PSS book: కర్మ పత్రము : audio format 22thJan24 seems 100% correct

https://ibm.box.com/s/n2yncz1m6rrk3loxqi350o7hytpqvp0u
త్రైత సిద్ధాంతము :  కర్మ పత్రము

కర్మ అనునది ప్రత్యక్షముగా తెలియునదికాదు. కర్మ మర్మమైనది, ఎవరికీ తెలియదు. కర్మ అను మాటను
అందరూ అనుచున్నా వినుచున్నా అది కార్యరూపములో జరిగినప్పుడే, కర్మ ఇటువంటిదని అర్థము కాగలదు. కార్యము
ప్రత్యక్షముగా అందరికీ తెలియునట్లు జరుగుచుండును. కర్మ ఒక తెలియని భావము కాగా, అదే కర్మ కార్యముగా
కనిపించుచున్నది. తర్వాత అదే కర్మ అనుభవము కూడా అగుచున్నది. చట్టము ప్రభుత్వముది కాగా, చట్టము
పరిపాలనరూపములో తెలియుచున్నది. పాలకులు పాలనను ప్రజల మీద అమలు చేయగా, ప్రజలు దానిని
అనుభవిస్తున్నారని అందరికీ తెలుసు. అలాగే కర్మమను చట్టము, శరీరములో రాజు అయిన ఆత్మది. కర్మ, కార్యరూపములో
తెలియుచున్నది. శరీర అవయవములు కార్యమును అమలు జరుపగా, జీవులు దానిని అనుభవిస్తున్నారని తెలియుచున్నది.
మొత్తము మీద సుఖదుఃఖములు అనుభవములనుండి రాగా, అనుభవము కార్యమునుండి, కార్యము కర్మనుండి
పుట్టుకొస్తున్నదని తెలియుచున్నది.

సుఖమును అనుభవించగా అది కొద్ది సెకండ్ల కాలమో, కొద్ది నిమిషముల కాలమో ఉండును. తర్వాత
సుఖము అయిపోవును. సుఖము అయిపోయిందంటే, దానికి సంబంధించిన కార్యము అయిపోయిందని అర్ధము.
కార్యము అయిపోయిందంటే, దానికి సంబంధించిన కర్మ అయిపోయిందని అర్ధము. సుఖము దానికి సంబంధించిన
కార్యము మనుషులకు తెలిసి అయిపోవుచున్నవిగానీ, వాటికి సంబంధించిన కర్మ మాత్రము అయిపోయినా
కనిపించడములేదు. కర్మ అనునది నమ్మకము మాత్రమే. దాని కార్యము సత్యము, అట్లే దాని అనుభవము ప్రత్యక్షము.
కర్మము వలన కార్యము జరుగుచున్నదనీ, ప్రతి కార్యమునకూ మూలము కర్మమేనని తెలియుచున్నది. జరుగబోవు
కార్యమునకు కారణమైన కర్మ మనిషి తలలోనే ఉన్నది. జరిగిపోయిన కార్యమునకు కర్మ అయిపోయినది. కార్యము
జరుగుచున్నప్పుడు కర్మకూడా అయిపోతూయున్నది. అర్ధము చేసుకొంటే కార్యమునుబట్టి కర్మ జరుగలేదనీ, కర్మనుబట్టి
కార్యము జరుగుచున్నదనీ జ్ఞాపకముంచుకోవలెను.   జరుగబోవు కర్మను భవిష్యత్తు అంటాము. జరిగిపోయిన కర్మను
భూతము అంటాము.  జరుగుచున్న కర్మను వర్తమానము అంటాము. వీటినే మాటల వరుసలో భూత, భవిష్యత్‌,
వర్తమానములని అంటాము. ఈ మూడు పదములు కర్మయొక్క స్థితిగతిని గురించి తెలుపుచున్నవి. వర్తమానము
ప్రస్తుత అనుభవములో ఉండగా, భూతము జరిగిన సత్యముకాగా, భవిష్యత్తు అనుభవముకాదు, జరిగిన సత్యముకాదు.
అయితే తెలియని అంధకారమే భవిష్యత్తు. అటువంటి అంధకార భవిష్యత్తును జ్ఞానము అను జ్యోతి ద్వారా తెలియవచ్చునని,
మా రచనలలోని “జ్యోతిష్య శాస్తము” అను గ్రంథములో చెప్పాము.

భవిష్యత్తు అంధకారమని చెప్పినట్టు, కర్మను మర్మమని చెప్ప వచ్చును. మర్మము అనగా తెలియకుండ రహస్యముగా
ఉన్నదని అర్ధము. అంధకారమనగా చీకటితో కూడుకొని కంటికి తెలియకుండా ఉండునదని అర్థము. బాహ్య
జ్ఞానేంద్రియమైన కంటికిగానీ, అంతరేంద్రియమైన బుద్ధికిగానీ తెలియకుండా ఉండునదే కర్మ. కర్మ ఎవరికి మర్మమైనది
అని ప్రశ్నించుకుంటే, ఎవరైతే కర్మను అనుభవించుచున్నారో వారికి కర్మ మర్మమైనదని చెప్పవచ్చును. కర్మ అను
పదమును నాస్తికవాదులు, "హేతు వాదులమని పేరుపెట్టుకొన్న నాస్తికులు, సత్యాన్వేషకులమని చెప్పుకుంటున్న నాస్తికులు
ఒప్పుకొరు. కొన్ని సమాజములవారూ కర్మయను మాటను నమ్మరు. అటువంటివారు కర్మ అనునది కేవలము
కల్పితమనీ, కర్మ యనునది జ్ఞానమునకు సంబంధించినది కానేకాదని వాదించుచూ, కర్మయను మాటను చెప్పు యోగులను
జ్ఞానులను అవమానించి మాట్లాడుచూ, దైవజ్ఞానమునే హేళన చేయుచుందురు. అటువంటివారు కర్మను గురించి

--

ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు జవాబును ఇవ్వదలుచుకొన్నాము. అందువలన కర్మద్వేషులు, జ్ఞానదూషులు అయిన వారిని

వదలక, వారివద్దకు మేమే పోయి. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాము. కనిపించని
చీకటిగా, తెలియని మర్మముగాయున్న కర్మను, అందరికీ తెలుపుట మా కర్తవ్యముగా భావించి, నాస్తికులు అడుగు
ప్రశ్నలకు జవాబులను చెప్పుచూ వచ్చాము. అక్కడక్కడ అనేక సందర్భము లలో నాస్తికులు అడిగిన ప్రశ్నలనూ, మేము
చెప్పిన జవాబులనూ క్రింద వ్రాయుచున్నాము చూడండి.

1) ప్రశ్న :- భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ బైబిల్‌లో ఏసు చెప్పిన పాపము, ఖుర్‌ఆన్‌లో జిబ్రయేల్‌ చెప్పిన
కర్మపత్రము అనుమాటలు మూడు వేరువేరు భావములతో ఉన్నాయా? లేక అన్నీ ఒకే భావమునకు సంబంధించిన
మాటలా?

జవాబు :- భగవద్గీత సృష్ట్యాదిలో ఆకాశవాణిచేత సూర్యునికి చెప్పబడిన జ్ఞానము. అదే జ్ఞానమునే ఐదువేల నూటయాభై
ఒక్క (5151) సంవత్సరముల పూర్వము శ్రీకృష్ణుడు భగవద్ద్గీతగా, 2013 సంవత్సరముల పూర్వము ఏసు బైబిలుగా,
1400 సంవత్సరముల పూర్వము జిబ్రయేల్‌ ఖుర్‌ఆన్‌గా చెప్పడము జరిగినది. ఎవరు చెప్పినా అదియంతయు దైవజ్ఞానమే
అయినందున, ప్రత్యేకించి సృష్ట్రాదిలో సూర్యునికి చెప్పిన జ్ఞానమే మూడు సందర్భములలో చెప్పియుండడము వలన,
కర్మ అనినా, పాపమనినా, కర్మ పత్రమనినా అంతయు గీతలో చెప్పిన కర్మ అనియే తెలియవలెను. కర్మ అను పదము
ఒకటే అయినా, వారి భాషలను భావములనుబట్టి ఒకచోట కర్మఅనియూ, మరియొకచోట పాపము, పుణ్యము అనియూ,
మరియొక చోట కర్మపత్రము అని చెప్పుచున్నారు. కొన్ని సందర్భములలో పేర్లు మారినా ఉద్దేశ్యము మాత్రము గీతలో
శ్రీకృష్ణుడు చెప్పిన భావమే ఉంటుందని తెలియవలెను. కొందరు మనుషులుగానీ లేక ఇతర మతములవారుగానీ
కర్మను అర్ధము చేసుకోవడములో పొరపడడము జరుగుచున్నది. వారి మెదడులో అందిన భావము మీద వారు
నిలిచిపోవడము జరుగుచున్నది. దానినే అవగాహన లోపము అంటాము. అవగాహన సరిగా లేకపోవడము వలన
అర్ధము మారిపోయి, వారి భావములో వేరు అర్ధము నిలిచిపోవుచున్నది. దేవుని జ్ఞానము తెలియడములో ఒక్కొక్కరికి
ఒక్కొక్క అభిప్రాయము రావడము జరుగుచున్న దంటే, అది మనుషులలోనున్న అవగాహనా లోపము వలన జరుగుచున్నదని
చెప్పవచ్చును.

2) ప్రశ్న:- అవగాహనా లోపము తెలివితక్కువవారికుండును కదా! తెలివైన వారూ, మేథావులూ, ఉన్నత పదవులలోనున్న
వారూ, చాలామంది దేవుని విషయములో పూర్తి విరుద్ధముగావుంటూ, దేవుడే లేడని చెప్పుచుందురు. మరియు
సోమరిపోతులు దేవుడనీ, జ్ఞానమనీ పనీపాట లేకుండా వృథాగా కాలము గడుపుచున్నారని దూషించుచుందురు. ఇక్కడ
అందరూ తెలివైన వారే కదా దేవుడులేడని అనుచున్నారు. ఇంకా కొన్నిచోట్ల అలాకాదు ఇలా ఉన్నాడని కొందరూ
అనుచుండగ్గా, మొత్తానికి మా మతములో తప్ప ఇతర మతములలోనున్నది జ్ఞానముకాదు, దేవుడూకాదు అని కొందరు
చెప్పుచున్నారు. . వీరందరికీ దేవుని విషయములో ఏకాభిప్రాయము ఎందుకు లేదు. వీరందరికీ అవగాహనా
లోపమున్నదంటారా?

జవాబు  :- అవగాహనా లోపము అనునది ఒక వ్యాధిలాంటిది. ఒక వ్యాధి వీడు తెలివైనవాడు, వీడు తెలివితక్కువవాడని
చూడకుండా, తనకిష్టమొచ్చిన వారినందరికీ ఎలాగైతే వ్యాపించునో, అలాగే అవగాహనా లోపము అనునది తెలివితక్కువ
వారికే కాకుండా, తెలివైన మేధావులకు కూడా రోగమువలె ఆక్రమించియుండును. ప్రత్యేకించి దేవుని విషయములో

--
మాత్రము అవగాహనా లోపము ఎవరిలోనైనా, ఎంతటి గొప్పవారిలోనైనా, ధనికులలో నైనా, బీదవారిలోనైనా,
అవివేకవంతులలోనైనా, వివేకవంతులలోనైనా, పండితులలోనైనా, చదువురాని పామరులలోనైనా ఉండవచ్చును. కొన్నిచోట్ల
జ్ఞానులలో, అజ్ఞానులలో, మరికొన్ని చోట్ల జ్ఞానమును బోధించు వారిలో కూడా అవగాహనా లోపము ఏర్పడవచ్చును.
ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమంటే అవగాహనా లోపము అన్ని విషయములలోనూ, అన్ని సందర్భములలోనూ

కాకుండా, కొన్ని విషయములలో, కొన్ని సందర్భములలో మాత్రము ఏర్పడుచుండును. ఒక విషయమును వంద
మంది ఒకేమారు విన్నప్పుడు, అందరికీ ఒకే భావముతో అర్ధముకాకపోవడము వలన, వినిన ఒకే విషయము మీద
కొందరు వేర్వేరు అభిప్రాయములను కల్గియుందురు. వందమందిలో ఎవరిది సరియైన అభిప్రాయమో, ఎవరికి సరిగా
అర్ధమైనదో, అక్కడ వందమందికి చెప్పిన వానికే తెలియాలి తప్ప, మిగతావారికి తెలియుటకు అవకాశములేదు. చెప్పినవాడు
ఏ అభిప్రాయముతో చెప్పియున్నాడో, వినినవారికి ఏ అభిప్రాయములో అర్ధమైనదో, చెప్పిన వానికి మాత్రము ఎవరిలో
అవగాహనా లోపమేర్పడినదో ఖచ్చితముగా తెలియును. ఎందుకనగా! చెప్పబడినది ఏదో, చెప్పిన వానికి మాత్రము
తెలియును. కనుక విన్న వారిలోని భావము సరియైనదో, కాదో చెప్పిన వానికి మాత్రము తెలియునన్నది సూత్రము.

3) ప్రశ్న :- నాకు తెలియక అడుగుచున్నాను. అవగాహన అంటే ఏమిటి?

జవాబు  :- చెప్పినవాడు ఏ ఉద్దేశ్యముతో చెప్పుచున్నాడో, అదే ఉద్దేశ్యమును సరిగా గ్రపహించుకోవడమును అవగాహన
అంటాము. చెప్పిన వాని భావము, విన్నవాడు తెలుసుకొన్న భావము రెండూ సమానముగా ఉన్నప్పుడు దానిని సరిగా
గ్రహించుకోవడము అంటాము. సరి అనినా, సమానము అనినా రెండూ ఒకే అర్థము. రెండువైపుల సమాన భావము
ఉన్నప్పుడు సరిసమానము అని అనడము కూడా జరుగుచున్నది. ఒకవైపు భావమును సరి అని మరియొకవైపు
భావమును మొదటి దానితో పోల్చి చూచి దానికి సమానముగాయున్నప్పుడు, సరిసమానము అనుమాటను ఉపయోగించ
డము జరుగుచున్నది. ఎప్పుడైతే చెప్పేవానికి (మొదటివానికీ) వినేవానికీ (రెండవ వానికీ) తేడావస్తే దానిని సరిసమానము
కాదు అంటాము. ఇంకా వివరముగా చెప్పుకుంటే, మొదట చెప్పేవాడు ఒక విషయమును వాని భావములో వానికి
తెలిసిన దానిని తెలిసినట్లు నూటికి నూరుపాళ్ళు బోధించాడనుకొనుము. బోధ అంతయు మాటల రూపములో గానీ,
వ్రాతల రూపములోగానీ ఉండును. ఒక వ్యక్తి తనకు తెలిసిన దానిని తెలిసినట్లు చెప్పడమూ, ఉన్నదానిని ఉన్నట్లు
వ్రాయడమూ నూటికి నూరుపాళ్ళు ప్రకటించడము అంటాము. తనకు తెలిసినది ఏ రూపములో వ్యక్తము చేసినా,
దానిని నూటికి నూరుపాళ్ళుగా చెప్పవచ్చును. మాటల రూపములో చెప్పబడిన విషయమునుగానీ, వ్రాతల రూపములో
వ్రాయబడిన విషయమునుగానీ, వినినవారు లేక చదివినవారు ఎన్ని పాళ్ళు గ్రహించారో అంత అతని అవగాహన 
ఉందని చెప్పవచ్చును. ఏ విషయమునైనా, నూటికి నూరుపాళ్ళు గ్రహించగలుగువారు చాలా అరుదుగా ఉందురు.
విన్నదానినిగానీ, చదివినదానినిగానీ ఎవరైనా నూటికి నూరుపాళ్ళు గ్రహించుకోలేరు. వారి వారి గ్రాహితశక్తినిబట్టి
కొందరు 90 పాళ్ళు, కొందరు 80 పాళ్ళు, కొందరు 70 పాళ్ళు, మొదలగు స్థాయిలలో గ్రహించుకొనుచుందురు. 99
పాళ్ళ నుండి 9 పాళ్ళవరకు గ్రహించుకొను వారున్నారంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. నూటికి నూరుపాళ్ళు
గ్రహించుకొనువారు చాలా అరుదుగా ఉందురని ముందే చెప్పుకొన్నాము. కొన్ని విషయములనైతే ఒక్కరు కూడా
సక్రమముగా గ్రహించుకొనుటకు వీలులేనట్లుండును. కొన్ని మాటలు పూర్తి ద్వంద్వార్థములతో కూడుకొని యుండును.
ఉదాహరణకు చిత్రము, చెప్పు, కళ్ళు. ఈ మూడు పదములు ఒకే అర్థమును సూచించక రెండు అర్థములను

--
సూచించుచుండుట వలన, వీటిని చదివినప్పుడు సందర్భమునుబట్టి అర్థము చేసుకోవలసియుండును. అట్లుకాకపోతే
పూర్తిగా వేరుగా అర్థము చేసుకోవడము జరుగుచుండును.

అప్పుడే ఊరినుండి వచ్చిన వ్యక్తిని చూచి బాగున్నావా అని అడిగి మీరు దేనికొచ్చారు? అని అడిగామనుకోండి,
అప్పుడు ఆ వ్యక్తి తాను ప్రయాణించిన వాహనమును గురించి అడుగుచున్నాడేమోనని తలచి, టైన్‌ మిస్‌ అయ్యింది
అందువలన బస్‌కు వచ్చానని చెప్పాడు, అప్పుడు అడిగిన వ్యక్తి అదికాదండీ, ఏ పనికొరకు వచ్చారని అడిగానని
చెప్పాడనుకోండి, అప్పుడు మొదట అడిగినది ప్రశ్న వేరు, అతను చెప్పిన జవాబు వేరని ఎవరికైనా అర్ధమైపోవును.
అలాగే చిత్రము అనుమాటకు ఆశ్చర్యము అని అర్ధము చేసుకోవచ్చును లేక బొమ్మ అనిగానీ సినిమా అనిగాని అర్ధము
చేసుకోవచ్చును. చెప్పు అని అన్నప్పుడు కాళ్ళకు ధరించు పాదరక్షగా ఆ మాటను అర్ధము చేసుకోవచ్చు లేక సమాధానమును
అడుగుచున్నాడని అనుకోవచ్చును. అదే విధముగా కళ్ళు అన్నప్పుడు చూచే. కళ్ళుగా అనుకోవచ్చును లేక రాయిగా
అనుకోవచ్చును. ఇట్లు అనేక సందర్భములలో ఉన్న భావమును వదలి ప్రక్క భావములోనికి పోవు అవకాశము కలదు.
ఒకవేళ మాటల సందర్భములో అయితే వెంటనే పొరపాటును గుర్తించు కోవచ్చునుగానీ, వ్రాతల రూపములోనున్న
దానిలో త్వరగా పొరపాటును గుర్తించుకోలేము. ఉదాహరణకు ఒక వాక్యమును తీసుకొని చూస్తాము. “ఆ సమయమునకు
కళ్ళు లేక చేతికి దొరికిన కర్రను తీసుకొనికొట్టాను” అని వ్రాయబడిన విషయమును చూచి, ఆ సమయములో చూపు
లేకపోయిన దానివలన చేతికి దొరికిన కట్టెను తీసుకొన్నాడేమో” అని అనుకోవచ్చును. అయితే అక్కడ ఉన్న ఉద్దేశ్యము
కళ్ళు అనగా రాయి అని అర్ధము. రాయి దొరకని దానివలన చేతికి దొరికిన కట్టెతో కొట్టానని అర్ధము. ఈ విధముగా
ఎన్నో సందర్భములలో ఉన్న విషయమును సరిగా గ్రహించుకోలేమని తెలియుచున్నది. ఒక విషయమును
గ్రహించుకొనుటలో బుద్ధికియున్న శక్తిని గ్రాహితశక్తి లేక అవగాహనాశక్తి అంటాము, దానినే అవగాహన అని కూడా
అంటాము.

