pss book:దయ్యాల - భూతాల యదార్థ సంఘటనలు. draft drive 22nd July 2024

 యోగీశ్వరుల ముందుమాట.


దయ్యాలను, భూతాలను ఈ కాలములో ఎవరు నమ్మినా హేతువాదులనువారు, నాస్తికవాదులనువారు నమ్మరు. నమ్మకము అను మాట (పదము) మా డిక్షనరిలో లేదు అని అనుచుందురు.బయట కనిపించు సమాజములో హేతువాదము, నాస్తికవాదము అని రెండు వేరువేరు పేర్లు కలిగిన వాదములుండినా, మాటలలోగానీ, కార్యములలోగానీ రెండూ ఒకటిగానే కనిపిస్తున్నవి. ఉదాహరణకు వెండి, బంగారు రెండు వేరువేరు లోహములు కలవు. కానీ ఈ కాలములో వెండినగలకు బంగారు పూత వేయడములో రెండూ బంగారుగానే కనిపిస్తున్నవి. అలాగే హేతువాదులు, నాస్తికవాదులు తమను వేరువేరుగా చెప్పుకొంటున్నా, హేతువాదులు నాస్తికులవలె మాట్లాడడము వలన హేతువాదులు కూడ నాస్తికులవలె కనిపిస్తున్నారు. అందువలన హేతువాదము అను పేరుండినా, అదికాస్త నాస్తికవాదముగా మారిపోయినది. నేటి కాలములో ఆస్తికవాదము, నాస్తికవాదము తప్ప హేతువాదము ఎక్కడా కనిపించలేదు. హేతువాదము పేరుతో కొన్ని సంస్థలు ఏర్పడినా, వారిది అసలైన హేతువాదముకాక, బంగారుపూత పూసుకొన్న వెండివలె నాస్తికత్వమును నింపుకొన్న హేతువాదమైనది. ఒకరకముగా చెప్పితే వాస్తవమైన హేతువాదము భూమిమీద అరుదైపోయినదని చెప్పవచ్చును. దేవుడున్నాడు అను ఆస్తిక వాదమునకు, దేవుడులేడు అను నాస్తికవాదము ఎప్పుడూ వ్యతిరేఖమే. ఎక్కడైనా హేతువాదులు అని చెప్పుకొనువారుండినా వారు నాస్తికవాదుల లోనికే జమ అయిపోయారు. కావున వారు కూడ ఆస్తికవాదమునకు వ్యతిరేఖులే!


మొదట నా జీవితము మొదలైనది హేతువాదముతోనే. నాలో ఉన్నది అసలైన హేతువాదము, కాబట్టి అందులో నాస్తికవాద లక్షణములైన దేవుడు లేడు అను ఉద్దేశము లేనేలేదు. దేవుడు ఎలా ఉన్నాడు అన్నది ఆనాటి నాలోని ప్రశ్న. ఆస్తికవాదములో జవాబు ఉండదు, నాస్తికవాదములో ప్రశ్న ఉండదు అని నేను చెప్పుచుంటాను. ఒకే ఒక హేతువాదములో మాత్రము ప్రశ్న ఉంటుంది మరియు జవాబు ఉంటుంది అనికూడ ముఖ్యముగ చెప్పుచుంటాను. అసలైన హేతువాద లక్షణములు నాలో మొదటినుండి ఉండుట వలన నాలో ప్రశ్న ఉంది, చివరకు జవాబు కూడ ఉంది. ఒక ప్రశ్న ఉద్భవించినపుడు, శాస్త్రబద్దమైన జవాబు దొరుకువరకు హేతువాది అన్వేషణ చేయుట వలన, హేతువాదివద్ద ప్రశ్న ఉంటుంది మరియు దానికి సరియైన జవాబు ఉంటుందని చెప్పవచ్చును. హేతు వాదము అను పదములో “వాదము” అన్నది సామాన్యమైనది "హేతు” అన్నది ముఖ్యమైనది. అలాగే ఆస్తికవాదము, నాస్తికవాదము అను వాటిలో కూడ 'వాదము' అన్నది అన్నిటిలోను సమానమే. వాదముకంటే ముందున్న శబ్దమే ముఖ్యమైనది. హేతువాదము అను శబ్దములో ఇమిడియున్న అర్థమును గమనిస్తే, సత్యము కొరకు అడుగునది లేక ప్రశ్నించునది. సత్యమైన జవాబును పొందునదని తెలియగలదు. హేతువాదములో శాస్త్రబద్ధమైన ప్రశ్న ఉంటుంది మరియు శాస్త్రబద్దమైన జవాబు ఉంటుంది. అందువలన హేతువాదమును అసలైన సత్యవాదము అని అనవచ్చును. 'హేతు' అను పదము భగవద్గీతలో మూడుచోట్ల వాడబడినది. రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయములో 10వ శ్లోకములోను, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అను అధ్యాయములో 5 మరియు 21వ శ్లోకములలోను చెప్పబడియున్నది. అందులో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగములోని 21వ శ్లోకమును గమనిస్తాము.


కార్య కారణ కర్తృత్యే హేతుః ప్రకృతి రుచ్యతే,

పురుష స్సుఖ దుఃఖానాం భోక్తృత్యే హేతు రుచ్యతే.



--

శ్లోకములోని రెండు వాక్యములలో పై వాక్యమందు కార్య, కారణ, కర్త అను మూడు పదములూ, రెండవ వాక్యములో సుఖ, దుఃఖా, భోక్త అను మూడు పదములు గలవు. పై వాక్యములోని కార్య, కారణ, కర్తకు చివరిలో ప్రకృతి చెప్పబడినది. అలాగే రెండవ వాక్యములోని సుఖ, దుఃఖ, భోక్తకు చివరిలో పురుష చెప్పబడినది. పై వాక్యములోను, క్రింది వాక్యములోను 'హేతు' అన్న పదము మాత్రమే మిగిలిపోయినది. ఈ రెండు వాక్యములలోను హేతు అన్న పదము విశేషత కల్గియున్నది. హేతు అన్న పదము వలననే సత్యము బయటపడుచున్నది. పై వాక్యములోని కార్య, కారణ, కర్తకు ప్రకృతిని అనుసంధానము చేయునది హేతు అను ఒకశబ్దమే, అలాగే సుఖ, దుఃఖ, భోక్తకు పురుషున్ని అను సంధానము చేయునది హేతు అను ఒక పదమేనని తెలియుచున్నది. సుఖ, దుఃఖ అనుభవమునకు, పురుషునికి (జీవునికి) మధ్యలోగల సత్యమేమిటో హేతు అన్న పదముతోనే తెలియుచున్నది. అలాగే కార్య, కారణ, కర్తకు ప్రకృతికి మధ్యలోగల సంబంధముగానీ, తెలియని రహస్యముగానీ, ఉన్న సత్యముగానీ, హేతు అన్న పదముతోనే తెలియుచున్నది. అందువలన బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతయందే, హేతు అనుపదము ముఖ్యముగా వాడబడినది. అటువంటపుడు హేతువాదము చాలాగొప్పదనీ, సత్యమును తెలియజేయునదనీ, వాస్తవ సంబంధమును తెలుపునదనీ అర్థమగుచున్నది. ఒక సత్యమును మనిషి తెలియాలంటే, వానికి ముందు ప్రశ్న అవసరము తర్వాత జవాబు అవసరము. అందువలన భూమిమీద హేతువాదము ప్రశ్నలతో మొదలై జవాబులతో ముగుస్తుంది. ప్రశ్న మాత్రముండి జవాబులేని నాడు అది హేతువాదముకాదు.



నేను హేతువాదముతో జీవితమును ప్రారంభించిన వాడిని. కావున చిన్నవయస్సుయందు ప్రతి విషయములోను నాలో ప్రశ్నలు వచ్చేవి. వాటి జవాబుల కొరకు పెద్దవారిని అడిగేవాడిని. ఆ కాలములో కొంత జ్ఞానము కలిగిన పెద్దలు కూడ నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక, ఈ వయస్సులో ఇవన్నీ నీకెందుకు అని నా నోరు మూయించేవారు. నాకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఒక పెద్దస్వామీజీని యోగదండమును గురించి ప్రశ్నించాను. నా ప్రశ్న అల్లరిగా గానీ, చిల్లరగా గానీ ఎప్పటికీ ఉండదు. ప్రశ్న వినయ విధేయతలతో కూడుకొని, శాస్త్రబద్ధమైనదిగా ఉంటుంది. నేను ఎంతో వినయముగా అడిగిన ప్రశ్నకు, ఆ స్వామీజీ సమాధానము చెప్పలేక తల తోక లేని జవాబు చెప్పాడు. అప్పటినుండి నాలో వచ్చిన ప్రశ్నలకు, నేనే జవాబును అనుభవముద్వారాగానీ, పరిశోధనద్వారాగానీ తెలుసు కోవాలనుకున్నాను. నాలోని మొదటి పెద్ద ప్రశ్న దేవుడెవరు? నాలోని రెండవ ప్రశ్న దయ్యము ఏది? ఈ రెండు ప్రశ్నల తర్వాత నేనెవరు అను ప్రశ్నమొదలుకొని కొన్ని వందల ప్రశ్నలున్నవి. అవన్నీ తెలియాలంటే, మొదట రెండవ ప్రశ్నవద్దనుండి ప్రారంభించి తెలుసుకొంటే, పెద్దప్రశ్న అయిన దేవుడెవరు అన్నదానికి కూడ జవాబును గ్రహించవచ్చునని అనుకున్నాను. అందువలన మొదట నా పరిశోధన దయ్యములవద్దనుండి మొదలైనది. ఆ పరిశోధనలో ఎన్నోవందల అనుభవములనుండి సత్యమును తెలుసుకొన్నాను. ఒక్కొక్క అనుభవములో ఒక్కొక్క జవాబును సేకరించుతూ వచ్చాను. ఈ గ్రంథములో వ్రాసిన సంఘటనలు, నూటికి ఒకటిని మాత్రము వ్రాశాము. నన్ను మొట్టమొదట స్వామీ అని పిలిచినది మనుషులు కాదు దయ్యాలు! ఆ రోజుల్లో నేను ఏ గుర్తింపులేకుండ, సర్వసాధారణ మనిషిలాగనే ఉండేవాడిని. పైగా అలా పిలిచినప్పటికి నావయస్సు ఇరవైరెండు (22) సంవత్సరములు మాత్రమే. అలా నా రెండవ ప్రశ్న అయిన దయ్యమంటే ఏమిటి? అన్నదానికి జవాబు ప్రారంభమై, తర్వాత క్షుద్రదేవతలు, మహా దేవతల వరకు కొనసాగింది. దాదాపు పది లేక పండ్రెండు సంవత్సరములు సాగిన నా అన్వేషణలో ఎన్నో జవాబులు శాస్త్రబద్దముగా లభించాయి.



---

ఇంత సత్యమైన విషయమును, హేతుబద్దమైన విషయమును చదువుకొన్న వారందరు అసత్యమనడమేమిటి, మేము నమ్మము అని అనడమేమిటి, అని యోచిస్తే, వారి మెదడులో సూక్ష్మమును గ్రహించు గ్రాహితశక్తి లేదని అర్థమగుచున్నది. అందరికి తెలిసిన నవగ్రహములలో బుధగ్రహము యొక్క కిరణములు అతడు పుట్టిన సమయములో మెదడు లోనికి ప్రాకకపోవడము వలన, సూక్ష్మములైన దయ్యములను గురించి తెలుసుకొనుశక్తి ఉండదు. అందువలన చాలామంది దయ్యాలులేవు, భూతాలులేవు అంటుంటారు. ఎవరు ఏమనినా, దయ్యాలు అనునవి మరియు దేవతలు అనునవి రెండు సత్యములే మరియు అనుభవ పూర్వకములే. ఈ గ్రంథములో వివిధ రకములైన సంఘటనలను వివరించి చెప్పినా, ఇప్పటివరకు నేను దయ్యములనుగానీ, దేవతలనుగానీ ప్రత్యక్షముగా చూడలేదు. ఒక్క దయ్యమును కూడ చూడనిదే, అన్ని విషయాలు ఎలా వ్రాయగలిగారు అంటే దానికి జవాబు, శరీరమునకున్న స్థూలకన్నులకు స్థూల ఆకారములే కనిపించును, కానీ సూక్ష్మ ఆకారములు కనిపించవు. శరీరములోపలనున్న సూక్ష్మనేత్రమైన జ్ఞాననేత్రమునకు సూక్ష్మములు కనిపించును. నాకు కనిపించని దయ్యాలను గురించి, మరియు భూతాలను గురించి పెద్దగ్రహములను గురించి, నా చేతనే ఈ గ్రంథములో వ్రాయబడి వుంది. ఇంతగా చెప్పినా కొందరు చెప్పినదానిని గ్రహించలేక, దయ్యాన్ని నాకు చూపిస్తావా? అని అడుగువారు కూడ గలరు. నేను చూచి ఉంటే నీకు చూపగలను, కానీ నేనే చూడంది, నీకు ఎలా చూపగలను? నేను, నువ్వేకాదు, ఎవరూ చూడలేరు. మనిషి పూర్తి నిద్రలోలేకుండ, పూర్తి మెలకువలో కూడ లేకుండ ఉండే సమయములో దయ్యాల యొక్క కొంత నమూనా ఆకారము కనపడును. అలా కనిపించినది స్పష్టముగా కనిపించదు. పూర్తి మెలకువగా ఉన్నప్పుడు ఏ దయ్యమూ ఎవరికీ కనిపించదు.


దయ్యము అను తీగలాగితే పెద్దడొంకే కదిలింది. అందులోనే రోగములు జీవరాసులని బయల్పడినది. అంతేకాక రోగములనుండి మేఘములవరకు తీగంతా కదిలి కనిపించినట్లయినది. ఇందులో మూడువందల పేజీల వరకు దయ్యములు, దేవతలను గురించి చెప్పడ మైనది. అంతవరకు దయ్యములు, దేవతల సంఘటనలు ఆసక్తిని కల్గించునవై, ఎవరికీ తెలియని విషయములెన్నో తెలియబడినవి. మూడు వందల పేజీల తర్వాత చెప్పిన సమాచారములో చాలా గొప్పదైన జ్ఞానము ఇమిడియున్నది. ఈ గ్రంథము పేరు చూస్తే, ఏదో దయ్యాల విషయములు కాలక్షేపమునకు, కథలను తయారు చేసి వ్రాసివుంటారు అని కొందరు అనుకోవచ్చును. అలాంటి ఉద్దేశముతో చదువను మొదలుపెట్టిన తర్వాత, అందులో చెప్పబడినవి అల్లిన కథలుకాదు, జరిగిన సంఘటనలని తెలిసి పోగలవు. ఇంకా ముందుకు చదివితే, జరిగిన సంఘటనలైనా, ఇవి ప్రొద్దుపోవుటకు (కాలక్షేపమునకు) చెప్పినవికావు, కర్మపోవుటకు (కర్మ క్షేపమునకు) చెప్పిన సమాచారమని తెలియగలదు. మేఘములను గురించి చెప్పిన సమాచారములో, కొంతమాత్రమే మేఘములను గురించి పరిశోధన చేయు శాస్త్రజ్ఞులకు తెలిసినదని అర్థమైపోవుచున్నది. మేఘముల విషయము ఇంతవరకు శాస్త్రజ్ఞులకు కూడ తెలియదని, చదివేకొద్దీ తెలిసిపోతుంది. ప్రతి విషయములోను హేతువును వెదకుచు పోవుటవలన, దొరికిన జవాబులు చాలామంది శాస్త్రజ్ఞుల అంచనాలకు కూడ మించిపోయినవిగా ఉన్నవి. ఈ గ్రంథమును చదివేకొద్దీ, చివరకు మనకు తెలియని క్రొత్త ప్రపంచము తెలిసినట్లగుచున్నది.


సాయిబాబా మొదలగు మహాత్ములు ప్రజలను ఉద్దరించుటకు, వారిని ఎన్నో ఆపదలనుండి కాపాడుటకు కొన్ని వందలసంవత్సరములనుండి భూమిమీదనే ఉన్నట్లు, వారు వారి శిష్యులు ఎన్నో మహత్యములను చూపించడము కూడ జరిగిందని ఈ గ్రంథములో తెలియబడింది. గొప్పవారైన పెనుకొండ బాబా పకురుద్దీన్, పుట్టపర్తి సాయిబాబాగారు మానవుల శ్రేయస్సుకొరకు ఎన్నో సంవత్సరములనుండి జన్మలు తీసుకోకుండ, ఒకే జన్మలో ఉన్నట్లు కూడ వారి


---

ద్వారానే తెలియబడింది. మానవుడు ప్రకృతిశక్తుల ముందర బలహీనుడని, యోగులశక్తి ప్రకృతిశక్తుల కంటే బలమైనదని, అవసరమొస్తే ప్రకృతిని కూడ శాసించగల స్థోమత యోగులకుండునని కూడ ఇందులో తెలియబడింది. అంతేకాక ఈ గ్రంథములో యోగులను పెద్దగ చెప్పడమేకాక, యోగులకు ప్రకృతిశక్తులేకాక, దయ్యములు, దేవతలు, భూతములు, గ్రహములు అన్నియు గౌరవమిచ్చునని, కొన్ని చోట్ల యోగులు చెప్పినట్లు నడుచుకొనునని తెలియజేయడ మైనది. ఈ గ్రంథము వలన, ఇటు ప్రపంచ జ్ఞానము, అటు పరమాత్మ జ్ఞానము తెలియును. అంతేకాక మేము గొప్ప, అన్నీ మాకు తెలుసు అను నేటి కాలపు హేతువాదులు ఈ గ్రంథమును చదివిన తర్వాత వారు కూడ నిజమైన హేతువును అనుసరించి, నిజమైన హేతువాదులుగా (సత్య వాదులుగా) మారగలరని అనుకుంటున్నాను.


ప్రపంచ విషయములతో మొదలైన ఈ గ్రంథము చివరకు పరమాత్మ విషయము వరకు తీసుకుపోయినది. అట్లని ఏదో దేవుని జ్ఞానమును అన్ని పుస్తకములలో ఉన్నట్లు, అందరు స్వాములు చెప్పినట్లు చెప్పివుంటారని అనుకోవద్దండి. ఇంతవరకు ఎవరూ చెప్పని సత్యమైన దేవుని విధానమును అక్షరాల సత్యమైన పద్ధతిని అందరికి అర్థమగునట్లు చెప్పడము జరిగినది. ఒక దేశములోని ప్రభుత్వము పరిపాలనా విధానమున్నట్లే, విశ్వమంతటికీ కనిపించని ప్రభుత్వము, కనిపించనిపాలన ఉందనీ, విశ్వమంతటావున్న కనపించని ప్రభుత్వమునకు, అధిపతి లేక రాజు కనిపించని దేవుడనీ, దేవుని ప్రభుత్వములోని పాలకులైన అధికారులు ఫలానావారని ఎవరికీ తెలియదని, వారి పాలన ఎంతో బలముతో కూడుకొన్నదని తెలియుచున్నది. దేవుని పాలకులైన మహాభూతములు, స్వల్పభూతములు, ఉపభూతములు, గ్రహములు మొదలగునవి నిజాయితిగలవియై పేద, ధనిక బేధము లేకుండ స్వచ్ఛమైన పాలన అందిస్తూ, భూమిమీదనే మనిషికి స్వర్గమును మరియు నరకమును చూపుచున్నవని తెలుపడమైనది. భూమిమీద గల అన్ని మతమువారు ఎక్కడో పై లోకములలోగలవని చెప్పుచున్న స్వర్గ, నరకములు అసత్యమనీ, భూమిమీదనే స్వర్గ, నరకములు రెండూగలవని, అవి దేవుని పాలకులు విధించు ప్రత్యక్ష సత్యములని తెలియని గొప్ప రహస్యములు ఈ గ్రంథము చివరిలో వ్రాయబడినవి. అందువలన ఈ గ్రంథమును చదవగలిగిన వారికి పాపముయొక్క ఫలితము ఎంత భయంకరముగ ఉంటుందో అర్థము కాగలదు. అట్లు అర్థమగుట వలన మనిషి కర్మనుండి బయటపడుటకు ప్రయత్నించును. పాపమునుండి బయటపడుటకు ఒకే ఒక దైవమార్గమును అనుసరించగలడని తలచుచున్నాము.


ఇట్లు,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.



--

దయ్యాల - భూతాల యదార్థ సంఘటనలు.


దేవుడు అను మాట పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. అయితే కొందరు దేవున్ని విశ్వసిస్తున్నారు, కొందరు విశ్వసించడము లేదు. విశ్వసించే వారిని ఆస్తికులనీ, విశ్వసించని వారిని నాస్తికులని అనడము జరుగుచున్నది. వాస్తవానికి ఇటు ఆస్తికులకు గానీ, అటు నాస్తికులకు గానీ దేవుడు తెలియబడలేదు. ఎందుకనగా దేవుడు నిజముగా లేడు, అబద్దముగా ఉన్నాడు. ఈ మా మాటను బట్టి మీరు కూడా నాస్తికులేనా? అని మమ్ములను మీరు ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము మేము నాస్తికులము ఏమాత్రము కాము, అట్లని ఇప్పుడున్నటువంటి ఆస్తికులము కాము, దేవుడు అబద్దముగా ఉన్నాడని చెప్పుచున్నాము కదా! అందువలన ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు మధ్యలోనున్నవారమని గుర్తించుకోవలెను.


దేవునికి రూపము, పేరు పెట్టుకొని అనేక పూజలూ, యజ్ఞ యాగాదులు చేయుచున్న ఈనాటి ఆస్తికులను మేము ఒప్పుకోము. కావున మమ్ములను నాస్తిక కోవలోనికి కొందరు ఆస్తికులు చేర్చినారు. అయితే మేము దేవున్ని లేడని చెప్పలేదు కదా! అబద్దముగా ఉన్నాడని చెప్పుచున్నాము కదా! కావున మేము నాస్తికులమెలా అవుతాము? అందువలన మేము నాస్తికులము కాము. అదే విధముగా దేవుడు లేడని ముందు చెప్పినా చివరిలో అబద్దముగా ఉ న్నాడనుట వలన నాస్తికులు మమ్ములను ఆస్తికుల కోవలోనికి చేర్చినా మేము వారనుకొన్నట్లు ఆస్తికులము కాము. దేవుడు నిజముగా లేడని చెప్పుచున్నాము కదా! కావున మమ్ములను ఆస్తికులనుటకు కూడ వీలులేదు. మేము చెప్పు మాటలు చాలా తికమకగా ఉన్నాయి కదా! ఇంతకూ మీరు ఎవరు అని అడగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! మేము నాస్తికులుగా కొందరికీ, ఆస్తికులుగా కొందరికీ కనిపించినా వాస్తవానికి మేము సత్యవాదులము. సత్యశోధన చేసి చూస్తే దేవుడున్నాడను ఆస్తికులలో దేవున్ని గురించియున్న భావముగానీ, దేవుడు లేడను నాస్తికులలో దేవున్ని గురించియున్న అవగాహనగానీ వాస్తవానికి దూరముగా ఉన్నాయి. ఆస్తికులు అనుకొన్న భావము ప్రకారము దేవుడు లేడు. అట్లే నాస్తికులు అనుకొన్న భావము ప్రకారమునకు కూడా దేవుడు లేడు. దీనిని బట్టి దేవుని వాస్తవికత ఇటు ఆస్తికులకు గానీ, అటు నాస్తికులకు గానీ ఏమాత్రము తెలియదనియే చెప్పవచ్చును.


భూమి మీద ఉన్న శాస్త్రములు మొత్తము ఆరు మాత్రమే. అందులో 1) గణిత, 2) రసాయనిక, 3) భౌతిక, 4) ఖగోళశాస్త్రములు నాలుగు ప్రపంచమునకు సంబంధించినవి కాగా, ఐదవదైన జ్యోతిష్యశాస్త్రము ఇటు ప్రపంచమునకు అటు పరమాత్మకు సంబంధించి మధ్యలో ఉన్నది. ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము దేవునికి సంబంధించినది. దీనిని బట్టి శాస్త్రములు మూడు తెగలనీ, నాలుగుశాస్త్రములు ప్రకృతికి సంబంధించిన వనీ, ఐదవది ప్రకృతికీ, పరమాత్మకు సంబంధించినదనీ, ఆరవది ఒకటి మాత్రము పరమాత్మకు సంబంధించినదని తెలియుచున్నది. ఇంకా కొంత యోచిస్తే కొందరి దృష్టిలో గణిత,రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములు పూర్తి ప్రపంచమునకు సంబంధించినవి కాగా, కేవలము జ్యోతిష్యశాస్త్రము, బ్రహ్మవిద్యాశాస్త్రము రెండు ఆధ్యాత్మికమునకు సంబంధించినవిగా ఉన్నవి. మరికొందరి దృష్ఠిలో

బ్రహ్మవిద్యాశాస్త్రము లేనే లేదు. ఇంకా కొందరి దృష్టిలో జ్యోతిష్యము శాస్త్రమే కాదు. అటువంటి వారికి కేవలము నాల్గు శాస్త్రములే కనిపిస్తున్నవి. ఈ విధముగా కొందరి దృష్ఠిలో నాలుగూ, కొందరి దృష్ఠిలో ఐదు, కొందరి దృష్ఠిలో ఆరు గలవు. ఆస్తికుల దృష్ఠిలో ఐదు మరియు ఆరుశాస్త్రములు ఉండగా, నాస్తికుల దృష్ఠిలో కేవలము నాల్గుశాస్త్రములే గలవు. నాస్తికులు ఆరవశాస్త్రము మీద ఏమి మాట్లాడక మూఢ నమ్మకమనుచు దేవుడే లేడనుచుందురు. అటువంటి


--

నాస్తికులే జ్యోతిష్యము మీద మాట్లాడుచూ జ్యోతిష్యము శాస్త్రముకాదని, దానిని నిరూపించగలరా అని కోట్లు పందెముతో సవాళ్ళు విసురుచుందురు.


నాస్తికులకు తెలిసిన గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములు ఈ మధ్య వంద సంవత్సరముల నుండి అభివృద్ధియై వాటిలోని చాలా విషయములు అందరికి తెలిసినవి. ఈ నాల్గు శాస్త్రముల అనుసంధానము తోనే గత యాభై సంవత్సరములనుండి మానవుని మనుగడ సుఖవంతము అగుటకు ఎన్నో పరికరములు కనుగొనబడినవి. ఈ నాల్గుశాస్త్రములను చదివిన మనుషులు, ఈ నాల్గుశాస్త్రముల వలన అభివృద్ధి చెందిన మనుషులు, అంతా మేమే కనుగొన్నాము, ఇదంతయు మానవుని మేధస్సు వలననే జరిగినది, ఇందులో దేవుని పాత్ర ఏమాత్రము లేదని చెప్పుచూ పూర్తి నాస్తికులైపోయారు. జ్యోతిష్యము మీదా, బ్రహ్మవిద్యాశాస్త్రము మీదా నమ్మకముకల కొందరు మాత్రము శాస్త్రములను పూర్తి తెలియకుండినా వాటిమీద నమ్మకముతో ఆస్తికులుగా ఉన్నారు. ఆస్తికులైన వారిలో కొందరు జ్యోతిష్యము మీదా, కొందరు బ్రహ్మవిద్య మీదా ఆసక్తి కల్గియుండినా వాటిలో పూర్తి పరిశోధన లేక, తెలిసిన కొద్దిపాటి దానితోనే అంతా తెలిసినట్లు భావించుకొనుచున్నారు. మొత్తము మీద గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళ శాస్త్రములు పరిశోధించబడి అభివృద్ధి అయినట్లు జ్యోతిష్యముగానీ, బ్రహ్మవిద్యాశాస్త్రములుగానీ శోధించబడలేదు, అభివృద్ధియు కాలేదు. ఈ రెండు శాస్త్రములలో ఆస్తికులైన వారు భిన్నాభిప్రాయములు కల్గియున్నారు. అందువలన ఎవరికి తెలిసిన దానిని వారు గొప్పగ చెప్పుకొనుచున్నారు. బ్రహ్మవిద్యా శాస్త్రములో మాకు తెలిసినది సత్యమా కాదా అని యోచించడము లేదు. చెప్పే దానిలో శాస్త్రీయత ఉందా లేదా అని కూడా అలోచించక ఎవరిది వారు గొప్పగా చెప్పుకొనుచున్నారు. అందువలన ఈనాడు ఆధ్యాత్మికరంగము అనేక చీలికలతో, అనేక మతములతో, అనేక సాంప్రదాయములతో, అనేక పేర్లతో, అనేక అచారములతో కనిపిస్తున్నది.


ఈ విధముగా ఆస్తికులు జ్యోతిష్య, బ్రహ్మవిద్యాశాస్త్రములను పూర్తి తెలియక, ఎవరికి తోచినది వారు చెప్పుచుండగా, అందులోని లొసుగులను గమనించిన నాస్తికులు కొందరు అసలు ఆస్తికవాదమే తప్పు అంటున్నారు. బ్రహ్మవిద్యను అసలు ఒప్పుకోక దేవుడే లేడంటున్నారు. అటువంటి నాస్తికులలో రెండు తెగలు కలవు. ఒక తెగ హేతువాదులనీ, మరొక తెగ నాస్తికవాదులని అంటున్నారు. నాస్తికవాదులు వేరు హేతువాదులు వేరని కొందరనినా, వాస్తవానికి హేతువాదమను పేరుతోనున్నది కూడా నాస్తిక వాదమే. పేరుకు హేతువాదము గొప్పదే, కానీ హేతువాదులు ఎవరూ లేరు, అంతా నాస్తికవాదులే గలరు. హేతువాదములో పరిశోధనా, పరిశీలనా దృష్ఠి ఉంటుంది. గ్రుడ్డిగ ఏ దానిని హేతువాదము కాదనదు. హేతువును (కారణమును) ప్రశ్నించునది హేతువాదము. కారణమునకు జవాబు దొరికినపుడు దానిని పరిశీలించి సత్యమైతే ఒప్పుకోవడమూ, సత్యము కాకపోతే ఖండించడము హేతువాదములోని ముఖ్య ఉద్దేశ్యము. అలాకాక విన్న సత్యమును పరిశీలించకనే ఖండించడమే తమ పని అయినట్లు వాదించడమును నాస్తికవాదమే అనవచ్చును. ఇటువంటి నాస్తికవాదముంది గానీ హేతువాదములేదు, లేదనడానికి ఒక ఉదాహరణగా ఒక యదార్థ సంఘటనను చూస్తాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములో గుంతకల్లు, గుత్తి అను రెండు ఊర్లమధ్యలో రైల్వేట్రాక్ ప్రక్కనే ఒక చిన్న పల్లెటూరు గలదు. ఆ ఊరిలో అందరూ కష్ట జీవులే. మగవారంతా వ్యవసాయములో నిమగ్నమవగా, స్త్రీలు కొందరు పాలు, పెరుగును ఐదు కిలోమీటర్ల దూరములోనున్న గుత్తికి తీసుకొని పోయి అక్కడ అమ్ముకొని జీవనము సాగించుచుందురు. అ పల్లెవాసులకు తెలుగు భాష తప్ప ఏ భాష తెలియదు. తెలుగు భాష కూడా

--

స్పష్టముగా కాకుండ ఆ ప్రాంతమునకు తగినట్లు కొంత యాసగా ఉండేది. ఆ ఊరి ఆడవారు కొందరు గుంపుగా ఉదయాన్నే బయలుదేరి రైల్వేట్రాక్ వెంట నడుచుకుంటూ పోయి పాలు, పెరుగు అమ్ముకొని రావడము నిత్యము చేయు పనిగా ఉండెడిది. ఒక దినము సాయంకాలము నిత్యము గుత్తికి పోయి వచ్చు వారిలో దాదాపు ముప్పై సంవత్సరముల వయస్సున్న ఒక స్త్రీ ఉన్నట్లుండి తమిళ భాష మాట్లాడడము మొదలు పెట్టింది. ఆ భాష ఆ ఊరిలో ఎవరికి తెలియని దానివలన వారికి ఏమి అర్థముకాక తికమక పడిపోయారు. ఆమె దాదాపు ఒక గంట కాలము తమిళభాష మాట్లాడిన తర్వాత తిరిగి యథాస్థితికి వచ్చి, మామూలుగా తెలుగు భాష మాట్లాడడము జరిగినది. అంతవరకు తెలుగు మాట్లాడకుండ తమిళమును మాట్లాడము, తమను క్రొత్తవారిని చూచినట్లు చూడడము చేశావు, అలా ఎందుకు చేశావు? తమిళమును ఎలా మాట్లాడగలిగావు? అని ఆమెను ప్రక్కనున్నవారు ప్రశ్నించారు. దానికి ఆమె నేను అలా చేశానా! అని ఆశ్చర్యముగా వీరినే అడిగిందట. నేను గంటసేపు నిద్రపోయినట్లయిందని, కానీ నేను ఏమి మాట్లాడినది నాకు తెలియదని చెప్పినది. అందుకు ప్రక్కవారు ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగక ఆమె అప్పుడపుడు క్రొత్తగా ప్రవర్తించడము, అలాంటి సమయములో తెలుగు ఏమాత్రము తెలియనట్లు ప్రవర్తించడము, తమిళములో మాట్లాడడము జరుగుచుండెడిది. ఆమె ఎందుకు అలా చేయుచున్నదో ఆ ఊరి వారికి అర్థముకాక, తమిళభాష వచ్చు వ్యక్తిని పిలుచుకువచ్చి, ఆమె క్రొత్తగా ప్రవర్తించి తమిళము మాట్లాడునపుడు, పిలుచుకు వచ్చిన తమిళ వ్యక్తితో మాట్లాడించారు. అపుడు ఆమె తమిళములో చెప్పిన విషయమును ప్రక్కవారికి ఆ వ్యక్తి తెలుగులో చెప్పడము జరిగినది.


అప్పటికి ఐదు సంవత్సరముల పూర్వము ఉదయము 7-30 గంటల సమయములో మద్రాస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించు తమిళనాడు నివాసి అయిన మాధవన్ అను వ్యక్తి, బ్రష్ తో పళ్ళు తోముకుంటూ డోర్ ప్రక్కన నిలబడియున్నపుడు స్పీడ్గా పోతున్న రైల్ బోగీ కదలికకు బ్యాలెన్స్ తప్పి ట్రైన్లోనుండి క్రిందపడి చనిపోవడము జరిగినది. ఆ వ్యక్తి క్రింద పడడము చూచిన అతని బంధువులు ట్రైనన్ను ఆపి అతని శవాన్ని తీసుకు పోవడము జరిగినది. అది జరిగిన తర్వాత ఐదు సంవత్సరములకు ఆ రోజు చనిపోయిన మాధవన్ ఆ పల్లెటూరి ఆడ మనిషిలోనుండి మాట్లాడము జరిగినది. ఆ విషయమంతా చనిపోయిన మాధవన్ తమిళములో చెప్పితే వచ్చిన తమిళ వ్యక్తి విని ప్రక్కవారికి తెలుగులో చెప్పడము జరిగినది. చనిపోయిన మాధవన్ రైల్వేట్రాక్ ప్రక్కనేయుండి ఆ దారి వెంటపోవు ఆడ మనిషి శరీరములో చేరిపోయి అప్పుడప్పుడు బయటికి వచ్చి మాట్లాడము జరిగెడిది. ఈ విషయమును విన్న వారికి చనిపోయిన వ్యక్తి మాట్లాడడ మేమిటని ప్రశ్నరావచ్చును. ఇది సంభవమేనా? అని కొందరికి ప్రశ్నవచ్చి నది. అది జరిగేపనికాదని అనుకొనుటకు భాషరాని ఆడమనిషి తమిళ భాష మాట్లాడము ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. కదాయని మరియొక ప్రశ్న వచ్చుచున్నది. ఈ విషయమును గురించి కొంత వివరముగా తెలుసు కోవాలని ఒక హేతువాది దగ్గరకు పోయి జరుగుచున్న విషయమంతా వివరించి చెప్పితే అతను అదొక రోగము, ఆ జబ్బు ఉన్నపుడు కొందరు తమకు తెలియకుండానే వేరే భాష మాట్లాడుదురని చెప్పడము జరిగినదట.



ఇక్కడ జరిగిన విషయము స్పష్టముగా ఉన్నప్పటికి ఆ విషయమును పరిశీలనగా చూడక, దానికి హేతువేమి అని వెతకక, అదొక జబ్బని సరిపుచ్చుకోవడము హేతువాదమౌతుందా? ఒక విషయాన్ని డేగ కన్నులాగ చూడునది హేతువాదము. పై సంఘటనలో రోగము వలన క్రొత్త భాష వస్తుందా? అని ప్రశ్నించుకొని చూడడము హేతువాద మౌతుంది. గంటసేపు మనిషికి జ్ఞప్తికి ఎందుకు లేదు? అని ప్రశ్నించు కోవడము హేతువాదము అవుతుంది. ఆ గంటసేపు క్రొత్త మనిషిగా ఎందుకు ప్రవర్తించినదని ప్రశ్నించుకొని యోచించడము, పరిశోధనా దృష్టితో చూడడము


---

హేతువాదం అవుతుంది. ఈ విధముగా ఈ సంఘటనలో ముఖ్యమైన మూడు కారణములకు (హేతువులకు) జవాబులను వెదికి, వాటికి సరియైన జవాబు దొరికినపుడు దానిని హేతుబద్దముగా అంగీకరించ వలసివస్తుంది. అలాకాక ఏ ప్రశ్నకు సరియైన జవాబు, సమాధానము లేనపుడు అది అసత్యమనీ, హేతుబద్దముకాదనీ, దానిని హేతువాదము ఒప్పుకోదని చెప్పవలసి యుంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ సంఘటన ఒక జబ్బని, రోగము ముసుగులో దానిని కప్పిపుచ్చడము నిజమైన హేతువాదముకాదు. అలా చెప్పడమును అసంబద్ధత హేతువాదము అనవచ్చును, అసంబద్ధత హేతువాదము అంటే అది సరియైన హేతువాదము కాదని అర్థము. అది ఒక రోగమని అంటే నిజమైన హేతువాది దానిమీద ఇలా ప్రశ్నించగలడు. రోగము అంటే ఆ లక్షణాలు ఎప్పుడో ఒకపుడు గంటసేపే ఎందుకు వస్తున్నాయి? ప్రపంచములో ఏ రోగమువలనైనా క్రొత్త భాష వస్తుందని నిరూపణ గలదా? ఆ రోగమునకు తమిళభాషకు సంబంధమేమి? ఆ కొద్దిసేపు పాత భాష ఏమైంది? తెలియని భాష అదియు ఒకే భాష ఎలా వచ్చినది? ఆ కొద్దిసేపు పాత మనిషి ప్రవర్తన పోయి క్రొత్త వ్యక్తి ప్రవర్తన ఎలా వచ్చినది? కనిపించేది ఆడమనిషి, చెప్పేది మగ మనిషి పేరు. అదియు మాధవన్ అను ఒకే పేరు చెప్పడమునకు కారణము ఏమిటి? ఆ సమయములో మాట్లాడు మగ మనిషి నేను పలానా వాడిని, పలానా విధముగా చనిపోయాను, నా అడ్రస్ తమిళనాడులో పలానా స్థలమని చెప్పితే, ఆ మాటను ఏమాత్రము లెక్కించక ఆ మాట సత్యమా, అసత్యమా అని ఎందుకు చూడలేదు. అప్పుడు జరిగినది రోగమనుకొనుటకు శరీరములో ఏ లోపముతో లేక ఏ క్రిములతో ఆ రోగము వస్తున్నది? ఆ రోగమునకు నిరూపణ ఏమైనా ఉన్నదా? ఇలా ఇన్ని ప్రశ్నలను హేతు బద్దముగ అడుగవలసి వస్తుంది. ఇన్ని ప్రశ్నలకు జవాబు లేకుండా రోగమను గ్రుడ్డి సాకుతో తప్పించుకొనువారు, మేము మేధావులము అని చెప్పుకోవడము తప్పుకాదా? ప్రశ్నలకు జవాబు చెప్పలేని నకిలీ మేధావులు మన జనాభాలో చాలామందియున్నారు. అటువంటి వారిని వదలి అసలైన మేధస్సు ఎలా ఉంటుందో గమనిస్తాము.


ఒక మనిషి ఆరు శాస్త్రములతో సంబంధపడియుంటాడు. కానీ చాలామంది మేధావులని పేరుగాంచిన వారు మనిషిని మొదటి నాలుగు శాస్త్రములతోనే చూస్తున్నాడు. అటువంటివారు మా దృష్ఠిలో సంపూర్ణ మేధావులు కారు. మనిషిని ఆరు శాస్త్రములకు వర్తింపజేసుకొని చూస్తేనే మనిషికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకును. అన్ని జవాబులు తెలిసినవాడే నిజమైన మేధావి. తెలియకున్నా తెలిసినట్లు చెప్పుకొనుచు తెలియని జవాబులను సైన్సు పేరుతో దాటవేయుచు తాము విజ్ఞానులమని చెప్పుకొన్నంత మాత్రమున వారు విజ్ఞానులౌతారా? ప్రపంచమునకు సంబంధించిన నాలుగు శాస్త్రములను నేర్చినంతమాత్రమున ఎవడూ మేధావి కాడు. ఆరవశాస్త్రమును తెలిసినవాడు ఎవడైన మేధావి కాగలడు. నాలుగు శాస్త్రములను తెలిసినవాడు నేను దయ్యములను నమ్మను, దయ్యములున్నాయనుట మూఢనమ్మకము అంటున్నాడు. తెలియకనే ఉన్నాయనడము ఎవనికైనా మూఢనమ్మకమే, కానీ తెలిసి ఉన్నాయంటే మూఢ నమ్మకమెలా అవుతుంది? ఇప్పుడు ఆరవశాస్త్రము ప్రకారము దయ్యాలు ఉన్నాయా అను ప్రశ్నకువస్తే నూటికి నూరుపాల్లు ఉన్నాయని చెప్పవచ్చును. గుత్తి దగ్గర జరిగిన యదార్థసంఘటనలోని అనేక ప్రశ్నలకు ఆరవ శాస్త్రమును

తెలిసినవానికే జవాబులు తెలియును.


ఆరవ శాస్త్రము ప్రకారము గమనిస్తే మనిషి శరీరము రెండు భాగములుగా ఉన్నది. దీని ప్రకారము మనిషి మరణము కూడ రెండు రకములుగా ఉన్నది. ఒక మనిషి చనిపోతే మన లెక్కలో వాడు పూర్తిగా తెలియ కుండపోయినట్లే. చనిపోయిన వాడు ఎక్కడ కనిపించడు, తిరిగి మాట్లాడడు. ఇక్కడ మరణించుట లేక చనిపోవుట అంటే శరీరము యొక్క రెండు భాగములు పూర్తిగా మరణించడమని అర్థము. ముఖ్యముగా గమనిస్తే ఇక్కడ చాలామందికి అనగా

--

సాధారణ వ్యక్తులకు గానీ, మేధావులకు గానీ శరీరము స్థూల, సూక్ష్మ అను రెండు భాగములున్నదనియు, మరణములో కాల,అకాల అని రెండు రకముల మరణములున్నవనియు తెలియదు. స్థూల, సూక్ష్మ శరీరములను గూర్చిగానీ, కాల, అకాల మరణములను గూర్చిగానీ తెలియక పోవడమే మనిషి మేధస్సుకు పెద్దలోటు. ఏ మనిషికైనా తన శరీరమును గూర్చిగానీ, తన మరణమును గూర్చిగానీ తెలియనపుడు అతను దేశములో ఎంత పెద్ద హెూదాలో ఉండినా, ఎంతో పెద్ద మేధావి అయినా ఏమి ప్రయోజనము? బయట విషయములు ఎన్ని తెలిసినా తన విషయము తనకే తెలియనపుడు అతను మేధావి అవుతాడా? మీరే చెప్పండి.


ఇంటగెలిచి రచ్చగెలిచిన వాడే శూరుడు అని పెద్దలు ఒక సామెత (సమత)ను చెప్పేవారు. దాని వివరమేమనగా! మొదట తన శరీరములోని రహస్యమును తెలుసుకొని తర్వాత బయటి ప్రపంచములోని రహస్యమును తెలిసినవాడు మేధావి అని భావము. ఇల్లు అనగా శరీరమని, రచ్చ అనగా బయటి ప్రపంచమని, గెలువడమనగా రహస్యములను తెలియడమని, శూరుడు అనగా మేధావి అని అర్థము. అలాగే ఇంకొక సామెత కూడ కలదు. అదేమనగా “మీసము త్రిప్పినవాడు వీరుడు కాడు, శూలము పట్టినవాడు శూరుడు కాడు” దీని అర్థము ఏమనగా! పుస్తకము చదివినంత మాత్రమున జ్ఞానికాడు, ప్రయోగము చేసినంతమాత్రమున విజ్ఞానికాడని భావము. దీనినిబట్టి చదువులు చదివినంతమాత్రమున జ్ఞానులూ కాలేరు, సైన్సు నేర్చినంతమాత్రమున విజ్ఞానులూ కాలేరని తెలియుచున్నది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావచ్చును. అదేమనగా! చదువు లేక విద్య అంటేనే జ్ఞానము కదా! అలాగే సైన్సు అంటేనే విజ్ఞానము కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! చదువు అంటే జ్ఞానము, సైన్సు అంటే విజ్ఞానము అనుమాట వాస్తవమే. కానీ శరీరమునకు బయట ఉన్న వాటిని జ్ఞానము, విజ్ఞానము అనుకోవడము పొరపాటు. చదువు, సైన్సు అన్నీ శరీరములోపల నుండి మొదలౌతాయి. శరీరములోపలే జ్ఞానము, విజ్ఞానము కలవు. శరీరమునుండి కాక బయటినుండి సంపాదించుకొన్న జ్ఞానము విజ్ఞానము ఎంత అయినా దానిని జనరల్ నాలెడ్జ్ (సాధారణ జ్ఞానము) అంటాము. జనరల్ నాలెడ్జిలో కేవలము నాలుగు శాస్త్రముల జ్ఞానము మాత్రముండును. శాస్త్రముల గురించి తెలియని వానిని నాలెడ్జి లేని వాని క్రిందికి లెక్కగట్టుచుందురు. దీనినిబట్టి నాలుగు శాస్త్రములను తెలియని వానిని జ్ఞానము లేనివాడనీ, నాలుగు శాస్త్రముల పరిచయమున్న వానిని సాధారణ జ్ఞానము గలవాడని తెలియుచున్నది. ఇక ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలిసిన వానిని గ్రేట్ నాలెడ్జి లేక సూపర్ నాలెడ్జి గలవాడని చెప్పవచ్చును. దానినే తెలుగులో అంతులేని జ్ఞానమనీ, అసాధారణ జ్ఞానమని, గొప్ప జ్ఞానమని చెప్పవచ్చును. మొదటి నాలుగు శాస్త్రముల జ్ఞానము సాధారణ జ్ఞానముకాగా, ఐదవశాస్త్రమైన జ్యోతిష్యము మధ్య జ్ఞానముకాగా, ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము అసాధారణ, అంతులేని, అమోఘమైన జ్ఞానమగుచున్నది. ఇక్కడ సాధారణ, అసాధారణమునకు మధ్య జ్ఞానమైన జ్యోతిష్యమును వదలివేసి సాధారణ జ్ఞానమును గురించి చెప్పుకొంటే అది అంతయు కంటికి కనిపించు విధానముగా ఉండును. సాధారణ జ్ఞానము వలన తయారు చేయబడిన ఏ పరికరముగానీ తయారు చేసినవానికే కాక ఇతరులకు కూడ ఉపయోగపడగలదు. నాలుగు శాస్త్రముల జ్ఞానము శరీరము బయటి ఐదు ఇంద్రియములకు తెలియబడునదై ఉండుట వలన ఎవరికైనా నిరూపణకు రాగలదు. ఉదాహరణకు ఒక రేడియోను తీసుకొందాము. ఇటలీ దేశములో “మార్కోని” అను వ్యక్తి 1866లో మొదట రేడియోను కనుగొనడము జరిగినది. రేడియో సాధారణ జ్ఞానము కావున అది కనిపెట్టిన వానికేకాక ప్రక్కనున్న మనుషులకు, ఇతర దేశముల వారికి, ఇతర కాలముల వారికి ఉపయోగపడుచున్నది. రేడియో నాలుగు శాస్త్రములకు లోబడి ఉన్నది కావున దానిని సాధారణ జ్ఞానము అంటున్నాము. సాధారణ జ్ఞానము అనునది సూత్రము ప్రకారము శరీరము యొక్క బయటి ఇంద్రియముల ద్వారా తెలియబడును. కావున కనిపెట్టిన


--

మార్కోనికేగాక, ఇంద్రియములున్న అందరికి తెలియుచున్నది, అనుభవానికి వస్తున్నది. “ఇంద్రియముల చేత చేయబడినది ఇంద్రియములకే తెలియును” అన్నది సూత్రము. ఆ సూత్రము ప్రకారము ఇంద్రియ జ్ఞానము సాధారణ జ్ఞానముగా లెక్కించబడుచున్నది. "కనిపించని ఇంద్రియముల చేత కనుగొనబడి కనిపించే ఇంద్రియములకు తెలియని దానిని అసాధారణ జ్ఞానము అంటాము.” ఈ సూత్రము ప్రకారము కనిపించే జ్ఞానము, కనిపించని జ్ఞానమని రెండు తెగలుగా జ్ఞానమును విభజించుచున్నాము. కనిపించే దానిని స్థూలము అంటాము. కనిపించని దానిని సూక్ష్మము అంటాము. కనిపించే జ్ఞానమునూ మరియు కనిపించని జ్ఞానమునూ తెలిసినవాడు అసలైన మేధావి అవుతాడు. కనిపించే విధానము యొక్క జ్ఞానమును మాత్రము తెలిసి, కనిపించని విధాన జ్ఞానమును తెలియని వానిని పూర్తి జ్ఞానమున్నవానిగ లెక్కించకూడదు. అటువంటివానిని సగము జ్ఞానమున్న వానిగ లెక్కించవలెను. అందువలన అటువంటి వానిని ఆఫ్ నాలెడ్జి గల వానిగ చెప్పవచ్చును. పూర్తి నాలెడ్జి సూక్ష్మమును తెలియజేయు ఆరవ శాస్త్రమును తెలిసినవానికే తెలియును.


భూమి మీద శాస్త్రములు ఎన్ని ఉన్నాయనీ, అవి ఏవియని తెలియని మనిషి సైన్సు అను పేరును అడ్డము పెట్టుకొని, తనకు సర్వము తెలుసునన్నట్లు మాట్లాడుచు, సూక్ష్మమును గురించి ఏమాత్రము జ్ఞానములేని వాడై వాస్తవానికి దయ్యములు లేవు అనుచుండును. దయ్యములున్నట్లు కొందరు అభూతకల్పన చేయుచున్నారనీ, అవన్నియు రాతియుగపునాటి మాటలనీ, నాగరికత పెరిగి సైన్సు అభివృద్ధి అయిన ఈ కాలములో దయ్యములున్నాయనుట అనాగరికపు మాటయని చెప్పుచుందురు. తాము ఎంతో మేధావులమని దయ్యములున్నవనుట మూఢనమ్మకమనుచుందురు. దయ్యములున్నాయనువారు నిరూపించగలరా? అని ప్రశ్నించుచుందురు. దానికి మా సమాధానము ఏమనగా! కంటితో చూచే దృశ్యములు ఉంటాయి. అలాగే చెవితో వినే శబ్దములుంటాయి. కంటితో చూచే దృశ్యములను దృష్టియున్నవాడు మాత్రమే చూడగలడు. చెవులతో వినే శబ్దములను వినికిడియున్నవాడు మాత్రమే వినగలడు. కళ్ళుండి చూపు లేనివాడు దృశ్యములను చూడలేడు. అలాగే చెవులుండి వినికిడి లేనివాడు శబ్దమును వినలేడు . అలాగే దయ్యములు సూక్ష్మజ్ఞానదృష్ఠియున్న వానికి మాత్రమే తెలియగలవు. కళ్ళుండి గ్రుడ్డివాడు దృశ్యమును చూడలేనట్లు, చెవులుండి చెవిటివాడు శబ్దమును వినలేనట్లు ఆరవశాస్త్రముయొక్క శాస్త్రీయత తెలియనివాడు పూర్తి మేధస్సు లేనివాడై సూక్ష్మమును గ్రహించ లేడు. నాల్గుశాస్త్రములలో తాను ఎంత ప్రవీణుడైనా సగము జ్ఞానము కలవాడే! కనుక వాడు ప్రపంచములో హేతువాది అయినా, సత్యవాది అయినా సూక్ష్మమును గ్రహించు స్థోమత వాని మెదడుకుండదు. అటువంటపుడు తనకు తెలియని వాటిని లేదనడము సహజమే, కానీ వానికి తెలియనంత మాత్రమున ఉన్నది లేకుండా పోవునా?



ఇక్కడ కొందరికి మరియొక ప్రశ్న రాగలదు. అదేమనగా! “గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములలో విజ్ఞులై శాస్త్రజ్ఞులని పేరుగాంచిన ఎంతో తెలివైన వారికి కూడా తెలియని సూక్ష్మములున్నాయనీ, వారికి తెలియనంత మాత్రమున ఉన్నవి లేకుండా పోవునా అంటున్నారు కదా! అలా దయ్యములుంటే నాలుగు శాస్త్రములలో ఆరితేరిన వారు తెలుసు కొనుటకు అవకాశమే లేదా?” అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాలుగుశాస్త్రములు తెలిసి దయ్యములు లేవు అనువారు కూడా తెలుసుకొనుటకు రెండే రెండు అవకాశములు గలవు. ఒకటి మాకు అంతా తెలుసునని గోడ కట్టుకొనియుండక, తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంది అని పరిశోధన దృష్టితో ఆరవ శాస్త్రమును తెలుసు కోవడము వలనా, రెండు కనిపించని దయ్యములు కనిపించెడి మనుషులలో ప్రవేశించి గానీ, ప్రవేశించకగానీ చేసిన పనులు ప్రత్యక్షముగా కనిపించి నపుడు, జరిగిన ఆ పనుల వెనుకయున్న సత్యమును తెలుసుకొనుట వలనా సూక్ష్మములైన దయ్యములను గురించి తెలియును.


---

మీ మాటను ఆలకించి ఆరవశాస్త్రమును తెలుసుకోగలము, ఆ శాస్త్రము ఏది అని ఎవరైనా అడిగితే మీకు దగ్గరగా సులభముగా అర్థమగుటకు మాచే రచింపబడిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”యే ఆరవ శాస్త్రమని చెప్పుచున్నాము. భగవద్గీత సంపూర్ణమైన ఆరవశాస్త్రముగా ఉన్నది. సిద్ధాంతమును ఆధారముగా చేసుకొని చెప్పబడినది “త్రైత సిద్ధాంత భగవద్గీత”. కావున పరిశోధనా దృష్ఠికలవారికీ, ప్రశ్నించు వారికీ అన్ని రకముల జవాబులతో కూడినది త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రైత సిద్ధాంత భగవద్గీతను పూర్తిగా చదివిన తర్వాత సంపూర్ణ మేధస్సు అంటే ఏమిటో అప్పుడు అర్థము కాగలదు.


రెండవ విధానము ప్రకారము దయ్యములు వాటి యదార్థసంఘట లను గూర్చి యోచించినపుడైన దయ్యములను గురించి తెలియుటకు అవకాశము గలదు. వాటిని తెలుపుటకే భూమి మీద అక్కడక్కడ జరిగిన సంఘటనలను గూర్చి మీకు ఈ గ్రంథము ద్వారా తెలుపుచున్నాము. ఎవరో చెప్పినవికాక నేను స్వయముగా చూచిన సంఘటనలను మాత్రమే ఈ పుస్తకములో వివరించగలిగాము. దీనివలన మీకు మేదస్సు పెంపొందగల దని అనుకొనుచున్నాము. ఈ గ్రంథము వలన మాకు కలిగే ప్రయోజనము ఏమిటని కూడ కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఒక మనిషి పరుగు పందెములో పాల్గొని పరుగిడుచున్నపుడుగానీ, లేక ప్రయాణము చేయుచున్నపుడుగానీ ఆ వ్యక్తిని ఎంత దూరము పరుగెత్తావు అని అడిగినా లేక ఎంత దూరము ప్రయాణించావు? అని అడిగినా బయలుదేరిన స్థలమునుండి ఎంత దూరమైనది లెక్కించుకొని చెప్పును. ఇక్కడ ముఖ్యముగా తాను ఎక్కడ బయలుదేరాడో, బయలుదేరిన వ్యక్తికి తెలిసియుండాలి. బయలుదేరిన స్థలమును మరచిపోతే తాను ఎంత దూరము ప్రయాణించినది తనకే తెలియదు. అలా మరిచిపోయిన వానిని తెలివితక్కువవాడని అంటాము. మధ్యదారిలో చాలా తెలివిగా ప్రయాణించినా, ఎత్తు పల్లములను ఎంతో తెలివితో సులభముగా దాటి పోతున్నా మొదట బయలుదేరిన స్థలమును మరిచిపోయిన వానిని మతిలేని వానిగానే లెక్కించాలి. ఒకడు బయలు దేరిన చోటును మరచి పోయినట్లు, ప్రస్తుతకాలములో మేము మేధావులమనుకొనువారు శరీరములోపల తాను ఎక్కడ నుండి బయటి ప్రపంచములో వ్యవహరిస్తున్నానని తెలియక, తన స్వస్థలమునే తాను మరిచి పోయి, బయట బాగా మేధస్సు కల్గినవారమని, హేతువాదులమనీ, జన వేదికవారమని, ప్రజావేదికవారమని, విజ్ఞానులమని చెప్పుకోవడము చూస్తే బావిలో కప్ప నాకు కనిపించేదే ప్రపంచమన్నట్లున్నది.


ప్రపంచములో కొందరు ఏ విషయమైన తర్కించడమూ, దానిని కాదనడమూ తమ పనిగా పెట్టుకొన్నారు. అటువంటి వారు కేవలము భౌతికమును మాత్రము సత్యమనీ, అభౌతికము పూర్తి అసత్యమనీ వాదించు చుందురు. భౌతికము స్థూలముతో కూడుకొన్నది, అభౌతికము సూక్ష్మముగా ఉన్నది. అటువంటి భౌతికవాదులు, అభౌతికమైన సూక్ష్మమును ఒప్పుకోరు. అభౌతికము అసత్యమనుటకు మొదటి నాలుగు శాస్త్రములను ఆధారము చేసుకొని మాట్లాడుచుందురు. సూక్ష్మమైన అభౌతికము ఆ నాలుగు శాస్త్రములకు సంబంధించినది కాదని వారికి తెలియదు. అటువంటి వారికి భూమిమీద షట్శాస్త్రములున్న విషయము కూడ తెలియదు. నిర్ధిష్టముగా ఇన్ని శాస్త్రములున్నాయని చెప్పలేనివారు, తమకు తెలిసిన విషయములన్నిటిని శాస్త్రములనుచుందురు. భౌతికవాదులైన వారు భూమి మీదున్న కొందరు మోసగాళ్ళునూ టక్కుటమారా విద్యలను మహత్యములుగా చెప్పుకొనువారిని చూపిస్తూ ఇదంతా మోసమని చెప్పుచుందురు. టక్కు టమారా విద్యలు ఇతరులను మభ్యపెట్టునవే కానీ సత్యములుకావని మేము కూడ చెప్పు చున్నాము. టక్కుటమారా విద్యలను చూచి మంత్రములను, మంత్రశక్తిని లేదనుట సరియైన తెలివికాదు. మంత్రముల పేరు చెప్పి ఎవరో మోసము చేసినంతమాత్రమున సూక్ష్మమైన మంత్రశక్తిని లేదనడము పొరపాటు. ఈ మా మాటలు


---

కొందరికి అనాకగరికముగా కనిపించవచ్చును, మోస పూరితముగా కనిపించవచ్చును, అసత్యవాదనగా కూడా కనిపించవచ్చును. ఇక్కడ గమనించవలసినది ఏమనగా! మా ఆదాయము మంత్రాల మీద ఆధారపడివుంటేనో, దయ్యాల మీద ఆధారపడివుంటేనో మీరు అలా అనుటకు అవకాశము గలదు. కానీ నేను ఆ పనులు ఎప్పుడూ చేయలేదు. వాటి మీద ఆధారపడి బ్రతకలేదు. వాటిని గురించి సమర్థించడములో నాకు ఎటువంటి లాభమూ లేదు. ఇది కేవలము మేధస్సుకు సంబంధించినదీ, శాస్త్రబద్ధమైనదీ కావున చెప్పవలసి వచ్చినది. అందువలన హేతువాదులూ, ప్రజా విజ్ఞాన వేదికలు పెట్టుకొన్నవారూ, మేము చెప్పు విషయములను కూలంకషముగా చూడవలెనని కోరుచున్నాము.


మనిషి అనగా కనిపించెడు శరీర భాగములతో కనిపించని జీవుడూ, అలాగే కనిపించని జీవునికి సంబంధించిన కొన్ని భాగములూ అని అర్థము. శవము అనగా కనిపించెడి శరీరము మాత్రమేనని అందులో కనిపించని జీవుడుగానీ, కనిపించని జీవునితో సంబంధపడియున్న కొన్ని భాగములు గానీ లేవని అర్థము. దయ్యము అనగా కనిపించని జీవుడు, వానికి అనుబంధముగా ఉన్నవి మాత్రమేనని, కనిపించెడి శరీరముకాదని అర్థము. ఇంకా వివరముగా చెప్పుకొంటే ఒక మనిషి అనగా కనిపించే పది (10) భాగముల శరీరమూ మరియు కనిపించని పదిహేను (15) భాగముల జీవుడు వాని అనుబంధమని అర్థము. శవము అంటే కేవలము కనిపించే పది భాగములేనని అర్థము. దయ్యము అంటే కేవలము కనిపించని జీవుడూ వాని అనుబంధము మొత్తము పదిహేను భాగములని అర్థము. దీనినిబట్టి ఒక మనిషి అనగా 25 భాగములతో కూడుకొన్న కదలెడు శరీరమనీ, శవము అనగా కేవలము 10 భాగములతోనున్న కదలని శరీరమనీ, దయ్యము అనగా కేవలము 15 భాగములతో కూడుకొన్న కనిపించని సూక్ష్మ శరీరమని అర్థము. ఈ వివరము తెలియకపోతే దయ్యములను గూర్చి ఎవరూ తెలియలేరు.


ఈ వివరము తెలియని వారికి దయ్యములను గురించి ఏమాత్రము తెలియదు. అందువలన వారు దయ్యములు లేవు అనుచుందురు. దయ్యములు లేవు అనువాడు తాను జీవుడననిగానీ, కనిపించకుండా వుండి తనకు సహాయపడు 14 భాగములు తన శరీరములో ఉన్నవనిగానీ తెలియదు. బయట ఎంత విజ్ఞానమును పెంచుకొన్న పెద్ద సైంటిస్టయినా తన జ్ఞానమే తనకు తెలియకపోవడము వలన అతనిని అజ్ఞాని అని అనవచ్చును. దీనిప్రకారము ఇప్పటి కాలములో బయటి మేధావులను, శాస్త్రవేత్తలను తమ అడ్రస్ తమకే తెలియనివారిగా, తమ స్వంత స్థలమేదో తమకే తెలియని వారిగా లెక్కించవచ్చును. తమ శరీరములో తమ చిరునామా ఏమిటో, తమ ఆకారమేమిటో, తన సహచరులెవరో తెలియని వీరా మేధావులు? దానికి జవాబుగా కాదనియే చెప్పవచ్చును. ఇటువంటి వారే దయ్యములున్నాయని నిరూపిస్తారా? అని మమ్ములను అడుగవచ్చును. మీకు కనిపిస్తే నిరూపణకు రాగలవు, కానీ దయ్యములు కనిపించనివి కదా! కావున వారికి నిరూపణకు రావు. కళ్ళున్నవాడే చూడగలడు, కళ్ళు లేనివాడు చూడలేడు అను సూత్రము ప్రకారము జ్ఞాననేత్రము లేనివారికి దయ్యములు తెలియవు. అందువలన వాటిని మీకు ప్రత్యక్షముగా చూపకున్ననూ వాటి పనులను వివరించుచూ ఎవరైనా తెలుసుకొనుటకు అవకాశము కల్గునట్లు ఈ గ్రంథమును వ్రాయవలసి వచ్చినది.


మొదట నేను చెప్పునదేమనగా! ఇప్పటి వరకు ఇక్కడ వ్రాసిన విధానమును బట్టి నన్ను ఒక ఆస్తికునిగా చాలామంది హేతువాదులూ, నాస్తికవాదులూ లెక్కించియుంటారు. అట్లే మా బోధలు విన్నవారూ, మా విధానమును చూచిన దేవతా భక్తులూ, ఆస్తికులూ, మతప్రచారకులు మొదలగువారు నన్ను నాస్తికుడు అన్నారు. సత్యవాదము అర్థముకాక కొందరు నీది ఏ మతము అని అడిగినవారు కూడ కలరు. భగవద్గీతను వివరించి చెప్పుతుంటే

ఇలా మా


---

అర్థముకాకనో, అసూయతోనో హిందూపరిషత్ అని పేరు పెట్టుకొన్నవారే మీరు పరమతమును బోధిస్తున్నారు అన్నారు. ఇలా ఎందరో ఎన్నో రకములుగా అనుకొనినా నా లెక్కలో నేను ఎవరో కొంత మీకు చెప్పవలసిన అవసరమున్నది. ఇందూమతము సనాతనమైనది. ఇది అన్ని మతములలాంటి మతము కాదు. ఇది ఎప్పుడు పుట్టినది కూడ ఎవరికీ తెలియదు. అయినా ఈ మతము క్షీణించకుండుటకు ఇందూమతములో కలియుగములోనే కేరళ రాష్ట్రములో ఆది శంకారచార్యుడు అను వ్యక్తి పుట్టాడు. ఇంటర్నెట్ సమాచారము ప్రకారము శంకారాచార్యులు క్రీస్తుశకము 788లో పుట్టి 820లో చనిపోయినట్లు గలదు. ఆయన బ్రతికినది కేవలము 32 సంవత్సరములు మాత్రమే. ఆయన 27వ సంవత్సరమునుండి తాను కనుగొన్న అద్వైత సిద్ధాంతమును బోధించాడు. ఆయన అద్వైత సిద్ధాంతము బోధించినది కేవలము 5 సంవత్సరములు మాత్రమే. శంకారాచార్యుడు చనిపోయిన తర్వాత 197 సంవత్సరములకు అనగా క్రీశ॥1017 సంవత్సరములో రామానుజాచార్యులు పుట్టాడు. ఆయన 120 సంవత్సరములు బ్రతికి క్రీశ॥ 1137వ సంవత్సరము చనిపోయాడు. ఆయన తాను కనుగొన్న విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. ఆయన తర్వాత 101 సంవత్సరములకు 1238వ సంవత్సరములో మధ్వాచార్యులు పుట్టారు. ఆయన 1317 వరకు 79 సంవత్సరములు బ్రతికి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. మధ్వాచార్యుల అనంతరము 633 సంవత్సరములకు అనగా 1951 సంవత్సరములో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టారు. 27 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత అనగా 1977 నుండి జ్ఞాన ప్రచారము చేస్తూ, తన త్రైతసిద్ధాంతమును ప్రచారము చేయుచున్నారు. త్రైత సిద్ధాంత ఆదికర్తయని, ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అని పేరుగాంచిన వ్యక్తియే ఇపుడు ఈ గ్రంథము వ్రాయుచున్న మేము. నేను స్వచ్ఛమైన ఇందూ ధర్మ సిద్ధాంతకర్తను కాబట్టి ఇక్కడ వ్రాయబడు విషయములన్నియు యదార్థములు మరియు శాస్త్రబద్దములని తెలుపుచున్నాము. ఎక్కడైన దయ్యములను పేరుతో మోసగాళ్ళు మోసము చేసినంతమాత్రమున దయ్యములు లేవనడము పొరపాటు. కావున దయ్యములు యదార్థములే! దయ్యముల సంఘటనలు యదార్థములే!! పరిశోధించి చూచితే శాస్త్రబద్దములే!!!



ఇపుడు మొదలు పెట్టి చెప్పునదేమనగా! నాకు ఏడు, ఎనిమిది సంవత్సరముల వయస్సులోనే ప్రతి విషయములోనూ పరిశోధనా దృష్టి ఉండెడిది. దానినే ఒక విధముగా హేతుశోధనా దృష్టి అంటాము. అందువలన ఏదైనా ప్రత్యేకమైన సంఘటన ఉంటే, దానిని ప్రత్యేకముగా ప్రశ్నించుకొని యోచించేవాడిని. కొందరు అనుభవజ్ఞులు చెప్పారని వారు చెప్పిన మాటలను నమ్మక, నాకు ఒక అవగాహన వచ్చేంతవరకూ నా ప్రశ్నలకు జవాబు దొరికేంత వరకూ యోచించడము పరిపాటి. అటువంటి సమయములో నాకు ఎనిమిది సంవత్సరముల వయస్సు జరుగుచున్నపుడు అనంతపురము జిల్లాయందు వజ్రములు దొరుకు వజ్రకరూరులో నివాసము ఉండడము జరిగినది. అక్కడికి దగ్గరగానున్న తట్రకల్లు అను గ్రామమునకు గ్రామదేవత పెద్దమ్మ జాతర జరుగుచుండగా పోవడము జరిగినది. వయస్సులో జాతరంటే ఏమిటో, గ్రామదేవత అంటే ఏమిటో కూడ నాకు తెలియదు. పెద్దవారు పోతూవుంటే వారివెంట పోయాము. అప్పటికే అక్కడ కొంత భాగము జాతర జరిగిపోయినది. ఆ గ్రామములోనికి పోతూనే గ్రామమధ్యములో ఒక దృశ్యము కనిపించినది. అక్కడ పది అడుగుల దూరములో ఒక దున్నపోతు పిల్ల తలను నరికియుండడము చూచాను. మొండెము మాత్రమున్నది. తల దూరముగానున్న గ్రామదేవత గుడి దగ్గర పెట్టారు. అలా నాలుగు వయస్సుకు రాని చిన్నపిల్ల దూడలనే నరికి యుండడము చూచాను. అప్పటికి అదొక వింత సంఘటనగా నాకు తోచినది. మా పెద్దలనడిగితే "పెద్దమ్మ దేవతకు దున్నపోతులను బలి ఇచ్చారు” అన్నారు. అపుడు అనేక ప్రశ్నలు నాలో వచ్చాయి. బలి అంటే ఏమిటి? ఎందుకు బలి ఇవ్వాలి? పెద్దమ్మ ఎవరు? ఆమెకు ఎందుకు ఈ దున్నపోతు దూడల రక్తపాతము? మనుషులచేత దూడలను కఠినముగా


---

చంపించిన పెద్దమ్మ దేవతవుతుందా? ఆ పెద్దమ్మతో మనకేమి పని? మనమెందుకు జాతర చేయాలి? గ్రామ మధ్యలోనే ఎందుకు జాతర చేశారు. ఇలా ఎన్నో ప్రశ్నలు రాగా వాటికి అప్పుడు జవాబు చెప్పువారు లేరు. ఎవరినైనా అడిగితే నీకెందుకురా ఇవన్నీ అని మందలించెడివారు. ఆ దినము సాయంత్రము నాలుగు గంటల సమయములో కొందరు గుంపుగా మేళ తాళాలతో, తప్పెట్లు మొదలగు వాయిద్యములతో ఊరేగింపుగా ఊరుకు ఆనుకొని దిగేదానికి పది అడుగుల వెడల్పుతో మెట్లున్న కోనేరులాంటి పెద్దబావి దగ్గరకు పోవడము జరిగినది. ఆ బావిలోనికి ముఖ్యమైన వారు దాదాపు 30 మందిదాకా దిగారు. మిగతావారందరూ పైనుండి చూస్తున్నారు. విశాలమైన బావి కనుక పైనుండి నాకూ బాగా కనిపిస్తున్నది. బావిలోనికి దిగిన తర్వాత క్రొత్త మట్టికడవను నీటితో నింపి దానిని కలశమువలె అలంకరించి గుంపులోని ఒక వ్యక్తికి ప్రత్యేకముగా పూలమాల వేసి ఆ కలశమును అతని తలమీదికి ఎత్తారు. ఆ కలశమును మహాసందడిగా కొందరు చిందులు వేస్తు తప్పెట్లు వాయిస్తూ తీసుకువస్తున్నారు. కలశమును ఎత్తుకొన్న మనిషి పెద్ద మీసాలు కలిగి బలమైన శరీరముతోనున్న దాదాపు 40 సంవత్సరముల వయస్సున్నవాడు. అలా చాలా గుంపుగా సందడిగా కొంత దూరము వచ్చిన తర్వాత కలశమును ఎత్తుకొన్న మనిషి నిలబడి పోయాడు. అతనితో పాటు అందరూ ముందుకు పోకుండ నిలబడి అందరూ అతను ఎందుకు నిలబడినాడని అతని వైపు చూడను మొదలుపెట్టారు.


అలా చూస్తుండగనే ఆ మనిషి కళ్ళవెంట కన్నీరు వస్తుండడము కనిపిస్తున్నది. అతను ఏడవను మొదలుపెట్టాడని అర్థమైనది. అపుడు అక్కడున్న ఊరి పెద్దలు కొందరు "ఏమి తల్లీ ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధకల్గినది” అని ప్రశ్నించారు. అపుడు అతను ఏడుస్తూనే "మీకు నేను ఐదు సంవత్సరములకు మతికి వచ్చానురా, మీరు నన్ను మరిచి పోయినారు” అని అనగా అక్కడున్నవారు "లేదు తల్లీ నిన్ను మరిచిపోలేదు. పంటలు సరిగా పండక పోవడము వలన ప్రతి సంవత్సరము నీకు దేవర (జాతర) చేయలేకపోయాము. ఇప్పటినుండి మాకు ఎన్ని ఇబ్బందులున్నా నీకు తప్పక దేవర చేస్తాము” అని వినయముగా చెప్పారు. అంతలో కలశమును ఎత్తుకొన్న అతను “మీకు ఒక సంవత్సరమేరా పంటలు సరిగా పండనిది, మిగత నాలుగు సంవత్సరములు పండినాయి కదరా? సరే ఇప్పటికైన నేను మీకు మతికి వచ్చాను. ఇప్పడైనా నా పండుగను సరిగా చేశారా? దేవర పోతులు చిన్న దూడలు దొరికాయా? పెద్దది ఒకటైనా ఉందా” అన్నాడు. అపుడు ఆ గ్రామ పెద్దలు “నీకు విడిచిన పెద్దపోతు కనపడకుండ ఎక్కడో పోయింది. అందువలన చిన్న పోతులను ఇచ్చాము తల్లీ. మా తప్పులు ఏమైన ఉంటే క్షమించు అమ్మా. నీవు బాధపడితే ఊరికి మంచిది కాదమ్మా, రేపు సంవత్సరము పెద్దపోతును బలిచ్చి పండుగ (దేవర) బాగా చేస్తాము” అని సర్దిచెప్పారు. అపుడు ఆ వ్యక్తి “సరే రేపు సంవత్సరమైనా బాగా చెయ్యండి లేకపోతే నేను ఊరుకోను” అని చెప్పగా అందరూ అలాగే తల్లీ మమ్ముదయతో చూడమ్మా అని నమస్కరించారు. అలా అనిన తర్వాత అతని కంటిలో నీరు రావడము, బాధగా ఏడుస్తూ మాట్లాడడము నిలిచి పోయినది. ముందు ఎలా ఉన్నాడో అలాగే ఠీవిగా కనిపిస్తూ అక్కడనుండి నడువను మొదలుపెట్టాడు.


ఈ సంఘటనంతటిని జాగ్రత్తగా గమినించిన నాకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి. పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొన్న మగ మనిషి ఆడమనిషిలాగ మూతి సొట్టబెట్టుకొని ఏడ్చినట్లు ఏడ్చడమేమిటి? మగ మనిషిని అందరు అమ్మా, తల్లీ అని ఎందుకంటున్నారు? చిన్న పిల్లలు అలిగినట్లు అతను అలిగి నాకు దేవర ఐదేండ్లనుండి చేయలేదు, నన్ను మరిచి పోయారనడము ఏమిటి? మరీ విచిత్రముగా నాకు పెద్ద దున్నపోతును బలి ఇవ్వలేదు, అన్నీ చిన్నదూడలనే ఇచ్చారు అవి నాకు చాలవు అనడమేమిటి? కొంతసేపు తర్వాత అతనిని అందరు మగ మనిషిగానే పిలుస్తూ, అతనితో సమానముగా వ్యవరించుచున్నారు. కలశము ఎత్తుకొని మాట్లాడినపుడు మాత్రము ఆడమనిషితో


---

మాట్లాడినట్లు వినయముగా, భక్తిగా మాట్లాడడము ఎందుకు? ఇలా జవాబులేని ఎన్నో ప్రశ్నలు రావడము జరిగినది. ఆ దినము మా ఇంటిలోని పెద్దలనడిగితే పెద్దమ్మ తల్లి కలశము ఎత్తుకొన్న మనిషిలోనికి వచ్చి ఆ కొద్దిసేపు మాట్లాడింది అన్నారు. అంత తప్ప వారు ఏమి చెప్పలేదు. పెద్దమ్మ ఎవరు? ఆమె మగ మనిషిలోనికి రావడమేమిటి? గుడిలోని దేవత పెద్దమ్మ అయితే అక్కడనుండే మాట్లాడ వచ్చుకదా! మనిషిలోనికి వచ్చి మాట్లాడడము జరుగుతుందా? కనిపించని దేవత కనిపించే మనిషిలోనికి వస్తుందా? దేవతలు గొప్పవారైనపుడు వారికంటే తక్కువవారైన మనుషులలోనికి వస్తారా? వచ్చిన పెద్దమ్మ చిన్న దూడలు నాకు చాలవు అనడమేమిటి? ఆమె వాటిని తింటుందా? అని అడిగితే ఎవరూ వాటికి సరియైన సమాధానము చెప్పలేదు.


ఇంతవరకు చెప్పుకొన్న విషయము ఒక గ్రామదేవతది. ఇపుడు చెప్పుకోబోవు విషయము ఒక ప్రాంతపు దేవునిది. అనంతపురము జిల్లా, గుంతకల్లు పట్టణమునకు నాలుగు కిలోమీటర్ల సమీపములో కసాపురము అను గ్రామము కలదు. ఆ గ్రామములో ఆంజనేయస్వామి దేవాలయము కలదు. నెట్టికంటి ఆంజనేయస్వామిగా పేరుగాంచిన ఆ దేవాలయము వద్దకు ఆ చుట్టుప్రక్కల ప్రాంతముల వారేకాకుండ, దూరప్రాంతముల వారు కూడ భక్తిగా రావడము జరుగుతున్నది. దేశములో ఎన్నో జాగాలలో ఎన్నో ఆంజనేయ దేవస్థానములు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రము పేరు గాంచినవి గలవు. అటువంటి వాటిలో కడప జిల్లాలో గండి ఆంజనేయ స్వామి పేరుగాంచియుండగా, అనంతపురము జిల్లాలో కసాపురము ఆంజనేయస్వామి పేరుగాంచియున్నారు. ఇంతవరకు గండి ఆంజనేయ స్వామిని నేను చూడలేదు. అటువంటి పేరుగాంచిన గుడికే పోలేదా అని మీరు అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! చిన్న వయస్సునుండి నాలో హేతువాద భావములు ఎక్కువగా ఉండెడివి. అందరిలాగ భక్తి భావము లేకున్నను, చిన్న వయస్సులో పెద్దలవెంట దేవాలయములకు పోవడము జరిగెడిది. అక్కడ జరిగే పనులన్నీ వింతగా, సమాధానము లేని ప్రశ్నలుగా కనిపించేవి. అందువలన పదహారు సంవత్సరముల వయస్సు నుండి దేవాలయము లకు పోవడము మానివేశాము. వాటి మీద ఇష్టము లేకున్ననూ, ఎవరైనా తెలిసినవారు మేము పోతున్నాము, మీరు మావెంట రాండి అని పిలిస్తే భక్తిలేని నా భావములను బయటికి చెప్పకుండ నేను కూడ భక్తివున్న వాని మాదిరే వారివెంట పోయేవాడిని. అక్కడ ఏమి జరుగుచున్నదో చూచేవాడిని. అదే విధముగా నాకు తెలిసిన వారు కొందరు గుంపుగా కసాపురము ఆంజనేయస్వామి దగ్గరకు పోవుచున్నాము, మీరు కూడా మా వెంటరండి అని పిలువడము జరిగినది. అలాగే వారివెంట మేము పోవడమూ జరిగినది.


దయ్యాల గురించి చెప్పుతానని దేవతల గురించి చెపుతున్నారేమిటి అనుకోవద్దండి. దేవతల దగ్గర మొదలు పెడితేగానీ దయ్యాలవద్దకు రాలేము. అందువలన దేవతల వద్దనుండి మొదలుపెట్టి చెప్పడము జరుగుచున్నది. మనిషి భావములో గుడిలోని దేవుడు గొప్పయనీ, స్మశానములోని దయ్యము తక్కువయనీ చెప్పుకోవడము జరుగుచున్నది. కానీ వాస్తవానికి ఆ తేడా ఏమిటో తెలుసుకోవడానికి దేవున్ని, దయ్యాన్ని రెండిటిని గురించి చెప్పవలసి వచ్చినది. కసాపురము ఆంజనేయస్వామి గుడిలోని దేవుడు కాగా! ఇక్కడి విశేషమేమంటే ఆ దేవుని ముందరే దయ్యాలు కూడ గలవు. మిగత గుళ్ళలో దేవతలు మాత్రమే ప్రతిమ రూపములో కనిపిస్తుంటారు. అక్కడ దయ్యాలు ఉండవు. కసాపురము గుడిలో ఆంజనేయస్వామిని చూడవచ్చును. వివరముగా చెప్పితే ఆంజనేయస్వామి గుడివద్ద మనుషుల శరీరముల మీద దయ్యములు పూని (ఆవహించి) మాట్లాడడము జరుగుచున్నది. ఈ విషయము ఇతరుల ద్వారా విన్న నేను అది ఎంత వాస్తవమో చూడాలని అవకాశము వచ్చింది కావున అక్కడికి పోవడము జరిగినది.


---

అక్కడ ఇంకొక వింత గలదు. అదేమనగా! కొందరు భక్తులు ఆంజనేయస్వామికి పాదరక్షలను (చెప్పులను) కానుకగా తెచ్చి ఇవ్వడము గలదు. ఆ చెప్పులు బజారులో దొరికే చెప్పులలాగ కాకుండ, మామూలు చెప్పుల కొలతకంటే రెండు లేక మూడు రెట్లు పెద్దవిగా ఉన్నవి. అంత పెద్ద చెప్పులను అదేపనిగా ప్రత్యేకముగా తయారు చేయించి తెచ్చి పెట్టడము జరుగుచున్నది. ఆ చెప్పులను ఎందుకిస్తున్నారని అడుగగా! "ఆంజనేయ స్వామి రాత్రిపూట చెప్పులు ధరించి బయట తిరిగి వస్తాడు” అని కొందరు చెప్పారు. అంతేకాకుండ “అలా మనమిచ్చిన చెప్పులు ధరించి తిరిగి రావడము వలన ఆ చెప్పులు పాతబడి పోవడము, అరిగిపోవడము, తెగి పోవడము జరుగుచున్నది” అని కూడా చెప్పారు. వారు చెప్పినట్లు గుడి ముందర కొంతదూరములో అటువంటి చెప్పులు గలవు. వాటిలో కొన్ని పాతవి, కొన్ని క్రొత్తవి గలవు. కొందరు చెప్పినది విన్నాము, విన్నంత మాత్రమున అవి సత్యము కావచ్చు, అసత్యము కావచ్చు. అందువలన చెప్పుల విషయము సత్యమా, అసత్యమా అని హేతువాద దృష్టితో చూడడము జరిగినది.


"సత్యముగానీ, అసత్యముగానీ మొదట నమ్మకముతోనే మొదలు అవుతుంది” అన్నది సూత్రము. తర్వాత ఆ నమ్మకము సత్యమూ కావచ్చు లేక అసత్యమూ కావచ్చు. విచక్షణా జ్ఞానముతో కూడుకొన్న నమ్మకము సత్యమవుతుంది. కొద్దిమాత్రము కూడా జ్ఞానము లేకుండా ఉన్న నమ్మకము మూఢనమ్మకమవుతుంది. విచక్షణ ఉన్నపుడు ఏ విషయముగానీ సులభముగా గ్రుడ్డిగా నమ్మము. ఆంజనేయస్వామి చెప్పుల విషయమును విచక్షణా దృష్ఠితో చూడడము వలన అది మూఢనమ్మకమని తెలిసిపోయినది. మూఢనమ్మకము ఆ విషయము అసత్యమనీ, ఆంజనేయస్వామి పాదరక్షలు (చెప్పులు) ధరించి తిరగడము లేదని, అవి కొద్దిగా అరిగినట్లు, కొంత తెగిపోయినట్లు కనిపించినా అట్లు జరుగుటకు కారణము వేరుగా ఉన్నదనీ, అక్కడికి పోయిన భక్తులందరూ వాటిని తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టుకోవడము వలన అవి పాతబడి పోయాయని తెలియుచున్నది. నిత్యము వందలాది మంది భక్తులు స్వామి చెప్పులను తీసి పెట్టడము వలన అడుగున కొంత రాపిడి ఏర్పడినది తప్ప, వాటిని ధరించి తిరగడము వలన కాదని తెలియుచున్నది. అట్లే నిత్యము లాగడము వలన మరియు ఇద్దరు వ్యక్తులు ఒకే చెప్పును పట్టుకొని నేను ముందు నేను ముందు అని గుంజి లాగడము వలన చిన్న చిన్న పట్టీలు తెగడము జరిగినది. ఆ విషయమును ఆలోచించకుండ గ్రుడ్డిగ నమ్మిన వారికి ఆంజనేయస్వామి చెప్పులు ధరించి రాత్రిపూట తిరిగివచ్చినట్లే, విచక్షణతో ఆలోచించు వారికి ఆంజనేయ స్వామి చెప్పులు ధరించలేదని తెలియుచున్నది. ఆంజనేయస్వామి చెప్పులు ధరించడము అవాస్తవము అని మేము చెప్పడమును చూచి కొందరు ఆస్తికులు నన్ను నాస్తికునిగా లెక్కించవచ్చును. నిజము చెప్పాలంటే నేను నాస్తికున్ని కాదు. ఎందుకనగా! ఆంజనేయస్వామిని లేడు అని నేను అనలేదుకదా! కసాపురములోని గుడి బొమ్మలో ఆంజనేయస్వామి ఉన్నాడనియే చెప్పుచున్నాము. ఈ మా మాటనుబట్టి కొందరు నాస్తికులు నన్ను మూఢనమ్మకము గలవాడని అనవచ్చును. వారు అలా అనినా వాస్తవానికి నేను గ్రుడ్డిగా నమ్మేవాడిని కాను. ఎందుకనగా ఎంతో విచక్షణతో ఎన్నో ప్రశ్నలకు జవాబు కలిగియున్నాను. ఒక విషయమును విచక్షణా రహితముగా విశ్వసించువాడు మూఢ విశ్వాసి (మూఢనమ్మకము గలవాడు) ఒక విషయమును విచక్షణా దృష్ఠితో చూచి విశ్వసించువాడు సత్యవాది లేక హేతువాది అవును. ఒక విషయమును విమర్శనా దృష్ఠితో విశ్వసించని వాడు నాస్తికవాది లేక అసత్యవాది అని చెప్పబడును. ఇక్కడ మూఢ నమ్మకస్తునికి, నాస్తికునికి ఏమీ పెద్ద తేడా లేదు. మూఢనమ్మకస్తుడు విచక్షణ లేని విశ్వాసముతో కూడుకొన్నాడు. నాస్తికుడు కూడా విచక్షణలేని విమర్శతో కూడుకొన్నాడు. ఈ రెండు కోవలకు చెందని వాడిని నేను. కావున ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు మధ్యలో ఉంటాము. మేము చెప్పు విషయము లను చూచి కొందరు తొందరపడి మమ్ములను నాస్తికులని అనుకోవచ్చును. అట్లే


---

కొందరు సాధారణ ఆస్తికుల క్రిందికి కూడ లెక్కకట్టవచ్చును. ఎవరేమనుకొన్నా మేము సత్యమును చెప్పుచున్నాము, కావున మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండ జాగ్రత్తగా చదివి తెలుసుకోవలెనని కోరుచున్నాము.


చిన్న వయస్సులో పెద్దమ్మ దేవతను ఒక మనిషి మీద చూచాను. యుక్తవయస్సులో ఆంజనేయస్వామి ముందర మనుషుల మీద దయ్యాలను చూచాను. అలాగే ఆంజనేయ ప్రతిమలో నిక్షిప్తమైయున్న ఆంజనేయుడను దేవున్ని చూచాను. దేవతను, దేవున్ని, దయ్యములను చూచిన మేము వాటిలోని సత్యాసత్యములను తెలుపుటకు ప్రయత్నిస్తున్నాము. గ్రుడ్డిగ విశ్వసించక, గ్రుడ్డిగా విమర్శించక సహేతుకముగా తెలుపుటయే మా ఉద్దేశ్యము. విచక్షణతో కూడుకొన్న మా దృష్ఠి ప్రకారము భూమి మీద గల పెద్దమ్మ అను దేవతగానీ, ఆంజనేయస్వామి అను దేవుడుగానీ, సాధారణ దయ్యముగానీ అందరూ ఒక కోవకు చెందిన వారే. ఇప్పుడు కొంత అవగాహన కొరకు దయ్యమునుండి మొదలుపెట్టి చెప్పుకొందాము.


ప్రపంచములో ఒక జీవుడు పుట్టుచున్నాడు. కొంతకాలము బ్రతికిన తర్వాత చనిపోవుచున్నాడు. పుట్టుట, చచ్చుట జగమెరిగిన సత్యము. మనిషిగా పుట్టిన వారిలో ఎంత పెద్ద మేధావియైనా, ఎంత ధనికుడైనా, ఎంత బలవంతుడైనా ఎవనికీ తన పుట్టుకను గురించి తెలియదు, అలాగే తన చావును గురించి కూడా తెలియదు. వివరముగా చెప్పుకొంటే పుట్టుకలో జీవుడు శరీరములోనికి ఎలా ప్రవేశిస్తున్నాడని తెలియదు, అలాగే మరణములో శరీరమునుండి జీవుడు ఎలా పోవుచున్నాడని కూడా తెలియదు. శరీరములోనికి జీవుడు రావడము పోవడము ఎవరికీ తెలియని పెద్ద రహస్యము. ఆ రహస్యము తెలియాలంటే మా రచనలలోని “జనన మరణ సిద్ధాంతము" అను గ్రంథమును చదవాలి. ఆ గ్రంథములో జీవుడు జన్మించడమును మరియు మరణించడమును గురించి తెలియబరిచాము. అందులో జీవితములో చివరిదైన మరణమును గురించి మాత్రము తెలిపాము. కానీ జీవితములో మధ్యలో వచ్చు మరణమును గురించి తెలుపలేదు. ఈ మాట విన్న కొందరికి జీవితము చివరిలో మరణముండ వచ్చును. కానీ జీవితములో మరణమేమిటని ఆశ్చర్యము కలుగవచ్చును. జీవితము చివరిలో వచ్చునది మరణము అయితే జీవితములో వచ్చునది అకాల మరణమని చెప్పుచున్నాము. దీనినిబట్టి జన్మ ఒకటే అయినా మరణములు మాత్రము రెండు రకములున్నవని చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్య గమనిక ఏమంటే మరణము ప్రతి జీవరాసికి గలదు. కానీ అకాల మరణము కొన్ని జీవరాసులకు మాత్రమే ఉండును. మనిషి శరీరములో జరుగు అకాలమరణమును గురించి తెలియాలంటే మొదట మనిషి శరీరమును గురించి తెలియాలి.


ఒక వస్త్రము ఎలా తయారైనదీ సవివరముగా తెలియాలంటే పత్తి, దూది, నూలు, మగ్గమును గురించి తెలియాలి. అదే విధముగా ఒక మనిషి శరీరమును గురించి సవివరముగా తెలియాలంటే ప్రకృతి, ప్రకృతి భాగములు, కనిపించే బయటి శరీరము, కనిపించని లోపలి శరీరమును గురించి తెలియవలెను. మనిషి యొక్క కనిపించు శరీరమును స్థూల శరీరమనీ, కనిపించని శరీరమును సూక్ష్మశరీరమని పిలుస్తున్నాము. మొదట ప్రకృతి యొక్క వివరమును గురించి తెలుసుకొంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు భూమి అను ఐదు భాగములుగా కలదు. ప్రకృతిలోని ఐదు భాగములు ఒక్కొక్కటి ఐదు భాగములుగా చీలిపోయి మొత్తము 25 భాగములుగా ఏర్పడినవి. ఆ 25 భాగములు ఒకదానితో ఒకటి కలిసిపోయి 25 శరీర భాగములు ఏర్పడినవి. అందులో 10 భాగములు కనిపించు శరీరముగా (స్థూలశరీముగా) 15 భాగములు కనిపించని శరీర భాగములుగా (సూక్ష్మ శరీరముగా) తయారైనవి. ప్రకృతి జఢమైనది, అనగా కదలిక



---

లేనిది, చైతన్యములేనిది, శక్తిలేనిది. ప్రకృతిలోని భాగములచే తయారైన శరీరము కూడ జడమైనదే. ఆత్మశక్తి (ఆత్మ చైతన్యము) శరీరముతో కూడినపుడే శరీరములో కదలికలేర్పడును. అందువలన ఆత్మలేని శరీరము కదలిక లేనిదగును. మనిషి చనిపోయినపుడు ఆత్మ శరీరమును వదలి పోవుచున్నది. కనుక మరణించిన మనిషి శరీరము కదలిక లేనిదగును. తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన శిశుశరీరములోనికి కొన్ని సందర్భములలో ఆత్మ కొంత ఆలస్యముగా చేరుచున్నది. అటువంటపుడు కూడా ఆ శిశువు కదలక మెదలక చైతన్యము లేనిదిగా ఉండును. చాలా చోట్ల 5 నిమిషములు,10 నిమిషములు, అరగంట, గంట ఇంకా ఎక్కువ కాలము పుట్టిన శిశువులోనికి ఆత్మ చేరని సందర్భములు గలవు. అటువంటపుడు శిశువు గర్భములోనే చనిపోయిందని చాలామంది పొర బడుచున్నారు. పుట్టిన శిశువులోనికి ఆత్మ చేరినపుడు శిశువులో చైతన్యము కల్గి ఏడ్వను మొదలు పెట్టును. అప్పుడే శరీరము సజీవమగును. అంతవరకు అది జీవములేని శరీరమే (శవమే). అలాగే మరణించిన తర్వాత ఆత్మ దానితో పాటు జీవాత్మ ఇరువురు బయటికి పోవుచున్నారు. కావున అప్పుడు కూడ శరీరములో కదలిక లేకుండ పోవుచున్నది. అప్పుడు ఆ శరీరము జీవము లేని శరీరమే (శవమే). విచిత్రమేమంటే చనిపోయిన తర్వాత జీవుడులేని శరీరమును శవము అంటున్నాము. పుట్టినపుడు జీవుడులేని శరీరమును శవము అని ఎవరూ అనడము లేదు.


సజీవ శరీరము అనగా జీవుడు నివాసముంటున్న శరీరమని అర్థము. జీవుడు గల జీవితము 25 శరీర భాగములతో గలదు. నిత్యము సజీవ శరీరమును మనము చూస్తున్నా అందులో జీవునితో 25 భాగములుగా శరీరమున్నదని తెలియదు. జీవుడు సూక్ష్మశరీరములో నివాసముండును. ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీములో నిక్షిప్తమై ఉండును. క్రింద సజీవ శరీరము యొక్క భాగములను గమనిస్తాము.



add here;


---


పై 10 భాగములు స్థూల శరీరము (కనిపించెడి శరీరము)

add here



పై 15 భాగములు సూక్ష్మ శరీరము (కనిపించని శరీరము).


పది స్థూల భాగముల లోపల పదిహేను సూక్ష్మ భాగములు గలవు. అందువలన పదిహేను సూక్ష్మ భాగములను ఇంతవరకు ఎవరూ చూడలేదు. జీవుడైన వాడు శరీరములో తాను ఎట్లున్నది? తన ఆకారమెట్లున్నది తెలియ కున్నాడు. ఈ గ్రంథము చదువుచున్న నీవు కూడ జీవునివే. కానీ నీ రూపము నీకు తెలియదు. అద్దములో చూచుకొంటే నీ శరీరము యొక్క రూపమూ, దాని అందమూ కనిపిస్తుంది. కానీ నీవు కనిపించవు. నీవే కాదు నీ శరీరములో మనస్సు, బుద్ధి, చిత్తము, అహములు కూడ ఎట్లున్నది తెలియదు. అలాగే ఎదుటివాని శరీరము కనిపిస్తుంది, కానీ లోపల సూక్ష్మము లోని మనస్సు, బుద్ధి కనిపించదు. కనిపించే స్థూల శరీరము పనిచేసే ప్రింటర్లాంటిది. కనిపించని సూక్ష్మశరీరము పనిచేయించే కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్ పనితనము ప్రింటర్లో బయటపడినట్లు, సూక్ష్మ శరీరము యొక్క పనితనము స్థూలశరీరము మీద కనిపించును. దీనినిబట్టి ఒక సజీవ శరీరము, కనిపించు మరియు కనిపించని రెండు భాగములుగా ఉన్నదని తెలియుచున్నది. కనిపించని సూక్ష్మశరీరములోనే బయటి విషయములను గ్రహించు



---

మనస్సు గలదు. వాటిని యోచించు బుద్ధియూ గలదు. ఒక విషయమును గ్రహించుశక్తి సూక్ష్మ శరీరమునకున్నదని అర్థమగుచున్నది. స్థూల, సూక్ష్మశరీరములలో సూక్ష్మమునకే ఎక్కువ ప్రాధాన్యత గలదు. స్థూలశరీరము అందముగా ఉండవచ్చును, కానీ సూక్ష్మ శరీరము యొక్క అందము కనిపించదు. సూక్ష్మమునకు వాస్తవముగా అందముండదు. స్థూలశరీరము అందముగా ఉండవచ్చును లేక అంద హీనముగా ఉండవచ్చును. సూక్ష్మమునకు అందముండదు కానీ చంద ముండును. కొందరి స్థూలము అందముగా, కొందరి స్థూలము అంద హీనముగా ఉన్నట్లు, కొందరి సూక్ష్మము చందముగా ఉండవచ్చును లేక చందహీనముగా ఉండవచ్చును. అందము అంటే అందరికి తెలుసు. కానీ చందము అంటే చాలామందికి తెలియదు. అందము చందము అనే మాటను చాలామార్లు మనము వినియే ఉందుము. ఒక యువకునికి పెళ్ళి సమయములో అతని భార్యను చూచి ఈడు జోడు సరిపోయింది లేక సరిపోలేదు అంటుంటారు. ఆ మాటలో ఈడు అంటే వయస్సు, జోడు అంటే ఎత్తు అని అర్థము. పెళ్ళి కూతురుకు వయస్సు 20 సంవత్సరములు ఉండి పెళ్ళికొడుకు వయస్సు 40 సంవత్సరములైతే వారికి ఈడు సరిపోలేదు అనవచ్చును. అలాగే పెళ్ళి కూతురు నాలుగు అడుగుల ఎత్తు ఉండి, పెళ్ళికొడుకు ఆరు అడుగుల ఎత్తు ఉంటే వారికి జోడు సరిపోలేదు అంటుంటాము. అదే విధముగా పెళ్ళికొడుకు అయినా లేక పెళ్ళికూతురు అయినా అందముగా లేకుండా ఉండి జ్ఞానము కల్గియుంటే, అందము లేక పోయినా పరవాలేదు చందముందిలే అనేవారు. ఒకవేళ అటు అందముగా లేకపోయి, ఇటు జ్ఞానము కూడలేకపోతే అందమూలేదు చందమూలేదు అనేవారు. దీనిని బట్టి ఇక్కడ చందము అంటే దైవజ్ఞానము అని తెలియుచున్నది. ఈ కాలములో కొందరికి అందమున్నా, చాలామందికి చందము లేదు.


ఇపుడు అసలు విషయానికి వస్తే స్థూల శరీరమునకు సంబంధించి నది అందమూ, సూక్ష్మశరీరమునకు సంబంధించినది చందము అని తెలియు చున్నది. అందము పుట్టుకతోనే వస్తుంది, చందము (జ్ఞానము) శ్రద్ధతో తెలుసుకొనేకొద్దీ వస్తుంది. చందము (జ్ఞానము) మనస్సు ధ్యాస వలన బుద్ధి యోచనవలన జీవితములో లభించగలదు. ఇటు ప్రపంచ జ్ఞానము గానీ, అటు దైవజ్ఞానముగానీ కేవలము సూక్ష్మ శరీరము గ్రహించుకోవడము వలన లభిస్తున్నది. స్థూలశరీరములోనున్న సూక్ష్మశరీరము బయటి విషయమును గ్రహించుకొనుచున్నది. కావున దానిని గ్రహము లేక గ్రహ అంటున్నాము. ఈ లెక్క ప్రకారము మనము కూడ గ్రహాలమే. ఇపుడు మనకు స్థూల శరీరమను గృహములో సూక్ష్మశరీరమను గ్రహము గలదు. ఖగోళములో కూడ నవగ్రహములను మాట వినుచున్నాము. ఉదాహరణకు చంద్రుడు, కుజుడు గ్రహములే. ఆ గ్రహములకు కూడ స్థూల శరీరము గోళముల ఆకారములో గలదు. గోళముల ఆకృతియే వాటి స్థూలశరీరము. చంద్రుడు తెల్లని చౌడు మట్టిగల గోళముగ కనిపిస్తున్నాడు. అలాగే కుజుడు ఎర్రగ ఎర్ర మట్టిగల గోళముగ కనిపిస్తున్నాడు. రంగులూ, గోళములూ, ఆ గ్రహముల స్థూల ఆకారము కాగా, అవి మన పాపపుణ్యములను గ్రహించు కొనుచున్నవి, కనుక వాటిని గ్రహములు అంటున్నాము. గ్రహించుకొనుట వలన మనిషి గ్రహయే, గోళము గ్రహయే. ఇదే విధముగా ఖగోళములోని గోళము గ్రహయైనట్లు, గుడిలోని ప్రతిమ కూడ గ్రహయే అవుతుంది. గుడిలోని ప్రతిమలో కూడ జీవుడున్నాడు. గుడిలో ఏదో ఒక దేవుడుగానో, దేవతగానోనున్న ప్రతిమలోని జీవుడు గుడికి వచ్చు భక్తుల మనో భావము లనూ, వారి కోర్కెలనూ గ్రహించుచున్నాడు. ఖగోళములో దూరముగానున్న గోళములను వదలివేసి ఇక్కడ భూమి మీదనే గ్రహములు ఇటు గృహములలోను అటు గుడులలోను గలవు. వాస్తవానికి గృహములోని కదిలెడు శరీర ఆకారములైన మనుషులూ, గుడులలోని కదలని ప్రతిమ ఆకారములైన దేవతలూ గ్రహములే, అయినా మనుషులు గుడిలోని ప్రతిమలను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. కనుక వారిని తమతో సమానముగా



---


గ్రహములు అంటే బాగుండదని ప్రతిమ ఆకారములోనున్న దేవతలను విగ్రహములన్నారు. ఇక్కడ బాగా అర్థము చేసుకోవలసినది ఏమనగా! మనిషి శరీరములోని సూక్ష్మశరరీమును గ్రహము అనుచున్నాము. అలాగే ప్రతిమ శరీరములోని సూక్ష్మశరీరమును విగ్రహము అంటున్నాము. అలా అనడము వలన సాధారణ మనిషికంటే గుడిలోని దేవత గొప్పదని తెలియుచున్నది.


విశేషమున్న దేనినైన దానికంటే ముందు “వి” అను అక్షరమును చేర్చి చెప్పితే దానికి గొప్పతనమున్నదని తెలియును. మనిషి గ్రహముకంటే ప్రతిమ గ్రహము గొప్పది, కావున దేవతాప్రతిమను విగ్రహము అనుచున్నాము. ఇక్కడ విశేషము అను పదమును సూత్రబద్ధముగా తెలుసుకొంటే విగ్రహము యొక్క అర్థము బాగా తెలియును. ఇపుడు ఈ సూత్రము మీకు క్రొత్తగా కనిపించినా ఇది శాస్త్రీయత కలదని తెలియు చున్నది. భాగించే సంఖ్యచే, భాగించబడే సంఖ్య భాగించబడి, చివరిలో మిగిలిన సంఖ్య, భాగించే సంఖ్యకంటే తక్కువ మిగిలితే దానిని శేషము అంటాము. భాగించబడే సంఖ్య భాగించబడి చివరిలో, భాగించే సంఖ్యకంటే ఎక్కువ మిగిలితే దానిని విశేషము అంటాము. అట్లే భాగించే సంఖ్యచే భాగింపబడే సంఖ్య భాగించబడి చివరిలో భాగించే సంఖ్యకంటే తక్కువగానీ, ఎక్కువగానీ మిగలకుండ పోతే దానిని సశేషము అంటాము. ఇపుడు క్రింద ఉదాహరణగా శేషము, విశేషము, సశేషము సంఖ్యలతో చూచెదము.

add here.


ఈ విధముగా భూమిమీద గ్రహముకంటే విగ్రహము విశేషము కలదిగా ఉన్నది. గ్రహముగానీ, విగ్రహముగానీ స్థూల శరీరములో ఉన్నపుడు వాటి యొక్క స్థూల ఆకారము మాత్రమే కనిపిస్తున్నది. కానీ సూక్ష్మమైన ఆకారము లేదు. ఇపుడు మరణాల విషయానికి వస్తాము. జీవితము యొక్క చివరిలో వచ్చునది మరణమనీ, జీవిత కాలములోనే వచ్చునది అకాల మరణమని చెప్పాము కదా! ఈ మాట విన్న చాలామందికి ఎవరికైనా మరణము ఒక మారే వస్తుంది, రెండు మరణాలెలా ఉంటాయని ప్రశ్నరావచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఏ జీవరాసికైనా పైకి కనిపించు శరీరము ఒకటే అయినా కనిపించని శరీరము కూడా మరొకటి కలదని చెప్పుకొన్నాము కదా! అందువలన ఒక జీవరాసికి జన్మతః రెండు శరీరములున్నవనీ, పైకి కనిపించునది స్థూలశరీరమనీ, కనిపించక


---

శరీరములోపల అణిగియున్న దానిని సూక్ష్మశరీరమని కూడ చెప్పుకొన్నాము. సూత్రము ప్రకారము జీవునికి జన్మతః వచ్చిన స్థూల, సూక్ష్మశరీరములు రెండు ఒకమారు జీవున్ని వదలిపోతే దానిని మరణము అంటాము. జీవుని నుండి రెండు శరీరములు విడి పోవడము జీవుని యొక్క జీవిత అంత్యములో జరుగును. మరణములో జీవుడు తన నివాసమైన రెండు శరీరములను కోల్పోయి వెంటనే క్రొత్త నివాసమును పొందును. దానినే జన్మ అంటున్నాము. ఇక్కడ చాలామందికి తెలియని శాసనము ఒకటికలదు. ఆ శాసనము ఏమనగా! ఏ జీవుడైనా, ఎక్కడైనా ఒక్కక్షణము కూడా శరీరమును వదలి బయట ఉండుటకు వీలులేదు. అందువలన మరణించిన జీవుడు మరుక్షణమే క్రొత్త శిశుశరీరములో ప్రవేశించి జన్మపొందుచున్నాడు. ఇక్కడ జీవుడు మరణము నుండి నేరుగా క్రొత్త జన్మను పొందుచున్నాడు.


శాసనములతో కూడుకొన్నదే శాస్త్రము. ఇపుడు మనము చెప్పుకొను శాస్త్రమును దేవుడు చెప్పినది. కావున దీని పేరు బ్రహ్మవిద్యాశాస్త్రము అన్నాము. దేవుని శాసనముల ప్రకారము పైన మరణము గురించి చెప్పుకొన్నాము. ఇపుడు అకాలమరణమును గురించి చెప్పుకొందాము. జీవునికి పూర్తి జీవితము అయిపోకనే జీవితకాలములో ఎప్పుడైనా సంభవించు దానిని అకాలమరణము అంటాము. అకాల మరణములో జీవుడు రెండు శరీరములలో కేవలం స్థూలశరీరమును మాత్రము వదలుచున్నాడు. స్థూలశరీరమును వదలి సూక్ష్మశరీరములో జీవుడు నివాసముంటున్నాడు. ఒక శరీరమున్నది కావున జీవుడు మరొక జన్మకు పోనవసరము లేదు. ఒకే జీవితములో స్థూలమును వదలి సూక్ష్మశరీరముతో కాలము గడుపుచున్నాడు. ఆ విధముగా జీవిత అంత్యము వరకు జీవించవలసియుండును. స్థూలశరీరమును వదలినది బయట ప్రజలకు తెలియుచున్నది. కానీ సూక్ష్మముతో ఉన్నది ఎవరికీ తెలియదు. కావున అకాలమరణము పొందిన వానిని కూడ మరణించిన వానిక్రిందకే ప్రజలు జమకట్టుచున్నారు. అకాలమరణము పొందిన వాడు మరణము పొందకున్ననూ, జీవించియే ఉన్ననూ, శరీరము కనిపించదు కావున వాడు మరణించాడని, ఇకలేడని అనుకుంటున్నారు. ఇక్కడ చదువు వచ్చిన వానికి గానీ, చదువురాని వానికిగానీ, మేధావి అనువానికి గానీ, సూక్ష్మము కనిపించదు. కావున మాకు సైన్సు తెలుసు, భౌతికశాస్త్రము తెలుసు అను శాస్త్రజ్ఞులకు కూడ అకాలమరణముగానీ, సూక్ష్మశరీరముగానీ అర్థము కాదు. కావున దయ్యములు లేవు అని చాలామంది విజ్ఞానులే అంటున్నారు. దయ్యము అంటే సూక్ష్మముగా కంటికి కనిపించని జీవరాసి అని తెలియదు. దయ్యములు మనుష్యుల్లోనే కాదు అన్ని జీవరాసులలోను ఉన్నాయి. అర్థము చేసుకొంటే కనిపించని ప్రపంచము ఎంతో ఉంది. దానినే కనిపించని రెండవ జగత్తు అని మేము అంటున్నాము. కేవలము భౌతికవాదము చేయువారికి అభౌతికము తెలియదు. అభౌతికము (సూక్ష్మము)ను గురించి తెలుసు కోవాలని ప్రయత్నము కూడ చేయకుండా, అది లేనే లేదు, ఉంటే చూపిస్తావా అను హేతువాదము ముసుగు తగిలించుకొన్నవారు కొందరుండ వచ్చును. వారిది హేతువాదము కాదని నేనిప్పుడు కూడ చెప్పుచున్నాను. ఒక యదార్థ సంఘటన వెనుక దాగియున్న కారణమును వెతికి దాని నిజస్థితిని తెలుసుకొని, సత్యమును ప్రకటించునది హేతువాదము కానీ తాను పట్టుకొన్న కుందేలుకు మూడేకాళ్ళు అని మొండిగా వాదించునది హేతువాదము కాదు.


దయ్యము అను పదము మొరటుగా కనిపించినా అది దేవుడు అను పదమునకు వ్యతిరేఖముగా పుట్టినది. దేవుడు వెతికినా తెలియడు, కనిపించడు. దయ్యము వెతికితే తెలియును, కనిపించును. దేవుడు, దయ్యము రెండు కంటికి కనిపించనివే అయినా దేవుడు శోధించినా తెలియడు, దయ్యము శోధించితే తెలియును. గుడిలో ఉన్న ప్రతిమ శరీరములో కూడ సూక్ష్మశరీరమున్నది, కావున దానిని కూడ దయ్యము అనవలసి వచ్చినది. అలాగే కదిలెడు జీవరాసుల శరీరములలో కూడ సూక్ష్మశరీరము ఉన్నది, కావున దానిని కూడ దయ్యములు అని అంటున్నాము. ఇంతకు ముందు


---

గ్రామదేవత మనిషి శరీరములోనికి వచ్చి మాట్లాడిన విషయము చెప్పుకొన్నాము. చనిపోయిన మనిషి అనగా దయ్యము, మనిషి శరీరములోనికి వచ్చి మాట్లాడిన విషయము చెప్పు కొన్నాము. ఇటు గుడిలోని దేవతగాక, అటు చనిపోయిన సూక్ష్మమైన మనిషిగాక మేము చూచిన ఇతర జీవరాసి విషయమును ఇపుడు చెప్పుకొందాము.


దాదాపు ఇప్పటికి 35 సంవత్సరముల క్రితము తాడిపత్రిలో రైల్వే స్టేషన్ మాస్టరు ఉద్యోగము చేయుచున్న నాగేశ్వరావు అనే పేరుగల నాగదేవత ఉపాసకుడు, నాగదేవతను గొప్ప ఊరేగింపుగా తీసుకెళ్లుచుండగా, ఇతరులు నాగదేవతను పూజించి, కొబ్బరికాయలను సమర్పించడానికి ఆపి పూజిస్తుండగా, దాదాపు 150 మీటర్ల దూరములో నుండి ఆ దృశ్యమును చూస్తున్న 40 సంవత్సరముల వయస్సు గల మనిషికి పూనకము వచ్చి క్రిందపడిపోయి, పాము ప్రాకినట్లు ప్రాకుచూ, పాము బుసకొట్టినట్లు బుస కొట్టుచున్న దృశ్యమును చూచాను. అతను చూస్తుండగానే దేవతవైపు ప్రాకుచు పోవడము జరిగినది. దానిని చూచిన నాగదేవత ఉపాసకుడు నాగేశ్వరరావు నాగదేవతకు నమస్కరించి, పూనకము వచ్చిన మనిషి ముఖము మీద దేవత తీర్థమును చల్లగా అంతవరకు పాముమాదిరి ప్రాకిన మనిషి సాధారణ మనిషిగా మారిపోయి లేచి నిలబడ్డాడు. అంతవరకు అతనికి ఏమి జరిగినది తెలియదు. కావున జరిగిన విషయమును ఇతరుల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన చూచిన మాకు అక్కడ పాము యొక్క సూక్ష్మము (దయ్యము) మనిషి శరీరములో ప్రవేశించినదని అర్థమైనది. ఆ విషయము నాగదేవత ఉపాసకుడైన అతనికి కూడ తెలిసినది. కానీ అక్కడున్న ప్రజలకు ఏమి అర్థము కాలేదు.

ఇలాంటిదే మరొక సంఘటనను కూడా చూచాను.


1997వ సంవత్సరములో అనంతపురము జిల్లాలోనే మారుమూల ఊరు, పేరు జ్ఞాపకము లేదు. ఆ ఊరి బయట ఈశ్వరాలయము గలదు. ఆ ఆలయములో దాదాపు 40మంది మనుషులతో మేము నమ్మకములు, మూఢనమ్మకములు అను విషయమును గురించి మాట్లాడుచున్నాము. ఆ విషయములే ఇపుడు “నాస్తికులు-ఆస్తికులు” అను పేరు మీద మేము వ్రాసిన చిన్న గ్రంథము కూడ కలదు. ఆ దినము అలా మాట్లాడుచుండగా అక్కడున్న ఆడవారిలో ఒకరు లేచి గర్భగుడిలోనికి పోవడము జరిగినది. పోవడము చూచినా, దానిని మేము పట్టించుకోలేదు. మేము మాట్లాడు చుండగా మిగతావారంత శ్రద్ధగా వింటున్నారు. అంతలో గర్భగుడిలో పాము బుసకొట్టినట్లు శబ్దము రావడము మొదలు పెట్టింది. అటు వైపుచూస్తే లోపలికి పోయిన ఆమె క్రిందపడి పామువలె వంకర్లు తిరుగుచు ఈశ్వర లింగము చుట్టు ప్రాకుచున్నది. తర్వాత 20 నిమిషము లకు ఆమె లేచివచ్చినది. అలా వచ్చిన ఆమె లోపలినుండి మల్లెపూలమాల తెచ్చి మా మెడలో వేసిపోయినది. ఆ మాలలో పూలు అపుడే కోసిన మొగ్గలుగా ఉన్నవి. అంతేకాక ఒక ఇంచుకొక పువ్వు కట్టివున్నవి. అక్కడెక్కడా ఆ పూలు దొరకవనీ, అంత తాజా మొగ్గలు అప్పుడే కట్టినట్లుండడము ఆశ్చర్యమని అక్కడున్నవారు చెప్పినా దానిని మేము పట్టించుకోలేదు. కానీ అక్కడ ఆమె శరీరములోనికి పాముగ్రహము లేక పాము సూక్ష్మశరీరము ప్రవేశించినదని, అదియే ఈశ్వరలింగము చుట్టు ప్రాకుచు తిరిగినదని మాకు అర్థమైనది.


ఈ విధముగా ఇతర జీవరాసులు కూడ మనిషి శరీరములోనికి అరుదుగా ప్రవేశించడము వలన మనుషుల సూక్ష్మములు, దేవతల సూక్ష్మములే కాక, మిగత జీవరాసుల సూక్ష్మములు కూడ ఉన్నవని తెలియు చున్నది. ఇలా పాము గ్రహము విషయమే కాక, ఒక చేప గ్రహము ఘటనను కూడ మేము 1975లో చూడడము జరిగినది. ఇవన్నిటిని ఒక పరిశోధన రూపములో చూచాము. గ్రుడ్డిగా దేనిని నమ్మలేదు. ఒక్కొక్క సంఘటనలో సూక్ష్మాలకు సంబంధించిన ఎన్నో విషయములు తెలిసినవి. మా పరిశోధనను మలుపు త్రిప్పిన ఆ సన్నివేశమును గురించి వివరిస్తాను. ఒక వ్యక్తి


--

మంత్రాలయము దగ్గర తుంగభద్ర నదిలో చేపలు పట్టుకొనివచ్చాడు. అందులో ఒక పెద్దచేప దొరికింది, అది ఎక్కువసేపు ప్రాణముతోనే ఉండగా దానిని భూమికి కొట్టి అతను చంపివేశాడు. అతను ముస్లీమ్ మతస్థుడు. దేవతలను, దయ్యాలను నమ్మేవాడు కూడా కాదు. ఆ చేపను చంపిన అర్థగంటకు అతనికి కడుపునొప్పి వచ్చినది. అతను డాక్టరు వద్దకు పోయి చికిత్స చేయించుకొనినా ఏమాత్రము తగ్గలేదు. ఆ నొప్పితో అతను మెలికలు తిరిగిపోతూ ఇంటికి వచ్చి బాధపడుతుంటే పక్కింటివారు నావద్దకు తీసుకువచ్చారు. ఆ సంవత్సరము నేను “రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్”గా పని చేయుచుంటిని. అందువలన వైద్యము నిమిత్తము అతను నావద్దకు వచ్చాడు. ముందు డాక్టర్ ఇచ్చిన ప్రిస్కిప్షన్ అంతా చూపించాడు. డాక్టరు మంచి మందులు ఇచ్చినట్లు తెలిసింది. అయినా అతను మెలికలు తిరిగి పోతుండడము ఆశ్చర్యము వేసింది. అపుడు అతనిని కడుపులో ఏ వైపు నొప్పి ఉంది అని ప్రశ్నించాను. అతను మొదట కుడి ప్రక్క చూపించాడు. తర్వాత నిమిషములోనే ఎడమ ప్రక్క ఉంది అన్నాడు. కరెక్టుగా చెప్పమంటే, నిమిష నిమిషము నొప్పి జాగా మారుతుంది కడుపులో కదిపివేసినట్లుంది అన్నాడు. అపుడు ఇది శరీరములో పుట్టిన నొప్పికాదని అర్థమైనది.



అపుడు అతని నుండి వివరములు సేకరించుటకు ప్రశ్నించను మొదలు పెట్టాను.

ప్రశ్న:- నీ కడుపులో నొప్పి కడుపులో మాత్రమే ఉన్నదా? లేక పైన ఊపిరితిత్తుల వరకు ఉన్నదా?

జవాబు : కొంతసేపు కడుపులో, కొంతసేపు కడుపుకు పై భాగమున దొమ్మలలోను నొప్పి వస్తావుంది?

ప్రశ్న:- అప్పుడప్పుడు ఒక నిమిషముగానీ, రెండు నిమిషములుగానీ నొప్పి ఏమాత్రము లేకుండపోయి, బాగావుండి

తర్వాత మొదలు పెట్టి విపరీతముగా నొప్పి కలుగుచున్నదా?

జవాబు : అవును మీరు చెప్పినట్లే ఒక నిమిషము బాధ లేకుండ పోయి తర్వాత వెంటనే వస్తావుంది.

ప్రశ్న:- ఈ నొప్పి ఎపుడు ప్రారంభమైనది?

జవాబు : ఉదయము 6-30 గంటలకు ట్రైన్లోనే వచ్చింది.

ప్రశ్న:- ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నావు?

జవాబు : మంత్రాలయము నుండి

ప్రశ్న:- అక్కడికి దేనికి పోయావు?

జవాబు : తుంగభద్ర నదిలో చేపలను పట్టేదానికి పోయింటి, అక్కడ మా వారు, నేను చేపలను రాత్రి పట్టి, నా భాగము

చేపలు నేను తీసుకువచ్చాను.

ప్రశ్న:- చిన్న చేపలా? పెద్ద చేపలా?

జవాబు : పెద్దచేపలు, ఒక్కొక్కటి కేజీ పైన, రెండు కేజీల వరకు ఉంటాయి.

ప్రశ్న:- అన్ని ఒకే జాతిచేపలా?

జవాబు : వేరు వేరు జాతివి దొరికినవి. నేను మాత్రము ఒకే జాతివి తెచ్చుకొన్నాను.

ప్రశ్న:- తెచ్చుకొన్న చేపలు వాటంతటకవే చనిపోతాయి, కొన్ని బ్రతికి ఉంటాయి. చాలాసేపటికిగానీ చనిపోవు అలా ఏమైనా నీవద్ద కనిపించాయా?

జవాబు : రెండు కేజీల చేప ఒకటి చాలాసేపు బ్రతికే ఉంది. ట్రయిన్ కూడ సంచిలో కదులుతూవుంటే, బయటికి


---

తీసి క్రిందకు కొట్టి చంపి సంచిలో వేశాను.


ప్రశ్న:- అలా చేసిన తర్వాత నీకు కడుపునొప్పి వచ్చిందా?

జవాబు : అవును దానిని చంపిన తర్వాత అర్థగంటకు నొప్పి వచ్చింది.


ఇక్కడ వానికున్న కడుపునొప్పికి ఇన్ని ప్రశ్నలు అవసరమా! అని కొందరనుకోవచ్చును. ప్రతి దానిని ప్రశ్నించి సత్యము తెలుసుకోవడమే హేతుపద్ధతి అని ముందే చెప్పానుగా! సాధారణముగా డాక్టర్లు నీకు నొప్పి ఎక్కడుంది అని అడుగుతారు. అలాగే మొదట నేనూ అడిగాను. కొంత సేపు కడుపులో, కొంతసేపు గుండె పై భాగములో నొప్పి వస్తావుంది అన్నపుడు నాకు ముఖ్యమైన క్లూ దొరికింది. దాని మూలంగా అన్ని ప్రశ్నలు వేయవలసి వచ్చింది. అక్కడ నొప్పికి తగిన ఆధారమేమి దొరికిందని కొందరు ప్రశ్నించ వచ్చును. దానికి జవాబు, ఏ నొప్పి అయినా అలా అంత తొందరగా ఒక జాగా నుండి మరియొక జాగాకు మారదు. అలా మారిందంటే అది సాధారణ నొప్పికాదని చెప్పవచ్చును. ప్రతి జాతి జీవరాసి సూక్ష్మముగా (దయ్యముగా) ఉండుటకు అవకాశముందని తెలిసిన మాకు, అవి శరీరము మీద పూనకము రావడము లేక ఆవహించడము జరుగుచున్నదని కూడ తెలుసు. అంతేకాక పైన వివరించిన చేప సంఘటనతో శరీరమును ఆవహించి పైకి కనిపించడమే కాదు, శరీరములోపల వుండి బాధించడము కూడ జరుగుచున్నదని అర్థమైనది. అతను చేపను చంపిన అర్థగంట తర్వాత చేప సూక్ష్మము (గ్రహము) అతని కడుపులో చేరి బాధించను మొదలు పెట్టింది అని తెలిసింది. అది మందులతో బాగవునది కాదని కూడ అర్థమైనది. అయినా ఆ నొప్పిని ఐదు నిమిషములలో నయము చేసి పంపడము జరిగినది. ఎలా నయము చేసినది తర్వాత వివరముగా చెప్పుతాము.


సాధారణ మనిషికి దయ్యాలను గురించి ఎటువంటి అవగాహన లేదు. అటువంటపుడు వాటి విషయములో ఎన్నో ప్రశ్నలుండును, కాని సరియైన జవాబులు దొరికియుండవు. అందువలన మనిషిలో ఉద్భవించు ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకులాగున మా ముందర, మా అనుభవములో జరిగిన యదార్థసంఘటనలను వివరిస్తూ ఈ గ్రంథమును వ్రాయదలచాము. మనిషిలో వచ్చు ప్రశ్నలను మేమే అడుగుచూ, వాటికి జవాబివ్వడము జరిగినది. ఇక ప్రశ్నలు చూస్తాము.


ప్రశ్న:- దయ్యమంటే ఏమిటి? భూమిమీద దయ్యములున్నాయా?

జవాబు: దేవుడు అను పదమునకు వ్యతిరేఖపదముగా దయ్యము అను పదము పుట్టినది. దేవుడు జీవితములో తెలియబడడు. దయ్యము తెలియ బడుతుంది. దయ్యమునే గ్రహము, సూక్ష్మశరీరము అని కూడ అంటున్నాము. కనిపించదు కావున సూక్ష్మమనీ, గ్రహించుశక్తి గలది కావున గ్రహమని అనడము జరుగుచున్నది. జీవమున్న ప్రతిదీ గ్రహించుకొను సామర్థ్యము కలదిగా ఉన్నది. కావున ప్రతి జీవరాసిని గ్రహము అనవచ్చును. ఆ లెక్క ప్రకారము మనమంతా గ్రహములమే. అలాగే కనిపించెడి శరీరములో కనిపించని సూక్ష్మశరీరముగా ఉన్నాము, కావున మనమంతా కనిపిస్తూ బ్రతుకుచున్న దయ్యాలమే. దయ్యాలు అంటే సినిమాలో మేకప్ చేసి చూపించినట్లు ఏదో వికారరూపములు కాదు. భూమిమీద దయ్యాలు ఉన్నాయి. వాటి అనుభవాలు, ఆచరణలు ఎన్నో ఉన్నాయి. మనిషి అకాల మృత్యువు పొందితే ఆయుస్సు అయిపోవువరకు ఉండు స్థితిని దయ్యము అంటున్నాము.

ప్రశ్న:- వెయ్యిమంది జనాభావున్న ఊరిలో ఎన్ని దయ్యములుంటాయి?


---

జవాబు: వెయ్యికంటే కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువగానీ ఉండవచ్చును. మనుషదయ్యాలేకాక ఊరిలో ఉండు కోళ్ళు, కుక్కలు, పశువులు మొదలగున వన్నీ ఉండును. ఒక విధముగ చెప్పితే దాదాపు కనిపించే ఊరంత కనిపించని ఊరుకూడ ఉందని చెప్పవచ్చును. ఒక ఊరే కాదు, ఒక దేశమేకాదు మొత్తము ప్రపంచమంతా సూక్ష్మశరీరములు మనుగడ సాగిస్తున్నవి. కావున కంటికి కనిపించని రెండవ ప్రపంచము మరొకటి ఇక్కడే కలదని చెప్పవచ్చును. ఒక మనిషిగానీ, జంతువుగానీ, పక్షిగానీ ప్రారబ్ధకర్మచేత నిర్ణయింపబడిన ఆయుస్సు అయిపోయి చనిపోతే మరు జన్మకు పోవునని, ఆయుస్సు అయిపోక ముందే చనిపోతే అదే జన్మలో సూక్ష్మముగ (దయ్యముగ) ఉండునని మరొకమారు జ్ఞప్తి చేయుచున్నాము. అట్లు ఆయుస్సు అయిపోకముందు చనిపోయిన జీవ జాతులు ఎన్నో కలవు. కావున అవన్నీ కనిపించని జీవ సముదాయముగా అనగా కనిపించని జగత్తుగా ఉన్నవి.


ప్రశ్న:- ఒక మనిషి స్థూలశరీరముతో బ్రతికి ఉన్నపుడు వానికి ఒక కాలు లేదు, కావున వాడు కుంటుతూ నడిచేవాడు. అటువంటివాడు అకాల మృత్యువుతో ఆయుస్సు అయిపోకముందే చనిపోతే వాని సూక్ష్మము బాగా నడుచునా? లేక అప్పుడు కూడ కుంటుతూ నడుచునా?

జవాబు: అకాలమృత్యువు లేక అకాలమరణము పొందకముందు అంగ వైకల్యమున్న వాడు సూక్ష్మశరీరముతో గడుపు జీవితములో కూడ అంగ వైకల్యముతోనే బ్రతుకును. దానికి నిరూపణగా ఒక సంఘటనను గూర్చి చెప్పెదను. అనంతపురము జిల్లా, పెనుకొండ దగ్గర ఒక పల్లెటూరులో అన్ని అవయవములు బాగున్న ఒక మనిషికి దయ్యము పట్టినది. దయ్యము పట్టిన సమయములో అతను కుంటుతూ నడుచును. దయ్యము వదలి పోతూనే కుంటకుండ బాగానడుచును. కాలు బాగా ఉన్నప్పటికీ శరీరములో అంగవైకల్యమున్న గ్రహమున్నంతసేపు, కాలుకు బలము లేకుండ పోవుచున్నది. కాలును ముల్లుతో గుచ్చినా కాలులో చైతన్యములేదు. దీనినిబట్టి లోపలున్న దయ్యము కర్మప్రకారమే పై శరీరము కూడా పని చేయునని తెలియుచున్నది.


జీవుని కర్మను బట్టి పై శరీరము తయారగునని చెప్పుటకు మరొక ఆధారమును తెల్పుచున్నాను. యాడికి అను గ్రామములో ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరముల క్రిందట జరిగిన సంఘటనను వివరించుకొందాము. పెళ్ళి అందమైన 18 సంవత్సరముల యువతికి, అప్పుడప్పుడు ఆరోగ్యము బాగుండెడిది కాదు. కొంత కాలముగా డాక్టర్లవద్ద చూపించినా అనారోగ్యముగనే ఉండేది. ఆ అమ్మాయికి దైవజ్ఞానము మీద మంచి ఆసక్తి ఉండుట వలన నేను ఆ ఊరికి పోయినపుడు జ్ఞానమును వినేదానికి ఆమె పెద్దమ్మ ఇంటికి వచ్చి అక్కడ విని పోయేది. ఆ అమ్మాయి యొక్క పెద్దమ్మ ఆ యువతి ఆరోగ్యమును గురించి నాకు చెప్పడము జరిగినది. నాకు మంత్రములురావు. నేను భూత వైద్యుడను కాను. అయినా నన్ను చూస్తే దయ్యములు పారిపోతాయని, నావలన ఎంతో మంది ఆరోగ్యము బాగుపడిందని ఆ యువతి పెద్దమ్మకు తెలుసు. అందువలన ఆ యువతి ఆరోగ్యమును గురించి నావద్ద ప్రస్తావించారు. నేను కూడ ఆ అమ్మాయి జ్ఞానము తెలుసుకోవడమును చూచాను. నేను అల్లోపతి మరియు హెూమియోపతి డాక్టర్ను కనుక తర్వాత వచ్చినపుడు చూచి చెప్పుతానని చెప్పాను. రెండు నెలల తర్వాత అక్కడికి పోవడము జరిగినది. అప్పుడు అమ్మాయిని ఆమె పెద్దమ్మ సమక్షములోనే చూచాను. ఆమెకు శరీరములో ఏ లోపము లేదని చెప్పాము. అయినా ఆమెకు ఆరోగ్యము బాగాలేదు, దానికి కారణము ఏముంటుందని ఆలోచించాము. నాకు వచ్చిన ఆలోచన ప్రకారము సాయంత్రము చూస్తామని చెప్పాము. అట్లే సాయంకాలము చూడడము జరిగినది. అప్పుడు ఆమె గుండె చప్పుడులో, 





---

రక్తప్రవాహములో బాగా తేడా కనిపించింది. అప్పుడు ఆమె శరీరములోపల మరొక గ్రహము ఉన్నదని (సూక్ష్మశరీరమున్నదని) అర్థమైనది. ఆ విషయమును ఆమె పెద్దమ్మకు చెప్పి, దానికి తగిన చికిత్సను మంత్రాలు వచ్చిన వారివద్ద చేయించుకొమ్మని చెప్పాము. అప్పటికే అన్ని రకములు చూపించామని భూత వైద్యులు కూడ చూచారని, తావెత్తులు కూడ కట్టించామని చెప్పారు.


ఆ యువతి ఇంటిలో వారి తల్లిదండ్రులకు జ్ఞానము మీద ఆసక్తిలేదు. అయినా ఆ అమ్మాయికి దైవజ్ఞానము మీద ఆసక్తి ఉండుట వలన ఆ రోగమును గురించి కొంత ఆరా తియ్యాలనుకొన్నాను. అపుడు నేను కూర్చున్న కుర్చీకి ఎదురుగా మూడు అడుగుల దూరములో అమ్మాయిని కూర్చోమని, తలపైకి ఎత్తి ఎదురుగా నావైపు చూడమన్నాను. అపుడు ఆమె నాపైపు చూడలేకపోయేది. నావైపు చూస్తే లోపల అణిగియున్న దయ్యము బయటికి రావడము జరుగుతుంది. కానీ ఆమె శరీరములోని సూక్ష్మము బయటికి రాలేదు. అపుడు నేనే లోపల అణిగియున్న జీవుడు (దయ్యము) బయటికి వచ్చి మాట్లాడమని చెప్పాము. అలా చెప్పగానే చాలా భయపడుచు ఆ యువతి మాట్లాడటము జరిగినది. పైకి యువతి కనిపిస్తున్నప్పటికీ మాట్లాడునది దయ్యము అని నాకు, అక్కడున్న వారికి బాగా అర్థమైనది. ప్రక్కన కనీసము 20మంది ఆడ మగ మనుషులున్నారు. వారందరికి దయ్యము మాట్లాడుచున్నదని అర్థమగుటకు కారణము ఆ అమ్మాయి మాట్లాడే మాట స్పష్టముగా లేదు. మూతి వంకరపోయి పార్శ వాయువు వచ్చినవాడు మాట్లాడినట్లు మాట్లాడుచున్నది. అంతేకాదు కుడి కాలు, కుడి చేయి కూడ ఏమాత్రము పని చేయలేదు. మొత్తము మీద శరీరమునకు పార్శవాయువు ఉన్నట్లు అక్కడివారందరికి అర్థమైనది. ఆమె లోనికి చేరిన వ్యక్తికి పార్శవాయువు ఉన్నదని, అందువలన ఆమె శరీరము అలా అయినదని నాకు తెలిసింది. అప్పుడు ఆ దయ్యమును ప్రశ్నించగా, ఎన్నో ఆసక్తికరమైన విషయములు తెలిసినవి.


ఒక వ్యక్తికి 20 సంవత్సరముల యుక్తవయస్సులోనే పార్శవాయువు (పెరాలసిస్) వచ్చి శరీరములో ఒక ప్రక్క కాలు, చేయి, నోరు పడిపోయినవి. అతనికి మాట్లాడేదానికి కూడ నోరు అనుకూలించడము లేదు. అలాగే కష్టముగా కుంటుతూ నడిచేవాడు. అతను అడుక్కు తిని బ్రతికేవాడు. అతనిది తెలంగాణా ప్రాంతము. బిక్షాటన చేస్తు అనంతపురము జిల్లాకు పోయాడు. యాడికిలో, ఊరిలోనే పెద్ద గుడి ఉందనీ, అక్కడికి భక్తులు వస్తుంటారని తెలుసుకొని గుడి ముందర కూర్చుంటే కొందరైన దయదలచి డబ్బులిస్తారనుకొన్నాడు. సరిగా నడువలేని అతను ఆ గుడిముందర ఉండేవాడు. అక్కడ ఎవరూ డబ్బులివ్వక పోవడము వలన ఆ ఊరిలోనే కొంత తిరిగి ఎవరైన ఏదైన పెట్టితే తిని బ్రతికేవాడు. ఆ కుంటివాడు ఆ ఊరికి వచ్చిన ఆరునెలలకే చనిపోవడము జరిగినది. అదియు అకాల మరణము పొందాడు. కావున దయ్యముగా ఉండిపోయాడు. ఇక్కడ అతను చనిపోయాడన్న పేరేగానీ, అతని జీవితము మాత్రము యధాతథమే. చనిపోకముందు కనిపించేవాడు, చనిపోయాక కనిపించడము లేదు. మనుషులకు కనిపించకున్నా, వాడూ ఉన్నాడు, వాని జీవితమూ ఉన్నది. అలా కాలమరణము వచ్చువరకు అనగా పూర్తి ఆయుస్సు అయిపోవు వరకు అతను ఉండవలసిందే. అతను బ్రతికినపుడు కాలు, చేయి సహకరించక ఎంత దుర్భర జీవితమును అనుభవించాడో, అకాల మరణము పొందిన తర్వాత కూడ, అలాగే దుర్భర జీవితమును అనుభవిస్తున్నాడు.


