రంథములను
ఒకటి ప్రథమ దైవగ్రంథమని, రెండవది మధ్య దైవగ్రంథమని చెప్పడము
జరిగినది. దీనిప్రకారము కలియుగము ఆదిలో ద్వాపరయుగ చివరిలో
చెప్పిన భగవద్గీతా గ్రంథమును ప్రథమ దైవగ్రంథమని, తర్వాత చెప్పిన
సువార్తల జ్ఞానమును (బైబిలు గ్రంథమును) మధ్య దైవగ్రంథమని చెప్పడము
జరుగుచున్నది. వేరువేరుగా చెప్పబడుచున్న మూడు దైవగ్రంథములలోనూ
ఒకే దైవ జ్ఞానముండుట వలన మూడింటినీ కలిపి “దైవగ్రంథము” అని
చెప్పవచ్చును. ఒకే దైవ గ్రంథము మూడు భాగములుగా దొరుకుచున్నది.
దేవున్ని, దేవుని జ్ఞానమును అర్థము చేసుకొన్న ఏ మనిషికయినా మూడు
గ్రంథములలో ఒకే దైవ జ్ఞానము కనిపించును. అట్లుకాకుండా మూడు
గ్రంథములు వేరువేరు మతములను, వేరువేరు దేవుళ్ళను బోధించాయను
వానికి ఆ గ్రంథములలో మూడు మతములు, ముగ్గురు దేవుళ్ళు
కనిపించడము జరుగుచున్నది. అటువంటివానికి ఎవడు ఏమి చెప్పినా
రుచించదు. తన మతము తనదే, తన దేవుడే దేవుడు అన్నట్లు, మిగతా
రెండు గ్రంథములు అసత్యములనీ, ఆ గ్రంథములలోని విషయములను
చెప్పువారు అజ్ఞానులని చెప్పుచుండును.

దేవుడు సర్వప్రపంచమునకూ సృష్టికర్తేకాక అన్ని సమయములలో
అందరికీ ఆయనే యజమానిగా కూడాయున్నాడు. ఆయనకు తెలియకుండా
సర్వ ప్రపంచములో ఏమీ జరుగుటకు వీలులేదు. అన్నీ దేవునికి తెలిసే
జరుగును. తనకు ఇష్టమున్న వారిని తనదగ్గరకు చేర్చుకొనుటకు, తనకు
ఇష్టము లేనివారిని తననుండి దూరము చేయుటకు దేవుడు తన గ్రంథము
లలో జ్ఞానమును చెప్పడమేకాక, తర్వాత అది గ్రంథరూపమైనప్పుడు కొంత
అజ్ఞానమును కూడా ఇరికించాడు. ఆ నేపథ్యములో ప్రథమ దైవగ్రంథములో
మొదట వ్యాసుని చేత కాకున్నా, తర్వాత కాలములో ఇతరుల చేత దేవుడు
చెప్పని జ్ఞానమును చేర్చడము జరిగినది. అదే విధముగా మధ్య దైవ
గ్రంథములోనూ, అంతిమ దైవగ్రంథములోనూ జరిగినది. అట్లు జరుగుట
సహజమే అనుటకు ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుకొందాము. ఒక
పొలములో ఒక రకమైన పంటను పెట్టామనుకొనుము. బహుశా జొన్న
పంటను పెట్టామనుకొందాము. పంట బాగా పండినప్పుడు పొలములో
జొన్నపైరుకు జొన్నకంకులు కాచియుండును కదా! అలా కాపుకు వచ్చిన
జొన్నకంకులలో కేవలము జొన్నలు మాత్రముండును. కంకులలో
రాళ్ళుకానీ, మన్నుకానీ ఏమాత్రము ఉండవు. స్వచ్ఛమైన పైరు మీద
తయారయిన కంకులలో ఏ కల్మషములేని గింజలు మాత్రముండును.
స్వచ్ఛమైన గింజలు మాత్రమున్న కంకులను పైరునుండి వేరుచేసి, కంకుల
నుండి గింజలు తీసుకొనుటకు కల్లములో వేసి, రాతిగుండును త్రిప్పి
కంకులు నలిగిపోయి వాటినుండి గింజలు రాలునట్లు చేయుదుము.
అయితే ఆ సందర్భములో కల్లములోని మన్ను, చిన్నచిన్న రాళ్ళు గింజలలో
కలిసి పోవును. మొదట పైరుమీద పండిన పంట మన్ను, రాళ్ళు
కాలుష్యము లేనిదై ఉండినా, కంకినుండి గింజలను తీసుకొనునప్పుడు
తప్పక అందులో మన్ను, రాళ్ళు కలిసిపోవు అవకాశమున్నది.

బాగా కాసిన కంకులనుండి గింజలను తీసుకొను సమయములో
ఏ విధముగా మన్ను, రాళ్ళ కాలుష్యము కలియునో, అదే విధముగా ఒక
గ్రంథములో బాగా చెప్పబడిన జ్ఞానమును మనుషులు గ్రహించు
సమయములో, అజ్ఞానము అను కాలుష్యము జ్ఞానములో కలిసిపోవు
అవకాశము గలదు. ఈ సమాచారములో పైరు దేవుడుకాగా, కంకి
గ్రంథముకాగా, కల్లము చేసి కంకినుండి గింజలు తీసుకోవడము మనిషి
గ్రంథమునుండి జ్ఞానమును గ్రహించుకోవడముకాగా, గింజలలో
రాళ్ళు చేరడము జ్ఞానములో అజ్ఞానము చేరడమని తెలియుచున్నది. ఇదే
విధముగా ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీతలో దేవుడు స్వచ్ఛమైన జ్ఞానమును
చెప్పియుండగా, దానిని గ్రంథములో చూచి అర్థము చేసుకొను
సమయములో ఒక భావము బదులు మరొక భావమును అర్థము
చేసుకొనుచూ, దేవుడిచ్చిన జ్ఞానమును అజ్ఞానముతో కలుపుకొని నిజమైన
దేవుని జ్ఞానమును మనిషి పొందలేకపోవుచున్నాడు. భగవద్గీతను వ్రాసిన
రచయితలే భగవద్గీతను సరిగా అర్థము చేసుకోలేక అజ్ఞానముతో కూడుకొన్న
వివరములను వ్రాశారు. కలియుగము మొదటిలో కృష్ణుడు అర్జునునికి
స్వచ్ఛమైన జ్ఞానమును అందించాడు. అర్జునుని ద్వారా కృష్ణుడు చెప్పిన
జ్ఞానమును తెలిసిన వ్యాసుడు అదే జ్ఞానమును వివరిస్తూ, దాదాపు ఐదు
వందల (500) శ్లోకముల రూపముతో వ్రాయగా, తర్వాత కాలములో
భగవద్గీతలో అజ్ఞానము కలియుట వలన రెండువందల (200) శ్లోకములు
ఎక్కువ వ్రాయబడి, చివరకు మొత్తము ఏడువందల (700) శ్లోకములుగా
భగవద్గీత తయారయినది.

మొదట కృష్ణుడు స్వచ్ఛమైన జ్ఞానమును ప్రథమ దైవగ్రంథముగా
భగవద్గీతను అందిస్తే, అది నేడు మనుషులవద్దకు చేరేటప్పటికి కొంత
అజ్ఞాన కాలుష్యముతో కూడుకొన్నదని చెప్పవచ్చును. ప్రథమ దైవగ్రంథము
లో కొంత అజ్ఞాన కాలుష్యము చేరిపోయి కృష్ణుడు చెప్పిన జ్ఞానమేదో
చాలామందికి తెలియకుండా పోయినది. భగవద్గీత తర్వాత వచ్చిన జ్ఞాన
గ్రంథము బైబిలు. మధ్య దైవగ్రంథమయిన బైబిలులో చెప్పిన జ్ఞానము
కొంత నాలుగు సువార్తల రూపములో ఉండగా, మిగతా 62 పాఠములుగా
యున్నదంతా ఏసు చెప్పిన నాలుగు సువార్తలకంటే వేరైనదనీ, ఏసు చెప్పినది
కాదని తెలిసిపోవుచున్నది.

చున్నది. దేవుని అంశ చేత వచ్చినవాడు ఏసుకాగా,
ఆయన తన జీవితమందు చివరి మూడు సంవత్సరములలో చెప్పినదే
నిజమైన జ్ఞానమని చెప్పవచ్చును. తర్వాత బైబిలును తయారుచేసిన వారు
నాలుగు సువార్తలకు ముందు 39, వెనుక 23 పాఠములను చేర్చి
(39+4+23=66) మొత్తము 66 పాఠములుగా వ్రాశారు. నాలుగు
సువార్తలు మినహాగల 62 పాఠములలో జ్ఞానముందో, అజ్ఞానముందో
మేము చెప్పలేముగానీ, అవన్నియూ ఏసు చెప్పిన జ్ఞానముకాదనీ,
మనుషులు చెప్పిన జ్ఞానమనీ చెప్పుచున్నాము. ఏసు మనిషే అయినా
ఆయన సాధారణ మనిషికాదు, ప్రత్యేకమయిన మనిషి. అందువలన
ఆయన చెప్పినదే నిజమైన జ్ఞానమని మేము చెప్పగలము. అరవై ఆరు
(66) పాఠములలో సువార్తలను పేరుతో నాలుగు పాఠములు మాత్రమే
గలవు. మిగతా అరవై రెండు (62) పాఠములు సువార్తలను పేరుతో
లేకుండుట గమనించవచ్చును. కేవలము నాలుగు సువార్తలుగాయున్న
కొంత జ్ఞానమునకు, అరవై రెండు (62) పాఠముల మనుషుల జ్ఞానము
చేరిపోవడముతో బైబిలులో ఏది దేవుని జ్ఞానమో, ఏది మనుషుల జ్ఞానమో
గుర్తించలేని పరిస్థితి ఏర్పడినది.

ఇకపోతే అంతిమ దైవగ్రంథములో దేవుడు అందించిన స్వచ్ఛమైన
దైవజ్ఞానము కలదు. దేవుడు తన పాలనలోయున్న జిబ్రయేల్ అనబడు
కనిపించని ఒక గ్రహశక్తి ద్వారా తన జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్త
గారికి చెప్పడము జరిగినది. ముహమ్మద్ ప్రవక్తగారు చదువురాని వాడయి
నందున, తాను ఒక్కడు మాత్రము వినిన దైవవాక్యములను తనవద్దకు
వచ్చిన తన అనుచరులకు చెప్పెడివాడు. ఖగోళమునుండి దిగివచ్చిన
జిబ్రయేల్ 23 సంవత్సరములపాటు తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాడు.
అలా చెప్పబడిన జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్త గ్రంథరూపములో చేయకనే
ఆయన అకస్మాత్తుగా ఆరోగ్యము క్షీణించి మరణించడము జరిగినది.
ముహమ్మద్ ప్రవక్తగారు చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన జ్ఞానమును
వినినవారు ప్రయత్నించి వారికి జ్ఞప్తికియున్న వాక్యములను ఆయత్ల

రూపములో వ్రాయడము జరిగినది. అలా వ్రాయడములో కొన్ని ప్రవక్తవారు
చెప్పని వాక్యములు కూడా వచ్చి చేరిపోయినవి. 23 సంవత్సరములక్రితం
నుండి వినుట వలన వారికి తెలియకనే కొన్ని వాక్యములను వ్రాయగా,
తెలిసి కూడా కొన్ని వాక్యములను వ్రాయడము జరిగినది. మహాజ్ఞాని
జిబ్రయేల్ కొన్ని వందల వాక్యములు మాత్రమే చెప్పియుండగా, చివరికి
ఖుర్ఆన్ గ్రంథము వేల వాక్యముల రూపములో తయారయినది. ప్రథమ
దైవగ్రంథములో, ద్వితీయ దైవగ్రంథములో అజ్ఞాన కాలుష్యము చేరినట్లే
అంతిమ దైవగ్రంథములో కూడా కొంత కాలుష్యము ఏర్పడినది. ఇది
అంతయూ దేవునికి తెలియకుండా ఏమాత్రము జరుగలేదు. పంట
గింజలలో రాళ్ళు, మన్ను కలిసినట్లు, దైవజ్ఞానములో కొంత అసంబద్ద
జ్ఞానము కలిసి పోయినది. అలా కలిసియున్న దానిని మనిషి ఏమాత్రము
గ్రహించలేక అంతా జ్ఞానమే అనుకోవడము వలన భగవద్గీతలోని జ్ఞానము
హిందువులకు పూర్తి అర్థము కాలేదు. బైబిలులోని వాక్యముల పరిస్థితి
అలాగే తయారయినది. అందువలన బైబిలులో ఏసు చెప్పిన వాక్యములను
మనిషి పూర్తిగా గ్రహించలేకపోయాడు. అందువలన బైబిలులో గల నాలుగు
సువార్తల రుచి ఎవరికీ తెలియకుండా పోయినది. ఈ విధముగా చెప్పుతూ
పోతే ఏ పంట పండినా తర్వాత శుభ్రముగా పండినది పండినట్లే ఇంటికి
ఏ విధముగా రాదో, అదే విధముగా దేవుడు చెప్పిన ఏ జ్ఞానమూ,
చెప్పినది చెప్పినట్లు మనుషులకు చేరలేదు. చివరకు ప్రతి దైవగ్రంథము
కొంత అజ్ఞానమును కలుపుకొని మనుషులవద్దకు వచ్చియున్నది.

గ్రంథములో కొంత అజ్ఞానమున్నా ఎంతో కొంత దేవుడు చెప్పిన
జ్ఞానము కూడా ఉన్నది. తన గ్రంథములో కొంత జ్ఞానము, కొంత
అజ్ఞానమును ఉంచిన దేవుడు తనకు ఇష్టములేని వారికి అందులోని

అజ్ఞానమే జ్ఞానముగా కనిపించునట్లు చేసి, అసలయిన జ్ఞానమును
అజ్ఞానముగా కనిపించునట్లు చేయును. ఈ విధానము ప్రకారము భగవద్గీత
లోని జ్ఞానము కూడా అజ్ఞానముగా చాలామందికి అర్థమగుట వలన
భగవద్గీత తీసుకొన్నా అందులోని జ్ఞానమును మనుషులు గ్రహించలేక
పోవుచున్నారు. ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీతలోని కొన్ని శ్లోకములకు
నేటివరకు అసలయిన అర్థమూ, నిజమైన జ్ఞానమూ తెలియదు. ఒక్కరోజు
కొన్ని నిమిషములు మాత్రము చెప్పిన భగవద్గీత జ్ఞానములోనే ఎంతో
అజ్ఞానము చేరియుండగా, మూడు సంవత్సరములు చెప్పిన బైబిలులో,
ఇరవైమూడు సంవత్సరములు చెప్పిన ఖుర్ఆన్ జ్ఞానములో ఎంత
అజ్ఞానము చేరియుంటుందో అంచనా వేయవచ్చును. ఈ విధముగా
ప్రతి మతములోనూ జ్ఞానముతో పాటు అజ్ఞానము కూడాయున్నది. అయితే
జ్ఞానమేదో, అజ్ఞానమేదో గుర్తించలేని మనిషి మూడు దైవ గ్రంథములలోని
దైవజ్ఞానమును గుర్తించ లేకపోవుచున్నాడు.

సమస్త మానవాళికీ, సమస్తమునకూ పెద్ద అయిన దేవుడు చెప్పిన
జ్ఞానము ఒక్కటేయని, దేవుడు చెప్పిన జ్ఞానమును మూడు మతములుగా
విభజించుకొని భగవద్గీతా గ్రంథము హిందువులదనీ, బైబిలు గ్రంథము
క్రైస్తవులదనీ, ఖుర్ఆన్ ముస్లీమ్లదనీ చెప్పుకొంటున్నారు. అయితే మూడు
గ్రంథములలో "సమస్త జనులారా!” అని దేవుడు సంబోధించి
చెప్పాడుగానీ, మతము పేరుపెట్టి ఏ గ్రంథములో కూడా చెప్పలేదు. దేవుడు
పెట్టని మతము పేరును, దేవుడు చెప్పని మతము పేరును మనిషి
చెప్పుకొనుచూ, నేను హిందువును, నేను క్రైస్తవుడను, నేను ముస్లీము
అని అనుకొంటున్నాడు. వాస్తవానికి ఈ మూడు మతముల పేర్లు, మనిషి
సృష్ఠించుకొన్నవే గానీ దేవుడు చెప్పినవి కావు. దేవుడు చెప్పిన ఏదో ఒక
దైవగ్రంథమును ఆశ్రయించిన మనుషులు ఆ గ్రంథము తమ మత
గ్రంథమని చెప్పుకొంటున్నారు. హిందువులు భగవద్గీతను తమ మత
గ్రంథముగా చెప్పుకోవడమేకాక ఇతర రెండు గ్రంథములను ద్వేషించు
చున్నారు. అక్కడే మతద్వేషములు పుట్టుచున్నవి. అలాగే క్రైస్తవుడు
బైబిలును తమ మత గ్రంథముగా చెప్పుకొనుచూ మిగతా రెండు
గ్రంథములను ద్వేషించు చున్నాడు. దానితో మిగతా రెండు మతముల
మీద అసూయ భావము ఏర్పడుచున్నది. ఇకపోతే అంతిమ దైవగ్రంథము
తమదేయని చెప్పుకొను వారు కూడా మిగతా రెండు గ్రంథములు తమవి
కాదనుకొంటున్నారు. అప్పుడు తమ గ్రంథము మీదనే దృష్టిని పెట్టి
మిగతా దైవగ్రంథములో చెప్పిన విషయముల మీద అవగాహన లేక
అవన్నియూ తప్పని తమకు తెలిసినదే సత్యమని అంటున్నారు.
దైవగ్రంథము అంటే ఒకే అర్థముతో కూడుకొనియున్నదనీ, దైవగ్రంథము
ఎన్ని భాగములుగా చెప్పుకొనినా అది ఒకే సారాంశముకలదని తెలియక
పోవడము వలన దానిని వేరువేరు గ్రంథములుగా అనుకోవడము
జరుగుచున్నది. ఈ విషయమును ధృవీ కరించుటకు అంతిమ దైవగ్రంథము
ఖుర్ఆన్అ సూరా 6, ఆయత్ 91లో (6-91) “దైవగ్రంథమును
వేరువేరు కాగితములుగా (గ్రంథములుగా) విభజించి చూపు
తున్నారు" అని కూడా చెప్పడమైనది.

సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే దేవుడు మనిషివలెయున్న శ్రీకృష్ణుని
ద్వారా అర్జునునకు చెప్పడము జరిగినది. ఈ మాటను ధృవీకరించుటకు
భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున ఒకటి, రెండు, మూడు
శ్లోకములలో ఈ విషయము కలదు చూడండి...

1) శ్లో॥ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్ |
వివస్వాన్ మనలే ప్రాహ మనురిక్ష్వాకలే బ్రవీత్ ॥
2) శ్లో॥ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్ష యో విదు: |
సకాలే నేహ మహతా యోగో నష్టః పరన్తప! ॥
3) శ్లో॥ స ఏవాయం మయాతేద్య యోగ: ప్రోక్తః పురాతనః ।
భక్తిసి మే సఖా చేత రహస్యం హ్యేత దుత్తమమ్
భావము :- అర్జునా! నాశనములేని ఈ యోగవిద్యను సూర్యునకు ఆదిలోనే
చెప్పియున్నాను. నేను చెప్పిన దానిని సూర్యుడు మనువునకు చెప్పి
యున్నాడు. మనువు ఇక్ష్వాకుడు అను రాజుకు చెప్పాడు. ఈ విధముగా
ఈ జ్ఞానము రాజులకు, ఋషులకు పరంపరగా తెలిసిపోయినది. అయితే
నేడు ఆ యోగము యొక్క జ్ఞానము తెలియకుండా పోయినది. మొదట
చెప్పిన జ్ఞానము అతి రహస్యమైనది, ఉత్తమమైనది, పురాతనమైనది,
అందరికీ చెప్పరానిది. అటువంటి గొప్ప జ్ఞానమును ఇప్పుడు నీకు తెలియ
జేసెదను వినుము.

ఈ మూడు శ్లోకములను చూచిన తర్వాత సృష్ట్యాదిలో ఆకాశ
వాణి ద్వారా చెప్పిన జ్ఞానమును మొదటి దైవ గ్రంథముగా శ్రీకృష్ణుడు
అర్జునునకు చెప్పాడని తెలియుచున్నది. రహస్యమైనది, పురాతనమైనది,
ఉత్తమమైనది, అందరికీ తెలియజేయరానిది అని మొదట జ్ఞానము యొక్క
శ్రేష్ఠతను మూడవ శ్లోకమున చెప్పడము జరిగినది. అటువంటి గొప్ప
జ్ఞానమును ప్రథమ దైవగ్రంథముగా చెప్పిన తర్వాత అదే జ్ఞానమునే
మిగతా రెండు దేశములలో, రెండు వేరువేరు కాలములందు మధ్య, అంతిమ
దైవగ్రంథములుగా చెప్పడము జరిగినది. అయితే గ్రంథములు వేరువేరుగా
యున్నా, అందులో చెప్పబడిన జ్ఞాన సారాంశము అంతయూ ఒక్కటేయని
తెలియవలెను. అయితే చాలామందికి ముఖ్యముగా ముస్లీమ్లకు ఒక
ప్రశ్న గలదు. అది ఏమనగా! భగవద్గీతను చెప్పినవాడు కృష్ణుడు కదా!
కృష్ణుడు ఒక మనిషి కదా! దేవుడు తెలియజేసిన జ్ఞానమును నేను
సృష్ట్యాదిలోనే సూర్యునకు చెప్పియున్నానని, మనిషియైన కృష్ణుడు చెప్పడము
తప్పుకాదా!యని అడుగవచ్చును. ఇంకా “ఏ మానవమాత్రుని మీద
దైవ సందేశమును నేను అవతరింప చేయలేదని” అంతిమ
దైవగ్రంథములో సూరా 6-91 ఆయత్లో కూడా చెప్పియున్నాడు.
అటువంటప్పుడు ఒక మనిషి చెప్పినది దైవజ్ఞానమగునా? అట్లు
దైవజ్ఞానమయితే అంతిమ దైవగ్రంథములో దేవుడు నేరుగా ఎవరితోనూ
మాట్లాడడు అని (42-51)లో చెప్పిన దేవునిమాట అసత్యమగును
కదా!యని అనుమానమును వ్యక్తము చేయవచ్చును. మేము జ్ఞానులము,
జ్ఞానమును బోధించు స్థోమత కల్గియున్నవారము అను కొందరు ముస్లీమ్లు
ఖుర్ఆన్ ఒక్కటే ఏకైక దైవగ్రంథము అంటున్నారు. బైబిలు, భగవద్గీత
రెండు మనుషులు చెప్పినవని ఖండించుచున్నారు.

మేము జ్ఞానులము అనువారు ప్రశ్నించడములో తప్పులేదుగానీ,
ప్రశ్నించేముందు ముందూ వెనుకా చూచి ఈ ప్రశ్నను ప్రశ్నించవచ్చునా
లేదా?యని యోచించి ప్రశ్నించడము మంచిది. ఏదో నోరు ఉంది
మాట్లాడినాము! కాళ్ళున్నాయి నడచినాము! అంటే నీవు నడచిన దారి
మంచిదా, కాదా!యని ముందే చూచుకోవలసిన అవసరమున్నది. అలాగే
మాట్లాడు మాట సక్రమమైనదో, కాదో! ముందే చూచుకొని మాట్లాడాలి.
ఈ ప్రశ్నకు జవాబును పరిశీలించి చూచితే, అంతిమ దైవగ్రంథము "అలీ
ఇమ్రాన్' అను మూడవ సూరాలో ఏడవ ఆయత్నందు (3-7) “దేవుని
సూక్ష్మ జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవమాత్రునికీ తెలియదని
చెప్పబడియున్నది." అంతేకాక సూరా 6, ఆయత్ 91లో (6-90) “ఏ
మానవుని మీద దైవజ్ఞానమును అవతరింపజేయలేదు” అని
ఉన్నది. దీనినిబట్టి దైవవాక్కు ప్రకారము ఒక మనిషి దైవ జ్ఞానమును
దైవగ్రంథముగా బోధించాడు అంటే అది నమ్మదగిన మాట కాదు, పూర్తి
అసత్యమని చెప్పవచ్చును. అంతిమ దైవగ్రంథములోనే సూరా 42, 51వ
ఆయత్నందు (42-5) “దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు"
అని కూడా ఉన్నది. దేవుడు మనిషికి జ్ఞానము చెప్పితే లేక తెలియజేస్తే
చెప్పువాడు దేవుడుకాని దేవుడనీ, మనిషికాని మనిషి అనీ తెలియుచున్నది.
మనుషులకు జ్ఞానము చెప్పాలంటే దేవుడు మనిషిగానేవుండి, మనిషి
భాషలోనే చెప్పవలసియున్నది. అందువలన చెప్పే మనిషి మనిషి కాదు,
అట్లని దేవుడూ కాదు. దేవునికి మనిషికి రెండిటికీ తప్పించి, ఇటు
మనిషీకాని అటు దేవుడూకాని వాడు చెప్పగలడని తెలియుచున్నది.
వివరముగా చెప్పుకొంటే దేవుడు మనిషి శరీరమును ధరించి తన
జ్ఞానమును చెప్పవలసియున్నది. మరొక విధముగా చెప్పితే మనిషి
దేవుని అంశ కలిగి జ్ఞానమును చెప్పవలసియున్నది. అందువలన
దైవగ్రంథమును మనుషులకు బోధించిన వాడు మనిషిగాయుండుట వలన,
అతనిని నేరుగా దేవుడు అనలేము. అట్లే మనిషి దైవగ్రంథమును బోధించితే,
ఏ మనిషీ చెప్పలేడు కావున వానిని మనిషి అనీ అనలేము.

ప్రథమ దైవగ్రంథమును బోధించిన కృష్ణుడు కనిపించే మనిషే,
అలాగే ద్వితీయ (మధ్య) దైవగ్రంథమును బోధించినవాడు కనిపించే మనిషే
అయివున్నాడు. అయితే రెండుమార్లు దైవగ్రంథమును బోధించిన ఇద్దరు
మనుషులు అందరివలె మనుషులుకాదు. మనిషి అనువానికి కొన్ని
నియమములున్నాయి. ఇక్కడ దైవగ్రంథము భగవద్గీతను, బైబిలును
బోధించిన ఇరువురూ మనుషులే అయినా, వారు మనిషికున్న ధర్మములలో
లేరు. ఒక మనిషిని పైకి చూస్తే అతను సాధారణముగా కనిపించును.
అతనికి లోపలున్న నియమములు లేక ధర్మములు ఏవీ కనిపించవు. అలాగే
భగవద్గీతను బోధించినవాడు పైకి కనిపించు సాధారణ మనిషే, అలాగే
భగవద్గీతను వినిన అర్జునుడు సర్వసాధారణ మనిషే. పైకి చూస్తే దైవ
గ్రంథమును బోధించినవాడు, దైవగ్రంథమును వినినవాడు ఇద్దరూ ఒకే
రకమైన మనుషులుగా, ఒకే రకమైన ఇంద్రియములుగల వారిగా, ఒకే
రకమైన ఆకలిదప్పులు కలవారిగా కనిపించుదురు. అటువంటప్పుడు
అందరూ వారి ఇరువురుని సాధారణ మనుషులవలె లెక్కించుదురు. అయితే
దైవగ్రంథమును బోధించినవాడు మనిషి అయినా, అతని శరీరములోపల
ఉన్న విధానము వేరని తెలియుచున్నది. శరీరము లోపలి విధానమును
గురించి అంతిమ దైవగ్రంథములో లేదు. ప్రథమ దైవగ్రంథములో శరీరము
యొక్క లోపలి విధానమును గురించిన జ్ఞానము సంపూర్ణముగాయున్నది.
అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 5, ఆయత్ 68లో (5-68)
“తౌరాతు, ఇంజీలు (భగవద్గీత, బైబిలు) మరియు మీ ప్రభువునుండి
వచ్చిన ఖుర్ఆన్ గ్రంథము యొక్క జ్ఞానమును మీ జీవితములలో
నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే" అని కలదు.

ఖుర్ఆన్లోని ఈ మాట ప్రకారము ఏ మతస్థుడయినా మూడు
మత గ్రంథములుగా చెప్పబడు ప్రథమ, మధ్యమ, అంతిమ దైవగ్రంథముల
లోని జ్ఞానమును తప్పనిసరిగా తెలిసియుండవలెను. అట్లుకాకుండా మా
మతగ్రంథమును మాత్రము మేము చదివామని అనువారు ఎంత గొప్ప
జ్ఞానులుగా చలామణి అయినా వారు సంపూర్ణ జ్ఞానులు కాజాలరు.
అటువంటివారు ఏ ధర్మములో లేనట్లేయని ఖుర్ఆన్ (5-68)
వాక్యముగాయున్న దానినిబట్టి భగవద్గీతను మాత్రము చదివి మిగతా
రెండు గ్రంథములు చదవనివారు హిందూధర్మములో లేనట్లే, అలాగే
బైబిలు మాత్రము చదివిన క్రైస్తవుడు క్రైస్తవుడు కానట్లే, ఖుర్ఆన్ గ్రంథమును
మాత్రము చదివి మిగతా రెండు దైవగ్రంథములను చదవని వారు ముస్లీమ్
కానట్లే, ఇది నేను స్వయముగా చెప్పుమాట కాదు. అంతిమ దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్ (సూరా 5, ఆయత్ 68లో) ఉన్న చట్టము
ప్రకారము చెప్పునది. భౌతిక శరీరములో ఉన్నవాడు సాధారణ జీవాత్మనా
లేక అసాధారణ పరమాత్మనా అని తెలియుటకు శరీర అంతర్భాగ
యంత్రాంగమును తెల్పిన ప్రథమ దైవగ్రంథమును చదివి తీరవలసిందే.
నేను ముస్లీమ్ను మా ఖుర్ఆన్ తప్ప ఇతరుల గ్రంథమయిన భగవద్గీతను
చదవనను వాడు 5 సూరాలో 68వ ఆయత్లో చెప్పినట్లు వాడు ఏ
మత ధర్మములో కూడా లేనట్లే లెక్కించబడును. అటువంటివాడు శరీర
జ్ఞానము తెలియనివాడు నిజమైన జ్ఞానికాదని ఒక తత్త్వవేత్త తన పద్యములో
ఇలా చెప్పాడు.

పంచ తత్త్వములను పంచీకరించక
మంచి యతుల మన్న మాటలన్న,
కుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన చందంబు
అఖిల జీవసంగ ఆత్మలింగా!
ఈ పద్యము ప్రకారము శరీరము గురించి, దాని నిర్మాణమును
గురించి తెలియనివాడు నేను జ్ఞానిని అంటే, ఏనుగు గంపక్రింద గ్రుడ్డు
పెట్టిందనుట ఎంత సత్యమో, వాడు జ్ఞాని అనుమాట కూడా అంతే
సత్యమగును. ఏనుగు గంపక్రింద గ్రుడ్డుపెట్టడము అసత్యమే, శరీర
అంతర్భాగమును గురించి, దాని నిర్మాణమును గురించి తెలియని వానిని
జ్ఞాని అనుట కూడా అసత్యమే. దీనినిబట్టి పంచతత్త్వములయిన ఆకాశము,
గాలి, అగ్ని, నీరు, భూమి వలన తయారయిన శరీరమును గురించి దాని
అంతర్భాగముల పనిని గురించి తెలియనివాడు ఎప్పటికీ జ్ఞానికాలేడు.
శరీర నిర్మాణ జ్ఞానము ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో మాత్రము
కలదు. మిగతా రెండు గ్రంథములలో ఆ విషయము లేదు. అంతిమ
దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో సూక్ష్మము (ముతషాబిహాత్) అను
పేరు కలదుగానీ, శరీరములోని సూక్ష్మమును గురించి చెప్పలేదు.
అందువలన ముస్లీమ్లకు ముతషాబిహాత్ వాక్యముల గురించి, శరీరము
లోని సూక్ష్మజ్ఞానము గురించి వారికి ఏమాత్రము తెలియదు. మనిషికి
అవసరమైన సూక్ష్మజ్ఞానమును దేవుడు సూక్ష్మవాక్యములలో అంతిమ
దైవగ్రంథమందు తెలియజేసినా, వాటి భావమును ముస్లీమ్లు తెలియలేక
పోయారు. ముస్లీమ్లకే తెలియనప్పుడు దానిని చదవని మిగతా మతస్థులకు
కూడా అక్కడ చెప్పిన సూక్ష్మజ్ఞానము తెలియదు.

మధ్యమ, అంతిమ దైవగ్రంథములలో లేని కొన్ని జ్ఞాన
విషయములు ప్రథమ దైవగ్రంథములో ఉండుట వలన అన్ని మతముల
వారికీ, అందరికీ ఆమోదయోగ్యమైనది భగవద్గీతయని ఖుర్ఆన్ గ్రంథములో
సూరా 5, ఆయత్ 44లో చెప్పడము జరిగినది. (5-44) “మేము తౌరాతు
గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి
ఉన్నాయి. ఈ తౌరాత్ గ్రంథము ఆధారముతోనే ముస్లిమ్న
ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను
పరిష్కరించే వారు” అని కలదు. అందువలన ఏ మతస్థుడయినా
మిగతా రెండు గ్రంథములు చదివియున్నా తప్పనిసరిగా తౌరాతు
గ్రంథమును చదువవలసియున్నది. తౌరాత్ గ్రంథములో సూక్ష్మజ్ఞానము
సంపూర్ణముగాయుండుట వలన అందరూ చదువవలెనని ఖుర్ఆన్
గ్రంథములో సూరా 62, ఆయత్ 5 లో ఇలా చెప్పారు. (62-5) “తౌరాతు
గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించినప్పటికీ దానికి
అనుగుణముగా ఆచరించనివారు, ఎన్ని గ్రంథములను
అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథములు వీపు మీద
మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును.
దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్టాంతము చాలా
చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లా సన్మార్గము చూపడు."
ఇదంతా చెప్పుటకు కారణమేమంటే మనిషికి కావలసిన సూక్ష్మ
జ్ఞానమంతయూ 'తౌరాతు అనబడు “భగవద్గీత” గ్రంథములో ఉన్నది.
కావున భగవద్గీతను ప్రతి మతస్థుడు చదువవలెనని ఖుర్ఆన్ గ్రంథము
చెప్పుచున్నది, మేము కూడా చెప్పుచున్నాము.

భగవద్గీతలో భౌతిక, అభౌతిక విషయ జ్ఞానమంతయూ ఉండుట
వలన భగవద్గీత ప్రకారము దేవుడు మనిషిగా రావచ్చును కానీ, మనిషి
దేవుడుగా చెప్పబడడు. దీనినిబట్టి ఏ మనిషి మీద దైవజ్ఞానమును దేవుడు
అవతరింప చేయలేదు. దేవుని జ్ఞానమును దేవుడే మనిషిగా వచ్చి చెప్ప
వలసిందేయని తెలియుచున్నది. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు మనిషి
గానే కనిపించును కనుక అతనిని దేవుడని ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ
ఒక మనిషి ఎవరయినా నేనే దేవుడనని చెప్పుకొనినా, అతని లోపలి
విషయము తెలియదు కాబట్టి, అతనిని దేవుడు కాదు అని చెప్పుటకు
కూడా ఆధారముండదు. అటువంటి పరిస్థితిలో మనిషిగా వచ్చిన దేవున్ని
గుర్తించలేక నమ్మకపోవడము, దేవుడుకాని మనిషిని దేవుడని నమ్మడము
అను పొరపాట్లు జరుగవచ్చును. అంతేకాక భగవద్గీతను, బైబిలును చెప్పిన
మనుషులు దేవుని అంశకలవారైనా, వారిని దైవాంశవరులుగా గుర్తించక
సామాన్య మనుషుల క్రిందికి జమకట్టు అవకాశము కలదు. సూక్ష్మజ్ఞానము
తెలియనివారు దేవుడు మనిషిగా రాడు అని వాదించు అవకాశము కూడా
కలదు. అందువలన ఈ సంశయములన్నీ తీరుటకు దైవగ్రంథములను
బోధించిన మనిషి దేవుడా! కాదా! యని తెలియుటకు, మనిషి శరీరములోని
మర్మమును ప్రథమ దైవగ్రంథ ఆధారముతో తెలియవలసిందే.

శరీరము ఎట్లు తయారగుచున్నదీ, శరీరము ఎన్ని భాగములుగా
యున్నదీ, శరీరములో ఎన్ని స్థూల భాగములున్నదీ, ఎన్ని సూక్ష్మ భాగములు
న్నదీ, శరీరము నడుపు యజమాని ఎవరు? శరీరములో జీవుడు ఏమి
చేయుచున్నాడు? శరీరములో దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?
ఎట్లున్నాడు? అను సమస్త విషయములను శరీరమును క్షేత్రముగా చెప్పిన
భగవద్గీతా గ్రంథములోనే చూచి తెలియవలెను. భగవద్గీతలో సాంఖ్య
యోగము, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, పురుషోత్తమప్రాప్తి యోగము
అను మొదలగు అధ్యాయములను చూచిన శరీరాంతర్గత జ్ఞానము
తెలియును. తౌరాతు (భగవద్గీత) గ్రంథము ప్రకారము సాధారణ మనిషి
శరీరము పంచభూతములనబడు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి

పంచభూతముల పంచీకరణ చిత్రమును 36 పేజిలో చూడండి.

అను ఐదు భాగములచేత తయారు చేయబడినది. ఈ ఐదు భాగములు
శరీరములో స్థూలముగా కనిపించుచున్నవి. ఈ ఐదు భాగములనే
పద్యములో పంచతత్త్వములు అని అన్నారు. పంచభూతములయిన ఐదు
ప్రకృతి భాగములను ఒక్కొక్క దానిని ఐదు భాగములుగా దేవుడు విభజించి
మొత్తము 25 భాగములను చేశాడు. ఈ 25 భాగములను ఒకదానితో
మరొక దానిని కలుపగా 25 శరీర భాగములు ఏర్పడినవి. ఒక శరీరము
మొత్తము 25 భాగములుగా, 25 పేర్లుగల ప్రకృతి సంబంధ భాగములుగా
యున్నవని తెలియుచున్నది. దేవుడు ప్రతి శరీరమును ప్రకృతితో తయారు
చేశాడు. అయితే ఆ 25 భాగములలో పది (10) భాగములు మాత్రము
కంటికి కనిపించు స్థూలశరీరముగాయున్నవి. మిగతా పదిహేను (15)
భాగములు కంటికి కనిపించని సూక్ష్మశరీరముగాయున్నవి. జీవాత్మ
ప్రకృతితో కలిసియున్న ఆత్మగా శరీరములో బంధింపబడియున్నది, కావున
జీవుడు కనిపించని పదిహేను శరీర సూక్ష్మభాగములలో ఒక భాగముగా
యున్నాడు.

శరీరములోని స్థూలభాగములు వరుసగా ఇలా కలవు. 1) కాళ్ళు
2) చేతులు 3) నోరు 4) గుదము 5) గుహ్యము (లింగము) అనునవి
కర్మేంద్రియములనబడును. 1) కన్ను 2) చెవి 3) ముక్కు 4) నాలుక
5) చర్మము అను ఐదు జ్ఞానేంద్రియములనబడుచున్నవి. కర్మేంద్రియములు
ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు మొత్తము పది భాగములు కనిపించు స్థూల
శరీరముగా చెప్పబడుచున్నది. కనిపించు స్థూలశరీరము లోపల కనిపించని
సూక్ష్మశరీరము ఇమిడియున్నది. సూక్ష్మశరీరము ఐదు వాయువులుగా,
ఐదు తన్మాత్రలుగా (జ్ఞానేంద్రియ శక్తులుగా) ఐదు అంత:కరణములుగా
యున్నది. సూక్ష్మశరీరమును విడదీసి వివరముగా చెప్పితే కనిపించని

ఐదు వాయువులు వరుసగా వ్యానవాయువు, ఉదానవాయువు, సమాన
వాయువు, ప్రాణవాయువు, అపానవాయువుగా ఉన్నవి. ఐదు ఇంద్రియ
శక్తులను చెప్పితే వరుసగా చూపు, వినికిడి, వాసన (ఘ్రాణశక్తి), రుచి,
స్పర్శగా యున్నవి. ఐదు అంత:కరణములను గురించి చెప్పితే వరుసగా
మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, జీవుడు అనునవిగా గలవు. ఇందులో
జీవుడు ఆత్మ సంబంధమైనవాడు అయినా ప్రకృతితో కలిసి జీవాత్మగా
బంధింపబడిన ఆత్మగా శరీరములో ఉన్నాడు. ఈ విధముగా తయారయిన
మానవ శరీరము ఎలా బ్రతకాలి, ఎలా చావాలి, ఎలా కష్ట సుఖములు
అనుభవించాలి, ఎప్పుడు ఏది తినాలి, ఎప్పుడు ఏది చేయాలి అను దానికి
కారణముగా కర్మయుండును. కర్మను పాలించుచూ జీవున్ని ఆడించుటకు
శరీరములో శరీరమునకు అధిపతిగా ఆత్మయున్నది. శరీరములో ఆడబడే
జీవాత్మ, ఆడించే ఆత్మ యుండగా, శరీరమందు రెండు ఆత్మలను గమనించు
సాక్షిగా దేవుడు కూడా యున్నాడు. ఇదే విషయమునే అంతిమ
దైవగ్రంథమయిన ఖుర్ఆన్ సూరా 50, ఆయత్ 21 లో ఇలా అన్నారు.

(50-2) “ప్రతి ప్రాణి ఒక తోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చే వాడితో
సహా వస్తుంది".
(50-21) “ప్రతి వ్యక్తి తనవెంట తనను తీసుకవచ్చేవాడొకడు,
సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు."

ఖుర్ఆన్లోని ఈ వాక్యములో మూడు ఆత్మల విషయము తెలియ
జేయబడినది. ప్రతి ప్రాణి ఒక జీవాత్మకాగా, ప్రతి జీవున్ని నడిపే ఆత్మను
తోలేవాడు అని చెప్పారు. జీవాత్మను, ఆత్మను గమనించుతూ శరీరములోనే
యున్న పరమాత్మను లేక దేవున్ని సాక్షిగా ఉండేవాడు అని చెప్పారు. ఈ

మూడు ఆత్మలు ప్రతి సజీవ శరీరములోనూ ఉన్నవి. ఒక సాధారణ
వ్యక్తిలో వానితో సహా మిగతా తోలే ఆత్మ, చూచే ఆత్మ రెండు గలవు. ఈ
విధముగా ఒక శరీరములో మూడు ఆత్మలువుండి శరీరము యొక్క
జీవనమును కొనసాగించుచున్నారు. ఒక మనిషి తన జీవితములో జ్ఞానిగా
యున్నా, అజ్ఞానిగాయున్నా, పండితునిగాయున్నా, పామరునిగాయున్నా,
ముస్లీన్గాయున్నా, హిందువుగాయున్నా అతని శరీరములో ఉండే
విధానము అంతేనని, ఆ శరీరము మూడు ఆత్మల చేత నడుపబడుచున్నదనీ,
ఆ మూడు ఆత్మలే తోలబడేవాడు, తోలేవాడు, చూచే వాడు అని ముగ్గురుగా
చెప్పబడుచున్నవని తెలియవలెను. శరీరము లోపల ఈ విధానమున్నవాడు
సర్వసాధారణ మనిషియని తెలియవలెను. ఇదే విషయమునే ప్రథమ
దైవగ్రంథములో పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయములో 16,17
శ్లోకములయందు మూడు ఆత్మలను ముగ్గురు పురుషులుగా చెప్పుచూ
క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని అన్నారు. ఖుర్ఆన్లో చెప్పబడినట్లు
తోలబడే జీవుడు క్షరపురుషుడనీ, తోలే ఆత్మ అక్షర పురుషుడనీ, సాక్షిగా
చూచేవాడు పురుషోత్తముడని భగవద్గీతలో ఐదువేల సంవత్సరముల
పూర్వమే చెప్పబడినది. తర్వాత 3600 సంవత్సరములకు వచ్చిన అంతిమ
దైవగ్రంథములోనూ, 3000 సంవత్సరములకు వచ్చిన మధ్యమ దైవ
గ్రంథములోనూ మూడు ఆత్మల విషయము వ్రాయబడియున్నట్లు ఆయా
గ్రంథ వాక్యములలో తెలియబడుచున్నది.

ఎప్పుడు దేవుడు భూమిమీద మనుషులకు తన జ్ఞానమును
చెప్పవలసిన అవసరమున్నదో, అప్పుడు దేవుడు భూమిమీద అవతరిస్తాడు.
దేవుడు ప్రత్యక్షముగా లేక నేరుగా ఎవరితోనూ మాట్లాడడు. అందువలన
దేవుడు దేవుడుగా కాక మనిషివలె అవతరించి, మనుషుల మధ్యలోయుండి


తన జ్ఞానమును తానే చెప్పవలసియున్నది. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు
ఆ శరీరములోని యంత్రాంగమంతయూ సాధారణ మనిషిలో ఉన్నట్లు
ఉండదు. అందువలన అలా వచ్చిన వానిని సాధారణ మనిషి అనుటకు
వీలులేదు. దేవుడు అసాధారణ మనిషిగా భూమిమీదకు వస్తున్నాడు.
సాధారణ మనిషిలో 24 శరీర భాగములు ఉంటూ అందులో క్షర, అక్షర,
పురుషోత్తమ మూడు ఆత్మలు గలవు. దేవుడు జ్ఞానమును చెప్పు నిమిత్తము
మనిషిగావచ్చి పుడితే, ఆ శరీరము పంచభూతముల చేత తయారయిన
24 శరీర భాగములతో యుండినా, అందరి శరీరములలో యున్నట్లు
మూడు ఆత్మలు ఉండవు. దేవుడు మనిషిగావస్తే ఖుర్ఆన్లో చెప్పినట్లు
“తోలేవాడు, తోలబడేవాడు, చూచేవాడు” అను ముగ్గురు లేరు.
దేవుడు మనిషిగా వస్తే ఆ శరీరమును 'భగవంతుడు' అను ప్రత్యేకమైన
పేరుతో పిలుస్తాము. భగవంతుడు అనగా భగమునుండి (స్త్రీ గర్భమునుండి)
పుట్టినవాడు అని అర్థము. స్త్రీ గర్భమునుండి ఒక్క దేవుడు తప్ప
ప్రపంచములో ఎవరూ పుట్టరు. ఈ మాట క్రొత్త విషయమైనా నూటికి
నూరుపాళ్ళు సత్యము. ఈ విషయమును సంపూర్ణముగా తెలియాలంటే
మా రచనలలోని “జనన మరణ సిద్ధాంతము” అను గ్రంథములో
చూడండి. దేవుడు మనిషిగా వచ్చిన శరీరములో మొదటికి తోలబడేవాడు
అనబడు జీవుడు ఉండడు. తర్వాత రెండవవాడయిన తోలే ఆత్మయుండడు.
అనుభవించే జీవుడుగానీ, అనుభవింపచేసే ఆత్మకానీ భగవంతుని
శరీరములో ఉండరు. ఆ శరీరములో దేవుడు ఒక్కడేయుండును.
భగవంతుని శరీరములో జీవాత్మ, ఆత్మ లేరను విషయము చూచేవారికి
ఎవరికీ తెలియదు. శరీరములో మూడు ఆత్మలు లేవని, ఉన్నది ఒకే
పరమాత్మయని హరి, హర, బ్రహ్మాదులు కూడా గుర్తించుటకు వీలులేదు.

