pss book: ప్రబోధ నాటికలు completed. 13th july 2024

 రావణ బ్రహ్మ.


ఆకాశవాణి :- బ్రహ్మా! రావణబ్రహ్మా!! మూడు కాలములను తెలిసిన త్రికాలజ్ఞానివి, మూడుయోగములను తెలిసిన బ్రహ్మజ్ఞానివి, మూడు ఆత్మల వివరమును తెలిసిన ఆత్మజ్ఞానివయిన ఓ రావణబ్రహ్మ! త్రేతాయుగము నాటి నిన్ను గురించి కలియుగములోని మనుషులు చెడు ఉద్దేశము కలిగియున్నారు. వారి ఉద్దేశములో నీవు రాక్షషుడవట, నీచుడవట, కామాంధుడవట, యజ్ఞములను నాశనము చేయించిన దుర్మార్గుడవట, సీత స్వయంవరమునకు పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినవాడివట, పరకాంత వ్యామోహముచే సీతాదేవిని అపహరించి ప్రాణముమీదికి తెచ్చుకొన్న అజ్ఞానివట. పదితలలు ఉన్నప్పటికి తెలివిలేనివాడివై, ఒక్కతల కల్గిన రాముని చేతిలో చచ్చిన ఛవటవట, స్త్రీలను గౌరవించని వాడివట, దైవభక్తిలేని మూఢునివట, ఈ విధముగా ఎన్నో రకముల నిన్ను దూషించుచున్నారు. నిన్ను చంపిన రాముణ్ణి దేవునివలె తలచి పూజిస్తున్నారు. కలియుగములోని ప్రజలు ఎందుకు ఆ విధముగ నీమీద దురుద్దేశము కల్గియున్నారు. వీటికి సమాధానము నీవే చెప్పాలి!


రావణుడు :- ఆత్మ స్వరూపమై ఎవరికి కనిపించని ఓ దివ్యవాణీ! నీకు నా నమస్కృతులు. స్వయాన నీవే నన్ను త్రికాలజ్ఞానియని, ఆత్మజ్ఞానియని, బ్రహ్మయని సంభోదించినపుడు, కలియుగములో మంచిచెడు విచక్షణా జ్ఞానములేని మానవులు ఏమంటే నాకేమి? భూమిమీద ద్వాదశ గుణములలో చిక్కి, వాటి వివరము తెలియని మానవులు, అజ్ఞానముతప్ప జ్ఞానమేమిటో తెలియని మానవులు, దేవతలు తప్ప దేవుని గురించి రవ్వంత కూడ తెలియని మానవులు, జనన మరణ అంతరార్థము ఏమాత్రము తెలియని మానవులు, భగవంతునికి, దేవునికి తేడా తెలియని మానవులు, శరీరమును నడిపించుశక్తిని గురించి తెలియని మానవులు, చివరకు తనెవరో తనకే తెలియని మానవులు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము తెలియని మానవులు, శ్రీరాముణ్ణి మంచివాడనిన, రావణబ్రహ్మను చెడ్డవాడనిన, తెలివిలో తేజస్సున్నవారు ఎవరు నమ్మరు. అయినప్పటికి నీవు ప్రత్యేకించి అడిగావు కావున అజ్ఞాన అజ్ఞాన అంధకారములో చిక్కుకొని చదువులుండి సంస్కారములేనివారు, భక్తియుండి భావములేనివారు, సన్యాసముండి సాక్షిని తెలియనివారు, ఆచారములుండి అర్థము తెలియని మనుషులు తెలియునట్లు, ఆలోచించునట్లు నేను చెప్పవలసిందే! ఈ ప్రజలు వినవలసిందే.

సీత స్వయంవరమునకు నేను పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినానా? సీత స్వయంవరము భారతదేశములో జరుగుచుండగ, లంకలోని నాకెట్లు తెలిసింది? ఎవరైన సముద్రమును దాటివచ్చి నన్ను ఆహ్వానించారా? అప్పటి కాలములో సముద్రమును దాటుటకు ఏ సదుపాయములు లేవే! అంతకుముందు ఎవరూ దాటని సముద్రమును సీత అన్వేషణకు హనుమంతుడు మాత్రము ఎగిరి దాటినాడని చెప్పినపుడు, రవాణా సౌకర్యములేని ఆ దినములలో ఎవరూ లంకలోనికి రానట్లే కదా! సీత స్వయంవరమును గురించి తెలుపనట్లే కదా! స్వయంవర విషయము నాకు తెలియకున్నను, తెలిసినట్లు వర్ణించి, నేను అక్కడికి పోకున్నను పోయినట్లు చిత్రించి, చివరకు శివధనస్సును ఎత్తకున్నను ఎత్తలేని నిర్భలునిగ రూపొందించి, రావణుడు చెడ్డవాడన్నట్లు చేశారు. ఈ విషయమును వ్రాసినది ఆనాటికవులు. ఆనాటి కవులు ప్రాంతీయ అభిమానముతో వారు ఆర్యులని, మేము ద్రావిడులమని, ద్రావిడులను రాక్షసులుగ, ఆర్యులను దేవతలుగ చిత్రించి చెప్పిన చరిత్రే రామాయణము. రామాయణములో నన్ను రాక్షసుడని రాముణ్ణి దేవుడని అన్నారు. నేను ఎలా రాక్షసుణ్ణి, రాముడు ఎలా దేవుడో యోచించవలసిన బాధ్యత మీదే.


స్వయంవరమునకు ఆహ్వానించబడిన వారందరు భారతదేశములోని చిన్న చిన్న సామంతరాజులు. అటువంటి సామంతరాజులు వచ్చిన స్థలమునకు లంకేశ్వరుడైన నేను, లంకాద్వీపమునకు చక్రవర్తినైన నేను పోగలనా? అప్పటికే



----


మండోదరి అను భార్యాసమేతుడనై, ఇంద్రజిత్ అను వివాహమైన కుమారయుతుడనై, వయస్సు పైబడిన నేను కూతురుతో సమానమైన, కూతురువయస్సున సీత స్వయంవరమునకు పోగలనా? పోయాననుట అసత్యము. అంతకుముందే కైలాసపర్వతమును శివునితో సహా ఎత్తిన నేను, సీతాదేవి ఎత్తిన ఒక ధనస్సును ఎత్తలేనా? స్వయంవరములో సీత ఎత్తిన ధనస్సును ఎత్తలేని వాడిని, అడవిలో సీతను మట్టిగడ్డతో సహా ఎలా ఎత్తుకు పోయాను? సీతను ఎత్తగలిన బలముకల నేను సీత ఎత్తిన ఒక వస్తువును ఎత్తలేనా? సీతను ఎత్తుకు పోయినమాట వాస్తవమేగానీ ధనస్సును గురించి కవులు అల్లిన సమాచారమంతా కల్పితము.


రావణునికి పది తలలున్నాయనుట పూర్తి అసత్యము. నాకు పది తలలు లేవు. కానీ పది తలలకున్నంత తెలివి, జ్ఞానముగలవాడిని కనుక ఆనాడు నన్ను దశకంఠుడు అన్నారు. సూక్ష్మముగ దశకంఠుడనే కానీ భౌతికముగ అందరికున్నట్లు ఒక్క తలమాత్రమున్నది. కనిపిస్తున్న ఒక్క తలను వదలి రామునికి ఒకటి, రావణునికి పది అనుట అవివేకము కాదా!... రావణ అను గంభీరమైన నామధేయముకల్గిన నన్ను అసురుడని నాలోలేని అసురత్వము కనిపించునట్లు రావణాసురుడనుట భావ్యమా!...


పదినెలలు పర్యంతము నా ఆధీనములోనున్న సీతాదేవికి ఎటువంటి అసౌకర్యము లేకుండునట్లు, ఒంటరితనము తోచనట్లు, పదిమంది స్త్రీలను ఆమె సేవకు వినియోగించాను. రావణుడు నన్ను అసభ్యముగ మాట్లాడాడని గానీ, అట్లు ప్రవర్తించాడనిగానీ, సీతాదేవి ఎవరితోనూ నన్ను గురించి చెప్పలేదే. అరణ్యమునుండి ఆమెను లంకకు తీసుకువచ్చేటపుడు కూడా సీతను తాకకుండ భూమితో సహా పెకలించుకొని తెచ్చాను. నాలో పరకాంత వ్యామోహముండినా, నేను కామాంధుడనైనా, ఒంటరిగ చిక్కిన అబలను మానభంగము చేసెడివాడిని కదా!.... అట్లు చేయలేదే!... చేతకాకనా! ధర్మము తెలుసును కనుక అలా చేయలేదు. నాభార్య మండోదరిదేవికి కూడ సీతను ఏ ఉద్దేశముతో తెచ్చానో తెలుసు. త్రికాల జ్ఞానినైన నేను నా మరణము శ్రీరాముని చేతిలో లంకలోనే ఉన్నదని, కనుక రాముణ్ణి లంకకు రప్పించుట కొరకు సీతను తెస్తున్నానని, ముందే నాభార్య మండోదరి దేవికి చెప్పాను. జరుగబోవు భవిష్యత్తు తెలిసిన నేను గొప్పవాడినా! ముందు ఏమి జరుగుతుందో తెలియక, బంగారు జింక ఉంటుందా అని యోచించక, అడవిలోనికి పోయిన రాముడు గొప్పవాడా!... ఈ విషయములోనైన రామునికి ఒకతల తెలివి, రావణునికి పదితలల తెలివి కలదని ఇప్పుడైన ఒప్పుకోక తప్పదు.


సీతను నేను బిడ్డవలె ఆదరిస్తే, ఆ విషయమునే సీతాదేవి రావణ బ్రహ్మ నన్ను కూతురులాగ చూచుకొన్నాడని చెప్పినప్పటికి, రాముడు సీతను అనుమానించి అగ్నిపరీక్షకు నిలబెట్టడము స్త్రీజాతిని అవమానపరిచినట్లు కాదా!... ఈ విషయమును చూస్తే స్త్రీలపట్ల అగౌరవముగ ప్రవర్తించినవాడు రాముడా? రావణుడా? ఎవడైన రాముడనియే ముమ్మాటికి చెప్పకతప్పదు.


రాముడు అశ్వమేధయాగము చేసి అశ్వమును వదలినపుడు, రాముడు స్వయాన తమకు తండ్రియని తెలియని లవకుశులు, అశ్వమును బంధించినపుడు, వారిచేతిలో రాముని సైన్యము ఓడిపోయినపుడు, మొదట లక్ష్మణుడు, ఆ తర్వాత రాముడు లవకుశుల వద్దకు పోయినపుడు, లవ కుశులు రామునిలోని లోపములన్ని బయటపెట్టి, దుర్భాషలాడిన విషయము ప్రజలకు తెలియదా! స్వంత కుమారులే రాముణ్ణి ఒప్పుకోలేదని ప్రజలకు తెలియదా! ఆ సందర్భములోనే సీత అక్కడికి వచ్చినపుడు, లవకుశులు తన కుమారులేనని తెలుసుకొన్న రాముడు, సీతను తిరిగి అయోధ్యకు పిలువగ,

----


నీ చేతిలో అవమానముపాలై అడవిలో విడువబడిన తర్వాత కూడ తిరిగి వచ్చి నీతో నేనెలా కాపురము చేసేదని, అట్లు చేయుటకంటే చావడము మేలని, సీతాదేవి కొండమీదినుండి దూకి ఆత్మహత్య చేసుకోవడము ప్రజలకు తెలియదా! అంతవరకు ప్రాణాలతోవున్న ఆమె ఆ దినమే ఎందుకు లేకుండ పోయిందో తెలుసా? అప్పటి వరకు అడవిలో ఒక అభాగ్యురాలిగ బ్రతికిన సీత, ఇక మీదట రాముని భార్యగ బ్రతుకదలచు కోలేదు కనుక, తిరిగి రాముని భార్యననిపించుకోవడము ఇష్టము లేదు కనుక, ప్రేమలేని రాముని వద్ద బ్రతకడము నరకము కనుక, ఇదంతా ప్రజలకు తెలియదా! తెలిసిన తర్వాత కూడ రాముణ్ణి దేవునిగ, నన్ను రాక్షసునిగా వర్ణించి ప్రజలను తప్పుదోవ పట్టించిన కవులు ఏ పాటివారో మీరే యోచించండి.


అపరబ్రహ్మననీ, బ్రహ్మజ్ఞానిననీ, రావణబ్రహ్మననీ పేరుగాంచిన నాకు యజ్ఞములంటే ఏమిటో తెలియదా! బాహ్యయజ్ఞములు ధర్మ విరుద్ధములని, దేవుని మార్గమునకు ఆటంకములని, అధర్మములైన యజ్ఞములను చెడగొట్టిన నేను ధర్మపరుణ్ణా లేక యజ్ఞములను కాపాడ దలచిన రాముడు ధర్మపరుడా! అధర్మములను త్రుంచివేయుటకు దేవుడు భూమిమీదకు వస్తానని గీతలో చెప్పలేదా! ద్వాపరయుగములో గీతయందు యజ్ఞముల వలన నేను తెలియబడనని చెప్పిన ధర్మము ప్రకారమే నేను త్రేతాయుగములోనే, అధర్మములైన యజ్ఞములను నాశనము చేశాను. అనాడే ధర్మపరుణ్ణి, బ్రహ్మజ్ఞానిని అనిపించుకొన్నాను. భగవద్గీతకు అనుకూలముగ నడచినవాడను నేను, భగవద్గీతకు వ్యతిరేఖముగ నడచిన వాడు రాముడు. రాముడు ధర్మపరుడు, రావణుడు అధర్మపరుడనుకున్న ఈ కాలపు గ్రుడ్డి ప్రజలను అడుగుచున్నాను. ఇప్పుడు చెప్పండి ఎవరు ధర్మపరుడో, ఎవరు అధర్మపరుడో.


ధర్మము ప్రకారము యజ్ఞములను నాశనము చేసిన నన్ను దుర్మార్గుడని ప్రజలచేత నమ్మించి, వారి భుక్తికొరకు రాజుల దగ్గర ధనమును తీసుకొని యజ్ఞము చేయుట, ద్వాపరయుగములో పెరిగిపోవడమును గమనించిన దేవుడు తానే శ్రీకృష్ణునిగ భూమిమీదకు వచ్చాడు.


శ్లోకము:యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ II


ఎప్పుడైతే ధర్మములకు ముప్పుకలుగుతుందో అపుడే నేను భూమి మీద అవతరిస్తానని చెప్పిన దేవుడు, వ్యాసుడు మొదలగు మహర్షులని పేరుగాంచిన వారున్నపుడే భూమిమీద అవతరించాడు. దీనినిబట్టి యజ్ఞములు పెచ్చుగ చేయు మహర్షులు అధర్మపరులనేగా అర్థము! దీనిని బట్టి యజ్ఞములను రక్షించినవాడు ధర్మపరుడా? యజ్ఞములను చెడగొట్టిన వాడు ధర్మపరుడా? ఎవడు ధర్మపరుడో యోచించండి.


ఇకపోతే నేను అజ్ఞానినని, దైవభక్తి ఏమాత్రము లేనివాడినని, సుందరకాండయని పేరుపెట్టి పాట పాడువారు కూడ కలరు. పరబ్రహ్మ స్వరూపమైన, పురుషోత్తమునికి మారురూపమైన ఈశ్వరలింగమును పూజించాను, కానీ అన్యదేవతను ఎక్కడా నేను ఆరాధించలేదే! దేవునికి అన్యముగనున్న దేవతలను, సూర్యున్ని ఆరాధించిన ఘనత రామునికున్నదే కాని, నాకు లేదే! విశ్వమంతా వ్యాపించిన ఈశ్వరుడయిన పరమ్మాతను ఆరాధించిన నేను దైవభక్తి లేనివాడినా!


---


నా చావు ముహూర్తము తెలిసిన నేను యుద్ధరంగములో పగటిపూట సూర్యకాంతి కల్గిన మిట్టమధ్యాహ్నము, శుక్లపక్షములో, ఉత్తరాయణమున మరణించి, విశ్వవ్యాప్తుడనై అన్ని చూస్తున్నాను. త్రేతాయుగములో నేను ఆటంకపరచిన యజ్ఞములు నేటికినీ సాగుచుండడమేకాక, నన్ను అధర్మ పరుడని అనడమేకాక, యజ్ఞములు, వేదములు, తపస్సులు అధర్మములన్న గీతను కూడ ఎవరూ పట్టించుకోలేదు. అందువలన అలనాటి రావణబ్రహ్మగ మీరు ప్రయాణించు మార్గమేదో తెలుసా? అని అడుగుచున్నాను నేను ఆశించిన సమాజమేనా ఇది? అని ప్రశ్నించుచున్నాను. మాయా ప్రభావము చేత నిజము తెలియక మభ్యపడిపోయి, రావణుడు దుర్మార్గుడని, క్రొవ్వుపట్టిన కామాంధుడని, లోకకంఠకుడని ప్రచారము చేయు ఎందరో స్వాములను, మఠాధిపతులను, పీఠాధిపతులను, పరమహంసలను, మహర్షులను, జ్ఞానము ముసుగు తగిలించుకొన్న మాయా గురువులను ప్రశ్నించుచున్నాను. స్వామి, మహర్షి అను పదమునకు అర్థము మీకు తెలుసునా? తృప్తిగా, రుచికరమైన భోజనము చేయుచు కష్టమనునది లేక సుఖమునకుమరిగి వళ్ళుపెంచిన మీకా క్రొవ్వుపట్టినది? లేక పరాక్రమవంతుడనై యుద్ధ రంగమున అరివీర భయంకరుడై చెలరేగిన నావంటి వీరునికా? మానవుని దైవత్వంవైపు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యతగల మీరు, పనికిమాలిన ప్రవచనాలు, పిట్టకథలు, అశాస్త్రీయమైన ఆగమశాస్త్రపు చర్చలు, పుక్కిటి పురాణాలతో కాలక్షేపము చేయుచు సోమరులై, కర్మక్షేపము చేయు మీరు, నిజమైన దేవుని జ్ఞానమును ప్రజలకు అందించక, వారిని మాయా మార్గమున నడిపించుచున్నారు. ఇందుకు తగిన ప్రతిఫలము మీరు తప్పక అనుభవించెదరుగాక! దైవనింద చేసిన వారికి జ్ఞానపు గట్టుకూడ దొరకకుండ చేస్తానని దేవుడు చెప్పిన ప్రకారము, మరుజన్మలోనైన మీరు ఈ భూలోకమునందు కరువుకాటకాలకు నిలయమైన ఆఫ్రికాఖండమున పుట్టి ఆకులు, అలుములు తినుచు ఆకలికి తట్టుకోలేక చివరికి పచ్చి ఉడతలను, పచ్చని మిడతలను, తొండలను తినుచు దుర్భరమైన జీవితమును గడుపుదురుగాక! మీ క్రొవ్వు కరుగునుగాక! ఇదే.... మోక్షముతో దైవత్వమును పొందిన నాయొక్క శాపము.... ఆ పరమాత్మ ఈ మాయా గురువులకు విధించు శిక్ష!


ఓ ప్రజలారా! ఇప్పటికైన జ్ఞాననేత్రము తెరచి, నిజమైన దైవజ్ఞానమును గుర్తించి, స్వచ్ఛమైన హేతువాదులై, మాయా జ్ఞానమును చెప్పువారిని ప్రశ్నించండి! నిలదీయండి! నిట్టనిలువున తాట వలవండి! నిజమైన దైవమార్గమును గుర్తించి దానిలో ఎదురయ్యే ఏ అడ్డంకులనైన ఎదుర్కొనండి.


శ్లోకము॥ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్టితాత్ |

స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥


అన్న దేవుని సందేశమే ఊపిరిగా జీవిచండి.


ఆకాశవాణి :- శభాష్ రావణబ్రహ్మ! కుక్కకాటుకు చెప్పుదెబ్బవలె నీవిచ్చిన సమాధానము ఈ మానవులను ఆలోచింప చేయునుగాక! నీ గురించి చెడుగా ప్రచారము చేయు మాయా గురువులకు చెంపపెట్టు అగునుగాక! ఇప్పటికైన ప్రజలకు నీపై సదుద్దేశము కలుగునుగాక!


రావణబ్రహ్మ :- నా గురించి ఎందరో చెడుగ చెప్పుకున్నను, నా నిజ స్వరూపమును, నాయొక్క పవిత్రతను ఏనాడో ఈ ప్రపంచానికి తెలియజేసిన ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు నా నమస్కృతులు, నేను గొప్ప వాడినని, నా జ్ఞానము గొప్పదని, నేను స్వచ్ఛమైన ధర్మపరుడినని తెలిసి ఇప్పటికి నన్ను గురించి చెప్పు ప్రబోధ సేవాసమితి వారున్న చోటికి వచ్చాను, మనసువిప్పి


----


మాట్లాడాను. యజ్ఞములు, వేదములు, ధానములు, తపస్సులు దేవుని ధర్మములు కావను గీతవాక్యమును గుర్తుంచుకొనిన వారి హృదయా లలో ఎప్పటికి ఉంటాను. ఇక సెలవు...


నాయనగంటు - అమ్మగంటు.


అది భూలోకములోనే యమధర్మరాజు కొలువు తీరిన సభ, మధ్యలో యమధర్మరాజు యొక్క సింహాసనముండగా ప్రక్కనే చిత్రగుప్తుని ఆసనము ఉంటుంది. అక్కడ మొదట ఇద్దరు యమకింకరులు, ఒక పోలీస్ అధికారిని, ఒక రాజకీయనాయకుణ్ణి, ఒక వడ్డీవ్యాపారస్తుణ్ణి, ఒక ఉద్యోగస్థుణ్ణి తీసుకు వచ్చి ఒక్క ప్రక్క నిలబెడుతారు. వేరొక ప్రక్కన ఆధ్యాత్మికవేత్తను, ఒక శైవుడిని, ఒక వైష్ణవుడిని కూర్చోబెడతారు. అంతలో ముందుగా చిత్రగుప్తుడు ప్రవేశించి యమకింకరులను చూచి...


చిత్రగుప్తుడు :- కింకరులారా ఈదినము, ఈగంటలో, ఈజిల్లాలో ఆయుస్సు తీరిన వారు కేవలము ఏడుగురేనా? 


కింకరులు :- అవును చిత్రగుప్తా! ఈ ఏడుమంది మాత్రమే కలరు.


చిత్రగుప్తుడు :- ఈ నలుగురిని ఒక ప్రక్క నిలబెట్టి మిగత ముగ్గురిని మరొక ప్రక్క ప్రత్యేకముగా కూర్చోబెట్టారు దేనికి?


 కింకరులు :- ఈ నలుగురు వేరువేరు పనులు చేయుచున్ననూ సర్వ సాధారణ మనుషులే. ప్రక్కనున్న ఈ ముగ్గురు జ్ఞానమును తెలిసిన గొప్పవారు, అందువలన ప్రక్కన కూర్చోబెట్టాము.


చిత్రగుప్తుడు :- వీరు ఎవరైనదీ, వీరు చేసిన పాపములు, పుణ్యములు ఎవైనవీ వీరి చిట్టా అంతా వ్రాసుకొన్న మనకు తెలుసు, కానీ వీరికి, వీరు చేసుకొన్నవి ఏమిటో తెలియాలి కదా! యమధర్మరాజు రాకముందే వీరు భూమిమీద సంపాదించుకున్నదేదో యమగుప్తుడినై నేను తెలిపెదను. అట్లే మరొక ప్రక్కనున్న ముగ్గురి జ్ఞానుల విషయమును యమధర్మరాజే తెలుపును. ఎవరిది వారికి తెలియాలి కదా! చివరగా వీరు చేసిన తప్పులను చెప్ప వలసినది గుప్తుడనైన నేనూ, శిక్ష చెప్పవలసినది సమవర్తి అయిన యమధర్మరాజు. ఇక మొదటిగా ఉద్యోగస్థుడైన రామావతారు ముందు హాజరు పెట్టండి. (యమకింకరులు ఒక ప్రక్కనున్న నలుగురిలో రామావతార్ను తీసుకువచ్చి చిత్రగుప్తుని ముందుంచారు.)


చిత్రగుప్తుడు :- ఏమయ్యా! రామవతార్! నీపేరు చాలా బాగుంది. కానీ నీ జీవితమంతా లంచావతార్ బ్రతికావుకదయ్యా! ఎంతోమందిని పీడించి వారివద్ద తీసుకొన్నది, డబ్బురూపములోని పాపమని ఇప్పటికైనా తెలుసుకో. నీ బిడ్డకు ఇచ్చిన కట్నము, నీ ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చిన ఆస్తులు అన్నీ నీవు ఉద్యోగము చేస్తూ లంచముగా తీసుకొన్నవే. లంచము తీసుకొని కొందరిని బాధపెట్టిన పాపము, లంచమివ్వడానికి తమవద్ద డబ్బులు లేవని చెప్పుకొన్న ఆడవారిని బలవంతముగా లంచము బదులు శీలము దోచుకొన్న పాపము పెద్దవికాగ, మరెన్నో పాపములు గలవు. నీవు చేసిన పనులు పాపములై నీవెంటనే ఉన్నవి. వాటిని అనుభవించుటకు శిక్షను యమధర్మ రాజు నిర్ణయించగలడు. కింకరులారా! మరొకనిని ప్రవేశపెట్టుము. (కింకరులు వడ్డీవ్యాపారుణ్ణి ముందుకు తెచ్చారు.)


చిత్రగుప్తుడు :- ఓహెూ ఇతను వడ్డీవ్యాపారి సుబ్బానాయుడు గారా! నీవు చేసిన మోసాలు లెక్కలేనన్ని పాపాలరూపములో


----


ఉన్నాయి. ఎదుటి మనిషి అవసరాన్ని ఆసరాగా చేసుకొని, ఫైనాన్సు వ్యాపారమని మూడురూపాయల వడ్డీనుండి ఇరవైరూపాయల వడ్డీవరకు ఇచ్చిన ఘనుడవు. ఎంతోమంది దగ్గర భూములు, ఇండ్లు వడ్డీక్రింద లాగుకొన్న మహానుభావుడవు. ప్రపంచములో డబ్బుతప్ప ఏదీ గొప్పదికాదని, ఇతరులకు కూడ నీతి చెప్పిన వానివి. డబ్బుకోసము నీ అన్నదమ్ములను కూడ మోసము చేసినవానివి. నీవే ఒక స్వామీజీని తయారుచేసి, అతని ద్వారా కొందరికి మీరు కాపురము చేసే ఇల్లు బాగాలేదని, వాస్తుదోషముందని తొందరగ అమ్మివేయమని చెప్పించి, ఆ ఇల్లును తక్కువ రేటుకు కొనడము, అలాగే భూములను కూడ అమ్మించి, వాటిని నీవే కొనడము మహాపాపములై నీనెత్తిన కూర్చొన్నవి. నీవు మరుజన్మలో ఇదే భూమిమీద ఏమి అనుభవించాలో యమధర్మరాజే నిర్ణయించగలడు. కింకరులారా! మరొకనిని ముందుకు తెమ్ము. (యమ కింకరులు పోలీస్ ఆఫీసర్ను ముందుకు తెచ్చారు.)