అలా జీవితము గడుపుచున్న అతనికి ఒక దినము ఒక క్రొత్త ఆలోచన వచ్చినది. అప్పటికి అతని వయస్సు 25 సంవత్సరములు. అతనిది యుక్తవయస్సే కావున, తనకు ఒక అమ్మాయి తోడు కావాలను కొన్నాడు. బ్రతికి ఉ న్నపుడు అడుక్కుని తినే అతనిని చూచీ, అతని కాలు చేయి చూచీ ఎవరు కూడా అతనికి తోడు కారు. కానీ ఇప్పుడు తన ఇష్టప్రకారము తోడు చేసుకోవచ్చు అనుకొన్నాడు (ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటున్నది. మగ దయ్యము


---

బ్రతికియున్న స్త్రీ శరీరములో చేరి ఆమెను అనుభవించవచ్చును. అలాగే స్త్రీ దయ్యము బ్రతికియున్న మగ శరీరములో చేరి అతనితో సంయోగము చేయవచ్చును) వెంటనే యుక్తవయస్సులోనున్న ఆడపిల్లల కొరకు వెదకను మొదలు పెట్టాడు. అదియు అందమైన అమ్మాయే కావాలనుకొన్నాడు. ఒక రోజు 10వ తరగతి చదువుచున్న అమ్మాయి కనిపించింది. అందరికంటే ఆ అమ్మాయి బాగా అందముగా ఉన్నదనుకొన్న అతను, ఆమెలో చేరడానికి ప్రయత్నము చేయను మొదలు పెట్టాడు. దాదాపు నెల తర్వాత ఒక దినము ఆమె స్కూల్నుండి వచ్చే సమయములో మధ్యాహ్నము ఒంటిగంటపుడు ఆమె లోనికి ప్రవేశించాడు. స్కూల్నుండి ఆమె ఇంటికి వచ్చుదారి పొలాల్లో ఉంది. ఆ దారిలో ఆమె ఒక్కతే ఒంటరిగా వస్తుంది. అదే మంచి అదనుగా అతడు తలచాడు. అతను కుంటివాడు కనుక దారిలో అదియు పొలము గట్టులో కాచుకొని కూర్చున్నాడు. ఆమె వచ్చుచున్నపుడు కనిపించక అదృశ్యముగా నున్న అతను, ఆ అమ్మాయి కాలుపట్టుకొన్నాడు. అపుడు ఆమె పొలము గట్టులో క్రిందపడింది. ఆ అమ్మాయి పడి తేరుకొని లేచే లోపల ఆమెలోనికి చేరుకొన్నాడు. చదువుతూవుంటే ఇదొక వింతగా ఉంది కదా! ప్రక్కన ఉండి చూచినట్లు చెప్పుచున్నావు, ఇదంతా నీకెలా తెలుసునని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి నా జవాబు ఇలా ఉంది.


ఆ అమ్మాయి పెద్దమ్మ ఇంటిలో నా ముందర కూర్చున్నపుడు ఆమెలో మార్పువచ్చింది కాలు, చేయి పని చేయలేదు, నోరు కూడ సరిగ పని చేయలేదు అని చెప్పాము కదా! అప్పుడు ఆమె శరీరములోనున్న కుంటి వాడు ఆమె శరీరము మీదికి వచ్చి మాట్లాడుచు, నేను ప్రశ్నించే కొద్దీ గతములో జరిగిన విషయమంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. అతడు చెప్పినదంతా వాస్తవమేనని తెలిసినది. కావున దానిని మీకు చెప్పాము. ఇదంతా విన్న తర్వాత నేను అడిగిన విధానము, అతను మాట్లాడిన విషయము ఇలా ఉంది.


నేను :- చిన్న వయస్సులోనున్న అందమైన అమ్మాయిని పీడించే దానికంటే ఆడవారుంటారు కదా! వారిలో ఎవరినైన తోడు చేసుకోకూడదా?

నీమాదిరి చనిపోయి దయ్యాలైన


కుంటివాడు:- నేను దయ్యాన్నే, వాళ్ళు దయ్యాలే, వారికి నేను కనిపిస్తా వుంటాను. నన్ను చూచి ఎవరు నా దగ్గరకు వస్తారు? నేనేమైనా మాట్లాడితే వాళ్ళే నన్ను తంతారు. అందువలన చనిపోయిన వారి జోలికి నేను పోలేదు. బ్రతికియున్నవారికి నేను ఎటూ కనిపించను. అందువలన వారిలోనికి దొంగగా చేరవచ్చును. చేరిన తర్వాత నా కోర్కెను తీర్చుకోవచ్చును. అందుకే ఈ అమ్మాయిలోనికి వచ్చాను.


నేను :- జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ అమ్మాయిని వదిలిపో, నీ జీవితము ఎటూ పాడైపోయింది. ఆమె జీవితమును ఎందుకు నాశనము చేస్తావు?


కుంటివాడు :- నాకు తోడు కావాలనే వచ్చాను. కొంత కాలము ఇలాగే ఈమెలో ఉండి, ఈమె బాగా బలహీనపడిన తర్వాత ఈమెను చంపేస్తాను. అపుడు ఈమె కూడ నా మాదిరి దయ్యమే అవుతుంది. అపుడు ఈమెకు నేనే పరిచయము కాబట్టి నాదగ్గరే ఉంటుంది. నాకు కాలు, చేయి సరిగ లేదు కదా! ఈమె తోడుంటే నన్ను పట్టుకొని నడిపించగలదు, ఏమైన పని చేసి పెట్టగలదు.


నేను :- ఎంతో మంచి భవిష్యత్తున్న అమ్మాయిని ఇలా చేయడము చాలా అన్యాయము. నీకు చాలా పాపము వస్తుంది, నేను చెప్పినట్లు విని ఈ అమ్మాయిని వదలిపో. లేకపోతే ఈ విషయములో నీమీద నాకు కోపము వస్తుంది.


---

కుంటివాడు :- పెద్దవాళ్ళు మీరే అలా అంటే ఎలా స్వామి! అవిటివాన్ని నేను బ్రతికేది ఎలా? నాకు ఆసరాగా ఎవరో ఒకరు ఉండాలి కదా! నేను ఏ మంత్రగాళ్ళవద్ద బయటికి వచ్చి మాట్లాడలేదు. కానీ మీ వద్ద మాత్రము అలా ఉండలేక పోయాను. మీ ముందర ఉండలేకపోతున్నాను. మీరు అనుకొంటే నాకు న్యాయమైనా చేయగలరు, అన్యాయమైనా చేయగలరు.


నేను :- నీకు న్యాయము చేస్తే, ఈ అమ్మాయికి అన్యాయము చేసినట్లు కాదా! ఇది నీకైనా పాపము పని కదా! నీవే ఆలోచించుకొని చెప్పు.


కుంటివాడు :- నేను ఆలోచించుకొని మీకు చెప్పేంతటివాడను కాను, మీరెలా చెప్పితే అలా చేస్తాను. ఈ అమ్మాయికి దైవజ్ఞానము మీద ఆసక్తి కలదు. అయినా స్వతంత్రముగావచ్చి తెలుసుకొనే అవకాశము లేదు. వాళ్ళ అమ్మ, నాన్నకు జ్ఞానమంటే సరిపోదు. ఇప్పుడు కూడ వాళ్ళకు తెలియకుండ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి జ్ఞానము తెలుసుకొనే దానికి వచ్చినది. నాకు కూడ జ్ఞానమును తెలుసుకోవాలనే ఉంది. ఈ అమ్మాయి నా దగ్గరుంటే ఇద్దరము వచ్చి జ్ఞానమును తెలుసుకోవచ్చును. ఈ అమ్మాయికి ఏ ఆటంకముండదు. నేను ఈమెను ఏ ఇబ్బంది పెట్టను. మీరు దయ తలచి నన్ను ఏమి అనవద్దండి, నాకు జ్ఞానము తెలుసుకొను అవకాశము ఇవ్వండి.


నేను :- ఒరే! నీవు నన్నే ఇరుకున పెడుతున్నావు. నీతి, న్యాయములు ప్రపంచ సంబంధమైనది. జ్ఞానము, ధర్మము దైవసంబంధమైనవని నేనే ఎందరికో చెప్పుచుంటాను. అలాంటపుడు ప్రకృతి సంబంధమైన నీతి, న్యాయముకంటే ఎక్కువ జ్ఞాన, ధర్మములకే విలువ ఇస్తాను. అందువలన నీవు అడిగిన దానికి సరియైన పరిష్కార మార్గము చెప్పుతాను నీవు అలాగే నడుచుకో. చెప్పమంటావా? నా మాటవింటావా?


కుంటివాడు :- జ్ఞానము ప్రకారము చెప్పే మీ మాటను తప్పనిసరిగ వింటాను. మీరు ఎలా చెప్పితే అలా చేస్తాను. నేను :- సరే, నీవు ఈ అమ్మాయిలో ఉండినా పరవాలేదు. కానీ ఈ అమ్మాయికి పెళ్ళి అయి సంతతికల్గిన తర్వాత నీ వెంట పిలుచుకొనిపో, అంతవరకు ఈమెను ఏ బాధ పెట్టకూడదు, నీవు చంపకూడదు. ఒకవేళ నామాట వినకపోతే నీకే మంచిదికాదు.


కుంటివాడు :- లేదు స్వామి మీ మాట జవదాటను. మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. ఇప్పటికే చేసుకొన్న పాపమును అనుభవించుచూ చస్తున్నా. మీ మాటను కాదంటే నాకు తిరుగులేని పాపము వస్తుంది.


సరే లోపలికి అణిగిపో. అని నేను చెప్పగానే అతను అణిగిపోవడము ఆ అమ్మాయికి జ్ఞప్తిరావడము జరిగినది. అప్పుడు నీవు జ్ఞానము తెలుసు కొంటూవుంటే నీకు మంచి జరుగుతుందని ఆమెకు చెప్పి వచ్చేశాము. తర్వాత కొంత కాలమునకు ఆమెకు పెళ్ళి కావడమూ, ఆ తర్వాత కొంత కాలమునకు గర్భము రావడము జరిగినది. అబ్బాయిని ప్రసవించిన తర్వాత ఆమె చనిపోవడము కూడ జరిగినది. తర్వాత కొంత కాలమునకు ఆమె చనిపోయినట్లు నాకు తెలిసింది. బ్రతికినవారే మర్యాద ఇవ్వని ఈ కాలములో చచ్చినవాడైనా, కుంటివాడైనా నామాట మీద గౌరవముతో అతను నడుచుకొన్నందుకు సంతోషించాను.


ఈ సంఘటనను చదివిన తర్వాత, మీకు ఎన్నో అనుమానములు, ఎన్నో ప్రశ్నలు వచ్చియుండవచ్చును. కొన్ని సంశయములు తీరుటకు నా గురించి కొంత వివరము చెప్పదలుచుకొన్నాను చూడండి. నేను మంత్రగాడిని కాదు,


---

నాకు ఏ మంత్రములు రావు. నా వద్ద శక్తివంతమైన మూలికలు (బదనికలు) గానీ, తావెత్తులు గానీ ఉండవు. నావద్ద ఉన్నదంతా ఒకే ఒక దైవజ్ఞానము. నాలోయున్న జ్ఞానమునుబట్టి దయ్యములు బయటపడడము, వాటంతటకవే బయటికి వచ్చి మాట్లాడడము జరిగింది. కొన్ని చోట్ల దయ్యములు వెంట్రుకలు విరబోసుకొని ఊగడమూ, కళ్ళుపెకిలించి చూడడము ఉంటుంది. కానీ నావద్ద ఎవరూ అలా ప్రవర్తించ లేదు. మామూలుగా మనుషులు మాట్లాడినట్లే మాట్లాడడమూ, అదియు భయ భక్తులతో ఉండడము జరిగినది. మేము దయ్యములకు కూడ జ్ఞానమే చెప్పినాము. వారు కూడ విని, జీవితమును మంచి మార్గములో గడుపుతా మని చెప్పిపోయారు. నా జీవితకాలములో దయ్యములతోనే కాక కొంతమంది దేవతలతోను, గొప్ప శక్తులతోను మాట్లాడడము జరిగినది. తర్వాత వాటన్నిటిని వివరిస్తాను. ఇపుడు అందరికి వచ్చు ప్రశ్నలను వ్యక్తపరచి దానికి జవాబు వ్రాస్తాను చూడండి.


ప్రశ్న :- ఒక మనిషి శరీరములోనికి మరొక మనిషి దయ్యము ప్రవేశించి మాట్లాడుచున్నపుడు మొదటి మనిషి ఏమై ఉంటాడు? వాని పరిస్థితి ఏమిటి?


జవాబు :- ఈ విషయము తెలియాలంటే సజీవ శరీరమును గురించి పూర్తిగా తెలిసియుండాలి. బయటికి కనిపించే శరీరము యొక్క పది భాగములు అందరికి తెలుసు. కనిపించని శరీరము (దయ్యము) యొక్క పదిహేను భాగములను గురించి తెలుసుకొంటే ఈ విషయము సులభముగా అర్థమగును. కనిపించని భాగములలో ముఖ్యముగ మనస్సు, జీవుడు శరీరములో ఎక్కడున్నది, ఏమి చేయుచున్నది తెలుసుకోవాలి. జీవుడు తల మధ్యభాగములోనున్న బ్రహ్మ,కాల,కర్మ,గుణచక్రములలో క్రిందగల గుణచక్రములో ఉన్నాడు. జీవుడు అక్కడ ఉండి అక్కడికే వచ్చిన విషయములను తెలుసుకోవడము, అనుభవించడము జరుగుతున్నది. జీవునికి తానున్న గుణచక్రము వరకు రాని విషయములు ఏవీ తెలియవు. ఇక మనస్సు విషయానికి వస్తే, మనస్సు శరీరములో రెండు విధములుగా వ్యాపించియుంటుంది. ఒక విధము మెలకువలో శరీరమంతా మనస్సు వ్యాపించియుంటుంది. రెండవ విధము శరీరమంతా వ్యాపించిన మనస్సు నిద్రలో ముకుళించుకొని ఒక చిన్న ఉంటగా ఏర్పడి బ్రహ్మనాడిలో చేరిపోవును. మెలకువలో శరీరమంతా వ్యాపించి, శరీర ఆకారమును పోలియున్న మనస్సు నిద్రలో ఒక్కచోట చేరిపోయి గుండ్రని ఉంటగా తయారగుచున్నది. మనస్సు సంకోచము చెందుటకు మొదలు పెట్టినపుడు కొందరికి ఆవులింపులు రావడము జరుగుచుండును. మనస్సు శరీరమునుండి ముడుచుకొని బ్రహ్మనాడిలో చేరిపోయినపుడు శరీరము నుండి జీవునికి ఏ విషయములు తెలియవు. ఎందుకనగా శరీరమునుండి వచ్చు సమాచారమును దేనినైనా శరీరమంతా వ్యాపించియున్న మనస్సే జీవునికి తెలుపవలసియున్నది. మనస్సు శరీరమంతాలేనపుడు జీవునికి సమాచారముండదు.


ఇటు మెలకువలోగానీ, అటు నిద్రలోగానీ శరీరమంతా ఆత్మ వ్యాపించియుండి శరీరమును నడుపుచున్నది. నిద్రలో జీవునికి శరీరముతో సంబంధము తెగిపోవుచున్నది. అలాగే మనస్సుకు కూడ శరీర సంబంధము లేదు. నిద్రలో మనస్సు, జీవుడు ఇద్దరు విశ్రాంతి తీసుకొంటున్నారు. ఒక్క ఆత్మ మాత్రము నిద్రలోను, మెలకువలోను ఒకే స్థితిలో ఉన్నది. మనస్సు శరీరమంతా వ్యాపించి, మెలకువగా ఉన్నపుడు బయటి విషయములను జీవుని వద్దకు చేర్చడమూ మరియు వాటిని జ్ఞప్తికి పెట్టుకోవడము జరుగు చున్నది. మనస్సు శరీరము మీద లేనపుడు శరీరములోని విషయములు ఏవీ మనస్సుకు తెలియవు. అందువలన నిద్ర పోయిన తర్వాత శరీరము ఎటు తిరిగి పడుకొనినది, ఏ ప్రక్కకు కదిలినది ఏమాత్రము మనస్సు జ్ఞాపకములో ఉండవు. అట్లే జీవునికి కూడ ఏమి తెలియదు. ఈ విధముగా ఒక శరీరములోని నిద్ర, మెలకువల విధానమున్నది.


---

ఒక మనిషి నిద్రపోవుచున్నపుడు అందులోని జీవునికి, మనస్సుకూ ఆ శరీరముతో సంబంధము లేదు. కావున ఆ సమయములో ఆ శరీరము ఏ జీవునికైనా, ఏ మనస్సుకైనా ఉపయోగపడవచ్చును. ఈ సూత్రము ప్రకారము ఒక శరీరములోని మనస్సును నిద్రలోనికి త్రోసి, మరొక జీవుని మనస్సు శరీరమును ఆక్రమించుకోవడమును ‘పూనకము’ లేక 'ఆవహించడము' అంటాము. ఇపుడు పైన అడిగిన ప్రశ్నకు దాదాపు జవాబు వచ్చినట్లే. ఒక శరీరములోనికి దయ్యము చేరితే, ఆ మనిషిలో నున్న మనస్సు నిద్రలోనికి, జీవుడు విశ్రాంతిలోనికి పోవుచున్నాడు. శరీరము మీద దయ్యము ఉన్నంతవరకు, ఆ జీవునికి ఏమి తెలియదు. దయ్యము ఉన్నపుడు ఏమి మాట్లాడినది, ఏమి చేసినది తెలియదు. అందువలన దయ్యము వదలి పోయిన తర్వాత అక్కడ గుంపుగా చేరిన మనుషులను చూచి ఏమి జరిగినదని, దయ్యము వదిలిన మనిషి అడుగుచున్నాడు.


ప్రశ్న :- ఒక మనషి శరీరములోనికి దయ్యము చేరి లోపలేవుండి ఎప్పుడైనా శరీరము పైకి వచ్చి మాట్లాడుచున్నదని తెలిపారు. యాడికిలో కుంటి దయ్యము అమ్మాయి శరీరములోనికి చేరి శరీరములోనే ఉంటూ యువతిని అనారోగ్యము పాలు చేసిందని, ఎక్కడ బయటికి రాలేదని మీ ముందు బయటికి వచ్చిందని చెప్పారు. అలా శరీరము లోపల ఎలా ఉండగలిగింది? ఎక్కడ ఉండగలిగింది? వివరముగా చెప్పండి.

జవాబు :- దయ్యములు (సూక్ష్మ శరీరములు) ఒకమారు శరీరములో చేరి లోపలే ఉండి, అప్పుడప్పుడు లేక ఎప్పుడైనా పైకి వచ్చి మాట్లాడునవి ఒక రకము ఉండగా, కొన్ని అవసరము వచ్చినపుడు మాత్రము శరీరములోనికి చేరి, బయటికి వచ్చి మాట్లాడునవి ఉన్నవి. ఇక మూడవ రకము ఎలా ఉండుననగా! శరీరములోనికి చేరిన దయ్యము అప్పుడప్పుడు శరీరము పైకి వస్తూ పోతూ, ఏదో ఒకమారు పైకి వచ్చినది తిరిగి శరీరములో అణిగి పోదు. ఆ శరీరములో మొదటినుండి ఉన్న జీవున్ని శాశ్వితముగా నిద్రలోనే ముంచివేసి, తానే శరీరమును వాడుకొనుచు, ఎవరికి అనుమానము రాకుండ శాశ్వితముగా శరీరము పైనే ఉండి, మొదటివానివలె నటిస్తూ, అందరిలో కలిసిపోవును. ఇక నాల్గవరకము, ఒకమారు శరీరములోనికి చేరిన తర్వాత ఒకసారి కూడ పైకి రాకుండ, శాశ్వితముగా శరీరములోనే ఉండి పోవునవి కలవు. కొన్ని నేరుగా శరీరము మీదకే వచ్చి తిరిగి బయటికి పోవునని చెప్పాము కదా! అవి శరీరములో ఉండు అవసరములేదు. ఇలాంటి ఒక రకము దయ్యములు తప్ప మిగతావి మొదట శరీరములోనికి చేరునని చెప్పాముగ! అలా చేరినవి శరీరములో ఏదో ఒక భాగములో నిలిచి యుండును. అలా శరీరములో దయ్యము ఎక్కడ నిలిచియుండునో అక్కడ శరీరమునకు బాధకల్గుచుండును, లేదా అక్కడి భాగము అనారోగ్యమునకు గురియగును. ఒక వ్యక్తిలో ప్రవేశించిన దయ్యము శరీరములోపలగానీ, లేక శరీరము పైనగానీ ఉండవలసిందే. శరీరము పైన ఉంటే అనారోగ్యము ఉండదు. కానీ శరీరములోపల ఉన్నపుడే అనారోగ్యము ఆ వ్యక్తికి కనిపించును.


ప్రశ్న :- దయ్యములు శరీరములో నివసిస్తే అనారోగ్యము కల్గునని చెప్పారు కదా! ఎటువంటి అనారోగ్యము వస్తుంది? అది ఏ రోగముగా అయినా కనిపిస్తుందా?


జవాబు :- దయ్యము శరీరములో ఉండగా వచ్చు అనారోగ్యములు అనేక రకములుగా ఉండును. ఒక రకము అనారోగ్యము అంటేనే ఒక రక రోగమని అర్థము. కావున దయ్యము వలన వచ్చు అనారోగ్యములు అనేక రోగముల రూపములో ఉండును. మనిషికి ఒక రోగము ఉంది అంటే అది దయ్యము వలన కావచ్చును లేక శరీరము యొక్క లోపము వలన అయినా కావచ్చును. పార్శవాయువులు లేక పక్షవాత వాయువులు నూటికి డెభ్భై శాతము దయ్యముల


---

వలన వచ్చుచున్నవి. కడుపు నొప్పి నూటికి యాభై శాతము సూక్ష్మశరీరముల వల్లనే వచ్చుచున్నవి. ఇలా అనేక రకాల రోగాలు అనేక శాతములుగా దయ్యముల వలననే కల్గుచున్నవి.


ప్రశ్న:- దయ్యాల వలన కలిగే రోగాలు నయము అవుతాయా?


జవాబు :- దయ్యము వలన కల్గు ఏ జబ్బు అయినా, ఏ బాధ అయినా మందుల వలన పోదు. వాటి వలన వచ్చు రోగాలు ఏవో కొన్ని మాత్రము మంత్రములకు, అంత్రములకు పోవును. చాలా రోగాలు అంత్ర, మంత్రములకు కూడా పోవు. అటువంటి రోగాలు దైవజ్ఞానము వలననే పోవును. దైవజ్ఞానము లేనివారికి మరణము తప్పదు.


ప్రశ్న:- దయ్యములు ఎవరిలోనైనా చేరునా? లేక కొందరిలో మాత్రము చేరునా?


జవాబు :- దయ్యములు అందరిలో చేరలేవు. దైవజ్ఞానమున్న వారిలో ఏమాత్రము చేరలేవు. దైవజ్ఞానము లేనివారిలో కూడ కొందరిలో మాత్రము చేరగలవు. ఎవని జాతకములో బుధగ్రహము వ్యతిరేఖమై, వాని ఆరవ స్థానములో ఉండినా లేక ఆరవస్థానమును చూచినా వానికి దయ్యముల బాధలు జీవితములో తప్పవని చెప్పవచ్చును. ఇక దైవజ్ఞానము లేకున్నా వానికి బుధగ్రహము అనుకూలమై ఉన్నపుడు వానికి దయ్యముల పీడ ఉండదు.


ప్రశ్న:- దయ్యము వలన వచ్చు రోగము ముదిరిపోయి మరణము కూడ రావచ్చునా?


జవాబు :- చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని దయ్యములు ఫలానా దినానికి చంపివేస్తానని చెప్పి, చంపినవి కూడా కలవు.


ప్రశ్న :- దయ్యము వలన వచ్చిన రోగమును డాక్టర్లు ఇది ఫలానా అని చెప్పలేరా?


జవాబు :- డాక్టర్లు రోగము పేరు చెప్పగలరు. కానీ ఎలా వచ్చింది చెప్పలేరు. తమ మందులు ఎందుకు పనిచేయనిది కూడ చెప్పలేరు. డాక్టర్లకు అర్థముగాని క్రొత్త రోగాలను కూడ మరొక జాతి దయ్యములు మనుషులకు వచ్చేటట్లు చేయగలవు. అటువంటపుడు ఒక్క దైవజ్ఞానము తప్ప ఆ రోగాలకు మందేలేదు. అన్నీ బాగున్నపుడు జ్ఞానముతో నాకేమి అవసరమని అనుకొన్న వాళ్ళను దయ్యములు భయంకరముగా తమ రోగాలతో చంపివేస్తాయి.


ప్రశ్న:- దయ్యాలలో జాతులున్నాయా?


జవాబు :- మనుషులు మరియు ఇతర జీవరాసులనుండి అకాలమరణము వలన తయారైన దయ్యములన్నీ ఒక జాతిక్రిందకి వస్తాయి. మనుషులు ఆరాధించు దేవతలందరు మరొక జాతి దయ్యములుగా ఉన్నవి. ఇటు జీవరాసులు, దేవతలు కాక, మహాభూతములనబడునవి కూడ ఒకజాతిగా చెప్పవచ్చును. జీవరాసుల దయ్యముల శక్తి పరిమితముకాగ, దేవతలనబడు దయ్యముల శక్తి చాలా గొప్పది. ఇక మహాభూతములనబడు వాటి శక్తి అపరిమితమైనది.


ఇంతవరకు చెప్పిన జవాబులకు తగిన విధముగా మూడు రకాల జాతుల వలన జరిగిన యదార్థ సంఘటనలను వివరిస్తాము చూడండి. ఇక్కడ చెప్పు సంఘటలన్ని నాకు ప్రత్యక్షముగా తెలిసినవే. ఎవరో చెప్పితే వ్రాసినవికావు. జరిగిన సంఘటన పూర్తి వివరము నాకు తెలిసినా, కొన్ని చోట్ల ప్రాంతము పేర్లు, ఊరిపేర్లు వ్రాసి, వ్యక్తుల పేర్లు వ్రాయలేదు. పేర్లు వ్రాయడము వలన ఆ వ్యక్తులకు గౌరవలోపము ఏర్పడునని మేము వ్రాయలేదని ముందే తెల్పుచున్నాము.


--

ఇపుడు తెలుపు సంఘటన ఒక దయ్యము కక్షసాధింపుకు మాసిపోని గుర్తుగా ఉన్నది. ఇది ఒక ఆసక్తిగల కథలాగ ఉంటుంది చూడండి.


1978వ సంవత్సరములో నేనొక ప్రవేటు డాక్టరుగా కాలము గడుపుచున్నాను. అపుడు ఆ పని చేయడము బ్రతుకుతెరువుకు కాదు. వచ్చే రోగులలో ఎంతమందికి శరీరములో సహజముగా వచ్చిన రోగాలున్నాయి, ఎంతమందికి దయ్యముల వలన వచ్చిన రోగాలున్నాయి? అని తెలుసుకొను నిమిత్తము పని చేయుచుంటిని. సహజముగా వచ్చిన రోగాలనైనా రోగికి ఖర్చు లేకుండా సులభముగా రోగము పోవు విధానమును శోధించుచుంటిని. అటువంటి సమయములో మా ఇంటివెనుక చెట్టుక్రింద 70 సంవత్సరముల ఒక ముసలి వ్యక్తి చిన్న పిల్లలకు ప్రవేటుగా చదువు చెప్పుచు, నెలకు వారిచ్చు కొద్దిపాటి డబ్బుతోనే కాలము గడుపుకొనేవాడు. వాస్తవానికి అతనిది దయనీయస్థితి. 30 మంది పిల్లలు ఒక్కొక్కరు ఐదు రూపాయలిచ్చినా నెలకు 150 రూపాయలే అతని ఆదాయము. ఇప్పటి కాలముతో లెక్కించినా 450 రూపాయల విలువే అవుతుంది. రెండు లేక మూడు రోజులకొకమారు అతని కొడుకు వచ్చి పదిపైసలో, పావలానో ఇప్పించుకొని పోయేవాడు. కొడుకు అంటే చిన్నపిల్లవాడు కాదు. దాదాపు 30 సంవత్సరముల వయస్సున్నవాడు. ఆ వయస్సువాడు ముసలి తండ్రికి డబ్బులివ్వాలి, కానీ తండ్రి దగ్గరే డబ్బులు తీసుకుపోవడమేమిటని అనుకోవచ్చును. కానీ అతని పరిస్థితి అటువంటిది. అతనికి కుడికాలు, కుడిచేయి పార్శవాయువువలన పడిపోయాయి, నోరు కూడ అలాగే సొట్టగ ఉండి మాట సరిగా రాదు. అతి కష్టముగా నడుస్తూ బజారులో డబ్బులు అడుక్కొనే వాడు. అడుక్కొన్న డబ్బులతో కాలము గడుపుకొంటూ అప్పుడప్పుడు తండ్రి వద్దకు కుంటుతూ వచ్చేవాడు.


అతని పరిస్థితిని చూచిన నేను, మూలికా ఔషధమును ఉపయోగించి అతని కాలు, చేయిని కొంతవరకైనా బాగుచేయాలనుకొన్నాను. అతనిని పిలిచి నీకు మేము అన్నము పెట్టుతాము, వైద్యము కూడ చేస్తాను ఇక్కడే ఉ ండమని చెప్పి, మాసిన గుడ్డలు తీయించి క్రొత్త గుడ్డలు ఇచ్చాము. పెరిగిన తలను గుండుగీయించి శుభ్రముగా ఉ ండునట్లు చేసి, మందు ఇచ్చి తినమన్నాము. ఇచ్చిన మందుకు పది రోజులకు దాదాపు సగము మార్పు కనిపించాలి. కానీ ఏ కొద్దిమార్పు కూడ కనిపించలేదు. కావున అతనిని ప్రత్యేకముగా చూడాలనుకొన్నాను. ఒక రోజు ఉదయము 9 గంటలకు నా ముందర కూర్చోమన్నాను. అతని వైపు నిఘాగా చూచాను. అలా చూస్తున్నపుడు చలనములేని అతని కుడిచేయి దానంతట అదే పైకి లేవను మొదలు పెట్టింది. కుడి చేయిని అతను భుజము వరకు ఎత్తాడు. అపుడు నీవు స్వయముగా ఎత్తుచున్నావా అని అడిగాను. లేదు అదే లేస్తున్నదని అతను చెప్పాడు. అప్పుడు అతని శరీరములో వేరెవరో ఉన్నట్లు నాకు అర్థమైనది. అపుడు లోపలున్న వ్యక్తి బయటికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పాను. వెంటనే లోపలనున్న వాడు శరీరము మీదికి వచ్చి మాట్లాడడము జరిగినది. అప్పుడు శరీరము పైకి వచ్చిన అతను చెప్పిన మాటలను బట్టి నాకు తెలిసిన సమాచారము ఈ విధముగా ఉన్నది.


కడప జిల్లా మడూరు అను ఊరిలో విశ్వబ్రాహ్మణ (వడ్రంగి) కులమునకు చెందిన ఒక కుటుంబము ఉండెడిది. అప్పటి కాలములో ఆ ఊరు ఎద్దులబండ్లు చేయడములో ప్రసిద్ధి. వారు వడ్రంగి వారే కావున కొయ్యపని చేయడములో ప్రావీణ్యత పొంది బాగానే బ్రతికెడివారు. ఆ కుటుంబములో తల్లి,తండ్రి, 16 సంవత్సరముల కొడుకు ఉండెడివారు. కొడుకు పేరు రామాచారి, తండ్రి పేరు నారాయణాచారి. కొడుకు రామాచారి బండ్ల పనులు చేయుచు బాగా సంపాదించెడివాడు. రామాచారికి బాల్యము నుండి ఒక స్నేహితుడు ఉండెడివాడు. అతని పేరు ప్రభుదాస్, అతను హరిజనుడు. అతను క్రైస్తవ మతములోనికి చేరి ప్రభుదాస్ గా పేరు మార్చుకొన్నాడు. రామాచారి కూడ స్నేహితుని


---

మాటలు విని క్రైస్తవ మతమును స్వీకరించాడు. వీరిరువురు బాల్య స్నేహితులు కావున యుక్తవయస్సులో కూడ వారి స్నేహము బాగా కొనసాగేది. అప్పటికి ఇటు రామాచారికి, అటు ప్రభుదాసుకు ఇద్దరికి పెళ్ళి కాలేదు. ఇరువురిలో మొదట ప్రభుదాసుకు పెళ్ళికుదిరింది. ప్రభుదాసుకు పెళ్లై ఒక సంవత్సరము గడచిపోయినది. రామాచారి అప్పుడప్పుడు ప్రభుదాసు ఇంటికి వెళ్ళి స్నేహితునితో కలిసి వచ్చెడివాడు. అట్లున్న సమయములో రామాచారికి ప్రభుదాస్ భార్యతో అక్రమసంబంధము ఏర్పడినది. ఒక దినము ప్రభుదాస్ ఇంటిలో లేని సమయములో రామాచారి ప్రభుదాస్ భార్యతో కలిసి పడకలో ఉండడమును అప్పుడే బయటినుండి వచ్చిన ప్రభుదాస్ చూచాడు. ప్రభుదాస్ చూచిన విషయము ప్రభుదాస్ భార్యకుగానీ, రామాచారికిగానీ తెలియదు. తనకు ముఖ్యమైన బాల్య స్నేహితుడు, తన భార్యతో అక్రమ సంబంధము ఏర్పరుచుకోవడము ప్రభుదాస్కు ఒక షాక్ తగిలినట్లయింది. దానికి తట్టుకోలేక అదే రోజు ప్రభుదాస్ బావిలో దూకి చనిపోయాడు. ప్రభుదాస్ ఎందుకు చనిపోయినది కూడ రామాచారికి తెలియదు.



ప్రభుదాస్ చనిపోయిన తర్వాత ఆరు నెలలకే రామాచారికి పెళ్ళి అయినది. పెళ్ళి అయిన ఆరు నెలలకే రామాచారి ఆ ఊరు వదిలి కుటుంబముతో సహా అనంతపురము జిల్లా తాడిపత్రికి చేరాడు. తాడిపత్రిలో వడ్రంగి పని చేస్తు డబ్బును బాగా సంపాదించను మొదలుపెట్టాడు. రామాచారి అన్ని విధముల సుఖముగా కాలము గడుపుచున్నాడు. తాడిపత్రి చేరిన తర్వాత ఒక సంవత్సరమునకు రామాచారి ఒక దినము తన సొంత ఊరుకు కుటుంబముతో కలిసి పోయాడు. అప్పటికి ప్రభుదాస్ చనిపోయి రెండు సంవత్సరములైనది. ప్రభుదాస్ కాలమరణము కాకుండ అకాల మరణము పొందాడు, కావున అతను సూక్ష్మశరీరముతో జీవించియే ఉన్నాడు. ఇటు స్థూలశరీరమును, అటు భార్యను పోగొట్టుకొన్న ప్రభుదాస్ భార్యా సమేతముగా వచ్చిన రామాచారిని చూచాడు. స్నేహితుడు చేసిన ద్రోహము వల్లనే నేను ఇలా అన్ని రకముల చెడిపోయానని రామాచారి మీద కోపము వచ్చింది. రామాచారి బంగారు ఉంగరాలు, మెడలో గొలుసు కల్గి భార్యతో సంతోషముగా ఉన్నాడు, నేను ఎటు కాకుండ పోయాను. దీనికంతటికి కారణమైన రామాచారిని వదలకూడదు. అతనిని సుఖముగా బ్రతకనివ్వకూడదని, ప్రభుదాస్ ఒక రోజంతా ఆలోచించి నిర్ణయము తీసుకొన్నాడు. మరుసటి దినము రామాచారి తిరిగి తాడిపత్రికి వచ్చాడు. అందువలన ప్రభుదాస్కు రామాచారి మడూరులో కనిపించలేదు. ప్రభుదాస్ రామాచారియున్న తాడిపత్రికే పోయి కక్షను సాధించాలనుకొన్నాడు. అలా అనుకొన్న రెండవరోజే బయలుదేరి తాడిపత్రికి వచ్చాడు. తాడిపత్రిలో రామాచారి ఎక్కడున్నది ప్రభుదాసు తెలియదు. అందువలన పది రోజులు ఊరంతా వెదికాడు, కానీ రామాచారి ఎక్కడా కనిపించలేదు. చివరికి పదకొండవ దినము రామాచారి, ప్రభుదాస్ కంటబడ్డాడు.


పదిరోజులుగా రామాచారిని వెదికిన ప్రభుదాస్, పదకొండవ దినమున రాత్రి 7-30 గంటలకు రైల్వేస్టేషన్ వద్ద బయలుదేరి తాడిపత్రి వైపు రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుండగా, సరిగా 8 గంటలకు రామాచారి ప్రభుదాస్కు కరెంటుసబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తూ కనిపించాడు. చేతిలో మిక్చర్ పొట్లము పట్టుకొని రామాచారి నడుస్తూ రావడము ప్రభుదాస్ చూచి, రామాచారి వెంట అతని వెనకే వచ్చాడు. రామాచారికి, ప్రభుదాస్ విషయము ఏమీ తెలియదు. ప్రభుదాస్ సూక్ష్మశరీరముతో ఉన్నాడు, కావున ప్రభుదాసు రామాచారి ఎదురైన విషయముగానీ, ప్రభుదాస్ తన వెంట వస్తున్నట్లుగానీ రామాచారికి ఏమాత్రము తెలియదు. ఎలక్ట్రికల్ సబ్స్టేషను నుండి అర్థకిలోమీటరు దూరములో, శ్రీనివాసపురములోనున్న తన ఇంటికి రామాచారి వచ్చి, భార్యకు మిక్చరొట్లమిచ్చి స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాడు. పదిహేను నిమిషములలో నీళ్ళు రెడీకాగా, బాత్రూమ్లోనికి రామాచారి పోయాడు. అప్పుడు


---

ప్రభుదాస్ కూడ రామాచారి వెంట బాత్రూమ్లోనికి పోవడము జరిగినది. రామాచారి చెంబుతో నీళ్ళు తీసుకొని మీద పోసుకొన్నపుడు, ప్రభుదాస్ రామాచారి శరీరములోనికి ప్రవేశించాడు. అపుడు వెంటనే రామాచారి బాత్రూమ్లో క్రిందపడిపోయి అపస్మారక స్థితి (కోమా) లోనికి వెళ్ళిపోయాడు. రామాచారి జ్ఞప్తిలేకుండ పలుకనిస్థితిలో ఉండడము అతని భార్యచూచి, వెంటనే హస్పిటలు తీసుకుపోయారు. అక్కడ రెండు రోజులు కోమాలోనే రామాచారి ఉండిపోయాడు. మూడవ రోజు కొద్దిగ జ్ఞాపకము వచ్చింది. మూడవ రోజుకు తేరుకొన్న అతనికి కాలు, చేయి, నోరు మొత్తము కుడిప్రక్క శరీర భాగమంతా శక్తి లేకుండ పోయినట్లు అతని భార్యకు, తండ్రికి తెలిసింది. డాక్టర్లు పెరాలసిస్ (పార్శవాయువు) వచ్చిందని చెప్పారు. అప్పటినుండి రామాచారి మంచములోనే పేషెంట్గా ఉండిపోయాడు. అతని వైద్యము కొరకు సంపాదించుకొన్నదంతా పోయింది. రామాచారి కొంతకాలానికి కొద్దిగా నడువగలిగాడు. కానీ కుడిచేయి కొద్దిగా కూడ కదిలేది కాదు. ఏదైనా తినాలంటే ఎడమచేతితో తినేవాడు. ఏమి చేతగాని వానిగా మారిపోయిన రామాచారిని చూచి, అతని భార్య అతనిని వదలి వెళ్ళి పోయింది. చివరికి ఇటు సంపాదించుకొన్న డబ్బును, అటు చేసుకొన్న భార్యను పోగొట్టుకొని కుంటివానిగా మిగిలి పోయాడు. తనను ఆదరించువారు ఎవరూ లేక పోవడము వలన చివరికి రామాచారి సమాజములో అడుక్కొని బ్రతకవలసి వచ్చినది.


తలమాసి, గుడ్డలు మాసి, తిండిలేని సమయములో నాకు కనిపించాడు. అతనికి పార్శవాయువు వలన ఆ విధముగా ఉన్నాడని తలచిన నేను, అతని కాలుకు, చేతికి చికిత్స చేయాలని నా వద్ద పెట్టు కోవడము జరిగినది. ఆ రోగము మీద అనుమానము వచ్చి చూడగా అతనిలో ప్రభుదాస్ బయటపడ్డాడు. అలా శరీరము మీదకి వచ్చిన ప్రభుదాస్ స్వయాన చెప్పినపుడు రామాచారి యొక్క ఇంత చరిత్ర తెలిసింది. ఇదేదో కథ అని అనుకోవద్దండి. నా ముందర నాకు తెలిసిన యదార్థ సంఘటన ఇది.


ఇదంత విన్న తర్వాత ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో చెప్పలేక పోయాము. రామాచారికి ప్రభుదాస్ వలన తనకు ఇలా జరిగిందను విషయము తెలియదు. ఆ విషయము ప్రభుదాస్ మొదట బయటికి వచ్చి నాకు చెప్పాడు. ఆ సమయములో మా ప్రక్కన ఎవరూ లేరు, కావున ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అపుడు నేను ప్రభుదాస్తో ఇలా చెప్పాను.



నేను :- ప్రభుదాస్! నీవు తొందరపడి చనిపోవడము నీవు చేసిన పెద్దతప్పు. దేవుడిచ్చిన జీవితమును, కొద్దిరోజుల క్రిందట వచ్చిన భార్యకోసము వదలు కోవడము పొరపాటు. సమస్యకు పరిష్కారము చావుకాదు. కొంత ఆలోచించి ఉండవలసింది. నీవు చనిపోయిన దానివలన అప్పుడు రామాచారికి ఏ నష్టము కలుగలేదు. నీ జీవితమే  నాశనమైపోయింది. దానికి నీకు కక్ష ఏర్పడి, అది అతనికి శిక్ష అయినది. ఇదంతటిని చూస్తే రామాచారిది మొదటి తప్పు, తర్వాత నీది రెండవ తప్పు. నీ భార్య పోయింది వేరే వారివద్ద వుంది. అలాగే రామాచారి భార్య పోయింది వేరే వారివద్ద వుంది. బాహ్య జీవితము పోయింది, సూక్ష్మజీవితము మిగిలింది. అలాగే అతని జీవితము నాశనమైంది, కుంటి జీవితము మిగిలింది. అలాగే అతని జీవితము నాశనమైంది, నీవు చచ్చి బ్రతుకు చున్నావు. ఇతను బ్రతికి నిత్యము చస్తున్నాడు. మీరు ఇద్దరు పోయిన జన్మలలో చేసుకొన్న పాపమును ఈ రూపములో అనుభవిస్తున్నారు. కొన్ని సంవత్సములకు రామాచారి నావద్దకు వచ్చాడు, కావున నేను నీకు చెప్పునది ఏమంటే ఇక ఇతనిని నీవు వదలిపెట్టిపో. వదలి పోయిన తర్వాత దైవజ్ఞానము తెలుసుకో, నీ జీవితమునకు ఒక అర్ధము, పరమార్థము ఏర్పడుతుంది.


ప్రభుదాస్ :- మీరు గొప్పవారు, ఇతని మీద నాకు ఎంత కోపమున్నా మీరు చెప్పినట్లు ఇతనిని వదలిపోతాను. నేను


--

ఇంతవరకు మెడ ప్రక్క నరమువద్ద చేరి అక్కడి నరమును అదిమి పట్టాను. ఆ నరము దాదాపు పూర్తిగా చెడిపోయినది. అందువలన నేను వదలిపోయినా ఇతను పూర్తిగా నడువలేడు. ఇప్పటికంటే కొంచెము బాగ నడవగలడు. అలాగే చేయి కొద్దిగ పైకి లేవగలదు. అదియు మీ ముందర ఎంత లేచిందో అంతే లేవగలదు. చేయి పూర్తిగా నోటివద్దకు పోలేదు. చేతితో అన్నము తినలేడు. ఇప్పటికి 75 శాతము ఇతని నరము దెబ్బతిని పోయింది. కావున మిగిలిన 25 శాతము మాత్రము నయము కాగలదు. మీరు చెప్పినట్లు నేను దేవుని జ్ఞానమును తెలుసుకొనే దానికి ప్రయత్నిస్తాను. ఇపుడు మా ఊరికి పోయి, అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి జ్ఞానము తెలుసుకొంటాను. నమస్కారము, అని చెప్పి ప్రభుదాస్ రామాచారి శరీరమునుండి బయటికి పోయాడు. అపుడు రామాచారికి జ్ఞాపకము వచ్చినది. అంతసేపు తాను నిద్రపోయానని అనుకున్నాడు. అప్పుడు రామాచారిని చూచి ఇలా అన్నాను. “నీకు పూర్తి బాగుకాదు, కొంతవరకు నడువగలవు, అలాగే చెయ్యి కొంత ఎత్తగలవు, మాట కొద్దిగ బాగరాగలదు. ఇక నీవు ఇక్కడినుండి వెళ్ళి పోవచ్చును.” అని చెప్పి పంపివేశాను. ఈ సంఘటను అంతా గమనిస్తే రెండు కుటుంబాలు, రెండు నిండు జీవితాలు నిలువునా నాశనమైనట్లు అర్థమగుచున్నది. ఇక్కడ భూమి మీద దయ్యములు లేవు అనే వారంతా ఏమి చెప్పగలరు? జరిగిన పై సంఘటనలో ఏదీ అసత్యము లేదు. ప్రభుదాస్ చెప్పినది బయటికి చెప్పకుండ, రామాచారి తండ్రిని అడిగితే అతను చెప్పిన దానికి ప్రభుదాస్ చెప్పిన దానికి పూర్తిగా సరిపోయింది. అటువంటపుడు ప్రభుదాస్ కనిపించని సత్యము, రామాచారి కనపడే సత్యము, రామాచారి తండ్రి జరిగిన సత్యమునకు సాక్ష్యము. కావున దీనిని ఎవరూ అసత్యమన లేరు, అలాగే దయ్యములు అసత్యమనుటకు వీలులేదు. మేధస్సుయున్న వారు హేతువాద దృష్ఠితో సత్యమును గ్రహించమని కోరుచున్నాము.


అనుభవానికి వచ్చేది ఏదైనా విజ్ఞానమే అవుతుంది. ఒక విధానమును వివరముగా తెలుసుకోవడమును జ్ఞానము అంటాము. జ్ఞానము ప్రకారము ఆచరించి నిరూపణకు వస్తే, అపుడు దానిని విజ్ఞానము అంటాము. ఆచరణకుగానీ, అనుభవానికిగానీ రాని విషయ వివరము జ్ఞానమే కాదు. దీనినిబట్టి జ్ఞానము తెలిసేదైతే విజ్ఞానము అనుభవించేది అని చెప్పవచ్చును. అందువలన జ్ఞానమునకు, విజ్ఞానమునకు అవినాభావ సంబంధము కలదని చెప్పవచ్చును. మేము చెప్పునవి సత్యమైనవి, అనుభవరీత్య జరిగినవి. కావున మా రచనలలో జ్ఞానము, విజ్ఞానము రెండూ ఉన్నాయి. అందువలన మేము 2004వ సంవత్సరములో స్థాపించిన “ఇందూ జ్ఞానవేదిక” అను సంస్థ ప్రచురణలలో ఈ గ్రంథము బయటికి వస్తున్నది.


ఏదో ఒక విజ్ఞానమని పేరు పెట్టుకొన్న కొన్ని సంస్థల వ్యక్తులు, ఇటు దయ్యాలను ఒప్పుకోవడము లేదు, అటు మంత్రాలనూ ఒప్పుకోవడము లేదు. అటువంటి వారికి జ్ఞానమంటే ఎట్లుంటుందో మరియు విజ్ఞానమంటే ఎట్లుంటుందో అర్థమగుటకు ఒక చిన్న ఉదాహరణను చెప్పుచున్నాను చూడండి. నాలో ప్రశ్నించే విధానము అనగా హేతువాద పద్ధతి ఎక్కువగా ఉంటుందని, నేను ఈ గ్రంథములో ముందే చెప్పాను. ప్రశ్నించుచున్నా మంటే జవాబు కొరకు వెదుకుచున్నామని అర్థము. ఈ కాలములో కొందరు హేతువాదము అని పేరు పెట్టుకొన్నవారు, ప్రశ్నించడము తప్ప జవాబును చూడడము లేదు. ప్రశ్నించడము, సరియైన జవాబును ఒప్పుకోవడము సంపూర్ణ హేతువాదమౌతుంది. దాని ప్రకారము ఒక పుస్తకములో తేలు కుడితే, ఆ విషమును నివారించుటకు ఒక మూలికను మందుగా ఉపయోగించు విధానమును చదివాను. మూలిక, తేలు విషమును లేకుండ చేసి, బాధను నివారిస్తుంది అని చెప్పిన విధానమంతా నాకు తెలిసింది కాబట్టి అది అప్పుడు నాకు జ్ఞానమైంది. తెలియబడింది కాబట్టి జ్ఞానమైంది. కానీ అనుభవానికి రాలేదు కాబట్టి అది నా లెక్కలో విజ్ఞానము కాలేదు. అక్కడ చెప్పిన మూలికను కొన్ని దినముల తర్వాత తేలు కుట్టిన మనిషికి వాడి


---

చూచాను. అక్కడ తెలిపినట్లు విషము వెంటనే తగ్గిపోయి బాధలేకుండ పోయినది. కాబట్టి నాకుగానీ, అది అనుభవానికి వచ్చింది

 నా ప్రక్కన ఉండి చూచిన వారికిగానీ అది విజ్ఞానమే అవుతుంది.


అంతేకాక అదే పుస్తకములో తేలుకుట్టినపుడు బాధ నివారణకు మరియొక విధానము కూడ కలదు. పైన చెప్పిన మొదటి విధానములో ఉన్నది చెట్టు యొక్క మూలిక, మరియొక విధానములో ఉన్నది అక్షరముల యొక్క మంత్రము. మూలిక ఒక పదార్థము. మంత్రము ఒక శబ్దము. మూలికయొక్క పదార్థము కనిపించునది, మంత్రముయొక్క శబ్దము వినిపించునది. ఎదుటి మనిషికి కనిపించు శరీరము మీద, కనిపించు మూలికను ఉపయోగించగా ఎదుట మనిషికి కనిపించని బాధ పోయినది. ఇపుడు ఎదుట మనిషికి కనిపించు శరీరము మీద, కనిపించని మంత్రమును ఉపయోగిస్తే, ఎదుట మనిషికి కనిపించని బాధ పోతుంది అని వుంది. మొదట ఔషధము అనుభవ నిరూపణకు వచ్చి విజ్ఞానమైనది, ఇపుడు మంత్ర విధాన జ్ఞానము విజ్ఞానమౌతుందా లేదా అని చూడవలసివుంది. మంత్ర విధాన జ్ఞానము ఏమని కలదనగా! ఈ మంత్రమును ధ్యాసతో పదివేల మార్లు జపిస్తే మంత్రశక్తి లభించును. తర్వాత ఎప్పుడైన తేలు విష నివారణకు మంత్రమును పదకొండు మార్లు జపించి, నీటిని ఊది ఆ నీరును త్రాగిస్తే, త్రాగిన వానికి విషనివారణ అగునని గలదు. దానిని తెలుసుకొన్న నేనే అది విజ్ఞానమో కాదో చూడవలసియున్నది. ఆ మంత్రము ఒక్కొక్క పదములు రెండు అక్షరాలుగావుంటూ మొత్తము నాలుగు పదములుగా కలదు. దానిని చెప్పినట్లు జపించినాము. తర్వాత కొద్ది రోజులకు, నాకు పరిచయమున్న విజయ్కుమార్ యాదవ్ ఇంటిలోని కుక్కకు తేలు కుట్టింది. కుక్క బాధకు అరుస్తూ ఉన్నపుడు దానిని తీసుకొని వచ్చారు. అప్పుడు మంత్ర విధానములో ఉన్నట్లు, కొద్ది నీరును గ్లాసులోనికి తీసుకొని మంత్రించి వెడల్పు ప్లేటులో పోసి కుక్కను త్రాగునట్లు చేశాము. కొద్ది నీరును కుక్క గతికింది. తర్వాత రెండు నిమిషములుకాకనే కుక్క అరుపు మానేసింది. ఆ మరుసటి దినమే 30 సంవత్సరముల వయస్సున్న వ్యక్తి తేలు కుట్టిందని బాధపడుచు వచ్చాడు. అతనికి గ్లాసుతో నీళ్ళను మంత్రము చెప్పి ఇవ్వగా వెంటనే నొప్పి లేకుండ పోయింది. అప్పుడు పూర్తిగా మంత్రము పని చేసినట్లు తెలిసింది. అందువలన తెలుసుకొన్న మంత్ర జ్ఞానము విజ్ఞానరూపమైనది. దీనినిబట్టి మందేకాక, మంత్రము కూడ విజ్ఞానముతో కూడుకొన్నదని అర్థమైనది. ఈ సంఘటన వలన జ్ఞానము, విజ్ఞానము రెండు అవినాభావ సంబంధము కలవని తెలియుచున్నది.


నేను చేసి చూచిన బాహ్యాచరణలో తేలు విషము మీద మందు పని చేసినట్లే, మంత్రము కూడ పని చేసినదని తెలిసినది. తర్వాత నా జీవితములో ఎవరికీ మందు ఇవ్వలేదు, మంత్రము చదవలేదు. నా పరిశోధనలో కేవలము నిరూపణ నిమిత్తము చేసి చూచి ఇవి సత్యము అని తెలుసుకొన్నాను. కొందరు మేము విజ్ఞానులము, మా విజ్ఞానము ప్రకారము దయ్యములు లేవు, మంత్రములు లేవు అనుచుందురు. అటువంటి వారిది అసత్యవాదన అని, వారు విజ్ఞానులే కాదని చెప్పుచున్నాము. సత్యమును గ్రహించలేని విజ్ఞానులకు కనువిప్పుగా మంత్రములు, దయ్యములు కలయికగానున్న, నేను చూచిన ఒక యదార్థ సంఘటను పొందుపరుచుచున్నాను చూడండి.


నేను తాడిపత్రిలో నివాసమున్నపుడు నేను వైద్యము చేసింది సంవత్సరమే అయినా చాలా రకముల రోగములను చూచాను. నేను వైద్యము చేసింది పరిశోధన నిమిత్తమేగాని జీవనమునకు కాదని ముందే చెప్పాను. ఆ నేపద్యములో నావద్దకు వచ్చిన రోగములలో శరీరములో వాస్తవ రోగాలు 30 శాతము మాత్రమే ఉన్నట్లు తెలిసినది. మిగత 70 శాతము స్థూల శరీర రోగములు కాదని, సూక్ష్మశరీర రోగములున్నాయని తెలిసింది. అలా వచ్చిన వారిలో దాదాపు 45 సంవత్సరముల వయస్సుగల ఒక ఆడమనిషిని నావద్దకు తీసుకరావడము జరిగినది. ఆమెకు వారమునకు ఒకమారు


--

కడుపునొప్పి వస్తుందని తెలిపారు. శరీరములో వచ్చు నొప్పి ఏదైనా శరీరములో లోపము ఏర్పడినపుడు రావచ్చును. కానీ వారానికి ఒకమారు అను నియమము ఉండదు. అలా ఉందంటే అది తప్పనిసరిగా సూక్ష్మశరీరముల వేధింపేనని నాకు అర్థమైనది. ఇది రోగము వలన వచ్చు కడుపునొప్పి కాదు. మందులతో పోదు, మంత్రములు వచ్చిన మాంత్రికుల వద్దకు తీసుకపొమ్మని ఆమెను తెచ్చినవారికి చెప్పాము. దానికి వారు "మేము మాంత్రికులందరి దగ్గరకు పోయాము ఎక్కడా ఏమీ కాలేదు. తర్వాత కసాపురము ఆంజనేయస్వామి వద్దకు, పప్పూరు శివాలయము వద్దకు, మిగత చాలా దేవతల దగ్గరికి కూడ పోయాము. అయినా అక్కడ కూడ ఏమి కాకపోయింది. చివరకు ఇది నివారణ కాదు అని నిర్ణయము చేసుకొని ఉన్నాము. ఇపుడు మీ దగ్గరికి పోతే, ఏదైనా తప్పనిసరిగా బాగవుతుంది అని మాకు తెలిసిన వారు చెప్పగా ఆశతో మీ వద్దకు వచ్చాము” అన్నారు.


వారు చెప్పినది విన్న తర్వాత వారిమీద కొంత జాలి కలిగి, సరే సాయంకాలము వరకు ఉండండి అని చెప్పి, తర్వాత ఆ దినము కుదరదని వచ్చే బుధవారము రమ్మని చెప్పి పంపాము. బుధవారము ఉదయమే వారు వచ్చారు. అపుడు 8 గంటలకే తయారై కడుపునొప్పి వచ్చు మనిషిని నాకు ఎదురుగా కూర్చోమని చెప్పి ఆమెవైపు చూచి, ఈమె శరీరములో వారమునకు ఒకమారు వచ్చు కడుపునొప్పి ఏదైతే ఉందో అది ఇప్పుడు నాముందర రమ్మని చెప్పాము. కూర్చున్నపుడు ఆమెకు కడుపునొప్పిలేదు. ఆమెకు ప్రతి ఆదివారము కడుపునొప్పి వచ్చేది. ఆ దినము బుధవారము, అయినా నామాట విన్న నిమిషమునకే ఆమెకు కడుపునొప్పి వచ్చింది. అప్పుడు అక్కడ పదిహేను మందిదాకా ఉన్నారు. పిలుస్తూనే ఆ నొప్పి రావడము అందరికి ఆశ్చర్యము వేసింది. ఎదురుగా కూర్చున్న ఆమె కడుపునొప్పి ఎక్కువగా ఉంది, అని చెప్పి బాధపడుచూ ఉన్నది. అపుడు "శరీరము లోపల కడుపునొప్పికి కారణమైన వారు ఎవరున్నా బయటికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పుచున్నాను” అని నేను అనగానే లోపలనున్న గ్రహము (సూక్ష్మశరీరము) బయటికి వచ్చింది. అంతవరకు కొద్దిగ ముడుచుకొని కూర్చొనియున్న ఆమె వెంటనే చక్కగ కూర్చొని ఒకమారు గట్టిగ నవ్వింది. ఆ నవ్వును చూచి ప్రక్కనున్న వారికి కూడ ఆమె శరీరములోని దయ్యము బయటికి వచ్చిందని అర్థమైనది. 


నేను :- నీవు ఎందుకు నవ్వినావు చెప్పు?

ఆమె :- ఎందరో వయస్సయిన ముసలి మంత్రగాళ్ళు కూడ నన్ను చూచి చివరికి పారిపోయారు. నీవు చిన్న పిల్లవాడివి, నన్ను పిలిచిన నిన్ను చూచి నవ్వువచ్చింది.

నేను :-'మంత్రగాళ్ళు మంత్రించి, ధూపముపొగ పెట్టి, వేపమండలు అల్లాడించి నిన్ను బయటికి పిలిచివుంటారు. కానీ నేను నిన్ను మంత్రించానా? దూపము వేశానా? వేపమండలతో దిగదీచానా? ఒక్క అగరుబత్తి అయినా ముట్టించానా? మాంత్రికులు చేసినట్లు నేనేమి చేయలేదు కదా! నొప్పిని పిలిచాను వచ్చింది, నొప్పికి కారణమైన నిన్ను పిలిచాను నీవూ వచ్చావు. నావద్ద నిమ్మకాయలు లేవు, కోళ్ళులేవు, నేను మాంత్రికుడను కాను, పైగా చిన్న పిల్లవాడిని, అటువంటపుడు నామాట వింటూనే నీవు బయటికెందుకు వచ్చావో చెప్పు?

ఆమె :- ఏమో! దయతలచి వచ్చాను. నన్ను పిలిచేదానికి అసలుకు నీవు ఎవరు?

నేను :- ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలుకు నీవు ఎవరు?

ఆమె :- నేను ఎవరో చెప్పితే భయపడిపోతావు, నీకు నిద్రరాదు.


---

నేను :- నాకు నిద్రవస్తుందో, పోతుందో అటుంచి, నీవు ఒకమారు నావైపు చూడు నేనెవరో నీకు తెలుస్తుంది.

(అపుడు ఆమె తల ఎత్తి నావైపు చూచి వెంటనే తలదించుకుంది. ఏమి మాట్లాడలేదు.)


నేను :- ఇప్పుడు జాగ్రత్తగ మాట్లాడు. నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పు. నీవు అసత్యము చెప్పిన నేను గ్రహించగలను. ఇంతవరకు అందరివద్ద మాట్లాడినట్లు మాట్లాడినావు. ఇపుడు నీకు అర్థమైంది. మంత్రగాడిని కాదని. అందువలన నేను ఏమి అడగను అన్నీ నీవే చెప్పు.

(అపుడు ఆమె శరీరములోని దయ్యము ఇలా చెప్పను మొదలు పెట్టింది)

మా ఊరిలో నన్ను అందరు వీరప్ప అనెడివారు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరములో రైలురోడ్డు ప్రక్కనే మా ఊరు ఉంది. ఆ ఊరిలో వడ్రంగి పని (చెక్కపని చేస్తుండెడి వాడిని. ఆ ఊరిలోని వారందరు నన్ను మామ అని పిలిచెడివారు. మా ఊరిలో రెడ్డి కుటుంబాలున్నాయి. వాటిలో రెండు ఇండ్లు పెద్ద పేరున్న కుటుంబములు. వారు మంచి ధనికులు. ఊరిలో అందరికి నాతో పని వుంటుంది. కావున అందరి ఇళ్ళదగ్గరికి పోయి వచ్చేవాడిని. అది ఆ ఊరిలో నాకున్న సంబంధము. ఇక నా స్వంత విషయానికి వస్తే, నేను విశ్వబ్రాహ్మణ కులములో పుట్టినవాడను. నా అసలు పేరు వీరప్పాచారి, నేను పెద్ద మాంత్రికుడను. కాళికాదేవి ఉపాసకుడను. మంత్రసిద్ధితో కాళికాదేవిని నా వశము చేసుకొన్నవాడిని. నేను చనిపోయినా ఇప్పటికి నేను మంత్రసిద్ధుడనే, కాళికాదేవి నా వశములోనే ఉన్నది. నేను చెప్పిన పని చేస్తుంది. ఇంతవరకు ఆంధ్రదేశములో నన్ను మించిన మాంత్రికులు ఎవరూ లేరు. ఎవరైనా మాంత్రికుడు నన్ను విడిపించాలని వస్తే ఏడిపించి పంపేవాణ్ణి. నా వద్దకు వచ్చిన వారంతా భయపడి పారిపోయారు. మొదట నీవు కూడ మంత్రగాడివేనని అనుకొని నిన్ను చూచి నవ్వాను. మీరు మాంత్రికుడు కాదని ఇప్పుడు తెలిసింది. మీరు ఏమి అడిగినా దాచకుండ చెప్పుతాను.


నేను :- అంతపెద్ద మాంత్రికునివి. కాళికాదేవే నీ వశములో ఉండగా నీహెూదా పెద్దగ ఉండాలి కదా! చిల్లర మనిషిలాగ ఈమెలోనికి ఎందుకు చేరావు?


వీరప్ప :- మీరు చెప్పినట్లు నాకు చిల్లర బుద్ధులున్నాయి. అందమైన ఆడమనిషిని చూస్తే ఆమెను ఎలాగైనా పొందాలి అనేది నా బలహీనత. నేను బ్రతికి ఉన్నపుడు మా ఊరిలో పెద్ద కుటుంబములో ఈమె పెద్దరెడ్డి భార్య. ఈమె మీద నాకన్ను పడింది, ఈమెను ఎలాగైనా అనుభవించాలి అని అనుకొనేవాడిని. కానీ బ్రతికియున్నపుడు ఎప్పుడూ కుదరలేదు. నేను చనిపోయిన తర్వాత ఏ ఆటంకములులేవు, కాబట్టి నేను ఈమెలో చేరినాను.


నేను :- నీవు నీ ఇష్టప్రకారము ఈమెలోనికి వచ్చావు సరే, వారమునకు ఒకమారు కడుపునొప్పి రావడమేమిటి? అలా ఎందుకు చేస్తున్నావు?


వీరప్ప :- నేను మంత్రగాడిని, ఇప్పటికీ నియమ నిష్టలతో మంత్ర జపము చేయుచున్నాను. నామంత్రశక్తిని పోగొట్టుకోలేదు. నాకు ఒక నియమమున్నది. దాని ప్రకారము వారమునకు ఒకమారు ఈమెను పొందుచున్నాను. దానివలన ఆమె కడుపులో నొప్పి కల్గుచున్నది. నేను పెద్దమంత్రగాడిని అయినా నాకు ఒక ఒక బలహీనతవుంది.


నేను :- ఆ బలహీనత ఏమిటి?


--

వీరప్ప :- నాకు ఒక బలహీనత ఉందియని నేను ముందే చెప్పాను. మీ ముందర దాచకూడని వాస్తవమొకటి ఉన్నది. అదేమంటే ఈమె బిడ్డ మంచి అందగత్తె, యుక్తవయస్సులోనున్న ఆమెను చూచి నాలో కోర్కె కలిగింది. నేను ఇంత పెద్దమాంత్రికున్ని కదా! నాచేత కానిదేముంది ఏదో ఒకటి చేయాలి అనుకునే వాడిని. ఏదైన బయటికి తెలిస్తే రెడ్డి వాళ్ళు చంపివేస్తారను భయము మరొక ప్రక్క ఉంది. ఆ కోర్కె కూడ నేను చనిపోయేంతవరకు కుదరలేదు.


నేను :- నీ వయస్సెంత? నీవు ఎలా చనిపోయావు?


వీరప్ప :- :- నా వయస్సు 45 సంవత్సరములకు మించి ఉండదు. నేను ఏ రోగముతోనూ చనిపోలేదు. మంచి ఆరోగ్యముగా ఉండేవాడిని. ఇంత తొందరగా నేను చనిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికి మూడు సంవత్సరముల క్రిందట ఒక దినము వర్షము బాగా వచ్చినది. ఆ దినము రెడ్డిగారి ఇంటిలో పశువుల గాడికి పైనఉన్న దూలము తడిమన్ను బరువుకు కొద్దిగ విరిగినట్లు చిన్న గీటు కనిపించింది. దూలము విరిగిపోతే పశువుల పై కప్పు అంతా కూలిపోతుందని అక్కడున్నవారు బారు కాడిమాను (ఎద్దుల మెడమీద పెట్టు పొడవు మొద్దు) ను దూలముకు ఆనించి పోటు పెట్టారు. ఆ కాడిమాను దూలము ఇరిగిపోకుండ సపోర్టుగ ఉండేది. కొయ్యపని చేసేవాడిని కనుక దానిని ఎలా రిపేరు చేయాలో అడిగే నిమిత్తము నన్ను రెడ్డి రమ్మంటున్నాడని పనిమనిషి వచ్చి చెప్పాడు. వెంటనే నేను పోయాను.


ఇంటికి పోతూనే రెడ్డి కాఫీ ఇప్పించాడు. కాఫీ త్రాగిన తర్వాత దూలమును ఏమి చేయాలో చూడమన్నాడు. కాఫీ త్రాగిన తర్వాత దూలము క్రిందకి పోయి చూస్తుండగా అంతవరకు దూలముకు పోటు పెట్టిన కాడిమాను విరిగిపోవడము పెద్దశబ్దముతో దూలము విరిగి నాతల మీద పడడము క్షణాలలో జరిగిపోయింది. దూలము నామీద పడడమే కాక పై కప్పు అంతా నామీద కూలిపోయింది. నా తల చీలి పోయింది నాకు క్షణాలలో ప్రాణము పోయింది. ఇలా అనుకోని సంఘటన ద్వారా నేను చనిపోయాను. నా శరీరము శిథిలమైపోయింది. సూక్ష్మశరీరము మిగిలిపోయింది. అప్పుడు అక్కడున్న వారంత మన్నును, కట్టెలను, దూలమును తొలగించారు. నేను లేచి బయటికి వచ్చాను. కానీ అక్కడ నాశరీరము తల పగిలి పడివున్నట్లు నాకు కనిపిస్తున్నది. నేను ఎవరిని మాట్లాడించిన ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అప్పుడు నేను చనిపోయానని, చనిపోయి దయ్యముగా ఉన్నానని నాకు అర్థమైంది. నా చావును గురించి రెండు రోజులు చింతించిన నేనే మనిషికంటే దయ్యముగా ఉండడమే బాగుందనుకొన్నాను. అంతవరకు నాలో ఉన్న కోర్కె ప్రకారము మొదట ఈమె బిడ్డను పొందాను. ఆమె మనిషిగా కాకుండ, నేను ఆమెకు కనిపించునట్లు ఆమెను దయ్యముగా మార్చితే ఇద్దరము కలిసి ఉండవచ్చనుకొన్నాను. అలా అనుకొన్న కొంతకాలానికే ఆమెను చంపి నావలె దయ్యముగా మార్చుకొన్నాను. ఆమె ఆమెతల్లి ఒక చోట లేకుండ బిడ్డను కొన్ని మైళ్ళ దూరములోనున్న కొండలో పెట్టాను. వారములో కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను.


నేను :- ఈమె బిడ్డను ఎలా చంపావు?


వీరప్ప : :- మొదట శరీరములో చేరి జీర్ణాశయమును అదిమిపట్టి కడుపు నొప్పిని కల్గించాను. డాక్టరువద్ద చూపించారు, మందు వాడారు. కానీ ఏమీ నయము కాలేదు. నేను అదిమే కొద్ది నొప్పి కల్గది. చివరికి డాక్టర్లకు ఏమీ అర్థము కాలేదు. జీర్ణాశయమును అదిమితే నొప్పి కల్గుచున్నది కానీ ఆమె చనిపోలేదు. అందరి దృష్టిని కడుపునొప్పి మీద పెట్టి, లోపల ఊపిరి తిత్తులను అదిమి ఊపిరాడకుండ చేసి చంపేశాను. నేను చంపినట్లు చనిపోయిన ఈమె బిడ్డకు తెలియదు. ఆమె సూక్ష్మశరీరముగా మారిన తర్వాత నేను కనిపించాను. పరిచయమున్న వ్యక్తిని నేనొక్కనినే. మిగత


---

సూక్ష్మాలు కనిపించినా వారు పరిచయము లేరు, కావున ఆమె నాతోనే మాట్లాడవలసి వచ్చింది. అప్పటినుండి ఆమెను నాదగ్గరే పెట్టుకొన్నాను.


నేను :- ఇదంతా పాపము పనికాదా? నీవు ఇంకా ఎవరినైనా చంపినావా?


వీరప్ప:- లోపల ఒక ప్రక్క పాపమొస్తుందనిపించినా, నేను చచ్చిపోయిన తర్వాత కదా యమలోకానికి పోయేది. అప్పుడు ఏమి జరిగేది ఎవడు చూచాడు అనిపించింది. అప్పటికి అనుకూలమైన పనిని వదులుకో కూడదనిపించింది. ఒక్కప్పుడు కాళీమాతను వశము చేసుకోడానికి తొమ్మిది సంవత్సరముల అమ్మాయిని స్మశానములో నరికి చంపాను. అది పాపమే అనిపించినా దేవత కోరుకున్నపుడు నాదేమి తప్పు అనుకొన్నాను. అటువంటి బలి ఇచ్చిన తర్వాతే కాళికాదేవత నాకు వశమైనది.


నేను :- ఇంత భయంకరమైన పనిని ఏమాత్రము పశ్చాత్తాపము లేకుండ చెప్పుచున్నావు. నీవు చాలా కఠినాత్మునివి. నీకు సమాజమనినా, చట్టమనినా, పోలీసులనినా భయము లేదా?


వీరప్ప :- బయటికి తెలిస్తే భయమే, తెలియకుండ చేస్తే భయమెందుకు? ఇపుడైతే భయపడవలసిన పనేలేదు. నేను చనిపోయాను కదా! నన్ను పోలీసులు ఏమి చేస్తారు? తొమ్మిది సంవత్సరముల అమ్మాయి కనిపించకుండ పోయిందో లేదో విచారించుకొమ్మనండి. ఆ ఊరిలో కనిపించని అమ్మాయిని నేనే చంపానని ఇప్పుడు చెప్పుచున్నాను కదా! బ్రతికియున్నపుడైతే చట్టము పోలీసులు. ఇపుడు వాళ్ళు నన్నేమి చేస్తారు? మీరు అన్నీ చెప్పమన్నారు, కాబట్టి ఇంకొక రహస్యము కూడ చెప్పుచున్నాను. ఒకరోజు రాత్రి నడుచుకొంటూ మా ఊరికి రావాలని వస్తున్నాను. అపుడు అంత రాత్రివేళలో ఒక అమ్మాయి ఎదురైనది. బంగారు నగలు ధరించుకొనివుంది. ఆ అమ్మాయిని ఆపి ఎవరు నువ్వు అని అడిగాను. ఆ అమ్మాయి ఏడుస్తు నాకు బలవంతపు పెళ్ళి చేస్తున్నారు. అందుకై పారిపోయివచ్చానని చెప్పింది. ఆమె పెళ్ళి కూతురని, పారిపోయి వచ్చిందని అర్థమైంది. ఎక్కడికి పోవాలని అడిగాను. ఎక్కడికి పోవాలో తెలియదు. ముందు అక్కడినుండి పారిపోవాలనిపించింది. వచ్చేశాను అన్నది. అపుడు నేను నాయింటికిరా! రెండు రోజుల తర్వాత పెళ్ళి ఆగిపోతుంది కదా! అపుడు నీవు ఇంటికి పోవచ్చు నేను కూడ వచ్చి ఆ పెళ్ళి వద్దని చెప్తాను అని అనగా ఆమె నావెంట వచ్చింది. అర్థరాత్రి తర్వాత ఊరిలోనికి పోయాము కాబట్టి ఎవరు చూడలేదు. ఆమె పడుకొన్న తర్వాత గొడ్డలితో తలమీద కొట్టి చంపివేసి, ఆమె వంటిమీద ఉన్న నగలన్ని తీసుకొన్నాను. నాయింటిలోనే గుంతతీసి అందులో పూడ్చివేశాను. ఈ విషయము కూడ ఎవరికీ తెలియదు. ఇపుడు చెప్పినా నన్నెవరూ ఏమి చేయలేరు. అందువలన చెప్పుచున్నాను. నామాట అబద్దమేమో అని అనుకొనుటకు కూడ వీలులేదు. ఎందుకనగా ఇప్పుడు పోయి త్రవ్వి చూచినా, నేను పూడ్చిన చోట ఆ అమ్మాయి శవము యొక్క ఎముకలు దొరుకుతాయి. నేను బ్రతికినపుడు ఈ రెండు హత్యలే చేశాను. అవి ఇద్దరి ఆడవారివే. నేను చనిపోయిన తర్వాత ఈమె బిడ్డను మాత్రమే చంపాను. ఇంకెవరిని చంపలేదు. మొత్తము ముగ్గరినీ పెళ్ళికాని వారినే చంపేశాను.


నేను :- నీ చరిత్రవద్దు కానీ ఈమె సమస్య చెప్పు. వీరు దేవతల వద్దకు, మాంత్రికుల వద్దకు పోయి చూపించుకొన్నారు కదా! అప్పుడు నీవు ఎందుకు వదలిపోలేదు?


వీరప్ప :- వీరు నాకు వ్యతిరేఖముగా మాంత్రికుల వద్దకు, దేవతల దగ్గరకు పోయారు. అలాంటపుడు మాంత్రికులుగానీ, దేవతలుగానీ నన్ను ఏమి చేయలేక పోయారు. వారిని నేనే బెదిరించాను. నాకు కాళికాదేవత వశములో ఉన్నది.


---

కావున, మిగత దేవతలు నన్ను చూచి ఏమి చేయలేక పోయారు. గండి ఆంజనేయస్వామి వద్దకు పోయారు. అక్కడ ఆంజనేయుడు పేరుపొందినవాడే, శక్తివంతుడే. నావద్దకు ఆయన వచ్చి దండించాలని చూచాడు. కానీ నేనే ఆయనను జాగ్రత్త అని హెచ్చరించాను. నేను అందరి మాదిరి మనిషినికాదు, నాజోలికి వస్తే నీతోక తెగిపోతుందని చెప్పినాను. ఆ దినమునుండి గండి ఆంజనేయుడు నా ప్రక్కకు కూడ చూడలేదు. గండిలో ఒక నెల రోజులుండి వచ్చి, తిరిగి కొన్నాళ్ళకు కసాపురము ఆంజనేయస్వామి వద్దకు పోయారు. అక్కడ ఆయన అన్ని దయ్యములను కొట్టినట్లు నన్ను కూడ కొట్టాలని చూచాడు. నా జోలికి వస్తే నీకే మర్యాద పోతుందని చెప్పాను. నేను మంత్రగాడిని మరియు కాళికాదేవిని వశపరుచుకొన్న వాడినని కూడ చెప్పాను. అంతే అప్పటి నుండి నా ప్రక్కవాడి వరకు వచ్చి, నన్ను వదలివేసి నా తర్వాత వాడిని కొట్టేవాడు.


ప్రతి రోజు అక్కడ ఉదయము, సాయంత్రము ఆంజనేయస్వామి దయ్యాలను దండించడము చూస్తు కూర్చొనే వాడిని. ఒక దినము ఉదయము 8 గంటలపుడు ఒక బాలింత దయ్యమును కొట్టుచుండగా చూచాను. ఆమె కూడ మంచి అందముగా ఉంది. ఆంజనేయస్వామి ఆమెను కొట్టడము, ఆమె నేను పోతాను స్వామీ అని చెప్పడము, రెండు రోజులనుండి అబద్ధము చెప్పుచున్నావని దండించడము, లేదు ఈ రోజు సాయంత్రానికి పోతానని ఆమె చెప్పడము జరిగింది. అదంతా చూచిన నేను, తర్వాత ఆ బాలింత దయ్యము వద్దకు పోయి ఆమెతో మాట్లాడినాను. ఆ బాలింత దయ్యముది ఉరవకొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఆమె ఆ ఊరిలోని ఒక ఆడమనిషిని ఆవహించింది. బాలింత పట్టుకొన్న వాళ్ళు పూర్తి బీదవాళ్ళు. వాళ్ళు మంత్రగాళ్ళ వద్దకు పోకుండ కసాపురమునకు వచ్చారు. అక్కడ ఆంజనేయుడు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక ఆ ఆడమనిషిని బాలింత వదలి పోవాలనుకొన్నట్లు నాకు తెలిసింది.



అప్పుడు నేను ఆమెతో నీవు తగులుకొన్నది కూటికి, గుడ్డకు లేనివాళ్ళను, నేను తగులుకొన్నది మా ఊరిలోనే పెద్దధనికులు. నేను ఉన్న ఇంటిలో ఏమి తినాలన్నా తినవచ్చును అన్నీ ఉన్నాయి. మావారికి మామిడి తోటలున్నాయి, ఎన్ని మామిడిపండ్లనైనా తినవచ్చును. పలానిది లేదు అనకుండ, ప్రతీది నేనున్న ఇంటిలో ఉన్నాయి. నా వెంట వస్తే బాగ సుఖపడవచ్చు అని చెప్పాను. అందుకు ఆమె నావెంట వచ్చుటకు ఒప్పుకుంది. అపుడు ఆమె మీవాళ్లు పొయ్యేంత వరకు నీవూ ఇక్కడే ఉంటావు కదా! అంతవరకు నేను ఉంటే ఆంజనేయస్వామి కొడతాడు, నేను తట్టుకోలేను అని చెప్పింది. ఆ మాటకు నేను ఆమెకు ధైర్యము చెప్పి నీవు భయపడవలసిన పనిలేదు. ఆంజనేయస్వామి నిన్ను ఏమీ అనకుండ ఉండాలంటే, నీవు కూడ నేనున్న ఈమె శరీరములోనికి వచ్చేయి. ఇద్దరము కలిసియుండవచ్చును, నీవు వారిని వదలి పోయినట్లూ ఉంటుంది. నాదగ్గరున్న దానివలన నిన్ను ఆంజనేయుడు ఏమి అనలేడు అని చెప్పాను. అప్పుడు ఆ బాలింత నేనున్న ఈమె శరీరములోనికి వచ్చింది. వీళ్ళు నన్ను ఒక్కన్ని వదిలించుకోవాలని కసాపురానికి పోయారు, నేను అక్కడ ఇంకొకరిని తగిలించుకొని వచ్చాను.


నేను :- అయితే ఇప్పుడు ఈమె శరీరములో నీవుకాక మరొకరు కూడ ఉన్నారు.


వీరప్ప :- అవును. మీరు అన్నీ నిజము చెప్పమన్నారు కదా! అందువలన ఉన్నది ఉన్నట్లు చెప్పాను.


నేను :- నీవు ఇప్పుడు లోపలికి అణిగిపో, ఆమెను బయటికి పంపు. నీవు చెప్పినది నిజమో కాదో ఇప్పుడే తెలుస్తుంది. (అప్పుడు అంతవరకు మాట్లాడుచున్న వీరప్ప లోపలికి పోయాడు. వెంటనే లోపలున్న మరొక దయ్యము బయటికి


---

*

వచ్చింది. ఆ దయ్యము బయటకు వస్తూనే బాలింతలు చెవులకు గాలి తగలకుండ తలకొంగు కట్టుకొన్నట్లు చీర చెరుగుతో తలకు కట్టుకొని భయముగా కూర్చుంది. వీరప్ప లోపలికి పోతూనే అంతవరకు కనిపిస్తున్న ముఖము యొక్క విధానము కనిపించకుండ పోయింది. అంతవరకు కూర్చున్నట్లుకాక, భయముగా ఒదిగి కూర్చోవడము జరిగింది. ఆ మార్పును చూచి అక్కడ చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు.)


నేను :- నీవు ఏమి భయపడవద్దు. వీరప్ప చెప్పినది నిజమేనా? ఉన్నదున్నట్లు చెప్పు. బాలింత :- నిజమే స్వామీ! నన్ను పొమ్మంటే పోతాను, నా తప్పు ఏమిలేదు స్వామీ. నేను :- వీరప్ప నీతో సంబంధము పెట్టుకొన్నది నిజమేనా?




బాలింత :- నాతో సంబంధము పెట్టుకొన్నది నిజమే స్వామీ! నేను వద్దన్నా వినలేదు. నేను :- నాతో చెప్పకుండా ఇంకా ఏమైనా దాచిపెట్టాడా?

బాలింత :- వీరప్పకు కోపము ఎక్కువ. అప్పుడప్పుడు నన్ను కొట్టుతుంటాడు. ఈ మధ్య నెల క్రిందట వీరప్పను విడిపించడానికి ఒక మాంత్రికున్ని వీళ్ళు పిలుచుకవచ్చారు. అయితే వీరప్ప ఆ మాంత్రికున్ని ముప్పతిప్పలు పెట్టి పంపించాడు. ఆ విషయమొక్కటి చెప్పలేదు.


నేను :- నీవు లోపలికి పో, నేను వీరప్పతో మాట్లాడుతాను.

(వెంటనే ఆమెలోపలికి అణిగి పోయింది. ఆమె పోయిన వెంటనే వీరప్ప బయటికి వచ్చాడు. వచ్చిన వెంటనే అంతవరకు ఆమె కట్టుకొన్న తలకొంగును తీసివేసి ఠీవిగా కుర్చున్నాడు. బాలింత ఉన్నపుడు కనిపించినంత అణుకువ కనిపించలేదు. అక్కడ చూస్తున్న వారికి ఆ మార్పు సులభముగా కనిపించింది)


నేను :- ఆమె చెప్పినది విన్నావా? ఆ మాంత్రికున్ని ఏమి చేశావు?


వీరప్ప :- వీరు పెద్దమాంత్రికుడు కావాలని వెదికి హైదరాబాద్నుండి వాణ్ణి పిలుచుకువచ్చారు. వాడు ఒకేమారు ఐదువేలు డబ్బులు తీసుకొన్నాడు. అది వాని బ్రతుకుతెరువులే అనుకొన్నాను. అయితే వాడు నేను ఇంత పెద్దవాడిని, అంత పెద్దవాడిని అని ప్రగల్భాలు చెప్పుకోవడమే కాక నన్ను సీసాలో బంధించి, స్మశానములో పూడ్చిపెట్టుతా అన్నాడు. దానికి వాని మీద నాకు కోపము వచ్చింది. అయినా వాణ్ణి నేను కొట్టలేదు.


నేను :- ఏమి చేశావు వివరంగా చెప్పు?


వీరప్ప : :- వాడు నన్ను విడిపించుటకు పూజపెట్టి, నడి ఇంటిలో ముగ్గువేసి, ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి, నన్ను బయటికి పిలిచాడు. నేను బయటికి వచ్చాను. నా పేరు అడిగితే చెప్పాను. తర్వాత ఎందుకొచ్చావు? ఎంత కాలమునుండి ఉన్నావు అని అడిగాడు. అప్పుడు అవన్ని నీకు అనవసరము. నీవు చేసే పని చేసి, నీ డబ్బులు నీవు తీసుకొనిపో అని చెప్పాను. అయినా వాడు నన్ను చులకనగా మాట్లాడి, సీసా (బాటిల్)లో బంధిస్తానని మంత్రాలు చదవను మొదలు పెట్టాడు. అప్పుడు నాకు కోపము వచ్చి, నీ మంత్రములు పెద్దవో, నా మంత్రములు పెద్దవో చూడు అని ఆ గదిలోనే ఒక ప్రక్కన ఇసురురాయిని తిరుగు అని అన్నాను. నేను చెప్పుతానే రాయి ఐదారు చుట్లు తిరిగింది. దానిని చూచిన ఆ మాంత్రికుడు నన్ను చూచి భయపడి నాడు. తర్వాత వారమునకు వస్తానని ఇంటివాళ్ళకు చెప్పి, అక్కడినుండి పోయాడు. అంతే నేను ఏమి చేయలేదు.


---

నేను :- నేను చెప్పినట్లు వింటావా లేక నేను మాంత్రికున్ని, నాకు కాళికాదేవి ఆసరాగా ఉంది అంటావా?


వీరప్ప :- నిన్ను చూచి కాళికాదేవి రూము బయటనే ఉంది. లోపలికి రావడానికి కూడ భయపడి రాలేదు. ఆయమ్మే భయపడినపుడు నేనెంత. మీరు ఎట్లు చెప్పితే అట్లానే నడుచుకొంటాను.


(అక్కడ అంతవరకు ఆ వింత చూస్తున్న వారందరినీ బయటికి పంపివేసి, తలుపులు మూసి వీరప్పకు మాత్రము చెప్పడము జరిగినది.)


నేను :– నీకు వ్యతిరేఖముగా నేను ఏమీ చెప్పను. నిన్ను నీకర్మకే వదలి వేస్తున్నాను. కానీ ప్రతి వారము ఈమెకు వచ్చు కడుపునొప్పి రాకూడదు. అలా వస్తే తిరిగి వీరు నాదగ్గరకు వస్తారు. కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అలా కాకుండ నీవు ఎట్లున్నావో అట్లే ఉండు. కడుపునొప్పి రాకుండ పోతే వీరిలెక్కలో నీవు పోయినట్లే. అందువలన నేను చెప్పినట్లు నడుచుకో. ఏమంటావు.


వీరప్ప : :- నేను అనునది ఏమి లేదు. మీరు చెప్పినట్లే చేస్తాను. ఇక లోపలికి పోతాను.

(చివరిగా వీరప్ప నమస్కారము చేసి అణిగి పోయాడు.) ఇదంతా ఒక వింత కథగా కనిపించినా, ఇది నాముందర జరిగిన యదార్థగాథ. ఇందులో దయ్యము అబద్దము అనేదానికి వీలులేదు, అలాగే మంత్రములు లేవు అనేదానికి కూడ అవకాశము లేదు. నేర్చుకున్న విద్య పూర్తి మరణము వచ్చు వరకు పోదు అనేదానికి ఇందులో ఆధారము లభించింది.


ఇపుడు చెప్పబోవు సంఘటనలో మనిషి శరీరము ఒక వాహనము లాంటిదని, దానిని ఎక్కినవాడు నడిపినట్లు నడుచునని తెలియుచున్నది. అకాలమృత్యువు చెందిన వారికి స్థూలశరీరముండదు. కనిపించని సూక్ష్మ శరీరము మాత్రముండును. మనకు సూక్ష్మశరీరముల (దయ్యముల) విషయము తెలియాలంటే దయ్యముల ద్వారానే తెలుసుకోవలెను. ఒక శరీరము మీదకు వేరొక సూక్ష్మశరీరము వచ్చినపుడు వారిని ప్రశ్నించడము ద్వారా ఎన్నో మనకు తెలియని విషయములను తెలుసుకోవచ్చును. అలాగే కనిపించు పనుల వలన కూడా తెలియని విషయములను తెలుసు కోవచ్చును. ఒక రైల్వే ఉద్యోగస్థుని భార్య శరీరము మీదికి ఒక దయ్యము వచ్చింది. దానిని విచారిస్తే ఆ దయ్యము పేరు శివరామయ్య అనీ, పేరును బట్టి అది మగ దయ్యమని తెలిసిపోయింది. ఇంకా తెలిసింది ఏమంటే శివరామయ్య గతములో బ్రతికియున్నపుడు, ఇపుడు పట్టుకున్న ఈమెను ప్రేమించెడివాడు. అతను ప్రేమిస్తున్నట్లు ఈమెకు కూడ తెలుసు. శివ రామయ్య తమ పెద్దలను అమ్మాయి ఇంటికి పెత్తనానికి పంపి, పెద్దలు ఒప్పుదలతో ఒక ముహూర్తములో పెళ్ళి చేసుకోవాలనుకొన్నాడు. కానీ అంతలో బస్సు ప్రమాదములో శివరామయ్య చనిపోయాడు. చనిపోయిన శివరామయ్య అకాలమృత్యువు పొందాడు, కావున కనిపించని మనిషిగా ఉండిపోయాడు. చనిపోకముందు ఒక నాటకములో రావణబ్రహ్మ పాత్రను బాగా ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆ నాటకము వేయకముందే అకాలముగా మరణించాడు. శివరామయ్య చనిపోయిన తర్వాత కొంత కాలమునకు ఆమెకు పెళ్ళి అయినది. ఆ పెళ్ళిని చూచిన శివరామయ్య చాలా బాధపడినాడు. పెళ్ళైయిన తర్వాత శోభనము దినము ఆమె భర్త, భార్యవద్దకు వస్తూనే, శివరామయ్య ఆమె శరీరము మీదికి వచ్చి ఈమె నాది, నీదికాదు అనెడివాడు. ఇదంతా అర్థముకాని ఆమె భర్త, అంతటా చూచి చివరకు నావద్దకు తెచ్చాడు. అప్పుడు శివరామయ్య బయటికి వచ్చి మాట్లాడు చున్నాడు. అలా మాట్లాడే సమయములో అప్పుడప్పుడు మీసము మెలి వేసినట్లు చేయిని మూతిమీద పెట్టేవాడు.



---

కనిపిస్తున్నది ఆడమనిషి, మాట్లాడుచున్నది మగమనిషి అలవాట్లు మగమనిషివే! అప్పుడు మేము, నీవు మీసము త్రిప్పుచున్నావా అని అడిగాము. అవునని అతను సమాధానమిచ్చాడు. అంతేకాకుండ తాను రావణబ్రహ్మ పాత్రను నేర్చుకొన్నాననీ, ఆ పాత్రలో ఎక్కువగా మీసము తిప్పేపని గలదనీ, అది అట్లే అలవాటుగా మారిందని చెప్పాడు. రావణ పాత్రలో పద్యాలు నేర్చివుంటే చెప్పమని అడిగాము. అపుడు పైకి కనిపించు ఆమె రావణునిగా నటించను మొదలుపెట్టింది. అపుడు గదను భుజముమీద పెట్టుకొన్నట్లు చేసి, ఎడమచేతితో మీసమును మెలివేసి పద్యమును చెప్పను మొదలు పెట్టింది. గంభీర స్వరముతో పద్యమును చెప్పగా అందరికి ఆశ్చర్యమైనది. తర్వాత శివరామయ్యను లోపలికి పొమ్మని, ఆమెను పద్యము గురించి అడిగాము. పద్యమేమిటో నాకు తెలియదని ఆమె చెప్పింది. శివరామయ్యను గురించి అడుగగా అంతా నిజమేనని ఆమె చెప్పింది. శివరామయ్యను పైకి పిలిచి అడిగితే మొదట ఆమెను ప్రేమించింది తానేనని, అందువలన ఆమెను ఇతరుని భార్యగా ఒప్పుకోలేక పోతున్నానని చెప్పాడు. అమెనడిగితే అతను పెళ్ళికాకముందే చనిపోయాడు. కావున నాఇష్టముతోనే నేను పెళ్ళి చేసుకొన్నాను. అయినా అతను మా కాపురానికి ఆటంకమైనాడు అంటున్నది.


ఇదంతా చూస్తే, ఆడమనిషి శరీరము మీద మగమనిషి నటన వచ్చిందంటే, శరీరము మీద ఎవరుంటే వారు ఆడించినట్లే శరీరము ఆడుతుందని, వారి లక్షణములు, అలవాట్లు శరీరము మీద కనిపిస్తాయని తెలియుచున్నది. స్థూలశరీరము కేవలం ఆట బొమ్మలాంటిదని, ఆడించే వానిని బట్టి అడునని చెప్పడమేకాక, శరీరము ఆడించేవాని లక్షణములు పొందునని కూడ తెలియుచున్నది. ఈ మాటను బలపరుచుచు మరొక సంఘటనను ఇపుడు చెప్పుకొందాము. ఒక ఆడమనిషిని అనారోగ్య కారణము వలన నావద్దకు వారిబంధువులు తెచ్చారు. రోగాలు అన్నీ శరీరము లోపముతో ఏర్పడవనీ, శరీరములో దయ్యాలు కల్గించడము వలన ఏర్పడునవి చాలా ఉన్నాయనీ ముందే చెప్పాము. ఈ సూత్రము ప్రకారము 22 సంవత్సరముల ఆమెకు ఏ రోగములేదని తెలిసింది. ఇక వెదకవలసింది దయ్యము ఏదైనా శరీరములో ఉన్నదా అని చూడాలి. అలా చూస్తే ఆమెకు దయ్యమున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎలా నిర్ధారణ చేశారని, దానికేదైన లాబ్స్టు ఉందా అని కొందరడుగవచ్చును. దయ్యాలు లాబ్లో ఏ టెస్టుకూ దొరకవు. దానిని కనిపెట్టడానికి చిన్న సూత్రము గలదు. అదేమనగా! వేరొక సూక్ష్మశరీరము, ఒక శరీరములో ఉన్నపుడు ఆ శరీరములో ఉన్నవి రెండు సూక్ష్మశరీరములగును. రెండు సూక్ష్మశరీరములు ఒక స్థూలశరీరములో ఉన్నపుడు గుండె వేగము ఎక్కువగా ఉండును. ఒకే పద్ధతిగా గుండె కొట్టుకోదు. అందువలన గుండె స్పీడు ఎక్కువ తక్కువలుగా ఉండును. నూటికి డెభ్భైమందిలో మణికట్టు దగ్గర నాడి ఎక్కువ తక్కువలుగా స్పీడుగా కనిపించును. ఇక 30 శాతము మందికి దయ్యము లోపల ఉండినప్పటికి నాడిలో తేడా కనిపించదు. దానికి కారణము, శరీరములో చేరిన దయ్యము బ్రహ్మనాడికి (వెన్నుపాముకు) దూరముగా ఉంటే తెలిసేదానికి అవకాశము లేదు. ఉదాహరణకు భుజములోగానీ, చేతిలోగానీ, కాలిలోగానీ ఉన్న ఎడల వాటి స్పందన నాడిలో కనిపించదు. గొంతు నుండి క్రింది కడుపు వరకు దయ్యము ఎక్కడున్నా నాడిలో తెలియును. ఎక్కువ శాతము కడుపులో గానీ, దొమ్మల భాగములోగానీ, మనుషులలో సూక్ష్మశరీరములు నివాసము ఏర్పరుచు కొనును. అందువలన దయ్యముల వలనవచ్చు అనారోగ్య సమస్యలన్నీ ఎక్కువ కడుపులోను, దొమ్మలలోను ఉండును.


నావద్దకు తెచ్చిన ఆడమనిషికి కడుపునొప్పి సమస్య. ఆ నొప్పి కారణము ఏ టెస్టులకు, ఏ స్కానింగ్లకు అంతుబట్టలేదు. నేను చూచినపుడు నాడి స్పీడు, స్లో రెండు రకములుగా ఆడుచుండుట వలన ఆ నొప్పి దయ్యము


--

వలన వచ్చినదని తెలిసిపోయింది. అపుడు ఆ దయ్యమును బయటికి పిలిచాము. మేము పిలిస్తే నూటికి తొంభైమందికి దయ్యాలు బయటికి వస్తాయి. దానిప్రకారము ఆ దయ్యము బయటికి వచ్చింది. అలా దయ్యము బయటికి రాగానే, ఆమెలో ఒక వింత కనిపించింది. ఆ వింత ఏమనగా! దయ్యము పైకి రానంతవరకు నా ఎదురుగా కూర్చున్న ఆమె కన్నులు బాగానే ఉండేవి. దయ్యము బయటికి వచ్చిన తర్వాత ఆమె కన్నులలో తేడా వచ్చింది. ఒక కన్ను బాగుంది, ఒక కన్ను మాత్రము మెల్ల కన్ను మాదిరి ఒక ప్రక్కకు తిరిగి ఉంది. చూస్తూనే కళ్ళలో తేడా బాగా కనిపించినది. దయ్యము లోపలికి అణిగి పోతానే, అంతవరకు ప్రక్కకున్న కన్ను తిరిగి యథాస్థానములోనికి వచ్చి, కన్నులు బాగా ఉన్నట్లే కనిపిస్తున్నవి. అర్థగంట తర్వాత రెండవమారు దయ్యమును బయటికి పిలిస్తే అప్పుడు కూడ కన్ను మెల్ల కన్నుగా మారిపోయింది. దీనినిబట్టి చనిపోయి దయ్యముగా మారిన వ్యక్తికి ముందే మెల్లకన్ను ఉండెడిదనీ, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మశరీరమునకు మెల్లకన్ను కలదనీ, సూక్ష్మశరీరము ఏ శరీరములో చేరితే, ఆ శరీరమునకున్న కన్ను కూడ మెల్లకన్నుగా మారిపోవుచున్నదని తెలియుచున్నది. ఈ విధముగా ఎన్నో వాటిని చూచిన అనుభవములూ, ఎన్నో దయ్యములతో మాట్లాడిన అనుభవములూ మనకు తెలియని దయ్యముల రహస్యములను అర్థమగునట్లు చేయుచున్నవి.


ముందు చెప్పిన రైల్వే ఎంప్లాయి భార్యకు పట్టిన శివరామయ్య అలవాట్లను బట్టి, ఒక సూక్ష్మశరీరమునకున్న అలవాట్లు ఆ సూక్ష్మశరీరము ప్రవేశించిన శరీరమునకు కూడ వచ్చునని తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు చెప్పుకొన్న మెల్లకన్ను విషయమును బట్టి ఒక సూక్ష్మశరీరమునకు ఏ లోపముండునో ఆ లోపము ఆ సూక్ష్మశరీరము ప్రవేశించిన శరీరమునకు కూడా కనిపించునని తెలిసిపోయినది. ఇపుడు ఒక సూక్ష్మశరీరమునకు (దయ్యమునకు) ఒక పదార్థము మీద ఉన్న ఎలర్జీగానీ, రియాక్షన్ గాని ఉన్నట్లయితే ఆ సూక్ష్మశరీరము ఇతరుల శరీరములను చేరినపుడు ఉంటాయో, ఉండవో చూస్తాము.


మాకు దగ్గరగానున్న ఒక గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబము ఉండెడిది. ఆ ఇంటి యజమాని ఆ ఊరికి కరణము పనిచేసేడివాడు. అతని వయస్సు అరవై సంవత్సరముల పైనే కలదు. అతని భార్యకు వయస్సు 60 సంవత్సరములు గలవు. ఆ కుటుంబములోని ఆమె కొడుకులు నాకు బాగా పరిచయమున్న వ్యక్తులు. ఒక దినము ఆమె కొడుకు నావద్దకు వచ్చి, మా అమ్మకు దయ్యము అప్పుడప్పుడు వచ్చిపట్టి పోతూవుంటుంది. ఆ దయ్యము ఎవరో కాదు స్వయాన మాకు పెద్దమ్మ, మా అమ్మకు స్వంత అక్క అవుతుంది. మా అమ్మమీద ఆమెకు ఎక్కువ ప్రేమవుంది. ఆమె చనిపోయి పది సంవత్సరములైనది. చనిపోయిన ఆమె అట్లు మా దగ్గరకు రావడము మంచిది కాదనుకొన్నాము. మేము నిష్టగ పూజలు చేసు కొంటాము. అటువంటి ఇంటిలోనికి దయ్యము రావడము అరిష్టం అనుకొన్నాము. ఆమెను రావద్దని చెప్పినా మామాట వినడము లేదు. మీ వద్దకు తీసుకువస్తాము, ఏదో ఒక రకముగా చెప్పి పంపండి మీ మాటైనా వింటుందేమో అని అడిగారు. ముందునుండి పరిచయమున్న వ్యక్తులైన దానివలన సరే తీసుకురాండి చెప్పి చూస్తాము అన్నాము.


ఒక దినము సాయంకాలము, ఆమెను తీసుకురావడము జరిగింది. ఆమె ముందే నన్ను చూచిన వ్యక్తి అయినందున, బాగున్నారా అని నన్ను పలకరించింది. నీ ఆరోగ్యము ఎట్లుందమ్మా అని నేను అడిగాను. దానికామె దయ్యము పీడ తప్ప ఆరోగ్యమంతా బాగానే ఉంది నాయనా అన్నది. నాముందర ఆమెను కూర్చొపెట్టుకొని ఆమెకు దయ్యముందని ముందే తెలుసు కాబట్టి నేరుగా ఆ దయ్యాన్నే పేరు పెట్టి పిలిచాను. పిలిచిన తర్వాత కూర్చున్న ఆమె


---

ఆవులిస్తూ ఆవులిస్తూ చిన్నగా నిద్రమత్తులోనికి జారుకుంది. అలా రెండు నిమిషములకు ఆమె నిద్రలోనికి పోగా, లోపలయున్న దయ్యము శరీరము మీదికి వచ్చి మాట్లాడడము మొదలు పెట్టింది. వచ్చిన దయ్యానికి తాంబూలము వేసుకొనే అలవాటుందంట. బ్రతికియున్నపుడు గంట గంటకు ఆకు, వక్కను దంచి వేసుకొనేదంట. ఇపుడు శరీరము పైకి వస్తూనే నాకు ఆకు, వక్క, సున్నము ఇవ్వండి అని అడగడము మొదలు పెట్టింది. ఎప్పుడు పైకి వచ్చినా అలాగే అడుగుతుందట. అప్పుడు అక్కడే పక్కనే గల ఆకు, వక్క, సున్నము ఇచ్చాము. ఆకు, వక్కను దంచి ఇమ్మని అడిగితే అలాగే ఇచ్చాము. తాంబూలమును నోటిలో పెట్టుకొన్న తర్వాత ఆమె మాట్లాడేదానికి మొదలు పెట్టి నాతో ఇలా అన్నది.


దయ్యము :- నీకు వీళ్లు బాగా తెలుసు కదా! నీవైనా చెప్పకూడదా! నేను అప్పుడప్పుడు నా చెల్లెలు దగ్గరకు వస్తే వీరికేమి నష్టము? ఇపుడు నీ వద్దకు తెచ్చారు, సరే! నాకు ఇక్కడికి వచ్చినందుకు ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఊరిలో ఇంటి దగ్గరకు ఒక మంత్రాల సాయబ్ను పిలుచుకు వచ్చారు. వాడు నన్ను నానారకాలుగా మాట్లాడి, నీవు పోకపోతే మాంసము ముక్క నీ నోటిలో పెట్టుతానన్నాడు. ఇదేమైనా మంచిపనేనా నువ్వే వీరినడుగు.


(అపుడు ఆమె చెల్లెలు కొడుకులతో అలా ఎందుకు చేశారు? పెద్ద వాళ్ళతో అలా మాట్లాడడము మంచిది కాదు కదా! అన్నాను. దానికి వారు దయ్యము విడిపించే వాడంటే అతనిని పిలుచుకు వచ్చాము. అతను చెప్పి చూచాడు. ఈయమ్మ నేను పోనే పోను అన్నది. దానికి వాడు మాంసము ముక్కను చూపించి నీ నోటిలో పెట్టుతానని అన్నాడు. ఆ మాట అంటూనే వానిని ఈయమ్మ ఊరకే వదిలిందా? ప్రక్కనేయున్న 20 కేజీల రుబ్బుడు గుండును వానిమీద వేస్తానని పైకి ఎత్తింది. ఆ గుండును ఎత్తుతానే వాడు లేచి పరిగెత్తాడు. వాడు బయటికి పరిగెత్తినా వదలకుండ ఈమె గుండును ఎత్తుకొనే బయటికి పోయింది. వాడు పరిగెత్తేకొద్దీ అంత బరువు గుండు ఎత్తుకొని వెంటపడింది. మేమంతా పరిగెత్తి పోయి గట్టిగ పట్టుకొని రాయిని క్రిందవేయించాము. ఇక ఎవరితోను కాదని నీవద్దకు తెచ్చాము.)


నేను :- వీరు చెప్పేదంతా నిజమేనా? 20 కేజీల గుండును ఎత్తుకొని పరిగెత్తావా?

దయ్యము :- వాడు దొరికింటే వానిని గుండుతోనే చంపేసే దానిని. వాడు ప్రత్తి చేనులోపడి పారిపోయాడు. అంతలో వీరు వచ్చి వెనుక నుండి నన్ను పట్టుకొన్నారు.


నేను :- చూడమ్మా, నీవు పెద్దదానివి నీకు చెప్పేంతటివారము కాము. కానీ నీకు గుర్తు చేయునది ఏమంటే? ప్రతి మనిషి భూమిమీద కొంత కాలమే బ్రతికి చనిపోవడము జరుగుచున్నది. కొందరికి చనిపోయిన తర్వాత కొంతకాలము సూక్ష్మరూపములో బ్రతుకుటకు అవకాశము గలదు. కొందరు చనిపోతూనే మరుజన్మకు పోవడము జరుగుచున్నది. చనిపోతూనే రెండవ జన్మకు పోవువారికంటే, కొంతకాలము సూక్ష్మశరీరముతో అదే జన్మలో ఉండడము మంచిదే. ఎందుకనగా ఆ జన్మలో బ్రతికియున్నపుడు తన జీవితము ఎలా గడిచింది అని జ్ఞాపకము తెచ్చుకొని చూచుకొనుటకు అవకాశము గలదు. బ్రతికియున్నపుడు దైవజ్ఞానము తెలుసుకొను తీరిక లేకుండ బ్రతికియుండినా, సూక్ష్మముగా ఉన్నపుడు తీరిక ఉంటుంది. కావున తన తప్పును తెలుసుకొని దైవజ్ఞానమును తెలుసుకోవచ్చును. చనిపోయి దయ్యముగా ఉన్నపుడు కూడ నీవు నా చెల్లెలు అంటున్నావు. వారేమో నిన్ను పీడ అంటున్నారు. వారు అంతగ ఏవగించుకొన్నపుడు నీవెందుకు వీరిని అనుకోవాలి. మంచి అవకాశమున్న కాలములో కూడ దేవున్ని తెలుసుకోకపోతే,



---

దయ్యముగా మారి తన తప్పును తాను తెలుసుకోలేనట్లే. జన్మకు పోతే తన తప్పును గుర్తు చేసుకొను జ్ఞాపకమే ఉ ౦డదు. అటువంటి వారికంటే తాను గడిపిన జీవితమును గుర్తు చేసుకొని, మంచి జీవితమును గడుపుటకు అవకాశమున్న సూక్ష్మశరీరములో ఉండి, ఒక క్షణము వృథా చేసినా, అది ఆ జన్మకు తీరని నష్టమే అగును.


ఇపుడు నీవు సూక్ష్మముగా కాలము గడుపుచున్నావు. ఏ ఆటంకము లేదు. గడచిన కాలమును గురించి యోచించుకో, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తముగ దైవజ్ఞానము తెలుసుకో. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. నీకు నేను చెప్పినది మంచిదనిపిస్తే ఇట్లు వచ్చేది మానివేసి జ్ఞానము తెలుసుకొనేదానికి కాలమును వినియోగించుకో లేకపోతే నీఇష్టము.


దయ్యము :- నీవు చెప్పినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఎక్కడికి పోయినా దయ్యము అంటేనే చాలా చిన్నచూపు చూస్తున్నారు. మనిషి యోగ్యతనుగానీ, బంధుత్వమునుగానీ, వయస్సునుగానీ, సాటి మనిషియని గానీ చూడకుండ పరక (చీపురు)తో కొట్టు, చెప్పుతో కొట్టు, పొగపెట్టు అనెడివారేగానీ మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళేలేరు. మావారు కూడ నాకు ఏమీ మర్యాద ఇవ్వలేదు. అలాంటపుడు నేను రావడము కూడ నాబుద్ధి తక్కువే అగును. ఇప్పటి నుండి దైవజ్ఞానమును తెలుసుకొనుటకే ప్రయత్నిస్తాను.


(అని చెప్పి అక్క తేలిపోయి చెల్లెలు నిద్రనుండి బయటికి వచ్చింది. ఇదంతా ఒక గంటకాలము జరిగిందనుకుంటాను. దయ్యము పోయి మనిషికి జ్ఞాపకము వచ్చిన రెండు నిమిషములకే చెల్లెలు కక్కుకున్నది (వాంతి చేసుకొన్నది). ఎందుకు అలా వెంటనే కక్కుకున్నదని అడుగగా ఆమె కొడుకులు ఇలా చెప్పారు. మా అమ్మకు తాంబూలము సరిపోదు. మా పెద్దమ్మకు సరిపోతుంది. మా పెద్దమ్మ తాంబూలము లేనిది ఉండలేదు. ఇట్లా మా పెద్దమ్మ వచ్చినపుడు తాంబూలము ఇచ్చినా, ఆమె పోయిన తర్వాత మా అమ్మ శరీరములో అది సరిపోదు. వెంటనే కడుపులో త్రిప్పి వాంతికి వస్తుంది అని చెప్పారు. ఇదంతా గమనించి చూస్తే, అక్క సూక్ష్మము చెల్లెలు శరీరమును ఆక్రమించి ఉన్నపుడు ఆ సూక్ష్మమునకు తాంబూలము సరిపోతుంది. కావున చెల్లెలు శరీరములో తాంబూలమున్నపుడు ఏ అలర్జీలేదు, రియాక్షన్ లేదు. అక్క సూక్ష్మము, చెల్లెలు శరీరమును వదలి పోయిన తర్వాత చెల్లెలు సూక్ష్మమును బట్టి, చెల్లెలు శరీరములో తాంబూలము ఎలర్జీ వలన రియాక్షన్ అయి వాంతికి వచ్చింది. దీనినిబట్టి ఏ శరీరములోనైనా ఆహార ప్రత్యేకతలు, ఆహార ఎలర్జీలు ఉండవనీ, కేవలము శరీరములో జీవించు జీవున్ని బట్టి, జీవుని కర్మను బట్టి, శరీరమునకు ఎలర్జీలు, రియాక్షన్లు ఉండునని తెలియుచున్నది.


ఇంతవరకు తెలుసుకొనిన శివరామయ్య మీసమును త్రిప్పు అలవాటుగానీ, దయ్యము పట్టినపుడు వచ్చిన మెల్లకన్నుగానీ, ఇపుడు చెప్పిన తాంబూలము రియాక్షన్గా నీ శరీరమునకు ఉండునవి కావనీ, శరీరములో ఉండు జీవున్ని బట్టి ఉండునవనీ, అనుభవపూర్వకముగా, ప్రత్యక్షముగా తెలిసిపోయింది. ఇంత ప్రత్యక్ష సాక్ష్యములున్నప్పటికి దయ్యాలను ఒప్పుకోని కొందరు నాస్తికులున్నారు. వారి అంతరంగమందు దయ్యాలు నిజమేనని వారికి అర్థమైనా, తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్లు వాదిస్తుందురు. తెలియనివారికైనా చెప్పవచ్చును, తెలిసినవారికైనా చెప్పవచ్చును, తెలిసినా, తెలియదను వారికి ఏమీ చెప్పలేము. ఎందుకనగా వానికి తెలిసినా తెలియదనడమూ, అర్థమైనా అర్థమే లేదనడము అతని పని. అటువంటివారికి చెప్పేదానికంటే చెప్పకపోవడమే మంచిది.


---

శరీరములో రోగాలు రావడము సహజము. కానీ అన్ని రోగాలు ఆసుపత్రిలో డాక్టరువద్దనే నయము కావు. దానికి కారణము, రోగాల రూపములో ఉండేవన్నీ రోగాలు కావు. ఇప్పుడు అటువంటి రోగాన్ని గురించి ఒక సంఘటన ద్వారా తెలుసుకొందాము. అనంతపురము జిల్లాలో గంగవరము అను ఊరిలో రామన్నచౌదరి అను వ్యక్తికి ప్రతి బుధవారము సాయంత్రము ఏడుగంటలకు వాయి (మూర్చ) లేచేది. అది ఐదునుండి పది నిమిషముల వరకు ఉండి పొయ్యేది. అట్లు దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలమునుండి జరిగేది. డాక్టర్ల వద్దకు పోయి చూపించుకొంటే ఆ రోగమునకు ఏదో ఒక పేరుపెట్టి, అది అట్లే వస్తుంది దానికి ఈ మందులు వాడితే రాకుండ పోతుందని చెప్పి, నెలల పర్యంతము మందులు ఇచ్చినా అది మాత్రము రాకుండ పోలేదు. చివరకు వారు నావద్దకు వచ్చి ఇలా చెప్పారు. “ప్రతి బుధవారము సాయంత్రము ఏడుగంటలకు వాయి లేవడము (ఫిట్స్ రావడము) వలన ఆ రోజు, ఆ సమయానికి పనులన్నీ మానుకొని ఇంటి వద్దనే ఉండవలసివస్తున్నది. ఇంతవరకు ఏ మందులు వాడినా నయము కాలేదు” వారి మాటలువిన్న నేను కొంత ఆలోచించగా రోగానికి బుధవారమనిగానీ, ఏడుగంటలే అనిగానీ నియమముండదు. అలా ఉంది అంటే అది శరీరరోగముకాదని, సూక్ష్మశరీరరోగమని అర్థమైనది. అప్పుడు అతనిని కొన్ని ప్రశ్నలడిగాను. 


నేను :- ఈ రోగము ఎంతకాలమునుండి వస్తున్నది?


రామన్న :- దాదాపు ఒకటిన్నర సంవత్సరమునుండి వస్తున్నది.


నేను :-· మొట్టమొదట వచ్చినపుడు ఇంకా ఏదైనా జరిగిందా లేక ఏదైనా జరిగిన తర్వాత ఈ రోగము వచ్చిందా? 


రామన్న :- మొదట వచ్చినపుడు ఏమి జరిగినట్లు గుర్తులేదు.


నేను :- ఈ రోగము రాకముందు అమాస్యదినముగానీ, పౌర్ణమి దినముగానీ, ఆదివారము దినముగానీ నీకేమైనా ప్రత్యేకముగా జరిగిందా?


రామన్న :- నాకు ఏమీ జరగలేదు, కానీ అమావాస్యదినము అనేది నాకు బాగా జ్ఞప్తికియున్నది.


రామన్న :- మా ప్రక్క ఊరిలో వడ్లమిషన్ ఉంది. ఆ రోజు వడ్లను ఆ మిషను తీసుకపోయాను. దారి మధ్యలో కొంత ఆలస్యమై అక్కడికి పోయేటప్పటికి సాయంత్రము చీకటిపడే సమయమైంది. మిషన్వాళ్ళు లైట్లు వేశారు. ఈ రోజు అమావాస్య మిషన్కు పూజ చేయాలి. రేపువస్తే వడ్లు వేస్తాము, ఇపుడు వేయము అన్నారు. ఎంత అడిగినా వాళ్ళు వినలేదు. ఆ రోజు ఇంటికి వచ్చాను, మరుసటి దినము నేను పోలేదు, మావాళ్ళు పోయారు.


నేను :- దారిలో ఎందుకు ఆలస్యమైనది?


రామన్న :- బండి వాటు పడింది. నేను ఒక్కడినే కాబట్టి చాలసేపువుండి. దారిలో ఐదారుమంది మనుషులు వచ్చిన తర్వాత, బండిని తిరిగి లేపి వడ్ల మూటలన్నిటిని తిరిగి బండిలోనికి వేసుకొని, వచ్చేటప్పటికి సాయంకాలమై పోయింది. నేను :- ఈ రోగము అమావాస్య తరువాత వచ్చినట్లు గుర్తుందా?


రామన్న :- అమావాస్య పోయిన తర్వాతనే, అదే నెలలో వచ్చింది, కానీ ఎన్ని దినములకు వచ్చినదో జ్ఞాపకములేదు. (ఇదంత విన్న తర్వాత ఏమీ అర్థము కాలేదు. అయినా అతని కుడి చేయి నాడిని చూచాను. నాడికొట్టుకోవడమునుబట్టి అతని శరీరములో మరొక సూక్ష్మశరీరమున్నట్లు అర్థమైనది. అప్పుడు అతనిని నాముందు కూర్చోమని అతని వైపు


---

చూచాను. అలా చూస్తూవుండగా ఒక నిమిషములోనే, రామన్న శరీరములోని సూక్ష్మశరీరము, శరీరము పైకి వచ్చినట్లు అర్థమైనది. అపుడు మా సంభాషణ ఇలావుంది చూడండి)

నేను:- నీవు ఎవరో తెలుసుకోవచ్చా?

సూక్ష్మము :- నన్ను ఎందుకు బయటికి లాగారు?

నేను :- ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. తర్వాత నీ ప్రశ్నకు జవాబు చెప్పుతాము.

సూక్ష్మము :- నేను సుబ్బలక్ష్మిని. నేను చనిపోయి ఏడు సంవత్సరములైనది.

నేను :- సుబ్బలక్ష్మీ నీవు ఎందుకు చనిపోయావు? నీ వయస్సెంత?

సుబ్బలక్ష్మి :- నాకు ఇప్పటికి 24 లేక 25 సంవత్సరముల వయస్సుంటుంది. నేను రోగమొచ్చి చచ్చిపోలేదు. వేరే వాళ్ళు నన్ను చంపేశారు.

నేను :- నీకు ఇప్పటికి 25 సంవత్సరముల వయస్సయితే, నీవు చచ్చిపోయి ఏడు ఏండ్లయితే, 18 సంవత్సరము వయస్సులోనే నీవు చనిపోయి ఉండాలి అంతేనా?

సుబ్బలక్ష్మి :- అంతే. నేను చచ్చిపోలేదు, నన్ను చంపారు. అయినా నేను బ్రతికే ఉన్నాను. ఇపుడు నన్ను ఎవరూ చంపలేరు. నేనే వాళ్లను చంపుతా.

నేను :- నీ వెనుక మాకు తెలియనిది చాలా ఉన్నట్లున్నది. అవసరమైతే నీకు నేను కూడ సహాయము చేస్తాను. నిన్ను ఎవరు చంపారు?

సుబ్బలక్ష్మి :- మీరు గొప్పవారు. మీరు నాకు సహాయము చేస్తానన్నారు. చాలా సంతోషము. నాది బీద కుటుంబము. నా తల్లి తండ్రులు నన్ను బాగా చదివించాలనుకొన్నారు. మా అమ్మకు నామీద ఎక్కువ ప్రేమ. మా ఊరికి ప్రక్కన ఉన్న ఊరిలో హైస్కూలు ఉన్నది. అక్కడ నేను పదవతరగతి చదివేదానిని. ప్రతి రోజు కాలినడకన స్కూల్కు పోయి వచ్చేదానిని. మా ఊరినుండి నాతోపాటు స్కూల్కు వచ్చేవాళ్ళుండిరి. కానీ ఒకరోజు నాకు ఇంటివద్దే ఆలస్యమైనది. తోటిపిల్లలు నేను రానని చెప్పడము వలన వారు వెళ్ళిపోయారు. తర్వాత కొంత ఆలస్యమైనా పరవాలేదు చెప్పుకోవచ్చునని బయలుదేరి వచ్చాను. స్కూలున్న ఊరు దగ్గర దగ్గరకు వచ్చాను. అంతలో ఇద్దరు యువకులు మోటర్ సైకిల్ లో ఎదురయ్యారు. వాళ్ళు ఇద్దరు నేను పొయ్యే ఊరివారే. కమ్మకులానికి చెందిన వారు. వారు నా ప్రక్కనే ఆగారు. ఏమి ఆలస్యము అని అడిగారు, నేను పలకలేదు. నాదారిన నేను వస్తున్నాను. అంతలో ఒకడు వెనుకనుండి వచ్చి నానోరు మూశాడు, రెండవాడు కాళ్ళు పట్టుకొని ఎత్తి ప్రక్కనేవున్న కందిచేనులోనికి తీసుకెళ్ళారు. నోటిలో కర్చీఫ్ పెట్టి, మొలత్రాడుతో చేతులు పైకిపెట్టి కట్టారు. అక్కడ కంపచెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోడ్డులోనికి ఏమి కనిపించదు. తర్వాత ఒకడు మోటర్ సైకిల్వద్దయుండి, ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారము చేశారు. తర్వాత విషయము తెలిస్తే ప్రమాదమని నన్ను నిర్ధాక్షిణ్యముగా గొంతు నులిమి చంపారు. శవాన్ని దారి ప్రక్కనే గల బావిలో వేశారు.

అలా వాళ్ళు నన్ను బలవంతముగా చంపారు. అయినా ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. మా అమ్మ నేనే బావిలోపడ్డానని అనుకుంది. వాళ్ళు ఎలా చంపినా దేవుడు నన్ను సజీవముగానే ఉంచాడు. దేవుడు నన్ను సజీవముగా, వారిమీద పగతీర్చుకొమ్మనే ఉంచాడనుకొన్నాను. తర్వాత కొన్నాళ్ళకే వారిద్దరినీ చంపేశాను. నన్ను


---

చంపింది కమ్మవాళ్ళే కనుక ఆ కులస్తులంటే నాకు కోపము. ఒక అమావాస్య దినమున ఈ రామన్న ఎద్దులబండిని తోలుకుంటూ ఆ దారిలో వస్తుండము చూచాను. దారి ప్రక్కనే బావివుందని చెప్పానుగా! నేను అప్పుడప్పుడు అక్కడే ఉంటాను. ఆ రోజు అక్కడే ఉండి రామన్నను చూచి చంపాలనుకొన్నాను. తర్వాత అతనేమి చేశాడు అని అనుకున్నాను. రామన్న కమ్మవాడు కదా అందుకు వదలకూడదనుకున్నాను. అక్కడికి వస్తూనే బండిని వాటు పడేటట్లు చేశాను. అక్కడ వాటుపడే అవకాశమే లేదు. అయినా పడిందే అనుకొన్నాడు. ఇతను ఒంటరిగా చాలాసేపు అక్కడే ఉన్నాడు. మనుషులు వచ్చిన తర్వాత బండిని లేపుకొని పోయారు. బండివాటు పడినపుడు రామన్న కూడ క్రింద పడినాడు. అప్పుడు కొద్దిగ మబ్బు వచ్చినట్లయినది (జ్ఞాపకము లేనట్లయినది) అప్పుడే నేను అతనిలో చేరుకొన్నాను. అప్పటి నుండి ఇతనిలోనే ఉన్నాను. రామన్న క్రిందపడింది బావిదగ్గరే. నామాట నిజమా? కాదా? అనుటకు అతనికి జ్ఞాపకము వచ్చిన తర్వాత అడగండి. ఇంకొక విషయము అతను మీకు చెప్పలేదు. అతను భార్యతో కాపురము చేయడము లేదు. భార్యతో శరీరసంబంధము ఏమాత్రము లేదు. దానికి కారణము నేనే. అతని మగతనాన్ని నేనే అనుభవిస్తున్నాను. అందువలన అతని భార్యతో రామన్నకు సంబంధము లేకుండ పోయింది. ఇతనికి ప్రతి బుధవారము వాయువు వచ్చునట్లు చేయుచున్నది నేనేనని ఎవరికీ తెలియదు. అట్లు వచ్చుట వలన అది పైకి కనిపించు కారణమైనది. దానివలననే ఇతని మగతనము పోయిందని అనుకున్నారు. ఇతను డాక్టర్లను అడిగితే వారు వాయువు వచ్చుటవలన అలా అయినదని చెప్పారు. మీరు గొప్పవారు ఇప్పుడు మీరే చెప్పండి, నేను చేసింది తప్పా?

నేను :- ' తప్పని నేను చెప్పలేను. ఇపుడు ఏమి చేయదలచుకున్నావు.

సుబ్బలక్ష్మి :- నేను చేయవలసినది చేశాను. నన్ను చంపిన వాళ్ళను చంపాను. ఇతని విషయానికి వస్తే, భార్యకు పసుపుకుంకుమ ఉంచాలను కున్నాను. నేను మనిషినే కదా! నాకూ కోర్కెలుంటాయి కదా! అందువలన నేను ఇతనిని వదలను, అట్లని చంపను. మీరు ముందే నాకు సహాయము చేస్తానన్నారు. అందువలన నన్ను నా దారినుండి తప్పుకొమ్మని చెప్పవద్దండి. దయచేసి నన్ను చెడ్డదానిని అనకుండ వదిలేస్తే, మీరు నాకు సహాయము చేసినట్లే.

నేను :- సుబ్బలక్ష్మీ నీవు చాలా తెలివైన దానివి. నేను నీకు మంచి చేసినా కొంత చెప్పేది ఉంది. నీకు ఒంటరిగా తర్వాత చెప్పుతాను. ముందు నీవు లోపలికి అణిగిపోయి రామన్నను బయటికి పంపు అతనితో మాట్లాడాలి.


 (సుబ్బలక్ష్మి అణిగిపోయి రామన్న బయటికి వచ్చాడు. అంతవరకు అక్కడేమి జరిగినది అతనికి తెలియదు. అంతవరకు అతను నిద్రలోవుండి లేచాడు. అప్పుడు రామన్నను కొన్ని మాటలు అడిగాను)


నేను :- నీవు వడ్లు తీసుకొని పోయిన ఆ దారి ప్రక్కనే బావి ఉంది కదా! ఆ బావి దగ్గరే నీబండి పడినదా?

రామన్న :- దారి ప్రక్కన బావి ఉన్నమాట నిజమే, నేను అక్కడ పడినది కూడ నిజమే.

నేను :- నీకు మగతనము తగ్గిపోయిన మాట వాస్తవమేనా?

రామన్న :- నిజమే అయినా ఆమాట నేను చెప్పలేదు కదా! మీకెలా తెలుసు? డాక్టర్లకు చెప్పుకొనినా ప్రయోజనము లేదు.

నేను :- రాత్రిపూట శృంగారమునకు సంబంధించిన స్వప్నాలు వస్తాయా?

రామన్న :- అవును వస్తుంటాయి.


--

నేను :- నీకు వాయి లేచినపుడు ఆ కొద్దిసేపు ఎలా ఉంటుంది.

రామన్న :- అది వచ్చేటపుడు, అలాగే వదలి పోయేటపుడు శరీరమంతా అదోరకము తిమ్మిరి ఉన్నట్లు తెలుస్తుంది. మధ్య మధ్యలో ఏమీ తెలియదు.


(అక్కడ రామన్నను తీసుకువచ్చిన అతని బంధువులను బయటికి పొమ్మని చెప్పాను. అప్పటికే రామన్న బంధువులందరికి రామన్న రోగము గురించి తెలిసిపోయింది. వారు సుబ్బలక్ష్మి చెప్పిన మాటలన్నీ వినుటవలన ప్రతి విషయము మనము చెప్పకున్నా వారికి తెలిసిపోయింది. అందరు బయటికి పోయిన తర్వాత సుబ్బలక్ష్మిని తిరిగి పైకి రమ్మని చెప్పగా ఆమె మళ్ళీ వచ్చింది.)


నేను :- సుబ్బలక్ష్మీ! నీకు చాలా అన్యాయము జరిగింది. అదియు చిన్న వయస్సులోనే జరగడము చాలా చింతించతగ్గ విషయము. ఇంతవరకు జరిగిన దానిలో ఎక్కడా నీ తప్పులేదు. నీవు అడిగినట్లు నేను ఏమీ దండించడము లేదు. అయినా దైవజ్ఞానము తెలిసిన మనిషిగా నీకు నేను కొంత చెప్పవలసియున్నది. జీవితము అంటే కష్టసుఖాల కలయిక. అందులో ప్రతి మనిషి తన కష్టమును గురించో, సుఖమును గురించో చింతించుతూ కాలము గడుపుచున్నాడు. ప్రస్తుతము నీవు కూడ నీకు కల్గిన కష్టమును గురించి చింతించుచు, దానికి ఒక ప్రతికారమనీ దానిలోనే నీ జీవితమును గడిపేస్తున్నావు. ఇది సహజముగ, సర్వసాధారణముగ అందరికి ఉండునవే. అలా జీవిత కాలమును వృథా చేసుకోకుండ మనిషి జీవితానికి ఒక అర్ధము, పరమార్థము ఏర్పడాలంటే ఏ మనిషి అయినా దైవజ్ఞానమును తెలుసుకోవాలి. ఇపుడు నీవు ప్రతీకారము మీద పెట్టుకొన్న శ్రద్ధను త్రిప్పి దైవజ్ఞానము మీద పెట్టుకో, చనిపోయిన తర్వాత జీవితము కొంతమందికే ఉంటుంది. అలాంటి జీవితమును దైవమువైపు త్రిప్పుకొంటే, ప్రపంచములో బ్రతికేవారి కంటే, సూక్ష్మప్రపంచములో బ్రతికే మీలాంటి వారు జ్ఞానమును, జ్ఞానశక్తిని ఎంతైన సంపాదించుకోవచ్చును. ప్రపంచము లో బ్రతికే వారికున్న ఆటంకములు మీకుండవు. అందువలన నీవు దేవుని జ్ఞానమును సంపాదించుకో! జీవితమునకు పవిత్రతను చేకూర్చుకో. అలాకాకుండ ఇప్పటివలె బ్రతుకుతూవుంటే, జీవితములో పాపాలు, పుణ్యాలు తప్ప ఏమీ రావు. ఈ జన్మలో నీకు జరిగిన అన్యాయము, పోయిన జన్మలో నీవు చేసుకొన్న పాపమే. పాపపుణ్య పరంపరల వలన సుఖదుఃఖాల గొలుసు జీవితము తప్ప ఏమీ ఉండదు. పాపపుణ్యాలను, కర్మను నిర్మూలించడానికి జ్ఞానము ఒక్కటే ఆయుధమని తెలుసుకో. ఇప్పుడు నేను చెప్పిన మాటలను జీవితాంతము గుర్తుపెట్టుకో. అలా గుర్తుండుటకు నీవు నేను చెప్పినట్లు మార్పుతో ఇప్పటినుండి ప్రవర్తించు. ఇంతవరకు లేనిది, నావద్దనుండి పోయిన తర్వాత ఉండవలసినది ఏమంటే, నీవు ప్రతి బుధవారము రామన్నకు కల్గించు వాయువును నేటినుండి రానీయవద్దు. అది నీ చేతిలోని పనే. నేను చెప్పిన విధానము నీకు సమ్మతమేనా?


సుబ్బలక్ష్మి :- స్వామీ! మీరు నా జీవితానికి కనువిప్పు కల్గించారు. నా జీవితములో మీ మాటను ఎప్పటికీ మరువను. మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. అని చెప్పి ఆమె ఆ దినము వెళ్ళిపోయింది. తర్వాత సమాచారము తెలియదు.


ఒక మనిషి కాలమృత్యువును పొందితే మరుజన్మకూ, అకాల మృత్యువును పొందితే జీవితానికే పోవలసి వస్తుంది. ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే, జీవుడు కర్మను అనుభవించేదానికే పుట్టుచున్నాడు. జీవుని చేత అనుభవింపబడే కర్మ రెండు రకములుగా ఉన్నది. ఒకటి మానసిక కర్మ, రెండు శారీరక కర్మ. వాటినే ఇంకొక విధముగా చెప్పుకొంటే సూక్ష్మకర్మ, స్థూలకర్మ అని కూడ అనవచ్చును. మానసిక కర్మ లేక సూక్ష్మకర్మ అనబడునది లోపలి సూక్ష్మశరీరముతో


---

అనుభవించునది. అట్లే శారీరక కర్మ లేక స్థూలకర్మ అనునది స్థూలశరీరము చేత అనుభవించబడునది. రెండు రకముల కర్మలు మిశ్రమముగ ఉండువాడు, ఆయుస్సు అయిపోయి మరణము పొందును, దానినే కాలమరణము అంటాము. ఒకవేళ శారీరక కర్మ (స్థూలకర్మ) ముందే అయిపోయి, కేవలము సూక్ష్మకర్మ మిగిలితే వానికి స్థూలశరీరము అవసరము లేదు. మిగిలిన మానసిక కర్మను (సూక్ష్మకర్మను) సూక్ష్మశరీరముతో అనుభవించవలసి ఉండును. కావున వానికి ఆయుస్సు అయిపోకముందే అకాల మరణము వస్తుంది. అకాల మరణములో స్థూల శరీరము పోయి సూక్ష్మశరీరము మాత్రము మిగులును. ముఖ్యముగ చెప్పుకొంటే అకాలమరణము పొందిన వారిలో మరొక రకము వారు కూడ కలరు. ఉదాహరణకు ఒకడు జన్మించిన తర్వాత 80 సంవత్సరములు బ్రతకవలసియున్నది. కానీ వానికి 20 సంవత్సరములకు శారీరక కర్మ అయిపోయి,10 సంవత్సరములు మానసిక కర్మ అనుభవించి, తర్వాత 50 సంవత్సరములు శారీరక కర్మ అనుభవించవలసి ఉన్నది. అటువంటి వాడు 20 సంవత్సరములకు అకాలమృత్యువు పొంది, అందరి దృష్టిలో చనిపోవును. తర్వాత 10 సంవత్సరములు సూక్ష్మశరీరముతో (దయ్యముగ) ఉండును. 30 సంవత్సరముల వయస్సు తర్వాత, 50 సంవత్సరముల కాలము తిరిగి స్థూలశరీరముతో బ్రతకవలసియున్నది.


ఇక్కడొక ప్రశ్న ఎవరికైనా రాగలదు. అదేమనగా! 20 సంవత్సరముల తర్వాత స్థూలశరీరము ఎలా వస్తుంది? అని అడగవచ్చును. దీనికి సమాధానము దొరకాలనినా, మరియు దొరికిన సమాధానము అర్థము కావాలనినా, భూమిమీద జరిగిన కొన్ని యదార్థసంఘటనలను చూడ వలసిందే. అవి ఎలా జరిగాయనగా! క్రొత్తగా పెళ్ళైన జంట ధర్మవరము శివానగర్ లోని తమ బంధువుల ఇంటికి పోయినారు. నాలుగురోజుల తర్వాత క్రొత్తజంటైన భార్య శేషమ్మ, భర్త పోలయ్య అనంతపురము రావాలని ధర్మవరము శివానగర్నుండి బయలుదేరారు. కదిరి గేట్ దగ్గరనుండి రైల్వే రోడ్ వెంట కాలినడకన నడుచుకొంటూ రైల్వేస్టేషన్ వైపు వస్తున్నారు. గేటు, స్టేషన్కు మధ్యలోనికి వచ్చిన తర్వాత భార్యకు రాయితట్టుకొన్నట్లయి క్రిందపడింది. ముందుపోవుచున్న భర్త వెంటనే వచ్చి భార్యను లేపాడు. తర్వాత స్టేషన్కు పోయి రైలెక్కి పోయారు. అప్పటికి దాదాపు పదిరోజుల తర్వాత భార్యకు కొద్దిగ ఆరోగ్యము సరిగ లేకుండపోయినది. దానివలన ఆమె నాకు బాగలేదని ఎక్కువగ పడుకొనేది. అప్పుడప్పుడు డాక్టర్ వద్దకు పోయి చూపించుకొని వచ్చేవారు. ఇట్లు ఒక సంవత్సకాలము గడిచింది, భార్య శేషమ్మకు ఆరోగ్యము సరిగలేదని గ్రహించిన భర్త పోలయ్య పెద్ద డాక్టర్ల వద్దకు తీసుకపోయాడు. అక్కడ కూడ ఆరోగ్యము కుదుటపడలేదని ఇతరుల సలహా ప్రకారము ఆమెకు మంత్రగాళ్ళవద్ద తావెత్తులు కూడ కట్టించాడు. అయినా అప్పుడప్పుడు ఆరోగ్యము బాగా లేనట్లనిపించేది. చివరకు నావద్దకు రావడము జరిగినది. నావద్దకు వచ్చిన తర్వాత శేషమ్మ శరీరములో మరొక సూక్ష్మశరీరమున్నట్లు నాకర్ధమైనది. ఒక శరీరములో దాని సూక్ష్మశరీరము ఒకటి ఎప్పటికి ఉండుట సహజము. వేరొక సూక్ష్మ శరీరము చేరితే మొత్తము రెండు సూక్ష్మశరీరములు శరీరములో ఉన్నట్లుగును. అలాంటపుడు నాడికొట్టుకోవడములో తేడావుండును. దానినిబట్టి శరీరములో మరొక సూక్ష్మశరీరమున్నదని అర్థమగును. అట్లున్న వారిలో శరీరము ఒకరి స్వంత ఇల్లుకాగ, మరొకరిది పరాయి ఇల్లగుచున్నది. జన్మలో శరీరములో చేరిన జీవునికి ఆ శరీరము స్వంత ఇల్లుగ లెక్కించబడును. అలాగే ఒక జీవుడున్న శరీరములోనికి, ఎవరైన వేరొక జీవుడు ఎప్పుడైన ప్రవేశిస్తే, వాడు పరాయి ఇంటిలోనికి వచ్చినట్లగును. అందువలన అకాల మృత్యువు పొందిన వారికి శరీరము లేకుండ పోయింది కావున వారికి స్వంత ఇల్లు లేనట్లే.


