pss book:Theerpu from cloud api. check 31stJuly2024 in html pre section.

Page 1
30
తీర్పు
దేవుని తీర్పు
(The Judgement Of God)
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
చక్రం
కాల
చక్రం
కర్మ
చక్రం
చక్రం
-బ్రహ్మనాడి
ఇందూ జ్ఞానవేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక
(Regd.No. : 168/2004)

Page 2
తీర్పు
(ది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్)
తీర్పు అనగా తీర్చబడునది అని అర్ధము. ఇంకా వివరముగా చెప్పుకొంటే ఒక విషయములో తప్పు ఒప్పులను
లెక్కించి, ఏది తప్పో, ఏది ఒప్పో వివరించడమే కాకుండా, ఒప్పుకు అక్షనూ తప్పుకు శిక్షనూ తీర్చి చెప్పు దానిని తీర్పు
అంటాము. ఉదాహరణకు న్యాయస్థానమును (కోర్టును) అందరూ చూచియే ఉంటారు. న్యాయస్థానములో (కోర్టులో)
ఒక న్యాయమూర్తి (జడ్జి) ఉంటాడు. జడ్జి ముందర ముద్దాయి ఉంటాడు. ముద్దాయి చేసిన పనిలో మంచి చెడులను
ముద్దాయి చేతగానీ, ముద్దాయి ఎన్నుకోబడిన న్యాయవాది (అడ్వకేట్) చేతగానీ వివరించబడుతుంది. పూర్తి విచారణ
జరిగిన తర్వాత న్యాయమూర్తి (జడ్జి) తనకు తెలిసిన చట్టము ప్రకారము అందులోని తప్పు ఒప్పులను గ్రహించి తీర్పు
చెప్పును. బయట కనబడు కోర్టులు మనుషులు తయారు చేసుకొన్నవే, వీటిని ఉదాహరణకు మాత్రము చెప్పాము.
వాస్తవానికి మనకు కనిపించని న్యాయస్థానము ఒకటి కలదు. అది అతిపెద్ద న్యాయస్థానము. ఆ న్యాయస్థానములో
కుల మత భేదములు లేకుండా అన్ని మతములవారు విచారించబడుదురు. విశేషమేమంటే న్యాయస్థానమూ కనిపించదు,
తీర్పు చెప్పు న్యాయమూర్తీ కనిపించడు. కనిపించని న్యాయస్థానములో, కనిపించని దేవుడే న్యాయమూర్తిగా ఉండును.
ఏ తీర్పయినా దేవుని ద్వారానే వచ్చును. అందువలన దానిని దేవుని తీర్పు అనవచ్చును. దానినే కొందరు “ది
జడ్జిమెంట్ ఆఫ్ గాడ్" అంటారు. కనిపించని న్యాయస్థానములో ఎలా విచారణ జరుగుతుందో, ఎలా తీర్పు చేయబడుతుందో
ఎవరికీ తెలియదు. తీర్పులోని శిక్ష ఏమిటి అను విషయము కూడా ఎవరికీ తెలియదు. విచారణగానీ, తీర్పుగానీ,
శిక్షగానీ లేక అక్ష గానీ ఎవరికీ తెలియవు. అయితే తీర్పు చేయబడిన శిక్ష మాత్రము తప్పనిసరిగా ఎవరైనా
అనుభవించవలసిందే. బయటి కోర్టులో విచారణ, తీర్పు, శిక్ష ముందే తెలియును. ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తే,
ఆ ముద్దాయికి అది ముందే తెలిసిపోవును. అలాగే జైలు శిక్షగానీ ముందే తెలియును. అయితే కనిపించని లోపలి
కోర్టులో విధించిన శిక్ష అమలు జరుగబోవుటకు ఒక్క క్షణము ముందు కూడా తెలియదు.
ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును, అదేమనగా! కోర్టును గురించిగానీ, జడ్జిని గురించిగానీ, శిక్షను
గురించిగానీ విన్నాము, అయితే 'అక్ష' అను పదమును గురించి ఎప్పుడూ వినలేదు, అలాగే అది ఎలా అమలు జరుగునో
కూడా తెలియదు, అంతకూ అది ఏమిటి? అని ప్రశ్నించ వచ్చును. దానికి నా అధికారియైన ఆత్మ నా ద్వారా ఇలా
తెలియజేస్తున్నది. అందువలన మేము (నా ఆత్మ+నేను) ఇద్దరమూ చెప్పునదేమనగా! "క్ష" అను శబ్ధము నాశనమును
సూచించును. శిక్ష అనగా నాశనమునకు సంబంధించినదని అర్ధము. శారీరకముగాగానీ, మానసికముగాగానీ కలుగు
నాశనమును శిక్ష అంటాము. శరీర మరియు మానసిక నాశనము బాధతో కూడుకొని ఉంటుంది. అటువంటి బాధ
కలుగుటను శిక్ష అంటాము. బయట కనిపించు కోర్టును న్యాయస్థానముగా, అందులోని జడ్జిని న్యాయమూర్తిగా
చెప్పుకొన్నాము. ఇది ఉదాహరణ మాత్రమే. అసలు న్యాయస్థానము శరీరములోనే గలదు. అందులో న్యాయమూర్తి
ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనను ఎవరూ చూడలేదు. దండనాధికారిగా ఒకడున్నాడనుటకు నిరూపణగా భగవద్గీతా
గ్రంథములో విభూతి యోగము అను అధ్యాయములో 29వ శ్లోకమున "యమ స్సంయమతా మహమ్” అను వాక్యముగలదు.
దాని అర్థము "శిక్షించు వారిలో యముణ్ణి నేను" అని గలదు. యముడు అంటే ఆయన ఎక్కడో ప్రత్యేకమైన యమలోకములో
ఉంటాడనీ, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ అనుకోవద్దండి. పురాణాల కథలలోనికి పోకుండా, ఆధ్యాత్మిక విషయములోకి
వచ్చి చూస్తే, మన శరీరములో కనిపించక ఉన్నవాడే నిజమైన యముడని తెలియగలదు. ఏ తప్పుకు ఏ శిక్షనో దానిని
ముందే 'దేవుడు' అను యముడు ఆదిలోనే నిర్ణయించి ఉన్నాడు. తప్పులకు శిక్షలు ముందే నిర్ణయించబడియున్నవి.
వాటి ప్రకారము మనిషి చేసిన తప్పేమిటో గ్రహించి దానికి తగిన శిక్షను అమలు చేయువాడు మరొకడు గలడు.
2

Page 3
సృష్టికంటే ముందే అన్నీ దేవుని చేత నిర్ణయించబడియున్నవి. సృష్ఠి తర్వాత దేవుడు పని చేయనివాడుగా,
రూపములేనివాడుగా, పేరులేనివాడుగా ఉన్నాడని ఎవరూ మరువకూడదు. ఆధ్యాత్మిక చట్టము ప్రకారము (ధర్మము
ప్రకారము) దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడని జ్ఞాపకముంచుకోవలెను. దేవుడు అన్నిటికీ అతీతుడుగా
ఉన్నాడు. విశ్వమునంతటినీ సృష్టించినవాడు, పాలించువాడు, నాశనము చేయువాడు దేవుడే అయినా, ఆ ఏర్పాట్లన్నిటినీ
దేవుడు సృష్ఠికి పూర్వమే చేసిపెట్టాడు. అందువలన దేవున్ని సృష్ఠి, స్థితి, లయలకు కారణభూతుడని చెప్పవచ్చును. ఇదే
విషయము అందరికీ తెలియునట్లు ప్రపంచ భాష అయిన ఆంగ్ల భాషలో దేవున్ని God (గాడ్) అని మూడక్షరముల
సమ్మేళనముతో చెప్పడము జరిగినది. దేవుడు సృష్టిని తయారు చేసినవాడు కావున ఆయనను Generator (జనరేటర్)
అని ఇంగ్లీషు భాషలో చెప్ప వచ్చును. అలాగే పాలించువానిని Operator (ఆపరేటర్) అని అనవచ్చును. అట్లే
లయము చేయువాడు లేక నాశనము చేయు వానిని Destroyer (డిస్ట్రాయర్) అని అనవచ్చును. దేవుడు జనరేటర్,
ఆపరేటర్, డిస్ట్రాయర్ కావున ఆయనకు గుర్తుగా Generator పదమునుండి మొదటి అక్షరమైన “ఆ” ని తీసుకొని,
తర్వాత పదమైన Operator పదమునుండి మొదటి అక్షరము “0” ని తీసుకొని, చివరి Destroyer అను పదమునుండి
మొదటి అక్షరమైన “D” అను అక్షరమును తీసుకొని మూడక్షరములను కలిపి “GOD" అన్నారు. గాడ్ (GOD) అను
మూడు అక్షరముల సమ్మేళనము సృష్ఠి, స్థితి, లయ కర్తయిన దేవునికి గుర్తుగా ఉన్నది. అంతేగానీ అది వాస్తవానికి
పేరుకాదు. దేవునికి పేరు లేదు, ఆయనకున్న గొప్పతనమునకు సంబంధించిన బిరుదులను గాడ్ అనీ, దేవుడనీ,
పరమాత్మయనీ, ఈశ్వరుడనీ, పురుషోత్తముడనీ, సర్వాంతర్యామి అనీ, సర్వధారి అనీ, సృష్ఠి కర్తయనీ, ఆదిమధ్యాంత
రహితుడనీ, విశ్వవ్యాపి అని ఎన్నో బిరుదులతో పిలువడము జరుగుచున్నది.
ఎవరి ఊహకు అందనివాడు దేవుడు, ఎవరికీ తెలియనివాడు దేవుడు. అన్నిటికీ కారణకర్తయిన దేవున్ని
ఆంగ్లభాషలో GOD (గాడ్) అనినా, తెలుగు భాషలో అందరికీ పరిచయమున్న దేవుడు అను బిరుదుతోనే మనము
చెప్పుకొందాము. దేవుడు మూల పురుషునిగా ఉన్నా ఏమీ చేయనివాడుగా ఉన్నాడు. అలాంటపుడు ప్రస్తుతము
మనిషి చేయుచున్న తప్పులను గుర్తించి దానికి దేవుడు నిర్ణయించిన చట్టము లేక ధర్మము ప్రకారము శిక్షలను అమలు
చేయువాడు మరొకడు కలడని చెప్పాము కదా! ఆ రెండవవాడు మనిషి చేయుచున్న తప్పులను పాపములుగా గుర్తించి
లిఖించుకొని, తర్వాత ఆ పాపములకు పరిహారముగా శిక్షలను అనేక విధములుగా అమలు చేయుచున్నాడు. అదే
విధముగా మనిషి చేయుచున్న ఒప్పులను పుణ్యములుగా గుర్తించి లిఖించుకొని, తర్వాత ఆ పుణ్యములకు పరిహారముగా
ఎన్నో విధముల అక్షలను కూడా అమలు చేయుచున్నాడు. శిక్షలనుగానీ, అక్షలనుగానీ ముందే నిర్ణయించినవాడు
మొదటివాడైన యముడు (దేవుడు) కాగా, వాటిని అమలు చేయువాడు రెండవవాడైన చిత్రగుప్తుడు. యముడు, చిత్రగుప్తుడు
అను పేర్లను విన్నవారు కొందరుండినా, వారి భావములో యమలోకములో యముడున్నాడనీ, అలాగే చిత్రగుప్తుడు
ఉన్నాడనీ పురాణగాథలననుసరించి అనుకోవడము జరుగుచున్నది.
అయితే ఇక్కడ ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమనగా! తెలుగులో “దేవులాడబడేవాడు దేవుడు లేక
వెతకబడేవాడు దేవుడు” అని అర్థమునిచ్చు పదముండినా, ఆంగ్లములో సృష్టి, స్థితి, లయలకు కారకుడను అర్థమునిచ్చు
GOD (గాడ్) ఉండినా, దండనాధికారి అయిన దానివలన దేవున్ని 'యమ' అని పిలుస్తున్నాము. 'యమ' అను పదము
దేవునికే వర్తిస్తుంది. ఒక మనిషి ఉన్నత ఉద్యోగి అయినా, దేశానికి రాజయినా, మంత్రయినా, ఏ హెూదాలో ఉండినా,
వాడు మూడవవాడైన జీవుడు మాత్రమే అగును. మొదటివాడు అన్నిటికీ కారణమైన పరమాత్మ (దేవుడు)కాగా, రెండవవాడు
3

Page 4
అన్నిటినీ అమలు చేయు చిత్రగుప్తునిగా ఉన్నాడు. వివరముగా చెప్పుకొంటే మొదటివాడు మూలపురుషుడైన యముడుకాగా,
శిక్షలను, అక్షలను అన్నిటినీ అమలు చేయువాడు చిత్రగుప్తుడనబడు రెండవవాడని చెప్పవచ్చును. ఇక మూడవవాడు
మనిషి శరీరములోపల ఉండి శిక్షలను నరకముగా, అక్షలను స్వర్గముగా అనుభవించువాడైన జీవుడని చెప్పవచ్చును.
విశ్వములో పురుషతత్త్వము కలవారు ముగ్గురు మాత్రమే కలరు. ఆ ముగ్గురిలో చివరి పురుషుడు లేక
మూడవ పురుషుడు జీవాత్మగా ఉన్నాడు. రెండవ పురుషుడు రహస్యముగా గుప్తాత్మగా ఉన్నాడు. ఇక మొదటి
పురుషుడే మూడవ పురుషునికంటే, రెండవ పురుషునికంటే ఉత్తముడైన పురుషోత్తమునిగా ఉన్నాడు. కావున ఆది
పురుషుడైన దేవున్ని పురుషోత్తమ అని కూడా అన్నాము. అక్షకు అర్థము చెప్పుకోవడానికి ముందు ఇవన్నీ చెప్పుకోవలసిన
అవసరమున్నది. ఈ ముగ్గురు పురుషులను విడదీసి చెప్పుచూ మేము "త్రైత సిద్ధాంతము”ను ప్రతిపాదించాము. త్రైత
సిద్ధాంత జ్ఞానము జ్ఞానములలోకెల్ల ఉత్తమమైన జ్ఞానమని గర్వముగా చెప్పుచున్నాను. ఇదే త్రైత సిద్ధాంతమును
ఇందుత్వమునకు మూల గ్రంథమైన భగవద్గీతలో చూస్తే, పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17, 18 శ్లోకములలో
ఇలా ఉన్నది.
16వ శ్లో॥
17వ శ్లో॥
18వ శ్లో॥
ద్వావిమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ |
II
క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః ।
యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
యస్మాత్ క్షర మతీతోహ మక్షరాదపి చోత్తమః |
అతోస్మిలోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః ॥
16వ భావము :- లోకములో రెండు రకముల పురుషులున్నారు. వారినే క్షరుడు, అక్షరుడని చెప్పుచున్నాము. క్షరుడు
సర్వజీవ శరీరములలో కలడు. వానితో పాటు అక్షరుడు కూడా ఉన్నాడు.
17వ భావము :- పరమాత్మ అనబడు పురుషుడు కూడ వేరొకడు గలడు. వానినే ఉత్తమ పురుషుడు అని అనుచున్నాము.
ముల్లోకములను ఆవహించి వాటిని భరించు ఉత్తమ పురుషున్ని ఈశ్వరుడనుచున్నాము.
18వ భావము :- క్షరునికంటే అధికుడగుట వలన, అక్షరునికంటే ఉత్తముడగుట వలన, నన్నే లోకమున వేద
స్వరూపమైన లేక గుణ స్వరూపమైన ప్రకృతి పురుషోత్తమునిగా చెప్పుచున్నది.
ఈ మూడు శ్లోకములలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని ముగ్గురు పురుషులను గురించి చెప్పడము
జరిగినది. మొత్తము విశ్వములో ఈ ముగ్గురే పురుషులు కలరు. వీరి మినహా పురుషుడనేవాడే లేడు. ముగ్గురు
పురుషులలో క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము. అక్షరుడనగా నాశనములేనివాడని అర్థము. ఇకపోతే వీరిద్దరికీ
పెద్ద మరియు ఉత్తముడైన వాడు పురుషోత్తమునిగా చెప్పబడుచూ, చావు పుట్టుకలు లేనివాడుగా ఉన్నాడు. పరమాత్మ
అనబడు దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉండడమే కాకుండా అందరి శరీరములలోనూ ఉన్నాడు. అందరికీ దేవుడనే
వాడు ఒకడున్నాడని తెలుసు. అయితే చాలామందికి తాను జీవున్నని తెలియదు. ఇకపోతే మధ్యలోనున్న అక్షరుడే
ఎవరికీ తెలియడు. అక్షరుడనబడేవాడే మనిషి చేయు కర్మలన్నిటిని లెక్కించి లిఖించువాడనీ, వాటిని తిరిగి అమలు
4

Page 5
పరుచువాడనీ ఎవరికీ తెలియదు. ప్రతి మనిషి శరీరములో జీవునితోపాటు ఉంటూ, ప్రతి కదలికను తానే కలుగజేస్తూ
శరీరములోపలి అవయవములనూ, బయటి అవయవములనూ నడిపి జీవుని చేత కర్మలను అనుభవింపజేయువాడు
రెండవవాడైన అక్షరుడే. ఇప్పుడు అక్షరుడు అను శబ్దము తెలిసిపోయింది. కావున అక్షకు కూడ అర్థమును సులభముగా
చెప్పుకోవచ్చును.
నీ శరీరములో నీవు శిక్షనుగానీ, అక్షనుగానీ అనుభవించు జీవునివి మాత్రమే. నీ శరీరమును కదిలించి రూప,
శబ్ద, స్పర్శ, రుచి, వాసన అను ఇంద్రియజ్ఞానములనిచ్చి, నీ చేత కష్టసుఖములు అనుభవించునట్లు చేయు అక్షరుడు నీ
శరీరములో నీ ప్రక్కనే ఉన్నా నీకు తెలియదు. అట్లే ఈ ప్రపంచములో ఎవరికీ తెలియదు. ప్రస్తుత కాలములో రెండవ
పురుషుని గుర్తింపేలేదు. తాను జీవుడనను విషయమునే భూమిమీద 95 శాతము ప్రజలు మరచిపోయారు. ఐదు
శాతము మంది నాస్తికులైపోయి, ఆది పురుషుడైన దేవున్నే లేడంటున్నారు. ఇతర మతముల పేర్లు పెట్టుకొన్న వారికి
పురుషుల జ్ఞానమే తెలియదు. తన శరీరములో తనకూ, తన శరీరమునకూ అధిపతియైన వాడొకడున్నాడనీ, తన
శరీరము మీద తనకు ఏ అధికారమూలేదనీ, తన శరీరమును తనలోనే తనకు పొరుగువాడిగా ఉన్న అక్షరుడు
నడిపిస్తున్నాడనీ, తనకు శరీరము మీద ఏ అధికారమూ లేదనీ, అందువలననే తనకు చెప్పకుండానే శరీరములోనికి
రోగములు వస్తున్నవనీ ఎవరూ గ్రహించలేక పోవుచున్నారు. ఎవరూ గుర్తించనట్లు శరీరములో అక్షరుడనబడు
రెండవవాడున్నాడు.
శరీరములో రహస్యముగా ఎవరూ గుర్తించలేనట్లున్న అక్షరున్ని గుప్తుడు అన్నారు. గుప్తుడు అనగా తెలియకుండ
దాగి ఉన్నవాడని అర్థము. శరీరములో ప్రత్యక్షముగా పనులు చేయుచున్నా, ప్రతి కదలికకు కారణమైవున్నా, మాయ
అను ముసుగును కప్పి ప్రత్యక్షముగా ప్రక్కనే ఉన్నా తెలియకుండా ఉండడము పెద్ద చిత్రము. ఆలోచిస్తే చిత్రముగా
తెలియబడువాడు అక్షరుడు. కావున రెండవ వానిని చిత్రగుప్తుడు అన్నారు. మన శరీరములో విచిత్రముగా, రహస్యముగా
ఉన్నాడు కావున చిత్రగుప్తుడు అనవలసి వచ్చినది. క్షరుడు మూడవవాడైన జీవాత్మకాగా, అక్షరుడు రెండవ వాడైన ఆత్మ
లేక చిత్రగుప్తుడు. ఆది పురుషుడైన పరమాత్మ మూలపురుషుడైన దేవుడు. దేవుడు పనిచేయనివాడు అందువలన
క్రియారహితుడని ఆయనను అనుచున్నాము. ఇకపోతే జీవుడు శరీరములోపల చిన్న కేంద్రములో ఉండి, ఏమీ చేయలేక
తన వరకు వచ్చినవాటిని మాత్రమే అనుభవించుచున్నాడు. శరీరములోపలనున్న జీవుడు కూడా క్రియలను ఆచరించువాడు
కాడు. అయితే ఈ మాట చాలామందికి అసత్యముగా, ఆశ్చర్యముగా కనిపించినా, జీవుడు అనుభవించు పని తప్ప ఏ
పనినీ చేయడనుట సంపూర్ణమైన సత్యము. పూర్తి ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సువిశాల విశ్వములో సర్వజీవుల
శరీరములనూ ఆడించి నడిపించువాడు ఒకే ఒక ఆత్మ. అదియే అక్షరాత్మయై చిత్రగుప్తునిగా ఎవరికీ తెలియకుండా
ఉన్నది.
ఒక శరీరములోనున్న ఆత్మ మరొక శరీరమును హత్య చేయుచున్నది. ఒక శరీరమును బలవంతునిగా చేసి
శక్తినిచ్చి కొట్టుచున్నది. మరొక శరీరమును బలహీనునిగా చేసి దెబ్బలు తినునట్లు చేయుచున్నది. ఈ విధముగా
అందరి శరీరములలోనున్న ఆత్మ, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా నడుపుచూ చిత్ర విచిత్రములు చేయుచున్నది. అయితే
ఈ ఆత్మ విషయము తెలియనివారు అందరూ తామే అన్ని పనులూ చేయుచున్నట్లు భ్రమించుచున్నారు. అదియే పెద్ద
అజ్ఞానమై, తమ భావముల చేతనే పాపపుణ్యములు ఏర్పడుచున్నవని తెలియలేక పోవుచున్నారు. అందువలననే హత్య
చేసినది ఆత్మయితే, హత్యా పాపమును అనుభవించునది జీవాత్మగా ఉన్నది. అలాగే కొన్ని మంచి పనులను చేసినది
5

Page 6
ఆత్మే అయినా జీవాత్మ తానే చేశానని అనుకోవడము వలన దానికి ప్రతిఫలితముగా పుణ్యము వచ్చుచున్నది. జీవుడు
తాను చేయని పనులను అజ్ఞానము వలన అహము చేత నేనే చేశానని అనుకోవడము వలన వచ్చిన పాపములను
శిక్షగా, అలాగే వచ్చిన పుణ్యమును అక్షగా అనుభవించుచున్నాడు. తనపాలిట వచ్చిన పాపమునుగానీ, పుణ్యమునుగానీ
అనుభవించకుండా తప్పించుకోవాలని ఎందరు ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎంతమంది దేవతలకు మ్రొక్కినా, నీ
పొరుగుననే నీ శరీరములోనున్న ఆత్మయిన చిత్రగుప్తుడు ఏమాత్రము వదలకుండా అనుభవించునట్లు చేయును. ఎవడు
ఏ విధముగా శిక్షను అనుభవించునది అనుభవించేంతవరకు ఎవనికీ తెలియదు. అలాగే ఎవడు ఏ విధముగా ఎంత
అక్షను అనుభవించేది అనుభవించేంతవరకు ఎవరికీ తెలియదు.
ఒక కార్యము జరుగుటకు కర్మ కారణమై ఉండును. కార్యము జరిగితే కారణమైన కర్మ (పాపముగానీ లేక
పుణ్యముగానీ) తీరిపోవును. కార్యము జరిగినప్పుడు ఆ కార్యములోని పాపపుణ్యములు క్రొత్తగా వచ్చినప్పటికీ, అవి
ఆత్మను అంటవు. కార్యము చేసినది చిత్రగుప్తుడైన ఆత్మే కావున ఆ కార్యములో వచ్చు ఫలితమైన కర్మ ఆత్మను
చేరవలసియుండినా, అది ఆత్మను చేరలేదు. అగ్నిలోనికి వచ్చిపడిన ఏ మిడతగానీ, ఏ పురుగుగానీ, ఏ కట్టెగానీ
కాలిపోకతప్పదు. అదే విధముగా రెండవ పురుషుడైన ఆత్మ శరీరమునకు అధిపతియై, శరీరమంతా వ్యాపించియుండి,
శరీరము చేత చేయించిన పనిలో తయారై వచ్చిన ఏ పాపముగానీ, ఏ పుణ్యముగానీ, ఎంత పెద్ద కర్మగానీ ఆత్మను
అంటదు. మూడవవాడైన జీవాత్మ శరీరములో లోపల ఒక్కచోట ఉన్నా, అది ఏ పనీ చేయలేదు, కావున జీవున్ని కూడా
కర్మ అంటుటకు వీలులేదు. అయితే జీవుడు తాను చేయని పనిని తాను చేసినట్లు అనుకోవడము వలన కార్యములో
తయారైన కర్మ వచ్చి జీవున్ని చేరుచున్నది. ఈ విధముగా ప్రపంచములో శరీరమును ధరించి పుట్టిన జీవుడు తాను
చేయని కార్యమునకు కర్మబద్ధుడగుచున్నాడు.
జీవున్ని అంటుకొనియున్న కర్మను రెండవవాడూ మరియు శరీరములో జీవునికి పొరుగువాడైన ఆత్మ, జీవుని
కర్మకు తగిన కార్యములను చేసి, ఆ కార్యములలోని కష్ట సుఖములను జీవుని చేత అనుభవింప చేయుచున్నది. తనకు
సంబంధము లేకున్నా, తాను చేయకున్నా జీవాత్మ అనవసరముగా కర్మను తన నెత్తిన వేసుకొని తిరిగి పుట్టి అనుభవించు
చున్నది. జీవుడు శరీరములోని “అహము” అను భాగము యొక్క మాటవిని, తాను అహం భావమును పొంది చేయని
కార్యములకు కర్మను మూట గట్టుకొనుట వలన, జీవుడే కర్మను అనుభవించవలసి వచ్చినది. అనుభవించువాడు
జీవుడు అయితే, అనుభవింప చేయువాడు చిత్రగుప్త బిరుదాంకితుడైన ఆత్మని తెలిసి పోయినది. మనిషిని నడిపించి
ఆడించి జీవున్ని అనుభవింపజేయువాడు ఆత్మయితే, శరీరములోపల కూడా దేవుడు ఉంటూ సాక్షిగా ఉన్నాడు.
నడిపించబడువాడు లేక ఆడించబడువాడు లేక తోలబడువాడు జీవాత్మయితే నడిపించువాడు, ఆడించువాడు, తోలువాడు
రెండవవాడైన ఆత్మగా ఉండగా పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. దీనినే లేక ఈ విషయమునే "త్రైత సిద్ధాంతము”
అంటున్నాము. మూడు ఆత్మల ఈ త్రైత సిద్ధాంతము భగవద్గీతలోను, బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథములలోనూ
తెలుపబడినది. అయినా మతాల మత్తున్న వారికి ఈ మూడు ఆత్మల విషయము ఏమాత్రము తెలియకుండా పోయినది.
కావున తిరిగి మేము ఇప్పుడు జ్ఞాపకము చేయవలసి వచ్చినది. ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో మూడు ఆత్మల
విషయము 'ఖాఫ్' అనబడు 50వ సురాలో 21వ ఆయత్నందు ఇలా కలదు.
1) “దివ్య ఖుర్ఆన్” గ్రంథములో 50-21 :- “ప్రతి వ్యక్తీ తనవెంట ఒక తోలేవాడూ, ఒక సాక్ష్యము
చెప్పేవాడూ ఉన్న స్థితిలో వస్తాడు.” అని వ్రాయబడినది.
6

