pss: vajara full draft

 







అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు



శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు  

"అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు" అను ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ముందు మాట వాస్తవముగా చెప్పాలంటే ప్రథమ దైవగ్రంథము, ద్వితీయ దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథము అని మూడే మూడు గ్రంథములు దేవుని ద్వార మనుషులకు ఇవ్వబడినవి. ఈ మూడింటియందు ఒకే దైవజ్ఞానము ఉండుట వలన వాటికి ముందు వెనుక దైవగ్రంథములను పేర్లు వచ్చినవి. మూడు దైవగ్రంథములలో ఆధ్యాత్మికమే ఉండుట వలన గ్రంథములలో ఆధ్యాత్మికము రహస్యముగా దాచిపెట్టబడి ఉన్నదని చెప్పవచ్చును. అందువలననే మూడు సమాజములవారికి మూడు గ్రంథముల వాస్తవికత అర్థముకాలేదని, వారికి అర్థమైనది అంటే అది మతములకు సంబంధించినదే అర్థమైనదని తెలియుచున్నది. గంధమారుతము అంటే వాసనను లేకుండ చేసినది అన్నట్లు గ్రంథము అనగా రహస్యముతో కూడుకొన్నది అని అర్థము గలదు. గంధమారుతము నుండి వాసనను ముక్కులద్వారానే తెలియదగును. అలాగే గ్రంథములోని ఆధ్యాత్మికము బుద్ధి ద్వారనే తెలియబడును. గ్రంథములోని విషయమును ఆత్మ తెలియజేసినప్పుడు మాత్రమే తమ బుద్ధి ద్వార గ్రహించవచ్చును. ఆత్మ తెలియజేయాలనుకోక పొతే మనిషి గ్రంథమును ఎంత చదివినా అందులోని చిన్న ముక్క కూడ అర్థము కాదు. అదే పరిస్థితే నేడు భూమి మీద నెలకొని యున్నది. నేడు భూమి మీద మూడు గ్రంథములను మూడు సమాజముల వారు నాది ఈ గ్రంథము, నాది ఈ గ్రంథము అని పంచుకొని, నిర్ణయించుకొని మూడింటిని వారి వారి గ్రంథములుగా చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకొనినా ఆ గ్రంథములను వారు అందరూ చదువలేదు. చదివినా అవి అందరికి అర్థముకాలేదు. గ్రంథము అని సూత్రము ప్రకారము అందులోని సమాచారము వారి బుర్రలకు, బుర్రలలోని బుద్ధికి అందలేదు. అలా బుద్ధి గ్రాహ్యమునకు రావాలంటే గ్రంథములోని శక్తి రూపమై యున్న ఆత్మకు చదివే వాడు నచ్చి యుండాలి. ఆత్మకు ఇష్టములేని వానికి గ్రంథము అర్థముకానట్లు ఆత్మ చేయుచున్నది. చదివిన తర్వాత వాని బుద్ధికి అది వాస్తవ భావముతో కాకుండా వేరు భావములో అర్థమగుచున్నది. అందువలన నేడు గ్రంథములను వ్రాయువారు వేరు భావములో వాక్యమునకు అర్థమును వ్రాయడము జరుగుచున్నది. మేము చెప్పునది మూడు గ్రంథముల విషయములలో అలాగే కొనసాగుచున్నది. హిందువులకు భగవద్గీత అర్థముకాలేదు. క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు. ముస్లీమ్ లకు ఖుర్ఆన్ అర్థముకాలేదు. భగవద్గీత అర్థముకాలేదని మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" బయటికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసినది. అలాగే క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు అనుటకు మేము వ్రాయబోవు "సువార్త బైబిలు" బయటికి వచ్చిన తర్వాత తెలియగలదు. ఇక పొతే ముస్లీమ్ లకు ఖుర్ఆన్ గ్రంథము అర్థమైనదా, అర్థముకాలేదా అని విషయము ఇప్పుడు మేము వ్రాసిన "అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యములు " అని ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. ఖుర్ఆన్ గ్రంథములో 114 సూరాలు, 6236 ఆయత్‍లు గలవు. అందులో స్థూల మరియు సూక్ష్మ అని రెండు రకముల వాక్యములు గలవు. మేము ఈ గ్రంథము ద్వార 6236 వాక్యములలో 132 సమాచారములకు వివరమును వ్రాసినాము. మేము వ్రాసిన 132 సమాచారములు దాచిపెట్టబడిన జ్ఞానము గల వాక్యములే అని చెప్పవచ్చును. ఈ 132 వాక్యములు వజ్రములవలె అమూల్యమైన వాక్యములుగా చెప్పవచ్చును. ముఖ్యముగా ఈ గ్రంథమును గురించి మేము చెప్పబోవునది ఏమనగా! ఇంతవరకు ఖుర్ఆన్ అర్థముకాకపోయిన ఇప్పుడు ఈ గ్రంథముతో అర్థముకాగలదు.



-----




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు



అభిప్రాయం   


తేది: 08.08.2017, శ్రీ కాళహస్తి.

జ్ఞానరత్న, సంఘమిత్ర, తాత్విక ఉపన్యాస చక్రవర్తి, అక్బర్ శాస్త్రి, అచల పరిపూర్ణ

మరియు నిర్భయానంద ఇత్యాది బిరుదాంకితులు, శ్రీయుతులు మొఘల్ ఫాహి,

అక్బర్బాద్షా Rtd.Jr. Accounts Officer, (Electricity)A.P.S.P.D.C.L


గౌరవనీయులు పూజ్య యోగిపుంగవులైన ఆచార్య ప్రబోధానంద మహాశయుల వారి వంద ఆధ్యాత్మిక గ్రంథాలలో దాదాపు ముఫ్పై, మరియు రికార్డు అయిన వారి 200 ప్రసంగాలలో చాలావాటిని శ్రద్ధగా పరిశీలించడముతో, నిద్రపోతున్న సింహము జూలు విదిల్చి మేల్కొన్నట్లుగా నాలోని జ్ఞాన భాస్కరుడు లేచాడు. దానితో వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కని-కల్ల నిజము తెల్సిన మనుజుడెపో నీతిపరుడు, మహిలో సుమతీ! అని చెప్పిన బద్దెన కవిని తలపించి వివేకోదయాన్ని కల్గించి త్రిమతాలలోని (హిందూ, క్రైస్తవ, ముస్లీమ్ల) దైవ సారాంశము ఒక్కటేనన్న సమరస భావాన్ని స్ఫురింపజేసి, ఆనందోన్మత్తుణ్ణి కావించి, విశ్వమానవ సౌభ్రాతృత్వ కడలిలో అజ్ఞానము అంతరించి, జ్ఞాన సంకేతమైన దైవ స్వరూప అభయత్త్వానుభూతిని కల్గించినందుకు ఆచార్యుల వారి పాద పద్మములకు మరొక్కమారు శిరసా నా హృదయపూర్వక నమో వాక్యములర్పించుకొంటున్నాను.


ఇలాంటి పరిస్థితిలో, వారి గ్రంథాల ద్వారా నాకు తెల్సినదేమనగా! మతానుయాయులైన హిందూ, క్రైస్తవ, ముస్లీమ్ సోదరులు, ఆచార్యుల వారు తమ గ్రంథాలలో వెలిబుచ్చిన సారాంశాలను అపార్థాలతో మాయకులోనై కేసులు పెట్టి ''ఆప్తాయదార్థవక్తా'' అన్నట్లు ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా ప్రజానీకానికి విశదపరుస్తున్న ప్రబోధానందుల వారి మనస్సును చికాకు పరచడము, నా మనసుకు చాలా బాధ కల్గిస్తున్నది. పైగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు గురికావలసి వస్తుందని వారిని హెచ్చరించడం, ఇది విన్న మాలాంటి వారికి శరాఘాతాలే కదా!


భారతీయ రాజ్యాంగం ప్రకారము మతాధికారులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడము ఎంత నేరమో, బ్రహ్మవిద్యా శాస్త్రం ప్రకారము (ఆధ్యాత్మికరీత్యా) దైవముచే అమలు కావాల్సిన నేరశిక్షల చట్టాన్ని మతోన్మాదులే స్వతహాగా బరి తెగించి, నిష్కల్మషులై సత్య ప్రబోధము గావిస్తున్న యోగీశ్వరులవారికి సహకరించక పోగా, ఇలా ఇబ్బందులపాలు చేయడము జ్ఞానము నెరిగినవారు హర్షించరుగాక హర్షించరు!


ఈ విషయములో వేమనయోగి వర్యులు తమ పద్యములో ''అంతరంగ మందు అపరాధములు చేసి, మంచివానిరీతి మసలుచుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా? విశ్వదాభి రామ వినుర వేమా! అని అన్నారు. అదే మాదిరిగా ఒక సందర్భములో ''మక్కాలోని ''కాబా మసీదు'' ను కాపాడుకొనే బాధ్యత ఆ దేవునిదే! కనుక ఆయనే రక్షించుకుంటాడు'' అంటారు అప్పటి దైవజనులు. కావున చెప్పడమే మన ధర్మము వినకపోతే మీ ఖర్మము.


భగవంతుడు దేశ, కాల, పరిస్థితులనుబట్టి ఎవరెవరిని ఎప్పుడు ఏ విధముగా వారివారి అర్హతలనుబట్టి ఏమి చెప్పాలో ఆయనకు తెలుసు. మధ్యలో విషయం తెల్సుకోక మతోన్మాదాలతో జోక్యము చేసుకోవడము, ఇలాంటి ఆచార్యుల వారి సర్వాత్మనా కార్యక్రమాలకు అడ్డుతగలడమే అవుతుంది.


ఇకనుంచి అయినా, ప్రభుత్వము వారు పరిశీలించి, సర్వమతాలకు ఆరాధ్యుడు దేవుడు ఒక్కడే! అని తమ త్రైత సిద్ధాంత బోధ ద్వారా కృషి చేస్తూ, మానవులంతా ఒక్కటే! సర్వప్రాణులూ సమానమే అని తమ రచనల ద్వారా, గ్రంథాల ద్వారా వెల్లడిస్తున్న ఆచార్యుల వార్కి అండగా నిలవడమే ఆయనకు కొండంత బలమని అర్థిస్తూ ''లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు'' అనే సూక్తిని స్మరిస్తూ సర్వులకు అల్లాహ్ అయిన దేవున్ని ప్రార్థిస్తూ...సెలవు. నమస్తే


ఇట్లు


సర్వజన శ్రేయోభిలాషి

ఎం.ఎస్. అక్బర్ బాదుషా

శ్రీకాళహస్తి, జవశ్రీశ్రీ : 9704521588

-----




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు  

ఖురాన్ గ్రంథము రెండవ సూరా ''అల్ బఖర'' తో ప్రారంభమైనది. ఖురాన్ గ్రంథము యొక్క మొత్తము సూరాలు 114. అందులో మొదటిది ''అల్ ఫాతిహా'' సూరా. దీని అర్థము 'ప్రారంభము' అని మాత్రమే. రెండవ సూరా పేరు ''అల్ బఖర'' అనగా 'ఆవు' అని అర్థము. ఖురాన్ గ్రంథము ఎక్కడి నుండి ప్రారంభమైనది? అని ప్రశ్న వస్తే అందరూ అల్ ఫాతిహా సూరా నుండి అని చెప్పుదురు. నన్ను అడిగితే నేను అలా చెప్పను. జ్ఞానబోధ ఎక్కడినుండి ప్రారంభమయినదో అక్కడి నుండి అని చెప్పుదును. జ్ఞానబోధ సూరా అల్ బఖర నుండి ప్రారంభమైనది కావున అల్ బఖర సూరా నుండి ఖురాన్ గ్రంథము ఆరంభమైనదని చెప్పుదును. అల్ ఫాతిహా సూరా మనిషికి చెప్పబడిన జ్ఞానబోధ కాదు. అల్ ఫాతిహా సూరాలో మొత్తము ఏడు వాక్యములు గలవు. ఏడు వాక్యములు అల్లాహ్ (దేవుని) ప్రార్థనగా యున్నది. ఏడు ఆయత్లు మనుషులు అల్లాహ్ను వేడుకొను విధానమైయున్నది. ఈ ఏడు ఆయత్లు మనుషులు జ్ఞానము తెలిసిన తర్వాత వారి భక్తి భావముతో మనుషులు చెప్పినవేగానీ వేరు కాదు.


దేవుడు ప్రజలకు జ్ఞానమును తెలియజేయాలను ఉద్దేశ్యముతో ఆకాశములోనున్న జిబ్రయేల్ అను గ్రహమును ప్రేరేపించగా, ఆ ప్రేరణను అల్లాహ్ ఆజ్ఞగా తలచిన జిబ్రయేల్ భూమిమీదికి వచ్చి, అప్పటి కాలములోని మనుషులలో ఉత్తమమైన ముహమ్మద్ ప్రవక్తగారిని ఎన్నుకొని ప్రవక్తగారికి జ్ఞానమును చెప్పడమైనది. జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును గ్రంథరూపము చేసినప్పుడు మొదట ప్రార్థనను వ్రాసి, తర్వాత జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును వ్రాయడము జరిగినది. అలా వ్రాసిన ప్రార్థనను మొదటి సూరాగా చెప్పి జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును రెండవ సూరాగా వ్రాయడమైనది. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత పదునెనిమిది అధ్యాయములుగా యున్నా, అందులో వాస్తవానికి పదిహేడు అధ్యాయములు భగవంతుడు చెప్పిన బోధ యున్నది. దానినే 'భగవద్గీత' అని అనవలెను. అర్జునుడు చెప్పినది బోధ కాదు, భగవంతుడు చెప్పినది భగవద్గీత. అయినా అర్జునుడు చెప్పిన దానితో సహా భగవద్గీత యనడము జరుగుచున్నది, అలా అనకూడదు. వాస్తవముగా భగవద్గీత ఎలా 18 అధ్యాయములు లేదో, అలాగే అంతిమ దైవగ్రంథములో కూడా 114 సూరాలు లేవు. భగవద్గీతను పదిహేడు అధ్యాయములు అనడము ఎంత న్యాయమో, ఖురాన్ గ్రంథమును 113 సూరాలు అని చెప్పడము అంతే న్యాయమగును. అందువలన జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి జ్ఞానమును చెప్పినది అల్ బఖర సూరానుండి యేనని చెప్పవచ్చును. అల్ బఖర సూరాలో ఖురాన్ జ్ఞానము ఎలా ప్రారంభమయినదో ఇప్పుడు చూస్తాము. అల్ బఖర సూరాలో మొదటి ఆయత్ నుండి కాక రెండవ ఆయత్నుండి జ్ఞానము ప్రారంభమయినది. రెండు, మూడు, నాలుగు అను మూడు ఆయాత్లలో రెండవ ఆయత్నుండి జ్ఞానబోధ ప్రారంభమయినది.


(2-2) ''ఇది (ఈ ఖురాన్) ఒక దివ్య గ్రంథము అనుటకు ఇందులో ఏమాత్రము సందేహము లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము. (2-3) ''ఎవరయితే అగోచర యదార్థాన్ని విశ్వసిస్తారో, నమాజును స్థాపిస్తారో మరియు మేము ప్రసాదించిన జీవనోపాధినుండి మా మార్గములో ఖర్చు చేస్తారో (2-4) ''ఓ ముహమ్మద్, ఎవరయితే నీపై అవతరింపబడిన ఈ ఖురాన్ను మరియు నీకు పూర్వము అవతరింపజేయబడిన (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో, మరియు పరలోక జీవితమును దృఢముగా నమ్ముతారో''


ఖురాన్ గ్రంథము యొక్క గొప్పతనము, ఖురాన్ గ్రంథము యొక్క సూక్ష్మత్వము మొట్టమొదట ఈ మూడు ఆయత్లలోనే కనిపించుచున్నది. మొదటి ఈ మూడు ఆయత్లు అర్థమయితే తర్వాత ఖురాన్ గ్రంథము అర్థము కాగలదు. ఇక్కడ మూడు వాక్యములు సరిగా తెలియకపోతే, మొదటనే తప్పుగా వేరు విధానములో అర్థమయితే మిగతా గ్రంథములోని ఆయత్లన్నీ తప్పుగానే అర్థము కాగలవు. దేవుడు చెప్పిన భావము తెలియకుండాపోవును. వేయిమందికి లేక లక్షమందికి ఈ మూడు ఆయత్లు ఒకే విధముగా అర్థమయినా అది దేవుడు చెప్పిన భావము కాకపోతే ఏమీ ప్రయోజనము లేదు. లక్షమంది ఒకే మాటను చెప్పినా అది అసత్య జ్ఞానముగా లెక్కించబడును. దేవుడు ఏ ఉద్దేశ్యముతో చెప్పాడో ఆ ఉద్దేశ్యము ఒక్కనికి అర్థమయినా, ఆ ఒక్కనినే సత్యమైన జ్ఞానియని చెప్పవచ్చును. లక్షమందిది కాదని ఒక్కనిది సత్యమైన జ్ఞానమనుటలో ఏమయినా పక్షపాత ధోరణి యుండవచ్చునేమోయని అనుకొనుటకు అవకాశము లేకుండా, తన జ్ఞానము ఏది నిజమైనదో, ఏది అసత్యమైనదో తేల్చి చెప్పుటకు తన గ్రంథములోనే శాస్త్రీయమైన వాక్యములను దేవుడు చెప్పియుండుట వలన వాటిని గీటురాయిగా ఉపయోగించి మనిషి అర్థము చేసుకొన్నదానిలోని సత్యాసత్యమును తేల్చి చెప్పవచ్చును. అందువలన కొంత ఆలస్యమయినా ఫరవాలేదు, ముందు ఈ మూడు వాక్యములను బాగా తెలియగలిగి తర్వాత ముందుకు పోవలసియుండును.


ఖురాన్ గ్రంథములో ముందు చెప్పబడిన మూడు ఆయత్లలో ముందు ఆయత్ కష్టమయినది కాదు. దానిని పెద్దగా అర్థము చేసుకోవలసిన అవసరము లేదు. మూడవ చివరి ఆయత్ కూడా విశ్వాసము మీద ఆధారపడి యున్నది గానీ పెద్దగా గ్రహించుకోవలసిన పని లేదు. ఇకపోతే మధ్యలో యున్న ఒక్క ఆయత్ను మాత్రము చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవలసి యున్నది. ఈ వాక్యములో మూడు భాగముల విషయములు కలవు. వాటిలో ఒకటి గ్రంథములో అత్యంత ముఖ్యమైనది అగోచర యదార్థము, రెండు నమాజు, మూడు నీకు ప్రసాదించిన జీవనోపాధి. ఈ మూడు విషయములు మనిషి బుద్ధికి అర్థము కాకపోతే, అది అమృతమే అయినా చివరికది విషమువలె బాధించును. అమృతము వలె మనిషిని రక్షించక విషమువలె బాధించును. దేవుడు చెప్పినది వాస్తవ జ్ఞానమే అయినా మనిషి బుద్ధికి అది సరైన భావములో అర్థము కాకపోతే మనిషి జీవితమే వ్యర్థము. అల్లాహ్ (దేవుడు) ఖురాన్ గ్రంథము ప్రారంభములో మూడు ఆయత్లను ముఖ్యముగా చెప్పాడు. అందులో మధ్యలోని ఒక్క వాక్యములో మనిషి అర్థము చేసుకోవలసిన మూడు విషయములను తెలియజేశాడు. దేవుని జ్ఞానము ఈ మూడు విషయముల మీద ఎక్కువ ఆధారపడియుంటుంది. ఈ మూడు జ్ఞాన విషయములు అర్థము కాకపోతే వాడే వానికి విషముగా లెక్కించవచ్చును.


దేవుడు చెప్పిన వాక్యమును అర్థము చేసుకొంటే ఒక విధముగా, అర్థము కాకపోతే మరొక విధముగా యుంటుంది. అర్థమయితే ఎలాగుంటుందో, అర్థము కాకపోతే ఎలాగుంటుందో క్రింద అక్షర రూపములో చూడండి.

జ్ఞాన విషయము - జ్ఞాని


ప్రాణ విషము - అజ్ఞాని


జ్ఞాన విషయము ప్రాణ విషములాగ మారిపోగలదు. అర్థమయితే విషయము. అర్థము కాకపోతే విషయములో 'య' లేకుండా పోయి విషయమే విషముగా మారిపోగలదు. పై వాక్యములో మొత్తము ఎనిమిది అక్షరములు గలవు. క్రింది వాక్యములో కూడా ఎనిమిది అక్షరములే గలవు. అయితే పైది జీవింపజేయును. క్రిందిది హరింపజేయును. దేవుని జ్ఞానము తెలియకుండా మనిషి ఎన్నాళ్ళు బ్రతికినా వాని జీవితము గుర్తింపు లేనిది. 'పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా' అన్నట్లు అది ఏ విధముగా చూచినా గుర్తింపు లేని జీవితముగానే ఉండును. ప్రతి మనిషి జీవితానికి గుర్తింపు రావాలంటే వాడు దేవుని జ్ఞానమును తెలియాలి. వాడు జీవుడు అయినందున తనకంటే పెద్ద అయిన తనను సృష్ఠించినవానిని తెలియవలసియున్నది. అప్పుడే వాడు ఆధ్యాత్మిక జీవితమును పొందినట్లగును. ఆధ్యాత్మికము అనగా 'ఆత్మను అధ్యయనము చేయడము' అని అర్థము. ఒక్కమారు వాడు ఆధ్యాత్మికములోనికి ప్రవేశించాక వాడు దేవుని దృష్ఠిలో గుర్తింపు పొందినవాడగును. అయితే వాని ఆధ్యాత్మిక జీవితము రెండు విధములుగా యుండును. ఒకటి సక్రమ మార్గము, రెండు అక్రమమైన మార్గము అని చెప్పవచ్చును. వాటినే జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గము అని కూడా చెప్పవచ్చును. జ్ఞానమార్గములో పోవువాడు జ్ఞాన విషయములను పొందును. అజ్ఞాన మార్గములో పోవువాడు ప్రాణ విషమును పొందును. అందువలన ఆధ్యాత్మికము మనిషిని దేవుని వైపు పంపగలదు. అది అర్థము కాకపోతే, తప్పుదారిలో అర్థమయివుంటే అదే ఆధ్యాత్మికమే మనిషిని మాయవైపు పంపును. మాయ విషముతో సమానము. దేవుడు అమృతముతో సమానమని పోల్చి చెప్పవచ్చును. అందువలన ప్రతి మనిషిని హెచ్చరించినట్లు ఖురాన్ గ్రంథములో మొదటనే మూడు ఆయత్లను చెప్పి దేవుడు తన జ్ఞానము యొక్క విధానమును తెలియజేశాడు. మొదట చెప్పిన మూడు వాక్యములలో మధ్యది, రెండవది అయిన వాక్యము మొదటనే మనుషులకు సరియైన మార్గమును అనుసరించునట్లు ముఖ్యమైన మూడు జ్ఞాన విషయములను చెప్పినది.


దాదాపు 1400 సంవత్సరములప్పుడు చెప్పిన అంతిమ దైవ గ్రంథము ఖురాన్లో ముఖ్యముగా చెప్పిన మూడు అంశములు ఈ రోజు వరకు మనుషులకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఖురాన్ గ్రంథము ఒక ముస్లీమ్ సమాజానికే చెప్పిన జ్ఞానమని చాలామంది అనుకొంటున్నారు. అలా అనుకోవడము పెద్ద పొరపాటు. ''ఖురాన్ దైవగ్రంథము అది సకల లోక ప్రజల కొరకు చెప్పిన హితోపదేశము''. ఖురాన్ గ్రంథము ఏ ఒక్క మతమునకు పరిమితమైనది కాదు, అట్లే ఏ మతమునకు సంబంధించినది కాదు. ఖురాన్ గ్రంథము మనుషులందరికీ అర్థము కాలేదని చెప్పవచ్చును. దైవగ్రంథములు భూమండలములో మూడు గలవు. మూడు గ్రంథములు సకల మానవులకు సంబంధించినవి. అందువలన మూడు గ్రంథములను అర్థము చేసుకోవడము మూడు మతములలోని ప్రజలందరి బాధ్యత. నేడు ఖురాన్ గ్రంథము అర్థము కాలేదంటే దానికి ప్రతి మనిషి జవాబు చెప్పవలసిందే.


ప్రథమ, మధ్యమ, అంతిమ దైవగ్రంథములు మూడు ఒకే జ్ఞానమును బోధించినా, మూడు గ్రంథములను చూస్తే వేరువేరు జ్ఞానమును బోధించినట్లు కనిపించును. చెప్పిన కాలమునుబట్టి, చెప్పిన భాషనుబట్టి వేరువేరుగా చెప్పినట్లు కనిపించడము వాస్తవమే. అయితే బోధించినది మాత్రము ఒకే సత్యమైన జ్ఞానము. మూడు గ్రంథములలోనే మూడు అగోచర ఆత్మలను గురించి చెప్పిన సారాంశము తప్ప ఇతరము ఏమీ లేదు. మూడు ఆత్మలను గురించి, వాటికి అనుబంధముగా యున్న జ్ఞానమును గురించి చెప్పడమైనది. ప్రథమ దైవగ్రంథములో మూడు ఆత్మల జ్ఞానమును చెప్పినా, మూడవ ఆత్మ (పరమాత్మను) గురించి కొంత ఎక్కువ విశధీకరించి చెప్పారు. అలాగే రెండవ దైవ గ్రంథములో మూడు ఆత్మలను గురించి చెప్పినా, రెండవ ఆత్మను (మధ్యాత్మను) గురించి ఎక్కువగా చెప్పినట్లు కనిపించుచున్నది. ఇక అంతిమ దైవగ్రంథ విషయానికి వస్తే సూరా 50, ఆయత్ 21లో మూడు ఆత్మలను గురించి చెప్పినా, జీవాత్మను గురించి మిగతా రెండు ఆత్మలకంటే కొంత ఎక్కువ చెప్పినట్లయినది. కొంత ఎక్కువ తక్కువలుగా మూడు గ్రంథములలోనూ మూడు అగోచర ఆత్మలను గురించి చెప్పడము ముఖ్య ఉద్దేశ్యముగా యున్నది.


మూడు దైవగ్రంథములలో దేవుని అంశలు మూడని ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మయని చెప్పడమైనది. పరమాత్మయనబడు మూడవ ఆత్మను దేవునిగా అల్లాహ్గా చెప్పడమైనది. మూడు ఆత్మలు అగోచరమైనవయినందున, ఆత్మల జ్ఞానమంతయూ బయటి దృష్ఠికి కనిపించదు. అందువలన ఖురాన్ ప్రారంభములోనే ''ఎవరయితే అగోచర యదార్థమును విశ్వసిస్తారో'' అని చెప్పడమైనది. అయితే భూమిమీద అగోచర విషయములను నమ్మని భౌతికవాదులు చాలామంది యున్నారు. కనిపించని అభౌతిక విషయములను ఇతరులు నమ్మకపోయినా, దేవుడు చెప్పిన అభౌతిక ఆత్మలను యదార్థమని ఎవడయితే నమ్మగలడో, వానికి ఆత్మజ్ఞానము సులభముగా అర్థము కాగలదు. కనిపించని యదార్థమైన ఆత్మల విషయములో మనుషులు పూర్తిగా అవగాహన లేకుండా పోయారు. అన్ని మతములలోనూ మూడు ఆత్మలను గురించి చెప్పుకొనువారే కరువై పోయారు. బోధకులకే ఆత్మలంటే ఏమిటో తెలియకుండా పోయినది. అగోచర విషయములను మేము నమ్మము అనువారు చాలామంది గలరు. తమను తాము సర్వము తెలిసినవారుగా భావించుకొనిన వారు, అభౌతిక ఆత్మవాదము పూర్తి అసత్యమని చెప్పుచుందురు. మొత్తము మీద మూడు ఆత్మలను గురించి నిగూఢముగా మూడు దైవగ్రంథములలో చెప్పబడినదని మూడు మతముల మనుషులకు తెలియకుండా పోయినది. దైవ గ్రంథములో ఆత్మలను గురించి ఉందని తెలియకపోవడము వలన వాటిని తెలుసుకొను ప్రయత్నమును ఎవరూ చేయలేదు.


రెండవ జ్ఞాన విషయము నమాజ్ను స్థాపించడము. నమాజ్ విషయములో కూడా చాలామంది పొరపడిపోయి తమకు తెలిసినదే నమాజ్ (ప్రార్థన) అని అనుకొంటున్నారు. దేవుడు ఇచ్చిన గీటురాయి ప్రకారము చూస్తే ఇంతవరకు ''నమాజ్'' అను ప్రార్థన దేవుని భావమునకు సరిపోవు ప్రార్థనగా లేదని, అందువలన అసలయిన ప్రార్థనను నెలకొల్పమని చెప్పాడు. మనుషులు చేయు ఆరాధనను చూచి అదే ఆరాధనయని అనుకొనుటకంటే, దైవగ్రంథములో దేవుడు ఏమి చెప్పాడో, దేనిని తన ఆరాధనగా చెప్పాడో, ఎట్లు ఆచరిస్తే తనది ఆరాధన అవుతుందో దాని ప్రకారము చేస్తే దేవుని మార్గములో ప్రయాణించినట్లగును. లేకపోతే మాయమార్గములో ప్రయాణించినట్లగును. ఖురాన్ గ్రంథమును చెప్పినది 1400 సంవత్సరముల క్రితము. అంతకుముందు మూడు యుగములు గడచిపోయాయి. మూడు యుగములనుండి దేవుని ఆరాధనను మనిషి చేయలేదను ఉద్దేశ్యముతో కలియుగములో తయారయిన మూడు దైవ గ్రంథములలో దైవారాధనను గురించి చెప్పియున్నారు. చివరి గ్రంథమయిన ఖురాన్లో నమాజ్ను నెలకొల్పమని చెప్పాడు. 1400 సంవత్సరములప్పుడు నమాజ్ విషయము దేవుడు చెప్పాడంటే అంతవరకు నమాజ్ విషయము మనుషులకు తెలియదనేగా అర్థము. దేవుని సందేశము గ్రంథరూపములో వచ్చిన తర్వాత అయినా ప్రార్థన (నమాజ్) విషయములో ఏమయినా క్రొత్తదనము వచ్చినదాయని చూస్తే ఏమీ తేడా రాలేదు. వాళ్ళు నోటితో గొణిగి చెప్తే, వీళ్ళు అరచి చేస్తున్నారు. వాళ్ళు నిలబడి చేస్తే వీళ్ళు కూర్చొని చేస్తారు. వాళ్ళు మంత్రములు చదివి ప్రార్థన చేస్తే, వీళ్ళు వాక్యము చదివి చేస్తారు. వాళ్ళు ఒకే దానిని 108 మార్లు జపిస్తే, వీళ్ళు ఒకే దానినే పూటకు ఒకమారు జపిస్తున్నారు. వాళ్ళు ఉదయము, సాయంకాలము ప్రార్థన చేస్తే, వీళ్ళు ఇంకా కొన్ని ఎక్కువమార్లు చేస్తున్నారు. చేసే విధానములు, చెప్పే మంత్రములు వేరువేరయినా ఆరాధనలన్నీ మనస్సుతోనే చేస్తున్నారు. మనస్సును నిలిపి చేయడము లేదు. అందువలన వారు చేయునది, వీరు చేయునది రెండూ తపస్సు క్రిందికే జమకట్టబడినాయి. అందరి ప్రార్థనలు ప్రకృతి సంబంధమైనవై తపస్సు క్రిందికి రాగా, నిజమైన ప్రార్థన ఇంతవరకు లేకుండా పోయినది. అందువలన ''నమాజును నెలకొల్పండి'' అని వాక్యములో చెప్పారు.


మూడవ మాటగా దేవుడు ''నేను ప్రసాదించిన జీవనోపాధి నుండి నా మార్గములో ఎవడు ఖర్చు చేస్తాడో వాడు వాస్తవమయిన నా జ్ఞానమును తెలియగలడు''. మనిషి జీవితములో దైవము వైపునుండి ఇవ్వబడునవి ఉండవచ్చును, ఉండకపోవచ్చును. అయితే కర్మవైపు నుండి ఇవ్వబడునవి అనేకముండును. ప్రపంచములో ఏది లభించినా అది కర్మవైపు నుండి వచ్చినదే అయివుండును. ధనము వచ్చినా, రోగము వచ్చినా అన్నీ కర్మనుండి వచ్చును. ఇది అది అని చెప్పుటకు వీలు లేకుండా మనిషికి జీవితములో లభించునవన్నియూ కర్మనుండే లభించును. ఒక్క దేవుని జ్ఞానము తప్ప మిగతావన్నీ కర్మ ఫలితమేయని తెలియవలెను. జీవితములో దైవజ్ఞానము మాత్రము దేవుడు ఇచ్చుచున్నాడు. జ్ఞానమును దేవుడు తప్ప ఇచ్చువారు ఎవరూ లేరు. జ్ఞానము మినహా ప్రతీదీ కర్మవలన కల్గును. త్రాగేనీళ్ళ నుండి పడుకొనే పడక వరకు ప్రపంచ సంబంధ ప్రతి వస్తువు, ప్రతి ప్రపంచ జ్ఞానములు అన్నీ కర్మనుండే లభించును. మనిషికి దైవజ్ఞానము దేవునినుండే ప్రసాదింపబడును. అందువలన మూడవ మాటగా ''నేను ప్రసాదించిన జీవనోపాధినుండి ఎవరు ఖర్చు చేస్తారో'' అని చెప్పబడినది. దీని అర్థము ఇలా కలదు. దేవుడు ప్రసాదించే జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడమే దేవుని సేవగా భావించి, దైవజ్ఞానమును ప్రచారము చేయు కొలది అతడు చివరకు అతి రహస్యమైన ఆత్మజ్ఞానమును తెలియగలడు. దానివలన అతనికి ముక్తి లభిస్తుంది అని చెప్పియున్నారు. అయితే మనుషులు దేవుడు ప్రసాదించిన జ్ఞానమును ఇతరులకు పంచకుండా, దేవుడు చెప్పిన మాటను అర్థము చేసుకోలేక, కర్మప్రకారము సంప్రాప్తమైన ధనమును పేదవారికి దానము చేయుచూ దేవుని మాట ప్రకారము దేవుడిచ్చినది ఇతరులకు అంతో ఇంతో పంచుతున్నామని తృప్తి పొందుచున్నారు. దేవుడు ధనమిచ్చాడా? అని ఆలోచించడము లేదు. దేవుడు ఏమి ఇవ్వగలడని కొద్దిగ అయినా విచక్షణ లేకుండా పోయినది. కర్మప్రకారము ధనము రాగలదు. కర్మప్రకారము వచ్చిన ధనమును పంచితే తిరిగి కర్మేరాగలదు. దేవుని వలన వచ్చిన జ్ఞానమును పంచితే తిరిగి ఉత్తమమైన జ్ఞానము లభించగలదు. అయితే ఈ విషయములో మనిషి పొరపడి కర్మవలన వచ్చిన ధనమును పంచుతూ దేవుడు చెప్పినట్లు నడచు కొంటున్నానని అనుకోవడము పెద్ద పొరపాటు.


ఏ మనిషికయినా దేవుని జ్ఞానము ఒక్కమారుగా పూర్తి ఇవ్వబడదు. కొద్దికొద్దిగా లభించుచూ పోవుచుండును. మనిషికి కొద్ది జ్ఞానము తెలియగానే దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము నడువగలిగితే తర్వాత ఇంకా కొంత ఉత్తమమైన జ్ఞానము తెలియును. ఇట్లు మనిషి జీవితములో అంచెలంచెలుగా జ్ఞానము లభించగా చివరకు దేవుని వాస్తవ జ్ఞానమర్థమయి పోవును. దానివలన మనిషికి పరలోక ప్రాప్తి కల్గును.

------




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


  వజ్ర వాక్య వివరము  

   ☞

1. సత్య తిరస్కారులు. (2-7)

భూమిమీద దేవున్ని ఏమాత్రము విశ్వసించనివారు కూడా కలరు. ముఖ్యముగా చెప్పితే కనిపించే మనుషులనూ, కనిపించని దేవతలను దేవుడు సృష్ఠించాడు. అయితే వారిలో కొందరు దేవున్ని విశ్వసించే వాళ్ళు యున్నారు, విశ్వసించని వాళ్ళు యున్నారు. మొత్తము జీవరాసులందరినీ ఈ విషయములో రెండుగా విభజించవచ్చును. కనిపించని దేవతల విషయము మనుషులకు సరిగా తెలియదు. దేవతలంటే తమకంటే గొప్పవారను భావము చాలామందిలో గలదు. దేవతలు మనుషులకంటే తక్కువ వారని చాలామందికి తెలియదు. దేవతలతో యున్న కొన్ని అనుభవముల చేత కొంత కాలమునకు వారు ఎంత గొప్పవారో, ఎంత నీచమైనవారో తెలియగలరు. అందరినీ సృష్ఠించిన దేవున్ని మనుషులు, దేవతలు ఆరాధించవలసి యున్నది. అయితే మనుషులు దేవున్ని పూర్తి మరచిపోయి దేవతలను ఆరాధించే దానికి మొదలు పెట్టారు. దానితో మనుషులకంటే నీచులయిన దేవతలు తమను తాము గొప్పవారిగా అనుకోవడము జరిగినది. దేవతల ఆరాధనతో మనిషి దేవున్ని, దేవుని జ్ఞానమును పూర్తిగా మరచిపోవడము జరిగినది.


దేవుడు అను ద్యాసగానీ, దేవుని జ్ఞానము అను జ్ఞప్తిగానీ లేని మనిషి ఇతరులు దేవున్ని ఆరాధించడము చూచి అసూయ చెందడమే కాక దేవున్ని పూర్తి తిరస్కార ధోరణిలో మాట్లాడడము మొదలుపెట్టాడు. ఈ విధముగా దేవున్ని కొందరు విశ్వసించగా, కొందరు విశ్వసించక తిరస్కారులుగా యున్నవారు గలరు. అటువంటి తిరస్కారులకు ఎంతగా చెప్పినా వారు ఏమాత్రము వినరు. ప్రపంచములో ఎన్నో చిన్న పెద్ద విషయములలో యోచించువారు దేవుని విషయములో ఏమాత్రము యోచించరు. దేవున్ని గురించి ఎంతో గొప్పగా చెప్పినా వారు ఏమాత్రము వినను కూడా వినరు. అటువంటి వారున్నారని దేవునికి బాగా తెలుసు. అందువలన అటువంటి తిరస్కారులను గురించి అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ ఏడులో ఇలా అన్నారు.


(2-7) ''అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్లపై పొర వుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష ఉంది.''


ఈ వాక్యములో వారి హృదయము, వారి చెవులు మూసివేయ బడినాయి. ముఖ్యమైన సామాగ్రికల పెట్టెకు బీగము (తాళము) వేసి తిరిగి దానిని ఎవరూ తీయకుండా లక్కతో దానికి ముద్ర వేయుదురు. అనగా వారి హృదయములో గల బుద్ధి దేవుని జ్ఞానమును గ్రహించదు. వారి చెవులు దేవుని జ్ఞానమును వినవు. అందువలన చెవులపై ముద్రవేశాడు అని అన్నారు. వారు తమ కళ్లతో జ్ఞాన గ్రంథాల వైపు చూడరు. వారి కన్నులకు పొర వుంది. కావున జ్ఞానము ఏమాత్రము కనిపించదు. అటువంటి మనుషులకు జ్ఞానము ఎంత మాత్రము చేరదు, దారులన్నీ మూసివేయబడ్డాయి అని చెప్పారు. బయట విషయము ఏదయినా తెలియాలంటే రెండు జ్ఞానేంద్రియముల ద్వారానే తెలియవలసియుంది. ఒకటి కన్ను, రెండు చెవ్వు. ఈ రెండూ మూసివేయబడినవంటే వారి హృదయములో గల బుద్ధికి కొద్దిగా కూడా అర్థము కాదని చెప్పుటకు కన్ను, చెవు, హృదయము మూసివేయబడినాయి అని చెప్పారు. దైవజ్ఞానము మనిషిలోనికి చేరుటకు ఒకటి కన్ను, రెండు చెవ్వు, మూడు హృదయము (బుద్ధి) ఈ మూడే ముఖ్యమైనవి. అందువలన దేవుడే ఈ మూడింటినీ మాయ చేత ముద్ర వేయించాడు. దేవుడు మనిషిని సక్రమమైన మార్గములో అయినా పంపును లేక అక్రమమైన మార్గములో అయినా పంపును. దేవుడు తనకు ఇష్టము లేని వారిని అలాగే చేయును. దానికి కారణము దేవున్ని మనిషి గౌరవించకపోగా విమర్శించుట వలన అటువంటి వారిని దేవుడు గుర్తు పెట్టుకొని తన మాయ చేత తనకు దూరముగా పంపును. తనకు దూరముగా మనిషి పోవుటకు చెవి, కన్ను మరియు బుద్ధి (హృదయమును) తాళము వేసి ముద్రవేశాడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

2. దేవున్ని రెండుమార్లు తిరస్కరించిన వారు. (4-137)

దేవున్ని, దేవుని జ్ఞానమును కొంత ఆస్తిక భావము గలవారు మొదట కొంత విశ్వాసము కల్గియున్నా, తర్వాత వారు వారిలో దాగియున్న నాస్తిక భావము బయటికి రాగా, కొంచెమైనా విచక్షణా జ్ఞానము లేకుండా వారు తిరస్కారులుగా మారిపోయి, తిరిగి కొంత కాలమునకు విశ్వాసులుగా మారి, ఆ తర్వాత తిరస్కారులుగా మారువారు కొందరు అక్కడక్కడ యున్నారు. అటువంటివారిని గురించి అంతిమ దైవగ్రంథములో సూరా 4, ఆయత్ 137 యందు ఇలా చెప్పారు చూడండి.


(4-137) ''నిశ్చయముగా ఎవరైతే విశ్వసించిన తర్వాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి ఆ తరువాత తిరస్కరించి, ఆ తిరస్కారములోనే పురోగమిస్తారో అలాంటివారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు మరియు సన్మార్గము వైపునకు దారి చూపడు.''


కొందరు దేవున్ని విశ్వసించి దానివలన ఇతరుల మీద పెత్తనమో, సమాజములో గౌరవమునో ఆశించియుందురు. అటువంటి పెత్తనముగానీ, అటువంటి గౌరవముగానీ దొరకనప్పుడు కష్టాలు వస్తున్నాయనో, దేవుని విశ్వాసము వలన రోగాలు ఎక్కువ వస్తున్నాయనో, డబ్బులు ఆదాయము తగ్గిపోయిందనో సాకు చూపి, అవిశ్వాసులుగా మారిపోయి తిరస్కార ధోరణిలో ఉందురు. అటువంటివారు కొంత కాలమునకు ఆధ్యాత్మికములో యుంటూ దేవుని మీద విశ్వాసము కల్గియుంటే, దానివలన డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చునని తలచి తిరిగి విశ్వాసులుగా మారినట్లు నటించుచుందురు. వారు ధనము మీద ఆశతో విశ్వాసులుగా నటించు వారైన దానివలన వారికి అనుకున్నంత డబ్బు రానందున అట్టివారు తిరిగి అవిశ్వాసులుగా మారిపోయి తర్వాత వారు తిరస్కారులుగానే కొనసాగుచుందురు. రెండుమార్లు వారి ఆశలు ఫలించకపోవడము వలన మూడవ మారు వారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచుందురు. విశ్వాసులుగా నటించుటకు వారు ఇతరులకంటే ఎక్కువ వాక్యములను నేర్చిన వారైనా, తిరిగి వారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచుందురు.


ప్రపంచ సంబంధ ఆశలను వదలి దేవున్ని విశ్వసించినవారు విశ్వాసములో నిలువ గలరు. అట్లుకాకుండా బయటి ఆదాయము కొరకు గానీ, హోదా కొరకుగానీ, గౌరవమునకుగానీ ప్రాకులాడువారు అది లభిస్తే విశ్వాసులుగానే యుందురు. ఒకవేళ ప్రపంచ సంబంధమైనవి ఏవి లభించకపోయినా అటువంటి వానికి దేవుని మీద విశ్వాసము తగ్గిపోతూ వచ్చును. అందువలన దేవుని జ్ఞానమును ప్రపంచ సంబంధ లాభముల తోనూ గౌరవములతోనూ, పదవులతోనూ ముడివేయకూడదు. అలా బయటి విషయములలో జ్ఞానమును ముడిపెట్టిన వాడు తనకు ఏమి నష్టము జరిగినా వాడు అవిశ్వాసిగా మారిపోవును. అంతటితో ఊరక యుండక తన నష్టమును కష్టమును చూపుచూ దేవున్ని విమర్శించుటకు మొదలుపెట్టును. దానివలన అటువంటివాడు విశ్వాసిగా మారలేడు. ఒకవేళ మారినా వాడు తొందరగా తిరిగి అవిశ్వాసిగానే కొనసాగును. అందువలన ఏ మనిషి అయినా జ్ఞానముతో విశ్వాసిగా మారవలెనుగానీ, ప్రపంచ విషయములతో సంబంధపడి విశ్వాసిగా మారకూడదు. ప్రపంచ విషయముల ధ్యాస యున్నవాడు దేవుని విశ్వాసములో ఇమడలేడు. ఈ విధముగా లెక్కించి చూచిన మనుషులలో విశ్వాసులు కొందరు, అవిశ్వాసులు చాలామంది కలరని తెలియుచున్నది.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

3. వారిని వారే మోసగించుకొంటున్నారు. (2-8, 9)

(2-8, 9) ''ప్రజలలో కొందరు మేము అల్లాహ్‍ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించాము అని అనే వారున్నారు. కానీ వాస్తవానికి వారు విశ్వసించేవారు కాదు. వారు అల్లాహ్‍ను, అల్లాహ్‍ను విశ్వసించిన వారిని ఇద్దరినీ మోసగిస్తున్నామని అనుకొంటున్నారు. కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించడము లేదు. అయితే వారది గ్రహించడము లేదు.''


చాలామంది ఆకారానికి ముస్లీమ్‍లుగా కనిపించుచున్నారు గానీ వాస్తవానికి వారిలో దేవుని మీద విశ్వాసము ఉండదు. ఉండక పోయినా దేవున్ని విశ్వసిస్తున్నామని చావును, చావులో జరిగే విధానమును నమ్ముచున్నామని అంటున్నారు. అయితే వారికి దేవుని మీద, అంతిమ దినము మీద వారికి విశ్వాసముండదు. వారికున్నదంతా మత ధ్యాసే ఉండును. మతమును, మత విధానములను తలచినంతగా దేవున్ని, అంత్యదినము అనగా చనిపోయిన దినమును గురించి వారు ఏమాత్రము ఆలోచించడము లేదు. పైకి కనిపించుటకు వేషధారణలో అందరికంటే పెద్ద ముస్లీమ్‍గా, అందరికంటే నిజమైన ముస్లీమ్‍గా కనిపించుచుందురు. అటువంటివారు నిజమైన ముస్లీమ్‍లని కొందరు నమ్మవచ్చును. దేవునికి మనుషుల భాషతో పనిలేదు. ఆయన భావమును గ్రహించును. అందువలన మతము కొరకు ముస్లీమ్‍లుగా యుండి అల్లా జ్ఞానమును ఏమాత్రము తెలియనివారిని దేవుడు తెలియగల్గును. వారి అంతరంగమందు దాగియున్న భావమును దేవుడు తెలియగలడు. అందువలన వారికి దైవగ్రంథములోని జ్ఞానము తెలియదనీ, వారు మతమునకు ముస్లీమ్‍లేగానీ జ్ఞాన విషయములో ముస్లీమ్‍లు కాదని దేవుడు తెలియగల్గును. అటువంటప్పుడు మత సంబంధ ముస్లీమ్‍లు ప్రజల దృష్ఠిలో ముస్లీమ్‍లుగా కనిపించినా దేవుని దృష్ఠిలో వారు ముస్లీమ్‍లు కారు. వారికి దేవుని జ్ఞానము మీద ధ్యాస లేనందున దేవుని మీద కూడా ధ్యాస ఉండదని చెప్పవచ్చును. వారు తాము ముస్లీమ్‍లని ఇతరులను మోసము చేయుచుందురు. అయితే వాస్తవానికి వారిని వారు మోసము చేసుకొంటున్నారు. ప్రజలు వారిని చూచి మోసపోయినా ప్రజలకు ఏమాత్రము నష్టముండదు. అయితే నష్టము ముస్లీమ్‍లుగా వేషము వేసిన జ్ఞానము తెలియనివారే ఎక్కువగా నష్టపోవుచున్నారు. అందువలన వారిని వారే మోసగించుకొనుచున్నారని చెప్పవచ్చును. దేవుడు పై వాక్యములో అదే మాటను చెప్పాడు.


1) ప్రశ్న :- సూరా రెండు, ఆయత్ ఎనిమిది (2-8) లో అంతిమ దినమును విశ్వసించినవారు ముస్లీమ్‍లు అని చెప్పారు. ముస్లీమ్‍లు అల్లాహ్‍ను విశ్వసించవచ్చును గానీ అంతిమ దినమును విశ్వసించడము ఏమిటి? అని ప్రశ్న రాగలదు. అంతిమ దినమును గురించి వివరముగా చెప్పవలెనని కోరుచున్నాము?


జవాబు :- ఈ విషయమును గురించి ముస్లీమ్‍లందరూ పొరపడిపోయారని చెప్పవచ్చును. అంతిమ దినము అంటే ఏమిటి? అని మేము ముందు వ్రాసిన ''అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు'' అను గ్రంథములో విపులముగా చెప్పియున్నాము. ఇప్పుడు ఈ గ్రంథములో కూడా వ్రాయబోవు సమాచారములో అంతిమ దినమును గురించి సందర్భానుసారముగా వివరించి చెప్పు ప్రయత్నము చేస్తాము. ఇప్పుడు స్థూలముగా కొంత సమాచారమును తెలియజేస్తాను. తర్వాత విపులముగా తెలియగలరు. అంతిమ దినము అనగా అందరికీ తెలిసిన అర్థము ప్రకారము చివరి దినము అని చెప్పవచ్చును. చివరి దినము అంటే జీవితమునకు చివరి దినము అని అర్థము. జీవితములో మరణము వచ్చిన రోజే చివరి దినమగును. అంతవరకు శరీరములో యున్న జీవుడు మరణములో ఏమగును? మరణము పొందిన దినమున అతనికి కల్గు అనుభవములేమిటి? అని ప్రశ్నించుకొని వాటి అన్నిటికీ సమాధానము తెలియడమే అంతిమ దినమును గురించి సంపూర్ణముగా తెలియడమగును. అంతిమ దినమున జీవాత్మ శరీరమును విడచిపోవును. అలా పోవడము ఒక సెకండులో జరిగిపోవును. ఆ సెకండు కాలములోనే ఆ జన్మలో ఆ జీవుడు చేసుకొన్న పాపపుణ్యముల లెక్క, దాని ప్రకారము సుఖదుఃఖములు అనుభవించవలెనని తీర్పు జరుగును. అయితే ఈ తీర్పు మీద ముస్లీమ్‍లకు ఎవరికీ నమ్మకము లేదు. వారి నమ్మకము అంతా ప్రళయ దినమున దేవుడు తీర్పు తీర్చుతాడని, ప్రళయ దినము భూమి ఆకాశములు పంచభూతములు అన్నీ నాశనమగు దినమని ముస్లీమ్‍ల అందరి నమ్మకము. ప్రపంచమునకు ప్రళయము అనునది లేనే లేదు. లేని ప్రళయమును గురించి చెప్పుకోవడము పెద్ద పొరపాటగుచున్నది.


2) ప్రశ్న :- ప్రళయమంటే ఏమిటి? అది ఎప్పుడు జరుగును?


జవాబు :- ప్రళయము అంటే పుట్టినదంతయూ నాశనమయి పోవడము. పంచభూతములు తమ విధులను నెరవేర్చక నిలిచి పోవడమును ప్రళయము అని చెప్పవచ్చును. శరీరములో యున్న పంచ భూతములు తమ విధులను నెరవేర్చలేక నిలిచిపోవడమును ప్రళయము అని చెప్పవచ్చును. ప్రళయములో శరీరమునందు పంచభూతములు నశించును. అంతేగానీ బయట కనిపించు అగ్ని, భూమి, నీరు, గాలి, ఆకాశము అన్నీ నశించి పోవునని అనుకోవడము పెద్ద పొరపాటు. బయట స్థూలముగా యున్నది ఏదీ నాశనము కాదు. అయితే పంచభూతముల చేత తయారయిన శరీరము నశించి పోవడమును ''ప్రళయము'' అని అంటున్నాము. శరీరములోని పంచభూతములు నాశనము కావడమును ప్రళయము అని అనవచ్చును. స్థూలముగా కనిపించు ప్రపంచము ఎప్పటికీ నాశనము కాదు. పుట్టిన శరీరములు నశించిపోవుచున్నవి. దానినే ప్రళయము అని అనవచ్చును. అంతిమ దినము యొక్క విషయములో చాలామంది పొరపడిపోయారు. అందువలన వాక్యములో అంతిమ దినమును గురించి చెప్పడము అయినది. మొత్తము ముస్లీమ్‍లు ''మనిషి చనిపోయిన తర్వాత శవమును భూమిలో గుంత తీసి పూడ్చడము చేయుచున్నారు. పూడ్చిన గుంతలో చనిపోయిన వారు ప్రళయ కాలము వరకు ఉంటారు'' అని చెప్పుచున్నారు. అలా చెప్పడము వలన వారిలో విచక్షణా జ్ఞానము పూర్తి లేకుండా పోయినదని అర్థమగుచున్నది. పది రూపాయల చిల్లరను తీసుకొన్నప్పుడు అందులో అర్ధ రూపాయి తక్కువయున్నా తిరిగి చిల్లర ఇచ్చిన వానిని అడిగి అర్ధ రూపాయి ఇప్పించుకొంటాము. ఇక్కడ పది రూపాయల వద్ద తక్కువ, ఎక్కువయని బుద్ధి పని చేసినప్పుడు మిగతా చోట కూడా అలాగే పని చేయాలి కదా!


చనిపోయిన వాని శరీరములో జీవుడే యుండడు. వాడు శరీరమును వదలిపోతే శరీరము శవము అయిపోతుంది. ఒకమారు శరీరమును వదలిపోయిన తర్వాత తిరిగి ఆ శరీరములోనికి జీవుడు చేరడు. శవమయిన శరీరములోనికి జీవుడు చేరేదానికి అవకాశమే లేదు. శవము దాదాపు ఆరు నెలలలో పూర్తి కుళ్ళిపోవును. ఎముకలు కొంత ఆలస్యముగా లేకుండాపోవును. జరిగే సత్యము అంతేకాగా, దేవుడు శవమును పూడ్చిన గుంతలో నుండి మనిషిని సజీవముగా లేపునని కొందరు చెప్పడము, వినిన మిగతా వారందరూ అట్లే జరుగునని అనుకోవడము, ఇతరులకు అలాగే చెప్పడము వలన, అదే నిజమని అందరూ అనుకోవడము జరుగుచున్నది. దేవుడు అనుకొంటే ఏమయినా చేయగలడని చెప్పుచున్నారు. దేవుడు ఎప్పుడూ శాస్త్రమునకు విరుద్ధముగా ఏదీ చేయడు. శవములోనికి జీవుడు చేరకూడదని దేవుడే నిర్ణయించి పెట్టినప్పుడు, దానిని దేవుడు ఎలా అతిక్రమించగలడు? 'భూసమాధినుండి చనిపోయిన జీవున్ని శరీరముతో సహా లేపుదును' అని దేవుడు తన వాక్యములో చెప్పిన మాట వాస్తవమే! అయితే దానిని అర్థము చేసుకోవడములో తప్పుగా అర్థము చేసుకొన్నారు. పూడ్చిన గుంతలో నుండి అనుకోవడము పెద్ద పొరపాటు. తల్లిగర్భమునుండి చనిపోయిన దినముననే అనగా అంతిమ దినమున మనిషిని శరీరముతో సహా లేపుదును అని దేవుడే చెప్పాడు. దానిని విచక్షణ లేనివారు ఎటు పడితే అటు అర్థము చేసుకోవడము వలన మిగతా వారందరూ దానినే నిజమని నమ్మారు. ఒక మనిషి చనిపోతే చనిపోయిన క్షణమే కర్మ లెక్కించబడి, తీర్పు తీర్చబడి రెండవ జన్మకు వచ్చి తల్లిగర్భమునుండి శరీరము బయటికి రాగా అందులో జీవుడు చేరుచున్నాడు. ఇదంతయూ ఒక్క క్షణములో జరిగిపోవుచున్నది. కావున 'అంతిమ దినమున' అన్నారు. అంతిమ దినము అనగా చనిపోయిన రోజు. అదే రోజే లేపబడుచున్నాడు. కావున చచ్చిన రోజే జీవుడు క్రొత్త శరీరముతో, క్రొత్త బుద్ధి, క్రొత్త మనస్సు మొదలగు వాటితో పుట్టుచున్నాడు. ఈ విషయము అర్థముకాక మనిషికి పునర్జన్మే లేదని మరొక అసత్యమును మనిషి చెప్పుచున్నాడు. మేము వ్రాసిన ''పునర్జన్మ రహస్యము'' అను గ్రంథము చదివితే చనిపోయిన వారు తిరిగి పుట్టిన తర్వాత వెనుకటి జన్మల జ్ఞాపకము వచ్చి చెప్పు సంఘటనలు అనేకము గలవు. అవన్నీ ప్రత్యక్ష సత్యములు అయినందున వాటిని అసత్యమని చెప్పుటకు వీలులేదు. దీనినిబట్టి మనిషికి పునర్జన్మలున్నా యని తెలియుచున్నది. ఇంత చెప్పినా నమ్మను అనే వారిని ఏమీ చేయలేము. వారి దారిన వారిని వదలి వేయడము మంచిది.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

4. మీరు సత్యాన్ని తెలిసియుండి దాచకండి. (2-42)

కొందరు తమముందు ప్రత్యక్షముగా యున్న సత్యమును తెలిసి కూడా తిరిగి అసత్యమునే చెప్పుచున్నారు. అలా వారు చెప్పుటకు కారణము మత నియమములని చెప్పుచున్నారు. ఒక ఇంటిలో దాదాపు 40 సంవత్సరముల వయస్సుగల వ్యక్తి హత్య కావింపబడ్డాడు. అతడు రెండు సంవత్సరముల తర్వాత అదే ఇంటిలోనే తిరిగి పుట్టడము జరిగినది. అతనికి వెనుకటి జన్మ జ్ఞాపకములు స్పురణకు రావడము మొదలుపెట్టాయి. అప్పుడు అదే ఇంటిలోని వారినందరిని గుర్తుపట్టాడు. అలా గుర్తుపట్టగా పుట్టిన పిల్లవాడు తమ ఇంటి మనిషేనని అందరికీ రూఢిగా తెలిసిపోయినది. దానితో మనిషికి పునర్జన్మలున్నవని, మనిషి చనిపోయిన తర్వాత వెంటనే తిరిగి జన్మకు వచ్చునని సాక్ష్యముగా అర్థమయిపోయినది. అయితే వారు ముస్లీమ్ కుటుంబము వారు. అందులోనూ ముస్లీమ్‍లందరికీ ఆ ఊరిలో బోధకుడుగా యున్నందున, ఇంటిలోపల పునర్జన్మల సత్యము తెలిసిపోయినా బయట బోధలో మనిషికి జన్మలు లేవు అని మొదటినుండి చెప్పినట్లే చెప్పుచుండెను. దీనినిబట్టి బోధకుడు ముస్లీమ్ అయినందున తనకు పునర్జన్మల విషయము సత్యమని తెలిసినా, సత్యమును అసత్యముతో కలిపి మతబోధ ప్రకారము జన్మలు లేవు అని చెప్పుచుండెను. ఇటువంటి వారిని చూచిన దేవుడు వారికి కనువిప్పు కల్గునట్లు సూరా రెండులో ఆయత్ 42 యందు ఇలా చెప్పియున్నాడు చూడండి.


(2-42) ''సత్యాన్ని అసత్యముతో కలిపి తారుమారు చేయకండి. మీకు తెలిసియుండి కూడా సత్యాన్ని దాచకండి.''


ఈ వచనమును చదివిన తర్వాత ముస్లీమ్‍లు చాలామంది సత్యమును తెలిసినా వారు మత నియమముల కొరకు సత్యమును దాచి అసత్యమును చెప్పుచున్నారని అర్థమగుచున్నది. ముఖ్యముగా బోధకుల స్థానములో యున్నవారు సత్యమును దాచి అసత్యమును బయటికి చెప్పుచున్నారని అర్థమగుచున్నది. అలా చేయవలసిన అవసరము ఏమి వచ్చింది? అని పరిశీలించి చూస్తే కేవలము మత అభివృద్ధి కొరకే అని అర్థమగుచున్నది. ఇది ఒక ముస్లీమ్ మతమునకే పరిమితము కాలేదు. ప్రతి మతములోనూ ఇదే విధానము కలదని తెలియుచున్నది. కొందరు తెలిసి అసత్య ప్రచారము చేయగా, కొందరు వారిని అనుసరించి పోవుచున్నారు తప్ప, తాము ఆచరించునది, తాము చెప్పునది సత్యమా అసత్యమా? అని ఏమాత్రము తెలియరు. కొందరయితే మా పెద్దలు చెప్పినట్లు మేము చెప్పవలసిందేగానీ మా స్వంతము ఏమీ చెప్పకూడదని అంటున్నారు. వారికి ఖుర్ఆన్ గ్రంథములో సత్యాన్ని దాచకండి యని (2-42) లో చెప్పిన మాట ఏమాత్రము తెలియదు. నేను మాత్రము దేవుని మాటను అనుసరించుచూ, దేవుని వాక్యమును గౌరవించుచూ సత్యమును ప్రజలకు తెలుపాలనుకొన్నాను. నేను హిందువునే అయినా ప్రథమ దైవగ్రంథమును అర్థము చేసుకొన్నాను కావున, దానిని అనుసరించే మిగతా రెండు గ్రంథముల జ్ఞానము ఉండుట వలన ఎక్కడయినా జ్ఞానము అజ్ఞానముగా ప్రజలకు అర్థమయివుంటే అది తప్పని నాకు తెలిసిపోవుచున్నది. సంగీతమును తెలిసినవాడు ఏ పాటయినా పాడును అన్నట్లు జ్ఞానము తెలిసిన వానికి ఏ సత్యమయినా తెలియగలదు. అందువలన జ్ఞాన విషయములో సత్యమును సులభముగా చెప్పగలుగు చున్నాను. ఎచ్చటయితే అసత్యమున్నదో అచ్చట సత్యమును తెలుపడమే నా కర్తవ్యముగా పెట్టుకోవడము వలన, నా బోధలు నిఘంటువువలె యుండుట వలన, ఇతరులు తెలియుటకు సులభమయినది. (2-42) లో గల దేవుని వాక్యమునకు గౌరవమును కల్గించునట్లు నేను సత్యమునే తెల్పుచూ ఈ గ్రంథమును వ్రాయపూనినాను. దీనివలన జ్ఞాన విషయములు, ఖుర్ఆన్ గ్రంథములో అర్థముకాని విషయములు కూడా సులభముగా అర్థము కాగలవు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

5. మూసాకు గీటురాయిని ఇచ్చాము. (2-53)

నేను సత్యమునే చెప్పి దేవుని వాస్తవిక జ్ఞానమును తెలియజేస్తానని చెప్పినా, కొందరికి నా మాట మీద కూడా సంశయము ఉండవచ్చును. నా మాటను నమ్మని వారు కూడా ఉండవచ్చును. అందువలన దేవుడు జ్ఞానములో ఏది సత్యము, ఏది అసత్యము అని తెలియుటకు మూసాకు గీటురాయిని ఇచ్చి పంపడము జరిగినది. దేవుడు మూసా అను ప్రవక్తకు దైవగ్రంథమును ఇచ్చాడు. ముందు దైవ గ్రంథమును మూసాకు ఇవ్వడమే కాక తర్వాత ''సత్యాసత్యమును వేరు చేసే గీటురాయిని ప్రసాదించాము'' అని దేవుడు చెప్పాడు. దానివలన గ్రంథములోని వాక్యములను ఎవరు గానీ అపార్థము చేసుకోకుండా, తప్పు భావముతో అర్థము చేసుకోకుండా సరైన అర్థము తెలియుటకు, సత్యమును స్వీకరించి అసత్యమును వదలుటకు గీటురాయిని ప్రసాదించాడు. దానివలన మాకు కూడా మేము చెప్పునది సత్యమేయని తెలియుటకు ఉపయోగపడుచున్నది. గీటురాయిని గురించి అల్లాహ్ (దేవుడు) తన గ్రంథములో సూరా రెండు, ఆయత్ 53లో ఈ విధముగా చెప్పుచున్నాడు చూడండి.


(2-53) ''మీరు సన్మార్గులవుతారని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యాసత్యాలను వేరే చేసే) గీటురాయిని ప్రసాదించాము.''


''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను తెలుగు అనువాద గ్రంథము నుండి వాక్యమును తీసి వ్రాశాము. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథమునుండి అదే వాక్యమునే వ్రాయుచున్నాము. తెలుగు అనువాదకులు పదాలు తేడాతో వాక్యమును వ్రాసినా అనువాదకులందరూ ఒకే భావమునే ఉండునట్లు వ్రాసియుందురు. ఆ విషయమును తెలియుటకే ఇక్కడ దివ్య ఖుర్ఆన్ సందేశములోని వాక్యమును వ్రాయుచున్నాము చూడండి.


(2-53) ''ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వము నిమిత్తము గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము.''


ఈ విధముగా రెండు గ్రంథములలోని వాక్యములను చూచినా, కొంత పదాల తేడాతో యున్నా ఒకే భావమునే తెలియజేయుచున్నవి. రెండు వాక్యములను చూచినా ప్రజలు సన్మార్గులవుటకు మొదట దైవగ్రంథమును మూసాకు ఇవ్వడము జరిగినది. తర్వాత అందులోని వాక్యములను ఎవరంతకు వారు ఇష్టానుసారముగా చెప్పుకోకుండా ఒక హద్దును ఏర్పరచుచూ మనుషులు అర్థము చేసుకొన్నది సత్యమో కాదో తేల్చి చూచుకొనుటకు మూసాకు దేవుడు గీటురాయిని కూడా ఇచ్చాడు. ఇక్కడ బాగా అర్థము చేసుకొంటే మూసాకు దేవుడు మొదట గ్రంథమును ఇచ్చాడు. తర్వాత సత్యాసత్యములను తేల్చి తెలుసుకొనుటకు గీటురాయిని ఇచ్చాడు అని వుంది. దీనినిబట్టి గ్రంథమువేరు, గీటురాయి వేరని తెలియు చున్నది. అలాగే ప్రతి మనిషి గ్రంథమును చదవవచ్చును. గ్రంథములోని విషయములను గీటురాయిని ఉపయోగించి సత్యమును తెలిసి అసత్యమును వదలి వేయవచ్చును.


ప్రశ్న :- గీటురాయి వేరు, గ్రంథము వేరని మీరంటున్నారా?


జవాబు :- నేను అనడము అటుంచి దేవుడు చెప్పిన ఖుర్ఆన్‍లోని (2-53) వాక్యాన్ని చూస్తే ఎవరికయినా గ్రంథము వేరు, గీటురాయి వేరని తెలియగలదు. గ్రంథము, గీటురాయి రెండూ ఒకటేయని కొందరను కోవచ్చును. అయితే దేవుడు ఇచ్చిన విచక్షణా శక్తి వలన గీటురాయి వేరు, గ్రంథము వేరని తెలియుచున్నది. ప్రతి చిన్న విషయమును విడదీసి తెలుపు విచక్షణా శక్తియే గీటురాయి అని కూడా అర్థము చేసుకోవచ్చును. గ్రంథమును అర్థము చేసుకొనులాగ చేయునది గీటురాయి. గీటురాయి వేరు, గ్రంథము వేరని తెలియవలెను. మూసాకు దేవుడు గ్రంథము ఇచ్చాడు. గ్రంథము ఇచ్చిన తర్వాత దాని పేరు తౌరాతుయని గ్రంథము ఇచ్చిన ఆయనే చెప్పాడు. గ్రంథము తర్వాత గీటురాయిని కూడా ఇచ్చాడు.


ప్రశ్న :- మీరు కొన్ని సందర్భములలో భగవద్గీత గీటురాయిగా ఉన్నదని చెప్పారు. అప్పుడు భగవద్గీత, గీటురాయి రెండూ ఒక్కటే అని కదా! అంతేకాక మీరు వ్రాసిన గీటురాయి గ్రంథములో 54వ పేజీయందు తౌరాతును గీటురాయిగా చెప్పారు. అలాగే భగవద్గీతను తౌరాతుగా చెప్పారు. అంతేకాదు మూడు దైవగ్రంథములను గీటురాయిగా పోల్చి చెప్పారు. ఇక్కడేమో గ్రంథము వేరు, గీటురాయి వేరు అని అంటున్నారు. మీరు చెప్పే మాటను మేము ఎలా అర్థము చేసుకోవాలి?


జవాబు :- ఎలా అర్థము చేసుకోవాలనునదే గీటురాయి. మనిషిలోని విచక్షణా జ్ఞానమునే గీటురాయి అని చెప్పుచున్నాము. గ్రంథము వేరు, గ్రంథమును అర్థము చేసుకొను విచక్షణా శక్తి వేరు. మొదట మూసాకు తౌరాతు గ్రంథమును అల్లాహ్ (దేవుడు) ఇచ్చినది వాస్తవమే. తర్వాత దానిని అర్థము చేసుకొను బుద్ధికి తగిన విచక్షణాశక్తిని ఇచ్చినది వాస్తవమే. అందువలన వాక్యములో గ్రంథమును మరియు గీటురాయిని రెండింటినీ ఇచ్చాను అని అన్నాడు. అందువలన గ్రంథము వేరు, గీటురాయి వేరని చెప్పాను. ఇకపోతే గీటురాయి గ్రంథములో మూడు దైవగ్రంథములయందు మూడు గీటురాళ్ళు కలవని చెప్పాము. దైవగ్రంథమును గీటురాయిగా ఎందుకు చెప్పామో అక్కడ మీరు ఎట్లు అర్థము చేసుకోవాలో వివరముగా తెలిపెదను. పాలను పూర్తిగా శీతలీకరణ చేసి చల్లగా చేస్తే పాలు ఐస్గా తయారగును. మన ఇంటిలోని ఫ్రిజ్‍లో ఐస్ ట్రేలో పాలను పోసి ఉంచితే పాలు ఐస్ ముక్కగా మారిపోవును. మనము తినే ఐస్గా, రుచికరముగా, తియ్యగా ఉండునట్లు పాల ఐస్‍ను తయారు చేసుకొనుటకు పాలలో కొంత చక్కెరను (పంచదారను) కలిపి, చక్కెర కలిపిన పాలను ఐస్ ట్రేలో పెట్టితే తియ్యని ఐస్ తయారగును. తియ్యని ఐస్‍ను విడదీసి చూస్తే అందులో పాలు+పంచదార రెండూ కలిసియున్నాయి. వాస్తవానికి పాలు వేరు, పంచదార వేరు. పాలు ద్రవ పదార్థము, పంచదార ఘన పదార్థము. ద్రవ పదార్థమైన పాలలో పంచదార కలిసిన దానివలన తియ్యని ఐస్ తయారయినది. పంచదార లేకుండా పాలే అయితే తీపిలేని చప్పని ఐస్ తయారయ్యేది. అది తినేదానికి యోగ్యముగా ఉండదు. పాలు మరియు పంచదార, ఐస్ ముక్క ఈ మూడు అర్థమయినవి కదా!


అలాగే పాలు గ్రంథముగా పోల్చుకొందాము, పంచదారను గీటురాయిగా పోల్చుకొందాము. ఈ రెండూ కలిపి తయారయిన ఐస్‍ను దైవ గ్రంథముగా లెక్కించుకొందాము. పాలు ద్రవ పదార్థముగా వేరుగా యున్నది. అలాగే చక్కెర ఘన పదార్థముగా వేరుగాయున్నది. రెండూ పరిమాణములోనూ, ఆకారములోనూ వేరువేరుగా యున్నవి. ఈ రెండింటినీ కలిపితే కలిసిపోవుచున్నవి. కలుపకపోతే వేరువేరుగా యున్నవి. గ్రంథమును పాలుగా పోల్చాము. దేశములో దైవగ్రంథములు మినహా ఎన్నో గ్రంథములు గలవు. చరిత్రలు గ్రంథ రూపముగా యుండును. చరిత్ర గ్రంథములను చదువునప్పుడు మనిషి ధ్యాస యంతయూ గత చరిత్రయంతయూ కథలాగ ఉండును కనుక దానిని మౌనముగా చదివి తెలుసుకోవలసిందే. చరిత్రలో ఎందరో రాజులు రాజ్యములు మారినా వాటిని తెలియుటకే మన బుద్ధి పరిమితమైయుండును గానీ అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అను ప్రశ్న రాదు. జరిగిపోయినది చరిత్ర కావున దానిని కథలాగ చదువవలసిందే!


నేడు మనకు ఎన్నో విషయములు జరుగుచున్నవి, ఎన్నో విషయములు జరిగి పోయినవి. అవి మన ఇష్టప్రకారము కాకుండా కర్మ ప్రకారము జరిగేవి అయినందున వాటిని ఎవరూ ఎందుకు ఇలా జరగాలి? అని ప్రశ్నించుటకు వీలులేదు. పూర్వము తయారయిన గ్రంథములన్నీ ఇతిహాసమునకు (చరిత్రకు) సంబంధించినవే. అందువలన వాటిని విచక్షణతో చదువవలసిన అవసరము లేదు. అవి అన్నియూ జరిగిన దానిని తెలియుటకు మాత్రమే చదువుచుండెడివారము. తర్వాత నాటికలు, పిట్టకథలు, పొడుపు కథలు, సామెతలు మొదలగు గ్రంథములు తయారయినా అవి చదివి తెలుసుకొనునవే గానీ, వాటి దగ్గర విచక్షణ అవసరమే లేదు. తర్వాత విద్య, వైద్య, విజ్ఞాన గ్రంథములన్నియూ చదివి నేర్చుకోవలసినవే గానీ ఇదెందుకు, అదెందుకు అను విచక్షణ అక్కడ కూడా అవసరము లేదు. ఇంకా కొంత కాలము గడువగా కలియుగము మొదలు, ద్వాపర యుగము చివర యుగ సంధికాలములో పురాణ కథల గ్రంథములు వ్యాసుని చేత వ్రాయబడినవి. అందులో భయముతో ముడివేయబడిన భక్తి యుండుట వలన అక్కడ కూడా మనిషి విచక్షణ అవసరము లేకుండా పోయినది. తర్వాత వేదములు, ఉపనిషత్తుల గ్రంథములు వ్యాసుని చేతనే తయారయి వచ్చినవి. పురాణములను చదివిన వారు వేదములను, ఉపనిషత్తులను చదివారు. అప్పటికే అనేక దేవతా పూజలయందు చిక్కుకుపోయిన వారు దేవతల మీద భక్తి వలన, భయము వలన ఉపనిషత్తులను వేదములను చదివారు. వాటియందు కూడా విచక్షణా జ్ఞానముతో పని లేకుండా చెప్పింది వినవలెను, చేయమన్నది చేయవలెను అని గ్రుడ్డిగా ఒకరిని చూచి మరొకరు పెద్దలు చెప్పినవి వినడము, చెప్పినది చేయడము తప్ప ఇదెందుకు? అదెందుకు? అను విచక్షణ ఎవరికీ ఏమాత్రము లేకుండాపోయినది. అంతవరకు మనిషికున్న విచక్షణయంతయూ బయట ప్రపంచ విషయములలో ఉపయోగపడేదే గానీ, స్వంతానికి ఏమాత్రము ఉపయోగ పడలేదు. తనకు సంబంధించిన విషయములన్నియూ బయటి ప్రపంచములో ఉన్నాయని అనుకొను మనిషి బయటి ప్రపంచములోనే తన బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించాడు.


మనిషి బుద్ధికి గల విమర్శనాశక్తినే విచక్షణా జ్ఞానము అని అంటున్నాము. ఆ విచక్షణా జ్ఞానమునే గీటురాయి అని క్రొత్తగా చెప్పబడినది. గీటురాయి అని పేరు రావడానికి ఒక కారణము గలదు. పూర్వ కాలము నేను చిన్నవయస్సులో యున్నప్పుడు దాదాపు అరవై సంవత్సరములప్పుడు నాకు ఏడు లేక ఎనిమిది సంవత్సరముల వయస్సులో ఇప్పటి రూపాయి ఆనాడు లేదు. బొట్టు, అర్ధ అణా, అణా, రెండు అణాలు, పావలా, అర్ధ రూపాయి, రూపాయి అను నాణెములు ఉండేవి. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయల నోట్లు ఉండేవి. అప్పటి చలామణి అంతయూ నాణెములు ఎక్కువగా ఉండేది. నోట్ల చలామణి తక్కువ ఉండేది. అప్పటి కాలములో అవన్నియూ బ్రిటీష్ గవర్నమెంటు తయారు చేసిన డబ్బుగా ఉండేది. నాణెముల మీద, నోట్ల మీద బ్రిటీష్ రాజుల ఫోటోలు ఉండేవి. అప్పటికి స్వాతంత్య్రము వచ్చి పది సంవత్సరములు అవుతుంది. ఆ పది సంవత్సరములలోనే అర్ధ రూపాయి బిల్లలు నకిలీవి తయారయినవి. అర్ధరూపాయి విలువ అప్పుడు వారము రోజులకు సరిపడు తిండి సరుకులు వచ్చేవి. అందువలన అర్ధరూపాయిని ఇస్తే ఇది నకిలీదా, అసలుదాయని జాగ్రత్తగా చూచేవారు. నకిలీది అని తెలిస్తే ఇది చెల్లదు అని వెనక్కు ఇచ్చెడివారు. అది నకిలీదా కాదా!యని తెలుసుకొనుటకు అర్ధరూపాయిని బండమీద గీచి చూచెడివారు. బండమీద గీకితే కొద్దిగ నల్లని చార బండమీద పడితే అది దొంగ బిళ్ళయనీ, నల్లని చార పడకపోతే మంచి బిళ్ళయనీ అనుకొనెడివారు. అర్ధరూపాయి బిల్లను రాయిమీద గీచి చూడడము ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకము కలదు. అప్పుడు అర్ధరూపాయిని ప్రతి దానిని రాయిమీద గీచి చూచెడివారు. అందువలన రాయిని గీటురాయి అని అప్పటినుండి అనడము అలవాటైపోయినది. అప్పటికే బంగారును గీచి చూచు రాయిని సానరాయి అని అనెడివారు. తర్వాత కాలములో సానరాయి అను పదము పోయి దానిని కూడా గీటురాయి అని చెప్పేదానికి అలవాటు పడిపోయారు. 1956, 57 లో అర్ధరూపాయిని అందరూ గీచి చూస్తున్నారని అప్పటి ప్రభుత్వమునకు చిన్నతనముగా ఉండేది. అందువలన 1957లో రూపాయికి 16 అణాలు అను మాటను లేకుండా మొత్తము నాణెములను తీసివేసి, రూపాయికి 100 పైసలు అను లెక్కలో నాణెములను పైసా, రెండు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, 20 పైసలు, 50 పైసలు, రూపాయి నాణెములను తెచ్చారు. నేడు పైసానుండి 50 పైసల నాణెముల వరకు చలామణి లేకుండా పోయింది.


60 సంవత్సరములప్పుడు అందరూ అర్ధరూపాయిని గీచి గీచి చూడడము వలన ''గీటురాయి'' అను పేరు అందరికీ తెలిసిపోయినది. అంతేకాక ఆ దినములలో మనిషి అర్ధరూపాయిని చూస్తేనే అది దొంగదా, మంచిదాయని తెలియాలనుకొనెడివారు. అర్ధరూపాయి సత్యమైనదా, అసత్యమైనదాయని అక్కడ బుద్ధి పనిచేయడమును, దానిని పరీక్షించి తెలుసుకోవడమును విచక్షణ అని చెప్పవచ్చును. అది డబ్బు మీద గల విచక్షణ. అలాగే ప్రపంచ విషయములలో ప్రతి దానిమీద మనిషికి విచక్షణ ఉండేది. గుడ్డను చూస్తే అది ఎన్నో నంబరు దారముతో తయారయినదని పరిశీలించెడివారు. గుడ్డల షాప్లో అప్పుడు నేత చీరలు ఉండేవి. 50 నంబరు నూలు నుండి గుడ్డలు తయారయ్యేవి. అంగడి ఆయన చీరను చూపి ఇది నూరో నంబరు చీర అని చెప్పినా, కొనేవారు అతని మాటను నమ్మకుండా అది ఎన్నో నంబరు చీరయని జాగ్రత్తగా చూచెడివారు. ఒకవేళ అంగడి ఆయన తప్పు చెప్పియుంటే గుర్తించేవారు. అలా సరుకుల అంగడిలో సరుకుల నాణ్యతను చూచెడివారు. ఇచ్చే డబ్బుకు సరిపడు నాణ్యతయుంటే కొనేవారు. లేకపోతే ఇంకొక అంగడికి పోయేవారు. ఈ విధముగా బయటి ప్రపంచములో అడుగడుగునా బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించి చూచెడివారు.


అటువంటి విచక్షణను మనిషి తన స్వంత విషయములో అనగా ఆధ్యాత్మిక విషయములో ఏమాత్రము ఉపయోగించడము లేదు. నేడు మనిషి ప్రపంచ విషయములలో ఎంతో గొప్పగా విచక్షణను ఉపయోగించి చూచుచున్నాడు. అయితే భక్తి, జ్ఞాన, ఆత్మ జ్ఞాన విషయములలో ఎవరు ఏమి చెప్పితే దానినే వింటున్నారు. ఎలా చేయమంటే అలానే చేస్తున్నారు. బయట విషయములలో ఎంతో మేథావులుగాయున్న వారు కూడా గ్రుడ్డిగా యజ్ఞములు చేయుచున్నారు. విచక్షణ లేకుండా ఆరాధనలు చేయుచున్నారు. గురువులు, స్వాములనువారు ఏమి చెప్పితే అది చేస్తున్నారు. వంగు అంటే వంగుచున్నారు. నిలబడు అంటే నిలబడుచున్నారు. పవిత్రమని మురికి నీళ్ళలో మునగమంటే కూడా మునుగుచున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీర్థయాత్రలకు పోయి అపాయములలో చిక్కుకొంటున్నారు. ఎన్నో బాధలు పడుచున్నారు అయినా వారికి ఏమాత్రము విచక్షణ లేకుండా పోయినది. ఇది ఎందుకు చేయాలి? దానివలన లాభమేమి? అని ఆలోచించడము లేదు. మిగతా ప్రపంచ విషయములలో ఎంతో తెలివిగా యున్నవారు దైవిక విషయములలో గ్రుడ్డిగా ప్రవర్తించుచున్నారంటే వారికి విచక్షణ లేదని, బుద్ధిని వారు ఉపయోగించడము లేదని తెలియుచున్నది. దీనినిబట్టి చూచిన గ్రంథములోని విషయములను కూడా గ్రుడ్డిగా నమ్ము అవకాశమున్నందు వలన మనిషికి విచక్షణా శక్తి అవసరము అన్నాము.


మనిషి బుద్ధికి ఏదయితే విచక్షణా శక్తియుందో దానినే 'గీటురాయి' అని అన్నాము. ప్రపంచ సంబంధ ఏ గ్రంథములో కూడా గీటురాయిని మనిషి ఉపయోగించుకోలేదు. గ్రంథమును విమర్శించి జవాబును చూచునది గీటురాయి. గీటురాయి మనిషి మెదడులో ఉంటుంది. దీనిని బట్టి గ్రంథము వేరు, గీటురాయి అను మనిషి బుద్ధి వేరు. మనిషి ఏ గ్రంథములో కూడా తన బుద్ధిని ఉపయోగించలేదు. కావున దైవగ్రంథములో ఏమాత్రము తన బుద్ధిని ఉపయోగించి జ్ఞానము చూడడని తెలిసిన దేవుడు తన గ్రంథములో అంతరంగమును గురించి, బుద్ధిని గురించి కూడా చెప్పాడు. గ్రంథములో సంచలన విషయములను పెట్టి, మనిషి బుద్ధిని ఉపయోగించునట్లు చేశాడు. దైవగ్రంథములో మనిషి విచక్షణ బుద్ధి వేరు. గ్రంథము వేరు, అయితే దైవ గ్రంథమును దేవుడు మనకు ఇచ్చాడు. దైవ గ్రంథమును ఎవరు చదివినా వారి బుద్ధి పని చేయులాగున గ్రంథములో శక్తిని ఉంచాడు. అయితే మనిషికి గల శ్రద్ధనుబట్టి బుద్ధియొక్క విచక్షణ పని చేయులాగ దైవగ్రంథములో శక్తిని అమర్చాడు. దైవగ్రంథములో దైవశక్తి యున్నది. అది చదివిన వారి మీద పనిచేసి వారి బుద్ధి విచక్షణను పని చేయునట్లు చేయుచున్నది. ఆ శక్తి గ్రంథము చదివెడు మనిషి శ్రద్ధతో మిళితమై వాని శ్రద్ధ ఎంత ఉందో అంతే విచక్షణ పని చేయులాగ చేయుచున్నది. అందువలన నేడు ఒకే దైవగ్రంథము అనేక మందికి అనేక విధములుగా అర్థమయినది.


దైవము, దైవ జ్ఞానము మీద శ్రద్ధ మనుషులకు అనేక విధములుగా యున్నది. ఎంత శ్రద్ధయుంటే అంతే అవగాహనయుండును. దైవ గ్రంథములో గల శక్తి మనిషి శ్రద్ధతో కలిసినప్పుడు విచక్షణ ఏర్పడును. ఎంత విచక్షణ ఏర్పడునో అంతే జ్ఞానము దైవగ్రంథము నుండి లభించును. అందువలన భగవద్గీత గ్రంథములో జ్ఞానయోగమందు 39వ శ్లోకమున 'శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్' అని చెప్పియున్నారు. దేవుడు దైవ గ్రంథమును ఇచ్చి దానిని చూచిన వాని మెదడు మీద పని చేయు శక్తిని గ్రంథములో ఇచ్చాడు. ఆ శక్తి మనిషి శ్రద్ధ మీద ఆధారపడి పని చేయుట చేత శ్రద్ధను బట్టి గ్రంథములోని జ్ఞానము వానికి అర్థమగుచున్నది. ఒకనికి దేవుని మీద శ్రద్ధ నూరు పాళ్ళు యుంటే దేవుడు తన గ్రంథములో చెప్పిన జ్ఞానము నూరుపాళ్ళు అర్థమగును. శ్రద్ధ కేవలం పది శాతము ఉంటే వాని శ్రద్ధనుబట్టి పది శాతము జ్ఞానము అర్థము కాగలదు. జ్ఞానిగా నటించువానికి దైవము మీద శ్రద్ధ కేవలము ఐదు శాతము కలదనుకోండి, అప్పుడు వానికి ఐదు శాతము జ్ఞానమే లభించును. అందువలన నేడు ఒకే భగవద్గీతను అనేక విధముల అర్థము చేసుకొన్నవారు గలరు.


మూడు దైవగ్రంథములలో జ్ఞానశక్తి (దైవశక్తి) నిక్షిప్తమై యున్నది. కావున మూడు గ్రంథములు గీటురాయిగా ఉన్నవని చెప్పాము. గ్రంథములలో శక్తి విషయము ఎవరికీ తెలియదు, కావున మేము అలా చెప్పవలసి వచ్చినది. దీనిని గురించి విపులముగా తెలియుటకు (2-53)వ ఆయత్‍లో చెప్పిన విషయమును వివరించి చూచుకొందాము. అందులో మూసాకు గ్రంథమును మరియు సత్యాసత్యమును వేరు చేసే గీటురాయిని ప్రసాదించాము అన్నాడు. ఇప్పుడు మనము మూసా అను వ్యక్తినే మొదట మోషే అని పిలిచెడివారు. మోషే అను పదము కొంత కాలమునకు మూసాగా మారిపోయినది. మొదట ద్వాపరయుగము చివరిలో అనగా కలియుగము మొదటిలో ప్రథమ దైవగ్రంథము సంస్కృత భాషలో తయారయినది. చెప్పినవారు మొదట అల్లాహ్ కాగా, తర్వాత దానిని మనుషులకు చెప్పినవాడు సూర్యుడు (జిబ్రయేల్) కాగా, దానినే ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు అర్జునునకు చెప్పగా అర్జునుని ద్వారా వ్యాసుడు తెలిసి, తనకు తెలిసిన దానిని గ్రంథరూపము చేశాడు. మొదట సృష్ఠ్యాదిలో చెప్పిన జ్ఞానము ఆకాశవాణి ద్వారా శబ్దముల రూపములో వినిపించగా దానినే సూర్యుడు గ్రహించి భూమిమీద మనువుకు చెప్పాడు. చివరకు సూర్యుడు మనువుకు చెప్పిన దానినే తిరిగి కృష్ణుడు అర్జునునకు చెప్పగా అది వ్యాసుని ద్వారా గ్రంథరూపము దాల్చినది. మొదట ఆకాశమునుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట కలియుగము మొదటిలో గ్రంథము కాగా, దానినే ''ప్రథమ దైవ గ్రంథము'' అని అంటున్నాము. ప్రథమ దైవగ్రంథము కంటే ముందు దైవజ్ఞానమునకు సంబంధించిన గ్రంథము ఏదీ లేదు.


ఆ విధముగా తయారయిన మొదటి దైవ గ్రంథము పేరు ఆనాడు, ఈనాడు భగవద్గీతయని భారతదేశములో చెప్పుకొన్నాము. భగవద్గీత తయారయిన వెంటనే కృష్ణుడు తన గ్రంథమయిన గీతను తీసుకొని పోయి ఇజ్రయేల్ దేశములోగల మోషే (మూసా) ప్రవక్తకు స్వప్నములో ఇవ్వడము జరిగినది. దీనికి సంబంధించిన విషయము మా రచనలలోని ''కృష్ణ మూస'' అను గ్రంథములో గలదు. మూసాకు ఇచ్చిన గ్రంథము భగవద్గీత అయినా మోషేకు తౌరాతు అను పేరును చెప్పాడు. మోషేకు తనవద్దకు వచ్చిన గ్రంథము పేరు తౌరాతుయని తెలియునుగానీ భగవద్గీతయని తెలియదు. భగవద్గీత అను పేరుకంటే తౌరాతు అను పేరే సరియైనదిగా లెక్కించిన అల్లాహ్ మోషేకు తౌరాత్యని చెప్పాడు. మోషేకు తౌరాతు గ్రంథము ఇవ్వబడినదిగానీ అప్పుడు గీటురాయిగా ఇవ్వబడలేదు. మోషే తౌరాతు గ్రంథమును చూచినా ఆయనకు అందులోని విషయము అర్థము కాలేదు. అప్పుడు మోషేకు గ్రంథములోని విషయమును తెలియాలను శ్రద్ధ ఎక్కువ అయినది. అంతేకాక మోషే చిన్నవయస్సులోనే దేవుని మీద పూర్తి శ్రద్ధ కల్గియున్నాడు. తౌరాతు గ్రంథములో శ్రద్ధనుబట్టి జ్ఞానము లభించునని చెప్పియుండుట వలన ఆ విధానము అమలు జరుగునట్లు మూసాకు గ్రంథము ఇచ్చిన మూడవ రోజు గ్రంథమునకు శక్తి ఇవ్వబడినది. ఆ దైవశక్తితో మనిషి శ్రద్ధ కలిసినప్పుడు గీటురాయి ఏర్పడుచున్నది. అనగా మనిషి శ్రద్ధను బట్టి దైవశక్తి వలన బుద్ధికి విచక్షణా జ్ఞానము ఏర్పడుచున్నది. ఎంత విచక్షణయుంటే అంత జ్ఞానము లభ్యమగుట జరుగుచున్నది. ఇది దేవుడు ఏర్పరచిన కొలమానము. దేవుడు ఏర్పరచిన కొలమానము ప్రకారము మనిషికి జ్ఞానము లభించడము జరుగుచున్నది. దైవశక్తి శ్రద్ధ కలిసినప్పుడే బుద్ధి విచక్షణ ఏర్పడగా, బుద్ధి విచక్షణ ఎంత కల్గునో అంతే జ్ఞానము లభించును. ఇది దైవ నిర్ణయము. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని గీతలో చెప్పారు.


మరొకమారు వివరముగా చెప్పితే మూసాకు అల్లాహ్ గ్రంథము ఇచ్చిన తర్వాత మరియు గీటురాయిని కూడా మూడు రోజులకు ఇవ్వడమైనది. గీటురాయి అనగా బుద్ధియొక్క విచక్షణా శక్తి. విచక్షణా శక్తికి కారణము దైవశక్తి. దైవశక్తిని దేవుడు మూడవ రోజు గ్రంథములో చేర్చాడు. దైవశక్తి + మనిషి శ్రద్ధ = గీటురాయి (విచక్షణాశక్తి). గీటురాయి వలన సత్యమైన జ్ఞానము మనిషికి తెలియబడుచున్నది. ఒక బోధకునికి తన మతము మీదయున్న శ్రద్ధ దైవము మీద లేదు. ఆ బోధకుడు దైవమును అడ్డము పెట్టుకొని మతమును ప్రచారము చేయుచుండెను. అటువంటి వానికి వాని దైవ గ్రంథమునుండి జ్ఞానము తప్పు భావములో లభించినది గానీ అసలయిన జ్ఞానము లభించలేదు. వానికున్న శ్రద్ధ నూటికి ఐదు పాళ్ళే అయినందున అతనికి దైవజ్ఞానము కూడా ఐదు పైసలంతే అర్థమయినది. అతనివద్ద యున్న మిగతా 95 పైసలు జ్ఞానము మాయా జ్ఞానము తప్ప ఏమీ లేదు. దైవ గ్రంథములోని జ్ఞానము అతనికి అజ్ఞాన భావముగా అర్థమయినది తప్ప జ్ఞానమార్గములో అర్థము కాలేదు. అందువలన అతడు బోధకుడైయుండి, ప్రజలకు గొప్ప జ్ఞానిగా కనిపించు చుండినా, ప్రజలలో గొప్ప గౌరవ మర్యాదలుండినా దైవమార్గములో అతనికి వచ్చిన లాభము ఏమీ లేదు. అతనికి గీటురాయిలాంటి విచక్షణ లేనందున జ్ఞానము తెలియకుండా పోయినది. విచక్షణ లేకుండా పోవడానికి కారణము అతనికి దేవుని మీద శ్రద్ధ తక్కువ కలదని చెప్పవచ్చును. భూమిమీద గురువులను, జ్ఞానులను, స్వాములను మతము అను మాయ ఆవహించి యున్నది. అందువలన అందరికీ మతము మీద శ్రద్ధను మాయ కల్గించు చున్నది. దేవుని మీద శ్రద్ధ లేనిదానివలన నేడు బోధకులయిన వారికే దైవ గ్రంథములలోని జ్ఞానము తెలియకుండా పోయినది.


ప్రశ్న :- నేను ఇప్పుడు మిమ్ములను ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగు చున్నాను. మీరు బుద్ధి సూటిగా జవాబు చెప్పండి? దేవుడు తన గ్రంథమయిన తౌరాతు గ్రంథమునకు ఒక్కదానికే దైవశక్తిని ప్రసాదించాడు. తౌరాతు గ్రంథమును ఒక్క మోషే (మూసా) తప్ప ఎవరూ చూడలేదు. అటువంటప్పుడు భగవద్గీత తర్వాత మూడు వేల సంవత్సరములకు తయారయిన బైబిలు (ఇంజీలు) గ్రంథమునకు దైవశక్తిని దేవుడు ఇచ్చాడా? ఎప్పుడిచ్చాడు? బైబిలు తర్వాత ఆరువందల సంవత్సరములకు తయారయిన ఖుర్ఆన్ గ్రంథమునకు శక్తిని ఇచ్చాడా? ఎప్పుడిచ్చాడు? మీరు మూడు గ్రంథములకు శక్తి ఉన్నదని చెప్పారు. వాస్తవముగా మిగతా రెండు గ్రంథములకు శక్తి యున్నదా?


జవాబు :- దేవుడు ఒక్క తౌరాతు గ్రంథమునకు మాత్రము శక్తిని ఇచ్చాడు. మిగతా రెండు గ్రంథములకు శక్తిని ఇవ్వలేదు. అయినా వాటియందు తౌరాతులో యున్న దైవశక్తి కలదు. అయితే దేవుడు ఇవ్వకుండా వాటిలో శక్తి ఎలా వచ్చినదని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. తౌరాతు గ్రంథములో ఉన్న జ్ఞానమే మిగతా రెండు గ్రంథముల యందు ఉండుట వలన తౌరాతు గ్రంథములోని జ్ఞానజ్యోతి, మార్గ దర్శకత్వము ఉండుట వలన తౌరాతు గ్రంథములోని దైవశక్తి మిగతా రెండు గ్రంథములయందు కలదు. తౌరాతు గ్రంథములోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలో ఉన్నదనుటకు నిదర్శనముగా అంతిమ దైవ గ్రంథము లోని కొన్ని ఆయత్‍లను ఇక్కడ చెప్పుకొందాము. మొదట సూరా 5, ఆయత్ 46లో వ్రాసియున్న సమాచారమును చూద్దాము.


(5-46) ''ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యం (మరియమ్మ) కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథాన్ని ఇచ్చాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథమును ధృవీకరించుచున్నది. అంతేకాక అది దైవభీతి కలవారికి మార్గదర్శినిగా, హితోపదేశినిగా ఉన్నది.''


(5-48) ''మేము నీవైపుకు ఈ ఖుర్ఆన్ గ్రంథమును సత్య సమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను (తౌరాతును, ఇంజీలును) సత్యమని ధృవీకరించు చున్నది. నీవద్దకు వచ్చిన సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరింపకు.''


(5-44) ''మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఆ తౌరాతు గ్రంథ ఆధారముగానే ముస్లీమ్‍లయిన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు.''


(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును (భగవద్గీతను, బైబిలును) మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన దానినీ (ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''


(62-5) ''తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి నప్పటికీ, దానికి అనుగుణముగా ఆచరించని వారు ఎన్ని గ్రంథములను అనుసరించినా ప్రయోజనము లేదు. అటువంటి వారిని గ్రంథములను వీపు మీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లాహ్ సన్మార్గమును చూపడు.''


(2-89) ''వారివద్ద ముందు నుంచి యున్న దైవగ్రంథాన్ని (భగవద్గీతను) ధృవీకరించే గ్రంథము (ఖుర్ఆన్) అల్లాహ్ (దేవుని) వద్దనుండి వచ్చినది.''


(10-37) ''ఖుర్ఆన్ గ్రంథము దేవుడు పంపిన వాణి ద్వారా కాకుండా ఇతరుల కల్పనతో వ్రాయబడిన గ్రంథము కాదు. పైగా ఇది తనకంటే ముందు అవతరించిన (తౌరాతు, ఇంజీలు) గ్రంథాలను ధృవీకరించే గ్రంథము. ఇంకా ముందు గ్రంథములలోని ముఖ్య విషయములను విపులీకరించేదిగా యున్నది.''


(5-43) ''దైవాదేశాలు పొందు పరచబడియున్న తౌరాతు గ్రంథము తమవద్ద యున్నప్పటికీ వారు నిన్ను ఎట్లు న్యాయ నిర్ణేతగా చేసుకొంటున్నారు. యదార్థమేమి అంటే తౌరాతును మరచిన వారు అసలు విశ్వాసులే కాదు.''


ఈ ఎనిమిది వాక్యములను చూచిన తర్వాత ఖుర్ఆన్ గ్రంథమునకు ఆధారము తౌరాత్యని చెప్పక తప్పదు. ఖుర్ఆన్ తౌరాతు ఆధారముగా పుట్టినదగుట వలన, తౌరాత్ జ్ఞానమే ఖుర్ఆన్‍లో ఉండుట వలన, తౌరాత్‍లో గల దైవశక్తి ఖుర్ఆన్ గ్రంథములో కూడా యున్నదని చెప్పవచ్చును. కొన్ని మనుషుల కల్పిత వాక్యములు తప్ప మిగతా ఖుర్ఆన్ గ్రంథమంతా తౌరాత్ జ్ఞానమే ఉండుట వలన తౌరాత్‍లోని దైవశక్తియే ఖుర్ఆన్ గ్రంథములో కూడా కలదు. అందువలన భగవద్గీత తర్వాత వచ్చిన ఇంజీలు, ఖుర్ఆన్ గ్రంథములలో తౌరాత్ గ్రంథములోని దైవశక్తే కలదని చెప్పవచ్చును. దైవశక్తియున్న గ్రంథము వలన మనిషి శ్రద్ధనుబట్టి గీటురాయి మనిషి తలలో ఉద్భవించగా, గీటురాయిని బట్టి (విచక్షణా శక్తిని బట్టి) మనిషికి దైవజ్ఞానము లభించుచున్నది.


తౌరాతు గ్రంథమును ఎవరూ చూడలేదు. మోషే (మూసా) ప్రవక్తకు మాత్రము తౌరాతు అంటే ఏమిటో తెలుసు. మోషే చెప్పిన తౌరాత్‍లోని విషయములను అన్నిటినీ కలిపి మోషే ధర్మశాస్త్రము అని అన్నారు. తౌరాత్ పేరుతో ఎవరుగానీ గ్రంథమును చూడలేదు. అయితే ఖుర్ఆన్‍లో (5-43) లో 'తౌరాత్ గ్రంథము తమవద్ద యున్నప్పటికీ' అని వ్రాశారు. ఈ మాటను బట్టి తౌరాతు గ్రంథము నేడు మనవద్ద యుందని చెప్పవచ్చును. అయితే నేడుగానీ, గతములోగానీ తౌరాతు గ్రంథమును చూచిన వారిలో ఒక్క మోషే తప్ప ఎవరూ లేరు. అటువంటప్పుడు ఐదవ సూరా 43వ ఆయత్‍లో చెప్పిన మాట వాస్తవమేనా? యని ప్రశ్న రాగలదు. తౌరాత్ అను పేరు మధ్యలో వచ్చినదే గానీ, గ్రంథము తయారయినప్పుడు పెట్టిన పేరు కాదు. తౌరాత్ యను పేరు గ్రంథమును మోషేకు ఇవ్వబడినప్పుడు స్వయముగా గ్రంథమును ఇచ్చినవారు చెప్పిన పేరు. మోషే తర్వాత ఆ దేశములో ఎవరుగానీ తౌరాత్ గ్రంథమును చూచిన వారు లేరు. తౌరాత్ యొక్క విషయము అంతే!


తౌరాత్ అను పేరు పెట్టక ముందు ఆ గ్రంథము భారతదేశములో పుట్టినది. గ్రంథమును వ్రాసిన వాడు వ్యాసుడు. గ్రంథమును చెప్పిన వాడు కృష్ణుడు. కృష్ణునికంటే ముందు సూర్యుడు చెప్పాడు. సూర్యుడు ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమును విని కృతయుగములో భూమిమీద చెప్పాడు. తర్వాత ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్పగా, అర్జునుడు విని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు గ్రంథముగా వ్రాశాడు. అదియే ప్రథమ దైవగ్రంథము. భూమిమీద మొదట వెలసిన ప్రథమ దైవ గ్రంథమునకు గ్రంథమును వ్రాసిన వ్యాసుడే భగవద్గీతయను పేరును పెట్టాడు. ఈనాడు (5-43) వాక్యములో చెప్పినట్లు తౌరాతు గ్రంథము మారు పేరుతో, మొదటి పేరుతో మన వద్దయున్నది. అందువలన ఖుర్ఆన్‍లోని 5-43వ వాక్యము ఏ విధముగా తప్పు కాదు. భగవద్గీతను తౌరాతుగా వెదకితే అది ఎక్కడా లేదు. భగవద్గీతను తౌరాతుగా తలచి వెదికితే అది మనవద్ద కలదని చెప్పవచ్చును.


ప్రశ్న :- తౌరాత్ గ్రంథము (భగవద్గీత) తర్వాత దైవశక్తి గల గ్రంథము రాలేదంటారా?


జవాబు :- రాలేదని చెప్పుటకు వీలులేదు. తౌరాతు గ్రంథములో దైవశక్తిని దేవుడు మూసా ప్రవక్తకు గ్రంథమును ఇచ్చిన తర్వాత మూడవ రోజు గీటురాయి అను పేరుగల విచక్షణాశక్తి మూసాకు ఇవ్వబడినది. అదే శక్తి అదే జ్ఞానమున్న మిగతా రెండు గ్రంథములలో ఇవ్వబడినది. ఈ పద్ధతి ప్రకారము మూడు దైవగ్రంథముల జ్ఞానము ఏ గ్రంథములో యున్నా, ఆ గ్రంథములో దైవశక్తి దానంతట అదే చేర్చబడుచున్నది. నేడు తయారయిన గ్రంథములలో దైవశక్తి చేరియున్నదని అదే గీటురాయిగా మనని తయారు చేయుచున్నదని చెప్పినా ఆ విషయమును ప్రజలు నమ్మలేరు. అందువలన నేడు ఎక్కడయినా తౌరాతు గ్రంథమును పోలిన గ్రంథము తయారయివుంటే అందులోని దైవశక్తి భగవద్గీతలో కనపడక యున్నట్లు చెప్పవచ్చును. భగవద్గీతలో కనిపించక నిక్షిప్తమైయున్న దైవశక్తి నేడు ఏ గ్రంథములోయున్నా, గ్రంథములో అణిగియుండక బయటి ప్రపంచమునకు తెలియునట్లు ఉండును. గ్రంథములోని శక్తి బయటికి తెలియుచున్నా, మనిషి ప్రత్యక్షముగా దానిని చూచినా, అనేక అనుమానముల వలన గ్రంథములోని దైవశక్తిని నమ్మలేడు. ఇతరులకు దైవశక్తి గల గ్రంథములు ఏవయినా తెలుసో, తెలియదోగానీ నాకు మాత్రము ఫలానా గ్రంథములే దైవశక్తి గలవని తెలుసు.


ఇక్కడ మోషే ప్రవక్త చరిత్రను కొంత తెలియవలసిన అవసర మున్నది. అందువలన మా రచనలలోని ''కృష్ణ మూస'' గ్రంథము నుండి సేకరించిన సమాచారమును చూస్తాము


కృష్ణుడు సాధారణ మనిషి కాదు. ఆయన ప్రత్యేకముగా వచ్చిన భగవంతుడు. భగవంతుని శరీరములో మూడు ఆత్మలు యున్నా, ఆత్మ తన పని తాను చేసినా, జీవాత్మ అయినవాడు కర్మ లేనివాడు, ప్రత్యేకమైనవాడు. అతనికి అందరివలె మరణముండదు. 'జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల' యన్నట్లు ఆయనకు మరణములు వర్తించవు. అట్లే అందరివలె పుట్టుక కూడా వర్తించదు. తండ్రి వీర్యకణముతో సంబంధము లేకుండా పుట్టిన ఆయనకు అందరివలె పుట్టుక ఎట్లు లేదో అట్లే ఆయనకు అందరివలె జీవుడు శరీరమును వదలి చనిపోవడము లేదు. ఆయన కర్మతో సంబంధము లేనివాడు. ఒకచోట చనిపోయి మరొకచోటికి పోవుటకు అతనికి కర్మలేదు. స్వయం నిర్ణయము ప్రకారము ఆయన పుట్టుక యుండును మరియు చావు వుండును. ఆయన ప్రస్తుతము భగవంతుడయినా ఆయనే మూడవ శక్తి అయిన పరమాత్మ (దేవుడు). అందువలన ఆయనను శాసించు శక్తి ఏదీ లేదు. ఆయన ధర్మసంస్థాపన కొరకు స్వయం నిర్ణయమును తీసుకొనును. భవిష్యత్తు ప్రణాళికను అనుసరించి ఆయన చేయు పనులుండును. తన రెండవ రాకను గురించి బోయవానికి కొంత సమాచారమును తెల్పిన కృష్ణుడు, అదే సమాచార నిమిత్తము ఇజ్రయేల్ దేశ సమీపములోనున్న ఒక ప్రవక్త శరీరములోనికి ప్రవేశించాడు. అప్పటి కాలములో జ్ఞాన సమాచారమును అందించు వ్యక్తిని ప్రవక్త అనడము సహజము. అది కొంత జ్ఞానమయినా కావచ్చును లేక ఎక్కువ జ్ఞానమయినా కావచ్చును. మొత్తము మీద జ్ఞాన సమాచారమును అందించు ప్రవక్తగా యున్న వ్యక్తికి కృష్ణుని మరణ సమయమునకు అతని మరణము కూడా నిర్ణయింపబడియుండెను. అతని పేరు ''మోషే'' అని చెప్పబడుచుండెను. మోషే ప్రవక్త ఆ సమయమునకు చనిపోవునను విషయము కృష్ణునికి తప్ప ఎవరికీ తెలియదు. మోషేకు కూడా తెలియదు. మోషే సాధారణ మనిషే అయినందున తన మరణమును గురించి మోషేకు తెలియదు.


సర్వ సృష్ఠికర్తయిన అల్లాయే (దేవుడే) మోషేను ఆ ప్రాంతములో పేరుపొందిన ప్రవక్తగా చేసియుంచాడు. మోషే 54 సంవత్సరములు బ్రతికాడు. మోషే 54 సంవత్సరములు బ్రతుకునట్లు, మోషే చనిపోవు సమయమునకు కృష్ణుడు చనిపోవునట్లు ముందే నిర్ణయము జరిగినట్లు ఎవరికీ తెలియదు. కృష్ణునికి మాత్రము అన్నీ తెలిసే జరిగినవి. ఆయన స్వయముగా దేవుడే అయివున్నందున ఆయనకు అన్నీ తెలుసు. మోషే చనిపోయిన క్షణములోనే కృష్ణుడు చనిపోయి మోషే శరీరములో ప్రవేశించు నట్లు నిర్ణయించుకున్నాడు. మోషే ప్రవక్త చనిపోవడము, కృష్ణ భగవాన్ చనిపోవడము ఒకేమారు జరిగినది. కృష్ణుడు తన శరీరములో లేకుండా పోయి మోషే శరీరములో ప్రత్యక్షమయినాడు. అలా మోషే శరీరములో చనిపోయినట్లు ఎవరూ గుర్తించలేదు. మోషే చనిపోయినా అందులో కృష్ణుడు యుండుట వలన మోషే సాధారణముగా బ్రతికేయున్నాడని అందరూ అనుకొన్నారు. కృష్ణుడు మోషేవలెనే వుండి జ్ఞానమును చెప్పుచుండుట వలన కృష్ణున్ని ఎవరూ గుర్తించలేదు, అందరూ మోషేనే మాట్లాడుచున్నాడని అనుకోవడము జరిగినది. కృష్ణుడు చనిపోయినట్లు భారతదేశములోనున్న వారికి తెలిసినా, అతను మోషేగా ఇతర దేశములో యున్నాడని మాత్రము తెలియదు.


ప్రశ్న :- ప్రపంచములో ఎందరో ప్రవక్తలుండగా మోషే ప్రవక్త శరీరమునే కృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడు?


జవాబు :- ఇది మంచి ప్రశ్నే! సమయానుకూలముగా అడుగవలసిన ప్రశ్నే. దీనికి నా జవాబు ఏమంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత వ్యాసమహర్షి కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపము చేయుటకు దాదాపు రెండు సంవత్సరములు పట్టినది. స్వచ్ఛమయిన కల్తీ లేని భగవద్గీత అప్పుడుండేది. వ్యాసుడు చనిపోయిన తర్వాత కొందరు స్వార్థవరులు వారి స్వార్థముతో కొన్ని శ్లోకములను కలుపడము జరిగినది. మొదట తయారయినది కలుషిత శ్లోకములు లేని భగవద్గీతగా యుండెడిది. కృష్ణుడు 90 సంవత్సరముల వయస్సులో అర్జునునకు సృష్ఠ్యాదిలోని జ్ఞానమును చెప్పగా, తర్వాత రెండు సంవత్సరముల కాలములో అది గ్రంథరూపముగా మారగా దాని పేరు 'భగవద్గీత' యని చెప్పుకొన్నాము. మోషే 54 సంవత్సరములు బ్రతుకగా, కృష్ణునికి 92 సంవత్సరముల వయస్సులో భగవద్గీత తయారయినది. భగవద్గీత తయారయిన సమయానికి మోషే వయస్సు సరిగా 20 సంవత్సరములుండును. 20 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములు మోషే బ్రతికాడు. అలాగే కృష్ణుడు కూడా 92 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములే బ్రతికాడు.


మోషేకు ఇరువది (20) సంవత్సరముల వయస్సులో ఒక శుభ దినము ఏర్పడినది. అప్పటినుండి మోషే అప్పుడప్పుడు కొంత జ్ఞానమును చెప్పుచూ మంచి వక్తగా మారిపోయాడు. తర్వాత ఆయనను ప్రవక్త అని అందరూ అన్నారు. 20 సంవత్సరములనుండి ఆయన జీవితములో ఒక క్రొత్త వెలుగు వచ్చినది. 92వ సంవత్సరములో కృష్ణునిలో కూడా ఒక తృప్తి ఏర్పడినది. అప్పుడు జరిగిన విశేషము ఏమి అనగా! మోషేకు 20 సంవత్సరములు గడచు కాలమున ఒక దినము ఆదివారము రాత్రి నడిరేయి గడచిన సమయములో స్వప్నము రావడము జరిగినది. ఆ స్వప్నములో కృష్ణుడు కనిపించి గ్రంథమైన తన భగవద్గీతను మోషేకు ఇవ్వడము జరిగినది. మోషే తన స్వప్నములో కృష్ణున్ని చూచినా కృష్ణుడు ఎవరో తనకు తెలియదు. అయితే స్వప్నములో కనపడిన కృష్ణుడు ఎంతో తేజస్సు కల్గియుండడమును చూచిన మోషే అతను నిజముగా దేవుడని నమ్మాడు. తేజస్సుతో కనిపించిన కృష్ణుడు మోషేకు భగవద్గీతా గ్రంథమును ఇచ్చి ఇది తౌరాత్ గ్రంథమని చెప్పడమైనది. మోషే స్వప్నములో గ్రంథమును తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. అంతే! అతని మెదడులో మెరుపు మెరిసినట్లయినది. మోషేకు ఒక్కమారుగా మెలుకువ వచ్చినది. మెలుకువ వచ్చిన తర్వాత కూడా గుండె వేగముగా కొట్టుకొనుచుండగా, తలలో ఏదో క్రొత్త అనుభూతిని పొందిన సంతోషము కల్గినది. జరిగినది ఏమిటి? అని కళ్ళు తెరచి చూడగా తన చేతులలో గ్రంథము కనిపించినది. అదియే తౌరాత్ గ్రంథము. దానిమీద అప్పటి భాషలో 'తౌరాత్' యని ఉండడమును మోషే చూచాడు. ఆ విధముగా మోషేకు తౌరాత్ గ్రంథము లభించినది. అక్కడి తౌరాత్ గ్రంథమే ఇక్కడి భగవద్గీత.


''తౌరాత్'' యనగా మూడు చీకటి రాత్రులని అర్థము. మూడు కనిపించని ఆత్మల యొక్క జ్ఞానముండుట వలన, మూడు ఆత్మల జ్ఞానము రహస్యమైనదయినందున, మూడు ఆత్మలనుద్దేశించి తౌరాత్యని భగవద్గీతకు కృష్ణుడే పేరు పెట్టాడని తెలియుచున్నది. ఇదంతా చదివే వారికి ఒక కథలాగ యున్నా, నమ్మశక్యముగానిదైయున్నా ఇది నూటికి నూరు పాళ్ళు జరిగిన సత్యము. నమ్మమని ఎవరినీ బలవంతము చేయడము లేదు. సత్యమును చెప్పక తప్పదు, కావున ఇప్పుడు సమయము ఆసన్నమైనప్పుడు చెప్పక తప్పలేదు. అట్లని పైకి కనిపించు నన్ను ఈ విషయమునకు బాధ్యున్ని చేయవద్దండి. నిజముగా మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇప్పుడిది మీకే కాదు నాకు కూడా క్రొత్త విషయమే. ఇలా మనకు తెలియని ఎన్నో క్రొత్త విషయములు ఆత్మకు తెలుసు. ఆత్మ అందించితేనే ఇప్పుడు మనకు తెలియుచున్నది.


తౌరాత్ గ్రంథము మోషేకు లభించినదని తెలిసినది కదా! ఇక్కడే ఇంకొక క్రొత్త రహస్యము కలదు. అదేమనగా! తౌరాత్ గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు. తౌరాత్ గ్రంథము మోషేకు మాత్రమే కనిపించేది, ఇతరులకు కనిపించేది కాదు. ఆ విధముగా తౌరాత్ (భగవద్గీత) గ్రంథము అక్కడి మనుషులకు రహస్య గ్రంథమయినది. ఆ విషయము మోషేకు కూడా అర్థమయినది. గ్రంథములోని జ్ఞానమును రాత్రిపూట చదువుకొని పగలు ఇతరులకు చెప్పెడివాడు. చెప్పేది భగవద్గీతలోని జ్ఞానమయినందున అది శాస్త్రబద్దముగా యుండెను. జ్ఞానమునకు గీటురాయిగా (సానరాయిగా) ఉండెను. తౌరాత్ జ్ఞానము వలన ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తేల్చిచెప్పుటకు వీలయ్యేది. అందువలన తౌరాత్ గ్రంథమునకు గీటురాయి అను పేరు సార్థకమయినది. అదే గీటురాయియే మన వద్ద గల భగవద్గీత. ఆ దినములలో మోషేకు మాత్రము కనిపించి ఇతరులకు కనిపించని భగవద్గీత నేడు మనముందు జ్ఞానులకు, అజ్ఞానులకు కనిపించుచున్నది. నేడు గ్రంథము కనిపించినా అందులోని జ్ఞానము చాలా మందికి కనిపించడము లేదు. అనగా అర్థము కావడము లేదు.


మోషే చెప్పు జ్ఞానమునకు చాలా మంది ఆకర్షితులై ఆయన చెప్పు జ్ఞానమును తెలియుచుండిరి. మోషే తనకు తౌరాత్ గ్రంథము లభించినప్పటి నుండి 34 సంవత్సరములు గ్రంథములోని జ్ఞానమునే చెప్పాడు. మోషే చెప్పు జ్ఞానము తౌరాత్ గ్రంథములోనిదని ప్రజలకు తెలియదు. మోషేకు 54 సంవత్సరములు గడచిన తర్వాత మోషే శరీరములో లేకుండా పోవడమూ, అందులో స్వయముగా కృష్ణుడే ఉండడము ఇతరులెవరికీ తెలియదు. కృష్ణుడు తొమ్మిది సంవత్సరములు మోషే శరీరములో వుండి, మోషే చెప్పునట్లే నటించుచూ రాబోయే ఏసును గురించి అతని జీవితములో జరుగు కొన్ని సంఘటనలను గురించి చెప్పడము జరిగినది. మోషే (కృష్ణుడు) చెప్పిన సంఘటనలు ఏసు జీవితములో నెరవేరినట్లు నాలుగు సువార్తలలో తెలియుచున్నది. మోషే ఏసును గురించి చెప్పిన కొన్ని సంఘటనలను తెలుసుకొన్న యెషయా అవే సంఘటనలనే తన లేఖనములలో వ్రాశారు. మోషే తౌరాత్ గ్రంథ జ్ఞానమును చెప్పుటవలన అతను ధర్మ శాస్త్రమును చెప్పాడని అందరూ అనుకోవడము జరిగినది. మోషే స్వయముగా ధర్మ శాస్త్రమును చెప్పాడని అనుకున్నారు. మోషేకు ఒక్కనికే తెలిసిన తౌరాత్‍ను మోషే తర్వాత ఎవరూ చూడలేదు. మోషే తప్ప తౌరాత్ గ్రంథమును చూచిన రెండవ వ్యక్తి లేడనియే చెప్పవచ్చును. కృష్ణుడు మోషే శరీరములో తొమ్మిది సంవత్సరములుండి ఏసును గురించి ముందే చెప్పడము, ఆ విషయములను తర్వాత తెలిసిన ప్రవక్తలు లేఖనములుగా వ్రాయడము జరిగినది.


ఇంతవరకు చూచిన విషయమునుబట్టి శ్రీకృష్ణుడు భారతదేశములో చనిపోయి మోషే శరీరములో చేరి, మోషేగా తొమ్మిది సంవత్సరములు జీవించడము జరిగినదని తెలిసినది కదా! కృష్ణుడు భారతదేశములో జీవించి ఉన్నప్పుడు చిన్నతనములో గోవులను కాచాడని చెప్పారు. అందువలన చిన్నప్పటినుండి ఆయనకు గోవులు అలవాటైపోయాయి. ఆయన ఎక్కడ వుంటే అక్కడ గోవులు కనీసము ఒక్కటిగానీ ఉండడము అలవాటై పోయాయి. కృష్ణుని జన్మలో 'ఆవుదూడ' అనుబంధము ఎక్కువగా ఉన్నది. అందువలన ఆయన చిత్రపటములలో ఆవుదూడ కనిపించుచుండును. కృష్ణుడు భారతదేశములో చనిపోయి మోషే శరీరములోనికి వచ్చిన తర్వాత ఆయన శరీరము మారినా, ఆయన చూపుకు ఆవుదూడలు ఆకర్షణగా వచ్చి ఆయన తాకేవరకు చేతి స్పర్శ కొరకు కాచుకొని వుండేవి. ఈ విధముగా శరీరము వేరయినా లోపలయున్న కృష్ణుని ప్రభావము వలన ఆవుదూడలు మోషే వద్ద ఆకర్షణగా యుండేవి. అది చూచినవారందరూ మోషే తర్వాత ఆవు దూడను గౌరవముగా చూచెడివారు. అందువలన మోషే కొద్ది రోజులు ఎవరికీ కనిపించకుండా పోవుటవలన మోషే తర్వాత ఆవుదూడను ఆరాధించను మొదలుపెట్టారు. మోషే కనిపించకుండా పోయిన 40 రోజులలోనే ఇంత పని జరిగినది. మోషే వచ్చిన తర్వాత ఆవుదూడను ఆరాధించు వారిని చూచి మోషే వారిని దండించడము జరిగినది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖురాన్‍లో సూరా 2, ఆయత్ 51, 54లలో ఇలా చెప్పారు చూడండి.


(2-51) ''ఇంకా జ్ఞాపకము చేసుకోండి, మేము మూసాకు నలభై రాత్రుల వాగ్దానం చేసి పిలిచినప్పుడు, మీరు అతను లేకపోవడము చూచి ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొన్నారు మరియు మీరు దుర్మార్గులయ్యారు.''


(ఇది ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథములోని తెలుగు అనువాద వాక్యము. ఇదే ఆయత్‍ను ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథములో వ్రాసిన వాక్యమును కూడా ఇక్కడ చెప్పుకొందాము. కొన్ని భాషా పదములు వేరయినా వాక్యములోని భావము మాత్రము ఒక్కటేయని గ్రహించవచ్చును. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' గ్రంథములోని వాక్యమును క్రింద చూడండి.)


(2-51) ''జ్ఞాపకము చేసుకోండి, మేము మూసాకు నలభై రాత్రుల వాగ్దానం చేసి అతనిని పిలిచినప్పుడు, అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవుదూడను పూజించను మొదలుపెట్టారు. ఆ విధముగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.''


(2-54) (దివ్య ఖుర్ఆన్ సందేశము) ''మరియు జ్ఞాపకము చేసుకోండి. మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయముగా ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొని మీకు మీరే అన్యాయము చేసుకొన్నారు. కనుక పాశ్చాత్తాపముతో క్షమాబిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్ఠికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోర పాతకులను) లేకుండా చేయండి. ఇదే మీ కొరకు మీ సృష్ఠికర్త దృష్ఠిలో శ్రేష్ఠమైనది. ఆ తరువాత అల్లాహ్ మీ పాశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పాశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత''


(2-54) (అంతిమ దైవగ్రంథము ఖురాన్) ''మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొని మీరు మీ స్వయానికి అన్యాయము చేసుకొన్నారు. కనుక ఇప్పుడు మీరు పాశ్చాత్తాప భావముతో మీ సృష్ఠికర్తవైపుకు మరలండి. ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్ఠికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పాశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహముగా ఆయన పాశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.''


(ఈ విధముగా రెండు గ్రంథములలోనూ ఒకే భావమును వ్రాసి యుంచారు.) మూసా (మోషే) తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ, మీరు మిమ్ములను సృష్ఠించిన దైవమును కాకుండా దేవుని చేత సృష్ఠింపబడిన ఆవుదూడను ఆరాధించి మీకు మీరు అన్యాయము చేసుకున్నారు. దానివలన పాపము వచ్చింది. అలా చేసిన వారు ఘోర పాపాత్ములు. అటువంటి వారిని జ్ఞానముతో మార్చి (వారిని చెడు నుండి మంచికి మార్చి) లేకుండా చేయండి. అన్నిటికంటే మంచి పని అదేయగును. దేవుడు పాశ్చాత్తాపాన్ని స్వీకరించి పాపమును లేకుండా క్షమించగలడనీ, దేవుడు క్షమాశీలుడనీ జిబ్రయేల్ చెప్పాడు.


మూసా (మోషే) తర్వాత ప్రజలు కొన్ని రోజులు మోషే కనిపించక పోతే ఇక మోషే లేడని తలచినవారై, మోషే బదులు మోషేకు దగ్గరగా యున్న ఆవుదూడను గౌరవించను మొదలుపెట్టారు. అదే ఆరాధన అయినది. తర్వాత మోషే వచ్చి ఎప్పటికయినా అందరినీ సృష్ఠించిన సృష్ఠికర్తకు విధేయులుగా ఉండాలిగానీ, సృష్ఠింపబడిన జంతువులను ఆరాధించకూడదని చెప్పి అది పాపపు పనియని, ఆ పాపమును క్షమించమని దేవున్ని వేడుకొంటే, దేవుడు క్షమించగలడని చెప్పాడు. అంతేకాక దేవుడు క్షమాశీలుడు, కరుణామయుడు అని కూడా చెప్పాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

6. మీరు మూసాతో అన్న మాటను గుర్తుంచుకోండి. మీపై పిడుగుపడింది. (2-55), (2-60, 61), (4-153)

మోషే (మూసా) తన అజ్ఞాతము తర్వాత తన ప్రజలవద్దకు వచ్చి చూడగా, మూసా ప్రవక్త అన్ని రోజులుగా చెప్పిన ధర్మశాస్త్రమును (తౌరాతును) లెక్కించక తమ మనో భావము ప్రకారము సృష్ఠికర్తకు (దేవునికి) బదులు ఆవుదూడను ఆరాధించడము పాపకార్యముగా చెప్పి, చేసిన తప్పిదమునకు వచ్చిన పాపము పోవునట్లు దేవున్ని క్షమించమని వేడుకోవలసినదిగా మూసా చెప్పగా! అప్పుడు పాప కార్యములను చేసిన ప్రజలు, దేవున్ని ఆరాధించక ఆవు దూడను ఆరాధించిన ప్రజలు మూసాకు ఎదురు మాట్లాడారు. ''నీవు మాకు దేవున్ని చూపిస్తే దేవున్ని విశ్వసిస్తాము'' అని దైవజ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడారు. అప్పుడు వారు చేసిన తప్పుకు గుర్తుగా వారిమీద పిడుగు పడి చనిపోయారు. చనిపోయిన వారు తిరిగి పుట్టవలసిందే. అదే విధముగా దేవుడు చనిపోయిన వారిని తిరిగి బ్రతుకునట్లు చేశాడు. చనిపోయి తిరిగి పుట్టిన వారు దైవత్వమునకు దాసులుగా ఉంటారేమోనని అనుకున్నాము.


అయితే ప్రజలు నీటి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు బండను కర్రతో కొట్టమని చెప్పాడు. అలా కొట్టగా రాతినుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. మనుషులలో ప్రతి తెగవారు నీటిని త్రాగే విధానాన్ని కనుగొన్నారు. అప్పుడు నీటిని త్రాగినట్లే దేవుడు మీకు ప్రసాదించిన ఆహారమును తినమని దేవుడు ఆదేశించగా అప్పుడు మనుషులు మేము ఒకే రకమైన ఆహారము తిని ఉండలేము. భూమిలో పండే ఆకుకూరలు, కాయకూరలు, గోధుమలు, ఉల్లిగడ్డలు, పప్పుదినుసులు మొదలగునవి పండించబడినవన్నీ తింటామన్నారు. అప్పుడు శ్రేష్ఠమైన ఆహారమును వదలి దానికి బదులుగా స్వల్పమైన ఆహారమును కోరుకొన్నారు. దీనినంతటినీ గమనిస్తే ప్రజలు దేవుడు చెప్పిన మాటను అతిక్రమించుచూ మాయ చెప్పిన మాటను ఆచరించుచున్నారని తెలిసినది. దేవుని మాటను వినకుండా దేవుని జ్ఞానమును వినినా దాని మీద ధ్యాసను పెట్టకుండా తన ఇష్టానికి తగినట్లు నడుచుకొనుచూ దేవున్ని వదలి జీవరాసులను, దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించుచున్నారు. అది తప్పని చెప్పినా అర్థము చేసుకోలేని స్థితిలో దేవున్ని, దేవుని ఉనికిని ప్రశ్నించుచూ, దేవుడుంటే చూపండని అడుగుట వలన ఆకాశములోని గ్రహములకు కోపము వచ్చి వారి మీద పిడుగును వేశారు.


నేడు కూడా దేవుని అస్తిత్వమును ప్రశ్నించిన వారిని చూచి దేవుని పాలకులయిన ఆకాశములోని భూతములు, గ్రహములు కోపగించుకొనునవై మనుషుల మీద అనేక రకముల హింసలను కల్గించుచున్నవి. అయినా మనుషులకు ఆ విషయము అర్థము కావడము లేదు. ఎన్నో రోగములు, ఎన్నో ప్రమాదములలో చిక్కుకొని చనిపోయి తిరిగి పుట్టుచున్నారు. తర్వాత జన్మలో అయినా సక్రమముగా జ్ఞానరీత్యా నడుచుకొంటారు యని అనుకొన్న దేవుడు మనుషుల కొరకు భూమిమీద పన్నెండు మతములను పుట్టించి వారికిష్టమైన మనుషులుండునట్లు స్వతంత్రమును కల్గించాడు. అయితే దేవుడిచ్చిన ఆహారమనబడు జ్ఞానమును జీవనాధార ఆహారముగా స్వీకరించమని చెప్పితే జ్ఞాన ఆహారము మాకు అవసరము లేదని భూమిలో పండు ధాన్యములను, కాయకూరలను ఆహారముగా తీసుకొంటామని అంటున్నారు. అలా వారికిష్టమైన ఆహారమును తీసుకొంటూ దేవుడిచ్చిన జ్ఞాన ఆహారమును వదలుకోవడము వలన కర్మలలో చిక్కి నలిగి పోవుచున్నారు. ఎంత ఉన్నా లేని బీదవారివలె కర్మలను అనుభవించు చున్నారు. దేవుని జ్ఞానము ప్రకారము నడువకపోయిన దానివలన కర్మలు ఏమాత్రము నశించక అన్నీ అనుభవించవలసి వచ్చినది. దేవునికి దూరముగా ఉండవలసి వచ్చినది. ఆకాశ శక్తులయిన గ్రహముల వలన పిడుగుల బాధలు, వర్షము వరదల బాధలు, రోగముల బాధలు అనేకము అనుభవించవలసి వచ్చినది.


పన్నెండు చీలికలు ఊటలుగా పుట్టిన నీటిని త్రాగుటయని వాక్యములో చెప్పారు. పన్నెండు నీటి ఊటలను పన్నెండు మతములుగా అర్థము చేసుకోవాలి. పన్నెండు ఊటల నీళ్ళు త్రాగుచూ పన్నెండు మతములుగా యున్న మనుషులు దేవుని జ్ఞానమును తెలియకుండా దానిని స్వీకరించక యున్నారు. ఇక్కడ దేవుడిచ్చిన ఆహారము అనగా దేవుని జ్ఞానము అని తెలియవలెను. ఎప్పుడయితే దేవుని జ్ఞానమును వదలి ప్రపంచ జ్ఞానము వెంట మనిషి పడుచున్నాడో, అప్పుడే దేవుని పాలకుల వలన బాధలు తప్పవని చెప్పుటకే వారి మీద పిడుగు పడింది యని చెప్పారు. మనిషికి కనిపించకుండా ఎన్నో అనర్థములు, బాధలు వచ్చు చుండును. వాటి వలన మనిషి చాలా ఇబ్బంది పడుచుండును. అయినా ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానమును తెలియని దానివలన జరుగుచున్నదని అనుకోవడము లేదు. దేవుడు మన వెంటపడి జ్ఞానమును అందించినా ఇది మాకు రుచిగా లేదు, ప్రపంచ విషయములే రుచిగా యున్నవని అనుకొంటున్నారు. అటువంటి వారికి పాపక్షమాపణ ఉండదు. దేవున్ని, దేవుని జ్ఞానమును విశ్వసించిన వానికి మాత్రమే పాపక్షమాపణ జరుగును. దేవుని క్షమాశీలత్వమునకు దారి ఏర్పడును. అందువలన దైవజ్ఞాన ఆహారమును స్వీకరించుచూ కర్మలను ఆకలిని లేకుండా చేసుకొమ్మని కోరుచున్నాము.


ఇంతవరకు చెప్పిన విషయమును గురించి స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍ల (వాక్యముల) రూపములో చెప్పిన సమాచారమును ఇప్పుడు వ్రాయుచున్నాము చూడండి.


(2-55) ''అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. ''ఓ మూసా! మేము అల్లాహ్‍ను ప్రత్యక్షముగా చూడనంతవరకు నిన్ను ఏమాత్రము విశ్వసించము'' అన్నారు. అదే సమయములోనే మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకర మైన పిడుగు మీపై విరుచుకపడింది. అప్పుడు మీరు చనిపోయారు.''


(2-56) ''ఆ పిమ్మట మీరు విధేయతకల్గి ఉంటారేమోయని మీరు చనిపోయిన తర్వాత మిమ్ములను బ్రతికించడము జరిగినది.''


(2-60) ''మరియు జ్ఞాపకము చేసుకోండి. మూసా తన ప్రజలకు నీటి కొరకై ప్రార్థించినప్పుడు మేము ''నీవు ఆ బండను కర్రతో కొట్టుము'' అని ఆదేశించాము. అప్పుడు అలాగే కొట్టగా దానినుండి పన్నెండు నీటి ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగ వారు తమ నీరు త్రాగే స్థలమును కనుగొన్నారు. అప్పుడు వారితో అన్నాము. ''అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారమును తినండి, త్రాగండి కానీ, భూమిలో కల్లోలము రేపుతూ, దౌర్జన్య పరులుగా తిరగకండి.''


(2-61) ''మరియు అప్పుడు మీరు ''ఓ మూసా! మేము ఒకే రకమైన ఆహారము తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకు కూరలు, దోసకాయలు, కాయకూరలు, గోధుమలు, ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలయినవి మా కొరకు పండించమని నీవు నీ ప్రభువును ప్రార్థించు'' అని అన్నారు. దానికతను ''ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకొంటున్నారా, అలాగయితే మీరు ఏదయినా నగరానికి తిరిగిపోండి. నిశ్చయముగా అక్కడ మీకు మీరు కోరినంత దొరుకుతుంది అని అన్నాడు. తర్వాత వారు తీవ్ర అవమానానికి మరియు దారిద్య్రానికి గురి అయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు. ఇదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన (ఆయత్)లను తిరస్కరించిన ఫలితము మరియు ప్రవక్తలను అన్యాయముగా చంపిన దాని ఫలితము. ఇదంతా వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఫలితము మరియు హద్దులు మీరి ప్రవర్తించిన పర్యవసానము.''


(4-153) ''ఓ ప్రవక్తా! గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశమునుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని అడుగుతున్నారని ఆశ్చర్యపడకు. వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ ''అల్లాహ్‍ను మాకు ప్రత్యక్షముగా చూపించు'' అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితముగా వారిపై పిడుగు విరుచుకుపడింది. స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొన్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము మరియు మూసాకు స్పష్టమైన అధికారము ఇచ్చాము.''


ఈ వాక్యములన్నియూ చూచిన తర్వాత దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని జ్ఞానమును ప్రశ్నిస్తే కలుగు పర్యవసానము అర్థమయివుంటుంది. ఇది ఆ కాలములోనే కాదు, ఏ కాలములో అయినా దేవుని మాటను లెక్కించని వారికి తప్పక జరుగును. ఈ వాక్యములలో మాటిమాటికి మూసాను ప్రజలు అడిగినట్లు గలదు. పిడుగు పడి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టి ఆ తర్వాత కూడా చాలామార్లు మూసాను ప్రశ్నించి అడిగినట్లు గలదు. దీనిని చూచిన తర్వాత మూసా ఎంతకాలము బ్రతికాడను ప్రశ్న రాగలదు. మనకు తెలిసినంత వరకు మూసా 54 సంవత్సరములు బ్రతకగా కృష్ణ మూసా తిరిగి తొమ్మిది సంవత్సరములు బ్రతికాడు. అంతయు కలిసినా 63 సంవత్సరములే యగును. కృష్ణమూస కాలములో ఆవుదూడను ఆరాధించిన వారు దేవున్ని ప్రత్యక్షముగా చూపనంత వరకు నమ్మము అని దేవుని అస్తిత్వమును ప్రశ్నించినందుకు పిడుగుపడి చనిపోయారు. వారు పుట్టిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞాన ఆహారమును తినమని చెప్పితే మాకు అవసరము లేదు అన్నారు. దేవుని జ్ఞానమునకు తలకు ఎక్కించుకోమని చెప్పితే, అది వద్దు అని చెప్పి కడుపు నింపుకొను ఆహారమును అడిగారు. వారు చేసిన తప్పులకు వారికి శిక్షలు పడుచున్నా తాము అజ్ఞానముగా ఉన్నందుకే ఇదంతా జరుగుచున్నదని తెలియక గ్రుడ్డిగా అట్లే ప్రవర్తించుచున్నారు.


మూసా విషయమును చూస్తే మూసా 63 సంవత్సరములకు చనిపోతే ఎంతో కాలముగా మూసాను వారు అడిగినట్లు కలదు కదా!యని ప్రశ్న రాకతప్పదు. అయితే ఆ ప్రశ్నకు జవాబు ఇలా కలదు చూడండి. మూసా 63 సంవత్సరములకు చనిపోయినది వాస్తవమే అయినా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 63 సంవత్సరముల వరకు తన ప్రజలకు అప్పుడప్పుడు కనిపించి మాట్లాడేవాడు. చివరిలో 63 సంవత్సరములకు చనిపోయినది కృష్ణమూస అయినందున, ఆయన సాధారణ వ్యక్తి కానందున సాక్ష్యాత్తూ భగవంతుడే అయినందున, దేవుని ప్రతినిధి అయినందున, దేవుని ఆత్మే అయినందున తిరిగి కనిపించు శక్తి ఆయనకు ఉండేది. కృష్ణుని శరీరములో 126 సంవత్సరములు ద్వాపరయుగమున బ్రతికిన కృష్ణుడు, మోషే (మూసా) శరీరములో ఆ శరీరమునకు 126 సంవత్సరములు అగునట్లు ఆ శరీరముతోనే కనిపించాడు. అందువలన అనేకమార్లు తన ప్రజలకు జవాబు చెప్పుతూ వచ్చాడు. ప్రజలు ఆయనను అప్పుడప్పుడు అడుగుచూ వచ్చారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

7. మనుషులు వ్రాసిన గ్రంథము దైవగ్రంథము కాదు. (2-79)

ఈ కాలములో ప్రతి మత గ్రంథము ప్రక్కన, మనుషులు వ్రాసిన గ్రంథము ఉన్నది. దేవుడు మూడు దైవగ్రంథములు ఇవ్వగా, అవి మూడు, మూడు మతములలో మత గ్రంథములుగా చెప్పబడుచున్నవి. క్రైస్థవములో నాలుగు సువార్తలకు ముందు వెనుక పాత క్రొత్త నిబంధనలను గ్రంథములు గలవు. ఇస్లామ్‍లో దైవగ్రంథమయిన ఖుర్ఆన్ ప్రక్కనే హదీసు గ్రంథములున్నవి. హిందుత్వములో భగవద్గీత ప్రక్కనే వేదములున్నవి. మూడు గ్రంథములకు మూడు గ్రంథములు పోటీగా తయారయినవి. ప్రక్కన గల మూడు గ్రంథములను దైవగ్రంథములతో సమానముగా చూడవలెనని కొందరు చెప్పుచున్నారు. అయితే మనుషులు వ్రాసినవి దైవగ్రంథములు కావని మేము ముందునుండి చెప్పుచున్నాము. మనుషులు ఎంత ప్రయత్నించి వ్రాసినా దేవుని ఆత్మ చెప్పిన దానితో సమానము కావు. మనుషులలో జీవాత్మ ఎంత వ్రాసినా వాని విషయము వానికే తెలియదు. ఆత్మ పరమాత్మ విషయములను ఎలా వ్రాయగలదు? ఆత్మచేత చెప్పబడినదే దైవజ్ఞానము. మొదట ఆత్మ చెప్పగా, ఆత్మ చెప్పిన దానిని తర్వాత ఏ మనిషి వ్రాసినా అది దైవగ్రంథముగా ఉండును. ఆత్మ ప్రమేయము లేకుండా జీవాత్మలు వ్రాయునది ఏదికానీ దైవగ్రంథము కాదు. అటువంటి అర్హత దానికి ఉండదు.


దైవగ్రంథమునకు మనుషుల గ్రంథమునకు ఏమి తేడా?యని కొందరు అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! దైవ గ్రంథములలో దైవశక్తి యుండును, మనుషుల గ్రంథములలో దైవశక్తి యుండదు. దైవము మీద శ్రద్ధయున్న వారికి దైవగ్రంథములు గొప్పగా కనిపించును. మిగతా వారు వ్రాసినవి ఆసక్తి రహితముగా కనిపించును. అయితే దైవగ్రంథము లను కూడా మనుషులే వ్రాసియున్నారు. మనుషులు స్వయముగా వ్రాయక ముందు ఆత్మనుండి చెప్పబడిన విషయములను గ్రంథరూపముగా ఇతర మనుషులు వ్రాయడము జరిగినది. అట్లు మనుషులు వ్రాసినా వ్రాయక ముందు ఆత్మ చెప్పియుండుట వలన వాటిని దైవగ్రంథములు అన్నాము. అట్లుకాక స్వయముగా మనుషులు వ్రాసిన వాటిని 'మనుషుల గ్రంథములు' అని అన్నాము. అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ విషయమును చూస్తే అల్లాహ్ నుండి సంకల్పింపబడిన జ్ఞానము మొదట ఆకాశ ఆత్మనుండి శబ్దరూపముగా వినపడగా, ఆకాశవాణిగా వచ్చిన శబ్దమును ఆ రోజు ఒకే ఒక సూర్యుడు గ్రహించాడు. సూర్యుడు అన్నిటికంటే పెద్ద గ్రహము అయినందున వాణిని గ్రహించు స్థోమత ఒక్క సూర్యునికే ఉండేది. అందువలన మిగతా గ్రహములు ఆకాశములో ఎన్నియున్నా అవి ఏవీ గ్రహించుకోలేక పోయాయి. ఉరుముల రూపములో వినపడిన వాణి ఆదిలోని మొట్టమొదటి జ్ఞానము. వహీ అని ఖుర్ఆన్ గ్రంథములో అరబ్బీ భాషలో చెప్పినా, వాణి అని తెలుగు భాషలో చెప్పినా రెండూ ఒక్కటే. వహీ అంటే శబ్దము. శబ్దము మాటల రూపములో రాలేదు. మేఘముల ఉరుముల శబ్దరూపములో వచ్చిన వాణి లేక వహీ మనుషులు వినుటకు అర్థము కానటువంటి భయంకర శబ్దముగా ఉండేది. అటువంటి శబ్దమును సూర్యుడు వినగలిగి సూర్యుడు మనువుకు కృతయుగములో చెప్పాడు. కలియుగములో సూర్యుడే జిబ్రయేల్ అను పేరుతో ముహమ్మద్ ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ ప్రాంత భాషలోనే అనగా అరబ్బీ భాషలోనే చెప్పాడు. దేవుని పాలనలోయున్న వారు అన్ని భాషలు వినగలరు, అన్ని భాషలు మాట్లాడగలరు. అందువలన ఆకాశ భాషను సూర్యుడు గ్రహించగలిగాడు. తర్వాత కలియుగములో సూర్యుడు ప్రవక్తగారికి చెప్పినప్పుడు అయితే మాట శబ్దము ఒక్కటి వినిపించి చెప్పిన వ్యక్తి కనిపించక పోవడము వలన వినిపించిన మాటను వహీ అన్నారు. శబ్దము ఒక్కటే వినిపించినది కావున దానిని వహీ అన్నా తప్పు లేదుగానీ వాస్తవానికి అది వహీ కాదు. వహీ సృష్ఠి ఆదిలోనే వచ్చినది. కలియుగములో ప్రవక్త గారు విన్నది తెరచాటున కనిపించని జిబ్రయేల్ చెప్పినది. అందువలన ఇవి మాటలేగానీ వహీ కాదు. చెప్పినవారు కనిపించక వారి శబ్దము వినిపించడము వలన దానిని వహీ అనడములో న్యాయముందిగానీ వాస్తవానికి దానిని 'వహీ' అనకూడదు. ''తెరచాటునుండి చెప్పబడిన జ్ఞానము'' అని చెప్పవచ్చును. వాణి శబ్దము కాకుండా, దేవుని ప్రతినిధి చెప్పినది కాకుండా, తెరచాటునుండి చెప్పినది కాకుండా ఏది అయినా అది మనుషులదే దేవునిది కాదని చెప్పవచ్చును. దేవుడు తన జ్ఞానమును మూడు విధముల తెలియజేయుదునని చెప్పాడు. మూడు విధములు కానిది దేవుని జ్ఞానము కాదనీ, అది మనుషుల జ్ఞానమని చెప్పవచ్చును. ఈ సూత్రము ప్రకారము ఖుర్ఆన్ గ్రంథము తెరచాటునుండి చెప్పబడిన జ్ఞానము అయినందున అది దైవగ్రంథముగా మారినది. ఖుర్ఆన్ గ్రంథమును మనుషులు వ్రాసినా అది దైవగ్రంథమేనని చెప్పవచ్చును. అయితే హదీసు సూత్రములు (వాక్యములు) (42-51) ఆయత్ ప్రకారము దేవుడు చెప్పినవి కావు. అందువలన మనుషులు హదీసులను ఎంతగొప్పగా చెప్పుకొనినా వాటిని దైవగ్రంథముగా గానీ, దైవగ్రంథములో భాగముగాగానీ చెప్పుటకు వీలులేదు. వాటిని మానవ గ్రంథములుగానే చెప్పవచ్చును.