4) ప్రశ్న :- కొందరు ఒక గ్రంథమును ఒకమారు చదివినంతమాత్రమున ఆ గ్రంథములో ఏ విషయము ఏ పేజీలో
ఉన్నది చెప్పగలరు. అట్లే ఏ అధ్యాయములో ఏ శ్లోకమున్నది చెప్పగలరు. ఏ శ్లోకమైనా ఒక్కమారు చదివినంతమాత్రమున
ఒక్క అక్షరము కూడా తప్పుపోకుండా ఎప్పుడైనా చెప్పగలరు. ఒక్కమారు విన్న దానినిగానీ, ఒక్కమారు చదివిన
దానినిగానీ, సంపూర్ణముగా గ్రహించుకొనువారిని “ఏకసంతాగ్రాహులు” అని అంటారు. ఏకసంతాగ్రాహులు అనగా
ఒక్కమారు వినినా, చదివినా గ్రహించుకొని తమలో దాచుకొనువారని అర్ధము. అటువంటి వారు ఎందరో గలరు.
అటువంటివారందరు వినిన దానినిగానీ, చదివినదానినిగానీ నూటికి నూరుపాళ్ళు గ్రహించుకున్నట్లే కదా!

జవాబు  :- ఒక్కమారు చదివినంతమాత్రమునగానీ, వినినంతమాత్రమునగానీ, గ్రహించుకొనువారుండుట సహజమే. అది
వారి గొప్పతనమే అయినా, అది స్థూలగ్రాహితమేగానీ సూక్ష్మగ్రాహితము కాదు. చదివిన చదువును, వినిన భాషను
స్థూలముగా గ్రహించుకొని దానిని తమ జ్ఞాపకములో పెట్టుకొని తిరిగి చెప్పువారు కలరనుట వాస్తవమే. ఒక్కమారు
విన్నంతనే లేక చూచినంతనే తిరిగి చెప్పువారుగలరు. అంతమాత్రమున వారిని గ్రాహితశక్తి గలవారనుకోవడము
పొరపాటగును ఎందుకనగా! వారికున్నది జ్ఞాపకశక్తేగానీ, జ్ఞానశక్తికాదని తెలియుచున్నది. ఒక విషయమును వినినా,
చదివినా తిరిగి దానిని నూటికి నూరుపాళ్ళు మక్కికి మక్కి ఎట్లున్నదట్లే చెప్పగలిగితే, దానిని సరియైన గ్రాహితశక్తికాదని
చెప్పవచ్చును. స్థూలముగాయున్న విషయమును మక్కికి మక్కి నూరుపాళ్ళు చెప్పినా, సూక్ష్మముగాయున్న భావమునకు
ఏమాత్రము సరిసమానము కాదని తెలియవలెను. అటువంటి వారు భాష మీదనే ఆధారపడియుందురుగానీ, భావము

--

మీద ఆధారపడియుండరు. దేనిలోనైనా భాష ముఖ్యము కాదు భావము ముఖ్యము. భావము లేని భాషను లేక విద్యను

ఎంతగా ప్రదర్శించిననూ అది అలంకారదాయకమే గానీ, ఆనందదాయకము కాదు. భావములేని అవగాహన
ప్రాణము లేని శరీరములాంటిది. సర్వసాధారణముగా ప్రపంచ విషయములలోనే భావమునందు పొరపాటుపడువారు
పరమాత్మ జ్ఞాన విషయములలో పూర్తి పొరపడుటకు అవకాశము కలదు. అందువలన ఎంత గ్రాహితశక్తి గలవారికైనా
దేవుని జ్ఞానములోని సూక్ష్మతను అర్థము చేసుకోలేక, తమకు అర్థము కాలేదను విషయము కూడా తెలియకుండా
పోయి, అంతా అర్ధమైన దను నమ్మకముతోయున్నారు.

5) ప్రశ్న :- కర్మ విషయము బ్రహ్మవిద్యా శాస్త్రములో ముఖ్యమైన సమాచారమైనందున, గ్రంథములలోని జ్ఞానమును
కంఠాపాఠముగా చెప్పు వారికి కూడా కర్మలోని సూక్ష్మత సరిగా అర్ధము కాలేదనియే చెప్పవచ్చునా?

జవాబు : దేవుని శాస్త్రమైన దానిని పెద్ద విద్యాశాస్త్రము అంటున్నాము. అన్నిటి కంటే ముందు పుట్టినా, అన్నిటికంటే
చివరిలోనున్నదే దేవుని శాస్త్రము. దానినే బ్రహ్మవిద్యా (పెద్ద విద్యా) శాస్త్రమని పిలువడము జరిగినది. దేవుడు
కనిపించని సూక్ష్మమైనవాడు. అలాగే దేవుని జ్ఞానమంతయు సూక్ష్మ భావములతో నిండియుండును. స్థూలముగానున్న
శ్లోకములోగానీ, పాటలో గానీ, పద్యములోగానీ, గద్యములోగానీ, సూక్ష్మతను గ్రహించుకోలేని వారు దేవుని జ్ఞానములోని
సత్యమును తెలియలేరు. దేవుని జ్ఞానములో కర్మ ముఖ్యస్థానమును ఆక్రమించియున్నది. కర్మ దేవుని జ్ఞానములో
భాగమైనందువలన, కర్మ సూక్ష్మముగాయుండి ఎవరికీ తెలియనిదైయున్నది. అటువంటి సూక్ష్మతతో కూడుకొన్న
కర్మను స్థూలముగా జ్ఞాపకశక్తిగలవారు తెలియలేరు. కర్మను తెలియుటకు సూక్ష్మ గ్రాహితశక్తి అవసరము. జ్ఞాపక శక్తి
మనోబలముతో కూడుకొన్నది. మనోబలము మాయలాంటిది. నేను బాగా తెలిసినవాడినను గర్వమును కల్గించుట
వలన, తనకున్న జ్ఞాపకశక్తి మిగతావారికి లేదనుభావము గుణములలో గర్వమునకు సంబంధించిన దైనందున,
జ్ఞాపకశక్తి కూడా మాయకు బలమునిచ్చుచున్నది. అందువలన దైవ సంబంధమైన కర్మను గ్రహించుటకు సూక్ష్మ దృష్టి
లేకుండ పోవుచున్నది. ఎంతటి జ్ఞాపకశక్తికలవారికైనా సూక్ష్మముతో కూడుకొన్న దైవజ్ఞానము అవగాహనకొస్తుందను
నమ్మకము లేదు.
 
6) ప్రశ్న :- జ్ఞాపకశక్తియున్నవారికి సూక్ష్మ విషయములు అర్థముకావు, అవగాహనకు రావు అన్నారు కదా! అయితే
సూక్ష్మమును గ్రహించుకొను వారికి జ్ఞాపకశక్తి లేకపోతే, వారు గ్రహించుకొని ఏమి ప్రయోజనము. ఎవరికీ చెప్పలేరు
కదా!

జవాబు: జ్ఞాపకశక్తియున్నవాడు ఏ శ్లోకమునైనా, తాను చదివినదేనినైనా సులభముగా చెప్పగలడు. అలా
చెప్పినంతమాత్రమున బయటికి గొప్పగ కనిపించినా, అతనికి మాత్రము జ్ఞానము యొక్క సూక్ష్మత తెలిసియుండదు.
అయితే జ్ఞానములోని సూక్ష్మతను గ్రహించినవానికి జ్ఞాపకశక్తి లేకపోయినా, అతనికి జ్ఞానశక్తియుండును. కనుక
జ్ఞానములోని ముఖ్య భావమును సర్వసాధారణముగా చెప్పునుగానీ, జ్ఞాపకమున్నవానివలె శ్లోకములు, పద్యములు,
వాటి పేజీనంబర్లు మొదలగు వాటిని చెప్పలేడు. సూక్ష్మముగాయున్న జ్ఞానమును వివరించి అర్ధమగునట్లు చెప్పగలడు.
అట్లు చెప్పుటకు జ్ఞాపకశక్తి అవసరములేదు. మనిషి శరీరములోని ఆత్మయే శ్లోకములను, పద్యములను పేజీనంబర్లను
చెప్పకుండా, స్వచ్చమైన జ్ఞానమును మాత్రము అర్థమగులాగున బోధించును. జ్ఞాపకశక్తిగలవారిలో మనస్సు దృఢమైనదై
యుండి, గ్రంథములోని విషయములను ఉన్నదున్నట్లు తప్పులేకుండ చెప్పించగలదు. అయితే జ్ఞానులు అలా చెప్పలేరు.

--

అటువంటి జ్ఞాపకశక్తి వారికి ఉండదు. ఆ విధముగా శ్లోకాలు, పద్యాలు, వాక్యాలతో కూడుకొన్న మాటలను చెప్పలేరు.

జ్ఞాపకశక్తికలవారిలో మనస్సు బలముగాయుండి పొల్లుపోని వాక్యములను చెప్పితే, జ్ఞానులలో ఆత్మ బలముగాయుండి
వాక్యములను, శ్లోకములను చెప్పక, వాటిలోనున్న మూల జ్ఞానమును మాత్రము చెప్పును. అందువలన జ్ఞానులకు
జ్ఞాపకశక్తి లేకపోయినా పరవాలేదు.

7) ప్రశ్న :- కర్మ అనునది మర్మముగా ఉండునదనీ, ఎవరికీ తెలియదనీ, కర్మ అనునది నమ్మకము మాత్రమేననీ మీరు
చెప్పారు కదా! ఎవరికీ తెలియని దానిని మీరు ఎలా చెప్పగలుగుచున్నారు? మీకు నమ్మకమైన దానిని మేమెలా
నమ్మాలి?

జవాబు : కర్మ నమ్మకమైనదే అయినా అది అమలు జరిగినప్పుడు ప్రత్యక్షముగా బాధపడుచూగానీ, లేక సుఖపడుచూగానీ
దానిని అనుభ విస్తున్నాము. కావున కర్మ సత్యమైనదని తెలియుచున్నది. అనుభవమునకు వచ్చినప్పుడు ఎవని బాధ
వానికి తెలియును. కావున ఎవని కర్మ వానికి అర్థమగుచున్నది, అంతకంటే నిరూపణ అవసరము లేదు. కర్మను
గురించి నేను ఈ రోజు నీకు ప్రత్యేకించి చెప్పడము లేదు. దేవుడు సృష్టి ఆదిలోనే కర్మను గురించి సంపూర్ణముగా
చెప్పాడు. అందువలన కర్మను గురించి మనము నమ్మవలసిందే. ఎవరైనా నమ్మినా లేక నమ్మకపోయినా వాడు వాని
కర్మను అనుభవించక తప్పదు. అనుభవించేటప్పుడు ఇది నా కర్మ అని వానినోటిగుండా వాదే అనుచుండును.
అనుభవించినా కర్మంటే ఏమిటో తెలియనివాడు, తలకాయలేని మనిషితో సమానము. ఏ మనిషికైనా, ఏ జంతువుకైనా,
కర్మ తలలోనే ఉండును. ఎవడైనా కర్మను లేదు అంటే వాడు తలకాయలేని వానితో సమానమగును. ఎవదైనా
నాకున్నది తలే కదా! తలకాయ అంటున్నావేమిటి అంటే కాయ అనగా ఫలము అని అర్థము. కర్మఫలము తలలో
ఉండును, కావున దానిని తలకాయ అనడము జరుగుచున్నది.

8) ప్రశ్న :- తల అను పదముకు మీరు తెలివిగా కాయ అను పదమును చేర్చి తలకాయ అని చెప్పుచున్నారు. మీ
మాట ప్రకారము పోయినా కాయ పచ్చిదిగా ఉంటుంది. దానిని తినేదానికి రాదు, అంటే అనుభవించేదానికి రాదు.
కాయగా చెప్పిన కర్మ ఎలా అనుభవమునకు వస్తున్నది. అనుభవమునకు వచ్చే దానికి ఫలము అనాలిగానీ కాయ అని
అనకూడదు కదా! కర్మను కర్మఫలము అంటే సరిపోతుంది, దాని ప్రకారము తలను తలఫలము అని అనవచ్చునుగానీ,
తలకాయ అనడము తప్పుకదా! దీనికి మీరు ఏమంటారు? ఎలా సమాధానము చెప్పగలరు?

జవాబు ॥ మీరు అడిగినట్లు తలను కొన్ని సందర్భములలో మాత్రము తల ఫలము అని అర్థమొచ్చునట్లు తలపండు
అన్నారు. కొందరి లెక్కలో దీవెనగాా మరికొందరి లెక్కలో దూషణగానున్న పదము ఒకటి కలదు. అదే “నీ తలపండు
పగలనాని” అని అనుచుందురు.. ఈ వాక్యము జ్ఞానము ప్రకారము దీవెన అయితే, అజ్ఞానము ప్రకారము తిట్టుగా,
దూషణగా ఉన్నది. ఎలాగైనా తలపండు అను మాటనుగ్గానీ, తలఫలము అనుమాటనుగానీ కొన్ని సందర్భములలో
మాత్రము అన్నారు గానీ, మిగతా సందర్భములలో అంతా తలను కాయగానే పోల్చి తలకాయ అనడము జరిగినది.

9) ప్రశ్న :- కర్మ అనుభవమునకు వచ్చునది, కావున దానిని ఉద్దేశించి తలను తలపండు అని అనాలిగానీ, తలకాయ
అనడము దేనికి?

జవాబు  నీవు పుట్టినప్పుడు శిశువుగాయున్నావు. తర్వాత కొంతకాలమునకు బాలునిగా అని పిలువబడినావు. ఆ
తర్వాత ఇప్పుడు మనిషి అని పిలువ బడుచున్నావు. నీది పుట్టినప్పుడు మనిషి జన్మే అయినా, అప్పుడు నిన్ను మనిషి
--

అని ఎవరూ అనరు. కొంత పెరిగిన తర్వాత కూడా నీవు మనిషివే, అయినా అప్పుడు కూడా నిన్ను మనిషి అని అనరు,

బాలుడు అని అంటారు. బాల్యమంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్ను మనిషి అంటున్నారు. నీవు మొదట
పుట్టినప్పటినుండి మనిషే అయినా, శిశువు, బాలుడు, మనిషి అని ఎట్లు అంటున్నారో అలాగే కర్మను ఒకప్పుడు కాయ
అన్నారు, మరొకప్పుడు పండు అన్నారు. ఏ సందర్భములో ఎలా పిలువాలో అలాగే పిలుస్తున్నారు. మనిషి వయస్సునుబట్టి
శిశువు, బాలుడు, మనిషి అని అన్నట్టు, కర్మను కూడా పక్వమునుబట్టి పిందె, కాయ, పండు అంటున్నారు. అదెలాగో
వివరముగా చెప్పెదను విను. కర్మ అనునది కనిపించని భావమే అయినా దానికి మనిషివలె శిశుదశయున్నది,
బాల్యదశయున్నది, తర్వాత యౌవ్వనదశయున్నది. శిశుదశలో మనిషిని శిశువు అన్నట్లు కర్మను పుట్టుకలో ఆగామి
అంటున్నాము. అలాగే బాల్యదశలో మనిషిని బాలుడు అన్నట్లు కర్మను కొంతకాలమైన తర్వాత సంచితము అంటున్నాము.
బాల్యము తర్వాత మనిషికి వచ్చు యౌవ్వన, కౌమార, వృద్ధాప్యదశలలో మనిషి అంటున్నాము. అట్లే సంచితము తర్వాత
కర్మను ప్రారబ్ధము అంటున్నాము. దీనినంతటినీ గమనించితే కర్మ కూడా పిందె, కాయ, పండుగా ఉండుట వలన
కొన్ని సందర్భములలో కర్మను కాయగానే పిలువాలి. అలాగే కొన్ని సందర్భములలో కర్మను పండుగానే పిలువాలి.
మనిషిని శిశువుగా ఉన్నప్పుడు బాలుడనీ, బాలుడుగాయున్నప్పుడు శిశువని ఎలా పిలువడము లేదో అలాగే ఆగామి,
సంచిత, ప్రారబ్ధములను గుర్తించి దేనిని ఎప్పుడు ఏమనాలో అప్పుడు అలాగే పిలువాలి.

10) ప్రశ్న :- కర్మ మూడు రకములని తెలిసినది. మనిషికిగల శిశు, బాల్య దశలలో ఒక పోషకుడు లేక సంరక్షకుడు
ఉండి శిశు, బాల్యములలో బాధ్యతకల్గి శిశువు మనిషిగా మారేవరకు కాపాడుచుండును. అలాగే ఆగామి, సంచిత
కర్మలకు ఎవరైనా రక్షకుడుగానీ, పోషకుడుగానీ ఉన్నాడా?

జవాబు ॥ కనిపించే శిశువుకు కనిపించే తల్లి రక్షణగా ఉండి పోషించుచున్నది. బాల్యదశలో కూడా తల్లే ఎక్కువగా
చూచుకోగా, తండ్రి కొంత బాధ్యత కల్గియుండును. అలాగే కనిపించని కర్మకు కనిపించని ఆత్మ తల్లివలె పోషించుచున్నది.
ఆగామికర్మను భద్రపరచునది ఆత్మయే. తర్వాత ఆగామి సంచితముగా మారినప్పుడు సంచితమును కూడా తన
రక్షణలోనే ఆత్మ ఉంచుకొనుచున్నది. శిశువు కొంత కాలమునకు బాలునిగా మారిన తర్వాత కొంతకాలము
బాలునిగానేవుండి, ఆ తర్వాత మనిషిగా మారి సమాజములో ఒక వ్యక్తిగా గుర్తింపుకు వస్తున్నాడు. అలాగే ఆగామికర్మ
69 సంవత్సరముల 5 నెలల 10 రోజులకు సంచితముగా మారిపోయి ఆత్మ రక్షణలోనే ఉన్నది. ఆగామిగాయున్నప్పుడు
గానీ, సంచితముగాయున్న ప్పుడుగానీ ఆత్మ రక్షణలోనున్న కర్మ ఎవరికీ తెలియదు. కర్మచక్రములోనే ఆగామి, సంచిత
కర్మలు రెండూవున్నాా అవి ఎవరికీ తెలియవు. బాలుడు మనిషిగా మారి వ్యక్తిగా సమాజములో గుర్తింపబడినట్లు,
సంచితకర్మ ప్రారబ్ధముగా మారినప్పుడు కర్మచక్రములో జ్యోతిష్యుల చేత గుర్తింపబడుచున్నది. జ్యోతిని తెలిసినవాడు
జ్యోతిష్యుడు అనబడును. జ్యోతి అనగా వెలుగునిచ్చు జ్ఞానము అని తెలియవలెను. జ్యోతిష్యుడు అనగా జ్ఞాని అని
అర్థము. జ్ఞాని అయినవానికి కర్మ అనగానేమి అని తెలియును. కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను జ్యోతిష్యుడు చూడగలడు.
మనిషి వ్యక్తిగా సమాజములో గుర్తింపబడినట్లు ప్రారబ్ధకర్మగా మారిన కర్మ కర్మచక్రములో జ్ఞానుల చేత గుర్తింపబడుచున్నది.
ఆగామి, సంచితముగాయున్నప్పుడు ఏమాత్రము ఎవరి చేత గుర్తింపబడకయున్న కర్మ, ప్రారబ్ధకర్మగా మారిన తర్వాత
గుర్తింపబడుచున్నది. కర్మ మూడు రకములుగాయున్నప్పుడు ఆత్మే దానికి రక్షకుడు పోషకుడుగాయున్నది. అయితే
ఆగామి, సంచితములుగాయున్నప్పుడు ఎవరికీ తెలియకుండ కర్మచక్రమందే దాచియుంచిన ఆత్మ అదే కర్మ ప్రారబ్ధమైన
తర్వాత కర్మచక్రమందు జ్ఞానులకు కనిపించునట్లు చేయుచున్నది.