శరీరముల విషయము వదలివేసి, బయటి ప్రపంచములోని మనుషులు నివాసము చేయు ఇళ్ళను గురించి మాట్లాడుకొందాము. ఒకడు కష్టపడి స్వంత ఇల్లును సంపాదించుకొని దానిలో కాపురమున్నాడు. ఉన్న ఇల్లును బాకీల


---

బాధలకు అమ్మివేసి, ఇల్లును పోగొట్టుకున్నవాడు మరొకడున్నాడు. స్వంత ఇల్లున్న వానిపేరు వెంకటరాముడు. ఇల్లును పోగొట్టుకొన్న వానిపేరు బికారి అంజయ్య. స్వంత ఇల్లున్న వెంకటరాముని ఇంటికి, ఇల్లులేని బికారి అంజయ్య అప్పుడప్పుడు పోయివచ్చెడువాడు. ఒక దినము వెంకటరాముని ఇంటికి బికారి అంజయ్య వచ్చాడు. ఇంటిలో వెంకటరాముని ప్రక్కనే అంజయ్య కూర్చొని ఉండగా, కాయకూరలమ్ముకొనే పుల్లయ్య వచ్చాడు. ఇద్దరినీ ఇంటిలో చూచిన పుల్లయ్యకు ఎవరు ఇంటి మనిషో, ఎవరు బయటి మనిషో అర్థము కాలేదు. తర్వాత నెలరోజులకు కాయకూరల పుల్లయ్య మళ్ళీ వచ్చాడు. ఆ దినము బయటిరూములో వెంకట రాముడు ఉండగా, లోపలి రూములో బికారి అంజయ్య ఉన్నాడు. బికారి అంజయ్య కాయకూరల పుల్లయ్యతో మాట్లాడి కాయకూరలు తీసుకొన్నాడు. తర్వాత నెలకు మళ్ళీ పుల్లయ్య కాయకూరలు తీసుకురాగ, ఆ దినము వెంకట రాముడు అసలుకు కనిపించలేదు. అంజయ్య మాత్రమే ఇంటిలో ఉన్నాడు. ఆ దినము కూడ పుల్లయ్యతో అంజయ్యే మాట్లాడినాడు. ఈ విధముగ మూడుమార్లు చూచిన పుల్లయ్యకు, బికారి అంజయ్యే ఇంటి యజమాని అని అర్థమైనది.


శరీర విషయములోను పరిశీలించితే అకాలమృత్యువు పొందిన వాడిని శరీరమను ఇల్లును పోగొట్టుకున్న బికారి అంజయ్యగ చెప్పవచ్చును. అటువంటివాడు వెంకటరాముని ఇల్లును చేరి, కొంతకాలమునకు వెంకట రామున్ని బయటికి గెంటివేసి, పుల్లయ్యకు తానే ఇంటి యజమానిగ కనిపించినట్లు, జన్మతో శరీరము పొందిన 'X' అను జీవున్ని, మధ్యలో శరీరమును పోగొట్టుకొన్న 'Y' అను జీవుడు, శరీరమునుండి బయటికి పంపి 'Z' అను వానికి శరీరముగల వానిగ కనిపించవచ్చును. సరిగా అదే విధానము భూమిమీద అక్కడక్కడ జరిగినట్లు కనిపిస్తున్నది. ఇక్కడ శేషమ్మ శరీరములోనికి, భారతి అను మరొక సూక్ష్మశరీరము ప్రవేశించి, కొంత కాలమునకు శేషమ్మను బయటికి గెంటివేసి, శేషమ్మ శరీరమును స్వంతము చేసుకొన్న విచిత్రమును ఈ సమాచారములో చూడగలరు.


శేషమ్మ శరీరములోనికి ప్రవేశించిన సూక్ష్మశరీరమును (దయ్యమును) బయటకు పిలిచి, అడిగినపుడు కొన్ని తెలియని విషయములు బయటపడినవి. అవి ఏమనగా! ధర్మవరములో బంధువుల ఇంటినుండి బయలుదేరిన శేషమ్మ, పోలయ్య రైల్వేలైను ప్రక్కన వస్తున్నపుడు ఆ దారిలోనున్న భారతి అను 20 సంవత్సరముల వయస్సున్న యువతి, శేషమ్మను చూచింది. శేషమ్మకు ముందు నడుస్తున్న పోలయ్యను కూడ చూచింది. శేషమ్మ అలంకారమును బట్టి క్రొత్తగా పెళ్ళైనదని గ్రహించింది. శేషమ్మను చూస్తూనే ఆమెలోనికి ప్రవేశించాలని అనుకొన్నది. శేషమ్మ వెంట కొంత దూరము నడిచిన భారతి, శేషమ్మను క్రిందపడునట్లు తోచింది. ఆమె క్రిందపడి లేచేలోపల భారతి ఆమెలోనికి చేరింది. అట్లు శేషమ్మ శరీరము లోనికి చేరిన భారతి, కొంతకాలము ప్రయత్నము చేసి చివరకు శేషమ్మ నిద్రలోనికి పోయినపుడు బ్రహ్మనాడిలో చేరి శరీరమంతా వ్యాపించు కొన్నది. బ్రహ్మనాడిలో చేరిన భారతి సూక్ష్మశరీరము, స్థూలశరీరమును ఆక్రమించుకొని చిన్నగ పోలయ్యతో శేషమ్మవలె నటిస్తూ మాట్లాడను మొదలు పెట్టింది. పైన కనిపించు శరీరమును బట్టి పోలయ్య, భారతిని శేషమ్మే మాట్లాడుచున్నదని అనుకొన్నాడు.


శేషమ్మ శరీరములోనున్న భారతి కొంతసేపు మాట్లాడిన తర్వాత పోలయ్య తన భార్య శేషమ్మ దగ్గర ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు. భారతి పెళ్ళికాకముందే 17 సంవత్సరములకే చనిపోయింది. అంతవరకు పురుషుల స్పర్శ తగలని భారతికి, పోలయ్య ముట్టుకోవడము క్రొత్త అనుభూతి అయినా అది ఆమెకు సుఖముగా తోచింది. భారతి ఆ విధముగ మొట్టమొదట పురుషసంపర్క సుఖమును పొందినది. అప్పటినుండి శేషమ్మ శరీరములో శేషమ్మ కొంతకాలముండగా, కొంతకాలము భారతి ఉండేది. మొదట శేషమ్మ నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆమె శరీరములోనికి దూరగలుగు


---

చుండెడిది. కాలము గడువగా, గడువగా భారతి ప్రయత్నము చేసి శేషమ్మను బలవంతముగా నిద్రలోనికి పంపేది. అట్లు కొంతకాలము జరిగిన తర్వాత శేషమ్మను మెలుకువలోనికి రాకుండ చేసింది. ఆ విధముగా శరీరములో ఇద్దరూ ఉన్నపుడు పోలయ్య నావద్దకు వచ్చారు. శరీరములో ఇద్దరున్నది తెలుసుకొన్న నేను, లోపల అణిగియున్న సూక్ష్మమును మాట్లాడమని చెప్పగా శేషమ్మ శరీరమునుండి భారతియే మాట్లాడుచు నేను భారతిని మాట్లాడుచున్నానని, అప్పుడే శరీరముపైకి వచ్చినట్లు మమ్ములను నమ్మించి మాట్లాడింది. పోలయ్య భార్య శేషమ్మ అని తెలిసిన నేను అప్పుడు చేరిన భారతి మాట్లాడుచున్నదని, తర్వాత శేషమ్మ శరీరము మీదికి వస్తుంది అనుకొన్నాను. కానీ భారతియే ఎల్లప్పుడు శరీరము మీద ఉన్నదని గ్రహించలేకపోయాను.


శేషమ్మ శరీరములో భారతి, శేషమ్మను బ్రహ్మనాడిలోనికి పోవునట్లు చేయుచుండుట వలన, శేషమ్మకు మొదట ఆరోగ్యము బాగుండెడిది కాదు. చివరకు శేషమ్మ లోపలికి, భారతి బయటికి ఉండిపోవడము వలన కొంత ఆరోగ్య సమస్య తగ్గింది. ఎవరైనా పైకి కనిపించు శరీరమునుబట్టి పలానా మనిషి అని గుర్తించగలము. అలాగే నేను కూడ పైకి కనిపించు శేషమ్మ శరీరమునుబట్టి ఆమె శేషమ్మే అనుకొన్నాను. కానీ ఉన్నది భారతి అని గుర్తించలేకపోయాను. నావద్దకు వచ్చిన పోలయ్య దంపతులను 9 దినములు అక్కడే నిద్రచేసి పొమ్మన్నాను. శేషమ్మగా కనిపించు భారతి నన్ను చూస్తే వణికిపోతూ ఉండెడిది. ఆమె కన్నులలో భయముతో కూడిన చూపు కనిపించేది. అమె ప్రవర్తనలో కూడ కొంతమార్పు కనిపించేది. ఇవన్నీ గమనిస్తున్న నాకు, శేషమ్మ మీద కొంత అనుమానము వచ్చినది. ఒక దినము నీవు ఎవరో చెప్పు అని అడిగాను. అప్పుడు నేను శేషమ్మను అని అబద్దము చెప్పినది. నీవు శేషమ్మవు కాదు శేషమ్మ శరీరములో తిష్టవేసి నన్ను కూడ మోసము చేశావు. ఉన్నదున్నట్లు చెప్పు లేకపోతే నీవెవరైనది నేనే చెప్పగలను అని అనగా! అప్పుడు తాను భారతినని ఒప్పుకొన్నది. అంతేకాక శేషమ్మను శరీరములో అణచివేసి, శరీరమంతటిని తానే ఆక్రమించుకొన్నాననీ, నేను భారతినని తెలియకుండ శేషమ్మనేనని పోలయ్యను కూడ నమ్మించి, అతనికి తానే భార్యగా ఉన్నానని చెప్పింది. భారతి నన్ను కూడ మోసము చేసినందుకు నాకు చాలాకోపము వచ్చింది. ఆమె చెప్పిన మాటలనుబట్టి, మొదట శరీరమును కబ్జా చేయక (ఆక్రమించుకోక) ముందే ఇంటిలోని వారిని, బయటివారిని, బంధువులను అందరినీ బాగా గ్రహించగలిగింది. శేషమ్మ ఎవరితో ఎలా మాట్లాడేదో బాగా గమనించింది. అలాగే శేషమ్మ చేసే పనిని కూడా కొంత నేర్చుకోగలిగింది. ఇలా అన్నిటిలోను తర్పీదు పొందిన తర్వాత శేషమ్మను శరీరము మీదికి రాకుండ నిద్రలోనే అణిచివేసింది. శేషమ్మను అపస్మారక స్థితిలో లోపలే ఉండునట్లు చేసిన భారతి, ఎవరికి అనుమానము రాకుండ అన్ని విధముల శేషమ్మవలె నటించను మొదలు పెట్టింది. కొన్నాళ్ళకు అంతా సులభమై పోయింది. నావద్దకు వచ్చినపుడు పైకి వచ్చినట్లు నటించి తాను భారతినని చెప్పింది. అప్పుడు శేషమ్మ ప్రక్కకు పోయి భారతి వచ్చిందనుకొని పొరపాటు పడినాను. తర్వాత నాకు అనుమానము వచ్చిన దానివలన చివరికి భారతి రహస్యము బయటపడింది.


ఈ విషయమునంతటిని విన్న భర్త పోలయ్య ఆశ్చర్యపోయాడు. కొన్నాళ్ళుగా దయ్యముతోనే కాపురము చేస్తున్నానని తెలుసుకొన్నాడు. ఆమె మోసము చేసినందుకు ఇటు భర్తకు, అటు నాకూ ఇద్దరికీ భారతి మీద కోపము వచ్చింది. శేషమ్మ శరీరమును వదలిపొమ్మని భారతికి గట్టిగా చెప్పాను. అంతేకాక నన్ను మోసము చేసినందుకు శిక్షగా ఒక 20 కేజీల బరువున్న రాయిని భారతి తలమీద పెట్టి, నేను ఇకచాలు అనేంత వరకు కూర్చొని లేవమన్నాను. ఆమె 20 లేక 30 మార్లకంటే ఎక్కువ కూర్చొని లేవలేదు, తర్వాత చేతకాదు, కావున భయపడి శిక్షను అనుభవించలేక శరీరమును వదలి పోతుందని అనుకొని ఆ విధముగ చెప్పాను. ప్రక్కన రంగారెడ్డి అనే వ్యక్తిని పెట్టి, ఎన్నిమార్లు కూర్చొని లేచేది


---

లెక్కించమని చెప్పాను. ఆమె కూర్చొని లేస్తూనేవుంది రంగారెడ్డి లెక్కించుచునే ఉన్నాడు. లెక్కించే సంఖ్య 200 కు చేరింది. ఒక ఆడమనిషి తలపైన బరువును మోస్తూ, రెండువందలమార్లు కూర్చొని లేవడమేకాక ఇంకొక వందమార్లయిన లెక్కలేకుండ చేసేటట్లున్నది. అది చూచిన నేను ఇన్ని మార్లు ఎలా కూర్చొని లేవగలిగావు? అని అడిగినాను. అందుకు ఆమె తాను చనిపోకముందు, బావులు త్రవ్వేపనికి పోతూవుంటిననీ, మెట్లమీద క్రిందినుండి పైవరకు 30 కేజీల బరువుగల మట్టిగంపలను మోసేదానినని, అందువలన ఈ పని సులభమైనదని చెప్పింది. అది విన్న నేను శిక్షలు ఈమెకు పనికి రావని అనుకొన్నాను. తర్వాత భారతికి ఒకమాట చెప్పాను. అదేమనగా! నీకు ఒక నెల దినములు గడువు ఇస్తున్నాను. అంతలో నీవు శేషమ్మ శరీరమును వదలి ధర్మవరమునకే పో అని చెప్పి పంపాను.


నెల తర్వాత మళ్ళీ నాదగ్గరకు వచ్చినప్పుడు భారతియే శరీరము మీద ఉన్నదని గ్రహించిన నేను, శేషమ్మను గురించి అడిగాను. శేషమ్మ చనిపోయిందని భారతి చెప్పింది. అప్పుడు ఆమె చేతి నాడిని పరీక్షించి చూచాను. దానిని బట్టి శరీరములో భారతి ఒక్కతే ఉందని,

శరీరములో ఇద్దరున్నప్పుడు కొట్టుకొను నాడివలె కనిపించలేదు. శేషమ్మ చనిపోయినది వాస్తవమేనని అర్థమైనది. ఆ విషయము నాకు ఒక్కనికే తెలుసు, ఆమె భర్తకు తెలియదు. నేను ఆ విషయమును గురించి మాట్లాడక భారతి పోయింది, శేషమ్మ ఉంది అని పోలయ్యకు చెప్పాను. ఇంతవరకు జరిగిన భారతి విషయము శేషమ్మకు తెలియకూడదనీ, ఆమెకు జరిగిన విషయము ఏమీ తెలియదనీ, నీవు కూడ ఎప్పటికీ చెప్పవద్దని చెప్పి పంపాను. అప్పటినుండి వారి సంసారము యధావిధిగా జరిగిపోయింది. వారికి నలుగురు పిల్లలు కూడ పుట్టినట్లు తెలిసినది. కానీ ఇంతవరకు భారతితోనే కాపురము చేస్తున్నానని పోలయ్యకు తెలియదు.


ఇదంతా ఒక సినిమా కథలాగ ఉందికదా! అవును అలాగే అనిపిస్తుంది. ఎవరికి ఎలాగ అనిపించినా ఇది 30 సంవత్సరముల క్రితము యదార్థముగా జరిగిన సంఘటన. ఇది నమ్మశక్యము కాదు దయ్యాలు మనుషులలో చేరి కాపురము కూడ చేస్తాయా! అని ఆశ్చర్యముగ మీరు అడుగవచ్చును. కాపురము చేయడమే కాదు పిల్లల్ని కూడ కన్నారు. ఇదేదో అరుదైనది ఇలా ఎక్కడా జరుగదు అనుకోవద్దండి. ఇలా జరుగునవి భూమిమీద నూటికి ఒకటి నుండి ఐదు కాపురాలున్నాయని చెప్పవచ్చును. కాపురాలేకాక వ్యక్తులు కూడ కొందరు అలాగే గలరు. ఉదాహరణకు సత్యనారాయణరాజు అనే అబ్బాయి శరీరములోనికి, ఒక గొప్పవ్యక్తి యొక్క సూక్ష్మశరీరము వారమునకు ఒకమారు, అదియు గురువారము దినమున ప్రవేశించి, ఒకగంటసేపు మాత్రముండి పైకివచ్చి మాట్లాడిపొయ్యేది. కొంతకాలానికి సూక్ష్మముగానున్న గొప్పవ్యక్తి ఆ అబ్బాయి శరీరములో శాశ్వితముగా నిలిచిపోయాడు. పై శరీరమును బట్టి లోపల నున్న వ్యక్తిని ఎవరూ గమనించలేదు. పిల్లవాడేనని హేళనగా మాట్లాడేవారు. చివరకు లోపలయున్న వ్యక్తే నేను పలానావాడినని చెప్పినా కొందరు నమ్మలేదు. తర్వాత తాను బ్రతికియున్నపుడు మాట్లాడినవి, చేసినవి, ఇచ్చినవి గుర్తుచేయగా కొందరు విశ్వసించారు. అలా ఒక బాలుని శరీరములో తనకు తానుగ చెప్పుకొన్న వ్యక్తి ఈ దినము ప్రత్యక్షసాక్ష్యముగా పుట్టపర్తిలో సత్యసాయిగా ఉన్నాడు. ఆయనే షిరిడి సాయిబాబాగారు. షిరిడి సాయిబాబా ప్రత్యక్షముగా సజీవముగా సత్యసాయిరూపముతో పుట్టపర్తిలో ఉండినా, అక్కడికి పోయి ప్రత్యక్షముగ ఆయనకు నమస్కరించక, ప్రక్కన షిరిడి బాబాగుడి కట్టుకొని మ్రొక్కేవారున్నారు. దీనినిబట్టి చూస్తే చనిపోయిన బాబా ప్రత్యక్షముగ శరీరముతో ఉన్నాడని చాలామందికి తెలియదని అర్థమగుచున్నది.


అనంతపురము జిల్లాలో ధర్మవరములో భారతి అను దయ్యము సాటి ఆడమనిషిలో ప్రవేశించి శాశ్వితముగా ఉండి కాపురము చేసి పిల్లలను కన్నది. అలాగే అదే ధర్మవరములోనే ఒక మగమనిషి సూక్ష్మము మరియొక మగమనిషిలోనికి


---

చేరి, పెళ్ళి చేసుకొని ఒక కొడుకును కూడ కలిగియుండి, ఎవరికీ తెలియకుండ బాబు అని మొదటివానిపేరు మీదనే జీవిస్తున్నాడంటే ఎంత విచిత్రమో చూడండి! వాస్తవముగా ఎవరైనా చెప్పినా ఇవి నమ్మశక్యము గాని విషయములే! అయినా ప్రత్యక్ష సత్యములని చెప్పక తప్పదు. ఒక్క అనంతపురము జిల్లాలోనే, అదియు ఒక్క ధర్మవరము ప్రాంతములోనే భారతి, బాబు, బాబా ముగ్గురి విషయము కనిపిస్తూవుంటే మనకు తెలియని విషయములు దేశములో ఎన్ని ఉ న్నాయో? ఇదంతా విన్న తర్వాత నన్ను కొందరిలా ప్రశ్నించవచ్చును. మీకంటికి సూక్ష్మశరీరములు కనిపిస్తాయా? కనిపించుట వలననే వీరు చచ్చినవారు, వీరు బ్రతికినవారని చెప్పగలుగు చున్నారా అని అడుగవచ్చును. నా జవాబు ఏమనగా! మీకంటికి సూక్ష్మశరీరములు ఎలా కనిపించవో, అలాగే నాకు కూడ కనిపించవు. అలా కనిపించివుంటే భారతి విషయములో మోసపోయేవాడిని కాదు కదా! అనుభవముతో పరిస్థితులను బట్టి, దైవజ్ఞానము మనవద్ద ఉ న్నపుడు వారి ప్రవర్తనను బట్టి తెలుసుకొనుటకు వీలున్నదని చెప్పుచున్నాను.


ఇంతవరకు మనుషుల శరీరములనుండి వచ్చిన సూక్ష్మశరీరములకు సంబంధించిన కొన్ని వివరములు మాత్రమే తెలుసుకొన్నాము. ఇపుడు దేవతా ప్రతిమల నుండి వచ్చిన సూక్ష్మశరీరముల యొక్క కొన్ని విషయములను తెలుసుకొందాము. మనుషులకు సూక్ష్మశరీరములుండుననీ, వాటినే దయ్యములనీ, గ్రహాలనీ అంటామని తెలుసుకొన్నాము. అట్లే ప్రతిమలకు కూడ సూక్ష్మశరీరములున్నాయనీ వాటిని దేవతలనీ, విగ్రహాలనీ అనవచ్చుననీ చెప్పుచున్నాము. భూమిమీద రకరకాల మనోభావములు గల మనుషులు ఉన్నట్లు, ప్రతిమలలో కూడ అనేక రకముల మనో భావములున్న విగ్రహములనబడు సూక్ష్మములు గలవు. మనుషులలో అందరూ మంచివారే లేనట్లు, దేవతలలో కూడ అందరూ మంచివారే లేరు. దీనినిబట్టి దేవతలలో కూడ మనుషులలో ఉన్నట్లు, దుర్మార్గులు కూడ ఉన్నారని తెలియుచున్నది. దేవతలను దుర్మార్గులని అంటారేమిటి? దుర్మార్గులు దేవతలెట్లవుతారని మీరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు కావాలంటే ముందు ఒక విషయము తెలుసుకోవాలి. అదేమనగా విశ్వమును సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. అతడే దేవుడు. దేవుడు రూప, నామ,క్రియ లేనివాడు. అంతేకాక సృష్టి, స్థితి, లయ కారకుడు కూడ దేవుడే. దీనినిబట్టి జగతిలో సృష్టించబడిన ఇటు మనుషులుగానీ, అటు దేవతలుగానీ జీవరాసుల క్రిందకి వస్తారు. దేవతలకు కూడ గుణములూ వాటి నడవడిక గలదు. వాస్తవమును విప్పి చెప్పితే మనుషులకంటే తెలివితక్కువవారు, మనుషులకంటే దుర్మార్గులు, మనుషులకంటే కఠినమైనవారు దేవతలలో కూడ కొందరు గలరు. ఇక్కడ గమనించవలసినది ఏమనగా! నేను దేవతలందరిని దుర్మార్గులనలేదు, కొందరిని మాత్రమే చెప్పుచున్నాను. దేవతలలో కూడ ఎంతో గొప్పవారు కలరు. ఒక మనిషి చాలా విషయములలో మంచివాడని అనిపించుకొన్నప్పటికీ, కొన్ని విషయములలో మాత్రము చెడ్డవాడని అనిపించుకొనుట చూస్తున్నాము. అలాగే కొందరు దేవతలు, కొన్ని విషయములలో సక్రమముగా ఉన్నప్పటికీ, కొన్ని విషయములలో చెడుగా ప్రవర్తించుచుందురు. ఇప్పుడు ఒక మగ దేవత ప్రవర్తనను గురించి వివరిస్తాను. దానిని చూచి ఆ దేవతామూర్తి దుర్మార్గుడో, సన్మార్గుడో మీరే యోచించి చెప్పవచ్చును.


ఒక దినము ఉదయము 9 గంటల సమయములో మా ప్రక్క ఇంటిలో కిరాయికి కాపురమున్న భీమక్క అనే ఆమె ఏడుస్తూ వచ్చి, ఆమె భర్త బోయలింగన్నకు మంచములోనే కాలు, చేయి పడిపోయిందని, మూతి వంకరపోయి మాట్లాడలేకున్నాడని, పైకి లేవలేకున్నాడని చెప్పింది. ఇంటి ప్రక్కనే ఉండుట వలన నిత్యము వారు నాకు కనిపించేవారు. నా ఇంటి ప్రక్కన చిన్నపాకలో (కొట్టములో) కిరాయికి నివశిస్తున్నారు. ఆమె భర్త పేరు బోయలింగన్న. ముగ్గురు చిన్న పిల్లలున్నారు. లింగన్న రోడ్డురోలర్ డ్రైవర్గా పనిచేయుచున్నాడు. అతను పెద్దత్రాగుబోతు, ఎక్కువ డబ్బులు సారాకు


---

ఖర్చు చేసెడివాడు. ఇంటిలో భార్య పిల్లలు చాలీ చాలని తిండితో కాలము గడిపేవారు. ఒకరోజు తిండిలేక పస్తున్నారు, నేనే తిండిగింజలు ఇచ్చిన సందర్భము కూడ కలదు. వారిది స్వంత ఊరు గుంతకల్లు దగ్గర చిప్పగిరి అనుకుంటాను. వారి బీదరికాన్ని ప్రత్యక్షముగ చూచిన వాడిని కనుక భీమక్క ఏడుస్తూ చెప్పినపుడు నాకు కూడ కొంత బాధగా అనిపించింది. డాక్టర్ల దగ్గరికి పోయి చూపించుకొను స్థోమతవారికి లేదు. కావున లింగన్నను నావద్దకు తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు ఆమె ఇతరుల సహాయముతో లింగన్నను నావద్దకు తెచ్చారు.


లింగన్నను ఇతరుల సహాయముతో లేపి నాముందర కూర్చోబెట్టి పట్టుకున్నారు. అప్పుడు అతని నాడిని చూడాలని లింగన్న కుడి చేయిని పట్టుకొన్నాను. అలా పట్టుకొని నాడిని గమనిస్తుండగా ఒక్కసారి వేగంగా చేయిని లాగేసుకున్నాడు. ఎందుకలా చేశాడని లింగన్న వైపు చూచాను. అప్పుడు లింగన్న కనుగుడ్లు పెకలించి కోపంగా నావైపు చూస్తున్నాడు. దృశ్యమును బట్టి లింగన్న శరీరము మీదికి ఎవరో వచ్చినట్లు తెలిసినది. అప్పుడు అతనికి

నాకు ఇలా సంభాషణ జరిగింది.


నేను :- ఏయ్! ఎవరు నువ్వు. ఎందుకలా చూస్తున్నావు. నీ చూపుకు భయపడను.


అతను :- ఏమిరా! నీవు ఎవరు అని నన్నే ప్రశ్నిస్తావా? కొద్దిగైనా భయము లేకుండ మాట్లాడుతావా? నేనెవరనుకున్నావు. నేను :- నీ వెవరైతే నాకేమి. ఇక్కడికి వచ్చినవారు నాముందర భయభక్తులతో మాట్లాడుతారు. నీవు నన్నే భయము లేదంటున్నావు. పైగా నేనెవరను కున్నావు అంటావా? నీవు చెప్పకనే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు కూడా నీకు మర్యాద ఇచ్చి అడుగుచున్నాను, నీవు ఎవరో చెప్పు. లింగన్నను ఇలా ఎందుకు చేశావో చెప్పు?


(అప్పుడు అతను మాట్లాడిన మాటలను బట్టి, అతను భైరవుడు అని తెలిసింది. అతనిని మబ్బు భైరవుడు అని కూడ అంటుంటారు. అతనికి నడిరాత్రి ప్రజలు పూజలు చేస్తారు. నల్లకోళ్ళు, నల్లమేకలను భైరవునికి బలి ఇస్తుంటారు. అతనంటే ప్రజలకు చాలా భయము. మ్రొక్కుకున్నవారు తప్పక అతని మ్రొక్కుబడిని చెల్లిస్తుంటారు.) ఇక లింగన్న విషయానికి వస్తే, ముందురోజు తాడిపత్రికి సమీపములోనున్న పుట్లూరులో డ్యూటీ చేశాడు. సాయం కాలము 7 గంటలకు కొంతత్రాగి, తాడిపత్రికి వచ్చేదానికి పుట్లూరులో బస్ స్టాండుకు వచ్చాడు. బస్సు ఆలస్యమైనది. 8 గంటలవరకు చూచి తిరిగి ఊరులోనికి పోయి ఫుల్గా త్రాగి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి 10 గంటలైనది. బస్మిస్సయి పోయింది. తాగిన మైకములో అతను తాడిపత్రి రోడ్డువెంట నడుచుకుంటూ వచ్చాడు. కొంత దూరము వచ్చిన తర్వాత, పుట్లూరుకు దగ్గరగానే రోడ్డుప్రక్కనే వేపచెట్టు ఉంది. దానిచుట్టు అరుగు కట్టబడివుంది. అక్కడ వరకు వచ్చిన లింగన్న రోడ్డుప్రక్కనే ఉన్న అరుగుమీద పడుకొన్నాడు. అలా అక్కడ నిద్రపోయిన లింగన్నను నడిరాత్రి గడచిన తర్వాత ఒక ఆడమనిషి వచ్చి లేపింది. నిద్రమత్తు మరియు సారామత్తులో లేచిన అతనిని అక్కడకు వచ్చిన ఆడమనిషి తనకు ఇష్టమొచ్చినట్లు క్రిందపడేసి కొట్టింది. ఆ దెబ్బలకు లింగన్నకు మత్తు అంతా వదలి పోయింది. ఆమె ఎవరో, ఎందుకు కొడుతావుందో తెలియలేదు. చివరకు అతని జుట్టుపట్టుకొని, కట్టచుట్టు త్రిప్పి అతని మోకాళ్ళను ఆ కట్టకు కొట్టమని చెప్పి కొట్టించింది. అట్లు కొట్టించడము వలన అతని మోకాళ్ళకు కొద్దిగ గాయములు కూడ అయినవి. అలా కొట్టి వదిలివేసింది. ఆమె వదలిన వెంటనే లింగన్న పుట్లూరువైపు వచ్చాడు. అక్కడ కెనాల్ ఆఫీస్ దగ్గర తన తోటి డ్రైవర్ ఇంటికి పోయాడు. లింగన్న వెంట కొట్టిన మనిషి కూడ వచ్చింది. లింగన్న వెనకే డ్రైవర్ ఇంటివరకు పోయింది. ఆమెను చూస్తునే డ్రైవర్ ఇంటికి పోయిన లింగన్న భయపడుచు తలుపు తట్టాడు. ఆ ఇంటి డ్రైవర్ తలుపుతీసి ఏమి లింగన్నా ఈ వేళప్పుడు


---

వచ్చావు అని అడిగాడు. అపుడు లింగన్న అక్కడే నిలబడుకొన్న ఆమె వైపు చేయి చూపి, ఈయమ్మ ఎవరు? నన్ను కొట్టింది అన్నాడు. ఆ డ్రైవర్కు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరు, నిన్ను ఎవరు కొట్టారని అని అడిగి ఇతని వాలకము చూచి, అతనికి భయము కలిగి పడుకొనేదానికి చాప, రగ్గు ఇచ్చి బయటే పడుకోమని తలుపులు వేసుకొన్నాడు. లింగన్న తలుపులు తెరువమన్నా అతను తెరువలేదు. ఇంకొకమారు అక్కడకు వస్తే చంపేస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.


లింగన్నకు తెల్లవారేవరకు నిద్రరాలేదు. ఉదయము మొదటి బస్సుకు తాడిపత్రికి వచ్చి ఇల్లు చేరుకొన్నాడు. రాత్రి క్రిందపడినపుడు మన్నుపట్టిన గుడ్డలు తీయించి, అతని భార్య స్నానము చేయించి, అన్నము పెట్టగా తిని మంచము మీద పడుకొన్నాడు. రాత్రి జరిగిన విషయము భార్యకు కూడ లింగన్న చెప్పలేదు. మన్నుపట్టిన గుడ్డలు చూచి, మోకాలి దెబ్బలు చూచి, త్రాగినమత్తులో ఎక్కడైన క్రింద పడివుంటాడని అతని భార్య అనుకున్నది. మంచము మీద పడుకొన్న లింగన్న నిద్రపోయాడు. దాదాపు ఉదయము 9 గంటలకాలములో అతను ఉలిక్కి పడి మెలకువలోనికి వచ్చాడు. మెలకువలోనికి వచ్చిన తర్వాత మంచము నుండి లేవాలని ప్రయత్నము చేశాడు. కానీ లేవలేక పోయాడు. అప్పటికే అతని కాలు, చేయి పనిచేయడము లేదు. భార్యను పిలువాలన్నా నోరు పనిచేయలేదు. దానిని గమనించిన అతని భార్య భీమక్క నావద్దకు వచ్చి చెప్పడము, అతనిని నావద్దకు తేవడము, భైరవుడు మాట్లాడడము జరిగినది. రాత్రి లింగన్న నావద్దకు వచ్చిన భైరవుని కట్టవద్దకు పోయాడు. లింగన్నకు అది భైరవుని కట్టయనిగానీ, త్రాగినవారు అక్కడకు పోకూడదనిగానీ తెలియదు. చాలా కాలమునుండి త్రాగినవారు ఎవరు అక్కడికి పోయేవారు కాదు. అంతేకాక రాత్రిపూట పూజ చేయువారు మాత్రము గుంపుగా అక్కడికి పోతారు. మిగతా దినములలో రాత్రిపూట ఒంటరిగా ఎవరు పోరని ఇతరులు చెప్పగా విన్నాను. అటువంటి జాగాలోనికి రాత్రిపూట ఒంటరిగా, అదియు త్రాగిపోవడము ఒక విధముగా తప్పే.


ఆ రాత్రి లింగన్న కట్టవద్దకు పోయిన సమయములో, భైరవుడు పుట్లూరులోనికి వచ్చాడు. లింగన్న పోయి పడుకొన్న కొంతసేపటికి, భైరవుని భార్య అక్కడికి వచ్చి చూచి, లింగన్నను కొట్టడము జరిగినది. తర్వాత ఆమె డ్రైవర్ ఇంటి వరకు వచ్చిపోయింది. తెల్లవారిన తర్వాత భైరవుడు తన జాగా అయిన కట్టవద్దకు వస్తూనే, అతని భార్య రాత్రి జరిగిన విషయమంతా చెప్పింది. అది విన్న భైరవుడు కోపముతో ఊగిపోయాడు. భయము లేకుండ నాకట్ట దగ్గరకు త్రాగి వచ్చినవానిని వదలిపెట్టను. వానికి జరిగినది ఇతరులకు గుణపాఠము కావాలి అని భార్యకు చెప్పి బయలుదేరి వచ్చాడు. అలా కోపముతో వచ్చిన భైరవుడు లింగన్నలోనికి దూరి, మెడలో నరమును అదిమి లింగన్నకు కాళ్ళు, చేతులు, నోరు పడిపోయేటట్లు చేశాడు. అంతేకాక భైరవుడు నన్ను కూడ లెక్కచేయక, నేనంటే భయములేదా అని అడిగాడు. తర్వాత అతను భైరవుడని, అతనికి చాలాకోపమని తెలిసింది. అయినప్పటికి లింగన్న తెలిసి చేసియుంటే, లింగన్నది తప్పేనని మనము కూడ అనవచ్చును. కానీ లింగన్నకు అది భైరవుని స్థలమని, ఆ అరుగుమీద పడుకోకూడదని తెలియదు. అలాంటపుడు లింగన్నది తప్పెలా అగును? అందువలన లింగన్న తరుపున భైరవునితో నేను వాదించడము జరిగినది. ఆ వాదనను క్రింద చూడండి.


నేను :- లింగన్న తెలియక అక్కడ పడుకొన్నాడు. ఇది లింగన్న తెలిసి చేసిన తప్పుకాదు. తప్పుకాకున్నా అతనిని కొట్టినారు. ఇదే పనిని మనుషులు చేసియుంటే వారి మీద క్రిమినల్ కేసు అయ్యేది.


---

భైరవుడు :- మేము చేసింది తప్పు అంటావా.

నేను :- ఎవరు చేసినా తప్పు తప్పే. న్యాయము, అన్యాయము అందరికీ ఒకటే ఉంటుంది.

భైరవుడు :- నన్ను పూజించే వాళ్ళను బాగా చూచుకొంటాను, నన్ను దూషించినా లేక నన్ను లెక్కచేయకుండినా వారిని వదలకుండా శిక్షిస్తాను.

నేను :- ఆ పనిని మనుషులు కూడ చేస్తున్నారు. నీవు దేవునివని చెప్పు కొంటున్నావే, నీకు మనుషులకు ఏమి తేడావుంది?


భైరవుడు: నన్ను మనుషులతో పోల్చుతావా? నన్ను ఏమనుకుంటున్నావు?


నేను :- నిన్ను మనుషులతో కూడ పోల్చకూడదు. ఎందుకంటే మనుషులు తెలియక తప్పుచేసిన వానిని శిక్షించరు. ఇట్లు చేస్తే తప్పు అని చెప్పుతారు, మీరు కొట్టినట్లు కొట్టడముగానీ, కాళ్ళు, చేతులు లేకుండ చేయడముగానీ చేయరు.


భైరవుడు: నేను మనుషులు పూజించే దేవుడనని, నాకు శక్తులున్నాయని, భయము లేకుండ మాట్లాడుచున్నావు. 


నేను :- నేను పద్ధతిగా మాట్లాడువాడిని కాబట్టి ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడినాను. అయినా నీవు నీ మర్యాదను నిలబెట్టుకోకుండ నేను దేవున్ని, నన్ను అందరు పూజిస్తారు, నాకు శక్తులున్నాయి అంటున్నావు. ఎవడురా నిన్ను దేవుడన్నది? ఏ జ్ఞానము తెలియని ప్రజలు అమాయకులై పూజిస్తే, నీవు నేనొక దేవున్ని అనుకొన్నావు. నాకు శక్తులున్నాయి అంటున్నావు. ఆ మాటలు ఎవరి దగ్గర చెప్పాలో తెలియని మూర్ఖునివి. నేను ఎవరో నీకు తెలియక మాట్లాడుచున్నావు. నీకు శక్తులుంటే ప్రజలకు మేలు చేయి. కీడు చేయడమా నీ పని? పూటకు కూడు సరిగలేని వ్యక్తి మీద నీ ప్రతాపము చూపుతావా? నిన్ను దేవుడని అన్నవాణ్ణి ముందు కొట్టాలి. తర్వాత నిన్ను కొట్టాలి. అట్లయితే కానీ మీలాంటి వారికి సిగ్గురాదు. కోళ్లు, మేకల కొరకు ప్రజలకు పని చేసి పెట్టేవానివి నీవు దేవునివా? ఎదుట మనిషి ఎంతటివాడోనని తెలియక గర్వము, అహము రెండు మేళవించి మాట్లాడే వానివి నువ్వు దేవునివా? తెలియక చేసిన పనిని తప్పుగా పట్టుకొని, ఇంతదూరము వచ్చి ఒక మనిషి కాళ్ళు, చేతులు పోగొట్టిన నువ్వు దేవునివా? రాత్రిపూట రాక్షసత్వముతో నల్లకోళ్ళు, నల్ల మేకల మాంసము తినే నువ్వు దేవునివా? ఏమాత్రము దైవజ్ఞానము లేకుండ అజ్ఞానముతో మాట్లాడు నువ్వు దేవునివా? ప్రజలను భయపెట్టి వారితో పూజలు చేయించుకొనే నువ్వు దేవునివా?


దేవుడెవరో తెలుసా? నిన్ను పుట్టించినవాడు దేవుడు. అసలైన దేవున్ని మరచిపోయి, నేను ఒక దేవున్ని అని అంటున్నావంటే నీవు అజ్ఞానులలో పెద్ద అజ్ఞానివని తెలియుచున్నది. ఇప్పటికే నీవు పెద్ద పాపము చేసుకొన్నావు. కనుక ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని, చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది, ఇతనిని (లింగన్నను) వదలిపో. ఇంతకంటే ఎక్కువ చెప్పను.


భైరవుడు :- నన్ను ఇంతవరకు ఇట్లు ఎవరూ మాట్లాడలేదు. 80 సంవత్సరముల వయస్సు ముసలివారు కూడ నాకు నమస్కరిస్తారు. నీవు చూస్తే 25 సంవత్సరముల పిల్లవానివి నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా? నేను అనుకొంటే..... 


నేను :- ఏయ్! నోరు మూసుకో! ఇంతవరకు చెప్పిందంతా చెవిటి వాని ముందర శంకు ఊదినట్లున్నది. ముసలి వాళ్లు నిన్ను మ్రొక్కితే నేను కూడ నీకు మ్రొక్కాలా? నీ యోగ్యత ఏమిటో నీకు తెలుసా? సరే నీవు అనుకొంటే ఏమి చేయగలవు చెప్పు?


---

భైరవుడు :- ఇప్పుడు చెప్పను, రాత్రికి చూచుకో నీకేమౌతుందో? తెల్లవారే సరికి నీవేమౌవుతావో చూచుకో! ఆ మాటకు నాకు నవ్వువచ్చి నవ్వినాను). నవ్విన తర్వాత భైరవునితో ఇలా అన్నాను. "రాత్రికి నాకు ఏమౌతుందో, నీవు ఏమి చేస్తావో అది తర్వాత జరుగబోవు విషయము. కానీ ఇప్పుడు ఇంతమంది ముందర చెప్పుచున్నాను. నీవు పెద్దదేవునివే అయితే, నీవు భైరవునివే అయితే, నీకు మగతనముంటే, నీకు చేతనైతే, నీకు శక్తివుంటే నాకళ్ళలోనికి చూడు” అన్నాను. అక్కడున్న అంతమంది ముందర ఆ మాట అనేసరికి పట్టలేని కోపముతో ఊగిపోతూ నావైపు తీక్షణముగా చూచాడు. వెంటనే తల దించుకొన్నాడు. చేతగాని వానిమాదిరి ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను ఈ విధముగా చెప్పాను. "ఇప్పుడు నేను చెప్పుచున్నాను విను. నీవు రాత్రికి నన్ను ఏమో చేస్తానన్నావు. కానీ నీకు పది నిమిషములు మాత్రమే వ్యవధిస్తున్నా. పది నిమిషములలోపల నీవు ఇతనిని వదలి పోకపోతే, నీకు కాళ్ళు, చేతులు పని చేయవు. ఇప్పుడు లింగన్నకు అయినట్లు నీకు అవుతుంది. పది నిమిషముల లోపల ఇక్కడి నుండి క్షేమంగా పోతావో, లేక కుంటివానివై ఇక్కడే పడిపోతావో నీవే నిర్ణయించుకో” అని భైరవునికి చెప్పి, అక్కడున్న వారితో "లింగన్నను ఇంటికి తీసుకొనిపోండి. పది నిమిషములు తర్వాత బాగా కాలేదంటే వచ్చి నాకు చెప్పండి” అని చెప్పి పంపించాము. పది నిమిషముల తర్వాత లింగన్న భార్యవచ్చి ఇక్కడనుండి పోయిన తర్వాత రెండు నిమిషాలకే లింగన్న కాళ్ళు, చేతులు బాగైనట్లు చెప్పింది.



ఇదంతా చదివిన తర్వాత ఇది నమ్మేవిషయమేనా అని కొందరికి అనుమానము రావచ్చును. మీరు నమ్మినా, నమ్మకపోయినా యదార్థముగా జరిగిన విషయమునే చెప్పాము. చాలాచోట్ల ప్రజలను ఇబ్బంది పెట్టు ఇలాంటి దేవతలున్నారని. కొందరు చెప్పుచుంటే విన్నాము. నొస్సనకోట సుంకలమ్మ అను దేవత గుడివద్ద రాత్రిపూట ఎవరు ఉండకూడదట. అనంతపురము జిల్లాలో రామగిరికి దగ్గరగానున్న నొస్సనకోట అను ఊరి బయట సుంకలమ్మ దేవాలయము కలదు. అక్కడ తెలియక పడుకొన్నవారు చనిపోయారు. ఏమి జరుగుతుందో చూస్తాము అని తెలిసిపోయిన వారు తెల్లవారేసరికి చనిపోయారు. రాత్రిపూట ఆ దేవతదగ్గరకు ఎవ్వరు పోయేవారుకాదట. ఇలాంటివే మరికొన్ని కూడ గలవు. మేము ఈ విషయములను నమ్మము అనేవారున్నప్పటికి, లింగన్నను వేధించిన భైరవులులాంటి వారు ఎందరో ఉన్నారు. మేము నమ్మము అనేవాళ్లు దయ్యాలు లేవు, మనిషి కల్పనే దయ్యాలు అని మాట్లాడేవారు, ప్రత్యక్షముగా జరిగిన సంఘటనలను పరిశీలించి సత్యమును చెప్పవచ్చును కదా! లింగన్న ఆ రాత్రి తన్నులు తిన్నది అబద్దమా? ఉదయము కాళ్లు, చేతులు పడిపోయినది అబద్దమా? చెప్పిన తర్వాత పది నిమిషాలకు రోగమంతా నయమైపోయినది అబద్దమా? మా అనుభవములో అన్నీ నిజమే. నేను భూతవైద్యము చేసేవాడినైతే, నా ప్రచారము కొరకు లేనిపోనివి అన్ని చెప్పవచ్చును. కానీ నేను అటువంటి వైద్యుడను కాను. ఇప్పటికి 35 సంవత్సరముల క్రిందట, నేను దయ్యాలమీద, దేవతలమీద చేసిన పరిశోధనలో, నాకు ఎదురైన వాటిని గురించి నేడు చెప్పుచున్నాను. నాకు ఇపుడు 60 సంవత్సరముల వయస్సు దాటి 61 నడుస్తున్నది. నావృత్తి, ఉద్దేశ్యము అన్ని దైవజ్ఞానమును గురించే ఉంటాయి. అయినా నాకు తెలిసిన సత్యమును చెప్పకపోతే, నా పరిశోధనలో నేను కనుగొన్న రహస్యములన్ని నాతోనే అంతరించి పోవును. అలాకాకుండ గ్రంథరూపములో నా అనుభవములను ఉంచితే, ఏనాటికైనా సత్యము బ్రతికి ఉండునను ఉద్దేశముతో ఈ విషయములను చెప్పుచున్నాము. అంతేగానీ నా ఉద్దేశములను బలవంతముగా ఇతరుల మీద రుద్దడముగానీ, నమ్మమని చెప్పడముగానీ లేదు. ఇక్కడ కొందరు ప్రశ్న అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! భైరవున్ని మీరు చూడమన్నపుడు అతను మీవైపు చూస్తూనే వెంటనే తలదించుకొన్నాడు, ఏమి మాట్లాడలేదు అన్నారు కదా! అప్పుడు భైరవునికి ఏమైంది? మీ గొప్పతనము చాటుకొనేదానికి అలా వ్రాశారా? అని అడుగవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! అక్కడ


---

సందర్భానుసారము జరిగిన విషయము చెప్పకతప్పదు. భైరవుడు తలదించుకున్నాడు, అని అక్కడ అందరికి కనిపించినది చెప్పాను తప్ప, భైరవునికి ఏమి కనిపించినదో, దానిని గురించి చెప్పలేదు కదా! అలాంటప్పుడు నాగొప్పతనమును గురించి నేను చెప్పనట్లేగా? భైరవునికి ఏమి కనిపించినదో, ఇప్పటికి కూడ చెప్పలేదు. కావున నన్ను గురించి మీరు ఆలోచించక, జరిగిన సంఘటనలోని సత్యమును తెలుసు కొమ్మంటున్నాను.


ఇంతవరకు ఒక మగదేవతను గురించిన విషయము తెలుసు కొన్నాము. ఇప్పుడు వివరించబోవు విషయము ఒక ఆడ దేవతది. మాంత్రికులు ఆరాధించు ఆడ దేవతలలో గొప్పశక్తిగల దేవతలు కాళి, భగళాముఖి, కాటేరి మొదలగువారు కలరు. అటువంటి వారిలో భగళాముఖిని ఒకవ్యక్తి గొప్పగా పూజించి, ఆమెను వశీకరణ చేసుకొని, ఆమె ద్వారా గొప్ప మాంత్రికునిగ చలామణి అయ్యేవాడు. పుట్టపర్తికి చెందిన గౌతమరాజు అను వ్యక్తి, మంత్రవిద్యలో కొంత ఆరితేరినవాడై, చివరకు భగళాముఖి అను క్షుద్రదేవతను ఉపాసించి తన వశము చేసుకొన్నాడు. మొండి దయ్యములను సహితము విడిపిస్తానని, అయితే తన ఫీజు మాత్రము ఎక్కువగా ఉండునని ప్రచారము చేసుకొన్నాడు. ఎవరైనా దయ్యమును విడిపించమని తనవద్దకు వస్తే, 35 సంవత్సరముల క్రితమే 1,108 రూపాయలను తన పారితోషికముగా తీసుకొనెడివాడు. ఇప్పటి కాలములో దానివిలువ 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంత డబ్బులు ఎక్కువ తీసుకొంటే, అంత గొప్ప వైద్యుడు అని మనుషులు అనుకొంటారు. అందువలన ప్రతిరోజు అతని వద్దకు ఒకటి రెండు దయ్యముల కేసులు వచ్చేవి. డబ్బులు బాగా సంపాదించుకొన్నాడు. అతని వయస్సు 80 సంవత్సరములు దాటినది. తనవిద్య తనతో పోకూడదని తన మనుమరాలుకు నేర్పించాడు. ఆమె పేరు ముత్యాలమ్మ. గౌతమరాజు తన మనుమరాలు ముత్యాలమ్మకు, భగళాముఖిని వశము చేసుకొను విధానమును కూడ నేర్పించి, తనవలె పెద్దమాంత్రికురాలుగ ముత్యాలమ్మను తయారు చేశాడు.


గౌతమరాజు వద్దకు, ఎవరైనా ఎక్కడాపోని మొండి దయ్యాన్ని తీసుకు వచ్చినా దానిని విడిపించి పంపేవాడు. దయ్యమును విడిపించే సమయములో ముందు భగళాముఖి పూజపెట్టి, ఆ దేవతను అక్కడకు రప్పించి దయ్యమును వదలించమని ఆదేశించును. అపుడు గౌతమరాజు ఆదేశము ప్రకారము భగళాముఖి ఆ దయ్యమును తరిమివేయును. ఎటువంటి దయ్యమైనా భగళాముఖిని చూస్తూనే భయపడి వణికిపోయి, పట్టిన మనిషిని వదలి పొయ్యేది. భగళాముఖి గొప్పశక్తిగల దేవత కావున ఏ దయ్యమైన ఆమెను చూస్తూనే చెప్పినట్లు విని పారిపోయేవి, తిరిగి వచ్చేవికావు. ఆ పని చేసినందుకు గౌతమరాజు 1108 రూపాయలు డబ్బు తీసుకోవడమేకాక ఆదినము భగళాముఖి పూజకోసము 11 టెంకాయలు, 11 కర్జూరాలు,11 ఎండు కొబ్బెర చిప్పలు, 11 నిమ్మకాయలు, 11 తాంబూలములు అన్ని వచ్చిన వారితోనే తెప్పిస్తాడు. దాని ఖర్చుకూడ వచ్చిన వారిమీద పడేది. ఇదంతా మంచి ఆదాయమున్న పనియే. డబ్బులు పోయినా, గ్యారంటీగా పని జరుగుతుందని, దయ్యాల బాధలున్న ప్రజలు చాలామంది గౌతమరాజు వద్దకు వచ్చేవారు.


గౌతమరాజు మనుమరాలు ముత్యాలమ్మ భర్త, రైల్వేశాఖలో చిన్న ఉద్యోగి. చాలీచాలని జీతముతో ఇబ్బంది పడేవారు. గౌతమరాజు పుట్టపర్తి నుండి వచ్చి, తాడిపత్రిలో మనువరాలు ఇంటిలో మూడు నెలలుండి డబ్బు సంపాదించడము చూచి, ఆ విద్యను ముత్యాలమ్మ కూడ నేర్చుకొని దయ్యాలు విడిపించడములో తర్ఫీదు పొందినది. తర్వాత గౌతమరాజు ఆరోగ్యము సరిగలేక పుట్టపర్తికి పోయి చనిపోవడము జరిగినది. క్షుద్ర దేవతలను వశము చేసుకొంటే, అవి తమ ఆజ్ఞ ప్రకారము పని చేయాలంటే, వాటిని అప్పుడప్పుడు ఆరాధిస్తుండాలి. అంతేకాక కొన్ని నియములు పాటించాలి. ఉదాహరణకు నీరు పారుచున్న కాలువను ఒక్క అడుగుతో దాటకూడదు. కాలువలో అడుగుపెట్టి పోయిన పరవాలేదు


---

కాని దాట కూడదు. అలాగే అమావాస్య, పున్నమి రోజులలో అద్దములో ముఖమును చూచుకోకూడదు. ఎప్పుడైనా అన్నము తినే సమయములో ఉప్పు అని అనకూడదు. ప్రక్కన ఎవరైనా ఉప్పు అని అనినా అప్పుడు అన్నమును తినకుండ వదలివేసి ఆ దినమంతా తినకూడదు. మూగవాని చేత ఇవ్వబడిన నీరు త్రాగకూడదు. సూర్య, చంద్ర గ్రహణ సమయములలో మంత్ర జపము చేస్తూనే ఉండాలి. ఇలా కొన్ని నియమములుండును. ఈ విధముగా, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమముండును. ఆ నియమము లను పాటించకపోతే ఆ దేవత మాంత్రికుని వశమునుండి తప్పించుకొని పోవును. అట్లు తప్పించుకొని పోవు దేవతలు తిరిగి తమని ఆ మాంత్రికుడు వశము చేసుకోకుండ, అతనిని చంపివేయడమో లేక అంగలోపము చేసి పోవడమో జరుగును. మంత్రబలముతో తమను వశపరుచుకొని తమ చేత పని చేయించాడని ఆ దేవతలకు కోపముండును. కావున అవి మంత్రగాళ్ళ వశమునుండి తప్పించుకొన్న తర్వాత కొందరిని చంపివేశాయి, కొందరికి కాళ్ళు, చేతులు పని చేయనట్లు చేశాయి. కొందరికి నోటిలో శబ్దము రాకుండచేసి, ఏమి మాట్లాడని స్థితికల్గించాయి. అందువలన మంత్రగాళ్ళు వారు తీసిన గొయ్యిలో వారే పడుదురని నేను చాలామార్లు చెప్పాను.


అటువంటి పరిస్థితి ముత్యాలమ్మకు ఎదురైనది. భగళాముఖి ఎదురు తిరిగింది. సమయము దొరికితే చంపేయాలని చూసింది. ఒకదినము మధ్యాహ్నము ఒంటిగంట సమయములో, ముత్యాలమ్మను భగళాముఖి గొంతు పట్టుకొన్నది. అప్పుడు ముత్యాలమ్మ గట్టిగ అరిచి విడిపించుకోవాలని చూచింది. ఆమె పరిస్థితి చూచిన భర్త మరియు చుట్టుప్రక్కల ఇళ్ళవారు గుంపుగా చేరారు. సరిగ ఆ సమయములోనే వారి ఇంటిముందు దారిలో నేను వచ్చాను. అక్కడ గుంపు చేరుచుండడము చూచి, నేను ఆగి ఆ ఇంటిలోనికి చూచాను. ఆమె క్రిందపడి ఉండగా భర్త వీపుభాగమును ఎత్తి పట్టుకున్నాడు. ప్రక్కవారు విసనకర్రతో విసురుచున్నారు. ఆమెకు శ్వాస సరిగ ఆడక ఇబ్బంది పడుతూవున్నది. అప్పుడు ఒక్కనిమిషము గడచినా ఆమెకు శ్వాస ఆగిపోతుందని బయటకు అర్థమగుచున్నది. ముత్యాలమ్మకు నీరు త్రాగించాలని, ప్రక్కన ఎవరో గ్లాసుతో నీళ్ళు పట్టుకొని ఉండడము చూచి, వెంటనే ఆ గ్లాసును నేను తీసుకొని అందులోని నీరును చేతిలో పోసుకొని, ముత్యాలమ్మ ముఖము మీద చల్లడము జరిగినది. వెంటనే ఆమె శ్వాసను సులభముగా తీసుకోవడము జరిగినది. అపస్మారక స్థితినుండి తేరుకుంది. నీరు ముఖము మీద చల్లుతూనే, పులిపంజాలో చిక్కిన జింక ఒక్కమారు విడిపించుకొన్నట్లు భగళాముఖి పట్టునుండి ముత్యాలమ్మ బయటపడింది.


అంతవరకు ఆమె మాంత్రికురాలని నాకు తెలియదు. నేను నివాసమున్న ఇంటికి దగ్గరగానే ముత్యాలమ్మ ఇల్లుకలదు. వారి ఇంటికి నాయింటికి కేవలము 40 మీటర్ల దూరమే కలదు. నా ఇంటినుండి 30 మీటర్ల దూరములో కుడిప్రక్కకు మలుపుతిరిగితే ప్రక్కనే పది మీటర్ల దూరములో వారి ఇల్లుగలదు. ముత్యాలమ్మ తాతగారు మంత్రగాడనీ, అతను దయ్యములను విడిపించు పనిచేసేవాడని తెలుసుగానీ, ముత్యాలమ్మ కూడ మాంత్రికురాలను విషయము నాకు తెలియదు. ముత్యాలమ్మ ప్రమాద స్థితిలో ఉన్నపుడు, అనుకోకుండ కాకతాళీయముగా అక్కడికిపోయి నీళ్ళు చల్లినపుడు ఆమె తేరుకున్న తీరును చూస్తే, అది ఏ రోగముకాదని అర్థమైనది. వెంటనే ఆ విషయమును ఆమె భర్తకు చెప్పగా! మొత్తము విషయమంతా సవివరముగా చెప్పాడు. కొద్దిరోజులుగా ముత్యాలమ్మకు ఏదో వికృతా కారము కనిపిస్తున్నదని, ఆమె చెప్పినట్లు కూడ చెప్పాడు. అప్పుడు అదంతా వారు పూజిస్తున్న భగళాముఖి పనియేనని నాకు అర్థమైనది. అంతేకాక భగళాముఖినుండి ఆమెకు ప్రమాదము తప్పదని కూడ అర్థమైనది. వెంటనే ముత్యాలమ్మకు ప్రమాదము తప్పదని ఆమె భర్తకు చెప్పాను. దానిని నివారించుకొనుటకు నీవు వెంటనే ఎవరైనా మంత్రగాళ్ళ వద్దకు పోయి ఏదైనా శాంతి చేయించుకొమ్మని చెప్పాను.


---

మంత్రగాళ్ళను వెదుక్కొనే దానికి, అక్కడికి పోయేదానికి కనీసము రెండు రోజులైన పడుతుంది. అంతలో ఏమైనా ప్రమాదము జరిగితే ఎలా అనీ, అతను నన్నే ఏదో ఒక నివారణ చేయమని అడిగాడు. దానికి నేను ఒప్పుకోలేదు. మంత్రములు నేర్చిన మాంత్రికులకు క్షుద్రదేవతల శాంతి విధానము కూడ తెలిసియుంటుంది. మీరు ఆ దేవతను శాంతపరుచు కొంటేనే అది మిమ్ములను వదలుతుంది” అని చెప్పాను. దానికి ముత్యాలమ్మ భర్త బాధపడుచు, “మేము మాంత్రికుల వద్దకు పోవువరకు ఏమి జరగకుండ ఏదో ఒక ఉపాయము చెప్పండి” అని అడిగాడు. అప్పుడు అతని బాధను చూచి, ఆమెకు ప్రమాదమున్నదని నేనే చెప్పాను కావున, సరే! మీరు పోవు వరకు ఏమి జరుగకుండ ఒక రక్షణను మీకిస్తాను. దానిని దగ్గరుంచుకొన్నంత వరకు భగళాముఖి ముత్యాలమ్మ దగ్గరకు రాలేదని చెప్పి, ఒక నిమ్మకాయను తీసుకొని దానిమీద సూదితో 'ఓం' అని వ్రాసి ఇచ్చాను. “ఇది నా చేతినుండి ఇచ్చాను. దీనిని ఆమె నడుమువద్ద చీరలో చెక్కి పెట్టుకొమ్మను. ఆమె స్నానము చేయాలనుకొన్నప్పుడు దీనిని క్రింద పెట్టకూడదు. నీవు చేతిలో పట్టుకొని ఆమె ప్రక్కనే నిలబడియుండు” అని చెప్పి పంపాము.


రెండవ దినము 'దక్షయజ్ఞము' సినిమా మొదటి ఆటకు పోయి ఇంటికి వచ్చాను. అప్పటికి రాత్రి పదిగంటల టైమ్ అయివుంటుంది. అప్పటికి నేను ఒక్కడినే ఇంటిలో ఉండేవాడిని. నేను సినిమానుండి వచ్చినది చూచి, ప్రతిదినము నావద్దకు జ్ఞానము వినే దానికి వచ్చే యువకుడు నా ఇంటిలోనికి వచ్చి ఏమైనా కడిగే పాత్రలున్నాయా అని అడిగాడు. నేను అన్నము తిన్న తర్వాత కడిగిపెట్టుదువు అని చెప్పి, అన్నము తినేదానికి ప్లేట్ తీసుకొను సమయములో ముత్యాలమ్మ భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ముత్యాలమ్మకు బాగాలేదని చెప్పాడు. నేను అన్నము తినే ప్రయత్నము ఆపివేసి ఆమెను వెంటనే తీసుకురమ్మని చెప్పాను. నా ఇంటిలోని యువకుడు ఆమె భర్త పోయి ఆమెను తీసుకొని వచ్చారు. అప్పుడు ఆమె కడుపునొప్పితో బాధపడుచున్నది. నేను ఇచ్చిన నిమ్మకాయ ఏమైనదని ఆమెను అడిగాను. ఐదునిమిషముల

ముందు నిమ్మకాయ పెద్ద శబ్దముతో పేలిపోయినట్లయింది. తర్వాత చూచుకొంటే నిమ్మకాయలేదు. వెంటనే నా

భర్తకు చెప్పాను. ఆ శబ్దమును నాభర్త కూడ విన్నాడు. తర్వాత నిమిషములోనే కడుపునొప్పి వచ్చిందని చెప్పినది. ముత్యాలమ్మ చెప్పినది చూస్తే ఎందుకు శబ్దము వచ్చిందో, నిమ్మకాయ లేకుండ ఎక్కడికి పోయిందో నాకు ఏమీ అర్థము

కాలేదు.


అప్పుడు ముత్యాలమ్మకు వచ్చిన కడుపునొప్పి భగళాముఖి పనేనని అర్థమైనది. వెంటనే గ్లాసుతో నీళ్ళను తీసుకొని, ఆ నీటిలోనికి నా కుడి చేతి చూపుడు వ్రేలిని అద్ది ఆమెకు త్రాగించాము. నీటిని త్రాగించిన వెంటనే అదిగదిగో పోతున్నదని ఆమె గట్టిగ అరిచింది. ఆమెను కొంతనెమ్మది పరచి ఏమి పోయింది? ఏమి చూచావు? అని అడిగితే, ఆమెకు కనిపించిన వికృతాకారమును గురించి చెప్పింది. ఆ సమయములో మేము కూర్చున్న రూము వాకిలి తెరిచియుంచాము. ఆ వాకిలికి ఎదురుగా చూస్తే దారి మలుపు వరకు కనిపిస్తుంది. దారిమలుపు, మా ఇంటినుండి దాదాపు 30 మీటర్ల దూరముంటుంది. ముత్యాలమ్మకు కనిపించిన ఆకారము 30 మీటర్ల దూరమును రెండు సెకండ్లలో పోయినట్లు చెప్పింది. మలుపు తిరిగి పోయిన తర్వాత కనిపించలేదని చెప్పడము వలన వారిని ఇంటికి పోయి పది నిమిషముల తర్వాత రండి! అంతలో అన్నము తింటాను. మీరు వచ్చిన తర్వాత రక్షణగా ఏదైనా ఇస్తానని చెప్పాను. అక్కడున్న వారంతా వెళ్లిపోయారు. నేను తిరిగి ప్లేట్ తీసుకొని అన్నము పాత్రవద్దకు పోకనే పోయిన వారంతా తిరిగి వచ్చారు. ఏమి వెంటనే వచ్చారని అడుగగ ముత్యాలమ్మ ఇంటివద్దకు పోయి తలుపు తెరుస్తూనే దేవుని మూల (వారు పూజ చేసే గదిలో) బండలసందులో కొద్దిగ ఆ వికృతాకారము కనిపించిందని, వెంటనే తలుపులు మూసివచ్చామని


---

చెప్పింది. నాకేమో ఒకప్రక్క ఆకలిగా ఉంది, ఒక్క ప్రక్కనేమో ముత్యాలమ్మ సమస్య. ముత్యాలమ్మ మాటలు వింటూనే భగళాముఖి మీద నాకు కొద్దిగ కోపము వచ్చింది.



ముత్యాలమ్మకు, ఆమెభర్తకు, నా ఇంటికి వచ్చిన యువకునికి ఈ విధముగ చెప్పాను. "ముత్యాలమ్మ కుడి, ఎడమ ప్రక్కల మీరు ఇద్దరు నిలబడి ఇంటివద్దకు పోయి తలుపు తెరవండి. ఒక్కమారుగ ముగ్గురు ఇంటిలోనికి పోండి. మీ వెనుక బారెడు దూరములోనే నేను వస్తుంటాను. మీరు లోపలికి బారెడు పోయేలోపల నేను వాకిలిలో నిలబడుతాను. అప్పుడు భగళాముఖి ఎక్కడికి పోలేదు ఇంటిలోనే చిక్కుకుంటుంది. అది నాకు కనిపించదు నీకు కనిపిస్తుంది కదా? అది ఎక్కడున్నది చెప్పుతూవుండు” అని ముత్యాలమ్మకు మిగతావారికి చెప్పి పంపి, నేను కూడ వారి వెనుక ఆరు అడుగుల దూరములో ఉంటూ పోయాను. వారు ఇంటితలుపు వరకు పోయి, శబ్దము లేకుండ తలుపు తెరిచి, ముగ్గురు ఒక్కమారు లోపలికి పోయారు. వారు లోపలికి పోయిన వెంటనే వాకిటిలో అడ్డముగ నిలబడా లనుకొని నేను ముందుకు ఒకడుగు వేశాను. లోపలికి పోయిన ముగ్గురు కనిపిస్తున్నారు. అంతలో ముత్యాలమ్మ పెద్దగా వచ్చె అని అరుస్తూ కుడి ప్రక్కనున్న యువకున్ని ప్రక్కకు త్రోసింది. ఆమె తన భర్తను ఎడమ ప్రక్కకు త్రోసి ఆమె కూడ భర్త ప్రక్కకు ఒరిగిపోయింది. ఇదంతా ఒక్క క్షణములోనే జరిగింది. అప్పుడు నేను వాకిలికి నాలుగు అడుగుల దూరములో ఉన్నాను. అలా పడిన వారు వెంటనేలేచారు. అంతలో నేను వాకిలిలో ఉన్నాను.


ఆమె లేచిన తర్వాత నన్నుచూచి, ఆమెకు కనిపించిన ఆకారము వేగంగా తమవైపు రావడముతో భయపడి, అతన్ని త్రోసి మేము పడినాము అది బయటికి పోవడము కనిపించిందని ముత్యాలమ్మ చెప్పింది. నేనెంత ప్రయత్నము చేసినా, భగళాముఖి దొరకకుండ తప్పించుకొని పోవడముతో భగళాముఖి మీద నాకు మరీ కోపము వచ్చింది. వారి సమస్యను పట్టించుకోనని మొదట చెప్పిన నేనే, ఈ విధముగ జోక్యము చేసుకోవలసి వచ్చింది. ఆ సందర్భానుసారము భగళాముఖిని తరిమివేయాలని నిర్ణయించు కొన్నాను. నేను లోపలికి పోయి వారి దేవుని మూలస్థలమును చూచాను. అక్కడ మంత్రములను వ్రాసిన అడుగు విస్తీర్ణమున్న రాగిరేకులు కనిపించాయి. అవి భగళాముఖి మంత్రములని వారిచేత తెలుసుకొన్నాను. తర్వాత వాటిని తీసుకొని పోయి నీరున్న బావిలో వేయమని చెప్పినాను. అంతలో ముత్యాలమ్మ బయటికి చూడడము జరిగింది. అప్పుడు ఇంటి బయట వికృతాకారము నిలబడి ఉంది, అది ముత్యాలమ్మను చూచి పైకి క్రిందికి తల అల్లాడించడము ఆమెకు కనిపించిది. ఆ వికృతాకారము ముత్యాలమ్మకు స్పష్టముగా కనిపిస్తున్నది, కానీ అక్కడ ఎవరికీ కనిపించడము లేదు. ఆమె చూస్తున్న వికృతాకారము ఎలా ఉన్నది అని అడుగగా! ముత్యాలమ్మ వివరముగా దాని ఆకారమును గురించి చెప్పింది. విశేషమే మంటే ఆ ఆకారమే భగళాముఖియనీ, ఆ ఆకారమునే తాము ఇంతకాలము పూజించామని ఆమెకు తెలియదు. భగళాముఖి, ఇంటిలో నాప్రక్కన నిలుచున్న ముత్యాలమ్మను చూస్తూ, తలను పైకి క్రిందికి నాలుగైదు మార్లు అల్లాడించినట్లు ముత్యాలమ్మ చెప్పింది. కనిపించే ఆకారము నోరు తెరుచుకొని నాలుకను బయట పెట్టివుందనీ, అలా బయటకున్న నాలుక దాదాపు జానెడు పొడవు ఉందనీ, తల పైకి క్రిందికి అల్లాడించినపుడు నాలుక దొమ్మలమీద తగిలినట్లు కనిపిస్తున్నదని చెప్పింది. అంతేకాక కన్నులు లైట్లు మెరిసినట్లు మెరుస్తూ కనిపిస్తున్నవని చెప్పడము జరిగినది.


అప్పుడు ఆ ఆకారమును నీ ఇష్టమొచ్చినట్లు తిట్టమని ముత్యాలమ్మ కు చెప్పాను. నేను నీ ప్రక్కనే ఉన్నాను నీకు ఏమీ భయము లేదు. చేతనైతే ఇప్పుడే రమ్మని, దానిని రెచ్చకొట్టినట్లు తిట్టు, అదివస్తే నా చేతిలో ఇరుక్కుంటుందని చెప్పాను. నామాటలను విన్న ముత్యాలమ్మ ఇష్ట మొచ్చినట్లు తిట్టను మొదలు పెట్టింది. దాదాపు ఐదు నిమిషములసేపు


---

తిట్టినా, అది ఒక్క అడుగు కూడ ముందుకు రాలేదని చెప్పింది. ఇక తిట్టడము వలన లాభము లేదనుకొన్న నేను ముత్యాలమ్మకు మరొక ఉపాయము చెప్పాను. ఈ మారు నేను నీ చేయి పట్టుకొని నీ వెంటనే వస్తాను. నేను రెడీ అంటూనే, నీవు స్పీడ్గా పరిగెత్తి దాని దగ్గరకు పోయి దానిని ముట్టుకో! అది నాచేతికి దొరుకుతుందని చెప్పాను. అట్లు మాట్లాడు కొన్న మేము ఒక్కమారు బయటికి పరుగెత్తడము జరిగినది. మేము వాకిలి దాటి బయటకు వస్తూనే, అది దాదాపు అర్థకిలోమీటరు దూరము పోయినట్లు ఆమెకు కనిపించింది. మేము ఒక్కనిమిషము అటువైపు చూస్తు నిలబడుకొన్నాము. నాకు అది కనిపించదు కావున ఆమె చెప్పడము వలననే అర్థమయ్యేది. ఆమె నా ప్రక్కనే చేయి పట్టుకొని నిల్చున్నది. మమ్ములను చూచిన ఆ ఆకారము చూస్తున్నట్లే దూరము పోతూ, పోతూ చివరకు ముత్యాలమ్మకు కనిపించకుండ పోయింది. ఆ విషయమును తెలుసుకొన్న నేను ముత్యాలమ్మకు ఆమె భర్తకు అది ఈ జన్మలో మీజోలికిరాదు నిశ్చింతగా ఉండండని చెప్పి ఇంటికి పోయాను. ఈ తతంగమును చూచుటకు దాదాపు అక్కడ 300 మందిపైగా జనము చేరి ఉండిరి. తర్వాత కొన్ని దినముల వరకు వారంతా దానిని ఒక వింతగా చెప్పుకొనిచుండిరి. అప్పటి నుండి ముత్యాలమ్మకు, భగళాముఖి పీడ లేకుండ పోయింది. వీటిని చూడనని ముందు రోజు చెప్పిన నేనే, రెండవ రోజు చూడవలసివచ్చింది. దీనినిబట్టి అన్నీ కర్మ నిర్ణయము ప్రకారమే జరుగునని నిరూపణ అయ్యింది.


దేవతలను ఉన్నత స్థానములో కూర్చోబెట్టి మనిషి పూజలు చేస్తుంటే, ఆ మనిషినే దేవతలు ఎలా వేధిస్తున్నారో భైరవ చరిత్రలోను, భగళాముఖి చరిత్రలోను కొంత అర్థమయ్యేవుంటుంది. దైవజ్ఞానము తెలియని ప్రజలకు దేవునికి, దయ్యాలకు తేడా తెలియదు. అందువలన దయ్యాలను దేవుళ్ళనుకోవడము జరుగుచున్నది. మా లెక్కలో మనిషి సూక్ష్మశరీరముగానీ, ప్రతిమ సూక్ష్మశరీరముగానీ రెండు దయ్యముల క్రిందకే జమకట్టబడును. నేడు దేవుళ్ళని పేరు పెట్టుకొన్నవన్నీ దేవుడుకాదు. మనము పూజించే ఈ దేవతలకు గుణములున్నాయి, ఆకారములున్నాయి, పేర్లు ఉన్నాయి. మనుషుల మాదిరి పేర్లు, ఆకారములున్న దేవతలు, మనుషుల గుణములకంటే హీనగుణము కల్గియున్నారని చెప్పుటకు ఎన్నో తార్కాణములు గలవు. అందులో ఒక దానిని ఇప్పుడు మీ ముందు పెట్టుచున్నాను చూడండి.



కళ్యాణదుర్గములో హెూటల్ నడుపుకొను ఒక వ్యక్తి, ప్రక్కనే 15 కిలోమీటర్ల దూరములోనున్న స్వంత ఊరిలో, కొన్ని సంవత్సరముల క్రింద “నేను కళ్యాణదుర్గములో హెూటల్ పెట్టుచున్నాను, నా వ్యాపారము బాగా జరిగితే నీకు పొట్టేలును బలి ఇస్తానని” పెద్దమ్మ అను దేవతకు మ్రొక్కు కున్నాడు. అతను కళ్యాణదుర్గములో హెూటల్ పెట్టిన తర్వాత రెండు సంత్సరములు వ్యాపారము సరిగా జరుగలేదు. కావున ఆ వ్యక్తి ఆ మ్రొక్కు బడిని మరచిపోయాడు. హెూటల్ పనిలో నిమగ్నమైన దానివలన స్వంత ఊరికి కూడ పోలేదు. రెండు సంవత్సరముల తర్వాత హెూటల్ బాగా పుంజుకున్నది. అలా నాలుగు సంవత్సరములు గడచిపోయాయి. ఆ వ్యక్తి పెద్దమ్మను మరచిపోయినా, పెద్దమ్మ

మాత్రము అతనిని మరచిపోలేదు.


ఒక దినము అతనికి గుండెలో నొప్పి వచ్చింది. డాక్టరును సంప్రదించితే, గుండెజబ్బు అని చెప్పి పెద్ద హాస్పిటలు పోయి చూపించు కొమ్మని చెప్పాడు. వెంటనే బంధువుల సమేతముగా అనంతపురమునకు వచ్చి పెద్ద ఆసుపత్రిలో చేరిపోయారు. అక్కడ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించారు. కానీ ఆ పరీక్షలలో లోపము కనిపించలేదు. ఆ వ్యక్తికేమో గుండెలో నొప్పి ఉన్నది. అతని బాధను చూచిన డాక్టర్లు కనిపించని లోపము ఏదైనా ఉండవచ్చును. పదిహేను రోజులు మా ఆధ్వర్యములోనే ఉండాలి అని చెప్పారు. గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి యాభై సంవత్సరముల పైనే వయస్సుంటుంది. అతని బంధువులందరు ఆస్పత్రికి వచ్చి చూచిపోతున్నారు. నాకు


---

దూరపు బంధువు ఒకరు అక్కడికి పోయి మనకు బంధువుగావున్న ఒకరు తాడిపత్రిలో ఉన్నాడు, అతనికి కూడ వైద్యము తెలుసు, ఆయనతో ఒకమారు చూపిస్తే బాగుంటుందని అన్నాడు. అతను ఆ మాట చెప్పిన వెంటనే అతనితో సహా ఆరుమంది వచ్చి నన్ను పిలువడము జరిగినది. సరేనని నేను అక్కడికి పోయి అతనిని చూడడము జరిగింది. గుండెకు సంబంధించిన అన్ని రిపోర్టు సరిగ ఉన్నపుడు, ఆ వ్యక్తికి గుండె నొప్పి ఎందుకుంటుందని యోచించిన నేను, నాకున్న అనుభవముతో ఆ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడిగాను.


నేను :- నీకు నొప్పి ఉంది అంటున్నావు. ఆ నొప్పి ఎక్కడ వచ్చిందో, మొదటి నుండి అక్కడే ఉందా? లేక కొద్దిగ ఏమైనా ప్రక్కకు జరిగినట్లున్నదా?

ఆ వ్యక్తి :- మొదట వచ్చినట్లు ఒక్కచోటే లేదు. కొద్దిగ అటు ఇటు మారుచున్నది.

నేను :- నీకు కనిపించే నొప్పి ఒకే స్థాయిలో ఉంటుందా లేక ఎక్కువ, తక్కువ అగుచు పిండినట్లు, అదిమినట్లు ఏమైనా కనిపిస్తుంటుందా?

ఆ వ్యక్తి :- ఎక్కువ తక్కువగా కూడ ఉంటుంది. మరియు అదిమినట్లు కూడ ఉంటుంది.

నేను :- నీవు దేవతలకు మొక్కుతుంటావా? ఎవరికైనా ఎదైనా ఇస్తానని మ్రొక్కుకున్నావా?

ఆ వ్యక్తి :- మేము పెద్దమ్మను ఎక్కువగా మ్రొక్కుచుంటాము. మా ఊరివద్ద నున్న పెద్దమ్మకు, హెూటల్ వ్యాపారము గురించి పొట్టేల్ని ఇస్తానని మ్రొక్కుకొని ఉంటిని. రెండేళ్ళు వ్యాపారము ఏమీ జరగలేదు. తర్వాత బాగానేవుంది. మూడవ సంవత్సరము పెద్దమ్మకు కోడిని బలి ఇచ్చివచ్చాను.

నేను:- నీవు ఇస్తానన్నది పొట్టేలు! ఇచ్చింది కోడి!! పెద్దమ్మ ఒప్పుకుంటుందా?

ఆ వ్యక్తి :- రెండేళ్ళు హెూటల్ జరుగలేదు కదా! అందుకని పొట్టేల్ని ఇవ్వలేదు. ఆయమ్మ మా కోరిక నెరవేర్చకుండినా, నేను కోడిని కోసి వచ్చాను కదా!

నేను :- చెప్పింది ఒకటి, చేసినది ఒకటి. అందువలన పెద్దమ్మకు కోపము వచ్చియుంటుంది. ఆయమ్మ కోపము వలన నీకు గుండెజబ్బు వచ్చిందేమో. ఇలా ఆస్పత్రికి డబ్బులు ఖర్చుపెట్టడముకంటే ఒక పొట్టేలుని పెద్దమ్మకు ఇచ్చేది మంచిదని అనుకుంటున్నాను.

ఆ వ్యక్తి :- నాకు బాగవుతుంది అంటే, ఒకటేమిటి? రెండు పొట్టేళ్ళను ఇస్తాను.

నేను :- నీకు బాగవుతుంది అనే పూచినాది. ముందునువ్వు ఊరికి పోయి పెద్దమ్మకు ఇచ్చేది ఇచ్చిరా పో!

ఆ వ్యక్తి :- అయితే ఆ పని రేపుకాక ఎల్లుండి చేస్తాను. నువ్వుకూడ వస్తే మంచిదని పిలుస్తున్నాను.

నేను :- నీకు మంచిదే, నాకు మంచిదే. కానీ నేను వస్తే పెద్దమ్మకు మంచిది కాదు. అందువలన నేను రాకుంటేనే పెద్దమ్మకు మంచిదవుతుంది. ఎల్లుండి ఆ కార్యము అయిపోయిన తర్వాత నీకు గుండెలో నొప్పివుంటే నన్ను అడుగు. ఆ వ్యక్తి :- అయితే పెద్దమ్మే ఇట్లు చేసిందంటావా?

నేను :- నేను అట్లంటే నీకు బాగుండదు, పెద్దమ్మకు బాగుండదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి. నీ రోగము గంటలోనే పోతుంది.


---

ఆ వ్యక్తి :- బంధువులను అందరినీ పిలుచుకొని ఎల్లుండి తప్పక ఆ కార్యమును చేస్తాను.


(అతను వెంటనే ఇంటికి పోయి ఆ కార్యమునకు తగిన ఏర్పాట్లు చేసుకొని, అతని మ్రొక్కుబడిని చెల్లించుకొని, ఏమైన తప్పులుంటే క్షమించమని పెద్దమ్మకు మ్రొక్కుకొన్నాడు. అతనికి నేను చెప్పినట్లు గంటకే నొప్పి లేకుండ పోయింది.)


మనుషులకు ఏదైనా ఇస్తామని చెప్పి ఇవ్వకుండినా పరవాలేదు. ఒకవేళ ఒక మనిషి దగ్గర బాకీ చేసి ఇవ్వకుండినా పరవాలేదు. కానీ ఒక దేవతకు ఏదైనా ఇస్తానని మ్రొక్కుకొని ఇవ్వకపోతే, వారు ముక్కుపిండియే కాదు కడుపుపిండి అయినా, గుండెలు పిండిఅయినా వసూలు చేస్తారు. పైన చెప్పిన సంఘటనలో పెద్దమ్మ, ఒక వ్యక్తికి గుండెలు పిండి తన పొట్టేలు బాకీని వసూలు చేసింది. ఇటువంటిదే మరొక సంఘటనను వివరిస్తాను చూడండి. ఈ సంఘటనలో తన బాకీకోసము ఒక మనిషి కడుపును పిండిన సమాచారము గలదు చూడండి.


రైల్వే డిపార్టుమెంటులో గార్డుగా పనిచేయు గంగయ్యయాదవ్ అను వ్యక్తి, ఒక దేవతకు ఏదో మ్రొక్కుబడి ఇస్తానని మ్రొక్కి, ఆ దేవతను మరచి పోయాడు. కొంతకాలము వేచిచూచిన ఆ దేవత ఇక లాభము లేదని ఏదో ఒకటి పిండి వసూలు చేసుకోవాలనుకొన్నది. చివరికి కడుపుపిండి వసూలు చేయాలనుకొన్నది. ఆ విధముగా అనుకొన్న ఆ దేవత, తన పనిని తాను చేసింది. కానీ కర్మబెడిసికొట్టి తానే చనిపోయింది. ఆ దేవత ఎలా చనిపోయిందో జాగ్రత్తగా చూస్తాము. రైల్వేగార్డు గంగయ్యయాదవ్కు కొంత కాలమునుండి అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేది. ఆ కడుపు నొప్పికి ఒక నియమము ఉండేది. అదేమనగా గంగయ్య డ్యూటిలో ఉన్నపుడు ఏమాత్రము నొప్పిరాదు. డ్యూటి అయిన తర్వాత ఇంటిదగ్గర ఉన్నపుడే నొప్పి వచ్చేది. అదియు 20 దినములకో, 30 దినములకో ఒకమారు వచ్చేది. ఒకమారు నొప్పి వచ్చిందంటే అర్థగంటనుండి ఒక గంటవరకు ఉండెడిది. కడుపునొప్పి ఉన్నంతసేపు భయంకరముగా బాధ ఉండేది. గంగయ్య ఆ బాధను తట్టుకోలేక క్రిందపడి పొర్లేవాడు. అతనికి అంతనొప్పి వస్తున్నా, ఏ కారణము వలన ఆ నొప్పి వస్తున్నదని తనకు ఏమాత్రము తెలియదు. ఆ కడుపునొప్పిని బాగుచేయించుకొనే దానికి రైల్వే హాస్పిటల్లో కొన్ని నెలలుండినా ఆ నొప్పి అంతుబట్టలేదు. హాస్పిటల్లోనే కడుపునొప్పి వచ్చినా డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆ నొప్పితో ఆయన బంధువుల ద్వారా నావద్దకు వచ్చాడు. వారు కడుపునొప్పిని గురించి చెప్పినదంతా వినిన తర్వాత, నాకు తీరిక ఉన్న దినమును చూచుకొని ఆ దినము రమ్మని చెప్పి పంపాము.


నేను చెప్పిన దినమున గంగయ్య, అతని బంధువులు పదిమంది వచ్చారు. గంగయ్యను నాముందర కూర్చోమని చెప్పాము. అతను నాముందర కూర్చున్న తరువాత, ఇపుడు నీకు కడుపునొప్పి ఉందా అని అడిగాను. ఇప్పుడు లేదు, ఎప్పుడు వస్తుందో చెప్పలేను అని గంగయ్య చెప్పాడు. సరే! ఎప్పుడో వచ్చే నొప్పిని ఇపుడు రమ్మని పిలుస్తాను. నొప్పి వస్తే చెప్పు అని గంగయ్యకు చెప్పి తర్వాత గంగయ్య శరీరములోవచ్చు కడుపునొప్పి ఏదైనా ఇప్పుడు నాముందర రమ్మని చెప్పుచున్నాను అని నేను తీక్షణముగా చెప్పడము జరిగినది. అలా చెప్పిన వెంటనే ఎదురుగా ఉన్న గంగయ్య కడుపులో కదలికలు మొదలయ్యాయి. ఒక నిమిషము తర్వాత గంగయ్య కడుపునొప్పితో బాధపడుట మొదలుపెట్టాడు. నీ కడుపులో నొప్పి ఎక్కడుందో అక్కడనే కరెక్టుగా చూపించు అన్నాను. నేను చెప్పిన మాటప్రకారము గంగయ్య కడుపు మధ్యభాగములో బొడ్డుకుపైన చూపించాడు. అప్పుడు నేను అతను చూపించిన కడుపు భాగమును చూడడము జరిగింది. నేను పది సెకండ్లు చూస్తూనే కడుపులోని నొప్పి అతని కుడి భుజములోనికి పోయింది. అలా నొప్పి


---

భుజములోనికి వచ్చిన సంగతి గంగయ్య చెప్పాడు. తిరిగి నేను భుజము మీదికి చూచాను. అక్కడ కూడ కొన్ని సెకండ్లలోనే నొప్పి కనిపించకుండ పోయి, వెనక వీపు భాగములోనికి చేరినది. భుజములో నొప్పి లేదని వెనుక వీపులోనికి నొప్పి చేరిందని గంగయ్య చెప్పాడు. వెంటనే అతనిని త్రిప్పి వీపు భాగములో చూడగా, అక్కడ కూడ మాయమైన నొప్పి అతని ఎడమ మోకాలిలోనికి చేరినది. ఈ మారు అతను తన మోకాలిని చేతితో చూపాడు.


గంగయ్య నిజము చెప్పుచున్నాడా, అబద్ధము చెప్పుచున్నాడా అని నాకు అనుమానము వచ్చింది. నీకు నొప్పి ఎక్కడున్నది తెలిసి చెప్పుచున్నావా, లేక అందాసుగా ఏమైనా చెప్పుచున్నావా, నీవు చెప్పేది అంతా నిజమేనా అని అడిగాను. దానికి గంగయ్య "ఉన్నదున్నట్లు చెప్పుచున్నాను. లేనిది చెప్పవలసిన అవసరము నాకేమి వచ్చినది. నాకు ఎప్పుడు వచ్చినా కడుపులోనే నొప్పి వచ్చేది. ఇంతవరకు ఎప్పుడూ ఇట్లు జాగ మారలేదు. పైగా ఇంత స్పీడుగా నొప్పి మారడము ఎవరికీ జరిగి ఉండదు.” అని అన్నాడు. ప్రక్కనున్న అతని బంధువులు కూడ జరుగుచున్న సంఘటనను చూచి ఆశ్చర్యపోతూ “కడుపునొప్పి వస్తే ఎప్పుడుగానీ ఇతను కూర్చోని మాట్లాడినది చూడలేదు. నొప్పి ఉన్నంతసేపు క్రిందపడి పొర్లడడము, కడుపు పట్టుకొని ముడుచుకోవడము చూచాము. ఇంత నెమ్మదిగా మాట్లాడుచున్నది ఇప్పుడే చూస్తున్నాము.” అన్నారు.


శరీరములోని నొప్పి ఒక్కచోట కూడ నిలబడకుండ, నాతో దోబూచులాట ఆడడము అది నీవు నన్నేమి చేస్తావు అని వెక్కిరించినట్లున్నది. నాచూపుకు చిక్కకుండ మనిషి సూక్ష్మములు (దయ్యాలు) ఏవి అట్లు శరీరములో జాగాలు మారలేవు. కొంతమంది దేవతలకే అది సాధ్యమగును. ఇదేదయినా మ్రొక్కుబడి దేవత అయి ఉంటుందని నాకు ముందునుండి అనుమానమే. అది ఒకచోట నిలబడితే, దానిని బయటికి లాగి మొత్తము సమాచారమును తెలుసుకోవచ్చును. అయినా అటువంటి అవకాశము ఇవ్వకుండ జాగాలు మారడము నాకు కొంత విసుగైనది. అయినా విసుగుపడకుండ, ఓపికతో అతని మోకాలి వైపుచూచి "నీవు అక్కడే ఆగు! ఉన్న జాగాను మారవద్దు. ఈతూరి జాగా మారితే, నీమీద నాకు కోపమొస్తుంది.” అని చెప్పాను. అయినా ఆ నొప్పి అక్కడ కూడ నిలువలేదు ఈమారు ఏకంగా తలలో చేరింది. శరీరములో నొప్పి ఎక్కడికి పొయ్యేది గంగయ్యకు బాగా అర్థమౌవుచున్నది. కావున వెంటనే ఇప్పుడు తలలోనికి వచ్చింది అన్నాడు. నేను వెంటనే తలవైపు చూచాను. అయినా ప్రయోజనము లేదు. ఈతూరి కొంత తేడా కనిపించింది. పది లేక పదిహేను సెకండ్లకే ఉన్న చోటు నుండి తప్పించుకొనునది, దాదాపు ఒక నిమిషము వరకు అక్కడే తలలోనే ఉండి, తర్వాత కడుపులోనికి చేరింది. గంగయ్య తిరిగి కడుపులోనికి నొప్పి వచ్చిందని చెప్పాడు.


ఆ మాట వింటూనే లోపల జాగా మారుచున్న విగ్రహము (దేవత) మీద తీవ్రమైన కోపము వచ్చింది. వెంటనే నాకు తెలియకుండానే నా నోటివెంట ఒకమాట వచ్చింది. అటువంటి మాట నా జీవితములో ఆ దినముకంటే ముందుగానీ, ఆ దినము తర్వాత ఇంతవరకుగానీ ఎప్పుడు వినలేదు. నా జీవితములో ఒక్కమారే వచ్చిన ఆ మాట ఏదనగా! “నాలోని జ్ఞానాగ్ని నిన్ను భస్మీపటలము చేయుగాక” ఆ మాట బయటికి వస్తూనే దానిని విన్న నాకే కొంత ఆశ్చర్యమైంది. నానోట ఆ మాట పలుకబడగానే ఎదురుగానున్న గంగయ్య శరీరములో అంతవరకు దొరకకుండ తిరిగినది ఏదైతేవుందో అది ఒక్కమారు భగ్గున అంటుకొన్నది. శరీరములోపల అది అలా అంటుకొంటూనే, బయట గంగయ్య మంట,మంట అని అరవను మొదలు పెట్టాడు. అగ్ని అంటుకొన్న మనిషి అరిచినట్లు అతను అరుస్తూ ఉంటే ఒక్కనిమిషము మాకు ఏమి చేయాలో అర్థము కాలేదు. తర్వాత బకెట్లో నీళ్ళు తెచ్చి, గుడ్డలు తడిపి, అతని శరీరము మీద వేయను మొదలు పెట్టాము. లోపల అంటుకొన్నది. శరీరమంతా పరుగెత్తుచుండుట వలన పైన గంగయ్యకు శరీరమంతా మంటలు


---

రేగిన అనుభూతి కల్గినది. నీటి గుడ్డలతో శరీరమును ఎంత తడిపినా అతను అరిచేది ఆపలేదు. అప్పుడు పైన చేయుచున్న మా ప్రయత్నము వృథా అనిపించింది. అక్కడున్న అతని బంధువులకు ఏమి జరుగుచున్నదో ఏమాత్రము అర్థము కాలేదు. ఏమైంది అని గాబరాగా నన్ను అడుగను మొదలుపెట్టారు. నేను వారికేమి జవాబు చెప్పలేదు. విధముగా దాదాపు పది నిమిషములు గడచింది. అప్పుడు గంగయ్య శరీరములోని మంటలు అణిగిపోయాయి. తర్వాత అతని శరీరములో ఏ బాధ కనిపించలేదు. అదంతా అక్కడున్నవారికి ఒక వింతగ కనిపించింది.


జరిగిన సంఘటన మాకు కూడ ఒక క్రొత్త అనుభవమును చేకూర్చినది. గంగయ్య శరీరములో కొంతకాలముగా వేధిస్తున్న ఆ దేవత ఎవరోగానీ, ఎదురుగావున్న నన్ను నా జ్ఞానమును లెక్కచేయకపోవడము వలన అలా కాలిపోవలసి వచ్చినది. మా జీవితములో ఒకే ఒక్కమారు జరిగిన ఆ అనుభవము నేను మరచిపోలేని గుర్తుగా మిగిలిపోయింది. దైవజ్ఞానమంటే ఏమిటో, దానిశక్తి అంటే ఏమిటో తెలియనివారికి ఇదేదో కల్పనగా, కథగా అనిపిస్తుంది. ఎవరికేమనిపించినా ఇది 35 సంవత్సరముల క్రిందటే జరిగిన యదార్థసంఘటన.


భూమిమీద జన్మను పొంది, ఒక పేరును కల్గియుండి, కొన్ని పనులు చేయుచున్న మనుషులుగానీ, దేవతలుగానీ, ఇంకా ఎవరైనాగానీ వారికి చివరిలో మరణము కూడ కలదు. పుట్టుక నుండి మరణము వరకు ఎవరికైనా జీవితము అనునది కలదు. పుట్టిన తర్వాత కొందరు తమ జీవితమును సార్థకము చేసుకొంటారు. కొందరు వ్యర్థము చేసుకొంటారు. ఎవరు స్థారకము చేసుకొన్నారో, ఎవరు వ్యర్థము చేసుకొన్నారో వారివారి జీవిత చరిత్రలను బట్టి తెలుస్తుంది. జగతిలో జీవితమును వ్యర్థము చేసుకొన్నవారు కోకొల్లలున్నారు. కానీ జీవితమును సార్థకము చేసుకొన్న వారు బహుఅరుదుగా ఉన్నారు. ఇప్పుడు గడుస్తున్న మన జీవితమును సార్థకము చేసుకోవాలంటే, గతములోని సార్థక జీవితమును పొందిన కొంత మంది చరిత్రలను తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకోవాలనినా కొంతమంది మహానుభావులు గడిపిన బాహ్యచరిత్రే అగుపించును. ఇక్కడ బాహ్య చరిత్ర అనగా వారు కనిపించు స్థూలశరీరముతో గడిపినదని అర్థము. కానీ మనకు కనిపించని సూక్ష్మశరీరములతో గడిపిన ఎందరో మహాత్ముల చరిత్రలు కూడ కలవు.


దయ్యము అను పేరు వింటూనే ఏదో అసహ్యమైనదిగా కొందరు భావించుకొంటుంటారు. దయ్యము అను పేరు మన జీవితములోని కొంత భాగమును తెలియజేయు పదము మాత్రమే. ఈ రోజు దయ్యమంటే ఏమిటో అని భయపడువారు ఎందరో, రేపు దయ్యముగా జీవితకాలమును గడపవలసివస్తుంది. కావున దయ్యము అంటే ఏమిటో తెలుసుకొని అది అంటరానిదో, వేరేజాతిదో కాదని, మనమే రాబోవు కాలములో దయ్యముగా మారగలమనీ, అలా మారిన వారిలో ఎందరో గొప్పవారున్నారని తెలుసు కొందాము. దయ్యముగా మారిన జీవితములు కూడా ఎంతో గొప్పవిగా, సార్థక జీవితముగా ఉన్నవని తెలుసుకొందాము. అటువంటి వాటిలో ఇప్పుడు కూడ జీవించియున్న ఒక సార్థక జీవితము తీసుకొని వివరించుకొందాము.


అనంతపురము జిల్లాలో పెనుకొండను తెలియనివారుండరు. ఎందుకనగా ఆ గ్రామము కృష్ణదేవరాయల కాలమునుండి చరిత్రగలిగినది. కావున చాలామందికి తెలిసే ఉంటుంది. పెనుకొండకు కేవలము ఏడు కిలోమీటర్ల దూరములో 'మావుటూరు' అను ఒక చిన్న గ్రామము గలదు. ఆ ఊరిలో నేను ఒక వారము దినములు ఉన్నాను. నేను ఆ ఊరిలో ఉన్న సమయములో, అక్కడ చిన్నపిల్లలకు మెదడువాపు జ్వరములు ఎక్కువగా ఉండేవి. ఆ ఊరినుండి మెదడువాపు జ్వరము వచ్చిన ఆరు సంవత్సరముల వయస్సున్న పాపను పెనుకొండ హస్పిటల్కు తీసుకుపోయారు.


---

అక్కడ మూడురోజులు చికిత్స చేశారు. అల్లోపతి చికిత్సకు ఆ రోగము నయము కాలేదు. ఇంకొక అర్థగంట కూడ బ్రతకదు అని డాక్టర్లకు అర్థమైనది. అటువంటిస్థితిలో పాప బ్రతకదు, ఇంటికి తీసుకుపోండి అని చెప్పగ తల్లి తండ్రులు ఇంటికి తెచ్చుకొన్నారు. ఇంటిలో బంధువులందరు ఆ పాపచుట్టు చేరి ఏడ్చుచున్నారు. ఆ ఊరిలో అందరికంటే స్థోమతగానున్న కుటుంబము ఆ పాప ఇంటివారిదే. ఆ పాప మామ ఆ ఊరి ప్రెసిడెంట్గా పని చేయుచున్నారు. ప్రెసిడెంట్ నాన్న అనగా పాప తాతగారు నావద్దకు వచ్చి పాపను కొద్దిగా చూడమన్నాడు. నేను డాక్టరునని ఆ ఊరిలో కొందరికి తెలుసును. అందువలన ఆయనవచ్చి నన్ను పిలువడము జరిగినది. నేను బంధువుల ఇంటికి పోయినవాణ్ణి, నాదగ్గర చికిత్స చేయుటకు ఏ మందులు లేవు. ఆ పెద్దమనిషి పిలిచినపుడు నేను రాను అంటే బాగుండదని పోయాను. అక్కడ ఆ పాప అపస్మారక స్థితిలో (కోమాలో) ఉన్నది. కాళ్ళు చేతులు చల్లగై పోయాయి. శరీరములో వేడి తగ్గిపోయింది. శ్వాస ఆడి ఆడక ఉంది. మొత్తము మీద ఆ పాప ప్రాణముతో ఉండినా, ఒక ఐదు లేక పది నిమిషములకంటే ఎక్కువసేపు బ్రతకదనిపిస్తావుంది.


ఆ పాపను చూచి ఏదో ఒకటి చేయాలనిపించింది. వెంటనే ఆవాలను తెప్పించి, వాటిని పిండి చేయించి, ఆ పిండిని నీటిలో కలిపి పెద్ద ప్లేటులో పోయించి, ఆ పాపను ఆ నీటిలో పడుకోపెట్టినాము. ఆ నీటితోనే తడువని చోటంత తడిపాము. అలా చేసిన ఐదు నిమిషాలకే, ఆ పాప కళ్ళు తెరిచి చూచింది. శరీరమంతా వేడివచ్చింది. శ్వాసకూడ బాగా ఆడను మొదలుపెట్టింది. చనిపోతుందనుకొన్న పాప బ్రతకడము, ఆ ఊరి వారందరికీ తెలిసిపోయింది. దానితో అక్కడివారంత నన్ను పెద్ద వైద్యునిగా లెక్కించుకొన్నారు. పాప విషయము జరిగిన మూడురోజులకు నేనున్న ఇంటికి కొద్దిదూరములోనే నిండుగర్భిణి మనిషికి ఆరోగ్యము బాగాలేదని, పలుకకుండ పడిపోయినదని, మీరు వచ్చి చూడండి అని పిలిచారు. సరేనని పోయి చూస్తే, గర్భిణి మనిషి అయిన ఆమె పలకని స్థితిలో అపస్మారకములో ఉన్నది. అప్పుడు నేను నీటిని ఆమె ముఖము మీద చల్లినాను. నీళ్ళు ముఖము మీద పడుతూనే వెంటనే జ్ఞప్తిలోనికి వచ్చింది. తర్వాత లేచి కూర్చుంది. ఆమెకు కొన్ని నీళ్ళు త్రాపి ఏమి కాదులే అని చెప్పి వచ్చేశాను. ఆమె పరిస్థితిని గమనించిన నాకు, అది అనారోగ్యము వలన జరిగినది కాదని, సూక్ష్మశరీరము యొక్క ప్రభావము వల్లనే జరిగిందని అర్థమైనది. అయినా ఆ విషయము వారికి చెప్పకుండ వచ్చేశాను.


నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇరవైనిమిషములకు గర్భిణీ అయిన ఆమె వచ్చింది. ఆమెను కూర్చోమని చెప్పగా ఆమె కుర్చీలో కూర్చొనక క్రింద కూర్చున్నది. సమయానికి మీరు వచ్చి చూచినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను అని నాకు నమస్కరించింది. అలా నాకు నమస్కరించ కూడదు. నేను నీలాంటి మనిషినే, నమస్కారమునకు అర్హుడు దేవుడు ఒక్కడేనని చెప్పాను. ఆ మాటవిన్న తర్వాత ఒక నిమిషమునకే మామూలుగా కూర్చున్న ఆమె ఒక ప్రక్కకు కాళ్ళు వెనక్కు మడిచి కూర్చొని, తర్వాత తలమీద ముసుగువేసుకొని, తలక్రిందికి వంచుకొని కూర్చోవడము జరిగినది. అలా కూర్చున్న తర్వాత "మీకు ధన్యవాదములు చెప్పుచున్నాను స్వామి!” అన్నది. అంతవరకు నన్ను స్వామి అని ఆ ఊరిలో ఎవరూ అనలేదు. డాక్టరునని, సార్ అని అనే వాళ్ళు. ఆమె కూర్చున్న వాలకమును బట్టి, మాట్లాడే మాటనుబట్టి మొదట వచ్చిన ఆమె కాదని నాకు అర్థమైనది. అప్పుడు నేను ఆమెను నీవు ఎవరు అని అడిగాను.


ఆమె :- స్వామి! నాపేరు అంబోజమ్మ. నేను మీ దగ్గరకు వచ్చిన గర్బిణీ మనిషిని కాదు.

నేను :- నీవు అలా కూర్చున్నపుడే నాకు అర్థమైనది. నీవు ఎవరివి, ఎందుకు వచ్చావు?


---

ఆమె : - నాది ఈ ఊరుకాదు పెనుకొండ. ఈమె పెనుకొండ బాబాగారి భక్తురాలు.

నేను :- బాబాగారు పుట్టపర్తిలో ఉన్నారు. నీవు పెనుకొండ బాబా అంటున్నావు. నీవు చెప్పే బాబా ఎవరు? పుట్టపర్తి

బాబా కాదా?

ఆమె :- పుట్టపర్తి బాబాగారు కాదు. పెనుకొండలోనే బాబా పకురుద్దీన్ గారిని, పెనుకొండ బాబయ్య అని ప్రజలు అంటారు. ఈమె బాబా పకురుద్దీన్ గారి భక్తురాలు. ఈమె మీ దగ్గరకు వచ్చింది కదా, నేను కూడ మీతో మాట్లాడవలెనని వచ్చాను.

నేను :- ఈమెది మావుటూరు, నీది పెనుకొండ. ఈమె నీకేమైన బంధువు అవుతుందా?

ఆమె :- ఈమె నాకు బంధువుకాదు. బంధువు కాకపోయినా మాకు బంధువు కంటే ఎక్కువ సంబంధము ఉంది. ఈమె హిందువు, హిందువులు చాలామంది బాబయ్యగారి దగ్గరికి వస్తుంటారు. కానీ వారిలో ఈమె బాబయ్యగారికి పెద్దభక్తురాలు. ప్రతి వారము పెనుకొండకు వచ్చి బాబాగారి దర్గాను దర్శించుకొని, ప్రదక్షిణలు చేసివస్తుంది. ఈమెకు బాబయ్యగారి మీద ఎక్కువభక్తి ఉండుట వలన, ఈమె కూడ ఇంటిలోనే నమాజ్ చేస్తుంది. ఈమెకున్న ఇద్దరి పిల్లలకు ముస్లీమ్ల పేర్లే పెట్టింది. తన పేరును కూడా మార్చుకున్నది.

నేను :- ఉన్న పేరును తీసి లేని పేరును ఎందుకు పెట్టుకున్నది?

ఆమె :- ఈమెకు పెళ్ళైయినప్పటినుండి ఈమెను ఒక దయ్యము పట్టి పీడించేది. దానివలన ఈమె కొంత అనారోగ్యముగ ఉండేది. ఏ దేవతను మ్రొక్కినా ఈమెను ఆ దయ్యము వదలలేదు, ఆరోగ్యము బాగుపడలేదు. చివరకు బాబాగారి దగ్గరకు వచ్చి కొన్ని రోజులు సేవ చేసింది. తర్వాత దయ్యము పోయింది. ఆరోగ్యము బాగుపడింది. అప్పటినుండి దేవతలను వదిలివేసి బాబాగారినే ఆరాధిస్తున్నది. బాబాగారు పేరు మార్చుకున్నట్లు ఈమెకూడ మార్చుకొన్నది.

నేను :- బాబాగారు పేరు మార్చుకున్నారా?

మారింది.

ఆమె :- అవును, బాబాగారు కూడ మార్చుకొన్నారు. బాబాగారినే ఆదర్శముగా తీసుకొని, ఆమె కూడ అలాగే బాబాగారికి కూడ ఈమె మీద ఎక్కువ ప్రేమ. తండ్రిప్రేమకంటే ఎక్కువ ప్రేమను చూపుతుంటాడు. అందువలననే ఈమెకున్న దయ్యమును వదిలించి ఏ దయ్యము ఈమె దగ్గరకు రాకుండ నన్ను కాపలా పెట్టాడు. నేను :- నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థము కాలేదు. బాబయ్యను మ్రొక్కింది, ఆరోగ్యము బాగుపడింది సరే, ఈమె పేరు మార్చుకొన్నది సరే అదీ ఈమె ఇష్టము, కానీ ఇక్కడ అర్థముకానిది, బాబయ్య ఈమెను బిడ్డకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటున్నావు కదా! అలా అయితే బాబయ్య ఇప్పుడు ఉన్నాడా? ప్రతి సంవత్సరము పెద్దగ ఉరుసు జరుగుతుందనీ, ఆరోజు అక్కడే ఉన్న చెట్టునుండి చక్కెర రాలుతుందని విన్నాను. నేను ఎప్పుడూ అక్కడికి పోలేదు, చూడలేదు. ఆ దర్గాను గురించేనా నీవు చెప్పునది?

ఆమె :- అవును, ఆ చెప్పుచున్నాను. బాబయ్యగారు దాదాపు ఐదు (500) వందల సంవత్సరముల క్రిందట నుండి నేటికినీ ఉన్నాడు. పెనుకొండ దర్గాదగ్గరే ఉన్నాడు. మీకు అర్థము కాకపోతే వివరముగా చెప్పుతాను. నేను :- బాబా ఎవరు? ముస్లీమ్ మతానికి చెందినవారిపేరు బాబా అని ఉండదు కదా! ఆయన ఇప్పుడు కూడ ఎట్లున్నాడు? ఆయన వయస్సు ఎంత? ఆయన ఏమి చేస్తుంటాడు? ఆయన మనిషా? కాదా! అన్నీ వివరముగా చెప్పితే బాగుంటుంది.


---

ఆమె :- అన్నీ వివరముగా చెప్పుతాను. అన్ని విషయములు మీకు తెలిస్తే బాగుంటుంది. దాదాపు ఐదు (500) వందల సంవత్సరముల క్రిందటి కాలములో తూర్పుగోదావరి జిల్లాలో క్షత్రియుల (రాజుల) కుటుంబములో సత్యంరాజు అను వ్యక్తి పుట్టాడు. అతను దాదాపు నలభైసంవత్సరముల వయస్సులో ఇల్లు వదలి దైవజ్ఞానమును తెలుసుకోవాలని, దానిని తెలుపు గురువు కొరకు అన్వేషణ చేస్తు ఊరు వదలి వచ్చాడు. ఆయనకు గురువు ఎక్కడ కనిపించలేదు. తూర్పుగోదావరి జిల్లానుండి కాలినడకతోనే తిరుగుచు పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అన్నిటిని దాటి, మూడు సంవత్సరములకు అనంతపురము జిల్లా పెనుకొండ ప్రాంతములోనికి వచ్చాడు. ఆ విధముగా ఏడు జిల్లాలు దాటి వచ్చిన సత్యంరాజు చివరికి బికారిలాగ మారిపోయాడు. ఏది దొరికితే అది తిని, ఎక్కడంటే అక్కడ పడుకొనేవాడు. ఒకరోజు పెనుకొండ కోటలోనికి పోయి అక్కడ దొరికింది తిని, కోటప్రక్కన కొండమీదనే నీడ ఉన్నచోట కూర్చొన్నాడు. అప్పటి కాలములో పెనుకొండ కోటను ఒక సామంత రాజు పాలించుచుండెను. ఐదు (500) వందల సంవత్సరముల కాలములో పెనుకొండ కోట, కృష్ణదేవరాయల వంశము వారిపాలనలో ఉండెడిది. కోటలో ఉన్నవారు పెట్టింది సత్యంరాజు తిని కొండమీదనే ఒక చెట్టుక్రింద కూర్చొని నాకు గురువు దొరకడా? జ్ఞానము తెలియదా? అని ఆలోచిస్తూ మనస్సులోనే బాధపడుచుండెను.


అంతలో ఒకమాట అతనికి వినిపించింది. “నీవు నావద్దకు రా” అని వినిపించగా, అతనికి ఏమి అర్థముకాక చుట్టుప్రక్కల కలియచూచాడు. అతనికి ఎవ్వరు కనిపించలేదు. నన్ను ఎవరు పిలిచారు, ఎక్కడనుండి పిలిచారు అని ఆలోచిస్తూ ఉండగా మరొక్కమారు అదేమాట వినిపించింది. ఆ శబ్దము వచ్చిన వైపు చూస్తే రెండు పెద్దరాతి గుండ్లు కనిపించాయి. ఆ రెండు గుండ్ల మధ్యలో, మనిషి పోవుటకు కూడ ఇరుకుగా ఉన్న కొద్దిపాటి సందు కనిపించింది. ఆ సందులోనుండి శబ్దము వచ్చినట్లు సత్యంరాజుకు అర్థమైనది. రెండు రాళ్ళ సందులోనికి బలవంతముగా దూరి చూడగా కుడి ప్రక్కకు కొద్దిగ మలుపు తిరిగి ఉండెను. పైన మన్ను కప్పబడి ఉండగా, మలుపుతిరిగిన దారి ముందుకున్నట్లు సత్యంరాజుకు అర్థమైనది. సత్యంరాజు ధైర్యముగ లోపలికి పోయాడు. దాదాపు నలభై అడుగుల దూరము పోయిన తర్వాత దారి కుడి ప్రక్కకు తిరిగింది. అక్కడ పది అడుగుల పొడవు, అంతే వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుగల బయలు కనిపించింది. ప్రక్కన నుండి చిన్న రంధ్రము ద్వారా వెలుతురు కూడ ఉన్నది. ఆ బయలులో మధ్యన ఒక వ్యక్తి కూర్చొని ఉండడము కూడ కనిపించింది. ఆ వ్యక్తిని చూస్తూనే సత్యంరాజుకు కొద్దిగ భయమైంది సత్యంరాజు భయమును చూచిన లోపలున్న ఆ వ్యక్తి, నీవు భయపడవద్దు నీవు వెతుకుతున్నది నన్నే అన్నాడు. అప్పుడు సత్యంరాజుకు భయము ఏమాత్రము లేకుండ పోయి, ఏదో నిధి దొరకినంత సంతోషమైనది. వెంటనే సత్యం అతని కాళ్ళమీద పడి నీవు ఎవరో మహానుభావునివి, నీకు కనిపించకుండినా బయటవున్న నన్ను పిలిచారంటే మీరే నా గురువు అని అన్నాడు. అక్కడున్న వ్యక్తి చూచేదానికి పొడవుజుట్టు, గడ్డము కలిగి ఒక మహర్షిలాగ కనిపించుచుండినా తాను ముస్లీమ్ మతములో పుట్టినవాడిననీ, అయినా హిందుమతములోని జ్ఞానమును తెలుసుకొని దానినే ఆచరించిన వాడిననీ, అందువలన నాపేరు రెండు మతములకు సంబంధించి నదిగా ఉన్నదనీ, ముస్లీమ్ మతానికి గుర్తుగా సాయబ్ అనీ, హిందూమతము నకు సంబంధించిన గుర్తుగా బాబాయని, రెండు కలిపితే “సాయబ్బాబా” అను పేరుతోయున్నానని సత్యంకు చెప్పాడు. అంతేకాక సాయబాబా గారు, ఇలా మరికొన్ని విషయములు కూడ చెప్పాడు. నేను ఇక్కడే కొన్ని సంవత్సరములు ధ్యానము చేశాను. నాలో ఎంతో శక్తి ఏర్పడినది. అయితే ఇస్లామ్ ఖురాన్లో చెప్పినట్లు, తోటి మనుషులకు సహాయము చేయాలను కొన్నాను. అందువలన నేను ఇక్కడినుండి పోవాలనుకొన్నాను. ఇన్ని రోజులు నీకోసమే వేచి చూచాను. ఇప్పుడు నీవు వచ్చావు. నాలో కల్గిన శక్తితో నేను మోక్షముకు పోవచ్చును. కానీ నేను



---

మోక్షమునకు పోకున్నా పరవాలేదు. ఆ శక్తిని ప్రజలకు ఉపయోగపడునట్లు దేవున్ని వేడుకున్నాను. దేవుడు నా నిస్వార్థ కోరికను మన్నించి నాకోర్కె నెరవేరునట్లు ఆశీర్వదించాడు. నీవు కూడా భవిష్యత్తు కాలములో ప్రజలకు ఉపయోగ పడుటకు నానుండి నీకు కొంతశక్తిని ఇస్తున్నాను. నీవు నా శక్తిని పొంది ఈ ఊరిలోనే ఉండిపో. నేను ఎంతో కాలముగా ఉండిన ఊరు పెనుకొండ. కావున నీవు పెనుకొండ లోనే ఉండు అన్నాడు. అప్పుడు సత్యం, సంతోషపడుచు ఇపుడు నా జీవితానికి ఒక గట్టు దొరికింది, మీరు ఎట్లు చెప్పితే అట్లే వింటానని అన్నాడు.


సాయబ్ బాబాగారు సత్యంరాజుతో ఇంకా కొంత విషయము చెప్పాడు. నీవు హిందూమతస్థునివి. నీవు నా శిష్యునివి అయిన తర్వాత నీకు ఈ మతము పేరు ఉండకూడదు. అందువలన నేను రెండు మతాలకు సంబంధించిన పేరు పెట్టుకొన్నట్లు, నీవు కూడ రెండు మతాలకు సంబంధించిన పేరుతో చలామణి కావలెను. నేను మొదట ఇస్లామ్ మతములోనివాడిని. తర్వాత హిందూ జ్ఞానమును తెలుసుకొని అనుసరించాను కావున ముందు ముస్లీమ్ పదము “సాయబ్” తర్వాత, హిందూపదము "బాబా” అని పూర్తిగా సాయబ్బ్బా అని పేరు పెట్టుకొన్నట్లు, నీవు హిందూమతములో పుట్టిన దానివలన ముందు హిందూ మతానికి సంబంధించిన పేరు 'బాబా' అనీ, తర్వాత ఇస్లామ్ జ్ఞానము ప్రకారము నడుచుకొందువు కాబట్టి వెనుక ముస్లీమ్ పేరు 'పకురుద్దీన్' అని రెండూ కలిపి 'బాబా పకురుద్దీన్' అను పేరుతో చలామణి కావలెను. నేను ముస్లీమ్ హిందువును కావున “సాయబ్బాబా”ను, నీవు హిందూ ముస్లీమ్ కావున “బాబా పకురుద్దీన్”వు! తర్వాత, ఇప్పటి నుండి నీవు ముస్లీమ్ మతస్థునిగానే కనిపించాలి. నేను ముస్లీమ్ మతములో పుట్టినా, హిందూ మహర్షిగా కనిపిస్తున్నాను. అట్లే నీవు హిందూమతములో పుట్టినా ఇస్లామ్ పండితునిగా కనిపించాలి. అలా ఉంటేనే నీకు నాశక్తి ఉపయోగపడుతుంది. అంతేకాక నీవు ఈ ఊరిలో ఎక్కడ ఉండవలసినది దేవుడే నిర్ణయిస్తాడు. దానికి నీవు ఒక పని చేయాలి. అదేమనగా! నేను ఒక పుల్లను ఇస్తాను. ఆ పుల్లను తీసుకొని నీవు రాత్రిపూట పడుకొనేటప్పుడు, తల ప్రక్క భూమిలో ఒక కొనను పాతిపెట్టి పడుకో. తెల్లవారి అది పైకొన చిగురించి ఉంటే అదే నీ నివాసస్థలమని తెలుసుకో! నేనిచ్చిన పుల్ల చిగురించేంత వరకు ఈ ఊరిలో వేరువేరు జాగాలలో పడుకొనిచూడు. తప్పక ఏదో ఒక స్థలము నీకు దొరుకుతుంది అని చెప్పి, సాయబ్బ్బా తాను పళ్ళు తోముకొన్న మిస్వక్ చెట్టు పుల్లను ఇచ్చాడు. మిస్వక్ చెట్టును కొన్ని ప్రాంతములలో చక్కెర చెట్టు అని పిలుస్తారు.


అలా పుల్లను ఇచ్చిన సాయబ్బాబాగారు, సత్యంరాజుకు ముస్లీమ్ లలో సన్యాసిగా చలామణి కావలెనని, క్రమము తప్పకుండ నమాజ్ చేసుకోమని, దేవుని మీద విశ్వాసము పెంచుకొమ్మని, ఇస్లామ్కు చెందిన జ్ఞానమును చెప్పి ఇక పొమ్మని పంపాడు. అంతేకాక “నీవు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు. ఇక్కడ నేనుండను. ఇక్కడినుండి వెళ్ళిపోతాను” అనికూడ చెప్పాడు. సాయబ్బాబా దగ్గర ఆశీర్వాదము పొందిన సత్యమ్రాజు బయటికి వచ్చి పెనుకొండలో తిరుగుచు, ప్రతి రాత్రి ఎక్కడ పడుకొంటే అక్కడ బాబాగారు ఇచ్చిన పుల్లను కొంత పాతిపెట్టి పడుకొనేవాడు. ఆ విధముగ కొన్ని దినములు గడిచినవి. ఒక దినము పెనుకొండలోయున్న ఈశ్వర ఆలయములో సత్యంరాజు పడుకొన్నాడు. తెల్లవారి చూచేటప్పటికి తల భాగములో పాతిపెట్టిన మిస్వక్ పుల్ల చిగురించి కనపడగా, ఆ దినమునుండి సత్యంరాజు అక్కడే పడుకొనుటకు మొదలు పెట్టాడు. ఇతనితో పాటు కొందరు సాధువులు ఊరిలో బిక్షాటన చేసుకొని వచ్చి, రాత్రిపూట ఆలయములో పడుకొనేవారు. అలా పడుకొను సాధువులు ఐదారు దినముల కంటే ఎక్కువ ఉండేవారు కాదు. సత్యంరాజు మాత్రము ఎక్కడకూ పోకుండ ఆ శివాలయములోనే నిలిచిపోయాడు.


నేను :- నీవు చెప్పుచున్న విషయమంతా బాగానేవుంది. కానీ చిన్న సంశయము కల్గుచున్నది అడగమంటావా?


---

ఆమె : – అడగండి స్వామీ! మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి. ఏమిటా సంశయము?


నేను :- సత్యం రాజు గుహలోనికి పోయినపుడు, అక్కడ ఒక్క సాయబ్ బాబాగారు మాత్రము ఉన్నారు. మీరు చెప్పినట్లు సత్యం మరియు బాబాగారు తప్ప ఎవరూ లేరు. అక్కడ వారిమధ్యలో జరిగిన విషయము ఏదైతే ఉందో దానిని ఇటు సత్యంగాని అటు బాబాగాని చెప్పితేనే బయటివారికి తెలియును. వారు ఎవరికీ చెప్పకుండ ఉంటే ఎవరికీ తెలియదు. అలాంటపుడు అక్కడ జరిగిన విషయమంతా పూసగ్రుచ్చినట్లు మీరు ఎలా చెప్పగల్గుచున్నారు?


ఆమె :- క్షమించండి, నేను ముందే చెప్పవలసిన విషయముంది కానీ చెప్పలేదు. నేను సత్యంరాజుకు స్వంత చెల్లెలవుతాను. నాపేరు అంబోజమ్మ. మా అన్న సత్యం ఇల్లు వదలిరాకముందే నేను చనిపోయాను. అయినా జన్మకు పోలేదు. నేను అప్పటినుండి ఉన్నాను, కానీ ఎవరికీ కనిపించను. మా అన్న ఇల్లువదలి వచ్చేటప్పుడు నేను కూడ అన్నవెంట వచ్చేశాను. నేను కనిపించక ఉండినా, అన్న సత్యంకు ఎటువంటి హాని కలుగకుండ చూచుకొనే దానిని. ఆ విధముగ సత్యం అన్నను వెంబడించి నేను కూడ గుహలోనికి పోయి, ఒక ప్రక్కనయుండి అన్నీ వినడమూ, అన్నిటినీ చూడడమూ జరిగినది. అందువలన మీకు పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్నాను.


నేను :- సరే! ఇప్పుడు సంశయము తీరిపోయినది. మరొక సంశయము పుట్టింది. దానిని అడుగుచున్నాను. మీరు చెప్పినది దాదాపు ఐదు (500) వందల సంవత్సరముల క్రిందటి విషయము. అప్పటినుండి మీరు సజీముగానే ఉన్నారా?


ఆమె :- అవును. నేను సూక్ష్మముగ అప్పుడున్నట్లే ఇప్పుడూ ఉన్నాను. అలాగే సత్యం కొంతకాలమునకు చనిపోయి, ఆయనకూడా నావలె సూక్ష్మముగా మారి సజీవముగానే ఉన్నాడు. ఇద్దరము కలసి దర్గాదగ్గరే ఉన్నాము. మాకు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా ఇంకా ఎంత కాలము ఉండాలో తెలియదు.


నేను :- అయితే మీరు ఇద్దరూ స్థూలశరీరమును వదలి సూక్ష్మశరీరముతో ఉన్నారన్నమాట.


ఆమె:- అవును అలాగే ఉన్నాము.


నేను :- సత్యం రాజుగారు, శివాలయములో నిలిచిపోయాడు కదా! అక్కడ ఎంత కాలమున్నాడు? తర్వాత జరిగిన విషయమును నీవే చెప్పాలి.


ఆమె : – సత్యంరాజు గురువుగారైన సాయబ్బాబాగారు చెప్పినట్లు పుల్ల చిగురించింది, కాబట్టి సత్యం శాశ్వతముగ అక్కడే ఉండాలి. అదే విధముగ మూడు నాలుగు నెలలు గడిచినవి. ప్రతిదినము ఉదయము, సాయంత్రము సత్యమును గమనించిన పూజారి, శాశ్వతముగ అక్కడే ఉండకూడదు, అప్పుడప్పుడు వచ్చి ఉండవచ్చునన్నాడు. ఆ పూజారిమాటను సత్యం వినలేదు. ఒక దినము పూజారి వచ్చి, నీ పేరు ఏమి అని అడిగాడు. అప్పుడు సత్యం నాపేరు సత్యంరాజు అని చెప్పకుండ, బాబాఫకురుద్దీన్ అన్నాడు. ఆ మాటవింటూనే పూజారికి మరింత కోపము వచ్చింది. ఈ గుడిలోనికి సాధువులు, సన్యాసులు రావచ్చు, పోవచ్చు కానీ నీవు ఒక ముస్లీమ్ ఫకీర్పు! లోనికి రాకూడదు అని పూజారి అనగా అందుకు బాబా ఫకురుద్దీన్ (సత్యమ్) ఇది మా గురువుగారు ఆజ్ఞప్రకారము ఇది నా స్వంత స్థానము. ఇక్కడినుండి నేను బయటికి పోను అన్నాడు. ఈ విధముగ పూజారి గుడి నాది నీవు బయటికి పో! అని అంటాడు, బాబయ్య ఈ స్థానము నాది నేను పోను అంటాడు. అట్లు కొంతకాలము జరిగినది. గుడికి వచ్చినవారు అనారోగ్యములను బాబయ్యకు


---

చెప్పితే, ఆయన తన గురువు ఇచ్చిన శక్తితో నయము చేసి పంపేవాడు. ఆ విధముగా గుడిలో బాబాగారికి కొంత పరపతి పెరిగినది.


ఈశ్వరాలయములోని పూజారికి, బాబా పకురుద్దీన్ (సత్యమ్రాజు) ప్రక్కలో బల్లెమువలె తయారైనాడు. ఒకనాడు పూజారికి, బాబాను మోసము తోనైన చంపాలని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత ఒకదినము విషమును కలిపి గారెలును తయారుచేసి, ఇతరుల చేత బాబాగారికి చేరునట్లు చేశాడు. రాత్రికి తిని, ఉదయానికి చనిపోవాలని ఉద్దేశముతో సాయం కాలము గారెలు బాబాగారికి ఇచ్చునట్లు చేశాడు. ఎవరు ఏమి ఇచ్చిన బాబాగారు తినేవాడే. అందువలన సులభముగ ఫథకము నెరవేరు తుందని పూజారి అనుకొన్నాడు. కానీ ఆ దినము బాబా పకురుద్దీన్ తాను తీసుకొన్న గారెలును ప్రక్కనపెట్టి పడుకొన్నాడు. ఆ దినము నడిరాత్రి సమయములో పూజారికి కడుపునొప్పి వచ్చింది. ఆ రాత్రంతా పూజారి విపరీతముగ బాధపడిపోయాడు. ఉదయాన్నే వచ్చిచూస్తే, బాబాగారికి ఏమీకాలేదు. పూజారికి ఆశ్చర్యమైంది. రోగగ్రస్తులకు బాబా మంత్రము చదివో, ఏదైనా మందు ఇచ్చో బాగు చేసేవాడు. కావున పూజారి కూడ బాబయ్య దగ్గరికి పోయి కడుపునొప్పి పోయేదానికి మందు ఇమ్మన్నాడు. అప్పుడు బాబా తనవద్ద ప్రక్కన పెట్టుకొన్న గారెలు ఇచ్చాడు. ఇవి తింటే కడుపునొప్పి పోతుందని చెప్పాడు. వాటిని చూస్తూనే పూజారికి విషము మతికి వచ్చింది. గారెలను చేతిలోనికి తీసుకొని, తినకుండ పెట్టుకోవడము చూచిన బాబా వాటిని తిను, నీవు ఏమి భయపడవద్దు వాటిలోని విషమే నీ కడుపునొప్పిని లేకుండ చేస్తుందని చెప్పాడు. పూజారికి ఏమి అర్థము కాలేదు. వీటిలో విషమున్నదని ఆయనకెలా తెలుసు? ఇప్పుడు ఇవి తింటే నేను చస్తాను, తినకపోయినా బాధకు తట్టుకోలేక చస్తాను. బాధను అనుభవించి చచ్చే దానికంటే వీటిని తిని తొందరగ చచ్చేది మేలనుకొని గారెలను తిన్నాడు. తిన్న వెంటనే బాబాగారు చెప్పినట్లు కడుపునొప్పి మాయమైపోయింది. అక్కడనుండి పూజారి తలవంచుకొని పోయాడు.


మరి కొంతకాలమునకు పూజారికి బాబామీద ద్వేషము పెరిగి పోయింది. ఈమారు నేరుగా కోటలోనికి పోయి, రాజుగారికి బాబా పకురుద్దీన్ విషయము చెప్పి, గుడినుండి రాజుగారి చేత తరిమేయించాలను కొన్నాడు. అలా అనుకొన్న తర్వాత ఒక దినము కోటలోని రాజుగారి వద్దకు పోయి ఒక ఫకీరు గుడిని ఆక్రమించుకొని, అపవిత్రము చేయు చున్నాడని చెప్పాడు. రాజుగారు భటులతో బాబా పకురుద్దీన్ను పిలువనంపాడు. ఇద్దరి వాదనలు విన్నాడు. దేవాలయము భక్తులది కానీ పూజారిది కాదు అని బాబా అంటాడు, ఆలయము పూజారిదే కానీ భక్తులది కాదు అని పూజారి అంటాడు. చివరికి రాజు ఎటూ తేల్చి చెప్పలేనివాడై ఇద్దరికి కలిపి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికే గుడి స్వంతమవుతుందని చెప్పాడు. ఆ పరీక్షకు ఇద్దరూ ఒప్పుకొన్నారు. ఆ పరీక్ష ఏమనగా! ఒక్కొక్క సున్నపు మూటలో ఒక్కొక్కరిని సున్నముతో సహ ఉంచి, మూటకట్టి, పెనుకొండ చెరువులో వేస్తే, ఎవరు ముందు మూటను విప్పుకొని బయటపడితే వారికే గుడి ఇవ్వడము జరుగుతుంది. రాజుగారు చెప్పిన ప్రకారము సున్నముతో సహా ఇద్దరిని మూటలుగా కట్టి నడి చెరువులో వేశారు. ఇదంత రాజుగారి సమక్షములోనే జరిగినది. మధ్యాహ్నము ఒంటిగంట సమయములో నీటిలో వేయగా, ఐదు నిమిషము లలో బాబాగారు ఒడ్డుకు చేరుకొన్నాడు. పూజారి సున్నములో ఉడికిపోయి చనిపోయాడు. బాబాగారు ఒడ్డుకు చేరిన వెంటనే చెరువు కట్టమీదనే నమాజ్ చేసి, రాజుగారివద్ద అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విధముగా శివాలయము బాబా పకురుద్దీన్ స్వంతమైనది. అప్పటినుండి శివభక్తులు వచ్చి, పూజచేసుకొని బాబా దగ్గర తమ కష్టాలను చెప్పుకొని పోవుచుండిరి. బాబా దగ్గర కష్టాలను చెప్పుకొంటే తీరిపోతాయని నమ్మేవారు. చాలామందికి అలా జరగడము వలన, అక్కడికి వచ్చేవారి సంఖ్య


---

పెరిగి పోయింది. ఆ విధముగ బాబాకు, ప్రజలకు సంబంధము పెరిగిపోయింది. కొంతకాలము గడువగా బాబాకు వృద్ధాప్యము వచ్చి చివరకు చనిపోవడము జరిగింది. చనిపోయిన తర్వాత సూక్ష్మశరీరముతో అక్కడే ఉండడము జరిగినది.



బాబాగారు చనిపోయిన తర్వాత అంతవరకు ఆయనతో పరిచయ మేర్పడిన ముస్లీమ్ భక్తులు, బాబా చనిపోకముందే తమతో చెప్పిన ప్రకారము ఆయన శరీరము గుడిలోపలే పూడ్చిపెట్టి దర్గాకట్టినారు. (నేటికీ దర్గా ఉంది శివాలయము ఉంది. ప్రస్తుత కాలములో పాతవారికి, ఆ ఊరి వారికి అది “శివాలయము” అని తెలుసుగానీ క్రొత్తవారికి బాబా పకురిద్దీన్ “దర్గా” అనియే తెలుసు. అక్కడ ప్రతి సంవత్సరము బాబాగారి ఉరుసు జరుగుతుంది. ఉరుసు ప్రత్యేకత ఏమిటంటే బాబాగారు మొదట పుల్ల నాటగా చిగురించిన మిస్వక్ చెట్టు (చక్కెరమాను) నుండి ఉరుసు దినమున చక్కెర రాలుతుందట. ఆ చక్కెరను బాబాగారికి చదివింపులు చేస్తారట. పూర్వము ఆ చెట్టునుండి ఆ దినము ఒక కేజీ చక్కెర రాలేదట. ప్రస్తుత కాలములో ఒక పిడికెడు మాత్రమే రాలుతుందని చెప్పుచున్నారు. (ఇది చెప్పితే వినడమే కానీ నేను చూడలేదు.)


నేను :– ఇదంతా బాబా పకురుద్దీన్ (సత్యంరాజు) చరిత్ర. కానీ సాయబ్ బాబా ఏమైనట్లు? ఒక్కమారైన ఆయన మీవద్దకు వచ్చాడా? లేక మీరు ఆయనవద్దకైనా పోయారా? ఆయన ఎక్కడున్నట్లు?


ఆమె :- పెనుకొండ కోటదగ్గర గుహలో మాట్లాడిన తర్వాత సాయబ్బాబా గారు వందలసంవత్సరముల కాలము, మహరాష్ట్రలోని షిరిడి దగ్గర భూమిలో ఏర్పరుచుకొన్న గుహలో ధ్యానములో ఉండిపోయాడు. తర్వాత బయటకు వచ్చి షిరిడిలోనే తిరుగుచుండెడి వాడు. అప్పడు కూడ ఆయన పేరు సాయబ్బాబానే! కానీ కాలక్రమేపి ఆయన పేరులో కొంత మార్పు వచ్చినది. చిన్నపిల్లలు నోరు తిరుగక సాయబ్ అనకుండ సాయబాబా అనెడివారు. అలా ఒక అక్షరము ఆయన పేరులో మాయమైపోయినది. సాయబాబాగా ఆయన జీవితకాలము అంతా గడిచిపోయింది. అక్కడ ఆయన చనిపోయినా సూక్ష్మముగానే మిగిలిపోయాడు. సూక్ష్మశరీరముతో తిరిగి పెనుకొండ ప్రాంతమునకే వచ్చి, ఇక్కడ మమ్ములను చూచి దీవించి ఇక్కడికి దగ్గరగానే ఉంటానని చెప్పి, సత్యనారాయణ రాజు అను బాలునిలో చేరి ఆ శరీరములోనే నేటికినీ పుట్టపర్తిలో ఉన్నాడు. ఇప్పుడు వంద సంవత్సరముల నుండి సాయిబాబాగా పిలువబడుచున్నాడు. మొదట పెనుకొండలో సాయబ్బాబాగా తర్వాత షిరిడిలో సాయబాబాగా, ప్రస్తుత కాలములో పుట్టపర్తిలో సాయిబాబాగా పిలువబడుచున్నాడు.


నేను :- సాయిబాబాగా ఎంతకాలము బ్రతుకుతాడో చెప్పగలవా?


ఆమె :-ఇప్పుడు నేను చెప్పేది ఏముంది? మూడు సంవత్సరముల క్రితము మీరే చెప్పారు. ఆయన ఆయుస్సు 90 నుండి 96 వరకు గలదని, బహుశ 92వ సంవత్సరము చనిపోవచ్చని ఒక సందర్భములో చెప్పారు. చంద్రునిలో నీళ్ళున్నాయి అని కూడ అప్పుడే చెప్పారు.


నేను :- నేను ఎప్పుడో చెప్పినది నీకెలా తెలుసు?


ఆమె : - మీరు ఇదే పెనుకొండ ప్రాంతములో మీ శిష్యులతో సహ జీపులో వచ్చి రాత్రిపూట రైల్వేగేట్ దగ్గరున్న ఆంజనేయస్వామి గుడివద్ద ఆగారు. అక్కడ మీ శిష్యులకు చెప్పుచుండగా నేను విన్నాను. నేనే కాదు మా అన్న బాబా పకురుద్దీన్ కూడ విన్నాడు.