ఈ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా రెండులో ఆయత్ 79 యందు ఇలా చెప్పారు చూడండి.


(2-79) ''ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి దానివలన గౌరవము, ధనము పొందే నిమిత్తము ఇది అల్లాహ్ తరపునుండి వచ్చింది అని ప్రజలకు చెబుతారో వారికి వినాశనముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి చెడు తప్పదు. మరియు వారు పొందిన ధన గౌరవములకు కూడా వారికి నాశనము తప్పదు.''


దేవుడు చెప్పిన మూడు విధముల కాకుండా మనుషులు చెప్పుట దానినే వ్రాయుట ఎక్కడ జరుగునో, అలాంటి వాటి ద్వారా గౌరవము, ధనము పొందు నిమిత్తము వారు వ్రాసిన గ్రంథములను దైవగ్రంథములని ప్రచారము చేయుట వలన వారికి ఘోరమైన పాపము తగుల్కొనుచున్నది. దైవగ్రంథముల ప్రక్కనేయుండి దైవ గ్రంథములతో పాటు గౌరవమును పొందుచూ దైవగ్రంథములని పేరు తెచ్చుకోవాలని ఆశించు వారందరికీ వినాశనము తప్పదని చెప్పారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

8. మూసాకు గ్రంథము ఇచ్చాము. అట్లే ఈసాకు గ్రంథము నిచ్చాము. మీకు నచ్చని వారిని ఎదిరించారు, చంపారు. (2-87, 6-154, 155, 157)

దేవుడు మనుషులను మంచి మార్గములో నడిపించు నిమిత్తము భూమిమీదికి ఎందరినో ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలు అనగా కొద్ది నుండి గొప్పవరకు జ్ఞానమును బోధించువారు. వక్త అనగా బోధించు వాడు అని అర్థము. ప్ర అనగా ముఖ్యమైన అని అర్థము గలదు. ముఖ్యమైనది దైవజ్ఞానమే కనుక, జ్ఞానమును బోధించు ప్రతివారు ప్రవక్తలుగానే పిలువబడుచున్నారు. దేవుడు మనుషులకు జ్ఞానమును బోధించు వారిని ఎంతోమందిని మనుషుల వద్దకు పంపినా ప్రవక్తలు బోధించుటకు కావలసిన జ్ఞానమును తన గ్రంథములలో నింపి పంపినా మనుషులు మూర్ఖత్వమునుండి మారకపోవడమే కాక తమకు నచ్చని విషయములను (జ్ఞానమును) చెప్పినందుకు ప్రవక్తలను కూడా అనగా హితము చెప్పిన వారిని కూడా ఎదిరించి మాట్లాడారు. తమకు అనుకూలముగా మాట్లాడునట్లు చేసుకోవాలని ప్రయత్నించారు. తమ మాట వింటే ఫరవాలేదు. వినకపోతే ప్రవక్తలను కూడా వదలక చంపారు. ఇటువంటి మనో స్వభావములున్న మనుషులను, దేవుడు బాగుపరచాలని ప్రయత్నించిన తర్వాత కూడా బాగుపడక అజ్ఞానులుగా మిగిలిపోయి, దుర్మార్గపు భావములలోనే ఉంటూ, తమవద్ద గల ధనముతో అన్ని పనులు నెరవేరునని అనుకొని దేవున్ని, దేవుని జ్ఞానమును, దేవుని జ్ఞానము తెలిసిన జ్ఞానులను, ఏమాత్రము గౌరవించని వారిని సహితము తన జ్ఞానమును స్వయముగా బోధించి, వారిని బాగు చేయుటకు వచ్చినా, వారు తమ దుష్ట భావమును వదలి మంచి మార్గములోనికి రారు. నూటికి ఒకడుకాక పోయినా లక్షమందికి ఒడు మారినా వానికి మంచి జరిగినట్లేయని తలచి దేవుడు తన ఆత్మను నింపిన తన ప్రతినిధిని పంపి జ్ఞానము చెప్పిన సందర్భములు కొన్ని గలవు. అయినా మనిషి చెడును వీడి మంచిని చేరుతాడను నమ్మకము లేదు. ఈ విషయమై అల్లాహ్ అనబడు దేవుడు తన ఖుర్ఆన్ గ్రంథములో కొన్ని ఆయత్‍లను చెప్పాడు చూడండి.


(2-87) ''వాస్తవముగా మేము మూసాకు తౌరాతు గ్రంథాన్ని ప్రసాదించాము. మరియు అతని తర్వాత ప్రవక్తలను పంపాము. మరియమ్మ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్వచ్ఛమైన, స్పష్టమైన సూచనలను ఇచ్చాము. పరిశుద్ధాత్మతో అతనిని బలపరిచాము. అయితే మీ మనోవాంఛలకు ప్రతికూలముగా యున్న దానిని తీసుకొని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారిపట్ల దురహంకారముతో ప్రవర్తించారు. వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు.''


(6-154) ''సజ్జనులకు మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయమును వివరించటానికి, వారికి మార్గదర్శకత్వమును, కరుణను చూపడానికి మరియు తమ ప్రభువును దర్శించటానికి, ఉన్నదానిని విశ్వసించటానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము.''


(6-155) ''అదే విధముగా శుభప్రదమైన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి భయభక్తులు కల్గియుంటే మీరు కరుణింపబడవచ్చు.''


(6-157) ''మీరు ''ఒకవేళ నిశ్చయముగా మా మీద గ్రంథమును అవతరింపజేసియుంటే మేము వారికంటే ఉత్తమరీతిలో సన్మార్గములో నడిచియుండే వారము'' అని అంటారు. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్ర్రభువు తరపునుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణము, మార్గదర్శకత్వము మరియు కారుణ్యముగల ఈ ఖుర్ఆన్ గ్రంథము వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికేవారికంటే, దైవ వచనాలపట్ల విముఖత ప్రదర్శించే వానికంటే మించిన దుర్మార్గుడు ఎవడూ ఉండడు. కాబట్టి ఈ వాక్యముల పట్ల విముఖత తెలిపేవానికి ఫలితముగా భయంకరమైన శిక్ష విధిస్తాము.''


దేవుని జ్ఞానమును వ్యతిరేఖించిన వానికి దేవుని వైపునుండి దేవుని పాలకులు కొన్ని శిక్షలను విధించుచున్నారు. అయినా అవి దేవుని వైపునుండి వచ్చాయని మనిషికి తెలియకపోవడము వలన దైవము ఎడల ఏమాత్రము భయము లేకుండా పోయినది. దానివలన ఒక మనిషిని సన్మార్గములో పంపుటకు దేవుడు కూడా ఎక్కువ శ్రమ పడవలసి వస్తున్నది. ఇంతవరకు మూడు దైవగ్రంథములను పంపినా స్వయముగా తన ప్రతినిధి వచ్చిపోయినా, నేటికీ అజ్ఞాన శాతము భూమిమీద 99 పాళ్ళు ఉందనియే చెప్పవచ్చును. చెప్పుట కాదుగానీ ప్రత్యక్షముగా కనిపించుచున్నది.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

9. దైవగ్రంథము వచ్చినా దానిని చూడరు. (2-101)

దేవుడు తానే తన ప్రతినిధి వేషములో భూమిమీద తిరిగి ప్రత్యక్షముగా జ్ఞానమును చెప్పి, తన జ్ఞానము ఎప్పటికీ ప్రజల మధ్య ఉండులాగున గ్రంథరూపములో జ్ఞానమును ఇచ్చినా, గుణములతో నిండిన మనుషులు గుణముల మాయ ప్రభావము చేత గ్రంథమును కూడా చూడరు. గ్రంథ విషయము మాకు తెలియదే! అని అంటారు. అదే విషయమునే తన వాక్యములో దేవుడు (అల్లాహ్) ఇలా చెప్పాడు.


(2-101) ''వారివద్ద పూర్వము నుండి ఉన్న గ్రంథమును ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహ్ దగ్గరనుండి వారివద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గము వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి త్రోసివేశారు.'' ఈ విధముగా మనిషి వద్దకు జ్ఞానము వచ్చినప్పుడు మనిషి దానిని పట్టించుకోవడము లేదు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

10. పరలోకము కొరకు మరణాన్ని కోరండి. (2-94)

అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో స్వర్గలోకము, నరకలోకము, పరలోకము అను మూడు లోకముల పేర్లు కలవు. స్వర్గలోకమును గురించి గ్రంథములో ఎక్కువగా వ్రాయబడినది. ముస్లీమ్‍లలో స్వర్గమునకు పోవాలను కోర్కె ఎక్కువగా కనిపించుచున్నది. పరలోకము అనునది స్వల్పముగా వ్రాయబడినది. తర్వాత నరకమును గురించి కూడా ఎక్కువగా వ్రాయడము జరిగినది. స్వర్గలోకము ప్రత్యేకముగా యున్నదని గ్రంథములో ఎక్కడా చెప్పలేదు. స్వర్గ లోకమున్న విషయాన్ని చెప్పారు. అయితే మనుషులకు అర్థమయినది ఒకటి. గ్రంథములో చెప్పినది ఒకటి. మనుషులలో విచక్షణా జ్ఞానము తక్కువ అయినవారు కొందరు, అసలుకు విచక్షణే లేనివారు కొందరు, గ్రంథమును చదవడము వలన వారికి గ్రంథములో చెప్పిన వాస్తవము అర్థము కాకుండా పోయినది.


పరలోకమును గురించిన అవగాహన ఏమాత్రము లేదు. పర లోకము అంటే ఏమిటి? అను విషయము పూర్తి మనుషులకు తెలియకుండా పోయినది. స్వర్గ నరకలోకములను గురించినంత మాత్రము కూడా పరలోకమును గురించి తెలియకుండా పోయినది. కొందరి దృష్ఠిలో స్వర్గలోకము పరలోకము రెండూ ఒకటేనని అనుకొన్నారు. కొందరు స్వర్గ లోకమునకు నరక లోకమునకు మధ్యలో ఉండునది పరలోకము అని చెప్పుచున్నారు. కొందరికి పరలోకము అంటే చెడుదా, మంచిదా! అని కూడా తెలియదు. స్వర్గలోకము పైన కలదని నమ్ముచున్నారు. స్వర్గములో సుఖములు కలవనీ, నరకములో కష్టములు కలవని చెప్పుచున్నారు. అయితే పరలోకములో ఏమున్నది ఎవరూ చెప్పలేకున్నారు. మనిషి మరణించిన తర్వాత స్వర్గానికో, నరకానికో పోతాడని హిందూ మతము వారు చెప్పుచున్నారు. స్వర్గ నరకముల విషయము ఒక్క ఇస్లామ్ మతమునకే పరిమితి కాలేదు. భూమిమీద ఉన్న మతములన్నీ స్వర్గ నరకముల గురించి చెప్పుచున్నవి. అయితే ఇస్లామ్ మతములో మనిషి చనిపోయిన తర్వాత అతను భూసమాధిలో ప్రళయ కాలము వరకు ఉండుననీ, ప్రళయ దినమున అల్లాహ్ మనిషిని సమాధినుండి లేపి అతను బ్రతికినప్పుడు చేసిన పాపపుణ్యములన్నిటినీ లెక్కించి దానికి తగినట్లు దేవుడు తీర్పు తీర్చి స్వర్గమునకో, నరకమునకో పంపుననీ చెప్పుచుందురు.


ప్రళయ దినముననే అంతవరకు చనిపోయి గుంతలలో ఉన్న వారిని శరీరములతో సహా లేపి, దేవుడు విచారణ చేయునని చెప్పడములో, ఎంత వరకు సత్యము కలదని? ఎవరయినా ప్రశ్నించితే, దేవుడు చెప్పిన దానిని ప్రశ్నించకూడదు, అల్లాహ్ చెప్పిన దానిని వినడము తప్ప ప్రశ్నించకూడదు, అలా ప్రశ్నిస్తే దేవుని ఎడల విశ్వాసము లేదనీ, అవిశ్వాసమున్నదని చెప్పుదురు. ప్రశ్నిస్తే అవిశ్వాసులని అంటారని భయపడి కొందరు ప్రశ్న వచ్చినా ప్రశ్నించకుండా యున్నారు. మనుషులలో చాలామందికి ఈ విషయములో విచక్షణ లేకపోవడము వలన ప్రశ్నే రాకుండా పోయినది. ఎక్కడయినా ఒక్కడు ప్రశ్నించాలని యోచన వచ్చినా వానిని అవిశ్వాసి అంటారని, దేవుడు చెప్పినది ప్రశ్నించకూడదని చెప్పడము వలన భయపడి కొందరు ప్రశ్నించలేకపోవుచున్నారు.


పరలోక విషయానికి వస్తే ఖురాన్ గ్రంథములోనే పరలోక విషయములో మనిషి ఎట్లున్నాడో తెల్పుచూ చెప్పిన వాక్యము సూరా 27, ఆయత్ 66లో కలదు చూడండి.


(27-66) ''వాస్తవానికి పరలోక జీవితము గురించి వారి జ్ఞానము శూన్యమే. నిజంగా దానిని గురించి వారు సంశయములో పడినారు. ఇంకా చెప్పితే దాని విషయములో వారు అంధులై పోయారు.''


ఈ వాక్యమును చూచిన తర్వాత మనుషులకు పరలోకమును గురించి వారికున్న జ్ఞానము శూన్యమని తెలిసినది. అంతేకాక పరలోక విషయములో వారు పూర్తి గ్రుడ్డివారిగా ఉన్నారని దేవుడే చెప్పినట్లు అర్థమగుచున్నది. అంధత్వములో యున్న మనిషికి పరలోక జ్ఞానము లేదని అర్థమగుచున్నది. లోకము అనుభవింపబడునదని ఒక విధముగా చెప్పవచ్చును. సుఖాలను అనుభవించునది స్వర్గలోకము, కష్టాలను అనుభ వించునది నరకలోకము. పరలోకము అనగా లోకముకంటే వేరుగా యున్నదని అర్థము. లోకము అనగా అనుభవించునది అయితే పరలోకము అన్నప్పుడు అనుభవమునకు వేరుగాయున్నదని అర్థము. ఏ అనుభవమూ లేనిదనీ, అనుభవముకంటే వేరుగాయున్నదనీ చెప్పవచ్చును. ఏ అనుభవము లేనిది పరలోకము అన్నప్పుడు, దానిని ఇంకా కొంచెము వివరముగా చూస్తే, లోకములో అనుభవములుండును. అనుభవములు కర్మ వలన సంభవించుచుండును. మంచి కర్మ అయిన పుణ్యముగానీ, చెడు కర్మ అయిన పాపము గానీ ఏ కర్మయున్నా అది అనుభవ రూపములోనికి వచ్చును. పాపపుణ్యములు రెండూ లేనప్పుడు ఏ అనుభవము లేకుండా పోవును. అప్పుడు లోకమే లేదని అర్థము. అందువలన లోకముకంటే వేరయినది పరలోకము. 'పర' అనగా వేరుగాయున్నదని అర్థము.


మనిషికి పరలోకము లభించవలెనంటే మనిషి పుట్టుకలో పాపముగానీ, పుణ్యముగానీ ఏదీ ఉండకూడదు. ఎప్పుడు మనిషి కర్మ రహితుడగునో అప్పుడు పరలోకము లభించును. లోకముకంటే వేరయిన లోకము ఎక్కడున్నది? అని ప్రశ్న వస్తే, కర్మ రహితమైనది ఎక్కడ కలదో అక్కడ పరలోకము ఉంటుంది అని చెప్పవచ్చును. పాపపుణ్యములు లేని స్థలము దేవునియందు మాత్రమే కలదు. ఎందుకనగా! దేవుడు పాపపుణ్య కర్మ రహితుడు. ఆయనకు ఏ కర్మ లేదు. అందువలన ఆయనకు ఏ అనుభవము లేదు. మనిషి కూడా కర్మలేనివాడైతే దేవునిలోకి ఐక్యమై పోయి ఏ అనుభవము లేనివాడుగా ఉండిపోవును. వానికి చావు పుట్టుకలు లేవు అని తెలియుము.


చావు పుట్టుకలు లేని, కర్మలు లేని పరలోకము లభ్యమగుటకు మనిషి మనిషిగా ఉండకూడదు. మనిషికి మరణము వచ్చినప్పుడు కర్మ లేకపోవడము వలన రెండవ జన్మకు పోకుండా వాడు నేరుగా పరలోకమును పొందును, అనగా మోక్షమును పొందును. అటువంటి స్థితిని పొందడమును దేవునియందు ఐక్యమై ఉండడము అని చెప్పవచ్చును. పరలోకము పొందిన వాడు అప్పటినుండి కర్మలకు అతీతుడై ఉండును. ఇప్పుడున్న స్థితినుండి మోక్షస్థితి (పరలోక ప్రాప్తి) పొందవలెనంటే మరణము వచ్చిన తర్వాతనే అది లభించును. అందువలన పరలోకము కొరకు మరణమును కోరవలెనని ఖుర్ఆన్ గ్రంథములో సూరా 2, ఆయత్ 94 లో ఇలా చెప్పారు చూడండి.


(2-94) ''వారితో ఇలా అను ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసము మానవులందరికీ కాక కేవలము నీకు మాత్రమే ప్రత్యేకించబడియుంటే, మీరు ఈ అభిప్రాయములో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని కోరండి.'' అని కలదు.


ఈ వాక్యము చదివితే మరణము తర్వాతనే పరలోక రాజ్యము లభించునని అదియూ నీ ఒక్కనికే లభించునని చెప్పుచున్నాడు. అలా చెప్పడమునకు కారణము ఏమనగా! ఇంతకుముందు ఎందరు పరలోకమును పొందియున్నా వారు పరలోకములో కనిపించరు. ఇప్పుడు ఒకనితో పాటు పదిమంది పరలోకమునకు పోవుటకు అర్హులుగా యున్నా, వందమంది ఒకేమారు పరలోకమును పొందినా అందులో మిగతా వారు ఎవరూ కనిపించరు. తాను ఒక్కడు మాత్రము ఉన్నట్లు తెలియుచుండును. అందరికీ అటువంటి అనుభూతే యుండుట వలన ఎవరికి వారు తెలియు చుందురు. ఇతరులున్నట్లు తెలియదు. అందువలన వాక్యములో ''మానవులందరికీ కాక నీకు మాత్రమే ప్రత్యేకించబడియుంటే'' అని చెప్పారు. అంతేకాక ఇప్పుడు మేము చెప్పు ఒంటరి విషయము ''సత్యమని నీకు అర్థమయితే'' అని వాక్యములో చెప్పడమైనది. పరలోకము యొక్క విలువ తెలిసినవాడు దానిని పొందుటకు మరణము కొరకు కాచుకొని ఉండును. మరణము తర్వాతనే మనిషికి మోక్షము గానీ, జన్మగానీ లభించును. అయితే జన్మకు పోకుండా పరలోకమునకు పోవాలనుకొన్నవాడు మరణమును కోరుకొనుచుండును. మరణము పొందిన తర్వాత రెండవ జన్మకు పోవు తీర్పు పొందక శాశ్వితముగా ఒకే స్థితిలో పరలోకమును పొందవలెనని ఉండును.


మోక్షము (పరలోకము) యొక్క విషయములో మనుషులు అంధులై యున్నారని (27-66) లో చెప్పినట్లు మనిషి తాను శరీరముతో బ్రతికి యున్నట్లే నేను మోక్షము పొందియున్నాను అని చెప్పుకొంటున్నాడు. కొద్ది మాత్రము జ్ఞానము తెలిసినంత మాత్రమున తనను గొప్ప జ్ఞానిగా ఊహించుకొని పరలోక విషయము ఏమాత్రము తెలియనివాడు తాను ప్రస్తుతము పరలోకములోనే ఉన్నాను అని అంటున్నాడు. మనిషి చనిపోతే తర్వాత సెకండు కాలములోనే రెండవ జన్మకుగానీ లేక పరలోకమునకు (మోక్షమునకు) గానీ పోవలసియుండును. మరణము పొందిన క్షణమే ఇటు ఇహలోకమునకా, అటు పరలోకమునకా అన్నది కర్మ నిర్ణయము మీద ఆధారపడియుండును. కర్మయుంటే జన్మకు, కర్మ లేకపోతే మోక్షమునకు (పరలోకమునకు) పోవలసియుండును. అయితే కొందరు ఆధ్యాత్మికము అర్థము కాని స్థితిలో ఉండి, దైవగ్రంథములో వ్రాసిన విషయము అర్థము కాకపోవడము వలన మరణము తర్వాత సమాధులలో ప్రళయము వరకు ఉండవలెనని, ఇంతకు ముందు చనిపోయిన వారందరూ ప్రస్తుతము భూసమాధులలోనే యున్నారని అంటున్నారు. రేపు తాము చనిపోయినా అట్లే గుంతలలో ఉందుమని చెప్పుకొంటున్నారు. ఈ విషయము ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ చెప్పాడని కూడా చెప్పుచున్నారు. అయితే అట్లు చెప్పిన మాట ఏ దైవగ్రంథములోనూ లేదు. దైవగ్రంథములో చెప్పిన విషయమును మనిషి సరిగా అర్థము చేసుకోక తనకు అర్థమయినదో లేక తనలాగా పొరపాటుపడిన బోధకులు చెప్పిన మాటనో విని దానినే చెప్పు చున్నారో గానీ, ఇది వాస్తవమా కాదా!యని ఏమాత్రము ఆలోచించడము లేదు.


ప్రపంచము సృష్ఠికర్త చేత సృష్ఠింపబడినది. ఇది ఎప్పటికీ నాశనమగునది కాదు. ప్రపంచమునకు ప్రళయ దినము లేనేలేదు. అట్లున్నదని ఏ గ్రంథములో కూడా వ్రాయలేదు. ఎక్కడా వ్రాయనిదే ఎక్కడా చెప్పనిదే, తనకు తాను ఊహించుకొని ప్రపంచ నాశనము తప్పదని చెప్పుచున్నారు. వాస్తవానికి అటువంటిది ఏదీ లేదు. దైవగ్రంథములలో అంతిమ దినమనీ, ప్రళయ దినమనీ వ్రాసియుండుట వాస్తవమే. అయితే అది బయట ప్రపంచమునకు చెప్పలేదు. లోపలి ప్రపంచమును గురించి చెప్పిన మాటయని తెలియవలెను. శరీరము ఎప్పుడు నశించి చనిపోవునో, అప్పుడు వానికది ప్రళయ దినమగును. ఎవడు చనిపోయిన దినము వానికి అదే అంతిమ దినమని చెప్పవచ్చును. భూమిమీద మరణ దినమే అందరికీ అంతిమ దినము. మరణ దినమే వాని శరీరమునకు ప్రళయ దినము. ప్రతి ఒక్కనికీ వ్యక్తిగతముగా చెప్పిన మాటలే ప్రళయ దినము, అంతిమ దినము అని తెలియవలెను. అట్లు లెక్కించక సామూహిక ప్రళయ దినము, సామూహిక అంత్య దినము వస్తుందనుకోవడము పొరపాటగును. నిత్యము కొందరి జీవితములకు అంత్య దినముగా యున్నది. అట్లే ప్రతి దినము కొందరికి ప్రళయ దినముగా యున్నది. ఎట్లు అంతిమ దినమున్నదో అట్లే ప్రథమ దినము ఉన్నది. ఎట్లు ప్రళయ దినమున్నదో అట్లే ప్రభవ దినము కూడా యున్నది. అంత్య ప్రథమ దినములు, ప్రళయ ప్రభవ దినములు కలవు. వాటియందు గల అజ్ఞాన అపోహలను తీసివేయుట వలన స్వచ్ఛమయిన జ్ఞానము తెలిసి పరలోకమును పొందవచ్చును.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

11. చివరి రోజును గురించి భయపడండి. (2-48, 2-123, 21-47)

చివరి రోజు అనగా! జీవితమునకు ముగింపు రోజును చివరి రోజు అని అంటున్నాము. జీవితములో ఎన్నో రోజులు గడచి పోయినా చివరి ఒక రోజుతో జీవితము ముగిసిపోవుచున్నది. జీవితమునకు అంత్య రోజు ఏదయితే ఉన్నదో దానినే చివరి రోజు, లేక అంతిమ దినము అని అంటున్నాము. అయితే కొందరు ఉన్న సత్యమును వదలి తమ వరకు ఆలోచించక బయట ప్రపంచమునకు సంబంధించిన చివరిరోజును చెప్పుకొంటున్నారు. మనిషికి సంబంధించిన జ్ఞానమును గ్రంథ వాక్యములో చెప్పియుండగా, మనిషి విచక్షణా జ్ఞానము లేకుండా అక్కడ చెప్పినది గ్రహించుకోలేక, తనకు చెప్పిన విషయమును వదలి ప్రపంచమునకు సంబంధించిన విషయమును లెక్కించుకోవడము జరుగుచున్నది. దాని వలన దారితప్పి జ్ఞానమార్గమును వదలి వేరు మార్గములో నడచినట్లగు చున్నది. అంతిమ దినమును గురించి సూరా 2, ఆయత్ 48లోనూ మరియు 123 లోనూ చెప్పారు. అంతేకాక సూరా 21, ఆయత్ 47లో కూడా ఇలా చెప్పారు చూడండి.


(2-48) ''తీర్పు దినమునకు భయపడండి. అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధముగానూ ఉపయోగపడలేడు. అతనికి ఎట్టి సిఫారసు అంగీకరించబడదు. మరియు ఎలాంటి పరిహారము తీసుకోబడదు. వారికి ఎలాంటి సహాయము కూడా చేయబడదు.''


(2-123) ''పునరుత్థాన దినమును గురించి భయముగలిగి యుండండి. ఆనాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏమాత్రము ఉపయోగపడలేడు. అంతేకాక ఎవరి నుండి ఎలాంటి పరిహారము స్వీకరించబడదు. ఎవరి సిఫారసు లాభదాయకము కాదు, వారికి ఎలాంటి సహాయము లభించదు.''


(21-47) ''పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసును ఏర్పాటు చేస్తాము. కనుక ఏ వ్యక్తికి కూడా ఏమాత్రము అన్యాయము జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మయున్నా మేము దానిని ముందుకు తెస్తాము. దాని లెక్క చూడడానికి మేమే చాలు.''


ఈ మూడు ఆయత్‍లలో మనిషి యొక్క చివరి దినమును గురించే వ్రాశారు. మిగతా రెండు దైవగ్రంథములకంటే చివరి గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనే విపులముగా వ్రాయడము జరిగినది. ఎంతో వివరముగా వ్రాసియున్నా గ్రంథములోని భావమును గ్రహించుకోలేక చాలామంది గ్రంథములో చెప్పినది ఒకటయితే వారు అర్థము చేసుకొన్నది మరొకటిగా యున్నది. మనకి అంతిమ దినము చనిపోయిన దినమే అయివుండగా అది తెలిసి కూడా సత్యమును వదలి అసత్యమును నమ్ముచున్నారు. అసత్యమును చెప్పు వారి మాటలనే వింటున్నారు. గ్రంథములో మనిషియొక్క అంత్య దినమును గురించి చెప్పితే, మనిషి ప్రపంచము యొక్క అంత్య దినమును గురించి చెప్పుకోవడము జరిగినది. కొందరు తమ మాటలను సత్యమని చెప్పుటకు ముహమ్మద్ ప్రవక్తగారే అలా చెప్పారని తమ తప్పును ప్రవక్తగారి మీదికి త్రోశారు. ప్రవక్తగారు చెప్పిన విషయము పైన గల మూడు ఆయత్‍లలో ఉండగా దానిని అర్థము చేసుకోలేక ప్రవక్తగారే తప్పు బోధించినట్లు ప్రచారము చేశారు. కొందరు ముఖ్యమైన వారు, బోధకులుగా యున్నవారు చెప్పగా మిగతా అసంఖ్యాక ముస్లీమ్ సమాజమంతా అదే నిజమని నమ్మినది.


నేడు ప్రతి మనిషి కొంత బుద్ధి కల్గియున్నాడు. బుద్ధికి ప్రపంచ సంబంధముగా ఎంతో విచక్షణ కలదు. ప్రపంచములో ఎంతో నైపుణ్యముగా ఉపయోగపడు విచక్షణ దైవ విషయముల దగ్గర పూర్తి గ్రుడ్డిదై పోయినది. సత్యమేదియని ఏమాత్రము ఆలోచించడము లేదు. మా పెద్దలు చెప్పింది మేము వింటున్నాము అంటున్నారు. వినడములో తప్పులేదు. అయితే వినిన విషయము సత్యమా అసత్యమా? అని ఏమాత్రము ఆలోచించకుండా గ్రుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే అది సత్యమయితే మంచిదే. ఒకవేళ మనము విన్నది సత్యము కాకపోతే అప్పుడు చెప్పినవాడు ఒకడే చెడిపోతే విన్నవారు వేలమంది, లక్షల మంది చెడిపోతారు. అందువలన చెప్పిన వానికంటే వినినవారికే ఎక్కువ నష్టము జరుగును. జరిగిన నష్టము ధనమో, ధాన్యమో అయితే ఫరవాలేదు. అది ప్రపంచ సంబంధమైనది కాకుండా దైవ సంబంధమైనదయిన దానివలన మనిషి జీవితమునకే నష్టము. మనిషి జన్మకే నష్టము. జీవితమంతా తప్పు జ్ఞానములోనే ఉండిపోవడము, దానినే చెప్పుకోవడము జరుగును. అటువంటప్పుడు ప్రస్తుత జన్మ అంతా వ్యర్థ మగును. వాస్తవ జ్ఞానము తెలియక జన్మ వృథాయగును.


దైవజ్ఞానము జన్మకు సంబంధించినది, ఒక జీవితమునకు సంబంధించినది అగుట వలన దైవ విషయములలో సత్యాసత్యమును తెలిసి బ్రతుకుట మంచిది. జన్మయొక్క ఉద్దేశ్యము దైవ జ్ఞానమును తెలియడమే. అటువంటి జ్ఞానము తెలియకపోతే జన్మయంతా సార్థకము లేనిదగును. అందువలన దైవగ్రంథములో చెప్పిన ప్రతి విషయమును జాగ్రత్తగా గ్రహించుచూ శ్రద్ధగా తెలియవలసి యున్నది. అంతిమ దిన విషయమును తీసుకొని చూస్తే దేవుడు జ్ఞానమును చెప్పినది తనకని తెలియక తనకు గల అంతిమ దినమును వదలి ప్రపంచ సంబంధ అంతిమ దినమును గురించి చెప్పడము పెద్ద తప్పగును. మనిషికి అంతిమ దినము లేకపోతే అప్పుడు నీవు ప్రపంచ అంతిమ దినమును గురించి ఆలోచించాలి గానీ, నీకున్న అంత్య దినమును వదలి బయట ప్రపంచ అంత్య దినమును గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడు ఎక్కడయినా ప్రపంచ సంబంధ అంతిమ దినమును గురించి చెప్పాడా? అని అడిగితే కొందరు ''అవును దేవుడు ప్రపంచ అంత్య దినమును గురించి చెప్పాడని'' అనుచున్నారు. ''ప్రళయ దినమే అంత్య దినము అని చెప్పడము వలన ప్రపంచమునకు ప్రళయము సంభవించినప్పుడు మనుషులకు అంత్య దినము వచ్చునని మేము అనుకొంటున్నాము. మా పెద్దలు అలాగే చెప్పారని'' చెప్పుచున్నారు. ప్రళయము అను ఒకమాటను అడ్డము పెట్టుకొని ప్రపంచ ప్రళయమని అంటున్నారు. ప్రళయము అనగా నాశనము అని అర్థము అగును. అంతేగానీ ప్రపంచ ప్రళయమని ఎందుకు అనుకోవాలని మేము అంటున్నాము.


ఖుర్ఆన్ గ్రంథములోనే మూడవ సూరాలో అంతిమ దినమును గురించి మరికొన్ని వాక్యములు (ఆయత్‍లు) చెప్పడము జరిగినది. రెండవ సూరాలో చెప్పినా, మూడవ సూరాలో చెప్పినా సత్యము ఏదయితే దానినే చెప్పియుందురు గానీ వేరు చెప్పియుండరు కదా! దేవుని జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పినది సాధారణ వ్యక్తి కాదు. ప్రతి దినము ప్రపంచమునకు వెలుగునిచ్చు సూర్యుడే జిబ్రయేల్ అను పేరుతో చెప్పడమైనది. జిబ్రయేల్ సృష్ఠి ఆదిలోనే ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమును విన్నవాడు. మొదట జిబ్రయేల్ తౌరాతును మనువుకు బోధించాడు. రెండవమారు తాను విన్న జ్ఞానమును, తాను తెలిసిన జ్ఞానమును ముహమ్మద్‍కు బోధించాడు. ప్రపంచములో జ్ఞానమును విన్న మొదటి వ్యక్తి జిబ్రయేల్ అయిన దానివలన ఆయన మహాజ్ఞానిగా యుంటూ తనకు తెలిసిన జ్ఞానమును ప్రవక్తగారికి చెప్పగా, ప్రవక్త ఇతరులకు అనగా తన అనుచరులకు చెప్పగా చివరికది గ్రంథరూపమైనది. అదే ఖుర్ఆన్ గ్రంథము. ఖుర్ఆన్ గ్రంథములో మనిషి చనిపోవు దినమును అంతిమ దినమనీ, పునరుత్థాన దినమనీ, ప్రళయ దినమనీ చెప్పడమైనది. మూడు, నాలుగు పేర్లతో చెప్పినా అది మనిషి చనిపోవు చివరి దినమును గురించి చెప్పినదేగానీ వేరుకాదు. ఇప్పుడు మూడవ సూరాలో చెప్పిన వాక్యములను కూడా చూస్తాము.


(3-9) ''దేవుడు నిశ్చయముగా జనులందరినీ ఏదో ఒక రోజు సమీకరిస్తాడు. ఆ రోజును గురించి ఎలాంటి అనుమానము లేదు. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధముగా వ్యవహరించడు.''


(3-10) ''అవిశ్వాసులను వారి అంతిమ దినమున వారి సిరి సంపదలుగానీ, వారి సంతానముగానీ, కర్మపత్రము నుండి, అల్లాహ్ శిక్షనుండి విడిపించడములో ఏమాత్రము ఉపయోగ పడవు. నరకానికి ఇంధనము అయ్యేవారు వీరే.''


(3-114) ''అల్లాహ్‍ను, అంతిమ దినమును కూడా వారు విశ్వసిస్తారు. మంచిని చేస్తారు, చెడును ఆపుతారు. సత్కార్యముల కోసము, దేవుని సేవ కోసము వారు ఒకరికొకరు పోటీ పడతారు. అటువంటి వారు సజ్జనుల కోవకు చెందినవారు.''


(3-185) ''ప్రతి ప్రాణి మృత్యువును రుచి చూడవలసిందే. ప్రళయములో అంతిమ దినమున మీరు అందరూ కర్మల పూర్తి ఫలితములను పొందుతారు. అప్పుడు ఎవడయితే నరకాగ్నిలో పడకుండా మోక్షములో ప్రవేశిస్తాడో అతడు నిశ్చయముగా సఫలీకృతుడైనట్లే. ప్రాపంచిక జీవితమైతే మాయ తతంగము తప్ప మరేమీ కాదు, అది మోసపూరిత జీవితమే.''


ఇక్కడ వ్రాసిన నాలుగు ఆయత్‍లను (వాక్యములను) చూస్తే మరణ సమయములోని పూర్తి జ్ఞానము కలదు. అయితే మనిషి తన బుద్ధిని ఈ వాక్యములయందు లగ్నము చేసి చూడకుండా, అందులో చెప్పిన విషయమును పూర్తి గ్రహించకుండా, ఒకచోట ''ప్రళయములో అంతిమ దినమున'' అని వ్రాయబడిన దానిని చూచి ప్రళయము ఎవరికి? అంతిమ దినము ఎవరికి? అని ఏమాత్రము ఆలోచించక, ప్రపంచ ప్రళయమును గురించి చెప్పుకోవడము జరిగినది. ప్రళయము అనగా 'ప్ర' అను శబ్దములో పుట్టినదియని అర్థము. ళయము అనగా నాశనము, లేకుండా పోవడము అని అర్థము. పుట్టినది ప్రపంచము అని అంటాము. అట్లే శరీరము అని అంటాము. ప్రపంచము అనగా ఐదు చేత పుట్టినదని అర్థము. వివరముగా చెప్పుకొంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగముల చేత పుట్టినది. అటువంటి ప్రపంచములో ఐదు భాగములయిన ప్రకృతి చేత పుట్టినది శరీరము. శరీరములో కూడా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు గలవు. బయట ప్రపంచము కనిపించు ప్రకృతి కాగా, శరీరము లోపలి ప్రపంచము ప్రతి జీవునికి కలదు. ప్రతి మనిషికి పంచ భూతముల చేత తయారయిన శరీరము గలదు. శరీరములో ఐదు భూతములు మిళితముగా ఉండుట వలన అవి మార్పుకు లోనవుతూ శిథిలావస్థకు చేరుచున్నవి. బయట ప్రపంచము మార్పు చెందక ఎప్పటికీ ఒకేలాగ ఉన్నది. శరీరము మాత్రము ఏదో ఒక రోజు నశించి పని చేయకుండా నిలిచిపోవుచున్నది. ఎప్పుడయితే శరీరములో కనిపించక యున్న మనస్సు, బుద్ధి, చిత్తము, అహము నాశనము చెందుచున్నవో వాటితో పాటు మిగతా శరీర భాగములన్నీ నశించుచున్నవి. అలా నశించి పని చేయకుండా పడిపోవు శరీరమును చనిపోయిన శరీరము అంటున్నాము. శరీరము ఎప్పుడు చనిపోయిందో అప్పుడే జీవునకు మరణస్థితి ఏర్పడు చున్నది. పంచభూత నిర్మిత శరీరము ఎప్పుడు చనిపోవుచున్నదో అప్పుడే ఆ శరీరమునకు ప్రళయము ఏర్పడినదని చెప్పవచ్చును. ప్రళయము శరీరమునకే ఏర్పడును. శరీరములోని పంచభూతములయిన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి ప్రళయము ఏర్పడుచున్నది. ఐదు భూతములు ఒక్కచోట ఉన్నప్పుడు అనగా శరీరములో కలిసియున్నప్పుడు ప్రళయము ఏర్పడుచున్నది.


బయట ప్రపంచములో ఐదు భూతములు ఒక్కచోట లేవు. వేరువేరుగా యున్నవి. నీరున్నచోట అగ్ని లేదు. అగ్ని వున్నచోట నీరు లేదు. అట్లే భూమి, ఆకాశము వేరువేరుగా యున్నవి. అందువలన బయట ప్రపంచమునకు ఆయుష్షు లేదు, అంతము లేదు. లోపలి ప్రపంచ మయిన శరీరమునకే ప్రళయము గలదు. అందువలన వాక్యములో చెప్పిన ప్రళయము శరీరమునకేగానీ బయటి ప్రపంచమునకు కాదని తెలియ వలెను. బయట ప్రపంచమునకు ఎప్పటికీ అంత్యము లేదు. యుగములు రెండువేలు గడచితే ఒక కల్పమగును. అట్లు ఎన్ని కల్పములయినా జరుగ వచ్చును. పూర్తిగా ప్రపంచము లేకుండా పోవును అనుట ఎప్పటికీ ఉండదు. ఏ యుగమునకు నాశనము లేదు. ఈ విషయమును మా రచనలలోని ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథములో విపులముగా వ్రాశాము. దానిలో బయటి ప్రపంచమునకు అంత్యము లేదని తెలిసినది. సునామీలు, భూకంపములు అనునవి మనుషులు కష్టపడుటకు ఏర్పడునవే గానీ అవన్నీ ప్రళయములు కావు. ఇంతవరకు ప్రపంచము ప్రళయము చెందును అనుటకు ఆధారము లేదు. శరీరము ప్రళయమును పొందవచ్చును. అనగా శరీరము నాశనము కావచ్చును. దానినే మరణము లేక చావు అనీ, మృత్యువు అనీ అంటున్నాము. మృతి చెందిన దినమును ప్రళయ దినమని చెప్పవచ్చును.


ప్రళయ దినము అనగా మనిషి చనిపోవు సమయములో ఏమి జరుగును అను సమాచారము ఎవరికీ తెలియదు. అప్పుడు ఏమి జరిగేది చనిపోయిన జీవునకు తెలుసు. అయితే చనిపోయిన తర్వాత వాడు ఆ శరీరమునుండి మాట్లాడడు గనుక ఆ సమయములో ఏమి జరిగినది బ్రతికియున్న ఎవరికీ తెలియదు. అది అత్యంత రహస్యమయిన విషయము. అటువంటి రహస్య విషయమును కూడా సులభముగా మీకు విప్పి చెప్పడమైనది. మా పరిశోధనలో శోధించి ఛేదించిన రహస్యమును మేము మా రచనలలోని ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథములో తెలియజేశాము. చనిపోవుట తిరిగి పుట్టుట అత్యంత చోద్యమైన రహస్యము. సులభముగా చెప్పితే మరణము నిద్రలాగ వచ్చును. జననము మెలుకువలాగ వచ్చును. చావడము పుట్టడము ఒక సెకను కాలములో జరిగిపోవుచున్నది. ఆ సెకను కాలములో మనిషికి (జీవునకు) తెలిసి కొంత, తెలియక కొంత జరుగుచున్నది. తెలిసి జరిగేది నిద్రపోవడము, అలాగే మెలుకువలోనికి రావడము. ఇది ప్రతి దినము ప్రతి మనిషికీ జరుగుచున్నది.


మనిషి చావు, నిద్ర రెండు ఒక్కటేయగును. జ్ఞాపకము ఉన్నంత వరకు మనిషికి బాధలు, సుఖములు తెలియుచుండును. ఎప్పుడు సుఖములు, బాధలు తెలియకుండా పోవుచున్నవో అప్పుడు నిద్రయగును. నిద్రపోయినవాడు అదే శరీరములో లేవగలిగితే మెలుకువ అంటాము. అట్లు కాకుండా వేరే క్రొత్త శిశు శరీరములో జ్ఞాపకము వచ్చి లేవగలిగితే దానిని జన్మ అంటారు. జన్మను నిర్ణయించి జన్మకు పంపువాడు శరీరములోని ఆత్మయేనని తెలియవలెను. ప్రతి మనిషి నిద్రలోనికి పోతే అందులో ఎవడయినా జన్మకు పోవచ్చును. జన్మకు పోవలసిన వానిని దేవుడే (ఆత్మే) వేరే శరీరమును నిర్ణయించి పంపుచున్నది. ఆ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా 39, ఆయత్ 42లో ఇలా చెప్పడమైనది చూడండి.


(39-42) ''అల్లాహ్‍యే ఆత్మలను (జీవాత్మలను) మరణ కాలమున వశపరచుకొనేవాడు. మరణించిన వారి ఆత్మలకు దేనికైతే మరణము నిర్ణయింపబడుతుందో దానిని తనవద్దే ఆపుకొని మిగతా వారి ఆత్మలను నిర్ణీత సమయము వరకు తిరిగి పంపుతాడు. ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి.''


ఈ వాక్యము కొందరికి అర్థమయినా చాలామందికి అర్థము కాక యుండవచ్చును. దీనినే వివరముగా చెప్పుకొంటే, ప్రతి దినము ప్రతి మనిషి నిద్ర అనబడు చావులోనికి పోతున్నాడు. నిద్రపోయినవాడు చచ్చిన వాడు ఇద్దరూ ఒక్కటేలాగున కనపడుచుందురు. శరీరములోని ఆత్మ ఆధీనములో నిద్రపోయినవాడు ఉండును. ఆత్మ వాని కర్మను బట్టి వాడు ఇంకా బ్రతకవలసి యుంటే అదే శరీరములోనే మెలుకువలోనికి పంపును. అట్లుకాక ఆ జన్మ కర్మయంతయు అయిపోయి వుంటే వానిని రెండవ జన్మకు పంపును. రెండవ జన్మ లేదని ముస్లీమ్ సమాజమంతా అనుకొంటున్నారు. రెండవ జన్మ ఉన్నదనుటకు సాక్ష్యముగా ఖుర్ఆన్ గ్రంథములోనే అనేక ఆయత్‍లు (వాక్యములు) గలవు. రెండవ జన్మ ఉన్నదను ఖుర్ఆన్ వాక్యములను ఇప్పుడు చూచి రెండవ జన్మ ఉన్నదని నిర్ణయమునకు వచ్చిన తర్వాత అంతిమ దినమున ఏమి జరుగుచున్నదో తెలియని విషయమును తెలుసుకొందాము. రెండవ జన్మకు సంబంధించిన వాక్యములను ఇప్పుడు చూస్తాము.


(7-29) ''మొదటిసారి మిమ్ములను అల్లాహ్ ఎలా పుట్టించాడో, మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.'' (అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ అను గ్రంథమునుండి ఈ వాక్యమును సేకరించాము.)


(22-66) ''మీకు జీవనము ప్రసాదించినవాడు దేవుడే. ఆయనే మరణమును ఇస్తాడు. మళ్లీ ఆయన తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరచేవాడే.''


(36-68) ''వృద్ధాప్యానికి చేరిన వారిని మళ్లీ జనన స్థితికి తీసుక పోతాము. అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?''


(40-11) ''మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు చావునిచ్చావు. రెండుసార్లు బ్రతుకునిచ్చావు.''


(53-44) ''నిశ్చయముగా ఆయన మరణింప చేసేవాడు మరియు జీవితమును ప్రసాదించేవాడు.''


(53-46) ''ప్రవహింపచేసే వీర్య బిందువునుండి''


(53-47) ''మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (దేవునికే) చెల్లును.''


ఈ వాక్యములన్నిటినీ చూచిన తర్వాత మనిషికి రెండవ జన్మలేదు అనువారు దేవుని వాక్యమునకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును. కొందరు దేవుడు చెప్పిన మాటను కూడా లెక్కించక మా మతములో జన్మలు లేవు అనువారు దేవుని శిక్షకు అర్హులు. వీర్యబిందువు నుండి మరొక జీవితమును ప్రసాదించడము అంటే రెండవ జన్మయని ఎవరికయినా అర్థము కాగలదు. మనిషికి మొదట మరణము వస్తే తర్వాత జన్మ వచ్చును. మరణము తర్వాత జన్మ వచ్చు వరకు మనిషికి తెలియని విధానము ఒకటి గలదు. దానినే ''తీర్పు తీర్చడము'' అని అంటున్నాము. తీర్పు తీర్చడము అంటే రెండవ జన్మను నిర్ణయించి పంపడము అని అర్థము. మనిషి చేసుకొన్న కర్మప్రకారము రాబోవు జన్మ నిర్ణయము జరుగును. అలా తీర్పు తీర్చు విధానము మనిషికి ఏమాత్రము తెలియదు. తీర్పు విధానమంతయూ మనిషికి తెలియని అత్యంత గొప్ప రహస్యమని చెప్పవచ్చును. ఇప్పుడు మరణము ఎట్లు జరుగుచున్నదో మరణ సమయములో తీర్పు విధానము ఎట్లున్నదో, తీర్పులోని అత్యంత రహస్యముతో పాటు తెలుసుకొందాము. ఇది ఒక మనిషికనిగానీ, ఒక మతము వారికే అనిగానీ ఏమీ లేదు. మనిషి అనువాడు ఏ మతము వాడయినా మరణములో జరుగు విధానము ఇంతేననీ, ఇంతకంటే మిగిలియున్న రహస్యము ఏమీ లేదని తెలియవలెను.


మొదటి బాల్యదశ మొదలుకొని వృద్ధాప్యదశ వరకు శరీరము లోపలి బయటి అవయవములు, కర్మ, గుణములు అన్నీ ఒకే విధముగా వాటివాటి పని చేయుచుండగా అవసాన దశలో మాత్రము శరీరము లోపలి, బయటి అవయవములలో మార్పులు కలుగుచూ అన్నియూ పని చేయక నిలిచిపోవును.


శరీరము యొక్క అన్ని దశలలో శరీరమంతా వ్యాపించి శక్తినిచ్చి అవయవములనన్నిటినీ కర్మానుసారము నడిపించు ఆత్మ అవసాన దశలో శరీరమంతా లేకుండా కొద్దికొద్దిగా ముకుళించుకొనును. అవసాన సమయములో ఆత్మ ముకుళించుకు పోవడము వలన మొదట వెంట్రుకలు చర్మము యొక్క స్పర్శ లేకుండా పోవును. ఆ సమయములో చీమలు కుట్టినా తెలియకుండా పోవును. తేలుకుట్టినా నొప్పి తెలియకుండా పోవును. బ్రతికినన్నాళ్ళు అన్ని దశలలోనూ చర్మము ద్వారా తెలిసిన బాధలు అవసాన దశలో తెలియకుండా పోవును. దీని ప్రకారమైతే జీవునికి అన్ని దశలకంటే అవసాన దశయే బాధ లేనిదని చెప్పవచ్చును. శరీరమంతా ఉన్న ఆత్మ ముడుచు పోవుట వలన కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు పని చేయు స్థోమతను కోల్పోవును. అప్పుడు మనిషి కదలక, మెదలక మంచము మీద పడివుండడము మాత్రముండును. నోటి కదలిక శక్తి కూడా లేకుండా పోవడము వలన మనిషి మాట్లాడలేడు. కేవలము కర్మేంద్రియములు పని చేయక, కొద్ది నిమిషములు జ్ఞానేంద్రియములు పని చేయుచుండుట వలన తనవద్దకు వచ్చిన మనుషులు కనిపిస్తుందురు, వారి మాటలు వినిపిస్తుండును. తాను మాత్రము ఎవరినీ పలకరించలేని స్థితిలో ఉండును. నోరు, కాళ్ళు, చేతులు పని చేయని దానివలన తనలో తాను మదనపడు చుండును. అప్పటి వరకు శరీరము మీద గల నొప్పులు కూడా తెలియక పోవును. కాళ్ళ నొప్పులు కూడా కనిపించవు. శరీరము లోపలి నొప్పులేమైనా వుంటే అవి మాత్రము తెలియుచుండును. తర్వాత కొంత సేపటికి అంతవరకు పని చేయుచున్న జ్ఞానేంద్రియములైన కళ్ళు, చెవులు కూడా శక్తి హీనమైపోవును. అప్పుడు బయట ఎవరున్నది, ఎవరు ఏమి మాట్లాడుచున్నది తెలియకుండా పోవును. బయటివారు ఇదుగో నీ చిన్న కొడుకొచ్చాడని చెప్పినా, దాచిన ధనమెక్కడ పెట్టినావని అడిగినా, లోపలి జీవునకు విషయమే తెలియకుండును. కన్నులు తెరచుకొని ఉండినా కనిపించకపోవుట వలన కనురెప్ప కూడా కొట్టక చూస్తున్నట్లే బయటి వారికి కనిపించుచుండును. అటువంటి సమయములో యమదూతలు వచ్చారని వారిని చూస్తున్నాడని, దూత దర్శనము చేత మన ధ్యాస పోయిందని కొందరనుకొనుచుందురు. అవసాన దశలోనున్న వారికి చూపే లేదని తెలియక, యమకింకరులను చూస్తున్నాడనుకోవడము పొరపాటు.


శరీరము బయటగల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పని చేయక పోవడము వలన బాహ్య బాధలన్నీ వదలిపోయినట్లే. బయటి ప్రపంచముతో పాటు మనస్సు కూడా బయటి ప్రపంచముతో సంబంధము తెగిపోయి లోపల ఇంద్రియములు పని చేయుచుండును. ఆత్మతో పాటు మనస్సు కూడా బయటి ఇంద్రియములతో సంబంధము తెగిపోవడము వలన బయటి విషయములను బుద్ధికి అందించ లేకపోవును. బుద్ధికి బయటి విషయములు చేరని దానివలన యోచించనవసరమే లేకుండా పోయినది. బుద్ధికి యోచనలు లేనిదానివలన చిత్తమునకు పనియే లేదు. ఏ పని జరగనందున అహమునకు కూడా పనిలేదు. అప్పటికీ మనస్సుకు ఆత్మశక్తి అందుచుండుట వలన మనస్సు తన నైజము ప్రకారము జరిగి పోయిన పనులను గురించి జ్ఞాపకము తెచ్చుచుండును. క్రమేపీ మనస్సు కూడా బలహీనపడి పోవుచుండును. ఆ సమయములో మనస్సు అందించు కొద్దిమాత్రము జ్ఞాపకము తప్ప మనిషికి ఏ బాధగానీ, ఏ చింతగానీ లేకుండును. ఎన్నో శరీర బాధలు, మానసిక బాధలు కల్గి ఏమాత్రము శాంతి లేనివానికి జీవితములో ఎప్పుడూ చవిచూడని బాధ రహిత స్థితిని అవసాన దశలో జీవుడు పొందుచుండును. ఏ బాధలు, ఏ చింతలు లేని ఆ స్థితిని గూర్చి బ్రతికున్నవారు తెలియలేక, చనిపోవునపుడు జీవుడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో అని అనుకొనుచుందురు. చివరకు మనస్సు కూడా శక్తిహీనమైపోవుచూ చిన్నచిన్న విషయములను మరచిపోవును. తనకున్న జ్ఞాపకశక్తి తగ్గుట వలన చాలా ముఖ్యమైన విషయములనూ, బాగా మనస్సుకు హత్తుకొనివున్న విషయములనూ జ్ఞాపకము తెచ్చుచుండును. ఆ విషయములనే బుద్ధి గ్రహించి జీవునకు తెలియజేయుచుండును. మనస్సు చివరి వరకు జ్ఞాపకాల పనినే చేయుచుండును. చివరకు మనస్సు అన్ని విషయములను మరచిపోయి ఆఖరుకు తనకున్న గొప్ప విషయమేదో దానినొక్క దానిని జ్ఞాపకము తెచ్చును. అదియే మనస్సుకు చివరి జ్ఞాపకము. దానికంటే మించిన విషయము మనస్సుకుండదు. ఆ చివరి విషయమే బుద్ధి ద్వారా జీవుడు గ్రహిస్తుండును. జీవితములో దేనినయితే మనిషి గొప్పగా తలచి ఉండునో, ఏ విషయమైతే మనిషికి ప్రాముఖ్యముగా ఉండునో, ఏ విషయమును జీవిత ధ్యేయముగా, జీవిత సారాంశముగా పెట్టుకొని బ్రతుకుచుండునో ఆ విషయమే చిట్టచివరి జ్ఞాపకమగును. చివరి విషయము మనోఫలకము మీద బుద్ధి ద్వారా జీవుడు చూచుచుండగా, ఆత్మ తనశక్తిని బుద్ధి, మనస్సు నుండి కూడా ముకుళింపజేయుట వలన అన్ని అవయవములు స్తంభించిపోయినట్లు అవి కూడా లేకుండా పోవును. శరీరములో అంతవరకు అన్ని దశలలో పని చేసిన 24 భాగములు అంత్యమై పోవును. చివరకు శరీర భాగముగా పేరుగాంచిన జీవుడొకడు మిగులును. ఆత్మ శరీరమంతటి నుండి ముడుచుకొని తన నివాస కేంద్రమైన బ్రహ్మనాడిని చేరును. అప్పుడు శరీరమంతా మృతమైపోయి తల మధ్యలో బ్రహ్మనాడి యందు ఆత్మయు, గుణచక్రములో జీవుడును ఉందురు. ఆ స్థితి కొన్ని సెకండ్లు మాత్రముండి ఆత్మ బ్రహ్మనాడిని కూడా వీడి తనతో పాటువున్న నాల్గు చక్రములను తీసుకొని శరీరమును వదలిపోవును. అప్పటికి పూర్తి మరణము సంభవించినట్లగును. అవసాన దశలో ముడుచుకొంటూ శరీర భాగములను వదలించుకొన్న ఆత్మ చివరకు తనతోపాటు జీవున్ని, వానిచుట్టు వున్న గుణములను అనగా గుణచక్రమును, దానికి పైనగల కర్మచక్రమును మిగతా రెండు చక్రములను తీసుకొని మరియొక శరీరమునకు పోవును. ఈ విషయమునే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు ఎనిమిదవ శ్లోకములో...

శ్లో|| 8. శరీరం య దవాప్నోతి యచ్చాప్యుత్క్రామ తీశ్వరః |

గృహీ త్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్ ||


భావము :- ''ఆత్మ ఏ శరీరము నుండి బయలుదేరి, తిరిగి ఏ శరీరమందు తాను ప్రవేశించుచున్నదో అక్కడికి తనతోపాటు కామాది గుణములను, కర్మను, జీవున్ని గాలి వాసనను తీసుకపోయినట్లు తీసుక పోవుచున్నది.''


మరణించిన శరీరమునుండి ఆత్మ నాల్గు చక్రములతో సహా బయలు దేరుచున్నది. ఆత్మ నాల్గు చక్రములకు ఇరుసుగా ఉండుట వలన ఆత్మ ఎక్కడికి పోయినా, దానిని అంటి పెట్టుకొనియున్న నాల్గు చక్రములు పోవుచుండును. మనుషులకొక్కరికే గాక ప్రతి జీవరాసికి ఈ నాల్గు చక్రముల అమరిక ఉండును. ఏ జీవరాసి శరీరము మరణము పొందినా, దానిలోని ఆత్మ నాల్గుచక్రములతో సహా బయలుదేరి కంటికి కనిపించకుండా పోవుచున్నది. గాలిలో సువాసన కనిపించకుండా మరొక చోటికి ప్రయాణము చేసినట్లు ఆత్మ కూడా సూక్ష్మముగా పోవుచున్నది. ఆత్మ, జీవాత్మ, గుణములు, కర్మ ఏవీ కనిపించునవి కావు. అందువలన మన ముందరే అవి చనిపోయిన వాని శరీరమునుండి పోయినా, వాటిని మనము గుర్తించలేము. ఆత్మను ఆధారము చేసుకొన్న నాల్గు చక్రములు ఆత్మతో పాటు పోవుచుండుట వలన క్రింది చక్రములో గల గుణములతో సహా జీవాత్మ కూడా పోవలసివున్నది. ఆత్మ జీవాత్మ రెండు జోడు ఆత్మలు. అందువలన ఒకటిపోతే మరొకటి కూడా పోవలసిందే!


పూర్వకాలము నుండి మనుషులకు మరణ కాలములో తెలియని రహస్యము ఏమనగా! ఆత్మ నాలుగుచక్రములతో బయటికి పోవుచున్నదను విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఏ గురువులు చెప్పలేదు, ఏ పుస్తకములలో వ్రాయబడలేదు. ఏ యుగములో కూడా నాల్గు చక్రముల వివరము ఎవరూ చెప్పక పోవడము వలన, ఈ విషయము క్రొత్తదగుట వలన జాగ్రత్తగా అర్థము చేసుకోవలయును. నీకు, నాకు అని తేడా లేకుండా ప్రతి జీవరాశి శరీరములోను తలయందు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు గలవు. సూక్ష్మరూపమై జ్ఞానదృష్ఠికి గోచరించు వీటిని జ్ఞానముతోనే తెలియనగును. ఆధ్యాత్మిక విద్యలోనే అతి రహస్యమైన నాల్గు చక్రములను అర్థము చేసుకొంటే జనన మరణ రహస్యము సులభముగా తెలియును. పాఠకులకు కొంత అర్థమగుటకు సూక్ష్మముగనున్న నాల్గు చక్రములను, కర్మచక్రమును తర్వాత పేజీలో చూడవచ్చును.


నాల్గు చక్రములలోని కాల, కర్మ, గుణచక్రముల విషయము కొంత అర్థమైవుండును. అన్నిటికంటే పైనగల బ్రహ్మచక్రము విశ్వము యొక్క ఆయుష్షుకు సంబంధించినది కావున దాని విషయము ఇపుడు మనకు అనవసరము. పువ్వులోని వాసన కనిపించనట్లు, వాసన గాలితో కలిసి మరొక చోటికి పోయినట్లు మరణములో నాల్గు చక్రముల అమరిక క్షణాల





మీద మరియొక శరీరమును చేరుచున్నది. వాస్తవముగా చెప్పాలంటే ఒక సెకనులో పదవవంతు కాలములో మరియొక శరీరమును చేరుచున్నదని చెప్పవచ్చును. ఇంకనూ వివరముగా చూస్తే మరణించబోవు వాని శరీరములో ఆడు శ్వాస పైకి క్రిందికి ఆడుచుండును కదా! అవసానదశలో ముక్కు రంధ్రములలో పైకి పోయి క్రిందికి వస్తున్న శ్వాస మరణముతో చివరిగా క్రిందికి వచ్చిన తర్వాత పైకి ముక్కురంధ్రములలో దూరదు. క్రిందికి వచ్చిన శ్వాస తిరిగి ముక్కు రంధ్రములలో దూరి పైకి పోవడము దాని సహజమైన పని అయినప్పటికీ అలా మరణించిన శరీరములో దూరక వెంటనే ఆత్మ ప్రవేశించిన చోట శ్వాస శరీరములోనికి ప్రవేశించును. ఇక్కడ క్రిందికి వచ్చినది ఇక్కడే పైకి పోక, ఇక్కడ పోయినట్లే ఏమాత్రము ఆలస్యము చేయక అక్కడ వేరు శరీరములోనికి పోయినది. దీనినిబట్టి శ్వాస క్రిందికి పైకి ఆడుచునే వున్నది. మరణముతో పాత జాగాలో పైకి పోక క్రొత్త జాగాలో పైకి పోయినది. మరణించిన శరీరము నుండి, క్రొత్తగా పుట్టిన శరీరము వేలమైళ్ళ దూరములో ఉండినప్పటికీ తత్క్షణమే ఆత్మ అక్కడికి చేరగల్గుచున్నది. మరణించిన జీవుడు వెంటనే వేరొక శరీరమును ప్రవేశించుట వలన యమధర్మరాజు, యమలోకము అను ప్రసక్తే లేదు. అటులయిన యమధర్మరాజు యొక్క ఉద్యోగమేమి కావలెనని కొందరడుగ వచ్చును. మీరు ఊహించుకొన్న యమలోకముగానీ, యమధర్మరాజుగానీ కేవలము కల్పితము. మనము చేసుకొన్న పాపపుణ్యములన్నియూ జన్మలలో భూమిమీదనే అనుభవించవలెను. పుణ్యము చేసిన వానికి స్వర్గము ఇచటే గలదు, పాపము చేసిన వానికి నరకము ఇక్కడే గలదని తెలియాలి.


ఎంతదూరమైనా ఒక సెకనులో పదవవంతు కాలములో పోవు ఆత్మ, జీవాత్మలకు తాము ధరించెడి శరీరము ఫలానా ప్రదేశములో ఉన్నదని ముందే తెలిసియుండునా? అను ప్రశ్న కూడా కొందరికి రావచ్చును. దానికి జవాబు చూస్తాము. మరణమునకు ముందు అవసాన దశలో మనస్సుకు చివరి జ్ఞాపకము ఏదయితే వచ్చియుండునో దానికి సంబంధించిన జన్మ కలుగునని భగవద్గీతలో చెప్పబడినది. చివరి జ్ఞాపకములను మొదట రెండు రకములుగా విభజించవచ్చును. పరమాత్మ సంబంధ జ్ఞాపకములన్నీ ఒక రకము, ప్రపంచ సంబంధమువన్నీ రెండవ రకముగా చెప్పవచ్చును. ఆఖరు జ్ఞాపకము ఏ కోవకు చెందినదో, దానిలోను అది ఏ స్థాయికి చెందినదో దానిప్రకారము వచ్చే జన్మ ఉండును. దీనిని గురించి భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము ఆరవ శ్లోకములో...

శ్లో|| 6. యంయం వాపిస్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్!

తం తమే వైతి కౌంతేయ! సదాతద్భావ భావితః ||


అన్నాడు. దీనిప్రకారము చివరి దశలో ఏ భావముండునో దానికి సంబంధించిన జన్మయే లభ్యమగును. చివరిలో ప్రపంచ సంబంధము జ్ఞాపకము వచ్చివుంటే ఆ భావమునకు సరిపడు జన్మ ఏ స్థలములో, ఏ ఇంటిలో కల్గియుండునో ఆ ఇంటిలో జన్మించిన శిశువును ఆత్మ చేరగలదు. శరీరమును వదలిన వెంటనే చివరి మనోభావమునకు తగిన శరీర మెచట జన్మించి ఉండునో అచటికి ఆత్మ నేరుగా పోగలదు. జీవుని ప్రారబ్ధము ప్రకారము ఏ శరీరములో ప్రవేశించవలెనో, ఆ శరీరములోనికే ఆత్మ ప్రవేశించుటకు తగిన కారణము గలదు. అనుభవించవలసిన కర్మలను బట్టి, తెలియవలసిన జ్ఞానమునుబట్టి, చేరవలసిన జీవున్నిబట్టి శిశు శరీరములోని మెదడులో అమరికలుండును. మరణించిన వాని చివరి జ్ఞాపకమునకు క్రొత్త శరీరములోని అమరికలు సరిపడు శరీరమే ఆత్మకు గోచరమగును, అదియే గమ్యమగును. నీరు పల్లమునకు (తగ్గుకు) పారునట్లు ఆత్మ, మనస్సు చివరి జ్ఞాపకమునకు సరిపడు శరీరమునే చేరును. తాబేలు సముద్రము బయటికి వచ్చి ఇసుకగుంతలో గ్రుడ్లు పెట్టి పోవును. కొద్ది రోజులకు ఇసుకలోనే గ్రుడ్లు పిల్లలుగా మారి ఇసుక నుండి బయటికి వచ్చి సముద్రము వైపే పోవును. సముద్రము ఎక్కడున్నది కనిపించక పోయినా అటు ప్రక్కకే ప్రయాణము సాగును. ఒకవేళ దారి మళ్ళించిన అది మాత్రము అటువైపే పోవును. సముద్రము తెలియనట్లు, దారి లేనట్లు ఒక పెద్ద గోడను పర్లాంగు పొడవు కట్టినా, తాబేలు పిల్ల ప్రక్క దిశలకు పోక గోడ పొడవున వచ్చి తిరిగి సముద్రమువైపే పోవును. అలాగే ఒక పావురమును వెయ్యిమైళ్ళ దూరములో వదలిన తన ఊరెటువైపు ఉన్నదో అటువైపే ప్రయాణము చేయును. అప్పుడే పుట్టిన తాబేలు పిల్ల ఎన్ని అడ్డంకులున్నప్పటికీ సముద్రపు దిశను గుర్తించుచున్నది. అట్లే దారి, దిశ తెలియని పావురము తన ఊరి దిశను సులభముగా గుర్తించుచున్నది. అలా గుర్తించు శక్తి వాటి శరీరములోని ఆత్మలకు గలదు. అట్లే ప్రారబ్ధ కర్మకు తగిన శరీరమును మరియు చివరి యోచనకు తగిన మడతలు గల మెదడున్న శరీరమును ఆత్మ గుర్తించగలదు.


మనిషి సంపాదించుకొన్న ఆగామికర్మ, సంచితకర్మలో కలిసిపోయి వుండును కదా! మనిషి మరణించినపుడు సంచితములోనిది ప్రారబ్ధముగా ఎలా మారుచున్నది? అని కొందరడుగవచ్చును. దానికి సమాధానము మరణ సమయములో శరీరమంతా శక్తి కోల్పోయి అన్ని అవయవములు పని చేయని స్థితిలో ఆత్మ ఊపిరితిత్తుల ద్వారా కొద్దిమాత్రము శ్వాసను ఆడిస్తూ చివరకు మనస్సు యొక్క పనిని కూడా నిలిచిపోవునట్లు చేయును. ఆ సమయములో చివరగా తనకందిన దానిని మాత్రము జీవాత్మ చూస్తుండును. ఒక శ్వాస తప్ప, మనస్సు కూడా నిలిచిపోయిన తర్వాత ఆత్మ బ్రహ్మనాడిలో చేరి నాల్గుచక్రములతో సహా ఒక్క క్షణముండునని ముందే చెప్పుకొన్నాము. ఆ క్షణములోనే చివరి మనోదృశ్యమును బట్టి సంచితమునుండి ప్రారబ్ధమును ఆత్మ చేతనే ఎన్నుకోబడును. జీవునికి చివరి దృశ్యము అందనంతవరకు ప్రారబ్ధము నిర్ణయము కాదు. చివరి దృశ్యమునుబట్టి ప్రారబ్ధము, ప్రారబ్ధమునుబట్టి రెండవ జన్మ శరీరము నిర్ణయించబడును. ఏ శరీరమును పొందవలసినది ప్రారబ్ధము నిర్ణయించగా, ప్రారబ్ధము జీవునికి వచ్చు చివరి మనోదృశ్యమును బట్టి నిర్ణయించబడును. చివరి క్షణములో సంచితమునుండి ప్రారబ్ధము నిర్ణయమైనపుడు ఆ సమయములోనే అంతవరకు సంపాదింపబడిన ఆగామి కర్మ సంచితములో కలిసిపోవును. సంచితము నుండి ప్రారబ్ధము తయారగుట మరియు సంచితములోనికి ఆగామికర్మ కలిసిపోవుట రెండూ ఒకే సమయములో జరిగిపోవును.


మనిషి తన జీవితములో ఏ విషయము మీద ఎక్కువ లగ్నమై బ్రతుకుచున్నాడో, ఏ విషయము మీద తన ఇచ్ఛ ఎక్కువగా ఉన్నదో, ఏ విషయమును ఎల్లప్పుడు తలచుకొనుచుండునో, ఆ విషయ జ్ఞాపకమే అవసానదశలో చివరిగా మనస్సుకు వచ్చి జీవునికి చేరును. ఎల్లపుడూ స్మరించుట చేత శరీరము వదలునపుడు అదే జ్ఞాపకము వచ్చి తర్వాత అదే స్థితిని పొందునని గీతలో కూడా చెప్పారు. అంతేకాక ''ఎల్లపుడూ నన్నే స్మరించుము, చివరిగా నేనే జ్ఞప్తికి వచ్చి నాలోనికే ఐక్యమగుదువని'' దేవుడు తెల్పడము కూడా జరిగినది. ఈ విషయములను గీతలో అక్షర పరబ్రహ్మ యోగమను అధ్యాయము 7, 8 శ్లోకములలో...

శ్లో|| 7. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ |

మయ్యర్పిత మనోబుద్ధి ర్మామేవైష్యస్య సంశయః ||


శ్లో|| 8. అభ్యాస యోగ యుక్తేన చేతసానాన్య గామినా |

పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చిన్తయన్ ||


దీని భావము :- ''నీ మనస్సు, బుద్ధి అన్నీ నాకే సమర్పించి సర్వ కాలముల లందు నన్నే స్మరించుచుండుము. తప్పక నన్నే చేరగల్గుదువు. ధ్యానము, అభ్యాసము చేత మనసునందు నన్నే స్మరించుచుండుట వలన పరమము, దివ్యము అయిన నన్నే పొందగలవు''. అని గీతలో ఉపాయము కూడా చెప్పాడు.


జీవునికి తర్వాత జన్మ ఏదైనా రావచ్చునుగానీ, మరణించు సమయములో శారీరక, మానసిక బాధలన్నిటి నుండి తప్పించుకొని ఏ బాధ పొందడని చెప్పవచ్చును. ఇంతవరకు మరుజన్మకు పోవువానికి అవసాన దశలో జరుగు విషయమంతా వివరముగా తెలుసుకొన్నాము.


ఇంతవరకు చదివిన సమాచారములో మరణము శరీరములో ఎలా వస్తున్నదో పూర్తిగా తెలిసిపోయినది. మరణము వచ్చినప్పుడు మనిషి చేసుకొన్న కర్మను అనగా పాపపుణ్యములను పూర్తిగా లెక్కించి ఆ పాప పుణ్యముల ప్రకారము తర్వాత జన్మను నిర్ణయించడము జరుగుచున్నది. అది మాత్రము అత్యంత రహస్యమైన ప్రక్రియ. మనిషి కర్మనుబట్టి తీర్పు తీర్చు అధికారము పరమాత్మకు తప్ప ఎవరికీ లేదు. అయితే పరమాత్మ తన అధికారము ప్రకారము పని చేయక తీర్పు తీర్చు పనిని తన ఆత్మకు ఇచ్చాడు. దానివలన పరమాత్మకు బదులు ఆత్మే అందరికీ జన్మల తీర్పు చేయుచున్నది. ఈ విషయమును బైబిలు గ్రంథములో యోహాన్ సువార్తలో 5వ అధ్యాయము 22, 23 వచనములలో కలదు చూడండి.


(యోహాన్ 5-22, 23) ''తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.''


ఈ వాక్యములో తండ్రియని చెప్పిన చోట అల్లాహ్ అనియు లేక పరమాత్మ అనియు అర్థము చేసుకోవాలి. కుమారుడు అని చెప్పినచోట ఆత్మయని గ్రహించుకోవాలి. పరమాత్మ (దేవుని) కుమారుడు ఆత్మని తెలిసినప్పుడే వాక్యములోని భావము సక్రమముగా అర్థమగును. లేకపోతే ఏమీ అర్థము కాదు. దేవుడు తీర్పు తీర్చు అధికారమున్నవాడైనా, ఎవనికీ తండ్రి తీర్పు తీర్చడు అని వ్రాసియున్నారు. పరమాత్మ పని చేయడు కావున ఆయన తన పనిని తన కుమారుడైన ఆత్మకు అప్పజెప్పియున్నాడు. తండ్రి (అల్లాహ్) పనిని ఆత్మే చేయుచూ, సర్వజనులకు మరణ సమయములో కర్మల నిర్ణయము ప్రకారము రెండవ జన్మ ఏది రావలెనను నిర్ణయమను తీర్పును వెల్లడించుచున్నది.


కర్మ నిర్ణయము ప్రకారము మరణములో రెండవ జన్మ నిర్ణయము జరుగునప్పుడు ప్రక్కవాడుగానీ, తన బంధువులుగానీ, ఇతర దేవతలు గానీ, ఎవరూ ఏ సహాయమును అందించలేరు. ఇంతకు ముందు చెప్పిన వాక్యముల ప్రకారము ఎవరి సిఫారసుగానీ, ఎవరి సహాయముగానీ, ఎవరి ఓదార్పుగానీ ఉండదు. ఆత్మ ప్రతి చిన్న విషయమును లెక్కించి దానికి తగిన ఫలితమును పొందునట్లు జన్మ లభించునట్లు చేయును. ఆ సమయములో ఆత్మ ఎవరికీ అన్యాయము చేయదు. ప్రతి చిన్న కర్మను వదలకుండా లెక్కించు యంత్రములాగ ఆత్మ పని చేయును. జీవితములో జ్ఞానమును తెలిసి సక్రమముగా బ్రతికిన వానికి పాప కర్మలు తక్కువ యుండును. కావున వానికి తర్వాత జన్మ మంచిదే వచ్చును. అట్లు కాకుండా ప్రస్తుత జన్మలో అధికారము, ధనము ఉండుట వలన తాను ఏమి చేసినా తన బలము చేత జరుగునని, పాపమును లెక్కించక, తన ఇష్ట ప్రకారము పని చేసిన వానికి తర్వాత జన్మలో భయంకరమైన నరకము అనుభవించునట్లు నిర్ణయించి పంపబడును. ఈ విధముగా మరణ దినమున పాపపుణ్య కర్మల తీర్పు తీర్చబడును. పుణ్యము గలవాడు తర్వాత జన్మలో సుఖములను అనుభవించును. అట్లే పాపము గలవాడు కష్టములను అనుభవించు జన్మ వచ్చును. సుఖములను భూమిమీద జీవితములో అనుభవించడమును స్వర్గము పొందినట్లు లెక్కించవచ్చును. అట్లే కష్టములను అనుభవించడమును నరకమును పొందినట్లగును. తర్వాత జన్మలో స్వర్గ, నరకములను మరణములోనే నిర్ణయము జరుగును.


ప్రశ్న :- మీరు మనిషికి మరణ సమయములో ఒక సెకను కాలములో గత జన్మ కర్మ ప్రకారము రాబోయే జన్మ నిర్ణయించబడునని ఇప్పుడు చెప్పుచున్నారు. చెప్పడమే కాక దైవగ్రంథములలోని వాక్యములను కూడా సాక్ష్యముగా చూపుచున్నారు. ఇది నిజమని నమ్మాలా వద్దా? అని మాకు సంశయము ఏర్పడుచున్నది. ఎందుకనగా! గతములో మీరు ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథమును వ్రాశారు. అందులో 84వ పేజీలో మనిషి సంపాదించుకొను ఆగామి కర్మ 69 సం||, 5 నెలల, 10 రోజులకు ఒకమారు సంచితములో చేరిపోవుచున్నదని చెప్పారు. మరణ సమయములో సంచిత కర్మే ప్రారబ్ధముగా మారుచున్నది. దానిప్రకారము ఒక మనిషి అరవై (60) సంవత్సరములు బ్రతికి చనిపోయాడనుకొందాము. అరవై సంవత్సరముల ఆగామి కర్మ ప్రారబ్ధముగా మారుటకు అవకాశము లేదు కదా! అంతకుముందు 69 సంవత్సరములప్పుడు ఆగామి కర్మ మారి సంచితమై యుండుట వలన అప్పటి సంచితము నుండి రాబోవు జన్మకు ప్రారబ్ధము ఏర్పడుచున్నది. అంతేగానీ ప్రస్తుత జన్మలోని ఆగామి కర్మ నుండి ప్రారబ్ధము రాదు కదా! జన్మకు కావలసిన ప్రారబ్ధ కర్మ సంచితము నుండే రావలసియున్నది. ఈ జన్మలోని ఆగామి సంచితము కానందున అంతకు ముందు పోయిన జన్మలోని సంచితమే ఇప్పుడు రాబోయే జన్మకు కర్మగా మారుచున్నది కదా! ఈ జన్మ కర్మ ప్రారబ్ధముగా మారలేదు కదా! ఈ జన్మలో చేసుకొన్న కర్మనుబట్టి రేపు రాబోవు జన్మ నిర్ణయమగును. తీర్పులో జరిగేది అదే అన్నప్పుడు ఈ జన్మలో 60 సంవత్సరములు బ్రతికినా ప్రస్తుత జన్మలోని కర్మ రాబోవు జన్మకు ఏమాత్రము రాలేదు కదా! ఇప్పుడు 60 సంవత్సరములు చేసిన పాపపుణ్యములు వచ్చే రెండవ జన్మకు రావు కదా! యని అడుగుచున్నాను. దీనికి మీరేమంటారు?


జవాబు :- మనుషుల వెనుకటి జన్మల కర్మలు ప్రారబ్ధముగా మారుననుట వాస్తవమే. శాస్త్రపద్ధతి ప్రకారము 69 సం||, 5 నెలల, 10 రోజుల కర్మ ఒకమారు సంచిత కర్మలో చేరడము సూత్రబద్ధమైన పని. ఈ విషయమును సంపూర్ణముగా తెలియుటకు మా రచనలలోని ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథమును చూడవలెను. ఒకమారు సంచితముగా మారిన కర్మ చిన్నచిన్న జన్మలకయితే ఒకే జన్మకు పరిమితి కాకుండా కొన్ని జన్మల వరకు ప్రారబ్ధమగుచుండును. 70 సంవత్సరముల పైన 80, 90, 100 సంవత్సరములు బ్రతుకు వారికి రెండు సంచితముల కర్మ ప్రారబ్ధముగా తయారగును. సంచితములో నిలువయున్న కర్మనుబట్టి జన్మలు నిర్ణయించబడుచుండును. కొందరికి కర్మల పేర్లు కూడా తెలియవు. కావున ప్రథమ దైవగ్రంథములో యున్న ప్రకారము చెప్పితే ఒక జన్మలో తయారయి క్రొత్తగా వచ్చు కర్మను ఆగామి కర్మ అంటాము. ఒక జన్మలో నిర్ణయింపబడి ఆ జన్మలో అనుభవించు కర్మను ప్రారబ్ధ కర్మ అంటున్నాము. జన్మ జన్మకు మిగులుపడుచూ వచ్చు కర్మను సంచిత కర్మ అని అంటున్నాము. మొదటి జన్మలో సంపాదింపబడిన కర్మను ఆగామి కర్మయనగా! ఆగామికర్మ సంచిత కర్మగా మారి నిలువయుండును. నిలువ యున్న సంచితకర్మ నుండి ఒక జన్మకు ఆత్మ కేటాయించబడిన కర్మను ప్రారబ్ధకర్మ యని అంటారు. మొదట ఆగామికర్మ, తర్వాత సంచిత కర్మ, ఆ తర్వాత ప్రారబ్ధ కర్మయని వరుస క్రమము తెలియవలెను.


కర్మల విషయము అర్థము కాక పండితులు కూడా భ్రమపడు చుందురు. సక్రమముగా అర్థము చేసుకోలేరు. అందువలన మీరు ఈ కర్మల విషయములో బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించి సక్రమముగా తెలియవలెనని తెల్పుచున్నాను. కర్మల విషయమై భగవద్గీతలో జ్ఞాన యోగమున 16వ శ్లోకమందు ఇలా చెప్పారు చూడండి...

శ్లో|| 16. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః |

తత్తే కర్మ పవ్రక్ష్యామి యద్జ్ఞాత్వా మోక్షసే శుభాత్ ||


భావము :- ''కర్మయేదో, ఏది కర్మకాదో పండితులు కూడా తెలియక భ్రమపడుచుందురు. సంసార బంధనమెల్ల దేని చేత (ఏ జ్ఞానము చేత) లేకుండా పోవునో దానిని చెప్పెదను వినుము.''


కర్మ విషయములో నేడు పెద్ద స్వాములుగా యున్నవారు, గొప్ప బోధకులుగా యున్నవారు, మాకు దేవుని జ్ఞానము తెలియును అనువారు అందరూ పొరపడియున్నారు. కర్మల విషయములో వారివద్ద ఖచ్చితమైన సమాచారము లేదు. అందువలన కర్మలు అంటుకోవడములో గానీ, కర్మలు అనుభవానికి రావడములోగానీ మనుషులవద్ద సరియైన అవగాహన లేదు. ఎంతవారైనా ఎంత పెద్ద జ్ఞానులయినా కర్మలను గురించి తెలియ వలసియున్నది. చనిపోయిన దినమున ఒక్క క్షణములో ఆత్మచేత రెండవ జన్మకు సరిపడు కర్మ నిర్ణయమగుచున్నది. చనిపోయినప్పుడు మనిషి యొక్క కుల, మత, వర్గ భేదములు లేకుండా ఆత్మ అందరికీ సమానముగా ఉండి ఖచ్చితమైన న్యాయ నిర్ణయము ప్రకారము కర్మలను రెండవ జన్మకు నిర్ణయించును. 'మాకు జన్మలు లేవు' అనే వారిని కూడా వదలడము లేదు. చావును చవిచూచిన ప్రతి మనిషి ఒక్క సెకను కాలములో తీర్చబడు తీర్పుకు లోనుకావలసిందే.


చనిపోయిన జీవాత్మలన్నీ ఆత్మవద్ద హాజరు కావలసిందే. ఎక్కడ హాజరు అవుదురు? అనుమాటకొస్తే తెలిసే విషయము ఆశ్చర్యముగా ఉండును. మనిషి చనిపోవు సమయములో శరీరమును జీవాత్మ వదలి పోవలసియుండును. ఎప్పుడయితే జీవుడు శరీరమును వదలి బయటికి పోవునో అప్పుడు వాడు మరణము పొందినట్లగును. మరణమును పొందు జీవుడు రెండవ జన్మకు కావలసిన ప్రారబ్ధ కర్మను మరణము పొందు చివరి క్షణములో శరీరమందే ఆత్మ చేత తీర్పు తీర్చబడి, రెండవ జన్మ ఏది? ఎక్కడ? అను విషయము నిర్ణయమగును. రెండవ జన్మ నిర్ణయము జరిగిన తర్వాతనే జీవాత్మను, ఆత్మ శరీరమునుండి తీసుకొని రెండవ జన్మకు చేర్చును. రెండవ జన్మకు వచ్చి క్రొత్తగా పుట్టిన శిశు శరీరములో జీవాత్మ చేర్చబడును. అలా చేరిన తర్వాత జీవితము షరా మామూలుగానే కర్మ ప్రకారము జరుగుచుండును. మనిషి చనిపోవు సమయములో ఒక్క క్షణమందు రెప్పపాటు కాలములో కర్మ నిర్ణయము పాత శరీరమందే జరుగును. పాత శరీరమందు కర్మచక్రములో సంచిత కర్మయుండగా సంచిత కర్మనుండి రాబోవు జన్మకు సరిపోవు ప్రారబ్ధమును కేటాయించడము జరుగును.


అలా పాత శరీరమును వదలి పోవుముందు ఒక సెకను కాలములో జరుగు కర్మనిర్ణయ ప్రక్రియ (తీర్పు తీర్చు కార్యము) జరుగునప్పుడు మనిషి బ్రతికియున్నప్పుడున్న మతముగానీ, మతమును బోధించిన మనుషులు కానీ అడ్డుపడి ఘోర కర్మ నుండి తప్పించలేరు. ఒక మనుషులే కాక అతను సంపాదించుకొన్న ధనముగానీ, హోదాగానీ, ఎవరి సిఫారసు గానీ, కర్మ నుండి మనిషిని విడిపించడము గానీ కర్మను తగ్గించునట్లు ఉపయోగపడడముగానీ ఉండదు. మనిషి బ్రతికియున్నప్పుడు ఆరాధింపబడిన దేవతలుగానీ కర్మనిర్ణయ సమయములో మనిషికి ఏ సహాయము చేయలేరు. అప్పుడు ఎవరి సహాయము అక్కడ ఆ సమయములో పనికి రాదు. నేను పండితుడను, జ్ఞానిని, యోగిని అనువారు కూడా మౌనముగా యుండి కర్మ తీర్పు ప్రకారము పోవలసిందే. తీర్పు తీర్చు విధానము ఎవరికీ తెలియకపోవడము వలన చాలామందికి రెండవ జన్మ భయమే లేకుండా పోయినది. అత్యంత రహస్యమైన తీర్పు విధానమును స్పష్టముగా తెలియజేశాము. ఇందులో సంశయమున్నా, అర్థము కాని విషయమున్నా అడుగవచ్చును. జ్ఞానము సముద్రము వంటిది. మనిషికున్న ఇష్టతను (శ్రద్ధను) బట్టి తెలియుచుండును. నేను ఎంతో గొప్ప రహస్యమైన విషయమును చెప్పినా, ఇంకా కొంత జ్ఞానము మిగిలియున్నదని చెప్పుచున్నాను. అయితే చెప్పిన వరకు నూటికి నూరుపాళ్ళు సత్యమే చెప్పబడినది. ఇందులో ఏమాత్రము సంశయము లేదు.


ప్రశ్న :- మీరు చెప్పిన దానిని గురించి ఏమాత్రము సంశయము లేదు. మీరు చెప్పిన వివరము మూడు దైవగ్రంథములకంటే మిన్నగా అర్థమగునట్లు గలదు. తీర్పును గురించి బైబిలులో కొంత, ఖుర్ఆన్ గ్రంథములో కొంత చెప్పియున్నా అక్కడ అర్థముకాని వివరమంతా ఇక్కడ మీరు చెప్పుట వలన అర్థమయినది. అయినా చిన్న ప్రశ్న ఒకటి కలదు. అదేమనగా! మనిషి చనిపోయిన సమయములో పాత శరీరమునందే రాబోవు జన్మను గురించిన నిర్ణయము జరుగుననీ, ఆ నిర్ణయము ప్రకారమే క్రొత్త శరీరమును ధరించడము, క్రొత్త జీవితము ఏర్పడడము జరుగునని తెలుసుకొన్నాము. మీ మాట ప్రకారమే రాబోయే జన్మలో పుట్టుకతోనే కుంటివాడుగా పుట్టవలెనని, అందరికీ ఉన్నట్లు రెండు కాళ్ళు కాకుండా గర్భములో ఒకకాలే తయారయి వుండుట వలన, వాడు రెండవ జన్మలో జీవితమంతా కుంటివానిగా బ్రతుకవలసి యుండును. రెండవ జన్మ కుంటివానిగా బ్రతకవలెనని మరణ సమయములోని ఆత్మ తీర్పులో నిర్ణయముకాగా అదే సమయములో క్రొత్త శరీరములో ప్రవేశించి జననము జరుగవలెను కదా! తల్లిగర్భములో దాదాపు తొమ్మిది నెలలనుండి కుంటి శరీరము తయారు కావలసియున్నది. అప్పుడు ఒక్క క్షణములో జరుగు నిర్ణయమునకు సరిపడు శరీరము ముందే ఎలా తయారగును? అను ప్రశ్న వచ్చినది. చనిపోవు వాని కర్మ ముందే నిర్ణయము జరిగియుంటే దానికి సరిపడు శరీరము తయారగుటకు వీలగును. అట్లు ముందే తీర్పు జరగనప్పుడు వాని కర్మకు తగిన శరీరము ముందే ఎలా తయారగు చున్నదను ప్రశ్నకు జవాబును తెలుపమని కోరుచున్నాము?


జవాబు :- ఇంతకు ముందు నా జవాబును ముగించునప్పుడు చివరిలో నేను ఎంత చెప్పినా ఈ విషయములో ఇంకా కొంత జ్ఞానము మిగిలి యున్నదని చెప్పాను. నేను ఏదయితే మిగిలియున్నదని చెప్పానో దానినే నీవు అడగడము జరిగినది. నేను ఈ విషయమై చెప్పడము అసందర్భ మగునని ముందు చెప్పలేదు. ఇప్పుడు నీవు అడిగావు కావున నేను సందర్భానుసారము చెప్పగలను. జాగ్రత్తగా, శ్రద్ధగా వినమని తెల్పు చున్నాను. పాపములు ప్రపంచ సంబంధమైనవి సర్వసాధారణముగా ఉండును. అయితే మరొక రకమైన పాపము కొందరికి మాత్రమే అరుదుగా ఉండును. దీనినిబట్టి పాపములు రెండు రకములని తెలియుచున్నది. ఒకటి ప్రపంచ సంబంధ పాపముకాగా, రెండవది దైవ సంబంధ పాపమని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధ పాపములు మనుషులకు సర్వ సాధారణము. ప్రపంచ సంబంధ కర్మ ఏదయినా 69 సంవత్సరముల 5 నెలల 10 రోజులకు ఒకమారు సంచితములో చేరుచుండును. అది ఇంతవరకు చెప్పిన విధానమంతయూ సత్యమే. అందులో ఎటువంటి అసత్యము లేదు. ప్రపంచ సంబంధ పాపపుణ్యములను మనిషి పూర్తి శరీరముతో సుఖ దుఃఖములుగా (స్వర్గ, నరకములుగా) భూమిమీదనే తన జీవితములో అనుభవించును. ప్రపంచ సుఖ దుఃఖములను మనిషి అంగ లోపము లేని శరీరముతోనే అనుభవించవలెను. అనగా కుంటి, గ్రుడ్డి, చెవిటి, మూగ అను అవయవ లోపములేని శరీరములోనే అనుభవించ వలసి యున్నది. శరీరములో ఏ అవయవ లోపముయున్నా అది ప్రపంచ సంబంధ పాపమునకు సంబంధము లేదు.


దైవ సంబంధ పాపము చేసుకొన్న వానికి శరీరములో అవయవ లోపము ఏర్పడును. దైవసంబంధ పాపము పుణ్యము (దైవ సంబంధ కర్మ) ప్రపంచ సంబంధ ఆగామి కర్మవలె 69-5-10 రోజులకు కర్మ చక్రములోని సంచితములో చేరదు. ప్రస్తుతము జరుగుచున్న జన్మలో దైవ సంబంధ కర్మవస్తే అది ఆగామిగా అట్లే ఎంత కాలమయినా ఉండి మనిషి మరణించినప్పుడు తీర్పు జరుగు క్షణములో నేరుగా ప్రారబ్ధము కాగలదు. దేవునికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా ప్రవర్తించిన వారికి మాత్రమే అలా జరుగును. దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడినా, దేవుని జ్ఞానమునకు తప్పు అర్థములను ఆపాదించి చెప్పినా, అటువంటి వారందరికీ రెండవ జన్మలో శరీర అంగ లోపము ఏర్పడి జీవితములో అంగ లోపమునకు సంబంధించిన కష్టములను, బాధలను పొందవలసి యున్నది. అటువంటి వారిని నష్టాత్ములని చెప్పవచ్చును. అందరివలె వారి శరీరములో ఆత్మశక్తి అన్ని అవయవములకు ప్రాకదు. ఆత్మశక్తి ప్రాకని వారి శరీరములోని అవయవములు పుట్టుకతోనే లేకుండా యుండును. ఒకవేళ అవయవములున్నా మధ్యలో అయినా ఆత్మశక్తి అవయవములకు ప్రాకకుండా నిలిచిపోవడము వలన అవయవములు పని చేయవు. చేయివుండి పని చేయకపోతే వానిని నష్టాత్ముడని చెప్పవచ్చును. కొందరికి 'చేయి' అను అవయవమే లేకుండా ఉండుట వలన అటువంటి వానిని కూడా నష్టాత్ముడేయని చెప్పవచ్చును. ఆత్మశక్తిని నష్టపోయిన వానిని నష్టాత్ముడు అని అనవచ్చును.


దైవజ్ఞానమును బోధించు బోధకుడిగా యుండి తప్పు భావములను బోధించిన వానికి శరీరమునకు అవయవములే లేకుండా పుట్టగలడు. అట్లుకాక బోధించిన దానిని విని తప్పు దారిపట్టినా, తర్వాత సత్యము తెలిసినప్పుడు కూడా తన భావమును మార్చుకోకుండా తన మతములో ఇట్లే చెప్పవలెను, అట్లే చేయవలెను అని మతమునకు కట్టుబడి సత్యమునకు దూరముగా ఉండు వానికి శరీర అవయవములున్నా అందులో ఆత్మశక్తి ప్రవహించదు. ఆత్మశక్తి ప్రవహించని అవయవములున్నా లేకున్నా ఒక్కటే. ఈ విషయమును గురించి ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అను అధ్యాయములో ఎనిమిది, తొమ్మిది శ్లోకములలో చెప్పియున్నారు. అక్కడ ఏమి చెప్పారో ఇప్పుడు క్రింద చూస్తాము.

శ్లో|| 8. అసత్య మపత్రిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్ |

అపరస్పర సమ్భూతం కి మన్యత్కా మహైతుకమ్ ||


భావము :- ప్రపంచములో దేవుడనే వాడు ఎవడూ లేడనుచూ, దేవుడు ప్రపంచమును సృష్ఠించలేదనీ, పరస్పర రసాయనిక మార్పుల వలన ప్రపంచము జీవరాసులు పుట్టాయనుచూ, జగతి పుట్టుటకు దేవుడు కారణము కాదనీ, ప్రపంచము నిత్యము జరుగుటకు మనిషిలోని ఆశే కారణమనీ, మనిషి కోర్కెవలన మనిషి తలచుట వలన అన్నిటినీ కనిపెట్టుచున్నాడని నాస్తికత్వమును చెప్పుచుందురు.

శ్లో|| 9. ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయః |

పభ్రవ న్త్యుగక్రర్మాణః క్షయాయ జగతోహితాః ||


భావము :- ఇటువంటి అజ్ఞానముతో పుట్టుచున్న వారందరూ నష్టాత్ములై, అల్పబుద్ధి కలవారై, అశుభమును చేయువారై భయంకర కర్మలతో పుట్టు చుందురు. వీరివలన లోకమునకు నష్టము, నాశనము కల్గుచుండును. వీరి శరీరములలో ఆత్మశక్తి కొన్ని అవయవములకు ప్రవహించదు. కావున వీరిని ''నష్టాత్మా'' యని శ్లోకములో చెప్పారు.


శరీర అవయవములలో కాలు, చేయి లేనివానిని అంగలోపము గలవాడని అనుచుందురు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంగము వుండి అంగములో శక్తిలేని వానిని నష్టాత్ముడని శ్లోకములో చెప్పినట్లు కాక అంగహీనుడని కూడా అనవచ్చును. ఇదంతయూ దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడిన వానికి మాత్రమే మరణ సమయములో తీర్పునందు గత జన్మలోని దైవిక పాపము రెండవ జన్మకు నేరుగా ప్రారబ్ధ కర్మయగుచున్నది. దైవిక పాపము ఆగామి నుండి నేరుగా ప్రారబ్ధము కాగలదు. ప్రపంచ కర్మవలె ఆగామి కర్మ సంచితకర్మగా మారదు. అందువలన వెనుక జన్మలో ఎప్పుడు చేసినా అది దైవిక కర్మయిన దానివలన వెంటనే రెండవ జన్మలో అనుభవానికి వచ్చునట్లు నిర్ణయించబడుచున్నది. దైవ సంబంధ పాపముగానీ, పుణ్యముగానీ సంచిత కర్మలో చేరిపోక, తీర్పులో ప్రారబ్ధ కర్మగా మారి అనుభవమునకు రెండవ జన్మలోనే వచ్చుచున్నదని చాలామందికి తెలియదు.


దేవుని జ్ఞానమును తప్పుదారి పట్టించిన వానికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖము చేసినవానికి, ఒక మతములో యుండి ఆ మతమునకు సంబంధించిన అజ్ఞానముతో వేరొక ఇతర దైవగ్రంథములోని జ్ఞానమును కించపరచినట్లు మాట్లాడిన వానికి, ఆత్మశక్తి యొక్క నష్టము జరిగి నష్టాత్ముడని చెప్పవచ్చును. ఇందులో దైవికమైన మరియొక పెద్ద పాపము గలదు. అది ఏమనగా! దేవుని జ్ఞానమునేకాక దేవున్నిగానీ, దేవుని కుమారుడైన సాకార భగవంతునికి గానీ, అట్లే దేవుని కుమారుడుగా చెప్పబడు ఆత్మకు గానీ వ్యతిరేఖముగా దూషణగా మాట్లాడువానికి గానీ, వ్యతిరేఖముగా చేయువానికి గానీ భయంకరమైన పాపము సంభవించును. ప్రపంచ సంబంధమైన పాపమును దైవజ్ఞానము చేత దహించుకొని లేకుండా చేసుకోవచ్చును. అనుభవించకుండా తప్పించుకోవచ్చును. అయితే దేవునికి, దేవుని కుమారుని సాకారమునకు, నిరాకారమునకు వ్యతిరేఖముగా మాట్లాడిన వానికి, కార్యములు చేసిన వానికి అంగలోపము అవయవ లోపముతో పోదు. 'ఆత్మశక్తిని నష్టపోవడము' అను శిక్షతో సరిపోదు. అటువంటి వానిని 'రెండు యుగముల పర్యంతము నిత్యము పాపము అనుభవించు శిక్ష పడును.' నా మాటను నమ్మలేకపోతే ఇంజీలు గ్రంథములో (బైబిలులో) మత్తయి సువార్తయందు 12వ అధ్యాయము 31, 32 వాక్యములలో వ్రాసినది చూస్తే మీకే అర్థమగును. (మత్తయి 12-31, 32) ''మనుష్యులు చేయు పత్రి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగ మందైననూ, రాబోవు యుగమందైననూ పాప క్షమాపణ లేదు.''


ఇక్కడ చెప్పిన దైవ గ్రంథములోని రెండు వాక్యములలో రెండు యుగముల కాలము నిత్యము పాపము అనుభవించ వలసిందే. వానికి పాప క్షమాపణ లేదని చెప్పడమైనది. దేవుని జ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడినా, బోధించినా వానికి ఆత్మశక్తి నష్టము అంగ లోపము కల్గును. అయితే నేరుగా దేవున్నే వ్యతిరేఖముగా మాట్లాడువానికి పాప క్షమాపణ లేకపోవడమే కాక భయంకరమైన పాపమును రెండు యుగముల పర్యంతము అనుభవించవలసి వచ్చును. మనుష్యులను దూషించిన పాపమును దైవజ్ఞానము వలన దైవసేవ వలన జ్ఞానమను అగ్నిని సంపాదించుకొని కర్మను కాల్చుకోవచ్చును. దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడినా, వ్యతిరేఖముగా చేసినా వాని కర్మపోదు. వాడు రెండు యుగములు ఎడతెరపిలేకుండా నిత్యము అనుభవించవలెను. దేవున్ని గానీ, ఆత్మనుగానీ, ఆత్మ శరీరము ధరించి భగవంతునిగా సాకారముగా వచ్చియున్నప్పుడు గానీ దూషించినా, వ్యతిరేఖ కార్యములు చేసినా వానికి భయంకరమైన పాపము తప్పదని హెచ్చరిక చేయడము జరిగినది.


దైవ దూషణ ఒక మనిషి చేశాడనుకొనుము. అప్పుడు వానికి సంభవించు పాపము ఆగామికముగా మొదట వచ్చును. అది ప్రపంచ కర్మవలె సంచితముగా మారదు. నేరుగా మరణ సమయములో రెండవ రాబోవు జన్మలో అనుభవమునకు వచ్చునట్లు ప్రారబ్ధ కర్మగా మారుచున్నది. అందువలన దైవ సంబంధమైన కర్మను ప్రపంచ సంబంధ కర్మతో సమానముగా లెక్కించకూడదు. రెండవ జన్మకే కాచుకొనియుండు కర్మ ప్రకారము తల్లిగర్భములో తయారగు శిశువు కూడా అంగవైకల్యముగా తయారగుచున్నది. అంగవైకల్యమైన శరీరము ఎవనికి కలదో వానిని దైవ సంబంధ కర్మవలన వచ్చిన ఫలితమని తెలియవలెను. దైవ సంబంధ కర్మ సంచితముగా యున్నా అది ప్రారబ్ధముగా మారి అనుభవించుటకు సిద్ధముగా యుండుట వలన పుట్టకముందే శరీరము మార్పులకు లోనగుచున్నది.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

12. అల్లాహ్ రంగును స్వీకరించండి. (2-138)

ఖుర్ఆన్ గ్రంథములో మూడవ సూరా, ఏడవ ఆయత్నందు దైవ గ్రంథములో రెండు రకముల వాక్యములు కలవని, వాటినే స్థూల, సూక్ష్మ వాక్యములని చెప్పడమైనది. స్థూలము అనగా ప్రత్యక్షముగా తెలియునదని అర్థము. అలాగే సూక్ష్మము అనగా నేరుగా తెలియకుండా ఆలోచిస్తే గానీ తెలియదని, నిగూఢముగా ఉండు విషయమని అర్థము. వీటినే గ్రంథములో ముహ్కమాత్ వాక్యములని స్థూలవాక్యములను, ముతషాబిహాత్ వాక్యములని సూక్ష్మవాక్యములను చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో సూక్ష్మవాక్యములు దాదాపు అరవై (60) శాతము గలవు. పై వాక్యము కూడా ముతషాబిహాత్ (సూక్ష్మవాక్యము) నకు సంబంధించినదేయని చెప్పవచ్చును. ఈ వాక్యములో పైకి కనిపించు అర్థము ఒకటియుండగా వాక్యములో అణిగియుండు అర్థము వేరుగాయుండును. మసక చీకటిలో దారిలో పడియున్న త్రాడు పామువలె కనిపించును. ప్రత్యక్షముగా కనిపించునది పాముగాయున్నా దానినే దీపము వెలుగులో చూస్తే పాము కాదు త్రాడని తెలియును. అలాగే వాక్యము పై చూపుకు ఒక విధమైన భావమును కల్గించినా దానినే 'బుద్ధి విచక్షణ' అను వెలుగులో చూడగలిగితే వాక్యములోని సత్యమైన భావము తెలిసిపోవును.


అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 138 నందు సూక్ష్మ భావము ఎలా అణిగియున్నదో ఇప్పుడు చూస్తాము.


(2-138) ''అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రము ఆయన్నే ఆరాధిస్తాము.''


ఈ వాక్యములో రంగు అనుమాట సూక్ష్మ అర్థముతో కూడుకొని యున్నది. ప్రస్తుత కాలములో ముస్లీమ్‍లందరూ సూక్ష్మవాక్యముల జోలికి పోకూడదనీ, ఏ వాక్యమునకయినా సూక్ష్మ అర్థముతో చెప్పకూడదనీ, అలా చెప్పువారు తమకు ఇష్టమొచ్చిన భావమును చెప్పుచుందురని చెప్పుచూ, సూక్ష్మ అర్థమును చూడడము మానివేసి ప్రతి వాక్యమునకు స్థూలముగానే అర్థము చెప్పుచుందురు. ఒక విధముగా సూక్ష్మవాక్యములకు కొందరు తప్పు భావమును చెప్పియుండవచ్చును. అంతమాత్రమున అందరూ అలాగే చెప్పుదురని, ఎవరు సూక్ష్మ అర్థమును చెప్పినా వినకుండాపోతే మొత్తానికి ఆ వాక్యమును పూర్తిగా పోగొట్టుకున్నట్లగును. సూక్ష్మవాక్యములకు ఎవరయినా అర్థమును చెప్పగలిగితే అది వాస్తవమా కాదా!యని మన బుద్ధిని ఉపయోగించి చూచి అది సత్యమా కాదా!యని పరిశీలించవచ్చును. వాక్య అర్థము శాస్త్రబద్దమా కాదా!యని చూచి తెలియవలెను.


(3-7) వాక్యములో ముతషాబిహాత్ (సూక్ష్మ) వాక్యములకు అర్థము అల్లాహ్‍కు తప్ప ఏ మనిషికీ తెలియదని చెప్పారు. అంతేకాక ఎవరికయితే బుద్ధి శ్రద్ధ, జ్ఞానము మీద ఉండునో వాడు అసలయిన అర్థమును గ్రహించ గల్గును అని చెప్పియున్నారు. ఆ మాట ప్రకారము సూక్ష్మ వాక్యములలోని అర్థము అందరికీ తెలియదనుట వాస్తవమే. సూక్ష్మ వాక్యముల అర్థము దేవునికి మాత్రమే తెలుసుననుట కూడా సత్యమే. అట్లు మనుషులకు తెలియనప్పుడు ఆ వాక్యములను చెప్పి ప్రయోజనముండదు. కావున దేవుడు మనుషులు తెలియుటకు ఒక అవకాశమిచ్చాడు. అది ఏమనగా! దేవుని జ్ఞానము మీద శ్రద్ధయున్న వానికి, వాని శ్రద్ధనుబట్టి వాని బుద్ధి పని చేయునట్లు చేసి, వాని బుద్ధికి తగినట్లుగా అర్థమగునట్లు దేవుడే చేయుచున్నాడు. అలా చేయుట వలన గ్రంథములో గల సూక్ష్మవాక్యముల అర్థము ప్రజలకు తెలియుచున్నది. ఈ విధముగా దేవుడు తనకు మాత్రము తెలిసిన జ్ఞానమును ప్రజలకు వారి శ్రద్ధనుబట్టి తెలుపుచున్నాడు. అందువలన దేవుని జ్ఞానము శ్రద్ధయున్న మనుషులకు అక్కడక్కడ అర్థమగు చున్నది. దేవుని జ్ఞానము అర్థమయిన వాడు ఎవడయినా సూక్ష్మవాక్యము యొక్క అర్థమును చెప్పితే దానిని విని ఇతరులు కూడా తెలుసుకోవచ్చును. అట్లు కాకుండా 'దేవునికి తప్ప ఎవరికీ తెలియదను' సూత్రము ప్రకారము మనుషులు చెప్పిన మాటలన్నీ తప్పే అంటే మనము దేవుని జ్ఞానమును నష్టపోయినట్లగును. దేవుడు ఎవరితోనూ మాట్లాడడు. అందువలన దేవుడు తనకు తెలిసిన జ్ఞానమును ఇతరులకు చెప్పుటకు వీలుపడదు. దేవుని జ్ఞానము దేవునికే తెలిసినా, ఇతర మనుషులకు ఎవరికీ తెలియకున్నా దేవుడు మనుషులకు ఏదో ఒక రకముగా తెలియజేయును. మనిషి శ్రద్ధను బట్టి మనిషికి దేవుని జ్ఞానము దైవగ్రంథము నుండి అర్థమగులాగున చేయును.


దేవుని జ్ఞానము గ్రంథములో సూక్ష్మ వాక్యములు (ముతషాబిహాత్) గా వ్రాసియుంచినా అది అర్థమగుటకు ఒక మార్గమును దేవుడు ఏర్పరచి యున్నాడు. మనిషికున్న శ్రద్ధ, గ్రంథములోని దైవశక్తి రెండూ కలిసినప్పుడు ఆ మనిషిలో బుద్ధికి విచక్షణ ఏర్పడును. మనిషి బుద్ధికి విచక్షణ ఎంత ఏర్పడునో అంతవరకు వాక్యములో చెప్పిన జ్ఞానము అర్థము కాగలదు. మనుషులలో దైవజ్ఞానము మీద శ్రద్ధ పది శాతమునుండి 20, 30, 40, 50, నుండి 100 శాతము వరకు శ్రద్ధగలవారు కలరు. నూరుశాతము శ్రద్ధ కలవానికి దైవవాక్యములోని సూక్ష్మ అర్థము నూరుశాతము అర్థము కాగలదు. అలా నూరు శాతము అర్థమయిన వ్యక్తి సూక్ష్మ వాక్యములకు వివరము చెప్పినప్పుడు అది నూటికి నూరు శాతము సత్యమైన భావముగా ఉండును. అటువంటప్పుడు చెప్పిన వ్యక్తి మాటలోని సత్యమైన జ్ఞానమును విని తెలియవలయును. అట్లు వినకుండా మనుషులు చెప్పు జ్ఞానము సరియైనది కాదు అంటే అటువంటి వాడు ఎప్పటికీ సత్యమైన జ్ఞానమును తెలియలేడు.


ఎప్పుడయినా దేవుని జ్ఞానము మనిషి చెప్పగా విని తెలియవలసిందే గానీ వేరు దారి లేదు. ఎవరు సత్యమైన జ్ఞానమును చెప్పునది నీకు అర్థము కాకపోతే చెప్పినది ముందు విని తర్వాత బుద్ధి చేత యోచించితే అందులో సత్యమున్నదీ, లేనిదీ తెలిసిపోవును. తెలియాలను శ్రద్ధ యుండుట వలన వినిన మాటలోని సత్యాసత్యము తెలియు శక్తిని దేవుడు ఇచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో (2-138) వాక్యమును చూచాము కదా! అందులో ''అల్లాహ్ రంగును స్వీకరించండి, అంతకంటే మంచి రంగు ఎవరిదీ లేదు'' అని కూడా చెప్పారు. ఈ వాక్యమును వ్రాసిన చోట గ్రంథకర్తలు, గ్రంథ అనువాదకులు ఎవరయినా కావచ్చును, వారు వాక్యమునకు వివరమును వ్రాశారు. వారు వ్రాసిన వివరమును చూస్తే చాలావరకు కళ్ళకు కనిపించే రంగును గురించే వ్రాశారు. క్రైస్థవులు పసుపు రంగును పవిత్రముగా చూస్తారని చెప్పి వారు అనుకొన్న పసుపురంగు కంటే గొప్పది ఇస్లామ్ ధర్మము అని కనిపించే రంగునుండి నేరుగా ఒక ధర్మము వైపు వచ్చారు. ధర్మములలో ప్రతి మతమునకు ఒక ధర్మమున్నది. అందులో ఇస్లామ్ ధర్మమని చెప్పడము ఒక మత ధర్మాన్ని చెప్పినట్లగుచున్నది. వారు చెప్పినది అంతా విన్న తర్వాత వారు బయటి రంగును గురించి మాట్లాడుచున్నారా? లేక ఒక మత ధర్మమును గురించి మాట్లాడుచున్నారా? అని స్పష్టముగా తెలియలేదు. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథములో వ్రాసిన విషయమును ఇక్కడ వ్రాయుచున్నాము చూడండి.


''క్రైస్థవులు పసుపు పచ్చ రంగుగల నీరును ప్రత్యేకించుకున్నారు. దాన్ని వారు క్రైస్థవ పిల్లలకు ఇస్తారు. క్రైస్థవము (బాప్తిస్మం) పుచ్చుకోదలచిన వారందరికీ అది ఇవ్వబడుతుంది. దీన్నే వారు బాప్తిస్మము పుచ్చుకోవడము అని అంటారు. ఈ ఆచారము వారి దృష్ఠిలో చాలా ముఖ్యమైనది. బాప్తిస్మము పుచ్చుకోనివారిని, వారు పరిశుద్ధులుగా భావించరు. అల్లాహ్ వారి పోకడలను ఖండిస్తూ అసలు రంగు అల్లాహ్‍దేనని, అల్లాహ్ రంగును మించినది వేరొకటి లేదని చెప్పాడు. అల్లాహ్ రంగు అంటే భావము సహజ ధర్మము. సహజ ధర్మము ఇస్లామ్ మాత్రమే. ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ జాతి ప్రజలను ఈ ధర్మము వైపుకే పిలిచారు అంటే దేవుని ఏకత్వము వైపుకు మానవాళిని ఆహ్వానించారు''


ఇక్కడ వ్రాసినది చూచారు కదా! కొంత రంగును, కొంత ఇస్లామ్ ధర్మమును చెప్పారు. వారికి అర్థమయినది వారు చెప్పారు. ఎవరు చెప్పినా వినడములో తప్పులేదు. వినిన తర్వాత అది సత్యమా? అసత్యమా? అని విచక్షణతో ఆలోచించాలి. అలా ఆలోచించగలిగినప్పుడు మనలోని శ్రద్ధనుబట్టి దేవుడు సత్యమునే తెలియునట్లు చేయును. మేము ఇక్కడ చెప్పినట్లే అందరు చెప్పేది వింటాము. తర్వాత అది సత్యమా అసత్యమా అని బుద్ధి విచక్షణతో చూస్తాము. విన్న సమాచారము శాస్త్రబద్దమైతే సత్యమనీ, అశాస్త్రమైతే సత్యము కాదనీ నిర్ణయించుకొంటాము. సత్యము దొరికితే అంతటితో తృప్తి చెందుతాము. సత్యము దొరకకపోతే తిరిగి సత్యము కొరకు అన్వేషణ సాగిస్తాము. అందరూ చేయవలసిన పని కూడా అదే. అట్లుకాకుండా మత నియమములలో చిక్కుకొని మతము చెప్పినట్లు వింటే సత్యమును వదలుకోవలసి వస్తుంది. అందువలన మతమునకు అతీతముగా దేవుని జ్ఞానమును తెలియవలసియున్నది. దేవుడు మతములకు అతీతుడు. కావున మతాతీతముగా దేవుని జ్ఞానమును తెలియవలసి యున్నది.


(2-138) ఆయత్‍లో చెప్పిన జ్ఞానము సూక్ష్మజ్ఞానము. దీనిని స్థూలముగా ఏమాత్రము చూడకూడదు. మూడు దైవ గ్రంథములలో సూక్ష్మ వాక్యములతో నిండిన జ్ఞానము ఒక్క ఖుర్ఆన్ గ్రంథమునందు మాత్రమే కలదు. తౌరాత్ గ్రంథమును చెప్పినవాడు కూడా జిబ్రయేలే. జిబ్రయేల్ తౌరాతు గ్రంథములో అన్నీ స్థూల వాక్యములనే చెప్పాడు. ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా సూక్ష్మవాక్యములను చెప్పాడు. అటువంటి సూక్ష్మ వాక్యములలో ''దేవుని రంగును పులుముకోండి'' అనునది కూడా ఒక సూక్ష్మ వాక్యమే. వేమన యోగి పద్యములు గానీ, బ్రహ్మముగారి తత్త్వములు గానీ పూర్తిగా సూక్ష్మవాక్యములతోనే కూడుకొనియుండును. పైన కనిపించునట్లు ఒక విషయముంటే దానికి సమానముగా కనిపించని భావము అందులో ఉండును. వారు చెప్పిన సూక్ష్మ భావములను ఒక్కమారుగా అర్థము చేసుకోలేరన్నది వాస్తవము. అలా ఎందుకు వ్రాశారని చూస్తే దానికొరకు బాగా ఆలోచించినప్పుడే ఆ విషయము పూర్తిగా తెలియును. అలా ఆలోచించి తెలుసుకొన్న విషయము జీవితాంతము జ్ఞాపకములో ఉండిపోవును. సులభముగా తెలిసినది తొందరగా మరచి పోవుటకు అవకాశము కలదు. అందువలన ప్రతి విషయమును ఆలోచించి తెలియునట్లు సూక్ష్మవాక్యములను చెప్పారు. ఇంతకు ముందు (39-42) ఆయత్‍లో ''అల్లాహ్‍యే ఆత్మలను (జీవాత్మలను) మరణ కాలమున వశపరచుకొనేవాడు. మరణించిన వారి ఆత్మలకు దేనికయితే మరణము నిర్ణయింపబడుతుందో దానిని తనవద్దే ఆపుకొని మిగతా వారి ఆత్మలను నిర్ణీత సమయము కొరకు తిరిగి పంపుతాడు'' అని చెప్పిన తర్వాత అదే వాక్యమందు చివరిలో ''ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలున్నాయి'' అని అన్నారు. అలా చెప్పడములో దీనిని బాగా ఆలోచించండి. ఇది పూర్తి సూక్ష్మమైన జ్ఞాన విషయము అని చెప్పినట్లున్నది. ఈ విధముగా అనేక వాక్యముల చివర ఏదో ఒక మాట చెప్పి ముగించినవి చాలా కలవు.


ఇవన్నీ చూచిన తర్వాత సూక్ష్మ వాక్యములను ఎంతో విచక్షణతో చదువాలని అర్థమయినది. 'అల్లాహ్ రంగు' అని వాక్యములో వ్రాయడము జరిగినది. ఇక్కడ బాగా ఆలోచిస్తే దేవునికి రూపమే లేదు. ఫలానా రూపములో ఉండేవాడు దేవుడు అని చెప్పే దానికి వీలులేదు. దేవునికి రూపములేదు, అట్లే పేరు లేదు. ఇంకా ఆయన పని చేయువాడు కాదు. దీనిప్రకారము దేవుడు నామ, రూప, క్రియలు లేనివాడని చెప్పవచ్చును. దేవుని ఉనికే ఎవరికీ తెలియనప్పుడు ఆయన ఫలానా అని చెప్పుటకు ఆయనది కనిపించే రంగు కాదు. ఆయన ఏ రంగూ లేనివాడు. అయితే మనిషి కొంత దీర్ఘముగా ఆలోచించి అసలు సత్యమును తెలియుటకు చెప్పిన వాక్యమే గానీ వేరు కాదు. ఇక్కడ దేవుని రంగును గురించి ఆలోచిస్తే దేవుని జ్ఞానమునే దేవుని రంగని చెప్పడమైనది. దేవుని జ్ఞానమును రంగుగా వర్ణించి చెప్పినప్పుడు దానిని కొంత ఆలోచిస్తే గానీ అది దేవుని జ్ఞానమని అర్థము కాదు. ''దేవుని వాక్యమును మించిన జ్ఞానము ప్రపంచములో ఇంకొకటి లేదు'' కనుక దేవుని రంగుకంటే మించిన రంగు ఏది కలదు? అని వాక్యములో చెప్పారు. ''దేవుని జ్ఞానమును స్వీకరించండి. దేవుని జ్ఞానము తెలియండి'' అని చెప్పుటకు ''దేవుని రంగును స్వీకరించండి'' అని వ్రాశారు. దేవుని జ్ఞానము స్వీకరించిన తర్వాత, దేవుని జ్ఞానము అర్థమయిన తర్వాత దేవుని గొప్పతనము తెలిసిపోవును. దేవుని ప్రత్యేకత, దేవుని ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ప్రపంచమును సృష్ఠించినవాడు దేవుడేయని, ప్రపంచమును నడుపువాడు దేవుడేయనీ, ప్రపంచమును నశింపజేయువాడు దేవుడేయనీ తెలిసినప్పుడు దేవునితో తప్ప ఇతరులతో పనే లేదనిపించును. మనిషి పుట్టుక, మనిషి బ్రతుకు, మనిషి మరణము అన్నీ దేవుని చేతిలోయున్నప్పుడు మనిషికి అవసరమైన ప్రతీ దానిని గురించి దేవున్నే అడుగుకోవలసి వస్తున్నది. మనిషికి కావలసిన వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది మోక్షము. చావు పుట్టుకలు లేని పరలోకము. తనకు కావలసిన విలువైనది, శాశ్వితమైనది అయిన పరలోకము కొరకు దేవున్నే వేడుకోవలసి యున్నది. అందువలన ''నేను దేవున్నే ఆరాధిస్తున్నాను'' అని వాక్యములో చెప్పడమైనది. మొదట దేవుని రంగు స్వీకరిస్తే, అనగా దేవుని జ్ఞానము తెలియగలిగితే తర్వాత దేవుని ప్రత్యేకత ఏమిటో తెలియును. దేవుని ప్రత్యేకత తెలిసి అన్నీ ఆయన ద్వారానే లభించునని, అన్నిటికీ ఆయనే అధిపతియనీ తెలిసినప్పుడు ఎవడయినా తప్పక ఆయననే ఆరాధించును. ఆయన జ్ఞానమునే అనుసరించును. ఈ విషయమును చెప్పుటకు 'రంగు' అను పదమును, 'జ్ఞానము' అను పదమునకు బదులుగా వాడారు. అలా వాడుట వలన శ్రద్ధయున్న వానికి సత్యము తెలియును. శ్రద్ధ లేనివానికి సత్యము తెలియకుండా పోయి అజ్ఞానములో ఉండిపోవును. మనిషిలోని శ్రద్ధను పెంచుటకు ఇలా సూక్ష్మ వాక్యములను వ్రాయవలసిన అవసరము ఏర్పడినది. సూక్ష్మ వాక్యములలో విషయమును నేరుగా చెప్పక ఇతర వస్తువులతో పోల్చి చెప్పడము వలన ఆలోచనా విధానము పెరగవలెననీ, దానివలన శ్రద్ధ పెరుగునని ఊహించి సూక్ష్మవాక్యములను చెప్పారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

13. గ్రంథమును చూచినవారు కన్నకొడుకును గుర్తుపట్టినట్లు గుర్తు పట్టగలరు. (2-146), (6-20)

మనిషి దైవమును గురించి తెలియుటకు దైవ గ్రంథములను ఇచ్చాడు. వాస్తవానికి దైవ గ్రంథము ఒక్కటే ఉన్నది. అయితే కాలమును బట్టి, దేశమును బట్టి దేవుడు ఒకే జ్ఞానమునే మూడు గ్రంథములుగా ఇచ్చాడు. మూడు గ్రంథములలోనూ ఒకే జ్ఞానమే గలదు. మూడు గ్రంథముల ఉద్దేశ్యము మనిషి దేవున్ని తెలియుటయే ముఖ్య ఉద్దేశ్యముగా యున్నది. మొదట దేవుడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపము కాలేదు. దేవుడు చెప్పిన జ్ఞానము ''జపర'' అను పేరుతో కొన్ని వేల సంవత్సరములు అలాగే ఉండిపోయినది. కొన్ని వేల సంవత్సరముల కాలములో జపర అను పేరులో కొంత మార్పు చెంది ''జబుర'' అని చెప్పుకోవడము జరిగినది. అప్పటినుండి దైవజ్ఞానము మాటల రూపములో జబుర అను పేరుతోనే ఉండేది. జబుర (జపర) జ్ఞానము మొదట గ్రంథరూపమైనది. దానికే 'తౌరాతు' అని పేరు వచ్చినది. తౌరాతు అను పేరు తర్వాత వచ్చినది. ముందు ఆ గ్రంథమునకు పెట్టిన పేరు భగవద్గీత. భారతదేశములో భగవద్గీత వ్రాయబడినది. వ్యాసుడు వ్రాయగా చెప్పినవాడు శ్రీకృష్ణుడు. భగవద్గీతను చెప్పిన కృష్ణుడే మోషే ప్రవక్తకు భగవద్గీతను ఇచ్చి దానిపేరు భగవద్గీతయని చెప్పక తౌరాతు యని చెప్పాడు. ఈ విధముగా 'జపర', 'జబుర' కావడము, జబుర జ్ఞానమే భగవద్గీతగా తయారు కావడము, భగవద్గీతయే ఇజ్రయేల్ దేశములో మోషేకు ఇచ్చినప్పుడు తౌరాతు గ్రంథముగా చెప్పబడడము జరిగినది. జబుర జ్ఞానమును గ్రంథరూపము చేసినప్పుడు అందులో దేవుని ఉద్దేశ్యమును పొందుపరచి దేవుని జ్ఞానమును చెప్పాడు. ఈ విధముగా తౌరాతు గ్రంథము పేరు బయటికి వచ్చినది. అయితే ఆ గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు. ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. అంతేకాక తౌరాతే భగవద్గీత అను విషయము కూడా ఎవరికీ తెలియదు.


తౌరాతు అను పేరు చెప్పినా, భగవద్గీతయను పేరు చెప్పినా రెండూ ఒక్కటేయను విషయము ఇటు భగవద్గీత పుట్టిన భారతదేశములోగానీ, అటు తౌరాతు యని పేరు పొందిన ఇజ్రయేల్ దేశములోగానీ ఒక్కరికి కూడా తెలియదు. తౌరాతును ఎవరూ చూడలేదు గనుక అక్కడి ప్రజలు జ్ఞానము తెలియు నిమిత్తము దేవుడు తన ప్రతినిధిగా ఏసును పంపి తౌరాతు జ్ఞానమునే చెప్పించాడు. ఆయన జెప్పిన జ్ఞానము ఇంజీలు గ్రంథముగా తయారయినది. తౌరాతు జ్ఞానమే ఇంజీలులో ఉన్నదని కూడా ప్రజలకు తెలియదు. తౌరాతు గ్రంథములోని జ్ఞానమయినా, ఇంజీలు గ్రంథములోని జ్ఞానమయినా రెండూ జపర (జబుర) జ్ఞానమేయని కూడా మనుషులకు తెలియదు. అలా తెలియలేదని ఇంకొక గ్రంథరూపములో అయినా చెప్పితే గ్రహించగలరని జిబ్రయేల్ చేత ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పడము జరిగినది. ప్రవక్త గారికి జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమే చివరకు ఖుర్ఆన్ గ్రంథముగా తయారయినది. ఖుర్ఆన్ గ్రంథము తౌరాతు, ఇంజీలు గ్రంథములను ధృవీకరించుచున్నదని ఐదవ సూరాలో చెప్పడమైనది. అయినా మనిషి మూడు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటేనని, అది జపర యని పిలువబడు జ్ఞానమేయని తెలియలేక పోయాడు. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో తౌరాతు, ఇంజీలు గ్రంథములలోని జ్ఞానమే ఖుర్ఆన్ యందు గలదని చెప్పడమైనది. మూడు గ్రంథములు దైవ గ్రంథములే. మూడు గ్రంథములలో దేవున్ని గురించిన జ్ఞానమే కలదు. మూడు గ్రంథములలో దేవుని జ్ఞానమే ఉండుట వలన దేవున్ని గురించి తెలియవచ్చును. దేవున్ని తెలియు నిమిత్తమే దేవుని గ్రంథములు మూడు గలవని తెలియవలెను.


దైవ గ్రంథములోని వాక్యములో దేవున్ని తెలియు జ్ఞానము ఉండుననునది సత్యమని ఎవరయినా ఒప్పుకొని తీరవలసిందే. దైవ గ్రంథములో ప్రతీ వాక్యము మనుషులు దేవున్ని తెలియు నిమిత్తమే ఉన్నదను మాటను అందరూ అంగీకరించవలసిందే. దైవగ్రంథములో దేవున్ని కాక ఇతరులను ఎవరినయినా తెలుపు నిమిత్తము ఉన్నదనుట అసత్యమగును. దేవుని గ్రంథములో దేవున్ని తెలియుటే సత్యము. దేవున్ని ప్రజలు తెలియు నిమిత్తమే గ్రంథములో దేవుని జ్ఞానమును వ్రాసియుంచారు. ఇప్పుడు రెండవ సూరా, 146వ ఆయత్నందు ఏమి వ్రాశారో చూద్దాము. (2-146) ''మేము ఈ గంథాన్ని ప్రసాదించినవారు తమ కుమారులను ఏ విధముగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్‍ను) కూడా ఆ విధముగా గుర్తిస్తారు. వాస్తవానికి వారిలోని ఒక వర్గము వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.'' (ఇది ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథము నుండి సేకరించి వ్రాయడమైనది. ఇదే వాక్యమునే ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథమునుండి తీసి వ్రాయుచున్నాము చూడండి.) (2-146) ''మేము ఎవరికి గ్రంథమును వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తు పట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్ ప్రవక్త గారిని) గుర్తు పడతారు. వారిలోని ఒక సమూహము సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చు తుంది.''


ఈ విధముగా రెండు గ్రంథములనుండి సేకరించిన రెండు వాక్యములలో ఒకే భావముండుట చూచాము. అంతేకాక వాక్యము చివరిలో వాక్యమునకంతటికీ విశేషమైన విషయము కలదు. అదేమనగా! 'వాస్తవానికి వారిలో కొందరు (ఒక సమూహము వారు) సత్యమును తెలిసి దాస్తున్నారు' అని ఉన్నది కదా! సత్యము అంటే ఏమిటి? సత్యమును తెలిసి ఎందుకు దాస్తున్నారు? సత్యమును సత్యముగా ఎందుకు బయట పెట్టడము లేదు? అని మనిషి కొంత విచక్షణను ఉపయోగించి చూడవలసియున్నది. ఈ వాక్యము రెండు భాగములుగా యున్నది. ఒక భాగము ఖుర్ఆన్ గ్రంథమును చూచినవారు ''తమ కన్నకొడుకులను ఎలాగ గుర్తిస్తారో అట్లు అతనిని (ముహమ్మద్ ప్రవక్తను) గుర్తు పడతారు'' అనునది ఒక భాగముగానూ, ''వారిలో ఒక వర్గము వారు సత్యమును గుర్తించి కూడా దానిని దాస్తున్నారు'' అనునది మరియొక భాగముగా యున్నది. ఈ వాక్యములోని మొదటి భాగమును చూస్తే దైవ గ్రంథము యొక్క ప్రాథమిక ఉద్దేశ్యమునకు వ్యతిరేఖముగా యున్నది. కొంత ఆలోచిస్తే వాక్యము వ్రాయడములో కొంత పొరపాటు జరిగినట్లు ఎవరికయినా అర్థము కాగలదు. అయితే ఆ విషయము అర్థమయినప్పటికీ కొందరు ఆ విషయమును దాచేస్తున్నారు. సత్యము బయటికి తెలియకుండా మూసివేయుచున్నారని వాక్యములో చెప్పారు.


ఒకే వాక్యములో పరస్పర విరుద్ధముగా వ్రాసియున్నారంటే, వాక్యము కొందరికి సత్యముగా కనిపించినా, కొందరికి అసత్యముగా కనిపించినదని చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే చెప్పబడిన వాక్యములో అసత్యమున్నదను సత్యము అందరికీ తెలిసినా కొందరు (ఒక గుంపువారు) దానిని వారు ఇష్టపడుట వలన సత్యమును కప్పిపుచ్చుతున్నారని మరొక వర్గము వారు ఆరోపించుచున్నట్లు తెలియుచున్నది. ఏది ఏమయినా వాక్యములోనే ఒక వర్గము వారు లేక ఒక సమూహము వారు సత్యమును తెలిసి కప్పిపుచ్చుచున్నారు అని చెప్పుచున్నారంటే కప్పిపుచ్చు వారికి వేరుగా యున్న వర్గము వారు అలా చెప్పుచున్నారని తెలియుచున్నది. అయితే ఈ వాక్యమును చెప్పినది మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ అయినందున, జిబ్రయేల్ గారే సత్యమును కప్పిపుచ్చు వారిని గురించి చెప్పాడని అర్థమగుచున్నది. ఇక్కడ ఎవరు చెప్పారన్నది ముఖ్యము కాదు, సత్యము ఏది అనునదే ముఖ్యము. కప్పిపుచ్చబడు సత్యమును గురించి యోచించి చూస్తే ''బుద్ధి విచక్షణ'' అను గీటురాయి ద్వారా సత్యాసత్యములు తెలిసిపోవును.


సత్యమును గురించి ఆరా తీస్తే దైవగ్రంథమును ఎవరు చూచినా అందులో దేవున్ని గురించి తెలియు దేవుని జ్ఞానము కలదు. ఇక్కడ వాక్యములో 'దేవుడు తెలియబడును' అనకుండా ''ముహమ్మద్ ప్రవక్తగారు తెలియుదురు'' అని సూచనగా చెప్పడములో పొరపాటయినదని ఒప్పుకోక తప్పదు. వాక్యములో 'కొడుకులను' అని బహువచనము చెప్పి ఏక వచనమయిన ప్రవక్తగారిని చూపడములో కూడా తప్పేగలదు. అంతేకాక ''జ్ఞానము తెలిసినవాడు తండ్రిని కొడుకు గుర్తుపట్టినట్లు'' ''మనిషి దేవున్ని గుర్తిస్తాడు'' అని చెప్పబోయి ''తండ్రి కొడుకులను గుర్తించినట్లు'' అని చెప్పడము పొరపాటని తెలియుచున్నది. 'ఎవరికి గ్రంథమును వొసగామో వారు గ్రంథమును చూచి తమ కొడుకు గుర్తుపట్టినట్లు అనగా తండ్రిని కొడుకులు గుర్తుపట్టినట్లు దేవున్ని గుర్తు పట్టుదురు' అని చెప్పవలసియున్నది. వాక్యములో 'తమ కుమారులని' ఉన్నచోట 'కుమారులు' అని ఉండవలసింది. అలాగే రెండవ వాక్యములో కూడా 'తమ కన్న కొడుకులను' అని ఉన్నచోట 'తమ కన్నకొడుకులు' అని ఉండవలసింది. 'ను' అను అక్షరము ఒకటి ఎక్కువ చేరడము వలన 'తండ్రి కుమారులను' అని అర్థమగుచున్నది. అట్లు కాకుండా కుమారులే 'తండ్రిని గుర్తుపట్టగలరు' అన్నట్లు చెప్పడము సత్యము. దైవ గ్రంథములో దేవుడు తండ్రితో సమానము. ప్రజలు కొడుకులతో సమానము. ప్రజలే దేవున్ని తెలియు విధానము దైవ గ్రంథములో ఉండుట సత్యము. అందువలన ఒక వర్గము వారు సత్యమును తెలిసి కప్పిపుచ్చుతున్నారని చెప్పడమైనది.


వాక్యములో తండ్రియైన దేవుడు తెలియబడునని చెప్పక 'అతను' అన్నచోట ప్రవక్త పేరు చెప్పడము వలన సత్యమును కొందరు కప్పిపుచ్చారని వాక్యములో చెప్పారు. దేవున్ని తెలియుటకు దైవ గ్రంథముల జ్ఞానమున్నా గానీ, మనుషులను తెలియుటకు లేదనుట సత్యము. అయితే చాలామందికి ఈ సత్యము తెలుసు. అయితే తెలిసీ సత్యమును కొందరు మూసి పెట్టు చున్నారు. గ్రంథములోని గుట్టును విప్పి చెప్పుచూ కొందరు సత్యమును తెలిసినా సత్యమును మూసివేయుచున్నారని దేవుడు ప్రకటించాడు. ఇప్పటి నుంచయినా దైవగ్రంథములోని ప్రతి వాక్యములోని సత్యాసత్యమును తెలియు విచక్షణ కొరకు దేవున్ని వేడుకొందాము. ఇదే వాక్యమునే సూరా6, ఆయత్ 20లో కూడా చెప్పియున్నారు చూడండి. (6-20) ''ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగియున్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తు పట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టములో పడవేసుకొన్నవారు మాత్రము విశ్వసించరు.'' (మరియొక గ్రంథములో) (6-20) '''ఎవరికయితే మేము గ్రంథాన్ని ప్రసాదించామో వారు తమ పుత్రులను గుర్తించినట్లు అతనిని (ముహమ్మద్‍ను) గుర్తిస్తారు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకొంటారో అలాంటివారే విశ్వసించరు.'' మీరు గీటురాయి అను విచక్షణతో వివరించుకొని చూచి సత్యమును తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

(14) ఎవరి కర్మలు వారివే. (2-141, 4-111, 35-18, 53-39, 41-46)

ఇంతకుముందు కర్మలను గురించి చెప్పుకొన్నాము. అప్పుడు కర్మల పేర్లను కూడా చెప్పుకొన్నాము. క్రొత్తగా వచ్చు కర్మను ఆగామికర్మ అనియూ, నిలువయున్న కర్మను సంచిత కర్మ అనియూ, ప్రస్తుత జన్మలో అనుభవానికి వచ్చు కర్మను ప్రారబ్ధకర్మయనీ మూడు రకముల పేర్లను చెప్పుకొన్నాము. మూడు పేర్ల కర్మలు ప్రతి మనిషికి ప్రత్యేకముగా ఉండును. ఏ మనిషి బుద్ధి ఆ మనిషికే ఉండును. మనుషుల బుద్ధులు వేరు వేరుగాయుండును. అట్లే మనుషుల బుద్ధికి వున్న భావములు కూడా వేరు వేరుగా ఉండును. ఒకరి బుద్ధికి మరొకరి బుద్ధికి కొద్దిగయినా తేడా యుండును. బుద్ధిని బట్టి భావము, భావమును బట్టి కర్మయుండును. బుద్ధి భావమునుబట్టి క్రొత్తగా తయారగు కర్మను ఆగామికర్మయని అంటున్నాము. ఒకే కార్యమును నలుగురు చేసినా, నలుగురు ఒకే పని చేసినా, దానివలన ఒకే రకమైన ఆగామికర్మ వచ్చునని మనము అనుకొన్నా, అలా ఒకే కర్మ వారికి రాదు. వారు ఒకే పనిని నలుగురు వేరువేరుగా చేసినా, చేసినది అందరూ ఒకే కార్యమయినా వారికి ఒకే విధమైన కర్మరాదు. ఎందుకనగా! వారు చేసినది ఒకే కార్యమునయినా, నలుగురు నాలుగు పొట్టేల్లను గొంతుకోసి చంపినా, వారు చేసినది ఒకే కార్యమే అయినా, కర్మ ఒకే విధముగా రాదు. దానికి కారణము వారి బుద్ధి యొక్క భావము వేరువేరుగా ఉండుట వలన వారు చేసిన కార్యములలో నలుగురికి నాలుగు రకముల కర్మలు వచ్చాయి.


వారిలోని అహము యొక్క భావము ఒకే విధముగా లేకుండుట వలన, వేరువేరుగా ఉండుట వలన, వారికి వేరు వేరు మోతాదులలో ఆగామి కర్మ రావడము జరిగినది. ఈ విధముగా వేరువేరుగా వచ్చిన కర్మ ఎవరికి వారి తలలోని కర్మచక్రములో చేరి సంచిత కర్మగా మారి ఉండును. మనిషి మరణించినప్పుడు రెండవ జన్మకు తీర్పు చెప్పినప్పుడు సంచిత కర్మ ప్రారబ్ధముగా మారి రెండవ జన్మలో అనుభవించుటకు సిద్ధముగా ఉండును. అప్పుడు ఎవరి కర్మను వారు అనుభవించుచున్నారు. ప్రతి మనిషి కర్మ ప్రత్యేకముగా ఉండుట వలన ఎవరి కర్మను వారు అనుభవించవలసియున్నది. ప్రతి మనిషికి కర్మ వేరుగా తయారగుచున్నది. ఎవని కర్మను వారు అనుభవించుచున్నారు. అంతతప్ప, ఇతరుల కర్మలో ఎవరికి కొంచెము కూడా సంబంధముండదు. అదే విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో కొన్ని వాక్యములయందు వ్రాశారు. ఇప్పుడు ఆ వాక్యములను చూస్తాము.


(2-141) ''ఇప్పుడు అది గతించిన ఒక సమాజము. వారు చేసుకొన్నది వారికి చెందుతుంది. మీరుచేసుకొన్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నింపబడరు.''


(4-111) ''కానీ ఎవడైనా పాపమును సంపాదించుకొంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతీదీ తెలిసినవాడు, వివేచన గలవాడు.''


(35-18) ''బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోపేే నిమిత్తము వేరొకరిని పిలిచినా, అతను సమీప బంధువు అయినా సరే, కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్తా! చూడకపోయినా తమ ప్రభవుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నీవు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడయినా తన స్వయము కొరకే పరిశుద్ధుడౌతాడు.''


(53-39) ''ప్రతి మనిషి దేనికొరకు పాటుపడతాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది.''


(41-46) ''ఎవరైనా సత్కార్యము చేస్తే తన మేలు కోసమే చేసు కుంటాడు. మరి ఎవరైనా దుష్కార్యమునకు ఒడిగడితే దాని దుష్ఫలితము అతని మీదనే పడుతుంది. నీ ప్రభువు మాత్రము దాసులకు అన్యాయము చేసేవాడు కాడు.''


అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ గ్రంథము కర్మ ఫలితములను గురించి చెప్పిన వాక్యములను గురించి చదివిన తర్వాత ఎవడు చేసుకొన్న కర్మములను వాడు అనుభవించవలసిందేనని, దేవుడు కర్మల నిర్మాణము అలాగే చేశాడని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

15. దేవుని నుండి వచ్చిన దానిని సంశయపడకు. (2-147, 2-209)

ప్రపంచములో ఒక్క జ్ఞానము తప్ప అన్నీ కర్మనుండి లభించునవే అయివుండును. దైవజ్ఞానము ఒక్కటి మాత్రము దేవుని నుండి లభించును. అలా దేవుని నుండి లభించిన దైవజ్ఞానమే మానవులకు మూడు గ్రంథములుగా దగ్గరయినది. అయితే మనుషులలోని మాయ చేత దేవుని నుండి వచ్చిన జ్ఞానము కూడా మతములుగా విడిపోయినది. వాస్తవముగా అది విడిపోలేదు, మనుషులే దానిని విడదీసుకొని మూడు గ్రంథములకు మూడు మతములను అంటగట్టారు. ఇదంతా మాయ విధానము వలన జరిగిన పనియేగానీ వేరు కాదు. దేవుని మూడు గ్రంథములు మతములకు అతీతముగా యున్న జ్ఞానమును బోధించినవి. దేవుని గ్రంథములో మతాలకు అతీతమైన దేవున్ని గురించి చెప్పిన జ్ఞానమే ఉండునుగానీ మత సంబంధమైన జ్ఞానము ఉండదు. దేవుడు మతాతీతుడు అయినందున మతాతీత జ్ఞానమే మూడు గ్రంథములలో కలదని చెప్పవచ్చును.


భూమిమీద గ్రంథములు ఎన్నో గలవు. అయితే మూడు గ్రంథములే దైవ గ్రంథములని పేరుగాంచినవి. దైవగ్రంథములలో దైవ జ్ఞానమున్నదని చెప్పగలిగినా, మిగతా గ్రంథములను దైవగ్రంథములని అనకూడదు. మిగతా గ్రంథములు ఎన్నో ఉన్నా, వాటిలో అన్నీ జ్ఞానమును బోధించకున్నా, కొన్ని అయినా జ్ఞానమును బోధించిన గ్రంథములు గలవు. అలాంటి గ్రంథము లను ఏ కోవకు సంబంధించినవిగా లెక్కించవలెను? అను అనుమానము రాక తప్పదు. కొన్ని గ్రంథములలో దేవుని జ్ఞానమువలె కనిపించినా అందులో అంతా ప్రపంచ జ్ఞానము అనగా మాయ జ్ఞానము ఎక్కువగా ఉండును. కొన్ని గ్రంథములు మాత్రము పూర్తి జ్ఞానము కొరకే వ్రాయబడి యున్నవై యుండును. వాటియందు దేవుని జ్ఞానమే కనిపించుచుండును. మూడు దైవ గ్రంథములలో దేవుడు ఉద్బోధించిన జ్ఞానమే ఉండుట వలన వాటిని తెలియుటయందు ఏమాత్రము సంశయము లేదు. అయితే మనుషులు చెప్పినవి, మనుషులు వ్రాసినవి అయిన గ్రంథములలో దైవజ్ఞానముండునా? వాటినుండి దైవజ్ఞానమును తెలియవచ్చునా? అనునది సంశయముగా ఉన్నది.


దైవజ్ఞాన విషయములో జాగ్రత్తగా ఉండవలెననీ, అన్నీ దైవ జ్ఞానమును బోధించు గ్రంథములు కాదనీ, మూడు దైవ గ్రంథాల విషయములో ఎటువంటి అనుమానము లేకున్నా కొన్ని పూర్తి దైవజ్ఞానముతో కూడిన గ్రంథములపట్ల ఎలా వ్యవహరించాలి? అని కొందరు సంశయము కల్గియున్నారు. దానికి మా సూచన ఏమనగా! దైవ గ్రంథములు పైకి కనిపించునవి, వరుస క్రమములో తయారై ప్రథమ, ద్వితీయ, అంతిమ అని పేరు పెట్టబడినవి మూడు గ్రంథములు కాగా, పైకి కనిపించనివి ఎన్నో గలవు. మూడు గ్రంథములు బయటికి తెలియునట్లు గలవు కావున వాటి విషయములో ఎవరూ చదువకపోయినా సంశయింపరు. అయితే బయటికి ఏమాత్రము తెలియని గ్రంథములు దైవ గ్రంథములని తెలియక పోవడము వలన వాటిని సాధారణ గ్రంథములుగా లెక్కించి వాటిలోని జ్ఞానము ఎడల సంశయపడుచుండుట వాస్తవమే. అయితే మూడు దైవ గ్రంథములుకాక మిగతా ఏ గ్రంథమైనా దైవ గ్రంథమా కాదా?యని తెలియుటకు ఒక అవకాశము కలదు. దాని ప్రకారము ఏది దైవగ్రంథముగా కనిపించినా, దాని ఎడల సంశయము పొందక చదివి దేవుని జ్ఞానమును తెలియవచ్చును.


దైవగ్రంథములలో దైవజ్ఞానము ఉండుట సహజమే. దైవజ్ఞానమున్న చోట దైవశక్తి కూడా ఉండును. నూటికి నూరుపాళ్ళు దైవజ్ఞానమున్న దైవ గ్రంథము ఏదయినా అందులో దైవశక్తి దైవజ్ఞానముతోపాటు ఉండును. మూడు దైవగ్రంథములలో జ్ఞానశక్తి యుండుట వలన బయట రసాయన క్రియ జరిగినట్లు మనిషి అంతరంగమున దైవక్రియ జరిగి మనిషిలో బుద్ధికి విచక్షణ ఏర్పడి, విచక్షణనుబట్టి జ్ఞానము మనిషికి లభించుచున్నది. ఈ దైవ క్రియలో ముఖ్యపాత్ర పోషించునవి గ్రంథములోని దైవశక్తి (జ్ఞానశక్తి) మరియు మనిషిలోగల జ్ఞానము మీద శ్రద్ధ. మనిషిలో గల శ్రద్ధ ఎంత ఉంటే అంత మనిషికి జ్ఞానము లభించుచున్నది. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని ప్రథమ దైవ గ్రంథములో జ్ఞానయోగమందు 39వ శ్లోకమున చెప్పడమైనది. ఒక ప్రక్క గ్రంథములోని జ్ఞానశక్తి, రెండవ ప్రక్క మనిషిలోని శ్రద్ధ, రెండూ కలిసినప్పుడు దైవక్రియ ఏర్పడుచున్నది. దైవక్రియలోనే శ్రద్ధనుబట్టి బుద్ధి, బుద్ధినిబట్టి జ్ఞానము దొరుకుచున్నది. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని అనడము జరిగినది. ఈ ప్రక్రియ మనిషికి తెలిసినా తెలియకున్నా మూడు దైవ గ్రంథములవద్ద జరుగుచున్నది.