చిత్రగుప్తుడు : ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారా! ఇపుడు నీవు పోలీస్ అధికారివికావు. సాధారణ మనిషివేనని గుర్తుంచుకో. ఉద్యోగము రాకముందు ఏ స్థోమతలేని నీవు, ఉద్యోగము కొరకు ఎంతోమంది దేవతలకు మ్రొక్కుకొన్నావు. ఉద్యోగమొచ్చి సస్పెక్టర్ అవుతూనే, నేను పోలీసు అను గర్వమును నెత్తికెక్కించుకొన్నావు. మనుషులను హీనముగ జంతువుల క్రింద జమకట్టావు. అధికారమదముతో తప్పుచేయని మర్యాదస్తులను దూషించావు. ఆత్మజ్ఞానముగల గురువును, వారి శిష్యులను తప్పు చేయకున్ననూ అదే పనిగ దూషించి తప్పుడుకేసు బనాయించావు. నీకు ఏమాత్రము ఆత్మజ్ఞానము తెలియకుండినా, మీది జ్ఞానమేనా అని గురువునే నిందించి కొట్టేదానికి పూనుకొన్నావు. మిగతా పాపులకంటే నీ పాపమే అధికము, యమధర్మరాజు నిన్ను ఏ విధముగా శిక్షించునో! ఇప్పటికైనా నీ అధికారము, నీ హెూదా కొంతకాలమేనని, నీవు సాధారణ జీవాత్మవేనని తెలుసుకో. కింకరులారా చివరిగానున్న అతనిని కూడ ప్రవేశపెట్టండి. (యమకింకరులు రాజకీయనాయకుణ్ణి ముందుకు తెచ్చారు.)


చిత్రగుప్తుడు :- మీరు రాజకీయములోని మంత్రివర్యులు అధికారమే అన్నిటి కంటే మించినదిగా తలచినారు అధికారముంటే డబ్బు దానంతటికదే వస్తుందని తలచినారు. అధికారము కొరకు ఎన్నో హత్యలు చేయించినారు. అధికారముతో ఎన్నో అక్రమాలు చేసిన తమరు, పాపమును కూడ అదే మాదిరి సంపాదించుకొన్నారు. తమరు చేసిన పాపములు ఏవీ చిన్నవిలేవు. అధికారమును కాపాడుకొనే దానికి, పోలీసులచేత చాలామందిని జైళ్ళలోనికి త్రోయించావు. కొందరిలో గ్రామకక్షలు పెంచి హత్యలు చేయించావు. కోట్ల ఆస్తులు సంపాదించావు. అయినా నీవెంట ఒక్కరూపాయి కూడ రాలేదు కదా! ఇపుడు నీవెంట కోట్లరూపాయలకు సమానమైన పాపము వచ్చినది. దానిని అనుభవించుటకు ఒక జన్మసరిపోదు. ఈ భూమిని ఎందరో రాజులు నీకంటే గొప్పగ పరిపాలించారు. ఒక్కడు కూడ పిడికెడు మట్టిని కూడ వెంట తీసుకుపోలేదు. నీ తర్వాత కూడ ఎందరో రాజకీయము లో మంత్రులుగా ఉండగలరు. వారుకూడ అంతే. ఎవరూ ఏమీ మూటగట్టుక పోరు, మూటకట్టుక పోయేది పాపము మాత్రమే. నీ పాపము మూటకు సమానమైన శిక్షను యమధర్మరాజు చెప్పగలడు. (అంతలో చిత్రగుప్తుడు మరొక ప్రక్కయున్న జ్ఞానులవైపు చూచి) మీరు జ్ఞానమార్గములో ఉన్నవారు, మీ హెూదాను నేను గుర్తించలేను. మీ పాప పుణ్యములను స్వయముగా యమధర్మరాజే చెప్పగలడు. (అంతలో యమ ధర్మరాజు సభలోనికి వచ్చు సూచనగా శబ్దము వినిపిస్తుంది.) జీవాత్మలకు సమవర్తి అయిన, శరీరాంతర్గత బహిర్గత నివాసి అయిన, మాయను తిరగ వ్రాసిన యమా పేరుకల్గిన, దండనకర్తయిన కాలయముడు విచ్చేయుచున్నాడు. జాగ్రత్త! జాగ్రత్త!! జాగ్రత్త!!!


----


(అపుడు యముడు ఠీవిగా సభలో ప్రవేశించి సింహాసనము మీద కూర్చొనును.)


చిత్రగుప్తుడు :- సమవర్తీ! ఇటు ప్రక్కనున్న వారు అజ్ఞానమార్గములో నడిచినవారు. ఒకరు పోలీస్ అధికారి, ఒకరు వడ్డీవ్యాపారి, ఒకరు ఉద్యోగస్థుడు, ఒకరు రాజకీయమంత్రిగారు ఉన్నారు. వీరి పాపములను నేనే వ్రాశాను, కావున కొన్నింటిని మాత్రము వారికి గుర్తు చేశాను. అటువైపు ఉన్నవారు జ్ఞానమార్గములో నడచినవారు, వారి కర్మలను చూచువానివి నీవే కావున వారిని ప్రక్కన పెట్టాము.


యమ :-  అజ్ఞానమార్గములో నడచి అమ్మగంటును సంపాదించు కొన్నవారిని ఒకప్రక్కగా, జ్ఞానమార్గములో నడచి నాన్నగంటును సంపాదించుకొన్నవారిని మరొకప్రక్కగా ఉంచడము మంచిదే. కానీ నేను చూడవలసిన ఈ ముగ్గురిలో కూడ, నాన్నగంటును సంపాదించుకొన్నవారు లేరు. అందులో ఒకరు మాత్రము నీవనుకొన్నట్లు పూర్తి జ్ఞానమార్గములో నడచినవాడున్నాడు. మిగత ఇద్దరూ ఇటు పూర్తి అమ్మగంటునుకాక, అటు పూర్తి నాన్నగంటును కాక మధ్యరకముగా ఉంటూ, అమ్మకంటే కొంత తక్కువైన చిన్నమ్మగంటును సంపాదించుకొన్నారు. మీరనుకొన్నట్లు వీరిరువురు నాన్నగంటును సంపాదించుకోలేదు, కావున వారిని జ్ఞానికి అజ్ఞానులకు మధ్యలో నిలబెట్టండి.


(యమభటులు యమధర్మరాజు చెప్పినట్లు వైష్ణవుణ్ణి, శైవుణ్ణి ఇద్దరినీ మధ్యలో నిలబెట్టారు.)


చిత్రగుప్తుడు :- యమా! ప్రకృతి సంబంధమైన (ప్రపంచసంబంధమైన) ధనమును సంపాదించిన వారు అమ్మగంటు కలవారనీ, పరమాత్మ సంబంధ జ్ఞానధనమును సంపాదించినవారు నాన్నగంటుకలవారనీ మాకు తెలియును. కానీ అటు, ఇటు కానీ పిన్నమ్మగంటును సంపాదించినవారనగా, మాకు అర్థముకాలేదు ప్రభూ! నాకే అర్థముకానిది వీరికేమి తెలియును. కావున వీరికీ నాకూ అర్థమగునట్లు, ధర్మములను తెలిసిన మీరే తెలుపమని కోరుచున్నాము.


యముడు :- చిత్రగుప్తా! అమ్మలాంటిదే అమ్మ చెల్లెలే చిన్నమ్మ. అలాగే ప్రకృతిలాంటిదే ప్రకృతి భావములున్నదే మరొక దేవతలభక్తిని చిన్న ప్రకృతి అనుకొనుము. ప్రకృతిని కోకిలగా, దేవతా ప్రకృతిని కాకిగా పోల్చి చెప్పెదము వినుము. 'కుహూ' అని అరిచేది నల్లనికోకిల, అలాగే 'కావు' అని అరిచేది నల్లనికాకి, కోకిలలాంటిది నల్లనిదే కాకి, కానీ దాని అరుపులో, దీని అరుపులో కొద్దిగ తేడా ఉంటుంది. కోకిల 'కు' అంటే కాకి 'కా' అంటుంది. ఇంకొక విషయమేమంటే, కోకిల తనగ్రుడ్లను ఎప్పుడు పొదగదు. కాకులు లేనపుడు కాకిగూటిలో కాకి పెట్టిన గ్రుడ్లమద్యలో, కోకిల తన గ్రుడ్డును పెట్టివస్తుంది. కాకి తనగ్రుడ్లతో పాటు తన గ్రుడ్డువలెనున్న కోకిల గ్రుడ్డును గుర్తించలేక దానిని కూడ పొదుగుట వలన, కోకిల పిన్నమ్మ అని కాకికి పేరువచ్చినది. అలాగే ప్రకృతి భావములు కోకిల మాదిరీ, దేవతల భావము కాకి మాదిరీయున్నది. కాకి, కోకిల రెండూ ఎలా నల్లగా ఉన్నవో అలాగే ప్రకృతి భావము, దేవతల భావము రెండు గుణములుగానున్నవి. ప్రపంచము లో వచ్చినట్లే, దేవతల ముందర కూడ కోర్కె మొదలగు గుణములన్నియు చెలరేగుచున్నవి. అందువలన ఆధ్యాత్మికము అని పేరు పెట్టుకొని, ఆదికర్త అయిన దేవున్ని వదలి, కోకిల ప్రకృతిలోయుండి, కాకి దేవతలను ఆరాధించు వారిని చిన్నమ్మగంటువారని చెప్పవలసివచ్చినది.


వీరు ఇద్దరు అలాంటి చిన్నమ్మగంటుగలవారే. ఆధ్మాత్మిక గురువుల మని పేరుపెట్టుకొని, ఆత్మను ఏమాత్రము ఆరాధించక, తెలుసుకోక, లోపలి ఆత్మధ్యాసను వదలి బయటి దేవతలను ఆరాధించుచున్నారు. దేవతల ఆరాధనలు ప్రకృతి జనిత కోర్కెలను కల్గించగా, ఆ కోర్కెల విధానముతోనే ఆదిలో పుట్టిన అసలైన దైవత్వములను చెడగొట్టి,


----


దైవజ్ఞానమును శైవము, వైష్ణవము అని చీల్చివేశారు. శైవ గురువులు భూమిమీద పుట్టకముందు నుండి నేను విభూతిరేఖలు ధరించుచున్నాను కదా! వీరి లెక్కలో నేను కూడా శైవుడనా? వైష్ణవములేని రోజుల్లోనే నామమును ధరించిన వారెందరో ఉన్నారు కదా! వారు అప్పుడు వైష్ణవులా? వీరు దేవతలు, దేవతలపార్టీల మాయలోపడి, మాయకు తిరుగబడి “యమా” అని పేరు కల్గిన నన్ను కూడ శైవుడన్నందుకు నీలకంఠాచార్యుణ్ణి, విష్ణువును కూడ వైష్ణవుడన్నందుకు, నారాయణబట్టును భూమిమీద పుట్టించి, 90 సంవత్సరములు వృద్ధాప్య యములో అనేక కష్టములు, అనేక అనారోగ్యములతో బాధ పడునట్లునూ, యౌవనములో వైష్ణవ, శైవ తెగల తగాదాలతో పోట్లాడుచు అనేక సమస్యలతో సతమతమౌచు, దైవత్వ జ్ఞానము యొక్క గట్టు దొరకక కాలము గడుపునట్లు, వీరు సంపాదించుకొన్న చిన్నమ్మగంటును అనుభవించునట్లు శిక్ష విధించు చున్నాను.


నీలకంఠాచార్యులు :- యమధర్మరాజా! ఇది చాలా అన్యాయము. నేను నా జీవితమంతయు శంకరభక్తుడనై, వీరశైవుడనై బ్రతికాను. నేనేమి తప్పు చేయలేదు. నన్ను కైలాసానికి పంపించు, భూలోకానికి పంపవద్దు.


యముడు :- (బిగ్గరగా నవ్వుచూ!) ఓరీ మూర్ఖుడా! కైలాసము ఉన్నది భూమిమీద కాదా? యమలోకము మొదలగు నీవు అనుకొను లోకములన్నీ భూమిమీదనే ఉన్నవి. ఇకమీదట శైవము అనుమాట లేని కాలములోనున్న వారికి శైవులని పేరు కరిపించవద్దు. అలా చేయడము వలన భయంకరమైన పాపమువస్తుంది.


నారాయణబట్టు :- యమధర్మరాజా! నన్ను విష్ణుసన్నిధికి పంపించు. భూలోకమునకు వద్దు. నన్ను దయచూడు.


యమధర్మరాజు :- నీవు పరమమూర్ఖునివి, నేను సమవర్తిని. మీవలె నాకు దయాగుణముండదు. నాకు దయలేకున్ననూ,  నా ధర్మము ప్రకారము నేను నిన్ను పంపునది విష్ణుసన్నిధికే. విష్ణుసన్నిధి భూలోకములోకాక ఎక్కడున్నదను కొన్నావు? నీవనుకొను అన్నీ లోకములు భూమిమీదనే ఉన్నాయి. ఇకనైనా భక్తితో రాజకీయపార్టీలాంటి వైష్ణవమును వీడి ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించు. (యమధర్మరాజు ఆత్మజ్ఞాని వైపు చూచి) నా ముఖాననున్న మూడు విభూతిరేఖలకు అర్థము తెలిసిన ఆత్మజ్ఞానీ! నీవు “మాయ”ను జయించి “యమా”ను మెప్పించావు. నీకు కర్మనునది ఏమాత్రము లేదు. కర్మయోగము వలన నీకర్మ అంతయు కాలిపోయినది. నీకు జన్మరాహిత్యము తప్ప జన్మ సాహిత్యములేదు. నీ వలన భూమిమీద జ్ఞానదీపము వెలిగినది. నీ జ్ఞానమును అర్థము చేసుకోలేక నిన్ను దూషించిన వారంతయు క్షమించరాని పాపమును మూటగట్టుకున్నారు.


ఆత్మజ్ఞాని :- యమధర్మరాజా! నాదొక మనవి. భూమిమీద అజ్ఞానము సాధారణ మనుషులలో లేదు. సామాన్యులు, జ్ఞానము తెలియని అమాయకులేగానీ, అజ్ఞానులుకాదు. జ్ఞానులమనుకొని మచ్చుకైన శరీరములోని ఆత్మజ్ఞానమును తెలియక బాహ్యముగా అనేక పేర్లతో, అనేక అరాధనలతో, అనేక సమాజములుగా, అనేక స్వాములుగా, అనేక బాబాలుగా ఉన్నవారే అజ్ఞానులుగా ఉన్నారు. వారు చెప్పు బోధలలో దేవునికి, భగవంతునికి అర్థము తెలియదు. శివునికి, శంకరునికి తేడా తెలియదు. యోగమునకు, యజ్ఞముకు బేధము తెలియదు. దేవునికి, దేవతలకు తారతమ్యము తెలియదు. జ్ఞానమును తెలియని వారందరు మేము గొప్పగ తెలిసినవారమనుకొని, ప్రజలను తప్పుదారి పట్టించడము వలన ఇలాంటి ఉద్యోగస్థులు, పోలీస్ లు, వ్యాపారస్థులు, రాజకీయనాయకులు పాపాత్ములగు చున్నారని నా అభిప్రాయము. అందువలన భూమిమీదున్న స్వామీజీలలోను, పీఠాధిపతులలోను మార్పువచ్చునట్లు చేయమని నా విన్నపము.




----


యముడు :- నిజము చెప్పితివి. నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందువలనే యమధర్మరాజు తీర్పులో సాధారణ మనుషులకు ఒకమారు అనుభవిస్తే అయిపోవు శిక్షయుండగా, జ్ఞానులమనుకొన్న అజ్ఞానులు దేవుని విషయములో పాపము చేయుచుండుట వలన, వారికి రెండు యుగములు అనుభవించు శిక్ష విధింపబడుచున్నది. నీవు వారిలో మార్పును అడిగావు, కావున గురువులలోను, స్వాములలోను, పీఠాధిపతులలోను, బాబాలలోను మార్పు తెచ్చుటకు ఇప్పటికే త్రైతసిద్ధాంత ఆదికర్త భూమిమీద పుట్టియున్నారు. ఆయన వలననే నీవు కోరిన మార్పు జరుగగలదు.


కింకరులారా! మీరు మహాభూతములుగా, స్వల్పభూతములుగా ఉపభూతములుగా, గ్రహములుగా విడిపోయి వీరు నలుగురు పాపమును అనుభవించునట్లు చేయండి. లంచాలతో బ్రతికిన ఈ ఉద్యోగస్థునికి మరుజన్మలో ఉద్యోగము లేకుండ కూటికి, గుడ్డకు కరువుగా బ్రతుకునట్లు చేయండి. పోలీస్ ఆఫీసర్గా గర్వముతో బ్రతికి అనేకుల మీద తప్పుడు కేసులు బనాయించిన వానిని, రేపుజన్మలో తప్పుడు కేసులోనే జైలుకుపోయి జీవితాంతము జైలులో గడుపునట్లు చేయండి. పోలీస్ గా ఉన్నపుడు గురువును నిందించినందుకు వందజన్మలు చర్మరోగముతో బాధపడునట్లు చేసెదను. వడ్డీ వ్యాపారముతో అనేకులను పీడించిన ఇతనిని పాముజన్మకు పంపించి, ఇతని వలన బాధపడిన వారిచేత, పాము కనిపిస్తూనే రాళ్ళతో కొట్టునట్లు చేసి, దిన దినము భయముతో బ్రతుకునట్లు చేయండి. ఇక రాజకీయనాయకునికి, ఇతను చేసిన హత్యాపాపమునకు చిన్నవయస్సులోనే శత్రువులచేత చేతులను నరుకునట్లు చేసి, జీవితాంతము మొండిచేతులతో బ్రతుకునట్లు చేయండి.


మాయకు వ్యతిరేఖమైన ధర్మమును తెలిసిన యమధర్మరాజునైన నేను చెప్పిన మాటకు తిరుగులేదు. కావున నాకు వ్యతిరేఖమైన “మాయ” వైపు ఉంటారో, మాయకు వ్యతిరేఖమైన “యమా” వైపు ఉంటారో యోచించుకోండి. ఇంతటితో ఈ సభను చాలించెదము.


ఎగువవాడు - దిగువవాడు.


స్టేజిమీద ఒక బ్రాహ్మణుడు వస్తూవుంటే, అతనికి ఎదురుగా మాదిగ కులస్థుడొకడు వచ్చుచుండెను. అంతలో... బ్రాహ్మణుడు :- ఓరే చండాలుడా! బ్రాహ్మణుణ్ణి దారిలో పోతూవుంటే నా ప్రక్కనే నీవు పోతావా? అంటరానివాడివి, మాంసము తినేవానివి, నీచునివి సత్ బ్రాహ్మణుని ప్రక్కగా పోకూడదని నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి నేను తిరిగి స్నానము చేసి శుద్ధి చేసుకోవలెను.


చండాలుడు :- ఏమి స్వామి! మీరు వస్తూంటే మీ ప్రక్కగా మేము పోకూడదా? ఇక్కడున్నది ఒకే దారికదా! దారిలో పోవునపుడు ఎవడైనా ప్రక్కగానే పోతాడు. అంతమాత్రాన ఇన్ని మాటలనుచు నన్ను అంటనివాడివని, నీచుడవని అనవచ్చునా?


బ్రాహ్మణుడు :- ఇపుడు ఎదురుగా వచ్చావు దానికే స్నానము చేయాలి, ఒకవేళ నన్ను తగిలియుంటే మూడురోజులు శుద్దికార్యము చేసుకోవలసి వచ్చేది.


చండాలుడు :- నేను నిన్ను తగలలేదు కదా! ఎదురుగా వచ్చినందుకు నీకేమి అంటుకొన్నది?



----


బ్రాహ్మణుడు :- చండాల దర్శనమే మహాపాపమ్ అని వేదాలలో వ్రాసి యుంది. తగిలితే మరీ పాపమని కూడ ఉంది. నీవు మాదిగవాడివి నేను బ్రాహ్మణున్ని అందుకే అంతగా చెప్పేది.


చండాలుడు :- నీవు బ్రాహ్మణునివి, నేను మాదిగవాడినా? అయితే ఇపుడొక మాట అడుగుతాను చెప్పగలవా? నీవు బ్రాహ్మణునివని, నేను దిగువవాడినని ఎలా చెప్పగలుగుచున్నావు?


బ్రాహ్మణుడు :- నేను పుట్టుకతోనే బ్రాహ్మణకులములో పుట్టాను. కనుక బ్రాహ్మణున్ని, నీవు మాదిగకులములో పుట్టావు. కనుక మాకు దిగువవానివే. ఇందులో ఏమైనా సంశయమా?


చండాలుడు :- బ్రాహ్మణుడని, దిగువవాడని పుట్టుకతోరాదు. వాడు చేసే పనినిబట్టి, వానికున్న గుణమునుబట్టి ఉండునని భగవద్గీతలో కూడ చెప్పారు. బ్రహ్మజ్ఞానము కలవానిని బ్రాహ్మణుడని, బ్రహ్మజ్ఞానము లేని వానిని వానికంటే దిగువవాడని ఒక గురువుగారు కూడ చెప్పారు. ఆయన చెప్పిన దానినిబట్టి, జగతిలో రెండే కులములున్నవనీ, దైవజ్ఞానము తెలిసినవాడు ఎగువ కులమువాడనీ, జ్ఞానము తెలియనివాడు వానికంటే దిగువ కులమువాడనీ తెలియుచున్నది. ఇపుడు బ్రహ్మజ్ఞానమును నీకంటే నేనే ఎక్కువ తెలిసినవాడిని కాబట్టి నేనే బ్రాహ్మణున్ని, తక్కువ తెలిసినవాడివి కాబట్టి నీవే దిగువవానివి.


బ్రాహ్మణుడు :- చతుర్వేదములు కంఠాపాటముగా చెప్పువాడిని, నిత్యము గాయిత్రీమంత్రమును ఉచ్ఛరించువానిని, ఎన్నో యజ్ఞములు చేసిన వానిని, నన్నే జ్ఞానము లేనివాడిననీ, నీకంటే దిగువవాడిననీ అంటావా?


చండాలుడు :- నీవు నన్ను మాదిగువవాడంటే, అంటరానివాడంటే, నేను నీకు వివరము చెప్పవలసివచ్చినది. వేదములను కంఠాపాటముగా పారాయణము చేయుటగానీ, ఏ మంత్రమునైన జపించుటగానీ, యజ్ఞములు చేయుటగానీ జ్ఞానముకాదని, దానివలన దేవుణ్ణి తెలియలేరని, భగవద్గీతలో భగవంతుడే చెప్పియున్నాడు కదా! భగవంతుడు గీతలో చెప్పిన దాని ప్రకారము నీవు నాకంటే దిగువవానివి కాదా! మాలాంటి జ్ఞానులందరికి నీవు మాదిగువవానివే. భగవద్గీతలో దేవుడు చెప్పిన దానిప్రకారము జ్ఞానము తెలిసి, దాని ప్రకారము ప్రవర్తించు నేనుగానీ, నాలాంటివారుగానీ అందరు ఎగువవారే. మాకంటే విభిన్నముగా యజ్ఞాలు చేసే మీరు, వేదమంత్రాలు వల్లించే మీరు మాదిగువవారే.


బ్రాహ్మణుడు: ఏమిటీ వైపరీత్యము. నీవు ఎగువవాడివా, నేను దిగువ వాడినా.


చండాలుడు :- అవును ముమ్మాటికి నిజము.


బ్రాహ్మణుడు :- (తలపట్టుకొని) కాదు కాదు నేనే బ్రాహ్మణున్ని, నీవు మాదిగువవానివే.


చండాలుడు :- సరే నీవే బ్రాహ్మణునివి అనుకుంటాము. నేను ఎదురుగా వస్తే నీకేమి అంటుకొన్నది. నాది పంచభూతములచే నిర్మాణమైన శరీరమే నీది అంతే, శరీరములలో ఏ తేడాలేదు, ఏ అంటులేదు. ఇకపోతే లోపలున్న జీవాత్మ నీ శరీరములో ఒకచోట, నా శరీరములో మరొకచోట ఉన్నదా? అట్లు కూడలేవు. అన్ని శరీరములలో జీవాత్మలు గుణచక్రములోనే ఉన్నవి. కాబట్టి అవియు సమానమే! వాటికి అంటులేదు. ఇక ఆత్మ విషయానికివస్తే అది అందరిలో బ్రహ్మనాడిలోనే ఉన్నది. అదియు అంటులేదు. శరీరము, ఆత్మలు అన్నీ సమానమైనపుడు మీరేమిటిని ‘అంటు’ అనుచున్నారు. అంటు అంటే దానికి పరిష్కారము శుద్ధి అంటే నేను ఒప్పుకోను, అంటు ఏమిటో ఎక్కడుందో చెప్పి తీరవలసిందే.


----


బ్రాహ్మణుడు :- అంటు ఏమిటో నాకు తెలియదు. మాపెద్దలు చెప్పారు అందువలన నేను చెప్పాను.


చండాలుడు :- మీరు బ్రతుకుతెరువు కొరకు మంత్రాలు నేర్చుకొన్నారు. సంపాదనకొరకు పంచాంగములను పట్టుకొన్నారు. పెళ్ళికి అర్థము చెప్పకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది జ్ఞానమగునా?


బ్రాహ్మణుడు :- పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా! మా వలననే హిందూసంస్కృతి మిగిలివున్నది కదా! 


చండాలుడు :- ఊ....... మీకు హిందూసంస్కృతి అన్న పదమునకు అర్థము తెలుసునా? హిందూ సాంప్రదాయములను సర్వనాశనము చేసినది మీరు కాదా! నేడు మీ అసమర్థతవలన హిందూమతములోని ఎన్నో కులములవారు ఇతర మతములలోనికి పోయారు. ఏమీ తెలియని అమాయక యువకులను, మనము హిందువులమని హిందూధర్మములను కాపాడుకోవాలని, పరమతములను ద్వేషించాలని కొన్ని హిందూసంఘముల పేరుతో ప్రోత్సహించినది మీరు కాదా! నేడుగల హిందూ సంఘములకు మతతత్త్వమును నేర్పారుగానీ, హిందూధర్మములు ఇవియని తెలిపారా? మీకు విరుద్ధముగ మాట్లాడిన హిందువులనైన పరమతస్థులుగా చిత్రీకరించ లేదా! హిందూధర్మములులేవో తెలియని హిందూసంఘములు గ్రుడ్డిగా హిందువులనే హింసించలేదా! ఆదిశంకరాచార్యులకంటే ఎక్కువగా హిందూ ధర్మములకు వివరముచెప్పే గురువును, విపులముగా భగవద్గీతను వ్రాసిన గురువును, హిందూమతములోనే ఎంతో పెద్దజ్ఞానులచేత ఇది నిజమైన జ్ఞానమనీ ప్రశంసింపబడిన గురువును, మీరు తయారుచేసిన హిందూ సంఘములు గుర్తించకపోవడమేకాక, మేము ఏమీ చేయుచున్నామను ఆలోచనే లేకుండ గురువుగారు వ్రాసిన భగవద్గీతను నడిరోడ్డులో మీరు తగులబెట్టారు. కాదయ్యా! కాల్చినవారు. అందులో ఏముంది అని చూచారా? మనము ఎవరిని అవమానిస్తున్నామని ఆలోచించారా? అంతగ్రుడ్డిగా హిందువులు హిందువుల మీదికే దాడి చేయుచున్నారంటే ఇదంతా మీచలవకాదా! ఈ రోజు మా స్ఫూర్తితో భగవద్గీత శ్లోకాలను అనర్గళముగా చదివే ఇతర మతస్థులను చూస్తున్నాము. మీ చలువతో భగవద్గీత అంటే ఏమిటో తెలియని హిందువులను ఎందరినో చూస్తున్నాము. ఇదంతయు ఎవరి వలన జరిగినది. మీరు తయారు చేసిన హిందూసమాజములో దేవుడు అనినా, సృష్టికర్త అనినా అర్థముకాక, ఈ పదములు ఇతర మతస్థులవని మనవి కావంటున్నారు. అదినుండి ఉన్న సృష్ఠికర్త అను పేరును, దేవుడు అను పేరును నిన్న మొన్న పుట్టిన ఇతర మతములవారికి లీజుకిచ్చినట్లు అవి మనవికావంటున్నారు. ఇలాంటి హిందూసమాజమునకు పునాదివేసినది మీరు కాదా! తాచెడ్డకోతి వనమెల్ల చెరిచినట్లు, మీరు అజ్ఞానులై పోయి హిందూసమాజమునే అజ్ఞానమువైపు నడిపించారు. మహోన్నతమైన జ్ఞానము కల్గినవారై పూర్వపు ఇందువులుండెడివారు. నేడు తమ ధర్మమును తామే గుర్తించలేని హిందువులు దైవభక్తిని వదలి దేశభక్తిని కల్గియుండాలంటున్నారు. చివరకు దేశభక్తి కూడ పోయి మతభక్తి ఏర్పడినది. దానివలన అజ్ఞాన హిందువులమై పోవడమేకాక, మనమే మత హింసలను ప్రోత్సహిస్తున్నాము. ఇదంతయు చూస్తే హిందూసమాజములో అధర్మములు పూర్తి చెలరేగి పోయాయి. అధర్మములను అణచివేయుటకు నేడు ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద గురువుగారు వస్తే, మీ స్వార్థబుద్ధితో అద్వైతము హిందువులదని, త్రైతము ఇతర మతస్థులదని నమ్మించారు. ఆదిశంకారాచార్యుని అద్వైతము పూర్తిగా తప్పని పూర్వము నాలాంటి చండాలుడు వాదించి గెలిస్తే, ఆనాడు శంకరా చార్యుడే చండాలుని కాళ్ళుపట్టుకొని నమస్కరించి ఓడిపోయానన్నాడు. ఆ విషయము బయటికి తెలిస్తే బాగుండదని, శివుడు చండాలుని వేషముతో వచ్చియుంటే, శంకరాచార్యుడు ఆయన కాళ్ళకు నమస్కరించారని కప్పిపుచ్చుకున్నారు. ఇప్పటికైన వేదాలు మన ప్రమాణ గ్రంథములుకాదు భగవద్గీత మన ప్రమాణ గ్రంథమని నమ్మి జ్ఞానమును తెలిసి హిందూత్వ ధర్మములేవో ప్రజలను


----


తెలుసుకోనివ్వండి.