Page 7
2) "అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అనుదానియందు 50-21 :- "ప్రతి వ్యక్తి తనవెంట తనను
తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు." అని వ్రాయబడియున్నది.
3) “దివ్య ఖుర్ఆన్ సందేశం" అను గ్రంథములో 50-21:- "ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో,
మరియొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది.” అని వ్రాయబడియున్నది.
4)
“ఖురాన్ మజీద్” అను గ్రంథములో 50-21 :- "ప్రతి మానవుడూ వచ్చును. అతని వెంట నొకడు
తీసుకొని వచ్చువాడునూ, మరొకడు సాక్షియునుందురు.” అని వ్రాయబడియున్నది.
శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎలా సంస్కృత భాషలో శ్లోకముల రూపముగా వ్రాయబడినదో, అలాగే జిబ్రయేల్
చెప్పిన ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలో వాక్యముల రూపముగా వ్రాయబడినది. అరబ్బీ వాక్యములను తెలుగులోనికి
అనువదించిన వారు కొన్ని పదముల మార్పుతో వ్రాసినా, భావము మాత్రము ఒక్కటిగానే ఉన్నట్లు తెలియుచున్నది.
భగవద్గీత మూల గ్రంథము సంస్కృత భాషలో ఉండుట వలన గీతలోని సంస్కృత శ్లోకమును చెప్పి, దాని వివరమును
తెలుగులో చెప్పినట్లు, ఖుర్ఆన్ గ్రంథములో కూడా ముందు అరబ్బీ భాషలోని వాక్యమును (ఆయత్ను) చెప్పి దాని
వివరము చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మనకు కావలసినది దైవజ్ఞానము, కావున భాషకంటే భావము ముఖ్యము.
అరబ్బీ భాషను తెలిసినవారు కొందరు ఖురాన్ జ్ఞానులు తెలుగులో భావమును వ్రాయడము జరిగినది. నలుగురు
ముస్లీమ్ పండితులు వ్రాసిన నాలుగు ఖుర్ఆన్ గ్రంథములను చూచాము. అందరి భావము ఒక్కటిగానే ఉన్నదానివలన,
ఖుర్ఆన్ వాక్యము యొక్క నిజ భావము మనకు తెలిసినట్లే అయినది. ఖుర్ఆన్దాయందు అరబ్బీ భాషలో 50-21 ఇలా
ఉన్నది. “వ-జాఅత్ కుల్లు-నఫ్సిమ్ -మఅహా-సా ఇఖున్. వ షహీద్.”
ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు సాక్షిగాయున్నవాడు దేవుడైతే, నిన్ను తోలేవాడు లేక తనను తీసుకొచ్చేవాడు
అని చెప్పబడినవాడు చిత్ర గుప్తమైన ఆత్మగాయున్నది. నిన్ను తోలేవాడు ఆత్మయితే నీవు జీవాత్మగా యున్నావు. జీవాత్మ
అనబడువాడు తాను స్వయముగా ఏమీ చేయలేడు. తీసుకురాబడేవాడుగా, తోలబడేవాడుగా ఉన్నాడు. దీనినిబట్టి పని
చేసేవాడు ఆత్మయనీ, సాక్షిగా చూచేవాడు దేవుడనీ, అనుభవించేవాడు జీవాత్మయనీ తెలిసిపోయినది. శరీరములో
జీవుడు విషయ సుఖములను అనుభవించుచున్నాడనీ, ఆత్మ శరీర భాగములకు శక్తినిచ్చి నడిపించుచు జీవున్ని
అనుభవింపజేయుచున్నదనీ, జ్ఞానదృష్టి గలవారికి మాత్రమే తెలియునని భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున
9,10 శ్లోకములలో ఈ విధముగా భగవంతుడు చెప్పుచున్నాడు చూడండి.
9వ శ్లో॥ :
శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవచ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే ॥
10వ శ్లో॥ :
ఉత్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ॥
9వ భావము :- శబ్దమును అందించు చెవిని, చూపునందించు కన్నును, స్పర్శనందించు చర్మమును, రుచిని అందించు
నాలుకను, వాసనను అందించు ముక్కును మరియు మనస్సును జీవాత్మ అధిష్ఠించియుండి ఎల్లప్పుడు విషయ
అనుభవములనబడు సుఖదుఃఖములను అనుభవించుచున్నాడు.
7

Page 8
10వ భావము :- జీవాత్మ శరీరమును ధరించి, లోపల గుణములతో కూడుకొనియుండి బయటినుండి వచ్చు విషయ
సుఖములను లేక విషయ దుఃఖములను అనుభవించుచుండును. ఆత్మల జ్ఞానములేని మూఢులకు ఈ విధానము
కనిపించదు. జ్ఞాననేత్రము కల్గినవారికి మాత్రము శరీరములో జీవుడు ఉన్న స్థితి తెలియుచున్నది.
ఇక్కడ విశేషమేమంటే శరీరములోనున్న కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుకకు శక్తినిచ్చి నడిపించువాడు
గుప్తముగా శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ. గుప్తమైనవాడు శరీర అవయవములను నడుపుచూ వాటిద్వారా
లోపలనున్న జీవున్ని కష్టసుఖములనుభవించునట్లు చేయుచున్నాడు. ఆత్మ నడిపించు ఇంద్రియముల ద్వారా జీవుడు
అనుభవములను పొందుచున్నాడను విషయము జ్ఞానదృష్ఠియున్న వారికి మాత్రమే తెలియును, జ్ఞానదృష్టిలేని వారికి
ఏమాత్రము తెలియదని స్పష్టముగా గీతలో చెప్పబడినది. అంతేకాక అందరినీ ఆడించు ఆత్మ శరీరములో ఉన్న
విషయము ప్రయత్నము చేయు యోగులకు మాత్రమే తెలియుననీ, యోగులు గాని వారికి, ప్రకృతి దృష్ఠి కల్గినవారికీ
ఆత్మ తెలియదనీ, అదే అధ్యాయములో 11వ శ్లోకమున కలదు చూడండి.
11వ శ్లో॥
యతన్తో యోగిన శ్చైనం పశ్యన్త్యాత్మ వ్యవస్థితమ్ |
యతన్తో ప్యకృతాత్మానో నైనం పశ్యన్య చేతసః ॥
భావము :- ప్రయత్నము చేయు యోగులు మాత్రము ఆత్మ శరీరమంతా ఏ విధముగా ఆవహించియున్నది తెలియగలరు.
ప్రకృతి జ్ఞానమును తెలిసినవారికి స్థూలము తప్ప సూక్ష్మమైన ఆత్మ తెలియబడదు.
వస్త్రము ధరించిన మనిషి వస్త్రము నేను కాదు, నేను వస్త్రములోపలయున్నానని జ్ఞప్తి కల్గియుండును. ధరించిన
వస్త్రమును కూడా నేనే అని తెలివి తక్కువవాడు కూడా అనుకోడు. అయితే జీవుడు శరీరమును వస్త్రమువలె
ధరించియుండి, శరీరము వేరు నేను వేరను జ్ఞప్తిలేక, శరీరమును చూచుకొని శరీరమును నేనే అనుకొనుచున్నాడు.
శరీరమునే తానుగా అనుకొన్నవాడు శరీరము ద్వారా జరుగు పనులన్నీ తానే చేయుచున్నానని అనుకోవడము
జరుగుచున్నది. జీవుడు ఏ విధముగా అనుకొనినా, శరీరము ద్వారా జరుగు పనుల వలననే జీవుడు దుఃఖములను
పొందుచున్నాడు. శరీరములోని బుద్ధి తాను కాకున్నా తనను గొప్ప ప్రతిభావంతునిగా చెప్పుకొనుచుండును. అయినా
తన బుద్ధి చేతనే కష్టములు కూడ ఎందుకు వస్తున్నవని తెలియలేక పోవుచున్నాడు. శరీరములో నివసించు జీవునికి
తెలియకుండానే శరీరములోని ఆత్మే జీవున్ని కష్టసుఖములపాలు చేయుచున్నది. జీవుడు తన శరీరములోనే అనుభవించు
కష్టములను శిక్ష అనుచున్నామనీ, అలాగే జీవుడు అనుభవించు సుఖములను అక్ష అనుచున్నామనీ చెప్పుకొన్నాము.
మీరు మొదటనే అక్ష అనగా ఏమి? అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇప్పుడు రాబోతుంది చూడండి.
కష్టమును సూచించు శిక్షలోగానీ, సుఖమును సూచించు అక్షలో గానీ రెండు పదములలో "క్ష" అను శబ్దము
కలదు. “క్ష” అనగా నాశనమని, క్షీణించి పోవడమని అర్థముగలదు. "శి" అనగా అడ్డులేకుండా లేక శీఘ్రముగా అని
అర్థము. తొందరగా నాశనము చెందడమును, ఆటంకము లేకుండా బలహీనపడిపోవడమును శిక్ష అంటున్నాము.
అలాగే అక్ష అను పదములో 'అ' కారము అడ్డుకలిగించునది లేక నివారించునది అని అర్థము నిచ్చుచున్నది. అశ్రద్ధ
అను పదమును తీసుకొని చూస్తే శ్రద్ధ లేకుండాపోవడము అని చెప్పవచ్చును. వివేకమునకు “అ” అను శబ్దమును
చేర్చితే అవివేకమగును ఉన్న వివేకము క్షీణించి పోయినదనీ లేకుండా పోయినదని తెలియుచున్నది. అలాగే “క్ష” అను
శబ్దమునకు “అ” అను శబ్దమును చేర్చితే నాశనము లేదని, బలహీనత లేదని తెలియుచున్నది. నాశనములోనూ,
8

Page 9
బలహీనతలోనూ జీవుడు బాధపడుచున్నాడు. అందువలన ఆటంకములేని లేక తొందరగా పొందు బాధను శిక్ష అని
పెద్దలు చెప్పారు. అలాగే బలహీనతను లేకుండా నాశనము లేకుండా ఉన్నప్పుడు పొందు సుఖమును అక్ష అని చెప్పడము
జరిగినది.
శరీరములో జీవుడు పొందు దుఃఖమును శిక్ష అనియూ, అలాగే జీవుడు పొందు సుఖమును లేక సంతోషమును
అక్ష అనియూ అంటున్నాము కదా! ఒక జీవుడు పొందు శిక్షలు, అక్షలు ప్రకృతి మార్గములోనివీ, దైవమార్గములోనివీ
అని రెండు రకములుగలవు. ప్రకృతి మార్గములో ప్రతి మనిషి శిక్ష అక్షలను అనుభవిస్తున్నాడు. అవి పాపపుణ్యములనబడు
కర్మ మూలముగా వచ్చుచున్నవనీ, వాటిని విధిగా అనుభవింపజేయువాడు ఆత్మని తెలుసుకొన్నాము. దైవమార్గములో
శిక్ష అక్షలున్నా, వాటిని కూడా విధించువాడు ఆత్మే అయినా, అవి కర్మనుబట్టి ఉండవు. బయట కోర్టులో శిక్షలు
చట్టమునుబట్టియుంటే, ప్రకృతి జనిత శరీరములోని శిక్షలు కర్మను బట్టియుంటే, దైవమార్గములోని శిక్షలు ధర్మాధర్మములను
బట్టియుండును. ఇక్కడ కొంత వివరముగా అర్థము చేసుకోవలసినదేమనగా! మనిషి చేత చేయబడు పనిగానీ, మాట్లాడు
మాటలుగానీ, బుద్ధిచేత చెప్పబడు సిద్ధాంతములుగానీ, ఆలోచనలుగానీ ప్రతిభలుగానీ అన్నీ ఆత్మవలననే కలుగుచున్నవి.
జీవుని ఇచ్చను అనుసరించి ఏదీ ఉండదు. అన్నీ ఆత్మ వలననే జరుగుచుండును. మనిషి తన అజ్ఞానముచేత ఆత్మ
చేయు అన్ని పనులనూ తానే చేయుచున్నానని భ్రమించినా, భ్రమించకపోయినా ఆత్మే సర్వమునూ చేయుచున్నది. ఏ
పనీ జీవుడు చేయుటకు హక్కుగానీ, అవకాశముగానీ లేదు. అన్నీ కర్మననుసరించి ఆత్మ శరీరము చేత చేయించు
చుండును.
అయితే దైవమార్గములో మాత్రము ఏ జీవునికి కర్మ ఉండదు. దైవమార్గములో కర్మను అనుసరించే పనులు
జరుగుననుట ఏమాత్రమూ లేదు. ప్రకృతి మార్గములో కార్యముల విషయములో ఏ హక్కూలేని జీవునికి, దైవమార్గములో
సంపూర్ణమైన స్వాతంత్ర్యము కలదు. జీవుడు దైవ మార్గములో తన ఇష్టప్రకారము చేయుటకు పూర్తి హక్కు కలిగియున్నాడు.
దైవమార్గములోని పనులన్నీ జీవుని ఇష్టము మీద ఆధారపడియుండును. ప్రపంచ విషయములలో జీవునికి ఏ విధముగా
అస్వతంత్రత కలదో, అట్లే దైవ మార్గములో జీవునికి పూర్తి స్వతంత్రత కలదని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధమైన
పనులన్ని కర్మాధీనము ప్రకారముండగా, దైవసంబంధ పనులన్ని ఏమాత్రము కర్మకు సంబంధము లేకుండా అంతా
జీవుని ఇష్టము ప్రకారము జరుగును. దైవ సంబంధ కార్యములు జీవునికి జన్మ హక్కుగా ఉన్నవి. అయితే అవి జీవుని
ఇష్టము మీద ఆధారపడియుండును. దైవమార్గములో ఇష్టమున్నవాడు తన ఇష్టప్రకారము ఎంతయినా సాధించగలడు.
ఎంతటి జ్ఞానమునైనా పొందగలడు. ప్రతి మనిషికి దైవమార్గములో ఎంతయినా ముందుకు పోవు అవకాశముండినా,
జీవునికి ఇష్టము లేని దానివలన దైవమార్గములో ప్రయాణించలేక పోవుచున్నాడు. కొందరికి దైవమార్గములో ఇష్టమున్నా
అది అంతంతమాత్రముగానే ఉన్నది. కావున వారికి జ్ఞానము అంతంతే లభించుచున్నది. ఇష్టమునే శ్రద్ధ అని కూడా
అంటాము. మనిషికున్న శ్రద్ధనుబట్టి జ్ఞానము లభించుచున్నది. ఎంత శ్రద్ధవున్నవారికి అంత లభించుచున్నది.
అందువలననే గీతలో జ్ఞాన యోగమందు 39వ శ్లోకమున "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పియున్నారు. కర్మవాన్
లభతే కార్యమ్ అన్నట్లు కర్మనుబట్టి కార్యములు జరుగును, మనిషి శ్రద్ధనుబట్టి జరుగవు.
మనిషి కర్మనుబట్టి జరుగు కార్యములలో శిక్ష అక్ష రెండూ ఉన్నట్లు, మనిషి (జీవుని) యొక్క శ్రద్ధనుబట్టి జరుగు
జ్ఞానములో కూడా శిక్ష అక్షలు రెండూ ఉన్నవి. వీటిని కూడా దేవుడు నిర్ణయించినట్లు ఆత్మ చేయుచున్నది. ప్రపంచ
విషయములోగానీ, పరమాత్మ విషయములో గానీ జీవుడు కార్యరూపముగా ఏమీ చేయకున్నా, రెండు మార్గములలోనూ
9

Page 10
కార్యరూపముగా చేయునది ఆత్మేనని తెలియాలి. శరీరమును ఏ మార్గములో నడుపవలసివచ్చినా, శరీరమునకు
అధిపతియైన ఆత్మ నడుపవలసిందేగానీ జీవుడుగానీ, దేవుడుగానీ శరీరమును నడుపరు. జీవుడు కూడా దేవునివలె ఏ
కార్యమును చేయకుండా శరీరములో తనవరకు వచ్చిన అనుభవములను మాత్రము పొందుచున్నాడు. ఇటు జీవుడుగానీ,
అటు దేవుడుగానీ చేయని కార్యములన్నిటినీ, మధ్యలోనున్న ఆత్మ ఒక్క క్షణము కూడా ఊరక ఉండక ఎల్లప్పుడు
చేయుచునే ఉన్నది. ఒక సైంటిస్టు ఒక కొత్త సూత్రము ప్రకారము ఒక క్రొత్త ఔషధమును కనుగొనినా, క్రొత్త పరికరమును
కనుగొనినా అదంతయు అక్షరాలా ఆత్మే చేస్తున్నా నేను కనుగొన్నానని వాడు (జీవుడు) అనుకొనును. ఫలానావాడు
కనుగొన్నాడని ప్రక్కవారందరూ అనుకొంటారు. వాస్తవానికి అందరిదీ పొరపాటే.
ప్రపంచ కార్యములలో పండితుని దగ్గరనుండి పామరుని వరకూ, పారిశ్రామికవేత్తనుండి పనివాని వరకూ,
మేధావి నుండి సామాన్యుని వరకూ, సైంటిస్టు నుండి మతిలేని శాడిష్టు వరకూ, రాజునుండి పేదవాని వరకూ ప్రపంచ
సంబంధముగా ఆత్మే అహర్నిశలు అన్ని పనులు చేయుచున్నది కదా! అదే విధముగా దైవమార్గములో గొప్ప జ్ఞాని
నుండి చిన్న జ్ఞాని వరకు ఆత్మే అందరినీ నడుపుచున్నది. ఎవరి శ్రద్ధనుబట్టి వానికి జ్ఞానము అర్థమగునట్లు ఆత్మే
చేయుచున్నది. జ్ఞానమార్గములో ఎవరిని ఎంత స్థాయికి తీసుకపోవాలో అంతస్థాయికి తీసుకొని పోవునది ఆత్మేనని
మరువకూడదు.
అలాగే దైవమార్గములో తప్పుకు తగిన శిక్ష, ఒప్పుకు తగిన అక్షను అమలు చేయువాడు కూడా
ఆత్మేనని తెలియవలెను. ప్రపంచ విధానములోగానీ, పరమాత్మ విధానములోగానీ ఆత్మ చేయని పనంటూ ఏదీ లేదు.
దీనినిబట్టి చూస్తే తీర్పులలో కూడా ప్రకృతి తీర్పు, పరమాత్మ తీర్పని రెండు రకములుగా విభజించుకొని
చూడవచ్చును. ప్రకృతి తీర్పు శరీరము మీద పడుతుంది, దానివలన స్వర్గ, నరకములనువాటిని కష్ట సుఖ రూపములలో
అనుభవించవలసి వస్తుంది. పరమాత్మ తీర్పు అనునది సూక్ష్మరూపమైన జీవుని మీద పడుతుంది, దానివలన జన్మ,
మోక్షములను పొందవలసి వస్తుంది. ప్రపంచ సంబంధ తీర్పులోని శిక్షకంటే, పరమాత్మ తీర్పులోని జన్మలు భయంకర
మైనవని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధ తీర్పులో వచ్చు పాపము మరుజన్మలో శిక్షగా అనుభవించవచ్చును. అయితే
పరమాత్మ తీర్పులో వచ్చు జన్మలు ఒక్క జన్మతో అయిపోవు, యుగముల పర్యంతము ఉండును. అందువలన పరమాత్మ
తీర్పు చాలా భయంకర మైనది. పరమాత్మ తీర్పులో వచ్చు అక్ష వస్తే అది జన్మలు లేకుండా మోక్షమును కలుగజేయును.
శిక్ష వస్తే జన్మ పరంపరలో మానవుడు (జీవుడు) చిక్కుకొనును. చాలామందికి శిక్ష అను పదము సుపరిచయమే, కానీ
అక్ష అను పదము అందరికీ బహుశా తెలియదనియే చెప్పవచ్చును. కొంత ఆలోచించి చూస్తే అక్ష అనునది పూర్వము
మనుషుల మధ్యలో ఉన్న పదమే. పూర్వము అక్ష అని పిలువబడు పదము నేడు మోక్షముగా పిలువబడుచున్నది.
పూర్వము “అక్ష” గా నున్న పదము కాలక్రమమున “మోక్ష” అను పదముగా మారిపోయినది. “క్ష” ముందర “అ”
పోయి “మో” రావడము జరిగినది. తర్వాత కొంత కాలమునకు మోక్ష అను శబ్దము మోక్షముగా చెప్పబడుచున్నది.
పూర్వము అక్ష అను పదమును ప్రపంచ సంబంధ కష్టములు తొలగిపోయినప్పుడు కూడా వాడెడివారు. నేడు కూడా
ప్రపంచ కష్టాలనుండి బయటపడినప్పుడు, కష్టాలనుండి మోక్షము లభించింది అనడము జరుగుచున్నది. కాలగమనములో
‘అ’ ‘మో’ గా మారినా పదములో ముఖ్యమైన అర్థము కల్గియున్న “క్ష” మాత్రము మారలేదు.
తీర్పులో శిక్ష ఉండవచ్చును. అలాగే అక్ష (మోక్ష) ఉండవచ్చును. తీర్పు ప్రపంచ సంబంధమైనది కావచ్చు లేక
పరమాత్మ సంబంధమైనదీ కావచ్చును. రెండు విధముల తీర్పులను ముందే దేవుడు నిర్ణయించి ఉండగా దానినే ఆత్మ
అమలు జరుపుచున్నది. ఆత్మ అమలు జరిపినా మొదటికది దేవుని తీర్పనియే చెప్పవచ్చును. మనిషికి సంభవించు
10

Page 11
ప్రపంచ సంబంధ కష్టసుఖములుగానీ, జన్మ మోక్షములుగానీ ఏదైనా దేవునికి తెలియకుండ జరుగవు. ఏదైన దేవుని
తీర్పును అనుసరించే ఉండునని జ్ఞాపకముంచుకోవలెను. దేవుని తీర్పు ఎలాగుండునో ముందుగా ఎవరికీ తెలియదు.
అయితే ఎవనికి ఏ తీర్పు తీర్చబడినదో, ఎవడు ఏమి అనుభవించునో అన్నీ దేవునికి ముందే తెలుసు. ఇదే విషయమును
గురించి భగవద్గీతయందు విజ్ఞానయోగములో 26వ శ్లోకమున ఇలా చెప్పబడినది చూడండి.
26వ శ్లో॥
వే దాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన ॥
భావము :- సర్వ జీవరాసులకు జగతిలో జరిగినవి, జరుగుచున్నవి, భవిష్యత్తులో జరుగబోవు విషయములన్నీ నాకు
తెలుసు. అయితే అందరి భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన నేను ఎవరికీ తెలియబడలేదు.
అందరూ దేవునికి తెలుసు, కానీ దేవుడు ఎవరికీ తెలియడు. దేవుడు పురుషుడుకాగా, ఆత్మ, జీవాత్మలు కూడా
పురుషులుగానే ఉన్నారు. రెండవ పురుషుడైన ఆత్మ శరీరములో అన్ని కార్యములూ చేయుచున్ననూ, ఆత్మ ఏ కార్యమునకూ
కర్త కాదు. కర్మప్రకారము నిమిత్తమాత్రముగా ఆత్మ పని చేయుచున్నది. అందువలన ఆత్మను కర్తకాదన్నాము.
అన్నిటికీ కారణకర్తగా మూలపురుషుడైన దేవుడున్నా, ప్రస్తుతము ఆయన స్థబ్ధునిగా ఉన్నాడు. ఆత్మ శరీరములో
మాత్రము విధిని అనుసరించి చేయుచున్నది. శరీరముల బయట అనంత విశ్వములోనూ, శరీరములోపలనూ కార్యము
లన్నిటికీ కర్తయై కార్యములను చేయించునది ప్రకృతియని చెప్పవచ్చును. దేవుని తర్వాత దేవునంతటి శక్తి కలది
ప్రకృతి. ప్రకృతిని అనుసరించియే ఆత్మ కూడా పని చేయుచుండుట వలన, ప్రస్తుత కర్తగానున్నది ప్రకృతియని
చెప్పవచ్చును. ఇదే విషయమునే భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగమందు 30వ శ్లోకమున ఇట్లు చెప్పారు చూడండి.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
30వ శ్లో॥
యః పశ్యతి తథాత్మాన మకర్తారం స పశ్యతి ॥
భావము :- సర్వ కార్యములు ప్రకృతి చేత చేయబడుచున్నవని ఎవడు తెలియునో, వాడు ఏ కార్యమునకు కర్త ఆత్మకాదని
తెలిసియుండును. అలా తెలిసిన వానిని నిజమైన జ్ఞానదృష్టి కలవాడని చెప్పవచ్చును.
శరీరములోపల ఆత్మ అన్నీ చేయుచున్నా, శరీరము బయట విశ్వమంతా ప్రకృతి ఆవహించియుండి ఎండ,
గాలి, వాన, మంచుగా ఉంటూ, భూకంపములు, సునామీలు, టోర్నడోలు (సుడిమేఘములు) తుఫాను మేఘములు
(క్యుములోనింబస్ మేఘములు) గా ఉంటూ బయట కార్యములన్నిటినీ ప్రకృతి చేయుచున్నది. విశ్వములోని ప్రకృతి
స్వతంత్రము కలదిగా ఉన్నది. ఆత్మ శరీరములో శరీరమునకు అధిపతిగా ఉంటూ మనిషి కర్మను అనుసరించి మనిషి
చేత పనిని చేయించుచుండును. ఆత్మ తన ఇష్టము ప్రకారము నడుచుకొనక, కర్మనుబట్టి మనిషిని నడిపించుట వలన
ఆత్మ స్వయముగా కర్తకాదు. అంతేకాక మనిషికి (జీవునికి) ఉన్న పాపము లేక పుణ్యము ప్రకారము నడిపించుటే
ఆత్మయొక్క పనిగా ఉన్నది. అంతేగానీ ఎవని పాపమునుగానీ, ఎవని పుణ్యమునుగానీ ఆత్మ తొలగించదు. అంతేకాక
కర్మలనుగానీ, కార్యములను చేయవలెనను ఆశను గానీ, కార్యమునకు నేనే కర్తనను భావమునుగానీ ఆత్మ కలుగజేయదు.
జీవుని స్వంత భావము వలననే అవన్నియు జీవునికి కల్గుచున్నవి. ఇదే విషయమునే భగవద్గీతలో కర్మ సన్యాస
యోగము అను అధ్యాయమున 14,15 శ్లోకములలో ఇలా చెప్పారు చూడండి.
11

Page 12
14వ శ్లో॥
15వ శ్లో॥
3
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥
నా దత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ॥
14వ భావము :- పాపపుణ్యములను కర్మలనుగానీ, జరిగిన పనిలో నేనే కర్తనను భావమునుగానీ, కర్మ ఫలములందు
ఆసక్తిని గానీ ఆత్మ కలుగజేయదు. అవన్నియు జీవుని స్వంత భావము (ఇష్టము) చేత వచ్చును.
15వ భావము :- శరీరమునకు అధిపతిగాయున్న ఆత్మ ఎవని పాపమును గానీ, ఎవని పుణ్యమునుగానీ తొలగించదు.
ఆత్మజ్ఞానమంతయు అజ్ఞానము చేత కప్పబడియున్నది. అందువలన ఆత్మ విషయము ఎవరికీ తెలియకున్నది.
జీవునియొక్క శరీరమంతయు ప్రకృతిచేత తయారు చేయబడివున్నది. పంచ భూతములుగాయున్న ప్రకృతి 25
భాగములుగా విడిపోయి 25 శరీర భాగములుగా మరియు వాటికి అనుబంధ అవయవములుగా తయారైనది. ప్రకృతి
చేత తయారైన శరీరములో ప్రకృతి భాగములకు శక్తినిచ్చి నడిపించునది ఆత్మ. ప్రకృతి చేత శరీరము తయారవడమే
కాకుండా శరీరములోని గుణములు కూడా ప్రకృతి చేతనే తయారైనవి. కనిపించని గుణములు మనిషి తలలో ఉంటూ,
మనిషికి కర్మలను అంటగట్టుచున్నవి. చేయించునది ఆత్మయినా, మంచి చెడు కార్యములను గుణముల ప్రేరణ వలన
ప్రకృతి కల్గించుచున్నది. ప్రకృతి యొక్క స్వభావము చేత కార్యముల మీద ఇష్టము కల్గడమూ, కార్యములు జరుగడము
వలన వాటి ద్వారా పాపపుణ్యములు రావడము జరుగుచున్నది. బయట కనిపించు ప్రకృతి, శరీరములో కనిపించని
గుణములుగా ఉన్నది. గుణములన్నిటినీ కలిపి మాయ అంటున్నాము. దీనినిబట్టి కనిపించెడి ప్రకృతి దేహములో
కనిపించని మాయగా ఉన్నదని చెప్పవచ్చును. మనుషులలోని కార్యములయందాసక్తికి, కర్మలకు ప్రకృతి కర్తయైయుండగా,
ఆత్మ శరీరమునకధిపతియై శరీర భాగములకు శక్తినిచ్చి నడిపించుచూ కర్మలను శిక్ష అక్షలుగా అనుభవింపజేయుచున్నదని
తెలుసుకొన్నాము. ఇంతవరకు తెలుసుకొన్న జ్ఞానము బాగా జ్ఞప్తికి వుండుటకు క్రింద ఒక పట్టికను చూపుచున్నాము.
రూప, నామ, క్రియలు
లేనివాడు
అన్నిటికి
చావు పుట్టుకలకు
జనన మరణలకు
పాప పనులను
చేయువాడు
సృష్టికర్త
మూలకర్త
ప్రస్తుత కర్త
శరీరము కదిలించి
అన్ని పనులు చేయువాడు
↓
↓
↓
↓
↓
పరమాత్మ
పరమాత్మ
దేవుడు
ప్రకృతి
ఆత్మ
అక్షరుడు
(పురుషోత్తముడు)
(దేవుడు)
(పురుషోత్తముడు)
(మాయ)
(అక్షరుడు)
(ఆత)
పుణ్య కార్యములను
మంచి చెడు కార్యములను
చేయువాడు
చేయనివాడు
సంబంధములేని కర్మను
అంటించుకొనువాడు
కష్ట సుఖములను
శరీరమునకు
జీవులకు
అనుభవించువాడు
అధిపతి
అధికారి
1
చిత్రగుప్తుడు
జీవుడు
క్షరుడు
జీవుడు
ఆత్మ
ప్రకృతి
(ఆత్మ)
(క్షరుడు)
(జీవుడు)
(క్షరుడు)
(చిత్రగుప్తుడు)
(మాయ)
12