---

నేను :- ఆ సమయములో మీరు అక్కడెందుకున్నారు. ఒక విధముగా ఈ ప్రశ్న నేను అడుగకూడదు. కావున దానికి జవాబు వద్దు కానీ ఇక్కడికి ఎందుకొచ్చావు? ఈ గర్భిణి మనిషిలోకే ఎందుకొచ్చావు?.


ఆమె :- నేను ముందే చెప్పాను కదా! ఈమె మా భక్తురాలని, అన్న ఆజ్ఞ ప్రకారము నేను అప్పుడప్పుడు వచ్చి ఏ దయ్యాలు ఈమె జోలికి రాకుండ చూసి పోతుంటాను. ప్రస్తుతము రెండు రోజులనుండి నేను పెనుకొండలోనే ఉంటిని, ఇక్కడికి రాలేదు. అదునుచూచి ఒక దయ్యము ఈమెలో దూరడము, మీరు పోయి బయటికి పంపిరావడము

జరిగినది.


బాబాగారు మక్కాకు పోయాడు కాబట్టి రెండు దినములనుండి ఇక్కడికి రాలేకపోయాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వచ్చి ఈమెను చూచివచ్చినట్లు నాకు తెలిసింది. ముందు ఒక మారు మిమ్ములను చూచాను కాబట్టి ఇప్పుడు చూడాలని, మీతో మాట్లాడాలని వచ్చాను. నా కోరిక నెరవేరింది.


నేను :- మీ అన్న సత్యంరాజు బాబాపకురుద్దీన్ అని పేరు మార్చుకొన్నపుడు, నీవు నీ పేరు మార్చుకోకుండ అంబోజమ్మ అని పాతపేరుతోనే ఉన్నావెందుకు.

ఆమె :- అన్న స్వయముగా పేరు మార్చుకోలేదు. అన్నకు సాయబ్బాబాగారు పేరు మార్చారు. నాకు ఎవరూ మార్చలేదు, అందువలన ఆ పేరుతోనే ఉన్నాను.

నేను :- పెనుకొండ దర్గాదగ్గర మీరు ఇద్దరే ఉన్నారా?

ఆమె :- దాదాపు రెండు వందలమంది ఉన్నారు. కానీ మా అంత వయస్సున్న వారు ఎవరూ లేరు.

నేను :- రెండువందల మంది కనిపించే వారా? కనిపించని వారా?

ఆమె :--కనిపించేవారు వచ్చి వారి కోర్కెలు చెప్పుకొని పోతూవుంటారు. కనిపించని వారే రెండు వందలమంది అక్కడే ఉంటారు. అన్నతో జ్ఞానమును చెప్పించుకొంటుంటారు.

నేను :- ఇప్పుడు మీ అన్న దర్గాదగ్గర లేడు కదా! ఇప్పుడు ఎవరు అక్కడ పెద్దగా ఉంటారు.

ఆమె :- ఎవరూ ఉండరు. నేనే వెళ్ళాలి. స్వామిగారు నాకు సెలవు ఇవ్వండి నేను పోయివస్తాను. (చివరిలో ఆమె నమస్కారము చేసి, గర్భిణి మనిషి శరీరము నుండి వెళ్ళి పోయింది.)


ఇదంతా ఒక సినిమా కథలాగ ఉంది కదా! అట్లని కథ అనుకునేరు. అంతయు వాస్తవమే! అంబోజమ్మ మాట్లాడము ద్వారా ఎన్నో క్రొత్త విషయములు, ఎవరికి తెలియని రహస్యములు తెలిసినవి. ఈ సంభాషణ జరిగి ఇప్పటికి ముఫ్పై సంవత్సరములైనది. మేము మాట్లాడినప్పటి నుండి ముఫై సంవత్సరములు గడిచినా, శిష్యుడైన బాబా పకురుద్దీన్, గురువు అయిన సాయబ్బ్బాగారు నేటికిని ఒకరు కనిపిస్తూ, ఒకరు కనిపించక యున్నారు. సాయబాబా కారణము వలననే పెనుకొండ ప్రాంతము చరిత్ర సంతరించుకొన్నది. విదేశాలకు సహితము బాబాగారి వలన పెనుకొండ పేరు తెలిసినది. సూక్ష్మశరీరములను గురించి చెప్పుచున్నాము కావున వీరు కూడ సూక్ష్మశరీముతోనే ఉన్నారని తెల్పుటకు ఈ సంఘటన చెప్పవలసి వచ్చినది. బాబాల భక్తులు ఎందరో దయ్యాలు లేవు అంటున్నారు. వారికి కూడ సూక్ష్మశరీరములంటే ఏమిటో, ఎలా ఉండగలుగుచున్నయో దీనిమూలముగ సులభముగా తెలియగలదు.


---

అంతేకాక ఒక మనిషి 70,80,90,100 సంవత్సరములే కాక సూక్ష్మశరీరముతో వందల సంవత్సరములు బ్రతుకుచున్నాడని ఇందుమూలముగా తెలియుచున్నది. మరియు కనిపించని జీవితమును కూడ మంచి మార్గములో నడుపుకొను వారు భూమి మీద ఎందరో ఉన్నారని కూడా ఇందు మూలముగా తెలియుచున్నది. ఇంకొక ముఖ్యమైన విషయము. కొందరు క్రొత్త జన్మకు పోకుండానే శరీరములను మార్చి బ్రతుకగలుగుచున్నారని కూడ దీని మూలముగా తెలియుచున్నది.


ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని ఒకరు అంటే, కొందరే మహానుభావులు వారికి వందనములు అన్నాడట మరొకరు. ఇక్కడ రెండు వాక్యములు, ఇద్దరు వ్యక్తులు గలరు. ఇందులో ఏది సరియైన మాట అని యోచిస్తే వాస్తవానికి రెండవ మాటయే సరియైనదని చెప్పవచ్చును. ఎందుకనగా మహానుభావులు ఎందరో ఉండరు, కొందరే ఉంటారు. గొప్ప భావమున్న వారిని మహానుభావులు అంటాము. అలాగే గొప్ప ఆత్మవున్న వారిని మహాత్ములు అని అంటాము. మహానుభావులు వేరు, మహాత్ములు వేరు. మహానుభావులలో గొప్ప భావములుండినా వారిలో జ్ఞానశక్తితో కూడుకొన్న ఆత్మ ఉండదు. మహాత్ములలో జ్ఞానశక్తితో కూడుకొన్న ఆత్మ ఉండును. అన్ని విధముల మహానుభావులకంటే మహాత్ములే గొప్పవారని చెప్పవచ్చును. ప్రస్థుత కాలములో మహానుభావులే కొందరున్నారని చెప్పినపుడు, వారికంటే గొప్పవారైన మహాత్ములు మరీ తక్కువగా ఉందురు. భూమిమీద తక్కువగానున్న మహాత్ములు స్థూలముగానైన ఉండవచ్చును, సూక్ష్మముగానైన ఉండవచ్చును. ఇపుడు సూక్ష్మముగానున్న ఒక మహాత్ముని కథనము

విందాము.


చిత్తూరు జిల్లా రామాపురము ప్రక్కన, పాపసముద్రము దాని ప్రక్కనే గుడిపాల అను ఒక చిన్న గ్రామముకలదు. గుడిపాల గ్రామమునకు నేను ఒక మారు 1981 వ సంవత్సరము పోవడము జరిగినది. గుడిపాల గ్రామములో గురుమూర్తి అను పేరుగల వ్యక్తి గలడు. అతను, అతని భార్య ఇద్దరే ఇంటిలో ఉంటున్నారు. అతనికి పిల్లలు లేరు, వారి వయస్సు యాభై సంవత్సరములు ఉండవచ్చును. నేను ఆ ఊరిలో గురుమూర్తి ఇంటికే పోయాను. ఆ దినము సాయంకాలము ఐదుగంటల సమయములో ఇంటి బయట మైదానములో కుర్చీమీద కూర్చోని ఉండగా, అక్కడికి వచ్చినవారు పాదనమస్కారము చేసుకొనుచున్నారు. నాకు మ్రొక్కించుకొనే దానికి ఇష్టముండదు. పల్లెటూరి ప్రజలు చెప్పినా వినరు. నేను మౌనముగా కూర్చున్నాను. అలా అందరు ఒక్కొక్కరుగా పాదములకు నమస్కారము చేయుచున్నప్పుడు, మధ్యలో గురుమూర్తి భార్యకూడ వచ్చి నమస్కారము చేసి పోయి ప్రక్కన నిలబడివున్నది. ఆమె నమస్కారము చేయునపుడే పాదముల స్పర్శలోనే కొంత నాకు తేడా కనిపించింది. తర్వాత ఆమె ప్రక్కన నిలుచుకొని అప్పుడప్పుడు నావైపే చూస్తూ, కళ్ళలో నీరు కార్చుచుండడము గమనించాను. తర్వాత రాత్రి ఎనిమిది గంటలపుడు తీరిక ఉండడము వలన గురుమూర్తి వద్ద అతని భార్య ప్రస్తావనను తీసుకువచ్చి ఈమె శరీరములో ఇంకా ఎవరో ఉన్నారు, నేను సాయంకాలము గమనించాను అన్నాను. దానికి గురుమూర్తి అలాంటిదేమి లేదు, అట్లున్నట్లు ఎప్పుడూ ఏమీ కనిపించలేదు అన్నాడు. దానిని విన్న నేను, “లేదు ఆమె శరీరములో ఎవరో గొప్పవ్యక్తి ఉన్నట్లు మరియు నన్ను చూచి ఆ వ్యక్తి కొంత సంతోషమును పొందినట్లు నాకు అనిపించింది. ఆ విషయమును గురించి ఆందోళన చెందవలసిన పని లేదు. లోపలున్న ఆ వ్యక్తి ద్వార మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటాను" అన్నాను. ఆ మాటను విన్న గురుమూర్తి కొంత ఆలోచించి ఏదో జ్ఞప్తికిరాగా ఇలా చెప్పసాగాడు.


నాకు పెళ్ళి అయిన క్రొత్తలో నా భార్యకు దయ్యమున్నదని ఒక మాంత్రికుడు చెప్పాడు. అప్పుడు దానిని విడిపించమని అతనినే అడిగాను. అతను ప్రయత్నము చేసి చూచాడు. ఆ దయ్యము బయటకు కూడ వచ్చి మాట్లాడలేదు.


--


చివరకు అతను తనకొక పెద్ద మాంత్రికుడు తెలుసునని అతని చేత చూపించితే సరిపోతుందని తెలిపాడు. ఎలాగైనా ఉన్న దయ్యమును వదిలించుకోవాలని పట్టుదలగానున్న నేను, ఆ పెద్ద మాంత్రికుని వద్దకు పోయి విషయమును చెప్పి పిలిచాను. అతను వస్తానని వచ్చాడు. వచ్చిన అతను ఏదో పూజ పెట్టించి ఆ పూజలో నా భార్యను కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూవుంటే అప్పుడు నా భార్య శరీరము మీదికి దయ్యము వచ్చింది. వచ్చిన వెంటనే నీ మంత్రాలు ఆపు అని గద్దించి చెప్పింది. మాంత్రికుడు మంత్రాలు ఆపివేశాడు. అప్పుడు ఆ దయ్యము నావైపు చూచి ఎందుకు వీరినందరిని పిలిచి డబ్బులు పోగొట్టుకుంటున్నావు. వీరు ఎవరు ఏమి చేసినా నేను పోను. వీరు ఎవరూ నన్ను పంపలేరు. ఇప్పటినుంచైనా ఇటువంటి ప్రయత్నములు మానుకో! నేను ఉన్నదానివలన నీకు ఏమి నష్టముగానీ, కష్టముగానీ లేదు కదా! ఇటువంటి పని మానుకో, అని నాకు చెప్పి లోపలికి అణిగిపోయింది.


ఆ దయ్యము అలా బుద్ధి చెప్పడము నాకు చాలా అవమానమైనట్లు అనిపించింది. వచ్చిన మాంత్రికుడు కూడ తన చేతకాదు అని చెప్పాడు. ఇది పొయ్యే మార్గమే లేదా? దీనిని పంపించే వారే లేరా అని మాంత్రికులని అడిగినాను. అప్పుడు ఇద్దరు మాంత్రికులు కలిసి మాట్లాడుకొని, నన్ను కూడ పిలుచుకొని పోస్టాఫీసు దగ్గరకు పోయి, అక్కడినుండి ఎవరికో ఫోన్ చేసి నాముందరే మాట్లాడినారు. తర్వాత వారు మాట్లాడిన విషయము నాకు చెప్పారు. మాకు తెలిసిన ఒక దేవతా ఉపాసకుడు ఉన్నాడు. ఆయన దేవతలను పిలిచి, వారి చేత ఎంత పెద్ద దయ్యమునైనా వదిలించగలడు. ఆయన ఫీజు ఐదువేల రూపాయలు తీసుకొంటాడు. దయ్యము పోతేనే ఫీజు ఇస్తాము పోకపోతే ఇవ్వము అని చెప్పాము. సరే! అలాగేనని ఆయన ఒప్పుకొన్నాడు. ఐదువేలు ఇవ్వాలంటే నీకు కష్టమే! అందువలన మాకు ఇద్దరికి ఇవ్వవలసిన డబ్బుకూడ మాకు వద్దు అది కూడ ఆయనకే ఇచ్చుకో! నీవు చెప్పితే ఆయనను అడిగి చూస్తాము అని నాతో చెప్పగా, సరే ఎలాగైనా రమ్మని చెప్పండి అన్నాను. తర్వాత వారు ఫోన్ చేసి మాట్లాడి, పది రోజుల తర్వాత వస్తాడని నాతో చెప్పారు. ఈమారు దయ్యాన్ని, దేవతలే తరిమి వేస్తారని ధైర్యముగా ఉంటిని. పదిరోజులకు ముందు వచ్చిన మాంత్రికులు ఇద్దరు పోయి ఆయనను పిలుచుకొనివచ్చారు. వచ్చిన వ్యక్తి దాదాపు అరవై సంవత్సరముల వయస్సువాడు, మంచి అనుభవము కలవాడని అతనిని చూస్తానే అర్థమైనది. ఆయన కూడ పూజా ద్రవ్యములన్నిటినీ పెట్టి, పూజ ప్రారంభించే ముందు నా భార్యను పిలిచి పూజ ముందర మాంత్రికునికి ఎదురుగా కూర్చోబెట్టి, పూజ మొదలుపెట్టాడు. ఇద్దరు మాంత్రికులు కూడ ఆయనకు సహాయముగా అతని ప్రక్కనే కూర్చున్నారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఒక్కొక్క దేవతకు, ఒక్కొక్క మంత్రమును చదువుచు ముగ్గురు దేవతలను అక్కడికి రమ్మని చెప్పసాగాడు.


అంతవరకు మౌనముగా కూర్చొని చూస్తున్న నాభార్య ఒక్కసారిగ లేచి, ప్రక్కనే ఉన్న ముగ్గుపొడి డబ్బాతీసుకొని వాకిలి దగ్గరకు పోయి గడప మాను ముందర బయట ముగ్గుతో మూడు గీతలు వాకిలికి అడ్డముగా వేసింది. ముగ్గుపొడితో గీతలు వేసిన తర్వాత వచ్చి ముందు కూర్చున్న స్థానములోనే మాంత్రికులకు ఎదురుగా కూర్చున్నది. నాభార్య ఆ విధముగా లేచి పోయినపుడు మాంత్రికులూ నేను చూస్తువుండిపోయాము. మేము ఎందుకు పోతావుంది అని తేరుకొనే లోపల, మూడు గీతలేసి వచ్చి కూర్చున్నది. కూర్చున్నది కదా అని ఆయన తిరిగి మంత్రాలు మొదలు పెట్టి దేవతలను తొందరగా రమ్మని చెప్పసాగాడు. అంతలో నాభార్య పెద్దగా నవ్వుచు, “ఒరేయ్ మూర్ఖుడా! నీవు ఏ దేవతను ఎంతగా పిలిచినా వాళ్ళువచ్చేది ఆ వాకిలివరకే, నేను గీచిన గీతదాటి నీవు పిలిచే ఏ దేవతలు రాలేరు. నామాట అర్థముకాకపోతే పిలిచి చూడు నీకే తెలుస్తుంది” అని చెప్పింది. ఆ మాంత్రికుడు కూడ కొంతవరకు ప్రయత్నము చేసి, ఇంతవరకు నాకు ఈ విధముగా ఎక్కడా జరుగలేదని, తన ప్రయత్నమును విరమించుకొన్నాడు. అయినా మేము పట్టువదలలేదు.


---

చివరకు కేరళలో చాలా పెద్ద మాంత్రికుడున్నాడని, అతను అడుగు పెట్టితే చాలు దయ్యములే కాదు, దేవతలు కూడ పారిపోతాయని తెలిసింది. తెలిసిన వెంటనే కేరళకు పోయి జరిగిన విషయమంతా చెప్పాము. మా మాటలు విన్న మళయాల మాంత్రికుడు, మీరు చెప్పే విషయము చాలా ఆసక్తిగా ఉందే! అయితే దానిని నేను చూడాలసిందే! అన్నాడు. ఆయన వచ్చి చూస్తానని చెప్పడము మాకు సంతోషమైనది.


మేము అక్కడ ఆయనకు డబ్బులిచ్చి వచ్చాము. ఆయన మూడు నెలలకు వస్తానని చెప్పి అలాగే వచ్చాడు. కేరళనుండి మొత్తము పండ్రెండు మంది శిష్యులతో ఆ మళయాల మాంత్రికుడు వచ్చాడు. ఆయన చేత తప్పక పని జరుగుతుందని నాకు పూర్తి నమ్మకము. ఆయన నా భార్యను చూచి ప్రక్కన కూర్చో! నేను పిలిచినప్పుడు రమ్మని చెప్పాడు. ఆయన పూజలకే గంటకాలము పట్టింది. తర్వాత నా భార్యను వచ్చి, వారు గీచిన గుర్తులో కూర్చోమన్నారు. తర్వాత మళయాళ భాషలో మంత్రములు మొదలు పెట్టి, కొంత మంత్రించిన విభూతిని నా భార్యమీద చల్లినాడు. అంతవరకు ఊరక కూర్చున్న నా భార్య శరీరము మీదికి వచ్చిన దయ్యమునకు కోపము వచ్చింది. అప్పుడు ఆ మాంత్రికున్ని హెచ్చరించినట్లు, ఇంకొకమారు నీ విభూతిని నామీద చల్లితే నేను నిన్ను ఏమిచేస్తానో చెప్పలేను జాగ్రత్త అన్నది. అప్పుడు ఆ మాంత్రికుడు చిన్నగ నవ్వి, నేను ఎవరో నీకు తెలియదు. నీవు నన్ను బ్రతిమలాడినా నిన్ను వదలను. నిన్ను బంధించి భూసమాధి చేస్తాను. ఎందరో మాంత్రికులను లెక్క చేయకుండ అవమానపరిచావు. చివరకు నీ కర్మకొద్దీ నాచేతిలో పడినావు. ఇక నీగతి చూచుకో! నేను ఒక్కొక్క మంత్రము చెప్పేకొద్దీ, నీ శరీరములో మంటలు రేగును, నా మంత్రములతో నీ శరీరమంత సూదులు గ్రుచ్చినట్లగును, అని చెప్పి మంత్రములు చదివి కొంత విభూతిని తిరిగి ఆమె మీద చల్లాడు. అప్పుడు ఆమె గట్టిగా తల విదిలించుకొని నేను ముందే చెప్పాను. మరొకమారు నా మీద విభూతి చల్లవద్దని. అయినా నీవు నామాటను లెక్కచేయకుండా నన్నే బంధిస్తానని భూమిలో పాతి పెట్టుతానన్నావు. నీ కర్మకొద్దీ నాకు దొరికావు అన్నావు. అదే మాట నేను అంటున్నాను, ఇప్పుడు నీవు నీకర్మకొద్ది నాకు దొరికావు. ఇదే నీకు నేను పెట్టుచున్న శాపము “నీకు మంత్రములు పలుకు గొంతే లేకుండ పోవుగాక" అన్నది. ఆ మాట అంటూనే, అంతవరకు మంత్రములు చెప్పుచున్న ఆయన గొంతులో శబ్దమురాలేదు. ఆయన శిష్యులు వెంటనే మంత్రించి ఆయన మీద నీళ్ళు చల్లడము, విభూతి చల్లడము చేసారు అయినా ఫలితము లేదు. ఆయన మాట పడిపోయింది. ఆ మాంత్రికుడు అవమానముపాలై ఏడ్వను మొదలుపెట్టాడు. ఆయన శిష్యులు ఆయనను బాగుచేయించుకొనుటకు కేరళకే తీసుకెళ్ళి పోయారు. ఆ సన్నివేశము చూచిన మాకు భయము చుట్టుకొన్నది.


ఒక్కమాటతో అంత పెద్ద మాంత్రికుని గొంతు పనిచేయకుండ పోయిందంటే, ఆ దయ్యము అనుకుంటే మేమెంత అనుకొన్నాము. అప్పటి నుండి మేము ఏ ప్రయత్నము చేయలేదు. ఆ దయ్యము జాడలు కూడ కనిపించకుండ పోయాయి. ముప్పయి (30) సంవత్సరములుగా దయ్యము కనిపించలేదు. ఇదంతయు నాకు పెళ్ళైయిన క్రొత్తలో జరిగింది అప్పటి నుండి ఏ పీడ లేకుండ హాయిగా ఉన్నాము. మళ్ళీ ఇదేదో క్రొత్తది, దీనిని గురించి మాకు ఏమీ తెలియదు అని గురుమూర్తి నాతో అన్నాడు! నేను గతములో వారికి జరిగిన కథనంత గురుమూర్తి చెప్పగా విన్నాము కదా! అప్పుడు పూర్తి విషయమంతా అర్థమైపోయినది. నాకు అర్థమైన విషయమంతటిని గురుమూర్తికి వివరముగా చెప్పాను. అదేమనగా! మొదట, సాయంకాలము గురుమూర్తి భార్య నావద్దకు వచ్చి పాదములు పట్టుకొన్నపుడే స్పర్శ కొంత తేడాగా కనిపించింది. తర్వాత ఆమె ప్రక్కన నిలుచుకొని నావైపు చూచి కళ్ళనుండి నీరు కార్చినది చూచాను. నావద్ద కల్గిన ఈ రెండుకార్యముల ఆధారముగా మరియు మాంత్రికుల వద్ద జరిగిన కార్యముల ఆధారముగా


---

వివరించుకొని చూస్తే, గురుమూర్తి భార్య శరీరములో ఉన్న వ్యక్తి గొప్ప మహాత్ముడని తెలియుచున్నది. జ్ఞానశక్తి కల్గినవాడు మహాత్ముడని ముందే చెప్పుకొన్నాము. జ్ఞానశక్తి ముందర ఏ విధమైన మంత్రములు, ఎంతో ప్రభావమున్న మంత్రములు పనిచేయవు. వచ్చిన మాంత్రికులు గొప్ప మంత్రశక్తిగలవారైనా, అంతపెద్ద మంత్రశక్తులు కూడ ఆ మహాత్ముని ముందు ఏ మాత్రము పనిచేయలేదు.


జ్ఞానశక్తిగల మహాత్ములు గీత గీచితే, ఆ గీతను ఎంతటి రోగము లైనా, ఎంతటి దేవతాశక్తులైనా దాటవని మా బోధలలో అనేకమార్లు నేనే చెప్పాను. ఆ విధముగనే గురుమూర్తి భార్య శరీరములోనున్న మహాత్ముడు, ముగ్గు పిండితో గీతవేస్తే ఆ గీతను మాంత్రికుడు పిలువగా వచ్చిన దేవతలు దాటి లోపలికి రాలేకపోయారు. అంతేకాక ఇటు గురుమూర్తిని ఆ మహాత్ముడు నన్ను మీరు ఏమీ చేయలేరు, నా వలన మీకు ఏ నష్టము ఉండదని చెప్పడము జరిగినది. అటు మాంత్రికులకు, నన్ను రెచ్చగొట్టితే మీకే ఇబ్బందని కూడ చెప్పడము జరిగినది. అయినా ఇటు గురుమూర్తి ఆయన మాట వినకపోవడము వలన డబ్బు నష్టము, శ్రమ రెండు కలిగినవి. చివరికి మాంత్రికుడు భూమిలో పాతిపెట్టుతానని పరాక్రమము చేసి చివరికి గొంతులో మాటనే లేకుండ పొగొట్టుకొన్నాడు. నేను నిన్ను శపిస్తున్నానని మహాత్ములే అంటారు. వారు దృఢసంకల్పముతో పలికిన మాట ఏదైనా శాపమగును. ఈ సూత్రము ప్రకారము ఆ శరీరములో ఎంతో జ్ఞానశక్తిగల మహాత్ముడున్నాడని తెలియుచున్నది. మంత్రశక్తి జ్ఞానశక్తికి ఏ విషయములోను సాటిరాదు. అంతేకాక మంత్రశక్తిగలవారు, జ్ఞానశక్తిగల వారిని గుర్తించలేరు. జ్ఞానశక్తియున్నవారు జ్ఞానశక్తియున్నవారిని గుర్తించగలరు. జ్ఞానశక్తియున్న వారిని, జ్ఞానశక్తియున్నవారు చూస్తే వారికి తెలియకుండానే సంతోషము కలుగును. ఆ ప్రకారమే నన్ను చూచినపుడు గురుమూర్తి భార్య శరీరములోని వ్యక్తికి, కళ్ళలో ఆనంద బాష్పములు రాలడము జరిగినది.


భూమిమీద కొందరి శరీరములు మాత్రమే సూక్ష్మశరీరములు నివాసము చేయుటకు యోగ్యముగా ఉండును. జాతకములో (జాఫతకములో) బుధగ్రహము వ్యతిరేఖమైయుండి, ఆ బుధగ్రహము జాతకలగ్నమునకు ఆరవస్థానములో ఉంటే, అటువంటి వాని శరీరములో తప్పక వేరొక సూక్ష్మశరీరము (దయ్యము) నివాసముండునని చెప్పవచ్చును. బుధగ్రహము అనుకూలము లేనివారి జీవితములలో, దయ్యాల సంబంధము ఉండును. కాబట్టి గురుమూర్తి భార్యకు జాతకచక్రములో బుధగ్రహము వ్యతిరేఖత ఉండుట వలన, ఆమె శరీరము ఆ మహాత్మునికి నివాసయోగ్య మైనది. కావున ఆమెలో చేరియుండడమైనది. మరొక విషయమేమనగా! జాతకచక్రములో ఐదవస్థానము స్త్రీలకు సంతాన స్థానమగును. ఐదవ స్థానము శత్రుగ్రహముల చేత చూడబడినా లేక శత్రుగ్రహము ఆ స్థానములో ఉండినా, ఆ స్త్రీకి సంతానము కలుగదు, ఆమె గొడ్రాలుగా ఉండును. ఇవి జ్యోతిష్యశాస్త్రములోని సూత్రములు. ఇటువంటి సూత్రము ప్రకారము కూడా ఆమెకు సంతానము కలుగుటకు వీలులేదు. అందువలన అన్ని విధముల, ఆ మహాత్ముడు ఉండుటకు అనుకూలమైన దానివలన ఆమె శరీరములో ఉండడము జరిగినది. జ్ఞానశక్తిగల మహాత్ములు పిల్లలుకనే శరీరములో ఉండరు. ఇన్ని విధముల ఆమె శరీరము ఆ మహాత్మునికి అనుకూలమైనది. కాబట్టే అందరు మంత్ర గాళ్ళు విడిపించాలని చూచినా శరీరమును విడిచిపోలేదు. పైగా మీరు ఏమిచేయలేరు, ఊరకనే ఉండండి, నన్ను రెచ్చకొట్టకండి నాకు కోపము వస్తుంది అని చెప్పినా వినకపోవడము వలన మాంత్రికుడు మహాత్మునిచేత శాపము పొందవలసి వచ్చినది. శాపము వలన నోటి మాట పోయినపుడు వారు ఆమె శరీరములోని వ్యక్తినే ప్రాధేయపడి


---

ఉండివుంటే అప్పుడే మాటవచ్చేదేమో! అలాకాకుండ ఆమె శరీరములోని మహాత్ముని సాధారణ దయ్యముగా లెక్కించిన మాంత్రికులు, మాట వచ్చేదానికి మంత్రాలు వైద్యముల మీద ఆధారపడినారు.


ఇలా పాపసముద్రము దగ్గర గుడిపాలలో గురుమూర్తి ఇంటిలో జరిగిన విషయములన్నిటిని బట్టి చూస్తే, భూమిమీద అరుదుగానున్న మహాత్ములు కూడా సూక్ష్మశరీరములలో ఉన్నారని తెలియుచున్నది. ఈ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు అరవై (60) సంవత్సరముల కాలము గడచిపోయినది. ఇలా ఎన్నో ముఖ్యమైన సంఘటనలు కాలగర్భములో కలిసిపోయాయి. ఎక్కడైనా ఒక విషయము మనిషి ఎదురుగా జరిగినా దానిని గుర్తించడము కానీ, అర్థము చేసుకోవడముకానీ మనిషికి చేతకాలేదు. ఎవరైనా ఒక్కడు ఇది దయ్యము లేక సూక్ష్మశరీరము పనేనని చెప్పితే వానిని రాతియుగము కాలమునాటి మనిషివని, ఇప్పుడు సైన్సు అభివృద్ధియైన ఈ కాలములో రాతియుగకాలమునాటి మాట మాట్లాడుచున్నారని హేళనగా, తెలివి తక్కువవానిగా లెక్కించి మాట్లాడువారు వాని ప్రక్కనే పదిమంది ఉందురు. ఇది దయ్యము పనేనని చెప్పు ఆ ఒక్కనికి కూడ దయ్యములను గూర్చి పూర్తి అవగాహనా జ్ఞానము లేనిదానివలన విజ్ఞానులమను పదిమంది చెప్పుమాటలను ఖండించి వివరము చెప్పలేడు. అందువలన దేశములో విజ్ఞానమను పేరుతో అజ్ఞానమును తలకెక్కించుకొని కనిపించు దానినే పరిశోధిస్తూ, కనిపించని దానిని మరచిపోతున్నారు. మరచిపోవడమే కాక ఎవరైనా గుర్తుచేస్తే కూడ దానిని కూడ పరిశోధన దృష్టితో చూడకుండ గ్రుడ్డిగ అది లేనే లేదు, ఇది జరుగనే జరుగదు అంతా అబద్దము, శాస్త్రబద్దము కాదు అంటున్నారు. దయ్యమనునది కూడ శాస్త్రీయ విషయమేనని వారికి తెలియకుండ పోయినది. తాము చదువుకొన్నదే శాస్త్రము, తమకు తెలిసినదే విజ్ఞానము అనువారు చాలామంది ఉన్నారు. తమకు తెలిసిన శాస్త్రములు నాలుగేనని, తమకు తెలియని శాస్త్రములు ఇంకా రెండు మిగిలియున్నాయని, ఆరు శాస్త్రములు తెలిసిననాడే ఒక మనిషి పూర్తి విజ్ఞాని అగునని, అంతవరకు ఏ మనిషి అయినా పూర్తి విజ్ఞాని కాలేడని, వాడు అసంపూర్ణ మేధస్సు కలవాడని చెప్పవచ్చును. చివరకు ఏ మనిషి అయినా వాని జీవితములో ఆరవశాస్త్రము అయిన బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలియనిదే వానికి ఏ శక్తి ఉండదు. అటువంటి వాడు మనిషి జీవితములో సంపాదించు కొను బాహ్య ప్రపంచ చదువుల డిగ్రీలు ఎన్ని పొందినా, తాను శక్తిని పొందు డిగ్రీలను ఒక్కదానిని కూడ పొందనట్లే. బాహ్యవిద్యలలో బి.ఎ., యం.ఎ., సి.ఎ అను డిగ్రీలు అనేకమున్నట్లు, బ్రహ్మవిద్యలో మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అను నాలుగు డిగ్రీలు కలవు. బాహ్య ప్రపంచములో ముప్పైసంవత్సరములు చదివి ఏదో ఒక డిగ్రీ తీసుకొన్న వానికి, ఆ డిగ్రీ గురించే తెలుసు. మిగత డిగ్రీల గురించి తెలియదు. ఉదాహరణకు యం.ఎ చదివినవానికి సి.ఎ డిగ్రీ చదువును గురించి తెలియదు. వాడు చదివిన యం.ఎ లో కూడ ఒక విభాగమును గురించే తెలుసు. మిగతా రెండవ విభాగము తెలియదు. ఆర్థిక విభాగమును చదివిన వానికి రాజకీయ విభాగము తెలియదు. ఈ విధముగ బయటి అన్ని డిగ్రీల గురించి తెలియక ఏదో ఒక డిగ్రీని తెలిసినవారికి, బ్రహ్మవిద్యా శాస్త్రమును గురించిగాని, శాస్త్రములోని డిగ్రీలు గురించిగాని తెలియదు. బ్రహ్మవిద్యాశాస్త్రములో చిన్న సబ్జక్టు దయ్యములు! బయటి డిగ్రీలు పొందిన వారు తమ సబ్జక్టు కాని దానిని గురించి ఎలా మాట్లాడగలరు? తెలియనపుడు అన్నీ అబద్దము అనేదే వారి వంతగును. అదే ఇప్పటి హేతువాదులమనుకొను నాస్తికవాదులు చేయుచున్న పసలేనివాదన.


పునర్జన్మ జ్ఞాపకము వచ్చి చెప్పితే, అది ఒక రోగమంటారు. దయ్యము పట్టి ఇతర భాష మాట్లాడితే ఇది బూటకము, ఆ భాష వానికి ముందే వచ్చునంటారు. దయ్యము పట్టి మాట్లాడక మౌనముగ ఉన్నవానికి హిస్టీరియా రోగమంటారు. ఈ విధముగ తమకు తెలియకున్నా, తెలిసినవారమను భావముతో, ఏదో ఒకటి ఆపాదిస్తు అన్నీ


---

అబద్దము అంటున్నారు. ఏ ఒక్కదానిని పరిశీలించి, పరిశోధనరీత్య తేల్చి చెప్పడము లేదు. తమకు తెలియని విషయము హేతువాద దృష్ఠిలో పరిశీలించక ముందే, అదికాదు అను నిర్ణయముతో మాట్లాడువారు హేతువాదులు కారు. సత్యమును సత్యమనీ, అసత్యమును అసత్యమని తేల్చి చెప్పునది నిజమైన హేతువాదము. అట్లుకాక శాస్త్రబద్దత ప్రకారము తేల్చి చూడకముందే ఇదంతా భూటకము, నాటకము, మోసము, అబద్దము అనుట బద్దమా? హేతువాదమా? శాస్త్రబద్దమా? అట్లని, చూచిన దానిని, విన్నదానిని నమ్మమని మేము చెప్పలేదు. మేము చెప్పునది ప్రతి దానికి కారణమును వెదకకుండ, కారణమును చూపకుండ కాదనడము హేతుబద్దతి కాదు. నేను కూడ ఏ విషయమును గ్రుడ్డిగ నమ్మడము లేదు. ప్రజలందరు తెలియక నమ్మిన దానిని నేను పద్దతి చూపి ఖండిస్తూ, వారి నమ్మకమును మూఢనమ్మకము అంటున్నాను. అట్లు నేను పరిశీలించి అందరూ సత్యమనుకొన్నా, నేను మాత్రము అసత్యమని చెప్పడమేకాక, దానికి పద్ధతిగా వివరమును కూడ చెప్పుచున్నాను. అటువంటి ఒక సంఘటనను క్రింద చూసెదము.


అనంతపురము జిల్లాలో గుంతకల్లు ఉరవకొండ మార్గమున మధ్యలో రోడ్డుకు ప్రక్కనే 'తట్రుకల్లు' అనే గ్రామము గలదు. నాకు ఎనిమిది సంవత్సరముల వయస్సులో, నేను జాతరకు పోయి మొదట దేవతా పూనకమును చూచినది కూడా అదే ఊరు! ఆ తట్రుకల్లులో సుంకులమ్మ అను గ్రామదేవత పేరు చాలామందికి తెలుసు. ఎందుకనగా వారములో ఒక దినము, సుంకులమ్మ ఒక వ్యక్తిమీదికి పూనకము వచ్చి మాట్లాడు చుండును. అప్పుడు ప్రజలు అక్కడకు పోయి వారివారి సమస్యలు ఆ దేవతకు చెప్పుకొనుచుందురు. ఆ దేవత వారికి పరిష్కారమార్గములు చెప్పుచుండును. అందువలన 'తట్రకల్లు సుంకులమ్మ' అను పేరు దూర ప్రాంతములవారికి కూడ తెలుసు. ప్రజలు ఒక మారుమూల గ్రామములో ఉండే సుంకులమ్మ దగ్గరికి అంతగా పోవడానికి కారణమేమి అని చూస్తే, అక్కడికి పోయిన ప్రతివారికి, సుంకులమ్మ చెప్పునది ఏదైనా నిజమేనను నమ్మకము మొదటనే కల్గుచున్నది. ఆ ఒక్క నమ్మకము ప్రజలను ఐదారు సంవత్సరములు విశేషంగా ఆమె చుట్టు త్రిప్పింది. ఆరోజు కూడ కొందరు హేతువాదులు సుంకులమ్మను అడ్డము పెట్టుకొని పూనకము వచ్చినట్లు డ్రామా ఆడి డబ్బు సంపాదించుకొంటున్నారని అన్నారు. వారు నాటకము ఆడుచుంటే ప్రజలు మరీ అంత గ్రుడ్డిగా ఏమీ పోరు. ఎంతో కొంత సత్యము కనిపించియుంటేనే అలా పోవుదురని అనుకుంటాను.


అందరూ మాట్లాడినట్లు మాట్లాడక, ఒక సమస్యలోని నిజానిజాలు తెలుసుకోవడమే నిజమైన హేతువాదమనే నేను, తట్రకల్లు సుంకులమ్మ విషయమును పరిశీలించి చూచాను. ఉదాహరణకు ఒక విషయమును తీసుకొని చూస్తాము. రామయ్య అనే వ్యక్తి తన కూతురు పెళ్ళి విషయమును అడగాలను ఉద్దేశముతో అక్కడికి పోయాడు. శుక్రవారము (గమనిక: పలానా వారమని గుర్తులేదు, దానిని శుక్రవారము అని వ్రాస్తున్నాము) పూజకు హాజరై కూర్చున్నాడు. రామయ్యలాగ వచ్చినవారు ఇంకా వందమంది దాకా అక్కడ రామయ్యతో పాటు కూర్చున్నారు. రామయ్య ‘మల్లేపల్లి’ అను ఊరునుండి వచ్చాడు. అలాగే వివిధ ప్రాంతములనుండి వివిధ పేర్లుగల వ్యక్తులు, వివిధ సమస్యలతో అక్కడికి వచ్చియున్నారు. కొంతసేపుకు ఒక ఆడ మనిషి వచ్చి పూజముందర కూర్చోని సుంకులమ్మకు పూజచేసింది. పూజ అయిపోయిన తర్వాత నిమిషానికే సుంకులమ్మ దేవత ఆమె శరీరములోనికి చేరి మాట్లాడడము మొదలు పెట్టింది. ఆడ మనిషి శరీరములోనికి వచ్చిన సుంకులమ్మ, మొదట అక్కడ ఎదురుగా కూర్చున్న వారందరిని చూచింది. తర్వాత ఒక వ్యక్తినే ఒక నిమిషము సేపు చూడడము జరుగుచున్నది. ఒకే వ్యక్తిని చూచిన తర్వాత ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలువడము జరుగుచున్నది. అలా పిలిచిన వ్యక్తి వచ్చి ముందర కూర్చోవాలి. ఆమె ముందర కూర్చున్న తరువాత, అతను ఏ


---

ఊరునుండి వచ్చినది, ఏ పనికోసము వచ్చినది అక్కడ కూర్చున్న వ్యక్తి చెప్పకముందే సుంకులమ్మే చెప్పుచున్నది. హేతువాదులు చెప్పినట్లు అక్కడ ఎవరు నాటకము ఆడలేదు. వాస్తవముగ సుంకులమ్మ దేవతను పూజించు తన భక్తురాలి శరీరములోనికి సుంకులమ్మ రావడము జరుగుచున్నది. సుంకులమ్మ శరీరము మీదికి వచ్చి చేరిన తర్వాత, ఆ దేవత ఏమి మాట్లాడినది ఆ భక్తురాలికి తెలియదు. అలాంటపుడు ఎవరూ నాటకమాడలేదు కదా! తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా, అది అంతయు సుంకులమ్మకు సంబంధమేకాని, ఆమె భక్తురాలికి గానీ, ఆ ఇంటివారికి గానీ ఏమి సంబంధముండదు.


సుంకులమ్మ శరీరము మీదికి చేరిన తర్వాత సుంకులమ్మను పూజించిన ఆ ఆడ మనిషి నిద్రలోనికి వెళ్ళిపోవును. బయట ఏమి జరిగినది శరీరము లోపల నిద్రలోనున్న ఆ భక్తురాలికి ఏమీ తెలియదు. సుంకులమ్మ తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తులలో ఒక్కొక్కరిని పిలుస్తున్నది. మాట్లాడి పంపుచున్నది. అలా జరుగుచుండగా సుంకులమ్మ రామయ్య ముఖము వైపు చూచి రామయ్యా! నాదగ్గరకి రమ్మని చెప్పింది. రామయ్య ఆశ్చర్యపడుచు పోయి అక్కడ కూర్చున్నాడు. రామయ్యకు ఆశ్చర్యమైన విషయమేమంటే తన పేరును అక్కడికి పోయినప్పటి నుండిగానీ, ఆ ఊరిలో ప్రవేశించినప్పటి నుండిగానీ, బస్సులో ప్రయాణించునపుడు గానీ ఎవరికీ చెప్పలేదు. అలాంటప్పుడు తన పేరు తాను చెప్పకున్నను చెప్పుచున్నదంటే ఈ దేవతకు అన్ని విషయములు తెలిసే ఉంటాయని అనుకున్నాడు. ముందర పోయి కూర్చున్న తర్వాత ఆమె రామయ్యవైపు చూచి రామయ్యా నీవు మల్లేపల్లి నుండి వచ్చావు కదా! అన్నది, అందుకు రామయ్య అవును అన్నట్లు తలూపాడు. సుంకులమ్మ అనిన ఆ మాటను రామయ్య విని నేను చెప్పకనే నా ఊరును కూడ చెప్పింది అనుకొన్నాడు. తర్వాత సుంకులమ్మ రామయ్యా నీకు ఒక్కతే కూతురు కలదు. ఆ అమ్మాయి పెళ్ళి విషయమును అడిగే దానికి వచ్చావు అన్నది. ఆ మాటతో రామయ్య ఆశ్చర్యచకితుడై పోయాడు. ఈ దేవతకు సమస్తము తెలుసునని నూటికి నూరుపాళ్ళు ఆ దేవతను నమ్మినాడు.


రామయ్యది ఏ ఊరైనది అతని పేరు ఏమైనది, అతను వచ్చినది దేని కోసము అను విషయము వాస్తవముగ రామయ్య ఎవరికి చెప్పకుండినా సుంకులమ్మ నిజంగానే చెప్పింది. ఈ విషయమునే హేతువాదులు ఖండిస్తున్నారు. అలా చెప్పుటకు వీలుకాదు అంటున్నారు. వారు ఖండించినా, వీలుకాదనినా, వాస్తవముగా రామయ్య పేరు, ఊరు, వచ్చిన పనిని చెప్పింది. ఈ విషయము హేతువాదులు పరిశీలనగా పరిశోధించి చెప్పకుండా గ్రుడ్డిగా కాదంటున్నారు. అందువలన అటువంటి వారిది నిజమైన హేతువాదము కాదంటున్నాను. నిజము చెప్పాలంటే హేతువాదము శాస్త్రబద్దమైనపుడు హేతువాదము హేతుబద్దత వుతుంది. హేతుబద్దత ప్రకారము ఒక గ్రామదేవత ఒక వ్యక్తి యొక్క పేరును, ఊరును, పనిని ఎలా చెప్పింది? అలా చెప్పుటకు హేతువేమి కారణమేమి) అని యోచించి చూస్తే, ఆ ప్రశ్నను శోధించి చూస్తే, జవాబు దొరుకుటకు కొంత ఆధారమున్నది. దొరికిన ఆధారము ప్రకారము అతని పేరును, ఊరును పనిని తెలుసుకోవచ్చును. ఒకవేళ అలా చెప్పుటకు వీలుకాదనిపిస్తే, ఎలా వీలుకాదో దానికి కూడ ఆధారము చూపాలి. తెలియని విషయమును ఎలా చెప్పుచున్నారో హేతువాదికి తెలియకపోతే, ఖండించుటకు కూడా శాస్త్రబద్దత కావాలి. ఎదుటి మనిషిని మీ మాటలలో శాస్త్రబద్దత లేదు అవి అసత్యము అని హేతువాది అంటే, అవి ఎలా అసత్యమో చెప్పుటకు కూడ శాస్త్రబద్దత కావాలి.


ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుతాను చూడండి. ఈ మధ్య రెండు రోజుల క్రితము 'టివి9' చానల్లో "బ్రహ్మముగారి కాలజ్ఞానము నిజమా? అబద్దమా?” అని చర్చావేదికను నిర్వహించారు. అందులో ఇద్దరు సైన్సు చదివినవారు పాల్గొన్నారు.


---

కాలజ్ఞానము నిజము అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుచున్నపుడు. ఫోన్లో మాట్లాడు వ్యక్తి కాలజ్ఞానము నిజమండీ, బ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞాన వాక్యములలో ఇప్పటికి పదిహేను, ఇరవై శాతము ప్రత్యక్షముగా జరిగి ఉన్నాయి. కావున జరుగబోవు కాలములో మిగత వాక్యములు జరుగునని నమ్ముచున్నాము అన్నాడు. అప్పుడు ఆ వేదికలో పాల్గొన్న గోగినేని బాబు అనునతడు ఇలా “అతను పదిహేను ఇరవైశాతము జరిగాయి అంటున్నాడు. ఇవన్ని కాకిలెక్కలు, ఎన్ని జరిగినది కరెక్టుగా అతనికే తెలియదు. ఇన్ని జరిగాయి అనేదానికి శాస్త్రబద్దత లేదు”. అన్నాడు. పైగా అతను నేను హేతువాదిని అంటున్నాడు. అతను ఇతరులు మాట్లాడిన మాటలలో శాస్త్రబద్దత లేదు అన్నపుడు, ఎన్నో కొన్ని జరిగాయి కదా! అవి జరుగలేదు అనే దానికి అతని వద్ద శాస్త్రబద్దత ఉందా? ఏ శాస్త్రము ప్రకారము అని జరుగ లేదని చెప్పగలడు? బ్రహ్మముగారు చెప్పిన మాటలు భవిష్యత్తులో జరుగవు అని చెప్పుటకు శాస్త్రబద్దతవుందా? ఎర్రగుడ్డలు వాళ్ళు అని చెప్పే బదులు కమ్యూనిష్టులు అని పేరు చెప్పవచ్చును కదా! బ్రహ్మముగారు పేరు ఎందుకు చెప్పలేదు అని ఆయన (గోగినేని బాబు) అన్నాడు. బ్రహ్మముగారున్నది నాలుగువందల సంవత్సరముల క్రితము, అప్పుడు ఇంగ్లీషు భాషకు ప్రాచుర్యము లేదు. ఆ భాష బ్రహ్మము గారికి తెలియదు. అలాంటపుడు కమ్యునిష్టులు అని ఎలా ఇంగ్లీషు పదమును చెప్పగలడు? ఒకవేళ ఆ దినము కమ్యూనిష్టులు అని ఆయన వ్రాసివుంటే, ఆ దినము బ్రహ్మముగారికి ఇంగ్లీషు భాషరాదు. ఈ మాట ఆయన వ్రాసినది కాదు. మధ్యలో వేరేవాళ్ళు బ్రహ్మముగారి పేరుమీద వ్రాసి, కాలజ్ఞానమని ప్రచారము చేయుచున్నారని ఇదే బాబుగారు అని ఉండేవారు. నక్సలైట్లు మావోయిస్టులుగా పేరు మార్చుకున్నపుడు, జరుగబోవు కాలములో కమ్యూనిష్టులు, హ్యూమనిష్టులుగా పేరు మార్చుకోకూడదా! ఏ పేరు మార్చుకున్నా, వారికి ఎర్రగుడ్డలే గుర్తు కావున ఎర్రగుడ్డలు వాళ్ళు అనడములో బ్రహ్మముగారికి దూరదృష్టి ఉన్నట్లే కదా!


గోగినేని బాబుగారు అదే వేదికలో బ్రహ్మముగారు చెప్పిన మాటలకు శాస్త్రబద్దత లేదు, సైన్సు ఒప్పుకోదు అన్నారు. దానికి నేను ఏమనుచున్నానంటే బ్రహ్మముగారు కొంత జ్ఞానమును ఉపయోగించి ఒక తత్త్వమును పాట రూపములో చెప్పాడు. ఆ తత్త్వము నూటికి నూరు పాళ్ళు భౌతికశాస్త్రమునకు సంబంధించినది. భౌతికశాస్త్రములో ధాతు కణమును గురించి వివరముగా చెప్పగలిగిన మీరు, ఆయన చెప్పిన తత్త్వము భౌతికశాస్త్రమునకు సంబంధించినది కాదని చెప్పగలరా? మాకు తెలుసు, మీరు కాదనే చెప్పగలరు. ఎందుకనగా మీరు భౌతికశాస్త్రవేత్తలైనా, మీకు తెలియనిది ఎంతో ఉంది అనుటకు ఆ తత్త్వము ఒక తార్కాణము. సైన్సు చదివి మేము హేతువాదులమని చెప్పుకొను వారు ఎవరూ దానిని భౌతిక శాస్త్రమునకు సంబంధించినదని చెప్పలేరు. కానీ మేము ప్రతి పదమును, ప్రతి వాక్యమును భౌతికమునకు సంధానము చేసి చెప్పగలము. మేము చెప్పిన దానిని శాస్త్రీయముగా ఎవరు ఖండించటకు వీలులేదు. బ్రహ్మంగారు అంత పెద్ద భౌతికశాస్త్రవేత్తయినపుడు, ఆయన శరీర రహస్యమును శాస్త్రబద్ధముగ కక్కయ్యకు చెప్పినపుడు, ఆయన మాటలలో శాస్త్రీయత లేదు అంటే, మేము ఒప్పుకుంటామా! హేతువాదులమని, సైన్సు చదివామని, చెప్పుకొనువారు బ్రహ్మము గారి తత్త్వములోని శాస్త్రమును గుర్తించలేనివారు గ్రుడ్డివారు కాదా? భగవద్గీతలో ఐదువేలసంవత్సరముల పూర్వము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగమును గురించి చెప్పినది భౌతికశాస్త్రము కాదని ఎవరైనా చెప్పగలరా? భౌతిక శాస్త్రము తెలిసిన వారు ఎవరూ కాదనరు. ఇలా వ్రాస్తూపోతే నడిచే దారిని వదలి ప్రక్కకు పోయినట్లవుతుంది. ఇది కేవలము ఉదాహరణకు మాత్రము చెప్పుకొన్న విషయము. ఇపుడు అసలు విషయానికి వస్తాము.


ధర్మవరములో మా జ్ఞానము తెలిసిన ఒక ఇంటిలో, ఒక సమస్య వచ్చినది. ఆ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలుసుకొనుటకు ఆ ఇంటి వారు ఒక దేవత దగ్గరకు పోవాలనుకొన్నారు. యల్లపు శ్రీరాములు అను ఆ ఇంటి యజమాని



---

వద్దు అన్నాడు. ఇంటిలోని వారు పోవాలని పట్టుబట్టారు. అపుడు ఇంటి యజమాని ఆ దేవతకేమి తెలుసు, అది ఒక దయ్యము అని అన్నారు. అపుడు అలా అనవద్దని అతనికి నచ్చచెప్పి, బలవంతముగ అతనిని ఆ దేవత దగ్గరకు తీసుకొని వచ్చారు. అక్కడకు వచ్చిన ఇంటి యజమానిని, పూనకము వచ్చిన ఆ దేవత చూచి, ఏమిరా? మీ ఇంటిదగ్గర నన్ను నీవు తిట్టలేదా? చెప్పు? నన్ను దేవతకాదు దయ్యము అనలేదా చెప్పు అని అడిగిందట. ఆ దేవత అలా అడుగుతూనే, ఆ వ్యక్తి బిత్తరపోయి నేను ఇంటిదగ్గరన్న విషయము ఈమెకెలా తెలిసింది? అనుకొని నాది తప్పు, క్షమించమని ప్రాదేయపడ్డాడు. ఈ సంఘటనను చూచినా, తట్రకల్లు సుంకులమ్మ చెప్పినట్లే ధర్మవరము పెద్దమ్మ కూడ చెప్పినది. ఈ సంఘటనను యోచించి, అందులోని రహస్యమును అనగా మనకు తెలియని విధానము ఏముందో తెలుసుకోవడము శాస్త్ర పరిశోధకుని కర్తవ్యము. అలా కాకుండ తనకు తెలియనిదంతా లేదు, కాదు అనుకొంటే అది శాస్త్రశోధన కాదు. శాస్త్రశోధన లేని దానివలన కొందరు దేవతలు కొన్ని విషయములను ముందే చెప్పుచూ పూజ్యనీయమైపోయారు. కొందరు జ్యోతిష్యులున్నారు వారు జ్యోతిష్యము అడిగేదానికి వచ్చినవారిని ముందు మూడుపువ్వుల పేర్లు చెప్పమంటారు. అందులో ఏదో ఒక దానిని గుర్తు పెట్టుకొమ్మని చెప్పుతారు. తర్వాత మూడు అంకెలను చెప్పమంటాడు, వాటితో ఏదో లెక్కలు చేసి మనము గుర్తుపెట్టుకొన్న పువ్వు పేరునే చెప్పుతారు. అలా చెప్పడముతో మనకు అతని మీద ఒక నమ్మకము ఏర్పడుతుంది. మన మనస్సులో అనుకున్నది చెప్పాడు కదా! అట్లే మన జ్యోతిష్యమునంత కరెక్టుగా చెప్పునని నమ్మి, అతను ఎంత అడిగితే అంత ఇచ్చి భవిష్యత్తు చెప్పించుకొంటాము. తర్వాత అతను చెప్పింది సత్యమో కాదో అది దేవుడెరుగును. కానీ ప్రస్తుతానికి అతను సత్యమే చెప్పునని మూఢంగా నమ్ముచున్నాము.

ఈ దేవతల వద్ద కూడ ఇటువంటి తంతు ఏదో జరుగుచున్నదని జ్యోతిష్యుని విషయమును ఆధారము చేసుకొని చూస్తే అర్థమవుతుంది. జ్యోతిష్యునివద్ద ముందు మన మనసులోని మాట చెప్పాడు కదా! ఇక ఆయన చెప్పునవన్ని సత్యమే అగునని ఎట్లు ఒక నిర్ణయానికి వస్తున్నామో, అలాగే దేవత ముందు మన ఊరు పేరు, వచ్చిన పనిని చెప్పిన వెంటనే మన మనసులోని మాటను చెప్పింది. ఇక ఆమె చెప్పునవన్ని సత్యమేనని నిర్ణయానికి వస్తాము. జ్యోతిష్యుడు ముందే చెప్పినది మనమనుకొన్న పువ్వును, దేవత ముందే చెప్పినది మనము అనుకొన్న పనిని. ఎలా చూచినా రెండు ఒకే కోవకు చెందినవే! ఇందులో ఏదో మనకు తెలియని విధానముంది అని నేను బాగా యోచించి, జ్యోతిష్యునివద్ద చెప్పవలసిన మూడు అంకెలలో రెండు వేరువేరు అంకెలు చెప్పి, మూడవది ముందు చెప్పిన రెండు అంకెలలోనిదే మరొకటి చెప్పగా, ఆ జ్యోతిష్యుడు ఈ అంకెను ముందే చెప్పావు, చెప్పింది వద్దు మరియొక అంకెను చెప్పమన్నాడు. ఇక్కడ చెప్పిన అంకెను చెప్పినా లేక రెండు అంకెలు చెప్పినా మనము నిర్ణయించుకొన్న పువ్వును అతను గుర్తించలేడు. అలాగే దేవతలవద్ద కూడ మనకు తెలియని విధానము ఒకటి కలదు. దాని మూలంగానే మన మనసులోని మాటను వారు మనము చెప్పకనే చెప్పుచున్నారు. ఆ విధానమును బయట పెట్టుటకు ఒక చిన్న ప్రయోగము చేశాము. అదేమనగా ధర్మవరములో ఇంటివద్ద దూషించి దేవతవద్దకు పోయినది నా అనుచరుడే! అతని ద్వారా ఆ దేవత తను దూషించిన విషయము పసికట్టి చెప్పిందని అతను నాకు చెప్పగా, నేను అతనికి ఆమె ఎలా చెప్పిందో అర్థమగుటకు ఒక ఉపాయము చెప్పాను. ఈ తూరి రెండవమారు ఏదో ఒక సమస్యను పెట్టి దానిని అడిగే దానికి మీ ఇంటిలోని వారిని పంపించు. నీవు మాత్రము పోవద్దు. కానీ నీవు ఈ తూరి కూడ అది దేవుడేకాదు దానిమీద నాకు నమ్మకము లేదు. మీరే పోండి అని చెప్పి పంపు. అపుడు నీవు పోకున్నా మీ ఇంటిలోని వారితో ఆ దేవత మీ ఇంటియజమాని ఇలా మళ్ళీ నన్ను దూషించాడు అని చెప్పుతుందో లేదో చూడమని చెప్పిపంపాను. అతను నేను చెప్పినట్లు చేశాడు. ఆ



---

దేవతను నేను చెప్పిన దానికంటే ఎక్కువ దూషించి నాకు నమ్మకము లేదు, నేను రాను మీరే పోండని చెప్పి పంపాడు. ఆ ఇంటి వారు ఆ దేవతవద్దకు పోయి తమ సమస్యను చెప్పగ దానికి ఆమె ఏదో సమాధానము చెప్పి పంపినది. కానీ మీ యజమాని నన్ను రెండవమారు కూడ దూషించాడని వారితో చెప్పలేదు. ఇతను అక్కడికి పోయివుంటే అతనిని చూచి నీవు మళ్ళీ నన్ను దూషించావే అని అడిగేది. అతను పోలేదు కావున, ఆయన తనను దూషించినట్లు ఆ దేవతకు తెలియదు.


దీనికి ఆధారమేమి? మీరు ఎలా చెప్పగలుగుచున్నారని కొందరు అడుగవచ్చును. దానికి నా సమాధానమును చూడండి. మనిషి కనిపిస్తేనే అతని మనసులో అతనికి తెలిసియున్న దానిని దేవత గ్రహించగలదు. మనిషి కనిపించకపోతే అతనిలోని ఉద్దేశమును ఏ దేవతా చెప్పలేదు. ధర్మవరము పెద్దమ్మ దగ్గర జరిగినది, తట్రకల్లు సుంకులమ్మ దగ్గర జరిగినది ఒకే విధానమే! ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. తట్రకల్లు సుంకులమ్మ దగ్గరికి పోయిన రామయ్య తన కూతురు పెళ్ళి విషయమును అడగాలను ఉద్దేశముతోనే పోయాడు. కావున ఆ విషయమును ఆ దేవత చెప్పగలిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్నరాగలదు. అదేమనగా! ఎదుటి వ్యక్తి తలలో ఆ సమయములోనున్న విషయమును దేవత గ్రహించి చెప్పగలదు అన్నారు కదా! మనిషియొక్క తలలోనున్న విషయమును దేవత ఎలా గుర్తించగలదు? అని అడుగవచ్చును. దానికి కూడ జవాబు చెప్పుచున్నాను. ఇప్పుడు నేను చెప్పు జవాబు శాస్త్రబద్ధమైనదని కూడ చెప్పుచున్నాను. భౌతికశాస్త్రము ప్రకారము చెప్పబడు ఈ వివరమును బాగా అర్థము చేసుకోవాలని చెప్పుచున్నాను. భౌతిక శరీరము రెండు భాగములుగా ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. ఒకటి స్థూలశరీరము, రెండు సూక్ష్మశరీరమని వాటి పేర్లు గలవు. స్థూలశరీరములోపల సూక్ష్మశరీరము ఉన్నది. కనిపించు స్థూలశరీరము కనిపించని సూక్ష్మశరీరమునకు పై తొడుగు (పై కవర్) లాంటిది. మీకు సులభముగా అర్థమగుటకు స్థూల, సూక్ష్మ శరీరములకు ఉదాహరణగా ఒక ట్యూబ్లైటును తీసుకొని చూద్దాము. ట్యూబ్ లైట్ను విభజించి చూస్తే లోపల వెలుగు వేరు, పైన కనిపించు ట్యూబ్ వేరు. పైన కనిపించు గాజు ట్యూబ్కు స్వయంగా వెలిగే శక్తిలేదు.


వెలుగు శక్తి ట్యూబ్ లోపల ఉండును. లోపల వెలిగిన ప్రకాశము బయటికి ట్యూబ్ ద్వారానే కనిపించును. లోపలనుండి వచ్చు ప్రకాశము ట్యూబ్ గాజుపొరలో దూరి బయటికి రావలసియుండును. మనిషి లోపలి సూక్ష్మశరీరమునకు పైన స్థూలశరీరము పై తొడుగులాగ ఉన్నదని చెప్పుకొన్నాము కదా! అలాగే లోపలి వెలుగుకు బయటి ట్యూబ్ పై కవర్గ ఉన్నది. పైన ట్యూబ్ దుమ్ముపట్టి ఉంటే లోపలి వెలుతురుకు దుమ్ము కొంత ఆటంకముగావుండి పూర్తి వెలుతురు బయటికిరాదు. అలాగే పై ట్యూబ్కు కొంత నూనె జిడ్డు తగులుకొని, ఆ పైన కొంత దుమ్ము, ధూళి పేర్కొన్న దనుకొనుము. అప్పుడు లోపలి నుండి వచ్చు వెలుగు ఇంకా కొంత తగ్గి వెలుతురు తక్కువగా కనిపించును. లోపలినుండి వచ్చు వెలుగు ఆకుపచ్చ రంగుగా కనిపించాలని ట్యూబ్పైన ఆకుపచ్చ పేపర్ను చుట్టి పెట్టామన్న కొండి. అప్పుడు ట్యూబ్ ఆకుపచ్చరంగులో వెలిగినట్లు కనిపించు చుండును. కానీ వెలుగు తొంభైపాళ్ళు పేపర్ వలన నిరోధింపబడి కేవలము పది పాళ్ళు వెలుగుమాత్రము బయటికివచ్చును. ట్యూబ్ శుభ్రముగా ఉన్నది ఒకటి, ట్యూబ్ కొంత దుమ్ముపట్టినది ఒకటి, నూనె జిడ్డు దుమ్ము తగులుకొన్న ట్యూబ్ ఒకటి, కలర్పేపర్ చుట్టిన ట్యూబ్ ఒకటి మొత్తము నాలుగింటిని తీసుకొని చూస్తే లోపల వెలిగే వెలుగు అన్నిటికి సమానము గానే ఉన్నది. ఆ వెలుగు బయటికి రావడములో నాలుగు రకముల తేడాలున్నాయి. శభ్రముగానున్న ట్యూబ్లో నుండి పూర్తి వెలుగు బయటికి వస్తూ బాగా ప్రకాశిస్తున్నది. మిగతా మూడు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకముగా కనిపిస్తున్నవి. వెలుగు ఒకటే అయినా, బయటి ట్యూబ్లనుబట్టి వెలుగు


---

బయటికి వస్తున్నదని అందరికి అర్థమైనదనుకొంటాము. వివరంగా చెప్పాలంటే లైట్కు స్థూలంగా కనిపించు గాజుట్యూబ్ లోపల సూక్ష్మంగా కనిపించని రెండు ఫిలమెంట్లు ఉన్నవి. మనకు బయటికి కనిపించని ట్యూబ్లెట్లోని ఫిలమెంట్లు నుండి వచ్చే వెలుగు, బయట స్థూలంగా కనిపించు ట్యూబ్నుండి బయటికి వస్తున్నది. అలా వచ్చు వెలుగు, పైన స్థూలంగానున్న ట్యూబ్ సామర్థ్యమును బట్టి ఉంటుంది. అలాగే మనిషి స్థూలశరీరము లోపలగల సూక్ష్మశరరీమునకు కూడ చూపు అనబడే ఫిలమెంటు గలదు. ఆ ఫిలమెంట్ వెలుగు స్థూలశరరీమునకున్న రెండు కళ్ళు అను అద్దముల ద్వారా బయటికి వస్తున్నది. కళ్ళు అనబడు రెండు అద్దములు శుభ్రముగ ఏ లోపము లేకుండ ఉంటే లోపలి చూపు బయటికి బాగా కనిపించును. అద్దములలో లోపముంటే చూపు బయటికి వచ్చేది కూడ అంతంతమాత్రమే ఉండును.


స్థూలశరీరమునకు రెండు కళ్ళు దేవుడిచ్చిన రెండు అద్దముల లాంటివి. మనిషికి వయస్సు పెరుగుకొద్దీ రెండు కన్నులలో కొంత సామర్థ్యము తగ్గి, లోపలినుండి చూపు ఉండినా, బయటి కన్నులు సరిగ చూడలేక పోవుచుండును. అలాంటపుడు కళ్ళ డాక్టర్ల దగ్గరకు పోయి దేవుడిచ్చిన కన్నులు అను అద్దములకు తోడు, బయటనే మరియొక జోడి బూస్టర్ అద్దములు తగిలించుకొని కన్నుల సామర్థ్యములను పెంచుకొని చూపును పెంచుకొంటున్నాము. నాలుగురకముల ట్యూబ్లో లోపలి వెలుగు నాలుగురకముల బయటికి వచ్చినట్లు, మనుషుల శరీర కన్నుల ఆరోగ్యమును బట్టి చూపు అనేక రకముల కనిపిస్తున్నది. ట్యూబ్లోట్లో లోపలి ఫిలమెంటు వెలుగు బయటికి వచ్చునపుడు శుభ్రముగా ఉన్న ట్యూబ్లో కూడ కొంత వెలుగు నిరోధించబడుచున్నది. ట్యూబ్కు ఉన్న తెల్ల అద్దములో దూరి వచ్చునపుడు వెలుగు కొంత తగ్గిపోయి వస్తున్నది. అలాగే మనిషి స్థూల కన్నులనుండి బయటికి వచ్చు చూపు, ఏ రోగము లేని ఆరోగ్యమైన కన్నులలో కూడ పది శాతమే బయటికి వస్తున్నదని చెప్పవచ్చును. ఒకనికి చూపు బాగుంది అని చెప్పినా, అది వాని సూక్ష్మశరీరమునకున్న చూపులో కేవలము ఐదునుండి పది శాతము వరకే ఉన్నదని చెప్పుటకు ఆధారముగలదు. ఈ మా మాట నమ్మశక్యముగా లేకున్నా శాస్త్రబద్ధమైనది, సత్యమైనది. స్థూల కన్నులను అద్దములో నుండి వచ్చు చూపు అను వెలుగు పది శాతము వరకే ఉన్నపుడు. కన్ను అను అద్దమును లేకుండ చూచువానికి నూటికి నూరుపాళ్ళు చూపు అను వెలుగు బయటికి వచ్చి దూరముగా ప్రసరించుచున్నది.


స్థూలశరీరమున్న వాని చూపుకంటే, స్థూలశరీరములేని వానికి చూపు నూరింతలు ఎక్కువ ఉండును అనునది సూత్రము!. ఈ సూత్రము ప్రకారము స్థూలకన్నులతో ఒక కిలోమీటరు దూరము వరకు చూచు శక్తియున్నవాడు, స్థూలశరీరము లేనపుడు సూక్ష్మశరీరముతో వంద కిలోమీటర్ల దూరము వరకు చూడగలడు. అంతేకాక మరొక విషయము ఏమనగా! సూక్ష్మశరీరముతోనున్నపుడు ఎదుటి వ్యక్తి స్థూలశరీరములోనున్న సూక్ష్మములోని మనో బుద్ధి యొక్క ప్రస్తుత సంకల్పములు సులభముగా తెలియగలడు. అందువలన ఒక దేవతా సూక్ష్మము, ఎదుటి మనిషి యొక్క శరరీములోని ప్రస్తుతమున్న యోచనలను నిర్ణయములను తెలుసుకోగలుగుచున్నది. అట్లు తెలియుట వలననే రామయ్య మనస్సులోని మాటను రామయ్య చెప్పకనే సుంకులమ్మ చెప్పగలిగింది. కానీ ప్రస్తుత సమయములో రామయ్య తలలోనున్నది చెప్పగలిగిన సుంకులమ్మకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ దేవతకు భవిష్యత్తు తెలియదని, మనుషులకు తెలియదు. వర్తమానములో మన తలలోని విషయమును మనము చెప్పకనే దేవత చెప్పడము వలన, ఆ దేవతకు అన్నీ తెలుసునని, మనిషి ఒక నిర్ణయానికి వచ్చి ఆమె చెప్పే మాటలన్నీ సత్యమేనని నమ్మడము జరుగుచున్నది. ధర్మవరము పెద్దమ్మ ఈ సూత్రము ప్రకారమే యల్లపు శ్రీరాములుతో నీవు ఇంటివద్ద నన్ను దూషించావు అని చెప్పి, తనకు అన్ని తెలుసునని నమ్మించింది. అలాగే తట్రకల్లు సుంకులమ్మ కూడ రామయ్యను నమ్మించ గలిగింది. కొంతకాలము ప్రజలు ఆమె


---

చెప్పునవి జరుగునని పోయినవారు కాలక్రమములో అలా జరుగక పోవడము వలన, కొంత అక్కడికి పోవడము తగ్గిపోయినది. కొన్ని సంవత్సరముల వరకు అక్కడికి పోవడము, పెరిగిన సంఖ్య తగ్గిపోవడానికి మరికొన్ని సంవత్సరములు పట్టినది.


ఒక్క తట్రకల్లులోనే కాదు దేశములో అనేక చోట్ల ఇటువంటి తంతులే జరుగుచున్నవి. వాటిని హేతువాదులు హేతుబద్దముగ ఖండించడము లేదు, గ్రుడ్డిగ ఖండించుచున్నారు. మన తలలోని ప్రస్తుత మాటను వారు చెప్పుటను సత్యముకాదు అని మొండిగ వాదిస్తున్నారు. ఒక వ్యక్తి చెప్పకనే వాని మనస్సులోని మాటను ఎదుటి దేవత చెప్పినపుడు ఆ వ్యక్తికి సత్యమని తెలిసినపుడు, హేతువాదులు దేవతలు చెప్పునది అబద్దము, బూటకము, నాటకము అని అరిచినా, ఆ వ్యక్తియే కాదు ఎవరూ వినరు. వాస్తవానికి హేతువాది చెప్పినది అసత్యమగును. అందువలన దేశములో ప్రజలయందు హేతువాదమునకు ఉన్నత స్థానము లేకుండ పోయినది. హేతువాద పద్ధతి సరియైనది, గొప్పది అయినా దాని పేరు చెప్పుకొని మేము హేతువాదులమను వారు గ్రుడ్డిగ వాదిస్తున్నారు. కావున హేతువాదమునకు మర్యాద లేకుండ చేసినవారగుచున్నారు. నాకు తెలిసిన హేతువాదము ప్రకారము, వర్తమానములో మనిషిలోని విషయము గ్రహించి దేవతలు చెప్పుట సత్యమేనని, కానీ వారు భవిష్యత్తు చెప్పలేరని చెప్పడమే కాక అందరికీ అర్థమగునట్లు వివరించాము. సత్యమును అంగీకరించి, అసత్యమును అంగీకరించకపోవడమే నిజమైన హేతువాదము అని మేము చెప్పుచున్నాము.


దేవతలు గుడులలో, రాతిప్రతిమలలోనే కాకుండ మనుషుల శరీరములలోనికి కూడ వచ్చి మాట్లాడుదురని తెలుపుటకు ఒక సంఘటనను వివరిస్తాను చూడండి. మేము చెప్పు విషయములు సత్యమును తెలుపుటకే గానీ, ఏ దేవతలను కించపరుచుటకు కాదని ముఖ్యముగ తెలియజేసు కొంటున్నాను. 1975వ సంవత్సరములో అనగా ఇప్పటికి ముప్పైఐదు (35) సంవత్సరముల క్రిందట ఒక దినము తొండపాడు అను గ్రామములో ఉండే రంగనాయకులు స్వామి గుడిలోనికి పోయాను. నేను గుడికి పోయాను అంటే పూజ చేయటానికికాదు, కొబ్బరికాయలు కొట్టడానికి కాదు. చల్లగా ఉంటుందని లోపలికి పోయి కూర్చున్నాను. కొద్దిసేపటికి తెల్ల జుబ్బా పైజామా వేసుకొన్న దాదాపు యాభైసంవత్సరముల వయస్సు గల వ్యక్తి దేవాలయములోనికి వచ్చాడు. ఆ సమయములో మిగత భక్తులు కూడ పూజ చేయించుకుంటున్నారు. అంతలో ఉన్నట్టుండి అక్కడే ఉన్న ఒక స్త్రీకి పూనకము వచ్చింది. కన్నులు పెద్దవి చేసి తీక్షణముగా అప్పుడే వచ్చిన పెద్దమనిషి వైపు చూస్తు, ఊగిపోతూవుండగా ప్రక్కనే ఉన్న ఆమె బంధువులు ఆమెను పట్టుకొన్నారు. అక్కడే ఉన్న పూజారి "ఎవరునువ్వు? రంగనాయకుల స్వామి గుడిలోనికే ఏకంగా వచ్చావు? ఇక్కడికి రాకూడదు బయటికి పో!" అన్నాడు. అప్పుడు ఆమె పూజారివైపు చూస్తూ “ఏమిరా! నా గుడిలోనికి నేను కాక ఎవరొస్తారు. నన్ను మీరు గుర్తుపట్టలేదు. నేనే రంగనాయకుణ్ణి” అనగానే అందరు మ్రొక్కను మొదలుపెట్టారు. రంగ నాయకుల స్వామి ఆమెలోనికి వచ్చాడని అందరికి అర్థమైనది. నేను ప్రక్కన కూర్చోని ఆ వింత చూస్తున్నాను. ఆమె తిరిగి తెల్ల జుబ్బావేసుకొన్న పెద్ద మనిషివైపు చూచి ఇలా అన్నది.


రంగనాయకులు :- ఏమిరా నీకు నేను ఐదు సంవత్సరములకు జ్ఞాపకము వచ్చానా? ఈ రోజు వచ్చావు.


పెద్దమనిషి :- (ఏమి చెప్పాలో తెలియక నోరు తడబడుచుండగా) లేదు స్వామీ! నిన్ను నేను ఎప్పటికీ మరచిపోలేదు. నీ పూజే చేస్తున్నాను. చాలా రోజుల నుండి ఇక్కడికి రావాలనుకొంటున్నాను. రాలేక పోయాను. అదే నాతప్పు. 


రంగనాయకులు:- రాలేక పోయావు. ఐదేండ్ల క్రిందట ఏమి లేదు. ఆ రోజు నేను అవసరమై నాదగ్గరకు వచ్చావు. ఆ రోజు బస్సులో వచ్చావు. ఈరోజు కారు, ధనము, ఇల్లు అన్ని వచ్చాయి. ఇంక నాతో అవసరము ఏముంది.


---

పెద్దమనిషి :- నాకు ఎన్ని ఉండినా అన్నీ నీవు ఇచ్చినవే. నీవు ఎప్పటికీ కావాలి, నేను నిన్ను మరచిపోను. ఇప్పటినుండి ప్రతి సంవత్సరము వస్తాను.

రంగనాయకులు:- ఐదు సంవత్సరముల క్రిందట కూడ ఇలాగే మ్రొక్కావు. నీవు మొక్కిన దానికి నేనే మోసపోయాను. ఆ రోజునుండి ఈ రోజు వరకు నీ జాడేలేదు. ఈ రోజు కూడ నా దగ్గరకు రావాలని రాలేదు, వేరే పని మీద పోతూ దారిలో గుడివుంది కాబట్టి మ్రొక్కిపోదామని వచ్చావు. మొదట వచ్చినపుడు నన్ను కష్టాలనుండి కాపాడు, నీకు అభిషేకములు చేయిస్తా, పూజలు చేయిస్తా అని చెప్పి తర్వాత కనపడకుండ పోతావా?


పెద్దమనిషి :- లేదు స్వామి నేను మొక్కుకున్నట్లు నీ వలన బాగుపడినాను. నేను నిన్ను మరచిపోకుండ పూజలు చేయిస్తున్నాను. నెలకొక్కమారు అభిషేకము చేయిస్తున్నాను.


రంగనాయకులు:- అబద్దాలు చెప్పవద్దు ఎప్పుడు చేయించావు?


పెద్దమనిషి :- ఆలూరులో పూజారికి ముందే డబ్బు ఇచ్చి, ఒకవేళ నేను పనిపడి రాకపోయినా, నెలలో ఏకాదశి రోజున అభిషేకము చేయునట్లు ఏర్పాటు చేసినాను. నేను కూడ హాజరై పూజ చేసి వస్తున్నాను.


రంగనాయకులు :- నీవు మ్రొక్కినది నాదగ్గర! నాకు చేయకుండ ఆలూరు రంగనాయకులుకు పూజచేస్తే సరిపోతుందా? అక్కడ చేస్తే ఆయనకు చేసినట్లు, ఇక్కడ చేస్తే నాకు చేసినట్లు. ఎక్కడ మ్రొక్కితే అక్కడే చేయాలి.


పెద్దమనిషి :- నాకు ఏమి అర్థముకాలేదు. అక్కడ చేస్తే నీకు చేసినట్లు కాదా! అక్కడుండేది కూడా నువ్వే కదా! రంగనాయకులు:- బాగా అర్థమయ్యేటట్లు చెప్పుతాను విను. ఇక్కడుండేది నేను బొల్లికొండ రంగనాయకులును. అక్కడుండేది ఆలూరు రంగ నాయకులు. నేను వేరు, ఆయన వేరు. నాకు మొక్కి, ఆయనకు మొక్కు తీర్చితే ఎలా సరిపోతుంది? నాకు మ్రొక్కినావు నాకు తీర్చలేదు. నీవు నాకు బాకీ ఉన్నట్లే. తెలియక పొరపాటుపడినావు. ఇప్పటినుండి నీ మ్రొక్కుబడి ఇక్కడే తీర్చుకో! లేకపోతే నీవు చెడిపోతావు.


పెద్దమనిషి :- పొరపాటు స్వామీ! తెలియక నీ దగ్గరకు రాలేదు. ఇప్పటి నుండి నెల నెల ఇక్కడికే వచ్చి, పూజ చేసుకొని పోతాను.


ఆ పెద్దమనిషి చెప్పిన తర్వాత రంగనాయకుల స్వామి ఆమె శరీరమునుండి పోయాడు. ప్రక్కనున్న వారికి ఏమి అర్థము కాలేదు. ఆ పెద్ద మనిషికి కూడ ఏమి అర్థము కాలేదు. కానీ అక్కడికి పోయి మ్రొక్కినా నాకు మాత్రము ఇక్కడికే వచ్చి మ్రొక్కాలి అనునది ఒక్కటి మాత్రము అర్థమైనది.


రంగనాయకులు ఏ గుడిలో ఉండినా, ఏ ఊరిలో ఉండినా అంతటా ఒక్కడే రంగనాయకుడు కదా! అని అందరూ అనుకొనుట సహజము. కానీ ఒకే రంగనాయకులు, అన్ని గుడులలోను ఉండడు. ఒక్కొక్క గ ఒక్కొక్క రంగనాయకుడు ఉన్నాడనడము సత్యము. అలాగే ఆంజనేయ స్వామి గుడులు ఎన్నో ఉన్నాయి కదా! అక్కడ కూడా ప్రజలందరు పడు పొరపాటు ఏమంటే రాముని బంటు ఆంజనేయుడని, ఆంజనేయుని గుడి ఎక్కడున్నా శ్రీరాముని భక్తుడైన ఆంజనేయుడే ఉంటాడని అనుకుంటారు. కానీ అది సత్యముకాదు. తొండపాడులో బొల్లికొండ రంగనాయకుల స్వామి చెప్పినట్లు, వేరు వేరు గుడులలో, వేరువేరు దేవుళ్ళున్నారనడము సత్యము. కసాపురము ఆంజనేయస్వామి


--

వేరు, గండి ఆంజనేయస్వామి వేరు. ఆంజనేయుడని ఒకే పేరుండినా, నిజముగా వారు వేరు వేరు దేవతలు. స్వభావము కూడ వేరువేరుగా ఉండును. భక్తులు ముడుపులు ఇస్తామని మ్రొక్కి ఇవ్వక పోయినా ఒక ఆంజనేయస్వామి పట్టించుకోడు, ఒక ఆంజనేయ స్వామి ముక్కుపిండి బాకీని వసూలు చేసినట్లు ముడుపులు వసూలు చేస్తారు. తొండపాడు రంగనాయకులస్వామి ఆ పెద్దమనిషిని నిలదీసి అడగడము న్యాయమే. అప్పుచేసిన తొండపాడులో బాకీ తీర్చక, ఆలూరులో ఇచ్చినానంటే ఆ పెద్దమనిషి పొరపాటు పడినట్లే.



నీవు షావుకారు మల్లారెడి దగ్గర అప్పు తీసుకొని, నీకు దగ్గరగా ఉన్నాడని చింతమాను మల్లారెడ్డికి డబ్బులిచ్చి నా బాకీ తీరిపోయింది కదా, నేను ఇచ్చింది మల్లారెడ్డికే కదా! అంటే అప్పు ఇచ్చిన షావుకారి మల్లారెడ్డి ఊరక ఉంటాడా? కోర్టుకు లాగి మరీ రాబట్టుతాడు. అలాగే ఒక ఆంజనేయు నికి మ్రొక్కి ఇంకొక ఆంజనేయునికి ఇచ్చినా, ఒక రంగనాయకుల స్వామికి మ్రొక్కి ఇంకొక రంగనాయకుల స్వామికి మ్రొక్కు తీర్చినా ఒప్పుకోరు. అదే ఆ ఆ పెద్దమనిషి విషయములో జరిగినది. ఇదంతా మీకెలా తెలుసు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి నా జవాబు ఏమనగా! నేను పదేళ్ళ వయస్సులో వజ్ర కరూరులో ఉంటిని. ఆ ఊరిలో పీర్ల చావిడులు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఊరికి క్రొత్తగావచ్చిన కరెంటు ఆఫీస్ లో పనిచేసే హెల్పర్ ఒక వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉండేవాడు. అంతలో అక్కడ పీర్లపండుగ వచ్చింది. ఆ పండుగలో పీర్లను నిలబెట్టినారు. హెల్పర్ ప్రసాద్ ఉన్న వీధిలో కూడ పీర్లచావిడి ఉండేది. హెల్పర్ ప్రసాద్ పీర్లచావిడి దగ్గరికి సాయంకాలము పోయి, నాకు పెళ్ళి ఈ సంవత్సరము అయితే వచ్చే పీర్లపండుగకు గుడ్డలు ఇస్తాను, ఐదు శేర్ల చక్కెర చదివిస్తానని ఉస్సేన్ అను పేరుగల పీరుకు మ్రొక్కుకొన్నాడు. ఆ వీధిలో ఉస్సేన్ పీరు శక్తివంతమైనదని, మ్రొక్కితే తప్పక నెరవేరునని వీధిలో అనెడివారు. అందువలన ప్రసాద్ తన పెళ్ళి విషయము గురించి మ్రొక్కినాడు. ఆ పండుగ పోయిన తర్వాత నాలుగు నెలలకే ప్రసాద్కు పెళ్ళి అయినది. తర్వాత నెలకు భార్య కాపురానికి వచ్చినది. అప్పుడు ప్రసాదున్న ఇల్లు చాలా చిన్నది, కావున అతను అదే ఊరులోనే, వేరే ప్రాంతము వీధిలోని పెద్ద ఇంటిలోనికి వచ్చాడు. తర్వాత ఆరు నెలలకు పీర్ల పండుగ వచ్చింది. అప్పుడు హెల్పర్ ప్రసాద్ ఉస్సేన్ పీరుకు ముడుపు లేక మ్రొక్కుబడి తీర్చాలి కదా! ఆ రోజు చెప్పిన ముడుపు కోసము, ప్రసాద్ ఐదుశేర్లు చక్కెర మరియు క్రొత్త గుడ్డలు తెచ్చి ప్రస్తుతము ప్రసాదున్న వీధిలోని పీర్లచావిడిలో ఉన్న ఉస్సేన్ అనే పీరుకు చక్కెర చదివించి, గుడ్డలు ఇచ్చాడు. అంతటితో తాను మ్రొక్కుకున్నట్లు ఉస్సేన్కు ముడుపు చెల్లించానని తృప్తి చెందాడు. అలా చేసిన రెండవరోజే, మొదట ప్రసాద్ కాపురమున్న వీధిలోని ఉస్సేన్ అను వీరు ప్రసాద్ ఇంటిముందుకు వచ్చింది. పీరును ఎత్తుకొన్న మనిషికి పూనకము వచ్చి మాట్లాడుచు “ప్రసాద్! చక్కెర గుడ్డలు ఇస్తానని చెప్పి, నీవు ఆ ప్రక్కకు రాలేదు. నా ముడుపు ఇవ్వవలసిందే” అని చెప్పాడు. అది చూచిన ప్రసాద్ నివ్వెరపోయి "నిన్ననే ఐదుశేర్లు చక్కెర, క్రొత్త గుడ్డలు ఇచ్చాను కదా” అన్నాడు. “నీవు నాకు మ్రొక్కినావు నాకు ఇవ్వాలి. అట్లు కాకుండ ఈ వీధిలోని ఉస్సేన్కు ఇస్తే నాకు ఇచ్చినట్లు ఎట్లగును? ఈ వీధిలో ఉస్సేన్కు నాకు సంబంధము లేదు. నీవు మాత్రము నాకు ఇవ్వవలసిందే". అని వీరు చెప్పింది. ఆ మాటతో ఆ పీరు ఉస్సేన్ వేరు, ఈ పీరు ఉస్సేన్ వేరని ప్రసాద్కు అర్థమైనది. రేపు తప్పకుండ మ్రొక్కుకున్నది ఇస్తానని ప్రసాద్ చెప్పగా వచ్చిన వీరు పోయింది. అతను మరుసటి దినము చక్కెర, గుడ్డలు తీసుకొని, ముందు కాపురమున్న వీధిలోనికి పోయి, అక్కడ పీర్ల చావిడిలోనున్న ఉస్సేన్ పీరుకు సమర్పించి వచ్చాడు.



ఈ విషయమునంతటిని పదేళ్ళ వయస్సులో వజ్రకరూరులోనున్న నేను ప్రత్యక్షముగా చూచాను. ఆ దినమే పీర్ల విషయము అర్థమైనది, తర్వాత, కాలము జరుగుకొలది పీర్లచావిడిలోని పీర్లేకాక, దేవతల గుడిలోని దేవుళ్ళు


---

కూడా ఒకే పేరుకల్గిన వారైనప్పటికీ, గుడి గుడికి వేరు వేరుగా ఉన్నారని అర్థమైనది. అందువలన తొండపాడు గుడిలో నాముందరే జరిగినది నాకు తెలిసిన పాత విషయమే, కావున నాకు ఏమీ ఆశ్చర్యము కాలేదు. కానీ అప్పుడు అక్కడున్న వారందరికి అది క్రొత్త విషయమైన దానివలన వారికి ఒక్కమారుగ అర్థముకాక, రంగనాయకుల స్వామి మాటలకు తికమక పడినారు. చివరికి తొండపాడు రంగనాయకులు వేరు, ఆలూరు రంగనాయకులు వేరు అనే విషయము అర్థముకాలేదు. వారికి అర్థమైనదంతా ఏ గుడిలో మ్రొక్కితే, ఆ గుడిలోనే మ్రొక్కుబడి చెల్లించాలను విషయము మాత్రము అర్థమైనది.


ఈ విధముగ చెప్పుకొంటూ పోతే, మనిషికి తెలియని రహస్యములు ఎన్నో ఉన్నాయి. ఒకే పేరున్న వ్యక్తులు నలుగురుంటే, వారికున్న పేర్లు ఒకటే అయినప్పటికీ వారు మాత్రము వేరు, వారి ఉద్దేశములు వేరు, వారి ప్రవర్తన వేరుగా ఎట్లున్నవో, అలాగే ఒక ఊరిలో ఒకే పేరున్న ఆంజనేయుని గుడులు నాలుగున్నాయనుకొనుము. ఆ నాలుగు గుడులలో ఉన్న నలుగురు ఆంజనేయుళ్ళు వేరువేరుగా ఉన్నారు. అలాగే వారి గుణములు వేరు, వారి ప్రవర్తన వేరుగా ఉండునని, పైన చెప్పిన రంగనాయకులస్వామి, ఉస్సేన్ పీరు ఉదంతము చూచిన తర్వాత ఎవరికైనా అర్థముకాగలదు. నాకు చిన్న వయస్సులోనే అర్థమైనది, కావున నేను మీకు చెప్పుచున్నాను. నా మాటను వివరంగా అర్థము చేసుకొన్నవారికి, ఒకే పేరున్న వారంతా ఒకే దేవుడుకాదని కొంతవరకు తెలుస్తుంది. కానీ ఈ గ్రంథమే చదవని వారికి దేవతల గురించి ఏమీ తెలియదు. అటువంటివారు ఒకరి దగ్గర బాకీ చేసి అదే పేరున్న ఇంకొకరి దగ్గర అప్పు తీర్చినట్లు, పళని సుబ్రమణ్యముస్వామికి కానుక ఇస్తానని చెప్పి తిరుత్తణి సుబ్రమణ్యస్వామికి ఇవ్వడముగానీ, గండి ఆంజనేయస్వామికి ముడుపు ఇస్తానని, కసాపురము ఆంజనేయస్వామికి ఇవ్వడముగానీ జరుగుతావున్నది. అట్లు చేయుట వలన మ్రొక్కిన వారికే కష్టము నష్టము కలుగునని తెలియవలెను. ఇటువంటి దేవతలను గురించి హేతువాదులు ఏమనగలరో?




మనిషి శరీరమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అను నాలుగు దశలు కలవు. నాలుగు దశలు అయిపోయిన తర్వాత శరీరము చనిపోవడము కూడ జరుగుచున్నది. శరీరము నాలుగు దశలలో, శరీరమునందు నివసించిన జీవుడు మరణములో శరీరమును వదలి పోవుచున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరికీ తెలియని విషయము కూడ ఒకటున్నది. అది ఏమనగా! మనిషికి మాంసముతో కూడుకొన్న శరీరమున్నట్లు, ఒక దేవతకుగానీ, ఒక దేవునికి గానీ, రాతితో తయారుచేయబడిన ప్రతిమయే శరీరముగా ఉన్నది. ఒక దేవతకు ఆ దేవతయొక్క ప్రతిమ స్థూలశరీరముగా ఉండగా, సూక్ష్మశరీరము మాత్రము మనుషులకున్నట్లే ఉన్నది. దేవతా ప్రతిమలో మనిషి స్థూల శరీరమునకు కనిపించునట్లు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము మరియు మరణములు కనిపించవు. ప్రతిమలో శరీర దశలు కనిపించకపోయినా, ప్రతిమ యొక్క సూక్ష్మశరీరమునకు అన్ని దశలు మనుషులకు ఉన్నట్లే తప్పక ఉండును. మనిషి శరీరము మరణాంతరము కుళ్ళిపోయి నాశనమైపోవును. కానీ ఒక దేవతా శరీరమైన ప్రతిమ ఆ దేవత మరణించినా కూడ ప్రతిమ నాశనము కాదు, ఎట్లున్నది అట్లే ఉండును. మనిషి శరీరము మరణములో కదలకుండ పడిపోవును, కావున ఆ మనిషి చనిపోయాడని శరీరమును చూచి చెప్పవచ్చును. కానీ దేవత చనిపోయినట్లు ప్రతిమను చూచి చెప్పలేము. ఇక్కడ కొందరికే కాక అందరికి కూడ వచ్చు ప్రశ్న ఒకటి గలదు. ఒక మనిషి తన శరీరములో చనిపోయినట్లు, ఒక దేవత తన శరీరమైన ప్రతిమలో చనిపోతుందా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా!



---

ఒక మనిషి అయినా, లేక దేవత అయినా ఏదో ఒకరోజు చనిపోవలసిందే. గుడిలోని దేవతలకు కూడ చావుగలదు, మరియు వెంటనే పుట్టుక కూడ గలదు. దీనినిబట్టి చావుపుట్టుకలకు, దేవతలు కూడ అతీతులు కారని తెలియుచున్నది. మనిషికి ఉన్నట్లే గుడిలోని దేవతలకు కూడ ఆయుస్సు ఉన్నది. మనిషికి ఆయువు పరిమితి 120 సంవత్సరములు. అట్లే దేవతల ఆయుస్సు, ప్రతిమలను శరీరములలో 120 సంవత్సరములు మనుషులకు ఉన్నట్లే ఉ న్నది. అందువలన మనిషికి, దేవతలకు ఆయుస్సు పరిమితిలో ఎటువంటి తేడాలేదు. కానీ మనుషులైనా, దేవతలైన ఆ జన్మకున్న ప్రారబ్ధ కర్మప్రకారము కొన్ని సంవత్సరములు బ్రతికి చనిపోవు చున్నారు. ఒక ప్రతిమలో ఒక దేవుడున్నాడనుకొనుము. ఆ దేవుడు 80 సంవత్సరములకు చనిపోతే, ఆ ప్రతిమ ఖాళీ అయిపోతున్నది. అట్లు ఖాళీ అయిన ప్రతిమలోనికి, క్రొత్త జీవుడు జన్మ తీసుకొని పుట్టుచున్నాడు. అలా పుట్టిన జీవుడు ఆ ప్రతిమలలోని దేవునిగా చలామణి అగుచున్నాడు. అలా కాలగమనములో ఒక ప్రతిమలో ఎందరో జీవుళ్ళు, దేవుళ్ళుగా చలామణి అయినట్లు తెలియుచున్నది. ఒక ప్రతిమలో కొంత కాలము ఒక జీవుడు, ఆ ప్రతిమ పేరునుబట్టి, ఆ దేవునిగా ప్రవర్తించినా అతనికి కూడ గుణములు కర్మనుబట్టి పనిచేయును. అందువలన ఒక దేవుని గుణము, పనులు, ఉద్దేశములు, స్వభావములు అదే ప్రతిమలో చేరిన వేరొక దేవునికి (జీవునికి) ఉండవు. ఇదంతా కొంతమందికి ఆషామాషీగా కనిపించినా, నేను చెప్పునది సత్యము అనుటకు ఎన్నో ఆధారములు గలవు. అటువంటి ఆధారమును క్రింద వివరిస్తాము చూడండి.


ఈ విషయమును చెప్పబోవు ముందు ముఖ్యముగ ఒకమాట చెప్పదలచుకొన్నాము. ఇంతకు ముందు చెప్పినది దయ్యాల విషయములే. కానీ ఇప్పుడు చెప్పునది గుడిలోని దేవుని విషయములు. సత్యమును భావితరాల వారికి అందించుటకు యదార్థమైన విషయములను చెప్పవలసి వచ్చినది. కానీ ఇందులో ఏ దేవుణ్ణి కించపరిచే ఉద్దేశము ఏమాత్రము లేదు. దైవజ్ఞానమును తెలిసిన వ్యక్తిగా వ్రాస్తున్నానే తప్ప, అజ్ఞానముతో ఏమీ వ్రాయలేదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన జ్ఞానము, ఇందూ సమాజములో గుర్తింపురావాలని, ప్రచారము కావాలని, ప్రతి ఒక్కరికి తెలియాలని గీతలోని శ్లోకముల ఆధారముతోనే ఇక్కడ చెప్పు విషయములు ఉండునని తెలియజేయుచున్నాము. భగవద్గీత ప్రకారము దైవత్వమును రెండు విధములుగా మనుషులు అర్థము చేసుకొన్నారు. ఎందరో దైవత్వమును అనేక దేవుళ్ళ రూపములో చూస్తున్నారు. కొందరేమో దైవత్వమును ఒక్కదేవునిగానే చూస్తున్నారు. ఆ ఒక్క దేవుణ్ణి రూప, నామ, క్రియలు అను మూడు లేనివానిగా లెక్కించుచున్నారు. చాలామంది ఆకారము, పేరు, పని మూడు ఉన్న వానిని దేవుడుగా లెక్కించుచున్నారు. దేవునికి రూప, నామ,క్రియలు ఉన్నాయని అనుకొనువారు రూపమున్న ప్రతిమలను దేవునిగా లెక్కించుకోవడము, ఆరాధించడము జరుగుచున్నది. ఆ నేపధ్యములో అనేకమంది, అనేక దేవుళ్ళను తయారుచేసుకొన్నారు. భూమిమీద ఉన్న అనేక దేవుళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఇష్ట దైవముగానో, ఇంటిదేవునిగానో పెట్టుకొన్నారు. విధముగా ఒక దేవుణ్ణి ఇష్టముగా జీవితాంతము ఆరాధించువాడు, చనిపోయిన తర్వాత ఆ దేవునిగా మారిపోవును. ఒక వ్యక్తి జీవితాంతము ఒక దేవున్ని ఇష్టముగా ఆరాధిస్తే ఆ వ్యక్తి చనిపోతే, అతను తల్లిగర్భములో తయారైన శిశువు శరీరములోనికి ప్రవేశించక, తన జీవితములో ఏ దేవున్ని గొప్పగా పూజించాడో అదే పేరున్న ప్రతిమ శరీరము ఎక్కడుండినా అక్కడ చేరును. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రొద్దుటూరులో రాముని గుడిలోని రాముణ్ణి ఎక్కువ శ్రద్ధతో జీవితాంతము పూజించాడు. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయి టంగుటూరులోని రాముని గుడిలోనున్న రాముని ప్రతిమలో పుట్టాడు. దీనినిబట్టి తెలియునదేమనగా పూజించినది రాముణ్ణి కాబట్టి పూజించిన గుడిలోనే కాక, ఏ గుడిలోనైనా రాముని పేరున్న ఏ ప్రతిమలోనైనా చేరి పుట్టవచ్చును.



--

దేవతా భక్తులు దేవతలుగా మారుదురని భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు జరుగుచున్నది. ఈ విషయమును గురించి భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్యయోగము అను అధ్యాయమునందు 25వ శ్లోకమున ఇలా గలదు.


“యాన్తిదేవ వ్రతాన్ దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః,

భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మధ్యాజినోకపి మామ్.”


భగవంతుడు ఈ శ్లోకములో చెప్పినట్లు, పూర్తి శ్రద్ధతో జీవితాంతము ఆకారమున్న దేవున్నిగానీ, పితృదేవతలనుగానీ, జీవరాసులైన పక్షులు, జంతువులు, వృక్షములనుగానీ పూజించినవాడు వాటియందే చేరును. అట్లుకాక ఆకారము, పేరు, పని లేనివాడైన దేవుణ్ణి పూజించిన లేక ఆరాధించినట్లయితే ఆ దేవునియందే చేరిపోవును. ఇక్కడ దేవునియందనగా తిరిగి పుట్టకుండ, పరమాత్మయిన దేవునిలోనికి ఐక్యమైపోవునని అర్థము. దేవుడు దేవుళ్ళు అనే విషయము అర్థమగుటకు చెప్పునదేమనగా! పుట్టించినవాడు దేవుడు, పుట్టినవారు దేవుళ్ళు. రూప, నామ, క్రియ లేనివాడు దేవుడు, రూప, నామ, క్రియలున్నవారు దేవుళ్ళు. విశ్వమంతా అణువణువున నిండియున్నవాడు దేవుడు, విశ్వములో ఎక్కడో ఒక చోటవున్నవారు దేవుళ్ళు. ఏ గుణములేనివాడు దేవుడు, అన్ని గుణములున్న వాళ్ళు దేవుళ్ళు. పుట్టనివాడు, చావనివాడు, దేవుడు! చావు, పుట్టుక రెండు ఉన్న వాళ్ళు దేవుళ్ళు. యోగశాస్త్రము లేక బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసినవారు దేవుని ఆరాధిస్తారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తెలియనివారు దేవుళ్ళను ఆరాధిస్తారు. అసలైన దైవత్వమును గురించి తెలియనివారు వారికి తెలిసినదే జ్ఞానమనుకొని, దేవతలను ఆరాధించి, చనిపోయిన తర్వాత దేవతా ప్రతిమలోనే పుట్టుచున్నారు.


ఒక దేవతా ప్రతిమలో దేవుడను జీవుడు పుట్టాలంటే, ఆ ప్రతిమలో అంతవరకు ఉన్న దేవుడనబడు జీవుడు మరణించి, ఆ ప్రతిమలోనుండి బయటకు పోయి ఉండాలి. ఒక ప్రతిమలోనున్న దేవుడు చనిపోతే, ఆ ప్రతిమలోనే క్రొత్త దేవుడు పుట్టునని తెలియుచున్నది. అలా పుట్టిన క్రొత్త దేవునికి అదే ప్రతిమలోనున్న పాతదేవునికి స్వభావములోగానీ, ప్రవర్తనలో గానీ ఎంతో తేడా ఉండును. భూమిమీద ఏ దేవాలయములోనున్న ఎంత పెద్ద దేవుడుగానీ, ఏదో ఒకనాడు ప్రతిమను వదలి చనిపోవలసిందే! అలా చనిపోయిన దినమున క్రొత్త జీవుడు దేవుడుగా ఆ ప్రతిమలోనే చేరవలసిందే! ఈ విధానము ప్రకారము చూస్తే దక్షిణ భారతదేశములోనే అతి పెద్దదైన పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానము. దేవస్థానములో ఉన్నది సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరస్వామి. ఈ దినమున్న వెంకటేశ్వర స్వామి శాంత స్వభావుడు, క్షమా గుణము కల్గినవాడు. తనను దూషించిన వానిని కూడా దీవించువాడు. తన సొమ్మును అపహరించిన వానిని కూడ చూచి చూడనట్లు వదలివేయువాడు. తన భక్తులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలనుకొనువాడు. ఇలా నేడు అన్ని విధముల గొప్ప దేవుడు తిరుమల వెంకటేశ్వరుడు!



ఇప్పటికి సరిగా అరవై సంవత్సరముల క్రిందట ఇదే తిరుమలలో ఉండే వెంకటేశ్వరస్వామి, తన సొమ్ము ఒక్కరూపాయి పోయినా సహించుకొనే వాడు కాడు. ఎవరైన తనకు తీసిపెట్టిన డబ్బును మ్రొక్కి వాడుకొనినా, తర్వాత దానికి వడ్డివేసి ఇవ్వాలి. తన సొమ్ము వాడుకొని వడ్డీతో సహా ఇవ్వకపోతే వారిని వదలకుండ తనసొమ్ము ఎంత విలువైనదో తెలియునట్లు కష్టాలపాలుచేసెడివాడు. ఎవడైన తన సొమ్మును దొంగిలించితే వానికి కాలో, చెయ్యో పని చేయకుండునట్లు చేసి శిక్షించేవాడు. అందువలన ఆ కాలములో తిరుపతి వెంకటేశ్వరస్వామి అంటే, భక్తికంటే భయమే ఎక్కువ ఉండేది. అందువలన ఆయన సొమ్మును వాడుకొనేదానికి ఎవరు సాహసించే వారుకాదు. దొంగలు సహితము తాము దొంగతనము చేసిన సొమ్ములో ముందుగా మ్రొక్కుకొన్నట్లు, దేవుని వాటా ఎంతో అంత హుండీలో వేసి పోయెడివారు. ఆనాడు వెంకటేశ్వరస్వామిని వడ్డికాసులవాడని, దొంగలను సహితము దోచుకొనువాడని చెప్పేవారు. అలా ఆనాడు


---

చాలామందిలో భయము, భక్తి రెండూ ఉండేవి. ఆనాటికి, ఈనాటికి తేడా చూస్తే నేడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉంది, కానీ భయము ఏమాత్రము లేదు. ఎందరో భక్తులు భక్తితో కానుకలు తెచ్చి వెంకటేశ్వరస్వామి హుండీలో వేయుచు, తమ భక్తిని ప్రదర్శించుకొంటూ ఉంటే, భయములేని ఎందరో దేవుని సొమ్మును ఇష్టమొచ్చిన పద్ధతిలో కాజేయడము కూడా జరుగుచున్నది. ఆనాడు ఎవరైనా మాంసము తిని కొండమీదికి పోవాలన్నా భయపడేవారు. ఈనాడు కొండమీదనే మాంసము, మద్యము ఉన్నట్లు వార్తలలో చెప్పు చున్నారు. ఈ విధముగ చెప్పుకొంటూపోతే ఆనాటికి, ఈనాటికి ఎంతో తేడాగలదని తెలియుచున్నది.



వీటన్నిటినీ ఆధారము చేసుకొని చూస్తే ఆనాడు ప్రతిమలోనున్న వెంకటేశ్వరుడు వేరు, ఈనాడు అదే ప్రతిమలోనున్న వెంకటేశ్వరుడు వేరు అని తెలియుచున్నది. ఆనాడు ఒక్క రూపాయి పోయినా ఆ వెంకటేశ్వర స్వామి వదలేవాడు కాదు. ఈనాడు కోట్లు పోయినా, ఈ వెంకటేశ్వరస్వామి పట్టించుకోవడములేదు, చూచినా చూడనట్లు వదలివేస్తున్నాడు. (ఇదంత మీకు క్రొత్త కథమాదిరి కనిపించవచ్చును. కానీ దీనిని కథ మాదిరి చూడకుండ సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించండి.) ఈనాడు తిరుమలలో దేవస్థాన పరిపాలనలోనే ఎన్నో అవకతవకలున్నట్లు, ఎంతో డబ్బును అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని అంటున్నారు. దీనినిబట్టి పరిశీలించి చూస్తే అరవై సంవత్సరముల క్రిందున్న వెంకటేశ్వరస్వామి, ఇప్పుడున్న స్వామికాదు అని నిరాటంకముగా చెప్పవచ్చును. మీరు అంత ఖచ్చితముగా ఎలా చెప్పగలుగుచున్నారని ఎవరైనా ప్రశ్నించినా, దానికి జవాబుగ పూర్వము అరవై సంవత్సరముల సమయములో జరిగిన సంఘటను వివరించగలను చూడండి.


అనంతపురము జిల్లాలో పుట్టపర్తికి సమీపములో గోరంట్ల అను గ్రామము గలదు. అరవై సంవత్సరముల క్రితము చాలా చిన్న గ్రామముగా ఉంటుందనుకుంటాను. ఆ ఊరిలో పురాతన దేవాలయములు, మంచి శిల్పకళతో కూడుకొన్నవి ఉండుట వలన, ఆ గ్రామము కొంత చరిత్ర కలిగినదేనని అనిపిస్తుంది. గోరంట్లలో చిత్రావతినది ఒడ్డున వున్న మాధవరాయుని గుడి ప్రసిద్ధి చెందినది. గోరంట్లలో అద్వైత పీఠమునకు చెందిన ఆశ్రమము కూడ కలదు. ఆ ఆశ్రమములో రమణానంద భారతి అను స్వామి ఉండి, ఆ ప్రాంతము వారికి ఆధ్యాత్మికబోధలు చేసెడివారు. అందువలన ఆ ఊరి వారందరికి సుపరిచిత వ్యక్తి ఆ స్వామీజీ. అరవై సంవత్సరముల క్రితము ఆ ఊరిలోని కొందరు తిరుపతికి పోవాలనుకొన్నారు. దాదాపు పది కుటుంబములనుండి కుటుంబమునకు ఒక్కరు ప్రకారము పదిమంది బయలుదేరాలనుకొన్నారు. ఆ ప్రయత్నములో అందరూ కలసి రమణానందభారతి స్వామిని తమవెంట, తమ ఖర్చులతోనే తీసుకుపోవాలనుకొన్నారు. వారు అడిగితే స్వామి కూడ వస్తానని ఒప్పుకొన్నాడు. అప్పటికి స్వామితో సహా మొత్తము పదకొండుమంది కాగ, అందులో ఒక కుటుంబము నుండి దాదాపు పది సంవత్సరముల వయస్సుగల అబ్బాయిని పంపారు. వారందరు వెంకటేశ్వరస్వామికి తీసిన ముడుపుల డబ్బులు తీసుకొని బయలుదేరారు. ఆ కాలములో ఇప్పటివలె హెూటళ్ళ సౌకర్యములేదు, కనుక ఇంటినుండి అన్నము, రొట్టెలు మొదలగు తిండిపదార్థములను మూటగట్టుకొని బయలుదేరారు. గోరంట్లనుండి కదిరి, రాయచోటి, పీలేరు మీదుగ తిరుపతికి బస్సులో ప్రయాణించి చేరుకొన్నారు. కాలములో ఇప్పటివలె క్యూలైన్ లేదు. దర్శనముకు ఆలస్యమయ్యేది కాదు. పోయిన వెంటనే దర్శనము లభించేది. తిరుపతి చేరుకొన్న గోరంట్ల బృందము, ఉదయము తొమ్మిది గంటలకు వెంకటేశ్వరస్వామి దర్శనము చేసుకొని, ముడుపులన్ని హుండీలో వేసి త్రాగు నీటి సౌకర్యమున్న చోటికి పోయి కూర్చున్నారు. వారితో పాటు తెచ్చుకొన్న రొట్టెలు తిని, అక్కడినుండి పాపనాశన తీర్థమువరకు పోయి రావాలనుకొని, రొట్టెల మూటలు విప్పుకొని తినేదానికి మొదలు పెట్టు


--


సమయములో, ఆ గుంపులో వచ్చిన పది సంవత్సరముల బాలునికి పూనకము వచ్చింది.అప్పుడు ఆ పిల్లవాని  శరీరమంతా గట్టిగ వణికినట్లు కదలుచూ, నోటివెంట నా మూడుబొట్లు నాకు ఇవ్వు అను మాట మాటి మాటికి వస్తున్నది. ఉన్నట్లుండి ఆ బాలునికి అలా జరగడము అక్కడి వారికి ఏమీ అర్థముకాలేదు. ఆ పిల్లవాడు అలా శరీరమంతా వణుకుచూ 'నా మూడు బొట్లు నాకివ్వు' అని అనడమేమిటి అని అక్కడేనున్న రమణానందస్వామి ఆలోచించి, అది పూనకమేనని నిర్ధారించుకొని నీవు ఎవ్వరు? నీ మూడు బొట్ల విషయమేమిటి? అని అడిగాడు. ఆ పిల్లవాడు ఎవరి మాటలను పట్టించుకోలేదు. అలాగే వణుకుచూ నామూడుబొట్లు నాకివ్వు అనుమాట మాటిమాటికి అను చున్నాడు. అప్పుడు రమణానంద స్వామికి ఒక ఆలోచన వచ్చింది. పిల్లవాని కుటుంబమువారు వెంకటేశ్వరస్వామి ముడుపుడబ్బులను హుండీలో వేయమని పిల్లవానిచేత పంపారు. ఈ పిల్లవాడు ఆ డబ్బులను అంతా హుండీలో వేయకుండ మూడుబొట్లు దాచిపెట్టుకున్నాడేమోనని అను మానముతో పిల్లవాని జేబులన్నీ వెదికాడు. కానీ డబ్బులు కనిపించ లేదు. అంగీని అల్లాడించగా అంగీ మెడపట్టిలో డబ్బుల శబ్దము వచ్చింది. ఆ శబ్దమునుబట్టి చూడగా మెడపట్టీలో మూడు బొట్లను చొప్పించి దాచుకొన్నట్లు అర్థమైనది.


అప్పుడు రమణానందస్వామి, వెంకటేశ్వరస్వామికి మ్రొక్కు కొనడము జరిగినది. పిల్లవాడు తెలియక తప్పు చేశాడు. నీ మూడు బొట్లకు మరియొక మూడుబొట్లు వడ్డీగా వేసి, నీ హుండీలో ఇప్పుడే వేస్తామని వెంకటేశ్వరస్వామికి మ్రొక్కగా అప్పుడు పూనకము నిలిచిపోయి ఆ పిల్లవానికి జ్ఞాపకము వచ్చింది. వెంటనే ఆరుబొట్లు హుండీలో వేసివచ్చారు. (ఆ కాలములో నయాపైసాలు లేవు రూపాయకు పదహారు ఆణాలు ఉండేవి. ఒక్క ఆణాకు నాలుగు బొట్లు ఉండేవి. రెండు బొట్లు కలిపితే అర్థ ఆణా అనెడివారు. బొట్లు, అర్థ ఆణాలు, పావల, అర్థరూపాయి అని చెప్పెడివారు. అప్పటి ఒక బొట్టు రూపాయిలో 64వ భాగము కాగ, ఆ బొట్టు విలువ ఇప్పటికాలములో పది రూపాయలకంటే ఎక్కువ విలువ చేస్తుంది.) అలా ఆరుబొట్లు హుండీలో వేసివచ్చినప్పటికీ, ఆ రోజు పూనక సమయములో వచ్చిన వణుకు అదే విధముగ అలాగే నిలిచిపోయింది. ఆ వణుకు జీవితకాలమంతా ఉండుట వలన అతని జీవితమే దుర్భరమైనది. నడిచేటప్పుడు : కాలు వణుకుచుండుట వలన అడుగు అనుకున్న చోటనే పెట్టలేడు. అందువలన క్రింద పడిపోయేదానికి అవకాశమున్నది. శరీరమంతా కదలుచుండుట వలన అందరివలె అతను తన పనులు చేయుటకు కూడ వీలులేదు. మొదట పూనకము వచ్చినపుడు నరముల మీద వచ్చిన వణుకు, పూనకము పోయిన తర్వాత కూడ నిలిచిపోవడము వలన అతని జీవితమే దుర్భరమైనది.


నాకు పదమూడు లేక పదునాలుగు సంవత్సరముల వయస్సులో, నేను గోరంట్లలో ఎనిమిదవ తరగతి చదువుచున్నపుడు చేతి కట్టె ఆధారముతో అతి కష్టముగా వణుకుచు నడుచు వ్యక్తిని చూచి, రమణానందస్వామిని ఇతనెందుకు అలా నడుస్తున్నాడని అడుగగా, రమణానంద స్వామి మొత్తము సమాచారమునంతటిని చెప్పాడు. రమణానందస్వామి ఆశ్రమములోనే మేము నివాసముండుట వలన, అనుమానము వచ్చిన ప్రతి విషయమును మరియు తెలియని విషయములను అడిగి తెలుసుకొనుచుంటిని. వణుకుచు నడుచు వ్యక్తికి పూనకము వచ్చిన రోజున, ప్రత్యక్ష సాక్షిగా రమణానంద స్వామి ఉండుట వలన, విషయమునంతటిని వివరముగా తెలిపాడు. నా చిన్న వయస్సులో రోజు ఆయన చెప్పినది వింతకథలాగ కనిపించినా నాకు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు వచ్చే సమయానికి, సూక్ష్మ . శరీరముల విషయములన్నియు దాదాపుగా అర్థమైనవి. అరవైసంవత్సరముల క్రితము చిన్న పిల్లవాడు తప్పుచేసినా వదలక పెద్దశిక్ష వేసిన ఆనాటి వెంకటేశ్వరస్వామికి, నేడు తన సొమ్మును ఎవడు ఎంత తినినా పట్టించుకోని వెంకటేశ్వర


---

స్వామికి అన్ని విధముల తేడా కనిపిస్తున్నది. అందువలన పూర్వమున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమలో చనిపోయాడని, క్రొత్త వెంకటేశ్వరస్వామి ఆ ప్రతిమలో పుట్టాడని చెప్పవచ్చును. దీనినిబట్టి ఒక ప్రతిమలోనున్న వాడు చనిపోతే, ఆ ప్రతిమలోనికి దేవుడుగా రావలసిన జీవుడు ఎవరని వెతుకకుండ భగవద్గీతలో భగవంతుడు ఫలానావాడే ప్రతిమలో పుట్టగలడని చెప్పుచు “యాన్తి దేవవ్రతాన్ దేవాన్” అన్నాడు. ఆ మాట చాలాచోట్ల నెరవేరుచున్నదని తెలియుటకు తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయమే మనకు నిదర్శనము. ఈ విధానము కొన్ని పదుల సంవత్సరములకు ఒకమారు ప్రతి దేవాలయములోని ప్రతిమలయందు జరుగుచున్నా, ఆ విషయము కంటికి కనిపించునది కాదు, కాబట్టి ఎవరికీ దేవతల, దేవుళ్ళ జనన మరణముల విషయము తెలియదని చెప్పవచ్చును. దేవుడున్నాడనీ, అలాగే దయ్యములు కూడ ఉన్నాయను వారికే దేవుళ్ల జనన మరణ విషయము తెలియకపోతే, ఇక దేవుడుగానీ, దయ్యముగానీ లేనేలేదు అనేవారికి ఈ విషయము అగమ్యగోచరముగా ఉండును. ఎన్నో విషయములు తెలియ కుండినా, అన్నీ తెలుసుననుకొను హేతువాదులు, నాస్తికవాదులు తిరుపతిలో వచ్చిన ఆ బాలుని వణుకు రోగమును గురించిన కారణము చెప్పగలరా? పూనకము వచ్చిన సమయమునుండియే, అలా అగుటకు కారణము చెప్పగలరా?? ఎవరికి తెలియకుండ దాచుకొన్న మూడు బొట్ల విషయము గుడిలోనున్న వెంకటేశ్వరునికి ఎలా తెలిసిందో చెప్పగలరా??? మూడుకు మూడు వడ్డిగా ఆరు బొట్లు ఇస్తామని చెప్పువరకు, నా మూడు బొట్లు నాకు ఇవ్వు అనుమాట ఆగకుండ, ఆ బాలుని నోట పలుకబడుటకు కారణమును చెప్పగలరా? ఇట్లు తిరుపతి సంఘటనలో ఎన్నో హేతువులను అడగవచ్చును. ఇందులో ఒక హేతువును కూడ తీసుకొని సమాధానము వెదకకుండ మొత్తముగా ఇదంతయు అబద్దము అనువారు హేతువాదులు అవుతారా?


ప్రతి మనిషిలో ఏ విషయమునైనా గ్రహించుకొను గ్రాహితశక్తి ఉంటుంది. ఆ గ్రాహితశక్తి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకముగా ఉండును. గ్రహించుకొను శక్తి ఉన్నది, కావున మనిషిని కూడ గ్రహము అనవచ్చును. కొందరిలో గ్రహించుకొను శక్తి ఎంతయున్నా కొన్ని విషయములను గ్రహించుకోలేరు. అటువంటి విషయములను ఎదుటి వారు తమ అనుభవములని ఎంత చెప్పినా, గ్రహించుకోలేక స్వయముగా అనుభవిస్తేగానీ మేము మీ మాటను విశ్వసించము అనువారు గలరు. ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా! కంటితో చూస్తేగానీ, చెవితో వింటేగానీ అందులోని వాస్తవమును తెలుసుకొనుటను గ్రాహితజ్ఞానము అంటాము. అట్లుకాక స్వయముగా అనుభవించి తెలుసుకోవడము అనుభవ జ్ఞానము అంటాము. ఒక మనిషి క్రొత్త విషయములను తెలుసుకొనుటకు గ్రాహితజ్ఞానము అవసరము. స్వయముగా తాను ఒక పనిని చేయవలసి వచ్చినపుడు అనుభవజ్ఞానము అవసరము. ఉదాహరణకు విద్యార్థులు టీచర్లు చెప్పు విషయములను తమకున్న గ్రాహితశక్తి వలన గ్రహించు కొంటూపోతే వానికి 'గ్రాహిత జ్ఞానము' ఏర్పడును. అలాగే ఒకడు డ్రైవర్గా మారాలంటే అప్పుడు అనుభవజ్ఞానము తనకి అవసరము. అతను స్వయముగా వాహనమును నడిపి అనుభవము ద్వారా తెలుసుకొన్న దానిని 'అనుభవ జ్ఞానము' అంటాము. ఈ విధముగ చూస్తే మనిషికి అనేక విషయములలో గ్రాహిత జ్ఞానము అవసరము. కొన్ని చోట్ల కొన్ని విషయములలో మాత్రమే అనుభవ జ్ఞానము అవసరము. గ్రాహిత జ్ఞానము అవసరమున్న చోట అనుభవజ్ఞానము కావాలనుకొనువారు, ఎంత మేధావులనిపించుకొనినా తెలివితక్కువారే. ఎప్పుడు ఏది అవసరమో తెలియకుండ అడుగువానిని తెలివితక్కువ వాడేనని చెప్పవచ్చును. ఉదాహరణకు అన్నము తినేటప్పుడు కంచము (ప్లేటు) అవసరము. పడుకొనేటప్పుడు మంచము అవసరము. అట్లుకాక తినేటప్పుడు మంచమును, పడుకొనేటప్పుడు కంచమును అడుగువాడు తెలివితక్కువ వాడు కాక ఏమగును? అందువలన మనిషి కొన్ని వినడము, చూడడము వలన తెలుసుకోవచ్చును. కానీ వాటిని అనుభవిస్తేగాని నమ్మను అనేవాడు తెలివితక్కువవాడగును.


---

కొందరు హేతువాదులు, నాస్తికవాదులు వినవలసిన వాటిని చూడాలనీ, చూడవలసిన వాటిని అనుభవించి చూడాలనీ అడుగుచుందురు. వారే కాకుండ మరికొందరు కూడ అదే విధముగ మాట్లాడుచుందురు. ఎక్కడ ఏ విధమైన గ్రహింపు కావాలో, తెలియకుండ మాట్లాడిన వారి విషయమును ఇప్పుడు వివరించుకొని చూస్తాము. ఇప్పటికి ముప్పయి అయిదు సంవత్సరముల క్రిందట నేను వైద్యము చేయు సమయములో ఒక మాంత్రికుడు వచ్చి నాతో కలిసి మాట్లాడినాడు. అతని ఊరు కనగానిపల్లి గానీ, కుంటిమద్దిగానీ అయివుంటుందని అనుకుంటాను. అతని వృత్తి భూతవైద్యము చేయడము, గృహవాస్తు చెప్పడము వగైర వగైరా చేసెడివాడు. ఆ నేపద్యములో చుట్టు ప్రక్కల ప్రాంతములో తిరిగేవాడు, అంతేకాక దూర ప్రాంతములకు కూడ పోయేవాడు. ఆ విధముగా కనగానిపల్లికి చుట్టుప్రక్కల ప్రాంతములు అన్నియు అతనికి సుపరిచితమైనవే. కనగానిపల్లికి పదిహేను లేక ఇరవై కిలోమీటర్ల దూరములో కుంటిమద్ది అను గ్రామము కలదు. ఆ గ్రామములో పీర్లపండుగ చేయుట గలదు. పీర్ల పండుగ సమయములో అక్కడ పీర్లు ఎత్తుకున్న మనుషులలోనికి, పీర్లు అనబడు దేవుళ్ళు వచ్చి మాట్లాడడము కూడ జరిగేది. ఆ విధముగ మాట్లాడడము అన్ని ఊర్లలో జరిగే విషయమే. అయితే మనుషులలో కొందరు ప్రత్యేకతను సంపాదించుకొన్నట్లు, కొన్ని గ్రామములలో కొన్ని పీర్ల దేవుళ్ళు కూడ కొంత ప్రత్యేకతను కల్గియున్నారు. గ్రామములోనున్న పీర్లకు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పేరు ఉండును. ప్రత్యేకత సంపాదించుకొన్న పీర్లయొక్క పేర్లను, ఆ ఊరి ప్రజలు గొప్పగ చెప్పుకొనుచుందురు. ఊరిలో ఎన్ని పీర్లు ఉంటే అందులో అన్ని పీర్లు చురుకుతనముగా ఉండవు.



సంవత్సరమునకు ఒకమారు వచ్చు పీర్ల పండుగ సమయములో పీర్లచావిడిలో పీర్లను అలంకరించి నిలబెట్టడము జరుగుతుంది. ఆ పీర్లను ఒక్కొక్క దానిని ఒక్కొక్కరు ఎత్తుకొని, ఊరిలో త్రిప్పడము కూడ జరుగుతుంది. అలా ఎత్తుకొని ఊరిలో తిరుగునపుడు పీరును ఎత్తుకొన్న మనిషిలోనికి ఆ పేరుగల సూక్ష్మము చేరి, ఎత్తుకొన్న వానికి జ్ఞప్తి లేకుండ పోతుంది. అప్పుడు ఎత్తుకున్న వ్యక్తిలోనికి చేరిన వీరు, ఆ వ్యక్తి శరీరము ద్వారా మాట్లాడడము, ఊగడము, తూగడము, ఎగరడము చేయుచుండును. అలా పూనకము వచ్చిన పీర్లు కొన్ని శాంత స్వభావముతో ఉండును. కొన్ని చురుకుతనము కల్గి ప్రజలను అడిగి లేక బెదిరించి, తమ కోర్కెలను, మ్రొక్కుబడులను నెరవేరు నట్లు చేసుకొనుచుందురు. అలాంటి పీర్లు పేరు పొందియుండును. (ఊరి పేరు సరిగా జ్ఞాపకములేదు, బహుశ ఆ మాంత్రికుడు చెప్పినది కుంటిమద్ది అను గ్రామమే అనుకుంటాను) కుంటిమద్ది గ్రామములో ఒక పీరు ఎవరు ఎత్తుకొనినా, పూనకమువచ్చి ఊరంత తిరిగి తనకు ఇష్టము వచ్చినవారి ఇంటికిపోయి అక్కడ వారిని పరామర్శించడమో, విమర్శించడమో, దండించడమో చేసివచ్చుచుండును. అలా చేయడము వలన కొందరు మనుషులు, అన్ని పీర్లలో ఆ పీరు గొప్పదని చెప్పు కొనుచుండగ, కొందరు ఆ పీరు గొప్పతనము ఏమీలేదు, కానీ ఆ పీరును ఎత్తుకున్న మనుషులు పూనకము వచ్చినట్లు నటించి, వారే కొన్ని ఇళ్ళకు పోయి రాద్దాంతము చేసి వస్తున్నారు. అందువలన ఆ పీరుకు పేరువచ్చింది, అని అనువారు కూడ కలరు. పేరుగాంచిన వీరును ఎత్తుకొన్న మనిషికి, ఆ పీరు పూనకమే రాలేదు అనువారిలో, నావద్దకు వచ్చి మాట్లాడిన మాంత్రికుడు కూడ ఒకడు. పీర్లు ఊరేగించునపుడు గానీ, పీర్లు చావిడిలో నిలబెట్టి ఉన్నపుడుగానీ, పీర్లకు చక్కరను చదివించుటకు, అలంకరించుటకు ప్రత్యేకమైన వ్యక్తి పీర్ల పూజారి మాదిరి ఒక వ్యక్తి ఉండును. పీర్ల పూజారిని ముజావర్ పేరుతో పిలుస్తారు. పీర్లవద్ద నుండు ఆ వ్యక్తితో ఒక రోజు మాంత్రికుడు పూర్తిగా వాదిస్తూ ఇలా అన్నాడు. "నేను మాంత్రికుణ్ణి ఎన్నో మొండి దయ్యాలను కూడ విడిపించాను. నాకు అన్నీ తెలుసు, ప్రతి సంవత్సరము ఒకే మనిషి ఆ వీరును ఎత్తుకొనుచున్నాడు. ప్రతిమారు ఆ మనిషే ఎందుకు ఎత్తుకోవాలి? మీరు చెప్పునట్లు ఆ పీరు పూనకము రాకున్నా, దానిని ఎత్తుకొన్న మనిషి పూనకము వచ్చినట్లు నటించి పీరుకు పెద్దపేరు వచ్చునట్లు చేశాడు”.


---

ఆ మాటకు ఆ పూజారి ముజావర్ బదులుగా ఇలా అన్నాడు “నీవు అనుకొన్నట్లు ఏమీ జరుగదు. ఎవరూ నటించరు. ఆ పీరును ఎవరు ఎత్తుకొన్నా, వారి మీదికి ఆ పీరు వచ్చి మాట్లాడుతుంది. ఆ పీరును ప్రతి సంవత్సరము ఒకే మనిషి ఎత్తుకొనే దానికి కారణము ఏమంటే? ఆ పీరును ఎత్తుకొనే దానికి ఎవరూ ముందుకు రావడము లేదు. ఏ పీరును ఎత్తుకొన్నా అర్థగంటకంటే ఎక్కువసేపు ఎత్తుకొన్న వారికి ఆ పీరు పూనకములో ఉండదు. ఈ వీరు మాత్రము మూడుగంటలసేపు పూనకములో ఉంటుంది. అంతసేపు పూనకములో ఉండుట వలన, ఆ పీరును ఎత్తుకొన్న మనిషికి రెండు రోజుల వరకు శరీరములో నొప్పులు ఉంటాయి. అందువలన ఆ పీరును మొదటినుండి ధైర్యముగా ఒకేవ్యక్తి ఎత్తుకుంటున్నాడు. అంతేతప్ప ఇందులో మోసములేదు.”

అప్పుడు మాంత్రికుడు “నీమాట నిజమైతే ఈ సంవత్సరము ఆ పీరును నేను ఎత్తుకుంటాను. నీవు చెప్పినట్లు నాకు పూనకము వస్తే నేను కూడ ఈ పీరు గొప్పదని ప్రచారము చేస్తాను. ఒకవేళ నాకు పూనకము రాకపోతే, మీరు చెప్పునదంతా అబద్దమని, పీరులో ఏమిలేదనీ, పీరును ఎత్తుకొన్న మనిషే అలా చేస్తున్నాడని నేను ఊరిలో దండోరా వేయిస్తాను” అన్నాడు. పీర్ల పూజారి కూడ సరేనన్నాడు. ఇదంతా మాంత్రికుడు స్వయముగా నాతో చెప్పిన విషయము. అంతేకాక ఆ మాంత్రికుడు ఇంకా ఏమి చెప్పాడనగా! ఒకవేళ ఆ పూజారి ముజావర్ చెప్పునట్లు ఎత్తుకొన్న మనిషిలోనికి ఆ పీరు వచ్చే మాట సత్యమే అయినా చివరకు నేనే గెలుస్తాను. ఎందుకనగా! నేను మాంత్రికున్ని కాబట్టి నాలోనికి ఎవరూ చేరరు. ఎవరికైనా పట్టిన దయ్యాలను నేనే విడిపిస్తా ఉంటాను. నన్ను చూస్తే దయ్యాలు భయపడుతాయి. అలాంటప్పుడు పీరుకూడ ఒక దయ్యములాంటిదే కదా! అలాంటప్పుడు అది నాలోనికి ఎలా పూనకము వస్తుంది? ఏమాత్రము రాదు, అందువలన నేనే గెలుస్తాను అన్నాడు.


ఆ పీరును నేనే ఎత్తుకుంటానని మాంత్రికుడు చెప్పిన తర్వాత కొంతకాలానికి పీర్లపండుగ వచ్చింది. అప్పుడు మాంత్రికుడు ముందే చెప్పిన ప్రకారము వీరును ఎత్తుకొనే దానికి పోయాడు. అందరూ పీర్లు ఎత్తుకొన్నట్లే మాంత్రికుడు కూడ అక్కడున్న ప్రత్యేకమైన పీరును ఎత్తు కొన్నాడు. పీర్ల చావిడి ముందర త్రవ్విన గుండమువద్దకు వచ్చి గుండము చుట్టూ తిరిగి ఊరేగింపుకోసము ఊరులోనికి పీర్లు పోవాలి. చావిడి దగ్గర పీర్లు ఎత్తుకొన్న వారందరు గుండము ముందరికి వస్తూనే పీర్లు పూనకము వచ్చినవి. కానీ మాంత్రికునికి పూనకము రాలేదు. అప్పుడు సాయంకాలము ఐదుగంటలైనది. మాంత్రికుడు గుండము చుట్టు పీరును ఎత్తుకొని తిరిగినాడు. అప్పటికీ పూనకము రాలేదు. గుండము చుట్టు తిరిగి గుండము ముందర నిలుచుకొని వేచి చూచారు. అప్పటికీ రాలేదు. నాలోనికి ఏదిరాదు అనే ధైర్యముతో మాంత్రికుడున్నాడు. అలా నిలబడినపుడు ముజావర్ ఉర్దూ భాషలో కల్మాలాంటి మంత్రము చదువుచున్నాడు. మాంత్రికుని వీపుమీద ఎవరో గట్టిగ కొట్టినట్లు ఫలీమని శబ్దము వచ్చింది. ఆ ఏటుకు మాంత్రికుడు పట్టు తప్పిపోయి గిర్రున ఒక చుట్టు తిరిగాడు. అంతవరకు జ్ఞప్తికి ఉన్న మాంత్రికునికి, ఒక చుట్టు తిరిగేలోపల జ్ఞప్తి పోయింది. తర్వాత ఏమి జరిగిందో ఏమాత్రము అతనికి తెలియదు. మూడుగంటల తర్వాత పీరును దించిన సమయములో జ్ఞాపకము వచ్చింది. అంతవరకు బాగానిద్రపోయి లేచినట్లయింది. అతను జ్ఞప్తిలోనికి వచ్చి చూచేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైనది. లెక్క ప్రకారము నాలుగుగంటల కాలము తనకు తెలియకుండ పోయింది. ఆ నాలుగు గంటలు శరీరములోనికి పీరు చేరినట్లు అతనికి అర్థమైనది. అప్పుడు ముజావర్ ముందర తాను ఓడిపోయినట్లు మాంత్రికునికి అర్థమైనది.


అలా మాంత్రికుడు అవమానముపాలై, కొంత మర్యాదను ప్రజలవద్ద పోగొట్టుకొని, తనకు పూనకము ఎలా వచ్చిందో అర్థముకాక, దాని వివరమును తెలుసుకొనే దానికి నావద్దకు వచ్చి విషయమంతటిని పూస గ్రుచ్చినట్లు


---

చెప్పాడు. దానినంతటిని విని నేను ఇలా చెప్పాను. “నీవు కేవలము మాంత్రికునివి మాత్రమే, నీ మంత్రబలము మీద నీకు నమ్మకము ఎంత ఉండినా, నీ మంత్రబలముకంటే పెద్దబలము లేదనుకోవడము నీ పొరపాటు. నీవు మాంత్రికునివి కాబట్టి నీకు దయ్యాలు భయపడుతాయి, నీ మంత్రబలముచేత పారిపోతాయి. అంతమాత్రమున నీవు పీరు నా శరీరములోనికి రాలేదు అనుకొన్నావు. కానీ ఆ వీరు సాధారణ దయ్యమా, అసాధారణ దయ్యమా అని ఆలోచించలేకపోయావు. మన భాషలో దయ్యమును గ్రహము అంటాము. గ్రహము అనగా ముందే వివరము చెప్పాము.) గ్రహముకంటే అన్ని విధముల శక్తి ఎక్కువగల దానిని విగ్రహము అంటాము. గ్రహము అనినా, విగ్రహము అనినా రెండు దయ్యాలే అయినా శక్తిలో ఎంతో తేడా ఉండును. అలాంటి తేడాగల విగ్రహము ఆ పీరులో ఉండవచ్చును. అందువలన అది నీలో చేరగలిగింది. నీవు నాలోనికి ఏది చేరలేదు అని జ్ఞప్తిగా ఉన్నపుడు, ఆ ఎరుకను మరిపించుటకు ఆ పీరు విగ్రహము నిన్ను వీపు మీద గిర్రున తిరుగులాగున కొట్టింది. ఊహించని ఆ దెబ్బకు నీవు ఒక ప్రక్కకు తిరుగుచు దయ్యము (పీరు) ఆలోచనను నీవు మరిచిపోయి నిన్ను నీవు రక్షించుకొను ధ్యాసలో ఉన్నపుడు ఆ పీరు నీలోనికి చేరింది. నాలోనికి ఏది చేరదు అను ఉద్దేశమును ఒక్క క్షణము లేకుండ చేయుటకు నిన్ను కొట్టడము జరిగింది. ఆ ' క్షణములో నీలోనికి చేరిపోయింది.


అక్కడ జరిగిన విషయమును పట్టి చూస్తే, నీవు నాలోనికి చేరవు అన్న మాటను పందెముగ తీసుకొని, పట్టువదలక ఆ పీరు నీ లోనికి చేరింది. అంతేకానీ అది నీ మీద కక్షతోనో, కోపముతోనో చేరలేదు. అందువలన నాలుగు గంటల కాలము నీ శరీరమును తన ఆధీనములో పెట్టుకొని, ఏ హాని చేయకుండ వదలిపోయింది. ఒకవేళ నీ మీద కోపముతో నీ శరీరములో చేరియుంటే అది అంత సులభముగా వదిలేది కాదు. నాలుగు గంటలుండి వదలి పోయిన తర్వాత, నీవు నాలుగు వారములు ఆసుపత్రికి పోవలసి వచ్చేది. నీకు " అర్థమగుటకు గతములో జరిగిన చిన్న ఉదాహరణను చెప్పుతాను విను. అనంతపురము జిల్లాలోనే గుత్తికి సమీపములో ఓబులాపురము అను గ్రామము కలదు. ఆ గ్రామములో ఉపసర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆ ఊరిలోని పీరును గురించి నీవు మాట్లాడినట్లే మాట్లాడినాడు. అంతేకాకుండ ఆ ఊరి పేరును గురించి దుర్భాషగ మాట్లాడడము జరిగినది. నీవు నాలోనికి రాదు అని మాత్రము అన్నావు. కానీ అతను పీరు పూనకము రావడము అబద్దము, అలా వచ్చినదని చెప్పితే వీరు ఎత్తుకున్న వానిని చెప్పుతో పూనకమున్నపుడే కొట్టుతాను, ఎవడు ఎత్తుకోక పోతే నేనే ఎత్తుకొని పూనకము అబద్దము అని చూపిస్తాను, మనుషులు అడే నాటకమే పూనకము. జానెడు రేకుకు కట్టెను తగిలించి ఎత్తుకొని దేవుడొచ్చాడని ఎగురుతారా? అని అన్నాడు. పీరును జానెడు రేకు అన్నందుకు, పూనకము వచ్చిన వానిని చెప్పుతో కొట్టుతాను అన్నందుకు ఆ పీరుకు కోపము వచ్చింది. ఇక మీదట ఎవరూ తనను గురించి మాట్లాడకుండ భయముండులాగున చేయాలను కొన్నది. వీర్లపండుగ అతను మాట్లాడిన మూడవరోజే వచ్చింది.