ఇంతచెప్పినప్పటికి అసూయతో అర్థము చేసుకోలేకపోతే నీవు ఎప్పటికి మాదిగవానివే. చెప్పింది అర్థము చేసుకొని ఆచరిస్తే నిజమైన బ్రాహ్మణునివవుతావు. నమస్తే...


ఎవరు దేవుడు.


ఎల్లయ్య, గిరి అను ఇద్దరు భక్తులు స్టేజిమీద దేవుని గురించి వాదోపవాదములు చేయుచుందురు. ఎల్లయ్య, “ఆదిపరాశక్తియే దేవుళ్ళందరికి పెద్దయనీ, ఆమెవలననే త్రిమూర్తులైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు పుట్టారనీ, దేవతలందరికీ పెద్ద ఆదిపరాశక్తియే” అని వాదించుచుండును. గిరి "దేవుడు పురుషునిగానే ఉండును, స్త్రీ ప్రకృతి స్వరూపిణి. అందువలన పరాశక్తి అందరికీ తల్లివంటిది ఆమెకు భర్త అయిన దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడు" అని అన్నాడు.


ఎల్లయ్య :- దేవతలందరికీ పెద్దయిన విష్ణువుకే ఆమెతల్లి అయినపుడు విష్ణువుకంటే ఏ దేవుడు పెద్దలేనపుడు ఆదిపరాశక్తియే కదా అందరికీ పెద్ద.


గిరి :- ఆదిపరాశక్తి అయిన ఆమెకు కూడ భర్తగలడు. ఆయనే అసలైన దేవుడు. ఆయననే కొందరు సృష్టికర్తయని, కొందరు పరమాత్మయనీ, కొందరు దేవుడని అనుచున్నారు.


ఎల్లయ్య :- నారాయణమూర్తి అయిన విష్ణువునే దేవుడని అందరూ అంటున్నారు కదా! ఆయనను పుట్టినంచిన ఆదిపరాశక్తియే కదా పెద్దది.


గిరి :- పరాశక్తికి పుట్టినవాడు సృష్ఠింపబడినవాడే కానీ సృష్టికర్త కాదుకదా! అటువంటపుడు విష్ణువును దేవుడని సృష్ఠికర్తయని ఎలా అనాలి?


ఎల్లయ్య :- అయితే నీ దేవుడు ఎవడో చెప్పు? ఎక్కడుంటాడో చెప్పు? ఏమి చేస్తుంటాడో చెప్పు?


గిరి :- ఎవడని చెప్పను! ఆయనకు పేరేలేదు, ఆకారము అంతకూలేదు, ఎక్కడుంటాడని చెప్పను? ఆయన అంతటా వ్యాపించి, అంతటా ఉండువాడు. ఆయన ఏమీ చేయడు. తన సంకల్పముతోనే ప్రకృతియే అన్నీ చేసి పెట్టుచున్నది. నిజానికి ఆయనెవరో భూమిమీద ఎవరికీ తెలియదు.


ఎల్లయ్య :- ఆయనెవడో ఎవరికీ తెలియనపుడు ఆయనతో మనకేమి పని?


గిరి :- మనము జీవులము కనుక, శరీరమను జైలులో చిక్కిన వారము కనుక, ఆయనశక్తిని మనము పొందనిదే, ఎవడూ దేహ ఖైదునుండి బయటపడడు కనుక, ఆయనే దేవుడు కనుక, ఆయనను తెలుసుకొనుటయే ప్రతి మనిషికి ముఖ్యమైన పని.


ఎల్లయ్య :- అటువంటి దేవుడు ఒకడున్నాడని పూర్వము ఎవరికైనా తెలుసునా? పూర్వము ఆయనను ఎవరైనా పూజించారా? గిరి :- పూర్వము పరమాత్మను గురించి చాలామందికి తెలుసు. అందువలన త్రేతాయుగములోనే శ్రీరాముడు, రావణుడు,


-----


మానవాకారములేని గుండును దేవుని గుర్తుగా చేసి పూజించారు. అంతకుముందు సృష్టి ఆదిలోనే విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులు, వారికే తెలియని దేవునికొరకు ఎంతో తీవ్రముగా యోచించారు.


ఎల్లయ్య :- ఏమిటీ త్రిమూర్తులు కూడ ధ్యానించారా?


గిరి :- అవును త్రిమూర్తులను కూడ పుట్టించినవాడే సృష్టికర్తయిన దేవుడు. ఆ దేవున్ని గురించే పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథమైనభగవద్గీత కూడ చెప్పిది.


ఎల్లయ్య :- నేను నీ మాటను నమ్మను. ఇంతకాలము నేను పూజించిన పరాశక్తినే ఈ విషయము అడుగుతాను. వీలైతే అడుగు.


గిరి :-ఎల్లయ్య :- అమ్మా! పరాశక్తీ! దేవుడెవరు అను సంశయాన్ని నీవే తీర్చాలి. ఈ విషయము నాకే కాదు సమస్త మానవాళికి తెలియాలి. నీవు మమ్ములను కరుణించి, మాకు కనిపించి ఈ విషయము చెప్పు తల్లీ.


(అంతలో పరాశక్తి స్టేజి మీద కనిపిస్తుంది.)


పరాశక్తి :- నేను దేవుణ్ణి ఏమాత్రము కాదు, ఒక దేవతను మాత్రమే. దేవుడెవరో తెలియాలంటే భగవద్గీతలో నేనే దేవున్ని అన్న శ్రీకృష్ణుణ్ణి అడగండి.


గిరి :- గీతను బోధించిన కృష్ణా! ఈ విషయమును నీవే చెప్పాలి. మా మాటను ఆలకించి మా సంశయమును తీర్చుము.


(అంతలో స్టేజి మీద కృష్ణుడు ప్రత్యక్షమైనాడు)


కృష్ణుడు :- కనిపించే వాడు ఎప్పటికి దేవుడు కాడు. అందువలన కనిపించే కృష్ణుడు దేవుడు కాడు, దేవుడెవరో తెలియాంటే నారదుణ్ణి అడగండి.


(అంతలో అక్కడికి నారదుడు కూడ వస్తాడు)


నారదుడు :- దేవుడెవరు? అన్నది అన్నిటికంటే పెద్దప్రశ్న. ఇది సమస్త మానవులకూ తెలియని ప్రశ్న. ఎందరో, ఎన్నో మతాలను సృష్ఠించుకొని దేవుడు ఫలానా అంటున్నారు. మా వాదనే నిజమని అన్ని మతములవారు అంటున్నారు. వాస్తవానికి ఎవరి మాటలూ సత్యముకావు. దేవుడెవరన్న సత్యమును నానోట, నామాటగా దేవుడే చెప్పించడము నాభాగ్యమని తలచుచున్నాను. దేవుడెవరన్న వివరము భగవద్గీతలో ఈ శ్రీకృష్ణులవారే చెప్పుచు వచ్చారు. నన్నే మ్రొక్కు, నన్నే ఆరాధించు, నేనే సృష్ఠికర్తను, పరమ్మాతను అన్న కృష్ణుడు కూడ ఇపుడు నేను దేవుణ్ణి కాదంటున్నాడు. చావుపుట్టుకే లేని దేవుడు ఎవరన్నది ఎవరికీ తెలియదు. దేవుని విషయము తెలిసినవాడు దేవుడొక్కడే. ఆ విషయము మానవులకు తెలియాలంటే ఆయనే చెప్పాలి. ఆ సూత్రము ప్రకారము ఎచ్చట దేవుని ధర్మములు తెలియుచున్నవో, అచ్చట దేవుడే చెప్పుచున్నాడని తెలియాలి. దానిప్రకారము గీతలో సంపూర్ణ జ్ఞానమును తెలియజేసి, నేను తప్ప వేరు దేవుడులేడు అనిన కృష్ణుణ్ణి దేవుడనాలి. కానీ దేవుడు ఇంద్రియ అగోచరుడు అన్న సూత్రము ప్రకారము అయితే కంటికి కనిపించు కృష్ణుడు కూడ దేవుడు కాడు. అందువలన కృష్ణుడు కూడ నేను దేవుణ్ణి కాదు అంటున్నాడు. ఈ మాటయు


----


వాస్తవమే. పరస్పర విరుద్ధవాక్యములను దేవుడు చెప్పునా అని కొందరు ప్రశ్నించవచ్చును. దేవుడు ఎప్పుడూ అలా చెప్పడు. వాస్తవ మేమంటే కనిపించే కృష్ణుని శరరీములోనుండి, కనిపించక మాట్లాడే వాడే దేవుడు. గీతలో నీముందు, నీ వెనుక, నీలోను ఉన్నానని అర్జునునితో చెప్పినపుడు అర్జునునికి అనుమానము వచ్చి, మాట్లాడువాడు కృష్ణుడుకాదని తలచి, నీవెవరని ప్రశ్నించినపుడు, నేను నీకంటికి కనిపించువాడను కానని స్వయముగ దేవుడే కృష్ణుని రూపమునుండి చెప్పాడు. ఆ దినము దేవుని రూపము అర్జునునికి మాత్రమే తెలియబడినది. ఎప్పటికైన అదియే భవిష్యత్ కాలమునకు నిదర్శనము. దీనినిబట్టి కృష్ణుని రూపే దేవుడైతే ప్రత్యేకముగా కనిపించనవసరములేదు. కావున నేడు కృష్ణుడు, నేను దేవుణ్ణి కాదన్నమాట వాస్తవమే. అమ్మపరాశక్తి నేను దేవుణ్ణి కాదన్నమాటా వాస్తవమే.


కొందరు మనుషులు దేవుణ్ణి కృపామయుడు, ప్రేమమయుడు అంటున్నారు. ఆ మాట వాస్తవమా అని పరిశీలిస్తే, 'కృప' అనగా 'దయ' అని అర్థము. దయగాని, ప్రేమగాని ఇవి మానవుని తలలోని పండ్రెడు గుణములలో వేరువేరు రెండు గుణములు. దేవుడు గుణాతీతుడు అన్న సూత్రము ప్రకారము, దేవుడు ఏ ఒక్క గుణముగలవాడు కాదు. గుణము ఉంటే దానివలన కార్యము, కార్యము వలన కర్మ, కర్మవలన జన్మ తప్పక వస్తుంది. దేవుడు గుణములకు, కార్యములకు, కర్మలకు అతీతుడు కావున ప్రేమమయుడు, కృపామయుడు అన్న వాక్యము కూడ అతనికి సరిపోదు.


ఇకపోతే కొందరు దేవుడు పరలోకములో ఉన్నాడన్నారు. ఆ మాటను వివరిస్తూ, పరలోకము పైన ఆకాశములో ఉన్నదని, అక్కడినుండి దేవుడు తన దూతలను పంపి దేవుని విషయమును వారిద్వారా చెప్పించునని అంటున్నారు. పరలోకము ఎక్కడున్నది? ఎంతదూరములో ఉన్నది వారికే తెలియదు! ఎక్కడో ఉన్నాడంటే ఇక్కడ లేడనే కదా అర్థము? ఇక్కడ లేని వానిని, అక్కడ మాత్రమున్నవానిని కొంత ప్రదేశానికే పరిమితి చేయవచ్చును. ఈ మాట ప్రకారము దేవుడు పరిమితుడగును. దేవుడు అప్రమేయుడు, అపరిమితుడు, ఎల్లలులేనివాడు, ఏ కొలతకూ దొరకనివాడని, గీతలో దేవుడు చెప్పిన సూత్రముల ప్రకారము ఎక్కడో ఉన్నవాడు, ఇక్కడలేనివాడు దేవుడు కాడు.


మరికొందరు దేవుడు పరలోక రాజ్యములో నుండి తన ఇష్ట కుమారులను భూమిమీదకు ప్రవక్తలవలె పంపుచు, తన విషయము ప్రజలకు చెప్పునట్లు చేయుచున్నాడని అంటున్నారు. ఆయన గృహములో పని మనుషులు కూడ ఉన్నారని అంటున్నారు. దేవుడు సర్వవ్యాపి అను సూత్రము ప్రకారము, మరియు సర్వజీవరాసులకు నేను తండ్రిని అను సూత్రము ప్రకారము ఆయనకు జంతువులు, పక్షులు, మనుషులు అందరూ సంతతేకాని ఫలానావారే కుమారులను మాట వర్తించదు. పరలోకము ఈ లోకము లోనే కనిపించనిదని తెలియక ఎక్కడో ఉన్నదనుకోవడము పొరపాటు. అందువలన సర్వవ్యాపి, సర్వపిత అను సూత్రము ప్రకారము వారి అంచనా ప్రకారమనుకొన్నవాడు దేవుడు కాడు.


మరికొందరు కంటికి కనిపించేరాయినీ, రాజ్యమేలిన రాజును దేవుడనుచున్నారు. కనిపించే ఆవులో దేవుడున్నాడని కొందరు మ్రొక్కు చున్నారు. అలాగే గుర్తింపు పొందిన మనిషిలో దేవుడున్నాడని కొందరు మ్రొక్కుచున్నారు. ఇతరులను మ్రొక్కువారు ఇతరుల లోనికి, నన్ను మ్రొక్కు వాడు నాలోనికి, చేరునన్న సూత్రము ప్రకారము మనము మ్రొక్కువారందరు దేవుడుకాదని తెలియుచున్నది.


ఇన్ని చెప్పినా దేవుడెవరో చెప్పక “వీరు అనుకొన్నట్లు కాదు, వారు అనుకొన్నట్లు కాదు అంటున్నారు. మీకు తెలిసిన ప్రకారము దేవుడెవరో తేల్చి చెప్పలేదే” అని మీరనుకోవచ్చును. దానికి మా సమాధానమేమనగా! నేను చెప్పితే


-----


దేవుని జ్ఞానము అర్థమగును, కానీ దేవుడు అర్థముకాడు. దేవుడు అనిర్వచనీయుడు, మాటలకు అందనివాడు. అందులన దేవుని జ్ఞానమునే ఎవరైనా చెప్పవచ్చును. దేవుడు ఫలానా అని చెప్పలేడు. జ్ఞానము ప్రకారము చెప్పాలంటే, ఇక్కడ కనిపించక, సర్వమునకు సూత్రధారియై, జన్మకర్మకు అతీతుడై, మాయ జన్మయెత్తి, మాయ శరీరములోనున్న ఈ కృష్ణుణ్ణి దేవుడని చెప్పవచ్చును. ఇంతవరకు కృష్ణుడు కూడ దేవుడు కాదన్న మీరే, అదే నోటితో కృష్ణుణ్ణి దేవుడంటున్నారేమిటి అని చాలామందికి ప్రశ్న వచ్చియుండవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! మీరు కంటికి కనిపించేదే చూస్తున్నారు. కావున మీకు ఈయన దేవుడుకానేకాడు. నేను కంటికి కనిపించని దానిని, నాకున్న నేత్రములతోకాక, అనేత్రముతో చూస్తున్నాను, కావున నాకు ఈయనే నిజమైన దేవుడు. సంపూర్ణ జ్ఞానమును తెలిసి మరొక జ్ఞాననేత్రము మీరు సంపాదించుకొన్న రోజు, మీకు నిజమైన దేవుడెవరో తెలియగలరు.


మీరు దేవుణ్ణి తెలియాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి. నేనే దేవుణ్ణి అని ఒకచోట, నేను దేవుణ్ణికాదని మరొకచోట, నేనే అన్నీ చేయుచున్నానని ఒకచోట, నేనేమీ చేయలేదని మరొక చోట, నేను పుట్టేవాడినే కాదు అని ఒకచోట, నాకు అవసరమొచ్చినపుడు పుట్టుచున్నానని మరొకచోట పరస్పర విరుద్ధ వాక్యములను చెప్పిన దేవుణ్ణి కనుగొనండి. ఇక్కడ పరస్పర విరుద్ధ వాక్యములు దేవుని వాక్యములై ఉండునా అని కొందరికి నా మీద అనుమానము రావచ్చును. ప్రశ్న పుట్టించి, వెదికించి, జవాబు దొరికించడము దేవుని విధానము. అందువలన ప్రశ్నతో ఆగవద్దండి. జవాబు కొరకు వెదకండి, అంతటితోనే ఆపకండి, పూర్తి జవాబు దొరికే వరకు వెదకండి అప్పుడు తెలుస్తాడు దేవుడెవరో!


ముఖ్యముగా చెప్పునదేమనగా! మీకు దొరికిన కొంత జవాబుతోనే గోడకట్టుకొని కూర్చోకండి. ఎక్కడ ప్రశ్నరాని జవాబు దొరుకునో, ఎప్పుడు ఎవరూ ఎదురాడని జ్ఞానము దొరుకునో, అప్పుడే దేవుడెవరో తెలియబడును. కానీ, ఇప్పటి కాలములో దేవుడే దిగివచ్చి, ఈ కృష్ణునిగా చెప్పినా వినక నాది ఫలానామతమని, నామాటే వినవలెనని అనుకొనుచుందురు. అట్టివారు వ్యర్థులగుదురు. మతాలకు అతీతముగా యోచించండి. మతము హద్దులో మాట్లాడకండి. దేవునివద్దకు చేరడానికి మతములో మార్గము దొరకదు. మతాతీతునివైనపుడే మార్గము దొరకగలదు.


నాకీ అవకాశమును కల్గించిన ఈ మాయ కృష్ణునికి, దేవదేవుడైన ఈయనకు నేను నమస్కరించుచున్నాను. నేను దేవుడుకాని కృష్ణునికి మ్రొక్కక, దేవుడైన కృష్ణునికే మ్రొక్కుచున్నాను. ఇదే నా సందేశము.


సృష్టికర్త, పరమాత్మ శ్రీకృష్ణునకు జై !!!.


మూఢ పండితులు.


అది ఒక యజ్ఞ కార్యక్రమము. అందులో కొందరు పండితులు యజ్ఞము చేయుటకు పూనుకొన్నారు. యజ్ఞము ప్రారంభమవుచున్నది. పండితులు వారివారి మంత్రోచ్చాటనలో నిమగ్నమైనారు. ఆ యజ్ఞము పేరు "భూ మాతా యజ్ఞము” అంతా హడావిడిగా ఉంది. అక్కడికి ఒక బిక్షగాడు వచ్చి అడుక్కుంటాడు. అక్కడి పండితులు బిక్షగాడిని కసురు కొంటారు. బిక్షగాడు మొండిగా ఉంటాడు. అంతలో ఒక హేతువాది వచ్చి మాట్లాడను మొదలుపెట్టును. హేతువాది :- ఏమి మనుషులయ్యా మీరు? వాడు ఆకలికొని కడుపు మంటను అపుకోలేక, ఏదో ఒకటి ఇవ్వమని అడిగితే కసురుకొని పొమ్మంటారా? పుట్టినప్పటి నుండి నెయ్యిని చూడనివారు, నెయ్యి రుచి ఎట్లుంటుందో తెలియనివారు,


----


ఈ దేశములో చాలామంది కలరు. డబ్బాలు డబ్బాలు నెయ్యి అగ్నిలో పోసే బదులు, ఒకకేజీ నెయ్యి ఇటువంటి బీదవానికి ఇస్తే, ఇచ్చినందుకు మీకు పుణ్యము, తీసుకొన్నందుకు అతనికి సంతోషమైనా ఉంటుంది. ఇటు పుణ్యానికిగానీ, అటు పురుషార్థమునకుగానీ సంబంధము లేని పనిని మీరు చేస్తున్నారు.


1) పిల్లవాడు ఏడుస్తుంటే అన్నము పెట్టలేని ఆర్థిక ఇబ్బందులలో ఎందరో ఉండగా, భక్తి అను పేరుతో దేవతల మెడలో బంగారం, దేవతల గుడులలో బంగారం నింపడము సాటిమనిషి చేయదగిన పనేనా? 2) ఎదుటివాడు అడుగుచున్నా పిడికెడు అన్నము పెట్టకుండా, అడగని మూగదేవతలకు, తినని మొండిరాళ్ళకు రుచులతో కూడిన నైవేద్యములు పెట్టడము మంచిదా? 3) మీరు చేసే యజ్ఞములలో వృథాగా కాల్చు గుడ్డలు, బంగారు, నెయ్యి, ధాన్యములను ఇతరుల ఆహారమునకు ఉపయోగిస్తే ఎంతమంచి పని అగునో కొంతయినా యోచించారా?


1) బిడ్డ పెళ్ళికి అరతులము బంగారం కొనలేని తండ్రులు ఎందరో ఉండగా, కొన్ని కేజీల బంగారం మోయుచున్న ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.


2) చంటిబిడ్డకు పాలులేక డబ్బులు పెట్టి కొనితెచ్చి తాపలేక, బాధపడు తల్లులు ఎందరో ఉండగా, వందలలీటర్ల పాలు నెత్తిన పోయించుకొను ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.


3) కట్టుకొనుటకు ముతకగుడ్డలు కూడ లేక, చలికి బాధపడు బీద వారుంటే వెచ్చని గుళ్ళళ్ళో పట్టువస్త్రములు కట్టిన ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.


4) తిండి, గుడ్డ లేని మనుషులు ఎందరో ఉండిన ఈ దేశములో తిండి, గుడ్డ, బంగారమూ ఉన్న దేవతలు ఎందరో గలరు. తిండి గుడ్డలు బంగారు బాధలుపడే మనిషికి అవసరమా? బాధలు లేని దేవతలకు అవసరమా?


మాకంటే మించిన జ్ఞానులులేరను భావముతో మీరున్నారు. మాలాంటివారు నిజము చెప్పితే నాస్తికులని, హేతువాదులని మమ్ములను అంటారు. మీకు బుద్ధి చెప్పే జ్ఞానులు త్వరలోనే వస్తారు.


(అంతలో తెల్లనిచక్రములు నుదిటి మీద ధరించిన నలుగురు (భటులు) అక్కడికి వస్తారు. వారి చేతులలో కొన్ని వ్రాతల బోర్టులు కలవు. ఆ సమయములో ఒక నిశ్శబ్దము ఏర్పడుతుంది. మంత్రములు చదువుచున్న పండితుల గొంతులో శబ్దమురాలేదు. వారు నోరు అల్లాడించినా గొంతులు మూగ బోయినవి. వచ్చిన వారు గద్దించి పండితులను నోరు కూడ మెదపకుండ చేశారు.)


భటులు :- మూర్ఖపండితులారా! మీ నోర్లు పడిపోయిననూ, మీకు ఇంకా బుద్ధిరాలేదు. శబ్దము రాకున్నా ప్రయత్నించి నోరు అల్లాడిస్తున్నారు. నోరు మూయండి.


పండితులు :- (చేతితో సైగ చేయుచు) మీరు ఎవరు అన్నట్లు అడిగాడు.


భటులు :- మేము జ్ఞానులము. మీ మూఢత్వమును చూచి మీకు బుద్ధి చెప్పనువచ్చాము.


పండితులు :- (అంతలో ఒకడు తమ నోరును చూపి మాకు మాట వచ్చేటట్లు చేయమని ప్రాధేయపడుతాడు.)


భటులు :- (అంతలో ఒక భటుడు) నీకు మాటవచ్చేటట్లు చేస్తాము. మా మాటవింటావా?



----


పండితులు :- ఊ..ఊ.. అని మూల్గుచు వింటాను అని సైగ చేశాడు.


భటులు :- మాలో దైవశక్తి అయిన జ్ఞానశక్తియుంటే, మాశక్తి వలన వీరి కర్మకాలిపోయి నోటమాట వచ్చునుగాక. అని అంటూనే పండితులకు నోట మాటలు వచ్చాయి. మీరు యజ్ఞము చేయుచున్నారు కదా! యజ్ఞమంటే నిజార్థము తెలుసా?


పండితులు :- తెలుసా అంటే కొంత తెలుసు.


భటులు :- ఏమి తెలుసో చెప్పండి?


పండితులు :- దేవతలకు ప్రీతికొరకు, దేవతలకు మనమిచ్చు వస్తువులు చేరుటకొరకు యజ్ఞము చేస్తున్నాము.


భటులు :- దేవతలా! ఎవరా దేవతలు! తమకంటే గొప్ప ఒక దేవుడు ఉన్నాడని, వారే దేవుణ్ణి భక్తిగ మ్రొక్కుచుంటే, అసలైన దేవుణ్ణి వదలి వేరే వారికి దేవతలని పేరుపెట్టి, మీరు యజ్ఞములు చేయడము జ్ఞానమంటారా?


పండితులు :- మేము వేరే దేవతలకు యజ్ఞము చేయలేదు, భూమాతకు చేస్తున్నాము.


(అంతలో విచిత్రశబ్దము ఏర్పడినది. అట్టహాసము చేయుచు శరీరమంతా మట్టినిండిన వ్యక్తి అక్కడికి వచ్చాడు.)


భూమి :- ఓరీ పండితులారా! నేను భూమిని మాట్లాడుచున్నాను. మీరు అధర్మమైన యజ్ఞములు చేయడమేకాక, నన్ను కూడ కలుపుకొని నాపేరుతో యజ్ఞము చేయుదురా! యజ్ఞమే ఒక పెద్ద అధర్మమూ, అజ్ఞానమూ అయితే, అందులో నన్ను కూడ ఇరికించి భూమాతాయజ్ఞమనీ, నాపేరు పెట్టి ఎందుకు చేయుచున్నారు.


పండితులు :- భూమాతాయజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని, ప్రజలు సుఖముగా ఉంటారని చేస్తున్నాము.