దేవుడు మనిషిగా వస్తే, ఆయన ధరించిన శరీరములో ఒకే ఒక
పరమాత్మ (దేవుడు) మాత్రమే ఉండును. ఇక్కడొక ప్రశ్న రాగలదు. అదే
మనగా! దేవుడు క్రియారహితుడు కదా! ఏ పనిని, ఏ కార్యమును
చేయనివాడు దేవుడు అయితే, దేవుడు జన్మించి జ్ఞానమును ఎలా చెప్పును?
సర్వసాధారణ మనిషివలె అన్ని కార్యములను ఎలా చేయును? అని అడుగ
వచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు. దేవుడు మనిషిగా
వస్తే ఆయనను ఎవరూ గుర్తించనట్లు అందరివలెయుంటూ, అన్ని
కార్యములు చేస్తూ, అన్ని అనుభవములను అనుభవిస్తూ, అవసర
మొచ్చినప్పుడు జ్ఞానమును కూడా చెప్పును. అలా అన్ని కార్యములు
చేయుట వలన ఆయనను ఎవరూ గుర్తించలేకపోవుచున్నారు. ఇక్కడ
మరొక ప్రశ్న కొందరికి వచ్చి ఇలా అడుగవచ్చును. “సాధారణ మనిషి
శరీరములో జీవాత్మను ఆడించే ఆత్మయుండుట వలన ఆత్మవలన పనులు
జరుగుచున్నవి. దేవుడు ధరించిన శరీరములో దేవుడు తప్ప ఆత్మ లేనందున
కార్యములన్నీ ఎలా జరుగుచున్నవి? దేవుడు పని చేయనివాడు అయితే
జరిగే పనులను దేవుడు అవతరించిన శరీరములో ఎవరు చేస్తున్నారు?"
అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు చూడండి.
పరమాత్మ మనిషిగా అవతరించిన శరీరములో దేవుడు తప్ప మిగతా రెండు
ఆత్మలు లేవనుట సత్యమే. అయితే దేవుడు ధరించిన శరీరములో కూడా
సాధారణ మనిషి శరీరములో జరిగినట్లే పనులన్నీ జరుగుచున్నవను మాట
కూడా సత్యమే. అసలు విషయము ఏమంటే దేవుడు మనిషిగా వచ్చిన
శరీరములో దేవుడు దేవునిగానే ఉండక దేవుడు ఆత్మగా మారిపోయి,
అవసరమొచ్చినప్పుడు జీవాత్మగా కష్టసుఖములను అనుభవించుచున్నాడు.
అవసరమొచ్చినప్పుడు ఆత్మగా అన్ని పనులు శరీరముతో చేయించు
చున్నాడు. అవసరమొచ్చినప్పుడు రెండవ ఆత్మగా రహస్య జ్ఞానమును
చెప్పుచున్నాడు. ఇంకా అరుదుగా పరమాత్మగా కూడా ప్రకృతినే శాసించు
చున్నాడు.

ఉదాహరణకు ప్రథమ దైవగ్రంథమును చెప్పినప్పుడు దాదాపు
5000 సంవత్సరముల పూర్వము దేవుడు మానవ శరీరము ధరించి
రావడము జరిగినది. భగవంతునిగా వచ్చిన ఆ శరీరమునకు 'శ్రీకృష్ణుడు'
అని పేరుపెట్టడడము జరిగినది. కృష్ణుని శరీరములో పరమాత్మ తప్ప
జీవాత్మ, ఆత్మలు రెండూ లేవు. అయితే జీవాత్మ, ఆత్మ చేయవలసిన
పనులన్నీ భగవంతుడు తన శరీరము ద్వారా చేయవలసియున్నది. అలా
చేసినప్పుడే దేవుని అవతారమును ఎవరూ గుర్తించలేరు. అందువలన
సర్వసాధారణ మనిషిలో జరుగునట్లు అన్ని పనులు భగవంతుని శరీరములో
జరుగుటకు, ఆ శరీరములోని దేవుడు దేవునిగా ఉండక ఆత్మగా మారిపోయి,
ఇటు జీవాత్మగా పనులు చేయుచూ, అటు ఆత్మగా పనులు చేయిస్తూ
యున్నాడు. అటువంటి గుర్తుపట్టని జీవితమును దేవుడు భూమిమీద
గడుపుచున్నాడు. అలా ఎవరూ గుర్తించనట్లు ఉంటూ సమయ
మొచ్చినప్పుడు తాను చెప్పవలసిన జ్ఞానమును చెప్పును. అయితే దేవుడు
ఆత్మగా ఉండడము అసత్యమని ఎవరయినా అనుటకు అవకాశమున్నది.
అంతేకాక దేవుడు ఈ విధముగా శరీరములో ఉంటాడు అనుటకు
ఆధారమున్నదా? శాస్త్ర బద్ధతయున్నదా? ఎక్కడయినా దేవుడు చెప్పాడా?
అని కొందరు అడుగవచ్చును. ఈ విషయము ఇప్పుడు మేము తప్పు
ఎవరూ చెప్పియుండలేదు. దేవుడు కూడా దీనిని ఎక్కడా ప్రస్తావించలేదు.
అందువలన ఈ విషయమునకు ముందుగల ఆధారమును చూపలేముగానీ,
మేము చెప్పు మాట సత్యమనుటకు ఒక ఆధారముగలదు. పునర్జన్మల
విషయములు కూడా ఇతరులు చెప్పితే వినవలసిందేగానీ అది సత్యమో!
అసత్యమో! అను అనుమానము మనుషులకుండేది. అటువంటి
అనుమానము లేకుండా పునర్జన్మల విషయము సత్యము అనునట్లు
చనిపోయి పుట్టిన కొందరికి చిన్నవయస్సులోనే వెనుక జన్మల విషయములు
జ్ఞాపకము రావడము వలన, వచ్చిన జ్ఞాపకములను విచారించితే సత్యమని
తేలుట వలన, పునర్జన్మలు నిజమని తెలిసినది. అలాగే ఇంతవరకూ
ప్రస్తావనకు రాని దేవుని జన్మ విషయములు ఇప్పుడు క్రొత్తగా వినుటవలన
చాలామందికి ఈ విషయముల మీద అనుమానముండవచ్చును. “దేవుడు
అవతరించును” అని భగవద్గీత లోనూ, ఖుర్ఆన్ గ్రంథములోనూ ప్రత్యక్ష
వాక్యములుండినా హిందువులు నమ్మీనమ్మకయుండగా, ముస్లీమ్లు పూర్తి
నమ్మకుండాయున్నారు. అంతిమ దైవగ్రంథములో 89వ సూరా,
21, 22 ఆయత్లలో, 15వ సూరా 29, 30 వాక్యములలోనూ
'దేవుడు అవతరిస్తాడు' అని ప్రత్యక్షముగా చెప్పియున్నా ముస్లీమ్లు
మొండిగా మేము నమ్మము అనీ, దేవుడు అవతరించడు అని అంటున్నారు.
అటువంటి సమయములో దేవుడు అవతరించినప్పుడు ఆయన ధరించిన
శరీరములో ఇట్లేయుండునని చెప్పడములో మేమే మొదట చెప్పాము. అలా
చెప్పడము కూడా పెద్ద సాహసమే అయినా మా మాట ఎప్పటికీ సత్యమే
కనుక మేము వెనుతిరిగి చూడకుండా చెప్పాము. మా మాట సత్యము
అనుటకు ఒకే ఒక ఆధారము కలదు.

నాకు తెలిసి ప్రథమ దైవగ్రంథములోని జ్ఞానమును చెప్పినప్పుడు,
మధ్యమ దైవగ్రంథములోని జ్ఞానమును చెప్పినప్పుడు, దేవుడు మనిషివలె
యుండి జ్ఞానమును అప్పటి ప్రజలకు చెప్పడము జరిగినది. అప్పుడు
పైకి మనిషివలె చెప్పినవారు కనిపించారుగానీ, వారి శరీరము లోపల
ఏమి జరుగుచున్నది, ఎట్లున్నది బయటి ప్రజలకు తెలియదు. అయితే
అప్పుడు వారి శరీరములో ఎట్లున్నదీ, ఏమి జరిగినది ప్రత్యక్షముగా మాకు
తెలుసు. అందువలన పరమాత్మ రెండవ ఆత్మగా మారి శరీరమును
నడపడమేకాక, జీవుడుగా ఉంటూ ఆ శరీరములోని కష్టసుఖములను
అనుభవించాడని చెప్పుచున్నాము. దేవుడు ధరించిన శరీరములో
దేవుడయిన పరమాత్మ తప్ప మిగతా రెండు ఆత్మలు లేవనీ, ఒక పరమాత్మ
మాత్రమే ఆత్మగాయుంటూ, జీవాత్మగా నటించుచూ కాలము గడిపినదని
గట్టిగా చెప్పుచున్నాము. ఆ శరీరములో యున్నది పరమాత్మేనని చెప్పు
మా మాట సత్యమని చెప్పుటకు, మా మాట భవిష్యత్తులోగానీ,
వర్తమానములోగానీ అసత్యము కాకుండుటకు, భూతకాలములో
(గడచిపోయిన కాలములో) తగిన సాక్ష్యమును ఆధారముగా ఉంచాడు.
అటువంటి ఆధారము ఏమి అనగా! ప్రథమ దైవగ్రంథమైన తౌరాతు
గ్రంథమును (భగవద్గీత గ్రంథమును) చెప్పిన కృష్ణుడు సర్వ సాధారణ
మనిషిగా, అల్లరి చిల్లరిగా తిరుగు మనిషిగా కనిపించినా, ఆయన
శరీరములోయున్నది ఒకే ఒక పరమాత్మయని మేము గ్రహించగలిగాము.
కృష్ణుని శరీరములోయున్న పరమాత్మ ఆత్మగావుంటూ, ఆ శరీరములో
అన్ని కార్యములకు కర్త అయినది. కొన్ని పనులయందు కర్మను
అనుభవించు జీవాత్మగా కూడాయున్నది. ఈ రెండు కార్యములను దేవుడు
స్వయముగా చేయకున్నా, దేవుడు దేవుడుగానే ఉంటూనే ఆత్మగా మారి
ఆత్మ కార్యములను, జీవుడుగా మారి జీవుని కార్యములను చేసినది. మిగతా
అన్ని శరీరములలో జరుగునట్లే జీవాత్మ ఏడ్వగా, ఆత్మ ఏడ్పించుచున్నది.
జీవాత్మ కార్యములను ఆచరించగా, ఆత్మ ఆచరింపజేయుచున్నది. ఇది


అన్ని శరీరములలో సర్వసాధారణముగా జరుగునదే కనుక ఈ కార్యము
లతో శరీరమును ధరించిన కృష్ణుడు దేవుడని ఎవరూ గుర్తించలేరు. కృష్ణుడు
ఆత్మగా దేవుని జ్ఞానమును 90 సంవత్సరముల వయస్సులో యుద్ధరంగ
మందు చెప్పినా, దానివలన కృష్ణుడు ఫలానా దేవుడుయని గుర్తుపట్టుటకు
వీలులేదు. కృష్ణుడు మానవుడే, మానవ శరీరము ధరించినవాడేయగుట
వలన ప్రపంచ పనులు చేసినా, దేవుని జ్ఞానమును చెప్పినా, ఆయనను
దేవుడని ఎవరూ గుర్తించలేకపోయారు.


సర్వసృష్ఠిలో దేవుని తర్వాత దేవుడంతటిది ప్రకృతియే. ప్రకృతి
దేవుని ఆధీనములోయుండి దేవున్ని అనుసరించి నడుచుచుండును. ప్రకృతి
దేవునిమాటను తప్ప ఎవరి మాటనూ వినదు. ఎవరిమాటనూ లెక్క
చేయదు. దేవుడు దేవునిగాయున్నా, దేవుడు మనిషి శరీరములో ఆత్మగా
నటించు చున్నా ప్రకృతి దేవున్ని గుర్తించగలదు. దేవుడు మనిషి
శరీరములో యున్నప్పుడు నేను ఫలానా సమయములో, ఫలానా
శరీరమును ధరించి యున్నానని తెలుపు నిమిత్తము, అందరూ
తెలియు నిమిత్తము దేవుడు మానవ శరీరములోయుండియే
ప్రకృతిని శాసించును. అప్పుడు ఆ మాటను ప్రకృతి విని, ఆ
మాటప్రకారము నడుచుకొనును. అలా ఎప్పుడు జరుగుచున్నదో, ఏ
శరీరమునుండి జరుగుచున్నదో, ఆ శరీరములో ప్రకృతికి భర్త అయిన
దేవుడున్నాడని తెలివున్నవారు గ్రహించవచ్చును. భార్య భర్తమాట వినడము
సహజమే కావున తన భర్త ఎక్కడ, ఎట్లున్నా, ఏ శరీరములోయున్నా
ప్రకృతి గుర్తించి ఆయన మాట వినగలదు. దేవుడు మనిషి శరీరములో
యుండి జ్ఞానము చెప్పుననుటకు తార్కాణముగా ఇటువంటి సంఘటనలు
భూమిమీద జరుగును. అందువలన కృష్ణుడు ధరించిన శరీరములో
నున్న పరమాత్మ (దేవుడు) కురుక్షేత్ర యుద్ధరంగములో మధ్యాహ్న
సమయమును సాయంకాల సమయముగా మార్చివేశాడు. కొంత
సమయము సాయంకాలముగాయున్న తర్వాత తిరిగి మధ్యాహ్నముగా
మారునట్లు ప్రకృతిని శాసించగా ప్రకృతి అలాగే నడుచుకొన్నది.
కురుక్షేత్ర యుద్ధరంగమున సైంధవుడు అనునతనిని చంపుటకు అలా
చేయవలసి వచ్చినది. సైంధవ వధ' అను ఘట్టములో కృష్ణుడు
ప్రకృతిని శాసించిన విషయము గలదు.

ప్రకృతి ఒక్క పరమాత్మ మాటతప్ప ఎవరిమాటా వినదు. ఎప్పుడు
ఎక్కడ ప్రకృతి మనిషిమాట వినగలుగుచున్నదో, అప్పుడు అక్కడ
మనిషి ఆకారములో దేవుడున్నాడని గుర్తుపట్టవచ్చును. ఈ
ఒక్క ఆధారము తప్ప దేవున్ని మనుషులు గుర్తుపట్టుటకు
అవకాశమే లేదు. కృష్ణుడు మనిషిగా యున్న భగవంతుడయినా, ఆయన
తన శరీరమునుండి 90 సంవత్సరముల వయస్సులో ప్రకృతిని శాసించాడు.
అంటే కృష్ణుడు ఎవరయినది కృష్ణుని వయస్సు 90 సంవత్సరములు
గడచువరకు ఎవరూ గుర్తించుటకు వీలులేదు. 90 సంవత్సరముల
వయస్సులో కృష్ణుడు ధరించిన శరీరము నుండి దేవుడు ప్రకృతిని
శాసించగా, ప్రకృతి మనిషిగాయున్న దేవుని మాట వినగలిగింది. ప్రకృతి
ఒక్క దేవుని మాట మాత్రము వినగలదు. ప్రకృతిని దేవుడు తప్ప ఎవరూ
శాసించలేరు. అందువలన ఏ మనిషి ప్రకృతిని శాసించగలిగాడో
ఆ మనిషిని దేవుడుగా గుర్తించవచ్చును. ఆ మనిషినుండే దేవుని

జ్ఞానము చెప్పబడును. ఆ మనిషినే దేవుని అవతారమని చెప్పవచ్చును.
దేవుడు ఆ మనిషిగా అవతరించాడని చెప్ప వచ్చును. కృష్ణుడుగా వచ్చిన
మనిషిలోయున్న దేవుడు తన జ్ఞానమును భగవద్గీత రూపములో చెప్పాడు.
సృష్ట్యాదిలో ఈ జ్ఞానమునే సూర్యునకు చెప్పానని చెప్పాడు. ఇన్ని
ఆధారములను చూచిన తర్వాత మనిషి శరీరములో దేవుడు వచ్చునను
సత్యము తెలిసినది. అంతేకాక మనిషి శరీరములో పరమాత్మ పరమాత్మగా
కాకుండా, ఆత్మగావుంటూ శరీర యంత్రాంగమును ఎవరూ గుర్తించనట్లు
నడుపుచున్నా, ఏదో ఒక వయస్సులో తాను శరీరమును ధరించి మనిషిగా
వచ్చానని తెలుపు సూచనను చూపిపోవును. అలా ప్రకృతిని శాసించిన
విషయమును అప్పుడు చూచిగానీ, తర్వాత తెలిసిగానీ ఇతను సాధారణ
మనిషికాదని, భగవంతునిగా వచ్చిన దేవుడని గ్రహించలేనివాడు
బుద్ధిహీనుడని చెప్పవచ్చును.

అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో సూరా 6, ఆయత్ 91
(6-90)లో “ఏ మానవునిమీద దైవసందేశమును అవతరింప
జేయలేదు” అని చెప్పబడియున్నది. ఒకవేళ ఎక్కడయిన దైవసందేశము
మానవుని ద్వారా తెలిస్తే ఆ మానవుడు సాధారణ మనిషికాదని, సాధారణ
మనిషి అయితే అతని ద్వారా దైవజ్ఞానము వచ్చేదికాదని తెలియవచ్చును.
అందువలన ప్రథమ దైవ (తౌరాతు) గ్రంథమును చెప్పిన మనిషి సాధారణ
మనిషికాదు. అసాధారణ మనిషి అయిన భగవంతుడని చెప్పవచ్చును.
దీనిప్రకారము మధ్య దైవగ్రంథమయిన ఇంజీలు (బైబిలు) గ్రంథమును
చెప్పిన మనిషి కూడా సాధారణ మనిషికాదు, అతను కూడా దేవుని అంశతో
వచ్చినవాడని చెప్పవచ్చును. కృష్ణుని జీవితములో 90 సంవత్సరములకు
ప్రకృతిని శాసించడము జరిగినది. కావున బయటికి కనిపించు
ఆధారముతో కృష్ణుడు దేవుని అవతారమని చెప్పుటకు వీలున్నది. అయితే
మధ్య దైవగ్రంథమయిన బైబిలును చెప్పినవాడు మనిషే. అయితే అతను
దేవుడనుటకు ఏదయినా ప్రత్యక్ష ఆధారము కలదా! యని కొందరు
ప్రశ్నించవచ్చును. దానికి మా వద్దనుండి సమాధానము ఈ విధముగా
కలదు. ప్రత్యక్ష ప్రమాణమంటే ప్రకృతిని శాసించినప్పుడే అది ప్రత్యక్ష
ఆధారముగా నిలువగలదు. ఏసు జీవితములో కూడా ప్రకృతిని శాసించిన
సంఘటన ఒకటి జరిగినది. అందువలన కృష్ణుడు పుట్టిన మూడువేల
(3000) సంవత్సరములకు తిరిగి దేవుడు మనిషి అవతారములో వచ్చాడని
చెప్పవచ్చును. ఏసుకు దాదాపు వయస్సు 32 సంవత్సరములున్నప్పుడు
ఒక దినము ఆయన, ఆయన శిష్యులు కలిసి సముద్రములో ప్రయాణము
చేయుచున్నప్పుడు, భయంకరమైన తుఫాను వచ్చి వారి పడవను
ముంచివేయు పరిస్థితి ఏర్పడినప్పుడు, పడవలోయున్న ఏసు శిష్యులందరూ
తమకు చావు తప్పదని భయపడిపోయారు. ఆ సమయములో ఏసు
పడవలోని గూడులో నిద్రించుచుండెను. ఆయన శిష్యులు భయపడి వారి
గురువైన ఏసును లేపారు.

పడవలో నిద్రించుచున్న ఏసు లేచి చూడగా, భయంకరమైన
తుఫాను తమను చుట్టుముట్టినదని తెలిసింది. ఈ విషయము బైబిలు
గ్రంథములోని మత్తయి సువార్తలో 8వ అధ్యాయమున 23వ
వచనము నుండి 27వ వచనము వరకు ఇలా గలదు. 23)
ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి.
24) అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె
అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా!
25) వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా! నశించిపోవుచున్నాము
మమ్ములను రక్షించుమని ఆయనను లేపిరి. (26) అందుకు
ఆయన అల్పవిశ్వాసులారా! ఎందుకు భయపడుచున్నారని వారితో
చెప్పి, లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ
మాయెను. (27) ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో!
ఈయనకు గాలియు, సముద్రమును లోబడుచున్నవని చెప్పు
కొనిరి. ఇదే విషయము లూకా సువార్త 8వ అధ్యాయమున
22వ వచనమునుండి 25వ వచనము వరకు ఇలా కలదు
చూడండి. (22) మరియొక నాడు ఆయన తన శిష్యులతో
కూడా ఒక దోనెను ఎక్కి సరస్సు అద్దరికి పోవుదమని వారికి
చెప్పగా, వారు ఆ దోనెను త్రోస్ బయలుదేరిరి. (23) వారు వెళు
చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు
మీదికి వచ్చి దోనె నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన
స్థితిలో ఉండిరి. (24) కనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా!
ప్రభువా! నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన
లేచి గాలిని, నీటిపొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళ
మాయెను. (25) అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ? అని వారితో
అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలిని, నీళ్ళను
ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే! ఈయన ఎవరోయని
యొకనితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.

ఇక్కడ ప్రకృతిలోని భాగమయిన గాలిని, నీరును ఏసు అణిగి
పొమ్మని గద్దింపగా ప్రకృతిలోని ఆ రెండు ఒక్కమారు అణిగి పోవడము
జరిగినది. ఆనాడు ఆయన శిష్యులు దానిని చూచి ఆశ్చర్యపడి ఈయన
మాటకు ప్రకృతి లొంగిపోవుచున్నది. ఈయన ఎవరయి వుండవచ్చునని
అనుకొన్నారుగానీ, ఆయన దేవుని అవతారమని అప్పుడు వారు గుర్తించ
లేకపోయారు. దగ్గరగాయున్న వారు గుర్తించలేకపోయినా, ప్రకృతిని
శాసించు శక్తి ఒక్క దేవునికి తప్ప ఎవరికీ ఉండదను సూత్రముతో, ఏసు
దేవుని అవతారమేయని నేను చెప్పుచున్నాను. మహాభారతములో సైంధవుని
వధ జరిగినప్పుడు ఆకాశములో సూర్యున్ని లేకుండా చేసి చీకటిగా
మార్చిన కృష్ణుడు కూడా దేవుని అవతారమేయని గట్టిగా చెప్పుచున్నాము.
వారు మనుషులే అయినా వారి శరీరములో ఉన్నది దేవుడే అయినందున,
అందరిలోవలె జీవుడు, ఆత్మ లేనందువలన వారు మానవ మాత్రులు
కాదని చెప్పుచున్నాము. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకున్నా దేవుని
జ్ఞానము మనుషులమీద అవతరించదు. దేవుని జ్ఞానమును దేవుడే చెప్ప
వలసియున్నది. అందువలన దేవుడు మనుషులకు జ్ఞానమును చెప్పుటకు
మనిషివలె రావలసియున్నది. మనిషిగా వచ్చినవాడు మనుషులు మాట్లాడు
భాషలోనే జ్ఞానమును చెప్పవలసియున్నది. అందువలన ఐదువేల
సంవత్సరముల పూర్వము భారతదేశములో కృష్ణుడు రూపముగా వచ్చిన
దేవుడు అక్కడి హిందీ భాషలోనే ప్రథమ దైవగ్రంథమును చెప్పాడు. తర్వాత
కాలములో మూడువేల సంవత్సరములకు ఇజ్రాయెల్ దేశములో మనిషి
రూపముతో వచ్చిన ఏసు అక్కడి భాష అయిన హెబ్రీ భాషలోనే జ్ఞానమును
చెప్పిపోయాడు. ఈ విధముగా రెండుమార్లు మానవ అవతారములో
వచ్చిన దేవున్ని అప్పుడు గుర్తించలేక పోవడమేకాక అజ్ఞానముతో ఇప్పటకీ
కూడా వచ్చిన వారు దేవుని అవతారమని నమ్మలేకపోవుచున్నాము.

ప్రథమ దైవగ్రంథము వచ్చిన తర్వాత మూడువేల ఆరువందల
సంవత్సరములకు అంతిమ దైవగ్రంథము వచ్చినది. అయితే ఈ మారు
దైవజ్ఞానమును ఒక మనిషి చెప్పక, ఖగోళమునుండి దిగివచ్చిన మహాజ్ఞాని
అయిన జిబ్రయేల్ అను దేవుని పాలకుడు చెప్పాడు. దేవుని పాలనలో
యుండి దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసియున్న జిబ్రయేల్ తనకు
తెలిసిన దైవజ్ఞానమును భూమిమీదగల ముహమ్మద్ ప్రవక్తగారికి అప్పుడు
కొంత, అప్పుడు కొంత తెలియజేయడము జరిగినది. ఆ విధముగా ఆ
ప్రాంత భాష అయిన అరబ్బీ భాషలోనే అంతిమ దైవగ్రంథములోని జ్ఞానము
నంతటినీ వినడము జరిగినది. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి
మొత్తము 23 సంవత్సరములు జ్ఞానమును చెప్పడము జరిగినది. అయితే
ఇక్కడ జ్ఞానమును చెప్పిన జిబ్రయేల్ మనిషే కాదు. ఆయన ఆకాశములో
సృష్ట్యాది నుండివున్న ఒక పెద్ద గ్రహశక్తి. జిబ్రయేల్ చెప్పగా వినిన
ప్రవక్తగారు మనిషే అయినా, ఆయన అందరివలె సాధారణ మనిషేగానీ
దేవుని అవతారము ఏమాత్రము కాదు. ఆయనలో ఏ ప్రత్యేకతలేదు.
ముహమ్మద్ ప్రవక్తగారు వినిన జ్ఞానమును ఆయన అనుచరులకు చెప్పగా
వారు ఆ విషయములను గ్రంథముగా వ్రాశారు.

అంతిమ దైవగ్రంథమును చెప్పినది జిబ్రయేల్ అయితే, విన్నది
ముహమ్మద్ ప్రవక్తగారు అయితే, ముహమ్మద్ ప్రవక్తగారు చెప్పగా వినిన
వారు దానిని గ్రంథముగా వ్రాశారు. ఈ విధముగా అంతిమ దైవగ్రంథము
తయారగుట వలన అందులో దేవుని అవతారము అనునది ఏమాత్రము
లేదు. యున్న దేవుని పాలకులలో ఒకరైన సూర్యుడు
భూమిమీద మనువు అను వ్యక్తికి దైవజ్ఞానమును చెప్పినట్లు, ఆకాశములోని
జిబ్రయేల్ అను గ్రహశక్తి భూమిమీద ప్రవక్తగారికి దైవజ్ఞానమును
చెప్పడము జరిగినది. ఈ విధముగా దేవుడు తాను స్వయముగా, నేరుగా
ఎవరితోనూ మాట్లాడక రెండుమార్లు తాను శరీరమును ధరించి ఆత్మగా
యుండి జ్ఞానమును చెప్పి గ్రంథరూపమగునట్లు చేశాడు. మూడవదయిన
అంతిమ దైవగ్రంథమును కనపడని తన సేవకుడయిన గ్రహశక్తి అయిన
జిబ్రయేల్ ద్వారా చెప్పించాడు. ఈ విధముగా మూడు దైవగ్రంథములు
భూమిమీదికి వచ్చాయి. దానితో అంతిమ దైవగ్రంథములో 42వ సూరా,
51వ ఆయత్లో చెప్పిన విధముగా ఒకటి వాణి ద్వారా, రెండు తన
దూతద్వారా, మూడు కనిపించక తెరచాటునయున్న గ్రహము ద్వారా తన
జ్ఞానమును భూమిమీద మనుషులకు తెలియజేయడము జరిగినది. తన
దూత ద్వారా అని చెప్పిన మాటలో తానే దూతగా, వార్తను తీసుకువచ్చే
వాడుగా నటించి శరీరమును ధరించి చెప్పడము జరిగినది. దేవుడు
మూడు పద్ధతుల ద్వారా తన జ్ఞానమును భూమిమీద సమస్త మానవులకు
వర్తించునట్లు తెలియజేశాడు. దేవుడు మొదట సృష్ఠి ఆదిలో ఆకాశవాణి
ద్వారా జ్ఞానమును తెలియజేశాడు. అలా తెలియజేసినప్పుడు తన
ప్రకృతిలోని ఒక భాగమైన ఆకాశమును వినియోగించుకొని ఆకాశము
నుండి జ్ఞానమును తెలియజేశాడు. ఈ విధముగా సృష్ట్యాదిలో ఆకాశము
నుండి సూర్యునికి చెప్పినప్పుడు దేవుడు తాను స్వయముగా శరీరమును
ధరించలేదు.

అంతిమ దైవగ్రంథములో 42వ సూరా, 51వ
ఆయత్లో చెప్పిన ప్రకారము “వహీ” ద్వారా తెలియజేయడము నెరవేరింది.
ఈ విషయమును పూర్తి వివరముగా వివరించుకొని తెలుసుకొంటే
ఈ విధముగా తెలియగలదు. వహీ అనగా ఆకాశములో పుట్టిన శబ్ధము
అని అర్ధము. ఆ శబ్ధము ఆకాశములో ఎలా పుట్టిందని ప్రశ్నించుకొని
చూస్తే ఇట్లు చెప్పవచ్చును. ప్రకృతి అనునది ఐదు మహాభూతముల
ద్వారా ఏర్పడినది. భూతము అనగా జీవశక్తియుండునది లేక జీవించి
యుండునదని అర్ధము. భూతము అంటే ఏదో దయ్యమనో, పిశాచియనో
అర్థము చేసుకోకూడదు. మహాభూతము అనగా గొప్పశక్తితో జీవించునదని
భావము. ఆకాశము ఒక భూతము అగుట వలన ఆకాశము ప్రపంచములో
ఎన్నో కార్యములను చేయవలసియున్నది. కార్యములు జరుగవలెనంటే
ఆకాశములో కార్యములను చేయించు ఆత్మకూడా ఉండాలి. జీవుడున్న
ప్రతి దానిని భూతము అంటున్నాము. ఆ లెక్క ప్రకారము మనుషులందరూ
భూతములే. ఒక మనిషిలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఏ విధముగా
ముగ్గురుయున్నారో అదే విధముగా మహా భూతమైన ఆకాశములో కూడా
మూడు ఆత్మలేవుండును. మనిషిలోయున్న జీవాత్మ కర్మకలిగి కష్ట
సుఖములను ఎక్కువగా అనుభవించుచుండును. అయితే మహా భూతము
లలోయున్న జీవాత్మ కర్మలేనిదై, కష్టసుఖములను అనుభవించనిదై, కేవలము
దేవుని కార్యములను మాత్రము చేయునదైయున్నది. జీవుడు ఎక్కడుండునో
అక్కడ తప్పనిసరిగా ఆత్మవుండి తీరవలసిందే. పద్ధతి ప్రకారము
ఆకాశభూతములో కూడా ఆత్మయుండి అవసరమైన దేవుని కార్యములను
చేయించుచున్నది. ఆత్మ సంపూర్ణముగా పరమాత్మను తెలిసినదైయుండుట
వలన దేవుని జ్ఞానమును ఎక్కడ చెప్పినా ఆత్మే చెప్పవలసియున్నది.
ఆత్మ తప్ప జీవాత్మ అనువాడు చెప్పుటకు వీలులేదు. ఏ విధముగా జీవుడు
దేవుని జ్ఞానమును చెప్పుటకు అర్హుడు కాదో, అదే విధముగా దేవుడు
స్వయముగా తన జ్ఞానమును చెప్పడు. ఎందుకనగా! దేవుడు కార్యరహితు
డను సూత్రము ప్రకారము ఏ కార్యములనూ చేయడు. జ్ఞానమును
ఇతరులకు చెప్పడము కూడా ఒక పనియే అగును. కావున తన జ్ఞానమును
చెప్పడము అను పనిని కూడా దేవుడు చేయడు. దేవుని జ్ఞానము చెప్పు
పని ఆత్మే చేయవలసియున్నది.
జీవుడు ఏ పనిని చేయలేని చేతగానివాడుగా శరీరములోవుంటే,
దేవుడు ఏ పనిని చేయకూడనివాడుగా, కార్యరహితుడుగా యున్నాడు.
జీవునికి దేవుని మధ్యయున్న ఆత్మమాత్రము ఇటు జీవుని పనినిగానీ, అటు
దేవుని పనినిగానీ చేయగల సామత్యముగలదై, చైతన్యవంతమైయున్నది.
అందువలన ఏ భూతములోనయినాగానీ, ఆకాశమునుండి భూమిమీద,
భూమి పొరలలో ఎక్కడున్న జీవరాశిలో అయినాగానీ ఆత్మే అన్ని చేయు
చున్నది. చేయవలసినది ప్రపంచ కార్యముగానీ, పరమాత్మ కార్యముగానీ
ఆత్మే చేయవలసియున్నది. ఇదంతయూ దేవుడు నిర్ణయించిన చట్టము.
ఆ దేవుని చట్టమును అనుసరించి ఆకాశభూతములో యున్న ఆత్మ, శబ్దము
ద్వారా ఆకాశములోని సూర్యునికి దైవజ్ఞానమును తెలియజేయడము
జరిగినది. ఈ విధముగా జరిగిన కార్యము అంతిమ దైవగ్రంథములో
దేవుడు మూడు విధముల జ్ఞానమును తెలియజేతును అను (42-51)
వాక్యములోని ఒకటవ మాట ప్రకారము ఆదిలోనే నెరవేరినది. దేవుడు
వాణి ద్వారా తెలియజేసినది నిజమే అయినా, అక్కడ ఆ కార్యమును పోషించి
చేసినది ఆత్మయని అందరూ తెలియవలెను. దేవుడు మూడు విధముల
జ్ఞానము తెలియజేయగా అందులో మొదట ఆత్మద్వారా వాణిరూపములో
తెలియజేశాడు. అప్పుడు దేవుడు అవతరించలేదు.

సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా దేవుని జ్ఞానము సూర్యునికి
చెప్పడము, తర్వాత సూర్యుని ద్వారా ఆకాశములోని మిగతా గ్రహములకు
మరియు భూమిమీద మనుషులకు తెలియడము జరిగినది. అలా మొదట
చెప్పబడిన జ్ఞానము చాలాకాలము గడచిపోగా, చివరకు మనుషులకు
తెలియని పరిస్థితి ఏర్పడి, అజ్ఞానముతో కూడుకొన్న అధర్మముల జ్ఞానమునే
జ్ఞానమని ప్రజలు ఆచరించుచున్న సమయములో, దేవుడు ప్రజలకు
ధర్మయుక్తమైన జ్ఞానమును చెప్పి, అధర్మములతో కూడుకొన్న జ్ఞానమును
లేకుండా చేయాలనుకొన్నాడు. ఆ ప్రయత్నములో దేవుడు స్వయముగా
మానవ శరీరమును ధరించి వచ్చి, శరీరములో ఆత్మగాయుండి, తన
జ్ఞానమును ఆత్మరూపముతో తెలియజేశాడు. అప్పుడు తెలియజేసిన
జ్ఞానము కొంతకాలమునకే గ్రంథరూపముగా మారినది. ద్వాపరయుగము
చివరిలో కలియుగము మొదటిలో దేవుడు మనిషిగావచ్చి కృష్ణుడను పేరు
కలిగి చెప్పిన జ్ఞానము వ్యాసుని ద్వారా ప్రథమ దైవగ్రంథమయినది.
అలా తయారయిన గ్రంథము పేరు “భగవద్గీత”యని చెప్పబడినది.
కృష్ణుడు ఆ కాలములో అక్కడి ప్రాంతీయ భాష అయిన హిందీ భాషలో
జ్ఞానమును చెప్పగా, వ్యాసుడు లిపిలేని సంస్కృత భాషలో హిందీలిపిలోనే
వ్రాశాడు. అలా వ్రాయబడిన భగవద్గీత నేటికినీ శ్లోకముల రూపములో
కలదు. కృష్ణుడు కొన్ని నిమిషములు మాత్రమే చెప్పిన జ్ఞానమును వ్యాసుడు
పూర్తి వివరిస్తూ అనేక శ్లోకముల రూపములో వ్రాశాడు. అప్పటి కవి
అయిన వ్యాసుడు దాదాపు ఐదువందల శ్లోకములను భగవద్గీతగా చెప్పగా,
తర్వాత కాలములో వ్యాసుడు చనిపోయిన తర్వాత ఇతరుల ద్వారా
మరికొన్ని శ్లోకములు చేర్చబడి, నేడు ఏడు వందల శ్లోకముల రూపములో
భగవద్గీత కనిపించుచున్నది.

ఈ విధముగా భగవద్గీతను దేవుడే మనిషిగా అవతరించి చెప్పగా,
అది నేడు భగవద్గీత రూపములోయున్నా, భూమిమీద చాలామందికి అదియే
ప్రథమ దైవగ్రంథమని తెలియదు. భగవద్గీత భారతదేశములో ఇప్పటికి
5153 సంవత్సరముల క్రిందట చెప్పబడినది. తర్వాత కలియుగము
మూడువేల సంవత్సరములకు పడమటి దేశమయిన ఇజ్రాయెల్ దేశములో
ఉన్న అజ్ఞానమునుబట్టి, అక్కడ దేవుడు ఉద్భవించి జ్ఞానమును చెప్పి
పోవడము జరిగినది. అక్కడ చెప్పిన జ్ఞానము కూడా బైబిలు గ్రంథముగా
వ్రాయబడినది. బైబిలు నేడు ప్రపంచములో అధిక సంఖ్యలో అనేక
భాషలలో అందరివద్దకూ చేరియున్నది. అయితే బైబిలు గ్రంథమే మధ్య
దైవగ్రంథమని క్రైస్తవులకు కూడా తెలియదు. భగవద్గీత ప్రథమ
దైవగ్రంథమనిగానీ, బైబిలు మధ్య దైవగ్రంథమనిగానీ భగవద్గీతను చదివిన
హిందువులకు, బైబిలును చదివిన క్రైస్తవులకు తెలియకుండా పోయినది.
బైబిలు గ్రంథమును చెప్పిన తర్వాత ఆరువందల సంవత్సరములకు అనగా
ఇప్పటికి 1400 సంవత్సరముల క్రిందట అరబ్ దేశములో ఖుర్ఆన్
గ్రంథము యొక్క జ్ఞానమును సూర్యగ్రహము వచ్చి భూమిమీద కృత
యుగము మొదటిలోనే చెప్పినట్లు, జిబ్రయేల్ అను గ్రహము భూమిమీదకు
వచ్చి కనిపించక తెరచాటునయుండినట్లుండి ముహమ్మద్ ప్రవక్తగారికి
చెప్పిపోవడము జరిగినది. సూర్యుడు మనువునకు చెప్పినట్లు జిబ్రయేల్
ముహమ్మద్ ప్రవక్తకు చెప్పడము జరిగినది. అయితే స్వయముగా దేవుడు
అవతరించి కృష్ణుడుగా భగవద్గీతను, ఏసుగా బైబిలు గ్రంథజ్ఞానమును
చెప్పడమైనది. ఖురాన్ గ్రంథమును చెప్పినప్పుడు దేవుడు అవతరించ
లేదు. ఆకాశములో సూర్యునివలెనున్న జిబ్రయేల్ గ్రహము అనబడు
గొప్ప జ్ఞాని భూమిమీదికి వచ్చి చెప్పడము జరిగినది. ఖుర్ఆన్ గ్రంథము
కంటే ముందు వచ్చిన రెండు గ్రంథములను జిబ్రయేల్ తన మాటలలో
'తౌరాతు', 'ఇంజీలు' అని చెప్పడము జరిగినది. అంతేకాక ఆ రెండు
గ్రంథములలో జ్ఞాన జ్యోతియున్నదని జిబ్రయేల్ చెప్పాడు. దేవుడు
స్వయముగా వచ్చి చెప్పిన జ్ఞానమని తెలిసిన మహాజ్ఞాని జిబ్రయేల్ చివరిలో
తాను చెప్పిన ఖుర్ఆన్ గ్రంథ జ్ఞానమునకు అంతిమ గ్రంథమని, దానిని
ప్రజలకు బోధించిన ప్రవక్త అంతిమ ప్రవక్తయని చెప్పడము జరిగినది.
అలా చెప్పుటకు కారణమేమనగా! ఇది అంతిమ గ్రంథమయినప్పుడు
భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమని, బైబిలును మధ్య దైవగ్రంథమని ప్రజలు
తెలుసుకోగలరని అలా చెప్పాడు.

ఖుర్ఆన్ గ్రంథములో 42వ సూరా, 51వ ఆయత్నందు (42-50)
“దేవుడు నేరుగా ఎరితోనూ మాట్లాడడు, అయితే దేవుడు తన
జ్ఞానమును మూడు విధములుగా మనుషులకు తెలుపును. ఒకటి
వహీ ద్వారా, రెండు తెర చాటునుండి, మూడు తన దూతద్వారా
అని చెప్పబడినది." ఇప్పటికి ఈ మూడు విధానముల ద్వారా దేవుడు
భూమిమీద మనుషులకు జ్ఞానమును తెలియజేశాడు. దేవుడు మొదట
వహీద్వారా తెలియజేసిన జ్ఞానమునే తర్వాత కాలములలో మిగతా రెండు
విధములలో తెరచాటునుండి ఒక రకము, దూతద్వారా ఒక రకము
తెలియజేశాడు. అయితే ఆయన తెలియ జేసిన విధానమును కూడా
సరిగా తెలియనివారు తెరచాటునుండి చెప్పిన జిబ్రయేలు దేవుని దూతగా
చెప్పుకొంటున్నారు. దూతగా వచ్చిన వానిని పూర్తిగా మరచిపోయారు.
దేవుడు ఎప్పుడు స్వయముగా శరీరమును ధరించి వచ్చునో, ఆ వచ్చిన
ఆకారమును దూతయని చెప్పడమైనది. వివరముగా చెప్పుకొంటే దూత
అనగా సమాచారమును తీసుకొనివచ్చిన వాడని అర్ధము. సమాచారమును
తీసుకొని వచ్చు దూతకు సహజముగా రెండు ధృవములుండును. ఒకటి
సమాచారమును అందివ్వవలసిన వ్యక్తి దగ్గరకు దూత రావలసియుండగా
మొదట సమచారమును ఎవరో ఒకరివద్దనుండి తీసుకొని రావలసియున్నది.
ఇక్కడ సమాచారమును తెచ్చు దూత మొదటి ధృవమైన దేవునివద్దనుండి
జ్ఞానము అను సమాచారమును తీసుకొని మనిషివద్దకు వచ్చి, తెచ్చిన
సమాచారమును అందివ్వవలసియున్నది. సమాచారమును స్వీకరించువాడు
మనిషికాగా, సమాచారమును తెచ్చువాడు ఎవడో దూత అనుకుందాము.
సమాచారమును దేవునివద్దనుండి తేవలసియున్నది. అయితే ఇక్కడ
ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమంటే! సమాచారమును
తెచ్చువాడు దేవునివద్దనుండి బయలుదేరి, దేవుడిచ్చిన సమాచారమును
తీసుకురావలెను కదా! అయితే బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము దేవున్ని
ఇంతవరకు ఎవరూ చూడలేదు. దేవుడు అంటే బ్రతికియున్న ఎవనికీ
తెలియదు. దేవుడు కనిపించువాడు కాదు, అటువంటప్పుడు ఎవడూ
దేవునివద్దనుండి సమాచారమును తెచ్చుటకు వీలులేదు.

దేవుడు తన చట్టము ప్రకారము (తన ధర్మము ప్రకారము) రూప,
నామ, క్రియలు లేనివాడు. ఆయన దగ్గర ఏ పనిమనిషిగానీ, దూతగానీ,
సేవకుడుగానీ, ఎవడుగానీ ఉండుటకు వీలులేదు. అలా ఉన్నాడు అంటే
వాడు దేవున్ని చూచినవాడు అగును. దేవున్ని చూచినవాడు ఇంతవరకు
ఎక్కడా లేనప్పుడు ఆయనకు ప్రత్యేకించి ఒక దూత ఉన్నాడనడము తప్పు
యగును. ఇప్పుడు ఇక్కడ కొందరు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చును.
అదేమనగా! దేవున్ని ఎవరూ చూడనప్పుడు, దేవునికి ఎవరూ దూతలు
లేనప్పుడు, అంతిమ దైవగ్రంథములో మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ 42వ
సూరాలో 51వ వాక్యములో (ఆయత్లో) దేవుడు తన దూతద్వారా
మనుషులకు జ్ఞానమును అందించును అని చెప్పియున్నాడు కదా! అలా
ఎందుకు చెప్పాడుయని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు మేము చెప్పు
సమాధానము ఇలా కలదు చూడండి. మనమున్నది ఇహలోకములో,
దేవుడున్నది పరలోకములో అయితే ఇహలోకములో సమస్త జీవరాసులు,
ఆ జీవరాసులను పాలించు దేవుని పాలకులు, దేవతలు, దయ్యాలు
మొదలగు సమస్త జనులు కలరు. పరలోకములో దేవుడు తప్ప రెండవ
వాడూ ఎవడూ ఉండుటకు వీలులేదు. రెండవవాడు ఎవరుండినా
దేవుడంటే ఏమి, దేవుడంటే ఎవరు అని వానికి తెలిసిపోవును. దేవుడు
తనకంటే వేరుగాయున్న ఎవనికిగానీ తెలియబడడు. అంతేకాక దేవుని
జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు దూత అను
ప్రత్యేకమయిన వాడు ఎవడూ ఉండుటకు వీలులేదు. ఎక్కడయినా తన
సమాచారమును తెలియజేయవలెనని దేవుడు అనుకొంటే, దేవుడే
స్వయముగా మారువేషములో దూతగా రాగలడుగానీ, ప్రత్యేకమయిన దూత
ఎవడూ ఉండడు. ద్వాపరయుగ అంత్యములో కలియుగ ప్రారంభములో
దేవుడు స్వయముగా మానవశరీరము ధరించి కృష్ణుడు అను పేరుతో
రావడము జరిగినది. రూపములేని దేవుడు మారువేషమువలె తనదికాని
రూపము ధరించి మానవునిగా వచ్చినప్పుడు, అట్లు వచ్చిన వానిని
దూతయని చెప్పడము జరుగుచున్నది. దేవుడు తన జ్ఞానమును
తెలియజేయు నిమిత్తము దూత వేషములో కలియుగములో ఇప్పటికి
రెండుమార్లు వచ్చి పోయినట్లు తెలిసినది. అయినా వచ్చినవాడు దేవుడు
అనీ, అతను మారువేషములో వచ్చాడనీ ఎవరూ తెలియలేకపోయారు.