--
11) ప్రశ్న :- కర్మను తలవ్రాత అని కొందరంటారు. వ్రాత అని ఎందుకు అంటున్నారు?

జవాబు ॥ కర్మ అనునది వ్రాయబడిన 'పేపరులాంటిది. వ్రాయబడిన పేపరులో కొంత సమాచారమే ఉండును. కర్మనునది
కొంత, ఇంత అని పరిమితి లేకుండయున్నది. అందువలన ఒక కర్మ ఒక కాగితములో వ్రాయబడియుంటే, అనేక
కర్మలు వ్రాయబడుటకు ఎన్నో పేపర్లు అవసరము. అలా ఎన్నో కర్మలు ఎన్నో పేపర్లలో వ్రాయబడియుండుట చేత అది
ఒక గ్రంథములాంటిదని చెప్పవచ్చును. 130 సంవత్సరముల పూర్వము పేపర్లు లేవు, అచ్చుయంత్రములు లేవు.
'పేపరులేని అలాంటి కాలములో తాటిఆకుల మీద వ్రాయబడడము జరిగెడిది. . త్రేతాయుగములో ఆదికవి అయిన
వాల్మీకివద్దనుండీ, మూడువందల యాభై సంవత్సరముల పూర్వము వీరబ్రహ్మముగారి వరకూ, రామాయణమును,
కాలజ్ఞానమును తాటిఆకుల మీదనే వ్రాయడము జరిగినది. ఆనాడు పసుపు నూనె పూసిన తాటిఆకుల మీద వ్రాయడము
వలన, చాలాకాలము వరకు ఆ తాటిఆకులు శిధిలము కాకుండా ఉండెడివి. ఆకును పత్రము అనెడివారు తాటిఆకులను
తాటిపత్రములు అనడము జరిగెడిది. పూర్వము ఆకులమీద వ్రాత వ్రాసెడివారని నేటికినీ గుర్తుండునట్లు నేడు పెళ్ళి
విషయమును కాగితములో వ్రాయుచున్నా దానిని లగ్నపత్రము అంటున్నాము. అలాగే బాకీ విషయములో కూడా
పత్రము వ్రాసుకొందాము అనడము జరుగుచున్నది. కొన్ని వ్రాతల సమయములలో ఇప్పటికీ పత్రము అను పేరు
ఉపయోగించబడుచున్నది. అలాగే మన శరీరములో కర్మపత్రము ఉన్నదని చెప్పబడుచున్నది. కర్మ అనునది వ్రాయబడిన
గ్రంథములాంటిదని అనుకొన్నాము కదా! గ్రంథములాంటి కర్మ తలలోని కర్మచక్రములో ఉండుట వలన, కర్మను
తలవ్రాత అనడము జరుగుచున్నది. ఎవని కర్మపత్రము వాని తలలోవున్నదని చెప్పుచుందురు. కర్మ లేకుండాపోయి
మోక్షము పొందవలెనను భావముతో పెద్దలు దీవెనను ఇచ్చునప్పుడు “నీ ఆకు చినగనాని” అని అనడము జరిగెడిది.
ఆకు చినిగితే కర్మవ్రాత లేకుండా పోతుందను భావముతో నీ ఆకు చినగనాని అని అనెడివారు. వ్రాత ఉన్నప్పుడు
వ్రాయబడు పత్రము కూడా ఉండాలి కదా! అందువలన కర్మవ్రాతను కర్మపత్రము అన్నారు. కర్మపత్రము ప్రతి ఒక్కరికీ
వారి తలయందే ఉండుట వలన, దానిని తలవ్రాత అని కూడా చెప్పుచుందురు. ఏ జ్ఞానమూ లేని సాధారణ మనిషి
కూడా ఏదైనా బాధకల్గినప్పుడు అంతా నాకర్మయని తలవైపు చేయిని చూపును. ఏమీ తెలియకున్నా అతని చేయి
తలవైపు చూపడము ఆశ్చర్యము కాదా! ఇంకా కొందరు అజ్ఞానులైనవారు కూడా ఏదైనా కష్టమొచ్చినప్పుడు, ఇదంతా
నా తలవ్రాతయని తలను కొట్టుకొనుచుందురు.. కొందరు తలను పట్టుకొనుచుందురు. వారికి కర్మంటే ఏమిటో
తెలియకున్నా నా కర్మయని వారు వారి తలను చూపడము వారి వెనుకయున్న ఆత్మే ఆ పని చేయిస్తున్నదని అర్థమగుచున్నది.
అలా చూపడము వలన కర్మ అనునది తలలో ఉన్నదని ఆత్మ అందరికీ తెలియజేసినట్లున్నది. దీనినంతటిని గమనించిన
జ్ఞానులు కర్మను తలవ్రాతయని అన్నారు.

12) ప్రశ్న :- కర్మ అనునది ఎన్నో విషయములతో కూడుకొనియున్నదనీ, ఎన్నో విషయములుండుట వలన దానిని
ఎన్నో పత్రముల సముదాయమైన ఒక గ్రంథములాంటిదని మీరు చెప్పడము జరిగినది. కర్మను గురించి చెప్పడములో
మాకు అర్ధమగుటకు అలా వ్రాయబడిన గ్రంథమని చెప్పారా? లేక ఎక్కడైనా దేవదూతలైనవారు మూలగ్రంథములలో
చెప్పారా? దీనికేమైనా శాస్త్రాధారమున్నదా?

జవాబు : మేము చెప్పు జ్ఞాన విషయములన్నియు శాస్త్రబద్దమైనవే ఉండును. శాస్త్రీయత లేనివాటిని గురించి మేము
ప్రస్తావించము. సృష్టాదిలో ఆకాశ వాణిద్వారా చెప్పబడిన జ్ఞానము ఖగోళములోనున్న సూర్యగ్రహము విని భూమిమీదగల
--

మనుషులకు తెలుపగా, కొంత కాలమునకు అది అధర్మములుగా మారిపోగా, ద్వాపరయుగ చివరికాలములో దేవుడు

తన దూత అయిన శ్రీకృష్ణుని ద్వారా, ఏసు ద్వారా రెండవమారు భూమిమీద చెప్పించాడు. సూర్యగ్రహము మనుషులకు
చెప్పినట్లే, దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసిన జిబ్రయేల్‌ గ్రహము 1400 సంవత్సరముల పూర్వము ముహమ్మద్‌
ప్రవక్త గారికి చెప్పడము జరిగినది. దేవదూతలైన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో, ఏసు చెప్పిన బైబిలులో, జిబ్రయేల్‌
గ్రహము చెప్పిన ఖుర్‌ఆన్‌లో కర్మను లిఖితముగా నున్నదని చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగ
మందు, మొదటి శ్లోకమున “కిం కర్మ పురుషోత్తమ” (కర్మ అంటే ఏమిటి కృష్ణా) అని అర్జునుడు అడగడము జరిగినది.
అప్పుడు కృష్ణుడు మూడవ శ్లోకమందు జవాబు చెప్పుచూ “విసర్గః కర్మ సంజ్ఞితః అని అన్నాడు. దాని అర్ధమేమనగా!
కర్మ సంజ్ఞితః అనగా గుంపుగాయున్న కర్మయని అర్ధము. విసర్గః అంటే సూక్ష్మాతి సూక్ష్యముగా విభజింపబడినదని
అర్ధము.  పూర్తి అర్ధమును చూస్తే ప్రతి చిన్న విషయమును కూడా లిఖించబడియున్న గ్రంథమని అర్ధము. కర్మ
సంజ్ఞితః అనగా కర్మ కూడలియైన గ్రంథమని చెప్పవచ్చును. కర్మంటే ఏమిటి? అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు
శ్రీకృష్ణుడు కర్మంటే సూక్ష్మాతి సూక్ష్మముగా విడదీసి వ్రాయబడిన కార్యములకు కారణమై నది కర్మని చెప్పాడు. ఇకపోతే
బైబిలు గ్రంథమందు లూకా సువార్త 12వ అధ్యాయమున 7వ వాక్యమందు “మీ తలవెంట్రుకలన్నియు లెక్కించబడియున్నవి”
అని కలదు. మనిషి శరీరమునకు ఎన్నో ముఖ్యమైన అవయవములున్నవి. ముఖ్యమైన వాటిని వదలి ముఖ్యముకాని
తలవెంట్రుకలను గురించి అవి కూడా లెక్కించబడియున్నాయి అంటే ముఖ్యమైన ప్రతి దానిని వదలక వ్రాసియుండునని
అర్థమగుచున్నది. ముఖ్యము కాని, మానవునికి ఎటువంటి ఉపయోగములేని వెంట్రుకలనే లెక్కల ప్రకారము వ్రాసియుంటే,
మిగతా బ్రతుకుతెరువుకు సంబంధించిన ప్రతి విషయము ముందే లెక్కించి వ్రాసియున్నవని అర్థమగుచున్నది. వెంట్రుకలు
కూడా లెక్కించబడి ఉన్నాయి అను మాట “శరీరమును చంపిన తర్వాత ఏమియు చేయని వారికి భయపడకుడి,
చనిపోయిన తర్వాత నరకాగ్నిలో వేయువానికి భయపడుము” అని చెప్పినప్పుడు అన్నాడు. దీనిఅర్ధము మనుషులకు
భయపడవలసిన పనిలేదు కర్మకు భయపడాలనీ కర్మప్రకారమే అన్నీ జరుగుననీ కర్మప్రకారమే నీ తలలోని వెంట్రుకలు
కూడా ఉన్నాయనీ, ఒక వెంట్రుక ఊడిపోవడానికి కూడా కారణమైన కర్మ ఉండాలని అర్ధమగునట్లు చెప్పుచూ, నీ
తలలోని వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయని అన్నాడు. దీనినిబట్టి ప్రతీదీ జీవితమంతా వ్రాసిపెట్టబడిన కర్మప్రకారమే
జరుగునని అర్థమగుచున్నది. ఒక జీవితమునకు సరిపడు కర్మ ఎంతోవుండును. కావున కర్మను లిఖించబడిన
గ్రంథమన్నాము.

మహాజ్ఞాని జిబ్రయేల్‌ చెప్పిన ఖుర్‌ఆన్‌గగ్రంథములో 18వ సూరా 49వ ఆయత్‌నందు “కర్మల పత్రాలు వారిముందు
ఉంచబడుతాయి. అపరాధులు ఆ పత్రాల్లో ఉన్నదానిని చూచుకొని (కర్మను చూచుకొని) భయపడడము నీవు చూస్తావు.
అప్పుడు వారు “అయ్యో మా దురదృష్టం, ఇదేమి గ్రంథము, ఇది ఏ చిన్న విషయమునుగానీ, పెద్ద విషయమునుగానీ,
వ్రాయకుండా విడిచిపెట్టలేదు.” అని అంటారు. తాము చేసుకొన్నదంతా వారు ప్రత్యక్షముగా చూచుకొంటారు. నీ
ప్రభువు ఏ ఒక్కడికీ అన్యాయము చేయడు అని కలదు. దీనినిబట్టి ఎవనికిగానీ, అన్యాయముగా కర్మ లిఖించబడదనీ,
ఉన్నదున్నట్లు వ్రాయబడుననీ తెలియుచున్నది. దేవుడు ఎవనికిగానీ కర్మ ఎక్కించడముగానీ, తగ్గించడముగానీ చేయక
ఎవరు చేసుకొన్నదానిని వారికి వ్రాయబడునట్లు చేయుచున్నాడు. ఈ విషయమై 58వ సూరా, 39, 40, 41 వాక్యములలో
ఈ విధముగా కలదు. “ (39) ప్రతి మనిషికీ తాను కృషి చేసిన దాని ఫలితము తప్ప మరొకటి లభించదు. (40)
నిశ్చయముగా త్వరలోనే అతనికి అతని కృషి ఫలితము చూపబడుతుంది. (41) అప్పుడు అతనికి అతని పూర్తి ప్రతి

--
ఫలితము ఇవ్వబడుతుంది.” ఈ మూడు వాక్యములలో ఎవడు చేసుకొన్న కర్మ, కార్యరూపములో వానికి లభించునని
తెలియుచున్నది. అంతేగాక కర్మ గ్రంథరూపములో ఉన్నదనీ, దానియందు ప్రతి చిన్న విషయమును కూడా వదలకుండా
వ్రాసియుంచారని కూడా తెలిసినది. ఈ విషయమునే కర్మ సంగము (కర్మ గ్రంథము) విసర్షముగా (అతి చిన్నదిగా)
విభజించి వ్రాయబడివున్నదని భగవద్గీతలో చెప్పబడినది. అందువలన మూడు మూల గ్రంథములలో కర్మను విపులముగా

చెప్పుచూ కర్మసంగమమని గీతలో, కర్మచయమని మరియొక చోట, ఏ చిన్న విషయమును (పాపమును) వదలక
వ్రాసిపెట్టబడిన గ్రంథమని ఖుర్‌ఆన్‌ గ్రంథములోనూ చెప్పిన దానినిబట్టి కర్మయొక్క కూడలి మన తలలో ఎలాగున్నదో
అర్థము చేసుకోవచ్చును.

13) ప్రశ్న :- కర్మ మీరు చెప్పినట్లు ఈ విధముగానే ఉండునని అందరూ తెలుసుకోగలరా?

జవాబు ॥ అలా అందరూ తెలియుదురనుటకు అవకాశము లేదు. కర్మయనునది చాలా సూక్ష్మమైన జ్ఞానముతో
కూడుకొనియున్నది. ఎంతో గొప్ప జ్ఞానులకు మాత్రమే కర్మ విధానము అర్ధము కాగలదు. దైవజ్ఞానము మీద విశ్వాసము
లేనివారికి , దైవజ్ఞానమును తెలియనివారికి కర్మ విధానము ఏమాత్రము అర్ధము కాదు. ఈ విషయమై ఎంతో గొప్ప
జ్ఞాని అయిన యోగి వేమన తన పద్యములందు ఇలా అన్నాడు.

*
(ఆటవెలది) తెలివినొందలేక తిరమును బడయక
తిరుగు నస్థిరుండయి దేహి జగతి
తిరుగ నేల కర్మ తెలియ దివ్యజ్ఞాని
విశ్వదాభిరామ వినురవేమా.

*
ఆ|| పరంగ నిలను ముందు బ్రతుకు తీరెటుంగక
సకల సంపదలను సతములనుచు
కర్మ మర్మములను కనలేరు మూర్కులు
విశ్వదాభిరామ వినురవేమా.

వేమనగారు చెప్పిన ఈ రెండు పద్యములలో మొదటి దానియందు దివ్యజ్ఞాని అయినవాడు మాత్రము కర్మను
తెలియగల్గుననీ, కర్మను తెలియని వారు అజ్ఞానులై స్థిరమైన మోక్షమును తెలియక అస్థిరుండయి తిరుగుచుండుననీ
చెప్పారు. రెండవ పద్యములో భూమిమీదగల సకల సంపదలను ఎల్లప్పుడు ఉండునవనీ, సంపద ధ్యాసకల్గిన
మూర్కులు కర్మయొక్క మర్మమును తెలియలేరని చెప్పారు. రెండు పద్యముల సారాంశములో దివ్యజ్ఞానులకు మాత్రము
కర్మ ఏమిటో తెలియుననీ, మూర్కులైన అజ్ఞానులకు కర్మ తెలియదని చెప్పడము జరిగినది.

14) ప్రశ్న:- మనుషులు చేసుకొన్న ఎన్నో మంచి పనుల ఫలితమైన పుణ్యములను, చెడు పనుల ఫలితమైన పాపములను
కలిపి కర్మసంగము అంటున్నాము. సంగము అంటే ఒక గుంపు అనియు లేక ఒక మొత్తము అనియు అర్ధము
రాగలదు. కర్మసంగమును గ్రంథముగా మూడు మూల గ్రంథములలో చెప్పినట్లు తెలియబడినది. అది అజ్ఞానులకు
తెలియదని, జ్ఞానులకు మాత్రము తెలియబడు లిఖితకర్మయని తెలియబడినది. వ్రాయబడిన కర్మ ఒక గ్రంథరూపములో
ఉండునని పెద్దలు చెప్పినట్లు మనకు కూడా కొంత అర్థమైనది. ఈ విషయములో మాకు ఒక ప్రశ్న వచ్చినది.

--

అదేమనగా! మర్మముగాయున్న కర్మగ్రంథము కొన్ని భాగములుగాయున్నదా? పాపము వేరు పుణ్యము వేరైన దానివలన

కర్మయను గ్రంథము కూడా రెండు భాగములుగా ఉన్నదా? లేక అంతా ఒకటే భాగముగా ఉన్నదా? తెలియజెప్పండి.

జవాబు : మీ ప్రశ్న బాగానే ఉన్నదిగానీ, కర్మను గురించి చెప్పాలంటే నేనెంతటివాడిని. ఎంతో గొప్ప జ్ఞానులయినా
కర్మను గురించి చెప్పడమునకు తడబడుచుందురు. ఎందుకనగా! ఎంతో తీక్షణమైన జ్ఞానదృష్టికలవారు మాత్రమే
కర్మను గురించి ఖచ్చితముగా చెప్పగలరు. అయినా మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసినంతవరకు చెప్పేదానికి
ప్రయత్నిస్తాను. నేను ఎందుకు ఇట్లు చెప్పుచున్నానంటే పెద్ద జ్ఞానులైనవారే ఏది కర్మో, ఏది కర్మ కాదో తెలియక
'భ్రమపడుచుందురని భగవద్గీతలో భగవంతుడే స్వయముగా చెప్పడము జరిగినది. భగవద్గీతయందు జ్ఞానయోగమను
అధ్యాయమున 16వ శ్లోకములో ఇలా చెప్పడము జరిగినది చూడండి.

శ్లో; “కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః”

భావము :- “ఏది కర్మనో, ఏది కర్మకాదో పండితులు (జ్ఞానులు) కూడా తెలియక పొరపడుచుందురు.” అని అన్నాడు.
వేమనయోగి “దివ్యజ్ఞానులు కర్మను తెలియగలరు. అంతటివారు కాకపోతే కర్మను తెలియలేరు.” అన్నాడు. భగవంతుడైన
శ్రీకృష్ణుడు, మహాయోగి అయిన వేమన చెప్పిన మాటలనుబట్టి కర్మ విషయములో ఏమి మాట్లాడినా జాగ్రత్తగా, కర్మను
గురించి పూర్తిగా తెలిసినవారైయుండి మాట్లాడవలెను. నేను వేమనయోగి అంతటి యోగిని కాకపోయినా, నా ప్రక్కవాడు,
నా హితుడు అయిన వాని సహకారముతో మేము ఇద్దరము కలిసి చెప్పడము ఏమనగా!