Page 13
ఇంతవరకు ప్రాథమికముగా పురుషులైన మూడు ఆత్మలను గురించీ, స్త్రీ అయిన ప్రకృతిని గురించీ, శరీరములో
అధిపతిగాయుండి అన్నిటినీ చేయిస్తున్న చిత్రగుప్త ఆత్మను గురించీ తెలుసుకొన్నాము. అట్లే జీవుడు తాను చేయని తప్పు
ఒప్పులకు అజ్ఞానము చేత అనవసరముగా బాధ్యుడై కష్టసుఖములను పొందుచున్నాడని కూడా తెలుసుకొన్నాము.
ఇంకా తీర్పులలో రెండు రకముల తీర్పులున్నవని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు మాచే వ్రాయబడు ఈ గ్రంథములోని
ముఖ్య అంశము తీర్పు అనునదే, కావున ఇక తీర్పును గురించే ఎక్కువగా చెప్పుకొందాము. తీర్పులలో ప్రకృతి
సంబంధమైన శిక్షలనూ అక్షలనూ అందరూ ప్రత్యక్షముగా అనుభవించుచున్నప్పటికీ, మనిషికున్న అజ్ఞానము చేత
పుణ్యములకు స్వర్గలోకమూ, పాపములకు నరకలోకమూకలదని అనుకొనుచున్నాడు. అన్ని మతములవారు తమ మత
గ్రంథములని చెప్పు మూల గ్రంథములలో స్వర్గము, నరకము అను మాటలుండడము వాస్తవమే. స్వర్గము సుఖముల
నిలయమనీ, నరకము బాధల నిలయమనీ ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే వాటికి ప్రత్యేక లోకములున్నవని
ఎంతమాత్రము చెప్పలేదు. మనిషి అజ్ఞానము చేత లేని విషయమును ఊహించుకొని, తనకు తెలియని, ఎవరూ
చూడనిదైన స్వర్గ, నరకములను ప్రత్యేక లోకములుగా చెప్పుకొనుచున్నాడు. అలా గ్రుడ్డిగా చెప్పుకోవడము తప్ప, వారు
ఊహించుకొన్న లోకముల అడ్రస్ వారికే తెలియదు. సృష్టి మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఎవడూ స్వర్గ నరక
లోకములకు పోలేదు. ఎవరూ వాటిని చూడలేదు. తమ వాదన గెలుచుట కొరకు మేము చూచాము అని ఎవరైనా
అనినా, వారి మాట పూర్తి అసత్యము.
స్వర్గ నరకములు అనునవి మనిషి అనుభవించు అనుభూతులు మాత్రమే. కానీ అవి ప్రత్యేకమైన లోకములు
కావు. సుఖమును స్వర్గమనీ, కష్టమును నరకమనీ అనవచ్చును. అట్లు కాకుండా శాస్త్రబద్ధత ఏమాత్రము లేకుండా,
మూఢముగా అనుకొంటే, అది అజ్ఞానమగును కానీ జ్ఞానము కాదు. 'తాను చెడిన కోతి వనమెల్ల చెరిసె' అన్నట్లు,
కొందరు బోధకుడు తప్పుగా బోధించి అందరినీ తప్పుదోవ పట్టించుచున్నారు. ఇలా ప్రపంచ విషయములలో తప్పుగా
భావించుకొనినా, దానివలన పాపము వచ్చును. పాపము వలన శిక్ష నరకమును అనుభవించడమే అగును. నరకము
అంటే ఎల్లప్పుడు ఉండునది కాదు. ఎంత పాపము వచ్చిన వానికి అంతే నరకముండును. బాధను అనుభవించు ఐదు
లేక పది నిమిషములను నరకము అనవచ్చును. నరకము క్షణ కాలముండవచ్చును, ఎక్కువ కాలముండవచ్చును.
నరకము జీవునికి సంక్రమించిన పాపమును బట్టి యుండును. అలాగే స్వర్గము కూడా జీవునికి వచ్చిన పుణ్యమునుబట్టి
యుండును. మనిషి జీవితములోనే స్వర్గ సుఖములు, నరక బాధలు కలవు. స్వర్గమంటే సుఖము అని అర్థమగునట్లు
స్వర్గ సుఖములు అనియూ, నరకము అంటే బాధ అని అర్థమగునట్లు నరక బాధలనీ అనడము జరుగుచున్నది.
ప్రపంచములో ఒకే సమయమునందు ఎన్నో సుఖములను అనుభవించు వారినీ, అట్లే ఎన్నో బాధలు అనుభవించువారినీ
ప్రత్యక్షముగా చూస్తూనే ఉన్నాము. ఇతరులను చూడడమే కాకుండా, స్వయముగా మనమే ఎన్నో సమయములలో స్వర్గ
సుఖములనూ, నరక యాతనలనూ అనుభవించాము. సుఖదుఃఖములన్నియు ఈ భూమిమీదనే స్వర్గ, నరకములను
పేరుతో జరుగుచున్నవి. భగవద్గీతలోగానీ, బైబిల్లో గానీ, ఖుర్ఆన్ గ్రంథములోగానీ స్వర్గ లోకము, నరక లోకము అని
వ్రాసియుండుట వాస్తవమే అయినా స్వర్గ నరక లోకములు ఎక్కడో ఉన్నట్లు అనుకోకూడదు. ఈ నా మాట రుచిలేనిదిగా
కొందరికి కనిపించినా, చాలామందికి చేదుగా మరియు కఠినముగా కనిపించవచ్చును. జ్వరము వచ్చిన వారికి నాలుక
రుచిని గ్రహించలేని స్థితిలోవుండి తీపి పదార్థము కూడా చేదుగా ఉన్నట్లు కనిపించును. పదార్థము తీపిదైనమాట
మాట వాస్తవమే అయినా వానికున్న రోగము వలన చేదుగా తెలిసియుండవచ్చును. అంతమాత్రమున తీపిని చేదు
అనుట అసత్యమగును కదా!
13

Page 14
ఆలోచన అనగా లోతుగా చూడడము అని అర్థము. ఇంకా దీర్ఘముగా చూడడము అని కూడా అర్థము కలదు.
“ఆ” అను దీర్ఘము గల అక్షరమునకు లోతుగా, దీర్ఘముగా అని విశేషతగలదు. లోచన అను పదమునకు “ఆ” అను
అక్షరము విశేషముగా ఉన్నట్లు చెప్పుచున్నాము. లోచన అనగా కనిపించునది లేక చూడబడునది అని అర్థము.
లోచనములు అనగా అద్దములు అని కూడా అంటాము. బాగా కనిపించునట్లు చేయు కంటి అద్దములను సులోచనములు
అని అంటాము. ముఖ్యముగా ఇప్పుడు మేము చెప్పునది ఏమనగా! లోచనము అను పదమునుండి పుట్టిన శబ్దము
లోకము. లోకము అనగా కంటికి బాగా కనిపించునదని అర్థము. మనము ఏ లోకమును గురించి చెప్పుకొనినా,
లోకములన్నియు కనిపించునవనియే అర్థము. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. స్వర్గలోకము అంటే అర్థమేమిటి
అనగా! కనిపించెడి సుఖములు అని చెప్పవచ్చును. అలాగే నరకలోకము అంటే అర్థమేమిటనగా! కనిపించెడి
బాధలని చెప్పవచ్చును. స్వర్గలోకము అను పేరులో కనిపించెడి సుఖము అని అర్థముండగా, స్వర్గ లోకము ఎక్కడో
మనకు కనిపించకుండ ఉన్నదనుట శాస్త్రబద్దమా? ధర్మబద్దమా? అని ప్రశ్నించుచున్నాను.
ఎప్పుడు మనిషియొక్క జీవుని యొక్క) అనుభవములో సుఖము తెలియుచున్నదో, అప్పుడు (ఆ జీవుడు)
స్వర్గమును పొందుచున్నట్లేయగును. అలాగే ఎప్పుడు మనిషియొక్క అనుభవములో శరీరమందే జీవుడు బాధను
అనుభవిస్తున్నాడో, అప్పుడు అతను నరకమును పొందుచున్నట్లేయగును. ఈ విధముగా సుఖదుఃఖములనబడు స్వర్గ
నరకములు మనిషి భూమిమీదనే ప్రత్యక్షముగా అనుభవించి చూస్తున్నాడు. ఎంతోమంది అనుభవించే వారినీ చూస్తున్నాడు.
అయినా లోకమంటే అర్థము తెలియక స్వర్గలోకము పైన ఎక్కడో ఉన్నదనీ, నరకలోకము క్రింద ఎక్కడో కలదని కథలు
చెప్పు కోవడమూ, పురాణములు వ్రాసుకోవడము జరిగినది. ఆత్మను అధ్యయనము చేయడమును ఆధ్యాత్మికము అంటాము.
ఎవరికీ ఆత్మే తెలియబడనపుడు ఆధ్యాత్మికము ఎలా తెలుస్తుంది? కొందరికి అద్వైతము తెలుసు, మరి కొందరికి
ద్వైతము తెలుసు, కానీ ఎవరికీ త్రైతము తెలియదు. అందులో గుప్తమైన ఆత్మ ఒకటున్నదని ఎవరికీ తెలియదు.
అందువలన ఆధ్యాత్మిక అను పేరుండినా అదేమిటో పూర్తిగా తెలియదని చెప్పవచ్చును.
విచిత్రమేమంటే మేము ఆధ్యాత్మికులమని పేరు పెట్టుకొన్న ఎందరో స్వామీజీలు, గురువులుగా చలామణి
అగుచున్న వారూ, మనిషి చనిపోయిన తర్వాత ముందు స్వర్గానికి తర్వాత నరకానికి పోతారు అని చెప్పుచున్నారు.
అలా చెప్పువారు అసత్యమును చెప్పినట్లగుచున్నది. అంతేకాక దేవుడు ఏర్పరచిన విధానమునకు వ్యతిరేఖముగా
బోధించినట్లగుచున్నది. ఒక సాధారణ మనిషి తాను రోడ్డు రవాణా సంస్థకు అధికారి కాకున్నా R.T.O నని చెప్పుకొంటూ,
రోడ్డు మీద పోవు వాహనములను ఆపి వారినుండి అపరాధ రుసుమును వసూలు చేస్తే అది తప్పగును. చట్టమునకు
వ్యతిరేఖమగును. అతడు చట్టము దృష్టిలో నేరస్థుడగును. అలాగే గురువు హెూదాగానీ, స్వామీజీ అధికారముగానీ
లేనిదే ప్రజల ముందు స్వామీజీగా, గురువుగా గుర్తింపబడి ప్రజలనుండి గౌరవ మన్ననలను పొందితే దేవుని చట్టములో
అది వ్యతిరేఖమగును. ధర్మము దృష్ఠిలో శిక్షార్హుడగును.
ఈ విషయమై కొందరు ఏమనుచున్నారనగా! మాకు గురువులుగా ఉన్నవారు అలాగే బోధించారు. వారి
తర్వాత గురువులైన మేము మా గురువు చెప్పిన బోధనే సనాతనముగా బోధించుచున్నాము. ఒకవేళ తప్పు అయితే అది
మా గురువుదగును కదా! మాదెలా తప్పగును అని అడుగుచున్నారు. అంతేకాక గురువు చెప్పిన దానిని బోధించడమే
మా సనాతన ధర్మము అంటున్నారు. అటువంటి వారికి గురువు అంటే అర్థము తెలియదు, ధర్మము అంటే ఏమిటో
అర్థము తెలియదు. సనాతనము అంటే కూడా వివరము తెలియదు. అయినా అన్ని పదాలూ వాడేస్తున్నారు. దేవుడు
14

Page 15
ఎవరో, భగవంతుడు ఎవరో తెలియదు. దేవుడన్నా భగవంతుడన్నా రెండు ఒక్కటే కదాయను హిందువులు ఉండడము
వలన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందూ (హిందూ) ధర్మము నేడు క్షీణించిపోయి, అది ఎక్కడున్నదో కూడా తెలియని
అగాధమునకు వెళ్ళిపోయింది. ఇందూ ధర్మరక్షణ పేరుతో ఎందరో ఉండినా వారు కూడా అశాస్త్రీయముగా బోధించుచూ,
పురాణగాధలను చెప్పడము వలన ఇందువులకు తమ ధర్మమేదో, తమ దేవుడెవరో తెలియక అయోమయ స్థితిలో
ఉండి ఇతర మతబోధనలవైపు చూస్తున్నారు. కొంతమంది ఏకంగా మతమునే మార్చుకొనుచున్నారు.
ఐదువేల సంవత్సరముల పూర్వమే, భగవద్గీత కృష్ణుని చేత చెప్పబడకనే, భారత దేశమంతటా వేదములు,
పురాణములు బాగా ప్రచారమైయుండెడివి. వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులలో ఎక్కడో సుదూరములో
యమలోకమున్నదనీ, అక్కడికి పోయివచ్చిన వారున్నారని వ్రాయడము జరిగినది. అలాగే పురాణములలో సతీసావిత్రి
తన భర్త ప్రాణములను యమధర్మరాజుతో వాదించి వెనక్కు తెచ్చుకొని సజీవున్ని చేసుకొందని వ్రాయబడి ఉన్నది.
ఇంకా కొందరు తాము చూచివచ్చిన వారివలె యమలోకమునకు పోవుటకు వైతరణీ నది దాటి పోవలెననీ, ఆ నది
అంతయు దుర్వాసనతో కూడుకొని రక్తమాంసముల ప్రవాహమె ఉన్నదని వ్రాశారు. గరుడ పురాణమును ప్రత్యేకించి
యమలోకమును గురించి చెప్పుటకే వ్రాశారు. ఫలానా పని చేసిన వానికి ఫలానా పాపము వచ్చుననీ, ఫలానా
పాపము వచ్చిన వారికి యమలోకములో ఫలానా శిక్ష ఉంటుందని వ్రాయడము జరిగినది. యమలోకములో పాపములను
గురించి చిత్రగుప్తుడు ఒక గ్రంథమును వ్రాసియున్నాడనీ, దానిలో అందరి పాపములున్నవనీ, మనిషి చనిపోయి
యమలోకమునకు పోయినప్పుడు వాడు జీవితములో చేసుకొన్న పాపములు చిట్టాను చిత్రగుప్తుడు విప్పి చెప్పగా,
వాటిని వినిన యమధర్మరాజు వాని పాపములకు తగిన శిక్ష వేయుననీ చెప్పడము జరిగినది. అంతేకాక యమధర్మరాజు
విధించిన శిక్షలను అమలు చేయడానికి లెక్కలేనంతమంది యమకింకరులున్నారని, వారు దయా దాక్షిణ్యము లేకుండా
శిక్షలు అమలు చేయుదురని, యమలోకమంతయు మనుషుల ఆర్తనాదములతో నిండియుండుననీ చెప్పడము జరిగినది.
గరుడ పురాణములో నరకము ప్రత్యక్షముగా కనిపించునట్లు వ్రాయడమే కాకుండా, యమకింకరులు పాపులను నూనెలో
వేయించుదురనీ, అగ్నిలో వేసి కాల్చుదురనీ, శూలములతో పొడుచుదురనీ, పెద్ద బండరాళ్ళను మీదికి త్రోసి మనుషులను
నలిగిపోవునట్లు చేయుదురనీ అనేక హింసలను వ్రాశారు. పాపములు అయిపోవునంతవరకు మనిషిని యమకింకరులు
బాధించి వదలివేయగా, అక్కడినుండి మనిషి తన పుణ్యమును అనుభవించుటకు స్వర్గలోకమునకు పోయి పుణ్యము
అయిపోవువరకు స్వర్గలోకములో రంభ ఊర్వశుల మధ్య ఎన్నో సుఖములను అనుభవించి, తర్వాత త్రిమూర్తులలో
ఒకరైన బ్రహ్మవద్దకు పోయి క్రొత్తగా తలవ్రాతను వ్రాయించుకొని తిరిగి భూమిమీదికి వచ్చి పుట్టునని వ్రాశారు.
ఇలా చెప్పుచూపోతే అదే ఒక గ్రంథమవుతుంది. నాలుగు వేదములనూ, పదునెనిమిది పురాణములను వ్యాసుడు
ద్వాపరయుగములో వ్రాశాడు. వేదములను వ్రాయడము వలన ఆయనను వేదవ్యాసుడు అన్నారు. ఎందరో మహర్షులు
బోధలుగా చెప్పిన విషయములను సేకరించి వాటిని ఉపనిషత్తులుగా వేదముల చివరి భాగములో వ్రాయడము జరిగినది.
ఎవరైతే ఉపనిషత్ను చెప్పారో వారి పేరునే ఆ ఉపనిషత్తుకు పెట్టడము జరిగినది. ఉదాహరణకు తైత్తరీమహర్షి చెప్పిన
బోధను వ్యాసుడు ఉపనిషత్తుగా వ్రాస్తూ ఆ ఉపనిషత్తుకు దానిని చెప్పిన తైత్తరీయ మహర్షి పేరును ఉంచుతూ
తైత్తరీయోపనిషత్తు అని పేరు పెట్టడము జరిగినది. ఈ విధముగా అన్ని ఉపనిషత్తులకు వాటిని చెప్పిన వారి పేర్లనే
వ్యాసుడు ఉంచాడు. వేదములను స్వయముగా వ్యాసుడే వ్రాశాడు. నాల్గు వేదములనే కాకుండా పదునెనిమిది
పురాణములను కూడా వ్రాశాడు. తనకు మంచి పనిగా త్రోచి వ్యాసుడు వ్రాసిన వ్రాతల వలన సత్యము మరుగునపడిపోయి
15

Page 16
అసత్యము బయటికి వచ్చినది. వ్యాసుడు వ్రాసిన వ్రాతల వలన ధర్మము మరుగునపడిపోయి అధర్మము బహిర్గతమైనది.
అప్పటి కాలములో వ్యాసుడు మాత్రమే పేరు పొందిన రచయితగా ఉండుట వలన, అందరూ వాటిని చదవడమూ,
అధర్మవరులుగా మారిపోవడమూ జరిగినది. ఇదంత వాస్తవముగా జరిగిన సత్యమే అయినా, ఇందులో కనిపించని
సత్యమొకటియున్నది. అదియే అందరికీ ముఖ్యమైన రహస్యము.
బయటికి కనిపించని రహస్యమైన సత్యమేమనగా! వ్యాసుడు అసత్యమునూ, అధర్మమునే తన వ్రాతలో వ్రాసినా,
వాస్తవానికి వ్రాసిన వాడు వ్యాసుడు ఏమాత్రము కాదు. ఈ మాట కొంత ఆశ్చర్యమును కలిగించినా వ్యాసుడు మనకు
కనిపించు వ్యక్తిగాయున్నా, వ్యాసుడు తన శరీరములో కేవలము జీవాత్మగాయున్నాడు. శరీరములోని జీవుడు ఎవడైనా
సుఖదుఃఖములను అనుభవించుటకే ఉన్నాడుగానీ, పనిని చేయుటకు గాదు. జీవుడు అన్ని విధముల గ్రుడ్డివాడు,
తనవరకు వచ్చిన దానిని అనుభవించడము తప్ప ఏ పనినీ చేయలేని అంగహీనుడు. అన్ని అంగములు శరీరమునకున్నవి
గానీ తనకు లేవు. శరీరము అంతయు ఆత్మది జీవునది కాదు. జీవుడు శరీరములో ఒక భాగమేగానీ, స్వయముగా
దేనినీ చేయలేడు, జీవునికి కార్యములు చేయు శక్తియులేదు. శరీరములో జరుగు ప్రతి చిన్న కార్యము రెండవవాడూ,
చిత్రగుప్తుడు అయిన ఆత్మ వలననే జరుగుచున్నది. అటువంటపుడు ఎంతో పెద్ద కార్యమైన వేదముల, పురాణముల
రచనలను చేసినది ఆత్మయే.
పైకి కనిపించునది వ్యాసుడున్న శరీరమే అయినా, లోపల చేయునది వాస్తవానికి వ్యాసుడుకాదు. స్వర్గ
నరకములను గురించిన అసత్యమును ఆధ్యాత్మికమును గురించిన అధర్మమునూ స్వయముగా ఆత్మే ఎందుకు వ్రాసింది.
ఆధ్యాత్మికమంతయు ఆత్మను గురించి తెలుసుకోవడము కొరకు ఉన్నదే కదా! అలాంటపుడు తన విషయమునే తాను
ఎందుకు ప్రక్కదోవ పట్టించి చెప్పినదను ప్రశ్న రాగలదు. దేవుని మార్గములో ఇది పెద్ద తప్పయినా, తప్పని ఆత్మకు
తెలిసినా, ఆత్మ అలా చేసింది అంటే దానికి బలమైన కారణముంటుంది. ఆ కారణమును గురించి చెప్పడము ఇప్పుడు
సమయోచితము కాదు, సందర్భము వస్తే తప్పనిసరిగా వివరిస్తాము. మనుషులందరికీ ఆత్మ మరొకటున్నదనీ, శరీరము
దానిదేననీ, దానితోపాటు శరీరములో నేనున్నానని ఏమాత్రము తెలియదు. తెలిసినదంతా శరీరమే నేనూ, నేనే శరీరము
అనునది మాత్రమే. శరీరము ద్వారా జరిగెడి పనినంతా నేనే చేశాను అను భావము తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ
గ్రంథమును వ్రాయుచున్నది నేనేననీ, జీవుడైన నేను అనుకొనుటకు ఏ అడ్డంకూ లేదు. అయినా నేనెవరో నాకు
తెలుసు. ఈ గ్రంథమును నేను వ్రాసినట్లు గ్రంథ రచయిత అని నా పేరున్నా, ఆ విధముగా పైకి నా పేరుపెట్టి వ్రాసినది
స్వయముగా ఆత్మని తెలుసు. అయినా ఏ పనినీ ఖండించనూలేనూ అట్లే చేయనూలేను. అందువలన చాలా
గ్రంథములలో ముందే 'దీనిని వ్రాసినది నేను కాదు, నా పొరుగువాడైన ఆత్మని' చెప్పాను. అలా చెప్పడము కూడా నా
చేత కాదు, అయితే నేను కాదు అను నా భావమును ఆత్మే శరీరము చేత వ్రాయించింది. చూచారా! ఇంత తెలిసినా
నేను ఎప్పటికీ ఏమీ చేయలేని వానినే. అయితే మీకు అర్థమగునట్లు ప్రబోధానందుని పేరుతోనే వ్రాయడము జరిగినదని
తెలుసుకోండి.
ఇది తీర్పుకు సంబంధించిన గ్రంథము. తీర్పు అనగా తప్పు ఒప్పులను తేల్చి శిక్షనుగానీ, అక్షనుగానీ అమలు
చేయుటకు న్యాయమూర్తి చేత నిర్ణయించబడునది. బయట కోర్టులలోనే తీర్పులు శిక్షలు ఉంటాయి. ప్రతి మనిషికీ
లోపల కనిపించని న్యాయస్థానము (కోర్టు), కనిపించని న్యాయవాది, కనిపించని న్యాయమూర్తి ఉన్నారు. ఎవరికీ
తెలియని అంతరంగములోని కోర్టులో విచారణ ఎలా ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలాగున
16

Page 17
వివరించాలనుకొన్నాము. కనిపించని న్యాయస్థానమును వివరించుటకు ముద్దాయిలు ఎలా ఉంటారో, ఎవరు
ముద్దాయిలవుతారో కొంత చెప్పుకోవలసియున్నది. ప్రపంచ సంబంధ తీర్పులను గురించి, ప్రపంచ సంబంధ ముద్దాయిలను
గురించి మనము చెప్పుకోవలసిన అవసరములేదు. ప్రపంచ సంబంధ హత్యలు గానీ, దొంగతనములుగానీ,
వ్యభిచారములుగానీ, అసత్యములుగానీ, దౌర్జన్యములుగానీ, హింసించుటగానీ, మోసములుగానీ మొదలగు అన్ని
కార్యములకు సంభవించు పాపములన్నిటిని ఆత్మ ఆగామికర్మగా వ్రాసి పెట్టుచుండును. తర్వాత కాలములో ఆగామికర్మ
ప్రారబ్ధకర్మయై శిక్షగా పరిగణింపబడును. వాటి వివరమును మేము ఇప్పుడు చెప్పదలచుకోలేదు. ఇప్పుడు మేము
చెప్పునది ప్రపంచ సంబంధము కాకుండా పరమాత్మ సంబంధమైన విషయములను మాత్రమేనని తెలుపుచున్నాము.
ప్రపంచ సంబంధమైన విషయములు పాపపుణ్యములుగా చిత్రగుప్తుడైన ఆత్మ చేత వ్రాయబడి శిక్ష అక్షలుగా అమలు
జరుగుచున్నవి. పరమాత్మ సంబంధ దైవ విషయములు జ్ఞాన అజ్ఞానములుగా ప్రకృతి చేత గుర్తింపబడియుండి లేక
వ్రాయబడి జన్మ మోక్షములుగా ప్రకృతిచేతనే అమలు జరుగుచున్నవి.
ప్రపంచ సంబంధ కార్యములలో మంచి పనులకు పుణ్యమూ, చెడు పనులకు పాపమూ వచ్చుచుండును. ఏవి
మంచి కార్యములు? ఏవి చెడు కార్యములు అని తెలియుట న్యాయ అన్యాయములను బట్టి యుండును. జరిగిన పని
న్యాయ సమ్మతమైతే మంచి పనియనీ, అన్యాయమైనదైతే ఆ పని చెడుదనీ చెప్పవచ్చును. ప్రపంచ కార్యములు న్యాయ
అన్యాయముల మీద ఆధారపడియున్నట్లు, దైవ సంబంధ కార్యములు ఏవైనా జ్ఞాన అజ్ఞానము మీద ఆధారపడియుండును.
ప్రపంచ విషయములలో ఏది న్యాయమో, ఏది అన్యాయమో సరిగా నిర్ణయించుటకు చట్టము అనునది గలదు. చట్టము
లేకపోతే ఎవని పని వానికి న్యాయముగనే కనిపించును. అట్లు కాకుండ ఏది న్యాయమో తేల్చి చెప్పుటకు చట్టము
అనునది హద్దుగా ఉన్నది. అలాగే దైవమార్గములో జ్ఞానమునుబట్టి ఎవని సాధన, బోధన సరియైనదో, ఎవని బోధనలుగానీ,
సాధనలుగానీ సరికావో ఖచ్ఛితముగా నిర్ణయించి చెప్పునది ధర్మము. బయటి ప్రపంచములో న్యాయమును నిర్ణయించుటకు
చట్టము ఉన్నట్లు, అంతరంగములో జ్ఞానమును నిర్ణయించుటకు ధర్మమున్నది.
దైవమార్గములో అజ్ఞానముగా ప్రవర్తించితే ఇది ధర్మవిరుద్ధము అని తెలియుటకు మనిషికి ముందు జ్ఞానమూ,
ధర్మమూ తెలిసియుండాలి. ఏ ప్రభుత్వమైతే చట్టమును తయారు చేసిందో, ఆ ప్రభుత్వమే తన చట్టమిదియని తెలియజేయాలి.
అలాగే ఏ దేవుడైతే ధర్మమును నిర్ణయించాడో, ఆ దేవుడే తన ధర్మమిదియని తెలియజేయాలి. ఇతరులు తెలుపుటకు
వీలులేదు. ప్రభుత్వ చట్టము ప్రభుత్వమునకే తెలిసినట్లు, దేవుని ధర్మము దేవునికే తెలుసు. ప్రభుత్వము ద్వారానే
చట్టము బయటకు రావాలి. అలాగే దేవుని ద్వారానే ధర్మము బయటికి రావాలి. దేవుని ధర్మము దేవుడు తెలుపనిదే
ఇతరులకు ఎవరికీ తెలియదు, అది అందరికీ రహస్యమే. ఇదే విషయమునే భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య
యోగమను అధ్యాయమున మొదటి శ్లోకములోనే భగవంతుడు ఇలా చెప్పుచున్నాడు.
1వ శ్లో॥
ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యాం మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞాన సహితం యద్దా త్వా మోక్ష్యసే శుభాత్ ॥
భావము :- ఇది అతిరహస్యమైన జ్ఞానము. ఎవరికీ తెలియని నా జ్ఞానమును విజ్ఞాన సహితముగా విశదముగా
చెప్పుదును వినుము. దీనిని తెలియుట చేత అన్ని అశుభములు తొలగి మోక్షమును పొందుదువు.
17