ఒకప్పుడు అలెగ్జాండరు పురుషోత్తమ రాజువద్దకు యుద్ధవిషయము
లను తెల్పుటకు దూతను పంపాడు. అయితే దూతవేషములో వచ్చినవాడు
అలెగ్జాండరేయని ఇతరులెవరూ తెలియకపోయినా, పురుషోత్తమ రాజు
వచ్చినవాడు దూతవేషములోయున్న అలెగ్జాండరని గ్రహించగలిగాడు. అట్లే
దేవుడు మనుషులకు జ్ఞానమును తెలియజేయు నిమిత్తము శరీరమును
ధరించి సమాచారమును తెచ్చిన దూతవలె వచ్చినప్పుడు ప్రజలు ఎవరూ
గ్రహించలేకపోయినా, సూక్ష్మజ్ఞాని అయినవాడు వచ్చినవాడు దేవుడేయని
తెలియగలడు. అయితే దేవుడు మారువేషములో మనిషివలెయున్నందున
దేవుని ప్రత్యక్షముగా ఎవడూ చూచినవాడు లేడని చెప్పవచ్చును. దేవుని
వద్ద దేవుడు తప్ప ఎవడూ లేడు. అందువలన ప్రక్కవాడు ఎవడూ దూతగా
వచ్చుటకు వీలులేదు. ఒకవేళ దేవుని జ్ఞానమును మనుషులకు తెలియ
జేయుటకు ఎవడు వచ్చినా వాడు మారువేషములోయున్న దేవుడని తెలియ
వచ్చును. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియనప్పుడు, దేవుని
జ్ఞానమును దేవుడే తెలియజెప్పవలసియున్నప్పుడు, దేవుడే దూతగా రావలెను
గానీ ఇతరులెవరూ వచ్చుటకు వీలులేదు. దేవుడు చెప్పిన జ్ఞానమును
ఆకాశములో ముందే తెలిసియున్న జిబ్రయేల్ భూమిమీద మనుషులకు
జ్ఞానమును చెప్పను వచ్చాడు. అప్పుడు ఆయనను దేవుని అవతారమను
కొనుటకు వీలులేదు. ఎందుకనగా! తాను ఇంకొకరి ద్వారా తెలిసిన
జ్ఞానమునే చెప్పుచున్నాడు గానీ స్వయముగా జ్ఞానమును చెప్పలేదు కదా!
అందువలన ఆయనను దూత అనుటకు అవకాశములేదు. ఖుర్ఆన్
గ్రంథములో కూడా జిబ్రయేల్ను దూత అని ఎక్కడా సంబోధించి చెప్పలేదు.
దేవుడు దూత రూపములో వస్తే దూతగాయున్నా ప్రకృతిని శాసించు
స్థోమత కల్గియుండును. కనిపించక తెరచాటున వుండి చెప్పినవాడు
కలియుగములో జిబ్రయేల్, కృతయుగములో సూర్యుడు ఉన్నారని
చెప్పవచ్చును. తౌరాతు, ఇంజీలు గ్రంథముల జ్ఞానమును చెప్పినవారు
కృష్ణుడు, ఏసు అను ఇద్దరు దూతలని చెప్పవచ్చును. రెండుమార్లు,
రెండు పేర్లతో, రెండు శరీరములను ధరించివచ్చిన ఇద్దరు
దూతలు వేరువేరు పేర్లు కల్గియున్నా, వచ్చినవాడు దేవుడు
ఒక్కడేయని తెలియవలెను.

దేవుడు దేవునిగా కాకుండా దూతలను మారువేషములో వచ్చి,
శరీరములో ఆత్మగాయుండి ప్రథమ దైవగ్రంథమును, మధ్య దైవగ్రంథమును
బోధించాడు. తర్వాత తన పాలనలోని ఒక్కడయిన జిబ్రయేల్ అను
గ్రహమునుండి అంతిమ దైవగ్రంథమును బోధించాడు. ఈ విధముగా
మూడు దైవగ్రంథములు భూమిమీద తయారుచేసి మానవులకు ఇచ్చాడు.
వాస్తవానికి సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమే మూడు దైవగ్రంథములలో
ఉన్నది. దేవుడు మొదట చెప్పిన ఒక జ్ఞానమునే మూడు గ్రంథముల
రూపములో ఎందుకు చేయవలసివచ్చినదని ఎవరయినా ప్రశ్నించితే దానికి
మా జవాబు ఈ విధముగా కలదు. ఈ విషయము అర్థమగుటకు చిన్న
ఉదాహరణను చెప్పుతాను బాగా అర్థము చేసుకోండి. ఒక కుటుంబములో
ఒకే కుండలో బెల్లముతో పానకమును తయారు చేశారనుకొనుము. ఆ
కుటుంబములోని పెద్దవారికి పెద్ద గ్లాసులో పానకమును పోసి ఇస్తారు.
పది నుండి ఐదు సంవత్సరముల పిల్లలకు పెద్దగ్లాసును పట్టుకోలేరని
చిన్నగ్లాసులో పోసి ఇస్తారు. ఒకటి రెండు సంవత్సరముల పిల్లలకు చిన్న
ఉగ్గు గంటెతో కొద్దికొద్దిగా తాపుతారు. వారి వయస్సును, బలమును
బట్టి వారికి పెద్దగ్లాసులను, చిన్నగ్లాసులను, చిన్న ఉగ్గు గంటలను ఎలా
వినియోగించి పానకమును త్రాపుచున్నామో, అలాగే దేవుడు ఒకే
కుటుంబములాగా యున్న ఒకే మానవజాతికి, వారివారి స్థోమతనుబట్టి
అందులోని జ్ఞానమును గ్రహించునట్లు, మూడు రకముల గ్రంథములలో
జ్ఞానమును ఇచ్చాడు. ఒక కుటుంబములోని పెద్దలు త్రాగినా, చిన్నలు
త్రాగినా ఒకే రుచిగల పానకమే కదా! అట్లే ఒకే జాతి మానవులయిన
హిందువులు చదివినా, క్రైస్తవులు చదివినా, ముస్లీమ్లు చదివినా మూడు
గ్రంథములలో ఉన్నది ఒకే జ్ఞానమే కదా! ఒకే పానకమును (పానీయమును)
పెద్దగ్లాసు, చిన్నగ్లాసు, చిన్న గంటలలో ఎలా ఇస్తున్నామో, అలాగే ఒకే
దేవుని జ్ఞానమును పెద్ద, చిన్న అను మూడు గ్రంథముల రూపములో
దేవుడు ఇచ్చాడు. ఒకే పానకమును త్రాగుటకు మూడు పరిమాణముల
గ్లాసులను వాడినట్లు, ఒకే జ్ఞానమును తెలియుటకు ప్రథమ, మధ్యమ,
అంతిమ అను మూడు గ్రంథములను మనుషులకు ఇవ్వవలసి వచ్చినది.
పెద్ద చిన్న వయస్సునుబట్టి మూడు రకముల గ్లాసులలో పానకమును
ఇచ్చినా కొందరు త్రాగలేక ఒలకపోసుకొన్నట్లు, మనుషులకు కూడా మూడు
రకముల గ్రంథములలో జ్ఞానమును ఇచ్చినా వారు జ్ఞానమును గ్రహించు
కోలేక పానకమును కొంత త్రాగి కొంత ఒలకపోసుకొన్నట్లు, జ్ఞానమును
కూడా కొంత తెలిసి, కొంత తెలియలేకపోవుచున్నారు.

కొందరు వణుకుడు రోగమున్నవారు మొత్తము గ్లాసు పానకమును
క్రింద పోసుకొని కొద్దిగా కూడా త్రాగలేకపోయినట్లు, కొందరు మెదడులో
స్థిరత్వము లేనివారు వారి గ్రంథములోని మొత్తము జ్ఞానములో కొద్దిగా
కూడా అర్థము చేసుకోలేకపోవుచున్నారు. వారికి గ్రంథములోని జ్ఞానము
ఏమాత్రము అర్థము కాలేదని చెప్పవచ్చును. ఇంట్లో త్రాగే స్థోమతనుబట్టి
పెద్దగ్లాసు, చిన్నగ్లాసు ఇస్తే, పానకమును త్రాగినవారు పానకమును గురించి
చెప్పక నాది పెద్దగ్లాసు పార్టీ, నాది చిన్నగ్లాసు పార్టీ అన్నట్లు దేవుడు
మనుషుల స్థోమతనుబట్టి వారికి అర్థము కావలెనని మూడు గ్రంథముల
రూపములో జ్ఞానమును అందిస్తే, మనుషులు దానిని అర్థము చేసుకోలేక,
మూడు గ్రంథములను ఆధారము చేసుకొని మూడు మతములను తయారు
చేసుకొన్నారు. మూడు మతములకు ముగ్గురు వేరువేరు దేవుళ్ళ పేర్లను
చెప్పుకొంటున్నారు. ఒకే పానకమును ముగ్గురికిస్తే దానిని త్రాగలేక క్రింద
పోసుకొని, మేము పానకమును త్రాగినాము అని అసత్యమును చెప్పుచూ,
నేను త్రాగినది ఉప్పగా ఉంది అని ఒకడు అంటే, నేను త్రాగినది వగరుగా
ఉంది అని మరొకడు అంటున్నాడు. ఇక మూడవవాడు నేను తాగిన
పానకము పుల్లగావుంది అని అంటున్నాడు. వారికి ఇచ్చినది బెల్లము
పానకము అయినప్పుడు అది తియ్యగా ఉండునుగానీ, ఉప్పగా, వగరుగా,
పుల్లగా ఉండుటకు వీలులేదు కదా! అటువంటప్పుడు వారు అందరూ
చెప్పునది అసత్యమని సులభముగా తెలియుచున్నది. అదే విధముగానే
వారికి ఇచ్చినది ఒకే దేవుని జ్ఞానమయినప్పుడు, దేవుడు ముగ్గురుగా
ఉన్నాడు అని వారు అన్నప్పుడు, వారికి దేవుని జ్ఞానము పూర్తిగా అర్థము
కాలేదని తెలిసిపోవుచున్నది.

మనుషులకు జ్ఞానము బాగా అర్థము కావలెనను ఉద్దేశ్యముతో
దేవుడు మనిషి రూపములోనికి వచ్చి, మనిషి భాషలోనే మాట్లాడి, తన
జ్ఞానమును చెప్పినప్పటికీ, మనిషి దేవుడిచ్చిన జ్ఞానమును సరిగా స్వీకరించక,
దేవుడు ఇచ్చిన మూడు గ్రంథముల జ్ఞానమును మూడు మతములుగా
ఏర్పరచుకొన్నాడు. ఎక్కడయినా దేవుని జ్ఞానము అర్థమయినవాడు వుండి
దేవుడు మతములను గురించి చెప్పలేదని చెప్పినప్పటికీ, వాని మాటను
ఎవరూ వినకుండా ఉన్నారు. తాము అజ్ఞానులైయుండి మతము అనునది
మంచిదికాదు అన్నవానిని అజ్ఞాని అంటున్నారు. ఒకే కుటుంబములో
ఒకే బెల్లముతో, ఒకే పాత్రలో, ఒకే రుచిగల పానకమును తయారు చేసి
కుటుంబములోని వారికి ఇస్తే, ఒకే రుచిగల పానకమును వేరువేరు
రుచులలో చెప్పినట్లు, ఒకే మానవ సమాజములో ఒకే దేవుని జ్ఞానమును
అందిస్తే, దానిని స్వీకరించిన వారు దానిలోని ఒకే దైవత్వమను రుచిని
తెలియక వేరువేరు రుచులుగా చెప్పుచూ, వేరువేరు మతములుగా
మారిపోయి, వేరువేరు దేవుళ్ళ పేరు చెప్పుకోవడము వలన, వేరువేరు
సమాజములుగా మారిపోయారు. నేడు భూమిమీదున్న పరిస్థితినిబట్టి
మనిషి మూడు గ్రంథములలోని దేవుని జ్ఞానమును ఏ కొద్దిగా కూడా
అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. మూడు మతములుగా చీలిపోయిన
మనుషులు ఒకరికొకరు మేము గొప్ప జ్ఞానులమంటే, కాదు మీకంటే
మేమే గొప్ప జ్ఞానులమని వాదించుకొనుచున్నారు. దానితో ఎవరు జ్ఞానులో,
ఎవరు అజ్ఞానులో అర్థముకాక, మేము జ్ఞానులమనుకొనుచూ
తారతమ్యములు లేకుండా మాట్లాడుచున్నారు. 'ముందు వచ్చిన చెవులకంటే
వెనుక వచ్చిన కొమ్ములు మేమే పెద్ద' అన్నట్లు, ముందు వచ్చిన గ్రంథముల
కంటే వెనుకవచ్చిన మత జ్ఞానమే గొప్పయని కొందరంటున్నారు.


నేడు భూమిమీద మత ప్రభావము ఎక్కువయిపోయి, దేవుని జ్ఞాన
ప్రభావము తగ్గిపోయినది. మూడు గ్రంథములలో దేవుని జ్ఞానము
ఒక్కటేయున్నా, ఒక్కొక్క గ్రంథమును ఒక్కొక్క మతగ్రంథముగా ప్రజలు
పెట్టుకొన్నారు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ను ముస్లీమ్ మత
గ్రంథముగా ప్రపంచములోని ముస్లీమ్లందరూ చెప్పుకొంటున్నారు. అట్లే
wwwయిన బైబిలును క్రైస్తవులు తమ మతగ్రంథముగా
చెప్పుకోవడము జరుగుచున్నది. ఇకపోతే హిందువులు కొందరు
భగవద్గీతను తమ మతగ్రంథముగా చెప్పుకొంటున్నారు. మూడు గ్రంథము
లలో లేని మతప్రసక్తిని మనుషులు ఆ గ్రంథములకు అంటగట్టారు.
వాస్తవానికి మూడు గ్రంథములు సమస్త మానవాళికీ చెప్పబడిన
జ్ఞానముగాయుండి, ఆ గ్రంథములలో కూడా సమస్త మనుషుల కొరకు

చెప్పబడిన జ్ఞానమున్నట్లు వాక్యములు కూడా కలవు. అయితే మనుషులు
మాత్రము వేరువేరు మతములుగాయుండి అన్ని మతములకంటే మా మతమే
గొప్పయని అంటున్నారు. ఒక మతములో లేని జ్ఞానము మరొక మతములో
ఉన్నదని అంటున్నారు. దేవుడు ప్రథమ దైవగ్రంథ మయిన భగవద్గీతలో
చెప్పిన జ్ఞానమునే మిగతా రెండు గ్రంథములలో చెప్పియున్నాడు. అయినా
ఒక మతమువారు మా జ్ఞానము వేరు, మా మతమువేరు, మా మతములోని
దేవుడు వేరు అని అంటున్నారు. నేడు భూమిమీద మనుషులలోయున్న
జ్ఞానమును చూస్తే దేవుడు చెప్పిన దానికి మనుషులవద్దయున్న దానికి
ఏమాత్రము సంబంధము లేదు.

ప్రస్తుత కాలములో ముఖ్యముగా మూడు మతములున్నా మొదటి
హిందూమతము, చివరి ముస్లీమ్ల మతము రెండూ ఒకదానికొకటి
ఎక్కువగా విమర్శించుకొంటున్నాయి. ఈ రెండు మతముల వారిలోనూ
జ్ఞానముయందు ముఖ్యముగా మూడు అభిప్రాయబేధములు కలవు. ఒకటి
దేవుడు మానవునిగా పుట్టడను విషయము, రెండు మనిషి అన్యదేవతారాధన,
విగ్రహారాధన చేస్తున్నాడనీ, మూడు మనిషికి పునర్జన్మలు లేవని అభిప్రాయ
బేధములు కల్గియున్నారు. దేవున్ని మినహా ఎవరిని ఆరాధించినా అది
అన్యదేవతారాధన అవుతుందని మూడు గ్రంథములలో గలదు. అయితే
హిందువులు ఆ మాటను లెక్కచేయక అన్యదేవతారాధన చేస్తున్నారు.
ముస్లీమ్లు ఒకే దేవతారాధనలో ఉన్నారు కాబట్టి, భగవద్గీత ప్రకారముగానీ,
ఖుర్ఆన్ గ్రంథము ప్రకారముగానీ, ఆరాధన విషయములో ముస్లీమ్లో
సక్రమముగా మాట్లాడుచున్నారు. ఒక విధముగా ఆరాధన విషయములో
హిందువులే దారితప్పి భగవద్గీతకు వ్యతిరేఖముగా నడుస్తున్నారని చెప్ప
వచ్చును. రెండవ విషయమయిన 'దేవుడు మనిషిగా పుట్టడు' అను దానిని
ముస్లీమ్లు ఎక్కువగా వాదించుచున్నారు. హిందువులు దేవుడు మనిషి
అవతారముగా వస్తాడని నమ్ముచున్నారు. ఈ విషయములో హిందువులు
సక్రమ జ్ఞానమును ప్రదర్శించుచుండగా, ముస్లీమ్లు ఇటు భగవద్గీతకు
అటు ఖుర్ఆన్ గ్రంథమునకు వ్యతిరేఖముగా నడుస్తున్నారు. మూడవదయిన
పునర్జన్మల విషయములో భగవద్గీతకు, ఖుర్ఆన్క వ్యతిరేఖముగా
ముస్లీములు పునర్జన్మలు లేవు అంటున్నారు.

ఈ విధముగా దైవగ్రంథములకు వ్యతిరేఖముగా కొన్ని మతముల
మనుషులు ప్రవర్తించుచున్నారు. ఇది మా గ్రంథము అను చెప్పు
హిందువులు కొన్ని విషయములలో భగవద్గీతకు వ్యతిరేఖముగా ప్రవర్తించు
చున్నారు. అట్లే ఇది మా గ్రంథమని ఖుర్ఆన్ గ్రంథము పేరు చెప్పు
ముస్లీమ్లు కూడా కొన్ని విషయములలో ఖుర్ఆన్లోని ఆయత్లకంటే,
వారి మతపెద్దలు చెప్పిన మత నిర్ణయములనే పెద్దగా పెట్టుకొన్నారు.
క్రైస్తవులు కూడా అందరూ ఏసు చెప్పిన జ్ఞానము ప్రకారము నడువకుండా,
వారు మతవ్యాప్తికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుచున్నారు. మొత్తము మీద
అన్ని మతముల వారు కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా
దైవగ్రంథము లను అతిక్రమించి నడుస్తున్నారు. అయితే మూడు
మతములవారు మేము మా గ్రంథములో దేవుడు చెప్పినట్లే నడుస్తున్నామని
చెప్పుకొంటూ వారికి తెలియకుండానే వారు దేవునికి, దేవుని జ్ఞానమునకు,
దైవగ్రంథమునకు వ్యతిరిక్తదిశలో ప్రయాణించుచున్నారు. గురిగింజ
నేనంతా ఎర్రగా యున్నానని అనుకొనుచూ తన క్రిందనున్న నలుపును
తెలియనట్లు, దైవగ్రంథమును అర్థము చేసుకోని ప్రతి మతస్థుడు తనలో
దాగియున్న అజ్ఞానమును తెలియలేక నేను నిజమైన జ్ఞానిననీ, నేను
సంపూర్ణ జ్ఞానిననీ, నేను స్వచ్ఛమయిన జ్ఞానిననీ, నేను దేవునికి దగ్గరగా
యున్న వాడినని అనుకొంటున్నాడు. తన అజ్ఞానము తనకు తెలియక
పోవడము వలన, నేను సంపూర్ణ జ్ఞానినని అనుకోవడము వలన, ఇతరులు
జ్ఞానమును చెప్పినా వినే స్థితిలో లేకున్నాడు. అట్లే దైవగ్రంథముల మీద
దృష్టిపెట్టి చూడకున్నాడు.

ప్రతి మనిషిలో ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములు
ఉండును. మొత్తము పన్నెండు గుణములను 'మాయ' అని దేవుడు తన
ప్రథమ దైవగ్రంథములో విజ్ఞానయోగములో 14వ శ్లోకమున "గుణమయీ
మమ మాయా" అని చెప్పియున్నాడు. ప్రతి మనిషిలో వాని తలలో మెదడు
యందు నిక్షిప్తమై ఎవరికీ తెలియకుండా ఉన్న నాలుగు చక్రముల
సముదాయములో క్రింది చక్రమున మాయ అనునది గుణముల రూపములో
యున్నది. అందులో చెడుగుణముల వరుసలోయున్న గర్వము అను
గుణము మనిషిని జ్ఞాన విషయములో నీవే పెద్ద జ్ఞానివి అని గర్వపడు
నట్లు చేయుచుండును. అప్పుడు తనలోయున్న మాయ మీద స్పృహలేని
మనిషి, గర్వముతో నేనే జ్ఞానినియని నన్ను మించిన జ్ఞాని లేడని అనుకొను
చుండును. అటువంటి వానికి మనిషి రూపములోయున్న దేవుడు
ఎదురయినా వాని దృష్టిలో తక్కువగానే కనిపించును. అటువంటివానికి
మనిషిగాయున్న దేవుడు వానిలోని అజ్ఞానమును తీసివేయుటకు జ్ఞానము
చెప్పినా, వాడు హేళనగా మాట్లాడుచూ నువ్వు జ్ఞానివా, నీకు జ్ఞానము
తెలుసునాయని లెక్కచేయక మాట్లాడును. నేడు ఒక మతము వాడు
మరొక మతగ్రంథముగాయున్న దైవగ్రంథమును హేళనగా మాట్లాడు
చున్నాడు. ఆ మతగ్రంథములో జ్ఞానమును చెప్పిన వక్తను చులకనగా
మాట్లాడుచున్నాడు. ఒక హిందువు ఇతర మత జ్ఞానమును, ఆ మత
గ్రంథమును విమర్శించి మాట్లాడితే, ఒక ముస్లీమ్ ఇతర మతములోని
జ్ఞానమును విమర్శించి మాట్లాడుచున్నాడు. ఎప్పుడయితే మతములు
వేరు, మత జ్ఞానములు వేరను భావము మనిషిలో పుట్టినదో, అప్పుడే ఆ
మనిషి ఈ మతము ఆ మతము అనకుండా, ఎవని మతమును వాడు
గొప్పగా చెప్పుకొనుచూ, ఇతర మతములను కించపరుస్తూ మాట్లాడును.
అప్పుడు మనిషిలోని మాయ పని చేయుచూ అన్ని మతములలో ఉన్నది
ఒకే దేవుని జ్ఞానమని మనిషికి తెలియకుండా చేసినదని చెప్పవచ్చును.
శరీరాంతర్గతములోయున్న మాయవిషయము తెలియని మనిషి
బయట ప్రపంచములో ఎంత గొప్ప జ్ఞానిగా కనిపించినా, లోపల ప్రపంచ
మైన శరీరములో అజ్ఞాన దారిలో నడుచుచుండును. అప్పుడు తనకు
తెలిసిన జ్ఞానమునకు అనగా దైవ గ్రంథమునుండి తనకు అర్థమయిన
జ్ఞానమునకు ఎవరు వేరుగా మాట్లాడినా అతను ఇతని మనోభావమునకు
సరిపోడు. అక్కడే అప్పుడే ఎదుటివాడు నిజమైన జ్ఞానమును చెప్పుచుండినా,
తనకు అర్థమయినట్లు లేకపోవడము వలన వాడు చెప్పునది సరియైనదా,
కాదాయని చూడక, తనకు వ్యతిరేఖిగానే భావించుకొనును. మనిషిలోని
గర్వము అను గుణము పని చేయుట వలన తాను తెలుసుకొన్న జ్ఞానములో
లోపమున్నా, ఇతరులు చెప్పు జ్ఞానములో లోపము లేకున్నా తనదే సరియైన
జ్ఞానమని తలచిన మనిషి ఎదుటి వానిమీద ద్వేషమును పెంచుకొనుచూ
వచ్చును. మనిషి శరీరములో ఆరు చెడు గుణములలో ఐదవది గర్వము
కాగా, ఆరవది అసూయ. మనిషిలో మొదట గర్వము పుట్టిన తర్వాత
తానే గొప్పయని అనుకొని, తనకు పోటీగా చెప్పువానిమీద ఆరవ
గుణమయిన అసూయను పెంచుకొనును. అసూయ పెరుగుకొలది కామ,
క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము అను ఆరు గుణములలో రెండవ

దయిన క్రోధము పెరుగును. ఈ విధముగా మనిషి తలలోని మాయ
మొదట గర్వము (మదము) రెండవ దఫా అసూయ (మత్సరము) మూడవ
దఫా కోపము (క్రోధము) అను రూపములో పెరిగి పెద్దదై ఇతర మనిషిని
హింసించి చంపునట్లు చేయుచున్నది. అందువలన ఏ మతములో అయినా
గానీ, ఆ మత గ్రంథ జ్ఞానము సరిగా అర్థముకాకపోయి తప్పు భావములతో
అర్థమయితే, ఇతర మతములన్నీ అజ్ఞాన మతములని, తన మతము
మాత్రమే జ్ఞానముగల మతమని భావింపబడును. అప్పుడు ఇతర మతముల
మీద ఇతర మతస్థుల మీద అసూయ పెరిగి అది ద్వేషమునకు దారిచూపి,
ద్వేషము పెరిగిపోయి, చివరకు హింసాకార్యములకు దారితీయును.
చివరకు అజ్ఞానము వలన మనిషిలో మతద్వేషము పెరిగి అక్కడే ఇతరులను
హింసించవలెనను ఉగ్రవాద బీజము పుట్టుచున్నది. ఇది ఒక మతములోనే
జరుగునది కాదు. అన్ని మతములలో ఎక్కడయినా ఇదే పద్ధతి ద్వారా
జరుగును. ఎవరికయితే మతధ్యాస ఎక్కువయుందో వారిలో అజ్ఞానము
పెరిగిపోయి, చివరకు మాయ ప్రభావము వలన ఉగ్రవాదము పుట్టు
చున్నది.

మనకు ముఖ్యమైనవి మూడు మతములు గలవు. అవియే
హిందూ, క్రైస్తవ, ఇస్లామ్ మతములు. ఈ మూడింటిలో సంఖ్యలో క్రైస్తవ
మతము పెద్దగాయున్నది. రెండవది ఇస్లామ్ మతము. మూడవది హిందూ
మతము. నేడు క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగా దాదాపు 210 కోట్ల జనాభా
కలరు. ముస్లీమ్లు 162 కోట్ల జనాభా కలరు, హిందువులు దగ్గరదగ్గర
100 కోట్ల జనాభా కలరని చెప్పవచ్చును. ఈ దినము మూడవ
స్థానములోయున్న హిందూమతము ఒకప్పుడు అనగా రెండువేల
సంవత్సరముల పూర్వము మొదటి స్థానములో ఉండేది. రెండువేల
సంవత్సరములప్పుడు మొదలయిన క్రైస్తవ మతము తన మత జ్ఞానమును
ప్రచారము చేసి మతమును పెంచుకోగలిగినది. 14 వందల సంవత్సరము
లప్పుడు పుట్టిన ఇస్లామ్ మతము కూడా హిందూ మతమును మూడవ
స్థానములోనికి నెట్టి రెండవ స్థానములోయున్నది. ఈ మూడు మతములు
పుట్టిన కాలమునుబట్టి, పెరిగిన సంఖ్యనుబట్టి లెక్కించి చూస్తే హిందువులకు
మతము మీద పెద్దగా ధ్యాసలేదనీ, వారికి భక్తి మీద శ్రద్ధకలదని తెలియు
చున్నది. మిగతా రెండు మతములకు మతము మీద శ్రద్ధయుండుట
వలన, ఆ రెండు మతములు ముందున్న హిందూమతమును వెనుకకు
నెట్టి ముందుకు పోగలిగాయి. 2000 సంవత్సరములప్పుడు పుట్టిన క్రైస్తవ
మతము నేడు సంఖ్యలో 210 కోట్లు ఉండగా, 1400 సంవత్సరములప్పుడు
పుట్టిన ముస్లీమ్ మతము నేడు 162 కోట్ల జనాభా కల్గియున్నది. ఈ
సంఖ్యనుబట్టి ఏ మతమువారు తమ జ్ఞానము మీద శ్రద్ధను తగ్గించి,
మతము మీద శ్రద్ధను పెట్టి మతమును పెంచుకోగలుగుచున్నారని చూచిన,
క్రైస్తవమతముకంటే వేగముగా ముస్లీమ్మతమే తమ మత సంఖ్యను పెంచు
కోగలుగుచున్నదని తెలియుచున్నది.

2000 సంవత్సరములనుండి ఉన్న క్రైస్తవమతము ఒక
సంవత్సరమునకు 10,50,000 మందిని క్రైస్తవులుగా మార్చుకోవడము
వలన ఇప్పటికి 210 కోట్ల జనాభాగాయున్నది. 1400 సంవత్సరముల
ప్పుడు తయారయిన ఇస్లామ్ మతము ఒక సంవత్సరమునకు 11,45,000
మందిని తన మతస్థులుగా మార్చుకోవడము వలన నేటికి 162 కోట్ల
జనాభాగాయున్నది. ఇది ఆయా మతములలో పుట్టే వారి సంఖ్యతో కలుపు
కొని చెప్పుచున్నాము. ఈ లెక్కల ప్రకారము క్రైస్తవమతముకంటే ఇస్లామ్
మతమే ఎక్కువ వేగముగా మతమును పెంచుకొంటూ పోతున్నదని తెలియు
చున్నది. 5000 సంవత్సరముల పూర్వము ప్రపంచ వ్యాప్తముగా 300
కోట్ల జనాభాయున్న హిందూమతము నేడు 100 కోట్లకు దిగజారిపోయింది
అంటే ప్రతి సంవత్సరము 4 లక్షలమంది హిందువులు తగ్గిపోతూ వచ్చారని
తెలియుచున్నది. అందువలన వెనుకపుట్టిన రెండు మతములకంటే
ముందు పుట్టిన హిందూమతమే పూర్తి వెనుకబడిపోయి, మూడవ
స్థానములోనికి వచ్చినది. ప్రస్తుత కాలములో క్రైస్తవులు, ముస్లీమ్లు
తమ మతములను పెంచుకొను ధ్యాసలోయుండి వారి గ్రంథముల
జ్ఞానముకంటే మతముమీదనే ఎక్కువ శ్రద్ధను పెట్టుకొన్నారు. నేడు
క్రైస్తవులకంటే ఎక్కువగా ముస్లీమ్ మతమును పెంచు ప్రయత్నము
చేయుచున్నారని బహిరంగముగానే తెలియుచున్నది. నేడు ముస్లీమ్లు తమ
మతమును పెంచుటకు క్రొత్త పథకములను అవలంబించుచున్నారు. గత
50 సంవత్సరములకంటే ఈ మధ్య కాలములో మతవ్యాప్తి కొరకు తమ
వేగమును పెంచారు. గతములో యున్న వేగము ప్రకారమైతే క్రైస్తవుల
సంఖ్యను దాటుటకు కనీసము 50 సంవత్సరములు పట్టును. అందువలన
అంతకాలము లేకుండా 20 సంవత్సరములలో క్రైస్తవుల సంఖ్యను
అధిగమించాలను యోచనతో అనేక రకముల వేగమును పెంచి తమ
మతమును విస్తరింపజేయాలనుకొన్నారు.

క్రైస్తవులు మతమును వ్యాప్తి చేయాలని చేయుచున్నా, వారు ఒక

పద్ధతిగా మత ప్రచారమును చేయుచున్నారు. ఎక్కడ క్రైస్తవ మతమును
ప్రచారము చేసినా, అక్కడ బైబిలు గ్రంథములోని జ్ఞానమును చెప్పి, తమ
జ్ఞానమువైపు ఆకర్షితులను చేసి, ఇతరులను క్రైస్తవులుగా మార్చుచున్నారు.
క్రైస్తవులు మతమార్పిడి చేసినా, వారు బైబిలు జ్ఞానమును చూపి, తమ
జ్ఞానమునకు ఇతర మతస్థులను ఆకర్షితులుగా చేసి, వారి ఇష్టముతో
వారు తమ మతములోనికి వచ్చునట్లు చేయుచున్నారు. అంతేగానీ తమ
మతమును గొప్పగా చెప్పుకోవడము కొరకు ఎక్కడాగానీ హింసా పద్ధతులను
అవలంబించలేదు. అయితే తమ మతములోని జ్ఞానము గొప్పదని,
హిందువుల జ్ఞానము తక్కువదని భారతదేశములో ప్రచారము చేసి, తమ
మతములోని గొప్పతనమును ప్రచారము చేసి హిందువులను ఎక్కువగా
ఆకర్షించి తమ మతములో కలుపుకొన్న మాట వాస్తవమే, అయినా
వారు హింసాపద్ధతిని ఎక్కడా అవలంబించలేదు. ఎక్కడ క్రైస్తవుల మత
ప్రచారమున్నా అక్కడ వారి గ్రంథములోని వాక్యములు కొంత చెప్పడము,
ఎక్కువగా ఆ మతములో చేరినవారికి వారి పాపములు పోవుననీ, ఏసే
నిజమైన దేవుడనీ, ఏసు రక్తము వలన పాపములు పోవుననీ చెప్పి,
ఇతరులను నమ్మించి వారి మతములో చేరునట్లు చేయుచున్నారు. హిందూ
మతములోనున్న కులవివక్షను ఓర్చుకోలేని వారందరూ క్రైస్తవమతములో
చేరడము జరిగినది. ఒక విధముగా మతమార్పిడి దైవద్రోహమని వారికి
తెలియదు. కావున తమ మతమును ఎంత ప్రచారము చేస్తే, అంతగా
ఏసు వారిని ఒప్పుకొనునని నమ్మి మతప్రచారమును సాగించుచున్నారు.
క్రైస్తవులలో ఎందరో  బోధకులు బైబిలును బోధించుచున్నా, బైబిలు
గ్రంథములోనున్న నాలుగు సువార్తల జ్ఞానము వారికి తెలియదనియే
చెప్పవచ్చును. వాస్తవముగా మధ్య దైవగ్రంథమయిన బైబిలు గ్రంథమును
ఇంజీలు గ్రంథమని ఖుర్ఆన్ గ్రంథములో వ్రాయబడియున్నది. అయితే
అందులోని నాలుగు సువార్తలలోనే ఏసు చెప్పిన జ్ఞానము కలదు.
నాలుగు సువార్తల జ్ఞానమును క్రైస్తవులలో పెద్ద బోధకులుగాయున్నవారు
కూడా పూర్తిగా తెలియరనియే చెప్పవచ్చును. నాలుగు సువార్తల జ్ఞానమే
బైబిలులో ముఖ్యమైన జ్ఞానముగాయున్నది. అయితే నేడు క్రైస్తవ బోధకులలో
ఎవరూ కూడా సువార్తల జ్ఞానములోని లోతును చూడలేదనియే చెప్ప
వచ్చును. బైబిలులో ముఖ్యమైన వాక్యముగాయున్న “తండ్రి,
కుమారుడు, పరిశుద్ధాత్మ”యను మూడు పేర్లకు వివరము తెలియని
వారు అందులోని జ్ఞానముమీద దృష్టిని పెట్టక మతప్రచారము మీదనే
ఎక్కువ దృష్టిని సారించారు. ఒకవైపు జ్ఞానమును చెప్పుచున్నా జ్ఞానముకంటే
మతము మీదనే వారికి ఎక్కువ మక్కువ గలదు.

భారతదేశములో ఎక్కువగా హిందువులుండుట వలన క్రైస్తవులు
ఎక్కువగా ప్రచారము చేసి, ప్రతి ఊరిలో చర్చీలను నిర్మించి, అక్కడక్కడ
సువార్తల సభలు నిర్వహించి ఎక్కువ శాతము హిందువులను క్రైస్తవులుగా
మార్చుకొన్నారు. హిందువులకు ఒక మత పెద్దయనిగానీ, మత గురువు
అనిగానీ లేకుండుట వలన, ఒక కులము వారే ప్రతిచోటా వారి
ఆధిపత్యమును కనబరుస్తూ హిందువులలో మిగతా కులమువారందరినీ
అంటరాని వారిగా చూచుట వలన, స్వయముగా దేవున్ని మ్రొక్కు
అవకాశములేనందున, ఆధ్యాత్మిక జ్ఞానమంటూ ఏమాత్రము తెలియని
దానివలన, తెలుసుకోవాలని ఆశయున్నా జ్ఞానము తెలియజేయువారు
లేనందున, మిగతా రెండు మతములకు బైబిలు, ఖుర్ఆన్ ఉన్నట్లు, హిందూ
మతమునకు ఏ గ్రంథమున్నదో కూడా తెలియని దానివలన, భగవద్గీతకంటే
ముఖ్యమైనవి వేదములని మిగతా గురువులు తప్పుదారి పట్టించుట వలన,
గురువులనువారు ఒక మంత్రమును చెప్పి ఇదే ఉపదేశము, ఇదే జ్ఞానము
దీనినే జపించుచుండ మని చెప్పుట వలన, కొందరు విగ్రహారాధనే
ముఖ్యమని చెప్పి అనేక దేవతలను పూజించునట్లు చేయుట వలన
జ్ఞానమంటే ఏదో, అజ్ఞానము అంటే ఏదో తెలియని అగమ్యగోచర
స్థితిలోయున్న హిందువులు క్రైస్తవులకు సులభముగా దొరుకు పక్షులవలె
కనిపించారు. అందువలన భారత దేశములో గత యాభై (50)
సంవత్సరములనుండి మతమార్పిడి ఎక్కువగా జరిగినది. హిందువులు
ఎక్కువగా క్రైస్తవులుగా మారిపోయారు.

కొన్ని సంవత్సరములుగా దీనినంతటినీ గమనించుచున్న
ముస్లీమ్లు తాము కూడా చేతనయినంత వరకు వారి సంఖ్యను పెంచు
కోవాలనుకొన్నారు. అందువలన ఈ మధ్య గత 20 సంవత్సరములనుండి
కొంత ప్రయత్నము చేయుచున్నారు. ఆ ప్రయత్నములో భాగముగా ప్రతి
జిల్లా సెంటర్లలోనూ, జిల్లాకాని పెద్ద పట్టణములలోనూ ఒక్కొక్కచోట ఒక్కొక్క
పేరుతో ఇస్లామ్ (ముస్లీమ్) సంఘములను స్థాపించారు. ఆ సంఘములలో
బాగా జ్ఞాపకశక్తియున్న వారినీ, వాక్చాతుర్యమున్న వారినీ, ఇతర మత
గ్రంథములలోని శ్లోకములను, పద్యములను నేర్వగలిగిన మేధావులను
చాతుర్యముగల యువకులను ఆ సంఘములలో ఉండునట్లు ఏర్పాటు
చేసుకొన్నారు. ధారాళముగా మాట్లాడు స్థోమతగల వారిచేత సంఘమును
నడుపుచూ, చాపక్రింద నీరులాగా మతమును ప్రచారముచేసి మతములో
సంఖ్యను పెంచుకోవాలనుకొన్నారు. చేతనయితే ఇతర మతస్థులను తమ
వైపు లాగుకోవడము వలన ఇతర మతమును తగ్గించి, తమ మతమును
పెంచుకోవచ్చును. అట్లు చేతగాకపోతే ఇతర మతస్థుల సంఖ్యను హింసతో
నయినా తగ్గించి తమ సంఖ్యను పెంచుకోవడమనే ఉద్దేశ్యముతోయున్నట్లు
వారి ప్రవర్తననుబట్టి తెలిసిపోవుచున్నది. క్రైస్తవులవలె మత గ్రంథములోని
జ్ఞానమును చెప్పుటకు ఖుర్ఆన్లో యుండే జ్ఞానమేదో వారికే అర్థము
కాలేదు. ఒకవేళ అర్థమయినవారున్నా ఇతరులకు అది ఆమోదయోగ్యముగా
ఉండదు. ఖుర్ఆన్ జ్ఞానము పదిశాతము కూడా ఇంతవరకు ఏ
ముస్లీమ్కు అర్థముకాలేదు. వారికి ఎక్కవగా అర్థమయినది వారి పెద్దలు
చెప్పిన హదీసు గ్రంథముల విషయములేగానీ, ఖుర్ఆన్ గ్రంథ విషయములు
కాదు. అందువలన ఏదో ఒక విధముగా ఇతరులతో పోటీపడి మాటల
చాకచక్యముతోనూ, తమ జ్ఞాపకశక్తితోనూ ఎదుటి వారిని ఓడించి తామే
గొప్పవారమని తమ ఆధిపత్యమును చాటుకోవాలని చూస్తున్నారు. ఏదో
ఒక పేరుపెట్టుకొన్న ముస్లీమ్ సంఘము వారిముందర కొద్దిగా ఎవరయినా
జ్ఞానమును మాట్లాడినా, మాతో బహిరంగముగా చర్చ పెట్టుకోండి అని
ముస్లీమ్లు పోటీకి పిలువడము జరుగుచున్నది. అట్లు పోటీ జరిగిన
సభల వీడియోలను విదేశములలోయున్న ముస్లీమ్లకు చూపి తాము
మిగతా మతములతో బాగా పోటీపడి వారిని ఓడిస్తున్నామని చెప్పు
కొంటున్నారు. అలా విదేశీ ముస్లీమ్లకు తమ వీడియోలను పంపి
వారినుండి తమ సంఘములకు ధనమును పంపునట్లు చేసుకొనుచున్నారు.

ప్రపంచ జనాభాలో రెండవ స్థానములోయున్న ముస్లీమ్లు 90
శాతము మంది ఉత్తములుగాయుండి, వారు ఎవరి మతముతోగానీ మత
ద్వేషముతోగానీ సంబంధము లేకుండా వారి బ్రతుకు వారు బ్రతుకు
చున్నారు. ఏదో ఒక పనిని చేసుకొని ఇతరులతో ద్వేషముగానీ, అసూయ
గానీ లేని జీవితమును గడుపుచూ, ఇతర మతస్థులతో అన్నదమ్ముల మాదిరి
కలిసిపోవుచున్నారు. ప్రపంచ వ్యాప్తముగాయున్న 90 శాతము ముస్లీమ్లతో
ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ముస్లీమ్ మతములో కేవలము
పది శాతము మంది పూర్తి అజ్ఞానులుగాయుండి తాము తమ మతములో
పెద్దజ్ఞానులమని చెప్పుకొనుచూ, మిగతా ముస్లీమ్లకు పెద్దలుగా
వ్యవహరిస్తూ 90 శాతము ముస్లీమ్లను వారిమాట వినునట్లు మత
కట్టుబాట్లు, మత షరియత్లుయని చెప్పి మిగతా ముస్లీమ్లందరినీ తమ
గుప్పిట్లో ఇరికించుకొని తాము పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. ముస్లీమ్
మతములో 90 శాతము మందికి అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్
గ్రంథములోని జ్ఞానమును ఏమాత్రము తెలియకుండా చేశారు. తాము
పెద్దలుగాయుండి వారికి ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పక, ఖురాన్ కంటే పూర్తి
వేరయిన హదీసు గ్రంథములలోని వాక్యములను చెప్పి మత కట్టుబాట్లను,
మత నియమములను నేర్పుచున్నారు. ఖుర్ఆన్ జ్ఞానము తెలియని మిగతా
ముస్లీమ్లు వారు చెప్పునదే నిజమైన జ్ఞానమని నమ్మి వారి కట్టుబాట్ల
ప్రకారము పూర్తి వారి పెద్దల ఆధీనములోవుండి వారు చెప్పినట్లు
నడుచుకొనుటకు అలవాటుపడుచున్నారు. ముస్లీమ్లలో కేవలము
పదిశాతము మంది తామే జ్ఞానులుగా చలామణి అగుచూ, మిగతా
ముస్లీమ్ల మీద స్వారీ చేయుచూ, అందరూ పేదవారుగా యుండగా
తాము మాత్రము ధనికులుగాయున్నారు. 90 శాతము ముస్లీమ్లు ఖుర్ఆన్
గ్రంథములోని జ్ఞానమును తెలియకుండా చేయుటకు ముఖ్యముగా
ఖుర్ఆన్ను అరబ్బీ భాషలోనే చదువవలెనను నియమమును పెట్టారు.
ప్రపంచములో ఎన్నో దేశములలో ముస్లీమ్లు ఉన్నారు. వారికి ఆ దేశభాష
తప్ప అరబ్బీ భాషరాదు. అటువంటివారు ఇతర భాషలోయున్న ఖుర్ఆన్
చదువకూడదను తమ పెద్దల నిర్ణయము ప్రకారము వారు ఖుర్ఆన్న
తమకు తెలిసిన భాషలో చదువలేకపోతున్నారు. ఎంతో కష్టపడి అరబ్బీ
భాషలోని అక్షరములను నేర్చుకొని అరబ్బీ అక్షరములతో ఖుర్ఆన్
చదివినవారున్నారు. అయితే వారికి అక్షరములు మాత్రము (లిపి మాత్రము)
తెలిసి భాషలోని పదముల అర్థములు తెలియకపోవడము వలన ఖుర్ఆన్
గ్రంథమును చదివినప్పటికీ అందులో ఏమి జ్ఞానమున్నదో వారికి తెలియ
కుండాపోయినది.

ప్రపంచ జనాభాలో మొత్తము 162 కోట్లమంది ముస్లీమ్లు
ఉండగా, అందులో కేవలము 32 కోట్లమందికి మాత్రమే అరబ్బీ భాష
తెలుసు. మిగతా 130 కోట్లమంది ముస్లీమ్లకు అరబ్బీ భాష తెలియని
దానివలన వారి మత గ్రంథములోని జ్ఞానమే వారికి తెలియదు. అరబ్బీ
భాష వచ్చిన 32 కోట్లమందిలో రెండు కోట్లమంది వికలాంగులు,
గ్రుడ్డివారు, మతిస్థిమితము లేనివారు కలరు. ఆ రెండుకోట్లమందిని
తీసివేస్తే మిగతా 30 కోట్లమందిలో పదికోట్లమందికి భాష తెలిసినా
చదువురాదు. అందువలన వారిలో 20 కోట్లమంది అంతిమ దైవ
గ్రంథమును చదివినవారున్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రము
కొంతవరకు అర్థమయినది. ఖుర్ఆన్ అర్థమయినది అనుకొనువారికి
ఖుర్ఆన్లో కేవలము కొంత భాగమే అర్థమయినది. మిగతా కొంత
భాగము అర్థము కాలేదు. చదివిన వారు మాకు అర్థమయినది అనినా
అది వేరు భావములో అర్థమయినది గానీ సరియైన భావములో అర్థము
కాలేదు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో ఎంతో పెద్ద
జ్ఞానరహస్యములు గలవు. అవి అందరికీ సులభముగా అర్థమవునవికావు.
అయితే ముస్లీమ్లలో మేము జ్ఞానులము అని చెప్పుకొను పదిశాతము
మంది మేము ఖుర్ఆన్ గ్రంథములో జ్ఞానమును సంపూర్ణముగా
తెలిసినవారుగానే అనుకోవడము జరుగుచున్నదిగానీ, వారిలో ఒక్క శాతము
కూడా జ్ఞానమును తెలిసినవారు లేరు.