పీర్ల పండుగ దినమున గొప్ప పేరున్న ఆ పీరును ఎవరూ ఎత్తు కోలేదు. ఉపసర్పంచ్ తిట్టినాడు కాబట్టి ఎవరు  ఎత్తుకొనే దానికి ముందుకు రాలేదు. ఎవరూ ఎత్తుకోక పోవడము వలన ఆ పీరును తిట్టిన ఆ సర్పంచ్ నేనే ఎత్తుకుంటానని ఎత్తుకున్నాడు. ఊరేగింపు మొదలైంది. సమయము కొరకు వేచి చూస్తున్న ఆ పీరు యొక్క సూక్ష్మము ఆ ఉపసర్పంచ్ శరీరము లోనికి ప్రవేశించింది. వెంటనే అతను కళ్ళు పెకలించి చూస్తూ, మోకాళ్ళ మీద నడువను మొదలుపెట్టాడు. అది చూచిన ప్రక్కన వాళ్ళు పైకిలేపి నిలబెట్టినా, తిరిగి మోకాళ్ళ మీదనే కూర్చొని నడుస్తున్నాడు. అది చిన్న ఊరు కావున ఒక గంటసేపుకు ఊరేగింపు అయిపోయింది. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ పీరు అతని


---

శరీరమునుండి తేలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞాపకము వచ్చింది. అతనికి మతికి వస్తూనే మోకాళ్ళ వద్ద నొప్పి కనిపించింది. కాళ్ళవైపు చూచుకుంటే మోకాలి చర్మమంతా కచ్చులు, కచ్చులుగా చీలి రంధ్రాలుపడి రక్తముతో తడిసి ఉన్నాయి. ఏమి జరిగింది అని ప్రక్క వారిని అడుగగ వారు జరిగిన విషయమంతా చెప్పారు. అప్పుడు పీరు అంటే భయము చుట్టుకొన్నది. కాళ్ళు బాగుచేయించుకొనుటకు పది రోజులు ఆసుపత్రిలోనే ఉండిపోయాడు.


ఒక లెక్క ప్రకారము చూస్తే, ఓబులాపురములోని పీరు అతనికి వేసిన శిక్షకంటే నీకు జరిగిన అవమానము పెద్దదికాదు. నీవు మాంత్రికునివై ఉండి, గ్రహాలకు (దయ్యాలకు), విగ్రహాలకు (దేవుళ్ళకు) తేడా తెలియని దానివలన ఆ పీరు తన ఉనికిని తెలిపే నిమిత్తమే నీలోనికి ప్రవేశించి వదలింది. సర్పంచికి అట్లుకాదు. ఆ ఊరిలో అందరికి భయము కల్గులాగున మోకాళ్ళ మీద నడిపించింది. ఆ ఆ సర్పంచ్కు కేవలము అజ్ఞానము తప్ప ఏ శక్తి లేదు. నీకు కొంత మంత్రశక్తి అయినా ఉన్నది. కానీ నీ లోనికి చేరిన పీరుకు ఏదో కొంతశక్తి, నీ మంత్రశక్తికంటే ఎక్కువ ఉండుట వలన నీలోనికి చేరి నీకంటే నేనే గొప్ప అని అర్థమగునట్లు చేసింది. నీవు ఏదో గొప్పగ అనుకొన్న మంత్రశక్తి, ఒక పీరు ముందరే లెక్కకు పడలేదు. అందువలన ఇటువంటి మంత్రములను, దాని శక్తులను, నమ్ముకొనే దానికంటే అన్నిటిని మించిన దైవజ్ఞానమును, దానిశక్తిని సంపాదించుకో! దైవశక్తిగల మనిషి వద్ద ఎంత పెద్ద దయ్యములైనా, దేవతలైనా తలవంచి నడుచుకొంటారు. నీవు ఇప్పటినుండి క్షుద్రమైన మంత్రములను వదిలివేసి, పవిత్రమైన జ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించు అని అతనికి హితము చెప్పగా అతను బాగా విని స్పందించి, తనకు తెలియని జ్ఞానమును గురించి అడిగి తెలుసుకొని, జ్ఞానమార్గములోనే నడుచుకొంటానని చెప్పి పోయాడు.




భూమిమీద కనిపించని జగతిలో దయ్యాలు, దేవుళ్ళు కలిసి యున్నారు. అందరూ జీవులే అయినప్పటకీ, కొందరు జీవులు దయ్యాల తెగలోనివారు, కొందరు దేవుళ్ళ తెగలోనివారని తెలియుచున్నది. చాలా మంది శాస్త్రవేత్తలు కనిపించని దానిని నమ్మరు, తెలుసుకొనే దానికి ప్రయత్నము కూడ చేయరు. కనిపించనిది లేదనుట, కనిపించేది ఉందనుట వారి సూత్రము. ఏదో సమాజమునకు మేము మేలు చేస్తున్నామను ఉద్దేశముతో సత్యమును కూడ అసత్యమంటే దానివలన సమాజమునకు కీడే జరుగును. సమాజములో దేవుళ్ళ పేరుతో మోసము చేయువారు కొందరుండవచ్చును. అటువంటి వారిని అడ్డము పెట్టుకొని దేవుళ్ళు, దయ్యములు లేవు అనడము సమంజసముకాదు. ఇపుడు చెప్పిన పీర్ల విషయములో జరిగిన దానిని అనగా పూనకమువచ్చి మోకాళ్ళుకు గాయమైన దానిని సత్యము అందామా? అసత్యమందామా? చూచే దానికి పైకి కనిపించు సత్యము, కావున దానిని సత్యము అంటే, అది జరిగినట్లు అతనికి జ్ఞాపకము వచ్చు వరకు తెలియదు. కాళ్ళు గాయమైనపుడు, పూనకములో ఉన్నప్పుడు ఆ విషయము ఎవరికి తెలిసినది? అంటే ఆ సత్యమును హేతువాదులు చెప్పలేరు. ఎందుకనగా! ఆ సమయములో శరీరములో ఎవరున్నది వారికి తెలియదు. పైకి కనిపించు మనుషుల శరీరములలోనే కనిపించని జీవున్ని తెలియనివారు, తమ శరీరములోపల తాము ఎలా ఉన్నారో తమకే తెలియనివారు, తమకు తెలిసిన శాస్త్రములను అనుసరించి లోపలి విధానమును, లోపల జీవున్ని గుర్తించలేరు. కనిపించు శరీరములలో జరుగు విధానము ఏదో తెలియనపుడు, అసలుకు శరీరము లేనివారిని, శరీరములో చేరని వానిని గురించి ఏమాత్రము చెప్పలేము. ఇంతవరకు శరీరములోనికి చేరు దయ్యములను, దేవతలను, వారిలోనే మహాత్ములను గురించి చెప్పుకొన్నాము కదా! ఇపుడు శరీరములో చేరకుండా అన్యాయమును ఖండించి, అన్యాయమును చేసినవారికి కల్గించిన నష్టమును చూస్తే, ఇంకా ఇలాంటివి మనుషులకు తెలియకుండా ఎన్ని జరుగుచున్నవో ఎలా తెలియగలవు? అను ప్రశ్న రాగలదు. అటువంటి ఒక యదార్థసంఘటనను గురించి చెప్పుకొందాము.


---

అది ఒక పల్లెటూరు. ఆ ఊరి బయట రోడ్డు ప్రక్కన ఒక పచ్చిమిరప తోట ఉంది. దానికి ఒక మనిషి కాపలాగా కూడ ఉన్నాడు. ఒకరోజు దారిలో పోవు ఒక సాధువు తోట ప్రక్కలో పోతూ, తోటలోని మిరపకాయలను చూచి రెండు మిరపకాయలను త్రుంచుకోవాలనుకొన్నాడు. వెంటనే తోటలోనికి పోయి, రెండే రెండు మిరపకాయలు త్రుంచుకొన్నాడు. అతనివద్ద అన్నము మాత్రమున్నది, కూర లేదు. అందువలన కూర బదులు మిరపకాయ కొరుక్కొని అన్నము తినవచ్చుననుకొన్నాడు. అతను మిరప కాయలు త్రుంచినది తోట కాపలదారుడు చూచాడు. కాపలాదారుడు అరుస్తూ అక్కడికి వచ్చాడు. సాధువును నానా దుర్భాషలాడి, మిరపకాయలు ఎందుకు త్రెంచావని అరుస్తూ అతను ఏమి చెప్పినా వినకుండ, కేవలము రెండుకాయలే త్రెంచితినని చెప్పినా వినకుండ, సాధువును బాగా తన్నినాడు. రెండు మిరపకాయలకు సాధువును అంతగ తన్నడము చూచిన వారికి ఎవరికైన అన్యాయమనిపిస్తుంది. కాని అక్కడ ఎవరూలేరు. సాధువు బాధపడుచు తన దారిన తాను పోయాడు. అయినా ఆ విషయమును అంతటిని ఒక వ్యక్తి గమనించాడు. ఇద్దరి స్థూలశరీరముల మధ్య జరిగిన సంఘటనను ఒక సూక్ష్మశరీరి అయిన వ్యక్తి చూచాడు. సూక్ష్మశరీరి అంటే కనిపించని వ్యక్తి అని అర్థము. కనిపించని వ్యక్తికి ఆ సంఘటన చాలా అన్యాయమని పించింది. అయినా తాను కనిపించని వ్యక్తి అయినందువలన అప్పుడు తానేమి అనలేక పోయాడు. అయినా ఆ తోట కాపలాదారునికి తగిన ప్రాయశ్చిత్తము చేయాలనుకొన్నాడు. ఆ దినము రాత్రికి వచ్చి ఆ తోటలో ఒక సెంటు జాగాలోనున్న మిరపచెట్లను పెరికి కుప్పవేసి పోయాడు. తెల్లవారిన తర్వాత ఆ తోట కాపలాదారుడు వచ్చి చూచి లబోదిబోమన్నాడు. నిన్న రెండు మిరపకాయలకు ఒక సాధువును కొట్టినాను కదా! అతనే కక్షతో రాత్రికి వచ్చి నా చెట్లను పెరికాడనుకొన్నాడు. కాని సాధువుకు ఏమి తెలియదు. తన దారిన తాను ఏడుస్తూ పోయాడు. ఆ సంఘటన చూచిన మూడవవ్యక్తి పెరికి వేశాడను విషయము తోటమాలికి తెలియదు. రెండవరోజు రాత్రి కూడ ఒక సెంటు జాగాలోని మిరపచెట్లు పెరకబడి ఉండడము తోటమాలి చూచాడు. ఈమారు సాధువు మీద చాలా కోపము వచ్చినది. మూడవ దినము కూడ ఆ విధముగనే చేస్తాడని ఊహించిన తోటమాలి రాత్రికి వచ్చి తోట దగ్గరనే పడుకోవాలనుకొన్నాడు. అలాగే రాత్రికివచ్చి తోటలోపడుకొన్నాడు. రాత్రి 12 గంటల వరకు మేల్కొని తర్వాత నిద్రపోయాడు. తెల్లవారి చూచాడు. ఇంకేముంది మూడవరోజు కూడ చెట్లు పెరకబడినాయి. తాను ఇక్కడే పడుకొన్నా ఫలితము లేకుండపోయిందని అనుకొన్నాడు. పెరకబడిన చెట్లను చూచి చాలా బాధ అయినది. ఈ మారు సాధువును ఎలాగైన పట్టుకొని బాగా తన్ని తన తోటవైపు రాకుండ చేయాలనుకొన్నాడు. నాల్గవరోజు రాత్రి తోట దగ్గరకు వచ్చి కాపలాగ కూర్చున్నాడు. ఈ మారు నిద్రపోకుండ జాగ్రత్తగ ఉన్నాడు. రాత్రి 12 గంటలు దాటింది, తెల్లని దుస్తులు వేసుకొన్న ఒక ఆకారము దూరముగ వస్తున్నట్లు అగుపించింది. వెంటనే తోటమాలి జాగ్రత్తపడ్డాడు. చేతికర్ర తీసుకొని అటువైపు పోయాడు. తోటమాలి తాను పోతూవున్నట్లే కనిపించిన వ్యక్తి తోటలోనికి రావడము చెట్లు పెరికి ఆ వ్యక్తి తిరిగిపోవడము జరిగినది. ఈ మారు తాను చూస్తూ వస్తున్నట్లే ఇంత స్పీడుగా పని జరిగిపోవడము తోటమాలికి ఆశ్చర్యము వేసింది. నాల్గవదినము కూడ సెంటు జాగాలో చెట్లు పెరకబడినాయి. ఎవరు వచ్చినది అంతుబట్టలేదు, సాధువైతే కాదనిపించింది. దూరము నుండి చూస్తూన్నట్లే తోటలోనికి రావడము, పోవడము జరిగిపోయినదంటే ఆశ్చర్యముగ ఉన్నది. ఈ విషయమంతా ఊరిలో చెప్పాడు. అందరికి వింతకథగ కనిపించింది. ఐదవరోజు ఊరిలోని ఐదుమంది కూడ వచ్చి ఒకచోట కూర్చొని జాగ్రత్తగా చూడసాగారు. వారందరు తోటకు ఒక మూలలో కూర్చొని ఉన్నారు. అర్థరాత్రి దాటింది. వారికి ఎదురు మోటులో ఒక మనిషి వచ్చినట్లు కనిపించింది. వెంటనే అందరు కేకలు వేయుచు అటువైపు పోయారు. అటువైపు పోయే లోపలే వచ్చిన వ్యక్తి చెట్లను పెరికి పోవడము జరిగినది. దూరమునుండి తెల్లని ఆకారము కనిపిస్తుంది, కానీ


---


ఫలనా మనిషి అని ఎవరికీ తెలియదు. అటువైపు పోయేలోపలే తన పని ముగించుకొని పోవడము అంటే, అది మనుషులతో అయ్యేపని కాదని, అది దయ్యము పనే అయి ఉండవచ్చునని కొందరికి అనుమానము వచ్చినది. మరుసటి దినము ఈ విషయమే ఊరంతా చర్చనీయాంశమైనది. ఏదో దయ్యమంట! మిరపతోటను ప్రతి దినము పెరికి వేస్తున్నదట! అని కొంత ప్రచారముకాగ, అలా కాదు ఏ దయ్యాలు అట్లు చేయవు, ఇదేదో మనుషుల పనియేనని కొందరు అనుకొనుట ప్రారంభించారు. ఆరవదినము ఆ విషయమును గూర్చి తేల్చుకోవాలని ఊరిలోని వారికి కూడ పట్టుదల కల్గినది. ఆ దినము నలభైమంది యువకులు అందరు తోడై కట్టెలు తీసుకొని రాత్రి తోటవద్దకు వచ్చారు. నలభైమంది నాలుగు గుంపులుగా విడిపోయి, నాలుగువైపుల కాపలా ఉండునట్లు మాట్లాడుకొన్నారు. ఒక గుంపుకు పదిమంది ప్రకారము విడిపోయి నాలుగువైపుల వేయికళ్ళతో చూస్తున్నారు. రాత్రి 12 గంటలైనది. ఒక గుంపులో చిన్న రాయి పడినది. ఎక్కడిది ఆ రాయి అని చూచుకొను లోపల మరొక చిన్నరాయి పడినది. పడిన రాయి వక్క (పోక) సైజుకంటే లావులేవు. నీవు ఏమైన వేశావా అని ఒకరినొకరు అడుగుకొని ఎవరు వేయలేదని నిర్ధారించుకొన్నారు. అయినా చిన్నరాళ్ళు ఎక్కడినుండి పడినవని ఆలోచించసాగారు. అంతలో వారిముందర ఉన్న చిన్నరాయి చూస్తున్నట్లు గానే ఎగిరిపడింది. అందరు అశ్చర్యముగ చూస్తున్నట్లుగానే ఒకరాయి తర్వాత ఒకటి క్రిందనున్న రాళ్ళు ఎగురుటకు మొదలుపెట్టాయి. వాటంతటవి మనిషి ఎత్తు ఎగిరెగిరిపడుచున్న ఆ రాళ్ళను చూచి అందరికి భయమువేసింది. ఇది మనుషులు చేయు పనికాదని అర్థమైనది. రాళ్ళు పడినగుంపు భయపడి మరొక గుంపువద్దకు పోయారు. వారివద్ద కూడ ఆ విధముగానే జరిగినట్లు విని ఆశ్చర్యపోయారు. అందరు ఒకచోట చేరి అందరికి అలాగే జరిగినట్లు చెప్పుకొన్నారు. ఇలా అందరు భయపడుచు ఒకచోట గుమికూడి చూస్తున్నట్లుగానే తోటలో ఒక ఆకారము కనిపించింది. ఈ దఫా ఎవరూ అటువైపు పోలేదు. ఎవరికీ అటువైపు పోవుటకు ధైర్యము చాలడము లేదు. ప్రతి దినము జరిగినట్లే ఆ దినము కూడ జరిగినది, చెట్లు పెరకబడినాయి. ఆ ఆకారము అక్కడినుండి పోయినట్లు నిర్ధారించుకొన్న తర్వాత అందరు తోటలోనికి పోయి చూచి చెట్లు ఆ రోజు కూడ పెరకబడినట్లు తెలుసుకొన్నారు. అందరు ఇదేమి వింత అని ఆలోచిస్తువుండ గానే నారాయణరెడ్డి అను అతని మెడమీద చేతితో ఫలీమని కొట్టి నట్లయినది. కొట్టిన శబ్దము అందరికి వినిపించింది. దెబ్బతిన్న నారాయణరెడ్డి అబ్బా అని గట్టిగ అరిచాడు. ఎవరు కొట్టినదీ అర్థముకాలేదు. అందరికీ భయమువేసింది. అక్కడనుండి అందరూ ఊరిలోనికి పోయారు. ఆ దినము నుండి ఎవరు ఆ తోటవైపు పోలేదు. తోటలో చెట్లు మాత్రము ప్రతి దినము కొన్ని పెరకబడేవి. ఆ విధముగా తోటలోని చెట్లన్ని అయిపోయినవి. రెండు మిరపకాయలు, అవి కూడ అన్నములోనికి తీసుకొంటే సాధువును అంతగ కొట్టి, చివరకు ఏమి చేయలేక తోటమాలి తన తోట మొత్తమును పోగొట్టుకున్నాడు.


ఇటికాల గ్రామములోని వ్యక్తి టెలిఫోన్ డిపార్టుమెంట్ నందు తాడిపత్రిలో ఉద్యోగిగానున్న నారాయణరెడ్డి ద్వార ఈ సంఘటన విషయమంతా నాకు తెలిసినది. నాకు తెలిపిన నారాయణరెడ్డి ఘటన జరిగిన ఆ పొలమువద్దకు రెండు రోజులు కాపలాగా పోయిన వ్యక్తి! అక్కడ జరిగనదంతా కళ్ళారా చూచిన వ్యక్తి! అంతేకాక చివరిలో మెడమీద కొట్టించుకొన్న వ్యక్తి కూడ ఈయనే! 1988వ సంవత్సరము నాకు ఈ సంఘటన సమాచారము చెప్పాడు. అప్పటికి దాదాపు 20 సంవత్సరముల ముందు అది జరిగినట్లు చెప్పాడు. ఆ లెక్క ప్రకారము 1968వ సంవత్సరము సమయములో జరిగి ఉండవచ్చును. దాని ప్రకారము ఇప్పటికి 42 సంవత్సరముల క్రిందట జరిగినట్లు అర్థమగుచున్నది. ఈ సంఘటనలో స్థూలశరీరము అనుమాటగానీ, పూనకము అనుమాటగానీ ఏమాత్రము లేదు. అక్కడ జరిగిన విషయమును అంతటిని చూస్తే ఎన్నో ప్రశ్నలు వచ్చుచున్నవి. సూక్ష్మములను గురించి బాగా తెలిసినవారు ఎంతో బాగా యోచిస్తేగానీ,


---

ఆ ప్రశ్నలకు జవాబులు దొరకవు. అటువంటపుడు సూక్ష్మములను గురించిగానీ, వాటి మనుగడను గురించి గానీ, వాటిలోని తరగతులనూ, హెూదాలను గురించిగానీ తెలియనివారికి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకదు. ఇక్కడ కొందరికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఇక్కడ కొందరికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరికినా, సూక్ష్మములను గురించి తెలిసినవారికి కూడా జవాబు దొరకని ప్రశ్న ఒకటి గలదు. అదేమనగా! కనిపించని సూక్ష్మము కనిపించే స్థూలమును కదిలించగలదా? ఇటు ఆస్తికవాదులకు అటు నాస్తికవాదులకు మరియు హేతువాదులకు దొరకని జవాబు కావున, అందరూ దీనిని మొత్తానికి అబద్దము అని అంటారు. తెలియక వారు అబద్దము అనినా, అది జరిగిన వాస్తవ సంఘటన కావున, మేము అందరిలాగ అబద్ధము అనుటకు వీలులేదు. అంతేకాక ఇటువంటి రకమునకు చెందిన సమాచారము మరొకటి కూడ కలదు. మేము నివాసమున్న తాడిపత్రిలోనే జరిగిన ఈ సంఘటనలో కూడ కనిపించని సూక్ష్మము, కనిపించే స్థూలమును కదిలించడమూ, ప్రక్కకు లాగడము జరిగినది. కనిపించని సూక్ష్మము కనిపించే మిరపతోటను పెరికిన విధానమునకు బలమును చేకూర్చు తాడిపత్రిలో జరిగిన దానిని వివరిస్తాము చూడండి.


ఇప్పటికి దాదాపు 50 సంవత్సరముల పూర్వము తాడిపత్రిలో ఒక బ్రాహ్మణ కుటుంబము అప్పులపాలైపోయి, తాము నివాసమున్న ఇంటిని అమ్మివేశారు. ఆ ఇంటినికొన్నవారు ముస్లీమ్లు. ఇల్లును అమ్మిన తర్వాత బ్రాహ్మణ కుటుంబము, ఆ ఇల్లును ఖాళీ చేసి వెళ్ళి పోయింది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరము వరకు ఆ ఇల్లు ఖాళీగానే ఉండేది. కిరాయికి ఇస్తామని చెప్పినా ఎవరూ ఆ ఇంటిలోనికి రాలేదు. కొన్నవారు కూడ ఆ ఇంటిలోనికి చేరలేదు. సంవత్సర కాలము చూచినా ఆ ఇంటిలోనికి కిరాయికి ఎవరూ రాలేదు. చివరికి ఆ ఇల్లునుకొన్న ముస్లీమ్ కుటుంబము ఖాళీ ఇంటిలోనికి చేరినది. ఇదంతా బయటికి తెలిసిన విషయము. ఇక బయటికి తెలియని విషయము కూడ కొంతగలదు. అదేమనగా! ఆ ఇంటిలో బ్రాహ్మణకుటుంబము కాపురమున్నప్పుడు, ఆ కుటుంబమునకు చెందిన ఒక బ్రాహ్మణ స్త్రీ అర్థ ఆయుస్సు గడిచినదై అకాలమృత్యువు పొందినది. అకాలమృత్యువును పొందిన ఆమెకు, స్థూలశరీరము పోయి సూక్ష్మశరీరము మిగిలింది. ఆ సూక్ష్మశరీరముతోనే మిగత అర్థ ఆయుస్సు గడచువరకు జీవించి ఉండవలెను. అలా జీవిస్తున్న ఆమె కనిపించక ఆ ఇంటిలోనే నివాసమున్నది. వారు ఇల్లు అమ్మకముందే ఏడెనిమిది సంవత్సరములనుండి, చనిపోయిన బ్రాహ్మణస్త్రీ సూక్ష్మశరీరముతో అక్కడ ఉండడము జరుగుచున్నది. బ్రాహ్మణులు తమ ఇంటిని అమ్మి, ఇల్లును వదలిపోయినా చనిపోయిన బ్రాహ్మణ స్త్రీ మాత్రము ఇల్లు విడిచిపోలేదు. ఇల్లును అమ్మినవారు ఆ ఇంటిని వారే కట్టించుకొన్నారు. ఆ ఇంటిలో దాదాపు నలభై సంవత్సరములు కాపురమున్నారు. చనిపోయిన ఆమె కూడ చిన్న వయస్సు నుండి ఆ ఇంటిలోనే ఉండి, ఆ ఇంటి మీద బాగా మమకారము పెంచుకొన్న దాని వలన తమ వారందరు ఇల్లును వదలి పోయినప్పటికీ, తాను మాత్రము ఈ ఇల్లు నాదేనను ఉద్దేశముతోనే ఇంటిలోనే ఉండిపోయింది. తమవారు ప్రక్క వీధిలో కాపురమున్నా అక్కడికి పోయి ఉండేది కాదు. ఎప్పుడైన తమవారిని చూడడానికి ప్రక్క వీధిలోనికి పోయినా కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఆ ఇంటిలోనే ఉండేది.


తమవారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీగా సంవత్సరమున్నది కదా! అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీకి ఎటువంటి ఇబ్బంది లేకుండ ఒక్కతే ఆ ఇంటిలో ఉండేది. ఇల్లునుకొనిన ముస్లీమ్ కుటుంబము, ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేది. శుచి, శుభ్రతగల్గి మాంసమును చూస్తేనే సరిపడని ఆమెకు, ఆ ఇంట్లో ముస్లీమ్లు మాంసము తినడమూ, శుచి, శుభ్రతగా లేకుండ ఉండడము చూచి అసహ్యించుకొనేది. ఆ ఇంటిలో చేరుకొన్న వారిని తరిమివేయాలని అనుకొనేది. ఆ ఇంట్లో ఉన్న ముస్లీమ్లను చూస్తే ఆమెకు కోపము వచ్చేది. అయినా వారిని ఏమీ

--

చేయలేక, ఖాళీగా ఉన్న ఒక రూములో ఉంటూ కాలము గడిపేది. అమావాస్య, పౌర్ణమి దినములలో సూక్ష్మశరీరముతోనున్న వారికి బలము ఎక్కువ, ఆ దినములు సూక్ష్మములకు అనుకూలమైన దినములు. అందువలన అమావాస్య, పౌర్ణమి దినములలో రాత్రిపూట అందరు పడుకొన్న తర్వాత తన రూములోనుండి బయటికి వచ్చి, పడుకొన్న చిన్న పిల్లలను మాత్రము ముట్టుకొని, పడుకొన్న చోట కాకుండ కొంత దూరముగా తీసుకుపోయి ఉంచేది. బ్రహ్మణస్త్రీకి చిన్నపిల్లల మీద ప్రేమ ఎక్కువ. అందువలన పిల్లలను మాత్రము ముట్టుకొనేది, కానీ పెద్దలను తాకేది కాదు. ఆమె చనిపోక ముందునుండి మృదు స్వభావముగల మనిషి, కాబట్టి ఆ ఇంటిలోని వారికి ఏ హాని తలపెట్టలేదు.


అమావాస్య దినమునగానీ, పౌర్ణమి దినమునగానీ, రాత్రిపూట చిన్న పిల్లలను పడుకొన్న చోట ఉండనివ్వక, జాగాలు మార్చి పడుకోపెట్టేది. తెల్లవారిన తర్వాత పెద్దలు తమ పిల్లలను చూచి నా దగ్గర పడుకొన్నవాడు అక్కడికి ఎలా పోయాడు? అని అనుకొనెడి వారు. అలా ప్రతి దినము జరుగదు, పదుహేను రోజులకొక మారు జరుగుట వలన? పిల్లలు నిద్రలో దొర్లుతూ పోయారేమో అని అనుకొనెడివారు. వారు అలా పడుకొన్న జాగా మారడము మీద పెద్దగా అనుమానము రాలేదు. ఆ ఇంటిలో ఇద్దరు పిల్లలు మాత్రముండేవారు. అందులో ఒకరికి మూడు సంవత్సరముల వయస్సు, మరొకరికి ఐదు సంవత్సరముల వయస్సు ఉండేది. హాలు మధ్యలో పెద్దల ప్రక్కన పడుకొన్న పిల్లలు, హాలు చివరిలో ఉండడము వలన పెద్దలకు అనుమానమే కలుగలేదు. అదియు నిత్యము జరుగుతుంటే పెద్దలకు కొంత అనుమానము వచ్చేది. ఎప్పుడో పదిహేను రోజులకొక మారు కాబట్టి ఆ విషయము గుర్తింపు రాలేదు. ఇట్లు దాదాపు ఆరు లేక ఏడు నెలలు గడిచింది. జనవరి నెల గడుస్తున్న కాలములో చలి ఎక్కువగా ఉండేది. ఆ నెలలో పౌర్ణమిదినమున కొంత విచిత్రము జరిగినది, అదేమనగా!


హాలులో పడుకొన్న మూడు సంవత్సరముల పిల్లవానిని తీసుకొని పోయి, వంటరూములో పొయ్యి ప్రక్కన పడుకోబెట్టడము జరిగినది. హాలులో చలి ఎక్కువగా ఉన్నది, పొయ్యి వేడిమికి వంటరూములో చలి తక్కువ ఉన్నది, కావున పిల్లవానిని పొయ్యికి దగ్గర పడుకోపెట్టడము జరిగినది. ఆ రోజు తెల్లవారిన తర్వాత, ఆ ఇంటివారు చూచుకొని మూడు సంవత్సరముల పిల్లవాడు ఒంటరిగా, వంటరూములోనికి ఎందుకు పోయాడు? అక్కడే ఎందుకు పడుకొన్నాడు? అని అనుమానము వచ్చింది. అప్పటినుండి నిఘాపెట్టి గమనించసాగారు. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు అలా జరుగుచున్నదని కొంత అర్థమైనది. ఆ విషయము వారికి అర్థముకాక ఎవరినైనా తెలిసినవారిని అడగాలనుకొన్నారు. అలా ఆ విషయమును గురించి భూతవైద్యుల దగ్గరకు పోయి అడిగారు. ఆ భూతవైద్యులకు ఏమి అర్థముకాక, చివరకు ఒక తావెత్తు ఇచ్చి ఇంటి గుమ్మమునకు కట్టు కొమ్మన్నారు. వారు అలాగే చేశారు. వారు అలా తావెత్తును తీసుకువచ్చి వాకిలి వద్ద కట్టడము వలన ఆ బ్రాహ్మణస్త్రీకి కోపము వచ్చింది. నా ఇంటికి తావెత్తులు కట్టుతారా? అని కోపము వచ్చిన ఆమె, ఆ ఇంటినుండి వారిని తొందరగా వెళ్ళకొట్టాలనుకొన్నది. అప్పటినుండి ప్రతిరాత్రి అందరూ బాగా నిద్రపోవు సమయములో, ఇంటిలోని పాత్రలను క్రిందవేసేది. అలా పాత్రపడడము వలన వచ్చిన శబ్దానికి వారు లేచి చూచేవారు. వంటరూము లోని పాత్ర హాలులో వారు పడుకొన్న చోటికి ఎలా వచ్చింది? అక్కడకి ఎక్కడినుండి వచ్చి పడింది? అర్థముకాక ఇదేదో దయ్యముల పనియేనని అనుకొన్నారు. ప్రతిరోజూ రాత్రిపూట ఏదో ఒక శబ్దమువచ్చేది. అంతేకాక అమావాస్య పౌర్ణమి దినములలో పిల్లలను జాగామార్చడము జరిగేది.


ఆ ఇంటిలోని ముస్లీమ్ కుటుంబములో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె మంచి ధైర్యముగల మనిషి, దయ్యాలను గురించి చెప్పినా భయపడేది కాదు. ఒక అమావాస్య రోజు, అందరూ పడుకొని నిద్రపోయినా ఆ ముసలామె


---

పడుకోలేదు, నిద్రపోలేదు. ఆ రోజు రాత్రి ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నది. అలా మేల్కొన్న ఆమెకు, అర్థరాత్రి తర్వాత కొద్దికొద్దిగ నిద్రవచ్చే సమయములో ఐదు సంవత్సరముల పిల్లవాడు కొంత కదిలినట్లు కనిపించింది. వెంటనే వచ్చే నిద్రనుండి బాగా తేరుకొని, నిఘాగా ఆ పిల్లవానివైపు చూచింది. అప్పుడు పిల్లవాని కాళ్ళు పట్టుకొని ఎవరో లాగినట్లు జరుగుతూపోవడము చూచింది. ఆ వృద్ధురాలు చూస్తున్నట్లే, ఆ పిల్లవాడు మూడు అడుగుల దూరము లాగబడినాడు. వెంటనే వృద్దురాలు పిల్లవాడు జరిగిపోకుండ ఆ అబ్బాయి చేతులు పట్టుకొన్నది. అయినా పిల్లవాడు అర్ధ అడుగు ఎవరో బలముగా లాగినట్లు జరిగాడు. అలా జరిగిన పిల్లవానిని వృద్ధురాలు వెనక్కిలాగింది. ఎవరో కనిపించకుండ లాగుచున్నారని ఆ ముసలామెకు అర్థమైనది. వెంటనే గట్టిగా అరిచి ప్రక్కవారిని లేపింది. అందరూ నిద్రనుండి లేచి, ఏమి జరిగిందని అడిగారు. అప్పుడు ఆ వృద్ధురాలు పిల్లవాడు జరిగిపోతుండగా చూచానని, పిల్లవానిని పట్టుకున్నా నని, అయినా ఎవరో గట్టిగా లాగినట్లయినదని విషయమంతా చెప్పింది. ఆ మాటలు విన్న అందరూ భయపడిపోయారు. ఇంతకు ముందు కూడ పిల్లలు ప్రక్కరూములో పడుకొని ఉండడము, రాత్రిపూట పాత్రలు పడడము అన్నీ ఏదో దయ్యము చేసే పనేనని వారికి బాగా అర్థమైనది. ఆ సంఘటనతో వారు ఇల్లు వదిలిపోవాలనుకొన్నారు. పది రోజుల లోపలే ఇల్లు వదలి పోయారు. ఆ ముస్లీమ్ కుటుంబము తన ఇల్లును వదలి పోవడము వలన అక్కడున్న బ్రాహ్మణ స్త్రీకి సంతోషము కల్గినది.


అప్పటినుండి దాదాపు ఒక సంవత్సరము వరకు ఆ ఇంటిలో ఎవరూ చేరలేదు. సంసారముతో ఉండువారు ఆ ఇంట్లో ఉండాలంటే భయపడి ఎవరూ రాలేదు. చివరకు ఆ ఇంటి యజమానులైన ముస్లీమ్లు పగలు మాత్రముండి, రాత్రిపూట తలుపులు మూసిపోయేటట్లు ఒక హెూటల్ను ఆ ఇంటిలో పెట్టాలను కొన్నారు. ఆ ఇల్లు రోడ్డుకు అనుకొని ఉన్నది కావున హెూటల్కు అనుకూలంగా ఉంటుంది. అదియు పగటి పూట మాత్రమే కదా అని ధైర్యముగా, ఆ ముస్లీమ్ కుటుంబము హెూటల్ను ప్రారంభించింది. ఇంటి ముందర బయలులో రేకులషెడ్డు వేసి, అందులో కుర్చీలు, బెంచీలు పెట్టి లోపలి ఇంటిని వంటకు, కాయకూరలు మొదలగు సరుకులు పెట్టుకొనే దానికి వాడుకొనునట్లు నిర్ణయించుకొన్నారు. వారు శాఖాహర హెూటల్ కాకుండ మాంసహార మిలిటరి హెూటల్ పెట్టినారు. 'మదార్ హెూటల్' అను పేరుతో ప్రారంభించి ప్రతి దినము ఆ ఇంటిలో మాంసమును తెచ్చిపెట్టడము, మాంసాహారవంటలు చేయడము వలన, అందులోనున్న బ్రాహ్మణస్త్రీకి దినదినము గండమైనది. అవన్ని చూడలేక ఆమె అక్కడినుండి వదలి పోయినది. ఇప్పటికీ ఆ ఇంటివద్దనే మదార్ హెూటల్ ఉన్నట్లు కొందరు చెప్పారు. ఇప్పుడు చెప్పినదంతా రామ్ గోపాల్ వర్మ సినిమాకథ కాదు, యదార్థముగా గతములో జరిగిన విషయము.


ఇందులో గమనించతగ్గ విషయమేమంటే, సూక్ష్మముగా కనిపించ కుండ ఉన్న బ్రాహ్మణస్త్రీ, స్థూలముగా కనిపించే పిల్లవానిని లాగుకొని పోవడము జరిగినది. ఇదే విధముగ ముందు చెప్పిన ఇటికాల తోట సమాచారములో కూడ, కనిపించని సూక్ష్మము కనిపించే మిరపచెట్లను పెరికివేసింది. ఈ రెండు సంఘటనలనుబట్టి సూక్ష్మములు, స్థూలములను కూడ కదిలించగలవనీ, అంతేకాక ఏమైనా చేయగలవని అర్థమైనది. ఒక రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలు ఇంజన్లో డ్రైవర్ లేకుండ దిగిపోయినపుడు డ్రైవర్ లేకుండగనే రైలు అరవై కిలోమీటర్ల వేగముతో ముందు స్టేషన్కు పోవడము జరిగినట్లు న్యూస్పేపర్లో చూచాను. అలా రైలు నడవడానికి కారణము సూక్ష్మము యొక్క పనియేనని అర్థమైనది. వీటన్నిటి ఆధారముతో ఒక సూక్ష్మము మరొక స్థూలమును ఏమైనా చేయగలదు. అందువలన సూక్ష్మము శరీరములోనికి చేరవలసిన పనిలేకుండ, బయటినుండి కూడ ఏమైన చేయగలదని అర్థమైనది. అట్లని ప్రతి సూక్ష్మము



---

అలా చేయుటకు వీలుకాదు. ఎందుకనగా జాతకచక్రములో బుధగ్రహము యొక్క బలము సంపూర్ణముగా ఉన్న సూక్ష్మములకు మాత్రము అలా చేయుటకు శక్తి యుండును. అకాలమృత్యువు పొందినవారు, సూక్ష్మశరీరముతో కొంత కాలము వారి ఆయుస్సు అయిపోవు వరకు జీవించవలసియున్నది. మరణానంతరము జన్మకు పోకుండ జీవించు జీవితకాలము, కొందరికి సుఖముగా గడచి పోవడము, కొందరికి కష్టముగా గడచిపోవడము జరుగు చున్నది. మనిషి శరీరముతో జీవించినప్పుడే కాకుండ, శరీరము లేకుండ జీవించునప్పుడు కూడా కష్టసుఖములుగలవనీ, పాపపుణ్యములు అమలు జరుగడము, సంపాదించుకోవడము రెండూ ఉన్నవనీ తెలియుచున్నది. మరణానంతర జీవితమునకు కూడ బుధగ్రహ బలము మరియు ఇతర గ్రహముల బలము కూడ అవసరము. అట్లు ద్వాదశ గ్రహముల బలా బలములనుబట్టి, దయ్యముల భవిష్యత్తు, వర్తమానము ఉండును. అందువలన దయ్యములు లేవు అనకుండ, ఆ స్థాయి జీవితములను గురించి తెలుసుకొని, అటువంటి జీవితము వస్తే, దానికి సంబంధించిన పాపపుణ్య ములను, సుఖదుఃఖములను తెలిసి బ్రతుకుటకు ప్రయత్నించాలి.


భౌతికశాస్త్రము అంటే ఏమిటో నాకంటే సైన్సు చదివిన వారికి, భౌతికశాస్త్రవేత్తలకు, డాక్టరువృత్తి నేర్చినవారికి బాగా తెలుసు. శరీరములో జరుగు ప్రతి చిన్న మార్పును భౌతికశాస్త్రము తెలియజేస్తున్నది. శరీరములోని అణువణువు యొక్క విషయమును, సంపూర్ణముగా వివరించునది భౌతిక శాస్త్రము. దానిని చదివిన వారికి శరీరమును గురించిన సంపూర్ణ జ్ఞానముండును. శరీరములోని కోట్ల ధాతువులలో ప్రతి ధాతువును గురించి వివరించి చెప్పు జ్ఞానము కొందరు హేతువాదులు కల్గియున్నారు. అంతగా తెలిసిన వారు, భౌతిక శరీరములో తమకు తెలియనిది లేదని చెప్పుచుందురు. కానీ నేనేమనుచున్నాననగా! ప్రతి ప్రశ్నకు జవాబు కల్గియున్నప్పుడే వానిని సంపూర్ణముగా తెలిసినవాడని చెప్పవచ్చును. ఎవని వద్ద ప్రశ్నకు జవాబు లేదో వానిని తెలియనివాడేనని చెప్పవచ్చును. ఈ సూత్రములు ఏ శాస్త్రమునకైనా వర్తించును. భౌతికశాస్త్రమును తెలిసిన ఒక శాస్త్రవేత్తకు శరీరములోని ఒక ప్రశ్నకు జవాబు తెలియనపుడు అతనిని శాస్త్రవేత్త అనుటకు అర్హుడుకాడు. అలాగే ఒక మెడికల్ ప్రొఫెసర్కు ఒక రోగమును గురించిన ప్రశ్నకు జవాబు తెలియనపుడు అతనిని ప్రొఫెసర్ అనకూడదు. అట్లే ఒక రోగమును గురించి తెలియనపుడు, అతనిని డాక్టర్ అని అనకూడదు. అయినా ఒక శాస్త్రవేత్త అని పేరు పెట్టుకొన్న వానికి ఆ శాస్త్రమును గూర్చి పూర్తి అవగాహన లేదనుటకు ఎన్నో నిదర్శనములు కలవు. శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని అర్థము. ఉదాహరణకు వంద శాసనములు ఒక శాస్త్రములో ఉన్నాయనుకొనుము. అందులో యాభైశాసనములు తెలిసినవానిని, డెబ్బై శాసనములు తెలిసిన వానిని సంపూర్ణ శాస్త్రవేత్త అని అనకూడదు. కానీ ఈ కాలములో ఏ శాస్త్రములోనైనా సంపూర్ణముగ తెలిసినవారు లేరు అనుటకు నిదర్శనములు కలవు. అవి ఎలా ఉన్నాయో వివరించుకొని చూద్దాము. జరిగిన సంఘటనల లోని తార్కాణములను తెలుసుకొందాము.


అనంతపురము శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటిలో పనిచేయు ఒక ప్రొఫెసర్కు కొంతకాలమునుండి, అతని శరీరములో ఒక నొప్పి ఉండేది. అది కుడిప్రక్క ఊపిరితిత్తి క్రింద భాగమున ప్రక్కటెముకల వద్ద నొప్పి వచ్చేది. ఆ నొప్పి ఎప్పటికీ ఉండక, అప్పుడప్పుడు నెలకొకమారు, నెలన్నర కొకమారు వచ్చేది. వచ్చినపుడు అర్ధగంట, గంటసేపు ఉండి పోయేది. ఆ నొప్పి వచ్చినపుడు విపరీతముగ బాధ కలిగేది. ఆ నొప్పిని లేకుండ చేసుకొనుటకు డాక్టర్లవద్ద చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడము కూడ జరిగినది. అయినప్పటికీ ఆ బాధ అప్పుడప్పుడు వస్తూనే ఉండేది. ఒక దినము ఆ ప్రొఫెసర్ తన నొప్పిని గురించి చెప్పాడు. సంవత్సరము నుండి మందులు తీసుకొనినా, నయము


---

కాలేదని చెప్పాడు. నొప్పి వచ్చినప్పుడు మందును మ్రింగినా నొప్పి తగ్గదని చెప్పాడు. అతను చెప్పిన దంతా వినిన నేను, అతనిని నాకు ఎదురుగా ఒక గజము దూరములో కూర్చోమని చెప్పినాను. అతను నా ముందర కూర్చున్న తర్వాత ఇప్పుడేమైనా నొప్పి ఉందా అని అడిగినాను. ఇప్పుడు లేదు అన్నాడు. అయితే ఇప్పుడు వస్తుంది చూడు అని నేను అతనికి చెప్పి తర్వాత ఇలా అన్నాను “నాకు ఎదురుగా కూర్చున్న మనిషిలో అప్పుడప్పుడు డొక్కలో వచ్చు నొప్పి ఇప్పుడే రావలెను”. ఆ మాట పూర్తి అయిన వెంటనే అర్థ నిమిషములోనే అతనికి డొక్కలో నొప్పి వచ్చింది. “నొప్పి వచ్చింది, చాలా వివరీతముగా నొప్పి ఉంది" అని ప్రొఫెసర్ అన్నాడు. అతని శరీరములో ఎప్పుడో తనకిష్టమొచ్చినప్పుడు వచ్చు నొప్పి పిలిచిన వెంటనే వచ్చింది. వచ్చినట్లు ఆయన కూడ చెప్పాడు. ఎదురుగా ఆయన ఎంత బాధపడుచున్నది నాకు తెలుస్తూవుంది. అది విపరీతమైన బాధగానే అర్థమైనది. అప్పుడు రెండవమారు ఇలా అన్నాను “ఈయన శరీరములోనున్న నొప్పికి నేను చెప్పుచున్నాను, ఇతని శరీరములో నొప్పి లేకుండ బయటికి పోవాలి" అని చెప్పగానే ఒక నిమిషములోనే అతని నొప్పి కనిపించకుండ పోయింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇట్లు చెప్పాడు. "మీరు బయటికి పొమ్మని చెప్పగానే లోపలవుండే నొప్పిని కడ్డీ కొండికి తగిలించి, లోపలినుండి లాగినట్లయినది. బలవంతముగా లాగితే కలిగినట్లు బాధ కలిగింది. ఎప్పుడో వచ్చు నొప్పి పిలుస్తూనే రావడమూ, పొమ్మని చెప్పగానే పోవడము చాలా విచిత్రముగా ఉంది. ఇటువంటి అనుభవము నేను ఎక్కడా చూడలేదు. కడుపులోపల కడ్డీతో పురిత్రిప్పి లాగినట్లయినది. నొప్పి బయటకు వచ్చిన అనుభూతి కలిగిన వెంటనే ప్రక్కకడుపులో ఏమాత్రము నొప్పిలేకుండ పోయింది. మందు ఇవ్వకుండ, మంత్రమూ చెప్పకుండ, కేవలము నోటిమాటతో నొప్పిని లేకుండ చేయడము దానిని శాసించినట్లయినది”.


అతని మాటలువిన్న నేను అతనితో ఇలా చెప్పాను. ఒక రోగము పోగొట్టుటకు మూడురకముల పద్ధతులు గలవు. వాటియందు ఒక పద్ధతిలో మందులు వాడడము వలన రోగమును లేకుండ చేయవచ్చును. రెండవ పద్ధతిలో మంత్రముల వలన రోగమును లేకుండ చేయవచ్చును. మూడవ పద్ధతిలో మందులుగానీ, మంత్రములుగా ఉండవు. ఈ పద్ధతిలో కేవలము అధికార పూర్వకముగ చెప్పడము వలన రోగమును లేకుండ చేయవచ్చును. ఈ పద్ధతిలోనే పోతులూరి వీరబ్రహ్మముగారు, ఏసుప్రభువు, శ్రీకృష్ణుడు మొదలగువారు రోగములను శాసించినట్లు తెలియుచున్నది. వీటిలో మొదటిదైన మందులు వాడడము అను వైద్యమును చదివి నేర్చు కుంటారు. రెండవ వైద్యమైన మంత్రములను సాధన చేసి నేర్చుకోవచ్చును. ఇక మూడవదైన వైద్యమును జ్ఞానశ్రద్ధ చేత సాధించవచ్చును. ఈ కాలములో మొదటి రకము వైద్యము ఎక్కడ చూచినా ఉన్నది. రెండవ రక వైద్యము చాలా అరుదుగా కొన్ని చోట్ల మాత్రము కనిపించగలదు. ఇక మూడవ రకమైన జ్ఞానశక్తి చేత శాసించు వైద్యము, భూమిమీద అరుదుగా కూడ ఎక్కడా కనిపించ లేదు.


భూమిమీద ఎన్నో రకముల రోగములు గలవు. కొన్ని రకముల రోగములు, మొదటి వైద్యము మందుల చేత కనిపించకుండ పోవును. కానీ కొన్ని రోగములు మొదటి వైద్యమైన మందులతో పోవు. వాటికి రెండవ రకమైన మంత్రముల వైద్యము అవసరము. ఆ రోగములు మంత్ర వైద్యము చేతనే పోవును. ఇకపోతే మొదటి వైద్యమునకుగానీ, రెండవ వైద్యమునకుగానీ లొంగని రోగములున్నవి. వాటిని తప్పక అనుభవించ వలసిందే. రెండు రకముల వైద్యమునకు నయముగాని రోగములు మూడవ వైద్యమునకే పోవును. మూడవ వైద్యము చేయువారు ఎవరూ లేరు. ఒకవేళ ఎక్కడైనా ఉండినా, వారు ఇతరులకు వైద్యము చేయు ఉద్దేశము వారికి ఉండదు. అటువంటి వారికి జ్ఞాన ప్రచారమే ముఖ్య ఉద్దేశమై ఉండును. జ్ఞానప్రచారములో అవసరమైనపుడు మాత్రమే జ్ఞానశక్తి యొక్క సామర్థ్యమును తెలియజేయు నిమిత్తము, ఎక్కడైన అరుదుగా వారి వైద్యము సంభవించవచ్చును. ఈ విధముగ మూడు వైద్యములు భూమి మీద గలవు.


---

ఇపుడు నేను చేసినది ఏ రకము వైద్యమో నీకు అర్థమై ఉంటుంది. ఒక మనిషికి ఏ రకము వైద్యము అవసరమో, మొదటి రెండు రకముల వైద్యులకు తెలియదు. అందువలన మంత్రములతో పోవు రోగములకు కొందరు వైద్యులు మందులు వాడుచుందురు. అట్లు ఎంతకాలము వైద్యము చేసినా ఆ రోగము పోదు. అట్లే మందుల వలన పోవు రోగములను తెలియక కొందరు మాంత్రికులు మంత్ర వైద్యమును చేయుచుందురు. అట్లు ఎంత కాలము మంత్రవైద్యము చేసినా వాని రోగము పోదు. ఈ విధముగ మందుల వైద్యులు, మంత్రముల వైద్యులు ఇరువురు ఏ రోగమునకు ఏ వైద్యము అవసరమో తెలియక పొరబడుచున్నారు. వైద్యుల పొరపాటుకు రోగులు నష్టపోవుదురు. ఇంతవరకు నీకు ఉన్న రోగమునకు మొదటి రెండు వైద్యములు పనికిరావు. కనుక నీవు ఎన్ని మందులువాడినా, నీకున్న నొప్పి ఏమాత్రము పోలేదు. నేటి కాలములో మంత్రవైద్యులు అరుదుగా ఉన్నారు, కావున వారివద్దకు రోగులు పోవుట కూడ తక్కువే. అల్లోపతి మందులు వాడు వైద్యులు ఎక్కడ చూచిన ఉన్నారు. వారివద్దనే ఎక్కువ మంది రోగులు రోగములు పోవు వైద్య విధానము తెలియక నష్టపోవు చున్నారు. మందుల వైద్యము తెలిసిన డాక్టర్ల దగ్గర రోగులు ఎలా నష్టపోవుచున్నారో, రోగము నయముకాక ఎలా బాధపడుచున్నారో మరియు డాక్టర్లు రోగమును గుర్తించలేక ఎలా పొరపడుచున్నారో, వివరముగా అర్థమగుటకు మరియొక సంఘటను తెలియజేస్తాము చూడు.


తాడిపత్రి మండలము చిన్నపొడమల గ్రామములో నివాసముండే మంగళ వెంకటేసుకు, అనంతపురము ప్రొఫెసర్కు వచ్చినట్లే ప్రక్క డొక్కలో నొప్పి వచ్చింది. అతను ఆ నొప్పికి తట్టుకోలేకపోయాడు. ప్రొఫెసర్కు అరగంటసేపు నొప్పి ఉండి పొయ్యేది. కానీ వెంకటేసుకు అలా పోకుండా ఏకధాటిగా అట్లే ఉంది. వెంకటేసు అనంతపురములోని డాక్టర్లవద్దకు పోయి చూపించుకొన్నాడు. వారు అన్ని టెస్టులు చేసి, ఇది పలానా రోగము అని నిర్ధారణ చేయలేక పోయారు. అతనిని ఇద్దరు, ముగ్గురు సీనియర్ డాక్టర్లు చూచి మందులు వాడినా అతని బాధ తగ్గలేదు. ఉదయము వచ్చిన నొప్పి సాయంకాలము వరకు పోలేదు. వారు మందులు ఇచ్చి ఈపాటికి నొప్పి పోయింటుంది కదా అని అడిగారు. లేదు పోలేదు అట్లే ఉంది అని రోగి అంటే డాక్టర్లు అతని మాట నమ్మలేదు. అంతలోనే నొప్పి ఉన్న ప్రక్క చర్మము మీద అర్థరూపాయి, రూపాయి వెడల్పు బొబ్బలు పుట్టాయి. వాటిని చూచిన డాక్టర్లు రోగికి నొప్పి తగ్గలేదని తెలుసుకొన్నారు. ఆ నొప్పి ఎందుకు వచ్చిందో, చర్మము మీద బొబ్బలు ఎందుకు వచ్చాయో డాక్టర్లకు అర్థము కాలేదు. వెంకటేసు బాధను భరించలేక ఆ నొప్పితోనే చనిపోతానేమో అనుకొన్నాడు. డాక్టర్లు ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ చేస్తాము ఐదువేలు ఖర్చువుతుందన్నారు. పేషెంట్ దగ్గరున్న ఐదువేలు అప్పటికే అయిపోయినాయి. ఇంక డబ్బులు లేవు. కావున రేపు డబ్బులు తీసుకొని వస్తామని చెప్పి ఇంటికి వచ్చినారు. రాత్రంతా బాధపడిన వెంకటేసు కృష్ణమందిరము వద్దకు వచ్చి అక్కడున్న నాతో విషయమును చెప్పాడు. ఇంకా డబ్బులు ఖర్చు చేయడము అతనికి శక్తికిమించిన పని. అతను ముందునుండీ పరిచయమున్న మనిషి, నావద్ద వినయ, విధేయతలుగా నడుచుకొను మనిషి. కావున అతని రోగము ఏమిటని తెలియుటకు నొప్పి ఉన్న చోటును చూపించమని చెప్పగా అతను చూపించాడు. చర్మము మీద బొబ్బలు కూడ వచ్చియుండడము గమనించాను. తర్వాత ఇది మందులతోను, మంత్రములతోను పోవు రోగముకాదని తెలిసింది. అప్పుడు చేతికర్రను తీసుకొని నొప్పివున్న చోట పెట్టి అతనికున్న నొప్పిని గురించి అడిగాను కర్రపెట్టిన వెంటనే తగ్గిపోయినదని చెప్పాడు. అతను నాదగ్గరకు వచ్చినపుడు నడువలేని స్థితిలో కష్టముగా నడుస్తూ వచ్చాడు. అతను నొప్పి లేదని అన్న తర్వాత కొద్దిగ నడువమన్నాను. అతను సులభముగా నడిచాడు. ప్రక్కనే ఉన్న నాలుగుమెట్లు ఎక్కి క్రిందికి దూకమన్నాను. అలా రెండుమార్లు దూకాడు అప్పుడు కొద్దిగ నొప్పి వచ్చినట్లు చెప్పాడు. తర్వాత చేతికర్రను నొప్పి ఉన్న జాగాలో తాకించి అడుగగా, నొప్పిలేదని చెప్పాడు. తర్వాత పైకి ఎక్కి దూకినా నొప్పి రాలేదు. అంతటితో



---

ఆ నొప్పి పోయింది. మూడవ రకము వైద్యము అతనికి జరిగింది. ఈ వైద్యము లేకుండ మొదటి రెండు రకముల వైద్యములు ఆ నొప్పిని పోగొట్టలేవు.


అనంతపురములోని ఒక డాక్టరుకు, ఆ నొప్పి అర్థముకాక అతని కంటే సీనియర్ దగ్గరకు పంపాడు. అతను మందులిచ్చినా తగ్గకపోవడముతో ఇంకొక డాక్టరును కూడ సలహా అడిగి వైద్యము చేసినా నొప్పి పోలేదు. దీనినిబట్టి వారికి ఆ రోగము యొక్క కారణమే తెలియలేదని తెలుస్తున్నది. తర్వాత కొంత అవగాహనతో మందులు ఇచ్చినా అవి పని చేయలేదు. అప్పుడైనా ఆ రోగమునకు తమ వైద్య విధానము సరిపోదని వారికి అర్థము కాలేదు. ఒకవేళ మన మందులు పని చేయలేదని తెలిసినా, ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గరికి, పెద్ద హస్పిటల్కు పొమ్మని చెప్పుదురు. కానీ ఈ వైద్య విధానము సరిపోదు, మరియొక వైద్య విధానము అయిన మంత్రవైద్యమును చేయించమని చెప్పరు. ఎవరైన రోగి, మందులు పని చేయలేదని మంత్రములనాశ్రయించితే, వానిని తెలివితక్కువ వానిగ జమకట్టి హేళనగా మాట్లాడుదురు. వైద్య విధానము మార్చడము మంచిదని ఏ డాక్టర్లూ అనుకోరు.


ఇక్కడ అందరికి ఒక ప్రశ్నరాగలదు. అది ఏమనగా! ఈ గ్రంథములో మీరు చెప్పవలసినది దయ్యాలను గురించిన సంఘటనలు కదా! ఇప్పుడు చెప్పిన ప్రొఫెసర్ విషయములోగానీ, వెంకటేసు విషయములో గానీ, రోగమును, వైద్యమును గురించి చెప్పారు తప్ప సూక్ష్మములను గురించినది ఏమి చెప్పలేదు కదా! అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఈ విషయములలో వైద్యులు, వైద్య విధానములను గురించి చెప్పాను. కానీ రోగములను గురించి చెప్పవలసినది ఇంకావుంది. ఇప్పుడు చెప్పబోవు సమాచారములో, మీరు అడిగిన దానికి జవాబు లభించగలదని తెల్పుచున్నాము. రోగములు, పోయిన జన్మలో చేసుకొన్న పాపఫలితములని ముఖ్యముగ తెలియాలి. ఒక మనిషి చేసిన కార్యములో కనిపించకుండ వచ్చు ఫలితము పాపముకావచ్చు, పుణ్యముకావచ్చును. ఇప్పుడు చేసినది చెడు కార్యమైతే దాని ఫలితము పాపమువచ్చును. ఆ పాపము తర్వాత జన్మలో అనుభవించవలెననునది దైవధర్మము. ఒక మనిషి ఇతర మనుషులపట్లగానీ, ఇతర జీవరాసులపట్లగానీ చేసిన పాపము ఒక రకముకాగ, ఒక మనిషి దేవతలపట్ల చేసిన పాపము మరొక రకముగ ఉన్నది. అట్లే ఒక మనిషి దైవజ్ఞానమునకు వ్యతిరిక్తముగా చేసిన కార్యములలో వచ్చు పాపము ఇంకొక రకముగ ఉన్నది. అదే విధముగ ఒక మనిషి దైవము పట్ల చేసిన పాపము మరియొక రకముగా ఉ న్నది. ఈ విధముగ మనిషి సంపాదించుకొను పాపములను విభజించవచ్చును. ఈ విధముగ నాలుగు రకములుగ విభజింపబడిన పాపము, మరుజన్మలో ఎట్లు అమలు జరుగుచున్నదో తెలుసుకొందాము.


మనుషుల ఎడలగానీ, ఇతర జీవరాసులు ఎడలగానీ చేసిన పాపములో, నాల్గవవంతు రోగముల రూపములో అనుభవించుటకు కేటాయించబడును. అలాగే దేవతల ఎడల చేసిన పాపములో సగము రోగముల రూపములో వచ్చును. దైవజ్ఞానము ఎడల చేసిన పాపము మూడువంతులు రోగముల రూపములో అనుభవించవలసివచ్చును. ఇకపోతే దైవము ఎడల చేసిన పాపము పూర్తిగ రోగముల రూపములోనే అనుభవించాలి. ఇలా పాప ఫలితములను కొన్ని రోగముల రూపములోనే అనుభవించవలసియున్నదని అర్థమైనది. రోగము ఏ రూపములోనున్నా దానిని కూడ ఒక జీవరాసిగా చెప్పవచ్చును. ఈ మాటను గతములో చాలా సందర్భములలో ఉపన్యాసములందు “రోగము ఒక భూతము” అని కూడ చెప్పియున్నాము. రోగము సూక్ష్మముగాను మరియు స్థూలముగాను ఉన్న జీవరాసియేనని చెప్పవచ్చును. ఒక రోగము శరీరములో చేరింది అంటే అతనిలో ఒక సూక్ష్మము ప్రవేశించినట్లే. అందువలన రోగము వచ్చిన మనిషిని, దయ్యము పట్టిన మనిషితో సమానముగా చెప్పవలసి వచ్చును. దీనినిబట్టి రోగము వచ్చిందంటే


---

దయ్యము వచ్చిందని అర్థము. రోగము పోయిందంటే దయ్యము పోయిందని అర్థము. మనుషుల ఎడల చేసిన పాపము వలన వచ్చు రోగములు లేక జీవులను (దయ్యములను) మందులచేత వెళ్ళగొట్టవచ్చును. అట్లే దేవతల ఎడల చేసిన పాపము వలన వచ్చు రోగములును లేక జీవులను లేక దయ్యములను మంత్రముల చేతనే తరిమి వేయవచ్చును. దైవజ్ఞానము ఎడల సంపాదించుకొన్న పాపము వలన వచ్చు రోగములను, దైవజ్ఞానశక్తి చేతనే లేకుండ చేయవచ్చును. కానీ ఇది అరుదైన పని అని ముందే చెప్పియున్నాము. చివరిగా చెప్పునది దైవము ఎడల ఎవడైన పాపము చేస్తే ఆ పాపము వలన వచ్చు రోగముల నుండి ఎవడూ తప్పించుకోలేడు. అదియే క్షమించరాని, క్షమించబడని పాపము. అందువలన దానిని జ్ఞానులు, యోగులు సహితము తప్పించలేరు. అది వీడని దయ్యమై బాధించును.



'రోగము ఒక భూతము' అను మాట మీకు అర్థమగుటకు ఒక యదార్థ సంఘటను వివరిస్తాను చూడండి. తాడిపత్రి పట్టణములో నాకు పరిచయమున్న వ్యక్తి, నావద్దకు అప్పుడప్పుడు వచ్చు వ్యక్తి కుల్లూరు శ్రీరాములు అనునతడు ఉండెడి వాడు. బహుశ అతనికి ముగ్గురు తమ్ముళ్ళు అనుకొంటాను. అందులో ఒకరి పేరు విశ్వమూర్తి. కుల్లూరు శ్రీరాములు కొంత తీరిక సమయములో నావద్దకు వచ్చి, జ్ఞాన విషయము లను అడిగి తెలుసుకొని పోయేవాడు. దైవజ్ఞానమును తెలుసుకొనుటలో ఆసక్తి ఉండుటవలన, అతనిమీద నాకు కొంత అభిమానముండెడిది. శ్రీరాములు ఒక దినము నావద్దకు వచ్చి దిగాలుగా కూర్చున్నాడు. అతనిని చూచిన నాకు అతను మానసికముగా బాధపడుచున్నాడని అర్థమైనది. అప్పుడతనిని ఎందుకిలా ఉన్నావని నేను అడగడము జరిగినది. అప్పుడతడు బాధపడుచు తన తమ్ముడు లక్ష్మణమూర్తి విషయమును చెప్పసాగాడు. నాతమ్మునికి కొన్ని దినములనుండి ఆరోగ్యము సరిగలేదు. నిన్నటి దినము అనంతపురము పోయి పెద్ద డాక్టర్లవద్ద చూపించాము. వారు అన్ని పరీక్షలు చేసి చూచిన తర్వాత అతని గుండె వాసిపోయింది (హర్టు ఎన్లార్జ్ అయింది) దానిని బట్టి చూస్తే అతను ఐదారు గంటలు మాత్రమే బ్రతుకుతాడు. చికిత్స చేసినా ఇతను బ్రతుకడు. ఇంటికి తీసుకుపొమ్మని చెప్పారు. ఈ విషయము నాకు, మా అమ్మ, నాన్నకు మాత్రమే తెలుసు, నా తమ్మునికి తెలియదు. గంట క్రితమే అనంతపురమునుండి వచ్చి, అతనిని ఇంటివద్ద వదలి, అమ్మనాన్న బాధపడుచుంటే నేను చూడలేక ఇక్కడికి వచ్చాను అన్నాడు.


అతని మాటలువిన్న తర్వాత అతనిని చూచి నాకు కూడ దయా గుణము కొంత పనిచేసిందనుకొంటాను. అప్పుడు శ్రీరాములును చూచి ముందు నీవు పోయి నీ తమ్మున్ని నావద్దకు తీసుకొని రా అన్నాను. నా మాటవింటూనే అతను లేచిపోయాడు. గంట తర్వాత అతని తమ్ముణ్ణి తీసుకొని వచ్చాడు. అతనిని చూస్తూనే ఇతను గంటసేపు కూడ బ్రతుకడు అనే విధముగా ఉన్నాడు. శరీరమంతా నీరుపట్టి ఉబికి ఉన్నది. అతనిని నాముందర కూర్చోమని, ఒక్క నిమిషము అతని గుండెవైపు చూచి ఇక చాలు ప్రక్కన కూర్చోపెట్టమని చెప్పాను. వారు అలానే చేశారు. అప్పుడు శ్రీరాములుతో “నీ తమ్మునికి ఇప్పుడు సగము బాగైపోయింది. ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి పోయిన తర్వాత మిగత సగము బాగైపోతుంది” అని చెప్పి పంపాను. నేను అలా చెప్పేసరికి శ్రీరాములు విన్నాడు కానీ, నామాట నిజమను నమ్మకము అతనిలో కలుగలేదు. ఒక్క నిమిషము చూచి సగము బాగైంది అనగానే ఏ చికిత్స చేయలేదు, ఎలా బాగవుతుంది, అను ప్రశ్న శ్రీరాములులో వచ్చింది. లోపల అతని తలలో ప్రశ్న వచ్చినా బయటికి ఏమి కనబడకుండ అతని తమ్మున్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజంతా గడచిపోయింది. రెండవరోజు కూడ గడచిపోయింది. మూడవ రోజు మొదలైంది. అప్పుడు శ్రీరాములుకు ఇలా అనిపించింది. అనంతపురములో డాక్టర్లు ఐదారు గంటలకంటే ఎక్కువ బ్రతుకడని చెప్పారు కదా! ఇప్పటికి దాదాపు అరవైగంటలు గడిచింది కదా! వారు చెప్పినట్లు ఏమీ కాలేదు.



---

ఎందుకైనా మంచిది, ఒకమారు అనంతపురము తీసుకొని పోయి చూపించుకొని వస్తామని అనుకొన్నాడు. వెంటనే అనంతపురమునకు కారులో బయలుదేరి పోయారు. అక్కడ డాక్టర్లకు లక్ష్మణమూర్తిని చూపించారు. డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేసి, ఇతని గుండె సాధారణ స్థితికి వచ్చింది ప్రాణాపాయము ఏమిలేదు అని చెప్పారు. అప్పుడు శ్రీరాములు మీరు ఐదారు గంటలకంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు కదా! అని డాక్టర్లను అడిగాడు. డాక్టర్లు దానికి సమాధానముగా నిజమే అప్పటి పరిస్థితి అలాగే ఉండేది. ఇప్పుడు చూస్తే మాకే ఆశ్చర్యముగా ఉంది. అప్పుడు చికిత్స చేసినా బ్రతకడని మేమే చెప్పాము. కానీ చికిత్స చేయకున్నా ఎలా బాగైందో మాకు అర్థము కాలేదు అన్నారు. అప్పుడు శ్రీరాములుకు మా మాటలు జ్ఞప్తికి వచ్చాయి. నేను ఒక్క నిమిషము చూచిన దానివలననే అతనికి బాగైందని గట్టి విశ్వాసము అప్పుడు కలిగింది.


రెండవరోజు నావద్దకు శ్రీరాములు వచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు. తాను మొదట నా మాటను నమ్మని విషయమును కూడా చెప్పాడు. లక్ష్మణమూర్తి ప్రాణాపాయము నుండి బయటపడుటకు మీరే కారణమని కృతజ్ఞత కూడ చెప్పాడు. తర్వాత లక్ష్మణమూర్తికి ఉబ్బసరోగము, శరీరమంతా నీరు చేరు విషయము చాలాకాలమునుండి ఉన్నదని చెప్పాడు. దానికి డాక్టర్లవద్ద మందులు తీసుకొమ్మని సలహా చెప్పి పంపాను. నేను చెప్పినట్లు మందులు వాడడము వలన ఆ రెండు రోగములు కొన్ని దినములు తగ్గేవి, తర్వాత కొన్ని దినములు ఎక్కేవి. డాక్టరు ఇంటివద్దకు వచ్చి ఒకమారు లాసిక్స్ ఇంజక్షన్ ఇస్తే ఒకరోజు మూత్రము వచ్చేది. అలాగే ఉబ్బస (ఆస్తమా) రోగమునకు మందు ఇస్తే, ఆ రోజు మాత్రము బాగుండేది. అలా ఆరు నెలలనుండి ఉన్న రోగములు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. లాసిక్స్ ఇంజక్షన్ ఇస్తే ఒకమారు మూత్రము వస్తుంది, ఆస్తమాకు మందు ఇస్తే ఒక గంట మాత్రము బాగుంటుంది. ఆ రెండు రోగములతోనే అతను చనిపోయేటట్లు ఉన్నాడని వైద్యులు చెప్పారు. అప్పుడు శ్రీరాములు వచ్చి ఒకమారు తన తమ్మున్ని చూడమని ప్రాధేయపడ్డాడు. అతని బాధ చూడలేక సరే అతనిని తీసుకురమ్మని చెప్పినాను.


ఆ రోజు సాయంకాలము లక్ష్మణమూర్తిని నాదగ్గరికి తీసుకవచ్చారు. అతని శరీరమంతా నీరు నిండుకొని ఉన్నది. ఉబ్బసము కొద్దిగ కనిపిస్తున్నది. వారు చెప్పినంత ఎక్కువగా కనిపించలేదు. అతనికి కూర్చొనే ఓపిక కూడ లేదు. ఒక మనిషి వెనుక పట్టుకొని కూర్చోబెట్టుకొన్నారు. అతనిని అదేలాగున నాముందర కూర్చోబెట్టారు. అప్పుడు నేను ఇలా చెప్పాను. "ఇతని శరీరములోని గాలివలన ఏర్పడు ఉబ్బసరోగము ఎంత ఉందో అంత బయటికి కనిపించమని ఎదురుగానున్న నేను చెప్పుచున్నాను" అనగానే లోపలినుండి ఉబ్బసము తీవ్రస్థాయిలో బయటికి వచ్చింది. అప్పుడు లక్షణమూర్తి విశేషముగా శ్వాసను పీల్చడము వదలడము చేయుచున్నాడు. శ్వాస నోటిలోను, ముక్కులోను పట్టినంత తీవ్రముగా బయటికి వస్తావుంది. అలాగే అంతే తీవ్రతతో లోపలికి పోతావుంది. ప్రక్కన చూచేవాళ్ళకు అతను ఊపిరితిత్తులు పగిలి చనిపోతాడేమో అనిపిస్తూవుంది. అపుడు నేను తీవ్రత తగ్గిపోయి సాధారణ స్థాయికి రమ్మని చెప్పగానే అతనికి శ్వాస సాధారణముగా ఆడను మొదలుపెట్టింది. అక్కడ ప్రత్యక్షముగా చూచువారికి అదొక వింతగ అగుపించింది.


రోగము ఒక భూతము (జీవుడు) అను నా సూత్రము ప్రకారము శరీరములోనున్న నీరు, గాలి, అను భూతములను అతనిని గురించి అడగాలనుకొన్నాను. అప్పుడు ఇట్లు అడిగాను. ఇతని శరీరములోనున్న గాలి, , నీరు అను మిమ్ములను అడుగుచున్నాను. ఇతనిని ఎందుకు అంత తీవ్రస్థాయిగా బాధించుచున్నారు కారణము ఏమిటి? మాటరాగానే మొదట ఉబ్బసం కొంతవరకు పెరిగి, నేను గాలిని మాట్లాడు చున్నాను అని చెప్పసాగింది.

అని నా నుండి


--

గాలి :- ఇతను మహాపాపమును సంపాదించుకొన్నాడు. గతజన్మలో మనుషులను తన అధికారము చేత చాలా ఇబ్బందులపాలు చేశాడు.


నేను :- ఈయనకు ఏ అధికారముండేది? ఏమి చేశాడు.


గాలి :- పోలీస్ ఉద్యోగము, యస్.ఐ నుండి డి. యస్.పి వరకు ఉద్యోగమును చేశాడు. తాను కూడ ఒక మనిషిని అను మాట మరిచిపోయి తన అధికారముతో ఎంతోమందిని నేరస్థులు కానివారిని కూడ ఇబ్బందుల పాలు చేశాడు, కొందరిని కాల్చి చంపేశాడు. తనకు తెలిసిన రేణుకా ఎల్లమ్మ తప్ప మిగత దేవతలను లెక్కచేయక, విలువ ఇవ్వకుండ మాట్లాడడము వలన పెద్ద పాపమును సంపాదించుకొన్నాడు. పోయిన జన్మలో ఎరికల కుటుంబములో పుట్టిన ఇతను, తనకంటే పెద్దకులస్థులను అసూయతో అదే పనిగా ఎక్కువగా బాధించెడివాడు. చెప్పేదానికి ఒకటి గాదు ఎన్నో పాపములు చేసుకొన్నాడు. దానివలననే ఈ ఉబ్బస రోగమును అనుభవించుచున్నాడు. నా వలన చిల్లర చిల్లర పాపములే ఐదు సంవత్సరములుగా అమలగుచున్నవి.


నేను :- నీవు అణిగిపోయి, నీరును మాట్లాడమని తెలియజేయి.


(నిమిషము తర్వాత గాలి మాట్లాడకుండ లక్ష్మణమూర్తి నుండి నీరు మాట్లాడను మొదలు పెట్టింది.)


నీరు :- మీరు ఇతనిని ఏమి చేయాలనుకొన్నారు.


నేను :- నేను ఏమీ అనుకోలేదు. ఈ బాధకు కారణమును మీ చేత తెలుసుకోవాలనుకొన్నాను. గాలి తనవంతు చేయవలసినది తెలిపినది. ఇతను చేసిన చిల్లర పాపముల చిట్టా ఎంతో ఉందని చెప్పింది. నీవు ఇతని శరీరములో ఏ పాపపరిహార నిమిత్తమున్నావు. మీరు చెప్పిన తర్వాత నా నిర్ణయము ఉంటుంది.


నీరు :- గాలి! మీకు చెప్పినది మనుషుల వలన వచ్చిన పాపము, దేవతల వలన వచ్చిన పాపమును అమలు చేయునట్లు తెల్పినది. దానికంటే పెద్దదైన ఒక జ్ఞానిని నిందించిన పాపమును, దాదాపు పది సంవత్సరములనుండి అనుభవిస్తున్నాడు. ఎదుటి మనిషి దైవజ్ఞానమును బోధించు బోధకుడని తెలిసి, అతనిని నానారకములుగా హేళనగా మాట్లాడి, చివరికి అతని మీద చేయి చేసుకొన్నాడు. ఆ రోజు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ నని గర్వముతో ఇతను చేసుకొన్న పాపమును ఇపుడు నేను అమలు చేయుచున్నాను. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఎన్ని మందులు తినినా, ఏమాత్రము నయముకాని రోగముగా శరీరములో అనుభవిస్తున్నాడు. ఇప్పటికి మీవద్దకు వచ్చి కొంత రక్షణ పొంది ఆరునెలలుగా బతికాడు. ఈ పాపము ఈ జన్మకేకాక రేపు జన్మకు కూడ ఉన్నది. వచ్చే జన్మలో కాళ్ళు, చేతులు చిన్నతనమునుండి లేకుండ పోవడమే కాక, మానసికముగా కూడ పెరుగుదల లేకుండ పోయి దాదాపు ఇరవై సంవత్సరములు బ్రతుకవలసియున్నది. 


నేను :- ఇపుడు ఈయన చరిత్ర నాకు అర్థమైనది. నా వలన ఇతని ఆయువు ఆరునెలలు సర్దుబాటు అయివుంటే, లెక్క ప్రకారము తర్వాత జన్మలో ఈ ఆరునెలలు తగ్గిపోతుంది. వీరు నావద్దకు వచ్చారు. మీరు కూడా నా వద్దకు వచ్చారు. కావున నేను ఇరువురకు న్యాయముగా పరిష్కారమును చెప్పెదను. దాని ప్రకారము నడుచుకోండి.

నీరు :- మీ మాటను మేము గౌరవిస్తాము చెప్పండి.


(అప్పుడు అక్కడ ఉన్నవారందరిని బయటకు పంపి మేము ఏమి చెప్పునది ఇతరులకు తెలియకుండ చేశాను.)


---

అందరు బయటికి పోయిన తర్వాత గాలి, నీరు అను భూతములకు (రోగములకు) నేను ఒక ఉపాయమును చెప్పాను. మనుషులలో జ్ఞానము అభివృద్ధి అగుటకు, జ్ఞానమునకు విలువను పెంచుటకు ఉపాయమును ఆ భూతములకు చెప్పవలసివచ్చినది. నా మాటను ఆచరిస్తామని రెండు భూతములు చెప్పిన తర్వాత, నేను వారితో లక్ష్మణమూర్తికి పదిహేను రోజులు ఏ బాధలేకుండ ఉండునట్లు చేయమని చెప్పాను. అంతేకాక పది రోజులకు లక్ష్మణమూర్తిని తిరిగి నావద్దకు రమ్మంటాను. అప్పటికి శరీరములో నీరు, గాలి ఏమాత్రము నాకు కనిపించకూడదనీ, తర్వాత ఐ ఐదు రోజులకు మీరు పాపపరిపాలనను ప్రారంభము చేసుకోవచ్చనీ, ఇరవై దినములకు అతనిని మరుజన్మకు పంపించమనీ, ఆ సమయమునకు రెండు రోజుల ముందే నేను మద్రాసుకు (చెన్నయ్) పోతానని చెప్పాను. ఆ మాటకు వారు, మీరు చెప్పినట్లే చేస్తామని చెప్పి నావద్ద సెలవు తీసుకొన్నారు. తర్వాత బయటవున్న శ్రీరాములును పిలిచి, లక్ష్మణమూర్తిని ఇంటికి తీసుకు పొమ్మని చెప్పాను. మరియు ఈ రోగమును పోవునట్లు చేశాను. పది రోజుల తర్వాత ఇతనిని నావద్దకు తీసుకొని వచ్చి చూపించుకొని పొమ్మని చెప్పినాను. అలాగేనని వారు పోయారు. తర్వాత పది రోజులకు వచ్చారు. పది రోజుల క్రిందట నేను లక్ష్మణమూర్తిని చూచినప్పుడు, మనిషి తెల్లగ లావుగా, శరీరమంత నీరు నిండుకొనియున్నాడు. ఇప్పుడు చూస్తే మనిషి బక్క పలుచగ, గుర్తుపట్టలేని విధముగ మారిపోయాడు. అంతేకాక తెల్లగ ఉన్న శరీరఛాయ నల్లగ మారిపోయివుంది. శరీరములో నీరు ఏమాత్రము కనిపించలేదు. అట్లే ఉబ్బసము కూడా ఏమి లేదు. లక్ష్మణ మూర్తి పూర్తి ఆరోగ్యముగా ఉన్నాడని, అతని అన్న శ్రీరాములు సంతోషమును వ్యక్తము చేస్తూ చెప్పాడు.


అప్పుడు శ్రీరాములుతో నేను కొన్ని మాటలు చెప్పాను. ఆరు నెలల క్రితము, నీ తమ్ముడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని చెప్పావు. ఎవరి విషయములోను జోక్యము చేసుకోని నేను ఆ దినము నిమిషములో నయము చేసి పంపాను. ఇది జరుగక ముందునుంచి నీవు నాదగ్గరకు వస్తున్నావు. నీవు వచ్చినా నీకు జ్ఞానము మీద శ్రద్ధకలుగలేదు. నీ తమ్మున్ని చూచి పంపితే, జ్ఞానమునకు ఇంత శక్తి ఉంది అని తెలుసుకొని, మీరు జ్ఞాన మార్గములో ప్రయాణిస్తారని అనుకొన్నాను. తర్వాత మీరు జ్ఞానమును పట్టించుకోలేదు. తిరిగి పదిరోజుల క్రితము మరియొక రోగముందని వచ్చారు. అప్పుడు కూడ మీకు నయమగునట్లు చెప్పిపంపాను. ఇప్పుడు శరీరములో నీరుగానీ, ఊపిరితిత్తులలో గాలి ఉధృతిగానీ లేదు. దీనినిబట్టి చూస్తే, నావద్దకు వచ్చినందుకు కొన్ని సంవత్సరముల నుండి ఆరోగ్యము బాగలేని వానికి బాగైనది. ఇంతవరకు మీకు పూర్తి బాగయ్యే వరకు చూచాను. ఇప్పటినుండి ఏ రోగము వచ్చినా మీరు నావద్దకు రావద్దండి. వైద్యము చేయడము మా ఉద్దేశముకాదు, మా పనీ కాదు. మా ధ్యాస అంతా జ్ఞాన అన్వేషణలో ఉంచాలనుకొన్నాము. అందువలన మా దారి వేరు. ఈ వైద్యము పనివేరు. నావద్ద మంత్రములేదు, మాయలేదు. కేవలము దైవజ్ఞానముతోనే మీకు బాగుచేయగలిగాను. ఇప్పటినుండి మీరు కూడ దైవజ్ఞానము మీద ధ్యాస పెట్టుకోండి. దానితోనే రోగాలు వచ్చినా పోతాయి. అటువంటి ధ్యాసలేకపోతే మీకే ఇబ్బంది. ఈ రోగాలు మందులతోనే పోతాయని అనుకోవద్దండి అని చెప్పి పంపినాను. అంతగా చెప్పినా దైవజ్ఞానము మీద శ్రద్ధలేదు. ఉన్న శ్రద్ధయంతా డబ్బు సంపాదన మీదనే పెట్టారు.


ఇక్కడనుండి పోయిన ఐదు రోజులకు లక్ష్మణమూర్తికి తిరిగి ఉబ్బసము, శరీరములో నీరు చేరుట ప్రారంభమైనది. తర్వాత ఐదు రోజులకు ఆ రెండు రోగములు ఎక్కువ అయిన దానివలన లక్ష్మణమూర్తి చనిపోయాడు. ఆ దినము నేను మద్రాసులో ఉన్నాను. నేను అతను పోయిన రెండు రోజులకు వచ్చాను. అప్పుడు శ్రీరాములు వచ్చి జరిగిన విషయము


---

చెప్పిపోయాడు. తర్వాత లక్ష్మణమూర్తికి దినాలు చేసినప్పుడు అతనియొక్క గుర్తుగా కొలాయి బిగించిన బకెట్లాంటి స్టీలాపాత్రను శ్రీరాములు తెచ్చి ఇచ్చాడు. ఆ పాత్రమీద లక్ష్మణమూర్తి అని వ్రాసిన అక్షరములు గలవు. ఆ పాత్ర మా వద్ద నేటికీ ఉన్నది. ప్రాణాపాయ స్థితి నుండి తప్పించి, ఆరోగ్యమును బాగుపడునట్లు చేసినా, దైవజ్ఞానమునకు ఒక్క రూపాయి కూడ వినియోగించలేదు. డాక్టర్ల మందులవద్ద వేలు, లక్షలు గుమ్మరించినవారు దేవుని జ్ఞానమునకు ఒక్క రూపాయిని కూడ వినియోగించలేదు అంటే, వారివద్ద జ్ఞానమునకు ఎంత విలువ ఉన్నదో అర్థమగుచున్నది. అందువలన చివరిలో దేవుడు, మీరు మావద్దకు రావద్దండి అని చెప్పి పంపించాడు. అతను చనిపోయిన తర్వాత వారు జ్ఞాపకార్థము ఇచ్చిన పాత్ర ఈ రోజు కొనినా వందరూపాయల ఖరీదు కూడ చేయదు. ముప్పైమూడు సంవత్సరములక్రితము దాని రేటు ఎంత ఉంటుందో, మీకే అర్థమవుతుంది. వారి గుణముల ప్రభావము వదలివేసి ఇక్కడ ముఖ్యముగ చెప్పవలసినది ఏమగా!


ప్రొఫెసరు, వెంకటేసుకు వచ్చిన నొప్పి రోగమే అయినా దానిని కూడ ఒక భూతముగా లెక్కించి శాసించి చెప్పి పంపాము. శరీరములో ప్రవేశించు సూక్ష్మశరీరముల (దయ్యముల) వలన వచ్చు అనారోగ్యములే కాక, శరీరములోవచ్చు కొన్ని రోగములు కూడ దయ్యములుకానటువంటి, భూతముల వలన వచ్చునవని చెప్పవచ్చును. దయ్యములు, భూతములు అనుమాటను ఇక్కడ కొంత జాగ్రత్తగ అర్థము చేసుకోవలసిన విధానమున్నది. ఒక మనిషి అర్ధాయుస్సుతో అకాల మరణమును పొందితే దయ్యముగా (సూక్ష్మశరీరముగా) అదే జన్మలోనే ప్రారబ్ధకర్మ అయిపోవునంత వరకు ఉండునని చెప్పాము. అటువంటి దయ్యములు మనుషులవి కావచ్చును, ఇతర జీవరాసులవి కావచ్చును. అటువంటివన్నీ జీవరాసులలోనికే లెక్కించబడును. జీవుడు అనగా భూతము అని కూడ అర్థముగలదు. అకాలమరణము పొందిన తర్వాత కూడ ఉన్నది జీవుడే అయినా గుర్తింపుకోసము దయ్యము అంటున్నాము. ఇటువంటి దయ్యములన్నిటినీ ఒక రకము భూతములని చెప్పవచ్చును. అట్లే రెండవ రకము భూతములు కూడ భూమిమీద గలవు. వాటిని వివరించుకొని చూచిన ఈ విధముగా తెలియగలదు.


ఆకాశము, గాలి, అగ్ని నీరు, భూమి అను వాటిని పంచ భూతములు అంటాము. అంతేకాక విశేషముగా వాటిని పంచ మహా భూతములని కూడ అంటాము. మహా భూతములనగా! చాలా గొప్పవని వాటి బలమును అంచనా వేయలేమని చెప్పవచ్చును. ఈ ఐదు మహా భూతములు బయట ప్రపంచముగా కనిపిస్తున్నవి. బయటి ప్రపంచములో ఐదు మహాభూతములుండగా, శరీరమను దానిలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పేర్లు గల స్వల్ప భూతములు కూడ గలవు. ప్రపంచము లోనివి పంచ మహాభూతములుకాగా, శరీరములోనివి పంచ స్వల్ప భూతములను రెండు రకములని చెప్పవచ్చును. మొదటి రక భూతములైన దయ్యములు, ఇంకొక శరీరములో వ్యాధుల రూపమున బాధించునట్లు, రెండవ రక భూతములైన పంచ స్వల్పభూతములు తామున్న శరీరములోనే వ్యాధుల రూపమున బాధించును. సులభముగా అర్థమగుటకు రెండు రకముల భూతములలో ఒక రకము బయట, మరొక రకము లోపల ఉన్నవని చెప్పవచ్చును. స్వల్పభూతములు దయ్యాలవలె రోగరూపములో ఉండినప్పటికి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను స్వల్ప భూతములు దయ్యలకంటే ప్రత్యేకమైనవి.


శరీరములో రోగరూపములో బాధించు మొదటి రకము దయ్యములు, మేము చెప్పితే మా మాటకు గౌరవమిచ్చి శరీరములో బాధించకుండ పోవుచున్నవి. అలాగే శరీరములో రోగరూపములో బాధించు రెండవ రకము స్వల్పభూతములు


---

కూడ, మేము చెప్పితే మా మాటను గౌరవించి బాధించకుండ పోవుచున్నవి. అనంతపురములోని ప్రొఫెసర్కు, చిన్న పొడమలలోని వెంకటేసుకు, తాడిపత్రిలోని లక్ష్మణమూర్తికి రెండవ రకము స్వల్పభూతముల వలననే రోగ బాధలు కల్గినవనీ, మేము చెప్పితే వారిలోని భూతములు మా మాటవిని అణిగి పోవుట వలన బాధలు లేకుండ పోయినవని తెలియుచున్నది. ఒక మనిషి చేసుకొన్న ప్రారబ్ధకర్మను రోగ రూపములో శరీరమునందు అనుభవించునపుడు, శరీరములో ఒకటవ రకములైన దయ్యములైనా బాధించవచ్చును, లేక రెండవరకములైన స్వల్పభూతాలైనా బాధించవచ్చును. మా జీవితములో మేము ఎంతో శ్రమించి, ఎంతో శ్రద్ధతో, జ్ఞాన సముపార్జన చేయడము వలన శరీరములోని కర్మలు, రోగములు, దయ్యాలు, స్వల్పభూతాలు ఎట్లున్నవని తెలియ గలిగాము. కొందరికి వచ్చిన రోగములను జ్ఞానశక్తివలన నివారించగ, నివారించినవాడు జ్ఞానియనిగాని, నివారణ గొప్పకార్యమనిగానీ గుర్తించక జ్ఞానమును మంత్రమని, జ్ఞానిని మంత్రగాడని చెప్పువారుగలరు. తమ రోగముల నివారణకు ఎన్నో వేలు, లక్షలు ఖర్చుచేసి ఎక్కడా నయము కాకపోతే, మా దగ్గరకు వచ్చి ప్రాధేయపడి, నివారింపజేసుకొని, మాకు మాంత్రికుడని బిరుదు ఇచ్చి పోయినవారు కూడా గలరు. అటువంటి ఒక సంఘటను వివరిస్తాను చూడండి. ఇది 1980వ సంవత్సరములో జరిగినట్లు నాకు జ్ఞాపకమున్నది.


పులివెందుల దగ్గర పార్నపల్లి గ్రామము గలదు. ఆ ఊరివారు అనంతపురములో నివాసమున్నారు. పార్నపల్లిలో నాకు బంధువులు గలరు. నాకు బంధువులైనవారు నన్ను గురించి చెప్పిన దానివలన అనంతపురములో నివాసముండు వారు, వారి అనారోగ్యమును గురించి అడుగుటకు తాడిపత్రి లోని నావద్దకు వచ్చారు. వచ్చినవారు ముగ్గురు. భార్య, భర్త, ఒక పెద్ద వయస్కురాలు. భర్తకు నలభై సంవత్సరముల వయస్సు కలదు. భార్యకు ముఫ్పైఐదు సంవత్సరములు వయస్సుగలదు. తర్వాత అరవై సంవత్సరముల వయస్సు గల ఆమె ఒకరు గలరు. పెద్దవయస్సుగల ఆమె వచ్చిన వ్యక్తికి తల్లి అవుతుంది. వచ్చినవారు “మాది పార్నపల్లె, ప్రస్తుతానికి అనంతపురము లో ఉన్నాము. పార్నపల్లెలో పలానా వ్యక్తి చెప్పిన దానివలన వచ్చాము” అని చెప్పారు. చెప్పి పంపిన వ్యక్తి నాకు బంధువు అయిన దానివలన, మా వాళ్ళు వచ్చినవారికి మర్యాద చేసి కూర్చోబెట్టారు. తర్వాత పై అంతస్తులో ఉన్న నాకు విషయమును తెలిపారు. నేను వీలు చూచుకొని వారిని పైకి రమ్మని చెప్పాము. వారు ముగ్గురూ వచ్చి కూర్చున్నారు. భర్త, భార్యను గురించి చెప్పాడు. ఆమెకు దాదాపు ఒక సంవత్సరమునుండి కుడి కాలులో విపరీతముగా నొప్పి ఉన్నదనీ, కాలికి నీళ్ళు తగిలితే తేలు కుట్టితే ఉన్న నొప్పికంటే ఎక్కువే అవుతుందనీ, కాలు నడువడానికి చాలా కష్టముగా ఉంటుందని చెప్పగ విన్నాను.

అప్పుడు నేను అడగడము జరిగినది.


నేను :- ప్రతి దినము నొప్పి వస్తుందా? లేక అప్పుడప్పుడు వస్తుందా?

అతను :- అది పోతే కదా వచ్చేది. సంవత్సరము నుండి ఎట్లున్నది అట్లే ఉంది. ఒక్కరోజు కూడ పోయిందని చెప్పేదానికే లేదు.

నేను :- అలా ఉన్నప్పుడు ఎక్కడా వైద్యము చేయించలేదా?

అతను :- చేయించాము. బెంగుళూరులో స్పెషలిస్టు దగ్గర చూపించాము. మూడు లక్షలకు పైన డబ్బులు అయిపోయినాయి. అయినా ఏమి నయము కాలేదు.

నేను :- ఇప్పుడు మందులు వాడుచున్నారా?

అతను :- ప్రతి దినము వాడవలసిందే! పూటకు 40 రుపాయల మందులు వాడవలసిందే. మందులు వాడితే రెండు


---

మూడు గంటలు నొప్పి కనిపించదు. తర్వాత నొప్పి మొదలవుతుంది. మూడు పూటలు మందులు వాడితే పగలంతా కొంత బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోతే పరవాలేదు. నిద్ర రాకపోతే భరించలేని బాధ ఉంటుంది. ఆ బాధ చూడలేక ఉయ్యాల కట్టి ఊపుచూ ఉంటే కొంతమేలు, లేకపోతే ఒక రాత్రి గడిచేదానికి చాలాకష్టముగా ఉంటుంది.


 నేను :- మందులు వాడితే పగలు నొప్పి అంతగా కనిపించదు అన్నావు కదా! అలాంటపుడు రాత్రిపూట కూడ మందులు వేసుకోవచ్చు కదా!


అతను :- ఒక దినములో మూడు మార్లకంటే ఎక్కువ వాడకూడదని డాక్టరు చెప్పాడు.

నేను :- రాత్రిపూట నొప్పి ఎక్కువగా నిద్రరాకుండ ఉంటుందని డాక్టరుకు మీరు చెప్పలేదా!

అతను :- చెప్పినాము. పగలు రెండు పూటలు వేసుకొని, ఒక డోస్ రాత్రిపూట వేసుకోమన్నాడు. కానీ పగలే బాధ తట్టుకోలేక మూడు మార్లు వేసుకొంటున్నాము.

నేను :- నొప్పి రావడానికి కారణమేమని డాక్టర్లు చెప్పారు?

అతను :- ఇక్కడ ఎవరూ చెప్పలేక, బెంగుళూరుకు వ్రాసి ఇచ్చారు. అక్కడకు పోయి అన్ని పరీక్షలు చేయించాము. చివరకు కాలు నరములో లోపము వలన అట్లు నొప్పి వచ్చినదని నరాల స్పెషలిస్టు చెప్పాడు.

నేను :- కాలి మీద నీరు తగిలితే, తేలుకుట్టిన నొప్పికంటే ఎక్కువ అవుతుందని చెప్పారు. స్నానము చేయాలంటే

ఎలా?

అతను :- కుర్చీలో కూర్చొని మరొక కుర్చీ మీద కాలుపెట్టి దానిమీద నీళ్ళు పడకుండ గుడ్డలు కప్పి మొదట వళ్ళంత స్నానము చేసిన తర్వాత కాలును మాత్రము తడి గుడ్డతో తుడవడము చేస్తున్నాము. మా ఇంటిలో పని మనుషులు ఆడవారు ఇద్దరు ఉన్నారు. అందువలన అందరూ కలిసి జాగ్రత్తగా స్నానము చేయిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము నీళ్ళు తగిలితే కష్టము కాబట్టి కాళ్ళు కడుక్కోలేదు.

నేను :- మొదట నొప్పి వచ్చినపుడు ఎలా ప్రారంభమైనదో చెప్ప గలుగుతారా?


ఆమె : - ఒకరోజు నిద్రలేస్తూనే క్రింద పాదము మీద ఐదు నిమిషాలకు ఒకసారి సూదులతో పొడిచినట్లు తెలిసేది. అలా ఆ రోజు ఉదయము 9 గంటల వరకు అట్లే ఉండేది. తర్వాత ఆ దినమంతా ఏమీలేదు. రెండవ రోజు నిద్రలేస్తూనే మొదటి రోజు ఉన్నట్లే సూదులతో పొడిచినట్లు తెలిసేది. ఆ దినము సాయంకాలము మూడుగంటల వరకు అట్లే ఉన్నది. మూడవ రోజుకూడ ఉదయమునుండి అట్లే ఉన్నది. ఆ దినము రాత్రి 9 గంటల వరకు పోలేదు. ఇక నాల్గవదినము నుండి కాలులో నొప్పి ప్రారంభమైనది. అప్పటినుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నది.


నేను :- మందులతో బాధపోనప్పుడు. ఎవరైన మంత్రగాళ్ళుంటే వారి దగ్గర చూపించకూడదా?

అతను :- చాలామంది దగ్గర చూపించాము. ఆ పీడ, ఈ పీడ అని చెప్పి డబ్బులు తీసుకొని కొంతమంది దిగదీశారు, కొంతమంది మంత్రించారు, కొంతమంది తావెత్తు కట్టారు. డబ్బులు పోయినాయి, కానీ రోగము బాగుకాలేదు.

నేను :- సంవత్సరమునుండి నొప్పి ఉన్నదంటున్నారు కదా! సైజులో ఏమైనా తేడా వచ్చిందా?

నొప్పి ఉన్న కుడికాలుకు, నొప్పిలేని ఎడమ కాలుకు,


---

అతను :- ఏమీ తేడా రాలేదు, మొదట ఎట్లున్నదో అట్లే ఇప్పుడూ ఉన్నది.


నేను :- సరే అది ఏ రోగమైనా కానీ తగ్గి పోయేటట్లు చూస్తాము. ఇలా రోగాలకు వైద్యము చేసేది నేను వదలుకొన్నాను. మీరు సరి కులస్థులు తర్వాత మా బంధువులు పంపగా వచ్చినవారు కావున చూస్తున్నాను.


(అని చెప్పిన తర్వాత రోగమున్న ఆమెను నేను ముట్టుకోకుండ ఆమెకు నయము చేయాలంటే కుదరదు. ఆమెకు నొప్పి ఎక్కడుందో అక్కడంతా వేలుతో ముట్టుకోవలసిందే. నాకు ఆమెను ముట్టుకోవడము ఇష్టములేక నా భార్య మల్లేశ్వరిని, నేను చెప్పినట్లు తాకుతూవుండమని చెప్పినాను. తర్వాత ఆమెను నిలబడమని చెప్పి నొప్పి ఎక్కడనుంచి ఉందో చెప్పమని అడిగాము. అప్పుడు ఆమె కుడికాలు పై భాగము నడుమువద్దనుండి ఉందని చెప్పింది. అప్పుడు చూపుడు వ్రేలును ఆమె చెప్పిన స్థలములో నడుము దగ్గర పెట్టమని నాభార్యకు చెప్పగ, నాభార్య అలాగే తన చూపుడు వ్రేలుతో ఆమె చెప్పిన చోట త్రాకింది. అలా ఆ వ్రేలును కొద్దికొద్దిగ నిదానముగా క్రిందికి జరుపుతూ రమ్మని చెప్పాను. నా భార్య మల్లేశ్వరి ఆ విధముగనే కొద్దిగ జరుపుతూ వచ్చింది. వ్రేలు పెట్టినప్పటినుండి మల్లేశ్వరి జరుపుతున్నపుడు నొప్పి ఎలాగుందో చెప్పమని ఆమెను అడిగినాను. ఆప్పుడు ఆమె నొప్పిని గమనిస్తూ వ్రేలు క్రిందికి జరిపేకొద్ది వేలు క్రిందనే నొప్పి వస్తూ ఉన్నదని, వేలు పై భాగమున నొప్పి కనిపించలేదని చెప్పింది. మల్లేశ్వరి వేలు జరిపేకొద్ది, నొప్పి వ్రేలు వెంట దిగుతూనే వచ్చింది. అలా కొద్దికొద్దిగా నేను చెప్పినట్లు మల్లేశ్వరి వ్రేలును క్రిందికి జరుపుతూ మోకాలి వరకు తెచ్చింది. తన నొప్పి కాలు పై భాగము నడుము వరకు ఉన్నదని చెప్పిన ఆమె, వ్రేలు ఉన్నచోటినుండి క్రిందికి నొప్పి ఉంది కానీ మోకాలి పైన ఎక్కడ నొప్పి లేదు అని చెప్పింది. మల్లేశ్వరిని అలాగే క్రింది పాదము వరకు జరుపుతూ రమ్మని నేను చెప్పాను. మల్లేశ్వరి అలాగే చేసింది. ఆమె కాలిలోని నొప్పి కూడ, జరిపే వ్రేలివెంట క్రింద పాదము వరకు వచ్చింది. పాదము పైన కాలిలో ఎక్కడ ఏమాత్రము నొప్పి లేకుండ పోయింది. అదే విషయమే ఆమె కూడ చెప్పింది. చివరిగా మల్లేశ్వరి వ్రేలును పూర్తి క్రిందికి వచ్చునట్లు చేసి, పాదము అయిపోయిన తర్వాత భూమికి త్రాకించమని చెప్పాను. నేను చెప్పినట్లే చేసింది. ఆమె శరీరములో కాలులోని నొప్పి కూడ భూమిలోనికి దిగిపోయింది, కాలులో ఏమాత్రము నొప్పి లేకుండ పోయింది. తనకు కాలులో ఏమాత్రము నొప్పి లేకుండ పోయిందని ఆమె కూడ చెప్పింది. ఇదంతా ఆమె భర్త ముందర, అత్త ముందర జరిగింది. పై నుండి క్రిందివరకు వ్రేలును జరుపుచు నొప్పిని క్రిందికి తెచ్చు ప్రక్రియ కనీసము ఐదు లేక ఆరు నిమిషముల కాలము జరిగివుంటుంది. సంవత్సరమునుండి ఉన్న నొప్పి ఐదారు నిమిషములలో లేకుండ పోయిందంటే ఆమె భర్త, అత్త ఇద్దరూ నమ్మలేకపోయారు. వారికి నమ్మకమును కల్గించుటకు నీళ్ళు తెప్పించి నాముందరే కాలి మీద పోసి చూపించాను. నీళ్ళు కాలికి తగిలితే తేలు కుట్టినంత నొప్పి కలిగేది. కానీ అప్పుడు ఏ నొప్పీ రాలేదు.


వారికి కొన్ని మాటలు చెప్పదలుచుకొని ఈ విధముగా చెప్పాను. “మీరు ఇంతవరకు ప్రతి దినము వాడుచున్న మందులు వాడవలసిన పనిలేదు. ఇప్పటినుండి నొప్పిరాదు. నేను ఉన్నాను కాబట్టి మీకు చూచాను సరిపోయింది. నేను లేకపోయుంటే, నీకు ఈ వైద్యము చేయువారే ఉండరు కదా! అందువలన ముఖ్యముగ మీకు నేను చెప్పునదేమంటే నేను మీ ముందరే వైద్యము ఏమి చేశాననేది మీరు ప్రత్యక్షముగ చూచారు కదా! నేను ఏ మందుగానీ, ఏ మంత్రముగానీ వాడలేదు. కేవలము వ్రేలు స్పర్శతోనే బాధను పోవునట్లు చేశాను. దానికి కారణము కేవలము దైవజ్ఞానము మాత్రమే. నేను జ్ఞానమును తెలుసుకొన్నాను కావున నాకు ఆ రోగములు చెప్పినమాట వింటాయి. అదే విధముగ మీరు కూడ జ్ఞానము తెలుసుకొంటే నాకున్నట్లే మీకు కూడ జ్ఞానశక్తియుండును. అలాంటపుడు మీ వద్దకు ఇటువంటి రోగములు


---

రానేరావు. ఎవరికైన రోగములుండి బాధపడుచుంటే నేను మీకు బాగుచేసినట్లే మీరు కూడ వారికి బాగుచేయ వచ్చును. అందువలన మీరు దైవజ్ఞానమును తెలుసుకోండి. మాకెట్లు జ్ఞానము తెలుస్తుంది అని అనుకోవలసిన పనిలేదు. మేము జ్ఞానమును తెలుపు నిమిత్తము ప్రబోధ, దేవాలయ రహస్యములు, జనన మరణ సిద్ధాంతము అను మూడు గ్రంథములు వ్రాసియుంచాము. ఆ మూడు గ్రంథముల ఖరీదు కేవలము 40/- రూపాయలు మాత్రమే. మీరు 40 రూపాయలు ఇచ్చి గ్రంథములు తీసుకొని పోయి ఇంటివద్దనే జ్ఞానమును తెలుసుకోండి అని జ్ఞానాన్ని గురించి, జ్ఞానము యొక్క గొప్పతనమును గురించి చెప్పాను.


నేను చెప్పిన దానికి వారు తర్వాత వచ్చి పుస్తకాలు తీసుకొంటామని చెప్పి పోయారు. వారము రోజుల వరకు వారు రాలేదు. గోనుగుంట్ల వెంకటనారాయణ అనంతపురములోనే కాపురమున్నాడు. (ప్రస్తుతము ఇపుడు ఆయన సన్యాసత్వము తీసుకొని జిహ్వానంద స్వామిగా ఉన్నాడు.) వెంకట నారాయణ తన స్నేహితుని ఇంటికి పోయాడు. ఆ స్నేహితుని ఇంటి ప్రక్కనే, నా దగ్గరకు వచ్చి నొప్పిని బాగుచేయించుకొని పోయిన వారున్నారట. ప్రక్క ఇంటి ఆమెకు తాడిపత్రి స్వామిదగ్గరకు పోయింటే నొప్పి పోయిందని వెంకటనారాయణకు ఆయన స్నేహితుడు చెప్పాడు. వెంకటనారాయణ నాదగ్గరకు వారమునకొకమారు వచ్చి జ్ఞానమును తెలుసుకొనేవాడు. కనుక వెంకటనారాయణ ప్రక్క ఇంటి వారి దగ్గరకు పోయి కలిసి మాట్లాడి, నొప్పి పూర్తిగ పోయిందా అని అడిగాడు. దానికి ఆమె పూర్తిగా పోయింది, ఎవరితోను కాని దానిని ఆయన పొగొట్టాడు అని చెప్పింది. అంతలో ఆమె అత్త నొప్పియేమో పోగొట్టినాడు, కానీ ఆయన డబ్బులు అడుగుతాడే అని అనింది. అంతేకాక ఆయనది ఏమి ఖర్చుకాలేదు, మమ్ములను 40 రుపాయలడిగినాడు. రెండు నిమిషాలు మంత్రించి, డబ్బులు అడిగితే ఏమి బాగుంటుంది? అని కూడ అన్నది. ఆ మాటలువిన్న వెంకట నారాయణకు ఏమీ అర్థముకాలేదు. ఇక్కడ ఏమి జరిగినది ఆయనకు తెలియదు. కావున ఆయన వారితో ఏమి మాట్లాడకుండ, మౌనముగ వచ్చేశాడు. వెంటనే తాడిపత్రికి వచ్చి, జరిగిన విషయమంతా నాభార్య ద్వారా తెలుసుకొన్నాడు. తర్వాత నావద్దకు వచ్చి కలిసి అనంతపురములో వాళ్ళు అనిన మాటలు నాకు చెప్పాడు. ఆ మాటలకు నాకు కోపము వచ్చింది.


అప్పుడు వెంకటనారాయణతో ఇలా అన్నాను. “వాళ్ళు విపరీతముగా బాధపడుచు నావద్దకు వచ్చారు. వారు ఎవరో నాకు తెలియదు. పార్నపల్లెనుండి చెప్పి పంపారని మరియు కులస్థులమని వాళ్ళు వస్తూనే కాఫీ ఇచ్చి మర్యాద చేశాము. తర్వాత మధ్యాహ్నము భోజన సమయమునకు ముగ్గురికి అన్నము కూడ పెట్టాము. పైసా కూడ ఖర్చు కాకుండ ఎంతో కాలమునుండి ఉన్న బాధను ఐదు నిమిషములలో లేకుండ చేశాను. నా దగ్గరకు రాకముందు ఒకరోజుకు వందరూపాయల మందులు తినేవారిమని వారే చెప్పారు. అంతేకాక డాక్టర్ల దగ్గర లక్షల రూపాయలు పోయాయని కూడ వారే చెప్పారు. అంత పెద్ద రోగమును నేను సులభముగా నయము చేసి, జ్ఞానమును తెలుసుకోండి, ఇటువంటి రోగములు రావు అని చెప్పాను. జ్ఞానమును తెలుసుకొనుటకు మా వద్దనున్న 40 రూపాయల పుస్తకములు కొనుక్కోమని చెప్పాము. 40 రూపాయలు ఇచ్చి, పుస్తకములు తీసుకొని చదువుకొమ్మని వారిమంచికే చెప్పాను గానీ, ఉచితముగ 40 రూపాయలు ఇవ్వమని నేను అడగలేదే! ఒకవేళ నేను 40 రూపాయలు ఉచితముగ అడిగియుండినా, నాది న్యాయమే అవుతుంది. వారు వచ్చిన రోజు ముగ్గురికి ఇచ్చిన కాఫీ, పెట్టిన భోజనము లెక్కవేస్తే 40 రూపాయలకంటే ఎక్కువే అవుతుంది. కొంతైనా విచక్షణా జ్ఞానము లేకుండ మాట్లాడు వారిని దగ్గరకు రానివ్వడము తప్పే, వారికి వైద్యము చేయడము తప్పే. నేను జ్ఞానమును తెలుసుకొమ్మని చెప్పితే డబ్బులు అడిగినారని చెప్పడము వారు చేసిన పెద్ద తప్పు అని కోపంగా అన్నాను.


---

భూతము గ్రహించుకొను శక్తియున్న గ్రహము కావున నేను కోపగించుకొని అరిచిందీ, వారు మాట్లాడింది పెద్దతప్పు అని చెప్పింది రోగ భూతము గ్రహించుకొన్నది. ఆ భూతమునకు కూడ కోపమొచ్చిందో ఏమో, అంతవరకు నా రూములోనే వేలును భూమికి తగిలించిన చోటనే ఉన్న భూతము వెంటనే అనంతపురమునకు పోయి ఆమె కాలుయందు చేరుకొని ముందు మాదిరి బాధించను మొదలుపెట్టింది. అప్పుడు ఒక గుమస్తా మతికి వచ్చినట్లు నేను మతికి వచ్చాను. అక్కడికిపోతే బాగు చేస్తాడులే అను ధైర్యముతో వచ్చారు. ఈమారు వచ్చినా, వారికి ఏ మర్యాద చేయలేదు. కాఫీకూడ ఇవ్వలేదు. అన్నము వేళకు అన్నము కూడ పెట్టలేదు. ఉదయము 9 గంటలనుండి సాయంకాలము 4 గంటల వరకు క్రిందనే మొండిగా కూర్చున్నా నేను పైకి పిలువలేదు. నా భార్యను అడిగితే ఆయన వేరే పని మీద ఉన్నాడు అని చెప్పింది. పైకి పోయి అడిగి వస్తామని అడిగినా, అట్లు అనుమతి లేకుండ పోకూడదు అని చెప్పారు. వారు వస్తూనే మనమే పలకరించి, మర్యాద ఇచ్చి వారి పని చేసి పంపుతారని అనుకొన్నారో ఏమో కానీ వారి అంచనా అంతా తారుమారైపోయింది. చివరికి చేసేది లేక వెను తిరిగిపోయారు. తర్వాత చాలామందితో అలా మాట్లాడడం మాది పొరపాటేనని చెప్పుకొనినా, మేము వారిని పట్టించు కోలేదు. లక్ష్మణమూర్తిది, అనంతపురము రోగిది నాకు మంచి గుణపాఠమైనది. అప్పటినుండి ఎవరికీ వైద్యము చేయకూడదనుకొన్నాను. నేను అంతవరకు చేసినది పరిశోధన నిమిత్తము. నాకు అన్ని విషయములు తెలిసిపోయిన దానివలన, ఆ వైద్యమునకు దూరము కావాలనుకొన్నాను. పై సంఘటనలో కాలులో నొప్పిని గురించి కొందరికి అది దయ్యమా లేక రోగమా అని అనుమానము ఉండవచ్చును. దానికి నా జవాబు అది మొదటి రకమైన దయ్యము కాదు. రెండవ రకమైన భూతమని చెప్పవచ్చును. అనుభవించే పాపములలో మూడవ రకమైన కర్మ అని చెప్పవచ్చును. అందువలన అది మందులకు, మంత్రములకు లొంగలేదు. ఒక్క జ్ఞానుల మాటతోనే లొంగిపోవు జ్ఞానమునకు సంబంధించిన కర్మయని అర్థమగు చున్నది. నా మాటకు విలువనిచ్చి, కాలునుండి దిగివచ్చి, నా సన్నిధిలోనే ఉన్న రోగ భూతము నాకు వచ్చిన కోపమును గ్రహించి, తిరిగి వారియందు చేరి తన పనిని తాను చేసినట్లు, ఈ సంఘటనలో నిరూపణకు వచ్చినది. భూతములు గ్రహించుకొను స్వభావముగలవని, అవి అనుకొంటే తిరిగి శిక్షను అమలు పరచగలవని తెలియుటకు, నిదర్శనముగా మరియొక ఘటనను వివరిస్తాను చూడండి. ఇప్పుడు చెప్పబోవునది మొదటి రకము భూతమునకు సంబంధించినదని అర్థముకాగలదు.



తాడిపత్రి దగ్గర చింతలపల్లి అను చిన్న పల్లెటూరు గలదు. ఆ ఊరిలో ఒక పెద్దరైతు. అతని పేరు సరిగ జ్ఞాపకము లేదు. బహుశ నారాయణరెడ్డి అనుకుంటాను. అతనిని ఒక సాధారణ దయ్యము పట్టి పీడిస్తుండేది. ఆ దయ్యము చరిత్ర చూస్తే ఇలా గలదు, నాగేంద్ర అనే యువకుడు క్రొత్తగా పెళ్ళి చేసుకొన్నాడు. అతనిది కూడ చింతలపల్లి గ్రామమే. పెళ్ళైన క్రొత్తనుండి, ఇటు భార్యకు అటు అమ్మకు ఒకరికొకరు సరిపోక పోట్లాడే వారు. అత్త కోడళ్ళు ప్రతి చిన్న విషయానికి పోట్లాడేవారు. ఇది నాగేంద్రకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇటు భార్యకు అటు తల్లికి చెప్పలేక మధ్యలో బాధపడేవాడు. ఆర్థిక స్థోమత లేని కుటుంబము, కావున ఎక్కడికైన పోయి బ్రతికే దానికి కూడ వీలులేదు. అటువంటి స్థితిలో అలాగే కాలము గడుపుచుండగ అత్త కోడలు ఇద్దరు వాదించుకొని, భార్య నాగేంద్రకు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. భార్య చెప్పినట్లే నాగేంద్ర అమ్మకూడ చచ్చిపోతానని బెదిరించింది. ఇద్దరు అలా చెప్పడము వలన ఏమి తోచక, వారికి ఏమి చెప్పలేక, నాగేంద్ర తానే చనిపోవాలని అనుకొన్నాడు. పైరుకు కొట్టే క్రిమి సంహారకమందును తీసుకొని పొలము లోనికి పోయి త్రాగినాడు. ఆ సమయములో చుట్టు ప్రక్కల పొలములలో ఎవరూ లేరు, కావున విషము త్రాగిన నాగేంద్ర క్రిందపడిపోయి పొర్లాడుచున్నా ఎవరు చూడలేదు. చివరికి అతను చనిపోయాడు. అది నాగేంద్రకు అకాలమృత్యువు అయినది. కావున అతను సాధారణ దయ్యముగ మిగిలిపోయాడు.


---

నాగేంద్ర చనిపోయి దాదాపు ఆరునెలలు కాలమైనది. ఒక దినము నారాయణరెడ్డి, నాగేంద్ర చనిపోయిన పొలముగట్టు మీద పోవుచుండుట వలన నాగేంద్ర చూచాడు. అతను ఆ ఊరిలో ధనికుడు, కావున అతనిలో చేరుకొంటే కొంత సుఖమును అనుభవించవచ్చును అనుకొన్నాడు. అపుడు నాగేంద్ర, నారాయణరెడ్డి వెంట నడుస్తూ సమయము చూచి నారాయణ రెడ్డిని క్రిందపడునట్లు త్రోచాడు. అతను క్రిందపడి పైకి లేచే లోపల అతని శరీరములోనికి ప్రవేశించాడు. నాగేంద్ర, నారాయణరెడ్డి శరీరములో ఉండడము వలన, నాగేంద్ర విషము త్రాగినపుడు కడుపులో బాధ ఎట్లుండునో అట్లే నారాయణరెడ్డికి బాధ కనిపిస్తుండెను. అప్పటినుండి నారాయణరెడ్డి చాలామంది డాక్టర్లవద్ద చూపించుకొని అది నయము కాకపోవడము వలన, ఇతరుల సలహాతో మాంత్రికులను ఆశ్రయించి వైద్యము చేయించుకొన్నాడు. నారాయణరెడ్డి శరీరములోనున్నది నాగేంద్ర అని తెలిసినది. కానీ దానికి సరియైన మాంత్రికుడు ఎవరూ దొరకలేదేమో, నారాయణరెడ్డికి కడుపులో బాధ తగ్గలేదు. నారాయణరెడ్డికి పరిచయమున్న నారాయణ అను వ్యక్తి నాకు కూడ కొంత పరిచయమే. నేను ఏదో పనిమీద బజారుకు పోయినపుడు, ఆ వ్యక్తి నాతో కలిసి నారాయణరెడ్డి విషయము, నాగేంద్ర విషయము రెండూ చెప్పాడు. ప్రక్కనే ఉన్న లాడ్జిలో నారాయణరెడ్డికి మాంత్రికులు వైద్యము చేస్తున్నారు. మనమూ అక్కడికి పోయి చూచి వస్తాము రమ్మని నన్ను పిలిచాడు. నేను ఎప్పుడూ మాంత్రికులు చేసే వైద్యమును చూడలేదు, కనుక వస్తాను పోదాము అని అతనితో కలిసి లాడ్జిలోనికి పోయాము. అప్పుడు సమయము పగలు పదకొండుగంటలైనది. నారాయణరెడ్డి చుట్టు నలుగురు మాంత్రికులు కూర్చొని మంత్రించుచున్నారు. నాగేంద్ర దయ్యము బయటికి వచ్చి మాట్లాడలేదు. నారాయణరెడ్డి మాత్రము కడుపులో బాధగా ఉన్నదని చెప్పుచున్నాడు. మేము ఒక గంట వరకు అక్కడే ఉండి చూచాము. దయ్యము బయటికి రావడముగానీ, నారాయణరెడ్డి కడుపులో బాధ తగ్గడముగానీ జరుగలేదు. మధ్యాహ్న భోజనము సమయము కావడము వలన నేను ఇంటికి వచ్చేశాను.


సాయంత్రము నాలుగు గంటల సమయములో నన్ను లాడ్జిలోనికి పిలుచుకొని పోయిన నారాయణ అను వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఏమి వచ్చావు? అని నేను నారాయణను అడుగగ, నారాయణ ఇలా అన్నాడు. “నారాయణరెడ్డి ఒంటరిగా ఉన్నపుడు లాడ్జిలో ఉరివేసుకొన్నాడంట. అంతలోనే అతని అల్లుడు అక్కడికి పోవడము వలన ఆయన బ్రతికాడు. మనము వచ్చిన తర్వాత మూడు గంటల సమయములో ఇది జరిగింది. నాకు తెలిసి నేను పోయివచ్చాను. ఆ బాధకు తట్టుకోలేక ఉరివేసుకొన్నానని నారాయణరెడ్డి చెప్పుచున్నాడు. అతని అల్లుడు ఏమి చేయాలో అర్థముకాక బాధపడుచున్నాడు. నన్ను పిలిచి నీకు తెలిసిన వారెవరైన ఉన్నారా అని అడిగినాడు. నేను ఏమి చెప్పలేదు. నీవు చూస్తానంటే వారిని తీసుకొని వస్తాను” అన్నాడు. దానికి నేను ఒప్పుకోలేదు. “ఎవరికీ ఇప్పటినుండి చూడదలుచుకోలేదు, ఎంతోమందికి బాగుచేసినా, చివరకు నన్ను కూడ మంత్రగాళ్లలోనికి కలిపివేసినారు. బయట లక్షలు ఖర్చు పెట్టినవారు ఇక్కడ తమ రోగము పోతూనే, పది రూపాయలు కూడ ఇవ్వకుండ పోతారు. అట్లు పోయేదే కాక, అక్కడకు పోతే బాగా మంత్రిస్తాడని ఇతరులకు కూడ చెప్పి నాకు మంత్రగాడను బిరుదు ఇస్తారు. అందువలన ఇతరులకు చూచేదే లేకుండ వదలివేయాలనుకొన్నాను” అని చెప్పాను. దానికి నారాయణ ప్రాధేయపడి, అతను బాధకు తట్టుకోలేక ఉరివేసుకొన్నాడు. మీరు చూడకపోతే బాధకు తట్టుకోలేక చనిపోతాడు. ఏమి అనుకోకుండ నన్ను చూచైనా ఇది ఒక్కటి చూడమని అడిగాడు. నారాయణ మాటలు వినిన తర్వాత నాకు కూడ చూడవలెననిపించింది. అప్పుడు నారాయణతో " నీవు అడుగుట వలన ఇది ఒక్కటి చూస్తాను. నేను ఎవరినీ డబ్బులు అడుగను కదా! నీవే వారిని డబ్బులు అడిగి వందరూపాయలైనా ఇప్పించ వలసియుంటుంది” అని చెప్పాను. నామాటవిన్న నారాయణ


---

వెంటనే పోయి జట్కాబండిలో నారాయణరెడ్డిని తీసుకువచ్చాడు. నారాయణరెడ్డితో పాటు, అతని అల్లుడు మాత్రము వచ్చాడు. అప్పుడు సమయము ఆరు గంటలవుతూ ఉన్నది.


నేను స్నానము చేసివచ్చి నారూములో కూర్చొని అతనిని నావద్దకు తెమ్మని చెప్పినాను. అలాగే అతనిని నాముందర కూర్చోబెట్టారు. అతనిలో సాధారణ దయ్యముందని తెలుసు కాబట్టి అతనిని నేనేమి అడుగక ప్రస్తుతము అతని బాధ పొయేటట్లు చేయాలని యోచించి ఆ సమయానికి తగినట్లు ఇంగువను వెల్లులి (తెల్లవాయిల) రసముతో కలిపి చేసిన గంధమును నారాయణరెడ్డి రెండు కళ్ళలో కొద్దిగా పెట్టాను. ఆ కలికమును కళ్ళలో పెట్టినపుడు ఒక్కమారు కరెంటుషాక్ కొట్టినట్లయినది.ఆ దెబ్బతో లోపలనున్న నాగేంద్ర దయ్యము భయపడి శరీరమును వదిలిపోయింది. నారాయణ రెడ్డికి కలికము మంట లేకుండ కళ్ళుకడుక్కొమన్నాము. అతను కన్నులు శభ్రముగా కడుగుకొన్న తర్వాత నీకు ఇపుడు ఏమైనా బాధ ఉందా అని అడిగాము. ఏమిలేదు అని అతను హుషారుగా మాట్లాడినాడు. అతనికి ఒక్కమారు అలా బాగుకావడము అక్కడున్న అతని అల్లునికి నారాయణకు సంతోషమైనది. అప్పుడు వారితో నేను ఇలా చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధను లేకుండ చేశాను, కానీ తర్వాత ఎప్పుడైనా రావచ్చును. అది శాశ్వితముగా పోవాలంటే మరొకమారు ఇక్కడికి వచ్చి చూపించుకోవలసి ఉంటుంది అని చెప్పి పంపాను. నేను నా జ్ఞానశక్తిని ఉపయోగించకుండ సాధారణముగా వైద్యము చేయాలనుకొన్నాను. అందువలన ఆ దయ్యమును బయటకు పిలిచి అట్లు రావద్దని చెప్పి పంపకుండ క్రొత్త విధానమును అనుసరించి కళ్ళలోనికి ఇంగువ కలికము వేయడము జరిగినది. నేను చేసిన ప్రయోగమునకు ప్రస్తుతానికి నాగేంద్ర బయటికి పోయాడు, నారాయణరెడ్డి బాధనుండి బయటపడినాడు.


నారాయణరెడ్డితో సహా నారాయణ కూడ వారి ఇంటికిపోయి వదలిపెట్టి వచ్చాడు. అలా పోయినప్పుడే ఇలా చెప్పాడు. "స్వామి ఏమి అడుగడు, ఆయనకు అడిగే అలవాటులేదు. నీవు వందరూపాయలు తీసుకొని వచ్చి, ఆయనకు తాంబూలములో పెట్టి ఇచ్చి, తర్వాత ఎప్పటికి ఆ దయ్యము రాకుండ, ఆ బాధ రాకుండ ఆయనతో గట్టి భద్రము చేయించుకో” నారాయణ మాటలు విన్న అల్లుడు రేపే పంపుతానని చెప్పి నారాయణ ముందరే నారాయణరెడ్డికి ఐదువందలు డబ్బులు ఇచ్చి, రేపుపోయి నూరు రూపాయలు ఆయనకు ఇచ్చి చూపించుకో అని చెప్పాడు. సరేనని చెప్పిన నారాయణరెడ్డి రెండవరోజు నావద్దకు వచ్చాడు. ఆ రాత్రి కూడ నా ఇంటివద్దే పడుకొన్నాడు. మా ఇంటికి వచ్చిన వారికి అన్నము పెట్టే అలవాటు మాకుండుట వలన, నారాయణరెడ్డి మూడు రోజులు నావద్దే తిష్టవేశాడు. ఆయన మాత్రము నూరురుపాయల డబ్బును ఇవ్వలేదు. రెండు రోజుల తర్వాత నారాయణ వచ్చి, స్వామికి డబ్బు ఇచ్చావా అని అడిగాడు. ఇవ్వలేదు వచ్చేటప్పుడు బజారులో ఖర్చయినాయి. తర్వాత ఇస్తానులే అన్నాడు. ఆ మాటకు నారాయణ బాగా అతని మీద కోపగించుకొని, నేను బ్రతిమాలితే నిన్ను చూచాడు. నీకు అంత బాధను క్షణాలలో లేకుండ చేస్తే ముందు ఇక్కడ ఇవ్వకుండ బజారులో ఖర్చయినాయి అని చెప్పడము మంచిదా అని అడిగాడు. దానికి నారాయణరెడ్డి అన్న మాటలు విచిత్రమును విస్మయమును కల్గిస్తాయి. “బాధ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు అడిగినా ఆ సమయములో అయితే ఇస్తాము. బాధ లేనపుడు అడిగితే ఎట్ల ఇవ్వబుద్ది అవుతుంది. ఎప్పుడైనా బాధ ఉన్నపుడే అడగాలని నీవు స్వామికి చెప్పు” అన్నాడు. ఆ మాటలకు నారాయణకు ఏమి అర్థముకాక బాధపడుచు నావద్దకు వచ్చి "మీరు ఎవరికి చూడను అని ముందు చెప్పినదే సరియైనది. నారాయణరెడ్డితో నేను నూరు రూపాయలు ఇమ్మని చెప్పితే, అతను ఇలాగ అంటున్నాడు.” దానికి నేను నవ్వి “నీవు ఒక్కన్నే చూచావు, నేను చాలామందిని చూచాను. అందువలన కఠినముగా చూడనని చెప్పాను. నేను ఎవరిని డబ్బు అడుగలేదు, అడగలేదని నన్ను తెలివితక్కువవానిగ


--

లెక్కించుకొనుచున్నారు. నేను నీకు అడగమని చెప్పినది వారికి పెట్టె అన్నము ఖర్చుకేగానీ నేను చేసిన పనికి కాదు కదా! నీవే అతనిని ఇక్కడ నుండి పంపించివేయి” అని చెప్పాను. నారాయణ, నారాయణరెడ్డిని పిలుచుకుపోయి

ఇంటికి పంపించాడు.


అతను ఇంటికి పోయిన వారము రోజులకు నాగేంద్ర నారాయణ రెడ్డిలో దూరుకొన్నాడు. విషమును త్రాగినవానికి కలుగుబాధ తిరిగి నారాయణరెడ్డికి వచ్చింది. ఆ విషయమును తెలుసుకొన్న నారాయణ రెడ్డి అల్లుడు నారాయణతో కలిసి మాట్లాడినాడు. నారాయణ మాట్లాడుచు “డబ్బులిచ్చి మీ మామ రెండవ మారు చూపించుకోవాలి. కానీ నాకు బాధ పోయింది కదా డబ్బులు ఇవ్వను బుద్ధిపుట్టలేదు అంటాడు. స్వామి ఇది తాత్కాలికమే, రెండవమారు వచ్చి చూపించుకోవాలి అని చెప్పాడు కదా! రోగమున్నపుడు వేల డబ్బులు పోగొట్టుకొని, బాగయ్యేచోట వందరూపాయలు కూడ ఇవ్వకపోతే ఎట్లా? వందరూపాయలు కూడ ఆయన అడుగలేదు. నేను ఇస్తానని చెప్పాను. మనము పోయినపుడు సమయానికి అన్నము పెడుతున్నారు కదా! మనము ఇచ్చే డబ్బులు మనము తిన్న అన్నమునకు కూడ సరిపోవు. ఈయన పోయి రెండు రోజులనుండి అక్కడే కూర్చున్నాడు. అక్కడుంటే బాధ రాదులే అనుకొన్నాడు. అట్లుండడము వారికి ఖర్చు కాదా? అని నేనే ఇంటికి పంపించాను. స్వామి మొదటనే ఇవన్నీ చూడను, నేను జ్ఞానమును చెప్పేపనే చేస్తాను, ఇది చేయను అన్నాడు. బలవంతముగా నేనే ఒప్పించుకొని వచ్చి పిలుచుకొని పోయాను. ఇప్పుడు అక్కడ నాకు కూడ మర్యాద లేదు” అన్నాడు.


నారాయణ మాటలువిన్న అల్లుడు మామను అరిచాడు “నేను ఐదువందలు ఇచ్చినాను కదా! వందరూపాయలు ఇచ్చేదానికి ఏమి? నీ వేమైన ఊరకనే ఇస్తున్నావా? అంత పెద్ద బాధను లేకుండ చేసినాడు కదా! నీవు చేసిన పనికి మాకు మర్యాద లేకుండ పోయింది.” అని నారాయణను బుజ్జగించి నారాయణను, మామను పిలుచుకొని నాదగ్గరకు వచ్చాడు. నేను వారిని చూచి ఏమి వచ్చారని అడిగాను. కడుపులో బాధ నారాయణ రెడ్డికి తిరిగి వచ్చిందని చెప్పారు. నారాయణ రెడ్డి అల్లుడు మా మామది పొరపాటు, డబ్బులు నేను ఇస్తున్నాను ఏదో ఒకటి చేయండని ఐదువందలు ఇవ్వబోయాడు. దానికి నేను నివారించి, డబ్బులు తీసుకోకుండ ఈ విధముగా చెప్పాను. “రెండవ మారు వచ్చి చూపించుకొమ్మని చెప్పినాను. అది ఏడు రోజుల లోపల రెండవమారు చూపించుకోవలసి ఉంటుంది. ఇపుడు ఏడు రోజులు అయిపోయింది. మొన్న వచ్చి నావద్ద రెండు రోజులున్నాడు. నేను రెండవమారు చూపించుకోవలెనని జ్ఞాపకము చేసినా నాకు బాగుంది కదా, పోయింది కదా అని బదులు చెప్పాడు. కాలము మించి పోయింది కావున, నేను ఏమి చేసే దానికి కాదు” అన్నాను. నా మాటలువిన్న అల్లుడు చేసేది లేక ఏమి చేయాలో అర్థముకాక మీరే ఏదైన ఉపాయము చెప్పండి అని అడిగాడు. దానికి నేను ఎక్కడైనా దేవతల దగ్గరకు పోయి చూపించుకోండి, మాంత్రికులవద్ద పోదని తెలిసింది. కావున మీకు దేవతలే దిక్కు కసాపురము ఆంజనేయస్వామి దగ్గరకుగానీ, గండి ఆంజనేయస్వామి దగ్గరకుగానీ లేక ఇంకా ఎక్కడైన ఎవరైనా దేవతలుంటే వారివద్దకు పోయి చూపించుకొమ్మని సలహా చెప్పాను. చేసేది లేక ఎక్కడికి పోవాలని ఆలోచన చేసుకొంటూ నావద్దనుండి పోయారు.


నావద్దనుండి పోయిన నారాయణరెడ్డి, అతని అల్లుడు నేను చెప్పినట్లు మాంత్రికులవద్దకు పోకుండ పెద్దమ్మ అను దేవత వద్దకు పోయారు. అక్కడంత మాట్లాడుకొని తిరిగి నావద్దకు వచ్చి నేను చెప్పిన తర్వాతనే పోవాలనుకొన్నారు. నారాయణరెడ్డి అల్లుడు, నారాయణ ఇద్దరు నావద్దకు వచ్చి దగ్గరపల్లెలో పెద్దమ్మ దేవత ఉంది. ఆమె దినము మార్చి దినము పూనకమువచ్చి మాట్లాడుతుందట. అక్కడికిపోతే ఈ బాధకూడ పోతుందట. మీరు పొమ్మంటేనే పోతాము


---

అని వచ్చి అడిగారు. నేను పొమ్మనే చెప్పినాను. నేను చెప్పిన తర్వాత వారు ఇంకాకొంత సమాచారమును చెప్పారు. అదేమనగా! పెద్దమ్మ దగ్గర రెండురకముల పూజలుంటాయి. ఒకటి పెద్దపూజ, రెండవది చిన్నపూజ. పెద్దపూజకు రెండు వందల రూపాయలు డబ్బులు కట్టి పేరు వ్రాయించుకోవాలి. చిన్నపూజకు వంద రూపాయలు కట్టవలసియుంటుంది. అలా డబ్బులు కట్టి పేరు వ్రాయించు కొన్నవారికి, ఒక కొబ్బరికాయ ఇచ్చి పంపుతారు. ఆ కొబ్బరికాయను రాత్రిపూట పడుకొనే సమయములో తలప్రక్కన పెట్టుకొని పడుకొని, రెండవరోజు సాయంకాలము ఆరుగంటలకు అక్కడికిపోతే, అప్పుడు దేవత మనలను గురించి చెప్పుతుందంట. పెద్దపూజకు రెండువందలు డబ్బులు కట్టితే పెద్దమ్మ ఉన్న రూములోనికి పంపిస్తారట, చిన్న పూజకు డబ్బులు కట్టితే పెద్దమ్మ ఉన్న రూములోనికి పంపరట. ప్రక్కరూములోనుండి మాట్లాడిస్తారట. అని అంతా వివరముగా చెప్పి నన్ను సలహా అడిగారు. నేను దానికి అక్కడికి పోయి చూపించుకొమ్మని సలహా ఇస్తున్నాను. కానీ మీరు పెద్ద పూజకు పోతారో, చిన్న పూజకు పోతారో అది మీ ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాను. దానికి వారు పెద్దపూజకు పోయేటట్లు పేరు వ్రాయించుకొంటామని చెప్పి పోయారు.



నేనున్న చోటికి నాలుగు కిలోమీటర్ల దూరములోనున్న పల్లెలో పెద్దమ్మ పూనకమువచ్చు వారి దగ్గరికి పోయి మాట్లాడి తమ విషయమంతా చెప్పి రెండువందలు డబ్బులు ఇచ్చి పెద్దపూజకు వ్రాయించుకొన్నారు. నారాయణ రెడ్డి దయ్యము వలన బాధ పడుచున్నాడు. దాని నివారణకు మీ దగ్గరకు పూజకు వస్తున్నాము అని చెప్పినపుడు, వారు నారాయణరెడ్డికి ఒక మనిషి తోడుగా రమ్మని చెప్పారు. తోడుగా వచ్చే మనిషి, దయ్యము పూనకము వచ్చినా భయపడకుండ ఉండేవారు వస్తే మంచిది అని చెప్పారు. దయ్యము అంటే అందరికి భయమే, కావున నారాయణరెడ్డి వెంట ఎవరు పోవాలన్నది సమస్య అయినది. ఆ విషయమును చివరకు నావద్దకు తెచ్చారు. అంతేకాక నారాయణరెడ్డిని నా ఇంటివద్దనే పెద్దమ్మ పూజ అయిపొయ్యేంత వరకు రెండు రోజులు ఉంచుతామని అడిగారు. ఆయన నావద్దవుంటే కడుపులో బాధ ఎక్కువ కాకుండ ఉంటుందని అడుగుట వలన సరేనని ఒప్పుకొన్నాను. నాకు చిన్నప్పటినుండి పరిశోధనాదృష్ఠి ఎక్కువ ఉండుట వలన పెద్దమ్మ దగ్గర ఏమి జరుగుతుంది? పెద్దమ్మ నిజముగా పూనకము వస్తుందా లేక మనుషులే పెద్దమ్మ పేరుతో నాటకమాడు చున్నారా? నిజంగా పెద్దమ్మ పూనకము వస్తే ఇతని బాధను ఎలా బాగుచేస్తుంది? పెద్దమ్మకు చిన్నపూజ, పెద్దపూజలేమిటి? పూనకము వచ్చిన పెద్దమ్మ ఎదురుగా ఉండక, ప్రక్క రూములో ఎందుకు ఉంటుంది? అలా ఎన్నో ప్రశ్నల జవాబుకు నారాయణరెడ్డి వెంట నేనే స్వయముగా పోతే బాగుంటుందనుకొని నారాయణరెడ్డికి తోడుగా నేనే పోతానని వారితో చెప్పాను. దానికి వారు సంతోషపడి నారాయణరెడ్డిని నావద్దనే వదలి అతని అల్లుడూ, నారాయణ ఇద్దరూ పోయారు.