భూమిమీద దేవుడు చెప్పిన మూడు విధానముల ప్రకారము మూడు దైవ గ్రంథములు తయారయినా, మిగతా గ్రంథములు కూడా కొన్ని దైవ గ్రంథములుగా చెప్పుటకు అర్హత కల్గియున్నవి. సూత్రము ప్రకారము ఏ గ్రంథములో దైవశక్తి (జ్ఞానశక్తి) కలదో ఆ గ్రంథమును దైవ గ్రంథము అని చెప్పుచున్నాము. గ్రంథములో జ్ఞానశక్తి మూడు దైవగ్రంథములుగా పేరుగాంచిన వాటిలోనే కాకుండా మిగతా వేరే గ్రంథములలో కూడా దైవశక్తి ఉండుట వలన వాటిని కూడా దైవ గ్రంథములని చెప్పవచ్చును. ఎక్కడయితే మనిషిలోని శ్రద్ధనుబట్టి దైవక్రియ వలన దైవజ్ఞానము లభించు చున్నదో అక్కడ దైవగ్రంథము కలదని చెప్పవచ్చును.


దైవ గ్రంథములలో దైవశక్తి యుండును కనుక వాటిని దైవ గ్రంథములనవచ్చును. దైవశక్తి ఎలా ఉన్నది బయటికి తెలియకపోయినా మూడు గ్రంథములయిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములను దైవ గ్రంథములని అనుచున్నాము. ఆ మూడు గ్రంథములలో దైవశక్తి ఉండుట వాస్తవమే. దైవశక్తి యుండుట వలన అవి మూడు దైవగ్రంథములయినాయి. మూడు దైవ గ్రంథములలో శక్తి బయటికి ఏమాత్రమూ కనిపించునది కాదు. ఆ మూడు గ్రంథములు కాకుండా మిగతా దైవ గ్రంథములు ఏవయినా ఉండుటకు అవకాశముండునా? అను ప్రశ్నకు మిగతా దైవ గ్రంథములు ఉండవచ్చుననే చెప్పవచ్చును. దేవుడు మూడు నియమముల ప్రకారము చెప్పు బోధలను మూడు దైవ గ్రంథములన్నాము. వాటి ముందు వెనుక వరుసను బట్టి మూడు గ్రంథములకు ప్రథమ, ద్వితీయ, అంతిమ గ్రంథములని చెప్పాము. మూడు గ్రంథముల తర్వాత కూడా అవసరమును బట్టి దేవుడు జ్ఞానము తెలియజేయును. దేవుడు ఎప్పుడు ఎలా తెలియజేస్తాడో మాత్రము ఎవరికీ తెలియదు. మూడు విధానముల ప్రకారము ఒకమారే చెప్పుదునని ఎక్కడా చెప్పలేదు. ఆ మూడు విధానములలో ఎవరూ గుర్తించని ఏదో ఒక విధానముతో తన జ్ఞానమును తర్వాత కూడా చెప్పవచ్చును. అయితే ఖచ్చితముగా ఇట్లే చెప్పునని చెప్పలేము. అది అల్లాహ్ (దేవుని) ఇష్టము.


దేవుడు మనుషులకు ఎవరికీ తెలియకుండా ముందు చెప్పిన మూడు విధానములు కాకుండా ప్రత్యేకించి మరొక విధానము ప్రకారము జ్ఞానమును బయటికి చెప్పు అవకాశము ఒకటి గలదు. ఆ విధానమును ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత (తౌరాతు) గ్రంథమందు ముందే చెప్పియున్నారు. తర్వాత అంతిమ దైవ గ్రంథములో మూడు విధానములను చెప్పడము జరిగినది. అందరికీ తెలిసిన మూడు విధానముల ప్రకారము జ్ఞానము చెప్పడమేకాక, ఎవరికీ తెలియని మరొక విధానము ప్రకారము కూడా చెప్పు విధానమును దేవుడు ముందే ప్రథమ దైవ గ్రంథమందే చెప్పియున్నాడు. ఆ విషయమును ఏ మనిషి నుండి అయినా చెప్పవచ్చును. దానిని సూచన ప్రాయముగా భగవద్గీత, పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయములో 15వ శ్లోకమందు చెప్పియున్నారు చూడండి.

శ్లో|| 15. సర్వస్య చాహం హృదిసన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనంచ|

వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాన్తకృ ద్వేదవి దేవ చాహమ్ ||


భావము:- ''నేను సకల జీవరాసుల హృదయ పీఠమునందు నివాసమున్నాను. నా వలననే మనిషికి (జీవరాసులకు) స్మృతి, జ్ఞానము, ఊహ కల్గుచున్నవి. వేదములు నన్నే తెలియజేయును. వేద ఫల దాతను కూడా నేనే.''


ఈ శ్లోకములో ముఖ్యముగా 'నా వలన మనిషికి స్మృతి, జ్ఞానము, ఊహ కల్గునని' చెప్పాడు కదా! అందులో మధ్యలో గలది జ్ఞానము. మనిషికి జ్ఞానము తెలియజేతును అన్నప్పుడు దాని ఆధారముతో మనుషులకు కావలసిన జ్ఞానమును దేవుడు తెలియజేయవలసిన అవసరమున్నది. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! దేవుడు మూడు గ్రంథములలో తన జ్ఞానమునంతటినీ చెప్పాడు కదా! తర్వాత చెప్పవలసిన జ్ఞానము ఏమున్నదని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దేవుడు మూడు విధానముల ప్రకారము మూడు గ్రంథముల జ్ఞానమును చెప్పాడు. అయితే మనుషులు మూడు గ్రంథములను ఆధారము చేసుకొని మూడు మతములను ఏర్పరచుకొని మూడు వర్గములుగా విడిపోయి ఉన్నారు. అంతిమ దైవ గ్రంథములో కొన్నిచోట్ల మూడు గ్రంథముల జ్ఞానము ఒకటేయని చెప్పియున్నా, మనుషులు మాత్రము 'మతము' అను అజ్ఞానములో పూర్తి మునిగిపోయి మతవర్గములుగా చీలిపోయి, దేవుని జ్ఞానమును, దేవున్ని కూడా మూడు వర్గములు చేశారు. 'దేవుడు అందరికీ ఒక్కడే' అను భావము పోయింది. ఎవరి మతము వారికి గొప్పయనీ, ఎవరి దేవుడు వారికి గొప్పయను భావములో మనుషులున్నారు. దేవుడు అందరికీ సంబంధించినవాడు అని చెప్పినా, ఒక మతస్థులు 'దేవుడు' అను పేరును కూడా ఒప్పుకోవడము లేదు. వారి దేవున్ని వారి మతములో అందరూ ఒకే విధముగా పిలుస్తారని, అలాగే వారి దేవున్ని అదే పేరుతో పిలువవలెనని, వేరే ఏ పేరు చెప్పినా, సర్వసాధారణముగా దేవుడు అని అనినా వారు ఒప్పుకోరు. ఈ విధముగా 'మతము' అను అజ్ఞానము పూర్తి స్థాయిలో అందరియందు పెరిగిపోయినది.


ఈ మతము ఆ మతము అనకుండా మతము అయిన ప్రతి దానియందు అజ్ఞానము పెచ్చుగా పెరిగి పోయినది. అటువంటి అజ్ఞానమును మూడు దైవగ్రంథములు నిర్మూలించలేవు. ఎందుకనగా! మూడు దైవ గ్రంథములను ఆధారము చేసుకొని పుట్టిన అజ్ఞానమును లేకుండా చేయుటకు ప్రత్యేకమయిన జ్ఞానము అవసరము. ఒక ప్రక్క మూడు గ్రంథముల జ్ఞానమును జ్ఞాపకము చేయుచూ మరొక ప్రక్క మతములను నిర్మూలించుటకు, మనిషిలో దాగియున్న అజ్ఞానమును పోగొట్టుటకు దేవుడు ప్రత్యేకమయిన జ్ఞానమును చెప్పవలసి యున్నది. అయితే దానిని మనిషి శరీరమునుండి ఆత్మగాయున్న వాడు బయటికి తెలియజేస్తే తెలియును. మనిషిలో ఆత్మగాయున్న దేవుడే మనిషినుండి చెప్పే జ్ఞానమే మనుషుల అజ్ఞానమును తీసివేయును. అలాగే మనిషి నుండి వ్రాయించిన ఆత్మే తన జ్ఞానమును మనుషులకు ఎలా అవసరమైతే అలా తెలియజేయును. అలా తెలియబడినది నిజమైన జ్ఞానమా కాదా!యని తెలియుటకు, అందులో దైవశక్తి ఉన్నదా లేదా?యని తెలియుటకు ఏదో ఒక ఆధారమును బయటికి దేవుడు తెలియజేయవలసిన అసవరమున్నది. దేవుడు భగవద్గీతలో చెప్పినట్లు ఏ మనిషినుండయినా, ఏ వయస్సు మనిషిలో నుంచయినా, ఏ మతములో మనిషినుండయినా మూడు గ్రంథముల తర్వాత అవసరమైన జ్ఞానమును తెలియజేయును. అలా తెలియజేసిన జ్ఞానము గ్రంథరూపమైతే, దానిని దైవ గ్రంథమని మనుషులకు తెలియక పోయినా దానిలోని జ్ఞానశక్తి బయటికి కనపడునట్లు దేవుడు అమర్చి యుండును. మూడు దైవ గ్రంథములలో జ్ఞానశక్తి లేక దైవశక్తి బయటికి కనిపించకపోయినా వాటియందు జ్ఞానశక్తియుండుట వలన వాటిని దైవ గ్రంథములు అని అనుచున్నాము. ఇప్పుడు మూడు గ్రంథముల మినహా తయారయిన వాటిలో స్వయముగా ఆత్మ మనిషి నుండి చెప్పిన గ్రంథములు ఉండుట వలన వాటిని కూడా దైవ గ్రంథములనుటకు వాటియందు జ్ఞానశక్తి (దైవశక్తి) బయటికి తెలియునట్లు ఉండును. అట్లు తెలియకపోతే వాటిని దైవ గ్రంథములనుటకు ఆధారము ఏమీ లేదనియే చెప్పవచ్చును.


మూడు దైవ గ్రంథములు పరోక్షముగా మనిషి కర్మను హరించి కర్మరహితున్ని చేసి జీవున్ని దేవునియందు ఐక్యమగుటకు తయారు చేయు చున్నవి. దైవ గ్రంథముల ఉద్దేశ్యమే అది. మూడు విధానముల చేత చెప్పబడిన బోధలు మూడు గ్రంథములై చేయుచున్న కర్తవ్యము ఏమి అనిన మనిషిని (జీవున్ని) దేవునియందు ఐక్యమగునట్లు చేయుటయే ముఖ్యమైన కర్తవ్యము మరియు ముఖ్యమైన ఉద్దేశ్యము. మూడు దైవ గ్రంథములను ఎంతగా విశ్వసించిన అంతగా గ్రంథములు పనిచేయును. మూడు గ్రంథములలో ఒకే దేవున్ని ఉద్దేశించి చెప్పిన జ్ఞానము ఉండుట వలన, మనిషి వేరుగా తలచినా గ్రంథములలో ఉన్నది ఒకే జ్ఞానము అయినందున, మూడు గ్రంథములయందు కర్మను కాల్చుశక్తియే కలదు. అయితే ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయము ఒకటి కలదు. అది ఏమనగా! మూడు గ్రంథములను మనిషి విశ్వసించినప్పుడు మాత్రమే గ్రంథములు కర్మను కాల్చగలవు. ఒక గ్రంథమును విశ్వసించి రెండు గ్రంథములను విశ్వసించకపోయినా, లేక రెండు గ్రంథములను విశ్వసించి ఒక గ్రంథమును దూరముగా ఉంచినా, ద్వేషముగా చూచినా, లేక మూడు గ్రంథములను ఏమాత్రము విశ్వసించక అసూయతో చూచినా, వారి యెడల గ్రంథములు కర్మను కాల్చు పని చేయవు. నేడు భూమిమీద ఒక గ్రంథమును విశ్వసించు వారు గలరు. మిగతా రెండు గ్రంథములను అసూయతో చూచుట వలన, విశ్వసించక పోవడము వలన నేడు ఎవరికీ దైవ గ్రంథముల వలన కర్మలు తొలగడము లేదు.


వివరముగా చెప్పితే ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును తమ గ్రంథమని చెప్పుచున్నారు. అందువలన వారు ఖుర్ఆన్ గ్రంథమును మాత్రము విశ్వసించి మిగతా రెండు గ్రంథములను వారు విశ్వసించడము లేదు. మిగతా రెండు గ్రంథములు కూడా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు దైవ గ్రంథములే అయినా వారు మతముతో కట్టివేయబడినవారై, మతదృష్ఠితో ఒక గ్రంథమును నమ్మి మిగతా రెండు గ్రంథములను నమ్మకపోవడము వలన వారికి దైవ గ్రంథముల వలన కలుగు కర్మ తొలగు విధానము ఏమాత్రమూ పని చేయడము లేదు. క్రైస్థవులు బైబిలు గ్రంథమును తమ గ్రంథమని చెప్పుకొంటున్నారు. మిగతా రెండు గ్రంథములను అసూయతో చూస్తున్నారు. ఇకపోతే హిందువుల విషయానికి వచ్చి చూస్తే వీరు క్రైస్థవులు, ముస్లీమ్‍లవలె భగవద్గీతను తమ గ్రంథమని నమ్మక వేదములను, ఉపనిషత్తులను తమ గ్రంథములని చెప్పుకొంటున్నారు. దానివలన వీరు మూడు గ్రంథములను నమ్మలేదని చెప్పవచ్చును. హిందువులలో చాలా తక్కువమంది భగవద్గీతను ఆశ్రయించిన వారు కలరు. అయినా వారు కూడా మిగతా రెండు గ్రంథములను నమ్మక అవి ఇతర మత గ్రంథములని వాటికి దూరముగా ఉంటున్నారు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములను పూర్తిగా నమ్మిన వారు భూమిమీద చాలా అరుదుగా ఉందురని చెప్పవచ్చును.


ఎవరయితే మూడు దైవగ్రంథములను విశ్వసిస్తారో వారికి తెలియకుండానే కర్మలు తొలగిపోవును. అంతేకాక మూడు దైవ గ్రంథములు లిసి ఒకే దైవగ్రంథములోని భాగములని, మూడింటిని సమానముగా గౌరవిస్తాడో వాని కర్మలు తొలగిపోవును. మూడు గ్రంథములు ఒకే గ్రంథములోనివని అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 6, ఆయత్ 91లో చెప్పియున్నారు. అంతేకాక సూరా 5, ఆయత్ 44, 46, 48, 68 లోనూ, (62-5) లోనూ మూడు గ్రంథములలోను ఒకే జ్ఞానమున్నదని చెప్పారు. ముస్లీమ్‍లు తమ గ్రంథము ఖుర్ఆన్ అని చెప్పినా, అందులో మూడు గ్రంథములు ఒక్కటేయని ఎన్నో వాక్యములలో చెప్పియున్నా, వారికి గ్రంథముకంటే మతము ముఖ్యమైనందున దైవ గ్రంథములోని మాటలను కూడా లెక్క చేయడము లేదు. చాలామంది ముస్లీమ్‍లకు దైవ గ్రంథములో ఏమి వ్రాసియున్నారను విషయము కూడా తెలియదు. ముస్లీమ్‍లకు బోధలు చెప్పువారు ఈ విషయములు గ్రంథములో వ్రాసియున్నాయని ప్రజలకు చెప్పడము లేదు. కొందరు ముస్లీమ్ పెద్దలు దైవ గ్రంథమును ప్రక్కన పెట్టి, మనుషులు వ్రాసిన హదీసు గ్రంథములను చదువుట వలన ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు చెప్పిన విషయములు తెలియకుండా పోయినవి. అందువలన మూడు దైవ గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానమున్నదను విషయము, ఒకే దేవున్ని గురించి చెప్పిన విషయము ముస్లీమ్ ప్రజలకు తెలియకుండా పోయినది. దానివలన వారు ఒకే గ్రంథమును విశ్వసించి ఇతర రెండు గ్రంథములను విశ్వసించక పోవడము వలన దైవ గ్రంథము వలన కర్మ కాలిపోవు విధానము వారికి లేకుండా పోయినది. దానిని వారు నష్టపోయినట్లే.


దేవుని నుండి వచ్చినది మొదట ఒకే ఒక జ్ఞానము. తర్వాత అది మనుషుల చేత మూడు గ్రంథములుగా వ్రాయబడినది. అందువలన సూరా ఆరులో ఆయత్ 91యందు (6-91) ''అవిశ్వాస జనులు దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మూసా తెచ్చిన తౌరాతు గ్రంథాన్ని ఎవరు అవతరింప జేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గ దర్శకత్వము. మీరు దాన్ని వేరువేరు కాగితములుగా (వేరు వేరు గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు.'' ఈ విధముగా దేవుడు చెప్పిన తర్వాత కూడా దైవ గ్రంథములు ఎన్నియున్నా అన్నీ ఒక్కటేయని తెలియకపోతే వారిది అజ్ఞానమగును.


ప్రశ్న :- మూడు దైవగ్రంథములు మనుషుల కర్మలు కాల్చునవై యున్నవని అన్నారు. మూడు దైవగ్రంథములలో కర్మను కాల్చుశక్తి బయటికి కనిపించ కుండా ఇమిడియున్నదని కూడా చెప్పారు. మూడు గ్రంథములకంటే మినహా ఎన్నో గ్రంథములు జ్ఞానశక్తి (దైవశక్తి) కలవి ఉన్నాయని చెప్పారు. వాటిలో దైవశక్తి కలదని తెలియుటకు ఆధారము కూడా ఉన్నదని చెప్పారు. ఆధారము లేకపోతే ఇతరులు వాటిని గుర్తించుటకు అవకాశమే లేదని కూడా చెప్పారు. అటువంటి గ్రంథములు ఉండుననుటకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున 15వ శ్లోకమును ఆధారముగా కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మాకు కూడా కొంత నమ్మకము ఏర్పడినది. అయితే అవి ఎట్లున్నాయో, ఎక్కడున్నాయో మాకు తెలియదు. మీకు మనిషి చేత రచింపబడిన దైవశక్తిగల దైవగ్రంథములు మీకు తెలిసియుంటే మాకు తెలుపమని కోరుచున్నాము?


జవాబు :- మూడు దైవగ్రంథముల బోధను ఒకే గ్రంథములో కలదని ఇతరులు చూపిస్తే అవి నమ్మదగినవి కావు. నేను ఫలానా గ్రంథములని చెప్పితే మీరు నమ్మడము మంచిది కాదు. అటువంటి గ్రంథములను ఎవరంతకు వారు గ్రహించగలిగితే మంచిది. అలా తెలియుటకు ముందు దైవశక్తియంటే ఏమిటి? అది దైవగ్రంథములలో ఎలా గలదో తెలియగలిగితే మూడు దైవగ్రంథముల తర్వాత వచ్చు దైవ గ్రంథము ఏదో ఎట్లుండునో తెలియవచ్చును. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా చెప్పుటకు మూడు గ్రంథములు బయటికి వచ్చాయి. అదే దేవుని జ్ఞానమును తెల్పుటకు వచ్చు దైవ గ్రంథము ఒకటిగాయుండదు. అనేక గ్రంథములుగా చెప్పబడియుండును అని అనుకొంటున్నాను. అనేక గ్రంథముల రూపములో తెలియజేయువాడు దేవుడేయని చెప్పవచ్చును. దేవుడు భగవంతునిగా యున్నప్పుడే అది సాధ్యమగును. దేవుడు భగవంతుని రూపములో శరీరమునుండి చెప్పిన జ్ఞానము దైవజ్ఞానమే అయినా, పైకి చూచుటకు నమ్మదగినదిగా ఉండదు. అయితే ఆ గ్రంథములు చదివే కొలది అవి దైవగ్రంథములని తెలియుచుండును. విశ్వాసముతో చదివే వానికి ఫలానా గ్రంథములు దైవగ్రంథములని తెలియును. అందువలన గ్రంథములలోని దైవత్వమును ఎవరంతకు వారు తెలియవలసినదేగానీ, ఇతరులు చెప్పునది కాదు.


దైవజ్ఞానము అనగా దైవశక్తితో కూడుకొన్నది. దైవశక్తితో కూడుకొన్న జ్ఞానము స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమై ఉంటుంది. దేవుని జ్ఞానమును ఎందరు బోధించినా, గ్రంథముగా వ్రాసినా అందులో దైవశక్తి లేకపోతే మనిషికి అందవలసిన ఆనందము, తృప్తి దానిలో దొరకదు. దైవశక్తి యున్న గ్రంథములను చదివినప్పుడు మనిషి గ్రహించగలిగితే ప్రత్యేకమైన ఆకర్షణ అందులో ఉండును. అటువంటిది ఎక్కడ దొరికినా అది దేవుని నుండి వచ్చినదని తెలియవచ్చును. తెలియకపోయినా నమ్మవచ్చును. అందువలన అంతిమ దైవగ్రంథములో సూరా 2 ఆయత్ 147లో ఇలా చెప్పారు చూడండి.


(2-147) ''నిస్సందేహముగా ఇది నీ ప్రభువు తరపునుండి వచ్చిన సత్యము. కావున నీవు సందేహించే వారిలో చేరకు.''


ఈ వాక్యములో చెప్పినట్లు ఎక్కడయితే దేవుడు భగవంతుని రూపములో చెప్పిన దానిని నీవు సందేహించితే, అదే నిజమైన దేవుని జ్ఞానమని, అందులోని రుచినిబట్టి గ్రహించలేకపోతే, తృప్తినిచ్చే శాస్త్రబద్దతను గ్రహించలేకపోతే అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపును. ఆ విషయములో దేవుడు చాలా వివేకవంతుడు. అంతేకాక దేవుడు చెప్పినా గ్రహించక దేవుని జ్ఞానమును హేళనగా మాట్లాడితే దేవుడు వానిని సులభముగా వదలక ఏమయినా చేయగల శక్తివంతుడు. ఇదే విషయమును తెలియజేస్తూ సూరా 2, ఆయత్ 209లో ఇలా చెప్పారు చూడండి.


(2-209) ''మీ వద్దకు స్వచ్ఛమయిన హితోపదేశములు వచ్చిన పిదప కూడా మీరు తప్పటడుగు వేస్తే, నిజంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడని తెలుసుకోండి.''


దైవగ్రంథములో దేవుడు చెప్పిన వాక్యముల ప్రకారము ఎక్కడయినా గానీ, ఏ గ్రంథములో అయినాగానీ దైవశక్తి గల దైవజ్ఞానము కనిపించినా దాని రుచిని తెలియలేక అది స్వచ్ఛమయిన దైవజ్ఞానమని గ్రహించలేకపోతే ఆ మనిషిని దేవుడు ఎంతటి అజ్ఞానములోనికయినా పంపును. ఎంతటి నరకములోనికయినా త్రోయును. దేవుడు ఏమి చేయాలో తెలిసిన వివేకవంతుడు అట్లే మహాశక్తివంతుడు. ఆయన మనిషిని ఏమయినా చేయగల సమర్థవంతుడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

16. దేవుని చిహ్నములు. (2-158), (5-2), (22-32)

'దేవుని చిహ్నము' అనగా దేవుని రూపమును పోలినదని లేక దేవుని లక్ష్యణములను పోలినదని చెప్పవచ్చును. దేవునికి రూపము లేదు కనుక దేవుని లక్ష్యణములను లేక దేవుని ధర్మములను పోలినదని చెప్పవచ్చును. లక్ష్యణములనినా, ధర్మములనినా ఒక్కటేయని తెలియవచ్చును. దీనిప్రకారము దేవుని చిహ్నము అనగా దేవుని ధర్మముతో సమానమైనదని, లేక దేవుని హోదాతో సమానమైనదని చెప్పవచ్చును. దేవుని చిహ్నము దేవుని ధర్మముతో పోల్చి చెప్పునది, కావున దేవుని ధర్మమును గౌరవించినట్లే దేవుని చిహ్నమును గౌరవించవలెను. పూర్వము రాజులు అంతఃపురములో యుండి అవసరము వచ్చినప్పుడు మాత్రమే బయటికి వచ్చేవారు. ప్రతి చిన్న పనికి బయటికి వచ్చేవారు కాదు. అయితే కొన్ని పనులు రాజు ఆజ్ఞప్రకారము జరుగవలసియుండును. అప్పుడు రాజు బయటికి రాకుండా తన ఆజ్ఞను మాత్రము ఇతరుల చేత చెప్పి పంపును. అప్పుడు రాజుగారు ఆజ్ఞ ఇచ్చారా లేదా!యని బయటివారు తెలియుటకు రాజుగారి ఆజ్ఞను నమ్ముటకు రాజుగారి వేలి ఉంగరమును రాజు ఆజ్ఞకు చిహ్నముగా పంపడము జరుగును. బయటివారు రాజుగారి ఉంగరమునుగానీ లేక ఏదయినా రాజుగారి గుర్తుగా వచ్చిన దానిని చూచి రాజుగారు స్వయముగా వచ్చినట్లు తలచి ఆజ్ఞను అమలు పరచెడివారు. దీనినిబట్టి రాజుగారి చిహ్నము రాజుతో సమానమైనదని తెలిసినది. దేవుని చిహ్నమును దేవుని ముద్ర అని కూడా పిలువవచ్చును. ''దేవుని చిహ్నము'' అని అంతిమ దైవ గ్రంథములో వ్రాసియుండుట వలన చిహ్నముకంటే ముందు 'దేవుని' అని వ్రాసియుండుట వలన ఈ గుర్తు దేవునికి సంబంధించినదని చెప్పకనే తెలియుచున్నది.


ఈ చిహ్నమును గురించిన సమాచారమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో 2, 5 సూరాలలో మరియు 22వ సూరాలో మూడు ఆయత్‍లలో వ్రాసిన దానిని ఇప్పుడు చూస్తాము (2-158) ''నిస్సందేహముగా సఫా మర్‍వాలు అల్లాహ్ చిహ్నములలోనివి. కనుక కాబా గృహాన్ని దర్శించి హజ్ ఉమ్రహ్‍లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రము తప్పులేదు. స్వచ్ఛంగా ఎవరయినా ఏదయినా సత్కార్యము చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకొనేవాడు.''


(5-2) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి''. ఖుర్బానీ నిమిత్తము కాబా గృహానికి కొనితేబడుతున్న జంతువుల మెడలో పట్టాలు కట్టబడియున్న జంతువుల జోలికి పోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యముతో పవిత్ర గృహము కాబావైపు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జీద్ హరామ్‍కు పోకుండా మిమ్ములను నిలువరించిన వారిపట్ల ద్వేషం మిమ్ములను హద్దుమీరిన వారిగా మార్చివేయరాదు. సత్కార్యా లలో అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరి తోనూ సహకరించకండి. అల్లాహ్‍కు భయపడుతూ ఉండండి. నిస్సందేహముగా అల్లాహ్ చాలా కఠినముగా శిక్షించేవాడు.''


(22-32) ''ఎవడయితే అల్లాహ్ నియమించిన చిహ్నములను గౌరవిస్తాడో, అది వారి హృదయాలలో ఉన్న దైవ భీతి వల్లనే.''


ఈ మూడు వాక్యములలో మొదటి దానియందు సఫా, మర్‍వాలు అను రెండు పర్వతాలను దేవుని చిహ్నములుగా చెప్పడమైనది. రెండవ వాక్యములో ''అల్లాహ్ చిహ్నాలను అగౌరవపరచకండి'' అను ఒకమాట కలదు. మూడవ వాక్యములో ''దేవుని భయము ఉన్నవారే అల్లాహ్ నియమించిన చిహ్నములను గౌరవిస్తారు'' అని ఉంది. మొత్తము మీద మూడు వాక్యాల సారాంశము దేవుని చిహ్నమును అగౌరవపరచకూడదనీ, గౌరవించవలెననీ చెప్పారు. దేవుని చిహ్నము ఏది? అను ప్రశ్నకు జవాబుగా 'దేవుడు నియమించినది' అని కలదు. దేవుడు తన జ్ఞానము చేత నియమించిన గుర్తును దేవుని చిహ్నము అని చెప్పబడుచున్నది. అంతేగానీ ముందే ప్రకృతిలో పుట్టిన పర్వతములను దేవుడు తన చిహ్నములుగా చెప్పలేదు. దేవుడు నియమించినది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము చేత నియమించి లేక నిర్ణయించి చెప్పినవే దేవుని చిహ్నములు. 'దేవుని చిహ్నములు' అని వాక్యములో చెప్పబడినది. అందువలన దేవుని చిహ్నములు ఎన్ని గలవు? అను ప్రశ్న రాగలదు. దేవుని చిహ్నము ఒక్కటే అయినా వాక్యములో 'చిహ్నములు' అని చెప్పబడినది. దానికి గల కారణము కూడా కలదు. అదేమనగా! చెట్టు ఒక్కటే అయినా దానికి కొమ్మలు నాలుగు కలవనుకో, అప్పుడు చెట్టును నాలుగుగా చెప్పుకోకూడదు. ఒకే చెట్టుకే నాలుగు కొమ్మలు ఉండుట వలన నాలుగు కొమ్మలను ఒకే చెట్టుగా చెప్పినట్లు, దేవుని జ్ఞానము ఎన్నో భాగములుగా యున్నా అది అంతయూ ఒక్క జ్ఞానమే. అలాగే దేవుని జ్ఞానము చేత తయారయిన దేవుని చిహ్నము కొన్ని భాగములుగా యున్నా దానిని ఒక్కటిగానే చెప్పాలి. అందువలన దేవుని చిహ్నము ఒక్కటేయని చెప్పవచ్చును.


ముఖ్యముగా చెప్పితే దేవుని చిహ్నము యొక్క ఆకారము కొన్ని భాగములుగా ఉండుట వలన దానిని చిహ్నములు అని బహువచనముతో చెప్పియుండవచ్చును. దేవుని చిహ్నము నాలుగు భాగములతో కూడుకొన్న ఆకారము. ఒకే ఆకారముగాయున్న దేవుని చిహ్నమును దేవుని ముద్రయని దైవ గ్రంథములోనే చెప్పుచున్నారు. ఒకే ఆకారమును చిహ్నము అనీ, ముద్రయని రెండు పేర్లతో మరియు రెండు అర్థములతో చెప్పుట వలన దేవుని గుర్తును బహువచనముగా పిలిచి యుండవచ్చును. 'దేవుని చిహ్నము' అను పేరుతో అంతిమ దైవగ్రంథములో మూడు ఆయత్‍లయందు చెప్పియుండగా, ద్వితీయ దైవగ్రంథమందు చివరిలోనున్న యోహాన్ ప్రకటన అను పాఠములో 'దేవుని ముద్ర' అని చెప్పారు. ఈ విధముగా రెండు దైవ గ్రంథములలో ఒకచోట దేవుని ముద్రయనీ, మరొక చోట దేవుని చిహ్నము అనీ ప్రత్యక్షముగా వాక్యములో చెప్పియుండగా, ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతయందు పేరును ప్రత్యక్షముగా చెప్పకున్నా దేవుని ముద్ర లేక చిహ్నము యొక్క ఆకారమును పరోక్షముగా చెప్పియున్నారు. నేను మొదట 1977వ సంవత్సరము భగవద్గీతలో నాలుగు భాగములుగా యున్న ఆకారమును గుర్తించగలిగాము. ఆ రోజులలో జ్ఞానదృష్ఠికి నాలుగు భాగములుగాయున్న ఆకారము తెలియబడగా, ఆ ఆకారమును చిత్రపటముగా గీయగలిగాను. ఆ రోజు చిత్రపటముగా గీయబడిన బొమ్మకు పేరును పెట్టలేదు. ఈ మధ్యకాలములో దాదాపు 38 సంవత్సరములకు అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో 'దేవుని చిహ్నము' అని చదవగలిగాను. తర్వాత ద్వితీయ దైవగ్రంథము ఇంజీలులో 'దేవుని ముద్ర'యని చదవగలిగాను. రెండుచోట్ల చూచిన తర్వాత నేను భగవద్గీతలో చూచిన చిత్రపటమే దేవుని చిహ్నము మరియు దేవుని ముద్రగా యున్నదని గ్రహించగలిగాను.


దేవుని చిహ్నము లేక దేవుని ముద్ర దేవుని జ్ఞానముతో సమాన మైనది. అందువలన దేవుని ముద్రను చూస్తే దేవుని జ్ఞానము తెలిసినట్లు, దేవున్ని అర్థము చేసుకొన్నట్లు ఉండును. దేవుని జ్ఞానము ప్రకారము శరీరము లోపలి ప్రపంచము, శరీరము బయటి ప్రపంచము అని రెండు రకములుగా ప్రకృతిని చెప్పవచ్చును. ప్రకృతినే ప్రపంచము అంటున్నాము. దేవుని నుండి పుట్టినప్పుడు మొదట పెట్టబడిన పేరు ప్రకృతికాగా, రెండవ పేరునే పూర్తి అర్థముతో ప్రపంచము అని అంటున్నాము. ప్రకృతియనినా అర్థముతో కూడుకొన్న పేరే. కృతియనగా చేయబడినది. 'ప్ర' అనగా ముఖ్యముగా అని అర్థము. దేవుని చేత మొట్టమొదట ముఖ్యముగా చేయబడినది ప్రకృతి. 'కృతి'యనడములో స్త్రీ తత్త్వమును సూచించుచున్నది. అందువలన 'చేయబడినది' అని అన్నాము. చేయబడినది కృతియని చెప్పినా, అది దేవుని చేత చేయబడిన దానివలన దానిని ప్రకృతియని అంటున్నాము. అంటే ఎంతో ప్రాముఖ్యమైనదని అర్థము.


ప్రకృతి స్త్రీ తత్త్వము గలది, దేవుడు పురుష తత్త్వము గలవాడు అని ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో చెప్పుకొన్నాము. దేవుడు తన సృష్ఠిలో మొట్టమొదట సృష్ఠించినది ప్రకృతినే. అప్పటికి ప్రకృతి పరమాత్మ ఇద్దరే కలరు. అప్పుడు పరమాత్మ తన సంకల్పము చేత ప్రకృతిని ఐదు భాగములుగా విభజించాడు. అంతేకాక తననుండి రెండు భాగములను తయారు చేసి తననుండి బయటపడిన రెండు భాగములకు ఒక దానికి ఆత్మయని, రెండవ దానికి జీవాత్మయని పేరు పెట్టాడు. దేవుడు ఆత్మ స్వరూపుడే అనగా పురుష స్వరూపుడే అయినందున దేవుని నుండి విభజింపబడిన రెండింటినీ ఆత్మ, జీవాత్మయని చెప్పడమైనది. ఇట్లు పరమాత్మ మూడు భాగములుగా, ప్రకృతి ఐదు భాగములుగా మొత్తము ఎనిమిది భాగములు మొదట తయారయిన విశ్వరూపము. ప్రకృతి ఐదు భాగములు వరుసగా 1) ఆకాశము 2) గాలి 3) అగ్ని 4) నీరు 5) భూమి. ఇదంతయూ నిర్జీవమైన ప్రపంచముగా తయారయినది. ఈ ప్రపంచములో జీవరాసులను నింపుటకు దేవుడు ఐదు భాగములుగా యున్న ప్రకృతిని రెండు భాగములుగా చీల్చాడు. ఆకాశములో రెండు భాగములు, గాలిలో రెండు భాగములు, అగ్నిలో రెండు భాగములు అలాగే నీరు, భూమిలో కూడా రెండు భాగములు చేశాడు. అలా తయారయిన రెండవ భాగముల ప్రకృతిని చరప్రకృతియని, మొదటి భాగములను అచర ప్రకృతియని పేరు పెట్టడమైనది. దానిని క్రింద కొంత అర్థమగుటకు చిత్ర పట రూపములో చూస్తే బాగుంటుంది.



ప్రకృతిని తయారు చేసిన దేవుడు కనిపించని వాడు. ప్రకృతిని తయారు చేయకముందు దేవునికి ఏ రూపము ఉండేదో మనకు తెలియదు గానీ సృష్ఠిని తయారు చేసిన తర్వాత దేవునికి రూపము లేదు. ఆయన ప్రకృతి వెనుక ఉండిపోవుట వలన దేవుని రూపము ఎవరికీ తెలియదు. అట్లే ఆయన ఎవరికీ తెలియనివాడై పోయాడు. ప్రకృతిని సృష్ఠించిన తర్వాత తాను మూడు భాగములుగా తయారైనాడు. మూడు భాగములను క్రింద చూస్తాము.



ఈ మూడు ఆత్మలే ఆధ్యాత్మికమునకు మూల సూత్రములు. ఈ సూత్రములతోనే జ్ఞానము అనే లెక్కలు చేయవచ్చును.


ఒక ప్రక్కనుండి పరమాత్మ, ఆత్మ, జీవాత్మల వరుసయుండగా! మరియొక్క ప్రక్కనుండి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను వరుసలో యున్న మూడు ఆత్మలు, ముందు పుట్టిన ప్రకృతికి వెనుక ప్రక్కయుండుట వలన ఈ మూడు ఆత్మలు ఎవరికీ కనిపించకయున్నవి. అందరికీ ముందుయున్న ప్రకృతియే కనిపించుచున్నది. మొదట తయారయిన ప్రకృతి ఐదు భాగములుగా తయారయినది. మొదట తయారయిన ప్రకృతి ఐదు భాగములుగా తయారయిన తర్వాత ప్రతి భాగము మరియు రెండు భాగములుగా విభజింపబడినది. దానిని తర్వాత పేజీలలో దృశ్యరూపముగా చూస్తాము.


ఈ విధముగా ప్రకృతి పంచభూతములుగా చీలిపోయి అందులో అచర, చర ప్రకృతియని భాగములుగా చీలిపోయి, అచర ప్రకృతిలోని











అర్ధ ఐదు భాగములు సకల జీవులు నివశించుటకు ఉపాధిగానుండుటకు శరీరములుగా తయారయినది. అచర ప్రకృతినుండి తయారయిన శరీరములోనే ప్రతి మనిషి ఉంటున్నాడు. శరీరములు కాకుండావున్న సగము అచర ప్రకృతి బయట ప్రపంచముగా కనిపించుచున్నది. బయట కనిపించు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవే ఒక దానితో ఒకటి కలిసి శరీరములుగా తయారయినవి. ప్రకృతిని తయారు చేసిన వాడు అల్లాహ్ (దేవుడు). అందువలన ప్రకృతికి అధిపతి ఆయనే, యజమాని, దేవుడు అన్నీ ఆయనే.


అచర ప్రకృతి బయట ప్రపంచముగా ఉండిపోగా, చర ప్రకృతి శరీరములుగా ఉంటూ మార్పు చెందుచూ శరీరములో యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మరణము వచ్చునట్లు చేయుచున్నది. అల్లాహ్ (దేవుడు) బయట ప్రపంచము ఆకాశము మొదలుకొని భూమిని మధ్యలో గల గాలి, అగ్ని, నీరు అను మూడును సృష్ఠించిన సృష్ఠికర్త. అలాగే లోపలి ప్రపంచము ఆకాశములు మొదలుకొని భూమి మరియు మధ్యలో గల సమస్తమును సృష్ఠించాడు. దేవుడు ఇట్లు రెండు రకముల సృష్ఠిని తయారు చేశాడు. బయట ప్రపంచములో ఆకాశమునకు భూమికి మధ్యలో గాలి, అగ్ని, నీరు అను మూడు తప్ప మిగతావి ఏవీ లేవు. అదే చర ప్రకృతి అయిన శరీరములో ఏడు ఆకాశములు పై నుండి ఒకదాని తర్వాత మరొకటియుండగా! పై ఆకాశమునుండి క్రింది పాదముల వద్దనున్న భూమి వరకు గల సమస్తమును అల్లాహ్‍యే (దేవుడే) సృష్ఠించాడు. శరీరములో ఆకాశము అనబడు తల నుండి భూమి అనబడు పాదముల వరకు మొత్తము 24 భాగములు గలవు. అవికాక వాటికి అనుబంధముగా యున్న రక్తము, మాంసము, ఎముకలు, నరములు మొదలగునవి ఎన్నో గలవు. అందువలన గ్రంథములో ఒకచోట ఒక వాక్యమునందు ''ఆకాశములు భూమి వాటి మధ్యలో యుండు సమస్తమును అల్లాహ్ సృష్ఠించాడు'' అని వ్రాసియున్నారు.


దేవుడు సృష్ఠ్యాదిలో శరీరము బయటి ప్రపంచము మరియు శరీరము లోపలి ప్రపంచము అని రెండు ప్రపంచములను సృష్ఠించాడు. వాటినే అచర ప్రకృతి, చర ప్రకృతియని రెండు విధముల పిలిచారు. వాటినే మార్పు చెందే ప్రకృతి, మార్పు చెందని ప్రకృతియని పిలిచారు. ఇంకా నాశనమయ్యే ప్రకృతి, నాశనము కాని ప్రకృతియని కూడా పిలిచారు. నాశనమును ''సఫా'' యనీ, నాశనములేని దానిని ''మర్‍వా'' యని ఆనాడు అన్నారు. సఫా చేస్తాను అంటే చంపుతాను, నాశనము చేస్తానని అర్థము. అందువలన మార్పు చెందేది అంటే నాశనమయ్యేదియను అర్థముతో సఫా అని చెప్పడమైనది. దేవుడు తయారు చేసిన రెండు ప్రకృతులకు సఫా, మర్‍వాలని పేరు పెట్టడమైనది. నేడు సఫా, మర్‍వాలు అనగా రెండు కొండలుగా గుర్తించుకొన్నారు. విశేషమైన అర్థముతో కూడుకొన్న రెండు కొండలు దేవుని సృష్ఠిలోని రెండు ప్రకృతులకు గుర్తుగా పెద్దలు చూపించారు. 'సఫా' అనగా నాశనమయ్యే ప్రకృతికి గుర్తుగా చూపినది. 'మర్‍వా' అనగా నాశనము కాని ప్రకృతికి గుర్తుగా చూపినది. సఫా, మర్‍వాలు చూస్తే దేవుని సృష్ఠిలోని రెండు ప్రకృతులు గుర్తుకు రావలెనను ఉద్దేశ్యముతో ఆ రోజు పెద్దలు రెండు కొండలను చూపారు.


అల్లాహ్ (దేవుడు) రెండు ప్రకృతులను తయారుచేసి తాను ఊరక ఉండిపోయాడు. సృష్ఠిని చేసిన తర్వాత దేవుడు పని చేయకుండా విశ్రాంతి తీసుకొన్నాడు. అందువలన ఆయన అప్పటినుండి క్రియా రహితుడయినాడు. ఈ విషయమును చెప్పుచూ ఆరు రోజుల సృష్ఠి తర్వాత ఏడవ రోజు, ఏడవ ఆకాశములోని తన సింహాసనమున ఆసీనుడయ్యాడు. అప్పటినుండి ఆయన పని చేయలేదు. జరుగవలసిన దానిని ఆయన చేయడు. ఆయన 'అయిపో' అంటే అదే అయిపోతుంది. అనగా తన పాలకుల ద్వారా చేయబడుతుంది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో ఈ విధముగా చెప్పారు. సూరా ఏడు, ఆయత్ 54లో ఒకమారు చూడండి.


(7-54) ''సంశయము లేకుండా దేవుడే మీరాజు. ఆయన ఆకాశములను భూమిని ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనముపైన ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దానిని వేగముగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధముగా సృష్ఠించాడు. వినండి! సృష్ఠి ప్రక్రియ ఆయన స్వంతము. ఆజ్ఞ ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన దేవుడు అపారమైన శుభాలు కలవాడు.''


(10-3) ''నిశ్చయముగా మీరాజు దేవుడే. ఆయన ఆకాశములను, భూమిని ఆరు రోజులలో సృష్ఠించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్ను) అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వ హిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షములో) సిఫారసు చేయగలవాడు ఎవడూ లేడు. అటువంటి అల్లాహ్‍యే దేవుడు, కాబట్టి మీరు ఆయననే ఆరాధించండి. ఇంత చెప్పినా మీరు గుణపాఠము గ్రహించరా?''


(50-37) ''హృదయాన్ని కలిగియుండి, శ్రద్ధను కల్గియుండి ఆలకించండి. సావధానముగా మసలుకొనే ప్రతి వ్యక్తికీ ఇందులో హితోపదేశము కలదు.''


(50-38) ''నిశ్చయముగా భూమి, ఆకాశములను వాటి మధ్యనున్న అన్నిటినీ ఆరు దినములలో సృష్ఠించాము. మరి మాకు అలసట ఏమాత్రము రాలేదు.''


దేవుడు తన సృష్ఠిని లోపల ప్రకృతి, బయట ప్రకృతియని రెండు రకముల తయారుచేసి బయట ప్రకృతిని మార్పు చెందని అచర ప్రకృతిగా, లోపల ప్రకృతిని మార్పు చెందే చర ప్రకృతిగా నియమించాడు. సృష్ఠిని తయారు చేసిన తర్వాత దేవుడు తాను ఏమీ చేయని క్రియారహితుడుగా ఉండిపోయాడు. అయితే తాను సృష్ఠించిన రెండు ప్రకృతులలో కార్యములు జరుగుటకు అవసరమైన యంత్రాంగమును అమర్చాడు. అందువలన దేవున్ని గొప్ప వివేకవంతుడు అని చెప్పవచ్చును. ఆయన నిర్మించిన పాలనను అర్థము చేసుకోవడమే నిజమైన జ్ఞానము. దేవుని పాలన అర్థము కాకపోతే దేవునికి సంబంధించిన జ్ఞానము అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుడు రెండు రకముల సృష్ఠిని తయారు చేసి, బయట పాలనను తన ప్రకృతి పాలించునట్లు ఏర్పాటు చేసి ప్రకృతి వెనుక ఎవరికీ తెలియకుండా తానుండి తన ప్రకృతికి సూచనలిస్తూ, ప్రకృతిలోని పాలకులకు ప్రకృతి సూచనలిచ్చునట్లు చేసి బయట పాలన సాగించెను. ఇక లోపలి పాలన విషయములోనికి వస్తే, తననుండి విడదీసిన ఆత్మను తనవలె దేవున్ని చేసి శరీరము లోపలి పాలన సాగునట్లు చేసెను. తననుండి విడదీసిన జీవున్ని శరీరములో నివశించునట్లు చేసి కర్మ విధానము చేత ఆత్మ జీవున్ని శరీరములో పాలించునట్లు చేశాడు.


రెండు ప్రకృతులయందు ఇద్దరు దేవుళ్లు అని చెప్పవచ్చును. బయట ప్రపంచములో సృష్ఠిని సృష్ఠించిన దేవుడు క్రియారహితుడై ఎవరికీ తెలియని వాడై ఉండిపోగా, కనిపించు ప్రకృతి తన పాలకుల చేత ప్రపంచమును పాలించుచున్నది. అవసరమైనప్పుడు మాత్రమే ప్రకృతికి పరమాత్మ సూచనలు మాత్రము చేయుచున్నది. అదియూ మనుషులకు తెలియదు. ప్రకృతికి దేవుడు ఎప్పుడు ఏమి సూచనలిచ్చునో ఎవరికీ తెలియదు. అందరికీ తెలియునట్లు ప్రకృతియే తన పాలకుల చేత ప్రపంచమును నడుపు చున్నది. లోపలి ప్రపంచమయిన శరీరములో దేవుడై కర్మరీత్యా జీవున్ని పాలించువాడు ఆత్మే. దేవుడు తన ఆత్మనే శరీరములో దేవునిగా నియమించి జీవులైనవారందరూ అనగా మనుషులైన వారందరూ ఆత్మ చేత పాలించ బడువారిగా చేశాడు. పరిపాలననుబట్టి లోపలి దేవుడు, బయటి దేవుడు అని చెప్పవలసి వచ్చినది. ఇద్దరు దేవుళ్లున్నారని చెప్పుటకు మూడు దైవ గ్రంథములలో ఎన్నో ఆధారములు గలవు. ఈ విధానము మీకు బాగా అర్థమగుటకు ''దేవుని ముద్ర'' అను గ్రంథమును చదువవచ్చును. దేవుడు తన సృష్ఠిని రెండుగా విభజించి తాను కూడా రెండుగా తయారై మనుషులందరూ ఆరాధించుటకు ఒకే దేవుడు అర్హుడని, ఆయనే శరీరము లో గల దేవుడని చెప్పియున్నాడు. ఈ విషయమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా మూడు ఆయత్ 18 యందు ఇలా చెప్పియున్నాడు చూడండి.


(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి యుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''


ఈ వాక్యమునుబట్టి నిజముగా సృష్ఠికర్త అయిన దేవుడే మనుషులందరూ ఆరాధించవలసిన దేవుడు ఈయనేయని మరొక దేవున్ని చూపించినట్లు పై వాక్యములో కలదు. అక్కడ చెప్పినవాడు బయటి దేవుడే కాగా, సూచించబడిన దేవుడు శరీరములోనున్న దేవుడు. శరీరములో ఆత్మనే దేవునిగా పరమాత్మ నిర్ణయము చేశాడు. జీవరాసులందరూ శరీరములలోనే నివశించుట వలన శరీరములోయున్న ఆత్మ దేవున్నే ఆరాధ్య దైవముగా ఉండునట్లు స్వయముగా సృష్ఠికర్తయైన దేవుడే వాక్యములో చెప్పియున్నాడు. ఈ విధముగా సృష్ఠిలో బయట దేవుడు, లోపల దేవుడు అని ఇద్దరు దేవుళ్ళుండగా అందరూ ఆరాధించవలసిన దేవుడు శరీరము లోపలి దేవున్నేయని నిర్ధారణ చేయబడినది. దేవుని నిర్ధారణ ప్రకారము మనుషులకు ఇద్దరు దేవుళ్లుకాగా, అందులో శరీరము లోపలి దేవున్నే ఆరాధించవలసిన దేవుడుగా స్వయానా దేవుడే నిర్ణయము చేశాడు.


దేవుని చట్టము ప్రకారము అనగా ధర్మముల ప్రకారము, దైవగ్రంథముల ఆధారముగా ఇద్దరు దేవుళ్ళు, రెండు ప్రకృతులు గలవు. బయట ప్రకృతిని బయట దేవున్ని తెలియునట్లు జ్ఞానము చేత దేవుని గుర్తును తయారు చేశాము. అలాగే లోపలి దేవున్ని లోపలి ప్రకృతిని గుర్తించునట్లు జ్ఞానము చేత దేవుని గుర్తును తయారు చేశాము. లోపలి దేవునికి సంబంధించిన గుర్తును దేవుని చిహ్నము అనియూ, బయటి దేవునికి సంబంధించిన గుర్తును దేవుని ముద్రయని చెప్పుచున్నాము. రెండు రకముల దేవుళ్ళకు రెండు రకముల గుర్తులను కొంత జ్ఞానము చేత చిత్రపటములుగా నేడు మేము గుర్తించగా, గతములో అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో లోపలి దేవుని గుర్తును దేవుని చిహ్నము అను పేరుతో వ్రాసిన మూడు ఆయత్‍లను చూచాము. అలాగే దేవుని ముద్ర అను పేరుతో వ్రాసిన వాక్యము ద్వితీయ దైవ గ్రంథములో ప్రకటన గ్రంథమందు తొమ్మిదవ అధ్యాయమున నాల్గవ వాక్యములో గలదు. అక్కడ దేవుని ముద్రను గురించి వ్రాయబడి యున్నది. అయితే రెండు చోట్ల దేవుని గుర్తు యొక్క చిత్రమును గురించి చెప్పియుండలేదు. అయినా భగవద్గీతలో పరోక్షముగా చెప్పిన జ్ఞానమును బట్టి దేవుని గుర్తును చిత్రపటముగా మేము ఇప్పటికి 38 సంవత్సరముల క్రిందటే గుర్తించాము. అదే చిత్రపటమే దేవుని చిహ్నముగా, దేవుని ముద్రగా రెండు రకములు కలదని తెలియుచున్నది. దేవుని జ్ఞానము ప్రకారమే కనిపెట్టబడినది దేవుని గుర్తు. దేవుని గుర్తునే దేవుని చిహ్నము అని ఒక గ్రంథములో, దేవుని ముద్రయని ఒక గ్రంథములో మేము విడమరచి చెప్పాము.


దేవుని చిహ్నమును చిత్రపటముగా గీచి చూచిన దాని చిత్రపటము క్రింది విధముగా గలదు చూడండి.



శరీరము లోపల గల దేవుడు, దేవుని యంత్రాంగము, దేవుని పాలనను గురించి చూడగలిగితే శరీరములో దేవుడు, కర్మ, కాలము, గుణములు అన్నీ తెలియును. ఆత్మే దేవుడైయుండి జీవాత్మను కర్మప్రకారము పాలించుచున్నది. శరీరము లోపల నియమింపబడిన దేవుడుగా ఆత్మయుండి కర్మను అనుసరించి ఎప్పుడు ఏ సమయములో జీవుడు అనుభవించాలో దానిని అనుభవింపజేయుటకు గుణములను ఉపయోగించి కర్మేంద్రియముల ద్వారా పనిని చేసి జీవున్ని ఆత్మే అనుభవింపజేయు కార్యకర్తగాయున్నది. శరీరములో యున్న మనుషులందరికి శరీరములోని ఆత్మే దేవుడని పరమాత్మ తేల్చి చెప్పినది. ఆరాధ్యదైవము వేరేవాడు ఎవడూ లేడని, అందరికీ ఆరాధ్యదైవము ఈయన ఒక్కడేయని ఆత్మను పరమాత్మయిన దేవుడు నిర్ణయించి చెప్పినట్లు (3-18) వాక్యములో గలదు. సృష్ఠికర్తయైన దేవుడు సృష్ఠి తర్వాత తాను ఏమీ చేయనివాడై ఉండిపోయి భూమిమీద మనుషులందరికీ తన ఆత్మనే దేవునిగా నియమించి పోయాడు. ఈ విషయము మూడు దైవగ్రంథములలో వివరముగా యున్నా మనుషులు దానిని గ్రహించలేకపోయారు. అందువలన ఇప్పుడు మేము చెప్పు విషయము అందరికీ క్రొత్తగా మరియు వింతగా కనిపించును. మీకు ఎట్లు కనిపించినా నేను చెప్పినది పూర్తి సత్యము.


ఇంతకుముందు దేవుని చిహ్నము యొక్క చిత్రపటమును చూచారు. ఇప్పుడు అదే చిత్రపటమును చూపి దానినే దేవుని ముద్రగా చెప్పుచున్నాము తర్వాత పేజీలో చూడండి.


ఇది దేవుని ముద్ర అని పిలువబడినా ఆకారములో దేవుని చిహ్నము, దేవుని ముద్ర రెండూ ఒకటిగానే యుండును. పేర్లు రెండు అయినా, దేవుడు ఒక్కడే అయినందున దేవునికి సంబంధించిన గుర్తు ఒక్కటేయున్నది. అయితే వివరము రెండు రకములు గలదు. ఒకే దేవుడే సృష్ఠి పూర్వమున్నాడు, సృష్ఠి తర్వాతయున్నాడు. సృష్ఠి పూర్వమున్న దేవుడు సృష్ఠి బయట ఎలా మూడు ఆత్మలుగా చీలిపోయాడో, అట్లే మొదట తన నుండి ప్రకృతిని విడదీసి శరీరములు తయారు చేశాడో, ఆ నాలుగు



భాగములను చూపుచూ దేవుని ముద్రను తయారు చేయడమైనది. అందువలన దేవుని ముద్రలో ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ నలుగురే చూపబడియుందురు. ఈ నలుగురిలో ముగ్గురిని మాత్రమే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని క్రైస్థవులు చెప్పుకోవడము జరుగుచున్నది. తండ్రి అనగా ఆత్మ, కుమారుడు అనగా జీవాత్మ, పరిశుద్ధాత్మ అనగా పరమాత్మయని అర్థము. వారు మొదట తయారయిన ప్రకృతిని వదలివేశారు. ప్రకృతిని గుర్తించుకోలేదు. మిగతా ముగ్గురిని కూడా వరుస క్రమము లేకుండా చెప్పుకొన్నారు. ముందు పరిశుద్ధాత్మ చెప్పవలసి యుండగా ముందు ఆత్మను తండ్రియని చెప్పి చివరిలో పరిశుద్ధాత్మను చెప్పారు. జ్ఞానరీత్యా చెప్పితే 'ప్రకృతి, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు' అని అనాలి.


దేవుని ముద్ర బయట ప్రపంచములోని నాలుగు భాగములను చూపుచున్నది. అట్లే పరమాత్మకు గుర్తుగా దేవుని ముద్ర గలదు. దేవుని చిహ్నము శరీరము లోపలగల ఆత్మ విధానమునకు, కాలమునకు, కర్మమునకు, గుణములకు గుర్తుగా ఉండిపోయినది. ఇట్లు ఒకే గుర్తు రెండు పేర్లతో పిలువబడుచూ లోపలి దేవునికి, బయటి దేవునికి ప్రతీకగా యున్నది. లోపలి, బయటి రెండు విధానములు ఒకటి మార్పుతో కూడుకొన్నది, మరొకటి మార్పు లేని ప్రకృతితో యున్నది. మార్పుగల ప్రకృతియున్న గుర్తును 'చిహ్నము' అని అంటున్నాము. మార్పులేని ప్రకృతిగల దానిని 'ముద్ర'యని అంటున్నాము. దేవుని గుర్తులలో రెండిటిలోనూ ప్రకృతి యుండుట వలన మార్పు చెందే ప్రకృతితో తయారయిన శరీరము మరణించుచున్నది. ''చర'' అను మార్పు చెందు ప్రకృతిలో జనన మరణములు రెండూ కనిపించుచున్నవి. అందువలన మార్పు చెందే ప్రకృతి నాశనమగుచున్నది. తిరిగి ఉత్పత్తియగుచున్నది. అందువలన దానిని నాశనము చేయునదని చెప్పవచ్చును. దానినే సఫా అని అరబ్బీ భాషలో చెప్పడమైనది. మార్పుచెందని ప్రకృతికి మర్‍వా యని పేరు పెట్టుకొన్నారు. అరబ్బీ భాషలోగల రెండు పేర్లను రెండు కొండలకు ఉంచి ఆ రెండు కొండలను దేవుని చిహ్నములుగా చెప్పుకొంటున్నారు. దాని వెనుకయున్న వివరము తెలియదుగానీ, దేవుని చిహ్నములు సఫా, మర్‍వాలను రెండు కొండలుగా యున్నవని ముస్లీమ్‍లు చెప్పుకోవడము జరుగుచున్నది. (2-158) వ ఆయత్‍లో సఫా, మర్‍వాలను పర్వతముల పేర్లు చెప్పి దేవుని చిహ్నములన్నారు. సఫా అనగా నాశనమునకు గుర్తుగా చెప్పవచ్చును. కావున మార్పుచెందే చర ప్రకృతికి 'సఫా' అను పేరు చెప్పబడినదని అనుకోవచ్చును. అంతేగానీ అక్కడ భూమిమీద గల కొండలను అల్లాహ్ చిహ్నములు అనుకోవడము పొరపాటు. దేవుని చిహ్నము వెనుక యున్న జ్ఞానము తెలిస్తే రెండు కొండలు 'దేవుని ముద్రకు, దేవుని చిహ్నము'నకు గుర్తులని తలచవలెను. అంతతప్ప జ్ఞానమును తెలియకుండా బయట పర్వతములను చుట్టివచ్చినా ప్రయోజనముండదు. అందువలన ప్రతి మనిషి తాను ఆరాధించవలసిన దేవుడు ఒక్కడేయని తెలిసి, ఆయన వెనుక చిహ్నము, ముద్ర రూపములో యున్న జ్ఞానమును తెలియగలిగితే దేవున్ని చేరుమార్గము లభించును. దేవుని జ్ఞానమును తెలియకుండా ప్రార్థన చేసినా ప్రయోజనముండదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

17. సృష్ఠి పాలన జరుగు విధానము. (2-164)

''దేవుడు సమస్తమును సృష్ఠించెను'' అని విన్నాము, చదివాము. ఈ మధ్య కాలములో దేవుడు ఒక్కడేయని అందరికంటే గట్టిగా చెప్పే మస్లీమ్‍లు మా గ్రంథమని చెప్పుకొను అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో సృష్ఠి తర్వాత పని చేయని దేవుడు, సృష్ఠి తర్వాత పని చేసే దేవుడు అని రెండు ఆయత్‍లలో (వాక్యములలో) ఉండడము చూచాము. సూరా రెండు ఆయత్ 117లో ఇలా చెప్పారు చూడండి.


(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే (దేవుడే). ఆయన ఏ పనియైనా చేయ సంకల్పించు కొన్నప్పుడు దాన్ని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.''


'దేవుడు పని చేయడు' అను ఈ వాక్యమే కాకుండా 'దేవుడు పని చేయుచున్నాడు' అని సూరా రెండు ఆయత్ 255లో ఇలా చెప్పారు చూడండి.


(2-255) ''అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్య దైవము. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారము, ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వారికి వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరుకొన్నది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.''


(2-117) లో చెప్పబడిన వాడు సృష్ఠికర్త అయిన దేవుడు. ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన తర్వాత ఆయన అన్ని పనులు చేయుట మానివేసి ఊరక ఉండిపోయాడు. అవసరము వస్తే ఆయన ఏదీ చేయక కేవలము సంకల్పముతో ఆ పని అయిపోయేటట్లు చేసేవాడు. ఆయన సంకల్పించుకొంటే వెంటనే దానిని చేయు తన పాలకులను ఆయన ముందే నియమించి పెట్టుకొన్నాడు. ఈ విధముగా మొదట భూమిని ఆకాశమును సృష్ఠించిన దేవుడు తర్వాత ఎప్పుడూ ఆయన పనిని చేయలేదు. అందువలన ఆయనను పనిని చేయని దేవునిగా చెప్పాము.


విశ్వములో బయట పనులను చేయుటకు తన పాలకులను నియమించి, శరీరము లోపలి కార్యములను చేయుటకు ఆత్మను నియమించి ఆత్మను తనంతటి వానిగా తన అధికారములన్నీ ఇచ్చి శరీరములో దేవునిగా నియమించి శరీరములో నివసించు జీవునికి దేవునిగా ఉండునట్లు, ఆయననే జీవులందరూ ఆరాధించునట్లు నియమించి పెట్టాడు. అంతే కాకుండా జీవులనందరినీ ప్రకృతి చేత చావు పుట్టుకలను పొందునట్లు చేసి, శరీరములోని కార్యములన్నీ ఆత్మే చేసేటట్లు కూడా నియమించినది. కర్మ ప్రకారము కర్మలను అనుభవింపజేయడము, కర్మ ప్రకారము పుట్టించడము కర్మ ప్రకారము పాలించడము, కర్మ ప్రకారము ఆడించడము ఆత్మకు అప్పజెప్పి ఆయనను పని చేసే దేవునిగా నియమించి, సృష్ఠి పూర్వమున్న దేవుడు సృష్ఠి తర్వాత దేవున్నే మనిషికి కార్యకర్తగా చేశాడు. శరీరములో యున్న దేవుడయిన ఆత్మనే అందరూ ఆరాధించు ఏకైక ఆరాధకుడుగా చేశాడు. దీనినిబట్టి భూమిమీద పని చేయని దేవుడు, పనిని చేయు దేవుడు అను ఇద్దరు దేవుళ్ళు తెలియుచున్నారు. పనిని చేయు దేవుడే అందరికీ ఆరాధ్య దైవము అని మొదటి దేవునిచే నిర్ణయింపబడినది. ఆరాధించబడు రెండవ దేవుడే మనిషికి (2-255) లో చెప్పినట్లు 'కార్యకర్తగా' యున్నాడు.


పనిని చేయని దేవుడు శరీరము బయట తన పాలకుల చేత తన సంకల్పము చేత కార్యములు చేయించుచున్నాడు. శరీరము లోపలి ఆరాధ్య దైవము తానే స్వయముగా అన్ని పనులు చేయుచున్నాడు. శరీరములో కార్యములను చేయు దేవుడు నిద్రపోకుండా పనిని చేయుచున్నాడనీ, జీవున్ని జీవింపజేయడములో ఆత్మయిన దేవుడు ఎప్పుడూ అలసిపోడని (2-255) లో చెప్పడము జరిగినది. ఇట్లు ఇద్దరు దేవుళ్ళలో ఒకరు లోపలి దేవుడు కాగా, బయటి దేవుడు సృష్ఠికర్తయైన దేవుడు. బయటి దేవుడు పనిని చేయడు. తన పాలకుల చేత తన సంకల్పముతో పని చేయించును. శరీరము లోపలి దేవుడు తానే శరీరమంతా పని చేయుచూ కార్యకర్తగా యుంటూ అందరూ ఆరాధించే దేవుడుగా కూడా యున్నాడు.


ఇప్పుడు అసలు విషయానికి వస్తే సూరా 2, ఆయత్ 164 లో శరీరము బయట పాలనను గురించి, లోపలి పాలనను గురించి వ్రాయడము జరిగినది. మొత్తము మనిషి పుట్టుకనుండి బయట జరుగు పనులను సహితము చేయు పాలకులను గురించి చెప్పడము జరిగినది. దీనిని మొత్తము సృష్ఠి పాలనయని చెప్పవచ్చును. ఇప్పుడు సూరా రెండు, ఆయత్ 164ను చూస్తాము.


(2-164) ''భూమి ఆకాశాల సృష్ఠిలో, రేయింబవళ్ళ నిరంతర మార్పులో, ప్రజలకు ఉపయోగ పడే వస్తువులను సముద్రములలో మోసుకపోవు ఓడలలో, ఆకాశం నుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, ఆ వర్షము నీటి ద్వారా నిర్జీవముగా పడియున్న భూమిని బ్రతికించడములో, అన్ని రకాల జంతువులను అందులో వశింపజేయడములో, వీచే పవనాల దిశలు మార్చటములో, భూమి ఆకాశాల మధ్య నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిగలవారికి ఎన్నో నిదర్శనములు కలవు.''


ఈ వాక్యములో ''బుద్ధి గ్రాహితశక్తియున్న వారికి ఎన్నో నిదర్శనములు గలవు'' అని చెప్పాడు. 'నిదర్శనము'లో ప్రత్యేకమయిన అర్థము గలదు. దర్శనము అనగా చూడడము అని చెప్పవచ్చును. నిదర్శనము అనగా 'దర్శనము లేనిది'యని చెప్పవచ్చును. అనగా కనిపించనిది యని అర్థము. ఎన్నో కనిపించని సత్యములు ఈ వాక్యములో యున్నట్లు తెలియుచున్నది. అందువలన నా బుద్ధి గ్రాహితమునకు వచ్చిన సత్యములన్నిటినీ తెలియజేతును చూడండి. భూమి ఆకాశముల సృష్ఠి అనగా ఇందులో రెండు రకముల అర్థము కలదు. బయటి ప్రపంచములో కనిపించు ఆకాశము భూమి అనునవి కలవు. అవి ఒక్కమారే సృష్ఠ్యాదిలో దేవుని చేత తయారు చేయబడినాయి. తర్వాత మాటిమాటికి సృష్ఠింపబడవు. మాటిమాటికి సృష్ఠింపబడునది శరీరము అను ప్రకృతి. శరీరము బయట భూమి ఆకాశములను అచర ప్రకృతియని అంటాము. శరీరము లోపలి ఆకాశము భూమిని చర ప్రకృతి అంటాము. శరీరములో కూడా ఆకాశము భూమి అని చెప్పబడినవి కలవు. శరీరము అంతా ప్రకృతే అయినా అందులో ఆకాశము భూమి అని చెప్పు గుర్తులు కలవు. తలను ఆకాశము అని అంటాము. భూమిని, కాళ్ళు అని గుర్తుగా చెప్పడము, మధ్య భాగము నంతటినీ భూమి, ఆకాశముల మధ్యలో గల సమస్తము అని అంటాము.


'భూమి ఆకాశములు వాటి మధ్యలో ఉండు సమస్తము' అని ఖుర్ఆన్ గ్రంథములో సూరా 32 ఆయత్ 4లో గలదు. ఈ వాక్యములో చెప్పినది శరీరమును గురించి అని చెప్పవచ్చును.


(32-4) ''అల్లాహ్‍యే ఆకాశాలను భూమిని వాటి మధ్యనున్న సమస్తమును ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు.''


అని యున్నది. ఈ వాక్యమును బాగా గమణించితే నిత్యము జరుగు పనులలో ఇదొక పనియని అర్థమగుచున్నది. నిత్యము జరుగునది కాక సృష్ఠి ఆదిలో ఒకమారే జరిగి తర్వాత జరుగదు. అదే బయటి భూమి ఆకాశమును తయారు చేయడము అని అర్థము చేసుకోవలెను. అంతేకాక బయటి ఆకాశము, భూమిని ఒకమారు తయారు చేసినవాడు సృష్ఠికర్తయైన పరమాత్మ అని చెప్పవచ్చును. శరీరము లోపలి ఆకాశములు, భూమిని తయారు చేయువాడు శరీరములో దేవుడుగా యున్న, అధిపతిగాయున్న ఆత్మయని తెలియవలెను. ఈ విధముగా బయటి సృష్ఠి, లోపలి సృష్ఠియని తెలియవలెను. లోపలి సృష్ఠిలో ఆకాశములు బహువచనములో ఉండును. బయటి సృష్ఠి అంటే ఆకాశము ఏకవచనములో ఉండును. లోపలి సృష్ఠిలో ఏడు ఆకాశములుండగా, బయటి సృష్ఠిలో ఒకే ఆకాశము ఉండును. ఒకే ఆకాశము, ఒకే భూమి ఉండు సృష్ఠిని ఒకమారే సృష్ఠికర్తయైన పరమాత్మ సృష్ఠించగా, ఏడు ఆకాశములు ఒక భూమి ఉండు శరీరములోని ప్రకృతిని నిత్యము ఎన్నిటినో శరీర రూపములలో ఆత్మ దేవుడు సృష్ఠించుచున్నాడు. బయటి ఆకాశమును, భూమిని మిగతా మూడు గాలి, నీరు, అగ్ని అను వాటిని తయారుచేసి తర్వాత రెండవమారు ఏ పని చేయక సృష్ఠికర్త అయిన పరమాత్మ ఊరక ఉండిపోయాడు. తర్వాత పరమాత్మ దేవునిగా నియమించిన ఆత్మ, తర్వాత ఆయన పాలకులు పని చేయుచుండగా విశ్వపాలన జరుగుచున్నది. విశ్వాధినేత మొదట సృష్ఠికర్తయిన పరమాత్మ యను దేవుడుకాగా, తర్వాత పనులు చేయు వారందరూ దేవుని చేత నియమింపబడిన పాలకులు అని అర్థము చేసుకోవలెను. అందులో మొదటి పాలకుడు ఆత్మయను దేవుడుకాగా, మిగతా పాలకులందరూ బయట ప్రపంచములో ఉందురు. ఆత్మయను దేవుడు శరీరములో ఉండి తన క్రింద పని చేయు 24 మంది పాలకులను పని చేయిస్తూ 25వ జీవున్ని నడుపుచున్నాడు. శరీరములో దేవుడైయున్న ఆత్మ జీవున్ని కష్టసుఖములలో నడుపుచున్నాడు. ''శరీరము ధరించిన ఏ మనిషికయినా, ఏ జీవరాసికయినా ఆత్మే ఆరాధింపదగిన దేవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు.'' ఈ విషయము మూడు దైవ గ్రంథములలో చెప్పబడియున్నా అంతిమ దైవ గ్రంథములో అనేకమార్లు చెప్పియున్నారు. అయితే ఆ విషయము ఏ మానవునికీ అర్థముకాక మొదటి సృష్ఠికర్తయైన పరమాత్మనే మేము ఆరాధించుచున్నామని అంటున్నారు. అయితే మొదటి సృష్ఠికర్త 'ఏ అక్కర లేనివాడనీ, ఏ ఆరాధన అవసరము లేనివాడని' ఆయనే స్వయముగా చెప్పినా తెలియకున్నారు. ఒకమారు అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 112లో రెండవ ఆయత్నందు చెప్పినది గమనించండి. (112-2) ''ఆయన ఏ అక్కరా లేనివాడు.'' ఈ మాటను చూచిన తర్వాత కూడా మొదటి సృష్ఠికర్తయైన దేవున్ని ఆరాధించితే వాడు జ్ఞానము తెలియక, దేవుడు చెప్పిన మాట అర్థముకాక అలా చేయుచున్నాడని చెప్పవచ్చును. నేడు ముస్లీమ్ సమాజము ఒకే దేవున్ని ఆరాధించుచున్నది. అయితే దేవుడు చెప్పినమాట అర్థముకాక ఎవరిని ఆరాధించవలెనో వారిని ఆరాధించక, ఎవరిని ఆరాధించకూడదో వారిని ఆరాధించుచున్నారు.


సూరా మూడులో ఆయత్ 18లో దేవుడే స్వయముగా ఇంకొక దేవున్ని చూపి 'ఈయనే మీకు ఆరాధ్య దైవము, ఈయన తప్ప వేరే దేవున్ని మీరు ఆరాధించవలసిన అవసరము లేదు' అని చెప్పియున్నా దానిని చూడకుండా ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానమును అనుసరించకుండా కొందరు ముస్లీమ్‍లు ప్రవర్తించుచున్నారు. దేవుని విషయములో ఎవరిని ఆరాధించాలో వారికి సక్రమముగా తెలియకుండా పోయినది. ఒక్క దేవున్ని ఆరాధించుచున్నా ఆ ఒక్క దేవుడు సృష్ఠి పూర్వమున్నవాడా? సృష్ఠి తర్వాత యున్నవాడాయని స్పష్టముగా తెలియలేకున్నారు. ఒకమారు ఈ వాక్యమును చూడండి.


(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన ఆయన తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''


ఈ ఆయత్ (వాక్యమును) చూచిన తర్వాత అయినా స్వయముగా అల్లాహ్ ఎవరిని ఆరాధించమని సిఫారసు చేయుచున్నాడని యోచించ లేకపోయారు. అట్లే (112-2) వ వాక్యములో ''ఏ అక్కర లేనివాడు దేవుడు'' అని చెప్పినప్పుడయినా మన ఆరాధన సృష్ఠ్యాదిలోని దేవునికి అవసరము లేదు కదా!యని ఆలోచించలేకపోయారు. ఎవరో ఏదో చెప్పితే దానిని విని ముందుకు పోతున్నారు తప్ప స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో ఏమి వ్రాశారని చూడకున్నారు. అందువలన మనము చేయు ఆరాధన ఎవరికి చేరవలెనో వారికి చేరడము లేదు. ఇది ఒక మతమునకు ఉన్న సమస్య కాదు. అన్ని మతములలో ఉన్న సమస్యేయని తెలియవలెను. హిందువులయితే ఏకముగా ఒక దేవుని ఆరాధనయనునది లేక బహు దేవతారాధన చేయుచున్నారు. అందరూ తెలియవలసినదేమనగా! ఒకే దేవున్ని ఆరాధించవలెను, అయితే ఆ ఒక్క దేవుడు ఎవరో తెలిసి ఆరాధించండి. ఇదంతా ఎందుకు చెప్పుచున్నామనగా! (2-164) ఆయత్ అర్థము కావాలంటే ఇదంతా తెలిసియుండాలి. ఈ విధానమంతా తెలిసి యుంటే 164వ వాక్యములో చెప్పిన విషయము సులభముగా అర్థము కాగలదు. ఒక మనిషి ఎలా పుట్టుచున్నాడు? ఎవరి చేత పుట్టుచున్నాడు? రేయింబగళ్ళు ఎలా మారుచున్నవి? అన్నియూ తెలియును. నాకు తెలిసినంత వరకు ఈ వాక్యమును రెండు విధముల భాగించి చూడవలసియున్నది. అలా చూడగలిగితే శరీరమును తయారు చేయు పనిని ఎవరు చేస్తున్నారో, ఆయనను మొదటి భాగములో తెలియవలెను. తర్వాత రెండవ భాగములో శరీరము బయట జరిగే పనులు ఎవరు చేయుచున్నారో తెలియవచ్చును.


2-164 వాక్యము ఎనిమిది (8) భాగములుగా యున్నది. అందులో మొదటిది భూమి ఆకాశముల సృష్ఠియని వ్రాయబడియున్నది. మిగతా ఏడు శరీరము బయట అందరికీ తెలియునట్లు జరుగుచున్నది. మిగతా ఏడు విషయములకంటే ముఖ్యమైనది మరియు ఎవరికీ సరిగా అర్థము కానిది మొదట చెప్పిన భూమి ఆకాశముల సృష్ఠియని చెప్పవచ్చును. ఆకాశములు శరీరము లోపలయున్నవి. ఆకాశము ఒక్కటి అయితే శరీరము బయట గలదు. వాక్యములో చెప్పినది ఆకాశములు అయినందున ఇది శరీరములోని విషయమని తెలియుచున్నది. శరీరముల సృష్ఠి తల్లి శరీరములో జరుగుచున్నది. తల్లి శరీరములోగానీ, తండ్రి శరీరములోగానీ ఆత్మే దేవునిగా యుంటూ శరీర కార్యములన్నిటినీ చేయుచున్నది. ఆత్మ కార్యములలో మనిషి శరీరమునకు బీజదాత కార్యము ఒకటికాగా, తర్వాత శిశు శరీరమును పూర్తిగా తొమ్మిది నెలలు శరీరములోనే పెంచి తర్వాత ప్రసవింపజేయుచున్నది. బయటపడిన శరీరములోనికి ఎక్కడో చనిపోయిన జీవున్ని తెచ్చి శిశు శరీరములో వేయుచున్నది. శిశు శరీరములోనికి జీవున్ని చేర్చి అక్కడ నుండి శిశు శరీరములో శిశువు పెరుగుటకు, బ్రతుకుటకు సంబంధించిన కార్యములను చేయుచున్నది. మనుషులను శరీరములో అధికారిగా, అధిపతిగా, దేవునిగాయున్న ఆత్మ కార్యకర్తగా పని చేసి మనిషిని సృష్ఠించుచున్నది. ఆత్మ పుట్టబోయేవాని తల్లి శరీరము లోను, తండ్రి శరీరములోను పని చేసి సృష్ఠి కార్యమును జయప్రదముగా చేయుచున్నది. భూమిమీద మనుషులే కాదు ఏ జీవరాసి పుట్టవలెనన్నా ఆత్మయే సృష్ఠించవలసి యున్నది. 2-164 వాక్యములో చెప్పినట్లు మొత్తము దేవుని పరిపాలన ఎనిమిది రకములను చెప్పియుండగా అందులో మొదటిది శరీరముల సృష్ఠియని చెప్పారు. దానినే జ్ఞానరీత్యా భూమి ఆకాశముల సృష్ఠియని చెప్పారు. ఈ సృష్ఠి కార్యములో ఆత్మ మూడు శరీరములలో ఉండి ఉమ్మడిగా పని చేయుచున్నది. ఒకటి పుట్టబోయే వాని తండ్రి శరీరములో బీజముగా బీజదాతగా, రెండు తల్లి శరీరములో శిశువును పెంచుటలో, మూడు చనిపోయిన శరీరములోని జీవున్ని తీసుకొని క్రొత్త శిశు శరీరములో తెచ్చివేయడము అను కార్యములు చేయడము వలన భూమి ఆకాశముల సృష్ఠి అని మొదటి కార్యమును చెప్పారు.


మనకు తెలిసిన జ్ఞానరీత్యా శరీరాంతర్గత జ్ఞానము ప్రకారము మనిషిని సృష్ఠించడములో నిదర్శనము కలదని వాక్యములో చెప్పారు. వాక్యములో ఎనిమిది కార్యములను చెప్పి ఇందులో బుద్ధిగలవారికి ఎంతో నిదర్శనమున్నది యని చెప్పారు. మొదటి కార్యము భూమి ఆకాశములను సృష్ఠించడము అనగా! ఒక సజీవమైన శరీరమును పుట్టించడమునకు సంబంధించిన మొత్తము కార్యమును అని అర్థము చేసుకొంటే, అది కనిపించకుండా ఎవరికీ తెలియకుండా జరుగుచున్న పనిగా చెప్పవచ్చును. ఇంతవరకు మనకు తెలిసి ఒక మనిషి (శిశువు) పుట్టుకకు కారణము కనిపించే తండ్రి, కనిపించే తల్లియని అనుకొన్నాము. అయితే అందులో కనిపించే తండ్రిపాత్రగానీ, తల్లిపాత్రగానీ లేదని ఎవరికీ తెలియదు. వారి పాత్ర లేదు అంటే, చెప్పిన వానిని విచిత్రముగా చూచువారు గలరు. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా, వాస్తవముగా జరుగునది పైకి కనిపించునది ఏమాత్రము కాదు. మనకు కనిపించనిది జరుగుచున్నది. అందువలన బుద్ధిగల వారికి ఎంతో కనిపించని విషయము తెలియగలదని వాక్యము చివరిలో 'నిదర్శనములు కలవు' అని అన్నారు.


బుద్ధి గలవారికి ఎన్నో నిదర్శనములు జ్ఞానము ద్వారా తెలియు చున్నప్పుడు, బుద్ధిలేనివారికి కనిపించనిది తెలియదనేగా అర్థము. ఎట్లు చెప్పినా కొందరు కనిపించని విషయములలో కొంతయినా తెలుసుకొందా మని అనుకోక మొండిగా తమకు తెలిసినదే నమ్ముతామనీ, తమకు కనిపించనిది, అభౌతికమైన దానిని ఏమాత్రము నమ్మము అంటున్నారు. అభౌతికమును నమ్మనంత మాత్రమున తాము గొప్ప బుద్ధి గలవారైనట్లు కనిపించని అభౌతికమును గురించి చెప్పిన వారందరూ ప్రజలను మోసము చేసేవారిగా లెక్కించడము, ప్రచారము చేయడము జరుగుచున్నది. దైవ గ్రంథములో నిదర్శనము అనగా అభౌతికము అనేకదా! అర్థము. బుద్ధిగల వారికి నిదర్శనము కలదు అని అన్నప్పుడు, బుద్ధిలేనివారికి ఏమాత్రము జ్ఞానము లేనివారికి నిదర్శనము లేదనేగా, తెలియదనేగా అర్థము. బుద్ధి ఉన్నా, దానికి గ్రాహితశక్తి కావాలి. కొందరు మాకు బుద్ధి ఉంది, ఎన్నో రంగములలో మేము మేథావులము. మాకు బుద్ధి లేదా! అని కొందరు నాస్తికులు మాట్లాడడము జరుగుచున్నది. వారు కొన్ని విషయములలో మేథావులే. కనిపించే విషయములలో మాత్రము బుద్ధిగల వారే, కాదని మేము చెప్పలేదు. అయితే అభౌతిక విషయములలో మాత్రము వారి బుద్ధికి గ్రాహితశక్తి లేదు అని చెప్పుచున్నాను. బుద్ధి గ్రాహితశక్తి గలవారికే అభౌతికమైన (నిదర్శనమైన) విషయములు తెలియగలవు. శరీరములో అధిపతిగా ఆత్మయున్నది. ఆత్మే దేవుడుగా యున్నది. ఆత్మే శరీరములో సర్వ కార్యములను చేయు కార్యకర్తగా యున్నది. ఒకవైపు దేవునిగా, ఒకవైపు కార్యకర్తగా యున్న వానిని అర్థము చేసుకొనుటకు తప్పనిసరిగా మనిషికి ఉన్న బుద్ధికి ప్రత్యేకమైన గ్రాహితశక్తి అవసరము. అది లేనివారే మేము చెప్పే విషయమును అర్థము చేసుకోలేకపోవుచున్నారు. వారి బుద్ధికి చెప్పేవారందరూ మోసగాళ్లే యనునట్లు కనిపించుచుండును.


ప్రశ్న :- మేము విద్యావేత్తలము, మేథావులము అనువారికే ఆధ్యాత్మిక విషయము మీద గ్రాహితశక్తి తక్కువ యుండును. మేము చూచిన వారిలో విద్యావేత్తలు, మేథావులు, ధనికులు, పదవులలో హోదాగా యున్నవారు ఆధ్యాత్మిక విషయములను నమ్మరు. వారికి ఎందుకు అర్థము కావడము లేదు. వారిని చూచి పెద్ద తెలివైనవారే నమ్మనప్పుడు మనమెందుకు నమ్మాలి? అని కొందరు వారిని చూచి దైవజ్ఞానమును కొద్దిగయినా తెలియకుండా చెడిపోవుచున్నారు. ఎందుకు ఇట్లు జరుగు చున్నది? విద్యావేత్తలకు బుద్ధి బాగా ఉంటేనే కదా! వారు విద్యావేత్తలయి నది. వారికెందుకు అర్థము కాలేదు?


జవాబు :- వారు ప్రపంచ విద్యలో వేత్తలుగానీ, పరమాత్మ జ్ఞానములో ఉత్తదుత్తలే (ఉత్త కుండలే). దేవుడు కనిపించేవాడు కాడు. అంటే దేవున్ని ఎవరూ దర్శించలేరు. దేవుడు నిదర్శుడు. దేవుని జ్ఞానము కూడా సూక్ష్మముగానే ఉండును. స్థూలము అనగా కంటికి కనిపించునది, స్పర్శకు తెలియునది. సూక్ష్మము అనగా కంటికి కనిపించదు, చేతికి తాకితే తెలియదు. ప్రపంచ చదువులలో వేత్తలయిన వారు స్థూలమునే తెలియగలరు. ఇంద్రియములకు తెలియు విషయులే వారికి తెలియును. ఇంద్రియములకు తెలియని విషయములు తెలియవు. వారి బుద్ధికి వాటిని గ్రహించు శక్తి యుండదు. మనిషికి ఆధ్యాత్మిక విషయములన్నియూ సూక్ష్మమైనవై యున్నవి. ఆత్మ కనిపించదు. ఆత్మకు సంబంధించిన సాక్ష్యములు ఏవీ కనిపించవు. అప్పుడు జ్ఞాన విషయములన్నియూ వారికి అసత్యముగా కనిపించు చుండును. అందువలన వారు జ్ఞానమును చెప్పు వారిని మోసగాళ్ళలో కలిపివేస్తున్నారు.


అంతెందుకు జ్ఞానులలో కూడా అనగా అభౌతికమును నమ్మేవారిలో కూడా కొన్ని జ్ఞాన విషయముల ఎడల వారి బుద్ధి పని చేయలేదు. అప్పుడు వారు తప్పుదారిపట్టి, తప్పు జ్ఞానమును అర్థము చేసుకొంటున్నారు. దీనికంతటికీ కారణము దైవజ్ఞానము మీద ఎంత శ్రద్ధయుండునో అంత వేగముగా జ్ఞానము అర్థమగును. కొందరికి శ్రద్ధ తక్కువ యుండుట వలన వారికున్న శ్రద్ధ ప్రకారము సూక్ష్మ విషయముల మీద నమ్మకమున్నా అర్థమయ్యేది తక్కువ యుండును. శ్రద్ధ లేనివారికి పూర్తి గ్రాహిత శక్తి యుండదు. బయట ప్రపంచములో ఎంత మేథావులయినా, ఎంత బుద్ధి గలవారైనా ఆధ్యాత్మిక విషయములు కొద్దిగ కూడా అర్థము కావు. అందువలన ఆధ్యాత్మికము అంతా అబద్దము. ఆత్మ అనునది హేతుబద్దము కానిది, అసత్యమైనది అంటున్నారు.


ఆకాశములో సూర్యుడు ఉంటున్నాడు. ఎంతో దూరములో యున్న సూర్యుని వెలుగు భూమిమీద పడుచున్నది. సూర్యుని వెలుగు భూమిమీద సూర్యకిరణముల ద్వారా వస్తున్నది. పైన సూర్యుడు సత్యమే, క్రింద వెలుగు సత్యమే అయితే మధ్యలో సూర్యకిరణములు కనిపించడము లేదు. అట్లని సూర్యకిరణమును అసత్యమంటామా! అని విద్యావేత్తలను ప్రశ్నించితే కనిపించని కిరణములను నమ్ముతాము అంటున్నారు. పైన సూర్యుడు క్రింద వెలుగు ఉన్నది, కావున వెలుగును తీసుకవచ్చే కిరణములను నమ్ముతాము అనేవారు లోపల ఆత్మ, పనులు బయట జరుగుచున్నవి కదా! పనులు జరుగుటకు ఆధారమైన ఆత్మశక్తిని ఎందుకు నమ్మడము లేదు? అని అడిగితే సూర్యుడు కనిపించినట్లు ఆత్మ కనిపించడము లేదు అంటున్నారు. అట్లని కనిపించని ఆత్మను నమ్మనప్పుడు, కనిపించని మనస్సును ఎందుకు నమ్మాలి? అంటే దానికి సరియైన జవాబు లేదు. బుద్ధి కనిపించదు, మనస్సు కనిపించదు. కనిపించని వాటిని పట్టుకొని బుద్ధిగలవానిని మేథావి అని అంటున్నారు. అట్లే కొందరు కనిపించని మనస్సును ఆధారము చేసుకొని మనస్తత్వ డాక్టర్లు, మనస్తత్వ శాస్త్రము అని పేరు పెట్టి చెప్పుచున్నారు. కనిపించని మనస్సుకు శాస్త్రము అని పేరుపెట్టి చెప్పినప్పుడు కనిపించని ఆత్మను ఎందుకు నమ్మరు? అంటే దేవతలకు అలవాటుపడిన హిందువులకు ఆత్మంటే సులకన. మిగతా మతముల వారయిన ముస్లీమ్‍లు అల్లాహ్‍ను తప్ప ఆత్మను ఒప్పుకోము అంటున్నారు. క్రైస్థవుల విషయములో కొందరు ఆత్మయని వ్రాసుకొన్నా, చెప్పుకొనినా అది జంతువులలో మిగతా వాటిలో ఉంటుందిగానీ మనిషిలో ఉండదు అంటున్నారు.


'మానవజాతికంతా ఆత్మే దేవుడని' మూడు దైవ గ్రంథములు చెప్పుచున్నా ఆత్మయను పదమును అనేక సందర్భములలో వాడుచున్నా ఆత్మంటే అదేమిటి? దేవునికి ఆత్మకు సంబంధమేమి? అని అంటున్నారు. 'ఆత్మే దేవుడని భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములు చెప్పుచున్నాయి' అను మాటను మరచిపోయారు. ఆత్మ చేత జన్మించి, ఆత్మ ఇచ్చిన శరీరములో ప్రవేశించి, ఆత్మ చేతనే క్షణక్షణము జీవించుచూ, ఆత్మను మనిషి తెలియలేడంటే, ఆత్మ విషయములు అబద్దముగా ఉన్నాయంటే, అతనిని నిజముగా అంధుడనియే చెప్పాలి.


వాక్యములో చెప్పిన ఎనిమిది కార్యములలో 'భూమి ఆకాశముల సృష్ఠిలో నిదర్శనము కలదని' చెప్పినట్లు నా బుద్ధికి తెలిసిన విధానమంతయూ చెప్పాను. భూమి ఆకాశముల సృష్ఠి వెనుకల జరుగుచున్న, తర్వాత జరుగ బోవు కార్యము ఇట్లే ఉంటుందని తెలిపాను. ఇది కనిపించని కార్యమయిన దానివలన ఎవరికీ తెలియదు. ఇతరులకు తెలియని రహస్యమును నేను చెప్పడమైనది. వాక్యములో చెప్పిన ఎనిమిది కార్యములలో 'శరీరము లోపల జరుగునది ఇది ఒక్కటే.' మిగతా ఏడు కార్యములు శరీరము బయట జరుగునవి. ఈ కార్యమును ఒక్కదానినే ఆత్మ చేయుచున్నది. సృష్ఠ్యాది నుండి యున్న దేవుడు సృష్ఠించిన వారిలో మొదటివాడు ఆత్మ. అంతేకాక సృష్ఠ్యాది దేవుని తర్వాత, దేవుని చేత నియమింపబడిన దేవుడుగా యున్నవాడు ఆత్మని ముందే చెప్పాము. ఆత్మ శరీరముల లోపలేయున్నది. తర్వాత చెప్పిన ఏడు కార్యములు దేవుడు సృష్ఠించిన తన పాలనలోని భూతములు, మహాభూతములు, గ్రహములు, ఉపగ్రహములు చేయుచున్నవి. మిగతా పనులలో రెండవది 'రేయింబగళ్ళు నిరంతరము మార్పు చెందడము' అను కార్యము కలదు.


ప్రపంచము సృష్ఠింపబడినప్పుడు నుండి రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చుచున్నవి. సృష్ఠి తర్వాత రాత్రింపగళ్ళు మార్పు నిరంతరాయముగా కొనసాగుచున్నది. ఏదయినా ఒకరోజు ఎప్పుడయినా ఒకప్పుడు, రాత్రి రాలేదనో లేక పగలు రాలేదనో చెప్పుటకు వీలులేదు. ఈ రెండు 'సృష్ఠినుండి ఎల్లప్పుడు కొనసాగునట్లు దేవుని నిర్ణయము' అయినందున అప్పటినుండి ఇప్పటి వరకు అలాగే కొనసాగుచున్నది. తర్వాత కాలములో కూడా కొనసాగుతుంది. ఇది సృష్ఠ్యాదిలోని దేవుని నిర్ణయమయిన దానివలన ఆయన పాలకులు ఆ పనిని తప్పక చేయుచుందురు. శరీరములో అయితే దేవుని పాలకులయిన మహాభూతములు, భూతములు, గ్రహములు, ఉపగ్రహములు పని చేయరు. శరీరములో ఆత్మ ఒక్కడే అన్ని కార్యములను నిర్వర్తించును. భూమి ఆకాశముల సృష్ఠి అనగా శరీరమును తయారు చేసి సజీవము చేయడములో ఆత్మే అన్నీ చేయుచున్నది. బయట కార్యములన్నిటినీ భూతములు, గ్రహములు చేయుచున్నారు. బయటి కార్యము వాక్యములో మొదట 'రేయింబగళ్ళు మార్పులో నిదర్శనము కలదని' చెప్పారు. బయట జరుగుచున్న రాత్రింపగళ్ళను ఎవరు మార్పు చేయు చున్నారో చాలామందికి తెలియదు. అందువలన కనిపించని తెలియని విధానము ఎక్కడయితే ఉందో అక్కడ 'నిదర్శనము' అనుమాటను చెప్పారు.


రాత్రి చీకటితో, పగలు వెలుగుతో కూడుకొనియుండునను విషయము అందరికీ తెలుసు. అంతేకాక సూర్యుని వలన రాత్రింపగళ్ళు జరుగుచున్నవని కూడా తెలుసు. ఖగోళశాస్త్రము అభివృద్ధి అయ్యేకొద్దీ భూమి తన చుట్టూ తాను తిరుగుచూ, సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని కూడా తెలిసిపోయినది. దాని ఫలితముగా పగలు, రాత్రి ఒకదాని వెనుక మరొకటి వచ్చుచున్నవని చెప్పుచుందురు. ఇదంతయూ సత్యమేయని చెప్పక తప్పదు. అలా అన్నీ తెలిసిపోయినప్పుడు ఈ విషయములో నిదర్శనము అనునది ఏమి కలదని ప్రశ్నించవచ్చును. కొద్దిపాటి చదువు చదువుకొన్న వానికి కూడా రాత్రింబగళ్ళు, అమావాస్య, పౌర్ణమి ఎలా వచ్చుచున్నవో తెలుసు. ఇక్కడ తెలియనిది ఏమీ లేదనిపించినా, సూర్యుని గురించి మనకు సూర్యుడు ఒక గ్రహము అని తెలిసినా, భూమి ఒక మహాభూతమని తెలియదు. భూమి, సూర్యుడు గుండ్రముగా యున్నారని చెప్పినా, సూర్యుడు మండే గోళమనీ, భూమి సముద్రముతో సహా యున్న గుండ్రని గోళమని చెప్పినా అందులో యున్న శక్తి తెలియదు. భూమి తిరిగే గోళమయినా అది స్వయముగా తిరుగుచున్నదా లేక ఏదయినా శక్తి దానిని త్రిప్పుచున్నదా! యను విషయము తెలియదు.


దైవజ్ఞానమును సముపార్జన చేసిన తర్వాత సూర్యుడు సజీవమైన గ్రహమనియూ, అట్లే భూమి కూడా సజీవమైన భూతమనియూ తెలియు చున్నది. సూర్యుడు గ్రహమే అయినా ఆయన సజీవుడు. బుద్ధి చేత సమస్తమును గ్రహించు స్వభావము గలవాడు. ప్రపంచములో సృష్ఠింపబడిన పరిపాలకులలో, అట్లే పాలింపబడు జీవరాసులలో (మనుషులలో) అత్యంత ఉన్నతమైన బుద్ధిగలవాడు సూర్యుడు. సూర్యుడు ప్రపంచములో బుద్ధి గ్రాహ్యశక్తిలో కూడా మొదటివాడు. ఆయన గ్రహించుకోలేనిది ఏదీ ప్రపంచములో లేదు. అందువలన ప్రపంచములో సృష్ఠ్యాదియందు ఆకాశవాణి ద్వారా దేవుడు తెలియజేసిన తన జ్ఞానమును సూర్యుడు గ్రహించ గలిగి, తాను తెలిసిన దానిని భూగోళము మీద గల 'మనువు' అను వ్యక్తికి తెలియజేశాడు. అలాగే కలియుగములో 'ముహమ్మద్ ప్రవక్త'క ు అదే జ్ఞానమునే జిబ్రయేల్ అను పేరుతో చెప్పాడు. మనువుకు చెప్పిన సూర్యుడే తర్వాత కలియుగములో ఒక మనిషికి జ్ఞానము చెప్పాడని తెలియకూడదని భావించి తన పేరును మార్చుకొని చెప్పాడు. ఆ విషయము నాకు ఒక్కనికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. సూర్యుడు కృతయుగములో మనువుకు జ్ఞానము చెప్పి, తర్వాత కలియుగములో అదే జ్ఞానమునే తన పేరును మార్చుకొని చెప్పడము జరిగినది. మొదట కృతయుగములో మనువుకు జ్ఞానము చెప్పినప్పుడు నేను ఫలానా సూర్యున్నియని మనువుకు చెప్పలేదు. ఆనాడు తనకు జ్ఞానము ఎవరు చెప్పారను విషయము మనువుకు ఎంతమాత్రము తెలియదు. ద్వాపరయుగము చివరిలో కలియుగము మొదటిలో కృష్ణుడు అర్జునునకు జ్ఞానము చెప్పినప్పుడు 'మనువుకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని' కృష్ణుడు చెప్పగా అప్పుడు అందరికీ సూర్యుడు భూమిమీద జ్ఞానమును ఒక మనిషికి చెప్పాడని తెలిసినది. అంతవరకు సూర్యుని విషయము ఎవరికీ తెలియదు. అంతేకాక ఇప్పటికి 14 వందల సంవత్సరముల క్రితము అదే సూర్యుడే మారుపేరుతో జ్ఞానమును చెప్పి పోయాడు. అప్పుడు కూడా ఆయన సూర్యుడని తెలియకుండా చేశాడు. ఇప్పుడు నేను చెప్పుచుంటే కొందరికి ఆ విషయము తెలిసినది. నేను చెప్పకపోతే సూర్యుడు రెండవమారు భూమిమీద జ్ఞానమును చెప్పాడను విషయము ఎప్పటికీ తెలిసేది కాదు.


సూర్యుడు గ్రహమే అయినా, ఆయన గ్రహములలోకెల్లా చాలా ముఖ్యమైనవాడు. సృష్ఠిలో గల ఎందరో గ్రహములకు సూర్యుడు కొన్ని ఆదేశాలు ఇచ్చుచున్నాడు. సూర్యుడు రాత్రంతా కనిపించకయుండి పగలు జరుగవలసిన కార్యముల గురించి సూర్యుడు మిగతా కొన్ని గ్రహములకు తెలియజేయగా, సూర్యుని నుండి విషయమును తెలుసుకొన్న ప్రకారము పగలు మొదలయిన తర్వాత ఎవరు, ఎప్పుడు ఏమి చేయాలో అదే చేస్తున్నారు. సాధారణ మనిషికి తెలియకుండా ఎన్నో విషయములు సూర్యునికి, భూమికి మధ్యలో జరుగుచున్నవి. సూర్యుని నుండి ఆదేశములు తీసుకొన్న గ్రహములు ఆ పనిని సక్రమముగా చేయుచున్నవి. అంతేకాక పగలు సమయములో భూమి ద్వారా కొన్ని భూతములు తాము చేయవలసిన కార్యములను గురించి తెలుసుకొని తర్వాత ఎప్పుడు ఆ కార్యములను చేయాలో అప్పుడే ఆ పనులను చేయుచున్నవి. రాత్రిపూట గ్రహములకు సూర్యుడు ఆదేశములివ్వగా, పగలు పూట భూమి భూతములకు తనకు అందిన ఆదేశములు ఇచ్చుచున్నది. పైన సూర్యుడు క్రింద భూమి తమ ద్వారా గ్రహములకు, భూతములకు జరుగవలసిన కార్యముల వివరమును ఆదేశముల ద్వారా తెలియజేయగా, సూర్యుని ద్వారా తెలుసుకొన్న గ్రహములు, భూమి ద్వారా తెలుసుకొన్న భూతములు తమతమ కార్యములను చేయుచున్నవి.


మనుషులకు తెలియకుండా అనగా నిదర్శనములతో ఎన్నో కార్యములు భూమిమీద జరుగుచున్నవి. ''భూకంపములు, సునామీలు, తుఫానులు, టోర్నడోలు'' అను ప్రకృతి సంఘటనల వెనుక గ్రహముల, భూతముల జోక్యమున్నదని ఎవరికీ తెలియదు. పగలు భూమి ద్వారా ఆదేశములు భూతములు గ్రహించగా, రాత్రి సూర్యుని ద్వారా ఆదేశములను గ్రహములు గ్రహించుచున్నవి. ''భూతములకు ఆదేశములు ఇచ్చుట కొరకు పగలు, గ్రహములకు ఆదేశములను ఇచ్చుటకు రాత్రిని'' భూమి, సూర్యుడు ఇద్దరు కలిసి వచ్చునట్లు చేయుచున్నారు. పగలు కొరకు సూర్యుడు, రాత్రి కొరకు భూమి ప్రయత్నించుట వలన రాత్రింబగళ్ళు జరుగుచున్నవని తెలియుచున్నది. రాత్రింపగళ్ళులోనే తమ ఆదేశములు భూతములకు, గ్రహములకు ఇచ్చుటకు ఒకదాని తర్వాత ఒకటి చక్రమువలె వచ్చునట్లు సూర్యుడు, భూమి చేయుచున్నారు. రాత్రింబగళ్ళు వెనుక ఇంత రహస్యమున్న దని ఎవరికీ తెలియదు.


భూతములు, గ్రహములు సజీవులనీ తమ ద్వారానే బయట ప్రపంచములోని మనుషులు కష్టసుఖములను అనుభవిస్తున్నారని ఇంతవరకు గ్రంథములలో వ్రాయబడలేదు. ఇంతవరకు ఎవరూ చెప్పనూ లేదు. ఇప్పుడు క్రొత్తగా ఒక మనిషి చెప్పితే మేము వినవలెనా? అను సంశయము చాలామందికి రావచ్చును. దానికి జవాబు ఏమనగా! ఈ విషయములు ఇంతవరకు ఎవరికీ తెలియదని మీకు కూడా బాగా తెలుసు. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు తెలియజేయడము జరుగుచుండును. ఇప్పుడు నా ద్వారా వింటే తప్పేముంది. నేను చెప్పునది సత్యమో కాదోయని తెలియుటకు ఒక యదార్థ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొందాము. ఇప్పటికి బహుశా మూడు లేక నాలుగు సంవత్సరముల క్రితము విశాఖ పట్టణములో హుదుద్ తుఫాను భయంకరముగా వచ్చినది. ఆ తుఫానులో వర్షము రావడము, సముద్రము బీచ్లో ముందుకు రావడమే కాకుండా అప్పుడు వీచిన గాలివలన కరెంటుపోల్లు అన్ని క్రిందపడిపోగా, ఎన్నో వృక్షములు నేలకొరిగి పోయాయి. ఉన్న చెట్లకు ఒక్క ఆకు కూడా లేకుండా రాలిపోవడము జరిగినది. అప్పుడు ప్రజలు ఎవరూ చనిపోలేదు గానీ, చాలామంది చాలా కష్టములుపడ్డారు. ఆ విషయము ఆ ప్రాంతము వారు ఎవరూ మరచిపోయి ఉండరు.


ఆ తుఫాను వలన నష్టము, కష్టము పడినవారందరూ సాధారణముగా కోలుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వారము రోజులు వైజాగ్లోనే ఉండి సహాయక చర్యలు వేగముగా జరుగునట్లు చూచాడు. తర్వాత ఒక సభ సమావేశములో మాట్లాడుతూ ''మనము ధైర్యముగా హుదుద్ తుఫానును ఎదుర్కొన్నాము. మన ధైర్యము చూచి తుఫానే పారిపోయింది. ఎవరికీ ప్రాణనష్టము జరుగలేదు'' అని తుఫాన్ను హేళనగా మాట్లాడడము జరిగినది. అది సజీవమైనది, మన మాటలను గ్రహించుచూ ఉంటుంది అని ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆయన చెప్పుమాటలను నేను టీ.వీలో విన్నాను. అప్పుడే ప్రక్కవారితో ఈయనకు తుఫాన్ సజీవమైనది అని తెలియదు. ఆ రోజు తుఫాన్ను సృష్ఠించి ఎంతో నష్టము, కష్టమును తెచ్చినవి భూతములు, గ్రహములు. ఈయన ఇప్పుడు చెప్పేమాటలు వారు వింటే వారికి కోపము రావచ్చును. తిరిగి ఇంకోమారు తుఫాన్ రూపములో వేధించగలరని చెప్పాను. భూమిమీద ప్రజలకు ఎవరికీ ప్రకృతి వైపరీత్యముల వెనుక ఎవరున్నారు? ఎవరు ఏమి చేయుచున్నారను విషయము తెలియదు.


రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఆనాడు తుఫానును సృష్ఠించిన గ్రహములు విన్నారు. తర్వాత ఆరు నెలలకో లేక కొద్దిగా ముందు గానీ వెనుకగానీ స్వయముగా ముఖ్యమంత్రిగారు ''విశాఖ ఫెస్టివల్'' అను పేరుతో సముద్ర తీరమున బీచ్లో పెద్ద ఉత్సవమును ఏర్పాటు చేశారు. ప్రజలందరూ అందులో పాల్గొనునట్లు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద గుడారాలు కట్టించారు. విశాఖ ఫెస్టివల్ వారము రోజులు జరుగునట్లు ఏర్పాటు చేశారు. క్రింద ఇసుకలో పెద్దపెద్ద మ్యాట్లు పరిపించారు. అన్ని హంగామాలతో ఉత్సవమును చేయాలనుకొన్నారు. అయితే తుఫాన్ను గురించి ''తుఫాన్ను జయించాము. మన ధైర్యమును చూచి అదే పారిపోయింది'' అని చెప్పడము గ్రహములకు, భూతములకు జ్ఞాపకముంది అన్నట్లు తుఫాను లేకపోయినా, వాతావరణము అంతయూ సక్రమముగా ఉండినా, ఎటువంటి ముందు హెచ్చరికలు లేకున్నా, సముద్రము నీరు ఎదురురోడ్డును త్రాకేటట్లు ముందుకు వచ్చింది. రోడ్డులోయున్న రెండు చిన్నవంతెనలు కూడా సముద్రము తాకిడికి కూలిపోయాయి. కొన్నిచోట్ల బీచ్రోడ్డు సగమునకు పైగా కోతకు గురి అయింది. తుఫాన్ వచ్చిన సమయములో జరిగినట్లే రోడ్డు వరకు నీరు వ్యాపించింది. ఫెస్టివల్ కొరకు ఏర్పాటు చేసుకొన్న ఇసుక మీద పరచిన పెద్ద పట్టాలన్నిటిని తడిపి వేసి, ఫెస్టివల్ జరుగకుండా చేసినది. గ్రహములు, భూతములు ప్రకృతిలో వైపరీత్యముల వెనుక ఉండి పని చేయుచున్నవనుటకు ఇది బలమైన నిదర్శనము. మేము చెప్పుమాటలు నమ్మశక్యము గానివిగా యున్నా, విశాఖ ఫెస్టివల్ చెడిపోయిన విధానమును చూచయినా నమ్మక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి హుదుద్ తుఫానును గురించి భయము లేకుండా మాట్లాడినప్పుడే వీరు పొరపాటుగా మాట్లాడుచున్నారు, అలా మాట్లాడితే గ్రహములు, భూతములు తిరిగి ఏదైనా చేయగలరని చెప్పాము. మేము చెప్పినట్లే విశాఖ ఫెస్టివల్‍ను కనిపించని గ్రహములు, భూతములు భంగము చేశాయి అని చెప్పవచ్చును. తుఫాను లేకుండా, సునామీ లేకుండా సముద్రము పోటు రోడ్డువరకు రావడము, రోడ్డును కోసివేయడము ఆలోచించదగిన విషయమైనా దానిని గురించి ఏ మేథావి ఆలోచించలేదు. ఈ విషయములో జరిగిన పనికి హేతువాదులు ఎందుకు హేతువును చూపలేకపోయారు? ఇటువంటి విషయములలో కారణము చూపకుండా మేము హేతువాదులము అంటే ఎలా సరిపోతుంది?


ప్రకృతిలో అనగా శరీరము బయట జరుగు ప్రతీ కార్యము వెనుక ఎంతోమంది గ్రహములు, ఎంతోమంది భూతములు పని చేయుచున్నారు. అలా ప్రతి చోట, ప్రతి క్షణము జరుగుచుండుట వలన దేవుని పాలన సులభముగా సాగుచున్నది. మనుషులకు గ్రహములు, భూతములు కంటికి కనిపించరు, అట్లే వారు చేయు పనులు కనిపించినా, చేయుచున్న విధానము తెలియదు. నేడు భౌతికమునే నమ్ముతాము అభౌతికమును నమ్మము అనువారు తుఫాను లేనప్పుడు సముద్రము ఎందుకు ముందుకు వచ్చినదో, ప్రభుత్వము చేయ తలపెట్టిన ఉత్సవమును ఎందుకు జరుగకుండా చేసినదో చెప్పలేరు. మనకు తెలియని ఎన్నో పనులు ప్రపంచములో జరుగుచున్నా ఆ పనుల వెనుక ఎవరున్నారో మనుషులకు ఎంతమాత్రము తెలియదు. భూమిమీద మనకు తెలిసినా, తెలియకున్నా అన్ని పనులు దేవుని పాలకుల చేత జరుగుచున్నవి. అయితే పనులు తెలుసు, వాటివలన కలిగే బాధలు తెలుసు. పనుల వెనుక ఎవరున్నది తెలియదు. ఏ పనిని అయినా గానీ భూమిమీద తమకు అందిన ఆదేశాల ప్రకారము పాలకులు చేయుచున్నారు. భూతములకు మహాభూతమైన భూమి ద్వారా, గ్రహములకు ముఖ్య గ్రహమైన సూర్యుని ద్వారా ఆదేశములు అందుచుండగా మిగతా భూతములు, గ్రహములు కార్యములను చేయుచున్నవి.




పనుల కొరకు (పరిపాలన కొరకు) గ్రహములకు కావలసిన ఆదేశములను అందుకొనుటకు రాత్రి కొరకు గ్రహములు వేచియుండగా, అట్లే భూతములకు కావలసిన ఆదేశములను అందుకొనుటకు పగలు కొరకు వేచి చూస్తున్నారు. దీనిప్రకారము ముఖ్య గ్రహమైన సూర్యుడు గ్రహములకు దేవుని సంకల్పములోని ఆదేశములను అందించుచుండగా, మహా భూతమైన భూమి భూతములకు దేవుని సంకల్పములోని ఆదేశములను అందించుచున్నది. అందువలన సూర్యుడు రాత్రి కొరకు, భూమి పగలు కొరకు కాలచక్రమును తిరుగునట్లు చేయుచున్నవి. అందువలన భూమిమీద రాత్రింబగళ్ళు ఒకదాని తర్వాత మరొకటి నిరంతరము మారుచున్నవి. ఇప్పుడు రాత్రింబగళ్ళు మార్పులోని నిదర్శనము అర్థమయినదని అనుకుంటాను.


ఇంతవరకు దేవుని పాలనలోని రెండవ కార్యము ''రాత్రింబగళ్ళు'' జరుగుచున్న విధానమును తెలుసుకొన్నాము. ఇప్పుడు దేవుని పాలన గురించిన ఖుర్ఆన్ వాక్యములోని మూడవ కార్యములోని 'నిదర్శనము' తెలుసుకొందాము. ''ప్రజలకు లాభమును చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో'' అని వ్రాసియుంది. దీనిని గురించి చెప్పుకొంటే సముద్రము మీద సామాగ్రిని మోసుకపోయే పడవలను మనము చూస్తున్నాము. పైకి సముద్రములో సులభముగా పడవల ప్రయాణము సాగుచున్నట్లు కనిపించినా మనకు కనిపించని రహస్యము ఒకటి గలదు. అది ఏమనగా! ప్రతి పడవ వెంటా ఒకటి లేక రెండు లేక అంతకంటే ఎక్కువ భూతములుగానీ లేక గ్రహములుగానీ, లేక భూతములు గ్రహములు ఇద్దరు కలిసిగానీ పడవను గమ్యము చేర్చు వరకు తమ శక్తి సామర్థ్యములను వినియోగించి పడవ ప్రయాణమును సాగునట్లు చేయుచున్నవి. తమ పాలన ప్రకారము సముద్ర ప్రయాణమును సాగించుచూ మానవులకు కావలసిన సామాగ్రిని దూర ప్రాంతములకు అందించు చున్నారు. తమకు అందిన సమాచారము ప్రకారము ఓడలను గమ్యమున కయినా చేర్చగలవు, లేక సముద్రములోనయినా ముంచివేయగలవు.


వంద సంవత్సరముల పూర్వము 1500 మందితో ప్రయాణించు పడవను సముద్రములో భూతములే ముంచివేసినవని ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా తప్పించుటకుగానీ, భూతములను మెప్పించి ప్రమాదము జరుగకుండా చేయుటకుగానీ ఎవరి చేత కాదు. ఎందుకనగా! భూతములు గానీ, గ్రహములుగానీ దేవుని ఆజ్ఞను అనుసరించును గానీ మనుషుల ఆజ్ఞను అనుసరించవు. ప్రతి పనికి దేవుడు ఆజ్ఞ ఇవ్వడము జరుగదు. దేవుడు నేరుగా గ్రహములకు, భూతములకు ఆజ్ఞ ఇవ్వడు. ఏ ఆజ్ఞ అయినా గానీ క్రింద భూమినుండి భూతములకు, పైన సూర్యుని నుండి గ్రహములకు ఆజ్ఞ ఇవ్వబడును. గ్రహములకుగానీ, భూతములకుగానీ ఏ ఆజ్ఞ అయినా గానీ ఒకరోజు ముందు ఇవ్వబడును. ఆజ్ఞను ఇచ్చు సూర్యుడుగానీ, భూమి గానీ మనుషుల కర్మనుబట్టి శిక్షలుగానీ, రక్షలుగానీ ఇవ్వమని ముందే దేవుని ఆజ్ఞ ఉండుట వలన మనుషుల కర్మప్రకారమే పాలకులు నడుచుకొను చుందురు. పాలకుల మంచి ప్రవర్తనగానీ, చెడు ప్రవర్తనగానీ మనుషుల కర్మనుబట్టియుండును.


ప్రశ్న :- మనుషుల కర్మనుబట్టి దేవుని పాలకులయిన భూతములు, గ్రహములు ప్రవర్తించి శిక్షలు, రక్షలు విధించుచున్నప్పుడు పాలకులకు దేవుని ఆజ్ఞతో పనే లేదు కదా! మీరు దేవుని ఆజ్ఞ ప్రకారము పాలకులు పని చేయుచుందురు అని చెప్పారు. పాలకుల కర్తవ్యము మనుషుల కర్మనుబట్టియే కదా! దేవుని ఆజ్ఞనుబట్టి కాదుకదా! ఉదాహరణకు ప్రభుత్వ పాలనలో ముందే గల గవర్నమెంట్ ఆర్డర్ (+.ూ) ప్రకారము ఉద్యోగస్తులు పని చేయుచుందురు. అంతేగానీ మాటిమాటికి ప్రతిరోజు ప్రభుత్వము పైనుండి పనిని చెప్పదు కదా! అట్లే దేవుని పాలకులకు ఒకమారు నిర్ణయించబడిన విధి నిర్వహణ ప్రకారము చేయుచుందురు. అంతేగానీ దేవుని ఆజ్ఞ మధ్యలో ఎందుకు? అని నేను ప్రశ్నించుచున్నాను. దీనికి వివరముగా జవాబు చెప్పగలరని కోరుచున్నాము.


జవాబు :- పాలకులు, పాలకుల పనులు చేయు విధానము ఎవరికీ కనిపించునది కాదు. సృష్ఠ్యాదినుండి అనేకులు మీకు జ్ఞానమును చెప్పినా ఈ విషయములను ఎవరూ చెప్పలేదు. తెలియని విషయములు, కనిపించని విషయములు, సూక్ష్మ విషయములు చెప్పుటకు ఎవరికీ చేతగాదు. అయినా ఇప్పుడు నా చేత దేవుడు చెప్పించడము ఒక విధముగా మీ అదృష్టమేయని చెప్పవచ్చును. నాకు తెలిసినంతవరకు పాలకులు అయిన భూతములు, గ్రహములు సంపూర్ణముగా దైవజ్ఞానమును తెలిసిన గొప్ప జ్ఞానులు. సూర్యుని ద్వారా, భూమిద్వారా తమకు అందిన ప్రతి ఆజ్ఞను దేవుని ఆజ్ఞగానే భావించి పని చేయుదురు. సూర్యుని ద్వారా, భూమిద్వారా అందిన ఆజ్ఞలు కర్మప్రకారము నిర్ణయించబడి చెప్పినవయినా ఇదంతయూ దేవుని నిర్ణయము వలన జరుగుచున్నదను భావములో ఉందురు. వారు దైవజ్ఞానులు అయినందున సహజముగా అలా అనుకోవడము మంచిది. అదియే సత్యము. మేము కూడా ధర్మము ప్రకారము దేవుని ఆజ్ఞ అని చెప్పినా దేవుడు ప్రతి విషయములోనూ ఆజ్ఞ ఇచ్చువాడు కాడు. పాలకులు దేవుని చట్టమును అనుసరించి కర్మప్రకారము పాలించువారై యున్నారు. అందువలన దేవుని ఆజ్ఞను అనుసరించి శిక్షలు, రక్షలు విధించుచుందురని చెప్పాము. ఈ విషయములను అర్థము చేసుకొనుటకు మనుషులకు బుద్ధి గ్రాహిత శక్తి అవసరము.


అట్లని దేవుడు ఏమీ జోక్యము చేసుకోడా?యని అంటే అట్లుండదు ఆయన ఏదయినా తలచినప్పుడు దానిని అయిపో అంటే అయిపోతుంది అని అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లోనే సూరా రెండు అల్బఖర, ఆయత్ 117లో ఇలా చెప్పారు చూడండి.


(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దానిని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది.''


ఇక్కడ దేవుడు అను మాటను ఆయన అని చెప్పియున్నారు. ఆరాధించ వలసిన దేవుడు ఒక్కడే అయినా సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు అని ఇద్దరున్నారు. ఆ ఇద్దరినీ వాక్యములలో ఆయన అని చెప్పడమైనది. చెప్పిన వాక్యములో ఆయన అనగా దేవుడని అర్థమయినా ఇద్దరి దేవుళ్లలో ఏ దేవుడని ప్రశ్న రాగలదు. అప్పుడు సృష్ఠి పూర్వము దేవుడా? సృష్ఠి తర్వాత దేవుడా? యని తెలియుటకు వాక్యములోనే కొంత ఆధారముండును. ఇప్పుడు ఈ వాక్యములో ''ప్రప్రథమముగా సృష్ఠించిన వాడు'' అని యున్నది. భూమి ఆకాశమును సృష్ఠించినవాడు ఒక్కడే. అవి ఒక్కమారే సృష్ఠించబడినాయి. అయినా మొట్టమొదట తయారు చేసినవాడు ఆయనే అని ఉంది. భూమి, ఆకాశములు తర్వాత కూడా సృష్ఠించబడినాయి. కావున రెండవమారు తయారు చేసిన దేవుడు వేరు, మొదట తయారుచేసిన దేవుడు వేరు. అందువలన ఎవరు? అను గుర్తింపుకు ''ప్రప్రథమమున భూమి, ఆకాశమును తయారు చేసిన దేవుడు'' అని చెప్పియున్నారు. మొట్టమొదట భూమి, ఆకాశమును తయారుచేసిన దేవుడే శరీరము బయటయున్న ప్రకృతికి అంతటికీ పెద్ద. ఆయన ఆధీనములోనే భూతములు, గ్రహములు సమస్త పాలకులు గలరు.


భూమి ఆకాశమును రెండవమారు తయారు చేసినవాడు కూడా దేవుడే. అయితే ఈ దేవుడు శరీరము లోపలే పెద్ద. శరీరము లోపలే ఆయన పాలనయంతా గలదు. రెండవమారు తయారు చేయబడిన ఆకాశములు, భూమి రెండు శరీర రూపములో యున్నవి. మొదట తయారు చేయబడిన ఆకాశము భూమి బయట కంటికి కనిపించునవే యని తెలియ వలెను. బయట ఆకాశమును భూమిని సృష్ఠించినవాడు సృష్ఠ్యాది దేవుడయిన పరమాత్మ. తర్వాత మానవున్ని సృష్ఠించిన దేవుడు ఆత్మ. తర్వాత సృష్ఠింప బడిన ఆకాశములు భూమి శరీర రూపములలో యున్నవి. మొదట సృష్ఠింప బడినవి కనిపించు ఆకాశముగా, కనిపించు భూమిగా యున్నవి. బయట సృష్ఠి, బయట పాలన బయట దేవుడని జ్ఞాపకముంచుకోవాలి. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు శరీరములోనివాడు. ఆరాధనకు అతీతముగా ఆరాధనలు కూడా అక్కర లేనివాడు, ఏ అక్కరా లేనివాడు సృష్ఠ్యాదిలోని దేవుడు. సృష్ఠి తర్వాత దేవుడు ఆత్మకాగా, సృష్ఠి పూర్వము దేవుడు పరమాత్మ. ఆత్మకంటే వేరుగా యున్నవాడు పరమాత్మ. పరమాత్మయే ప్రప్రథమముగా ఆకాశమును, భూమిని సృష్ఠించాడు. ఆయన (పరమాత్మ) బయట పాలకులందరికీ దేవుడు. బయట పాలకులు ఆయనను ఆరాధించరుగానీ భక్తి, గౌరవ భావము కల్గిన జ్ఞానులుగాయున్నారు. పాలకులకు శరీరము లోపలి దేవుడు తెలుసు, శరీరము బయటి దేవుడు తెలుసు. దైవజ్ఞానము సంపూర్ణముగా తెలిసినవారికి ఇద్దరు దేవుళ్లు తెలుసు. అట్లే తాము బయట పాలనలోయున్నామని కూడా తెలుసు.


పాలన సాగించు భూతములు, గ్రహములు సూర్యుని నుండి, భూమి నుండి ఆజ్ఞలు తీసుకోవడము వాటినే చేయడము జరుగుచున్నది. అయినా జ్ఞానము ప్రకారము తమకు ఆజ్ఞలు ఇచ్చు సూర్యునికి, భూమికి అందరికీ యజమాని దేవుడు పరమాత్మేయని తెలుసు. గ్రంథములోని వాక్యమును చదువు వారికి కూడా ఆ తేడా తెలియునట్లు ''మొట్టమొదట ఆకాశమును, భూమిని సృష్ఠించిన దేవుడు ఆయనే'' అని చెప్పియున్నారు. ఆయన అవసరమైనప్పుడు సంకల్పించుకొంటే ఆ పని జరిగిపోవును. దేవుడు 'అయిపో' అని చెప్పుట మనకు అర్థమయ్యే దానికేగానీ, ఆయన 'అయిపో' అని అరచుటకు నోరు లేదు. ఆయనకు శరీరము లేదు. ఆయన ప్రత్యక్షముగా ఏమీ చెప్పువాడు కాడు. ఆయన మనస్సులో అనుకొంటే చాలు ఆ విషయము ఇటు సూర్యునికి, అటు భూమికి చేరిపోవును. అప్పుడు వారు మధ్యలో వచ్చిన ఆ విషయమును తమ పాలకులయిన భూతములకు భూమి, గ్రహములకు సూర్యుడు ఆదేశమివ్వగా దానిప్రకారము అది చేయబడును. దేవుడు అనుకొంటే ఏదయినా జరిగిపోవును అని ఉన్నది కదా! పరమాత్మయిన దేవుడు ఏమి అనుకొంటాడు? ఏమని సంకల్పించుకొంటాడు? ఆయన మధ్యలో సూర్యునికి భూమికి ఎందుకు ప్రత్యేకమైన పనిని కల్పించుచున్నాడు? అని ప్రశ్నించుకొని చూస్తే అట్లు దేవుడు అనగా సృష్ఠ్యాదిలోని దేవుడు అరుదుగా సంకల్పించుకొనును. అంతేగానీ మాటి మాటికీ దేనినీ చేయదలచుకోడు. కర్మప్రకారమే పాలకులు ఖచ్చితముగా పనిని చేయునప్పుడు మధ్యలో ఆయన జోక్యము చేసుకోడు. అలా చేశాడు అంటే అది చాలా అరుదుగా జరుగు పనియై ఉండును. ఏమిటి అంత అత్యంత అవసరమైన పని? తమ విధులను జాగ్రత్తగా నెరవేర్చు పాలకులను మధ్యలో కల్పించుకొని చెప్పవలసిన అవసరము ఏమి వచ్చింది? ఆయన ఏ పనిని చేయనివాడుగా యుండి తన మౌనమును భంగము చేసుకొని, నోరు తెరచి చెప్పకున్నా సంకల్పము చేతనయినా తన ఆజ్ఞను తన పాలకులకు తెలియజేయు అవసరము ఏమి? అని ప్రశ్నించుకొని చూస్తే కొంత ఆసక్తికరమైన విషయములు తెలియుచున్నవి. ''దేవుడు అపార కరుణా మయుడు, అమిత దయాసాగరుడు'' అని చెప్పిన మాటను మరువలేము.


సాధారణ ప్రజల ఎడల పాలకులు పని చేయుచుండగా, ప్రజలు కష్ట సుఖములను అనుభవిస్తూ వారి బ్రతుకు వారు బ్రతుకుచుండగా, పాలకులు వీరి పని వీరు చేయుచుందురు. మనుషుల పుట్టుకలోనే మనిషి గత జన్మలో చేసుకొన్న పాపపుణ్యములను లెక్కించి ప్రారబ్ధముగా చేసి ప్రస్తుత జన్మలో అనుభవించునట్లు శరీరములో మరణము జరిగినప్పుడే ఆత్మ కర్మల నిర్ణయము చేసి పంపును. అలా నిర్ణయించబడిన కర్మచక్రము లోని కర్మలను చూచిన కాలచక్రములోని పన్నెండు గ్రహములు గ్రహించి వాటిని సూర్యునకు తెలుపగా, సూర్యుడు పాలకులకు తెలుపగా, పాలకులు ఖచ్చితముగా కర్మపాలన చేయుచున్నారు. మనిషి పుట్టినప్పటినుండి మనిషి చనిపోవువరకు జరుగుచున్న విధానము ఇదియే. జరుగ వలసిన విధానము కూడా అదియే. అయితే ఎవడయినా మధ్యలో దేవుని మీద శ్రద్ధను పెంచుకొని ఇతరుల ద్వారాగానీ, గ్రంథముల ద్వారాగానీ దైవజ్ఞానమును తెలియగలిగి యోగమును ఆచరించగలిగితే కర్మనాశనము జరుగును. శరీరములో ఎంత జ్ఞానము కల్గినది, ఎంత జ్ఞానశక్తి వలన ఎంత కర్మ కాలిపోయినది దేవునికి తెలుసు. ఒక రోజు గ్రహముల చేత గుర్తింపబడిన కర్మ సూర్యునికి తెలియబడగా, సూర్యుడు ఒక రోజు ముందు పాలకులకు తెలిపియుండును. పాలకులు రెండవ రోజు సాయంకాలము నాలుగు గంటలకు ఒక పాపము ప్రకారము మనిషికి కాలు విరిగిపోవునట్లు చేయవలసి యున్నది. బస్సు టైరు క్రింద కాలుపడి నలిగిపోయి కాలు తొలగించవలసిన కర్మయున్నది. అట్టివాడు తన జ్ఞానముచేత ఆ కర్మను లేకుండా చేసుకోగలిగినప్పుడు ఆ అనుభవమంతయూ పూర్తి తొలగి పోవలసి యున్నది.


మనిషియొక్క యోగమును, జ్ఞానమును బట్టి దేవుడే ఆ కర్మను క్షమించియుండును. అనగా తన శక్తిచేత కాలిపోవునట్లు చేసియుండును. దానిని ''దేవుని క్షమాశీలత''యని అంటారు. దేవుడు మనిషి పాపమును క్షమించి కరుణామయుడు, కృపాశీలుడు అనుమాటను సార్థకము చేసుకొనును. దేవుని క్షమాశీలత వలన కర్మచక్రములోని కర్మ ఈ రోజు తొలగిపోయివుంటే నిన్నటి దినమే సూర్యుడు తెలుసుకొన్న కర్మను అనుభవింపజేయుటకు పాలకులకు ఆజ్ఞ ఇచ్చి ఉండును. అప్పుడు పాలకులు తమకు అందిన ఆజ్ఞ ప్రకారము శిక్షను అమలు చేయవలసి యున్నది. అలాంటప్పుడు దేవుడు పాపమును క్షమించియుండుట చేత అది అమలు కాకూడదు. అప్పుడు మొదటి దేవుడు అయిన ఆయన మొట్టమొదట భూమి ఆకాశమును సృష్ఠించిన దేవుడు, తన భక్తుని పాపము క్షమించబడినదని, అది ముందే పాలకులకు ఆజ్ఞగా చేరబడినదని, దానిని రద్దు చేసుకోమని సూర్యునికి సంకల్పము చేత తెలుపగా సూర్యుడు అత్యవసరముగా తన పాలకులకు సమాచారమును పంపి ఆ కార్యమును రద్దు చేయించును. అటువంటి అత్యవసర సమయములలో దేవుడు తన సంకల్పము చేత తాను తలచినది తన పాలకుల వరకు చేరిపోవును. అప్పుడు ఆ శిక్షను పాలకులు రద్దు చేయడము జరుగుచున్నది. ఇదంతయూ ఒకరోజు కాలవ్యవధిలో జరుగు శిక్షల ఎడల క్షమాపణ జరిగినప్పుడు ఇటువంటి అత్యవసర సంకల్పముల అవసరము వచ్చును. దేవుని సంకల్పముల చేత దేవుని పని నెరవేరుచున్నది.


ఇంత గణితముగా దేవుని పని, దేవుని పాలకుల చేత జరుగు చున్నదని చాలామందికి తెలియదు. పాలకులందరికీ దేవుడే అధిపతి. ఆయనే యజమాని. దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు, భూమికీ, సూర్యుని భూమి అనుమతిమేరకు పాలకులు, పని చేయుట వలన అందరూ దేవుని ఆజ్ఞ చేత పనిని చేయువారుగా చెప్పియున్నాము. ఇది సాధారణముగా జరుగు విధానముకాగా, ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా మనిషి పాపము క్షమించబడినప్పుడు, అది ముందే పాలకులకు ఆజ్ఞ చేయబడియుంటే అప్పుడు మాత్రమే దేవుని సంకల్పము పని చేయగా భూమికి సూర్యునికి చేరిన సంకల్పము పాలకులకు తెలుపబడును. అప్పుడు పాలకులు దేవుని సంకల్పము ప్రకారము శిక్షను రద్దు చేసుకొందురు. ఇదంతా అరుదుగా జరిగే విషయము. పాప క్షమాపణలోనే దేవుడు సంకల్పించుకోవడము ఒక్కటే కాదు. మరొక విషయములో కూడా దేవుని సంకల్పము ఉండును.


మనుషులు ముందే చేసుకొన్న పాపపుణ్యముల వలన, వారి కర్మ పత్రములలో వ్రాయబడిన విధానము వలన, వారి జీవితములను కర్మను అనుసరించి శరీరములోని దేవుడు తీర్పుతీర్చి, జన్మ జీవితమును నిర్ణయము చేసి పంపును. అలా పంపబడిన మనిషిని అతని కర్మప్రకారము శరీరము లోపలయున్న ఆత్మయే శరీరములో కర్మను అనుభవింపజేయుచుండును. జీవుడు (మనిషి) కర్మను అనుభవించుటకు కావలసిన పనులను శరీరములో ఆత్మే చేయుచున్నది. కొన్ని కర్మలు బయటి పనుల వలన మనిషి అనుభవించ వలసియుండగా, అటువంటి పనులనన్నిటినీ బయటి పాలకులు చేయుచున్నారు. శరీరము లోపల ఆత్మ, శరీరము బయట పరమాత్మ పాలకులు చేయు కార్యముల వలన, శరీరమును ధరించిన జీవుడు కర్మ చక్రములోని (కర్మపత్రములోని) కర్మప్రకారము జీవించగలుగుచున్నాడు. జీవితములో కష్టసుఖములను, సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు. అలా కర్మప్రకారమే జీవితము గడచునట్లు దేవుడు నిర్ణయించియుండును.


అట్లు కర్మప్రకారము జీవితమును సాగించు జీవుడు, జరుగుచున్న జీవితములో స్వంత భావములు కల్గియున్నాడు. జీవితములో జరుగు సంఘటనలన్నియూ ముందే కర్మపత్రము ప్రకారము నిర్ణయమైనవే జరుగు చుండును. కర్మపత్రములోని ప్రారబ్ధ కర్మప్రకారము జరుగు పనులన్నియూ శరీరము లోపల, శరీరము బయట జరుపబడుచుండును. జీవితములో పనులు చేయుటయందుగానీ, కర్మలను అనుభవించుటయందుగానీ జీవునికి ఎటువంటి స్వతంత్రత లేకుండా యుండును. జీవునికి అనుభవించడములో గానీ, దానికొరకు అల్లాడడములోగానీ ఎంతమాత్రము స్వతంత్రత లేక యుండును. అయితే అంతర్గత భావములో స్వతంత్రత కల్గియుండును. అతను జ్ఞానము ప్రకారము భావించుకోవచ్చును లేక అజ్ఞానము ప్రకారము భావించుకోవచ్చును. భావములన్నీ జీవుని ఆధీనములో ఉండుట వలన అతను మంచి చెడు రెండు రకముల భావములలో ఏ భావమునందైనా ఉండవచ్చును. ఉదాహరణకు ఒక కార్యములో ఎట్లు భావమును పొంది యుండునో చెప్పుకొని చూద్దాము.


ఒక మనిషికి వాని కర్మప్రకారము ఒక రాజకీయ పదవి పొందు అవకాశము కలదు. దానిప్రకారము అతను రాజకీయ పదవిని దాదాపు పది సంవత్సరములు అనుభవించడము జరిగినది. ఆ అనుభవములో విపరీతమైన డబ్బు కూడా చేకూరినది. ఒక ప్రక్క అధికారము మరొక ప్రక్క ధనము లభించడము వలన అతను సమాజములో గొప్పవ్యక్తిగా గుర్తింపు పొందాడు. అందరూ అతనిని గౌరవించేవారు. ఇదంతయూ వాడు పుట్టకముందు చనిపోయినప్పుడే కర్మరీత్యా ఆత్మ నిర్ణయించి పంపగా వచ్చి పుట్టడము జరిగినది. వాని జీవితములో ఏదీ స్వంతముగా చేయుట లేదు. అన్నియు లోపలి ఆత్మ మరియు బయటి పరమాత్మ పాలకులు చేయుచుండగా వానికి జీవితములో రాజకీయ పదవి, ధనము, గౌరవము లభించాయి. అయితే మనిషిగా పుట్టినవానికి ఏమీ తెలియదు. కలిగినదంతా తన బుద్ధి వలననే కలిగాయి అని తన భావములో ఎల్లప్పుడు అనుకోవడము జరిగినది. అన్నీ కర్మప్రకారమే అయినా, మనిషిలోని భావములు మాత్రము కర్మ ప్రకారముండవు. మనిషిలోని భావములు వాని స్వంతము. మనిషి ఏ భావమునయినా పొందునట్లు దేవుడు జీవునికి పూర్తి స్వతంత్రత కల్గించాడు. అయితే చేయబడు కార్యములలో గానీ, అనుభవించు కర్మలలోగానీ మనిషికి ఎటువంటి స్వతంత్రత లేదు.


భావ స్వతంత్రము జీవునికి ప్రాథమిక హక్కులాంటిది. మనిషి స్వంత భావములు వాని బుద్ధి నుండి పుట్టుచుండును. సర్వ జీవరాసులకు భావముల గని వాని బుద్ధియే. వాని బుద్ధి భూమిలోని గనిలాంటిది. భూమిని బట్టి గని లోపలి ఖనిజము లభించునని చెప్పినట్లు, మనిషిలోని బుద్ధిని బట్టి అందులోని భావములుండును. మనిషిలోని బుద్ధికి భావ స్వాతంత్య్రము కలదు. మనిషి బుద్ధి అజ్ఞానముతో నిండియుంటే వాని బుద్ధి నుండి అజ్ఞాన భావములు బయటికి వచ్చుచుండును. ఒకవేళ వాని బుద్ధి జ్ఞానముతో నిండియుంటే వానినుండి వచ్చు భావములన్నియూ పూర్తి జ్ఞానముతో నిండియుండును. మనిషి అజ్ఞానములో వేయి రకములు, జ్ఞానములో వేయి విధములు ఉండుట వలన మనిషి భావములు మొత్తము రెండువేల సంఖ్యలో గలవని చెప్పవచ్చును.


వేయియుగములు దేవుని పగలు, వేయి యుగములు దేవుని రాత్రియని చెప్పినట్లు మనిషి అజ్ఞానము వేయి విధములు, జ్ఞానము వేయి విధములు దేవుని రాత్రింబగళ్ళకు గుర్తుగా పెట్టబడినది. దేవుని పగలు అజ్ఞానమునకు గుర్తుగా, దేవుని రాత్రి జ్ఞానమునకు గుర్తుగా లెక్కించి, ఆ గుర్తులు మనిషి బుద్ధిలో చిత్రీకరించి, మనిషి భావములు అజ్ఞానమునకు సంబంధించినవి వేయి, జ్ఞానమునకు సంబంధించినవి వేయి కలవని చెప్పారు. పగళ్ళులో ఎండకాలము పగలు, చలికాలము పగలు ఉన్నట్లు, రాత్రిళ్ళలో వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఉన్నట్లు మనిషిలోని బుద్ధి వేయి విధములయినా, అందులో కూడా అనేక హెచ్చుతగ్గు బుద్ధుల భావములు ఉండును. ఇట్లు మనిషి బుద్ధి జ్ఞానములోగానీ, అజ్ఞానములోగానీ శాఖోపశాఖలై ఉండును.


మనిషి జ్ఞానముకంటే అజ్ఞానములో ఉండేవారే ఎక్కువ శాతము ఉండుట వలన వారిలో భావములన్నీ అజ్ఞాన భావములే ఉండును. ఎన్నో వేలసంఖ్యలో అజ్ఞాన భావములుండుట వలన మనిషి తలంపులో అవియే బయటికి వచ్చుచుండును. అదే విధముగా జ్ఞానముతో కూడుకొన్న బుద్ధి గలవారికి జ్ఞానముతో కూడుకొన్న భావములే వచ్చుచుండును. బుద్ధి భావములతో సంబంధము లేనిది ''దేవునిలోనికి ఐక్యము కావాలను ఉద్దేశ్యము.'' అది ఒక్కటి తప్ప మిగతా జ్ఞాన, అజ్ఞాన భావములన్నీ మనిషికి పాపపుణ్యములను తెచ్చిపెట్టుచుండును. అజ్ఞానములో ఎన్నో శాఖలు, జ్ఞానములో ఎన్నో శాఖలు ఉండుట వలన వాటినే మంచి, చెడు శాఖలని చెప్పవచ్చును. యోగమునకు తప్ప మిగతా కార్యముల ఎడల బుద్ధి పని చేసినా, అందులో జ్ఞాన భావములు బయలుదేరినా, అవి దేవున్ని చేర్చు యోగమునకు సంబంధించినవి కాకపోవడము వలన వాటి వలన పుణ్యము లభించవచ్చునని పెద్దలు చెప్పారు. అజ్ఞాన భావము వలన పాపము లభించునని వేరే చెప్పనవసరము లేదు.


మనిషి జీవితమంతా ముందే నిర్ణయింపబడిన కర్మప్రకారము జరుగునప్పుడు, అందులో జీవుని స్వతంత్రము ఏమీ లేనప్పుడు వాస్తవముగా క్రొత్త కర్మ వచ్చుటకు అవకాశమే లేదు. అయితే మనిషికున్న భావ స్వాతంత్య్రము వలన, బుద్ధి మనిషికి అనేక భావములను అందించుట వలన జీవుడు శరీరములో ఏమీ చేయకున్ననూ, బుద్ధి భావములు అహమ్ భావములుగా మారుట వలన క్రొత్త కర్మ (ఆగామికర్మ) ఏర్పడుచున్నది. మనిషి ప్రారబ్ధకర్మను అనుభవిస్తూ, అన్ని పనులకు తానే కారణమని అనుకోవడము వలన జరిగిపోయిన కర్మ తిరిగి ఏర్పడుచున్నది. మనిషిలోని అహము యొక్క భావముల వలన జరుగుచున్న ప్రారబ్ధము తిరిగి ఆగామికర్మగా తయారగుచున్నది. మనిషి బుద్ధి వలన వచ్చు భావములకు అహము చేరి క్రొత్త కర్మలు వచ్చుచున్నవి. అహము వలన వచ్చు భావముల వలన గతములో ప్రారబ్ధముగా యున్న కర్మ తిరిగి ఆగామికర్మగా వచ్చుచున్నది. మనిషి బుద్ధి వలన ఏర్పడు క్రొత్త భావముల వలన సరికొత్త కర్మ ఏర్పడుచున్నది. విషయము అర్థమగుటకు ఉదాహరణగా చెప్పుకొంటే రాజకీయ పదవిలో యున్నవాడు వాని కర్మప్రకారము పదవి, హోదా, డబ్బు కలిగినా వానిలోని అహము అన్నీ తనవలనే వచ్చినట్లు తలచుట వలన క్రొత్త కర్మ వచ్చి చేరుచున్నది. జరిగిన పనిని జీవుడు చేసినట్లే లెక్కించి ఆ పనులలోని కర్మను జీవునికి చేరునట్లు లోపలి ఆత్మే చేయుచున్నది. బుద్ధి క్రొత్త భావములను అందించుట వలన, బుద్ధి భావములను జీవుని భావములే యని అహము జీవున్ని అనుకొనునట్లు చేయుట వలన బుద్ధి వలన కూడా క్రొత్త కర్మ వచ్చుచున్నది.


బుద్ధి వలన పుట్టు ప్రతి భావముతో అహము చేరి, జీవుని భావముగా చేయుట వలన అహము సాంద్రతనుబట్టి కర్మ సాంద్రత పెరుగుచుండును. మనిషి బుద్ధికి భావములు స్వంతమయిన దానివలన, దానికి కర్మ పరిమితియన్నది ఏదీ లేని దానివలన, రాజకీయ నాయకుడు ఒక ఆధ్యాత్మికవేత్తకంటే, ఒక యోగికంటే తననే గొప్పవానిగా తలచుట వలన ఆ భావమునకు అహము చేరుట వలన, ''నిజమే! నీవే యోగికంటే గొప్పవానివి'' అని చెప్పుట వలన వాని భావమునకు సరితూగు కర్మ వచ్చి అతనికి చేరును. బుద్ధి భావములో ఒక యోగికి చెడు చేయాలని, అతనికి నష్టమును, కష్టమును చేయాలని అలా చేయుట వలన ప్రజల చేత గౌరవించబడు యోగి కూడా తన క్రిందికి వచ్చి తనే గొప్పయనీ, తనను పొగడవలెనని భావించినప్పుడు దానికి ప్రక్కనేయున్న అహము చేరుట చేత వాడు ఆ పని చేయకున్ననూ చేసినట్లగుచున్నది. అప్పుడు దేవుని చట్టము ప్రకారము అనగా! దేవుని జ్ఞానము ప్రకారము క్రొత్త కర్మ (పాపము) వచ్చి అతని కర్మచక్రములో చేరిపోవుచున్నది. ప్రపంచ విషయములైతే దానివలన వచ్చు కర్మ ప్రపంచములో సాధారణముగా అనుభవించునదై ఉండును. అలాకాక దేవుని విషయములోనయినా, దేవుని జ్ఞాన విషయములోనయినా, తప్పు భావము, హేళన భావము, యోగులను జ్ఞానులను బాధించు వేధించు భావము కల్గుట వలన వాడు ఎంత పెద్ద రాజకీయ పదవిలో యున్నా, వానికి ప్రత్యేకమైన కర్మ అంటుకొనును. అటువంటి కర్మలు రెండు రకములుగా యుండును.