భూమి :- ఆహా ఇంతటి మోసమా? మీరు పండితులని పిలిపించు కొనుటకు తగినవారేనా? నాపేరు చెప్పి ప్రజలను మోసము చేస్తారా? నాపేరు పెట్టి యజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని నేను ఎవరితోనైనా చెప్పానా? నేను ఎవరికీ చెప్పని విషయమును మీరెందుకు చెప్పుచున్నారు? నీకు యజ్ఞము చేయమని నీతో చెప్పానా? నీతో చెప్పానా? చెప్పండి.


పండితులు :- లేదు తల్లీ! మమ్ములను క్షమించు.


భూమి :- ఏమిటి నేను తల్లినా? నాపేరు భూమాతనా? ఏమీ తెలియని ప్రజలు, మీమాటలువిని నన్ను ఆడదానిగా లెక్కించుకోరా? ఎవరు చెప్పారు. నేను స్త్రీనని చెప్పండి.


పండితుడు :- ప్రకృతి స్త్రీ స్వరూపమని భగవద్గీతలో చదివాము.


భూమి :- ప్రకృతి అంటే ఐదు భాగములు తెలుసా! అందులో నేను ఒక్కణ్ణి, నేను ప్రకృతిలో ఒక భాగమైనంత మాత్రమున నన్ను స్త్రీగా లెక్కించు కోవడము పొరపాటు కాదా? నేను ప్రకృతిలో ఒక్కణ్ణి కావున మీరు నన్ను స్త్రీగా పోల్చి చెప్పుకుంటే, అదే పద్ధతి ప్రకారము అగ్నిని అగ్నిమాతా అనాలి కదా? అలా ఎందుకనలేదు. అగ్ని దేవుడని ఎందుకంటున్నారు. గాలిని గాలిమాత అనవచ్చును కదా? గాలి దేవుడనీ, వాయుదేవుడనీ ఎందు కంటున్నారు. గాలికి పుట్టినవాడు ఆంజనేయుడని చెప్పుకొంటున్నారే. అపుడు స్త్రీగా గాలినెందుకు చెప్పలేదు? ప్రకృతిలో భాగములైన అగ్నిని


----


అగ్ని దేవుడనీ, వాయువును వాయుదేవుడనీ పిలిచెడి మీరు, నన్నేమో భూమాత అని అంటున్నారెందుకు?


(అక్కడ ఒక విధమైన శబ్దము ఏర్పడగా అందరూ ఆశ్చరముగ చూస్తుండగా అక్కడికి వాయువు, అగ్ని ఇద్దరూ ప్రవేశిస్తారు.)


అగ్ని :- ఏమి భూమీ! నీవేదో మాపేర్లు చెప్పుచున్నావు.


భూమి :- అవును. నేను కూడ మీతోపాటు పురుషుణ్ణి కదా! వీరు నన్ను భూమాత అనీ, భూదేవి అని పిలుస్తున్నారు. అదే విషయమును గురించి వాయువును వాయుదేవుడనీ, అగ్నిని అగ్ని దేవుడని చెప్పే వీరు నన్ను మాత్రము ఆడదిగా చెప్పడమెందుకని ప్రశ్నించుచున్నాను.


అగ్ని :- భూమిమీద మేము ఎంతో జ్ఞానులమనీ, సర్వజ్ఞులమనీ చెప్పుకొనే వీరు, నిన్ను స్త్రీగానే పిలుస్తున్నారు. అంతమాత్రము తప్ప, నిన్ను ఎక్కడా వాడుకోలేదు. నన్నయితే ఏకముగా గుమస్తానే చేసినారు. వీరు యజ్ఞ గుండములో వేసే పట్టుచీరలు, నగలు మొదలుకొని ప్రతీదీ ఎవరికి సమర్పిస్తే వారికి చేర్చుటకు, ఆ వస్తువులను కాల్చి పొగరూపములోనికి మార్చి పంపాలట!


వాయువు :- నీవు పొగరూపములోనికి మార్చితే, ఆ పొగరూపములో ఉన్న వస్తువులను వీరు ఎవరి పేరు చెప్పి సమర్పించారో వారికి చేర్చాలట. వీరి లెక్కలో నేను కూడ గుమస్తానే! యజ్ఞాలు చేస్తే లాభాలు కలుగుతాయని భ్రమించి, మమ్ములను మీ పని మనుషులుగా ప్రచారము చేస్తారా? తెలియని ప్రజలు మేము అలాంటి పనులు చేసేవారమే అనుకోరా? ప్రకృతిలో భాగములైన మేము, దేవుని ఆజ్ఞ ప్రకారము పనిచేయుచున్నాము. కానీ మనుషుల ఆజ్ఞల ప్రకారము పనులు చేయడములేదు. మీరు చేసే యజ్ఞముల వలన, ప్రజలు మమ్ములను తప్పుగా అర్థము చేసుకొను అవకాశము గలదు. పండితులమని పేరుపెట్టుకున్న మీరు, మమ్ములను పని మనుషులుగా ప్రచారము చేయడము బావ్యమా! మీరు చేసే యజ్ఞములో అటు భూమి, ఇటు నీరుకంటే అగ్ని వాయువులైన మమ్మే ఎక్కువ వాడుకొను చున్నారు. ఇది మీకు ధర్మమా?


(అపుడు మరియొక వింతశబ్దము ఏర్పడును. అంతలో అక్కడికి నీరు కూడ వచ్చును.)


నీరు :- ఏమిటీ? ఇక్కడ భూమి, అగ్ని, వాయువు ముగ్గురూ ఉన్నారు. నాపేరును పలుకుచున్నారేమిటి?


అగ్ని :- భక్తి అను ముసుగులో వీరు చేయు అధర్మపనులను విమర్శి స్తున్నాము. మీస్వార్థము కొరకు మమ్ములను ఎందుకు దుష్ప్రచారము చేస్తున్నారని అడుగుచున్నాము.


నీరు :- వీరు పండితులమని పేరుకల్గి, భక్తి అను పేరుతో వక్రమార్గములో ప్రయాణిస్తూ, వీరు చెడిపోవడమేకాక, వీరిని అనుసరించు ప్రజానీకమంతా చెడిపోవునట్లు చేయుచున్నారు. పండు అనగా బాగా పరిపక్వత చెందినదని అర్థము. జ్ఞానములో బాగా పండినవారిని పండితులు అని అనవచ్చును. కానీ వీరివద్ద జ్ఞానము ఏమాత్రములేదు. అయినా పండితులమని ముసుగు తగిలించుకొన్నారు. భక్తీ, విశ్వాసము, విశ్వమునకంతా అధిపతియైన దేవుని మీద ఉండాలి. దేవుని మీదకాక చిల్లర దేవుళ్ళ మీద భక్తిని చూపుచు వారికొరకు యజ్ఞములనుచేయు వీరా పండితులు? వీరిలో చిల్లర దేవుళ్ళ భ్రమతప్ప అందరికి అధిపతియైన, అన్ని మతములకు పెద్దదిక్కు అయిన దేవుని మీద వీరి దృష్టి ఏమాత్రములేదు.



----


మహాభూతములని పేరుగాంచిన భూమినేమో భూమాతా, భూదేవి అని స్త్రీని చేశారు. అగ్ని, వాయువులనిద్దరిని అగ్నిదేవుడు, వాయుదేవుడని మగవారిని చేశారు. చివరకు నీరునైన నన్ను అటు ఆడకాకుండ, ఇటు మగకాకుండ చేశారు. నదిలో ఉన్నప్పుడు గంగమ్మ తల్లి అనీ అంటూనే, సముద్రములో ఉన్నప్పుడు సముద్రుడు అంటున్నారు. వీరు చెప్పుమాటలనుబట్టి, కొందరు ప్రజలు నన్ను ఆడకాక, మగకాక రెండింటికి తప్పినవాడని అనుకొంటున్నారు.


పుష్కరాలని పేరుపెట్టి, వీరి స్వార్థముకొరకు శుభ్రముగ పారుచున్న నన్ను అశుభ్రము చేయుచున్నారు. నాలో స్నానముచేస్తే మీపాపాలను కడిగేస్తానని ఎవరికైనా చెప్పియున్నానా? మీరు చేసుకొన్న పాపాలు నా నదిలో స్నానము చేస్తే పోవు అని తెలుసుకొనే దానికి, పుష్కరాలకు వచ్చి తిరిగిపోయే వారిలో కొందరికి నేను రోడ్డు ప్రమాదములు కలిగించి కాళ్ళు, చేతులు విరిగేటట్లు చేశాను. అప్పటికైనా పుష్కరాలలో శరీరము మీద మలినము తప్ప, తలలోని పాపములు పోవని ఎవరైనా తెలుసు కొంటున్నారా? అదియు లేదు. పాపములు పోతే అనుభవించేది ఉండదు కదా! అలాంటపుడు నాకు చేయి ఎందుకు విరిగింది? కాలు ఎందుకు విరిగింది? ప్రమాదము ఎందుకు జరిగింది? అని మేధావులు కూడ ఆలోచించడములేదు. ఎవరూ నిజము తెలుసుకోకుండా పుష్కరాల పేరుతో నన్నూ, యజ్ఞాలపేరుతో అగ్ని, వాయువులనూ బాధించు వీరి మీద, మాకు ఎంతో కోపమున్నా, మేము ఏమీ అనకుండా ఇంకా కొంతకాలానికైనా తెలుసుకుంటారులే అని కొంత ఓర్పుతోనే ఉన్నాము. వీరికి మాలాంటి వారికంటే రావణబ్రహ్మయే సరియైనవాడు. ఎందుకంటే ఆయన యజ్ఞములు చేయడము మంచిదికాదని కొట్టిచెప్పాడు.




(అంతలో ఒకరకమైన శబ్దము ఏర్పడుతుంది. అపుడు రావణ బ్రహ్మయే స్వయముగా అట్టహాసముగా అక్కడికి వస్తాడు.)


భటులు : అహో !రావణబ్రహ్మ ! త్రికాలజ్ఞాని బ్రహ్మజ్ఞాని, దైవంశ సంభూత !నవగ్రహములనే శాసించిన శాసనకర్త!

ధర్మప్రచారా! అధర్మశత్రూ మీకిదే మా వందనమ్.




రావణబ్రహ్మ :- :- ఏమిటీ! త్రేతాయుగములో బ్రహ్మ అని పేరుగాంచిన నన్ను, కలియుగములో ఈ విధముగ పొగడుటయా! కలియుగములో... అజ్ఞానాంధ కారములో... భ్రమించు మనుషులు, నన్ను దుర్మార్గునిగా... దుష్టునిగా... చెప్పుకొను తరుణములో, నన్ను సుత్తించుటయా... బహు ఆశ్చర్యముగ నున్నదే... ఎవరు మీరు?


భటులు :- మేము మీ అభిమానులము. త్రైతసిద్ధాంత ఆదికర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల శిష్యులము. మా గురువుగారు చెప్పిన జ్ఞానము వలన మిమ్ములను, మీ ఔన్నత్యమును గుర్తించాము.


రావణబ్రహ్మ :- లెస్సపలికితిరి! లెస్సపలికితిరి! యోగీశ్వరుడే మీకు గురువుగా దొరికినందుకు మీరు ధన్యులు. నొక్కివక్కాణించు సత్యమేమంటే మీ గురువు అగమ్య, అగోచర, అనర్థ, అపారుడు. ఆయన ఎవరికీ అర్థము కాడు, అంతే. అసలు విషయానికి వస్తాము, ఇపుడు ఇక్కడ భూమి, అగ్ని, వాయువు, నీరు ఇందరు కలిసి నా నామధేయమును ఉచ్చరించు కారణమేమిటి?


భటులు :- ఇక్కడ భూమాతా యజ్ఞమను కార్యము జరుగుచున్నది. దానిని వ్యతిరేకించుటకు మేము వచ్చాము. మాకు శ్రమలేకుండ సత్యము చెప్పుటకు మాకు సహాయకులుగా మహాభూతములైన భూమి, అగ్ని, వాయువు, నీరు





----


వచ్చారు. వారి మాటలలో మీ పేరు వచ్చింది.


రావణబ్రహ్మ :- అటులనా! సారాంశమర్థమైనది. మహాభూతములారా మీరేమన్నారు?


భూతములు :- మేము ఈ కార్యము తగదని, అజ్ఞానమనీ, అధర్మమనీ చెప్పుచున్నాము. స్వయముగా తమరే వచ్చారు, మాకు సంతోషము.


రావణబ్రహ్మ :- మదీయ నామధేయము రావణ! నవగ్రహముల ముఖతా బ్రహ్మ బిరుదాంకితుడనై, రావణ బ్రహ్మయని పేరుగాంచిన నన్ను, ఒక అసురునిగా భావించి, రావణాసుర అని పిలుచు ఈ కలియుగ వాసులను మూర్ఖులనాలో లేక మూఢులనాలో నాకే అర్థముకాలేదు.


నాలో అసురత్వమున్నదా?.. .అజ్ఞానమున్నదా?....... అధర్మమున్నదా?..... అహేతుకమున్నదా?..... ఏమి  చూచి నాకు రావణాసుర అని రాక్షస పేరు పెట్టారు?


అహర్ణిశలు ధర్మచింతనా పరుడనై... కర్మయోగా అనుష్టుడనై.... ధర్మకార్యాచరుడనై.... వేదఘోష వ్యతిరేఖినై.... యజ్ఞయాగాదుల బద్ద శత్రువునైన నన్ను.... అసురా! రావణాసురా! అని పిలుచు ఈ మూర్ఖ మూఢ మానవులకు మీరే కాదు నేనుకూడ బుద్ది చెప్పవలసిందే.


త్రేతాయుగములోనే నేను యజ్ఞములను వ్యతిరేఖించాను. వేద పఠనములను వ్యతిరేఖించాను. వాటిని అచరించు వారిని ముప్పుతిప్పలు పెట్టి మాన్పించాలని చూచాను. యజ్ఞముల విషయములోనే మొదట పిల్లవాడైన శ్రీరామునితో శత్రుత్వము పెంచుకొన్నాను. నేను ఎంత వ్యతి రేఖించినా, మనుషులు మాయప్రభావితులై యజ్ఞముల నుండి బయటికి రాలేకపోయారు. ఆనాటి ఆర్యులైన వారు నన్ను దుర్మార్గునిగా, స్త్రీలోలునిగా, కామాంధముతో సీతను అపహరించిన వానిగా ప్రచారము చేశారు. నా వయస్సు 90 సంవత్సరములుండగా, నాకు మనువరాలు వయసున్న సీతను కోరినానని దష్ష్ప్రచారము చేశారు.


ద్వాపరయుగములో స్వయముగా భగవంతుడే వచ్చి యజ్ఞములు బాహ్యముగా చేయునవికావు, దేహములోనే రెండు రకముల యజ్ఞములు ఉన్నాయని చెప్పినా, బాహ్యయజ్ఞముల వలన దేవుణ్ణి చేరలేరని చెప్పినా, ఆయన మాటలను మనుషులు ఖాతరు చేయలేదు. సాక్షాత్తు దేవుడేయైన కృష్ణుణ్ణి కూడ నిందించారు. ఈనాటికి ఆయన మీద మంచి అభిప్రాయము లేదు. భగవంతుడైన కృష్ణుణ్ణి జారుడు, చోరుడు అని ప్రచారము చేయుచున్నారు. కలియుగములో యోగీశ్వరుడైన ఆచార్య ప్రబోధానంద యజ్ఞముల వలనగానీ, వేదపఠనములవలనగానీ, దానముల వలనగానీ, తపస్సుల వలనగానీ దేవుడు తెలియబడడని చెప్పుచూ, గీతను ఆధారముగా చూపుచున్నప్పటికి, హిందువులమని పేరుపెట్టుకొన్న వారికే నచ్చక, ఆయనను కూడ చెడుగానే చెప్పుకొంటున్నారు. త్రేతాయుగములో బ్రహ్మ అని పేరు గాంచిన నన్నుగానీ.... ద్వాపరయుగములో భగవంతుడని గుర్తింపు వచ్చిన కృష్ణున్నిగానీ.... వదలక, చెడుగా చెప్పుచున్న మానవులు, కలియుగములో యోగీశ్వరుడని పేరుగాంచిన ఆచార్య ప్రబోధానందను చెడుగా చెప్పకుండా వదులుతారా?


ఇటు నన్ను, అటు యోగీశ్వరులను మానవులుగా లెక్కించితే లెక్కించవచ్చు. మా మాటలను అజ్ఞానముగా





----


పోల్చితే పోల్చవచ్చు, మమ్ములను దుర్మార్గులుగా భావించితే భావించవచ్చును. కానీ సాక్షాత్తు దేవుని అవతారమైన కృష్ణుడు చెప్పిన మాటలనైనా కలియుగములోని మనుషులు నమ్మగలిగారా? కృష్ణుడు భగవద్గీతను బోధించుచు అందులో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయములో 28వ శ్లోకమున యోగి అయిన వాడు వేదపారాయణము చేయువారికంటే, యజ్ఞములు చేయువారికంటే, దానములు చేయువారికంటే, తపస్సులు చేయువారికంటే అధికుడనీ, వారి పుణ్యములకంటే అధికశక్తికలవాడనీ తెలియజేశాడు కదా!


విశ్వరూప సందర్శన యోగములో 48 శ్లోకమున మరియు 58 శ్లోకమున తపములచేతగానీ, దానములచేతగానీ, వేదాధ్యయనముల వలన గానీ, యజ్ఞముల వలనగానీ దేవుణ్ణి తెలియుటకు శక్యముకాదని చెప్పాడు కదా!


మేము హిందువులమని గొప్పగ చెప్పుకొను మీరు, హిందూ మతములో పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథముగ పేరుగాంచినదీ, దేవుడే స్వయముగా చెప్పినదీ అయిన భగవద్గీతను నమ్మరా?


దేవుని మాటను కూడ లెక్కించకుండా వేదములను పారాయణము చేయువారినీ, యజ్ఞములను చేయువారినీ, నా కాలములో తీవ్రముగా శిక్షించాను. యజ్ఞములను ధ్వంసము చేయించాను. అప్పుడు నేను చేసినది మంచిపనియని చెప్పుటకు ద్వాపరయుగములోని భగవద్గీత కూడ ఆధారముగా ఉన్నది.


ఇప్పటికైన మీరు బయటి యజ్ఞములను మానుకొని, దేవుడు చెప్పిన లోపలి యజ్ఞములను ఆచరించండి. మీ కర్మలను ఆ యజ్ఞములో కాల్చండి. మీ కర్మనిర్మూలనమైన రోజు, మీరు దేవునివద్దకు చేరవచ్చును. ఈ మాటలను లెక్కించక, మీ బుద్ధులుమానక, అట్లే యజ్ఞములు చేయుచూ ఉంటే నేను తిరిగి భూమిమీదకు రావలసి వస్తుంది. మీ యజ్ఞములను ధ్వంసము చేయవలసివస్తుంది జాగ్రత్త.



పండితులు :- మమ్ములను క్షమించండి. మీరు ఇంతమంది వచ్చి చెప్పేంతవరకు మేము చేయుచున్నది ధర్మమే అని నమ్మియుంటిమి. ఇపుడు మీ మాటలు విన్న తర్వాత, మేము ఇంతవరకు చేసినది అధర్మమే అని తెలియుచున్నది. ఇప్పటినుండి మేము కూడా యజ్ఞములు, వేదా ధ్యయనములు అధర్మమని ఇతరులకు తెలియజేస్తాము.


నేటికాలములో మీవలె చెప్పుచున్న అచార్య ప్రబోధానంద యోగీశ్వరుల మాటలనే వింటాము. ప్రేక్షకులైన మీరు కూడ నేడు ఎవరూ బోధించని అణగారిపోయిన ధర్మయములను తెలియజేయు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానమును విని తరించండి...


రావణబ్రహ్మకు...జై


ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు...జై




----


ప్రబోధానందం నాటిక.


(పురాణాల పూర్ణయ్య ప్రవేశించి తన చంకలోని భాగవతాన్ని చేతులలోనికి తీసుకొని పారవిప్పి కండ్లకు మూడుసార్లు అద్దుకొని అక్కడే వున్న కుర్చీలో కూర్చొని పఠనం మొదలుపెట్టును.)




:-


ఆ .వె.

 కృష్ణవాసుదేవం కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద

మిమ్ము జూడగంటి మీకృప గనుగొంటి అఖిలసౌఖ్య పదవు లందగంటి


ఆ .వె.

అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు

దా భక్తి తోడ జదివిన సంసార దుఃఖరాసి బాసి తొలిగిపోవు


పూర్ణయ్య: (ఇంటిలోనికి వేణు ప్రవేశించగానే పూర్ణయ్య చూచి ఇలా అంటున్నాడు) ఒరేయ్! వేణూ ఇదేనా నీరాక? మొన్న ఉదయం వెళ్ళిన వాడివి ఇపుడా ఇంటికి వచ్చేది? ఇంట్లో పనులూ, పాటలు విడిచిపెట్టి జ్ఞానం, యోగం, ఆత్మా, పరమాత్మా అనుకుంటూ ఏదో ఆశ్రమానికి పోతుండావంట. మీ నాయన కాటమయ్య ఇప్పుడు నిన్ను చూచాడంటే నీతోలుతీసి తప్పెట వాయిస్తాడు, నీవు ఆశ్రమానికి పోయింది నిజమేనాంట.


వేణూ :- నిజమే తాతయ్యా! నేనొక ఆశ్రమం చేరి అక్కడున్న గురువును ఆశ్రయించి జ్ఞానము తెలుసుకుంటున్నాను. పూర్ణయ్య :- :- ఓరి బడుద్దాయివెధవా! చంకలో గొర్రెను పెట్టుకొని మందంతా వెతికినాడంట ముందెవరో నీయట్లాంటోడు. భారత, భాగవత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు తిరగవేసి నిత్యం పఠించి అందులో సారాన్ని గ్రహించి, అందరికి అనర్గళంగ మాట్లాడి అర్థం చెప్పే, మీ తాతయ్యను నేను ఇంట్లో ఉండగ, జ్ఞానంజ్ఞానం అంటూ ఎక్కడో ఆశ్రమాలకు పోయి, గురువులను ఆశ్రయింప వలసిన కర్మేమిబట్టిందిరా నీకు. నన్ను అడుగు నీకు ఏ విషయం కావలసిన వివరించి చెప్పుతాను. నాకంటే తెలిసిన వాడా ఆ గురువు?


పద్యం.

సి:

ప్రహ్లాద చరితంబు ఆహ్లాదకరముగా

భక్తులకుందెల్ప భక్తిపరుడ

వామనునవతార నైనంబు ప్రజలకు

భక్తమార్కండేయ భవ్య చారిత్రంబు

 తనివితీరగ జెప్పు ఘనడునను

 ఘన యజామీళుని ఘట్టంబు గట్టిగా 

 చదివి యర్థము జెప్పు చతురయుతుడ



-----




తే॥గీ॥ 

అష్టాదశ పురాణంబుల నిష్టగాను

తరచి దెల్పెడినట్టి నీ తాతనుండు

వేరు ఆశ్రమ గురువిద్య గోరెదేల

కుర్ర మనవడ చాలింక వెర్రిమాను.


వేణు :- ఓహెూ అలాగున తాతగారు ఐతే విను


తము*


తే॥గీ॥ 


నీవు జెప్పు పురాణముల్ నిజముగాదు


శాస్త్రవిది గొప్ప దెప్పుడు సత్యముగను 

పుక్కిటి పురాణములండ్రు బుధులువాని 

ముక్తి త్రోవను జూపవో ముసలి తాతా.


పూర్ణయ్య :- హవ్వ! హవ్వ! ఎంత మాటంటివిరా శుంఠ మనువడా! పురాణాలన్నీ అబద్దాలా, శాస్త్రసమ్మతం గానివా! అసలు పుక్కిటి పురాణాలా? శివశివా! ఎంత అపచారం, ఎంత అపచారం. ఓ శ్రీమన్నారాయణ మూర్తీ! నీ విలాసాలకు నిలయమైన పురాణాల్ని తప్పుబట్టిన ఈ కుర్రకుంకను క్షమించు. ఓరేయ్ బడుద్దాయ్! ఇదేం పొయ్యేకాలంరా నీకు, శ్రీవిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానుని విరచితము, భక్తశిఖామణియైన బమ్మెర పోతనగారు రచించిన మహాపవిత్రమైన పురాణాన్ని దోషాలెంచితే, కాశీలో గోవును చంపినంత పాపమొస్తుంది! తప్పని ముక్కు, చెంపలేసుకో.


వేణు :- ఓ నాతండ్రికి తండ్రిగారు! తప్పని నేనే ముక్కు చెంపలేసు కోవలయునా, అర్థపర్థము లేకుండా అడ్డ ద్రోవలు చూపించే కల్పిత పురాణాల్ని నీలో జీర్ణింప చేసుకొని, తాజెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు ప్రజలకు బోధించి, వారిని కూడా పెడద్రోవలు పట్టిస్తుది మీరుకాదా! ఆశ్రమాలకు పోయి అసలైన ధర్మాలు తెలుసుకొంటున్న నన్నే తప్పంటావా? 


పూర్ణయ్య :- తప్పా! తప్పున్నారా! తర తరాలనుండి మన హిందువులకు పూజ్యనీయమై, భక్తిగా ఆరాధించే పురాణాల్ని, యదార్థానికి నిలువవనీ, కల్పితాలనీ నోటికి వచ్చినట్లు ప్రేలుతావురా! ఆశ్రమానికి పోయిన నీకు మీ గురువు బోధించిన జ్ఞానం ఇదేనా? వ్రేలడంత లేవు! నాకు ఇష్టమై నిష్టగా పఠించే పౌరాణిక గ్రంథరాజాన్ని నా ఎదురుగానే కాదంటవురా! 


వేణు :- నామాటకు సమాధానము చెప్పు, పురాణాలు వ్రాసిందెవరు మానవులే కదా! మరి వారిలో జ్ఞానం ఎంత ఉ ంటే అవి అంతే ఉంటాయి కదా! కవితాశక్తి ఎంతైనా ఉండి పెద్దకవులు కావచ్చును, కానీ వారిలో అసలైన జ్ఞానశక్తి ఉ ండాలికదా! ఏ జ్ఞానము లేకుండా, శాస్త్రబద్ధము కాకుండా చెప్పిన మాటలు హేతువాదం చేత ఖండింపబడతాయి. కావాలంటే నీవిప్పుడు చెప్పిన పురాణఘట్టాల్లోని కొన్ని అంశాలు యదార్థానికి ఎంత వరకు నిలువగలవో అడుగుతాను చెప్పగలవా?


పూర్ణయ్య :- ఓరి పిల్లపిడుగా! నా అనుభవములో పదోవంతు లేదు కదరా నీవయస్సు. పిల్లవచ్చి గ్రుడ్డును వెక్కిరించినట్లు నన్నే పరీక్షిస్తావురా! నీవి పనికిమాలిన ప్రశ్నలుంటాయి. ఆ ఆ కానీ. ఏంటివో ఆ ప్రశ్నలు రానీ బయటకు.


వేణు :- నేనడిగిన ప్రశ్నలకు నీవు సరైన సమాధానము చెప్పకపోతే?


పూర్ణయ్య :- నీవు అడిగే బోడిప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనా! ఓరేయ్ నాపేరేంటనుకున్నావు పురాణాల పూర్ణయ్య,





----


సమస్త పురాణాల్ని కాచి వడగట్టినవాణ్ణి, నీ సందేహాల్నే తీర్చకపోతే, ఇదిగో నిత్యం భక్తితో పఠించే ఈ పురాణాలను ఏటిలో పారవేసి ఎవ్వరికి చెప్పకుండా పురాణ సన్న్యాసం చేస్తాను సరేనా!