నారాయణరెడ్డి పెద్దమ్మ దగ్గర పేరు వ్రాయించుకొన్నపుడు, వారు ఇచ్చిన కొబ్బరికాయను, తలప్రక్క పెట్టుకొని రాత్రికిపడుకొన్నాడు. తెల్లవారిన తర్వాత కొబ్బరికాయను క్రిందపెట్టకుండ, ఒకసంచిలో ఉంచి గోడకు తగిలించి పెట్టి సాయంకాలము ఐదుగంటలకు కొబ్బరికాయ సంచిని తీసుకొని బయలుదేరి, ఆరుగంటలకంటే ముందే అక్కడికి పోయాము. మేము పోయి ముందే వారివద్ద వ్రాయించుకొన్న చీటిని చూపితే, అప్పుడు వారు మాదగ్గరున్న కొబ్బరికాయను తీసుకొని, మాముందరే దాని పీచునంత పెరికి, మాదగ్గర పెట్టుకొమ్మని లోపల పూజకు పోయినపుడు కొబ్బరి కాయను తీసుకొని పోవాలని చెప్పారు. ఆరు గంటలకు పూజ మొదలయ్యింది. అపుడు నారాయణరెడ్డిని, అతనికి తోడుగానున్న నన్ను ఒక మనిషి వచ్చి లోపలికి పిలుచుకొని పోయాడు. అతని వెంట మేము ఇద్దరము మూడు రూములు దాటి నాలుగవ రూములోనికి పోయాము. లోపలికి పిలుచుకొని పోయిన వ్యక్తి, మమ్ములను నాల్గవరూములోనే కూర్చోబెట్టాడు.


---

ఐదవరూములో పెద్దమ్మ ఆడ మనిషిలోనికి పూనకము వచ్చివుంది. ఐదవరూముకు మధ్యలో తలుపువున్నది. తలుపుకు కుడిప్రక్క పెద్దమ్మ ఉన్నట్లు మాకు అర్థమైనది. మమ్ములను లోపలికి తీసుకొని పోయిన వ్యక్తి ఐదవ రూములోనికి పోయి, మాకు కనిపిస్తున్నట్లు కుడిప్రక్క తిరిగి నిలబడి “అమ్మవారితో తల్లీ! నారాయణరెడ్డి అనునతడు పూజకు వచ్చాడు, అతనికి దయ్యము బాధ ఉన్నదట” అని అన్నాడు. ఆ మాట అన్న వెంటనే తిరిగి బయటికి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత నారాయణరెడ్డితో కొబ్బరి కాయను తీసుకొని లోపలికి పోయి అమ్మవారికి ఇచ్చి వచ్చేయి అని చెప్పాడు. నారాయణరెడ్డి అలాగే కొబ్బరికాయను తీసుకొని లోపలికి పోయి కుడి ప్రక్కన ఉన్న అమ్మవారికి ఇచ్చాడు బయటినుండి చూస్తే నారాయణరెడ్డి అమ్మవారికి కొబ్బరికాయను ఇచ్చినది కనిపించదు. అతను కొద్దిగ కుడి ప్రక్కకు పోయి ఇచ్చుట వలన, ఇచ్చిన అతను కనిపించడు, తీసుకొన్న అమ్మవారు కనిపించదు.



లోపలికి పోయిన నారాయణరెడ్డి కొబ్బరికాయను పెద్దమ్మకు ఇచ్చిన వెంటనే, పెద్దమ్మ బయటికిపో అని గద్దించి చెప్పింది. అలా గట్టిగ అరచి చెప్పడము, నాల్గవరూములోనున్న నాకు వినిపించింది. నారాయణ రెడ్డి బయటికి వచ్చి మేమున్న చోట కూర్చున్నాడు. అతను కూర్చున్న వెంటనే లోపల అమ్మవారి రూములో కొబ్బకాయను కొట్టిన శబ్దము వినిపించినది. అప్పుడు మాతో పాటు నాల్గవరూములోనే ఉన్న వ్యక్తి నారాయణరెడ్డితో "లోపలికి పోయి అమ్మవారు కొట్టిన కొబ్బరికాయను గిన్నెలో వేసివుంటుంది. ఆ గిన్నెను తెచ్చుకో పో” అని చెప్పాడు. నారాయణ రెడ్డి ముక్కుతూ మూల్గుతూ చిన్నగ పోయి అక్కడ కొబ్బరికాయ చిప్పలున్న గిన్నెను తెచ్చాడు. ఆ గిన్నెలోనికి చూస్తూనే నాకు ఆశ్చర్యము అయినది. ఆ గిన్నెలో కొబ్బరి చిప్పలతోపాటు ఒక ఊపిరితిత్తి, దానితోపాటు రక్తము కలిసి ఎరుపు రంగునున్న నీచు నీళ్ళు, ఆ నీళ్ళలో అరంగుళం పొడవుతో కదులుతూవున్న రెండు తోకకల్గిన తెల్లని పురుగులు గలవు. మాంసపు మార్కెట్లో చూచిన గొర్రెల ఊపిరితిత్తిలాగ, ఆ గిన్నెలోనున్న ఊపిరితిత్తి కనిపిస్తున్నది. డ్రైనేజి కాలువలో కనపడే తోక పురుగులు ఆ గిన్నెలోనున్నవని నాకు అర్థమైనది. అప్పుడు లోపలనున్న అమ్మవారు, నాల్గవరూములోనున్న మాకు వినిపించేటట్లు బిగ్గరగా అరుస్తూ, ఏమిరా బాలా? గిన్నెలో నీకు కనిపించేది నీ ఊపిరితిత్తి అది రంధ్రాలుపడింది కనిపిస్తావుందా లేదా? అని అడిగింది. ఇక్కడ ప్రక్కనేవున్న వ్యక్తి ఒక అడుగు పొడవున్న కడ్డీని తీసుకొని ఆ కడ్డీతో గిన్నెలోనున్న ఊపిరితిత్తిని కదిలించి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ రంధ్రాలు పడింది చూడు అని నారాయణరెడ్డికి చూపిస్తున్నాడు. అంతలో "గిన్నెలో పురుగులు కూడా ఉన్నాయి కనిపించాయా బాలా" అని అమ్మవారు అడిగింది. ప్రక్కన వున్న వ్యక్తి, ఇదిగో ఇవి పురుగులు చూడు అంటున్నాడు. అక్కడ లోపలనుండి అమ్మవారు “నీకు ఊపిరితిత్తులు చెడిపోయినాయి అవి పురుగులు పట్టినాయి. చెడిపోయిన ఊపిరితిత్తిని, పురుగులను ఇప్పుడు తీసివేసినాను. నీకు ఇంకా లోపముంది, నీవు మళ్ళీ నాదగ్గరకు వస్తే అప్పుడు చెప్పుతాను” అన్నది.


అప్పుడు మా దగ్గరున్న వ్యక్తి మావైపు చూచి “మీరు ఇంకొక టెంకాయ (కొబ్బరికాయ)ను తీసుకొని పోండి. ఈ రోజు రాత్రికి తల క్రింద పెట్టుకొని నిద్రపోయి, ఎల్లుండి సాయంకాలము రండి. అప్పుడు మీకున్న లోపము ఏముందో కొబ్బరికాయలో వస్తుంది. ఇప్పుడు కూడ మీరు తెచ్చుకొన్న కొబ్బరికాయను, అమ్మవారు పగులగొట్టినపుడు కాయలో నుంచి పడిన వస్తువులను చూచాము కదా! ఈ రోజు కొబ్బరికాయలో చెడిపోయిన ఊపిరితిత్తి వచ్చింది కదా! రేపు నీ శరీరములో ఏదైనా అనా రోగ్యముగానీ, అనారోగ్యమునకు కారణమైనది కానీ ఉంటే అది వస్తుంది" అని చెప్పి ఐదురుపాయలు తీసుకొని కొబ్బరికాయను ఇచ్చి పంపాడు. ఆ తతంగమంతటిని చూచిన నేను, తొందరగా ఏ నిర్ణయానికి రాకుండ హేతుబద్దముగా యోచించను మొదలుపెట్టాను. ఇంతకుముందు నాలో ఉన్న ప్రశ్నలకు మరికొన్ని


---

ప్రశ్నలు తోడైనాయి. అవి, కొబ్బరికాయలో వస్తువులు రావడము సాధ్యమా? చూచిన ఊపిరితిత్తి మనిషిదా, జంతువుదా? అంతలావు డ్రైనేజి పురుగులు ఊపిరితిత్తులలో ఉంటాయా? ఇట్లు అనేక ప్రశ్నలు మెదిలాయి.


మొదటిరోజు పెద్దమ్మ దగ్గర జరిగిన సంఘటనలను బాగా విశ్లేషించుకొని, వాటికి అనుబంధముగా రెండవరోజు ఏమైనా ఆధారము దొరుకుతుందేమో చూడాలనుకొన్నాను. మూడవదినము సాయంకాలము పెద్దమ్మవద్దకు పోయాము. ఆ దినము కూడ పెద్ద పూజ వ్రాయించుకొన్న దానివలన, మేము అందరికంటే ముందు లోపలికి పోయాము. మొదటి రోజువలె కొబ్బరికాయను పట్టుకొని కూర్చోవడము, లోపలికి పోయి అమ్మ వారికి ఇవ్వడము, ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చి కూర్చోవడము జరిగింది. లోపల పెద్దమ్మ కొబ్బరికాయను కొట్టిన శబ్దము వినిపించింది. నారాయణ రెడ్డి పోయి గిన్నెను తెచ్చుకోవడము జరిగినది. గిన్నెలో చూస్తే కొబ్బరి చిప్పలతోపాటు మూరడు పొడవు గొర్రెల కడుపులో వున్న ప్రేగు కనిపించింది. అది నాలుగు ఇంచులకొక చోట ముడిపడి వుంది. లోపలి నుండి అమ్మవారు “ఏమిరా బాలా గిన్నెలో ప్రేగు కనిపిస్తా వుందా?” అని అడిగింది. ప్రక్కనున్న వ్యక్తి కడ్డీతో గిన్నెలోని ప్రేగును ఎత్తి చూపుచు “కనిపించిందని చెప్పు” అన్నాడు. అప్పుడు నారాయణరెడ్డి "కనిపిస్తావుంది తల్లీ" అన్నాడు. మళ్ళీ అమ్మవారు లోపలినుండి “నీ ప్రేగు ముడులు పడివుంది కనిపిస్తావుందా” అన్నది. ఇక్కడ చూపించువాడు “ప్రేగు ఎన్ని ముడులు పడిందో చూడు” అని ఎత్తి చూపించాడు. నారాయణ రెడ్డి "కనిపిస్తావుంది తల్లీ" అన్నాడు. అప్పుడు పెద్దమ్మ “నీ కడుపులో ముడిపడిన ప్రేగును కత్తిరించి తీసివేసినాను. ఇప్పటినుండి కడుపులో బాధ కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. ఇంతటితో అయిపోలేదు, నీకు ఇంకా ఎందుకు బాగలేదో తెలుస్తుంది. నీవు మళ్ళీ ఒకమారు వచ్చిపో” అని చెప్పింది. ప్రక్కనున్న వ్యక్తి “మీరు అమ్మవారు చెప్పినట్లు ఎల్లుండి రండి ఇంకా ఏమైనా ఉంటే కొబ్బరికాయలో తీసివేస్తుంది” అన్నాడు. దానికి నారాయణరెడ్డి సరేనని తలూపాడు. అప్పుడు కూడా రెండు వందల డబ్బులు కట్టి పెద్ద పూజకు చీటి తీసుకొని, కొబ్బరికాయను కూడ తీసుకొని వచ్చాడు.


రెండవమారు మూరెడు ప్రేగు కనిపించడము, ప్రేగు ముడిపడి ఉండడము చూచిన తర్వాత, నాకు మరికొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మొదటి రోజు, రెండవ రోజు కనిపించిన దృశ్యములను గురించి యోచించి తొందరగా ఏ నిర్ణయమును తీసుకోకుండ, మూడవరోజు కూడ చూడాలను కొన్నాను. మూడవరోజు కూడ రానేవచ్చింది. ఆ దినము కొబ్బరికాయను తీసికొని పోయాము. సాయంకాలము ఆరుగంటలకు పూజ మొదలైంది. మేము నాల్గవరూములో కూర్చున్నాము. నారాయణరెడ్డి కొబ్బరికాయను లోపల ఇచ్చివచ్చాడు. నారాయణరెడ్డి కూర్చోకముందే కొబ్బరికాయను కొట్టిన శబ్దము వినిపించింది. నారాయణరెడ్డికి ఓపిక లేకున్నా పోయి గిన్నెను తెచ్చుకొన్నాడు. ఈ తూరి గిన్నెలో కొబ్బరి చిప్పలతో సహా వెంట్రుకలతో పేడిన చిన్నత్రాడు, ఆ త్రాడుకు మూడు ఎండిపోయిన నిమ్మకాయలు కట్టబడి ఉన్నాయి. ఆ నిమ్మకాయలకు చిన్న ములుకులు (సీలలు) లేక మేకులు కొట్టబడివున్నాయి. ఆ త్రాడుకు చివరిలో మూడు ఇంచులు పొడువుగల బొమ్మకట్టబడి వున్నది. ఆ బొమ్మ నల్లనిగుడ్డతో చేయబడి ఉండడమేకాక దాని, కడుపులో ఒక ములికి కొట్టబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని కనిపిస్తున్నాయా అని లోపలినుండి అమ్మవారు అడుగుచుండగా, మావద్దవున్న వ్యక్తి కడ్డీతో అన్నిటిని చూపిస్తున్నాడు. చూపించడము అయిపోయిన తర్వాత లోపలినుండి పెద్దమ్మ “బాలా నీకు సరిపోని వాళ్ళు నీవు చనిపోవాలని, మంత్రములతో చేతబడి చేశారు. చూశావుగా! నీ పేరు మీద నిమ్మకాయలకు ములుకులు కొట్టినారు, బొమ్మను చేసి కడుపులో ములుకులు కొట్టినారు. అందువలన నీకు ఆరోగ్యము బాగలేకుండ పోయింది. నీవనుకొన్నట్లు నీకు దయ్యములేదు భూతమూ లేదు. ఇప్పుడు ఇవన్నీ తీసివేసినాను



---

కదా! ఇంక ఏమీలేవు. ఇప్పటినుండి నీ ఆరోగ్యము కొద్దికొద్దిగా బాగైపోతుంది. పూర్తి బాగయ్యే దానికి నలభైరోజులు పడుతుంది. నీవు నలభై రోజులు ఊరక ఉండకుండ నేను చెప్పినట్లు చేసుకో. అట్లు చేసుకోకపోతే ఇంకా ఏదైనా క్రొత్తగా అనారోగ్యము రావచ్చు. అందువలన నేను చెప్పినదంతా వ్రాసుకొనిపోయి, అట్లే నడుచుకో” అని చెప్పింది. అప్పుడు ప్రక్కన ఉన్న వ్యక్తి పెన్ను, పేపరు ఇచ్చాడు. నేను వ్రాసుకొనేదానికి వారు ఇచ్చిన పేపరు పెన్ను తీసుకొన్నాను.


పెద్దమ్మవారు లోపలినుండి చెప్పుతూవుంటే నేను వ్రాయుచున్నాను. ఆమె చెప్పునదేమనగా! నలభైరోజులు శివాలయమునకు పోయి లింగమునకు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి. శివాలయమునకు పోకముందే రాత్రి రాగిబిందెలో నీళ్ళు పెట్టుకొని, ఉదయము స్నానము చేసిన తర్వాత శివాలయమునకు పోవాలి. అట్లే నలభైరోజులు సాయంకాలము వేపాకు వేసిన నీళ్ళతో స్నానము చేసి, ఆంజనేయుని గుడికి పోయి ప్రదక్షణ చేసి రావాలి. నలభైరోజులు మాంసము తినకూడదు. ఆ నలభైరోజులలో వారమునకొకమారు శెనగలు నానబెట్టిన నీళ్ళు తాగి ఆ శెనగలను ఉడక బెట్టుకొని గుగ్గిళ్ళు తినాలి. ఉదయము, సాయంకాలము కాఫీగానీ, టీ గానీ త్రాగకుండ గ్లాసు పాలుత్రాగాలి. రాత్రిపూట ఆంజనేయస్వామి ఫోటోను తలక్రింద పెట్టుకొని పడుకోవాలి. ఇవన్నీ క్రమము తప్పకుండ చేయాలి అని చెప్పింది. అమ్మవారు చెప్పినవన్ని వ్రాసుకొన్న నేను “ఇంక పూజకు రావలసిన పనిలేదు కదా” అని మా ప్రక్కనున్న వ్యక్తిని అడిగాను. అతను “అమ్మవారు చెప్పింది. అన్నీ తీసివేసినానని ఇంక అవసరములేదు” అన్నాడు. అప్పుడు నేను “మూడు రోజులుగా నేనూ వచ్చాను. నాకు అమ్మవారి దర్శనము దొరకలేదు. పైగా నేను ఎవరికైనా చెప్పేదానికి అమ్మవారి మహత్యము కూడ ఏమి తెలియదు. నీవు ఇక్కడ ముఖ్యమైన మనిషిగా ఉన్నావు కదా! నీవు నాకు పెద్దమ్మ వారి దర్శనమును చేయించ వచ్చును కదా!” అని అడిగాను. దానికి ఆ వ్యక్తి "తప్పకుండ దర్శనము చేయిస్తాను” అని నా చేయి పట్టుకొని రూములోనికి పోకముందే "అమ్మా! ఒక బాలుడు నీ దర్శనమును అడుగుచున్నాడు” అని చెప్పి, నన్ను లోపలికి తీసుకొని పోయాడు.



లోపలికి పోయి కుడిప్రక్కను తిరిగి చూచాను. నాల్గవరూముకంటే అమ్మవారున్న రూము రెండింతలు వెడల్పు ఎక్కువగా ఉన్నది. అమ్మవారు ఒక ఆడమనిషిలో చేరివున్నది. ఆ ఆడమనిషి వెల్లకిలా పడుకొని, కాళ్ళు వెడల్పుగా చాపివుంది. ఆమె శరీరములో నుండి చిన్నగా మూల్గినట్లు వినిపిస్తావుంది. ఆమె నడుముల వద్దనుండి క్రిందికాళ్ళ వరకు కుడిప్రక్క ఎడమప్రక్క స్వీటాల్లో ఉన్నట్లు అన్ని స్వీట్లు, కారాలు, బూందీలు అన్ని రెండు వైపులా పెట్టబడి ఉన్నాయి. నడుముపై భాగమున రెండు ప్రక్కల ఖాళీ స్థలముండి, స్థలములో రెండు ప్రక్కలా రెండు అడుగుల ఎత్తుగల దీపస్తంభములు గలవు. మా వైపు కాళ్ళు ఉండగా తలవైపున పెద్ద దిండుమీద తలపెట్టుకొని పడుకొని ఉంది. ఆమె పడుకొని చూచినా, దిండుమీద తల ఉండుటవలన ఎదురుగా ఉన్న మేము బాగా కనిపిస్తాము, అలా పడుకొన్న ఆమెకు ఎడమ ప్రక్కన రెండున్నర అడుగుల దూరములోనే, మేము వచ్చిన తలుపు దగ్గరనుంచి ఆ గది పొడువునా కేవలము మూడు అడుగుల ఎత్తు, అర్థ అడుగు మందము గల గోడ కలదు. గోడ ప్రక్కన ఎనిమిది అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల విస్తీర్ణము గల గది ఉన్నది. అమ్మవారు పడుకొన్న రూముకు, ప్రక్క రూముకు గజము ఎత్తుగల గోడమాత్రము కలదు. గోడ ప్రక్కన గల గదిలో, పది లేక పండ్రెడు పెద్ద కుండలు (బానలు) కలవు. వాటిమీద మూతలు కూడా ఉన్నాయి. ఆ గదిలోనుండి తెలిసి తెలియనట్లు కొద్దిగ కుళ్ళిన మాంసము వాసన వస్తూవుంది. ఆ చిన్న గోడకు, బానలకు (పెద్దకుండలకు మధ్యలో రెండు అడుగుల స్థలమున్నది. గోడకు, బానలకు మధ్యలో ఒక మనిషి పడుకొంటే మేము నిలుచున్న చోటినుండి ఏమాత్రము కనిపించడు. ఇదంతా ఎవరు గ్రహించుకొనే దానికి ఏమాత్రము వీలులేదు. ఎందుకనగా!


---

నాలాగ ఎవరైన లోపలికి పోయి అమ్మవారు ప్రక్క తిరిగి చూస్తూనే అంతవరకు పడుకొని ఉన్న ఆమె అమాంతం ఒక్కసారి లేచి కూర్చుంటుంది. ఆ దృశ్యమును చూస్తూనే, ఎవరిలోనైన కొంత భయము ఏర్పడుతుంది. అంతేకాక లోపలికి వచ్చిన మనిషి ఎంత తెలివైనవాడైన వాని తెలివి పని చేయకుండునట్లు, ఎలాగ చేయాలో వారు ముందే తయారు చేసుకొన్న పథకము ప్రకారము అలాగే చేయుదురు. అట్లు చేయుటలో వారి తెలివి గొప్పదే అని చెప్పవచ్చును. నేను లోపలికి పోయిన వెంటనే నా ధ్యాసను ప్రక్కకు మళ్ళించుటకు, పడుకొన్న మనిషి ఒక్కసారిగ లేచి కూర్చుంది. రా ముందుకు రా అని గద్దించి పలికింది. అలా గద్దించి చెప్పడములో మనలో యున్న యోచనలన్ని గాలికి పోతాయి. ఆమె చెప్పినట్లు ముందుకు పోతూనే వెనక్కి పో అని అరుస్తుంది. నేను ముందుకు పోతూనే నేనేమో తప్పు చేసినట్లు వెనక్కి పో అని అరిచి చెప్పింది. ఆ అరుపుకు రెండు అడుగుల వెనక్కి వచ్చాను. నేను వెనక్కి వచ్చేటప్పుడు నాతో పాటు లోపలికి వచ్చిన మనిషి, నా వెనుకనుండి నా చేయి పట్టుకొని వెనక్కి రమ్మనట్లు లాగినాడు. ఆ స్థితిలో ఎవడైనా ఏమి తప్పు చేశామోనని వానిలో వాడు యోచించు కుంటాడు తప్ప బయట ఏమి జరుగుతూ ఉన్నదని యోచన చేయలేడు. వచ్చిన వానిని అలా తికమక చేయడమే వారికి ముఖ్యమైనపని. వెనక్కి వచ్చిన నన్ను, ప్రక్క గూడువుంది చూడు అని అమ్మవారు గద్దించి చెప్పింది నా ప్రక్కనున్న మనిషి ఇదిగో గూడు అని నాకు చూపించాడు. ఆ గూడు మేము వచ్చిన వాకిలికి ఎదురుగా ఉన్నది. నేను ఆ గూడువైపు చూచి చూడకనే గూటిలో చెంబు ఉంది కనిపిస్తావుందా అని అమ్మవారు గద్దించి అడిగింది. ఆ మాటకు కనిపించింది తల్లీ అని నేను చెప్పాలి. మాట్లాడకుండ (పలుకకుండ) మౌనముగా ఉండకూడదు. నేను కనిపించింది అని చెప్పాను. వెంటనే ప్రక్కనే దూది ఉంది చూడు, దూదిని తీసుకో అని వెంటనే చెప్పింది. నేను అదే గూటిలో చెంబు ప్రక్కనే ఉన్న దూదిని తీసుకొన్నాను. చెంబులోని నీళ్ళలో దూదిని ముంచి నాకివ్వు అని అరిచింది. నేను అలాగే చెంబులోని నీటిలో దూదిని తడిపి కూర్చొనియున్న అమ్మవారికి ఇవ్వడానికి పోయాను. చేయి చాచి నా చేతిలోని దూదిని తీసుకుంటూనే దూరంగా నిలబడు అని గద్దించగా, నేను రెండు మూడు అడుగులు వెనక్కి వేసి నిలబడినాను. నా ప్రక్కనున్న మనిషి చేతులు కట్టుకొని చాలా భయముగా ఉన్నట్లు కనిపించాడు. అంతలో నా చేతినుండి తడిసిన దూదిని తీసుకొన్న అమ్మవారు, దూది పై భాగమును దీపమునకు అంటించింది. దీపమునకు అంటుకున్న దూది పై భాగము నూనెతో మండినట్లు మండుచున్నది. పై భాగమున దూది మండుచుండగ, అమ్మవారు చేతితో పట్టుకొని ఉన్నది. నా ప్రక్కనేనున్న మనిషి, చూచావా? అమ్మవారి మహత్యము అంటున్నాడు. అంతలో ఆ దూదిని ప్రక్కన క్రింద పెట్టిన అమ్మవారు, నీ వెనుక గూడువుంది చూడు అన్నది. వెను తిరిగి చూచాను. గూడు ఉన్నది. అక్కడ చేటలో మన్నువుంది చూడు అని చెప్పింది. అక్కడికి పోయి చూస్తే గూటిలో చేటవుంది, ఆ చేటలో మన్ను కూడ ఉన్నది. ఆ మన్నును తీసుకొని రా అని చెప్పింది. నా ప్రక్కనున్న మనిషి దోసెడు నిండా తీసుకో అని చిన్నగ చెప్పాడు. అతను చెప్పినట్లు నేను రెండు చేతుల నిండా మన్ను తీసుకొన్నాను.


వెంటనే నా ప్రక్కనున్న వ్యక్తి అమ్మవారికి ఇవ్వు అని చెప్పాడు. నేను ముందుకు పోయాను. అప్పుడు అమ్మవారు ముందుకు చేతులు చాచి తన చేతులలోనికి మన్నును పోయించుకొని వెనక్కి పో అని అరిచింది. నేను కొద్దిగ వెనక్కి వచ్చి నిలబడ్డాను. అమ్మవారు కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని ఉంది అన్నాను కదా! తన చేతులలోని మన్నును రెండు హస్తములతో గట్టిగా రుద్దుచూ, క్రింద తన చీరలో పడునట్లు చేసినది. ఆ మన్ను రాపిడిగా రుద్ది క్రిందికి వదిలేకొద్దీ, అ మన్ను ఎర్రగ రంగు మారి పడుచున్నది. నేను ఇచ్చినది నల్లమట్టి, ఆమె రాలిపింది ఎర్రని కుంకుమ. ప్రక్కన మనిషి చూచినా అమ్మవారి మహత్యము అంటున్నాడు. రెండు హస్తముల మధ్యన మట్టిని రుద్దిన చేతులు ఎర్రగ కనిపిస్తున్నాయి. ఆమె చీరమీద, కాళ్ళ మద్యలో పడినదంతా ఎర్రగా కనిపిస్తావున్నది. అప్పుడు


--

అమ్మవారు చూచావా బాలా? నా మహత్యమును అన్నది. చూచాను అమ్మా అని నేను చెప్పాను. అయితే నా దీవెన నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇంక పోండి అన్నది. అక్కడినుండి వచ్చేశాము. ఆమె చెప్పిన విషయములను వ్రాసుకొన్న పేపరు నారాయణరెడ్డికి ఇచ్చి, అతని ఊరికి పంపించివేశాను.


నేను ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజులు జరిగిన విషయ ములన్నిటిని గుర్తుచేసుకొని చూచాను. అలాగే చివరిలో వారు నాకు చూపిన మహత్యములను కూడ వివరించుకొని యోచించాను. అసలైన విషయమంతా అర్థమైనది. అక్కడ జరుగుచున్న వాటిలోనున్న సత్యమేమిటి అన్నది తెలిసిపోయింది. నాకు తెలిసింది మీకు వివరించి చెప్పుచున్నాను చూడండి. వారు ఇచ్చే కొబ్బరికాయగానీ, బజారులో కొనే కొబ్బరికాయగానీ రెండు ఒక్కటే. అలా ఇవ్వడములో అది ఒక వ్యాపారమే గానీ, అందులో ఏ మోసములేదు. తలక్రింద పెట్టుకొని తీసుకుపోవడము వలన దానిలో తలక్రింద పెట్టుకొన్న వాని సమాచారము ఏమి ఉండదు. అట్లు పెట్టుకొని పోవడము వలన ఏమైన అందులో తెలుస్తుందేమో అనుకొంటే అది వారి భ్రమే అగును. అలా చేయించడము మనకు నమ్మకము కల్గుటకు మాత్రమేనని అర్థమగుచున్నది. ఇక ముఖ్యముగ గమనించ వలసినదేమంటే కొబ్బరికాయను కొట్టిన శబ్దము మాత్రము వినిపిస్తున్నది. కొబ్బరికాయను తీసుకుపోయిన వాడు, అక్కడ ఇచ్చి వచ్చిన తర్వాత కొట్టుచున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే? మన ముందర కొట్టకుండ ఎవరు చూడకుండ కొట్టడము ఎందుకు? దానికి జవాబును వెదికితే. మనము తీసుకు పోయిన కొబ్బరి కాయను కొట్టడము వాస్తవము. కానీ అమ్మవారు కొబ్బరికాయను కొట్టలేదు. కాయను లోపలికి తీసుకొని పోయినప్పుడు కూర్చొనే ఉంటుంది. టెంకాయను ఇవ్వు అని, ఇచ్చిన వెంటనే పో అని గద్దించి చెప్పి పోయిన వానిని గందరగోళము చేసి పంపడము వలన వాడు అక్కడ పరిస్థితులను గురించి యోచించు అవకాశమే ఉండదు. కాయను ఇచ్చిన వాడు బయటికి వస్తూనే, ఆ కొబ్బరికాయను అమ్మవారు ఎడమ చేతితో చిన్న గోడవైపు అందించును. అంతకు ముందు నుండి గోడ ప్రక్క ఎవరికి తెలియకుండ దాగియున్న మనిషి, కొబ్బరికాయను తీసుకొని పగులగొట్టి కొబ్బరిచిప్పలను ముందే తనవద్దనున్న పాత్రలోనికి వేయును. ఆ గిన్నెలో ఏమివేసియుంచాలో ముందే నిర్ణయించుకొని చిప్పలలో వేసి, గోడప్రక్కన నుండి అమ్మవారుకు ఇవ్వగా దానిని తీసుకొని అమ్మవారు, వచ్చి తీసుకుపో అనిచెప్పగానే బయటినుండి పోయి రోగి తెచ్చుకుంటున్నాడు. లోపల జరిగే తంతు, పోయిన రోగికి తెలియదు. కానీ రోగిని నాల్గవ రూము వరకు తీసుకొని పోయి అన్ని అర్థమగులాగున చెప్పు వ్యక్తి ఉన్నాడు కదా! అతనికీ, అమ్మవారుకూ, గోడప్రక్కన కనిపించకుండ ఉన్న వ్యక్తికీ అన్నీ తెలుసు. వచ్చిన రోగి ఆరోగ్యము బాగలేక పోతేనో లేక నడువ లేక పోతేనో అతని వెంట ఒక మనిషి వచ్చుటకు అవకాశమిస్తారు. రోగి బాగుంటే రెండవ మనిషిని నాల్గవరూము వరకు రానివ్వరు. వచ్చినవాడు చిన్న పూజకో, పెద్ద పూజకో డబ్బులుకట్టి వచ్చినపుడు వానికి ఉన్న సమస్య అక్కడ డబ్బులు కట్టించుకొనే వానికి చెప్పును. డబ్బులు కట్టించుకొను వాడు నాల్గవరూములో మన ప్రక్కనే ఉండి గిన్నెలోవున్న వాటిని వివరముగా చూపువాడే! అతని ద్వారా అమ్మవారుకు, లోపల తెలియకుండ ఉండి కొబ్బరికాయ కొట్టువానికి, వచ్చినవాని విషయమంతా తెలిసియుండును. అందువలన వచ్చినవానికి తగినట్లు వారు అక్కడ చేయడము జరుగుచున్నది.


వచ్చిన రోగి విషయమంతా అవగాహన చేసుకొని, నాల్గవ రూములోవున్న వ్యక్తి, అమ్మవారు, తెలియకుండ చాటున ఉన్న మనిషి ముగ్గురు కలిసి ఆడుచున్న నాటకము నాకు బాగా అర్థమైనది. నాల్గవ రూములో ఉన్న వ్యక్తి చాలా తెలివిగా నడుచుకొనుచుండును. కొబ్బరి కాయను ఇస్తూనే పొమ్మని అమ్మవారు చెప్పగా, తిరిగి వచ్చిన రోగిని అమ్మవారు పిలిచేంత వరకు లోపలికి పోకుండ చూచుకొనును. కాయను ఇచ్చి వస్తూనే కూర్చోమని చెప్పును. కూర్చుని అరనిమిషము


---

కాకముండే లోపలికి పిలువడము జరుగుచున్నది. పోయిన రోగి గిన్నెను తీసుకొని పోయేటట్లు లోపల గద్దించి పంపగా, వచ్చినవానికి గిన్నెలోని వస్తువులను అమ్మవారు చెప్పినట్లు చూపుచుండును. రోగి కొబ్బరికాయను ఇవ్వడానికి తీసుకొని వచ్చే దానికి రెండుమార్లే లోపలికి పోవును. ఆ సమయములో కూడ అమ్మవారు వెంట్రుకలు విరబోసుకొని, కాళ్ళు చాపుకొని కూర్చొని ఉండడమూ, పోయిన వానిని గద్దించి మాట్లాడడము వలన అక్కడ ఏమి జరుగుచున్నదో ఎవడూ ఊహించలేడు. బయటికి వస్తూనే బయటివాడు ఇది చూడు, అది చూడు అని మభ్యపెట్టును. అందువలన ఏ రోగీ అది వారు ముగ్గురు ఆడుచున్న నాటకమని గుర్తించలేడు. మట్టిబానలలో నిల్వయుంచడము వలన లోపల కొద్దిగ వాసన రావడమును నేను గ్రహించాను.


ప్రక్కనే చిన్నగోడ, దానిలోపల మట్టిబానలు, వాటిలో వచ్చిన వారికి గిన్నెలలో చూపవలసిన సామాగ్రి. ఆ సామాగ్రిలోనుండియే మాకు మూడు రోజులు మూడు రకములవి చూపించారు. చివరిలో చూపిన నిమ్మకాయలు, త్రాడుబొమ్మ, దానికున్న ములుకులు చాలా రోజులనుండి ఉన్నవేనని అవి పాతబడివున్న స్థితినిబట్టి చూస్తూనే అర్థమగుచున్నది. ఇలాంటివి వారివద్ద ఎన్ని వస్తువులను మట్టి బానలలో పెట్టుకొన్నారో? ఇంకా అమ్మవారు విషయానికి వస్తే, ఆమెలో పెద్దమ్మలేదు, చిన్నమ్మలేదు. ఆమె పూనకము వచ్చినట్లు నటిస్తున్నది. నేను అమ్మవారున్న రూములోనికి పోయినపుడు ఆమె వెల్లకిల పడుకొనివుండి, కొద్దిగ మూల్గినట్లు నటించినది. అట్లు మూల్గుట వలన ఆమె శరీరములో పెద్దదేవత ఉన్నదనీ, దేవత ఉండుట వలన సాధారణ మనిషి అయిన ఆమె శరీరము తట్టుకోలేక పోవుచున్నదని తెలియునట్లు నటించినదని అర్థమైనది. దేవత శరీరములో ఉన్నట్లు నటించడమేకాక, లోపలికి పోయిన రోగిని మాటలతోనే భయపెట్టడములో మంచి అనుభవమును పొందినది. నేను లోపలికి పోతే మన యోచనలు పారకుండ, అరిచి భయపెట్టి మభ్యపెట్టుదురని నేను ముందే ఊహించు కొన్నట్లే, నన్ను ముందుకు వెనక్కు, దూరము, అక్కడ చూడు అని గద్దించి మన దృష్ఠిని వారి చేతుల్లో పెట్టుకోవాలనుకొన్నారు. కానీ అమ్మవారి దర్శనము కావాలని లోపలికి పోయిన నన్ను మభ్యపెట్టినా, వారు ఆడించినట్లు నేను ఆడినా, వారి దృష్ఠిలో నేను మభ్యపడిపోయినట్లు కనిపించినా, ఇతను మనకంటే బాగా నటిస్తున్నాడని వారికి తెలియదు. నేను లోపల గడిపిన కొద్ది నిమిషములకే వారు ఆడించినట్లు ఆడుచు అన్నీ అర్థము చేసుకొన్నాను.


ఇక్కడ కొందరికి ఒక అనుమానము వచ్చి “నీటితో దీపమును వెలిగించింది కదా! అనియు, మట్టిని కుంకుమ చేసింది కదా! అనియు, ఇవన్నీ మహత్యములు కావా? సాధారణ ఆడమనిషి చేయగలదా? అని అడుగ వచ్చును. దానికి నా సమాధానము ఇలా ఉన్నది. నాలాగ ఎవరికైన వారి మీద అనుమానము వస్తే, వారికి ఆ అనుమానము లేకుండ చేయుటకు పెట్టుకొన్న రెండు మహత్యములు నాకు చూపినవి. అవి మహత్యములే అయితే ఆ మహత్యములను మీరూ చేయవచ్చును. చదువు రాని వారు కూడ చేయవచ్చును. అది అందరికి ఎలా సాధ్యమో వివరిస్తాను గమనించండి. అక్కడ చెంబులో నీళ్ళను ఎందుకు పెట్టారు? ప్రక్కనే దూదిని ఎందుకు పెట్టారు? ఈ రెండు ప్రశ్నలకు జవాబును వెదికితే దానికి ఒకటే సమాధానము దొరుకుతుంది. ముందే సంసిద్ధముగా చేసి పెట్టుకొన్న వని అర్థమగుచున్నది. అక్కడున్న దూదిలో ఏమి లేదు. అది సాధారణ దూదియే. కానీ చెంబులో నీళ్ళు మాత్రము మామూలు నీళ్ళుకాదు. నీళ్ళలో భాస్వర కణములు కలిసివున్నాయి. భాస్వరము అనునది ఒక ఘనపదార్థము. భాస్వరము అను పదార్థము నీటిలో ఉన్నపుడే ఏ మార్పు చెందకుండ ఉంటుంది. కానీ దానిని నీటినుండి బయటికి తీస్తే మండి పోతుంది. ఈ విషయము చదువుకొన్న వారందరికి బహుశ తెలిసే ఉంటుంది. అక్కడ నీటిలో కొద్దిపాటి భాస్వరమును కలిపి


---

పెట్టారు. చిన్న ముక్క భాస్వరము నీటిలో నలిపివేస్తే, చిన్న చిన్న ముక్కలై నీటిలోనే ఉండును. దూదిలో నీరు ఉండుట వలన, దూదిలో అంటుకొని వచ్చిన భాస్వరకణములు మండిపోవు. ఆ దూదిని దీపముతో అంటించితే భాస్వర కణములు అంటుకొని నీరు ఉండినా, భాస్వరకణములు ఒక్కొక్కటిగా మండుట మొదలుపెట్టును. నీటిలోని భాస్వరకణముల విషయము మనకు తెలియనప్పుడు నీటిలో తడిసిన దూది మండుతున్నదని, అది ఎక్కడా జరగని పని కావున, దానిని మహత్యమని మనము అనుకుంటాము. అక్కడ ఏ మహత్యము లేకున్నా ప్రజలను నమ్మించుటకు చేసిన మోసము పని తప్ప ఏ మహత్యముకాదని తెలియుచున్నది.


ఇక వారు చేసిన రెండవ మహత్యము, మట్టిని ఎర్రని బండారుగా మార్చడము. చేటలో ముందే మట్టిని అక్కడెందుకు పెట్టుకొన్నారు? అని ప్రశ్నించుకొంటే, ఆ మట్టి అప్పుడప్పుడు బయట దొరుకు మట్టికాదు. అది ముందే తయారు చేసుకొన్న మట్టి అని జవాబు తెలియుచున్నది. ఆ మట్టిని తయారు చేసి పెట్టుకొంటే, మీరైన సులభముగా మహత్యమును చేయవచ్చును. కొంత కుంకుమను తీసుకొని దానిని మజ్జిగలో కలిపి ఆరబెట్టితే చిన్న చిన్న తెల్ల ముక్కలుగా తయారుకాగలదు. ఎర్రని కుంకుమను తెల్లని మజ్జిగలో కొంత కలుపడము వలన ఎండలో ఆరపెట్టినపుడు కుంకుమ చిన్న ఉంటలుగా తయారై ఉంటపై భాగము ఎర్రగ కనిపించకుండ కొద్దిగ తెల్లగ కనిపించును.ఆరిన తర్వాత ఆ ఉంటను నలిపితే లోపల ఎర్రని కుంకుమ బయటపడును. ఎర్రని కుంకుమను కొద్దిగా మజ్జిగలో కలిపినపుడు తేమకు, కుంకుమ గడ్డలుగా మారును. ఆరబెట్టినపుడు మజ్జిగలోని తెల్లతనము, కుంకుమ ఉంటపై భాగమును చేరును. లోపల భాగమున కుంకుమ అట్లే ఉండును. కుంకుమ ఉంటలకు ఎర్రని రంగు కనిపించ కుండ కొద్దిగ తెలుపు కనిపించుటకు, కుంకుమకు మజ్జిగను కలుపుచున్నారు. అట్లు కలుపుకొని కుంకుమ ఉంటలను కొద్దిపాటి మన్నులో కలిపిపెట్టుకొంటే అది మన్నులో కలిసిపోయి మన్ను మాదిరే కనిపించును. ఆ మన్నును అవసరమొచ్చినపుడు వ్రేళ్ళతో నలిపితే, కుంకుమ ఉంటలు పగిలిపోయి మట్టికి కూడ ఎర్రతనము అంటుకొని పొడిగా రాలును. అప్పుడు కొంత రంగు తక్కువ కుంకుమ (బండారు) కనిపించును. అలా కనిపించుట వలన, తెలియనివారికి అది మహత్యము అవుతున్నది. పెద్దమ్మ బొమ్మను గాని, సుంకులమ్మ బొమ్మను ఎత్తుకొన్నవారుగానీ, కొరడాలు భుజముమీద వేసుకొని బజారులో డబ్బులు అడుక్కొనేవారు కూడ, క్రింద మట్టిని తీసుకొని తమ చేతిలో పెట్టుకొన్న కుంకుమ ఉంటలను నలిపి మన చేతిలోనికి పెట్టుచుందురు. దానిని చూచి మట్టిని తీసుకొని బండారు పెట్టాడని భ్రమించినవారు వారికి డబ్బులు ఇచ్చి పంపుట అక్కడక్కడ జరుగుచుండును. అదే పద్ధతి ప్రకారము ముందే కుంకుమను మజ్జిగలో తడిపి ఆర పెట్టుకొన్న జొన్నగింజలలాంటి ఉంటలలోనికి కొంత జల్లెడపట్టిన మెత్తని రేగడిమన్నును కలిపి పెట్టుకొన్నారు. రేగడిమట్టితో కలిసియుండుట వలన కుంకుమ ఉంటలు కూడ మన్ను మాదిరే ఉన్నాయి. ఆ మట్టినే నేను అమ్మవారి చేతుల్లోనికి పోసాను. చేతిలోనికి పోసిన వెంటనే నన్ను వెనక్కిపో అని గద్దించి, నేను వెనక్కి పోతూనే రెండు చేతుల మధ్యన గట్టిగా మట్టిని త్రికుటవలన క్రింద ఎర్రనిరంగు పొడి మట్టితో కలిసి రాలింది. మట్టికూడ ఎర్రని రంగుతో కలిసిపోవుట వలన క్రింద రాలినదంతా బండారుగా అనుకొన్నాము. అది కొంత కలరు తక్కువగ ఉండుట వలన, ముందే చేటలో మట్టిని రడీగా ఉంచిన దానివలన, ఇచ్చిన మట్టిని అమ్మవారు నలిపి రాల్పడము వలన, అది మహత్యముకాదని, అది ఎదుటివారిని నమ్మించుటకు చేయు క్రియ అని అర్థమైనది. ఇలా వారు చేసి చూపించినవి మహత్యములుకాదు. ప్రజలకు తెలియని పనులని తెలియుచున్నది.


--

రోగి కొబ్బరికాయను తీసుకొని లోపలికి పోయి ఇచ్చినపుడు, అతని ముందరనే కొబ్బరికాయను కొట్టితే, కొబ్బరికాయలో నుండి పడిన వస్తువులు రోగికి కనిపించును కదా! అప్పుడు వాటిని బయటికి తెచ్చుకొని బయటనున్న వ్యక్తితో వివరముగా చెప్పించుకోవచ్చును. అలా కాకుండ లోపలకి పోయిన రోగిని బయటకు పంపి, అతనికి తెలియకుండ, అతను చూడకుండ కొబ్బరి కాయను కొట్టి, నీకున్న రోగము కొబ్బరికాయలోనుండి పడినదని చూపించడము, రోగిని మోసము చేసి నమ్మించినట్లు కాదా! మొదటి దినము నారాయణరెడ్డి కొబ్బరికాయను లోపలికి తీసుకుపోయి అమ్మవారికి ఇచ్చివచ్చాడు. నారాయణరెడ్డి బయటికి వస్తూనే, అమ్మవారుగా పూనకము వచ్చినట్లు నటిస్తున్న ఆమె, ఆ కొబ్బరికాయను గోడప్రక్కనున్న వ్యక్తికి ఇస్తే అతను కాయను సులభముగా పగులగొట్టుటకు తయారు చేసుకొన్న ఇనుపరాడ్తో కొట్టి, నీళ్ళను వేరేపాత్రలోనికి పట్టిపెట్టి, నీళ్ళు లేని చిప్పలను గిన్నెలోనికి వేసి, ఆ గిన్నెలోనికి ముందే అనుకొన్నట్లు ఏమి వేయాలో అవియే వేసి, ఆమెకు అందిస్తే అప్పుడు అమ్మవారు పిలిచింది. (నేను లోపలికి పోయినపుడు అక్కడ కొబ్బరికాయ కొట్టినట్లు గుర్తు ఏమి కనిపించలేదు. కాయ పగులకొట్టినపుడు పడిన నీళ్ళ గుర్తులు కూడ లేవు. దానినిబట్టి అక్కడ కొబ్బరికాయను కొట్టలేదని సులభముగా అర్థమగుచున్నది.) అమ్మవారు పిలువగానే, నారాయణరెడ్డి పోయి తెచ్చుకొన్న గిన్నెలో కనిపించిన ఊపిరితిత్తి, కొద్దిగ ఎరుపు వర్ణముగల నీచునీళ్ళు, రెండు పురుగులు అన్ని గిన్నెలో వేసి పంపినవే. అయితే బయటవున్న వ్యక్తి, అమ్మవారు కాయను పగులగొట్టినప్పుడు కాయలోనుండి బయటపడినవని చెప్పి నమ్మించారు. లోపలినుండి అమ్మవారు నీకు ఊపిరితిత్తి రంధ్రాలు పడింది, పురుగులు పట్టింది అని, రెండు పురుగులు చూపడము పచ్చి మోసమని తెలిసింది. ఊపిరితిత్తి రంధ్రాలుపడడమేమిటి? లోపల అంతలావు డ్రైనేజి పురుగులు ఉంటాయా? అవన్నిటిని ఈమె కొబ్బరికాయలోనికి వచ్చేటట్లు చేయడ మేమిటి? ఇవన్నీ నమ్మశక్యముకాని పచ్చి అబద్దపు మాటలు. బాధలతో నివారణకు ఒక దేవత దగ్గరకు పోవుచున్నామని నమ్మిపోవుచున్న వారినుండి పెద్దపూజకు రెండువందలు, చిన్న పూజకు వంద డబ్బులు లాగడము, ముందే బాధలతో బాధపడుచున్న వారిని ఇంకా దోచుకొని బాధపెట్టడము కాదా? కడుపులోని ప్రేగు ముడిపడిందని చెప్పడము, దానిని కత్తిరించి తీసివేసినానని చెప్పడము మోసము కాదా? ఉండే సమస్యలన్నిటిని ఒకేరోజు చెప్పక మూడు రోజులు త్రిప్పుకొని, ఆరువందల డబ్బులు కాజేయడము మోసము కాదా? చివరిరోజు కంబడిదారమును ఎండిపోయిన నిమ్మకాయ లను, గుడ్డబొమ్మను చూపించి నారాయణరెడ్డికి చేతబడి చేశారని చెప్పడము విడ్డూరమైన మోసము కాదా? ఆయనకున్నది సాధారణ దయ్యము యొక్క సమస్యకాగా, దానిని ఏమాత్రము చెప్పకుండ, లేనివన్ని చెప్పి వాటినన్నిటిని కొబ్బరికాయలోనుండి తీసి వేశామనడము పాపభీతి లేకుండ మోసము చేయడము కాదా? ఇప్పటికి ముప్పైఐదు సంవత్సరముల క్రితము రోజుకు రెండువందలు డబ్బులు తీసుకొన్నారు. ఇప్పటికాలములో ఆ రెండు వందల విలువ రెండువేలు అవుతుంది. మేము పోయినపుడు ఒక్క రోజుకు ఇరవైమంది దాక అక్కడికి పోయేవారిని చూచాను. లెక్క ప్రకారము ఒక రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో?



నేను ఇంతవరకు ఎన్నో దయ్యముల విషయములను చెప్పాను. అన్నీ వాస్తవముగా దయ్యాలే. అలాగే దేవతలను కూడ చూశాను. అవి కూడ వాస్తవమే. కానీ పెద్దమ్మను చూచిన వెంటనే ఆమె శరీరములో ఏ దేవతాలేదని తెలుసుకోగలిగాను. నిజముగ ఆమె దేవతే అయ్యుంటే నన్ను చూస్తూనే భయపడి తేలిపోయేది. అక్కడ ఒక ఆడమనిషి, దేవత పూనినట్లు నటిస్తున్నది. అక్కడున్న ముగ్గురు కలిసి చేసే మోసము చాలా పెద్దమోసము. అయినా ఆ రోజు నుండి ఇంతవరకు ఎక్కడా వారు చేయుచున్నది మోసమని నేను చెప్పలేదు. వారి బ్రతుకుతెరువులో అది ఒక మార్గము అని అనుకొన్నాను. కానీ వారు చేయుచున్నది, ఒక దేవత పేరు చెప్పి పాపమునే సంపాదించుకొనుచున్నారు. వారికర్మ వారిదనుకొన్నాను. ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చినది. నేను దయ్యాలు ఉన్నాయనినా,


--

శాస్త్రబద్దముగానే చెప్పుచున్నాను. అన్నిటిని గ్రుడ్డిగా దయ్యాలనీ, దేవతలనీ చెప్పడము లేదనుటకు ఇది ఒక నిదర్శనము. నేను ఇప్పుడు పెద్దమ్మవారు పూనకము వచ్చింది అని చెప్పిన వారిలో దేవతలేదు అని చెప్పడము కూడ శాస్త్రబద్దము గానే చెప్పి దానిని మహత్యమనుట తగదన్నాను. ఒక విషయమును ఒప్పుకొనినా, ఖండించినా రెండిటికీ శాస్త్రబద్దత ఉండవలెను. కొందరు హేతువాదులు శాస్త్రబద్ధత లేకుండ అన్నిటిని కాదు, లేదు, అసత్యము అని అంటున్నారు. కాదన్నది ఎట్లు కాదో, అసత్యమన్నది ఎట్లు అసత్యమో శాస్త్రీయముగా వివరించకుండ గ్రుడ్డిగ అసత్యమని, కాదని వాదించు చున్నారు. అందువలన హేతువాదులకు, నాస్తికవాదులకు మేమిచ్చు సలహా ఏమంటే, ఒక విషయమును ఖండించినా, లేక సమర్థించినా దానికి శాస్త్రీయతను చూపించి ఆ పనిని చేయాలి. నేను దయ్యాలున్నాయి అంటున్నాను. అన్నీ యదార్థముగా జరిగిన సంఘటనలే. నేను చెప్పిన వాటిని ఎవరైనా ఖండించవచ్చును. “ఖండించకూడదు, నేను చెప్పినవన్ని అందరు ఒప్పుకోవాలని" చెప్పను. కానీ మీరు ఒప్పుకోవడానికీ, ఖండించ డానికి శాస్త్రబద్దత ఉందా? అని అడుగుచున్నాను. శాస్త్రబద్దతలేకుండ మాట్లాడితే ఎవరైనా కూడ మూఢ నమ్మకస్తులే అవుతారు.


మన శరీరములో ముఖ్యమైనవి ఏడు గ్రంథులున్నవి. ఏడు గ్రంథులలోను చిన్నది ఒకటి గలదు. దానిపేరు గ్రంథిరాజము అంటాము. గ్రంథిరాజము అనగా గ్రంథులన్నిటికి రాజు అని అర్థము. అన్నిటికంటే చిన్న గ్రంథి తనకంటే పెద్ద గ్రంథులను కూడ తన ఆజ్ఞకు లోబడి పని చేయునట్లు చేసుకొన్నది కావున దానిని గ్రంథిరాజము అని అంటున్నాము. అలాగే భూమండలములో శాస్త్రములు ఆరున్నవి. వాటిని “షట్శాస్త్రములు” అని అంటాము. ప్రపంచములో ఏదైన ఈ షట్శాస్త్రములను అనుసరించి ఉండును. షట్శాస్త్రములలో అన్నిటికంటే చిన్నది ఆరవశాస్త్రము. దానికంటే మిగత ఐదుశాస్త్రములు పెద్దవే. అయినప్పటికీ ఆరవశాస్త్రమునకు లోబడియే మిగతా శాస్త్రములన్ని ఉండును. అందువలన ఆరవశాస్త్రమును రాజవిద్యా శాస్త్రము లేక బ్రహ్మవిద్యా శాస్త్రము అంటాము. బ్రహ్మ అనగా అన్నిటికంటే గొప్ప అని అర్థము. అలాగే రాజ అని అన్నిటికంటే గొప్ప అని అర్థము. జగతిలో మొట్టమొదట తెలిసిన శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము. తర్వాత మిగత శాస్త్రములు తెలిసినవి. ఇప్పటికాలములో తెలియకుండ పోయిన శాస్త్రము కూడ మనిషికి మొదట తెలిసిన ఆరవశాస్త్రమే. ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము, సృష్టి ఆదిలోనే మనిషికి పూర్తిగా తెలిసిపోయినది. మిగత ఐదు శాస్త్రములు సంపూర్ణముగా ఇంకా తెలియబడలేదు. కాలక్రమేపి మిగత ఐదు శాస్త్రములు అభివృద్ధి చెందుచున్నవి. అభివృద్ధిలో అన్నిటికంటే ఎక్కువ వెనుకబడినది ఐదవశాస్త్రమైన జ్యోతిష్యశాస్త్రము. ముందే సంపూర్ణముగా తెలిసిన బ్రహ్మవిద్యా శాస్త్రము తెలియకుండా పోయినది. ఐదవశాస్త్రమైన జ్యోతిష్యశాస్త్రము అభివృద్ధి చెందలేదు. కొంతవరకు అభివృద్ధి చెందిన గణిత, ఖగోళ, రసాయనిక, భౌతికములు నాలుగు ప్రజలలోనికి చొచ్చుకొని పోయినవి. కొంతవరకే అభివృద్ధి చెందియున్న నాలుగు శాస్త్రము లను కొంత తెలిసిన మనిషి, అభివృద్ధి చెందని జ్యోతిష్యశాస్త్రము తనకు తెలియదు కనుక అది ఉన్నదని కొందరు, లేదని కొందరూ అంటున్నారు. మొదటనే ఉండి, ప్రస్తుతకాలములో లేకుండా పోయిన బ్రహ్మవిద్యా శాస్త్రమును మనిషి లేనేలేదు అంటున్నాడు.


జననము, మరణములు రెండు ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవి. ఆరవశాస్త్రము తెలియకుండా పోయినది, కావున భూమిమీద కొందరు మరణించిన తర్వాత, మళ్ళీ జన్మేలేదు అంటున్నారు. ఇస్లామ్మతములోను, క్రైస్తవమతములోను పునర్జన్మలేదు అను వాదన వినిపిస్తూ ఉన్నది. ఇకపోతే ఒక ఇందూమతములోనే పునర్జన్మ ఉన్నదని కొందరికి మాత్రము కొంత నమ్మకము గలదు. ఇందూమతములోనే ఎక్కువ శాతము మంది జ్ఞానమును తెలియని విద్యాధికులుగా, హేతువాదులుగా, నాస్తికవాదులుగా తయారై దైవమునే నమ్మనివారై చచ్చిన


---

తర్వాత పుట్టడమేమిటి? తెలివి ఉన్నవాడు, చదువు ఉన్నవాడు ఈ మాటను చెప్పరు. చదువులేనివారు, తెలివితక్కువవారే ఈ మాటలంటుంటారు. అని చెప్పుచున్నారు. దీనినంతటిని బట్టి చూస్తే భూమిమీద చావడము వరకే గానీ, చచ్చిన తర్వాత పుట్టడములేదు అనువారు ప్రపంచ జనాభాలో 98 శాతము గలరు. కేవలము 2 శాతము మాత్రము జన్మలున్నాయి అని చెప్పువారు గలరు. అలా చెప్పువారిలోను పూర్తి నమ్మకము లేనివారు ఒక శాతముండగా, పూర్తి నమ్మకముతో చెప్పువారు ఒక్క శాతము గలరు. దీని ప్రకారము ప్రపంచ జనాభా 700 కోట్లు కాగా అందులో 7 కోట్ల మంది మాత్రము జన్మలను పూర్తిగా విశ్వసించువారు గలరని తెలియుచున్నది.


ఏడుకోట్ల మందిలో ఏడు లక్షలమంది మాత్రమే వేదములను, పురాణములను వదలి అసలైన బ్రహ్మవిద్య మీద ఆసక్తి గలవారున్నారు. ఏడు లక్షలమందిలో ఏడు వేలమంది అసంపూర్ణ దైవజ్ఞానముగలవారు ఉన్నారు. ఏడు వేలమందిలో 70 (డెభ్బై)మంది మాత్రము అసలైన బ్రహ్మవిద్యను తెలిసి అసలైన దైవజ్ఞానము పొందియున్నారు. బ్రహ్మవిద్యను (దైవజ్ఞానమును) పొల్లుపోకుండ ఆచరించువారు సంపూర్ణ జ్ఞానాగ్నికలవారు భూమండలమునందు 70 (డెభై) మందిలో కేవలము ఏడు (7) మంది మాత్రము గలరు. 700 కోట్ల ప్రపంచ జనాభాలో మాయ బారినుండి తప్పించుకొని, దైవమార్గములో ప్రయాణించువారు కేవలము ఏడుమంది మాత్రమేనని తెలియుచున్నది. వందకోట్ల మనుషులలో అసలైన దైవ మార్గము తెలిసి, అసలైన దైవమార్గములో శాస్త్రబద్దముగా నడుచువాడు ఒక్కడేనని తెలియుచున్నది. ప్రస్తుతము మన దేశ జనాభా వందకోట్లకు కొద్దిగ మించియున్నది. కావున మన భారతదేశము (ఇందూదేశము) అంతటికి, ఎవడో ఒకడు ఆరవ శాస్త్రమును తెలిసి దాని ప్రకారము నడుచువాడు గలడని అర్థమగుచున్నది. సరిగా ఆచరించువాడు ఒక్కడున్నా, మిగత 69 మంది సంపూర్ణజ్ఞానులు ఆరవశాస్త్రమును క్షణ్ణముగా తెలిసినవారు గలరు. అటువంటివారి వద్ద నేను తెలుసుకొన్న జ్ఞానము ప్రకారము పునర్జన్మలు ఉన్నాయని చెప్పుచున్నాను.


ఇంకా వివరముగా చెప్పితే పునర్జన్మలే కాదు, పునర్మరణము కూడ కలదు. ఒకసారి పుట్టినవాడు చనిపోయి, రెండవమారు పుట్టితే దానిని పునర్జన్మ అంటున్నాము. అలాగే ఒకసారి మరణించిన వాడు పుట్టి తర్వాత చనిపోతే దానిని పునర్మరణము అంటున్నాము. ఇది బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము చెప్పుమాట. ఇక్కడ కొంత వివరమును జాగ్రత్తగా విందాము. శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని, చెప్పినది చెప్పినట్లు జరిగి తీరునని చెప్పవచ్చును. శాస్త్రము భూమిమీద ఎక్కడైన, ఏ దేశములోనైన ఒకే విలువ, ఒకే ఆచరణ కల్గియుండును. శాస్త్రమును చెప్పినది మనుషులకే కావున ఏ దేశములోని, ఏ మతస్థులకైన ఒకే విధముగా వర్తించును. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్కరకముగా, ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క విధముగా వర్తించదు. ఉదాహరణకు గణితశాస్త్రమును తీసుకొందాము. 3x3=9 అను సూత్రము ఏ దేశములోనైనా, ఏ మతస్థునికైనా వర్తిస్తుంది. అలాగే ఆరు శాస్త్రములలో పెద్ద శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము “జాతస్యహి ధృవో మృత్యుః, ధృవం జన్మ మృతస్యచ" అను సూత్రము అన్ని దేశములలోను అన్ని మతములలోను వర్తించును. శాస్త్రము శాపములాగ జరిగి తీరుతుంది. కావున అన్ని మతములలోను గల ధర్మము, జనన మరణములను సూచిస్తున్నది. దేవుడు చెప్పిన ధర్మమును ఆయా మతస్థులు గ్రహించుకోలేక మాయబారిలో (సాతాన్బారిలో) పడిపోయి దైవవాక్యమును మరచిపోయి జన్మలు లేవు అంటున్నారు. ఉదాహరణకు పరిశుద్ధ బైబిలులో మత్తయి సువార్త 12వ అధ్యాయములో 31,32 వచనములను చూస్తే “మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమించబడును గాని, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ


---

యుగమందైననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.” మా మతములో జన్మలు లేవు అని చెప్పుచున్న వారి గ్రంథములోనే దైవధర్మము ప్రకారము జన్మలున్నాయనుటకు సాక్ష్యముగా ఈ మాట నిలిచినది. శాస్త్రము ఎవరికైనా శాసనమే అనుటకు బైబిల్ లోని వాక్యము నిదర్శనముగా ఉన్నది. సాతాను (మాయ) ప్రభావము వలన పై వాక్యమును క్రైస్తవులు ఇంకొక విధముగా అర్థము చేసుకొని, అందులోని సత్యమును గ్రహించలేక పోయినా, దైవధర్మశాస్త్రము ప్రకారము మనిషికి జన్మలున్నాయనే ఆ వాక్యము చెప్పుచున్నది.


జ్యోతిష్యశాస్త్రము ప్రకారము స్థూలశరీరముతో మనిషి 120 సంవత్సరములు బ్రతుకవచ్చును. సూక్ష్మశరీరముతో ఎంతకాలమైన బ్రతుకవచ్చును. మనకు కనిపించేది స్థూలశరీరమే కావున దానిని గురించే మాట్లాడుకొందాము. ప్రస్తుత కాలములో మనిషి 80 లేక 90 సంవత్సరములకంటే ఎక్కువ బ్రతుకలేకున్నాడు. కొందరైతే మరీ తొందరగానే చనిపోవుచుందురు. ఆయుష్షు తీరి చనిపోయినవాడు, ఆ క్షణమే జన్మకు పోవునని ధర్మశాస్త్రమైన ఆరవశాస్త్రము చెప్పుచున్నది. 1200 సంవత్సరము లకు 10 జన్మలు తీసుకోవలసిన మనిషి 15 లేక 20 లేక 30 జన్మలు పొందుచున్నాడు. ఒకవేళ 90 సంవత్సరములు బ్రతుకునట్లు లెక్కించిన 1200 సంవత్సరములకు 13 లేక 14 జన్మలు పొందుచున్నాడు. మనిషికి ఆయుష్షు పరిమాణమున్నట్లు, నాలుగు యుగములకు కూడ పరిమాణము గలదు. కలియుగము యొక్క ఆయుష్షు 4,32,000 సం||లు అని దేవుని చేత నిర్ణయించబడినది. అలాగే ద్వాపరయుగము 8,64,000 సం||లు అనియు, త్రేతాయుగము 12,96,000 సం||లు అనియు, కృతయుగము 17,28,000 సం||లు అనియు నిర్ణయింపబడినది. బైబిలులో చెప్పిన వాక్యము రెండువేల సంవత్సరముల పూర్వముదే, కావున కలియుగములో చెప్పబడినదేనని సులభముగా తెలియుచున్నది. బైబిలు వాక్యము ప్రకారము ఎవడైనా దేవున్ని దూషించితే, వాడు రెండు యుగములలో పాపమును అనుభవించును. ఉదాహరణకు ప్రస్తుత కాలములో ఈ దినమే దేవున్ని దూషణగా మాట్లాడినవాడు పది సంవత్సరముల తర్వాత చనిపోయాడను కొనుము. అప్పటినుండి ఈ యుగములోనూ, రాబోవు యుగములోను పాపభారమును మోయవలసియుండును. ఆ లెక్క ప్రకారము కలియుగము ఇప్పటివరకు జరిగినదికాక, మిగిలియున్న సంవత్సరములు మరియు రాబోవు కృతయుగ సంవత్సరములు మొత్తము అనుభవించవలసియుండును. కలియుగము ఇప్పటి వరకు 5110 సంవత్సరములు గడిచిపోయినది. వాడు ఈ జన్మలో చనిపోవుటకు 10 సంవత్సరములున్నది. కావున వాడు చనిపోవు సమయమునకు కలియుగము 5,120 సంవత్సరములు గడిచిపోవును. ఇంకా మిగిలియున్నది 4,26,880 సంవత్సరములు. రాబోవు కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇపుడు ఈ యుగములోని 4,26,880 సం||లు, రాబోవు యుగములోని 17,28,000 సంవత్సరము లను కలిపితే మొత్తము 21,54,880 సంవత్సరములు పాపమును అనుభవించవలసియున్నది.


ఈ జన్మలో దేవుని ఎడల పాపమును సంపాదించుకొన్నవాడు ప్రతి జన్మలోను 100 సంవత్సరములు జీవించినా, బైబిలు వాక్యమును అనుసరించి 21,549 మార్లు భూమిమీద పుట్టవలసి వస్తున్నది. 21 వేయి 5 వందల 49 మార్లు జన్మనెత్తవలసియున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31,32 వాక్యములలో స్పష్టముగా ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను అని ప్రభువే చెప్పియుండగా క్రైస్తవులు ప్రభువు మాటకు వ్యతిరేఖముగా సాతాను మాట ప్రకారము, మనిషికి జన్మలు లేవు అనడము అధర్మము కాదా! ధర్మశాస్త్రమునకు విరుద్ధము కాదా?


ఆరవశాస్త్రమైన దైవశాస్త్రము లేక ధర్మశాస్త్రము ప్రతి మతములోను ప్రతి దేశములోను శాసనమై నిలిచియున్నదనుటకు బైబిలులోని వాక్యమే తార్కాణము. ఇదే విధముగ కొన్ని మతముల వారు తమ తమ ధర్మగ్రంథము



--

లలోవున్న దైవవాక్యమును, మాయా ప్రభావముచేత తప్పుగా అర్థము చేసుకొని జన్మలులేవు అంటున్నారు. అట్లే కొన్ని మతములవారు దయ్యములున్నాయని అంటున్నారు. కొన్ని మతములవారు దయ్యములు లేవు అంటున్నారు. బైబిలులో ప్రభువు అనేక పర్యాయములు దయ్యాల ప్రస్తావన తెచ్చాడు. మనము కూడ ఈ గ్రంథములో ఇంతవరకు దయ్యాలను, దేవతలను, క్షుద్రదేవతలను, దేవతలవలె నటించు వారి విషయములు ఎన్నో తెలుసు కొన్నాము. ఎవరు ఉన్నాయనినా, ఎవరు లేవనినా దయ్యాలు ఉన్నది నూటికి నూరుపాళ్ళు నిజమని, ఎన్నో అనుభవ సంఘటనల ద్వారా తెలిసింది. దయ్యాలున్నాయి అను వారికి దయ్యముల భయము కూడ ఉంటుంది. అందువలన వాటికి వ్యతిరేఖముగా మాట్లాడరు, వ్యతిరేఖమైన పనులు చేయరు. దయ్యాలులేవు అను వారికి మాత్రము వాటి భయముండదు. ఉంటే కదా భయపడవలసినది అనే ధైర్యముతో ఉంటారు. అటువంటివారు అవి లేవు అను ధైర్యముతో దయ్యాలకు వ్యతిరేఖమైన మాటలు మాట్లాడడము, వ్యతిరేఖమైన పనులు చేయడము జరుగుతుంది. కొన్ని దయ్యాల మనస్తత్వము గొప్ప నీతి నిజాయితీగా ఉండును. అటువంటి దయ్యాలు ఎవరి జోలికిరావు, ఎవరికి హాని చేయవు. కానీ వారిని ఎవరైనా రెచ్చగొట్టినా, దూషించినా, హేళనగా మాట్లాడినా, తమ విషయములను బయటికి తెలియునట్లు చేసినా వారిమీద కక్షసాధింపునకు దిగుదురు. అటువంటపుడు కొన్ని దయ్యములు కక్షసాధింపేకాక, ఏకంగా ప్రాణము తీయునవి కూడ కలవు. భూమిమీద అటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. పాము పగపట్టితే కక్షసాధింపునకు 12 సంవత్సరములైనా జ్ఞప్తి పెట్టుకొని అవకాశము కొరకు కాచుకొని ఉండును. అనుకొన్న మనిషిని చంపేంతవరకు ఆహారమును కూడ ముట్టదు.


పాము పగలాగ కొంతమంది దయ్యముల పగ ఉండుననుటకు కొన్ని సంఘటనలు గలవు. ఉదాహరణకు చంద్రముఖి సినిమాను తీసుకొందాము. చంద్రముఖి సినిమాలో ఉన్న కథ తమిళనాడులో యదార్థముగా జరిగిన విషయమేనని వార్తలలో చూచాను. తమిళనాడులో ఊరుపేరును చూచాను గానీ జ్ఞాపకము లేదు. ఆ ఊరిలో పాతబంగ్లా ఉండడము, దానిలో ఎవరూ నివసించక పోవడము, ఆ ఇంటిలో ఎవరైన ఉంటే సంగీత శబ్దము వినిపించడము, వింత సంఘటనలు జరగడము అన్నియు వాస్తవముగానున్న విషయములే. ఆ వాస్తవ విషయమును ఆధారము చేసుకొని ఒక సినిమాను తీయాలని అనుకున్నారు. తమిళనాడు లో ఉన్న ఇల్లూ వాస్తవమే, చంద్రముఖీ వాస్తవమే. దాని తర్వాత చంద్రముఖిని ఇంటినుండి తరిమివేసిన కథ వాస్తవము కాదు. సినిమాకొరకు వాస్తవ చరిత్రను మధ్యనుండి జరుగని చరిత్రను జరిగినట్లు సినిమా తీసారు. మొదట తమిళములో తీసిన సినిమాను తెలుగులోనికి డబ్బింగ్ చేశారు. చంద్రముఖి పేరుతో తీసిన ఒకే యాక్టర్లున్న సినిమా అటు తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఆడడము జరిగినది. మొదట చంద్రముఖి సినిమా తీయకముందు చంద్రముఖి దయ్యానికి ఆ విషయము తెలియదు. సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బయట ప్రదర్శించుచున్నప్పుడు తన సినిమాను గురించి ఆమెకు తెలిసింది. ఆమె కూడ ఆ సినిమాను చూచింది. ఆ సినిమాలో మాంత్రికుడు (భూతవైద్యుడు) మరియు మానసిక వైద్యుడు ఇద్దరు కలసి తెలివిగా మోసము చేసి తనను ఇంటినుండి తరిమివేసినట్లు చిత్రించడము చంద్రముఖికి కోపము వచ్చింది. రెండు మూడు వందల సంవత్సరములనుండి స్తబ్దతగా ఎవరిజోలికి పోకుండ ఉన్న నన్ను ఇలా చిత్రించుతారా? అని ఆమెకు కోపము రావడము జరిగినది. సినిమాలో నటించి చూపించిన వారిమీద తన కోపమును తీర్చుకోవాలనుకొన్నది.


ఆధ్యాత్మిక శ్రద్ధ కల్గి, జ్ఞానసముపార్జనలోనున్న రజనీకాంత్ ఆ సినిమాలో ముఖ్యపాత్రను పోషించడము వలన చంద్రముఖి రజనీకాంత్ను చూస్తూనే వెనకడుగు వేసింది. అంతేకాక ఆయనతో కలిసి నటించిన ఎవరి మీదకు వచ్చుటకు చంద్రముఖికి ధైర్యము లేకపోయింది. దానికి కారణము దైవజ్ఞానము మీద ఆమెకున్న గౌరవము అలాంటిది.


---

చంద్రముఖి దయ్యముగా మారి, కాలము గడుపుచున్న ఆమె దేవునిపట్ల విధేయురాలై జ్ఞానజిజ్ఞాసకల్గియున్నది. అందువలన రజనీకాంత్ను గానీ, ఆయన సహ నటులనుగానీ ఏమి అనకుండ ఊరకుండిపోయింది. తమిళములో తీసిన సినిమాను తెలుగులోనికి డబ్బింగ్ చేసినట్లు, కన్నడములోనికి డబ్బింగ్ చేసుకొని ఉంటే బాగుండేది. కన్నడవారు అలా కాకుండ అదే కథను 'ఆప్తమిత్ర' అను పేరు పెట్టి సినిమాను తీశారు. దానిలో నటీనటులందరు కన్నడవారే. కన్నడభాషలో విష్ణువర్థన్, సౌందర్య ముఖ్యపాత్రలు పోషించారు. ఆ విషయము తెలుసుకొన్న చంద్రముఖి, కోపముతో కర్నాటక రాష్ట్రానికి పోయింది. అక్కడ సమయము చూచి ముఖ్యపాత్రలు చేసిన విష్ణువర్ధన్ను, సౌందర్యను చంపివేసింది. సౌందర్యను హెలిక్యాప్టర్ ప్రమాదములో చంపివేసింది. అలాగే విష్ణువర్ధను చంపింది. తనను హింసించి, మోసము చేసి పారద్రోలినట్లు సినిమాలో చూపడము, చంద్రముఖిని అవమానపరచి నట్లయినది. అందువలన ఆమెకు కోపము వచ్చి వారిమీద కసి తీర్చుకొన్నది. 'ఆప్తమిత్ర' సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన విష్ణువర్ధన్కు, సౌందర్యకు రజనీకాంత్వలె దైవజ్ఞానము మీద శ్రద్ధగానీ, జిజ్ఞాసగానీ లేవు. చంద్రముఖిని ఆపగలిగిన దైవజ్ఞానము వారివద్దలేని దానివలన, ఆమె కోపమునకు సౌందర్య, విష్ణువర్ధన్ ఇద్దరు బలియైపోయారు.


వారిరువురు అర్ధాంతరంగా చనిపోవడము వలన తమిళములో ఆ సినిమాలో నటించిన రజనీకాంత్ కొందరి జ్యోతిష్యుల వలన చంద్రముఖి చేతనే వారిరువురు చనిపోయినట్లు తెలుసుకొన్నాడు. ఆ విషయమును తెలుసుకొన్న తర్వాత రజనీకాంత్ కూడ, చంద్రముఖి వలన ముప్పు పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్పడము వలన, ఆయన ఆలోచనలో పడ్డాడు. కొంతమంది పండితులతో కలిసి చర్చించిన తర్వాత చంద్రముఖి నుండి వచ్చు ప్రమాదమును తప్పించుకొనుటకు రజనీకాంత్ "మృత్యుంజయ యజ్ఞము” చేయవలసి ఉంటుందని పండితులు అభిప్రాయమును వ్యక్తము చేశారు. వారి మాటలు విన్న తర్వాత రజనీకాంత్ గారు డబ్బును ఖర్చుపెట్టి మృత్యుంజయ యజ్ఞమును చేయించారు. చంద్రముఖి, రజనీకాంత్ జోలికి రాకున్నా పండితులు అనవసరమైన భయమును ఆయనకు కల్పించి యజ్ఞమును చేయించారు. కర్నాటకలో ముఖ్యపాత్రలు చేసి తనను కించపరిచారని, దైవజ్ఞానము లేని ఇద్దరిని చంపిన తర్వాత అదే కథను మరొక భాషలో క్రొత్తగా తీయాలని ప్రయత్నించి నాయిక పాత్రను పోషించుటకు ఒక యువతిని ఎంచుకొని ఆమె చేత చంద్రముఖి పాత్రను రిహార్సల్ చేయిస్తున్న సమయములో ఆ యువతికి చంద్రముఖి పూనకము వచ్చి నానా హంగామ చేసిందట. ఆ యువతి అలా ప్రవర్తించడములో సినిమాను తీయాలనుకొన్న వారికి కొంత అనుమానము వచ్చి ఆ సినిమాను తయారు చేయకుండ విరమించుకొన్నారట. యువతికి పూనకము వచ్చినది, విష్ణువర్థన్ చనిపోయింది, రజనీకాంత్ మృత్యుంజయ యజ్ఞము చేయించినది తమిళనాడులో చంద్రముఖి స్వంత ఇంటి ఫోటో విషయములన్నియు ఒక దినము 'సాక్షి' దినపత్రికలో చూచినట్లు నాకు జ్ఞప్తికి ఉన్నది.



చంద్రముఖి సినిమా విషయమునంతటిని వివరించుకొని చూస్తే తెలియునదేమనగా! తమను కించపరిస్తే, కొన్ని సూక్ష్మములు పామువలె పగపట్టి సాధిస్తాయని అర్థమగుచున్నది. దయ్యాల వలన ఎన్నో చావు బ్రతుకు సమస్యలు ఏర్పడుచున్ననూ వాటి ఉనికిని గ్రహించలేని వారు ఎంత చదువు చదివినా గ్రుడ్డివారితో సమానము కాదా! ఎవడైనా దయ్యాలున్నాయి అంటూనే వానిని అమాయకుని క్రిందకు జమకట్టి మాట్లాడు వారిని మేము ఎవరి క్రింద జమకట్టాలి? పెద్ద చదువు చదువుకొన్నంత మాత్రమున, మేము విజ్ఞానులము అని పేరుపెట్టుకొన్నంత మాత్రమున తమ చదువు కొంతేనని, తమ విజ్ఞానము విజ్ఞానముకాదని తెలియని వారిని అమాయకులలోకెల్ల అమాయకులని చెప్పవచ్చును. భూమిమీద ఉన్న చదువులన్ని నాలుగుశాస్త్రములకు సంబంధించినవే. ప్రాధమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయముల


--

వరకు వాటిలో బోధింపబడు విద్యలన్నిటిని కలిపి చూస్తే, చివరకు కనిపించేవి నాలుగు శాస్త్రములే. గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, రసాయనికశాస్త్రము, భౌతికశాస్త్రమును మినహా మిగత ఏ శాస్త్రములు ఏ బోధనాలయములలోను కనిపించవు. ఈ నాలుగు శాస్త్రములు మనిషికి స్థూలముగా కనిపిస్తున్నవి. కావున ఈ నాలుగు శాస్త్రములు మనిషికి స్థూలదృష్టిని ఇచ్చి, స్థూల భావములను గ్రహించుశక్తి నిచ్చుచున్నవి. అందువలన సూక్ష్మముగానున్న దయ్యములను, దేవతలను, చదువులో ఏ డిగ్రీ పొందినవాడుగానీ తెలియ లేకున్నాడు. సూక్ష్మముగానున్న దయ్యాలను, దేవతలను వారి జీవిత విధానాలను గ్రహించాలంటే మనిషికి, సూక్ష్మదృష్టి అనబడు జ్ఞానదృష్టి అవసరము. జ్ఞానదృష్ఠి అను పదము ఒకే ఒక బ్రహ్మవిద్యాశాస్త్రములో మాత్రము కనిపిస్తున్నది. కొద్దిగ అయినా ఆరవశాస్త్రమైన రాజవిద్యా శాస్త్రము, లేక ధర్మశాస్త్రము అనుబడు బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలియని సూక్ష్మములను గురించి ఎవనికి ఏమాత్రము తెలియదు. అందువలన నేటికాలములో ఎంత చదువు చదివినా, ఎంత విజ్ఞానమును సంపాదించు కొనినా, ఎన్ని డిగ్రీలు పేరు చివర తగిలించుకొనినా, వారికి దయ్యములను గురించికానీ, దయ్యముల కోవకు చెందిన దేవతలు, దేవుళ్ళను గురించిగానీ ఏమాత్రము తెలియదు. అటువంటపుడు దేవతలకు, దయ్యములకు కూడ అతీతమైన, అగమ్యగోచరుడైన దేవుడు తెలియునా?


విశ్వవిద్యాలయాలలో బోధించు నాలుగుశాస్త్రములను చదివి బాహ్యజ్ఞానమును సంపాదించుకొనిన శాస్త్రజ్ఞులకే దయ్యముల, దేవతల, దేవుళ్ళ విషయము తెలియనిది, ఏ శాస్త్రముకానటువంటి పురాణములను, వేదములను చదివిన వారికి ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును. వేద, పురాణములను చదివినవారు, దయ్యములున్నాయను గ్రుడ్డినమ్మకముతో వాటిని గుర్తించి శాస్త్రబద్దముగాని, అబద్ద విషయములు చెప్పుట వలన బాహ్యశాస్త్రములను చదివినవారు ఆ విషయములను ఖండించుచుందురు. అంతమాత్రమున వాస్తవముగా దయ్యాలులేవు, దేవుళ్ళు లేరు అనడము పొరపాటు. ఇంతవరకు కొన్ని రకముల సంఘటనలకు సంబంధించిన విషయములను చెప్పుకొన్నాము. చివరిలో చంద్రముఖిని గురించి చెప్పుకొన్నాము. చంద్రముఖి దైవజ్ఞానము యొక్క జిజ్ఞాసకల్గిన మరియు కొంత దైవజ్ఞానముగల రజనీకాంతన్ను గౌరవించడము. జ్ఞానము లేనివారిని ఏదో ఒక రూపములో చంపివేసినట్లు తెలుసుకొన్నాము. దీనితో దయ్యములు అంటే అన్నీ చెడు చేయునవే అని అనుకోకుండ మంచి చేయునవి, జ్ఞానమునకు విలువనిచ్చునవి, దైవజ్ఞానమును గౌరవించునవి మరియు పూజ్యముగ చూచునవి, దేవుని సేవ చేయునవి, దేవుని సేవ చేయువారికి రక్షణనిచ్చునవి కలవని తెలియుచున్నది.


చంద్రముఖి, జ్ఞానమునకు విలువనిచ్చి, జ్ఞానములేని వారిని చంపినది కదా! అట్లే జ్ఞాన జిజ్ఞాసకల్గి, జ్ఞాన సేవను దైవసేవగా భావించి చేయు సాధారణ వ్యక్తిని చంద్రముఖిలాగ జ్ఞానమునకు విలువనిచ్చు ఒక సూక్ష్మము ఎలా చావునుండి రక్షించిందో జరిగిన ఒక సంఘటననుబట్టి చూస్తే తెలుస్తుంది. మావద్దకు వచ్చిన ఒక వ్యక్తి దగ్గర ఏ ప్రత్యేకత లేదు. దైవజ్ఞానము తెలియని సాధారణ వ్యక్తి మరియు అన్ని దుర్వ్యసనములున్న వ్యక్తి. తన సహచరులు నన్ను గురించి గొప్పగా చెప్పి, వారి వెంట అతనిని తీసుకొనివచ్చారు. అలా వచ్చిన వ్యక్తికి “ఇక్కడ ఏ ప్రపంచ కోర్కెలు నెరవేర్చబడవు. కేవలము దైవజ్ఞానము మాత్రము చెప్పబడుతుంది. నీకు దైవజ్ఞానము మీద ఆసక్తియుంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి జ్ఞానము తెలుసుకోవచ్చును. అలాకాకుండ నావద్దకు వస్తే మీకు ఏదో మంచి జరుగుతుందని అనుకోవద్దండి. నావద్దకు వస్తే ప్రపంచపరముగా ఏ మంచి జరుగదు" అని చెప్పాను. నేను చెప్పిన మాటలు అతనికి నచ్చి రెండు మూడుమార్లు నావద్దకు తన సహచరులతోపాటు వచ్చాడు. ఆయన సహచరులు, ముందునుంచే నావద్ద దైవజ్ఞానమును

---

తెలుసుకొనుచు నాలోని జ్ఞానమును బాగా విశ్వసించినవారు. అటువంటి అనుచరుల వలన నా జ్ఞానము యొక్క విలువ గొప్పదని తెలిసి, నావద్దకు రావడము వలన అతనికి ప్రపంచ జ్ఞానముకంటే, దైవజ్ఞానము గొప్పదని తెలిసినది. అప్పటినుండి దైవజ్ఞానము మీద ఆసక్తిని పెంచుకొని, ప్రపంచ జ్ఞానముమీద ఆసక్తిని తగ్గించుకొన్నాడు. అట్లు చేయుట వలన తనలోని త్రాగుడు మొదలగు దుర్వ్యసనములన్ని అతనికి దూరమైపోయాయి.


కర్నూల్ జిల్లా డోన్ సమీపములోనున్న జలదుర్గము గ్రామములో విశ్వనాథ్ అను వైశ్యకుటుంబము, నావద్దకు వచ్చి జ్ఞానమును తెలుసుకొనే వారు. విశ్వనాథుప్తకు అదే గ్రామమునకు చెందిన శేఖర్ అను పెళ్ళికాని యువకుడు పరిచయము. ఆ పరిచముతోనే విశ్వనాథుప్త అతనికి తాను తెలుసుకొన్న జ్ఞానమును చెప్పి, నావద్దకు తీసుకురావడము జరిగినది. అలా వచ్చిన వ్యక్తియే పైన నేను చెప్పిన దుర్వ్యసనములు మానుకొన్న వ్యక్తి. తర్వాత కొంతకాలానికి నా సమక్షములోనే పెళ్ళి కూడ చేసుకొన్నాడు. అతని వృత్తి లారీని నడుపు డ్రైవర్. అతను డ్రైవర్ పని చేస్తూనే వీలు దొరికినపుడు జ్ఞానమును తెలుసుకొనేవాడు. తాను జ్ఞానమును తెలుసుకొని దానిని ఇతరులకు తెలుపుట దేవునిపని చేసినట్లని నేను చెప్పిన దానివలన అతను డ్రైవర్గా పోయినపుడు కూడ తన లారీలో నా రచనలలోని కొన్ని గ్రంథములును ఉంచుకొని పోయేవాడు. వీలు దొరికినపుడు ఇతరులకు జ్ఞానమును చెప్పేవాడు. వినేవారు ఆసక్తిగ కనిపిస్తే వారికి తనవద్దనున్న గ్రంథములను ఉచితముగా ఇచ్చేవాడు. అలా అతని వృత్తి డ్రైవర్కాగా, అతని ప్రవృత్తి జ్ఞానమును ఇతరులకు అందించడము అని చెప్పవచ్చును. నావద్ద జ్ఞానమును తెలుసుకొన్నవారంత ముఖము మీద ధరించు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను అతను నిత్యము ధరించెడివాడు. ఆ విధముగ 24 గంటలు అతని ముఖము మీద కాల, కర్మచక్రములు కనబడేవి.

ఈ విధముగ కొంతకాలము తాను జ్ఞానమును తెలుసుకొంటూ ఇతరులకు తెలుపుచు, జ్ఞానసేవ చేయుచున్న శేఖర్ చివరకు మనము పూజించే దేవతలు, దేవుళ్ళు కూడ దేవుని చేత సృష్ఠింపబడినవారేనని, మనుషులను, దేవతలను, దేవుళ్ళను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడని, దేవునికి రూప, నామ,క్రియలు లేవని, ఆకారముగానీ, పేరుగానీ, పనిగానీ ఉన్నవాడు ఎవడూ దేవుడుకాదని తెలుసుకొన్నాడు. భగవద్గీతలో భక్తియోగమందు 10వ శ్లోకమున “మదర్థమపి కర్మాణి” నా కొరకు పనిచేయు అను సూత్రము ప్రకారము దైవజ్ఞానమే తన ధ్యేయముగా, ప్రవృత్తిగా చేయుచుండెను. అలా మనోభావములో జ్ఞానమునకు గొప్ప స్థానమిచ్చిన శేఖర్న చంద్రముఖిలాంటి ఒక సూక్ష్మము చూచినది. దైవ జ్ఞానమును శాస్త్రబద్దముగా తెలుసుకొని అలాగే ఆచరించుచు దైవ భావమున్న వ్యక్తులను గౌరవించు స్వభావమున్న చంద్రముఖిలాంటి సూక్ష్మము, అతను చేయు వృత్తి లారీని నడపడము కావున అతనికి రక్షణగా అతని వెంట ఉండాలనుకొన్నది. అప్పటినుండి అతను లారీకిపోతే ఆ సూక్ష్మము కూడ అతని వెంటపోయేది. అతను ఇంటిదగ్గర ఉంటే ఇంటి దగ్గరే ఉండేది.



దేవతలను పుట్టించినది, మనుషులను పుట్టించినది ఒక్క దేవుడేనని తెలిసిన తర్వాత, శేఖర్కు మనుషులు దేవతలను పూజించడము, దేవున్ని గుర్తించలేకపోవడము సరిపోయేది కాదు. ఆ విధముగ ఉన్నపుడు ఒకరోజు బెంగుళూరుకు వెళ్ళే మార్గమైన పామిడి ప్రాంతములో రోడ్డుప్రక్కనే వేపచెట్టుకు తాయమ్మ పేరుతో పూజచేసి చెట్టుకు పసుపు చీరకట్టియుండడము చూచాడు. రాత్రిపూట రేడియేటర్కు నీళ్ళు పోసేదానికి రోడ్డుప్రక్కన లారీని నిలబెట్టినపుడు, ప్రక్కనే చీరకట్టియున్న చెట్టును చూచాడు. జ్ఞానమును తెలుసుకొన్న తర్వాత దేవతలంటే చాలా చులకన భావము అతనిలో ఏర్పడింది. కావున చెట్టుకు చీర ఎందుకు? బండి తుడిచే దానికి పనికి వస్తుందని అనుకొని చెట్టుకున్న


----

చీరను తెచ్చుకొన్నాడు. ఆ సమయములో అతని నుదటిమీద కాల, కర్మచక్రములను పెట్టుకొనియున్నాడు. రాత్రి ఒంటిగంట సమయములో అందరు నిద్రించుచుండుట వలన చెట్టుకున్న చీరను తీయడము మనుషులు ఎవరూ చూడలేదు. కానీ ఆ చెట్టుమీదనే ఉన్న తాయమ్మ చూచింది. అతని నుదటిమీద కాల, కర్మచక్రముల గుర్తుండడము వలన, అది ప్రకాశిస్తున్నట్లు కనిపించడము వలన, తాయమ్మ అతనిని ఏమి చేయలేక పోయింది. అప్పటినుండి ఏదో ఒకరకముగా సమయము దొరికినప్పుడు శేఖర్ను ఇబ్బంది పెట్టాలనుకొన్నది. అతను బెంగుళూరు ఏరియాకు పోయినప్పుడల్లా అతని మీద తాయమ్మ కోపముగా ఉండేది. తాయమ్మ చెట్టుకుచుట్టిన చీరను శేఖర్ తెచ్చుకొన్న తర్వాత, బహుశ నెలరోజులకు తిరిగి బెంగుళూరికి పోయాడు. బెంగుళూరులో అన్లోడ్ చేసి, ఖాళీలారీని తీసుకొని వచ్చేటప్పుడు బెంగుళూర్ చివర యలహంక ప్రాంతము దగ్గర రోడ్డు సైడుకు లారీని ఆపాడు. అప్పుడు మధ్యాహ్నము ఒంటిగంట సమయము అయిన దానివలన భోజనమునకు ఆపాడు. అక్కడే రోడ్డుప్రక్కన మొబైల్ హెూటల్ ఉంటే అక్కడికిపోయి క్లీనర్ రమేష్, డ్రైవర్ శేఖర్ ఇద్దరు భోంచేశారు. వారితో పాటు చంద్రముఖిలాంటి సూక్ష్మము కూడ ఉండేది. రోడ్డుమీద అక్కడే స్పీడ్ బ్రేకర్ ఉన్నది. అంతేకాక రోడ్డు బెంగుళూరు వైపు పూర్తి తగ్గుగా ఉండేది. డౌన్లో స్పీడ్గా వచ్చిన వాహనములన్ని స్పీడ్ బ్రేకర్ ఉన్నదానివలన బ్రేక్వేసి, స్లో చేసుకొని బ్రేకర్ దాటుకొనిపోతున్నారు. అంతలో బెంగుళూరు వైపు పోయే లారీ డౌన్లో స్పీడ్గా వచ్చి ముందర బ్రేకర్ ఉన్నదానివలన బ్రేక్ వేయడము జరిగినది.


అప్పుడు లారీబ్రేక్ పనిచేయలేదు. ముందర స్పీడ్ బ్రేకర్ దగ్గర కొన్ని మోటర్ సైకిళ్ళు, రెండు కార్లు స్లో అవుతున్నవి. లారీ బ్రేక్పడక పోవడము వలన స్పీడ్గా వస్తున్నది. లారీ కొద్దిగ ముందుకు వస్తే రెండు కార్లు, కొన్ని మోటర్ సైకిళ్ళు లారీక్రింద నలిగి పోతాయి. అటువంటి సమయములో లారీడ్రైవర్ సమయస్పూర్తితో, లారీని ఎడమ చేతివైపు రోడ్డుకు అడ్డముగా ప్రక్కకు త్రిప్పడము వలన, ముందర ఉన్న కార్లను మోటర్సైకిళ్ళను లారీ గుద్దలేదు. స్పీడ్ ఉన్న లారీని అడ్డముగా ప్రక్కకు త్రిప్పడము వలన లారీ స్పీడ్గా వెళ్ళి, రోడ్డు ప్రక్కన ఉన్న తొమ్మిది అడుగుల ప్రహరిగోడను గుద్దింది. టాటాకంపెనీ లారీ ప్రహారి గోడను గ్రుద్దడము వలన లారీక్యాబిన్ వెడల్పు గోడపడిపోయింది. గోడ పడిపోగా, క్రింది భాగములో పడిపోకుండ మిగిలిన అడుగుఎత్తు గోడకు లారీ ముందర చక్రాలు ఆనుకొని, లారీ నిలిచిపోయినది. పైగోడ అంతా, లారీ వెడల్పు ప్రక్కనున్న తోటలోపలి పొలములోనికి పడిపోయింది. ఆ గోడ సిమెంట్ పెళ్ళలతో కట్టినది కావున లారీ గుద్దేటప్పటికి ఒక్కసారి ప్రక్కకు వాలి పోయినది. దాదాపు 9 ఇంచులు వెడల్పు, 18 ఇంచుల పొడవున్న, పెద్ద ఇటుకతో కట్టిన గోడ ప్రక్క పొలములోనికి దాదాపు 10 అడుగుల దూరము వరకు పడియున్నది. ఈ విషయమును అంత ప్రాముఖ్యముగా చెప్పవలసిన పనేముంది అని మీరు అనుకోవచ్చును. ఎందుకు చెప్పాను అనగా! ఇక్కడే ఒక ప్రమాద సంఘటన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది. అంత ఆశ్చర్యపడునది ప్రమాదమైనది ఏమనగా!


శేఖర్, రమేష్ ఇద్దరూ గోడను అనుకొనియున్న మొబైల్ హాటల్ దగ్గర నిలబడి భోంచేసి ఇద్దరూ తమ లారీవైపు రావాలని బయలుదేరారు. రమేష్ రోడ్డు దగ్గరకొచ్చాడు, శేఖర్, రమేష్ వెంట రెండడుగులు వచ్చి ఇంకా కొన్ని నీళ్ళు తాగివస్తామని గోడవైపువున్న డబ్బాలాంటి నీళ్ళ పాత్రవైపు పోయాడు. నీళ్ళు త్రాగి తిరుగుతున్న సమయములో, లారీ రోడ్డుకు అడ్డము తిరిగి గోడవైపు రావడమును చూచాడు. లారీ ఈ ప్రక్కకు ఎందుకు వస్తావుంది? అని అనుకొని తేరుకొనేలోపల, లారీ స్పీడ్గా వచ్చి గోడను గుద్దింది. శేఖరు ప్రక్కకు రావాలని ప్రయత్నము చేయకముందే లారీ గుద్దడము జరిగినది. ఆ విధముగా శేఖర్కు ఊహించని ప్రమాదము జరిగింది. ఆ ప్రమాదములో ఇటు లారీకి అటు


---

గోడకు మధ్యలో శేఖర్ ఉండిపోయాడు. ఆ విధముగా జరిగిన ప్రమాదములో శేఖర్ గోడకు లారీకి మధ్యలో నలిగిపోయి, అతని ఆకారము కూడ మిగలకుండ పోవాలి. కానీ అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన వింత ఏమిటంటే, శేఖర్ గోడతోపాటు పొలములో పడినాడు. అదియు గోడమీద కూర్చున్నవాడు గోడ చివరిలో పడినట్లు పొలములో గోడంతా పది అడుగుల దూరము వరకు పడియుంది. పది అడుగుల తర్వాత శేఖర్ పడివున్నాడు. శేఖర్ శరీరమునకు ఎటువంటి దెబ్బతగలలేదు, కానీ కుడికాలు మీద సిమెంట్ ఇటుకలు పడివున్నాయి. ఎడమ కాలుమీద ఒక్క ఇటుక కూడ పడలేదు. శరీరమంతా ఎక్కడగానీ, ఎడమ కాలుకుగానీ దెబ్బ తగలకుండ పోయి. కుడికాలు క్రింద పాదము పై భాగమున కాలిమీద సిమెంట్ ఇటుకలు పడిన దానివలన కాలుకు పిక్క కండలు తెగి ఎముక విరిగింది. ఈ విధముగ ఒక్క కుడికాలుకు మాత్రము దెబ్బ తగిలి ఎముక విరిగింది.


తొమ్మిది (9) అడుగుల ఎత్తు గోడకు అనుకొని మనిషి ఉండగా, ఆ మనిషి ఐదున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండగా, మనిషి ఎత్తుకంటే పైన దాదాపు మూడున్నర అడుగుల గోడ ఉండగా, లారీ తగిలితే మనిషి ఆకారము కూడ మిగలకుండ పోవాలి. కానీ ఒక కాలికి మాత్రము దెబ్బ తగిలి, మిగత శరీరములో ఎక్కడా తగలకుండుటకు కారణము ఏమిటని కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలావుంది చూడండి. లారీ బ్రేక్ ఫెయిల్ అయి గోడవైపు దూసుకొచ్చినపుడు, శేఖర్తో పాటు అతని ప్రక్కనే అతనికి రక్షణనివ్వాలనుకొన్న సూక్ష్మము కూడ నిలచి ఉండెను. శేఖర్ అడుగు ప్రక్కకు వేయకముందే, లారీ అతనిని గుద్దివేయునని సూక్ష్మము గ్రహించింది. అతనిని ఆ ప్రమాదమునుండి రక్షించాలనుకొన్నది. అంతలో లారీ శేఖర్కు అర్థఅడుగు దూరము వరకు సమీపించింది. అప్పుడు సూక్ష్మము శేఖర్ను గాలిలోనికి పైకి గోడ అంచువరకు ఎత్తింది. అంతలోపల అరక్షణములో లారీ గోడను గుద్దింది. అప్పుడు శేఖర్ గోడ అంచువరకు పైకి పోయిన దానివలన గోడకు, లారీకి మధ్యలో అతను నలిగిపోలేదు. రెండు సెకండ్లు ఆలస్యముగా లారీ తగిలివుంటే, శేఖర్ను సూక్ష్మము ఇంకా పైకి లేపి ఉండెడిది. అలా ఇంకా కొద్దిగ పైకిపోవు అవకాశముంటే గోడకు కొంత దూరముగా పడేవాడు. కుడికాలు కూడ గాయపడేది కాదు. అక్కడికే సూక్ష్మము, శేఖర్ను చాలావరకు రక్షించగలిగింది. లారీ ప్రక్కకు రావడము రమేష్ కూడ గమనించి, శేఖరైవైపు చూచేలోపల శేఖర్ కనిపించకుండ లారీ అడ్డమైపోయింది. అంతలోనే గోడను గ్రుద్దడము జరిగినది. ఇక శేఖర్ లేడు అని రమేష్ అనుకొని ఆతృతగా అటువైపు పోయి చూచాడు. గోడ చివరిలో పొలములో పడియున్న శేఖర్ దగ్గరకు పోయి కుడికాలు మీద పడిన ఇటుకలను తీసివేసి, శేఖర్ను రోడ్డు ప్రక్కకు ఇతరుల సహాయముతో తీసుకువచ్చారు. ఆ సమయములో శేఖర్ లారీక్రింద పడక పొలములో ఎట్లు పడినాడను యోచనకూడ రమేష్క రాలేదు. వెంటనే అంబులెన్స్ వ్యాన్ వస్తే, ఆసుపత్రికి తీసుకుపోవడము

జరిగినది.


శేఖర్ను అతని వెంటనున్న సూక్ష్మము రక్షించగలిగింది అని చెప్పాముగా! ఇక శేఖర్మీద కోపముగానున్న తాయమ్మ ఏమి చేసిందో చూద్దాము. స్పీడ్ బ్రేకర్ వరకు లారీ రాకముందు, తాయమ్మ బ్రేక్ పైపును విరిగిపోవునట్లు చేసింది. తర్వాత క్యాబిన్లోనికి వచ్చి డ్రైవర్ దగ్గర కూర్చుంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేస్తే, బ్రేక్ ఆయిల్ కారిపోవడము వలన లారీకి బ్రేక్ పడలేదు. లారిడ్రైవర్ బ్రేక్ ఫెయిలైందను తత్తరపాటులో ఉన్నపుడు అతనికి తెలియకుండానే అతని చేతులు ఎడమ ప్రక్కకు స్టీరింగ్ను లాగాయి. వెంటనే లారీ దిశ మారిపోయి, శేఖరైవైపు పోసాగింది. శేఖర్ మీద కోపముతో తాయమ్మ, శేఖర్ను అతని శరీరమును కూడ మిగలకుండ చేయాలనుకొన్నది. కానీ ఆ సమయములో


---

శేఖర్ ముఖము మీద చక్రాలుండడము వలననూ, ప్రక్కనేవున్న సూక్ష్మము అతనిని ఒక్కసారిగ పైకి ఎత్తడము వలననూ శేఖర్ బ్రతికి బట్టకట్టగలిగాడు. ఇక్కడ ఒక సూక్ష్మము చంపాలని చూస్తే, ఒక సూక్ష్మము బ్రతికించాలని చూచింది. చివరకు శేఖరైవైపున్న సూక్ష్మమే ఆ పోరాటములో కొంత నెగ్గగలిగింది.


కొంతకాలము తర్వాత నావద్దకు వచ్చిన సూక్ష్మము ద్వార జరిగిన విషయమంతా నాకు తెలిసింది. కావున ఇప్పుడు మీకు నేను చెప్పగలుగు చున్నాను. ఇక్కడ జరిగినదంతా గమనించితే, భూమిమీద అన్ని చెడు చేయు దయ్యాలేకాక, మంచిని చేయునవి, జ్ఞానమును తెలుసుకొనునవి ఎన్నో గలవు. ఇంతవరకు దయ్యముల గురించి నాకు తెలిసిన కొన్ని విషయము లను మాత్రము తెలియజేశాను. నేను దయ్యాలున్నాయా? అను పరిశోధన నిమిత్తము గడిచిన దాదాపు ఒకటిన్నర లేక రెండు సంవత్సరముల కాలములో నేను చూచిన పదవవంతు విషయములను మాత్రమే ఇంతవరకు తెలిపాను. ఇంతవరకు తెలిపిన విషయములన్నియు కేవలము దయ్యములకు సంబంధించిన సమాచారములే. మనకు కనిపించని దయ్యములు ఒక్కటే కాదు. భూతములు కూడ ఉన్నవి. భూతములు అనుమాట దయ్యాలకు వర్తించదా? అని ఎవరైనా అడిగితే దయ్యములు వేరు, భూతములు వేరు అని చెప్పవచ్చును. దయ్యములలాంటివే భూతములు, భూతములలాంటివే దయ్యములు. అయినా వాటిని విడదీసి దయ్యములు, భూతములని వేరువేరుగా చెప్పవలసిన అవసరమున్నది.


'భూతము' అంటే జీవుడు అని అర్థము. దయ్యము అంటే దేవుడు కానివాడు జీవుడు అని అర్థము. దయ్యము అనినా భూతము అనినా జీవుడనియేగా అర్థము. అలాంటపుడు దయ్యాలు, భూతాలు వేరు వేరు అనడమేమిటి అని ఎవరైనా అనవచ్చును. దానికి జవాబు ఏమనగా! మనుషులు అందరు ఒకే జాతి అయినా కొందరు పండితులుగా, కొందరు పామరులు (చదువురానివారు) గా ఉండవచ్చును. ఒకే మనిషి జాతి అయిన మనుషులను, వారికున్న పరిజ్ఞానమును బట్టి, విద్యా జ్ఞానమునుబట్టి ఏ విధముగ కొందరిని పండితులని, కొందరిని పామరులని విభజించి పిలుస్తున్నామో, అదే విధముగా అందరూ జీవులే అయినా వారు చేయు కార్యములనుబట్టి, వారికున్న శక్తినిబట్టి దయ్యాలు, భూతాలు అని రెండు విధముల విభజించవలసివచ్చినది. కొందరు తమకు తెలియకున్నా కొన్ని సందర్భములలో మాట్లాడుచు దయ్యాలులేవు, భూతాలులేవు అనుచుందురు. ఇంకా దయ్యాలుగానీ, భూతాలుగానీ నన్ను ఏమి చేయలేవు అనుచుందురు. కొన్ని చోట్ల నాకు దయ్యాలన్నా, భూతాలన్నా భయములేదు, నేను దయ్యాలకు భూతాలకు భయపడను అని అంటుంటారు. ఈ విధముగా చాలామంది తమకు తెలియకుండినా దయ్యములు, భూతములు అను పదములను అనడము వినుచుందుము. మనకు తెలియకున్నా వాటిని గురించి దేవుడే అవి వేరువేరు అని తెలియునట్లు మనచేత అట్లు పలికించుచున్నాడు. ఈ విధముగా దయ్యాలు, భూతాలు అను రెండు రకములు జగతిలో కలవని తెలియుచున్నది. ఇంతవరకు దయ్యముల విషయములను కొన్నిటిని చెప్పుకొన్నాము. భూతముల విషయములు చెప్పుకోవలసియున్నది.


భూతములను రెండు రకములుగా చెప్పుకోవచ్చును. ఒకటి మహా భూతములు, రెండు స్వల్ప భూతములని వాటిని చెప్పవచ్చును. మహా భూతములనునవి ప్రకృతిలోని భాగములు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ప్రకృతిలోని ఐదు భాగములను ఐదు మహాభూతములుగా చెప్పవచ్చును. ఈ ఐదు అన్ని జీవరాసులకంటే గొప్పవి, కావున వీటిని మహా భూతములని పిలుస్తున్నాము. స్వల్ప భూతములనునవి కూడ ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పేరుతోనే ఉన్నవి. బాగా అర్థము చేసుకొంటే, మహాభూతములనే స్వల్పభూతములను పేరుతో పిలుస్తున్నాము. మహాభూతములలోని ఆకాశమునకు, స్వల్ప భూతములలోని ఆకాశమునకు ఏమీ తేడా ఉండదు. అలాగే


---

మహాభూతములనబడు గాలికి, స్వల్ప భూతములనబడు గాలికి ఏమీ వ్యత్యాసములేదు. మహా భూతమేదో స్వల్ప భూతము కూడ అదియేనని చెప్పవచ్చును. స్వల్పభూతము మహా భూతము రెండు ఒకటే అయినపుడు స్వల్ప, మహా అను వ్యత్యాసమును చూపుతూ స్వల్పభూతములని, మహాభూతములని పేర్లు ఎందుకు పెట్టారు? భూతములు రెండు రకములని ఎందుకు చెప్పారని ఎవరైన అడుగవచ్చును. దానికి మా సమధానము ఏమనగా!


విశ్వము రెండు భాగములుగా ఉన్నది. ఒకటి ప్రపంచము, రెండు జగతి. ప్రపంచము, జగతి అను రెండిటిని కలిపి చెప్పితే ‘విశ్వము' అని చెప్పవచ్చును. విశ్వమును ఇంకా వివరముగా చెప్పుకొంటే, విశ్వములోని మొదటి భాగము ప్రపంచము, రెండవ భాగము జగతి. “ప్ర” అనగా గొప్ప లేక ముఖ్యమైన అనియు "పంచము” అనగా ఐదు అనియు చెప్పవచ్చును. గొప్పవైన ఐదింటిని ప్రపంచము అంటున్నాము. ఆ ఐదు ఏవి అనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని తెలియుచున్నది. ఈ ఐదు స్వయముగా పరమాత్మ సంకల్ప బలము చేత నిర్మింపబడినవి. అందువలన ఈ ఐదుకు పరిమితిలేని అమితబలముండును. ఈ ఐదు, అన్ని జీవరాసులకంటే బలమైనవి, గొప్పవి కావున వీటిని మహాభూతములు అని అంటున్నాము. ఈ ఐదు (పంచము) కలిసి కనిపించునదే ప్రపంచము. శరీరమున్న జీవరాసులు, ప్రపంచము పుట్టిన తర్వాత పుట్టినవి. జీవరాసులు శరీరములను ధరించి పుట్టుచున్నవి మరియు మరణించుచున్నవి. పుట్టుకను “జననము” అనియు, మరణించుటను “గతించుట” అనియు చెప్పవచ్చును. పుట్టుట, చచ్చుట కలిగిన జీవసముదాయమునకు జనించుట, గతించుట ఉన్నదానివలన “జగతి” పేరుపెట్టి చెప్పుచున్నాము. జీవ సముదాయ శరీరములున్న దానిని జగతి అనియు, పంచభూత సముదాయమును ప్రపంచము అనియు ప్రపంచమును, జగతిని రెండిటిని కలిపి విశ్వము అనియు చెప్పవచ్చును. పంచభూతములను ప్రపంచము అనినా, ప్రపంచమును పంచభూతములు అనినా రెండూ ఒకటే. ఇంతవరకు భూతములలో ఒక రకమైన మహాభూతములను గురించి తెలుసుకొన్నాము. ఇక స్వల్పభూతములను గురించి తెలుసుకొందాము.


స్వల్ప, మహా అను పేరు తప్ప భూతములు అన్నీ ఒకటేనని చెప్పుకొన్నాము. అలాంటపుడు స్వల్ప అని పేరు ఎందుకు పెట్టామనగా! మహాభూతములలో అన్నీ అఖండముగా ఉన్నవి. కానీ సకల జీవరాసులు శరీరములలో స్వల్పభూతములు ఖండ ఖండములుగా ఉన్నవి. ఒక జీవుని శరీరములో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అన్ని కొద్దికొద్దిగా ఉన్నవి. అనేక జీవరాసులు శరీరములలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనేక భాగములుగా విభజింపబడి ఉన్నాయి. ఒక శరీరములో పంచ భూతములు ఏ నిష్పత్తిలో ఉన్నాయో వివరించుకొని చూస్తే, ఆకాశము ఒక్కశాతము, గాలి రెండు శాతము, అగ్ని మూడు శాతము, నీరు అరవై తొమ్మిది శాతము, భూమి ఇరవైఐదుశాతము గలవు. ఆకాశము 1, గాలి 2, అగ్ని 3, నీరు 69, భూమి 25 పాళ్ళు శరీరములో గలవని తెలియుచున్నది. ఈ విధముగా శరీరములో పరిమిత భాగములుగా, పరిమిత శక్తికల్గియున్న ఐదు భూతములను పంచ స్వల్పభూతములని అనుచున్నాము. జగతి మొత్తము జీవుళ్ళ శరీరములలోని పంచభూతములను కలిపితే కొద్దిమాత్రము తేడాతో అనగా ఇంచుమించుగా బయటి మహా భూతములతో సమానముగా ఉన్నవి. వివరముగా చెప్పితే మహా భూతములు బయట 50.1%గా ఉండగా, శరీరములోని స్వల్ప భూతములు 49.9% గా ఉన్నవి. అందువలన ఇంచుమించుగా అని చెప్పుకొన్నాము. ఇంతటితో శరీరములోపల స్వల్ప పంచభూతములు గలవని అందరికీ అర్థమై ఉంటుంది.


ఒక శరీరములోని జీవున్ని కూడ భూతమనియే అనవచ్చును. జీవుడు అనబడు భూతము పంచభూతములను ఆశ్రయించుకొని శరీరములో మనగలుగుచున్నాడు. దీనినిబట్టి ఒక సజీవ శరీరములో మొత్తము ఆరు భూతములున్నవని


---

చెప్పవచ్చును. ఒకటి శరీరములో జీవించు జీవుడు కాగా, మిగత ఐదు భూతములు శరీరముగా నిర్మాణమై ఉన్నవి. శరీరములో జీవునితోపాటు ఆత్మకూడ నివాసము చేయుచున్నది. జీవుని అంటిపెట్టుకొని ఉండునది ఆత్మ. ఆత్మ లేకుండ జీవాత్మ ఎక్కడగానీ, ఎప్పుడుగానీ ఉండుట అసంభవము. ఆత్మ జీవునికి అధిపతిగా శరీరములో ఉన్నది. ఆత్మ ఒక్క జీవునికే అధిపతికాక శరీరములోనున్న ఐదు స్వల్ప భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి కూడ అధిపతిగా ఉన్నది. అనగా శరీరమంతటికి కూడ అధిపతిగా ఉన్నదని చెప్పవచ్చును. శరీరరూపములోనున్న ఐదు స్వల్పభూతములు ఆత్మ ఆధీనములో ఉంటూ ఆత్మ ఆదేశించినట్లు నడుచుకొనును. అంతేకాక గొప్ప యోగీశ్వరులైన వారు తమను ఆదేశించితే, వారు ఆత్మతో సమానమైన వారుగ గుర్తించి వారిమాటను శిరసా ఆచరిస్తాయి. యోగీశ్వరుల మాటలను శరీరములోపలి స్వల్ప భూతములు మాత్రమే ఆలకించి ఆచరించును. కానీ బయటి మహాభూతములు మాత్రము ఏ యోగీశ్వరుని మాటను లెక్కించవు. శరీరము బయటనున్న ఐదు మహాభూతములు, ఒక్క పరమాత్మ ఆధీనములో మాత్రముండును. అందువలన పరమాత్మ మాటను తప్ప ఇతరుల మాటలను ఏమాత్రము ఆలకించవు. స్వల్పభూతములు, మహాభూతములు రెండు ఒకటే అయినా స్వల్పభూతములు శరీరములోపల, మహాభూతములు శరీరము బయట గలవు. స్వల్పభూతములు ఆత్మ ఆధీనములో ఉండగా, మహాభూతములు పరమాత్మ ఆధీనములో గలవు. స్వల్పభూతములు ఆత్మమాట వినును, మహాభూతములు ఆత్మమాట వినవు. స్వల్పభూతములు యోగీశ్వరుల మాటలకు గౌరవమిచ్చును, మహాభూతములు పరమాత్మను తప్ప ఎవరినీ గౌరవించవు. శరీరములోపలనున్న జీవున్ని దయ్యము అనినట్లు, స్వల్ప భూతములను అట్లు దయ్యములతో జమకట్టకూడదు. స్వల్ప భూతముల శక్తి పరిమితము, మహాభూతముల శక్తి అపరిమితము. ఈ విధముగా చెప్పుతూ పోతే స్వల్ప, మహాభూతములకు ఎన్నో తేడాలు గలవు.


శరీరములో నివశించుట వలన జీవున్ని కూడ భూతము అని చెప్పవచ్చును. బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో జీవున్ని భూతము అని ఉచ్చరించారు. జీవున్ని మినహా భూతములను రెండు రకములుగా చెప్పవచ్చును. ఒకటి మహాభూతములు, రెండు స్వల్పభూతములని చెప్పవచ్చును. దయ్యములను గురించి చెప్పిన వెనుక పేజీలలో లక్ష్మణ మూర్తిని గురించి చెప్పినపుడు రోగరూపములోనున్న గాలి, నీరు శరీరములో నుండి మాట్లాడినట్లు చెప్పాము. అప్పుడు మాట్లాడినది ఆ శరీరములోని స్వల్పభూతములని గుర్తించుకోవాలి. యోగుల మాటలకు గౌరవమిచ్చును అనినట్లు, ఆ దినము స్వల్పభూతములైన గాలి, నీరు మా మాట వినడము జరిగినది. స్వల్పభూతములకు సంబంధించిన మరొక యదార్థసంఘటను వివరించి, తర్వాత మహాభూతములను గురించి వివరిస్తాము. మనుషులు చేసుకొన్న పాపములను అమలు చేయుటకు ప్రకృతి మహాభూతములుగా, స్వల్పభూతములుగా ఏర్పడినది. సామూహికముగా మనుషులనుగానీ, ఇతర జీవరాసులనుగానీ బాధించుటకుగానీ, చంపుటకుగానీ మహా భూతములు విజృంభించుచున్నవి. ఒక మనిషి పాపమును అనుభవింప జేయుటకుగానీ, అతనిని శరీరములోనే కృంగదీయుటకు గానీ, చంపుటకు గానీ స్వల్పభూతములు శరీరములోనే చెలరేగుచున్నవి. సాముహికముగా మనుషుల పాపములను అమలు చేయుటకు మహాభూతములైన భూమి చెలరేగి, భూకంపములను సృష్టించి ఎందరినో చంపడము, గాయపరచడము, అంగహీనులను చేయడము జరుగుచున్నది. నీరు చెలరేగితే తుఫానులు, సునామీలను తెచ్చిపెట్టి భయంకరముగా బాధపెట్టడము, చంపడము చేయుచున్నది, అగ్ని అనుకుంటే అగ్ని పర్వతాలను ప్రేలిపోవునట్లు చేసి, సూర్యరశ్మిలో వేడిని పెంచి మనుషులు తట్టుకోలేనంత చేసి, మనుషులను సామూహికముగా చంపడము, బాధపెట్టడము చేయుచున్నది. గాలి అనుకుంటే తన బలమైన గాలిని వేగముగా వీచునట్లు చేసి, దేనినైన కూల్చగలదు, గాలిలో ఎగిరి పోవునట్లు చేయగలదు. ఆకాశము కోపగిస్తే


--

వాతావరణములో ఎన్నో మార్పులు రాగలవు, వాతవరణము స్థంభించి పోగలదు. పైనున్న శాటిలైట్స్, ఖగోళలములోనున్న గోళములన్నియు నిలిచిపోగలవు. ఒక్కొక్క మహా భూతము, తన అపారమైన శక్తితో, ఒక్క సమయములోనే వందలు, వేలు,లక్షలు, కోట్లమందిని చంపగలదు.


ఇపుడు ప్రస్తుతము స్వల్పభూతముల విషయానికి వస్తాము. ఒక మనిషిలోని పాపమును వాడు మాత్రము అనుభవించునట్లు చేయునవి స్వల్పభూతములు. మనిషిలో వచ్చు రోగములు, రుగ్మతలు మొదలగునవి అన్నియు స్వల్పభూతముల వలన కలుగునవేనని చెప్పవచ్చును. స్వల్ప భూతముల అవగాహనకొరకు, అవి యోగుల మాటకు ఎట్లు గౌరవమును ఇచ్చుచున్నవో తెలియుట కొరకు, ఒక యదార్థవిషయమును చెప్పుకొందాము. నావద్దకు వచ్చి, దేవుని జ్ఞానమును తెలుసుకొను వారిలో ఒక ముస్లీమ్ కుటుంబము కూడ కలదు. నేను తెలుపు మతాలకు అతీతమైన జ్ఞానమును తెలుసుకొని, జ్ఞానము మీద కుటుంబములోని వారు మొత్తము ఆసక్తి కలిగియున్నారు. భర్త డ్యూటీలో బెంగుళూరులో ఉండగ, భార్య రంజాన్భీ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉండేది. సైదా భార్య రంజానీకి ఉన్నట్టుండి జబ్బు చేసింది. ఆమె ప్రవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకొంది. కొద్దిగ కూడ నయముకాకపోగా ఆ రోగము ఇంకాకొంత తీవ్రమైంది. ఇక్కడ మిర్యాలగూడలో రంజాన్భీ తన స్థితి ప్రమాదస్థితికి వచ్చినదని భర్తకు చెప్పగా, భర్త సైదా బెంగుళూరునుండి ఆందోళనగా నాకు దగ్గరగానున్న వారికి ఫోన్చేసి తన భార్య పరిస్థితి బాగాలేదు, నేను దూరముగా ఉన్నాను. స్వామివారికి నాభార్యస్థితి బాగలేదని ఒకమారు చెప్పండని చెప్పాడు. అతను సాయంకాలము నాలుగుగంటలకు శ్రీనివాసులు అనే వ్యక్తికి చెప్పగా, అతను ఆరుగంటలకు సైదా భార్య విషయము చెప్పాడు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ విషయము నాకు తెలిసిన తర్వాత కొంత యోచించాను. సైదా కుటుంబము జ్ఞానము తెలుసుకుంటున్నది మరియు వారు బీదవారు రోగమునకు ఎంతడబ్బైనా ఖర్చు పెట్టు స్థోమతలేనివారు, పైగా రోగము తీవ్రస్థాయిగా ఉందనడము, ఇవన్నిటిని చూచి వారికి కొంతమంచి చేయాలనుకొని, నాకు విషయమును చెప్పిన శ్రీనివాసులుకు "నేను మిర్యాలగూడకు ఇప్పుడే పోయి రంజాన్ఫీని చూచివస్తాను” అని చెప్పి ఆరున్నరకు బయలుదేరాను. శ్రీనివాసులు రంజాన్ఫీకి నేను బయలుదేరిన విషయమును చెప్పాడు. శ్రీనివాసులు ద్వారా నేను వస్తున్నానను విషయమును రంజానీకి తెలిసిన వెంటనే ఒక్క నిమిషములోనే ఆమె శరీరములోని జబ్బు ఏమాత్రము లేకుండ పోయింది. అంతవరకు బెడ్మీద లేవలేకున్న ఆమె వెంటనే లేచికూర్చొని కాళ్ళు, ముఖము శుభ్రము చేసుకొని ఫ్రెష్ గా తయారైపోయి, ప్రక్క బెడ్ లో నున్న వారందరికి మా గురువుగారు వస్తున్నారని చెప్పింది. అంతవరకు అనారోగ్యముతోనున్న ఆమె ఒక్కసారిగా లేచి ఆరోగ్యముగా తిరగడము అక్కడున్న వారందరికి ఆశ్చర్యమైనది.


నేను, నావెంట ఇంకా ముగ్గురు మనుషులు బయలుదేరి రాత్రి తొమ్మిదిగంటలకు మిర్యాలగూడ చేరుకొన్నాము. మేము అసుపత్రికి పోయి రంజాన్ఫీని చూస్తే ఆమెకు ఏ రోగములేనట్లు కనిపించింది. ఆమెకు రోగము బాగైనట్లు మాకు తెలియదు. అందువలన “నీ రోగము ఏమైంది” అని అడిగాము. దానికి ఆమె “మీరు ఇక్కడికి బయలుదేరారని శీనా అన్న చెప్పిన వెంటనే, నాలో అంతవరకు ఉన్న రోగము లేకుండపోయింది. ఒక్కసారిగా బాగైపోయింది”. అని చెప్పింది. ఆమె మాటలు విని మాకు ఆశ్చర్యమైనది. ప్రక్కన మంచముల మీదవున్న పేషెంట్లు కూడ “ఆమె ఒక్కమారుగ లేచి కూర్చొని రోగము బాధలేకుండ పోయిందని, మీరు వస్తున్నారని కూడ చెప్పింది” అని చెప్పడము జరిగినది. తర్వాత మేము ఆమెను పరామర్శించి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వచ్చాము. ఆమెకు రోగము ఎందుకు ఉన్నట్లుండి బాగైనది, అని యోచించాము. అప్పుడు మా యోచనకు అందిన వివరము ఏమనగా! ఆమెకు


--


శ్వాససంబంధమైన రోగము మరియు ఇతర రోగము రెండూ గాలివలన ఏర్పడిన రోగములు. గాలి ఆమె శరీరములో స్వల్పభూతములలో ఒకటి. ఆ స్వల్పభూతము నేను వస్తున్నానని వింటూనే నాకు గౌరవము నిచ్చునదై వెంటనే తన వలన కలిగిన రోగమును ఉపసంహరించుకొన్నది. వారు బీదవారు కావున వారికి రోగము నయము చేయాలను ఉద్దేశముతో నేను బయలుదేరగానే, ఆ ఉద్దేశమును గ్రహించిన గాలి దైవజ్ఞానమునకు యోగమునకు మర్యాద నిచ్చునదై, నేను బయలుదేరిన ఐదునిమిషములకే ఆమెకు రోగము లేకుండ పోవడము జరిగినది. ఈ విధముగ స్వల్పభూతములు శరీరములో పాపమును పాలించునవై ఉంటూ అవసరమైనపుడు యోగుల మాటలను గౌరవించినట్లు ఎన్నో చోట్ల చరిత్రలో కూడ గలదు. జరిగిన చరిత్రను తిరగవేసి చూస్తే ఎన్నో సందర్భములలో యోగులైన వారు చెప్పిన మాటకు, తాకిన స్పర్శకు, చూచిన చూపుకు రోగములు పోయినట్లు తెలియుచున్నది. స్వల్పభూతములు జీవుని పాపమునే కాకుండ, పుణ్యమును కూడ శరీరములో పాలించుచున్నవి. అందువలన పుణ్యము చేసుకొన్న శరీరములో కొందరికి ఎనభైసంవత్సరముల వయస్సులో కూడ 'ప్యాంక్రియాస్' గ్రంథి బాగ పనిచేస్తూ సుగర్ జాడ్యము అతనికి రాకుండ చేస్తుంది. అలాగే పాపము చేసుకొన్న వారికి ముప్పైసంవత్సరముల వయస్సులో గ్రంథి పని చేయకుండపోయి సుగర్ జాడ్యము వస్తుంది. శరీరములో భాగములన్ని బాగా పని చేయుటకుగానీ, చేయకుండ పోవుటకుగానీ స్వల్పభూతములే కారణము. స్వల్పభూతములు పనిచేయునవై ఉండగా వాటికి ఉత్తర్వు ఇచ్చి పని చేయునట్లు చెప్పువాడు శరీరములోని ఆత్మ. శరీరములోని ఆత్మ శరీరములోని స్వల్పభూతములకు అధిపతియై ఉన్నప్పటికి, తన ఇష్టాను సారము ఉ త్తరువులు జారీచేయదు. ఆ శరీరములో నివశించుచున్న జీవుడు గతములో చేసుకొన్న పాపమునుబట్టి, ఎట్లు నడుచుకోవలసినది ఆత్మ ఆజ్ఞాపిస్తే దానికి అనుగుణముగా స్వల్పభూతములు నడుచుకొనును. ఒక శరీరములోని స్వల్పభూతములకు శరీరమంతావున్న ఆత్మ అధిపతికాగా, ఆత్మకు విశ్వమంతావున్న పరమాత్మ అధిపతిగా ఉన్నాడని తెలియాలి. ఈ విధముగా స్వల్పభూతములు ఆత్మను అనుసరించి, ఆత్మ కర్మననుసరించి శరీరములో పని చేయుచుండును. విశ్వము అంతా నిండియున్న పరమాత్మ ఆధీనములోని మహాభూతములు, శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ ఆధీనములోని స్వల్పభూతములు, దైవనిర్మితమైన కర్మ అను చట్టమును అమలు చేయుచున్నవి.


దేశముంటే దానికి ఒక ప్రభువు, ప్రభుత్వము ఉండును. ప్రభుత్వము నకు ఒక చట్టముండును, చట్టమును అమలు చేయువారుందురు. దానినే “లా అండ్ ఆర్డర్" అని కూడ అనుచుందురు. చట్టము ఏదైనా అది దేశమునకు అధిపతియైన ప్రభువుచేతిలో ఉండును. అతను పనిచేయడు, అతని క్రింద పరిపాలన కొన్ని శాఖలరూపములో ఉండును. ఎంత తప్పు చేసినవానికైన చివరికి చట్టము ప్రకారము ఉరిశిక్ష పడిన వానికైన క్షమించి వేయు అధికారము ప్రభువుకు (రాష్ట్రపతికి) ఉన్నది. అలాగే దేహము అను ఒక దేశమునకు అధిపతి పరమాత్మ, అతని ఆధీనములోనే శరీర పరిపాలనంతా జరుగుచుండును. కర్మ అను చట్టము ప్రకారము ఆత్మ అను జడ్జి నిర్ణయించిన శిక్షలను స్వల్పభూతములను భటులు అమలు చేయుదురు. చట్టప్రకారము నేరముచేసి ఉరిశిక్షపడిన వానినైన తన ఇష్ట ప్రకారము శిక్షను రద్దుచేసి విడుదల చేయగల అధికారము పరిపాలనాధి పతియైన ప్రభువుకు ఉన్నట్లు, ఎంతపాపాత్ముడైన ఏ బాధ అనుభవించ కుండ, ఏ శిక్ష అమలుకాకుండ, తనకు ఇష్టమైతే శిక్షను రద్దుచేసి విడుదల చేయువాడు (ముక్తికి పంపువాడు) దేవుడు అని తెలియవలెను. ఎంతటి పాపాత్ముడైన దైవమును గుర్తించి, ఆరాధించుట వలన ఒకే జన్మలో ముక్తి పొందవచ్చును. ఇదేమాటను భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగమున, శ్లో॥ 30,31 "అపిచేత్సు దురాచారో భజతే మా మనన్యభాక్, సాధురేవస మన్తవ్య స్సమ్యగ్వ్యవసితోహిసః, క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి.” ఎంతటి దుర్మార్గుడైనా వాడు నన్ను ఆరాధించుట వలన మరియు నేను దైవమునని నిశ్చయము కలిగియుండుట వలన


---

వానిని సాధువని (మంచి వాడని) నేను లెక్కింతును. అటువంటివాడు ధర్మాత్ముడు కావున వానికి తొందరగా, శాశ్వితశాంతియైన మోక్షము లభించును” అని కలదు. వేమనయోగి వ్రాసిన ఒక పద్యములో “పతిమెచ్చిన సతిమెచ్చును” అను పద్యములో కూడ దేవుడు మెచ్చితే వానికి కర్మచట్టము వర్తింపకుండ ముక్తి పొందునని చెప్పాడు. ఈ విధముగా పరిశీలించి చూచితే రాష్ట్రపతి ఉరిశిక్షను రద్దుచేసినట్లు, దైవము జన్మనే రద్దుచేసి ముక్తికి పంపగలదు.


అపరిమితమైన, ఎవరూ అంచన వేయలేని శక్తికల్గియున్న మహా భూతములకు అధినాయకుడైన దైవము అనుకుంటే ఎంతటి పాపమునైన క్షమించి ముక్తి నివ్వగలడు. ఒకవేళ పెద్దభూతములకే పెద్దవాడైన దైవమును చిన్న భూతములకంటే చిన్నవాడైన మనిషి, దైవమును లెక్కచేయకుండ దూషించినా లేక దూషణ భావముకల్గియున్నా అటువంటి వానికి గొప్ప పాపము అంటుకొని రెండుయుగముల కాలము అనుభవించవలసి యుండును. దైవమును ఇష్టపడి ఆరాధిస్తే దుర్మార్గుడైనా ముక్తి పొందవచ్చును, అయిష్టపడి దూషిస్తే, సన్మార్గుడైనా రెండు యుగములు నరకము అనుభ వించును. ఒకయుగము కొన్ని లక్షల సంవత్సరములుండగా అటువంటివి రెండు యుగముల నరకము అనుభవించాలంటే, ఎంతటి దుస్థితో యోచిస్తే భయంకరముగా ఉండును. అటువంటి నరకమును పొందవలెనని, మానవుడు తెలియక దైవమును దూషిస్తున్నాడు. మతముల భ్రమలోపడి చాలామంది దైవమును దూషిస్తున్నారు. మనిషి మతాల మత్తులో పడిపోయి, తనకు తెలిసినవాడే దేవుడనీ, ఇంకెవరు దేవుడుకానేకాదని, పంచమహా భూతములకు అధిపతియైన దేవున్ని తెలియలేక, ఆయన పరిపాలనను గుర్తించలేక, మహాభూతములు బయట దేశములో, స్వల్ప భూతములు లోపల దేహములో స్వర్గ, నరకములను కలుగజేస్తున్నవని అర్థము చేసుకోలేక, మనము ప్రతిదినము అనుభవించేవి పాపపుణ్య ఫలితములైన సుఖదుఃఖము లని గ్రహించలేక, ఎక్కడో స్వర్గ, నరకములు ఉన్నాయను భ్రమలో మునిగి పోయాడు. కొన్ని మతములవారు, దేవుని విషయములో పొరపడిపోయారు. కళ్ళ ఎదుట కనిపించు స్వర్గ, నరకములనే గుర్తించలేని గ్రుడ్డివారు, కళ్ళకు కనిపించని దైవమును గుర్తించగలరా? గుర్తించలేక, తమకు తెలిసిందే జ్ఞానమని, తాము విశ్వసించినవాడే దేవుడని, తామున్నదే నిజమైన మతమని అనుకొను మత విశ్వాసులు దేవున్ని ఎప్పటికీ తెలియలేరు. దేవుడు మతాతీతుడు అని తెలియనిదే, ఆయనే ప్రజలకు ప్రభువని (రాజని), ప్రభువు ఆధీనములోనున్నదే పంచభూతముల పరిపాలనా ప్రభుత్వమని తెలియనిదే, అసలైన పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మను గుర్తించలేరు. అందువలన అసలైన దేవున్ని తెలియాలంటే ముందు ఆయన ప్రభుత్వమును గురించి తెలుసుకోవాలి. ప్రత్యక్షముగా అందరికి తెలియునట్లు జరుగుచున్న విధానమును యోచించి చూస్తే దేవుడు సృష్టించిన సృష్ఠి మన ముందరే ఉండగా, దానినే ఆధారము చేసుకొని చూస్తే, దానిని సృష్టించిన సృష్టికర్త తెలియునని ఆలోచించక, మతములు చెప్పిన మార్గములో పోతే మాయే కనిపిస్తుంది, కానీ దేవుడు తెలియడు.


ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చూస్తాము. ఒక ఇంటిలో దొంగతనము జరిగింది. ఆ ఇంటిలోనికి ప్రవేశించిన దొంగ, తనెవరో ఇతరులకు తెలియకుండ దొంగతనము చేసిపోయాడు. ఆ ఇంటిలో పోయింది ఎంతైన, ఏమైనా దొంగను కనిపెట్టవలసిన బాధ్యత పోలీస్ వారిది. దొంగతనము చేసిన దొంగ, ఏ పోలీస్లు తనను గుర్తించలేరను ధైర్యముతో పోలీస్లకు సవాల్ ఒక లేఖను వదలిపోయాడు. మీరు నన్ను గుర్తించ గలిగితే, మీరు ఉద్యోగము చేయకుండినా ప్రతినెల జీతము నేనే ఇస్తాను. ఏ పనిపాట లేకుండ నేను ఉచితముగా ఇచ్చు జీతముతో మీరు హాయిగా ఉండవచ్చునని, తనను గుర్తించితే కలిగే లాభమును కూడా చెప్పాడు. ఆ దొంగ అలా చెప్పడమేకాక, తనను గుర్తించుటకు అవసరమైన తన చేతి వ్రాతను వదలిపోయాడు. ఆ దొంగతనమును ఎలాగైనా ఛేదించాలనుకొన్న పోలీస్లు


---

ఆ దొంగతనమును పరిశోధించుటకు కొన్ని గుంపులుగా చీలిపోయి ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క కోణమునుండి ఇన్వెస్టిగేషన్ (పరిశోధన) ప్రారంభించారు. ఒక గ్రూపు అంతకంటే ముందు జరిగిన దొంగతనము చేసిన వారిని విచారింపసాగారు. ఒక గ్రూపు వేలిముద్రలు తీసుకొని పరిశోధన ప్రారంభించింది. ఒక గుంపువారు దొంగకు సంబంధించిన 'క్లూ’ దొరుకుతుందేమోనని దొంగతనము జరిగిన ఇంటిలో వెదికారు. ఈ విధముగ ఒక్కొక్క కోణములో ఒక్కొక్కరు వెదకను మొదలుపెట్టారు. చాలా కష్టపడి చాలా తొందరగా దొంగను పట్టుకోవాలనుకొన్నారు. అంతగా వారు శ్రమించుటకు ముఖ్యకారణము, దొంగతనము జరిగిన ఇల్లు హెూమ్ మినిస్టర్గారిది. పోలీస్వరు ఎంత వెదికినా దొంగ దొరికేటట్లు లేడని ఒక గుంపు పోలీస్లు నిర్ధారించుకొన్నారు. ఇంకా మూడు గుంపుల పోలీసులు వెదికి ఒక్కొక్క గుంపువారు ఒక్కొక్కని పట్టుకొని వచ్చి ఇతనే దొంగ అన్నారు. మూడు గ్రూపులవారు ముగ్గురు పాతనేరస్థులైన పాత దొంగలనే పట్టుకొనివచ్చారు. మూడు గ్రూపులలో ఒక గ్రూప్ పోలీస్లు నేనే అసలైన దొంగను తీసుకువచ్చానని అనగా, మిగత పోలీస్పార్టి లేదు మేము తెచ్చినవాడే నిజముగా దొంగతనమును చేశాడు అని చెప్పారు. అలా అందరూ మేము తెచ్చినవాడే నిజమైనదొంగ అనగా, ఒక గ్రూపువారు మాత్రము మాకు దొరకని దొంగ మీకెట్లు దొరుకుతాడు. వీరంతా పాత దొంగలు కానీ వీరిలో అసలైన దొంగలేడు అన్నారట.