కర్మనునది గనిలాంటిది. గనిలో త్రవ్వేకొద్దీ ఖనిజము దొరుకు చుండును. అలాగే ఖనిజమున్న గనిలాంటిది
మర్మగ్రంథము.  మర్మ గ్రంథమును అజ్ఞానులు తెరచి చూస్తే. ఖాళీ పేపర్లు కనిపించును. అందులో ఏ వ్రాతా
కనిపించదు. అందరికీ కనిపించదు కాబట్టి దానిని మర్మగ్రంథము అంటున్నాము.  ఇదే విషయమును చెప్పుచూ
వేమనయోగి తన పద్యమందు ఇలా అన్నాడు.

ఆ|| కర్మజాలమనుచు ఘనులెల్ల బల్మేరు
కర్మమేమి? దాని ఘనతయేమి?
తెలుపో, నలుపో, యెరుపో, తెలిసినం బల్ముండు
విశ్వదాభిరామ వినురవేమా.

వేమన చెప్పిన ఈ మాటనుబట్టి, కర్మను గురించి ఘనమైనవారు (గొప్పవారు) చెప్పుచున్నాా వారికి కూడా
కర్మమేదో, దాని ఘనత ఏమిటో వారికి తెలియదు. కర్మను గ్రంథమును తెరచి చూచినా దానిలో నలుపు రంగు
అక్షరములుగానీ, తెలుపు రంగు వ్రాతగానీ, ఎరుపురంగు లిఖితము గానీ ఏమీ కనిపించదు. అటువంటి మర్మగ్రంథమును
గురించి తెలిసినప్పుడే మాట్లాడు అని చెప్పినట్లు తెలియుచున్నది. ఇప్పుడు నేను దీనిని గురించిన వివరము చెప్పలేనుగానీ,
నా తోడున్నవాడు అన్నీ తెలిసి, కర్మమర్మమును బాగా తెలిసినవాడై ఆయనే స్వయముగా ఇట్లు చెప్పుచున్నాడు, జాగ్రత్తగా
వినండి. “కర్మ అనునది ఎంత పెద్ద గ్రంథమో ఎవరికీ తెలియదు. ఆ గ్రంథమును ఎంత చదివినా ఆ గ్రంథము
అయిపోవునది కాదు. ఎందుకనగా! చదివిన పేజీలను చించివేస్తూ పోయినా ఎన్ని పేజీలను చదివి చించివేస్తారో అన్ని
పేజీలుగానీ, దానికంటే ఎక్కువ పేజీలుగానీ, లేక దానికి రెండింతలు పేజీలుగానీ గ్రంథము చివరిలో నేనే ఆతికిస్తా

--
వుంటాను. చదివి చించివేసిన పేజీలలో క్రొత్తవ్రాత వ్రాసి వెనుక నేను అతికించుట వలన ఎవడు ఎంతకాలము
చదివినా అది అయిపోదు. భూమిమీద కర్మగ్రంథము మర్మగ్రంథముగాయున్నదని తొంభై శాతము మందికి తెలియదు.
పది శాతము మందికి తమ కర్మతో కూడుకొన్న మర్మగ్రంథమొకటున్నదని తెలిసినా, అందులోని వ్రాత ఏడు శాతము
మందికి కనిపించదు. మిగిలిన మూడు శాతము మందికి కర్మగ్రంథము దానిలోని వ్రాత కనిపించినా, చదివినా,
వారిలో రెండు శాతము మందికి నేను వెనుక పేజీలను పెంచుతున్నానని తెలియదు. నూరులో ఒక్క శాతముగల
వారెవరో వారికి మాత్రము కర్మగ్రంథమును శిథిలము కాకుండా, ఎంత చదివినా అయిపోకుండా పేజీలను అతికించుచూ,

ఆ గ్రంథమునకు రక్షకునిగా, పర్యవేక్షకునిగా నేనున్నానని తెలిసినవారు, గ్రంథమును వదలి నామీదే ధ్యాసపెట్టుకొని
నాతో ఏకాంత సహవాసము చేయడము వలన, వారినెత్తిన మర్మముగాయున్న కర్మ గ్రంథమును నేనే తీసి వేయుచున్నాను.
కర్మగ్రంథము ఎవని తలమీద లేకుండా పోవునో వాడు నాతో సమానమగును. ఎందుకనగా నాకు గ్రంథము లేదు,
నావలె వానికీ గ్రంథములేదు. కావున ఇద్దరము కలిసిమెలిసియుందుము.  వాడు మూడు, నేను ఆరే అనుకోండి.
ఇద్దరము కలిసియుంటే ఏమౌతామో మీరే చెప్పండి. ఏమౌతాము? కేవలము తొమ్మిది అవుతాము అంతే! ఇందులో
రహస్యము ఏముంది. మూడు ఆరు కలిస్తే తొమ్మిదే కదా!”

15) ప్రశ్న :- నేను అడిగిందేమిటి? మీరు చెప్పిందేమిటి? గ్రంథము భాగములుగా ఉన్నదా అన్నాను. మీరునా
మాటకి సమాధానము చెప్పకుండ అటు త్రిప్పి ఇటు త్రిప్పి ఎటో తీసుకెళ్ళి మూడు ఆరు కలిస్తే తొమ్మిది అంటున్నారు.
మూడు ఏమిటో, ఆరు ఏమిటో, తొమ్మిది ఏమిటో నాకు రవ్వంత కూడా అర్ధము కాలేదు. వాటినన్నిటినీ వదలివేసి నా
ప్రశ్నకు జవాబును చెప్పండి. అసలు నీకు నా ప్రశ్నకు జవాబు తెలుసో తెలియదో ముందు చెప్పు?

జవాబు: నీవు అడిగిన ప్రశ్నకు కావాలనే నేను జవాబు చెప్పలేదు. నీ స్థాయిని నీవు తెలిసినప్పుడు ఎదుటివాని స్థాయిని
అంచనావేయగలవు. అందువలన నీ స్థాయి ఎంతనో చెప్పుటకు మూడు ఆరు తొమ్మిది అన్నాను. నీవు ఎప్పటికీ
మూడే, నేను ఎప్పటికీ ఆరే. ఇప్పుడు నీతో మాట్లాడునది మూడుగానున్న మనిషికాదు. ఆరుగానున్న నేను. ముందే
నీ ఎదుటనున్న మనిషి నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను, నాతోయున్నవాడు చెప్పునని చెప్పాడు. ఆ మాట నీకు
ఏమాత్రము అర్ధము కాలేదు. అందువలన నన్ను వాడే అనుకొన్నావు. నీ ఎదుటనున్నవాడు మూడు. నీతో మాట్లాడు
వానిని ఆరు. ఇదంతా నీకు అర్ధముకాదుగానీ నీవడిగిన ప్రశ్నకు జవాబు నీముందున్నవాడే చెప్పుతాడు. వానితో నేనే
చెప్పిస్తాను విను. మర్మగ్రంథము అని పేరుగాంచిన కర్మగ్రంథము నీవనుకొన్నట్లు రెండు భాగములుగా లేదుగానీ, అది
మూడు అధ్యాయములుగా ఉన్నది. ఒక్కొక్క అధ్యాయములో పన్నెండు పాఠముల ప్రకారము మూడు అధ్యాయములకు
36 పాఠములు గలవు. ఒక్కో పాఠమున తొమ్మిది సమాచారములు గలవు. ఆ లెక్క ప్రకారము 36 పాఠములకు
మొత్తము 324 సమాచారములు గలవు.

ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! కర్మ గ్రంథము వాస్తవానికి 324 పేజీల పుస్తకమే.
అయినా ఎన్ని పేజీలు చదువుచూ పోయినా అన్ని పేజీలు పెరుగుట వలన అది అంతులేని గ్రంథమైనది. ఎవరికీ దాని
పేజీలు ఇన్ని ఉన్నాయని అర్ధము కాలేదు. యోగులైన వారికి కొందరికి మాత్రము కర్మగ్రంథము యొక్క మర్మము
తెలుసును. అయినా వారు చెప్పినా మిగతవారు వినే స్థితిలో లేరు. అందువలన కర్మ గ్రంథముగానీ, కర్మగ్రంథములోని
కర్మసిద్ధాంతము గానీ ఎవరికీ అర్ధము కాలేదు. దేవుడు ముందు జ్ఞానము తెలిపిన హిందూ సమాజములోనే కర్మ

--

విషయము పూర్తిగా మర్మమైపోయినది. తర్వాత వచ్చిన మతములలో కర్మవిధానము ఏమాత్రము తెలియకుండా

పోయినది. నాస్తికవాదులైతే కర్మ అను పదము అసత్యమైనదిగా లెక్కించుకొనుచున్నారు. క్రైస్తవ, ఇస్లామ్‌ సమాజములలో
కర్మ అంటే ఏమిటో పూర్తి అవగాహన లేకుండా పోయినది. బైబిలు గ్రంథముకంటే ఖుర్‌ఆన్‌ గ్రంథములో కర్మ అను
పదము ఎక్కువమార్లు ఉన్నా అది ఎక్కడోనున్న స్వర్గ నరకముల నిమిత్తమే అనుకొన్నారు. బైబిలులో కర్మను ఎక్కువగా
పాపము అని చెప్పియుండగా, దానికంటే దగ్గరగా ఖుర్‌ఆన్‌ గ్రంథములో కర్మలిఖితము, కర్మ గ్రంథము, కర్మపత్రము
అను పదములు వాడి దగ్గర భావముతో చెప్పినప్పటికీ వారు కర్మను స్వర్గ నరకముల నిమిత్తమని సరియైన భావమునే
చెప్పినా స్వర్గ నరకములు ఎక్కడో ఉన్నాయని పొరపాటు పడిపోయారు. అంతేకాక మోక్షము అను జన్మ లేని విధానమును
స్వర్గముగా పోల్చుకోవడములో కర్మ విధానము, కర్మరాహిత్యవిధానము రెండూ పూర్తి తెలియకుండా పోయాయి. ఖుర్‌ఆన్‌
గ్రంథములో ఎంతో ఉన్నతమైన దైవజ్ఞానమున్నా ఒక విధముగా దానిని ముస్లీమ్‌లు పూర్తిగా అందుకోలేకపోయారు.
ఒక్క కర్మ విధానములో మాత్రము జిబ్రయేల్‌ చెప్పిన స్థాయిని అందుకోలేక పోయారు. ముస్లీమ్‌లే కాకుండా అన్ని
మతములవారు కర్మను గురించిన అవగాహనను తెలుసుకోలేక పోయారు.

16) ప్రశ్న :- మీరు చెప్పు విధానములో కర్మ అనునది ఎక్కడున్నది?

జవాబు:   శరీరములోనే తలయందుగల బ్రహ్మ, కాల, కర్మ గుణచక్రములను నాలుగు చక్రముల సముదాయములో
పైనుండి బ్రహ్మచక్రమును వదలి వేసి క్రిందగల కాల, కర్మ గుణచక్రములను పరిశీలించిచూస్తే, మూడు చక్రములలో
మధ్యనగల కర్మచక్రములో కర్మ నిలువయుండుననీ, కర్మచక్రమే కర్మకు గ్రంథముగాయున్నదనీ, కర్మచక్రములోనే కర్మ
నమోదు చేయబడుచున్నదని తెలియుచున్నది. ప్రతి మనిషి శరీరములోని ఆత్మే అతనికి పర్యవేక్షకుడిగాయుండి, అతని
కర్మచక్రములో వాడు చేసుకొన్న మంచి చెడు కార్యములయొక్క పుణ్య పాపములను నమోదు చేయుచున్నాడు. ఇదే
విషయమునే ఖుర్‌ఆన్‌ గ్రంథములో 50వ సూరాయందు 18వ ఆయత్‌లో ఇలా కలదు చూడండి. “మనిషి నోట మాట
వెలువడకముందే, అతని దగ్గరున్న ఒక పర్యవేక్షకుడు, దానిని భద్రపరచటానికి (వ్రాసి పెట్టడానికి) సిద్ధముగా
ఉంటాడు.” ఈ మాటలో పర్యవేక్షకుడు అన్న పేరుకు తగినట్లు మనిషి శరీరములోని ఆత్మ అన్ని పనులు చేయుచూ
మనిషి సంపాదించుకొను మంచి చెడులను పాపపుణ్యముల రూపములో నమోదు చేయుచున్నది. అందువలన ఆత్మను
ఉద్దేశించి ఖుర్‌ఆన్‌ గ్రంథములో పర్యవేక్షకుడు అని అనడము జరిగినది.

17) ప్రశ్న :- మనిషి చేయు ప్రతి తప్పును ఒప్పును నమోదు చేయువాడు ఒకడున్నాడనీ, వానినే పర్యవేక్షకుడు లేక
ఆత్మ అంటున్నారు కదా! అలాంటప్పుడు వారికిష్టమైనవారు తప్పుచేసినా ఒప్పుగా, ఇష్టములేనివారు మంచి చేసినా
చెడుగా వ్రాసుకోవచ్చును కదా! ఒకవేళ అట్లు జరిగితే తప్పు చేయని వాడు కూడా అన్యాయముగా శిక్షకు గురికాగలడు
కదా! తప్పు చేయని వానిమీద తప్పుచేసినట్లు నింద మోపడము మంచిది కాదు కదా! ఎక్కడైనా అట్లు జరుగుటకు
అవకాశము లేదా?

జవాబు  అక్కడ మంచి చెడులను వ్రాసుకొనువాడు పర్యవేక్షకుడు. అతను మన ప్రభుత్వములోని గుమస్తాలాంటివాడు
కాదు. భూమిమీద స్థూలంగా మనకు కనిపించు ప్రభుత్వములో పనిచేయు గుమస్తాలు (గులామ్‌ చేయువారు) లేక
'సేవ చేయువారు, అవినీతి అక్రమాలతో ఏమైనా చేయగలరు. లంచమిస్తే బొమ్మని తిమ్మిగా, తిమ్మిని బొమ్మగా చేయగలరు.
అయితే కనిపించక శరీరములోపల జరుగు దేవుని పాలనలో (లోపలి ప్రభుత్వములో) స్వచమైన పరిపాలన గలదు.

--

దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసినవారే దేవుని ప్రభుత్వములో సేవకులుగా, పాలకులుగాయున్నారు.  దేవుని
గవర్నమెంటు ప్రతి శరీరములోను జరుగుచునే ఉన్నది. మనుషులందరికీ బయట జరుగు రాజకీయమే తెలుసుగానీ,
శరీరములోపల జరుగు రాజకీయము తెలియదు. బయట ఎవరు రాజుగా మంత్రులుగాయున్నావారు కొంతకాలము
వరకేయుందురు.  తర్వాత కాలములో రాజులు, మంత్రులు మారిపోవుచుందురు. అయితే లోపల పరిపాలనలో
ప్రభుత్వము ఎప్పటికీ మారదు. కనిపించని ప్రభుత్వమునకు అధిపతియైన దేవుడు ఎప్పటికీ మారడు. బయట
మనుషులు ఎందరో గలరు, కావున ఒకరి తర్వాత మరొకరు రాజుగా మారుచుందురు. సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే
ఉన్నాడు, కావున బయట మారినట్లు మారుటకు అవకాశములేదు. శాశ్వతముగా ఒకటే ప్రభుత్వము, ఒకటే పరిపాలన,
ఒకటే ధర్మము, ఒకటే శాసనము ఉండును. బయట ప్రపంచములోని పాలకులు అవినీతిపరులుగా రాజంటే
భయములేనివారుగాయున్నారు. అయితే లోపలగల ప్రభుత్వములోని పాలకులందరు దేవునికి విధేయత కల్గి సక్రమముగా
నీతిగా పాలించుచున్నారు. అందువలన దేవుని పాలనలో అక్రమాలు జరుగుటకు వీలులేదు. ఈ మాటను బలపరుచుటకు
ఖుర్‌ఆన్‌ గ్రంథములో 18వ సూరా, 49వ వాక్యము చివరిలో * నీ ప్రభువు ఏ ఒక్కరికీ అన్యాయం చేయడు” అని ఉంది.

ప్రతి శరీరములోనూ వారివారి మంచి చెడు కర్మలను నమోదు (రికార్డు) చేయువాడు పర్యవేక్షకుడు అని
చెప్పుకొన్నాము కదా! పర్యవేక్షకుడు ఒకడు అని 50వ సూరాలో 18వ వాక్యమునందు కలదు. అక్కడే 17వ ఆయత్‌లో
“అతనేమి చేసినా నమోదు చేసుకొనువారు ఇద్దరు ఉంటారు. ఒకడు కుడిప్రక్కన, మరొకరు ఎడమ ప్రక్కన కూర్చొని
వ్రాసుకుంటూ వుంటారు.” ఈ వాక్యములో అతను అనగా మనిషి అని అర్ధము. ఒక మనిషి ఏమి చేసినా, అది మంచి
పనియైనా, చెడుపనియైనా లేక మంచి మాట అయినా చెడు మాట అయినా నమోదు చేసుకొనువారు ఇద్దరుకలరని
చెప్పబడినది. ఈ వాక్యము ప్రక్కనే 18వ ఆయత్‌లో అన్నిటినీ నమోదు చేసుకొను ఒక పర్యవేక్షకుడున్నాడని
చెప్పబడియున్నది. ఇక్కడ 17వ ఆయత్‌లో వ్రాసుకొను వారు కుడి ఎడమగా ఇద్దరున్నారని చెప్పియుండగా, 18వ
ఆయత్‌లో ఒక పర్యవేక్షకుడు (పరిశీలకుడు) అని చెప్పడము వలన 17వ మరియు 18వ వాక్యములలో పరస్పర విరుద్ధ
భావములు ఏర్పడుచున్నవి. కర్మను లేక తప్పు ఒప్పులను, లేక పాపపుణ్యము లను నమోదు చేయువారు ప్రతి మనిషికి
కుడి ఎడమ ఇద్దరున్నారని 17వ వాక్యములో ఉన్నది కదా! ఈ వాక్యమైనా స్పష్టముగా అర్ధముకావాలంటే ముందు
నమోదు చేసుకొనువారు ఇద్దరు ఎవరు అని తెలుసుకోవాలి? మనిషి కుడి ఎడమగా ఇద్దరున్నారు కదా! వారు మనిషికి
బయటనా? లేక మనిషికి లోపలనా? అను ప్రశ్నకు జవాబును తెలుసుకోవాలి. లోపలో బయటో ఎక్కడో ఒకచోట
ఇద్దరున్నప్పుడు మనము కూడా మనుషులమే కదా! మనము చేయు మంచి చెడులను నమోదు చేయువారు ఉండాలి
కదా! జిబ్రయేల్‌ చెప్పినట్లు నమోదు చేయువారు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లు నీకు తెలిసినదా? నీవు చూచావా?
నమ్మావా? ఒకవేళ నమ్మినావను కుందాము. 17వ వాక్యములో కుడి ఎడమగా ఇద్దరు వ్రాసుకొనువారున్నా రని
చెప్పినమాటను వదలి 18వ వాక్యములో ప్రతి దానిని వ్రాసుకొనువాడు ఒక పరిశీలకుడు (ఒక పర్యవేక్షకుడు) ఉన్నాడని
చెప్పారు కదా! నమోదు చేయువారు ఒక్కరా ఇద్దరా? 17వ వాక్యము సత్యమా? 18వ వాక్యము సత్యమా? ఒకటి
సత్యమైతే మరియొకటి అసత్యమగును కదా! అప్పుడు మన నమ్మకము ఎటువైపు, ఏ వాక్యము వైపు ఉండాలి? ఇన్ని
ప్రశ్నలకు జవాబులను తెలియగలిగితే అప్పుడు దేవుడు చెప్పిన జ్ఞానము అర్ధము కాగలదు.