Page 18
దేవుని ధర్మము అతి రహస్యమైనదని దేవుడే చెప్పునప్పుడు అది ఎవరికీ తెలియని విషయమని స్పష్టముగా
తెలియుచున్నది. దేవుని జ్ఞానము దేవుని ద్వారానే తెలియబడుతుందనుటకు పై శ్లోకమే సాక్ష్యమని చెప్పవచ్చును. ఇదే
విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను 3వ సురలో 7వ ఆయత నందు కూడా ఇలా సారాంశము
గలదు. “దేవుడు ప్రజలకు ఖుర్ఆన్ గ్రంథమును ఇచ్చాడు. అందులో 'ముతషాభిహాత్' అనబడు చాలా రహస్యమైన
విషయములు గలవు. వాటి జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదని” చెప్పబడినది. ఇక్కడ కూడా ఎవరికీ
తెలియనిది దేవుని జ్ఞానమనీ, దానిని దేవుడు చెప్పితేనే అర్థము కాగలదు అని ఉన్నది కదా! దేవుని జ్ఞానము దేవునికి
తప్ప ఎవరికీ తెలియనప్పుడు, ఆయన తెలియజెప్పితే తప్ప ఇతరులకెవరికీ తెలియదు. ఇక్కడ ముఖ్యమైన సమస్య
ఏమిటంటే! దేవుడు పని చేయనివాడు, కనిపించనివాడు, పేరులేనివాడు అయినప్పుడు మనుషులకు ఎవరికీ తెలియని
తన ధర్మమును భూమిమీద మనుషులకు ఎలా తెలియజేస్తాడు అను సంశయము రాక తప్పదు. ఇట్లు ప్రశ్న రాగలదని
గ్రహించిన దేవుడు ముందే దానికి జవాబుగా ఖుర్ఆన్ గ్రంథములో ఇలా వ్రాశాడు. 42వ సురా 51వ ఆయత్నందు
సారాంశము ఇలా కలదు. "దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు. అయితే వహీ ద్వారా (దివ్యవాణి ద్వారా)
లేదా తెర వెనుకనుంచి, లేదా ఒక దూతను (వ్యక్తిని) పంపడము ద్వారా తన జ్ఞానమును (ధర్మమును) తెలియజేయును.
వచ్చిన దూత (భగవంతుడు) దేవుని సందేశము ప్రజలకు అందిస్తాడు.” ఈ విధముగా దేవుడు మూడు విధములుగా
అవసరమును బట్టి తెలియజేస్తాడు. సృష్ఠి తయారైన మొదటిలో దివ్యవాణి ద్వారా తన ధర్మమును సూర్యునికి చెప్పినట్లు
భగవద్గీతలో కలదు. గీతయందు జ్ఞానయోగమను అధ్యాయమున ఒకటవ శ్లోకములోనే ఆ విషయము గలదు.
తెరవెనుకనుండి అనగా చెప్పేవ్యక్తియున్నా, కనిపించకుండ మాట్లాడడమును తెరవెనుకనుండి అన్నారు. ఆ విధముగా
ముహమ్మద్ ప్రవక్తకు జిబ్రయేల్ కనిపించకుండా చెప్పాడు. ఇక దేవుడు పంపగా వచ్చిన దూత కృష్ణుడు అని సులభముగా
చెప్పవచ్చును. కృష్ణున్ని ఖురాన్ ప్రకారము దేవుని వద్దనుండి వచ్చిన వ్యక్తిగా, మన లెక్కలో భగవంతునిగా చెప్పవచ్చును.
ఈ విధముగా దేవుడు ఎక్కడా ఎవరితోనూ ప్రత్యక్షముగా మాట్లాడ కుండా, తన ధర్మమును ఇప్పటికే మూడు
విధములుగా, మూడు ప్రాంతములలో, మూడు యుగములలో తెలియజేశాడని చెప్పవచ్చును. కృతయుగము మొదటిలోనే
అనగా సృష్ట్యాదిలోనే శబ్ధరూపములో చెప్పాడు. ద్వాపరయుగము చివరిలో భగవంతునిగా లేక దేవునివద్దనుండి పంపబడిన
వ్యక్తిగా శ్రీకృష్ణుడు వచ్చాడు. కలియుగములో జిబ్రయేల్ అనునతడు ఉండి, ముహమ్మద్ ప్రవక్తకు కనిపించకుండా
ఉంటూ దేవుని జ్ఞానమును చెప్పడము జరిగినది. ఇప్పటికి మూడు విధముల మూడు సమయములలో దేవుడు తన
జ్ఞానమును తెలియజేశాడు. మూడుమార్లు తెలియజేసిన జ్ఞానము మూడు గ్రంథముల రూపముగా ఉన్నది. మూడు
గ్రంథముల రూపములో జ్ఞానమున్నా అది ఇప్పటి మానవులకు అర్థము కాలేదు. కావున మూడు గ్రంథములలోని
జ్ఞానమును వివరించి చెప్పుటకు భగవంతుడు మరొకమారు రావలసియున్నది.
దేవుడు మనిషికి తెలియవలసిన తన ధర్మములను జ్ఞానరూపముతో తెలుపగా, అది కాస్త మూడు మతములుగా
తయారైనది. అది తయారు కాలేదు కానీ మనుషులే అలా మతములుగా జేశారు. దేవుడు తన జ్ఞానమును ధర్మములుగా
చెప్పాడుగానీ, మతములుగా చెప్పలేదు. మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును తన స్వార్ధముతో మతాలుగా రూపుమార్చాడు.
దేవుని జ్ఞానమును అడ్డము పెట్టుకొని దానిని చూపించుచూ తమ మతమును పెంచుకోవాలని చూస్తున్నాడు. మతమను
గుంపును పెంచుకొనుటకు దేవుని జ్ఞానమును ఉపయోగించుకొనుచూ దేవుని జ్ఞానమును కించపరచుచున్నారు. దేవుడిచ్చిన
గ్రంథమును తమ మతగ్రంథమని చెప్పుకొంటున్నాడు. దేవుని జ్ఞానమును ఉపయోగించుకొని జన్మలనుండి కడతేరి
18

Page 19
మోక్షమును పొందక, దేవుని గ్రంథమును తమ మతగ్రంథమని చెప్పుకోవడము వలన, దేవుని దృష్టిలో మత పెద్దలు
దోషులగుచున్నారు.
ఆయా మతములలో ఆయా బోధకులు ఒకవైపు దైవజ్ఞానమును చెప్పుచున్నామని చెప్పుచూ, వారికి వాక్యముల
నిజభావము తెలియకపోవడము వలన, తమకిష్టమొచ్చినట్లు చెప్పుటకు మొదలుపెట్టారు. తప్పు భావములను చెప్పుట
వలన తమ బోధలను విన్నవారందరూ అదియే నిజమని నమ్మి, తమ బోధకులు చెప్పినట్లే నడుచుకోవడము వలన
చెప్పిన వాడూ, విన్నవారూ అందరూ దేవుని మార్గములో దోషులగుచున్నారు. అటువంటి వారికి న్యాయస్థానము,
విచారణ చివరకు శిక్ష తప్పవు. గురువులు చెప్పినట్లు విన్నాము మాదేమి తప్పు అనినా, అతను శిక్షనుండి తప్పించుకోలేడు.
దైవమార్గము అంటే ఏమిటో తెలియక, దైవమార్గములోనికి రానివానికి, ప్రకృతి సంబంధ పాపముల శిక్షలు తప్ప,
దైవసంబంధ శిక్షలుండవు. దేవుని మార్గమును అనుసరిస్తున్నానని చెప్పుకొనుచూ శిష్యులుగా ఉండినా, గురువులుగా
ఉండినా, స్వామీజీలుగా ఉండినా, ఎవరు ఏ స్థాయిలో ఉండినా వారు దేవుని దృష్టిలో దోషులే, కావున వారికి విచారణ
తప్పదు.
ఈ మా మాటలను విన్న కొందరు లేక అన్ని మతములలోని అందరూ మా మాటలను వ్యతిరేఖించి “మేమెలా
దోషులమవుతాము? మా గ్రంథములను మేము బాగా అర్థము చేసుకొన్నాము, దేవుడు చెప్పినట్లే నడుస్తున్నాము. దేవుడు
చెప్పిన జ్ఞానమునకు మినహా మేము ఏ ప్రక్క దారిలోనూ పోలేదు. దేవుడు చెప్పినట్లే దేవున్నే ఆరాధిస్తున్నాము. అన్ని
విధముల దేవుడు చెప్పినట్లు నడుచుకొను మమ్ములను, దోషులుగా నిలబడ వలసివస్తుంది, శిక్షలు తప్పవు అనడము
సమంజసమా” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దైవమార్గములో పోవువారిని, దేవుని
జ్ఞానము ప్రకారము నడుచుకొనువారిని గురించి నేను చెప్పడము లేదు. దేవుని జ్ఞానమును చెప్పుకొనుచు తన
మతము మీద వ్యామోహము గల వారిని గురించి చెప్పుచున్నాను. గుమ్మడికాయ దొంగ అంటే అందరూ ఉలికిపడవలసిన
పనిలేదు. మా మతమువేరు, మీ మతమువేరు అను వారిని గురించీ, మా దేవుడువేరు మీ దేవుడు వేరు అనువారిని
గురించీ, మా గ్రంథమువేరు, మీ గ్రంథము వేరు అను వారి గురించీ చెప్పుచున్నాము.
సర్వ సృష్ఠికి దేవుడు ఒక్కడే అధిపతియైనప్పుడు మీ దేవుడు మా దేవుడు అనడము తప్పుకాదా! క్రైస్తవులకు,
హిందువుల కృష్ణుడంటే హేళన భావము. అట్లే హిందువులకు ఏసుప్రభువు అంటే ఎలర్జీగ అవుతుంది. ఇకపోతే
హిందువులకంటే, క్రైస్తవులకంటే మేమే సరియైన మార్గములో ఉన్నామనీ, మా అమ్మాయిని వివాహమాడాలంటే మా
మతములోనికి రావలసిందేనని ముస్లీమ్లు అంటున్నారు. ఎంతోగొప్ప జ్ఞానిని అనుకొన్న వానికి కూడా మతము అను
రోగము లేదేమో గుండెలమీద చేయివేసుకొని చెప్పండి. మూడు మూల గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖురాన్లలో
ఒకే భావమునిచ్చు జ్ఞానమున్నదనీ, మూడు గ్రంథములను మూడు కాలములలో, మూడు ప్రాంతముల వారికిచ్చినవనీ,
మూడు గ్రంథములలో చెప్పినది ఒకే దైవము యొక్క జ్ఞానమనీ, ఎవరు ఎలా చెప్పుకొనినా మనుషులందరికీ దేవుడు
ఒక్కడేనని మతములకు అతీతముగా మేము జ్ఞానమును చెప్పితే, మా జ్ఞానము మాకే తెలుసు మీకు తెలియదనిన
ముస్లీమ్లు ఉన్నారు, క్రైస్తవులూ ఉన్నారు. హిందువులైతే ఏకంగా మమ్ములను క్రైస్తవమును బోధించుచున్నారని
ఆరోపించడము జరిగినది. మతాతీత జ్ఞానమును చెప్పిన దానివలన మేము స్వయముగా హిందూ, క్రైస్తవ, ముస్లీమ్
అను మూడు మతముల నుండి ఎన్నో దాడులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ఇటువంటి అనుభవములు మాకున్నపుడు
ఎవరిని మతముల మమకారము లేని వారిగా చెప్పవలెను? అందరూ మతముల మత్తు పూర్తి ఎక్కినవారుగా ఉన్నారు.
19

Page 20
దేవుడు చెప్పని మతమును సృష్టించుకొన్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్ఠిలో ముద్దాయిలే. ఈ విధముగా చెప్పుచూపోతే
అన్ని మతములలోనూ మేము భక్తులమూ, జ్ఞానులమూ అనుచూ సృష్టికర్తయిన దేవుని ఎడల తమకు తెలియకుండానే
వ్యతిరిక్తముగా ప్రవర్తించుచున్నారు.
భూమిమీద మనుషులకు దేవుడు మూడు విధానములుగా జ్ఞానము తెలియజేశాడు. దివ్యవాణిగా సృష్ట్యాదిలో
ఒక్కమారే చెప్పాడు. తెరవెనుక ఉన్న జ్ఞానినుండి ఒక్క మహమ్మద్ ప్రవక్తకేగాక, ఎన్నోమార్లు ఎందరికో బోధించాడు.
అలాగే తాను పంపు దూత ద్వారా అనగా తన అంశతో పంపబడు భగవంతుని ద్వారా ద్వాపరయుగములో ఒక్కమారే
కాకుండా గతములో ఎన్నోమార్లు బోధించాడు. తర్వాత రాబోయే కాలములో కూడా ధర్మములకు ముప్పు వచ్చినప్పుడు,
అధర్మములు పెరిగిపోయినప్పుడు, తిరిగి ఇదే విధముగా చెప్పుతానని కూడా చెప్పాడు. ద్వాపరయుగము తర్వాత
కూడా దేవునివద్దనుండి పంపబడిన దూత వచ్చిపోయినట్లు కొన్ని ఆధారములున్నవి. ఈ విధముగా దేవుడు మనుషులకు
తన ధర్మమును తెలుపుటకు అనేకమార్లు ప్రయత్నము చేయుచుండగా, మనిషి తనవరకు వచ్చిన దేవుని జ్ఞానమును
తప్పు భావముతో అర్థము చేసుకొని దేవునికి వ్యతిరిక్తముగా బోధించడమూ, దేవుడు చెప్పినట్లు ఆరాధించక, తన
ఇష్టమొచ్చినట్లు ఆరాధించడము వలన అటువంటి మనుషులు దేవుని ధర్మము ఎడల నేరస్తులు కారా? వారు శిక్షార్హులు
కారా అని ప్రశ్నించుచున్నాను.
మనుషులు మతాలను సృష్టించుకొనినా, నాకు తెలిసినంతవరకు మూడు మతముల వారికి మూడు గ్రంథములను
దేవుడు ఏర్పరచాడు. మూడు గ్రంథములలోను దేవుడు తన జ్ఞానమును నింపి ఇచ్చాడు. వాటిలో ఒక గ్రంథమందు
దైవజ్ఞాని అయిన ఒక గ్రహము కనిపించకుండ బోధించిన దేవుని జ్ఞానము కలదు. రెండు గ్రంథములందు దేవునివద్దనుండి
పంపబడిన దూత (దేవుని అంశతో తయారై వచ్చిన భగవంతుడు) చెప్పిన జ్ఞానము కలదు. భవిష్యత్తు కాలములో
ఎవరైనా దేవుని జ్ఞానము మాకు తెలియదు అనకుండా, దేవుడు మాకు తన జ్ఞానమును తెలియబరచలేదు అనకుండా,
ముందే తాను జ్ఞానమును బోధించినట్లు సాక్ష్యముగా తన జ్ఞానమును గ్రంథ రూపములో ఇచ్చాడు.
ఏదైనా తెలియని విషయము మన మధ్యకు వచ్చినప్పుడు, దాని వాస్తవికతను చూచుటకు, దానిలో అసత్యము
ఏదైనా ఉందా అని చూచుటకు, దానికి సంబంధించిన శాస్త్రమును ఆధారము చేసుకొని చూడవలసి ఉంటుంది.
జలములో ఎన్ని రసములున్నాయి? లేక ఎన్ని వాయువులు ఉన్నాయి? అని చూచుటకు దానికి సంబంధించిన రసాయన
శాస్త్రమును చూస్తాము. అలాగే ఒక లెక్కను సరియైనదా కాదా అని చూచుటకు గణిత శాస్త్రమును ఆధారము చేసుకొని
చూస్తాము. మనిషి శరీరములోని గుండె వివరము తెలియాలంటే దానికి ఆధారమైన భౌతికశాస్త్రమును చూస్తాము. ఈ
విధముగా ప్రపంచ విషయములనూ, ప్రపంచ జ్ఞానములనూ తెలియుటకు పంచశాస్త్రములు గలవు. వాటి పేర్లు
వరుసగా 1) గణిత శాస్త్రము 2) ఖగోళశాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము 5) జ్యోతిష్య శాస్త్రము.
ప్రకృతి లేక ప్రపంచ విషయములకు సంబంధించినవి ఐదు శాస్త్రములుకాగా, ప్రకృతిని సృష్టించిన దేవుని విషయమును
గురించి సత్యాసత్య నిర్ధారణకు బ్రహ్మవిద్యాశాస్త్రమును ప్రమాణముగా చూడవలసి యుంటుంది. మనిషి దేవుని
విషయములను తెలియుటకు దేవుని గ్రంథమును చూడవలసిందే. దైవశాస్త్రము (బ్రహ్మవిద్యా శాస్త్రము) భగవద్గీత,
బైబిల్, ఖుర్ఆన్ గ్రంథములలో ఉన్నది. దైవవిషయములను నిర్ధారించుకొనుటకు హిందువు అయితే భగవద్గీతనూ,
క్రైస్తవుడయితే బైబిల్నూ, ముస్లీమ్ అయితే ఖుర్ఆన్ గ్రంథమునూ చూడవలసియుంటుంది.
20

Page 21
ఇక్కడ ఒక విషయమును గ్రహిస్తే ఒక ముస్లీమ్ను మీ దైవ గ్రంథమేది అని ప్రశ్నిస్తే, వెంటనే పవిత్ర ఖుర్ఆన్
గ్రంథమని చెప్పుచున్నారు. అట్లే క్రైస్తవున్ని మీ దైవగ్రంథమేది అని ప్రశ్నిస్తే, పరిశుద్ధ బైబిల్ అని జవాబు చెప్పగలడు.
అలాగే హిందువు అయిన 25 సంవత్సరముల వయస్సున్న M.B.A స్టూడెంట్ను మీ దైవగ్రంథమేది అంటే నాకు
తెలియదు అన్నాడు. మరియొకనిని అడిగితే రామాయణము అన్నాడు. మీ దేవుడెవరు అని ప్రశ్నిస్తే రాముడు అని
జవాబిచ్చాడు. క్రైస్తవులనుగానీ, ముస్లీమ్లను గానీ కేవలము ఐదు సంవత్సరముల పిల్లవానిని ప్రశ్నించినా, వారి
గ్రంథమును, వారి దేవున్ని సులభముగా చెప్పగలుగుచున్నాడు. అయితే ఒక్క హిందూమతములో 25 సంవత్సరముల
వయస్సున్న వారిని అడిగినా, ఒకరు తెలియదంటే, మరొకరు రామాయణమంటే, ఇంకొకరు వేదములనీ, మరొకరు
ఉపనిషత్తులనీ అనేక రకముల జవాబులను చెప్పుచున్నారు. పదింటికి ఒకడైనా మా గ్రంథము భగవద్గీత అని చెప్పడము
లేదు. భారత దేశము హిందూదేశముగా పేరుగాంచినా, ప్రస్తుత కాలములో 50 లక్షల మంది సన్యాసులుగా ఉండినా,
పదివేలమందికంటే అధికముగా బోధించు స్వామీజీలు ఉండినా, చివరకు పదింటికొకనికైనా హిందువుల గ్రంథము
భగవద్గీత అని తెలియకపోవడము ఆశ్చర్యము. ఇంకా ఆశ్చర్యకర విషయమేమంటే హిందువులలో ఐదుశాతము
మంది మాత్రమే భగవద్గీతను చదివారు, 95 శాతము చదువలేదు. ఇంకా వివరముగా చూస్తే క్రింది విధముగా గలదు.
భగవద్గీతను ఏమాత్రము తెలియనివారు నూటికి 80 మంది హిందువులు గలరు.
భగవద్గీతను గురించి విని కూడా దానిని చూడనివారు నూటికి 10 మంది హిందువులుగలరు.
భగవద్గీతను చూచి కూడా దానిని చదవనివారు నూటికి 5 మంది హిందువులు గలరు.
భగవద్గీతను చూచి దానిని శ్రద్ధగా చదివినవారు నూటికి 5 మంది మాత్రమే గలరు.
భారతదేశములో మొదటవున్న హిందువుల సంఖ్య తగ్గుచూపోయి క్రైస్తవుల సంఖ్య వేగంగా, ముస్లీమ్ల సంఖ్య
నిదానముగా పెరుగుచూ వచ్చాయి. ఇదే సమయములో హిందూ మతరక్షణ కొరకు అనేక సంఘములు అనేక పేర్లతో
పుట్టుకొచ్చాయి. హిందూ ధర్మమంటే ఏమిటో తెలియని వారు హిందూ రక్షణ అను పేరును పెట్టుకొని, గ్రుడ్డిపాము
తన పిల్లలనే తిన్నట్లు హిందూ (ఇందూ) ధర్మమును బోధించు మమ్ములనే పరాయి మతముల క్రిందికి లెక్కగట్టారు.
క్రైస్తవులనుగానీ, ముస్లీమ్లనుగానీ ధర్మమును గురించి ప్రశ్నించు స్థోమతగల మమ్ములను కూడా ధర్మము, జ్ఞానము
తెలియని హిందువులు హేళన చేయుచున్నారు. మతము పేరుతో హిందువులు కొందరు గుంపులుగా ఏర్పడి రాజకీయముగా
ముందుకు పోవుచూ, దైవత్వ విధానమును ప్రపంచ సంబంధ రాజకీయమునకు ఉపయోగించుకొంటున్నారు. ఇది
దేవుని విధానములో నేరమగును.
ఏ మతములోగానీ దైవ విధానమునకు, దైవ జ్ఞానమునకు ఆటంకము కలుగకుండుటకు, వారు చేయు తప్పు
ఒప్పులను సూచించుటకూ, బ్రహ్మవిద్యా శాస్త్రమును దేవుడు వారివారి మతములలో గ్రంథ రూపములో ఇచ్చాడు.
దైవజ్ఞానమను పేరుతో మనిషి ఇష్టమొచ్చినట్లు తన భావములను చెప్పుకోకుండా నిలిపివేయుటకు చెక్పోస్టు (తనిఖీ
కేంద్రము) లాంటిది శాస్త్రము. పాలలోనికి నీరు కలిపినట్లు, స్వచ్ఛమైన దైవజ్ఞానములోనికి మనుషుల స్వార్ధ జ్ఞానము
కలిసినా, పాలలో నీరు శాతమును చూపుయంత్రములాగా బ్రహ్మవిద్యాశాస్త్రము దైవజ్ఞానములో కలిసిన మనుషుల
జ్ఞానమును బయటికి చూపగలదు. మనిషి ఎక్కడైనా, ఎంత పెద్దస్వామివద్దనైనా జ్ఞానమును వింటే దానిలో
శాస్త్రబద్దతయుందో లేదో గమనించి, శాస్త్రీయమైన దానిని గ్రహించి, శాస్త్రీయము కానిదానిని వదలివేయమని
21

Page 22
చెప్పుచున్నాము. ఏయే మతములలో ఎవరెవరు అశాస్త్రీయముగా వారి జ్ఞానమును చెప్పుకొంటున్నారో, ఎటువంటివారు
దేవుని కోర్టులో దోషులుగా, శిక్షార్హులుగా నిలబడగలరో, వారివారి జ్ఞానమునుబట్టి చూస్తాము. నేను ఎవరికీ అర్ధము
అయినా కాకపోయినా నేను స్వచ్ఛమైన ఇందువును. అంతేకాకుండా నాకు నేను స్వయముగా పెట్టుకోని ఒక బిరుదు
కలదు, అదియే “ఇందూ ధర్మప్రదాత”. శాస్త్రీయమైన ఇందూ ధర్మములతో (దైవ జ్ఞాన ధర్మములతో) మొదట ఇందూ
(హిందూ) మతములోని లోటుపాట్లను గురించే చెప్పుకొందాము.
సరిగ్గా నిన్నటిదినము 19-03-2013 మంగళవారము జమ్మల మడుగు దగ్గరగల వద్దిరాల గ్రామస్థుడు
ఒకరు మా ప్రబోధాశ్రమమునకు వచ్చి మా భక్తులతో దైవజ్ఞానమును గురించి వాదించి పోయాడు. ఆయన వాదన
ఇలా ఉన్నది. దేవున్ని ఇంతవరకు ఎవరూ చూడలేదని, దేవుడు ఎవరికీ కనిపించడనీ మీరు చెప్పుచున్నారు. మీమాట
పూర్తి అసత్యము, దేవున్ని చూచిన వారు ఎందరో ఉన్నారు. రామక్రిష్ణ పరమహంస “నేను దేవున్ని చూచాను” అని
చెప్పాడు కదా! అంతేకాక చాలామంది మేము చూచామని చెప్పారు. అటువంటపుడు మీరు ఎవరూ చూడలేదని
ఎందుకు చెప్పుచున్నారని వాదించాడు. దానికి మావారు వివరంగా చెప్పను ప్రయత్నిస్తే, అతను నాకు జ్ఞానమంతా
తెలుసు, మీరు నాకేమి చెప్పవలసిన అవసరము లేదన్నాడట. సరే ఆయన మాట ప్రకారమే ఆయన జ్ఞానమును తెలిసి
మాట్లాడుచున్నపుడు, ఆయన జ్ఞానమును మనము విన్నప్పుడు, అది సరియైనదో కాదో అని మనము చూచుకోవలసిన
అవసరమున్నది. పాలను పాలడిగ్రీ యంత్రముతో పరీక్షించి, పాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసుకొన్నట్లు, ఇప్పుడు
ఆ వ్యక్తి చెప్పిన జ్ఞానము సరియైనదో కాదో, బ్రహ్మవిద్యా శాస్త్రమును ఆధారము చేసుకొని, మనుషులకు దేవుడు
కనిపిస్తాడా లేదాయని చూడవలసియున్నది.
మేము దేవున్ని చూచాము అనువారు ఇస్లామ్లో తప్ప క్రైస్తవములోనూ, హిందువులలోనూ అక్కడక్కడ
ఉన్నారు. రామక్రిష్ణ పరమహంసను వివేకానందుడు మొదట కలిసినప్పుడు “నీవు దేవున్ని చూచావా? నాకు చూపగలవా”
అని అడిగాడు. అప్పుడు రామక్రిష్ణ పరమహంసగారు "నేను దేవున్ని చూచాను, నీకు చూపగలను" అన్నాడు. నేను
చూచాను నీకు చూపగలను అనుట వలన వివేకానందుడు అంతటితో గురువును అన్వేషించుట మానివేసి పరమహంస
దగ్గర శిష్యునిగా చేరాడు. ఈ విషయము "స్వామి వివేకానంద ప్రామాణిక సమగ్ర జీవితగాథ" అను గ్రంథములో 84వ
పేజీయందు ఇలా కలదు.
వివేకానందుడు : "మహాశయా, మీరు భగవంతున్ని కళ్ళారా చూచారా?
రామక్రిష్ణ
: అవును చూచాను. ఎంతో స్పష్టముగా నిన్ను చూస్తున్నంత స్పష్టముగా, ఇంకా స్పష్టముగా నీతో
మాట్లాడుచున్నట్లు మాట్లాడవచ్చు. చూడవచ్చును.
అదే 84వ పేజీలో క్రింది పేరాలో వివేకానందుడు అన్నమాటలను గమనిద్దాము "ఆయన అప్పటి మాటలు,
కాసేపటిక్రితం ప్రవర్తించిన తీరు ఎంతో విరుద్ధముగా కనిపించాయి. అలా అయితే కొన్ని సమయాలలో స్పష్టంగానూ,
మరికొన్ని సమయాలల్లో పిచ్చిపట్టినట్లు ఉంటారాయన, బహుశా సగం పిచ్చేమో అని అనిపించింది.” ఈ విధముగా
పరమహంసను గురించి చాలామార్లు వివేకానందుడు అనుకోవడము జరిగినది. దేవున్ని నేను చూచాను నీకు చూపుతానని
చెప్పిన రామకృష్ణ చాలాకాలము వరకు ఏమీ చూపలేదు. చివరకు రామకృష్ణులవారికి వ్యాధి ముదిరి మరణ కాలము
దగ్గరైనప్పుడు తనకు దేవున్ని చూపుతానని ఇంతకాలమూ చూపని దానివలన వివేకానందుడు సహనము కోల్పోయి
మాట్లాడిన మాటలను అదే గ్రంథములో 172 పేజీలో చూడవచ్చును.
22

Page 23
నరేంద్రుడు
660"
మ”
: దేవుడు, గీవుడు అంటూ ఏదీ లేదు. ఇదిగో నేను ఈ చెట్టును చూస్తున్నాను. ఆ విధముగా ఎవరైనా
దేవున్ని చూచారా?
: ఎందుకు, గురుదేవులు చూచారుకదా!
నరేంద్రుడు : అది ఆయన మనోభ్రాంతి దృశ్యము కావచ్చు.
తర్వాత కొన్ని దినములకు పరమహంస రామకృష్ణులు చని పోయారు. పరమహంస అస్తికల కలశమును,
ఆయన పటమును ఉంచిన గదిలో పరమహంసకు పూజ చేయాలని శిష్యులందరూ ప్రారంభించినపుడు పూజా
మందిరములో నిలబడే, ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా వివేకానందుడు వాదించసాగాడు. మరొక శిష్యుడు
స్వామి రామక్రిష్ణానంద కూడా యుక్తమైన జవాబిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. అప్పుడు
స్వామి రామకృష్ణానంద గారు స్వామీజీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ పూజమందిరమునుండి బయటికి త్రోసివేశాడు.
చూచారా వివేకానందుడు రామకృష్ణ పరమహంసగారి ఆరాధనలో తనకు పరమహంసగారు దేవున్ని చూపకుండా
చనిపోయాడను ఆవేదనతో అలా ప్రవర్తించాడని అర్థమగుచున్నది. దేవుడు కనిపిస్తాడనడము అసత్యమని వివేకానందునికి
బాగా తెలిసిపోయింది. అందువలన ఒక భక్తుడు నాకు దేవుడు కనిపించలేదు జీవితమే వృథా అని అన్నప్పుడు
ప్రక్కనేవున్న వివేకానందుడు “ఇదిగో నీ ప్రక్కనే కత్తివుంది, తీసుకొని పొడుచుకో” అని హేళనగా అన్నాడు. ఈ విధమైన
ఆయన మాటలు దేవుడు ఎవరికీ కనిపించడు అను ఉద్దేశ్యమును బయల్పరుచుచున్నవి.
ఇదంతయు యదార్థముగా జరిగిన సంఘటనలుకాగా, ఆ సంఘటనలలో రామకృష్ణుడు దేవున్ని వివేకానందునికి
చూపలేదని స్పష్టముగావుంటే, రామక్రిష్ణపరమహంస చూచాడు అని అనుట జ్ఞానము తెలిసినవాడు మాట్లాడు మాటయేనా?
నేను చూచాను అని చెప్పిన రామకృష్ణ పరమహంసనే వివేకానందుడు తిక్కవాని క్రిందికి లెక్కవేయగా! వద్దిరాల నుండి
వచ్చిన వానిని పూర్తి మతిలేని వాని క్రిందికి జమకట్టవలసిందే. నోరుందని దేవుని జ్ఞానమును అశాస్త్రీయముగా
మాట్లాడితే, అది దేవుని మాటకు వ్యతిరేఖమై పోవుట వలన, ఎవడైన దేవుని శిక్షకు గురికావలసిందే. ఇప్పుడు
పొగరుబట్టి దైవజ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడితే, శిక్ష అమలు జరుగునప్పుడు అన్ని పొగరులు అణిగిపోయి,
ఎందుకు చేసుకొన్నాను ఈ పాపమును అని రోదించవలసియుంటుంది జాగ్రత్త.
ఇట
ఇక బ్రహ్మవిద్యా శాస్త్రబద్దముగా దేవుడు ఎవరికీ కనిపించడూ, ఎవరితోనూ మాట్లాడడు అనుటకు
భగవద్గీతలోనూ, అటు ఖుర్ఆన్ మరియు బైబిల్ గ్రంథములోనూ ఆధారములు గలవు, వాటిని ఇప్పుడు చూస్తాము.
భగవద్గీతయందు విజ్ఞాన యోగమను అధ్యాయములో...
24వ శ్లో॥ అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యస్తే మామబుద్ధయః |
పరం భావ మజానన్తో మమావ్యయ మనుత్తమమ్ ||
25వ శ్లో॥
నాహం ప్రకాశ స్వర్వశ్య యోగమాయా సమావృతః |
మూడో యం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్||
26వ శ్లో॥
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణిచ భూతాని మాంతు వేదన కశ్చన ॥
23