దేవుడు మనిషిగా వచ్చి పుట్టినప్పుడు అనగా! భగవంతునిగా యున్నప్పుడు, పదవిలో యున్న వాని బుద్ధి భావములో చెడు యోచన వస్తే, దానికి అహము చేరుట వలన అది పాపముగా మారుటకు అవకాశము గలదు. అటువంటి పాపము నేరుగా అన్ని కర్మలు చేరినట్లే వాని కర్మచక్రమును చేరియుండి, తర్వాత జన్మలో అనుభవమునకు వచ్చును. అలా వచ్చు పాపము రెండవ జన్మనుండి అనుభవమునకు వచ్చును. దానిని గురించి ఇంజీలు (బైబిలు) గ్రంథములో ''ఈ యుగములోనూ రాబోవు యుగములోనూ పాపమును అనుభవించవలెనని'' చెప్పియున్నారు. అనవసరముగా చెడు తలచి రెండు యుగముల కాలము ప్రతి జన్మలోనూ, నిత్యము పాపము అనుభవించవలెనని కలదు. (మత్తయి-12-31, 32) ''మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.''


అధికారము, ధనము యున్నవారు తామే అందరికంటే గొప్పయను భావముతో యోగులను సహితము అగౌరవముగా మాట్లాడడము, వారికి వ్యతిరేఖముగా చేయడము చేయుచుందురు. అలా చేయకున్నా యోగుల ఎడల వ్యతిరేఖ భావము వస్తే అది మహా పాపముగా పరిగణించబడును. సామాన్య మనుషుల ఎడల చేసే పాపము ఎప్పుడయినా జ్ఞానమార్గములోనికి వచ్చినవానికి క్షమించబడును. అయితే దేవుడే మనిషిగా వస్తే ఆయనను తప్పుగా తలచినా, ఆయనకు చెడు చేసినా ఆ పాపము క్షమించబడదు. మనుషులలో జ్ఞానము తెలిసి యోగులుగా యున్నవారిని చెడుగా భావించితే వారికి కూడా పాపము వస్తుంది. వారి పాపము సామాన్య మానవుని పాపమువలె కాకుండా, మనిషిగా యున్న భగవంతుని ఎడల చేసిన పాపము వలె కాకుండా వేరుగాయుండును. మనుషుల యెడల చేసిన పాపముగానీ, మనిషి ఆకారములో దేవుడే యున్నప్పుడు ఆయన ఎడల చేసిన పాపముగానీ నేరుగా మనిషి కర్మచక్రమును చేరియుండి రెండవ జన్మలో అది అనుభవ మునకు వచ్చును. సాధారణ మనిషి వలన వచ్చిన పాపము సాధారణ కష్టముల వలన, రోగముల వలన అనేక బాధల వలన, అనేక దుఃఖముల వలన అనుభవములను పొందవలసియుండును. అదే దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఆయన ఎడల చేసిన పాపము తర్వాత జన్మలోనే ప్రారంభమయినా అప్పటినుండి అది రెండు యుగముల పర్యంతము నిత్యము పాప అనుభవముతో కూడుకొనియుండును.


ఒక్క యోగుల విషయములో మాత్రము వచ్చిన పాపము కర్మ చక్రమును చేరదు. మరు జన్మమున అనుభవమునకు రాదు. మనిషి యోగిగా యున్నప్పుడు పూర్తి జ్ఞానసంపన్నుడై దానిని ఆచరించు వాడైనప్పుడు ధనము, అధికారము యున్నవారు తమ బుద్ధిలో నేనే గొప్పయను భావము పుట్టగా, అది అహమును చేరి అహంభావముగా మారగా, అప్పుడు యోగిని అగౌరవముగా ఆలోచించినందుకు గానీ లేక ఏదయినా వ్యతిరేఖమైన పనులు చేయుట వలన ఏర్పడిన పాపమును గానీ, అది సామాన్యముగా అహంభావము పొందిన మనిషి తలలోని కర్మచక్రములో చేరదు. అది అప్పుడే అదే జన్మలోనే కొద్దికాలము వ్యవధిలోనే అనుభవమునకు వచ్చును. అట్లు పాలకులు చేయుచున్నారు. ఒకవేళ యోగుల ఎడల చేసిన పాపము అప్పుడే అదే జన్మలో అనుభవమునకు రాకపోతే అది కర్మచక్రము చేరినదని అనుకోవలెను. అనుభవమునకు రాని కర్మ, కర్మచక్రములో చేరి తర్వాత జన్మలో రెండు యుగముల కాలము అనుభవమునకు వచ్చును. ప్రస్తుత కాలములో ఒక యోగిపట్ల చెడు భావమును కల్గిన రాజకీయ నాయకున్ని చూచాను. అతడు జనబలము, ధన బలముతో తన బుద్ధే గొప్పదని అనుకొని, యోగి ఎడల తప్పు భావములు, ఇబ్బంది పెట్టు పనులు చేయుట జరుగుచున్నది. అతనికి పాపము వచ్చియుండును. అయితే ప్రస్తుత కాలములో ఎంతమాత్రము అనుభవమునకు రాలేదు. అతను అన్ని రకముల బాగున్నాడు, ఏ పాప అనుభవము అతను పొందలేదు. గ్రహములు, భూతములు అతను యోగుల ఎడల చేయు అరాచకములను చూచి కూడా ఊరకయున్నారంటే వానికి ప్రత్యేకముగా శిక్షించుటకు వాని కర్మను కర్మచక్రములోనికి పంపారని తెలియుచున్నది. అతను రెండు యుగముల పాప అనుభవమునకు అర్హుడయినాడని నాకు అర్థమయినది.


కర్మల విషయము ఇంతవరకు ఎవరూ చెప్పలేదని, ఇప్పుడు నేను చెప్పినది క్రొత్తగా యున్నదని, దీనిని నమ్మకపోతే మీరే జ్ఞానములో నష్ట పోయినవారగుదురు. మీరు అనేక రహస్యములు తెలియు కాలము వచ్చినది కావున నా ద్వారా క్రొత్త రహస్యములను వినగలుగుచున్నారు. దేవుని పాలకులు తమకు ఇవ్వబడిన ఆజ్ఞలను తప్పక ఆచరించి పాపపుణ్య అనుభవములను న్యాయబద్దముగా అందించుచున్నారు. దేవుని జ్ఞానమును తెలిసిన జ్ఞానుల ఎడల మరియు జ్ఞానమును ఆచరించు యోగుల ఎడల ఇతరులు చేసిన పాపములు కర్మచక్రము చేరనప్పుడు, వారిని శిక్షించు బాధ్యత రెండు రకముల పాలకులకు ఉంది. అయితే తమ ఇష్టమొచ్చినట్లు ఏదీ చేయక, ప్రతీదీ ఆజ్ఞను అనుసరించి చేయుచుందురు. శరీరములోని ఆత్మ వాని పాపమును కర్మచక్రములో చేర్చుకొనక బయటికి పారవేసినప్పుడు ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన దేవుడు అన్నీ తెలిసినవాడై ఆ పాపమును అప్పుడే అనుభవమునకు వచ్చునట్లు సంకల్పించుకొనగా ఆ సంకల్పమును స్వీకరించిన సూర్యగ్రహము, మహాభూతమైన భూమి ఎలా ఆ పాపమును అనుభవింపజేయాలో పథకమును రచించి తమ పాలకులకు తెలుపగా వారు తప్పక అమలు చేయుదురు. అలా అమలు చేయగా ఏ రోగము లేకుండా చనిపోయిన వారు కొందరిని చూచాను. అట్లే ప్రమాదము లేనిచోట కూడా ప్రమాదము జరిగి అంగ లోపము పొందిన వారిని, చనిపోయిన వారినీ చూచాను. పాము కరచి చనిపోయిన వారిని చూచాను. నేను చూచినవి వేల సంఖ్యలో గలవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన బాధలను అనుభవించారు. భూతముల పనైతే నేరుగా చంపడము జరుగును. గ్రహముల పనైతే బాధించడము జరుగును. రెండింటినీ చూచాను కావున ఇప్పుడు చెప్పగలుగుచున్నాను.


దేవుడు తన సంకల్పము ద్వారా తన పాలకులకు ఎలా ఆజ్ఞను ఇచ్చుచున్నాడో తెలియుటకు ఇదంతయూ చెప్పవలసి వచ్చినది. అత్యవసరముగా కర్మలను రద్దు చేయుటకుగానీ, అమలు పరచుటకుగానీ తన సంకల్పముతో తెలుపగా దానినే దేవుని ఆజ్ఞగా భావించి పాలకులయిన గ్రహములు, భూతములు పని చేయుచున్నారు. ఈ విధముగా కర్మ పాలనలో చాలా జాగ్రత్తగా పాలకులు పని చేయుచుందురు. ఒక్క పాపమును అనుభవింపజేయడములోనే కాకుండా పుణ్యమును అనుభవింప జేయడములో కూడా ఒకే విధముగా పని చేయుచున్నారు. పాలకులు కేవలము అనుభవములను అనుభవింపజేయుటకే కాకుండా, ప్రపంచములో శరీరము బయట జరుగు కార్యములను అన్నిటినీ చేయుచున్నారు. శరీరము లోపల ఆత్మే కార్యకర్తగా పనిచేయుచుండగా, శరీరము బయట కార్యములన్నిటినీ భూతములు, గ్రహములు చేయుచున్నవి. అందువలన బరువులను మోసుకొని పోవు ఓడలలో కనిపించని పాలకుల పని జరుగు చున్నది. పాలకులు పడవలను క్షేమముగా గట్టుకు చేర్చుచున్నారని అదే ఆ పనిలో 'నిదర్శనమని' తెలియుచున్నది.


దేవుని పాలనలో ఎన్నో పనులు ప్రపంచ వ్యాప్తముగా యున్నవి. వాటిలో కొన్నింటిని మాత్రము చెప్పి, అర్థమగునట్లు చేయుట వలన మిగతావన్నీ అర్థమగునని దేవుడు కొన్నింటిని ఇక్కడ చెప్పాడు. అందులో నాల్గవది ఇలా కలదు. ''ఆకాశము నుండి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మాతృ భూమిని బ్రతికించడములో'' బీడు భూముల మీద వర్షమును కురిపించి, అవి పచ్చని పైరుతోగానీ, గడ్డితోగానీ నిండునట్లు చేయడము చాలా పెద్ద కార్యము. అయినా మనిషికి సర్వసాధారణముగా జరుగు కార్యముగా కనిపించుచుండును. ఎక్కడయినా కనుచూపు మేర ఖాళీ భూములు కనిపించడము అందులో గడ్డిగానీ, చిన్న మొక్కలుగానీ లేకుండడము వలన ఎండు భూములుగా కనిపించడము, ఏమాత్రము పచ్చదనము లేకుండడము వలన, భూమి రంగుతో యున్న మైదానములన్నీ వర్షము కురియడము వలన వారము లేక పదిరోజులలో పూర్తి పచ్చదనము చేకూరి, ముందు కనిపించు వట్టి భూముల దృశ్యము కనిపించకుండా పోవును. అలా ఒక్కమారుగా భూమి అంతయూ పచ్చదనము సంతరించు కోవడము ప్రతి సంవత్సరము సాధారణముగా కనిపించినా, మనకు తెలియకుండా దాని వెనుక ఎంతో కృషి, ఎందరో శ్రమించడము జరుగు చున్నది.


ఈ విషయము తెలియుటకు ఒక పరిశోధనవలె మనము కొన్ని కార్యములు చేసి చూస్తాము. ఒక పది ఎకరముల బీడు భూమిని తీసుకొని దానిచుట్టూ మట్టికట్టలు వేసి, బయటి నీరు లోపలికిగానీ, లోపలి నీరు బయటికిగానీ రాకుండా పోకుండా చేసి, లోపలి పది ఎకరముల భూమిని చదును చేసి ఆ భూమిలో అంతకుముందున్న ఏ విత్తనములు లేకుండా పోవునట్లు పొలమంతా చెత్త వేసి అగ్గిపెట్టి కాల్చవలెను. చెత్త పది, పదిహేను నిమిషములు కాలునట్లు చేస్తే, అప్పుడు ఆ భూమిలో యున్న పోషక పదార్థములు, గడ్డి విత్తనములు మిగతావి ఏవియున్నా కాలిపోవును. తర్వాత వర్షము వచ్చినా ఆ పది ఎకరములు బాగా వర్షపు నీరుతో తడిసినా మొలకెత్తే దానికి విత్తనములుండవు. అట్లే మొలచిన గడ్డి బ్రతికే దానికి కావలసిన పోషక పదార్థములు ఉండవు. అయినా వర్షము వస్తే యథాతథముగా గడ్డి మొలచి పెరుగుచున్నది. అప్పుడు అక్కడ గడ్డి మొలచేదానికి విత్తనములు ఎక్కడినుండి వచ్చాయని? ఆలోచించవలసిన పని ఏర్పడుచున్నది. ఎంత ఆలోచించినా దానికి సమాధానము దొరదు.


అదే విధముగా మరొక పది ఎకరముల జాగాలో ఆరు అడుగుల లోతు వరకు త్రవ్వి అదేమన్నును చుట్టు కట్టవేసి బయట నీరు లోపలికి రాకుండా చేశారనుకోండి. అప్పుడు ఆరు అడుగుల లోతులో ఒక్క గడ్డి గింజగానీ ఉండుటకు అవకాశమే ఉండదు. అటువంటి స్థలములో కూడా వర్షము వచ్చి నేల తడిస్తే గడ్డి మొలకెత్తును. అంతలోతులో ఏ గింజ లేనిదీ, ఎలా పైరు పచ్చగా మొలచినదని ఆలోచించవలసి వచ్చును. అప్పుడు ఎంతగా ఆలోచించినా జవాబు దొరకడము లేదు. ఇట్లు ప్రకృతిలో మనుషుల వద్ద జవాబు లేని కార్యములు జరుగుచున్నవి. జవాబు ఉన్నా మనిషి ఆ జవాబును నమ్మడము లేదు. నన్ను వాటిని గురించి అడిగితే సులభముగా జవాబును చెప్పగలను. మనకు కనిపించని విధానము వర్షము కురియడము వెనుక, భూములు మొలకెత్తి పచ్చగా ఉండడము వెనుక ఎంతోయున్నదని, దానిని కనిపించని దర్శనమని (దృశ్యమని) చెప్పాము. అదియే 'నిదర్శనము' అని వాక్యములో చెప్పారు. కనిపించనిది కంటికేగానీ బుద్ధికి కాదు. ఇంకొక రకముగా చెప్పితే మనిషికి రెండు రకములయిన చూపు కలదు. ఒకటి బాహ్య కన్నుల ద్వారా చూడవచ్చును. రెండవది బుద్ధ్గి గ్రాహితము ద్వారా తెలియవచ్చును. బుద్ధి గ్రాహితమునే మనోనేత్రము అని చెప్పుచుందురు. దానినే జ్ఞానదృష్ఠి యని కూడా చెప్పు చుందురు. మనస్సుకు చూపు లేదుగానీ బుద్ధికే చూపు గలదు. అయితే అలవాటు ప్రకారము మనోదృష్టియని అనడము జరుగుచున్నది గానీ, మనస్సుకు ఎక్కడా దృష్టి లేదు. ప్రథమ దైవగ్రంథములో జ్ఞానచక్షువు అని బుద్ధినే చెప్పారు. మనో చక్షువు అని ఎక్కడా చెప్పలేదు. అలవాటయిన భాష ప్రకారమైతే మనోనేత్రముతో యని చెప్పవచ్చును. సత్యమును చెప్పాలంటే అలవాటు లేని భాషయినా జ్ఞాననేత్రము లేక బుద్ధిచూపుతో యని చెప్పవచ్చును. నాకున్న బుద్ధి గ్రుడ్డిది కాదు, మంచి చూపుగలది. నా బుద్ధికున్న చూపుతో ఆకాశములో యున్న మేఘముల వరకు చూడగలను. అట్లే శూన్యములో తేలియాడుచున్న కోట్లమైళ్ళ దూరములో యున్న గ్రహ గోళములను చూడగలను. అట్లే ఆకాశ భూతములో గల అంతరార్థమును తెలియగలను. ఇదంతయూ నేను స్వయముగా మాట్లాడడము లేదు. ద్వితీయ దైవగ్రంథములో (మత్తయి-10-20) ''మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాట్లాడుచున్నాడేగానీ మాట్లాడువారు మీరు కారు.'' అని చెప్పిన మాటను మరువకూడదు.


నాకు తెలిసిన విషయము చెప్పితే ఆకాశములో భూతముల జాతికి చెందిన మేఘములు గలవు. అట్లే గ్రహముల జాతికి చెందిన ఎ న్నో గ్రహములు గోళములుగా గలవు. ఆకాశములోనున్న భూతములకు ఒక నిర్ధిష్టమైన ఆకారము ఉండదు. గ్రహములన్నియూ గోళముల రూపములో ఉండగా, కొన్ని భూతములు మేఘముల రూపములో యుండగా, మరి కొన్ని భూతములు కంటికి కూడా కనిపించని ఆకారములో రోగములుగా యున్నవి. మేఘములు ఎట్లు సజీవమైనవో అట్లే రోగములు కూడా సజీవమైన పాలకులని ఎవరికీ తెలియదు. ఇప్పుడు సందర్భానుసారము చెప్పితే మేఘములు వర్షమును వర్షించునని అందరికీ తెలుసు. మేఘములలో భూములకు చాలినంత వర్షము నీరు ఎలా నిలువ యున్నదో చాలామందికి తెలియదు. కొందరు చదువుకున్న వారు మేఘములు నీటి ఆవిరిని స్వీకరించి యుండుననీ, చల్లగాలి మేఘములకు తగిలినప్పుడు వర్షించునని చెప్పుచుందురు. ఎండకాలములో సముద్రము నీరు ఆవిరిగా మారగా అదియే మేఘములయినవనీ నీటి ఆవిరే వర్షముగా వస్తున్నదని కొందరు చెప్పుచుందురు. ఈ లెక్కలన్నీ తప్పేనని మేము పది సంవత్సరముల క్రిందటే చెప్పాము. ''దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు'' అను గ్రంథములో వ్రాశాము. సముద్రము నుండిగానీ, మరి ఏ ఇతర స్థలముల నుండిగానీ మేఘములు నీటి ఆవిరిని గ్రహించడము లేదని చెప్పాము. సముద్రము నీరు ఆవిరి అగుటకు వంద సెంటీగ్రేడ్ వేడి అవసరము అనీ, అది ఇంతవరకు ఎక్కడా రాలేదనీ, ఎక్కువ అంటే 50 సెంటిగ్రేడు డిగ్రీల వరకే భూమిమీద ఉష్ణోగ్రత వస్తున్నదనీ, అంతకంటే ఎక్కువ రానప్పుడు నీరు ఎలా ఆవిరవుతుందని అడిగాము. అది అంతయూ కాకిలెక్కలేయని తేలిపోయినది.


మేఘములు భూతములు అని చెప్పాము కదా! భూతములయిన మేఘములు దేవుని పాలకులలోని భాగములేయని జ్ఞాపకముంచుకోవలెను. మేఘములు సముద్రములోని నీరును నేరుగా తమయందు నింపుకొను చున్నవి. ఈ విషయము కంటికి కనిపించునది కాకపోయినా, ఎక్కడయినా సాక్ష్యము కొరకు అందరికీ కనిపించేటట్లు చెరువులలోని నీరంతటినీ పీల్చుకొని రెండు నిమిషములలో చెరువును ఖాళీ చేసినది. దానిని ప్రత్యక్షముగా చూచినవారు గలరు. సముద్రములో నీటిని కనిపించకుండా పీల్చుకొనినా 'తాను ఈ పనిని చేయుచున్నానని' తెలుపునట్లు బయట చెరువులలోని నీరును కొందరు చూస్తున్నట్లే పైకి లాగుకొన్న సందర్భములు గలవు. అలా తీసుకొన్న నీరును కొంతకాలము తనలోనే పెట్టుకొని భూమిమీద ఎక్కడ అవసరమో అక్కడ వర్షించుచున్నవి. ఎక్కడ వర్షించవలెనో మేఘములకు మహాభూతమైన భూమినుండి ఆజ్ఞ వచ్చును. ఆ ఆజ్ఞ ప్రకారమే మేఘములు వర్షించును.


మేఘములు బీడు భూమిలో వర్షించగా అక్కడగల విత్తనములు మొలకెత్తి భూమి పచ్చగా మారిపోవును. ఒకవేళ మొలకెత్తుటకు అక్కడ విత్తనములు లేకపోతే నీరే విత్తనములతో సహా వర్షించును. అక్కడ లేని జంతువులనుగానీ, అక్కడలేని వృక్ష జాతులనుగానీ మేఘములే తెచ్చి అవి లేని జాగాలో వదలుచున్నవి. మేఘములు ఒక వర్షపు పనిని మాత్రమే చేయలేదు. ఒక ప్రాంతములో లేని విత్తనములను, జీవరాసులను మరొక ప్రాంతమునకు తెచ్చి వదలుచున్నవి. ఈ మాటలు ఎవరూ నమ్మలేనివయినా జరుగుచున్న సత్యము అదియే. మేఘము కొన్ని వందల మైళ్ల దూరములో యున్న మొసళ్ళను తెచ్చి అవి లేని ప్రాంతములో వదలిన సంఘటనలు జరిగినవి. అట్లే తాబేళ్ళను ఎక్కడనుండో తెచ్చి ఆ జాతి తాబేళ్ళు లేని జాగాలో క్రొత్తగా వదలడము జరిగినది. ఇట్లు అనేక జంతువులను గానీ, వృక్షజాతులను గానీ, మేఘము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తెస్తున్నవి. అట్లే పక్షులను వాటిలోని నిక్షిప్త రోగములను, రోగములు లేని ప్రాంతములోనికి తెస్తున్నవి. భూమండలములో లేని రోగములను కూడా ఇతర గ్రహములనుండి స్వీకరించి, తెచ్చి ఇక్కడ వదలడము జరుగుచున్నది. ఒక జంతువునుగానీ, కొన్ని జంతువుల మందలనుగానీ (గుంపులనుగానీ) మేఘము తనయందు ఒకటి రెండు రోజులనుండి రెండు మూడు నెలల వరకు ఉంచుకొన్న సందర్భములు గలవు. అన్ని రోజులు ఆ జంతువులకు ఆహారమును సమకూర్చి తనయందే పెట్టుకొన్నవంటే మేఘములు ఎంత శక్తివంతమైనవో అర్థము చేసుకోవచ్చును.


ఆహారము అవసరమైన జంతువులనే కాక, నీరు అవసరమైన చేపలను సహితము తనలో కొంతకాలము పెట్టుకొని వర్షములో ఒక్క చేప కూడా చనిపోకుండా పై నుండి క్రిందికి వదలుచున్నది. ఆకాశము నుండి క్రిందపడితే చేపలు చనిపోవు అవకాశము కలదు, కావున రెండు అడుగుల ఎత్తునుండి క్రిందికి వేయుచున్నది. మేఘము యొక్క చేతులు వేలు, లక్షల సంఖ్యలో యుండునని ముందే చెప్పుకొన్నాము. ప్రతి చేపను ఒక చేయి తెచ్చి క్రింద వదలిపోవుచున్నది. అందువలన క్రిందపడిన ప్రతి చేప చనిపోకుండా బ్రతికేయున్నది. ఇదంతయూ కనిపించక జరుగు చున్నది. చేప కనిపించినా మేఘము చేతులు కనిపించడము లేదు. అట్లే మనకు కనిపించుచున్న వర్షము కొంతే, కనిపించక భూమిమీదికి చేరు నీరు కొన్నిచోట్ల ఎక్కువగాయుండును. కొన్ని ప్రాంతములలో కురిసే వర్షమునకు క్రింద ప్రవహించే నీరుకు సంబంధము లేని విధముగా యుండును. కొద్దిసేపు కొంత వర్షము కురిసినా క్రిందికి భూమిమీద చేరిన నీరు ఎక్కువ యుండును. అదంతయూ మేఘముల మహత్యము. మేఘములు ఏమి అనుకుంటే అది చేయగలవు. మేఘముల విషయము ఎవరికీ అర్థము కాదు. మేఘములు రోగములను క్రిందికి తెచ్చును. కొన్ని రోగములు వేరు రూపములలో యుండినా, అవి మేఘముల ఆధారము తోనే క్రిందికి దిగును. అనేక జీవరాసులను, అనేక వృక్ష జాతులను, అనేక విత్తనములను, అనేక వస్తు జాలమును, అనేక జంతు జాలమును ఇట్లు అనేకములయిన వాటిని ఒక ప్రాంతమునుండి మరొక ప్రాంతమునకు మేఘములే చేర్చుచున్నవి. అందువలన భూమిమీద కొన్ని ప్రాంతములలో అంతవరకు లేని క్రొత్త జాతుల పక్షులు, క్రొత్త జాతి మృగములు కనిపించుచుండును. ఎక్కడో ఆఫ్రికా ఖండములో యున్న అరుదైన తాబేళ్లు ఇక్కడ (భారత దేశములో) ఆంధ్రప్రదేశ్లో కనిపించాయంటే అది మేఘముల పనేయని చెప్పవచ్చును. ఇట్లు మనకు తెలియకుండా, కనిపించకుండా వర్షము కురియడములోనూ, బీడుభూములు పచ్చని పైర్లతో నిండడములోనూ, ఆ పైర్లలో జీవసముదాయము నిండిపోవడములోనూ ఎంతో నిదర్శనముగా మేఘములు పని చేయుచున్నవని తెలియవలెను. ఈ విషయమునే ఖుర్ఆన్ గ్రంథములోని 2-164వ వాక్యములో వ్రాశారు.


అంతేకాకుండా అదే వాక్యములో వీచే గాలుల దిశలు మారడములో కూడా నిదర్శనము కలదని చెప్పారు. గాలి కనిపించదుగానీ దాని శక్తి కనిపించుచుండును. 'సజీవమైన దానికే శక్తియుండును' అను సూత్రము ప్రకారము గాలి సజీవమైనదేయని తెలియుచున్నది. జీవము అను దానిని భూతము అనుట సహజము. భూతము అనగా జీవుడు అని అర్థము. గాలి మహా భూతములలో ఒకటియని మనకు తెలుసు. భూతము అను దాని దగ్గర జోడుగా ఆత్మయుండును. సజీవమైన దేనియందు గానీ దానికి సమీపమున ఆత్మయుండును. సజీవమైనదేదయినా శక్తి కల్గియుండును అంటే శక్తినే ఆత్మయని లెక్కించదగును. ఆత్మ వలననే ప్రతి దానికి శక్తి వచ్చుచున్నది. గాలి భూతమైతే ఆ భూతమునకు ఆత్మ శక్తిని ఇచ్చుచున్నది. ఎంత శక్తి అవసరమైతే అంత శక్తిని ఇచ్చుచున్నది. గాలికి అమితమైన శక్తి యుండునని అందరికీ తెలుసు. ఆ శక్తి యంతయూ గాలి వెనుకయుండు ఆత్మదని చాలామందికి తెలియదు. ప్రపంచములో భూతములు కొన్ని కోట్లుయున్నా, మహా భూతములు మాత్రము ఐదేయని చెప్పుచున్నాము. దేవుడే ప్రకృతియనబడు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములను భూతములనీ, ఇవి ఐదు ప్రపంచమునకు మూల స్థంభముల లాంటివనీ, వాటిని మహా భూతములని చెప్పారు. అన్ని భూతములకంటే గొప్పవి అయినందున ఈ ఐదును మహా భూతములని చెప్పడమేకాక వాటికి అందరికంటే ఎక్కువ శక్తిని కూడా ఇచ్చాడు. అందువలన ఐదు భూతముల శక్తిని ఎవరూ అంచనావేయలేరు.


గాలి ఎక్కువ శక్తికలదై ఏ దిశకు అయినా వీచు సామర్థ్యము కలదై యున్నది. ఎంతశక్తివంత భూతమైనా దేవుని ఆజ్ఞకు లోబడి పని చేయుచుండును. శూన్యములో ఏ ఆధారము లేని చోట గాలికి దిశలు మారుచున్నవి. గాలి తనకు లభించిన ఆజ్ఞ ప్రకారము దిశలు మార్చు కొంటున్నది. ఏ దిశ నుండి ఏ దిశకు గాలి వీచవలెనో, ఎంత శక్తితో వీచవలెనో అన్ని ఆదేశములు గాలికి చేరియుండును. అంతేకాక ఎక్కడ తనశక్తితో దేనిని కూల్చవలెనో అక్కడ ఆ పనిని గాలి చేయుచున్నది. గాలివలన ఒక్కొక్కప్పుడు ఎంతో నష్టము జరుగును. 'టోర్నడోలు' అను రూపములో గాలి ఎంతటి నష్టమునయినా చేయగలదనీ, ఎందరినయినా చంపగలదనీ, ఎన్ని ఇళ్ళనయినా నేలమట్టము చేయగలదని తెలిసినది. వచ్చిన ఆజ్ఞ ప్రకారము గాలి తన దిశను ఎటయినా మార్చుకోగలదు. ఇదంతయూ నిదర్శనమేయని తెలియవలెను. కనిపించని విధానము అంతయూ బుద్ధి చేత తెలియవచ్చునని వాక్యము చివరిలో చెప్పియుండుట చేత బుద్ధి గ్రాహితశక్తి యున్నవారు అనగా బుద్ధికి చూపుయున్నవారు ఎవరయినా ఈ విషయములలోని కనిపించని విధానమును నేరుగా చూడవచ్చును. అందువలన బుద్ధిగల వారికి ఇందులో నిదర్శనము కలదని చెప్పారు. దాని అర్థము బుద్ధికి చూపున్న వారికి అనగా జ్ఞానదృష్ఠి యున్నవారికి ఈ విషయములన్నియూ తెలియునని చెప్పారు. నేడు భూమిమీద గల మనుషులకు బుద్ధియున్నది గానీ, అది ప్రపంచమునే చూచుచున్నదిగానీ కనిపించని విధానమును జరిగే పనులలో చూడలేకున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

18. ఉప వాసములు. (2-187), (7-31)

సూరా 7, ఆయత్ 31 ని చూస్తాము.


(7-31) ''ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జీదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన (అల్లాహ్) ఇష్టపడడు.''


ఇప్పుడు రెండవ సూరాలోని 187వ ఆయత్‍ను ఇక్కడ చూస్తాము. (2-187) ''ఉపవాస రాత్రులందు మీరు మీ భార్యలతో కలుసు కోవడము మీ కొరకు ధర్మ సమ్మతము చేయబడినది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యముగా ఆత్మద్రోహానికి పాల్పడుచున్నారనే సంగతి అల్లాహ్‍కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమా గుణముతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుండి మీరు మీ భార్యలతో ఉపవాస రాత్రులందు రమించడానికి, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దానిని అన్వేషించటానికి మీకు అనుమతివుంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలోనుండి ప్రస్ఫుటమయ్యేవరకు తినండి, త్రాగండి. ఆ తర్వాత వీటినన్నిటిని పరిత్యజించి రాత్రి చీకటి పడేవరకు ఉపవాసము ఉండండి. ఇంకా మీరు మస్జీద్లలో ''ఎతెకాఫ్'' పాటించే కాలములో మాత్రము మీ భార్యలతో సమాగమం జరుపకండి. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తముగా ఉండేటందుకుగానూ అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెప్పుచున్నాడు.''


ఈ ఆయత్‍లో 90 శాతము భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకొను విషయముండగా, పది శాతము రాత్రి తినండి, త్రాగండియని పగలు ఉపవాసముండండియని చెప్పియున్నారు. ఈ విషయమును అందరూ ప్రపంచ సంబంధముగానే చూస్తున్నారు. అయితే ముస్లీమ్‍లకు అర్థమయినది పది శాతము చెప్పిన రాత్రి తినండి, పగలు తినవద్దండి అని చెప్పినదే నూరు శాతము అర్థమయినది. ఈ ఆయత్‍లో చెప్పిన 90 శాతము భార్యాభర్తల సంబంధమును వదలివేసి పదిశాతము రాత్రిపూట తినండి అను విషయమునే చెప్పుకొనుచూ దానినే అందరూ ఆచరిస్తున్నారు. మేము ఈ ఆయత్ చూచిన తర్వాత ప్రపంచ సంబంధముగా అర్థము చేసుకొంటే ఈ విషయమును దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ విషయములు ప్రపంచ విషయములైనప్పుడు ఈ విషయములతో దేవునికి ఏమి పని ఉండును? అని ఆలోచించాము. ఈ వాక్యముకంటే ముందు 186వ వాక్యమును చెప్పియున్నందున ఆ వాక్యము ప్రకారము 187వ ఆయత్ మనుషులకు అర్థము కాలేదని తెలిసినది. 'పగలు ఉపవాసము' అను విషయము పూర్తి దైవ సంబంధమైనదని తెలిసిపోయినది. వెనక్కు పోయి 184, 185వ వాక్యములను చూచిన తర్వాత 'ఉపవాసము' అనగా తినే తిండికి సంబంధించిన విషయము కాదనీ, దైవికమైన యోగమనీ, అలా ప్రపంచ ధ్యాస లేకుండాపోయి దైవచింతనలో యుండడము ఉపవాసమగుననీ, దానికి కావలసిన జ్ఞానమును గురువువద్ద నుండి పొందడము ఉపదేశము అనీ, ఉపదేశమును పొందినవాడు, ఉపవాసము ఉండవలసిందేనని తెలిసి పోయినది. ఉపదేశమునే 'రంజాన్' అని చెప్పినట్లు, రంజాన్, రోజా అను పదములు ఖుర్ఆన్ గ్రంథముకంటే ముందే కృతయుగములోనే చెప్పబడినవని తెలిసిపోయినది. దానిప్రకారము నిజమైన ఉపదేశమును పొందిన వానిని 185వ వాక్యములో రంజాన్ ను పొందినవాడు అని వ్రాయబడి యుండడము మా భావమునకు చాలా దగ్గరయినది. అప్పుడు 187వ వాక్యములో వ్రాసిన భార్యాభర్తలు కలుసుకోవడమును ధర్మసమ్మతము చేయబడినదని చెప్పియుండడమును గురించి ఆలోచించగా కొంత విషయము అర్థమయినది. అదేమనగా! అక్కడ చెప్పినది భార్యాభర్త శరీర సంబంధముగా కలుసుకోవడమును గురించి కాదు. భార్యాభర్తలు కలుసుకోవడానికి అనగా లైంగిక విషయముల దగ్గర కూడా దైవ సంబంధమైన ధర్మము ఉంటుందా? యని ప్రశ్న రాక తప్పదు. అలా ప్రశ్నించుకొని చూస్తే ఆ విషయములో దేవుడు ఏమీ చెప్పలేదు అనీ, ఆ పనులన్నియూ వారివారి కర్మలనుబట్టి ముందే నిర్ణయింపబడి యుండునని చెప్పక తప్పదు. ప్రతి చిన్న ప్రపంచ విషయము ముందే వ్రాసిపెట్టబడిన కర్మపత్రము ప్రకారము జరిగి తీరవలసిందే. ఈ విషయములో ధర్మమనునది ఉండదు. ఆ విషయము మీద దేవుడు ఎటువంటి ధర్మనిర్ణయము చేయలేదు. వాక్యమును మనము సరిగా గ్రహించుకోలేదు.


గ్రంథ ప్రారంభమందే మూడవ సూరా మొదటిలోనే ఏడవ ఆయత్‍లో ఈ గ్రంథములో ముతషాబిహాత్ వాక్యములున్నవని గ్రంథమును బోధించిన జిబ్రయేల్గారే చెప్పడమైనది. జ్ఞానమును వాక్యరూపములో బోధించగా అది గ్రంథరూపమై ప్రజలలోనికి పోయినప్పుడు దానిని సరిగా అర్థము చేసుకోలేకపోతే చేసిన పని వ్యర్థమగునని జిబ్రయేల్ మొదటే తాను చెప్పిన వాక్యములలో ముతషాబిహాత్ (సూక్ష్మ అర్థములుగల) వాక్యములున్నవని చెప్పడమైనది. జిబ్రయేల్ ముందే చెప్పినా చాలామంది ముస్లీమ్‍లు ముతషాబిహాత్ వాక్యములున్నట్లుగానీ, వాటికి సూక్ష్మమైన అర్థమున్నది అనిగానీ, బయటికి చెప్పుకోవడము లేదు. ఎవడయినా సూక్ష్మముగా వివరము చెప్పువాడు ఉంటే ''ఇవి మనుషులు చెప్పు విషయములు కావు, దీని అర్థము దేవునికే తెలుసు'' అని వానిని హేళన చేయుచున్నారు. మనుషులు స్వయముగా చెప్పలేరు అని నేను కూడా ఒప్పుకొంటాను. అయితే మనిషిలోయున్న దేవుడు చెప్పవచ్చును కదా!యని ఎవరూ అనుకోవడము లేదు. ఈ విధముగా ముతషాబిహాత్ వాక్యముల వివరము మనుషులు తెలియలేకపోయారు.


దేవుడు ముతషాబిహాత్ వాక్యములను చెప్పకుండా స్థూలమైన ముహ్కమాత్ వాక్యాలే చెప్పియుంటే బాగుండేది కదా!యని కొందరు అడుగ వచ్చును. దానికి నా సమాధానము ఏమనగా! దేవుడు అన్నీ తెలిసిన వాడు. ఆయన మనుషులు చదివే వాక్యము మనుషులకు సులభముగా అర్థము కాకూడదనే అటువంటి సూక్ష్మ అర్థముగల వాక్యములను పెట్టాడు. అటువంటి వాక్యములను తెలియాలని ఎవడు తపన పడునో, వానికి 2-186 వాక్యములో చెప్పినట్లు తానే వాని శరీరములోనుండే తెలియజేయును. కష్టమైన వాక్యములు దేవుని మీద నమ్మకము లేనివారికి అర్థము కాకూడదనే ఉద్దేశ్యముతోనే దేవుడు నిగూఢ వాక్యములను ఉంచడము జరిగినది. నేడు ఎంతోమంది ముస్లీమ్‍లు భూమిమీద గలరు. కొన్ని కోట్ల సంఖ్యలో ముస్లీమ్‍లు ఉండగా, అందులో లక్షలు, వేలు, నూర్లు, పదుల సంఖ్యలో కూడా కొన్ని విషయములు సక్రమముగా అర్థమైన వారున్నారని చెప్పలేము. ముస్లీమ్‍లలో ఒక క్రమశిక్షణ గలదు. ఏ ఇతర మతములలో లేని క్రమశిక్షణ ముస్లీమ్‍లలో యుండుటను గొప్పగా చెప్పుకోవచ్చును. అటువంటి గొప్పతనము మిగతా మతములలో లేదనియే చెప్పవచ్చును. అయితే వారి పెద్దలు ఎలా చెప్పితే అలా వినడము క్రమశిక్షణే అయితే అది ప్రపంచ విషయములలో గొప్పగానే కనిపించుచుండును. కనిపించే విధముగా పెద్దల మాటప్రకారము నడువ గల్గుట గొప్ప పనియేయగును. అదే పరమాత్మ (దేవుని) విషయములోనికి వచ్చేటప్పటికి (6-91) ఆయత్‍లో ''నేను చెప్పిన జ్ఞానము మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియదు'' అని దేవుడే చెప్పియుండుట వలన దేవుని జ్ఞానము వారి పెద్దలకు కూడా తెలియదనియే చెప్పవచ్చును. అందువలన దేవుని జ్ఞాన విషయములో పెద్దలు చెప్పినట్లు వింటాము అనే క్రమశిక్షణే నష్టమును చేకూర్చినది. ప్రపంచ విషయములో గొప్పగా చెప్పబడిన క్రమశిక్షణ జ్ఞాన విషయములో జ్ఞానమును తెలియకుండా చేసినది. పెద్దలు చెప్పినట్లు వినడము వలన వారు చెప్పిన కొన్ని తప్పు భావములు అందరికీ ప్రాకి పోయినవి. ఉపవాస విషయములో అదే జరిగినది. అట్లే భార్యాభర్త కలయిక అను విషయములో అదే జరిగినది.


సూరా రెండు 184, 185 ఆయత్‍లలో చెప్పిన, చెప్పబడిన 'ఉపదేశము' ఏమిటో అక్కడగల 'ఉపవాసము' ఏమిటో తెలియకుండా పోయినది. అదే విధముగా 187వ ఆయత్‍లో 90 పాళ్ళు భార్యాభర్తల కలయిక విషయము చెప్పితే అది దంపతుల శారీరక కలయిక క్రిందికి పోల్చుకొన్నారు. అలా అనుకొనే ముందు ఈ విషయములో దేవునికి సంబంధము లేదు కదా! దేవుడు చెప్పునది జ్ఞాన విషయము కదా! కర్మకు సంబంధించిన ప్రపంచ విషయము ఎందుకు చెప్పును? అని కొద్దిగయినా ఆలోచించలేకపోయారు. మనిషికి ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా కష్టములు సుఖములు శరీరములోని జీవునికి చేరుచుండును. ఆహార విషయమునకు వస్తే వాడు చేసుకొన్న కర్మను అనుసరించి వానికి ఏ ఆహారము దొరకవలెనో అది నిర్ణయము ముందే జరిగిపోయివుండును. దేనిని ఎప్పుడు తినవలెనని వ్రాసిపెట్టబడియుంటే అది అప్పుడే లభించును. సుఖ దుఃఖములను ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా మనిషి అనుభవించుట జరుగుచున్న సత్యము. నాలుక ద్వారా రుచి అనే సుఖమును అనుభవించవలసి యుండును. మనిషి ఏ మతస్థుడయినా గానీ మతము పైన విషయమేగానీ లోపల మాత్రము అందరికీ అన్ని మతముల వారికీ ఒకే విధానము గలదు. ఒకే నాలుక ద్వారా మనిషి రుచి యను సుఖమునో కష్టమునో అనుభవించ వలసి యుండును. మనిషి ఆహారము నాలుకకు సంబంధించినది. అంటే శరీర ఇంద్రియ సంబంధమైనది. అలాగే భార్యాభర్త శరీర కలయికకు సంబంధించిన విషయము, ఐదు జ్ఞానేంద్రియములలో చర్మమునకు సంబంధించినది. ఇక్కడ ముస్లీమ్కని, హిందువుకని, క్రైస్థవులకని వేరువేరు విధానము ఉండదు. శరీరమున్న వారికందరికీ ఒకే విధానముండును. శరీరములో ఐదు జ్ఞానేంద్రియములు వరుసగా ఇలా గలవు. 1) కన్ను, 2) ముక్కు, 3) నాలుక, 4) చెవి, 5) చర్మము. ఈ ఐదు ప్రపంచ సుఖ దుఃఖములకు ద్వారములలాంటివి. వీటివలననే శరీరములోని జీవునికి కష్టసుఖములు చేరుచుండును. ఆహార సుఖము నాలుక ద్వారా లోపలి జీవునికి చేరగా, భార్యాభర్తల కలయిక సుఖము చర్మము అను జ్ఞానేంద్రియము ద్వారా చేరును. ఈ ఐదు అవయవ సుఖదుఃఖములు మనిషి చేసుకొన్న కర్మనుబట్టి యుండును. ఈ విషయములను దేవుడు మనిషిని జన్మకు పంపినప్పుడే తన తీర్పులో కర్మపత్రముగా వ్రాసి పంపియుండును. కర్మపత్రములో ముందే వ్రాసిన దానిప్రకారమే ఆహారముగానీ, భార్యభర్తలు ఉండడము గానీ జరుగు చుండును. మధ్యలో దేవుడు వీటి జోక్యము చేసుకోడు. జీవుని కర్మనుబట్టి ఆత్మ వానిని తోలుచుండగా, అల్లాహ్ (దేవుడు) సాక్షిగా చూస్తూ యుండును. ఇదే విషయమే సూరా 50, ఆయత్ 21 (50-21)లో చెప్పడమైనది. అక్కడ చెప్పిన వాక్యమును మనుషులు మరువకూడదు.


సుఖదుఃఖములకు అతీతమైనది నిద్ర. దేవుడు మనిషికి కష్ట సుఖములను కర్మబద్దము చేశాడుగానీ నిద్రను కర్మకు అతీతము చేశాడు. అందువలన నిద్రలో సుఖము ఉండదు, కష్టము ఉండదు. సుఖదుఃఖ కర్మలు అమలు కానప్పుడు మనిషి నిద్రలోనికి పోవును. మనిషి పగలు మెలుకువగల్గి కర్మలు ఆచరించునట్లు, రాత్రిపూట కర్మలకు అతీతముగా నిద్రపోవునట్లు దేవుడు నిర్ణయించాడు. నిద్రలో శరీరము అను ప్రకృతి (స్త్రీ), పురుషుడు అనబడు ఆత్మ రెండు ఏకమైపోవును. అప్పుడు పురుషుడుగా యున్న ఆత్మగానీ, ప్రకృతి (స్త్రీ)గాయున్న శరీరముగానీ వేరువేరుగా లేకుండా ఒకటిగాయుండును. దానినే 'స్త్రీ పురుషుల కలయిక' అని అంటారు. శరీరములో నివశించు ఆత్మ శరీరముతో కలిసిపోయినప్పుడు నిద్రయగును. అట్లే శరీరమే ఆత్మలో కలిసినప్పుడు కూడా నిద్రయేయగును. అందువలన ఆత్మ శరీరమును కలియవచ్చును. శరీరము ఆత్మను కలియవచ్చును. ఇక్కడ మీకు అర్థమగుటకు శరీరమును ప్రకృతియనీ, ఆత్మను పురుషుడనీ చెప్పడమైనది. భగవద్గీత గ్రంథములో ప్రకృతివలన తయారయిన శరీరమును స్త్రీ అంశయనీ, ఆత్మను, జీవాత్మను, పరమాత్మను ముగ్గురు పురుషులని చెప్పడమైనది. ఆత్మ పురుషుడని చెప్పుచూ ఆత్మ, శరీరము కలిసినప్పుడు నిద్రయగును. అప్పుడు శరీరములో సుఖదుఃఖములను జీవుడు అనుభవించుట లేదు.


సూరా రెండు ఆయత్ 187లో ప్రకృతి ఆత్మలో కలియవచ్చును. ఆత్మ ప్రకృతిలో కలియవచ్చును అను విషయమును 'మీకు మీ భార్యలు దుస్తులు, మీ భార్యలకు మీరు దుస్తులు' అని చెప్పారు. భార్య అనగా భరించబడునది ప్రకృతియనీ, భర్త అనగా భరించువాడు ఆత్మయనీ తెలియ వలెను. నిద్రను భార్యాభర్తల కలయికగా చూడవలెను. మనిషి రాత్రి పడుకొని నిద్రపోయేదానికి శరీరములో దేవుడు నిర్ణయించాడు. దానినే 'ధర్మసమ్మతము చేయబడినది' అని చెప్పాడు. రాత్రిపూట నిద్ర పోయేది ధర్మసమ్మతము. అందువలన రాత్రిపూట నిద్రపోవడము వలన పాపము రాదు. పగలు పూట నిద్ర అధర్మము. పగలు నిద్ర ధర్మసమ్మతము కానిది. పగలు నిద్ర పోవువారిని 'మీరు రహస్యముగా ఆత్మద్రోహానికి పాల్పడుచున్నారని' చెప్పాడు. అందువలన రాత్రిపూట నిద్రపోవడము ధర్మసమ్మతము చేయబడినది. అయితే తొలిజాములోని తెలుపు చీకటి నుండి కనిపించే వరకు అనగా, నాలుగు నుండి ఆరుగంటల వరకు రెండు గంటలు మీ కొరకు దేవుడు తెల్పిన జ్ఞానమును, వ్రాసిపెట్టబడిన దైవగ్రంథములలో అన్వేషించటానికి అనుమతివుంది అని చెప్పాడు. తెల్లవారుజామున రెండు గంటల కాలము దేవుని జ్ఞానమును గ్రంథములలో వెదకి తెలుసుకొనుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. అందువలన ఆ సమయములో మేల్కొనడము ధర్మసమ్మతమే. మిగతా రాత్రి మేలుకోవడము పగలు చేయవలసిన పనులు రాత్రి చేయడము అధర్మమగును. 'తొలి జాములో తెల్లని సారలు కనిపించే వరకు తినండి, త్రాగండి' అని వున్నది కదా!యని కొందరు అడుగవచ్చును. దానికి నా జవాబు ఇలా కలదు. మీ కొరకు వ్రాసిపెట్టబడిన దానిని అన్వేషించండి అని చెప్పి, ఆ పని చేయవలసింది తెల్లవారు జామున యని చెప్పి, అప్పుడు మీకు చదువువస్తే చదవండి. చదువు రాకపోతే ఇతరుల ద్వారా వినండి అని చెప్పాడు. 'చదవండి, వినండి' అని చెప్పు మాటను చాటుగా 'తినండి, త్రాగండి'యని చెప్పారు. దైవజ్ఞానమంతా అలాగే చెప్పబడుచూ వుంటుంది. దానిని బుద్ధి శ్రద్ధ కల్గినవాడు తెలియగలడు అని (3-7) లో చెప్పడమైనది. తెల్లవారిన తర్వాత వినేది, చదివేది వదలి దానిని ఆచరించుచూ యోగమును (ఉపవాసమును) చేయవలెను. యోగము (ఉపవాసము) అనగా జీవాత్మ, ఆత్మతో కలిసి నివశించడము అని అర్థము. ఆత్మ, జీవాత్మ కలిసియుండు దానిని 'యోగము' అని అంటాము. దానినే వాక్యములో ఉపవాసము అని చెప్పాడు. పగలు యోగము, రాత్రి నిద్ర, తెల్లవారు జామున జ్ఞానము తెలియుట మనిషికి ధర్మసమ్మతము చేయుటయని ఈ వాక్యములో తెలిసినది. దేవుడు చెప్పిన విషయమును సూక్ష్మముగానే యోచించాలి గానీ, స్థూలముగా యోచించితే అక్కడ చెప్పిన జ్ఞాన రహస్యము తెలియకుండా పోతుంది. కొందరు మత పెద్దలు తాము చెప్పు జ్ఞానమును సూక్ష్మముగా చెప్పక స్థూలముగా చెప్పారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

19. అత్యంత సమీపమున ఉన్నది. (2-186)

ప్రపంచములో మనిషి అనువానికి అత్యంత సమీపమున అనేక సమయములలో అనేక వస్తువులలో, మనుషులలో, జంతువులలో, పక్షులలో ఏవయినా ఉండవచ్చును. అయితే అవి ఎల్లప్పుడూ దగ్గరగా యుండక కొన్ని సమయములలో మాత్రము దగ్గరయుండి తర్వాత దూరముగా పోవడము జరుగుచున్నది. ఎల్లప్పుడు దగ్గరగాయుండునది, ఏ సమయములో కూడా మనిషికి దూరముగా పోనిది ఏదయినా ఉన్నది అంటే అది శరీరమే యని చెప్పవచ్చును. ఎవని శరీరము వానికి ఎల్లప్పుడు దగ్గరగా యున్నదని చెప్పవచ్చును. అట్లు చెప్పినా అది సరియైన జవాబు కాదని తెలియుచున్నది. ఎందుకనగా! మనిషి సజీవముగా యున్నంతవరకు జీవునికి దగ్గరగా వాని శరీరము యున్నా మరణములో అది దూరముగా పోవుచున్నది. జీవుడు శరీరమును వదలి దూరముగా పోవుచున్నాడు. అప్పుడు ఎల్లప్పుడు దగ్గరగా ఉండునది అనుమాట శరీరమునకు కూడా వర్తించదు.


ఇట్లు లెక్కించుచూ పోతే భూమిమీదున్నది వస్తువుగానీ, చివరకు శరీరముగానీ ఏదీ కూడా జీవునకు దగ్గరగా లేదని తెలియుచున్నది. ప్రపంచము పుట్టినప్పుడు నుండి, అనగా నీవు శరీరముతో పుట్టినప్పటినుండి ఇంతవరకు జీవునికి అత్యంత సమీపముగా యున్నది ఆత్మేనని తెలియు చున్నది. జీవునికి శరీరమున్నప్పుడుగానీ, శరీరము లేనప్పుడుగానీ ఎప్పటికీ జీవునికి అత్యంత దగ్గరగా యున్నవాడు ఆత్మయని మూడు దైవ గ్రంథములలో చెప్పబడినది. జీవాత్మతో ఎప్పుడూ కూడుకొనియుండువాడు అని ఆత్మను 'కూటస్థుడు' అని ప్రథమ దైవగ్రంథములో చెప్పారు. ద్వితీయ దైవగ్రంథములో ప్రక్కనేయున్నవాడు అను ఉద్దేశ్యముతో 'పొరుగువాడు' అని చెప్పారు. అంతిమ దైవగ్రంథములో ఎల్లప్పుడు 'త్రోలేవాడు' అని చెప్పియున్నారు. ఎల్లప్పుడు జీవున్ని త్రోలాలి అంటే త్రోలే ఆత్మ జీవున్ని అంటి పెట్టుకొని ఉంటుంది అని తెలియుచున్నది. చావులోగానీ, పుట్టుకలో గానీ, జీవితములో గానీ జీవున్ని అంటిపెట్టుకొని అతి సమీపమున ఎల్లప్పుడు యున్నది ఆత్మేనని తెలియుచున్నది. మనిషికి (జీవునికి) అతి దగ్గరగా యున్నది ఆత్మే అయివుండుట వలన, జీవున్ని నడుపుచున్నది ఆత్మేనని కూడా తెలియుచున్నది. జీవుని ప్రతి మాటను దగ్గరుండి ఆత్మ వినుచున్నది. అవసరమొస్తే, జీవుడు తన భక్తుడు అయితే, వానికి వచ్చిన ప్రశ్నకు జవాబు కూడా ఆత్మ ఇచ్చుచున్నది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 186లో ఇలా చెప్పారు చూడండి.


(2-186) ''నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపములోనే ఉన్నాను, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గము పొందటానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నాయందు విశ్వాసము కలిగియుండాలి అని చెప్పు.''


దేవుడు అనగా మనుషులు ఆరాధించవలసిన దేవుడైన ఆత్మ స్వయముగా ఈ వాక్యమును చెప్పినట్లు యున్నది. నా భక్తులయిన వారు అడిగితే వారికి మాత్రము చెప్పు, మిగతా అందరికీ చెప్పవద్దు అన్నట్లు ఈ వాక్యములో 'నా దాసులు నన్ను గురించి అడిగితే' అని చెప్పారు. అంతేగాక వారికి అతి సమీపమున ఉన్నానని కూడా ఆత్మ చెప్పియున్నాడు. ఎంత దగ్గర? అను ప్రశ్నకు మనసులో అనుకొన్న దానిని వినగలుగునంత దగ్గరగా శరీరములో దేవుడు ఒక్కడు గలడని స్వయముగా ఆయనే చెప్పి యున్నాడు. తన భక్తుడు అనుకొను ప్రతి మాటను దగ్గరుండి వినగలుగు చున్నాడు. అలా వినినప్పుడు అవసరమైన ప్రతి మాటకు ఆయన (దేవుడు) జవాబు ఇచ్చునని కూడా చెప్పియున్నాడు. ఈ వాక్యమునుబట్టి శరీరములోని జీవునికి, శరీరములోని ఆత్మే దగ్గరగా యున్నదని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

20. జ్ఞానముతో వాదించండి. (2-190, 191, 192, 193, 194)

ఎక్కడయినా దేవుని ధర్మ విషయములలో చాలామందికి పూర్తి జ్ఞానము ఉండదు కనుక వారు వేరువేరు అభిప్రాయములు కల్గియుందురు. అసలయిన సత్యమయిన జ్ఞానమును ఒకడు కలిగియుంటే అదే విషయములో అనేక అభిప్రాయములతో అనేకులు ఉండుట వలన నాది సత్యమని ఒకడు అంటే లేదు నాదే సత్యమని ఇంకొకడు అనుట జరుగు చుండును. ఇట్లు ఎవరిది వారు సత్యమని భావించుకోవడము వలన ఒకరికొకరు పొందికలేక వాదించుకొనుటకు పూనుకొందురు. అలాంటప్పుడు వారు జ్ఞాన విషయములలో మాత్రము వాదించు కొనుచున్నారు తప్ప ప్రపంచ విషయములలో కాదు. అందువలన అంతిమ దైవగ్రంథములో సూరా రెండు, ఆయత్ 190 లో ఇలా చెప్పారు చూడండి.


(2-190) ''మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గములో పోరాడండి. కానీ మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.''


ఇక్కడ వాక్యములో పోరాటము అని ఉంది. పోరాటము రెండు విషయములలో ఉండును. ఒకటి ప్రపంచ విషయము, రెండు పరమాత్మ సంబంధింత జ్ఞాన విషయములో పోరాటములు ఉండును. పోరాటము అనగా రెండు కర్మేంద్రియముల ద్వారా జరుగునది. మనిషికి ఐదు కర్మేంద్రియములు గలవు. కాళ్లు, చేతులు, నోరు, గుదము, గుహ్యము అను ఐదు కర్మేంద్రియములలో ఒకటి చేతులు, రెండు నోరు ద్వారా పోరాటము జరుగుచుండును. నోరు ద్వారా జరుగునవి మాటలతో కూడు కొని యుండును. చేతులతో చేయు పోరాటము మల్లయుద్దము (కుస్తీ) కావచ్చు, రాళ్లు విసురుకోవడము కావచ్చు, కట్టెలతో కొట్టుకోవడము కావచ్చు, కత్తులతో పొడుచుకోవడము కావచ్చు. ఇక్కడ మనుషులు దేవుని జ్ఞాన విషయములో భేదములు వచ్చినప్పుడు నోటితోనే వాదించవలెను. పరమాత్మ విషయములన్నియూ జ్ఞానము చేత, నోటిమాటతో బోధించబడి యుండును. అందువలన జ్ఞాన విషయములన్నియూ మాటలతోనే నోటి వాదములోనే జరుపవలసియున్నది. అందువలన అల్లాహ్ ముందే ఈ విషయములో మనుషులు పొరపాటు పడకుండా ఉండుటకు ''మీరు దైవమార్గములో పోరాడండి'' యని చెప్పియున్నాడు. దైవ మార్గములో పోరాటము నోటితో మాటలవరకే పరిమితి అయివుండుట వలన మితిమీరి ప్రవర్తించకండి, మితిమీరి పోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు అని చెప్పారు. దీనినిబట్టి నోటితోకాక చేతులతో పోరాటము చేయువారిని దేవుడు ఇష్టపడడు అని చెప్పియున్నారు. కావున దేవుని జ్ఞాన విషయము ఏదయినా 'నోటి మాటల పోరాటమే చేయాలి' అని ప్రత్యేకించి చెప్పాడు.


ప్రథమ దైవ గ్రంథములో దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము వచ్చినప్పుడు ధర్మములను నోటితోనే బోధించి, నోటితో మాటల రూపమున చెప్పు జ్ఞానముతో అధర్మవరులను సంహరిస్తాను అని చెప్పాడు. నోటి మాటలతో చంపుతాను అంటే వానిలో ఉండే ఉద్దేశ్యమును (అజ్ఞానమును) లేకుండా చేసి తాను చెప్పు జ్ఞానిగా మార్చడము అని అర్థము. అంతేగానీ భౌతికముగా కత్తులతో చంపుకోవడము కాదు. ఒక వ్యక్తిలోని భావమును మార్చివేసి క్రొత్త భావములోనికి తేవడమును వానిని వాని భావమునుండి చంపివేసినట్లు అగును. ఇక్కడ వాక్యములో పోరాడండి, చంపండి అని అంటే ఇది ప్రపంచ విషయమైతే దానిని బాహ్యముగా అర్థము చేసుకో వచ్చును. దేవుని మార్గములో పోరాటమని వాక్యములో చెప్పియుండుట వలన చంపడము అంటే వాని లోపలి భావమును లేకుండా చేయడము అని అర్థము. అందువలన ఇక్కడ 191, 192, 193, 194 వాక్యములలో చెప్పునదంతా మాటల యుద్ధమేనని, భావమును చంపడమే యని తెలియవలెను. దేవుని (అల్లాహ్) మాటను మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు అని చెప్పియున్నారు.


మనిషిలోని భావమును మార్చగలిగితే వానిని హత్య చేసిన దానికంటే గొప్పకార్యమగును. అందువలన ఎదుటి మనిషిని భౌతికముగా చంపడములో వీరత్వము లేదు. నిజమైన వీరత్వము ఎదుటి మనిషిని మానసికముగా భావములను చంపితే అదియే నిజమైన వీరత్వము. వాడే నిజమైన వీరుడు. అందువలన మీరు దైవమార్గములో పోరాడండియని (2-190) లో చెప్పియున్నారు.


(2-191) ''వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి. మిమ్ములను ఎక్కడినుండి వారు తరిమికొట్టారో, అక్కడినుండి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (భావ మార్పిడి చేయడము) అనేది చంపటముకన్నా తీవ్రమైనది, 'మస్జిదె హరామ్'' వద్ద వారు మీతో యుద్ధము చేయనంత వరకు మీరు వారితో పోరాడకండి. వారు గనుక మిమ్ములను హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానము ఇదే. (192) ''ఒకవేళ వారు గనుక తమ తప్పు భావములను మానుకొంటే నిశ్చయముగా అల్లాహ్ క్షమించే వాడు, కరుణించేవాడు. (193) ''తప్పు భావము సమసిపోనంత వరకు, దైవ ధర్మానిది పై చేయి కానంతవరకు వారితో పోరాడుతూనే (వాదించుచూనే) ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి. మెడలు వంచ వలసినది అసత్యవాదులే. (194) ''నిషిద్ధమాసమునకు బదులుగా నిషిద్ధ మాసమున్నది. నిషేధాజ్ఞలు సరిసమానముగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా మాటల దౌర్జన్యమునకు ఒడికడితే మీరు కూడా ఆ మేరకు వారి మీద ప్రతీకారముగా మాట్లాడండి. అల్లాహ్‍కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ (దేవుడు) భక్తి గలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.''


ఈ విధముగా మొత్తము ఐదు ఆయత్‍లలో (వాక్యములలో) నోటి పోరాట విషయమును గురించి చెప్పారు. 191వ వాక్యములో చెప్పిన దానినిబట్టి జ్ఞాన విషయములో వాదించువారు ఎక్కడ ఎదురై వాదించినా, మీరు కూడా వాదించుటకు తలపడండి. వాదించువారు ఎక్కడ నుండి మొదలు పెట్టి మిమ్ములను ఓడించాలని చూస్తున్నారో, మీరు కూడా అక్కడ నుండే ఆ విషయములనుండే మొదలుపెట్టి వారిని వాదనలో పారిపోవునట్లు, ఓడిపోవునట్లు చేయండి. జ్ఞానములో భావమార్పు (ఫిత్నా) అనునది చంపడముకన్నా పెద్దది. ప్రార్థనా మందిరములలో వారు జ్ఞాన విషయములలో వాదనకు దిగనంతవరకు మీరు కూడా వాదనకు దిగక ఊరక ఉండండి. వారు గనుక మిమ్ములను వాదనలో జయించాలని చూస్తే మీరు కూడా వారితో ధీటుగా వాదించి ఓడించండి. జ్ఞానమును నమ్మని వారికి సరియైన పని అదేయని తెలియండి.


192) ''ఒకవేళ వారు గనుక వారు తప్పు భావములను మానుకొంటే అల్లాహ్ వారిని క్షమించేస్తాడు, కరుణిస్తాడు.''


193) ''తప్పు భావము వారిలో లేకుండా పోవునంతవరకు దైవధర్మానిదే పై చేయి కానంతవరకు వారితో వాదోపవాద పోరాటము చేస్తూనే ఉండండి. ఒకవేళ వారు వాదనలు మానుకొంటే మీరు మానుకోండి. చివరికి మెడలువంచి మాది తప్పని తలలు దించుకోవలసినది అసత్యమును మాట్లాడువారే.''


194) ''మీపై ఎవరయినా మాటల దౌర్జన్యమునకు మొదలు పెడితే మీరు కూడా వారికి బదులుగా మాటలు మొదలు పెట్టి మాట్లాడండి. దేవునికి (అల్లాహ్‍కు) భయపడుతూ ఉండండి. అల్లాహ్ తనమీద భక్తిగలవారికి తోడుగాయుంటాడు అన్న మాటను మరచిపోకండి.''


ఈ విధముగా సూరా రెండులో ఐదు వాక్యములలో మీరు జ్ఞాన విషయములో వాదించు విధానమును తెలుపడము జరిగినది. ఈ వాక్యములలో ''చంపడము, దాడి చేయడము'' అను పదములు వాడబడినా మొదటి వాక్యములోనే ''మీరు పోరాడదలిస్తే దైవమార్గములోనే పోరాడండి'' అని యున్నది. అంతేకాక మితిమీరి పోకండి అని కూడా చెప్పడమైనది. దైవ మార్గములో పోరాటము నోటి మాటలతోనే ఉండును. అందువలన దానిని పరిమితియని అంటున్నాము. నోటి మాటలతో కాకుండా చేతులతో పోరాటము చేయువారు పరిమితి మీరి పోయినట్లగును. దేవుడు చెప్పినట్లు నోటితో కాకుండా చేతులతో పోరాటము చేయువానిని అల్లాహ్ ఇష్టపడడు అని వాక్యములో చెప్పియున్నాడు. అందువలన ఎవరయినా అల్లాహ్‍కు ఇష్టము లేని విధానమును అనుసరించకూడదు. అట్లు అనుసరించిన వాడు అల్లాహ్ (దేవునికి) వ్యతిరేఖముగా ప్రవర్తించినట్లగును.


జ్ఞానములు రెండు రకములు గలవు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము. జ్ఞానము బుద్ధిని ఆధారము చేసుకొని మనిషిలో పెరుగుచుండును. ప్రపంచము మీద శ్రద్ధయున్న వానికి ప్రపంచ జ్ఞానము, దేవుని మీద శ్రద్ధయున్న వానికి దేవుని జ్ఞానము లభించుచుండును. అయితే మిశ్రమ శ్రద్ధలు కొందరిలో ఉండును. కొందరిలో కేవలము ప్రపంచ శ్రద్ధ మాత్రము ఉండును. అటువంటి వారికి ప్రపంచ జ్ఞానము తప్ప పరమాత్మ జ్ఞానము ఏమాత్రము లభించదు. అటువంటి వానికి దేవుడుగానీ దేవుని జ్ఞానముగానీ ఏమీ తెలియదు, చెప్పినా వినే ఓపికగానీ, అర్థము చేసుకొను శక్తిగానీ ఏమాత్రము ఉండదు. ప్రపంచ శ్రద్ధ ఎక్కువ, దేవుని మీద శ్రద్ధ తక్కువ యుండువారు కలరు. అందువలన వారికి మిశ్రమ జ్ఞానము ఏర్పడును. అది పూర్తి ఎటూకాని జ్ఞానము ఉండును. కొందరికి దేవుని జ్ఞానము మీదనే ఎక్కువ శ్రద్ధయుండును ప్రపంచ జ్ఞానము మీద తక్కువ శ్రద్ధయుండును. అటువంటి వానివద్ద యున్న జ్ఞానము స్వచ్ఛమైన దైవజ్ఞానముండును. కొద్దిగ ప్రపంచ జ్ఞానముండుట వలన అది దైవజ్ఞానములో కలియక ప్రత్యేకముగా యుండును. కొందరిలో పూర్తి దైవజ్ఞానము మీదనే శ్రద్దయుండును. అటువంటి వారికి పూర్తి దైవజ్ఞానమే చేరియుండును. వారిలో పేరుకు మాత్రమే ప్రపంచ జ్ఞానముండుట వలన వారు సమాజములో తెలివి తక్కువవారిగా కనిపించుచుందురు. కొంత ప్రపంచ జ్ఞానము, ఎక్కువ దైవజ్ఞానము కల్గినవారిలో మిశ్రమ జ్ఞానమున్న వారు తరచు 'మా జ్ఞానమే గొప్పయని' వాదించుచుందురు. ఉదాహరణగ చెప్పుకొంటే ఎక్కువ ప్రపంచ ధనమున్న వాడు తనవద్ద ధనము ఎక్కువ లేదని చెప్పుచుండును. వానివద్ద కొంత జ్ఞానధనము కొద్దిగయున్నా దానిని ఎక్కువ యున్నట్లు చెప్పుకొనుచుండును. అటువంటివారే ఎక్కువ ప్రపంచ జ్ఞానము, తక్కువ దైవజ్ఞానము కలవారుగా యుందురు. వారు ఎల్లప్పుడు తమవద్ద దైవజ్ఞానము ఎక్కువ వుంది అని తలపోయుచూ ఎక్కువ జ్ఞానమున్న వారితో వాదమునకు దిగుచుందురు. అట్టివారు చివరకు వాదములో ఓడిపోక తప్పదు. అట్లు ఓడిపోయినప్పుడు జ్ఞానులమీద కక్షను పెంచుకొను అవకాశము గలదు. అటువంటివారే ఇతరుల మీద హింసాయుత దాడులకు పాల్పడుచుందురు. అటువంటి దానిని దేవుడు పూర్తి ఖండించుచున్నాడు. అది మంచి పద్ధతి కాదని చెప్పుచున్నాడు. ఖుర్ఆన్‍లో 2-190 నుండి 194 వరకు వీరిని గురించి చెప్పాడు.


అటువంటి తక్కువ జ్ఞానమున్నవారు ఎక్కువ జ్ఞానమున్న వారితో వాదమునకు దిగుచూ తమకు తెలిసిన జ్ఞానమే గొప్పయని చెప్పుచుందురు. వారు మాట్లాడు మాటలలో శాస్త్రబద్ధత ఎంతమాత్రము ఉండదు. అయినా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళున్నాయి, కావున అన్ని కుందేళ్లకు మూడు కాళ్ళుండునని మొండిగా వాదించుచుందురు. ఏ కుందేలుకయినా నాలుగు కాళ్లు ఉంటాయి. నీవు పట్టుకొన్న కుందేలు కుంటిది అంటే వాడు తనమాటను నెగ్గించుకోవాలని చూచును తప్ప తన కుందేలును గురించి ఇది కుంటిదేమో అని అనుకోడు. అటువంటి వారు దేశములో ప్రతిచోట తప్పక ఉందురు.


ఒక గ్రంథములో తెలివితక్కువ వారిని వర్ణించి చెప్పుచూ ''తల తోక తెలియనివారని'' వ్రాసియున్నది. దానిని చూస్తే ఒక జంతువుకు ఇది తల, ఇది తోకయని గుర్తించలేని గ్రుడ్డివారు, తెలివి లేనివారు ఉన్నారని చెప్పియుండగా, మరొక తెలివి తక్కువవాడు దానిని చూచి ఏనుగుకు తలకే తోక యున్నదియని అన్నాడట. అలా ఉండుట వలననే తల తోకయని వ్రాశారు అని చెప్పాడట. అక్కడ వ్రాసినది వేరు, నీవు చెప్పునది వేరని చెప్పినా అతడు గ్రహించలేక తల తోక ఒక్క ఏనుగుకే యున్నదని తొండమును తోకగా పోల్చుకొని చెప్పాడు. కొందరికి తొండము అంటే ఏమిటి? తోక అంటే ఏమిటి?యని వివరము తెలియనివారు అన్నీ తెలిసిన వారితో నాకు తెలిసినదే సత్యము అని అంటున్నారు. ఎలా సత్యము? అని కొంతయినా ఆలోచింప లేకపోవుచున్నారు.


ఆధ్యాత్మిక జ్ఞానమును చెప్పిన వారు ఎవరూ దానిని గ్రంథముగా వ్రాయలేదు. మేము దైవగ్రంథముల విషయమును చెప్పుచున్నాము. కృష్ణుడు జ్ఞానము చెప్పగా, అది భగవద్గీతగా వ్యాసుడు వ్రాశాడుగానీ, కృష్ణుడు వ్రాయలేదు. దైవ గ్రంథములను చెప్పినవారు వ్రాయకూడదని దేవుడు ముందే నిర్ణయము చేశాడు. చెప్పినవాడే వ్రాస్తే తాను చెప్పినది మాత్రమే గ్రంథములో వ్రాయును. అట్లుకాక ఇతరులు వ్రాస్తే చెప్పినది కొంత, చెప్పనిది కొంత వ్రాసి గ్రంథము చేయగలరు. చెప్పినది మాత్రమే ఏ దైవగ్రంథములో ఉండకూడదనీ, చెప్పినది కొంత, చెప్పనిది కొంత దైవగ్రంథములో ఉండవలెనని దేవుని ఉద్దేశ్యము. అందువలన కృష్ణుడు భగవద్గీతను వ్రాయలేదు. అట్లే ఏసు చెప్పిన ఇంజీలు గ్రంథమును (బైబిలు గ్రంథమును) ఏసు వ్రాయలేదు. కృష్ణుడు చెప్పిన జ్ఞానమును వ్యాసుడు ఒక్కడు వ్రాయగా, ఏసు చెప్పిన జ్ఞానమును మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అను నలుగురు వ్రాశారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త మనుషులకు చెప్పిన జ్ఞానమును ప్రవక్తగారు వ్రాయలేదు. ప్రవక్తగారు వ్రాస్తే తాను చెప్పిన వాక్యములను మాత్రము వ్రాయగలడు. అలా వ్రాయకూడదని అల్లాహ్ యొక్క నిర్ణయము. చెప్పినవి, చెప్పనివి రెండూ, మూడు దైవగ్రంథములలో యున్నవి. అలా ఉన్నప్పుడే జ్ఞానమునకు విలువయని దేవునికి తెలుసు. చీకటి యున్నప్పుడే వెలుగు యొక్క విలువ తెలియును. అట్లే చెడు ప్రక్కన మంచి యుంటే మంచియొక్క విలువ తెలుస్తుంది. అజ్ఞానము ప్రక్కలో జ్ఞానమున్నప్పుడే జ్ఞానము యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. అంతేకాక చదివే వానికి నేరుగా అర్థము కాకూడదనీ, ఎవనికయితే జ్ఞానము మీద ఆసక్తి యుండునో వానికి మాత్రమే జ్ఞానము తెలియునట్లు దేవుడే అదే పనిగా మూడు గ్రంథములను చెప్పినవారితో వ్రాయించలేదు. ఇతరులు వ్రాయునట్లు చేశాడు.


అలా వ్రాసినందున కొన్ని పూర్తి జ్ఞాన విషయములున్నా, కొన్ని పూర్తి ప్రపంచ సంబంధ విషయములుండును. దేవుడు తన జ్ఞానమును మాత్రము చెప్పియుండగా, ప్రపంచ ఆస్తులు పంచుకొను విషయము కూడా దేవుడు చెప్పినట్లు గ్రంథములలో వ్రాయబడియున్నది. మూడు గ్రంథములు అలాగే యున్నవి. ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానము చాలా ప్రత్యేకమయినది. ఎంతోగొప్ప రహస్య జ్ఞానమును చెప్పిన ఘనత ఖుర్ఆన్‍కు ఉన్నది. అట్లే దేవుని జ్ఞానము కాని విషయములు ఎన్నో గ్రంథములో గలవు. బుద్ధిగల వాడు వాని బుద్ధిని ఉపయోగించి, తన జ్ఞానమును తెలియవలెనను ఉద్దేశ్యముతో దేవుడే అలా చేశాడని తెలియుచున్నది. మనిషి శ్రద్ధనుబట్టి అన్నీ కలుపుకొని చదువుకొనువారు గలరు. కొందరు అవసరమైనవే గ్రహించి మిగిలిన వాటిని వదలివేయువారు గలరు. విచక్షణ లేనివారు గ్రంథములోని వాక్యమును తీసుకొని జ్ఞానులతో పోట్లాడుచుందురు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

21. స్వర్గము సులభముగా వస్తుందనుకోవడము పొరపాటు. (2-214)

'స్వర్గము' అనునది మూడు దైవగ్రంథములలో చెప్పబడియున్నది. అయితే స్వర్గము అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? అను విషయము నేడు మూడు గ్రంథములను చదివినా, మూడు మతముల వారికి తెలియదని నేను అనుకొంటున్నాను. ఎందుకనగా! మూడు మతములవారు స్వర్గము అనునది ఒక ప్రత్యేకమైన లోకమని అనుకొంటున్నారు. అక్కడే అందరూ స్వర్గమును గురించి అర్థము చేసుకోలేక పోయారని తెలియుచున్నది. మొదటనే తప్పుదారి పట్టినవారు తర్వాత కొంత సత్యమును చెప్పుకొనినా ఏమీ ప్రయోజనముండదు. స్వర్గములో సుఖములు ఉంటాయి, నరకములో కష్టాలు, బాధలు ఉంటాయి అని అనుకోవడము సత్యమే అయినా మనిషికి ప్రయోజనము చేకూర్చునదై ఉండదు. స్వర్గ, నరకములు ఒకదానికొకటి వ్యతిరేఖమైన లోకములనీ, నరకములో శిక్షలతో కూడుకొన్న బాధలుండగా, స్వర్గములో సుఖమయమై ఉండునని చెప్పుకొనుచుందురు.


హిందూమతములో నరకమును గురించిన వివరముల గ్రంథమున్నది. దాని ఆధారముతో దానికి వ్యతిరేఖమైన స్వర్గములో సుఖములను అంచనా వేసుకోవడము జరిగినది. మొదట హిందువులు అనుకొన్నట్లే తర్వాత మిగతా మతములవారు అనుకోవడము జరిగినది. హిందువులలో నరకమును గురించి ఎక్కువగా చెప్పుకోగా, ముస్లీమ్‍లలో స్వర్గమును గురించి ఎక్కువ చెప్పుకోవడము జరిగినది. క్రైస్థవులలో స్వర్గ నరకముల గురించి ఎక్కువగా చెప్పుకోలేదు. హిందువులలో చనిపోయిన మనిషి ముందు స్వర్గానికి పోయి, తన పుణ్యము అయిపోవు వరకు సుఖములు అనుభవించి, తర్వాత పాపమును అనుభవించుటకు నరక లోకమునకు పోయి అక్కడ నరకమును అనుభవించి, పాపము అయిపోయిన వెంటనే తిరిగి భూమిమీద క్రొత్త జన్మ ఎత్తుచున్నాడని చెప్పుకొంటున్నారు. అదే ముస్లీమ్‍లలో అయితే మనిషి జీవితములో చేసుకొన్న దానినిబట్టి స్వర్గమో, నరకమో ఏదో ఒక్కటి లభించుననీ, ఏది లభించితే దానిలోనే శాశ్వితముగా ఉందురని చెప్పుచూ స్వర్గములో మనిషి అనుభవించు సుఖాలను గురించి ఎక్కువగా వ్రాశారు.


స్వర్గ సుఖముల గురించి ఎక్కువగా వర్ణించి చెప్పి దేవుని కొరకు పని చేసినవాడు స్వర్గమునకు పోతాడని, అక్కడ మంచి అందగత్తెలయిన కన్యలుగా యున్న ఆడపిల్లలు సేవలు చేయుచుందురనీ, అట్లే వారితో శరీర సుఖములు పొందవచ్చునని చెప్పియున్నారు. అనుకూలమైన వాతావరణములో అనుకూలమైన అందమైన స్త్రీలతో శాశ్వితముగా స్వర్గములో ఉండిపోవచ్చునని చెప్పియున్నారు. ఎలాగయితేనేమి, స్వర్గము అంటే సుఖాల పుట్టయని చెప్పుకొనుచుందురు. స్వర్గమును గురించి ఇస్లామ్ మతములో ఎక్కువగా చెప్పుకోవడము గలదు. అందువలన ముస్లీమ్‍లందరికీ స్వర్గము నోరు ఊరించు లోకముగాయున్నది. కొందరు యువకులు, దేవుని కొరకు చనిపోతే స్వర్గమునకు పోతారుయను మాటను విని ఇక్కడ నిత్యము ఆర్థికముగా ఇబ్బందులు పడుటకంటే ఏదో ఒక రకముగా దేవుని పనిలో చనిపోతే స్వర్గానికి పోయి శాశ్వితముగా సుఖములు అనుభవించ వచ్చును కదా!యని అనుకొంటున్నారు. అటువంటి యువకులను డబ్బు చూపి ఆకర్షించి, కొందరు వారిని దేవుని పనియని, మతము పని చెప్పి, మతము కొరకు చనిపోతే దేవుని కొరకు చనిపోయినట్లే యని తమ మతముకంటే ఇతర మతములలో యున్నవారు తమ దేవున్ని, తమ మతమును తిరస్కరించినవారనీ, వారిని చంపితే అది దేవుని కొరకు పని చేసినట్లనీ, ఇతరులను చంపు కార్యములో చనిపోతే స్వర్గము వస్తుందని చెప్పడము వలన చాలామంది యువకులు స్వర్గము కొరకు అదే పనిగా చావాలని మనుషుల మీద దాడులు చేయుచున్నారు. అలా ఇతరులను చంపడములో తప్పనిసరిగా వారు కూడా చావవలసిన పని ఏర్పడుచున్నది. అది వారికి తెలిసి అదే పనిగా చనిపోవాలను ఉద్దేశ్యముతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుచున్నారు.


అలా ఇతర మతస్థులను చంపడము, తమ దేవుని కొరకు పని చేసినట్లనీ, ఆ పనిని చేయడములో చనిపోతే నేరుగా స్వర్గ లోకానికి పోవచ్చుననీ వారు నమ్మి ఇతరులను చంపి తాము చనిపోతున్నారు. అయితే అంత సులభముగా వారికి స్వర్గము రాదని వారికిగానీ, వారి పెద్దలకుగానీ తెలియదు. నేడు యువకులకు స్వర్గ సుఖముల ఆశచూపి స్వర్గము కొరకు ఉగ్రవాదులుగా కొందరి యువకులను తయారు చేసి, వారు స్వర్గము కొరకు చనిపోవాలను నిర్ణయముతో చేతనయినంత మందిని చంపుదురు. అట్లు వారు చేయుచున్న దాడులలో వారు చనిపోవడము జరుగుచున్నది. దీనినిబట్టి స్వర్గము కొరకు తాము అమాయక ప్రజలను చంపుచున్నారని, అది పాపపు పనియనీ, అటువంటి పాపపు పని వలన నరకమునకు పోవలసి వస్తుందని వారికి తెలియదు. తమకు తెలిసినదే సత్యమని, తమ పెద్దలు చెప్పినదే వాస్తవమని నమ్మి తమ ప్రాణాలను పోగొట్టుకొనుచున్నారు.


'ఉగ్రవాదులు' అను పేరుతో పోలీసుల మీదికో, సైన్యము మీదికో, లేకపోతే ప్రజల మీదికో, ఐదు లేక ఆరుమంది వచ్చి దాడి చేసి, తమ సంఖ్యకు నాలుగు, ఐదు ఇంతలు ఎక్కువమందిని ప్రజలు తేరుకొనే లోపలే చంపి తర్వాత ఎంతమందిని వీలయితే అంతమందిని చంపుటకు ప్రయత్నింతురు. ఇట్లు మారణకాండ సాగించు లోపలే భద్రతా దళముల చేతిలో చనిపోవడము జరుగును. భద్రతా దళములు ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ''ఉగ్రవాదులు ఎవరూ తప్పించుకోకుండా అందరినీ చంపివేశాము'' అని భద్రతా దళాలు చెప్పుకొనును. ఉగ్రవాదులుగా వచ్చిన వారు తప్పించుకోవాలనేది వారి హృదయాలలో ఉండదు. వారు చనిపోవాలనే వచ్చియుందురు. వారు ముందే తాము భద్రతా దళాల చేతిలో చనిపోతామని నిర్ణయము చేసుకొనే వచ్చియుందురు. తప్పించుకొనే దానికి వారికి అవకాశమున్నా వారు తప్పించుకోరు. భద్రతా దళాలు తమను చంపలేని స్థితిలోయున్నా, వారే బయటికి వచ్చి వారు కాల్చే దానికి అవకాశము కల్పించుదురు. వారు స్వర్గము కొరకు చనిపోవాలను ఉద్దేశ్యముతో అక్కడకి వచ్చారే తప్ప తప్పించుకొనుటకు కాదు. ఆ విషయము భద్రతా దళములకు తెలియక మేము ఉగ్రవాదులు తప్పించుకోకుండా అందరినీ చంపివేశామని చెప్పుకొనుచుందురు.


ముఖ్యముగా వారు స్వర్గము అంటే ''వడ్డించిన విస్తరి లాంటిదని'' తలచి మతము కొరకు, దేవుని కొరకు చనిపోతే స్వర్గమే వస్తుందని అదే పనిగా చచ్చుటకే ఉగ్రవాదుల అవతారములో రావడము జరుగుచున్నది. చెప్పి పంపేవారు అలానే చెప్పి పంపుచున్నారు. బాగా గమనించితే ఉగ్ర వాదులుగా మారి చావుటకు సిద్ధమగువారు అందరూ చిన్న వయస్సు వారే అయివుండడము గమనించదగిన విషయము. చిన్న వయస్సు వారికి అవసరమైన స్వర్గము, పెద్ద వయస్సువారికి అవసరము లేదాయని చూస్తే, అది అందరికీ అవసరమే అయితే, చురుకుగా ఇతరులను చంపుటకు చిన్నవయస్సువారే పనికి వస్తారనీ, వారిని తయారు చేసి పంపేవారు అనుకోవడము వలన, అందరినీ చిన్నవయస్సు వారినే పంపడము జరుగు చున్నది. స్వర్గము కొరకు చావుకైనా సిద్ధమయినవారు అందరూ ఆర్థిక ఇబ్బందులతో జీవితమును కష్టముగా సాగించువారే. వారిని అలా తయారగునట్లు చేసి స్వర్గము యొక్క ఆశ చూపు నాయకులకో, పెద్దలకో స్వర్గము అవసరము లేదా! అంత సులభముగా మతము కొరకు చచ్చు చావుతోనే స్వర్గము వచ్చేటట్లయితే, బోధించి పంపు వారిలో కనీసము ఒక్కరయినా స్వర్గము కొరకు చనిపోవుటకు సిద్ధమగుచున్నారా? అని చూస్తే వారు ఎవరూ అలా తయారు కారు. వారు అందరినీ తయారు చేసి పంపడమే వారి లక్ష్యము. ఉగ్రవాదము వలన ఎవడయినా స్వర్గమునకు పోడని వారికి బాగా తెలుసు.


అందువలన వారు ఉగ్రవాదులుగా పోయి చనిపోవడానికి ఎవరూ ముందుకు రారు. వారు అట్లే ఉండి అమాయకులకందరికీ పెద్దల మాటలను వినవలెనను ఆంక్షలు పెట్టి, పెద్దలు చెప్పినట్లే జరుగునని బోధించి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి అమాయకులైన ముస్లీమ్‍ల చావుకు కారణమగుచున్నారు. 'చంపు, చావు' అను రెండు మాటలే నేర్పించి పంపు చున్నారు. వారి మాటలు విని అమాయకులైనవారు దేవుని జ్ఞానము మీద శ్రద్ధను వదలి, తమ జీవితములను నాశనము చేసుకోవడమేకాక ఇతర సమాజములలోని మనుషుల జీవితములను కూడా నాశనము చేస్తున్నారు. వాస్తవముగా వారికి దేవుని జ్ఞానము తెలియకనే అలా తయారగుచున్నారు.


ముస్లీమ్‍లను రెండు విధముల విడదీసి చెప్పవచ్చును. ఒక రకము అమాయక ముస్లీమ్‍లు, రెండవ రకము మాయ ముస్లీమ్‍లు. అమాయక ముస్లీమ్‍లు తమ పెద్దలు చెప్పినట్లు వినవలెనను పరిస్థితిలో ఉందురు. వారి మనోబలహీనతను ఆధారము చేసుకొని కొందరు వారి మీద తాము పెద్దలమని చెప్పుచూ పెత్తనము చెలాయిస్తుందురు. ఖుర్ఆన్ గ్రంథము లోనిది వారికి బోధించక మరియొక గ్రంథమే ముఖ్యమని ఆ గ్రంథములోని మత విషయములను, మత సాంప్రదాయ విషయములను నేర్పించి 'మేము మనుషులము' అను మాటను మరచిపోవునట్లు చేసి 'మేము ఫలానా మతస్థులము' అను ధ్యాస వచ్చునట్లు చేయుచున్నారు. ఖురాన్‍లోని జ్ఞానమును బోధించక ముస్లీమ్‍లందరినీ పక్కదారి పట్టించి తమకు అనుకూలముగా మార్చుకుంటున్నారు. అటువంటి స్థితిలో మిగతా ముస్లీమ్‍లందరికీ ఖుర్ఆన్‍లోని జ్ఞానము తెలియకుండా చేశారు. అరబ్బీ భాషలోనే చదువవలెనను నియమమును ఉంచి, అరబ్బీ భాషరాని ఏ దేశము ముస్లీమ్‍లకు గ్రంథజ్ఞానమే తెలియకుండా చేశారు. అరబ్బీ భాష వచ్చిన ప్రాంతము కొంతే అగుట వలన ప్రపంచములో కేవలము పది శాతము ముస్లీమ్‍లే ఖుర్ఆన్‍ను అరబ్బీ భాషలో చదువగలరు. అయితే ఆ పది శాతము మందిలో కూడా ఖుర్ఆన్కంటే ముందు చదువవలసినవి హదీసు గ్రంథములనీ, ప్రవక్త మీద ముస్లీమ్‍లకున్న అభిమానమును అడ్డము పెట్టి ప్రవక్తగారు చెప్పిన నియమములను ముందు పాటించాలనీ, హదీసులను మనుషులకు (ముస్లీమ్‍లకు) పరిచయము చేయుట వలన గల్ఫ్ దేశములలో అరబ్బీ భాష వచ్చిన ముస్లీమ్‍లకు కూడా ఖుర్ఆన్ జ్ఞానము కాకుండా హదీసు వాక్యములనే చెప్పుట వలన పేరుకు ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్‍లది అని చెప్పుకొన్నా, అందులోని జ్ఞానము ముస్లీమ్‍లకే తెలియకుండా పోయినది. నేడు దైవగ్రంథము ఖుర్ఆన్ కంటే మనుషుల గ్రంథములయిన హదీసులే ముస్లీమ్‍లకు బాగా తెలుసు. మేము స్వచ్ఛమయిన ముస్లీమ్‍లకు నిలయమయిన హైదరాబాద్లో ఎన్నో ముస్లీమ్ షాప్లలో ఖుర్ఆన్ ఆయత్‍లను చెప్పితే ''ఇవి మాకు తెలియవు, ఖుర్ఆన్‍ను మేము చదవలేదు'' అని అంటున్నారు. మరికొందరు ''మేము ఖుర్ఆన్‍ను చదివినా ఎక్కడ ఏమి వ్రాశారో తెలియదు, మేము మాకు రాని అరబ్బీ భాషలో చదివాము. అందువలన ఏ ఆయత్‍లో ఏమి ఉన్నది తెలియదని'' వారు చెప్పుచున్నారు. కొందరు బోధకులయిన వారిని కొన్ని ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు కూడా సరియైన జవాబు చెప్పలేక పోవుచున్నారు. కొన్ని ఆయత్‍లను గురించి అడిగితే వాటిని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోక తప్పు భావముతో అర్థము చేసుకొన్నారు. ''నమాజ్ చేయమని చెప్పిన దేవుడు ఒకరు, ఏ అక్కర లేదని చెప్పిన దేవుడు మరొకరు'' అని తెలియదు. అట్లే ''సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు'' ఇద్దరు అను విషయమే తెలియదు. ఆరాధించవలసినది ఒక్క దేవున్నేయనీ, హితము చెప్పిన దేవున్ని గురించి తెలియదు. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే అయినా, ఆరాధనలకు అతీతముగా యున్న దేవుడు మరొకడున్నాడని, ఖుర్ఆన్‍లో యున్నదని వారికి తెలియదు. ఆరాధన అవసరము లేని దేవున్ని గురించి 112వ సూరాలో యున్నదనీ, ఆరాధించవలసిన దేవున్ని గురించి అన్ని సూరాలలో గలదని వారికి తెలియదు. వారికే తెలియని ఖుర్ఆన్ గ్రంథమును గురించి తెలుసుకొందామని అనుకోకుండా వారు హదీసులనే ప్రేమించుచున్నారు, దానినే ఇతర ముస్లీమ్‍లకు చెప్పుచున్నారు. ఏ గ్రంథములో ఏమి యున్నది వారికి తెలుసు. అయినా వారిలో 'మతము' అను అధర్మము ఇమిడిపోయి వుండుట వలన ఇతరులకు కూడా మతము అను దానిని గురించే బోధించుచున్నారు. హదీసుల వలననే వారిలో మత ఐకమత్యముంటుందనీ, అది ఖుర్ఆన్ వలన మతము సాధ్యము కాదని వారికి తెలుసు. అందువలన దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లోని దైవజ్ఞానమును బోధించక, మత సాంప్రదాయములను తెలుపు హదీసు గ్రంథములోని మాటలనే ఎక్కువగా చెప్పుచున్నారు.


ఎక్కడయినా, ఎవరయినా దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍ను చదివినా అందులోని ఆయత్‍ను లోతుగా అర్థము చేసుకోకుండా, మత సాంప్రదాయములు అందులో కూడా ఉండునట్లు వాటికి అర్థము చెప్పు కొంటున్నారు. ఇప్పుడు ఖుర్ఆన్‍లోని ఒక ఆయత్‍ను తీసుకొని ఎలా తప్పు భావముతో, మత సాంప్రదాయముతో కూడుకొన్న అర్థమును చెప్పుకొంటున్నారో చూద్దాము.


(2-214) ''ఏమిటి మీరు స్వర్గములో ఇట్టే ప్రవేశించగలమని అనుకొంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వము గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే (ఆ ధాటికి తాళలేక) ''ఇంతకీ దైవ సహాయము ఎప్పుడు వస్తుంది'' అని ప్రవక్తలను, వారి సహచరులను ప్రశ్నించ సాగారు. ''వినండి! దైవసహాయము సమీపములోనే ఉంది'' అని వారిని ఓదార్చడము జరిగినది.''


దైవ గ్రంథములోని ఆయత్‍ల (వాక్యముల) వివరము తెలియక స్వర్గము అంటే ఏమిటో తెలియనివారు, అది ఎక్కడ ఉంటుందో తెలియని వారు మోక్షము సులభముగా వస్తుందనుకున్నవారు. మతము కొరకో, దేవుని కొరకో చనిపోతే స్వర్గము సులభముగా లభించునని అనుకొన్నారు. అయితే 'స్వర్గ విషయములో వారు పొరపాటు పడుచున్నారు' అను విషయము పై వాక్యమును బట్టి తెలియుచున్నది. పై వాక్యములో స్వర్గములో సులభముగా ప్రవేశించ గలవారు పూర్వము నుండి ఉన్నారు. అయితే పూర్వము మేము స్వర్గానికి పోతామని అనుకొన్నవారు చనిపోయిన తర్వాత వారికి తర్వాత జన్మలలో ఎదురైనటువంటి పరిస్థితులు ఎట్లుంటాయో ఇప్పుడు స్వర్గమును గురించి మాట్లాడుకొను వారికి తెలియదు. అటువంటి వారి పరిస్థితులు చాలా దుర్భరముగా తయారయినాయి. వారికి స్వర్గము రాలేదుగానీ, వారికి అనేకమైన కష్టాలు, రోగాలు వచ్చాయి. వారు మానసికముగా ఎంతో క్షోభకు గురియై కుదిపివేయబడ్డారు. వారికి స్వర్గ సుఖాలు వస్తాయని మురిసిపోయారుగానీ, వారు చనిపోయిన తర్వాత వారికి సుఖాల బదులు కష్టాలు వచ్చాయి, స్వర్గానికి బదులు నరకము వచ్చింది. కష్టాల ధాటికి, రోగాల ధాటికి తట్టుకోలేక ''మాకు దేవుని సహాయము ఎప్పుడు అందుతుంది? దేవుడు మమ్ములను ఎప్పుడు కష్టాల నుండి బయట పడవేస్తాడు'' అని కొంత జ్ఞానమును బోధించు ప్రవక్తలను, ప్రవక్తల సహచరులను దీనముగా అడుగుచుందురని వాక్యములో చెప్పారు. అలా అడిగితే ''దేవుడు సహాయము తొందరగానే చేస్తాడు'' అని వారు చెప్పుచుందురు.


దేవుడు సహాయము చేస్తాడా! చేయడా! అను విషయము ప్రవక్తలైన వారికి కూడా తెలియదు. అందువలన దేవుడు తొందరగా సహాయము చేస్తాడు అని చెప్పుచుందురుగానీ, ఎప్పుడు సహాయము చేస్తాడని వారికి కూడా తెలియదు. ఓదార్పు కొరకు అలా చెప్పుచుందురేగానీ అటువంటి వారికి దేవుడు సహాయము చేస్తాడను నమ్మకము కూడా లేదు. ఎందుకనగా! స్వర్గము ఏదో, నరకము ఏదో తెలియనివారు నరకము వచ్చే పనులు చేసి స్వర్గము వస్తుందనుకోవడము పొరపాటు. మతము కొరకనో, దేవుని కొరకనో నీవు స్వంతముగా అనుకొని దుర్మార్గపు పనులు, హింసతో కూడుకొన్న పనులు చేసి స్వర్గము వస్తుందని అనుకొంటే నీవు అనుకొన్నట్లు రాదు. నీవు చేసిన పనికి ప్రతి ఫలితముగా ఏమి రావలెనో అదే వచ్చును. మనిషి చేసిన పనిలో కనిపించక పాపము, పుణ్యము రెండూ ఉండును. చేసిన పని మంచిదయితే పుణ్యము, చెడ్డదయితే పాపము రావడము సహజము. మతము కొరకు, దేవుని కొరని నీవు అనుకొన్నట్లు తన గ్రంథములో ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా చెప్పకున్నా, నీ స్వంతముగానో నీలాంటి వారు స్వయముగానో చెప్పగా విని చేసిన పనులు దేవుడు చెప్పినవి కావు. దేవుడు ఎక్కడా తన జ్ఞానములో మీ స్వర్గము కొరకు ఇతరులను చంపమని చెప్పలేదు. దేవుని లెక్కలో ఎవరయినా అజ్ఞానులు అధర్మవరులుయున్నా, వారికి 'దైవజ్ఞానము' బోధించి వారిని మంచి జ్ఞానులుగా, ధర్మవరులుగా మార్చమని చెప్పాడుగానీ, సంహరించమని ఎక్కడా చెప్పలేదు.


మతమను మాయలో మనిషి చిక్కుకొని మరియు మత సాంప్రదాయములు అను ధ్యాస పెరిగిపోయి, మతము అనునది అధర్మమని తెలియక, మతము కొరకు చేయు పనులు ఏవయినా పాపమే వస్తుందని తెలియక, పుణ్యము వస్తుంది, దానివలన సుఖము వస్తుంది, అని అనుకొను వారు గతములో కూడా ఉన్నారు. వారు మతము కొరకు మతమును అభివృద్ధి చేయుటకు ఇతర మతములను అణచివేయాలని ఇతర మతముల వారిని చాలామందిని చంపడము జరిగినది. ఆ రోజు వారు చేయు పని మంచిదేయని వారు చేసినా, అది దేవుని లెక్కలో మంచిదా! కాదాయని ఏమాత్రము ఆలోచించలేదు. తన కొరకుగానీ, తన జ్ఞానము కొరకుగానీ దేవుడు హింస చేయమనలేదు, హితముతో బోధించమని చెప్పాడు. అటువంటప్పుడు తనకు సంబంధము లేనిది, మనుషులు తయారు చేసుకొన్నది, అజ్ఞానముతో కూడుకొన్నది అయిన మతము కొరకు ఇతరులను చంపమనిగానీ, హింసింపమనిగానీ చెప్పినాడనుట అజ్ఞానమే గానీ జ్ఞానము కాదు. అలా హింస చేసినవారికి పాపము రాకతప్పదు. దానివలన భూమిమీద జన్మించి నరక బాధలను ఇక్కడనే అనుభవించక తప్పదు.


స్వర్గము గానీ, నరకము గానీ ఏదో ప్రత్యేకమయిన లోకము కాదు. గత జన్మలో చేసుకొన్నవి ప్రస్తుత జన్మలో, ప్రస్తుత జన్మలో చేసుకొన్నవి రాబోయే జన్మలో అనుభవించవలసి యున్నది. కొందరు ముస్లీమ్‍లు జన్మలే లేవు, వచ్చేది స్వర్గమో, నరకమో అని అంటున్నారు. అటువంటి వారికే ఈ ఆయత్ చెప్పబడినది, ఈ వాక్యములో గలదు. వాస్తవానికి 'పూర్వము గతించినవారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారో వారి కష్టాలు మీకు ఇంకా అనుభవమునకు రాలేదు' అని వాక్యములో చెప్పారు. 'పూర్వము చనిపోయిన వారికి ఇప్పుడు జీవితములో కష్టాలు, రోగాలు వచ్చాయి' అని చెప్పియున్నారు. పునర్జన్మలున్నాయని, చనిపోయిన వారు స్వర్గము వస్తుందనుకొనినా 'వారికి ఈ జన్మలో కష్టాలు, రోగాలు వచ్చాయి' అని వాక్యములో చెప్పబడియుండుట వలన ఈ వాక్యములో జన్మలు, గత జన్మలు ఉన్నాయని తెలియుచున్నది. జన్మలు లేవు అనుకొను వారు కూడా తప్పనిసరిగా జన్మలున్నాయని తెలియునట్లు దేవుడు 'పూర్వము గతించినవారిపై కష్టాలు, రోగాలు వచ్చి పడ్డాయి, వారు బాధల చేత కుదిపి వేయబడ్డారు' అని చెప్పియుండుటను బట్టి జన్మలు లేవు అనువారు స్వయముగా దేవుని వాక్యమును ధిక్కరించినట్లగును. దేవుడు జన్మలున్నా యని చెప్పినా, మనిషి తన స్వంత జ్ఞానము చేత జన్మలు లేవు అని అంటున్నాడు. ముస్లీమ్‍లు వారి హదీసుల ఆధారముతో జన్మలు లేవు అంటున్నారు తప్ప ఖుర్ఆన్ గ్రంథములో 'జన్మలు లేవు' అని ఎక్కడా చెప్పలేదు.


ఖుర్ఆన్ గ్రంథములో అనేక ఆయత్‍లలో జన్మలున్నాయి అని చెప్పారు తప్ప, లేవు అని ఎక్కడా చెప్పలేదు. అంతెందుకు ఈ వాక్యములో 'పూర్వము గతించినవారు' అనగా ''ముందు చనిపోయిన వారికి వచ్చినవి, ఎదురైనవి మీకు ఎదురుకాలేదు'' అని చెప్పారు. అంతేకాక వారికి కష్టాలు, నష్టాలు, రోగాలు వచ్చాయి అని చెప్పారు. ఇదంతయూ దైవ గ్రంథములో యున్న తర్వాత కూడా జన్మలు లేవు అనువారు దైవగ్రంథములోని దేవుని వాక్యమును కాదనినట్లగును. అదొక్కటే కాదు వాక్యములో స్వర్గము సులభముగా వస్తుందని అనుకొన్నవారికి స్వర్గము రాలేదు, తర్వాత జీవితములో కష్టాలు వచ్చాయి అని చెప్పారు. దీనినిబట్టి చూస్తే మనుషులు అనుకొన్నట్లు స్వర్గము రాదని తెలియుచున్నది. అంతేకాక స్వర్గము మరొక ప్రత్యేకమయిన లోకము కాదనీ, మనిషి అనుభవించే సుఖములను స్వర్గము అనీ, అట్లే మనిషి అనుభవించే కష్టములను నరకము అనీ తెలియవలసి యున్నది. కష్టములుగానీ, సుఖములుగానీ జీవితములో ఇక్కడే అనుభవించుచున్నాము. కావున స్వర్గ నరకములనునవి రెండు భూమిమీద అనుభవించు అనుభవములే తప్ప అవి లోకములు కాదని తెలియుచున్నది. కొందరు స్వార్థవరులు ఇతరులకు ఆశ చూపుటకు స్వర్గ నరకములు ప్రత్యేకమైన లోకములనీ, అక్కడ స్వర్గములో మనుషులకు ఇష్టమైన సుఖములు ఉండునని చెప్పుకొన్నారు. లోకములు వేరుగా లేవనీ, నీవు అనుకొన్నట్లు నీవు చేయు పనులకు స్వర్గము వస్తుందని అనుకోవడము పూర్తి తప్పు. నీవు చేసే ప్రతీ పనికి తీర్పు చెప్పు దేవుడు నీ శరీరములోనే ఉన్నాడు. ఆయన నీవు చేసిన ప్రతీ పనికి పాపపుణ్యములు నిర్ణయించి దానివలన అనుభవించవలసిన కష్ట సుఖములను కూడా తీర్పు చేసి జన్మలకు పంపియున్నాడు. దేవుని తీర్పు ప్రకారము భూమిమీదనే జీవితములోనే అనుభవముల రూపములో పాపపుణ్యములను అనుభవించవలసి యున్నది. అట్లు అనుభవించు వారిని ఎందరినో మనతో జీవించు వారియందు చూస్తున్నాము. 'మాకు ఎప్పుడు ఈ కష్టాలు పోతాయి' అని మా దగ్గరికి వచ్చి అడిగిన వారిని చూచాము. 'దేవుడు దయ తలిస్తే, దేవుడు క్షమించితే మీ కష్టాలు, మీ రోగాలు పోతాయి' అని మేమే చాలామందికి చెప్పాము. పై వాక్యములో చెప్పినట్లు కష్టాల ధాటికి, రోగాల ధాటికి, దిక్కుతోచక కుదించి పోయిన వారిని చూచాము. వారు ఆశగా మా కష్టాలు పోయే మార్గము చెప్పమని ఎందరో అడిగారు.


నేడు భూమిమీద అటువంటి వారిని మేము చూడడమే కాదు, మీరు కూడా మీ ఊరిలోనో, మీ ఇళ్ళ ప్రక్కనో, ఎక్కడో ఒకచోట అట్లు బాధపడువారిని చూచియే యుందురు. సుఖములను అనుభవించే వారిని చూస్తున్నాము, కష్టాలు అనుభవించే వారిని చూస్తున్నాము. వారు అనుభవించే కష్టాలు పాపముల నమూనాలనీ, అట్లే వారు అనుభవించే సుఖములు వారి పుణ్యముల నమూనాలని తెలియుచున్నది. ప్రత్యక్షముగా కనిపిస్తున్నా, స్వయముగా మనమే అనుభవిస్తున్నా అవి మనము చేసుకొన్న పాపపుణ్యములు కాదు అని తెలియకపోతే దేవుడు దైవగ్రంథములో (2-214) లో వాక్యమునకు విలువ లేదనియే చెప్పవచ్చును. ఇది దేవుని వాక్యమైయుండుట వలన అది ముమ్మాటికీ సత్యమైనది. ఈ వాక్యము ప్రకారము మనిషి గతించడము ఉన్నది. గతించిన తర్వాత కర్మపత్రము ప్రకారము వెంటనే తీర్పు పొంది జన్మించడము జరుగుచున్నది. జన్మించిన తర్వాత జరిగే జీవితములో పాప ఫలము అనుభవించడమూ ఉంది. పాప ఫలము అనుభవించడమే నరకమును చవి చూచినట్లగును. అట్లే పుణ్య ఫలమును అనుభవించడము కూడా కలదు. దానినే స్వర్గము అనుచున్నాము. ఈ రెండు అనగా స్వర్గ, నరకములు మిశ్రమముగా ఉండును. ఒక గంటసేపు నరకమును అనుభవించిన తర్వాత, ఒక అరగంట కాలము సుఖమును (స్వర్గమును) అనుభవించుటకు వ్రాసియుంటే అట్లే జరిగి తీరును. దీనినంతటినీ బాగా గమనించితే ఆధ్యాత్మికరీత్యా ''స్వర్గ, నరకము''లనునవి అనుభవించు అనుభవముల పేర్లేగానీ, అవి లోకములు కావు.


''లోకము'' అను పదము ''లోచన'' అను పదము నుండి పుట్టినది. లోచన అనగా కంటితో చూడడము, చెవితో చూడడము, నాలుక, చర్మము, ముక్కు ద్వారా చూడడము అని అర్థము. చూడడము అంటే కంటి చూపు ఒక్కటే కాదు, ఐదు జ్ఞానేంద్రియముల సామత్యమును లోచన అని అనవచ్చును. నాలుకతో రుచి చూచాను అంటే నాలుకకు అనుభూతి అనునది ఏదయితే ఉందో అదే లోచన లేక చూపు. లోచన నుండి పుట్టిన పదము లోకము అని చెప్పాము కదా! దానిప్రకారము సుఖముల అనుభవమును స్వర్గలోకము అని అన్నారు. లోకము అనగా అనుభూతి లేక అనుభవము. కడుపునొప్పిని గంటసేపు అనుభవించినప్పుడు గంట కాలము నరకమును అనుభవించినట్లేయగును. అంతేగానీ ప్రత్యేకమయిన లోకము లోనికి పోయి అనుభవించి రాలేదు. కడుపు నొప్పి పోయిన తర్వాత హాస్పిటల్లో ఫ్యాన్ క్రింద చల్లని గాలి తగులుచుండగా, అందమైన నర్సులు కడుపును మెత్తని చేతులతో నొక్కుచుండగా, అరగంట కాలము వైద్యశాలలో ఉండి అరగంట తర్వాత ఇంటికి రావడము జరిగినది. అప్పుడు గంటసేపు నరకమును, అరగంటసేపు స్వర్గమును అతడు అనుభవించినట్లగుచున్నది. ముందు వెనుక అనుభవములో వచ్చునవే స్వర్గ, నరకములు. అంతేగానీ అవి వేరు లోకములుగా ఉండుననీ, స్వర్గములో ఎల్లకాలము ఒకే విధముగా ఉండవచ్చుననీ అనుకోవడము పొరపాటు. మనిషి మంచి చెడు అనుభవములతో కూడుకొన్నవే స్వర్గ, నరకములు. స్వర్గ నరకములు ఒక్కొక్కనికి ఒక్కొక్క సమయములో అనుభవమునకు వచ్చుచుండును. అంతేగానీ ఒక ఊరిలోని ప్రజలకు అందరికీ ఒకేమారు సుఖము ఉండడము గానీ, దాని తర్వాత అందరికీ ఒకేమారు బాధలు ఉండడము గానీ జరుగదు. ఒక ఊరిలోనే కాదు ఒక ఇంటిలో పదిమంది యుంటే వారిలో ఒకనికి కడుపునొప్పి వచ్చి బాధపడుచుండును. ఇంకొకడు కామెర్ల రోగముతో బాధపడుచుండును. ఆ దినము మిగతా ఎనిమిది మంది కోడిమాసంము (చికెన్) తింటూ రుచిని చూస్తున్నారు (అనుభవించుచున్నారు). ఒకే సమయములో ఇద్దరు చికెన్ తినకుండా పత్యముండడము, మిగతావారు తింటూ హాయిగా ఉండడము రెండూ చూస్తే, ఇద్దరు నరకము ఎనిమిది మంది స్వర్గమును ఒకే సమయములో పొందుచున్నారని తెలియుచున్నది. అందువలన (2-214) వాక్యములో మీరు స్వర్గమును సులభముగా తొందరగా చేరవచ్చునని అనుకోవడము పొరపాటని, అట్లు అనుకొన్నవారు చాలామంది పూర్వము చనిపోయి ప్రస్తుతము కష్టాల, రోగాల బాధలు అనుభవించలేక సహాయమునకు ఎదురు చూస్తూ ఇతరులను జ్ఞానమున్న ప్రవక్తలను మా కష్టాలు ఎప్పుడు పోతాయి, దేవుడు ఎప్పుడు సహాయము చేస్తాడని అడుగుచున్నారని చెప్పియున్నారు. దీనిని గమనించిన తర్వాత మా అనుభవము ప్రకారము స్వర్గ, నరకములను గురించి మనిషి తెలియని స్థితిలో యున్నాడని చెప్పవచ్చును. స్వయముగా నరకమును అనుభవిస్తూ నేను స్వర్గానికి పోతానని చెప్పడము, అట్లే స్వయముగా స్వర్గమును అనుభవించు వారు ఎక్కడో స్వర్గము ఉందనుకోవడము పొరపాటు. జ్ఞానముగలిగి సత్యమును తెలియగలిగితే స్వర్గ, నరకములు మనవద్దనే, మన అనుభవము లోనే ఉన్నవని తెలియుచున్నది. ఈ సమయములో నీవు ఎక్కడున్నావు? స్వర్గములోనా, నరకములోనా? చూచుకో...




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

22. ఎవరికి ఖర్చు చేయగలవు? తల్లి తండ్రికా, బంధువులకా, నిరుపేదలకా? (2-215)

ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయము చేయడము మంచి కార్యమే. ఇందులో తనకు బంధువులుగా యున్నవారు చాలామంది యుండవచ్చును. అట్లే చిన్నప్పటినుండి తనను పెంచి పోషించిన తల్లితండ్రి కూడా కలరు. ఇకపోతే బయటివారు పేదలు, అనాథలు, బాటసారులు ఎవరయినా, ఎందరయినా ఉండవచ్చును. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమనగా! నీ సంబంధీకులకుగానీ, సంబంధీకులు కాకపోయిన వారికి గానీ నీవు ఏమి ఇస్తావు, ఎలా ఆదుకొంటావు? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఖుర్ఆన్ గ్రంథములో మనిషి జీవితమునకు దగ్గరగాయున్న జ్ఞానము, ముందు వచ్చిన రెండు గ్రంథములకంటే ప్రత్యేకముగా అర్థమగునట్లు కలదు. అయితే ఇది ఎందరికి అర్థమయినదని చూస్తే ముస్లీమ్‍లకంటే ఇతర మతముల వారికే బాగా అర్థము కాగలదని చెప్పవచ్చును. అలాంటి విశిష్టత ఖుర్ఆన్ గ్రంథములో యున్నదని చెప్పక తప్పదు. ఈ ఖుర్ఆన్ గ్రంథము మిగతా రెండు మతస్థులకు దేవుడిచ్చిన వరములాంటిది. అయితే మా గ్రంథము అని చెప్పుకొను ముస్లీమ్‍లకు దీనిని అర్థము చేసుకోవడములో అందరికంటే వెనుక యున్నారని చెప్పవచ్చును. మా మాట సత్యము కాదని కొందరికి అనిపించినా, ఇప్పుడు చెప్పు వాక్యమును చూస్తే మా మాట సత్యమని తెలియగలదు, చూడండి.


(2-215) ''తాము ఏమి ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నించుచున్నారు. మీరు ఏమి ఖర్చు చేసినా అది మీ తల్లి తండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాథలకొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‍కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు.''


ఈ వాక్యములో అంతా సులభముగా అర్థమయినా, రెండు ముక్కలు అర్థము కాకుండాయున్నవి. అవి ఏమనగా! 'వారు నిన్ను ప్రశ్నించుచున్నారు' అని ఉంది. వారు అంటే ఎవరు? ఎవరు ప్రశ్నించుచున్నారను విషయము కొంత యోచన చేయువారికి అర్థము కాగలదుగానీ, యోచన చేయని వారికి సులభముగా అర్థము కాదు. తర్వాత రెండవ ముక్క ఏదనగా! 'తాము ఏమి ఖర్చు చెయ్యాలి?' అనునది. దానికి కొందరు యోచించుచున్నారు. మరి కొందరు ఏమీ యోచించకనే జవాబును చెప్పుచున్నారు. బీదలకు, బాటసారులకు, అనాథలకు, తల్లితండ్రులకు ఇవ్వవలసినవి ధనము, ధాన్యము, బంగారు, భూమి ఇవ్వవచ్చును. అందులో అందరికీ అవసరమైనది ధనము అందువలన దానినే అందరికి ఇచ్చి ఆదుకోవచ్చును అని చెప్పుచున్నారు. కొందరికి ఇందులో అనుమానములు కూడా కొన్నియున్నవి. ధనము కలవాడు ఇతరులకు ధనమును దానము చేయవచ్చును. ఒకవేళ ఇచ్చే వాని వద్ద ధనము లేకపోతే ఎలాగ? అను ప్రశ్న రాగలదు.


ఒకవేళ ఒకనివద్ద ధనమున్నా తల్లితండ్రులకు ఇవ్వగలడు, బంధువులకు ఇవ్వగలడు, ఇతరులకు ఇవ్వలేడు. అనాథలు, నిరుపేదలు, బాటసారులు బయటివారుగా లెక్కించబడుచుందురు. బయటివారికి సహాయము చేయవలెనని అనుకొనినా తనకు దగ్గరవారయిన తల్లితండ్రులు, బంధువులు తమకే ఇమ్మంటారుగానీ, ఇతరులకు ఇచ్చేది ఒప్పుకోరు. అందువలన దానము చేయవలసిన సొమ్ము అంతా తనవారికే సరిపోవును. తనవారికి కాకుండా మిగులునది ఉండదు. అట్లు తనవారికే కాకుండా బయటి వారికి కూడా ఇయ్యగల స్థోమతయుండి ఒకమారు అనాథలకు, నిరుపేదలకు ధనము ఇస్తే రెండవ రోజు అంతకంటే రెట్టింపు పేదవారు, అనాథలు వచ్చి అడుగుదురు. ఇట్లు ''ఇచ్చేవాడుంటే చచ్చేవాడు కూడా వస్తాడు'' అను సామెత ప్రకారము, వచ్చే వారికి అంతు ఉండదు. అందువలన ఒకరికి ఇద్దరికి దానము ఇవ్వవచ్చునుగానీ, వచ్చిన వారందరికీ దానము ఇచ్చుటకు సాధ్యపడదు. ఇటు తనవారైన తల్లితండ్రులకు గానీ, బంధువులకుగానీ, బయటివారైన పేదవారు, అనాథలకుగానీ, ధనముగానీ దానికి సంబంధించిన స్థూలముగా యున్న ధాన్యముగానీ, బంగారుగానీ ఏది ఇచ్చినా రెండవ రోజు అడుగుదురు. మాటిమాటికీ ఇచ్చుటకు ఎంత ధనము ధాన్యమున్నా అవి అన్నీ అయిపోవుచుండును. ఎంత ఇచ్చినా, ఎందరికి ఇచ్చినా, ఎన్నిమార్లు ఇచ్చినా చివరకు ఇవ్వలేదనుమాటే మిగులును గానీ ఇచ్చాడను మాట మిగలదు.


ఉదాహరణకు ఒక హోటల్ యజమాని తండ్రి పుణ్యము సంపాదించుకొనుటకు పేదలకు దానము చేయాలి అను ప్రయత్నము చేసి తన కుమారుని హోటల్ దగ్గర కూర్చోని అక్కడికి వచ్చిన అడుక్కొనే వానికి ఒక బ్రెడ్ ఇచ్చి, గ్లాసు పాలను ఉచితముగా ఇచ్చాడు. దానిని దానముగా అతను లెక్కించుకొన్నాడు. దానివలన పుణ్యము వస్తుంది అనుకొన్నాడు. రెండవ రోజు మొదట వచ్చిన అడుక్కొనువాడు, వాని వెంట వానికి తోడుగా మరో నలుగురు వచ్చి హోటల్ యజమాని తండ్రికి నమస్కరించి ''ఆకలిగా ఉన్నదయ్యా'' అని అడిగారు. అప్పుడు దానము చేస్తే పుణ్యము వస్తుందని తెలిసిన అతను వచ్చిన ఐదుమందికీ పాలు, బ్రెడ్లు ఇచ్చి పంపాడు. హోటల్ యజమాని కొడుకు వచ్చి ''అలా ఎందుకు ఇచ్చావు? వచ్చిన వారికి ఒక్క రూపాయి ప్రకారము ఐదుమందికి ఐదు రూపాయలు ఇచ్చి పంపియుంటే బాగుండేది కదా!'' యని అడుగగా, ''డబ్బులు ఇస్తే వారు దేనికయినా ఖర్చు చేయవచ్చు. చెడు పనులకయినా వాడుకోవచ్చు. అందువలన అటువంటి అవకాశము లేకుండా కడుపులోనికి తినే దానికి, త్రాగే దానికి బ్రెడ్, పాలు ఇచ్చాను'' అని చెప్పాడు. సరే అది మంచి పనేలే అనుకొన్నాడు. అయితే అడుక్క తినేవారు (బిక్షగాళ్లు) మూడవ రోజు, నాల్గవ రోజు, ఐదవ రోజు ప్రతి దినము రెట్టింపు సంఖ్యలో హాజరయి అడగను మొదలు పెట్టారు. అప్పుడు హోటల్ వాళ్ళు బిక్షగాళ్ల ధాటికి దివాలా తీసే స్థితికి వచ్చారు. అపుడు హోటల్ యజమాని జోక్యము చేసుకొని ఒక్క బిక్షగానికి కూడా బ్రెడ్డు పాలు ఇయ్యకుండా వారిని అక్కడనుండి పొమ్మన్నాడు. అప్పుడు ఆ బిక్షగాళ్ళు హోటల్ వాళ్లను తిట్టుచూ పోయారు. అన్ని రోజులు వారికి దానము చేసినా ఏమీ ప్రయోజనము లేకుండా పోయినది. చివరికి బిక్షగాళ్ళతోనే తిట్లు తినవలసి వచ్చినది. కనిపించే వస్తువులుగానీ, ధనముగానీ ఇచ్చే కొద్దీ తరగిపోవును. చివరకు ఇవ్వలేని స్థితి ఏర్పడును. అప్పుడు అంతవరకు తీసుకొన్నవారే బిక్షగాళ్ళు దూషించినట్లు దూషిస్తారు.


నేను చూచిన మరొక సంఘటనను వివరిస్తాను చూడండి. ఆంజనేయ జయంతి రోజు ఒక భక్తుడు ఆంజనేయస్వామి గుడిలో అన్న దానము చేస్తానని మ్రొక్కుకొన్నాడు. ఆ రోజు 200 కేజీల బియ్యమును వండి, పేదవారందరూ వచ్చి గుడిలో భోజనము చేసి పోవలసినదిగా చాటింపు వేశారు. వంట వండడము ఉదయము 11 గంటలకు అయిపోగా భోజనము పెట్టేదానికి 11-30 నుండి మొదలు పెట్టారు. 12-30 గంటలకు వండిన అన్నము అంతా అయిపోయినది. 12-30 నుండి వచ్చిన వాళ్ళు చాలామంది యున్నారు. అయితే వారికి అన్నము లేదు. అప్పుడు భోజనానికి వచ్చిన పేదవారు, కూలీవాళ్లు ''ఇంతమాత్రానికి అన్నదానమని చాటింపు వేయాలా? చాటింపు వేసినవాళ్లు అన్నము పెట్టాలి కదా!''యని నాలుగు తిట్లుతిట్టి పోయారు. అన్నదాన కార్యక్రమము పెట్టక పోతే ఏ సమస్య ఉండేది కాదు. అన్నదానమని చెప్పిన దానివలన వాళ్లు తిట్ల దానము చేసి పోయారు. కనిపించే వస్తువుల దానము ఏదయినా ఇచ్చే డబ్బుగానీ, వస్తువులుగానీ అయిపోయిన వెంటనే క్రొత్త సమస్యలను మనమే తెచ్చుకొన్నట్లగును.


అందువలన ఎవరయినా దానము చేయదలిస్తే ఏమి ఇవ్వదలచు కొన్నరని తెలివైనవారు అడుగుచున్నారు. (2-215) వాక్యములో మీరు ఏమి ఇవ్వదలచుకొన్నారని వారు నిన్ను ప్రశ్నించుచున్నారు? అని వేసిన ప్రశ్న జ్ఞానమున్న వారు అడుగుచున్నారని చెప్పినది. ప్రశ్నించినది జ్ఞానులే అయినా అడిగిన ప్రశ్నలో మీరు ఏమి ఖర్చు చెయ్యాలి? అని అడిగారు. జ్ఞానులు ముందే హెచ్చరిక చేసినట్లు అడుగుచున్నారు. నీవు నీ వారయిన తల్లితండ్రులకు, నీ బంధువులకు ఇచ్చినా, బయటి వారయిన పేదలు, బాటసారులు, అనాథలకు ఇచ్చినా కనిపించే దానము ఇస్తే చివరికది అయిపోవును. దానము తీసుకొన్న వారితోనే దూషణలు వచ్చును. అందువలన కనిపించని ధనమును దానము ఇవ్వండి. ఎంతమందికి ఇచ్చినా, ఎన్నిమార్లు ఇచ్చినా, ఎంత ఇచ్చినా తరగని ధనము అయినందున అది అయిపోతుంది అనే భయము లేదు. తీసుకొని పోయేవాడే మోసుకొని పోలేడుగానీ ఇచ్చేదానికి ఏ అలసటగానీ, అవమానముగానీ ఉండదు. తరగని ధనము ఇచ్చేవాడు ఎంత ఇస్తే తిరిగి అంత చేరే ధనము ఒక్క జ్ఞాన ధనమే. జ్ఞానము అను ధనమును నీ వారయిన తల్లితండ్రులకు, బంధువులకు ఇవ్వడమేకాక బయటివారయిన పేదవారు, అనాథలు బాటసారులు మొదలగు వారికి ఇవ్వవచ్చును.


జ్ఞానులయిన వారు దానము ఇవ్వాలి అనుకొను వారికి ముందే హెచ్చరించినట్లు, నీవు ఏమి ఇవ్వదలచావు? అని ప్రశ్నించుచున్నారు. నీవు ఏమి ఇచ్చినా, ప్రపంచ ధనము ఇచ్చినా, జ్ఞాన ధనము ఇచ్చినా రెండిటిని గురించి అల్లాహ్ (దేవుడు)కి తెలుసు. ప్రపంచ ధనములో మంచి డబ్బు, చెడ్డ డబ్బు అనునది ఏమీ ఉండదు. అదే ఒకే విలువగల్గిన డబ్బుగా ఉండును. దానము ఇచ్చినవారు ఎవరయినా ప్రపంచ ధనము మాత్రము ఒకే విలువ కల్గియుండును. అయితే ఎటొచ్చీ జ్ఞాన ధనములోనే చెల్లని ధనము, చెల్లే ధనము అని రెండు రకములుండును. ప్రపంచ ధనములో అన్నీ చెల్లే నోట్లేయుండును. ప్రపంచ ధనములో ఎక్కడయినా చెల్లని నోట్లుయున్నా వెంటనే దానిని బ్యాంకువారు గానీ, బయట వ్యాపారస్తులు గానీ, మిగతా వారుగానీ ఎవరయినా చటుక్కున గుర్తించగలరు. అందువలన చెల్లని ధనము ఉండేదానికి వీలులేదు. ఒక్క జ్ఞాన ధనములోనే చెల్లని ధనము, చెల్లే ధనము రెండు ఉన్నాయి. దానము తీసుకొన్నవాడు మోసపోయే అవకాశమున్నది. అందువలన జ్ఞాన ధనమును ఇచ్చే వానికంటే దానము తీసుకొనేవాడే ఎక్కువ జాగ్రత్తగా చూచి తీసుకోవలెను. చెల్లని ధనము తీసుకొనినా, తీసుకొన్న వానికి ఏమీ ప్రయోజనము ఉండదు. అందువలన జ్ఞానము చెప్పే వానికంటే వినేవాడే జాగ్రత్తపడవలసి యుండును. దానములలో అన్ని దానములకంటే ఉత్తమమైనది జ్ఞాన దానము. ఎందుకనగా! జ్ఞానము అను ధనమును దొంగలు ఎత్తుక పోలేరు, చాలాకాలమున్నా అది పుచ్చిపోదు, పురుగు పట్టదు, రంగుగానీ, వాసన గానీ మారదు. అనగా ఎట్లుండునది అట్లే యుండునని అర్థము. అందువలన జ్ఞాన దానము శ్రేష్ఠమయినదని పెద్దలు చెప్పారు.


నీవు నా వారికిగానీ, బయటివారికిగానీ ఏ మేలు చేసినా అనగా ప్రపంచ ధనమును ఇచ్చినా లేక జ్ఞాన ధనమును ఇచ్చినా అది అల్లాహ్ (దేవునికి) ఖచ్చితముగా తెలుసు. అయితే అట్లు దానము చేసినది జ్ఞాన ధనము అయితే అది చెల్లేదా? చెల్లనిదా?యని చూచు బ్యాంకులాంటివాడు దేవుడు. బ్యాంకులో ప్రపంచ నోట్లలో చెల్లని నోటును కనుగొన్నట్లు జ్ఞాన ధనములో అది మంచి జ్ఞానమా! కాదా!యని దేవుడు తెలియగలడు. సత్యసమేతమైన జ్ఞానమును దానముగా ఇచ్చియుంటే అది మంచి దానమే యగును. అట్లుకాక అసత్య జ్ఞానమును చెప్పియుంటే దానిని దేవుడు దానముగా గుర్తించడు. అతడు దానము చేయకున్నను దానము చేసినట్లు తన వారిని, బయటి వారిని ఇరువురినీ మోసము చేసినట్లగును. తనది జ్ఞానమేయని దానము చేసి యున్ననూ దేవుడు దానిని తప్పుగా పరిగణించును. అందువలన వాక్యములో మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‍కు దానిని గురించి తెలియును. అందువలన నీవద్దగల ధనము సరియైనదో కాదో ముందు చూచుకో, సరియైనదైతే దానము చేయి, కాకపోతే ఊరక యుండు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

23. అంతిమ దినమున పునర్జన్మ గురించి. (3-30)

మనిషి జీవితము గడచిపోయిన తర్వాత మనిషికి అంత్యదినము ఏర్పడును. మనిషికి ప్రథమ దినము పుట్టిననాడే జరిగినది. చచ్చిననాడు 'అంత్య దినము' అని అంటున్నాము. ఒక లెక్కప్రకారము ఏదయితే మనిషికి అంత్య దినమైన రోజు ఉందో దానిని ప్రథమ దినము అని అంటున్నాము. మనిషి జీవితమునకు అంతిమ దినమునే చచ్చిన రోజు అంటున్నాము. అదే రోజే మనిషికి పుట్టిన దినమై జీవితమునకు ప్రథమ దినమగుట వలన మనిషికి ఎప్పుడైనా చివరి దినము, ప్రథమ దినము రెండూ ఒకే రోజు వచ్చుచున్నవి. ఇదంతా కనిపించని విషయము అయినందున ఒక్క దినమే చావు, పుట్టుకలున్నాయని ఎవరికీ తెలియదు. ముందు మనిషి మరణమును పొందుచున్నాడు. తర్వాత అదే క్షణమే జన్మను పొందుచున్నాడు. చావు పుట్టుకలలో శరీరము మారిపోవుచున్నది. మనిషిగా పుట్టిన ఏ మతస్థునికైనా ఒకే విధానము గలదు. మరణ దినమునే ప్రళయ దినము అని అంటున్నాము. అంతిమ దినమున పాత శరీరము పోవడము, ప్రథమ దినమున క్రొత్త శరీరము రావడము జరుగుచున్నది. ప్రథమ దినము, అంత్య దినము రెండూ ఒకే సెకనులో జరుగుచున్నవి కనుక ఒకే రోజే, ఒకే క్షణమే మనిషి శరీరము మారిపోవుచున్నది. శరీరము మారిపోయి క్రొత్త శిశు శరీరము లభించుట వలన అంత్యదినమే పునర్జన్మకు నాందియని తెలియవలెను. ఆ దినమే రెండవ జీవితమునకు అవసరమైన పాప పుణ్యములు రెండు జీవునికి తెలియును. అప్పుడు జీవుడు (మనిషి) తన పుణ్యమును గురించి చింతించకున్నా, పాపమును గురించి తప్పక చింతించును. తాను పాపమును చేయకుండా ఉండివుంటే బాగుండేది యని అనుకొనును. ఈ జన్మకు కేటాయించబడిన పాపము ఇప్పుడు కాకుండా కొన్ని జన్మల అవతల వచ్చేటట్లు దూరముగా ఉండివుంటే బాగుండేది అని తలచును. ఈ విషయమై సూరా 3, ఆయత్ 30లో ఇలా వ్రాశారు చూడండి.


(3-30) ''ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకొన్న పుణ్యాన్నీ, తాను చేసుకొన్న పాపాన్నీ తనముందు చూచుకొంటాడు. తనకూ తన పాపానికి మధ్య ఎంతో దూరము ఉంటే బాగుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్ములను హెచ్చరించు చున్నాడు. అల్లాహ్ తన దాసులపట్ల అమితమైన ప్రేమ గలవాడు.''


మనిషి అంత్య దినమున శరీరములోని ఆత్మయే అల్లాహ్గా యుంటూ మనిషి చేసిన సంచితకర్మను కొంత ప్రారబ్ధకర్మగా మార్చి క్రొత్త శరీరము ధరించి రెండవ జీవితములో అనుభవించ వలెనని నిర్ణయించును. అప్పుడు కర్మ నిర్ణయము జరుగడము, జన్మ మారడము క్షణకాలములో జరిగినా జీవునికి ఎదురుగా జరగడము వలన అనుభవించవలసిన పాపమును చూచి ఇది ఎంతో దూరము ఉంటే, కొన్ని జన్మల తర్వాత అనుభవమునకు వచ్చును. దగ్గరగా యుండుట వలన ఈ జన్మలోనే అనుభవించవలసి వచ్చును అని తలపోయును. అలా అప్పుడు అనుకొనినా ఏమీ ప్రయోజనము లేదు. అందువలన మిమ్ములను హెచ్చరించుచూ తనను గురించి తెలియుమనీ, తన జ్ఞానమును తెలియవలెననీ, దానివలన పాపము దూరముగా పోవడము తర్వాత ఆలస్యముగా అనుభవానికి రావడము లేకుండా, మొత్తానికి పాపమంతయు లేకుండా పోవు విధానమును తెలుపుచున్నాడు. పాపమును అనుభవించ కుండా మొత్తము లేకుండా పోవునట్లు జరుగు విధానమును హెచ్చరిక చేసి చెప్పుచున్నాడు. అంటే! దేవునికి తన భక్తుల మీద అమితమైన ప్రేమ ఉందని చెప్పవచ్చును. ఎక్కువ ప్రేమ గలవాడైనందున పాపక్షమాపణ విధానమును అనేక విధముల బోధించాడు. అయినా మనిషి దేవుడు చెప్పిన విధానమును అనుసరించక తన ఇష్టమొచ్చినట్లు అజ్ఞానములో నడుచుకొంటున్నాడు. అందువలన పాప క్షమాపణ లేకుండా అల్లాహ్‍యే చేయుచున్నాడు. దేవుడు తన మాట వినేవారిని ప్రేమిస్తాడు. వినని వారిని ద్వేషిస్తాడు. కావున దేవుని క్షమాశీలతను పొందాలంటే దేవునికి దాసులుగాయుంటూ దేవుని జ్ఞానమును తెలియాలి. అప్పుడు పాపక్షమాపణ ఎలా జరుగునో, అల్లాహ్ దయ ఎట్లుండునో అప్పుడు తప్పక తెలియును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

24. భర్త లేకుండా సంతానము. (3-40), (3-47)

భూమిమీద అందరికీ తెలిసిన సత్యమువలె తెలియని సత్యము ఒకటి గలదు. అందరూ అందరికీ తెలిసిన సత్యమే అని అనుకొనినా, వాస్తవముగా ఎవరికీ తెలియని సత్యము 'సంతానము' ను గురించి కలదని చెప్పవచ్చును. సంతానము స్థూల విషయమే, అయితే అందులో సూక్ష్మమైన విషయము, అందరికీ తెలియని విషయము కలదు. అది ఏమనగా! ప్రతి మనిషి తన తల్లితండ్రులకు పుట్టానని అనుకొంటున్నాడు. ఖచ్చితముగా పుట్టాను అని నిరూపణగా చెప్పలేరు. కొందరు మేము ఫలానా వారికే పుట్టాము. ఫలానా వారే నా తల్లితండ్రులు అని గట్టిగా చెప్పినా, అది సత్య నిరూపణగా చెప్పలేడు. కొందరు కనిపించే పోలికలను చూపించినా అందులో వాస్తవము లేదు. డి.ఎన్.ఎ (D.N.A) టెస్టింగ్ చేయిస్తే ఏ బిడ్డకు ఎవరు తల్లితండ్రులో శాస్త్రబద్దముగా, హేతుబద్దముగా చెప్పవచ్చునని శాస్త్రవేత్తలు సహితము చెప్పుచుందురు. D.N.A పరీక్ష తర్వాత ఫలానా వారే తల్లితండ్రులని ఖచ్చితముగా, ఆధారపూరితముగా చెప్పవచ్చును. భౌతిక శాస్త్ర ఆధారముతో మేము ఈ మాటను చెప్పుచున్నామని కొందరు విజ్ఞానమును తెలిసినవారు చెప్పుచుందురు.


ఏ విషయమునయినా సత్యనిర్ధారణ చేయుటకు ఆరు శాస్త్రములు గలవు. సంతానము అను విషయము ఇట్లే కలదని నిర్ధారణ చేసి చెప్పుటకు ఇది భౌతికమైన విషయమని తలచి భౌతిక శాస్త్ర ఆధారముతో ఈ సమస్యను పరిష్కారము చేయుచుందురు. కొందరు ఈ విషయము భౌతిక శాస్త్రమునకు సంబంధించినది కాదు, ఇది బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినదని చెప్పుచున్నారు. ఈ సంతాన విషయము వాస్తవముగా ఏ శాస్త్రమునకు సంబంధించినదో ముందు తెలిస్తే తర్వాత ఆలోచించ వచ్చును. ఈ విషయమై చూస్తే మనిషి స్థూలమైనా అతనిలో కొంత సూక్ష్మమున్నది. స్థూలముకంటే సూక్ష్మమే ఎక్కువగా యున్నది. అందువలన స్థూలముగా కొంత, సూక్ష్మముగా కొంత ఆలోచించవలసి యున్నది. స్థూలమును గురించి భౌతిక శాస్త్రము ద్వారా, సూక్ష్మమును గురించి బ్రహ్మ విద్యా శాస్త్రము (సూక్ష్మ శాస్త్రము) ద్వారా పరిశోధించి తెలుసుకోవలెను.


శిశు శరీరము తయారగునది తల్లిగర్భములో, తల్లిగర్భములో పురుష బీజము చేరినప్పుడు తల్లి గర్భము ధరించును. గర్భములో శిశు శరీరము పెరుగుట వలన 9 నుండి 10 నెలలలో పెరిగిన శిశువు ప్రసవింపబడును. ప్రసవింపబడిన శిశు శరీరములోనికి జీవుడు చేరడము జరుగుచున్నది. జీవుడు శరీరములో ఎప్పుడు చేరితే అప్పుడు మనిషి జీవితము ప్రారంభ మగుచున్నది. స్త్రీ గర్భములో తయారగు శరీరమునకు అవసరమైన బీజము పురుషునిది అవసరము. పురుష బీజము పురుషుని నుండే స్త్రీ గర్భములో చేరవలసియున్నది. స్త్రీ ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి ఒక్కటే అయినందున ఏ స్త్రీ గర్భమయినా శిశు దేహమును పెంచుటకు స్థోమత కల్గియున్నది. ప్రకృతి తత్త్వము వలన పుట్టిన స్త్రీ తల్లిగా యుంటున్నది. గర్భము ధరించుటకు సిద్ధముగా యున్నది. ప్రకృతి ఒక్కటేకాగా, పురుషుడు బహువచనములో ముగ్గురు యున్నారు. ఇద్దరు పురుషులుకాగా, ఒకరు పురుషోత్తముడుగా యున్నాడు. ఇద్దరు పురుషులలో జీవుడు అనువాడు పురుషుడే అయినా నశించిన పుంసత్వము కల్గియున్నాడు. అతనిని (జీవున్ని) నపుంసకుడుయని అనవచ్చును. రెండవ పురుషుడు ఆత్మకాగా, మూడవ పురుషుడు పరమాత్మ.


మూడవ పురుషుడయిన పరమాత్మ ''ఏ అక్కర లేనివాడు.'' ''ఎవరితోనూ సంబంధము లేనివాడు.'' ''ఆయనకు ఎవరూ సంతానము లేరు.'' ఈ విషయమును అనగా మూడవ పురుషుని విషయమును ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో రెండవ వాక్యము లోనూ, మూడవ వాక్యములోనూ ఈ విషయములు చెప్పబడియున్నవి. మూడవ పురుషుడయిన పురుషోత్తముడు ''ఎవరికీ బీజదాత కాదు'' అని 112వ సూరాలోని మూడవ వాక్యము ప్రకారము తెలిసినది. ఇక మిగిలిన మధ్యాత్మ ఒక్కడే బీజదాతగా యున్నాడని తెలిసినది. మూడు ఆత్మలలో మధ్యాత్మ ఒక్కడే సర్వజీవరాసులకు బీజదాతగా యున్నాడు గనుక అతనినే తండ్రియని అనవచ్చును. అయితే ముఖ్యమైన సమస్య ఏమి అనగా ప్రతి మనిషి శరీరములోనూ మూడు ఆత్మలు గలవు. ఈ విషయము సూరా 50 ఆయత్ 21లో చెప్పబడియున్నది. ''తోలబడేవాడు, తోలేవాడు, చూచేవాడు'' అని ముగ్గురిని చెప్పారు. ఈ ముగ్గురిలో మధ్యాత్మ అయిన తోలేవాడే సర్వులకు తండ్రిగా యున్నాడు.


మూడు ఆత్మలు కంటికి కనిపించునవి కావు. మూడు ఆత్మలు స్త్రీ శరీరములోను, పురుష శరీరములోనూ గలవు. స్త్రీ శరీరములోని మధ్యాత్మ స్త్రీ శరీరములోనే తన బీజమును స్త్రీ గర్భములో వదలుట వలన స్త్రీ గర్భములో శిశువు పెరుగుచున్నది. స్త్రీకి బయట పురుషునితో సంబంధము లేకపోయినా స్త్రీ శరీరములోని ఆత్మ వలన స్త్రీ గర్భము ధరించు అవకాశము గలదు. ఈ విషయము తెలియని ఒక పురుషుడు అట్లే, ఒక స్త్రీ తమ సంతతి విషయములో అనుమానమును వ్యక్తము చేసిన విషయము మూడవ సూరాలో 40వ ఆయత్నందు మరియు 47వ ఆయత్నందు చెప్పిన దానిని ఇప్పుడు ఇక్కడ చెప్పుకొందాము చూడండి.


(30-40) ''జకరియ్యా ఇలా విన్నవించుకొన్నాడు. ''ప్రభూ నేనేమో పండు ముసలివాన్ని నా భార్య గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?'' దానికి ''అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది చేస్తాడు'' అని దైవదూత సమాధానము ఇచ్చాడు.''


(3-47) ''ఆమె ''నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుట్టగలడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!'' అని అన్నది. ''అలాగే జరుగుతుంది అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు 'అయిపో' అంటే చాలు అది అయి పోతుందియని దైవదూత ద్వారా సమాధానము లభించినది.''


ఈ రెండు వాక్యములలో మాకు స్వయముగా పిల్లలు పుట్టు అవకాశము లేదు కదా! అటువంటి మాకు సంతానము ఎలా కలుగుతుంది? అని మొదటి వాక్యములో మగవాడయిన జకరియ్యా అడిగాడు. అట్లే రెండవ వాక్యములో 'పురుషుడు నన్ను తాకనిదే నాకు ఎలా పిల్లలు పుట్టగలరని' ఒక స్త్రీ అడిగినట్లు కలదు. అయితే రెండు వాక్యములలోనూ దేవుడు అనుకుంటే ఏమయినా జరుగగలదని, దేవుని మీద సమాధానము చెప్పారు గానీ, స్త్రీ పురుషుల కలయిక చేత సంతానము కలుగుతుందని చెప్పలేదు. అసలు విషయము ఏమనగా! బాహ్యముగా కనిపించు పురుష శరీరములను ధరించిన మగవారి చేత స్త్రీలకు ఎవరికిగానీ సంతానము కలుగదు, కలుగుటకు వీలులేదు. ఎందుకనగా! పురుషుడు అనువాడు ఏ శరీరములో అయినా ఉన్నాడుగానీ, పైకి కనిపించు మగవారిని పురుషులనకూడదు. శరీరములు ఆడవయినా, మగవయినా అందులో ముగ్గురు పురుషులు గలరు. ముగ్గురు పురుషులలో బీజదాత అయిన మధ్య పురుషుడు గలడు. మనుషుల కర్మలను అనుసరించి మనుషులను నడిపించువాడు మధ్య పురుషుడే అయినందున ఆయన ఎవరికి ఎప్పుడు సంతతిని కలుగజేయవలెనో అప్పుడు కలుగజేయును. సంతతి భార్య భర్తలుగా యున్న వారికి వారి కర్మను అనుసరించి సంతానమును కలుగజేయును. సంతాన సుఖమునుగానీ, సంతాన బాధలుగానీ భార్యాభర్తలు ఇద్దరు అనుభవించు కర్మయుండును. అందువలన పెళ్ళి అయిన వారికే పురుషుడైన ఆత్మ సంతానమును కలుగునట్లు బీజమును ఇచ్చుచున్నాడు. మధ్యాత్మ అయిన ఆత్మే అందరి శరీరములలో దేవుడుగా యుంటూ, భార్యాభర్తలుగా యున్న దంపతులకు తానే సంతానమును కలుగజేయగా అప్పుడు భార్యకు భర్తగా యున్నవాడు తన వలననే, తన బీజము వలననే తన భార్యకు సంతానము కల్గినదని అనుకొంటున్నాడు.


మనిషి అయిన ప్రతి మగవాడు సంతాన విషయములో తానే తండ్రినని భ్రమించుచున్నాడు. వాస్తవముగా తన భార్యకు పుట్టిన సంతానమునకు తనకు ఎటువంటి సంబంధము ఉండదు. అయితే మనిషికి అనగా మగవానికి ఆ విషయము తెలియకుండునట్లు దేవుడయిన ఆత్మ మనిషిని మభ్యపరచుచున్నాడు. దంపతులలో తండ్రి ఆకారమును కొంత, తల్లి ఆకారమును కొంత శిశువుకు వచ్చునట్లు చేయుచున్నాడు. అప్పుడు ఆ దంపతులు తమ బిడ్డలో తమ పోలికలను చూచుకొని మురిసి పోవుచుందురు. పుట్టిన వానికి తమ పోలికలున్నవనీ, తండ్రి పోలికలు ఎక్కువ అని కొందరూ, తల్లి పోలికలు ఎక్కువ గలవని కొందరూ చెప్పుకొను చుందురు. తండ్రి శరీరము మరియు తల్లి శరీరము లోపల ఆత్మేయుండుట వలన, ఆత్మ శరీరము అంతటా వ్యాపించియుండుట వలన, ఆత్మ మనిషి పాదము నుండి తల వరకు గోర్లలో, వెంట్రుకలలో కూడా వ్యాపించి యుండుట వలన శరీరములోని ఆత్మ, శరీరము యొక్క ఆకృతిని పోలియుండును. అందువలన ఏ శరీరములోని ఆత్మ ఆ శరీరము యొక్క ఆకారమును పోలియున్నదని చెప్పవచ్చును.