చివరకు పోలీస్ ఉన్నతాధికారులు విచారణలో మూడు గ్రూప్ వారు తెచ్చిన దొంగలలో నిజమైన దొంగలేడని తేలిపోయినది. పోలీస్ లు వీరే దొంగలు అని తెచ్చినా, అలా దొంగలుగా చూపబడిన ఏ ఒక్కరూ ఆ ఇంటిలో దొంగతనము చేయలేదని తెలిసినది. చివరికి ఎవరినీ పట్టుకొని రాని వారిని పిలిచి మీకు దొంగ ఎందుకు దొరకలేదని అడిగారు. అప్పుడు ఆ గ్రూప్ ఇన్చార్జి అయిన ఇన్స్పెక్టర్ ఇలా “మేము దొంగను పట్టుకోవాలి అంటే అతను (దొంగ) వ్రాసిన లేఖనే ఆధారముగా తీసుకోవాలి. మేము ఆ లేఖను బాగా గమనిస్తే, అందులో “మీరు నన్ను గుర్తించితే మీరు ఉద్యోగము చేయకున్నా ప్రతినెల జీతము నేనే ఇస్తాను" అని ఉన్నది. అంతేకాక దొంగతనము జరిగిన ఇల్లు స్వయాన హెూమినిస్టర్ గారిది. మేము అన్ని విధాల ఆలోచిస్తే, మేము దొంగను గుర్తించితే, మేము డ్యూటీ చేయకున్నా ప్రతినెల జీతము ఇచ్చు స్థోమత అధికారము ఒక్క హెూమ్ మినిస్టర్ గారికే కలదు. ఒకవేళ వేరే ఎవరైనా ఘరానా దొంగైనా చాలా డబ్బున్నవాడైన మేము ఉద్యోగము చేయకున్నా డబ్బు ఎప్పుడవసర మొస్తే అప్పుడిస్తాడుగానీ, కరెక్టుగ ప్రతినెల ఇవ్వడు కదా! ఎప్పుడు అవసరమొస్తే అప్పుడిస్తానని వ్రాసివుంటే మేము దొంగను వెదికేవారమే, కానీ ప్రతినెల జీతము ఇస్తానని చెప్పడము వలన, పైగా బాగా చదువుకున్న వారు వ్రాసిన లేఖ అయినందువలన, దొంగ ఇచ్చే డబ్బును జీతము అని చెప్పడము వలన, మరియు ప్రతినెల అని నిర్ధిష్టముగా కూడ చెప్పుటవలన, అంతేకాక నన్ను మీరు గుర్తించగలిగితే అని వ్రాశాడంటే, నేను మీకు బాగా తెలుసు అని అర్థమగుచున్నది. ఈ విధముగా అన్ని రకములుగా యోచించి చూచితే మామీద పూర్తి అధికారమున్న హెూమ్మినిస్టర్గారే దొంగ అని చెప్పవచ్చును. వ్రాసిన లేఖ ఆధారముగా లేఖను వ్రాసినవాడు పలానా అని గుర్తించి చెప్పగలుగుచున్నాము కానీ ఆయనను పట్టుకొనే స్థోమత మాకులేదు” అని చెప్పాడు. ఆ విషయమును విన్న పోలీస్ అధికారులు ఆ విషయమును హెూమి మినిస్టర్గారికి తెలుపగా మినిస్టర్, తనమీద నేరారోపణ చేసినవారిని అభినందించి తానే ఆ దొంగతనమును సృష్ఠించినదని (చేసినదని) ఒప్పుకొన్నాడట. ఆ లేఖలో వ్రాసిన ప్రకారము తనను గుర్తించినవారికి ప్రమోషన్ ఇచ్చి పనిలేని పోస్టులో వారిని నియమించి వారికి శ్రమలేకుండా చేశాడట. పోలీస్ వారి సామర్థ్యమును తెలుసుకొనుటకు, వారిలో సామర్థ్యమును పెంచుటకు మినిస్టర్రే తన ఇంటిలోని దొంగతనము తానే చేసి, దానిని చేసిన దొంగ ఎవరో కనిపెట్టమని చెప్పాడు. దొంగతనము తన ఇంటిలో జరిగినట్లు తెలిసిన మంత్రి, తానే లేఖ వ్రాసి, పోలీస్ లకు సవాల్ విసిరినట్లు చేసిన


---

దానివలన కొందరు పోలీస్లు, మొదటినుండి దొంగలుగా పేరుగాంచిన వారిని పట్టుకొని వచ్చారుగానీ, అసలైన దొంగను, ఇటువంటివాడు అని అంచనా కూడ వేయలేకపోయారు. ఒక గుంపువారు మాత్రము దొంగ వ్రాసిన లేఖను పట్టుకొని దొంగను గుర్తించగలిగారు.


పై దొంగతనమును చూస్తే, మనకు కొంత సమాచారము అర్థమగు చున్నది. తెలియవలసిన దొంగ పోలీస్లందరికి పెద్ద అయిన హెూమ్ మినిస్టర్గారు. అట్లే తెలియదగినవాడు మనుషులందరికి పెద్ద అయిన దేవుడు! పోలీస్లు నాలుగు గ్రూపులుగా దొంగకోసము అన్వేషణ చేశాయి. అలాగే నాలుగు మతములవారు దేవునికోసము అన్వేషణ చేశారు. మూడు గ్రూపుల పోలీస్లు ముగ్గురు దొంగలను తెచ్చారు. అట్లే మూడు మతముల వారు ముగ్గురు దేవుళ్ళను చూపుతున్నారు. ముందునుండి పేరు పొందిన దొంగలనే మూడు పోలీస్ గ్రూపులు దొంగగా చూపుతున్నాయి. అలాగే ముందునుండి వీరు దేవుళ్ళు అని పేరుపొందిన వారినే మూడు మతముల వారు దేవునిగా చూపుతున్నారు. ఒక పోలీస్ గ్రూపు మాత్రము పలానావాడు దొంగ అని చూపలేదు. అలాగే కొందరు జ్ఞానులు మాత్రము, పలానావాడు దేవుడని చూపలేదు. అధికారుల విచారణలో పోలీస్వరు తెచ్చిన దొంగలలో అసలు దొంగ లేడని తెలిసింది. అలాగే యోగీశ్వరుల విచారణలో కొన్ని మతములవారు చెప్పుచున్న దేవుళ్ళలో అసలైన దేవుడులేడని తెలిసింది. ఒక గ్రూప్ పరిశోధనాధికారులు, దొంగ చేతితో వ్రాసిన కనిపించే లెటర్ ఆధారముగా కనిపించని దొంగను గుర్తించవచ్చును అన్నారు. అలాగే కొందరు జ్ఞానాన్వేషులు, దేవుడు సృష్టించిన కనిపించే పంచభూతముల ఆధారముతో కనిపించని దేవున్ని గుర్తించవచ్చును అన్నారు. పోలీస్లకు ప్రతినెల జీతము ఇచ్చే అధికారి, పనిచేయకున్నా జీతమివ్వగల స్థోమత ఉన్నవాడు హెూమినిష్టర్. అలాగే ప్రతి జన్మకు జీవితమును ఇచ్చువాడు, పనివున్నా, పనిలేకున్నా జీవితము మాత్రము ఇవ్వగల స్థోమతయున్నవాడు దేవుడు. పోలీస్వరు దొంగను గుర్తించితే, ఉచితముగ జీతము ఇచ్చువాడు దొంగ అయిన హెూమ్మినిష్టరే. అలాగే జ్ఞానులు తెలియదగిన దేవుడు పలానావాడని గుర్తించి చెప్పగలిగితే మోక్షమునిచ్చువాడు దేవుడే. మూడు గ్రూపుల పోలీస్వరు కూడా దొంగ వదలిపోయిన లేఖను పట్టించుకోలేదు. మూడు మతముల వారు ఆధారముగానున్న ప్రకృతిని (పంచభూతములను) చూడలేదు. లేఖ ఆధారముతో ఒక గ్రూప్ పోలీస్ లు అసలైన దొంగను గుర్తించగలిగారు. అలాగే శాస్త్రబద్ద జ్ఞానమును అనుసరించువారు ప్రత్యక్షమైన ప్రకృతిని ఆధారము చేసుకొని అసలైన దేవున్ని గుర్తించగలిగారు. చివరికి దొంగ పోలీస్లకు అధిపతియైన హెూమ్మినిష్టర్ అని తెలిసింది. అలాగే చివరికి దేవుడు అందరికి అధిపతియైన పరమాత్మ అని తెలిసింది.


పై సారాంశమునంతటిని చూస్తే, దొంగ వదలిన లేఖ ఆధారము తోనే దొంగను గుర్తించగలిగినట్లు, దేవుడు మన ముందర ఉంచిన ప్రకృతి ఆధారముతోనే అసలైన దేవున్ని గుర్తించవచ్చును అను విధానము తెలియు చున్నది. కావున దేవునిచే తయారు చేయబడి, వ మన ముందర కనిపిస్తున్న పంచభూతములను (ప్రకృతిని) ఆధారము చేసుకొని దేవున్ని తెలియవచ్చును అని ధైర్యముగా చెప్పవచ్చును. అలా కాకుండ ప్రకృతిని తెలియకుండ పరమాత్మను గుర్తించలేము. అందువలన బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో ప్రకృతిని పంచభూతములుగా విభజించిన జ్ఞానము, ప్రకృతి వలననే సకల శరీరములు తయారైన విషయము, ప్రకృతివలననే అజ్ఞానమునకు మూలమైన గుణములు తయారైన వివరము, ప్రకృతివలననే జీవుల చావుపుట్టుకలు జరుగుచున్నవని తెలుపు సమాచారము కలదు. ప్రకృతియే తన గర్భమును మోయుచున్న భార్య అనియు, సర్వజీవరాసులకు ప్రకృతియే తల్లి అనియు, తండ్రియైన నేను ఏమి చేయలేదనియు, చేయునది అంతయు ప్రకృతియే ననియు ప్రకృతిని గురించి విస్తారముగా చెప్పియున్నారు. దేవున్ని తెలుసు కోవడములో


---

ప్రకృతి (పంచభూతముల) పాత్ర ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నట్లు తెలియుచుండగా, మతానికొక దేవున్ని పెట్టుకొని ప్రకృతిని విస్మరించిన వారు ఎవరైన దేవున్ని తెలియగలరా? అని ప్రశ్నించుచున్నాను. ఏ మతమువాడైనా దేవున్ని పూర్తి విశ్వసించినా, దేవున్ని ప్రార్థనల ద్వారా, పూజల ద్వారా, యజ్ఞముల ద్వార, వేదపఠనముల ద్వారా, దానముల ద్వారా, తపస్సుల ద్వారా తెలియలేరని గీతయందు చెప్పారు. అన్నిటిని మించిన యోగము ద్వారానే దేవున్ని తెలియవచ్చునని అదే గీతయందు చెప్పారు. యోగమును ఆచరించవలెనంటే ప్రకృతి వలన ప్రపంచమెలా ఉన్నది? ప్రకృతి వలన శరీరమెలా తయారైవున్నది? ప్రకృతి వలన తయారైన గుణములు ఎలా పనిచేయుచున్నది? ప్రకృతి దైవమార్గమునకు ఆటంకమైన మాయగా ఎలా పని చేయుచున్నది? తెలిసిన తర్వాతే యోగము ఎవరికైన సాధ్యమగును.


అందువలన ప్రకృతిని గురించి తెలుసుకోవలసిన అవసరమున్నది. ప్రకృతియే పంచమహాభూతములుగా బయట, పంచ స్వల్పభూతములుగా శరీరములోపల గలవు. శరీరములోని స్వల్పభూతములను గురించి కొద్దిగ అవగాహన కొరకు రెండు సంఘటనలు చెప్పుకొన్నాము. వాటిని గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉన్నది. శరీరములో మాయగా పనిచేయు 36 గుణములు కూడ పంచస్వల్ప భూతముల వలననే తయారైనవి. స్వల్ప భూతములను గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉండినా, ప్రస్తుతానికి వాటిని వదలి పంచ మహాభూతములను గురించిన సమాచారమును కొంత తెలుసుకొందాము. దేవుడు సృష్టి ఆదిలో తన సంకల్పముచేత ప్రకృతిని మొదట సృష్ఠించాడు. తర్వాత వెంటనే ఆత్మ, జీవాత్మలను సృష్టించాడు. ఇపుడు మీరు అర్జంటుగా ఒక ప్రశ్న అడుగవచ్చును. రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు అన్నారు కదా! ఇపుడు ఆయనకు ఒక పనిని పెట్టి చూపిస్తున్నారు. ప్రకృతిని సృష్టించెను, తర్వాత ఆత్మ, జీవాత్మలను సృష్టించెను అన్నారు. అలాంటపుడు దేవుడు కూడ సృష్టించే పనిని చేసినట్లే అవుతుంది. దీనినిబట్టి పనిలేనివాడు (క్రియలేనివాడు) దేవుడు అను సూత్రము చెడిపోతుంది కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు అన్నది సూత్రము. సూత్రము అనగా శాస్త్రబద్దమైనదని అర్థము. ఆ మాట శాసనమై ఎల్లప్పుడు చెక్కుచెదరనిదై ఉంటుంది. అలాంటపుడు సూత్రము చెడిపోవడము జరగదు. ఇక్కడ ముఖ్యముగ గమనించవలసినది ఏమనగా! రూప, నామ, క్రియలు లేనివాడు అను సూత్రము ఎప్పుడు చెప్పబడినదని యోచించితే రూపము, పేరు, పని ఉన్న మానవుడు తయారైనప్పటినుండి రూప, నామ, క్రియలు లేనివాడున్నాడని, అప్పటినుంచి ఆ సూత్రము వర్తిస్తుందని తెలియాలి. ఒకనికి రూపమున్నపుడే ఇంకొకనికి రూపములేదని చెప్పవచ్చును. అలాగ ఒకనికి పేరు, పని ఉన్నపుడే ఇంకొకనికి పేరు పని లేదని చెప్పవచ్చును. ఒక రూపమున్నపుడే, రూపము అంటే ఏమిటో మనకు తెలిసినపుడే, రూపమును పోల్చి, రూపము లేనటువంటిది అని చెప్పవచ్చును. అలాగే రూపము, పేరు, పని ఉన్న మనిషి వచ్చిన తర్వాత అతను చేయుచున్న పనినిగానీ, అతనికున్న పేరునుగానీ, రూపమునుగానీ పోల్చి నీకున్న ఇటువంటివి ఏవి లేవు అని తెల్పుచు రూప, నామ, క్రియ రహితుడు అన్నారు. సృష్టికి పూర్వము దేవునికి ఈ మాట వర్తించదు. సృష్ఠి జరిగిన తర్వాత దేవుని సూత్రానుసారము మనవలె ఆకారముగానీ, మనవలె పేరుగానీ, మనవలె (జీవరాసులమాదిరి పనికాని ఏదిలేదు. సృష్టి జరిగిన తర్వాత అన్ని కార్యములను ప్రకృతియే చేయునట్లు, ఒక చట్టము నిర్ణయించి పెట్టాడు. ఆ చట్టము ప్రకారము రూప, నామ, క్రియలున్న ప్రకృతి అన్ని పనులను తానే చేయుచున్నది. మనుషులను పుట్టించడము, బ్రతుకు సాగించడము, మరణించడము అన్నిటినీ ప్రకృతియే చేయుచున్నది. ఈ విశ్వములో ఏది జరిగినా ప్రకృతివలననే జరుగుచున్నది. విశ్వమంతా నిండియున్న పరమాత్మ సాక్షిభూతుడై ఉన్నాడు తప్ప కార్యభూతుడై లేడు. ఇది బ్రహ్మవిద్యాశాస్త్రములోని ముఖ్యమైన మాట.


---

రూప, నామ, క్రియలున్న విశ్వము సృష్టించబడకముందు, క్రియలేని వాడు అను వాక్యము దేవునికి వర్తించదు. సృష్ఠిలేనపుడు కూడ దైవము యొక్క సంకల్పముతోనే సృష్ఠి మొదలైనది. అప్పుడు కూడ దైవము కార్యరూపములో దేనిని తయారు చేయలేదు. సంకల్పము కూడ పనితో సమానమే అయినా, సృష్ఠిలేకముందు రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు అనుటకు అప్పుడు ఈ సూత్రము వర్తించదు. సృష్ఠిలేనపుడు నీవు లేవు కావున నీవున్నపుడే సూత్రముగానీ నీవు లేనపుడు (జీవరాసి పుట్టక ముందు) ఈ సూత్రమే ఉండదు. అంతేకాదు, సృష్ఠి లేకముందు దైవమును పరమాత్మ అని అనుటకుగానీ, పురుషోత్తమ అని అనుటకు గానీ, దేవుడు అని అనుటకుగానీ వీలులేదు. ఎందుకనగా ఆత్మేలేనపుడు ఆత్మకంటే పరముగానున్నవాడని అర్థమొచ్చునట్లు, పరమాత్మ అను మాటను చెప్పుటకు వీలులేదు. వేరే పురుషులే లేనపుడు, పురుషులలో ఉత్తమమైనవాడు అని అర్థమొచ్చునట్లు పురుషోత్తమా అనుటకు కూడ వీలులేదు. అలాగే వెదికే జీవుడే లేనపుడు వెదకబడేవాడు ఉండడు. దేవులాడేవాడు లేనపుడు దేవులాడబడేవాడు ఉండడు. అందువలన దేవులాడబడేవాడు అను అర్థమొచ్చు దేవుడు అను ఉచ్చారణే ఉండదు. సృష్ఠి జరిగిన తర్వాత దైవమును గుర్తించుకొనుటకు దేవుడు, పరమాత్మ, పురుషోత్తమ అని చెప్పుచున్నాము గానీ సృష్ఠిలేనపుడు దైవమునకు ఏ గుర్తింపులేదు. కావున అప్పుడు దైవమును దేవుడనిగానీ, పురుషోత్తముడనిగానీ పరమాత్మ అనిగానీ చెప్పుటకు వీలులేదు.


దేవుని సృష్ఠిలో మొదటిది ప్రకృతి, రెండవ సృష్ఠి ఆత్మ, జీవాత్మలు. ప్రకృతి, ఆత్మ, జీవాత్మలను ఒక్క సమయములోనే, సృష్ఠి ఆదియందే తయారు చేసినా, ముందు సృష్టించినది ప్రకృతిని, తర్వాత సృష్టించినది ఆత్మ, జీవాత్మలను. అన్నీ ఒక్కమారుగా తయారైనా వరుసక్రమములో ప్రకృతియే ముందున్నదని తెలియుచున్నది. ప్రకృతి తర్వాత ఆత్మ, జీవాత్మలున్నాయని అందరికి తెలియునట్లు, ప్రస్తుత ప్రపంచములో ఒక విధానము అమలులో గలదు. ఆ విధానము అమలులో ఉండినా, ఇది పలానా గుర్తింపు అని ఎవరూ గుర్తించలేక పోవుచున్నారు. ఏ దానికైనా ప్రశ్నవుంటే జవాబు కొరకు వెదకుతాము. ప్రశ్నలేనపుడు జవాబు ఏదో తెలియదు. నేటి మానవుడు డబ్బు సంపాదన మీదనే తన బుద్ధినంతా ఉపయోగిస్తున్నాడు. అందువలన అతనికి మిగత దేనిమీద ప్రశ్నరావడములేదు. మనిషి తనను గురించిగానీ, తనకంటే ముందున్న ప్రపంచమును గురించిగానీ యోచించడము లేదు. ఎవరూ యోచించకుండినా, ప్రశ్నించకుండినా, వారి తరపున మనమే ప్రశ్నవేసుకొని మనమే జవాబు చెప్పుకొందాము. ఇక్కడ ప్రశ్న మనదే, జవాబు మనదేనని ఇష్టమొచ్చినట్లు చెప్పకూడదు. జవాబు శాస్త్రబద్దముగా ఉండాలి. ఇది దైవజ్ఞానము కావున ప్రతిమాట సూత్రబద్దముగా ఉండాలి, అట్లుకాకపోతే అంతా అబద్దమైపోతుంది.


ఇప్పుడు ఒక ప్రశ్నను ప్రశ్నించుకొందాము. అదేమనగా! దైవము సృష్ఠి ఆదిలో మొదట ప్రకృతినే ఎందుకు సృష్ఠించాలి? ఆత్మ, జీవాత్మలను ఎందుకు ముందు సృష్టించలేదు? వరుస క్రమములో ప్రకృతియే ముందు ఉండవలసిన అవసరమేమిటి? దానికి జవాబు ఏమనగా! ఒక వస్తువు బయటికి తెలియకుండుటకు దానిమీద ఏదైనా కప్పియుంచుతాము. ఉదాహరణకు ఒక ధాన్యము కుప్పను (రాశిని) పెద్దగుడ్డను ఉపయోగించి కప్పి పెట్టాము అనుకొనుము. అప్పుడు చూచేదానికి మొదట బయటవున్న గుడ్డయే కనిపించును. గుడ్డక్రింద ఏమున్నది కప్పిపెట్టినవారికి తప్ప ఎవరికీ తెలియదు. గుడ్డ ఎత్తుగా ఉన్నది కదా? అది అలా ఎత్తుగా ఉండుటకు క్రింద ఆధారముగా ఏదైనా ఉన్నదా? అని యోచించువారు గుడ్డను తొలగించి చూడగలరు. అలా గుడ్డను తొలగించి చూచినవారికి మాత్రమే లోపలనున్న ధాన్యము కనిపించును. గుడ్డఎత్తుగా ఎలా నిలబడగలిగింది? అని ప్రశ్న రానివారికి, దానిని గురించి యోచించని వారికి, పైనున్న గుడ్డమాత్రము తెలియును. లోపల ఒకటున్నదనిగానీ, లోపలనున్నది ఏమిటనిగానీ తెలియదు. అదే


---

విధముగా దైవము, ప్రకృతి అనే గ్రుడ్డక్రింద ఆత్మ, జీవాత్మలను ఉంచాడు. ఆత్మ, జీవాత్మలను ప్రకృతి (మాయ) అను గుడ్డ కప్పియుండుట వలన, బయట అందరికి ప్రకృతియే కనిపించునుగానీ ఆత్మ, జీవాత్మలు ఎవరికీ కనిపించవు. ఎవరైనా నూటికో, కోటికో ఒకడు ప్రకృతి క్రింద ఏముంది? ప్రకృతి దేనిని కప్పియుంది? అని ప్రశ్నించుకొని మొదట ప్రకృతిని గురించి తెలుసుకొని, ఎక్కడ పట్టిలాగితే ప్రకృతి ముసుగు పోతుందో తెలుసుకొని, తర్వాత జ్ఞానమను విధానముతో, మాయ అనబడు ప్రకృతిని తొలగించి చూచితే ఆత్మ, జీవాత్మలు ఎవరో తెలియుదురు. అప్పుడు ఆత్మ జీవాత్మల ద్వారా వారిని దాచియుంచిన పరమాత్మను తెలియవచ్చును. అలా తెలిసినపుడు తెలియబడిన దానికి విలువవుండును. మనిషి వెదకి తెలుసుకొనేదానికి దేవుడు, ప్రకృతిని పైన అడ్డము పెట్టాడు. మొదట జీవాత్మ, ఆత్మల విషయములు తెలియకుండా ఉండుటకు ప్రకృతిని అడ్డముగా మాయరూపములో మనతలయందే ఉంచాడు. అందువలన మనిషియొక్క విధానములన్నిటిలోను మొదటిస్థానము మాయకు లేక ప్రకృతికి దక్కింది.


ఆత్మ, జీవాత్మల విధానమును ప్రకృతిచేత కప్పియుంచి, మొదట ప్రకృతియే తెలియునట్లు చేసిన పరమాత్మ, తనచేత తయారు చేయబడిన ప్రకృతిని (మాయను) మనిషి విధానములన్నిటిలోను మొదటి స్థానములో ఉంచిన పరమాత్మ, కనిపించని కారణమైన తనకు (పరమాత్మకు) కనిపించే కార్యమైన ప్రకృతిని కవచముగా పెట్టుకొన్న పరమాత్మ, తనచేత సృష్ఠింపబడిన ఆత్మ, జీవాత్మలకంటే ముందు సృష్ఠింపబడినది ప్రకృతియని అందరికి తెలియునట్లు, మనుషుల మధ్యలో ప్రకృతికి సంబంధించిన పదమునే మొదట ఉచ్చరించునట్లు అమర్చాడు. పరమాత్మ పుంలింగము, ప్రకృతి స్త్రీలింగము అని ఆధ్యాత్మికవిద్యలో చెప్పబడియున్నది. అందువలన ఎక్కడైన పరమాత్మకు సంబంధించిన పుంలింగముకంటే, ప్రకృతికి సంబంధించిన స్త్రీలింగమునే మొదట చెప్పునట్లు లేక పలుకునట్లు దేవుడు అమర్చాడు. అది ఎలా అనగా! మనము మాట్లాడు భాష ఏదైనా కావచ్చును, అందులో మొదట స్త్రీతత్త్వమైన శబ్దమునే ఉచ్చరించుచున్నాము. ఉదాహరణకు ఆడమగ, స్త్రీపురుషులు, భార్యభర్తలు, ఆలుమగలు, పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణుడు, సీతారాములు, ప్రకృతిపురుషులు అని మాట్లాడుట అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అన్నిచోట్ల ప్రకృతి (ఆడ) విధానమే మొదటగలదు. కానీ ఏ మనిషి కూడా ఇలా ఎందుకున్నది అని యోచించడము లేదు. అలా యోచించగలిగితే దానికి సమాధానము ఆరవశాస్త్రమైన రాజవిద్యాశాస్త్రములోనే దొరుకును. ఎవడైనా ప్రశ్నించుకొని సమాధానముకొరకు అన్వేషణ చేస్తే, దేవుడు సృష్టి ఆదిలో ప్రకృతిని తయారు చేసినట్లు తెలియగలదు. అలా ఎందుకు చేశాడో కూడ తెలియగలదు, అంతేకాక తయారు చేసినవాడు ఎవరో కూడ తెలియగలదు. మొదట కనిపించే ప్రకృతిని ఆధారము చేసుకొని, దానిని తయారుచేసిన, కనబడని వానిని కనుగొనుటయే ముఖ్యమైన పరిశోధన. అలా పరిశోధనలో ముందుకు పోతే తెలియునది ఏమనగా!



రాజు రాజధానిలో ఉండును, రాజుయొక్క పరిపాలన రాజ్యములో ఉండును. రాజధానిలోనున్న రాజును ప్రభువు అంటారు. అతని రాజ్యములోనున్న పరిపాలనను ప్రభుత్వము అంటారు. ప్రభుత్వము ఎంతవరకు విస్తరించివుందో, అంతవరకు ప్రభువు కనిపించకుండ ఉండును. కనిపించని ప్రభువుయొక్క యోచనలు (ఉత్తర్వులు) కనిపించే పరిపాలకుల చేత అమలు చేయించబడును. కనిపించని ప్రభువు లేక రాజు దేవుడైతే రాజ్యములో పనిచేయువారు మరియు చేయుంచు వారు ముఖ్యమైన కనిపించు ఐదుగురు అధికారులు గలరు. రాజ్యములో కనిపిస్తూ తాము పనిచేయుచు, తమ అనుచరులచేత పని చేయిస్తూ, రాజ్యములో పరిపాలన సక్రమముగా సాగులాగున చేయు ఐదుగురిని ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని చెప్పవచ్చును. ఇక్కడొక వింత సమాచారము మేము చెప్పకతప్పదు. అదేమనగా!


--

పరిపాలనకర్త అయిన ప్రభువు పురుషుడే! పరిపాలించబడు ప్రజలు పురుషులే! ఇక మధ్యలో పరిపాలన చేయువారు మాత్రము అందరు స్త్రీలే. వివరముగా చెప్పితే ప్రభువు లేక రాజు దేవుడుకాగ, ప్రజలు జీవులుకాగ, పరిపాలించు ముఖ్య అధికారులు ఐదుగురు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ ఐదుమంది స్త్రీలను కలిపితే ఒకే ప్రకృతి అని చెప్పవచ్చును. ఒకే పురుషుడైన పరమాత్మ, ఆత్మ, జీవాత్మలుగా విభజింప బడినట్లు, ఒకే స్త్రీ అయిన ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిగా విభజింపబడియున్నది. రాజు పురుషుడు, రాజ్యాంగము స్త్రీ. పరమాత్మ రాజ్యములో ప్రకృతి పరిపాలన జరుగుచున్నది. వివరముగా చెప్పితే మగ రాజు క్రింద ఆడపరిపాలన జరుగుచున్నదని అర్థముచేసుకోవాలి.


ఇప్పుడు పరిపాలనా విభాగమునకు వచ్చి చూచి, అక్కడున్న వివరమంతా తెలుసుకొందాము. పరిపాలనలో ప్రధానపాత్ర పోషిస్తున్నది ప్రకృతి. ప్రకృతి ఐదు భాగములుగా విడిపోయి విశ్వమంతా నిండియున్న జగతిలో పాలన సాగిస్తున్నది. భూమిమీదున్న జీవరాసులన్నిటిని కలిపి జగతి అంటున్నాము. జగతిని విడివిడిగా చూస్తే ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క శరీరముండును. జీవుని శరీరములో కూడ ఐదు భాగములుగా ప్రకృతి యున్నది. బయట పంచమహాభూతములుగానున్న ప్రకృతి, శరీరములో పంచ స్వల్ప భూతములుగా ఉన్నది. శరీరము బయట ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిగానున్న ప్రకృతి, శరీరములోపల కూడా ఆ పేర్లతోనే ఉన్నది. శరీరము బయట ఐదు మహాభూతములుగానున్న ప్రకృతి ఐదు భూతముల చేత భూకంపములు, వరదలు, సునామీలు, అగ్ని పర్వత ప్రేళ్ళులు, సుడిగాలుల విజృంభణ మొదలగు భీభత్సములను సృష్టించు చున్నది. శరీరములోపలనున్న ఐదు స్వల్పభూతములుగానున్న ప్రకృతి ఎన్నో రోగములను, తన భాగముల చేత సృష్ఠించుచున్నది. శరీరములో నివశించు జీవుడు, దుఃఖమును పొందాలన్నా లేక సుఖమును పొందాలన్నా పంచభూతములు పనిచేయవలసిందే! శరీరములో శ్వాస గాలి, చంకలో వేడి, నాలుక తేమ, చెవి ఆకాశము, చర్మము మీద మట్టి కనిపిస్తూ పంచ భూతములు తెలియుచున్నా, శరీరములోని ముఖ్య భాగములు ఇరువది నాలుగు (24) పంచభూతముల వలననే తయారైనవి. 24 భాగములు పని చేయుటకు అనుబంధముగ శరీరములోపల మరికొన్ని అవయవములు కూడ తయారైనవి. ఈ విధముగ 24 భాగములు, వాటి అనుబంధ భాగములు అన్నిటినీ కలిపి శరీరము అంటున్నాము.


శరీరము మొత్తము ప్రకృతి భాగముల చేత తయారు చేయబడినది, కావున శరీరమును స్త్రీ లింగమునకు చెందినదిగా చెప్పుకొంటున్నాము. ఆత్మ, జీవాత్మ రెండు పుంలింగమునకు సంబంధించినవి కావున రెండు ఆత్మలను పురుషులుగా చెప్పుకొనుచున్నాము. ప్రకృతియైన పంచ భూతములు భార్యస్థానములో ఉండగా, పరమాత్మ భర్త స్థానములో ఉన్నాడు. జీవుడు అనువాడు ప్రకృతి, పరమాత్మలచేత పుట్టబడినవాడు, కావున జీవునికి ప్రకృతి తల్లి, పురుషోత్తముడైన పరమాత్మ తండ్రి అని భగవద్గీతలో చెప్పబడినది. ఇక ఆత్మ విషయానికి వస్తే ఆత్మ ప్రత్యేకమైనది. ప్రకృతి ఏమాత్రము ఆత్మ తయారగుటకు ఉపయోగపడలేదు. దేవుడు ప్రకృతిని తయారు చేసిన వెంటనే ఆత్మను తయారుచేశాడు. ఆత్మను చేసిన తర్వాత ప్రకృతిని భార్యగా ఉపయోగించుకొని జీవుణ్ణి పుట్టించాడు లేక తయారుచేశాడు. అందువలన ప్రకృతి పరమాత్మలు జీవుళ్ళకు శాశ్వితమైన తల్లి, తండ్రికాగా, ఆత్మ, ప్రకృతికి సోదరుడు అవుతుంది. దైవసృష్ఠిలో మొదట ప్రకృతి పుట్టగా, దానిని అనుసరించి రెండవదిగా పుట్టినది ఆత్మ కావున, ప్రకృతికి ఆత్మ అనుజుడు (తమ్ముడు) అవును. ప్రకృతికి ఆత్మ తమ్ముడుకాగ, జీవుడు కుమారుడౌవును. స్వచ్ఛముగ పరమాత్మచేత ఉద్భవించినవాడు ఆత్మ. ఆత్మ, జీవాత్మకు తోడుగా శరీరము లోని పురుషుడుగా ఉన్నాడు. చైతన్యశక్తిగ శరీరములో ఉండి, శరీరములోని దేవునిగా గుర్తింపుపొందియున్నాడు. పరమాత్మ శక్తికి నమూనాగా దేహములోని ఆత్మ కలదు. బయట ప్రపంచములో


--

పంచమహాభూతములకు పరమాత్మ అధిపతియై ఉన్నట్లు, దేహము లోపల ఆత్మ, పంచ స్వల్ప భూతములకు అధిపతిగా ఉన్నాడు. పంచమహాభూతములు ఒక్క పరమాత్మ మాట మాత్రము వినును. అలాగే శరీరములోని పంచస్వల్పభూతములు ఆత్మమాటను వినును. ఇట్లు ఎన్నో విధముల ఆత్మ ప్రత్యేకతను కల్గియున్నది. అంతేకాక ఎంతటి జ్ఞానిగాని, మొదట ఆత్మను తెలుసుకోవలసిందే. ఆత్మను అధ్యయనము చేయుటనే ఆధ్యాత్మికము అంటాము. ఆత్మను తెలియనివాడు పరమాత్మ జ్ఞానమును తెలియలేడు.


నేటి ప్రపంచములో పెద్దపేరు పొందిన స్వామీజీలకు కూడ ఆత్మ విషయము అణుమాత్రము కూడ తెలియదు. జీవాత్మనే ఆత్మ అనువారు కొందరుండగా, పరమాత్మనే ఆత్మ అనువారు ఎందరో కలరు. ఇంకా కొందరు, మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహమును మొదలగు వాటినన్ని టిని ఆత్మే అంటున్నారు. ఆత్మనే మనస్సు అని అనవచ్చును, అలాగే అని అనవచ్చును అని చెప్పుచున్నారు. మొత్తము మీద ఆత్మ అనగా ఇది అని, ఆత్మయొక్క పాత్ర ఇది అని శాస్త్రీయముగా ఎవరూ చెప్పలేకపోవు చున్నారు. భగవద్గీత శాస్త్రములో ఆత్మను ఉద్దేశించి అక్షరుడు అని భగవంతుడు చెప్పగా, గీతను వ్యాఖ్యానించిన వారందరు అక్షరుణ్ణి జీవునిగా వ్రాసుకొన్నారు. పెద్దస్వామీజీలకు, పీఠాధిపతులకు అక్షరుడంటే ఎవరో తెలియకపోతే, సామాన్య ప్రజానీకానికి ఆత్మ విషయము ఎలా తెలుస్తుంది? ఇంతవరకు ప్రపంచములోని మనుషులలో అగమ్యగోచరముగ ఉన్నది ఆత్మ. ఒక్క హిందూమతములోనే కాదు, ప్రపంచములోని ఏ మతములో కూడ ఆత్మంటే ఎవరో తెలియదు. ఆత్మ అను మాటను అందరు చెప్పు కొంటున్నారు. ఆత్మ అను పదమును అక్కడక్కడ స్వామీజీలు అందరు ఉపయోగించుకొంటున్నారు. అయినా అది ఏదో? ఎలా ఉందో? దాని పనేమిటో? అది ఎలా తయారు చేయబడిందో? ఎప్పుడు తయారు చేయబడిందో? జీవుని ఎడల దానిపాత్ర ఏమిటో? అది శరీరములో ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? గుండెల మీద చేయిపెట్టుకొని ఎవరైనా ధైర్యముగా ఆత్మంటే ఏమిటో చెప్పగలరా? చెప్పలేరు, అందువలననే భగవద్గీతలో ఆత్మను గురించి కొమ్ములు తిరిగిన స్వామీజీలు కూడ తప్పుగా వ్రాశారు. ఆత్మ ఎవరికి తెలియదనుటకు, మేము జ్ఞానులము అని గీతను వ్రాసిన వారందరు ఆత్మను గురించి తప్పుగా వ్రాయడమే నిదర్శనము.


ఇంతమందికి తెలియనిది ఈయనకొక్కనికే తెలుసా? అనియు ఎంత గర్వముతో మాట్లాడుచున్నాడు? అని కొందరు నన్ను గురించి అనుకోవచ్చును. నాకు తెలుసు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలిసింది ఇక్కడ వ్రాశాను, నాలోని ఆత్మ నాచేత వ్రాయిస్తే వ్రాస్తున్నాను. ఈ మాటలన్నీ నేను స్వయముగా అడుగునవికావు. ఆత్మే మిమ్ములను ప్రశ్నించుతావుందని మీరెందుకు అనుకోకూడదు? నాకు తెలుసు, ఎలా చెప్పినా మీరు నన్నే అనుకుంటారు. ఎందుకనగా ఆత్మంటే ఎవరో మీకు తెలియదు కదా! ఎవరికి తెలిసినా, తెలియకున్నా అందరి శరీరములలో జీవాత్మతో పాటు ఆత్మవున్నాడు. ఆత్మ పురుషుడే! పరమాత్మ పురుషుడే!! ఆత్మ ఒక విధముగా పరమాత్మ చేత పుట్టినందుకు, దేవునికి కుమారుడు అగును. మరొక విధముగా ప్రకృతికి తమ్ముడు అయినందుకు దేవునికి బావమరిది అగును. జీవునికి మామ అగును. ఇక ప్రకృతి పరమాత్మ చేత పుట్టినందుకు దేవునికి ఒక విధముగా బిడ్డ అగును. మరొక విధముగ దేవుని బీజము వలన జీవుని శరీరమును తయారు చేసినది మరియు జీవుడు పుట్టుటకు తను సహకరించిన దానివలన దేవునికి భార్యగనున్నది. జీవున్ని దేవునివైపు పోకుండ ప్రకృతి చేయుచున్నది, కావున జీవునికి ప్రకృతి ఒక విధముగా చెడు చేయు మాయగా ఉన్నది. ఆత్మ ఎల్లప్పుడు జీవున్ని వదలకుండ ఉండి దేవునివైపు పోవుటకు అవకాశము కల్పించి మంచి చేయుచున్నది. కావున పొరుగువానిగా, స్నేహితునిగా ఆత్మను చెప్పవచ్చును.


---

ఇప్పుడు చెప్పుకొన్న దానిని బట్టి ప్రకృతి ఆత్మకేమౌతుందో, పరమాత్మకేమౌతుందో, జీవాత్మకేమౌతుందో అర్థమైంది. అలాగే ఆత్మ ప్రకృతికేమౌతుందో, పరమాత్మకేమౌతుందో, జీవాత్మకేమౌతుందో అర్థమైంది. జీవాత్మ ప్రకృతికి ఏమౌతుందో, ఆత్మకు ఏమౌతుందో, పరమాత్మకు ఏమౌతుందో అర్థమైంది. అట్లే పరమాత్మవైపు నుంచి చూస్తే, పరమాత్మ ప్రకృతికి ఏమౌతుందో, ఆత్మకు ఏమౌతుందో, జీవాత్మకు ఏమౌతుందో అర్థమైంది. ముందే కొంత జ్ఞానము తెలిసిన వారికైనా ఈ వావి వరుసలు తొందరగా అర్థముకావు. అందువలన కొంత శ్రద్ధగా యోచనచేసి, చూచిన చెప్పినదంతా సత్యమేనని తెలియును. అర్థము చేసుకొంటే ఇందులో జ్ఞానమే కనిపించును. అర్థముకాకపోతే అజ్ఞానము కనిపించును. దేవునికి వావి వరుసలు లేవు అన్నట్లు అర్థమగును. వావివరుసలు లేనివాడు దేవుడెట్లగునని మాయ ప్రేరేపించగలదు. అందువలన యోచించి నిజము తెలుసు కొమ్మంటున్నాము.

మీకు బాగా అర్థమగుటకు క్రింద పట్టికరూపములో వ్రాయుచున్నాము చూడండి.


add here.



ఇంతవరకు తెలుసుకొన్న విషయములలో ఆత్మ,జీవాత్మ, పరమాత్మల వివరమును, ముగ్గురు పురుషుల విషయమును తెలుసుకోగల్గినాము. ముఖ్యముగా, ముందుగ తెలుసుకో తగిన ప్రకృతియొక్క విషయములనే ఇంకా తెలుసుకోవలసిన అవసరమున్నది. ప్రకృతియొక్క విభజనలో కూడ మహాభూతములు, స్వల్పభూతముల వరకు తెలుసుకోగలిగాము. అయినా ఇంకా తెలుసుకోవలసినది, ముఖ్యముగా మనకు తెలియనిది చాలా ఉన్నది. దానిని గురించి తెలుసుకొనే దానికి ప్రయత్నిస్తే, అంతకు అంతాకాకున్నా, కొంతకు కొంతైనా అర్థముకాగలదు. రాజు పరిపాలనలో మంత్రి వద్దనుండి సిపాయి వరకు ఎందరో భాగస్థులుగా ఉన్నట్లు, దేవుని పరిపాలనలో కూడ ప్రకృతి మొదలుకొని గ్రహముల వరకు ఎందరో భాగస్థులుగా ఉన్నారని తెలియుచున్నది. దేవుని పరిపాలన సృష్టి అంతటా వ్యాపించియున్నది. ప్రతి జీవరాసి శరీరములోని ప్రతి అణువు వరకు వ్యాపించి ఉండుట వలన, దేవుని పాలననుండి ఎవరుగానీ తప్పించుకొను అవకాశముండదు. ప్రతిజీవరాసి శరీరములో స్వల్పభూతములు వ్యాపించి పాలన సాగించుచున్నవి. అట్లే బయట ప్రపంచములో ఆకాశము, గాలిలేని స్థలమంటులేదు. బయట కూడ పంచభూతములకు తెలియకుండ ఎవరూ ఏమి చేయుటకు వీలులేదు. ఇటు శరీరము లోపలగానీ, అటు శరీరము బయటగానీ పంచభూతములకు తెలియకుండ ఎవరూ ఏమీ చేయలేరు.


---

దేవుని పాలన మహాభూతములు, స్వల్పభూతములు అను రెండు భాగముల చేతనే కాకుండ మరియొక విభాగముచేత కూడ చేయబడు చున్నది. దీనినిబట్టి పాలనా విధానము మొత్తము మూడు భాగములుగా ఉన్నదని చెప్పవచ్చును. మూడు భాగములలో రెండు భాగములు మనకు తెలిసిన మహాభూతములు, స్వల్పభూతములుగా ఉన్నవి. మనకు ఇంతవరకు తెలియని విభాగము యొక్క పేరు ఉప భూతములు.

1) మహా భూతములు :సృష్ఠి అంతా ఇవే కలవు. అవి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.

2) స్వల్ప భూతములు :పుట్టిన జీవుల శరీరములలో గలవు. అవి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.

3) ఉప భూతములు :ఖగోళములో ద్వాదశ (పండ్రెడు) గ్రహములు మొదలుకొని భూగోళము వరకు లెక్కలేనన్ని కలవు.




ఉపభూతములు అనునవి మహాభూతములు, స్వల్పభూతములవలె ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమివలె విడివిడిగా కాకుండ, ఐదు భూతములు కలిసి ఏర్పడిన శరీరములతో ఉండును. పంచభూతములతో ఏర్పడిన జీవరాసుల శరీరమువలె కాకుండ వివిధరకముల ఆకారములతో కొన్ని కనిపించునవిగా, కొన్ని కనిపించనవిగా ఉన్నవి. కనిపించువాటిలో ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలగునవి. కనిపించని వాటిని ఫలానా అని చెప్పుటకు వీలులేదు. కనిపించిన వాటిలో కూడ కొన్ని తమకు ఇష్టమొచ్చిన సమయములలో మాత్రము కనిపించి, మిగత సమయములలో కనిపించ కుండ పోవునవి గలవు. అటువంటివాటిలో ఉదాహరణకు మేఘములను చెప్పుకోవచ్చును. మనకు తెలిసిన సప్తగ్రహములు కూడ జీవులే! అందువలన వాటిని గ్రహములు అంటున్నాము. సూర్యచంద్రాది గ్రహములు జీవము గలవి మరియు ప్రాణము కూడగలవని చెప్పవచ్చును. అలాగే మేఘములు, అట్లే ఎన్నో అసంఖ్యాకముగానున్న ఉపభూతములు కూడ జీవముగలవి మరియు ప్రాణముకలవిగా ఉన్నాయి. ఉపభూతములలో మేఘము ఒక భూతముకాగ, రోగము కూడ ఒక భూతముగా ఉన్నది. భూమిమీద ఉప భూతములుగా ఎన్నో మేఘములు, ఎన్నో రోగములు అసంఖ్యాకములుగా ఉండగా, మనము చెప్పలేనివి, పేర్లు తెలియనివి ఎన్నో లేక్కలేనన్ని గలవు. అటువంటి ఉపభూతములు, భూగోళమునుండి ఖగోళము వరకు వ్యాపించి ఉన్నవి. ఉపభూతములు మేఘములు, రోగములు మొదలుకొని, సూర్య చంద్రాది గోళముల వరకు, దేవుని పరిపాలనా విభాగములో పాత్రధారులై ఉన్నవి. ప్రజలు వేరు, ప్రభుత్వము వేరుగా ఉన్నట్లు, జీవరాసులు వేరు పాలనా భూతములు వేరని తెలియుచున్నది.


పాలనా విభాగములోనున్న ప్రతి భూతము కర్మను పాలించునవిగా ఉన్నవి. ఉపభూతములన్నియు నియమిత పనిని మాత్రము చేయుచున్నవి. ఒక ఉద్యోగి తనకు ఏ పని నియమితమై ఉంటే ఆ పనినే చేసినట్లు, ఉప భూతములు చేయుచున్నవి. ఉదాహరణకు బిల్ కలెక్టర్ బిల్లులు మాత్రమే వసూలు చేయును, బస్కండక్టర్ బస్సులో ఎక్కిన ప్రయాణికులకు టికెట్లు ఇచ్చును. అదే విధముగా నవగ్రహములు ఒక విధముగా వారివారి నియమిత పనిని చేయగా, రోగములు, మేఘములు కూడ నియమిత పనినే చేయుచున్నవి. అందువలననే రోగములకు, వాటి వాటి పనిని బట్టి ఒకదానిని మలేరియా రోగము అంటాము, మరొక దానిని మశూచి రోగము అంటాము. బయట మనకు కనిపించే ప్రభుత్వములో బిల్ కలెక్టర్కు, జిల్లాకలెక్టర్కు ఎంత తేడా ఉంటుందో అట్లే కనిపించని దేవుని పాలనలో కూడ మలేరియాకు, మశూచికి ఎంతో కొంత తేడా ఉండును. ఈ విధముగా దేవుని పాలనను విశ్లేషిస్తూ పోతే, ఒక రోగమునకు మరొక రోగమునకు,


--

ఒక మేఘమునకు మరొక మేఘమునకు, ఒక గ్రహమునకు మరొక గ్రహమునకు వాటి నియమిత పనులలో ఎన్నో తేడాలుండును.


మహాభూతములు, స్వల్పభూతములు, ఉపభూతములు అన్నియు జీవరాసుల కర్మలను పాలించునవియే కానీ, జీవులవలె కర్మను అంటించు కొనవు. మూడు రకముల భూతములకు కర్మలు అంటుకొను విధానము లేదు. అన్ని జీవరాసులకు ఉన్నట్లు, మూడు రకముల భూతములకు మనో, బుద్ధి, చిత్త, అహములు లేవు. అందువలన ఒక మేఘము వర్షించి వరదను కల్పించి ఎందరినో దయా దాక్షిణ్యము లేకుండ చిన్నపిల్లలను సహితము చంపివేసినా, ఆ మేఘమునకు అంతమందిని చంపిన పాపము అంటదు. మహాభూతములకుగానీ, స్వల్పభూతములకుగానీ, ఉపభూతములకుగానీ గుణములుండవు. అందువలన పాపము చేసిన వానిని నిర్దాక్షిణ్యముగా చంపివేయుచున్నవి. ఏమాత్రము ప్రేమగానీ, ఏమాత్రము దయగానిలేని రోగము, పాపము అమలుకొచ్చినపుడు మనిషి పాలుత్రాగే ప్రాయములో ఉన్నా, మధ్యవయస్సులో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా హింసించుట మానుకోదు. పాలుత్రాగే ప్రాయములో మశూచి (పెద్దఅమ్మవారు) లేక బొబ్బల రోగమువస్తే, ఒకటిన్నర సంవత్సరము పిల్లవాడు బాధ అనుభవించ లేక ఏడుస్తుంటే, పిల్లవానిని చూచే తల్లిదండ్రులు దేవునికి దయలేదనినా, దేవునికి న్యాయములేదనినా, పిల్లవాడు ఇంతగా బాధపడుచుంటే దేవునికి మ్రొక్కినా, కొంతైనా కరుణ కలుగలేదనినా, పాపమును రోగము అమలు చేసి తీరును. ఒకవేళ పిల్లవాని పాపము ఎక్కువవుంటే రోగము చంపి వేయవలసివచ్చును. మనస్సుగాని, దయగాని లేని రోగము పిల్లవానిని చంపివేస్తే తల్లిదండ్రులకు కోపమువచ్చి దేవున్నే నిందించడము, దేవుడు గ్రుడ్డివాడనడము జరుగుతుంది.


దేవుని ప్రభుత్వ విధానమును, పరిపాలనా విభాగములను తెలియని ప్రజలు తమ కర్మలను గుర్తుచేసుకోకుండ దేవునికి న్యాయము లేదని, దేవునికి దయలేదని నిందించుట జరుగుచున్నది. ఏదైనా చాలా బాధాకరమైన సంఘటన జరిగినా, అల్లారుముద్దుగా ప్రేమగా పెంచుకొన్న పిల్లవాడు చనిపోయినా, అంతవరకు దేవుడున్నాడని కొంత నమ్మకమున్న వారు కూడ ఆ సంఘటనతో దేవుడేలేడను నిర్ధారణకు వస్తారు. కొందరైతే దేవుడు కనపడలేదు కావున సరిపోయింది. ఒకవేళ దేవుడు కనిపిస్తే చెప్పుతో కొట్టేవాడిని అని తిట్టడము స్వయముగా నేనే విన్నాను. ఆరు సంవత్సరముల వయస్సున్న ఆడపాప రోడ్డు ప్రమాదములో చనిపోతే, ఆ ప్రమాదములో బ్రతికిన వారు “మేమంటే పాపము చేసివుంటాము, మేము చనిపోయినా సరిపోతుంది. కానీ చిన్నపిల్ల ఏమి చేసింది? ఎన్నో పాపములు చేసిన వారము మేముంటే, మాకు ఏమి జరుగకుండ చిన్నపిల్ల చనిపోవడము చూస్తే దేవునికి కళ్ళు ఉన్నాయా? దేవుడు గ్రుడ్డివాడు కాదా, కనిపిస్తే దేవుడని కూడ లెక్కచేయకుండా తన్నేవాడిని, అని ఒక పెద్దమనిషి ఏడుస్తూ అనడము జరిగింది. అతను బాధతో అలా అనడమును చూస్తే దేవుడు చంపలేదు, చంపినవారు వేరేవాళ్ళు అని అతనికి తెలియక పోవడము వలన అలా మాట్లాడడము జరిగినది. ఈ విధముగా దేవుని పరిపాలన తెలియని వారందరూ మాట్లాడడము జరుగుచున్నది.


దేవుని పరిపాలనా విధానము ఏ విధముగా ఉన్నదీ, సామాన్య ప్రజలకేకాక, మేము జ్ఞానులము అని అనుకొను వారికి కూడ ఏమాత్రము తెలియదు. దేవుని పరిపాలన, అందులోని విభాగములు ప్రత్యక్షముగా మనముందున్నా వాటిని గ్రహించలేక పోయాము. రోగాలు, మేఘాలను మనము నిత్యము చూస్తున్నా, ఇవి ఎందుకిలా ఉన్నాయి అని ఆలోచించ లేకపోయాము. ప్రత్యక్షముగా దేవునిపాలన మనముందరే సాగుతున్నా ఇది ప్రత్యక్షనరకమని తెలియక, నరకము ఎక్కడో ఉన్నదని వ్రాసుకొన్నాము. పాపము అంటే ఏమిటో తెలియక దాని ధ్యాస కొంచెమైనా లేక ధన మదాంధులై కొందరు, అధికారమదముతో గ్రుడ్డివారై కొందరు, దైవజ్ఞానము అను వాసనలేని అజ్ఞాన అంధకారులై


--

సులభముగా పాపమును మూటకట్టు కొంటున్నారు. ప్రస్తుతము సుఖములను అనుభవిస్తూ డబ్బూ, అధికారము ఉ ంటే, అతను దేవున్నిగాని, దేవుని జ్ఞానముతో కూడుకొన్న జ్ఞానులను, యోగులను గానీ లెక్కచేయకుండ మాట్లాడుతున్నాడు. పాపము అంటే భయము లేని పనులను చేయుచున్నాడు. దానివలన సంభవించు భయంకర పాపమును అనుభవించలేక, దేవునివద్ద న్యాయము లేదు, దయలేదు అంటున్నాడు. జరిగిన రోజులలో తన ఇష్టప్రకారము నడుచుకొని పాపభీతి లేకుండ ప్రవర్తించి, పాపమును సంపాదించుకొని, లెక్కప్రకారము అనుభవించవలసి వచ్చినపుడు మాత్రము దేవుడు జ్ఞప్తికి వస్తాడు. దేవుని దగ్గర న్యాయము లేదంటారు.


దేవుడు సృష్ఠిఆదిలో పాపపుణ్యముల సంపాదన, దాని అనుభవము లైన నరక స్వర్గములు అన్నియు భూమిమీదనే ఉండునట్లు, తన పరిపాలన ద్వారా లెక్కప్రకారము పాపములను అనుభవించునట్లు నిర్మించిపెట్టాడు. దానిప్రకారమే అన్నీ జరుగుచున్నవి. స్వర్గము, నరకములు రెండు మనిషి భూమిమీదనే పాలనాభూతముల ద్వారా అనుభవించునట్లు దేవుడు ఏర్పాటు చేసిపెట్టాడు. తన పరిపాలనలో శిక్షలు, వాటిని అమలు చేయు భూతములు అన్నీ ఉండగా, ప్రతి మతములోని వారు ఎక్కడో స్వర్గము, నరకములు ఉన్నాయనుట ద్వారా ఏ మతములోను దేవుని పరిపాలన తెలియలేదని అర్థమగుచున్నది. ఒక్క హిందూమతమేకాక, ఇతర మతముల వారు కూడ దేవుని జ్ఞానమును తెలిసినవారమని చెప్పుకొనుచూ, స్వర్గనరకముల నిజ స్థితినీ, దేవుడు అమర్చిన ప్రత్యక్షనరకమును, ప్రతక్షస్వర్గమును తెలియలేక పై లోకములో స్వర్గముందని, క్రింది లోకములో నరకముందని చెప్పు చున్నారు. అలా అసత్యమును చెప్పడము వలన దైవజ్ఞానము పట్ల ఇంకా పాపము చేసినవారగుచున్నారు.


దేవుని పాలనా విషయము తెలియనివారు, దేవుడు మనిషిని సృష్టించి భూమిమీద వదలి తాను ఎక్కడో పైన ఉ న్నాడనీ, పై లోకములోనున్న దేవుడు అక్కడ మానవుని కొరకు స్వర్గము, నరకము ఏర్పాటు చేశాడనీ, భూమిమీద పాపపుణ్యము సంపాదించుకొన్నవారు, అక్కడకు పోయి ముందు నరకమును అనుభవించి, తర్వాత స్వర్గమునకు పోవుదురనీ, పుణ్యమును స్వర్గములో అనుభవించిన తర్వాత, తిరిగి భూమిమీద పుట్టుచుందురని హిందువులు చెప్పుచుండగా! ఇతర మతములవారు నరకము అయిపోయిన వెంటనే స్వర్గములో హాయిగా ఉందురని తిరిగి ఎవరు పుట్టరని, పునర్జన్మలే లేవని చెప్పుచున్నారు. ఈ విధముగా అన్ని మతములవారు మాయ ప్రభావముచేత అజ్ఞానదశలో ఉండి, దేవుని పరిపాలన ప్రత్యక్షముగా భూమి మీద ఉందనీ, స్వర్గ నరకములు భూమిమీద ఉన్నాయనీ, మనము నిత్యము అనుభవించు సుఖములే స్వర్గసుఖములని, నిత్యము అనుభవించు కష్టములు బాధలు దుఃఖములు అన్నియు నరకములనీ తెలియక భ్రమలో మునిగి యున్నారు. భూమిమీద ఏమాత్రము రాయితీలేని దుఃఖములను తాను అనుభవిస్తున్నా, భయంకరమైన బాధలను ఎదుటివారు అనుభవిస్తున్నా మనముందరే జరుగు హింసలు ఎక్కడివనీ, దేని కారణముతో వస్తున్నవని యోచించక గ్రుడ్డిగ అనుభవిస్తూ, ఎప్పుడో చచ్చిన తర్వాత యమలోకము వస్తుందనుకోవడము పొరపాటు కాదా?


యమలోకము ఒకటున్నదని దానిలో యమధర్మరాజు ఉన్నాడని అట్లే మన పాపములను లెక్కించు చిత్రగుప్తుడున్నాడని కూడ చెప్పుచున్నారు. అటువంటివారు, శరీరములో చైతన్యశక్తియై, శరీరమును కదిలించి నడిపించు ఆత్మ చిత్రగుప్తుడు అని తెలియలేకపోయారు. దండనాధికారులలో రాజు అయిన యమధర్మరాజు విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని తెలియలేక పోయారు. శరీరములో చిత్రగుప్తుడు లెక్కించిన పాపముల ప్రకారము చిత్రహింసలు భూమిమీదనే అనుభవిస్తున్నామని తెలియలేక పోయారు. ఏ విధముగ చూచినా, దైవజ్ఞానము ప్రకారము, బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము, ఈ భూమండలమే పాపము చేసినవారికి యమలోకము, పుణ్యము చేసినవారికి స్వర్గలోకముగా


---

ఉన్నది. శరీరములో ఎవరికి తెలియకుండ గుప్తముగావున్న ఆత్మయే చిత్రగుప్తుడు. తానే అన్నీ చేస్తూ, ఏమి చేయనివానివలె ఉంటూ, దేనిని చేసినా దానిని ఏమాత్రము అనుభవించనివాడై, దేనిని చేసినా దాని పాపమునుగానీ, పుణ్యముగానీ అంటనివాడై, తన పనులు కనిపిస్తున్నా, తాను కనిపించక దేహములో అంతటా నిండియుండినా, శరీరములో తనను ఎవరూ గుర్తించనట్లు విచిత్రముగా శరీరములో దాగియున్న ఆత్మను తెలిసిన జ్ఞానులు, ఆత్మ ఇటువంటిది అని అర్థమగులాగున ఆత్మను చిత్రగుప్తుడు అన్నారు. ఈ విధముగా మన శరీరములోనే చిత్రగుప్తుడు అను పేరుకల్గి, మనము చేసుకొన్న పాపములను లెక్కించి అనుభవింపచేయుచున్న ఆత్మను తెలియకున్నాము. మనిషి అనేక పాపములను సంపాదించుకొనుచు, దానికంటే ముందు జన్మలలో సంపాదించుకొన్న పాపములను అనుభవిస్తూవున్నాడు. ఇతరులు అనుభవిస్తున్న నరక బాధలన్నిటిని ప్రత్యక్షముగా చూస్తున్నా, వాటిని ఏమాత్రము లెక్కించక యమధర్మరాజు, యమలోకము, చిత్రగుప్తుడు, నరకము ఎక్కడో ఉన్నాయనుకోవడము మనలో ఉన్న అజ్ఞానము కాదా? మనిషి తన అజ్ఞానమును లేకుండ చేసుకొని జ్ఞాననేత్రముతో చూడగలిగితే, స్వర్గనరకములు భూమి మీదనే ఉన్నాయని తెలియగలవు. వాటిని అనుభవింపజేయుటకు ముఖ్యపాత్రవహించునవి పంచ మహాభూతములు, పంచ స్వల్పభూతములు కాగ అనేక పాత్రలుగా అమలు చేయునవి ఉప భూతములని తెలియుచున్నది.


పంచ మహాభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని గురించి కొంతమందికి కొద్దిగా అయినా తెలిసియుండును. పంచ స్వల్ప భూతములను గురించి, అవి చేయుచున్న కార్యములను గురించి బహుశ చాలామందికి తెలియదు. అలాగే ఉపభూతములను గురించిగానీ, వాటి పనిని గురించిగానీ, అవి ఉన్నాయనిగానీ ఎవరికీ తెలియదనే చెప్పవచ్చును. ఇన్ని విభాగములుగ దేవుని పరిపాలన నిర్ణయించబడి ఉన్నదనీ, ఆ పరి పాలనలో ఎవరు, ఏ పనిని చేసినా వాని శరీరములోని ఆత్మయే దానిని వదలక కర్మరూపములో, కర్మచక్రములోని పాపపుణ్యముల స్థానములలో దానిని నిలువచేయునని, తర్వాత జన్మలలో దానిని అమలుచేసి జీవుని చేతనే అనుభవింపచేయునని, గొప్ప ఆధ్యాత్మికవేత్తలమనుకొను వారికి కూడ తెలియదు. ఇక్కడ కొందరు మమ్ములను ఈ విధముగ ప్రశ్నించ వచ్చును. “మీకే అన్ని తెలిసినట్లు, మీకు తప్ప పెద్దస్వామీజీలకు, పీఠాధిపతులకు, గురువులుగానున్న వారికి తెలియదని చెప్పడము వలన అందరిని కించపరిచినట్లు కాదా? మీకిది మంచి పద్దతా?” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! మీరన్నట్లు అలా చెప్పడము మంచిపద్దతా? కాదా? అని లెక్కించి చూస్తే, ప్రపంచ విధానము ప్రకారము ప్రపంచ విషయమేదైనా ఎదుటి వానికి తెలియకున్నా నీకు తెలియదని బహిరంగముగా చెప్పడము అతనిని అవమానపరిచినట్లే అగును. ఎవరైనా అలా చెప్పడములో వానిలోని గర్వము అను గుణము వలన జరిగినదనియే చెప్పవచ్చును. కానీ ఇక్కడ చెప్పువిషయము దైవసంబంధ జ్ఞానవిషయము. ఇది ప్రపంచ విధానము కాదు, పరమాత్మ విధానములో చెప్పునది. దేవుని విషయములో మాన, అవమానముల ప్రసక్తి ఉండదు. కేవలము సత్య అసత్యముల ప్రసక్తే ఉండును. దేవుని విషయములో తెలిసి సత్యమును చెప్పకపోతే దైవద్రోహమగును. ఇతరులు బాధపడుదురని సాటి మనుషులను గురించి, దేవుని విషయము దాచడము వలన దేవునికంటే మనుషులకే ఎక్కువ విలువనిచ్చినట్లవుతుంది. అట్లు చేయడము మంచిదికాదు. ఎవరు ఏమనుకొన్నా దైవవిషయములో సత్యమును చెప్పడము వలన అప్పటికది అవమానముగా కొందరికున్నా, తర్వాత వారికి కూడ మార్గదర్శకమగును. ఒక మందు మ్రింగేటప్పుడు చేదుగావున్నా, మ్రింగేవానికి ఇబ్బందిగా ఉన్నా కొంతకాలము తర్వాత ఆ మందే వానిలోని రోగమును పోగొట్టి మంచి ఆరోగ్యమును చేకూర్చినట్లు, మేము చెప్పిన సత్యమైన జ్ఞానమను మందు, ప్రస్తుతానికి కొందరికి చేదుగా అనిపించినా తర్వాత కాలములో ఇదే జ్ఞానము వలన వారిలోని అజ్ఞాన రోగమంతా పోయి సంపూర్ణ జ్ఞానులు కాగలరు. అందువలన మేము చెప్పుమాటలు


--

కొందరికి ఇబ్బందిగా ఉండినా పరవాలేదు. తర్వాత, వారికి మా మాటలు మంచి జ్ఞానమార్గమును చూపునను ఉద్దేశముతోనే ఉన్నదున్నట్లు చెప్పవలసివచ్చినది.


ఎవరికీ తెలియకుండ తమ పనిని తాము చేయుచు, ఎక్కడా దైవ నిర్ణితమగు పాలనా చట్టమైన ధర్మములను అతిక్రమించకుండా, ప్రకృతి జనితములైన దయా గుణమునుగానీ, కోప గుణమునుగానీ, ప్రేమనుగానీ, అసూయనుగానీ లేకుండ, జీవుని కర్మప్రకారము ప్రవర్తించు ఉపభూతము లను గురించి ఇప్పుడు తెలుసుకొందాము. మనకు బాగా అర్థమగుటకు అసంఖ్యాకములైన ఉపభూతములలో ముందుగా “రోగము ఒక భూతము" అను విషయమును గురించి చెప్పుకొందాము. శరీరములో రెండు రకముల శరీర బాధలు ఏర్పడును. వాటిని ఒకటి రోగము, రెండు జాడ్యము అని చెప్పవచ్చును. శరీరములో ఏర్పడు బాధలన్నిటిని రోగములని చాలామంది అనుచుందురు. అలా ఉన్న బాధలన్ని రోగములుకావు. కొన్ని రోగములు కావచ్చును, కొన్ని జాడ్యములు కావచ్చును. రోగము అనగా శరీరములో ఏర్పడు జబ్బు అని చెప్పవచ్చును. ఉదాహరణకు మలేరియా, టైఫాయిడ్, కలరా, శబ్ది (గనేరియా), శవాయి (సిప్స్), క్షయ (టి.బి) కుష్టు, గజ్జి, తామర, అతిసారము (బేదులు), రాచపుండు (క్యాన్సర్) మొదలగు అనేక రోగములున్నవి. శరీరము బయటినుండి వచ్చి, శరీరములో ప్రవేశించునవి రోగములు లేక జబ్బులు అని చెప్పవచ్చును. జబ్బు శరీరములో కొంత కాలముండి పోవచ్చును. జబ్బు శరీరము బయటినుండి వచ్చినది, కావున అది తిరిగి శరీరమును వదలి బయటికే పోవచ్చును. కానీ జాడ్యము అలా కాదు. జాడ్యము శరీరము బయటినుండి రాదు తిరిగి శరీరమువదలి బయటికి పోదు. శరీరములోనే ఉత్పన్నమగు బాధను జాడ్యము అంటాము. ఉదాహరణకు మోకాళ్ళ కీళ్ళ నొప్పులు, ఉబ్బసము, మధుమేహము (సుగర్వ్యాధి), చత్వారము (గ్రుడ్డితనము లేక చూపు తగ్గుట), ముసలితనము, చర్మము ముడుతలు పడడము, గ్రంథుల పని తగ్గిపోవడము, నరములు బలహీనపడిపోవడము, శరీరము సహజత్వమును కోల్పోవడము మొదలగున వన్నియు జబ్బులుకాదు జాడ్యములు అని చెప్పవచ్చును.


జాడ్యము అనగా! శరీరము తన సహజత్వము కోల్పోయి అవయవములలో కార్యలోపములు పెరిగి పోవడము లేక శరీరములోని అవయవములకు వయస్సు అయిపోవడము వలన ఏర్పడు రుగ్మతలను జాడ్యము అంటాము. వయస్సు అయిపోయి వృద్ధాప్య సూచనలు కనిపించి నపుడు దానిని రోగము అనము కదా. అలాగే శరీరములోని అవయవముల పని సామర్థ్యమును సహజముగ కోల్పోతే దానిని రోగమనుటగాని, జబ్బు అనుటగానీ జరుగదు, దానిని జాడ్యము అనాలి. శరీరములో క్లోమరస గ్రంథి (ప్యాంక్రియాస్ గ్లాండ్) తన సామర్థ్యమును కోల్పోతే, దానివలన డయాబెటిస్ (సుగర్) వ్యాధి వస్తే, ఆ వ్యాధిని జాడ్యము అంటాము. సామర్థ్యమును కోల్పోయిన దానిని ఎవరూ బాగుచేయలేరు. అందువలన మందుల వలన సుగర్వ్యాధి నయముకాదు. మందుల వలన క్లోమరస గ్రంథి తిరిగి పని చేయునట్లు డాక్టరు వైద్యమును చేయలేడు. ఆ గ్రంథి ఉత్పత్తి చేయలేని ఇన్సులిన్ హార్మోనును బయటినుండి పంపి శరీరములో ఇన్సులిన్ అవసరమును తీర్చవచ్చును. కానీ ఇన్సులిన్ మందుకాదు, సుగర్ వ్యాధి రోగముకాదు. దీనినిబట్టి శరీరములో ఏర్పడు రుగ్మతలలో కొన్ని సహజసిద్ధమైన జాడ్యములుకాగా, కొన్ని మాత్రము రోగములుగా ఉన్నవి. అటువంటి రోగములు కొన్ని మందులతోను, కొన్ని మంత్రముల తోను పోవునవి ఉండగా, మరికొన్ని అరుదుగా మందులకు గానీ, మంత్రములకుగానీ, పోని రోగములు కూడ కలవని ముందే చెప్పుకొన్నాము. అలా ఎందుకు జరుగుచున్నదని వివరముగా తెలుసుకోవాలంటే రోగము అంటే ఏమిటో దానిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.


---

మన శరీరములో వచ్చు ఏ రోగమైనా అది కూడా ఒక భూతమే అనగా జీవముకలది అని అర్థము. ఒక జీవున్ని భూతము అనికూడ అనవచ్చునని ముందే చెప్పుకొన్నాము. కొన్ని కోట్ల జీవధాతుకణ సముదాయమును ఒక సజీవ శరీరము అని అంటున్నాము. సజీవ శరీరమును ఒకవ్యక్తి అంటున్నాము. వ్యక్తి కనిపిస్తాడు, వ్యాధి కనిపించదు. వ్యక్తికి ఉద్దేశము, కార్యము ఉన్నట్లు, వ్యాధికి కూడ ఉద్దేశము, పని రెండూ ఉన్నాయి. వ్యాధి అను పేరు మొదట ‘వ్యక్తి’ అనుపేరుకు దగ్గరగా ఉన్నట్లు “వ్యధి” అని పిలువబడేది. కాలక్రమమున వ్యధి అను పేరు చివరకు 'వ్యాధి'గా మారినది. వ్యాధినే అందరు రోగము అని పిలుస్తున్నారు. కొన్ని కోట్ల జీవక్రిముల సముదాయము ఒక రోగముగా ఉన్నది. ఉదాహరణకు 'కలరా' రోగమును తీసుకొందాము. కలరా అనునది అందరికి తెలిసినట్లు ఒక రోగమే. కానీ అందరికి తెలియనట్లు అది కూడ ఒక ఉపభూతముగా ఉన్నది. ఉపభూతమైన కలరా తన క్రిమిసముదాయము చేత మనుషుల లోనికి వ్యాపించగలదు. మనిషిలోనికి చేరిన కలరా, ఆ మనిషిని 48 గంటలలోనే చంపగలదు. దీనినిబట్టి చూస్తే కలరా రోగమునకు మనుషులను చంపాలను ఉద్దేశముకలదని తెలియుచున్నది. ఒక మనిషిని చంపాలను ఉద్దేశముతో అతనియందు చేరి అతని శరీరములో బలపడి చివరకు అతనిని చంపివేయుచున్నది. అలా ఎందుకు చేయాల్సివచ్చిందంటే, ఆ మనిషి చేసుకొన్న పాపము అలా ఉంటుంది. ఒక మనిషి చేసుకొన్న పాపమునుబట్టి అతనిని ఎంతవరకు, ఏ స్థాయి బాధతో, ఎట్లు హింసించాలో అట్లే హింసించి అతనిని చంపడము జరుగుచున్నది. అందువలన ఒక కలరా రోగికి, మరొక కలరా రోగికి వారివారి కర్మల ప్రకారము, వారివారి అనుభవములు కూడ తేడాగా ఉండును.


ఒక వ్యక్తి కర్మప్రకారము కలరా రోగము అతని శరరీములోనికి చేరి, రెండు లేక మూడు రోజులు అతనిని బాధించి, చంపకుండ వదలి వేయవలసివుంటే, అలాగే మనిషిలోనికి చేరిన కలరా, రెండు మూడు రోజులు బాధించి, అతను వాడిన మందుల వలన అతనిని వదిలిపోయినట్లు మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి అలా వదలి పోవలసిన కర్మ ఉంటేనే మందుల సాకుతో వదలిపోవును. దీనినిబట్టి కలరా రోగము మందుల వలన పోవునని తెలియుచున్నది. ఒక్కొక్కప్పుడు కలరా చేరిన వ్యక్తికి కర్మ బలీయముగా ఉండి చనిపోవలసిన నిర్ణయము జాఫథకము (జాతకము)లో ఉంటే, అతనికి ఎన్ని ఖరీదైన మందులు వాడినా, ఎంత గొప్ప డాక్టర్లు వైద్యము చేసినా, వాటన్నిటిని కలరా అతిక్రమించి అతనిని చంపివేయును. ఒకవేళ ఒక వ్యక్తికి కర్మబాధ, అనుభవించు వరకు మాత్రమేవుండి, చనిపోవలసినది లేదనుకొనుము, ఆ వ్యక్తికి వైద్యము కూడ అందలేదనుకొనుము, వైద్యము అందకున్నా అతని కర్మానుసారము కలరా ప్రవర్తించి అతనిని వదలి పోవుచున్నది. కలరా రోగము వచ్చిన తర్వాత మందులువాడకున్నా బ్రతికిన వారిని నేను చూచాను. కొందరు మందులు వాడినా చనిపోయిన వారిని చూచాను. అలాగే మందులు వాడిన తర్వాత కలరా రోగము వదలి పోయిన వారిని కూడ చూచాను. మనకు కనిపించని కర్మను అనుసరించి కలరా రోగము యొక్క ఆత్మ ఆదేశానుసారము లేక ఆత్మ ఆడించునట్లు కలరా అడుచున్నది. భూమిమీద ప్రతి జీవుడు ఆత్మ ఆడించినట్లు ఆడవలసిందే. ఆ సూత్రము ప్రకారము కలరా కూడ జీవత్వము కలదే, కావున ఆత్మ ఆదేశానుసారము పనిచేయుచున్నది. ఆత్మ జీవునకున్న కర్మానుసారము కలరాను ఆదేశించగా, ఆత్మ ఆదేశమునే తన ఉద్దేశముగా ఉంచుకొని కలరా పనిచేయుచున్నది. ఇక్కడ ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమనగా! ఆత్మ ఆదేశము మనకు ఏమాత్రము తెలియదు. ఆత్మ ఆడించుచున్నా, ఆ విషయము మనకు తెలియక చేయునదంతా నేనే అని మనిషి అనుకొనుచున్నాడు. కానీ ఆత్మ ఆదేశము రోగమునకు తెలియును. రోగము తాను చేయుచున్న పని, ఆత్మ ఆదేశముతో చేయుచున్నానని తెలిసి చేయుచున్నది. ఆత్మ ఆదేశమునే తన ఉద్దేశముగా పెట్టుకొని పనిని చేయుచున్నది. తన ప్రత్యేకత ఏమిలేని రోగము, ఎవరిని బాధించినా, ఎంత బాధించినా, ఆ రోగమునకు కర్మ అంటదు. ఒక జీవుని కర్మానుసారము ఆత్మ పనిచేయగా,


---

ఆత్మానుసారము రోగము పనిచేయుచు, ఆ జీవున్ని అనుభవింపచేయుచున్నది. అందువలన జీవుని కర్మానుసారము పనిచేయు ఆత్మకుగానీ, ఆత్మానుసారము పనిచేయు రోగమునకుగానీ ఏ కర్మలు అంటవు.



రోగము సజీవమైనదే అయినప్పటికీ, దేవుని పరిపాలనా వ్యవస్థలో పనిచేయు సైనికునిలాంటిది. ఒక సైనికుడు ప్రభుత్వ ఆదేశానుసారము శత్రువులను ఎంతమందిని చంపినా, ఎంతమందిని హింసించినా ఆ సైనికుణ్ణి హంతకుడు అనము, అతనికి ఏ కేసులుండవు. అలాగే ఒక రోగము ఆత్మ యొక్క ఆదేశానుసారము మనుషులను ఎంతమందిని చంపినా, ఎంత మందిని హింసించినా, ఆ రోగమునకు పాపము అంటదు, దానికి అనుభవము ఉండదు. “నానా రూపేణా కాల కింకరః” అను వాక్యమును పెద్దలు చెప్పియున్నారు. కింకరుడు అనగా సైనికుడని అర్థము. కాలము అనగా దేవుడు అని అర్థము. కాలకింకరులు అనగా దేవుని సైనికులని అర్థము. నానా రూపేణ అనగా అనేక రోగముల రూపముతో అని ఈ సందర్భములో అర్థము చేసుకొందాము. దీనిప్రకారము కలరా దేవుని ప్రభుత్వములో ఒక సైనికునిగా పని చేయుచున్నదని తెలియుచున్నది. మనుషులు చేసుకొన్న పాపమునుబట్టి, కలరా కొందరిని బాధించి వదిలి వేయుచున్నది. కొందరిని బాధించి చంపివేయుచున్నది. ఒక మనిషిని మరొక మనిషి బాధించితే పాపము వస్తుంది. కానీ కలరా అను జీవుడు మనిషి అను జీవుణ్ణి బాధించితే పాపమురాదు. అట్లు రాకుండుటకు కలరా సాధారణ జీవుడుకాదు, దేవుని పరిపాలనలో పనిచేయుచున్న జీవుడు (సైనికుడు). అందువలన కలరా అను వ్యాధి పాపపుణ్యములకు, ప్రేమ, ద్వేషములకు అతీతముగా ఉండి ఆత్మను గౌరవిస్తున్నది. ఆత్మను గౌరవించడమే కాక, ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న యోగులను కూడ గౌరవిస్తున్నది. అట్లని కర్మ విషయములో యోగులకు రాయితీ ఏమీ ఉండదు. కర్మయున్నపుడు యోగినైన రోగము బాధించవలసివస్తుంది. ఆత్మ ఆదేశానుసారము పనిచేయు కలరా, ఆత్మజ్ఞానముగల యోగియొక్క ఆజ్ఞను కూడ పాటించును. అందువలన యోగీశ్వరులు చెప్పితే ఒక శరీరములోనున్న కలరా కూడ, ఆ శరీరమును వదిలి బయటికిపోవును. ఇక్కడ మందుగానీ, మంత్రముగానీ లేకుండనే కేవలము నోటిమాటతో కలరా రోగము బయటికి పోవడము జరుగుచున్నదంటే, ఆత్మ ఆదేశమును పాటించిన కలరా, యోగీశ్వరుల ఆదేశమును కూడ పాటించుచున్నది. యోగులమాట రోగము వినునని తెలిసినా ప్రకృతిసిద్ధమైన రోగమును, ధర్మబద్దమైన యోగి ఎప్పుడూ ఆదేశించడు. ఎప్పుడైనా దైవజ్ఞానము ప్రచారమగుటకు, జ్ఞానశక్తి ఇంతటి గొప్పదని తెలుపుటకు, నిరూపణ నిమిత్తము అరుదుగా యోగి ఉపభూతమైన రోగమును ఆదేశించును. అప్పుడు అది ఎంత పెద్దరోగమైనా యోగి మాటను గౌరవించి, యోగీశ్వరుల ఆదేశానుసారము నడుచుకొనును.


ఒక శరీరములోని జీవుడు చేసుకొన్న పాపమును అనుభవింప చేయుటకు, కాలకింకరులు అను తన సేనను దేవుడు తయారుచేశాడు అనుకొన్నాము కదా! సేన లేక సైన్యము అనగా ఎంతో సంఖ్య ఉంటుంది. అందులోను ఎన్నో విభాగములు ఉంటాయి. సైన్యములో 1. సిపాయి 2. నాయక్ 3. హవల్దార్ 4. సుబేదార్ 5. కాప్టన్ 6. మేజర్ 7. లెఫ్టినెంట్ కల్నల్ 8. కల్నల్ 9. బ్రిగేడియర్ 10. జనరల్ హెూదాలు ఉన్నట్లు, హెూదాలకు తగినట్లు వారి అధికారబలమున్నట్లు, కాలకింకరులు అను సైనికులు కూడ హెూదాలు కలిగియున్నారు. హెూదాలు బయటికి కనిపించునవి కావు. బయటి హెూదాలవలె అధికారబలములో తేడాలు ఉండక, వారిశక్తి సామర్థ్యములలో తేడాలుండును. బాగా అర్థమగుటకు ఉదహరించి చెప్పుకొందాము. ఒక పల్లెటూరు ఉందనుకొందాము. ఆ చిన్న గ్రామములో ఒక వెయ్యి ఇళ్ళు ఉన్నాయనుకొందాము. ఒక ఇంటికి సగటుకు పదిమంది ఉన్నారనుకొందాము. వెయ్యి ఇళ్ళకు ఇంటికి పదిమంది ప్రకారము పదివేల మంది జనసంఖ్య ఉన్నారనుకొనుము. పదివేలమందికి కర్మప్రకారము ఒక కాలములో


---

కలరా వ్యాధి ఊరంతా వ్యాపించి, పదివేలమందిని బాధించును. అందులో కొందరిని చంపివేయును, కొందరిని బాధపెట్టి వదలివేయును. ఊరిలోనికి కలరారోగము ప్రవేశించిన వెంటనే డాక్టర్లు స్పందించి ఊరందరికి వైద్యము చేసినా, కొందరు చనిపోవడము, కొందరు మిగలడము జరిగినది. చనిపోయిన వారు 2% శాతము, బ్రతికి మిగిలిన వారు 98% శాతము. చనిపోయినవారు రెండువందల మందికాగ, బ్రతికి బట్టకట్టినవారు తొమ్మిదివేల ఎనిమిది వందల మంది అని అర్థమగుచున్నది.


పదివేలమంది గల చిన్న ఊరిలో, ఒక్కమారుగా కొన్ని దినముల తేడాతో కలరావ్యాధి అందరికి తగలడము జరిగినది. నాలుగు లేక ఐదు రోజుల తేడాతో ఊరంతా వ్యాపించిన కలరా అను భూతము (జీవాత్మ) ఒక్కటేనా, లేక ఒక్కొక్కరికి ఒక్కొక్క కలరా భూతము చేరినదా అని కొందరికి ప్రశ్నరావచ్చును. దానికి మా జవాబు ఏమనగా! కొన్ని కోట్ల జీవక్రిమి సముదాయముకల్గిన కలరా భూతము ఒక్కటియే, ఒక ఊరంతా వ్యాపించ గలదు. ఒక ఊరేకాదు, ఆ ఊరి చుట్టుప్రక్కల గ్రామాలకు కూడ ప్రాకగలదు. అలా ఒకే కలరా భూతము ఒక జిల్లా మొత్తము వ్యాపించగల స్థోమత కల్గియుండును. ఒక గ్రామములోని ఒకరిలో మొదట కలరావ్యాధి కనిపించి, అక్కడినుండి తన జీవక్రిముల ద్వారా ఇతరులలో వ్యాపించుచుపోవును. అలా ఒక ఊరిలోని పదివేలమందికి కూడ నాలుగైదు రోజులలో వ్యాపించును. దీనినిబట్టి చూస్తే అనేక హెూదాలు కల్గిన భూతములలో కలరారోగము బయటి సైన్యములో మూడవస్థానములోనున్న హవల్దార్ హెూదాకు సమానమైన హెూదా కల్గినదని అర్థమగుచున్నది. మూడవస్థాన హెూదా కల్గిన కలరా భూతము ఒక్కటే ఒక జిల్లానుగానీ, ఒక రాష్ట్రమును గానీ కొన్ని రోజులలోనే అతలాకుతలము చేసి, పీడించి కొందరినైన చంపగలదు లేక అందరినైన చంపగలదు. మూడవస్థానములోనున్న కలరా భూతము ఒక్కదానికే అంతబలము ఉంటే, అంతకంటే పెద్ద హెూదాలు కల్గిన ఉపభూతములకు ఎంత బలముండునో సులభముగా అర్థము చేసుకోవచ్చును.


ఇక్కడ మరొక ప్రశ్న అడగవచ్చును. అదేమనగా! భూమండలము అంతటికి కలరాభూతము ఒకటే ఉన్నదా లేక కలరాభూతములు ఇంకా ఉన్నాయా? ఈ ప్రశ్నకు మా జవాబు ఈ విధముగా ఉన్నది. కలరా ఒక ఉపభూతము, కొన్ని సమయములలో భూమిమీద మొత్తము వెదికినా కలరా భూతము (రోగము) ఎక్కడా కనిపించదు. కానీ కొన్ని సమయములలో భూమిమీద అనేకచోట్ల, అనేక రాష్ట్రములలో, అనేక దేశములలో, అనేక ఖండములలో ఒకేమారు కనిపిస్తున్నది. ఒక్క చోట విస్తరించియున్న కలరాను ఒక్క కలరా భూతముగా లెక్కించితే, వివిధ చోట్ల విస్తరించియున్న కలరాను వివిధ భూతములుగా లెక్కించవలసియున్నది. అఖండముగ ఒకచోట ఉన్న రోగమును ఒక భూతముగా లెక్కించవచ్చును. ఖండ ఖండములుగా కొన్ని ప్రదేశములలో వ్యాపించిన కలరాను, వేరువేరు కలరా భూతములుగా పరిగణించాలి. ఒకే దేశములో యాభైమైళ్ళ దూరము సందుగలిగి, నాలుగు చోట్ల కలరా ఉందనుకొనుము. అప్పుడు ఒకదాని కొకటి సంబంధము లేకుండ యాభైమైళ్ళ దూరములో ఉండుట వలన, ఆ దేశములో నాలుగు కలరా భూతములు, ఆ సమయములో ఉన్నవని చెప్పవచ్చును. ఈ విధముగా లెక్కించి చూచితే కలరా భూతము లేక కలరా రోగము ఒకటికాదు ఎన్నో ఉన్నవని తెలియుచున్నది. మేడిపండు మేలిమైయుండు పొట్టవిప్పిచూడు పురుగులుండు అన్నట్లు, కలరా రోగమే మనిషి శరీరము మీద కనిపించదు, శరీరములోపల పొట్టయందు, క్రిమిరూపములో (పురుగురూపములో) వ్యాపించి, ప్రేగుల మీద ఎక్కువ ప్రభావము చూపి, మనిషిని చంపి వేయుచున్నది. అది మనిషిమీద కలరాయొక్క ముఖ్యమైనదాడి. ఒక మేడిపండు ఎట్లుంటుందో, సరిగా అటువంటి దానినే మేడిపండు అంటాము. అనగా ఒక మేడిపండుకు మరొక మేడిపండుకు ఎటువంటి తేడా ఉండదు. అలాగే ఒక కలరా రోగము మనిషిమీద ఎలా దాడి


---

చేయుచున్నదో, అలాగే మరొక కలరా రోగము కూడ అదే విధముగా దాడిచేయును. కలరా రోగములు వేరువేరుగా ఉండినా, అన్నియు ఒకే లక్షణములు కల్గియుండును. అయితే కలరా రోగములు భూమిమీద ఎన్ని ఉన్నవో సరిగా చెప్పలేము.


ఇక్కడ కూడ మరొక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! భూమిమీద కొన్ని సమయములలో అక్కడక్కడా అనేకచోట్ల, అనేక దేశములలో కనిపించు కలరారోగము, కొన్ని సమయములలో భూమిమీద ఎక్కడ తన ఆనవాళ్ళు కనిపించకుండ పోతుంది. ఆరునెలలుగానీ, సంవత్సరముగానీ, కొన్ని సంవత్సరములుగానీ ఎక్కడ లేకుండా కనిపించ కుండపోయిన కలరా, తిరిగి అక్కడక్కడ కనిపించి మనుషులను చంపు చున్నది. కొంతకాలము భూమిమీద ఏ ప్రాంతములో లేని కలరా భూతము (కలరా రోగము) భూమిమీద కనిపించని సమయములలో ఏమైపోయింది? తిరిగి ఎక్కడినుండి వస్తున్నది? అని మీరు అడిగిన ఈ ప్రశ్నకు మా సమాధానము ఏమనగా! ప్రభుత్వమునకు అధిపతియైన రాజు (రాష్ట్రపతి) యొక్క ఆజ్ఞతో పనిచేయు సైన్యము బయటి ప్రజలు ప్రవేశించని మిలిటరీ ఏరియా అను ఒక ప్రదేశములో ఉండును. అవసరము వచ్చినపుడు వారు బయటికి వచ్చి వారు చేయవలసిన విధులు నిర్వహించి తిరిగి వారి స్థలములోనికే పోవుదురు. అదే విధముగ కలరా అను రోగము కూడ ఒక సైనికుడే కావున కలరాగానీ, మిగత రోగములను సైన్యముగానీ ప్రజలులేని, ప్రజలురాని నిషిద్ధ స్థలములో నివాసముండును. రాజు లేక రాష్ట్రపతి ఆర్డరును బట్టి సైన్యము బయటికి వచ్చి పని చేయునట్లు, దైవ నిర్ణయము ప్రకారము కలరా బయటికి ప్రజలలోనికి వచ్చి, తన కర్తవ్యమును తాను చేయుచున్నది. పని అయిపోయిన వెంటనే తనలాంటి సైన్యమున్న మిలటరీ రెజిమెంట్ ఏరియాలోనికి పోయి ఉంటున్నది. మిలటరీ రెజిమెంట్ ఉన్న ఏరియాలోనికి ప్రజలు ఎవరు పోకూడదు. అక్కడున్న సైనికులు ఎప్పుడైనా బయటికిరావచ్చును. కానీ ప్రజలు మాత్రము ఎప్పుడు సైన్యమున్న ప్రదేశము లోనికి పోకూడదు. అటువంటపుడు సైనికుడు బయటికి వచ్చినపుడే కనిపిస్తాడు. తన ఏరియానుండి బయటికి రానపుడు కనిపించడు కదా! అలాగే ప్రజలు భూగోళములో ఉన్నట్లు, దేవుని సైన్యము అయిన రోగములు ఖగోళములో ఉన్నవి. ఖగోళములోనున్న రోగములు ఎవరికీ కనిపించకుండ పోవును. ఖగోళములోని కనిపించని రోగములు, భూగోళము మీదికి వచ్చినపుడు మాత్రమే కనిపించును. భూమిమీద రోగము, దాని పనిని చూచిన ప్రజలకు, రోగము తిరిగి కనిపించకుండ ఎక్కడికి పోవుచున్నదో తెలియదు. మేఘము కరిగిపోవునట్లు కనిపించకుండపోవును. తిరిగి మేఘము చిన్నగ పుట్టి పెద్ద ఆకారమును పొందునట్లు, రోగము కూడ పుట్టి కనిపించును.


ప్రభువు ఆధీనములోని ప్రభుత్వములో పనిచేయు సైన్యమునుగానీ, ఒక సైనికుణ్ణి గానీ, బయటి ప్రజలు బంధించలేరు. బయటి ప్రజలను బంధించుటకుగానీ, చంపుటకుగానీ సైన్యమునకే అధికారముండును. అందువలన కలరా రోగమును ఎవరూ బంధించలేరు. అంతేకాక కలరా రోగము ప్రజలలో ఉన్నపుడు మాత్రమే కనిపించి, తిరిగి కనిపించకుండ ఎక్కడికి పోవునది ఎవరికీ తెలియదు, అట్లే అది ఎక్కడినుండి వచ్చేది కూడ తెలియదు. ఒక్క కలరానే కాదు, ఏ రోగమైనా ఎక్కడినుండి ఊడిపడుతుందో ఎవరికీ తెలియదు. నేను విజ్ఞానిని అని చెప్పుకొను మనిషి, ఖండాంతర క్షిపణులను తయారుచేసిన మనిషి, జీవకణాన్ని సృష్టించానని గొప్పలు చెప్పుకొను మనిషి, వివిధ రంగములలో పనిని చేయు కంపూటర్లను కనిపెట్టిన మనిషి, ఖగోళములో కలియతిరిగి పైనున్న వాటిని గురించి తెలుసుకొన్నానని చెప్పుకొను మనిషి, దేవుడెవరు, వాని అడ్రస్ ఏమిటి? అని ప్రశ్నించు మనిషికి, చివరకు తన శరీరములోనికి వచ్చు రోగము ఎక్కడినుండి వచ్చినదో తెలియదు. తన శరీరములోనికి వచ్చిన క్రొత్త రోగము ఎక్కడిదో తెలియనిది, ఇంతకు


--

నా

ముందు ఎక్కడాలేని రోగము, ఎలా పుట్టుకొచ్చిందో తెలియని మనిషి, నేను విజ్ఞానిని అని చెప్పుకోవడము ఎట్లుందనగా! ముఖానికి మసిపూసుకొన్న మనిషి, తాను వికారముగా కనిపిస్తున్నా, నేను అందగాడినని చెప్పుకొన్నట్లున్నది. ముఖానికి మసి ఉందని మరిచిపోయి నేను అందగాడినని చెప్పుకొన్నట్లు, మన శరీరములో రోగమును గురించి తెలియకున్నా దానిని మరచిపోయి, నేను విజ్ఞానిని అని అనుకోవడము జ్ఞానమవుతుందా? విజ్ఞానమవుతుందా?


జీవక్రిమి సముదాయమైన కలరా, రోగముగా మనుషులకు తెలిసినా మేము దానిని ఒక ఉపభూతముగా లెక్కించుచున్నాము. ఉపభూతమైన కలరా రోగము దైవజ్ఞానమును తెలిసిన యోగులను మాత్రమే అభిమానించు నని ముందుకూడ చెప్పుకొన్నాము. యోగులు, ఆత్మను అధ్యయనము చేసిన ఆధ్యాత్మికులు, కావున రోగము వారిమాటను వినగలుగుచున్నది. అందువలన పూర్వము ఒక యోగి, కలరా రోగమును ఈ ఊరి లోపలికి రావద్దని, ఊరికి నాలుగువైపులవున్న త్రోవలవద్ద దారికి అడ్డముగా గీతను గీచాడు. రెండు రోజుల తర్వాత కలరా రోగము ఊరిలోనికి పోవాలను ఉద్దేశముతో ఒక దారిలో పోయింది. అలా పోయిన ఆ భూతమునకు ఆ దారిలో యోగిచేత గీయబడిన గీత మెరిసినట్లు కనిపించింది. కలరా ఆ దారిలో పోయిన సమయానికి, యోగి గీచిన గీత కనిపించకుండ చెదిరి పోయినప్పటికీ, ఆయన ఉద్దేశము గీతరూపములో ప్రకాశించి కలరా భూతమునకు కనిపించింది. అప్పుడు బాహ్యకంటికి కనిపించని కలరా భూతము, యోగియొక్క ఉద్దేశమును సూక్ష్మముగానే గ్రహించి అక్కడినుండి వెనుతిరిగి వచ్చింది. దీనినిబట్టి కలరా భూతము యోగిమాటను జవదాట లేదని (గీత దాటలేదని) తెలియుచున్నది. ఇక్కడ మీరు మమ్ములను ఒక ప్రశ్న అడుగవచ్చును. “ఎవరో గీత గీచితే కలరా దాటలేదని చెప్పుచున్నారు కదా! ఆ విషయమును మీరు ప్రత్యక్షముగా చూచినది కాదుకదా! ఎవరో చెప్పగా విని మీరు మాకు చెప్పారనుకుంటాము. అలాంటపుడు మీరు ప్రత్యక్షముగా చూడనపుడు దానిని సత్యమని మేము ఎలా అనుకోవాలి? మీరు చెప్పిన మాట సత్యము అని మీరు అనుకొన్నా, మేము అనుకొనుటకు ఆధారము లేదుకదా" అని సంశయమును వెలిబుచ్చవచ్చును.


మీ సంశయమునకు మా సమాధానము ఇలాగ ఉన్నది చూడండి. నేను ముందే నా జీవితము హేతువాద పద్ధతిలో మొదలైనదని చెప్పాను. ఏ విషయమునూ మూఢనమ్మకముతో ముడిపెట్టి చెప్పను. దయ్యముల విషయములలో చెప్పినవన్నీ యదార్థసంఘటనలే! ఇక్కడ భూతముల విషయములలో చెప్పినవన్నీ కూడ నా స్వంత అనుభవముతో చెప్పినవే! దయ్యముల విషయములలో జరిగిన యదార్థసంఘటనలలో వాస్తవమును చెప్పకతప్పలేదు. కావున వాస్తవ విషయములను అన్నిటిని ఇష్టములేకున్నా చెప్పవలసివచ్చినది. అక్కడ నాకు ఇష్టములేని విషయము దయ్యములకంటే, దేవతలకంటే, క్షుద్రశక్తులకంటే నేను గొప్ప అని తెలియబడడము. ఆ విషయములను చెప్పడము వలన అవి సత్యమే అయినప్పటికీ, ఆ సంఘటన లలో ఎక్కువగా నా ఆధిపత్యమే కనిపిస్తుంది. నేను గొప్ప అని ప్రకటించుకోవడము నాకు ఏమాత్రము నచ్చదు. ఎవరూ ప్రశ్నించకుండ యదార్థ సత్యములను చెప్పాము. భూతముల విషయములలో మీ అవగాహన కొరకు ఇతరులవద్ద జరిగిన సంఘటనను చెప్పాను. దానిని మూఢ నమ్మకమని ఇతరులు అనుటకు అవకాశము కలదు. కావున దయ్యముల విషయములను చెప్పినట్లే, భూతముల విషయములలో కూడ నావద్ద యదార్థముగా జరిగిన సంఘటనలనే వివరించి చెప్పుతాను. అందువలన ఎవరూ మూఢ నమ్మకము అనుటకు వీలుండదు. ఇపుడు చెప్పబోవు విషయము 1973వ సంవత్సరములో జరిగినది.


అనంతపురము జిల్లాలోని గుత్తికి సమీపములో ఒక పల్లెటూరిలో నాకు దూరసంబంధ బంధువులుండెడివారు. 37 సంవత్సరముల క్రితము ఒకరోజు బంధువులున్న పల్లెకు పోవడము జరిగినది. ఆ ఊరిలో పశువులకు గాలికుంటు


---

రోగము మొదలైంది. గాలికుంటు రోగము పశువుల కాలిగిట్టలకు వచ్చి, పశువులను పది పదిహేనురోజులపాటు బాధిస్తుంది. ఆ రోగమున్న పది పదిహేను రోజులు పశువులు నడువడానికి చాలా ఇబ్బంది పడి నడవలేక బాధపడును. గాలికుంటు రోగము కూడ భూతమే అగును. గాలికుంటు భూతము, పశువుల పాపమును బట్టి ఆత్మ ఆదేశానుసారము పశువులను బాధపెట్టును. నేను అక్కడికి పోకనే ఒకటి రెండు రోజులముందు ఆ పల్లెలో, ఆ రోగము ప్రవేశించి కొన్ని పశువులలో చేరిపోయింది. గాలికుంటు రోగము కొన్ని పశువులకు వచ్చినదని ఆ ఊరిలోని అందరికి తెలుసు. మొదట ఒకటి రెండు పశువులతో ప్రారంభమైన రోగము, ఊరిలోని పశువులన్నిటికి కొన్ని రోజులలోనే వ్యాపించును. అది అంటురోగము కావున అన్ని పశువులకు ప్రాకును. రోగమున్న పశువు కాలిమీద వాలిన ఈగ, రోగములేని పశు వుమీద వాలితే రోగము ఈగ ద్వార, బాగున్న పశువును చేరి ఆ పశువుకూడ రోగగ్రస్త మగును. ఆ విధముగా గాలికుంటు అను భూతము లేక రోగమను అంటువ్యాది అన్ని పశువులకు చేరిపోవును. నేను వెళ్ళిన బంధువుల ఇంటిలో దాదాపు చిన్నవి, పెద్దవి అన్నీ పదహారు పశువులున్నవి. నేను వెళ్ళిన దినము అన్ని ఆరోగ్యముగానే ఉన్నవి. నేను వెళ్ళిన ఇంటిలోనివారు నన్ను చూచి “మా ఇంటిలో ఇన్ని పశువులున్నాయి, గాలికుంటు రోగము ఊరిలోనికి వచ్చింది. అది మా పశువులకు కూడ వస్తుంది. అది అంటురోగము కావున మా పశువులకు కూడ రెండు మూడు రోజులలో అంటుకొంటుంది. ఆ రోగము రాకుండ ముందే మందులను వాడవచ్చునా? ఆ రోగము రాకుండుటకు ఏమైనా మందులుంటే చెప్పండి” అని అడిగారు.


నేను అల్లోపతి మరియు హెూమియోపతి డాక్టర్ కోర్సులు చదివానని వారికి తెలుసు. కావున వారు వైద్యమును గురించి నన్ను అడిగారు. నాకు అల్లోపతి, హెూమియోపతి మాత్రమే తెలుసునని వారికి తెలుసు, కానీ అందరిపతి కూడ నాకు తెలుసునని వారికి తెలియదు. ఇక్కడ కొంతమంది డాక్టర్లకు అల్లోపతి తెలుసు, హెూమియోపతి అంటే తెలుసు కానీ అందరిపతి ఎక్కడుంది అని అనుమానము రావచ్చును. దానికి జవాబు ఏమంటే, అందరిపతి అంటే అందరికి భర్త అని అర్థము. అందరి భర్త లేక అందరిపతిని గురించి తెలియాలంటే ఆరవశాస్త్రమైన భగవద్గీతను చదివితే క్షుణ్ణంగా అందరిపతిని గురించి అర్థమౌతుంది. అల్లోపతి చదివి దానిని బాగా తెలుసుకొంటే ఒకరకమైన వైద్యమును చేయవచ్చును. హెూమియోపతి చదివి దానిలో ప్రావీణ్యతను సంపాదించు కొంటే, మరొక రకమైన వైద్యమును చేయవచ్చును. అందరిపతి ఏమిటో చదివి బాగా అర్థము చేసుకొని గ్రహించగలిగితే, అన్ని రకముల వైద్యములను చేయవచ్చును. అందరిపతిని గూర్చి వివరంగావున్న భగవద్గీతను చదివి అర్థము చేసుకొని దానిలోవున్న దానిని బాగా గ్రహించుకొన్నాను. కావున అల్లోపతి, హెూమియోపతియేకాక, అందరిపతి కూడ తెలిసినవాడిని కనుక అందరిపతి వైద్యము అప్పుడు ఆ ఇంటిలోని పశువులకు అవసరము అనిపించింది. వారు అడిగిన దానికి సమాధానముగా "ప్రస్తుతము అందరికి తెలిసిన వైద్యము ప్రకారము గాలికుంటు వ్యాధి రాకుండ చేయుటకు మందులులేవు. రోగము వచ్చిన తర్వాత అది తగ్గిపోవుటకు అల్లోపతిలో మందులున్నాయి. ముందే రాకుండ చేయుటకు అల్లోపతిలో మందులు లేవు. ఎందుకనగా! నవ్వ వచ్చినపుడే బరకాలి లేక దురదవచ్చినపుడే గోకాలి అన్నది అల్లోపతి సూత్రము. అందువలన ముందే దురదను రాకుండ చేసుకొను విధానము అల్లోపతిలో లేదు.


ప్రస్తుతకాలములో భూమిమీద అల్లోపతి విధానము యొక్క డాక్టర్లు ఉన్నారు. కానీ అందరిపతి విధానముయొక్క డాక్టర్లు లేరు. నేను వెళ్ళిన పల్లెటూరిలో పశువుల సమస్యను అడ్డము పెట్టుకొని, ఆ ఇంటివారికి జ్ఞానముయొక్క విలువ తెలుపుటకు, అందరిపతి విధానముతో గాలికుంటు రోగము ఆ ఇంటి పశువులకు రాకుండ వైద్యము చేయాలనుకొన్నాము.


--

ఉదయము ఏడుగంటల తర్వాత పశువులన్నిటిని బయటికి తోలకముందే పశువులు త్రాగే తొట్టిలో, అన్ని పశువులు త్రాగేదానికి సరిపోవు నీరును పోయించాను. తర్వాత ఒక గ్లాసులో త్రాగేనీరు తీసుకొని, నా కుడిచేతి చూపుడు వ్రేలును ఆ నీటిలో సగము వరకు ముంచి “ఈ నీరు త్రాగిన పశువులకు గాలికుంటు వ్యాధి రాకూడదు.” అని మనస్సులో అనుకొని, ఆ గ్లాసు నీటిని పశువులు త్రాగునీటి తొట్టిలో కలిపి అన్ని పశువుల చేత ఆ తొట్టిలోని నీటిని త్రాపాము. అన్ని పశువులు నీరు త్రాగిన తర్వాత పశువులన్నిటిని బయటకు వదలడము జరిగినది. అప్పటినుండి ఒక నెల రోజులు, గాలికుంటు వ్యాధి ఆ ఊరిలో అన్ని పశువులను బాధించినా, ఆ ఇంటిలోని పశువులకు మాత్రము రాలేదు. ఊరిలో అన్ని పశువులకు రోగము సోకడము, ఆ ఇంటి పశువులకు మాత్రము ఆ రోగము రాకుండపోవడము, ఊరిలోని వారికి ఆశ్చర్యమును కలిగించింది. అయినా నేను చేసిన విధానము ఎవరికీ చెప్పకూడదని ఆ ఇంటివారికి ముందే చెప్పాను. కాబట్టి ఆ ఇంటివారు కూడ ఆ విషయము ఎవరికీ చెప్పలేదు. జ్ఞానము బయటికి తెలియాలని అర్జునుడు అడగకున్నా కృష్ణుడు సందర్భము వచ్చింది కాబట్టి జ్ఞానమును చెప్పాడు. అలాగే ఆ ఇంటివారికి జ్ఞానము తెలియాలని వారు జ్ఞానమును అడుగకున్నా సందర్భము వచ్చింది కాబట్టి జ్ఞానసంబంధ వైద్యమును చేశాను. ద్వాపరయుగములో ఆ రోజు యుద్ధము అయిపోతూనే కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అర్జునుడు మరచి పోయినట్లు, ఈ కాలములో వారి అక్కర తీరిపోతానే నేను చేసిన వైద్యమును వారు మరచిపోయారు. పైగా నేను చేసింది మంత్రవైద్యము అనుకొన్నారు, నన్ను మంత్రగాడు అనుకొన్నారు.


ఎవరు ఏమనుకొన్నా నేను ఒక యోగిగా గాలికుంటు రోగమును పశువులు త్రాగిన నీటిద్వారా ఆదేశించాను, నేను గ్లాసులో నీటిని తెప్పించు కొన్నపుడు ఆ నీటిలోగానీ, తొట్టిలోని నీటిలోగానీ ఏమీలేదు. అన్నీ సర్వ సాధారణముగా ఉన్నవే. గ్లాసులోని నీటిలో, నా చూపుడు వ్రేలుని ముంచినపుడు నేను రోగమునకు ఇచ్చిన సంకల్పము నీటిలో చేరిపోయింది. నాతలలోని సంకల్పము వెన్నుపాము ద్వార (బ్రహ్మనాడి ద్వార) ప్రయాణించి కుడిచేయి చివరివరకు, నరముల ద్వారా చేరి హస్తములోని చూపుడు వ్రేలు గుండా గ్లాసులోని నీటిలోనికి చేరింది. ఆ నీటిని తొట్టిలోని నీటిలో కలిపిన దాని ద్వారా తొట్టిలోని నీరంతా నా సంకల్ప ఆదేశము ప్రాకిపోయినది. ఆ నీరును త్రాగిన పశువుల శరీరములలోనికి, నేను గాలికుంటు రోగమునకు చెప్పిన మాట చేరిపోయినది. గాలికుంటు క్రిమి ఆ పశువుల వద్దకు వచ్చినపుడు, అప్పటికే పశువు శరీరములోనున్న సందేశము ఆ క్రిమికి చేరగా, ఆ క్రిమి ద్వారా గాలికుంటు భూతముకు చేరినది. అప్పుడు రోగమనుబడు ఆ భూతము నా మాటను గౌరవించి, నా సంకల్పమున్న ఏ పశువులోనికి చేరకూడదనుకొన్నది. అలా ఆ భూతము అనుకోవడము వలన, ఆ రోగక్రిములు ఆ పశువులను వదలి ప్రక్కకు పోయేవి. మనకు కంటికి కనిపించని ఇంత తతంగము జరిగింది. కావున గాలికుంటు రోగము ఆ ఇంటి పశువులకు మాత్రము రాలేదు. ఒక నెల రోజులు గాలికుంటురోగము, ఆ ఊరిలో ఉండి తర్వాత అన్ని పశువులను వదలి పోయినది. నేను చేసిన విధానము అప్పుడు ప్రత్యక్షముగ అక్కడున్న వారికి చెప్పినా వారి బుర్రకెక్కలేదు. కానీ నేను మంత్రములను గురించి చెప్పకున్నా, నా మంత్రమువలన వారి పశువులకు రోగము రాలేదనుకొన్నారు.


ఇక్కడ ఒక విచిత్రము జరిగినది. అదేమనగా! ఆ ఊరిలోనికి వచ్చిన గాలికుంటు రోగము నెలరోజుల తర్వాత పూర్తిగా పోయినదని చెప్పాము కదా! ఆ రోగము పోయిన తర్వాత దాదాపు ఒక నెల రోజులు ఆ ఊరిలోని పశువులన్ని ఆరోగ్యముగా ఉండేవి. అలా ఆరోగ్యముగా ఉన్న నెలరోజులు తర్వాత, తిరిగి గాలికుంటు వ్యాది ఆ ఊరిలోనికి వచ్చి ఒక్కొక్క పశువు అనారోగ్యము చెందినది. రెండవమారు దాదాపు ఊరిలోని పశువులన్నిటికి ఆ రోగము వచ్చినది.


---

అప్పుడు మొదట రోగము రాని ఆ ఇంటి పశువులకు కూడ గాలికుంటు వచ్చింది. అలా వచ్చిన రోగము కొన్ని రోజులుండి పోయింది. అప్పుడు నాకు బంధువులుగా ఉన్నవారు వచ్చి, అప్పుడు రాని రోగము ఇప్పుడెందుకు వచ్చింది అని అడిగారు. ఈ ప్రశ్న వారికేకాదు, ఎవరికైనా వస్తుంది. దానికి మా జవాబు ఏమనగా! చిన్న ఉదాహరణతో అర్థమగులాగున వివరిస్తాను. నేను మల్లయ్య అనే బిలకలెక్టర్కు డబ్బులిచ్చి ఒక పనిని చెప్పాను. నేను డబ్బులిచ్చానను గౌరవముతో ఆ వ్యక్తి నా పనిని చేసిపెట్టాడు. తర్వాత అతను పోయి అతని స్థానములోనికి ఎల్లయ్య అనే బిల్కలెక్టర్ వచ్చాడు. ఇద్దరు బిల్ కలెక్టర్ అయినా, ఇద్దరూ ఒకే పనిని చేసినా, ఎల్లయ్య నా పనిని చేయడు. మొదట మన పని అయింది కదా, ఇప్పుడెందుకు కాలేదు అంటే, మొదట ఉన్నవాడు మల్లయ్య, మల్లయ్యతో నేను మాట్లాడి డబ్బులిచ్చాను, కాబట్టి నా పనిని చేసి పెట్టాడు. తర్వాత వచ్చిన ఎల్లయ్యతో ఏమాత్రము నాకు సంబంధము లేదు, నేను అతనికి తెలియదు. అతనికి నేను ఏ పనిని చెప్పలేదు. అటువంటపుడు ఎల్లయ్య నా పనిని ఎందుకు చేయును? ఏమాత్రము చేయడు. అదే విధముగ నేను రోగమును రావద్దని ఆదేశించినది మొదట వచ్చిన గాలికుంటు రోగమును. నేనిచ్చిన 'జ్ఞానశక్తి' అను ఆదేశానుసారము అప్పుడు ఆ రోగము ప్రవర్తించినది. నేను చెప్పిన పనిని నెరవేర్చినది. దానివలన అప్పుడు పశువులకు రోగము రాలేదు. తర్వాత రెండవమారు వచ్చినది గాలికుంటు రోగమే అయినా, రెండవమారు వచ్చిన రోగమునకు నేను ఎవరో తెలియదు. నా ఆదేశము ఏమీ, ఆ రోగమునకు నేను చెప్పలేదు. రెండవమారు వచ్చిన రోగము, మొదట వచ్చిన రోగము రెండు ఒకే పనిని చేయుచు, ఒకే పేరుకల్గియున్నా, నేను చెప్పినది మొదటి రోగమునకేగానీ, రెండవమారు వచ్చిన రోగమునకు కాదు. అందువలన రెండవమారు వచ్చిన గాలికుంటు రోగము, తన పనిని తాను నిర్వర్తించి అన్ని పశువులకు రోగము ప్రాకునట్లు చేసినది. దీనినిబట్టి ఉపభూతములు అనేకము అని చెప్పినట్లు, ఒకే పని విధానమున్న, ఒకే పేరుకల్గిన ఉప భూతములు వేరుగా ఉన్నవని పై సంఘటన ద్వారా తెలియుచున్నది.



ఇదంతా విన్న తర్వాత కొందరు హేతువాదులుకానీ లేక కొందరు నాస్తికవాదులుకానీ ఈ విధముగా ప్రశ్నించవచ్చును. అదేమనగా! "మీ ఆజ్ఞవలన లేక మీ సంకల్పము వలన మీరు చెప్పినట్లు రోగము మీమాట వినినదని చెప్పారు. ఆ విధముగ ప్రత్యక్షముగ జరిగినదని చెప్పారు. అటువంటి విధానము ఎక్కడైనా, ఎవరివద్దనైనా భూమిమీద ఉంటే లేక మీ వద్దయినా ఉంటే, రోగమును మీరు శాసించవచ్చును కదా! ఇంతమంది డాక్టర్లు, ఆస్పత్రులు అవసరము లేదుకదా! కట్టుకథలు చెప్పి ప్రజలను మోసము చేయడము తప్ప, ఇందులో సత్యములేదని మేమంటున్నాము. రోగమును, మందులు లేకుండ మంత్రములతో నయము చేయలేరు, మాటలతోను బాగుచేయలేరు. మీరు చెప్పిన మాటలతో రోగములు నయమైపోతే, మీకు నెలకు పదిలక్షల రూపాయలు ఇస్తాము. మీరు ఏ పనిచేసిన అంత డబ్బులు ఎవ్వరూ ఇవ్వరు. మేము పెద్ద మొత్తము పది లక్షలు ఇస్తాము, ఊరకనే కూర్చొని వచ్చిన ప్రజలకు రోగములు పోయేటట్లు చెప్పండి. ఈ నియమానికి ఒప్పుకుంటారా? లేక మీరు చెప్పినవన్నీ భూటకము, అబద్దము అని ఒప్పుకుంటారా” అని మాకు సవాల్ విసర వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాకు అల్లోపతి వైద్యము తెలుసు, హెూమియోపతి వైద్యము తెలుసు. అందరు చేసినట్లు నేను డాక్టరువృత్తి చేసి డబ్బు సంపాదించుకోవచ్చును. అంతేకాక నేను జ్యోతిష్య శాస్త్రమును ఉత్తమపద్ధతిలో వ్రాసినవాడిని, అనగా ఇప్పుడున్న జ్యోతిష్యులకంటే జ్యోతిష్యము బాగా తెలిసినవాడిని. జ్యోతిష్యమును అందరికంటే బాగా చెప్పితే ఎంతైనా డబ్బులు సంపాదించవచ్చును. ఇవియేకాక ఎన్నో పనులలో నైపుణ్యత కలిగినవాడిని. అయినా నేను ఏ పనీ చేయలేదు. జ్యోతిష్యము తెలిసినా జ్యోతిష్యమును చెప్పలేదు. అల్లోపతి వైద్యము తెలిసినా డాక్టర్ వృత్తి చేయలేదు. మా నాన్న రైల్వేసర్వీస్లో చనిపోయిన దానివలన నాకు రైల్వేలో ఉద్యోగము వచ్చినా, నేను ఆ ఉద్యోగానికి పోలేదు. డబ్బుల కొరకు ఆశించేవాడినైతే, డబ్బు సంపాదన పని, నేను ఏదీ ఇంతవరకు


---

చేయలేదు. ఒకప్పుడు యుక్తవయస్సులో మిలిటరీలో మంచి ఉద్యోగమును చేసేవాడిని. అప్పుడు నా మనస్సు ఆధ్యాత్మికమువైపు మరలిన వెంటనే ఆ ఉద్యోగమును కూడ వదలుకొన్నాను. నేను ఇప్పటికి నలభైసంవత్సరము లుగా ఆధ్యాత్మికములో, ఎంతో పరిశోధన చేసి కొంతైనా నేర్చుకోగలిగాను. డబ్బు విషయానికి వస్తే అది కర్మనుబట్టి వస్తుందని నాకు బాగా తెలుసు. ఎప్పటికీ నేను దానిని గురించి చింతించలేదు. నా చింతనంతా దైవము మీదనే కలదు.


ఇక మీరడిగిన ప్రశ్నకు జవాబును వివరముగా చెప్పాలంటే, ఒక ఉదాహరణను చూస్తాము. గరీబ్ అనే ఒకడు మగ్గము మీద చీరలు నేయుచున్నాడు. నెలకు పది చీరలు తయారుచేసి 'నవాబ్' అను ఒక ధనికుడైన వ్యాపారస్తునికి ఇస్తాడు. అలా ఇచ్చిన చీరలకు బదులుగా కొంత డబ్బును ఆ ధనికుడు చీరలు తయారుచేసిన వానికి ఇస్తాడు. నవాబ్ ఇచ్చిన డబ్బుతో గరీబ్ బ్రతుకగల్గుచున్నాడు. గరీబ్ జీవితము సాఫీగా సాగాలంటే నవాబ్కు చీరలు నేసి ఇవ్వవలసిందే. ఆ విధముగ గరీబ్ నిత్యము చీరలు నేయడము చేస్తున్నాడు. ఒక దినము గుడ్డలు లేకుండ చలికి బాధపడు నసీబ్ అనే వానిని చూసి, తనకు వచ్చు ఆదాయము కొంత పోయినా పరవాలేదు, చలికి బాధపడువాని బాధను ఒక చీరనిచ్చి తీర్చాలనుకున్నాడు. తన ఆదాయము పోతుంది అని తెలిసినా, ఎదుటి వాని బాధను పోగొట్టుటకు తన ఆదాయమును లెక్కచేయక వదలివేసి, ఒక చీరను గుడ్డలు లేకుండ చలికి వణుకుచున్న నసీబు ఇచ్చాడు. అంతవరకు చలికి బాధపడుచున్న వానికి, చీర లభించగానే చలి బాధపోయింది. చీరను కప్పుకొని హాయిగా ఉన్నాడు. నసీబ్ అను వాని బాధనివారణ కొరకు గరీబ్ ఒక చీర ఆదాయమును పోగొట్టుకున్నాడు. గరీబ్ అనే వ్యక్తి, నసీబ్ అనే వ్యక్తికి చీరనివ్వడము వలన నసీబు చలి బాధ పోయింది, అని చూచిన వ్యక్తులు చెప్పితే, దానిని వినిన కొందరు మోటువాదులు చీరవలన చలి బాధపోదు, దుప్పటి వల్లనే పోతుంది, చీరవలన పోతుంది అనడము అబద్దము అన్నారు. ప్రత్యక్షముగ చూచిన వ్యక్తులు “చీరవలనే అతని చలిబాధ పోయింది, మేము ప్రత్యక్షముగా చూచాము” అని చెప్పారు. అప్పుడు మోటువాదులు ఇలా అన్నారు. "గుడ్డలు లేకుండ చలితో బాధపడేవారు దేశములో చాలామంది ఉన్నారు. వారందరికి ప్రతి దినమూ చీరలిచ్చి చలిబాధనుండి విముక్తి చేస్తే, మేము నెలకు పది మూటలు వజ్రాలరాళ్ళు ఇస్తాము” అన్నారట.


మొరటుగా మాట్లాడే మోటువాదులు చెప్పిన విషయమును కొందరు గరీబ్కు చెప్పారట. ఆ మాటకు గరీబ్ నవ్వి నేను నవాబ్కు చీరలునేసి ఇచ్చి నేను పడిన శ్రమకు కూలిగా నవాబ్నుండి చీరకు వందరూపాయలు డబ్బులు తీసుకొంటున్నాను. ఆ డబ్బులతో నేను సుఖ జీవనము సాగించు చున్నాను. నేను చీరలను తయారుచేసి నవాబ్కు ఇవ్వకపోతే, నాకు నవాబ్ డబ్బులివ్వడు దానివలన నా జీవనము సుఖముగా కాకుండ దుఃఖముగా సాగును. గరీబ్ నేసిన నవాబ్ చీర చలిబాధను పోగొట్టునని అందరికి తెలుపుటకు, తర్వాత ఎదుటి వాని బాధను పోగొట్టుటకు ఒక చీరపోయినా పరవాలేదు, ఆ ఒక చీరవలన నాకు వంద రూపాయలే కదా నష్టము అనుకొని ఇచ్చాను. దేశములో ఎందరో గుడ్డలులేని వారుంటారు. వారందరికి గుడ్డలు ఇవ్వాలి అంటే నేను పస్తుండాలి. ఆకలితో గుడ్డలు లేనివారికంటే నేనే ఎక్కువ బాధపడవలసి వస్తుంది. “తనకు మాలిన ధర్మము మొదటికి చేటు” అని పెద్దలన్నట్లవుతుంది. పైగా నేను చీరలను నిత్యము నేసి, నిత్యము గుడ్డలులేని వారికి ఇస్తే మోటువాదులు నాకు ఇచ్చేది పది మూటల వజ్రాల రాళ్ళు. వాటిని తీసుకొని నేనేమి చేయాలి. ఆ వజ్రాలు నాకు ఉపయోగపడవు. వజ్రాలను తీసుకొని పోయి అమ్మినా ఎవరూ తీసుకోరు. ఒకవేళ ఎవరైనా తీసుకొన్నా, వారి డబ్బులు మా అంగడిలో తీసుకోరు, సరుకులు ఇవ్వరు. కావున నేను


--

నేసిన చీరలను ఇతరులకు దానముగా ఇవ్వడమెందుకు? నేను దానమిస్తే ఎవరో నాకు అక్కరకు రాని వజ్రాలివ్వడమెందుకు? నేను నేసిన చీరను మా నవాబ్కు ఇస్తే, మా నవాబ్ ఇచ్చు డబ్బులు నాకు సుఖమునిస్తాయి. అందువలన నవాబ్కు నాకు ఉన్న సంబంధము తెగిపోకుండా ఉండాలంటే, నాకు వజ్రాలిస్తామన్నా వాటికి నేను ఆశపడకూడదు. నాకు నవాబ్ నెలకు ఇచ్చే వెయ్యిరూపాయలే సుఖాన్నిస్తాయి, ఇతరులిచ్చే వజ్రాలు దుఃఖానిస్తాయి అన్నాడు.


ఇది ఉదాహరణకు చెప్పిన విషయము కావున, దీనిలోని విషయము లను అర్థము చేసుకోవలసిన పని ఉన్నది. ఈ కథను వివరించుకొని చూస్తే, గరీబ్ అను నేతగాడు ఒక యోగి అని అనుకుందాము. యోగి చేయు యోగమును గరీబ్ నేయు చీరలుగా పోల్చుకుందాము. చీరల వలన వచ్చే డబ్బును, యోగము వలన లభించే జ్ఞానశక్తిగ లెక్కించుకొందాము. గరీబ్ నేసిన చీరలకు డబ్బులిచ్చు నవాబ్ను దేవునిగా లెక్కించు కుందాము. ఇప్పుడు దీనినంతటిని కలిపి చూస్తే, ఒక యోగి తాను నిత్యము యోగమును చేయడము వలన, ఆ యోగమునకు ఫలితముగా దైవమునుండి యోగికి జ్ఞానశక్తి లేక జ్ఞానధనము అనునది లభించును. నవాబ్ చీరలకు ఇచ్చు డబ్బుతో గరీబ్ సుఖజీవనము సాగించుచున్నాడు. అనగా యోగమునకు వచ్చు జ్ఞానశక్తి చేత యోగి కర్మలు కాలిపోవును, కర్మలను యోగి అనుభవించడు, కావున నవాబ్ ఇచ్చు డబ్బుతో గరీబ్ సుఖజీవనము సాగించుచున్నాడు అని చెప్పారు. గరీబ్ గుడ్డలు లేక చలికి బాధపడువానికి తను నేసిన చీరను ఇచ్చాడు, దానివలన వానికి చలి బాధ పోయింది,అనగా యోగి, రోగమును అనుభవించు వాని కర్మను తన యొక్క యోగము చేత లేకుండ చేశాడని అర్థము. కర్మలచేత బాధపడు కర్మ జీవులు దేశములో ఎందరో ఉన్నారు. కావున వారిని గుడ్డలులేక బాధ పడువారు చాలామంది ఉన్నారని పోల్చి చెప్పారు. గుడ్డలు లేని వారందరికి గుడ్డలు ఇవ్వమని చెప్పిన మోటువాదులను రోగమున్న వారందరిని తమ శక్తి చేత బాగు చేయమని అడిగిన హేతువాదులుగా చెప్పవచ్చును. మందులు లేకుండ, మాటలచేత రోగములను లేకుండా చేస్తే వజ్రాలమూటలు ఇస్తామన్నారు కదా! ఆ వజ్రాల మూటలను ప్రపంచ డబ్బుగ పోల్చి చెప్పవచ్చును. ప్రపంచ డబ్బు యోగికి మోక్షము నివ్వదు. కావున గరీబ్ వారి వజ్రాల వలన నాకు సుఖములేదు, నా ఆకలి తీరదు అన్నాడు.



ఈ కథ యొక్క వివరమును చెప్పుకొంటే ఒక (గరీబ్ అను) యోగి నిత్యము యోగము చేయుచుండుట వలన యోగము యొక్క ఫలితము యోగశక్తి లేక జ్ఞానాగ్ని దైవము నుండి లభించును. ఆ విధముగా లభించిన జ్ఞానాగ్ని వలన. తన కర్మలను కాల్చుకొని, యోగి ఏ కర్మ అనుభవించ కుండునట్లు చేసుకొనును. ఎవడైన బాధపడుచున్నపుడు జ్ఞానాగ్నికి కర్మలను కాల్చుశక్తి ఉన్నదని నిరూపణగా చూపించుటకు తన జ్ఞానాగ్ని చేత ఎదుటి వాని కర్మను కాల్చివేయును. అట్లు ఒకమారు ఇతరుల కర్మను కాల్చివేసిన, తన అగ్ని తనకు ఉపయోగపడక ఇతరులకు ఉపయోగపడడము వలన అక్కడ కొంత జ్ఞానశక్తిని యోగి కోల్పోయినట్లే అగుచున్నది. ఒక రోగి యొక్క రోగమును, తన మాటచేత శాసించినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే యోగియొక్క యోగశక్తి లేక జ్ఞానాగ్ని కొంత నష్టమై పోవుచున్నది. ఒక్క రోగిని రోగమునుండి విముక్తి చేయుటకు వాని కర్మను కాలిపోవునట్లు చేయాలి. అలా చేయుటకు కొంత అగ్ని వృథా అయిపోవు చుండగా, అనేకమంది రోగులను బాగుచేయాలంటే యోగి తనకున్న శక్తినంతటిని కోల్పోవును. అలా చేయడము బూడిదలో పన్నీరును పోసినట్లవుతుంది. అనేకమంది రోగులను యోగి తన మాటచేత బాగుచేస్తే హేతువాదులు ఇచ్చేది కొన్ని కోట్లరూపాయలైన అది ప్రపంచధనమే అగును. వారు ఇచ్చిన అర్థగంట తర్వాత చనిపోయిన, అది ఒక్క రూపాయి కూడ వెంటరాదు. యోగికి కావలసినది జ్ఞానధనము, ప్రపంచ ధనముకాదు. అందువలన హేతువాదులు, నాస్తికవాదులు ప్రపంచ ధనమును ఆశ చూపితే దానికి ఆశపడి యోగులు పని చేయరు. యోగుల ఉద్దేశము, వారి


---

పని మోక్షము కొరకు, జ్ఞానశక్తి కొరకు ఉంటుంది. ప్రపంచ పేరు ప్రఖ్యాతుల మీద కానీ, ప్రపంచ ధనముమీద కానీ ఏమాత్రముండదు. యోగులు ఎప్పటికీ రోగములను బాగుచేయు వైద్యులుకారు. యోగులకు, వైద్యులకు ఎంతో ' వ్యత్యాసము కలదు. యోగులు వైద్యుల స్థాయికి దిగజారి పోరు. ఎక్కడైనా, ఎవరి రోగమునైనా వారు నోటి మాటతోగానీ, చేతి స్పర్శతోగానీ, కంటి చూపుతోగానీ బాగుచేస్తే అది జ్ఞానాగ్నికి ఎటువంటి శక్తి ఉందో తెలుపుటకే గానీ, వైద్యముకాదని

తెలియాలి.


పూర్వము కొందరు పెద్దలు, ఎవరి రోగమును లేకుండ చేసినా, అది వైద్య విధానము కాకుండ జ్ఞాన ప్రచార విధానముతోనే చేశారు. ఒక యోగి ఎక్కడైనా ఒక రోగమును పోగొట్టితే, రెండవమారు అటువంటి పనిని చేయడు. ఒకనికి రోగము పోయినదని తెలిసి, అటువంటి రోగులు కొందరు అతి వినయమును ప్రదర్శిస్తూ, మాకూ నయము చేయండని ప్రాధేయపడినా, యోగి వారి అభ్యర్థనలను అంగీకరించడు. యోగి అయిన వాడు జ్ఞానమార్గమునుండి తప్పిపోకుండ జాగ్రత్తపడుచు నడుచుకొనును. అందువలన యోగి, రోగి విషయములను పట్టించుకోడు. హేతువాదులు లక్షల డబ్బులు ఇస్తాము మాకు చేసి చూపించండి అంటే, అలా చూపించే దానికి అది గారడి విద్యకాదు. దేవుడు నిర్మించిన చట్టము ప్రకారము ప్రకృతి ఆధ్వర్యములో జరిగే, జనన మరణములయందుగానీ, ఆరోగ్య అనా రోగ్యములయందుగానీ, సుఖ దుఃఖములయందుగానీ యోగి ఎప్పటికి తల దూర్చడు. దేవుని చట్టము ప్రకారము జ్ఞానశక్తికి లేక జ్ఞానాగ్నికి కర్మల మీద ఇటువంటి శక్తి ఉందని తెలుపు నిమిత్తము సమయమును, సందర్భమును చూచి అరుదుగా రోగముల విషయములోగానీ, మరణము విషయములోగానీ, దుఃఖముల విషయములోగానీ, యోగి జోక్యము చేసుకొని, జ్ఞానశక్తి యొక్క విలువ తెలియునట్లు చేయును.


రోగములను గురించి ఇంతవరకు కొన్ని విషయములనే తెలుసు కొన్నాము, మనకు తెలియని విషయములు ఇంకా ఉన్నవి. రోగములు భూమిమీదనే మనుషులలోను, జంతువులలోను, పక్షులలోను, భూమి నుండి పుట్టు వృక్షములలోను చేరుటయేకాక, సముద్రగర్భములోనున్న అనేక జీవ రాసులను బాధించుచున్నవి, చంపుచున్నవి. రోగము జీవుడే అయినా రోగమును, భూతము అను పేరుతోనే పిలుస్తున్నాము. భూతము ఒక జీవుడు, మరొక జీవున్ని బాధించడము, చంపడమును దేవుడు రచించిన చట్టమని చెప్పవచ్చును. అది ఎక్కడ జరుగుచున్నదో దానినే యమలోకము అంటున్నాము. దీని ప్రకారము మనము నివసించు భూమండలమే యమ లోకము! రోగములే ఒకరకమైన యమకింకరులు! రోగములే కాక మిగత రకములైన యమకింకరులు కూడ కలరు. రెండవ రకమైన యమకింకరులను గురించి చెప్పుకుంటే రోగము మాదిరి మేఘము కూడ ఒక భూతమే! ఒక రోగము భూమిమీద కొంతకాలము కనిపించి, కొంతకాలము ఏమాత్రము కనిపించకుండ పోతుంది. అలాగే ఒక మేఘము కూడ కొంతకాలము కనిపించి, కొంతకాలము కనిపించకుండ పోవును. రోగమునకు, మేఘమునకు కొన్ని విషయములలో దగ్గర పోలికలున్నా రోగముకంటే మేఘము కొంత గొప్పదనియే చెప్పవచ్చును. ఎందుకనగా రోగమునకు వైద్యమున్నది. వైద్యము ద్వారా రోగమును మనిషి అణిచి వేయవచ్చును. కానీ మేఘము వైద్యమునకు గానీ, మరి ఏ ప్రపంచ విధానమునకుగానీ లొంగునదికాదు. రోగము తన ఉనికి తెలియకుండ వంద లేక రెండువందల సంవత్సరములైన అణిగి ఖగోళములో నివశించును. మేఘములు రోగములవలె అంత దీర్ఘకాలము కనిపించకుండాపోవు. రోగము కొంత ప్రదేశములో వ్యాపించుటకు కొన్ని దినముల కాలము పట్టును. కానీ మేఘము కొన్ని నిమిషములలోనే కొంత ప్రదేశమంతటా వ్యాపించును. ఒక రోగము కొన్ని కోట్ల క్రిముల సముదాయమనిచెప్పుకొన్నాము. ఆ క్రిములను మైక్రోస్కోపుల ద్వారా ప్రత్యక్షముగా, స్థూలముగా


---

చూడవచ్చును. ఆ క్రిముల ఆకారమును గుర్తించవచ్చును. అయితే మేఘములకు అటువంటి క్రిమిసముదాయముండదు. ఏ స్కోపుల ద్వారా మేఘములలోని స్థూలత్వమును చూడలేము. రోగము చేతిలో పడిన మనిషినిగానీ, జంతువునుగానీ, నీటిలోని చేపనుగానీ చూడవచ్చును. కానీ మేఘము చేతిలో పడిన మనిషినిగానీ, జంతువునుగానీ, చేపగానీ ఏదీ కనిపించకుండ పోవును. మేఘము వదలినప్పుడు తిరిగి కనిపించును. రోగమునకు కొన్ని కోట్ల క్రిములుంటే, మేఘమునకు కొన్ని కోట్ల చేతులున్నవి. ఇలా రోగమునకు, మేఘమునకు ఎన్నో తేడాలున్నవి. ఇపుడు రోగముకంటే అన్ని విధముల గొప్పదైన మేఘమును గురించి తెలుసుకొందాము.


మేఘము ఒక భూతము అనుమాట కొందరికి విచిత్రముగా, విడ్డూరముగా కనిపించినా, మామాట నూటికి నూరుపాళ్ళు సత్యము. మేఘము అను భూతము లేక జీవుడు, దేవుని పరిపాలన విభాగములోని వాడే కావున, మేఘమునకు ప్రకృతినుండి వచ్చు ఆజ్ఞను ఆచరించడము మేఘము యొక్క కర్తవ్యము. ప్రకృతినుండి వచ్చు ఆజ్ఞను బట్టి చేయవలసిన పని ఎంత భయంకరమైనదైనా, ఎంత కూరత్వముతో కూడుకొన్నదైనా మేఘము చేసి తీరును. దేవుని చట్టమును అనుసరించి ప్రకృతినుండి వచ్చు ప్రతి ఆజ్ఞను నెరవేర్చడము మేఘము యొక్క విధి విధానము. భూమిమీద రోగములు ఎన్నో రకములున్నట్లు, ఖగోళములో కూడ మేఘములు ఎన్నో రకములున్నవి. చాలామందికి మేఘము అంటే వర్షము కురుయునదని మాత్రము తెలుసు. మేఘము వర్షించడమేకాక, మిగత ఎన్నో పనులను కూడ చేయుచున్నదని తెలియదు.