Page 24
భావములు :- అన్నిటికంటే ఉత్తమమైనదీ, నాశనములేనిదీ అయిన దైవత్వమును తెలియని బుద్ధిహీనులైన కొందరు,
ఎవరికీ కనిపించని నన్ను మేము చూచాము అంటున్నారు. యోగమాయ గప్పియున్న నన్ను చూచుటకు ఏ మానవునికీ
చేతకాదు. ఇటు పుట్టుకగానీ, అటు మరణముగానీ లేని నేను ఎట్లున్నది అజ్ఞానులైన మనుషులకు తెలియదు. ఈ
జగతిలో సర్వజీవరాసులకు జరుగుచున్న వర్తమాన కాలమూ, జరిగినట్టి భూతకాలమూ, అట్లే జరుగబోవు భవిష్యత్తు
కాలములోని సమాచారము నాకు తెలుసు. త్రికాలములు తెలిసిన నేను ఎట్లున్నదీ ఎవరికీ తెలియదు.
ఇంతేకాక రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయములో నాల్గవ శ్లోకమున ఒక వాక్యము. "మయాతత
మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా" అని కలదు. దీని భావము "నేను ఇంద్రియములకు అగోచరునిగా ఉంటూ, ఈ
ప్రపంచమునంతటిని వ్యాపించియున్నాను.” ఈ మాటలన్నియు స్వయముగా భగవంతుడు చెప్పిన మాటలు. అందువలన
ఇవన్నియు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవిగా లెక్కించుచున్నాము. నేను ఏ ఇంద్రియములకు తెలియను,
నన్ను ఎవరూ చూడలేరు అని దేవుడు చెప్పిన మాటలను అతిక్రమించి, నేను చూచాను అని ఎవడైనా అంటే, వాడు
అశాస్త్రీయముగా దేవుని ధర్మమునకు వ్యతిరేఖముగా మాట్లాడి నట్లగును. దేవుని మాటనుకాదనిన వాడు ఆయననూ,
ఆయన జ్ఞానమునూ దూషించినట్లగును. దైవదూషణ పాపము వానికి సంభవించును. దేవున్ని నేను చూచాను, నేను
మాట్లాడినాను అనినవారు ఎవరైనాగానీ, స్వామీజీలుగానీ, దైవమార్గములో నేరస్థులగుదురు, శిక్షార్హులగుదురు.
దేవున్ని ఎవరూ చూడలేరు, ఆయన ఎవరితోగానీ ప్రత్యక్షముగా మాట్లాడడు అనుటకు ఖుర్ఆన్ గ్రంథములో
సురా 6, ఆయత్ 103 నందు ఇలా కలదు. “ఎవరి చూపులు కూడా ఆయన్ను (దేవున్ని) అందుకోజాలవు. (అల్లాహ్ ను
ఎవరూ చూడలేరు) ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. (అల్లాహ్ అందరినీ చూస్తున్నాడు.) ఆయన
సూక్ష్మదృష్ఠి కలవాడు, సర్వమూ తెలిసినవాడు. ఈ వాక్యములో దేవున్ని ఎవరూ చూడలేరుగానీ, దేవుడు అందరినీ
చూడగలడు అనివుంది. అంతేగాక 42వ సురాలో 51వ ఆయత్నందు కూడా ఇలా కలదు. " ఏ మానవుని తోనూ
దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడడము అనేది జరుగదు.” ఈ విధముగా దేవుడు తన గ్రంథములో చెప్పియుండగా,
ఆయన మాటలనుకాదని, మేము చూచాము, మేము మాట్లాడాము అంటే వారు ఎవరిని చూచారో? ఎవరితో మాట్లాడారో
వారికే తెలియాలి. వారు చూచినది మాత్రము దేవున్నికాదని బ్రహ్మవిద్యాశాస్త్రమే చెప్పుచున్నది. ఒక గురువు మీకు
దేవున్ని చూపుతాను ఫలానా దినము తనవద్దకు రమ్మని తన శిష్యులకు చెప్పాడట. దేవున్ని చూడాలనుకొను శిష్యులందరూ
ఆ దినము ఆసక్తిగా గురువువద్దకు పోయారు. అప్పుడు నేను దేవున్ని చూపుచున్నాను జాగ్రత్తగా చూడండి అని గురువు
చెప్పగా, మరీ జాగ్రత్తగలిగి పూర్తి ఎరుకగా శిష్యులు చూస్తున్నప్పుడు, తమ మధ్యలోనున్న శూన్యమైన బయలును చూపి
ఇదే దేవుని ఆకారము ఎవరూ చూడనిది ఇపుడు మీరు చూడగలిగారు అని చెప్పాడట. అప్పుడు ఒక శిష్యుడు లేచి ఈ
బయలును ప్రతి దినము మేము చూస్తునే ఉన్నాము. మేమే కాకుండా మా వెంటవుండే కుక్కలు, మా ఇంట్లోవుండే
పిల్లులు
లి చూస్తున్నాయి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు "బయలే దేవుడు, బయలు దేవుడని ఇంతవరకు
మీకు తెలియదు కదా!” అన్నాడట. కొందరు ఆయన మాటలను గ్రుడ్డిగా నమ్మారు. కానీ కొందరు ప్రకృతిని చూపి
పరమాత్మ అంటున్నారు. ప్రకృతిని చేసినవాడు పరమాత్మ. ప్రకృతి కనిపిస్తున్నది, పరమాత్మ కనిపించడని ఈయనకు
తెలియదు కాబోలు అని అనుకొన్నారు. అంతటితో ఆ గురువును వదలి నిజమైన జ్ఞానము కొరకు అన్వేషణ సాగించారు.
నేటి కాలములో ఆధ్యాత్మికత అను పేరున్నదిగానీ, అందులో ఆత్మా లేదు, ఆధ్యయనమూ లేదు. మీకు
అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పుతాము చూడండి. నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఇల్లిల్లు తిరిగి జ్యోతిష్యము
24

Page 25
చెప్పి డబ్బు సంపాదించుకొనేవారిని చూచాను. “ఎరుక చెప్పుతాము” అని కొందరు ఆడవారు తలమీద బుట్టలు
పెట్టుకొని ఊరంతా తిరిగేవారు. ఊరిలో ఎవరో ఒకరు లేక కొందరు వారి చేత భవిష్యత్తును చెప్పించుకొనెడివారు.
ఎరుక చెప్పువారు చెప్పించుకొనువారి చేయి పట్టుకొని దేవతల పేర్లన్నీ చెప్పుచూ “అంబపలుకు, జగదాంబపలుకు,
కంచిమీనాక్షి పలుకు, మధుర కనకలక్ష్మి పలుకు" అనుచూ ఒక పాటలాగా దీర్ఘముగా వారికి తోచిన వాటిని వారు
చెప్పుచుందురు. దానిని “ఎరుక” అంటారు. ఎరుక అంటే జ్ఞానము అని అర్థమొస్తుంది. అయితే ఆ పదమును
జ్యోతిష్యము అని వాడుట సరికాదు. కానీ పూర్వము అలాగే అనెడివారు. పూర్వము ఎరుకల వారు ఎరుక చెప్పడము
ఒక విధమైన జ్యోతిష్యముకాగా, చిన్న పంజరములో చిలుకను పెట్టుకొని ఊరంతా తిరిగి చిలుకతో జ్యోతిష్యము చెప్పెడి
వారిని చూచాము. ఇంకా ఒక పుస్తకము లోనికి ఒక పుల్లను పెట్టి ఏ పేజీ తెరుచుకొంటే ఆ పేజీలో ఉన్న విషయమును
చదివి చెప్పెడివారిని చూచాను. అది కూడా ఒకరకమైన జ్యోతిష్యమే. ఇకపోతే తెల్లని గవ్వలను క్రిందవేసి అవి ఎన్ని
బోర్లపడినాయి, ఎన్ని వెల్లకిల పడినాయి అని చూచి వాటితో జ్యోతిష్యము చెప్పువారినీ చూచాము. కొందరు పంచాంగమును
చూచి జ్యోతిష్యమును చెప్పేవారిని కూడా చూచాము. కొందరు సంఖ్యాశాస్త్రము అని పేరుపెట్టి మనిషి పేరులోని
అంకెలనుబట్టి జ్యోతిష్యమును చెప్పువారు కూడా కలరు. ఈ విధముగా చెప్పుచూపోతే సమాజములో ఎన్నో రకముల
జ్యోతిష్యములు ప్రబలియున్నవి. వీటిలో శాస్త్రీయత ఉన్నది ఏదో ఒకటి నిజమైన జ్యోతిష్యమగును గానీ, శాస్త్రీయతలేనిది
జ్యోతిష్యముకాదని చెప్పవచ్చును. శాస్త్రీయతలేని జ్యోతిష్యము పేరుకు జ్యోతిష్యమగునుకానీ, అందులో సత్యము
ఏమాత్రము ఉండదు. అటువంటి వాటినన్నిటినీ మూఢనమ్మకముతో కూడుకొన్నవని చెప్పవచ్చును.
విధములుగా
అదే విధముగా ఆధ్యాత్మికము కూడా అనేక విధములుగా ప్రజలకు బోధింపబడుచున్నది. ఎరుక జ్యోతిష్యము,
పుల్ల జ్యోతిష్యము, గవ్వ జ్యోతిష్యము, చిలుక జ్యోతిష్యము అని అనేక రకముల జ్యోతిష్యములు అశాస్త్రీయముగా ఎలా
వ్యాపించి ఉన్నవో, అదే విధముగా నేటి కాలములో ప్రజలకు అనేక పద్ధతులుగా ఆధ్యాత్మికము చెప్పబడుచున్నది. ఏ
విధముగా అనేక రకముల జ్యోతిష్యులున్నారో, అదే విధముగా అనేకరక ఆధ్యాత్మిక బోధకులు కూడా ఉన్నారు.
జ్యోతిష్యములు ఎన్నియున్నా అవి ఎలా శాస్త్రబద్ధము కాకుండా అసత్యముగా ఉన్నవో, అట్లే నేటి అనేక రక ఆధ్యాత్మిక
బోధలు ఏమాత్రము శాస్త్రీయతలేనివై పోయాయి. జ్యోతిష్యము పదిలేక పదిహేను రకములుగా ఉంటే, ఆధ్యాత్మికము
మాత్రము దాదాపు రెండు మూడు వందల రకములుగా ఉన్నవని చెప్పవచ్చును. ఇన్ని వందల రకములలో పూర్తి
శాస్త్రీయమైనది దీపముపెట్టి వెదకినా కనిపించకుండా పోయినది. అయినా మనిషి బోధకుల వెంటపడుతూనే ఉన్నాడు,
బోధకులు వారివారి బోధలను చెప్పుతూనే ఉన్నారు. ఈ విధముగా నేటి ఆధ్యాత్మికము దారితప్పి నడుస్తున్నది. ఇంతమంది
బోధకులలో నా బోధ గొప్పదని ఒకరుంటూ వుంటే, లేదు అన్నిటికంటే నా బోధే గొప్పదని మరొకరంటున్నారు. ఈ
విధముగా నేను గొప్ప, నా బోధ గొప్ప అనుచూ బోధకులందరూ దేశములో డబ్బుకొరకు, పేరు ప్రఖ్యాతులకొరకు
ప్రాకులాడుచున్నారు తప్ప దేవుని జ్ఞానము కొరకు ఏమాత్రమూ కనీస ప్రయత్నము కూడా చేయలేదని అర్థమగుచున్నది.
కొందరి దృష్ఠిలో ఆధ్యాత్మిక బోధ ఒక వ్యాపారములాగ మారిపోయినది. ఆధ్యాత్మికము పవిత్రమైనదనీ, శక్తితో
కూడుకొన్నదనీ బోధకులు కూడా అనుకోవడములేదు. ఇదంతా నా అనుభవముతో చెప్పుచున్నాను. నా అనుభవమేమిటో
క్రింద వ్రాస్తున్నాను చూడండి.
దాదాపు ముప్పయి సంవత్సరముల క్రిందట నేను కర్నూలు జిల్లాలో ఒక స్వామీజీని కలిసాను. నేను ఏ
గుర్తింపూలేని సాధారణ వ్యక్తిగా ఆయనను కలిసాను. అప్పటి కాలములో ఆయన బాగా ఉపన్యాసములు చెప్పి మంచి
25

Page 26
పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పేరును కొంతమార్చి చెప్పితే ప్రనాధ చైతన్య స్వామి. అప్పటికాలములో హిందూమత
రక్షణ సంఘములన్నీ ఆయనను గొప్పగా పొగిడేవి. ఎందుకనగా ఆ స్వామీజీ హిందూ మతమును గొప్పగ చెప్పుచూ
ఇస్లామ్ మతమునూ, క్రైస్తవ మతమునూ ఎక్కువ దూషించడమూ విమర్శించడమూ చేసెడివాడు. అప్పటికాలములో
ధైర్యముగా మాట్లాడే స్వామి అని చాలామంది ఆయనను పొగుడుచుండెడివారు. ఆ స్వామివద్ద ఒక రోజంతా గడిపాను.
రాత్రి అన్నము తిన్న తర్వాత 8 గంటల నుండి 2 గంటల వరకు అనగా ఆరు గంటలసేపు కూర్చున్న వారము
లేవకుండ మాట్లాడినాము. నేను ఎన్నో ప్రశ్నలను అడుగుచూ వచ్చాను. ఆయన పురాణములనూ, ఇతిహాసములనూ
వాడుకొంటూ ఒక్కొక్కప్పుడు భగవద్గీత నూ, ఉపనిషత్తులనూ వాడుకొంటూ జవాబులు చెప్పుచూవచ్చాడు.
చెప్పడములో కొన్ని విషయములను ముందు ఒకరకముగా చెప్పి వాటినే తర్వాత ఇంకొక రకముగా చెప్పవలసి వచ్చినది.
అలాగే ముందు ఆయనే అవును అని చెప్పిన మాటలను చివరకు ఆయనే సందర్భమునుబట్టి కాదనవలసి వచ్చినది.
చివరకు ఆయనకే తాను ఒకే విషయమును రెండు రకములుగా మాట్లాడినానని అర్థమైనది. అదే విషయమునే నేను
కూడా 'అప్పుడేమో అలా చెప్పారు చివరకు ఇప్పుడు ఇలా చెప్పుచున్నారే' అని అడిగాను. దానికి ఆయన నేను
ఆశ్చర్యపోయే విషయమును చెప్పాడు. అదేమనగా! "కొన్ని చోట్ల అలాగే మాట్లాడవలసివస్తుంది. అలా మాట్లాడితేనే
ప్రజలకు సంతోషము, అలా మాట్లాడకపోతే వారికి మనము నచ్చము.” అన్నాడు. అప్పుడు నేను "ప్రపంచ విషయములనైతే
ఎలామార్చి మాట్లాడినా ఫరవాలేదు. ఇది దేవుని విషయముకదా శాస్త్రబద్ధమై ఎప్పటికీ ఒకేలాగుండునది కదా!
అలాంటపుడు ఒకమారు ఒకరకము, మరొకమారు ఇంకొకరకము చెప్పితే దేవుని జ్ఞానమును చిన్నబుచ్చినట్లు కాదా.”
అని అడిగాము. దానికి జవాబుగా ఆయన “నేను ఏమీ దాచకుండా ఉన్న సత్యమును చెప్పుతాను విను. నిజంగా
చెప్పితే దేవుడూ లేడు, దయ్యమూ లేదు. ఆ విషయమును గురించి మాట్లాడుకోవడమే వృథా ప్రయాస” అని నవ్వుతూ
చెప్పాడు. అప్పుడు నాకు పూర్తి ఆశ్చర్యమై “మీరు సమాజములో పేరున్న స్వామీజీగా ఉన్నారు. ఎన్నో ఊర్లలో
పెద్దపెద్ద సభలలో వారము రోజులు ప్రవచించి మంచిపేరు తెచ్చుకొన్నారు. దేవున్ని గురించి, దైవజ్ఞానమును గురించి
ఎన్నో ఉపమానములను చెప్పి పామరులకు కూడ అర్థమగులాగున బోధించారు. అటువంటి మీరే దేవుడులేడు,
దయ్యములేదు అనడము నాకు ఆశ్చర్యముగా ఉంది. దేవుడు లేనప్పుడు, ఆ విషయము మీకు తెలిసినప్పుడు, మీరు
కాషాయములను ధరించి స్వామీజీగా ఉంటూ అలా ఎందుకు బోధించాలి? అని అడిగాను.
అప్పుడు ఆయన మరొక ఆశ్చర్యకరమైన విషయమును సున్నితముగా ఏమాత్రము తొణకకుండా ఈ విధముగా
చెప్పాడు. "నేను ప్రజల కొరకు చెప్పాను. నా కొరకు కాదు. నాకు దేవుడున్నాడను నమ్మకము లేదు. ప్రజలకు
దేవునిమీద నమ్మకముంది. కావున వారికొరకు చెప్పాను. వారము రోజులకు లక్షరూపాయలు డబ్బు ఇచ్చి మాకు
దేవుని జ్ఞానమును గురించిన ప్రవచనాలు చెప్పండి అని అడిగారు. కావున నేను డబ్బు తీసుకొన్నందుకు చెప్పాను.
వారికి ప్రవచనము కావాలి, నాకు డబ్బు కావాలి. అందువలన నాకు దేవుడు లేడని తెలిసినా, వారికి ఉన్నాడని
చెప్పడము అవసరము. కాబట్టి వారికి ఏ విధముగా నచ్చితే ఆ విధముగా చెప్పాను. సినిమాలో యన్.టి. రామారావు
రాముడు లేక కృష్ణుని వేషము వేసి పాత్రకు తగినట్లు నటిస్తున్నాడు. వాస్తవానికి ఆయన రాముడుగానీ, కృష్ణుడుగానీ
కాదు కదా! నటించినందుకు ప్రతిఫలముగా డబ్బులు తీసుకొంటున్నాడు కదా! రాముని వేషము వేసినవాడు రాముడే
అయి వుండవలసిన పనిలేదు కదా! అలాగే దేవుని ఉపన్యాసము చెప్పాను. చెప్పినంతమాత్రమున నిజముగా స్వామియో
లేక భక్తుడో అయివుండవలసిన పనిలేదు. ఇప్పుడు భక్తి జ్ఞానమును గురించి ఉపన్యాసములు చెప్పువారందరికీ నిజముగా
26

Page 27
దేవుని మీద భక్తి ఉందనుకోవడము పొరపాటు" అన్నాడు. ఇదంతయు వినిన నేను కొంత ఆశ్చర్యపోయినా,
ఉన్నదున్నట్లు చెప్పినందుకు ఒక విధముగా ఆయనను పొగడవలసిందేననుకొన్నాను.
ఆధ్యాత్మికము అనునది ఉన్నత పదమే అయినా అందులో ఆత్మగానీ, ఆధ్యాయనముగానీ లేదని చెప్పుకొన్నాము
కదా! నేడు జ్యోతిష్యము అనునది కొన్ని రకములే అయితే, ఆధ్యాత్మికము అను పేరు గలది అనేక రకములుగా
ఉన్నదని కూడా చెప్పుకొన్నాము. ఒక గురువేమో నాసికాగ్రము మీద ధ్యాస నిలుపవలెనంటాడు. మరొక గురువేమో
ముక్కు మీద కాదు, దాని అగ్రము మీద అంతకూ కాదు. ముక్కులోపలి శ్వాస మీద ధ్యాసను పెట్టవలెనంటాడు. ఒక
గురువేమో ముక్కుమీద వద్దు శ్వాసమీద వద్దు, మనస్సు మీద పెట్టుకోమంటాడు. మరొక గురువేమో “మనస్సు
ఎక్కడుండేది, ఎట్లుండేది తెలియదు. అది ఎక్కడుండేది తెలియనప్పుడు దానిమీద ధ్యాసను ఎలా పెట్టుతావు? వారు
చెప్పినదంతా అబద్దము, నేను చెప్పునది మాత్రమే సత్యము. నీ ధ్యాసను భూృమధ్య స్థానములో పెట్టు" అని అనుచున్నారు.
మరొక గురువేమో నేను మంత్రో పదేశమును ఇస్తాను, దానిని నిత్యము కొంతసేపు ధ్యానించుకొనుచూవుండు, దానివలన
జన్మలు లేకుండా పోతాయి అనుచున్నాడు. బ్రహ్మకుమారి సమాజమను వారు ఓంశాంతి అంటారు. శివుడు గుండ్రని
ఎర్రని వెలుగుగా ఉన్నాడంటారు. పిరమిడ్వాళ్ళు పిరమిడ్లో ధ్యానముచేయి అంటారు. రామకృష్ణ పరమహంస
మఠమువారు అంతా కాళీమాతనే అంటారు. బాబాలుగానున్న వారేమో వేరే ధ్యానమువద్దు, వేరే ధ్యాసవద్దు నేనే దేవున్ని
అనుచున్నారు. కొందరు స్వామీజీలేమో నన్ను తాకితే మీకు మోక్షము వస్తుంది అంటున్నారు. కొందరేమో దేవుడు
నగ్నముగా పుట్టించితే తిరిగి దేవుని దగ్గరకు పోవుటకు నగ్నముగానే ఉండవలెనంటారు. ఇలా చెప్పుకొంటూపోతే
కొన్ని వందల విధానములు భక్తి, ధ్యానము, యోగము, దీక్ష, ఉపాసన అను పేర్లతో ఉంటూ ఒక్కొక్క దానియందు ఎన్నో
చీలికలు కల్గియున్నవి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానమును బోధించుచూ ఆధ్యాత్మికమను దానిని హద్దూ పద్దూ
లేనిదానిగా, ఇష్టారాజ్యముగా చేశారు. ఎవరికి తోచింది వారు చెప్పుచూ ఇదియే నిజమైన జ్ఞానమంటున్నారు.
ఎన్నో విధములుగానున్న ఆధ్యాత్మికమును చూచి కొందరు ఎటూ పోకుండా దేవుని జ్ఞానమునే నమ్మకుండా
పోయారు. కొందరు దొరికిన దానితో తృప్తిచెంది గ్రుడ్డికంటే మెల్ల మేలన్నట్లు, ఏదీ లేకుండా ఉండే దానికంటే, ఏదో
ఒకటి ఉంటే చాలులే అనుకొన్నారు. కొందరేమో జీవితములో ఒకమారు ఏదో ఒక గురువువద్ద ఉపదేశము తీసుకొంటే
చాలు అని అనుకొనువారు కూడా కలరు. ఇలా ఎన్ని రకముల గురువులు ఉన్నారో, అన్ని రకముల శిష్యులు కూడా
ఉన్నారు. ఇకపోతే లక్షకొకరు దేవుని జ్ఞానమును తెలుసుకోవాలను ప్రయత్నమును చేయుచున్నారు. దేవుని మీద పూర్తి
ఇష్టత కల్గి, దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకోవాలనుకొనువారు కూడా లక్షకొకరు, పదిలక్షలకొకరు, కోటికొకరు
అక్కడక్కడ కనిపిస్తున్నారు. అటువంటి వారికి ఎంత పెద్దస్వామి చెప్పినదైనా అది అశాస్త్రీయమైతే దానిని వారు
ఒప్పుకోవడములేదు. అది నిజమైన జ్ఞానము కాదని వారికి తెలిసిపోవుచున్నది. అటువంటి బోధలతో వారు తృప్తి
చెందక వారికి కావలసిన సంపూర్ణమైన బోధ కొరకు అన్వేషణ సాగిస్తూనే ఉంటారు. అటువంటి శ్రద్ధగలవారికి
తప్పనిసరిగా వారికి కావలసిన జ్ఞానమును దేవుడు అందునట్లు చేస్తాడు. దేవుడు చేస్తాడు అంటే దేవుడు స్వయముగా
చేయడు. దేవుని బాధ్యతలను స్వీకరించి పని చేయుచున్న ప్రకృతియే చేస్తుందని అర్థము.
ఆధ్యాత్మికము కొందరి స్వామీజీల చేతులలో నాటకీయమైనది. స్వామీజీలు అసలైన దేవున్ని వదలిపెట్టి తామే
స్వయముగా దేవుళ్ళను సృష్టించుచున్నారు. వారికి తగిన జ్ఞానమునూ, దానికి తగిన ఆచార వ్యవహారములనూ తయారు
చేయుచున్నారు. ఇట్లు ఏదో ఒక విధముగా తమ ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తున్నారు. అటువంటి కోవలోనే
27

Page 28
దేవుడు చెప్పని మతములను మనిషి తయారు చేసుకొన్నాడు. కొందరు సృష్టించిన కొన్ని భక్తి విధానములే కాకుండా,
పెద్ద గుంపుగా తయారగుటకు మత విధానములనే మనిషి సృష్టించాడు. మతము అను అంధత్వములో దేవుని
జ్ఞానమును మనిషి వక్రీకరించుకొన్నాడు. మనిషి తన మత చాంధసముతో దేవుని జ్ఞానమును అశాస్త్రీయము చేశాడు.
మనిషి బయట సమాజములో దొంగతనము చేస్తే కోర్టు, విచారణ, శిక్ష వుంటుంది. అలాగే అత్యాచారము చేసినా,
హత్య చేసినా, ఇతరులను హింసించినా మొదలగు ఎటువంటి తప్పుచేసినా కోర్టు శిక్ష ఉంటే, ఏకంగా దేవుని విషయములోనే
తప్పు చేస్తే కోర్టు, విచారణ, శిక్ష ఉండదా? అని అంటే, తప్పనిసరిగా ఉంటుందనియే చెప్పాలి. బయటి సమాజములో
కోర్టులో ఏదో ఒక ఉపాయముతో నేరమును చేయనివానిగా తప్పించుకొని బయటపడవచ్చునుగానీ, దేవుని విషయములో
జరిగిన తప్పునుండి ఎవడూ తప్పించుకోలేడు. ఎవని తెలివి తేటలుగానీ, ధనము హెూదాలుగానీ దేవుని శిక్షనుండి
బయటపడవేయలేవు. దేవుని విషయములోగానీ, దేవుని జ్ఞాన విషయములోగానీ తప్పుచేసినవానికి దాని విచారణ
కనిపించదు. శిక్షను వేయువాడు కనిపించడు, శిక్ష ఏమైనది ఎవరికీ తెలియదు. అది అనుభవానికి వచ్చినప్పుడు కూడా
అది దేని మూలముగా వచ్చిన శిక్షని కూడా తెలియదు. బయటి సమాజములో ప్రపంచ సంబంధ నేరములు చేస్తే,
బయట ప్రపంచములోనే శరీరముతో ఉన్నప్పుడే అనుభవిస్తున్నాడు. అలాగే కనిపించని దేవుని విషయములోగానీ,
జ్ఞానము ఎడలగానీ చేసిన తప్పుకు శిక్షను మనిషి ఈ కనిపించే ప్రపంచములోనే అనుభవించవలసి వుంటుంది.
భారతదేశములో మనకు భగవంతుడు ఐదువేల సంవత్సరముల పూర్వము దైవజ్ఞానమును బోధించాడు. ఆనాడు
అధర్మములు వ్యాపించి ధర్మములు తెలియకుండా పోయాయను ఉద్దేశ్యముతో దేవుని అంశ లేక శక్తి భగవంతుడు
అనబడు వ్యక్తిగా వచ్చి దేవుని ధర్మములను బోధించి పోయాడు. ద్వాపరయుగము అంత్యములో ప్రపంచ సంబంధముగ
ఇప్పుడున్నంత అన్యాయములు అక్రమములు ఆనాడు లేవు. అంతేకాక దైవజ్ఞానసంబంధముగా ఈనాడున్నంత గురువులు,
ఈనాడున్నంత అనేక భక్తి విధానములు, ఈనాడున్నంత దేవతల గుడులు, ఈనాడ్నుంత స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు,
ఈనాడున్నంత ఉపదేశములు, ఈనాడున్నంత అనేకరక ఆరాధనలు ఆనాడు లేవనియే చెప్పవచ్చును. అయితే ఆ
దినములలోనే ధర్మములకు ముప్పు ఏర్పడినదని దేవుడు భగవంతునిగా వచ్చి తన విషయములను తానే చెప్పిపోయాడు.
ఆనాడు ఎందరో మహర్షులున్నా భగవంతుడు రావలసిన పని వచ్చినది. ఆనాడు అధర్మములు ప్రబలుటకు ఒకే ఒక్క
కారణము కలదు. కృష్ణునికంటే ముందు పుట్టిన వ్యాసుడు చేసిన పనివలన ధర్మములకు ముప్పు ఏర్పడినదని
చెప్పవచ్చును.
వ్యాసుడు వ్రాసిన నాల్గువేదములు, 1108 ఉపనిషత్తులు. 18 పురాణములు ఆనాడు ప్రజలలోనికి చొచ్చుకొని
పోయాయి. అప్పటి కాలములో విద్యావేత్త, కవి, ప్రజ్ఞాశాలి అని పేరుగాంచిన వ్యాసుడు వ్రాసిన గ్రంథముల మీద
ప్రజలకు గౌరవముండుటచేత, అప్పటికాలములో ఇతర గ్రంథములు ఏవీ లేనిదానివలన, వ్యాసుని గ్రంథములను
అందరూ చదివారు. పందుల రక్తమును పీల్చిన దోమల వలన ప్రజలకు మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు, వ్యాసుడు
వ్రాసిన గ్రంథములలోని మాయ ప్రభావము వలన ప్రజలలో అధర్మములు వ్యాపించినవి. వేదములు, పురాణములు,
ఉపనిషత్తులు అందరికీ నేటికినీ బాగా కనిపిస్తున్నవి, వాటిలో మాయతో కూడిన అధర్మములున్నవని ఇప్పటికీ ఎవరికీ
తెలియదు. మనకు తెలియని విషయమును గ్రహించిన దేవుడు భగవంతుని ద్వారా తన ధర్మములను తెలియజేశాడు.
అయినా భగవంతుడు చెప్పిన భగవద్గీతలో అసలైన దేవుని ధర్మములున్నాయని కూడా చాలామందికి తెలియదు. భగవద్గీత
నేడు కోర్టులో సాక్ష్యులవద్ద సాక్ష్యము చెప్పుటకు గ్రంథమును ప్రమాణము చేయుటకు చూపుచున్నారు. అయితే
28