ఇప్పుడు కొందరికి ఒక సంశయము రావచ్చును. అదేమనగా! పరస్పర విరుద్ధముగాయున్న రెండు వాక్యములు
దేవుని జ్ఞానమేనా అని ప్రశ్న రావచ్చును. దానికి మేము చెప్పునదేమనగా! ఈ ప్రశ్నకు ముస్లీమ్‌ సోదరులే సమాధానము

ఇవ్వవలసియున్నది. అయితే వారి విషయము నాకు తెలియదు కానీ, ఒక విధముగా నేను ముస్లీమ్‌నే కనుక నాకు


--
తెలిసింది నేను చెప్పగలను. ఖుర్‌ఆన్‌ను ముహమ్మద్‌ ప్రవక్తగారికి చెప్పినవాడు మహాజ్ఞాని అయిన జిబ్రయేల్‌. జిబ్రయేల్‌
సృష్టాదిలో దేవుడు చెప్పిన జ్ఞానమునే ముహమ్మద్‌ ప్రవక్తకు చెప్పాడు. సృష్ట్రాదిలో చెప్పిన జ్ఞానమునే సూర్యుడు
మొదట భూమిమీద ప్రజలకు తెలిపాడు. భూమిమీద మొదట సూర్యుడు చెప్పిన జ్ఞానమునే తిరిగి ఇప్పుడు నీకు
చెప్పుచున్నానని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన జ్ఞానమునే భగవద్గీత అంటున్నాము.
దీనినిబట్టి ఆదిలోనే భగవద్గీతా జ్ఞానము చెప్పబడినదనీ, అదే జ్ఞానమునే జిబ్రయేల్‌ ముహమ్మద్‌ ప్రవక్తకు చెప్పాడని
తెలియుచున్నది. అందువలన ఖుర్‌ఆన్‌ను దైవగ్రంథము అనక తప్పదు. మా దృష్టిలో భగవద్గీతలోని జ్ఞానమునకు,
ఖుర్‌ఆన్‌లోని జ్ఞానమునకు ఏమాత్రము తేడా కనిపించడము లేదు. మొదట చెప్పబడిన గీతాజ్ఞానమును ప్రథమ
దైవగ్రంథమని అంటున్నాము. తర్వాత చెప్పబడిన అదే జ్ఞానమునే అంతిమ దైవగ్రంథమంటున్నాము. దేవుని జ్ఞానము
ఆది, అంతిమమను రెండు వైపుల నిండియున్నది. అందువలన ఇటు ఖుర్‌ఆన్‌లోనూ అటు భగవద్గీత లోనూ మించిన

జ్ఞానములేదని చెప్పవచ్చును. అయితే ఒకే దేవుని జ్ఞానము మనుషులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా అర్థము
కావచ్చును, అలాగే అయినది. అందువలన మా భగవద్గీతయని హిందువులూ, మా ఖుర్‌ఆన్‌ అని ముస్తీమ్‌లు అంటున్నారు.
వాస్తవముగా చూస్తే రెండిటి జ్ఞానము ఒక్కటేనని మాకు తెలియుచున్నది. ఇదే విషయమే అందరికీ తెలిసి ముస్లీమ్‌లు
భగవద్గీతనూ, హిందువులు ఖుర్‌ఆన్‌ను చదివి అందులోని సత్యమును తెలుసుకోవలెనని కోరుకొంటున్నాము.

నాకు తెలియబడిన గీతాజ్ఞానముచేత, ఖుర్‌ఆన్‌ జ్ఞానమును సులభముగా చెప్పగలనను నమ్మకముంది. అందువలన
50వ సూరాలో 17,18 వాక్యములలో పరస్పర విరుద్ధముగాయున్న వాక్యములకు కూడా సులభముగా భావము అర్థమైనది.
ఆ రెండు వాక్యములు రెండు ఒకదానికొకటి విరుద్ధముగా కనిపించినా రెండిటియందు ఒకే భావము ఇమిడియున్నదని
తెలియుచున్నది. ఈ మాట కొందరికి ఆశ్చర్యమును కలిగించినా, నా మాట సత్యమే కనుక దానినే మీకు చెప్పాను.

అదే 50వ ఖాప్‌ సూరాలో 21వ వాక్యము (ఆయత్‌) నందు ముగ్గురు పురుషులు కనిపించుచున్నారు. ఇప్పుడు
వాక్యమును చూస్తాము. “ప్రతి వ్యక్తీ (జీవుడు) ఒక తోలేవాడితో, ఒక సాక్ష్యమిచ్చేవాడితో సహా హాజరవుతాడు.” అని
(ఖుర్‌ఆన్‌ మజీద్‌లో) “ప్రతి వ్యక్తీ తన వెంట తనను తీసుకువచ్చే వాడొకడు, సాక్ష్యమిచ్చే వాడొకడు ఉన్న స్థితిలో
హాజరవుతాడు.” అని (అంతిమ దైవగ్రంథము ఖుర్‌ఆన్‌లో), “ప్రతి వ్యక్తీ తనవెంట ఒక తోలేవాడూ, ఒక సాక్ష్యం
చెప్పేవాడూ ఉన్న స్థితిలో వస్తాడు అని (దివ్య ఖుర్‌ఆన్‌లో) ప్రతి ఆత్మ ఒకతోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా
వస్తుంది” అని (ఖుర్‌ఆన్‌ భావామృతములో) గలదు. నాలుగు ఖుర్‌ఆన్‌ గ్రంథాలలో వ్రాసిన విషయమునే వ్రాశాము.
నాలుగు గ్రంథములలో కొంత భాషవేరైనా భావము అంతా ఒక్కటేనని తెలియుచున్నది. 21వ వాక్యములో ముగ్గురు
కనిపిస్తున్నారు. ప్రతి మనిషికీ ఒకతోలేవాడూ, ఒక సాక్ష్యమున్నవాడుతో సహా వస్తున్నాడు అని ఉన్నది కదా! నడిపేవాడు
లేక తోలేవాడు అని ఒకరినీ, సాక్ష్యమున్న వాడు అని మరొకరినీ, తోలబడేవాడు లేక తోలబడే జీవాత్మ అని మరొకనినీ,
మొత్తము ముగ్గురిని గురించి ఈ వాక్యములో చెప్పడము జరిగినది. ఈ ముగ్గురులో సాక్ష్యమున్నవాడు, తోలబడేవాడు
(నడుపబడేవాడు) ఇద్దరూ స్వతహాగా ఏ పనినీ చేయక ఊరకుండువారని తెలియుచున్నది. సాక్ష్యమున్నవాడు పూర్తిగా
పనిలేనివాడై తటస్టుడుగా ఉండగా, నడుపబడేవాడు తాను నడువకున్నా ఇతరుల చేత త్రోయబడుచున్నాడు. ఒక
తోలేవాడు లేక నడిపేవాడు ముఖ్యపాత్ర పోషించుచూ, సర్వ జగత్తులోని మనుషులందరినీ కదిలించి నడిపించుచున్నాడు.
నడిపే వాడు అందరినీ కదలించి నడుపుటవలన ప్రపంచములో ఎన్నో పనులు జరుగుచున్నవి. రెండవవాడు పాడిస్తే
మనిషి పాడుచున్నాడు. అలాగే నడిపించువాడు కదిలించి చేయిస్తే వ్యక్తి అన్ని పనులు చేయుచున్నాడు. ఈ విధముగా

--

నడిపించేవాడు, లేక తోలేవాడు తోలుతుంటే మనిషి పనులు చేయుచున్నాడు. ఏ మనిషీ భూమిమీద తాను స్వయముగా
ఏ పనినీ చేయడము లేదు. మొదటివాడైన జీవున్ని లేక జీవాత్మను రెండవవాడైన ఆత్మ తోలుచుండగా మరణము

వరకు మనిషి కదలి పని చేయుచున్నాడు. మూడవవాడైన సాక్షి కదిలించేవాడినీ, కదిలేవాడినీ ఇద్దరినీ చూస్తున్నాడు.
ఆత్మ చైతన్యముగా ఉండి జీవున్ని కదలించుచున్నది. జీవుడు స్వయముగా కదల లేనివాడిగాయున్నాడు. కదలించేవాడే,

కదిలేవాని మంచి చెడులన్నీ వ్రాసుకొంటున్నాడు.  ఆత్మగాయున్న పరిశీలకుడే శరీరమంతా యుండి మనిషి తన
మనస్సులో ఏమనుకొనినా దానిని నమోదు చేసుకొనుచున్నాడు. జీవాత్మ తనను నడిపించే ఆత్మ విషయము తెలియ
కుండా, నేనే స్వయముగా నడుస్తున్నాననుకుంటే వాడు తప్పు చేసిన వాడగును. అప్పుడు పరిరక్షకుడు, పరిశీలకుడు
అయిన ఆత్మ వాడు అనుకొన్నదంతా వ్రాసుకొనును. శరీరమంతా వ్యాపించి పరిరక్షకుడుగా యున్న ఆత్మ ఒక్కడే
శరీరములో కుడిప్రక్క మరియు ఎడమప్రక్క వ్యాపించియున్నాడు. శరీరమును అందులోని జీవున్ని నడిపించువాడు
శరీరమంతా కుడి, ఎడమగా వ్యాపించియున్నాడు. అలా శరీరములో ఆడించు ఆత్మ ఒకడు, ఆడుచున్న జీవాత్మ
మరొకడు ఉన్నాడు. జీవాత్మకు ఆత్మనువాడు సర్వకాలము సహవాసిగాయుంటూ . జీవుడు ఏమనుకొనినా దానిని
వెంటనే లిఖిత పూర్వము చేయుచున్నాడు. ఆ లిఖితపూర్వ గ్రంథమునే కర్మపత్రము అంటున్నాము.

జీవాత్మ ఆత్మ కాకుండా శరీరములోనూ, శరీరము బయట అణు వణువున అంతటా వ్యాపించియున్నవాడు
దేవుడు. దేవుడు క్రియా రహితుడు, పని చేయనివాడు, దేవునికి రూపములేదు, దేవునికి పేరులేదు. దేవుడు నామ,
రూప, క్రియారహితుడనునది దేవుని ముఖ్య ధర్మము... దేవుడు చూచేవాడేగానీ ఏమీ చేయడు. ఆయన ఏమీ చేయకనే
చేయవలసిన కార్యములన్నీ ఆయన పాలనలోని వారే చేయుదురు.  దేవుని సృష్టి అంతయు దేవుని సేవకులైన
దేవదూతలనబడు గ్రహముల వలన, భూతముల వలన జరిగిపోవుచున్నది. అందువలన ఆయన చూచేవాడే, అనగా
సాక్షిగాయున్న వాడేనని తెలియవలెను. 50వ సూరాలో 21వ వాక్యము ప్రకారము, ఆ వాక్యములో ఉన్నట్లు నడిపించబడే
జీవాత్మ నడిపించే ఆత్మ, అన్నిటినీ చూచే పరమాత్మ (దేవుడు) ముగ్గురు ఉన్నారని జ్ఞాపకముంచుకోవలెను.  17వ
వాక్యములో కుడి ఎడమ ప్రక్కల ఇద్దరు నమోదు చేయువారున్నారని చెప్పడములో ఒక వివరము కలదు. అది
ఏమనగా! మనిషి చేయు పనులలో మంచి పనులు, చెడు పనులు అని రెండు రకములుగా ఉన్నాయి. మంచి పనులను
నమోదు చేయువానిని కుడి ప్రక్కన గలవానిగా చెడు పనులు నమోదు చేయువానిని ఎడమ ప్రక్కయున్నవానిగా చెప్పడము
జరిగినది. ఖురాన్‌లో ఇది “ముతషాఖిహాత్‌” వాక్యము. ఈ వాక్యమునకు స్థూలమైన అర్ధము తీసుకుంటే ఏమీ
తెలియదు. దీనిని సూక్ష్మముగానే అర్ధము చేసుకోవాలి. అందువలన అవగాహనయున్న వానికి శరీరములో రెండువైపులా
వ్యాపించి మంచి చెడు రెండిటిని నమోదు చేసుకొను ఆత్మనే కుడి ఎడమనున్న వాడిగా చెప్పడమైనది. ప్రతి మనిషికీ
ఉన్నది ఒక్క సహవాసియే. అతడే ఆత్మ, అతనే నీకు జీవితాంతము తోడుగాయున్నాడు. అతనే మనిషిని మరణము
వరకు, మరణమునుండి పుట్టుక వరకు నడిపించు చున్నాడు. పుట్టుకనుండి చావువరకు నడిపిస్తూనేయున్నాడు. అటువంటి
సహవాసి ఎవడో ఎవరికీ తెలియదు. నీ సహవాసిని గురించి దేవుడు ఖుర్‌ఆన్‌ గ్రంథములో ఎంతో చెప్పినా, మనిషి
దానిని గ్రహించలేక పోవుచున్నాడు.  కొందరు సహవాసి అయిన, పరిరక్షకుడయిన ఆత్మను కూడా సైతాన్‌గా
పోల్చుకుంటున్నారు.. సైతాన్‌ (మాయ) వేరు సహవాసి వేరని మనిషి అవగాహనలోనికి రావడము లేదు. అందువలన
ఖుర్‌ఆన్‌ గ్రంథములో ఎంతో జ్ఞాన విషయమున్నా చాలామందికి ఆ గ్రంథమునుండి ఏకేశ్వరోపాసన తప్ప ఏకేశ్వరుని
జ్ఞానము ఏమాత్రము తెలియలేదు.  ఏకేశ్వరుడైన దేవుడు తెలియాలంటే ఖుర్‌ఆన్‌ గ్రంథమునుండి కర్మంటే ఏమిటో,

--
అది మనిషి ఎడల ఎట్లు అమలు జరుగుచున్నదో, ఎట్లు సంపాదించ బడుచున్నదో ముందు తెలియాలి. దైవగ్రంథము

దగ్గరున్నా దైవధర్మములను ఒక్కదానిని కూడా మనిషి తెలియలేకపోవుచున్నాడు.  దేవుడు సూక్ష్మమైన వాడు. దేవుని
జ్ఞానము కూడా సూక్ష్మమైనదే. అటువంటి వానిని సూక్ష్మమైన వాక్యములతోనే, సూక్ష్మమైన వివరముతోనే తెలియాలి.
అట్లుకాక సూక్ష్మ ధర్మములన్నీ కల్పితములను సాకుతో సూక్ష్మమైన వివరము తెలియకపోతే, ఖుర్‌ఆన్‌లోని వాక్యములే
పరస్పర విరుద్ధముగా కనిపించును. అటువంటి వాక్యములు ఎప్పటికీ అర్ధము కావు. 50వ సూరాలో 17వ వాక్యమునకు
18వ వాక్యమునకు సరియైన అర్ధమును సూక్ష్మ గ్రాహితశక్తి లేనివారు ఎప్పటికీ తెలియలేరు.

నడుపబడువాడు, నడిపించువాడు, సాక్షిగాయున్నవాడు ఈ ముగ్గురూ తప్ప ప్రపంచములో ఇంకెవరూ లేరు.
ప్రతి జీవరాశి జీవాత్మకాగా, వాటినన్నిటిని నడిపించువాడు ఆత్మకాగా, సాక్షిగాయున్నవాడు దేవుడుగాయున్నాడు. ఈ
మూడు ఆత్మలు మినహా ఉన్నదంతా ప్రకృతియే. జీవాత్మ అనునది అనేక జీవరాశులుగాయుండి ప్రపంచమంతా
నిండియున్నది. ఆత్మయనునది ప్రతి జీవరాశి శరీరములో జీవునికి తోడుగాయుండి సహవాసిగా, లేక తోడు ఆత్మగా
పేరుగాంచియున్నది. బైబిలులో రెండవ ఆత్మనే పొరుగువాడని అన్నారు. ఇక మూడవ వాడు ఆత్మకంటే వేరుగానున్న
పరమాత్మ. పరమాత్మనే మనము దేవుడు అని అంటున్నాము.  మనిషికి కులాలు, మతాలు వేరైనా దేవుడు అందరికీ
సాక్షిగాయున్నవాడే, అన్ని మతముల వారు మనుషులే, మరియు శరీరములోనున్న జీవరాశులే. ఏ మతస్తుడికైనా, వాని
శరీరమంతా ఆత్మనిండుకొని, శరీరమంతా వ్యాపించి యుండి. వానిని నడుపుచున్నది. ఆత్మ నడుపనిదే ఏ మతస్థుడు
కదల లేడు. ఆత్మలేనిదే ఎవడూ లేడని తెలియవలెను. ఆత్మ మనిషి అయిన ప్రతి ఒక్కరిలోవుండి వానిని నడుపుచుండగా,
ఆ విషయము ఏమాత్రము తెలియని అజ్ఞానియైన మనిషి, జరిగిన పనులన్నిటినీ తానే చేసినట్లు అనుకొంటున్నాడు.
ప్రపంచములో ఏ మనిషికీ లోపలనున్న ఆత్మ విధానము తెలియకుండా పోయినది. నేను ఇప్పుడు ఈ గ్రంథమును
వ్రాయుచున్నాను అంటే. అది జీవాత్మ అయిన నేను చేయునది కాదు. ఈ పనంతయు ఆత్మే చేయుచున్నది. గుడిలో
పూజారి పూజ చేయుచున్నా ఒక హంతకుడు మరొకనిని చంపుచున్నా, విటుడు వేశ్య ప్రక్కలో శృంగారమును నడుపు
చున్నాా ఆకలిగొన్నవాడు ఆహారమును తింటున్నా, ఫుట్‌బాల్‌ ఆడువాడు ప్లేగ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌ ఆడుచున్నా యుద్ధములో
సైనికుడు శత్రు సైన్యముతో కాల్పులు జరుపుచుండినా, ఒకడు రాజకీయములోవుండి ఎలక్షన్‌ కొరకు ఉపన్యసించుచుండినా,
పిల్లి ఎలుక మీద దాడిచేయుచున్నాా పాము కప్పను పట్టుకొనుచుండినా, ఒక మత గురువు శిష్యులకు బోధను చెప్పుచుండినా,
ఒక పైలెట్‌ ఆకాశములో విమానము నడుపుచుండినా, డాక్టరు పేషెంటుకు ఆపరేషన్‌ చేయుచుండిన్నా నా వ్రాతలు
చూచి అసూయతో నన్ను దూషించు చుండినా, లేక అభిమానముతో పొగడుచుండినా అన్నిటినీ అందరిలోయుండి
చేయువాడు ఆత్మని మరువకూడదు. ప్రపంచములో గల మొత్తము జీవరాసులు చేయు పనులన్నిటినీ ఆత్మ చేయు
చున్నాడు. కనుక ఆత్మను నడిపించువాడు అని ఖుర్‌ఆన్‌ గ్రంథములో మహాజ్ఞాని అయిన జిబ్రయేల్‌ చెప్పాడు. జిబ్రయేల్‌కు
తెలుసు దేవుడు ఏమీ చేయడనీ, అందువలన దేవున్ని సాక్షీభూతుడని అన్నాడు. సాక్షీభూతుడు అనగా! భూతములైన
అన్ని జీవాత్మలకు సాక్షిగాయున్నాడని అర్థము.

జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మలలో పరమాత్మ సాక్షియెన దేవుడుకాగా, ఆత్మ అందరినీ నడిపించు
చైతన్య స్వరూపమైన శక్తికాగా, జీవాత్మ అన్ని శరీరములలో కర్మ జీవులుగాయుండి కర్మను అనుభవిస్తూ జీవించుచున్నది.
ఈ మూడు ఆత్మలు సృష్టి మొదలునుండి ఉన్నాయి. మొదట సృష్టాదిలో దేవుడైన పరమాత్మనుండి ఆత్మ, జీవాత్మలు
సృష్టించబడ్డాయి. అందువలన సర్వ జీవరాసులకూ, వాటిలోని ఆత్మలకు దేవుడే సృష్టికర్త అధిపతి. ఆత్మ దేవునినుండి
--

పుట్టినది సర్వప్రపంచమును నడుపుచున్నది. దేవుని తర్వాత శక్తిగలది ఆత్మ. ఆత్మకు దేవుని జ్ఞాన మంతయు తెలుసు.

అయితే జీవుడు పూర్తి అజ్ఞానిగాయున్నాడు. దేవుడు మనిషి కొరకు జ్ఞానమును భూమిమీద మూడు విధానములుగా
చెప్పించినా ఇప్పటికీ అదే జ్ఞానము భగవద్గీత, బైబిలు, ఖుర్‌ఆన్‌ గ్రంథముల రూపములో ఉన్నా వాటిలోని దేవుని
జ్ఞానమును గుర్తించలేక, దేవుని జ్ఞానమునకు కూడా మతాల రంగును పూశారు. మతము అను మాయ నుండి బయట
పడలేక సృష్టి అంతటినీ సృష్టించిన దేవున్ని కూడా మీ దేవుడు, మా దేవుడు అని చీల్చి చెప్పుచున్నారు. అలాగే మూడు
గ్రంథములలోని జ్ఞానము వేరువేరనుకొనుచున్నారు. ఇట్లు మనిషి పూర్తి అజ్ఞానిగా మారిపోయినప్పుడు అతనిలోని
ఆత్మకు కూడా విసుగువచ్చి అతనిని కఠినముగా శిక్షించుటకు మొదలిడును. అయినా శిక్ష ఎవరినుండి వస్తున్నదని
కూడా తెలియని స్థితిలో మానవుడున్నాడు.

ఇంతటి అజ్ఞానముతో కూడుకొన్న మనిషికి ఆత్మజ్ఞానము తెలియు నట్లు, దేవుడు ఆధ్యాత్మిక విద్యలో మూడు
ఆత్మలకు మూడు గుర్తులను ఉంచాడు. జీవాత్మకు సంఖ్యా (గణిత) శాస్త్రంలోని మూడు (3) సంఖ్యను గుర్తుగా
ఉంచాడు. అలాగే ఆత్మకు ఆరు (6) సంఖ్యను గుర్తుగాయుంచాడు. దేవుడైన పరమాత్మకు తొమ్మిది (9) సంఖ్యను
గుర్తుగాయుంచాడు. ఈ విధముగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మకు 3, 6, 9 సంఖ్యలను గుర్తుగా ఏర్పరచడం
జరిగినది. అలా మూడు వేరువేరు విలువలుగల్గిన సంఖ్యలతో గుర్తింపబడియుండుట వలన మూడు ఆత్మలు విడివిడిగా,
వేరువేరు ప్రభావముగలవిగా ఉన్నాయని సులభముగా తెలియవచ్చును. ఇప్పుడు నడుపబడువాడు మూడు గుర్తుగల
జీవాత్మయనీ, నడిపించువాడు ఆరు గుర్తుగల ఆత్మయనీ, సాక్షిగాయున్నవాడు తొమ్మిదిగాయున్న దైవమని సులభముగా
తెలిసిపోవుచున్నది. ఈ మూడు ఆత్మల విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయమందు
16,17 శ్లోకములలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని వివరించి చెప్పాడు. సర్వప్రపంచమునకు మూలమైన ఈ
మూడు ఆత్మలను ఖుర్‌ఆన్‌ గ్రంథములో 50వ సూరాలో 21వ వాక్యములో చెప్పగా, ఆ విషయము పూర్తి అవగాహనకు
రాకుండా పోయినది. ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు పూర్తి జవాబు వచ్చింది. ఇంకా ఏమైనా ప్రశ్నవుంటే
అడుగవచ్చును.

18) ప్రశ్న :- మీరు కర్మగ్రంథములో మూడు (3) అధ్యాయములు, 36 పాఠములు, 324 సమాచారములు కలవని
వ్రాశారు కదా! వాటి వివరమేమిటో చెప్పండి?

జవాబు   ఇంతకుముందు మూడు ఆత్మలను గురించి చెప్పుకొన్నాము కదా! అందులో ఇటు జీవాత్మకాక అటు పరమాత్మకాక
మధ్యలోనున్న ఆత్మ అందరినీ నడుపుచున్నదనీ చెప్పాము. అయితే తనను ఆత్మ నడుపుతున్నదని తెలియని జీవాత్మ
తానే అన్ని చేయుచున్నానని అనుకోవడము వలన జరిగిన మంచిపనికిగ్గానీ, చెడుపనికిగానీ వాడే కారణమగుచున్నాడు.
అందులో వచ్చిన కర్మను శరీరములో పరిశీలకునిగా, పర్యవేక్షకునిగాయున్న ఆత్మ జీవుని ఖాతాలో వ్రాయుచున్నది.
అలా వ్రాసిపెట్టబడిన పత్రములన్నీ మూడువందల ఇరవైనాలుగు (324) కలవు. ఒక్కతెగకు సంబంధించిన కర్మలన్నిటినీ
ఒక పత్రములో వ్రాయడము జరుగుచున్నది. ఆ విధముగా విభజించబడిన కర్మలు 324 ఉండడమువలన, మూడు
వందల ఇరవై నాలుగు పత్రములలో వాటి సమాచారములు వ్రాయడము జరుగుచున్నది. దీనినంతటిని వివరముగా
చెప్పితే ఇలా కలదు చూడండి. ప్రతి మనిషి చేత మంచి చెడుపనులను చేయించువాడు శరీరములోనున్న ఆత్మని
చెప్పుకొన్నాము కదా! ఆత్మ చేయిస్తున్నదని తెలియనివారంతా ప్రతి పనినీ తామే చేసినట్లు భ్రమించుచున్నారు. అలా
అనుకోవడము వలన పాపపుణ్యములకు నేను చేశానని అనుకొను మనిషే కారకుడగుచున్నాడు. అందువలన వాని

--
కొరకు కేటాయించబడిన కర్మగ్రంథములో కర్మను ఆత్మే నమోదు చేయుచున్నది. అలా వ్రాయబడిన కర్మల నమోదు
పుస్తకమును ఖురాన్‌ గ్రంథములో 83వ సురాలో 7, 8, 9 వాక్యములలో “సిజ్జీను” అన్నారు. “(7) నిశ్చయముగా
పాపాత్ముల రికార్డు సిజ్జీనులో ఉండును. (8) సిజ్జీన్‌ అంటే ఏమిటో నీకేమి తెలుసు. (9) అది ఒక లిఖితపూర్వక దస్త్రం”.
అని కలదు. దస్త్రం అంటే వ్రాయబడిన గ్రంథమని అర్థము. వ్రాయువాడు ఆత్మ కనుక ఆత్మ మనిషి భావమునుబట్టి
వ్రాయుచున్నది. మనిషికున్న భావములు తెలియాలంటే మనిషి శరీరములోగల కర్మచక్రము క్రిందగల గుణచక్రములోనికి
పోయిచూడాలి. గుణచక్రములోనే జీవుడు అనువాడు (నీవు) ఉండును. అక్కడున్న గుణములనుబట్టి జీవుడు గుణభావమును
పొందుచుండును. గుణచక్రము మూడు భాగములుగా ఉన్నది. మూడు భాగములకు మూడు పేర్లు కలవు. ఒక
భాగము పేరు తామసము, రెండవ దాని పేరు రాజసము. మూడవ దాని పేరు సాత్వికము. ఈ మూడు భాగములలో
ఒక్కొక్క దానియందు 12 గుణములుండును. అందులో ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు కలవు. ఆరు
చెడు గుణముల పేర్లను వరుసగా చెప్పితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము అనునవి. అలాగే ఆరు మంచి
గుణముల పేర్లను చెప్పితే, అవి చెడు గుణములకు వ్యతిరేఖ భావములున్నవిగా తెలియుచున్నవి. అవి వరుసగా దాన,
దయ, ఔధార్య, వైరాగ్య, వినయ, ప్రేమలుగాయున్నవి.

ఒక గుణభాగములో ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములు కలిసి మొత్తము 12 గుణములు కలవు.
ఒక భాగములో పన్నెండు గుణముల ప్రకారము, మూడు గుణభాగములలో 36 గుణములు కలవు. జీవుడు మూడు
గుణభాగములలోనూ తిరుగుచుండును, కనుక 36 గుణభావములను జీవుడు పొందుచుండును. ఒక్కొక్క గుణభాగములో
పన్నెండు గుణములున్నవి కదా! అవి ఒక్కొక్కటి తొమ్మిది భాగములుగా విభజింపబడియున్నవి. ఆశ (కామము) అను
గుణము తొమ్మిది ఆశలుగా ఉన్నది. మొదట పెద్దది తర్వాత చిన్నది, ఆ తర్వాత దానికంటే చిన్నదిగా ఉంటూ ప్రతి
గుణము తొమ్మిది రకముల పరిమాణములలో ఉన్నది. ఆ విధముగా పన్నెండు గుణములు 108 చీలిక
గుణములుగాయున్నవి. ఒక్క గుణ భాగములో 108 చిన్న పెద్ద గుణములుండగా, మూడు భాగములలో మొత్తము
324 గుణములు కలవు. మొదట కర్మచక్రము మూడు భాగములుగా ఉండుట వలన కర్మగ్రంథము మూడు
అధ్యాయములుగా ఉన్నదని చెప్పాము. అలాగే ఒక్కొక్క భాగములో పన్నెండు గుణముల ప్రకారము, మూడు భాగములలో
36 గుణములుండుట వలన కర్మ గ్రంథములో 36 పాఠములున్నవని చెప్పాము. ఒక్కొక్క గుణము తొమ్మిది భాగములుగా
విభజింపబడియుండుట వలన ఒక్కొక్క భాగములో 108 గుణములుండుట వలన, గుణచక్రములోని మూడు గుణ
భాగములలో మొత్తము 324 గుణములుండుట వలన, కర్మగ్రంథములో 324 సమాచారములున్నాయని చెప్పడము
జరిగినది.

ప్రతి మనిషి తన గుణచక్రములోని గుణముల ప్రకారము భావములను పొందుచున్నాడు. కనుక మనిషి
పొందు 324 భావముల ప్రకారము వచ్చు 324 కర్మలను, శరీరములోవుండి నడిపించు ఆత్మ నమోదు చేయుచున్నది.
అందువలన కర్మదస్త్రములో 324 సమాచారములు 36 పాఠముల రూపములో ఉన్నవని చెప్పవచ్చును. 36 పాఠములు
తామస, రాజస, సాత్తికమను మూడు అధ్యాయములుగా ఉన్నవని చెప్పవచ్చును. మనిషి పొందే భావములకు తగినట్లు
పాపపుణ్యములను పర్యవేక్షకుడైన ఆత్మ కర్మల రూపములో వ్రాయుచున్నాడు. మనిషికున్న ప్రతి భావమునకు ఒక కర్మ
తయారగుచున్నది.  ప్రతి మనిషిలోనూ 162 మంచి గుణ భావములు, 162 చెడు గుణ భావములుండుట వలన
కర్మలు కూడా అదే లెక్కప్రకారము వ్రాయబడుచున్నవి. కర్మగ్రంథము ఎంత చదివినా అయిపోదు. అలాగే దానినుండి

--
ఎన్ని పేజీలను తీసివేసినా పేజీలు తరగవు. అందువలన ఈ కర్మగ్రంథము యొక్క పూర్తి విషయము చాలామందికి
తెలియదనియే చెప్పాలి. కర్మ ఎలా తయారగుచున్నదో తెలియనప్పుడు, కర్మ ఎలా అనుభవించబడుచున్నదో కూడా
తెలియదు. కర్మ ఎలా చేకూరుచున్నదీ, దానిని ఎవరు నమోదు చేయుచున్నదీ తెలియకపోతే, ఎలా అది అనుభవ
రూపమునకు వస్తున్నదో, ఎప్పుడు వస్తున్నదో, ఎంతకాలము అనుభవించవలసియుండునో పూర్తి తెలియకుండా పోవు
చున్నది. కర్మ సంభవించు విధానము దాదాపు అన్ని మతములలోనూ తెలియకుండాపోయినదనియే చెప్పాలి. అలాగే
కర్మను ఎలా అనుభవి స్తున్నామో, ఎక్కడ అనుభవిస్తున్నామో కూడా తెలియకుండా పోయినది. అందువలన భగవద్గీతలో
కర్మ విధానమును గురించి చెప్పడము జరిగినది. భగవద్ద్గీతలోనే కాకుండా బైబిలు, ఖుర్‌ఆన్‌ గ్రంథములలో కూడా
చెప్పడము జరిగినది. అయినా కర్మవిధానమును అర్థము చేసుకోలేక, దానిని తెలియకుండా సంపాదించుకొనుచున్నాము.
అలాగే తెలియకుండానే అనుభవించుచున్నాము.

19) ప్రశ్న :- దేవుడు చెప్పిన లేక దేవుడు అందించిన మూడు గ్రంథములలో కర్మను గూర్చి చెప్పియుంటే సామాన్యులకు
తెలియకుండా పోయివుండ వచ్చును. జ్ఞానములో ఎంతో అనుభవమున్న వారికి, మత పెద్దలకు, మత గురువులకు,
స్వామీజీలకు కర్మ విషయమంతా తెలిసియుండును కదా! వారికి కూడా కర్మ విధానము తెలియదంటారా?

జ ॥ కర్మ రహస్యము అందరికీ తెలియదని నేనెందుకంటాను. కొందరు తెలిసినవారుండవచ్చును. అయినా
చాలామందికి తెలియదనియే చెప్పుచున్నాము. కర్మ విధానము తెలిసియుంటే మొదటనే దానిని అంటించు కొనక
నమోదుకానట్లు చూచుకొందురు. ఒకవేళ ముందు నమోదైన కర్మను కూడా అనుభవించక తప్పించుకొనెడివారు.
నేడు కర్మను అంటుకొనక యుండువారికంటే, కర్మను అంటించుకొనువారే ఎక్కువ కనిపించుచున్నారు. కర్మను
తగిలించుకొన్న తర్వాత కూడా దానిని గురించిన జ్ఞానము తెలియకపోతే, కర్మ అనుభవమునుండి ఎవరుగానీ
తప్పించుకోలేరు. కర్మను పూజలు, శాంతులు లేకుండా చేయలేవు. జ్ఞానము తెలియని ఎంతటివారైనా కర్మ ముందర
చిన్నవారే. అందువలన ఏ మానవుడూ దాని అనుభవము నుండి తప్పించుకోలేడు.

20) ప్రశ్న :- దేవుడు చెప్పిన జ్ఞానమూ, కర్మ విధానమూ సులభముగాయున్నప్పుడు, అందరికీ అర్ధమయ్యేలాగున
దేవుడు చెప్పినప్పుడు, అందరికీ ఎందుకు అర్థము కాలేదంటారు? ఎక్కడ లోపముందంటారు?

జవాబు  లోపమంతా అర్థము చేసుకోవడములోనే ఉన్నది. మనిషి చేయు ప్రతి చిన్న తప్పును పాపరూపములో, ప్రతి
చిన్న మంచిని పుణ్య రూపములో లిఖించుకొనువారున్నారని తెలుసుకోవడము వరకు ఎటువంటి లోపము లేదు. అయితే
నమోదు చేయబడిన కర్మను ఎక్కడ, ఎప్పుడు అనుభవిస్తున్నా మని తెలియడములో పూర్తిగా తప్పుదారి పట్టిపోయారు.
చనిపోయిన మనిషి సమాధినుండి లేపబడుతాడు, అప్పుడు వాడు చేసుకొన్న కర్మలకు (పాపములకు) శిక్ష వేయబడుతుంది
అని దేవుడు తెల్పిన జ్ఞానమును అవగాహన లోపమువలన తప్పుగా అర్థము చేసుకొని మిగతావారికి తమకు అర్ధమైనట్లు
చెప్పడము వలన అందరూ తప్పుదారిలోనికి పోయినట్లయినది. ఖుర్‌ఆన్‌ గ్రంథములో 23వ సూరాలో 15, 16
ఆయత్‌లయందు ఇలా కలదు. (15) కొంత కాలము తర్వాత మీరు నిశ్చయముగా మరణిస్తారు. (16) అటు పిమ్మట
నిశ్చయముగా మీరు పునరుత్థాన దినమున మరల లేపబడుతారు.” అని ఉన్నది. ఈ విషయమును ఖుర్‌ఆన్‌ గ్రంథములో
చాలామార్లు చెప్పడము జరిగినది. 23వ సూరాలో ఆరవ (6) ఆయత్‌లో ఆ రోజు జనులంతా తమ ప్రభువు సమక్షములో
నిలబడుతారు.” దీనికంటే ముందు రవ ఆయత్‌లో “ఒక మహా దినమున” అనిగలదు. ఈ రెండు వాక్యములలో

--

దృశ్యమంతా మారిపోయినది. ఈ వాక్యములలో పెద్ద చిక్కు సమస్య లేకున్నా అర్ధముకాని విధానము ఏమీ లేకున్నా
మరణించిన వారు తిరిగి పునరుత్భాన దినమున లేపబడుతారు అని 23వ సురా 15, 16 వాక్యములలోయున్నా
దేవుడు చెప్పిన జ్ఞానమార్గమును వదలి అజ్ఞాన మార్గములోనికి పోయి. వేరుగా అర్ధము చేసుకోవడము జరిగినది.
చాలామందికి అర్థమైన విధానమును ఇప్పుడు చూస్తాము.

మనిషి మరణించిన తర్వాత భూమిలో పూద్చిపెట్టడము జరుగు తుంది. అలా ప్రపంచము పుట్టినప్పటినుండి
చనిపోయిన వారిని పూడ్చి పెట్టడము జరుగుచున్నది. పూడ్చి పెట్టబడిన వారంతా వారి సమాధులలో (గోరీలలో)
అలాగే ఉంటారని ముస్లీమ్‌, క్రైస్తవ సమాజములలో అనుకోవడము జరుగుతుంది. పునరుత్థాన దినమున వారందరు
దేవుని ముందర లేపి నిలబెట్టబడుదురనీ, అప్పుడు వారు చేసుకొన్న కర్మ చిట్టాను చూచి. దేవుడు వారికి స్వర్గమో లేక
నరకమో ఇచ్చుననీ అనుకోవడము జరుగుచున్నది. అయితే ఇక్కడ సమాధి నుండి లేపబడడము అంటే ఏమిటి అని
తెలియక, సమాధిని భూమిలో గల గుంతగా లెక్కించుకోవడము పూర్తి పొరపాటైనది. చనిపోయినప్పుడు వాని శరీరమును
పూడ్చిపెట్టుచున్నాము తప్ప పోయిన వానిని (శరీరమునుండి పోయిన వానిని) పూడ్చడము లేదు కదా! శరీరములో
జీవించు జీవుడు వేరు, శరీరము వేరు. జీవుడు శరీరమును వదలిపోతే మరణము అవుతుంది. శరీరములో చేరితే
జననము అవుతుంది. జీవుడు పుట్టుటకు క్రొత్త శరీరము అవసరము. మరణించిన వానిని శరీరముతో లేపును అని
అంటే, క్రొత్త శరీరమని తెలియక పాత శరీరముతో అని అనుకోవడము పూర్తి పొరపాటు. మనిషి మరణించిన వెంటనే
వాని పాపపుణ్యములకు తగినట్లు రెండవ జన్మనిచ్చి, భూమిమీదనే దేవుడు పుట్టించుచున్నాడు తప్ప మరేదో లోకమునకు
పంపడము లేదు. ఎవడు చేసుకొన్న కర్మపత్రమును అనుసరించి వాడు స్వర్గమునూ, నరకమునూ రెండిటినీ భూమిమీదనే
ప్రత్యక్షముగా అనుభవించుచున్నాడు. దేవుడు చెప్పిన స్వర్గము, నరకము రెండూ ఇక్కడే కలవు.