ముస్లీమ్ మతములో మేము జ్ఞానులము అనుకొను పదిశాతము
మంది భారతదేశములో ఇస్లామ్ పేరుతో కలిసిన ముస్లీమ్ సంఘములను
తయారు చేసి, ఒకవైపు మిగతా ముస్లీమ్ల మీద వారి పెత్తనమును చలా
యించడమేకాక, హిందువులను ఇతర మతముల వారిని తమ మతము
లోనికి లాగుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. వారి ప్రచారములో
“గతములో మేము హిందువులుగా ఉన్నవారిమే, హిందూమతములో
సరియైన జ్ఞానము లేదనీ, ముస్లీమ్ మతములో ఎంతో గొప్ప జ్ఞానమున్నదని
తెలిసి మేము ముస్లీమ్గా మారిపోయామని” అసత్యమును చెప్పుచూ
హిందువుల దృష్టిని తమ మతమువైపు త్రిప్పుకొంటున్నారు. అందరికీ
తెలియునట్లు తమ జ్ఞానమును ప్రచారము చేయుచూ, అక్కడక్కడ వారి
సంఘము పేరుతో బహిరంగసభలు ఏర్పాటు చేసి, అక్కడ ఖుర్ఆన్
జ్ఞానమునేకాక వారికి అనుకూలముగాయున్న మిగతా మతములలోని
జ్ఞానమును కూడా శ్లోకముల రూపములో, పద్యముల రూపములో వర్ణించి
చెప్పుచూ, వారికి వారి మతజ్ఞానమేకాక మిగతా మత జ్ఞానములు కూడా
సంపూర్ణముగా తెలిసినట్లు కనిపించుచూ, ఆ వీడియోలను విదేశీ
ముస్లీమ్లకు పంపుచూ, తమ సంస్థకు కావలసిన ఆర్థిక సహాయమును
పొందుచుందురు. ఇది ముస్లీమ్ పెద్దలమనీ, ముస్లీమ్ పండితులమనీ,
ఖుర్ఆన్ పండితులమని చెప్పుకొనుచూ బయట అందరితో సంబంధము
పెట్టుకొని తమ మతమును ప్రచారము చేయడము ఒక కోణముకాగా,
తమ మతమును పెంచుకోవడమే కాక ఇతర మతముల సంఖ్యను
తగ్గించడము మరియొక కోణముగా యున్నది. ఆ విషయము తర్వాత
ప్రస్థావనకు తీసుకవస్తాము. ఇప్పుడు తమ మతజ్ఞాన ప్రచారములో కొన్ని
ముస్లీమ్ సంఘములు చేయు ఆర్భాటములను గురించే చెప్పుచున్నాము.
ఈ విషయములను మేము చెప్పుచుండుటను చూచి కొందరు
హిందువులే మమ్ములను ఒక ప్రశ్న అడుగవచ్చును. అది ఏమనగా!
ఎవరి మతమును గురించి వారు చెప్పుకొను స్వతంత్రము వారికున్నది

కదా! భారతరాజ్యాంగము ఇచ్చిన ప్రాథమిక హక్కు ప్రకారము ఎవరు
ఏమయినా మాట్లాడవచ్చును. వారి మతమును గురించి వారు గొప్పగా
వారి సభలలో చెప్పుకోవచ్చును. వారి మతమును పెంచుకొనుటకు వారి
గ్రంథమును గురించి చెప్పుకోవచ్చును. మనము వారి మాట వినకుండా
పోతే సరిపోతుంది కదా! అట్లుకాకుండా వారిని మీరు ఎందుకు
విమర్శించుచున్నారని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా
కలదు. ఎవరి మతమును గురించి వారు చెప్పుకోవడము తప్పుకాదు.
అట్లే వారిదని చెప్పుకొను ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానమును గురించి
చెప్పుకొనినా తప్పులేదు. లోపల ఏదో దురుద్దేశ్యమును పెట్టుకొని చెప్పడము
తప్పు అంటున్నాము. దేవుడు ప్రజలందరికీ మూడు దైవగ్రంథములను
ఇచ్చాడు. నేడు మూడు మత గ్రంథములుగా చెప్పుకొను వాటిలో మతముల
ప్రసక్తేలేదు. మూడు దైవగ్రంథములు సమస్త మానవాళికీ సంబంధించిన
వని ఖుర్ఆన్ గ్రంథములో సూరా 81, ఆయత్ 27లో కలదు. ప్రత్యేకించి
ఖుర్ఆన్ గ్రంథమును గురించి అక్కడ కలదు. అటువంటప్పుడు ఖుర్ఆన్ న్ను
ఒక మతమునకు పరిమితి చేసి ఇది మా గ్రంథమని ముస్లీమ్ సంఘముల
వారు చెప్పడమును మేము వ్యతిరేఖిస్తున్నాము.

ఒక కుటుంబములో పదిమంది కొడుకులున్న తండ్రి, తన
కొడుకులకు మూడు వజ్రములు పొదిగిన బంగారు హారమును ఇస్తే,
కొడుకులలో ఒకడు ఇది నాదేయని హారములోని వజ్రమును లాగివేసు
కొంటే మిగతా కొడుకులు ఒప్పుకొంటారా? అది అందరికీ చెందవలసి
నదేయని అంటారు. అదే విధముగా దేవుడిచ్చిన దైవగ్రంథములో ఒక
భాగముగాయున్న అంతిమ దైవగ్రంథములోని జ్ఞానము మానవులందరిదే
కానీ ముస్లీమ్లదొకరిదే కాదు అంటున్నాము. ముస్లీమ్లు మాట్లాడేదంతా
మనము వింటూవుంటే దేవుడు వారికే జ్ఞానమిచ్చాడు, మిగతావారికి ఎవరికీ
జ్ఞానము ఇవ్వలేదు అనుటకు సిద్ధముగాయున్నారు. అందువలన వారు
చెప్పు అసత్యములను ముందే మేము ఖండించుచున్నాము. వారు
చెప్పేదంతా వింటూవుంటే చివరకు మమ్ములను మీకు జ్ఞానము తెలుసా?
అని ప్రశ్నించుచున్నారు. అలా వారు మమ్ములను అడిగినప్పుడు కూడా
మౌనముగా, ఉంటే ఆకాశములో విమానములను హైజాక్ చేసినట్లు
భూమిమీద మతములన్నిటినీ హైజాక్ చేయగలరు. అందువలన
మమ్ములను ప్రశ్నించిన వారిని మేము కూడా ప్రశ్నించుచున్నాము. ఈ
మధ్య కాలములో శ్రీకాకుళములో గల ఒక ముస్లీమ్ తనకు జ్ఞానము
తెలుసునను గర్వముతో మమ్ములను ప్రశ్నించడము జరిగినది. మమ్ములను
అంటే ప్రత్యేకించి నన్ను కాదుగానీ, మా శిష్యులుగా చెప్పుకొను వారిని
ప్రశ్నించడము, తమతో బహిరంగ చర్చకు రమ్మని పిలువడము జరిగినది.
చర్చలో తమతో ఓడిపోతే మీ హిందూమతమును వీడి ఇస్లామ్ మతములో
చేరమనడము కూడా జరిగినది. మా తరపున చెన్నైనుండి 'ఖుదా ఇస్లామిక్
స్పిరిచ్యువల్ సొసైటీ' నుండి ఒక ముస్లీమ్ మాట్లాడితే అతనిని కూడా
బహిరంగ చర్చకు రమ్మని, చర్చలో ఓడిపోతే వారిచెప్పుతోనే వారు
కొట్టుకోవలెనని చెప్పడము జరిగినది. దానికి మావారు నీవు చర్చలకు
పిలిస్తే మేము ఎందుకు రావాలి? అని ప్రశ్నించారు. అంతేకాక నీవు
పెట్టిన నియమాలకు మేము ఎందుకు ఒప్పుకోవాలి? అని ప్రశ్నించారు.
నీకు మాతో మాట్లాడాలి అని వుంటే సర్వసాధారణముగా మాట్లాడి ఒకరి
భావములు ఒకరు చెప్పుకోవచ్చును గానీ, పోటీకి రావడము ఓడడము
గెలువడము మాకు సరిపోదని చెప్పారు. అంతేకాక ఫలానా రోజు
మేము మీవద్దకు వచ్చి మాట్లాడతాము అప్పుడు నీవు అడిగిన ప్రశ్నలకు

మాకు తెలిసిన సమాధానము చెప్పుతాము. అట్లే మేము అడిగిన ప్రశ్నలకు
మీరు కూడా జవాబు చెప్పండి. అంతేగానీ పంతాలకు పట్టింపులకు
మేము ఎక్కడికీ పోము, ఎక్కడికీ రాము అని చెప్పారు. అప్పుడు అతను
చెప్పిన దినమున శ్రీకాకుళమునకు పోయి ఉదయమునుండి సాయంకాలము
మూడుగంటల వరకు కాచుకొని, ఆయనతో మాట్లాడి వచ్చారు. మమ్ములను
చర్చకు పిలిచినందుకు శ్రీకాకుళమునకు దగ్గరగాయున్న విజయనగరము,
వైజాగ్ మరియు శ్రీకాకుళము వారు ఆయనతో మాట్లాడుటకు పోయారు.
పోయిన వారు దాదాపు పదిమంది కాగా వారిలో ఇద్దరు ముస్లీమ్లు
కూడా యున్నారు. మిగతావారు హిందువులు పోవడము జరిగినది.

అక్కడికి పోయిన తర్వాత మా వారిని పిలిచిన ఆయన
స్థానికముగా ఒక ఇస్లామ్ సంస్థను నడుపు వ్యక్తి అని తెలిసినది. మేము
విజయనగరమునుండి, వైజాగ్నుండి, శ్రీకాకుళము నుండి కూడా వచ్చిన
వారమని మావారు చెప్పిన తర్వాత ఒకరికొకరు పరిచయము తర్వాత
మాట్లాడుటకు మొదలు పెట్టారు. మావారిని పిలిచిన వ్యక్తి వయస్సు
దాదాపు 35 సంవత్సరములు ఉండవచ్చును. అతనితో పాటు పదిమంది
దాదాపు అదే వయస్సున్న ముస్లీమ్లు కూడా అక్కడ పాల్గొనడము జరిగినది.
వారి మాటలు క్రింది విధముగా సాగినవి. మాటల సందర్భములో
కొన్నిమార్లు అతను రెచ్చిపోయి మాట్లాడినా మావారు నెమ్మదిగా
మాట్లాడడము జరిగినది. అక్కడున్న మిగతా ముస్లీమ్లు అతనినే
నిదానముగా మాట్లాడమని చెప్పడము కూడా జరిగినది.

మావారు :- మేము “ఇందూ జ్ఞానవేదిక”లో పనిచేయు సభ్యులము కొంత
మంది, "ప్రబోధ సేవాసమితి”లో పనిచేయు వారము కొంతమంది
ఉన్నాము. అట్లే ఇక్కడికి మాతోపాటు వచ్చిన ముస్లీమ్ సోదరులు ఇద్దరు
“ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ" తరపున వచ్చారు. మీరు మా
ఇస్లామిక్ సంస్థనుండి వచ్చిన "అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు"
అను గ్రంథము చూచి అందులో చాలా తప్పుగా వ్రాశారని మీరు
మద్రాసులోయున్న మా “ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సోసైటీ" సభ్యులను
ఫోన్లో దండించారని తెలిసింది. తర్వాత మీరు మాతో మాట్లాడమని
చెప్పగా ఇప్పుడు మేము మాట్లాడి మా భావములు తెల్పుటకు మాత్రమే
వచ్చాము. మేము మీతో పోటీగా మాట్లాడుటకు రాలేదు. ఇతరులతో
పోటీగా మాట్లాడడము మా సంస్థలలో ఎవరికీ సరిపోదు. అందువలన
మీరు “అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు" అను గ్రంథములో మీకు
నచ్చని వివరము ఏమున్నదో చెప్పండి.

ముస్లీమ్ :- “అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు" అను గ్రంథమును
మేము చూచాము. అందులో చాలా తప్పులున్నట్లు మేము గ్రహించాము.
ఈ గ్రంథమును ప్రచురించిన వారు “ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ"
వారయితే వ్రాసినది ఒక హిందువయిన ప్రబోధానంద యోగీశ్వరులు.
ఆయన ఒక హిందువైయుండి ముస్లీమ్ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథమును
ఎలా వ్రాయగలడు? అలా ఇతర మత గ్రంథమును గురించి చెప్పుటకు
ఆయనకు ఏమి అధికారమున్నది? ఆయన హిందూ గ్రంథమయిన
భగవద్గీతను వ్రాసుకోవచ్చునుగానీ, మా గ్రంథమును ఎందుకు వ్రాశాడని
మేము అడుగుచున్నాము. దీనికి మాకు మీరు సమాధానము చెప్పవలసి
యుంటుంది.

మావారు :- 'ముస్లీమ్ల గ్రంథమును హిందువు వ్రాయకూడదని
మీరన్నప్పుడు హిందూ గ్రంథములను ముస్లీమ్లు ఎలా ప్రస్తావించి
వ్రాశారు?” అని మేము కూడా అడుగగలము. "సృష్ఠిని కాదు సృష్ఠికర్తనే
ఆరాధించండి" అను పేరుతో ముస్లీమ్లు ఒక చిన్న గ్రంథమును వ్రాసి
అందులో భగవద్గీత శ్లోకములు మొదలుకొని, వేదముల వాక్యములు,
ఉపనిషత్తుల మంత్రములను కూడా వ్రాసి వాటికి వివరమును చెప్పారు.
ఇప్పుడు మీరు అడిగినట్లు మేము మా హిందువుల గ్రంథములను గురించి
మీరెందుకు వ్రాశారు? మీకు అలా వ్రాయుటకు ఏమి అధికారమున్నది?
అని మేము అడుగగలము. అయితే మేము అలా అడుగము. మీరు మా
భగవద్గీతను, వేదములను, ఉపనిషత్తులను వ్రాయడమేకాక, క్రైస్తవ
మతమువారు మా గ్రంథమని చెప్పుకొను బైబిలును గురించి కూడా
వ్రాశారు. మీరయితే ఇతర మత గ్రంథములను గురించి వ్రాయవచ్చు,
చెప్పవచ్చు, మేమయితే మీ దానిని గురించి వ్రాయకూడదు,
మాట్లాడకూడదా! ఇది మేము మిమ్ములను అడుగవలసిన ప్రశ్నే, అయినా
కానీ మేము మిమ్ములను ఏమాత్రము ఎక్కడా అడుగలేదు. మీరు
మమ్ములను ప్రశ్నించినా మేము మిమ్ములను తిరిగి అడుగక పోవడానికి
మాకు ఏమీ తెలియదని అనుకోవద్దండి. మేము దేవుడు చెప్పిన
ధర్మములకు, వాక్యములకు విరుద్ధముగా ఎక్కడా ప్రవర్తించము మరియు
మాట్లాడడము అంతేకాక భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు
గ్రంథములూ సాధారణ గ్రంథములుకాదనీ, అవి మూడు దైవగ్రంథములని
మేము అంటున్నాము. మూడు దైవగ్రంథములలో దేనియందుగానీ ఇది
ఫలానా మతమునకు సంబంధించిన గ్రంథమని ఎక్కడా దేవుడు చెప్పలేదు.
అంతిమ దైవగ్రంథమని పేరుపెట్టబడిన ఖుర్ఆన్ గ్రంథములో సూరా
81, ఆయత్ 27లో (81-27) “ఇది సర్వలోకవాసులకు హితోపదేశము"
అని ఉన్నదిగానీ కేవలము ముస్లీమ్లకు మాత్రమే చెప్పిన జ్ఞానమని లేదు.
అందువలన ఖుర్ఆన్ సమస్త జనులకు సంబంధించిన గ్రంథమని
అనుకొంటున్నాము. అంతేకాదు మిగతా రెండు గ్రంథములయిన బైబిలు,
భగవద్గీత కూడా మనుషులకు అందరికీ సంబంధించిన గ్రంథములని
చెప్పబడియున్నవి. ఏ గ్రంథము ఏ మతమునకూ సంబంధించినదికాదు.
ఎవడయినా ఫలానా గ్రంథము ఫలానా మతమునకు సంబంధించినది
అ అంటే వారు దైవగ్రంథమునకు, దేవునికి వ్యతిరేఖముగా
మాట్లాడినట్లగును. ఖుర్ఆన్ మా గ్రంథమని మీరు దేవుని మాట అయిన
అంతిమ దైవగ్రంథములోని 81వ సూరాకు, 27వ ఆయత్కు వ్యతిరేఖముగా
మాట్లాడినా, మేము మాత్రము భగవద్గీత మాగ్రంథమని మాట్లాడము.
మూడు గ్రంథములు సర్వమానవాళికీ సంబంధించిన గ్రంథములయిన
దానివలన మాకు వాటిని గురించి మాట్లాడు హక్కు, అధికారముందను
ఉద్దేశ్యముతో మా గురువుగారయిన యోగీశ్వరులు "అంతిమ దైవగ్రంథములో
జ్ఞాన వాక్యములు" వ్రాశారు.

ముస్లీమ్ :- ఖుర్ఆన్ సర్వమానవాళికీ చెప్పిన గ్రంథమే మేము కాదనడము
లేదు కదా! అరబ్బీ భాషరాని వారు మా గ్రంథమును ఎలా వ్రాశారు.?
అరబ్బీ భాష తెలిసియుంటేనే ఆయత్లకు వివరము చెప్పగలరు. అదియూ
గాక ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలోనే చదవాలి, అరబ్బీ భాషలోనే
వ్రాయాలి అని నియమము మా ముస్లీమ్ సమాజములో కలదు. దానిని
కాదని మీరు తెలుగులో వ్రాసినా మేము ఎవరమూ చదువము, ఏ ముస్లీమ్
అయినా అరబ్బీ భాషలోనే ఖుర్ఆన్ గ్రంథమును చదవాలి. అప్పుడయితేనే
వాక్యముల యొక్క భావము మారకుండా ఉంటుంది. ఇలా తెలుగులో
అదియూ అరబ్బీ భాష తెలియనివారు వ్రాయుట వలన ఖుర్ఆన్

గ్రంథములో భావము మారిపోవును. దేవుడు చెప్పినది సరిగా అర్థము
కాకుండా పోవును. అందువలన ఇతరులు ఖుర్ఆన్ గ్రంథమును
వ్రాయకూడదు. ముస్లీమ్లో వ్రాయాలి. మమ్ములను (ముస్లీమ్లను)
సంప్రదించకుండా ఎవరూ ఖుర్ఆన్ గ్రంథము వ్రాయకూడదు. ఒకవేళ
వ్రాయాలి అనుకొంటే మా అనుమతి తీసుకొని వ్రాయవలెను. అందువలన
మీరెందుకు వ్రాశారు? ఎవరి అనుమతితో వ్రాశారు? ఏ అధికారముతో
వ్రాశారని అడుగుచున్నాము.

మావారు :- మీరు “భగవద్గీతలోని శ్లోకాలకు వివరమును వ్రాసినప్పుడు
హిందువుల అనుమతిని తీసుకొని వ్రాశారా? వేదాలు, ఉపనిషత్తుల
మంత్రములకు భావములను వ్రాసినప్పుడు ఎవరి అనుమతి తీసుకొని
వ్రాశారు?” అని మేము కూడా అడుగవచ్చునని ముందు ప్రశ్నలోనే
చెప్పాము. దేవుని గ్రంథము అందరికీ సంబంధించినదేయని దానికి
ఎవరి అనుమతి అవసరము లేదని కూడా చెప్పాము. ఇప్పుడు క్రొత్తగా
అరబ్బీ భాషను అడ్డము పెట్టుకొని అరబ్బీ భాషలోనే వ్రాయాలి కదా!
అరబ్బీ భాష వచ్చిన వారే వ్రాయాలి కదా! అని అడుగుచున్నారు. దానికి
బదులుగా ముస్లీమ్లు భగవద్గీత శ్లోకముల వివరములు వ్రాసినవారు
సంస్కృతమును నేర్చినవారాయని అడుగుచున్నాము. మీరు అడిగారని
మేము అదే పద్ధతిలో అడగడము సరియైన పద్ధతి కాదు. మేము ఏ
జవాబు చెప్పినా దైవగ్రంథమును ఆధారము చేసుకొనే చెప్పుతాము. దేవుడు
మొదట జ్ఞానము చెప్పినప్పుడు వినే మనిషి ఏ భాష తెలిసియున్నాడో, ఏ
భాషవాడో ఆ భాషలోనే జ్ఞానమును చెప్పాడు. ఐదువేల (5000)
సంవత్సరముల పూర్వము కృష్ణుడు భగవంతుడుగా వచ్చినప్పుడు హిందీ
భాషలోనే అర్జునునికి జ్ఞానమును చెప్పాడు. రెండువేల (2000)

సంవత్సరముల పూర్వము ఏసు వచ్చినప్పుడు ఆ ప్రాంతీయభాషలోనే
అక్కడి ప్రజలకు తన బోధను చెప్పాడు. 1400 సంవత్సరములప్పుడు
జిబ్రయేల్ భూమి మీదికి వచ్చి ముహమ్మద్ ప్రవక్తకు జ్ఞానమును
తెలియజేసినప్పుడు అక్కడి ప్రాంతీయ భాషయైన అరబ్బీ భాషలోనే
చెప్పిపోయాడు. ఈ విధముగా గతములో జరిగియుండగా ఖుర్ఆన్
గ్రంథమును అరబ్బీ భాషలోనే వ్రాయాలని అరబ్బీ భాషలోనే చెప్పాలనీ,
అరబ్బీ భాషలోనే చదవాలని దానిని చెప్పిన జిబ్రయేల్గానీ, దేవుడు తన
వాక్యముగాగానీ ఎక్కడా చెప్పలేదు. అటువంటప్పుడు అరబ్బీ భాషకు
దేవుని జ్ఞానమునకు సంబంధమేమి? అని అడుగుచున్నాము. అంతెందుకు
అదే ఖుర్ఆన్ గ్రంథములో 14వ సూరాలో, 4వ ఆయత్నందు ఇలా
చెప్పి యున్నాడు. (4-4) “మేము ఏ ప్రవక్తను పంపినా అతను
విషయమును స్పష్ఠముగా విడమరచి చెప్పడానికి వీలుగా వినే
ప్రజలు మాట్లాడే భాషలో చెప్పగలిగే వానిగా చేసి పంపాము.
ఆ పైన అల్లా తాను కోరినవారిని అపమార్గము పట్టిస్తాడు.
తానుకోరిన వారికి సన్మార్గము చూపిస్తాడు. ఆయన (దేవుడు)
సర్వాధిక్యుడు, వివేకవంతుడు" దైవగ్రంథములోని దేవుని వాక్యమైన
ఈ ఆయన్ను చూచిన తర్వాత అరబ్బీ భాషలోనే చదవాలి, వ్రాయాలి
అనుటలో అర్థములేదు. మీరు ఒక ముస్లీమ్ అయివుండి, ఒక ఆధ్యాత్మిక
సంస్థను స్థాపించినవారుగాయుండి మాట్లాడడము మీకు తగునా!యని
అడుగుచున్నాము. మీరు మాట్లాడిన విధానము దేవుని వాక్యమునకు
భంగము కలిగించునదిగాయున్నది. ఖుర్ఆన్లోని (14-4) వాక్యమును
అగౌరవపరచునట్లున్నది. అందువలన వాక్యము చివరిలో దేవుడు ప్రత్యేకించి

ఒకమాట చెప్పాడు. అది “అల్లా తాను కోరినవారిని అపమార్గము
పట్టిస్తాడు” అని హెచ్చరించి చెప్పాడు. ఆ మాటలోని అర్థము ప్రకారము
దేవునిమాటను లెక్కచేయక తమకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడు వారికి
అపమార్గము తప్పదని తెలియుచున్నది. మీరు ఖుర్ఆన్ను చదవని వ్యక్తులు
కూడా కాదు. ఖుర్ఆన్ గ్రంథమును చదివి కూడా అరబ్బీ భాషను గురించి
మాట్లాడడము మంచిదా!యని అడుగుచున్నాము.

అరబ్ దేశములో అరబ్బీ మాట్లాడుదురు. అందువలన మొదట
అక్కడ భాషలోనే ఖుర్ఆన్ జ్ఞానము చెప్పబడినది, తర్వాత వ్రాయబడినది.
ఆ ప్రాంత భాష అరబ్బీ భాష అయిన దానివలన దేవుడు పంపిన జిబ్రయేల్
అరబ్బీ భాషలోనే జ్ఞానమును చెప్పాడు. అదే జ్ఞానము తర్వాత ఏ ప్రాంతము
లోనికిపోతే అక్కడివారు తెలిసిన ఆ ప్రాంత భాషలోనే మాట్లాడవలసి
యుంటుంది. దానికి తార్కాణము ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన 14-4
వాక్యమేయని చెప్పవచ్చును. దైవగ్రంథములోని దేవుని వాక్యమును
అనుసరించి ఇక్కడి ప్రజలు తెలుగు భాష తెలిసినవారయినందున మా
గురువుగారు ఇక్కడి వారికి అర్థమగునట్లు తెలుగు భాషలోనే వ్రాయడము
జరిగినది. “ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ" అను పేరుగల సంస్థవారు
వచ్చి మా గురువుగారితో కలిసి మీరు "భగవద్గీతను "త్రైత సిద్ధాంత
భగవద్గీత” అను పేరుతో వివరించి వ్రాశారు. ఇంతవరకు ఎందరో
వ్రాసిన భగవద్గీతలకంటే మీరు వ్రాసిన వివరము చాలా బాగుంది.
ఇంతవరకు ఎవరికీ తెలియని జ్ఞాన రహస్యములను తెలియజెప్పారు. అలాగే
ఖుర్ఆన్ గ్రంథమును కూడా మీరు వివరించి వ్రాసి, అందులో ఇంతవరకూ
తెలియకుండా దాగియున్న జ్ఞానమును తెలియచెప్పగలరని అడుగు
చున్నాము. మీరు ఖుర్ఆన్ గ్రంథమును వివరించి వ్రాస్తే మీ మీద
నమ్మకమున్న హిందువులు కూడా ఖుర్ఆన్ గ్రంథమును చదువగలరు”
అని అడిగారు. అప్పుడు మా గురువుగారు ముస్లీమ్ల కోరిక మేరకు
ఖుర్ఆన్ గ్రంథమునంతటినీ వ్రాయక మనిషికి అవసరమైన వాక్యములకు
(ఆయత్లకు) మాత్రము వివరమును వ్రాస్తానని చెప్పాడు. అదేమాట
ప్రకారము కొన్ని వాక్యములకు మాత్రమే వివరమును వ్రాసి “అంతిమ
దైవగ్రంథములో జ్ఞానవాక్యములు" అను పేరుతో గ్రంథమును విడుదల
చేశారు. మా గురువుగారు ముస్లీమ్ సంస్థవారు అడిగినందుకు గ్రంథమును
వ్రాయుట వలన ఆ ముస్లీమ్ సంఘమువారే ఆ గ్రంథమును ప్రచురించారు.
మా గురువుగారయిన యోగీశ్వరులు వ్రాయడము వలన ముస్లీమ్లకంటే
హిందువులే ఎక్కువగా చదువడము జరిగినది. ఇంతవరకు చదివిన
హిందువులు ఖుర్ఆన్ గ్రంథములో ఇంతపెద్ద జ్ఞానరహస్యములున్నాయా?
అని ఆశ్చర్యపోవుచున్నారు. ఇంతవరకు ఖుర్ఆన్ గ్రంథమును గురించి
తెలియని హిందువులందరికీ ఖుర్ఆన్ గ్రంథముయొక్క గొప్పతనము
తెలిసిపోయినది. మీ ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథమును గురించి ఇంతవరకు
హిందువులకు తెలుపలేకపోయిన సమాచారమును ఇప్పుడు మా గురువు
గారు తెలుపడమైనది. మా గురువుగారు చేసిన పనికి ఎందరో ముస్లీమ్లు
సంతోషిస్తూవుంటే దానికి వ్యతిరేఖముగా మీరు మాట్లాడుచున్నారు. మా
గురువుగారివద్దకు అన్ని మతములవారు వచ్చి తమ గ్రంథములో తెలియని
జ్ఞానమును తెలుసుకోగలుగుచున్నారు. మా గురువుగారు ఒక్క హిందూ
మతములోని ప్రజలకేగాక మూడు మతములవారికీ జ్ఞానమును
తెలియజెప్పుచున్నారు. ఆయన అన్ని మతములూ నాకు సమానమే, అన్ని
మతములు నావే అని అంటున్నాడు అందువలన అన్ని మతములవారు

వచ్చి సంతోషముతో జ్ఞానమును అడిగి తెలుసుకొంటున్నారు, మీరేమో
అసూయతో మాట్లాడుచున్నారు.

ముస్లీమ్ :- మీరు మీ గురువును గురించి గొప్పగా మాట్లాడవచ్చును.
కొంత తెలిసినంతమాత్రమున అంతా తెలియుననుకోవడము పొరపాటు.
మీ గురువుగారు వ్రాసిన ఖుర్ఆన్లో జ్ఞానవాక్యములను గ్రంథములో
దేవుడు మనిషిగా వచ్చి పుట్టునని వ్రాశారు. దేవుడు మనిషిగా పుట్టునను
మాట పూర్తి అసత్యము, అజ్ఞానము. మా ముస్లీమ్ సమాజము ఈ మాటను
ఏమాత్రము ఒప్పుకోదు. భగవద్గీతలో కూడా దేవుడు చావుపుట్టుకలు
లేనివాడు అని యున్నది. మీకు తెలియకపోతే భగవద్గీతలో జ్ఞానయోగమను
అధ్యాయమున ఆరవ శ్లోకములో ఈ మాట చెప్పియున్నాడు.

అజోలి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవా మ్యాత్మమాయయా॥

ఈ శ్లోక భావములో “జీవరాసులకు దేవుడనైన నేను చచ్చువాడను
కాను పుట్టువాడను కాను. ప్రకృతితో కూడి నా ఆత్మ పుట్టుచున్నది” అని
చెప్పాడు. ఈ శ్లోకములో నా ఆత్మ పుట్టుచున్నది అన్నాడుగానీ నేను
పుట్టుచున్నానని చెప్పలేదు కదా! నాకు పుట్టుక లేదని కూడా చెప్పాడు
కదా! అటువంటప్పుడు మీరు అన్నీ తెలిసిన వారివలె దేవుడు వచ్చి
మనిషిగా అవతరిస్తాడని ఎలా చెప్పారు? ఇంత ఘోరముగా అజ్ఞానమును
బోధిస్తూ మేము అన్ని మతాలకు జ్ఞానమును చెప్పుచున్నామంటారా?
దేవుడు మనిషిగా పుట్టునని చెప్పడము చిన్న విషయముగాదు.
విషయమును మేము సులభముగా వదలము, మిమ్ములను కోర్టుకయినా
లాగి మీ చేత తప్పు అని ఒప్పిస్తాము. ఈ విషయములో మేము ఏమాత్రము
ఈ

ఒప్పుకోము. మిమ్ములనందరినీ బయటకు లాగి అందరిచేత మిమ్ములను
అజ్ఞానులని నిరూపిస్తాము.

మావారు :- మీరు నిదానముగా మాట్లాడండి, ఎందుకు అంత ఆవేశ
పడుచున్నారు! మేమూ మీవలె గట్టిగా అరవగలము, మేము ఇక్కడికి గట్టిగా
అరిచేదానికి రెచ్చిపోయి మాట్లాడేదానికి రాలేదు. నెమ్మదిగా మీరు అడిగే
ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చాము. మీకు జవాబు చెప్పవలసిన
అవసరము కూడా మాకు లేదు. మీరు కోర్టుకు పోతానంటే పోండి.
మీరు ఒక కేసు పెట్టితే మేము మీ మీద ఇరవై కేసులు పెట్టగలము.
అప్పుడు అక్కడున్న మిగతా ముస్లీమ్లు కూడా ఆయనను చిన్నగా
మాట్లాడమని చెప్పి సవరించారు. అప్పుడు తిరిగి మేము కూడా నెమ్మదిగా
మాట్లాడుచూ వచ్చాము. మీరు భగవద్గీత శ్లోకమును చెప్పి దానికి అర్థము
చెప్పారు. దానికి మేము ఒప్పుకుంటాము. మాకంటే మీరే శ్లోకమును
బాగా చెప్పారు. అయితే మీకు అనుకూలముగా శ్లోకము యొక్క భావమును
చెప్పారు. దేవుడు ఆత్మ జన్మించుచున్నదని చెప్పాడుగానీ నేను పుట్టుతానని
చెప్పలేదు కదా!యని అడిగారు. మీరు చెప్పినమాటను మేము కాదనము.
దేవుడు చెప్పిన దానిని మనము సరిగా అర్థము చేసుకోలేక
పోవుచ్చును గానీ, దేవుడు మాత్రము ఎప్పుడు చెప్పినా ఒకే జ్ఞానమును
చెప్పును. ఒక్కొక్కచోట ఒక్కొక్క మాటను మాట్లాడడు. అదే భగవద్గీతలో
రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయమున పదకొండవ శ్లోకమున
చెప్పిన మాటను ఒకమారు చూస్తాము.

అవజానన్తి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్ ।
పరంభావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ॥

భావము :- “సర్వ జీవరాశులకు దేవుడనైన నన్ను నా మహత్యమును
తెలియని మూఢులు మానవ శరీరమును ధరించియున్న నన్ను
అవమానించుచున్నారు.” ఇక్కడ ఈ శ్లోకములో “మానుషీం తను
మాశ్రితమ్” అని మానవ శరీరమును ధరించిన అని స్పష్టముగా
చెప్పినప్పటికీ దేవుడు మనిషిగా రాడు అని చెప్పడములో అర్థములేదు,
ఎవరయినా తెలియని అజ్ఞానులు ఆ మాటను అనవచ్చునుగానీ అంతో
ఇంతో జ్ఞానము తెలుసు అనువారు దేవుడు మనిషిగా పుట్టడు అంటే
ఎలాగ మనకు జ్ఞానమున్నట్లు? దేవుని వాక్యమును మనమెలా
తెలుసుకొన్నట్లు? “మనిషి దేవుడు కాలేడు గానీ, మనిషిగా దేవుడు
రావచ్చును” అని మా గురువుగారు చాలామార్లు చెప్పారు. ఈ శ్లోకములో
దేవుడు స్వయముగా "నేను దేవుడనై యున్నప్పటికీ మనిషి
శరీరమును ధరించిన నన్నుగానీ, నా మహత్యమునుగానీ
తెలియని మూఢులు నన్ను అవమానించుచున్నారు” అని అన్నాడు.
అంతకుముందు మీరు చెప్పిన జ్ఞానయోగములోని శ్లోకములో నేను పుట్టలేదు
ఆత్మ పుట్టుచున్నదని దేవుడు చెప్పినట్లు చెప్పారు. ఇక్కడ శ్లోకములోని
జ్ఞానమును అర్థము చేసుకోవడములో మీరు తప్పటడుగు వేశారని మేము
చెప్పుచున్నాము. దేవుడు ఎప్పుడయినా ఒకేమాటను చెప్పుతాడుగానీ,
ఒక్కొక్క చోట ్క జ్ఞానమును చెప్పడు. అటువంటి అవసరము
ఆయనకు లేదు.

శ్లోకములో 'అజోపి' అన్నప్పుడు దేవునికి పుట్టుక లేదని తెలిసినది.
ప్రక్కనే 'సన్నవ్యయాత్మ' అన్నప్పుడు దేవునికి చావు కూడా లేదని తెలిసినది.
అక్కడ “దేవునికి మనిషివలె చావు పుట్టుకలు లేవు” అని చెప్పినమాట

వాస్తవమేయనీ మేము కూడా చెప్పుచున్నాము. దేవుడు అక్కడ ఏమి
చెప్పాడో బాగా గ్రహించవలసియున్నది. మనుషులకున్నట్లు తనకు
చావుపుట్టుకలు లేవు అనీ అలా ఎందుకు లేవు అంటే జీవరాశులకన్నిటికీ
నేనే దేవుడను అని చెప్పడము జరిగినది. ఇది పై వాక్యములో చెప్పి
శ్లోకము యొక్క క్రింది వాక్యములో 'ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా
ఆత్మమాయయా' అని కూడా అన్నాడు. అలా అనడములో నేను నా
ప్రకృతిని అధిష్ఠించి సంభవించుచున్నాను అని చెప్పడము జరిగినది.
శ్లోకములో ఆత్మయని చెప్పబడినది కదా! ఆత్మ పుట్టుచున్నది అని
చెప్పాడుగానీ, నేను పుట్టానని చెప్పలేదు కదా!యని మీరుగానీ, మీలాంటి
మరికొందరు గానీ అనవచ్చును. దానికి మేము చెప్పు వివరమేమనగా!
“దేవుడు సర్వసాధారణ మనుషులవలె పుట్టను మరియు చావను”
అని చెప్పాడు. అంతేగానీ మానవ శరీరమును ధరించి రానని ఎక్కడా
చెప్పలేదు. 'మనిషికున్నట్లు దేవునికి పుట్టుక లేదు' అని మేము కూడా
మొదటినుండి చెప్పుచున్నాము. అయితే దేవుడు మనిషి శరీరమును
ధరించి వస్తుండడము నూటికినూరుపాళ్ళు సత్యము. ఇక్కడ
మేము రెండు విధముల మాట్లాడినట్లు కనిపించినా మీకు అలా
అనిపించుచున్నదిగానీ, మీరు అనుకొన్నట్లు మేము రెండు విధముల
మాట్లాడలేదని చెప్పుచున్నాము.

ఇక్కడ మనిషి తన బుద్ధిని ఉపయోగించి దేవుడు చెప్పిన జ్ఞానమును
గ్రహించవలసియున్నది. దేవుడు చెప్పినప్పటికీ దానిని అర్థము చేసుకొను
స్థోమత లేకున్నా, ఎదుటి వానిలోని జ్ఞానమును అంచనా వేయలేక గ్రుడ్డిగా
నాకే తెలుసు మీకు తెలియదని గట్టిగా అరచినా ఏమీ ప్రయోజనము
లేదు. గట్టిగా మాట్లాడినవాడు బయటి ప్రజల దృష్ఠిలో జ్ఞానిగా చలామణి
కావచ్చునుగానీ, దేవుని దృష్ఠిలో వాడు అజ్ఞానిగానే మిగిలిపోవును. దేవుడు
రాజవిద్యా రాజగుహ్య యోగములో చెప్పిన శ్లోకము ప్రకారము మానవ
శరీరమును ధరించి పుట్టడము వాస్తవమే. అయితే 'దేవుడు మనిషి
పుట్టునట్లు పుట్టడు' అని మాత్రము చెప్పవచ్చును. ఎవరికీ అర్ధముగాని
సమస్య ఇక్కడే యున్నది. అందువలన దీనిని 'దేవుని జ్ఞానము' అని
అన్నాము. దేవుడు కూడా నాకు ఇష్టమైన వానిని సక్రమమైన మార్గములో
పంపుదును అని అనడమేకాక, నాకు ఇష్టములేని వానిని తప్పుదారిలో
అజ్ఞాన బాటలో పంపుదును అనికూడా చెప్పాడు. ఇక్కడే ప్రతి మనిషికీ
అజ్ఞాన బాటయో లేక జ్ఞాన బాటయో నిర్ణయము కాగలదు.

దేవుడు కొందరిని అజ్ఞాన దారిలో, కొందరిని జ్ఞాన దారిలో
ఎందుకు పంపుచున్నాడు? దేవునికి కూడా ఇష్టాయిష్టములుండునా, దేవునికి
అందరూ సమానులు కాదా!యని కొందరు అడుగవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా! దేవుడు సర్వజీవరాశులకు సమానముగాయున్నాడు.
సర్వమానవులకు సమానముగాయున్న దేవుడు తనకు స్వంతముగా ఇష్ట
అయిష్టములంటూ ఏవీ లేవు. అయితే మనిషి భావమునుబట్టి ఆయనలో
ఇష్టము అయిష్టము ఉండును. మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును
అర్థము చేసుకోగలిగితే అతడు దేవునికి ఇష్టుడయిపోవును. ఒకవేళ మనిషి
దేవుడు చెప్పిన జ్ఞానమును సరిగా అర్థము చేసుకోలేకపోతే అతడు దేవునికి
అయిష్టుడయిపోవును. దేవుడు చెప్పిన జ్ఞానము వేరే భాషలోయుంటే
అది అర్థముకాలేదని ఎవరూ అనుటకు వీలులేకుండా, వారికి తెలిసిన
భాషలోనే చెప్పబడునట్లు అదే భాష ప్రవక్తలను పంపాను అని దేవుడు
ఖుర్ఆన్ గ్రంథములో (14-4)వ వాక్యములో చెప్పాడు. మీకు తెలిసిన
భాషలో చెప్పినప్పటికీ దేవుని భావమును అందుకోలేక పోయిన వానికి
అజ్ఞాన మార్గమునూ, దేవుని జ్ఞానమును అందుకున్న వానికి దైవమార్గమును
(జ్ఞాన మార్గమును) కలుగజేస్తానని చెప్పాడు. ఈ ఆయత్నుబట్టి దేవుడు
మనకు దగ్గరగా మనకు అర్థమయ్యే భాషలోనే జ్ఞానమును చెప్పినప్పటికీ,
మతమును అడ్డము పెట్టుకొని, మా మతము ప్రకారము జ్ఞానము ఇట్లే
వుంటుంది అని దేవుడు చెప్పిన మాటను కాదనిన వానిని దేవుడు ఇష్టపడడు.
తనమాటను కాదను వానిని దేవుడు ఎలా ఇష్టపడును? దేవుడు చెప్పిన
జ్ఞానమును గొప్పగా తలచి ఒప్పుకొను వానిని తన మనిషిగా దేవుడు
లెక్కించి వానిని ఇష్టపడును. దీనినిబట్టి మనిషి భావమునుబట్టి దేవుడున్నాడు
అని తెలియుచున్నది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. దేవుడు చెప్పిన జ్ఞానము
ప్రకారము మనుషులకున్నట్లు చావు పుట్టుకలు దేవునికి లేవు. దేవుడు
మనిషి పుట్టినట్లు పుట్టువాడు కాడు, అలాగే చచ్చువాడు కాడు. ఈ
విషయము నాకు బాగా అర్థమయినది, అందువలన నా భావమునుబట్టి,
నాకు దేవుని జ్ఞానము అర్థమయిన దానినిబట్టి, నేను దేవునికి ఇష్టునిగా
మారిపోయాను. దేవునికి స్వయముగా ఇష్టాయిష్టములులేవు అదంతయూ
మనిషి భావమునుబట్టి యుంటుందని మరువకూడదు. పైన దేవునికి
చావు పుట్టుకలు లేవు అను విషయము నాకు అర్థమయినది, నాతోటి
ముస్లీమ్లకు కూడా అర్థమయినది. కావున నేనుగానీ, నా తోటి ముస్లీమ్లు
గానీ ఇంతవరకు ఈ విషయములో దేవునికి అయిష్టులము కాదు. అయితే
దేవుడు చావుపుట్టుకల విషయమును అంతటితో ఆపక ఇంకా కొంత
క్రొత్త విషయమును చెప్పాడు. అదేమనగా! నేను కూడా శరీరమును
ధరించి భూమిమీద పుట్టుచున్నాను అని చెప్పాడు. ఇంకా వివరముగా
చెప్పితే, నేను కూడా మానవ శరీరమును ధరించి భూమిమీద అవతరించు
చున్నాననియో లేక పుట్టుచున్నాననియో చెప్పాడు. పైన “నాకు మనుషుల
వలె చావు పుట్టుకలు లేవు” అని చెప్పిన దేవుడు తర్వాత కొంతసేపటికే
"నేను మనుష దేహమును ధరించి భూమిమీద తల్లిగర్భమునుండే
పుట్టుచున్నాను” అని చెప్పాడు. ఈ మాట వినిన ప్రతివానికీ దేవుడు
రెండు నాలుకలతో మాట్లాడుచున్నాడన్నట్లు కనిపించును. మొదట నాకు
చావు పుట్టుకలు లేవు అన్నప్పుడు నేను, నా తోటి ముస్లీమ్లు విని
దేవునికి మనుషులవలె చావు పుట్టుకలు లేవు అని దేవుడు చెప్పిన మాటను
అర్థము చేసుకోగలిగాము. కావున దేవునికి మేము అయిష్టులము కాలేదని
చెప్పాము కదా! అయితే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నాకు బాగా
అర్థమయినది. నా ప్రక్కనయున్న ముస్లీమ్లకు ఈ మాట అర్థము కాలేదు.
దేవుడు అక్కడ నిజము చెప్పి, ఇక్కడ అబద్దము చెప్పుచున్నాడనుకొన్నారు.
బుద్ధి యొక్క గ్రాహితశక్తియున్న వారు, శ్రద్ధయున్నవారు నా జ్ఞానమును
గ్రహించు కోగలరు అని ఖుర్ఆన్ (3-7) లో చెప్పినట్లు నా బుద్ధికి
దేవుడు రెండవ మారు చెప్పిన జ్ఞానము అర్థమయినది. దేవుడు తల్లిగర్భము
నుండి మనిషిగా శరీరమును ధరించి పుట్టుతాడని నాకు తెలిసిపోయినది.
మొదటి మాట దేవుడు నేను మనుషులవలె పుట్టను అని చెప్పినప్పుడు,
ఆయన మాట ప్రకారము దేవుడు పుట్టడని ఎట్లు అర్థమయినదో, అట్లే
దేవుడు రెండవ మారు చెప్పిన జ్ఞానము కూడా బాగా అర్థమయినది.
రెండవమారు నాకు అర్థమయినమాట చూచేవారికి మొదటిమాటకు
విరుద్ధముగా చెప్పినట్లు కనిపించి, వారికి ఏమాత్రము అర్థము కాకుండా
పోయి, దేవుడే పొరపాటుగా రెండు విధముల చెప్పాడని వారు అంటున్నారు.
అయితే నేను ఏమాత్రము అలా అనలేదు. దేవుడు చెప్పిన రెండు విధముల
జ్ఞానము అర్థమయినదనియే చెప్పుచున్నాము. దేవుని రెండు మాటలను
అర్థము చేసుకొన్నందుకు నేను దేవునికి ఇష్టునిగా మారిపోయాను. దేవుని
రెండవమాటను అర్థము చేసుకోలేక దేవుడు పుట్టడు అను మొదటిమాట
ప్రకారము మాట్లాడు నాతోపాటు విన్న ముస్లీమ్లు దేవునికి అయిష్టులుగా
మారిపోయారు.

ఇక్కడ ముస్లీమ్లు కొందరు “ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు
మనిషిగా పుట్టునట్లు ఎక్కడా చెప్పలేదు, అందువలన మా
గ్రంథము ప్రకారము దేవుడు పుట్టడు” అని చెప్పుచున్నాము అని
చెప్పవచ్చును. దానికి మేము ఏమి చెప్పుచున్నామనగా! దేవుడు చెప్పినది
దైవగ్రంథము. దేవుడు సృష్ట్యాదిలో ఒకమారు చెప్పిన జ్ఞానమే తర్వాత
కాలములలో మల్లీ మల్లీ చెప్పబడినది. అలా చెప్పబడిన దానిని మూడు
గ్రంథములుగా వ్రాయబడినాయి. మూడు గ్రంథములు విడివిడిగాయున్నా
మూడింటిలో యున్నది ఒకే జ్ఞానము అయినందున మూడింటిని కలిపి
ఒకే దైవగ్రంథముగా చెప్పుచున్నాము. ఒకే దైవగ్రంథము అను మాటను
మనుషులు తెలియకుండా పోయారని దేవుడే మూడవ భాగముగాయున్న
గ్రంథమును “అంతిమ దైవగ్రంథము” అని పేరుపెట్టాడు. అలా ఖుర్ఆన్
గ్రంథములో ఆ గ్రంథమును అంతిమ దైవగ్రంథమనుట వలన దానికంటే
ముందు వచ్చిన రెండు గ్రంథములను ప్రథమ, మధ్యమ దైవగ్రంథములని
చెప్పుటకు దు అవకాశం మర్పడినది. మూడు గ్రంథముల సారాంశము ఒకటే
అయినందున ఖుర్ఆన్లో ఉన్నదే ప్రథమ దైవగ్రంథములో ముందే
ప్రథమ దైవగ్రంథమయిన తౌరాతు అనబడు భగవద్గీత
గ్రంథములో చెప్పిన జ్ఞానమే అంతిమ దైవగ్రంథములో ఉండుట వలన
ఖురాన్లో కూడా దేవుడు మనిషిగానే అవతరిస్తాడని చెప్పియుండును.
అయితే దానిని అర్థము చేసుకోవడములో మనుషులమయిన మనమే
పొరపడియుండవచ్చును. ఇప్పుడు ఖుర్ఆన్ గ్రంథములో దేవుని పుట్టుకను
గురించి ఏమి చెప్పారో చూస్తాము.