మనిషి ఎవరయినాగానీ ఆ మనిషి ఆకారము ఆ శరీరములో నివసించు జీవునిది కాదు. వాస్తవముగా శరీరము జీవునిది కాదు. శరీరమునకు అధిపతి, శరీరమంతా పై అంచువరకు వ్యాపించిన ఆత్మ అయినందున శరీర ఆకృతి కూడా అధిపతియైన ఆత్మదేయని తెలియవలెను. జీవుడు శరీరము లోపలయున్నాడు. అతనికి శరీర ఆకృతికి ఏమాత్రము సంబంధము లేదు. అయినా అజ్ఞానము వలన శరీరములోని ప్రతి జీవుడు శరీరము యొక్క ఆకారము తనదేయని అనుకొనుచున్నాడు. వాస్తవముగా జీవునికి శరీర ఆకృతికి ఏమాత్రము సంబంధము లేదు. శరీరము యొక్క ఆకృతి ఆ శరీరము అంతటా వ్యాపించిన ఆత్మదేయని తెలియవలెను. పుట్టిన ప్రతి శిశువుకు ఆత్మే బీజదాత, తండ్రి అయిన దానివలన దంపతులుగాయున్న ఇద్దరి శరీర పోలికలు బిడ్డకు వచ్చి యుండును. ఆత్మబిడ్డకు ఆత్మ ఆకార పోలికలే వచ్చాయి అని చెప్పవచ్చును.


ప్రకృతి తల్లికాగా, ఆత్మ తండ్రిగాయున్నాడు. అందువలన ప్రకృతికి మారుపేరుగా యున్న స్త్రీల గర్భములోనే శిశువు శరీరము పెరుగుచున్నది. తల్లి శరీరములోని ఆత్మే బీజదాత అయినందున సంతానము కలుగుటకు ఏ పురుషుడు అవసరము లేదు. దంపతులు భార్యాభర్త ఇద్దరుగా ఉండగా, ఆ రెండు శరీరములలోని ఇద్దరు జీవులు కర్మలు అనుభవించుచుండగా, ఆత్మ వారి చేత అనుభవింపజేయుచున్నది. అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 50, ఆయత్ 21లో ''జీవాత్మను త్రోలబడేవాడనీ, ఆత్మను త్రోలేవాడనీ, పరమాత్మను సాక్షిగా చూచేవాడనీ'' చెప్పియున్నారు చూడండి.


(50-21) ''ప్రతి ప్రాణి (ప్రతి జీవుడు) ఒక తోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది.''


(50-21) ''ప్రతి వ్యక్తి (ప్రాణి) ఒక తోలేవాడితో, ఒక సాక్ష్యమిచ్చే వాడితో సహా హాజరవుతాడు.'' (ఖుర్ఆన్ మజీద్ తెలుగు అనువాదము)


జీవుడు శరీరము లోపల అధిపతియైన ఆత్మచేత నడుపబడు చుండగా, పరమాత్మ చూస్తూ ఉన్నాడు. ఇంకా వివరముగా అర్థమగునట్లు చెప్పవలెనంటే మొట్టమొదట భూమిని, ఆకాశమును సృష్ఠించిన అల్లాహ్ చూస్తూయుండగా, సర్వజీవరాసులకు ఆరాధింపబడు ఏకైక అల్లాహ్గా నియమింపబడిన, ఆరాధ్య దైవముగా యున్న అల్లాహ్ నడిపించుచుండగా ప్రతి మనిషి (ప్రతి జీవుడు) జీవితమును అనుభవించుచున్నాడు. ఇక్కడ సాక్షిగా ఉండు అల్లాహ్ ఒకరుకాగా, సర్వ ప్రపంచములోని జీవులనందరినీ నడిపించుచూ అందరిచేత ఆరాధింపబడు అల్లాహ్ మరొకరు గలడని అర్థము చేసుకోవలెను. ఇదే విషయమునే (3-18) లో ఇద్దరు అల్లాహ్‍లు గలరనీ, మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ మనుషులకు ఆరాధ్య దైవముగా ఉండుటకు మరొక అల్లాహ్‍ను నియమించాడనీ, మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ సాక్షిగా చూస్తుయున్నాడనీ, కార్యకర్తగా, ఆరాధ్య దైవముగాయున్న అల్లాహ్ జీవులను కర్మప్రకారము తోలుచున్నాడనీ కలదు చూడండి.


(3-18) ''అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవము లేడనీ, స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''


(6-102) ''ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక రెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్ఠించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే, అన్ని పనులు చేయు కార్యకర్త ఆయనే.''


ఈ రెండు వాక్యములను చూచిన తర్వాత సృష్ఠిపూర్వము అల్లాహ్ మొదటివాడు కాగా, ఆయన చేత ఆరాధ్య దైవముగా సర్వ కార్యముల కార్యకర్తగా నియమింపబడిన అల్లాహ్ మరొకడున్నాడని చెప్పబడియున్నది. (3-18) లో 'మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను నియమించాడనీ, ఆరాధ్య దైవము ఆయన ఒక్కడేయని చెప్పాడనీ' తెలియుచున్నది. (6-102) లో 'ఆరాధ్య దైవము మరియు అన్ని కార్యముల కార్యసాధకుడుగా అనగా సర్వ కార్యములు చేయు కార్యకర్తగా రెండవ అల్లాహ్‍యే ఉన్నాడని తెలియుచున్నది.' ఇప్పుడు (50-21) లో 'మొదటి అల్లాహ్ చూస్తూ ఉండగా, రెండవ అల్లాహ్ చేస్తూయుండగా, సర్వప్రాణులు (సర్వ జీవరాసులు) కర్మలను అనుభవించుచూ జీవితములో పరిగెత్తుచున్నారని' తెలియుచున్నది.


ఈ కార్యక్రమములోనే మనుషులను ఆత్మే శిశువులుగా స్త్రీ శరీరముల నుండి పుట్టించుచున్నది. ఏ స్త్రీ శరీరము నుండి ఏ జీవుడు శిశువుగా పుట్టినా, అతనికి ప్రకృతి తల్లియనీ, తండ్రి అల్లాహ్ అయిన ఆత్మయని తెలియవలెను. అయితే ఈ విషయము ఎవరికీ తెలియకుండా పోయినది. ప్రతి బిడ్డకు తామే తల్లితండ్రులమని భార్యాభర్తలుగా యున్న జీవుళ్ళు అనుకోవడము జరుగుచున్నది. సర్వప్రపంచములోని మనుషు లందరూ అదే భ్రమలోనే యున్నారు. ఈ విషయము (ఈ జ్ఞానము) మాకు తెలియదు అనుటకు అవకాశము లేకుండా ప్రథమ దైవ గ్రంథము లోనే ఐదువేల సంవత్సరముల పూర్వమే దేవుడు చెప్పియున్నాడు. ''సర్వ జీవరాసులకు నేనే బీజదాతను. ప్రకృతి నాకు గర్భముగల స్త్రీగా యుండగా నేను ప్రకృతికి భర్తగా యున్నాను. మా వలననే సర్వ జీవరాసులు శరీరము ధరించి పుట్టుచున్నవి.'' అలా పుట్టిన వారందరికీ నిజమైన తల్లి తండ్రి మేమేయని గుణత్రయ విభాగయోగమున 3, 4 శ్లోకములలో చెప్పి యున్నారు. తర్వాత ద్వితీయ దైవగ్రంథములో పరోక్షముగా ఈ విషయమును చెప్పియున్నారు. ప్రత్యక్షముగా ఏసు పుట్టుకయే గలదు. ఇకపోతే అంతిమ దైవ గ్రంథమున (3-40) (3-47) రెండు ఆయత్‍లలో 'మనుషులకు సంతతి కలుగునా?యను ప్రశ్నను లేవనెత్తారు. ఆ రెండు ఆయత్‍లకు వివరణ ఇచ్చుటకు ఇంతవరకు ఇంత సమాచారమును చెప్పాము. అయినా అంత తొందరగా, అంత సులభముగా ఈ విషయము అర్థము అగునను నమ్మకము లేదు. అందువలన బుద్ధిగ్రాహిత శక్తి సరిగా లేనివారికి సహితము పూర్తి వివరముగా తెలియుటకు ఇంకా కొంత సమాచారమును చెప్పుకోవలసిన అవసరమున్నది.


అందరూ బాహ్య తల్లితండ్రులను కనిపించేవారుగా చెప్పుచున్నా వారికి నిజమైన తల్లి ప్రకృతి, నిజమైన తండ్రి ఆత్మయని తెలిసిపోయినది. ప్రకృతి తల్లితండ్రుల ఇద్దరి శరీరములుగా ఉండగా, తండ్రియైన ఆత్మ భార్య భర్త అయిన కనిపించే తల్లి తండ్రి శరీరము లోపల గలడు. అయితే సత్యమును చెప్పితే ఆకారములు రెండు తల్లి తండ్రులవే అయినా భావము మాత్రము తప్పుయని చెప్పవచ్చును. వాస్తవముగా చెప్పితే కనిపించే ఆకారములు రెండు ఆత్మవే అయినందున తల్లి శరీర ఆకృతి కూడా ఆత్మదే. భార్యాభర్త ఆకృతులు రెండు ఆత్మవికాగా, వారి శరీరములు రెండు ప్రకృతియైన తల్లివిగాయున్నవి. శరీరములు ప్రకృతి నిర్మితములు కాగా, అదే శరీరముల ఆకారము ఆత్మదని జ్ఞానము ప్రకారము తెలియుచున్నది. అయితే జీవుడు మాత్రము ఎక్కడా బయటికి కనిపించడము లేదు. జీవుడు శరీరములో తలయందు తల మధ్య భాగములో యున్న గుణచక్రమందు రవ్వంతగా గుండ్రని ఆకారము కల్గియున్నాడు. శరీర లోతులలో యున్న జీవుని ఆకారమును ఎవరూ చూచియుండలేదు. మేము మనుషులను చూస్తున్నామనుకొను ఆకారములు ఆత్మవి. శరీరములు ప్రకృతివి. తల్లియైన ప్రకృతి శరీరమును తయారు చేసియుండగా తండ్రియైన ఆత్మ శరీరములకు ఆకారముగా యున్నాడు. ఆత్మ ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆకృతి కల్గియున్నది. అందువలన మనుషులకే సర్వ జీవరాసుల ఆకారములన్నియూ ఆత్మవేయని తెలియవలెను. ఆత్మ ఒకే ఆకృతిలో లేదు. జీవాత్మ ఒకే ఆకారములో యున్నాడు. ఎందరు జీవుళ్ళయినా అందరూ ఒకే ఆకారము కల్గి, అందరూ గుండ్రముగానే యున్నారు.


ఆత్మ ఒక్కడే అయినా ఎన్ని శరీరములుంటే అన్ని ఆకారములుగా యున్నాడు. జీవుళ్ళు ఎన్ని శరీరములలోయున్నా అందరూ ఒకే ఆకృతిని పోలియుండగా, ఆత్మ ఎన్ని శరీరములలో యున్నా అన్ని శరీరముల ఆకృతి కల్గియున్నది. శరీరములు ప్రకృతివి. శరీరముల పై ఆకారములు ఆత్మవి. లోపలి ఆకారము జీవాత్మలది. ఏ శిశువు ఎక్కడ పుట్టినా అక్కడ తల్లి తండ్రిగా పైకి కనిపించు వారి D.N.A ఆ శిశువులో ఉండును. అన్ని శరీరములు ప్రకృతివే అయినా అన్ని శరీరముల అధిపతి ఆత్మ అయినందున D.N.A ఆత్మదే అయివుండును. అందువలన ఒక శిశువు ఏ తల్లితండ్రుల శరీరమునకు పుట్టాడు అని ఆ శరీరముల D.N.A ను బట్టి చెప్పుచున్నారు. ఆత్మను బట్టి ప్రతి శరీరమునకు ఆత్మ ఆకారము వేరువేరుగా యున్నట్లు D.N.A అనునది కూడా వేరువేరుగా యుండును. D.N.A అనునది జీవాత్మకు సంబంధము లేనిది. శరీరములో కష్ట సుఖములు అనుభవించువాడు జీవుడు, అనుభవింపజేయువాడు దేవుడయిన ఆత్మ.


ప్రతి శరీరములోనూ అధిపతిగా యున్న ఆత్మ బీజదాతగా యుండగా దానిని స్వీకరించు ప్రకృతి తల్లిగా యున్నది. ఒక స్త్రీ శరీరములోని ఆత్మ బీజమును దానము చేయుచున్నది. కావున పురుష సంపర్కముతో సంబంధము లేకుండా స్త్రీకి సంతానము కలుగవచ్చును. అట్లు కలుగునని (3-40) (3-47) ఆయత్‍లలో చెప్పబడియున్నది. ఇంజీలు గ్రంథములో చెప్పబడిన ''ఏసు పురుష సంబంధము లేకుండా పుట్టాడని'' సాక్ష్యము గలదు. అలాగే చాలామంది భర్తలు లేకముందే పిల్లలుగన్న చరిత్ర గలదు. కలియుగములో ఏసు పుట్టినట్లే, ద్వాపర యుగములో కర్ణుడు కూడా పుట్టాడు. దేవుడు ఇస్తే భర్త లేకున్నా సంతానము కలుగుతుంది. దేవుడు ఇవ్వకపోతే భర్తవున్నా సంతానము కలుగదు. సంతానము కలుగుట, కలుగక పోవుట కర్మనుబట్టి ఆత్మ అనుకోవడముబట్టి యుండును. అంతేగానీ ఎంత పెద్ద మీసాలున్న వారికయినా పిల్లలు పుట్టుదురను నమ్మకము లేదు. అంతా ఆత్మయనబడు ఆయన ఇష్టము. ఆయన ఇష్టము మన కర్మనుబట్టి యుండును. నేడు కొందరు వైద్యులు 'సంతాన సాఫల్య కేంద్రము'లను పేర్లతో బోర్డులు పెట్టుకొన్నారు. అయినా డాక్టరునుబట్టి ఏ ప్రయోజనము ఉండదు. ఆత్మ అనుకొంటే డాక్టర్ల ఉద్దేశ్యము నెరవేరును, లేకపోతే లేదు. అందువలన సంతాన సాఫల్య కేంద్రములు కూడా ఆత్మ సాఫల్యమును బట్టి యుండునుగానీ డాక్టర్ల చేతిలోగానీ, వారి పనిలోగానీ ఏమీ ఉండదు.


కొందరికి అమితమైన సంతానమును ఇచ్చువాడు ఆయనే (ఆత్మయే). ఏమాత్రము సంతానమును ఇవ్వక గొడ్రాలు చేయువాడు ఆయనే. కొందరికి వృద్ధాప్యములో సంతానమును కల్గించి ఆశ్చర్యమును కల్గించువాడు ఆత్మయే. కొందరిలో కవల పిల్లలను కల్గించువాడు ఆత్మయే. కొందరిలో గర్భము మధ్యలో పోవునట్లు చేయువాడు కూడా ఆయనే. కొందరికి ఏడు నెలలకే శిశువును తయారు చేయును. కొందరిలో పది నెలలకు కూడా పూర్తి ఎదుగుదల లేకుండా చేయును. కొందరిలో ఆరోగ్యవంతమైన, అంగ సౌష్టవమైన శిశువును పుట్టించును. కొందరిలో అంగహీనత కల్గిన శిశువును పుట్టించును. మనుషులలో తల్లితండ్రులుగా యున్న వారి కర్మను బట్టి ఆ శరీరములోని ఆత్మ వారికి సంతానము కలుగజేయగా, వారి సంతానము వలన తల్లితండ్రులుగా చెప్పుకొను వారికి అనేకమైన సుఖములు, అనేకమైన దుఃఖములు కల్గుచుండును. అందువలన ఆత్మ కర్మనుబట్టి కొందరికి భర్త లేనప్పుడు కూడా సంతానము కల్గించి, దానివలన అనేకమైన ఇబ్బందుల పాలు చేయగలడు. ఇతర పురుషుల వలననే సంతానము కల్గునని నమ్మినవారు భర్తలేని స్త్రీ సంతానము పొందితే ఆమెను అనేకులు కులటయని నిందింతురు. కర్మనుబట్టి ఆత్మయే అలా నిందలపాలు చేయుచున్నది. భర్తలేని స్త్రీకి సంతానము కల్గించి, నిందలపాలు చేయువాడు ఆత్మయిన దేవుడే. అలా నిందించుటకు కారణము ప్రజలకు బయటి పురుషునితో సంబంధము లేకుండా సంతానము కలుగవచ్చునను సత్యము తెలియని దానివలన అలా జరుగుచున్నది. అందువలన ప్రతి మనిషి ఆత్మజ్ఞానము తెలియగలిగితే శరీరములో ఆత్మ ఏమి చేయుచున్నది తెలియును. తానే పురుషుడైయుండి అందరికీ సంతానము కలుగజేయు వాడు ఆత్మేనని తెలియగలదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

25. అతనికి తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. (3-48)

మొదటి సృష్ఠికర్తయైన దేవుడు, అనగా మనకు తాతయైన దేవుడు ప్రతి శరీరములోనూ కార్యనిర్వాహకునిగా మరియు ఆరాధ్య దైవముగా ఉండునట్లు ఆత్మనే తయారు చేసి అన్ని అధికారములు ఆత్మకు ఇచ్చి తాను ఏమీ చేయక చూస్తూ యుండును. శరీరములో దేవుడు కర్మనుబట్టి పాపపుణ్యములను, శ్రద్ధనుబట్టి జ్ఞాన అజ్ఞానములను ఇచ్చుచుండును. మనిషి శ్రద్ధ అజ్ఞానము వైపు ఎక్కువగా ఉండుట చేత ఆత్మ అజ్ఞానమునే మనిషికి అందించుచుండును. అట్లు కొంతకాలము అనగా వేల సంవత్సరములో లేక లక్షల సంవత్సరములో జరుగగా అజ్ఞానము ఎక్కువై అధర్మములు అభివృద్ధియగుచున్నవి. ధర్మములు బలహీనపడి పోవుచున్నవి. అప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడినదని తలచి, తిరిగి ధర్మములు అభివృద్ధి చెంది, అధర్మములు లేకుండా పోవలెనని తలచిన మొదటి సృష్ఠికర్తయైన దేవుడు, తానే ఆ కార్యమును చేయుటకు పూనుకొనును. శరీరములో దేవుడుగాయున్న ఆత్మ కర్మ ప్రకారము ప్రవర్తించుట వలన, కర్మ ప్రకారమే ఆత్మే అధర్మములను అభివృద్ది చేసినది. అయితే ధర్మముల ప్రతిష్టాపన ఆత్మ చేయదు. ధర్మప్రతిష్టాపన పరమాత్మయైన దేవుడు చేయవలసి యున్నది. అయితే పరమాత్మ ఏమీ చేయనివాడుగా యుండుట వలన ఆయన చేయనట్లే యుంటూ, తన ప్రతినిధి ద్వారా చేయించినట్లు చూపుచూ ఇతరులు తెలియనట్లు తానే ధర్మ ప్రతిష్టాపన చేయుచున్నాడు.


పరమాత్మయైన దేవుడు తాను కానట్లు తన ప్రతినిధియన్నట్లు, ప్రతినిధి పేరుతో తానే తన ధర్మములను భూమిమీద ప్రజలకు తెలియజేయు చున్నాడు. ఈ కార్యము చేయుటకు మనుషుల మధ్యలోనికి మనిషివలె వచ్చి, మనుషుల భాషలో ధర్మయుక్తమైన జ్ఞానమును చెప్పవలసి యుండును. ఆ విధముగా వచ్చినవాడే ఈసా, ఆయననే ఏసు అని చెప్పుచున్నాము. దేవుడు తానే స్వయముగా ఏసుగా వచ్చియున్నా ఆ విషయము ఎవరికీ తెలియకూడదు కావున ఏసును సాధారణ మనిషిగానే ప్రజలు నమ్మునట్లు చేయుచున్నాడు. అందువలన ఏసుకు గతములో వచ్చిన భగవద్గీతను, ఇప్పుడు అనగా ఏసు యున్నప్పుడు చెప్పు బైబిలును (ఇంజీలును) నేర్పునట్లు చెప్పుచున్నాడు. అదే విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 3, ఆయత్ 48లో ఈ విధముగా చెప్పుచున్నారు చూడండి. (3-48) ''అల్లాహ్ అతనికి (ఈసాకు) గ్రంథాన్ని వివేకాన్ని బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథ జ్ఞానాన్ని నేర్పుతాడు.''


తౌరాతు, ఇంజీలు అను పేర్లు అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ ఒక్క గ్రంథములో మాత్రమే చెప్పియున్నారు. తౌరాతుయనగా భగవద్గీత. ఇంజీలు అనగా బైబిలు గ్రంథము. ఇంజీలు అంటే బైబిలు అని ముస్లీమ్‍లు ఒప్పుకోవచ్చునుగానీ, తౌరాతు అంటే భగవద్గీతయను మాటను సులభముగా ఒప్పుకోరు. వారి దృష్ఠిలో తౌరాతు గ్రంథము ప్రత్యేకమైనది ఉంటుందియను నమ్మకము కలదు. తౌరాతు గ్రంథమును వారు చూడకున్నా దానిని భగవద్గీతయని మేము చెప్పితే దానిని ఒప్పుకొనుటకు వారి మనస్సు అంగీకరించడము లేదు. 'తౌరాతు' అను పేరు గ్రంథమును మూసా ప్రవక్త (మోషే ప్రవక్త) ఒక్కడు మాత్రము చూచాడు. ఆ పేరుతో ఆ గ్రంథమును ఎవరూ చూడలేదు. మోషే (మూసా)కు నేరుగా సాకార రూపములో మనిషిగా యున్న దేవుడే ఆ గ్రంథమును మూసాకు ఇచ్చి దాని పేరు తౌరాతుయని చెప్పాడు. ఎవరయితే గ్రంథమును ఇచ్చారో ఆయనే ఆ గ్రంథము పేరు కూడా చెప్పి ఇచ్చాడు. అలా ఇవ్వబడిన గ్రంథమును మూసా ఒక్కడు చూచాడు. ఆయన తర్వాత ఆ పేరుతో ఆ గ్రంథము ఎక్కడా లేదు. భారతదేశములో భగవద్గీతగా యున్న గ్రంథమే తౌరాతుయని తెలియవలెను.


ఏసుగా వచ్చిన ఆయన ఎవరో ఆయనకు తౌరాతు జ్ఞానము తెలుసు. అదే జ్ఞానమునే ఇంజీలు జ్ఞానముగా ఏసు చెప్పడము జరిగినది. అంతకు ముందు గతములో భగవద్గీతయే తౌరాతుగా చెప్పబడిన జ్ఞానమే ఏసు కాలములో ఇంజీలు (బైబిలు) జ్ఞానముగా ప్రజలకు చెప్పాడు. ఏసుగాయున్న వ్యక్తికి ఒకే దేవుని జ్ఞానము తెలియుట చేత దానినే ''తౌరాతు, ఇంజీలు జ్ఞానము ఆయనకు నేర్పబడ్డాయి'' అని వాక్యములో చెప్పారు. 'నేర్పబడ్డాయి' అంటే ఆయనకు రెండు గ్రంథముల జ్ఞానము తెలుసుయని మనము అర్థము చేసుకోవాలి.


శరీరములోని 'ఆత్మయిన దేవుడు ఒక్కడే ఆరాధింప తగినవాడు' అని నిర్ణయించి, అధికారములు ఇచ్చినవాడు మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మ. పద్ధతి ప్రకారము అధర్మములు అభివృద్ధయి ధర్మములకు ముప్పు ఏర్పడినప్పుడు తిరిగి ధర్మప్రతిష్టాపనకు వచ్చినవాడు ఏసుయని చెప్పుకొన్నాము. ఏసు వచ్చి ఇంజీలు జ్ఞానమును చెప్పాడు. అయితే తౌరాతు (భగవద్గీత) జ్ఞానమును చెప్పిన కృష్ణుడు కూడా దేవుడు సాకారముగా అవతరించినవాడే కదా!యని కొందరు అనుకోవడము జరిగినది. దేవుడు శరీరము ధరించి కృష్ణుడుగా వచ్చినమాట నిజమేగానీ, ఆయన ఏసువలె ధర్మసంస్థాపనకు రాలేదుయని చెప్పవచ్చును. ''ధర్మ సంస్థాపన కొరకు దేవుడు మనిషివలె వస్తాడని'' కృష్ణుడు చెప్పినట్లు ఏసు వచ్చాడు. కృష్ణుడు ''సృష్ఠ్యాదిలో తాను సూర్యునకు చెప్పిన జ్ఞానమును తిరిగి జ్ఞాపకము చేయుట కొరకు వచ్చాడు.'' భగవద్గీత సృష్ఠ్యాదిలో చెప్పినదేగానీ ద్వాపరయుగము చివరిలో చెప్పినది కాదు. అందువలన కృష్ణుడు దానిని భగవద్గీతయను పేరుతో చెప్పలేదు. కృష్ణుడు చెప్పిన పేరు, కృష్ణుడు పెట్టిన పేరు 'తౌరాతు' యని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

26. అల్లాహ్‍యే నిజమైన దైవము. (3-62)

(3-62) ''నిశ్చయముగా ఇదే (మర్యమ్ కుమారుడు ఈసా గురించిన) నిజమైన గాథ. అల్లాహ్ తప్ప ఆరాధనకు వేరెవరూ అర్హులు కారు. నిశ్చయముగా అల్లాహ్‍యే ప్రాబల్యము కలవాడు, ఆయనే వివేచనా పరుడు.''


పెద్ద దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము శరీరము ధరించి ఎక్కడ పుట్టినా, ఆయన జీవితము రెండు కోణములలో ఉండును. ఒకటి ప్రపంచ కోణములో సాధారణ జీవితమును సాగించడము, రెండు దైవికమయిన అసాధారణ జీవితమును సాగించడము రెండు రకముల జీవితముండును. సాధారణ జీవితము ఎక్కువగా యుండును, దైవికమైన అసాధారణ జీవితము చాలా తక్కువ యుండును. ద్వాపర యుగములో 'తౌరాత్ జ్ఞానమును గుర్తు చేసిన కృష్ణుడు దేవుని అవతారమే' అయినా ఆయన తన జీవితములో ధర్మప్రతిష్టాపన చేయుటకు రాలేదు. గతములో ఆకాశవాణి ద్వారా సూర్యునకు చెప్పిన జ్ఞానమును ఐదు లేక ఆరు నిమిషములలో గుర్తు చేయుటకు వచ్చాడు. తన జీవితములో ఎప్పుడుగానీ ప్రత్యక్షముగా కృష్ణుడు ఎవరికీ జ్ఞానము చెప్పలేదు. మనిషిగా తర్వాత వచ్చినవాడు మొదట కృష్ణునిగా వచ్చినవాడే అయినా, తన రెండవ జన్మలో ఏసుగా వచ్చి ధర్మములను మూడు సంవత్సరములు తెలియజేయడమైనది. మూడు సంవత్సరములు తెలియజేసిన జ్ఞానము తౌరాత్ జ్ఞానమే అయినా దానికి ''ఇంజీలు'' అని క్రొత్త పేరు పెట్టబడినది. చెప్పినవాడు ఏసుగా యున్నందున దానికి వేరు పేరు పెట్టాడు. దానివలన కృష్ణుడు వేరు, ఏసు వేరను భావము రావలెననీ, ఇద్దరూ ఒకటేయని తెలియకూడదనీ అలా చేశారు.


జ్ఞాన సముపార్జన వలన వారు ఇద్దరు ఒక్కరేయనీ, రెండు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని తెలియుట సరియైన పద్ధతి. అందువలన వారు వేరువేరుగా ఉన్నారనీ, గ్రంథములు వేరువేరుగా ఉన్నవనీ తెలుపడ మైనది. అలా వారి యదార్థస్థితి బయటి మనుషులకు తెలియకుండడమే మంచిది. తెలిస్తే ''ఆరాధ్య దైవము ఒక్కడే'' యను మాటకు భంగము ఏర్పడును. దేవుని అవతారముగా ఫలానా వారున్నారని తెలిస్తే వారిని ఆరాధించుటకు అవకాశమున్నది. అందువలన అది సరియైన పద్ధతి కాదు. ఆరాధ్య దైవము ఆత్మ ఒక్కడే అయినందున ఆ మాటకు భంగము కలుగకూడదు అంటే భగవంతుని అవతారముగా వచ్చినవారు గానీ, చెప్పబడిన గ్రంథములుగానీ ఫలానాయని తెలియకూడదు. అందువలన ఏసు కాలములో ఏసు ఎవరయినది తెలియకుండా పోయినది. అట్లే చెప్పబడిన ఇంజీలు గతములో ఎట్లుండేదని ఎవరికీ తెలియకుండా పోయినది.


కృష్ణుడు దేవుని అవతారమే గానీ ధర్మములను బోధించి ధర్మ ప్రతిష్టాపన చేయుటకు రాలేదు. కృష్ణుడు భగవద్గీతలో (తౌరాతులో) చెప్పినట్లు ''దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము ప్రతి యుగములోనూ వస్తాడు. ధర్మములను బోధించి అధర్మములను లేకుండా చేసి ధర్మములను స్థాపితము చేస్తాడు'' యని చెప్పినట్లు దేవుడు ఏసు రూపములో వచ్చాడని తెలియు చున్నది. దేవుడు మనిషి ఆకారములో ఏసుగా వచ్చినా ఆయన ఎవరి చేత పూజింపబడలేదు. ఆరాధింపదగిన దేవుడు ఒక్కడే అదే విషయమునే వాక్యములో ''అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవరూ అర్హులు కాదు'' అని అన్నారు. శరీరములో చైతన్యముగా యున్న ఆత్మ తప్ప, సాకారముగా కనిపించు వారు ఎవరూ ఆరాధనకు అర్హులు కారని చెప్పారు. అందువలన స్వయముగా దేవుడే మనిషిగా వచ్చినా తాను ఎవరయినది తెలియుటకు అవకాశము లేకుండా చేయుచున్నాడు. ఈ కారణము చేత కృష్ణుడుగా వచ్చినప్పుడుగానీ, ఏసుగా వచ్చినప్పుడుగానీ సాధారణ మనుషులకు తాను ఎవరయినది ఏమాత్రము తెలియకుండా చేశాడు. కృష్ణునిది దేవుని అవతారమే, అలాగే ఏసుది దేవుని అవతారమే. కృష్ణుడు ధర్మసంస్థాపనకు రాలేదు. జ్ఞాపకము చేయుటకు మాత్రమే వచ్చాడు. కొన్ని నిమిషముల పని మాత్రమే ఆయనది. ఏసు ధర్మ సంస్థాపన కొరకు వచ్చాడు. అదే ఆయన (ఏసు) నిజమైన గాథ.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

27. దైవ గ్రంథమున్నా తప్పుదారిలో ఎందుకు పోతున్నారు? (3-69, 70, 71)

దైవ గ్రంథములు మూడు ప్రజలందరి సొత్తుగాయున్నవి. ఏ గ్రంథము ఏ మతమునకు సంబంధము లేదు. హిందువులు, క్రైస్థవులు తమ గ్రంథములుగా భగవద్గీతను, బైబిలును చెప్పుకొన్నా ముస్లీమ్‍లు ఆ రెండు గ్రంథములలోని వాక్యములను తీసుకొని బోధించుచున్నా దానికి హిందువులుగానీ, క్రైస్థవులుగానీ అభ్యంతరము తెలుపలేదు. ఒక్క ముస్లీమ్‍లు మాత్రము ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములు ఎవరయినా, ఎక్కడయినా చెప్పినా, వాటిని వివరించి వ్రాసినా దానికి అభ్యంతరము తెలుపుచున్నారు. 'మా ఖుర్ఆన్‍ను మీరు చెప్పకూడదు' అంటున్నారు. 'ఇది మా ఖుర్ఆన్' అనుటకు గ్రంథములో ఏ ఆధారము లేదు. అది ఒక్క ముస్లీమ్ గ్రంథము కాదు. అందరి ఉమ్మడి సొత్తు. (81-27) వ ఆయత్‍లో ఇలా కలదు. ''ఇది సమస్త లోకవాసులకు హితోపదేశము'' అని చెప్పబడి యున్నది. ఇది ఒక్క ముస్లీమ్‍లకని చెప్పలేదు. అలాంటప్పుడు ఖుర్ఆన్ గ్రంథమును ఎవరయినా చదివి, వివరించి చెప్పుకోవచ్చును. ఎవరి బుద్ధికి దేవుడు ఎంత అందిస్తే అంత ఖుర్ఆన్ గ్రంథము అర్థము కాగలదు. అంతేగానీ ముస్లీమ్‍లు ఇది మా గ్రంథమనినా, ఇతరులు చదువకూడదనినా అల్లాహ్ లెక్కలో వారిది తప్పగును. మూడు గ్రంథములు మూడు మతముల వారికి స్వతంత్రమైనవి. ఎవరు ఏ గ్రంథమునయినా చదువవచ్చు, దానిని వివరించి ఇతరులకు చెప్పవచ్చు. అట్లు చదువకూడదు, వివరించి చెప్పకూడదు అనుటకు ఎవరికీ హక్కులేదు.


హిందువులు ఇతర మత గ్రంథములని చెప్పుకొను బైబిలు, ఖుర్ఆన్ చదువవచ్చును. అట్లే క్రైస్థవులు భగవద్గీత, ఖుర్ఆన్‍ను, ముస్లీమ్‍లు భగవద్గీత బైబిలును చదివి చెప్పవచ్చును. తమకు అర్థమయ్యే విధానము వేరువేరు అర్థములుగా యున్నా ఫరవాలేదుగానీ మూడు దైవగ్రంథములను చదువ వలెనను ఉద్దేశ్యము కల్గియుండవలెను. దైవగ్రంథములను చదువవలెనను శ్రద్ధకల్గి చదువుచుండినా ఎప్పుడో ఒకప్పుడు దేవుడు దయతలచి దానిలోని నిజ భావమును తెలియజేయును. అలా చదువుచున్న వారికి తమ గ్రంథమని చెప్పుకొను వారికి తెలియని సత్యము తెలియవచ్చును. ముస్లీమ్‍లకు అర్థము కానిది ఖుర్ఆన్ గ్రంథములో క్రైస్థవులకు అర్థము కావచ్చును. సత్యమును చెప్పితే మూడు మతముల వారికి మూడు గ్రంథములలో చెప్పిన జ్ఞానము అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుని మీద, దేవుని జ్ఞానము మీద శ్రద్ధయున్న వాని బుద్ధికి వాక్యములోని జ్ఞానము సత్యసమేతముగా అర్థమగును.


ఒక మతము వారు ఎవరయినా మా గ్రంథము మాకు అర్థము కాలేదా? యని అడిగితే కాలేదని చెప్పవచ్చును. ఎందుకనగా! మూడు గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానముండుట వాస్తవము. అయితే అందులోని సత్యము పూర్తిగా అర్థము కాలేదని చెప్పవచ్చును. దానికి ఆధారము కలదు. అదేమనగా! హిందువులు భగవద్గీత చదివినా, క్రైస్థవులు బైబిలు చదివినా, ముస్లీమ్‍లు ఖుర్ఆన్ చదివినా అందులో అర్థము కాని విధానము మూడు గ్రంథములలో గలదు. అది ఏమనగా! భగవద్గీతలో సృష్ఠికర్తయిన దేవున్ని ఆత్మయని, సృష్ఠింపబడిన ఆత్మను ఆత్మని చెప్పియుండుట వలన అట్లే జీవాత్మను ఆత్మని చెప్పియుండుట వలన ఏ శ్లోకములో భావము ఏ ఆత్మను గురించి కలదో చెప్పుటకు వీలుపడడము లేదు. అట్లే బైబిలు గ్రంథములో దేవున్ని తండ్రియని చెప్పడమేకాక దేవుని చేత సృష్ఠింపబడిన దేవున్ని కూడా తండ్రియని చెప్పారు. అలాంటప్పుడు ఏ వాక్యములో ఏ తండ్రిని గురించి చెప్పారో తెలియకుండా పోయినది. అట్లే ఖుర్ఆన్ గ్రంథములోనికి వచ్చి చూస్తే సృష్ఠ్యాదిలో సర్వమును సృష్ఠించిన దేవున్ని అల్లాహ్యని అన్నారు. సృష్ఠి తర్వాత అందరూ ఆరాధించుటకు ఆరాధ్య దైవముగా నిర్ణయింపబడిన దేవున్ని అల్లాహ్యని అన్నారు. ఈ లెక్క ప్రకారము సృష్ఠ్యాదిలో యున్న దేవుడు, సృష్ఠి తర్వాత ఆరాధన అవసరమైన దేవున్ని తయారు చేసి ఈయన ఒక్కడే ఆరాధ్య దైవమని చూపించాడు. అలా ఆరాధింపబడు దేవుడు, ఆరాధన అవసరములేని దేవుడు ఇద్దరినీ అల్లాహ్యని వాక్యములో చెప్పియుండుట చేత ఎక్కడ ఏ అల్లాహ్‍ను గురించి చెప్పారని ముస్లీమ్‍లు ఎవరూ తెలియలేకపోవుచున్నారు. ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో రెండవ ఆయత్‍లో మొట్టమొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్‍ను చెప్పియున్నారు. అల్లాహ్ నిరాపేక్షా పరుడు. ఏ ఆకాంక్ష లేనివాడనీ, ఏ అక్కర లేనివాడని చెప్పారు. ఇంకా బాగా అర్థము చెప్పుకొంటే ఏ ఆశా లేనివాడు అని చెప్పవచ్చును. ఏ ఆకాంక్ష లేని దేవున్ని 112వ సూరా, రెండవ వాక్యములో చెప్పియున్నారు.


అక్కడే అదే సూరాలో మొదటి వాక్యములో అల్లాహ్ ఒక్కడే గలడు అని సృష్ఠ్యాదిలో యున్న దేవున్ని గురించి చెప్పారు. సూరా రెండు ఆయత్ 255లో మనుషులు ఆరాధించుటకు అర్హుడయిన ఒకే దేవున్ని గూర్చి చెప్పారు. మూడవ వాక్యములో అల్లాహ్‍కు సంతతి లేదు అని చెప్పబడినది. తర్వాత చెప్పిన (6-102) వాక్యములో అందరినీ సృష్ఠించిన వాడు ఆయనే అన్నారు. 112వ సూరా రెండవ ఆయత్‍లో అల్లాహ్ ఏ ఆకాంక్ష లేనివాడు అని చెప్పారు. (2-255)లో ''నిత్యము పని చేయువాడు'' అని చెప్పారు. (2-117) ''భూమిని ఆకాశమును సృష్ఠించినవాడు ఆయనే, ఆయన పని చేయడు, ఆయన 'అయిపో' అంటే అయిపోతుంది'' అని చెప్పారు. అదే (2-255)లో ''కునుకు నిద్ర లేకుండా పనిని చేయుచున్నాడని చెప్పి, పనిని చేయడములో అల్లాహ్ అలిసి పోడు'' అని అన్నారు. ఇవన్నీ చూచిన తర్వాత (2-255) లో పనిని చేసే అల్లాహ్ ఉండగా, (2-117)లో పనిని చేయక మౌనముగా యుంటూ అల్లాహ్ సంకల్పించుకొంటే అయిపోవునని చెప్పారు. ఒకచోట 'ఏ అవసరము లేనివాడు, ఎవరి అక్కర లేని అల్లాహ్' వాక్యములో గలడు. ఇంకొక వాక్యములో 'నమాజ్ చేయు భక్తులతో అక్కర గల అల్లాహ్' ఉన్నట్లు తెలియుచున్నది. ఇట్లు సృష్ఠి పూర్వము 'ఏ సంబంధము లేని అల్లాహ్' ఉండగా సృష్ఠి తర్వాత 'తాను ఒక్కడే ఆరాధ్యదైవము'గా యున్న అల్లాహ్ కలడు. అయితే ముస్లీమ్ సమాజము మొత్తమునకు అల్లాహ్ ఒక్కడే గలడని తెలుసు. ఆరాధ్య దైవముగా యున్న (6-102) లో గల అల్లాహ్ ఒక్కడు మాత్రము తెలుసు. (112-1,2,3) వాక్యములలో గల ఏ సంబంధము లేని అల్లాహ్ గురించి ఏమాత్రము తెలియదు. ఒకరు ఆరాధనకు దూరముగా యుండే అల్లాహ్ గలడనీ, మరియొకరు ఆరాధనకు అర్హుడైయున్న అల్లాహ్ గలడనీ ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పియున్నారను విషయము తెలియదు.


ముస్లీమ్ సమాజములో సాధారణ మనుషులు కాకుండా మేము జ్ఞానులము, మాకు ఖుర్ఆన్ జ్ఞానము బాగా తెలుసు అనువారికి కూడా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారనీ, ఒకరు సృష్ఠి పూర్వమునుండి ఉండే అల్లాహ్యనీ, అందరూ ఆరాధించుటకు సృష్ఠి తర్వాత నియమింపబడిన అల్లాహ్ మరొకరు గలడనీ, మొత్తానికి ఇద్దరు అల్లాహ్‍లు గలరని తెలియదు. 112వ సూరాలో నాలుగు వాక్యములలో చెప్పిన దేవుడు మొదటి సృష్ఠికర్త యనీ, (2-255) లో (6-102) లో చెప్పబడిన అల్లాహ్ రెండవ సృష్ఠికర్త యనీ, ఇద్దరి దేవుళ్ళ తారతమ్యము తెలియకున్నారు. ఆరాధనకు దూరముగా యున్నవాడు మొదటి దేవుడనీ, ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక దేవుడు మొదటి దేవుని చేత సృష్ఠింపబడిన రెండవ దేవుడనీ, గ్రంథములో శ్రద్ధయున్న వారి బుద్ధికి తెలియుచుండగా అది అసత్యము అని చెప్పుచున్న ముస్లీమ్‍లు కూడా కలరు. ఒకే దేవుడని చెప్పుకొను ముస్లీమ్‍లు తమ గ్రంథమని చెప్పుకొను ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చెప్పియున్నారని చెప్పితే మా మాట వినిన ముస్లీమ్‍లు దానిని జీర్ణించు కోలేకపోవుచున్నారు. ఇద్దరు అల్లాహ్‍లు గ్రంథములో యున్నా ఒకరు మనుషులతో ఏ సంబంధము లేని దేవుడు ఉండగా, నమాజ్‍తో సంబంధము గల దేవుడు గలడు. ఈ విషయము ముస్లీమ్‍లందరికీ క్రొత్త విషయమే.


ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలోని నాలుగు వాక్యములు మనుషుల ఆరాధనతో సంబంధము లేని దేవున్ని గురించి చెప్పారని తర్వాత (6-102) లో మరియు (2-255) లో ''ఆరాధనతో సంబంధమున్న దేవున్ని గురించి చెప్పారని ''ధర్మచక్రము'' గ్రంథములో చెప్పియున్నారని మేము చెప్పగా కొందరు జ్ఞానులుగా యున్నవారు సూరా మూడు ఆయత్ 69లో చెప్పినట్లు మేము ఇద్దరు దేవుళ్ళని చెప్పినది సత్యము కాదనీ, మీరు తప్పు దారి పట్టిపోయారు, ఇప్పటినుండయినా మీ దారి మార్చుకొమ్మని చెప్పుచూ మమ్ములను దారి మళ్లించాలని చూస్తున్నారు. వారు సక్రమమయిన మార్గములో ఉన్నారని అనుకొంటున్నారు. నిజానికి వారే తప్పుదారిలో యున్నారని వారు తెలియలేకపోయారు. వారి మార్గమును గురించి వారు తెలియక ఇతరుల మార్గము తప్పుయని అంటున్నారు. అటువంటి వారిని గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా మూడులో, ఆయత్‍లు 69, 70, 71 అను మూడు వాక్యములలో ఇలా చెప్పారు చూడండి.


(3-69) ''గ్రంథవహులలోని ఒక వర్గము మిమ్ములను పెడత్రోవ పట్టించాలని చూస్తున్నది. నిజానికి వారు తమను తాము పెడత్రోవలో పడవేసుకొంటున్నారు. వాస్తవానికి వారే తప్పుదారి పట్టుచున్నారని గ్రహించలేకపోవుచున్నారు.''


(3-70) ''ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్ ఆయతులకు సాక్షిగా యుండి కూడా వాటిని ఎందుకు తిరస్కరించుచున్నారు.''


(3-71) ''గ్రంథము గల ఓ ప్రజలారా! తెలిసి కూడా సత్యానికి అసత్య రంగు పులిమి చెప్పిన దానిని ఎందుకు అనుమానాస్పదము చేస్తున్నారు? ఉద్దేశపూర్వకముగా సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చు తున్నారు?''


దేవుడు ఇద్దరుగా యున్నారని చెప్పినా గ్రంథమును చదువువారు, గ్రంథము తమ దగ్గరేయున్నా దానిని గమనించక మీరు తప్పుదారిలో పోవు చున్నారని సత్యము చెప్పిన వారిని అంటున్నారు. నిజానికి వారే అసత్యమార్గము పట్టియున్నారని వారికి తెలియదు. గ్రంథములో చెప్పిన (112, 1,2,3) (6-102) ఆయత్‍లలో ఉండగా సత్యమును ఎందుకు కాదంటున్నారు. తెలిసి 'సత్యానికి అసత్య రంగుపూచి సత్యమును ఎందుకు కప్పిపుచ్చుతున్నారని' దేవుడు ప్రశ్నించుచున్నాడు. మనిషి ప్రపంచ విషయములలోనూ డబ్బువద్దను చాలా జాగ్రత్తగాయుండును. వేయి రూపాయలు అప్పు తీసుకొన్నవాడు ఒకమారు ఐదువందలు మరొకమారు నాలుగు వందలు డబ్బు ఇస్తే ఇంకా వందరూపాయలు బాకీయున్నాడని లెక్కవేసి చెప్పుదుము. ముందు ఏమి ఇచ్చాడు తర్వాత ఏమి ఇచ్చాడని లెక్కాచారము చెప్పు మనిషి దేవుని విషయములో అంత గ్రుడ్డిగా ఎందుకున్నాడో తెలియకున్నది. ముందు ఎంత జ్ఞానమును చెప్పాడు, తర్వాత ఎంత జ్ఞానమును చెప్పాడు అని లెక్క తెలియలేకపోవుచున్నాడు. డబ్బు విషయములో ఎంత ఇచ్చాడు, ఎంత బాకీ ఉన్నాడని రూపాయితో సహా లెక్క చెప్పు మనిషి, జ్ఞాన విషయములో కొంతయినా విచక్షణ లేకుండా పోవడము విచిత్రముగా యున్నది.


దైవ గ్రంథములు జ్ఞానమును గ్రామునుండి తూకము వేసి టన్ను వరకు వివరముగా చూపు త్రాసులాంటివి. దైవ గ్రంథములు ఖచ్చితముగా తూకము చూపు తక్కెడలాంటివి. చిన్న జ్ఞానము నుండి పెద్ద జ్ఞానము వరకు ఎంతో వివరముగా విచక్షణా సహితముగా, శాస్త్రబద్దముగా తెలుపు చున్నవి. దైవజ్ఞానమును ఖచ్చితమైన తూకముతో చూపు దైవ గ్రంథములో 112వ సూరాలోని నాలుగు ఆయత్‍లలో తొమ్మిది వేల (9000) రూపాయల తూకమున్న దేవున్ని చూపి తర్వాత (6-102) వాక్యములో తొమ్మిది వందల (900) రూపాయల తూకమున్న దేవున్ని చూపారు. పైన (112-1,2,3,4) వాక్యములలో సంఖ్య తొమ్మిదేయుండి సున్నాలు మాత్రము మూడు గలవు. అలాగే (6-102) వాక్యములో సంఖ్య తొమ్మిదేగానీ సున్నాలు రెండే గలవు. అటువంటప్పుడు చదువు వచ్చినవాడు ఎవడయినా చిన్న మొత్తము ఏది, పెద్ద మొత్తము ఏది అని సులభముగా చెప్పగలడు. అదే విధముగా పని చేయనివాడు, ఏ అక్కర లేనివాడు (112-2) లో ఉండగా, పని చేయువాడు ఆరాధనకు తగినవాడు (6-102)లో ఉన్నాడు. దీనిప్రకారము బుద్ధియున్న వారు ఎవరు పెద్ద దేవుడు? ఎవరు చిన్న దేవుడు? అని తెలియగలరు. దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఎంతో ఖచ్చితమైన లెక్కప్రకారము జ్ఞానముండగా దానిని ముస్లీమ్‍లు సరిగా తెలియలేక రెండుచోట్ల చెప్పబడిన వాడు ఒక్కడే యనుచున్నారు. అలా అనడము 9000 లను, 900 లను ఒక్కటేయని చెప్పినట్లు కలదు. 112వ సూరాలోని 2వ ఆయత్‍కు ఆరవ సూరాలోని 102వ ఆయత్‍కు తేడా తెలియకపోతే తొమ్మిది వేల (9000) కు, తొమ్మిది వందల (900) కు తేడా తెలియనట్లేయగును. బైబిలులోగానీ, ఖుర్ఆన్ గ్రంథములో గానీ తొమ్మిది సంఖ్యను చూస్తున్నారుగానీ దాని ప్రక్కలో యున్న సున్నాలను గమనించడము లేదు. వాక్యము ఎంత విలువయైనదని లెక్కించి చూడడము లేదు.


ఉదాహరణకు బైబిలును బోధించు కాలేజీలు పెట్టుకొని, ఆ కాలేజీలలో కొందరిని బోధకులు (పాస్టర్‍లు)గా తయారు చేయు ఒక బోధకుడు తనకంటే బైబిలులో మించిన జ్ఞాని లేడని అనుకొను ఒక స్కూల్ డైరెక్టర్ మమ్ములను దేవుని మార్గము త్రప్పి నడచువానిగా, అందరినీ తప్పుదారిలో పంపు వానిలాగా వర్ణించి చెప్పడము జరిగినది. అతనిని బైబిలులో ఒక వాక్యమును చెప్పి ఇది నీకుగానీ, మరి ఎవరికయినా దీని వివరము తెలుసునా?యని అడుగుచున్నాను. నన్ను ఇతరులు విమర్శించిన విమర్శలను కూడా అందరూ చదువునట్లు నేను గ్రంథములోనే వ్రాయుచున్నాను. నేను త్రిమత గురువును. మూడు మతముల వాక్యములకు వివరమును చెప్పుచున్నాను. నా వివరము శాస్త్రబద్దముగా ఉందో లేదో నా గ్రంథములు చదివే ప్రజలకే తెలుసు. నా ప్రశ్న ఇది చూడండి. మార్కు సువార్తలో 14వ అధ్యాయములో 22, 23, 24 ఇలా కలవు. మార్కు (14-22, 23, 24) ''వారు భోజనము చేయు చుండగా, ఆయన ఒక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది తాగ్రిరి. అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము'' అని చెప్పి యున్నాడు.


అట్లే ఇదే విషయమే మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 26, 27, 28 వాక్యములలో చెప్పియున్నారు చూడండి. (మత్తయి 26-26, 27, 28) ''వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగ్రుడి. ఇది నా రక్తము అనగా! పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింప బడుచున్న నిబంధన రక్తము.''


మార్కు, మత్తయి రెండు సూవార్తలలో ఒకే విషయము చెప్పబడి యున్నది. ద్రాక్షరసమును గిన్నెలో ఇచ్చి ఇది నా నిబంధన రక్తము పాపుల కొరకు చిందింపబడుచున్న రక్తము అని చెప్పారు. అయితే నేడు క్రైస్థవ బోధకులు వారిని తయారు చేసిన పెద్ద బోధకులు 'ఏసు మన కొరకు చిందించిన రక్తముతో మీ పాపములను కడుగుకొనుడి' అని చెప్పుచున్నారు. ఆ రోజు ఏసు తన రక్తము ప్రస్తుతము చిందింప బడుచున్నదియని వర్తమాన కాలములో చెప్పాడు. ఆ వాక్యము ఎప్పుడు చెప్పినా అది సజీవ వాక్యమై వర్తమాన కాలమునకే వర్తించునను విషయము నేడు బోధకులకు తెలియకుండా పోయినది. ఏసుప్రభువుది నిబంధన రక్తము. అందువలన అది ఎప్పటికీ ఉండునదియని తెలియుచున్నది. ఏసు చెప్పిన జ్ఞానమే శాశ్వితముగా వెదజల్లుచున్న జ్ఞానము (చిందింప బడుచున్న రక్తము) అని ఎందుకు అర్థము కాలేదో! అంతేకాక ఆయన నా నిబంధన రక్తమును త్రాగమని చెప్పితే ఏసురక్తముతో పాపమును కడుగుకొనుము అనియో లేక రక్తమును పూసుకొనుము అనియో చెప్పుచున్నారు. ఏసు తన వాక్యములో త్రాగమని చెప్పాడా? తన రక్తముతో కడుక్కోమన్నాడా? ఏసు ఒకటి చెప్పితే మరొకటి చెప్పు బోధకులు నన్ను విమర్శిస్తూ, నా మార్గము సరియైనది కాదు అంటున్నారు. ''నాకు మార్గము లేదు అని వారికి తెలియదు. నాకు ప్రయాణమే లేదు, మార్గమెలా ఉండును? నా మార్గమే లేనప్పుడు నాది మీవలె ప్రయాణమే కానప్పుడు, 'నా మార్గము తప్పు' అనుకోవడము పొరపాటు కాదా! నాకు ప్రయాణమే లేనప్పుడు మీకు మార్గము ఎలా కనిపించిందో చెప్పగలరా?''


ఇంతవరకు ఆయన రక్తమును గురించే క్రైస్థవ లోకము చెప్పు కొంటున్నది. ఆయన శరీరమును గురించి కొంతయినా ఆలోచించారా? లేదు ఆయన జ్ఞానరక్తము యని చెప్పితే సాధారణ రక్తము అనుకొన్నారు. అయితే ఆయన శరీరమునుండే రక్తము కారవలసియున్నది. రక్తము 'నిబంధన' అను పేరుతో యున్నది. నిబంధన యను మాటను మరిచి ప్రక్కన పెట్టిన మీది ఏ మార్గమో చెప్పగలరా? రొట్టెను ఇచ్చి నా శరీరము అన్నాడు. శరీరమునుండే రక్తము వస్తుంది. అందువలన నా శరీరమును తింటే అందులో రక్తము దొరుకుతుందియని చెప్పకనే చెప్పినట్లు అర్థమగు చున్నది. నా శరీరము గ్రంథము, దానిలోనే జ్ఞానము అను రక్తము దొరుకును. అది మీ కర్మలను కాల్చునుయని ఏసు తన శిష్యులకు గుప్త భావమును తన మాటలలో ఇరికించి చెప్పాడు. ఆయన చెప్పిన మాటే మీకు అర్థము కాలేదు. అయినా రహస్య సత్యమును చెప్పు మాది చెడు దారి, శరీరమును గురించి మాట్లాడని మీది మంచిదారా?


మీలాంటి వారున్నారని తెలిసిన దేవుడు 3-69వ వాక్యమును చెప్పాడు. ఎదుటి వారిని తప్పుదారి యను వారు తామే దారి తప్పి యున్నారని వారికి తెలియదని చెప్పాడు. అటువంటి కొందరు ఒక ఇస్లామీ సంస్థలో గురువులమని చెప్పుకొను వారు మమ్ములను విమర్శిస్తూ ఇలా వ్రాశారు గమనించండి. ''త్రైత సిద్ధాంత స్థాపకులు శ్రీ ప్రబోధానంద యోగీశ్వరులు. స్వామి వారి భావము మంచిదే. వారు ఇస్లామ్‍ను, ముహమ్మద్ ప్రవక్తగారిని గౌరవిస్తారు. వారు ఇస్లామ్‍ను లేకుండా చేయాలి అని అనుకోలేదు. నిజమైన ఆత్మజ్ఞానమును చెప్పదలచారుగానీ వారు ఏదైతే మార్గాన్ని తీసుకొన్నారో అది చాలా ప్రమాదకరము. ఇస్లామ్ యొక్క అసలు ఉద్దేశ్యమునుండి అది దూరము చేస్తుంది. ఒక పెద్ద మనిషి ఒక గుంపును తీసుకొని వెళ్ళుచున్నారు కానీ, గమ్యము ఎక్కడున్నదో వారికే తెలియదు. ఇలాంటి వారు తాము మార్గము తప్పడమే కాకుండా అందరినీ మార్గము తప్పిస్తారు. అందుకే మా ఈ ప్రయత్నము. స్వామివారికి వారి భక్తులకు నిజమైన మార్గమును చూపి అంధకారము నుండి వెలుగులోనికి తీసుకొని రావాలని కోరుచున్నాము.''


ఈ విధముగా ముస్లీమ్‍ల ఆధ్యాత్మిక సంస్థలోయుండు గురువులుగా యున్నవారు వ్రాశారు. మేము నడుచు మార్గము ప్రమాదకరమైనదనీ అంధకారము నుండి వెలుగు లోనికి తేవాలని కోరుచున్నామని చెప్పారు. నా మార్గము చెడుదనీ, ప్రమాదకరమైనదని వ్రాశారు. నేను ఏ దారిలో పోలేదే, నా దారి మీకు ఎలా కనిపించినది? నాది ప్రయాణమే కానప్పుడు నా దారి మీకు ఎలా కనిపించినదో? నేను మూడు మతములను సమానముగా చూస్తూ, మూడు గ్రంథములను దైవ గ్రంథములని చెప్పుచూ మూడు దైవ గ్రంథములను గౌరవిస్తూ, ప్రజలకు మూడు గ్రంథములలోని విషయములను సమానముగా చెప్పుచున్నాము. నేను మతముల మధ్య ద్వేష భావము గల మనుషులలో ఇతర మతముల మీద ద్వేష భావము లేకుండా చేసి గౌరవ భావమును కల్గునట్లు చేశాను. ఏ గ్రంథములో అయినా రహస్య వాక్యములుండి వాటి భావము అర్థము కాకపోయినప్పుడు, అక్కడి వాక్యమునకు మేము అర్థమును వివరిస్తూ మూడు గ్రంథముల జ్ఞానమును బోధిస్తున్నాను. నాలాంటి మత ద్వేషము లేని వానినే ఒక ప్రక్క ముస్లీమ్‍లు, మరొక ప్రక్క క్రైస్థవులు నన్ను విమర్శిస్తున్నారు. కావున వారి కొరకు దేవుడు 3-69 వాక్యమును కేటాయించి చెప్పాడు. వాక్యము ప్రకారము వారు దారితప్పిన వారై తాము దారి తప్పినామని తెలియనివారై యున్నారు. ఇప్పటికి మేము 102 గ్రంథములను వ్రాశాము. నా గ్రంథములను చదివి ఇదే నిజమైన జ్ఞానమనీ, నన్ను విమర్శించిన వారి భార్యలు కూడా నా జ్ఞానము కొరకు భర్తలనే వదలివేశారు. భర్తలను ఎదిరించి వారి జ్ఞానము నుండి బయటికి వచ్చి, నా జ్ఞానము మీదనే ధ్యాసకల్గి, నా జ్ఞానమునే నిత్యము పఠించుచున్నారు. ఇది వారికి 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ' యన్నట్లు అయినది. ఇంట్లో వారి భార్యలు కూడా వారి జ్ఞానమును ఒప్పుకోలేదు. వారి భార్యలు సహితము నా జ్ఞానమునే ఆశ్రయించి యుండుట, వారికి చాలా అవమానకరమైన విషయమైనది. అట్లే 'ఆదామ' యనే క్రైస్థవ గురువు తన శిష్యులు నా వద్దకు వచ్చి జ్ఞానము తెలుసు కొంటున్నారని ఓర్చుకోలేని బాధ కల్గినవారై చివరకు సోషల్ మీడియాయైన 'ఫేస్బుక్'లో నన్ను విమర్శించాడు. నన్ను, నా జ్ఞానమును తెలియకుండానే విమర్శించు వారు ఇళ్లలో తమ భార్యలను కూడా తమ జ్ఞానము గొప్పదని చెప్పుకోలేకపోయారు. తమ జ్ఞానము ఇతరులను విమర్శించుటకు పనికి వచ్చునని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

28. దైవాజ్ఞ లేనిది ఏ ప్రాణి చావదు. (3-145)

(3-145) ''అల్లాహ్ ఆజ్ఞ కానంతవరకు ఏ ఒక్కరికీ మరణము రాదు. ప్రతి ప్రాణికి మరణ సమయము వ్రాయబడియున్నది. ప్రాపంచిక ఫలితము కోరుకొను వారికి మేము దాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలితమును ఆశించిన వానికి మేము దానిని ప్రసాదిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము శీఘ్రముగా మంచి ప్రతిఫలితమును ఇస్తాము.''


ఈ వాక్యములో నాలుగు అంశములున్నవి. ఒకటి మరణము, రెండు ప్రాపంచిక కోరికలు, మూడు పరలోకము, నాలుగు భక్తి భావము. మరణము ముందే నిర్ణయము చేసి వ్రాయబడియుండును. తర్వాత మూడు విషయములు జరుగబోవునవి అని తెలియవలెను. ముందే నిర్ణయము చేయబడిన చావు ఏ సమయమునకు రావలెనని వ్రాసియుండునో ఆ సమయమునకే వచ్చును. అది నిర్ణయింపబడి యున్న విషయమైనందున కాలము జరుగుకొలది అది జరిగిపోవును కదా! అటువంటప్పుడు దేవుని ఆజ్ఞ కొరకు అది ఆగదు కదా!యని ఎవరయినా ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.


మనకు తెలిసిన మరణము ఒక్కటే గలదు. వాస్తవముగా మరణములు నాలుగు రకములు గలవు. ఆ నాలుగు రకముల మరణములలో రెండు మరణములు దేవుని ఆజ్ఞతో సంబంధము లేకుండా కాలక్రమమున జరిగి పోవుచుండును. అయితే రెండు మరణములు మాత్రము దేవుని ఆజ్ఞను అనుసరించి యుండును. మిగతా రెండు మరణములు ఒకటి అకాల మరణము, రెండు తాత్కాలిక మరణము అనునవి దేవుని ఆజ్ఞతో సంబంధము లేకుండా వచ్చుచుండును. అకాల మరణము, తాత్కాలిక మరణము తర్వాత ఉన్నవి మరణము, ఆఖరీ మరణము. ఈ రెండు మరణములు దేవుని ఆజ్ఞ లేనిది జరగడము లేదు.


ఇప్పుడు ఈ విషయమును సంపూర్ణముగా తెలియుటకు ముందుగా మరణము అంటే ఏమిటి? అను వివరము తెలియవలసి యుండును. మరణమును గురించి ఇంతకు ముందు ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథమును వ్రాసుకొన్నాము. రెండవది ''మరణ రహస్యము'' అను గ్రంథమును, మూడవది ''పునర్జన్మ రహస్యము'' అను గ్రంథమును వ్రాసు కొన్నాము. దాదాపు తొంభైయి (90) శాతము మరణమును గురించి చెప్పుకోవడము జరిగినది. ఇప్పుడు ఈ చర్చతో పూర్తి నూరు (100) శాతము మరణమును గురించి తెలిసినట్లగును. సాధారణముగా మనిషి శరీరములో జరిగే శ్వాస ఆగిపోతే మరణము అని అందరూ అనుకొంటున్నారు. ఇప్పుడు అలా చనిపోవడములో నాల్గు రకములు కలవని చెప్పుకొన్నాము. మనిషి శరీరములో ఎలా వచ్చినా దానిని మరణమేయని మనము అనుకొంటున్నాము. మరణములో కనిపించేది ఒక్కటే అయితే కనిపించనిది ఎంతో గలదు. కనిపించని సమాచారమును గురించి ఇప్పుడు చెప్పుకొందాము.


మరణము పొందిన వ్యక్తి ఒక్క సెకను కాలములో రెండవ జన్మను చేరుచున్నాడు అని ఇంతకుముందు జన్మ విషయమును గురించి చెప్పుకొన్నాము. మరణించిన జీవుడు రెండవ జన్మలో అనుభవించుటకు కావలసిన కర్మను కర్మపత్రములో వ్రాయించుకొని రావలసియున్నది. అప్పుడే మరణము తర్వాత ఎప్పుడు వచ్చునో నిర్ణయము చేయబడును. అందువలన వాక్యములో ప్రతి ప్రాణికి మరణము ముందే వ్రాయబడి యున్నది అని చెప్పియున్నారు. మరణములో కర్మ నిర్ణయము రెండవ జన్మకు కావలసినంత నిర్ణయము చేసి ముద్రించిన తర్వాత జీవుడు (మనిషి) రెండవ జన్మకు పోవడము జరుగుచున్నది. మనిషి చనిపోవడము జరిగిన తర్వాత కర్మ నిర్ణయము దేవుడు చేయనిదే ఎవడూ రెండవ జన్మకు పోయే అవకాశము లేదు. గతములో చనిపోయినప్పుడు కూడా ప్రస్తుత జన్మకు దేవుడే కర్మ నిర్ణయము చేసి పంపియుండును. అయితే జీవితములో జరుగవలసినవి అన్నియూ వ్రాయబడియుండును. వ్రాయబడిన పాపపుణ్యముల ప్రకారము ఏమి అనుభవించవలెనో వాటిని జీవుడు జీవితములో అనుభవ రూపములో పొందుచుండును. అట్లు ఒక జన్మకు కావలసినంత కర్మను సంచితకర్మ నుండి శరీరములోని ఆత్మే కేటాయించియుండును. శరీరములోని ఆత్మే అందరికీ ఆరాధ్య దైవముగా ఉండునట్లు సృష్ఠికర్తయైన దేవుడు నిర్ణయించి ఆత్మకు అధికారము ఇచ్చియున్నాడు. అధికారము పొందియున్న ఆత్మయిన దేవుడు జీవుని మరణములో కర్మను కేటాయించి రెండవ జీవితమునకు పంపుచున్నది.


ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! ఒక జీవితమునకు కావలసినంత కర్మను కేటాయించి పంపుటకు ఆత్మకు అన్ని అధికారములు గలవు. తాను దేవునివద్ద నుండి పొందిన అధికారము ప్రకారము జీవునికి ఎంతో కొంత కర్మను అత్మయిన దేవుడు నిర్ణయించు చున్నాడు. అలా అనుభవించే కర్మలను శరీరములోని దేవుడు కేటాయించు చున్నాడు. ఆ కేటాయింపు ప్రకారము జీవుడు కష్ట సుఖ అనుభవములను అనుభవించుచుండును. ఎప్పుడయితే కర్మ అయిపోవునో అప్పుడు అనుభవములు అయిపోవును. అప్పుడు ఆ జన్మలో జీవుడు ఏమీ అనుభవించుటకు వీలులేదు. అప్పుడే ప్రతి దినము నిద్రలోనికి పోయినట్లు జీవుడు నిద్రను పొందును. నిద్రలో ఏ అనుభవము లేదుకదా! ఏ అనుభవము లేని దానినే నిద్ర అనవచ్చును లేక మరణము యని అనవచ్చును. రెండిటిలో ఏదయినా కావచ్చును. బయటి మనుషులకు నిద్రవేరు, చావువేరుగా కనిపించు చుండును. నిద్రలో శ్వాస ఉండును, మరణములో శ్వాస ఉండదు. అయితే జీవునికి మాత్రము రెండూ ఒకే విధముగా ఉండును. ఏదీ తెలియనిదే నిద్ర, ఏదీ తెలియనిదే చావు. నిద్రనుండి లేవగానే ప్రపంచము కనిపించినట్లు మరణము నుండి జన్మలోనికి పోయినప్పుడు కూడా ప్రపంచమే కనిపిస్తా వుంది. నిద్రనుండి లేవగానే పాపపుణ్య అనుభవములు మొదలవుతాయి. అలాగే మరణము నుండి జన్మలోనికి రాగానే పాపపుణ్య కర్మల అనుభవములు మొదలవుతాయి.


ఒక మనిషి ఎప్పుడయినా, ఏ విధముగానయినా, ఏ పరిస్థితిలో అయినా ప్రపంచ జ్ఞాపకమును కోల్పోవుటయే మరణము అనవచ్చును, తిరిగి అదే శరీరములో లేస్తే దానిని నిద్ర అంటాము. లేక తిరిగి క్రొత్త శరీరములో లేస్తే దానిని మరణము అంటాము. మనిషి తన జీవితములో అనుభవించే కర్మయున్నంత వరకు వచ్చే మరుపు నిద్రగా వచ్చును. ఎప్పుడయితే అనుభవించే కర్మయంతయూ అయిపోవునో అప్పుడు వచ్చే మరుపును మరణము అనవచ్చును. జీవితములో పుట్టినప్పటి నుండి అన్ని అనుభవములు అనుభవించినా మరణము అనునది అనుభవములో ఉండదు. అలాగే పుట్టుక యనునది కూడా అనుభవములో ఉండదు. ఏ అనుభవము లేనిది, అనుభవములన్నీ అయిపోయినది మరణము కాగా, ఏ అనుభవము లేనిది, అనుభవములు ప్రారంభము అగునది జననము అని చెప్పవచ్చును. ఈ విధముగా చెప్పితే ఇటు మరణము గానీ, అటు జననము గానీ రెండూ జీవుని అనుభవములో లేనివనీ, ఏమాత్రము ఎవరికీ తెలియనివనీ చెప్పవచ్చును. మరణమును గురించి మరొకమారు జ్ఞాపకము చేయడమేమనగా!


మనిషికి వ్రాసిపెట్టబడిన కర్మలు అయిపోతానే మరణము రావలెను వస్తుంది. కర్మలు అయిపోతే వచ్చేదే మరణముగానీ, ప్రత్యేకించి మరణము ఫలానా సమయములో వస్తుంది అని వ్రాసిపెట్టియుండదు. కర్మలు అయిపోవడమునే మరణముగా వ్రాయబడినదని చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే కర్మలు అయిపోయిన సమయమునే మరణ సమయముగా వ్రాసియున్నదని కూడా చెప్పవచ్చును. అంతేగానీ మరణము అను పేరుతో ఫలానా సమయము అని చెప్పబడియుండదు. ఏదో ఒక సమయములో జీవితములో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మలన్నీ అయిపోతే ఆ సమయమే ఆ మనిషికి మరణ సమయముగా లెక్కించబడును. ఆ సమయములో మనిషి తనకున్న జ్ఞాపకమును కోల్పోవును అదే మరణము. సర్వ సాధారణముగా మరణము పొందిన జీవుడు ఒక సెకను కాలములో కావలసిన కర్మను మోసుకొని తర్వాత జన్మకు పోవును. ఇదంతా మనిషికి తెలియదు అని ముందే చెప్పాము. ఏ అనుభవము లేని స్థితిలో మనిషి యుండుట వలన రెండవ జన్మకు కర్మను ఎవరు కేటాయించారు? ఎంత కర్మను కేటాయించారు? అను విషయము ఏమాత్రము తెలియదు.


మరణించిన మనిషి మౌనముగా ఎరుక లేని స్థితిలో యుండును. అకాల మరణములోగానీ, తాత్కాలిక మరణములోగానీ దేవుని జోక్యము ఉండదు. ఎప్పుడయితే కర్మ అయిపోవునో, అప్పుడు దేవుని ఆజ్ఞతోనే మరణము వచ్చును. ప్రారబ్ధ కర్మలు అయిపోయిన మనిషికి తర్వాత అనుభవించుటకు సంచితకర్మ లేకపోతే, ఉన్న కర్మంతయూ అతని జ్ఞానాగ్ని చేత కాలిపోయి వుంటే అప్పుడు వాడు పరలోకమును పొందవలసి యున్నది. అతని కర్మ జ్ఞానము అను అగ్నిచేత కాలిపోయినదని చెప్పినా, లేక దేవుని చేత క్షమించబడినదని చెప్పినా రెండూ ఒక్కటే. భాష వేరు అయినా భావము అంతా ఒక్కటేయగును. మనిషి కర్మలను క్షమించే వాడు, లేకుండా చేయువాడు, జ్ఞానమను అగ్నిగా కాల్చువాడు దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఆరాధనకు అర్హుడుగా యున్నాడో, ఏ దేవుడు సృష్ఠికర్త చేత అన్ని అధికారములు పొందియున్నాడో, ఆ దేవుడే మనిషి శరీరములో యుండి అతను చనిపోయినప్పుడు తన ఆజ్ఞలను ఉపయోగించి మనిషిని జన్మలకు పంపడముగానీ, లేక మోక్షము (పరలోకము) నకు పంపడము గానీ చేయును.


ఒక మనిషి శరీరములో ఎప్పుడు మరణమును పొందునది శరీరములో యున్న దేవుడయిన ఆత్మకే తెలుసు. ఒకనికి రాత్రి పది గంటల వరకు అనుభవించు కర్మ కలదు. తర్వాత కర్మ లేదు. అతడు తన జీవితములో దేవున్ని విశ్వసించి, దేవున్నే ఆరాధించుట వలన, దేవుని జ్ఞానము సంపూర్ణముగా తెలియుట చేత అతని కర్మలన్నీ నశించిపోయినవి. అతనిని క్రొత్త కర్మ ఏదీ అంటలేదు. పాతకర్మలు కూడా కొన్ని అనుభవిస్తూ రావడము వలన అతని కర్మ రాత్రి పదిగంటలకు అయిపోవునట్లు గలదు. అప్పుడు వానికి రాత్రి పూట పది గంటలప్పుడు మరణము సంభవించును. అప్పుడు వాడు వాస్తవముగా మోక్షమును పొందవలసి యున్నది. అయితే బ్రహ్మ విద్యా శాస్త్రము ప్రకారము ప్రథమ దైవగ్రంథములో అక్షర పరబ్రహ్మ యోగములో చెప్పినట్లు రాత్రిపూట చనిపోయిన వానికి మోక్షము రాదు. అట్లు రాత్రిపూట చనిపోవువాడు జన్మలకు పోవలసియుండును. అప్పుడు వాని చావు తర్వాత వాడు మోక్షమునకు పోవలసియున్నా, అయితే అది రాత్రిపూట మరణము అయిన దానివలన మోక్షమునకు ఆటంకమేర్పడును. రాత్రిపూట చనిపోయినవాడు జన్మకు పోవలసియుండును. అప్పుడు దేవుని వాక్యమునకు ముప్పు ఏర్పడుచున్నది. మోక్షము పొందువాడు పగలు పూటే చనిపోవాలను సూత్రము వర్తించక పోవును. అందువలన అప్పుడు దేవుడయిన ఆత్మ జోక్యము చేసుకొని వానిని రాత్రి వరకు బ్రతకకుండా ముందు రోజు పగలే చనిపోవునట్లు చేయుచున్నాడు.


రాత్రి చనిపోవలసిన వాడు రాత్రివరకు అనుభవించ వలసిన కర్మను శరీరములోని దేవుడే క్షమించుట వలన అతని కర్మ ముందే పగలు కాలములోనే అయిపోవుచున్నది. అప్పుడు వాడు పగలే చనిపోవును, మోక్షమును పొందును. ఇక్కడ దైవాజ్ఞ పని చేసినదని తెలియుచున్నది. ఒకవేళ మోక్షము పొందనివాడు జన్మలకు పోవువాడు ఎప్పుడు చనిపోయినా వానికి చనిపోవు కాల నియమములు వర్తించవు. కర్మ మిగులు యున్నవాడు చనిపోతే అక్కడే శరీరములోనే జీవునితో పాటు యున్న ఆత్మ వానిని రెండవ జన్మకు కావలసిన కర్మను నిర్ణయించి తీర్పుచేసి పంపును. అలా తీర్పు చేయడము ఒక సెకను కాలములోనే జరిగిపోవుచున్నది. మనిషికున్న నాలుగు మరణములను ఆత్మే కలుగజేయుట చేత ఆత్మకు తెలియనిది ఏ మరణము లేదని చెప్పవచ్చును. అయితే రెండు మరణములలో మరణ సమయములో దేవుని జోక్యము ఏమీ ఉండదు. మరణము, ఆఖరీ మరణము అను రెండు మరణములలో మాత్రము దేవుడు నిర్వహించవలసిన పాత్ర గలదు. అందువలన ''దేవుని ఆజ్ఞ లేనిది ఎవనికీ మరణము రాదు'' అని పై వాక్యములో చెప్పారు.


ఇంకనూ వాక్యములో ''ప్రాపంచిక విషయమును కోరుకొన్న వానికి దానిని ఇస్తాము'' అని చెప్పబడియున్నది. మనిషి మరణిస్తే వాని కర్మ ప్రకారము, వాని శ్రద్ధ (కోరిక) ప్రకారము, వానికి రెండవ జన్మలో అనుభవించునట్లు ఆత్మ కర్మను నిర్ణయించి పంపుచున్నాడు. అప్పుడే వాడు కోరిన కోర్కెలు తర్వాత జన్మలో నెరవేరునట్లు దేవుడే చేయుచున్నాడు. అలాగే పరలోకమును ఆశించిన వానికి దానినే ఇస్తాము అని చెప్పాడు. దేవుడు మోక్షమునకు పంపువాని ఎడల కర్మలను ఎలా క్షమించుచున్నాడో, మోక్షము పొందవలసిన కాలము పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము ఉండునట్లు కర్మలను సవరించి వానిని తిరిగి పుట్టకుండా, వానిది చివరి మరణము అగునట్లు చేసి పంపుచున్నాడు. అట్లే దేవునియందు విశ్వాసము కలవానికి రాబోవు జన్మలో జ్ఞానమును తెలుసుకొను అవకాశమును కల్గించుచున్నాడు. ఈ విధముగా శరీరములోనే దేవుడు ఆత్మరూపములో ఉంటూ, తన ఆజ్ఞలతోనే తర్వాత జన్మకుగానీ, జన్మలులేని పరలోకమునకుగానీ పంపుచున్నాడు. అందువలన ప్రతి మరణము దేవుని ఆజ్ఞతోనే జరుగుచున్న దని చెప్పారు. మరణము, జననము రెండు అంటుకొని యున్నవి. జననమును చెప్పితే మరణమును చెప్పినట్లే, మరణమును చెప్పితే జననమును చెప్పినట్లే యగును. శరీరములోనే జీవునితో పాటు యున్న దేవునికి శరీరములో తానే అన్నీ చేయుచున్నాడు. మరణమును కూడా తానే కల్గించుచున్నాడు. మరణములో చేయవలసినది అంతా చేయు చున్నాడు. అందువలన ''అల్లాహ్ ఆజ్ఞ లేనిది ఏ జీవికి మరణము రాదు'' యని అన్నారు.


మరణముగానీ, జననముగానీ ఏ మానవునికీ తెలియదు. ఈ విధానము శరీరము లోపల అత్యంత రహస్యముగా జరుగుచున్నది. ఎవరికీ ఏ అనుభవము లేనిదానిని నేను చెప్పడము జరిగినది. ఎవరికీ తెలియనిది ఈయనకెలా తెలుసుయని పొరపడి నా మాటను నమ్మకపోతే మీకే నష్టము. ఎవరికీ తెలియనిది వాస్తవమే. అయితే నేను చెప్పినదీ వాస్తవమే. పైకి కనిపించు వ్యక్తిని నేను చెప్పినది వాస్తవమే అని గట్టిగా చెప్పుటకు ఆధారము గలదు. ఆ ఆధారము ఏమి అనగా! మీకు కనిపించు నేను మాట్లాడు ప్రతిమాట, నేను వ్రాయు ప్రతి వ్రాత నాది కాదు. నా శరీరములో ఆత్మగాయున్న దేవుడే స్వయముగా చెప్పాడుగానీ, నేను మనిషిగా ఏమీ చెప్పలేదు. వాస్తవముగా నాకు ఏమీ తెలియదు. నేను ఒక దౌర్భాగ్యపు జీవితమును గడిపే సామాణ్య మనిషిని మాత్రమే. ఈ రహస్యము చెప్పిన ఘనత మన తండ్రియైన దేవునిదే. తాతయైన దేవుడు (పరమాత్మ) చూస్తూయుండగా, తండ్రియైన దేవుడు (ఆత్మ) సర్వ మానవులలో అన్నీ చేయుచున్నది. (3-145) వాక్యములో చెప్పినట్లు వాక్యములో చెప్పిన కార్యములన్నియూ చేయువాడు శరీరములో యున్న దేవుడే. శరీరము లోపల, శరీరము బయట ఉండి చూస్తున్న పరమాత్మ తన కుమారుడైన ఆత్మకు మరణములో తీర్పు తీర్చు అధికారమును ఇచ్చాడు. అంతేకాక అందరిచేత ఆరాధించుటకు అర్హుడైన వాడు కుమారుడయిన ఆత్మయేనని ఆయన మృత్యువును దాటుటకు మోక్షమును (పరలోకమును) ఇచ్చుటకు అర్హుడుగా యుండునట్లు, మన తాతయైన పరమాత్మ తండ్రియైన ఆత్మకు సర్వ అధికారములు ఇచ్చాడు. ఇదే విషయమునే ద్వితీయ దైవ గ్రంథము ఇంజీలులో యోహాను సువార్తలో ఏమి చెప్పారో చూడండి.


(యోహాన్ 5-21) ''తండ్రి మృతులను ఏలాగు లేపి బత్రికించునో అలాగే కుమారుడును తన ఇష్టము వచ్చిన వారిని బత్రికించును.''


(యోహాన్ 5-22) ''తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగానీ''


(యోహాన్ 5-23) ''తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారున్ని ఘనపరచ వలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. కుమారున్ని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రి ఘనపరచడు''.


(యోహాన్ 5-24) ''నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''


(యోహాన్ 5-25) ''మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను''.


(యోహాన్ 5-26) ''తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగహ్రించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగహ్రించెను.''



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

29. కర్మ ఫలితము న్యాయముగా దొరుకుతుంది. (3-161)

(3-161) ''ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడడమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకొని ప్రళయదినాన హాజరవుతాడు. తర్వాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకొన్న కర్మలకు పూర్తి ప్రతిఫలితము ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయము జరుగదు.''


'వక్త' అంటే బోధించువాడు లేక చెప్పువాడు. ప్రవక్త యనగా బాగా బోధించువాడు లేక గొప్ప విషయమును చెప్పువాడు అని అనవచ్చును. బోధించే వాడినే ప్రవక్తయని అన్నప్పుడు, బోధించేవాడు మంచే బోధిస్తాడు గానీ ఇతరులకు చెడు చేయుటకు పూనుకోడు. ఒకవేళ ఎవరయినా బోధకుల ముసుగులో అనగా దొంగగా మాటలు చెప్పేవారు వారి స్వార్థము కొరకు కపటముగా మాట్లాడుచూ ఇతరులను మోసము చేయాలనుకొంటే వారు శిక్షకు గురికాక తప్పదు. ప్రవక్తలయినా, పాఠకులయినా, పండితులయినా, మోసము చేయువాడు ఎవడయినా వాడు చేసిన మోసమునకు ప్రతిఫలముగా పాపము వచ్చియుండును. ఆ పాపము వాని వెంటనే ఉండును. అలా ఉండిన పాపముగానీ, పుణ్యముగానీ మరణ సమయములో తీర్పుకు వచ్చును. శరీరములో తీర్పు జరుగు క్షణ కాలములో మనిషి చేసుకొన్న పాపముగానీ, పుణ్యముగానీ న్యాయబద్దముగా తీర్పు తీర్చబడును. అనగా చేసుకొన్న పాపమునకు తగిన కష్టమును అనుభవించు నట్లు నిర్ణయము చేయబడును. అట్లే మనిషి చేసుకొన్న పుణ్యమునకు తగినట్లు సుఖములు అనుభవించుటకు దేవుని చేత నిర్ణయము చేయబడును. మనిషి చేసుకొన్న పాపపుణ్యములకు ప్రళయ కాలములో తీర్పు తీర్చబడును అని గ్రంథములో చాలాచోట్ల వ్రాయబడి యున్నది.


ప్రళయము అంటే ఏదో ప్రపంచ నాశనమని అనుకోకూడదు. ప్రపంచము అనగా బయట కనిపించునదే ప్రపంచము కాదు. పంచము అనగా అయిదు అనియూ, ఐదు చేత పుట్టగా దానినే ప్రపంచము అనియూ చెప్పచుందుము. 'ప్ర' అనగా పుట్టుటయని అర్థము గలదు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను వస్తువుల చేత తయారయినది శరీరము. అలాగే ఈ ఐదు బయటికి కనిపించే భాగముల చేత అమర్చబడినది ప్రపంచము. బయట ప్రపంచము ఎప్పటికీ నాశనము కానిది. దేవుడు, ప్రకృతి రెండు కుడి, ఎడమగా యున్నవి. దేవునికి భార్యలాంటిది ప్రకృతి. ప్రకృతి భాగములయిన ఐదు వస్తువుల మిశ్రమము చేత తయారయినది మానవ దేహము. ఒక్క మానవ దేహమే కాదు, సమస్త జీవరాసుల శరీరములు ప్రకృతి చేతనే తయారయినవి. ఎప్పుడయితే పుట్టినదంతా నాశనము అయిపోతుందో దానిని ప్రళయము అని అనవచ్చును. బయటి ప్రకృతి దేవుని దగ్గరగా ఉండునది కావున అది ఎప్పుడూ నాశనము కాదు. ఇకపోతే శరీరముగా తయారయిన ప్రకృతి మట్టి మట్టిలోనికి, గాలి గాలిలోనికి కలిసిపోవు అవకాశము గలదు. మరణ సమయమునుండి శరీరము మార్పు చెంది పూర్తి నాశనమై పోవును. అనగా ప్రళయమై పోవుచున్నది. శరీర ప్రళయము మరణములోనే మొదలవును, కావున మరణమును ప్రళయము అని అంటున్నారు. మరణములో జీవుడు శరీరము నుండి ఎప్పుడు బయటికి పోతే అప్పుడే శరీరము ప్రళయము చెందునట్లు లెక్కించవలెను. శరీరము లయమై (నాశనమై) పోవడమునే ప్రళయము అని అంటున్నాము. దేవుడు చావును ప్రళయము అని వాక్యములో చెప్పాడు. మరణ దినమున దేవుడు న్యాయబద్దముగ పాపమునకు కష్టము, పుణ్యమునకు సుఖము నిర్ణయించి జన్మకు పంపును. పాపపుణ్య నిర్ణయము ప్రకారము తీర్పు తీర్చునప్పుడు మనము దేవుని ముందర హాజరయినట్లే కదా! అందువలన పాపములతో సహా ప్రళయ దినమున హాజరవుతారు అని చెప్పాడు. ఈ వాక్యములో ప్రళయము అను దానినే వివరముగా తెలియవలసిన అవసరమున్నది. చాలామందికి ప్రళయము అంటే మరణించిన రోజు అని అర్థముకాక బయట భూమి కంపించడము, సునామీలు, తుఫానులు బయట ఉపద్రవములు జరగడమును ప్రళయమని అనుకొంటున్నారు తప్ప 'మరణమే ప్రళయము' అని ఎవరూ అనుకోవడము లేదు. ప్రతి మరణము వాని శరీరమునకు జరుగు ప్రళయముగా లెక్కించ వలెను. ప్రళయములో (మరణములో) శరీరము నాశనమగుచున్నది గానీ, అప్పుడు కూడా శరీరములో యున్న జీవుడు నాశనము కాలేదు. ఎవడు ఎంత తప్పు చేసియుంటే అంత తప్పుకు బదులుగా న్యాయముగా శిక్షలు నిర్ణయించబడును. నిర్ణయించువాడు దేవుడే (శరీరములోని ఆత్మే) అయిన దానివలన ఎవనికిగానీ, ఎటువంటి అన్యాయము జరుగదు. ప్రతి ఒక్కటి న్యాయబద్దముగా నిర్ణయింపబడును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

30. ప్రవక్తలను మనుషుల నుండే పంపుతాడు. (3-164)

ఒక విషయమును గురించి బాగా మాట్లాడు వానిని వక్తయని అంటాము. 'ప్ర' అంటే 'ముఖ్యము' అనీ, లేక 'పుట్టిన'యని అర్థము కలదు. 'ప్రవక్త' యనగా జ్ఞానమును చెప్పువాడని కూడా చెప్పుకోవచ్చును. వక్తలు ఎవరయినా కావచ్చును. వారిలో ప్రవక్తలు కొందరే ఉందురు. ఒక ఉపన్యాసమును విని చెప్పిన వానిని వక్తయని కొందరు అనడము మేము విన్నాము. ఒక రోజు హరికథను ఒక వ్యక్తి బాగా చెప్పాడనీ, వానిని 'మంచి వక్త' అనీ అన్నారు. అలాగే ప్రవక్తలని కొద్దిమందిని మాత్రమే చెప్పుచున్నారు. మా లెక్కలో నేడు కూడా ప్రవక్తలు ఎందరో ఉన్నారు. పూర్వము కూడా ఉండేవారు. అయితే పూర్వము కొద్దిమందిని మాత్రమే ప్రవక్తలు అని చెప్పుచూ మిగతా వారిని చెప్పలేదు. నేడు కూడా ప్రవక్తలు ఎందరోయున్నా వారిని ప్రవక్తలు అని చెప్పకపోవడమును చూస్తే నేటి ప్రజలకు 'ప్రవక్త' అను పేరుకు అర్థము తెలియదని తెలియుచున్నది. అందువలన అందరికీ అర్థమగునట్లు మేము చెప్పునదేమనగా!


'ప్ర' అంటే 'పుట్టిన' లేక 'ముఖ్యమైన' అను అర్థము ప్రకారము, ప్రవక్త అనగా 'ముఖ్యమైన మాటలు చెప్పువాడు' అనీ లేక 'పుట్టిన విషయమును చెప్పు వాడని' అర్థము. పుట్టిన విషయము అనగా ఇతరులు చెప్పిన దానిని చెప్పడము అని అర్థము. హరికథ ఇతరులు వ్రాసినదో లేక ఇతరులు చెప్పినదో అయివుండుటను బట్టి హరికథను చెప్పువానిని ప్రవక్త అనక అందరూ వక్త అని అంటున్నారు కదా! న్యాయముగా అయితే మీరు చెప్పినట్లు ప్రవక్తయని అనవచ్చును కదా!యని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా! చెప్పబడేది ప్రపంచ విషయమైతే ఎంత చెప్పినా, ఏది చెప్పినా వానిని వక్త అనియే చెప్పుదురు. పుట్టిన విషయములలో ప్రపంచ విషయముల బోధకులకు మంచివక్తలని పేరు గలదు. ఇకపోతే ప్రపంచ విషయము కానటువంటిది పరమాత్మ, ఆత్మ విషయమైనటువంటిది ఏది చెప్పబడినా చెప్పిన వానిని ప్రవక్తయని అనవలెను. ఆకాశవాణి ద్వారా చెప్పబడిన జ్ఞానము మూడు గ్రంథముల రూపములో గలదు. వాటినే దైవ గ్రంథములని అంటున్నాము. ఆ గ్రంథముల జ్ఞానము ముందే ఇతరుల చేత చెప్పబడి, ఇతరుల చేత వ్రాయబడియున్నది. అలా ముందే చెప్పబడి యున్న విషయమును (జ్ఞానమును) మాటల రూపములో బాగా చెప్పువానిని వక్త అనకుండా ప్రవక్తయని అనవచ్చును. వక్త బాగా మాట్లాడినా, ప్రవక్త తక్కువగా మాట్లాడినా వక్తది ప్రపంచ జ్ఞానమై యుండును. ప్రవక్తది పరమాత్మ జ్ఞానమైయుండును. వక్తకు, ప్రవక్తకు అంత తేడా గలదు.


మరొక విషయమేమనగా! వక్త, ప్రవక్త అను మాటలు మనుషులకే వర్తించును. దేవుడు మనిషివలె వచ్చి జ్ఞానమును బోధించినప్పుడు ఆయనను ప్రవక్తయని 'గుంపులో గోవిందా'యన్నట్లు పిలువవచ్చును గానీ, ఆయనను ప్రత్యేకముగా చెప్పునప్పుడు ప్రవక్తయని అనకూడదు. ఆయనకు ప్రత్యేకించి 'భగవంతుడు' అను పేరును చెప్పవచ్చును. ఆయన దేవుని జ్ఞానమునే చెప్పినా, మనిషివలెనున్న భగవంతుడు చెప్పిన జ్ఞానము, ముందు చెప్పిన జ్ఞానమేకాక కొంత ప్రత్యేకమైన జ్ఞానమును, అంతవరకు చెప్పని విధానములో యున్న జ్ఞానమును చెప్పియుండుట చేత ఆయనను ప్రవక్తయని అనకూడదు. ఆయన చెప్పిన జ్ఞానము క్రొత్త కోణములో చెప్పబడియుండుట వలన ఆయనకు ప్రవక్తయను పేరు కూడా వర్తించదు. అందువలన అందరూ ఆయనను గుర్తించలేక ప్రవక్తయని అనవచ్చును గానీ, వాస్తవానికి ఆయన ప్రవక్త కాదు. గతములో దేవుడు మనిషిగా వచ్చిన సందర్భములు ఎన్ని ఉన్నాయోగానీ, మనకు తెలిసినవి రెండు మాత్రము గలవు. దేవుడు శరీరములో యున్న కాలములో ఆయన తెలియలేదుగానీ, ఆయన వచ్చి పోయిన కొన్ని వేల సంవత్సరములకు దేవుడు మనిషిగా వచ్చిపోయినట్లు తెలిసినది.


తెలియనప్పుడు దైవజన్మలోనున్న వారిని ప్రవక్తయనినా ఫరవా లేదు. వారు ఎవరయినది ఇప్పుడు తెలిసియుండుట చేత ఇప్పుడు వారిని ప్రవక్తలు అనుటకు వీలులేదు. వారిని ప్రత్యేకించి భగవంతుడు యని పిలువవచ్చును. భగవంతుడు భూమిమీద ఉన్నప్పుడు ఆయనను గుర్తించుటకు సాధ్యము కాదు గనుక, అప్పుడు ఆయనను భగవంతుడని ఎవరూ అనుటకు అవకాశముండదు. అప్పుడు ఏమనినా వారిని ప్రవక్తలనియే చెప్పవలసి యుండును. తెలియనప్పుడు కృష్ణున్ని, ఏసును ప్రవక్తలని చెప్పినా ఫరవాలేదుగానీ, తెలిసిన తర్వాత ప్రవక్తలని చెప్పడము భావ్యము కాదు. మనుషులలోనే వక్తను ప్రవక్తలనీ, ప్రవక్తలను వక్తలనీ చెప్పుచున్నాము. కొందరు ప్రవక్తలను దేవునితో సమానముగా గానీ, దేవుని కంటే ఎక్కువగా గానీ చూచువారు కూడా కలరు.


మనుషులు ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప ప్రవక్తలైనా వారిని దేవునివలె చూడడము గానీ, దేవునికంటే గొప్పగా గౌరవించడము గానీ తగని పనియగును. అయితే నేడు ముస్లీమ్‍లు అందరూ కాదుగానీ కొందరు తమ ప్రవక్తయైన ముహమ్మద్ ప్రవక్తగారిని దేవునికంటే గొప్ప యన్నంత గౌరవముతో చూస్తున్నారు. ముస్లీమ్‍లకు వారి ప్రవక్త మీద ఉన్నంత గౌరవము, ప్రేమ ఇతర మతములలో ఎవరికిగానీ, ఏ ప్రవక్త మీదగానీ అంత లేదనియే చెప్పవచ్చును. ముస్లీమ్‍లకు ముహమ్మద్ ప్రవక్తకు యున్న అనుబంధము అలాంటిది. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ప్రవక్తల విషయమై అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 3లో ఆయత్ 164 లో ఇలా కలదు.


(3-164) ''అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారము ఏమిటంటే, ఆయన వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి దేవుని వాక్యములను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయముగా అంతకు ముందైతే వారు స్పష్టమైన అపమార్గమునకులోనై ఉండేవారు.''


ఈ వాక్యములో బాగా గమనిస్తే దేవుడు ప్రజలలోనుండే ప్రవక్తను ఎన్నుకొంటాడని గలదు. ఈ మాటనుబట్టి ఎప్పటికయినా ప్రవక్తలు మనుషులే అయివుంటారు. దేవుడు మనిషిగా వస్తే ఆయన ప్రవక్త కాడు అను మా మాటకు వాక్యములోగల మాట సాక్ష్యముగా యున్నది. మనుషులలోనే ప్రవక్తను ఎన్నుకొని, మనుషుల వద్దకే పంపితే అతను ముందే యున్న విషయమును, గ్రంథరూపమైన దానిని చదివి వినిపిస్తాడు, దానినే బోధిస్తాడు. ''ఉన్న జ్ఞానమును బోధించువాడు ప్రవక్తగానీ, లేని జ్ఞానమును ప్రవక్త బోధించలేడు'' అను మా మాటకు ఇది సాక్ష్యముగా గలదు. ప్రవక్తయైన మనిషి దైవ గ్రంథముల జ్ఞానమును బోధించగా దానివలన ప్రజలు పరిశుద్ధత నొందగలరు. ముందు అపమార్గము (అజ్ఞాన మార్గము)లో యుండే వారందరూ ప్రవక్తల బోధల వలన జ్ఞానమార్గమును పొందగలరు. పై వాక్యములో ముఖ్యముగా మనుషులే ప్రవక్తలనీ, ప్రవక్తలు ముందు పుట్టి గ్రంథరూపమైన జ్ఞానమునే బోధింతురనీ, స్వయముగా ఏమీ చెప్పరని తెలియుచున్నది.

అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

31. సత్కార్యములు చేసే స్త్రీలు అయినా, పురుషులయినా స్వర్గములో ప్రవేశిస్తారు. (4-124)

ప్రతి మతములోనూ స్వర్గ నరకముల ప్రస్తావన కలదు. ప్రజలలో ఎక్కువ శాతము స్వర్గము కొరకు ప్రాకులాడవలెనని ప్రయత్నించుచుందురు. స్వర్గము ఆశతో కూడుకొన్న కోర్కెలాగ మనిషిలో గలదు. దానికి తోడు జ్ఞానబోధకులనువారందరూ జ్ఞానమును, దానివలన వచ్చు పరలోకమును బోధించక స్వర్గమును గురించి ఎక్కువగా బోధించుచున్నారు. స్వర్గములో సుఖముల నిలయము గలదని చెప్పడమేకాక, పురుషులు స్వర్గములో ప్రవేశిస్తే వారికి ప్రత్యేకముగా పరిచర్యలు చేయు అందమైన కన్నెపిల్లలుందురని ముఖ్యముగా చెప్పడము వలన యుక్తవయస్సు వారు, మధ్య వయస్సువారు, ముసలివారు అందరూ స్వర్గమునే కోరుకొనుచున్నారు. కొందరు చెప్పే సుఖములను గురించి చూస్తే స్వర్గము అనేది పవిత్రమైనదా, అపవిత్రమైనదా యను ఆలోచన రాకతప్పదు. ఒక విధముగా చూస్తే స్వర్గము అనునది ఒక వ్యభిచార లోకముగా కనిపిస్తాయున్నది. శారీరక సుఖ కేంద్రముగా కనిపించుచున్నది. అట్లున్నదని బోధించడము వలన, అందరికీ అలాగే అర్థము కావడము వలన ప్రతి మనిషి మనస్సులో స్వర్గచింతన తప్ప దైవచింతన లేకుండా పోయినది.


నేడు స్వర్గమును ఎరగా చూపి, మనుషులను చేపలవలె పట్టుకొని తమ పనులకు వినియోగించుకొనువారు గలరు. 'స్వర్గము' అను ఆశకు ప్రాణములను సహితము లెక్కచేయక చస్తే స్వర్గానికి పోతాము అని అనుకొంటున్నారు. స్వర్గము అనునది అసత్యము అనీ, అది ఎక్కడా లేదనీ, ఎవరికీ తెలియదు. ప్రతి దైవ గ్రంథములోనూ, ప్రతి ధార్మిక బోధలోనూ 'స్వర్గము' అనుమాటను ఇరికించి దానినే ముఖ్యముగా చెప్పడము వలన దైవ గ్రంథములలో దేవుని జ్ఞానముకంటే ముఖ్యముగా స్వర్గమే కనిపించు చున్నది. స్వర్గము కొరకు ఒక్క క్షణము చచ్చినా ఫరవాలేదు, శాశ్వితముగా స్వర్గములో ఉండవచ్చునని కొందరు చెప్పడము వలన, విన్నవారు ''ఒక్క క్షణము కష్టపడి చనిపోయినా శాశ్వితముగా అందమైన స్త్రీల సాంగత్యము లతో సుఖముగా యుండవచ్చును కదా!'' యని చావును వెతుక్కొంటూ పోతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో దేశము కొరకు, దేవుని కొరకు, మతము కొరకు ప్రాణ త్యాగము చేస్తే స్వర్గము వస్తుందని చెప్పడము వలన చాలామంది 'మతము కొరకని', 'దేవుని కొరకని' పేరు పెట్టుకొని ఉగ్రవాద కార్యములను చేయుచూ చనిపోవుచున్నారు. వారు అదే పనిగా స్వర్గము కొరకు చావును వెదకుకొనుచున్నారు. ''ఉగ్రవాదము వలన ఇతరులను చంపవచ్చును తాము చనిపోవచ్చును. ఇతరులు ఎంతమంది చనిపోయినా వారు పరమతము వారయిన దానివలన మేము మతము కొరకు, అల్లాహ్ కొరకు ఇతరులను చంపినట్లగును. తర్వాత మేము స్వర్గమునకు పోవచ్చును'' అని అనుకొనుచుందురు. ఎక్కువ భాగము పురుషులు మతము కొరకు, దేవుని కొరకు చనిపోతే స్వర్గానికి పోవచ్చుననే అనుకొనుచుందురు. అయితే దేవుడు ఎక్కడా అలా చెప్పలేదు. అల్లాహ్ ఏమి చెప్పాడనగా! సూరా నాలుగు, ఆయత్ 124లో చెప్పిన విషయమును చూస్తాము.


(4-124) ''సదాచరణ చేసేవాడు పురుషుడుగానీ, స్త్రీ గానీ అల్లాహ్‍ను విశ్వసించిన వారైయుంటే అలాంటి వారు తప్పకుండా, స్వర్గములో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయము కూడా జరుగదు.''


అల్లాహ్ నుండి వచ్చిన ఈ వాక్యమును చూచిన తర్వాత అందరూ అనుకొనులాగా జరగదని, స్వర్గము పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా వస్తుందని తెలిసిపోయినది. ముఖ్యముగా తెలిసినదేమంటే మతము కొరకో, దేవుని కొరకో చనిపోతే స్వర్గము వస్తుందని అనుకోవడము పూర్తి అసత్యమనీ, కేవలము మంచి పనులు చేయువారికి మాత్రమే స్వర్గము లభించునని చెప్పియున్నారు. మంచి పనులు చేయువారు స్త్రీగానీ, పురుషుడుగానీ ఇద్దరికీ స్వర్గము లభించునని వాక్యములో యుండుట వలన దీనిని గురించి కొంత ఆలోచించవలసిన అవసరమున్నది. స్వర్గ విషయమును గురించి ఆలోచించి చూస్తే ఈ విధముగా తెలియుచున్నది.


పై వాక్యములో 'సదాచరణ' అనునది ముఖ్యముగా యున్నది. మంచి పనులు చేయడమును సదాచరణ అని అనవచ్చును. మనిషి చేయు మంచి పనులుగానీ, చెడు పనులుగానీ ముందే అల్లాహ్ తీర్పు తీర్చి నిర్ణయించి పంపుచుండును. ప్రతి మనిషి చావు ముందే నిర్ణయింపబడి యున్నది అని సూరా మూడు, ఆయత్ 145 (3-145)లో చెప్పియున్నట్లు ప్రతి మనిషి చేయు ప్రతి కార్యమును వాని కర్మపత్రములో వ్రాసి పంపబడియుండును. కర్మపత్రములో అల్లాహ్ నిర్ణయించిన కార్యములేవి కలవో అవి మాత్రమే ఆ మనిషి చేయుచుండును. చావును ముందే నిర్ణయించినట్లు కార్యములను కూడా ముందే నిర్ణయించియుండును. దాని ప్రకారమే పనులు జరుగుచుండును. మనిషి జీవితములో కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు జరుగుచుండును. వాటిని ఆపే దానికి ఎవరి చేత కాదు. ముందే దేవుడు నిర్ణయించిన పనులు అయినందున అవి జరిగి తీరును. అందులో మనిషి ప్రమేయము ఏమీ ఉండదు. నేను చేయను అని ఎవడయినా ఊరక ఉండుటకు వీలులేదు. ఏవి జరుగవలసి యుండునో అవి తప్పక జరిగితీరును. మనిషి మంత్రముగ్ధునివలె ఆ పనులు చేసి తీరును. అందులో ఎవరి ఇష్టము గానీ, అయిష్టము గానీ పని చేయదు.


ఒక మనిషి కర్మపత్రములో అల్లాహ్ వ్రాసి పంపినట్లే పదిమందికి సంబంధించిన ఒక పని జరుగవలసియున్నది. అది ఆగదు కదా! జరిగినది. అల్లాహ్ ప్రతి పనిని ముందే నిర్ణయించియుండును. దానిప్రకారమే మనిషి జీవితములో అన్ని పనులు జరుగుచుండును. పది మందికి సంబంధించిన పని జరిగినప్పుడు ఆ పని వలన పదిమందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున లాభము వచ్చినది. అలాగే చేసిన వానికి కూడా లక్ష రూపాయలు లాభము వచ్చినది. అప్పుడు అతను చేసిన పని పదిమందికి లాభమును చేకూర్చినది. కావున దానిని మంచి పనియని చెప్పవచ్చును. ఈ పనిని మొదటే నిర్ణయించిన వాడు అల్లాహ్‍యే, అలాగే మనిషిలో ఉండి కార్యకర్తగా చేసినవాడు అల్లాహ్‍యే. సూరా ఆరు, ఆయత్ 102 (6-102) ప్రకారము అల్లాహ్ ప్రతి కార్యమును చేయుచున్నాడు. ఈ కార్యములో అంతా అల్లాహ్ ప్రమేయమేగానీ, మనిషి ప్రమేయము ఏమీ లేదు. అయితే అంతా మనిషి ప్రమేయము వలననే ఈ కార్యము జరిగినది అన్నట్లు తెలియుచున్నది. మనిషి జరుగుచున్న పనిని అంతా చూచాడు. తన శరీరముతోనే తాను చేసినట్లు అనుభూతిని పొందాడు. ఆ పనిని చేయడములోని కొంత కష్టమును అనుభవించాడు. అందువలన ఆ కార్యమును నేనే చేశాను అని మనిషి అనుకొంటున్నాడు. బయట చూచే వారికి కూడా ఆ మనిషే చేసినట్లు కనపడినది. అటువంటప్పుడు చేసిన మనిషి ఆ పనిని నేనే చేశాను అని అంటాడు. చూచినవాడు కూడా ఆ మనిషే చేశాడు అని అంటాడు. ఆ పనిని అల్లాహ్ చేశాడని గానీ, అల్లాహ్ నిర్ణయించిన పనియని గానీ ఎవరికీ తెలియదు. అల్లాహ్ కనిపించి చేయడము లేదు. అల్లాహ్ ఎవరికీ కనిపించడు. అల్లాహ్‍కు సంబంధించిన జ్ఞానము తెలియనివాడు అల్లాహ్ విషయమును పూర్తిగా మరచిపోయి, జరిగే కార్యములన్నీ నేనే చేశాను అని అనుకొంటున్నాడు. కార్యము జరిగే వరకు అది మనిషి జీవితములో అల్లాహ్ చేసే కార్యమే. అయితే మనిషి నేనే చేయుచున్నాను అని ఎప్పుడు అనుకొంటున్నాడో అప్పుడు అది వాడు చేసినట్లే లెక్కించ బడును. అల్లాహ్ జ్ఞానము తెలిసి అల్లాహ్‍యే చేశాడు అని అనుకొని యుంటే అది వాని ఖాతాలోనికి పడేది కాదు. అట్లు కాకుండా ఆ పనిని నేనే చేశాను అని అహము భావమును పొంది అనుట చేత అది వాడు చేసినట్లే యగుచున్నది.


అలా అనుకోవడము సులభమే అయితే దానివెనుక జరుగు కార్యము పెద్దది. అంతపెద్ద కార్యము ఏమి కలదని ప్రశ్నించిన, దానికి జవాబు ఈ విధముగా గలదు. ఎప్పుడయితే జరిగిన పని మనిషి ఖాతాలోనికి వస్తున్నదో అప్పుడే అది మంచి పనియైతే దానివలన పుణ్యమూ, చెడు పనియైతే దానివలన పాపము ఆ మనిషి లెక్కలోనికి వచ్చి చేరును. ఇప్పుడు జరిగినది పదిమందికి ఉపయోగపడిన పని, పది మందికి లక్ష రూపాయలు వచ్చునట్లు జరిగిన పని అయినందున నేను చేశాను అని అనుకొన్న మనిషికి పుణ్యము వచ్చినది. ఈ విధముగా ప్రతి కార్యములోనూ మనిషి భావమును బట్టి ఉండును. మనిషి అల్లాహ్ జ్ఞానము తెలిసి నేను ఏమాత్రము చేయలేదు. నా శరీరములోయున్న దేవుడే (6-102) వాక్యము ప్రకారము కార్యకర్తగా చేశాడు అని అనుకొంటే వానికి ఆ పనిలోని పాపముగానీ, పుణ్యముగానీ రాదు. ఇది దైవ నిర్మితమైన కర్మ సిద్ధాంతము. దీనిప్రకారమే ప్రతి మనిషికీ, ప్రతి జీవికీ జరుగుచుండును. ఒక మనిషి పాపాత్ముడుగానీ, పుణ్యాత్ముడుగానీ అగుటకు వానిలోని అహంభావమే కారణము. అహమ్ భావము వలన జరిగెడి ప్రతి పనిని నేనే చేశానని అనుకోవడము, దానివలన కర్మను సంపాదించుకోవడము జరగుచున్నది. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే వాని శరీరములో జరుగవలసిన పనులను నిర్ణయము చేసి పంపియుండును. ఆ లిఖితము అంతయూ మనిషిలోనే నిక్షిప్తమై యుండును. కాలము జరుగుకొద్దీ ఎప్పుడు ఏమి జరుగవలెనని నిర్ణయ ముండునో అది జరుగుచూవచ్చును. అక్కడే మనిషి కర్మలలో (పాప పుణ్యములలో) చిక్కుకోవడముగానీ, చిక్కుకోకపోవడముగానీ వాని భావమును బట్టి జరుగుచుండును.


మనిషి జీవితములో కష్టసుఖములను అనుభవించుట కొరకు కొన్ని మంచి చెడు పనులు జరుగునట్లు దేవుడు నిర్ణయించియుండును. దేవుడు శరీరములోయుండి, శరీర అవయవముల చేత ఆ పనులు చేయునప్పుడు అందులో యున్న సుఖమునుగానీ, బాధనుగానీ మనిషి అనుభవించు చుండును. అలా అనుభవించుటకే ఆ పనులను దేవుడు నిర్ణయించి వ్రాసిపెట్టాడు. కర్మపత్రములో వ్రాయబడిన కర్మరీత్యా ఆ పనులు జరుగుచుండును. జరుగుచున్నప్పుడు అనుభూతిని జీవుడే పొందవలసి యున్నది. దాని ప్రకారమే దేవుడు పని చేయుచుండగా, జీవుడు దాని అనుభవమును అనుభవించుచుండును. దైవజ్ఞానము తెలిసిన వానికి ఇదంతయూ తెలిసియుండును. అటువంటి వాడు జరిగెడి పనులకు నేనే కారణమని గానీ, నేనే చేయుచున్నాననిగానీ అనుకోడు. అటువంటి వానికి పాపము గానీ, పుణ్యముగానీ క్రొత్త కర్మ ఏదీ రాదు. అటువంటి విధానము తౌరాతు (భగవద్గీత) గ్రంథములోనూ, ఇంజీలు (బైబిలు) గ్రంథములోనూ, అట్లే ఖుర్ఆన్ గ్రంథములోనూ చెప్పబడియున్నది. అయినా మనిషి మతము, మత సాంప్రదాయములు అను వాటిమీద గల శ్రద్ధను, దేవుని జ్ఞానము మీద చూపడము లేదు. దైవ గ్రంథములలో ఏమి చెప్పారని చూడడము లేదు. ఖుర్ఆన్ గ్రంథములో (6-102) వ ఆయత్‍ను ఒక్కదానిని అర్థము చేసుకోగలిగితే తాను ఏమీ చేయలేదనీ, అంతా దేవుడే చేస్తున్నాడని తెలియ గలదు.


మనిషి తానే చేశానని, ఏ పనిని చేసినా అందులో కనిపించే ఫలితము, కనిపించని ఫలితము అని రెండు రకముల ఫలితములుండును. మనిషి ఒక పనిని చేస్తే దానికి కనిపించే ఫలితముగా ధనము లభించును. కనిపించేది పది మందికి పది లక్షలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ప్రకారము దొరికినది. అట్లే చేసిన మనిషికి కూడా లక్ష రూపాయల ఆదాయము వచ్చినది. మనిషి తాను పని చేశానని తలచడమే కాకుండా, కనిపించే ఫలితమును చూచి నేను సంపాదించాను అని మురిసిపోవుచున్నాడు. కనిపించే ఫలితమునే చూచాడుగానీ, కనిపించని ఫలితమైన పాపపుణ్యము లను లెక్కచేయలేదు. మనిషి నిత్యము జరిగే పనులలో అహమును పొందడము, కర్మను పొందడము జరుగుచున్నది. ఎవడయితే అహమును పొందడో వాడు పాపపుణ్య కర్మలను కూడా పొందడు. అయితే అది జ్ఞానము తెలిసిన వానికే సాధ్యమగును.


నేడు జ్ఞానము తెలిసినవాడు అంటే ఏమిటో తెలియదుగానీ, మనిషి దేవున్ని విశ్వసించి నమాజ్ (ప్రార్థన) చేయగల్గితే వాడు జ్ఞానియైనట్లే లెక్కింతురు. దేవుని మీద విశ్వాసము ప్రార్థన (నమాజ్) చేయడము బయటి జ్ఞానమగునుగానీ, శరీరము లోపలి జ్ఞానము కాదు. శరీరము లోపల జ్ఞానము తెలిస్తే మనిషి (జీవుడు) కర్మలను (పాపములను) అంటించుకోడు. శరీరము లోపలి జ్ఞానము తెలియకపోతే దేవుడు చేసే పనిని నేనే చేశాను అని అనుకోవడము జరుగును. దానివలన మనిషి క్రొత్త కర్మలను సంపాదించుకొనును. నేడు ముస్లీమ్ సమాజములో బయటి జ్ఞానము తప్ప లోపలి జ్ఞానమును తెలిసినవారు ఎవరూ లేరు. అందువలన కర్మను తప్పించుకోక, దానిని మూటకట్టుకుంటున్నారు.


పుణ్యమును ఎవరు సంపాదించుకొనినా వారికి స్వర్గము లభించుననుట వాస్తవమే. వాక్యములో సత్కార్యములు చేసే స్త్రీలయినా, పురుషులయినా స్వర్గములో ప్రవేశిస్తారు. వాస్తవముగా మూడు దైవ గ్రంథములు ఒకే జ్ఞానమునే బోధించుననుటకు గుర్తుగా మూడు దైవ గ్రంథములలోనూ స్వర్గ నరకముల ప్రసక్తి కలదు. చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో స్వర్గ నరకములను గురించి ఎక్కువగా చెప్పియున్నారు. అందువలన ఇందులోని వాస్తవమును తెలియగలిగితే స్వర్గము, నరకము రెండూ అర్థము కాగలవు. మంచి పనులు శరీరములో దేవుడే చేస్తున్నా దానిని మనుషులు తెలియక జరిగే పనులన్నీ తానే చేయుచున్నానని అనుకోవడము వలన వారికి పుణ్యము వస్తున్నది. ఇది కర్మ విధాన పద్ధతి. దేవుడు ఏర్పరచిన కర్మ సిద్ధాంతము ప్రకారము అహము వలన చేయుచున్న పనిలోని పాపమయినా లేక పుణ్యమయినా మనిషికి చేరుచుండును. అహము పురుషులకయినా, స్త్రీలకయినా రావచ్చును. అందువలన స్త్రీలకయినా, పురుషులకయినా కర్మ చేరుచుండును. మంచి పని జరిగినప్పుడు నేనే ఈ పనిని చేశానని ఒక స్త్రీ అనుకొంటే ఆమెకు పుణ్యము చేరును. చేరిన పుణ్యమును అనుభవించుటకు స్త్రీ కూడా స్వర్గమునకు పోవలసివచ్చును. పాపపుణ్యములు కర్మ సిద్ధాంతము ప్రకారము అహము లేని మనిషికి చేరవు. అహము గల మనిషికి స్త్రీకయినా, పురుషునికయినా చేరును. అందువలన స్త్రీ పురుషులు ఇరువురు వారు చేసుకొన్న కర్మప్రకారము స్వర్గము మరియు నరకమును అనుభవించవలసి వచ్చును. అలా స్వర్గ, నరకములకు పోకుండా పరలోకమునకు మనిషి పోవాలనునదే దైవజ్ఞానము.


దైవ జ్ఞానమున్నవాడు ఎవడయినాగానీ కర్మ అంటని విధానమును ఆచరించును. పాపమును సంపాదించుకొన్న తర్వాత ప్రార్థన చేసినా అది పోతుందను నమ్మకము లేదు. అందువలన శరీరములోని జ్ఞానమును తెలిసి పాపపుణ్యములను అంటకుండా చేసుకోవడమే మంచిది. ఒకవేళ స్వర్గమును పొందిన తర్వాత పురుషులకు గానీ, స్త్రీలకు గానీ సుఖములు సమానముగా యుండును. అయితే స్వర్గ సుఖములను గురించి అట్లే నరక కష్టముల గురించి ఖుర్ఆన్ గ్రంథములో కొంత వివరించారు. అయితే దానిని అర్థము చేసుకోవలసిన విధముగా మనుషులు అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ఉదాహరణకు పుణ్యము సంపాదించుకొన్న వాడు స్వర్గమునకు పోతాడు అని చెప్పుకొంటున్నారు. అయితే స్వర్గము అనునది ఎక్కడున్నది? ఎంతదూరము పోతున్నాము? స్వర్గము అనునది ప్రత్యేకమైన లోకమా? అక్కడ సుఖాలను అందించి సేవలు చేయు మనుషులు మనుషులా కాదా! వారు మనవలె పుట్టారా లేదా? వారు స్వర్గములో ఎందుకు పని చేయుచున్నారు? సుఖాలు అందించే అందమైన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వారు ఎందుకు మనుషులకు సేవ చేయుచున్నారు? పురుషులకు స్త్రీల వలన సుఖాలు అందితే, స్త్రీలకు సుఖాలు ఎట్లు అందుతున్నాయి? అను ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలిసినప్పుడు స్వర్గ నరకములంటే ఏమిటో తెలియగలవు.


''సదాచారము చేసిన స్త్రీ పురుషులు స్వర్గములో ప్రవేశిస్తారు'' అని ఉంది. ''వారికి రవ్వంత కూడా అన్యాయము జరుగదు'' అని ఉంది. అంటే పురుషులకు ఎటువంటి సుఖములు గలవో, స్త్రీలకు కూడా అవే సుఖములు అందించబడును, న్యాయముగా సుఖములను ఇవ్వడము ఉండును. అందులో కొంత మాత్రమయినా అన్యాయము జరుగదు అని చెప్పారు. అలా చెప్పడము వలన పుణ్యమును బట్టి పురుషునికి ఎంత సుఖము ఉండునో అంతే సుఖము స్త్రీకి కూడా ఉండును. అట్లే ఒక కష్టము పురుషునికి ఎంత ఉండునో, అంతే కష్టము స్త్రీలకు కూడా ఉండును అని అర్థమగు చున్నది. గ్రంథములో స్వర్గ సుఖములను గురించి వ్రాసియున్నారు. అయితే అవి అర్థము చేసుకొనుటకు వ్రాసినవేగానీ వాస్తవముగా అట్లే ఉండదు. స్వర్గము అనునది ప్రత్యేకమయిన లోకము కాదు. అందరి భావములో స్వర్గము, నరకము వేరువేరు లోకములు అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి ఆ రెండు లోకములే కాదు. అయినా అర్థము చేసుకోవడానికి 'లోకములు' అని గ్రంథములో చెప్పారు. వాస్తవముగా స్వర్గనరకములు మనమున్న చోటే కలవు.


ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో స్వర్గము ఒక లోకమని వ్రాశారు. అక్కడ పురుషులకు సపరిచర్యలు చేయడానికి అందమైన స్త్రీలు, కన్యలుగా యున్న స్త్రీలు గలరని చెప్పారు. పురుషులకు ప్రత్యేకించి అందమైన స్త్రీలు ఉన్నారని చెప్పినప్పుడు, రవ్వంత కూడా అన్యాయము జరుగకుండా స్త్రీలకు కూడా పరిచర్యలు చేయడానికి అందమైన చిన్నవయస్సులోని అబ్బాయిలు ఉండవలెనని చెప్పవచ్చును. గ్రంథములో అమ్మాయిలు ఉన్నారని చెప్పిన ఆయత్‍లు గలవు. అట్లే అబ్బాయిలు ఉన్నారని చెప్పిన వాక్యములు కూడా గలవు. అవి అట్లు వేరే లోకములో ఉండవచ్చునేమో గానీ, మీరు చెప్పినట్లు భూమిమీద స్వర్గము నరకము ఉంది అంటే వాక్యములో చెప్పినట్లు పరిచర్యలు, సేవలు చేసే అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ ఉండరు కదా! దీనికి మీరేమంటారు?


జవాబు :- గ్రంథములో ఎన్నో స్వర్గ సుఖములను వర్ణిస్తూ ఆ వర్ణణలో కొన్ని వాక్యములయందు అందమైన స్త్రీలు ఉంటారని, వారితో వివాహము జరిపిస్తామని మగవారికి చెప్పినట్లు కలదు. అక్కడ అమ్మాయిల విషయములో చెప్పినది చూస్తే (37-48, 49) వారి చూపులు క్రిందికి వాలియుండే పెద్దపెద్ద కన్నులు గల మగువలు ఉంటారు. (49) వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా కోమలముగా, స్వచ్ఛముగా ఉండే స్త్రీలు ఉంటారు.''


(55-58) ''ఆ స్వర్గ కన్యలు అందచందాలరీత్యా స్వచ్ఛమైన కెంపులు పగడాల మాదిరిగా ఉంటారు.''


(44-54) ''పెద్ద పెద్ద కన్నులుగల అందగత్తెలతో మేము వారి వివాహము జరిపిస్తాము.''


ఈ మూడు వాక్యములను చూచిన తర్వాత పురుషులు సంతోష పడుటకు స్వర్గములో స్త్రీలు ఉంటారని అర్థమగుచున్నది. స్త్రీలను పురుషులతో వివాహము చేస్తామని కూడా చెప్పియున్నారు. ఇది పురుషులకు జరిగే పనియైతే కొద్దిమాత్రము కూడా అన్యాయము జరుగని ఆడవారి విషయములో వారి సేవలు చేయడానికి అందమైన అబ్బాయిలు, యవ్వనములో యున్న అబ్బాయిలు ఉన్నారని చెప్పిన వాక్యములు కూడా గలవు. వాటిలో ఏమి చెప్పారో చూస్తాము.


(52-24) ''వారి సేవలో భద్రముగా దాచబడిన ముత్యాలలాంటి కుర్రాళ్లు తిరుగుతూ ఉంటారు.''


(76-19) ''వారి చుట్టూ నవనవలాడే పిన్నవయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వారు నిత్యము అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూచినప్పుడు చెదిరిన ముత్యాలా అని భావిస్తావు.''


ఈ రెండు వాక్యములలో అబ్బాయిలను గురించి చెప్పారు. పై వాక్యములు రెండు పురుషులకు అని తెలిసిపోయినది. అక్కడ అందమైన స్త్రీలు మగవారి సేవలు చేయుటకు ఉంటే ఇక్కడ అబ్బాయిలు ఆడవారి సేవకు ఉన్నట్లు అర్థమగుచున్నది. చాలామంది బోధకులు అలాగే బోధిస్తారు. పురుషులకు అందమైన స్త్రీల ఆశను, స్త్రీలకు అందమైన అబ్బాయిల ఆశను కల్పించి దాని కొరకు స్వర్గానికి పోవాలంటే మతము కొరకు, దేవుని కొరకు చనిపోయిన ఎవరికయినా స్వర్గము వచ్చునని చెప్పుట వలన స్వర్గము మీద ఆశ కల్గిన వారిని ఉగ్రవాదులుగా మార్చి ఇతరులను చంపమని చెప్పి ఆ కార్యములో చనిపోతే స్వర్గము వచ్చునని, స్వర్గ లోకానికి పోతారని చెప్పడము వలన అది సత్యమని నమ్మిన వారు అనవసరముగా ఇతరులను చంపి, వారు చనిపోవుచున్నారు. అయితే చనిపోయిన తర్వాత వారికి విన్నదంతా అసత్యమని తెలుస్తుంది. ఖుర్ఆన్ దైవ గ్రంథములో వ్రాసినది ఎలా అసత్యమగునని కొందరికి అనుమానము రావచ్చును. దానికి జవాబు ఏమనగా!


గ్రంథములో చెప్పినది వాస్తవమే. అయితే అక్కడ చెప్పిన వాక్యములను అర్థము చేసుకోలేక వాక్యములోని విషయమును ఏదో లోకములో ఉందని అనుకోవడము చేత పొరపడుటకు అవకాశము గలదు. స్వర్గము, నరకము ప్రత్యేక లోకములు అనుకోవడమే పెద్ద పొరపాటు. ఈ విషయము అర్థము కావాలంటే మరణము తర్వాత ఏమి జరుగుచున్నదో, జరిగేది ఎక్కడ జరుగుచున్నదో, ఎప్పుడు జరుగుచున్నదో వీటికి జవాబును తెలియగలిగితే స్వర్గము, నరకము ప్రత్యేక లోకములు అని అనుకోవడమే తప్పుయని, స్వర్గ నరకములు లోకములు కావని తెలియుచున్నది. స్వర్గము నరకము రెండు అనుభవములు అని తెలియవలెను. మనిషి సుఖమును అనుభవించితే అదే 'స్వర్గము', అట్లే మనిషి కష్టములు అనుభవించితే ఆ అనుభవమునే 'నరకము' అను పేరుతో చెప్పుచున్నాము. మనిషి యొక్క అనుభవముల భేదములను రెండుగా చెప్పుచున్నాము. ఆ రెండే స్వర్గ నరకములు. భూమిమీద మనిషి అనుభవములలో స్త్రీలతో కలిసి తిరగడము, అందమైన స్త్రీలు దగ్గరుండి సేవలు చేయడము జరిగినప్పుడు జీవుడు అనుభవించు సుఖ అనుభవములను స్వర్గము అను పేరుతో చెప్పవచ్చును. అంతేగానీ అది లోకము కాదు.


మంచి అనుభూతిని స్వర్గము అనీ, చెడు అనుభూతిని నరకము అని అంటున్నాము తప్ప ఆ రెండూ ప్రత్యేకమయిన లోకములు కావు. ఈ రెండు అనుభూతులను మనిషి పుట్టినప్పటి నుండి అనుభవించుచున్నాడు. స్వర్గ, నరక అను రెండు అనుభవములు నిత్యము భూమిమీద మనుషుల జీవితములలోనే జరుగుచున్నవి. అందువలన భూమిమీదనే మనిషి శరీరములోనే స్వర్గ, నరకములనునవి కలవని చెప్పవచ్చును. మనిషి శరీరములో సుఖ, దుఃఖములను అనుభవించువాడు జీవుడు. సుఖ (స్వర్గ), దుఃఖ (నరక)ములను జీవునికి అందించువాడు శరీరములో యమధర్మ రాజుగాయున్న ఆత్మేనని తెలియవలెను. (3-18) వాక్యము ప్రకారము శరీరములోని ఆత్మే మనుషులు ఆరాధించవలసిన దేవుడుగా యున్నాడు. ప్రథమ దైవగ్రంథములో ''దండనాధికారులలో యమున్ని నేనే'' అని చెప్పినట్లు శరీరములోని ఆత్మే యమునిగా కూడా యున్నది. ఆత్మ అన్ని పనులను శరీరములోని అవయవముల చేత చేయిస్తూ ఆ పనులలో లభించు సుఖ దుఃఖములను జీవునికి బుద్ధి ద్వారా చేర్చగా జీవుడు తనకు బుద్ధి ద్వారా లభించిన కష్ట సుఖములను అనుభవించుచున్నాడు. ప్రతీ సుఖమును మనిషి (జీవుడు) శరీరములోనే అనుభవించుచున్నాడు. అట్లే ప్రతి దుఃఖమును శరీరములోనే అనుభవించుచున్నాడు శరీరములో కష్టసుఖము లను ఇచ్చుటకు ఆత్మ అధిపతిగా యుండగా మనస్సు సుఖ దుఃఖములను బుద్ధికి అందివ్వగా, బుద్ధి తన ప్రక్కనేయున్న జీవునికి అందించుచున్నది. దీనినిబట్టి శరీరములోనే యముడు అయిన ఆత్మ ఉండగా, సుఖ దుఃఖముల అనుభవములను అందిచు యమభటులు అయిన మనస్సు, బుద్ధి శరీరములోనే ఉండగా, నీ శరీరములోనే స్వర్గమును, నరకమును అనుభవించుచున్నావు.


ఎక్కడ వెదకినా బయట కనిపించని స్వర్గము, నరకము రెండు శరీరములోనే కనిపించుచున్నవి. మనిషి అనుభవించు అనుభవములే స్వర్గ నరకములు. సుఖ దుఃఖ రెండు అనుభవములు. జీవుడుండేది శరీరములో, అనుభవించేది శరీరములో అందువలన శరీరములోనే సుఖ దుఃఖముల అనుభవములయిన స్వర్గ, నరకములు రెండూ కలవని చెప్పవచ్చును. మరణములో తీర్పు (జడ్జిమెంట్) జరిగేది శరీరములోనే. ఆ తీర్పు ప్రకారము జీవితములో శరీరములోనే సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు. మంచి పనులుగానీ, చెడు పనులుగానీ జరిగేది శరీరములోనే. ప్రతి మనిషికి ఆడగానీ, మగగానీ ఎవరికయినా న్యాయబద్దముగా తీర్పు జరుగును. రవ్వంత కూడా అన్యాయము జరుగదు. తీర్పు చేయువాడు దేవుడయిన ఆత్మే అయినందున ప్రతీ చిన్న కర్మను కూడా అహమును బట్టి నిర్ణయించి తీర్పు చేయును. మనుషులుగా పుట్టిన స్త్రీ అయినా, పురుషుడయినా శరీరములో జీవుడుగానే యున్నాడు. ఆత్మ శరీరములో ఏ జీవునికి కొద్దిగా కూడా అన్యాయము చేయక, సుఖ దుఃఖము లను నిర్ణయించి పంపుచున్నది. అందువలన (4-124) వాక్యములో ''ఎవరికీ రవ్వంత కూడా అన్యాయము చేయడు'' అని చెప్పియున్నారు. కర్మను (పాపపుణ్యములను) బట్టి స్త్రీలకయినా, పురుషులకయినా ఒకే తీర్పు విధానము ఉండును. అందువలన స్త్రీ పురుషులకు ఇరువురికీ సమానమైన అనుభవములుండును. ఏ అనుభవమైనా శరీరములోనే ఉండును. అందువలన స్వర్గ నరకము ఏది అయినా అది శరీరములోనే కలదనీ, శరీరము బయట లేదని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

32. చాలామంది ప్రవక్తల వద్దకు మేము వహీని పంపుచున్నాము. (4-163)

వహీ అనగా వాణి అని అర్థము. వాణి అనగా శబ్దము అని అర్థము. శబ్దము అనగా వినపడునదని అందరికీ తెలుసు. వినపడే శబ్దము పెద్దది కావచ్చు లేక చిన్నది కావచ్చు లేక మధ్యరకము కావచ్చును. సృష్ఠ్యాదిలో దేవుడు సృష్ఠిని అంతటినీ తయారు చేసి, మనుషులకు దైవ జ్ఞానమును అందివ్వాలని తలచి ఆకాశము ద్వారా శబ్దమును పుట్టించి ఆ శబ్దముతో జ్ఞానమును చెప్పడమైనది. ఆకాశము ద్వారా వచ్చిన శబ్దమునే తెలుగులో వాణి అన్నారు. అరబ్బీ భాషలో 'వహీ' అన్నారు. వాణి అనగా శబ్దము అని అర్థము. దానినే ఆకాశ వాణి అని అనడము కూడా జరిగినది. ఆకాశము నుండి పుట్టిన శబ్దమును ఆకాశవాణి అని అన్నారు. ఆ శబ్దములో దైవజ్ఞానము ఇమిడియున్నదని చెప్పుచున్నాము. దైవజ్ఞానము ఇమిడియున్న శబ్దము ఆకాశము నుండి వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దములుగా వచ్చినది. ఆ విధముగా వచ్చిన శబ్దములు జ్ఞానముతో కూడినవైనా అవి మనుషులకు అర్థము కాలేదు. శబ్దములు అందరికీ వినిపించినా అందులో దైవజ్ఞానము యున్నదని ఏమాత్రము ఎవరికీ తెలియదు. సష్ఠ్యాదిలో చెప్పబడిన జ్ఞానమే ప్రతి సంవత్సరము ఆకాశ శబ్దము ద్వారా చెప్పబడుచున్నది. అలా వినిపించెడి శబ్దము పెద్ద శబ్దములుగా ఉన్నవని చెప్పుకొన్నాము. ఆ శబ్దములనే మేఘముల ఉరుములు అని అంటున్నారు. మేఘము తన ఉరుముల ద్వారా పుట్టించిన శబ్దములు ఆకాశము నుండి వచ్చుచున్నవి. అలా మొదట వచ్చిన జ్ఞానముతో కూడిన శబ్దములలోని జ్ఞానమును ఆకాశములో యున్న సూర్యగ్రహము గ్రహించగలిగినది. అందువలన సూర్యునికే ఆకాశ వాణి జ్ఞానము పూర్తిగా తెలిసినది.


ఆకాశము రెండు రకములు గలదు. ఒకటి కనిపించని ఆకాశము, రెండు కనిపించే ఆకాశము. ఆకాశము శూన్యమని, అది కనిపించదని అందరికీ తెలుసు. అయితే రెండవది కనిపించే ఆకాశమును అందరూ చూస్తున్నా ఇది కనిపించే ఆకాశమని ఎవరికీ తెలియదు. ఆకాశము యొక్క రెండవ ఆకారము మేఘములు. మేఘములు ఆకాశములో ఒక భాగము. ఆకాశము యొక్క శబ్దము మేఘముల నుండి ఉరుముల రూపములో పెద్దపెద్ద శబ్దములుగా వచ్చినది. ఉరుములలో వచ్చిన జ్ఞానమును సూర్యుడు తెలియగలిగి దానినే భూమిమీద చాలామంది ప్రవక్తలకు తెలియునట్లు చేశాడు. ఆకాశము నుండి వచ్చిన శబ్దమును, దానిలోని జ్ఞానమును సూర్యుడు తెలియగలిగి దానినే భూమిమీదికి మొదట ఒక మనిషికి చేర్చగా, ఆ తర్వాత ఆ మనిషి ద్వారా మిగతా మనుషులకు తెలియబడినది. అట్లే భూమిమీద ప్రవక్తలందరికీ వహీ జ్ఞానము తెలియబడినది. ఏ ప్రవక్తకు జ్ఞానము చేరవేయబడినా అది సృష్ఠ్యాదిలో అల్లాహ్ (దేవుడు) ఆకాశవాణి ద్వారా చెప్పిన జ్ఞానమేయని తెలియవలెను.


ఆకాశవాణి ద్వారా చెప్పబడిన జ్ఞానము మొదట గ్రంథరూపములో లేదు. మొదట శబ్దముల రూపములో వచ్చిన జ్ఞానమును సూర్యుడు గ్రహించి దానినే శబ్దముల నుండి మాటల రూపములోనికి మార్చి చెప్పాడు. అలా మాటల రూపములో యున్న జ్ఞానము ద్వాపరయుగము చివరిలో, కలియుగము ప్రారంభములో గ్రంథరూపమైనది. అంతవరకు గ్రంథ రూపముగా లేని దానిని "జపర" జ్ఞానము అని చెప్పేవారు. మాటల రూపములో యున్న జ్ఞానము ''జపర'' అను పేరుతో పిలువబడేది గానీ, అది గ్రంథము పేరు కాదని తెలియవలెను. 'జపర' అను పదము కాలక్రమమున 'జబుర' అను పేరుగా మారిపోయినది. మొదట గల జపర అను పేరు ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొని యుండేది. తర్వాత మారిన పేరుకు అర్థము లేకుండా పోయినది. ''జపర'' అను పేరులో రెండు భాగములు కలవు. జ+పర=జపర అయినది. 'జ' అనగా పుట్టుట అని అర్థము. 'పర' అనగా వేరు అని అర్థము. 'జపర' అనగా పుట్టిన దానికంటే వేరయినది అని అర్థము. సృష్ఠి ఆదిలో సమస్తము సృష్ఠింప బడినది. సృష్ఠింపబడినది అంతా ప్రపంచమే, ప్రకృతికి సంబంధించినదే అయిన దానివలన దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకృతికంటే వేరయినది అగుట వలన దానిని జపర అని అన్నారు. దేవుని జ్ఞానము మాటల రూపములో యున్నప్పుడు జపర అని అనెడివారు. తర్వాత ద్వాపరయుగము చివరిలో జపర జ్ఞానము గ్రంథరూపమైనది. గ్రంథ రూపమైన జ్ఞానమును అల్లాహ్ స్వయముగా తౌరాత్ అని చెప్పాడు. అదే గ్రంథమును మనుషులు భగవద్గీతయని అన్నారు. అయితే దేవుడు గ్రంథరూపమైన జ్ఞానమును మోషే ప్రవక్తకు (మూసా ప్రవక్తకు) ఇచ్చినప్పుడు ఇది తౌరాతు గ్రంథమని చెప్పాడు.


నేడు తౌరాతు గ్రంథమే భగవద్గీతయనీ, భగవద్గీతయే జపర జ్ఞానమని చాలామందికి తెలియదు. ఈ విషయములు తెలియనివారు జపర పేరుమారి జబుర అను పేరుతో యుండగా, జబురను గ్రంథమని అనుకొంటున్నారు. జపర గానీ, జబుర గానీ గ్రంథము కాదని తెలియవలెను. మొదట జపర జ్ఞానము గ్రంథరూపముగా మారినది. అయినా ఇదే జ్ఞానమే వేరువేరు విధానముల చేత, వేరువేరు ప్రవక్తలకు అందివ్వబడినది. ఎవరికి అందించినా, ఎంతమందికి ఇచ్చినా, ఎంత కాలము వరకైనా సృష్ఠి మొదటిలో చెప్పిన జ్ఞానమే గానీ వేరే జ్ఞానమంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమే జపరగా ఉంటూ తర్వాత జబుర అయినది. ఆ తర్వాత భగవద్గీతగా పిలువబడినది తర్వాత అదే తౌరాతుగా పిలువబడినది. ఆ తర్వాత ఇంజీలుగా ఏసు దగ్గరకు వచ్చినది. ఇప్పుడు అంతిమ దైవ గ్రంథముగా వచ్చిన జ్ఞానము కూడా సృష్ఠ్యాదిలో వహీ ద్వారా వచ్చిన జ్ఞానమే. మొదట వహీ (వాణి) ద్వారా వచ్చిన జ్ఞానమే అనేక రకముల, అనేక విధముల, అనేక ప్రవక్తల వద్దకు చేరినది. ఎక్కడ చేరినా, ఎవరి వద్దకు చేరినా అది మొదట ఆకాశము నుండి వాణి (వహీ) రూపములో వచ్చిన జ్ఞానమేయని తెలియ వలెను. అందువలన ఈ విషయమును తెలుపు నిమిత్తము సూరా నాలుగు, ఆయత్ 163 లో ఈ విధముగా చెప్పారు చూడండి.


(4-163) ''(ఓ ప్రవక్తా!) మేము నూహ్ వైపు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తల వైపు దివ్యవాణి పంపినట్లే, నీ వైపుకు కూడా దివ్యవాణి (వహీ)ని పంపాము. ఇంకా మేము ఇబ్రహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకోబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులేమాన్‍ల వైపుకు కూడా దివ్యవాణిని పంపాము. ఇంకా మేము దావూదుకు జబూర (గ్రంథాన్ని) ఇచ్చాము.''


ఈ వాక్యములో ఎంతమందిని చెప్పారో అంతమంది దగ్గరకు వహీ ద్వారా వచ్చిన జ్ఞానమునే పంపాము అని చెప్పారుగానీ, వేరే ఏదీ చెప్పినట్లు లేదు. గతములో ప్రవక్తలందరికీ చెప్పినది ఒకే ఒక జ్ఞానము. అదే సృష్ఠ్యాదిలో దేవుడు వహీ ద్వారా చెప్పిన జ్ఞానము. రాబోవు కాలములో కూడా ఎవరికి చెప్పినా అదే జ్ఞానమునే అందించును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

33. నమాజ్‍ను నెలకొల్పండి. (4-103)

వాస్తవముగా వాస్తవమునే చెప్పుతాను. అవాస్తవమును చెప్ప వలసిన అవసరము నాకు లేదు. సత్యమును బోధించడము దేవుని సేవ యగును. అందువలన అల్లాహ్ జ్ఞానమును గురించి ఎవరు ఏమనుకొన్నా ఫరవాలేదు. వారికి అర్థము కాకపోయి నన్ను అపార్థము చేసుకొన్నా ఫరవాలేదు. అల్లాహ్ దృష్ఠిలో నేను సత్యమును చెప్పువానిగా ఉండవలెను. ఇతరుల దృష్ఠిలో నేను అసత్యమును చెప్పువానిగా కనిపించినా వారు నాకు మోక్షమును (పరలోకమును) ఇవ్వరు. పరలోకమును ఇచ్చువాడు అల్లాహ్ ఒక్కడే. అందువలన అల్లాహ్ దృష్ఠిలో నేను సత్యమును బోధించు వానిగా ఉండవలెనని తలచుచున్నాను. మనిషి జీవితములో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ''నమాజ్''. నమాజ్ అను పదము మరియు అల్లాహ్ అను రెండు పదములు స్వచ్ఛమయిన తెలుగు పదములు. పూర్వము ప్రపంచములో మొదటి భాష తెలుగు భాష. తెలుగు భాష నుండే మిగతా భాషలు పుట్టాయని చెప్పవచ్చును. కాలక్రమములో కొన్ని తెలుగు పదములు మిగతా అనేక భాషలలో చేరిపోవడము జరిగినది. అలా అరబ్బీ భాషలో చేరిపోయిన ముఖ్యమైన పదములు అల్లాహ్, నమాజ్. మిగతా కొన్ని తెలుగు పదములు అరబ్బీ భాషలోయున్నా అన్నిటికంటే ముఖ్యమైనవి దేవుడు (అల్లాహ్), దేవుని ఆరాధన (నమాజ్).


నేడు ఇస్లామ్ లో అల్లాహ్ అను పదమును, నమాజ్ అను పదమును తెలియని ముస్లీమ్‍లు ఎవరూ లేరు. ఈ రెండు పదములు అందరికీ తెలిసినా పూర్వము ఈ రెండు పదములు తెలుగు భాషలో పుట్టిన పదములని ముస్లీమ్‍లకు ఎవరికీ తెలియదు. తెలుగు భాషలో ప్రతి పదము భావముతో కూడుకొన్న పదమైయుండును. పదములోని శబ్దమును బట్టి అందులోని సారాంశము తెలియునదిగా ఉండును. అదే విధముగా అల్లాహ్ అను పదములో రెండు భాగములుగా భావమున్నదని తెలియుచున్నది. అ+ల్లాహ్=అల్లాహ్. ల్లాహ్ అనగా అంతు లేక గట్టు అని అర్థము. అ అనగా లేదు, కాదు అని అర్థము. ఈ అర్థముల ప్రకారము అంతులేని వాడు, హద్దులేనివాడు, లేక గట్టు లేనివాడు దేవుడు అని తెలియునట్లు చేయుచున్నది. అల్లాహ్ అంతు ఎవరికీ తెలియదు. అందువలన పూర్వము తెలుగు భాషలో దేవున్ని అల్లాహ్ అని అన్నారు. తెలుగులో దేవుడు అనినా వెతకబడేవాడు అని అర్థము గలదు. అల్లాహ్ అనినా, దేవుడు అనినా ఎవరికీ తెలియనివాడే యని అర్థమగుచున్నది.


'అల్లాహ్' అను పదము ఎట్లు అర్థపూరితమైనదో అట్లే నమాజ్ అను పదము కూడా అర్థముతో కూడినదై యున్నది. నమాజ్ అను పదమును విభజించి చూస్తే న+మ+జ్ అని మూడు భాగములుగా యున్నది. న అనగా లేదు, కాదు అని అర్థము గలదు. మ అనగా నేను, నా యొక్క అని అర్థము. జ్ అనగా పుట్టుక లేక జన్మయని అర్థము. దీనిని అంతటినీ కలిపి చూస్తే 'నాకు జన్మ వద్దు' అని అర్థము. 'నేను పుట్టడము లేదు' అని చెప్పవచ్చును. నమాజ్ అర్థము ద్వారా మనిషి దేవున్ని జన్మను కోర మోక్షమును (పరలోకమును) కోరుచున్నాడని చెప్పవచ్చును. ఈ విధముగా తెలుగు భాషలో నమాజ్ అను పదమునకు జన్మరాహిత్యమును తెలుపు అర్థము కలదని చెప్పవచ్చును. అయితే ఇంతవరకు అందరికీ నమాజ్ అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు. అట్లే అయినా ప్రార్థన వలన జన్మ రాహిత్యము ఏర్పడి పరలోకము లభించునని చెప్పవచ్చును. ఈ విధముగా ఇస్లామ్ సమాజములో నేడు అల్లాహ్, నమాజ్ ప్రత్యేకమైన స్థానములు సంపాదించుకొన్నవని చెప్పినా, అవి ఇప్పుడే కాదు పూర్వమే ఈ రెండు పదములు తెలుగు భాషలో అందరికీ సుపరిచయమైనవే. అయితే అవి తెలుగు పదములనీ, కాలము మారేకొలదీ నేడు అరబ్బీ భాష పదములుగా యున్నవనీ, తెలియకుండా పోయినది.


నేడు భూమిమీద ప్రార్థన చేయువారిలో అందరికంటే ముందున్న వారు ముస్లీమ్‍లేయని చెప్పక తప్పదు. అందువలన నమాజ్ అంటే ప్రార్థనయని ముస్లీమ్‍లందరికీ తెలుసు. ప్రార్థన చేయడము ముస్లీమ్‍లలో ముఖ్యమైన దేవుని పనిగా లెక్కించి ఆచరించుచున్నారు. భూమిమీద అత్యంత ఎక్కువగా ప్రార్థన (నమాజ్) చేయువారు ముస్లీమ్‍లే. ముస్లీమ్‍లు ప్రార్థన చేయడము మిగతా మతముల వారికి కూడా తెలుసు. ఒక దినము బహుశా శుక్రవారము అనుకొంటాను మధ్యాహ్నము ఒంటి గంట ప్రాంతములో నమాజ్‍కు పోయి, నమాజ్ చేసి వచ్చిన వ్యక్తిని, దాదాపు 50 సంవత్సరముల వయస్సు గల వ్యక్తిని, టీచర్ వృత్తి చేయు వ్యక్తిని ''నమాజ్ వలన మీకు ఏమి వస్తుంది?'' అని అడిగాను. అందులకు ఆయన ''మాకు ఫలానాది వస్తుందియని ఆశించి మేము నమాజ్ చేయడము లేదు'' అని అన్నారు. అప్పుడు నేను ''నమాజ్‍లో ఏమని ప్రార్థన చేస్తారు'' అని అడిగాను. అందులకు ఆయన ''మేము దేవున్ని జ్ఞాపకము చేసుకొని ఆయనను పొగడడము తప్ప ఏమీ చేయము'' అని అన్నాడు.