Page 29
గీతమీద ప్రమాణము చేయువానికి భగవద్గీత అంటే ఏమిటో? భగవద్గీతలో ఏమున్నదో కూడా తెలియదు. ఈ విధముగా
చూస్తే వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ప్రాకినట్లు భగవద్గీత పుట్టి ఐదువేల సంవత్సరములైనా ప్రజలలోనికి
ప్రాకలేదనియే చెప్పవచ్చును.
నేడు భూమిమీదున్న లక్షలాది గ్రంథములలో ముందు వచ్చినదీ, మనిషి జీవితమునకు అవసరమైన దేవుని
ధర్మములుగలదీ, భగవద్గీతయని చెప్పవచ్చును. తర్వాత అదే కోవకు చెంది ధర్మములు బోధించినది భగవద్గీత తర్వాత
మూడు వేల సంవత్సరములకు వచ్చిన బైబిలు గ్రంథము. ఆ తర్వాత ఆరు వందల సంవత్సరములకు వచ్చిన గ్రంథము
ఖుర్ఆన్ గ్రంథమని చెప్పవచ్చును. ఈ మూడు గ్రంథములు దైవజ్ఞానమునకు ధర్మములకు మూలగ్రంథములని
చెప్పవచ్చును. మొదట భగవద్గీత వ్యాసుని చేత సంస్కృత భాషలో హిందీలిపితో వ్రాయబడినది. తర్వాత వచ్చిన బైబిలు
హెబ్రిభాషలో వ్రాయబడినది. ఆ తర్వాత వచ్చిన ఖుర్ఆన్ అరబ్బీ భాషలో వ్రాయబడినది. మొదట చెప్పిన భగవద్గీత
కేవలము ఐదు లేక పది నిమిషములలో చెప్పినదే. అది కృష్ణుడు చెప్పగా అర్జునుడు విని కొద్ది రోజుల తర్వాతే
వ్యాసునికి చెప్పగా, ఆయన వినిన సారాంశమును విపులముగా విడదీసి శ్లోకముల రూపములో వ్రాయడము జరిగినది.
మొదట అర్జునుడు విన్నది కొద్ది నిమిషముల సారాంశమే అయిన దానివలన విన్నది విన్నట్లు వ్యాసునికి తెలుపడము
జరిగినది. దానివలన కృష్ణుడు చెప్పిన కొద్దిపాటి సమాచారము ఉన్నదున్నట్లు వ్యాసుని వరకు చేరినదని చెప్పవచ్చును.
విన్న దానిని పూర్తిగా వ్యాసుడు వ్రాయడము జరిగినది. అక్కడి వరకు కూడా దేవుని జ్ఞానము చెక్కుచెదరకుండా
శ్లోకముల రూపములో ప్రజలవరకు చేరినది. ఈ విధముగా వచ్చిన సంస్కృత భగవద్గీతను సంస్కృతము తెలిసినవారందరు
ఇతర భాషలలోనికి అనువదించి వ్రాయడము జరిగినది. ఇప్పుడు మనవరకు సంస్కృతము, తెలుగు వచ్చినవారు
తెలుగులోనికి వ్రాయడము జరిగినది. అలా వ్రాసిన భగవద్గీతలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని మధ్యరకమువి
అనేక రకములు కనిపిస్తున్నవి.
సంస్కృత భాషలోయున్న గ్రంథము ఒకే పరిమాణములో ఉండగా తెలుగులోనికి అనువదించినవి చిన్నవి,
పెద్దవి అయినాయంటే వాటిలో ఏదో హెచ్చుతగ్గులు జరిగిందని సులభముగా తెలిసిపోవుచున్నది. ఒకే శ్లోకమునే
అనువదించిన వ్యక్తి యొక్క భావమునుబట్టి ఎక్కువగా కొంత మంది, తక్కువగా కొంతమంది వ్రాయడము జరిగినది.
శ్లోకములోని సత్యము ఒక్కటే అయినా, వ్రాసిన వారి భావములోనికి చేరినవి కొన్ని సత్యములు మరికొన్ని అసత్యములుండుట
వలన వ్యక్తి వ్యక్తికీ రచనలు పొడుగు పొట్టి అయిపోయాయి. అందువలన కొన్ని చిన్న భగవద్గీతలు, కొన్ని పెద్దభగవద్గీతలు
బయటికి వచ్చాయి. మూడు సంవత్సరముల క్రితము వరకు విద్యాప్రకాశానందగిరి వ్రాసిన 'గీతామకరందము' అను
భగవద్గీత అందరి భగవద్గీతలకంటే మిక్కిలి పెద్దదిగా ఉండెడిది. గీతామకరందము 1100 పేజీల గ్రంథముకాగా,
దాని తర్వాత 2000 పేజీల గ్రంథముగా సుందర చైతన్య స్వాములవారు వ్రాసిన 'చైతన్య భగవద్గీత' మిక్కిలి పెద్దదిగా
ఉన్నది. 200 పేజీల భగవద్గీతకు, 2000 పేజీల భగవద్గీతకు శ్లోకములలో ఏమీ తేడాయుండదు. అయితే భావములలో
ఎంతో తేడాయున్నదని చెప్పవచ్చును. భగవద్గీత శ్లోకముల వరకు భావము చెడిపోకుండా ఉన్నదున్నట్లుండగా, మిగతా
రచయితల అనువాదములో భగవంతుడు చెప్పిన భావము కొంతమారిపోయి, రచయితల భావము అందులో చేరినదని
చెప్పవచ్చును. ఈ విధముగా కృష్ణుడు చెప్పిన భావము కొన్ని గీతలలో 50 శాతము మారిపోయివుండగా, కొన్నిటిలో
60,70,80 శాతము కూడా మారిపోయినదని చెప్పవచ్చును. కొందరు వ్రాసిన భగవద్గీతలలో కేవలము 10 శాతము
మాత్రము మారిపోయి 90 శాతము భగవంతుని భావమున్నదని చెప్పవచ్చును. 20,30,40 శాతము భావమార్పిడి
29

Page 30
జరిగిన గీతలను కూడా చూచాను. చిన్న సైజు (పరిమాణములో)నున్న గ్రంథములలో ఎక్కువ భగవంతుని భావమున్నట్లు
తెలియుచున్నది. ఏది ఏమైనా భగవద్గీత శ్లోకముల రూపములో ఈ దినము కూడా మనముందున్నందుకు
సంతోషించవచ్చును. ఎందుకనగా రచయిత శరీరములోనున్న ఆత్మ అందిస్తే 100 శాతము భగవంతుని భావమున్న
భగవద్గీత బయటికిరావచ్చును, ఎక్కడైనా ఈ పాటికి వచ్చియుండవచ్చును.
నాకు తెలిసినంత వరకు గీతలోని ఆధ్యాయములలో రెండవ దానిగా చెప్పబడు సాంఖ్యయోగములో 11,19,
22, 23, 47 శ్లోకములకు భగవంతుడు చెప్పిన భావము ప్రకారము ఇంతవరకు ఎవ్వరూ వ్రాయలేదని తెలియుచున్నది.
ఒక్క అధ్యాయములోనే ఐదు శ్లోకములకు అర్థము లేదంటే గీతలో ఎన్ని శ్లోకములకు సరైన భావము బయటికి రాలేదో
సరిగా చెప్పలేము. ఇదంతా ఉదాహరణకు చెప్పేదే అని తెలుసుకోండి. గీతలో ఈ ఐదు శ్లోకములకు ఎవరైనా
సరియైన భావము వ్రాయగలరేమోగానీ, ఖుర్ఆన్ గ్రంథములో సురా 6, ఆయత్ 95 కు గానీ, సురా 50, 21
ఆయత్కు గానీ ఎవరూ సరియైన వివరము చెప్పలేరనియే చెప్పవచ్చును. ఈ రెండు సురాలలో రెండు వాక్యములకు
వేయి సంవత్సరములు పరిశోధన చేసి చూచినా తెలియని భావముండుట వలన బహుశా వీటి భావము ఎవరికీ
తెలియదనియే చెప్పవచ్చును. ఇది కూడా ఉదాహరణ నిమిత్తమే చెప్పాము. ఖుర్ఆన్ గ్రంథములోనికి పోయి చూస్తే
అందులోనున్న దేవుని భావము చాలామందికి అర్థము కాలేదనీ, తిరిగి దేవుడే చెప్పేంతవరకు అర్థము కాదనీ చెప్పవచ్చును.
ఒక విషయము ఒకరినుండి బయటికి వచ్చినప్పుడు అది వాక్యముగా ఉండును. దేవుని నుండి వచ్చినా,
మనిషి నుండి వచ్చినా మొదట అది వాక్యముగా ఉండును. 'వాక్యము అను పదమునుండి పుట్టినది వాదము.' మొదట
పుట్టిన వాక్యమును అనుసరించి తర్వాత ఎవరు చెప్పినా దానిని అనువాదము అంటాము. అనువాదము అనగా
మొదటి దానిని అనుసరించి వివరము చెప్పునదని అర్థము. ఎక్కడైనా మొదటి దానిని అనుసరించి చెప్పునప్పుడు వ్యక్తి
రెండవవాడే, వాదము లేక వాక్యము రెండవదే అగును. వ్యక్తి మారినప్పుడు వాక్యము యొక్క అనుకరణ కూడా
మారియుండవచ్చును, ఉండకపోవచ్చును. ఎవడైతే మొదట చెప్పిన వ్యక్తి యొక్క భావము నూరుశాతము
గ్రహించుకొంటాడో, వాడు తన అను వాదమును మొదట చెప్పినవాని భావమునకు సరిపోవునట్లు వ్రాయగలడు, లేక
చెప్పగలడు. మొదటి భావమును గ్రహించలేనివాడు మొదటి వాని భావమును వదలి ప్రక్కకు పోగలడు. ఉదాహరణకు
ఒక వ్యక్తి తనవద్దయున్న రెండవవానికీ, మూడవవానికీ అన్నము తినే తట్టను (పల్లెమును) తీసుకొనిరా అని
చెప్పాడనుకొనుము. అప్పుడు రెండవవాడు భోజనగదిలోనున్న ఒక పల్లెమును తెచ్చాడు. మూడవవాడు అట్లు కాకుండా
అప్పుడు అన్నము తింటున్న వ్యక్తినుండి తట్టను బలవంతముగా తీసుకొచ్చాడు. మొదటివాడు చెప్పినది అన్నము తట్టను
తీసుకురమ్మనగా, రెండవ వానికి అన్నము తినే దానికి ఉపయోగపడే పల్లెమని అర్థమై ప్రక్కన ఖాళీగాయున్న పల్లెమును
తెచ్చాడు. మూడవవానికి ప్రస్తుతము అన్నము తింటున్న పల్లెమునే తీసుకరమ్మని అర్ధమై అన్నము తింటున్న వానిదగ్గరినుండి
అన్నముతో సహా పల్లెమును తెచ్చాడు. ఇప్పుడు రెండవ, మూడవ వానిలో ఎవరిది సరియైన భావమో మనకు తెలియాలంటే
మొదటివాడు అన్నము తినే పల్లెము అని అన్నప్పుడు వాడు ఏ భావముతో చెప్పాడో, ఆ భావము తెలిస్తేగానీ ప్రక్కనున్న
మనకుకూడా ఏది సరియైనదో అర్థము కాదు. అలాగే భగవద్గీతలోగానీ, మిగత మూల గ్రంథములలోగానీ, చెప్పబడిన
దేవుని వాక్యములు పూర్తి అర్థముకాక సందిగ్ధములో ఉండిపోయాయి. అవి పూర్తిగా సరియైన భావముతో అర్థము
కావాలంటే తిరిగి దేవుడే వచ్చి చెప్పవలసిందే. సందిగ్ధముతో కూడుకొన్న కొన్ని సూక్ష్మమైన జ్ఞానవాక్యములు దేవునికి
తప్ప ఏ మనిషికీ తెలియవని ఖురాన్ గ్రంథములో సురా 3, ఆయత్ 7లో చెప్పబడినది. “భగవద్గీతలో ఆదిలో చెప్పిన
30

Page 31
జ్ఞానము రాజవిద్యగానున్నది. అలాగే రాజ (పెద్ద) రహస్యముగా ఉన్నది. అందువలన ఇప్పుడు తిరిగి వివరముగా
చెప్పుచున్నాను విను అర్జునా” అని భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు.
దేవుడు చెప్పిన భగవద్గీత మనయొద్ద ఉండినా, అనువాదములో కొంత తేడా రావడములో పూర్తి అర్ధము
కాకపోయినదని చెప్పవచ్చును. కొందరు మనుషులు గీతయొక్క భావమును అక్కడక్కడ తప్పుగా వ్రాయడమే గాక,
వారి స్వార్థముకొరకు కొన్ని శ్లోకములను సృష్టించి కలుపడము కూడా జరిగినది. అటువంటి శ్లోకముల వలన దేవుని
భావమునకు వ్యతిరేఖ భావము గీతలోనే కనిపించుచున్నది. మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత” గ్రంథములో
మనుషులు వ్రాసిన శ్లోకములను గుర్తించి తీసి వేయడము జరిగినది. దేవుడు సృష్ఠిని తయారు చేసినప్పుడే తనకు
ప్రత్యర్థిగా ఉండుటకు, స్త్రీ స్వరూపమై తోడుగాయుండుటకు ప్రకృతిని తయారు చేశాడు. ప్రకృతి దేవుని ఆజ్ఞతో
జీవరాసులనందరినీ పాలించుచున్నది. ప్రతి మనిషి లోను శక్తిగాయుండుటకు ఆత్మ వెలసియుండగా, పనిని ప్రేరేపించు
గుణములుగా ప్రకృతియున్నదని చెప్పవచ్చును. ప్రకృతి చేత తయారైన గుణములనే మాయ అనికూడా అంటున్నాము.
గీతను వ్రాయుటకు మాయ సంబంధ గుణములు తప్పు ఆలోచనలనిచ్చి మనిషిని ప్రేరేపించగా, ఆత్మ హస్తములను
కదలించి వ్రాయించుచున్నది. గీతను అనువదించడములో ప్రేరేపణ, ఆలోచన, ఆచరణ అన్నియూ గుణములు
మరియు ఆత్మ చేయగా శరీరములోని జీవుడు ఆ కార్యములో ఎటువంటి భాగస్వామి కాలేదు. అయినా జీవుడు తన
అజ్ఞానముచేత ఆ పనిని తానే చేసినట్లనుకొనుచున్నాడు. ఆ కార్యములోని చెడుకుగానీ, మంచికిగానీ తానే బాధ్యుడవు
చున్నాడు. గీతను తప్పుగా వ్రాయునట్లు చేసినది మాయ (గుణములు) కాగా, శరీరమును కదలించి పనిని చేసినది
ఆత్మ. జీవుడు తాను చేయని పనికి అనవసరముగా అజ్ఞానముతో బాధ్యుడైనా, తప్పు భావమును సృష్టించి వ్రాయించినది
ప్రకృతి జనితమైన మాయ, దానికితోడు ఆత్మ. వీరిద్దరు దేవుని చేత నిర్మించబడినవారై దేవుని యొక్క ధర్మమును,
శక్తిని తెలిసినవారైయుండి, ఎందుకిలా తప్పుగా గీతను వ్రాయించారు అని ప్రశ్నించుకొంటే, దేవుడు తనకు ఇష్టములేని
వారు తననుండీ, తన జ్ఞానమునుండీ దూరముగా పోవుటకు తన మాయచేత, ఆత్మచేత అలా చేయించాడని తెలియుచున్నది.
ఇదంతా తెరవెనుక ఎవరికీ తెలియకుండా జరుగు తతంగమిదియని చెప్పవచ్చును.
తెర ముందర ఆ కార్యములోని తప్పుకు జీవుడే బాధ్యుడగుచున్నాడు. తాను చేయకున్నా తానే చేశానని జీవుడు
అనుకోవడము వలన, గీతను తప్పు భావములతో అనువదించినందుకు జీవుడే శిక్షార్హుడగుచున్నాడు. కావున
ఆధ్యాత్మికములో ముందుకు పోవుటకు స్వయం హక్కుదారుడుగా జీవుడుండి, దేవుడు అవకాశమిచ్చినా దానిని
వినియోగించుకోకుండా, అన్నిటిలోను అహమును పొందుచుండుట వలన, చేయని తప్పులకు శిక్షార్హుడగుచున్నాడు.
దేవుని మార్గములో కర్మ ఆటంకము లేకుండుట వలనా, కర్మప్రకారము జ్ఞానము లభిస్తుందను నియమము లేనందునా,
శ్రద్ధయుంటే ఎంతటి జ్ఞానమునైనా తెలుసుకోవచ్చును. అవకాశమున్నా మనిషి తన శ్రద్ధను బయటి ప్రపంచము మీద
పెట్టుట వలన, దేవునికి ఇష్టము లేనివాడగుచున్నాడు. దేవునికి ఇష్టములేని వానిని ప్రకృతి మాయరూపమై తన
గుణముల ద్వారా దేవుని మార్గమునుండి దూరముగా పోవునట్లు చేయుచున్నది. అందువలననే వేమనయోగి తన
పద్యములలో “పతి యొప్పిన సతి ఒప్పును” అని అన్నాడు. పతి అనగా పరమాత్మ అనియూ, సతి అనగా ప్రకృతియనియూ
తెలియవలెను.
దేవుని విషయములో సర్వస్వతంత్రుడైన జీవాత్మ, ఏమాత్రము దేవుని విషయము మీద శ్రద్ధలేనివాడగుట చేత,
ప్రకృతి సంబంధ విషయము మీదనే ఆసక్తిని చూపుట వలన, జీవుడు దేవుని విషయములో తప్పు చేసిన వాడగుచున్నాడు,
31

Page 32
శిక్షార్హుడగుచున్నాడు. దేవుడు తన జ్ఞానమును భగవంతుని ద్వారా భూమిమీద తెలియునట్లు చేసినప్పటికీ, భగవంతుడు
భగవద్గీతలో చెప్పని అనేక ఆరాధనలను జీవుడు స్వయముగా సృష్టించుకొనుచున్నాడు.
దేవుడు తనను ఎలా ఆరాధించాలో, తన జ్ఞానముచేత దేవున్ని ఎలా తెలియవచ్చో, దేవున్ని తెలుపుటకు
ఉపయోగపడు ధర్మములేవో, దేవున్ని తెలుసుకొనుటకు ఏమాత్రము పనికిరాని అధర్మములేవో, పూర్తి వివరముగా
చెప్పినప్పటికీ, ధర్మములను ఏమాత్రము గుర్తించక, ఆచరించకపోవడమే కాకుండా, దైవమార్గమునకు, గమ్యమునకు
ఆటంకమైన అధర్మములను ఆచరించుచున్నాడు. ఇటువంటి అధర్మ విషయములలో ఏ జ్ఞానమూ తెలియని సాధారణ
మనిషికంటే మాకు జ్ఞానము తెలుసునను స్వామీజీలు మొదలగువారు దైవదృష్ఠిలో నేరస్థులగుచున్నారు. జ్ఞానులమూ,
స్వాములమూ అనువారు ఎట్లు ధర్మములను గుర్తించక అధర్మ ఆచరణ చేయుచున్నారో కొంత వివరముగా తెలుసుకొందాము.
భగవద్గీతలో జ్ఞానయోగమందు ఏడవ శ్లోకమున చెప్పిన భావమిలాగలదు. "భూమిమీద ఎప్పుడెప్పుడు ధర్మమునకు
ముప్పు కలిగి, అధర్మము అభివృద్ధి చెందునో, అప్పుడప్పుడు నన్ను నేను తయారు చేసుకొని వస్తాను" అని దేవుడు
భగవంతుని రూపముతో చెప్పాడు. ఆ విధముగా చెప్పడమే కాకుండా, అప్పుడు తాను వచ్చినది ధర్మములను
తెలియజెప్పుటకేనని చెప్పి, తాను ఏ విధమైన అధర్మములతో తెలియబడడో, ఏ విధమైన ధర్మములతో తెలియబడునో
కూడా వివరముగా చెప్పాడు.
ఉదాహరణకు ఒక స్వామీజీ భగవద్గీతను పది రోజులు బాగా ఉపన్యసించి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
భగవద్గీతను చెప్పునప్పుడు ఎన్నో ఉపమానములను చెప్పి అందరికీ అర్థమయ్యేటట్లు బోధించాడు. ఆయన బోధలు
వినిన చాలామంది ఆ దినమునుండి అసలైన దేవుడు ఒకడున్నాడనీ, ఆయనే సర్వమునకు అధిపతియనీ, ఆయనను
ఆరాధించుట వలననే మోక్షము లభించుననీ తెలియగలిగారు. అప్పటినుండి ఇతర దేవతలనుగానీ, చెట్టుకు, పుట్టకు
పూజచేయడముగానీ, పితృదేవతలకు గుడ్డలు సమర్పించడముగానీ, పూజించి కొబ్బరికాయలు కొట్టడముగానీ మానివేశారు.
ఎందుకలా మానివేశారని ఇతరులు వారినడిగితే జీర్ణానంద స్వామి చెప్పిన గీతా బోధను విన్న తర్వాత భగవద్గీత బాగా
అర్థమైనది. జీర్ణానందస్వామి భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయమున 25వ శ్లోకమును చెప్పి
దాని భావమును తెలియజేసిన తర్వాత ఇక ఎవరినీ పూజించకూడదనుకొన్నాము అన్నారు. వారు వినిన దేమనగా!
యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృ వ్రతాః |
భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోపి మామ్ ||
25వ శ్లో॥
భావము :- “దేవతలను పూజించువారు దేవతలలోనికే పోయి చేరుతారు. పితృ దేవతలను (పెద్దలను) పూజించువారు
పితృ దేవతలలోనికే పోయి చేరుతారు. పాములను, ఆవులను, చెట్లను మొదలగు జీవరాసులను పూజించువారు
వాటిలోనికే పోయి జన్మిస్తారు. నన్ను పూజించువారు మాత్రము నాలోనికే వచ్చి చేరుతారు” అని ఉన్నది. ఈ శ్లోకమును
దీని భావమును వినినవారు దేవున్ని ఆరాధించి దేవునిలోనికే చేరాలనుకొన్నారు. దేవుడు తప్ప ఇతరులెవరూ
వద్దనుకొన్నారు. ఆ విధముగా కొందరు ఆ శ్లోకమును విని మారిపోయి ఉండగా, కొన్ని రోజుల తర్వాత ఒక టీ.వీ
లో
'యాన్తి దేవవ్రతాన్ దేవాన్' అను శ్లోకమును బోధించిన జీర్ణానందస్వామి
భాగ్యలక్ష్మి గుడిలో భాగ్యలక్ష్మికి పూజ చేయుచూ కనిపించాడు. ఆయన బోధ వలన మారిన వారందరూ ఆ దృశ్యమును
చూచారు. అప్పుడు వారికి ఒక ప్రశ్న వచ్చినది. సృష్టికంతటికీ దేవుడే గొప్పయనీ, ఆయననే ఆరాధించవలెననీ,
ప్రోగ్రామ్లో భగవద్గీతనూ అందులోని ఆ
32

Page 33
ఆయనను ఆరాధించితే ఆయనవద్దకు పోగలరు, లేకపోతే మీరు ఆరాధించిన వారివద్దకే పోతారనీ మా అందరికి
చెప్పిన జీర్ణానందస్వామి ఎందుకలా దేవుడు కానటువంటి దేవతను పూజించుచున్నాడని అనుకొన్నారు.
ఇప్పుడు మనకు తెలియకుండానే నేరము, కోర్టు, విచారణ, శిక్ష అవి జరిగిపోవుచుండును. దేవుని జ్ఞానమైన
భగవద్గీతలో దేవుని ఆరాధనను కృష్ణుడు గొప్పగ చెప్పుచూ, దేవతలను పూజించడము చేసిన వారందరు అజ్ఞానులని
కూడా చెప్పారు. విజ్ఞానయోగము 20, 23వ శ్లోకములను చూస్తాము.
20వ శ్లో॥
కామైస్మైసైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః |
తంతం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా॥
23వ శ్లో॥
అంత వత్తు ఫలం తేషాం తద్భవ త్యల్ప మేధసామ్ ।
దేవాన్ దేవ యజోయాంతి మద్భక్తా యాంతి మామపి ॥
20వ భావము :- ప్రపంచ సంబంధములైన పాపముల చేత, ఆశలలో మునిగిన అజ్ఞానులు కొందరు, నన్ను వదలి
ఇతర దేవతల నియమము ప్రకారము వారిని పూజించుచుందురు.
23వ భావము :- స్వల్పబుద్ధికలవారు పొందు ఫలితము కూడా స్వల్పము గానే ఉండును. దేవతలను ఆరాధించు
దేవతా భక్తులందరు దేవతలను చేరగా, నా భక్తులు మాత్రము నన్ను చేరగలరు.
దేవుడు భగవంతునిగా భగవద్గీతలో ముందే చెప్పిన ఈ మాటలను బట్టి ఇప్పుడు జీర్ణానందస్వామి చేసినది
తప్పా కాదా? యని మనము ఆలోచిస్తాము. భగవద్గీతను పరిపూర్ణముగా తెలిసిన జీర్ణానందస్వామికి దేవుడు చెప్పిన
మాటలు శ్లోకములు జ్ఞాపకమున్నా వాటిని ఇతరులకు చెప్పేదానికే నేర్చుకొన్నాడు. విజ్ఞాన యోగములో 20వ
శ్లోకమున చెప్పినట్లు ప్రపంచ సంబంధ ఆశలతో కూడుకొన్నవారు, ఆ ఆశలచేత జ్ఞానమును మరచిపోయినవారై,
అజ్ఞానులగుచూ దేవతల నియమముల ప్రకారము వారిని పూజింతురని ఉన్నట్లు, జీర్ణానందస్వామి తనలోని ఆశచేత
దేవతను పూజిస్తే ఆమె తనకు మంచి చేయునను భావముతో భాగ్యలక్ష్మి గుడిలోనికి పోయి పూజ చేయడము జరిగినది.
భగవద్గీతను చదివిన సామాన్య మనిషికైనా అందులో దేవునికి దేవతలకు ఉన్న తారతమ్యము తెలిసిపోవును. అటువంటి
విధానము భగవద్గీతలో ఉన్నప్పుడు, ఇతరులకు గీతను బోధించు స్థోమతకల్గియున్న స్వామీజీయే ఇక్కడ దేవుడు గొప్పయని
చెప్పి, అక్కడ పోయిన తర్వాత తన మాటను మరచిపోయి, దేవునికంటే దేవతయే గొప్పన్నట్లు, ఒక స్త్రీ స్వరూప
దేవతలను పూజించడము మనకు ఎట్లున్నా, అది దేవుని న్యాయస్థానములో గొప్ప నేరమగును.
విశ్వమును అందులోని జీవజాలమును సృష్టించి, తనచేత సృష్ఠింపబడిన సృష్ఠి ఎల్లకాలము సాగునట్లు ఏర్పాటు
చేసిన దేవుడు నన్ను తెలుసుకోండి, నా వలననే అన్నీ మీకు జరుగుచున్నవి, మీకున్న ఈ జన్మలు లేకుండా పోవాలంటే
నా జ్ఞానమే ఆధారమని ఆయన జ్ఞానమును గీతలో తెల్పితే, ఆ మాటను లెక్క చేయకుండా ప్రవర్తించువారు ఎవరైనా,
దేవుని శిక్షకు అర్హులు కాకతప్పదు. దేవుడు చెప్పకపోతే మాకు తెలియదు అని తప్పించుకొనుటకు అవకాశమున్నది.
అటువంటి అవకాశము లేకుండా కొందరికి భగవద్గీత రూపములోనూ, మరికొందరికి బైబిలు రూపములోనూ, ఇంకా
కొందరికి ఖుర్ఆన్ గ్రంథరూపములోనూ దేవుడు తన ధర్మములను సంపూర్ణముగా తెలిపియున్నాడు. దేవుడు ముందే
33