పునరుత్ధాన దినము అంటే చనిపోయి పుట్టుదినము అని అర్ధము. చనిపోయిన తర్వాత వెంటనే ప్రతి ఒక్కడు
పుట్టుచున్నాడు. చనిపోయిన క్షణములోనే మానవుడు చేసుకొన్న కర్మ ప్రారబ్ధిముగా మారిపోయి వాని పుట్టుకకు
కారణమగుచున్నది. చనిపోయినవారందరూ వారి కర్మ నిర్మాణము ప్రకారము, తమ వెంటనున్న పర్యవేక్షకుడైన ఆత్మ
జన్మను నిర్ణయించగా, దేవుడు సాక్షిగా చూస్తూయుండగా, మనిషి తన కర్మ ప్రకారము సుఖదుఃఖము లను అనుభవించుటకు
పుట్టుచున్నాడు. మనిషి చేసుకొన్న పుణ్యము ప్రకారము దేవుడు స్వర్గమును ఇక్కడే తయారు చేసి ఇచ్చాడు. అలాగే
నరకమును ఇక్కడేయుంచాడు. ప్రతి ఒక్కరూ స్వర్గమును అనుభవించే వారినీ చూస్తున్నాము. నరకమును అనుభవించేవారినీ
చూస్తున్నాము. మనము సుఖదుఃఖ రూపములో స్వర్గ నరకమును అనుభవిస్తున్న వారినీ చూస్తున్నా స్వర్గము
ఎక్కడోయున్నదనీ, నరకము ఎక్కడోయున్నదనీ అనుకోవడము పొరపాటు కాదా! ప్రళయ దినమున చనిపోయిన వారు
సమాధులనుండి లేపబడతారు అని దేవుడు చెప్పితే, దేవుని మాటను గ్రహించుకోలేక తమకిష్టమొచ్చినట్లు అనుకోవడమూ,
అట్లే చెప్పుకోవడము వలన దేవుని బోధను తప్పుమార్గము పట్టించినట్లు కాదా! అట్లు తప్పుదారి పట్టించువారిని 2వ
సూరా 59వ ఆయత్‌లో చెప్పినట్లు దేవుడు శపిస్తాడు. ప్రళయ దినము అంటే చనిపోవుదినమనీ, సమాధినుండి
లేపబడు పునరుత్థాన దినము అంటే తల్లిగర్భమునుండి తెలియని స్థితిలో పుట్టుదినమనీ తెలియక, ఎక్కడో పోయి ఏదో
అర్ధము చేసుకుంటే దేవుని జ్ఞానమునకు దూరమైపోయినట్లు కాదా! సమాధి స్థితినుండి పుట్టువారందరినీ ప్రత్యక్షముగా
చూస్తున్నాము. అలాగే ప్రళయము వానికి మాత్రమువచ్చి వాని శరీరములోని పంచభూతములకు (ఆకాశము, గాలి,
అగ్ని నీరు, భూమి) ప్రళయము ఏర్పడి శరీరము మరణించడము నిత్యము జరుగుచున్న పనియే. సమాధి అంటే

--

బయట గోరీలను పోల్చుకొని అసలైన సమాధిని మరచిపోవడము పొరపాటు. అలాగే చావువరకు, చావు నుండి
పుట్టుక వరకు తీసుకొని వచ్చి (తోలుకొని వచ్చి) ఎల్లకాలము నీవెంటవున్న సహవాసి అయిన ఆత్మను అందరూ
మరచిపోవడము పూర్తి అజ్ఞానము. ప్రతి కర్మను నీ వెంటవున్న ఆత్మ పర్యవేక్షకుడుగాయుండి వ్రాసుకొని, తర్వాత జన్మ
సమయమున ప్రారబ్ధకర్మగా మార్చి భూమిమీదనే సుఖదుఃఖములను అనుభవింపజేస్తుండగా, ఎవరూ చూడని
స్వర్గ నరకములను ఊహించుకొని, ప్రత్యక్షముగా అనుభవించే దానిని మరచిపోవడము అజ్ఞానము కాదా! భూమిలో
పూడ్చు నిర్జీవమైన శరీరమును, జీవముగా పోల్చుకొని వాడు శరీరముతో తిరిగి లేచునని అనుకోవడము అజ్ఞానము
కాదా! పునరుత్ధాన దినము చనిపోయిన దినమే అవుతుండగా, ప్రళయ దినాన తిరిగి లేపబడుతారని దేవుడు చెప్పగా,
చనిపోయిన దినముననే శరీరముతో లేపబడుదురని అర్ధము చేసుకోక సృష్ట్రాదినుండి అందరూ గుంతలో పడుకొని ఉ
న్నారనుకోవడము అజ్ఞానము కాదా! దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ గ్రంథములో ఎక్కడా లేని విషయమును మనిషి ఎందుకు
వేరుగా అర్ధము చేసుకొన్నాడు. దేవుడు చెప్పిన భావమును వదలి ప్రత్యక్ష నరకమును పరోక్ష లోకములో ఉన్నదనుకోవడము
అజ్ఞానము కాదా! నరకము ప్రత్యక్షముగా ఉన్నదనుటకు ఆధారముగా ఖుర్‌ఆన్‌ గ్రంథములో 2వ సూరా 165వ
ఆయత్‌ను చూడండి. “సర్వశక్తులూ, సర్వాధికారములు అల్లాహ్‌ (దేవుని) గుప్పెట్లో ఉన్నాయనీ, ఇంకా శిక్షించడములో
కూడా ఆయన కఠినుడనీ, ఈ దుర్మార్గులకుమున్ముందు ఘోరశిక్షను ప్రత్యక్షముగా చూచిన తర్వాత బోధపడే బదులు
ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది.” ఇక్కడ దేవుడు మనుషులు శిక్షను ప్రత్యక్షముగా చూడకముందే. దేవుని
జ్ఞానము ఇప్పుడే తెలిసియుంటే ఎంత బాగుండేది అన్నారు కదా! ఈ మాటతో నరకము శిక్షరూపములో, బాధలరూపములో
ఉండునని అర్థమగుచున్నది కదా! మనుషులు చేసుకొన్న కర్మలు కర్మపత్రములో లిఖించబడి 324 పేజీల పెద్ద
(గగ్రంథముగాయున్నది. ఆ గ్రంథములోని కర్మల ప్రకారము మనిషి భూమిమీద ప్రత్యక్ష నరకమును అనుభవిస్తున్నాడు.
అయినా కర్మంటే ఏమిటి? కర్మను ఎవరు వ్రాస్తున్నారు? తనను కర్మప్రకారము శిక్షలకు గురిచేయువాడు ఎవడు? అని
తెలియక ఉన్నది ఈ జన్మేనని, తర్వాత జన్మలేదనీ, ప్రళయము వరకు సమాధులలో పడుకొనియుంటామనీ, ప్రళయ
దినమున లేపబడుతామనీ చెప్పుకోవడము సమంజసమా? దేవుడు ఎక్కడైనా, నీవనుకొన్నట్లు చెప్పాడా? అసలు ప్రళయ

కాలము ఎప్పుడో వస్తుందని అనుకొనుచూ.. కాలము వృథాగ గడుపుటకంటే మనిషి మరణములో నలిగిపోవు దినమే
ప్రళయమని తిరిగి జన్మించడమే పునరుత్ధారణ దినమని ఎందుకనుకోకూడదు? చావుపుట్టుకలకు అన్నిటికీ కారణము
మన కర్మవ్రాతేనని ఎందుకనుకోకూడదు? ఇప్పటికైనా మించిపోయినది లేదు. ఇప్పుడైనా కర్మంటే ఏమిటో, కర్మను
గ్రంథ రూపములో వ్రాయువాడెవడో, తిరిగి శిక్షించువాడెవడో తెలుసుకో. తెలుసు కోకపోతే, నరకమంటే ఏమిటో?
కర్మంటే ఏమిటో ముందు నీకే తెలుస్తుంది. జాగ్రత్త!

21) ప్రశ్న :- ఒకడు ఒక తప్పు చేశాడనుకొనుము. అప్పుడు వానికి ఎంత పాపము వచ్చినది వానికి తెలియునా?

జవాబు  చేయబడు కార్యము తప్పుదైనా, లేక మంచిదైనా అది ప్రత్యక్షముగా జరుగుచుండును. అయితే ఆ కార్యములో
వచ్చు ఫలితము మర్మమైనది. అది ఎవరికీ తెలియదు. ఎంత పాపము వచ్చినదీ అర్థము కాదు. జ్ఞానదృష్టి కలవారు
ఒక పనికి ఇంత పాపము వచ్చునని కొలత కొలచి చెప్పినా, అప్పటికి ఆ మాట సత్యమే అయినా, తర్వాత ఆ మాట
సత్యము కాదు. ఒకమారు ఒక పనిలోని పాపమును ఇంతే వచ్చునని చెప్పగలిగినపుడు, ఆ పని ఎప్పుడు చేసినా అంతే
పాపము వచ్చునుకదాయని కొందరనుకోవచ్చును గానీ, అదే పనిని రెండవమారు అదే వ్యక్తి చేసినా, లేక అదే పనిని
వేరే మనిషి చేసినా మొదట వచ్చినంత పాపమే వస్తుందని చెప్పుటకు వీలులేదు. అలా ఎందుకు జరుగుచున్నదనగా!

--

కార్యమును చేసిన వ్యక్తికి ఆ సమయములో ఉన్న భావమును బట్టి కర్మ వచ్చుచుండును. ఒక వ్యక్తి ఒక పనిని

చేసినప్పుడు వచ్చిన పాపము (కర్మ) తర్వాత అదే పనిని అదే వ్యక్తి చేసినా రెండవమారు వచ్చిన పాపము మొదట వచ్చిన
పాపముకంటే ఎక్కువగానీ, తక్కువగానీ ఉండును. మొదట చేసినప్పుడు ఉన్న భావమే, రెండవమారు చేసినప్పుడు లేని
కారణమున, రెండవమారు చేసిన కార్యము ఒకటే అయినా వచ్చిన కర్మ హెచ్చుతగ్గులైనది. అందువలన ఈ కార్యము
చేయగా ఇంత కర్మ వస్తుందని చెప్పలేముగానీ, కార్యము చేసినప్పుడు ఉన్న భావమునుబట్టి కర్మ వచ్చుచుండును.