మిగతా మతములలో ఎవరు ఏ దేవున్ని ప్రార్థించినా వారు ఏదో ఒక కోరికతోనే చేస్తారు. ఏ కోర్కె లేకుండా దేవున్ని (అల్లాహ్‍ను) పొగడుచూ ఆరాధన చేయడము ఏ స్వార్థము లేకుండా చేయు ఆరాధన యగును. నిస్వార్థముగా ఆరాధన చేయువారు బహుశా ఒక్క ముస్లీమ్‍లేయని చెప్పవచ్చును. దేవున్ని ఎక్కువగా ప్రార్థన చేయువారు మరియు దేవున్ని నిస్వార్థముగా ఆరాధించువారు ముస్లీమ్‍లు తప్ప ఎవరూ లేరనియే చెప్పవచ్చును. ఎవరి ప్రార్థన అయినా ఆశలతో, కోర్కెలతో కూడుకొని యుండును. ముస్లీమ్‍ల ప్రార్థన పెద్దలు నిర్ణయించిన దానిప్రకారము జరుగుచుండును. నియమిత వేళలలో సామూహిక ప్రార్థన చేయడము ఒక్క ముస్లీమ్ మతములోనే కలదు. క్రైస్థవులు కూడా ఆదివారము సాముహిక ప్రార్థనను చర్చీలలో చేయుచుండినా సమయపాలన లేదని, ఒకే సమయములో కాకుండా కొంత ముందు వెనుక ప్రార్థన జరుగుచుండును. మూడు మతములలో ప్రార్థన విషయమునందు హిందువులకంటే క్రైస్థవులు, క్రైస్థవులకంటే ముస్లీమ్‍లే ఉత్తమరీతిలో ఉన్నారని చెప్పవచ్చును. ప్రార్థన విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 4, ఆయత్ 103లో ఈ విధముగా చెప్పియున్నారు చూడండి.


(4-103) ''మరిమీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహముగా నమాజును నిర్ధారిత వేళలలో చేయడము విశ్వాసులకు విధిగా చేయబడినది. ('అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'లో వ్రాయబడిన వాక్యము)


(4-103) ''మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూనే ఉండాలి. అయితే పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట నమాజును నెలకొల్పండి. నిశ్చయముగా సమయపాలన చేస్తూ నమాజును నెరవేర్చడము విశ్వాసులకు విధిగా చేయబడినది. ('ఖుర్ఆన్ మజీద్'లో వ్రాయబడిన వాక్యము)


(4-103) ''ఇక నమాజ్‍ను పూర్తి చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూ ఉండండి. కానీ శాంతిభద్రతలు నెలకొన్న తర్వాత నమాజ్‍ను స్థాపించండి. నిశ్చయముగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడినది ('దివ్య ఖుర్ఆన్ సందేశము' గ్రంథములో వ్రాయబడిన వాక్యము)


ఒకే వాక్యము మూడు గ్రంథములలో తెలుగు అనువాదముగా వ్రాసినా కొన్ని పదములు వేరయినా, అర్థము అంతా ఒకే విధముగా యున్నది. (4-103) వ వాక్యము మూడు భాగములుగా యున్నది. నిర్ణయించబడిన కాలము ప్రకారము నమాజ్ చేయడము ఒక భాగము కాగా, నమాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా, ఎలా ఉన్నా దేవున్ని (అల్లాహ్) ను స్మరించుకోవడము రెండవ భాగము. నీకు అనుకూలమైనప్పుడు నమాజ్‍ను స్థాపించడము మూడవ భాగము. మొదటిదయిన నియమిత కాలము ప్రకారము నమాజ్ చేయడము ముస్లీమ్‍లందరికీ తెలుసు. నమాజ్ అయిపోయిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍నే స్మరించుకొమ్మని చెప్పిన రెండవ విధానము మంచిదే అయినా ఎందరు ఆచరిస్తున్నారో చెప్పలేము. ఇక మూడవ విధానమయిన నమాజ్‍ను స్థాపించడము ఎవరూ చేయలేదని చెప్పవచ్చును. భూమిమీద ఎందరు ముస్లీమ్‍లుయున్నా వారందరికీ నియమిత కాలములో నమాజ్ చేయడమే తెలుసు కానీ, నమాజ్‍ను స్థాపించడము అంటే ఏమిటో, స్థాపింపబడే నమాజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ వాక్యములో చెప్పిన మూడు విధానములలో మొదటి విధానము తప్ప రెండవ విధానము కూడా కొందరికి తప్ప చాలామందికి తెలిసియుండదని చెప్పవచ్చును. మూడవ విధానమైన నమాజ్‍ను స్థాపించడము ఒక్కరికి కూడా తెలియదనియే చెప్పవచ్చును.


ఇస్లామ్ సమాజము అంతయూ మత సాంప్రదాయముల మీద, మత నియమ నిబద్దతల (షరియత్) మీద ఆధారపడియుండును. మత పెద్దలు ఎలా చెప్పితే అలా ఆచరించడము తప్ప, పెద్దల మాటను జవదాటని పద్ధతిలో ఇస్లామ్ సమాజమంతా యున్నదని చెప్పవచ్చును. అందువలన సమయ పాలనలో చేయు నమాజ్ తప్ప మిగతా దేనివైపు వారు చూడరు, దేనిని గురించి ఆలోచించరు. పెద్దలు చెప్పిన నమాజ్ ఒక్కటే, అదే నియమిత సమయములలో సామూహికముగా నమాజ్ చేయడము. ఇది వదలి వేరే నమాజ్ అనుమాట కూడా వారు వినరు. దానిని గురించి కొద్దిగా అయినా ఆలోచించరు. అటువంటప్పుడు మనిషి సామూహికముగా కాకుండా ఒక్కడుగా ప్రత్యేకమైన నమాజ్‍ను స్థాపించడము గ్రంథములో యున్నాగానీ దానిని ఖాతరు చేయరు. అటువంటప్పుడు ఒక వ్యక్తి స్థాపించు నమాజ్ అంటే ఏమిటో ఎవరికీ, ఏ ముస్లీమ్కూ తెలియదు. మొదట ముస్లీమ్ పెద్దలు ఏమి చెప్పారో దానిని వినడము, దానిని ఆచరించడము తప్ప స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినమాటను కూడా గమనించరు. 'దేవుడు పుట్టడు' అని పెద్దలు చెప్పారు. అదే వారిలో నిలిచి పోయినది. ఖుర్ఆన్ గ్రంథములో 'దేవుడు అవతరిస్తాడని' 15వ సూరాలోనూ, 89వ సూరాలోను చెప్పియున్నా దానిని ఏమాత్రము నమ్మరు. అలాగే ''మనిషి తిరిగి పుట్టుతాడు, పునర్జన్మ ఉంది'' అని గ్రంథములోయున్నా ముందు తమ పెద్దలు మనిషికి పునర్జన్మలు లేవు అని చెప్పిన మాటనే గట్టిగా నమ్మియున్నారు. ఇట్లు నమాజ్ విషయములో అందరికీ తెలిసినది, అందరూ చేయునదే తప్ప ఇతర నమాజ్ అంటే ఏమిటో తెలియదు. నమాజ్ అనే పదములో ఉండే ప్రతి అక్షరమునకు అర్థమున్నదని కూడా తెలియదు. నమాజ్ అంటే జన్మలు వద్దు, మోక్షము కావాలని చెప్పడమని తెలియదు. నమాజ్ అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు.


ఈ ఆయత్‍లో ముఖ్యమైన ఘట్టము ఏమనగా! ''పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట'' అనీ, దానినే ''శాంతిభద్రతలు నెలకొన్న తర్వాత'' అనీ, మరొక గ్రంథములో ''పరిస్థితులు కుదుట పడిన తర్వాత''యనీ వ్రాసియున్నారు. ఇట్లు ఒకే విషయమునే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పియున్నారు. ఇది ఎలా ఉందంటే బయట ప్రపంచములో గొడవలు జరిగినప్పుడు పోలీసువారు కర్ఫ్యూ విధించిన తర్వాత పరిస్థితులు చల్లబడి, శాంతిభద్రతలు కుదుట పడినప్పుడు కర్ఫ్యూ తొలగించే కార్యమును ఆలోచించి ఎట్లు చేయవలెనో, అట్లే ఇక్కడ ఒక మనిషి 'నమాజ్‍ను నెలకొల్పడము' అను కార్యము చేయవలసియున్నది. నమాజ్‍ను మనిషి ప్రత్యేకముగా నెలకొల్పడమేమిటని ఎవరికయినా ప్రశ్న రాగలదు? ఇదే ఆయత్‍లోనే నమాజ్‍ను చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍నే తలచుకొమ్మని చెప్పారు. మొదట నమాజ్ చేసిన తర్వాత అల్లాహ్‍నే స్మరించమని చెప్పారు కదా! అప్పుడు అందరితో కలిసి నిర్ణీత సమయములో నమాజ్ చేశారు కదా! మొదట చేసినది నమాజ్ అయినప్పుడు రెండవమారు పరిస్థితులు అనుకూలించినప్పుడు నమాజ్‍ను స్థాపించడము లేక నెలకొల్పడము అంటే ఏమిటి? నిజము చెప్పితే ఆచరించడము వేరు, స్థాపించడము వేరు. ఉన్న దానిని ఆచరించవచ్చును. లేనిదానిని స్థాపించవచ్చును. అలాగే ఉన్న దానిని నెరవేర్చవచ్చును, లేనిదానిని నెలకొల్పవచ్చును. నిర్ణీత సమయములో అందరూ కలిసి సామూహికముగా నమాజును చేయవచ్చును, నెరవేర్చ వచ్చును. అంతవరకు లేని క్రొత్తదానిని అయితే నెలకొల్పడము, స్థాపించడము చేయవచ్చును. (4-103) వాక్యములో చెప్పిన సమాచారమును బట్టి చూస్తే అంతవరకు ఎవరూ చేయని దానిని, నిర్ణీత సమయము లేనిదానిని ప్రత్యేకముగా చేయమని చెప్పడమే కదా! అలా క్రొత్త నమాజ్‍ను నెలకొల్పడము అంటే ఏమిటి? అన్నీ అనుకూలించినప్పుడు అంటే ఇతరులతో ఏ పేచీలు రానప్పుడు, సానుకూలమైన సమయములో నెలకొల్పబడు నమాజ్ ఎలా ఉంటుంది? అన్నది పెద్ద ప్రశ్నగా మిలిగిపోవుచున్నది.


ఈ వాక్యము సూక్ష్మ (ముతషాబిహాత్) వాక్యము కూడా కాదు. స్థూల వాక్యముగానే చెప్పబడియున్నది. అటువంటప్పుడు జవాబు చెప్పడములో కూడా సులభముగా యుండును. స్థూల వాక్యములోని అర్థము కంటికి కనిపించునట్లుగానే యుండును. నమాజ్ అనగా ప్రార్థనయని అందరికీ తెలుసు. ఆ ప్రార్థనను కొందరు ముస్లీమ్ పెద్దలు, జ్ఞాన పరిశోధన చేసిన వారు మూడు భాగములుగా విభజించి చెప్పారు. ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్''లో ''అల్ ఫాతిహా'' మొదటి సూరా నమాజ్‍లో పఠించడము ముస్లీమ్‍లకు అందరికీ తెలుసు. అక్కడ ఆ సూరాలో యున్న ఏడు ఆయత్‍ల వివరము చెప్పడములో వారి అభిప్రాయములను ఇలా చెప్పారు. ఇది ఖుర్ఆన్ గ్రంథము నుండి సేకరించి చెప్పుచున్నదే. నమాజ్ చేయడము అంటే ఫాతిహా సూరాలోని ఏడు ఆయత్‍లను పఠించడమేయని చెప్పవచ్చును. అలా పఠించు నమాజ్ నాలుగు రకములు కలదు. 1) నెమ్మదిగా చేసే నమాజ్ సిర్రీ నమాజు. 2) బిగ్గరగా చేసేది జహ్రీ నమాజు. 3) విధిగా చేసేది ఫర్జ్ నమాజు. 4) స్వచ్ఛందముగా చేసేది నఫిల్ నమాజు.


నమాజ్‍ను తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యని అనవచ్చును. ఏకేశ్వరోపాసన మూడు రకములు గలదని చెప్పవచ్చును. ఆ మూడు రకములనే ఈ విధముగా ముస్లీమ్ పెద్దలు చెప్పుచున్నారు. 1) తౌహిదే రుబూబియత్ 2) తౌహీదే ఉలూహియత్ 3) తౌహిదే అస్మా వ సిఫాత్ అని అంటున్నారు. అందులో 1) తౌహిదె రుబూబియాత్ అనగా! ఈ మొత్తము విశ్వానికి సృష్ఠికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకొని ఉన్నవాడు, వ్యూహ రచయిత అల్లాహ్ మాత్రమేయని అర్థము. 2) తౌహీదే ఉలూహియత్ అనగా! అన్ని రకాల ఆరాధనలకు, దాస్యాలకు, వేడుకోళ్లకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. 3) తౌహిదే అస్మావ సిఫాత్ అనగా! ఖుర్ఆన్, హదీసులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణ గణాలను లక్ష్యణాలను ఏమాత్రము వక్రీకరించకుండా వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథముగా అల్లాహ్‍ను అంగీకరించడము అని చెప్పవచ్చును.


ఈ మూడు దేవుని విధానాలలో దేవుని ప్రార్థనను గురించి చెప్పినది తౌహీదె ఉలూహియత్ అనునది. అందులో ఆరాధనను గురించి చెప్పారు. ఆరాధనను గురించి ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాదములో చెప్పినది ఇలా కలదు. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసము లేక అతని ప్రసన్నత కొరకు ప్రాకులాడుచూ అతని ప్రసన్నత లేకుండా పోతుందేమోనను భయముతో చేసే ప్రతి పనీ ఆరాధన గానే భావించబడుతుంది. అందుచేత నమాజ్, రోజా, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు. ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవడము, అతని పేర మ్రొక్కుకోవడము, మొక్కుబడులు తీర్చు కోవడము, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకొని నిలబడడము, అతని చుట్టూ ప్రదక్షణ చేయడము, అతని సమక్షములో భయభక్తులు ప్రదర్శించడము, అతను తమకేదయినా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించడము ఇవన్నీ ఆరాధన (ఇబాదత్) గానే లెక్కించబడుతాయి.


ఇదంతా చూస్తే ఇన్ని విధముల చేయు క్రియలు అన్నీ ఆరాధనలే, ప్రార్థనలే అయినప్పుడు నేడు ముస్లీమ్‍లు చేయు నమాజ్‍కానీ, హిందువులు చేయు ప్రదక్షణలు, పూజలుగానీ, క్రైస్థవులు చేయు ప్రార్థనలుగానీ అన్నీ తౌహీదె ఉలూహియత్‍కు సంబంధించినవనియే చెప్పవచ్చును. అటువంటప్పుడు హిందువుల ఆరాధనలకంటే ముస్లీమ్‍ల నమాజ్ గొప్పదనీ, ముస్లీమ్‍ల నమాజ్ కంటే క్రైస్థవుల ప్రార్థన గొప్పదనీ చెప్పుటకు వీలులేదు. అన్నీ ఒక కోవకు చెందినవేయనీ, అందరి ఉద్దేశ్యము ఒక్కటేయనీ తెలియుచున్నది. 4-103వ ఆయత్‍ను అనుసరించి చూస్తే, అక్కడ అల్లాహ్ (దేవుడు) చెప్పిన విధానమును గమనించితే మీరు చేయు ఆశపూరిత, స్వార్థపూరిత నమాజ్‍లకంటే, ఆరాధనలకంటే, ప్రార్థనలకంటే ప్రత్యేకమైన నమాజ్ ఒకటి కలదని చెప్పడమైనది. అయితే మీరు ఇప్పుడు అలవాటుపడిన నమాజ్‍లను ఆరాధన క్రమములను, ప్రార్థనలను వదలకుండా చేసుకొమ్మని చెప్పడమే కాక, మీరు ఏది చేసినా దానికంటే గొప్పది దేవుని స్మరణ. అందువలన మీరు నమాజ్‍ను సమయాను కూలముగా, సామూహికముగా మీరు అనుకొన్నట్లు చేసిన తర్వాత దేవున్ని (అల్లాహ్‍ను) స్మరించుచూ ఉండండి అని చెప్పాడు. అల్లాహ్‍ను స్మరించుట నిలుచుండినా, కూర్చుండినా, పరుండినా చేయవలసియున్నది. దీనినిబట్టి చూస్తే మనిషి ఎల్లప్పుడూ మూడు రకముల ఉంటూ కాలము గడుపుచుండును. నిలబడియైనా ఉండును. లేక కూర్చుని అయినా ఉండును. ఈ రెండు లేకపోతే పరుండి అయినా ఉండును. ఈ మూడు స్థితులలో మనిషి ఏదో ఒక స్థితిలో ఎల్లప్పుడూ ఉండును. దీనిప్రకారము మనిషి ఎట్లుండినా, ఎక్కడుండినా, ఏమి చేయుచుండినా, అల్లాహ్‍నే (దేవున్నే) స్మరించుకొంటూ ఉండవలెనని చెప్పారు. అయితే అది సాధ్యముకాని పని. నిలబడినప్పుడుగానీ, కూర్చున్నప్పుడుగానీ మనిషి ప్రపంచ పనులలో లగ్నమై ఉండును. పడుకొన్నప్పుడు పనులు లేకపోయినా నిద్రలోనికి పోవును. అందువలన నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకొన్నప్పుడు మూడు కాలములలో మనిషి దేవున్ని జ్ఞాపకము చేసుకోలేడు.


అలా శరీరము మూడు స్థితులలో యున్నప్పుడు కూడా మీ ఆరాధన అయిపోయిన తర్వాత దేవున్ని స్మరించమని చెప్పాడు అంటే అంతవరకు మీరు చేసిన ఆరాధన (నమాజు) దేవునికి సంబంధము లేనిదనేగా అర్థము. ఆ మాటను దేవుడే స్వయముగా చెప్పినట్లు కలదు. అంతకుముందు చేసిన నమాజు సక్రమమయినదే అయితే, అది నిజమైన దైవ ఆరాధనే అయితే, మీరు నమాజు చేసిన తర్వాత నిలబడినా, కూర్చున్నా, పరుండినా దేవున్ని స్మరించుకోమని అల్లాహ్ చెప్పేవాడు కాదు. అలా చెప్పాడు అంటే మనుషులు చేసే నమాజు నాకు ఇష్టము లేనిదనేగా అర్థము. అందువలన ఎవరితోనూ, ఏ ఆటంకము లేనప్పుడు, నీకు పరిస్థితులు అనుకూలించి నప్పుడు నీవు చేసే నమాజు అందరికీ ఇష్టము లేనిదైనా, క్రొత్తది అగుట వలన వారికి వ్యతిరేఖత లేనప్పుడు, శాంతిభద్రతలు ఉన్నప్పుడు, ఇతరుల విరోధము లేనప్పుడు, అన్నీ సక్రమముగా అనుకూలముగా యున్నప్పుడు నీవు నమాజును నెలకొల్పుము లేక స్థాపించుము అని చెప్పాడు. అలా చెప్పడము వలన దేవునికి ఇష్టమయిన నమాజు వేరే ఏదో ఉన్నదని తెలియుచున్నది. 4-103వ ఆయత్‍లో నీవు ప్రత్యేకముగా నమాజును నెలకొల్పుమని చెప్పినా, అది ఫలానా విధముగా ఉండునని చెప్పలేదు. ఎందుకనగా! అది మనిషికి గల దేవుని జ్ఞానమునుబట్టి స్వయముగా అర్థము చేసుకోవలసియున్నది. అందువలన దేవుడు తన నమాజును గురించి చెప్పలేదు. అది మనిషి వ్యక్తిగత జ్ఞానమునుబట్టి యుండును. అంతేకాక ముందు దైవగ్రంథములు అయిన తౌరాతు, ఇంజీలు గ్రంథములలో అసలయిన ఆరాధన (నమాజును) గురించి చెప్పియున్నారు. (5-68) వ వాక్యము ప్రకారము మూడు దైవ గ్రంథములను జీవితములో నెలకొల్పిన వానికి అసలయిన నమాజును గురించి తెలియును. అందువలన అల్లాహ్ ప్రత్యేకించి ఆయన స్వయముగా ఏమీ చెప్పలేదు.


(5-68) ''ఓ ప్రవక్తా వారికి చెప్పు, గ్రంథవహులారా! మీరు తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన దానిని (ఖుర్ఆన్‍ను) మీ జీవితాలలో నెలకొల్పనంతవరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే.''


ఇక్కడ చెప్పినట్లు మూడు దైవ గ్రంథములు చదవనివారు ఏ ధర్మములో లేనట్లేయని చెప్పగా, ఏ మతస్థుడయినా మూడు గ్రంథములు చదివియుంటే అసలయిన నమాజును గురించి తెలియును. అలా తెలిసిన వాడు మిగతావారు దేవున్ని ఒకటి కొరితే, తాను మరొకటి కోరును. వారు కోరినది వీడు కోరడు, వీడు కోరినది వారు కోరరు. అదే విషయమును చెప్పుచూ సూరా నాలుగు ఆయత్ 104 లో ఇలా చెప్పుచున్నారు చూడండి.


(4-104) ''వారిని వెంబడించడములో ఏమాత్రము బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతముగా ఉన్నారనుకొంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతముగా ఉన్నారు. పైగా అల్లాహ్‍నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.''


ఇక్కడ 4-103 ప్రక్క ఆయత్‍లోనే 4-104లో 'వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు' అని ఉన్నది. ముస్లీమ్‍లందరూ నమాజ్ చేసినట్లే నీవు కూడా నమాజ్ చేయి. అప్పుడు వారికి నీకు ఏమీ తేడా లేదు. బయట పనిగానీ, నమాజ్‍గానీ చేయడములో వారి మాదిరి నీవు, నీ మాదిరి వారు ఉందురు. అదే విషయమునే వాక్యములో 'వారిని వెంబడించడములో ఏమాత్రము బలహీనతను ప్రదర్శించకండి' అని అన్నారు. అంతేకాక మీరు అవిశ్రాంతముగా ఉంటే, వారు కూడా అవిశ్రాంతముగా యుందురని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమనగా! 'వారు ఆశించని దానిని మీరు ఆశించుచున్నారు' అని కలదు. ఎవరు ఏమి కోరుచున్నది అల్లాహ్‍కు బాగా తెలుసు. ఆయన వివేచన కలవాడు. అందువలన ఎవరు అడిగిన దానిని వారికి ఇస్తాడు అని తెలియుచున్నది.


ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. 4-103లో అందరితో పాటు నమాజు నెరవేర్చిన తర్వాత మీకు అనుకూలమైనప్పుడు నమాజ్‍ను స్థాపించండి అని వాక్యములో చెప్పడమైనది. తర్వాత 4-104లో అందరితో పాటు మీరు అన్ని కార్యములు చేయుచూ వారికంటే వెనుక పడకండి అని వున్నది. దానిప్రకారము చూస్తే నీవు, వారు అందరూ చేసినట్లే నమాజ్ చేయి అని చెప్పినట్లు అర్థమగుచున్నది. అంతేకాక వారున్నట్లే నీవుండు అని చెప్పుచూ, వారందరూ కోరని పరలోకమును నీవు కోరమని చెప్పడమైనది. వారందరూ పరలోకమును (మోక్షమును) ఎందుకు కోరలేదు అనగా! అందరికీ ఇష్టమైనది సుఖములను అందించు స్వర్గమే అయినందున ఎవరు కోరినా అందరూ స్వర్గమునే కోరుచున్నారు. అందువలన వారు కోరని దానిని నీవు కోరుచున్నావని చెప్పారు. దేవుడు వివేకవంతుడయిన దానివలన ఎవరు కోరిన దానిని వారికిస్తున్నాడు అని వాక్యములో అర్థమగునట్లు చెప్పాడు.


నీకు 4-103లో చెప్పినది అర్థమయి నిత్యము అందరితో పాటు నమాజు నెరవేర్చుచూ ప్రత్యేకమైన నమాజును నెలకొల్పి, ఇదే నిజమైన నమాజని నిర్ణయము చేసి ఇతరులకు చెప్పినా, నీ మాటను వారు ఖండించకుండా, నీ మాట సత్యమని నిరూపించుటకు ఈ గ్రంథాన్ని పంపు చున్నాను. నీవు సత్యమును వాదించు, అసత్యమును వాదించు వారి ప్రక్కన ఉండవద్దని అల్లాహ్ తన వాక్యములో తెలియజేశాడు చూడండి.


(4-105) ''ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు చూపిన విధముగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి గాను మేము నీవైపుకు ఈ గ్రంథాన్ని సత్యముతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి వైపున వాదిగా నిలబడకు.''


ఈ వాక్యమును చూస్తే నమాజును ప్రతి రోజు ఆచరించే వారికంటే ఏదో ఒక రోజు క్రొత్తగా అసలైన నమాజును నెలకొల్పి ఇదే నిజమైన నమాజు అని చెప్పితే దానికి ఆధారముగా సత్యసమేతముగా గ్రంథాన్ని (గ్రంథవాక్యాన్ని) పంపాము అని చెప్పారు. అయితే నీవు అసలయిన నమాజు ప్రక్కనే వాదించు, అసలయిన నమాజు లేదు అని దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పు ద్రోహానికి పాల్పడే వారి ప్రక్కన వాదించకు అని చెప్పడమైనది. నాల్గవ సూరాలోని 103, 104, 105 వాక్యములను చూచిన తర్వాత నేను అసలయిన నమాజు వైపు వాదించాలని అనుకొన్నాను. వాక్యములో దేవుడే స్వయముగా ప్రతి దినము మీరు నెరవేర్చే నమాజుకంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు అనుకూలము కుదిరినప్పుడు నమాజును స్థాపించు అని చెప్పిన మాటప్రకారము నిత్యము నమాజును చేసేవారి వైపుకంటే నమాజును స్థాపించేవారివైపు వాదిస్తాను. మనిషికి అవసరమైనది ప్రత్యేకముగా స్థాపించబడే నమాజు అని చెప్పు దేవుని మాటనే సత్యమని నేనూ నావంతుగా చెప్పుదును.


ప్రశ్న :- ప్రపంచములో ఉండే ముస్లీమ్‍లందరూ నిత్యము అందరూ చేయు నమాజునే చేయుచున్నారు. అల్లాహ్ నమాజ్‍ను చేయమని చెప్పాడు. ఐదు పూటల నమాజ్ చేయమని చెప్పాడు. అందువలన నిర్ణీత సమయములలో ప్రతి దినము ఐదుపూటల నమాజ్‍ను చేయుచున్నారు. ఇది నమాజ్ కాదా?


జవాబు :- ప్రతి దినము అందరూ చేయు నమాజ్‍ను అందరితోపాటు తప్పక చేయమనే వాక్యములో కూడా చెప్పారు. నిత్యము చేయునది నమాజు కాదని మేము కూడా చెప్పలేదు. ఇది చేస్తూ ఉండేది. నిత్యము నెరవేర్చే దానిని నెరవేర్చుచూ ఉండమని అల్లాహ్ చెప్పాడు. అలా నెరవేర్చుచూ ప్రత్యేకమైన నమాజును ఎల్లవేళల చేయు నమాజును నెలకొల్పమన్నాడు. నిత్యము నెరవేర్చు నమాజుకంటే ఏదో ఒక దినము నెలకొల్పు నమాజు శ్రేష్ఠమయినదని చెప్పినట్లు కలదు. అందువలన చేసే ప్రార్థన (నమాజు) ను చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు.


ప్రశ్న :- ప్రతి దినము చేసే నమాజుకు క్రొత్తగా నెలకొల్పే నమాజుకు ఏమి తేడా గలదు? నిత్యము చేసే నమాజున్నప్పుడు, క్రొత్త దాని అవసరము ఏమి ఉంటుంది? దీనిలో లేనిది దానిలో ఏముంది?


జవాబు :- 4-103వ వాక్యములో నమాజును చేసిన తర్వాత నిలబడినా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍నే స్మరిస్తూ ఉండమని చెప్పారు కదా! నమాజు అంటే ఎల్లప్పుడూ అన్ని కాలములలో దేవున్ని స్మరించడమని చెప్పాడు. అది సాధ్యమేనా? అని చూస్తే ప్రత్యేకమైన నమాజువల్ల సాధ్యమవుతుంది గానీ సాధారణముగా స్మరించుకొనుటకు సాధ్యము కాదు. సాధారణముగా నిలబడి, కూర్చొని, పడుకొని ఎవరూ స్మరించుకోలేరు. అలా సాధ్యము కాదు కనుక, అది సాధ్యమగునది క్రొత్తగా స్థాపించబడే నమాజునందే కనుక ఇతరుల వలన ఏ ఇబ్బంది లేనప్పుడు, నీకు బాగా అర్థమయినప్పుడు, క్రొత్తగాయుండు నమాజును, క్రొత్తగా చెప్పబడు నమాజును స్థాపించండి అని చెప్పాడు. క్రొత్తగా స్థాపించబడు నమాజు ప్రతి రోజు ముస్లీమ్‍లందరూ చేయు నమాజ్‍కంటే చాలా ప్రత్యేకమైనది. అందువలన ఇది అది కాదు, అది ఇది కాదు. అది అదే, ఇది ఇదేయని చెప్పవచ్చును.


ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో నెరవేర్చబడు నమాజ్‍కంటే నెలకొల్పబడు నమాజ్ గొప్పదన్నట్లు చెప్పియున్నారు. (4-104) నిత్యము నమాజు చేయువారు కోరే దానికంటే క్రొత్తగా నమాజును స్థాపించేవారు కోరేది వేరుగాయుంటుంది అని క్రొత్త నమాజు ప్రత్యేకతను చాటి చెప్పారు. తర్వాత (4-105) లో మీరు నెలకొల్పినది గొప్పదని తేల్చి తీర్పుతీర్చి చెప్పినా, వినని వారికి నేను గ్రంథమును 'సత్యసమేతముగా సాక్ష్యముగా యుండునట్లు పంపుచున్నాను' అని చెప్పాడు. ఈ మూడు ఆయత్‍లు చూచుట వలన క్రొత్త నమాజు ఉన్నదని కొందరికి, క్రొత్త నమాజు అంటే ఏమిటో కొందరికి అర్థమయి ఉండవచ్చును. అయినా మాకు అర్థమగునట్లు నెలకొల్పబడు నమాజు అంటే ఇదియనీ, దాని వివరమును సంపూర్ణముగా తెలుపలేదు. ఈ విధముగా మూడు ఆయత్‍లు చెప్పి క్రొత్త నమాజును సూచించడమే తప్ప దానిని పూర్తి వివరముగా క్రొత్త నమాజు ఈ విధముగా ఉండునని చెప్పలేదు. అలాంటప్పుడు క్రొత్త నమాజును ఎలా నమ్మాలి?


జవాబు :- క్రొత్త నమాజు విషయము ప్రక్కన పెట్టి పాత నమాజు విషయమునకు (ప్రతి దినము చేసే నమాజు విషయమునకు) వచ్చి చూస్తే ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడా నమాజ్ నిర్వహించే క్రమము అని అల్లాహ్ చెప్పియుండలేదు. అయితే ముస్లీమ్ పెద్దలుగానీ లేక ముహమ్మద్ ప్రవక్తగారు గానీ, నమాజు చేయు పద్ధతిని తెలిసి ఆచరించి చూపుట వలన, వారి తర్వాత వీరు అలాగే చేయను మొదలుపెట్టారు. అల్లాహ్ ఆకాశవాణి ద్వారా (వహీ ద్వారా) దైవజ్ఞానమును అందించాడు. నమాజులో పఠించు ఏడు ఆయత్‍లను కూడా అల్లాహ్ చెప్పలేదు. మనుషులు అల్లాహ్ గొప్ప తనాన్ని నాలుగు వాక్యములుగా, మనుషుల అవసరమును కోరుచూ మూడు వాక్యములుగా చెప్పుకొన్నారు. అలా చెప్పిన వాక్యములనే నమాజ్‍లో మంత్రములుగా చెప్పుచున్నారు. ఏడు వాక్యములను చదవనిదే అది నమాజ్ అనిపించుకోదుయని చాలామంది ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు. నమాజ్‍లో ఏడు వాక్యములను తప్పనిసరిగా మంత్రపఠనము లాగా చదువవలసి యుండును. అయితే ఈ విషయమును అనగా ఏడు ఆయత్‍లను చదివే విషయమును దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ చెప్పినట్లు జిబ్రయేల్ ఎక్కడా ఏ సూరాలో, ఏ ఆయత్‍లో చెప్పలేదు.


వాస్తవముగా అల్ ఫాతిహా అను ఏడు ఆయత్‍లను మనుషులు ప్రార్థన కొరకు సృష్ఠించుకొన్నదేగానీ దేవుడు చెప్పినది గాదు. ప్రార్థన విషయమును ప్రత్యేకించి అల్లాహ్ చెప్పియుండలేదు. గడచిన మూడు యుగములలోనూ, తర్వాత గడచుచున్న కలియుగములోను అనేకులు అనేక ప్రార్థనలను చేయుచున్నారు. ముందే తయారయిన హిందూ మతములో అనేక దేవతారాధనలు గలవు. అట్లే ఇస్లామ్కంటే ముందు తయారయిన క్రైస్థవములో కూడా ప్రార్థనలు కలవు. కలియుగములో 3600 సంవత్సరముల తర్వాత ఇస్లామ్ సమాజము తయారయినది. అంతవరకు అందరూ చేయు ప్రార్థనలలాగే ముస్లీమ్‍లు నమాజు అను పేరుతో ప్రార్థనను తయారు చేసుకొన్నారు. అందులో మొదటి నుండి చివర వరకు చేయు విధానము, చదువు వాక్యములు అన్నియూ మనుషులు కల్పించుకొన్నవే. ఖుర్ఆన్‍ను గ్రంథముగా వ్రాయకముందే ముస్లీమ్‍లలో ప్రార్థన విధానమును ముహమ్మద్ ప్రవక్తగారు ప్రవేశపెట్టారని చెప్పవచ్చును. ముస్లీమ్ సమాజము ఏర్పడినప్పటి నుండి నమాజు అను ప్రార్థనయున్నా అది ఇతర మతస్థులు ఆచరించునట్లు ఆచరించుట వలన, అది ఒక విధమైన ప్రార్థనే అయినా, దానిని చేయువారు అట్లే చేస్తూ, క్రొత్త నమాజును స్థాపించమని 4-103లో చెప్పియున్నారు. పాత నమాజు వలన మనిషికి పరలోక ప్రాప్తి యుండదనీ, మిగతా మతముల వారు చేయు ప్రార్థనలకు కూడా మోక్షము (పరలోకము) లభించదని దేవుడు తెలియజేసినట్లు ఇంకొక నమాజును (ప్రార్థనను) చెప్పడమైనది.


పాత నమాజును చేస్తూనే క్రొత్త నమాజు అర్థమయినప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, నమాజును స్థాపించమన్నారు. పాత నమాజులోని లోపమును చూపిస్తూ నిలబడినప్పుడు, కూర్చుండినప్పుడు, పరుండినప్పుడు అల్లాహ్‍ను (దేవున్ని) స్మరించుము అన్నాడు. అలా స్మరణ ఉండుట కొరకే క్రొత్త నమాజు అవసరమైనది.


పాత నమాజు చేసినంతసేపు దేవుని జ్ఞాపకము ఉండును. చేయనప్పుడు దేవుని జ్ఞాపకము ఉండదు. అందువలన శరీరము మూడు స్థితులలో యున్నప్పుడు దేవుని స్మరణ చేయమని చెప్పిన అల్లాహ్, ఆ విధానమును నమాజ్ అని చెప్పుచూ, దానిని స్థాపించమని చెప్పాడు. ఆయన ప్రజలకు మంచి చేయుటకు, పరలోకము లభించునట్లు చేయుటకు నమాజ్‍ను స్థాపించమని చెప్పాడు కదా! మనిషికి ఆ నమాజు (ప్రార్థన) ఎలాగుండునో తెలియనప్పుడు ఎలా స్థాపించునను ప్రశ్న ఇప్పుడు అందరికీ వచ్చినది. అయితే దానికి జవాబుగా ఇట్లు చెప్పుటకు వీలుకలదు. ఇంతకు ముందు చెప్పిన జ్ఞానము ప్రకారము అనగా! రెండు, మూడు సూరాలలో చెప్పిన జ్ఞానము ప్రకారము మనిషి ఎల్లవేళల, మనిషికి జ్ఞాపకమున్న (ఎరుక యున్న) సమయములలో ఒక్క క్షణము కూడా దేవున్ని మరచిపోకుండా ఉండుటకు తగినది చెప్పబడియున్నది. రెండు సూరాలలోనేకాక, ఆరవ సూరాలో కూడా దేవుడు సూచించిన నమాజు కలదు. అందువలన ఖుర్ఆన్ చదివిన ఏ వ్యక్తి అయినా అంతకుముందు చేయు ఆరాధన చేయుచూ, దాని తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా చేయబడు నమాజును స్థాపించవచ్చును. అయితే దేవుడు చెప్పిన ఈ నమాజు ప్రార్థన మందిరములో చేయునది కాదు. బజారులో నిలబడినప్పుడుగానీ, హోటల్లో కూర్చున్నప్పుడుగానీ, పరుపు మీద పడుకొన్నప్పుడుగానీ దేవుడు సూచించిన నమాజును చేయవచ్చును. నిలబడి నడుస్తునప్పుడు బజారులోని దృశ్యములను చూస్తూ, కూర్చుండి మాట్లాడుచున్నప్పుడు, ఇతరులతో వాదించుచూ గానీ, పడకలో పరుండి భార్యాపిల్లలతో సంతోషముగా మాట్లాడునప్పుడుగానీ, పూర్తి నమాజుగాయుండు ఆరాధనను చేయవచ్చును.


పాత నమాజు ప్రతీ దినము నియమింపబడిన కాలములో చేయుచున్నా దానికి కొన్ని విధివిధానములు గలవు. క్రొత్త నమాజులో అటువంటివి ఏవీ లేవు. పాత నమాజులో ఏడు ఆయత్‍లు చదవడము, మోకాళ్ల మీద కూర్చొని వంగి తల భూమికి పెట్టి ప్రార్థన చేయడము గలదు. క్రొత్త నమాజులో అటువంటి క్రియలు ఉండవు. పాత నమాజులో నిర్ణీత సమయముండును. క్రొత్త నమాజులో సమయము ప్రత్యేకించి యుండదు. అన్ని సమయములలో ఆచరించునదిగా ఉండును. పాత నమాజులో సాముహికముగా జనముతో కూడి చేయడము గలదు. అయితే క్రొత్త నమాజులో ప్రక్క మనిషితో సంబంధము లేకుండా అడవిలో అయినా ఒక్కడే చేయవచ్చును. ఇట్లు ఎన్నో తేడాలు ఉండుట వలన పాత నమాజును చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అలా నెలకొల్పడము వలన పాత నమాజును చేసే సమయములో కూడా పాత నమాజును చేస్తూనే క్రొత్త నమాజును దానిలోనే మిళితముగా చేయవచ్చును. నీ శరీరము ఏమి చేయుచున్నా, నిలబడి గానీ, కూర్చుండిగానీ, పరుండి గానీ యున్నా ఏమి చేయుచున్నా దానిని వదలక క్రొత్త నమాజును చేయవచ్చును. ఇదంతా పెద్ద విచిత్రముగా ఏదో మాయాలాగా ముందు కనిపించినా, తెలిసిన తర్వాత క్రొత్త నమాజు ఎంతో సులభమైనదని అనిపించును.


ప్రశ్న :- నేడు ముస్లీమ్‍లు అల్లాహ్ (దేవుడు) అనినా, ముహమ్మద్ ప్రవక్త అనినా ఎంతో ఇష్టముగా యుండుటేగాక వారి మాటను ఎంతో గౌరవముగా స్వీకరిస్తారు, ఆచరిస్తారు. అటువంటప్పుడు ముస్లీమ్ సమాజములో నమాజు ఒక్కటే కలదు. దానిని నిర్ణీత సమయములలో అందరూ కలిసి సామూహికముగా, క్రమశిక్షణగా, శుచిశుభ్రతలతో, కాళ్లు, చేతులు, ముఖము కడుగుకొని ప్రార్థనలో (నమాజులో) పాల్గొని తృప్తి పొందుచున్నారు. కొందరికి వీలయితే ఐదుపూటలు నమాజ్ చేయువారు కలరు. అంతేకాక ముస్లీమ్‍లు అంటే విశ్వాసము, విశ్వాసము అంటే ముస్లీమ్‍లు అనునట్లు గలదు. ఖుర్ఆన్ గ్రంథమును ఎంతో గౌరవముగా చదివి దానిలో దేవుడు చెప్పిన సూచనలను తెలియుచుందురు. అంత భక్తిగా యున్నవారికి మీకు తెలిసిన రెండవ క్రొత్త నమాజు తెలియకుండునా?అట్లు యున్నట్లు హదీసు పండితులకుగానీ, ఖుర్ఆన్ బోధకులకు గానీ తెలియదా? మీరు చెప్పేంత వరకు వారికి తెలియదంటారా? మసీదులలో ఇమాంసాబ్‍లు నిత్యము ఖుర్ఆన్ పఠనము చేయుచుందురు. వారు కూడా మీరు చెప్పిన దానిని చెప్పలేదే? మీరు తెలుగులో వ్రాసిన ఖుర్ఆన్‍ను చదివి చెప్పుచున్నారు. ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలో వ్రాయబడినది. అరబ్బీ భాషా పండితులు మీరు చెప్పిన వాక్యమును చదివియుంటారు కదా! మీరు చెప్పిన (4-103) వాక్యములో ఇంకో నమాజును గురించి, దానిని నెలకొల్పమని చెప్పిన దానిని గురించి చెప్పినది తెలిసియుండదా? అరబ్బీ పండితులకు తెలియని విషయమును మీరు చెప్పుచున్నారా? అని మాకు అనుమానము (ప్రశ్న) వచ్చుచున్నది. దీనికి మీరు ఏమి జవాబు చెప్పగలరు?


జవాబు :- ఖుర్ఆన్ గ్రంథమును అరబ్బీ భాషలో వ్రాసిన మాట నిజమే. అరబ్బీ, తెలుగు తెలిసిన పండితులు అరబ్బీ భాషలోని ఖుర్ఆన్ గ్రంథమును తెలుగులో అనువదించి వ్రాశారు. అలా తెలుగు అనువాద గ్రంథములు నావద్ద ఏడు గ్రంథములు గలవు. అన్ని గ్రంథములలోను (4-103) ఆయత్‍ను చూస్తే అన్నీ ఒకే అర్థము ఇచ్చునవిగా గలవు. కొన్ని గ్రంథములలోని పదములు వేరుగాయున్నా అర్థము ఒకే విధముగా యున్నది. ఒక గ్రంథములో 'నమాజును స్థాపించండి' అని వ్రాశారు. మరొక గ్రంథములో 'నమాజును నిర్మించండి' అని గలదు. ఇంకొక దానిలో 'నమాజును నెలకొల్పండి' యని కలదు. మూడు తెలుగు అనువాద గ్రంథములలో వేరువేరు పదములుగా నిర్మించండి, స్థాపించండి, నెలకొల్పండి యని యున్నా అన్నీ ఒకే అర్థమును చూపుచున్నవి. అటువంటప్పుడు భాషను చూడక భావమును చూడవలెను. ఇటువంటి ప్రశ్న వస్తుందేమోనని ముందుచూపుగా ఒకే ఆయత్‍ను మూడు గ్రంథములనుండి సేకరించి మూడు విధముల వ్రాసి చూపాను. ఆ మూడు ఆయత్‍లు కొద్దిగా పదాలు వేరుగా యున్నా, భావములో అన్నీ ఒకే విధముగా యున్నవని చెప్పవచ్చును. తర్వాత ఇస్లామ్‍లో ఎందరో పండితులు భక్తులు ఉన్నారు. అయితే 4-103 లో క్రొత్త నమాజును కూడా పాత నమాజుగా వారు లెక్కించుకొని క్రొత్త దానిని కూడా పాతదానిగానే చెప్పుచున్నారు. ఎన్నిచోట్ల చెప్పినా ఉన్నది ఒకే నమాజు కదా!యని అంటున్నారుగానీ వాక్యములోని హెచ్చుతగ్గులను, సూక్ష్మాతి సూక్ష్మములను తెలియలేకున్నారు. అలా నమాజ్ ఒక్కటేయని, అల్లాహ్ ఒక్కడేయని నిర్ధారణలో ఉండుట వలన క్రొత్త నమాజ్ వారికి తెలియకుండా పోయినది.


ప్రశ్న :- ఇంత పెద్ద ముస్లీమ్ సమాజములో, ఖుర్ఆన్ వాక్యమునందు నమాజ్ స్థాపించండి, నెలకొల్పండి అని వ్రాసిన పదము అర్థముకాక చెప్పిన నమాజ్‍ను పాత నమాజ్ అనుకున్నారా? ఒక్కరు కాకపోతే మరొక్కరికయినా దాని భావము అర్థము కాలేదా? ఇస్లామ్ పండితులకంటే నీవు పెద్దవాడివా, వారికి అర్థము కానిది నీకు అర్థమయినదని మేము ఎట్లు నమ్మాలి? నీవు ఇందూ సమాజములోని వానివి. హిందూ సమాజములోని మనిషి (మీరు) ఖుర్ఆన్ గ్రంథము చదివి అర్థము చేసుకొన్న దానిని ఇస్లామ్ పండితులకు అర్థము కాలేదని చెప్పగలరా?


జవాబు :- సత్యమును సత్యముగానే చెప్పితే అల్లాహ్ సంతోషిస్తాడుగానీ, సత్యమును అసత్యముగా చెప్పితే అల్లాహ్ ఏమాత్రము ఒప్పుకోడు. దేవుడు అంటే నాకు ఎంతో భయము కలదు. అట్లే భక్తీ కలదు. సత్యము అంటే కూడా భయము కలదు. దేవుడు, దేవుని బోధలు సత్యసమేతముగా ఉండును. అందువలన సత్యమును అసత్యముగా చెప్పుట పెద్ద తప్పుగా భావింతును. వాస్తవముగా ఖుర్ఆన్ గ్రంథము నాకు అర్థమయినట్లు ఇతర ముస్లీమ్‍లకు అర్థము కాలేదనియే చెప్పుచున్నాను. హిందూ సమాజములో పుట్టిన వానికి అర్థము అయినప్పుడు, ముస్లీమ్ సమాజములో పుట్టినవారికి అర్థము కాకుండా పోవునా? ఇది నమ్మవలసిన మాటేనాయని అడుగవచ్చును. అట్లు అడగడములో తప్పులేదుగానీ సత్యము తెలిస్తే మీరు ఎవరూ ఈ మాటను అడుగరు. అందరికీ తెలియని సత్యము ఏమనగా!


ఖుర్ఆన్ గ్రంథములో ఎన్నో గొప్పవాక్యములు గలవు. ఇప్పుడు వజ్రవాక్యములను పేరుతో ఈ గ్రంథమును వ్రాయుచున్నా, వాస్తవముగా చూస్తే వజ్రవాక్యములు అను పేరు కూడా ఒక విధముగా ఈ గ్రంథమునకు తక్కువేయని చెప్పవచ్చును. వజ్రాలకంటే ఎక్కువ విలువయిన వాక్యములు ఖుర్ఆన్ గ్రంథములో గలవు. ఖుర్ఆన్ గ్రంథము ఏ మనిషికి అర్థము కావాలన్నా, మతముతో సంబంధము లేకుండా ముస్లీమ్‍కుగానీ, హిందువులకుగానీ, క్రైస్థవులకుగానీ ఎవరికి అర్థము కావాలన్నా మిగతా రెండు గ్రంథములు చదివిన వారికే అర్థమగును. ఎవడయితే మూడు దైవ గ్రంథములలో మిగతా రెండు గ్రంథములు చదవకపోతే ఖుర్ఆన్ అర్థము కాదు. మిగతా రెండు దైవగ్రంథములయిన భగవద్గీత, బైబిలు చదివి అర్థము చేసుకొనియుంటే వానికి ఖుర్ఆన్ గ్రంథము సులభముగా అర్థము కాగలదు. నేను భగవద్గీతను, బైబిలును వివరముగా చదువగలిగాను. చదవడమేకాక బాగా అర్థము చేసుకొన్నాను. అందువలన మూడవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథము బాగా అర్థమవుచున్నది. ముస్లీమ్‍లకు కూడా తెలియని రహస్య భావములు నాకు తెలియుచున్నవి. వాస్తవానికి (4-103) వ వాక్యము చిన్న వాక్యము. అందులో మూడే ముక్కలు గలవు. ఒకటి పాత నమాజును చెయ్యి, తర్వాత ఎక్కడున్నా ఏ పరిస్థితిలోయున్నా అని చెప్పుచూ నిలుచున్నా, కూర్చుండినా, పరుండినాయని అన్నారు. ఆ తర్వాత సమయము అనుకూలిస్తే, నమాజును నెలకొల్పమని చెప్పారు. నమాజును నెలకొల్పమని చెప్పినది అన్ని గ్రంథములలో గలదు. అందరూ దానిని చదివినా పాత నమాజును తప్పనిసరిగా శ్రద్ధగా ఆచరించడమే నమాజును నెలకొల్పినట్లు తలచుచున్నారు. గ్రంథములో మా బుద్ధికి క్రొత్త నమాజుగా కనిపించుచున్నది. దానికి ఒకే ఒక కారణము గలదు. అదే వారు ఖుర్ఆన్ గ్రంథమును అర్థము చేసుకోలేదని ఆ కారణము చేతనే క్రొత్త నమాజ్ కూడా పాత నమాజ్ మాదిరే అర్థమయినదని చెప్పవచ్చును. అలా అర్థము కాకపోవడానికి ముస్లీమ్‍లు భగవద్గీతను, బైబిలును చదవలేదు. రెండు గ్రంథములను చదవనిదే మూడవ గ్రంథము అర్థముకాదని నేను కొన్ని సంవత్సరములనుండి చెప్పుచూనే యున్నాను.


భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ మూడు దైవ గ్రంథములేయని చెప్పవచ్చును. ఒక దైవ గ్రంథము అర్థము కావాలంటే మిగతా రెండు దైవ గ్రంథములను తప్పనిసరిగా చదువవలసిందే. మనిషి ఏ ధర్మములో యున్నా ఆ ధర్మము వానికి తెలియాలంటే మిగతా రెండు గ్రంథములను చదవవలెను. ఇది అల్లాహ్ ఐదవ సూరాలో 68వ ఆయత్‍లో ఇలా ఆజ్ఞ చేసి చెప్పాడు చూడండి. అక్కడ చెప్పిన వాక్యము అనుసరించి మనిషి ధర్మము నిర్ణయించబడును.


(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు వద్ద నుండి వచ్చిన మీ వద్దకు పంపబడిన దానిని (ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే''


ఈ వాక్యము ఖుర్ఆన్ గ్రంథములో ముస్లీమ్‍లకే చెప్పియున్నారు కదా! అటువంటప్పుడు ముస్లీమ్‍లు భగవద్గీత, బైబిలు చదవనిదే ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍లు సక్రమముగా అర్థము కావు. దేవుని నియమము ప్రకారము నడుచుకోని వారికి వారి ధర్మము వారికే తెలియదు. ఇది ముస్లీమ్‍లకే కాదు, అన్ని మతముల వారికి వర్తించును. అందువలన తమ మత గ్రంథమని ఒక గ్రంథమును ఆశ్రయించి, మిగతా రెండు దైవ గ్రంథములను పరమత గ్రంథములుగా అసూయతో చూచువారికి, ఎంత కాలమునకయినా వారి గ్రంథములోని జ్ఞానమే అర్థము కాదు. నేడు హిందువులు బైబిలును పరమత గ్రంథము అని అసూయతో చూస్తున్నారు. అట్లే ఖుర్ఆన్ గ్రంథమును కూడా పరమత గ్రంథమని దూరముగా పెట్టారు. అందులో ఏమున్నది ఆ రెండు గ్రంథముల జ్ఞానము తెలియదు కావున అటువంటి వారికి భగవద్గీత జ్ఞానము కూడా తెలియదు. అంతేకాక మేము హిందువులమని చెప్పుకొనుచుండినా వారికి హిందూ ధర్మము ఏదో తెలియకుండును. ఒక దైవగ్రంథములోని జ్ఞానము అర్థము కావాలంటే మిగతా రెండు దైవ గ్రంథముల జ్ఞానము తెలిసియుండాలి. ఈ సూత్రము తెలియని దానివలన ముస్లీమ్‍లకు వారి ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍లు అర్థము కావడము లేదు.


నేను భగవద్గీత, బైబిలు రెండు గ్రంథములు చదివాను కావున ఖుర్ఆన్ అర్థమగుచున్నది. అలాగే ఖుర్ఆన్, బైబిలు చదివియుండుట వలన భగవద్గీత అర్థమగుచున్నది. అట్లే భగవద్గీత, ఖుర్ఆన్‍ను చదివి యున్నాను కావున నాకు బైబిలు సులభముగా అర్థమగుచున్నది. ముస్లీమ్‍లకు (4-103)లో యున్న వాక్యములో క్రొత్త నమాజ్ అర్థము కాలేదంటే, క్రొత్త నమాజు ఉన్నదని తెలియలేదంటే వారికి మిగతా రెండు గ్రంథముల జ్ఞానము తెలియదనే చెప్పవచ్చును. దేవుడు ఒక సూత్రమును ఒక దైవ గ్రంథములలో చెప్పితే మూడు దైవగ్రంథములలో ఆ సూత్రము ఉన్నట్లేయగును. మూడు దైవగ్రంథములలో ఒకే దేవున్ని గురించి చెప్పియుండుట చేత ఒక జ్ఞాన సూత్రము ఒక దైవ గ్రంథములో చెప్పితే అది మిగతా రెండు దైవగ్రంథములలో చెప్పినట్లుగా లెక్కించవలెను. చెప్పునది ఒకే దేవున్ని అయినందున ఒకే సూత్రము మూడు గ్రంథములలో సమానముగా వర్తించును.


ఒక బ్యాంకు లాకర్‍లో సొమ్మును దాచుకొన్నప్పుడు, బ్యాంకు లాకర్‍కు రెండు తాళము చెవులు ఉండును. ఒకటి ఖాతాదారునికి ఇచ్చి రెండవ దానిని బ్యాంకు మేనేజర్ ఆధీనములో ఉంచుకొనును. లాకర్‍లో సొమ్ము కావలసి వస్తే నీ వద్ద యున్న తాళము చెవితో మాత్రము లాకర్ తెరుచుకోదు. బ్యాంక్ మేనేజర్ వద్దయున్న తాళము చెవి నీవద్ద యున్న తాళము చెవి రెండూ ఉపయోగించినప్పుడు బ్యాంక్‍లాకర్ తెరుచుకొని అందులోని సొమ్ము లభించును. ఇక్కడ బ్యాంక్ లాకర్ తెరవటానికి రెండు తాళము చెవులు అవసరమైనట్లు ఒక తాళము చెవితో లాకర్ తెరుచుకోనట్లు ఒక గ్రంథము చదివితే దేవుని జ్ఞానము లభించదు. రెండు తాళములు ఉన్నప్పుడే లాకర్ తెరచుకొన్నట్లు ఎప్పుడయినా ఇతర మత గ్రంథములని అసూయ చెందక చదివినప్పుడు గ్రంథములోని వాక్యమందు గల జ్ఞానము లభించును. నేడు ఎక్కడ చూచినా ఒక మతము రెండవ మతము మీద ద్వేషము కల్గియున్నది. అందువలన ఎవరికీ దైవ గ్రంథములలోని జ్ఞానము అర్థము కావడము లేదు. దేవుడు అన్ని మతములకు ఒక్కడే అయినప్పుడు అన్ని మతములలోని జ్ఞానము ఒక్కటే యుండును గానీ, వేరుగా యుండుటకు అవకాశముండదు. ఆ విషయము తెలియక ప్రతి ఒక్కరూ మత ద్వేషమును కల్గి ఇతర దైవ గ్రంథములోని జ్ఞానము తెలియని దానివలన ఒక మతములోని జ్ఞానము ఆ మతములోనే అర్థము కాకుండా పోయినది. ముఖ్యముగా అదే కారణము చేత వాక్యములో నమాజును నెలకొల్పమని చెప్పినా, అది ఏ నమాజో ముస్లీమ్‍లకే అర్థము కాకుండా పోయినది.


ఖుర్ఆన్ గ్రంథములో ఈ మాట ఉన్నది. కావున ముస్లీమ్‍లకే ఈ విషయము బాగా అర్థము కావలసియున్నది. అయితే వారు చేయుచున్న నమాజ్‍కు, క్రొత్తగా స్థాపించబడవలసిన నమాజ్‍కు ఏమి తేడా యున్నదని వారు కొంచెమయినా ఆలోచించలేదు. (4-103) వ ఆయత్‍లో ఖుర్ఆన్ గ్రంథములో చేయుచున్న నమాజును గురించి చెప్పడమేకాక, క్రొత్తగా నెలకొల్పు నమాజ్‍ను గురించి కూడా చెప్పారు. ఇది అల్లాహ్ నుండి వచ్చిన జ్ఞానముకాగా, దానినే జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పాడు. ఈ జ్ఞానమును సృష్ఠి మొదలయిన తర్వాత కొంత కాలానికే వాణి (శబ్దము) ద్వారా వచ్చినది. ఆ శబ్దము ఆకాశము నుండి వచ్చినది. ఆ రోజు అది మాటల రూపములో రాలేదు. ఆకాశము నుండి ఎలా శబ్దము వచ్చునో అలాగే ఉరుముల రూపములో వచ్చినది. అలా ఉరుముల రూపములో వచ్చిన శబ్దమును విని, గ్రహించుకొన్న సూర్యుడు కొంతకాలానికి భూమి మీద 'మనువు' అను వ్యక్తికి తాను వినిన శబ్దములను మనుషుల మాటల రూపములోనికి మార్చి చెప్పాడు. సూర్యుడు ఏ శబ్దములోని భావమును గానీ, ఏ భాషలోని భావమునుగానీ గ్రహించుశక్తి గలవాడు, అలాగే ఏ భాషలోనయినా మాట్లాడు స్థోమత గలవాడు. అన్ని భాషలను గ్రహించుశక్తి ఆయనకు గలదు. అందువలన కృతయుగములోనే మొదటి భాష అయిన తెలుగు భాషలో మాట్లాడి, మనువుకు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును చెప్పడము జరిగినది. అలాగే కలియుగములో 1400 సంవత్సరముల క్రితము 'జిబ్రయేల్' అను పేరుతో క్రిందికి దిగివచ్చి, ముహమ్మద్ ప్రవక్తగారికి కృతయుగములో మనువుకు చెప్పిన జ్ఞానమునే చెప్పడము జరిగినది. మనువుకు చెప్పిన జ్ఞానమే చివరికి మారుచూ మారుచూ వచ్చి కలియుగము మొదటిలో ద్వాపరయుగము చివరిలో అనగా యుగ సంధిలో వ్యాసుని చేత 'భగవద్గీత' గ్రంథముగా వ్రాయబడినది. అలాగే అదే జ్ఞానమే 1400 సంవత్సరములప్పుడు 'ఖుర్ఆన్' గ్రంథముగా వ్రాయబడినది. దీనినిబట్టి చరిత్ర తెలిసిన వారికి రెండు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటేయని తెలియబడుచున్నది.


అందువలన ఖుర్ఆన్ గ్రంథములో (4-103) ఆయత్ ఒక్క ముస్లీమ్‍లకే గాక హిందువులకు, క్రైస్థవులకు వర్తించునదిగా యున్నది. దీనినిబట్టి చూస్తే హిందువులు ఏ ఆరాధన చేయుచున్నారో దానికంటే వేరే ఆరాధనను నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే క్రైస్థవులు ఏ ఆరాధన (ప్రార్థన) చేయుచున్నారో దానికంటే వేరుగా యున్న ప్రార్థనను నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే ముస్లీమ్‍లు వారు చేయుచున్న నమాజ్‍ను వారు చేయుచూ, దానిని కాదని ప్రత్యేకముగా మరొక నమాజును నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అంతవరకు చేయని క్రొత్త నమాజును నెలకొల్పుకోమని చెప్పడమైనది. అలాగే నెలకొల్పుకోవలసిన అవసర మున్నది. అయితే దేవుడు ఈ విషయమును వాక్యరూపములో చెప్పినా 'నాకు తెలిసినది ఇంతే, నాకు తెలియనిదాని జోలికి నేను పోను' అని దేవుడు చెప్పిన వాక్యమును కూడా లెక్కచేయనివారు, చూడనివారు గలరు. అటువంటి వారికి నాలాంటి వాడు ఎవడయినా వాక్యము ఇలా ఉన్నదని చూపినా, ఖుర్ఆన్ గ్రంథము జ్ఞానమును కూడా పెడచెవిన పెట్టి, మా పెద్దలు చెప్పినట్లు నడుచుకొనుచుందుమని చెప్పుచుందురు. పెద్దలు చెప్పినది వినడము మంచిదే అయినప్పుడు దేవుడు చెప్పినది వినడము మరీ మంచిదగును కదా! దేవునికంటే పెద్దలు కూడా చిన్నవారేయగుదురు. దేవుని మాటతో సమానముగా పెద్దల మాటలను పోల్చుకోకూడదు. దైవగ్రంథము లోని వాక్యమును వదలి, పెద్దలు పెట్టిన మత సాంప్రదాయములను అనుసరించి అట్లే నడచుకొంటే దేవునిమాటను గౌరవించని వారమగుదుము.


ప్రశ్న :- మీరు చెప్పినది మంచిదే. అయితే కొందరు విద్వాంసులయిన ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథములోని ప్రతి వాక్యమును తెలిసిన పండితులుగా యుంటున్నవారు ఈ విషయమును గురించి ఇలా అంటున్నారు. (4-103) వ వాక్యములో చెప్పినది అర్థము కావాలంటే (4-102) వ వాక్యమును చూడాలి. అక్కడ యుద్ధ సమయములో 'కొందరు నమాజ్ చేయండి, కొందరు నమాజ్ చేయకుండా శత్రువుల ఎడల అప్రమత్తముగా యుండండి అనీ, మొదట కొందరు నమాజ్ చేసినప్పుడు కాపలా యున్న మిగతావారు తర్వాత నమాజ్ చేయండి' అనీ చెప్పియున్నట్లు కలదు. అలా మొదట కొందరు, రెండవ మారు కొందరు నమాజు చేయడము జరుగుచున్నది. నమాజు చేసేవాడిని ఉద్దేశించి నమాజును నెలకొల్పండి అని అన్నారు. అంతేగానీ రెండవవారు చేయునది క్రొత్త నమాజ్ కాదు. మొదట చేయునది, తర్వాత చేయునది రెండూ ఒకే నమాజుగా యున్నది. అది తెలియక కొందరు రెండవమారు రెండవ గుంపు చేయునది క్రొత్త నమాజ్‍కాదు. రెండూ ఒకే నమాజ్‍యని తెలియవలెను.


(4-102) (ఓ ప్రవక్తా!) ''నీవు వారి మధ్యన ఉన్న సమయములో (యుద్ధము జరుగుతూ యుంటే) వారు నమాజ్ చేయటానికి సిద్ధమైనప్పుడు వారిలో ఒక వర్గము నీతోపాటు సాయుధులై నిలబడాలి. మరి వారు నమాజ్ చేయగానే మీ వెనక్కి వెళ్లిపోవాలి. అప్పటి వరకు నమాజ్ చేయని రెండవ గుంపు వచ్చి నీతోపాటు నమాజ్ చేయాలి. నమాజ్ చేసి ప్రక్కన యున్నవారు ఆయుధములు ధరించి అప్రమత్తముగా ఉండాలి'' అని ఉంది.


ఈ ఆయత్ యుద్ధసమయములో కూడా నమాజ్ చేయాలని, అప్పుడు అందరూ ఒకేమారు నమాజు చేయక రెండు గుంపులుగా చీలిపోయి ఒక గుంపు నమాజ్ చేయునప్పుడు మరొక గుంపు ఆయుధములు ధరించి నమాజ్ చేయువారికి కాపలా ఉండవలెననీ, అట్లే మొదటి గుంపు నమాజ్ అయిపోయినప్పుడు రెండవ గుంపు నమాజ్ చేయగా మొదటి గుంపు కాపలా ఉండవలెనని వాక్యములో చెప్పియున్నారు. మొదటి గుంపు నమాజ్ చేయగా తర్వాత రెండవ గుంపు చేయు నమాజ్‍ను 'నమాజ్‍ను నెలకొల్పమని' చెప్పారు. అందువలన ఉన్నది ఒకే నమాజ్, గుంపులు రెండు ఉండుట వలన ఒక గుంపు నమాజ్‍ను ఆచరించగానే రెండవ గుంపును నమాజ్ చేయమని చెప్పడములో అలా చెప్పారు తప్ప రెండవ నమాజ్ లేదు. నమాజు ఒకటే ఉండును దానినే అందరూ ఆచరిస్తున్నారు. రెండవ క్రొత్త నమాజు లేదని చెప్పుచున్నారు. పొరపడి రెండవ గుంపును చేయమని చెప్పినదే రెండవ నమాజ్‍గా అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారో చెప్పండి?


జవాబు :- దేవుడు (అల్లాహ్) అనుగ్రహించినట్లు దైవగ్రంథములోని జ్ఞానము అర్థమగుచుండును. అలాగే ఇస్లామ్ పండితులకు అర్థమయి ఉండవచ్చును. పండితులు చెప్పినట్లు రెండవ గుంపు నమాజ్ చేయడమును వాక్యములో గల రెండవ నమాజ్‍గా అర్థము చేసుకొని యుండవచ్చును. అయితే అల్లాహ్ మనిషికి ఇచ్చిన బుద్ధితో ఆలోచిస్తే నాకు ఈ విధముగా అర్థమగుచున్నది. నేడు ముస్లీమ్ సమాజములో ఉన్నది ఒకే ఒక నమాజ్. ఒకే విధమైన నమాజునే ముస్లీమ్‍లందరూ చేయుచున్నారు. ఎన్ని గుంపుల మనుషులు గుంపుల వారిగా, ఎన్నిమార్లు చేసినా ఒకే నమాజ్‍యేగానీ అది రెండవ నమాజ్‍గా యుండదు. నమాజు ఏడు ఆయత్‍ల పఠనముతో కూడుకొని యుండును. ఏడు ఆయత్‍ల పఠనము లేనిది నమాజ్ పూర్తికాదు. నమాజు ముందు చేసినా వెనుక చేసినా, వేరువేరు సమయములలో చేసినా నమాజ్ అనునది ఒక్కటే. నమాజు క్రమశిక్షణతో కూడుకొనియున్నది. సామూహికముగానయినా చేయవచ్చును. ఎవరూ లేనిచోట ఒంటరిగా అయినా చేయవచ్చును. ఎలా చేసినా, ఎప్పుడు చేసినా నమాజ్ ఒక్కటేగానీ రెండవది లేనేలేదు. అయితే (4-103) లో నెరవేర్చే నమాజు వేరు, నెలకొల్పబడే నమాజు వేరుగా చెప్పియున్నారు. ఆచరించబడే నమాజును నేడు అందరూ ఆచరించుచున్నారు. యుద్ధ సమయములో ఒక గుంపు ముందు చేసిన నమాజునే రెండవ గుంపు కూడా చేయుచున్నది. అంతేగానీ ముందు గుంపు ఒక నమాజు చేస్తే రెండవ గుంపు రెండవ రకము నమాజును చేయలేదు. వాక్యములో చెప్పిన సారాంశములో అందరూ ఆచరించు నమాజ్‍ను చెప్పడమేకాక క్రొత్తగా స్థాపించబడే నమాజును గురించి చెప్పారు. రెండవ క్రొత్త నమాజును బయటపెట్టడము వలన దానిని ఒప్పుకొంటే కొందరి వలన పేచీలు వస్తాయేమోనని తెలిసి, ముందే సమయము అనుకూలించినప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పారు. రెండవ నమాజు క్రొత్త నమాజు ఉందంటేనే అదేమిటని ఆలోచించకుండా దానిని గురించి వ్యతిరేఖముగా మాట్లాడు వారుందురు. అందువలన ముందే అనుకూలమైనప్పుడు అని చెప్పారు.


(4-102) వ వాక్యములో ఉన్న సమాచారములో క్రొత్త నమాజు లేనేలేదు, పాత నమాజును గురించే చెప్పారుగానీ అందరూ ఆచరించు నమాజ్‍కంటే వేరే నమాజును గురించి చెప్పలేదు. (4-103) లో మాత్రమే క్రొత్తగా స్థాపించవలసిన నమాజును గురించి చెప్పారు. అయినా ఆ క్రొత్త నమాజును ఇంతవరకు ఎవరూ స్థాపించలేదు. క్రొత్తగా స్థాపించవలసిన నమాజును గురించి ప్రత్యేకముగా అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ ప్రత్యేకముగా క్రొత్త నమాజు ఇలా ఉంటుందని చెప్పియుంటే ప్రజలు దానిని స్థాపించేవారు, తర్వాత అందరూ ఆచరించేవారు. దేవుడు ప్రత్యేకమైన క్రొత్త నమాజును స్థాపించుకొమ్మన్నాడు గానీ, ఇదే క్రొత్త నమాజు అని ఏమాత్రము చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదనగా! ముందు చెప్పిన రెండు దైవగ్రంథములలోనూ క్రొత్త నమాజును గురించి యున్నది. అట్లే చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో కూడా దానిని గురించి గలదు.


మూడు దైవగ్రంథములలో వెదికితే రెండవ రకమయిన క్రొత్త నమాజు కనిపించగలదు. అలా దైవగ్రంథములో వెదకకల్గి రెండవ నమాజును (ప్రార్థనను) తెలియగలిగినా, అది తెలిసిన వానికి ఒక్కనికే ఉపయోగపడును. ఏ మతస్థుడయినా మొదటినుండి అలవాటయిన, మొదటి నుండి తెలిసిన నమాజునే ఆచరించుచున్నాడు. అది ఒక్కటే నమాజు అని అనుకొనుచున్నారు. గ్రంథములలో నిక్షిప్తమైయున్న నమాజు ఏమిటో ఎవరికీ తెలియదు. ఒకవేళ దానిని ఎవరయినా విశధీకరించి ఇదే క్రొత్త నమాజు అని చెప్పినా, దాని విషయమును సంపూర్ణముగా తెలిసినా, దానిని అందరూ చేయలేరు. రెండవ నమాజును గురించి తెలిసినా, దానిని ఆచరించుటకు చాలామంది పూనుకొనినా, ఒకరు లేక ఇద్దరు ఆ నమాజ్‍ను చేయగలరేమో గానీ, అందరూ ఆచరించలేరు. దేవుని ఆరాధనను దేనినయినా నమాజ్‍గానే చెప్పవచ్చును అని ''తౌహీదె ఉలూహియత్'' అని ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు. అల్లాహ్ యొక్క రెండవ క్రొత్త ఆరాధన (నమాజు) ''తౌహీదె ఉలూహియత్'' కోవకు కూడా చెందినది కాదు. అదొక ప్రత్యేకమైన ఆరాధన. దానిని ప్రయత్నించి చేయలేక వదలివేసినవారు కూడా కలరు. పట్టుదల గల జ్ఞానసంపన్నులైన వారు దానిని సాధించి ఆచరించినవారు కూడా కలరు. తౌరాతు (భగవద్గీత), ఇంజీలు (బైబిలు) గ్రంథముల జ్ఞానమును చెప్పిన కృష్ణుడు, ఏసు ఇద్దరూ రెండవ నమాజ్‍నే ఆచరించారు. మా వలె మీరు కూడా ఆచరించమని కృష్ణుడు తన గ్రంథములో చెప్పియున్నాడు. మొదట వహీ ద్వారా వచ్చిన జ్ఞానములో రెండవ నమాజును గురించి యున్నది. అందువలన చివరిలో ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పిన జిబ్రయేల్ తన జ్ఞానములో రెండవ ఆరాధనను గురించి చాలాచోట్ల చెప్పాడు. అయినా ఖుర్ఆన్ గ్రంథములో రెండవ నమాజు వివరము గలదని ముస్లీమ్‍లకు తెలియకుండా పోయినది. అందువలన (4-103) లో ప్రత్యేకముగా నమాజును నెలకొల్పండియని చెప్పాడు. అయినా ఆ ఆయత్‍ను ముస్లీమ్‍లు చూచి ఆరాధన అంటే ఒకటేయనీ, ప్రార్థన (నమాజు) తాము చేయునదేయని అనుకొంటున్నారు.


ప్రశ్న :- మీరు చెప్పునది కొంత సత్యమే అనిపించినా ఒక ప్రక్క సత్యము కాదనిపించుచున్నది. మీరు సత్యమును చెప్పాలని తాపత్రయ పడుచు చెప్పుచున్న విధానమునుబట్టి మీరు చెప్పునది సత్యమే అనిపించినా ఇంకా మాకు ఆటంకముగా కనిపించు కొన్ని వాక్యములను బట్టి దీనికేమంటారు అని అడుగవలసి వచ్చినది. ఇంకొక చోట కూడా నమాజు స్థాపించండి అను పదముతోనే చెప్పారు. ఆ వాక్యమునుబట్టి మేము ఏమనుకోవాలో మీరే చెప్పండి.


(17-78) ''నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకొనే వరకు'' అని చెప్పబడియున్నది. దీనినిబట్టి నమాజును చేస్తూనే ఉండు అని ఉంది కదా! ఈ వాక్యములో చెప్పినది ఒకే నమాజు కదా! రెండవ నమాజు పేరు లేదు కదా! (4-103) లో చెప్పినట్లే నమాజును నెలకొల్పమని మొదటనే చెప్పారు. దీనిని చూచిన తర్వాత మీకు ఏమనిపిస్తావుంది? ఇక్కడ ఏ నమాజును గురించి చెప్పియున్నారు? అను ప్రశ్నలు వస్తున్నవి. దీనికి మీరేమంటారు?


జవాబు :- మిమ్ములను తప్పుదారి పట్టించాలనునది నా ఉద్దేశ్యము కాదు. సత్యము చెప్పాలనునదే నా ఉద్దేశ్యము. దాని ప్రకారము చెప్పుచున్నాను. పైగా ఒక ఆయత్‍కు తప్పు వివరము ఇస్తే ఘోరమైన పాపము వస్తుందని సూరా 41, ఆయత్ 40లో కలదు.


(41-40) ''మా వాక్యాల విషయములో వక్రవైఖరిని అవలంభించి అసత్యాలను కూర్చి చెప్పు వారిని మేము చూస్తూనే యున్నాము. అగ్నిలో పడవేయబడువాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితముగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు ఇష్టమొచ్చింది చేసుకొంటూ పోండి. ఆయన (అల్లాహ్) మీరు చేసే పనులన్నీ చూస్తూనే యున్నాడు.''


ఆయత్‍లో దేవుని వాక్యమునకు తప్పు భావమును వ్రాస్తే మరణానంతరము అగ్నిలో పడవేయబడుదురు అని చెప్పిన తర్వాత కూడా ఎవరూ ఆయత్‍ల జోలికి పోరు. సత్యము తెలిసియుంటే బయటికి చెప్పగలరు గానీ, వాక్యమును గురించి తెలియకపోతే ఊరకనే ఉండును. నాకు సత్యము తెలిసింది, కావున ధైర్యముగా బయటికి చెప్పుచున్నాను. బుద్ధి పెట్టి యోచించువారికి నా మాటలలోని సత్యము తెలియగలదు. ఇప్పుడు మీరు (17-78)వ ఆయత్‍లోని వాక్యమును చెప్పారు. ఇక్కడ నమాజును నెలకొల్పమని చెప్పారు. కావున క్రొత్త నమాజును గురించి చెప్పారని తెలియుచున్నది. తలమీది సూర్యుడు తిరిగినప్పటినుండి రాత్రి చీకటి పడే వరకు క్రొత్త నమాజ్‍ను వదలకుండా చేయవచ్చును. అదే పాత నమాజు అయితే నిర్ణయమైన కాలములలో క్రమశిక్షణగా సామూహికముగా నమాజు చేయవలసి యుండును. క్రొత్త నమాజుకు నియమాలు లేవు. మధ్యాహ్నము నుండి రాత్రివరకు ఏకధాటిగా చేయు నమాజ్ క్రొత్తదికాగా, పాత నమాజ్ ఏకధాటిగా చేయునది కాదు. దీనినిబట్టి (17-78) ఆయత్‍లో క్రొత్త నమాజును గురించి చెప్పియున్నారు గానీ పాత నమాజ్‍ను చెప్పలేదని తెలియుచున్నది. పాత నమాజ్ నియమములతో కూడినదనీ, ఏకధాటిగా చేయునది కాదని ముస్లీమ్‍లందరికీ తెలుసు. పాత నమాజును గురించి అందరికీ తెలుసు, క్రొత్త నమాజును గురించి ఎవరికీ తెలియదు. మేము చెప్పుతూయుంటే, ఇప్పుడే తొలిసారిగా క్రొత్త నమాజు అను పేరును వినుచుందురు. ఇప్పుడయినా గ్రంథములో చెప్పిన క్రొత్త నమాజును గురించి తెలియవచ్చును కదా! మూడు దైవ గ్రంథములలో మనకు తెలియని క్రొత్త నమాజ్‍ను గురించి ముఖ్యముగా చెప్పియున్నారు. మనిషికి బోధించిన జ్ఞానములో ప్రధానముగా క్రొత్త నమాజును గురించే గలదు. అటువంటప్పుడు క్రొత్త నమాజ్‍ను గురించి అందరూ తెలిసి గ్రంథములో చెప్పినట్లు ఏకధాటిగా నమాజ్‍ను చేయవచ్చును కదా!


మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజును గురించి యుండడము వాస్తవమేయని దానిని గురించి తెలిసిన మేము చెప్పుచున్నాము. ఇంకా వివరముగా చెప్పితే ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతలో క్రొత్త నమాజును గురించి ఎక్కువ శాతము చెప్పబడినది. ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలులో భగవద్గీతలో చెప్పిన దానికంటే కొంత తక్కువ చెప్పియున్నారు. అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్ గ్రంథములో ద్వితీయ దైవ గ్రంథములో కంటే తక్కువ చెప్పియున్నారు. తౌరాతు గ్రంథములో దాదాపు 60 శాతము కొత్త నమాజ్‍ను గురించి చెప్పగా, ఇంజీలు గ్రంథములో 30 శాతము చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో 15 శాతము చెప్పారు. మూడు దైవ గ్రంథములలో ఇంత శాతము చెప్పారని కొలత వేసి మేము చెప్పుచున్నా మంటే, అదేదో గ్రంథములో యున్నా చదివిన వారికి అర్థము కాలేదనేగా తెలియుచున్నది. మాకు తెలిసినది మీకు కూడా తెలియగలదు. అయితే మీకు తెలిసిన వరకే గోడకట్టుకొని ఇంతే ఉన్నది అనుకోకూడదు. దైవ గ్రంథములలో మనకు తెలియనిది ఎంతో గలదు. అందువలన బుద్ధిని ఉపయోగించి ప్రతి వాక్యమును చూడవలెనని తెలుపుచున్నాము.


ప్రశ్న :- మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజ్‍ను గురించి చెప్పి యున్నారని మీరు తెలుపుచుండగా మేము వింటున్నాము. మాకు ఎందుకు తెలియలేదో, మీకు ఎందుకు తెలిసిందో? మీకు తెలిసింది కదా! ఇప్పుడయినా అందరికీ ఆ నమాజును గురించి మీరు తెలియ చెప్పవచ్చును కదా! ఇంతవరకు మీరు ఆ క్రొత్త నమాజు ఇలా చేయవలెనని చెప్పలేదు. ఇప్పుడయినా ఆ క్రొత్త నమాజును ఎలా నెలకొల్పాలో? ఎలా ఆచరించాలో చెప్పవలెనని అడుగుచున్నాము. దయచేసి మీకు తెలిసినదంతా మాకు తెలుపవలెను.


జవాబు :- నాకు తెలిసినది నేను చెప్పగలను. అయితే గ్రంథములో ఎన్నోచోట్ల గల దానిని ఎవరంతకు వారు తెలుసుకొని ఆచరించినప్పుడు దానికి విలువ యుండును. నమాజ్ అను పేరుకు సార్థకము చేకూరును. క్రొత్త ప్రార్థన లేక నమాజు వలన మనిషి పరలోకమును చేరు భాగ్యము కల్గును. ''నాకు జన్మ వద్దు'' అను అర్థమును నమాజ్ అనే మూడు అక్షరములు తెల్పుచున్నవి. ఒకప్పుడు కృతయుగములోనే నమాజ్ అనునది స్వచ్ఛమయిన తెలుగు పదముగా ఉండేదని ముందే చెప్పుకొన్నాము. దాని అర్థము తెలుగులో న అంటే వద్దు. మ అంటే నాకు, జ్ అంటే జన్మలు. 'నాకు జన్మలు వద్దు' అను మాటను కుదించిన అక్షరములలో నమాజ్ యని అన్నారు. క్రొత్త నమాజ్ (ఆరాధన) అయితే దాని అర్థమునకు సరిపోవునదిగా యున్నది. అహర్నిశలు చేయునది ఒకే ఒక ఆరాధన కలదు. అదే క్రొత్త నమాజ్. నీకు క్రొత్త నమాజ్‍యని చెప్పుచున్నా నాకు మాత్రము అలవాటుపడిన పనిగా యున్నది. అందరికీ తెలిసిన పాత నమాజ్ దేవుని మీద విశ్వాసమున్న వారు అనగా ముస్లీమ్‍లు అదొక పనిగా చేయుచున్నారు. అయితే అందరి దృష్ఠిలో క్రొత్త నమాజ్‍గా గ్రంథములో చెప్పబడినది ప్రత్యేకించి చేయు కార్యము కూడా కాదు. అందరికీ అర్థమయ్యే దానికి నేను క్రొత్త నమాజ్‍ను చేస్తున్నాను అని చెప్పినా అది నేను చేయునది కాదు. అది అందరిలో జరుగుచున్నది. నాలో కూడా జరుగుచున్నది. జరుగుచున్న దానిమీద ధ్యాసను పెట్టుకొన్నాను. కావున అది నేను చేసినట్లగుచున్నది. అంతేగానీ క్రొత్త నమాజ్‍ను ప్రత్యేకించి పాత నమాజ్వలె చేయునది కాదు. ఎవరికి తెలిసినది వారు చేయుట అని చెప్పవచ్చును గానీ ప్రత్యేకముగా చేయునది కాదు కనుక సామూహికముగా చేయలేము. నియమిత కాలములో అనునదే ఉండదు. బయటికి కనిపించునది కాదు. పాత నమాజ్ బయటికి తెలియును. పాత నమాజ్‍ను చేయువారిని చూడ వచ్చును. క్రొత్త నమాజ్‍ను చేయువారు ప్రక్కలోయున్నా వారిని గురించి మనకు తెలియదు.


చాలామంది ముస్లీమ్ పెద్దలు అందరూ చేయు నమాజ్‍ను కుదించిన నమాజ్‍యని అనుచుందురు. భయముతో నియమముతో చేయు నమాజ్‍ను కట్టివేయబడిన నమాజ్, కుదించబడిన నమాజ్‍యని అనుచుందురు. క్రొత్తగా నెలకొల్పమని చెప్పిన నమాజ్ కుదించబడిన నమాజ్ కాదు. ఇంతే సమయములో ఇట్లే చేయవలెనను నియమము లేదు. అందువలన అందరూ ప్రతి దినము చేయు నమాజ్‍కంటే ప్రత్యేకమయినది. నిత్యము అందరూ ఒకచోట గుమికూడి చేయు నమాజ్ ఏడు ఆయత్‍ల పఠనముతో కూడుకొనియుండును. మిగతా మతములలో కూడా ఏవో మాటలతోనో, మంత్రములతోనో వారి ఆరాధనలు కూడుకొని యుండును. క్రైస్థవుల ఆరాధన మాటలతో, హిందువుల ఆరాధన మంత్రములతో కూడుకొన్నట్లు ముస్లీమ్‍ల ఆరాధన (నమాజ్) ఏడు వాక్యముల పఠనముతో కూడుకొని యుండును. ఆ ఏడు ఆయత్‍లలో ముందు నాలుగు అల్లాహ్‍ను పొగడునవి, తర్వాత మూడు అర్థించునవిగా యున్నవి. దేవుని ఆరాధనలో ఈ రెండు విధానములు అన్ని మతములయందు గలవు. పొగడడము, అడుగుకోవడము దేవుని వద్దే కాకుండా ప్రపంచ వ్యవహారములలో కూడా యున్నది. ప్రపంచ వ్యవహారములలో కూడా ఒకనిని ముందు పొగిడి తర్వాత అడిగితే వాడు ఏమయినా ఇవ్వగలడు. పొగడకుండా అడిగితే ఎవడూ ఏమీ ఇవ్వడు. అదే సూత్రమునే అందరూ దేవుని విషయములో కూడా ఉపయోగించారు. ముందు ప్రసన్నత కొరకు పొగడడము తర్వాత లబ్ధి కొరకు అర్థించడము జరుగుచున్నది. ప్రపంచములో ఉపయోగించు విధానమును దేవుని విషయములో ఉపయోగించడము దేవునికి ఇష్టము లేదు. దానివలన మనుషులను, దేవున్ని సమానము చేసినట్లగును.


అయితే మనుషులకు తెలిసిన విధానము ఒక్కటే అయినప్పుడు అదే విధానము ప్రకారము దేవుని ఆరాధన విషయములో ముందు పొగడడము తర్వాత అడగడము అను రెండు పద్ధతులు గల దానినే ఆచరించుచున్నారు. ఈ విధానము ఒక మతమునకే కాకుండా మనుషులున్న ప్రతీ మతములో గలదు. ఒక మనిషి నుండి లాభమును పొందవలసినప్పుడు వానిని పొగిడితే వాడు ప్రసన్నుడవును. తర్వాత వానిని అర్థించితే అప్పుడు వాడు ఇచ్చుట జరుగుచున్నది. ప్రపంచ విషయములో ముఖ్యమయిన దానినిగానీ, ముఖ్యముకాని దానినిగానీ అర్థించడము జరుగుచున్నది. దేవుని వద్ద కూడా మనిషి అలాగే అర్థించు చున్నాడు. అయితే దేవుని వద్ద అర్థించవలసినది ముఖ్యమైనదయిన పరలోకము. దానిని మోక్షము అని అంటున్నాము. ముఖ్యమైన ముక్తిని గురించి అడగడమును ప్రార్థన అని అనవచ్చును. 'ప్ర' అనగా ముఖ్యమైన అనీ, అర్థన అనగా అడుగుకోవడము అని చెప్పవచ్చును. ప్ర+అర్థన=ప్రార్థన అని అంటున్నాము. అయితే నేడు చాలామంది ముఖ్యముకాని దానిని దేవుని వద్ద అడుగుచూ, దానిని కూడా ప్రార్థనయని అంటున్నారు. ముఖ్యము కాని దానిని అడగడము దేవునికి కూడా సరిపోదు. అంతేకాక అందరినీ పొగడినట్లు తనను పొగడడము, అందరినీ అడిగినట్లు తనను అడగడము దేవునికి ఏమాత్రము సరిపోలేదు. అలా చేయడము వలన మనుషులను, దేవున్ని కలిపివేసినట్లగుచున్నది.


మనుషులలో హిందువులు ద్యానము అనీ, క్రైస్థవులు ప్రార్థనయనీ, ముస్లీమ్‍లు నమాజ్ అను పేర్లతో చేయు ఆరాధనలు ఏవీ దేవునికి (అల్లాహ్) కు సరిపోవు. అందువలన మూడు మతములలో యున్న మనుషులకు తనను ఎలా ఆరాధించవలెనో తెలుపుచూ నేడు దేవుని విధానములో చేయు ఆరాధనలన్నీ ఏవీ తనకు సరిపోవనీ, తనకు ఇష్టము లేదని తెలిపి తనకిష్టమైన విధానమును ప్రజలకు తన గ్రంథముల ద్వారా తెలియజేశాడు. మనిషి తనతో కలియవలెనని అనుకోవడమే తనకు ఇష్టమనీ, మిగతా ఏవీ తనకు ఇష్టము లేదని తెలియజేశాడు. అదే విషయమునే తన గ్రంథములలో కలయిక లేక ఐక్యము అను అర్థముతో తన ప్రార్థనను గురించి చెప్పాడు. దేవుడు తన మూడు గ్రంథములలో చెప్పిన దానిని నేడు క్రొత్త నమాజ్ అని అంటున్నాము. పాత నమాజ్ మనుషులు సృష్ఠించుకొన్నది. క్రొత్త నమాజ్ దేవుడు సృష్ఠించినది. అందువలన దైవ గ్రంథములలో క్రొత్త నమాజ్‍ను నెలకొల్పమని చెప్పాడుగానీ, పాత నమాజ్‍ను గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. పాత నమాజ్ ముస్లీమ్‍లలో, ద్యానము హిందువులలో ప్రార్థన అను పేర్లతో క్రైస్థవుల యందు ఉండుట సహజమే. అయితే మూడు మతముల ప్రజలలో అందరూ ద్యానము, ప్రార్థన, నమాజ్‍లను ఆచరించడము లేదు. దేవుని భయము యున్నవారు కొందరు, అట్లే దేవుని మీద భక్తియున్నవారు కొందరూ అనగా దేవుని మీద భక్తితోనో, భయముతోనో ప్రార్థన చేయుచున్నారు. మరికొందరు లాభము కొరకు చేయుచున్నారు. ఎలా చేసినా నూటికి నూరుమంది దేవుని ఆరాధనలు చేయడము లేదు. కొందరు మాత్రమే ఆరాధన చేయుచున్నారు. కొందరు దేవుడున్నాడని నమ్మకమున్నా ఆరాధనలు చేయకున్నారు. కొందరు దేవుడు ఉన్నాడను నమ్మకము కూడా లేకుండా నాస్తికులుగా యున్నారు. వారు ఆరాధనలు చేయరు, ఆరాధనలలో పాల్గొనరు.


భారతదేశములోనే మొట్టమొదట దేవుడు మరియు దయ్యమును గురించి తెలిసినది. అప్పుడు హిందూ సమాజము కలదు. అప్పుడు కొందరు జ్ఞానులు తమకున్న జ్ఞానము చేత దయ్యమును వదలి దేవున్ని ఆరాధించవలెనని తెలుసుకొన్నారు. ఆ క్రమములో దేవుడు ఎవరో తెలియక దయ్యములను అనేక దేవతలుగా ఆరాధించను మొదలుపెట్టారు. ఆ సమయములో దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలియబరచుటకు ఆకాశ వాణి ద్వారా జ్ఞానమును పంపడము, చివరికది సూర్యుని ద్వారా భూమికి చేరడము జరిగినది. అయినా భూమిమీద దేవుని జ్ఞానము మనుషులందరికీ తెలియుటకు చాలా కాలము పట్టినది. కొందరికి దేవుని జ్ఞానము తెలిసినా ముందునుండి అలవాటు పడిన పనులనే చేయుచూ దైవజ్ఞానము తెలియుట వరకే అన్నట్లుండిరి. కొందరు మాత్రము దేవుని జ్ఞానము తెలిసి, జ్ఞానము ప్రకారము నడుచుకొనేవారు. మొదట దైవజ్ఞానము కొంతవరకు భారతదేశమంతా ప్రాకినా తర్వాత మాయ ప్రభావము వలన జ్ఞానము, అజ్ఞానముల మధ్యలో కొందరు అటు, కొందరు ఇటు మారుచూ చివరికి అజ్ఞానమే ఎక్కువగా పెరిగిపోయినది.


అటువంటి పరిస్థితులలో మనిషి దేవుని వద్దనుండి కొందరు, దేవతల వద్దనుండి చాలామంది కోర్కెలను కోరను మొదలుపెట్టారు. ఇతరులను ఏదయినా అడుగునప్పుడు అడిగేవారు అడుగవలసిన వాని మెప్పును పొందితే, అడిగినది తప్పక ఇచ్చునను ఉద్దేశ్యముతో కోర్కెలతో కూడుకొన్న వారు తాము ఆరాధించు దేవున్నిగానీ, దేవతలనుగానీ ముందు బాగా పొగిడేవారు. తర్వాత తమ కోర్కెలను వెలిబుచ్చి అడిగేవారు. దానినే మొదట ఆరాధనయని అన్నారు. ఆ రోజులలో ధనమే అన్నిటికీ మూలము అని ధనము ఉంటే అన్ని పనులు జరుగునని తలచి దేవతా పూజలలోగానీ, దేవుని పూజలోగానీ చివరకు ధనమునే కోరుచుండిరి. ధనమును కోరుటకు చేయవలసిన ఆరాధనలను మనిషి ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఈనాడు చేయు పూజలను ఆరాధన యనుటలో అర్థము గలదు. ఆరాధన పదమును విభజించి చూస్తే చివరిలో 'ధన'యని కలదు. దేవతల వద్ద తమకు కావలసిన ధనము కొరకు ఆరా తీయడమును ఆరాధనయని చెప్పడము జరుగుచున్నది. మొదట ఆ విధముగా దేవతలవద్ద ఆరాధనలు తయారు కాగా, చివరకు దేవునివద్ద కూడా అదే ఆరాధనను చేయుటకు మొదలు పెట్టారు. వాస్తవముగా దేవునివద్ద చేయు ఆరాధన వేరు, దేవతల వద్ద చేయు ఆరాధన వేరు.


దేవతల వద్ద చేయు ఆరాధన ప్రపంచ ధనమును ఆశించి చేయునది యని చెప్పవచ్చును. అదే దేవుని వద్ద చేయు ఆరాధన జ్ఞాన ధనమును ఆశించి చేయునదియని చెప్పవచ్చును. రెండూ ఆరాధనలే అయినా ఒకటి దేవుని వద్ద, రెండవది దేవతల వద్ద చేయునదిగా యున్నది. దీనినిబట్టి ఆరాధనలు రెండు తెగలని చెప్పవచ్చును. దేవునివద్ద చేయు ఆరాధన జన్మలు లేని మోక్ష స్థితికి అనగా పరలోకమునకు తీసుకొని పోవును. దేవతల వద్ద చేయు ఆరాధన జన్మలకు తీసుకొని పోవునదిగా యున్నది. మనుషులు ఎక్కువగా జన్మలు కలుగజేయు దేవతా ఆరాధనలే చేయు చున్నారు. జన్మలు లేకుండా చేయు ఆరాధనలు దేవుడు నిర్ణయము చేసి చెప్పియున్నాడు. దేవుడు చెప్పినట్లు చేయు ఆరాధనలు జన్మలు లేకుండా చేయును. కనుక అటువంటి ఆరాధనలను ''నమాజ్'' అని పేరుపెట్టి చెప్పడము జరిగినది. నమాజ్ అనగా జన్మలు లేకుండా పోవడము అని అర్థమును తెలుపుచున్నది. 'న' అనగా వద్దు, 'మ' అనగా నాకు, 'జ' అనగా జన్మలు అని చెప్పవచ్చును. దేవుని ఆరాధనను నమాజ్ అని పూర్వము కృతయుగములోనే హిందువులు చెప్పేవారు. భూత కాలములో లేదు, భవిష్యత్తు కాలములో లేదు అని చెప్పుటకు ''న భూతో న భవిష్యత్'' అని చెప్పినట్లు ''జన్మల విషయములో జన్మలు వద్దు, జన్మలు లేవు'' అని చెప్పుటకు నమాజ్ అని చెప్పారు. జన్మలు లేకుండా దేవునిలోనికి ఐక్యమగు కోర్కెను తెలుపునదే నమాజ్ అని అర్థము. అయితే నేడు దేవుని ప్రార్థనలో కూడా ఏవో ప్రపంచ కోర్కెలను ఆశించి చేయు ఆరాధనను నమాజ్ అని అంటున్నారు.


ప్రపంచ ధనమును ఆశించి దేవతలను పూజించువారు తమ పూజలను ఆరాధనయని అన్నట్లు అట్లే పరమాత్మ ధనమును ఆశించి పూజించు వారు కూడా తమది ఆరాధనేయని చెప్పుచున్నట్లు రెండు రకముల ఆరాధనలను దేవుడు దేవతల పట్ల చేసినట్లు, రెండు రకముల నమాజ్‍లను దేవునివద్ద చేయుచున్నారు. దానినే ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో గల అందరూ చేయు పాత నమాజు అనియూ, ఒక్క మనిషి అయినా క్రొత్తగా నెలకొల్పు దానిని క్రొత్త నమాజు అనియూ రెండు రకములు గలవు. ఆ రెండు రకములు తెలియక ముస్లీమ్‍లు నమాజ్ ఒక్కటేయని అనుకొన్నారు.


ద్వాపరయుగము వరకు భూమిమీద మతములు లేవు. ఉన్న వారందరూ ఇందువులే యగుట వలన ఈ దేశమును ఇందూదేశము అని అన్నారు. ఇందూ అను పేరుతో ఇందువులు ఉండేవారు. ఈ మధ్య కాలములో దాదాపు 100 నుండి 150 సంవత్సరముల క్రితము 'ఇందూ' అను శబ్దము, 'హిందూ' అను శబ్దముగా మారిపోయినది. కలియుగము ప్రారంభమయిన తర్వాత మూడువేల సంవత్సరములకు మతములు అనునవి పుట్టుకొచ్చినవి. అలా పుట్టిన వాటిలో మొదటిది క్రైస్థవ మతము. మొదట అది సంఘముగా తయారయి, క్రైస్థవ సంఘము గుంపు పెరిగేకొద్దీ అది మతముగా మారిపోయినది. క్రైస్థవ మతము తయారయిన తర్వాత ఇందూ సమాజముగా యున్నవారు తమది ఇందూమతము అని చెప్పారు. ఇట్లు ఇందూమతముగా తయారయ్యే వరకు ఇందూ సమాజముగా యున్నవారు తమ కోర్కెల నిమిత్తము అనేక దేవతలను ఆశ్రయించి వారిని ఆరాధించడము జరిగేది. అప్పటి దేవతలను ఆరాధించకూడదని కలియుగము మొదటిలోనే తౌరాతు జ్ఞానము (భగవద్గీత జ్ఞానము) బయటికి వచ్చినది. అయినా తౌరాతు జ్ఞానమును కొందరే అర్థము చేసుకోగలిగి దేవుడు వేరు, దేవతలు వేరని తెలియగలిగినా చాలామంది దేవతారాధకులే ఉండేవారు. ఆనాడు తౌరాత్ జ్ఞానము వలన దేవుడు, దేవతలు అని రెండు భాగములు చేసి, దేవుని ఆరాధన వేరు, దేవతల ఆరాధన వేరని చెప్పియున్నా, ప్రపంచ ధనమును ఇచ్చు దేవతలనే ఆశ్రయించి ఆరాధించడము ప్రజలకు అలవాటై పోయినది.


కలియుగములో భగవద్గీత ప్రథమ దైవగ్రంథముగా బయటికి వచ్చినా, అంతకు ముందు యుగములనుండి దేవతా పూజలకు అలవాటు పడిన ప్రజలు భగవద్గీత మాటను లెక్కచేయక దేవతారాధనయందే ఆసక్తిని చూపుచుండిరి. అటువంటప్పుడు దేవతారాధనలలో రెండు ఆరాధనలు పేరుగాంచియుండేవి. ఈ రెండు ఆరాధనలను పేరుతో పిలుస్తున్నా వాటిలో తేడాలుండేవి. ఆ తేడాలనుబట్టి వాటికి పేర్లు కూడా పెట్టారు. వాటిని యజ్ఞములు మరియు తపస్సులుగా చెప్పేవారు. యజ్ఞములు దేవతారాధన లలో ఒకటయినా యజ్ఞములను చేయు విధానము వేరు, తపస్సులను చేయు విధానము వేరుగాయుండేది. తపస్సు చేయడములో ఏదో ఒకటి తలచుటయో, జపించుటయో జరుగుచుండును. తపస్సు చేయువారు జపించే మంత్రముగానీ, తలచే మాటగానీ బయటికి తెలియకుండా జపించేవారు. తపస్సు చాలావరకు మౌనముగా సాగేది. యజ్ఞములకంటే తపస్సులు చేయువారు గొప్పవారు అను భావము ఉండేది. తపస్సు చేయువారు తపశ్శక్తిని పొందేవారు. తపశ్శక్తికి దేవతలు సహితము భయపడేవారు. దేవతలను ఆరాధించగా వచ్చిన తపశ్శక్తికి దేవతలే భయపడేవారంటే దేవతల ఆరాధనలలో గొప్ప ఆరాధన తపస్సని చెప్పవచ్చును. ఇది ఎవరికి వారు చేసేదేగానీ సామూహికముగా చేయునది కాదు. ఎవరి సహాయము లేకుండా చేయునది తపస్సు.


యజ్ఞములు చేయడము ఒక విధమైన దేవతారాధనయని చెప్పవచ్చును. ముందే ఒక కోర్కెను ఉద్దేశ్యములో పెట్టుకొని దేవతల కొరకు చేయు ఆరాధన యజ్ఞము అని చెప్పవచ్చును. యజ్ఞము ద్వారా ఒక దేవతనుగానీ లేక ఎక్కువమంది దేవతలను గానీ ఆరాధించుచూ చేయునది యజ్ఞము. యజ్ఞము మౌనముగా తపస్సువలె చేయునది కాదు. యజ్ఞము ఒకే వ్యక్తి చేయలేడు. కొందరితో కలిసి ఒక దేవున్ని గానీ, ఎక్కువ మంది దేవుళ్ళనుగానీ ఆరాధించవచ్చును. యజ్ఞములో అగ్నిని రగిల్చి అగ్నిలో ఆహుతి చేసి ప్రతి వస్తువు వారు సంకల్పించుకున్న దేవతకు చేరునని చేయువారి నమ్మకము. యజ్ఞము ఒక్కరు చేయునది కాదు సామూహికముగా చేయునది. యజ్ఞము చేయువారు వేదమంత్రములను చదువుచుందురు. వేదమంత్రములు లేని యజ్ఞము ఎక్కడా చేయబడదు. యజ్ఞములతో వేదములు సంబంధపడియుండును. అట్లే తపస్సుతో ఏదో ఒక మంత్రము సంబంధపడియుండును. మంత్రము వేరు, తపస్సు వేరయినట్లు, యజ్ఞము వేరు వేద పఠనము వేరుగా యున్నది. మనుషులు చేయు దేవతల ఆరాధనలలో యజ్ఞములు, తపస్సులు ముఖ్యపాత్రను పోషించుచున్నవి.


తపస్సులు, యజ్ఞములు రెండూ కృతయుగము నుండి వచ్చుచున్నవే. యజ్ఞములు ఒక హిందూమతములోనే ఉండగా, తపస్సులు అన్ని మతముల లోనూ ఉన్నవి. యజ్ఞములు మొదటినుండి యజ్ఞములుగానే చెప్పబడు చున్నవి. వాటి పేరులోగానీ, ఆచరణలోగానీ ఏ మార్పు లేదు. అయితే తపస్సులు తపస్సులుగా చెప్పబడడము లేదు. కొందరు తపస్సుయనగా, కొందరు ద్యానము అంటున్నారు. తపస్సు అన్ని మతములలోనికి చొచ్చుకొని పోయినదంటే వినేవారందరికీ ఆశ్చర్యముగా ఉండును. ఎవరు ఏమనుకొన్నా తపస్సు అను ఆరాధన అనేక రూపములలో, అనేక పేర్లతో అన్ని మతములలో ఉన్నదనుట సత్యము. తపస్సును గుర్తించుట చాలా సులభము. తపస్సు ఎక్కడున్నా దానికి చిన్న మంత్రమో, లేక పెద్ద మాటయో తగిలించబడియుండును. ఆ లెక్కప్రకారము ఎక్కడ అయితే మంత్ర పఠనగానీ, మాటల పలుకులు తలచుటగానీ ఉండునో అక్కడ తపస్సు ఉన్నదని చెప్పవచ్చును. నేడు ద్యానము అని కొందరూ, మెడిటేషన్ అని కొందరూ అనుచున్నా అది తపస్సు క్రిందికే జమకట్టబడును. క్రైస్థవుల ప్రార్థనలయందు చెప్పబడు మాటలను చేర్చి వారి ప్రార్థనను తపస్సుయని చెప్పవచ్చును. తపస్సు అనునది ఒక నిమిషము నుండి ఒక సంవత్సరము వరకు చేయవచ్చును. తపస్సుకు కాలపరిమితి లేదు. ఎక్కడ చేసినా, ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా మంత్రముతో కూడి చేయునది తపస్సే యగును.


నేడు ముస్లీమ్ మతములో అనగా ఇస్లామ్ సమాజము వారు తమ ప్రార్థనా మందిరములయిన మజీద్‍లలో నిలబడిగానీ, కూర్చుండిగానీ ఖుర్ఆన్ గ్రంథములో మొదటి సూరా అయిన అల్ఫాతిహా సూరాలో ఏడు ఆయత్‍లను పఠించుచూ చేయు నమాజ్ అను ఆరాధన కూడా ఒక రకముగా తపస్సనియే చెపవ్పచ్చును. తపస్సు అను పదము ముస్లీమ్‍లలో గానీ ఖుర్ఆన్ దైవగ్రంథములోగానీ చెప్పకున్నా, అలా మాటల పఠనతోగానీ, చిన్న మంత్ర పఠనతోగానీ చేయు ఆరాధన తపస్సుకు సంబంధించినదే యగును. ఏదయితే ఏమి, అది దేవుని ఆరాధనే కదా!యని ఎవరయినా అనవచ్చును. అది దేవుని ఆరాధనగానీ, దేవతల ఆరాధనగానీ అది దైవిక మైన ఆరాధన కాదు. ప్రథమ దైవగ్రంథములో తపస్సు అధర్మములలో ఒకటిగా చెప్పబడినది. ద్వాపరయుగము వరకు దేవుని మార్గములో ఆటంకములు కల్గించు అధర్మములు ముఖ్యమైనవి నాలుగేయుండేవి. కలియుగములో నేడు అధర్మముల సంఖ్య పెరిగి ఆరుకు చేరినది. అందులో ఒకానొక అధర్మము తపస్సు. ప్రథమ దైవగ్రంథమయిన తౌరాతు గ్రంథములో తపస్సు వలన దేవుడు తెలియబడడు అని ఖచ్చితముగా చెప్పబడినది.


నేడు అధర్మములు మనుషుల అజ్ఞానమును ఆధారము చేసుకొని వారు చేయు ఆరాధనల లోనికి చొచ్చుకొనిపోయి మనుషులు చేయు ఆరాధనలు అధర్మములైనవిగా యున్నవి. మనుషులు తాము చేయు ఆరాధనలు సక్రమమైనవేయని చేయుచున్నారు. అలాంటి నమ్మకమును అధర్మములు మనుషులలో కల్గించినవి. నేడు ముస్లీమ్‍లు ఎంతో విశ్వాసముతో దేవున్ని ప్రార్థించాలను ఉద్దేశ్యముతో ఖుర్ఆన్ గ్రంథములో మొదటి సూరాలోని ఏడు ఆయత్‍లను పఠించుచూ నమాజ్ చేయుచున్నారు. అలా చేయు నమాజ్‍ను మనుషులు బోధించారు గానీ, దేవుడు బోధించలేదు. మనుషుల బోధలలో దూరిన అధర్మములు చివరకు ప్రార్థనలో కూడా చేరినవి. తపస్సుగాయున్న ఏ ఆరాధన వలనగానీ దేవున్ని తెలియుటకు శక్యముకాదు అని ప్రథమ దైవగ్రంథములో చెప్పబడియున్నది. దాని ప్రకారము నేడు ముస్లీమ్‍లు చేయు నమాజ్ వలన దేవుడు తెలియబడడు. దానివలన పరలోకము లభించదు. ఈ విషయము మనుషులకు తెలియకున్నా దేవునికి అన్నీ తెలుసు. అందువలన మనుషులు తనను చేరుటకు నిజమైన ఆరాధన, నిజమైన నమాజ్‍ను తెలియజేయాలనుకొన్నాడు.


దేవుడు తనవద్దకు చేరాలనుకొన్న వారికి నిజమైన నమాజ్‍ను తెలియజేస్తూ (4-103) వ వాక్యములో 'నమాజ్‍ను నెలకొల్పండి' అన్నాడు. దానివలన పాత నమాజ్‍ను మీరు ఎప్పుడు చేసినా ఫరవాలేదు. నియమ నిబంధనలు లేని, మంత్ర పఠన లేని, నిర్ణీత సమయము లేని నమాజ్‍ను సూచించాడు. అయినా మనుషులు దానిని గుర్తించలేక దానిని కూడా పాత నమాజ్ క్రిందికే జమకట్టుకున్నారు. దేవుడు ఒకవైపు పాత నమాజును చేస్తూ మరొకవైపు క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అదియూ బయట ప్రపంచములో అనుకూలమైనప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పినా ఇదేదో ప్రత్యేకమయినది అని అనుకోవడము లేదు. ఈ విధముగా ఒక్క ముస్లీమ్ మతములోనే కాదు అన్ని మతములలో వారివారి ఆరాధనలను వదలుకోలేక పోవుచున్నారు. మనుషులు ఏర్పరచిన ఆరాధన కాదని, దేవుడు చెప్పిన ఆరాధనను స్వీకరించడము లేదు. ఒకవేళ మాలాంటి వారు మీరు చేయుచున్న ఆరాధనలో మంత్రములున్నవి. మంత్రములుగానీ, మాటలుగానీ లేని ఆరాధనను దేవుడు కోరుకొంటున్నాడు అని చెప్పినా వినకున్నారు.


మనుషులుగా యున్నవారు సత్యమును చెప్పినా సాటి మనుషులు వినకున్నారు. ఇది ఇప్పుడు సమస్యకాదు పూర్వమునుండి అనగా సృష్ఠ్యాది నుండి ఉండే సమస్యయే. ప్రతీ విషయానికి దేవుడు వచ్చి చెప్పడము సాధ్యము కాదు. దేవుడు వచ్చి స్వయముగా బోధించడు. దేవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనముగా ఉండువాడే. అందువలన మొదట తన పాలకులయిన ఆకాశము ద్వారా తన జ్ఞానము చెప్పించాడు. ఆకాశము తన శబ్దము ద్వారా దేవుని జ్ఞానమును తెలియజేసింది. దేవుడు ఆకాశ వాణి ద్వారా తెలియజేయడమేమిటి యని మనుషులు అనుకొను అవకాశమున్నది. కావున అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా 42, ఆయత్ 51 లో ఇలా చెప్పాడు చూడండి.


(42-51) ''దేవుడు ఏ మానవునితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా (వహీ ద్వారా) లేక తెరవెనుక నుంచి, మనిషికి చేరవేస్తాడు. లేదా తాను కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు.''


ఈ వాక్యమును బట్టి దేవుడు గతములో శబ్దము ద్వారా జ్ఞానమును తెలియజేశాడని నిరూపణ అయినది. దేవుడు వాణి ద్వారాయే కాక మిగతా రెండు విధముల జ్ఞానమును తెలిపినా, మొదట వాణిద్వారా వచ్చిన జ్ఞానమునే చెప్పుతూ వచ్చాడు. అయినా మనిషి దేవుని జ్ఞానమును తెలిసిన, జ్ఞానిని అనుకొంటున్నాడుగానీ, దేవుడు చెప్పిన జ్ఞానమును ఏమాత్రము అందుకోలేక పోవుచున్నాడు. ఆ మాట వాస్తవమనుటకు ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు 'నమాజును నెలకొల్పండి' యని చెప్పినా దానిని గ్రహించలేకపోయాడు. ఈ విధముగా మనిషి అజ్ఞానములో మొదటినుండి ప్రయాణిస్తూ నేను జ్ఞానములోనే ఉన్నానని ఊహించుకొంటున్నాడు. మనిషికి ఒకమారు చెప్పితే సరిపోలేదని గ్రహించిన దేవుడు, తాను మనుషులకు తెలియజేయు మూడు విధానములను ఒక్కమారుతో ఆపకుండా మరీమరీ ఆ మూడు విధానముల ద్వారా చెప్పుచున్నాడు. సూర్యగ్రహము మనకు తెలిసినంతలో రెండుమార్లు భూమిమీదికి వచ్చి జ్ఞానము చెప్పాడు. అలాగే దేవుని ప్రతినిధి మానవ రూపములో రెండుమార్లు భూమిమీదికి వచ్చి జ్ఞానమును చెప్పిపోయాడు. ఇకపోతే ఆకాశవాణి ప్రతీ సంవత్సరము తన శబ్దము ద్వారా జ్ఞానమును గ్రహములకు, భూతములకు తెలియజేస్తూనే యున్నది. వాణి ద్వారా అందుకొన్న ఆజ్ఞను అనుసరించి గ్రహములు, భూతములు తమ చేతనయినంత వరకు మనుషులు జ్ఞానమార్గములో నడుచునట్లు చేయుచున్నారు.


ఆకాశవాణి మేఘరూపములో గర్జించుచూ, పెద్దపెద్ద శబ్దములను కల్గించుచున్నది. ఆ శబ్దములలోని అర్థము మనుషులకు తెలియదు. గ్రహములు, భూతములు మాత్రము గ్రహించగలుగుచున్నవి. మేఘములు ఆకాశము రెండూ ఒక్కటే. ఆకాశము అప్పుడప్పుడు మేఘముల రూపములో దర్శనమిచ్చుచుండును. మేఘములు గర్జించునప్పుడు వర్షము వచ్చును. వర్షము వచ్చినప్పుడు బయట ప్రదేశములో పనులన్నీ వదలుకొని మనుషులు ఊరక నిలుచుందురు. అప్పుడు మేఘముల శబ్దములు వినే అవకాశము దొరుకును. మేఘముల శబ్దములే ఆకాశవాణి యని చెప్పుచున్నాము. ఆ శబ్దమునే వహీ అని ఖుర్ఆన్‍లో అన్నారు. వహీ అంటే వారి భాషలో చెప్పిన వాక్యము అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. మనము మాట్లాడు భాషలో ఎప్పుడూ వహీ రాలేదు. మాటల రూపములో వహీ వచ్చిందని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. అలా ఎప్పుడూ రాలేదు. ఆకాశము నుండి వహీ లేక వాణి సంవత్సరమునకు ఒకమారు రావడము నేడు అందరికీ తెలుసు. ఈ రోజులలో ఎట్లు శబ్దము ఉరుముల రూపములో వచ్చినదో ఆ రోజు కూడా అలాగే ఉరుముల రూపములోనే వాణి రావడము జరిగినది. నేడు మనకు మేఘముల శబ్దము ఎలా అర్థము కాలేదో ఆనాడు కూడా ఎవరికీ అర్థము కాలేదు. దానిని ఆకాశములోని సూర్యుడు (జిబ్రయేల్) గ్రహించి భూమిమీద మనుషులకు మనుషుల భాషలో తెర చాటునుండి చెప్పడము జరిగినది. ఆనాటి నుండి నేటివరకు దేవుడు మొదట మేఘముల ద్వారా పంపిన జ్ఞానమే మూడు దైవ గ్రంథములయందు చెప్పబడినది. ఈ కాలములో కూడా ప్రతీ సంవత్సరము ఆకాశవాణి తన శబ్దము ద్వారా తన సందేశమును తెలియజేస్తూనే యున్నది. ఆ భాష ఎవరికీ తెలియదు. ఆకాశ భాష తెలిసినవారు గ్రహములు, భూతములని చెప్పాము. నేడు భూమిమీద దేవుని పాలనను నడుపుచున్నవి గ్రహములు, భూతములే. అవి ఎక్కడో ఆకాశములోనే ఎప్పుడూ లేవు. భూమిమీద మన మధ్యనే ఉంటూ, మనలను బయట కష్టసుఖములకు లోను చేస్తున్నవి. గ్రహములు, భూతములు మన మధ్యలో ఉంటూ ఎన్నో కార్యములను మనకు తెలియకుండా చేస్తున్నవి.


మనకు ఆకాశవాణి భాషరాదు. ఆ భాష దేవుని పాలనలో పాలనను సాగించు పాలకులయిన గ్రహములకు, భూతములకు తెలుసు. వారు ప్రతీ సంవత్సరం ఆకాశము చెప్పు సూచనలను వారి భాషలో గ్రహించు చుందురు. అలా వారు తెలియగలిగిన సమాచారములు మనకు తెలియాలంటే దేవుని పాలకులు ఫలానావారు, ఫలానాచోట ఉన్నారని తెలియగలిగితే తమకు తెలిసిన జ్ఞానమును మాకు తెలుపమని వారిని వేడుకొంటే వారు స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమును తెలుపగలరు. అలా వారి భాష తెలియగలిగితే వారు ముందు మనిషిని జ్ఞానమును తెలియమని హెచ్చరించుచున్నారు. మీరు జ్ఞానము తెలియకపోవడమే కాక, దేవుని జ్ఞానమును నిందించడము జరుగుచున్నదని, అలా చేయుట వలన మేము చాలామందిని చంపివేశామని చెప్పుచున్నారు. దైవజ్ఞానమును నిందించిన వారిని వారు నిందించిన 24 గంటలలో చంపివేశామని చెప్పుచున్నారు. వారు దేవుని జ్ఞానమును చెప్పే దానికంటే వారు వేయుచున్న శిక్షలను వింటే చాలా భయము పుట్టుకొస్తున్నది. దేవున్ని వదలి, దేవున్ని ఏమాత్రము తలచను కూడా తలచక, దేవుని జ్ఞానమునుగానీ, దేవుని గ్రంథములను గానీ అపహాస్యము చేసినవారిని, దేవుని ఆరాధనను చేయక దేవతల ఆరాధనను చేయువారిని, దేవతల గుడులకు పోవునప్పుడు వారిని రోడ్డు ప్రమాదములలో చంపివేయుచున్నామనీ, కొందరిని అంగహీనులను చేస్తున్నామనీ చెప్పుచున్నారు. ఎక్కువగా దేవాలయములకు భక్తిగా పోవువారి మీద దృష్ఠి కేంద్రీకరించి ఎక్కువగా వారినే రోడ్డు ప్రమాదములలో ప్రమాదములకు గురి అగునట్లు చేయుచున్నామని తెలుపుచున్నారు. అదే విధముగా పెళ్లి సంబంధమునకు గానీ, పెళ్లికిగానీ పోవువారిని కూడా ప్రమాదముల పాలు చేయుచున్నామని చెప్పుచున్నారు.


దేవుని పాలనను నడుపు గ్రహములు, భూతములు ప్రతీ మనిషి వెంట ఉండి వారు చేయుచున్న ప్రతీ పనిని చూస్తూనే యున్నవి. అవసరమునుబట్టి ఒక్కొక్క సమయములో పదుల సంఖ్యలో ఉండడము, ఒక్కొక్కమారు ఎవరూ లేకుండా పోవడము కూడా జరుగుచున్నది. దైవ దూషణ చేసినప్పుడు ఒకవేళ ఆ సమయములో అతనివద్ద గ్రహములు ఉంటే ఆ గ్రహముల వలన అతనికి బాధలు తప్పవు. ఒకవేళ ఆ సమయములో భూతములు అక్కడవుండి అతను దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడినది చూస్తే వారు అతనిని అదును చూచి తప్పక చంపివేయుదురు. ఐదు తేళ్లు కుట్టిన బాధవరకు గ్రహములు కలుగజేయ గలవు. అంతేగానీ చంపుటకు అధికారము లేదు. భూతములయితే ఏకముగా చంపు అధికారమును కల్గియున్నాయి. ఈ విషయము ద్వితీయ దైవ గ్రంథములో వ్రాయబడియున్నది. ఈ విషయములన్నీ సులభముగా తెలియవచ్చును. దేవున్నిగానీ, దేవుని జ్ఞానమునుగానీ నిందించిన వారికి గ్రహముల వలన, భూతముల వలన శిక్షలు తప్పవు.


దేవుని ఆరాధన విషయములో గ్రహములు, భూతములు మనుషులను చూస్తూనే యుందురు. దేవున్ని వదలి దేవతలను పెద్దగా తలచి ప్రపంచ సుఖముల కొరకు వారిని ఆరాధిస్తే అనేక సమయములలో అనేక ఇబ్బందులు కలుగజేయుచుందురు. అయినా దానివలనే ఈ బాధలని మనుషులకు తెలియదు. దేవుని పాలకులకు 24 గంటల ముందు చేయవలసిన పనులకు ఆజ్ఞ ఇవ్వబడుచున్నది. దేవుని ఆజ్ఞను గ్రహించిన పాలకులు మనుషులకు ముందే నిర్ణయించబడిన కర్మను రద్దు చేసి శిక్షలు విధించగలరు. దేవతలను ఆశ్రయించి, దేవున్ని వదలిన వారికి శిక్షలు వేయుచుందురు. దేవున్నే విశ్వసించి సరియైన జ్ఞానము తెలియక దేవున్ని ఆరాధించు క్రమము తెలియక పోయిన వారిని గ్రహములు, భూతములు గ్రహించుచుండును గానీ వారిని ఏమీ అనరు. వారికి దేవుడు జ్ఞానము తెలియు అవకాశమిచ్చినప్పుడు వారు తెలియకపోతే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అను ధోరణిని అవలంభించి, నాకు తెలిసినదే నేను చేస్తానని జ్ఞానమును తెలియకపోతే అప్పుడు వారిని గ్రహములు, భూతములు కష్టాలకు గురి చేస్తారు. అంతకంటే ఎక్కువ శిక్షను వేయరు. అట్లుకాకుండా జ్ఞానమును దూషిస్తే కఠినముగా శిక్షలు వేస్తారు. దేవుని పాలకులు దేవుడనినా, దేవుని జ్ఞానమనినా ఎంతో ఇష్టపడుతారు. జ్ఞానులను చూచి సంతోషిస్తారు.


గత జన్మల పాపము వలన అనుభవించవలసిన కర్మను తీర్పు చేయబడి పెద్దపెద్ద రోగముల చేత పీడింపబడువారు దేవుని జ్ఞానమును తెలియగలిగి దేవుని మీద విశ్వాసము పొంది, దైవజ్ఞానమును తెలియుటకు ఇష్టపడు వారిని రక్షించు పనిని కూడా పాలకులు చేయుచున్నారు. దేవుని పాలకులు శిక్షించు వారేకాదు రక్షించువారు కూడా యని తెలియవలెను. మాకు తెలిసినంత వరకు దేవుని జ్ఞానమును దూషించిన వారిని 24 గంటలలోపు కొందరినీ, వారము సమయములో కొందరినీ, నెల లోపల కొందరినీ అక్కడక్కడ పాలకులు చంపిన సంఘటనలు గలవు. కొందరు క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు రోగము ముదిరిపోయిన వారు దేవుని జ్ఞానము తెలిసి దానినే ఆశ్రయించడము వలన, నిజమైన ఆరాధన చేయడము వలన, ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో చెప్పినట్లు అసలయిన నమాజును చేయడము వలన, వారి శరీరములో క్యాన్సర్, ఎయిడ్స్ రోగములు కూడా మాయమైపోయి. వారు సంపూర్ణ ఆరోగ్యము గలవారుగా మారడము వెన దేవుని పాలకుల హస్తముందని తెలియుచున్నది. అందువలన ఇప్పటినుండయినా దేవుని ఆరాధనను దేవుడు చెప్పినట్లే చేస్తాము.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

34. ఇద్దరు అల్లాహ్‍లు ఎవరిని ఆరాధించాలి? (3-18)

ప్రశ్న :- ఇంతకుముందు 4-103 వ ఆయత్‍లో బాగా పరిశోధించి చూస్తే రెండు నమాజులు కనిపించాయి. అందులో ఒకటి ప్రతి దినము అందరూ సామూహికముగా చేయునది కాగా, రెండవ దానిని దేవుడు నెలకొల్పమని చెప్పాడు. ముస్లీమ్ సమాజములో 'ఒకే నమాజు, ఒకే అల్లాహ్' అని చెప్పుచుందురు. మీరు రెండవ నమాజు మరొకటున్నదని చెప్పారు. ప్రతి దినము ముస్లీమ్‍లందరూ చేసే నమాజుకంటే ముఖ్యమైనది రెండవ నమాజుయని మీరు చెప్పారు. మీరు చెప్పడమేకాక గ్రంథములో కూడా చూపారు. రెండు నమాజులున్నప్పుడు ఇద్దరు అల్లాహ్‍లు ఉండాలని చెప్పారనుకుందాము. ఇద్దరు అల్లాహ్‍లు అనే దానికి ఏమయినా ఆధారమున్నదా? నమాజ్‍లను గురించి చెప్పినప్పుడు, నమాజ్‍ను నెలకొల్పమని చెప్పినప్పుడు అది క్రొత్తదే అని మాకు అర్థమయినది. అయితే క్రొత్త నమాజ్ ఎలాగుండవలెనో చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పినప్పుడు వారిని గురించిన వివరమును చెప్పకపోతే మేము ఎలా నమ్మాలి?


జవాబు :- రెండు నమాజ్‍లను గురించి చెప్పినది వాస్తవమే. అయితే అది గ్రంథములో అల్లాహ్ చెప్పిన మాటేగానీ మామాట కాదు. గ్రంథములో రెండవ నమాజ్‍ను గురించి అల్లాహ్ ఇప్పుడు చెప్పలేదు. ఎందుకనగా! ముందే తన జ్ఞానములో క్రొత్త నమాజ్‍ను గురించి చెప్పియుండుట చేత ప్రత్యేకించి ఇప్పుడు దానిని గురించి చెప్పలేదు. అల్లాహ్ జ్ఞానము తెలిసినవారందరికీ రెండవ క్రొత్త నమాజ్ ఏమిటో అర్థమయినది. అట్లే మాకు కూడా ఆ వాక్యము చదివిన వెంటనే రెండవ నమాజ్ అంటే ఏమిటో అర్థమయినది. 6-102వ వాక్యము ఎప్పుడయితే అర్థము కాగలదో అప్పుడే క్రొత్త నమాజ్ (రెండవ నమాజ్) సగము అర్థమయిపోగలదు. అట్లే 2-255వ వాక్యము ఎప్పుడు అర్థము కాగలదో అప్పుడే 4-103 లో చెప్పిన వాక్యము పూర్తి అర్థము కాగలదు. అందువలన 'క్రొత్త నమాజ్' అను వాక్యమునకు ప్రత్యేకమైన వివరమును అల్లాహ్ చెప్పలేదు. అదే కారణము చేత మేము కూడా చెప్పలేదు. ప్రథమ దైవగ్రంథమున, ద్వితీయ దైవగ్రంథమున మరియు ఇప్పుడు చెప్పిన తృతీయ దైవ (అంతిమ దైవ) గ్రంథమున 'నెలకొల్పమని' చెప్పిన రెండవ నమాజ్‍ను గురించి సంపూర్ణముగా చెప్పబడియున్నది. అందువలన దానిని గురించి ప్రత్యేకముగా చెప్పలేదు. ఖుర్ఆన్ గ్రంథములో ఉదాహరణకు 6-102, 2-255 చెప్పియున్నాము కదా! ఈ రెండు ఆయత్‍లే కాక మిగతా చాలా ఆయత్‍లలో ఈ రెండవ నమాజ్‍ను గురించి చెప్పబడి యున్నది. ప్రథమ దైవగ్రంథములో ద్వితీయ దైవగ్రంథములోకంటే, ఖుర్ఆన్ గ్రంథములో కంటే నమాజ్‍ను ఎక్కువ చెప్పియున్నారు. ముందు వచ్చిన ప్రథమ, ద్వితీయ గ్రంథములను చదువగలిగితే అంతిమ దైవగ్రంథములో గల క్రొత్త నమాజ్ పూర్తి అర్థము కాగలదు. ఉదాహరణగా చెప్పితే ముందు వచ్చిన రెండు గ్రంథములలో అన్నములో కలుపుకొని తినుచున్న సాంబారులో ఇంగువను వాడుదురు అని ఉందనుకో, అప్పుడు తర్వాత వచ్చిన మూడవ గ్రంథములో సాంబారు అను పదమును చెప్పకుండా ఇంగువ అనే పదమును చెప్పినంత మాత్రమున సాంబారు అను పేరు జ్ఞప్తికి వచ్చినట్లు, రెండవ నమాజ్‍ను చెప్పిన వెంటనే భగవద్గీత, బైబిలులో చెప్పిన రెండవ ప్రార్థన ఏమిటో తెలియగలదు. అదే విధముగా ఖుర్ఆన్‍లో నెలకొల్పమని చెప్పిన వెంటనే అది ఏమిటో ముందు వచ్చిన రెండు గ్రంథములు చదివిన వారికి తెలిసిపోవుచున్నది.


ఇక ఇద్దరు అల్లాహ్‍లను గురించి ముందు వచ్చిన రెండు గ్రంథములలో చెప్పడమేకాక, ఖుర్ఆన్ గ్రంథములో అనేకమార్లు చెప్పి యున్నారు. మీరు ఆరాధించవలసిన అల్లాహ్ ఈయనేయని, ఆరాధ్య యోగ్యమైనవాడు ఈ అల్లాహ్ ఒక్కడేయని అనేకమార్లు రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పడమేకాక మొదటి అల్లాహ్‍ను గురించి ఏ ఆరాధన, అవసరము లేనివాడు అన్నట్లు 112వ సూరాలో రెండవ ఆయత్‍లో ''ఈయన ఏ అక్కరా లేనివాడు'' అని మొదటి అల్లాహ్‍ను గురించి చెప్పియున్నారు. ఎంతో వివరముగా మొదటి అల్లాహ్‍ను, రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పియుండగా, ఆ వ్యత్యాసమును గ్రహించలేకపోతే, రెండవ అల్లాహ్‍ను గురించి తెలియలేరు. ద్వితీయ దైవ గ్రంథము ఇంజీలులో తండ్రియని ఒకరినీ, కుమారుడని ఒకరినీ పోల్చి చెప్పారు. అట్లే ప్రథమ దైవ గ్రంథమున మొదటి ఆయనకు, రెండవ ఆయనకు తేడాను చెప్పి మొదటి ఆయనకు పేరు లేదని, రెండవ ఆయనకు పేరు కలదని తెలియజేయడమైనది. ఇట్లు ముందు వచ్చిన రెండు గ్రంథములలో ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పడమేకాక వారి తేడాను కూడా చూపడమైనది. అదే విధముగా అంతిమ దైవ గ్రంథములో కూడా చెప్పడమైనది.


మొదట భగవద్గీతలోనే పరమాత్మ, ఆత్మను సూచించినా హిందువులు ఆ విషయమును గుర్తించలేకపోయారు. క్రైస్థవులు తమ గ్రంథములో పరిశుద్ధాత్మ (తండ్రి), ఆత్మను (కుమారున్ని) సూచించినా దానిని గ్రహించలేకపోయారు. ముస్లీమ్‍లలో వారికిచ్చిన గ్రంథము ఖుర్ఆన్‍లో మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్ కార్యకర్తయైన దేవున్ని (అల్లాహ్‍ను) ప్రకటించినా వారు కూడా రెండవ అల్లాహ్‍ను కనుగొనలేకపోయారు. మూడు మతములవారు అందరూ ఆరాధింపదగిన దేవుడు ఒక్కడేయని అంటున్నారు. ఆ ఒక్క దేవున్ని ఎవరు చూపించారు? ఆ ఒక్క దేవున్ని ఎవరు ఆరాధించమన్నారు? మనము ఆరాధించే దేవుడు మొదటినుండీ ఉన్నవాడా? లేక మధ్యలో సృష్ఠింపబడినాడా? మనము ఆరాధించే ఏకైక దేవుడు మధ్యలో సృష్ఠింపబడియుంటే, ఆయనను సృష్ఠించినవాడు ఎవరు? మనము ఆరాధించే దేవున్ని సృష్ఠించిన దేవదేవున్ని (పెద్ద దేవున్ని) ఎందుకు మనము ఆరాధించడము లేదు? అందరికంటే పెద్ద, మొదటివాడు అల్లాహ్‍యే అయితే అల్లాహ్కంటే పెద్దవాడు ఉన్నాడా? ఆరాధింపతగిన దేవుడు ఒక్కడే యుండగా! ఆయనకంటే పెద్ద దేవుడు ఉండవలసిన అవసరము ఏముంది? ఇన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకొంటే, అప్పుడు దేవుని విషయము తెలియును. అలా తెలిసినప్పుడు దేవుడు ఒక్కడా, ఇద్దరాయని తెలియును. బహుశా ఈ ప్రశ్నలు భూమిమీద మొదట ఇక్కడే వచ్చియుండునని చెప్ప వచ్చును. ఎందుకనగా! ఇంతవరకు దేవుని విషయములో చెప్పింది వినేవారే గానీ తిరిగి ప్రశ్న వేసినవారు లేరు. అందువలన ఇవి మొదటి ప్రశ్నలని తెలియవలెను. ఈ ప్రశ్నలు వేయుటకు అవసరమైన సంశయములు గలవు. అందువలన ప్రశ్నలు వేయడము జరిగినది.


ఇప్పుడు ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబు తెలియగలిగితే దైవ గ్రంథములలోని సత్యము ప్రజలకు తెలియగలదు. సత్యము తెలియగలిగితే మూడు గ్రంథములలోని వాక్యములకు మంచి వివరణ దొరుకును. కొన్ని ఆయత్‍లకు వివరము దొరుకుట వలన దేవుని విషయమే కాకుండా దానితో పాటు మిగతా జ్ఞానము కూడా తెలియును. దేవుని విషయములో సంశయము కల్గించు వాక్యములు దైవ గ్రంథములో కనిపించినా, వాటిని గ్రుడ్డిగా చదువుతున్నారు తప్ప పూర్తి వివరముగా తెలియడము లేదు. అట్లు సంశయము కల్గించు వాక్యమును ఇప్పుడు చెప్పుకొందాము. ఆ వాక్యము సూరా మూడు, ఆయత్ 18లో ఇలా కలదు చూడండి.


(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)


(3-18) ''నిశ్చయముగా ఆయన తప్ప వేరొక ఆరాధ్యనీయుడు లేడని అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు. ఆయనే న్యాయపరిరక్షకుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)


ఈ రెండు ఆయత్‍లు దేవునిమీద ప్రశ్నను రేకెత్తించుచున్నవి. అయితే కొందరు ఇందులో ప్రశ్న ఏమున్నది? నేను తప్ప వేరే దేవుడు లేడని దేవుడే చెప్పాడు కదా! యని అడుగుచున్నారు. లేదు సృష్ఠిర్తయిన దేవుడు తనను గురించి చెప్పక, తాను సృష్ఠించిన వానిని అల్లాహ్యని చెప్పుచూ, ఈ అల్లాహ్‍నే ఆరాధించమనీ, ఈయన తప్ప వేరొక ఆరాధ్య దైవము లేడని చెప్పారని మేము అంటున్నాము. ఇందులో ఏది నిజము అని తెలియుటకు ముందు వచ్చిన దైవ గ్రంథములలో ఇంజీలు గ్రంథమును ఆధారము చేసుకొని చూచిన అందులో ఏమి చెప్పారో దాని ప్రకారము సత్యమును తెలియవచ్చును. అట్లే ఇదే ఖుర్ఆన్ గ్రంథములో మరొక చోట వ్రాసిన దానిని బట్టి సత్యమును నిర్ణయించవచ్చును. రెండవ దైవ గ్రంథమయిన ఇంజీలు గ్రంథములో ఏమి వ్రాశారో మొదట చూస్తాము. ఇంజీలులో యోహాన్ సువార్త ఐదవ అధ్యాయమునందు గల 21 నుండి 26 వరకు ఉన్న సమాచారమును చూస్తే ఖుర్ఆన్‍లో ఇద్దరు అల్లాహ్‍ల సమస్య తెగిపోవును.


(యోహాన్ 5-21 నుండి 26 వరకు)


(5-21) ''తండ్రి మృతులను ఏలాగు లేపి బత్రికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బత్రికించును.''


(5-22) ''తండ్రి యెవనికి తీర్పు తీర్చడుగానీ''


(5-23) ''తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు, కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.''


(5-24) ''నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాస ముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''


(5-25) ''మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''


(5-26) ''తండ్రి యేలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగహ్రించెను.''


ఈ వాక్యములో తండ్రి, కుమారుడు అని చెప్పబడడమేకాక అన్ని అధికారములు తండ్రి ద్వారా కుమారుడు పొందియున్నాడు అని తెలియు చున్నది. తండ్రి తన కుమారున్ని అందరూ ఆరాధించమని చెప్పాడు. తన కుమారున్ని గౌరవించి ఆరాధిస్తే తనను గౌరవించి ఆరాధించినట్లేయని చెప్పాడు. అదే విధముగా ఖుర్ఆన్ గ్రంథములో సృష్ఠికర్తయైన దేవుడు తన చేత సృష్ఠింపబడిన ఆత్మను దేవునిగా తెలియజేస్తూ ఆత్మయే మీకు ఆరాధింపదగిన అల్లాహ్యని చెప్పాడు. ఇంజీలు గ్రంథములో తన ఆత్మను ఆరాధించమని చెప్పినట్లు, ఇక్కడ ఖుర్ఆన్ గ్రంథములో 3-18లో తాను చెప్పిన అల్లాహ్‍ను ఆరాధించమని స్వయముగా అల్లాహ్‍యే చెప్పారు. రెండవ అల్లాహ్‍యే అందరి ఆరాధ్య యోగ్యుడు అని అన్నారు.


ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలు (బైబిలు) లో రెండవ అల్లాహ్ ఉన్నాడనుటకు కొంత ఆధారము దొరికినది. బుద్ధి గ్రాహితము ఉన్న ఏ మనిషికయినా బైబిలు సమాచారము చూచిన తర్వాత 3-18లో చెప్పినది కూడా అదే విషయమేయని తెలియగలదు. అంతేకాక ఇదే ఖుర్ఆన్ గ్రంథములో 32-4లో మరియు 2-255లో పని చేసే దేవున్ని చెప్పి 2-117 లో పని చేయని దేవున్ని చెప్పడమైనది. ఈ విధముగా రెండు రకముల అల్లాహ్‍లను (దేవుళ్ళను) చెప్పడమైనది. ఈ వాక్యములనుబట్టి రెండు రకముల దేవుళ్ళున్నారని తెలియుచున్నది. పని చేసే దేవున్ని గురించి అనేకమార్లు చెప్పియున్నారు. ఉదాహరణకు...


(2-255) ''అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవము. ఆయన తప్ప ఇంకో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారము. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమి, ఆకాశములలోని సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా, ఆయన సమక్షములో సిఫారసు చేయగల వాడెవడు? వారికి ముందున్న దానిని, వెనుకయున్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధి లోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.''


ఈ వాక్యములో పని చేసే అల్లాహ్‍ను గురించి చెప్పడమైనది. పని చేయని అల్లాహ్‍ను గురించి 2-117 వాక్యము (ఆయత్)లో చెప్పారు. పని చేయని దేవుడు, పని చేసే దేవుడు ఇద్దరున్నారని ఈ మాటతో స్పష్టమైపోవుచున్నది.


(2-117) ''భూమి ఆకాశములను ప్రప్రథమముగా సృష్ఠించినవాడు దేవుడే. ఆయన ఏ పనియైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దాన్ని అయిపో అంటే చాలు, అది అయిపోతుంది.''


ఈ ఆయత్‍లో చెప్పిన దానిని గమనిస్తే మొదటి దేవుడు అర్థమయి పోవుచున్నాడు. 2-255 వాక్యమును గమనించితే రెండవ దేవుడు తెలియు చున్నాడు. ఈ విషయము అర్థము కావాలంటే ఉదాహరణ చూస్తాము. ఒక యజమాని తాను చేయవలసిన పనిని తన గుమస్తా చేత చేయించును. యజమాని పనిని చేయడు. యజమాని చేయవలసిన పని ఏదయినా ఉంటే తన గుమస్తా చేత చేయించును. అదే విధముగా మొదట యజమాని తన గుమస్తాకు తన పేరునే పెట్టాడు. ఏ పనిని చేసినా అతని పేరు చెప్పినా అది తన పేరులాగే ఉండునట్లు అందరికీ కనపడవలెనని, అప్పుడు తాను చేయకున్నా తానే చేసినట్లు అందరూ అనుకోవలెనని యజమాని తన గుమస్తాకు తన పేరే పెట్టాడు అనుకొనుము. యజమాని పేరు అజా, అట్లే గుమస్తా పేరు కూడా అజా గానే పిలువబడుచున్నది. యజమాని పేరు, గుమస్తా పేరు రెండూ ఒక్కటే. అట్లే యజమాని తనకు రావలసిన డబ్బులు తన గుమస్తాకు ఇచ్చునట్లు, అట్లే తాను ఇవ్వవలసిన డబ్బులు తన గుమస్తానే ఇచ్చునట్లు సర్వ హక్కులు (పవర్ పట్టా) తన గుమస్తా పేరు మీద వ్రాసి ఇచ్చాడు. తన యజమాని ఇచ్చిన పవర్ పట్టా వలన యజమాని చేయు పనులన్నీ గుమస్తానే చేయుచుండెను. యజమాని పేరు, గుమస్తా పేరు రెండూ ఒక్కటే అయిన దానివలన ఏ పని జరిగినా అందరూ యజమాని అయిన అజా నే చేశాడని అనుకొనేవారు. గుమస్తా అయిన అజా చేశాడని ఎవరూ అనుకొనేవారు కాదు. డబ్బుల వ్యవహారము ఇవ్వడము తీసుకోవడము అజా అనే వ్యక్తి చేయుట వలన అందరూ యజమాని అజా నే చేశాడని పొరపడెడివారు. అన్ని పనులు తన గుమస్తా అజా చేయుట వలన యజమాని అయిన అజా ఏమీ చేయక ఊరక యుండెను. ఏదయినా చేయవలసి వస్తే ఆయన చెప్పి ఊరకుండెడి వాడు. అప్పుడు ఆ పనిని గుమస్తా నే చేయుట వలన యజమాని అనుకొను పనులన్నీ జరిగి పోవుచుండును. బయట ప్రజలకు యజమానియే డబ్బులు బాకీ ఇచ్చినట్లు చెప్పుకొనెడి వారు. అట్లే బాకీ డబ్బులను కూడా యజమానికి ఇచ్చి తమ బాకీని తీర్చివేశాము అని చెప్పుచుండిరి. అందరూ యజమాని పేరు చెప్పినా ఆ పనిని చేయువాడు గుమస్తానేయని చాలామంది తెలియక పొరపడుచుండిరి. ఇద్దరి పేరు ఒకటే అయిన దానివలన యజమాని అజా ఏమీ చేయలేదనీ, అన్నీ చేశానని చెప్పు అజా, గుమస్తా అజా యని తెలియకయుండిరి. యజమాని, గుమస్తా అను ఇద్దరి సమాచారమున్నట్లే దేవుని విధానములో కూడా ఇద్దరి అల్లాహ్‍లు కలరు.


దేవుడయిన అల్లాహ్ మొదట ఆకాశము, భూమిని సృష్ఠించిన అల్లాహ్ ఏ పనినీ చేయకున్నా, ఆయన అనుకున్న పనులన్నీ అయిపోవాలంటే అయిపోవుచుండును. అయితే యజమాని అల్లాహ్ ఏమీ చేయడనీ, గుమస్తా అల్లాహ్ అన్నీ చేయునని ఎవరికీ తెలియదు. అదే విషయమునే 2-117 లో చెప్పడమైనది. అన్నీ తన గుమస్తా అల్లాహ్‍యే చేయుననీ, ఏమి అడిగినా తన గుమస్తానే అడగమని చెప్పిన విషయమే (3-18) లో కలదు. మీరు అడగవలసిన వాడు ఇతనేయని తన గుమస్తాను చూపి చెప్పినది 3-18లో కలదు. ఆయన తప్ప మీ పనులు చేయువాడు ఇంకొకడు లేడనీ, ఆయనే మీ పనులన్నీ చేసి పెట్టుననీ, అందువలన అందరూ ఆయన వద్దకు పోయి ఆయననే ఆశ్రయించమని చెప్పిన విషయము 2-255 లో గలదు. తాను ఏమీ చేయని వాడిననీ (అల్లాహ్ ననీ), అన్నీ చేయు అల్లాహ్ తాను కాదని చెప్పినా మనుషులు అర్థము చేసుకోలేక 'అల్లాహ్ ఒక్కరే, ఆయనే మా దేవుడు' అని అంటున్నారు. పవర్ ఆఫ్ పట్టా పొందినవాడు అన్ని పనులు చేయుచున్నాడు. అతను ఆరాధ్యుడుగా యున్నాడు. అలా ఉండుటకు ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన అల్లాహ్ తనకు ఇష్టమైన వానికి అధికారమిచ్చాడు. మొదటి సృష్ఠికర్త అయిన అల్లాహ్ ఏమీ చేయడు. యజమాని ఊరకయుంటే, యజమాని పనులన్నీ గుమస్తానే చేసినట్లు మొదటి అల్లాహ్ పనులన్నింటినీ రెండవ అల్లాహ్ చేయుట నమ్మలేని సత్యముగా యున్నది. ఇది నిజము యని ఎన్నో ఆయత్‍లు సాక్ష్యము చెప్పినట్లు కనిపిస్తూ యున్నా వాటిని మనిషి బుద్ధి అందుకోలేకున్నది.