వేణు :- సరేగాని నీవు చెప్పింది నమ్మమంటావా?


పూర్ణయ్య :- (భాగవతం తలపై పెట్టుకొని) ఈ భాగవతం సాక్షిగా చెప్పుతున్నాను. మాటతప్పితే ఏమంటివిరా ముసలిగాడిదా అను.


వేణు: ప్రహ్లాద చరితలో ఒక ఘట్టంలోని అంశమును అడుగుతాను చెప్పు. హిరణ్యకశిపుడు తనకు చావులేకుండ వరాలు పొందడానికి తపస్సు ఎవరిని గూర్చి చేశాడు? ఎక్కడ చేశాడు? ఎన్ని సంవత్సరాలు చేశాడు.


పూర్ణయ్య :- :- ఓస్ ఇవేనా నీ సందేహాలు, హిరణ్యకశిపుడు తనకు చావు రాకుండ ఘోరమైన అడవిలో, బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరాలు తపమాచరించాడు నాయనా.


వేణు :- హిరణ్యకశిపుడు అడవులలో పదివేల సంవత్సరాలు తప మాచరించి తిరిగి ఇంటికి చేరునప్పటికి, తన కుమరుడైన ప్రహ్లాదుడు ఐదు సంవత్సరముల బాలునిగా ఉన్నట్లు ఆ చరిత్రలో ఉందిగదా! మరి హిరణ్యకశిపుని భార్య ఎప్పుడు గర్భవతియైనట్లు?


పూర్ణయ్య :- తనభర్త తపస్సుకు పోయే ముందు అయివుంటుంది.


వేణు :- తపస్సుకు పోయే ముందు అయివుంటుందా! అలా జరిగివుంటే పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తిరిగివచ్చిన హిరణ్యకశిపుని కుమారునికి ఐదు సంవత్సరములెలా ఉంటాయి? ఐతే ఆయన భార్య లీలావతి వేల సంవత్సరాలు గర్భాన్ని మోసి కుమారున్ని కన్నందంటారా? ఇలా ప్రపంచము లో ఎక్కడైన జరుగుతుందా! ఇది చాలా విడ్డూరంగదా, ఇది నమ్మదగిన విషయమేనా?


పూర్ణయ్య :- (ఆలోచించి) అలా ఎట్లు జరుగుతుంది? వేలసంత్సరాలు స్త్రీ ఎక్కడైనా గర్భం మోస్తుందా, నవమాసాలు మాత్రమే కదా! అలా జరిగుండదు.


వేణు :- అలా జరిగుండకపోతే హిరణ్యకశిపుడు తపస్సుకు పోయిన తర్వాత, ఆయన భార్య గర్భం ధరించి ప్రహ్లాదున్ని ప్రసవించిందంటారా? అలా జరిగివుంటే పతివ్రతా తిలకమైన లీలావతి శీలానికి మాయనిమచ్చ వస్తుంది కదా! దీనికి పరిష్కారం ఎలా చేసి చెప్పుతావో చెప్పు.


పూర్ణయ్య :- (తలగోక్కుంటు ఆలోచనతో అటు, ఇటు తిరిగి) కొట్టేవురా దెబ్బ, ఎంత ఆలోచించినా ఈ పాయింటుకు సమాధానము దొరకలేదు. ఒరేయ్ నేను బుద్ధి తెలిసినప్పటి నుండి పురాణాల్ని శోధిస్తున్నానుగానీ, ఈ సంగతే అర్థము కాలేదు. ఇది చాలా అర్థరహితముగ యదార్థ విరుద్ధంగా ఉందని ఒప్పుకుంటున్నాను నాయనా


వేణు :- ఒప్పుకుంటున్నావు కదా! ఇంకొక విషయం అడుగుతాను, గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో శ్రీహరి అయిన విష్ణుమూర్తి ఎక్కడున్నట్లు కవులు వర్ణించారో తెల్పు తాత.


పూర్ణయ్య :- (హీన స్వరముతో) అలాగే వివరిస్తాను నాయనా విను (కింది పద్యం గట్టిగా చదువును మొదలుపెట్టును)





----




మ. అల వైకుంఠ పురంబులో నగరులో నామూల సౌధంబుదా 

పలమందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో

 త్పలపర్యంక రమావినోది యగునాసన్న ప్రసన్నుండు వి

 హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై.


వేణు :- ఏమీ వైకుంఠమనే పురంలో, ఒక వీధిలో, ఒక మూలగల మేడలో, శేషపాన్పుపైన, లక్ష్మీదేవితో వినోదములాడుతూ, సంతోషముగా ఉన్నాడ నియేగా ఆ పద్యములోని అర్థము. సరే మరి ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కుమారున్ని నీ శ్రీహరి ఎక్కడున్నాడని అడిగినపుడు


కం॥

యిందుగల డందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే.


అని వల్లించినాడే, ఈ రెండు విధానాల్లోను ఏ దాన్ని నమ్మ మంటావు? ఒకచోట వైకుంఠపురంలో ఉన్నాడని, ఒకచోట ఎక్కడ చూచినా ఉన్నాడని తెలిపే ఈ పురాణకవుల ఏ మాట నిజమైందంటారు తాతగారు?


పూర్ణయ్య :- ఓరి నీదుంప తెంచ! పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు ఎట్లాంటి చిక్కుపాయింట్లు ఏరిపెట్టుకొన్నావురా. ఇదికూడ నీవు చెప్పినట్లు వాస్తవానికి దూరంగా ద్వంద్వ వైఖరిలో ఉంది. ఆలోచించి చూడగా పురాణాలలో అక్కడక్కడ ఇలాంటి అసత్య విషయాలున్నట్లు నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది.


వేణు :- అప్పుడే ఏమైంది తాతారావుగారూ! ముందుంది ముసళ్ళ పండుగ, ఇంకో పాయంటడుగుతాను చెప్పండి. వామన పురాణములో వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానంగా యాచించాడు ఆయన ఇచ్చాడు. మరి వామనమూర్తి, ఆ దానమిచ్చిన భూమిని ఎలా పుచ్చు కున్నానడో వివరిస్తారా!


పూర్ణయ్య :- :- ఏముంది నాయనా? ఆ వటుడు ఆకాశానికి పెరిగి ఒక పాదంతో భూగోళానంత కొల్చి ఆక్రమించుకొన్నాడు. రెండవపాదం అంబర వీధినంతయు కొల్చుకొన్నాడు.


వేణు :- మూడవపాదంతో ఏమి కొల్చుకొన్నాడు.


పూర్ణయ్య :- :- అదే చెప్పుతున్నాను విను నాయనా! మూడవపాదం కొల్చుకొనుటకు ఏమి లేనందున, ఆ సంగతి బలిచక్రవర్తిని అడిగితే నా తల మీద పెట్టమన్నాడట, అలానే చేసి ఆయన్ని పాతాళానికి త్రొక్కేశాడంట.


వేణు:- ఆ! ఆగు తాతయ్యా ఆగు. ఒకటవపాదంతో భూమినంతా కొలుచుకొన్నపుడే బలిచక్రవర్తి కూడ ఆ పాదం క్రిందనే కొలువబడ్డాడు. మూడవపాదము ఏమి పుచ్చుకొన్నాడో చెప్పండి.


పూర్ణయ్య :- చెప్పడానికి ఏముంది? నాబొందవుందా! భలేచిక్కు పాయింట్లు అడిగి చీకాకు పెడుతున్నావు.


వేణు :- బాగా ఆలోచించు తాతగారు. మోక్షము కావలనుకొనే వారు శాస్త్రబద్దమైన ధర్మాలు తెలుసుకోవాలి, కానీ





----


శాస్త్రసమ్మతంగాని పుక్కిటి పురాణాలను పట్టుకొని ప్రాకులాడితే చివరకు మిగిలేవి చిక్కులు చీకాకులే. పురాణాలు కేవలం కాలక్షేపానికి పనికివస్తాయి, కానీ కర్మ కాల్చుటకు ఉపయోగించే జ్ఞానం ఉండదు.


పూర్ణయ్య :- (తలపంకించి) నిజమే నాయనా నిజమే! చిన్నవాడవైనా నా కళ్ళు తెరిపించావు. నాకు ఇప్పుడు బుద్ధివచ్చింది, బాగా అర్థమౌతున్నది. నీవే అటువంటి ప్రశ్నలతో పురాణాల్లోని బండారాలన్నీ బయటికి లాగకపోతే, మిగిలిన నా జీవితకాలం వాటితోనే వ్యర్థం చేసుకొనేవాణ్ణి, అసలు నీకు ఇటువంటి పాయింట్లు తెలిపిన మహానుభావుడెవరు? వేణు :- ఇంకెవరు మా గురువే.


పూర్ణయ్య :- ఆహా! ఆయన నిజంగా భగవత్సరూపుడే, లేకుంటే ఎంతో తార్కిక జ్ఞానముతో ఇంతవరకు ఎవ్వరూ విమర్శించని పురాణాలను, శాస్త్ర సమ్మతంగా విమర్శించి, అందులోనున్న అసహజమైన కవితాశైలిని అందరికీ తెలిసేలాగున చేశాడు. ఆయన పేరేమిటి? ఆయన ఆశ్రమం నామమేమిటో తెలుపు నాయనా! నేను కూడ ఆయన్ను దర్శించి కృతార్థుడనవుతాను ఇటువంటి గొప్ప విజ్ఞానియైన గురువును నీవు సేవిస్తున్నందుకు నీ జీవితము ధన్యమైంది నాయనా. నాకు కూడ ఇప్పుడు మోక్షప్రాప్తికి ఉపకరించే జ్ఞానం తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ


 తే॥గీ॥ పరమపదమును జేర్పంగ తరముగాని 

 పుక్కిటి పురాణముల నమ్మి నిక్కముగను

కాలమంతయు రిత్తగా గడిపితేను

సత్యధర్మంబు లెరిగించు శాస్త్రమేది.


వేణు :- తాతయ్యగారు నిజమైన యోగవిధానాలు తెల్పు గ్రంథము కావలయునంటే వినుము.


పద్యం : కం|:


నిక్కమగు ధర్మమార్గము

చక్కగ నెరిగించునట్టి సత్ శాస్త్రంబున్

యెక్కడో వెదకగ నేలను

మక్కువగను గీతయొకటె మహిలో తాతా.


పూర్ణయ్య :- ఏమి నాయనా భగవద్గీతయా! అదికూడ పురాణాంతర్గత మైన గ్రంథమే గదా?


వేణు :- ఏ పురాణంలో ఉందంటారు.


పూర్ణయ్య :- మహాభారతములో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించినదే కదా!


వేణు :- ఆ! అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. భారత, రామాయణాలు పురాణాల్లోకి చేరవు. అవి ఒక ఇతిహాసగాథలు. పురాణాలు వేరు, ఇతిహాస గాథలు వేరు, శాస్త్రములు వేరు.


పూర్ణయ్య :- నేనంతలోతుగా ఆలోచించలేదు నాయనా, ఇక ఇప్పటి నుండి పురాణాల గొడవలు మాని, నీవు చెప్పినట్లుగా భగవద్గీతను భక్తిగా పఠించి, పరమార్థతత్త్వాన్ని గ్రహించి పరంధామానికి దగ్గరౌతాను. నీకు చెప్పిన మాటప్రకారం ఈ పురాణపుస్తకాలను ఇప్పుడే కట్టగట్టి గంగలో పారేస్తాను. (అని భాగవతం చేతులలోనికి తీసుకొని) ఓ పురాణ పుస్తకముల్లారా! నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మిమ్మేపఠించి, ఆరాధించినాను. మీ వలన





---


ఉపయోగము లేదని ఈనాడే తెలుసుకొన్నాను. ఇంక ఇప్పటితో మీకూ, నాకూ రుణం తీరిపోయింది (అని భాగవతాన్ని తన భూజము పైనున్న వల్లెలో మూటగట్టుకొని నెత్తిమీద పెట్టుకొని పోవుచుండగా)


వేణు :- (పూర్ణయ్య చేయి పట్టుకొని) తాతాజీ గారూ, ఆగండి! మీరంత బాధగా పురాణపుస్తకములను గంగలో పారవేయవలసిన పనిలేదు. ఏమీ తెలియక మూఢత్వములోవున్న ఆజ్ఞాన మానవుల్ని భక్తిమార్గలోనికి మళ్ళించ డానికి ఈ పురాణములు కొంతవరకు ఉపకరిస్తాయి. కావున వాటిని అట్లే ఉంచుకోండి.


పూర్ణయ్య :- అబ్బా బ్రతికించావురా బాబూ, ఏండ్ల తరబడి కష్టపడి సాధించుకున్న పురాణ విద్య పూర్తిగ పనికిరాకుండ పోయిందే అన్న బాధను తగ్గించావు.


వేణు :- తాతా ఇకనుండి అయినా భగవద్గీతను భక్తిగా పఠించి, అందులోని సారాంశమును గ్రహించుటకు ప్రయత్నించు ఫలితముంటుంది. అందులో నీకేమైన అర్థంకాని విషయాలుంటే నన్నడిగితే మా గురువు ద్వారా తెలుసుకొని నేను నీకు తెల్పగలను.


పూర్ణయ్య :- నాయనా! వేణూ అజ్ఞానమనే అంధకారంలో ఉన్నవారికి జ్ఞానవెలుగును ప్రసరింపజేసే మహాధర్మాల్ని ప్రబోధజేసి ఆనందం కల్గజేసే మీ సద్గురుని నామధేయమేమి?


వేణు :- తాతయ్యగారు నీవిప్పుడు పల్కిన వాక్యంలోనే మా గురువు పేరువుంది. అది నీకర్థం కాకపోతే సమయము వచ్చినపుడు తప్పక చెప్పుతానులే. అదిగో అన్నయ్య చంద్రం ఇటే వస్తున్నాడు.


చంద్రం :- (అంతలో వేణు అన్నయ్య చంద్రమ్ ప్రవేశించి) ఏంట్రా వేణూ తాతామనవడు తత్త్వాయణంలో మునిగినట్లున్నారు.


పూర్ణయ్య :- ఔనురా! చంద్రం. ఈ వేణు ఈరోజు నాకు మంచి ఉపకారం చేశాడు నాయనా! అసత్యమార్గములో పయనించే నన్ను సత్య మార్గమునకు మళ్ళించాడు.


వేణు :- ఔనన్నయా! తాతయ్యగార్ని పురాణాల ప్రభావమునుండి తప్పించి ధర్మాశాస్త్రాలవైపు త్రిప్పగలిగినందుకు సంతోషిస్తున్నాను.


చంద్రం :- వాట్! ధర్మశాస్త్రమా! అది ఎందుకు ఉపయోగపడుతుంది మానవులకు?


వేణు :- ఎందుకేమిటన్నయ్యా! దేవున్ని తెలుసుకొనేటందుకు, ఆయనలో ఐక్యమయేటందుకు.


చంద్రం :- నాన్ సెన్స్ దేవుడు దేవుడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు. మానవ మేధస్సు మహోన్నతంగా పెరిగి పోయిందిరా బ్రదర్, ఆకాశంలో రయ్మని వేగంగా దూసుకుపోయే రాకెట్లను తయారు చేసి, చంద్రలోకములో పాదం మోపాడు మానవుడు, సబ్మెరైనులు తయారుచేసి సముద్ర అంతర్భాగంలో సురక్షితంగా ప్రయాణం చేయగల్గుతున్నాడు. మర మనుషుల్ని సృష్టించి మానవుడు సునాయాసంగా మహామహా కార్యాలు చేయగలుగుతున్నాడు. మానవుడు హైడ్రోజన్ అణుబాంబులవంటి మహా మారణాయుధాల్ని సృష్ఠించి సృష్ఠినే అరక్షణంలో అంతం చేయగల అనంత శక్తిని సంపాదించుకొన్నాడు. మానవుడు గుండెకు బదులు గుండెను, కంటికి బదులు కంటిని వేస్తున్నాడు. మానవుడు ఇవన్నీ ఎలా చేయ గల్గుతున్నాడు? అదే సైన్సు సైన్సు యుగంరా బ్రదర్! ఇది. ఇప్పుడు కూడా దేవుడు, దయ్యాలు, సాధులు, సన్యాసులు అని భ్రాంతితో ఉండే మీలాంటి వెర్రివారిని ఏమనాలో తెలియకున్నది.





----


వేణు :- ఓరేయ్ అన్నయ్యా! సైన్సు అని అరుస్తూ నీ సైంటిస్టు బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు. చివరకు మీ సైన్సు ఏమి సాధిస్తుందో తెలుసునా, ప్రపంచాన్ని ఏదో ఒకనాడు ఉపద్రవంలో ముంచివేస్తుంది. ప్రపంచశాంతి ఏనాటికీ కల్పించలేదు. అయినా మీ సైంటిస్టులు, డాక్టర్లు అంతా కంటికి కనిపించే వాటిని శోధించి సాధించగలరు. కానీ కంటికి కనిపించని తత్త్వరహస్యాలు మీకెలా తెలుస్తాయి?


చంద్రం :- కంటికి కనిపించని తత్త్వాలా ఏంటవి, ఎక్కడ ఉన్నాయి?


వేణు :- అవి మన శరీరములోనే ఉన్నాయి. జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం ఇవికాక అనేక గుణాలు బాహ్యనేత్రాలకు ఏమాత్రము కనుపించవు. కంటినితీసి కంటిని, గుండెను తీసి గుండెను వేయగల్గా డాక్టర్లు శరీరములోని జీవుణ్ణి తీసి వేరే జీవుణ్ణి ఎందుకు వేయలేకున్నారు. మరణ సమయములో జీవుడు కంటికి కనిపించకుండా ఎలా పోతున్నాడో కనిపెట్ట గల్గుతున్నారా? పుట్టిన శిశుశరీరములోనికి జీవుడెలా ప్రవేశిస్తున్నాడో చూడ గల్గుతున్నారా? ఆకలిదప్పుల్ని జయించగలుగుచున్నారా? ఆశను అదుపులో పెట్టగల్గుతున్నారా?


చంద్రం :- ఓరేయ్ బ్రదర్! నీవు చాలా పెద్దవాడివై పోతున్నావ్ ఇంతకూ నీవుజెప్పే దేవుడు, దేవాది దేవుడు ఉన్నారంటావా, ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు చెప్పుచూద్దాము?


వేణు :- భూమి తనచుట్టూ తాను తిరుగుచు సూర్యునిచుట్టు తిరుగు తూవుంది. అది ఏ శక్తి ఆధారంతో అలా తిరుగుతోంది? సూర్యుడు చంద్రుడు అనేక గ్రహాలు, నక్షత్రాలు శూన్యములో వ్రేలాడుతున్నాయి. అవి ఏ శక్తి ఆధారముతో నిలచివున్నాయి? సముద్ర జలాలు మేరతప్పకుండా ఉన్నాయి. ఏ శక్తి ఆధారంతో ఉన్నాయి? గాలి క్రమబద్దంగా వీస్తుంది. అలా ఏ శక్తి వలన జరుగుతుంది?




చంద్రం :- డియర్ బ్రదర్! వెరీ ఇంపార్టెంటు క్వశ్చన్ అడిగావురా నాయనా, నీవు ఇపుడు చెప్పిన వాటన్నిటినీ కంట్రోలింగ్ చేసేశక్తి ఒకటుంది. దానినే మాగ్నెట్పవర్ అంటారు. ఈ విశాల విశ్వమంతా దానికి లోబడి ఉంటుంది. దానినే తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఈ శక్తి కంటికి కనిపించకుండవున్నా సృష్టినంతా కంట్రోల్ చేస్తువుంటుంది. వేణు :- ఆ! అదేశక్తినే మేము పరమాత్మయని, దేవాది దేవుడని అంటుంటాము. జీవుడుగావున్న మనము ఆ శక్తిలోనికి లీనం కావడమే ముక్తి అంటాము. ఆ శక్తినే ఆది, మధ్యాంతములు లేనిదని, అవ్యయమైనదని ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయ్. చంద్రం :- వాటి! వాటి! చాలా ఆశ్చర్యంగా ఉందే! గురుత్వాకర్షణ శక్తినే మీరు పరమాత్మగ చెప్పుతున్నారా, ఐసీ అయితే నేనిప్పుడు పరమాత్మ ఉన్నాడని నమ్ముతున్నాను.


వేణు :- సంతోషమన్నయ్యా! ఇంకొక విషయం భూమిపై జన్మించిన ప్రతి ప్రాణికీ స్వయంగా కదిలేశక్తి ఎలా కలుగుతుందంటారు?


చంద్రం :- ప్రతి ప్రాణమున్న శరీరములోను వారి తలలో మెదడు ఉంటుంది. దానిలో ఒకశక్తి ఉంటుంది. దానినే విల్పవర్ అంటారు. దానివలన ప్రతి జీవరాసి కదలగల్గుతున్నాయి.


వేణు :- ఆ విలవర్ శక్తినే జ్ఞానులు ఆత్మశక్తి అంటారు. ఆ శక్తిని యోగా భ్యాసము ద్వారా తెలుసుకోవచ్చుననికూడా ఆత్మజ్ఞానులు తెల్పుతున్నారు.





---


చంద్రం :- వెరీ కరెక్ట్ బ్రదర్, ఇప్పుడు నీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నాను. అలా రెండు ఒకటిగా కలుస్తాయి. ఇటువంటి విషయాలు ఎలా నేర్చుకున్నావు?


వేణు :- మా గురుదేవుని వలన.


వాదించినప్పుడే సైన్సు, వేదాంతం


చంద్రం :- ఆహా! అయితే మీ గురువు ఆఖండమైన జ్ఞానిగ నాకు అర్థమౌతున్నది. ఆయన కూడా గొప్ప సైంటిస్టు అయివుంటాడని అను కుంటున్నాను. ఇటువంటి సిద్ధాంత ధర్మాలు నీకు ప్రబోధ జేసి, నిన్ను జ్ఞానిగ మార్చినందుకు నాకెంతో ఆనందం కల్గుతున్నది. ఆయన పేరేమిటి? ఎక్కడుంటాడో తెల్పితే నేను కూడ ఒకమారు ఆయనను కలుస్తాను.


వేణు :- ఆయన నామధేయం నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఆయన స్థలం, ఆయన పేరు తరువాత తెలుపగలను.


(అంతలో వేణు మామయ్య కామేశం ప్రవేశించి)

కామేశం :- ప్రవేశిస్తు పాట.




జీవుడెక్కడున్నాడో జెప్పరా అసలు

దేవుడెక్కడున్నాడో జెప్పరా

జీవుడెవడు? దేవుడెవడు?

వారికన్న పెద్ద ఎవడు?

చాటుమాటలన్ని మాని నీటుగాను జెప్పరా.  ॥జీవు.


చ॥ (1).


గడ్డాలను, మీసాలను ఘనముగా పెంచినోడ

కాషాయ బట్టలతో వేషాలు వేసినోడ

మోయనన్ని పూసాలు మెడనిండా వేసినోడ

వీబూధి రేఖలేన్నో ఇంపుగా పూసినోడ.  ॥జీవు.




చ॥ (2).


మాయ వదలి పోవునంచు మంత్రాలు జెప్పుతారు.

తలకర్మ తీరునంచు తాయెత్తులు గట్టుతారు

ముక్తి గోరి మీచెంతకు భక్తిగాను జేరితేను

బూటకాల ఎన్నొజెప్పి బూడిదిచ్చి పంపుతారు.  ॥జీవు.




చ॥ (3)


ఉపదేశ మిత్తుమంచు వూరూరా తిరుగుతారు

దండిగ ధనమిచ్చునోళ్ళ తన శిష్యులంటారు 

గొప్పస్వామి వంచు మ్రొక్క అబ్బరాని కుబ్బుతారు 

తత్త్వమిప్పి జెప్పమంటే తైతక్కలాడుతారు.





---


చంద్రం :- రావయ్య రా! దేవుడేలేడు, దేవుడుంటే చూపండి అని అందరి ముందు అరుస్తూవుంటావు నీనాస్థికవాదనికి పులిస్టాప్పడుతుంది రా.


కామేశం :- నా నాస్తికవాదానికి పులిస్టాప్ పెడతారా! ఎవరు ఎక్కడ, ఎక్కడ ఆ మగధీరుడు? నాముందుకువచ్చి నిలబడి మాట్లాడమను దమ్ముంటే.


వేణు :- కల్లు సారాయి త్రాగినావా కామేశం మామయ్య, అలా చిందులేస్తున్నావ్ ఆ మగధీరుణ్ణి నేనే.


కామేశం :- పిల్ల కాకికేమి తెలుసు తోడేలు దెబ్బ. నీవు నా నాస్తికత్వాన్ని నాస్తి చేయగల పురుష పుంగవునివా, నా మూడు ప్రశ్నలకు జవాబు చెప్పగలవా.


వేణు:- చెప్పగలిగితే?


కామేశం :- నీవు సరియైన సమాధానాలు చెప్పితే, ఇప్పుడే నా నాస్తికత్వాన్ని వదలి ఆస్థికత్వం చేపడతా. మొదటి ప్రశ్న జీవుడెవరు? ఎక్కడుంటాడు? ఏ పని చేస్తుంటాడు?


వేణు :- జీవుడు పరమాత్మయొక్క అంశమువాడే. అయినా ప్రకృతి ప్రభావానికిలోనై కర్మలో బంధింపబడివున్నాడు. జీవుడు ప్రతిప్రాణి తలలో గుణచక్రంలో, గుణాలమధ్యలో, వాటితో సంబంధము పెట్టుకొనివుండి గుణాలు చేయించే పనులయొక్క సుఖదుఃఖ కర్మలను అనుభవిస్తుంటాడు.


కామేశం :- జీవునికి పెద్ద ఎవరు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తుంటాడు?


వేణు :- జీవునికంటే పెద్ద ఆత్మయే, ఆత్మ సర్వశరీరాల్లోను తల మొదలు గుధస్థానము వరకు వ్యాపించిన బ్రహ్మనాడియందుండును. ఈ ఆత్మ సర్వశరీరాల చైతన్యకారణమై ఉంటూ కర్మప్రకారము శరీరముతో పని చేయిస్తుంటుంది. కామేశం :- ఆఖరు ప్రశ్న వీరిద్దరికన్నా పెద్ద ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఎక్కడుంటాడు?


వేణు :- వీరిద్దరికన్నా పెద్ద పరమాత్మ, సమస్త విశ్వమూ వ్యాపించి, ప్రకృతికధినేతయై, చరాచర ప్రకృతిని తన స్వాధీనమందుంచుకొని, సృష్టి, స్థితి, లయలకు కారణమైవుంటూ, గమనిస్తే మన శరీరమందే ఉన్నాడు.


కామేశం :- భేష్ అల్లుడూ! భేష్ ! నేనింతవరకు ఎందరో స్వాముల్ని, సన్యాసుల్ని, వేదాంతుల్ని తరచి చూచినాను. ఎవ్వరు చూచినా, నేనడిగిన ప్రశ్నలకు శరీరం బయట చెప్పుతారు. కానీ శరీరాంతర్గతంగా ఇంత సక్రమంగా చెప్పినవారులేరు. ఇంతటితో నేను నా నాస్తికవాదాన్ని కట్టి పెట్టుతున్నాను. కాని శరీరములోనే దేవుడు ఉన్నాడని నిరూపణగా చెప్పగలవా?


వేణు :- మామయ్యగారు, నీముక్కు రంధ్రాలలో పైకిక్రిందికి ఆడుతున్న శ్వాస ఎలా ఆడుతోంది, ఏ ఆధారంతో ఆడుతోంది?