ఉదాహరణకు ముగ్గురు దొంగలు దారిదోపిడీ చేయుటకు ఒక దారిలో చాటుగా పొంచి ఉన్నారనుకొనుము.
వారికి పది రోజులుగా ఆ దారిలో ఎవరూ రానందున దొంగతనము జరుగలేదు. వారికి ఎటువంటి సొమ్ము దొరకలేదు.
పది రోజుల తర్వాత ఒకేమారు ముగ్గురు బాటసారులు ఆ దారిలో కాలినడకన ప్రయాణిస్తూ వచ్చారు. వచ్చిన ముగ్గురు
బాటసారులలో ఒక్కొక్కరివద్ద లక్ష రూపాయలు ఉన్నాయి. ముగ్గురివద్ద మూడు లక్షలున్నాయి. ముగ్గురు బాటసారులు
ముగ్గురు దొంగల దృష్టిలో పడినారు. వస్తున్న బాటసారులను చాటుగా సమీపించిన దొంగలు, ఒక్కమారుగా బాటసారుల
మీద దాడిచేశారు. బాటసారులు ముగ్గురు, దొంగలు ముగ్గురు అయినందున కొంతసేపు వారిమధ్య పోట్లాట జరిగినది.
ఒక బాటసారి తనవద్దయున్న కట్టెతో బలముగా వీరయ్య అను దొంగను కొట్టాడు. అప్పుడు వీరయ్య అను దొంగకు
విపరీతమైన కోపము వచ్చి తనవద్దయున్న కత్తితో పొడిచి కట్టెతో కొట్టిన బాటసారిని చంపివేశాడు. రెండవ బాటసారి
జాన్‌ అనే దొంగతో పెనుగులాడుచుండగా జాన్‌ గట్టిగా త్రోయడము వలన ప్రక్కనేయున్న రాయిమీద పడి తలకు
గాయమై రెండవ బాటసారి చనిపోవడము జరిగినది. రెండవ దొంగ అయిన జాన్‌ అనునతడు బాటసారిని చంపాలని
అనుకోలేదు. అయినా జాన్‌ త్రోయడము వలన రాయిమీద పడి చనిపోవడము జరిగినది. మూడవ బాటసారి మొదట
ఎదురు తిరిగినా తనతోటి ప్రయాణీకులు ఇద్దరూ చనిపోవడముతో పూర్తి భయపడిపోయి తనవద్దయున్న లక్ష రూపాయలను భాషా అను మూడవ దొంగకు ఇవ్వడము జరిగినది. మూడవ బాటసారి పోట్లాడకుండ లొంగిపోయి ఉన్న డబ్బులిచ్చినా, డబ్బును తీసుకొన్న తర్వాత భాషా అను దొంగ మూడవ బాటసారిని కూడా చంపివేశాడు. చివరికి ముగ్గురు బాటసారులు దొంగల చేతిలో చనిపోయారు. ముగ్గురు దొంగలు ముగ్గురు ప్రయాణీకులను చంపినట్లయినది. దానివలన ముగ్గురు దొంగలకు సమానముగా ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు దొరికినవి. దొంగలు ముగ్గురిలో ఒకడు వీరయ్య హిందువుకాగా, రెండవవాడైన జాన్‌ క్రైస్తవుడు, మూడవవాడైన భాషా ముస్లీమ్‌ మతస్థుడు. ముగ్గురు మూడు మతములవారైనా, ముగ్గురు కలిసి చేసిన దారి దోపిడిలో ముగ్గురు ప్రయాణీకులు చనిపోవడము జరిగినది. ముగ్గురికి సమానముగా లక్షరూపాయల ప్రకారము ఆదాయము వచ్చినది. వారికి వచ్చిన లాభము సమానమే అయినా, వారికి వచ్చిన హత్యా పాపము మాత్రము హెచ్చుతగ్గులుగాయున్నది. మొదటి దొంగ అయిన వీరయ్యకు ఎక్కువ పాపము వచ్చినది, రెండవవాడైన జాన్‌కు మిగత ఇద్దరికంటే తక్కువ పాపము వచ్చినది. మూడవ దొంగ అయిన భాషాకు మొదటి ఇద్దరికంటే ఎక్కువ పాపము వచ్చినది. వివరముగా చెప్పాలంటే వీరయ్యకు 80 యూనిట్ల పాపమురాగా, జాన్‌కు 40 యూనిట్ల పాపమే వచ్చినది. భాషాకు మాత్రము 100 యూనిట్ల పాపము వచ్చినది (అర్ధమగుటకు పాపమును యూనిట్ల రూపములో వ్రాశాముగానీ, ఆ విధముగా లెక్కించుటకు వీలుపడదు. మొదట కత్తితో పొడిచి బాటసారిని చంపిన వీరయ్యకు 80 శాతము పాపము వచ్చినది కదా! అలా ఎందుకు 80 శాతము పాపము వచ్చిందని యోచించి చూస్తే ఈ విధముగా తెలియు చున్నది. వీరయ్య మొదటి బాటసారిని చంపాలని అనుకోలేదు. కావున అతనితో పెనుగులాడి కొట్టయినా డబ్బును లాగుకోవాలనుకొన్నాడు. -- అయితే బాటసారి కట్టెతో కొట్టగా, రెండవమారు కూడా కొట్టకుండా కత్తితో పొడవాలనుకొని పొడిచాడుగానీ, అతనిని చంపాలని పొడవలేదు. ఒక కత్తిపోటుకే బాటసారి చనిపోవడము వీరయ్యకు కొంత ఆశ్చర్యము వేసింది. అయినా బాటసారి తన కత్తి పోటుతో మరణించాడు అని వీరయ్యకు అర్థమైనది. కత్తితో పొడవడము వలన చనిపోతాడని తెలిసి తన రక్షణ కొరకు పొడవడము వలన వీరయ్యకు బాటసారిని చంపిన పాపము 80 శాతము వచ్చినది. 20 శాతము తగ్గిపోవుటకు కారణము వీరయ్యకు మొదటగానీ, చివరగానీ బాటసారిని చంపాలను ఉద్దేశ్యములేదు. అయినా జరిగిన సంఘటనలో కత్తితో పొడవడము వలన మరణించు అవకాశమున్న దని తెలిసి పొడవడము వలన పాపము వచ్చినా, అతనిని చంపాలను భావము లేదు కావున 20 శాతము పాపము లేకుండా పోయి 80 శాతము పాపము వచ్చినది. ఇకపోతే జాన్‌ అను దొంగ పెనుగులాటలో బాటసారిని గట్టిగా త్రోశాడుగానీ, అతనిని చంపాలను ఉద్దేశ్యముతో తోయలేదు. బాటసారిని తోయడము వలన అతను రాయిమీద పడి మరణిస్తాడని ఏమాత్రము అనుకోలేదు. తెలియకుండా జరిగిన సంఘటనలో అతని బాధ్యత భావము కేవలము 40 శాతము మాత్రమేయున్నది. అందువలన 60 శాతము పాపము జాన్‌కు అంటలేదు. తర్వాత మూడవ దొంగ అయిన భాషా విషయానికి వస్తే బాటసారి తనతోటి ప్రయాణీకులు చనిపోయినది చూచి, పెనుగులాడితే తనకు కూడా చావు తప్పదని తెలిసి, భాషాకు లొంగిపోయి తనవద్దయున్న డబ్బునంతటినీ ఇచ్చివేశాడు. అయితే మిగిలిన బాటసారిని వదలి వేస్తే అతను పోయి మిగత ఇద్దరినీ తాము చంపినట్లు పోలీస్‌ వారికి తెల్పుననీ, అతడు ఇద్దరి చావులకు సాక్షిగాయున్నాడనీ, మిగిలిన ఒక్క బాటసారిని చంపితే తమకు కేసువుండదు, ఆ విషయము బయటికి ప్రొక్కదని తలచిన భాషా మూడవ బాటసారిని ఉద్దేశ్యపూర్వకముగా చంపడము జరిగినది. అలా అదే పనిగా చంపాలను భావముతో చంపడము వలన భాషాకు నూరుశాతము పాపము తగులుకొన్నది. ఇక్కడ భావమును బట్టి పాపము (కర్మ) వచ్చినదనీ, చేసిన కార్యము వలన పాపము రాలేదనీ తెలియుచున్నది. దీనినిబట్టి కర్మ విధానములో ఒక సూత్రము ఏర్పడుచున్నది. అదేమనగా! కార్యము వలన కర్మరాదుగానీ, భావము వలన పాపము (కర్మ) వచ్చుచున్నదని తెలియుచున్నది. కార్యము ఏమాత్రము జరుగకున్నాా కేవలము భావము వలననే కర్మ ఏర్పడుచున్నదని మరియొక సంఘటన ద్వారా తెలియుచున్నది. ఒక ఊరిలో వేదవేదాంగములను తెలిసిన సద్‌ బ్రాహ్మణుడు నిత్యము వేదపఠనము చేయుచూ, తన ఇష్ట దేవతామూర్తి అయిన శివలింగమును పూజించుచూ, తన ఇంటి ముందరేగల రావిచెట్టును నిత్యము ఆరాధించుచూ ప్రదక్షిణలు చేయుచుండెను. ఉదయము లేచింది మొదలు ఏదో ఒక దైవారాధన చేయుచూ కాలము గడుపుచుండెను. ఆ బ్రాహ్మణుని ఇంటి ముందరే ఎదురుగా ఒక వేశ్య ఇల్లు ఉండెడిది. ఆ వేశ్య ఇంటికి ఒకరు తర్వాత ఒకరు రోజుకు ముగ్గురు లేక నలుగురు విటులు వచ్చి పోయెడివారు. ఆ వేశ్య పొట్టకూటి కొరకు, తన జీవితమును సాగించుట కొరకు, ఏ మార్గము లేక వేశ్యా వృత్తిని ఎంచుకొని జీవించెడిది. అలా ప్రతి దినము ముగ్గురు లేక నలుగురు విటులతో కాలము గడుపు వేశ్య తాను చేయుచున్నది పాపపుపనియనీ, తన ఇంటిముందర నివశించు బ్రాహ్మణుడు నిత్యము ఇద్దరు ముగ్గురు దేవతలను పూజించుచూ పుణ్యకార్యము చేయుచున్నాడనీ అనుకొనెడిది. ఎప్పుడు హారతి గంట శబ్దము వినపడినా, ఆమె విటుని ప్రక్కలోయున్నా బ్రాహ్మణుడు చేయు పూజా కార్యమును జ్ఞాపకము చేసుకొనెడిది. తాను విటునితో మెలుగుచుండినా, ఆమె ధ్యాస అంతయు బ్రాహ్మణుడు చేయు ఆరాధన కార్యముల మీదనే ఉండెడిది. ఆ విధముగా చేయు కార్యము శృంగారమైనా ఆమె మనస్సు శృంగారము మీద లేకుండా దైవ చింతనమీద పూజలమీద ఉండెడిది. -- వేశ్య ఇంటికి ఎదురుగాయున్న బ్రాహ్మణుడు తన ఇంటికి ముందరే యున్న రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయుచూ, వేశ్య ఇంటిలోని విటులను గమనించెడివాడు. ఒకవైపు పూజాకార్యములు చేయుచున్నాా అతని మనస్సంతా వేశ్యమీద వేశ్య ఇంటికొచ్చు విటులమీద ఉండెడిది. వేశ్య ఇంటికి విటుడు వచ్చినది చూచి అతడు తిరిగిపోవునంతవరకు అక్కడ జరుగు కార్యములను గురించి మనసులో అనుకొనెడివాడు. బ్రాహ్మణుని పూజ శివునిదైనా, ధ్యాస వేశ్యదై వుండెను. ఇలా కొన్ని సంవత్సరములు గడచిపోయినవి. ఒకమారు ఆ బ్రాహ్మణుడు ఉన్న ఊరిలో కలరా వ్యాధి వ్యాపించినది. ఆ ఊరిలో చాలామంది చనిపోయారు. ఒక దినము బ్రాహ్మణుడున్న వీధిలోనికి కలరా ప్రవేశించినది. ఒకే దినము వేశ్యకు, బ్రాహ్మణునికి కలరా సోకినది. కలరా తగిలిన మరుసటి రోజే ఇద్దరూ చనిపోయారు. వేశ్య మరియు బ్రాహ్మణుడు ఒకేమారు రెండు మూడు నిమిషముల తేడాతో చనిపోయారు. అప్పుడు వేశ్య శరీరములోనున్న జీవున్ని తీసుకొని పోవుటకూ, అలాగే బ్రాహ్మణుని శరీరములోనున్న జీవున్ని తీసుకొని పోవుటకూ ఒకవైపు దేవదూతలు, మరొకవైపు యమదూతలు వచ్చారు. అయితే యమదూతలు బ్రాహ్మణుని ఇంటికీ, దేవదూతలు వేశ్య ఇంటికీ పోయారు. అప్పుడు బ్రాహ్మణుడు మీరెందుకు వచ్చారని యమదూతలను ప్రశ్నించాడు. ఆ మాట విన్న యమదూతలు నిన్ను యమ లోకానికి తీసుకొనిపోయి నరకములో వేస్తామని చెప్పారు. అప్పుడు ఎదురుగానున్న వేశ్య ఇంటికి వచ్చిన దేవదూతలను చూచి, వారెందుకు వచ్చారని యమదూతలనే అడిగాడు. అప్పుడు వారు బ్రాహ్మణునితో మాట్లాడుచూ, వారు దేవదూతలు ఎదురింటిలో చనిపోయిన స్త్రీని (జీవున్ని తీసుకొని స్వర్గ లోకమునకు పోవుదురని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణుడు “నన్ను యమలోకానికీ, ఆ వేశ్యను స్వర్గలోకానికా? ఆమె నిత్యము పాపకార్యములు చేయుచున్నది. నేను నిత్యము పుణ్యకార్యములైన ఆరాధనలు చేశాను” అని చెప్పాడు. అప్పుడు యమదూతలు ఇలా అన్నారు. చేసే కార్యము వలన పాపముగానీ, పుణ్యముగానీ రాదు. మనిషిలో ఉండే భావము వలననే పాపపుణ్యకర్మలు వస్తాయి అనిచెప్పారు. బ్రాహ్మణుడు ఆరాధనా కార్యములు చేయుచున్నా మనస్సును వేశ్య ఇంటిలో పెట్టుకోవడము వలన అతని ధ్యాస ప్రకారము బ్రాహ్మణునికి పాపము వచ్చినట్లు యమదూతలు చెప్పారు. అలాగే వేశ్య విటులవద్దయుండి పాపపు పనులు చేసినా, ఆమె ధ్యాస అంతయు బ్రాహ్మణుని ఇంటిలో పూజల మీద ఉండుట వలన వేశ్యకు పుణ్యము వచ్చినది. ఇదే విషయమునే దేవదూతలు వేశ్యకు చెప్పి ఆమెను స్వర్గమునకు తీసుకొని పోయారు. ఈ విషయము నంతటినీ గమనించితే భావము వలననే కర్మ ఏర్పడుచున్నది గానీ, కార్యము వలన కాదని తెలియుచున్నది. (యమ దూతలు, దేవదూతలు అను మాటను పాఠకులకు విషయము అర్ధమగుటకు వ్రాశాము. వాస్తవానికి యమదూతలు, దేవ దూతలు అనువారు లేరు. అట్లే స్వర్గమూ, నరకమూ ఎక్కడో లేవు అని తెలియవలెను.) కర్మ సూత్రమును గమనించితే కర్మ (పాపము+పుణ్యము) అనునది భావము వలన ఏర్పడుచున్నది గానీ, కార్యము వలన ఏర్పడడము లేదని తెలియుచున్నది. మనము చెప్పుకొనునదే కాకుండా భగవద్గీతలో మోక్షసన్న్యాసయోగమను అధ్యాయమున 17వ శ్లోకమందు భగవంతుడు ఇలా చెప్పాడు. శ్లోకం || యస్య నాహంకృుతో భావో బుద్దిరస్య నలిప్యతే . హత్వావీ స ఇమాన్‌ లోకాన్న హన్తి న నిబధ్యతే భావము :- “ఎవని భావములో అహంకారము లేదో, ఫలితము మీద ఎవ్వనికి ఆశలేదో, వాడు లోకములోనున్నవారిని -- హత్య చేసినా, అతడు హంతకుడుగాడు మరియు అతనికి పాపము అంటుకొనదు” అని అన్నాడు. ఇక్కడ చెప్పినకార్యము చిన్నదికాదు. భూమిమీద గల మనుషులను అందరినీ హత్యచేసినా అని చెప్పబడినది. అందరినీ హత్య చేయడము భయంకరమైన పాపముతో కూడుకొన్న పని అని అందరికీ తెలుసు. అటువంటి పెద్ద పాపము వచ్చు పనిలో కూడా అహంకారము లేకపోతే, హత్య చేసినా వాడు హంతకుడుగాడు, హత్యాపాపము రాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడంటే చేసే కార్యమునకు కర్మ ఏమాత్రము సంబంధము లేదనీ, శరీరములోనున్న అహంభావమునకే కర్మ సంబంధపడియున్నదని తెలియుచున్నది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదే కాకుండా బైబిలులో ఏసు ఇదే విషయమునే మరొక కోణములో చెప్పుచున్నాడు. ఏసు చెప్పినమాట, శ్రీకృష్ణుడు చెప్పినమాట రెండూ ఒకే అర్థమును తెలియజేయుచుండినా, బయటికి వేరుగా కనిపించినట్లున్నది. ఏసు చెప్పిన మాటలో కూడా భావమునకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలియుచున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో ఇలా కలదు. “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” ఈ వాక్యములో కార్యము చేయకున్నా భావములో అనుకోవడము వలన అతడు నిజముగా చేసినట్లుగుచున్నది. వ్యభిచార పాపము వానికి అంటుకొనుచున్నది. అదే గీతలో చెప్పిన వాక్యములో కార్యమును చేసినా భావము లేనందువలన, చేయనివాడుగా పరిగణించుచూ పాపముకాదని చెప్పారు. గీతలోనూ, బైబిలులోనూ ఉన్న వాక్యముల ఉద్దేశ్యము ఒక్కటే అయినా, గీతలో కార్యము చేసినా అన్నారు. బైబిలులో కార్యము చేయకున్నా అన్నారు. అలాగే గీతలో భావము లేకపోతే అని అన్నారు. బైబిలులో భావముంటే అన్నారు. చెప్పిన వాక్యములు ముందుది వెనుకకు, వెనుకది ముందుకు చెప్పారు తప్ప రెండిటి అర్ధము ఒక్కటేనని తెలియుచున్నది. కర్మ సూత్రము ప్రకారము కర్మవచ్చుటకు కార్యము ముఖ్యముకాదు, భావము ముఖ్యమన్నారు. కార్యము వలన కర్మ రావడము లేదు. భావము వలన కర్మ వచ్చుచున్నది. ఎక్కడైనాగానీ భావమును కార్యమును విడదీసి చూచి, భావమును వదలి కార్యమును చేయువాడు కర్మను జయించును, కర్మయోగిగా మారిపోవును. మానవుడు చచ్చుటకు పుట్టుటకు కర్మే కారణమైవున్నది. మానవుడు జనన మరణ చక్రమునుండి బయటపడుటకు కర్మ అడ్డుగా ఉన్నది. కర్మను లేకుండా చేసుకొంటే పుట్టవలసిన అవసరములేదు. కర్మ లేకుండా పోయినప్పుడు మనిషి దైవసాన్నిధ్యము చెంది మోక్షమును పొందును. అందువలన ఆధ్యాత్మిక విద్యలో కర్మను జయించడము ముఖ్య ఘట్టముగా యున్నది. కర్మయెలా అంటుచున్నదో, తెలియగలిగితే సులభముగా దానిని జయించి ముక్తిని పొందవచ్చును. కర్మ కేవలము భావము వలననే అంటుచున్నదనీ, కార్యముల వలన కాదనీ అర్థమగుచున్నది. అటు వంటప్పుడు భావములను పొందకపోతే కర్మరాదు. కేవలము భావమును లేకుండ చేసుకోవడము వలన కర్మను సులభముగా జయించవచ్చును. అయినా సూత్రము తెలియని మనుషులు ప్రక్కదారిపట్టి, మోక్షము కొరకు, పూజలు, యజ్ఞములు, వేదాధ్యయనములు, దానములు, తపస్సులు మొదలగు కార్యములను చేయుచున్నారు. కొందరైతే మెడిటేషన్‌ అని ధ్యానమును చేయుచున్నారు. అనేక రకముల సాధనలను చేయుచున్నారు. ఆధ్యాత్మిక విద్యలో పెద్దవారమని ప్రచారమైన వారు కూడా కేవలము భావముతో కర్మను జయించవచ్చునని తెలియక తలలు కొరిగి కొందరూ, తలలు పెంచి కొందరూ, గుడ్డలు మార్చి కొందరూ, గుడ్డలు విప్పి కొందరూ, యాత్రలు చేసి కొందరూ, బూడిద పూసుకొని కొందరూ, ఇలా ఎన్నో రకముల అగచాట్లుపడుచున్నారు. ఎన్ని చేసినా వాటివలన కర్మపోలేదు. దేవుడు తెలియబడడు. కర్మరాహిత్యమైన రోజు జన్మరాహిత్యమగును. కర్మరాహిత్యమునకు తపస్సులు, యజ్ఞములు, వేదాధ్యయనములు పనికిరావు. -- ప్రతి నిత్యము మనిషి భావముతో కూడిన కార్యములను చేయుచున్నాడు. అందువలన ఆ కార్యముల కర్మలు మనిషిని తగులుకొను చున్నవి. ఒకవేళ ఇప్పుడు జ్ఞానము తెలిసి కర్మరహస్యమును తెలియగల్గితే, ఇప్పటినుండి వచ్చు కర్మలు రాకుండాపోవును. అయితే ఇంతకుముందు సంపాదించుకొన్న కర్మలను తప్పనిసరిగా అనుభవించవలసియుండును. 22) ప్రశ్న:- ఇంతకు ముందు చేసిన కార్యములలో లిఖించబడిన కర్మల గ్రంథమున్నప్పుడు, దానినుండి అనుభవించకుండా
తప్పించుకొనుటకు వీలగునా? ఇప్పుడు వచ్చు కర్మను జయించు ఉపాయము సులభమైనదిగా ఉన్నట్లే, ఉన్న కర్మ అనుభవించకుండుటకు ఏదైనా ఉపాయము కలదా? జ ॥ ఉన్న కర్మను తీసివేసి అనుభవించకుండా తప్పించుకొనుటకు దేవుడు ఒక ఉపాయము చెప్పాడు. ఆ విధానము తప్ప భూమిమీద కర్మను తప్పించు మార్గము ఏమాత్రము లేదు. అందువలన చేసుకొన్న కర్మను తప్పనిసరిగా అనుభవించవలసియున్నది. సంపూర్ణ దైవజ్ఞానమును తెలిసినవాడు, కర్మను జయించగలుగు ఉపాయమును తెలిసియుండును. కర్మను జయించి, దానినుండి అనుభవించక తప్పించుకొనుటకు, దేవుడు గీతయందు ఒక శ్లోకమున ఇలా చెప్పాడు. జ్ఞానయోగమున 37వ శ్లోకమందు... శ్లోకము: యథైధాంసి సమిద్ధోஉగ్నిః భస్మసాత్కురుతేஉర్జున యథైధాంసి సమిద్ధోஉగ్నిః భస్మసాత్కురుతేஉర్జున భావము :- “అగ్నిలో కట్టెలు ఏ విధముగా కాలి బూడిదై పోతాయో, అదే విధముగా జ్ఞానము అను అగ్నిలో కర్మలను కట్టెలు కాలిపోగలవు” అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందువలన ఎవడైతే దేవుని జ్ఞానమును తెలియగల్గునో, వాడు ఉన్న కర్మను లేకుండా చేసుకొని, అనుభవించకుండా తప్పించుకొనును. దేవుని జ్ఞానమును తెలిసినవానికి జ్ఞానము అగ్నివలె ప్రకాశించి కర్మలను కాల్చివేయును. అంతేతప్ప ఇతర మార్గము ఏదీలేదు. ఎవడైనా పాపమును కల్గియుంటే, వానికి జ్ఞానము లేకపోతే, ఆ కర్మను వాడు తప్పనిసరిగా అనుభవించవలసిందే. ఇదే విషయమును ఖుర్‌ఆన్‌ గ్రంథములో 4వ సూరాలో 111వ వాక్యములో “ఎవడైనా పాపాన్ని మూటగట్టుకొనియుంటే, అతని మూట అతని మీద పడుతుంది” అని కలదు. ఈ మాట ప్రకారము ఎవని కర్మను వాడే అనుభవించాలని తెలియుచున్నది. ఉన్న కర్మను జయించుటకు 1వ సూరాలో 106వ వాక్యములో “పాపక్షమాపణకై అల్లాహ్‌ను వేడుకొంటూయుండు. నిశ్చయముగా అల్లాహ్‌ క్షమాసాగరుడు, కృపాకరుడు” గతములో కర్మ గ్రంథమునందు వ్రాయబడిన కర్మలను లేకుండా చేసుకొనుటకు మొదట దేవుని జ్ఞానమును తెలిసి దేవున్ని వేడుకుంటే కర్మలు క్షమించబడి కర్మచక్రములో లేకుండా పోవును. దేవుడు అన్నిటికీ అధిపతి, అధికారి కావున ఆయన అనుకుంటే రెప్పపాటులో కర్మను లేకుండా చేయగలడు. ఒకవేళ మనిషి సంపాదించుకొన్నది ప్రపంచ సంబంధమైనదైతే దేవుని జ్ఞానము వలన కాలిపోవును. అలా కాకుండా దైవదూషణ వలన వచ్చిన పాపము దేవుని జ్ఞానము వలన క్షమించబడదు. ఇదే విషయమును తెలియజేస్తూ 4వ సూరాలో 107వ వాక్యమున “అత్మద్రోహానికి ఒడిగట్టే వారి పక్షాన నీవు వాదించకు, విశ్వాసఘాతుకానికి పాల్పడి పాప పంకిలములో కూరుకుపోయిన వానిని అల్లాహ్‌ ఎంతమాత్రము క్షమించడు” అని చెప్పడము వలన దేవుని ఎడల చేసిన పాపము క్షమించబడదని, కాలిపోదని అర్థమగుచున్నది. ఇదే విషయమునే బైబిలు గ్రంథమందు మత్తయి సువార్త 12వ అధ్యాయములో 32వ వాక్యమునందు “మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదుగానీ, పరిశుద్ధాత్మకు విరుద్ధముగా మాట్లాడువానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగమందునూ పాపక్షమాపణ -- లేదు” అని చెప్పబడియున్నది అని చెప్పారు. ఇదంతయూ గమనిస్తే, ప్రపంచ విషయములు జ్ఞానము వలన క్షమించ బడునుగానీ, దేవుని ఎడల చేసిన పాపము క్షమించబడదని తెలియుచున్నది. కర్మ అనునది ఒక గ్రంథమువలె వ్రాయబడియున్నది. ఆ గ్రంథములో ఎన్నో పత్రములు కలవు, వాటిని ఎంచితే 324 గలవు, అలాగే 36 పాఠములు గలవు. అంతేకాక కర్మగ్రంథము మూడు అధ్యాయములుగా ఉన్నది. కర్మగ్రంథము యొక్క వివరమును తెలియగల్గిన ఎవడైనా కర్మను జయించగలడు. కర్మ మర్మమైనది మరియు భయంకరమైనది. అటువంటి కర్మను కేవలము భావముచేత సంపాదించుకోవచ్చును, లేక లేకుండా చేసుకోవచ్చును. కర్మను జయించుకోవడము తెలియగల్గితే చాలా సులభముగా కర్మను జయించవచ్చును. కర్మ రహస్యము అంతే. సమాప్తం.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024