Page 34
తన జ్ఞానమును తెలిపి యుండగా, దేవుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకోవడమే జీవిత సారాంశమని తెలియక, ప్రపంచములో
డబ్బు సంపాదించడమే జీవిత సారాంశముగా కొందరు పెట్టుకొన్నారు. సామాన్య మనిషిని అటుంచి మాకు జ్ఞానము
తెలుసునని బోధించు స్వామీజీలే దేవుని మార్గములో ఎక్కువగా శిక్షార్హులగుచున్నారని చెప్పవచ్చును.
సాధారణ మనిషి దేవుని మార్గమును అనుసరించాలంటే ముందు ఏమి చేయాలో, ఎలా అనుసరించాలో
తెలియుటకు ఒక గురువును ఆశ్రయించి, వారు చెప్పినట్లు చేయుటకు పూనుకొనును. ప్రస్తుత కాలములో గానీ,
కొంత పూర్వకాలములోగానీ ఒక వ్యక్తి గురువును ఆశ్రయించితే, గురువు ముందుగా ఆశ్రయించిన వ్యక్తికి గురూపదేశము
ఇచ్చి తన శిష్యుడిగా చేసుకొనును. దానితో ఆ వ్యక్తి (శిష్యుడు) ఆ గురువును వదలి ప్రక్క గురువు దగ్గరకు పోకుండా
చేసుకోవడము జరుగును. అలా అప్పటినుండి వాడు తనవాడు అన్నట్లు గురువు శిష్యున్ని గురూపదేశముతో బంధించు
కొనుచున్నాడు. అప్పటినుండి ఇతరుల గ్రంథములు చదవకూడదనీ, ఇతరుల బోధలు వినకూడదని చెప్పి, శిష్యునికి
ప్రక్క చూపులేకుండా చేయుదురు. తర్వాత తాను మొదట ఉపదేశముగా చెప్పిన మంత్రమును ప్రతి దినము ధ్యానించవలెనని
చెప్పుదురు. అలా ప్రతి దినము ధ్యానము (మెడిటేషన్) చేయడమే జీవితములో ముఖ్యమనీ, అలా చేయడము వలననే
మనిషి దేవుని మార్గములో ప్రయాణించి చివరకు దేవున్ని చేరగలడని చెప్పుదురు. అంతేకాకుండా మధ్యమధ్యలో
యజ్ఞములు చేయించడమూ, వేదములను చదివించడమూ, దానములను చేయించడమూ జరుగుచున్నది. ఏదైన ఒక
దానిని ధ్యానించడమును తపస్సు అనికూడా అనవచ్చును.
ప్రపంచములో ఒకవ్యక్తి తాను స్వామిగానో, గురువుగానో ఇతరులకు తెలియుటకు బయటికి కనిపించు
యజ్ఞములు, దానములు, వేదాధ్యయనములు, తపస్సులను ముఖ్యముగా చేయుచున్నాడు. ఈ నాలుగు చేయగలిగితే
సమాజములో ఒక జ్ఞానిగా, స్వామిగా, గురువుగా తెలియగలడు. ఒక గురువుగాయున్న స్వామీజీ తాను ఈ నాలుగు
పనులలో కొన్నిటిని ఎక్కువగా, కొన్నిటిని తక్కువగా చేయుచూ, తనను ఆశ్రయించిన శిష్యుల చేత కూడా చేయించుచుండును.
అట్లు గురువులవద్ద చేరిన శిష్యులు కూడా యజ్ఞ, దాన, వేదాధ్యయన, తపస్సులను చేయుచూ, ఇతరు లెవ్వరూ చేయని
గొప్ప కార్యములను చేసినట్లు తలచుకొనుచుందురు. ప్రపంచములో కూడా ఈ నాలుగు కార్యములే దైవమార్గములో
గొప్ప విలువైన కార్యములుగా ప్రజలు లెక్కించుచున్నారు. ఈ నాలుగు కార్యములను మహర్షులను వారు కూడ చేస్తూ
వచ్చారు. కృతయుగము తర్వాత వచ్చిన త్రేతాయుగములో (తైతాయుగములో) త్రికాల జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ద్రావిడ
బ్రాహ్మణుడు అయిన రావణబ్రహ్మ ఈ నాలుగు కార్యములను పూర్తిగా వ్యతిరేఖించాడని, జరుగుచున్న యజ్ఞములను
ధ్వంసము చేయించాడని విన్నాము. బ్రహ్మజ్ఞాని అని పేరుగాంచిన ఒక వ్యక్తి అలా ఎందుకు వ్యతిరేఖించాడు, అందరికీ
గొప్ప కార్యములుగా కనిపించినవీ, నేటికినీ ఎందరో పేరుపొందిన స్వామీజీలు చేయుచున్నవీ, అయిన యజ్ఞములను
ఎందుకు భగ్నము చేశాడు అని తెలియుటకు, మనము బ్రహ్మవిద్యా శాస్త్రమును ప్రమాణముగా తీసుకొని చూడవలసిందే.
శాస్త్రము వలననే ఏది అశాస్త్రీయము, ఏది శాస్త్రీయమని తెలియగలదు. చేయుచున్న వ్యక్తులను బట్టి ఒక కార్యము
సరియైనదో, కాదో చెప్పకూడదు. ముందే నిర్మించబడియున్న శాస్త్రమునుబట్టి ఒక కార్యము సరియైనదో, కాదో
చెప్పవచ్చును. ఇప్పుడు అందరూ గొప్పగ ఆచరించు యజ్ఞ, తపస్సు, దాన, వేదాధ్యయనములను కార్యములు దైవమార్గములో
జ్ఞానులమనువారు చేయునవి, కావున వీటిని షట్ శాస్త్రములలోని బ్రహ్మవిద్యా శాస్త్రముచేత విడదీసి చూడవలసి యున్నది.
ప్రస్తుత కాలములో బ్రహ్మవిద్యా శాస్త్రమేది అని చూస్తే మూడు గ్రంథములలో అది కనిపిస్తున్నది. హిందువులకు
(ఇందువులకు) భగవద్గీతలో, క్రైస్తవులకు బైబిల్లో, ముస్లీమ్లకు ఖుర్ఆన్ గ్రంథములో దేవునికి సంబంధించిన బ్రహ్మవిద్యా
34

Page 35
శాస్త్రము యొక్క సూత్రములు తెలియుచున్నవి. ఇపుడు మనము ఇందువులము (హిందువులము) కాబట్టి భగవద్గీతా
శాస్త్రమును చూడవలసిందే. భగవద్గీత నూటికి నూరుపాళ్ళు బ్రహ్మవిద్యా శాస్త్రమైన దానివలన, అందులో మొదటినుండి
చివర వరకు పరిశీలించి చూస్తే, విశ్వరూప సందర్శనయోగమను ఆధ్యాయములో 48 మరియు 53 శ్లోకములలోనూ,
దానికంటే ముందున్న అక్షర పరబ్రహ్మ యోగములో చివరి 28వ శ్లోకములోను బాహ్యయజ్ఞములను గురించీ,
వేదాధ్యయనమును గురించీ, దానములనూ, తపస్సులను గురించి చెప్పడము జరిగినది. వాటిని క్రింద వివరిస్తాము
చూడండి. ముందు అక్షర పరబ్రహ్మ యోగములోని 28వ శ్లోకమును చూస్తాము.
28వ శ్లో॥
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరంస్థాన ముపైతి చాద్యమ్||
భావము :- “నేను చెప్పిన జ్ఞానమును తెలిసినవాడు వేదముల వలన, యజ్ఞముల వలన, దానముల వలన, తపస్సుల
వలన వచ్చు పుణ్య ఫలములను అతిక్రమించినవాడై, యోగియై పరమమైన మోక్షపదమును పొందగలడు.”
భగవంతుడు చెప్పిన ఈ మాటనుబట్టి చూస్తే మనకు అర్థమగు విషయమేమనగా! వేదముల వలనగానీ,
యజ్ఞముల వలనగానీ, తపస్సుల వలనగానీ, దానముల చేతగానీ ప్రపంచ సంబంధ ఫలితమైన పుణ్యము లభించుచున్నది.
పాపపుణ్యములు రెండూ ప్రపంచ సంబంధ ఫలితములని జ్ఞాపకముంచుకోవలెను. ఈ రెండు ఫలితముల వలన
కష్టసుఖములు లభించునని చెప్పుకొన్నాము. ప్రపంచ సంబంధ ఫలితముకంటే గొప్పది దైవసంబంధ ఫలితము.
దైవసంబంధ ధర్మాధర్మముల వలన జన్మ, మోక్షములు కలుగుచుండును. కష్టముంటే సుఖముండదు. అట్లే జన్మవుంటే
మోక్షముండదు. కష్టసుఖములు, జన్మ మోక్షములు ప్రకృతి పరమాత్మ యొక్క వేరువేరు ఫలితములు. ప్రకృతి సంబంధమైనవి
కష్టసుఖములు, ఇవి మనిషి చేయు పాపపుణ్యముల చేత వస్తున్నవి. అలాగే దైవసంబంధ మైనవి జన్మ మోక్షములు.
ఇవి మనిషి ఆచరించు ధర్మములను బట్టి, అధర్మములనుబట్టి లభించుచున్నవి. ఈ శ్లోకములో చెప్పిన యజ్ఞ, దాన,
వేద, తపస్సులు నాలుగు కార్యములు ప్రకృతికి సంబంధించినవా లేక పరమాత్మకు సంబంధించినవాయని చూస్తే,
దైవమునకు సంబంధించిన కార్యములుగానే అందరూ చేస్తున్నారు. అయితే గీతలో చెప్పినట్లు ఈ కార్యములకు
పుణ్యఫలితము వస్తున్నదనీ, పుణ్యమువలన సుఖములను అనుభవించుటకు జన్మ కలుగుచున్నదని చెప్పవచ్చును.
భగవద్గీతలో ఈ కార్యములను ప్రకృతికి సంబంధించిన కార్యముగా ప్రకటించారా అని చూస్తే, మోక్షము కాకుండా
జన్మను కలుగజేయు అధర్మ కార్యములుగా కనపడుచున్నవి. ఈ మాట అందరికీ ఆశ్చర్యముగనే ఉన్నందున ఇంకా
లోతుగా చూడవలసిన అవసరమున్నది.
దైవమార్గములో ధర్మకార్యముల వలన వచ్చు ఫలితము మోక్షము. మోక్షము అనగా జన్మనుండి విడివడి
(జన్మించిన శరీరమునుండి బయటికి వచ్చి) దేవునియందైక్యమై పోవుట. ఎప్పుడైతే జీవుడు దేవునియందైక్యమై పోవునో,
అప్పుడు అంతవరకు తెలియని దేవుడు తెలియబడును. జీవునికి దేవుడు తెలియబడినప్పుడు తర్వాత జీవుడనువాడుండడు.
వాడు దేవునిలో కలిసిపోయి శరీరమునుండి, కర్మనుండి విముక్తుడగుచున్నాడు. కర్మనుండి విడుదలను పొందడమునే
మోక్షము అంటున్నాము. ధర్మముల వలన మోక్షము లేక దైవదర్శనము లభిస్తే అధర్మమువలన జన్మయే లభించు
చున్నది. అధర్మముల వలన లభించు జన్మలో, అధర్మముల వలన లభించు పుణ్యముతో సుఖములు లభించుచున్నవి.
ఆ విషయమునే పై శ్లోకములో “వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన లభించు పుణ్యఫలములకంటే, నా జ్ఞానము ధర్మము
35

Page 36
తెలియుట వలన వాడు యోగియై మోక్షమును పొందుచున్నాడు.” అని చెప్పాడు. దీనినిబట్టి యజ్ఞ, దాన, తపస్సు,
వేదములు దైవమార్గములోనున్న అవి అధర్మములనీ, యోగము అనునది ధర్మము అనీ తెలియుచున్నది. వేద, యజ్ఞ,
దాన, తపస్సులు నాలుగు అధర్మములనీ, వాటి వలన దేవుని తెలియుటకు ఏమాత్రము శక్యముకాదనీ విశ్వరూప
సందర్శన యోగమున 48, 53వ శ్లోకములలో చెప్పబడుచున్నది, చూడండి.
48వ శ్లో॥
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర చక్రియాభిర్న తపొభిరుగ్రైః
וט
ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర॥
భావము :- ఓ అర్జునా! వేదములు చదువుట వలన, యజ్ఞములు చేయుట వలన, దానములను ఇచ్చుట వలన,
ఉగ్రమైన తపస్సు చేయుట వలన ఇప్పుడు నీవు చూచిన ఈ రూపమును చూచుటకు శక్యముకాదు.
నేను చెప్పిన ధర్మముల వలన దేవుడు తెలియబడును అని అక్షర పరబ్రహ్మయోగము చివరి శ్లోకములో చెప్పిన
భగవంతుడు, ఈ నాలుగు కార్యముల వలన దేవున్ని చూచుటకు శక్యముకాదు అని చెప్పడము జరిగినది. దీనితో
భగవంతుడు ఈ నాలుగు పనులను అధర్మ కార్యములుగా ప్రకటించినట్లయినది. అధర్మకార్యముల వలన సుఖములకు
కారణమైన పుణ్య జన్మకలుగుననీ, మోక్షము లభించదనీ అర్థమగుచున్నది. ఇదే విషయమునే దృఢపరుస్తూ 53వ
శ్లోకములో కూడా చెప్పడము జరిగినది చూడండి.
53వ శ్లో॥
నాహం వేదైర తపసా న దానేన న చేజ్యయా
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా॥
భావము :- వేదముల చేతగానీ, తపముల చేతగానీ, దానములచేతగానీ, యజ్ఞములచేతగానీ నా రూపము చూచుటకు
సాధ్యముకాదు. ఇపుడు నీవు చూచిన విశ్వరూపము ఈ నాలుగు కార్యముల వలన శక్యముకాదు.
48వ శ్లోకము విశ్వరూపముతో ఉన్నప్పుడే చెప్పినది కాగా, 53వ శ్లోకము విశ్వరూపమును వదలి సాధారణ
కృష్ణుడుగా ఉన్నప్పుడు చెప్పినది. ఈ రెండు శ్లోకములలోనూ ఒకే భావము తెలియపరచబడినది. ఈ నాలుగు
కార్యముల వలన నేను ఏమాత్రము తెలియబడనని చెప్పడమేకాక, రాజ విద్యా రాజగుహ్య యోగమున 25వ శ్లోకమున
దేవతలను పూజించు వారుగానీ, పితృ దేవతలను పూజించువారుగానీ, జీవములైన చెట్లను, జంతువులనూ, మనుషులను
పూజించువారు గానీ చనిపోయిన తర్వాత ఎవరిని పూజించారో, వారి దగ్గరకే పోవుదురు తప్ప నా వద్దకు రాలేరు
అన్నాడు. భగవంతుడు చెప్పిన ఈ మాటలనుబట్టి శాస్త్రప్రమాణముగా దేవునివద్దకు చేర్చని కార్యములన్నియూ,
అధర్మయుతములని అర్థమైపోవు చున్నది. దేవునివద్దకు చేర్చునవి మాత్రమే ధర్మములని తెలియుచున్నది. యజ్ఞముల
ద్వారా ఇతర దేవతలను పూజించుచున్నారు. కావున అన్ని రకముల ఆరాధనలను యజ్ఞముల క్రిందికే చేర్చి చెప్పవచ్చును.
ఇవన్నియు అధర్మములని చెప్పినా దేవుని మాటను లెక్కించక తమ ఇష్టానుసారము అన్యదేవతారాధన చేయువారిని,
యజ్ఞములు చేయువారిని, తపస్సు చేయువారినీ, అధర్మయుతులుగా దేవుడు లెక్కించుచున్నాడు. భూమిమీద అధర్మములు
ఉండకూడదని అదే పనిగా దేవుడు అవతరించి ధర్మములు తెలియజేయగా, దేవుని ఉద్దేశ్యమునూ, శ్రమను గుర్తించక
అదే పనిగా అధర్మములను ఆచరించితే దేవునికి కోపము రాదా! దేవుడు భగవంతుడై శరీరమును ధరించి వచ్చి
భూమిమీద అనేక అవమానములకు ఓర్చి కొన్ని సంవత్సరముల కాలము తన జ్ఞానమునూ, ధర్మములనూ తెలియజేస్తే,
ఆయన శ్రమను ఏమాత్రము లెక్కచేయక, దేవుడు చెప్పాడే అని గౌరవము కూడా లేకుండా, ధర్మములవైపు ఏమాత్రము
36

Page 37
చూడకుండా, అధర్మములను ఆచరిస్తే దేవున్ని కించపరచినట్లు కాదా! అటువంటపుడు దేవునికి కోపము రాదా!
వస్తుంది.
ఆయన కోపము మనుషుల కోపమువలె ఉండదు. ఆయన ఇప్పుడు ఎవరినీ కోపగించుకోడు. సృష్ట్యాదిలోనే
ఇటువంటి వారికి ఇది, ఈ పని చేసిన వారికి ఈ శిక్షయని ముందే తీర్పు తీర్చి పెట్టాడు. ఆ తీర్పులను శాస్త్రీయముగా
నిర్ణయించి పెట్టాడు. అలా సృష్ట్యాదిలో నిర్ణయించిన తీర్పు ప్రకారమే నేడు తప్పు చేసినవారికైనా శిక్షలుంటాయి.
దేవుడు శాస్త్రబద్దముగా నిర్ణయించిన తీర్పులనుండి ఎవడూ బయటపడుటకు అవకాశములేదు. నేడు మనిషి తన
ఇష్టమొచ్చినట్లు అలవాట్లు నేర్చుకొని, నన్ను తప్ప ఎవరినీ ఆరాధించవద్దు అని దేవుడు చెప్పినమాటకు, అట్లు చెప్పితే
మా మనో భావములు దెబ్బతింటాయి అని, ఇది మా సనాతన ధర్మమని అరచినా దేవుడు ఒప్పుకోడు. నేను
సనాతనున్ని సనాతనముగానున్న నన్ను ఆరాధించడము సనాతన ధర్మమవుతుందిగానీ, నిన్న నేడు నీవు అలవాట్లు
చేసుకొన్నవి సనాతన ధర్మములెట్లగునని దేవుడు ప్రశ్నించగలడు. అంతేకాక నీకు మనస్సును, బుద్ధిని ఇచ్చినది నేను,
శరీరములోనున్న మనో బుద్ధులు నావే అయినప్పుడు, నీ మనోభావమేదో అది నా మీద ఉండవలెను గానీ, నీ
ఇష్టమొచ్చిన దేవతల మీద పెట్టుకొని అవి వదలమని మంచి మాటలు చెప్పితే, మా మనోభావము దెబ్బతింటుంది
అనడము భార్య నా మనస్సు వేరేవాని మీద ఉందని భర్తతో చెప్పినట్లు కాదాయని దేవుడు ప్రశ్నించగలడు. భగవద్గీతలో
రాజవిద్యా రాజగుహ్య యోగమున 34వ శ్లోకములో ఈ విధముగా అంటున్నాడు చూడండి.
34వ శ్లో॥
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామే వైష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణః||
భావము :- "నీ భక్తిని నామీదే చూపు, నీ మనస్సును నామీదే ఉంచు, నీవు నన్నే నమస్కరించు, నీవు నన్నే పూజించు,
నన్నే ఆశ్రయించు నన్నే పొందగలవు". అని చెప్పియుండగా! మనిషి తన ఇష్టమొచ్చిన వారిని పూజించడము
నమస్కరించడము చేస్తూ, ఎవరైనా వారి మంచికోరి దేవున్ని తప్ప ఇతరులను పూజించవద్దు, నమస్కరించవద్దు అంటే,
మూతి ముడుచుకొని అట్లు చెప్పితే మా మనోభావములు దెబ్బతింటాయి అంటే, జేబు దొంగతనములకు అలవాటుపడిన
వానిని చూచి పోలీస్ "దొంగతనము చేయుట మంచిది కాదు, పని చేసి బ్రతుకు" అని చెప్పితే దొంగ “అట్లు చెప్పితే
మా మనోభావాలు దెబ్బతింటాయి” అన్నాడట. పోలీసు ఆ మాట విని " నీ మనోభావాలు నీ క్రింది జోబిలో ఉన్నాయా,
పై జోబీలో ఉన్నాయా” అని అడిగాడట. ఆ విధముగా ఇది దైవజ్ఞానము కదా! మన మంచికే చెప్పుచున్నారు కదా
అనుకోకుండా, దీనిని వ్రాసిన మాకు కూడా వ్యతిరేఖముగా మాట్లాడువారుండవచ్చును. మీరు నన్ను ఏమనుకొనినా
మంచిదేగానీ, మీరు మాత్రము దేవుని తీర్పును శిక్షను జ్ఞాపకములో ఉంచుకోమని చెప్పుచున్నాను. దేవుడు మనిషికి
జ్ఞానమును తెలుపు నిమిత్తము హిందువుల (ఇందువుల) మైన మనకు భగవద్గీతా గ్రంథము నిచ్చాడు. ఇది నా
శాస్త్రము అని (బ్రహ్మ విద్యాశాస్త్రమని) చెప్పాడు. అయితే మనిషి దేవుడిచ్చిన గ్రంథమును (శాస్త్రమును) వదలి ఎవడో
గొట్టముగాడు చెప్పిన గుండు సాధననో లేక గుండుగాడు చెప్పిన గొట్టము సాధననో పట్టుకొని ఇదియే జ్ఞానము,
ఇదియే సాధన అంటే దేవునికి కోపము రాదా? అటువంటి వారిని గురించి భగవంతుడు తన గీతలో ఏమనుచున్నాడో,
దైవాసుర సంపద్విభాగయోగమునందు 23వ శ్లోకమును చూస్తాము.
37

Page 38
23వ శ్లో॥
యశ్శ్యాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః।
న స సిద్ధి మవాప్నోతి న సుఖం నపరాం గతిమ్ ||
భావము :- “బ్రహ్మవిద్యా శాస్త్ర విధానమును వదలి ఆశల చేత ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తించువాడు సుఖమును పొందలేడు,
దేనినీ సాధించలేడు, మోక్షమును పొందలేడు” అని చెప్పారు. బ్రహ్మవిద్యా శాస్త్రమునుకాదని, నాది ఫలానా సిద్ధాంతమనియో,
నాది ఫలానా పీఠమనియో, నాది ఫలానా సాధన అనియో, నాది ఫలానా ఆరాధన అనియో, నాది ఫలానా మత
మనియో, ఫలానా సాంప్రదాయమనియో, ఇట్లు ఎన్ని చెప్పుకొనినా, ప్రజల దృష్ఠిలో పెద్ద స్వామిగా పేరుగాంచియున్నా,
ఎటువంటివాడైనా దేవుని దృష్ఠిలో నేరస్థుడే అగును. అటువంటి వానికి గానీ, అధర్మములను ఆచరించు ఎటువంటివానికి
గానీ శిక్ష తప్పదు. శిక్ష ఎట్లుంటుందో ఉదాహరణకు గీతలో దైవాసుర సంపద్విభాగయోగమను అధ్యాయమున 19,
20 శ్లోకము లను ఒకమారు చూస్తాము.
19వ శ్లో॥
తా నహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపా మ్యజస్ర మశుభా నా సురీష్వేవ యోనిషు||
భావము :- క్రూరత్వముతో కూడుకొన్నవారిని, అసూయ నిండిన వారిని, మంచిని దూషించువారిని, నరులలో
అధములైనవారిని అసుర గర్భములలో పుట్టినట్లు చేసి, సంసార దుఃఖములను పొందునట్లు చేయుచుందును.
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని ।
20వ శ్లో॥
మా మప్రాప్యైవ కౌక్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్ ||
భావము :- “అసుర యోనులందు జన్మించువారు జన్మ జన్మకు అజ్ఞానులగుచూ, నన్ను తెలియు జ్ఞానము యొక్క గట్టు
ఏమాత్రము లభించక అంతకంతకు అధమగతికి పోవుచుందురు”.
ఇంతవరకు శిక్ష తప్పదు అని చెప్పుచూ వచ్చాముగానీ శిక్ష ఎట్లుంటుందో చెప్పుకోలేదు. అయితే ఇప్పుడు
దేవుడు చెప్పిన మాటలలోనే శిక్ష విషయము సూచాయగా తెలిసింది. రాక్షస గుణములుగలవారి గర్భములలో పుట్టి
దుఃఖములను పొందడమే కాకుండా కాలము గడుచు కొలది, జన్మలు మారుకొలది జన్మజన్మకు కొంత అధోగతికి
పోవుచుందురనీ, అటువంటి వారికి దేవున్ని తెలుసుకొను జ్ఞానము యొక్క గట్టు ఏమాత్రము దొరకదని చెప్పబడియున్నది
కదా! దీనిని విన్న తర్వాత ఇప్పుడొక ప్రశ్న రాగలదు. అదేమనగా! రాక్షస యోనులందు పుట్టువారు జన్మజన్మకు
జ్ఞానము యొక్క గట్టు దొరకక క్రింది స్థితికి దిగజారి పోవుచుందురని చెప్పారు కదా! అధర్మములనాచరించి శిక్షను
పొందినవాడు ఎన్ని జన్మలు అలా అసుర యోనులందు పుట్టవలసియున్నది? ఎన్ని జన్మలకు శిక్ష అయి పోవును? అని
అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఏ శిక్షకైనా కాలపరిమితి ఉండుట బయట కోర్టులో చూచాము. అలాగే
దేవుని కోర్టులో దేవుని తీర్పులో కూడా కొంత కాలపరిమితి ఉంటుందని అనుకొంటున్నాము. బయటి శిక్షలకు ఒకే
జన్మలో కొన్ని సంవత్సరముల కాలము శిక్ష అమలులో ఉండును. అదే లోపలి కోర్టులో దైవమార్గములో తప్పుచేసిన
వారికి విధించబడు శిక్ష కొన్ని జన్మలని శ్లోకము యొక్క భావములోనే తెలిసిపోయినది. ఎన్ని జన్మల శిక్ష లేక ఎంతకాలము
శిక్ష అని చూస్తే దానికి ఒక ఆధారము దొరికినది. ఒక మూల గ్రంథములో ఈ విధముగా చెప్పబడినది. “మనుష్యులు
చేయు ప్రతి పాపమును, దూషణయు క్షమించబడునుగానీ, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యులకు
38

Page 39
విరుద్ధముగా మాట్లాడువారికి పాప క్షమాపణ కలదుగానీ, పరమాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందై
ననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.”
ప్రపంచ విషయములలోగానీ, ప్రపంచ మనుషుల విషయములో గానీ పాపమును చేసియుంటే, అటువంటి
పాపమును జ్ఞానము చేత కాల్చి వేసుకోవచ్చును. ప్రపంచ సంబంధమైన పాపములను చేసుకొన్నవాడు జ్ఞానిగా మారుటకు
అవకాశమున్నది. దైవజ్ఞానమును తెలుసుకొని జ్ఞానిగా మారినవాడు ఎంత దుర్మార్గుడైనాగానీ, ఎంత పాపాత్ముడైనాగానీ,
వాని పాపము జ్ఞానాగ్ని చేత దహించివేయబడును. అట్టివాడు కొద్ది కాలములోనే పాపములనుండి బయటపడిపోవును.
అటువంటివాడు దుర్మార్గునిగా పేరు తెచ్చుకొన్నవాడైనా, నా లెక్కలో వాడు సత్పురుషడనియే చెప్పవచ్చును. ఇదే
విషయమును గీతయందు రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయమున 30వ శ్లోకములో చెప్పడమైనది.
30వ శ్లో॥ అపిచేత్సు దురాచారో భజతే మా మనన్య భాక్
సాధురేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితోహిసః ॥
భావము :- " ఈ ప్రపంచములో దురాచారములతో కూడుకొన్న ఎంతటి దుర్మార్గుడైనాగానీ, అన్యచింతలేకుండా నన్నే
ఆరాధించు వానిని సాధువని చెప్పవచ్చును. ఎందుకనగా వాడు నిశ్చయ జ్ఞానము తెలిసినవాడు”.
ప్రపంచ సంబంధ పాపములను చేసుకొన్నవాడు తన పాపములను దైవజ్ఞానముచేత లేకుండా చేసుకోవచ్చునూ,
మంచివానిగా చెప్పబడవచ్చును. అయితే దైవ సంబంధముగ తప్పు చేసినవానికి జ్ఞానము తెలుసుకొను అవకాశమే
ఉండదనీ, జ్ఞానము యొక్క గట్టు ఏమాత్రము దొరకకుండా చేస్తానని దేవుడే చెప్పాడు. ప్రకృతి సంబంధ విషయములో
పాపమును పొందినవాడు పాపక్షమాపణ పొందవచ్చును. దైవసంబంధ విషయములలో అధర్మముగా ప్రవర్తించిన
వానికి అటువంటి అవకాశమే ఉండదు. దేవుని చేత తీర్పు తీర్చబడిన వానికి జ్ఞానము యొక్క గట్టు దొరకదని
చెప్పాడు. ఈ విధానము ఒక హిందువులకేకాక మిగతా అన్ని సమాజముల వారికి ఒకే విధముగా వర్తించును.
హిందూ సమాజములో ఉంటూ మేము హిందువులము అని చెప్పు చాలామందికి వారి గ్రంథమేదో కూడా తెలియదు.
అయితే మిగతా సమాజములైన ముస్లీమ్లకు, క్రైస్తవులకు వారి గ్రంథము ఫలానాయని బాగా తెలుసు. ముస్లీములు
దైవ జ్ఞానము కొరకు ఖుర్ఆన్ గ్రంథమునూ, క్రైస్తవులు బైబిల్ గ్రంథమునూ చూడడమే కాకుండా బైబిల్కు ముందు
'పరిశుద్ధ' అను పదము నుంచి పరిశుద్ధ బైబిలు అనియూ, ఖుర్ఆన్కు ముందు 'పవిత్ర' అను పదమునుంచి పవిత్ర
ఖుర్ఆన్ అనియు గౌరవ పూర్వకముగా చెప్పుచుందురు. హిందువులు భగవద్గీతకు ముందు అటువంటి గౌరవ పదములను
ఉంచలేదు. అయితే ఇప్పుడు మేము, మా అనుచరులు భగవద్గీతకు ముందు “పరమ పవిత్ర పరిశుద్ధ” అను పదములను
చేర్చి, 'పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత' అని చెప్పుచున్నాము. ముందర గౌరవ పదములను చూచినవారికి
గ్రంథము ఎటువంటిదో చదవకనే తెలియగలదు. గ్రంథము ముందర గౌరవ ప్రదమైన పేర్లు ఉండినా, గ్రంథములలో
దైవజ్ఞానము నింపబడియున్నా ఇటు క్రైస్తవులు అటు ముస్లీమ్లు వారివారి గ్రంథములనుండి ఎంత తెలియాలో అంత
తెలియలేక పోయారని చెప్పవచ్చును.
ఇందువుల (హిందువుల) గ్రంథమైన భగవద్గీత హిందువుల వద్దయున్నా, కొందరు దానిని శ్రద్ధగా చదివినా,
అందులోని జ్ఞానమును తెలుసుకోలేక పోవుచున్నారు. జ్ఞానము తెలియకపోవడమే కాకుండా పైగా కొన్ని సంశయములు
ఏర్పడుచున్నవి. విశ్వరూప సందర్శన యోగములో యజ్ఞములను చేయుట అధర్మమనీ, వాటి వలన దేవుడు తెలియబడడనీ
39