ఆకాశములోని మేఘమునకు ఒక రూపము ఉండదు. ఒక మేఘము అనేక రూపములను మార్చుకొనును. అంతేకాక మేఘము తెలుపు, నలుపు, ఎరుపు రంగులను మార్చుకొనును. మేఘము యొక్క ఆకారము ఏమాత్రము కనిపించకుండ అదృశ్యమైపోవును. అలా అదృశ్యమైన మేఘము తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపించగలదు. అదృశ్యములోనున్న మేఘము, మొదట చిన్న ఆకారముతో అర్ధ అంగుళము పరిమాణమునుండి మొదలై దాదాపు 20 లేక 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము వరకు తన ఆకారమును పెంచుకొనును. ఈ విధముగ ఆకారము పెరిగిన మేఘము, ఎంతో బలము కలిగినదై, ఎన్నో చేతులు కలిగినదై ఉండును. కొన్ని కోట్ల చేతులు కలిగియున్న మేఘము, పరిమితము లేని బలము కలిగి, ఎంతటి బరువునైన మోయగల స్థోమత కల్గియున్నది. ఆకాశములో మేఘములు ఎన్నో గలవు. ఒక్కొక్క మేఘము కొన్ని లక్షల, కొన్ని కోట్ల టన్నుల బరువును మోయగల శక్తి కల్గియున్నది. మేఘము భూమిమీద నీటిని సూక్ష్మముగా కంటికి కనిపించకుండా తీసుకోగలదు. ఎక్కడైనా అరుదుగా మనిషి కంటికి కనిపించే విధముగా కూడ నీటిని మేఘము తీసుకొనును. మేఘము ఒక్క నీటినేకాక నీటిలోని చేపలను, తాబేళ్ళను కూడా పైకి తీసుకొని పోగలదు. కొన్ని చోట్ల మనుషులను, జంతువులను పైకి తీసుకొని పోయినట్లు చరిత్రగలదు. ఈ మధ్య కాలములో 118 మంది మనుషులను, కొన్ని జంతువులను ప్రత్యక్షముగా పైకి తీసుకొని పోయి వారిని క్రింద పడవేయడము, వారు చనిపోవడము జరిగినట్లు ఆంధ్రయూనివర్శిటిలో మేఘములను గురించి పరిశోధన చేయు ఒక ప్రొఫెసర్ చెప్పగా విన్నాము. మేఘములకు కనిపించని ఎన్నో చేతులున్న దానివలన ఎవరినైన, దేనినైనా పైకి తీసుకొని పోగలవు. పైకి తీసుకొని పోయిన వారిని క్షేమముగా భూమిమీదకు తీసుకవచ్చి వదలగలవు. లేకపోతే పై నుండి క్రిందపడవేసి చంపగలవు. మేఘము నీటితో సహా చేపలను తీసుకొని పోతే వాటిని క్షేమముగా, ఒక్క చేపకు కూడ దెబ్బతగలకుండ భూమికి దగ్గరగా తీసుకువచ్చి వదలుచున్నవి. పై నుండి క్రిందపడినట్లు మనకు ప్రత్యక్షముగా కనిపించినా చేపలు చనిపోకుండ క్రిందపడును.


--

మేఘము కొన్ని సమయములలో అరుదుగా మనకు కనిపించే విధముగా భూమిమీద నుండి దేనినైనా తీసుకుపోగలదు. ఉదాహరణకు స్థూలముగా కనిపించు చేపలను నీటితో సహా మేఘము పైకి తీసుకొని పోయినపుడు మేఘము యొక్క చేతులలో నీరు, చేపలు అన్ని ఉండును. మేఘము యొక్క చేతులు ఎవరికి కనిపించునవి కావు. అందువలన మేఘము చేతులలోనికి పోయిన నీరుగానీ, చేపలుగానీ కనిపించకుండ పోవును. మేఘము తీసుకొని పోయిన నీరుగానీ, చేపలుగానీ, తాబేళ్ళు కానీ పైన మేఘములలో అదృశ్యముగా ఎవరికి కనిపించకుండ ఉండి పోవును. అందువలన ఒక మేఘములో ఎన్ని నీళ్ళున్నది ఎవరు చెప్పలేరు. అలాగే ఇంకా ఏదైనా మేఘములో ఉండినా అది కూడ తెలియ బడక అదృశ్యరూపములో ఉండును. అదృశ్యరూపములోనున్న చేపలను ఒక దినముగానీ, అంతకంటే ఎక్కువ కాలముగానీ మేఘము తన చేతులలో ఉంచుకోగలదు. అయినా అంతకాలము ఉంచుకొను అవసరము మేఘమునకు లేదు. మేఘము తన చేతిలో ఉంచుకొన్న వాటిని కొన్ని కిలోమీటర్ల దూరము వరకు తీసుకొని పోయి, ఎక్కడ వదలాలని నిర్ణయముంటుందో అక్కడే వదులును. కొన్ని చేపలనుగానీ, కొన్ని జంతువులనుగానీ ఆఫ్రికాఖండమునుండి ఆసియాఖండమునకు, ఆసియా ఖండమునుండి ఐరోపాఖండమునకు తీసుకొని పోగలదు. కొన్ని వేల కిలోమీటర్ల దూరము పైన ఆకాశములో ప్రయాణించు మేఘము, ఒక ఖండమునుండి మరొక ఖండమునకు చేరుచున్నది. జంతువులను ఒక ఖండమునుండి మరొక ఖండమువరకు, ఒక ప్రాంతమునుండి మరొక ప్రాంతము వరకు తీసుకుపోగలదు. ఆకాశములో మేఘమునందు కనిపించకుండవున్న చేపలుగానీ, తాబేళ్ళుగానీ, పాములుగానీ మేఘము వర్షించునపుడు వాటిని క్రిందికి వదలును. కనిపించని మేఘము చేతులు చేపలు మొదలగువాటిని క్రిందికి తీసుకొని వచ్చినపుడు, దాదాపు వంద అడుగుల పైనుండి చేపలు మొదలగునవి దృశ్యరూపమై కనిపించను మొదలుపెట్టును.


మేఘము ఒక నీటినేకాక, నీటితో సహా చేపలను తాబేళ్ళను, పాములను తీసుకొని పోయి మరొక ప్రాంతములో, మరొక దేశములో వదలుట వలన అక్కడకి అవి మేఘము వలన రవాణా చేయబడినవని చెప్పవచ్చును. అలా రవాణా చేయబడుట వలన అక్కడలేని చేపల జాతిగానీ, తాబేళ్ళ జాతిగానీ, పాముల జాతిగానీ క్రొత్తగా అక్కడ కూడ కనిపించును. ఉదాహరణకు ఒక రోజు వార్తాపత్రికలో అరుదైన నక్షత్ర తాబేలు కర్నూలు జిల్లా 'అవుకు'లో కనిపించిందని వ్రాశారు. నక్షత్ర తాబేలుజాతి మన భారత దేశములో ఎక్కడాలేదనీ, ఆ జాతి తాబేలు ఆప్రికాఖండములో కలదని, ఈ దేశములో లేని తాబేలుజాతి, కర్నూలు జిల్లా అవుకుప్రాంతములో కనిపించడము ఆశ్చర్యమని వ్రాశారు. నాలుగైదు చిన్న నక్షత్ర తాబేళు ఎ) కనిపించినట్లు వ్రాశారు. నక్షత్ర తాబేళ్ళ ఫోటో కూడ అందులో ముద్రించారు. ఆ దినము అందరికి అది ఆశ్చర్యకరమైన వార్త అయినపుడు, దానిని అంతటితోనే వదలివేశారు. ప్రతి దానికి కనిపించే నిరూపణకావాలని వాదించే హేతువాదులు, ప్రత్యక్షముగా వ్రాసినవార్తను, ముద్రించిన తాబేలు బొమ్మను చూచి, ఇది అసత్యము. ఇక్కడలేని జాతి ఎలా వచ్చింది అని ఎందుకు ప్రశ్నించలేక పోయారో? మేధావులుగానీ, సామాన్యులుగానీ హేతువాదులుగానీ ఆ వార్తను చూచిన తర్వాత దేశములో ఎక్కడలేని జాతి ఉన్నట్లుండి ఇక్కడ ఎలా కనిపించింది? అని ప్రశ్నించుకోలేక పోయారు, దానిని గురించి ఆలోచించలేక పోయారు. మేధావుల ఆలోచనకు కూడ అవి లేని ప్రాంతములోనికి ఎలా వచ్చాయో, ఏ విధానము ద్వారా వచ్చాయో కూడ తెలియదు. దాని వెనుకనున్న సత్యమును తెలిస్తే మేఘముల ద్వారా వచ్చాయని ఎవరైనా ఒప్పుకోక తప్పదు.


ఒక్క తాబేళ్ళనేకాక, కొన్ని జాతుల పాములను, కొన్ని జాతుల చేపలను కూడ తెచ్చి, మరొక దేశములో, మరొక ప్రాంతములో వదలు చున్నవి. అందువలన వర్షము కురియునపుడు వర్షముతో సహా పాములు పడడము, చేపలుపడడము,


---

తాబేళ్ళుపడడము కొందరు ప్రత్యక్షముగా చూచిన వారున్నారు. అలాగే మేఘములు ప్రత్యక్షముగ నీటిని, నీటితో సహా చేపలను, కప్పలను ఒక చెరువునుండి తీసుకోవడము కొందరు ప్రత్యక్షముగ చూచారు. ఒక చెరువునుండి నీటినంతటిని మేఘము పీల్చుకోవడము ఫోటోతో సహా వార్తను ప్రచురించడము కూడ జరిగింది. ఈ మధ్యకాలములో మేఘము నీటిని తీసుకొంటున్న ప్రత్యక్షదృశ్యమని టి.విలలో కూడ ప్రసారము చేసి చూపించారు. మేఘము అరుదుగా దృశ్యరూపములో కనిపించే విధముగా ఎక్కడో ఒక చోట నీటిని ప్రజలకు దగ్గరగానున్న చెరువునుండి తీసుకొనుచున్నది. అలా చేయడము వలన మేఘములు నీటిని ఈ విధముగా తీసుకొంటున్నవని ప్రజలకు తెలియవలెనని దేవుడే ఆ విధముగా చేయించాడని అర్థమగుచున్నది. మనము తెలుసుకొనుటకు ఆధారముగా ఎక్కడో ఒకచోట ఉన్న సత్యమును, మనకు కనిపించే విధముగా చూపించినా మనిషి దానిని అర్థము చేసుకొను స్థితిలో లేడు. ఇప్పుడు ఉన్న సత్యమును విప్పి చెప్పినా, విజ్ఞానులమనుకొను కొందరు మా మాటలను హాస్యాస్పదము గా తీసుకొంటున్నారు. మా మాటను అసత్యము అంటున్నారు. మనుషులకు ఏ విధముగా తెలియని కొన్ని విషయములను, కొందరు ఏ విధముగానూ నమ్మని విషయములను, దేవుడు ప్రత్యక్షముగా ఎక్కడో ఒకచోట చూపించును. అప్పటికి సత్యమును గ్రహించలేని మనుషులు విజ్ఞానులవు తారా? మేధావులవుతారా?


మేఘములు నీటినిగానీ, నీటితో సహా కొన్ని జీవరాశులనుగానీ తీసుకొని పోవునను సత్యము ఎవరికీ తెలియదు కనుక, కొన్ని సంవత్సరము లకు ఒకమారు, ఎక్కడో ఒకచోట ప్రత్యక్షముగ కనిపించునట్లు దేవుడు చేయించాడు. దీని మాదిరే పునర్జన్మ విషయము కూడ! ఇది సత్యము అని చెప్పుటకు ఎటువంటి ఆధారము లేనిదానివలన దానిని కూడ కొన్ని సంవత్సరములకు ఒకమారు ఎక్కడో ఒకచోట అందరికి తెలియునట్లు, కొంత కాలము మాత్రము వెనుకటి జన్మ జ్ఞాపకము వచ్చిన వారిని దేవుడు కనిపింపజేయుచున్నాడు. ప్రత్యక్షముగా వెనుక జన్మ విషయములను చెప్పడమేకాక, చూపించడము జరిగినపుడు కూడ విజ్ఞానులము, మేధావులము అనువారు కొందరు, కనిపించే సత్యమును గ్రహించుకోలేని స్థితిలోవుండి, సత్యమును మూఢనమ్మకము అంటున్నారు. అటువంటివారు ప్రపంచ విధానములో ఎంత పెద్ద మేధావులు, విజ్ఞానులు అయినా, పరమాత్మ విధానములో వారి బుద్ధి, కనిపించే దానిని కూడ గ్రహించకోలేని బలహీనముగా ఉన్నదని తెలియుచున్నది. ఒక విధముగా ప్రపంచ విధానములో మేధావులుకానటువంటి సామాన్య ప్రజలే, దేవుని విధానమును అర్థము చేసుకొను బుద్ధి బలము కల్గియున్నారని చెప్పవచ్చును. ఇటువంటి రెండు రకముల మనుషులేకాక, మూడవరకము మనుషులు కూడ చాలా అరుదుగా ఉన్నారు. వారు ఇటు ప్రపంచ విధానములోను మేధావులే, అటు పరమాత్మ విధానములోను మేధావులే అయివున్నారు. ప్రపంచ విషయములో మేధావులైన ఒక రకమువారు భూమిమీద కొందరే ఉండగా ప్రపంచ విషయములో మేధస్సులేని రెండవరకము వారు, భూమిమీద ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే ప్రపంచ విషయములోను, పరమాత్మ విషయములోను రెండు విధముల మేధావులైన మూడవరకము వారు భూమిమీద బహు అరుదుగా ఉన్నారు. ఈ మూడు రకముల మనుషులలో దైవజ్ఞానము ప్రకారము చూస్తే, అరుదుగానున్న మూడవరకము వారు ఉత్తములు, ఎక్కువగానున్న రెండవ రకమువారు మధ్యములు, తక్కువగానున్న ఒకటవ రకమువారు అధములని చెప్పవచ్చును.


దేవుని జ్ఞానములో అధములై, ప్రపంచ జ్ఞానములో మేధావులైన వారు, సముద్రము నీరు ఆవిరై పైకిపోయి మేఘముగా ఏర్పడుచున్నదని చెప్పుచున్నారు. ఎండాకాలము సూర్యుని వేడికి సముద్రము మీద నీరు ఆవిరై పోతున్నదని ప్రపంచ విజ్ఞానులు చెప్పుచున్నారు. అయినా మేము ఆ మాటను విశ్వసించడము లేదు. ఎందుకనగా! ఒక లోహమును


---

సీసమును

కరిగించుటకు ఎంత వేడి, అవసరమవుతుందో, దానిని మెల్టింగ్ పాయింట్ డిగ్రీలు అని అంటారు. (లెడు) కరిగించుటకు ఎంత వేడి అవసరమో, దానికంటే ఎక్కువ వేడి రాగి లోహమును (కాపర్) కరిగించుటకు అవసరమగును. దీనినిబట్టి సీసము ఒక ఉష్ణోగ్రత వద్ద, రాగి మరొక ఉష్ణోగ్రత వద్ద కరుగుచుండుట వలన సీసముకు, రాగికి మెల్టింగ్ పాయింట్స్ డిగ్రీలు వేరువేరుగా ఉన్నాయని తెలిసింది. అలాగే నీరు ఆవిరి అగుటకు ఎంతవేడి అవసరమో, ఆ వేడిని బాయిలింగ్ పాయింట్ డిగ్రీలు అంటారు. ఇపుడు మనకు అవసరమైనది నీరు విషయము. కావున నీటి విషయమును చూస్తే నీరు నూరు (100) సెంటిగ్రేడ్ డిగ్రీలవద్ద మరిగి ఆవిరి అగును. అందువలన నీరు యొక్క బాయిలింగ్ పాయింట్ డిగ్రీలు వంద సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అని చెప్పవచ్చును. మన ఇంటిలో ఒక పాత్రలో నీరును నింపి, పోయ్యి మీదపెట్టి వందడిగ్రీల వరకు వేడిచేస్తే అప్పుడు నీరు ఉడికి (మరిగి) ఆవిరి అగుచున్నదని అందరికి తెలుసు. ఆకాశములో సూర్యుని వేడివలన సముద్రము నీరు ఆవిరై, పైకి పోయి మేఘములు ఏర్పడుచున్నవని చాలామంది చెప్పుమాటలో సత్యము లేదని తెలియుచున్నది. సముద్రము నీరు ఆవిరి అగుటకు వంద డిగ్రీల వేడి అవసరము కదా! అంతవేడి సూర్యుని నుండి రాలేదు. సూర్యుని నుండి వచ్చు వేడి ఎండాకాలము 40 నుండి 45 డిగ్రీల వరకు ఉండును. ఎప్పుడైన అరుదుగా 50 డిగ్రీల వరకు ఉండవచ్చును. నీరు ఆవిరి అగుటకు వంద సెంటిగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమైనపుడు, సూర్యుని నుండి వచ్చు 40 లేక 45 డిగ్రీల ఉష్ణోగ్రతకు నీరు ఆవిరైపోవు ప్రసక్తే లేదు. అందులన సూర్యుని వలన నీరు ఆవిరైపోతుందని, ఇంతవరకు మనము వినిన లేక చదువుకొన్న విషయము పూర్తి అసత్యమని తెలియుచున్నది.


ఇంత చెప్పినా "లేదు! సముద్రము నీరే ఆవిరై మేఘముగా తయారగు చున్నది. ఆ మేఘమునకు చల్లని గాలి తగిలినపుడు మేఘములలో ఆవిరి రూపములోనున్న నీరు చల్లనిగాలికి, నీరుగా మారి వర్షము పడుచున్నదని” మొండిగా వాదించు వారుండవచ్చును. అటువంటి వారిని మేము అనేక ప్రశ్నలు అడుగవలసి వచ్చును. ఆ ప్రశ్నలకు వారు మొండిగా, జవాబు కాని దానిని చెప్పడము తప్ప వేరు మార్గములేదు. సముద్రములో నీరుగానీ, ఒక డ్యామ్లో నీరుగానీ, చిన్న చెరువులో నీరుగానీ అన్నీ నీరే అగును. అన్నిటికి నూరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత బాయిలింగ్ పాయింట్ అగును. అటువంటపుడు చిన్న చెరువులోగానీ, పెద్ద డ్యామ్లోగానీ, అపారమైన సముద్రములోగానీ నీరు ఉ డికి (మరిగి) ఆవిరి అవడము ఎవరైనా చూచారా? ఎవరూ చూడలేదు, అది ఎక్కడ జరుగలేదు. సూర్యుని నుండి నూరు సెంటిగ్రేడ్ డిగ్రీల వేడి రానపుడు, నీరు ఆవిరి అగుటకు వీలులేదని ఎవరైనా చెప్పవచ్చును. నీరు భూమిలోనికి ఇంకిపోవచ్చును. కానీ ఆకాశములోనికి ఆవిరైపోదు. అలాగే గాలిలోనికి నీరు కలిసి గాలిలో తేమ ఏర్పడును. కానీ నీరు ఆవిరై గాలిలో కలిసిపోలేదు. బండలమీద నీరుగానీ, తేమగానీ గాలికి అరిపోతుంది, కానీ ఆవిరై పోదు. తడిగుడ్డలలోని తేమ గాలిలోనికి అరిపోతుంది, కానీ ఆవిరై పోదు. ఏరూలర్లోని నీరు ఫ్యాన్గాలికి ఆరిపోతుంది, కానీ ఆవిరైపోదు. ఇట్లు నీరు అరిపోయే దానికి, ఆవిరై పోయే దానికి తేడా తెలియని కొందరు నీరు ఆవిరై మేఘాలుగా మారి పోతున్నదని అనుకోవడము జరుగుతున్నది. ఎవరు ఏమనుకొనిన మేఘములు నీరును, నీటితోపాటు కొన్నిటిని తీసుకుంటున్నదని చెప్పుటకు ఆధారముగా వార్తాపత్రికలో వచ్చిన సమాచారమును క్రింద ఇస్తున్నాము చూడండి.


---

చేపల జల్లులు... కురిసిన కప్పలు!.


(ఈనాడు హైదరాబాద్ ఆదివారం 25 జులై 2010, 28వ పేజీలో)


(వర్షంతో పాటు వడగళ్ళు పడితే సంబరపడతారు... మరి చేపలు, కప్పలు కూడా పడితే? అవే కాదు నాణాలు, పిజ్జాలు కూడా పడ్డ సంగతి తెలుసా? అవే వింత వానలు!)


అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ కుటుంబమంతా కలిసి కారులో వెళ్తుంది. అకస్మాత్తుగా ఆకాశంలో ఓ చోట నల్లని మబ్బులు కమ్ముకుని వానపడింది. దాంతోపాటు దబదబమంటూ చేపలు కురిశాయి! పైగా అవి బతికున్నవే!!


సెర్బియా దేశంలో 2005లో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు హఠాత్తుగా ఇళ్ళలోకి పరుగులు తీశారు. ఎందుకో తెలుసా? వడగళ్ళలాగా చిన్న కప్పలు కురవడం ప్రారంభించాయి!


ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల వింతవానలు కురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటినే 'ఆడ్ రెయిన్స్’ 'స్ట్రేంజ్ రెయిన్స్' అంటారు. యాసిడ్ వర్షాలు, ఎర్రరంగులో కురిసే వానలు కూడా ఈ కోవలోకే వస్తాయి. అయితే మొసళ్ళు, పిజ్జాలు, కాసులు కూడా కురిసిన సందర్భాలు ఉన్నాయి. బలమైన సుడిగాలులు ఏర్పడినప్పుడు అవి ఏ చెరువులోని నీటినో పీల్చుకుంటాయని, ఆ గాలులు చెల్లాచెదరైనప్పుడు అందులోని చేపలన్నీ వర్షంలా కురిసే అవకాశం ఉందని చెబుతారు. ఏమైనా ఇలాంటి వింత వానల గురించి వానాకాలంలో తెలుసుకోవడం ఆసక్తికరం.



అర్జెంటైనాలోని ఓ ప్రాంతంలో 2007 ఏప్రిల్ 6న సాలీళ్ళ వర్షం కురిసింది. ఆ వానని ఒకతను ఫోటో తీశాడు

కూడా!


మన దేశంలో కేరళలో 2001లో ఎర్రరంగు వర్షం కురిసింది. దాన్ని 'బ్లడ్ రెయిన్' అని పిలిచారు.


గుజరాత్లోని బాన్వాడ్, 2009 అక్టోబరు 24న చేపల వర్షం కురిసింది.


కాలిఫోర్నియాలో 1869 ఆగష్టు 1న ఏదో జంతువుకు చెందిన శరీర భాగాలు కురిశాయి.


ఇంగ్లాండులో 1894లో జెల్లీఫిష్లు రాలాయి.


ఇంగ్లండ్లో 1881లో హెర్మిట్ పీతలు వందల కొద్దీ పడ్డాయి.


కొలరాడో ప్రాంతంలో 1982 నుంచి 86 వరకూ ఏటా మొక్కజొన్న కంకులు కురిశాయి.


ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ 1982 మే 28న నాణాల వాన కురిసింది. రష్యాలో మెర్చెరీ గ్రామంలో కూడా

కాసులు రాలాయి.


అమెరికాలోని సిల్వర్టౌన్లో 1877లో ఓసారి మొసళ్ళ వాన కురిసింది. ఒక్కో మొసలి 12 అంగుళాల

పొడవుంది.


మాంట్రియల్ అనే ఊరిలో 1857లో బల్లుల వర్షం పడింది.


--


ఆఫ్రికాలో ఒకాయన కారుపై దబ్బుమని పెద్ద పిజ్జా పడింది.


హెూండురస్ దేశంలో ప్రతి ఏడాది మే-జులై నెలల మధ్య చేపల వాన కురుస్తుంది. వాటిని వండుకుని

తింటారు కూడా.


ప్రత్యక్షముగ క్రిందపడిన ఇన్ని వస్తువులు ఆవిరియై పోలేదు కదా! నీటిని వేడి ద్వారా ఆవిరి చేసి, ఆ ఆవిరిని చల్లబరచి తిరిగి నీరగునట్లు ప్రయోగశాలలో చేసి చూపించవచ్చును. అదే మాదిరి సముద్రము నీరు ఆవిరై మేఘరూపములో ఉండగా, చల్లని గాలి తగలడము వలన ఆవిరి తిరిగి నీరై, వర్షము కురవడము జరుగుచున్నదని కొందరు చెప్పినా, నీరు ఆవిరై, ఆవిరి చల్లబడి నీరవుతుందను సూత్రము చెప్పినా, ఆ విధానమును ప్రయోగము చేసి, చూపించినా, ఆ సూత్రము సారాయిని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ వర్షము కురిసే దానికి ఉపయోగపడడము లేదు. కొందరు వారికి తెలిసిన సూత్రము ప్రకారము, మేఘమధనము చేసి వర్షాలను కురిపిస్తామని ప్రయత్నము చేసినా, మేఘ మధనము ద్వారా కూడ వర్షాలు కురుస్తాయని నిరూపణకు రాలేదు. మేఘ మధనము చేసినా, వర్షము కురవని సందర్భములున్నవని దీనినంతటిని గమనిస్తే, మేఘములు మన ఇష్టప్రకారము పని చేయవనీ, దేవుని ఇష్టము ప్రకారము పని చేయునని తెలియుచున్నది.


మేఘము వర్షించినపుడు వచ్చు నీరు, కొన్ని లక్షల చెరువులు నిండేంత ఉండును. వర్షించిన నీరు వరదలై పారుచున్నది. భూమిలోనికి కొంతనీరు ఇంకిపోయినా, కొంత నీరు పల్లముగానున్న గుంతలలో నిలిచి పోయినా, చివరకు సముద్రము వరకు వర్షము నీరు ప్రవహించుచున్నదంటే ఎన్ని నీళ్ళు పైకి పోయి ఉండాలో మీరే లెక్కించుకోండి. అంత నీరు ఆవిరి రూపములో పైకి చేరినదని చెప్పుటకు వీలులేదు. చివరకు ఒక లీటరు నీరు కూడ సూర్యరశ్మి ద్వారా ఆవిరై పైకి పోయిందనుటకు అవకాశము లేదు. అందువలన మేము చెప్పునది ఏమనగా! మేఘము జీవము గల భూతము. అది ఇంకొకరి ఆజ్ఞకు లోబడి పని చేయుచున్నది. తనకు వచ్చు ఆజ్ఞ ప్రకారము, భూమిమీద నీరును కంటికి కనిపించకుండ సూక్ష్మముగా పైకి తీసుకోగలుగుచున్నది. మేఘములోని నీరు ఆవిరి రూపములో వచ్చినది కాదు, మేఘము స్వయముగ తీసుకొన్నదేనని తెలియాలి. ఇటు ప్రపంచ జ్ఞానము, అటు దైవజ్ఞానము తెలిసిన మేధావులైన మూడవరకము వారు చెప్పు ప్రకారము, దేవుని పాలనలో మేఘములు ముఖ్యపాత్ర పోషిస్తున్నవి. మనుషులు బ్రతుకుటకు త్రాగునీరును, ఆహార ధాన్యములు పండుటకు అవసరమైన నీరును, మనిషికి జీవనాధారమై ప్రతిచోట ఉపయోగపడు నీరును అందించడము మేఘముల యొక్క ముఖ్య కర్తవ్యము. మనుషులు చేసుకొన్న పాపపుణ్యము ప్రకారము, వారికి పంటలు పండాలన్నా, భూమి సారవంతముగా ఉండాలన్నా, మేఘముల వర్షము మీద ఆధారపడి ఉండును. అంతేకాక మనుషులను వరదల ద్వారా హింసించుటకుగానీ, చంపుటకుగానీ మేఘములదే ముఖ్యపాత్ర!


దేవుని పాలనలో సేవకులై, దైవత్వము యొక్క గొప్పతనమును తెలిసిన మేఘములు, నేటికాలములో అజ్ఞానములో మునిగిపోయి, దైవత్వమును పూర్తి మరచిపోయిన మనుషులనూ, జ్ఞానులను దైవ జ్ఞానమున్న గ్రంథములను గౌరవించని వ్యక్తులనూ, ప్రపంచ ధనము అయిన డబ్బు ముందర దేవున్ని కూడ లెక్కచేయని మానవులనూ, కానుకలు, ముడుపులు ఇస్తే దేవుడు కూడ తమ పనిని చేస్తాడు అనుకొను వ్యాపార దృష్టికల్గిన మనుషులనూ, చూచిన మేఘములు తమ దేవుని రాజ్యములో ఉండి దేవున్ని గౌరవించని వారి మీద విసుగుకల్గియున్నవి. అందువలన మనుషుల పాపము వంతుకు వచ్చినపుడు, మనుషులను బాధించుచున్నవి. చిన్న ఉదాహరణ ప్రకారము చూస్తే, ఒక వరదవచ్చి ఊరంతా జలమయమై పోయి తిండిగింజలుగానీ, కట్టుబట్టలుగానీ చేతికి దొరకకుండ పోయినపుడు, తమకు పిడికెడు అన్నము కూడ దొరకనపుడు,


---

తమ పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే, తమకు ఆహారము లేని కారణమున శరీరములోని శక్తి లేకుండ పోవుచున్నపుడు, ఈ వరద ఎంత పని చేసినదని బాధపడుచున్నపుడు మేఘము అదే ప్రాంతములో వర్షించను మొదలుపెట్టితే, ఇక వర్షము వద్దు, వర్షము వస్తే మా ప్రాణాలు పోతాయి, మమ్ములను కాపాడమని దేవున్ని ప్రార్థించినా, ఇంతకాలము డబ్బు తప్ప దేవుడే గుర్తుకు రాని మీకు ఆపద సమయములో మాత్రము దేవుడు గుర్తుకు వస్తాడా? అని మేఘములు వర్షించి, నీటిలో మునిగిపోవు పరిస్థితిని తెచ్చుచున్నవి. కొన్ని ప్రాంతములలో నీటినుండి బయటపడకుండ చనిపోవునట్లు చేయుచున్నవి. కొందరి ఇళ్ళను వర్షము వలన కూలిపోవునట్లు చేసి, ఇంటిలోని వారందరిని దయదాక్షిణ్యము లేకుండ చంపివేయుచున్నవి. ఇవన్నియు దేవునికి తెలియకుండ జరగడము లేదు. దేవునికి తెలిసినా, నా పాలన బాగా సాగుచున్నదనుకొంటాడు, నా సైన్యము బాగా పని చేస్తున్నదని అనుకుంటాడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. "ప్రాణాపాయ స్థితిలో తమ ప్రాణములు పోతాయను భయముతో దేవున్ని వేడుకుంటే దీన స్థితిలోనున్న వారిని చూచి దేవునికి కొద్దిగ అయినా దయరాదా? తమ సైనికుడు చేయు భీభత్సమును చేయవద్దని, తమ సైనికుడైన మేఘమునకు చెప్పలేడా?” అని అడుగవచ్చును. దానికి దేవుడు ఈ విధముగ సమాధానము చెప్పవచ్చునని అనుకుంటాను. "నన్ను భక్తితో వేడుకొమ్మని భగవద్గీతలో చెప్పానుగానీ, భయముతో వేడుకొమ్మని నేను ఎక్కడ చెప్పలేదు. భయము పరధర్మమని అది నా ధర్మమేకాదని, అది మీకు అజ్ఞానాన్నే ఇస్తుందని, పర ధర్మమైన భయముకంటే, స్వధర్మములో మరణమైన మంచిదేనని భగవద్గీతలో కర్మయోగమున 35వ శ్లోకములో చెప్పియున్నానని మరువవద్దు. నీకు అభిషేకములు చేయించానే? ఆకు పూజలు కట్టించానే? వేలు ఖర్చుపెట్టి కుంకుమార్చనలు, లక్షలు ఖర్చుపెట్టి తులసి అర్చనలు, కోట్లు ఖర్చుపెట్టి నగలు, కిరీటాలు చేయించానే? మామీద కొంచెమైన దయరాదా? మమ్ములను కాపాడవా? అని కొందరు అంటున్నారు.


దానికి నా సమాధానము ఏమనగా! నేను గుణరహితుడనని గీతయందు చెప్పాను. నాకు గుణములే లేనపుడు, దయా గుణము ఎలా వస్తుంది? కావున నాకు దయలేదు. నా మాదిరి నా సేవకుడైన మేఘమునకూ దయలేదు. ఆకు పూజలు, అర్చనలు, అభిషేకములు చేయించానే అని అడుగువారున్నారు. ఆ మాటను నేను ఒప్పుకుంటాను. మీరు వేలు, లక్షలు ఖర్చుపెట్టి నాకు అర్చనలు చేయించేటపుడు, దేవుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అని అనుకోకుండ, నేను గుడిలో మాత్రమున్నవాడిగ, నా ఎదురుగా నిలుచున్నవాడు, ఎవడో కూడ తెలియని గ్రుడ్డివానిగ నన్ను లెక్కించి, నేను పలానావాడిని, నీకు పూజచేయిస్తున్నాని నాకు తెలియు నట్లు, నాది పలానా వంశము, పలానా గోత్రము, పలానా నామధేయము అని మీ అడ్రస్ పూజారి చేత చెప్పిస్తారా? అలాంటపుడు నీవు ఎవరో తెలియని నేను, నిన్ను రక్షించే దానికి నీవు పిలిచినపుడే రావాలంటే కుదరదు. ఎందుకు కుదరదనగా, నీలాగా చాలామంది అడ్రస్లు చెప్పిపోయారు కదా! నీకు వరదలు వచ్చినపుడు, నీకంటే వందరూపాయలు ఎక్కువ ఖర్చుపెట్టి పూజ చేసినవాని కొంప అంటుకొని వాడు పిలుస్తున్నాడు. అదే సమయము లోనే కోట్లు ఖర్చుపెట్టి కిరీటము చేయించినవాడు కడుపునొప్పితో బాధపడుచు నన్ను కాపాడు అంటున్నాడు. అలాంటపుడు ఎవడు ఎక్కువ ఖర్చుపెట్టాడని నేను కూడ లెక్క చూచుకొని తక్కువ ఖర్చుపెట్టిన వారిని వదలి, ఎక్కువ ఖర్చుపెట్టిన వానివద్దకు పోవాలంటే వాని అడ్రస్ వెదకుచు పోవాలి. ఎక్కువ తక్కువల లెక్క చూచుకొని పోయే దానికి కొంత సమయము, వాడు చెప్పిన అడ్రస్ వెదకుచు పోయే దానికి కొంత సమయము వృథా అవుతుంది కదా! అలా వెదకుచూ పోయినా వాడు చెప్పిన అడ్రస్, గోత్రము, పేరుమాత్రము ఉన్నది, ఇంటినెంబరు పూజారికి చెప్పలేదు. నేను గోత్రము, పేరును పట్టుకొని పోతే అదే పేరు, అదే గోత్రమున్న వాళ్ళు పదిమంది ఉన్నట్లు తెలిసింది. ఇంటినెంబర్ లేని దానివలన అదే పేరు, అదే గోత్రమున్న పదిమందిలో ఎవనికి


--

కడుపునొప్పి ఉందో ఎలా తెలుస్తుంది? పదిమందిలో ఎవడు పిలిచాడో తెలియక వెనక్కివచ్చాను. అప్పుడు మీరు అడ్రస్ చెప్పినా, పూర్తి ఇంటినెంబర్తో సహా చెప్పకపోయిన దానివలన, నేను చివరకు కడుపునొప్పి వచ్చినవాని దగ్గరకు పోలేకపోయాను.


మీరు నన్ను గ్రుడ్డివానిగ అనుకోకుండ, సర్వవ్యాపిగా లెక్కించి, ఆ రోజు గోత్రము, పేరు చెప్పకుండ పూజ చేసియుంటే ఈ రోజు నేను కూడ సులభముగ నీవద్దనే ఉండేవాడిని, అలా కాకుండ నాకు మీ అడ్రస్ చెప్పి నన్ను అవమానపరుస్తున్నారు. అటువంటి మిమ్ములను నేనెందుకు కాపాడాలి? మీరు పూజచేస్తే కాపాడుతానని నేను ఎక్కడా చెప్పలేదు. నన్ను అర్ధముతో ఆరాధిస్తే దానివలన జ్ఞానము కల్గునని, జ్ఞానము వలన మీ కర్మలు పోవునని, దానివలన మీరు రక్షింపబడుదురని గీతయందు చెప్పాను గానీ, అర్థములేని పూజలు చేస్తే మిమ్ములను కాపాడుతానని చెప్పలేదు. అందువలన మీరు అర్థము తెలిసి ఆరాధనలు చేయండి అర్థము తెలిసి చేస్తే జ్ఞానశక్తికల్గి దానివలన మీరు కాపాడబడుతారు. కానీ నా వలన ఎవరూ కాపాడబడరు. నేను పెట్టిన చట్టము ప్రకారము నా మేఘములు పనిని చేయుచున్నవి. మేఘములు ఎవరిని హింసించినా, చంపినా అది నా పాలనలోని చట్టరీత్య జరిగినదేగానీ వేరుకాదు.


మేఘములు ద్రవపదార్థమైన నీటివర్షమునేకాక, ఘన పదార్థమైన మంచు లేక ఐసముక్కలనుగానీ, పెద్ద మంచుగడ్డలనుగానీ, మంచుపొడిని గానీ తెచ్చి క్రిందవేయడము జరుగుచున్నది. ఎక్కువ శీతల ప్రాంతములలో మంచుపొడి మేఘములనుండి రాలుతుంది. ఉష్ణప్రాంతములో వర్షా కాలమున చిన్న చిన్న మంచుముక్కలు రాలడము జరుగుతుంది. ఎప్పుడైన అరుదుగా పెద్దపెద్ద మంచుబండలు క్రిందికి పడడము కూడ జరుగుతుంది. ఈ మధ్యకాలములో మంచుముక్కల వర్షము లేక వడగండ్ల వాన ఎక్కువగా కురిసింది. వర్షముతోపాటు వడగండ్లు (మంచుముక్కులు) పడడమును వడగండ్లవాన అంటాము. వడగండ్ల వానపడడము వలన అరటితోటలు, బొప్పాయితోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దానివలన రైతులు నష్ట పోయారు. మేఘమునుండి విసరివేయబడిన మంచుముక్క బుల్లెట్లాగ (తుపాకిగుండులాగ) అరటిగెలను తాకడమువలన అరటికాయలు రంధ్రాలుపడి చీలిపోయాయి. అలాగే బొప్పాయి కాయలురంధ్రాలు పడిపోయాయి. పచ్చి అరటికాయలు, పచ్చిబొప్పాయి కాయలు గట్టిగా ఉండినప్పటికి, వేగముగా వచ్చి తగిలిన వడగండ్లవలన రాళ్ళలాగ గట్టిగ ఉన్న కాయలు కూడ రంధ్రాలు పడిపోయాయి. ఈ విధముగా మంచు ముక్కల వర్షమువలన ఎన్నో పంటలు పూర్తిగా నాశనమై రైతులు నష్టపోయి, నానా బాధలు పడడమేకాక అప్పులు తీర్చలేక, ఆత్మహత్యలు చేసుకొనునట్లు మేఘములు చేయుచున్నవి. ఈ సంవత్సరము కర్నూలు జిల్లాలో స్పీడ్గా పోయే బస్సుమీద వడగండ్ల వాన కురియుట వలన బస్సు అద్దములు పగిలి లోపలి ప్రయాణికులకు గాయములై, ఆసుపత్రికి పోయినట్లు టి.విలో వార్తను చూచాను. ఈ విధముగా మేఘములు వర్షములు, వరదల రూపములోనే కాకుండా, మంచు తుఫాన్రూపములో కూడ మనుషులను కష్టాలపాలు చేయుచున్నవి. మంచు కురియడము వలన చిన్నదారులు, పెద్ద రహదారులు పూడిపోయి కనిపించకుండ పోవడము వలన, రోడ్లమీద పోవు రవాణా వ్యవస్థ అంతా స్థంభించి పోవుచున్నది. ఇళ్ళపైకప్పుల మీద మంచు పేరుకోవడము వలన పైకప్పులు బరువెక్కి కూలిపోవుచున్నవి. మంచుపొడి ఎడతెరపి లేకుండ రాలడము వలన ఇళ్ళు, వాహనములు, రోడ్లు, చిన్న చిన్న చెట్లు అన్నీ మునిగిపోవుచున్నవి. దానివలన ఆ ప్రాంత ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతము!


తన ఆకారమును, పరిమాణమును మార్చుకొను మేఘములు, కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధి వరకు ఆకాశములో విస్తరించుకొని ఉండును. అలా విస్తరించుకొన్న మేఘముల పరిధిలోనికి విమానములుగానీ, హెలిక్యాప్టర్లుగానీ వస్తే,


---

కొన్నిటిని ఏమి చేయక వదలి వేయును. కొన్నిటిని మాత్రము, తన చేతులతో విమానములను కూడ క్రిందికి నెట్టివేయును. మేఘములు విమానములను బలముగా మరియు వేగముగా క్రిందికి త్రోయడము వలన విమానములను నడుపువారికి విమానము కంట్రోల్ కాకపోవడమేకాక ఏమి జరుగుచున్నదని పైలెట్లకు అర్థము కాకుండ పోవును. వారు తేరుకొనే లోపలే విమానము క్రిందపడి ప్రమాదము జరిగిపోవును. ఈ మధ్యకాలములో మేఘములు విమానములను క్రిందికి త్రోయడము అక్కడక్కడ జరిగింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డిగారు ప్రయాణించు హెలిక్యాప్టర్ కూడ మేఘముల వలననే ప్రమాదానికి గురియైనదని, మేఘములు క్రిందికి తోయడము వలన హెలి క్యాప్టర్ వేగముగా క్రిందకివచ్చి భూమికి కొట్టుకొన్నదని పరిశోధనలోనే తేలింది. అంతేకాక ఆంధ్రయూనివర్శిటిలో మేఘములను గురించి రీసర్చ్ చేయు ప్రొఫెసర్ “క్యూములోనింబస్” మేఘములు ప్రమాదరకమైనవని, అవి విమానములను సహితము క్రిందికి త్రోయగలవని, వాటినే రాక్షస మేఘములంటామని న్యూస్పేపర్లో ప్రకటించారు.


మేఘములు వర్షాలు, వరదల రూపములోనే కాకుండ, వడగండ్ల వానరూపములో, మంచుపొడి తుఫాన్ రూపములో, ఆకాశమబ్బులైన క్యుములోనింబస్ మేఘాలరూపములో మనుషులను ఎన్నో కష్టాలపాలు చేయుచున్నవి. అంతేకాక కొన్ని విదేశాలలో సుడిమేఘాలరూపములో కూడ విజృంభించుచున్నది. విదేశాలలోని సుడిమేఘములను బహశ నేషనల్ జియోగ్రఫి టి.వి ఛానల్లోగానీ, డిస్కవరిఛానల్లోగాని చూడవచ్చును. చాలామంది సుడిమేఘాలను, సుడిగాలిగా అనుకోవడము జరుగుచున్నది. కానీ అది సుడిగాలి కాదు. గాలివలె పనిచేయుట వలన సుడిమేఘాలను సుడిగాలిగా చాలామంది పొరబడి అనుకోవడము జరుగుచున్నది. సుడి మేఘమును గురించి చెప్పుకొంటే ఆకాశములో అదృశ్యముగానున్న సుడి మేఘము దృశ్యరూపములోనికి మారి, పది నుండి ఇరవై ఎకరాల విస్తీర్ణముగా విస్తరించి అక్కడినుండి క్రిందికి వ్యాపించును. పైన పది ఎకరముల విస్తీర్ణముగల మేఘము క్రిందికి వచ్చేటప్పటికి దాదాపు నాలుగవవంతు విస్తీర్ణముగా తయారగును. పైన పది ఎకరముల విస్తీర్ణముగా కనిపిస్తూ, క్రిందికి విస్తీర్ణవ్యాసము తగ్గుతూ భూమిమీదకు వచ్చేటప్పటికి రెండు లేక రెండున్నర ఎకరముల విస్తీర్ణముగా ఉండును. పైన వెడల్పుగా కనిపిస్తున్న మేఘము క్రింద భూమిమీద ఆకారము తక్కువ వెడల్పుగ కనిపించును. అలా కనిపించిన ఆకారము ముందుకు కదలుచువచ్చుచుండును. గంటకు పది నుండి ఇరవై కిలోమీటర్ల వేగముతో నుడి మేఘము ముందుకు కదలుచు పోవుచుండును. అలా కదలుచున్న మేఘము, కొన్ని ఊర్లమీద ప్రయాణించడము జరుగుచున్నది.


సుడి మేఘము పై నుండి క్రింద భూమివరకు ఉండును కదా! క్రింద భూమిని తాకినకొన, రెండు మూడు ఎకరముల విస్తీర్ణముగా ఉంటూ వేగముగా సుడి తిరుగుచుండును. మేఘము క్రిందికొన, సుడి తిరుగడము వలన భూమిమీద ఏమున్నా, అది మేఘము యొక్క బలమునకు తట్టుకోలేక మేఘము వెంట తిరుగుచు పైకెగురును. అలా సుడిమేఘములో చిక్కుకొన్న, చిన్నచిన్న కార్లు కూడ గిర్రున తిరుగుచు పైకి లేచి, సుడి వ్యాసము యొక్క అంచు దగ్గర నుండి విసరివేయబడును. ఉదాహరణకు కోళ్ళఫారమ్ను నిర్వహించు ఇనుపరేకుల షెడ్గానీ, సిమెంటేకుల షెడ్ గానీ సుడిమేఘము ప్రయాణించు దారిలో ఉందనుకొనుము. సుడిమేఘము ఆ షెడ్ల మీదకు వస్తూనే, మేఘము సుడి తిరుగు వేగమునకు మరియు బలమునకు, షెడ్మీద ఉన్న రేకులు పైకి లేచి మేఘములో తేలిపోతూ, సుడి తిరుగుచు విసిరివేయబడినట్లు దూరముగా పడిపోవుచుండును. మేఘము కదలి పోయేకొలది దారిలోనున్న ఏవైనా తేలిక వస్తువులనుండి, బరువు వస్తువుల వరకు పెరికి త్రిప్పి విసిరివేయడము జరుగుచుండును. సుడి మేఘము ఎక్కడికి వచ్చినా విధ్వంసము జరిగినట్లే అవుతుంది. ఆ మేఘమును దూరమునుండి గమనించిన మనుషులు, దానిలో చిక్కుకోకుండ


---

ఇళ్ళు వదలి పారిపోవుదురు. ఆ మేఘములో చిక్కుకొన్న పశువులు కూడ వంద అడుగుల పైకిలేచి, మేఘములో గిర్రున తిరగడము టి.వి. ఛానళ్ళలో చూడడము జరిగింది. ఒక ఊరుమీద ఆ మేఘము ప్రయాణించి పోయిన తర్వాత, ఆ ఊరును చూస్తే చీపురుతో ఊడ్చినట్లు పై కప్పులు ఊడిపోయిన ఇండ్లు, చెల్లాచెదురుగా పడిన వాహనములు మొదలగునవి భయంకరముగా కనిపించును. నిన్నటి దినము ఒక దేశములో సుడిమేఘము ప్రయాణించ డమును టి.వి. ఛానల్ లో చూచాను. అది ప్రయాణించకముందు విమానా లను రిపేరు చేయు పెద్దషెడ్లను దూరమునుండి చూపించారు. ఆ మేఘము ఆ షెడ్మీదకు వచ్చినపుడు, పై కప్పులు సుడితిరుగుచు, మేఘములో లేచి పోవడము, గిర్రున తిరుగుచూ దూరముగా పై నుండి విసిరివేసినట్లు పడి పోవడము ప్రత్యక్షముగా కనిపిస్తూవుంది. సుడిమేఘము ఆ ప్రాంతమును దాటిపోయిన తర్వాత అక్కడికి పోయి ఆ దృశ్యములను చూపించగా షెడ్లలో నిలబడివున్న విమానాల రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విమానాలు ప్రక్కకు తిరిగి పడివున్నాయి. చూచేదానికి ఎవరైనా పెద్ద రౌడిమూక (కొన్ని వందలమంది రౌడీలగుంపు) వచ్చి విధ్వంసము చేసినట్లు, అన్నిటిని పగులకొట్టినట్లు కనిపిస్తున్నది. సుడిమేఘము, గాలి సుడితిరిగినట్లు, గాలిలో వస్తువులు లేచిపోయినట్లు, కొట్టుకుపోయినట్లు చేయుచున్నది. కావున వాస్తవానికి అది మేఘమే అయినా, చాలామంది దానిని సుడిగాలి అనుకోవడము జరుగుచున్నది.


మేఘము అనునది ఒకటే అయినా మానవుడు చేసుకొన్న పాపమును బట్టి అది ఐదు రకములుగా పనిని చేయుచు ఐదు రకముల పేర్లను కలిగియున్నది. 1. వర్షమును కురియునపుడు వర్షమేఘము అంటాము. 2. మంచుముక్కలు పడునపుడు వడగండ్ల మేఘము అంటాము. 3. పొడిమంచు పడునపుడు మంచుమేఘము అంటాము. 4. విమానాలను కూలద్రోయునపుడు మబ్బుమేఘము అని మనము అంటాము. శాస్త్రవేత్తలు రాక్షసమేఘము లేక క్యుములోనింబస్ మేఘము అని అంటారు. 5) సుడిగాలిలాగ ప్రయాణిస్తు దొరికిన వస్తువులన్నిటిని పైకిలేపి విసరివేయు మేఘమును సుడిమేఘము అంటాము. ఐదు రకాలపేర్లు కల్గి ఐదు విధములుగా మేఘము, మనుషులను చిత్రహింసలపాలు చేయడమేకాక ఘోరముగా మనుషులను చంపివేయుచున్నది. ఎక్కడో యమలోకముందని చెప్పుకోవడము తప్ప దానిని ఎవరూ చూడలేదు. కానీ మేము ఇక్కడే యమలోకముందని చెప్పినా, వాస్తవమును ఎవరూ గ్రహించలేకున్నారు. యమలోకములో మనిషియొక్క పాపము చిత్రగుప్తుని చేత లెక్కించబడి చిత్రగుప్తుడు చెప్పిన లిస్టు ప్రకారము అనుభవించవలసియున్నది. దానిని అనుభవింప చేయువారు యమకింకరులు. యమధర్మరాజు రాజ్యములో, యమకింకరుల ద్వారా, పాపులైన ప్రజలను పాలించడము జరుగుచున్నది.


పూర్వము వ్యాసుడు యమలోకము అను దానిని గరుడపురాణము లలో చెప్పినా, ఇప్పుడు ప్రబోధానందయోగీశ్వరులు యమలోకము అనునది బ్రహ్మవిద్యాశాస్త్రములో కలదని చెప్పినా, యమలోకమును పరిశీలించితే మూడు ముఖ్యమైన భాగములు తెలియుచున్నవి. ఒకటి యమధర్మరాజు, రెండు యమకింకరులు, మూడు ప్రజలు లేక జీవులు. దానినే ఒకటి ప్రభువు, రెండు పాలకులు, మూడు పాలించబడువారు అనవచ్చును. ఇక్కడ ప్రభువు ఎవరు? పాలకులు ఎవరు? పాలించబడువారు ఎవరు అని ప్రశ్నించు కొనినట్లయితే, ప్రభువు యమధర్మరాజు, పాలకులు యమ కింకరులు, పాలించబడువారు జీవులు అని చెప్పవచ్చును. యమధర్మరాజు, యమకింకరులు అను పేర్లలో రెండిటియందు 'యమ' అను పదమును తీసివేస్తే, మిగిలేది మొదట ధర్మరాజు, తర్వాత కింకరులు. కింకరులు అనగా సైనికులు అని చెప్పవచ్చును మరియు సేవకులు అని చెప్పవచ్చును. సేవకులుగానీ, సైనికులుగానీ, రాజు క్రింద రాజు ఆధీనములో పని చేయువారు అయినపుడు రాజు, కింకరులు అంటే సరిపోతుంది.


---

కానీ రాజు ముందర “ధర్మ" అనే పదము ఒకటి ప్రత్యేకముగా ఉన్నది. ఏ దేశములో అయినా, ఏ రాజ్యములో అయినా రాజు ఉంటాడు. రాజు అను పదము ముందర ఏమీ ఉండదు. కానీ ఇక్కడ రాజు ముందర “ధర్మ” అనే ప్రత్యేకమైన పదము ఎందుకున్నది అని యోచించవలసిన అవసరమున్నది. “ధర్మ” అనే పదమునకు దగ్గరగా సరిపోవు పదము "నిబంధన”. నిబంధన అనగా బంధములేనిది (బంధింపబడనిది) అని అర్ధము. ప్రపంచములోని బంధనములలోకెల్ల పెద్దబంధము "కర్మబంధము” కర్మచేత బంధింపబడనివాడు లేక కర్మబంధనము లేనివాడు దేవుడు తప్ప ఎవరూ లేరు. అందువలన దేవున్ని రాజు అని చెప్పినపుడు ఆయన అందరి రాజులాంటివాడు కాడు, ఈ రాజు ప్రత్యేకమైనవాడు అని చెప్పుచు, ఆ ప్రత్యేకత ఏమిటో అందరికి తెలియునట్లు “ధర్మరాజు” అన్నారు. గరుడ పురాణములో వ్యాసుడు చెప్పిన యమధర్మరాజు, ఎక్కడో ఎవడూ చూడని యమలోకములో ఉంటాడు. బ్రహ్మవిద్యలో మేము చెప్పు యమధర్మరాజు మనకు కనిపించు విశ్వము లోనే ఉన్నాడు. వ్యాసుడు చెప్పిన గరుడ పురాణములోని యమధర్మరాజును గురించి తెలుసుకొంటే కాలక్షేపమౌతుంది. మేము చెప్పు యమధర్మరాజును గురించి తెలుసుకొంటే కర్మక్షేపమౌతుంది.


ఇపుడు మనకు కర్మక్షేపము (కర్మనాశనము)ను గురించిన యమ ధర్మరాజును గురించి తెలుసుకొనుటయే ముఖ్యము. ఒక రాజ్యములో రాజు, రాజు క్రింద పనిచేయు సైనికులైన సేవకులుంటారు. ఇక్కడ మనము చెప్పుకొను రాజు ప్రత్యేకత కల్గియున్నాడు. కావున రాజును ధర్మరాజు అనడము జరిగినది. ఇంకా గమనిస్తే ధర్మరాజుకు ముందర మరియు కింకరులకు ముందర “యమ” అను పదముకలదు. ఇటు ధర్మరాజు ముందర అటు కింకరుల ముందర ఉ ండుటలో ఏమి విశేషముకలదని యోచించి చూస్తే కొంతవరకు అర్థమగుచున్నది. అదేమనగా! యమ అనగా పెద్ద అనియు, గొప్ప అనియు చెప్పవచ్చును. దీనిప్రకారము యమధర్మరాజు అనగా పెద్ద ధర్మరాజు అని అర్థము. అలాగే యమ కింకరులు అనగా పెద్ద కింకరులు అని అర్థము. అన్నిటికంటే మించిన పెద్దది ఏదైతే ఉందో దాని ముందర “యమ” అను పదమును వాడవచ్చును. విశ్వములో దేవునికంటే మించిన రాజుగానీ, భూతములకంటే మించిన కింకరులుగానీ లేరు. కావున దేవున్ని యమధర్మరాజు అని, భూతములను యమకింకరులని చెప్పడము జరిగినది. యమ అనగా పెద్ద అయితే, నియమ అనగా చిన్నదని అర్థము. అందువలన దేవున్ని యమము కలవాడనీ, నియమము లేనివాడని చెప్పవచ్చును. కావున కొన్ని చోట్ల దేవున్ని నియమ నిష్టలు లేనివాడు అని అన్నారు. అట్లే భూతములను నియమము లేనివని చెప్పవచ్చును.


విశ్వమునందు బలములోగానీ, పనులు చేయుటలోగానీ భూతముల కంటే మించినవి లేవు. కనుక మహాభూతములనుగానీ, స్వల్పభూతములను గానీ, ఉపభూతములనుగానీ యమకింకరులు అని అనవచ్చును. అనేక ఉపభూతములలో, ఒకానొకటి అయిన మేఘము అను భూతము ఎంత పెద్దదో, ఎంత పెద్ద బలముకలదో చెప్పుకొన్నాము. మేఘము అను భూతమునకు కొన్ని కోట్ల చేతులున్నాయి అనియు, ఆ చేతులకు బలము లెక్కలేనంతకలదని కూడ చెప్పాము. యమకింకరులు అన్నపుడు మేఘమునకు కూడ 'యమ' అను పదము వర్తిస్తుంది. కావున మేఘమును మించిన బలము, భూమిమీద ఏ జీవరాసికి లేదని చెప్పవచ్చును. మేఘమునకున్న బలము ఏ జీవరాసికి లేదన్నపుడు, ఏ జీవరాసికి ఉపయోగపడని బలము మేఘమునకు ఉపయోగపడినదని చెప్పవచ్చును. ఉదాహరణకు పోయిన సంవత్సరము చైనాలో, ఒక ప్రాంతములో అరవై (60) లక్షల టన్నుల పొడిమంచు కురిసిందనీ, మరియొక చోట ఎనభై (80) లక్షల టన్నుల పొడిమంచు కురిసిందని వార్తలలో చెప్పడము, చూపించడము జరిగింది. రెండు ప్రాంతములలో కురిసిన మంచుయొక్క బరువును చూస్తే, 140 లక్షల టన్నులు! దీనినిబట్టి మేఘముల చేతులకు ఎంత బలమున్నదో చెప్పలేము.


---

ఒక లారీకి పది టన్నుల బరువును వేస్తాము. ఆ లెక్క ప్రకారము మేఘము కురిసిన పొడిమంచు 14 లక్షల లారీలలోనికి నింపవచ్చును. దీనినిబట్టి చూస్తే ఉపభూతమైన మేఘమును యమ కింకరుడని అనవచ్చును.


యమలోకములో యమకింకరుల బాధ ఉంటుందని, అది చనిపోయిన తర్వాత యమలోకములో ఏర్పడునని కొందరు హిందువులు చెప్పుచున్నారు. ఇతర మతముల వారు కొందరు, ప్రళయాంతము వరకు చనిపోయిన వారు సమాధులలోనే ఉంటారని, అంతవరకు పునర్జన్మలు లేవని, మనిషి ఒకమారు పుట్టి ఒక మారే చనిపోతాడని, ప్రళయాంతములో దేవుడు అంతవరకు చనిపోయి సమాధులలో ఉండిన వారందరిని లేపి, వారు చేసిన పాపములను విచారించి, వారి పాపములకు తగినట్లు నరకమునకు పంపునని చెప్పుచున్నారు. ఎవరికి తెలిసినది వారు చెప్పుకొనినా, జరుగుచున్న సత్యము ఏమిటి అని చూస్తే, అందరికి తెలిసిన దానికంటే, వారు చెప్పుకొను దానికంటే, నరకము విభిన్నముగా ఉన్నదని చెప్పవచ్చును. అన్ని మతాల మనుషులకు దేవుడు లేక యమధర్మరాజు ఒక్కడేకాగ, మనుషులందరికి యమకింకరులు మహా, స్వల్ప, ఉపభూతము లనియే చెప్పవచ్చును. చనిపోయిన తర్వాత అని చెప్పు హిందూమతములోని కొందరి మాటలు, యుగాంతము లేక ప్రళయములో అని చెప్పు ఇతర మతస్థుల మాటలు, నరకము, స్వర్గము ప్రత్యేక లోకములని అవి ఎక్కడో పైన ఉన్నాయని చెప్పు అన్ని మతముల వాదనలను చూస్తే, మాయ లేక సాతాన్ (సైతాన్) అనునది మనుషులకు సత్యము తెలియకుండ ఎలా చేసిందో, ఎంత బలముగా వారి ప్రజ్ఞను ముంచేసిందో అర్థమగుచున్నది. మాయ తన ఫథకమును మనుషులయందు, మనుషుల చేత ఎలా నమ్మించ గలిగిందో అర్థమగుచున్నది. మాయ ఎవరి ద్వారా తనవైపు మనుషులను మరల్చుకోవాలో, అలాగే వారి ద్వారానే మరల్చుకొంది. అట్లే భవిష్యత్తులో తన మాయ నుండి ఏ మతస్థుడు కూడ బయటపడకుండ, తనకు తెలిసిందే సత్యమని నమ్మి, చివరకు దేవుడు చెప్పినా, దేవుని మాటను కూడ నమ్మనట్లు వారి తలలో మార్పురానట్లు, మనుషులచేతనే తన బోధను మనుషులలోనికి ఎక్కించింది. అందువలన యమలోకము, స్వర్గలోకము ఇక్కడే ఉన్నాయని మేము చెప్పినా, ఎవరూ విననిస్థితిలో ఉన్నారు. దేవునిమాటే విననివారు మాలాంటివారు చెప్పేమాటను వింటారను నమ్మకములేదు. కావున మేము ఎంత చెప్పినా వినకుండ స్వర్గము, నరకము పైన ఉన్నాయని మాకే తిరిగి చెప్పుచున్నారు. ఎవరు ఏ నమ్మకము మీదైన ఉండవచ్చును. కానీ వారు నమ్మిన నమ్మకము, మూఢనమ్మకమా లేక సరియైన నమ్మకమా అని చూచు కోవలసియుండగా, అలా ఎవరూ చేయడము లేదు. వారు నమ్ముచున్న స్వర్గమును గానీ, నరకమును గానీ ఎవరైనా చూచారా అని వెదికినా, అట్లు చూచినవారు ఎవరూ లేరు. అట్లు చూడకపోయినప్పటికీ ఒకవేళ వారు చెప్పునది శాస్త్రబద్దమా అంటే, అట్లు శాస్త్రమునకు సంబంధించిన విషయమనుటకు కూడ వీలులేదు. ఇటు శాస్త్రబద్ధముకాక, అటు ఎవరూ చూడక, ఎవరూ కూడ ఏమాత్రము అనుభవించక, స్వర్గమునకు నరకమునకు మధ్యలో దూరమెంతవుందో తెలియక, నీవు ప్రస్తుతము వాటికి ఎంత దూరములో ఉన్నావో తెలియక, అన్ని తెలిసినవానివలె స్వర్గముంది, నరకముంది. రెండు పైన ఉన్నాయంటే మేము గ్రుడ్డిగా నమ్మాలా? హేతువాద ప్రశ్నలకు నిలబడి జవాబిచ్చినపుడు, చెప్పబడు విషయము శాస్త్రబద్ద మైనపుడు దానిని విశ్వసించవచ్చును. కానీ అబద్దమైన దానిని జ్ఞానులైన వారు ఎవరూ విశ్వసించరు.


భూమిమీదనే ప్రత్యక్ష స్వర్గము, ప్రత్యక్ష నరకము రెండు ఉన్నాయి. స్వర్గనరకములు రెండూ ప్రక్క ప్రక్కనే ఉ న్నాయి. ఉదాహరణకు ఒకడు రంభకంటే అందమైన అమ్మాయిని చూచాడు. వాడు ఆ అమ్మాయిని చూచినప్పటి నుండి ఆ అమ్మాయితో స్నేహము చేయాలని, ఆమెతో శరీర సుఖమును అనుభవించాలని తహతహలాడిపోయేవాడు. అయితే కొద్ది రోజులకే ఆమెతో స్నేహము ఏర్పడింది. తర్వాత కొద్దిరోజులకే అన్ని విధముల అతని మాట వినేస్థితిలోనికి


---

ఆమె వచ్చింది. అటువంటి అనుకూల వాతావరణమును గ్రహించిన అతను, ఆ అమ్మాయికి తన కోర్కెను తెలిపాడు. అతని కోర్కెను విన్న అమ్మాయి, ఏ ఆటంకము చెప్పక నవ్వి ఊరుకుంది. అప్పుడతనికి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లయినది. ఇదంతా అతనికి సంతోషమును కల్గిస్తున్నది. చివరకు ఒకదినము ఆ అమ్మాయితో శరీరసుఖమును అనుభవిస్తూ, సంతోషమును పొందుచూ, నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడనుకొన్నాడట. ఇదంతటిని బాగా ఆలోచిస్తే, స్వర్గసుఖమును అతడు అనుభవిస్తున్నాడని చెప్పవచ్చును. అది ప్రత్యక్షముగ కనిపిస్తున్న మరియు ప్రత్యక్షముగ అనుభవిస్తున్న స్వర్గము. (స్వర్గము, నరకము మనిషికి చాలా దగ్గరగా ఉన్నాయనుటకు కూడ నిదర్శనము కలదు) ఆ విధముగ అతను సంతోషమును పొందుతూ నాలుగురోజులు సుఖములలో తేలియాడాడు. నాల్గవదినము అమ్మాయితో అతను శారీరక సుఖములో కలిసియుండగా, అమ్మాయి మేనమామ చూచాడు. అక్క బిడ్డ అందంగా ఉందికదా, అనుకొని పెళ్ళి చేసుకోవాలనుకొన్న మేనమామకు అపరిమితమైన కోపమువచ్చి వెంటనే ఒకచోట కలిసియున్న వారి ఇద్దరిని పట్టుకొన్నాడు. ఆ అమ్మాయి, అమ్మ తమ్ముణ్ణి చూచేసరికే ప్లేటు ఫిరాయించి, ఇతనెవడో నాకు తెలియదు, నన్ను బలవంతముగా అత్యాచారము చేయుచున్నాడని ప్రియుని మీద అబద్దము చెప్పింది. అంతవరకు అందమైన ప్రియురాలితో స్వర్గసుఖములు అనుభవించిన ప్రియునికి ఒక్కమారుగా స్వర్గము సీను పోయి, నరకము సీన్ మొదలైంది. ఆ సమయానికి అతనికి పాపము వంతుకొచ్చింది. ఆ అమ్మాయి మేనమామ అతనిని తన ఇష్టమొచ్చినట్లు కొట్టి, పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు. పోలీస్ స్టేషన్ బయట ఉన్నంతవరకు, ఆమె మేనమామ అతనికి యమభటుడై కొట్టాడు. పోలీస్ స్టేషన్కు పోయిన తర్వాత పోలీస్ వారు యమభటులై చితకబాదారు. తర్వాత రేపేసు నమోదుచేసి సబ్సల్కు పంపినారు. నెల రోజులకు బెయిల్ వచ్చి అతను బయటికి వచ్చాడు. అంతకు ముందు నెలలో సంతోషముతో, సుఖముతో, కాలము గడిపాడు. కావున దానిని స్వర్గసుఖము అనవచ్చును. నెల తర్వాత వెంటనే నరకము మొదలై, నెలరోజుల వరకు శరీరబాధలు, మానసిక కష్టాలు అనుభవించాడు. కావున దానిని నరకము అనవచ్చును. ఈ సంఘటన స్వర్గము, నరకము భూమిమీదనే ఉందనుటకు మరియు స్వర్గము నరకమునకు చాలా దూరములేదు, రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయనుటకు నిదర్శనముగా ఉన్నది.


ఉదాహరణగ చెప్పిన పై సంఘటనలో, యమకింకరుల పాత్ర భూతములకు లేదే? మనుషులనే ఆ సమయానికి యమకింకరులుగా పోల్చి చెప్పారే? అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! మీకు అర్థమగుటకు కనిపించే మనుషులనే యమభటులుగా చెప్పినాము. పైకి కనిపించే మనుషులను, ఆడించే స్వల్పభూతములు శరీరములోపల ఉన్నాయి. వాటిపాత్ర కనిపించదు. స్వల్పభూతములు మనుషులను బాధించుటకు గానీ, సుఖ పెట్టుటకుగానీ అధికారము కల్గియున్నవని ముందు కూడ చెప్పియున్నాము. "నానా రూపేణా కాలకింకరః" అను వాక్యములో అనేక రూపములలో దేవుని సైన్యముంటుంది. మొదట యువతి, యువకుని శరీరములోని స్వల్పభూతముల పాత్రవలన యువతి, యువకుడు స్వర్గ సుఖమును అనుభవించారు. తర్వాత అవే స్వల్పభూతములే, యువతిని మాట మార్చునట్లు చేసి, యువకున్ని దోషిగా నిలబెట్టాయి. అమ్మాయి మామ శరరీములోనుండి అతనిని, ఆ సమయానికే అక్కడికి తీసుకొనివచ్చి, అతనికి చూపించవలసిన దృశ్యమును చూపించి, ఆ సమయానికి అమ్మాయి మామను, కనిపించే యమకింకరునిగా మార్చాయి. తర్వాత పోలీస్ స్టేషన్ పోలీస్లను యమకింకరులుగా మార్చాయి. కనిపించినా, కనిపించక పోయినా ఈ సంఘటనలో స్వల్పభూతములపాత్ర ఉంది అవియే ఒకనికి కొంతకాలము స్వర్గమును చూపించాయి, వెంటనే కొంతకాలము నరకమును కూడ చూపించాయి.


---

స్వర్గ, నరక విషయములో కొన్ని సమయములందు స్వయముగ మహాభూతములు పనిచేయును, అట్లే కొన్ని సమయములలో స్వల్ప భూతములు పనిచేయును. ఇంకా కొన్ని సమయములలో ఉపభూతములు పనిచేయును. అంతేకాక దైవజ్ఞానమును తెలిసిన పెద్దపెద్ద గ్రహములు కూడ కొన్ని జ్ఞానుల ఎడల, అజ్ఞానుల ఎడల మంచిగా, చెడుగా, మిత్రులుగా శత్రువులుగా పని చేయుచున్నవి. ప్రపంచసంబంధ పాపపుణ్యములను భూతములు మూడు విధములుగా ఉండి పాలించగా, దైవసంబంధ పాపపుణ్యములను మూడు విధముల భూతములే కాకుండ కొన్ని రకముల జీవులైన గ్రహములు కూడ దేవుని పక్షమున నిలిచి, దేవుని సైనికులుగానే పని చేయుచున్నవి. దైవసంబంధ పాపపుణ్యములను కూడ మనిషి సంపాదించుకొంటున్నాడు. దేవున్ని దూషిస్తే భయంకరమైన పాపము వస్తుంది. దేవున్ని పూజిస్తే మోక్షము వస్తుంది. దేవతలను ఆరాధిస్తే పుణ్యము వస్తుంది. దేవుని ఎడల వచ్చిన పాపమును గానీ, దేవతల వలన వచ్చిన పుణ్యమునుగానీ అమలు చేయుటలో జ్ఞానముకల్గిన జీవ గ్రహములు కొన్ని భూతములవలె పని చేయుచు, తాము కూడ దేవుని సేవ చేయువారిగ ప్రవర్తించుచున్నవి. జీవగ్రహములు కొన్ని ఖగోళములో సూక్ష్మముగా తిరుగుచూ, అవకాశమొచ్చినపుడు దేవుని సేవ చేయుచున్నవి. అటువంటి గ్రహములు తమ జీవితములో ఇంకా ఉన్నతస్థాయి జ్ఞానమును తెలుసు కొనుటకు ప్రయత్నించుచున్నవి. అందువలన దైవజ్ఞానమును తెలిసిన వారికి ఎక్కువ గౌరవమునిచ్చుచున్నవి. అజ్ఞానులను ఇబ్బందుల పాలు చేయుచున్నవి. ఇటువంటి జీవగ్రహములు స్థూలశరీరములేనివై, సూక్ష్మ శరీరముతో ఖగోళములో ఉన్నాయను విషయము ఎవరి ఊహకు అందదు. ఇప్పుడు ఎవరి ఊహకూ అందనప్పుడు, నీకెలా తెలిసింది అని వెంటనే ఎవరైన నన్ను ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము ఏమనగా! ఇప్పుడు ఈ సమాచారమును వ్రాయునది నేను కాదు, 'మేము' వ్రాయుచున్నా మని చెప్పుచున్నాము. ఈ పుస్తకము వ్రాయడములో ముఖ్యమైనపాత్ర నా శరీరములోని ఆత్మది. ఆత్మ ఆడిస్తే శరీరము ఆడుచున్నది. కనుక పైకి నేను వ్రాసినట్లు మీకు కనిపించుచున్నది. కానీ మీరు చదువుచున్నపుడు విషయము మీకు అర్థమైనట్లు, ఈ సమాచారము శరీరము యొక్క చేయిచేత ఆత్మ వ్రాయించునపుడు మొదట ఆ విషయము నాకు తెలియుచున్నది. అంతే తప్ప వ్రాత పడకముందు నాకు కూడ తెలియదు. నాకు తెలియని విషయము నేను వ్రాసినట్లు పైకి మీకు కనిపించినా, వాస్తవముగా వ్రాయించునది ఆత్మ అని తెలియవలెను. ఇది నా ఊహకు కూడ అందని విషయమే, కావున ఆత్మ స్వయముగ ఎవరికి తెలియదని ధైర్యముగా చెప్పుచున్నది. మనకు తెలియని విషయమును తెలియదని మనము ఒప్పుకోవడములో తప్పులేదు కదా! అందుకే నాకు తెలియదని ధైర్యముగా నేను ఒప్పుకుంటున్నాను.


జీవగ్రహములు భూతముల కోవకు చెందకున్నను దైవధర్మముల ఎడల ఆసక్తి కల్గియుంటూ, జ్ఞానులకు అనుకూలముగా, అజ్ఞానులకు వ్యతిరేఖముగా పనిచేయుచున్నవి. ఉదాహరణకు ఒక కుటుంబము అజ్ఞానము కల్గియుండి, జ్ఞానము మీద ఏమాత్రము ఆసక్తి లేనివారై దేవదేవుడైన పరమాత్మను వదలి, దేవతలను కూడ సృష్టించిన దేవున్ని మరచి అన్యదేవత ఆరాధన చేయుటయందు ఆసక్తి కల్గినవారై, 300 కిలోమీటర్ల దూరముగానున్న ఒక దేవతను పూజచేయుటకు, ముడుపులు చెల్లించుటకు, కోర్కెలు కోరుటకు జీపులో బయలుదేరి పోయారు. ఖగోళములో దేవుని జ్ఞానముకల్గి, దేవుని కొరకే పని చేయాలను ఉద్దేశము కల్గియున్న జీవ గ్రహములలో ఒక గ్రహము ఆ కుటుంబమును, వారి ఉద్దేశమును, వారి ప్రయాణమును గ్రహించింది. వారు తమను పుట్టించిన దేవున్ని వదలి కోర్కెల కొరకు అన్యదేవతను పూజించడము, దూరముగా ఉండినా, శ్రమ అయినా, డబ్బు ఖర్చు అయినా అన్నిటిని భరించుకొనిపోవడము, ఆ గ్రహమునకు నచ్చలేదు. వారు దేవతవద్దకు బయలుదేరకముందు ఒక నెల క్రిందట దైవజ్ఞానమును ప్రచారము చేయువారు భగవద్గీత గ్రంథమును ప్రచారము చేయుచు, వారి ఇంటివద్దకు వచ్చి భగవద్గీతను తీసుకొని చదవండి అని


--

చెప్పితే, వారు మనము జ్ఞానమును తెలుసుకొను నిమిత్తము శ్రమపడి, దేవుని సేవ చేయుచు, మన ఇంటివరకు భగవద్గీతను తెచ్చారు కదా! అని వారిని గౌరవించి మాట్లాడక, మా దగ్గర ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఉచితముగా అయితే ఇవ్వండి, డబ్బులకైతే వద్దు అన్నారు. ఆ మాటకు గీతను ప్రచారము చేయువారు ఇలా "మేము మా ఇంటివద్ద పనులు వదలుకొని కొన్ని రోజులు దేవుని సేవ చేయాలని వచ్చాము. ఈ గ్రంథము కేవలము రెండువందలు మాత్రమే, రెండు వందలు ఈ గీతకు పెట్టితే మీకు ఎన్నో జ్ఞానవిషయములు తెలియబడుతాయి” అని చెప్పితే మాకు గీతతో పనేలేదు, మాకు చదువుకొనే తీరికలేదు అని చెప్పడమే కాక గీతను, గీతను ప్రచారము చేయువారిని హేళనగ మాట్లాడడమును, ఆ సమయములో అక్కడేవున్న గ్రహము విని వారిమీద కోపము తెచ్చుకుంది. అప్పటినుండి వారిమీద నిఘా పెట్టిన గ్రహము, వారు దేవతాపూజ కొరకు ప్రయాణము చేయడమును గ్రహించినది.


జ్ఞానము తెలిసిన మనిషికి మరియొక అజ్ఞాని మాటలు చేష్టలు ఎలా నచ్చవో, అలాగే దైవజ్ఞానము మీద ఆసక్తికల్గి, జ్ఞానము తెలిసియున్న గ్రహమునకు, అజ్ఞానులైన ఆ కుటుంబము మాటలు, పనులు నచ్చక పోవడమేకాక, వారు భగవద్గీత పట్ల మాట్లాడిన మాటలకు జ్ఞానులపట్ల అగౌరవ ప్రవర్తనకు పూర్తి కోపము వచ్చింది. గ్రహము జీవజాతికి చెందినది, కావున గుణములున్నవని మరువకూడదు. జ్ఞానము అంటే గౌరవములేని ఆ కుటుంబము మీద తన కోపమును తీర్చుకొనుటకు అవకాశము కొరకు చూచుచున్న సమయములో, వారి దేవతా ప్రయాణము కనిపించింది. వారు వారనుకున్న దేవతవద్దకు పోయి, తమ మొక్కుబడిని తీర్చుకొని, క్రొత్త కోర్కెలు కోరుకొని, తిరుగు ప్రయాణము చేయుచున్న సమయములో వారినే వెంబడించుచున్న గ్రహము, వారి వాహనమును ప్రమాదానికి గురి అగునట్లు చేసింది. వాహనములో పదిమంది ప్రయాణము చేయుచుండగ అందులో ఎనిమిది మంది అక్కడికక్కడనే చనిపోగా, ఇద్దరికి తీవ్రమైన గాయములైనవి. దేవతల కొరకు పోవడమే గ్రహములకు సరిపోదు. అదియేకాక వారు గీతను, గీతా ప్రచారకులను గౌరవించకపోవడము మరీ కోపమునకు కారణమైనది. అందువలన ఎనిమిదిమంది చనిపోయారు ఇద్దరికి తీవ్రమైన గాయములైనవి. అందరికి పెద్ద అయిన దేవున్ని వదలిపెట్టి, చిల్లర దేవతలను మ్రొక్కడము గ్రహములకు సరిపోదని ఈ సంఘటనతో తెలియుచున్నది.


ఇందూసాంప్రదాయములు చాలాగొప్పవి. వాటిలో పెళ్ళి సాంప్రదాయము చాలా ముఖ్యమైనది. పెళ్ళికార్యములో చేయు పనులన్నిటికి దైవజ్ఞానము ముడిపెట్టబడియున్నది. కానీ నేటి సమాజములో పెళ్ళి జ్ఞానసంబంధమైనదని ఎవరికి తెలియదు. అందువలన ఎవరి ఇష్టాను సారము వారు చేయుచున్నారు. జీవితములో జ్ఞానానికి ముఖ ద్వారమైన పెళ్ళిని, జ్ఞానసంబంధముగ కాకుండ తమ తమ ఆర్భాటములను ప్రదర్శించుకొనునట్లు చేయుచున్నారు. ఎవరి పెళ్ళిలోగానీ జ్ఞానము మచ్చుకైన లేదు. అందువలన పెళ్ళి విషయములో దేవతల విషయముకంటే ఎక్కువ కోపముతో ఖగోళములోని గ్రహములున్నారు. ఎక్కడైన పెళ్ళి విషయముగానీ, పెళ్ళిదృశ్యముగానీ గ్రహముల కంటబడితే పెళ్ళివారిని వెంబడించి, వారికి ఏదో ఒక విధముగ ప్రమాదము జరుగునట్లు చేయు చున్నవి. గ్రహములకు తెలియని పెళ్ళి ఉంటే పరవాలేదు, ఆ పెళ్ళి వారు ప్రమాదమునుండి తప్పించుకొన్నట్లే. పెళ్ళిపెత్తనము మొదలు నిశ్చితార్థము, పెళ్ళి, తిరిగింపులు మరిగింపుల వరకు ఎప్పుడు గ్రహములకు తెలిసినా ప్రమాదము తప్పదు. అందువలననే ప్రస్తుతకాలములో పెళ్ళి వాహనములు ఎక్కువగా ప్రమాదానికి గురియగుచున్నవి. పెళ్ళివాహనముల ప్రమాదము, పెళ్ళి ఇంటిలో ప్రమాదము, దేవతలవద్దకు పోవు వాహనములు, దేవతక్షేత్రములలో ప్రమాదములు, గత ముప్పయి సంవత్సరములనుండి ఎక్కువై, ఇప్పటి కాలమునకు తీవ్రస్థాయికి చేరుకొన్నవి. అలా ఎందుకు జరుగుచున్నదనగా!


---

దేవతలువేరు దేవుడువేరనీ, పెళ్ళి పూర్తిస్థాయి దైవజ్ఞానమనీ గత ముప్పయి సంవత్సరములనుండి ఉన్నత జ్ఞానము చెప్పబడుచున్నది. గ్రహములు కొన్ని సంవత్సరములనుండి ఉన్నత జ్ఞానమును తెలుసుకొంటున్నవి కనుక, అప్పటినుండి ప్రమాదములు జరుగుట ప్రారంభమైనవి. ప్రస్తుతకాలమునకు, ఉన్నత జ్ఞానమును తెలుసుకొను గ్రహముల సంఖ్య ఎక్కువైనది. కావున ప్రమాదముల సంఖ్య ఎక్కువైనది. నేను చెప్పునది సత్యమా, అసత్యమా అనుటకు మీరు ఇప్పటినుండి ధ్యాస పెట్టి చూడండి. ఎక్కడైన ప్రమాదము జరిగింది అంటే, అది పెళ్ళిదైనా ఉంటుంది లేక దేవతలయాత్రదైన ఉ ంటుంది. ఈ ప్రమాదముల వెనుక గ్రహముల హస్తముందని ఎవరికీ తెలియదు.


దైవజ్ఞానమును తెలిసిన గ్రహములు, భూతముల స్థాయిలో కర్మల పాలన చేయకున్ననూ, దైవవిషయములో మాత్రము అజ్ఞానముగా ప్రవర్తించు వారిని శిక్షించుచున్నవి. ఇక్కడొక ప్రశ్న ఎవరైన అడుగవచ్చును. "గ్రహములు జీవజాతికి చెందినవి కదా! గ్రహములకు గుణములైన కోపమున్నపుడు, కోపము ప్రకారము ఇతరులను ప్రమాదములకు గురి చేసి చంపడము, గాయాలపాలు చేసి బాధపెట్టడము వలన గ్రహములకు కూడ పాపము వచ్చును కదా!” అలా అడిగితే, దానికి జవాబుగా ఇట్లు చెప్పవచ్చును. గ్రహములు జ్ఞానము తెలిసినవి. అవి కర్మయోగ పద్ధతిలో కార్యములను చేయుచుండుట వలన గ్రహములకు పాపము అంటదు. గ్రహములన్ని భగవద్గీత ప్రకారము జ్ఞానము తెలిసి, దైవ విషయములోనే మనుషుల మీద కోపముతో ప్రవర్తించుచున్నవి. అజ్ఞానులను హింసించు గ్రహములు, జ్ఞానులను గౌరవించుచున్నవి. గ్రహములు తమను ఎట్లు గౌరవించుచున్నది జ్ఞానులకు కనిపించదు. కావున జ్ఞానులకు కూడ గ్రహముల పనులు తెలియవు. జ్ఞానులకు తెలియనిది నీకెలా తెలుసునని మీరు ప్రశ్నించగలరు. దానికి నా సమాదానము నేను జ్ఞానిని కాదు కదా! నేను కేవలము యోగిని, యోగీశ్వరుణ్ణి. అందువలన గ్రహముల విషయము మాకు తెలుసు. అందువలన ప్రబోధాశ్రమ నియమావళిలో పెద్ద బోర్డుమీద “మావద్దకు ఖగోళములోని గొప్పశక్తిగల గ్రహములు జ్ఞానమును తెలుసు కొనుటకు వస్తుంటారు. కావున ఇక్కడికి వచ్చువారు చెడు ఉద్దేశముతో రావద్దండి. ఒకవేళ చెడు ఉద్దేశముతో వస్తే గ్రహముల వలన మీకు కష్టము నష్టము జరుగవచ్చును” అని వ్రాసియుంచాము. ముప్పయి సంవత్సరములుగా మాకు కనిపించకుండ, మావద్దకు వచ్చి కనిపించని గ్రహములు, పెద్దపెద్ద మహర్షులు జ్ఞానమును విని పోతున్నారు. అందువలన ప్రస్తుతకాలములో అజ్ఞానులకు తెలియకుండానే ప్రమాదములు జరుగుచున్నవి. నన్ను ఒక యోగిగ గ్రహములు గౌరవిస్తున్నవి, కావున నన్ను ఎవరైన నిందించినపుడు, ఏ గ్రహమూ అక్కడ లేకపోతే పరవాలేదు, ఒకవేళ ఏ గ్రహమైన నన్ను నిందించినది చూస్తే, అతనిని సామాన్యముగ వదలదు. ఇది సత్యమనుటకు చిన్న ఉదాహరణగా ఒక సంఘటనను వివరిస్తాము.


ధర్మవరము (అనంతపురము జిల్లా)లో ఆచారి కులమునకు చెందిన 35 సంవత్సరముల వయస్సున్న వ్యక్తి, ఇస్లామ్ మతమునకు చెందిన వ్యక్తితో మాట్లాడుచు “మీరు గొప్ప జ్ఞానిగ చెప్పుకొను ప్రబోధానంద యోగీశ్వరులను తిట్టితే మంచిది కాదు అంటుంటారు కదా! అయితే నేను ఇప్పుడు నీ ముందరే తిట్టుతాను నాకు ఏమౌతుందో చూస్తాను” అని అనవసరముగా దూషించి బెంగుళూరుకు పోయాడు. అతని బావమరిది పెళ్ళిలో మేము చెప్పిన “జ్ఞానసాంప్రదాయము” ప్రకారము పెళ్ళి చేసుకోవాలని బావమరది అన్న చెప్పగా, అదంతావద్దు అందరూ ఎలా చేస్తే

అలా చేస్తాము అని గొడవపెట్టుకొన్న అతను, పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు ఇంటికి పోవునపుడు, అజ్ఞాని అయిన అతను మమ్ములను దూషించిన తర్వాత పదిహేను నిమిషములకే పెళ్ళివారి వెంట బెంగుళూరికి పోవడము జరిగినది. అలా అతను దూషించినపుడు అక్కడ ఏ గ్రహములేకుంటే అతనికి ఏమి జరిగేది కాదు. కానీ


---

అతను దూషించిన సమయములో మమ్ములను అభిమానించు గ్రహము, అక్కడుండడము వలన అతని మాటలన్నిటిని ఆ గ్రహము వినగలిగింది. అప్పుడు ఆ గ్రహమునకు కోపము వచ్చింది. అతనిని వదలకూడదనుకొని అతనిని వెంబడించింది. మరుసటి దినము తిరుగు ప్రయాణమున బెంగుళూరు బస్ స్టాండులో బస్సు ఎక్కి కూర్చొన్న అతనిని, బస్సు పూర్తిగ సిటి దాటకముందే, ఎవరికి తెలియకుండ అతనిని వెంబడించిన గ్రహము చంపేసింది. అతను కూర్చొన్నవాడు కూర్చొన్నట్లే చనిపోయాడు. అతడు చనిపోయినట్లు గ్రహించిన ప్రక్క ప్యాసింజర్లు బస్సును ఆపి, దగ్గరగానున్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. గుండె ఆగిపోయి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. హార్టు ఫెయిల్ అయితే, ఉన్నట్లుండి చనిపోవడము వాస్తవమే కానీ, అలా ఒంటికి, దొడ్డికి గుడ్డలలో పోవడము జరుగదు. బజారులో బస్సు ఎక్కేముందు నేను ఇప్పుడు తిట్టుచున్నాను నాకు ఏమౌతుందో చూస్తాము, అన్న అతను మరుసటి దినము అదే సమయమునకు చనిపోవడము వలన గ్రహములే అతనిని చంపాయని అర్థమగుచున్నది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కావున గ్రహములు ఒక్క జ్ఞానవిషయములోనే ఎక్కువ పని చేయుచున్నవని తెలియుచున్నది.


ఈ విధముగ అన్నిటిని లెక్కించి చూచితే, మానవుని పాప పుణ్యములను మూడు రకముల భూతములు, ఒక రకము గ్రహములు అమలు చేయుచున్నవని తెలియుచున్నది. ఈ గ్రంథములో చెప్పిన దయ్యములుగానీ, భూతములుగానీ, గ్రహములుగానీ అన్ని జీవుళ్ళే అయినా దయ్యములు వేరు, భూతములు వేరు, గ్రహములు వేరని అర్థమైనది. దయ్యముల వలన జరిగే పనులకంటే, గ్రహముల వలన జరుగు పనులు ఉత్తమమైనవి. దయ్యములు అజ్ఞానముతో పని చేయుచున్నవి. అందువలన వాటికి కర్మ అంటుచున్నది. గ్రహములు జ్ఞానముతో పని చేయుచున్నవి. కావున గ్రహములకు కర్మ అంటడములేదు. ఇకపోతే మూడు విధముల భూతములు పని చేసినా, వాటికి గుణములుగానీ, ఉద్దేశములుగానీ లేవు కావున భూతములు కర్మకు అతీతమైనవని చెప్పవచ్చును. మానవుడు అజ్ఞానిగా ఉన్నంతవరకు కర్మలు వచ్చుచుండును. కర్మలు పెరుగుకొలది భూతముల పని ఎక్కువగుచున్నది. మనిషి దైవత్వమును లెక్కచేయనంత వరకు, జ్ఞానమార్గములో ప్రయాణించనంతవరకు, ముక్తిస్థానమును అన్వేషించనంత వరకు, మనిషి అనేక ఉపద్రవములను, అనేక కష్టములను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇప్పటి కాలములో చిన్న తనమునుండి చదువుకొని ప్రపంచ జ్ఞానముమీద ప్రవీణులవుతున్నారు, కానీ పరమాత్మ జ్ఞానము అంటే ఏమిటో తెలియనిస్థితిలో ఉంటూ, దైవత్వమును లేదు అంటున్నారు. దైవజ్ఞానము కల్గినవారిని ఏమాత్రము గౌరవించకపోగా కించపరుచుచున్నారు. పూర్వకాలముకంటే ప్రస్తుతకాలములో అజ్ఞానము ఎక్కువై, పాపసంపాదన ఎక్కువైనది. పాపము పరిహారము కావాలంటే, భూతములు, గ్రహములు విజృంభించి పని చేయుచున్నవి. అందువలన పూర్వకాలములో లేని రోగములు క్రొత్తక్రొత్తవి పుట్టుకొస్తున్నవి. పూర్వములేని సునామి మొదలగు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి.


మనుషులు విజ్ఞానము అను పేరుతో అజ్ఞానములోనికి పోవు చున్నారు. దైవత్వమును పూర్తి మరచిపోయారు. డబ్బు ఉంటే చాలు హాయిగా బ్రతుకవచ్చు అనుకుంటున్నారు. డబ్బుకోసము చదువుకొంటున్నారు. డబ్బుకొరకే ఉ ద్యోగాలు చేస్తున్నారు. కానీ విజృంభించే రోగాలను గానీ, చెలరేగే ప్రకృతి వైపరీత్యాలనుగానీ, డబ్బు ఆపలేదని మనిషికి తెలియడము లేదు. మనము చేసుకొన్న పాపములను భూమిమీదనే అనుభవిస్తున్నాము అని అర్థము కావడములేదు. ముఖ్యముగ ఏ పాపమునకు ఏమి శిక్ష పడుతుందో, ఏ మనిషికీ తెలియదు. అట్లే ఏ పాపము ఎప్పుడు అనుభవిస్తామో తెలియదు. అంతేకాక చేసుకొన్నదంతా ఇక్కడే అనుభవిస్తున్నామని కూడ తెలియదు. ఒక పాపమునకుగానీ, పుణ్యమునకుగానీ ఏమి అనుభవమును పొందుతామో, ఎప్పుడు పొందుతామో, ఎక్కడ పొందుతామో తెలియనిస్థితిలో


--

మానవుడు ఉండి పోవడము వలన, జరుగుచున్నదే సత్యము, జరుగబోవునది అసత్యము అను వాదనలో మనిషి ఉండిపోయాడు. వర్తమానములో ఒక మానసిక రోగి ఉన్నాడనుకొనుము అది సత్యము. కానీ అతను అలా ఉండడానికి కారణమేమి అని దాని వెనుక ఉన్న సత్యమునుగానీ, ముందు జరుగబోవు సత్యమునుగానీ మనిషి వెదకడము లేదు. ప్రపంచములో వెదికితే ఒక్క దేవుడు తప్ప అన్ని దొరుకును. శ్రద్ధతో దేవుని జ్ఞానమునే తెలుసుకోవచ్చును. అలాంటపుడు ఒక మానసిక రోగి విషయముగానీ, అంగవైకల్యముగల వాని పాపమును గురించిగానీ, మందులకు, మంత్రములకు, మాటలకు లొంగని రోగమును గురించిగానీ మనకు శ్రద్ధవుంటే తెలుసుకోవచ్చును.


నేడు మానవులలో కొందరు స్వర్గసుఖములను, కొందరు నరక బాధలను భూమిమీదనే అనుభవిస్తున్నారు. భూమినివదలి ఎవరు ఎక్కడికీ పోలేరు. భూమిమీద ఒక జాగాలో ఒకడు చనిపోతే, వాడు అదే క్షణమే భూమిమీదనే పుట్టుచున్నాడు. అలాంటపుడు బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి చెప్పుకొంటే, నీవు ఇప్పటికాలము మనిషివికాదు, కృత యుగమునుండి ఇదే భూమిమీద ఉంటున్నావు! కాని ఈ జన్మ విషయము మాత్రము జ్ఞప్తికి ఉన్నందున, వెనుకగల నీ సమాచారము నీకే తెలియదు. వెనుక జన్మలలో అనేక సుఖములను, అనేక దుఃఖములను అనుభవించిన మనిషి, ప్రస్తుత జన్మలో వాటిని అన్నిటిని మరచిపోయి నేడు జరుగుచున్నది మాత్రము సత్యమనుకొంటున్నాడు. నేడు బ్రతుకుతున్న జీవితములోని కష్టసుఖములకు, వెనుకటి జన్మల పాపపుణ్యములే కారణమను జ్ఞప్తిని, జ్ఞానమును కోల్పోయాడు. నేడు మనిషి బ్రతుకుతున్న జీవితములోని కష్టసుఖములకు కారణము ప్రస్తుతమున్న డబ్బే అనుకుంటున్నాడు. మనిషికి అన్ని విధముల పెద్దగా కనిపిస్తున్నది డబ్బే! మనిషి మనసులో దేవునిస్థానము కంటే మించిన స్థానము డబ్బుకు కలదు. కావున మొదట దానిని సంపాదించుటకే ఎక్కువ అవకాశమిస్తున్నాడు. అలా తన మెదడునంతటిని డబ్బు సంపాదనకే వినియోగించినా, తృప్తి కలిగినంత సంపాదించలేక పోవుచున్నాడు. కొందరైతే తృప్తినటుంచి కొంతైనా సంపాదించుకోలేక పోవుచున్నారు. డబ్బు సంపాదనకు కూడ కర్మే కారణమని వారికి తెలియదు. ఇటువంటి తెలియని స్థితిలో తెలివైనవారు కూడ జీవిస్తున్నారు. వీరి జీవితములలోని కర్మలను పాలించుటకు భూతములు, గ్రహములు పని చేయుచున్నవి. భూతములు, గ్రహములు నేడు భూమిమీద మనిషి బాధపడు బాధలన్నిటికి కారణముగానున్నవి. భూకంపములుగానీ, సునామీలుగానీ, వరదలుగానీ, అగ్నిపర్వతములుగానీ, వేడిగాలులుగానీ, మంచుతుఫానులు గానీ, వడగండ్లవానగానీ, అనేక రోగములుగానీ క్రొత్తగా పుట్టుకొచ్చు క్రొత్తరోగముగానీ, ఇటు శరీరములో గానీ, అటు బయటగానీ కలుగు ఉపద్రవములన్నిటికి కారణము, మనిషి తనెవరో, తననెవరు నడిపిస్తున్నారో తెలియకపోవడము మరియు విశ్వమునంతటిని నడిపించు దేవున్ని గురించివున్న జ్ఞానము తెలియక పోవడము. ఏనాడైతే మనిషి తనస్థితిని తాను తెలుసుకొని తాను ఏమి చేయని జీవాత్మనేనని, తనను నడిపించు ఆత్మ మరొకటిగలదని, తనను నడిపించు ఆత్మను కూడ నడిపించునది పరమాత్మయని తెలిసి, మోక్షమును పొందునంతవరకు, ఈ ప్రపంచములో యుగముల తరబడి మనిషి కష్ట సుఖములను అనుభవిస్తు ఉండవలసిందే. పరమాత్మను తెలియనంతవరకు జీవాత్మకు జన్మలనుండి విడుదల లేదు. పరమాత్మను తెలియాలంటే ఆయన ప్రభుత్వమును, ఆ ప్రభుత్వములోని పాలకులను, పాలకుల ద్వారా పాలించబడువారిని మొదట తెలియాలి. పాలకులను తెలిసి వారి అనుమతి పొందితే రాజును చూడవచ్చును. అలాగే మహాభూతములను, స్వల్ప భూతములను, ఉపభూతములను, గ్రహములను తెలుసుకొని వారి ద్వారా దేవునివద్దకు పోవచ్చును. అందువలన ఈ గ్రంథములో మొదట దయ్యములను గురించి చెప్పి చివరకు భూతముల వరకు తెచ్చి గ్రహములతో ముగిస్తున్నాము.

సమాప్తం.


---

చివరి మాట.

దయ్యాల, భూతాల యదార్థసంఘటనలు అను ఈ గ్రంథములో వ్రాయబడినవన్నియు సత్యములే. కావున ఈ గ్రంథము పేరులో యదార్థ అను పదమును పెట్టవలసివచ్చినది. సత్యముతో కూడుకొన్న జరిగిన సంఘటనలు ఉ ండుట వలన, యదార్థసంఘటనలు అని చెప్పవలసి వచ్చినది. ఇంతవరకు మేము వ్రాసిన గ్రంథములలో, నా గొప్పతనమును గురించి ఎక్కడా చెప్పలేదు. మా వ్రాతలో కేవలము శాస్త్రబద్ధమైన జ్ఞానము మాత్రము ఉండెడిది. కానీ ఇక్కడ తప్పనిసరిగ చెప్పవలసిన విషయములలో కొంత మా గొప్పతనము బయటపడినది. మమ్ములను గురించి మేము చెప్పుకోవడము నాకు ఇష్టములేకున్నను తప్పనిసరిగ చెప్పవలసివచ్చినది. ఈ గ్రంథములోని విషయములను చదివిన తర్వాత, దయ్యాల బాధలున్న వారు మావద్దకు వచ్చి చూపించుకోవలెనని, మావద్దకు వస్తే సులభముగా వాటి బాధపోతుందని అనుకోవచ్చును. కానీ ముఖ్యముగ అలాంటివారు ముందుగా తెలుసుకోవలసినది ఏమంటే! నేను దయ్యాలను గురించి పరిశోధన చేయునపుడు జరిగిన సంఘటలను గురించి వ్రాశాను. ఆ కాలము జరిగిపోయి దాదాపు ముప్పయిఐదు (35) సంవత్సరములు అవుతుంది. ఆనాడు నావయస్సు కేవలము ఇరువది ఐదు (25) సంవత్సరములే. అప్పటికి, ఇప్పటికి నా శరీరములో ఎన్నో మార్పులు జరిగాయి. నేడు శారీరకముగా మరియు మానసికముగా అన్ని విధముల వెనుకబడిపోయాను. ఆనాడున్న జ్ఞానశక్తిగానీ, శరీరశక్తిగానీ ఇప్పుడు లేవు. అందువలన ఎవరైన నావద్దకు వచ్చినా, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని ముందే చెప్పుకొంటున్నాను. నేను దయ్యాలను గురించి పరిశోధన చేయు సమయములో కూడ, ఇతరుల బాధలను నివారించుటకు చేయలేదు. అందువలన ఆరోజుగానీ, ఈరోజుగానీ నేను దయ్యాల బాధలను నివారించు వృత్తి చేయలేదు. పరిశోధనలో భాగముగా ఆ దినము కొందరి బాధలను నివారించడము, దేవతలను దండించడము జరిగింది. అంతేకానీ మనిషి బాధలను పోగొట్టాలను ఉద్దేశముతో చేయలేదు. ఆనాడు, ఈనాడు దైవజ్ఞానమును ప్రజలకు అందించడమే నాముఖ్య ఉద్దేశముగానీ, వేరుగా నేను ఏ విధముగా ఎవరికీ ఉపయోగపడువాడినికాదు. నాకు అటువంటి శక్తిలేదని ముందే తెలియజేయుచున్నాను.


ఈ గ్రంథములో హేతువాదులను, నాస్తికవాదులను ఎక్కువగా విమర్శించి వ్రాసినట్లు కనిపిస్తుంది. నేను ముఖ్యముగ విమర్శించినది నాస్తికవాదులనే అని చెప్పుచున్నాను. హేతువాదులమనుకొనుచు హేతువాదమంటే ఏమిటో తెలియక, నాస్తికవాదమునే పునాదిగా చేసుకొని మాట్లాడు హేతువాదులమనుకొను వారిని విమర్శించాను. నిజమైన హేతువాదమును నేను ఏనాడూ విమర్శించలేదు. ఎందుకనగా నేను కూడ స్వచ్ఛమైన హేతువాదినే. హేతువాదము వలన ప్రశ్నలు వచ్చినపుడే దానికి జ్ఞానము జవాబివ్వగలదు. అప్పుడే దైవజ్ఞానము బయటపడగలదు. మావ్రాతలో మధ్యమధ్యలో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలను నేనే ప్రశ్నించి జవాబు చెప్పడము జరిగింది. జ్ఞానము చెప్పుచున్నపుడు ఎక్కడైనా ప్రశ్నకు అవకాశముంటే, ఎవరికీ ఆ ప్రశ్న యోచనకు రాకున్ననూ, నేనే ఆ ప్రశ్నను అడిగి, దానికి జవాబును కూడ చెప్పిన తర్వాతనే, మిగత విషయములను వ్రాయడము జరిగినది. ఈ ఒక్క గ్రంథములోనేకాక మా రచనలన్నిటి లోను ఇదే విధానముండును.


నిజమైన హేతువాదము సత్యమునకు కారణమైనది. కావున అసలైన హేతువాదమును సత్యవాదము అని అనవచ్చును. నాది కూడ సత్యవాదమే. కనుక కొన్నిచోట్ల నాస్తికవాదులనూ, కొన్నిచోట్ల మేధావులనూ, కొన్నిచోట్ల శాస్త్రజ్ఞులనూ, కొన్నిచోట్ల భక్తులనూ, కొన్నిచోట్ల స్వాములనూ విమర్శించవలసి వచ్చినది. సత్యవాదము ప్రకారము మాట్లాడునపుడు అసత్యవాదులు ఎవరుండినా, వారిని విమర్శించక తప్పదు, వారి మాటలను అసత్యములని చెప్పక


---

తప్పదు. అందువలన ఈ గ్రంథములోని మాటలు ఎవరికైన బాధను కలిగించియుంటే, వివేకముతో వారు అర్థము చేసుకుంటారని కోరుచున్నాను. అందరిని విమర్శించడము నాపని కాదు, అంతా నిజమును చెప్పడమే నాపని. ఈ గ్రంథములో నామాటలు ఎవరినైన విమర్శించియుంటే వారు సత్యమును తెలుసుకొని, జ్ఞానమార్గములో ముందుకు పోవుటకు నా విమర్శలను తీసుకోవాలనీ, అంతేతప్ప నామాటలను అపార్ధముగ అర్థము చేసుకోకూడదని కోరుచున్నాను.


నేడు మనుషులలో దైవభక్తిగానీ, దైవజ్ఞానముగానీ పూర్తిగ లేకుండ పోయినది. హిందూమతములో పూర్వముకంటే ఎక్కువ దేవాలయములు ఈకాలములో తయారై ఉండినా, పూర్వముకంటే ఆరాధనలు, అర్చనలు ఎక్కువైనా, అవన్నియు మనిషిని దైవత్వమువైపు పంపకుండ ప్రక్కదారిలోనికి మళ్ళించుచున్నవి. ఇక ఇతర మతములలోనికి వస్తే అక్కడ వారు దేవుని మీద దృష్టికంటే, మతమును విస్తరింపజేయుటయందు ఎక్కువ దృష్టిని సారించారు. తమ మతమును విస్తరింపచేయు నిమిత్తము, ఇతర మతము లను తక్కువగ లెక్కించడము, అందులో చెప్పబడిన దైవత్వమును కూడ తక్కువగా చెప్పడము జరుగుచున్నది. అలా చేయడము వలన తమకు తెలియకుండానే, దైవదూషణకు పాల్పడినవారగుచున్నారు. సర్వ ప్రపంచము నకు సృష్టికర్త అయిన దేవుడు అందరికీ అధిపతియై ఉండగా, మా మతము లోని దేవుడే నిజమైన దేవుడు, మిగత మతములలో చెప్పబడిన దేవుడు, దేవుడేకాదు అనడము వలన, ఆ మాట ఎంత తప్పవుతుందో వారికి అర్థము కాలేదు. అన్ని మతములలోను దేవుని విషయములో మీ దేవుడు, మా దేవుడు అను భావముండుట వలన మనుషులు దేవున్ని తక్కువగా లెక్కించినట్లయినది. విశ్వమునకంతటికి దేవుడు గొప్పవాడైనపుడు, ప్రతి మనిషితోను దేవునికి సంబంధమున్నపుడు, ప్రతిమనిషి దేవునివైపు పోవుటకు ప్రయత్నించాలి. కానీ ప్రతి మనిషి మతమువైపు పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మతములకు అతీతుడు. ఒక్క మతమునకు సంబంధించినవాడు కాడు. అన్ని మతముల మనుషులకు అధిపతి అయిన వాడు దేవుడు. మనిషిలో మత భావముంటే, దైవత్వము మనిషికి దూరమగును. ఎందుకనగా మతములకు దేవుడు అతీతుడు అయినందున, మతాతీత భావమున్న వానిప్రక్కే దేవుడుండును. మతము అనగా మౌఢ్యముతో కూడుకొన్నదని అర్థము. అందువలన మనిషి మతము, దేవుని పథమునకు ఆటంకమైనదని అర్థమగుచున్నది. జ్ఞానదృష్టితో చూస్తే ప్రతి మతము దేవుని విధానములో మనిషిని ప్రక్కదారి పట్టిస్తున్నది. కావున మతము మౌఢ్యముతో కూడుకొన్నదని చెప్పుచున్నాము.


మతము దేవుని జ్ఞానమును తెలియజేస్తుంది అని అందరూ అనుకోవచ్చును. అలా తెలియజేస్తే, ఏ మతములోనూ మౌఢ్యముండదు. కానీ అలా ఏ మతము చెప్పడము లేదు. మతము అన్నది ఏదైనా కానీ దేవుని స్పష్టమైన విధానమును తెలియజేయకుండ, మతము తన యొక్క విధానమును మనుషుల మీద దిద్దుచున్నది. అందువలన ఏ మనిషిని చూచినా, వీడు పలానా మతమువాడు అని గుర్తించుటకు వీలుండునట్లు వాని మతము, వానిని కనిపింపజేయుచున్నది. కానీ ఏ మనిషిని చూచినా వీడు దైవజ్ఞాని అని తెలియుటకు వీలులేకుండ, మతము వానిని కప్పివేసి పలానామతమువాడని తెలియునట్లు చేసినది. ప్రతి మతము మనిషిమీద తనదైన ముద్రను వేసి, దేవుని విధానమును గురించి తెలుసుకొను అవకాశమే లేకుండ చేయుచున్నది. ఉదాహరణకు స్వర్గ, నరకముల విషయమును తీసుకొందాము. ప్రతి మతము స్వర్గ, నరకములను గురించి చెప్పి మా మాటయే మీకు శిరోధార్యము అన్నట్లు చేసినవి. అందువలన మనిషి వాని మతములో చెప్పినట్లే స్వర్గ,నరకములున్నాయి అనుకుంటున్నాడు. ఆ విధానమునే మిగతావారికి కూడ చెప్పుచున్నాడు. నేను చెప్పునది వాస్తవమా? అని ఏ మనిషి తనను తాను ప్రశ్నించుకోవడము లేదు. అలా ప్రశ్నించుకోగలిగితే, ప్రశ్నలు ఇలా ఉంటాయి. హిందూమతములో చెప్పిన స్వర్గము, నరకము ఎక్కడున్నాయి? ఎక్కడో పైన ఉన్నాయను వారు


---

వాటిని చూచారా? నరకములో మనిషిని బాధపెట్టువారు ఎవరు? వారు ఎలా ఉంటారు? ఒక మనిషికి శిక్షవేయడానికి ఒకనికి ఇద్దరైనా కావాలి. అలా చూస్తే మనుషులకంటే శిక్షించు వారిసంఖ్యే ఎక్కువగా ఉండాలి. అటువంటి వారికి కూడు, గుడ్డ ఎక్కడి నుండి వస్తాయి? వారికి జీతాలు ఎవరిస్తారు? స్వర్గములోనికి పోయిన వానికి రంభ, ఊర్వశి మొదలగు వారి సాన్నిహిత్యము సంపర్కము లభిస్తుందని అంటారు. అది నిజమా? నిజము అయితే స్వర్గములో ఉ ండే రంభ, ఊర్వశిలు ఒక్కొక్కరే కదా! మనుషులతో వారు సన్నిహితముగా మెలగాలంటే స్వర్గమునకు పోయిన మనుషులు నెలలు, సంవత్సరములు తరబడి క్యూలో నిలుచుకోవాలి కదా! అందరికి రంభ కావాలంటే, కాచుకొనేదానికి ఎంతకాలము పట్టుతుంది? ఇట్లు చెప్పుకుంటూ పోతే, వంద ప్రశ్నలకు పైగానే వస్తాయి. ఇతర మతములలో వారు చెప్పునది చూస్తే, స్వర్గమునకు పోయినవానికి, సెలయేర్లుకల ఉద్యానవనములలో చల్లనిగాలియందు, అందమైన ఆడవారితో సుఖముగా ఉండునట్లు దేవుడు చేస్తాడని అంటుంటారు. అలా స్వర్గమునకు పోయిన ప్రతి ఒక్కనికి అందమైన నలుగురు ఆడవాళ్ళను అతనికి ఇచ్చినా, అక్కడికి పోయిన వారందరికి ఎంతమంది ఆడవారు అవసరమౌవుతారు? మగవాడు స్వర్గానికిపోతే అక్కడ అతనిని సుఖపరిచేదానికి అందమైన ప్రదేశము, అందమైన స్త్రీలు ఉంటారు. ఒకవేళ ఆడవారు స్వర్గానికి పోతే వారు సుఖపడేదానికి అందమైన ప్రదేశముంటుంది, కానీ అందమైన మగవారు ఉంటారా? స్వర్గము ఆడవారికి ఉండదా? మగవారికి మాత్రమే ఉంటుందా? మగవారికి మాత్రమే స్వర్గమంటే, దేవుడు ఆడవారికి అన్యాయము చేసినట్లు కాదా? దానివలన దేవుడు అందరికి సమానుడు కాదు కదా? ఇట్లు అనేక ప్రశ్నలురాగలవు. ఇలా ప్రశ్నలు వేసుకొని చూస్తే, దేవునిపాత్ర విలువలేనిదై పోతుంది. ప్రశ్నించుకోకపోతే మూఢనమ్మకమై దేవుని విధానమును తెలుసుకోలేనివారమై పోతాము. అందువలన మనిషి స్వర్గ, నరకముల విషయములో దేవుని వాస్తవ విధానమును తెలుసుకొనునట్లు, ప్రతి ప్రశ్నకు జవాబు దొరకునట్లు ఈ గ్రంథములో వ్రాయబడింది. దేవుని విధానమును మనిషి తెలుసుకోగలిగితే తప్ప, దేవున్ని మనిషి గుర్తించలేడు. అందువలన సర్వసృష్టికి అధిపతియైన దేవుని ప్రభుత్వమును గురించి ఇందులో సంపూర్ణముగా వ్రాయబడింది. దేవుని ప్రభుత్వము మరియు పరిపాలనా విధానమును తెలుసుకుంటే, అన్ని మతముల వారి సంశయములు పటాపంచలైపోవును. అట్లుగాక వ్రాసిన మమ్ములను అసూయతో చూచిన, వారు దైవదూషణ పాపమును పొందవలసివచ్చును. ఇందులో చెప్పిన సమాచారము నావెనుక ఉన్నవాడు చెప్పాడు. కనుక మీరు నన్ను దూషించినా, ఆ దూషణ నేరుగా నావెనుక ఉన్నవానికే చేరును. కావున మీరు మా మాటను నమ్మకపోయినా పరవాలేదు. దైవదూషణా పాత్రులు కావద్దండి. దైవదూషణ పాపము క్షమించబడక, రెండుయుగములు అనుభవించవలసివచ్చును. మీరు దైవము ఎడల సత్యమును తెలుసుకోండి, సత్యమునే ఇతరులకు చెప్పండి. అలా చేస్తే అది దేవుని సేవ అవుతుంది. మీరు కూడ దేవుని సేవకులు కావాలని కోరుచున్నాము.

ఇట్లు,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


---

ముఖ్య విషయము.

ఈ గ్రంథమంతా చివరివరకు చదివినవారికి దేవుడు, దేవునియొక్క చట్టము, పరిపాలన అర్థమైయుంటుంది. అటువంటి వారు ఇప్పటినుండి అయినా మాయవైపు పోకుండ, దేవునివైపు పోవుటకు, గతములో మనము చేసుకున్న పాపముల (కర్మల) నుండి బయటపడుటకు, సులభమైన ఉపాయమును చెప్పదలచుకొన్నాము. ఆ ఉపాయమును కూడ ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రములో గల ఆధారముతోనే చెప్పుచున్నాను. ఒక మనిషి మృత్యుకూపము, నరకకూపము అయిన ప్రపంచమును వదిలి పరమాత్మ అయిన దేవునివద్దకు చేరాలంటే, ప్రస్తుతము భక్తికోవకు చెందినవి మరియు అందరూ ఆచరించునవి అయిన వ్రతక్రతువులూ, యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనములు, వేదమంత్రములను చదువుట ద్వారా చేయు ఆరాధనలు, ప్రపంచములోనున్న దానములైన గోదాన భూదాన, అన్నదాన, ధనదాన మొదలగు దానములు, చిన్న ధ్యానము నుండి పెద్ద తపస్సులు మొదలగునవన్నియు దేవుణ్ణి చేరుటకు పనికిరావు. ఈ విధానములు దేవుణ్ణి తెలియుటకు పనికిరావు. ఈ విధానముల వలన దేవున్ని తెలియుటకు శక్యముకాదు అని భగవద్గీతయందు విశ్వరూప సందర్శన యోగము అను ఆధ్యాయములో 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున భగవంతుడే స్వయముగా చెప్పాడు. ప్రస్తుత కాలములో భక్తి అనునది ఎవరికైనా ఉంటే, అది పైన చెప్పిన విధానములోనే ఉంటుంది. అటువంటపుడు వారు భక్తి విధానములో పడిన శ్రమ, ఖర్చు అన్ని వృథాయేనని చెప్పవచ్చును. ఇది నామాట కాదు గీతలో భగవంతుని మాటని గుర్తుంచుకోవాలి.


మనము చేయు పూజలు, అర్చనలు, యజ్ఞములు, మ్రొక్కుబడులు, ముడుపులు అన్నీ వృథా అయితే ఇక సరియైన మార్గమేది అని ఎవరైనా అడుగవచ్చును. దానికి సమాధానము భగవద్గీతలోనే కలదు. దేవుణ్ణి తెలియాలంటే, దేవునివద్దకు చేరాలంటే 'యోగము' అను మార్గము తప్ప వేరు మార్గములేదు. యోగము అనునది ధ్యానములు, తపస్సులకంటే, యజ్ఞములకంటే, దానములకంటే ప్రత్యేకమైనది. భగవద్గీతలో భగవంతుడు యోగము రెండు రకములుగా ఉన్నదనీ ఒకటి కర్మయోగము, రెండు బ్రహ్మయోగము అని చెప్పి వాటి ఆచరణ కూడ చెప్పియున్నాడు. ఈ రెండు యోగ విధానములు మనిషిని దేవునివద్దకు చేర్చునవే. కర్మ, బ్రహ్మ అను రెండు యోగములను తెలుసుకొంటే అవి ప్రస్తుతమున్న భక్తి విధానములకంటే సులభమైనవే. అర్చనలు, యజ్ఞములు, తపస్సులకంటే సులభమైనవేకాక, ఏమాత్రము ఖర్చు, శ్రమలేనివని చెప్పవచ్చును. యోగములలో కర్మయోగమునందు మనలోని అహమును అణచివేయడమే మనము చేయవలసిన పని. ఇందులో పైసా ఖర్చూ ఉండదు. ఇకపోతే బ్రహ్మయోగములో మనలోని మనస్సును అణచివేయడమే పనిగా ఉన్నది. ఇందులో కూడ ఏ ఖర్చూలేదు. శరీరములో అహమును, మనస్సును అణచివేయడము అలవాటు మీద ఆధారపడివుంటుంది. అలవాటు శ్రద్ధవలన లభిస్తుంది. చివరకు శ్రద్ధకూడ కష్టమూ, ఖర్చూ లేనిదే! ఏ కష్టము, ఖర్చులేని సులభమైన విధానమును భగవంతుడు చెప్పితే, అటువంటి వాటిని వదిలి, వ్యయ ప్రయాసలతో కూడుకొన్న భక్తినే మనిషి ఆచరించు చున్నాడు. కష్టము, ఖర్చుతో కూడుకొన్న పని అయిన భక్తివిధానములో ఒక దానిని ఉ దాహరణకు చెప్పుకొందాము.


ఒక వ్యక్తి తిరుపతి వెంకటేశ్వరస్వామికి నాకు వ్యాపారములో లాభమువస్తే అందులో పదవవంతు నీ హుండీలో వేస్తానని మ్రొక్కుకొన్నాడు. సంవత్సరము తర్వాత తన వ్యాపారములో కొంత లాభము కనిపించగా, వెంకటేశ్వరస్వామికి మ్రొక్కుకున్నట్లు వచ్చిన లాభములో పదవవంతు, తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరస్వామి హుండీలో వేసివచ్చాడు. అక్కడికి పోయి, ఒక లక్షరూపాయలను హుండీలో వేసివచ్చుటకు, మొత్తము ఆరు రోజుల కాలము పట్టినది. వెంకటేశ్వరస్వామి


---

దర్శనమునకు వరుసలో రెండు రోజులు నిలబడవలసివచ్చినది. తన ఊరిలో బయలుదేరినప్పటి నుండి ఒకప్రక్క కష్టము, ఒకప్రక్క ఖర్చు రెండూ తగులుకొన్నాయి. అలా మొదట వ్యాపారము మొదలు పెట్టినప్పుడు ప్రారంభించిన భక్తి, వ్యాపారము పెరుగుకొద్దీ, లాభము వచ్చుచుండుట వలన వెంకటేశ్వరస్వామియే నాకు డబ్బులు ఇస్తున్నాడనీ, ఆయన వల్లనే నా వ్యాపారము అభివృద్ధి అగుచున్నదని తలచిన ఆ భక్తుడు, ప్రతి సంవత్సరము కొండకుపోయి గుండుకొరించుకొని ముడుపులు చెల్లించి వచ్చుచుండెను. అతను చేయు వ్యాపారములో విపరీతమైన లాభము వచ్చినది. కావున కొన్ని సంవత్సరములలోనే అతను కోటీశ్వరుడైపోయాడు. అదంతయు వెంకటేశ్వరస్వామి తనమీద దయ చూపడము వల్లనే జరిగినదని అనుకొన్నాడు. ఆ విధముగా అతనికి వెంకటేశ్వరస్వామి మీద ప్రగాఢమైన విశ్వాసము ఏర్పడినది.


తాను చేయు వ్యాపారములోవచ్చు విపరీతమైన లాభములో కోట్ల రూపాయలను హుండీలో వేయడము మానివేసి, వెంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణమును శాశ్వితముగా ఉండునట్లు చేయించాలనుకొన్నాడు. అనుకొన్న తక్షణమే స్వామి ప్రతిమకు తగినట్లు కిరీటమును చేయించాలను కొన్నాడు. 42 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బంగారు కిరీటమును చేయించాడు. ఒక శుభ దినము ఆ కిరీటమును వెంకటేశ్వర స్వామికి తిరుమలకు పోయి సమర్పించి వచ్చాడు. తర్వాత రెండవ సంవత్సరము నుండి ఆ వ్యక్తికి నష్టాలు రావడము మొదలైనవి. నష్టములో అపారనష్టము ఏర్పడినది. తాను చేయు వ్యాపారము అక్రమమని ప్రభుత్వమే ఆటంక పరచినది. తన వ్యాపారమే నిలిచిపోయినది.అలా నిలిచిపోవడమేకాక, కోర్టువ్యవహారములో కూడ చిక్కుకోవలసి వచ్చినది. ఈ విధముగా ఒకదానికొకటి అన్ని వ్యతిరేఖములే ఎదురైనాయి. దీనిని బట్టి చూస్తే ఇంతవరకు వెంకటేశ్వరుడు ఆదాయమును చేకూర్చినాడు, ఇప్పుడెందుకు ఆదాయమును చేకూర్చలేదు అన్న ప్రశ్నవస్తుంది. ఆ ప్రశ్నకు జవాబును చూస్తే ఈ విధముగా కలదు.



మానవజీవితములో ప్రతిదీ జరుగుటకు ఒక కారణముంటుంది. ప్రతి పనికీ గల హేతువును చూస్తే, ఆ హేతువు గత జన్మలలో మనము చేసుకొన్న పాపపుణ్యములని తెలియుచున్నది. వెంకటేశ్వరస్వామి భక్తునికి జీవితములో పుణ్యము అమలుకొచ్చిన దానివలన, అతను చేయుచున్న వ్యాపారములో లాభము రావడము మొదలయింది. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము అతనికి పుణ్య ఫలితమునిచ్చు మంచి దశ ఉండుటవలన, ఆ లాభము వచ్చింది. లాభమునకు హేతువు తన పుణ్యమని తెలియని ఆ వ్యక్తి, అదంతయు వెంకటేశ్వరుని ద్వారానే వచ్చిందనుకొని స్వామికి ముడుపులు చెల్లిస్తూ, చివరకు గొప్ప కిరీటమునే చేయించాడు. పుణ్యము అయిపోయిన వెంటనే, లాభము రాకుండ పోవడమేకాక పాపఫలితముగ కష్టాలు కూడ మొదలైనవి. దీనినిబట్టి చూస్తే మొదట లాభమునకుగానీ చివరి నష్టమునకుగానీ వెంకటేశ్వరస్వామి ఏమాత్రము కారకుడు (హేతువు) కాడు. మీరు ఆరాధించు దేవుడు, మీకు ఏమీ ఇవ్వడు అను విషయమును మనము తెలుసుకొనుటకు భగవంతుడు భగవద్గీతలో ఈ విధముగా చెప్పాడు. ( విజ్ఞాన యోగము 20,21,22,23,24 శ్లోకముల సారాంశము) 1) ఆశ అను గుణము చేత కట్టబడినవారై, నియమ నిష్టల ప్రకారము దేవుడుకాని ఇతర దేవతలను కొందరు మనుషులు ఆరాధిస్తున్నారు. 2) ఎవరు ఏ దేవతను పూజించదలచుకొన్నారో, ఆ దేవతాభక్తి మీదనే వారికి శ్రద్ధ ఉండునట్లు నేను చేయుచున్నాను. 3) అతను శ్రద్ధతో దేవతను ఆరాధించగా దానివలన అతను కోరుకొన్న కోర్కెలు నెరవేరునట్లు నేనే చేయుచున్నాను. 4) తెలివితక్కువవారు పొందు ఫలితము కూడ అంత మాత్రమే ఉంటుంది. దేవతాభక్తులెల్ల దేవతలనే పొందగా, నా భక్తులందరు నన్ను పొందగలరు. 5) బుద్ధిలేనివారు కొందరు నాశనములేని, ఉత్తమమైన నా గొప్పతనమును తెలియక, కనిపించని నన్ను కనిపించే దేవతగా లెక్కించుచున్నారు. దేవుడు చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తే, దేవతలను పూజించువారు బుద్ధిలేనివారు, తెలివితక్కువవారని తెలియుచున్నది.


---

అంతేకాక దేవతలను పూజించువారు, నావైపు రాకూడదను భావముతో, వారి కోర్కెలను దేవుడే నెరవేర్చుచున్నాడు. అది తెలియక వారు పూజించు దేవతే మా కోర్కె నెరవేర్చినదని, దేవతాభక్తులు అనుకోవడము జరుగుచున్నది. వెంకటేశ్వరస్వామి భక్తుడు కూడ అలాగే అనుకున్నాడు. నా కోర్కెలు నెరవేర్చి, నాకు లాభమొచ్చునట్లు చేశాడని కొన్ని కోట్లు హుండీలో వేయడమేకాక, గొప్ప కిరీటమును కూడ చేయించాడు. తన కోర్కెలను వెంకటేశ్వరుడు నెరవేర్చలేదను అసలు విషయము ఆ భక్తునికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పినా వినేస్థితిలో ఉండడు.


ప్రతి పనికి కనిపించని ఫలితముండును కదా! వెంకటేశ్వరస్వామి భక్తుడు చేసిన ఆరాధనలకు ఫలితముండదా అని కొందరడుగవచ్చును. దానికి జవాబు కనిపించే ఫలితమును దేవుడే ఇచ్చి, తనవైపు రాకుండ చేసుకొంటాడు. ఇక కనిపించని ఫలితము పుణ్యము వస్తుంది. పుణ్యము వలన జన్మవస్తుంది, కానీ ముక్తిరాదు. గొప్పదైన ముక్తిని వదలి, బంధమైన జన్మకు పోవడము తెలివితక్కువ పనికాదా! అందువలన పవిత్రమైన దైవము వైపు పోవడమే మేధావుల పని అగును. అలా పోవాలి అంటే కర్మయోగము, బ్రహ్మయోగము అను శాస్త్రబద్ధమైన మార్గములు గలవు. మార్గములు భగవద్గీతలో ధర్మయుక్తముగా చెప్పబడివున్నవి. ఒకవేళ ఎవరైన యోగముల మీద పూర్తి ఆసక్తి కల్గియుండి, ఆ రెండు యోగములను ఆచరించడములో గానీ, అభ్యాసము చేయడములోగానీ సమర్థతలేనివారైతే, అటువంటివారికి ప్రత్యేకమైన మార్గముకలదు. అదియే భక్తిమార్గము. భక్తిమార్గములో కేవలము దేవుని ఎడల మాత్రము సేవ చేయడముండును. సృష్టికర్త అయిన పరమాత్మ సేవ తప్ప, ఏ దేవత సేవకు సంబంధముండదని జ్ఞప్తికి ఉంచుకోవలెను. దేవుడు కనిపించని వాడు, ఆకారములేనివాడు అయినపుడు ఆయనకు సేవ ఎలా చేయాలని కొందరికి ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా! ప్రపంచములో దేవుని సేవ అనునది ఒకే ఒక్కటి మాత్రము గలదు. ఆ ఒక్కటి ఏదనగా! దేవుని జ్ఞానమును ప్రచారము చేయడము. అంతగొప్ప దేవునికి ఇంత చిన్న సేవ ఒక్కటిమాత్రమే గలదా? అని కొందరు అనుకోవచ్చును. దీనిని గురించి భగవద్గీత భక్తియోగములో 10వ శ్లోకమున...


అభ్యాసే ప్యసమర్ధో సి మత్కర్మపరమో భవః,

మదర్థమపి కర్మాణికుర్వన్ సిద్ధిమవాస్స్యసి॥


ఇలా గలదు. “నీవు యోగము చేయుటయందు అసమర్థుని వైతే, నాకొరకు పనిని చేయుము. నా కొరకు పనిని చేసినట్లయితే, నీవు ముక్తి పొంది నావద్దకు రాగలవు.” అన్నాడు. దీనినిబట్టి చూస్తే దేవుని పని ప్రపంచములో ఒక్కటి మాత్రమే గలదు. దానికొరకు దేవుడే భూమిమీదకు భగవంతునిగా వచ్చి ఆ పనిని చేసిపోయాడు. ఆయనే స్వయముగా ధర్మముల యొక్క ప్రచారము అను పని చేశాడు. అందువలన ఆయన (దేవుని) యొక్క ధర్మములను ప్రచారము చేయడమే నిజమైన దేవుని పనియగును. దేవుని పనిని ప్రత్యక్షముగాగానీ, పరోక్షముగాగానీ చేయడము వలన దేవుని సేవ చేసినట్లుగును. ఎవరికైనా దేవుని ధర్మములు శాస్త్రబద్ధము గా, హేతు బద్దముగా తెలిసియుంటే, వాటిని ఇతరులకు తెలియజేయడము దేవుని సేవ అగును. ఒకవేళ దేవుని జ్ఞానముగానీ, ధర్మములుగానీ తెలియనపుడు అవి తెలియబడుటకు సహాయపడినా, ప్రత్యక్షముగా కాకుండ పరోక్షముగా సేవ చేసినట్లగును.


ఇప్పుడు కొందరికి కొన్ని ప్రశ్నలు వచ్చి ఇలా అడుగవచ్చును. “నేను పదిలక్షలు ఖర్చుచేసి ఆంజనేయస్వామి గుడిని కట్టించాను. ఆ గుడి ఉండుట వలన మా ఊరిలోని చాలామంది ప్రజలలో భక్తి భావము పెరిగి, ప్రతి దినము గుడికి పోయి వస్తుంటారు. దానివలన నేను దేవుని సేవ చేసినట్లే కదా! అని అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!


--

దేవుడు వేరు, దేవతలు వేరు అని ముందే చెప్పియున్నాము. ఆంజనేయస్వామి గానీ, మరెవరుగానీ ఆకారముండి కనిపించే దేవతలు మరియు పేరుండి వినిపించే దేవతలు అయినందువలన వారు ఎవరూ దేవుడుకాదు, వారికి చేసినది దేవుని సేవాకాదు. అలా చేయడము దేవుడుకాని అన్యదేవున్ని ఆరాధించినట్లు, సేవించినట్లు అగును. నేడు భూమిమీద దేవుని ధర్మములు తెలియక అధర్మయుక్తములైన పనినే చేయుచున్నారు. కొందరు ఆంజనేయ దండకము అను పుస్తకమును అచ్చువేయించి, ఉచితముగా లక్షకాపీలను పంచినవారు, కొందరు రాప్డేవ్ బాబా మహత్యమును గురించి ప్రచురించి ఐదు లక్షల పుస్తకములను పంచిన వారు, మేము ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా దేవునిసేవ చేసినట్లే కదా! అని అనుకొనుచున్నారు. పైన చెప్పిన సూత్రము ప్రకారము ఇటువంటివన్ని దేవతల సేవలగును. కానీ దేవుని సేవకాదు.


బ్రహ్మవిద్యాశాస్త్రమును గురించి స్వయముగా ఇతరులకు బోధించినా, లేక దానిని గురించి తెలియనపుడు, ఆ శాస్త్రమును బోధించు వారికి సహాయపడి బ్రహ్మవిద్య ప్రచారమగునట్లు చేసినా, అది దేవుని సేవ చేసినట్లు అగును. స్వయముగా బోధిస్తే ప్రత్యక్షముగా సేవ చేసినట్లుగును. బోధించువారికి సహాయపడినగానీ, ఆ కార్యములలో పాల్గొనినాగానీ, అతను పరోక్షముగా సేవ చేసినట్లగును. నేడు బ్రహ్మవిద్యాశాస్త్రము ఇందూమతములో ఒకే ఒక భగవద్గీతలో కనిపిస్తూవున్నది. అందువలన నేను స్వయముగా త్రైతసిద్ధాంత భగవద్గీతను రచించి, ప్రచురించి ప్రచారము చేయుచున్నాను. అంతేకాక బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిన అనేక అంశములను కూడ వ్రాసి ప్రచురించి, ప్రచారము చేయడము వలన నాది నిజమైన దేవునిసేవ అని ధైర్యముగా చెప్పుకొంటున్నాను. నేను ఇంతవరకు ఇతరులనుండి ధన సహాయమును తీసుకోకుండ, చందాల పేరుతో డబ్బును వసూలు చేయకుండ, స్వచ్చందముగా గత 40 సంవత్సరములనుండి దేవుని సేవ చేయుచువచ్చాను.


నేడు దేశములో దేవుని సేవ అంటే ఏమిటో తెలియకుండ పోయినది. యోగములంటే వారి ఇష్టమొచ్చినట్లు ఊహించుకొంటున్నారు. బ్రహ్మవిద్య అసలుకు అడుగంటిపోయి తెలియకుండ పోయినది. ఆరవశాస్త్రము ఒకటున్నదను మాటకూడ ఎవరికి తెలియకుండ పోయినది. ఇటువంటి సందర్భములో మేము దైవజ్ఞానమును, ధర్మములను ఎంతగా ప్రచారము చేసినా, పూర్తి ప్రయోజనము లేకుండ పోవుచున్నది. వేయింటికి ఒక్కనికి కూడ మా జ్ఞానము అందడము లేదు. నేను ఒక్కనినేకాక చాలామంది నాలాగ దైవజ్ఞానమును ప్రచారము చేస్తే, కొందరికైనా అసలైన జ్ఞానము తెలియగలదు. నాలాగ అందరు జ్ఞానమును బోధించలేక పోవచ్చును. అయినా నాలాగ జ్ఞానమును ప్రచారము చేయవచ్చును. జ్ఞానప్రచారములో ప్రత్యక్షముగా పాల్గొనకపోయినా, పరోక్షముగా సహాయపడినా అది దేవుని సేవయే అవుతుందనుకొన్నాము. అందువలన మా అనుమతితో మా గ్రంథములను ప్రచురించి, ఉచితముగా ఇతరుల కివ్వడము దేవునిసేవ అగును. మేము తెల్పిన జ్ఞానము దేవతలకు సంబంధము కాకుండ, కేవలము దేవునికి మాత్రమే సంబంధించినది. కావున మా గ్రంథములను ప్రచారము చేయుటవలన మాత్రమే దేవునిసేవ చేసినట్లగును.


దేవుని జ్ఞానమును బోధించడము అను సేవ నిమిత్తము మేము ఒక సంఘమును స్థాపించాము. దానిపేరు “ప్రబోధ సేవాసమితి” ఈ సమితి, దేవునిసేవ నిమిత్తము ఏర్పరచబడినది. ఈ సంఘము దాదాపు 20 సంవత్సరములనుండి పని చేయుచుండినప్పటికి, ఈ ప్రబోధ సేవాసమితి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. మాయా ప్రభావము చేత, మాచే స్థాపించబడిన ప్రబోధ సేవాసమితి ప్రచారము కాలేకపోయినది. అందువలన ఇంతవరకు చాలామందికి ప్రబోధ సేవాసమితి అసలైన దేవునిసేవ చేస్తున్నదని, ఎవరికీ తెలియకుండపోయినది. ఇప్పుడు మేము అందరికీ తెలియజేయునది ఏమనగా! ప్రపంచములో నిజమైన దేవునిసేవ చేయాలనుకొన్నవారు ఎవరైనా ఈ సంఘములో సభ్యులుగా చేరవచ్చును.


---

కొందరికి అలా చేరుటకు కొన్ని ఇబ్బందులుండుట వలన, వారు ప్రబోధ సేవాసమితిలో సభ్యులుగా చేరలేకపోవచ్చును. అలాంటివారు కూడ ఈ సంఘమునకు ఆర్థిక సహాయము చేసి పరోక్షముగా దేవుని సేవలో పాల్గొనవచ్చును. అటువంటి సహాయము చేయువారికి వారి ఆధాయపు పన్నునుండి మినహాయించబడుటకు తగిన అవకాశము కూడ గలదు. దానికి తగిన ప్రభుత్వ అనుమతి కూడ గలదు.


---

ఈ సంస్థ ద్వారా దేవుని సేవ చేయవచ్చును. అట్లుకాకుండ ఎంతమంది దేవతలకైనా, ఎంత పెద్ద పేరున్న దేవతలకైనా, వారి హుండీలలో లక్షలు గుమ్మరించినా, అది దేవుని సేవకాదని తెలియవలెను. చాలామంది అసలైన దైవత్వము తెలియక, కనిపించే దేవతలే దేవుడనుకొని పొరపడి పోయారు. ఆ విషయము గీతయందు స్పష్టముగా చెప్పబడినది. ఇప్పటి నుండైన దేవతలను కూడ సృష్టించినవాడు దేవుడనీ, ఆ దేవున్ని యోగము ద్వారాగానీ, సేవ ద్వారాగానీ చేరవచ్చునని తెలిసి, ఇటు యోగమైనా చేయండి, అటు సేవ అయినా చేయండి. యోగము చేయుటకు ఎట్లు దారిని చూపామో, అట్లే సేవ చేయుటకు కూడ దారిని చూపాము. చెప్పవలసినది మా తప్పులేకుండ చెప్పాము. ఇక మీ ఇష్టము.

ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త ,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024