89వ సూరా, 21,22 ఆయత్లలో 'దేవుడు అవతరిస్తాడు' అని
యున్నది. (21) “భూమిని ఎడాపెడాదంచి తుత్తునియలుగా
చేయడము జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు" (22)
దేవదూతలు బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు.”
అని చెప్పబడియున్నది. అంతేకాక 15వ సూరా, 29వ ఆయత్నుండి
30, 31వ ఆయత్ వరకుగల సమాచారమును చూస్తాము. (29) నేను
అతనిని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను
ఊదినప్పుడు మీరంతా అతనిముందు సాష్ఠాంగ పడండి. (30)
దేవదూతలందరూ సాష్టాంగపడ్డారు. (31) ఇక్కడ సాష్ఠాంగ
పడేవారిలో ఇబ్లీసు తప్ప అందరూ సాష్ఠాంగపడినారు. ఇక్కడ
ఈ వాక్యములను చూచిన తర్వాత దేవుడు పుట్టడు అనుటకు ఏ ముస్లీమ్
కూడా సాహసించడు అనుకుంటాము. అయితే కొందరు, ఆధ్యాత్మిక
సంఘములను నడుపుచున్న ముస్లీమ్లు “దేవుడు అవతరిస్తానని చెప్పాడు
గానీ, మనిషిగా అవతరిస్తాడు అని చెప్పలేదు కదా!” అని అంటున్నారు.
దానికి మా జవాబు ఇలా కలదు. దేవుడు అవతరిస్తాడని ఒప్పుకొన్నవారు
మనిషిగా అవతరిస్తాడని ఒప్పుకోకపోవడము హాస్యాస్పదము. దేవుడు
మనుషులకు జ్ఞానము చెప్పుటకు మనిషిగానే పుట్టవలసియున్నది. మనిషిగా
కాకపోతే ఎలాగ పుట్టునని మేము తిరిగి అడిగినప్పుడు, దానికి సమాధానము

చెప్పలేక, ఎలాగో ఒకలాగ పుట్టుతాడు దానితో మనకేమి పని? అని
అడ్డముగా మాట్లాడుచున్నారు. మనిషిగా పుట్టకపోతే జ్ఞానము ఎలా
మనుషులకు తెలియజేయగలడు అని అడిగితే, ఎలాగో ఒకలాగా తెలియ
జేస్తాడు ఎట్లా తెలియచేస్తే మీకేమి? అని సాలుతప్పి మాట్లాడుచున్నారు.
ఆ మాటలు వినువారికి వారివద్ద జవాబులేక అలా మాట్లాడుచున్నారని
అర్థమయి పోవుచున్నది. మీరు చెప్పండి అంటే వారు చెప్పలేరు, మేము
చెప్పుతాము వినండి అంటే అట్లా వినలేరు అటువంటివారికి జ్ఞానము
ఎలా తెలుస్తుంది?

ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో “దేవుడు అవతరిస్తాడు”
అను విషయమును చెప్పడమేకాక, అంతిమ దైవగ్రంథములో కూడా
దేవుని పుట్టుకను గురించి 89-21, 22 వాక్యములలోనూ, 15-29,30,31
వాక్యములలోనూ చెప్పబడియున్నది. ఇప్పుడు తిరిగి భగవద్గీత వద్దకు
వస్తాము. ఇక్కడ జ్ఞానయోగములో ఆరవ శ్లోకమందు నాకు చావు పుట్టుకలు
లేవు అని చెప్పినమాటకు వ్యతిరిక్తముగా రాజవిద్యా రాజగుహ్య యోగమున
పదకొండవ శ్లోకమున చెప్పినట్లు అందరూ అనుకొన్నా, అట్లుకాదు దేవుడు
ముందు చెప్పిన మాటకు వ్యతిరేఖముగా చెప్పలేదు. దేవుడు మనిషివలె
పుట్టడముగానీ, చావడముగానీ లేదు అను మాట వాస్తవమే. జ్ఞాన
యోగములో చెప్పినమాట వాస్తవమే, అట్లే రాజవిద్యా రాజగుహ్య
యోగమున చెప్పిన శ్లోకము ప్రకారము దేవుడు మనిషి శరీరము ధరించి
తల్లిగర్భమునుండి పుట్టు మాట నిజమే అని మేము చెప్పితే, దేవుని
జ్ఞానమును అర్థము చేసుకోలేనివారు మమ్ములను పూర్తి అసత్యము పలుకు
వారిగానో, రెండు విధములుగా మాట్లాడువారిగానో లెక్కించి మమ్ములను
మీరు జ్ఞానులా? అని ప్రశ్నించుచున్నారు. దానికి మేము అవును మేము

దేవుని మాటను, దేవుని జ్ఞానమును పూర్తి గ్రహించిన జ్ఞానులమేయని
చెప్పుచున్నాము. అంతేకాక దేవుని జ్ఞానమును అర్థము చేసుకొన్నాము
కాబట్టి మేము దేవునికి ఇష్టులుగాయున్నాము అని కూడా చెప్పుచున్నాము.
దేవుని జ్ఞానములో ఈ రెండు శ్లోకములే అర్థము కానప్పుడు మీకు దేవుని
జ్ఞానము పూర్తి ఎలా తెలియగలదని ప్రశ్నించుచున్నాము. ఇక్కడ దేవుడు
చెప్పిన మాట అర్థముకాకపోతే, ముస్లీములకు ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన
సూరా 6 ఆయత్ 95, సూరా 3 ఆయత్ 27 వాక్యములు ఎప్పటికీ
అర్థము కావు.

సూరా 6 ఆయత్ 95నందు చెప్పబడిన జ్ఞానము మరియు సూరా
3 ఆయత్ 27నందుగల జ్ఞానము ఏ ముస్లీమ్కు అయినా అర్థము
కావాలంటే దేవుడు మరియు మనిషి పుట్టుకను గురించి, వారి పుట్టుకలో
గల తేడాలను గురించి తెలిసియుండవలెను. "దేవుడు శరీరము ధరించి
తల్లిగర్భము నుండి పుట్టుచున్నాడు" అనుమాట నూటికి నూరుపాళ్ళు
సత్యము అని చెప్పుచున్న మేము, 'మనిషివలె దేవుడు పుట్టలేదు' అనియూ
మరియు 'మనిషివలె చావలేదు' అని కూడా చెప్పుచున్నామంటే మాకు
అర్థమయినది ఏదో ఇతరులకు అర్థము కాలేదనియేగా అర్థము.
"మనిషివలె దేవుడు పుట్టువాడు కాడు” అని చెప్పుచూ 'దేవుడు
తల్లిగర్భమునుండి మనిషి శరీరమును ధరించి పుట్టుచున్నాడు'
అని చెప్పుచున్నామంటే ఇందులో ఏదో తెలియని రహస్యము దాగియుంది
అనుకోకుండా, దానిని తెలుసుకోవాలని ప్రయత్నము చేయకుండా, మీరు
జ్ఞానులా? మీకు జ్ఞానము తెలుసా? అని అంటే, ఎదురుగా దేవుడు
కనిపించినా ఏ నాటికలోనుండి పారిపోయి వచ్చావని అడిగినట్లుండును.

నన్ను మనుషులలో అజ్ఞానిగా, జ్ఞానము తెలియని మనిషిగా లెక్కించారను
కొందాము. ఈ రెండు మాటలను ప్రథమ దైవగ్రంథములో దేవుడే చెప్పాడు
కదా! అంతెందుకు ఖుర్ఆన్ గ్రంథములో 89-21,22 లోనూ అలాగే
15-29,30,31 లో కూడా దేవుడు పుట్టుననే చెప్పాడు. దేవుడు పుట్టడు
అని అంటే ఎవరయినాగానీ 6-95లో దేవుడు చెప్పిన వాక్యమునకు
వివరమును చెప్పగలరా? దేవుడు మనిషివలె పుట్టడు అని తెలిసియుంటే,
దేవుడు మనిషి శరీరమును ధరించే పుట్టునని కూడా తెలిసియుంటే (6-95)
ఆయతు సరియైన వివరమును చెప్పగలరు. మేము ఒక హిందువుగా
యుండి ఇంతలోతుగా చెప్పుచున్నా వినని వారికి తర్వాత కాలములో
ఎప్పటికీ ఇంత రహస్యమును సులభముగా చెప్పువాడు రాడు అనియే
చెప్పుచున్నాము.


ఇంతవరకు ఎవరికీ అర్థముకాని దేవుని జన్మల విషయములను
మనిషి జన్మల విషయములను కొంతవరకు అర్థము చేసుకోగలరని తలచి
ఇక్కడ చెప్పుచున్నాము. మనిషికి దేవుని జన్మ విషయమే అర్థము కాలేదు
అని చెప్పుచూ, మనిషి జన్మల రహస్యము కూడా తెలియదని చెప్పు
చున్నాము. మనిషి ఎలా పుట్టుచున్నది ప్రతి దినము అందరము
చూస్తున్నాము. అందులో రహస్యమేమున్నదనీ, అది అందరికీ తెలిసిన
విషయమే కదా!యని అందరూ అనుకోవచ్చును. అయితే మనిషి జన్మ
వివరము ఎవరికీ ఇంతవరకు తెలియదనియే చెప్పుచూ, దానిని గురించి
ఒక ముఖ్యమైన మాట చెప్పుచున్నాము. ప్రపంచములో మనిషి అనువాడు
ఎవడూ తల్లిగర్భమునుండి పుట్టలేదు అని చెప్పుచున్నాము. ఈ
మాట అన్ని మతముల వారికి వింతగానే కనిపించును. అంతేకాక

తల్లిగర్భము నుండి ఏ మనిషి పుట్టుచున్నాడో వాడే మనిషిగా
వచ్చిన దేవుడు. ఈ రెండు మాటలు పండితులకు, పామరులకు,
ముస్లీమ్లకు, హిందువులకు ఆశ్చర్యముగానే కనిపించును, అట్లే
అసత్యముగా కూడా కనిపించును. అయినా మా మాట సత్యమే. ఇక్కడ
చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగ వచ్చును, అదేమనగా! తల్లిగర్భము
నుండి మనుషులందరు ఒక దినమునకు కొన్ని వేలమంది పుట్టుచుండుటను
చూస్తున్నాము. అలా చూచిన తర్వాత కూడా ఏ మనిషీ తల్లిగర్భమునుండి
పుట్టలేదు అంటే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించవచ్చును. ఈ విషయములన్నీ
ఇక్కడ ప్రస్తావించడము అసందర్భమగును. మేము సత్యమైన సూచనలను
ప్రశ్నించి వదలివేయుచున్నాము. ఈ విషయములన్నీ పూర్తి వివరముగా
తెలియవలెనంటే యోగీశ్వరులవారు వ్రాసిన “జనన మరణ సిద్ధాంతము"
అను చిన్న గ్రంథమును చూడండి. ఆ గ్రంథములో మనిషి జన్మ
విషయమున్నది, దానిని తెలియగలిగితే, దానికి భిన్నముగా ఉండునది
దేవుని జన్మ అని తెలియగలదు.

ముస్లీమ్ :- మీరు మాటల చాకచక్యముతో మమ్ములను మభ్యపెట్టాలని
చూస్తున్నారు. మీరు రేనికాయలకు (రేగు కాయలకు) మసిపూసి
నేరేడుకాయలని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. మీ మాటలకు
మోసపోవువారము కాదు. మా మతములో పెద్దలు పెట్టిన షరియత్
ప్రకారము మేము ఇతరులు వ్రాసిన గ్రంథములను చదువము. మా
ఖుర్ఆన్ గ్రంథమును మరియు హదీసు గ్రంథములను మాత్రమే
చదువగలము. ఈ రెండు గ్రంథములలో లేని జ్ఞాన విషయములంటూ
ఏవీ లేవు. మా పెద్దలు నిర్ణయించిన షరియత్ ప్రకారము అరబ్బీ భాషలో

యున్న ఖురాన్ గ్రంథమునే చదువగలము. మీరు ఖుర్ఆన్ గ్రంథమును
తెలుగులో వ్రాసి చదువమంటే మేము చదువము. అరబ్బీ భాష
తెలిసియుంటేనే ఖుర్ఆన్ గ్రంథము భావములో తప్పులేకుండా అర్థము
కాగలదు. అలాకాక వేరే భాషలో వ్రాస్తే అర్థము మారిపోవును. మొదటికి
మీకు అరబ్బీ భాషేరాదు. అటువంటప్పుడు మీ గురువుగారు వ్రాసిన
ఖుర్ఆన్ గ్రంథములో ఎన్నో తప్పులుండును. మీరు ఖుర్ఆన్లో ప్రాంతీయ
భాష తెలిసిన ప్రవక్తనే పంపుదునని దేవుడు చెప్పినట్లు కలదని చెప్పారు.
ఇప్పుడు చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ ప్రవక్తగారు 1400
సంవత్సరముల క్రిందనే వచ్చిపోయాడు. ఆయనే చివరి ప్రవక్తయని అల్లా
(దేవుడు) ఖుర్ఆన్ గ్రంథములోనే చెప్పాడు. చివరి ప్రవక్త రాకముందు
వచ్చిన ప్రవక్తలను గురించి దేవుడు చెప్పియున్నాడు గానీ, ఆఖరీ ప్రవక్త
వచ్చిన తర్వాత మరియొక ప్రవక్త వచ్చుటకు వీలులేదని జ్ఞప్తిలో
ఉంచుకోవలెను.

మా వారు :- మీరు మాటి మాటికీ మా ఖుర్ఆన్ అంటున్నారు. అలా
అనకండి ఖుర్ఆన్ దేవుడు సర్వమానవులకు పంపిన దైవసందేశము. అది
దైవగ్రంథము. మీది, మాది అని దైవగ్రంథములను అనకూడదు. మనిషి
అయిన ప్రతివానికి దైవగ్రంథములోని దేవుని వాక్యములు గలవు. ఖుర్ఆన్
గ్రంథములోని జ్ఞానము ముస్లీమ్లకు ఒక్కరికే అని అనుకోవడము, భగవద్గీత
హిందువులకు మాత్రమే అని అనుకోవడము పొరపాటగును. తర్వాత
మా మతములోని షరియత్ ప్రకారము ఇతరులు వ్రాసినదిగానీ, అరబ్బీ
భాషలో లేనిదిగానీ చదవము అని అన్నారు. అరబ్బీ భాషను గురించి
ఇంతకుముందే చెప్పాము. ఖుర్ఆన్ గ్రంథమును అరబ్బీ భాషలో తప్ప
ఇతర భాషలో చదవకూడదని చెప్పారు. అది మా షరియత్ అని చెప్పారు.

షరియత్ అనునది ప్రతి మతములోనూయున్నది. కొన్ని మతములలో
దానినే సాంప్రదాయములు అను పదముతో కూడా చెప్పుకొంటున్నారు.
దేవుడు మనుషులకు జ్ఞానమును మూడు గ్రంథముల ద్వారా ఇచ్చాడు.
అలా ఇచ్చుటకు కారణమును కూడా ముందే చెప్పాము. మనిషి స్థోమతను
బట్టి, ఆయా ప్రాంతముల ప్రజల మనోభావములనుబట్టి, వారు గ్రహించు
కొనుటకు సులభముగా ఉండునట్లు మూడు గ్రంథములుగా దేవుని
జ్ఞానమును అందివ్వడము జరిగినది. దానికి అర్థమగునట్లు ఒకే
కుటుంబములో, ఒకే పాత్రలో తయారు చేసిన, ఒకే రుచిగల పానకమును
త్రాగుటకు వారివారి శరీరములనుబట్టి పెద్దగ్లాసు, చిన్నగ్లాసు, చిన్నగంటెతో
త్రాగమని చెప్పి ఇస్తే త్రాగింది పానకమయినా త్రాగిన మూడురకముల
వారు నాది పెద్ద గ్లాసుపార్టీ, నాది చిన్నగ్లాసుపార్టీ, నాది చెంచాపార్టీ అని
త్రాగినదాని గొప్పతనమును వదలి, త్రాగిన పరికరములనుబట్టి చెప్పు
కొన్నట్లు, దేవుడు ఇచ్చిన జ్ఞానమును గొప్పగా చెప్పుకోక దేవుడు జ్ఞానమును
గ్రహించుటకు ఇచ్చిన గ్రంథములనుబట్టి నాది ఫలానా మతము అని
వేరువేరు మతములుగా చెప్పుకొంటున్నారు. జ్ఞానమును తెలుసుకొనుటకు
గ్రంథమును ఇస్తే, అందులోని జ్ఞానమును వదలి గ్రంథమునుబట్టి
మతమును తయారు చేసుకొన్నారు. మతమే మనుషులకు పెద్ద మాయ
కాగా, దానికి తోడు సాంప్రదాయములు అను షరియత్ను ప్రతి మతములో
తయారు చేసుకొన్నారు.

దేవుడిచ్చిన గ్రంథములలో లేని సాంప్రదాయములను మనిషి తాను
ఎన్నుకున్న మతములో పెట్టుకొన్నాడు. ప్రథమ దైవగ్రంథమయిన
భగవద్గీతలో ఎక్కడయినా హిందువులను గడ్డము పెంచుకోమని చెప్పాడా?
కాషాయ గుడ్డలు ధరించమని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. అయితే
నేను కొంత జ్ఞానిని అను ప్రతివాడు గడ్డము పెంచుకొన్నాడు, కాషాయ
గుడ్డలు ధరించుచున్నాడు. కొందరయితే పూర్వమునుండి వచ్చిన
సాంప్రదాయము అనీ, భగవద్గీతను చెప్పకముందు ఐదువేల సంవత్సరముల
కంటే ముందు కూడా మహర్షులు గడ్డము పెంచుకొనివుండే వారని కొందరు
హిందువులు అంటున్నారు. దానికి మా జవాబు ఏమనగా! పూర్వము
నేడున్నట్లు రేజర్లు, బ్లేడ్లు లేవు. మంగలివారు మాత్రమే అప్పుడప్పుడు
క్షవరము చేసెడివారు. ఊరిలో అయితే మంగలివారు ఉంటారు. ఊరు
వదలి అడవిలోనికి పోయి, అడవిలోవుంటూ తపస్సు చేసుకొనువారికి
అక్కడ మంగలివారు లేకపోవడము వలన స్వయముగా గడ్డమును
తీసివేసేదానికి రేజర్లు, బ్లేడ్లు లేనిదానివలన వారికి గడ్డములు
పెరిగిపోయెడివి. ఇప్పుడు ఎక్కడికి పోయినా వెంటతీసుకపోగల రేజర్లు,
బ్లేడ్లు ఉన్నాయి. దానినిబట్టి అడవిలో వుండువాడు కూడా గడ్డమును
స్వయముగా లేకుండా చేసుకోవచ్చును. అయితే విచిత్రముగా ఊరిలో
ఉన్నవారు కూడా మంగలివారు అనుకూలముగాయున్నా, గడ్డాలు పెంచి
ఇది హిందూసాంప్రదాయము అని అంటున్నారు. ముస్లీమ్ల విషయానికి
వస్తే ఖుర్ఆన్ గ్రంథములో చెప్పని సాంప్రదాయములన్నిటినీ ఆచరిస్తూ
ఇది మా షరియత్ (సాంప్రదాయము) అని అంటున్నారు. షరియత్ల
పేరుతో ఎవరు ఎట్లున్నా పరవాలేదుగానీ, దైవగ్రంథములలోని జ్ఞానమునకు
వ్యతిరేఖముగా నడుచుకోకూడదని చెప్పుచున్నాము.

అలా దైవగ్రంథములోని దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా
అసత్యాలను ఆపాదిస్తే అటువంటి వానికి దేవుడు నరకయాతనలు పడునట్లు
చేయును. ఈ విషయమై అంతిమ దైవగ్రంథములో సూరా 41, ఆయత్
40 యందు ఇట్లు కలదు. (41-40) “మా వాక్యాల విషయములో
వక్రవైఖరిని అవలంబించి అసత్యాలుగా మార్చి చెప్పువానిని
మేము చూస్తూనేయున్నాము. అగ్నిలో పడవేయబడేవాడు మేలా
లేక ప్రళయ దినాన సురక్షితముగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు
మేలా? మీరు ఇష్టమొచ్చింది చేసుకొంటూ పోతేపొండి. ఆయన
మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు.” దేవుడు చెప్పిన
జ్ఞానమును దాచిపెట్టి మార్చి చెప్పితే శాపాలు తప్పవని ఖుర్ఆన్
గ్రంథములోనే సూరా 2, ఆయత్ 159లో చెప్పారు. (2-159) “అల్లాహ్
అవతరింపజేసిన నిదర్శనములను మరియు సన్మార్గములను ప్రజల
కొరకు గ్రంథములో విశదపరచిన తర్వాత కూడా వాటిని
దాచిపెట్టే వారిని దేవుడు (అల్లాహ్) శపిస్తాడు. ఇంకా వేరే
శపించే వారు కూడా వారిని శపిస్తారు.” ఇదంతయూ చూచిన
తర్వాత దేవుడు చెప్పిన జ్ఞానమును కాదని మతము, మతములోని
మనుషులు చెప్పిన సాంప్రదాయముల పేరుతో నడువకూడదు.
దేవుడు తన పాలనలోయున్న సూర్యగ్రహము చేత సృష్ట్యాదిలోనే
మనువు అను వ్యక్తికి జ్ఞానమును చెప్పించాడు. భూమిమీద ఒక మనిషికి
జ్ఞానము తెలియజేయుటకు ఎన్నో ఉత్తమ లక్షణములున్న మనిషిని
ఎన్నుకొని అతనికి జ్ఞానము చెప్పడము జరుగును. సృష్ట్యాదిలో అటువంటి
ఉత్తముడు మనువుగా కనిపించాడు. తర్వాత ఇప్పుడు కలియుగములో
ముహమ్మద్ ప్రవక్తగారు మనుషులలో ఉత్తమమైన వాడుగా దేవునికి తెలిసి
తన జ్ఞానమును జిబ్రయేల్ ద్వారా ప్రవక్తకు జ్ఞానమును చేరునట్లు చేశాడు.
జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము అంతిమ దైవగ్రంథముగా తయారయినది.
ప్రజలతో మాట్లాడువానిని 'వక్త' అంటారు. ముఖ్యమైన జ్ఞాన
విషయములను చెప్పువానిని 'ప్రవక్త' అంటారు. ముహమ్మద్ ప్రవక్తగారు
ప్రజలకు జ్ఞానమును అందించాడు కావున ప్రవక్త అయినాడు. ముహమ్మద్
ప్రవక్తగారు అందించిన జ్ఞానము అంతిమ దైవగ్రంథములోని జ్ఞానము
అగుట వలన ముహమ్మద్ ప్రవక్తగారిని 'అంతిమ దైవప్రవక్త' అని చెప్పవలసి
వచ్చినది. ఒకే దైవజ్ఞానము ప్రథమ, మధ్యమ, అంతిమ దైవగ్రంథములుగా
చెప్పబడుట వలన ప్రతి గ్రంథములోని జ్ఞానమునకు ఒక ప్రవక్తయున్నాడు.
“నేరుగా ప్రజలతో జ్ఞానమును చెప్పినవారు ప్రవక్తలు" అను సూత్రమునుబట్టి
భగవద్గీతకు వ్యాసుడు ప్రవక్తకాగా, అతనిని ప్రథమ ప్రవక్తగా చెప్పవచ్చును.
అలాగే రెండవ గ్రంథ జ్ఞానమును ఏసు ప్రజలకు నేరుగా చెప్పడము
వలన ఏసును ద్వితీయ ప్రవక్తయని చెప్పవచ్చును. చివరి గ్రంథముగా
అంతిమ దైవగ్రంథ జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారు ప్రజలకు చెప్పడము
వలన ఆయనను ఆఖరీ ప్రవక్తయనీ లేక చివరి ప్రవక్తయనీ చెప్పడము
జరిగినది.

చివరి ప్రవక్త చెప్పిన తర్వాత ప్రథమ ప్రవక్త చెప్పిన మాటలను
వదలివేయవలెనని ఎవరూ అనుకోకూడదు. దేవుడు తన గ్రంథములో
చెప్పిన మాటలనే ప్రవక్తలు ప్రజలకు చెప్పారుగానీ, ప్రవక్తలు ప్రత్యేకించి
స్వయముగా జ్ఞానమును చెప్పలేదు. దేవుడు చెప్పిన జ్ఞానమును ప్రవక్తలు
ఎవరూ కాదనలేరు. ఖుర్ఆన్ గ్రంథములో (14-4) వాక్యములో యున్న
భాషను గురించి చెప్పిన మాటలను ఎవరూ ఖండించుటకు వీలులేదు.
ముహమ్మద్ ప్రవక్తగారే ఆ విషయమును స్వయముగా ప్రజలకు చెప్పాడు.
అందువలన ఆయన తర్వాత కూడా ఆ మాట శాశ్వతముగా ఉండగలదు.
మూడు గ్రంథములలోని విషయములకంటే మించిన జ్ఞానము ఎక్కడా

లేదు. ఆ మూడు గ్రంథములకూ ముగ్గురు ప్రవక్తలు యున్నారు. తర్వాత
జ్ఞానములేదు, తర్వాత ప్రవక్తయూలేడు. అందువలన ముహమ్మద్
ప్రవక్తగారే ఆఖరీ ప్రవక్తయని చెప్పవచ్చును. ఆయన తర్వాత ఉన్న
జ్ఞానమును విడదీసి వివరముగా చెప్పుకొనువారు రావచ్చునుగానీ, క్రొత్త
జ్ఞానమును చెప్పువారురారు. అందువలన ముహమ్మద్ ప్రవక్తగారికి
శాశ్వతముగా ఆఖరీ ప్రవక్తయను పేరు శాశ్వతముగా నిలిచిపోయినది.

మీరు ఈ ప్రశ్నలో అరబ్బీ భాషలోని ఖుర్ఆన్నే చదువవలెననీ
ఇతర భాషలో వ్రాసిన ఖుర్ఆన్లో భావలోపముండునని చెప్పుచూ మీరు
తెలుగులో వ్రాసిన ఖుర్ఆన్ను చదవము అన్నారు. దానిని గురించి మేము
మాట్లాడునది ఏమనగా! అరబ్బీ భాష మీకు మాత్రమే తెలుసు. 162
కోట్ల మంది ముస్లీమ్లలో కేవలము 30 కోట్లమందికి మాత్రమే అరబ్బీ
భాష తెలుసు. అందులో భాష తెలిసినా, లిపి తెలియనివారు వ్రాయడం
రానివారు చాలామంది నిరక్షరాస్యులున్నారు. 30 కోట్లమంది అరబ్బీ
భాష మాట్లాడినా వారిలో అరబ్బీ లిపిని, చదువును చదివినవారు కేవలము
పది (10) కోట్ల మంది ఎన్ని ప్పవచ్చును. అరబ్బీ చదువువచ్చిన
వారిలో ఎన్ని కోట్లమందియుండినా వారిలో పండితులు కొద్దిమంది మాత్రమే
ఉంటారు. ఆ పండితులలో రచనాశక్తియున్నవారు కేవలము పదుల
సంఖ్యలోనే ఉంటారు. అటువంటి ఉద్దండపండితులలో అరబ్బీ భాషతోపాటు
తెలుగు భాషను తెలిసియున్న వారు కేవలము పది లేక పదిహేనుమంది
ఉండవచ్చును. అటువంటి పండితులు అరబ్బీ భాషలోయున్న ఖుర్ఆన్
గ్రంథమును తెలుగులోనికి అనువదించారు. కొందరు ఉర్దూలోనికి
అనువదించారు. ఉర్దూనుండి తెలుగులోనికి కొందరు, అరబ్బీ భాషనుండి
తెలుగు భాషలోనికి కొందరు ఖుర్ఆన్ గ్రంథమును వ్రాయడము జరిగినది.
అలా పండితులు వ్రాసిన దానిలో భావలోపము ఉండదు కదా! పండితులు
తెలుగులో వ్రాసిన ఖుర్ఆన్ గ్రంథమును మేము చూచి, అందులో అర్థము
కాని వాక్యములకు జ్ఞాన వివరమును వ్రాశాము. అంతేగానీ నేరుగా
అరబ్బీ భాషలోయున్న ఖుర్ఆన్ గ్రంథమునకు మేము వివరము వ్రాయలేదు
కదా! అంతేగాక ఖుర్ఆన్ను అరబ్బీ భాషలోనే చదువవలెను. తెలుగులో
గానీ ఇతర భాషలలోగానీ చదువకూడదని మీరు అన్నారు కదా! మీకు
తెలిసిన విషయము అరబ్బీ భాషనుండి ఖుర్ను తెలుగులోనికి వ్రాసిన
పండితులకు తెలియదా!

తెలుగు ప్రజలు హిందూమతస్థులని తెలిసి వారికి ఖుర్ఆన్
గ్రంథమును పరిచయము చేయవలెనను ఉద్దేశ్యముతోనే అరబ్బీ ఖుర్ఆన్ను
తెలుగులో వ్రాశారు. అంతిమ దైవగ్రంథమును మాకు తెలుగులో
పరిచయము చేసినందుకు చాలా సంతోషము. మీరు తెలుగులో వ్రాయక
పోతే మాకు ఖుర్ఆన్లోని జ్ఞానము తెలియకపోయేది. అరబ్బీ భాష
వచ్చిన పండితులు తెలుగులో వ్రాసి చాలా మంచి పని చేసినా, వ్రాయించిన
పెద్దలలో మాత్రము హిందువులు “ఖుర్ఆన్” చదివి ఇస్లామ్ మతమువైపుకు
రావలెనను ఉద్దేశ్యముతోనే వ్రాయించారని తెలియుచున్నది. అంతిమ
దైవగ్రంథమయిన ఖుర్ఆన్ను హిందువులకు తెలియజేయడము మాకు
సంతోషకరమైన పనిగా కనిపించినా, అందులో వ్రాయించిన వారి
ఉద్దేశ్యము వేరుగాయున్నట్లు వారు వ్రాసిన ఆయత్ వివరములో అర్థమగు
చున్నది. ఖుర్ఆన్ గ్రంథములోని సూరాలు, అందులో వాక్యములుగా
యున్న ఆయత్లు దేవుడు చెప్పినవగుట వలన వాటిని తెలుగులో
అనువదించినా, ఆయత్లోని జ్ఞానము ఏమాత్రము చెడకుండా ఉన్నది
ఉన్నట్లు కనిపించుచున్నది. ఆయన్ను (వాక్యమును) ఎవరూ మార్చలేరు.

అయితే వాక్యమునకు క్రింద వివరమును వ్రాసినప్పుడు ఆ వివరము
వ్రాసిన మనుషుల భావముతో కూడుకొని ఉండును. కనుక అందులోని
వ్రాతలో ఎటు తిరిగీ ఖుర్ఆన్ గ్రంథము మిగతా గ్రంథములకంటే గొప్పదనీ,
ముస్లీమ్ మతమే గొప్పదనీ, ముస్లీమ్ల జీవన విధానమే గొప్పదన్న భావము
కనిపించుచున్నది. దేవుడు చెప్పిన ఆయత్లలో అటువంటి ఉద్దేశ్యము
లేదు. ఖుర్ఆన్ గ్రంథమును కొద్దిగా చదువుతూనే దాని వాక్యములలో
మతము అనిగానీ, మతాచారములనిగానీ, ఇది ముస్లీమ్లదే అనిగానీ
ఎక్కడా లేదు. ఖుర్ఆన్ గ్రంథము దైవగ్రంథముగానే కనిపించగలదు.
అది సర్వమానవులకు పంపిన జ్ఞానసందేశమని కలదు. దేవుని జ్ఞానము
ఒక భాషకుగానీ, ఒక మతమునకుగానీ పరిమితమైనది కాదు. అందువలన
ఏ మతస్థుడయినా, ఏ భాషలో అయినా దానిని చదువుకోవచ్చును.
అందువలన ఖుర్ఆన్ గ్రంథమును అరబ్బీ భాషలోనే చదవాలను ఉద్దేశ్యము
మనుషులదేగానీ, దేవుడు చెప్పునది కాదు.

ముస్లీమ్ :- మీరు ముహమ్మద్ ప్రవక్తగారిని ఆఖరి ప్రవక్తయని
ఒప్పుకొంటున్నారు. ఖుర్ఆన్ గ్రంథమును అంతిమ దైవగ్రంథమని కూడా
ఒప్పుకొంటున్నారు. అంతమాత్రమున మిమ్ములను మేము ఒప్పుకోము.
మీరు ఎన్ని మాట్లాడినా అల్లాహ్ ఒక్కడే దేవుడని ఒప్పుకోక కృష్ణున్ని
కూడా దేవుడని అంటున్నారు. హిందువులు ఎంత జ్ఞానులమని చెప్పినా
అన్యదేవతారాధనలో మునిగిపోయారు. ఒకే దేవున్ని గురించి బోధించినది,
అన్యదేవతల ఆరాధనను ఖండించు ఏకైక గ్రంథము ఖుర్ఆన్ ఒక్కటే
గలదు. మీరు ఎన్ని చెప్పినా, మిమ్ములనుగానీ మీ గ్రంథమునుగానీ మేము
ఒప్పుకోము.
మావారు :- నీవు ఒప్పుకోవాలని మేము నీతో మాట్లాడడము లేదు. నీకు
అర్థముకావాలని చెప్పుచున్నాము. మేము ఎంత చెప్పినా అర్థము చేసుకోలేక
పోవుచున్నావు. మాటమాటకు మాగ్రంథము ఖుర్ఆన్ అనీ, మీ గ్రంథము
భగవద్గీతయనీ అంటున్నావు. రెండు వేరువేరు గ్రంథములని చెప్పడము
పెద్ద అజ్ఞానమగును. ఖుర్ఆన్ గ్రంథములో సూరా 5, ఆయత్ 44,46,
48,68 మరియు సూరా 62, ఆయత్ 5 లలో ఈ విధముగా ఉన్నది.

(5-44) “మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము.
అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నాయి. ఈ తౌరాతు
గ్రంథ ఆధారము గానే ముస్లీమ్ లైన ప్రవక్తలు, రబ్బానీలు,
ధర్మవేత్తలు, యూదుల సమస్యలను పరిష్కరించే వారు”.

(5-46) “ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యమ్ (మరియమ్మ)
కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు
పూర్వము వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించే
వాడు. మేము అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథాన్ని ఇచ్చాము.
అందులో (బైబిలులో) మార్గదర్శకమూ, జ్యోతీ ఉండేవి. అది
తనకు ముందున్న తౌరాతు గ్రంథమును ధృవీకరించేది. అంతేకాక
అది దైవభీతి కలవారికి మార్గదర్శినిగా, హితబోధినిగా ఉండేది.”


(5-48) “మేము నీవైపుకు ఈ గ్రంథాన్ని (ఖుర్ఆనన్ను)
సత్య సమేతముగా అవతరింపజేశాము. ఇది తమకన్నా ముందు
వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తున్నది. నీ వద్దకు వచ్చిన
సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరించకు”.

(5-68) “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ,
ఇంజీలునూ (భగవద్గీతను, బైబిలును) మీ ప్రభువు తరపున
మీవద్దకు పంపబడిన దానినీ (ఖుర్ఆన్ గ్రంథమును) మీ
జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే”.

(62-5) “తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని
ఆదేశించినప్పటికీ, దానికి అనుగుణముగా ఆచరించనివారు                             
ఎన్ని గ్రంథములను అనుసరించిన  అటువంటి వారిని ఎన్నో
గ్రంథములను వీపుమీద మోయు గాడిదలాంటి వారని
ఉపమానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన
వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లా
సన్మార్గము చూపడు"

వీటిలో తౌరాత్ గ్రంథములోని జ్ఞానమే ఖుర్ఆన్ గ్రంథములో
ఉన్నదని చెప్పియున్నారు. అంతేకాక ఆ వాక్యములలో ఖుర్ఆన్ గ్రంథము
తౌరాత్ గ్రంథమును ధృవీకరిస్తున్నానని చెప్పియున్నట్లు కలదు. తౌరాతు,
ఇంజీలు అను రెండు గ్రంథములలోని జ్ఞానమును అనుసరిస్తున్నానని,
అదే జ్ఞానమే ఖుర్ఆన్ గ్రంథములో కూడా ఉన్నట్లు చెప్పడము జరిగినది.
తౌరాతు గ్రంథములోని జ్ఞానము తెలియకపోతే, వాడు ఏ మత
ధర్మములోనూ లేనట్లేయని కూడా ఖురాన్లో గలదు. ఖుర్ఆన్ గ్రంథమే
తౌరాతు గ్రంథమును గొప్పగా చెప్పియుంటే, మీరు ఏమాత్రము అర్థము
చేసుకోక మీ గ్రంథముకంటే మా గ్రంథమే గొప్పదనడము విచిత్రముగా
యున్నది. దీనిని అంతటినీ గమనించితే మీరు సక్రమముగా మాట్లాడక
సాలు మూల లేకుండా అడ్డముగా మాట్లాడుచున్నారని తెలియుచున్నది.
మీరు ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను ఎందుకు ఒప్పుకోవడము
లేదు?

ముస్లీమ్ :- మీరు తౌరాత్ అని చెప్పిన గ్రంథమును భగవద్గీత గ్రంథమని
ఎలా చెప్పగలుగుచున్నారు? మీ ఇష్టమొచ్చినట్లు మీరు చెప్పుకుంటే సరి
పోతుందా? మా మాటకు సమాధానము చెప్పండి.

మావారు :- ఇప్పుడు మేము మిమ్ములను ఒకమాట అడుగుతాము, మీరు
దానికి సమాధానము చెప్పండి, తర్వాత మీరు అడిగిన దానికి మేము
జవాబు చెప్పగలము. తౌరాత్ గ్రంథమంటే ఏమిటో మాకు తెలియదు
అని మేము ఒప్పుకొంటాము. ఆ గ్రంథమేదో మీరు చెప్పగలరా? ఆ
పేరున్న గ్రంథమును మీరు చూచారా? తౌరాతు గ్రంథము ఏ భాషలో
వ్రాయబడిందో చెప్పగలరా? దానిని రచించిన రచయిత పేరు తెలుసునా?
దాని పేరును వినడము తప్ప దానిని చూచిన వారున్నారా? అని అడుగు
చున్నాను. ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెప్పలేరు. ఎందుకనగా! తౌరాత్
గ్రంథమేదో ఎవరికీ ఇంతవరకు తెలియదు. ఆ పేరున్న గ్రంథమును
ఎవరూ చూడలేదు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో తౌరాత్,
ఇంజీలు అని రెండు పేర్లుగల గ్రంథములను చెప్పారు. అవి రెండూ
రెండు గ్రంథములే అయినా అవి వాటి నిజమైన పేర్లుకాదు. ఆ రెండు
గ్రంథములయొక్క బిరుదులను తౌరాతు, ఇంజీలు అని చెప్పారు. ఇంజీలు

గ్రంథమును చెప్పినవాడు ఈసాయని, తౌరాతు గ్రంథమును చెప్పినవాడు
మూసాయని ఖుర్ఆన్ గ్రంథమందు సూరా 5, ఆయత్ 68లో ఉన్నది
చూడండి. (5–68) “ఓ ప్రవక్తా ! వారికి (ప్రజలకు) చెప్పు మీరు
తౌరాతునూ (భగవద్గీతనూ), ఇంజీలునూ (బైబిలునూ) మీ ప్రభవు
తరపున మీ వద్దకు వచ్చిన అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ను
మీ జీవితములో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మము పైనా
లేనట్లే, నీ ప్రభువు తరపున వచ్చిన ఖుర్ఆనాన్ను చూచి వారిలోని
అనేకులకు గర్వము, తిరస్కార వైఖరి మరింత అధికమైనది.
అయితే నీవు ఈ తిరస్కారులను లెక్కచేయకు".

సూరా 6, ఆయత్ 91లో ఇలా కలదు. (6-90) “దేవుడు ఏ
మానవమాత్రునిమీద ఎలాంటి జ్ఞానమును అవతరింపజేయలేదు
అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు దేవున్ని అర్థము
చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు
మూసా తెచ్చిన ఆ (తౌరాతు) గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసి
నట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గ
దర్శకత్వము. మీరు దానిని వేరువేరు కాగితాలుగా (వేరు వేరు
గ్రంథాలుగా) విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయములను
దాచేస్తున్నారు. మీరుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో
విషయములు ఇందుమూలముగా మీకు నేర్పబడ్డాయి.
తౌరాతును అవతరిపంజేసిన వాడు అల్లాహ్యేనని చెప్పు తర్వాత
వారిని వారి వ్యర్థ విషయముల లోనే ఆడుకోనివ్వు.”
ఈ వాక్యములను చూచిన తర్వాత తౌరాతు గ్రంథమునే భగవద్గీత
గ్రంథమని, ఇంజీలు గ్రంథమునే బైబిలు గ్రంథమని మేము అంటున్నాము.
(5-68) లో వరుసగా మూడు గ్రంథములను చెప్పునప్పుడు తౌరాతు
గ్రంథమును, ఇంజీలు గ్రంథమును, మీ ప్రభువు మీకిచ్చిన ఖుర్ఆన్
గ్రంథము అని మూడు పేర్లు చెప్పినప్పుడు తౌరాత్ అంటే భగవద్గీతయని,
ఇంజీలు అంటే బైబిలు అని సులభముగా తెలిసిపోయినది. అంతేకాదు
ఈసా అంటే ఏసుయనీ, మూసా అంటే కృష్ణుడని కూడా చెప్పుచున్నాము.
ఇంకా అందరికీ తెలియని రహస్యము ఏమంటే మూసా అను శబ్దమునుండే
ఈసా అను శబ్దము పుట్టినట్లు, క్రిష్ణనుండి క్రీస్తు వచ్చాడని తెలియుచున్నది.
మేము పదాలకు అర్థములతో సహా చెప్పి తౌరాతు అంటే మూడు రాత్రులు
యని మూడు రాత్రులవలె మూడు కనిపించని ఆత్మలున్న గ్రంథమును
తౌరాత్ అని పేరు పెట్టబడినదని కూడా చెప్పుచున్నాము. ఈ విధముగా
మేము ధైర్యముగా తౌరాతు, ఇంజీలును గురించి చెప్పుచున్నాము. తౌరాతు,
ఇంజీలు అనునవి పేర్లు కావు ఆ గ్రంథములకున్న బిరుదులు అని
చెప్పుచున్నాము. ఈ విషయము వివరముగా తెలియవలెనంటే
యోగీశ్వరులవారు వ్రాసిన “అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు"
అను గ్రంథమును జ్ఞానదృష్టితో చూడండి.

తౌరాతు గ్రంథములోయున్న జ్ఞానమే ఇంజీలులోనూ, ఖురాన్
గ్రంథములోనూ కలదు. ఈ విషయమును ఖుర్ఆన్ గ్రంథమే అనేకమార్లు
చెప్పినది. అయితే దానిని అర్థము చేసుకోలేని ముస్లీమ్లు కొందరు
ఒక్క ఖుర్ఆన్ గ్రంథము మాత్రము అన్యదేవతారాధన లేని ఏకైక గ్రంథము
అంటున్నారు. అలా అంటే దానికంటే ముందు చెప్పిన తౌరాతు గ్రంథములో
అన్యదేవతారాధన ఉన్నదని చెప్పినట్లేయగును కదా! అప్పుడు తౌరాతు

అప్పుడు ఖుర్ఆన్
గ్రంథమును నేను ధృవీకరిస్తున్నానని ఖుర్ఆన్ చెప్పినమాట అసత్యమగును.
అప్పుడు ఖుర్ఆన్ గ్రంథమునకు అసత్యమును అంటగట్టినవారమగుదుము.
అందువలన అన్యదేవతారాధన లేని ఏకైక గ్రంథము ఖుర్ఆన్
అని చెప్పకుండా దానికంటే ముందువచ్చిన తౌరాతు, ఇంజీలు
గ్రంథములు కూడా అన్యదేవతారాధనను ఖండించుచున్నవనీ,
వాటి అడుగు జాడలలోనే ఖుర్ఆన్ కూడా అన్యదేవతారాధనను
ఖండించుచున్నదని చెప్పవలెను. అప్పుడు ఖుర్ఆన్ గ్రంథము
ధృవీకరించుచున్న తౌరాతు, ఇంజీలు గ్రంథములను మనము కూడా
ధృవీకరించినట్లగును. అట్లుకాకుండా ఖుర్ఆన్ ఒక్కటే అన్యదేవతారాధనను
ఖండించునను మాట దేవుని దృష్ఠిలో అసత్యమగును.

ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతయందు అన్యదేవతారాధన
చేయకూడదనియే ఉన్నదిగానీ, అన్యదేవతారాధనను ప్రోత్సహించినది
ఏమాత్రము లేదు. ఇకపోతే కృష్ణాష్టమి రోజున బంగ్లాదేశ్లోనూ,
పాకిస్థాన్లోనూ, బీహార్లోనూ, చైన్నైలోనూ, బాంబేలోను మిగతా కొన్ని
ముఖ్యనగరములలోని ముస్లీమ్లు తమ పిల్లలకు కృష్ణుని వేషము వేసి
వేడుకలో పాల్గొనిన ఫోటోలు ఇంటర్నెట్లో లభించగా వాటిని మేము
వ్రాసిన “అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు”లో ప్రచురించి
చూపాము. అక్కడ అలా చూపడములో మేము అన్యదేవతారాధన
చేస్తున్నాము, మీరు కూడా చేయండని మేము చెప్పలేదు. కొంతమంది
ముస్లీమ్లు కూడా "కృష్ణుడు ఎవరను విషయము గ్రహించగలిగారు” అని
మాత్రమే చెప్పాము. మేము మా దృష్ఠిలోనే కాకుండా ఇతరుల దృష్ఠిలో
కూడా జ్ఞానులుగా యున్నాము. భగవద్గీతలోగానీ, ఖుర్ఆన్ గ్రంథములో
గానీ ఇంతవరకు ఎవరూ చెప్పని వివరమును చెప్పాము. దేవుడంటే
ఎవరు? దేవతలంటే ఎవరు? అని తెలిసి దేవుడు అను పేరు ఒక్కనికే
కలదు, మిగతా దేవతలనబడు వారందరూ దయ్యాలు అని చెప్పాము.
ఒక్క దేవున్ని తప్ప మా చేత దయ్యములనబడు ఏ దేవతలను మేము
మ్రొక్కలేదు. మేము దేవునికి విధేయునిగా ఉంటాము, దేవతలకు మేము
యమధర్మరాజువలె కనిపిస్తుంటాము. ఎన్నో సందర్భములలో దేవతలను
మీరు తప్పు చేయుచున్నారని మందలించుచున్నాము. అందరినీ బెదిరించి
పూజలు చేయించుకొను దేవతలు మమ్ములను చూస్తే ఆమడదూరము
పారిపోతారు. ఎన్నో జ్ఞాన విషయములను తెలిసిన మేము, దేవుడు మనిషి
వలె వచ్చి ఎప్పుడు జ్ఞానమును చెప్పిపోయాడో కూడా చెప్పుచున్నాము.
తౌరాతును బోధించిన మూసా, ఇంజీలును బోధించిన ఈసా ఇద్దరూ
సాధారణ మనుషులు కాదని, వారు మనిషి రూపములో వచ్చిన దేవుని
అవతారములని కూడా చెప్పాము.