Page 40
చెప్పబడియున్నది. ఇదే యజ్ఞములను గురించి కర్మయోగమను అధ్యాయములో 10 నుండి 16 శ్లోకముల వరకు
యజ్ఞములు చేయాలి అనియూ, యజ్ఞముల చేతనే దేవతారాధన చేయాలని చెప్పడమైనది. యజ్ఞము చేయడము మనిషియొక్క
కర్తవ్యమనీ, యజ్ఞములు చేయక పోవడము దొంగతనముతో సమానమని 12వ శ్లోకమునగలదు. దేవుడు వేదములనూ,
యజ్ఞములనూ, తపస్సులనూ అధర్మములుగా విశ్వరూప సందర్శనయోగములో చెప్పినవాడు, కర్మయోగములో యజ్ఞములను
తప్పక చేయాలి అని ఎందుకు చెప్పాడు. పరస్పర విరుద్ధమైన మాటలలో ఏది నమ్మాలి అను సంశయము రాగలదు.
ఈ విధమైన అనుమానములు వచ్చి చాలామంది గీతనుండి ఏమీ తెలియలేక పోయారు. భగవద్గీతను చదివిన తర్వాత
జ్ఞానము తెలియకపోవడమేకాక, అంతుకుముందు లేని సంశయములు కూడా పుట్టుకు రావడము జరిగినది. ఐదువేల
సంవత్సరముల క్రిందట పుట్టిన భగవద్గీతలోనే ఇటువంటి లోపములున్నాయని ఒక ఇందువుగా (హిందువుగా) నేను
ఒప్పుకొంటున్నాను. అటువంటి లోపములు గీతలో కనిపించకుండా చేయుటకు మావంతు కృషి చేశాము. లోపరహిత
భగవద్గీతగా "త్రైత సిద్ధాంత భగవద్గీత"ను లోకమునకు చూపాము. దేవుని సేవలో ఒక భాగముగా ఆ కార్యమును
చేశాము.
భగవద్గీతలో కూడా మనుషులను ప్రక్కదారి పట్టించుటకు, దేవుని వైపు పోకుండా చేయుటకు, అక్కడక్కడ
అనుమానములు కల్గునట్లు మాయ తన జ్ఞానమును కూడా గీతలో ఉంచినది. దేవునికి తెలియకుండా ఏమీ జరుగదని
జ్ఞాపకముంచుకోవలెను. భగవద్గీతలో ఒక రకముగా తన ప్రభావమును చూపిన మాయ (సాతాన్) బైబిలు గ్రంథములో
మరొక రకముగా తన ప్రభావము చూపినది. బైబిలు గ్రంథములో సాతాన్ ప్రభావమేమిటో ఎవరికీ తెలియదు. గీతలో
మాయ ప్రభావమేమిటో ఇంతవరకు హిందువులకు కూడా తెలియదు. మొట్టమొదట మేము ఇది మాయ జ్ఞానమని
చెప్పాము. అదే విధముగా బైబిలులో కూడా మనిషిని దేవుని మార్గమునుండి ఎలా ప్రక్క దారిలోనికి పంపించాలో, ఆ
విధమైన ఏర్పాటు మరొక విధముగా చేసిపెట్టింది. ఆ సాతాన్ ప్రయత్నము మేము బయటికి చెప్పలేకపోయినా, ఒక
విషయమును మాత్రము మొదటినుండి చెప్పు చున్నాము. బైబిలు 66 భాగములుగా ఉన్నది. అందులో ఏసుప్రభువు
ప్రత్యక్షముగా జీవించినప్పుడు చెప్పిన మాటలున్న మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అను నాలుగు భాగములు గలవు.
ఈ నాలుగు సువార్తలను మాత్రము చదవండి మిగతా 62 భాగములు మీకు అవసరములేదు అని చెప్పుచున్నాము.
అర్థము చేసుకొను శక్తియున్నవానికి ఒక్క యోహాన్ సువార్త చాలునని కూడా చెప్పాము. అయినా చెవిటివాని ముందు
శంకు ఊదినట్లు మా మాటను ఎవరూ పట్టించుకోలేదు. పైగా మా క్రైస్తవుల గ్రంథమును గురించి హిందువుగానున్న
ఆయనకేమి తెలుసు అని అన్నారు. బైబిలులో దేవుని జ్ఞానమే కాకుండా, సాతాన్ ప్రభావము కూడా ఎవరికీ కనిపించకుండా
ఉండగా, ఖుర్ఆన్ గ్రంథము మరొక విధముగా ఉన్నది.
ఏది జరిగినా దేవుని అనుమతితోనే జరుగును. దేవునికి తెలియకుండా ఏదీ జరుగదని జ్ఞాపకముంచుకోవలెను.
ముస్లీమ్లను కూడా సైతాన్ (సాతాన్ లేక మాయ) అనునది ప్రక్కదారి పట్టించుటకు ప్రయత్నము చేసినది. ఇస్లామ్లోనేకాక
అన్ని మతములలోనూ దాని ప్రభావమున్నది. ముస్లీమ్లను సైతాన్ (మాయ) ఎలా మోసగించుచున్నదో, దేవుని
మార్గములో ఉన్నావని చెప్పుచూ ఎలా ప్రక్క దారి పట్టిస్తున్నదో, నాకు తెలిసినా దానిని బయటికి చెప్పుటకు నేను
సిద్ధముగా లేను. ఎందుకనగా నాకు తెలిసినది సత్యమో కాదో. అందువలన అది నా వరకే ఉంటుంది.
ముస్లీమ్ సమాజములోనున్నవారికి నేను చెప్పునదేమనగా! ఖుర్ఆన్ నిజముగా దైవగ్రంథము. అందులోని 112వ
సురాలోని నాలుగు ఆయత్లను బాగా అర్థము చేసుకోండి. ఆ ఒక్క సురాతోనే దేవుడంటే ఏమిటో, ఎంత శక్తిగలవాడో
అయినా
40

Page 41
మీకు తెలియగలదు.
ఇంకా ముఖ్యముగా చెప్పునదేమనగా ఇస్లామ్లో ఖుర్ఆన్ గ్రంథమునుమించినది లేదు.
అటువంటపుడు మీకు హదీసులెందుకు? ఖుర్ఆన్ గ్రంథము ప్రక్కలో దానికి సమానముగా ఏ గ్రంథమును చేర్చవద్దండి.
సైతాన్కు తమను దైవమార్గము నుండి తప్పించు అవకాశము ఇవ్వద్దండి.
మాయను దేవుడే సృష్ట్యాదిలోనే తయారు చేశాడు. దేవుని ఆజ్ఞతోనే మాయ పని చేయుచున్నది. దేవుని శక్తితో
పనిచేయు మాయ చాలా బలాఢ్యమైనది. దేవుని మీద శ్రద్ధలేని వానిని దేవునివైపు రానివ్వదు. దేవుని మీద ఇష్టములేని
వారిని దేవునివైపు పోకుండా చేయుటకు మాయ కాపలాగావుంటూ, అన్ని మతములలోనూ శ్రద్ధలేని వారిని దూరముగా
పంపుటకు కావలసిన ఏర్పాట్లన్నియు చేసిపెట్టుకొన్నది. ఆ ప్రయత్నములలోని భాగమే భగవద్గీతలో అధర్మ శ్లోకములు
గలవు. మిగత అన్ని మతములలో మాయ ప్రయత్నము కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు మనము ఒక్క హిందువుల
గ్రంథమైన భగవద్గీతలోనే కాకుండా బయట వేదములలో, పురాణములలో మాయ ఎక్కువగా నిండుకొని ఉన్నది. అన్ని
మతముల వారు తాము సక్రమముగా ఉన్నామని అనుకొంటున్నారు గానీ, తమను మాయ ఏమైనా మభ్యపెట్టిందేమోనని
ఎవరూ చూచుకోవడములేదు. జాగ్రత్తగాయున్నవారినే వదలిపెట్టని మాయ, జాగ్రత్తగా లేని వారిని వదలి పెట్టుతుందను
కోవడము పొరపాటు.
ఇంతవరకు హిందువులను గురించి వారు చేయుచున్న అధర్మములను గురించి చెప్పుకొన్నాము. అయితే
దేవుడు చెప్పునది ఒక హిందువులకే కాదు. ఆయన సర్వమానవులకు అధిపతి అయినందున, ఆయన బోధలు సర్వ
జీవరాసులకు సంబంధించినవైనందున, ఆయన తీర్పు అందరికీ ఒకే విధముగా ఉండును. ఇదంతయు సత్య ప్రకటన
కొరకు చెప్పునదేగానీ, ఎవరినీ కించపరచుటకుకాదని ముందే తెల్పుచున్నాము. హిందువులను వదలి క్రైస్తవులను
ముస్లీమ్లను చూస్తే, ఇద్దరికీ దేవుడు ఒకే జ్ఞానమును చెప్పియున్నా వీరిద్దరిలో మరణము గురించి, పుట్టుకను గురించి
చాలా అభిప్రాయభేదములున్నవి. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టడడముగానీ, బ్రతకడముగానీ జరుగదని
ముస్లీమ్లు అనుచుండగా, ఏసుప్రభువు చనిపోయి తిరిగి బ్రతికాడని క్రైస్తవులు అనుచున్నారు. ఎటు తిరిగి మా
ఖుర్ఆన్ జ్ఞానమే గొప్ప అని ముస్లీమ్లు, కాదు మా బైబిలు జ్ఞానమే గొప్పయని క్రైస్తవులు అనడము జరుగుచున్నది.
రెండు జ్ఞానములు ఒక్కటే అయినా వాటిని వేరువేరుగా అర్థమగునట్లు చేసి అభిప్రాయ భేదములను మాయ ఏర్పరచినదని
ఇరువురూ గ్రహించ లేకపోయారు. ఇరువురూ ఒకరి జ్ఞానమును మరొకరు ప్రత్యక్షముగా నిందించుకోవడము వలన
పరోక్షముగా దేవున్ని, దేవుని జ్ఞానమును నిందించినట్లగుచున్నది. దానివలన దేవుని న్యాయస్థానములో (కోర్టులో)
ఇరువురూ దోషులుగా నిలబడవలసి వస్తుందని, శిక్ష పడుతుందని వారికి అర్థము కాలేదు. ఎక్కడ ఏమీ మాట్లాడినా
ఫరావాలేదుగానీ, దేవుని విషయములో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుందని మరువకూడదు.
మనుషులు మతముగా విభజింపబడియున్నా దేవుని దృష్ఠిలో అందరూ సమానమే. ఎవరు తప్పుచేసినా
హిందువులకు ఒక రకము శిక్ష, ముస్లీమ్లకు ఒక రకము శిక్ష ఉండదు. అందరికీ సమానమైన తీర్పు, సమానమైన శిక్ష
ఉంటుంది. దేవుని విషయములో ఎవరైనా తప్పు చేయుచున్నప్పుడు, అది తప్పు అని మనకు తెలిస్తే, అది దేవుని
విషయమైనందువలన, తప్పు చేయువారిని జాగ్రత్త పరచడము అందరి బాధ్యత. అందువలన నాకు తెలిసినంత వరకు
దేవుని మార్గములో మనిషి చేయు తప్పులను గురించి చెప్పుచున్నాను. ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను
మూడవ సురాలో ఏడవ ఆయత్నందు ముతషాభిహత్ అను వాక్యములు ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నాయనీ, ఆ వాక్యములకు
అర్థము దేవుడు తప్ప మరి ఎవ్వరు ఎరుగరు అని చెప్పబడియున్నది. దీనినిబట్టి ఏ మనిషికీ ఆ వాక్యముల జ్ఞానము
41

Page 42
తెలియదనియేగా అర్థము. దేవుని విషయము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియనప్పుడు, మనుషులకు దేవుడు
తప్ప ఇతరులెవరూ బోధించలేరనియేగా అర్థము. ఎక్కడైనా దేవుని ధర్మములను సక్రమముగా ఎవడైనా బోధిస్తూ వుంటే
వానిని మనిషి అనుటకు వీలులేదు. ఎందుకనగా ఏ మనిషికీ దేవుని సూక్ష్మజ్ఞానము తెలియదని తన గ్రంథములో
దేవుడే చెప్పాడు. భూమిమీద మనుషులకు జ్ఞానము తెలియజేయుటకు ఏ మనిషీ యోగ్యుడుకానప్పుడు, ఏ మనుష్యునికీ
దేవుని జ్ఞానము తెలియనప్పుడు, దేవుడే చెప్పవలసి వస్తున్నది. దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు అని అదే
ఖుర్ఆన్ గ్రంథములో 42వ సురా 51వ ఆయత్నందు కలదు. అలాంటపుడు దేవుడు ప్రత్యక్షముగా కాకుండా
పరోక్షముగా మారువేషములో వచ్చి మాట్లాడాలి. ఆయన వచ్చి చెప్పినప్పుడు అసలైన జ్ఞానము ప్రజలకు తెలుస్తుంది.
అంతవరకు తెలియుటకు అవకాశమేలేదు. దేవుడు ఏదో ఒక విధముగా భూమిమీద అవతరిస్తాడు అనుటకు ఖుర్ఆన్
గ్రంథమందే సాక్ష్యము గలదు. సురా 89, ఆయత్ 22లో "దైవదూతలు బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు.
(23) ఆ రోజు నరకము ముందుకు తీసుకరాబడుతుంది. ఆనాడు మనిషికి జ్ఞానోదయమౌతుంది. కానీ ఆ రోజు
జ్ఞానము కలిగి ఏమి లాభము (24) అయ్యో నా జీవితము కొరకు ముందే జాగ్రత్తపడి జ్ఞానము తెలిసియుంటే ఎంత
బాగుండేది అని అనుకుంటాడు.
ఈ మూడు వాక్యములను చూస్తే దేవుడు అవతరించి తెలియజేసినప్పుడే మనిషికి జ్ఞానము తెలుస్తుందనీ, అలా
తెలిసినప్పుడు ఇంత కాలము జ్ఞానము మీద శ్రద్ధ లేక కాలమును ఎంత వృథా చేసుకొన్నానని అనుకొంటాడని
అర్థమగుచున్నది. నా జ్ఞానము నాకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఏతెంచి (అవతరించి) మనుషులకు చెప్పునప్పుడు
మనిషి జ్ఞానమును తెలిసి పశ్చాత్తాపపడుతాడని ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు సూచనగా చెప్పియున్నా, దేవుడు
ఎప్పటికీ అవతరించడు అనుట దేవుని మాటకు విరుద్ధము కాదా? అట్లు మాట్లాడినవారు అంతరంగ న్యాయ స్థానములో
శిక్షార్హులు కాదా? 42వ సురా 51వ ఆయత్లో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడడు అని చెప్పి తన జ్ఞానమును మూడు
విధములుగా మనుషులకు తెలియజేస్తాడు అని ఉన్నది. అందులో మూడవది తన దూత ద్వారా తెలియజేస్తాను
అన్నాడు. ఆ దూత ఎవరో? ఏ ముస్లీమ్ అయినా చెప్పగలడా? పురుషోత్తమ మహారాజు వద్దకు అలెగ్జాండరు చక్రవర్తి
దగ్గరనుండి దూత వచ్చాడు. పురుషోత్తముడు మహా ధైర్యశాలి. ఆయన ఎవరికీ లొంగలేదు. అటువంటి వానితో
సమయస్ఫూర్తితో తెలివిగా మాట్లాడ వలసియుంటుంది. పురుషోత్తముడు అడుగు ప్రశ్నకు అప్పటికప్పుడు జవాబు
చెప్పవలసియుంటుంది. అటువంటపుడు సాధారణ దూత ఎటువంటి నిర్ణయమునూ తీసుకోలేడు. అవసరాన్నిబట్టి
మాట్లాడవలసియుంటుంది. కావున దూత వేషములో అలెగ్జాండరే పురుషోత్తముని వద్దకు వచ్చాడు. వచ్చిన వానిని
దూతయని అందరూ అనుకొనినా వాస్తవానికి వచ్చినవాడు చక్రవర్తియే కదా! అలాగే దేవుడు మారువేషములో మనిషివలె
వచ్చి తన జ్ఞానమును బోధించిపోవును.
చూడండి.
భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 11వ శ్లోకములో పై మాటకు సాక్ష్యముగా ఇలా ఉన్నది
11వ శ్లో॥
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్||
భావము :- “సర్వ జీవరాసులకు సృష్టికర్తనైన, దేవుడనైన నేను మానవ శరీరమును ధరించి వచ్చినప్పుడు నన్ను జూచి,
42

Page 43
నా యొక్క దైవ భావమును తెలియలేక నరులు మూఢులగుచు నన్ను అవమానింతురు.” ఈ భావము లోని విషయమును
చూస్తే దేవుడు మనిషి శరీరము ధరించిరాడని ఎవరూ చెప్పుటకు వీలులేదు. భగవద్గీతలో కూడా ధర్మములు భూమిమీద
తెలియకుండాపోయినప్పుడు వాటిని తెలియజేయుటకు వస్తానని చెప్పాడు. అలా వచ్చినవాడు ఎవరిచేతనూ గుర్తింపబడక
మనిషివలె నటించి, మనిషివలె జీవించి చివరకు తన జ్ఞానమును తెలిపిపోవును. అట్లు వచ్చిన వానిని ఈయన ఫలానా
అని ఎవరూ గుర్తించలేరు. తాను ఫలానా అని చెప్పినా దేవున్ని గుర్తించలేని పరిస్థితిలో మనిషి ఉన్నాడు. అందువలన
దేవుడు భగవంతుని వేషములో మనిషిగా వచ్చిపోతాడని ఎవరికీ తెలియదు. భగవద్గీతలో నా జ్ఞానమును తెలియజెప్పుటకు
వస్తానని, అట్లు వచ్చిన నన్ను ఎవరూ గుర్తించక సాధారణ మనిషివలె భావించి అజ్ఞానులైన వారు అవమానింతురని
కూడ చెప్పాడు.
బైబిలు గ్రంథమును చూస్తే యోహాను 8వ అధ్యాయములో 23వ వాక్యము “మీరు ఈ లోక సంబంధులు, నేను
ఈ లోక సంబంధుడను కాను.” అని ఉన్నది. ఆ ఒక్క మాటనుబట్టి ప్రభువుగా వచ్చినవాడెవడో తెలియవచ్చును.
అయితే మాయ మభ్యపరచి ఆయనను సాధారణ మనిషిగానే అర్థమగునట్లు చేయును. ఒక సందర్భములో (యోహాను
8-19 వ వాక్యమునందు) వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగగా! యేసు మీరు నన్నైననూ, నా తండ్రినైననూ
ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. ఈ 19వ వాక్యములో నేను,
నాతండ్రియని విభజించి చెప్పిన ఏసు ప్రక్కమాటలోనే నన్ను తెలిసినవారు నా తండ్రిని కూడా తెలిసినవారగుదురని
చెప్పడములో కూడా వచ్చినవాడు ఎవడో అర్థము కాగలదు. అయినా ఎవరూ ఆయనను గుర్తించలేరు. ఇంకొకచోట
(యోహాను 8,24 వాక్యము) నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని
వారితో చెప్పెను. ఈ వాక్యము పూర్తి విప్పి చెప్పినట్లున్నది. దేవున్నిగానీ, దేవుని జ్ఞానమునుగానీ తెలిసిన వానికి
పాపములన్నీ నశించి కర్మ విముక్తుడగునని భగవద్గీతలోయున్నట్లు నేను దేవున్నని నమ్మకపోతే మీ పాపము నశించదని
చెప్పినమాట భగవద్గీతలో చెప్పినమాటకు సమానమగుచున్నది. దేవుడు దేవునిగా వస్తానని ఎక్కడా చెప్పలేదు. దేవుడు
భగవంతునిగా వస్తానని చెప్పాడు. తన ధర్మములను బోధించుటకే అలా వస్తానని చెప్పాడు. అందరికీ దేవుడనైన నేను
మానవ శరీరము ధరించి వస్తే అజ్ఞానులు నా గొప్పతనమును తెలుసుకోలేక అవమానింతురని కూడా చెప్పాడు.
కొంత జ్ఞానమున్నవాడు దేవుని రాకను గుర్తించుటకు అవకాశమున్నా దేవుడు అవతరించడు, అవతరించినవాడు
దేవుడు కాదు అంటే అది దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడినట్లు కాదా! దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడుట వలన
మనిషి శిక్షార్హుడగుచున్నాడు.
దేవునికి మతమూ, మతస్థుడు అను తారతమ్యము ఉండదు. ఎవరైనా ఆయన లెక్కలో తప్పుచేసినవారగుదురు.
దేవుడు భూమిమీదికి మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు ఎవరూ ఆయనను గుర్తించలేరు. తనతో సమానముగానున్న
మనిషిని దేవునిగా ఒప్పుకొనుటకు అన్నీ అడ్డము వస్తాయి. అప్పుడంటే కాదు. అయితే ఆయన వచ్చిపోయిన
తర్వాతనైనా వచ్చి జ్ఞానము చెప్పినవాడు ఫలానావాడు అని గుర్తించకపోవడము అజ్ఞానము కాదా! గుర్తించకపోవడమే
కాకుండా దేవుడు మనిషిగా రాడు అని చెప్పుచూ నేను వస్తానని చెప్పిన దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పుట దేవుని
మాటను కించపరిచినట్లు కాదా! ఇటువంటివారికి తీర్పు ఉండదంటారా! శిక్షపడదంటారా! మేము ఇంతవరకు
సక్రమమైన జ్ఞానమునే మాట్లాడినామనుకొనువారంతా ఒకమారు వెనుతిరిగి చూచుకోండి. మీరు చేసినది తప్పో
ఒప్పో తెలియగలదు. మీకు తెలిసినా తెలియకున్నా మీరు పప్పులో కాలు వేశారు. మీరు చేసినది ముమ్మాటికి తప్పే.
43

Page 44
ఇప్పటినుంచయిన మతము అను మత్తులోనుండి బయటపడి నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలియుటకు ప్రయత్నించు.
ఇంత చెప్పినా దేవుడు ఎక్కడో పైన ఉంటాడు, ఆయన మనిషిగా రాడు అని అనువారిని ఎవరూ రక్షించలేరు.
క్రైస్తవ మతములోని క్రైస్తవులలో ఏసుప్రభువును గురించి భిన్నాభి ప్రాయములు కలవు. ఏసు మీదనే సరియైన
అభిప్రాయము లేనివారు ఆయన చెప్పిన బోధల మీద ఏకాభిప్రాయముతో ఉంటారను నమ్మకములేదు. ఏసును
కుమారుడు అనియు దేవున్ని తండ్రి అనియు కొందరనుచున్నారు. దేవుని కుమారుడు ఏసు అని కొందరనుచుండినా,
ఏసును తండ్రి అని అనుచున్నారు. స్వయముగా ఏసే తనను పంపినవాడు దేవుడైన తండ్రి అని చెప్పుట బైబిల్లో
గలదు. దానినిబట్టి కొందరు దేవున్ని తండ్రియని ఏసును కుమారుడని అనడము జరుగుచున్నది. దేవుడు అందరికీ
తండ్రి అయినందున ప్రజలకు కూడా దేవుడు తండ్రియనీ, ఆ లెక్కప్రకారము దేవునికి కుమారుడుగా చెప్పబడిన ఏసు
మనుషులకు సోదరుడని లెక్కించి, క్రైస్తవులలో జ్ఞానులుగా చెప్పుకొను కొందరు ప్రభువును మా సోదరుడు అంటున్నారు.
మాకంటే ముందు పుట్టినవాడు కనుక మాకు అన్న అవుతాడని చెప్పుచున్నారు. అదే నేపథ్యములో మా అన్న అయిన
ఏసు ఈ విధముగా చెప్పాడని ఆయన చెప్పిన మాటలను చెప్పుచున్నారు. దేవుడు అవసరమొచ్చినప్పుడు మనిషిగా
వచ్చి తన జ్ఞానమును చెప్పి పోతానని అనేకమార్లు చెప్పి, అలాగే ఆయనకు అవసరమొచ్చినప్పుడు ఒక్కొక్కమారు
ఒక్కొక్క రూపముతో, ఒక్కొక్కమారు ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క మారు ఒక్కొక్క విధానముతో వచ్చి లోకములో మనిషి
కాకున్నా మనిషివలె నటించి చివరకు తన జ్ఞానమును చెప్పిపోయాడు. ఎన్నిమార్లు వచ్చినా, ఎన్ని పేర్లు చెప్పినా
వచ్చినవాడొకడే అను విషయమును ఎవరూ గ్రహించలేక పోయారు. ఆయన వచ్చినప్పుడు చెప్పిన జ్ఞానము తప్ప
ఆయన ఆకారములు గానీ, వచ్చినప్పుడు చెప్పిన పేర్లుగానీ, ఆయన చెప్పిన మిగతా మాటలుగానీ అన్నీ కల్పితములే.
దేవుడు తండ్రి తాను కుమారుడనని చెప్పినది నిన్ను మాయలో వేయుటకే గానీ వేరుగాదు. వాస్తవానికి తండ్రి ఆయనే,
కుమారుడు ఆయనే. నేను ఫలానా అని ఆయన కొన్నిచోట్ల సత్యము చెప్పినా, మనిషికి ఆయనను గుర్తించు
జ్ఞానములేనందున కొన్నిచోట్ల నేను వేరు దేవుడువేరన్నట్లు చెప్పాడు. అదే కోవలోనే నేను కుమారుడు, నా తండ్రి
దేవుడన్నాడు. ఆ మాటతో చాలామంది దేవుడు వేరనీ, ఏసు వేరని అనుకొన్నారు. ఏసుప్రభువు చెప్పిన మాటలు
ఒకమారు తానే దేవుడనని చెప్పి అంతలోనే దేవుడు వేరన్నట్లుండును. వాస్తవానికి ఆయన కొన్నిచోట్ల తనంతటతానే
నేను దేవుడనని సూచన కల్గించినా గ్రుడ్డి ప్రజలు ఆయనను గుర్తించలేక పోయారు.
గుర్తించకపోయినా ఫరవాలేదుగానీ, తాము జ్ఞానులమని చెప్పుకొను ఒక తెగవారు ఏసును మా అన్న, మా
సోదరుడు అని చెప్పడము విచిత్రముగాయున్నది. నేను ఎల్లప్పుడూ ఉన్నవాడినని దేవుడు తప్ప ఎవడైనా ధైర్యముగా
చెప్పునా? మనిషి అయినవాడు ఎవడూ చెప్పలేని మాటను ఏసు చెప్పినట్లు యోహాను సువార్త 8వ అధ్యాయములో
57,58 వాక్యములలో కలదు. (57) నీ కింకనూ యాభైసంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని
ఆయనతో చెప్పగా! (58) అబ్రహాము పుట్టకమునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. చూచారా!
సాధారణ మనిషి ఎవడైనా ఇలా చెప్పగలడా? ద్వాపరయుగములో కృష్ణుడు అర్జునునితో కూడా ఇట్లే అన్నాడు. “నీవు
ఇప్పుడు పుట్టియున్నావు కదా! సూర్యుడు సృష్ట్యాదిలో పుట్టాడు కదా! అప్పుడు ఆయనకు నీవు ఎట్లు జ్ఞానము
చెప్పితివి?” అని అర్జునుడు ప్రశ్నించగా! అప్పుడు కృష్ణుడు “నేను అప్పుడూ ఉన్నాను ఇప్పుడూ ఉన్నాను, నాకు
అన్నియు జ్ఞాపకమున్నాయి” అన్నాడట. ఈ మాటలన్నిటినీ క్రోడికరించి కొంత జ్ఞానదృష్టితో చూస్తే, దేవుని జ్ఞానము
దేవునికే తెలుసు మరి ఎవ్వరికీ తెలియదు. కావున దేవుని జ్ఞానము భూమిమీద లేకుండా పోయినప్పుడు, దేవుడు
44

Page 45
మనిషి వేషముతో వచ్చి తానే జ్ఞానమును చెప్పిపోవునని తెలియుచున్నది. దేవుడు కూడా నేను మీ మధ్యలోనికి
ధర్మములకు ముప్పు కల్గినప్పుడు వచ్చి ధర్మసంస్థాపన చేసి పోతానని గీతలో చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. దేవుడు ఆ
విధముగా చెప్పియుండగా! దేవుడు అవతరించడు అని దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పు వారినీ, దేవుడు మనిషిగా
వచ్చినా ఆయనను గుర్తించక ఆయననే అవమానించిన వారినీ, దేవుని కోర్టులో ప్రకృతి ముద్దాయిగా నిలబెట్టగలదు.
దేవుడు మనిషివలె (భగవంతుడుగా) ఎదురుగా ఉండి మాట్లాడినా లెక్క చేయక హేళన చేసిన వారినీ, తన గ్రంథములలో
ఎంతగా చెప్పినా తన మాటలను పెడచెవిన పెట్టి దేవుడు మనిషివలె రాడు అను వారినీ, దేవుడు ఒకే శిక్షకు గురి
అగునట్లుగా దేవుని తీర్పు జరుగును.
దేనినుండైనా తప్పించుకోవచ్చును గానీ, దేవుని తీర్పునుండి తప్పించుకొనుటకు ఎవరికీ తరముగాదు. అప్పుడు
తెలియక మాట్లాడినాను అని చెప్పినా, మా గురువు లేక బోధకుడు చెప్పిన మాటలు విని ఆ విధముగా మాట్లాడినాను,
అందులో నా తప్పేమి లేదనినా, మత్తుపానీయము త్రాగి ఎరుకలేని స్థితిలో అలా మాట్లాడినాననినా, ఏ విధముగా
చెప్పినా నీమాటవినువారు ఎవరూ ఉండరు. తీర్పు జరుగుతుంది, శిక్ష అమలవుతుంది. అప్పుడు నీవు జ్ఞానమును
తెలుసుకోవాలనినా అది ఏమాత్రము దొరకదు. ఎంత ప్రయత్నించినా జ్ఞానము గట్టు దొరకకుండా పోతుంది. అందువలన
ఇప్పటినుండి దేవునికీ, దేవుని జ్ఞానమునకు విధేయుడవై ఉండుము.
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
45


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024