కామేశం :- (ముక్కు శ్వాసను పైకి క్రిందికి ఆడించి) నేను పీల్చుకుంటున్నా బయటికి వదలుతున్నా,


వేణు :- ఇపుడు మెలకువలో ఉన్నావు కాబట్టి నీవు పీల్చుకుంటున్నావు వదలుచున్నావు, నీవు నిద్ర పోయినపుడు ఎలా ఆడుతుందంటావు?





----


కామేశం :- ఎలా ఆడుతుంది, ఎలా ఆడుతుందో తెలియదు.


వేణు :- తెలియదా మామయ్యా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మూడవస్థ లోను ఆత్మమూలంగనే శ్వాస ఆడబడుతుంది. ఆ ఆత్మను తెలుసుకొనేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ' ఆత్మే నీ శరీరములోని దేవుడు.


కామేశం :- ఆహా! అమోఘమైన రహస్యం తెల్పావురా అల్లుడూ. ఇటువంటివి దివ్యజ్ఞానియైన గురుముఖతా వచ్చివుంటాయి. ఇలాంటి జ్ఞాన విషయాలు ప్రబోధ చేసిన మీ గురువెవరో తెల్పురా, నేనుకూడ ఆనందంతో ఆయన్ని కలుసుకొని జ్ఞానం తెల్సుకుంటాను.


వేణు :- సరే! ముందు భోంచేస్తాం పద మామయ్య, తర్వాత చెప్పగలను అయినా నీవు అర్థముచేసుకుంటే, నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఉంది మా గురువు పేరు.

(అంతలో వేణు తండ్రి కాటమయ్య ప్రవేశించి)


కాటమయ్య: ఒరేయ్ వేణు, మొన్న ఉదయమంటూ వెళ్ళినవాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? ఇంతవరకు ఎక్కడ పోయావ్, ఏ ఘన కార్యాలాచరించావ్?


పూర్ణయ్య :- నాయనా కాటమయ్య! వేణుమంచి బుద్ధిమంతుడు అవుతున్నాడురా. గురు ఆశ్రమానికి వెళ్ళాడంట చక్కని దైవజ్ఞానం తెలుసు కొని వచ్చాడు.


కాటమయ్య :- ఏమిటి నాన్నా వీడు ఆశ్రమానికి వెళ్ళాడా! అట్లయితే వేదాంతంలోకి దిగినాడన్నమాట, ఒరేయ్ అడ్డగాడిదలాగా లక్షణంగా తిని పనీపాటా లేకుండా ఆశ్రమాలు, గురువులు అని తిరుగుతావుంటే కాపురం చక్కబడినట్లే.


పాట.

ప: 

పో పోర పొమ్మికన్ నీ ముఖం చూపించ

 రావలదు రాతగదు పో పోర పొమ్మికన్

చేనుల తోటల పనులు మాని

జ్ఞానం గీనం అంటూ నీవు

ఆశ్రమంబుల వెంట తిరిగెడి

ఆకతాయి వెధవ అల్లరినాకొడకా

తంతా! నడ్డివిరగ తంతా నీపండ్లు వూడగొడత

నీచర్మ మొలిచివేస్తా (అని వేణును తన్నబోగ).



(అంతలో వేణు తల్లి కనకమ్మ వచ్చి అడ్డుపడి).



కనకం :- ఏమండీ వాన్ని కొట్టకండి, నేను నచ్చ జెప్పుతాను. (వేణుతో) ఏమిరా వేణూ? మీ నాయనకు కోపం వచ్చే

పనులను ఎందుకు చేస్తావురా నాయనా!





----




పద్యం


తే॥గీ॥ ముసలి ముతకలు కోరెడి ముక్తి విద్య

 పడుచుప్రాయంబునందేల పట్టకయ్య

ఇలను సంసార మందునే గలదు సుఖము

వద్దు వద్దు సన్యాసి బ్రతుకింక ముద్దుతనయా.




వేణు :-అమ్మా! ఆశ్రమానికిపోయి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రానే, పెండ్లీ పెటాకులు లేకుండ, సన్న్యాసినై సత్రాలు, చావిళ్ళు చేరతాననుకున్నారా అదేం లేదు. మా గురువుగారు మాకు బోధించేదంతా రాజయోగ సిద్ధాంతం.


కాటమయ్య :- నీ పిండాకూడు సిద్ధాంతంరా, ఇరుగు పొరుగువాళ్ళను చూడు, ఎట్లా పనులు చేసుకుంటూ సంపాదించుకొని ఎలా బ్రతుకుతున్నారో, మానవుడై పుట్టినందుకు సిగ్గు మానముండాలిరా.


వేణు :- నాయనా! నేనేమి అల్లర చిల్లరగా తిరగలేదుగదా! భక్తి, జ్ఞానము, యోగాల గురించి తెలుసుకుంటున్నాను. అది తప్పంటే ఎట్లా.


కాటమయ్య :- తప్పే లేదంటావా తప్పుడునాయాలా.




తె॥గీ॥ ఇంత జెప్పిన విన నీ ఇచ్చరీతి

వెడలుచున్నను నాయాస్థి కడకు నీకు

చిల్లిగవ్వైన ఇవ్వను కల్లగాదు

ముందు జూపును గనుమింక మూర్ఖచిత్తా.


వేణు :- నాన్నగారు ఆస్థి, ఐశ్వర్యం అశాశ్వితమైనవి, పోయేటప్పుడు ఏమైనా వెంటగట్టుకొని పోతామా, అలానే కానివ్వండి. ఆస్థిపాస్థులు కర్మానుసారంగా కలుగుతాయి, కానీ జ్ఞానం మాత్రము శ్రద్ధానుసారంగా కలుగుతుంది. మీ నిర్ణయమదే అయితే జ్ఞానంకోసం వేటినైనా విడచేదానికి సిద్ధంగా ఉన్నాను.


కాటమయ్య :- అలాగైతే నీవన్నిటికి తెగించి ఉన్నావన్నమాట. పో! నీ ముఖమింక నాకు చూపించద్దు.




పాట.


పోపోర పొమ్మికన్ నీ ముఖమునాకింక చూపించ

రావలదు రాతగదు పో పోర పొమ్మికన్.


చ|| .తల్లిదండ్రుల మాటలు వినక

ఇల్లూ వాకిలి కల్లగదలచి

స్వాములు గీములు అంటూ నీవు

యేమో యేమో వాగుచునంటివి

కొడతా! కాళ్ళు విరగ కొడతా! నీ కీళ్ళు విరచివేస్తా! నీ వీపు బగులకొడతా!





----


(వేణుని కొట్టుటకుపోగా తల్లి కనకం అడ్డుపడి ఏమండీ కొట్టకండి, కొట్టకండి అని అడ్డురాగా కాటమయ్య భార్యను ఒకవేటు వేయగా క్రింద పడిపోవును)


పూర్ణయ్య :- (గప్పునలేచి) ఓరి కాటిగ! ఎంత పని చేస్తివిరా! వాడు ఆశ్రమాలకు పోతే ఏమి, నీకేం పోయ్యేకాలం వచ్చిందిరా, అన్యాయంగా అమ్మాయిని పడగొట్టావు. (కనకం మీదికి వంగీ అమ్మా కనకం కనకం అంటాడు.)


కాటమయ్య :- నేనేం చేస్తాను నాయనా! బడుద్దాయి వెధవ వేణుగాన్నీ కొట్టబోతే అడ్డువచ్చింది, దెబ్బతగిలి క్రిందపడిపోయింది. దానికర్మ నన్నేం చేయమంటావు.


కామేశం :- బావగారూ! ముందుగానే మీకు కోపం ముక్కుమీదుంటుంది. వేణు ఏం తప్పు చేశాడని, జ్ఞానార్జన మీ దృష్ఠిలో తప్పయితే మీకంటే మూర్ఖుడు ఈ లోకంలో ఉండడు. చెల్లాయిని నిష్కారణంగ దెబ్బకొట్టావు. (కనకంను పట్టుకొని అమ్మా చెల్లాయి, అమ్మా చెల్లాయి, అమ్మా చెల్లాయ్ లేమ్మా అని అంటాడు.)


చంద్రం :- (ప్రవేశించి) డామిట్ ఎంతపని జరిగింది నాన్నగారూ! ఈ మధ్య మీకోపం ఎక్కువవుతోంది, కోపం ఎక్కువవుంటే గుండెజబ్బు వస్తుంది. ఎప్పుడు చూచినా పనులు పనులని పడిచస్తువుంటావు.




కాటమయ్య :- అనండ్రా! అనండి. అందరూ నన్నే అనండి. ఈ కొంపలో అందరికీ నేను అలుసై పోయినాను, కానీలే నాయనా! మీ అమ్మ సంగతి జూడు (అందరు కలిసి కనకమ్మను పైకి లేపగా కనకమ్మ ఉన్నట్లుండి గట్టిగా అందర్ని విదిలించి పారేసి వెంట్రుకలు విరబోసుకొని ఆవలిస్తూ హూ హూ అని మూల్గుతుంది.)


కాటమయ్య : :- (భయంతో కూడిన అదుర్దాతో) ఒరేయ్ చంద్రం, ఒరేయ్ వేణూ! మీ అమ్మను చూడండ్రా ఇదేందో మాయ రోగమున్నట్లుంది. ఎవరైనా వెంటనే డాక్టర్ను పిలుచుకరండర్రా.


వేణు :- తండ్రిగారు! ఇది డాక్టర్లు నయంచేసే జబ్బుకాదు. ఇది ఒక గ్రహ చేష్ట.


కాటమయ్య :- ఏమిటీ గాలిచేష్టా! ఒరేయ్ అడగండ్రా ఎవరో? ఎందుకొచ్చి నారో? ఏమి కావాలో.


వేణు :- మీరంతా ప్రక్కకు తప్పుకోండి నేనడుగుతాను. అమ్మా అమ్మా ఏమైంది నీకు, ఎవరునువ్వు? చెప్పు తల్లీ చెప్పు నీకేంకావాలి.


కనకం : - (గట్టిగా ఒళ్ళు విరచుకొని) రేయ్! నేనురా, నేను మీ ముసలవ్వను మర్రెమ్మను.


వేణు :- నాయనా! మీ అమ్మగారంట ఎందుకు వచ్చినాదో అడుగు.


కాటమయ్య :- అమ్మా! తల్లీ ఎందుకు వచ్చావమ్మా, నీకేం తక్కువ చేసాము. ఏటేటా చీరలు, రవికలు పెడుతున్నాం, పెద్ద దినం చేసుకొంటున్నాం గదా.


కనక మరెమ్మ :- ఓరేయ్ కాటిగా చీరలు, రవికలు నాకెందుకురా? అయినా నాకవి పెడతారు, మీరేకట్టుకుంటారు. పెద్దదినమని చెప్పి అన్నివంటలు చేసుకొని మీరే దొబ్బి తింటారు. ఏదో మిమ్ములనందరిని చూచి పోతామని వచ్చాన్రా. 


పూర్ణయ్య :- ఒసేయ్ ముసలిముండా! బ్రతికినన్నాళ్ళు సాధించావు, చచ్చినాక కూడ సాధించడానికి వచ్చావా.





---


కనక మరెమ్మ : - ఒరేయ్ ముసలిముండా కొడకా నోరు మూసుకుంటావా లేదా?


పూర్ణయ్య :- దీనికి చచ్చినాక కూడ నామీద గౌరవం లేదే. కర్మ కర్మ సరే మూసుకుంటాను లేవే.


(నోరు మూసుకొని ప్రక్కకు పోవును)


కనక మరెమ్మ :- రేయ్ కాటమయ్యా! ఇందాక నుంచీ చూస్తున్నాను. నా చిన్న మనవడు వేణూగాని మీద కారాలు, మిరియాలు నూరుతున్నావు. వాడు ఎక్కడబోతే నీకేమి? ఎక్కడుంటే నీకేమి? వాడంటే నాకు చాలా ప్రేమ, ఇకముందు వాడినేమైనా అన్నావంటే నేను సహించను. మీ సంసారాన్నంతా చిన్నా భిన్నాం చేస్తాను. తెలిసిందా ఆ...


కాటమయ్య :- అమ్మా నాకు బుద్ధివచ్చింది. ఇకముందు వాడినేమీ అనను. బుద్ధిమంతుడై సంసారమన్న చేసుకోనీ, సన్న్యాసై చిప్పదీసుకొని దేశాలన్నా పట్టనీ, ఏమన్నంటే నీమీదొట్టు ఇంక పోతల్లి.


వేణు :- అవ్వా! ఇంక నీవు వెళ్ళిపో, వీళ్ళు నన్నేమన్నా భయపడను. అసలు నేనేం తప్పు చేశాను. తాగి తందనాలాడానా, జూదాలాడానా లేక వ్యభిచారం చేశానా అవేమి చేయ్యలేదే. నేను శ్రీ యోగ పీఠాధిపతి ప్రబోధాశ్రమ వాసియైన శ్రీశ్రీశ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గరకు పోయి జ్ఞానం తెలుసుకుంటున్నానంతే.


కనక మరెమ్మ :- ఏమీ! మీ గురువు శ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరులా! ప్రబోధాశ్రమమా! ఒరేయ్ నేవెళ్ళి పోతున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ స్వామి పేరు ఎక్కడ వినబడితే అక్కడ నేను క్షణమైనా ఉండడానికి వీల్లేదు వెళ్ళి పోతున్నాను, రేయ్ వెళ్ళిపోతున్నాను. (గట్టిగా అవలించి, తలవిదిలించి ఒళ్ళు విరచుకొనుచు దయ్యము విడచిపోవును) .


కాటమయ్య :- నాయనా వేణూ! మీగురు నామము మహాశక్తివంతమైందే! ఏమో అనుకున్నాను దయ్యాలు సైతం భయపడి పారిపోతున్నాయి. ఇక ఎప్పుడూ నిన్ను ఏమీ అనను, నీ బుద్ధి పుట్టినప్పుడు ఆశ్రమానికి పోయి వస్తూవుండు, ఇంటిపనులు చేస్తువుండు.


వేణు :- సంతోషం తండ్రీ, మీ అందరి మనసులు మా గురువుగారే మంచిగా మార్చినారు.


శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి (అందరూ జై అందరు).


త్రైత సిద్ధాంత ఆదికర్తకు  (అందరూ జై అందరు).

శ్రీ ప్రబోధాశ్రమ గురుదేవునికి (అందరూ జై అందరు).


సత్ సంపూర్ణం, ఓం తత్సత్.


త్రిమూర్తులు.


ఒక వైష్ణవుడూ, శైవుడూ ఒకరికొకరు ఎదురుపడుతారు. వారిరువురి సిద్ధాంతములు వేరువేరు కావడమూ, అనాదిగా శైవ, వైష్ణవ సిద్ధాంతముల మధ్య విబేధాలు ఉండడము వలన, వారిరువురికి ఒకరికొకరు సరిపడక మా దేవుడుగొప్ప అంటే, మా దేవుడు గొప్ప అని ఈ విధముగా వాదులాటకు దిగారు.





----


సీన్. నెం.1.


అడ్డనామం, నిలువునామం చెరొకవైపు నుండి వచ్చి ఎదురుపడతారు.


అడ్డనామం :- ఒరేయ్! నిలువునామము పొద్దుపోద్దునే నీ దరిద్రపు ముఖం కనిపించిందేంట్ర. ఈరోజు నా గతి ఎలా ఉంటుందో; ఏమో!


నిలువునామం :- నిత్యం అష్టాక్షరి మంత్ర నామస్మరణతో నారాయణుని మెప్పించిన గొప్ప భక్తులము మేమే! మమ్ములను నీవు అవహేళన చేస్తావా అప్రాచ్యుడా!


అడ్డనామం :- మీ అష్టాక్షరికంటే ముందు పుట్టిన పంచాక్షరి మంత్రమునే జపించిన ఆదిపీఠవారసులము. పంచాక్షరి మంత్రముతో పరమశివుణ్ణి మెప్పించగల మమ్ములను ఆక్షేపిస్తున్నావురా! నిలువు నామమా!


నిలువునామం :- దశావతారాలలో సృష్టిని కాపాడిన నా విష్ణుమూర్తియే నిజమైన దేవుడు. ముందు ఆ విషయమును తెలుసుకో!


అడ్డనామం :- ఆ..ఆ... శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు తెలుసా? అంటే అన్ని కార్యములకు శివుడే కారకుడు, ఆయనకు తెలియనిదంటూ ఏమీలేదు. అంతేకాకుండ, లోక క్షేమంకోసం విషమును తన గొంతులో దాచుకొని, ఈ లోకములోని జీవరాసులన్నిటినీ కాపాడాడు. లేకుంటే నీతాత, నీముత్తాత అందరూ ఆదిలోనే లేకుండాపోయి ఈ రోజు నీవుకూడా లేకుండా పోయేవాడివి, అటువంటి శివుని గూర్చి తెలుసుకొని నీవుకూడ అడ్డనామములు ధరించుకో! అన్ని కోర్కెలు తీర్చగల సమర్థుడు మా శివుడే అందుకే నిలువునామమును తీసేయ్.. తీసేయ్....


నిలువునామము :- ముందు నీవు మూసేయ్... మూసేయ్ అన్ని కోర్కెలూ తీర్చగల సమర్థుడు నా విష్ణువే, లోకరక్షకుడు కూడా నా విష్ణువే. పూర్వము భస్మాసురుడు తపస్సు చేసినపుడు ప్రత్యక్షమైన నీ శివుడు, ఆయన కోర్కెను తీర్చి ప్రాణాలమీదికి తెచ్చుకున్నపుడు, నా నారాయణుడే మోహిని అవతారందాల్చి నీ శివుడ్ని కాపాడాడు, జరిగిన విషయం తెలుసుకొని మాట్లాడు.


అడ్డనామం :- అరే నీకు, నాకు వాదనవద్దు ఇది మనతాత, ముత్తాల నుంచి వచ్చిన తెగని పంచాయితి, కాబట్టి ఎవరు నిజమైన దేవుడో ఆ దేవుళ్ళను అడిగి తేల్చుకుందాము.


సీన్ నెం.2.


(ఇరువురు, దేవుళ్ళ జాడకోసం అనేక స్వామీజీలను అడుగుతూ, దేశమంతా తిరుగుతూ చివరకు హిమలయాలకు చేరుకొని అక్కడ కొలువైవున్న త్రిమూర్తులను చూస్తారు.)


అడ్డనామం :- ఆహా! ఏమి నాఅదృష్టం! నేను ఆరాధించే పరమశివుడు నాకు కనిపించాడా? ఇది కలా? లేక నిజమా? తన్నుతాను గిల్లికుంటూ (శివ, శివ, శంకర)... పాట


నిలువునామం :- ఓహెూ హెూ! ఏమిఠీవి, ఏమిఠీవి నా నారాయణమూర్తిని చూసిన నేను, ఎంతో ధన్యుడని ఇందుగలడందుగలడు ఎందెందు చూసిన అందందే కలడంటారే, కానీ ఎక్కడెక్కడో వెతుకుతువుంటే ఇక్కడ దర్శన మిచ్చావా! నాతండ్రి...(పాట)





----


అడ్డనామం :- తండ్రీ, పరమాత్మా, శంకరా! నిన్ను చూచిన ఆనందములో అన్నీ మైమరచిపోతున్నానే, ఈ ఆనంద సమయములోనే నన్ను నీలో కలుపు కోగలవా తండ్రీ. ఈ జన్మలు ఇకచాలును, ఈ బాధలు ఇక చాలును, ఈ చరాచర సృష్టికి ఈశ్వరుడిగా పిలువబడుచున్న నీవేగదా అసలైన దేవుడివి. నిన్ను గూర్చి ఎన్నో పురాణాలలో విన్నాను. నీ మహిమలు ఎన్నో తెలుసుకున్నాను. ఎందరి కోర్కెలనో తీర్చిన మహానుభావుడివి నీవేకదా నిజమైన దైవానివి, మీ తర్వాత చరిత్రలో చెప్పుకుంటున్న విష్ణుమూర్తిని అసలైన దేవుడని ఈ నిలువు నామము వాడు అంటున్నాడు, తండ్రీ వీడికి నీవే అసలు దేవుడివని నీవైన చెప్పు.


నిలువునామం :- ఆ! ఏందయ్యా అడ్డనామం ఏందీ నీ కథ, మమ్ములను దబాయించి, నెగ్గుకొస్తున్నట్లు చేస్తున్నావు. ఇది మన ఊరు కాదు. నా నారాయణుడు నివశిస్తున్న ప్రాంతము. ఆయనకు కోపం వస్తే సుదర్శన చక్రముతో నీ తలను ఖండిస్తాడు. నా నారాయణుడంటే అసలైన దేవదేవుడు. అందుకే వైకుంఠనివాసుడుగా పేరొందాడు. మరి నీ శివుడు స్మశానవాసి ఆ సంగతి కూడ నీకు తెలుసో తెలియదో.


శంకరుడు :- చూడండి నాయనలార, సృష్టి ఆదినుండి కలహాలు లేని మాకు మీరే కలహాలు పెట్టేవారవుతావున్నారు. మీరు అనుకున్నట్లు నేను దేవుడినికాదు, దేవతను మాత్రమే. నేను కూడ పరమాత్మ చిహ్నమైన ఈశ్వరలింగాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాను. అదియే సృష్టికర్త అయిన దేవునికి కనిపించే గుర్తు కాబట్టి సృష్ఠి ఆదినుండి అన్యచింతన లేకుండ ఈశ్వర లింగాన్ని ఆరాధిస్తున్నాను. కాబట్టి మాములు శివుడునైన నాకు దేవత హెూదా కల్గింది. అంతేకానీ నేను సృష్ఠికర్తను కాదు. అందుకే నేను కూడ ముక్తి కోసమే బ్రహ్మయోగం చేస్తున్నాను.


అడ్డనామం :- ఏంటీ! నీవు ఈశ్వరలింగాన్ని పూజిస్తున్నావా! అంటే నీవు వేరు, ఈశ్వరలింగము వేరా? నీవే సృష్టికర్త అని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాను, ఎన్నో మౌనవ్రతాలు చేశాను, ఎంతో ధనము, కాలాన్ని వృథా చేశాను. కళు ్ళమూసుకొని ఎన్నో రోజులు నీకోసం తపస్సు చేశాను. మరి నీవు సగం కళ్ళు తెరచి యోగము చేస్తున్నావు, నీవు ఏమి యోగము చేస్తున్నావో నాకు కొంచెం కూడ తెలియడం లేదు శంకరా...


శంకరుడు :- అవును నాయన నేను కూడ ఎన్నో యుగాలుగా కళ్ళు మూసుకొని యోగం చేశాను. కానీ కలియుగం వచ్చినాక సగంకళ్ళు తెరుచుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంతా దొంగలే, మోసగాళ్ళే! దేవతలను గొప్పగా చెప్పుకుంటూ, పూజిస్తూ కూడ మా సొమ్మునే కాజేస్తున్నారు. ఎన్నో ఆలయాలలో నగలు, కిరీటాలు, హూండీలో డబ్బులు మాయం చేస్తున్నారు. కొన్ని ఆలయాలలో విగ్రహలనే దొంగిలించి విదేశాలలో అమ్ముకుంటున్నారు. అందుకే నా పరువు పోకూడదని, నా ఆస్తి అయిన పాదరక్షకులు, కమండలము, యోగదండము, నా వాహనమైన నందిని కాపాడుకోవడానికి సగం కన్నులతో చూస్తూ, అప్పుడప్పుడు యోగబ్రష్టుడనై దైవత్వమును చేరుకోలేక నానాపాట్లు పడుతున్నాను.


నిలువునామం :- చూసావా, చూసావా నీ శంకరుడే దేవున్ని కాను అని ఆయన స్వయాన చెబుతున్నాడు. ఇపుడైన తెలిసిందా నా నిజమైన దేవుడు. అందుకే విభూతి రేఖలు తీసి, నిలువునామము ధరించి మా సమాజంలో కలుసుకో..


బ్రహ్మ :- ఓరీ! నీచ మానవులార! ఏమీ మీ ప్రేలాపన? మా దగ్గరకు వచ్చినా మీ బుద్ధులు మారలేదే? భయం, భక్తి





----


లేకుండా మాట్లాడుచున్నారు. రాజకీయపార్టీల్లా వేషాలు, ఆచరణలు మారమంటున్నారు. మీకున్న భక్తి మీ స్వార్థంకోసమే కాని జ్ఞానం, ధర్మముకోసం కాదురా! పొండి. ఇక్కడ నుండి పొండి లేకుంటే నేను ఏమి చేస్తానో.


నిలువునామం :- నారాయణ! నారాయణ! నీవే కాపాడు. బ్రహ్మగారు మా మీదకు కోపంగా వస్తున్నారు. మీరే మమ్ములను కాపాడండి. నీహుండీలో ఎంతో డబ్బువేశాను, నావి నా కుటుంబ సభ్యులందరి తలనీలాలు సమర్పించినాము. నీ పుణ్యక్షేత్రములు అన్ని తిరిగాను, నన్ను కాపాడు స్వామీ.


విష్ణు :- ఏమిరా! పుణ్యక్షేత్రములు తిరిగావా? అంటే స్థలాలు ఎక్కడైన పుణ్యము చేసినవి, పాపము చేసినవి ఉంటాయా? మనిషే పాపాలు, పుణ్యాలు చేస్తుంటాడు. నీవు తిరిగినవన్నీ దేవతాప్రాంగణాలు, నిజమైన దేవుని ఆలయం దేహమే. పుణ్యక్షేత్రాలు అన్న పదాన్ని కట్టడాలకు, స్థలాలకు వాడకూడదు. ఇంకా ఏమి అన్నావు? హూండీలో డబ్బులు వేసావా? అవి ఏనాడైన నేను ఒక్క రూపాయైన ఖర్చుపెట్టానా? అవి నాదాక వచ్చినవా? నాకు 100/- హూండీలో వేసి లక్షరూపాయలు కోరుతున్నారు.


ఇంకా ఏమి చెప్పావు. నీవు, నీ కుటుంబ సభ్యులందరు మీ తల వెంట్రుకలను సమర్పించినారా? నెత్తిమీద సరుకే కదా మొత్తానికి చవకేకదా అని చెప్పినట్లు ఊరక పెరిగిన వెంట్రుకలను మాకు ముడుపులుగా ఇస్తున్నారు. మేము ఏమయినా సవరాల వ్యాపారం చేస్తున్నామా, అసలు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా మీకు? 


శంకరుడు :- వాళ్ళకి అటువంటి జ్ఞానవిషయాల మీద ఆసక్తి ఎందు కుంటుంది? కేవలం కోర్కెలమీదనే ధ్యాసంతా ఉంటుంది. మొన్నటికిమొన్న నా ఆలయానికి వచ్చినవారు కొందరిలో ఒకడు మా బావమారిదిని నీవు చంపేస్తే మా అత్తగారి ఆస్తి మొత్తం నాకు వస్తుంది. అట్లు చేస్తే నా తలవెంట్రుకలు ఇస్తానంటాడు. ఇంకొక విద్యార్థి పరీక్షలు సమీపించినా చదవడు. ఆటలు, పాటలు, అమ్మాయిలతో షికారులు చేసినవాడికి ఆ పరీక్షలన్నిటిలో నేను ఉత్తీర్ణుడును చేస్తే, నా గుడికివచ్చి గుండు గీయి స్తానంటాడు. ఇంకొకడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే వాళ్ల పై అధికారులనంతా శాసించే పెద్ద హెూదా కల్పిస్తే, తలనీలాలు అర్పిస్తా నంటాడు. ఇంకొక రాజకీయ నాయకుడు గెలిచిన మొదటిసారే పెద్ద మంత్రి కావాలంటాడు. వీళ్ళందరి కోర్కెలు తీర్చితే, నాకు వాళ్ళ తల వెంట్రుకలు ఇస్తారంట. ఇలా ఎందుకు తయరైనాము, అసలు జ్ఞానం అంటే ఏమిటి? జీవుడు ఎవరు? దేవుడు ఎవడు? అని ఎప్పుడైన ఆలోచించారా? మీరు పోయి ముందు జ్ఞానం తెలుసుకోండి.