మేము చెప్పినమాట ఖుర్ఆన్లోని సూరా 6,
ఆయత్ 91 లో కూడా నిజమని అల్లా తెలియజేసినట్లు
కలదు. అక్కడ మూసా అందించిన గ్రంథమును ఎవరు
అందించినట్లు ప్రశ్నవేసి అడిగి, తర్వాత ఆ గ్రంథము
యొక్క గొప్పతనమును గురించి చెప్పుచూ ఇలా అన్నాడు.
ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవులకు మార్గదర్శకత్వము,
మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో
విషయములు ఈ గ్రంథము ద్వారా చెప్పబడ్డాయి అని
చెప్పి ఆ వాక్యములో చివరకు ఆ గ్రంథమును
అవతరింపజేసినవాడు అల్లాహ్ యే అని చెప్పాడు.
ఖుర్ఆన్ గ్రంథములో (6-91) వాక్యమును చూస్తే ఈ
విషయము తెలుస్తుంది. మూసాగానీ, ఈసాగానీ ఇద్దరూ
మానవులే. వారిని ప్రవక్తలని పిలిచాము. అంతేగాక
మూసా తౌరాతు గ్రంథమును, ఈసా ఇంజీలు గ్రంథమును
ఇచ్చారని కూడా ఇదే ఖుర్ఆన్ గ్రంథములోనే ఉన్నట్లు
తెలిసినది. ముఖ్యముగా ఇక్కడ గమనించితే ఒక
మనిషిగాయున్న మూసా అందించిన గ్రంథమును ఎవరు
అందించిన గ్రంథమని ప్రశ్నించి, ఆ ప్రశ్నకు జవాబుగా
దానిని అల్లాయే అందించాడని చెప్పినట్లు వాక్యములో
గలదు. అప్పుడు ఖురాన్ గ్రంథము యున్న ఒక మనిషిని
అనగా మూసాను ఏమని చెప్పినట్లో మీరే అర్థము
చేసుకోండి. ఇదే వాక్యములో మొదటనే దేవుడు ఏ
మానవమాత్రుని పైనా ఎలాంటి జ్ఞాన విషయాన్ని
అవతరింపజేయలేదు అని పలికినప్పుడు, అవిశ్వాస
జనులు దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము
చేసుకోలేదు అని కూడా చెప్పాడు. అవిశ్వాస జనులు
అంటే దేవుని జ్ఞానమును సరిగా అర్ధముచేసుకోని వారని
అర్థము. ఖుర్ఆన్ గ్రంథములో ఈ ఒక్క ఆయత్ను
గ్రహించుకోగలిగితే మూసా ప్రవక్త ఎవరో తెలిసిపోతుంది.
మూసా ఒక మనిషి అని అందరికీ తెలుసు. ఆ మనిషి
ఇచ్చిన గ్రంథములో జ్యోతి ఉందని చెప్పిన (6-91)
వాక్యము చివరకు 'ఆ గ్రంథమును ఇచ్చినది ఎవరో
తెలుసా?” అని అడిగి “అల్లాహ్ యే” అని జవాబు చెప్పడ
మైనది. దీనినిబట్టి ఒక మనిషిని దేవుడని చెప్పిన ఘటన
సాక్షాత్తూ ఖుర్ఆన్ గ్రంథములో వుంటే, దానిని అర్ధము
చేసుకోలేని వాడు దేవుని దృష్టిలో జ్ఞాని అవుతాడా? అక్కడే
అదే వాక్యములోనే మొదటిలోనే దేవుడు ఏ మానవునిమీద
ఎలాంటి జ్ఞాన విషయాన్ని అవతరింపజేయ లేదు.
దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా అవిశ్వాసులు
అర్థము చేసుకోలేదని చెప్పి, వెంటనే మూసా తెచ్చిన
గ్రంథమును ఎవరు అవతరింప జేసినట్లు అని అడిగి,
చివరకు అల్లాహ్ యే అని చెప్పితే, మూసాగా కనిపించు
వాడు సాధారణ మనిషి కాదు అని అర్ధము కాదా! కొందరు
మూసారూపముతో యున్నవానిని అర్థము చేసుకోలేదు,
కావున అర్థము చేసుకోవలసిన విధముగా అవిశ్వాసులు
అర్ధము చేసుకోలేదన్నాడు.

భూమిమీద పేర్లు మార్చబడి చెప్పబడినవారు
ఈసా, మూసా అని ఇద్దరు కలరు. బైబిలు గ్రంథములో

ఏసు అనుచెప్పబడిన వ్యక్తియే, ఈసా ప్రవక్తగా
ఖుర్ఆన్లో చెప్పబడ్డారని తెలియుచున్నది. ఈసా
ఇంజీలు గ్రంథమును ఇచ్చాడని తెలిసిపోయినది. ఈసా
మరియమ్మ కొడుకని ఖుర్ఆన్ గ్రంథములో ప్రస్తావన
వచ్చినప్పుడు ఈసా అంటే ఏసు అనీ, ఇంజీలు గ్రంథము
అంటే బైబిలు గ్రంథమని అర్థమయిపోవుచున్నది. ఈసా,
ఇంజీలు రెండిటి పేర్లు మార్చి చెప్పబడియున్నా, చివరికి
ఈసా అంటే ఫలానా వ్యక్తియనీ, ఇంజీలు అంటే ఫలానా
గ్రంథమనీ ఖుర్ఆన్ ఆధారముగానే తెలిసిపోయినట్లు,
ఖుర్ఆన్అ (6-91) లో చెప్పిన వాక్యమును బాగా
పరికించి చూడగలిగితే, బుద్ధిని ఉపయోగించి అర్థము
చేసుకోగలిగితే, దేవునిపట్ల నిజమైన విశ్వాసులుగా యుంటే
ఎవరికయినా మూసా అంటే ఎవరయినదీ, ఆయన
అందించిన గ్రంథము ఏదయినదీ సులభముగా తెలిసి
పోగలదు. ఈ విషయమును అర్థము చేసుకోలేని
వారున్నారు గనుక, అదే వాక్యములోనే అజ్ఞానులు దేవున్ని
అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు
అని చెప్పాడు.

అక్బర్ చక్రవర్తి తన రాజ్యములో ప్రజలు ఎట్లున్నారని తెలియుటకు
స్వయముగా మారువేషములో బయలుదేరిపోయి, ఊరూరూ తిరిగి
చూచాడు. అలా తన రాజ్యములో తిరుగునప్పుడు ఆయన చక్రవర్తియై
యున్నా, ఎవరూ గుర్తించకుండా మారువేషములో సాధారణ పౌరుని
వేషములోయున్నాడు. ఒకమారు మారువేషములో బయలుదేరితే కనీసము
రెండు మూడునెలలు తనను ఎవరూ గుర్తించని విధముగా ఉండి, అందరూ
తినే అన్నమును తిని, అందరూ త్రాగే నీరును త్రాగి, బాటసారివలె
సత్రములలోనూ, సావిళ్ళలోనూ పడుకొని అక్కడయున్నవారితో కలిసిమెలసి
పోయి తన రాజ్యములో ప్రజల కష్టసుఖాలను, జరుగుచున్న వాస్తవ పరిస్థితిని
తెలుసుకొనెడి వాడు. అలా మారువేషములో ఉండినప్పుడు ప్రజలలో
కలిసియుండుట వలన మీరాభాయి భజన అనంతరము అందరు
మీరాభాయికి పాదనమస్కారము చేయుచుండగా చక్రవర్తి అయిన అక్బరు
కూడా సాధారణ మనిషివలె మీరా పాదములకు నమస్కరించాడు. చక్రవర్తి
అయిన ఆయనకు అందరూ నమస్కరించు స్థోమతలో ఉండికూడా ఆయనే
మీరాకు నమస్కరించడము వలన ఆయనను అక్బరు చక్రవర్తియని
గుర్తుపట్టుటకు అవకాశమే లేదు. అలాగే దేవుడు తన సృష్టికంతటికీ
పెద్దగాయుండి, సర్వసాధారణ మనిషివలె భూమిమీద ప్రజల మధ్యలోనికి
వచ్చి, ఎవరూ గుర్తించనట్లు మనుషుల మధ్యవుండి, మనుషులు తినే
అన్నము తిని, మనుషులు త్రాగే నీరు త్రాగి, దుర్మార్గుల మధ్యలో,
అజ్ఞానులమధ్యలో పడుకొని లేచి మనుషులలో వుండే అజ్ఞానమును
తెలిసి, ఎవరికి జ్ఞానము చెప్పాలో వారికే జ్ఞానమును చెప్పినా, వారికి
కూడా తాను ఎవరయినదీ తెలియకుండా చెప్పి రావడము జరిగినది.

అక్బరు చక్రవర్తి ప్రజల మధ్యలోనికి వచ్చి పోయిన తర్వాత ఆయన
మీరాకు ఇచ్చిన వజ్రాలహారమునుబట్టి కొందరు అక్బరుచక్రవర్తి వచ్చి
పోయాడని గుర్తించగలిగారు. అయితే ఆ మాటను కొందరు ఖండించారు.

చక్రవర్తి ఇక్కడికెందుకు వస్తాడు? ఆయనకు ఏ సమాచారము కావలసి
యున్నా దానిని తెలియజేయు గూఢచారులు ఎందరో ఉండగా, ఆయన
రావలసిన అవసరములేదు అని కొందరు వాదించారు. నేడు అదే విధముగా
దేవుడు మనిషివలె ఎందుకు పుట్టును? ఆయన పుట్టవలసిన అవసరము
లేదు. ఆయన అనుకుంటే ఏమయినా జరిగిపోవును. అటువంటప్పుడు
ఆయన (దేవుడు) భూమిమీద పుట్టును అనుట అసత్యము అంటున్నారు.
అక్బరు చక్రవర్తి మారువేషములో రాడు అను వారున్నా, ఆయన ప్రజల
మధ్యలోనికి వచ్చి వజ్రాలహారము ఇచ్చిపోయినట్లు, దేవుడు మనిషిగా
రాడు అను వారున్నా, ఆయన మనిషివలె మారువేషములో వచ్చి
జ్ఞానబోధను ఇచ్చి పోయాడు. ఎంతో విలువయిన దైవగ్రంథములను
ఇచ్చిపోయాడు. వజ్రాల హారమునుబట్టి అక్బరు వచ్చాడను వారున్నా,
ఆ మాటను నమ్మనివారు చాలామందియున్నారు. అట్లే దేవుడు చెప్పిన
దైవగ్రంథములలోని జ్ఞానమును బట్టి దేవుడు వచ్చాడని మాలాంటివారు
చెప్పుచున్నా, ఆ మాటను నమ్మనివారు కూడా చాలామందియున్నారు.
అందువలన విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరని దేవుడు చెప్పుచూ,
దేవున్ని అవిశ్వాసులు అర్థము చేసుకోలేరని చెప్పాడు.

దేవుడు ఏ మనిషిమీద తన జ్ఞానమును అవతరింపజేయనప్పుడు,
మనిషిగా వచ్చి చెప్పినవాడు దేవుడేయనీ, అతను మనిషికాదని గుర్తించ
వచ్చును. అయితే కొందరు భూమిమీద “నేను పట్టుకున్న కుందేలుకు
మూడేకాళ్ళు” అని వాదించుచూ, నాకు తెలిసినంత వరకు దేవుడు పుట్టడు
అని అంటున్నారు. వాడు పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్ళు ఉండ
వచ్చును. అతనికి మూడుకాళ్ళుగల కుంటికుందేలు దొరికియుండవచ్చును.
అతనికి దొరికిన దానికి మూడుకాళ్ళున్నంత మాత్రమున, భూమిమీదగల

కుందేళ్ళన్నిటికీ మూడే కాళ్ళుంటాయి అనుకోవడము పొరపాటు కాదా!
అలాగే తనకు తెలిసిన జ్ఞానము ప్రకారము దేవుడు మనిషిగా పుట్టడు
అనుటకు అతనికి తెలిసిన జ్ఞానములో అలాగేయుండవచ్చును. అతనికి
తెలిసిన జ్ఞానము సరిగా అర్థముకాకపోయి యుండవచ్చును. అంత
మాత్రమున దేవుడు మనిషిగా రాడు అనడము పొరపాటు కాదా! అతనికి
తెలిసిన జ్ఞానములో ఏదయినా లోపముందేమోనని ఎందుకు ఆలోచించ
కూడదు. “దేవుడే స్వయముగా నేను మనిషి మీద నా జ్ఞానమును
ప్రసరింపచేయలేదు అని ఒకచోట, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ
మానవునికీ తెలియదని మరొకచోట చెప్పియున్నా”, మూసా తెచ్చిన
గ్రంథమును ఎవరు అవతరింపజేసినట్లు అని ప్రశ్నించి దానిని
అల్లాహ్ అవతరింపజేశాడని చెప్పినా దైవగ్రంథమును ఏ మనిషి
ఇచ్చాడో, ఆ మనిషిగా దేవుడు వచ్చాడని ఎందుకు అనుకోకూడదు? దేవుడు
మనిషిగా వచ్చినట్లు సాక్ష్యాధారములు దైవగ్రంథమయిన ఖుర్ఆన్
గ్రంథములో స్పష్టముగా కనిపించుచుండినా ముస్లీమ్లు దేవుడు మనిషిగా
పుట్టడు అని వాదించుచున్నారు. ఎన్నో ఆధారములున్నా ఎందుకు మీరు
అలా వాదించుచున్నారని అడిగితే, వారిలో కొందరు మా మతములోని
నియమముల ప్రకారము మేము మాట్లాడుచున్నాము. మా మతము యొక్క
షరియత్ ప్రకారము దేవుడు మనిషిగా అవతరించాడు అంటే ఒప్పుకోము
అని చెప్పాడు. దానికి దేవుడు చెప్పిన జ్ఞానము ముఖ్యమా? మతము
చెప్పిన అజ్ఞానము ముఖ్యమా? అని అడిగితే మా మతము ఏది చెప్పితే
అదే జ్ఞానము అని చెప్పడము జరిగినది. భూమిమీద మతము అనునది
ప్రతి మనిషికీ ఉన్నది. మూడు మతములు భూమిమీద ఉంటే హిందూ
మతము వారు దేవుడు మనిషిగా వస్తాడు అని పూర్తి నమ్ముచున్నారు.
షరియత్ ప్రకారము

క్రైస్తవ మతమువారు ఒకచోట ఏసును దేవుడని అంటారు, మరొకచోట
దేవుడుకాదు దేవుని కుమారుడు అని అంటారు. ముస్లీమ్ మతమువారు
దేవుడు మనిషిగా పుట్టును అనుమాటను ఏమాత్రము ఒప్పుకోరు. దీనినిబట్టి
మూడు మతములలో దేవుడు మనిషి అనుటను ఒక మతము అవును
అనీ, ఇంకొక మతము కాదు అని చెప్పగా, మరొక మతము అవును అని
ఒకచోట, కాదు అని మరొక చోట చెప్పడము జరుగుచున్నది.

ముస్లీమ్ :- మీరు మా గ్రంథములోని మాటను మాకే చెప్పి ఒప్పించాలని
అనుకొంటున్నారు. మనిషి చనిపోయి తిరిగి పుట్టుతాడని చెప్పినా మేము
ఒప్పుకోము, అటువంటప్పుడు ఏకంగా దేవుడు వచ్చి పుట్టుతాడు అంటే
ఎలా ఒప్పుకుంటాము.

మావారు :- ఖుర్ఆన్ను మా గ్రంథమని చెప్పద్దండి. ఖుర్ఆన్తో మీకు
ఎంత సంబంధముగలదో మాకు కూడా అంతే సంబంధమున్నది.
ప్రత్యేకించి మీ పేరు చెప్పి, మీకు దేవుడు ఇవ్వలేదు. దేవుడు
మనుషులందరికీ ఇచ్చినదని, అది అందరి గ్రంథమని మేము చాలామార్లు
చెప్పాము. ఖుర్ఆన్ గ్రంథమును అగౌరవపరచినా, అసత్యములను
అంటగట్టి మాట్లాడినా మాకు సరిపోదు. అట్లు మాట్లాడిన వారు ఏ
మతములోయున్నా, ఎంతటి జ్ఞానులయినా వారిది తప్పని మేము చెప్పక
తప్పదు. మీరు ఒక మతమును అడ్డము పెట్టుకొని దేవుని జ్ఞానమును
అజ్ఞానముగా చెప్పుచున్నారు. దేవుడు తన గ్రంథములో ఎక్కడా చెప్పని
విషయమును మీరు మా మతములో ఇట్లే చెప్పవలెనని కలదు అంటారు.
దేవుని జ్ఞానము మతములో పుట్టినదా? లేక దేవుని గ్రంథములో పుట్టినదా?
అని అడుగుచున్నాము. మతము మధ్యలో వచ్చింది. దేవుని జ్ఞానము
సృష్టి ఆదిలోనే వచ్చింది. మనిషి, దేవుడు చెప్పినట్లు నడువవలెనుగానీ,
మతము చెప్పినట్లు నడువకూడదు. దేవుని జ్ఞానము ప్రకారము కాకుండా
మత సాంప్రదాయము ప్రకారము పోవడము ఏ మతములోని వారికీ
తగని పనియని చెప్పుచున్నాము.

ముస్లీమ్ :- మిగతా మతములవారు ఎట్లున్నా మా మతముగానీ, మా
మతములోని వారుగానీ పూర్తి క్రమశిక్షణ కల్గియుందురు. మా పెద్దలు
అన్నీ తెలిసే చెప్పుదురు. అందువలన మా పెద్దలు చెప్పినట్లే నడుచు
కొంటాము. క్రమశిక్షణలో మొదటిమెట్టులో ఉన్నది ముస్లీమ్ మతమే
అని అందరికీ తెలుసు. మా క్రమశిక్షణ ప్రకారము, మాకు మా పెద్దలు
చెప్పిన దానిప్రకారము మనిషే తిరిగి పుట్టడు. మనిషే తిరిగి పుట్టనప్పుడు
దేవుడు వచ్చి అప్పుడప్పుడు పుట్టుతాడని మీరు చెప్పితే మేము ఎలా
నమ్మాలి?
మావారు :- మేము ఇంతకుముందు మతమును గురించే చెప్పాము.
అది విన్న తర్వాత కూడా తిరిగి మతము చెప్పినట్లు, మా పెద్దలు చెప్పినట్లు
అంటే మేము చెప్పినదంతా చెవిటివాని ముందర శంఖు ఊదినట్లుండును.
చనిపోయిన మనిషి తిరిగి పుట్టడని ఎలా చెప్పుచున్నారు? మీరు చెప్పే
దానికి ఏదయినా ఆధారమున్నదా?
ముస్లీమ్ :- చనిపోయిన వారిని భూసమాధిలోనికి పంపుచున్నాము. మనిషి
చనిపోయినప్పుడు అతనిని భూమిలో పూడ్చిపెట్టుచున్నాము. అట్లు పూడ్చి
పెట్టబడినవాడు ప్రళయము వచ్చువరకు భూసమాధిలో అలాగే ఉండును.
ప్రళయకాలములో దేవుడు వచ్చి సమాధులలో ఉన్న వారందరినీ లేపి,
వారు చేసుకొన్న పాపపుణ్యములను లెక్కించి ఎవరికి వేయవలసిన శిక్షను
వారికి వేయును. అంతవరకు చనిపోయినవారు ఎక్కడ పూడ్చిపెట్టబడి
యుంటే అక్కడే ఉంటారు.
మావారు :– చనిపోయిన మనుషులు భూసమాధిలో ఎంత కాలముంటారు?
ముస్లీమ్ :- ప్రళయ కాలము వచ్చువరకు.
మావారు :- చచ్చిపోయినది మనిషే కదా! అతను ప్రళయము వచ్చువరకు
భూసమాధిలో ఏమి చేస్తుంటాడు?
ముస్లీమ్ :- ఊరకనే పడుకొని ఉంటాడు.
మావారు :- దేవుడు అలా ఎక్కడయినా చెప్పాడా? ఖుర్ఆన్ గ్రంథములో
కూడా ఎక్కడా చెప్పలేదే! ప్రళయము అంటే మీరు ఏమనుకొన్నారు?
ముస్లీమ్ :- ప్రళయము అంటే భూమి మొదలుకొని, ఆకాశము వరకు
నాశనమయిపోవడము. ప్రళయములో దేవుడు వచ్చి మనుషులను భూ
సమాధులనుండి లేపును.
మావారు :- ప్రళయము వచ్చినప్పుడు భూమే లేకుండా పోయినప్పుడు,
అప్పుడు దేవుడు వచ్చి చనిపోయిన మనుషులను ఎక్కడినుండి లేపును.
ప్రళయములో భూమి ఆకాశము అన్ని పోయినప్పుడు, చచ్చిపోయిన వారి
సమాధులు ఎక్కడున్నాయో చెప్పగలరా?
ముస్లీమ్ :- మా పెద్దలను అడిగి వివరముగా చెప్పుతాము.
మావారు :- సరే దేవుడు మీరు చెప్పినట్లే ప్రళయములో అందరినీ లేపాడు
అనుకొందాము. ఇప్పుడున్న జనాభాకే భూభాగము తక్కువ వచ్చుచున్నది.
సృష్ట్యాదినుండి చనిపోయిన వారంతా ఒకమారు లేస్తే కనీసము నిలబడు
దానికి కూడా భూమిమీద జాగా ఉండదే. అంతకు అది సాధ్యమయ్యే
పనేనా? ఇది శాస్త్రబద్ధమైన మాటయేనా?
ముస్లీమ్ :- దేవుడు ప్రళయములో వస్తాడు అని ఖుర్ఆన్ గ్రంథములోనే
ఉన్నది కదా! ప్రళయములో ప్రతి ఒక్కరి పాపపుణ్యములను దేవుడు
లెక్కించి పుణ్యము చేసిన వారిని స్వర్గమునకు, పాపము చేసినవారిని
నరకమునకు పంపునని గ్రంథములో చెప్పారు కదా!
మావారు :- అవును గ్రంథములో ప్రళయమునందు మనుషుల పాప
పుణ్యములను లెక్కించి స్వర్గనరకమునకు పంపుదును అనుమాటను మేము
కూడా చూచాము. గ్రంథములో చెప్పినది మహాజ్ఞాని అయిన జిబ్రయేల్.
జిబ్రయేల్ దేవునిమాటనే చెప్పాడు. అందులో తప్పులేదు. అయితే మీరు
అర్థము చేసుకొన్నదే తప్పు అంటున్నాము. ప్రళయము నీవు అనుకొన్నట్లు
లేదు. అలాగే స్వర్గనరకములు మీరు అనుకొన్నట్లు ఎక్కడోలేవు. గ్రంథములో
చెప్పిన జ్ఞానము సక్రమమైనదే, అయితే అది అర్థము కావడములో మనలో
కాలుష్యము ఏర్పడి కొంత, గ్రంథముగా వ్రాసినప్పుడే వ్రాసినవారు చేర్చిన
కాలుష్యము కొంత ఉండుటవలన, ఖుర్ఆన్ గ్రంథము పూర్తి అర్థము
కాలేదని చెప్పుచున్నాము. ఒక్క ముస్లీమ్ మతమునే మేము వ్రేలుఎత్తి
చూపలేదు. అన్ని మతములలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అందువలన
దేవుని జ్ఞానము మనుషులలో పూర్తిగా తెలియకుండా పోయినది. దేవుడు
తన జ్ఞానమును మూడు గ్రంథములుగా ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానములో
పైకి అర్థము కనిపించునవి నూటికి ఇరవై వాక్యములుండగా, పైకి అర్థము
కనిపించక నిగూడార్థముతో యున్న సూక్ష్మవాక్యములు దాదాపు
ఎనభైశాతము గలవు. పైకి అర్థము కనిపించు వాక్యములను
స్థూలవాక్యములు అని అంటాము. పైకి అర్థము కనిపించక యున్న
వాక్యములను సూక్ష్మవాక్యములు అని అంటాము. ప్రథమ దైవగ్రంథ
ములోగానీ, అంతిమ దైవగ్రంథములోగానీ స్థూల, సూక్ష్మమను రెండు
రకముల జ్ఞానవాక్యములు గలవు.

ఇదే విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 3, ఆయత్ 7
(3-7)లో కూడా ముహ్కమాత్, ముతషాబిహాత్ అను రెండు రకముల
వాక్యములు కలవని చెప్పారు. ముహ్కమాత్ అనగా స్థూలవాక్యములని,
ముతషాబిహత్ అనగా సూక్ష్మవాక్యములని అర్ధము. ఇదే ఆయత్లో
సూక్ష్మవాక్యముల నిజ భావము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియవు
అని కూడా చెప్పారు. దేవునిమాట ప్రకారమే మూడు దైవగ్రంథములలోనూ
ఎనభై శాతము మనుషులకు అర్థముకాని వాక్యములున్నవి. అటువంటి
వాక్యములలో ప్రళయము అనేది కూడా ఒక ముతషాబిహాత్ వాక్యమే.
దానిని సూక్ష్మముగా అర్థము చేసుకోవలెనుగానీ, స్థూలముగా అర్థము
చేసుకోకూడదు. వాస్తవానికి ప్రళయము అనునది స్థూలముగా ఎక్కడా
జరుగునది కాదు. భూమి ఆకాశముతో కూడుకొన్న ప్రపంచమును దేవుడు
సృష్టించాడు. ప్రపంచమును శాశ్వితముగా ఉండునట్లు దేవుడు సృష్టించాడు
గానీ, తర్వాత ఎప్పుడయినా నాశనమగునట్లు సృష్ఠించలేదు. ఈ
ప్రపంచము ఎప్పటికీ నాశనముకాదు. బయట ప్రపంచమును వదలి
చూస్తే సూక్ష్మమయిన ప్రపంచము కూడా జీవరాశుల శరీరముల
రూపములో ఉన్నది. శరీరములో భూమి మొదలుకొని ఆకాశము వరకు
ఉన్నవి. పంచభూతములతో తయారయిన శరీరము నశించినప్పుడే
శరీరములో ప్రళయము ఏర్పడుచున్నది. మనిషి చావును ప్రళయముగా
దేవుడు నిర్ణయించాడు. మనిషి చనిపోయినప్పుడు వెంటనే వాని పాప
పుణ్యములను లెక్కించి వానికి స్వర్గ, నరకములను నిర్ణయించుచున్నాడు.
అదే విధానముననే ప్రళయములో మనిషి పాపపుణ్యములు లెక్కించబడి,
కర్మపత్రములో వ్రాయబడి దానినిబట్టి, మనిషికి స్వర్గ నరకములను
నిర్ణయము చేయడము జరుగుచున్నది. చనిపోయినప్పుడు ఆ జన్మలో

చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి వెంటనే తర్వాత జన్మలో అనుభవించు
కష్టసుఖములను నిర్ణయించి పంపడము జరుగుచున్నది. అలా చనిపోయిన
వాడు తిరిగి వాడు చేసుకున్న కర్మను అనుభవించుటకు వెంటనే శిశు
శరీరమును ధరించి పుట్టుచున్నాడు. ఇది ప్రతి నిత్యము జరుగుచున్న
విధానమే. అయినా ప్రతి మనిషికి చావే వాని ప్రళయమని తెలియకుండా
పోయినది. అందువలన ప్రళయమను వాక్యము ఖుర్ఆన్ గ్రంథములో
యున్నా అది నాకు తప్ప మనుషులకు తెలియదని దేవుడు చెప్పాడు.
అందువలన ప్రళయము ఎప్పుడో వస్తుందని మనిషి అనుకొంటున్నాడు.
ప్రతి జన్మలోనూ ప్రతి జీవికి జరుగు ప్రళయమును ఎవరూ గుర్తించలేక
పోయారు.

ముస్లీమ్ :– మీరు ఏది చెప్పినా మమ్ములను గందరగోళమునకు గురిచేయు
మాటలనే చెప్పుచున్నారు. మేము అనుకొన్నదానికి విరుద్ధముగా చెప్పు
చున్నారు. ఇప్పుడు మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాము చెప్పండి.
ఖుర్ఆన్లోగల ముతషాబిత్ వాక్యముల అర్ధము దేవునికి తప్ప ఏ మనిషికీ
తెలియదని ఇంతకుముందు మీరే చెప్పారు కదా! అలాంటపుడు ఒక
మనిషిగాయున్న మీరు ఈ వాక్యమునకు వివరమును ఎలా చెప్పగలుగు
చున్నారు. మీరు చెప్పిన ప్రళయము మనిషి యొక్క మరణమేనని మీకు
ఎలా తెలుసు?

మావారు :- ఖుర్ఆన్ గ్రంథములో సూరా మూడు, ఆయత్ ఏడునందు
చివరిలో బుద్ధి, శ్రద్ధయున్నవాడు మాత్రమే దేవుని సూక్ష్మజ్ఞానమును గ్రహించ
గలుగుతాడు అని ఉన్నది కదా! ఆ మాట ప్రకారము మాకు దేవుని జ్ఞానము
మీద శ్రద్ధ ఉన్నది. అట్లే జ్ఞానము మీద ఆసక్తిగల బుద్ధియున్నది.

అందువలన దేవుని జ్ఞానము మాకు అర్థమయినది. దేవునిమాట అమృత
వాక్యము. అది ఎప్పటికీ చెక్కుచెదరదు. దేవుడు చెప్పినట్లు నెరవేరి
తీరును. దేవుని జ్ఞానము మీద శ్రద్ధ, బుద్ధియున్న వాడు ఏ మతములో
పుట్టియున్నా, వానికి దేవుని జ్ఞానము సులభముగా అర్థముకాగలదు.
వాడు సంపూర్ణ జ్ఞాని కాగలడు. మతము మీద శ్రద్ధయున్న వానికి జ్ఞానము
లభించదు. దేవుని జ్ఞానము దేవునికే తెలుసు. చెప్పేది ఆయనవంతు
తెలుసుకొనేది మనవంతు. దేవుడు మనిషిగా వచ్చి చెప్పిన గ్రంథములలోని
జ్ఞానమును మేము బుద్ధి గలిగి, శ్రద్ధగలిగి గ్రహించుకొన్నాము. అందువలన
చనిపోయినప్పుడు మనిషి శరీరములో ప్రళయమును పొంది తిరిగి
పుట్టుచున్నాడు. ఇదే విషయమే ఖుర్ఆన్ గ్రంథములో చాలాచోట్ల గలదు.
దానిని ఎవరూ కాదనలేరు.

ముస్లీమ్ :- మనిషి ఒక్కమారు పుట్టి ఒక్కమారు మాత్రమే చనిపోతాడు.
అంతేగానీ ఒకే మనిషి మాటిమాటికీ పుట్టడు. మేము ఖుర్ఆన్ జ్ఞానమును,
హదీసుల జ్ఞానమును కలిపి చదువుకొని సత్యమును తెలుసుకొన్నాము.
మీరు కేవలము ఖుర్ఆన్ జ్ఞానముతోనే చెప్పుచున్నారు. ఖుర్ఆన్ జ్ఞానము
ఒక్కటే సరిపోదు. బల్బు వెలగాలంటే పాజిటివ్ నెగిటివ్ అను రెండు
వయర్లు ఎట్లు అవసరమో అట్లే మనిషిలో జ్ఞానము వెలగాలంటే కరెంటుకు
రెండు వయర్లు ఉన్నట్లు మనిషికి ఖుర్ఆన్ గ్రంథము, హదీసు గ్రంథము
రెండూ అవసరము. మీకు హదీసు జ్ఞానము తెలియదు. అందువలన
మీకు పూర్తి జ్ఞానము తెలియదని చెప్పవచ్చును. మాకు ఖుర్ఆన్తో పాటు
హదీసులు కూడా తెలియును అందువలన మీకు తెలియని జ్ఞానము
కూడా మాకు తెలియును. అందువలన మీ మాటను మేము వినము.
మావారు :- ఖుర్ఆన్ గ్రంథమును దేవుడు అందించాడు. అందువలన
అది దైవగ్రంథమయినది. హదీసు గ్రంథమును ఎవరు వ్రాశారో మాకు
బాగా తెలుసు. హదీసు గ్రంథములో ఏమి వ్రాయబడిందో కూడా మాకు
తెలుసు. హదీసు గ్రంథములో జ్ఞానముంటే, అది ఏ జ్ఞానమో మాకు
తెలియదు అనుకోవద్దు. మేము ఇంతవరకు ఎందుకు మాట్లాడవలసి
వచ్చిందంటే, మీరు మమ్ములను అజ్ఞానులుగా మాట్లాడినందుకు మాకు
తెలిసిన జ్ఞానమేదో మీకు చెప్పాలని చెప్పాము. అంతేగానీ మేము చెప్పినది
మీరు వింటారని, తెలుసుకుంటారని కాదు. జ్ఞానము అర్థము కావాలంటే
దేవుని అనుమతి ఉండాలి. దేవుడు ఒప్పుకొన్నవాడే జ్ఞానమార్గములో
పోగలడు. దేవుడు ఒప్పుకోని వాడు అజ్ఞానమార్గములో పోగలడు.
మనుషులకు దేవుడు జ్ఞానము ఇచ్చినా, అది అందరికీ లభ్యముకాదు అని
దేవునిమాటతోనే అర్థమయినది. వర్షము కురువని ప్రాంతమునకు దేవుడు
మేఘమును పంపి వర్షమును కురిపించినట్లు, మనుషులు జ్ఞానము
తెలియాలని జ్ఞానము లేని ప్రాంతమునకు జిబ్రయేల్ దూతను పంపి
జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తకు చెప్పునట్లు దేవుడు చేశాడు.
అప్పటికాలములో నీతిమంతుడైన ప్రవక్తగారు తనకు జిబ్రయేల్ చెప్పిన
జ్ఞానమును తన అనుచరులకు చెప్పగా చివరకు అది ఖుర్ఆన్ గ్రంథముగా
వ్రాయబడినది.

ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్తగారు చనిపోయిన తర్వాత ఆయన
అనుచరులచేత వ్రాయబడిన గ్రంథము అగుట వలన, అందులో దేవుని
వాక్యములతో పాటు కొంత కాలుష్యము కూడా చేరియుండవచ్చును.
పొలములోని పంట ఇంటికి వచ్చులోపల కల్లములో రాళ్ళు, మన్ను
ధాన్యములో కలిసినట్లు, జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము ప్రవక్తకు అర్థమగుటలో
కొంత, ప్రవక్త చెప్పిన జ్ఞానము గ్రంథరూపముగా మారుటలో కొంత,
వ్రాయబడిన జ్ఞానములో కొంత అజ్ఞానము కూడా కలిసియుండవచ్చును.
అది సహజముగా జరుగుపని. పంటనుండి ఇంటికి వచ్చులోపల పంట
కొంత కాలుష్యముకాగా, ఇంటినుండి వంటకు పోవు సమయములో దానిని
శుభ్రముచేసుకొని, కలిసియున్న రాళ్ళను మన్నును తీసివేసి స్వచ్ఛమయిన
ఆహారమును స్వీకరించినట్లు, జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమునే ప్రవక్తగారు
చెప్పినా, అది గ్రంథరూపముగా మారునప్పుడు కొంతకు కొంత కాలుష్యము
కలిసియుండవచ్చును. గ్రంథమునుండి దానిని స్వీకరించునప్పుడు
జ్ఞానములో కలిసిన అజ్ఞానమును తీసివేసి స్వచ్ఛమయిన జ్ఞానమును
సేకరించవలసియుండును. ఇదే విధముగా ప్రతి దైవగ్రంథము దగ్గర
ప్రతి మతస్థుడు అలాగే చేయవలసియున్నది. దైవగ్రంథము వద్దనే ఇంత
జాగ్రత్త వహించవలసియున్నప్పుడు, దైవగ్రంథములు కాని గ్రంథముల
నుండి జ్ఞానమును పొందవలెనంటే ముందు అందులోనిది జ్ఞానమో
కాదో చూడవలసియున్నది.

ఇప్పుడు హదీసుల విషయానికి వస్తే, హదీసులు ప్రవక్తగారి పేరు
చెప్పి మనుషులు మనే తప్ప ప్రవక్త కూడా వాటిని చెప్పలేదు.
ప్రవక్తగారు చనిపోయన తర్వాత దాదాపు రెండువందల సంవత్సరములకు
కొంతముందు, కొంత వెనుక కాలములో హదీసులు మనుషుల చేత
వ్రాయబడినాయి. నేడు ప్రసిద్ధిలోయున్న హదీసులు హజరత్ బుఖారీ,
హజరత్ ముస్లీన్గారు చెప్పినవే. హదీసులు ఎక్కువగా ముస్లీమ్ల జీవన
విధానమును తెలియజేశాయి తప్ప జ్ఞాన విధానమును తెలియజేసినది
అందులో ఏమీ లేదు. హదీసులు మొదట పదివేల వరకు వ్రాయబడినా
అందులో కొన్ని ఆమోదయోగ్యము కానివి ఉన్నాయని ముస్లీమ్ పెద్దలు
అప్పుడుకొన్ని, అప్పుడు కొన్ని తీసివేయగా, చివరకు 1800 మిగిలి
యున్నాయి. వాటిని ఏమాత్రము ఖుర్ఆన్ గ్రంథముతో జోడించుటకు
వీలులేనివై, జీవిత విధానమునకు సంబంధించినవై ఉన్నాయి. వాటిని
దైవగ్రంథముతో జోడించుకొను అవసరమే లేదు. మనిషి ప్రపంచమునుండి,
కర్మలనుండి దేవునివైపు పోవుటకు, దేవునిలో చేరిపోవుటకు మూడు
గ్రంథములలో ఏ గ్రంథమయినా ఉపయోగపడగలదు. ముస్లీమ్లు ఖుర్ఆన్
గ్రంథమును ఆశ్రయించితే అదియే మిగతా రెండు గ్రంథములను చదవమని
తన వాక్యములో చెప్పి పూర్తి జ్ఞానమును అందివ్వగలదు. ఖుర్ఆన్
సూరా 5, ఆయత్ 68లో చెప్పినట్లు “భగవద్గీతను, బైబిలును,
ఖుర్ఆన్ గ్రంథమును మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు
ఏ ధర్మములోనూ లేనట్లేయగును.”

మీరు పై ప్రశ్నలో మనిషి ఒక్కమారే పుట్టి, ఒక్కమారే చనిపోవును
అని చెప్పి, హదీసు జ్ఞానము తెలియనంతవరకు పూర్తి జ్ఞానము తెలియదని
చెప్పుట వలన, మేము హదీసుల గురించి చెప్పవలసి వచ్చినది. ఇప్పుడు
మనిషి పుట్టుకను గురించి దేవుడు తన గ్రంథములో ఏమి చెప్పాడో చూచి,
ఎవరు చెప్పినమాట నిజమో గ్రహిద్దాము. మనిషి సృష్ట్యాదిలో పుట్టించబడి
అప్పటినుండి ఇప్పటివరకు చావుపుట్టుకల మధ్య నలుగుచున్నాడు,
దైవజ్ఞానమును తెలిసినవారు మాత్రము తిరిగి పుట్టకుండా దేవునియందు
ఐక్యము చెందగా, జ్ఞానము లేనివారందరూ చస్తూ పుట్టుచున్నారు. ఒక
మనిషి జ్ఞానమును తెలియగలిగి మోక్షమును పొందనంతవరకు ఒకమారు
చచ్చి రెండవమారు పుట్టుచూ, అదే విధానమును కొనసాగించుచూ
వచ్చుచున్నాడు. ఈ విషయమును ఖుర్ఆన్ గ్రంథములో చాలాచోట్ల,

చాలామార్లు చెప్పాడు. అయినా ముస్లీమ్లు మనిషి ఒకమారే చస్తున్నాడు
తిరిగి పుట్టడు అని అంటున్నారు. వారు ఎందుకు ఆ మాటను అంటున్నారో
గానీ దైవగ్రంథములో అట్లు ఎక్కడా చెప్పలేదు. మొదట పుట్టించినట్లే
చచ్చిన తర్వాత రెండవమారు కూడా అట్లే పుట్టించబడతారు అని
చెప్పినప్పుడు, రెండవ జన్మ మొదటి జన్మవలె ఉన్నదని తెలియుచున్నది
కదా! ఖుర్ఆన్ సూరా 7, ఆయత్ 29లో ఇలా కలదు. (7-29) “మొదటి
సారి మిమ్మల్ని అల్లాహ్ ఎలా పుట్టించాడో మలిసారి కూడా
మీరు అలాగే పుట్టించబడతారు" ఈ వాక్యమును చదివిన తర్వాత
దీనికి వ్యతిరేఖముగా ఎవరూ మాట్లాడుటకు వీలులేదు. అయితే ముస్లీమ్
దీనికి వ్యతిరేఖముగా మాట్లాడుచున్నారంటే దానికి బలమైన కారణము
ఏదో ఉంటుంది.

ఒక మనిషి చనిపోయినప్పుడు వాని శరీరమును భూమిలో పాతి
పెట్టగా అది కుళ్ళిపోయి మట్టిగా మారిపోవును. శరీరమును భూమిలో
పూడ్చిపెట్టక ముందే ఆ శరీరములో బ్రతికిన మనిషి అనగా జీవుడు
శరీరమును వదలిపోతే
దానిని చనిపోవడము అని అంటున్నాము.
చనిపోయినది శరీరములోని జీవుడుకాగా, ఎందుకూ పనికిరాని శరీరమును
భూమిలో వేయుచున్నాము. శరీరములో కొంతకాలము బ్రతికిన జీవుడు
మనకు ముఖ్యముగాని, చైతన్యము లేని మృతదేహము లెక్కలేదు కదా!
కొంతకాలము శరీరములో బ్రతికిన వానిని మనము భూమిలో పూడ్చి
పెట్టలేదు. వాని శరీరమును మాత్రము పాతిపెట్టుచున్నాము. అయితే
శరీరములో ఉన్న జీవుడు చనిపోయినప్పుడు శరీరము నుండి బయటికి
పోవుచున్నాడు. బయటికి పోయినవాడు తిరిగి క్రొత్త శిశు శరీరమును
ధరించుచున్నాడు. ఇదే విషయమునే (7-29)లో మొదట శిశువుగా
జీవితమును ప్రారంభించినవాడు రెండవమారు కూడా శిశువుగానే
జీవితమును ప్రారంభించునని చెప్పాడు. తొలిసారి శిశువుగా పుట్టినట్లు
రెండవమారు కూడా శిశువుగా పుట్టాలంటే తల్లిగర్భములో తయారయి
బయటికి వచ్చిన శిశు శరీరములో చేరవలసిందే. ఒకమారు శిశువుగా
జీవితమును ప్రారంభించినవాడు రెండవమారు కూడా శిశువు దశనుండే
జీవితమును ప్రారంభించవలసిందే. అదే విధానమును దేవుడు మనుషులకు
అమర్చాడు అనుటకు గుర్తుగా ఖుర్ఆన్ గ్రంథములో (53వ సూరాలో
46,47) వాక్యములలో దేవుడు ఇలా చెప్పియున్నాడు.

(53-46,47) “స్త్రీ గర్భములో ప్రవహింపజేసిన వీర్యబిందువు
నుండి తొలిసారి జీవితమును ప్రారంభించినట్లే, మలిసారి
జీవితమును ప్రసాదించడము దేవునికే చెల్లును".

ఈ వాక్యములతో మనిషి చనిపోయినా రెండవమారు జీవితమును శిశు
దశనుండి ప్రారంభించును అని తెలియుచున్నది. ఇంత వివరముగా
ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ చెప్పియుంటే అల్లాహ్ మాటలను లెక్క
చేయకుండా ఒకమారు చనిపోయిన వానికి జన్మలు లేవు, వాడు ప్రళయ
కాలము వరకు భూసమాధిలోనే ఉండునని చెప్పడము వలన, జన్మల
విషయములో దేవునికి పూర్తి వ్యతిరేఖముగా మాట్లాడినట్లేయగుచున్నది.
భూసమాధిలో పూడ్చబడిన శరీరము కూడా ఆరునెలలకంటే ఎక్కువ
కాలముండదు. అటువంటి దానిని ప్రళయకాలము వరకు ఉండునని
చెప్పడము విడ్డూరము, సైన్సు కూడా ఒప్పుకోదు.