యజమాని పేరు, యజమాని చేయవలసిన పనులను చేయు గుమస్తా పేరు రెండూ ఒకటే అయిన దానివలన ఎవరు పెద్ద, ఎవరు చిన్నయని తెలియక ఇద్దరు లేరు ఒక్కరే యున్నారని చెప్పుచున్నారు. ఒక్కడు ఉండేది వాస్తవమే. మాకు అర్థమయినది గుమస్తా మాత్రమే యజమాని కాదు. మీరు ఆరాధించుచున్నది, గౌరవించుచున్నది గుమస్తా సీటులో యున్న అల్లాహ్‍ను మాత్రమే. అయినా ఇస్లామ్ మతము పుట్టినప్పటి నుండి అల్లాహ్ ఒక్కడేయను మాటనే వినిన ముస్లీమ్‍లు నేడు ఒక్కమారుగా అల్లాహ్ అను వారు ఇద్దరు అని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన మాటను చెప్పితే మా మాటను ఏమాత్రము నమ్మలేకున్నారు. 2-255 ఆయత్‍లో అల్లాహ్ అన్ని పనులు చేయుచున్నట్లు ఆయన ఎప్పటికీ అలసిపోడు, ఆయనకు కునుకు గానీ, నిద్రగానీ రాదు. రాత్రింపగళ్లు పని చేయుచున్నాడు అని చెప్పియున్నారు. పని చేయని యజమానిగా యున్న అల్లాహ్ ఏ పనీ చేయనివాడై యున్నాడని సాక్ష్యము చెప్పినట్లు సూరా 112లో గల నాలుగు ఆయత్‍లు వ్రాయబడియున్నవి. అందులో దేవుడు ఏ అక్కరా లేనివాడనీ చెప్పినప్పుడు ఆయన దేని కొరకు పని చేయనివాడని తెలిసిపోవుచున్నది. యజమాని పనిని గుమస్తా చేసినట్లు 2-255లో చెప్పినా, 6-102లో అల్లాహ్ కార్యకర్త యని చెప్పినా ఈయన వేరు, ఆయన వేరు అని తెలియలేక పోయారు. పని చేయని ఆయన (అల్లాహ్) ఒకరుండగా, పనిని చేయు అల్లాహ్ మరొకరున్నారని ఇంతవరకూ తెలియకుండా పోయినది. ఇప్పుడు చెప్పినా వినే స్థితిలో లేరు.


అల్లాహ్ ఒక్కడే ఉన్నాడని అనుకోవడము వలన యజమానిని, గుమస్తాను ఇద్దరినీ కలిపివేసినట్లున్నది. పని చేయని అధికారిని, పని చేయు గుమస్తాను ఒక్కరేయని తలచుట ఎంత తెలివితక్కువ యగునో అలాగే నేటి ముస్లీమ్‍ల పరిస్థితి యున్నది. ఎవరయినా సత్యమును చెప్పితే దానిని వినకుండా మా గ్రంథమును గురించి మీరు చెప్పకూడదు అని మొండిగా మాట్లాడుచున్నారు. ఈ విషయమై ఇంకా లోతుగా చూచినట్లయితే సూరా 50, ఆయత్ 21లో మనిషి పాత్ర ఏమిటో? గుమస్తా అల్లాహ్ అనగా పని చేయు అల్లాహ్ పాత్ర ఏమిటో, యజమాని అల్లాహ్ అనగా పని చేయని అల్లాహ్ పాత్ర ఏమిటో వ్రాయబడియున్నది. దానిని ఒకమారు చూడండి.


(50-21) ''ప్రతీ వ్యక్తి తనవెంట తనను తీసుకొచ్చినవాడొకడు సాక్ష్యమిచ్చే వాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు.''


ఇక్కడ ప్రతీ మనిషి వెంట ఇద్దరున్నారని చెప్పారు. ఆ ఇద్దరినే మేము ఇంతవరకు యజమాని, గుమస్తాతో పోల్చి చెప్పాము. ఈ వాక్యములో నిన్ను తీసుకవచ్చేవాడు గుమస్తా దేవుడుకాగా, సాక్షిగా చూస్తూ ఊరకయుండువాడు యజమాని దేవుడుగా చెప్పవచ్చును. ఒక జీవున్ని (మనిషిని) జన్మలోనికి తెచ్చి వానిని మరణము వరకు నడిపించుచూ ప్రతీ దినము, ప్రతీ పని చేసి అందులోని కష్టసుఖములను జీవుని చేత అనుభవింపజేయువాడు నిత్యము మనతో సంబంధపడియుండి పని చేయు దేవుడు. ఏ పనినీ చేయక శరీరములో జీవునికి దేవునికి సాక్షిగా యున్న దేవుడు సృష్ఠికర్తయైన దేవుడు, సృష్ఠి తర్వాత ఏ పనీ చేయక ఊరక ఉండిపోయాడు. సృష్ఠి తర్వాత కార్యములన్నీ జరుపుటకు తన చేత సృష్ఠింపబడిన దేవున్ని నియమించి ఆయనకు తన అధికారములన్నీ ఇచ్చి తనంతటి దేవునిగా తయారు చేశాడు. అలా సృష్ఠించిన దేవుడు యజమానిగా, సృష్ఠింపబడిన దేవుడు గుమస్తాగా యున్నాడనుకొనుము. ఇద్దరు దేవుళ్ళు, ఒక మనిషి మొత్తము ముగ్గురున్నారని 50-21 లో చెప్పబడినది.


ప్రపంచమంతా ప్రకృతితో కూడుకొన్నదైయుండగా, అందులో తోలబడే జీవుడు (మనిషి), తోలే గుమస్తా (అల్లాహ్), చూచే యజమాని (దేవుడు) ముగ్గురూ కలరు. జీవుడు, దేవుడు అను ఇద్దరూ సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడగా, ప్రకృతియగు నిర్జీవమైన జఢపదార్థము జీవునికంటే, దేవునికంటే ముందే సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడినది. ఎవరి చేత సృష్ఠింపబడని దేవుడు ప్రపంచమంతా వ్యాపించిన ప్రకృతిని మొదట తయారు చేసి, తర్వాత ఒక దేవున్ని తయారు చేశాడు. తయారు చేసిన దేవునికి అన్ని అధికారములు ఇచ్చి ఆ దేవుని చేత కోట్లాది జీవుళ్ళను తయారు చేయించాడు. అలా తయారు చేయబడినదే మనము చూస్తున్న ఈ ప్రపంచము. సృష్ఠికర్తయైన దేవుడు సృష్ఠిలో మరొక దేవున్ని తయారు చేసి, తన అధికారములన్నీ సృష్ఠింపబడిన దేవునికి ఇచ్చి ఆయన చేత మొత్తము జీవరాశులను సృష్ఠింపజేసి వారిని అందరినీ నడిపించు బాధ్యత సృష్ఠిపంబడిన దేవునికే ఇచ్చాడు. సృష్ఠికర్తయైన దేవుడు ప్రకృతిని మరియు తనలాంటి దేవున్ని తయారు చేసిన తర్వాత అన్ని పనులు తాను తయారు చేసిన దేవునికి అప్పజెప్పి తాను ఏ పనినీ చేయనివాడుగా ఉండిపోయాడు. తాను తయారు చేసిన దేవుని చేతనే సర్వజీవరాశులను తయారు చేయించి అందరికీ దేవునిగా చేశాడు. అప్పటినుండి తయారు చేయబడిన దేవుడు, అందరినీ తయారు చేసి, శరీరధారులను పరుగెత్తించుచున్నాడు. ఇదే విషయమునే సూరా 50, ఆయత్ 21 లో ఇలా చెప్పారు చూడండి.


(50-21) ''ప్రతి జీవాత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది.''


ప్రతీ ప్రాణిని తోలేవాడు సృష్ఠింపబడిన దేవుడుకాగా, సృష్ఠింపబడిన దేవుని చేత సృష్ఠింపబడిన ప్రాణులు తోలబడుచున్నవి. ఇద్దరినీ చూస్తున్నవాడు దేవున్ని సృష్ఠించిన దేవుడు. ఈ ముగ్గురి విషయము మూడు దైవ గ్రంథములలో చెప్పబడినది. అయితే ఇద్దరి దేవుళ్లను మనుషులు అర్థము చేసుకోలేకపోవుచున్నారు. తౌరాతు (భగవద్గీత) గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'అక్షరుడు' అని చెప్పారు. సృష్ఠించిన అల్లాహ్‍ను 'పురుషోత్తముడు' అని అన్నారు. ఇంజీలు (బైబిలు) గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'కుమారుడు' అని అన్నారు. మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్‍ను 'తండ్రి' యని అన్నారు. ఖుర్ఆన్ గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'తోలేవాడు' అని అన్నారు. సృష్ఠించిన అల్లాహ్‍ను 'సాక్షి' యని అన్నారు. మూడు గ్రంథములలో ఒక మనిషిని, ఇద్దరు దేవుళ్ళను చెప్పడమైనది. తౌరాతు గ్రంథములో 15వ అధ్యాయములో 16, 17 శ్లోకములలో చెప్పడమైనది. ఇంజీలు గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యములో చెప్పారు. అట్లే ఖుర్ఆన్ గ్రంథములో 50-21లో 'ఇద్దరు దేవుళ్లను, మనిషిని' గురించి చెప్పడమైనది. ఒక దైవ గ్రంథమును చదివినవారికి పూర్తి జ్ఞానము అర్థము కాదు. మూడు దైవ గ్రంథములు చదివిన వారికే సంపూర్ణ జ్ఞానము తెలియగలదు. దేవుడు చెప్పిన సత్యము తెలియుటకు మూడు దైవ గ్రంథములు చదువవలసిందే. అప్పుడే హిందువులకు, క్రైస్థవులకు, ముస్లీమ్‍లకు ఇద్దరు దేవుళ్లను గురించి తెలియును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

35. తౌరాత్ అంటే ప్రథమ దైవ గ్రంథము. (5-44)

తౌరాత్ గ్రంథము 'పూర్వము ప్రజల కొరకు దేవుడు పంపిన 'గ్రంథమని' చాలామంది నమ్మకము. నేటి ముస్లీమ్‍లు ఎవరూ తౌరాత్ గ్రంథమును చూచియుండలేదు. అయితే ముస్లీమ్‍లు తౌరాతు గ్రంథము తమ పెద్దల వద్ద యుందని చెప్పుకొనుట చూచాము. ముస్లీమ్ పెద్దలను అడిగితే ఇప్పుడు మనవద్ద లేదు, అరబ్ దేశములో ఉందని కొందరు, మక్కాలో ఉందని కొందరు, మదీనాలో ఉందని కొందరు చెప్పుచుందురు. మొత్తానికి తౌరాతు గ్రంథము ఉందని ఎందరు అనుకొన్నా, ఎవరూ దానిని చూడలేదు. సూరా ఆరు, ఆయత్ 91లో ''తౌరాతు గ్రంథమును ఇచ్చినవాడు, అవతరింప చేసినవాడు అల్లాహ్‍యే'' అని కలదు. అల్లాహ్ ఇచ్చిన గ్రంథము నేడు ఏమయినది? అని ప్రశ్నించుకొంటే తౌరాతు గ్రంథము వెనుక పెద్ద చరిత్ర దాగియున్నది. ఆ చరిత్ర మూడు మతముల వారికి ఏమాత్రము తెలియదు. నేడు మనము ఆ చరిత్రను కదిలించితే ఎన్నో క్రొత్త విషయములు తెలియుచున్నవి.


తౌరాతు గ్రంథము 5000 సంవత్సరముల పూర్వము మోషేకు ఇవ్వబడినది. మోషే పేరు బైబిలు గ్రంథములో చూడవచ్చును. మోషే ఒక ప్రవక్త. 'మోషే ధర్మశాస్త్రము' అను పేరుతో తౌరాతు గ్రంథములోని విషయములు ఆ కాలములో ప్రజలకు తెలియజేశాడు. మోషే చెప్పిన ధర్మశాస్త్రము వలన ఆ కాలములో కొందరు దైవజ్ఞానమును తెలియగలిగారు. మోషే పోయిన తర్వాత ఆయన ధర్మశాస్త్రము ఆగిపోయినది. బైబిలులో మోషే అని పిలువబడిన మోషేయే ఖుర్ఆన్ గ్రంథములో మూసా ప్రవక్తగా చెప్పబడినాడు. అయితే మోషే, మూసా ఇద్దరూ ఒక్కరేయను విషయము చాలామందికి తెలియదు. బైబిలులో యున్న మోషే వేరు, ఖుర్ఆన్ గ్రంథములో యున్న మూసా వేరని కొందరు అంటున్నారు. చరిత్ర తెలియని వారు ఎట్లు మాట్లాడినా అది లెక్కించబడదు.


మోషే ప్రవక్త యుక్తవయస్సులోనే తౌరాతు గ్రంథమును పొంద గలిగాడు. 6-91లో తౌరాతు గ్రంథమును అల్లాహ్‍యే మూసాకు ఇచ్చాడు అని కలదు. అప్పుడు జరిగినదే ఖుర్ఆన్ గ్రంథములో వ్రాయబడినది. తౌరాతు గ్రంథము 5000 సంవత్సరముల పూర్వము ఇంకొక పేరుతో గ్రంథముగా వ్రాయబడినది. అలా వ్రాయబడిన గ్రంథమునకు పెట్టబడిన పేరు అల్లాహ్‍కు నచ్చలేదు. ఆ రోజులలో అల్లాహ్ చెప్పినట్లు తెలియకుండా చెప్పబడిన గ్రంథము తౌరాతు గ్రంథము. అయితే 'అల్లాహ్ చెప్పిన గ్రంథము' అను అర్థముతో యున్న పేరును గ్రంథమునకు పెట్టడము వలన ఆ పేరుతో ఇది దేవుడు చెప్పిన గ్రంథమని తెలియగలదు. అలా తెలియుట అల్లాహ్‍కు ఇష్టము లేదు. అందువలన మోషేకు గ్రంథమును ఇచ్చినప్పుడు పాతపేరు చెప్పకుండా క్రొత్తపేరు చెప్పబడినది. ఆ క్రొత్త పేరే 'మూడు రాత్రులు' అని అర్థమొచ్చునట్లు 'తౌరాత్'యని చెప్పాడు. ముందున్న పేరు ఏమిటి? ముందు గ్రంథమును వ్రాసినవారు ఎవరు? అని ప్రశ్నించుకొని చూస్తే, తౌరాత్ గ్రంథమును గురించి ఎవరికీ తెలియని క్రొత్త విషయములు, చరిత్రలో మరుగున పడిపోయిన విషయములు తెలియగలవు.


ద్వాపర యుగము చివరిలో 5150 సంవత్సరముల పూర్వము కృష్ణుడు అర్జునునకు దైవ జ్ఞానమును బోధించాడు. అలా చెప్పిన జ్ఞానమును తర్వాత వ్యాసుడు గ్రంథరూపము చేశాడు. గ్రంథరూపము చేసిన దానికి 'భగవద్గీత' యను పేరు పెట్టబడినది. అదే మొదట తయారయిన దైవగ్రంథము. అందువలన దానిని 'ప్రథమ దైవగ్రంథ'మని చెప్పడమైనది. మోషేకు 20 సంవత్సరముల వయస్సులో స్వప్నావస్థలో భగవద్గీత జ్ఞానమును చెప్పిన కృష్ణుడు భగవద్గీత గ్రంథమును ఇవ్వడము జరిగినది. అలా ఇచ్చినప్పుడు ఆ గ్రంథము పేరు భగవద్గీతయని చెప్పకుండా దానిపేరు మార్చి 'తౌరాత్' గ్రంథమని చెప్పాడు. అప్పటినుండి మోషే దానిని తౌరాతు గ్రంథమని చెప్పుచుండెను. నేడు భగవద్గీత భారతదేశములో ప్రత్యక్షముగా యున్నా, ఇదే ఆ తౌరాతు అని ఎవరికీ తెలియదు. ఈ విషయము ఆనాడు మోషేకు కూడా తెలియదు. ఇక్కడ భగవద్గీతగా చెప్పబడునది, అక్కడ ఇజ్రాయెల్ దేశములో తౌరాతుగా చెప్పబడేది. ఇంకొక రహస్యమేమనగా! మోషేకు తౌరాతు గ్రంథమును ఇచ్చినవాడు కృష్ణుడే అయినా అది ప్రత్యక్షముగా మెలుకువలో జరుగలేదు. జరిగినది స్వప్నములో జరిగినది. తర్వాత మోషేకు ఒక్కనికి మాత్రమే తౌరాతు గ్రంథము ప్రతీ దినము స్వప్నములోనే కనిపించేది. అప్పుడు మోషే ప్రతి రోజు తౌరాతు గ్రంథమును చదివేవాడు. అట్లు 34 సంవత్సరములు కనిపించగా ఎన్నోమార్లు పూర్తిగా చదవడమైనది. తౌరాతు గ్రంథములోని జ్ఞానము ఒక్క మోషేకు తప్ప ఎవరికీ తెలియదు.


మోషే తప్ప తౌరాతు గ్రంథమును ఎవరూ చూచినవారు లేరు. భారతదేశములో సంస్కృతములో వ్రాయబడిన భగవద్గీత మోషేకు తౌరాతు యను పేరుతో ఇవ్వబడడమే కాక స్థానిక భాషలో గ్రంథమును ఇవ్వడము జరిగినది. మోషే చదువగల్గిన భాషలో లభ్యమయిన గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూచుటకు అవకాశమే లేదు. మోషేకు స్వప్నములో కనిపించినా గ్రంథములోని విషయములు మెలుకువలో కూడా బాగా జ్ఞాపకముండేవి. అందువలన మోషే గ్రంథములోని ధర్మములను ప్రజలకు తెలియజేసెడివాడు. అలా తెలియజేయబడినదే మోషే ధర్మశాస్త్రము అని బైబిలులో చెప్పబడినది. తౌరాతు గ్రంథములోని ధర్మములను చదివినవాడు, గ్రంథమును చూచినవాడు ఒక్క మోషే తప్ప ప్రపంచములో ఎవరూ లేరు. మోషే తర్వాత తౌరాతు గ్రంథము ఎవరికీ కనిపించలేదు. అందువలన అందరూ తౌరాతు గ్రంథము పేరును విన్నారు గానీ, తౌరాతు గ్రంథమును చూచినవారు అప్పటినుండి ఇప్పటివరకు ఎవరూ లేరు.


తౌరాతు గ్రంథము ఇప్పటికీ భారతదేశములో భగవద్గీత యను పేరుతో సజీవముగా యున్నా, ఈనాటి భగవద్గీతయే ఆనాటి తౌరాతు యని ఎవరికీ తెలియదు. చరిత్ర తెలియని వారు నేడు మేము చెప్పేమాటను నమ్మలేకయున్నారు. తౌరాతు గ్రంథము ఉంది అని వాదించువారు కూడా కలరు. అటువంటి వారిని మీరుగానీ, గతములో మీ పెద్దలుగానీ చూచారా? అని అడుగుచున్నాము. అట్లే ప్రపంచములో ఏ భాషలోగానీ, ఏ దేశములో గానీ, ఏ మనుషులుగానీ చూచినట్లు ఆధారము కలదా!యని ప్రశ్నించు చున్నాము. తౌరాతు అంటే ఏమిటో తెలియనివారు చాలామంది దానిని గురించి ఊహించుకొని చెప్పడమేగానీ, ప్రత్యక్షముగా చూచి మాట్లాడు వారు ఎవరూ లేరు. అయితే బైబిలుయందు మోషే ధర్మశాస్త్రము అను పేరుతో చెప్పబడిన దానిని ఖురాన్ గ్రంథములో మూసాకు ఇవ్వబడిన తౌరాత్ గ్రంథముయని వ్రాసియుండుట కలదు. అయితే ఖుర్ఆన్‍లో చెప్పబడిన మూసా, బైబిలులో చెప్పిన మోషే ఇద్దరూ ఒక్కరేయని ఎవరికీ తెలియదు. అట్లే బైబిలులో చెప్పిన మోషే ధర్మశాస్త్రము ఖుర్ఆన్‍లో చెప్పబడిన తౌరాతు గ్రంథము రెండూ ఒక్కటేనను విషయము కూడా ఎవరికీ తెలియకుండా పోయినది.


తౌరాతు గ్రంథములో చెప్పబడిన జ్ఞానమును వ్యాసుడు వ్రాసినా, కృష్ణుడు చెప్పినా, కృష్ణుడు తనమీద పెట్టుకోక అందులోని జ్ఞానమును నీకు జ్ఞాపకము చేయుచున్నానని చెప్పాడు. అందులోని జ్ఞానమంతయూ సృష్ఠి ఆదిలో ఆకాశవాణి చెప్పిన జ్ఞానమని చెప్పాడు. సృష్ఠి మొదలయిన తర్వాత మొట్టమొదట ఆకాశవాణి ద్వారా దేవుని జ్ఞానము చెప్పబడినది. ఆకాశము ఉరిమి ఉరుములుగా ఇచ్చిన జ్ఞానమును మనుషులు గ్రహించ లేదుగానీ, ఆ భాషను, ఆ శబ్దములోని భావమును ఆకాశములోని సూర్యుడు గ్రహించి, తర్వాత భూమిమీద మనుషులు మాట్లాడు భాషలో 'మనువు' అను వ్యక్తికి వాణి ద్వారా వచ్చిన జ్ఞానమును తెలిపాడు. మనువుకు తెలిసిన జ్ఞానము చివరకు భగవద్గీతగా తయారయినది. వాణి ద్వారా వచ్చిన జ్ఞానమే తర్వాత 'బైబిలు' గ్రంథముగా తయారయినది. దానివలన తౌరాతు యనబడు జ్ఞానము, అనగా! భగవద్గీత యనబడు జ్ఞానమే బైబిలుగా వచ్చినదని తెలియుచున్నది. అట్లే భగవద్గీతలోని జ్ఞానమే 'ఖుర్ఆన్'గా కూడా వచ్చినది. అయితే ఖుర్ఆన్ చదివే వారికి ఇది భగవద్గీత (తౌరాతు) జ్ఞానమేయని తెలియకున్నది. అట్లే బైబిలు చదివే వారికి ఇది తౌరాతు జ్ఞానమేయని తెలియదు. ఖుర్ఆన్‍లో తౌరాత్ జ్ఞానమే ఉన్నదని తెలియునట్లు కొన్ని ఆయత్‍లు చెప్పబడినవి చూడండి.


(5-46) ''ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యం కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథమును ఇచ్చాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథమును ధృవీకరించేది.''


(5-48) ''మేము నీవైపుకు సత్యసమేతముగా ఈ ఖుర్ఆన్ గ్రంథమును అవతరింపజేశాము. ఇది తమకన్నా ముందు వచ్చిన భగవద్గీత (తౌరాతు), ఇంజీలు (బైబిలు) గ్రంథాలను సత్యమని ధృవీకరించుచున్నది.''


ఈ విధముగా తౌరాతు (భగవద్గీత) ను గొప్పగా చెప్పడము జరిగినది. తౌరాతు గ్రంథములోని జ్ఞానమే మాయందు గలదని ఖుర్ఆన్ మరియు బైబిలు రెండూ ధృవీకరించుచున్నవి. ముందు చెప్పిన 5-46 వాక్యములో బైబిలు, భగవద్గీతను సత్యమని ధృవీకరించుచున్నదని చెప్పారు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములలో భగవద్గీత రెండు గ్రంథములకు పుట్టినిల్లులాగ యున్నది. రెండు గ్రంథములలోనూ మొట్టమొదట ఆకాశవాణి చెప్పిన జ్ఞానమే కలదు. మొదట ఆకాశవాణి జ్ఞానము భగవద్గీతగా తయారయినది. తర్వాత బైబిలు, ఖుర్ఆన్‍లుగా తయారయినది. అందువలన భగవద్గీతలోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములయందు కలదని ఆకాశవాణి జ్ఞానమును భూమిమీద చెప్పిన సూర్యుడే (జిబ్రయేల్) చెప్పుచున్నాడు. తౌరాత్ గ్రంథమును గురించి ఇంకనూ ఏమి చెప్పు చున్నారనగా!


(5-68) ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభువు మీ వద్దకు పంపిన ఖుర్ఆన్ గ్రంథములను మీరు చదివి మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''


(5-44) ''మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఈ తౌరాతు గ్రంథ ఆధారముగానే ముస్లీమ్‍లైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు.''


(62-5) ''తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి నప్పటికీ దానికి అణుగుణముగా ఆచరించనివారు ఎన్ని గ్రంథములు అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథము లను వీపుమీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్ఠాంతము చాలా చెడ్డది.''


తౌరాతు (భగవద్గీత)ను గురించి ఇంత గొప్పగా చెప్పారని ఎవరికీ తెలియదు. ముస్లీమ్‍లకయితే ఏమాత్రము తెలియదు. మొదటికి తౌరాతు భగవద్గీత రెండూ ఒక్కటేయని మిగతా మతస్థులకు కొద్దిగా కూడా తెలియదు. స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పియుండడము వలన నేడు మనకు తెలిసినది. ఖుర్ఆన్ గ్రంథములో మతసామరస్యము కలదు. అందువలననే ఖుర్ఆన్, ఇంజీలు రెండు గ్రంథములు తౌరాతును సమర్థించుచున్నవి. అయితే గ్రంథములలో ఎక్కడా 'మతము' అను ప్రసక్తి లేదు. మూడు గ్రంథముల జ్ఞానము ఒకదానితో మరొకటి కలిసియున్నది. అయినా మనుషుల మధ్య గ్రంథముల జ్ఞానము పెరుగక, మాయతో కూడుకొన్న మతము పెరిగినది. దానివలన కొందరిది ఒక మతము, మరికొందరిది ఇంకొక మతము అనుచూ, అంతటితో ఆగక మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని అంటున్నారు.


అందరికీ ఒక్కడే దేవుడు, అందరికీ ఒక్కటే జ్ఞానము అని ఎవరూ అనడము లేదు. సృష్ఠ్యాదిలో చెప్పిన జ్ఞానము మొదటి గ్రంథముగా వచ్చినది. ఆ గ్రంథమునకు మొదటి పేరు వ్యాసుడు పెట్టాడు. రెండవ పేరు కృష్ణుడు పెట్టాడు. కృష్ణుడు జ్ఞానమును బోధించినవాడు, రెండవ పేరు తౌరాతుయని పెట్టాడు. వ్యాసుడు కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపములో వ్రాశాడు. అప్పుడు వ్యాసుడు తాను వ్రాసిన గ్రంథమునకు 'భగవద్గీత'యను పేరు పెట్టాడు. అయితే ఈ విషయము ఎవరికీ తెలియకపోవడము వలన తౌరాతు గ్రంథము వేరు, భగవద్గీత గ్రంథము వేరని అందరూ అనుకొన్నారు. భవద్గీతయను పేరు వ్యాసుని చేత చెప్పబడినది. తౌరాతుయను పేరు స్వయముగా కృష్ణుడే చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు చెప్పిన రెండు సంవత్సరములకు తయారుకాగా, తర్వాత కృష్ణుడే స్వయముగా మూసాకు (మోషేకు) గ్రంథము ఇచ్చి దాని పేరు 'తౌరాతు'యని చెప్పాడు. తౌరాతు యను పేరు ఖుర్ఆన్‍లో వినిపిస్తూయున్నది.


'మూడు దైవ గ్రంథముల ఉద్దేశ్యము ఒక్కటే' అను విషయము మూడు మతముల వారికీ తెలియదు. ఆ విషయము తెలియక అజ్ఞానముతో భేదాభిప్రాయములు కల్గియున్నారు. వాస్తవమును తెలియగల్గితే అటువంటి భేదాభిప్రాయములు ఉండవు. అయితే దైవ గ్రంథముల బోధలోని ఉద్దేశ్యమేమిటి? అని తెలియువారు ఎవరూ లేరు. ముస్లీమ్‍లు 'మా ఖుర్ఆన్ గ్రంథమే గొప్ప, దీనిలోనే సత్యమైన జ్ఞానము కలదనీ, ఖుర్ఆన్ ముస్లీమ్‍ల గ్రంథమనీ' అనుకొంటున్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో 81-27లో ''ఇది (ఖుర్ఆన్) సమస్త ప్రజలకు హితోపదేశము'' అని చెప్పబడి యున్నది. దీనినిబట్టి ఖుర్ఆన్ ఒక మతమునకు సంబంధించినది కాదు అని తెలియుచున్నది. ఖుర్ఆన్ ఒక్కటే కాకుండా మిగతా రెండు గ్రంథములు కూడా ప్రజలందరికీ యని చెప్పియున్నారు. బైబిలులో ''సమస్త మానవులారా నావద్దకు రండి''యని చెప్పబడి యున్నది. అందువలన ఇది అది అనకుండా మూడు గ్రంథములు మతాలకు సంబంధము లేకుండా ప్రజలందరికీ అవసరమని తెలియుచున్నది. దీనినిబట్టి గీత హిందువులది కాదు, బైబిలు క్రైస్థవులది కాదు, ఖుర్ఆన్ ముస్లీమ్‍లది కాదు అని తెలియడమేకాక మూడు దైవగ్రంథములు ప్రజలందరికీ సంబంధించినవనీ, ఏ ఒక్క మతమునకు సంబంధించినవి కాదని తెలియుచున్నది.


మూడు దైవ గ్రంథములలో ముఖ్యమైన, రహస్యమైన ఒక ఉద్దేశ్యము గలదు. ఆ ఉద్దేశ్యమును ప్రజలలో ఎవరూ గ్రహించ లేకపోయారు. దేవుడు సృష్ఠ్యాదిలో ప్రకృతిని తయారు చేశాడు. తర్వాత తననుండి తన అంశగాయున్న ఆత్మ, జీవాత్మలను తయారు చేశాడు. ఆత్మకు తన అధికారములన్నీ ఇచ్చి దేవునిగా చేసి జీవున్ని పాలించమన్నాడు. జీవులందరికీ ఆత్మ దేవుడు కాగా, సృష్ఠికర్తయైన పరమాత్మ సాక్షిగా యున్నాడు. జీవాత్మ అనుభవించేవాడు కాగా, ఆత్మ అనుభవింపజేయు దేవుడుకాగా పరమాత్మ సాక్షిగా యున్నాడు. ప్రతి జీవి శరీరములో నివాసముండగా శరీరములోని ఆత్మచేత జీవుడు ఆడింపబడుచూ కర్మఫలమును అనుభవించు చున్నాడు. అందువలన ప్రతి మనిషి శరీరములో త్రోలబడేవాడు, త్రోలే వాడు, చూచేవాడు యున్నాడని ఖుర్ఆన్‍లో 50-21 యందు గలదు. అదే వాక్యమునే పదములు మార్చి బైబిలు గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయములో 19వ వచనమునందు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యని చెప్పియున్నారు. త్రోలబడేవాడు జీవాత్మకాగా, త్రోలేవాడు ఆత్మకాగా, సాక్షిగా చూచేవాడు పరమాత్మ అని తెలియుచున్నది. ఆ ముగ్గురినే బైబిలులో చెప్పారు. జీవాత్మ కుమారుడు అనియూ, ఆత్మ తండ్రి అనియూ, పరమాత్మను పరిశుద్ధాత్మ అని చెప్పారని తెలియుచున్నది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విషయము భగవద్గీతలో చెప్పియున్నారు. మూడు గ్రంథములలో మూడు ఆత్మలను గురించి చెప్పినా, పేర్లు మార్చి చెప్పియుండుట వలన మూడు గ్రంథములలో ఒకే సమాచారమును చెప్పారని ఎవరి దృష్ఠికీ రాకుండా పోయినది. భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని చెప్పియుండుట వలన భగవద్గీతలో చెప్పిన ముగ్గురినే మిగతా రెండు గ్రంథములలో రెండు వేరువేరు విధములుగా చెప్పియున్నారు. ఎక్కడ చెప్పినా మూడు ఆత్మల విషయమేయని తెలియక వాటిని వేరువేరు విషయములుగా తలచారు.


మూడు ఆత్మలలో జీవాత్మను భగవద్గీతలో క్షరుడు అని చెప్పారు. క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము. ఆత్మను అక్షరుడు అని అన్నారు. అక్షరుడు అనగా నాశనము లేనివాడని అర్థము. పరమాత్మను పురుషోత్తముడు అని అన్నారు. పురుషోత్తముడనగా పరమాత్మయని అర్థము. భగవద్గీతలో మూడు ఆత్మల విషయమును గ్రహించితే ప్రకృతి స్త్రీ సంబంధము కాగా, పురుషుడయిన పరమాత్మ తన నుండి ఇద్దరిని విడదీసి క్షరుడు, అక్షరుడు అని అన్నారు. పరమాత్మ ''మమైవాంశో'' అని అనుట వలన పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీ కాగా, పరమాత్మనుండి విడివడిన క్షరుడు, అక్షరుడు అను ఇద్దరూ పురుషులే. అయితే క్షరుడు నాశనమయ్యే పురుషుడు, అక్షరుడు నాశనము లేని పురుషుడు. ఇద్దరి పురుషులకంటే ఉత్తముడు పరమాత్మ అయినందున పరమాత్మను పురుషోత్తముడు అని అన్నారు. మూడు గ్రంథములలోనూ ముగ్గురు పురుషుల జ్ఞానమును వేరువేరు పదములతో చెప్పియుండుట వలన మూడు ఆత్మల విషయమును తెలియజేయు జ్ఞానముగల మొదటి గ్రంథమయిన భగవద్గీతను కృష్ణుడు తౌరాతు యని అన్నాడు. మూడు తెలియని చీకటి రాత్రులను పోల్చి మూడు ఆత్మలను తౌరాత్‍యని చెప్పడమైనది. తౌరాత్ అనునది ప్రత్యక్షముగా భగవద్గీతయందు, పరోక్షముగా బైబిలు ఖురాన్‍ల యందు గలదు. ఎలాగయితేనేమి మూడు ఆత్మల విషయము ఎక్కడయితే యున్నదో అక్కడంతా తౌరాతు గలదని చెప్పవచ్చును. 'తౌ' అనగా మూడుయని తెలుగు భాషలో అర్థము గలదు. సంస్కృతములో కూడా ఇదే అర్థము గలదు. అరబ్బీ దేశములోని అరబ్బీ భాషలో కూడా 'తౌ' అంటే మూడు అని అర్థము గలదు. మొదటికి 'తౌ' అను అక్షరము తెలుగు అక్షరము. 'తౌ' అను తెలుగు అక్షరము మిగతా భాషలలోని అక్షరముగా చెప్పబడుచూ చివరకు అరబ్బీ భాషలో కూడా ఇదే పదము నిలిచిపోయినది. దానివలననే తౌరాత్‍యని ఖుర్ఆన్ గ్రంథములో వ్రాశారు. తౌరాత్ అంటే ముఖ్యముగా మూడు కనిపించని ఆత్మలని అర్థము.


మూడు ఆత్మలను తెలియజెప్పడమే ముఖ్యముగా మూడు దైవ గ్రంథములలోని ఉద్దేశ్యము. దైవ గ్రంథముల బోధయంతయూ మూడు ఆత్మల చుట్టూ ఆవహించి యుండును. ఒక దైవ గ్రంథములో ఒకే వాక్యముగా మూడు ఆత్మలను వేరువేరు వాక్యములుగా చెప్పియున్నా, ఆ గ్రంథమంతా దానిని బోధించుటకేయని తెలియుచున్నది. దైవ గ్రంథములో ఒకే వాక్యముగా చెప్పియున్నా, ఆ వాక్యమే ఆ గ్రంథమునకంతటికీ తలమాణిక్యములాగ యున్నది. ఈ విషయము గ్రంథము చదివిన వారికి సామాన్యముగా తెలిసియుండదు. ప్రతి మనిషియందు, ప్రతి జీవరాసియందు ఈ మూడు ఆత్మలేయున్నవి. మూడు ఆత్మలు లేనిది జీవము లేనిది యని పిలువబడును. జీవమున్నది యంటే జీవమును అంటుకొని ఆత్మయుండును, ఆత్మను అంటుకొని పరమాత్మయుండును. ఈ మూడు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధముగా ఉండును. మొదట పుట్టిన ప్రకృతిలోని ఆకాశములోగానీ, గాలిలోగానీ, అగ్నిలోగానీ, నీరులోగానీ, భూమిలోగానీ ఈ మూడు ఆత్మలే గలవు. మూడు ఆత్మలు లేని జీవరాసి ఏదీ లేదు. అందువలన దైవ గ్రంథములో మూడు ఆత్మలు ప్రత్యక్షముగా ఒకే వాక్యములో మాత్రమే చెప్పియున్నా, పరోక్షముగా గ్రంథమంతా చెప్పియున్నట్లు కలదు. అందువలన ప్రథమ దైవ గ్రంథమునకు భగవద్గీతయను పేరు సరిపోలేదని తెలిసిన కృష్ణుడు దానికి స్వయముగా 'తౌరాత్' యని పేరుపెట్టి మోషేకు ఇవ్వడము జరిగినది. మొదటి దైవ గ్రంథమునకు మూడు అక్షరముల పేరు తౌరాతుయని పేరు పెట్టిన తర్వాత, తౌరాతులోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలోనూ ఉండుటను బట్టి ఆ రెండు గ్రంథములకు కూడా మూడు అక్షరముల పేర్లే చెప్పబడినవి. అందువలన 'తౌరాత్' అను పదమునకు అర్థము మూసిపెట్టి చెప్పితే మూడు రాత్రులనీ, తెలిసి చెప్పితే మూడు ఆత్మలనీ చెప్పవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

36. అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించే వారికి భయము లేదు. (5-69)

నేడు మనుషులు నిర్మించుకొన్న 12 మతములలో ముఖ్యమైనవి మూడే గలవు. హిందూ, క్రైస్థవ, ముస్లీమ్ అను మూడు మతములలోని మనుషులలో ఒక్క హిందూమతము పురాతనమైనది. ప్రపంచములో ఎక్కువ దైవజ్ఞానము గలదిగా ఒకప్పుడు ఇందూ సమాజమే ఉండేది. ఇందూ సమాజము కలియుగములో ఇందూమతముగా తయారయినది. ఆ తర్వాత ఇందూ మతము కాస్త మారిపోయి హిందూ మతముగా చెప్పబడుచున్నది. ఈ పేర్లు ఎలా మారుతూ వచ్చాయో అలాగే హిందువులు అజ్ఞానులుగా మారుతూ వచ్చారు. అందువలన నేడు హిందువులకు దేవుడు ఎవరో తెలియదు. ముఫ్పైమూడు కోట్ల దేవతలను ఆశ్రయించి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధించుచున్నారు. ఒక కుటుంబములో పదిమంది యుంటే ఇంటి అందరికీ ఇంటి దేవుడు ఒకడుండును. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్ట దేవుడు ఉండును. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత దేవత యుండును. మానవజాతిని దేవుడు సృష్ఠించినట్లే, దేవతజాతి జీవరాసులను కూడా దేవుడు సృష్ఠించాడు. మనుషులు కనిపిస్తారు, దేవతలు కనిపించరు. దీనినిబట్టి కనిపించే మనుషులను, కనిపించని మనుషులను రెండు రకముల వారిని దేవుడు సృష్ఠించాడు. దేవతలను ఖుర్ఆన్ గ్రంథములో 'జిన్నాతులు' అని అన్నారు. ఖుర్ఆన్‍లో సూరా 51 ఆయత్ 56లో ఇలా కలదు.


(51-56) ''నేను జిన్నాతులను మరియు మనుషులను సృష్ఠించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.''


దేవుడు ఈ విధముగా మనుషులను, దేవతలను (జిన్నాతులను) సృష్ఠించినది ఆయనను ఆరాధించడానికే గానీ, ఇతరులను ఆరాధించడానికి కాదు. అయితే మనుషులు కనపరాని జిన్నాతులను (దేవతలను) గొప్పగా తలచి, దేవున్ని వదలి దేవతలను ఆరాధించుచున్నారు. ఇదే విషయమును అంతిమ దైవగ్రంథములో సూరా 72 ఆయత్ 6లో ఇలా చెప్పారు. చూడండి.


(72-6) ''అసలు విషయమేమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతులను ఆరాధించేవారు కలరు. ఈ కారణముగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.''


ఈ వాక్యము ప్రకారము నేడు హిందువులు తమతోపాటు పుట్టి, తమతోపాటు పెరిగి, తమతో పాటు చనిపోవు దేవతలను గొప్పవారుగా నమ్మి అజ్ఞానముతో అసలయిన దేవున్ని వదలి, దేవునికి చేయవలసిన ఆరాధనలు దేవతలకు చేయుచున్నారు. వాస్తవముగా 'ఆరాధ్యదైవము దేవుడు ఒక్కడే.' అయినా మనుషులు అజ్ఞానముతో తమతోపాటు చావు పుట్టుకలు గల దేవతలను గొప్పగా తలచి, దేవుని విషయము తెలియక దేవతలను ఆరాధించుచున్నారు. దానివలన దేవతలు కూడా మనుషులవలె అజ్ఞానములో పడిపోయి, తాము మనుషులతో సమానముగా పుట్టినవారమే నని మరచిపోయి, తమను గొప్పగా ఊహించుకొని వారు కూడా దేవున్ని మరచి పొగరుపోతులై తిరుగుతున్నారు. దేవుడు చేయు పనులను తామే చేసినట్లు తలచుచున్నారు. మనుషులు కోరిన కోర్కెలు ఏవయినా నెరవేరితే అవి తమ వలననే నెరవేరినవని అనుకొంటున్నారు. ఈ విధముగా మనుషులు, దేవతలు ఇరువురూ అజ్ఞానములో కూరుకపోయి ఉన్నారు. తమను సృష్ఠించినది దేవుడే యను మాటను మరచిపోయారు. ఈ విధముగా నేడు హిందువుల మనుషులలోనూ, హిందువుల దేవతలలోనూ జరుగు చున్నది. ఎక్కడయినా అరుదుగా కొన్ని లక్షల దేవతలకొకరు తాను దేవతా జన్మ ఎత్తినా, దేవున్ని గురించి తెలుసుకొని, దేవుని మార్గములో ప్రయాణిస్తూ, దేవున్ని ఆరాధించుచున్నారు.


మూడు మతస్థులలో ఏ మతస్థుడయినాగానీ, ఏ దేవతను పూజించినా అతడు దేవున్ని ఆరాధించనట్లేయగును. దేవుడు ఎవరో తెలిసి, దేవతలు ఎవరో తెలిసినప్పుడు దేవతలను వదలి దేవున్ని ఆరాధించ వచ్చును. సృష్ఠికర్తయిన దేవుడు ఎవరో? ఆరాధనకు యోగ్యుడయిన లేక ఆరాధనకు అనుమతి పొందిన దేవుడు ఎవరో? అనుమతి పొందిన దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలెవరో తెలిసినప్పుడు మనుషులు ఆరాధించవలసిన దేవున్ని ఆరాధించగలరు. ఇప్పుడు చెప్పినవారిని మూడు రకములుగా విభజించి చెప్పవచ్చును. మొట్టమొదట భూమిని, ఆకాశమును సృష్ఠించిన దేవుడు, రెండవది సృష్ఠ్యాదిలో సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడిన దేవుడు, మూడవది సృష్ఠింపబడిన దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలు. ఈ మూడు భాగములుగా యున్న వారిలో ఎవరిని ఆరాధించవలెనో, మనుషులు ఆరాధించుటకు తగిన దేవుడు ఎవరో తెలిసి ఆయననే ఆరాధించడమును నిజమైన జ్ఞానమగును. ఇంతవరకు దేవతల విషయము తెలిసిపోయినది. సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించవద్దని చెప్పాము. దేవతలు మనుషులు ఇద్దరూ సమానమేనని చెప్పబడినది. అయితే దేవతలను వదలి చూస్తే సృష్ఠి ఆదిలో భూమిని, ఆకాశమును మొట్టమొదట సృష్ఠించిన దేవుడు మొదటివాడు కాగా, సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడిన దేవుడు రెండవవాడు. ఈ రెండవ దేవుడు కూడా మనుషులు, దేవతలు సృష్ఠింప బడినట్లే మొదటి దేవుని చేత సృష్ఠింపబడినవాడు. దేవతల విషయము తెలిసిపోయింది.


ఇప్పుడు సృష్ఠించిన దేవుడు, సృష్ఠించబడిన దేవుడు ఇద్దరున్నారు. ఈ ఇద్దరి దేవుళ్లలో ఎవరిని ఆరాధించవలెనో తెలిస్తే, అంతిమ దినమున ఎవరు తీర్పు తీర్చుదురో తెలిస్తే అతనినే విశ్వసించి ఆరాధించవచ్చును. అందువలన అంతిమ దైవ గ్రంథములో సూరా ఐదు ఆయత్ 69లో ఇలా చెప్పారు చూడండి.


(5-69) ''ముస్లీమ్‍లైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్థవులు) అయినా, ఎవరయినా సరే వారు గనుక అల్లాహ్‍ను (దేవున్ని) మరియు అంతిమ దినమును విశ్వసించి సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయముగానీ, చింతగానీ ఉండదు.''


ఈ వాక్యములో ఏ మతస్థుడయినా వాడు ఆరాధించవలసిన దేవుడు ఎవరో తెలిసిన మనిషి చనిపోవు అంతిమ దినమున దేవుడే మళ్లీ జన్మకు కర్మ తీర్పు తీర్చి పంపునని తెలిసి, తన దేవున్ని ఆరాధించుచూ సక్రమ మార్గములో ఉంటూ, ప్రతీ దినము దేవున్ని ఆరాధించు సదాచరణ చేయుచూ యున్న వానికి కర్మలు అంటుకోవు, పాపపుణ్యములు రావు. వాడు రెండవ మారు అంతిమ దినమున తీర్పులోనికి రాడు. అందువలన వానికి భయముగానీ, చింతగానీ ఉండదు అని చెప్పవచ్చునన్నాడు. భయము చింతలేని మాట వాస్తవమే! అయితే ఇక్కడ సదాచరణ అంటే ఏమిటి, అల్లాహ్ అంటే ఎవరో తెలియాలి. నేడు ముస్లీమ్‍లందరూ మేము అల్లాను 'విశ్వసించాము' అని ప్రతి దినము నమాజ్ చేస్తున్నారు. సదా ఆచరించడమును సదాచరణ అంటారు. సదా అనగా ఎల్లప్పుడు అని కూడా అర్థము కలదు. ఎల్లప్పుడు ఆచరణ కల్గి యుండడమును సదాచరణ అని అనవచ్చును. ముస్లీమ్‍లు నమాజ్‍ను చేయడమును సదాచరణ అని అనవచ్చును. అయితే ఇక్కడ ముఖ్యముగా ఒక ప్రశ్న వచ్చుచున్నది. అది ఏమనగా! ముస్లీమ్‍లు అందరూ అల్లాహ్‍ను విశ్వసించారు సరే. సృష్ఠించిన అల్లాహ్ ఒకరు, సృష్ఠింపబడిన అల్లాహ్ మరొకరు గలరు. ఈ ఇద్దరి అల్లాహ్‍లలో నేటి ముస్లీమ్‍లు ఏ అల్లాహ్‍ను విశ్వసించారు? అని అడుగుచున్నాము. అల్లాహ్ ఒక్కడే అయివుంటే ఆ ఒక్కనినే ముస్లీమ్‍లు అందరూ విశ్వసించారు అని చెప్పవచ్చును. ఇప్పుడు ప్రశ్న వచ్చినది. జవాబును వారినే అడిగి తెలుసుకోవలసి యున్నది.


ఈ ప్రశ్న ఒక ముస్లీమ్ మతస్థులకే కాదు. దైవ గ్రంథములు గల మిగతా రెండు మతములవారికి కూడా అడుగుచున్నాము. ఒక గ్రంథములోగల విషయము ఏదయినా, మిగతా రెండు గ్రంథములకు వర్తించును. దైవ గ్రంథములో దైవ సంబంధమైన విషయమే ఉండును గానీ, ప్రపంచ సంబంధ విషయములు ఏవీ ఉండవు. ఎవరయినా ఏ దైవ గ్రంథములోనికైనా ప్రపంచ సంబంధమైన విషయము కలిపియుంటే దానిని దైవ గ్రంథమునకు సంబంధించినదిగా లెక్కించకూడదు. ఇది దేవుని విషయమైనందువలన ప్రతి దైవ గ్రంథమునకు వర్తించును. వర్తించును అని చెప్పడమేకాక మిగతా రెండు దైవ గ్రంథములలో ఇద్దరు దేవుళ్లను గురించి చెప్పబడియున్నది. అయినా ఏ గ్రంథములోని విషయము గానీ, ఏ మతస్థుడుగానీ గ్రహించకుండా తమకు ఒకే దేవుడున్నాడని చెప్పుచున్నారు. ప్రతి గ్రంథములోనూ భగవద్గీత, బైబిలు, ఖురాన్‍లలో ఇద్దరు దేవుళ్లను గురించి చెప్పడమైనది. అయినా అది ఎవరికీ తెలియకుండా పోయినది. మిగతా రెండు మతములను గురించి తర్వాత చెప్పుకొందాము. ఇప్పుడు ముస్లీమ్ మతము వారిని ఈ ప్రశ్న వేస్తే, గ్రంథములో యున్న ప్రశ్నే అని అడిగితే వారివద్ద ఏమీ ఖచ్చితమైన జవాబు ఉండదు. ప్రతి ముస్లీమ్ ఈ విషయములో తమ పెద్దల మాట విని మోసపోయినారు. తమను తమవారే మోసము చేయుచున్నారని తెలియలేకపోయారు. అందుకు సంబంధించిన ఆయత్‍ను చూపి ప్రశ్నించితే ఈ ప్రశ్నే వారికి క్రొత్తగా కనిపించుచున్నది. ప్రశ్న ఎలా కనిపించినా మూడు మతముల వారికి ఇద్దరు దేవుళ్లు కలరనుట సత్యము. అయితే ఇంతవరకు రెండవ దేవున్ని గురించి ఆలోచించలేదు. ఏ దేవున్ని ఆరాధించవలెనను ప్రశ్న కూడా వారికి రాలేదు.


ఖుర్ఆన్ గ్రంథములో దేవునికి దగ్గరగా చెప్పిన వాక్యములు గలవు. దేవునికి దగ్గరగా తీసుకపోయిన వాక్యములో 5-69 కూడా ఒకటి. ఎందుకనగా! ఈ వాక్యము చూచేదానికి చిన్నగయున్నా ''అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించిన'' అని చెప్పియున్నారు. ఆ చిన్న మాటను లోతుగా ఆలోచిస్తే ఎంతో గొప్ప జ్ఞానము తెలియగలదు. దేవుడు ప్రతి ప్రాంతమునకు ఒక గ్రంథమును ఇచ్చాడు. చదివేదానికి అక్షర జ్ఞానాన్ని ఇచ్చాడు. యోచించే దానికి బుద్ధిని ఇచ్చాడు. నీకు, దైవ గ్రంథమునకు మధ్యలో ఎవరినీ లేకుండా చేసుకొని, నీవు చదివి తెలుసుకోవచ్చును కదా! ఎవరో నాకు చెప్పలేదు అనే దానికంటే నీవే ఎందుకు తెలుసుకోకూడదు? ఒక ముస్లీమ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాడు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయి, ''ఇది మా పెద్దలు చెప్పలేదే!'' యని అంటున్నాడు. నీకు గ్రంథములోని విషయము ఎలా తెలియదో అలాగే మీ పెద్దలకు కూడా తెలియదు. అందువలన ''తౌరాతులోని జ్ఞానము మీకుగానీ, మీ పెద్దలకు గానీ తెలియదు'' అని ఖుర్ఆన్ గ్రంథములో 6-91 వాక్యములో చెప్పి యున్నారు. అందువలన నీకు తెలియదను నిందను నీ పెద్దల మీద వేయక నీవు చదివి తెలుసుకోవడము నీ బాధ్యత. ఇట్లు తెలియనివారు ముస్లీమ్ సమాజములో చాలామంది యున్నారని తెలిసిన అల్లాహ్ (దేవుడు) ''అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యములు'' అను పేరుతో ఈ వ్రాతను వ్రాయించుచున్నాడు.


ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. అంతిమ దినము అనునది పుట్టిన ప్రతి మనిషికీ యున్నది. అంతిమ దినము ఉన్నవానికి ప్రథమ దినము, ప్రథమ దినము ఉన్నవానికి అంతిమదినము ఉండుట అనివార్యము అని తౌరాతు గ్రంథములో చెప్పబడినది. ఇప్పుడున్న ప్రతి మనిషికీ, ప్రతి జీవరాసికీ అంతిమ దినము తప్పదు. అంతిమ దినమంటే ఒక జీవితమున చివరి దినము అని చెప్పవచ్చును. ఏదయితే అంతిమ దినము కలదో అదే రెండవ జీవితమునకు ప్రథమ దినము అవుతున్నది. ఒక్క క్షణములో అంతిమ దినము ముగియుచుండగా, అదే క్షణములోనే ప్రథమ దినము మొదలవుచున్నది. ఈ విషయమును కొందరు నమ్మినా నమ్మకపోయినా పూర్తి సత్యబద్దమై యున్నది. అంతిమ దినమునకు ప్రథమ దినమునకు అధిపతి, అధికారి ఒక్కడే. ఆయనే అల్లాహ్. అల్లాహ్ అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న కర్మనుబట్టి తీర్పు తీర్చి రెండవ జన్మకు పంపును. ఇదంతా ఒక్క క్షణములో జరిగిపోవుచున్నది. అలా తీర్పు తీర్చు అధికారము అల్లాహ్‍కు ఒక్కనికే కలదు. అయితే ఆ ఒక్క అల్లాహ్ ఎవరు? సృష్ఠించిన అల్లాహ్నా లేక సృష్ఠింపబడిన అల్లాహ్నా? ఇక్కడ ఇద్దరిలో ఎవరు? అను ప్రశ్నకు జవాబు లేదు. అల్లాహ్‍ను విశ్వసించిన వారు ఆయన చేసే తీర్పును తప్పక విశ్వసించును. అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించే వానికి భయము, చింత లేదు అనుట వాస్తవమే.


అంతిమ దినమును విశ్వసించక తప్పదు. అయితే అంతిమ దినమున నీకు తీర్పు తీర్చువాడు ఎవడు? అన్నదే ముఖ్యమైన ప్రశ్న. వాక్యము చిన్నదే ప్రశ్న మాత్రము పెద్దదే! ప్రశ్న లేకపోతే చిన్నదయినా, పెద్దదయినా మనిషికి ప్రయోజనము లేదు. మనిషికి ఈ వాక్యము వలన ప్రయోజనముండాలి యంటే అంతిమ దినమునకు అధిపతి ఎవరో తెలియాలి. అలా ఆలోచిస్తే ఎవడయితే మనుషుల చేత ఆరాధింపబడు చున్నాడో, ఎవడయితే ఆరాధనకు యోగ్యుడో, ఎవడయితే మానవులకు కావలసిన కార్యములన్నియూ చేయుచూ కార్యకర్తగా యున్నాడో, ఎవడయితే సృష్ఠికర్తయైన అల్లాహ్ చేత సృష్ఠింపబడినాడో, ఎవడయితే సర్వజీవరాసులను సృష్ఠించు కార్యమును చేయుచున్నాడో, ఎవడయితే మూడు దైవ గ్రంథముల లోనూ ఎక్కువగా చెప్పబడినాడో, అతడే అంతిమ దినమునకు, అంతిమ తీర్పుకు అధికారిగా యున్నాడు. అతనే అందరికీ దేవుడు. ఆ ఒక్క దేవున్ని తెలియుట చేత మనిషికి సంబంధించిన జ్ఞానమంతయూ తెలిసి, అజ్ఞానము కొద్దిగా కూడా లేకుండా పోవును. ఎప్పుడయితే అజ్ఞానము లేదో అప్పుడు మనిషిలోని భయము లేకుండా పోవును. ఎప్పుడయితే భయము లేదో అప్పుడు భవిష్యత్తును గురించి చింతన యుండదు. అదే విషయమునే పై వాక్యములో చెప్పియున్నారు. మేము ఎంత చెప్పినా మీకు ప్రశ్నను రేకెత్తించునంత వరకే, జవాబును మీరు తెలియవలసిందే యని తెలుపుచున్నాము. కొందరికి మా మాటలు చెడును బోధించినట్లు, అజ్ఞానము వైపు పంపునట్లు కనిపించుచుండవచ్చును. అలా చేయుట వలన నాకు ఏమీ ప్రయోజనము లేదు. పైగా అల్లాహ్ ఆయత్‍కు తప్పుగా అర్థము చెప్పితే అల్లాహ్ ఆగ్రహమునకు గురికాక తప్పదు. అందువలన మేము ఏమి చెప్పినా దానిని బాగా ఆలోచించి చెప్పుచున్నాము తప్ప, వేరు భావముతో ఎక్కడా చెప్పలేదని తెలియాలి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

37. ఆహార విషయము. (5-87, 88), (5-3)

విశ్వములో ఒకటి కనిపించే ప్రపంచము, రెండు కనిపించని దేవుడు తప్ప మూడవది ఏదీ లేదు. ఒకటి ఉంది అంటే అది ప్రపంచమునకు సంబంధించినదియైనా ఉంటుంది లేక దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి నదియైనా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినది కాకుండా ఏదీ లేదు. ఒక మనిషి పుట్టాడు అంటే అతను కొంత ప్రపంచమునకు సంబంధించి, కొంత దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి పుట్టియున్నాడు. ప్రపంచములో ఒక మనిషే కాకుండా ఏ జీవరాసి పుట్టినా రెండింటికీ సంబంధించి పుట్టును. బాగా గమనించితే జీవముగలదేది అయినా ప్రపంచమునకు, దేవునికి సంబంధించి యుండును. జీవము లేనిది ఏది అయినా కేవలము ఒక్క ప్రపంచమునకు మాత్రము సంబంధించినదై యుండును. ఇదే విధముగా స్థూల వస్తువులే కాకుండా సూక్ష్మ విషయములు కూడా ఏ దానికో ఒక దానికి సంబంధించి యుండును. విషయములు కూడా రెండే గలవు. ఒకటి ప్రపంచ విషయము, రెండు దేవుని విషయము. ఇంకొక విధముగా చెప్పితే ప్రపంచ వస్తువుకు సంబంధించిన విషయము ప్రపంచమునకు సంబంధించిన విషయముగానే ఉండును. అట్లే దేవుని విషయములు ఉండును. ఒక మాటను చెప్పితే అది దేవుని విషయమా, లేక ప్రపంచ విషయమా తేల్చి చెప్పవచ్చును.


ఇప్పుడు ఆహార విషయమును గురించి అడిగితే అది ప్రపంచ సంబంధ విషయము తప్ప దేవుని విషయము ఏమాత్రము కాదుయని ఎవరయినా చెప్పగలరు. కనిపించే పదార్థముగానీ, వస్తువుగానీ ప్రపంచ సంబంధమైనదే అయి ఉంటుంది. ఆ లెక్క ప్రకారము భార్య విషయమును దైవికము కాదు ప్రపంచ విషయమని చెప్పవచ్చును. భార్య, పుత్రులు మొత్తము శరీర సంబంధమైన వారు ఎవరైనా ప్రపంచ సంబంధమైన వారు గానే చెప్పాలి. శరీర సంబంధ ప్రత్యక్ష పరోక్ష విషయములేవి యున్నా అవి ప్రపంచ విషయములేయని చెప్పవచ్చును. ఆహారము శరీర సంబంధమైనది యగుట వలన దానిని ప్రపంచ సంబంధ విషయముగా చెప్పవచ్చును. ఈ విధముగా సృష్ఠిలోయున్న వాటినన్నిటినీ రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. ప్రపంచములోయున్న కనిపించేవి, కనిపించనివి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయములుగానే యున్నవి. ఈ రెండు విషయములలో ప్రపంచ విషయమును దేవుడు ముందే నిర్ణయించి యుండును. దానిలో ఎవరూ జోక్యము చేసుకోలేరు. ఎవరి జోక్యము వలన అవి మారునవి కావు. దేవుని మొదటి నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచుండును. ఇప్పుడు నేనున్నాను అయితే నా ఆహార విషయమును నేను మార్చుకొనుటకు వీలుపడదు. ముందే దేవుడు నిర్ణయించినట్లు జరుగుచుండును. దేవుడు ముందే నిర్ణయించిన నిర్ణయము ప్రకారమే ప్రతీదీ జరుగును. నా మరణము కూడా నిర్ణయము మీద ఆధారపడి యుండును. అందులో దేవుని నిర్ణయము తప్ప మన నిర్ణయము ఏమాత్రము పని చేయదు.


ప్రపంచము, దేవుడు అను రెండు విషయములలో ప్రపంచ విషయములన్నియూ ముందే నిర్ణయించబడి యుండును. దేవుడు వాటిలో జోక్యము చేసుకోడు. వాటిని గురించి రెండవమారు చెప్పడు. ఒకమారు నిర్ణయము తర్వాత రెండవమారు దేవుడు చేయునది ఏమీ లేదు. దేవుని నిర్ణయము మనిషి పుట్టినప్పుడే మనిషి చావులోనే జరిగియుండును. అదే అంతిమ దిన తీర్పు. ఆ తీర్పును దేవదూతలు అమలు చేయుచుందురు. ఆ తీర్పు మనిషి పుట్టినప్పటినుండి తిరిగి చనిపోవు వరకు అనుభవించవలసి యుండును. ఇది దేవుడు భూమిమీద మనుషుల జీవితములో పెట్టిన విధానము. దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. తీర్పు విధానము అంతయూ ఇటు దేవదూతలు, అటు మనుషుల మీదనే యుండును. దేవుడు ఆ విషయములలో జోక్యము చేసుకోడు. కోర్టులో న్యాయమూర్తి (జడ్జి) తీర్పు చేసిన తర్వాత దానిని అమలు చేయడము పోలీసుల చేతిలో ఉన్నట్లు, మనిషికి దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. మనిషికి వేయబడిన శిక్ష చట్టము ప్రకారము మనిషి అనుభవించి తీరవలసిందే. ఒకవేళ సత్ప్రవర్తన వలన అతని శిక్ష తగ్గే అవకాశమున్నట్లు, మనిషి జీవితములో మనిషి దైవమార్గమును అవలంభించితే దేవుడు వేసిన శిక్ష కొంత తగ్గే అవకాశము ఉండును. ఖైదీ మంచి ప్రవర్తన ఖైదీ చేతిలో యున్నట్లు, మనిషి దైవిక ప్రవర్తన మనిషి చేతిలో యుండును. అందువలన వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే శిక్షమారే అవకాశమున్నట్లు, మనిషి దైవిక మార్గమును అనుసరించు పద్ధతినిబట్టి వానికి నిర్ణయించబడిన శిక్షలో కొంతవరకు మార్పు జరుగవచ్చును.


దైవికమైన ప్రవర్తనను గురించి ఏది సరియైన విధానమో, ఏది నిజమైన దైవమార్గమో దేవుడు తెలియజేయును తప్ప మనిషికిచ్చిన తీర్పులో ఆయన స్వయముగా మార్పుచేయడు. అలా మనిషి దైవికమైన విధానమును తెలియజేయు బాధ్యత దేవునిదే అయివుండుట వలన ఆయన తన బోధల వలన తన జ్ఞాన విధానమంతయూ తెలియజేశాడు. మనిషి అంతిమ దినమున దేవుని తీర్పును పొందిన తర్వాత దైవజ్ఞానమును ఏమాత్రము తెలియకుండా బ్రతికితే వానికి నిర్ణయించబడినవి జరిగితీరును. వాడు దైవ జ్ఞానమార్గములోనికి పోయి దైవజ్ఞానము ప్రకారము నడుచుకోగలిగితే అప్పుడు వానికి నిర్ణయించబడిన విధానము కొంతవరకు మారు అవకాశము గలదు. అందువలన వాని ప్రవర్తన వాని చేతిలోనే యున్నదని దానిని ఎవరూ మార్చలేరని చెప్పవచ్చును. ఇప్పుడు మనిషి జీవితములో ఆహార విషయమును గమనించితే, వాడు ఎప్పుడు ఏమి తినాలని ముందే నిర్ణయించ బడియుండును. మనిషి అంతిమ దినమును పొందినప్పుడే ఆ నిర్ణయము జరిగిపోయి ఉండును. దానిప్రకారము మనిషి తొలి రోజునుండి అనగా శిశు దశ నుండి ఆ నిర్ణయము అమలు జరుగును.


ఒక మనిషికి అంతిమ దిన తీర్పునుబట్టి తన జీవితములో ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనునది వ్రాసిపెట్టబడి యుండును. దాని ప్రకారమే వానికి ఆహారములు లభించుచుండును. కొందరికి వాని తీర్పునుబట్టి సుఖమైన ఆహారములు, రుచికరమైన ఆహారములు లభించుచుండును. కొందరికి కష్టముతో కూడుకొన్న ఆహారములు, రుచిలేని ఆహారములు, రోగప్రదమైన ఆహారములు లభించుచుండును. ఇదంతయూ వానివాని కర్మనుబట్టి అనగా కర్మ తీర్పునుబట్టి యుండును. మనిషి అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి దేవుడు తీర్పు తీర్చి యుండును. ఆ తీర్పు ప్రకారమే అతనికి అమలు జరుగుచుండును. కొందరి జీవితములో ఏమాత్రము కష్టము లేకుండా సుఖవంతమైన, రుచికరమైన ఆహారములు దొరుకుచుండును. కొందరికి వారి జీవితములో ఎంత కష్టపడినా మంచి ఆరోగ్యమైన ఆహారము దొరకదు, రుచికరమైన ఆహారము దొరకదు. ఇదంతయూ మనము అనుభవ పూర్వకముగా చూస్తున్న విషయములే. దీనిని ఎవరూ కాదనలేరు. దేవుడు కూడా తన జ్ఞానములో అదే చెప్పాడు. దేవుడు ఎప్పుడూ సత్యబద్దమైన జ్ఞానమునే చెప్పునుగానీ, అసత్యమైన జ్ఞానమును చెప్పడు. ఒకచోట ఒక రకము, మరొక చోట మరొక రకము చెప్పడు.


దేవుని జ్ఞానము ప్రకారము దేవుడు ప్రపంచ విషయములను గురించి చెప్పడు. దేవుడు దేవుని విషయములను గురించి మాత్రమే చెప్పును. దేవుడు దేవుని సంబంధ జ్ఞాన విషయములు తప్ప ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోడు. ఇప్పుడు ముఖ్యముగా చెప్పదలచు కొన్నదేమనగా! కొందరు దేవుడు తిండి విషయము చెప్పాడు, ఫలానా వస్తువులను తినమన్నాడు, ఫలానావి తినవద్దని చెప్పాడు అని అంటున్నారు. వారు చెప్పే దానినిబట్టి దేవుడు తన ధర్మమును వదలి తాను చేయను అన్న పనులు చేసినట్లగును. దేవుడు దేవుని విషయములనే బోధిస్తాడు తప్ప ప్రపంచ విషయములను బోధించడు. ప్రపంచ విషయములను మనిషి యొక్క అంతిమ దినముననే తీర్పు చేసి చెప్పాడు. ఫలానా వయస్సులో, ఫలానా దినము, ఫలానా పూట, ఫలానా ఆహారము తినవలెనని వ్రాసిపెట్టియుండును. అలా తీర్పులో చెప్పినప్పుడు దానిని కాదని చెప్పే దానికి ఎవరికీ వీలులేదు. ఇంకెవరయినా వచ్చి సంజాయిషీ చెప్పి సరి చేయడానికి వీలులేదు. తీర్పులో చెప్పినది చెప్పినట్లు జరిగితీరును. ''దేవుడు కొన్నింటిని తినవద్దు అని చెప్పాడు'' అని కొందరు అంటున్నారు. దేవుడు ప్రపంచ విషయాలలో జోక్యము చేసుకోడు అన్న మాటకు తినవద్దని చెప్పడము వలన భంగము ఏర్పడును. దేవుడు మాట తప్పినవాడగును. అందువలన మనము వాక్యమును అర్థము చేసుకోవడములో ఏమయినా పొరపడినామేమో కొద్దిగా ఆలోచించండి. దేవుని జ్ఞానమును తేలికగా తీసుకోకూడదు.


దేవుడు ఎక్కడయినా ఫలానా వాటిని తిను, ఫలానా వాటిని తినవద్దు అని చెప్పాడా? అను ప్రశ్నను వేసుకొందాము. ఫలానావి తినమని ఎక్కడా ఏ వాక్యములోనూ చెప్పలేదు. పాపము చేసుకొన్నవాడు తినే తిండిని గురించి చెప్పాడు తప్ప నిన్ను తినవద్దని చెప్పలేదు, అట్లే తినమని కూడా చెప్పలేదు. ఫలానా ఆహారము పాప కార్యములు అని అన్నాడు. ఘోరమైన పాపములు అని కూడా చెప్పాడు. దీనిని బాగా అర్థము చేసుకొంటే ఘోరమైన పాపములు చేసినవారు ఈ ఆహారమునే తినెదరు. పాపకార్యములు చేసినవారికి శిక్షగా ఈ ఆహారమునే ఇస్తాను, ఈ ఆహారము దొరుకునట్లు తీర్పులో నిర్ణయించుతాను అని చెప్పాడని ఎందుకు అర్థము కాదు? పాపము చేసినవారికి దొరుకు ఆహారమును చెప్పాడు తప్ప నిన్ను ఇది తిను, ఇది తినవద్దు అని చెప్పలేదు. నీ కర్మ నిర్ణయములో అనగా తీర్పులో పాపకార్య ఆహారము లభించినా దానిని అహము లేకుండా ఉద్దేశ్య పూర్వకముగా కాకుండా తినినా, దానివలన తిరిగి పాపము రాదు. పాపము చేత నిర్ణయమైన ఆహారమును సత్యతిరస్కారులు, దేవుని ధర్మమును విశ్వసించని వారు తింటే వానికి తిరిగి ఘోరమైన పాపము వచ్చును. అందువలన పాపము చేత నిర్ణయింపబడిన ఆహారము అంతయూ తిరిగి పాపమునే తెచ్చి పెట్టును. అందువలన ఇవి ధర్మసమ్మతము కానివి అన్నారు. ధర్మ సమ్మతము కానివియైనా ఒకవేళ తినినా అహంభావము లేకుండా తిన్నట్లయితే వానికి పాపము రాదు అని చెప్పబడినది.


ఆహార పదార్థముల విషయమై సూరా ఐదులో ఆయత్ 87, 88లో ఈ విధముగా చెప్పారు.


(5-87) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతము (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయముగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.''


(5-88) ''అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థములను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‍కు భయపడండి.'' ఈ రెండు ఆయత్‍లలో మొదటి 87వ వాక్యము ఆహార సంబంధమైనది కాదు. తర్వాత 88వ వాక్యము ఆహార సంబంధమైనది. దేవుడు ప్రపంచములో ఏ వస్తువునయినా నీకు దేవుని ధర్మము ప్రకారము తీర్పు తీర్చబడియుంటే అదే నీకు లభ్యమవుతుంది. ధర్మసమ్మతము చేయబడినది అనగా! దేవుడు నీకు కేటాయించబడినది ఏదయితే వుందో దానిని నీవు నిషేధించుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ భాషను కొంత అర్థము చేసుకోవలసియున్నది. దీనిని నేనే సంపాదించుకొన్నాను అని ఏ వస్తువును అనుకొన్నా ఆ వస్తువును నీవు నిషేధించుకొన్నట్లే అనగా దేవుని ధర్మమును (తీర్పును) నిషేధించుకొన్నట్లగును. దేవుడు ఇచ్చినదే నాకు దొరికింది అని ఇల్లు, భూమి, ధనము, బంగారు విషయములలో అనుకొంటే అది ధర్మమును సమ్మతించినట్లేయగును. అట్లుకాకుండా నేనే సంపాదించుకొన్నాను అనుకొంటే దానిని ధర్మము నుండి నిషేధించి నట్లగును, అప్పుడు అది ధర్మసమ్మతము కాదు, కనుక ఆ వస్తువు విషయములో క్రొత్తగా పాపము వచ్చును. దేవుని ధర్మమును అతిక్రమించు వానిని, అనగా తీర్పు విషయము తెలియని వానిని దేవుడు ఇష్టపడడు అని చెప్పాడు.


ఇకపోతే 88వ వాక్యములో పూర్తి ఆహారమును గురించి చెప్పాడు. దేవుడు తన ధర్మము ప్రకారము తీర్పు తీర్చిన (నిర్ణయించిన) ఆహారమును భుజించమని చెప్పాడు. దానినే మీకు ధర్మసమ్మతము చేయబడి ప్రసాదించిన పరిశుద్ధమైన పాపము రాని వాటినే తినండియని చెప్పాడు. ఇక్కడ 87వ వాక్యములో చెప్పినట్లు ఆహారమును నేనే సంపాదించుకొన్నాను అని అనుకొంటే ధర్మమును మీరిపోయినట్లేయగును. అప్పుడు దానిలోని పాప రహితమును లేకుండా చేసుకొన్నట్లగును. దానినే నిషేధించుకొన్నట్లగును. ఈ రెండు వాక్యములు దైవజ్ఞానము తెలిసిన వారికి, దేవుని చట్టము తెలిసిన వారికి సులభముగా అర్థము కాగలవు. దేవుని ధర్మములు తెలియని వారికి ఈ వాక్యములు అర్థము కావనియే చెప్పవచ్చును. దేవుని చట్టము (ధర్మము) తెలిసినవాడు చెప్పిన జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోగలడు. ధర్మములు తెలియనివానికి అర్థమగుట దుర్లభము అని చెప్పవచ్చును. ఆహార విషయము చెప్పుటకు ముందు దేవుడు ఇచ్చిన వస్తువులను నిషేధించు కోకండియని ముందే హెచ్చరించి చెప్పాడు. ఏ వస్తువయినా దేవుడిచ్చినదే యనుకోవడము ధర్మసమ్మతము. అట్లు అనుకోకపోతే ధర్మమును నిషేధించుకొన్నట్లేయగును. దానివలన లేని పాపము వచ్చి అంటుకొనును. ఆహార సంబంధ విషయము ఐదవ సూరాలో మూడవ ఆయత్‍లో కూడా చెప్పాడు.


దానియందు పాపమును తెచ్చిపెట్టు ఆహారములను గురించి చెప్పాడు. ఈ ఆహారము వలన పాపము వస్తుంది కావున వాటిని నిషేధ పదార్థములుగా అనగా పాపసంబంధ పదార్థములుగా చెప్పబడినవి. ధర్మముల మీద విశ్వాసము లేనివారికి పాపభీతియే ఉండదు. అందువలన వారు పాపము వచ్చు వాటినయినా వదలక తినుచుందురు. ఇది దేవుడిచ్చినది యని అనుకోకుండా ధర్మములకు నీళ్లు వదలి, అధర్మము ప్రకారము ఆహారమును తీసుకొనుచుందురు. ధర్మము తెలిసినవాడు తనలో అహమును లేకుండా ఉండి ఏదయినా దేవుని నిర్ణయము వలన లభించినదని అనుకొంటే దేవుడు చెప్పిన పాపపు ఆహారమును తినినప్పటికీ వానికి పాపము రాదుయని చెప్పాడు. దీనినే కర్మ కాలిపోవడము అని తౌరాతు గ్రంథములో చెప్పియున్నారు. దానిప్రకారమే వాని పాపమును దేవుడు క్షమించును అని చెప్పారు. ఈ విషయము ఐదవ సూరా మూడవ ఆయత్‍లో చెప్పియున్నారు. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము లేని వారికి ఈ వాక్యము కూడా అర్థము కాదు. స్థూలముగా కనిపించునదే తెలియును. దానిప్రకారము ఇవి తినకూడదు, మిగతావి అన్నీ తినవచ్చునని అనుకుంటారుగానీ, అందులోని దేవుని ధర్మము ఏమాత్రము తెలియరు. 'ధర్మసమ్మతము' అనుదానికి అర్థము తెలియని వారికి ఇవి తినకూడదని మాత్రము తెలుసు. ఇప్పుడు వాక్యమును చూస్తాము.


(5-3) ''మీ కొరకు నిషేధింపబడిన వస్తువులు ఇవి, మృత పశువు రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుగాక వేరు ఇతరుల పేరు ఉచ్ఛరింపబడునది. గొంతు పిసకబడటం వలన చనిపోయిన పశువు. దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన ప్రదేశము నుండి క్రిందపడి చనిపోయినది, కొమ్ములు తగిలి చనిపోయినది, కౄర మృగాలు చంపి చీల్చి తినటము వలన చనిపోయిన పశువు. కానీ మీరు ఒకవేళ జిబహ్ చేస్తే అది మీకొరకు నిషిద్ధము కాదు. ఇలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధముగా బాణాల ప్రయోగము ద్వారా అదృష్టాన్ని పరీక్షించు కోవడము కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యములు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మము గురించి ఇక ఆశను వదలుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణము గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లామ్‍ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవరయినా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడి పోతూ, గత్యంతరము లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశ్యము లేకుండా వుండి పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే నిస్సందేహముగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.''


ఈ విధముగా 5-3 వాక్యము చెప్పబడినది. ఈ వాక్యము ఎవరికి ఎట్లు అర్థమయినా 'అల్లాహ్ అంతిమ దినమున నిర్ధారించిన ఆహారమే మనిషికి లభించును.' చివరిమాటలో పాపము అని చెప్పినవే తినవలసి వస్తే అన్నప్పుడు 'నీ ప్రయత్నములు ఏమీ పనికి రావు. నేను నిర్ధారించినట్లే జరుగును' అని అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవుని ధర్మమును గురించి తెలియకపోతే అది పాప కార్యమేయగును. ఎప్పుడయితే ధర్మము తెలియునో అప్పుడు వానికి ఏ కార్యములో కూడా స్వంత భావము, స్వంత ఉద్దేశ్యము ఉండదు. స్వంత భావము లేకుండా తిన్నవానికి పాపము క్షమించబడును అని చెప్పాడు. ఈ వాక్యము మేము సహితము ధర్మములను గుర్తు పెట్టుకొని చదవడము వలన అర్థమవుచున్నది గానీ ధర్మములు తెలియకపోతే ఈ వాక్యము ఉల్టాగా అర్థమగును.


అంతిమ దినమున తీర్పు చేసిన దేవుడే తన తీర్పును తప్పక అమలు చేయును. తప్పు చేసిన వారికి తీర్పునివ్వడమే కాకుండా అల్లాహ్ కఠినముగా శిక్షించేవాడు. అల్లాహ్ తన ధర్మము ప్రకారము మనుషుల అంతిమ దినమున వారు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు అనుగుణముగా న్యాయబద్దముగా తీర్పును ఇచ్చి తర్వాత మొదటి దినము నుండి చివరి దినము వరకు తన తీర్పును అమలు చేయును. తీర్పును అమలు చేయడములో ఎక్కడగానీ రాజీపడడముగానీ, సర్దుకపోవడము గానీ ఉండదు. ఎంత శిక్షవుంటే అంత అమలు ఉండును. ఈ విషయము అంతా తెలియడమే దేవుని ధర్మములు, దేవుని జ్ఞానము తెలియడము. దేవుని జ్ఞానము తెలిసినప్పుడు పాప క్షమాపణ కూడా ఉండును. పాప క్షమాపణ తీర్పు తీర్చిన అల్లాహ్ చేయునా అంటే అటువంటి పని ఆయన పరిధిలో లేదు. ఆయన తీర్పు తీర్చడము, అమలు చేయడము తప్ప క్షమాపణలు ఆయన చేయువాడు కాదు. అయితే పాపముతో కూడిన ఆహారమును 'నేను' అను భావము లేకుండా దేవుడు ఇచ్చినది అని తినునో అటువంటి వాని పాపమును క్షమించువాడు అల్లాహ్‍యే. అయితే తీర్పు తీర్చిన అల్లాహ్ క్షమించడు. తీర్పు తీర్చని అల్లాహ్ క్షమించగలడు. ఈ రహస్యము దేవుడు తన గ్రంథములలో అనేకమార్లు సూచించినా ఎవరూ తెలియలేదు. ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని మొత్తము మానవాళికి తెలియదు. ఒకరు సృష్ఠికర్తయైన అల్లాహ్, ఆయన పని చేయడు. మరొకరు సృష్ఠింపబడిన అల్లాహ్, ఆయన అన్ని పనులు చేయును.

1 సృష్ఠికర్తయైన అల్లాహ్ ఎవరు? సృష్ఠించబడిన అల్లాహ్ ఎవరు?


2 మనుషులు ఆరాధించని అల్లాహ్ ఎవరు? మనుషులు ఆరాధించే అల్లాహ్ ఎవరు?


3 మనుషుల ఆరాధనలకు దూరముగాయున్న అల్లాహ్ ఎవరు? మనుషుల చేత ఆరాధింప తగిన అల్లాహ్ ఎవరు?


4 పనిని చేయని అల్లాహ్ ఎవరు? పనిని చేసే అల్లాహ్ ఎవరు?


5 అంతిమ దినమునకు సంబంధము లేని దేవుడు ఎవరు? అంతిమ దినమున తీర్పును తీర్చు దేవుడు ఎవరు?


6 ధర్మములు లేని అల్లాహ్ ఎవరు? ధర్మములు గల అల్లాహ్ ఎవరు?


ఈ విధముగా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలిసి, మనిషి ఆరాధించవలసినది ఒక్కనినేనని తెలిసి, ఒక్క అల్లాహ్‍నే ఎవరు ఆరాధించునో వాడు దైవమార్గములో ఉన్నట్లేయగును. ఇదే విషయమునే అనగా ఇద్దరు అల్లాహ్‍ల విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇంకా విపులముగా ఇచ్చారు. ప్రథమ దైవ గ్రంథములో కూడా ఇదే విషయమును చెప్పారు. అయితే మూడు మతముల వారు ఇద్దరిని గుర్తించలేకపోయారు. ఇద్దరినీ ఎన్నో తేడాలతో గ్రంథములో చెప్పియున్నా, తెలియని గ్రుడ్డివారుగా మనుషులున్నారు. ద్వితీయ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చాలా దగ్గరగా చెప్పారు. అయితే ప్రపంచములో ఎన్నో తెలివిలుగల మనుషులు, ఎంతో చదువు చదివిన వారు, మేథావులు అని పేరుపొందిన వారు సహితము ఇద్దరు దేవుళ్లను గుర్తించక ఇద్దరినీ కలిపి ఒకే దేవుడు అని అంటున్నారు.


'ఇద్దరు దేవుళ్లు' అను విషయము మూడు గ్రంథములు చదివిన వారికే తెలియుటకు అవకాశము గలదు. ఒక గ్రంథమును చదివిన వారికి రెండవ దేవున్ని గురించి తెలియు అవకాశమే లేదు. అందువలన చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్యందు ఐదవ సూరాలో నాలుగైదు చోట్ల 'మూడు గ్రంథములను చదవమని' అల్లాయే చెప్పినట్లు కలదు. ఒక ఆయత్‍లో 'మూడు దైవ గ్రంథములను చదువకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే'యని కూడా చెప్పడమైనది. ఒకమారు ఖుర్ఆన్ గ్రంథములో సూరా ఐదు, ఆయత్ (68) లో ఏమి చెప్పారో చూడండి.


(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతు, ఇంజీలు మరియు మీ ప్రభువు తరపునుండి మీ వద్దకు పంపబడిన ఖుర్ఆన్‍ను మీ జీవితములలో నెలకొల్పువరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''


ఈ వాక్యములో స్పష్టముగా 'మూడు గ్రంథములను మీ జీవితములలో నెలకొల్పుకోమని' చెప్పాడు. అలా కాకుండా నాది ఒక గ్రంథమేయని, ఒక మతమువారు ఒక గ్రంథమును మాత్రమే ఆశ్రయించి దానిని మాత్రమే తెలిసి, దానిప్రకారమే మేమున్నాము అనినా, మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము తెలియనిదే వాడు జ్ఞానములో పరిపూర్ణుడు కాలేడు. ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. ఇద్దరు దేవుళ్ల విషయము నీ గ్రంథములోయున్నా, మిగతా రెండు గ్రంథములు చదవనిదే అది నీకు తెలియబడదు. అంతేకాక నీ గ్రంథములోని జ్ఞానము కూడా నీకు సరిగా అర్థము కాదు. అందువలననే ఆహార విషయములోని విధానము తెలియకుండా పోయినది. ఇది తినకూడదు అని మనిషి అనుకోవడము జరుగుచున్నది. ముందే దేవుడు నిర్ణయించియుండును, మనిషి నిర్ణయము పనికిరాదు అని తెలియలేకపోయారు. అంతేకాక 'ప్రపంచ విషయములను గురించి దేవుడు (అల్లాహ్) తన బోధలో చెప్పడు' అను మాట కూడా మరచిపోయారు. ఆహార విషయము మూడు దైవ గ్రంథములలో ప్రస్తావించ బడినది. మూడుచోట్ల చెప్పిన విషయమును గ్రహించినప్పుడే ఆహారము యొక్క అసలు విషయము తెలియును. అంతవరకు ఒక గ్రంథమును చదివిన వారికి అర్థము కాదు. తౌరాతు గ్రంథములో సాత్త్విక, రాజస, తామస ఆహారములని చెప్పారు. ఇంజీలు గ్రంథములో అక్షయ, క్షయ ఆహారము అని చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో పాపముతో కూడుకొన్న ఆహారము అని చెప్పారు. మూడు గ్రంథముల విశ్లేషణ వలననే ఆహార విషయము సంపూర్ణముగా అర్థము కాగలదు. అప్పుడు ఆహారమునకు సంబంధించిన ధర్మములు తెలియును. అప్పుడు మనిషి ఒక తోలుబొమ్మ మాత్రమేయనీ, స్వయం నిర్ణయము ఈ బొమ్మకు లేదనీ, అన్నీ నిర్ణయించు వాడు, నిర్ణయించినవాడు, సృష్ఠించబడిన, అందరూ ఆరాధించదగిన అల్లాహ్ యని తెలియును.


నేడు ప్రతి మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన నియమాలనే ఎక్కువగా ఆచరించుచున్నాడు. అలా మనుషులు చెప్పిన నియమాలల


అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

37. ఆహార విషయము. (5-87, 88), (5-3)

విశ్వములో ఒకటి కనిపించే ప్రపంచము, రెండు కనిపించని దేవుడు తప్ప మూడవది ఏదీ లేదు. ఒకటి ఉంది అంటే అది ప్రపంచమునకు సంబంధించినదియైనా ఉంటుంది లేక దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి నదియైనా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినది కాకుండా ఏదీ లేదు. ఒక మనిషి పుట్టాడు అంటే అతను కొంత ప్రపంచమునకు సంబంధించి, కొంత దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి పుట్టియున్నాడు. ప్రపంచములో ఒక మనిషే కాకుండా ఏ జీవరాసి పుట్టినా రెండింటికీ సంబంధించి పుట్టును. బాగా గమనించితే జీవముగలదేది అయినా ప్రపంచమునకు, దేవునికి సంబంధించి యుండును. జీవము లేనిది ఏది అయినా కేవలము ఒక్క ప్రపంచమునకు మాత్రము సంబంధించినదై యుండును. ఇదే విధముగా స్థూల వస్తువులే కాకుండా సూక్ష్మ విషయములు కూడా ఏ దానికో ఒక దానికి సంబంధించి యుండును. విషయములు కూడా రెండే గలవు. ఒకటి ప్రపంచ విషయము, రెండు దేవుని విషయము. ఇంకొక విధముగా చెప్పితే ప్రపంచ వస్తువుకు సంబంధించిన విషయము ప్రపంచమునకు సంబంధించిన విషయముగానే ఉండును. అట్లే దేవుని విషయములు ఉండును. ఒక మాటను చెప్పితే అది దేవుని విషయమా, లేక ప్రపంచ విషయమా తేల్చి చెప్పవచ్చును.


ఇప్పుడు ఆహార విషయమును గురించి అడిగితే అది ప్రపంచ సంబంధ విషయము తప్ప దేవుని విషయము ఏమాత్రము కాదుయని ఎవరయినా చెప్పగలరు. కనిపించే పదార్థముగానీ, వస్తువుగానీ ప్రపంచ సంబంధమైనదే అయి ఉంటుంది. ఆ లెక్క ప్రకారము భార్య విషయమును దైవికము కాదు ప్రపంచ విషయమని చెప్పవచ్చును. భార్య, పుత్రులు మొత్తము శరీర సంబంధమైన వారు ఎవరైనా ప్రపంచ సంబంధమైన వారు గానే చెప్పాలి. శరీర సంబంధ ప్రత్యక్ష పరోక్ష విషయములేవి యున్నా అవి ప్రపంచ విషయములేయని చెప్పవచ్చును. ఆహారము శరీర సంబంధమైనది యగుట వలన దానిని ప్రపంచ సంబంధ విషయముగా చెప్పవచ్చును. ఈ విధముగా సృష్ఠిలోయున్న వాటినన్నిటినీ రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. ప్రపంచములోయున్న కనిపించేవి, కనిపించనివి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయములుగానే యున్నవి. ఈ రెండు విషయములలో ప్రపంచ విషయమును దేవుడు ముందే నిర్ణయించి యుండును. దానిలో ఎవరూ జోక్యము చేసుకోలేరు. ఎవరి జోక్యము వలన అవి మారునవి కావు. దేవుని మొదటి నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచుండును. ఇప్పుడు నేనున్నాను అయితే నా ఆహార విషయమును నేను మార్చుకొనుటకు వీలుపడదు. ముందే దేవుడు నిర్ణయించినట్లు జరుగుచుండును. దేవుడు ముందే నిర్ణయించిన నిర్ణయము ప్రకారమే ప్రతీదీ జరుగును. నా మరణము కూడా నిర్ణయము మీద ఆధారపడి యుండును. అందులో దేవుని నిర్ణయము తప్ప మన నిర్ణయము ఏమాత్రము పని చేయదు.


ప్రపంచము, దేవుడు అను రెండు విషయములలో ప్రపంచ విషయములన్నియూ ముందే నిర్ణయించబడి యుండును. దేవుడు వాటిలో జోక్యము చేసుకోడు. వాటిని గురించి రెండవమారు చెప్పడు. ఒకమారు నిర్ణయము తర్వాత రెండవమారు దేవుడు చేయునది ఏమీ లేదు. దేవుని నిర్ణయము మనిషి పుట్టినప్పుడే మనిషి చావులోనే జరిగియుండును. అదే అంతిమ దిన తీర్పు. ఆ తీర్పును దేవదూతలు అమలు చేయుచుందురు. ఆ తీర్పు మనిషి పుట్టినప్పటినుండి తిరిగి చనిపోవు వరకు అనుభవించవలసి యుండును. ఇది దేవుడు భూమిమీద మనుషుల జీవితములో పెట్టిన విధానము. దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. తీర్పు విధానము అంతయూ ఇటు దేవదూతలు, అటు మనుషుల మీదనే యుండును. దేవుడు ఆ విషయములలో జోక్యము చేసుకోడు. కోర్టులో న్యాయమూర్తి (జడ్జి) తీర్పు చేసిన తర్వాత దానిని అమలు చేయడము పోలీసుల చేతిలో ఉన్నట్లు, మనిషికి దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. మనిషికి వేయబడిన శిక్ష చట్టము ప్రకారము మనిషి అనుభవించి తీరవలసిందే. ఒకవేళ సత్ప్రవర్తన వలన అతని శిక్ష తగ్గే అవకాశమున్నట్లు, మనిషి జీవితములో మనిషి దైవమార్గమును అవలంభించితే దేవుడు వేసిన శిక్ష కొంత తగ్గే అవకాశము ఉండును. ఖైదీ మంచి ప్రవర్తన ఖైదీ చేతిలో యున్నట్లు, మనిషి దైవిక ప్రవర్తన మనిషి చేతిలో యుండును. అందువలన వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే శిక్షమారే అవకాశమున్నట్లు, మనిషి దైవిక మార్గమును అనుసరించు పద్ధతినిబట్టి వానికి నిర్ణయించబడిన శిక్షలో కొంతవరకు మార్పు జరుగవచ్చును.


దైవికమైన ప్రవర్తనను గురించి ఏది సరియైన విధానమో, ఏది నిజమైన దైవమార్గమో దేవుడు తెలియజేయును తప్ప మనిషికిచ్చిన తీర్పులో ఆయన స్వయముగా మార్పుచేయడు. అలా మనిషి దైవికమైన విధానమును తెలియజేయు బాధ్యత దేవునిదే అయివుండుట వలన ఆయన తన బోధల వలన తన జ్ఞాన విధానమంతయూ తెలియజేశాడు. మనిషి అంతిమ దినమున దేవుని తీర్పును పొందిన తర్వాత దైవజ్ఞానమును ఏమాత్రము తెలియకుండా బ్రతికితే వానికి నిర్ణయించబడినవి జరిగితీరును. వాడు దైవ జ్ఞానమార్గములోనికి పోయి దైవజ్ఞానము ప్రకారము నడుచుకోగలిగితే అప్పుడు వానికి నిర్ణయించబడిన విధానము కొంతవరకు మారు అవకాశము గలదు. అందువలన వాని ప్రవర్తన వాని చేతిలోనే యున్నదని దానిని ఎవరూ మార్చలేరని చెప్పవచ్చును. ఇప్పుడు మనిషి జీవితములో ఆహార విషయమును గమనించితే, వాడు ఎప్పుడు ఏమి తినాలని ముందే నిర్ణయించ బడియుండును. మనిషి అంతిమ దినమును పొందినప్పుడే ఆ నిర్ణయము జరిగిపోయి ఉండును. దానిప్రకారము మనిషి తొలి రోజునుండి అనగా శిశు దశ నుండి ఆ నిర్ణయము అమలు జరుగును.


ఒక మనిషికి అంతిమ దిన తీర్పునుబట్టి తన జీవితములో ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనునది వ్రాసిపెట్టబడి యుండును. దాని ప్రకారమే వానికి ఆహారములు లభించుచుండును. కొందరికి వాని తీర్పునుబట్టి సుఖమైన ఆహారములు, రుచికరమైన ఆహారములు లభించుచుండును. కొందరికి కష్టముతో కూడుకొన్న ఆహారములు, రుచిలేని ఆహారములు, రోగప్రదమైన ఆహారములు లభించుచుండును. ఇదంతయూ వానివాని కర్మనుబట్టి అనగా కర్మ తీర్పునుబట్టి యుండును. మనిషి అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి దేవుడు తీర్పు తీర్చి యుండును. ఆ తీర్పు ప్రకారమే అతనికి అమలు జరుగుచుండును. కొందరి జీవితములో ఏమాత్రము కష్టము లేకుండా సుఖవంతమైన, రుచికరమైన ఆహారములు దొరుకుచుండును. కొందరికి వారి జీవితములో ఎంత కష్టపడినా మంచి ఆరోగ్యమైన ఆహారము దొరకదు, రుచికరమైన ఆహారము దొరకదు. ఇదంతయూ మనము అనుభవ పూర్వకముగా చూస్తున్న విషయములే. దీనిని ఎవరూ కాదనలేరు. దేవుడు కూడా తన జ్ఞానములో అదే చెప్పాడు. దేవుడు ఎప్పుడూ సత్యబద్దమైన జ్ఞానమునే చెప్పునుగానీ, అసత్యమైన జ్ఞానమును చెప్పడు. ఒకచోట ఒక రకము, మరొక చోట మరొక రకము చెప్పడు.


దేవుని జ్ఞానము ప్రకారము దేవుడు ప్రపంచ విషయములను గురించి చెప్పడు. దేవుడు దేవుని విషయములను గురించి మాత్రమే చెప్పును. దేవుడు దేవుని సంబంధ జ్ఞాన విషయములు తప్ప ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోడు. ఇప్పుడు ముఖ్యముగా చెప్పదలచు కొన్నదేమనగా! కొందరు దేవుడు తిండి విషయము చెప్పాడు, ఫలానా వస్తువులను తినమన్నాడు, ఫలానావి తినవద్దని చెప్పాడు అని అంటున్నారు. వారు చెప్పే దానినిబట్టి దేవుడు తన ధర్మమును వదలి తాను చేయను అన్న పనులు చేసినట్లగును. దేవుడు దేవుని విషయములనే బోధిస్తాడు తప్ప ప్రపంచ విషయములను బోధించడు. ప్రపంచ విషయములను మనిషి యొక్క అంతిమ దినముననే తీర్పు చేసి చెప్పాడు. ఫలానా వయస్సులో, ఫలానా దినము, ఫలానా పూట, ఫలానా ఆహారము తినవలెనని వ్రాసిపెట్టియుండును. అలా తీర్పులో చెప్పినప్పుడు దానిని కాదని చెప్పే దానికి ఎవరికీ వీలులేదు. ఇంకెవరయినా వచ్చి సంజాయిషీ చెప్పి సరి చేయడానికి వీలులేదు. తీర్పులో చెప్పినది చెప్పినట్లు జరిగితీరును. ''దేవుడు కొన్నింటిని తినవద్దు అని చెప్పాడు'' అని కొందరు అంటున్నారు. దేవుడు ప్రపంచ విషయాలలో జోక్యము చేసుకోడు అన్న మాటకు తినవద్దని చెప్పడము వలన భంగము ఏర్పడును. దేవుడు మాట తప్పినవాడగును. అందువలన మనము వాక్యమును అర్థము చేసుకోవడములో ఏమయినా పొరపడినామేమో కొద్దిగా ఆలోచించండి. దేవుని జ్ఞానమును తేలికగా తీసుకోకూడదు.


దేవుడు ఎక్కడయినా ఫలానా వాటిని తిను, ఫలానా వాటిని తినవద్దు అని చెప్పాడా? అను ప్రశ్నను వేసుకొందాము. ఫలానావి తినమని ఎక్కడా ఏ వాక్యములోనూ చెప్పలేదు. పాపము చేసుకొన్నవాడు తినే తిండిని గురించి చెప్పాడు తప్ప నిన్ను తినవద్దని చెప్పలేదు, అట్లే తినమని కూడా చెప్పలేదు. ఫలానా ఆహారము పాప కార్యములు అని అన్నాడు. ఘోరమైన పాపములు అని కూడా చెప్పాడు. దీనిని బాగా అర్థము చేసుకొంటే ఘోరమైన పాపములు చేసినవారు ఈ ఆహారమునే తినెదరు. పాపకార్యములు చేసినవారికి శిక్షగా ఈ ఆహారమునే ఇస్తాను, ఈ ఆహారము దొరుకునట్లు తీర్పులో నిర్ణయించుతాను అని చెప్పాడని ఎందుకు అర్థము కాదు? పాపము చేసినవారికి దొరుకు ఆహారమును చెప్పాడు తప్ప నిన్ను ఇది తిను, ఇది తినవద్దు అని చెప్పలేదు. నీ కర్మ నిర్ణయములో అనగా తీర్పులో పాపకార్య ఆహారము లభించినా దానిని అహము లేకుండా ఉద్దేశ్య పూర్వకముగా కాకుండా తినినా, దానివలన తిరిగి పాపము రాదు. పాపము చేత నిర్ణయమైన ఆహారమును సత్యతిరస్కారులు, దేవుని ధర్మమును విశ్వసించని వారు తింటే వానికి తిరిగి ఘోరమైన పాపము వచ్చును. అందువలన పాపము చేత నిర్ణయింపబడిన ఆహారము అంతయూ తిరిగి పాపమునే తెచ్చి పెట్టును. అందువలన ఇవి ధర్మసమ్మతము కానివి అన్నారు. ధర్మ సమ్మతము కానివియైనా ఒకవేళ తినినా అహంభావము లేకుండా తిన్నట్లయితే వానికి పాపము రాదు అని చెప్పబడినది.


ఆహార పదార్థముల విషయమై సూరా ఐదులో ఆయత్ 87, 88లో ఈ విధముగా చెప్పారు.


(5-87) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతము (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయముగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.''


(5-88) ''అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థములను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‍కు భయపడండి.'' ఈ రెండు ఆయత్‍లలో మొదటి 87వ వాక్యము ఆహార సంబంధమైనది కాదు. తర్వాత 88వ వాక్యము ఆహార సంబంధమైనది. దేవుడు ప్రపంచములో ఏ వస్తువునయినా నీకు దేవుని ధర్మము ప్రకారము తీర్పు తీర్చబడియుంటే అదే నీకు లభ్యమవుతుంది. ధర్మసమ్మతము చేయబడినది అనగా! దేవుడు నీకు కేటాయించబడినది ఏదయితే వుందో దానిని నీవు నిషేధించుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ భాషను కొంత అర్థము చేసుకోవలసియున్నది. దీనిని నేనే సంపాదించుకొన్నాను అని ఏ వస్తువును అనుకొన్నా ఆ వస్తువును నీవు నిషేధించుకొన్నట్లే అనగా దేవుని ధర్మమును (తీర్పును) నిషేధించుకొన్నట్లగును. దేవుడు ఇచ్చినదే నాకు దొరికింది అని ఇల్లు, భూమి, ధనము, బంగారు విషయములలో అనుకొంటే అది ధర్మమును సమ్మతించినట్లేయగును. అట్లుకాకుండా నేనే సంపాదించుకొన్నాను అనుకొంటే దానిని ధర్మము నుండి నిషేధించి నట్లగును, అప్పుడు అది ధర్మసమ్మతము కాదు, కనుక ఆ వస్తువు విషయములో క్రొత్తగా పాపము వచ్చును. దేవుని ధర్మమును అతిక్రమించు వానిని, అనగా తీర్పు విషయము తెలియని వానిని దేవుడు ఇష్టపడడు అని చెప్పాడు.


ఇకపోతే 88వ వాక్యములో పూర్తి ఆహారమును గురించి చెప్పాడు. దేవుడు తన ధర్మము ప్రకారము తీర్పు తీర్చిన (నిర్ణయించిన) ఆహారమును భుజించమని చెప్పాడు. దానినే మీకు ధర్మసమ్మతము చేయబడి ప్రసాదించిన పరిశుద్ధమైన పాపము రాని వాటినే తినండియని చెప్పాడు. ఇక్కడ 87వ వాక్యములో చెప్పినట్లు ఆహారమును నేనే సంపాదించుకొన్నాను అని అనుకొంటే ధర్మమును మీరిపోయినట్లేయగును. అప్పుడు దానిలోని పాప రహితమును లేకుండా చేసుకొన్నట్లగును. దానినే నిషేధించుకొన్నట్లగును. ఈ రెండు వాక్యములు దైవజ్ఞానము తెలిసిన వారికి, దేవుని చట్టము తెలిసిన వారికి సులభముగా అర్థము కాగలవు. దేవుని ధర్మములు తెలియని వారికి ఈ వాక్యములు అర్థము కావనియే చెప్పవచ్చును. దేవుని చట్టము (ధర్మము) తెలిసినవాడు చెప్పిన జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోగలడు. ధర్మములు తెలియనివానికి అర్థమగుట దుర్లభము అని చెప్పవచ్చును. ఆహార విషయము చెప్పుటకు ముందు దేవుడు ఇచ్చిన వస్తువులను నిషేధించు కోకండియని ముందే హెచ్చరించి చెప్పాడు. ఏ వస్తువయినా దేవుడిచ్చినదే యనుకోవడము ధర్మసమ్మతము. అట్లు అనుకోకపోతే ధర్మమును నిషేధించుకొన్నట్లేయగును. దానివలన లేని పాపము వచ్చి అంటుకొనును. ఆహార సంబంధ విషయము ఐదవ సూరాలో మూడవ ఆయత్‍లో కూడా చెప్పాడు.


దానియందు పాపమును తెచ్చిపెట్టు ఆహారములను గురించి చెప్పాడు. ఈ ఆహారము వలన పాపము వస్తుంది కావున వాటిని నిషేధ పదార్థములుగా అనగా పాపసంబంధ పదార్థములుగా చెప్పబడినవి. ధర్మముల మీద విశ్వాసము లేనివారికి పాపభీతియే ఉండదు. అందువలన వారు పాపము వచ్చు వాటినయినా వదలక తినుచుందురు. ఇది దేవుడిచ్చినది యని అనుకోకుండా ధర్మములకు నీళ్లు వదలి, అధర్మము ప్రకారము ఆహారమును తీసుకొనుచుందురు. ధర్మము తెలిసినవాడు తనలో అహమును లేకుండా ఉండి ఏదయినా దేవుని నిర్ణయము వలన లభించినదని అనుకొంటే దేవుడు చెప్పిన పాపపు ఆహారమును తినినప్పటికీ వానికి పాపము రాదుయని చెప్పాడు. దీనినే కర్మ కాలిపోవడము అని తౌరాతు గ్రంథములో చెప్పియున్నారు. దానిప్రకారమే వాని పాపమును దేవుడు క్షమించును అని చెప్పారు. ఈ విషయము ఐదవ సూరా మూడవ ఆయత్‍లో చెప్పియున్నారు. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము లేని వారికి ఈ వాక్యము కూడా అర్థము కాదు. స్థూలముగా కనిపించునదే తెలియును. దానిప్రకారము ఇవి తినకూడదు, మిగతావి అన్నీ తినవచ్చునని అనుకుంటారుగానీ, అందులోని దేవుని ధర్మము ఏమాత్రము తెలియరు. 'ధర్మసమ్మతము' అనుదానికి అర్థము తెలియని వారికి ఇవి తినకూడదని మాత్రము తెలుసు. ఇప్పుడు వాక్యమును చూస్తాము.


(5-3) ''మీ కొరకు నిషేధింపబడిన వస్తువులు ఇవి, మృత పశువు రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుగాక వేరు ఇతరుల పేరు ఉచ్ఛరింపబడునది. గొంతు పిసకబడటం వలన చనిపోయిన పశువు. దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన ప్రదేశము నుండి క్రిందపడి చనిపోయినది, కొమ్ములు తగిలి చనిపోయినది, కౄర మృగాలు చంపి చీల్చి తినటము వలన చనిపోయిన పశువు. కానీ మీరు ఒకవేళ జిబహ్ చేస్తే అది మీకొరకు నిషిద్ధము కాదు. ఇలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధముగా బాణాల ప్రయోగము ద్వారా అదృష్టాన్ని పరీక్షించు కోవడము కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యములు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మము గురించి ఇక ఆశను వదలుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణము గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లామ్‍ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవరయినా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడి పోతూ, గత్యంతరము లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశ్యము లేకుండా వుండి పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే నిస్సందేహముగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.''


ఈ విధముగా 5-3 వాక్యము చెప్పబడినది. ఈ వాక్యము ఎవరికి ఎట్లు అర్థమయినా 'అల్లాహ్ అంతిమ దినమున నిర్ధారించిన ఆహారమే మనిషికి లభించును.' చివరిమాటలో పాపము అని చెప్పినవే తినవలసి వస్తే అన్నప్పుడు 'నీ ప్రయత్నములు ఏమీ పనికి రావు. నేను నిర్ధారించినట్లే జరుగును' అని అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవుని ధర్మమును గురించి తెలియకపోతే అది పాప కార్యమేయగును. ఎప్పుడయితే ధర్మము తెలియునో అప్పుడు వానికి ఏ కార్యములో కూడా స్వంత భావము, స్వంత ఉద్దేశ్యము ఉండదు. స్వంత భావము లేకుండా తిన్నవానికి పాపము క్షమించబడును అని చెప్పాడు. ఈ వాక్యము మేము సహితము ధర్మములను గుర్తు పెట్టుకొని చదవడము వలన అర్థమవుచున్నది గానీ ధర్మములు తెలియకపోతే ఈ వాక్యము ఉల్టాగా అర్థమగును.


అంతిమ దినమున తీర్పు చేసిన దేవుడే తన తీర్పును తప్పక అమలు చేయును. తప్పు చేసిన వారికి తీర్పునివ్వడమే కాకుండా అల్లాహ్ కఠినముగా శిక్షించేవాడు. అల్లాహ్ తన ధర్మము ప్రకారము మనుషుల అంతిమ దినమున వారు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు అనుగుణముగా న్యాయబద్దముగా తీర్పును ఇచ్చి తర్వాత మొదటి దినము నుండి చివరి దినము వరకు తన తీర్పును అమలు చేయును. తీర్పును అమలు చేయడములో ఎక్కడగానీ రాజీపడడముగానీ, సర్దుకపోవడము గానీ ఉండదు. ఎంత శిక్షవుంటే అంత అమలు ఉండును. ఈ విషయము అంతా తెలియడమే దేవుని ధర్మములు, దేవుని జ్ఞానము తెలియడము. దేవుని జ్ఞానము తెలిసినప్పుడు పాప క్షమాపణ కూడా ఉండును. పాప క్షమాపణ తీర్పు తీర్చిన అల్లాహ్ చేయునా అంటే అటువంటి పని ఆయన పరిధిలో లేదు. ఆయన తీర్పు తీర్చడము, అమలు చేయడము తప్ప క్షమాపణలు ఆయన చేయువాడు కాదు. అయితే పాపముతో కూడిన ఆహారమును 'నేను' అను భావము లేకుండా దేవుడు ఇచ్చినది అని తినునో అటువంటి వాని పాపమును క్షమించువాడు అల్లాహ్‍యే. అయితే తీర్పు తీర్చిన అల్లాహ్ క్షమించడు. తీర్పు తీర్చని అల్లాహ్ క్షమించగలడు. ఈ రహస్యము దేవుడు తన గ్రంథములలో అనేకమార్లు సూచించినా ఎవరూ తెలియలేదు. ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని మొత్తము మానవాళికి తెలియదు. ఒకరు సృష్ఠికర్తయైన అల్లాహ్, ఆయన పని చేయడు. మరొకరు సృష్ఠింపబడిన అల్లాహ్, ఆయన అన్ని పనులు చేయును.

1 సృష్ఠికర్తయైన అల్లాహ్ ఎవరు? సృష్ఠించబడిన అల్లాహ్ ఎవరు?


2 మనుషులు ఆరాధించని అల్లాహ్ ఎవరు? మనుషులు ఆరాధించే అల్లాహ్ ఎవరు?


3 మనుషుల ఆరాధనలకు దూరముగాయున్న అల్లాహ్ ఎవరు? మనుషుల చేత ఆరాధింప తగిన అల్లాహ్ ఎవరు?


4 పనిని చేయని అల్లాహ్ ఎవరు? పనిని చేసే అల్లాహ్ ఎవరు?


5 అంతిమ దినమునకు సంబంధము లేని దేవుడు ఎవరు? అంతిమ దినమున తీర్పును తీర్చు దేవుడు ఎవరు?


6 ధర్మములు లేని అల్లాహ్ ఎవరు? ధర్మములు గల అల్లాహ్ ఎవరు?


ఈ విధముగా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలిసి, మనిషి ఆరాధించవలసినది ఒక్కనినేనని తెలిసి, ఒక్క అల్లాహ్‍నే ఎవరు ఆరాధించునో వాడు దైవమార్గములో ఉన్నట్లేయగును. ఇదే విషయమునే అనగా ఇద్దరు అల్లాహ్‍ల విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇంకా విపులముగా ఇచ్చారు. ప్రథమ దైవ గ్రంథములో కూడా ఇదే విషయమును చెప్పారు. అయితే మూడు మతముల వారు ఇద్దరిని గుర్తించలేకపోయారు. ఇద్దరినీ ఎన్నో తేడాలతో గ్రంథములో చెప్పియున్నా, తెలియని గ్రుడ్డివారుగా మనుషులున్నారు. ద్వితీయ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చాలా దగ్గరగా చెప్పారు. అయితే ప్రపంచములో ఎన్నో తెలివిలుగల మనుషులు, ఎంతో చదువు చదివిన వారు, మేథావులు అని పేరుపొందిన వారు సహితము ఇద్దరు దేవుళ్లను గుర్తించక ఇద్దరినీ కలిపి ఒకే దేవుడు అని అంటున్నారు.


'ఇద్దరు దేవుళ్లు' అను విషయము మూడు గ్రంథములు చదివిన వారికే తెలియుటకు అవకాశము గలదు. ఒక గ్రంథమును చదివిన వారికి రెండవ దేవున్ని గురించి తెలియు అవకాశమే లేదు. అందువలన చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్యందు ఐదవ సూరాలో నాలుగైదు చోట్ల 'మూడు గ్రంథములను చదవమని' అల్లాయే చెప్పినట్లు కలదు. ఒక ఆయత్‍లో 'మూడు దైవ గ్రంథములను చదువకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే'యని కూడా చెప్పడమైనది. ఒకమారు ఖుర్ఆన్ గ్రంథములో సూరా ఐదు, ఆయత్ (68) లో ఏమి చెప్పారో చూడండి.


(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతు, ఇంజీలు మరియు మీ ప్రభువు తరపునుండి మీ వద్దకు పంపబడిన ఖుర్ఆన్‍ను మీ జీవితములలో నెలకొల్పువరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''


ఈ వాక్యములో స్పష్టముగా 'మూడు గ్రంథములను మీ జీవితములలో నెలకొల్పుకోమని' చెప్పాడు. అలా కాకుండా నాది ఒక గ్రంథమేయని, ఒక మతమువారు ఒక గ్రంథమును మాత్రమే ఆశ్రయించి దానిని మాత్రమే తెలిసి, దానిప్రకారమే మేమున్నాము అనినా, మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము తెలియనిదే వాడు జ్ఞానములో పరిపూర్ణుడు కాలేడు. ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. ఇద్దరు దేవుళ్ల విషయము నీ గ్రంథములోయున్నా, మిగతా రెండు గ్రంథములు చదవనిదే అది నీకు తెలియబడదు. అంతేకాక నీ గ్రంథములోని జ్ఞానము కూడా నీకు సరిగా అర్థము కాదు. అందువలననే ఆహార విషయములోని విధానము తెలియకుండా పోయినది. ఇది తినకూడదు అని మనిషి అనుకోవడము జరుగుచున్నది. ముందే దేవుడు నిర్ణయించియుండును, మనిషి నిర్ణయము పనికిరాదు అని తెలియలేకపోయారు. అంతేకాక 'ప్రపంచ విషయములను గురించి దేవుడు (అల్లాహ్) తన బోధలో చెప్పడు' అను మాట కూడా మరచిపోయారు. ఆహార విషయము మూడు దైవ గ్రంథములలో ప్రస్తావించ బడినది. మూడుచోట్ల చెప్పిన విషయమును గ్రహించినప్పుడే ఆహారము యొక్క అసలు విషయము తెలియును. అంతవరకు ఒక గ్రంథమును చదివిన వారికి అర్థము కాదు. తౌరాతు గ్రంథములో సాత్త్విక, రాజస, తామస ఆహారములని చెప్పారు. ఇంజీలు గ్రంథములో అక్షయ, క్షయ ఆహారము అని చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో పాపముతో కూడుకొన్న ఆహారము అని చెప్పారు. మూడు గ్రంథముల విశ్లేషణ వలననే ఆహార విషయము సంపూర్ణముగా అర్థము కాగలదు. అప్పుడు ఆహారమునకు సంబంధించిన ధర్మములు తెలియును. అప్పుడు మనిషి ఒక తోలుబొమ్మ మాత్రమేయనీ, స్వయం నిర్ణయము ఈ బొమ్మకు లేదనీ, అన్నీ నిర్ణయించు వాడు, నిర్ణయించినవాడు, సృష్ఠించబడిన, అందరూ ఆరాధించదగిన అల్లాహ్ యని తెలియును.


నేడు ప్రతి మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన నియమాలనే ఎక్కువగా ఆచరించుచున్నాడు. అలా మనుషులు చెప్పిన నియమాలలో దేవునివైపు కాకుండా మాయ (ఇబ్లీస్) వైపు పోయి నట్లగుచున్నది. మనుషులు బోధించిన నియమములను అనుసరించడము వలన తమ గ్రంథము ఒక్క దానిపైన తప్ప, ఇతర రెండు దైవ గ్రంథముల మీద అసూయ ఏర్పడుచున్నది. అలా ఏర్పడడమేకాక తమ గ్రంథమే మిగతా గ్రంథములకంటే గొప్పదని చెప్పుచుందురు. అలా అయినా తమ గ్రంథమునయినా చదివి, అందులోని జ్ఞానమును తెలియగలిగారా అంటే అదీ లేదు. ప్రతి మతములోనూ దైవ గ్రంథమునకు ప్రక్కలో మనుషులు చెప్పిన మరొక గ్రంథముండును. ప్రజలు అలా ప్రక్క గ్రంథమునకే ఎక్కువ విలువనిచ్చుచున్నారు. దైవ గ్రంథములోని జ్ఞానముకంటే ప్రక్క గ్రంథములోని వాక్యములే గొప్పగా కనిపించుచుండును. హిందువుల భగవద్గీత ప్రక్కన వేదములు, క్రైస్థవుల ఏసు బోధనలు గల క్రొత్త నిబంధన ప్రక్కన పాత నిబంధన, ముస్లీమ్‍ల ఖుర్ఆన్ ప్రక్కన హదీసు గ్రంథములు గలవు. ఈ విధముగా యున్న మూడు దైవ గ్రంథములకు మూడు గ్రంథములుండగా, ప్రజలు వాటి మీదనే ఎక్కువ మక్కువను పెంచుకొన్నారు. అలా వారి మత పెద్దలే చెప్పుట వలన అందరూ ప్రక్క గ్రంథములను గొప్పగా చెప్పుచున్నారు. అవి లేనిది దైవ గ్రంథములను మాత్రమే చదువకూడదని చెప్పుచున్నారు. ఈ విధముగా కలకూర గంపవలె దైవజ్ఞానము మనుషులు చెప్పిన జ్ఞానములో కలిసిపోయినది. దానివలన ఏది నిజమైన జ్ఞానమో ఏ మనిషికీ తెలియకుండా పోయినది. అలా దైవ జ్ఞానము అర్థము కాకుండా పోవడము వలన ముఖ్యమైన విషయములు వేరుగా అర్థము చేసుకోవడ మైనది. ఉదాహరణకు ఆహార విషయములలో ఇవి పాపమునకు సంబంధించినవియనగా ఇంకొక విధముగా అర్థము చేసుకొన్నారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

38. సర్వ లోకవాసులకు హితోపదేశము. (6-90), (81-27)

భూమి మీద పుట్టిన మనుషులందరికీ పాపమునకు శిక్ష వేసేవాడు, శిక్షను అమలు చేయువాడు అల్లాహ్ (దేవుడు) కాగా, శిక్ష నుండి మరియు శిక్షలు పడు జన్మల నుండి బయటపడు మార్గమును ఇంకొక అల్లాహ్ చూపించాడు. ఒకరు 'సృష్ఠికర్తయైన అల్లాహ్', రెండవవాడు 'కార్యకర్తయైన అల్లాహ్' అని తెలియవలెను. ఈ విషయము తెలియకపోతే ఖుర్ఆన్ జ్ఞానము అర్థము కాదు. ఖుర్ఆన్ జ్ఞానమే కాదు, ఖుర్ఆన్కంటే ముందు వచ్చిన భగవద్గీత, బైబిలు అను రెండు దైవ గ్రంథములలోని జ్ఞానము కూడా అర్థము కాదు. మూడు దైవ గ్రంథములలో ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుని ప్రస్తావన గలదు. మూడు దైవ గ్రంథములు 'ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుని ప్రస్తావన' అను విషయమును ఆధారము చేసుకొని తయారయినవే. మూడు గ్రంథములలో ముఖ్య సమాచారము, మూడు గ్రంథములు తయారగుటకు ఇతి వృత్తముగా యున్న సమాచారము, ముగ్గురు పురుషుల విషయమే. అయితే ముఖ్యమైన ఈ విషయము మూడు మతముల వారికీ తెలియకుండా పోయినది. వారికి మూడు గ్రంథములలో వారివారి మతము కనిపించుతూ యున్నది తప్ప 'ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుడు' ఎవరికీ కనిపించలేదు. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని స్వయముగా అల్లాహ్‍యే చెప్పాడు. వివరముగా చెప్పుకొంటే క్షరుడు అనగా జీవుడు అనియూ, అక్షరుడు, పురుషోత్తమ అనగా ఇద్దరు దేవుళ్ళనియూ చెప్పవచ్చును.


ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులో కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మయని చెప్పియున్నారు. కుమారుడు అనగా జీవాత్మ (మనిషి) అనియూ, తండ్రి, పరిశుద్ధాత్మయనగా ఇద్దరు దేవుళ్ళు అనియూ చెప్పవచ్చును. అట్లే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో త్రోలబడేవాడు, త్రోలే వాడు, సాక్షిగా చూచేవాడు అని ముగ్గురిని చెప్పియున్నారు. ఇక్కడ త్రోలబడేవాడు జీవుడుకాగా, త్రోలేవాడు, సాక్షిగా యున్నవాడు ఇద్దరూ దేవుళ్ళుగా యున్నారు. ఈ విధముగా మూడు గ్రంథములలో భాష వేరుగా కనిపించినా, భావములో ముగ్గురు గలరు. దీనినిబట్టి సృష్ఠ్యాదిలో చెప్పిన తౌరాతు (భగవద్గీత), కలియుగములో చెప్పిన ఇంజీలు (బైబిలు), కలియుగములోనే చివరి దైవ గ్రంథముగా చెప్పిన ఖుర్ఆన్ గ్రంథము మూడు గ్రంథములు సమానముగా ఒకే జ్ఞానమునే బోధించాయని చెప్పవచ్చును. ముగ్గురు పురుషతత్త్వముతో కూడుకొన్నవారు మాత్రమే విశ్వములో గలరు. మిగతాది అంతా స్త్రీతత్త్వముగా యున్నది. యావత్ విశ్వమంతా కలిసి పురుషతత్త్వము గలవారు ముగ్గురు, స్త్రీ తత్త్వముగల ప్రకృతి ఒక్కటి మాత్రమే గలవు. ముగ్గురు పురుషులు, ఒక ప్రకృతిని గురించి చెప్పినవే మూడు దైవ గ్రంథములు. మూడు దైవ గ్రంథములు సమస్త మానవాళికి ఒకే జ్ఞానమును బోధించుచున్నవి.


తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రములలో ఒకే తెలుగు భాషయున్నా, రెండు రాష్ట్ర ప్రజలు ఒకే భాషను మాట్లాడుచున్నా, తెలంగాణా ప్రాంత ప్రజలు ఒక రకముగా, ఆంధ్ర ప్రాంత ప్రజలు మరొక రకముగా మాట్లాడుచుందురు. ఆంధ్రాలో 'అట్లనా' అంటే, అదే మాటనే తెలంగాణాలో 'గట్లనా'యని అందురు. అట్ల అనినా, గట్ల అనినా రెండింటిలోని భావము ఒక్కటే యున్నది. భాషా పదములు వేరుగా పలికినా, అందులోని ఉద్దేశ్యము ఒకటే అయివుండుట వలన రెండూ ఒకటేయనీ, రెండూ ఒకే తెలుగు భాషలోనివి యనియు చెప్పవచ్చును. అదే విధముగా మూడు దైవ గ్రంథములలో ముగ్గురు పురుషులను గురించి వేరువేరు పదములుగా చెప్పియున్నా, భావములో మాత్రము ఒక జీవున్ని, ఇద్దరు దేవుళ్ళను గురించి చెప్పినదే గలదు. ఉద్దేశ్యము ఒక్కటే అయివుండి పలికిన పలుకులు వేరయినా అన్ని పలుకులను ఒక్కటిగానే చెప్పవచ్చును. ఉద్దేశ్యము ఒక్కటే అయినప్పుడు దానిని వినే ప్రజలందరికీ ఒకే సందేశముగా చెప్పవచ్చును. దీనిప్రకారము మూడు గ్రంథములలో యున్న ముగ్గురు వేరువేరు మాటలలో చెప్పబడి యున్నా ఆ ముగ్గురూ ఒక్కటే. అందువలన భగవద్గీతలో చెప్పబడిన ముగ్గురు, బైబిలులో చెప్పబడిన ముగ్గురు, ఖుర్ఆన్‍లో చెప్పబడిన ముగ్గురు సమస్త మానవులకు జ్ఞానబోధగా యున్నారు. అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 81, ఆయత్ 27లో 'ఇది అందరికీ సంబంధించిన గ్రంథము' అని చెప్పారు. ఒకమారు దానిని చూడండి.


(81-27) ''ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశము.''


ఖుర్ఆన్ గ్రంథము సర్వలోక ప్రజలకు అని చెప్పియున్నారు గానీ ముస్లీమ్‍లకొక్కరికేనని చెప్పలేదు. నేడు ఖుర్ఆన్ అంటే అది ముస్లీమ్ గ్రంథము అని అంటున్నారు. ముస్లీమ్‍ల గ్రంథమని చెప్పుటకు ఆధారము లేదు. ఎవరు ఏమి చెప్పినా ఖుర్ఆన్ గ్రంథము ప్రజలందరి కొరకు చెప్పినది. మనుషులందరూ ఖుర్ఆన్ గ్రంథమును తప్పక చదవవలసి యుండును. బైబిలులో 'సమస్త మానవులారా నావద్దకు రండి'యని ఏసు అన్నాడు గానీ, క్రైస్థవులారా నా వద్దకు రమ్మని చెప్పలేదు. దీనిప్రకారము మూడు దైవ గ్రంథములు మానవ సమాజమునకు చెప్పినవేగానీ, మత సమాజమునకు చెప్పలేదు. అటువంటప్పుడు ఖుర్ఆన్ ముస్లీమ్‍లదని చెప్పడము పొరపాటు. మిగతా రెండు గ్రంథములను కూడా క్రైస్థవులది బైబిలు అనీ, భగవద్గీత హిందవులదని చెప్పకూడదు. అలా చెప్పితే దేవుని మాటను వ్యతిరేఖించినట్లగును. కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్ మా గ్రంథమని చెప్పడమేగాక, ఖుర్ఆన్‍లోని వాక్యములకు ఇతర మతముల వారు వివరమును చెప్పకూడదు అని అంటున్నారు. కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్‍కు మేమే హక్కుదారులము, దానిని మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా చదవకూడదు, తాకకూడదు అని అంటున్నారు. అలా అనడమును కొందరు జ్ఞానము తెలిసిన ముస్లీమ్‍లు వ్యతిరేఖించుచున్నారు. వారు ఈ విధముగా అంటున్నారు.


ఏమైనప్పటికీ ఖుర్ఆన్ యావత్తు మానవాళి కోసము అవతరించిన అంతిమ దైవగ్రంథము. ఇది ప్రపంచ మానవులందరి ఉమ్మడి సొత్తు. దీనిపై ఏ ఒక్క జాతికి, వర్గానికి గుత్తాధిపత్యము లేదు. గాలి, నీరు, సూర్యరశ్మి మొదలయిన ప్రకృతి వనరుల్ని మానవుడు ఎలా వినియోగించుకొని ప్రయోజనము పొందు చున్నాడో, ఖుర్ఆన్వల్ల కూడా అలాగే ప్రయోజనము పొందవచ్చును. ఇది ఇహ లోక మానవుల మార్గ దర్శనము కొరకు, పరలోకములో వారి ముక్తి మోక్షాల కొరకు సర్వేశ్వరుడు పంపిన ఏకైక హితవాణి. ఇందులో సత్యాన్వేషకులకు ఆసక్తికరమైన అనేక విషయములు ఉన్నాయి. అందువలన సత్యాన్ని ప్రేమించి మోక్షాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరూ కనీసము ఒక్కసారైనా ప్రశాంతముగా ఆలోచించి, దీనిని అధ్యయనము చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది.

ఇట్లు

అబుల్ ఇర్ఫాన్

(''ఖుర్ఆన్ భావామృతము'' అనువాదకుడు)


ఇక్కడ అబుల్ ఇర్ఫాన్ గారు వ్రాసిన దానినిబట్టి ఖుర్ఆన్‍ను చదువుటకుగానీ, వ్రాయుటకుగానీ ముస్లీమ్ పెద్దల అనుమతి కావాలని చెప్పు వారి మాటలు వ్యర్థమయినవని, విలువ లేనివని తెలియుచున్నది. మనుషుల మాటలను ప్రక్కన పెట్టి చూస్తే స్వయముగా అల్లాహ్‍యే ''ఖుర్ఆన్ గ్రంథము సర్వమానవుల కొరకు'' అని చెప్పియున్నారు. ఇదే విషయమునే సూరా ఆరు, ఆయత్ 90 లో ఇలా చెప్పారు చూడండి.


(6-90) ''ఇలాంటివారే అల్లాహ్ మార్గదర్శకత్వమును పొందిన వారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు వారితో ఇలా అను. ''నేను దీనికి బదులుగా ఎలాంటి ప్రతిఫలమును అడుగను. ఇది సర్వలోకాల వారి కొరకు ఒక హితోపదేశము అని ఓ ప్రవక్తా వారికి చెప్పు.''


ఈ విధముగా స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములోనే చెప్పబడి యుండుట చేత ఖుర్ఆన్ హిందువులకు, క్రైస్థవులకు మిగతా తొమ్మిది మతముల వారికి దైవజ్ఞానమునే అందించుట చేత ఇది అందరి కొరకు చెప్పబడిన గ్రంథమేగానీ, ఒక మతమునకుగానీ, ఒక సమాజమునకు గానీ చెప్పబడినది కాదు. అందువలన ఖుర్ఆన్ ముస్లీమ్‍ల గ్రంథము కాదు. అందరికీ సంబంధించినదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథమును చదువుటకు, వాక్యములకు వివరమును వ్రాయుటకు సర్వులకు సమాన హక్కు గలదు. గ్రంథమును గురించి ప్రచారమును ఏ మతమువారైనా చేయవచ్చును. కొందరు ముస్లీమ్‍లు మా పెద్దల అనుమతి తీసుకోవాలి లేకపోతే మిమ్ములను ప్రచారము చేయనీయము అని మొండిగా మాట్లాడు చున్నారు. ఎవరయినా దేవుని జ్ఞానమును ప్రచారము చేయవచ్చును. అయితే కొందరు దేవుని జ్ఞానమును ప్రక్కన పెట్టి మత ప్రచారము కొరకు అడ్డముగా మాట్లాడుచుందురు. ఈ మధ్యన 'ఏలూరు'లో కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును హిందువులు ప్రచారము చేయకూడదని అన్నారు. అది దేవుని వ్యతిరేఖమైన పనులని వారికి తెలియదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

39. ఏ మానవుని మీద దేవుడు తన జ్ఞానమును అవతరింపజేయ లేదు. (6-91)

మనిషికి కావలసిన జ్ఞానమును దేవుడే తెలుపవలసియున్నది. మనిషికి జ్ఞానమును తెలుపుటకు మనిషియే అవసరము. ఒక మనిషి జ్ఞానమును చెప్పితే ఇంకొక మనిషి జ్ఞానమును తెలియగలడు. మనిషికి మనిషి తప్ప జంతువులుగానీ, వృక్షములుగానీ జ్ఞానమును చెప్పలేవు. దేవుడు జ్ఞానమును చెప్పినా మనిషి రూపములోనే చెప్పాలి. అప్పుడయితేనే మనిషి వినగలడు, తెలియగలడు. కృష్ణుడు మనిషే కావున ఆయన తోటి మనిషి అయిన అర్జునునకు జ్ఞానమును చెప్పాడు. అలాగే ఏసు మనిషి అయినందున మనుషులయిన తన శిష్యులకు జ్ఞానమును చెప్పగలిగాడు. మోషే తన ధర్మశాస్త్రము అను జ్ఞానమును అప్పటి మనుషులకు బోధించాడు. అలాగే ముహమ్మద్ ప్రవక్తగారు తనకు తెలిసిన జ్ఞానమును ఇతర మనుషులకు తెలియజేశాడు. దీనినిబట్టి మనిషి ఇంకొక మనిషికి జ్ఞానమును చెప్పగలడు తప్ప మిగతా ఏ విధానము చేతగానీ తెలుపుటకు వీలుపడదని తెలియుచున్నది.


అయితే భూమిమీద ఏ మనిషికిగానీ దేవుని జ్ఞానము తెలియదనీ, దేవుడు తన జ్ఞానమును ఏ మనిషికీ ప్రసాదించలేదనీ, దేవుని జ్ఞానము దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరనీ, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదనీ దైవగ్రంథములో స్వయముగా దేవుడే చెప్పాడు. ఆ విషయమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆర్‍లో సూరా మూడు ఆయత్ ఏడులో ఈ విధముగా చెప్పారు చూడండి.


(3-7) ''నిజానికి దేవుని జ్ఞానములోని సత్యము దేవునికి తప్ప (అల్లాహ్‍కు తప్ప) వేరెవరికీ తెలియదు. అయితే జ్ఞానములో పరిపక్వత చెందినవారు మాత్రము ''మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరపున వచ్చినవే'' అని అంటారు. వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.''


ఈ వాక్యము ప్రకారము దేవుని జ్ఞానము దేవునికి తప్ప వేరెవరికీ తెలియనప్పుడు దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలసిందే. దేవుడు నేరుగా ఏ మానవమాత్రునితోనూ మాట్లాడడు అని కూడా దేవుడే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 42, ఆయత్ 51లో చెప్పియున్నాడు. ఆ మాట ప్రకారము దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడడు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియదు. తర్వాత ఒక మనిషికి ఇంకొక మనిషే జ్ఞానమును చెప్పాలి. మనిషి చెప్పితే ఇంకొక మనిషికి జ్ఞానము తెలుస్తుంది. మనిషికి తెలిసిన భాషలోనే జ్ఞానమును చెప్పవలసియుండును. అట్లు యున్నప్పుడు దేవుడు మనిషిగానే జ్ఞానమును చెప్పవలసియుండును. అయితే సూరా ఆరు, ఆయత్ 91లో ఇలా కలదు.


(6-91) ''అల్లాహ్ ఏ మానవుని మీద ఏ జ్ఞానాన్ని అవతరింప జేయలేదు'' అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహ్‍ను అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మరి ముసా తెచ్చిన గ్రంథాన్ని ఎవరు అవతరింప చేసినట్లు? ఆ గ్రంథం ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గ దర్శకత్వము. మీరు దానిని వేరు వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకు గానీ తెలియని ఎన్నో విషయాలు ఇందుమూలముగా మీకు నేర్పబడ్డాయి. తౌరాతును అవతరింపజేసినవాడు అల్లాహ్‍యే అని చెప్పు. ఆ తర్వాత వారిని వారి వ్యర్థ విషయాలలో ఆడుకోనివ్వు.''


దేవుడు పంపిన ఈ వాక్యములో ''ఏ మానవుని మీద దేవుడు తన జ్ఞానమును ప్రసరించలేదు'' యని ఉంది. దాని అర్థము ఏమనగా! దేవుని జ్ఞానము ఏ మానవునికీ తెలియదు అని చెప్పడమే. ఏ మనిషికీ తెలియనప్పుడు ఎవరో ఒకరు చెప్పితేనే ఇంకొక మనిషికి తెలియును. అలాంటప్పుడు ఏ మనిషికీ దేవుడు తన జ్ఞానమును ఇవ్వనప్పుడు, ఇతరులు ఎవరూ, ఏ మానవుడు దేవుని జ్ఞానమును గురించి చెప్పలేరు. ఆ పరిస్థితిలో మానవులకు దేవుడే జ్ఞానము చెప్పవలసి యుంటుంది. అయితే ఇక్కడ ఒక ఆటంకము గలదు. అదేమనగా! దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు. అంతేకాక ఒక మనిషికి ఇంకొక మనిషి చెప్పినప్పుడే జ్ఞానము అర్థమగును. ఇంకొక మనిషికి జ్ఞానము తెలియదు. దేవుడు తనకు మాత్రమే తెలిసిన తన జ్ఞానమును తాను స్వయముగా (దేవునిగా) ఎవరికీ చెప్పడు. అటువంటప్పుడు భూమిమీద మనుషులకు దైవజ్ఞానము తెలిసే అవకాశమే లేదు. ఏమాత్రము తెలిసే అవకాశము లేకున్నా, దేవుడు మనుషులకు దైవజ్ఞానము తెలియు అవకాశమును కల్గించాడు. తానే స్వయముగా మానవుడు కాని మానవునిగా భూమిమీద అవతరించి జ్ఞానమును చెప్పాడు.


దేవుడు స్వయముగా మానవుడు కాని మానవునిగా వచ్చి జ్ఞానము చెప్పడము వలన మనిషికి మనిషే జ్ఞానమును చెప్పినట్లయినది. తర్వాత ఏ మనిషికీ జ్ఞానము ప్రసాదించకుండా తానే మానవులకు జ్ఞానమును చెప్పినట్లయినది. దానివలన దేవునికి తప్ప, ఇతర మనుషులకు ఎవరికీ దేవుని జ్ఞానము తెలియదని అర్థమయినది. 'దేవుడు మనిషితో నేరుగా మాట్లాడడు' అను మాట నెరవేరునట్లు దేవుడు దేవునిగా కాకుండా దేవుడు మనిషి అవతారములో మాట్లాడినాడు. 'దేవుడు పుట్టడు' అనుమాట నెరవేరునట్లు దేవుడు దేవునిగా పుట్టకుండా మనిషివలె పుట్టాడు. దేవుడు మనిషికాదు అనునట్లు దేవుడు పూర్తి మనిషిగా కాకుండా 'భగవంతుడు' అను ప్రత్యేకమైన మనిషిగా పుట్టాడు. భగవంతుడు ఇటు దేవునికి అటు మనిషికి చెందినవాడు కాకుండా మధ్యలో యున్నవాడు. భగవంతుడు మనిషి ఆకారములో యున్నా దేవుని జ్ఞానము కలవాడుగా యున్నాడు. భగవంతుడు మనిషితో సమానముగా పైకి కనిపించుచున్నా లోపల దేవునితో సమానముగా యున్నాడు. మనిషి గర్భమునుండి నిర్జీవముగా పుట్టితే తర్వాత ప్రాణము పోసుకొంటే భగవంతుడు తల్లిగర్భము నుండి సజీవముగా పుట్టినవాడు. మనిషి శరీరములో జీవుడు ఒకే కోణములో బ్రతుకుతుండగా, భగవంతుడు ఒక కోణములో మనిషిగా, మరొక కోణములో దేవునిగా బ్రతుకుచున్నాడు. రెండు కోణముల జీవితముగల మనిషి ఒకే ఒకడు భూమిమీద ఉంటాడు అతడే భగవంతుడు. భగవంతున్ని మనుషులు ఎవరూ గుర్తు పట్టలేరు. అందువలన భగవంతున్ని సాధారణ మనిషిగా చూస్తారు. భగవంతున్ని దేవదూతలు అనబడు భూతములు, గ్రహములు గుర్తించి నమస్కరించుచున్నారు. దేవుడు తనను తాను మనిషిగా నమ్మించు అవతారము భగవంతుడు. భగవంతుడు ఒక్కచోట భూమిమీద యున్నా, దేవుడు ప్రపంచమంతా వ్యాపించియుండును. దేవుడు ప్రపంచమంతా వ్యాపించియున్నా, భగవంతుడు మనిషివలె ఒక్కచోట యున్నా, దేవునికున్న శక్తి యుండుట చేత భగవంతుడు దేవునితో సమానము అయినందున మరియు దేవుడు భగవంతుడు ఒకటే అయినందున, దేవున్ని సూక్ష్మముగా ఆరాధించినా, భగవంతున్ని స్థూలముగా ఆరాధించవచ్చును. దేవుడు భగవంతుడు ఒకటేయని తెలియకపోతే వాడు సంపూర్ణ జ్ఞాని కాలేడు. మనిషికి పుట్టుక గలదు, అట్లే చావు కలదు. అయితే భగవంతునికి పుట్టుక లేదు, చావులేదు. భగవంతునికి మనిషికున్నట్లే మరణమున్నా మరణములో భగవంతుడు చావడు, మరుజన్మకు పోడు. భగవంతుడు మనిషివలె పుట్టినా పుట్టుకలో భగవంతుడు జన్మకు రాలేదు. ఆయన పుట్టువాడు కాడు. అందరివలె పుట్టినట్లు, అందరివలె మరణించినట్లు కనిపించినా భగవంతునికి చావు పుట్టుకలు లేవు. ఆయన దేవుడే అయిన దానివలన ఆయనకు జనన మరణములుండవు. దేవుడు ప్రపంచమంతా వ్యాపించి యున్నా మనిషివలె కనిపిస్తూ మనుషుల మధ్యలోనికి వచ్చి తన జ్ఞానమును చెప్పి పోవును. దేవుడు మనిషివలె అవతరించడమునే భగవంతుడు అని అంటారు.


దేవుడు మనిషివలె అవతరిస్తాడని భగవద్గీత (తౌరాత్), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ మూడు దైవ గ్రంథములలో చెప్పియున్నారు. అయితే అలా పుట్టినవాడు భగవంతుడుగా యుంటాడు అని ఎక్కడా చెప్పలేదు. భగవంతుడు అను పేరును దేవుడు తన దైవగ్రంథములలో ఎక్కడా ప్రకటించ లేదు. అలా ప్రకటించకున్నా దైవజ్ఞానమును సంపూర్ణముగా అర్థము చేసుకొన్నవారు, మూడు దైవ గ్రంథములలో 'మనిషిగా వస్తాను' అని చెప్పిన వాక్యములను ఆధారము చేసుకొని తమకు తెలిసిన జ్ఞానముతో దేవుని జన్మను భగవంతునిగా చెప్పారు. అలా చెప్పుటకు ఒక కారణము గలదు. భగము (తల్లిగర్భము) నుండి సజీవముగా పుట్టువాడు అయినందున భగవంతుడు అను పేరును పెట్టడమైనది. బలవంతుడు అనగా బలము కలవాడు అనినట్లు భగవంతుడు యనగా! భగము కలవాడు యని చెప్పకూడదు. భగము నుండి వచ్చినవాడు అని అర్థము. దేవుడు సృష్ఠిర్త అయినందున ఆయన సృష్ఠించేవాడు. ఎవరిని సృష్ఠించినా గర్భము నుండే పంపాలి. అందువలన ఆయన కేరాఫ్ అడ్రస్ గర్భము. గర్భము నుండే దేవుడు మనిషిగా వచ్చాడు కావున ఆయనను 'భగవంతుడు' అని అనవచ్చును. దేవుని పూర్తి అడ్రస్ ఎవరికీ తెలియదు. అయితే ఆయన పెద్ద అడ్రస్ కాకుండా చిన్న అడ్రస్ అనగా చిరునామా మాత్రము అందరి సృష్ఠి జరుగు గర్భము అని చెప్పవచ్చును. అందువలన దేవుడు మనిషి రూపములో భగము నుండి వచ్చాడు కనుక అలా వచ్చిన దేవుని చిరునామా తెలియునట్లు 'భగవంతుడు' అని అన్నారు.


'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని' అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 3, ఆయత్ 7 లో దేవుడే చెప్పియున్నాడు. ఆ మాట ప్రకారము భూమిమీద ఏ మనిషికీ దేవుని జ్ఞానము తెలియదు. అందువలన దేవుడే తన జ్ఞానమును మనుషులకు చెప్పవలసియున్నది. మొదట జ్ఞానమును చెప్పు వానిని గురువుయని అంటారు. 'గురువు' యను పేరు ఏ మానవునికీ వర్తించదు. ఎందుకనగా! మొదట జ్ఞానమును ఎవరూ చెప్పలేదు. దేవుడు భగవంతునిగా వచ్చి జ్ఞానమును చెప్పిపోయిన తర్వాత ఉన్న జ్ఞానమును చెప్పువాడు బోధకుడు యగును గానీ గురువు కాడు. దీనినిబట్టి గురువు వేరు, బోధకుడు వేరని చెప్పవచ్చును. భూమిమీద ఏ మనిషి స్వయముగా దేవుని జ్ఞానమును తెలియలేడు. అందువలన స్వయముగా ఎవరికీ తెలియని దేవుని జ్ఞానమును చెప్పలేడు. అందువలన మనుషులలో గురువు ఉండడు. దేవుడు భూమిమీద మనిషిగా అవతరించి భగవంతుని రూపములో దేవుని జ్ఞానమును మనుషులకు తెలియజేయును. కనుక భగవంతుడే భూమిమీద గురువుగా యుండును. దేవుని రహస్యములు, దేవుని ధర్మములు, దేవుని మర్మములు దేవుడే మనిషిగా వచ్చి చెప్పగలడు. అతడే భగవంతుడు. భూమిమీదికి భగవంతుడు రానంతవరకు దేవుని ధర్మములు తెలియవు.


'దేవుడు ఏ మానవుని మీద తన జ్ఞానమును అవతరింపజేయలేదు' అని దేవుడే చెప్పినప్పుడు తన జ్ఞానమును తానే మొదట స్వయముగా చెప్పుతానని అర్థము కదా! అటువంటప్పుడు మహా ప్రవక్తల రూపములో చెప్పిన జ్ఞానము ఎవరు చెప్పినట్లు? అని ప్రశ్నించుకొని చూచినట్లయితే దానికి జవాబు 'దేవుడే ప్రత్యేకమైన మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పాడు' అని చెప్పవచ్చును. అలా చెప్పిన ఆయనను సాధారణ మనిషిగా లెక్కవేయక అసాధారణ మనిషిగా చూడవలసి ఉండును. మనిషి కాని మనిషిని దేవుని అవతారము అని చెప్పవచ్చును. అట్లు మారువేషములో అసాధారణ మనిషిగా వచ్చినవాడే 'భగవంతుడు' అనబడు దేవుడు. దేవుడు శరీరధారి కాడు, కావున ఆయన ఎవరితోనూ మాట్లాడలేడు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా దేవుడు భగవంతునిగా వస్తే అప్పుడు శరీరముండుట వలన మనుషులతో నేరుగా మాట్లాడవచ్చునని చెప్పవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

40. అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు. (4-164)

'అల్లాహ్ మాట్లాడడు' అని చెప్పినది దైవ గ్రంథమే. అట్లే 'అల్లాహ్ మాట్లాడును' అని చెప్పినది దైవ గ్రంథమే. అదెలా సాధ్యము దేవుడు రెండు విధముల మాట్లాడునా? యని ప్రశ్న రాక తప్పదు. అయితే ఇక్కడ కొంత అర్థము చేసుకోవలసిన అవసరమున్నది. బుద్ధికి పదును పెట్టవలసి యున్నది. బాగా యోచిస్తే దేవుడు సూక్ష్మమైనవాడు. కనిపించువాడు కాడు. శరీర ఐదు ఇంద్రియములకు తెలియనివాడు. ఆకారము లేని దేవుడు ఎలా మాట్లాడగలడు? దేవుడు యనగా దేవులాడబడేవాడు (వెదకబడే వాడు) అని అర్థము కలదు. ఇది అంతయూ సృష్ఠికర్తయైన దేవుడు యొక్క స్థితియని చెప్పవచ్చును. 'దేవుడు దేవుడుగా యున్నప్పుడు ఏ మానవునితోనూ మాట్లాడడు' అను మాట వాస్తవమే. ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుకొని చూస్తాము. మనిషికి నిద్ర, మెలుకువ యను రెండు స్థితులు గలవు. మనిషి నిద్రలో ఎవరితోనూ మాట్లాడడు యను మాట పూర్తి సత్యము. మనిషి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడడు అనుమాట సత్యమే అయినా, రెండవ స్థితియైన మెలుకువలో యున్నప్పుడు మాట్లాడుచున్నాడు. దీనినిబట్టి మనిషి నిద్రలో యున్నప్పుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు అనుట ఎంత సత్యమో అట్లే మనిషి మెలుకువలో యున్నప్పుడు మాట్లాడును అనుట అంతే సత్యమగును.