అడ్డనామం :- స్వామీ! మీరు కూడ అలా కోపగించుకొని పొమ్మంటే ఎట్లా తండ్రీ. మాకు ఊహ తెలిసినప్పటినుండి మిమ్ములను నిజమైన దేవుళ్ళగా భావిస్తున్నాము, ఒక్కసారిగా మమ్ములను చీదరించుకోకుండ, అసలు విషయాలు తెలియజేయండి, నిజమైన దైవాన్ని తెలియజేయండి.


విష్ణు :- :- చూడండి నాయనాలార! మేము దేవతలము మాత్రమే, మీకు మాకు సృష్టికంతటికి అధిపతి ఒకే పరమాత్మనే. అందరమూ ఆయన బిడ్డలము కాబట్టి మీరు కూడ ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తే మీరు కూడ యోగులుగా తయారవుతారు. యోగులు దేవతలకంటే అధికులు. పూర్వము దుర్వాసుడు అనే యోగి నన్ను కోపంతో కాలితో తన్నితే, ఆయన ముందు నాశక్తి చాలక ఏమీ చేయలేక పోయాను. అంటే మనుష్యులు కూడ జ్ఞానమును తెలిసి ఆచరిస్తే యోగులుగా అయి దైవత్వాన్ని పొందుతారు.





---


నిలువునామం :- అటువంటి నిజమైన జ్ఞాన వివరము తెలియాలంటే ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? స్వామీ కొంచెం మాకు తెలియజేయండి.


శంకురుడు :- మేము చెప్పితే స్వార్థముతో చెప్పాడనుకుంటారు. బ్రహ్మగారికి భూలోకములో గుడిలేదు భక్తులు లేరు కావున ఆయననే అడగండి, నిస్వార్థముగా చెబుతాడు.


అడ్డనామం :- స్వామి బ్రహ్మగారు, మీరు అనుసరిస్తున్న జ్ఞాన విషయాలను గూర్చి చెప్పి మేము నిజమైన మార్గాన్ని తెలుసుకునేటట్లు జేయండి తండ్రి.


బ్రహ్మ :- నాయనలారా! మీ అజ్ఞానమునకు ఒకవైపు జాలి, ఒకవైపు కోపము కలుగుచున్నవి. అజ్ఞానమే అన్ని అనర్థములకు కారణమని మిమ్ములను చూచి తెలియుచున్నది. దేవునికీ, దేవతలకు తేడా తెలియక, ఎవరు దేవుడో, ఎవరు దేవతలో తెలియని అయోమయములోపడి, మీరు సృష్టించుకొన్న మతములలో మునిగి, ఇహములోనే ఉండిపోవుచున్నారు. మీరు ఎంతటి అజ్ఞానాంధకారములో ఉన్నారంటే, ఈ సకలసృష్ఠినీ బ్రహ్మ అను పేరుగల నేను తయారు చేశానను మూఢనమ్మకముతో ఉన్నారు.


వాస్తవమునకు ఈ సర్వసృష్ఠిని తయారు చేసినవాడే దేవుడు. సృష్టికర్త! పరమాత్మ, అధిపతి, ఆదికర్త అను పదములన్నియు దైవమునకు పర్యాయ పదములే! దేవుడు సృష్టించిన సకల జీవరాసిలో ఒకటైన మానవ జాతి రెండు రకములుగా విభజించబడినది. అవియే దేవజాతి, రాక్షసజాతి. జ్ఞానమున్నవారు ఈ రెండిటినీ గుర్తించవచ్చును. మరియు తాను ఏ జాతివాడైనదీ గుర్తించవచ్చును.


భగవద్గీతయందు “దైవాసుర సంప ద్విభాగ యోగము” అను అధ్యాయములో భగవంతుడు, దేవతల, రాక్షసుల యొక్క గుణములను చెప్పియున్నాడు. దాని ఆధారముగా దైవజ్ఞానము తెలిసినవారు దేవతలనీ, అజ్ఞానము కల్గినవారు రాక్షసులనీ చెప్పవచ్చును. అంతేకాక తెలుసుకొన్న జ్ఞానము పరిమాణమును బట్టి దేవతలకు కొన్ని హెూదాలు ఈయబడినవి. అవియే విష్ణు, ఈశ్వర, బ్రహ్మస్థానములు లేదా పదవుల హెూదాలు. అత్యధిక జ్ఞానశక్తి కలవానిని విష్ణువు అనీ, అక్కడినుండి జ్ఞానశక్తి తగ్గుకొలది ఈశ్వర, బ్రహ్మ మొదలగు దిక్పాలురు వరకు కలరు.


మానవులలోనే దేవతలు ఉన్నప్పటికీ, వారిని భూమిమీద ఎందుకు గుర్తించలేక పోవుచున్నారనే ప్రశ్న మీకు వచ్చును. దానికి సమాధానముగా గీతలో భగవంతుడు చెప్పినట్లు, దేవతలు అందరూ భూమిపైనే ఉన్నారు. కానీ అజ్ఞానులు వారిని గుర్తించలేరు. ఎందుచేతననగా మనకున్న స్థూల కన్నులతో చూచిన, అన్నీ మానవాకారములే కన్పించును. మానవుల యందున్న దైవత్వమును గుర్తించవలెనన్న జ్ఞానదృష్టి కావలెను. ఈ జ్ఞానదృష్టి లేకున్న దేవునికీ, దేవతలకు తేడా తెలియక కనిపించే ప్రతిదీ దైవమే అనుకొను ప్రమాదముకలదు.


ప్రస్తుతము మీ పరిస్థితి అదే! విష్ణు, ఈశ్వర, బ్రహ్మలనునవి జ్ఞానశక్తిని బట్టి పదవులనీ, ఆ పదవులు ఖాళీ అవుతూనే, అంటే ఆయా పదవులో ఉండేవారు మోక్షానికి చేరుకోగానే, ఆ పదవికి అర్హులైన జ్ఞానశక్తి పరులు భర్తీ అగుదురనీ మీరు తెలుసుకోవలసిన అవసరమున్నది. ఇదంతయు తెలియవలెనంటే దేవుడు భూమిపైకి వచ్చి చెప్పిన నిజమైన బోధ తెలియవలెను.





----


దురదృష్టవశాత్తూ, ఈనాడు మాయప్రభావమున భూమిపై కొంత మంది మాయాగురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు దేవతలనే దేవునిగా చిత్రించి, తమ అజ్ఞానపు బోధలతో మీవంటి వారిని మరింత అంధకారము లోనికి నెట్టివేసి, దైవమార్గమునుండి దూరము చేయుచున్నారు. అంతేగాక తమ ఉనికినీ, తాము సృష్టించిన మతము యొక్క మనుగడనూ కాపాడు కోవడానికి శైవము, వైష్ణవము అను బేధములను సృష్టించి, మనుషుల మధ్య విభేదాలు, విద్వేషాలురగిల్చి ఇదిగో! మిమ్మల్ని ఈ స్థితికి తీసికొచ్చారు.


(నిలువు నామాలవైపు తిరిగి) ఏమయ్యా! నిలువునామలూ ఈ విష్ణువు తనను తప్ప మరెవరినీ పూజించవద్దని నీ పూర్వీకులకుగానీ, నీకుగానీ చెప్పాడా?


నిలువునామము :- లేదు స్వామి?


బ్రహ్మ : - (అడ్డనామాలవైపు తిరిగి) ఏమయ్యా అడ్డనామాలు, పోని ఈ శివుడైనా నీకు, తననే పూజించాలని చెప్పాడా? వేరే దేవతలను ఆశ్రయించ వద్దని చెప్పడం జరిగిందా?


అడ్డనామము : :- అటువంటిది ఏమీ లేదు స్వామీ!


దైవజ్ఞానము తెలిసినవారి మధ్య శరీరసంబంధముకన్నా, గొప్పదైన ఆత్మసంబంధముండును. మా ముగ్గురికీ మధ్య అటువంటి ఆత్మసంబంధమే ఉండి మేము కలిసికట్టుగా ఉంటూ, దైవజ్ఞానమును పెంపొందించుకొంటూ దైవాన్ని చేరవలెననే తపనలో ఉన్నాము. కానీ మీరు మా పేర్లు చెప్పుకొని కలహించుకొనుచున్నారు. మాకులేని విభేదాలు మీకేల?


నేను కూడా ఒకపుడు మీవంటి సాధారణ మానవుడినే! కానీ నిజమైన దైవజ్ఞానమును తెలుసుకొని, ఆచరించి ఇదిగో! ఈ రోజు ఈ బ్రహ్మస్థానమునొంది, దేవతలైన విష్ణు, ఈశ్వరుల సరసన నిలిచితిని. నిజమైన దైవమును చేరి, మోక్షమునొందవలెనని మేమెంత తపించుచుంటిమో. మీరు అట్లే తపించండి. అందుకు అవసరమైన సంపూర్ణ దైవజ్ఞానమును తెలియండి. ఈ కలహాలుమానండి.


భక్తులు :- స్వామీ! అటువంటి విలువైన జ్ఞానము ఈ మాయ ప్రపంచములో ఎక్కడ లభించును.


బ్రహ్మ :- :- సంతోషం నాయనాలారా! మీరడిగిన ప్రశ్నను బట్టి, మీకు జ్ఞానోదయమైనదని తెలియుచున్నది. ఇక మీ ప్రశ్నకు జవాబు ఏమనగా! మేము చెప్పినది, ఆచరించినది అయిన దైవజ్ఞానము, ఈరోజు అదృష్టవశాత్తు ఈ భూమిపైనే లభించును.


భక్తులు :- ఎక్కడ స్వామీ! త్వరగా సెలవీయండి!


బ్రహ్మ :- చిన్నపొడమల గ్రామములో ప్రబోధాశ్రమములో శ్రీకృష్ణుని నిజమైన బోధ అయిన త్రైతసిద్ధాంత భగవద్గీత జ్ఞానసందేశమును ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లవారు నిర్విరామముగా అందించుచున్నారు. అన్నట్లు మరొక విషయము. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి సందర్భముగా యోగీశ్వరులవారి దివ్య జ్ఞానసందేశమును అందించబోవుచున్నారు. మేమును అచటికే పోవుచున్నాము. మీరును మాతో రావచ్చును.





---


భక్తులు :- ధన్యులము స్వామీ! ఇంతకాలమునకు విలువైన జ్ఞానమార్గము లభించినందుకు ఎంతో ఆనందముగా ఉ న్నది. నేటినుండి యోగీశ్వరుల జ్ఞానమును తెలుసుకొని, శైవము, వైష్ణవమనెడి మతములకతీతమైన జ్ఞానమును ప్రపంచమంతా ప్రచారము చేయుదుమని ప్రతిజ్ఞచేయుచున్నాము.


బ్రహ్మ :- ఇంతటి గొప్ప జ్ఞానమును అందించిన ఆచార్య ప్రబోధానందులకు నమస్కరించుచూ.


ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు జై...


ఎవడు జ్ఞాని - ఏది మతము.


(తెర తీయగానే మొదటి దృశ్యములో)


ఒక హిందువు, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లీమ్ ముగ్గురు కలిసి ప్రయాణము చేయుచుందురు. హిందువు గడ్డము పొడవుగా పెంచి తల వెంట్రుకలు ముడివేసి, పెద్ద నామము కలిగివుండును. క్రైస్తవుడు తెల్లని పొడవు అంగీ తొడిగి, అంగీమీద శిలువ డాలర్ను కనిపించునట్లు పెట్టు కొన్నాడు. ముస్లీమ్ మోకాళ్ళ క్రిందికి జిబ్బా వేసుకొని, మడమలపైకి పైజమా ధరించియున్నాడు. వారిని చూస్తూనే పలానావాడు, పలాన మతమునకు చెందినవాడని తెలియుచున్నది. వారి ముగ్గురికీ జలుబు చేసివుండడము వలన, వారు అప్పుడప్పుడు తుమ్ముచుండెడివారు. హిందువు తుమ్మినపుడు “రామ” అనుచుండెను. క్రైస్తవుడు తుమ్మినపుడు “ప్రభు” అనుచుండెను. అలాగే ముస్లీమ్ తుమ్మినపుడు “అల్లా” అనెడివాడు. వారు అలా అనడమునుబట్టి వారు ముగ్గురు మూడు మతాలకు చెందినవారని తెలియుచున్నది. వారు ముగ్గురు ఒకచోట కూర్చొని సేద తీర్చుకుంటూ మాట్లాడుకొంటున్నారు.


హిందువు :- మన ముగ్గురికి జలుబు చేసింది. ముగ్గురికి తుమ్ములు వస్తున్నాయి. నేను తుమ్మినపుడు రామా అంటున్నాను. మీరు ఇద్దరు మొదట హిందూమతములో వుండి, ఇతర మతములలోనికి పోయారు. మతమంటే మార్చుకున్నారు. చివరకు తుమ్మినపుడు కూడ దేవున్ని మార్చి ఒకరు ప్రభు అని, మరొకరు అల్లా అనుచున్నారు. మతము మారిపోతే దేవున్ని కూడ మార్చవచ్చునా?


ముస్లీమ్ :- నేను మొదట హిందూమతములోవుండి హిందూమతము కంటే ఇస్లామ్మతము గొప్పదని దానిని వదిలివచ్చాను. ఇస్లామ్ ధర్మము ప్రకారము మాకు దేవుడు ఒక్కడే. అందువలన మేము అల్లా అనుచున్నాము.


క్రైస్తవుడు :- నేను కూడా మొదట హిందూ మతంలోని వాడినే . ఆ మతములో 33 కోట్లమంది దేవుళ్ళున్నారు. అందులో ఎవరు నిజమైన దేవుడో చెప్పేదానికే వీలులేదు. క్రైస్తవములో ప్రభువును మించిన దేవుడు లేడని తెలిసిన దానివలన నేను క్రైస్తవుడయినాను. ప్రభువువే దేవుడని అందరికి తెలియుటకు తుమ్మినపుడు కూడ ప్రభూ అంటున్నాను.


హిందువు :- ఒకరికి అల్లా, ఒకరికి ప్రభు, నాకేమో రాముడు, మీకంటే నేనే మేలు. త్రేతాయుగమునాటి రామున్ని పట్టుకొన్నాను. మీరు కలియుగ ములోని వారిని పట్టుకొన్నారు. కలియుగముకంటే ముందు మీరు చెప్పే పేర్లు లేవు కదా! కాబట్టి ముందు నుంచివున్న రాముణ్ణి పట్టుకొన్న నేనే మేలు.





----


క్రైస్తవుడు :- మీ దేవుడైన రాముడు త్రేతాయుగము నుండి వచ్చినవాడే కదా! అంతకు ముందు కృతయుగములో లేడు కదా! నీవు కూడ మధ్యలో వచ్చిన వానినే కదా! పట్టుకొన్నది.


హిందువు : మా రాముడు అవతారపురుషుడు. ముందునుంచివున్న విష్ణువు రామునిగా పుట్టాడు. కావున మా రాముడు ముందునుంచి ఉన్నవాడే.


ముస్లీమ్ :- అయితే మధ్యలోవచ్చిన రామునిపేరు చెప్పకుండ నేరుగా విష్ణువు పేరునే మీరు చెప్పవచ్చును కదా! నీమాట ప్రకారము విష్ణువు అవతారమే రాముడైతే, ద్వాపరయుగములో పుట్టిన కృష్ణుడు కూడ విష్ణువు అవతారమే కదా! అలాంటపుడు కృష్ణుని పేరును మీరు చెప్పకుండ రాముని పేరే ఎందుకు చెప్పుచున్నారు?


హిందువు :- - కృష్ణునికంటే రాముని అవతారము ముందు కలదు. కృష్ణుడు ద్వాపరయుగములో పుట్టాడు. రాముడు దానికంటే ముందు యుగమైన త్రేతాయుగములో పుట్టాడు. అందువలన హిందూసమాజమంతా రాముణ్ణి దేవునిగా చెప్పుచున్నది.


క్రైస్తవుడు :- అలాగైతే రాముని అవతారముకంటే ముందు కృత యుగములో నరసింహావతారము కలదు కదా! రామునికంటే ముందున్న నరసింహా స్వామిని దేవునిగా చెప్పవచ్చును కదా!


హిందువు :- నరసింహస్వామి విష్ణువు అవతారమే, కానీ ప్రజలకు రామున్ని దేవునిగా చెప్పడమే అలవాటైపోయింది.


ముస్లీమ్:-నీకు నరసింహస్వామిని వదలి రాముణ్ణి దేవుడనడము ఎట్లు అలవాటై పోయిందో, మాకు కూడ రాముణ్ణి వదలి అల్లాను దేవుడనడము అలవాటైపోయింది. ఏమి తప్పా?


హిందువు :- అయితే రాముణ్ణి దేవుడు కాదంటావా?


ముస్లీమ్:-- నేను రాముణ్ణి దేవుడు కాదు అనడములేదు. నీ అలవాటు ప్రకారము నీకు రాముడు దేవుడే, నా అలవాటు ప్రకారము నాకు అల్లా దేవుడే అంటున్నాను.


క్రైస్తవుడు :- స్వచ్ఛమైన దేవుడెవరో తెలుసుకోమంటున్నాను. మాకు స్వచ్ఛమైన దేవుడు ప్రభువే.


హిందువు :- మీకు ప్రభువు స్వచ్ఛమైన దేవుడైతే, శిలువ మీద ములుకులు కొట్టించుకొని రక్తము కార్చి ఎందుకు చనిపోయాడు?


క్రైస్తవుడు:-పాపులను తన రక్తముతో కడిగే దానికి ఆయన రక్తమును కార్చాడు. ఆయన దేవుడైన దానివలననే అలాగ చేశాడు. చనిపోయి లేచిన వాడే నిజమైన దేవుడు. ఆయనే ప్రభువు.


హిందువు :- ఆ రోజు ఆయన రక్తముతో ఎవరూ తమ పాపములను కడుగుకోలేదే? ప్రభువును శిలువవేసిన వారు పాపము చేసినట్లే కదా! ప్రభువును చంపించిన యూదా పాపియే కదా! ప్రభువు శిలువ వేయబడిన దినము దగ్గరలోనున్నవారే కడుక్కోలేదు. మిగతావారు ఎవరు కడుక్కొన్నారు, ఎవరి పాపము పోయింది చెప్పగలవా? 


ముస్లీమ్ :- ఏసుప్రభువు శిలువ మీద చనిపోలేదు. చనిపోయినట్లు నటించాడు. అతను చనిపోయివుంటే అక్కడే కాపలావున్న సైనికుడు ప్రభువు డొక్కలో పొడిచినపుడు రక్తము కారదు కదా! కానీ రక్తము కారింది. చనిపోయిన







---


వానికి రక్తము గడ్డకట్టి పోతుంది. చనిపోయినట్లు నటిస్తున్న ప్రభువును సైనికులు పొరపాటుగా చనిపోయాడనుకొన్నారు. తర్వాత మూడవరోజు సమాధిలోనుండి లేచి పారిపోయాడు. 40 రోజులు బయట తన భక్తులకు కనిపించి తర్వాత ఎటో తెలియకుండ పోయాడు. శిలువ మీద ప్రభువు చనిపోలేదు, చనిపోయినట్లు నటించాడు, తర్వాత పారి పోయాడు. అటువంటివాడు దేవుడెలా అవుతాడు. మా అల్లా ఎవరికి కనిపించలేదు, ఏ మనిషి చేతికి దొరకలేదు. కావున మా అల్లానే నిజమైన దేవుడు.


హిందువు :- కనిపించనివాడు దేవుడెలా అవుతాడు? మా రాముడు కనిపించాడు, వాళ్ళ ప్రభువు కనిపించాడు. మీ అల్లా ఎక్కడా కనిపించలేదే!


ముస్లీమ్ :- సర్వలోక సృష్ఠికర్త అయినవాడు మా దేవుడు. మీ దేవునికి రూపమున్నట్లు మా దేవునికి రూపము, పేరు ఉండవు.


క్రైస్తవుడు :- మీ దేవునికి రూపము, పేరు లేదు అంటున్నావు. అలాగైతే అల్లా అని పేరుపెట్టి ఎవరిని పిలుస్తున్నావు? అంతే కాకుండ మీ హదీసు పండితులు దేవునికి 100 పేర్లున్నాయని చెప్పుచున్నారు. ఇంకా మీ దేవునికి పెద్ద సింహాసనము ఉందని, దేవుడు పై లోకములో ఉన్నాడని, ప్రళయములో అందరిని సమాధులలో నుండి లేపునని, అప్పుడు పాపము చేసిన వానిని నరకమునకు, పుణ్యము చేసిన వానిని స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు కదా! అలాంటపుడు మీ దేవుడైన అల్లాకు రూపము, పేరు, పని ఉన్నట్లే కదా!


హిందువు :- ఇప్పుడేమంటావు చెప్పు.


ముస్లీమ్ :- ఇప్పుడు కూడ మా దేవుడైన అల్లానే గొప్ప అంటాను. మా దేవుని మీద మాకు విశ్వాసమున్నట్లు మీ దేవుళ్ళమీద మీకు విశ్వాసము ఉందా? ముస్లీమ్ అంటేనే విశ్వాసి అని అర్థము. మా దేవునికంటే గొప్పవాడు లేడు, మా ఇస్లామ్లోవున్న విశ్వాసము ఏ మతములోనూ లేదు. అవునా, కాదా?


క్రైస్తవుడు :- మా మతములో తన ద్వారా రోగము బాగైన మనిషిని చూచి ప్రభువు నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అన్నాడు. కావున మాకు కూడ దేవుని మీద విశ్వాసముంది. దేవుని మీద విశ్వాసముతోనే మేము ప్రార్థన చేయుచున్నాము. 


హిందువు :- మీ రెండు మతాలలో టైప్డేబుల్ ఉంది. దానినే ప్రార్థనా సమయము అంటారు. క్రైస్తవులకు ఆదివారము, ముస్లీమ్లకు శుక్రవారము ముఖ్యము. ముస్లీమ్లు ప్రతి దినము ప్రార్థన మసీద్లలో చేసినా దానిని ఉ దయము, మధ్యాహ్నము, సాయంకాలము చేస్తారు. శుక్రవారము ఐదు పూటలు చేస్తారు. మాకు అటువంటి టైప్డేబుల్ లేదు. అందువలన మా భక్తియే దేవునికి ముఖ్యమైనది.



ముస్లీమ్ 'ఆగవయ్యా; మాది టైమ్జీబుల్ భక్తియా? మీది కాదా? మాకు శుక్రవారము ముఖ్యము, క్రైస్తవులకు ఆదివారము ముఖ్యము, మీకు మధ్యలోనున్న శనివారము ముఖ్యముకాదా! వెంకటేశ్వరునికి మీరు శనివారము కాదా పూజించేది. హిందువులందరు శనివారము ఇల్లువాకిలి శభ్రపరుచుకొని తలస్నానము చేసి ఇంట్లో పూజలు చేయలేదా? గుడులకు వెళ్ళి పూజలు చేసి రావడము లేదా? ఆంజనేయునికి శనివారము, వెంకటేశ్వరునికి శనివారము, శివునికి సోమవారము అని మీరు టైమ్హబుల్ పెట్టుకోలేదా? చెప్పండి.





---


క్రైస్తవుడు :- ఆదివారము సెలవు దినము, ఆ దినము పనులుండవు కాబట్టి ఆదివారమును గుర్తింపుగా మేము పెట్టుకొన్నాము. మీరు శని వారమును దేనివలన గుర్తింపుగా పెట్టుకొన్నారో! చెప్పండి.


హిందువు :- మా పెద్దలు అలా నిర్ణయించారు, కావున మేము అలాగే మా సాంప్రదాయముల ప్రకారము చేస్తున్నాము. ముస్లీమ్ :- మేము కూడ మా పెద్దలు నిర్ణయించినట్లే చేయుచున్నాము, అది మా సాంప్రదాయము. మా సాంప్రదాయములను మీరు టైటేబుల్ అన్నపుడు, మీ సాంప్రదాయములకు కూడ టైమ్హబుల్ ఉన్నదనుటలో మా తప్పులేదు కదా!


క్రైస్తవుడు :- ఎవరు ఏమనుకొనినా! ఏది ఏమైనా! మీ మతములోని దేవుళ్ళు పాపులను శిక్షించుతామని చెప్పారు. మా దేవుడు పాపులను క్షమిస్తానని చెప్పాడు. శిక్షించువాడికంటే క్షమించువాడే గొప్పవాడు. కనుక మా దేవుడే గొప్ప అని చెప్పుచున్నాను.


హిందువు :- పాపులను క్షమిస్తాను, పాపులకు నావద్ద రక్షణ కలదని మీ దేవుడు చెప్పుటవలన భూమిమీద పాపాత్ములు ఎక్కువైపోవు ప్రమాదము గలదు. ఎన్ని పాపములు చేసినా దేవుడు క్షమిస్తాడను ధైర్యముతో మనుషులు పాపములు చేయుటకు మొదలుపెట్టుదురు. పాపాలు చేసి క్షమించు, రక్షించు అని ప్రభువును వేడుకొంటారు. ప్రభువు క్షమిస్తాడు. నేను మీ కొరకే రక్తమును కార్చానని పాపక్షమాపణ నావద్ద కలదని చెప్పుట వలన దేశములో దుర్మార్గము ఎక్కువై పోతుంది, పాపుల సంఖ్య ఎక్కువై పోతుంది. ఇది మీ తప్పు కాదా!


ముస్లీమ్ :- మా దేవుడు అలా చెప్పలేదు. ప్రళయకాలములో సమాధుల నుండి తిరిగి మనిషిని లేపి, అతను చేసుకొన్న పాపమును విచారించి నరకానికి పంపుచున్నాడు. పాపము చేసిన వానిని తడిగుడ్డను పిండినట్లు పిండి ఆరేయగలడు. అందువలన మా మతములో దేవుడు శిక్షిస్తాడను భయముతో ఎవరూ పాపము చేయరు. చేయుటకు భయపడుతారు. మా ఇస్లామ్లో దేవుని భయముంది, మీ క్రైస్తవములో దేవుని భయము లేదు. అందువలన పాపములను ఇష్టమొచ్చినట్లు భయము లేకుండ చేయుచున్నారు.


క్రైస్తవుడు :- మా దేవుడు అందరి పాపములను క్షమిస్తానని చెప్పలేదు. ప్రభువును నమ్మినవారికి మాత్రమే క్షమాపణ కలదు.


హిందువు :- ఆ మాట చెప్పి మా హిందువులనందరిని మీ మతము లోనికి లాగుకొనుచున్నారు.