జన్మల విషయమునకు వస్తే చాలామంది ముస్లీమ్లు మనిషికి
రెండవ జన్మలేదు అని మాట్లాడుచున్నారు. వారు గ్రంథము చదివి గ్రంథము
ప్రకారము మాట్లాడుచున్నారా అంటే, అలా కాకుండా వారి పెద్దలు చెప్పినట్లు
మాత్రమే మాట్లాడుచున్నారు. దీనినిబట్టి ముస్లీమ్ సమాజమును అంతటినీ
వారి పెద్దలు తప్పుదారిలో నడిపిస్తున్నారని తెలియుచున్నది. అలా ముస్లీమ్
లందరినీ తప్పుదారి పట్టించవలసిన అవసరము ఏమి వచ్చిందని చూస్తే,
ముస్లీమ్ సమాజమునంతటినీ వారి గుప్పిట్లో పెట్టుకొని వారు ఏమి చెప్పితే
అది చేయునట్లు, ఏమి చెప్పితే అది వినునట్లు మలచుకొనుటకు
విధముగా అమాయకులయిన ముస్లీమ్లనందరినీ దేవుని విషయములో
పూర్తి తప్పుదారి పట్టించారు. ఎవడయినా తమ మాట వినకుండా జ్ఞానము
తెలియునేమోయని అనుమానముతో వారిని కూడా కట్టడి చేయుటకు
దేవుడు చెప్పని విధానమంతటినీ గ్రంథరూపము చేసి, వాటికి హదీసులని
పేరుపెట్టి, ఖుర్ఆన్కంటే ముస్లీమ్లకు హదీసులే ముఖ్యమని చెప్పుచున్నారు.
ఖుర్ఆన్ గ్రంథమును ముందుపెట్టుకొని నేర్పించేది, బోధించేది అంతా
హదీసుల గ్రంథములోనిదే. దానితో నేడు ప్రతి ముస్లీమ్కు హదీసు జ్ఞానమే
అంటుకొని యున్నదిగానీ, ఖుర్ఆన్ జ్ఞానము ఏమాత్రము ఎక్కలేదు.
ఇంతవరకు మేము చెప్పిన మనిషి పుట్టుక విషయములోనూ, దేవుడు
భగవంతునిగా (మనిషిగా) అవతరించును అను విషయములోనూ,
అన్యదేవతారాధన విషయములోనూ, అరబ్బీ భాష విషయములోనూ,
హదీసుల విషయములోనూ ఖుర్ఆన్ ప్రకారము ముస్లీమ్లు
నడువకపోవడానికి వారిపెద్దలే కారణమని అంటున్నాము. అమాయక
ప్రజలయిన ముస్లీమ్లలో మగవారి నందరినీ తమ కబంధ హస్తములలో
షరియత్లనీ, హదీసులనీ చెప్పుచూ బంధించారు. మగవారిని అలా
తమ చేతులలో పెట్టుకోవడమేకాక, ఆడవారిని పూర్తి వంటింటికే పరిమితి
చేసి కనీసము ప్రార్థనా మందిరము లకు కూడా రాకుండా చేసి ముందే
జాగ్రత్తపడ్డారు. ఆడవారిని పూర్తి సైతానులుగా పోల్చి బంధువులు
చనిపోయినా, భర్త చనిపోయినా స్మశానమునకు కూడా పోకుండా చేశారు.
ప్రార్థనమందిరములకు ముందే దూరము చేశారు. ముస్లీమ్లలో సగము
జనాభాగావున్న 80 కోట్లమంది ఆడవారిని ఎక్కడా, ఏ రంగములోనూ
బయటికి రాకుండా చేశారు. కొన్ని దేశములలో చదువుకు కూడా
దూరముగా పెట్టారు. ఇదంతా చూస్తే ముందే ప్లాన్ ప్రకారము (పథకము
ప్రకారము) అణచివేయుటకే అలా చేశారని అర్థము కాగలదు. ముస్లీమ్లు
ఇంతవరకు ఏమాత్రము ఆలోచించకుండా సమాజము, మతము
అనుపేరుతో అణచివేయబడినారు. మతము అను మత్తు త్రాగించి
భవిష్యత్తునుగానీ, దేవుని జ్ఞానమునుగానీ తలచకుండా మతమత్తులో
తూగునట్లు చేశారు. అంతేకాక తమ పెత్తనమును ఇంకా పెంచుకోవాలని,
తమ సమాజములోని అమాయక ముస్లీమ్లను వాడుకొని, వారిలో
ఉగ్రవాద బీజములు నాటి అమాయక ప్రజలను చావునట్లు చేయుచూ,
తాము మాత్రము చాటుగా చక్రమును త్రిప్పుచున్నారు. వారిలోని కొందరికి
స్వర్గము యొక్క ఆశచూపి ఆత్మాహుతి దళములుగా మార్చి “చంపు,
చావు” అను నినాదమును నేర్పుచున్నారు. వారిలో రెండవ కోణముగా
యున్న ఉగ్రవాద విధానమును ఇప్పుడు వివరించి చెప్పుకొందాము. నేడు
ముస్లీమ్లు దేవునిమీద విశ్వాసముతో బ్రతుకుచున్నారు. ముస్లీమ్లలో
ఉన్న ఆస్తి అంతా దేవునిమీద విశ్వాసమే. అలా ఉండడము ఎవరికయినా
ఏ మతస్థునికయినా మంచిదే. అయితే కొందరు వారిలోని విశ్వాసమును,
పేదరికమును ఆయుధముగా మలచుకొని, వారిని హింసకు ప్రేరేపించి,
తమ పబ్బమును గడుపుకొను వారున్నారని తెలుపుటకు, ముస్లీమ్లు వారి
హస్తములలో చిక్కుకోకుండు టకు, అన్ని మతములవారు ఐక్యతతో
బ్రతుకుచూ ఒకే దేవున్ని అందరూ ఆశ్రయించవలెనను ఉద్దేశ్యముతో,
భారతదేశములో ఇప్పుడు బీజములుగా నున్న ఉగ్రవాదమును గురించి
వ్రాయుచున్నాము, జాగ్రత్తగా తెలుసుకోండి.

1400 సంవత్సరములప్పుడు పుట్టిన ముస్లీమ్ (ఇస్లామ్) మతము
సంఖ్యలో హిందూ, క్రైస్తవ మతములకంటే చాలా చిన్నది. అప్పుడది
శిశు దశలో ఉండేది. రెండు వేల (2000) సంవత్సరముల పూర్వము
క్రైస్తవ మతము పుట్టినది. అప్పుడది శిశుదశలోవుండి నేటికి ఎంతో
పెరిగిపోయినది. సృష్ట్యాదినుండి మతము అను పేరులేని ఇందుత్వము
క్రైస్తవ మతము పుట్టిన తర్వాత ఇందూమతముగా పిలువబడినది. ఐదువేల
(5000) సంవత్సరముల పూర్వము మూడువందల (300) కోట్లుగాయున్న
ఇందువుల జనాభా నేటికి వంద (100) కోట్లకు దిగజారిపోయినది. ప్రతి
సంవత్సరము నాలుగు (4) లక్షలమంది హిందువులు క్షీణించిపోవడము
జరిగినది. రెండువేల (2000) సంవత్సరములప్పుడు పుట్టిన క్రైస్తవమతము
నేడు దాదాపు 210 కోట్ల జనాభా సంఖ్యలో ఉండగా, ఇస్లామ్ మతము
దాదాపు 162 కోట్ల జనాభాగాయున్నది. క్రైస్తవులు ప్రతి సంవత్సరము
10,50,000 మంది సంఖ్య పెరుగుచుండగా, ముస్లీమ్ మతము ప్రతి
సంవత్సరము 11,45,000 మంది సంఖ్య పెరుగుచున్నది. ప్రపంచములో
అత్యంత వేగముగా పెరుగు జన సంఖ్య నేడు ముస్లీమ్లదేయని
చెప్పవచ్చును. అయితే ప్రపంచములో జనాభాయందు క్రైస్తవులను దాటి
మొదటి స్థానములోనికి రావడానికి ముస్లీమ్లకు దాదాపు 50
సంవత్సరములు పట్టవచ్చును. అయితే అంతవరకు ఉండు ఓపిక

ముస్లీమ్లకు లేదు. అందువలన ఏదో ఒక విధముగా తొందరగా ప్రపంచ
జనాభాలో క్రైస్తవమతమును మించిపోవాలని అనుకొన్నారు. ప్రపంచములో
తమదే మొదటి స్థానముగా ఉండవలెనని అనుకొన్నారు. ప్రపంచములో
మొదటి స్థానముగా ఉన్నప్పుడు ప్రపంచము మొత్తము ఇస్లామ్
సామ్రాజ్యముగా చేయాలనుకొన్నారు. ప్రపంచము నంతటినీ తమ గుప్పిట్లో
పెట్టుకోవాలను ఉద్దేశ్యము ముస్లీమ్లలో కొద్దిమందికి మాత్రము కలిగినది.
“వేరుపురుగు చేరి వృక్షమునే చెరిచినట్లు" కొందరు ముస్లీమ్ల
దురాలోచన ప్రపంచమును మొత్తము వినాశనమువైపుకు లాగుచున్నది.
గత పది సంవత్సరములనుండి ముస్లీమ్ మతము తమ జనాభాను చాలా
వేగముగా పెంచుకొనుచున్నది. ప్రపంచ జనాభాలో తామే ముందుండాలని
ఎందుకు అనుకున్నారో చెప్పేదానికంటే ముందు కొంత సమాచారమును
తెలుసుకొందాము. ఒక మనిషి మరొక మనిషిని తనవైపు ఆకర్షించు
కొనుటకు అతను మాట్లాడే మాటయే ముఖ్యపాత్ర వహించుచున్నది. ఒక
మనిషి మాట్లాడే విధానమునుబట్టి మరొక మనిషి వానికి దగ్గరవడముగానీ,
దూర మవడముగానీ జరుగును. అందువలన మనిషిలోని మాట మహా
శక్తివంతమయినదని జ్ఞానము తెలిసిన పెద్దలనడము జరిగినది. ఎదుటి
మనిషిని వశము చేసుకోవడానికి మాట మంత్రమువలె పని చేయును.
అందువలన “వేమన యోగి” తన మాటలలో ఒకమాటను ఈ విధముగా
అన్నాడు. అదేమనగా! “ప్రతి ఆకు ఔషదమే, ప్రతి మాట మంత్రమే”
అని అన్నాడు. అంతేకాక “మాటను మించిన మంత్రము లేదు,
ఆకును మించిన ఔషదము లేదు” అని అనడము కూడా జరిగినది.
దీనినిబట్టి చూస్తే మనిషి తెలియకుండా మాట్లాడుమాటకు ఎంత

విలువయున్నదో అర్థమగుచున్నది. ఒక మాట కొన్ని సమయములలో
విషముగా పనిచేసి, మనిషికి హాని చేయును. మరియొక మాట కొన్ని
సందర్భములలో అమృతమువలె పనిచేసి జరుగబోయే వినాశనమునుండి
రక్షించగలదు. దీనినిబట్టి మాట అంటే ఒకవైపు అమృతము మరియొకవైపు
విషము కలిసియున్నదని అర్థము.


ఒకమాటను సరిగా అర్థము చేసుకొంటే అది అమృతములాగా
పని చేయును. అదే మాటనే సరిగా అర్థము చేసుకోలేకపోతే అది
విషములాగా పని చేయును. ఉదాహరణకు ఒకమాటను గురించి
చెప్పుకొందాము. ఒక గురువు ఇద్దరు వ్యక్తులను చూచి మీరు ఇరువురు
నాకు నమ్మకస్తులుగా ఉన్నారు. మీరు నేను ఏమి చెప్పితే దానిని తప్పక
ఆచరించుతారు. ఆ నమ్మకముతోనే మీ ఇద్దరికి నేను ఒక మాటను
చెప్పుదును. మీరు ఆ మాటను శాశ్వితముగా ఆచరించుతారని
అనుకొంటాను. రేపు మంచి దినము ఆ మాటను రేపు ఉదయము సరిగా
ఆరుగంటలకు చెప్పుతాను అని అన్నాడట. అప్పుడు అక్కడున్న ఇద్దరు
అలాగే మీ మాటను శాశ్వితముగా ఆచరిస్తామని అన్నారు. రెండవరోజు
ఉదయము ఆరుగంటలకే అక్కడికి రావాలని ఆ ఇద్దరూ ప్రయత్నము చేసి
వచ్చినా, దారిలో వర్షము పడుట వలన కొంతముందు రాలేకపోయినా,
ఖచ్చితముగా ఆరుగంటలకు అక్కడికి చేరుకోగలిగారు. అప్పటికే వారిని
రమ్మనిన అతను వారిద్దరికొరకు వేచిచూస్తూయుండెను. వారు ఆరుగంట
లకు కనిపించిన వెంటనే మూహూర్తము దాటిపోకుండా ఆరుగంటలకే
చెప్పవలెనని అతను చెప్పవలసిన మాటను వెంటనే చెప్పి తనమాటను
ఆచరించమన్నాడు. అతను ఖచ్చితమైన మూహూర్తము కాలములోనే
చెప్పినమాట “పో రా పో”. ఆ మాటను విన్న ఆ ఇద్దరూ గురుతుల్యుడయిన
అతని మాటను తప్పనిసరిగా ఆచరించాలను ఉద్దేశ్యముతో అక్కడినుండి
వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన ఇద్దరిలో ఒకడు తిరిగి రెండవరోజు
వచ్చాడు. మరియొకడు తిరిగి రాలేదు. ఒకడు మాత్రము ప్రతి దినము
తన గురువు దగ్గరికి వచ్చి నమస్కారము చేసుకొని పోవుచుండగా, మరొకడు
ఎప్పటికీ అక్కడికి రాలేదు.

అలాగ కాలము దాదాపు నలభై సంవత్సరములు గడచిపోయినది.
అప్పటికి గురువు వయస్సు తొంభై సంవత్సరములయినది. పూర్తి
వృద్ధాప్యములో గురువుగారికి నలభై సంవత్సరముల క్రింద తనవద్దనుండి
పోయి ఇక తిరిగి రాని శిష్యున్ని చూడాలనిపించి గురువే శిష్యున్ని వెదకుచూ
పోయాడు. చివరకు శిష్యున్ని చూడగలిగాడు. అప్పుడు శిష్యున్ని చూచి
“నీవు నన్ను వదలి వచ్చి నలభై సంవత్సరములయినది. నీవు నా దగ్గరకు
రాకుండా ఎందుకు మానుకొన్నావు?” అని అడిగాడట. అప్పుడు
గురువుగారు ఆ మాట అడిగినందుకు శిష్యుడు పూర్తి కోపము వచ్చినవాడై
“పో రా పో” అని ఆ దినము చెప్పి, ఇప్పుడు ఎందుకు రాలేదని అడుగుతావా!
అని గురువును గద్దించి మాట్లాడి, కోపమును భరించలేక పిడికిలితో
గురువుగారి నెత్తిన గుద్దాడు. శిష్యుడు గుద్దిన గుద్దుకు ముసలి గురువు
క్రిందపడి ప్రాణము వదిలాడు. అంతలోనే గురువు వెంట వచ్చినవారు
గురువుగారి శవమును తీసుకొనిపోయి, శిష్యుడే తలమీద గుద్ది చంపాడని
న్యాయస్థానములో న్యాయమును కోరుచూ శిష్యుని మీద ఫిర్యాదు చేశారు.
అప్పుడు న్యాయాధిపతి గురువును చంపిన శిష్యుని పిలిచి విచారించాడు.
అప్పుడు తనకు నలభై సంవత్సరములప్పుడు గురువు చేసిన మోసమును
గురించి చెప్పాడు. న్యాయాధిపతి ఆ విషయమును సమగ్రముగా విచారించ
దలచి, నలభై సంవత్సరములప్పుడున్న మరొక శిష్యున్ని కూడా పిలిచి
అడిగాడు. అప్పుడు మొదటి శిష్యుడు మా గురువుగారు ఎవ్వరినీ మోసము
చేయలేదు. మా విద్యాభ్యాసము అంతా అయిపోయిన తర్వాత మేము
గురువువద్దనే ఉండవలసిన అవసరము లేదనీ, అప్పుడప్పుడు వచ్చి పోండని
మా గురువుగారు మా ఇద్దరికి 'పోరాపో' అన్నాడు. మా గురువుగారు
చెప్పిన మాటప్రకారము నేను పోయాను, తర్వాత వచ్చాను, అట్లే ఇప్పటికీ
అక్కడికి పోయి వచ్చుచూ గురువుగారి మాటను జవదాటకుండా ప్రవర్తించు
చున్నాను. మా గురువుగారు చెప్పినమాట నా తోటి శిష్యునికి అర్థము
కాక, అతను పోయినప్పటినుండి ఇంతవరకు రాలేదు. పైగా గురువు
తనను మోసగించాడని గురువుమీదికే దాడిచేసి ఆయన మరణమునకు
కారణమయినాడు అని చెప్పగా అప్పుడు గురువుగారు చెప్పినమాట
నీకేమని అర్థమయినదని న్యాయాధిపతి అడిగాడు. జడ్జి అడిగినమాటకు
వెంటనే మొదటి శిష్యుడు ఇలా సమాధానమును చెప్పాడు. “నన్ను అప్పుడు
అక్కడి నుండి పోవచ్చునని "పో” అన్నాడు. పోయినవాడు తిరిగి వచ్చునట్లు
“రా” అన్నాడు. వచ్చిన మేము అక్కడేవుండక తిరిగి పోతుండమని రా
తర్వాత “పో” అన్నాడు. మీరు పోయి తర్వాత వచ్చి తిరిగి పోతుండమని
మాకు అర్థమగునట్లు 'పోరాపో' అని మూడక్షరముల పదమును చెప్పితే,
వాటిని అనగా ఆ మాటను నేను అర్థము చేసుకోగలిగి గురువుగారు
చెప్పినట్లే చేస్తూ వచ్చాను. నాకు విరామము దొరికినప్పుడంతా గురువు
గారివద్దకుపోయి తిరిగి వచ్చెడివాడిని. అయితే నాతోటి శిష్యునికి గురువు
గారు చెప్పినమాట అర్థముకాక అతను తిరిగి రాలేదు” అని అన్నాడు.

ఆ సమాచారమంతయూ సాక్ష్యముగా విన్న జడ్జిగారు ముద్దాయిగా
యున్న శిష్యున్ని విచారించగా అతను ఇలా చెప్పాడు. "గురువుగారు
ఇద్దరి శిష్యులను రెండవరోజు ఉదయము ఆరుగంటలకు రమ్మని చెప్పుట

వలన మేము సరియైన సమయమునకు అక్కడకు పోయాము. గురువుగారి
మాటను తప్పనిసరిగా వినవలెనని చెప్పిన ఆయన, మేము అక్కడికి పోతూనే
మమ్ములను చూచి "పోరాపో” అన్నాడు. ఆయన తన మాటలో రెండు
మార్లు పొమ్మని చెప్పడము వలన, తర్వాత మమ్ములను శిష్యులని
ఏమాత్రము అనుకోకుండా కనీసము పేరుతో కూడా పిలువకుండా, ‘పోరా’
అని చెప్పి తర్వాత 'పో' అనడము వలన, తర్వాత తనవద్దకు రావద్దని
చెప్పినట్లు అర్థమయినది. ఆయన మాటలోని భావమును గ్రహించిన
నేను ఆయన మాటను ఆచరించవలెనను గౌరవముతో అప్పటినుండి ఇప్పటి
వరకు గురువుగారి దగ్గరకు పోలేదు. అయినా కొన్ని సంవత్సరములు
ఆయన సేవ చేసిన నేను, ఏమి తప్పు చేయకనే తనవద్దకు రావద్దని
బహిష్కరించినట్లయినది. అప్పుడు గురువు అను భావముతో ఆయన
మాటను గౌరవించి నేను అక్కడికి పోకుండా నిజాయితీగా ఆయన మాటను
విని ఆచరించాను. అయితే ఇప్పుడు వచ్చి నేను ఆయన మాటను విననట్లు
ఆయన పొమ్మని చెప్పనట్లు ఎందుకు నావద్దకు రాలేదని అడగడము వలన
నాకు కోపమువచ్చి ఆవేశమును పట్టుకోలేక కొట్టాను.” అని చెప్పాడు.
అప్పుడు జడ్జిగారు రెండవ శిష్యుడు గురువు చెప్పినమాటను అర్థము
చేసుకోవడములో పొరపడినాడనీ, గురువు చెప్పినమాటలోని పో, రా,పో
అను మూడు అక్షరములను తప్పుగా అర్థము చేసుకొని గద్దించి పొమ్మనట్లు,
ఇక తిరిగి తనవద్దకు రావద్దని విసుగుగా చెప్పినట్లు అర్థము చేసుకోవడము
వలన, చెప్పిన విషయమేదో అతనికి అవగాహన కాకపోవడము వలన
అర్థము పోయి అనర్థమయినది. అతనికి తెలిసిన అనర్థము వలన చివరికి
అది హింసగా మారినది. అతనికి గురువు చెడు చెప్పకున్నా తనకు
అన్యాయము చేసినట్లు తలచాడు. చెడుగా అర్థము చేసుకొన్నాడు.
”

గురువుగారి ఒకే మాటను ఇద్దరు శిష్యులు ఎలా రెండు విధముల
అర్థము చేసుకొన్నారో, అట్లే దేవుడు చెప్పిన ఒకే మాటను రెండుమతముల
వారు, రెండు విధముల ఎవరికి వారు అర్థము చేసుకోవడము వలన,
మనుషుల మధ్యలో హింస చోటు చేసుకొంటున్నది. ఒకరు మంచి
భావముతో చెప్పినమాట ఇంకొకనికి చెడు భావముతో అర్థమయితే, చెప్పిన
వానిమీద మనిషికున్న స్నేహము పోయి శత్రుత్వము కల్గును. అదేమాట
మంచిగా అర్థమయితే శత్రుత్వము పోయి స్నేహము ఏర్పడును. ఒకమాట
ఎదుటి మనిషిని మార్చగల ప్రభావముగలదై యున్నందున, మాటను
మంత్రము అన్నారు. దేవునికి సంబంధించిన మాట అర్థమయితే అది
మనిషికి జ్ఞానముగా కనిపించును. అర్థము కాకపోతే అజ్ఞానముగా
కనిపించును. దేవుడు తన జ్ఞానమును ముగ్గురికి మూడుమార్లు చెప్పాడు.
చెప్పినవాడు ఒక్కడే, చెప్పినది ఒకే జ్ఞానమునే. అయితే వినినవారు ముగ్గురు
అయినందున, వారు విడివిడిగా వేరువేరు సమయములలో వినుట వలన,
వినిన ముగ్గురు ఒకే జ్ఞానమునే మూడు విధముల అర్థము చేసుకొన్నారు.
దేవుడు మనిషియొక్క చావు పుట్టుకలను గురించి చెప్పితే, మనుషులు ఆ
మాటను రెండు విధముల అర్థము చేసుకోవడము జరిగినది. కొందరు
మనిషి ఒకమారు పుట్టి, ఒకమారు మాత్రమే చావగలడనీ, అదే విషయమునే
చావుపుట్టుకలని దేవుడు చెప్పాడనీ అంటున్నారు. మరి కొందరేమో మనిషి
చచ్చిన తర్వాత తిరిగి పుట్టునని తెలుపుచూ, దేవుడు చచ్చి పుట్టుట అని
మనుషుల గురించి చెప్పాడని అంటున్నారు.

ఒక గుంపువారు (ఒక మతమువారు) చావు పుట్టుకయనీ, ఒక
చావు ఒక పుట్టుకను గురించి దేవుడు చెప్పాడు, అంటే మనిషి ఒకమారే
పుట్టి ఒకమారే చనిపోవుననీ అంటున్నారు. మరియొక గుంపు (మతము)

వారు దేవుని మాటను బాగా పరిశీలించి చూస్తే ముందు చావు, తర్వాత
పుట్టుక అని చెప్పియుండుట వలన, మనము ఇప్పుడు బ్రతికి ఉన్నాము
కనుక తర్వాత వచ్చునది చావుయనీ, చావు అని చెప్పిన తర్వాత పుట్టుక
అని ఉండుట వలన, చనిపోయినవాడు పుట్టునని వరుస క్రమమునుబట్టి
అర్థమయినదని చెప్పవచ్చును. చావు తర్వాత పుట్టుక అంటే మనిషి ఎన్ని
జన్మలెత్తినా చావడము తిరిగి పుట్టడము జరుగునని తెలియుచున్నది.
అట్లుకాకుండా అదే పదమును ఒక చావు ఒక పుట్టుక అని లెక్కించి
అర్థము చేసుకొంటే ఒకమారు పుట్టి ఒకమారు చనిపోవడము తప్ప
మనిషికి జన్మలు లేవు అని చెప్పవచ్చును. ఇట్లు ఒకే వాక్యము రెండు
విధముల అర్థము నివ్వడము జరుగుచున్నది. అదే విధముగా దేవుని
జ్ఞానములో అనేక పదములు, అనేక వాక్యములు రెండు రకములుగా
అర్థము నిచ్చుచున్నవి. ఇటువంటి ద్వంద్వ అర్థములున్న చోట ఏకపక్ష
నిర్ణయము తీసుకోకుండా జాగ్రత్తగా యోచించాలి. అర్థము కాకపోతే
ఇతరులతో చర్చించి తెలుసుకోవాలి. ఒకే వ్యక్తి తన శిష్యులకు చెప్పిన
ఒకే పదము కేవలము మూడు అక్షరములు “పో రా పో” అనునవి ఏ
విధముగా ఇద్దరికి రెండు రకముల అర్థమయినవో, అట్లే చావు పుట్టుకలు
అను ఒకే పదము రెండు మతముల వారికి వేరువేరుగా అర్థమయి
ఒకడు ఒకమారే చచ్చి పుట్టుటయని చెప్పితే, మరొకరు అలాకాదు
చావుపుట్టుకలు మనిషికి శాశ్వితముగా ఉన్నాయి అంటున్నారు. దేవుడు
చెప్పినట్లు ముందు చావు తర్వాత పుట్టుక అయితే చావుపుట్టుకలు
శాశ్వితముగా ఉన్నట్లే కదా! అని అంటున్నారు. ఇక్కడ చావుపుట్టుకల
విషయములో మనుషులు రెండు గుంపులుగా విడిపోయి ఎవరిమాట
వారికి సత్యము అంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే

ఒకమాట ఏదయినా సరిగా అర్థము కాకపోతే అది విరుద్ధ భావమును
కలిగించి నాది సత్యమంటే, నాది సత్యము అనిపించును. అప్పుడు
ఒకరిమీద మరొకరు ఆధిపత్యమును ప్రదర్శించి తనమాటనే నెగ్గించు
కోవాలని చూచుదురు. అప్పుడు నాకు ఇతరులకంటే ఎక్కువ తెలియునను
గర్వము మనిషిలో పుట్టును. గర్వము పుట్టిన తర్వాత తనమాటను కాదను
వానిమీద అసూయ పుట్టును. అసూయ తర్వాత కోపము పుట్టును. మనిషి
తలలో కోపము పుట్టుట వలన అది బయట ప్రపంచములో హింసగా
మారును. అప్పుడే భూమిమీద ఉగ్రవాద బీజములు పుట్టుచున్నవి.

ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము అని రెండు రకముల
జ్ఞానము భూమిమీదకలదు. ప్రపంచ జ్ఞానమును ప్రాథమిక పాఠశాలతో
మొదలుకొని విశ్వవిద్యాలయముల వరకు నేర్పుచుండుట వలన మరియు
ప్రపంచ జ్ఞానమునకు నాలుగు శాస్త్రములు ఉండుట వలన ఒకరు నేర్చిన
దానిని మరొకరు నేర్చుచున్నారు. ప్రపంచ జ్ఞానములో ఎక్కడా పేచీలుగానీ,
పట్టింపులుగానీ, నేను పెద్ద అనుటగానీ ఉండదు. ఒక్క పరమాత్మ
జ్ఞానమును నేర్పు కాలేజీలు, యూనివర్శిటీలు లేనందున, పరమాత్మ
జ్ఞానమునకు ఒక శాస్త్రము ఉందని తెలియకపోవడము వలన ఎవరికి
తెలిసినది వారు జ్ఞానము అనుకోవడము జరుగుచున్నది. అంతేకాక
జ్ఞానములో నేను పెద్ద అంటే కాదు నేను పెద్దయని అనుకోవడము
జరుగుచున్నది. ఎవరికి వారు నేను జ్ఞానిని అనుకోవడము వలన రెండవ
వానిని అజ్ఞానిగా చెప్పుచున్నాడు. అప్పుడు మనుషుల మధ్య గర్వము,
అసూయ, కోపములు పుట్టుచున్నవి. అప్పుడే హింసకు దారి ఏర్పడుచున్నది.
ప్రపంచ జ్ఞానమునకు సంబంధించిన ప్రపంచ విషయములకు ఇది
న్యాయము, ఇది అన్యాయము అని నిర్ణయము చేయు చట్టము, కోర్టులు
(న్యాయస్థానములు) కలవు. అయితే పరమాత్మ జ్ఞానమునకు సంబంధించిన
ధర్మములను, అధర్మములను నిర్ణయము చేయు చట్టముగానీ, కోర్టులు
గానీ లేవు. అందువలన ఎవరికి తెలిసిన దానిని వారు ధర్మము
అనుకోవడము, ఇతరులకు తెలిసినదంతా అధర్మము అని అనుకోవడము
జరుగుచున్నది.

దైవజ్ఞాన విషయములలో ఇటువంటి లోపములుండుట వలన,
ఇది ధర్మము అని తేల్చి చెప్పువారు ఎవరూ లేనిదానివలన, దేవుని
జ్ఞానమును దేవుడే నిర్ణయము చేసి చెప్పవలసియుండుట వలన, దేవుని
విషయములో అజ్ఞానులు సహితము తలదూర్చి మేము చెప్పునది జ్ఞానము
అని అనవచ్చును. ఇక్కడే కొందరు తమ ఆధిపత్యమును సంపాదించు
కోవాలనుకొంటున్నారు. జనాభాలో ఎక్కువగాయున్న క్రైస్తవమతమును
దాటుటకు రెండవ స్థానములోయున్న ముస్లీమ్లు ప్రయత్నము చేయుచున్నా
రనడము పూర్తి సత్యము. సంఖ్యను పెంచి మతమును బలోపేతము
చేయుటకు ముస్లీమ్లు రెండు విధానములను అనుసరిస్తున్నారు. తమ
బోధను బోధించి, తమ బోధలకు ఆకర్షితులను చేసి, ఇతరులను తమ
మతములో చేర్చి సంఖ్యను పెంచుకోవడము ఒక విధానముకాగా, రెండవ
విధానము ఇతరుల సంఖ్యను సాధ్యమున్నంతవరకు తగ్గించితే సంఖ్యలో
తమకు అగ్రస్థానము తొందరగా లభించునట్లు చేయడము. తమకు తెలిసిన
తమ మతములోని బోధలతో ఇతర మతముల వారిని ఆ మతములో
లేకుండా చేసి తమ మతములో కలుపుకోవడము వలన ఒకవైపు తమ
మత సంఖ్య పెరుగును. మరొక వైపు ఇతరుల సంఖ్య తగ్గును. అలా
తమ మతబోధలు నచ్చనివారు, తమ మతజ్ఞానమే గొప్పయనువారు
ఎవరయినావుంటే, వారు తమ మత జ్ఞానమును ఒప్పుకోరు కనుక వారు
తమ మతములోనికి రారు. కావున అటువంటి వారిని భౌతికముగా
లేకుండా చేయడము రెండవ విధానముగా ఉన్నది. ప్రస్తుత కాలములో
ముస్లీమ్లయందు తమ మతమును, మత సంఖ్యను వేగముగా పెంచుకో
వాలను యోచన ఎక్కువగా ఉండుటవలన, రెండు విధ కార్యములకు
శ్రీకారము చుట్టారు.

మొదటి విధానములో తమ బోధలను, బోధించుటకు ప్రతి
పట్టణములోనూ కొన్ని ఆధ్యాత్మిక సంఘములను ఏర్పరచడము, ఆ
సంఘములలో ముస్లీమ్లలోయున్న మేధావులను ఉంచడము, వారిచేత
బోధలు చెప్పించడము, బహిరంగ ఉపన్యాసములు చెప్పించడము జరుగు
చున్నది. ఆ బోధలలో, ఉపన్యాసములలో తమ మేధాశక్తిని ఉపయోగించి
చెప్పుట వలన, ఇతర మతములలోని వేదములను, ఉపనిషత్తులను, పురాణ
ములను, భగవద్గీతను కంఠాపాటముగా చెప్పుచూ ఇతరులను వారి
బోధలకు ఆకర్షితులను చేయుచున్నారు. వారి ఉపన్యాసములను విన్నవారు
ఎవరయినా వారిని శభాష్ అన్నట్లు, వారు చెప్పినదే నిజ జ్ఞానమన్నట్లు
చేయుచుందురు. ఉపన్యాసముల ద్వారా ఎక్కువగా ప్రజల దృష్టిని తమవైపు
త్రిప్పుకొనుచున్నారు. వారి ఉపన్యాసములలో భగవద్గీతయున్నా,
బైబిలుయున్నా, వేదములున్నా అన్నిటినీ బోధించినా చివరకు అన్ని
మతములకంటే ఇస్లామ్మతమే గొప్పదని చెప్పుచుందురు. బహిరంగ
ఉపన్యాసములలో అన్ని మతగ్రంథముల విషయములు ప్రస్తావిస్తూ అన్ని
మతస్థులను ఆకర్షించుకొని తమ బోధలను వినునట్లు చేయుచున్నారు.
అన్ని మతముల గ్రంథములలోని జ్ఞానమును చెప్పినా చివరకు ముస్లీమ్
మతముకంటే మించినది లేదని, ఈ మతము నవీనముగా వచ్చినదని,
మిగతా మతములన్నీ పాతబడిన ధర్మములతో కూడుకొన్నవని, తమ
మతము స్వచ్ఛమయినదనీ, అన్ని విధముల గొప్పదని చెప్పుచూ చెప్పకనే
తమ మతములోనికి ఆహ్వానించుచుందురు. మిగతా మతములలోని
శ్లోకములనుగానీ, వాక్యములనుగానీ వారికి అనుకూలముగాయున్న వాటిని
మాత్రమే చెప్పుచుందురు. వారికి అనుకూలముగా లేని వాక్యములనుగానీ,
శ్లోకములనుగానీ ఏమాత్రము చెప్పరు. జ్ఞాన విషయములో ఎవరయినా
ఇదికాదు అని అంటే వారిని డిబేటు (చర్చకు) పిలుస్తారు. ఒకవేళ చర్చ
జరిగితే అందులో వారి మేధాశక్తిని, వాక్చాతుర్యమును ప్రదర్శిస్తారు.
ఎదుటివాడు చెప్పేది నిజమయినా అబద్దమన్నట్లు చేస్తారు. అదంతయూ
వీడియో తీసి 'యూ ట్యూబ్' లో పెట్టి తామే గొప్ప, తమ జ్ఞానమే
గొప్పయన్నట్లు ప్రచారము చేసుకొంటారు. ఆ వీడియోలను విదేశాలకు
పంపి, ఇస్లామ్ మతమును తాము బాగా ప్రచారము చేయునట్లు చెప్పి,
అక్కడినుండి విపరీతమైన ధనమును తెచ్చుకొంటున్నారు. ఆ ధనముతో
తమవారిలో ముఖ్యముగా యువకులలో ఎవరయినా మేధాశక్తి,
జ్ఞాపకశక్తియున్న వారిని వెదకి అటువంటివారిని తమ సంస్థలో చేర్చుకొని
వానికి ధన సహాయము చేసి, అతనిని తమకు పనికివచ్చు బోధనలను,
అన్ని మత గ్రంథములనుండి నేర్పించి, వాదనలో దిట్టగా తయారు
చేయుదురు. అలా జ్ఞాపకశక్తిలో గొప్పగాయుండి ఏ సమయములోనయినా,
ఏ గ్రంథములోనయినా, ఏ పేజీలోయున్న శ్లోకమునుగానీ, పద్యమునుగానీ,
వాక్యమునుగానీ చెప్పగలుగు వారిని వారి సంస్థలో ఉంచుకోవడమేగాక
అటువంటివారు దొరుకుకొలది, ఆధ్యాత్మిక సంస్థలకు ఏదో ఒక పేరు పెట్టి
తయారు చేసిన సంఘములను చిన్న పట్టణము మొదలుకొని, పెద్ద నగరము
వరకు తయారు చేసి, ఆ సంఘముల ద్వారా తమ ఆధ్యాత్మిక కార్యములను
నడుపుచూ, బయటికి అన్ని మతములకంటే ఎక్కువ జ్ఞానమును ప్రచారము
చేయు వారిగా కనిపించుచున్నారు. అవకాశమున్న చోటంతా “మతముల
ఐక్యత”, “అందరికీ దేవుడు”, “మతముకంటే జ్ఞానము పెద్ద” అని అందరికీ
సంబంధించిన జ్ఞానమును చెప్పునట్లు కనిపించుచున్నారు.
గత పది లేక పదిహేను సంవత్సరములనుండి ఆధ్యాత్మిక
సంఘములుగా ఒక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రములలోనే వందల సంఖ్యలో
ఇస్లామిక్ సంబంధ సంఘములు తయారయిన దల సంఖ్యలో
ఇస్లామిక్ సంఘములు నేడు ప్రతి జిల్లాలోను, జిల్లా సెంటర్కాని పెద్ద
పట్టణములలోనూ తయారయినాయి. అక్కడ అన్ని మతములకు
సంబంధించిన పాఠములు నేర్చిన వారిని చూస్తే ఎవరయినా ఆశ్చర్య
పోక తప్పదు. హిందువులలో సంస్కృత భాష పరిచయమున్నవారు, సంస్కృత
శ్లోకములు చెప్పువారు ఒక్క బ్రాహ్మణులు తప్ప ఎవరూ లేరు. అయితే
వారికంటే బాగా సంస్కృత శ్లోకములను చెప్పువానిని ఇస్లామిక్ సంఘము
లలో చూడవచ్చును. వారు గడ్డములు పెంచి ముస్లీమ్లుగా కనిపించు
చుండినా, హిందువులలో లేని పాండిత్యమును వారు వ్యక్తము చేయు
చున్నారు. వారిలో కనిపించు పాండిత్యమును చూచి ఎవరయినా ఆశ్చర్య
పోకతప్పదు. బయట సాధారణ మనుషులకేకాక జ్ఞానములో అంతో
ఇంతో అనుభవమున్న వారిని సహితము వారి మాటలతో ఓడించి మేమే
గొప్ప, మా జ్ఞానమే గొప్ప అన్నట్లు చేయుచున్నారు. మేము చాలామార్లు
ఇస్లామిక్ సంఘముల వారితో మాట్లాడము జరిగినది.

మేము సర్వ
సాధారణముగా మాట్లాడి వారివద్దవున్న జ్ఞానమును తెలియుటకు చాలా
ప్రశ్నలకు జవాబులు నాకు తెలియనట్లు అడిగాము. ఎవరికయినా
చెప్పగలము అనునట్లున్నవారు చెప్పిన సమాధానములన్నిటినీ చూచాము.
మేము ప్రశ్నించినప్పుడు వారు ఏమి చెప్పినా మధ్యలో మాట్లాడకుండా

శ్రద్ధగావిన్నాము. దానివలన వారు మేము అడిగిన ప్రశ్నలకన్నిటికి
జవాబును చెప్పారు. వారు చెప్పిన వాటిలో వినేదానికి అన్నీ బాగున్నా,
ఏది శాస్త్రబద్ధముగాయున్నదో, ఏది శాస్త్రబద్ధముగాలేదో మేము మా
అనుభవము వలన గ్రహించగలిగాము.

మేము అడిగిన ప్రశ్నను మాకు తెలియనట్లే, ఇతరులు మమ్ముల
నడిగితే మేము ఏమి సమాధానము చెప్పాలి? అని అడిగాము. అప్పుడు
వారు జ్ఞాపకశక్తితో ఎక్కడెక్కడి శ్లోకములనో, వాక్యములనో చెప్పగలిగినా
అందులో జ్ఞానము శాస్త్రబద్ధముగా లేదని తెలిసింది. చనిపోయిన వారంతా
భూసమాధులలోవుంటే క్రొత్తగా వచ్చి పుట్టేవారు ఎక్కడినుండి వస్తున్నారు
అని అడిగితే దానికి వారు ఇలా చెప్పారు. “దేవుడు భూమిమీద పుట్టించే
వారందరిని ముందే తయారు చేసి ఒక మైదానములో పెట్టుకొనివుంటాడు.
అక్కడ మైదానములో ఉన్నవారిని ప్రతి దినము కొంతమందిని పుట్టేటట్లు
చేస్తున్నాడు” అని అన్నారు. అది శాస్త్రబద్ధము లేనిమాటయని తెలిసి
పోవుచున్నది. ఏ గ్రంథములోలేని విషయములను వారు స్వంతముగా
చెప్పి సరిచేయుచున్నారు. “మనుషులుండే మైదానము ఎక్కడుంది? అక్కడ
ఎంతమంది నిలువయున్నారు” అని అడిగితే ఆకాశములో ఒక
మైదానముంది అక్కడ వేయి సంవత్సరములకు సరిపడు మనుషులను
దేవుడు తయారు చేసి ఉంచుకొన్నాడు" అని జవాబు చెప్పడమైనది. ఈ
విధముగా వారి మాటలను నమ్మేవారికి శాస్త్రబద్ధముకాని విషయములను
కూడా చెప్పి నమ్మించుచున్నారు. మేము జ్ఞానములో పరిచయములేని
వారిగా చాలామార్లు అనేక ఇస్లామిక్ సంఘములతో కలిసి, వారు చెప్పిన
మాటలకు ఎదురు మాట్లాడకుండా చెప్పినవన్నీ వింటూ వచ్చాము. అలా
విని వారిలోని ఉద్దేశ్యమేమి? వారు దేవుని జ్ఞానమునే చెప్పుచున్నారా?
మతమును అభివృద్ధి చేస్తున్నారా? అని తెలియుటకు ప్రయత్నించాము.
మా ప్రయత్నములో వారికి ఖుర్ఆన్ గ్రంథముయొక్క జ్ఞానము ఏమాత్రము
తెలియదని అర్థమైపోయింది. ఇస్లామిక్ జ్ఞాన సంఘములుగా పేరు
పెట్టుకొని, ఇతరులకు బోధించడమే మా పనియని చెప్పువారికి, ఖుర్ఆన్
గ్రంథములోని ఒక్క ఆయత్కు కూడా వివరము సరిగా తెలియదని తెలిసి
పోయినది. ముస్లీమ్లు మా గ్రంథమని చెప్పుకొను ఖుర్ఆన్లో కూడా
ఒక్క వాక్యమునకు కూడా సరిగా వివరము తెలియనప్పుడు, భగవద్గీత
శ్లోకములు నోటితో చెప్పినంతమాత్రమున వాటికి వివరము తెలియునను
కోవడము పొరపాటగును. మొత్తము మీద మేము పెద్ద జ్ఞానులము అని
చెప్పుకొను ఇస్లామ్ ఆధ్యాత్మిక సంఘముల వారికి, దేవుని జ్ఞానము
అందినట్లు పైకి కనపడినా, వారికి లోపల జ్ఞానము తెలియదనియే
చెప్పవచ్చును.

మా జ్ఞానము ఏమాత్రము
ు తెలియనప్పుడు, భగవద్గీత
భారతదేశములో అనేకచోట్ల, అనేక ఆధ్యాత్మిక సంఘములను
స్థాపించి, అందులో ఆధ్యాత్మిక బోధలు సాగునట్లు చేసి, ఉపన్యాసముల
ద్వారా వారితో పోటీకి వచ్చి మాట్లాడు వారికి చర్చల ద్వారా తమ మత
జ్ఞానమును బయటికి చెప్పి, వారి జ్ఞానము వైపుకు ఆకర్షింపజేసుకొని,
క్రమేపీ వారి మతమును అభివృద్ధి చేసుకోవాలనునదే వారి ముఖ్య
ఉద్దేశ్యము. అయితే అది పైకి అందరికీ తెలియునట్లున్న విధానము
మాత్రమేయని తెలియుచున్నది. పైకి కనిపించక గుట్టుచప్పుడు కాకుండా
జరిగిపోవు విధానము మరొక కోణములో చూచిన బాగా కనిపించగలదు.
తమకు తెలిసిన జ్ఞానప్రచారముతో కొంతమందిని తమ మతమువైపు
లాగుకొనుటకు ప్రయత్నము చేస్తూ, ఇతర మతముల సంఖ్యను తగ్గించి
తమ మతములోని సంఖ్యను పెంచుకోవాలని ఉద్దేశ్యము ఒక విధానములో

కలిగియున్నారు. ఇంకొక విధానము ద్వారా ఇతర మతము వారి సంఖ్యను
తగ్గించడము అను ముఖ్య ఉద్దేశ్యమును కూడా కల్గియున్నారు. ఆ
విధానములో జ్ఞానము ద్వారా కాకుండా హింసద్వారా మనుషులను
భౌతికముగా లేకుండా చేసినప్పుడు, ఇతరుల సంఖ్యను తగ్గిపోవడమేకాక
లెక్కాచారములో వారి సంఖ్య ఎక్కి పోవును. హింసను ఆయుధముగా
చేసుకొని ఇతర మనుషులను చంపుటకు అవసరమైనది ఉగ్రవాదము
మాత్రమే. అటువంటి ఉగ్రవాదమును హిందువుల దేశమయిన
భారతదేశములోనే అభివృద్ధి చేసి హిందువులను లేకుండా చేయాలను
కొన్నారు. భారతదేశములోయున్న ముస్లీమ్లు ఎంతోమందియున్నా
వారిపని వారు చేసుకొని, వారి బ్రతుకు వారు బ్రతుకుచున్నారు.
జీవితములో ఎటువంటి పేచీలు, తగాదాలు లేకుండా వారి జీవితమును
వారు గడుపుకోవాలనుకొను ముస్లీమ్లు 90 నుండి 95 శాతము మంది
గలరు. అయితే దురుద్దేశ్యముతో మతమును పెంచుకోవాలనుకొనువారు
వారి సమాజములోని అమాయక ప్రజలను, పేదరికములో బ్రతుకు
బరువుగాయున్న వారిని చూచి, డబ్బులను ఎరగా చూపి, తమ మాటను
వినునట్లు చేసుకొని వారికి తర్ఫీదునిచ్చి, దేవునికొరకే తమ పోరాటమని
చెప్పి, దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడువారిని, దేవున్ని వదలి ఇతరులను
దేవునిగా భావించిన వారిని, ఇస్లామ్ జ్ఞానమును, ఇస్లామ్ను ఒప్పుకోని
వారిని, ఒప్పుకోక వారికి వ్యతిరేఖముగా ఉండవలెనని చెప్పుచున్నారు.
వారి మాటలను వారి సమాజములో కొందరు ఇష్టపడగా, వారిలోని
యువకులను ముందు తమ ఆధ్యాత్మిక కేంద్రములతో పరిచయము
చేయుదురు. ఇస్లామిక్ ఆధ్యాత్మిక కేంద్రములలో ఆధ్యాత్మికము అను
ముసుగులో తమవైపు వచ్చిన యువకులను చిన్నగా ఉగ్రవాదమును గురించి

చెప్పి, వారిలో ఉగ్రవాద బీజాలను నాటుదురు. నిదానముగా తమవద్ద
తమ సంఘములో పనిచేయుచున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు
చేయుచున్నారు. ఇస్లామిక్ ఆధ్యాత్మిక కేంద్రములలోనే ఉగ్రవాద బీజములు
నాటబడుచున్నవి. ఉగ్రవాదులు విదేశములలో ఆయుధములను
ఉపయోగించు ట్రయినింగ్ పొందుచున్నారని భారత ప్రభుత్వము అనుకొను
చున్నది. అక్కడికిపోయి ఆయుధములను ఉపయోగించు తర్ఫీదును
పొందుటకు ముందుగానే భారతదేశములోనే మానసికముగా ఉగ్రవాద
భావములను పొందుచున్నారు. మనస్సులో పూర్తి ఉగ్రవాదము నిండిపోయిన
తర్వాత, కేవలము ఆయుధములను ఉపయోగించు తర్ఫీదు కొరకే ఇతర
దేశములకు పోవుచున్నారు. కొందరు అలా ఆయుధమును ఉపయోగించు
టకు కూడా పోకుండా ఇక్కడే కంప్యూటర్ పరిజ్ఞానమును పొంది,
అజ్ఞాతములోనే ఉగ్రవాద కార్యకలాపాలను చేయుచున్నారు. ఉగ్రవాదము
ఇది అది అని చెప్పుటకు వీలులేని విధముగా ఇక్కడే తయారగుచున్నా,
ఉగ్రవాద బీజములు ఇక్కడే మహావృక్షములుగా మారుచున్నా ఏమాత్రము
ప్రభుత్వముగానీ, ప్రజలుగానీ గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అన్ని ఇస్లామిక్
సంఘములు చెడు పనిని చేయుచున్నవని మేము చెప్పలేదుగానీ, కొన్ని
ఇస్లామిక్ సంఘములు పైకి ఒక విధముగా కనిపించుచునే లోపల
ఎవరికీ తెలియని విధముగా, ఒకేమారు కాకుండా, ఒకే నెలలో కాకుండా
తమవైపు వచ్చిన వారిని అంచెలంచెలుగా మనస్సులో ఉగ్రవాద బీజములను
నాటుచున్నారు. అటువంటివారు పూర్తి స్థాయి ఉగ్రవాదము వారిలో
పొడచూపుటకు, దాదాపు రెండు నుండి మూడు సంవత్సరముల కాలము
పట్టుచున్నది. ప్రతి ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంఘములలోను జ్ఞానముతోయున్న
వారు కనిపించుచుండినా, కొన్నిచోట్ల ఉగ్రవాదులుగా తయారగువారు

ఒకరునుండి ఇద్దరు లేక ముగ్గురు కలరని చెప్పవచ్చును. ఒకేచోట ఎక్కువ
మందియుంటే వారిలో బేధములు వచ్చి బయటపడు అవకాశముండుట
వలన, ఒక సంఘములో ఒకరు లేక ఇద్దరుకంటే ఎక్కువ లేకుండా
చూచుకొంటున్నారు. ఎక్కడో అరుదుగా ముగ్గురున్నారని చెప్పవచ్చును.
మొత్తము మీద భారతదేశములో మిగతా మతములను నాశనము చేసి,
తమ మతమును వృద్ధి చేయాలనువారు పూర్తి ఉగ్రవాద భావములతో
ఒక సంవత్సరమునకు దాదాపు వందనుండి రెండువందలమంది దాకా
తయారగుచున్నారు. విదేశములనుండి భారత దేశమునకు వచ్చిన
ఉగ్రవాదులు తక్కువగానీ, భారతదేశమునుండి ఇతర దేశములకు
ఉగ్రవాదులుగా పోయినవారు చాలా ఎక్కువ. విదేశములకు పోయిన
ఉగ్రవాదులు ఏ ట్రయినింగ్ లేకుండా నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలలో
పాల్గొనుచున్నారు.