క్రైస్తవుడు :- మేము చెప్పే మాటకాదు. మీ హిందూమతములోని వేదములలోనే పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించడము అను మాటవుంది. అలా పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించినవాడు మా ప్రభువు ఒక్కడే గలడు. నాలుగు వేదములలో సామవేదమున రెండవ భాగమైన తాండియా మహాబ్రాహ్మణమందు

శ్లోకము॥ 'ప్రజా ప్రతిర్థే వేభ్యం ఆత్మనా యజ్ఞం కృత్వాప్రాయశ్చిత్" అని వుంది. దీని భావము ఏమనగా! ప్రజలను పరిపాలించువాడు, ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమును ప్రాయశ్చిత్తముగా నలుగగొట్టుకొని యజ్ఞము చేయును. ప్రజాపతి అనగా దేవుడు అని అర్థము. ఈ శ్లోకము ప్రకారము ప్రభువు ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమునే బలి ఇచ్చాడు. అందువలన మీ వేదముల ప్రకారము మా దేవుడే నిజమైన దేవుడు.





----


హిందువు :- మీరు మా వేలే తీసుకొని మా కన్నే పొడిచినట్లు, మా వేదాలే తీసుకొని మా దేవుణ్ణి కాదంటున్నారు. మా వేదాలలోని మీకు అనుకూల మైన మాటలను చెప్పుకొంటున్నారు. మీ బైబిలులో మా దేవుణ్ణి సమర్థించే మాటలుకూడ ఉన్నాయి. మీరు నడుచు విధానము తప్పు అని చెప్పు వాక్యములు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటిని మేము కూడ చెప్పగలము.


క్రైస్తవుడు :- ఎక్కడున్నాయో చెప్పు చూస్తాము.


హిందువు : మీ బైబిలులోనే ఉన్నాయి. పలానా చోట అని చెప్పలేను. ఒక్క మారే చదివాను. అందువలన అవి సరిగ జ్ఞప్తికిలేవు.


క్రైస్తవుడు :- మీ వేదాలలో మాటలను బట్టీపట్టి, శ్లోకాలను వాటి నంబర్లను, వాటి ఆధ్యాయములను మేము చెప్పినపుడు మా పుస్తకములో లోపాలు ఉన్నాయి అవి జ్ఞాపకములేవు అనడమేమిటి? మాకు వ్యతిరేఖమైనవి ఏవైనా ఉంటే మీరు ఊరకనే వదులుతారా? అలా ఉంటే కంఠాపాటము చేసుకొని చెప్పవచ్చును కదా!


హిందువు :- నేను ఒకమారు బైబిలు చదివి వాటిలో మాకు అనుకూల మైన వాక్యములను, మీ నడవడికి వ్యతిరేఖమైన వాక్యములను చూచాను. వాటిని నోట్ చేసుకొని, బాగా చదివి జ్ఞాపకము పెట్టుకొని మీలాంటి వారికి చెప్పాలనుకొన్నాను. అంతలో ఆ పని ఆగిపోయింది. ఎందుకనగా! మా ప్రక్కింటి అతను విశ్వహిందూపరిషత్లో పని చేస్తుంటాడు. అతను నేను బైబిల్ చదువునపుడు చూచి పోయి భజరంగ్ దళ్ సంఘము వాళ్ళకు చెప్పాడు. అప్పుడు కొందరు భజరంగ్ దళ్ సభ్యులు, కొందరు విశ్వహిందూ పరిషత్ సభ్యులు అందరు కలిసి అరవై (60) మందిదాకా వచ్చి, నేను బైబిలు చదువుచున్నందుకు నన్ను కొట్టి, నానాదుర్భాషలాడి ఇక ఎప్పుడైనా బైబిల్ ముట్టుకుంటే చంపేస్తామని బెదిరించి పోయారు. అందువలన నేను ఇప్పుడు మీ బైబిల్లో ఏ లోపములున్నది చెప్పలేక పోవుచున్నాను.


క్రైస్తవుడు :- (నవ్వుచూ) ఇప్పుడు మీ విశ్వహిందూపరిషత్ గానీ, భజ రంగ్ దళ్ నీ, ప్రత్యక్షముగా మాకు చెడు చేయాలనుకొన్నా, పరోక్షముగా మాకు మంచే జరుగుచున్నది. వారు లేకపోతే మా మతము అంతగా అభివృద్ధి అయ్యేదికాదు. వారున్న దానివలననే మా మతము అందరికి తెలిసినది. మా మీద అందరికి సానుభూతి ఏర్పడినది. చాలా తొందరగా మా మతము విస్తరించి పోయినది. వారు నిన్ను బైబిల్ చదవనివ్వని దానివలననే కదా! నీవు ఇపుడు తప్పు పట్టలేక పోతున్నావు. దానివలన వారు మాకు మేలు చేసినట్లే కదా!


ముస్లీమ్ :- విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ వారి వలననే మన దేశములో ముస్లీమ్ల ఉగ్రవాదము పెరిగిపోయినది. వారు మా ముస్లీమ్లకు కొద్దిగ వ్యతిరేఖత చేస్తే, మా ముస్లీమ్లు ఏకంగా ఎంతోమంది హిందువు లను చంపివేయుచున్నారు. ఆ రెండు సంస్థల పనులకు అమాయకులైన హిందువులు ఉగ్రవాదుల చేతులలో బలియైపోవుచున్నారు. ముఖ్యముగా చెప్పాలంటే హిందువులందరూ ఈ రెండు సంస్థలను ఏవగించుకొంటున్నాయి. హిందూ మతనాశనానికే ఈ సంస్థలు పుట్టాయి అనుకుంటున్నారు.


క్రైస్తవుడు :- విశ్వహిందూ పరిషత్ వాళ్ళు వివేకానందుని పేరును గొప్పగ చెప్పుకుంటుంటారు కదా! వివేకానందుడు ప్రభువును గురించి ఎక్కడా చెడ్డగగానీ, తక్కువ చేసిగానీ మాట్లాడలేదు. హిందూమతములో వివేకానందుని స్ఫూర్తితో ముందుకు పోవు హిందువులు, ప్రభువు మాట వింటూనే ఎందుకు మండిపడుచున్నారు. ఏసుప్రభువు మాటను





----


చూస్తేనే ఎందుకు ఎలర్జివచ్చిన వారి మాదిరి ప్రవర్తిస్తున్నారు. బైబిలును చదువుచున్న నిన్ను ఎందుకు కొట్టారు? బైబిలును చదివిన నీ మీద అంత కోపమును ప్రదర్శించిన వారు ప్రభువును గౌరవించిన వివేకానందున్ని ఎందుకు ఏవ గించుకోలేదు. "స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవితగాథ" పుస్తకము యొక్క రెండవభాగములో 17వ పేజీలో రెండవ పేరాయందు రెండవ లైనులో "నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, నా హృదయరుధిరముతో కడిగి ఉండేవాన్ని" అని వివేకానందుడు స్వయముగా ఈ మాట అన్నపుడు వివేకానందున్ని విశ్వహిందూపరిషత్వారు ఎందుకు గొప్పగ చెప్పుకొంటు న్నారు. వారికున్నది పరమత ద్వేషము తప్ప హిందూమతములోని ధర్మములు ఒక్కటి కూడ తెలియవు. హిందూమతములో దేవుని జ్ఞానము లేదు, దేవతాభక్తి కలదు. అందువలన జ్ఞానజిజ్ఞాసులందరు ఇతర మతము లోనికి పోవుచున్నారు.


ముస్లీమ్ :- నేను కూడ మొదట హిందువునే. హిందుత్వమును అడ్డము పెట్టుకొని వినాయకచవితి పండుగలో దౌర్జన్యముగ డబ్బులు వసూలు చేయువారిని చూచి, అటువంటి అన్యాయానికి మద్దతు ఇచ్చే హిందూ సంస్థలను చూచి, ఆ పద్ధతులు నచ్చక ఏకేశ్వరోపాసన గల ఇస్లామ్ మతములోనికి వచ్చి నాపేరును కూడ మార్చుకొన్నాను. హిందువు :- - నిజమే వినాయకచవితి అల్లరి పండగైపోయింది. ఆ పండుగలో చందాలు వసూలు చేయువారు వీధిరౌడీలలాగ ప్రవర్తిస్తున్నారు. హిందూమతము గొప్పదే, కానీ ఇటువంటి వారివలన అప్రతిష్ఠపాలై పోవుచున్నది.


క్రైస్తవుడు :- మీ మతములో భగవద్గీతను గొప్పగ బోధించు ఒక పెద్ద గురువు మీదనే విశ్వహిందూపరిషత్వారు, భజరంగ్ దళ్వారు వేదాలను చెప్పకుండ భగవద్గీతను చెప్పుతావా, వేదాలకంటే భగవద్గీత ముందు పుట్టినదంటావా అని దాడిచేసిన రోజే హిందూమతము ప్రతిష్ఠ మంటలో కలిసిపోయింది. ఆ సంఘటనను చూచిన తర్వాతే హిందూమతములో ఒక గురువునే అవమానపరచు హిందూసంఘములుండుటను చూచి క్రైస్తవ మతములో ఫాదర్కు , పాస్టర్కు ఎంతో మర్యాదకలదని క్రైస్తవులు వారి గురువులపట్ల వినయ విధేయతలుకల్గి గౌరవభావముతో ఉండుటను చూచి నేను క్రైస్తవునిగా మారిపోయాను.


(అంతలో ఆరుమంది దొంగలు వచ్చి, ఆ ముగ్గురిని కొట్టి వారి వద్ద ఉన్నవన్ని గుంజుకొని అంతటితో ఆగక వారి తలవెంట్రుకలను, గడ్డము వెంట్రుకలను కొరిగి వీరు పలానా మతమువారను గుర్తింపే లేకుండ చేసినారు. వారిలో దొంగలకు పెద్ద అయిన వ్యక్తి ఇలా అన్నాడు)


దొంగ :- ఇంతవరకు చాటున ఉండి మీ మాటలన్నీ విన్నాను. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాదించుకొంటున్నారు. మీ మతాలు పైకి కనిపించేటట్లు గడ్డాలు, మీసాలు పెంచుకొన్నారు. ఇప్పుడు వాటిని తీసివేసినాము కదా! ఇప్పుడు అందరూ సమానముగా కనిపిస్తున్నారు కదా! మీ శరీరాల మీద ఏదైనా పలానా మతము వాడని గుర్తుందా? చెప్పండి.


హిందువు :- నీవు దొంగవు. మా మతాల విషయము, దేవుని విషయము నీకేమి తెలుసు?


దొంగ :- నేను మొదట పెద్ద హేతువాదిని, తర్వాత దొంగను. నాకు తెలియని మతము నాకు తెలియని దేవుడు ఉన్నాడా?





----


ముస్లీమ్


:-


దొంగవు మావద్దనున్నది లాగుకొని దొంగతనము చేయ వచ్చును. కానీ ఈ విధముగా మీదాడిని (మా గడ్డమును తీసివేయడము) చేయడము దేనికి? నీవు అట్లు చేయడము వలన మా మతమును, మతాచరణను అవమానించినట్లు కాదా!


దొంగ :- అవును నేను దొంగనే నా దొంగతనము స్పెషల్గా ఉంటుంది. నీ దగ్గరున్నదంతా దోచుకొనినా అరవై (60) రూపాయలకంటే ఎక్కువ లేవు. ఆ దొంగతనము ఏమి గిట్టుబాటుకాదు. కనుక మీ వద్దనుండి మరొక అజ్ఞానమును దోచుకోవాలనుకొన్నాను. నేను దొంగ తనము చేసిన తర్వాత నీవద్ద ఏమి మిగలకూడదు. నా మాదిరి దోచుకోనే వాడు దేశములో ఎవడూ ఉండడు. ఇప్పుడు చెప్పు నీ మతము, నీ పేరు ఏది? ఊ ముగ్గురూ చెప్పండి. - ముస్లీమ్ :- నాది ఇస్లామ్ మతము, నాపేరు వహీద్.


క్రైస్తవుడు :- నా మతము క్రైస్తవము, నా పేరు జాన్.


హిందువు :- నా పేరు శ్రీనాథగుప్త, నాది హిందూమతము.


దొంగ : - మొదట మీ పేర్లనుండి మొదలుపెట్టుతాను. ఇప్పుడు చెప్పు గుప్త, ఈ పేరు నీదా? నీ శరీరమునదా? అని ప్రశ్నించుకొని చూస్తే నీ శరీరమునదే, కానీ నీది కాదు. నేను అడిగినది నీ పేరును. ఇప్పుడైనా చెప్పు నీ పేరు ఏది? ఇక్కడొక కండీషన్ చేయుచున్నాను. మీరు నా చేతిలో ఇరుక్కొన్నారు. కనుక నా కండీషన్కు ఒప్పుకొని తీరవలసిందే. ఆ కండీషన్ ఏమంటే మీరు నా ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే తంతాను. చెప్పినా అది జవాబు కాకపోతే కూడ తంతాను.


హిందువు :- నా శరీరమునకున్న పేరే నాదని అనుకున్నాను. మిగత విషయము నాకు తెలియదు.


ముస్లీమ్ :-శరీరమునకున్న పేరే నాపేరవుతుంది. కదా!


క్రైస్తవుడు :-శరీరము, నేను ఇద్దరము ఒకటే, కావున నా శరీరము పేరే నా పేరవుతుంది.


దొంగ :- మీరు ఇలా చెప్పుతారని నేననుకొన్నాను. ఇప్పుడు ఆలోచించి చెప్పండి. నీవు చనిపోయినపుడు నీవు లేకుండపోవుచున్నావు. అయినా నీ శరీరము అక్కడ పడుకొని ఉంది కదా! శరీరము, నీవు ఒక్కటే అయితే, నీవు పోతూనే నీ శరీరము కూడ కనిపించకుండ పోవాలి కదా! నీవు కనిపించకుండ పోయినా నీ శరీరము ఉన్నది. కావున నీవు వేరు, నీ శరీరము వేరు అని తెలియుచున్నది. గుప్త అను పేరు నీ శరీరమును చూచి పెట్టినదే. నిన్ను చూచి పెట్టినది కాదు. నీవు కనిపించేవానివి కాదు. నీశరీరమే కనిపిస్తూవుంది. ఇప్పుడు చెప్పు నీవు ఎవరో?


ముస్లీమ్ :- శరీరము, నేను వేరు వేరు అయినపుడు, పేరు శరీరమునకే అయినపుడు, నేను ఎవరో తెలియనపుడు, నేను ఎవరని చెప్పాలి. ఇంత వరకు నేను “వహీద్"ను అనుకున్నాను. ఇపుడు వహీద్ పేరు శరీరముదే నాది కాదని తెలియుచున్నది.


దొంగ :- నీవు ఎవరో నీకే తెలియనపుడు, నీవు ఫలానా మతము వాడినని చెప్పుటకు వీలుందా? వీలులేదు. మతము బయట గ్రంథాలలో ఉన్నది. బయటి గ్రంథాల విషయము తెలిసినపుడుగానీ, లేక బయటి వ్యక్తి గురువుగా ఉండి చెప్పిన మతమును తెలిసినపుడుగానీ, నాది ఆ మతము అంటున్నారు. నీవు ఎవరో నీకే తెలియనపుడు ఇది నా





----


మతము కాదు, అది నా మతము అనడము పొరపాటు కాదా! ఒక చిన్న ఉదాహరణను చూస్తాము; ఒక ఆవు, గాడిద, కుక్క అను మూడు జంతువులున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఒకరు ఆవును, ఒకరు కుక్కను, ఒకరు గాడిదను స్వంతము చేసుకొన్నారు. ఆవును పట్టుకొన్నవాడు దాని త్రాడును తన చేతిలో ఉంచుకున్నాడు. ఆవుకున్న త్రాడును తన చేతిలో ఉంచుకొన్నదానివలన ఇది నాది అని చెప్పవచ్చును. కానీ తన అడ్రసే తనకు తెలియనపుడు, తన పేరే తనకు తెలియనపుడు, ఆవు ఏదో, ఆవు త్రాడో ఏదో తెలియనపుడు తాను మతము అనబడు ఆవును పట్టుకొన్నానని చెప్పడము విడ్డూరము కాదా? నీవు ఎక్కడున్నావు? నీ ఆవు ఎక్కడుంది అని అడిగితే చెప్పగలడా? మూడు జంతువులను మూడు మతములుగా పోల్చి చూచితే వాటికి నీవు సంబంధములేదు. ఆవు నీ చేతికి దొరకకుండినా ఆవు నాది అని భ్రమించినట్లు ఆ మతము నాది అంటున్నావు.


ఇప్పుడు నేను బంధించి మిమ్మలను ఇబ్బంది పెట్టుచున్నాను. ఇప్పుడు దేవుణ్ణి కాపాడమని అడిగినా దేవుడు వచ్చి మిమ్ములను కాపాడడు. ఎందుకో తెలుసా నీ అడ్రస్ నీకే తెలియదు, నేను పలానా చోట ఉన్నానని చెప్పలేవు. నీ అడ్రస్సే నీకు తెలియనపుడు, దేవుని అడ్రస్సు నీకు ఏమాత్రము తెలియదు. కావున ఆయన ఎక్కడున్నాడని పిలువగలవు? నీ అడ్రస్ గానీ, దేవుని అడ్రస్ గానీ తెలియకుండ బ్రతికే నీవు నేను ఫలానా మతమువాడిని, నా దేవుడు ఫలానావాడని చెప్పగలవా? ఒకవేళ నీవు చెప్పినా మేము నమ్మాలా? నీవు వహీద్ అనినా, నీది ఇస్లామ్ అనినా, నా దేవుడు అల్లా అనినా నేను నమ్మను. నీవు వహీద్వే కానప్పుడు, నీ దేవుడు అల్లా అని నేను ఎందుకు నమ్మాలి? చెప్పు గుప్త నీవు దేవుని చూచావా? లేక దేవుని అడ్రస్ ఏమైనా నీకు తెలుసా?


గుప్త :- నేను ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎక్కడుండేది తెలియదు.


దొంగ :- నీవేకాదు, జాన్కానీ, వహీద్కానీ చూడలేదు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏమి చేస్తుంటాడో కూడ తెలియదు. దేవుని విషయము ఏమాత్రము తెలియనపుడు దేవునికి ఒక పేరుపెట్టి, మా దేవుడు ఫలానావాడని చెప్పడము అబద్ధము కాదా?


ముస్లీమ్ :- మా మతములో మా ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటున్నాము. ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోగలమని మాకు నమ్మకమున్నది.


దొంగ :- మీ ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే ఫరవాలేదు. మీ ప్రవక్త చాలా గొప్ప దైవజ్ఞాని, ఆయన చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోవచ్చును. ప్రవక్త చెప్పిన విధానమును అర్థము చేసుకోలేనివారు, ప్రవక్త చెప్పినట్లు చేయుచున్నామని అనుచుందురు. కానీ ప్రవక్త చెప్పిన ప్రకారము వారు నడువలేదని వారికి తెలియదు. ప్రవక్త చాలా సూక్ష్మ విషయములను చెప్పగా, కొందరు ముస్లీమ్లు ఆ మాటలను అపార్థము చేసుకొన్నట్లు తెలియుచున్నది. ప్రవక్త దేవునివైపు ముస్లీమ్లను నడుపాలనుకోగా, ఆయన మాటలను అర్థము చేసుకోలేక కొందరు ముస్లీమ్లు సైతాన్ (మాయ) వైపు పోవుచున్నారు. ప్రళయములో ప్రతి మనిషిని సమాధినుండి దేవుడు లేపుతాడని, వాని పాపపుణ్యములను విచారించి స్వర్గ నరకములకు పంపుతాడని, అల్లా లేపినపుడు లేపబడిన వాని శరీరము మీద ఒక నూలు పోగు కూడ ఉండదని, అప్పుడు ఏ గుణ భావములుండవని ప్రవక్త చెప్పగా, ఆ మాటలలో ప్రళయము అంటే ఏ ప్రళయమో, ఏ ముస్లీమా్కూ అర్థము కాలేదు. సమాధి అంటే సమాధి ఏదో అర్థము చేసుకోలేదు. ప్రతి మనిషిని లేపి విచారిస్తాడనగా ఎలా లేపుతాడో, ఎలా విచారిస్తాడో ఎవరూ అర్థము చేసుకోలేదు. స్వర్గ నరకములకు పంపుతాడనగా ఎక్కడకు పంపుతాడో





-----


స్వర్గ నరకములు ఎంత దూరమున్నాయో ఎవరికీ అర్థము కాలేదు. శరీరము మీద నూలుపోగు కూడ ఉండదని ప్రవక్త చెప్పగా, నూలుపోగు ఎందు కుండదో ఎవరూ యోచించలేదు. సమాధినుండి లేపినపుడు ఏ గుణములు ఉండవు, ఏ యోచనలుండవు అని ప్రవక్త చెప్పిన మాటలలోని అంతర్యమును ఎవరూ గ్రహించలేదు. ప్రవక్త చెప్పినది దొంగనైన నాకు బాగా అర్థమైనది. ప్రవక్త చెప్పిన మాటలు ఎవరూ ఖండించలేనివి. ఎంతో సత్యమైనవి. కానీ వాటిని చాలామంది అపార్థము చేసుకొన్నారు. దీనినిబట్టి చూస్తే ప్రవక్త చెప్పిన గొప్ప రహస్యమును ప్రజలు అందుకోలేక పోయారని తెలియుచున్నది.


ముస్లీమ్:- ప్రవక్త చెప్పింది మాకు అర్థము కానిది నీకర్థమైందా? ప్రవక్త చెప్పింది మాకు ఏమి అర్థము కాలేదో ఒక్క దానిని చెప్పు.


దొంగ :- అట్ల అడిగితే ఫరవాలేదు. ప్రశ్నించినపుడే ఏదైనా అర్థమయ్యేది. సరే నేను ఒకమాట అడుగుచున్నాను. నామాటకు సమాధానము సరిగ చెప్పితే, ప్రవక్త మాట నీకు అర్థమైనట్లే, లేకపోతే అర్థము కానట్లే.


ముస్లీమ్ :- సరే అడగండి, నా పేరే వహీద్, నేనెందుకు చెప్పలేను?


దొంగ :- వహీద్ నీ శరీరము పేరని జ్ఞప్తికుంచుకో. ప్రళయములో దేవుడు మనిషిని తిరిగి లేపుతాడన్నారు కదా! ప్రళయము అంటే ఏది?


వహీద్ :- ప్రపంచమంతా నాశనమై పోవడమే ప్రళయము.


దొంగ :- ‘ప్ర’ అంటే పుట్టినది 'పంచము' అనగా ఐదు అని అర్థము. ప్రపంచము అనగా పుట్టివున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని అర్థము. ప్రళయము అనగా పుట్టినవి లయించి పోవడము, లేక నాశనమై పోవడమని అర్థము. బయట కనిపించే ప్రపంచము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములు. కనిపించే ప్రపంచము 108 కోట్ల సంవత్సరము లకు ప్రళయము చెందుట నిజమే. కానీ ప్రళయము అనునది మరొకటి కూడ కలదు. పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వలన ఏర్పడిన నీ శరీరము కూడ ఒక ప్రపంచమే. నీ శరీరము ఐదు భూతముల వలననే పుట్టినది. నీ శరీరము ఎప్పుడు చనిపోతుందో ఆ దినమును కూడ ప్రళయమే అనవచ్చును. పంచభూతముల వలన పుట్టిన ప్రపంచములు చర, అచర అను రెండు కలవని, అలాగే ప్రళయములు కూడ చర ప్రళయము, అచర ప్రళయము రెండు కలవని దీనివలన తెలియుచున్నది. రెండు ప్రళయములను దేవుడే సృష్ఠించాడు. ప్రవక్త చెప్పింది చలించు చరా ప్రపంచమైన మనిషికిగానీ, అచర ప్రకృతియైన బయట ప్రపంచమునకు కాదు. ప్రవక్త మనిషికి సంబంధించిన విషయము లను చెప్పగ, చెప్పిన విషయమును తనకు వర్తింపజేసుకొని చూడకుండ, సంబంధము లేని బయటి ప్రపంచమునకు వర్తింపజేయుటను బట్టి ప్రవక్త మాటను మనిషి అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ప్రవక్త చెప్పినవన్ని మనిషికి దగ్గరగానున్న సూత్రములనే చెప్పగా, మనిషి ఆ మహావ్యక్తి చెప్పిన అమూల్యమైన మాటలను అర్థము చేసుకోలేక తప్పుగా అర్థము చేసుకొని తప్పుగా నడుస్తున్నాడు. ఆయన బోధించిన బోధలో ఒక్క ప్రళయము అను మాట అర్థము కాకపోవడము వలన, ఆయన భావమునకు ఎంతో దూరముగా మనిషి పోయాడు. నీ భావము తప్పు అని ఇప్పుడు అర్థమైందా వహీద్, దేవుడు చెప్పిన రెండు ప్రళయములో ప్రవక్తగారు చెప్పిన ప్రళయమేదో తెలియనివారు మిగత ఆయన మాటలను సరిగ అర్థము చేసుకొన్నారని నమ్మకమేమి?





---


దేవుడు సమాధినుండి లేపుతాడని చెప్పిన ప్రవక్తమాట నూటికి నూరుపాళ్ళు నిజమే. అయితే సమాధి అంటే మనిషి శరీరము కనిపించకుండ కప్పియున్నదని అర్థము. శరీరము కనిపించకుండ కప్పియున్నది భూమిలో తీయబడిన గుంత అనుకోవడము సరియైనదో కాదో యోచించండి. ఇలా ఎన్నో విషయములను మనము అర్థము చేసుకోలేక పోయాము. దేవుడు చనిపోయిన సర్వ మానవులకు సమాధిని సమానముగా ఉంచాడు. ఆ సమాధిని ప్రవక్తగారు చెప్పినా మనము అర్థము చేసుకోలేక పోయాము. మీరు అనుకొన్నట్లు భూమిలో పూడ్చిపెట్టిన వానికి సమాధి ఉంటుంది. కానీ అగ్నిలో కాలిపోయిన వారికి గానీ, నీటిలో మునిగిపోయిన వారికి గానీ, సమాధి ఉండదు కదా! ఖురాన్లోని దేవుని వాక్యము పొల్లుపోదు. దాని ప్రకారము అగ్నిలో కాలిపోయిన వానిని గానీ, నీటిలో మునిగి కుళ్ళి పోయిన వానిని గానీ చివరిలో దేవుడు సమాధినుండే లేపుతాడు. దీనినిబట్టి దేవుని వాక్యము నూటికి నూరుపాళ్ళు సత్యము.


ముస్లీమ్లు ప్రవక్త చెప్పిన మాటలను సరిగ అర్థము చేసుకోలేనట్లు, క్రైస్తవులు ప్రభువు చెప్పిన వాక్యములను అపార్థము చేసుకొన్నారు. అలాగే హిందువులు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఎంతో తప్పుగా అర్థము చేసు కొన్నారు. అందువలన మీ మూడుమతముల వారికి దేవుడు ఏమాత్రము అర్థము కాలేదు. కానీ దేవుడు మీ అందరికి ఒక అవకాశమిచ్చాడు. అన్ని మతములకు అతీతముగా, ముగ్గురు ప్రవక్తలు చెప్పిన వాక్యములకు సరియైన అర్థము తెలుపు వ్యక్తి ప్రస్తుతము భూమిమీద ఒకే ఒకడున్నాడు. అతనిని ఆశ్రయించినా, అతని బోధలను ఆశ్రయించినా, మీ ప్రవక్తలు చెప్పిన రహస్యములు మీకు వివరముగా అర్థము కాగలవు. ఆయన ఎవరో నాకు తెలిసినా నేను దొంగను కదా! అందువలన నేను చెప్పను. మీరే వెతుక్కొని సత్యమును తెలుసుకొని సరియైన దైవమార్గములో నడవండి.


సమాప్తము


.


(ఈ నాటికలో ఏ మతస్థునికైనా అర్థము కాని విషయముంటే సామరస్యముగా అడిగి తెలుసుకోవచ్చును.)


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.





-----


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024