భారతదేశములోని అనేక రాష్ట్రములలో చాపక్రింద నీరులాగా
ఉగ్రవాదము పెరిగిపోవుచున్నది. భారతదేశము భౌగోళికముగా తూర్పు
పడమర దిశలలో ఎక్కువగా ఇస్లామిక్ దేశములుండుట వలన, మధ్యలో
హిందూమతమునకు సంబంధించిన భారతదేశముండుట వలన, ముస్లీమ్
ఉగ్రవాదుల చూపు భారతదేశము మీద పడినది. భారతదేశమును ఇస్లామిక్
దేశముగా చేయగలిగితే, ఇండోనేషియా దేశములో ముస్లీమ్ల సంఖ్య
ఎక్కువగాయుండుట వలన, తూర్పుపడమర మధ్యలోనున్న భారతదేశము
అన్నీ ఇస్లామిక్ దేశములయిపోయి ఇస్లామిక్ సామ్రాజ్యము ఏర్పడును
అని అనుకొన్నారు. అందువలన ఇతర దేశములనుండి వచ్చిన ఉగ్రవాదులు
భారతదేశ ప్రజలను కారణము లేకుండా చంపుటకు కారణము అదేనని
చెప్పవచ్చును. ఇతర దేశముల ఉగ్రవాదులు భారతదేశములో దాడులు

చేయుటకు భారతదేశములోని ఉగ్రవాదుల సహకారము కూడా ఉందని
చెప్పవచ్చును. నేడు భారత దేశములోని ఇస్లామిక్ ఆధ్యాత్మిక కేంద్రములలో
మొదట జీవితము మీద విరక్తి కల్గించు జ్ఞానమును చెప్పి, తర్వాత
దేవునికొరకు చనిపోవాలని చెప్పడము జరుగుచున్నది. దేవుని కొరకు
చనిపోయిన వానికి స్వర్గము వస్తుందనీ, అందులో శాశ్వితముగా
సుఖములను అనుభవించవచ్చని ఆధ్యాత్మికమును మేళవించి చెప్పుదురు.
వారి భావములకు దగ్గరగా వచ్చు యువకులను గమనించి పూర్తిస్థాయి
ఉగ్రవాదులుగా మార్చివేయుచున్నారు. పూర్తి స్థాయి ఉగ్రవాదిగా మారిన
వానని కదిలించి చూస్తే వానిది ఉగ్రవాదం కాదని వానిది దేవుని 
సేవయని దేవుని కొరకు ప్రాణం అయినా ఇస్తానని అంటున్నాడు దేవుని
కొరకు ప్రాణమునయినా ఇచ్చుట త్యాగమని, తనకంటే గొప్ప త్యాగము
చేయువారు భూమిమీద లేరు అంటున్నాడు.

ప్రాణమును కూడా త్యాగము చేయుటకు సిద్ధముగా యున్నవాడు
తాను దేనికి ప్రాణత్యాగము చేయుటకు సిద్ధముగానున్నాననీ ఆలోచించలేదు.
దేవునికొరకు అని చెప్పినా, అతడు మతము కొరకు చచ్చుటకు వెనుకాడ
లేదని అర్థమగుచున్నది. ఆధ్యాత్మికముతో మొదలుపెట్టి, జీవితము మీద
విరక్తి కల్గునట్లు చేసి, ఆ విరక్తిని ఉగ్రవాదములో వినియోగించునట్లు చేసి
'చంపు చావు' అను నినాదమును నేర్పుచున్నారు. దానిని నేర్చిన
ఉగ్రవాదులు తమది ఉగ్రవాదము కాదనీ, దేవునికొరకు, దేవుని వాక్యము
కొరకు చేయు సేవ అని చెప్పుకొంటున్నారు. వారి దృష్టిలో వారు ఆచరించు
ఉగ్రవాదము దేవుని సేవగా కనిపించగా, అల్లాహ్ను అనుసరించని వారిని,
ముస్లీమ్ మారనివానిని చంపుటకు పూనుకొంటున్నారు. ఆ పనికి
అనుగుణముగా 'చంపు చావు' అను నినాదమును చెప్పుచూ, దేవునికి

వ్యతిరేఖముగా యున్న వారిని మాత్రమే చంపుదునని అది దేవుని సేవేగానీ,
దానికి ఉగ్రవాదము అను పేరు పెట్టకూడదు అంటున్నారు. తనకు
ఇష్టములేని వానిని చంపడము దేవుని సేవ అయితే, ఉగ్రవాదమని
దేనిని అనాలి? అని మేము ప్రశ్నించుచున్నాము.

ఉగ్రవాదిగా తయారయిన వాని దృష్ఠిలో వానిది ఉగ్రవాదము
కాదని, దేవుని మార్గములో నడుచుచున్న భక్తిమార్గమని వాడు చెప్పు
కొంటున్నాడు. ఆ విధముగా వానికి అర్థమయినదంటే, వాడు తయారయిన
ఇస్లామిక్ సంఘములోనున్న పెద్దలే అలా నేర్పించారు. దొంగతనము
చేయువాని దృష్ఠిలో తనది దొంగతనమనరని, బ్రతుకుతెరువు అంటారని
చెప్పుచున్నాడు. ఎవనిది వానికి మంచి పనిలాగా కనిపించినా,
దేవుని దృష్టిలో ఏమవుతుందని ఆలోచించాలి. అట్లుకాకుండా ఇతరులు
చెప్పుమాటను విని తనది మంచిదనుకోకూడదు. "దేశము మోసము-
దేహము మోహము" అను నానుడి ప్రకారము ప్రపంచములోని
మనుషులు మోసముతో కూడుకొనియున్నారు. అందువలన తన మతము
వారుగానీ, చివరకు తన ఇంటివారుగానీ, తనను మోసము చేయుచున్నారా!
లేదా?యని ప్రతి విషయములోనూ గమనించవలసియున్నది. లేకపోతే
ఎవడయినా గానీ, ఎంత తెలివైనవాడుగానీ మోసపోక తప్పదు. నీవు
చేయు పని దేవుని కొరకని, దానివలన నీకు స్వర్గము వస్తుందని, అక్కడ
అందమైన ఆడవారితో సుఖముగా ఉండవచ్చునని చెప్పి, మోసముతో
మనిషిని ఉగ్రవాదములోనికి దింపుచున్నారు. అసత్యము, మోసము అను
రెండు జంతువుల మెదడులో లేవుగానీ, మనుషుల మెదడులో మొదటిది
మోసము, రెండవది అసత్యము అను రెండూ మెండుగా ఉన్నవి.

అందువలన ప్రతి విషయములోనూ ఒక మనిషి ఇంకొక మనిషిని మోసము
చేయుచున్నాడు. అదే విధముగా కొన్ని ఇస్లామిక్ సంస్థలు కూడా
ఆధ్యాత్మికము, దేవుని విశ్వాసము అని మాటలు చెప్పి అమాయక ముస్లీమ్
యువకులను ఉగ్రవాదములోనికి దించుచున్నారు.

అనేక పేర్లతో కొన్ని రిజిష్టర్ అయిన ఇస్లామిక్ సంస్థలుండగా,
కొన్ని రిజిష్టర్ కాని సంస్థలు, సంఘములు అనేకము గలవు. ఇస్లామిక్
సంఘములలో స్థానికముగాయున్న కొందరు ఆ సంఘములను నడుపు
చుందురు. కొన్ని సంఘములు బోధకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వగా,
కొన్ని సంఘములు ఉగ్రవాదమునకే ఎక్కువ ప్రాధన్యత నిచ్చుచున్నవి.
స్థానికముగా ఒక నగరములో ఒక ఇస్లామిక్ సంఘము ఉందనుకొనుము.
అట్లే ఒక రాష్ట్రములో 20 నుండి 30 వరకు ఇస్లామిక్ సంఘములు
అనేక పేర్లతో ఉండవచ్చును. ఆ సంఘములను నడుపుచున్న వారు
స్థానికముగానే ఉందురు. స్థానికముగా వుండి మిగతా పనులతోపాటు
సంఘములను కొందరు నడుపుచుండగా, కొందరు అన్ని పనులూ వదలి
సంఘములోనే పని చేయుచుందురు. అటువంటి వారిలో కొందరు వారికి
తెలిసిన జ్ఞానము వరకు సంఘమును నడుపుచుండగా, కొందరు మాత్రము
పైకి ఆధ్యాత్మికతను చెప్పుచున్నా, లోపల ఉగ్రవాదమును ప్రేరేపించు
చున్నారు. అలా వారు ఉగ్రవాదమును ప్రేరేపించడానికి, తయారు చేసిన
ఉగ్రవాదులను ఏమి చేయాలను దానికి ప్రత్యేకించి, ఒక రాష్ట్రమునకంతటికీ
ఒక వ్యక్తిగానీ లేక ఇద్దరు వ్యక్తులుగానీ మూలకారకులై ఉంటారు. పెద్ద
రాష్ట్రమయితే ఇద్దరు, చిన్న రాష్ట్రమయితే ఒక్కరు రాష్ట్ర ఇన్చార్జులు
ఉంటారు. కర్నాటక రాష్ట్రమునకంతటికీ ఒక వ్యక్తి ఇన్చార్జిగా వున్నాడనుకో,
అతను అన్ని ఇస్లామిక్ ఆధ్యాత్మిక సెంటర్లతో సంబంధము పెట్టుకొని

ఉండును. అతను సాధారణ వ్యక్తిగాయుంటూ రాష్ట్రమంతటా తిరుగుచూ
ప్రతి పట్టణములోయున్న ఇస్లామిక్ సంఘములతో కలిసి మాట్లాడు
చుండును. అతను ఇస్లామిక్ సంఘములను ఉత్సాహపరుస్తూ, బాగా
ఆసక్తిగా పనిచేయు సంఘములతో కలిసి వారికున్న శ్రద్ధనుబట్టి, వారు
పనిచేయు చున్న తీరునుబట్టి ఆర్థిక సహాయము చేయుచుండును. అతను
ఒక రాష్ట్రములోని అన్ని ఇస్లామిక్ సంఘములకు రథసారధిగా పని
చేయుచున్నా, అతను అంతటి పనిని చేయుచున్నాడని ఎవరూ
గుర్తించనట్లుండును.

రాష్ట్రములోని ముస్లీమ్ సంఘములన్నిటికీ ఒక ఏజెంటుగా పని
చేయుచున్న ఆ వ్యక్తి, సంఘములను ప్రేరేపించి బాగా పని చేయించడమే
కాక, విదేశీ ముస్లీమ్లకు స్వదేశీ ముస్లీమ్ సంఘములకు మధ్యవర్తిగా
యుండును. తనవద్ద విదేశీ ధనమును నిలువ పెట్టుకొని ఎప్పుడయినా
ఏ సంఘమునకయినా ఆర్థిక అవసరమొస్తే, ఆ అవసరమునకు డబ్బులిచ్చు
చుండును. ఒక రాష్ట్రములోని సంఘములన్నిటికీ ఆర్థిక సహాయము
చేయుచూ మూలవ్యక్తిగాయున్న అతను, మొదట ఇస్లామిక్ సంఘములలో
ఉగ్రవాద బీజాలు నాటుచున్నాడు. అతని పని రాష్ట్రమంతటా తిరిగే
పనియే, కావున రాష్ట్రములో వారి ముస్లీమ్లందు ఎవరు ఎంత తెలివైన
వారని నిఘా పెట్టి చూచుచుండును. ఎక్కడయినా తెలివైన ముస్లీమ్
యువకుడు ఉన్నాడు అంటే, అతనితో ముస్లీమ్ సంఘమువారు కలియునట్లు
పరిచయము ఏర్పడునట్లు చేసి, చిన్నగా సంఘమును గురించి తెలిపి, ఆ
సంఘమునకు సానుభూతివరునిగానో, లేక సభ్యునిగానో ఉండునట్లు
చేయును. తర్వాత కొంతకాలమునుండి వచ్చిన యువకునిలో చిన్నగా
ఆధ్యాత్మిక బోధయంటూ నేర్పుచూ, సంఘము ద్వారా ఉగ్రవాదమును

బోధించునట్లు చేయును. ఆ విధముగా రాష్ట్రములోని తెలివైన యువకులు
ఉగ్రవాద గాలములో చిక్కుకొంటున్నారు. ఒకమారు అటువైపు అడుగువేసిన
ఎవరుగానీ వెనుతిరిగిరారు. ఎందుకనగా ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంఘముల
వారే వచ్చినవారిని తిరిగి పోకుండా మార్చుకోగలుగుచున్నారు. అంతేకాక
రాష్ట్రమునకు ఉగ్రవాద ఏజెంటుగా పనిచేయు వ్యక్తి పై నుంచి అన్నీ
గమనించుచుండును. రాష్ట్రమునకంతటికీ మూలకారకుడయిన వ్యక్తి విదేశీ
ఉగ్రవాద సంస్థలనుండి వచ్చు ఆర్థిక సహాయమును తెచ్చి నేరుగా
ఉగ్రవాదులను పెంచి పోషించు సంఘములకు అందించుచున్నాడు.
అందువలన కొన్ని సంఘములు ఉగ్రవాదమును పెంచడములో
ఉత్సాహముగాయున్నాయి.

రెండు లేక మూడు సంవత్సరములకు మానసికముగా పూర్తి
ఉగ్రవాదులుగా మారిపోయిన వారు, స్వయముగా ఉగ్రవాద కార్యములలో
పాల్గొనుటకు ఇతర దేశములకు పోవుచున్నారు. ఎక్కడయితే ఇస్లామిక్
ఆధ్యాత్మిక కేంద్రములున్నాయో, అక్కడే ఉగ్రవాద బీజాలు మొలకెత్తి
వృక్షములుగా తయారగుచున్నవి. ఉగ్రవాదులుగా తయారయినవారు
తాము జ్ఞానమును తెలుసుకోలేక పోయామని చింతించక, ఇప్పటినుండి
ఇతర మతములవారిని చంపి తమ మతమును ఉద్దరించాలను యోచనలోనే
ఉందురు. పూర్తి స్థాయి ఉగ్రవాదులయిన తర్వాత రాష్ట్రములో ఉగ్రవాద
బీజాలను నాటి ఏమీ తెలియని వ్యక్తిగా తిరుగుచుండు ఏజెంటు అను
వ్యక్తి తయారయిన ఉగ్రవాదులను ఏరుకొని, వారికి ఆర్థిక సహాయము
చేసి విదేశములకు పంపుచుండును. విదేశములలోని ఉగ్రవాదులకు
స్వదేశములో తయారయిన ఉగ్రవాదులకు అనుబంధముగాయున్న వ్యక్తి
క్రొత్తగా తయారయిన వారిని ఎక్కడికి అవసరమొస్తే అక్కడికి పంపును.

భారతదేశములోని ముస్లీమ్ విదేశముల వారికి ఏజెంట్లుగా పని
చేయుచున్నారు. భారతదేశములో కాశ్మీరులో ఒక రకము, ఆంధ్రాలో
ఒక రకము విధానమును అనుసరిస్తూ ఉగ్రవాదులను, ఏజెంట్లుగాయున్న
వారు తయారు చేయుచున్నారు. ఎక్కడ అనుకూలమునుబట్టి అక్కడ
విదేశీ ఏజెంట్లుగాయున్నవారు ఉగ్రవాదమును తయారు చేయుచున్నారు.
ఈ మధ్య కాలములో విదేశాలలో చనిపోయిన ఉగ్రవాదులు భారతదేశము
నుండి వచ్చినవారేనని తెలిసింది. ఇతర రాష్ట్రములలో జరిగిన కొన్ని
ఉగ్రవాద కార్యములలో మన రాష్ట్రములకు సంబంధించినవారున్నట్లు కూడా
తెలిసింది. హైదరాబాద్నుండి పోయిన ఉగ్రవాదులు ఇరాక్, సిరియా
దేశములలో కూడా పట్టుబడిన విషయము తెలిసినదే. విదేశములకు
పోతూ పట్టుబడిన ముస్లీమ్ యువకుల విషయము కూడా అందరికీ
తెలిసినదే. కొన్నిచోట్ల ఉగ్రవాదులను గుర్తించిన పోలీసులు ఉగ్రవాదము
తయారగుటకు మూలకర్తలయిన విదేశీ ఏజెంట్లుగా పనిచేయు స్వదేశీయు
లను గుర్తించలేకపోయారు.

ఒక ఏరియాలో నక్సల్స్ తయారగుటకు ఒక వ్యక్తి మూలకర్తగా
వ్యవహరించి, ఎవరికీ తెలియకుండా ఆ ప్రాంతములో నక్సల్స్న తయారు
చేయును. అలా తయారయిన నక్సల్స్న పెంచి పోషించుటకు, వారికి
కావలసిన విషయములను అందించుటకు, సేకరించుటకు ముఖ్యపాత్ర
వహించుచున్న వ్యక్తి సర్వసాధారణముగా ఎవరూ గుర్తించనట్లు మనుషుల
మధ్యలోవుండి, తన కార్యకలాపములను కొనసాగించుచుండును. అదే
విధమయిన పద్ధతిని ఉగ్రవాదమును తయారు చేయువారు కూడా
అనుసరించుచున్నారు. ఇక్కడ ఇంతవరకు ముస్లీమ్ల విషయమే చెప్పాము.
ముస్లీమ్లు అలా మారుటకు జ్ఞాన విషయములో బేధాభిప్రాయములు
వుండడము వలననే అని చెప్పుకొన్నాము. దేవుడు చెప్పిన ఒకే జ్ఞానము
హిందువులకు ఒకరకము, ముస్లీమ్లకు మరొక రకముగా అర్థమగుట
వలన నేనే సత్యము, నేనే సక్రమము అనీ, ఇతరులు సరికాదని ఒకరికొకరు
చంపుకొను స్థితికి వచ్చారు. విదేశములలో కొన్నిచోట్ల ఒకే ముస్లీమ్హ
ఒకరుకొకరు ఉగ్రవాదులుగా వారిని వారే చంపుకొంటున్నారంటే అక్కడ
వారిలో కూడా జ్ఞానములో పొడచూపిన అభిప్రాయ బేధములే కారణమని
చెప్పవచ్చును. ఉగ్రవాదము ఒక మతమునకే పరిమితము కాదు, అన్ని
మతములలో అంతో ఇంతో గలదు. అయితే ముస్లీమ్లలోనే మరీ ఎక్కువగా
యున్నది. బాగా గమనించివలసిన విషయము ఏమంటే! ఎక్కడ
ఉగ్రవాదమున్నా అక్కడ దానంతటకదే తయారు కావడములేదు. సామాన్య
ప్రజలను ఉగ్రవాదులుగా మార్చు అదృశ్యశక్తులుగాయున్నవారు అక్కడ
ఉండి తీరుతారు.

భూమిమీద తయారయిన ఉగ్రవాదులను ఎంతమందిని
బంధించినా, ఎంతమందిని చంపినా, తిరిగి క్రొత్త ఉగ్రవాదులు తయారగు
చుందురు. ఉగ్రవాదము సమూలముగా పోవాలంటే క్రొత్తవారిని తయారు
చేయుచూ, ఎవరికీ కనిపించకయున్న మూలకర్తలను లేకుండా చేయవలెను.
అప్పుడే భూమిమీద ఉగ్రవాదము లేకుండా పోగలదు. మేము ఈ విధముగా
వ్రాయడము వలన ముస్లీమ్లు స్వచ్ఛమయిన జ్ఞానులుగా తయారు
కాగలరనీ, ఉగ్రవాదము వైపు పోకుండా ఉందురని ఆశించుచున్నాము.
ఉగ్రవాదము మనిషి తలలో పుట్టుచున్నది. మనుషులెవరయినాగానీ వాని
భావములలోని మార్పువలన ఉగ్రవాదము తయారగుచున్నది. కావున
ఉగ్రవాదము ఒక మతమునకే పరిమితము కాదు. నేడు ఇస్లామ్ మతములో
ఎక్కువగాయున్న ఉగ్రవాదము రేపు ఇంకొక మతములో చెలరేగి పోవచ్చును.


నేడు భారతదేశములోని పరిస్థితిని చూస్తే, గతకొన్ని సంవత్సరములుగా
ముస్లీమ్లు తమ సంఖ్యను పెంచుకోవాలను ఉద్దేశ్యముతో, ఆ మతములోని
కొందరు ఉగ్రవాదమును తయారు చేశారని చెప్పాము. గత ఇరవై లేక
ముఫ్పై సంవత్సరములనుండి ఇస్లామ్ మతములో పెరిగిన వేగమునుబట్టి
చూస్తే తెలుస్తుంది. ఇస్లామ్ మతము తమ మతమును పెంచుకోవడములో
నిమగ్నమై ఉండగా, గత పది సంవత్సరములుగా హిందూమతము వారు
తమ మతమును రక్షించుకొను దిశలో వారు కూడా హింసామార్గమును
అవలంబించుచున్నారు. హిందువులు క్రైస్తవము వలన హిందూమతము
క్షీణించిపోవుచున్నదని క్రైస్తవుల మీద ద్వేషము కల్గియున్నారు.

ద్వేషము చివరకు హింసగా మారునని, హింస చేయడమునే
ఉగ్రవాదమని అంటామని కూడా చెప్పుకొన్నాము. హిందూమతము క్షీణించి
పోవుచున్నదను ద్వేషముతో, హిందువులు క్రైస్తవులుగా మారిపోయారను
ఉద్దేశ్యముతో హిందువులు క్రైస్తవుల మీద ఎక్కువగా ద్వేషమును
పెంచుకొన్నారు. తమ మతమును రక్షించుటకొరకని చెప్పి హిందువులు
కూడా కొన్ని సంఘములుగా తయారయినారు. హిందువులలో తయారయిన
సంఘములు ఆధ్యాత్మిక సంఘములవలెయున్నా అవి పూర్తి రాజకీయరంగు
పూసుకొని యున్నవి. హిందూ మతరక్షణ, హిందూ ధర్మరక్షణ అను
ముఖ్య ఉద్దేశ్యముతో విశ్వహిందూపరిషత్, శివసేన, భజరంగదళ్, హిందూ
ధర్మరక్షణ సమితి అను మొదలగు సంఘములు తయారయినా, అవి
మత రక్షణ అను ఉద్దేశ్యముతో ఉండినా, చివరకు రాజకీయరంగు పూసుకొని
క్రైస్తవులను మతప్రచారము చేయకుండా ఎక్కడికక్కడ అడ్డు కోవాలను
కొన్నారు. క్రైస్తవ ప్రచారమును అడ్డుకోవాలనుకొన్న వారు, వారి
ప్రచారమును అడ్డుకోకుండా ఏకంగా వారిమీదికి దాడికి దిగడము మొదలు

పెట్టారు. ఎక్కడయితే మతమును గురించి, జ్ఞానమును గురించి హింస
రేగుచున్నదో, అక్కడే ఉగ్రవాదము తయారగుచున్నది. దీనినిబట్టి హిందూ
దేశములోని హిందువులలో కూడా ఉగ్రవాదమున్నదని చెప్పవచ్చును.

ముస్లీమ్లలో డబ్బును ఆశచూపి కొంతమంది పేద ముస్లీమ్లను
ఉగ్రవాదులుగా మార్చుచుండగా, హిందూమతములో అట్లు డబ్బు
ఇచ్చువారు ఎవరూ లేరు. హిందూమతము కొరకు స్వయంకృషి చేయ
వలసిందే. అందువలన మతము కొరకు పని చేయువారిని స్వయంసేవక్
అనికూడా అంటున్నారు. ఇస్లామ్ మతములోని వారు దేవునికి, దేవుని
జ్ఞానమునకు వ్యతిరిక్తముగా యున్నవారి మీద శత్రుత్వమును చూపు
చున్నారు. అక్కడ పూర్తి దేవుని జ్ఞానముతో ముడిపడిన హేతువాదముండగా,
హిందూమతములో తమ జ్ఞానముతో ముడిపడిన విషయమేకాక, మత
రక్షణతో ముడిపడిన విషయమై పోయినది. అయితే భారతదేశములో
హిందువుల చూపంతయూ క్రైస్తవుల మీద వున్నది. ముస్లీమ్ల చూపంతా
హిందువుల మీదయున్నది. ముస్లీమ్లు హిందువులను హింసించాలని
చూస్తున్నారు. హిందువులు క్రైస్తవులను హింసించాలని చూస్తున్నారు.
మొదట క్రైస్తవ మత ప్రచారమును ఆపవలెనని తలచిన హిందువులు,
దానికొరకు అనేక సంఘములను తయారు చేసుకొన్నారు. ఆ ఉద్దేశ్యము
కొన్ని సందర్భములలో హింసగా మారుచున్నది. హిందువులలో ముఖ్య
లోపము ఒకటి గలదు. నేటికాలములో ఏది జ్ఞానమో, ఏది జ్ఞానము
కాదో వారికి తెలియకుండా పోయినది. అంతేకాక ఏది క్రైస్తవ జ్ఞానమో,
ఏది హిందూ జ్ఞానమో కూడా తెలియకుండాపోయినది. ఇంకా లోతుగా
చెప్పితే హిందువుల గ్రంథమేదో, క్రైస్తవుల గ్రంథమేదో కూడా తెలియని
స్థితిలో నేటి హిందువులు ఉన్నారని చెప్పవచ్చును. అటువంటివారు ఎక్కడ

జ్ఞానప్రచారము జరుగుచున్నా అది క్రైస్తవులదని అడ్డుకోవడము జరుగు
చున్నది.

క్రైస్తవులు వారి మతమును వారు ప్రచారము చేసుకొంటున్నారు.
దానికి ఆకర్షితులైన హిందువులు క్రైస్తవులుగా మారిపోవుచుండుట
వాస్తవమే. అయితే హిందువులు ఎందుకు క్రైస్తవులుగా మారిపోవుచున్నారని
ఆలోచించక క్రైస్తవ ప్రచారమును అడ్డుకొంటున్నారు. హిందువులకు
హిందూ జ్ఞానమును ఎవరూ చెప్పని దానివలన, క్రైస్తవములో జ్ఞానము
బాగా కనిపించడము వలన, అందులోనికి చాలామంది పోయారు.
హిందువులు క్రైస్తవులుగా మారుటకు కారణము తెలిసిన మేము, దానికి
విరుగుడుగా హిందూ జ్ఞానమును భగవద్గీత బోధను ప్రచారము చేయాలని
ప్రచారము మొదలు పెడితే, తమ జ్ఞానమేదో పరమత జ్ఞానమేదో తెలియని
హిందువులు మా ప్రచారకుల మీద దాడిచేసిన సందర్భములు అనేకము
కలవు. ముస్లీమ్లలో ఉగ్రవాదముంది అది ఇతరముల మీద ప్రయోగించ
బడుచున్నది. హిందువులలో కూడా హింసతో కూడుకొన్న ఉగ్రవాదమున్నది
గానీ అది తమ మతమేదో, ఇతర మతమేదో గుర్తించనిస్థితిలో తమ
మతము మీదే దాడిచేయుచున్నది. కళ్ళు కనపరాని సర్పము తన పిల్లలను
తానే తిన్నట్లు హిందువులలోని అజ్ఞానులు తమ మతముమీదనే తాము
దాడి చేయడము జరుగుచున్నది. ఉగాదితో ప్రారంభమయిన క్యాలెండరు
హిందువులకు పరమత క్యాలెండరుగా కనిపించినది. భగవద్గీత
హిందుత్వమునకు సంబంధించినదని తెలియని హిందూ ఉగ్రవాదులు
భగవద్గీతను నడిరోడ్డు మీద కాల్చడము జరిగినది. అనంతపురము
జిల్లాలో గుంతకల్లు పట్టణములో హిందూ సంఘములున్నచోట ఉగాది
క్యాలెండరును, త్రైత సిద్ధాంత భగవద్గీతను పరమత ప్రచారమని చెప్పి
కాల్చడము వలన హిందుత్వములోని ఉగ్రవాదము బయటపడడమేకాక,
హిందువులలోని ఉగ్రవాదము గ్రుడ్డిదని కూడా తెలిసిపోయినది.
చివరిగా మేము చెప్పుమాట ఏమనగా, దేవుడు మనకిచ్చిన
జ్ఞానము భగవద్గీత (తౌరాతు) గ్రంథముగా మనముందరున్నది. అదే
జ్ఞానము ఇంకా రెండు గ్రంథములుగా ఇతర దేశములలో చెప్పబడినది.
ఒకే దేవుని జ్ఞానమే మూడు గ్రంథములుగాయున్నదని ఖుర్ఆన్లో ఐదవ
మరియు ఆరవ సూరాలో చెప్పడము జరిగినది. అయితే ఒకే దేవుడు
చెప్పిన ఒకే జ్ఞానమును మనిషి ఒకే విధముగా అర్థము చేసుకోకపోవడము
వలన జ్ఞానము మూడురకముల అర్థమై, మూడు మతములుగా
మారిపోయినది. నేటికయినా జరిగిపోయిన తప్పును తెలుసుకొని,
మతముల పిచ్చి వదలి దేవుని జ్ఞానము మీద ధ్యాస పెంచుకోమని మరీ
మరీ తెలుపుచూ ఇంతటితో ముగిస్తున్నాము.
సమాప్తము...

నా చివరి మాట.
ఈ గ్రంథమును చదివిన తర్వాత కొందరు మా వ్రాతను మెచ్చు
కోవడము, మరికొందరు నొచ్చుకోవడము జరుగును. ఇందులో చెప్పిన
జ్ఞానము అర్థమయినవారు చాలామంది సంతోషిస్తారు. అర్థముకానివారు
కొంత ఇబ్బంది కల్గినవారై నన్ను దూషించగలరు, ద్వేషించనూగలరు.
ప్రపంచము నుండి వచ్చు దూషణ, భూషణములు రెండూ నాకు సమానమే.
ఏ కార్యములో అయినా దూషణ, భూషణములు రెండూ ఉంటాయి. అయితే
నేను చేసిన పని మంచిదా, చెడుదా? జ్ఞానముకల్గినదా, అజ్ఞానముకల్గినదా?
అని చూచుకోవలసియున్నది. ఒక పనిని చేయుటలో మన పాత్ర ఎంత
అని చూస్తే, ఆడించేవాడు ఆడించినట్లు ఆడడమే నా పాత్ర అని
తెలిసిపోయినది. స్వయముగా నేనే కాదు ప్రపంచములో ఎవడూ ఆడలేడు.
ఖుర్ఆన్లో సూరా 50, ఆయత్ 21లో చెప్పినట్లు “ప్రతి మనిషి ఒక
ఆడించేవాడితోనూ, సాక్షిగా చూచే వాడితోనూ కలిసి వస్తాడు”
అని చెప్పినట్లు, మనిషిని అయిన నేను నన్ను ఆడించు ఆత్మతో కలిసి
యున్నాను. ప్రతి పనిని ఆటగా తలిస్తే ఈ గ్రంథమును వ్రాయించినది
నాలోయున్న ఆత్మయనీ, నేను కాదనీ, ఆడించేవాడు ఆడిస్తే దానికి
అనుగుణముగా నేను కదలవలసి వచ్చిందని చెప్పవచ్చును. అందువలన
ఈ గ్రంథము వ్రాయు కార్యములో స్వయముగా నా ప్రమేయము లేదు.
ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీతలో మోక్షసన్న్యాస యోగమను
అధ్యాయమున 61వ శ్లోకమున “జంత్రగాడు బొమ్మలను ఆడించు
నట్లు సర్వప్రాణులను నేను ఆడించుచున్నాను” అని చెప్పినట్లు,
అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో (50-21) వాక్యము ప్రకారము
పైకి నేను వ్రాసినట్లు నా శరీరము కదలికలనుబట్టి కనిపించినా,
శరీరములోపల యుండి వ్రాయించినవాడు నాకూ దేవునికి మధ్యలోయున్న
ఆత్మయని నాకు బాగా తెలుసు. అందువలన ఈ గ్రంథము యొక్క
దూషణ, భూషణములు గానీ, పాపపుణ్యములుగానీ, నాకు సంబంధము
కాదు. ప్రతి పనిని చేయించునది ఆత్మకాగా, సాక్షిగా దేవుడు చూస్తున్నాడు.
అందువలన నా శరీరములోని దేవునికి తెలియకుండా ఏదీ జరుగలేదు.
ఇదియంతయూ మనుషులకు వర్తించు సూత్రమయినందున, అందరు
చేయు పనులు దేవునికి తెలియకుండా జరుగడము లేదు. అయితే అంతర్గత
జ్ఞానము తెలియని మనిషి అన్ని పనులనూ తానే చేయుచున్నానని అసత్య
భావమును పొందియున్నాడు. అందువలన జరిగిన కార్యములోని

నా చివరి మాట
పాపపుణ్యములు వానికే తగులుకొనుచున్నవి. నేను మాత్రము చేయని
పనిని నేను చేశానని అసత్య భావమును పొందలేదు. అందువలన నాకు
పాపపుణ్యములు రావు.

నా శరీరములో ఇప్పుడు కూడా దేవుడు చూస్తూవుండగా మధ్య
ఆత్మగాయున్న ఆత్మ నా శరీరమును కదుపుచూ నా చేత ఈ విధముగా
ఈ గ్రంథములో చివరిమాటను వ్రాయిస్తూ ఉన్నాడు. అది ఏమో ఇప్పుడు
చూస్తాము. మొదట దేవుడు తన ప్రకృతి ద్వారా మనిషిని సృష్టించాడు.
అప్పుడు స్వయముగా ఎవడూ పుట్టలేదు. మనిషి ఒకమారు మొదట
పుట్టిన తర్వాత వానికి మొదట చావును, తర్వాత పుట్టుకను దేవుడు
ఇచ్చాడు. పుట్టినవానికి మొదట దేవుడిచ్చిన చావు వచ్చింది, తర్వాత
పుట్టుక వచ్చింది. దేవుని మాట ప్రకారము చావు, పుట్టుకలను మనిషి
పొందుచునే యున్నాడు. చావు తర్వాత పుట్టుక అగుట వలన మనిషి
జన్మలు ఎడతెరపి లేకుండా కలుగుచునేయున్నవి. అట్లు పుట్టడములో
గడచిపోయిన జన్మలు జ్ఞాపకము లేవు. గడుస్తున్న జన్మ మాత్రము
జ్ఞాపకమున్నది. గడచిపోయిన జన్మలో క్రైస్తవునిగావున్నవాడు ప్రస్తుత
జన్మలో ముస్లీమ్ పుట్టియుండవచ్చును. అట్లే పోయిన జన్మలో ముస్లీన్గా
యున్నవాడు ప్రస్తుత జన్మలో క్రైస్తవునిగా పుట్టియుండవచ్చును. అలాగే
హిందువు ప్రస్తుత జన్మలో హిందువుగానే పుట్టవచ్చును లేక ముస్లీన్గా
అయినా లేక క్రైస్తవునిగా అయినా పుట్టవచ్చును. ఏ జన్మలో ఎక్కడ, ఏ
మతస్థునిగా పుట్టవలెను అనునది కర్మనిర్ణయము ప్రకారము జరుగు
కార్యములేగానీ, స్వంత ఇష్టముతో పుట్టునది కాదు. ఈ జన్మలో ఒకడు
ముస్లీమ్ యుండి హిందువులను ఎక్కువగా ద్వేషించుచుండును.
అటువంటి వాడు తర్వాత వచ్చు జన్మలో హిందువుగానే పుట్టుట వలన
వాడు హిందువులను ద్వేషించడు. అప్పుడు ముస్లీమ్లను ద్వేషించును.
దీనినంతటినీ గమనిస్తే ఎవడూ స్వతంత్రముగా జన్మించలేదనీ, జన్మలు
ఎవని ఇచ్ఛ ప్రకారమూ వచ్చునవి కావు అని తెలియుచున్నది. జన్మజన్మలకు
మతములు మారిపోయి వివిధ మతములలో పుట్టుచుండుట వలన, మతము
అనునది ప్రస్తుత కాలములో ఉండునదేగానీ, ఏ మనిషికీ శాశ్వితముగా
ఉండునది కాదు.


ప్రస్తుతము మాత్రముండి తర్వాత కాలములో లేని మతమును
పట్టుకొని, “నేను ఫలానా మతస్థుడిని” అనుకోవడము పొరపాటు కాదా!
ఇప్పుడు ముస్లీమ్ అయినవాడు తర్వాత క్రైస్తవుడు కాడని నమ్మకమేమి?
అలాగే నేడు హిందువుగా యున్నవాడు తర్వాత జన్మలో క్రైస్తవునిగా పుట్టడని
నమ్మకమేమి? అందువలన కొంత కాలమేవుండు మతము కొరకు నీవు
నీ జీవితమును వృథా చేసుకోవద్దు. మతము మనిషి ధరించు వస్త్రము
లాంటిది. ఒక దినము తెల్లని దుస్తులు, మరొక దినము ఆకుపచ్చ దుస్తులు,
మూడవ దినము ఎరుపు దుస్తులు ఒకడు ధరించాడు అనుకొనుము. తెల్లని
దుస్తులు ధరించినరోజు వానిని తెల్లని రంగు బట్టలు కట్టినవాడు అని
చెప్పుచున్నాము. అట్లే తెల్లరంగు వాడని కూడా చెప్పవచ్చును. ఒక దినము
ధరించిన తెల్లని రంగు రేపు వుండదు. కావున అది ప్రస్తుతము చెప్పు
పేరేగానీ శాశ్వితముగా ఉండునది కాదు. రెండవరోజు ఆకుపచ్చరంగు
దుస్తులు ధరించిన రోజు గుర్తింపుకు ఆకుపచ్చ వాడు అని అనవచ్చునుగానీ
అది అతనికి శాశ్విత రంగుగా ఉండదు. అలాగే ఒక జన్మలో మాత్రము
వుండు మతమునుబట్టి అప్పటికి ఆ మతస్థుడని పేరు వచ్చినా తర్వాత
వాడు ఆ మతస్థునిగా ఉండడు. కావున వానిని శాశ్వితముగా ఆ మతస్థుడని
అనుకోవడము పొరపాటగును. ఒక నాటకములో కొద్దిసేపు రామునిగా
నటించు పాత్రనుబట్టి అప్పుడు అతనిని రాముడని చెప్పినా, అది ఆ
నాటకము వరకేగానీ, తర్వాత అతను ఇంటికి పోయినప్పుడు రాముడు

కాదుకదా! అలాగే జీవుడు శరీరమును ధరించి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క
మతస్థునిగా పుట్టినా, వాడు అప్పటికి ఆ   మతస్తుడిగా ఉన్న, తర్వాత  
కాలములో, తర్వాత జన్మలలో అతనిని ఆ మతస్తుని చెప్పలేము.
అందువలన ప్రస్తుత కాలములో హిందువుగా పుట్టినవాడుగానీ, ముస్లీన్గా
పుట్టినవాడుగానీ ఇప్పటికి హిందువనియో, ముస్లీమ్ అనియో పిలువబడినా
తర్వాత కాలములో, తర్వాత జన్మలో అతను ఆ మతములోనే పుట్టునను
నమ్మకము లేదు. అందువలన మతము ఒక జన్మలో ఒక దినము ధరించు
దుస్తులలాంటిది. దీనిప్రకారము మతము ఎవరికీ శాశ్వితము కాదు.
కాబట్టి మతమును ఆధారము చేసుకొని చేయు పనులన్నియూ వృథా
కార్యములేయగును. వాటివలన పాపములే వచ్చును గానీ, దేవునికి
సంబంధించిన జ్ఞానము ఏమాత్రము రాదు.

శాశ్వితముకాని మతము మీద ప్రతి మనిషి శ్రద్ధను పెంచుకొని
నేను ఫలానా మతస్థుడనని చెప్పుకోవడమేకాక, ఇతర మతములను
ద్వేషముగా చూస్తున్నాడు. మతము మీద శ్రద్ధతో మనిషి తెలియవలసిన
జ్ఞానమును తెలియలేకపోతున్నాడు. మతము మనిషికి పుట్టుకలో లేదు.
పుట్టిన తర్వాత కొంతకాలమునకు వాడు పుట్టిన కుటుంబమునుబట్టి వానికి
మతము అంటగట్టబడుచున్నది. పుట్టినప్పుడు లేని భార్య యుక్తవయస్సు
వచ్చిన తర్వాత వచ్చి జీవితములో తగులుకొన్నట్లు, పుట్టినప్పుడు లేని
మతము యుక్తవయస్సు రాకముందే జీవితములో తగులుకొనుచున్నది.
ఒక మనిషి జీవితములో యుక్తవయస్సుకంటే ముందు మతము, యుక్త
వయస్సు తర్వాత భార్య తగులుకోవడము జరుగుచున్నది. భార్య వచ్చిన
తర్వాత మనిషి తన తల్లితండ్రికి దూరమగుచున్నాడు. భార్యకంటే ముందు
మనిషి జీవితములోనికి వచ్చిన మతము వలన కనిపించని తల్లి తండ్రి
అయిన ప్రకృతి పరమాత్మలకు దూరమగుచున్నాడు. భార్యమీద ప్రేమతో

తల్లితండ్రుల మీద ధ్యాస లేకుండా పోయినట్లు, మతము మీద గల
ప్రేమతో ప్రకృతి, పరమాత్మల జ్ఞానము మీద ధ్యాస లేకుండా పోవుచున్నది.
మతముగానీ, భార్యగానీ జీవితము మధ్యలో వచ్చునవేయనీ, ఇప్పుడున్న
మతము, భార్య తర్వాత జన్మలో వారే ఉందురని నమ్మకములేదనీ, మతము,
భార్య ఎవరికీ శాశ్వతముకాదనీ తెలిసినవారు మత మాయనుండి, భార్య
మోజు నుండి బయటపడగలరు. భార్యమోజులో లేనివాడు తన తల్లి
తండ్రులను శ్రద్ధతో చూచుకొనును. అలాగే మతమాయలో లేనివాడు
ప్రకృతి పరమాత్మల జ్ఞానమును శ్రద్ధతో తెలియగలడు. దీనినిబట్టి ప్రతి
మనిషికీ మతము పెద్దమాయగా ఉన్నదనీ, మతము మీద ధ్యాస వలన
మనిషికి దేవుని మీద శ్రద్ధ తగ్గిపోవుచున్నదనీ తెలియుచున్నది.

మతములో కూడా జ్ఞానమున్నది కదా! మతములో జ్ఞానము
లేకపోతే దానిని వదలుకోవలసివచ్చును. మూడు మతగ్రంథములలో
దేవుని జ్ఞానమున్నదనీ, అవి దైవగ్రంథములని మీరే చెప్పారు కదా!
అలాంటప్పుడు మనిషి మతమును ఎందుకు లేకుండా చేసుకోవలెను
అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు. మూడు
దైవగ్రంథములలోని జ్ఞానమును మనిషి తెలియాలంటే వానికి మతము
లేకుండా ఉన్నప్పుడే అది సాధ్యమగును. లేకపోతే ఆ గ్రంథములలోని
జ్ఞానము మనిషికి సరిగా అర్థముకాకుండా తప్పుగా అర్థమగును. దానికి
తార్కాణముగా ఒక విషయమును చూస్తాము. ఒక హిందూ గురువు,
ఒక ముస్లీమ్ గురువు ఇద్దరూ స్నేహితులుగా ఉండుట వలన, వారు
అప్పుడప్పుడు వారివారి జ్ఞానమును చర్చించుకొనుచుండిరి. ఒక దినము
మామిడితోటలో ఇద్దరు గురువులు కూర్చొని జ్ఞానమును మాట్లాడుకొను
చుండిరి. అప్పుడు హిందూ గురువు "మనిషి చనిపోతూనే తిరిగి జన్మకు
పోవును” అని చెప్పగా ముస్లీమ్ గురువు “అలా జరుగదు, మనిషి చనిపోతే
భూసమాధిలోనే ప్రళయము వచ్చువరకు ఉండును" అన్నాడు. వారు
ఇద్దరిలో నేను చెప్పునదే సరియైన జ్ఞానమని ఒకరు అనగా, కాదు నేను
చెప్పిన జ్ఞానమే సత్యమైనదని మరొకరు చెప్పుచుండిరి. అయితే అక్కడే
వారికి తెలియకుండా ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత అటు జన్మకు
పోకుండా, ఇటు భూసమాధిలో లేకుండా మధ్యలో దయ్యాలైవుండిరి. ఆ
ఇద్దరు దయ్యాలుగాయున్నవారు ఇద్దరి గురువుల మాటలువిని “వారు
ఇద్దరూ చెప్పునది తప్పు, వారిది నిజమైతే మనమెందుకు ఇట్లు ఎటూ
కాకుండా మధ్యలో ఉన్నాము" అని వారు ఆ గురువుల మీద కోపముగల
వారై, వీరు బ్రతికియుంటే అజ్ఞానమును, అసత్యమును బోధించి
సమాజమును చెడగొట్టుదురని తలచి, వారిని చంపివేయాలనుకొని, ఇద్దరి
గురువుల శరీరములోనికి దూరి పది రోజులు బాధించి వారిని చనిపోవునట్లు
చేశారు. అప్పుడు చనిపోయిన ఇద్దరు గురువులు కూడా దయ్యాలై మొదటి
ఇద్దరి దయ్యాలతో కలిసిపోయారు. అప్పుడు ఆ ఇద్దరి గురువులకు మేము
చెప్పినది సత్యముకాదని తెలిసింది. చనిపోయిన తర్వాత భూసమాధిలో
ఉంటారను ముస్లీమ్ మతము చెప్పినది తప్పని ముస్లీమ్ గురువుకు తెలిసి
పోయింది. అట్లే చనిపోయిన తర్వాత అందరూ జన్మకు పోరని కొందరు
దయ్యాలవుతారని హిందూ గురువుకు కూడా తెలిసింది. అప్పుడు వారు
వారి మతముల ప్రకారము చెప్పు బోధలను అనుసరించక ప్రత్యక్ష
సాక్ష్యముగాయున్న బోధలనే గ్రహించాలనుకున్నారు. వారు తర్వాత జన్మలో
నిజజ్ఞానమువైపు ధ్యాస నుంచి నిజమైన జ్ఞానులుగా మారిపోయారు.
అందువలన మీరు కూడా మతము బోధించిన జ్ఞానమును వదలి మతాతీత
జ్ఞానమును తెలియవలెనని కోరుచున్నాము.

అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.



Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024