ఒకచోట ఒక స్థితిలో మనిషి మాట్లాడడు అని చెప్పిన మాట అదే మనిషే మాట్లాడును అనుమాటకు పరస్పర విరుద్ధముగా యున్నా రెండూ సత్యమనియే చెప్పవచ్చును. నిద్రలో ఉన్న మనిషి మాట్లాడడు అని చెప్పి అదే నిద్రలోనే మనిషి మాట్లాడును అంటే అది అసత్యమగును గానీ, మనిషి నిద్రస్థితిలో మాట్లాడడు యని చెప్పి అదే మనిషి మెలుకువ స్థితిలో మాట్లాడును అని చెప్పుటలో తప్పు లేదు. మనిషికి గల రెండు స్థితులలో రెండు రకములుగా యుండునని తెలిసినట్లు, దేవుడు తనకు గల ఒక స్థితి అయిన సూక్ష్మముగా (దేవునిగా) యున్నప్పుడు మాట్లాడడనీ, తన రెండవ స్థితియైన స్థూలముగా (భగవంతునిగా) యున్నప్పుడు మాట్లాడునని చెప్ప వచ్చును. దీనినిబట్టి దేవుడు సూక్ష్మముగా యున్నప్పుడు మాట్లాడడు, ఊరక యుండుననీ, స్థూలముగా యున్నప్పుడు మౌనముగా ఊరకయుండడని చెప్పవచ్చును.


నేడు మనుషులు మూడు మతములుగా విభజింపబడియుండి, ఎవరి జ్ఞానము వారిదే అన్నట్లు ఉండుట వలన వారి చూపంతయూ మతముల చుట్టూనే యున్నదిగానీ, దేవుని జ్ఞానము తెలియు దారిలో లేదు. అందువలన మనుషులు అసంపూర్ణ జ్ఞానులుగా ఉండుట వలన దేవుని సూక్ష్మ, స్థూల యను రెండు విధానములు తెలియకుండా పోయాయి. ముస్లీమ్‍లు దేవుడు సూక్ష్మముగా కనిపించనివాడు అని నమ్మారు. అదే హిందువులు దేవుడు స్థూలముగా కనిపించువాడు యని దేవున్ని అనేక రూపములలో చూపారు. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలోనూ అట్లే మిగతా రెండు దైవ గ్రంథములలోనూ దేవుని స్థూల, సూక్ష్మ రెండు విధానములను తెల్పియున్నారు. అది గ్రహించనివారు ఏదో ఒక విధానమునే తెలిసినవారై దేవుడు మాట్లాడడు, దేవునికి రూపము లేదు యని అంటున్నారు. అట్లే మరొక విధానమును తెలిసినవారు దేవుడు మాట్లాడుననీ, దేవునికి ఆకారము కలదని చెప్పుచున్నారు. రెండు విధానములు దేవునికి ఉన్నాయని తెలియనివారు మా జ్ఞానము గొప్పయని ఒక మతము వారు అనగా, మా జ్ఞానమే గొప్పయని ఇంకొక మతము వారు అంటున్నారు.


మూడు మతములలో దేవుని రెండు విధానములను తెలిసినవారు లేకపోవడము వలన, ఇక్కడ ఖుర్ఆన్ గ్రంథములో సూరా నాలుగు ఆయత్ 164 లో చెప్పిన వాక్యమునకు 42-51లో చెప్పిన వాక్యము వ్యతిరేఖముగా యున్నది చూడండి. (42-51) ''అల్లాహ్ ఏ మానవునితోనూ నేరుగా మాట్లాడడు!'' అని కలదు. (4-164) ''అల్లాహ్ మూసా ప్రవక్తతో నేరుగా మాట్లాడాడు'' అని కలదు. ఈ రెండు వాక్యములను దగ్గర చేర్చి చూస్తే ఒకదానికొకటి పూర్తి విరుద్ధముగా కనిపించుచున్నవి. వివరము తెలియని వారికి వ్యతిరేఖముగా కనిపించినా మాకు దేవుని సూక్ష్మ, స్థూల రెండు విధానములు తెలిసినదానివలన మాకు రెండు వాక్యములు ఏమాత్రము వ్యతిరేఖముగా కనిపించడము లేదు. దేవుడు స్థూల విధానములో మాట్లాడునని దానివలన దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో 4-164లో 'మూసాతో దేవుడు మాట్లాడాడు' అని చెప్పారు. దేవుని సూక్ష్మ విధానము వలన 'దేవుడు మాట్లాడడు' యని అదే ఖుర్ఆన్ గ్రంథములో 42-51లో వ్రాసియున్నారు. రెండూ ఉన్న విధానములే కావున ఒకే గ్రంథములో రెండు వాక్యములను చెప్పారు.


ప్రథమ దైవ గ్రంథము అయిన భగవద్గీతలో ''దేవుడు పుట్టడు'' అని ఒకచోట చెప్పియున్నారు. తర్వాత మరొకచోట ''దేవుడు శరీరము ధరించి పుట్టి మనుషులచేత అవమానమును పొందుచున్నాడని'' చెప్పారు. భగవద్గీతలో పుట్టడనీ, తర్వాత పుట్టునని పరస్పర విరుద్ధముగా చెప్పి యున్నారు. ఈ విషయము అక్కడ కూడా చాలామందికి అర్థము కాలేదు. దేవుడు ఒక్కడే అయినా ఆయన రెండు విధములా ఉన్నాడని తెలియని వారికి దైవ గ్రంథములోని జ్ఞానము ఏమాత్రమూ తెలియడము లేదని చెప్పవచ్చును. మూడు మతములలో గల మనుషులు దేవున్ని ఒకే కోణములో చూచుట వలన గ్రంథములో రెండు కోణములుగా యున్న ఏ విషయమూ అర్థము కాకుండా పోయినది. ప్రతి దైవ గ్రంథములో స్థూల విషయములు 40 శాతము, సూక్ష్మ విషయములు 60 శాతము ఉన్నాయని ఏ మతము వారు గ్రహించలేకపోయారు.


స్థూల సూక్ష్మ విషయములను తెలియనిదానివలన దేవుడు రెండు కోణములలో చెప్పిన జ్ఞానము ఎవరికీ తెలియకుండా పోయినది. ఇంజీలు (బైబిలు) గ్రంథములో ఒక సందర్భమున ఏసు తన శిష్యులతో కలిసి భోజనము చేయుచూ ఒక రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చి 'ఇది నా శరీరము' యని చెప్పెను. అట్లే ఒక గిన్నెతో ద్రాక్షరసము ఇచ్చి 'ఇది నా నుండి చిందింపబడుచున్న నిబంధన రక్తము. దీనిని మీరు త్రాగుడు' అని చెప్పడమైనది. ఈ వాక్యములు రెండు సూక్ష్మ జ్ఞానముతో కూడుకొన్నవై యున్నవి. రొట్టెను శరీరముగా, ద్రాక్షరసమును రక్తముగా చెప్పడమైనది. ఇక్కడ బాగా గమనించితే శరీరము స్థూలముగా కనిపించుచుండును. రక్తము సూక్ష్మముగా కనిపించక శరీరములోపల యుండును. శరీరములోనికి పోతే రక్తము ఉన్నట్లు తెలియును. అలాగే స్థూలము కనిపించునదైనా సూక్ష్మము ఉన్నా కనిపించక లోపలయుండును. శరీరము 10 భాగములు అనగా 40 శాతము స్థూలముగా యున్నది. శరీరములోని భాగములు 15 సూక్ష్మముగా యున్నవి. అనగా 60 శాతము కలవు. శరీరములోని 15 భాగములలో రక్తము సూక్ష్మముగా ఇమిడి యున్నది.


కనిపించు శరీరమును అనగా ఇచ్చిన రొట్టెను స్థూలమైన గ్రంథముగా చెప్పుకొంటే శరీరములో సూక్ష్మముగా ఇమిడియున్న రక్తమును గ్రంథములో జ్ఞానముగా చెప్పవచ్చును. ఏసు తన శరీరమును బైబిలు గ్రంథముగా, రక్తమును గ్రంథములో సూక్ష్మముగా ఇమిడియున్న జ్ఞానముగా పోల్చి చెప్పాడు. ఈ విషయమును తిరిగి ఏసే చెప్పువరకు తెలియని పరిస్థితి క్రైస్థవులలో ఉన్నదని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ద్రాక్ష రసమును రక్తముగా (జ్ఞానముగా) చెప్పిన ఏసు అదే బైబిలు గ్రంథములో జ్ఞానమును 'జీవ జలము' అని అన్నాడు. ఒకచోట దైవజ్ఞానమును నిబంధన రక్తమని చెప్పి మరొక చోట అదే జ్ఞానమునే 'జీవజలము' అన్నప్పుడు, ఒకే జ్ఞానమును రక్తముగా ఒకచోట, జలముగా మరొకచోట రెండు విధములా చెప్పినట్లు కలదు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములలోను జ్ఞానము రెండు కోణములలో రెండు రకములుగా చెప్పడమైనది. ఒకే దేవుడు ఒకే జ్ఞానమును రెండుగా చెప్పినా, దానిని ఒక్కటిగానే గ్రహించు స్థోమత మనిషిలో ఉన్నప్పుడే మనిషికి సంపూర్ణమైన జ్ఞానము అర్థమగును. అంతిమ దైవ గ్రంథములో ఒక దేవుడు ఒకే జ్ఞానము రెండు కోణములు అని అర్థము చేసుకొన్నప్పుడే ఒక కోణములో దేవుడు మాట్లాడడనీ, మరొక కోణములో దేవుడు మాట్లాడును అని తెలియును. అప్పుడే 4-164వ ఆయత్ సంపూర్ణముగా అర్థము కాగలదు. గ్రంథములోని రెండు కోణములు తెలియకపోతే దేవుడే అబద్దము చెప్పినట్లుండును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

41. ఒంటరిగా వస్తారు. (6-94)

ఎక్కడికయినా సరే ఎంతమందితోనయినా పోవచ్చును. అయితే చావు పుట్టుకలలో ఒక్కరే ఉంటారు. దీనికి సంబంధించిన వాక్యము ఇలా కలదు చూడండి.


(6-94) ''మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీ వెంట చూడడము లేదు. నిజంగానే వారికీ మీకు మధ్యగల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయినది.''


ఈ ఆయత్ స్థూలముదే అయినా కొంత తెలియనిదానిని అర్థము చేసుకోవలసియున్నది. దేవుడు మనిషిని మొదటిసారి పుట్టించినట్లు అనగా ఒంటరిగాయని అర్థము. మనిషి ఒంటరిగా పుట్టుచున్నాడు మరియు ఒంటరిగా మరణిస్తున్నాడు. మరణములో వెంటవచ్చువారు ఎవరూ ఉండరు. జీవితములో ఎవరు ఎన్నాళ్ళు తోడున్నా చివరికి మరణములో ఎవరూ తోడు రారు అనునది అందరికీ తెలిసిన సత్యము. మనిషి మరణించిన రోజు బయటి వారిని వదలి పోవడమే కాకుండా, పుట్టుక నుండి జీవునికి నివాసముగా యున్న శరీరము కూడా చనిపోయిన స్థలము లోనే నిలిచిపోవును. 24 శరీర భాగములను వదలి బయటికి రావడము జరుగుచున్నది. ఎప్పుడు జీవాత్మ బయటికి వచ్చినదో అదే క్షణమే జీవుడు మరొక చోటికి పోవడము జరుగుచున్నది. అలా ఒకమారు శరీరమును వదలి వచ్చినప్పుడు దేవుడు ఆ జీవితములో ప్రసాదించిన ధన, కనక, వస్తు, వాహనములను శరీరముతో పాటు వదలి రావడము జరుగుచున్నది.


మనిషి జీవితములో దేవునితో సమముగా ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ, వారు మీకు జీవితములో సహాయపడినారనుకొనినా చనిపోయిన తర్వాత మనిషి వెంటవారున్నట్లు రావడము లేదు. ఇతర దేవతల మీద ఎంత భక్తి భావములున్నా అదంతా మరణముతో పూర్తిగా తెగిపోయినది. మీరు మీ జీవితములో నమ్మినదంతా మరణముతో కనిపించకుండా పోవుచున్నది. మనిషి జీవితములో గల అధికారముగానీ, జన బలముగానీ, ధన బలముగానీ, స్థిరాస్థులయిన భూములుగానీ తనవెంట రాకపోవడమే కాక దేవునితో సమానముగా లెక్కించి ఎంతో కాలమునుండి మ్రొక్కుచున్న దేవతల ఆచూకీ కూడా మరణములో లేకుండా పోవుచున్నది. అన్నీ వదలిన మనిషి (జీవుడు) ఒక్కడు ఒంటరిగా మరణములో పోవుచున్నాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

42. ఆయనే నీకు ఆరాధ్య దైవము మరియు ఆయనే నీకు కార్యకర్త. (6-102)

విశ్వములో సృష్ఠి అనగా తయారు చేయబడినది అని అర్థము. సృష్ఠికర్త అనగా ఉన్నదానిని తయారు చేసినవాడు అని అర్థము. సృష్ఠి రెండు రకములు గలదు. ఒకటి బయట కనిపించు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచభూతములు, రెండవది పంచభూతముల మిశ్రమము చేత తయారయిన శరీరము. బయట దానిని అచర ప్రకృతి యనీ, శరీర రూపములోయున్న దానిని చర ప్రకృతియని అనుచున్నారు. బయటిది మార్పు చెందని ప్రకృతి, శరీరములోపలిది మార్పు చెందే ప్రకృతియని చెప్పవచ్చును. రెండు విధముల ప్రకృతులను దేవుడే (అల్లాహ్‍యే) సృష్ఠించాడు. దీనినిబట్టి అల్లాహ్ సృష్ఠించిన సృష్ఠి రెండు రకములు. బయటి సృష్ఠిని, లోపలి సృష్ఠిని అల్లాహ్‍యే సృష్ఠించాడు. కావున అల్లాహ్‍ను సృష్ఠికర్తయని అంటున్నాము. దేవున్ని సృష్ఠికర్తయని అనడమే రెండు రకముల సృష్ఠిని బట్టి అల్లాహ్ రెండు విధములుగా యున్నాడు. బయటి సృష్ఠిని సృష్ఠించిన వాడు అల్లాహ్‍యే. అట్లే లోపలి సృష్ఠిని సృష్ఠించినవాడు అల్లాహ్‍యే. అల్లాహ్ అనే పేరు ఒక్కటేయున్నా మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్ఠించిన సృష్ఠికర్త ఒకరుకాగా, తర్వాత శరీర ప్రకృతిని సృష్ఠించిన అల్లాహ్ మరొకరు. అయితే ఇద్దరినీ అల్లాహ్ అని పిలుచుట చేత మనుషులందరూ అల్లాహ్ ఒక్కడేయని అనుకొంటున్నారు. అయితే మొదటి సృష్ఠికర్త ఒకరు, తర్వాత శరీరములను సృష్ఠించిన సృష్ఠికర్త మరొకరు అని ఎవరికీ తెలియకుండా పోయినది.


నేడు ముస్లీమ్‍లందరూ అల్లాహ్ ఒక్కడేయనీ, ఒక్క అల్లాహ్‍యే ఆరాధ్య దైవమనీ ఆరాధ్యులు ఇద్దరు లేరని అంటున్నారు. ఆ మాట నూటికి నూరుపాళ్లు వాస్తవమే. విశ్వములో ఆరాధ్య దైవము ఒక్క అల్లాహ్‍యేనని నేను కూడా చెప్పుచున్నాను. అయితే ఇద్దరిలో ఏ అల్లాహ్ ఆరాధ్య దైవముగా యున్నాడను విషయము ఏ మనిషికీ తెలియకుండా పోయినది. శరీరములను సృష్ఠించిన అనగా మనుషులను సృష్ఠించిన రెండవ అల్లాహ్ ఒక్కడే అందరికీ ఆరాధ్య దైవము అని తెలియకపోవడము విచిత్రము. విశ్వములో ఒకే అల్లాహ్ ఉన్నాడనీ, ఆయన ఒక్కడే ఆరాధ్య దైవము అని అంటున్నారు. అయితే ఆరాధ్య దైవము ఒక్కడేయనుట వాస్తవమే గానీ, అల్లాహ్ ఒక్కడు అనుట సత్యము కాదు. ప్రప్రథమముగా బయట భూమిని, ఆకాశమును సమస్త వస్తువులను సృష్ఠించిన సృష్ఠికర్త అయిన అల్లాహ్ మొదటివాడు కాగా, శరీరము లోపలి సూక్ష్మ ప్రకృతిని అయిన భూమి, ఆకాశములను వాటి మధ్య సమస్తమునూ సృష్ఠించిన అల్లాహ్ రెండవవాడు. బయట ప్రకృతిని కాకుండా లోపలి ప్రకృతిని సృష్ఠించిన అల్లాహ్‍యే సమస్త మానవులకు ఆరాధ్య దైవముగా యున్నాడు. అయితే ఇద్దరు అల్లాహ్‍లు అనడము చాలామందికి అర్థముకాని విషయము, నమ్మలేనిదిగా యున్నా నేను చెప్పు మాట సత్యము అనుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనే ఆధారములు కలవు. మొదటి సృష్ఠికర్తయిన మొదటి అల్లాహ్‍ను గురించిన వాక్యమును సూరా రెండు, ఆయత్ 117 లో చూడవచ్చును.


(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే (అల్లాహ్‍యే). ఆయన ఏ పనైనా చేయ సంకల్పించు కొన్నప్పుడు దాన్ని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.''


ఈ వాక్యమును చాలామంది చూచినా ప్రప్రథమముగా అను విశేష పదమును ఎవరూ గుర్తించియుండరు. అంతేకాక ఆయన పని చేయడు అనీ, సంకల్పించుకొన్నప్పుడు దానంతట అది అయి పోతుందనీ చెప్పడము మొదటి అల్లాహ్ యొక్క ప్రత్యేకత. మొట్టమొదట సృష్ఠిని తయారు చేసినది కూడా మొదటి అల్లాహ్ ప్రత్యేకత యని అందరూ తెలియవలసి యున్నది. అయితే మొదటి అల్లాహ్ తన వెనుక యున్న రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవము అని స్వయముగా సూరా మూడు ఆయత్ 18 లో చెప్పడమైనది చూడండి.


(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వమును నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కాదు.''


ఇక్కడ బాగా బుద్ధిని ఉపయోగించి చూస్తే రెండవ అల్లాహ్‍ను నిజమైన ఆరాధ్య దైవమని మొదటి అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవదూతలు మొదటి అల్లాహ్‍కు మాత్రమే గలరు. మొదటి అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞానులు అయినవారు రెండవ అల్లాహ్‍ను గొప్పగా ఆరాధ్య దైవముగా చెప్పారు అని తెలియుచున్నది. స్వయముగా మొదటి అల్లాహ్ అయినవాడు రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవముగా వర్ణించి చెప్పడము వాక్యములో బాగా కనిపించుచున్నా ఇద్దరూ ఒకే పేరుతో యున్నారనీ, వారు ఇద్దరూ అల్లాహ్‍లేయని చాలామందికి తెలియదు. ఈ విధముగా యున్న ఇద్దరిలో మొదటి వాడు బయటి ప్రపంచమును సృష్ఠించిన సృష్ఠికర్త కాగా, రెండవ అల్లాహ్ శరీరములుగా గల ప్రకృతిని సృష్ఠించిన సృష్ఠికర్తగా యున్నాడు. తండ్రిని మరియు తండ్రికి తండ్రిని అబ్బ అని ఒకే పేరుతో పిలిచినట్లు చర, అచర అను రెండు ప్రకృతులను సృష్ఠించిన ఇద్దరు సృష్ఠికర్తలను ఒకే పేరుతో పిలుస్తున్నట్లు ఖుర్ఆన్ గ్రంథములో కలదని మనుషులకు తెలియనిదానివలన బైబిలులో తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క వివరమును, భగవద్గీతలో ఆత్మ, పరమాత్మ వివరమును తెలియలేక పోయారు. భగవద్గీతలో పదిహేనవ (15) అధ్యాయము వరకు ఆత్మ, పరమాత్మలను 'ఆత్మ'యను ఒకే పేరుతో చెప్పారు. అట్లే బైబిలు గ్రంథములో తండ్రి, పరిశుద్ధాత్మను అనేకచోట్ల 'తండ్రి'యను పేరుతో చెప్పడమైనది. మనుషులకు ఆత్మ తండ్రికాగా, ఆత్మకు పరిశుద్ధాత్మ తండ్రిగా యున్నట్లు చెప్పడమైనది. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఇద్దరినీ 'అల్లాహ్' యని చెప్పినప్పటికీ మొదటి సృష్ఠికర్తయనీ, తర్వాత సృష్ఠికర్తయనీ రెండు విధములుగా చెప్పియున్నారు. అంతేకాక పని చేయు అల్లాహ్, పని చేయని అల్లాహ్ అని కూడా విడివిడిగా చెప్పియున్నారు. అయినా మొదటి అల్లాహ్‍ను ఎవరూ గుర్తించకపోవడము దురదృష్టకరము. ముస్లీమ్‍లు అల్లాహ్ ఒక్కడే ఇద్దరు లేరు అని అంటున్నారు. అయితే ఆరాధింపదగిన అల్లాహ్ ఒక్కడేయనీ, ఆయనకంటే పెద్ద అల్లాహ్ మరొకరు ఉన్నారని, ఆయనే పని చేయని అల్లాహ్యని తెలియలేకపోయారు. పనిని చేయు అల్లాహ్‍ను ఒక్కనినే గుర్తించి ఆయన ఒక్కడే అల్లాహ్ యని చెప్పడము కొంత అజ్ఞానమే యగును. స్వయముగా మొదటి అల్లాహ్ 'రెండవ అల్లాహ్ ఒక్కడే మీకు ఆరాధ్య దైవము' అని చెప్పిన వాక్యము (3-18) లో యున్నా, పెద్ద అల్లాహ్ 'ఏ అక్కరా లేనివాడు' అని (112-2) లో యున్నా, మొదటి అల్లాహ్ 'ఏ కార్యము చేయనివాడుయని మరియు మొదటి సృష్ఠికర్తయని' (2-117) లో యున్నా తండ్రియైన అల్లాహ్‍ను గుర్తించక కుమారుడైన అల్లాహ్‍ను ఒక్కనినే గుర్తించి అల్లాహ్ ఒక్కడేయని చెప్పడము పూర్తి పొరపాటు. ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడేయని చెప్పండి అది వాస్తవము. అంతేగానీ అల్లాహ్ ఒక్కడేయని ఇద్దరు లేరు అని చెప్పడము తప్పుయని చెప్పుచున్నాము. ఆరాధ్య దైవము ఒక్కడేయని ఇద్దరు కాదని (16-51)లో కూడా కలదు చూడండి. (16-51) ''అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఇద్దరు ఆరాధ్య దైవములను కల్పించుకోకండి. ఆరాధ్య దైవము మటుకు ఆయన ఒక్కడే. కావున మీరంతా కేవలము నాకే భయపడండి.''


ఈ ఆయత్‍లో మొదటి అల్లాహ్ చెప్పినట్లు స్పష్టముగా తెలియు చున్నది. ఆరాధ్య దైవము ఇద్దరు కాదు, ఆయన ఒక్కడేయని మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను చూపించాడు. ఇద్దరు అల్లాహ్‍లు ఉండడము వలన ఆరాధనకు ఇద్దరు పనికిరారు రెండవ అల్లాహ్ ఒక్కడే పనికి వస్తాడనీ 'ఆయనకు మ్రొక్కండి, నాకు భయపడండి'యని కూడా ఇద్దరి ఉనికిని చాటుకుంటూ చెప్పాడు. 'ఇద్దరు' అను మాటను గ్రహించాలి. ఇట్లు అనేకచోట్ల ఖుర్ఆన్ గ్రంథములో యున్నా పనిలేని మొదటి అల్లాహ్‍ను గ్రహించ లేకపోయారు. ఇంతేకాక మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పిన ముఖ్యమైన విషయము సూరా ఆరు, ఆయత్ 102 లో యున్నది చూడండి.


(6-102) ''ఆయనే మీ అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్ఠించిన వాడు ఆయనే. కాబట్టి మీరు ఆయననే ఆరాధించండి. అన్ని విధములా కార్యసాధకుడు ఆయనే.''


(16-51) లో అల్లాహ్‍యే స్వయముగా మీ ఆరాధ్య దైవము ఆయన ఒక్కడే అని చెప్పినట్లు, (6-102) లో కూడా ఆయనే మీ అల్లాహ్, మీ ప్రభువు, మీ ఆరాధ్య దైవము అని మొదటి అల్లాహ్‍యే స్వయముగా చెప్పాడు. అందువలన అందరికీ ఆరాధ్య దైవము రెండవ అల్లాహ్ ఒక్కడేయని తెలియవలెను. అల్లాహ్‍లు ఇద్దరు అనునది సత్యమే అయినా అందులో ఒక్కడే అందరి ఆరాధ్య దైవమని తెలియవలెను. మొదటి అల్లాహ్ మీద భయము, రెండవ అల్లాహ్ మీద భక్తి కల్గియుండాలి. ఇద్దరు అల్లాహ్‍లు అని తెలియడము జ్ఞానము. ఒక్కనినే ఆరాధించడము ధర్మము. ఎవడయితే సమస్త మానవులకు ఆరాధ్య దైవముగా యున్నాడో అతడే అందరికీ కార్యకర్తగా యున్నాడు. అలాగే ఎవడయితే సమస్త మానవులకు సాక్షిగా మొదటి అల్లాహ్గా యున్నాడో అతడే ఏ కార్యమును చేయనివాడుగా యున్నాడు. ఒకే పేరు మీద ఇద్దరు యున్నా అందులో ఒకరు కార్యకర్తగా, ఆరాధ్య దైవముగా ఉండగా, మరొకరు ఆరాధనకు అతీతముగా యుంటూ, కార్యములకు కూడా అతీతముగా ఉన్నాడు. అందువలన (6-102) ఆయత్‍లో పనిచేసే అల్లాహ్‍ను గురించి చెప్పుచూ ఆయనే మీ ఆరాధ్య దైవమని కూడా చెప్పారు. (2-117) లో ఆరాధనకు సంబంధము లేని అల్లాహ్‍ను గురించి చెప్పుచూ ఆయన మొదటి సృష్ఠికర్త యనీ, ఆయన పని చేయడనీ చెప్పడము జరిగినది. అల్లాహ్ అను ఒకే పేరు ఇద్దరికీ యున్నా అందులో ఒకడు ఆరాధ్య దైవము మరొకరు ఏ ఆరాధన అక్కర లేనివాడు. ఒకడు కార్యకర్త, మరొకడు సృష్ఠికర్త ఆయనే కార్యమునకు అతీతుడు. ఈ విధముగా ఇద్దరి అల్లాహ్‍ల మధ్య ఎన్నో తేడాలున్నాయని గ్రహించినవాడే నిజమైన జ్ఞాని యగును.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

43. ఎవరూ ఆయనను చూడలేదు. ఆయన అందరినీ చూడగలడు. (6-103)

ఇక్కడ ముహ్కామాత్ (స్థూలము), ముతషాబిహాత్ (సూక్ష్మము) లను గురించి చెప్పడమైనది. మనుషులు స్థూలమైనవారు అలాగే మనుషుల దృష్ఠి స్థూలమైనదే. దేవుడు సూక్ష్మమైనవాడు అట్లే దేవుని చూపు సూక్ష్మమైనదే. స్థూలదృష్ఠి స్థూలమునే చూడగలదు. సూక్ష్మమును చూడలేదు. అందువలన స్థూలదృష్ఠిగల మనిషి సూక్ష్మమైన దేవున్ని చూడలేడు. సూక్ష్మమైన దృష్ఠి స్థూలమును చూడగలదు. అందువలన సూక్ష్మదృష్ఠిగల దేవుడు స్థూలముగా యున్న మనుషులనందరినీ చూడగలడు. అందువలన సూరా ఆరు, ఆయత్ 103 లో ఈ విధముగా చెప్పారు చూడండి.


(6-103) ''ఎవరి చూపులు కూడా ఆయన్ని (దేవున్ని) అందుకో జాలవు. ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్ఠి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.''


ఈ వాక్యములో ''ఆయన సూక్ష్మ దృష్ఠి కలవాడు'' అని యున్నది. దేవుడు సూక్ష్మమైనవాడు అయినప్పుడు ఆయనకు సూక్ష్మదృష్ఠి ఉండడము సహజమే. సూక్ష్మదృష్ఠికి కన్ను అనునది ఉండదు. కన్ను లేకుండా ఉండు దృష్ఠిని సూక్ష్మదృష్ఠియని చెప్పడము జరుగుచున్నది. దేవునికి మనిషికున్నట్లు అవయవములు ఉండవు. కన్ను అను అవయవము కూడా ఉండదు. దేవుడు ఇంద్రియాతీతుడు, ఇంద్రియములకు అతీతముగా ఉండువాడు దేవుడు. దేవున్ని ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యని చెప్పారు. అల్లాహ్ అనగా అంతులేని వాడని అర్థము. అల్లాహ్ (దేవుడు) ఒక మనిషి శరీరము లోపల శరీరమంతా వ్యాపించియుండును. ఒక శరీరము లోపల మాత్రము యుంటే అతనికి అంతు ఉందని చెప్పవచ్చును. అందువలన దేవుడు ఆత్మ స్వరూపుడై జీవుడు ఎక్కడుండునో అక్కడ జీవునికి తోడుగా ఉండును. జీవాత్మ శరీరములో ఒకచోట మాత్రముండగా ఆత్మ అయిన దేవుడు నఖ శిఖ పర్యంతమూ వ్యాపించి యుండును. గోర్లు, వెంట్రుకల చివరి వరకూ వ్యాపించియుండును.


ఒక్క శరీరములో ఒక్క జీవాత్మ మాత్రముండగా, ఆత్మ మాత్రము ఒక్క శరీరములో యున్నదే అన్ని శరీరములలోనూ ఉండును. ఆత్మ ఒక్కటే అన్ని శరీరములలో ఒకే విధానము కల్గియున్నది. జీవున్ని కర్మ ప్రకారము అనుభవించునట్లు శరీరమును కదలించుచూ శరీరములో చైతన్యముగా యున్నది. ఆత్మనే అల్లాహ్గా చెప్పుచున్నాము కావున ఆయన అన్ని శరీరములలో పూర్తి వ్యాపించియుండి అందరినీ ఆడించుచుండుట వలన ఆయన అందరినీ చూచినట్లే. అందరి గుట్టు ఆయనకు తెలిసినట్లే. ఆత్మ అయిన దేవుడు శరీరములోని అన్ని అవయవములయందు వ్యాపించడమే కాక కన్నుయందు కూడా వ్యాపించియుండుట వలన ఆయన అందరి చూపులను అందుకోగలడని వాక్యములో చెప్పారు. ఆత్మశక్తి వలన మనిషి యొక్క ప్రతీ అవయవము పని చేయుచున్నది. అందువలన మనిషి శరీరములోని అంతరంగములో గల ప్రతీ విషయము ఆయనకు తెలుసు. తనకు కళ్లు లేకున్నా అందరి కళ్లతో సర్వమునూ చూడగలడు. అందువలన వాక్యములో ఆయన సర్వమూ తెలిసినవాడుయని అన్నారు. మనిషి శరీరములో బుద్ధి, మనస్సుయందు కూడా యుండి బుద్ధిని ప్రేరేపించు వాడు, మనస్సును ఉత్తేజపరచువాడు అన్నిటికీ తన చైతన్యమును ఇచ్చి పనిని చేయించువాడు అయినందున ఆయనకు తెలియనిది అంటూ ఏదీ లేదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

44. మీ వద్దకు సూచనలు వచ్చాయి. వాటిని నమ్మక గ్రుడ్డిగాయుంటే మీకే నష్టము. (6-104)

(6-104) ''వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు. ఎవడు అంధుడుగా ఉంటాడో అతడే నష్టపోతాడు. నేను మీ రక్షకుడను కాను అని చెప్పు.''


ఈ వాక్యము జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పినా ఇందులోని సారాంశమును అర్థము చేసుకోవడము చాలా కష్టము. ఈ వాక్యమును ఎవరు చెప్పారు? అన్నది ప్రశ్నకాగా, ఎవరికి చెప్పారు? అన్నది కూడా ప్రశ్నయే. కొందరు ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పినట్లు చెప్పుచున్నారు. దేవుడు నేరుగా మనుషులకు చెప్పాడని కొందరు చెప్పుచున్నారు. ఇందులోని వాస్తవమును గ్రహిస్తే మనందరి రక్షకుడు అల్లాహ్ మాత్రమే యని చెప్పవచ్చును. అల్లాహ్ నుండి కనిపించని దర్శనము అనగా! నిదర్శనములు మీవద్దకు వచ్చాయి అని అన్నారు. ఒక విధముగా దైవ జ్ఞానమును నిదర్శనము యని అంటున్నాము. దేవుడు మనిషి అజ్ఞానము నుండి జ్ఞానములో పడాలని తననుండి కొన్ని సూచనలను తెలియజేశాడు. దేవుని సూచనలు గ్రంథరూపములో వచ్చాయి. గ్రంథరూపములో వచ్చిన జ్ఞానము అను నిదర్శనములు ఎవడు బుద్ధితో దర్శనము చేసుకొనునో వాడు మేలు పొందగలడు. అందుకే వాక్యములో ''ఎవడు నిదర్శనములను గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు'' అని చెప్పియున్నారు.


ఈ వాక్యములో 'దేవుని నుండి వచ్చిన నిదర్శనములు' అను మాటకు అర్థము 'దైవము నుండి వచ్చిన జ్ఞానము' అని తెలుసుకొన్నాము. తర్వాత దైవ జ్ఞానమును తెలుసుకోవడము ద్వారా మనిషి పొందు మేలు ఏమిటో, జ్ఞానము తెలియకపోతే పొందే నష్టము ఏమిటో తెలియవలసి యున్నది. అంతేకాక దేవుడు రక్షకుడైయుండి కూడా నేను మీ రక్షకుడను కానుయని ఎందుకు చెప్పాడో తెలియవలసి యున్నది. అయితే కొందరు ముహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ప్రవక్తగారు ప్రజలకు రక్షకుడను కాను యని చెప్పమన్నట్లు వాక్యము చివరిలో కలదనీ, అది ప్రవక్తకు చెప్పిన మాటయని కొందరు అనవచ్చును. ఇది ప్రవక్తకు చెప్పినట్లు కాక స్వయముగా అల్లాహ్‍యే (దేవుడే) మనుషులకు 'నేను మీ రక్షకుడను కాను' అని చెప్పినట్లున్నదని మేము అనుకొంటున్నాము. దేవుడే ఆ వాక్యమును చెప్పినట్లు అనుకొంటే వాక్యములోని భావము స్పష్టముగా అర్థము కాగలదు. అలా కాకుండా ప్రవక్త గారికి చెప్పమని చెప్పాడు అనుకొంటే వాక్యములోని భావము సంపూర్ణము కాదు. చివరిగాయున్న 'రక్షకుడు' అను పదములో వాక్య సారాంశము అంతయూ ఇమిడి యున్నదని అనుకొంటున్నాను. 'దేవుడు క్షమాశీలుడు' అనుమాట ఖుర్ఆన్ గ్రంథములో అనేకచోట్ల గలదు. అంతేకాక ప్రత్యేకముగా (6-127) లో 'దేవుడు జ్ఞానులకు రక్షకుడుగా ఉన్నాడు' అని చెప్పారు. దీనినిబట్టి చూస్తే దేవుడు మంచివారందరికీ రక్షకుడే యని, మంచివారు కానివారికి దేవుని రక్షణ ఉండదని తెలియు చున్నది. అల్లాహ్ యొక్క జ్ఞానమును గ్రహించినవాడు మేలు పొందుతాడు అనగా రక్షణ పొందుతాడు యని అర్థము. అల్లాహ్ యొక్క జ్ఞానమును గ్రహించని వానికి అల్లాహ్ రక్షకుడుగా ఉండడు. అందుకే (6-104) లో దేవుని జ్ఞానము గ్రహించని వానికి నష్టమేయని చెప్పాడు. వానికి దేవుడు రక్షణ ఇవ్వడు కావున అదియే వానికి నష్టము. దేవుని జ్ఞానము అవతరించి నప్పటికీ దానిని చదవని (చూడని) వారు, ఒకవేళ గ్రంథ జ్ఞానమును చూచినా లేక గ్రంథ బోధను వినినా దానిని అర్థము చేసుకోకుండా నాకు జ్ఞానము తెలుసునని గర్వముగా యున్నవారికి దేవుని రక్షణ ఉండదు. అందువలన అటువంటి వారిని ఉద్దేశించి 'నేను మీ రక్షకుడను కాను' యని ప్రజలకు చెప్పుయని ప్రవక్తగారికి దేవుడు జిబ్రయేల్ ద్వారా చెప్పాడు. దేవుని దగ్గర నుండి జ్ఞాన నిదర్శనములు వచ్చినప్పుడు వాటిని గ్రహించిన వాడు ధన్యుడు. వాడు తన మేలుకొరకే జ్ఞానమును గ్రహించాడు. ఎందుకనగా! వానికి దేవుని రక్షణయను మేలు కలుగనున్నది. దేవుని జ్ఞానము గ్రహించనివాడు నష్టపోయినవాడగును. దేవుని రక్షణ లేకుండా పోవడమే అతనికి నష్టమని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

45. ఏమి చేసినా వాళ్ళు విశ్వసించరు. (6-111)

ఏ మనిషి అయినా మొదట తనకు అర్థమయినదే సత్యమని పూర్తిగా విశ్వసించియుండును. తనకు మొదట తెలిసినదే సత్యమని విశ్వసించి యుండుట వలన రెండవమారు తెలిసినది ఏదయినా అసత్యమను నిర్ణయము కలిగి యుండును. ఉదాహరణకు పాము కరిస్తే చనిపోతాము అని మొదట తెలిసినవాడు ఎప్పటికీ అది సత్యమేయని నమ్మియుండును. అటువంటి వానికి పాముకాటుకు గురియైన వారందరూ చనిపోరు అని చెప్పితే అది అసత్యముగా కనిపించును. నాగుపాము కరిస్తే చనిపోవు మాట వాస్తవమే. అయితే పూడుపాము కరిస్తే చనిపోడు అనుమాట కూడా వాస్తవమే. పాములలో తేడా తెలియనివాడు తనకు తెలిసిన మొదటి మాటనే సత్యమంటున్నాడు గానీ, అన్ని పాములు విషమున్నవి కాదను విషయము అతనికి తెలియకపోవడము వలన ఏ పాము కరచినా చనిపోతారనే అతను నమ్ముచున్నాడు. అట్లు అన్ని పాముల వలన చనిపోడని వేయిమంది వచ్చి చెప్పినా ఆ మాటలను నమ్మేస్థితిలో ఉండడు. అలాగే దేవుని విషయములో ముందు తనకు అర్థమయినదే సత్యమని తర్వాత ఎవడు ఏది చెప్పినా అది అసత్యమని అనుకోవడము జరుగుచున్నది.


ఉదాహరణకు 'దేవునికి పుట్టుకలేదు' అని మొదట చదివినప్పుడు గానీ, తెలుసుకొన్నప్పుడు గానీ దానినే పూర్తి నమ్మినవాడు తర్వాత 'దేవుడు జన్మిస్తాడు' అనుమాట పూర్తి అసత్యము అని అంటాడు. అట్లుకాదు 'దేవుడు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకమారు జ్ఞానమును బోధించుటకు జన్మిస్తాడు' యని ఎంత చెప్పినా అతడు నమ్మేస్థితిలో ఉండడు. తనకు మొదట తెలిసిన దానికి భిన్నముగా బోధించు వానిని అసత్యము చెప్పువానిగా లెక్కించును. తర్వాత చెప్పువాడు సత్యమునే చెప్పినా, మొదటి దానిని నమ్మినవాడు రెండవమాటను ఏమాత్రము నమ్మడు. దేవుడు జ్ఞానబోధ చేయు అవసర నిమిత్తము జన్మిస్తాడని చెప్పినా, అలా జన్మించడము శాస్త్రబద్దమైన సత్యమే అయినా దానిని అసత్యముగానే లెక్కించును. అదే విధముగా 'దేవుడు జన్మించడు, దేవునికి జన్మలు లేవు' అని మొదట తెలిసిన ముస్లీమ్‍లు తర్వాత ''దేవుడు అవతరిస్తాడు, మనుషుల మధ్యలోకి వస్తాడు. అప్పుడు మీరు కూడా నమస్కరించండి, దేవుని రాకను తెలిసిన దేవదూతలు వచ్చిన వానికి సాష్టాంగ దండ ప్రణామము చేశారు. అయితే మాయతో కూడుకొన్నవాడు మనిషివలె వచ్చిన దేవున్ని నమస్కరింపడు'' అని దైవ గ్రంథములో చెప్పినా వినే స్థితిలో ఉండరు. అలా చెప్పినమాటను అసత్యముగా లెక్కింతురు.


ఈ విధముగా మనుషులు మొదట తెలిసిన దానినే నమ్ముదురని తర్వాత తెలిసినది ఎంత సత్యమని చెప్పినా నమ్మరని తెలుపుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా ఆరు, ఆయత్ 111 లో ఇలా కలదు చూడు.


(6-111) ''మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ల ఎదుటే తెచ్చి పెట్టినా వారు విశ్వసించడమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయము. అయితే వీరిలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే.''


ఈ వాక్యములో దూతలు అని ఒక పదము, మృతులు అని మరొక పదము చెప్పబడినది. వీరి విషయమును గురించి బాగా తెలియగలిగితే దేవదూతలు రెండు రకములు కలరు. ఒకటి భూతములు, రెండు గ్రహములు. భూతములను, గ్రహములను దేవదూతలుయని చెప్పడమైనది ఇకపోతే మృతులు అనగా చనిపోయినవారు. మన లెక్కలో చనిపోయినా వారు పూర్తి చనిపోక అకాల మరణము పొందియుండుట వలన వారు స్థూలశరీరము లేకుండా సూక్ష్మముగా బ్రతికేయుందురు. అట్లు ఉన్నవారు ఇతరుల శరీరములలో ఆవహించి మాట్లాడగలరు. అజ్ఞానపు దారిపట్టి, అజ్ఞాన వాక్యములను విశ్వసించిన వారికి సత్యమైన జ్ఞానమును ఎంత చెప్పినా వారు వినరని చెప్పుచూ అటువంటి వారికి దేవదూతలయిన భూతములు, గ్రహములు బాధించినా, సూక్ష్మశరీరముతో యున్న మృతులు వచ్చి మాట్లాడి చెప్పినా వినే స్థితిలో ఉండక తమకు తెలిసినదే సత్యమని వాదించుచుందురు.


మూడవది 'సమస్త వస్తువులు వారి కళ్ల ఎదుట పెట్టినా' అని ఉంది. దీనికి ముందు చెప్పిన దేవదూతలు, మృతులు ఇద్దరూ సూక్ష్మమైన వారే అనగా కంటికి కనిపించని వారే, మూడవదయిన 'సమస్త వస్తువులు' అనుమాట కంటికి కనిపించు స్థూలమైనదని అందరూ అనుకోవచ్చును. అయితే ఈ ఆయత్‍లో చెప్పిన దూతలు, మృతులు, సమస్త వస్తువులు మూడు సూక్ష్మమైనవేగాని ఇందులో ఒకటి కూడా స్థూలమైనది లేదు. సమస్త వస్తువులు స్థూలముగా కంటికి కనిపించునవే కదా!యని ఎవరయినా అనుకోవచ్చును. దూతలు, మృతులు చెప్పితేనే విననివారు కనిపించే వస్తువులను చూచి మారుతారని అనుకోవడము పొరపాటు. ఇక్కడ మూడవ దయిన వస్తువులు కూడా సూక్ష్మమైన వాక్యమేయని తెలియవలెను. సమస్త వస్తువులు అనుమాట సూక్ష్మమైనదని చెప్పుటకు ఒక ఆధారము గలదు. ''క్రింద భూమిని పైన ఏడు ఆకాశములను వాటి మధ్యలో సమస్త వస్తువులను సత్యసమేతముగా దేవుడు సృష్ఠించాడని'' అంతిమ దైవ గ్రంథములో చెప్పబడినది. బయట కనిపించు భూమిని బయట కనిపించు ఆకాశములు వాటి మధ్యలో గల సమస్త వస్తువులు అనుమాట స్థూలమైనది కాదు. కనిపించు ఆకాశము ఒకటే గలదు, కనిపించని ఆకాశములు ఏడు గలవు. అందువలన ఈ వాక్యము సూక్ష్మమైనదని చెప్పవచ్చును. శరీరమునకు క్రింద గల కాళ్ళను భూమి అనియూ, పైన తలను ఏడవ ఆకాశమనియూ కాళ్ళు, తల మధ్యలోగల శరీర భాగములన్నిటినీ సమస్త వస్తువులని అర్థము చేసుకొన్నప్పుడే ఈ వాక్యము సరియైన పద్ధతిలో అర్థము కాగలదు.


శరీరములోని అన్ని అవయవములను తెలియజేస్తూ అవి ఏ శక్తి వలన పని చేయుచున్నవో, వాటి నిర్మాణము ఎలా సాగినదో అన్ని అవయవముల వలన మనిషికి గల ఉపయోగమేమి? అవయవముల వలన మనిషి ఎలా జీవించగలుగుచున్నాడో వివరముగా కనిపించునట్లు తెలియ జేసినా అజ్ఞాని అయినవాడు అనగా అవిశ్వాసి అయినవాడు దేవుని జ్ఞానమును విశ్వసించక తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్లు వాదించుచూ అజ్ఞాన మాటలనే మాట్లాడుచుందురు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

46. నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనము,నా మరణము అన్నీ అల్లాహ్కే అర్పితము. (6-162)

మనిషి జీవితమును దేవుడే ఇచ్చాడని మనుషులు నమ్మడము లేదు. మనమే పని చేస్తున్నాము, మనమే జీవితమును కొనసాగిస్తున్నాము మధ్యలో దేవుడు ఏమి చేశాడు? అని కొందరు ప్రశ్నించుచున్నారు. పైకి కనిపించు జీవితము తప్ప దాని వెనుకదాగియున్న రహస్యము తెలియదనియే చెప్పవచ్చును. జీవితము వెనుక జరిగే తతంగమును చెప్పినా మనిషి వినేటట్లు లేడు. అలా వినకపోవడము అజ్ఞానమేయని చెప్పవచ్చును. జ్ఞానము మీద ఆసక్తి యున్నవారు, జ్ఞానులు అయినవారు రహస్యమైన శరీరయంత్రాంగమును గురించి చెప్పితే అర్థము చేసుకోగలరు. సాధారణ మనిషి చేసే ప్రార్థన గానీ, జీవనములో చేసే పనులన్నీ గానీ చివరకు మరణము వరకు అన్నీ తానే చేయుచున్నానను అహముతో కూడుకొన్న భావము (అహంభావము) కలిగియున్నాడు. ఇది ప్రపంచములో అందరి భావన అలాగే యున్నది.


అయితే దైవ జ్ఞానమును సంపూర్ణముగా తెలిసినవాడు జీవితములో జరుగుపనులన్నీ తాను ఏమాత్రము చేయడము లేదనీ, శరీరములో రహస్యముగా యున్న దేవుడే చేయిస్తున్నాడని తలచి అన్ని పనులు దేవునికే సమర్పణయనీ అనుకొనును. ఆ విషయమై సూరా ఆరు, ఆయత్ 162 లో ఇలా వ్రాసియుంచారు చూడండి.


(6-162) ''ఈ విధముగా ప్రకటించు ''నిస్సందేహముగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనము, నా మరణము ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.''


ఈ ఆయత్‍లో ఎంతో నిగూఢమైన అర్థము ఇమిడియున్నది. అది తెలియాలంటే శరీర యంత్రాంగమును తెలిసియుండాలి. శరీరము ఒక యంత్రములాంటిది అందులో జీవుడు యంత్రములో ఉపయోగపడు ఇంధనములాంటివాడు, దేవుడు యంత్రములోని శక్తిలాంటివాడు. యంత్రములోని శక్తి యంత్రమును ఆడునట్లు చేయుచూ యంత్రము వలన అనేక పనులు జరుగునట్లు చేయుచున్నది. అలాగే శరీరయంత్రము చేత బయట పనులు ఎన్నో జరుగుచున్నవి. శరీరము చేత చేయుచున్న ప్రార్థనగానీ, ఆరాధనలుగానీ, జీవన కార్యములుగానీ అన్నీ శరీరములో శక్తియైయున్న దేవుని చేతనే జరుగుచున్నవి. శరీర యంత్రాంగమును తెలిసిన జ్ఞాని తాను ఏమీ చేయలేదని, తాను నిమిత్తమాత్రుడనేననీ, అన్ని కార్యములను శరీరములో దీపమువలెయున్న దేవుడే చేయుచున్నాడని అనుకొనును. అప్పుడు జననము నుండి మరణము వరకు శరీరములో జరుగు అన్ని కార్యములకు దేవుడే కారణమనీ, ఆయనే చేయిస్తున్నాడని తెలిసి అన్ని కార్యములు ఆయనకే సమర్పణయని అనుకొనును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

47. ప్రతి దానికి ఆయనే ప్రభువు. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసే వాడు ఇంకొకరి బరువును మోయడు. మీరు ప్రభువు వద్దకు పోయినప్పుడు మీరు విభేదించినది చెప్పును. (6-164)

ప్రపంచములో సర్వమానవులకు ఒక్కడే దేవుడు. ఆ విధముగా సృష్ఠింపబడిన వారందరూ ఒకే దేవుని ఆధీనములో ఉన్నారు. సర్వ శరీరములు అల్లాహ్ (దేవుని) ఆధీనములోనే ఉన్నాయి. అన్ని శరీరములలో చైతన్యశక్తిగా దేవుడున్నాడు. శరీరములలోనున్న దేవున్ని ఆత్మయని అంటున్నాము. ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీరమునకు అధిపతిగా ఉన్నది. శరీరములో అధిపతిగా యున్న దేవుడు జీవుడు చూస్తున్నట్లే జీవునికి తెలియునట్లే బుద్ధికి ఆలోచనలు ఇచ్చి, మనస్సుకు ఆజ్ఞలు ఇచ్చి శరీరము చేత పనులను చేయిస్తున్నాడు. అయితే దేవుడు చేయించగా, శరీరము చేయగా శరీరములో ఏమీ చేయని జీవుడు అన్ని కార్యములను తానే చేయుచున్నట్లు అనుకొంటున్నాడు. బుద్ధి చేయు ఆలోచనలు, మనస్సు ద్వారా వచ్చు ఆజ్ఞలు అన్నీ తనవేనని మనిషి (జీవుడు) అనుకోవడము జరుగుచున్నది. అందువలన శరీరములో జరిగిన పనులకు దేవుడు బాధ్యుడు అయినా మనిషి తాను చేయుచున్నట్లు అనుకోవడము వలన జరిగిన కార్యములన్నిటికీ జీవుడే బాధ్యుడు అగుచున్నాడు. దేవుడు చేసినా నేనే చేశానని జీవుడు అహంభావమును పొందుట వలన ఆ కార్యములలోని మంచి, చెడు ఫలితములయిన పుణ్యము, పాపము రెండూ జీవునికే చెందుచున్నవి. అందువలన ఎవరు చేసిన కార్యములకు వారే బాధ్యులు అని వాక్యములో చెప్పారు.


మనిషి జ్ఞానమును కలవాడైతే అన్ని కార్యములను శరీరములో గుప్తముగాయున్న ఆత్మే (దేవుడే) చేయుచున్నాడని తెలియగలుగును. దైవ జ్ఞానము లేనివానికి అహంభావము కలిగి అన్నీ నేనే చేయుచున్నానని అనుకొనును. బరువును మోయువాడు తెలిసి ఇంకొకరి బరువును తీసుకొని మోయడు. అలాగే పాపములను అనుభవించు జీవుడు జ్ఞానమును తెలిసిన తర్వాత తనకు తెలిసి జరిగినా ఆ పనులు తాను చేయలేదనీ, శరీరములో అధిపతిగాయున్న ఆత్మే అన్నీ చేయుచున్నాడని, శరీరములో జరిగెడి మంచి పనులకు, చెడు పనులకు తాను కారణము కాదనీ, శరీరమునకు అధిపతియైన దేవుడే సర్వకార్యములను చేయుచున్నాడని, శరీరము ద్వారా బయట జరిగే కార్యములకు, అట్లే శరీరము లోపల రాత్రింబగళ్లు జరిగే శరీర అంతర్ముఖ కార్యములను దేవుడే చేయుచున్నాడని అలా శరీరము లోపల, శరీరము బయట కార్యములను చేయడములో సూరా రెండు, ఆయత్ 255 (2-255) లో చెప్పినట్లు ''ఆయనకు అలసట రాదు, అట్లే కునుకు రాదు.'' శరీరములో (2-186) లో చెప్పినట్లు ''జీవునికి అత్యంత సమీపమున ఉండి కార్యములను చేయుచున్నాడని'' తెలియగలిగిన వాడు శరీరము బయట జరిగే పనులను తాను చేశానని ఒప్పుకోడు. అజ్ఞాన దశలో అలా ఒప్పుకొని చెడు కార్యములలోని పాపమును అనుభవించువాడు, పాప భారము ఎంత బరువైనదో, ఎంత కష్టమైనదో తెలిసి, జ్ఞానము కల్గిన తర్వాత తన పొరుగువాడయిన ఆత్మ చేయు కార్యములకు తాను బాధ్యుడు కాదని అనుకొనును. ఇదే విషయమును చెప్పుచూ వాక్యములో (6-164) లో ''బరువును మోయువాడు ఇంకొకరి బరువును మోయడు'' అని అన్నారు. వాక్యమును పూర్తిగా చూస్తే ఇలా కలదు చూడండి.


(6-164) ఇలా అను ''నేను అల్లాహ్‍ను వదలి వేరొకరిని దేవునిగా స్వీకరించాలా! సర్వులకు అల్లాహ్ ఒక్కడే ప్రభువు. ప్రతి వ్యక్తి తాను సంపాదించినదే అనుభవిస్తాడు. బరువును మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపుకు మరలి పోవలసియున్నది. అప్పుడు ఆయన మీరు ఏ విషయములలో భేదాభిప్రాయములు కల్గియుండేవారో వాటిని మీకు తెలియజేస్తాడు.''


ఈ వాక్యములో సగము వరకు వివరముగా తెలుసుకొన్నాము. 'బరువును మోసేవాడు ఇతరుల బరువును మోయడు' అని తెలుసుకొన్నాము. ఇతరుల బరువు అనగా శరీరములో ఆత్మ చేసిన కార్యములలో వచ్చిన పాపపుణ్యములను బరువును జ్ఞాని అయిన జీవుడు మోయడు అని తెలియ గలిగాడు. జ్ఞానమును తెలిసినవాడు గానీ, జ్ఞానమును తెలియనివాడు గానీ ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. అప్పుడు మనిషి సంపాదించు కొన్న పాపపుణ్యములను బట్టి తొలి జన్మవలె మలి జన్మను దేవుడు కలుగ జేయును. దానినే 'తీర్పు దినము' అంటున్నాము. తీర్పు దినమును అంతిమ దినము అని కూడా అనుచున్నాము. అంతిమ దినము అనగా జీవితములో చివరి రోజు. అదే మనిషి మరణించిన రోజు.


మనిషి మరణించిన సమయములో ఒక సెకను కాలములో దేవుడు తీర్పు తీర్చి తిరిగి మలి జన్మకు పంపును. అలా జరుగు తీర్పు సమయములో అనగా ఒక్క క్షణకాలములోనే జరుగవలసినవన్నీ జరిగిపోవును. ఇది అందరికీ తప్పక జరుగును. కావున వాక్యములో మీరందరూ ప్రభువువైపుకు మరలి పోవలసిందేయని అన్నారు. అది తప్పనిసరిగా జరిగే పనియైనా మరణ సమయములో ఒక్కక్షణములో జరిగే తీర్పును గురించి ఎవరికీ తెలియదు. కొందరు జ్ఞానులకు ఈ విషయము తెలిసినా మరణములోనూ, పుట్టుకలోనూ ఎవరికీ జ్ఞాపకము ఉండదు. అనగా మననము (జ్ఞాపకము) చేయు మనస్సు ఉండదు. అందువలన తీర్పు సమయములో ఏమి జరిగినది ఎవరికీ తెలియదు, అనగా జ్ఞాపకము ఉండదు. తీర్పు సమయములో పాపపుణ్యములకు తగిన శిక్షలను, సుఖములను నిర్ణయించడమే కాకుండా మనిషి తన జీవితములో ఏయే విషయములలో దేవునితో, దేవుని జ్ఞానముతో భేదాభిప్రాయములు కలిగియున్నాడో దేవుడు తెలియజేసి దానికి తగిన శిక్ష విధించును. సాధారణముగా మనిషి కొన్ని విషయములలో దేవున్ని నమ్మడము, కొన్ని విషయములలో నమ్మకపోవడము జరుగుచున్నది. ఉదాహరణకు 'దేవుడు ఒక్కడే'యను విషయమును కొందరు నమ్ముచున్నారు, కొందరు నమ్మడము లేదు. ముస్లీమ్‍లు 'దేవుడు ఒక్కడే'యని అనుచుండగా హిందువులు అనేక దేవుళ్లను ఆరాధించుచున్నారు. దేవుడు ఒక్కడేయను సత్యమును ముస్లీమ్‍లు నమ్మగా, హిందువులు నమ్మలేకపోవుచున్నారు. అందువలన తీర్పు దినమున ఈ విషయములో ముస్లీమ్‍లను వదలివేసి హిందువులను దేవుడు శిక్షకు గురి చేయును.


అదే విధముగా 'దేవుడు మనిషిగా అవతరిస్తాడు' అను సత్యమును హిందువులు గ్రహించగా, ముస్లీమ్‍లు ఆ విషయములో విభేదించి 'దేవుడు అవతరించడు' అని చెప్పుచుండుట వలన తీర్పు దినమున ఆ విషయములో హిందువులను వదలివేసి ముస్లీమ్‍లకు వారి తప్పును తెలియజేసి దానికి తగిన శిక్షను విధించును. కొందరు ఒక గురువును గొప్పగా గౌరవించడము, మరొక గురువును దూషించడము చేయుచుందురు. గురువుల (బోధకుల) విషయములో నిజమైన బోధకున్ని దూషించడము వలన వచ్చు పాపమును తీర్పు దినమున చెప్పబడును. ఇట్లు దేవుడు, దేవుని జ్ఞానము, బోధకులు మొదలగు అనేక విషయములలో మనుషులు కొందరు విభేదించడము వలన ప్రపంచ పాపములనే కాకుండా దైవ సంబంధ పాపములకు శిక్షలు తీర్పు దినమున ఖరారు చేయబడును. అయితే మనిషి అయినవాడు తీర్పు దినమును నమ్మలేకపోవుచున్నాడు. ఒకే దేవుడని నమ్మినవారు కూడా తీర్పు దినము మరణించిన సమయమేయని తెలియలేక పోవు చున్నారు. ఈ విషయములన్ని గ్రహించుటకు ముఖ్యముగా మరణ సమయములో తీర్పు జరుగు విధానమును ఈ ఆయత్‍లో చెప్పడము జరిగినది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

48. విశ్వసించిన వారికి ఇది హితబోధిని. (7-2)

(7-2) ''ఓ ప్రవక్తా! ఇది ఒక గ్రంథము. దీని ఆధారముగా నీవు ప్రజలను హెచ్చరించటానికిగానూ ఇది నీ వద్దకు పంపబడినది. కాబట్టి దీనిపట్ల నీ మనసులో ఎటువంటి సంకోచము ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (దైవ జ్ఞానము తెలియజేయు జ్ఞాపిక).''


కాగితములో వ్రాయబడిన దానిని లేక వ్రాయబడిన కాగితములు కూర్చబడిన దానిని పుస్తకము లేక గ్రంథము అని అంటాము. అందులో వ్రాయబడిన విషయములనుబట్టి అది గ్రంథమా లేక పుస్తకమా అని నిర్ణయించడము జరుగును. ప్రపంచ విషయములు ఏవియున్నా అది పుస్తకము అని చెప్పబడును. దైవ విషయములు ఏవియున్నా అది గ్రంథము అని చెప్పబడును. ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే తలలో వచ్చు ప్రపంచ ఆలోచనలున్న దానిని పుస్తకము అని చెప్పడము జరుగుచున్నది. దానినే మస్తక విషయములు గలది పుస్తకము అని అంటున్నారు. నాడులను, గ్రంథులను నడుపు శక్తి నుండి వచ్చు విషయములున్న దానిని గ్రంథము యని అంటున్నారు. దానినే గ్రంథిశక్తి నుండి పుట్టుకొచ్చిన విషయములు గలది గ్రంథము అని అంటున్నాము. గ్రంథిలో దైవశక్తి పని చేయుచున్నది. దైవశక్తి వలన వచ్చు జ్ఞాన విషయములు గలది గ్రంథము. ఖుర్ఆన్ దైవ శక్తి వలన వచ్చిన సమాచారము గలది కావున దానిని గ్రంథము అనియూ, దైవ గ్రంథము అనియూ అంటున్నాము. దేవుడు ఆకాశము ద్వారా (వాణి ద్వారా) అందించిన జ్ఞానమును జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పగా, అది గ్రంథరూపముగా మారినది, దానినే అంతిమ దైవ గ్రంథము అని అంటున్నాము.


అంతిమ దైవ గ్రంథమునకు కొందరు ఖుర్ఆన్ అని పేరు పెట్టారు. అంతిమ దైవ గ్రంథములోని జ్ఞాన సమాచారమును చెప్పి ప్రజలను తప్పు దారిలో (అజ్ఞాన దారిలో) పోకుండా హెచ్చరించమని, మేలుకొల్పమని ప్రవక్తగారికి చెప్పడమైనది. మొదట నీవద్దకు పంపబడిన జ్ఞానము ఎడల నీవు ఎటువంటి సంకోచము లేకుండా బాగా అర్థము చేసుకొని ఇతరులకు చెప్పమని ప్రవక్తగారికి మొదటే చెప్పారు. ప్రవక్తగారు ఎంతో వివరముగా చెప్పిన జ్ఞానమును ఎవరయితే బాగా తెలియగలరో వారికి ఇది సర్వ విధముల మంచిని చేకూర్చు హితబోధిని యని కూడా వాక్యములో చెప్పారు. గ్రంథములో జ్ఞానము ఉన్నా దానిని సంశయము లేకుండా, తప్పు భావముల లోనికి పోకుండా తెలియజేయు వ్యక్తి అవసరము. అలా జ్ఞానమును బోధ రూపములో తెలియజేయు బోధకుడు లేనిదే ఎవరికీ జ్ఞానము అర్థము కాదు. బోధకుడుగా యున్నవాడు మొదట తాను ప్రతి విషయములోని సత్యమును తెలిసియుండును. అలా తెలిసి అంతిమ దైవ గ్రంథమును వివరముగా చెప్పినవాడు ముహమ్మద్ ప్రవక్తగారు. నేడు ఆయన లేడు కావున కొందరు ముస్లీమ్‍లు కొన్ని ఆయత్‍లను తప్పుగా అర్థము చేసుకొను అవకాశము గలదు.


నేడు అంతిమ దైవ గ్రంథములోని కొన్ని వాక్యములలో సంకోచము కల్గునట్లు కొందరు అర్థము చేసుకొంటున్నారు. అలా సత్యసమేతముగా అర్థము కానప్పుడు ఆ వాక్యములో కలుగు సంశయములకు జవాబులు ఉండవు. జవాబులేని జ్ఞానము సంకోచ జ్ఞానము అగును. అది సత్యమైన జ్ఞానము కాదు. ఉదాహరణకు మనుషులు చనిపోతే తిరిగి ప్రళయ కాలమున సమాధులనుండి లేపబడును అని ఉన్నది. ఈ వాక్యమును నేడు ప్రతి ఒక్కరు సరియైన భావము ప్రకారము అర్థము చేసుకోలేదు. కొన్ని లక్షల సంవత్సరములకో, కోట్ల సంవత్సరములకో వచ్చు ప్రళయ దినమున చనిపోయిన వారందరినీ వారివారి సమాధుల నుండి దేవుని చేత లేపబడుదురు అని అర్థము చేసుకొన్నారు. వారు అర్థము చేసుకొన్నది సత్యమేయని వారు అనుకొనినా, వాస్తవానికి అది దూరముగా యున్నదని వారికి తెలియదు. ప్రళయము ఎప్పుడో వస్తుంది అనుకోవడము పొరపాటు. ప్రళయము అనగా మరణించు సమయమనీ, సమాధి అనగా తల్లిగర్భము యని సూక్ష్మ అర్థమును తెలియలేకపోయారు. ప్రతి వాక్యమును స్థూలముగా అర్థము చేసుకొంటే గ్రంథములో సూక్ష్మవాక్యములున్నవని చెప్పిన (3-7)వ వాక్యము ఏమి కావలెను? దేవుడు తన గ్రంథమున ముతషాబిహాత్ (సూక్ష్మ) వాక్యములున్నవని చెప్పినమాట వ్యర్థము కాకూడదు అంటే వాక్యము స్థూలముగా చెప్పినా, అందులో సూక్ష్మము ఇమిడియున్నదని తెలిసి సరిగా అర్థము చేసుకొన్నప్పుడు గ్రంథములోని వాక్యములు సంశయము లేకుండా అర్థమయినట్లు లెక్కించవచ్చును. సూక్ష్మ విషయములు తెలియకపోతే అతనిలో ఎన్నో సంకోచములు ఉన్నట్లు తెలియవలెను. ముహమ్మద్ ప్రవక్త గారు ప్రతి విషయమును పూర్తిగా తెలిసి వాక్యములను బయటి ప్రజలకు చెప్పారు. అయితే నేడు ప్రజలే దైవ గ్రంథమును సరిగా అర్థము చేసుకోలేదు. 'అంతిమ దినమున ప్రళయ కాలములో చనిపోయిన వారిని వారివారి సమాధుల నుండి లేపును' అని చెప్పడమేకాక 'సమాధి నుండి లేచినవాడు గుడ్డలు లేకుండా నగ్నముగా ఉండును' అని చెప్పాడు.


ఈ విషయమును విశధీకరించుకొని అర్థము చేసుకొంటే 'చనిపోయినవాడు తిరిగి తల్లిగర్భము అను సమాధి నుండి లేచును' అని చెప్పుచూ తల్లిగర్భము నుండి వచ్చిన వారికి గుడ్డలు ఉండవనీ వారు నగ్నముగా యుందురని అర్థముతో సమాధినుండి వచ్చిన వారికి దుస్తులు ఉండవని చెప్పాడు. అప్పుడు ప్రవక్తగారి చిన్న భార్య అయిన ఆయెషా అను ఆమె సమాధి అంటే తల్లిగర్భము అని అనుకోక భూసమాధియని అనుకోవడము వలన ప్రవక్తగారిని ఒక ప్రశ్న అడిగింది. అదేమనగా! ''మేము స్త్రీలము మమ్ములను అల్లాహ్ సమాధినుండి లేపినప్పుడు శరీరము మీద గుడ్డలు లేకపోతే మాకు మానము, మర్యాద పోవును కదా! అది స్త్రీలకు అవమానకరము కాదా?''యని అడిగింది. అప్పుడు ప్రవక్తగారు ఇలా చెప్పాడు. ''సమాధుల నుండి లేపబడిన వారికి ఆ సమయములో బయట ప్రపంచ స్పృహలు ఉండవు. అందువలన ఎవరికీ మర్యాద పోదు'' అని అన్నాడట. ఇదంతయూ గమనించితే ప్రవక్త గారికి సత్యము తెలిసి పోయినదనీ, చనిపోయినవాడు వెంటనే వేరొక శరీరము ధరించి తల్లిగర్భము నుండి నగ్నముగా పుట్టునని తెలిసి చెప్పాడని అర్థమగుచున్నది. ఈ విధముగా ప్రతి వాక్యమును సంశయము లేకుండా తెలియగలిగినప్పుడు అందరికీ దైవ గ్రంథము హిత బోధినియగును. అర్థము కానప్పుడు సరియైన భావము తెలియనప్పుడు వారికది అహిత బోధిని యగును. అప్పుడు దైవ గ్రంథము యొక్క లాభమును మనిషి పొందలేడు. అందువలన ఆలస్యమైనా ఫరవాలేదు గ్రంథమును సరిగా అర్థము చేసుకోండి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

49. ఎవరి వద్దకు ప్రవక్తలను పంపామో వారిని తప్పక అడుగుతాము. (7-6), వారికి అన్నీ విప్పి చెప్పుతాము, మాకు అన్నీ తెలుసు. (7-7)

ఇక్కడ 7-6, 7-7 వాక్యములను చూస్తే దేవుడు జ్ఞానమును తెలియు మనుషులను తిరిగి ప్రశ్నించును. అట్లే జ్ఞానము చెప్పు బోధకులను అడగకమానడనీ, అందువలన తెలియువారు, తెలియజెప్పువారు సరియైన వివరణ తెలిసియుండాలియని హెచ్చరించినట్లు ఇక్కడ చెప్పిన రెండు ఆయత్‍లు గలవు. ఇప్పుడు ఆ రెండు వాక్యములను చూస్తాము.


(7-6) ''ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.''


(7-7) ''మాకు ప్రతీదీ తెలుసు గనుక తర్వాత వారి ముందు ఉన్నదున్నట్లు విప్పి చెప్పుతాము. మాకు ఏదీ తెలియకుండా లేదు.''


ఈ వాక్యములో 'ప్రవక్తలు' అని చెప్పారు. ప్రవక్తలు అనగా ముహమ్మద్ ప్రవక్తగారు కాదు. జ్ఞానమును చెప్పు బోధకులనందరినీ ప్రవక్తలు అని అనడము జరిగినది. బోధకుల ద్వారా ఎవరయితే జ్ఞానమును విన్నారో వారందరూ దైవజ్ఞానమును సరిగా అర్థము చేసుకొన్నారో లేదోయని తెలియు నిమిత్తము వారిని తప్పక ప్రశ్నించి చూస్తాము. అప్పుడు వారు తెలిసినది సత్యమో కాదో తెలిసిపోవును. జ్ఞానమును ప్రవక్తల ద్వారా విన్నవారినే కాకుండా జ్ఞానమును చెప్పిన ముఖ్య వక్తలయిన బోధకులను కూడా తప్పకుండా ప్రశ్నిస్తాము. అప్పుడు వారు చెప్పినది తప్పో ఒప్పో తెలిసి పోవును. అలా ప్రశ్నించడము వలన ఎవరి జ్ఞానము వారికి సత్యమో కాదో తెలిసిపోవును. అయినా తాము చెప్పినది అసత్యమైనదని కొందరు గురువులకు (బోధకులకు) తెలిసినా మాది సత్యమేయని వాదించు వారు గలరు. అటువంటి బోధకులు ప్రజలకు అసత్యమునే చెప్పుచూ అందరినీ తప్పు దారి పట్టించుచుందురు. అటువంటి వారికి దేవుడే దిగివచ్చి ఉన్నదున్నట్లు విప్పి చెప్పును. దేవునికి తెలియని జ్ఞానము ఏదీ లేదు. దేవుడు సూక్ష్మమైనవాడు. అందువలన సూక్ష్మ జ్ఞానరహస్యమంతయూ అల్లాహ్‍కు తెలుసు. అల్లాహ్ మనిషి రూపములో నుండి జ్ఞానమును సవివరముగా చెప్పినప్పుడు సత్యమైన జ్ఞానము ఇటు మనుషులకు, అటు బోధకులయిన వక్తలకు తెలియును. దేవుడు భూమిమీద సత్యసమేతమైన జ్ఞానమును మనిషివలె వుండి మనుషుల భాషలోనే చెప్పును. అప్పుడు అన్ని భాషలవారు ఎవరికి ఎంత ఆసక్తియుండునో అంత జ్ఞానమును తెలియగలరు. చివరకు దేవుడు చెప్పనిదే ఇటు ప్రజలకు, అటు బోధకులయిన ప్రవక్తలకు జ్ఞానము తెలియదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

50. మొదటిసారి అల్లాహ్ మిమ్ములను ఎలా పుట్టించాడో, మలిసారి కూడా అలాగే పుట్టించబడతారు. (7-29)

ఒక మనిషి ఒకమారే పుట్టి చనిపోతాడని, చనిపోయిన తర్వాత ప్రళయము వరకు భూసమాధులలోనే ఉంటారని, ప్రళయములో అల్లాహ్ సమాధుల నుండి చనిపోయిన వారిని లేపి వారి పాపపుణ్యములను విచారించి స్వర్గానికో, నరకానికో పంపునని ముస్లీమ్‍లు అనుకొంటున్నారు. మనిషి చనిపోయేది, సమాధుల నుండి లేచేది, దేవుడు తీర్పు తీర్చేది, ప్రళయ కాలము మొదలగునవి అన్నీ సూక్ష్మ జ్ఞానమే అయినదానివలన సూక్ష్మ జ్ఞానదృష్ఠి లేనివారు వాక్యములోని సత్యము తెలియక స్థూలముగా అర్థము చేసుకొన్నారు. చీకటిలోని త్రాడును పామని భ్రమించినట్లు, ప్రళయమంటే ఎప్పుడో వచ్చునదనీ సమాధులంటే భూమిలో ఉన్నవని అనుకోవడము జరుగుచున్నది. వాక్యమును స్థూలముగా అర్థము చేసుకోవడము వలన వాక్యములోనున్న భావము అంతయూ దారితప్పి తప్పుగా చెప్పుకోవడము జరిగినది. చనిపోయిన వాని మృత దేహమును భూమిలో పూడ్చగా ఆరు నెలలకు శవము పూర్తి కుళ్లిపోయి మట్టిలో కలిసిపోవుచున్నది. మనిషి మృత శరీరమును శవముగా భూమిలో పెట్టుచున్నారుగానీ మనిషిని సజీవముగా భూమిలో పాతిపెట్టలేదు కదా! అలాంటప్పుడు చనిపోయిన వాడు భూసమాధిలో ఉన్నాడని చెప్పడము పొరపాటు కాదా! మనిషి బ్రతికినప్పుడు శరీరములో యున్న జీవుడు ఎవరికీ కనిపించడు. కనిపించని జీవుడు మరణములో ఎట్లు శరీరము నుండి బయటికి పోయేది, ఎక్కడికి పోయేది ఎవరూ చూడలేదు. అటువంటప్పుడు సూక్ష్మమైన జీవున్ని స్థూలముగా చూచినట్లు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ప్రళయము వరకు భూమిలో ఉన్నాడు అని చెప్పుకోవడము తప్పుకాదా!


దైవ గ్రంథము అను పేరు ఒక్కటే అయినా దైవ గ్రంథములు మూడుగా ఉన్నాయి. ఒకటి తౌరాత్ (భగవద్గీత), రెండు ఇంజీలు (బైబిలు), మూడు ఖుర్ఆన్. దైవ గ్రంథములు మూడుగా యున్నా అందులోని జ్ఞానము ఒకదానితో మరొకటి అనుసంధానము చేయబడియున్నది. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలోని జ్ఞానమే మిగతా రెండు దైవ గ్రంథములలో యున్నదని చివరిగా వచ్చిన ఖుర్ఆన్ గ్రంథమే ధృవీకరించి చెప్పుచున్నది. ఈ విషయమును సూరా ఐదు, ఆయత్ 48లో చూడవచ్చును.


(5-48) ''మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్‍ను) సత్య సమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరించుచున్నది. నీవద్దకు వచ్చిన సత్యమును విడచి వారి మనోవాంఛలను అనుసరించకు.''


ఈ వాక్యము ప్రకారము 5000 సంవత్సరముల ముందు వచ్చిన భగవద్గీత, 2000 సంవత్సరముల ముందు వచ్చిన బైబిలు గ్రంథములలో గల జ్ఞానము సత్యమని ఖుర్ఆన్ గ్రంథము ధృవీకరించుచున్నదని తెలియుట వలన భగవద్గీతలో మనిషికి చావు పుట్టుకలు గలవని చెప్పినట్లు ఖుర్ఆన్‍లో కూడా చనిపోయిన మనిషి తిరిగి వెంటనే జన్మించునని చెప్పియున్నారు. చనిపోయినవాడు మొదట పుట్టినట్లే తర్వాత కూడా పుట్టునను విషయమును సూరా ఏడు ఆయత్ 29లో చెప్పియున్నారు చూడండి.


(7-29) ఓ ప్రవక్తా! ఈ విధముగా చెప్పు ''నా ప్రభువు న్యాయము గురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతీసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూచుకోమని, ధర్మాన్ని కేవలము అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకొని ఆయన్ను వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్ములను ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.''


చాలామంది ముస్లీమ్‍లు మనిషికి రెండవ జన్మలేదని అనుకోవడము సహజము. అయితే వారి అజ్ఞానమును పటాపంచలు చేయుచూ అల్లాహ్ తన ఆయత్‍లో మనిషి మొదట పుట్టునట్లే తిరిగి రెండవసారి కూడా పుట్టు చుండును అని తేల్చి చెప్పాడు. ఈ ఆయత్‍లో చెప్పినది సత్యమైన మాటయని సాక్ష్యముగా చూపుటకు సూరా 53, ఆయత్ 46, 47 లలో కూడా ఇలా చెప్పారు.


(53-46) ప్రవహింప చేసే వీర్యబిందువు నుండి


(53-47) మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (అల్లాహ్కే) చెల్లును.


ఈ విధముగా చెప్పిన మూడు వాక్యములలో మనిషికి మరణమే కాదు, జన్మ కూడా కలదని తెలియుచున్నది. అంతేకాక మనిషి తండ్రి వీర్యబిందువు చేతనే మరుజన్మ పొందుచున్నాడు అంటే తల్లిగర్భములో శిశు శరీరము పెరిగిన తర్వాత, ప్రసవము జరిగి జీవుడు తిరిగి క్రొత్తగా పుట్టుచున్నాడు. కొందరికి పూర్తి తెలియునట్లు మొదట తల్లిగర్భము నుండి జన్మించినట్లే చనిపోయిన తర్వాత కూడా తిరిగి తల్లిగర్భము నుండే జన్మించునని చెప్పుటకు తొలిసారి పుట్టినట్లే రెండవసారి కూడా పుట్టుననీ, తండ్రి వీర్యకణము ద్వారా తల్లిగర్భము నుండి తయారయిన శిశు శరీరములో పుట్టునని వాక్యములలో అర్థమగునట్లు చెప్పారు. దీనినంతటినీ గమణించిన తరువాత కూడా మనిషికి రెండవమారు జన్మలు ఉండవు అని అనుకోవడము అజ్ఞానమే యగును. (7-29)వ వాక్యము రెండవ జన్మను ధృవీకరించగా, అదికాదు అనడము పూర్తిగా వాక్యమునకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

51. మజీద్‍కు హాజరయ్యే ప్రతీసారి వస్త్రాలంకారము పట్ల శ్రద్ధ వహించండి. తినండి త్రాగండి కానీ మితి మీరి పోకండి. (7-31)

ఈ వాక్యము దైవ గ్రంథములో 60 శాతము గల సూక్ష్మవాక్యము లలో ఇది ఒకటని చెప్పవచ్చును. ఈ వాక్యము పైకి చూచుటకు పూర్తి స్థూలముగా కనిపించినా పూర్తి సూక్ష్మ భావముతో కూడియున్నది. అట్లు సూక్ష్మము కాదని స్థూలముగానే చెప్పియున్నారని ఎవరయినా అనినా వస్త్రాలంకారములోను, తినే దానిలో, త్రాగే దానిలో ఏమాత్రమూ జ్ఞానము లేదని తెలియుచున్నది. దేవుడు మనుషులకు వస్త్రాలలోను, తిండిలోను జ్ఞానమున్నదని చెప్పునా? అని ప్రశ్నరాక తప్పదు. ప్రార్థనా స్థలములలో వస్త్రాలంకారము, తినడము, త్రాగడముతో పనే లేదు. ఈ రెండు ప్రపంచ విషయములు అగును గానీ, దేవుని జ్ఞానమునకు ఏమాత్రము సంబంధము లేదు. దేవుడు తన జ్ఞానమును దుస్తులు ధరించడములోను, తినడము, త్రాగడములోను చెప్పునాయని అనుమానము రాకతప్పదు. స్థూలముగా చెప్పుకొంటే ఏమాత్రము జ్ఞానముకాని విషయమును సూక్ష్మముగా తెలిస్తే మంచి జ్ఞానముతోనే వాక్యము ఇమిడియున్నదని తెలియగలదు. ఈ వాక్యములో పూర్తి విషయము ఎలా ఉన్నదో ఇప్పుడు చూస్తాము.


(7-31) ''మీరు మస్జీద్‍కు హాజరైన ప్రతీసారి వస్త్రాలంకరణపట్ల శ్రద్ధ వహించండి. తినండి త్రాగండి కానీ మితిమీరకండి. మితిమీరి పోయే వారిని ఆయన (అల్లాహ్) ఇష్టపడడు.''


దైవ గ్రంథములు మూడు అయినా మూడు ఒకే దేవున్ని గురించి ఒకే జ్ఞానమును చెప్పాయి. తినండి, త్రాగండి యను మాట రెండవ దైవ గ్రంథమయిన ఇంజీలులో (బైబిలులో) ఏసు తన శిష్యులతో పాటు పస్కా పండుగ విందులో పాల్గొనినప్పుడు 'ఒక రొట్టెను ఇచ్చి ఇది నా శరీరమనీ, ద్రాక్ష రసమును ఇచ్చి ఇది నా రక్తము' అని చెప్పి రొట్టెను (శరీరమును) తినండియనీ, పానీయమును (రక్తమును) త్రాగండియని చెప్పాడు. తినండి, త్రాగండి యను పదము బైబిలు గ్రంథములోనే వచ్చినది. అయితే అక్కడ కూడా మనుషులు ఆయన శరీరమును తినడము ఏమిటి? ఆయన రక్తమును త్రాగడము ఏమిటి? ఈయన తిక్కపట్టి మాట్లాడుచున్నాడు అని అనుకొన్నారు. ఆ విషయము నేటికీ ప్రజలలో అర్థము కాకుండా పోయినది. అదే అర్థము కాని పరిస్థితిలో యున్న ప్రజలకు ఆ గ్రంథము తర్వాత ఆరు వందల (600) సంవత్సరములకు వచ్చిన అంతిమ దైవ గ్రంథములో తినండి, త్రాగండి యను పదము వచ్చినది. తినేది, త్రాగేది జ్ఞానము కాదని అందరికీ తెలుసు. అయితే ఈ రెండు మాటలను రెండు దైవ గ్రంథములలో ఎందుకు పొందుపరచారు అను విషయము జుట్టు పెరుక్కున్నా అర్థము కాకుండా పోయినది. అలాంటప్పుడు ఆ వాక్యములను అటు క్రైస్థవులు, ఇటు ముస్లీమ్‍లు ఇద్దరూ స్థూలముగానే చెప్పుకొంటున్నారు.


ఇప్పుడు ఆ వాక్యము మా ముందరకు వచ్చినది. ఖుర్ఆన్‍లో (3-7)లో ''దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని'' చెప్పిన ప్రకారము ఇటువంటి కష్టమైన వాక్యములకు దేవుడే వివరమును చెప్పవలసి యున్నది. తెలుసుకోవాలన్న అభిలాష (శ్రద్ధ) కలవారికి దేవుడు మనుషులలో ఏదో ఒక మనిషి శరీరము నుండి తప్పక వివరించి చెప్పును. ''మనుషులు మాట్లాడు ప్రతి మాటను శరీరములో ఆత్మగాయున్న దేవుడే (అల్లాహ్‍యే) మాట్లాడుచున్నాడు గానీ మాట్లాడు వారు మీరు కాదు'' యని బైబిలు గ్రంథములో మత్తయి అధ్యాయము పది, వాక్యము 20 లో చెప్పియున్నారు. ప్రతి మాట దేవుడే మాట్లాడుచున్నప్పుడు ప్రత్యేకించి జ్ఞాన వివరములు ఒక మనిషి నుండి చెప్పుచుండును. కొందరిలో అజ్ఞానముగా, తెలివి తక్కువగా మాట్లాడువాడు దేవుడే, ఒక్కనిలో జ్ఞాన వివరము చెప్పువాడు దేవుడే. నా లోని ప్రతిమాట నేను పలుకలేదు తండ్రియైన (దేవుడుయైన) ఆత్మయే పలుకుచున్నదని తెలిసిన నేను ఇప్పుడు అర్థముకాని తినండి, త్రాగండి అను పదములకు గల సూక్ష్మ జ్ఞానమును కూడా చెప్పగలడని నమ్ముచున్నాము.


తినండి, త్రాగండి అను విషయము స్థూలముగా జ్ఞానము కాదని తెలుసు. అయితే (7-31) వాక్యములో తినండి, త్రాగండి అనుమాటకంటే ముందు ప్రార్థన మందిరములకు పోయినప్పుడు ప్రతిసారీ వస్త్రాలంకరణలో శ్రద్ధ కలిగి ఉండాలియని చెప్పారు. వస్త్రాలంకారమునకు జ్ఞానమునకు స్థూలముగా ఎటువంటి సంబంధము లేదు. ఒకే వస్త్రముండి మారు వస్త్రము లేని పేదవాడు వస్త్రాలంకారము చేసుకొనలేడు కదా! అటువంటప్పుడు వస్త్రాలు సరిగా లేనివాడు జ్ఞానమును తెలియలేడని చెప్పలేము కదా! జ్ఞానము తెలియుటకు శ్రద్ధ అవసరము యని ప్రథమ దైవ గ్రంథములో చెప్పారు. అందువలన శ్రద్ధయున్న వారికి దుస్తులతో పని లేకుండానే జ్ఞానము లభించును. అటువంటప్పుడు ప్రార్థనా మందిరములకు పోయినప్పుడు ప్రతిసారీ వస్త్రాలంకరణ ఉండాలియని అనడము స్థూలముగా తీసుకొంటే అర్థముకాని విషయమై పోయినది. అందువలన శరీరము లోపలనుండి శరీర అధిపతియైన దేవుడు ఏమి తెలియజేస్తాడో ఇప్పుడు వేచి చూస్తాము. ఈ వాక్యము చివరిలో మితిమీరి పోకండి యని కూడా చెప్పాడు. ఏ విషయములో మితిమీరి పోకూడదో అది స్పష్టముగా అర్థమగునట్లు తెలియజేయలేదు. అందులో కూడా ఏదో దాగియుందని తెలియుచున్నది.


'మస్జీద్‍కు పోయినప్పుడు' అని వాక్యములో యుండుట వలన మస్జీద్ అంటే ఏమిటి? అని యోచిస్తే మనిషి ఎక్కడ దైవ ప్రార్థన చేయునో ఆ స్థలమును మస్జీద్యని అనవచ్చును. అందువలన కట్టడములతో కూడుకొన్న దానినే మస్జీద్ అనుటకు వీలులేదు. ఖాళీ స్థలములో ప్రార్థన చేసినా అది అప్పటికి మస్జీద్యనే చెప్పవచ్చును. మస్జీద్‍కు పోయిన ప్రతిసారియని అనగా! ప్రార్థన చేసిన ప్రతిసారియని అర్థము. ఇక వాక్యములోని 'దుస్తుల' విషయమునకు వస్తే వస్త్రాలంకరణ మీద శ్రద్ధ వహించండియని చెప్పారు. అందరికీ వస్త్రములుండవచ్చును గానీ, అందరి వస్త్రములు అలంకారముగా ఉండవు. దీనినిబట్టి వస్త్రములు వేరు, వాటి అలంకారము వేరని తెలియుచున్నది. ఇక్కడ వాక్యములో గల వస్త్రము ఏమిటి? వస్త్ర అలంకారము ఏమిటి? అని స్థూలముగా కాకుండా సూక్ష్మముగా ఆలోచిస్తే మనిషి శరీరమునకు ధరించు వస్త్రములు బయటికి కనిపించునవనీ, మనిషిలోని జీవుడు ధరించు వస్త్రములు ప్రతి మనిషికీ శరీరమే వస్త్రముగా యున్నదని తెలియుచున్నది. బయట శరీరమునకు గుడ్డను మార్చినట్లు, లోపలి జీవునకు 'మరణములో పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నాడని' భగవద్గీతలో సాంఖ్యయోగమున 22వ శ్లోకము యందు చెప్పబడి యున్నదని మరువకూడదు. అక్కడ చెప్పినట్లు మనిషిలోని జీవుని వస్త్రము అతను ధరించిన శరీరముకాగా, ఆ శరీరములోని మనస్సు, బుద్ధినిబట్టి ఆ శరీరమునకు 'విలువ' అను అలంకారము ఏర్పడును. మనస్సు, బుద్ధి శుద్ధము లేని జీవునికి విలువ లేదు. మనస్సు, బుద్ధి శుద్ధముగా పవిత్రముగా యున్న వాని శరీరము ''జ్ఞాన విలువ'' అను శక్తి అలంకారము కలిగియుండును.


ప్రత్యేకించి దైవ ప్రార్థన సమయములో మనస్సు, బుద్ధి పవిత్రముగా, శుద్ధముగా యుంచుకొన్న వాని ప్రార్థన ఎంతో జ్ఞాన విలువతో (జ్ఞానశక్తితో) కూడుకొని యుండును. మనస్సు ఏకాగ్రతగా, బుద్ధి ఆలోచనారహితముగా యున్నప్పుడు చేసిన ప్రార్థనలో జ్ఞానశక్తి లభించును. పవిత్ర మనస్సు, పరిశుద్ధ బుద్ధి లేనివాడు ఎన్నిమార్లు ప్రార్థన చేసినా అది వృథా ప్రార్థనేయగును. ఆ ప్రార్థనలో ఏమాత్రము జ్ఞానశక్తి లభించదు. జ్ఞానశక్తినే జ్ఞానాగ్నియని ప్రథమ దైవ గ్రంథములో కూడా చెప్పియున్నారు. ప్రార్థన చేసిన ప్రతిసారి శరీరములో మనోబుద్ధులు రెండూ పవిత్రముగా యుంటే వాని దుస్తులు అలంకారముగా యున్నట్లే లెక్కించబడును. ప్రార్థన సమయము తర్వాత దైవజ్ఞాన సముపార్జన కొరకు దైవ గ్రంథములోని వాక్యములను చదివి అందులో యున్న జ్ఞానమును గ్రహించవలసి యుండును. ఏసు రొట్టెను చూపి 'ఇది నా శరీరము అని, పానీయమును చూపి ఇది నా రక్తము అనీ చెప్పి తినండి, త్రాగండి' యని ద్వితీయ దైవ గ్రంథములో చెప్పడము జరిగినది. అంటే నా శరీరమును తినండి, శరీరములోని రక్తమును త్రాగండియని అర్థము కదా! ఇక్కడ గ్రంథమును శరీరముగా, గ్రంథము లోపల కనిపించక ఇమిడియున్న జ్ఞానము శరీరము లోపల బయటికి కనిపించక ప్రవహించుచున్న రక్తముగా అర్థము చేసుకోవలసి యున్నది. ప్రార్థనా స్థలములో ప్రార్థన అయిన తర్వాత కొంతసేపు దైవ గ్రంథమును చదివి అందులో కనిపించక ఇమిడియున్న జ్ఞానమును తెలియండి అను ఉద్దేశ్యముతో 'తినండి, త్రాగండి' అని చెప్పడము జరిగినది.


అయితే గ్రంథములో ఎక్కడయితే తినండి, త్రాగండియని అన్నారో అక్కడంతా స్థూలముగా అర్థము చేసుకోవడము వలన గ్రంథములోని ముతషాబిహాత్ (సూక్ష్మమైన) అను వాక్య అర్థము తెలియక తప్పుదారి పట్టుచున్నారు. ఇదే విషయమే సూరా రెండు, ఆయత్ 187 లో కూడా చెప్పియున్నారు. అక్కడ 'తినండి, త్రాగండి' అను విషయము ఎలాకలదో వాక్యములో చూస్తాము.


(2-187) ''ఉదయపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు మీరు తినండి, త్రాగండి'' అని ఉన్నది.


తెల్లవారు జామున అనగా మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అనగా దాదాపు మూడు గంటల కాలము మనిషిలో బుద్ధి, మనస్సు తాజాగా ఉండడమే కాకుండా బుద్ధి ఆలోచనారహితముగా, మనస్సు చలనరహితముగా ఉండును. అందువలన ఆ సమయములో గ్రంథమును చదివి అందులోని జ్ఞానమును తెలియమని చెప్పడము జరిగినది. ప్రపంచ చదువు చదివే వ్యక్తులయినా తెల్లవారు జామున చదవడము మంచిదని అప్పుడు చదివిన చదువు బాగా జ్ఞాపకముండునని కొందరు చెప్పగా వినియే ఉందుము. అందువలన ప్రాతఃకాలమున చదివిన చదువు శ్రేష్ఠమైనదను ఉద్దేశ్యముతో (2-187) వ వాక్యములో 'తొలిజాములోనే తినండి, త్రాగండి' యని అర్థముతో చెప్పియున్నారు. ఆ విషయమును తెలియని వారందరూ, వాక్యమును స్థూలముగా అర్థము చేసుకొను వారందరూ దేవుడు చెప్పిన సూక్ష్మ భావమును కోల్పోవుచున్నారు. అందువలన అంతిమ దైవ గ్రంథము లోని జ్ఞానము చాలామందికి అర్థము కాకుండా పోయినది.


వాక్యములో చివరిగా మితిమీరి పోకండి ''మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు'' అని ఉన్నది. వాక్యములో చెప్పిన చివరి విషయము మితిమీరి పోకండియని చెప్పడములో ముఖ్యమైన సందేశము కలదు. దేవుని సందేశమును బుద్ధియున్న వాడు, శ్రద్ధతో గ్రహించువాడు తెలియగలడు. మీరు అడిగే ప్రతిమాటకు, మీకు తెలియని ప్రతిమాటకు 'నేను మీకు అత్యంత సమీపమున ఉండి జవాబు ఇవ్వగలనని' (2-186) లో అల్లాహ్ స్వయముగా చెప్పియున్నాడు. కావున మనకు తెలియని విషయమును అల్లాహ్‍కు విన్న వించుకొంటే ఆయన తప్పక జవాబు ఇచ్చి సత్యమును తెలుపగలడు. ప్రత్యేకించి అల్లాహ్‍కు ఇష్టుడయిన వానికే ఆయన సరియైన జవాబు ఇవ్వగలడు. అల్లాహ్‍కు ఇష్టము లేనివానికి తప్పు జవాబు ఇచ్చి తప్పుదారి పట్టించగలడు. అందువలన మొదట అల్లాహ్‍కు ఇష్టుడుగా ఉండడము నేర్చుకోవాలి.


'మితిమీరి పోకండి' యని చెప్పిన విషయమును గురించి నాకు అల్లాహ్ తెలియజేసిన విషయమును మీకు తెలియజేయుచున్నాను చూడండి. మనిషి ప్రతి విషయములోనూ కర్మబద్దుడైయున్నాడు. అల్లాహ్ అంతిమ దినమున తీర్పు తీర్చిన విధముగానే ప్రతి విషయము జరుగుచుండును. ఎవడు ఏమనుకొనినా, ఏమి చేయాలనుకొనినా ముందే వ్రాయబడిన కర్మ ప్రకారమే జరుగుచుండును తప్ప మనిషి ఇష్ట ప్రకారము జరుగవు. మనిషి ఒక్క జ్ఞాన విషయములో తప్ప మిగతా ప్రపంచ విషయములలో మితిమీరిపోయే అవకాశమే లేదు. 'మితి' అనగా 'కర్మ నిర్ణయము' అని అర్థము. దేవుని జ్ఞాన విషయములో మాత్రము మనిషి పరిమితి ఉండదు. ఎందుకనగా! ప్రపంచ విషయములు మాత్రము కర్మపత్రములో వ్రాసిన విధముగా జరుగుచుండును. జ్ఞాన విషయములు కర్మను అనుసరించి ఉండవు. దేవుడుగానీ, దేవుని జ్ఞానముగానీ కర్మకు అతీతముగా ఉండును. దేవుని విషయములలో మనిషి ఇష్టమువచ్చినట్లు ప్రవర్తించవచ్చును. జ్ఞానమును తెలుసుకోవాలంటే తన ఇష్టప్రకారము ఎంత జ్ఞానమునయినా తెలియవచ్చును. జ్ఞాన విషయములలో కర్మపరిమితి ఉండదు, కావున మనిషి పద్ధతిగా జ్ఞానమును తెలియవచ్చును. అయితే కొందరు పద్ధతి లేకుండా మితిమీరి కూడా పోవుచుందురు. దేవుడు గ్రంథములో చెప్పినది ఒకటైతే తాము మరొకటి చెప్పుచుందురు. దేవుడు బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము జ్ఞానమును చెప్పియున్నాడు. శాస్త్రపద్ధతిని అనుసరించి తెలియు వారు స్వచ్ఛమయిన, సత్యమైన జ్ఞానమును తెలియుచుందురు. శాస్త్రపరిధిని వదలి పరిధి దాటి మితిమీరి పోవువారు శాస్త్రబద్దమైన జ్ఞానమును తెలియ లేరు. దేవుడు చెప్పినట్లు కాకుండా దైవశాస్త్రమును వదలి మితిమీరి పోవువారికి దేవుని జ్ఞానము అశాస్త్రీయమైనది, అసత్యముతో కూడినది తెలియును. అప్పుడు తమకు తెలిసిన అశాస్త్రీయ జ్ఞానమునే సత్యమని నమ్మి దానినే ఇతరులకు చెప్పుచూ తాము తప్పుదారి పోవడమే కాక తమమాటను నమ్మువారందరినీ తప్పుదారి పట్టించడము జరుగును. నేడు అనేకమంది బోధకులు, మత పెద్దలు అనువారు అదే స్థితిలో యున్నారు.


ఉదాహరణకు నేడు మూడు మతములలో 'ఉపవాసము' అను పేరుతో ఆహారమును తినకుండా ఉండడము కలదు. అది అన్ని మతములలో సాంప్రదాయ కార్యముగా సాగుచున్నది. అయితే దైవ గ్రంథములలో ఆ కార్యమున్నదని అన్ని మతముల వారు చెప్పుచుందురు. వాస్తవముగా ఉపవాసమునకు సంబంధించిన వాక్యములను దేవుడు ఏ దైవ గ్రంథములో కూడా చెప్పలేదు. అయితే కొందరు మా మత గ్రంథములో ఫలానాచోట, ఫలానా వాక్యమున్నదని చెప్పినా, ఆ వాక్యమును చూస్తే అక్కడ చెప్పినది ఒక్కటి వీరు అర్థము చేసుకొన్నది మరొక్కటి అని తెలియుచున్నది. దేవుడు చెప్పిన వాక్యమును చూస్తే ఆ వాక్యము శాస్త్ర పరిధిలో జ్ఞానమును చెప్పియున్నా కొందరు మనుషులు శాస్త్రపరిధిని అతిక్రమించి, ఉన్నదానిని ఉన్నట్లు కాకుండా వేరు విధముగా అర్థము చేసుకోవడము జరిగినదని తెలియుచున్నది. అటువంటివారు దేవుడు చెప్పిన దానిని శాస్త్రపరిధిలోనే అర్థము చేసుకోక, అజ్ఞాన విధానములో అర్థము చేసుకోవడము వలన, అటువంటి వారిని దేవుడు ఇష్టపడడు అని కూడా వాక్యములో చెప్పడము జరిగినది. శాస్త్రపరిధిని అనుసరించని వారు దైవ గ్రంథమునకే వ్యతిరేఖముగా చెప్పుచుండుట వలన వారంటే దేవునికి కూడా నచ్చదనియే చెప్పవచ్చును. మనిషి జన్మల విషయము గానీ, దేవుని అవతరణ విషయముగానీ, స్వర్గ, నరక, పరలోక విషయములో గానీ, స్థూల, సూక్ష్మ విషయములోగానీ, ప్రార్థనా విషయములోగానీ, దేవుని పాలన కొనసాగించు దేవదూతల విషయములోగానీ, దేవుడు, దేవతల విషయములో గానీ, ధర్మముల విషయములోగానీ, ఆత్మ, పరమాత్మల విషయములో గానీ మొత్తముగా శాస్త్రపరిధి దాటిపోయి తప్పు భావములలో నిండిపోవుట వలన అటువంటివారు దేవునికి అయిష్టులుగా మిగిలిపోయారు. అదే విషయమునే ఈ వాక్యము చివరిలో చెప్పారు. అయినా ఈ వాక్యము మొత్తము సూక్ష్మమైన భావముతో కూడుకొని యుండుట వలన చాలామందికి అర్థము కాలేదనియే చెప్పవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

52. ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి వుంది. నిర్ణీత సమయము వచ్చినప్పుడు ఒక్క క్షణము కూడా వారు ముందు వెనుక కాలేరు. (7-34)

ఈ వాక్యములో మొదటనే తప్పుదారి పట్టు అవకాశము గలదు. 'సమాజము' అంటే అందరూ బయటి చూపు చూస్తూ ఫలానా మతము వారనో, ఫలానా కులము వారనో లేక ఫలానా దేశము వారనో, ఫలానా ప్రాంతము వారనో అనుకోవడము జరుగుచున్నది. ఏ విధముగా మొదటనే చెప్పిన సమాజము అర్థము కాలేదో అట్లే తర్వాత చెప్పిన 'నిర్ణీత సమయము' అంటే ఏమిటనిగానీ, 'నిర్ధారించబడిన గడువు' అంటే ఏమిటనిగానీ, ముందు వెనుక అంటే ఏమిటని గానీ తెలియకుండా పోయినది. ఈ విషయమును గురించి చర్చించుకోబోయే ముందు దైవ గ్రంథములోనున్న ఈ వాక్యమును చూస్తాము.


(7-34) ''ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడియున్నది. వారి నిర్ణీత సమయము వచ్చేసినప్పుడు ఒక్క క్షణము కూడా వారు ముందు వెనుక కాలేరు.''


ఇక్కడ ఈ వాక్యములో బాగా గమనించితే ముందుగా 'ప్రతి సమాజానికి' యని అన్నారు. చాలామందికి సమాజము అంటే ఒక మతము అని అనుకోవడము సహజముగా యున్నది. ఇంకా కొందరు ఒక ప్రాంతములో ఒకే విధమైన జీవనము సాగించువారిని గానీ, లేక ఒక కులము వారినిగానీ ఒక సమాజము అని అనడము జరుగుచున్నది. దైవ గ్రంథములో దేవుడు చెప్పిన ఈ వాక్యములో 'సమాజము'అంటే బ్రహ్మ విద్యా శాస్త్రముననుసరించి యున్న అర్థము ఏమి? అని మనము తెలియ గలిగితే మనుషులు ఇప్పటివరకు అనుకొన్నది పరిమితి దాటి అనుకొన్నట్లు తెలియుచున్నది. శాస్త్రపరిధిలో తెలియగలిగితే ఇంతవరకు మనుషులు అనుకొన్న దానికంటే భిన్నముగా యున్న అర్థము కనపడుచున్నది. అందువలన ఏది సత్యము? ఏది అసత్యము? అని జాగ్రత్తగా చూడవలసి వచ్చినది. అంతేకాక అందరికీ ఎంతో వివరముగా తెలియ చెప్పవలసిన అవసరమున్నది. ఇప్పుడు 'సమాజము' అను పదమును వివరించు కొందాము. సమాజము అను పదమును విడదీసి చూస్తే అందులో రెండు భాగములున్నవి. ఒకటి సమ, రెండు జము, సమ+జము= సమాజము. సమ అనగా సమానమైన అనియూ ఏమాత్రము హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధముగా యున్నదనియూ తెలియుచున్నది. జము అనగా పుట్టడము అని అర్థము. సమాజము అనగా సమానముగా పుట్టడము అని అర్థము గలదు. ఈ అర్థము ప్రకారము ఒక మతమును సమాజము అని అనడము సరిపోదు. మతములో అందరూ సమానముగా పుట్టలేదు. ఆ లెక్క ప్రకారము సమాజము అను పేరు ఒక మతమునకు గానీ, ఒక కులమునకు గానీ, ఒక ప్రాంతవాసులకు గానీ వర్తించదు. అటువంటప్పుడు సమాజము అను పేరు దేనికి లేక ఎవరికి వర్తిస్తుందని చూస్తే బయట 'సమాజము' అను పదము ఎవరికీ వర్తించదని తెలియుచున్నది. బయట సమాజము అనుకొను దానికంటే శరీరము లోపలి సమాజమే నిజమైన సమాజమని తెలియుచున్నది. శరీరము లోపలి సమాజము సమానముగా ఒక్కమారు పుట్టుచున్నది. అట్లే ఒకమారే చనిపోవుచున్నది. ఇప్పుడు ఈ విషయము బాగా అర్థము కావాలంటే సమానముగా అందరూ ఒకేమారు పుట్టి, ఒకే విధముగా పెరిగి, ఒకే ఆయుష్షు కలిగి, ఒకేమారు చనిపోవు వారందరినీ కలిపి సమాజము అని అనవచ్చును. అలా జరుగునది శరీరము బయట లేదుగానీ శరీరము లోపల జరుగుచున్నది.


శరీరములో ఒక గుంపుగాయున్న శరీర భాగములన్నీ ఒకేమారు పుట్టడము, ఒకే విధముగా పెరిగి, ఒకే ఆయుష్షు కలిగి ఒకేమారు చనిపోవడము జరుగుచున్న విషయమే. అందువలన శరీరమును సమ సమాజ నిలయము అని అన్నారు. వివరముగా తెలియగలిగితే శరీరములో మొత్తము 25 భాగములు గలవు. మనిషి పుట్టుకలో శరీరము పుట్టుచున్నది. అప్పుడే శరీరములో ఒక్కమారుగా 25 భాగములు పుట్టుచున్నవి. ఒకే సమానముగా పుట్టునవి శరీరములోని భాగములే యగుట వలన సమ+ జము=సమాజము అని శరీరములోని గుంపును అనవచ్చును. శరీరములోని గుంపు 25 భాగములుగాయుండగా, అందులో జీవుడు కూడా 25వ భాగముగా కలడు. బాహ్యేంద్రియములు 10, అంతరేంద్రియములు జీవునితో 15 గలవు. లోపలివి 15, బయటి ఇంద్రియములు 10తో కలిపి మొత్తము 25 సమాజముగా యున్నవి. శరీర సమాజము ఒకేమారు పుట్టడమేకాక ఒకేమారు చనిపోవుచున్నది. అందువలన (7-34) వాక్యములో సమాజము అను మాటను సజీవ శరీరమునే అన్నట్లు చెప్పారు. ప్రతి మనిషికి దేవుడు కర్మప్రకారము ఎప్పుడు చనిపోవాలో నిర్ణయము చేసియుంచును.


మనిషి శరీరమును ధరించి పుట్టుచున్నాడు, శరీరములో జీవుడు తనతో పాటు 24 శరీర భాగములతో నివాసము చేయుచున్నాడు. శరీరములో 24 భాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని చేయుచుండుట వలన శరీర భాగములను జీవునితో పాటు నివాసము చేయు సమాజము అని చెప్పుచున్నాము. 24 భాగములు పని చేయునట్లు జీవుడు కూడా శరీరములో ఒక పనిని చేయుచున్నాడు. ఒక ప్రత్యేకమైన పనిని చేయు అవయవమును ప్రత్యేక భాగమని చెప్పవచ్చును. అదే విధముగా శరీరములో జీవునితో సహా అన్ని భాగములు పని చేయుచుండుట వలన మొత్తము 25 భాగములని చెప్పాము. 24 భాగములు ప్రకృతి సంబంధమైనవి కాగా, 25వ భాగమయిన జీవుడు ఆత్మ (దేవుని) సంబంధము. జీవుడు మినహా 24 భాగములు స్వయముగా పని చేయునవి కావు. 24 భాగముల చేత శరీరములో జీవునితో పాటు నివాసమున్న ఆత్మ (దేవుడు) పనిని చేయిస్తున్నాడు. 24 భాగముల చేత ఆత్మ సర్వకార్యములను వాని కర్మను అనుసరించి చేయించుచున్నది. కార్యములను చేయు 24 అవయవ భాగములు ఎంత పనిని చేసినా వాటికి అలసట ఉండదు. అలాగే పనిని చేయించు ఆత్మకు కూడా అలసట ఉండదు. శరీరములో ఒక కార్యము జరుగుచున్నప్పుడు అన్ని అవయవములు పని చేయవచ్చును లేక కొన్ని చేస్తూ కొన్ని ఊరక ఉండిపోవడము జరుగుచున్నది. కొన్ని కార్యములలో అవయవములు అన్ని పని చేసినా, చేయకపోయినా ఆత్మ చేయించునది కావున అహర్నిశలూ, ఎల్లప్పుడూ అన్ని కాలములలో ఆత్మ పని చేయుచున్నది. జీవునకు నిద్రయను విశ్రాంతియున్నా ఆత్మకు అటువంటి విశ్రాంతి యుండదు. ఆత్మకు నిద్రగానీ, కునుకుగానీ ఉండదు. అట్లే ఎల్లకాలము పని చేసినా అలసట ఉండదు. శరీరములో అల్లాహ్ ఆత్మరూపములో కార్యకర్తగా యుండి అన్ని పనులను చేయిస్తున్నాడు. అందువలన ఆత్మను 'జీవున్ని, అవయవములను నడిపేవానిగా', జీవుడు 'నడుపబడేవాడుగా' 50వ సూరా, 21వ ఆయత్‍లో చెప్పియున్నారు. దేవుడు కార్యకర్తగా యున్నాడని సూరా ఆరులో ఆయత్ 102లో చెప్పియున్నారు. అలాగే అల్లాహ్‍కు 'కునుకు గానీ, అలసటగానీ లేదని' సూరా రెండు, ఆయత్ 255లో చెప్పియున్నారు.


ఈ విధముగా చెప్పితే సమాజముగా యున్న శరీరమును ఆత్మ (అల్లాహ్) ఎంతకాలము నడిపినా చివరకు ఒకరోజు మరణమును కూడా కలుగజేయును. జీవునికి పుట్టుకను, మరణమును కలుగజేయువాడు అల్లాహ్‍యేనని తెలియవలెను. మనిషి మొదట చనిపోయినప్పుడే అల్లాహ్ (ఆత్మ) జీవుడు సంపాదించుకొన్న కర్మప్రకారము తీర్పు చేసియుండును. ఆ తీర్పులో రెండవ జన్మలో మనిషి ఏయే పనులు చేయాలి, ఏయే అనుభవములను అనుభవించాలి, ఏమి తినాలి, ఎలా బ్రతకాలి, చివరకు ఎప్పుడు చనిపోవాలని నిర్ణయము చేసియుండును. జీవితములో అన్ని కార్యముల నిర్ణయము ప్రకారము 'మరణము' అను నిర్ణయము కూడా జరిగియుండును. మరణములో శరీర రూపములో పుట్టిన సమాజ మంతయూ ఒకమారు చనిపోవలసియుండును. అలా ఎప్పుడు చనిపోవలసినది ఆత్మ నిర్ణయించి యుండుట చేత, ఆ నిర్ణీత గడువు ఏ సమయములో వచ్చునో ఆ సమయములో మనిషి చనిపోవలసియుండును. మరణమును 'తుది గడువు' అని కూడా గ్రంథములో కొన్నిచోట్ల చెప్పియున్నారు. ఎప్పుడు తుది గడువు వస్తుందో అప్పుడు ప్రతి జీవుడు చనిపోవడము జరుగును. జీవుడు చనిపోయినప్పుడు జీవునితోపాటు పుట్టిన శరీర సమాజమంతయూ అనగా 24 భాగములు చనిపోవడము జరుగుచున్నది.


ప్రతి మనిషికీ చావు యొక్క సమయము నిర్ణయించబడియున్నది. ఆ సమయము ఏదో ఒక రోజు వచ్చును. రోజులో ఏదో ఒక సమయములో రాత్రి పూటనో, పగలు పూటనో వచ్చును. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము నిర్ణయించబడియుండును. నిర్ణయించబడిన సమయము ఏదయినా అది సెకండ్లతో సహా నిర్ణయముండును. తుది గడువు ఎప్పుడు వచ్చునో అప్పుడు ఒక సెకను వెనుకగానీ, ఒక సెకను ముందుగానీ లేకుండా చనిపోవడము జరుగుచున్నది. అదే విషయమునే వాక్యములో వ్రాశారు. మరణములను ప్రత్యక్షముగా చూస్తున్నాము కావున రాత్రిపూట ఏ సమయములోనయినా చనిపోయినవారిని చూచాము. అట్లే పగలు పూట కూడా సెకండ్ల తేడాతో ఎంతోమంది చనిపోవుచుండుట తెలిసిన విషయమే. ఒకే కాలములో, ఒకే సెకనులో ప్రపంచము మొత్తము మీద ఎంతోమంది చనిపోవుచున్నారు. ఏది ఏమయినా మరణ సమయము వచ్చినప్పుడు ఒక్క క్షణ కాలము కూడా ముందు వెనుక లేకుండా చనిపోవలసియున్నది. చావుల గురించి అందరికీ తెలుసు అయితే శరీర సమాజము గురించి చాలామందికి తెలియదు. 'ప్రతి మనిషికి' అని చెప్పుటకు బదులు వాక్యములో 'ప్రతి సమాజానికి' అని చెప్పియున్నారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క సమాజమున్నదనీ, సమాజములోని సంఖ్య మొత్తము 25 మందని తెలియుచున్నది. 25 గా యున్న సమాజమునకు తుది గడువు ఉండేది సహజమే. గడువుకంటే ముందుగానీ, గడువుకంటే వెనుకగానీ ఒక్క సెకను కూడా తేడా లేకుండా పోవుచుందురు. ఇదియంతయూ ప్రతి దినము జరుగుచున్న పనియే, కావున ఈ వాక్యమును సులభముగా అర్థము చేసుకోవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

53. ఒకవేళ మీలోనుండి నియుక్తులైన ప్రవక్తలు నా ఆదేశాలను వినిపించినప్పుడు తమ్ముతాము సరిదిద్దుకున్న వారికి దుఃఖము గానీ, భయముగానీ ఉండదు. (7-35)

మనుషులలో బోధకులు అనేకులు ఉందురు. అయితే ప్రవక్తలు మాత్రము అరుదుగా ఉందురు. ప్రవక్తలు అను పదములో రెండు భాగములు ఉన్నాయి. ప్రమరియు వక్తలు అని రెండు భాగములు గలవు. భూమిమీద అనేకులుగా యున్న బోధకులను వక్తలు యని అనవచ్చును. బోధకులలోనే ముఖ్యమైన వారిగాయుండు వారు అరుదుగా యుందురు. వారినే ప్రవక్తలు యని అంటున్నాము. 'ప్ర' యనగా 'ముఖ్యమైన' అని అర్థమును తెలియవలెను. ప్ర అను శబ్దమునకు పుట్టుటయని అర్థమున్నా అది ఈ సందర్భములో పనికి రాదు. ముఖ్యమైన బోధలు చెప్పువాడు ప్రవక్తయని పిలువబడును. అంతేకాక సాధారణ బోధకులకంటే ప్రత్యేకమైనవారిని ప్రవక్తలుయని అనడము జరుగుచున్నది.


ప్రవక్తలు యనువారు మనుషులలో నుండియే తయారగుచున్నారు. అల్లాహ్ మనుషులనే బోధకులుగా, మనుషులనే ప్రవక్తలుగా తయారు చేయుచున్నాడు. అల్లాహ్ ఇష్టానుసారమే ప్రవక్తలు తయారగుచున్నారని చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును ప్రవక్తయను వ్యక్తి శాస్త్రబద్దముగా బోధించుచుండును. కొందరు బోధకులు దేవుని జ్ఞానమును అశాస్త్రీయముగా బోధించవచ్చును గానీ, ప్రవక్త అలా చేయడు. అల్లాహ్ గ్రంథములో తెలియజేసిన జ్ఞానమును శాస్త్రబద్దముగా బోధించువాడు ప్రవక్తయని చెప్పవచ్చును. అల్లాహ్ జ్ఞానమును తెలిసీ తెలియక బోధించు బోధకులు అనేకులు గలరు. ప్రతి ఊరికి ఒకరు లేక ఇద్దరు బోధకులు ఉండవచ్చును. అయితే వేయి ఊర్లకు ఒక ప్రవక్త ఉండవచ్చును. లేకపోతే ఒక దేశమున కంతటికీ ఒక ప్రవక్త యుండవచ్చును అని చెప్పవచ్చును. గ్రంథములో చెప్పిన ప్రకారము 'ఒక భాషకు ఒక ప్రవక్త యుండునని' గలదు. ''ప్రతి భాషవారికి వారి భాషలో బోధించు ప్రవక్తను పంపుదునని'' సూరా 14, ఆయత్ 4 లో చెప్పారు చూడండి.


(14-4) ''మేము ఏ ప్రవక్తను పంపినా అతను విషయమును స్పష్టముగా విడమరచి చెప్పటానికి వీలుగా తన జాతివారి భాషలో మాట్లాడేవానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్ తాను కోరిన వారిని అపమార్గము పట్టిస్తాడు. తాను కోరిన వారికి సన్మార్గమును చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.''


ఈ వాక్యము ప్రకారము ఒక భాషకు ఒక ప్రవక్తయుండవచ్చును. ఒక దేశములో నాలుగు భాషలు మాట్లాడువారు ఉన్నప్పుడు నలుగురు ప్రవక్తలనయినా పుట్టించవచ్చును లేకపోతే నాలుగు భాషలు తెలిసిన ఒకే ప్రవక్తనయినా పుట్టించవచ్చును. బోధకుడు అనువాడు ఒక్క ఊరిలో ఒకడుండవచ్చును లేక ఒక్కొక్క ప్రార్థన మందిరములో ఒక్కొక్క బోధకుడు ఉండవచ్చును. అయితే ఎందరు బోధకులు యున్నా వారందరూ చివరకు ప్రవక్త చెప్పిన వివరమునే అనుసరించవలసియుండును. బోధకులు మనుషులే, ప్రవక్త మనిషే అయి ఉండుట వలన కొందరు బోధకులు ప్రవక్త చెప్పిన మాటను ఖాతరు చేయకుండా, తమకు తెలిసిన జ్ఞానమే గొప్పదని వాదించుచుందురు. ఏ బోధకుడయినా చివరకు ప్రవక్త బోధలే వినవలసియున్నా, ప్రవక్త బోధనే అనుసరించవలసియున్నా విభేదించడము మానుకోరు. ఈ విషయమును సూరా ఏడు, ఆయత్ 35లో ఇలా చెప్పియున్నారు చూడండి.


(7-35) ''ఒకవేళ మీలోనుండే నియుక్తులైన ప్రవక్తలు మీవద్దకు వచ్చి నా ఆదేశాలను వారు మీకు వినిపించినప్పుడు భయభక్తుల వైఖరిని అవలంబించి తమ్ముతాము సరిదిద్దుకున్న వారికి భయముగానీ, దుఃఖముగానీ ఉండదు.''


ఎదుటి మనిషిని తమకంటే గొప్పవానిగా భావించినప్పుడు, అతని మాటకు విలువ ఇచ్చి, అతను చెప్పు జ్ఞానమును తెలియవచ్చును. అట్లు ఎదుటి మనిషిని తమకంటే తక్కువవానిగా లెక్కించినప్పుడు ఎదుటి మనిషి చెప్పుమాటలను మనిషి వినే స్థితిలో ఉండడు. అలాగే బోధకులు ప్రవక్తను చూచినప్పుడు ప్రవక్త యొక్క విలువను గ్రహించనివారై ఆయన చెప్పు జ్ఞానమును తప్పు పట్టుచూ, తాము గ్రహించక తాము చెడిపోయి తమను అనుసరించువారిని కూడా తప్పుదారి పట్టించుచుందురు. అందువలన 14-4 లో ''అల్లాహ్ ప్రవక్తను పంపినా తాను కోరిన వారిని అపమార్గము పట్టిస్తాడు'' అని చెప్పియున్నారు. నేడు ప్రత్యక్షముగా భూమిమీద బోధకులు ప్రవక్తల మాటలను విననివారై తప్పుదోవ పట్టి పోవుచున్నారు.


7-35 లో ''ప్రవక్తలు మీవద్దకు వచ్చినా ఆదేశములను వినిపించి నప్పుడు భయభక్తులతో విని తమ్ముతాము సవరించుకొన్నప్పుడు'' అని ఉంది కదా! దీనినిబట్టి కొందరు దేవుని జ్ఞానమునకు విభిన్నముగా యున్నారని వారు ప్రవక్తలు చెప్పిన మాటను వినగలిగితే భయము, దుఃఖము ఉండదు అని చెప్పారు. అయితే విననివారు కూడా కొందరుంటారని మరువకూడదు. అలా వినక ప్రవక్తకు కూడా ఎదురు మాట్లాడువారిని దేవుడు అపమార్గములోనే పంపునని (14-4) లో చెప్పియున్నారు. ''ప్రవక్త మాటలు వింటే భయము దుఃఖము పోయి జ్ఞానమార్గములో పోవుదురనీ, వినకపోతే అపమార్గము పట్టిస్తానని'' స్వయముగా అల్లాహ్‍యే చెప్పినట్లు కలదు. నేడు భూమిమీద బోధకులు అధికముగా, ప్రవక్తలు అరుదుగా యున్నారు. ఒక ప్రవక్త చెప్పిన జ్ఞానమును బోధకులు అందరూ వినినా ప్రవక్త మాటను గ్రహించువారు కొద్దిమందే యుందురు. ప్రవక్తలు చెప్పిన జ్ఞానమును వ్యతిరేఖించువారు బోధకులు తమకు తెలిసిన జ్ఞానమే సత్యమైనదని ఇతరులు చెప్పు జ్ఞానము అసత్యమైనదని వాదించుచుందురు. ఎదుటివారు చెప్పు జ్ఞానమును వ్యతిరేఖించువారు ఎదుటివారు ప్రవక్తయని కూడా తెలియక దైవజ్ఞానములో తక్కువ చేసి మాట్లాడుచుందురు. అటువంటి వారిని అల్లాహ్ తప్పక అపమార్గములో పోవునట్లు చేయును.


దేవుడు చెప్పిన జ్ఞానమును శాస్త్రబద్దముగా వివరించువాడు గురువు (ప్రవక్త) యని అనుచుందురు. హిందువులలో ప్రవక్తను గురువు అనియు, ముస్లీమ్‍లలో మరియు క్రైస్థవులలో ప్రవక్తయని అనడము జరుగుచున్నది. ప్రవక్త లేక గురువుకాని వారందరూ జ్ఞానమును బోధించినా వారిని బోధకులు యని అనుచుందురు. అందరి దేవుడు ఒక్కడే మరియు అందరి జ్ఞానము ఒక్కటే అయిన దానివలన హిందువుల గురువయినా, ముస్లీమ్‍ల ప్రవక్త యైనా ఒక్కటే జ్ఞానమును, ఒక్కడే దేవున్ని గురించి చెప్పుచుండును. అయితే బోధకులయినవారు హిందువులయితే ముస్లీమ్‍ల ప్రవక్తను ఒప్పుకోరు. ముస్లీమ్‍లయితే హిందువుల గురువును ఒప్పుకోరు. అట్లుకాక ప్రవక్తలయిన వారు గురువులు చెప్పిన జ్ఞానమును, గురువులయిన వారు ప్రవక్త చెప్పిన జ్ఞానమును తప్పక ఒప్పుకొందురు, సత్యమని గ్రహించుదురు. గురువులు గానీ, ప్రవక్తలుగానీ శాస్త్రబద్దమైన జ్ఞానమునే బోధించుచుందురని వారికి బాగా తెలుసు. ఆ విషయము తెలియని బోధకులు ఏ మతమువారయినా గురువులు (ప్రవక్తలు) చెప్పిన జ్ఞానమును గ్రహించలేని స్థితిలో ఉందురు.


ఉదాహరణకు దైవ గ్రంథములలోని ఒక జ్ఞాన విషయమును గురువులు లేక ప్రవక్తలు ఎలా శాస్త్రబద్దముగా చెప్పుదురో దానిని బోధకు లయినవారు ఎలా గ్రహించుకోలేక వ్యతిరేఖించుచున్నారో వివరము చెప్పు కొందాము. అంతిమ దైవ గ్రంథములో 'అల్లాహ్ విషయము' అనేక ఆయత్‍లలో కలదు. ముస్లీమ్‍లకందరికీ అల్లాహ్ ఒక్కడేయను విశ్వాసము నూరు శాతము గలదు. 'ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడే' యను విషయమును చెప్పితే అందరూ ఒప్పుకొందురు. అయితే ఇక్కడ ఆరాధింప తగిన అల్లాహ్ ఒక్కడేగానీ, అల్లాహ్ ఇద్దరిగా యున్నాడు. మొదటి అల్లాహ్ ఏ ఆరాధన అవసరము లేనివాడనీ, ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ ఒక్కడేయను విషయము శాస్త్రబద్దమైనదని ముస్లీమ్ బోధకులు ఒప్పు కోవడము లేదు. ఊరిలో ఎన్ని ప్రార్థనామందిరములుండునో అక్కడ బోధకులు ఉందురు. అయితే బోధకులు దైవ గ్రంథములోని జ్ఞానమును గ్రహించనివారై గురువుల మాటలను లెక్కచేయరు. ఖుర్ఆన్‍లోని వాక్యములను వివరించి చూపినా వారు అర్థము చేసుకొను స్థితిలో ఉండరు.


ప్రకృతి సంబంధమైన ప్రపంచములో ఆత్మ సంబంధమైన వారు ముగ్గురున్నారనీ, అందులో మొదటివాడు జీవుడు (జీవాత్మ) కాగా, మిగతా ఇద్దరినీ ఒకే పేరుతో అనగా 'అల్లాహ్' యను పేరుతో అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియున్నారు. అయినా గ్రంథములో ప్రత్యక్షముగా యున్న వాక్యములను శాస్త్రబద్దముగా వివరించి చెప్పినా, కొందరు ముస్లీమ్ బోధకులు ఏమాత్రము వినడము లేదు. తమకు తెలిసినదే జ్ఞానము, ఇతరులు చెప్పునది జ్ఞానము కాదన్నట్లు మాట్లాడు చుందురు. అల్లాహ్యను పేరు ఇద్దరికి చెప్పబడుచున్నప్పటికీ అందులో మనుషులందరికీ ఆరాధ్య దైవము ఒక్కడేయనీ, ఆరాధనకు అతీతముగా యుంటూ అల్లాహ్కంటే ముందు స్థానములో మూడవవాడుగా యున్న వాడొకడు కలడని చెప్పినా అది వారికి గ్రహింపుకు రాదు. అప్పుడు చెప్పబడిన సత్యమును అసత్యముగా భావించి మూడవవాడు లేడుయనీ ఉన్నది ఒక్కడేయని చెప్పుచుందురు. అనేక ఆయత్‍లలో 'ఈయనే మీ ఆరాధ్య దైవము'యని మూడవ అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పినమాట వారికి ఏమాత్రము గ్రహింపుకు రావడము లేదు. 'పని చేయు అల్లాహ్‍యే మీ ఆరాధ్య దైవము అనీ, నేను పని చేయనివానిననీ, ఏ అక్కర లేనివాడిననీ' చెప్పినా బోధకులు అవగాహన చేసుకొను స్థితిలో ఉండరు.


ఆ విధముగా వారి చెవులు, కన్నులు ఎందుకు మూసివేయబడ్డాయి, సత్యము అసత్యముగా ఎందుకు అనుకుంటున్నారని ఆలోచిస్తే, చెప్పిన సత్యమును అల్లాహ్‍కు ఇష్టమైనవారికే అర్థమగును. అల్లాహ్‍కు ఇష్టము లేనివారికి ఏమాత్రము సత్యము అర్థము కాదు. అల్లాహ్‍కు ఇష్టము అగుటకు జ్ఞానము మీద శ్రద్ధ యుండి, తనకు దేవుని జ్ఞానము తెలియదని, దేవుడు సత్యమును ఏ రూపములో ఎవరినుండయినా తెలుపునని అనుకొనువాడు దేవునికి ఇష్టుడుగా ఉండును. అట్లు కాకుండా నాకు దేవుని జ్ఞానమంతా తెలుసునని అనుకొనువాడు దేవునికి అయిష్టుడుగా ఉండును. దేవుడు తనకు ఇష్టమున్న వానికి మంచి దైవమార్గమును చూపును. ఇష్టము లేనివానికి అజ్ఞాన మార్గమును చూపును. నేను ఒక గురువుగా అల్లాహ్ ఇద్దరనీ, రెండవవాడు ఆరాధ్య దైవమనీ, మూడవవాడు రెండవ అల్లాహ్‍ను నియమించినవాడనీ, మూడవ అల్లాహ్ రెండవ ఆయనకు 'మృతులను లేపి తీర్పుతీర్చు అధికారమును ఇచ్చాడనీ, సర్వులకూ రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవమని తెలియజేశాడని, తాను ప్రజల ఆరాధనల అవసరము లేనివాడిననీ', తనను గురించి ఖుర్ఆన్ గ్రంథములో అక్కడక్కడ చెప్పడమే కాక 112వ సూరాలో గల నాలుగు ఆయత్‍లను మూడవ అల్లాహ్‍ను (తనను) గురించి చెప్పడమైనది.


దేవుడు ప్రపంచమునకంతా ఒక్కడేయనీ, దేవుని జ్ఞానము మూడు దైవ గ్రంథములలో ఉన్నది ఒక్కటేయనీ ఎవడు తెలియగలడో, వాడు సక్రమమైన శాస్త్రబద్దమైన జ్ఞానమును తెలిసి, దైవమార్గములో పోవునట్లు దేవుడే చేయగలడు. అట్లుకాకుండా అల్లాహ్ ఒక్కడేయను మాటను తెలిసినంత మాత్రమున ఏమీ ప్రయోజనము లేదు. ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడేయని తెలిసినప్పుడే ప్రయోజనము. ఆరాధనకు అతీతముగా యున్న అల్లాహ్ మరొకరున్నారని ఆయనే ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 117 లో చెప్పిన అల్లాహ్యనీ, ఆరాధనకు తగిన అల్లాహ్ ఒక్కడే ఆయనే సూరా ఆరు, ఆయత్ 102లో చెప్పబడిన అల్లాహ్యని తెలియవలెను. సూరా రెండు ఆయత్ 117కు, సూరా ఆరు, ఆయత్ 102 కు గల తేడాను గమనిస్తే రెండవ అల్లాహ్, మూడవ అల్లాహ్‍ను గురించి తెలియును.


(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దానిని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.'' (మూడవ అల్లాహ్) పరమాత్మ.


(6-102) ''ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సర్వానికి సృష్ఠికర్త. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతీ కార్యమునకు కార్యకర్తగా ఉన్నాడు.'' (రెండవ అల్లాహ్) ఆత్మ.


ఈ రెండు ఆయత్‍లలో ఇద్దరి అల్లాహ్‍ల తేడాలు స్పష్టముగా కనిపించుచున్నా కొందరు మూడవ అల్లాహ్‍ను ఏమాత్రము గుర్తించక ఉన్నది ఒకే అల్లాహ్ అని రెండవ అల్లాహ్‍ను మాత్రము చెప్పుచుందురు. ప్రవక్తలు (గురువులు) తన వరకు తెచ్చిన సత్యమును నమ్మనివాడు తన్ను తాను సరిదిద్దుకొని దేవుని మార్గములో పయణించలేడు. దేవుడు తన ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత (తౌరాత్) యందు ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములుగా ఉండగా, పరమాత్మ (దేవుడు) మూడు భాగములుగాయుండి ప్రపంచమును జీవరాసులతో నడుపుచున్నాడని కలదు. పరమాత్మ ఒకటి జీవాత్మగా, రెండు ఆత్మగా, మూడు పరమాత్మగా ఉన్నాడని తెలియుచున్నది. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ ప్రథమ దైవ గ్రంథమును అనుసరించి యున్నదనీ, ప్రథమ దైవ గ్రంథములో 'జ్యోతి, మార్గదర్శకత్వము' కలదని సూరా అయిదు, ఆయత్ 44లో చెప్పడము జరిగినది. ఇది గ్రహించని ముస్లీమ్ బోధకులు కొందరు దేవుడు ముగ్గురుగా లేడని, దేవుడు ఒక్కడేయని వాదించుచున్నారు. అలా చెప్పడము వలన ప్రథమ దైవ గ్రంథమును మరియు అంతిమ దైవ గ్రంథమును రెండింటినీ అవమానించి మాట్లాడినట్లగుచున్నది. అటువంటి వారికి దేవుడు మంచిమార్గమును చూపడు. వారు దైవ సందేశములను తెచ్చిన మనుషులను నమ్మక తమకంటే హీనులుగా చూచుచుందురు.


ప్రకృతి ఐదు భాగములు, దేవుడు మూడు భాగములు ఉన్నట్లు తెలియకపోతే దైవ ఆదేశాలను వినిపించిన వారిని, దైవ గ్రంథములను కించపరచినట్లగును. అర్థము కాకపోతే అడిగి తెలుసుకోవచ్చును గానీ, లేదు, కాదుయని ఎందుకు వాదించవలెను. వాదన వలన ఏమీ లాభము లేదు. సంవాదము వలన ఎంతో లాభము కల్గును, అనగా ఎంతో జ్ఞానము తెలియును. దైవ గ్రంథములను అనుసరించి శాస్త్రబద్దముగా దేవుడు చెప్పిన విధానమును తెలియగలిగితే దేవుని విధానము మూడు గ్రంథము లలో ఎలా యున్నదో తెలియగలదు. ప్రవక్తల (గురువుల) మాటలలోని సత్యమును మూడు గ్రంథములలో ఎలా గలదో ఇప్పుడు చూస్తాము.

ప్రథమ దైవగ్రంథము (తౌరాత్) లో... 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ


ద్వితీయ దైవగ్రంథము (ఇంజీలు) లో...


1) కుమారుడు 2) తండ్రి 3) పరిశుద్ధాత్మ


అంతిమ దైవగ్రంథము (ఖుర్ఆన్) లో...


1) మనిషి 2) అల్లాహ్ 3) అల్లాహ్


ఒకటవ ఆత్మ మనిషిగా ఉండగా, రెండవ ఆత్మ అందరికీ దేవుడుగా, ఆరాధింప దైవముగా యున్నది. మూడవ ఆత్మ పరమాత్మగా ఆత్మకంటే అతీతముగా ఉంటూ ఎవరికీ తెలియనిదిగా ఉన్నది. రెండవ ఆత్మనే అందరినీ ఆడించు దేవునిగా ఉండగా, మూడవ పరమాత్మ అందరినీ చూచు సాక్షిగా యున్నాడు. భగవద్గీతలో ఆత్మకు, పరమాత్మకు విడివిడిగా యున్న శ్లోకములు గలవు. ఈ విషయమును శ్రద్ధ, బుద్ధియున్నవాడు గ్రహించగలడు. ఆత్మకు, పరమాత్మకుగల తేడాను తెలియగలడు. రెండవ దైవగ్రంథములో తండ్రి, పరిశుద్ధాత్మయని వేరువేరుగా చెప్పబడినవారే అంతిమ దైవ గ్రంథములో ఇద్దరినీ ఒకే పేరుతో చెప్పడమైనది.


2) ఆత్మ 3) పరమాత్మ (ఆత్మ ఒక్కడే ఆరాధింప తగినవాడు)


2) తండ్రి 3) పరిశుద్ధాత్మ (తండ్రి ఒక్కడే ఆరాధింప తగినవాడు)


2) అల్లాహ్ 3) అల్లాహ్ (రెండవ అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము)


మూడు దైవ గ్రంథములలో రెండవ ఆత్మే ఆరాధ్య దైవముగా యున్నది. మూడవవాడు ఎవరి అక్కరలేని వాడుగా అన్నిటికీ అతీతముగా యున్నాడు. రెండవవాడే అన్ని కార్యములు చేయుచూ జగత్తులోని జీవుల నందరినీ నడుపుచుండగా, మూడవ ఆత్మ రెండవ దానికంటే అతీతమై, ఏమీ చేయనివాడుగా, మొదటి సృష్ఠికర్తగా అన్ని కార్యములను రెండవ వానికి అప్పజెప్పినవాడుగా యున్నాడు. ఈ విషయము రెండవ దైవ గ్రంథము బైబిలులో యోహాన్ సువార్త ఐదవ అధ్యాయములో 21 నుండి 29వ వచనము వరకు గలదు. మూడు ఆత్మల విషయము తెలిసినవాడే నిజమైన జ్ఞానియని చెప్పవచ్చును.


ఇంకా ఈ వాక్యములో తెలియవలసిన లోతైన రహస్యము ఏమనగా! ''మీలోనుండి నియుక్తులైన ప్రవక్తలు'' అని యున్నది. ప్రవక్తను గురువు అని కూడా అనవచ్చును. 'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవ మాత్రునికి తెలియదని' (3-7) లో చెప్పిన విషయమును మరువకూడదు. ఆ మాటప్రకారము మనిషిగా పుట్టినవాడు ఎవడూ దేవుని జ్ఞానమును తెలియడనియే చెప్పవచ్చును. దైవ గ్రంథములో దైవజ్ఞానమున్నా దానిని దైవము చెప్పినప్పుడే మనుషులకు అర్థము కాగలదు. దేవుడు దేవునిగా యుండి ప్రజలతో నేరుగా మాట్లాడడు. అందువలన దేవుడు మనుషులలో మనిషిగా వచ్చి తన జ్ఞానమును చెప్పవలసియున్నది. అందువలన దేవుడు మనిషిగా తప్పక రావలసియున్నది. దేవుడు దేవునిగా కాకుండా మనిషిగా వచ్చి మనుషులతో మాట్లాడగలడు. మనుషులలో మనిషిగా వచ్చిన వానిని ప్రవక్త లేక గురువు యని అనవచ్చును. అలా వచ్చిన దేవుడు స్వయముగా దైవ గ్రంథములో నిగూఢముగాయున్న జ్ఞానమును విప్పి చెప్పగలడు. మూడు దైవ గ్రంథములలో నిగూఢ (రహస్య) జ్ఞానవాక్యములు అంతిమ దైవ గ్రంథములో ఎక్కువ గలవు. అలా దేవుడు మనిషిగా వచ్చినప్పుడు అనగా ప్రవక్తగా (గురువుగా) వచ్చినప్పుడు మనుషులు ఆయన చెప్పు జ్ఞానమును విని తమలోని తప్పును సరిదిద్దుకొన్న వారికి పరలోకప్రాప్తి కల్గునని చెప్పుచూ దానినే 'భయము, దుఃఖము ఉండదు' అని అన్నారు. భయము, దుఃఖము పరలోకములోనే లేకుండా ఉండును. ఇహ లోకములో భయము, దుఃఖము ఉండును. అవి లేనిదే పరలోకము (మోక్షము). ఈ వాక్యమును చూచిన తర్వాత 'నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు' అనునట్లు నాకు తెలిసినదే జ్ఞానము అనుకోకుండా, తన తప్పును తెలిసి ప్రవక్త జ్ఞానమును తెలియువాడు ధన్యుడు అని చెప్పవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

54. అల్లాహ్ అజ్ఞానుల మీదికి ఆకాశము నుండి ఆపదను పంపును. (7-162)

ఇంతకుముందు చెప్పిన వాక్య వివరములో సందర్భానుసారము 'అల్లాహ్' అను పేరు గలవారు ఇద్దరున్నారని చెప్పియున్నాము. అందులో అందరికీ ఆరాధ్య దైవము ఒక్కడేయనీ, ఆయనే రెండవ అల్లాహ్యనీ, మూడవ అల్లాహ్ మొదటి సృష్ఠికర్తయనీ చెప్పియున్నాము. అల్లాహ్ అంశ మూడుగా యుండగా ఒకటి జీవాత్మకాగా, రెండవవాడు ఆత్మ, మూడవ వాడు పరమాత్మయని ప్రథమ దైవ గ్రంథములో చెప్పియున్నారు. ప్రథమ దైవ గ్రంథమయిన తౌరాతులో చెప్పిన ప్రకారము ఖుర్ఆన్ అదే విధానమునే ధృవీకరించుచున్నది. ప్రథమ దైవ గ్రంథములో చెప్పినట్లు అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో అల్లాహ్ ఒకటి మనిషిగా, రెండు అల్లాహ్గా, మూడు కూడా అల్లాహ్గా యున్నాడని చెప్పడము జరిగినది. మొదటి వానిని త్రోలబడేవాడు యనీ, రెండవవాడు త్రోలేవాడుయనీ, మూడవ వాడు ఏమీ చేయక సాక్షిగా యున్నాడని సూరా 50, ఆయత్ 21 లో చెప్పడము జరిగినది.


ఎన్నో ఆయత్‍ల సాక్ష్యముతో ఇద్దరు అల్లాహ్‍లున్నారనీ, వారిలో రెండవ వాడు ఆరాధన యోగ్యుడనీ, మూడవ అల్లాహ్ ఏమీ చేయనివాడని చెప్పారు. రెండవ అల్లాహ్ 'మనిషి చేయు ప్రతి కార్యమునకు కార్యకర్తగా యున్నాడని' (6-102) లో మరియు (2-255) లో చెప్పడము జరిగినది. ఇకపోతే మూడవ అల్లాహ్ ఏ అక్కర లేనివాడుగా యుంటూ, ఎవరి ఆరాధనలతో సంబంధము లేకుండా యున్నాడు. మూడవ అల్లాహ్ ఏ కార్యమును చేయడు. అయినా ఆయన సంకల్పించుకొన్న పనులన్నీ వాటంతటకవే జరిగిపోవుచున్నవి. బాగా ఆలోచిస్తే ఒక పనిని చేయువాడు కనిపిస్తే వాడు ఆ పనిని చేయుచున్నాడని ఎవరయినా చెప్పవచ్చును. అయితే ఒక పనిని చేయువాడు కనిపించకుండా జరిగితే దానంతట అది జరిగి పోయినదని చెప్పుదురు. మూడవ అల్లాహ్ సంకల్పించుకొంటే ఆయన చేయకుండానే వాటంతట అవి జరిగిపోవును అని అంటే మనకు కనిపించక చేయువారుండవచ్చును కదా! దీనిని గురించి వివరముగా చెప్పుకొంటే ఈ విధముగా కలదు.


''మమైవాంశో జీవలోకే జీవభూతస్సనా తనః'' ప్రథమ దైవ గ్రంథములో పురుషోత్తమప్రాప్తి యోగము అను అధ్యాయమున ఏడవ శ్లోకములో గల ఈ వాక్యమును అనుసరించి 'దైవ అంశ మనిషిగా (జీవునిగా)' యున్నదని తెలియుచున్నది. అలాగే రెండవ అంశ 'అందరూ ఆరాధింపదగిన ఆత్మగా' ఉన్నది. అట్లే మూడవ అంశ 'ఆత్మకంటే అతీతముగా యున్న పరమాత్మగా' యున్నది. ఇక్కడ చెప్పిన రెండవ ఆత్మను అంతిమ దైవ గ్రంథములో అల్లాహ్ అని అనడమేగాక, మూడవ ఆత్మను కూడా అల్లాహ్ అనియే అంటున్నారు. ఇద్దరు అల్లాహ్‍లలో ఒక్కడే ఆరాధ్య దైవముగా యున్నా, ఆయనే మీ ఆరాధ్య దైవము అని చెప్పినవాడు మూడవ అల్లాహ్‍యేనని చాలామందికి తెలియదు. రెండవ అల్లాహ్, మూడవ అల్లాహ్‍ల మధ్య ఎన్నో తేడాలున్నా వాటిని మనిషి గ్రహించలేకున్నాడు. ఇప్పుడు ఆ తేడాలను వివరముగా చెప్పుకొంటే ఇలా గలవు. రెండవ అల్లాహ్ మనిషి (జీవరాసి) శరీరమంతా వ్యాపించియుండి ఆ శరీరములో చైతన్యశక్తిగా యుంటూ శరీరమును కదలించి, శరీర అవయవముల చేత పనులను చేయించుచున్నాడు. శరీర అవయవములు కదిలి పని చేయుటకు కావలసిన శక్తిని శరీరములో రెండవ అల్లాహ్‍నే ఇచ్చుచున్నాడు. రెండవ అల్లాహ్ చైతన్యరూపముగా శరీరమంతా వ్యాపించి యున్నాడు. రెండవ అల్లాహ్ శరీరములో మాత్రమేయుంటూ, శరీరమంతా వ్యాపించి యున్నాడు. అంతేగానీ శరీరము బయట ఏమాత్రము లేడు. శరీరములో నఖ శిఖ పర్యంతమున్న అల్లాహ్ శరీరము బయట లేనే లేడు.


శరీరము బయట, శరీరము లోపల రెండుచోట్ల మూడవ అల్లాహ్ అయిన పరమాత్మ వ్యాపించియున్నాడు. ఎక్కడయినా అణువణువునా వ్యాపించి యున్నవాడు మూడవ అల్లాహ్ యని తెలియవలెను. మూడవ అల్లాహ్ శరీరము బయట లోపల అంతటా వ్యాపించియుండుట వలన బయట పాలన మూడవ ఆత్మ (అల్లాహ్), లోపల పాలన రెండవ ఆత్మ కొనసాగించుచున్నారని చెప్పక తప్పదు. శరీరము లోపల రెండవ అల్లాహ్ అంతటా వ్యాపించి అన్ని కార్యములను చేయు కార్యకర్తగా యుండగా, శరీరము బయట అల్లాహ్ ఏమీ చేయనివాడైనా ఆయన ఆలోచన మేరకు, ఆయన సంకల్పము మేరకు కార్యములను చేయు దేవదూతలు కోట్ల సంఖ్యలో గలరు. కోట్ల సంఖ్యలోయున్న దేవదూతలు అందరూ మూడవ అల్లాహ్ అనుకున్న దానిని అంతా చేయుచుందురు. దేహములోని 25 భాగములన్నియూ రెండవ ఆత్మ ఆధీనములో ఉండగా, శరీరము బయట గల కోట్లాది భూతములందరూ మూడవ ఆత్మను అనుసరించియుందురు. మూడవ ఆత్మ అయిన దేవుడు లేక అల్లాహ్ తాను ఏమీ ఆదేశించకున్నా ఆయనలో సంకల్పము కలిగిన వెంటనే ఆ పనికి పూనుకొందురు. శరీరములో 25 భాగములను ఆదేశించి నడుపువాడు రెండవ ఆత్మకాగా, ఆదేశించకనే మూడవ ఆత్మ పనులు జరుగుచుండును. ఈ విధముగా దేవునిపాలన సాగుచున్నది. శరీరములో బాధలు రెండవ ఆత్మ ద్వారా జరుగగా, శరీరము బయట ప్రపంచములో ఆపదలు, బాధలు మూడవ ఆత్మ ద్వారా జరుగుచున్నవని తెలియుచున్నది. బయటి ప్రపంచములో వచ్చు ప్రకృతి వైపరీత్యములు అన్నియూ మూడవ ఆత్మ (మూడవ అల్లాహ్) ద్వారా జరుగునవేయని తెలియుచున్నది. గత జన్మలో చేసుకొన్న పాపమునకు, గత జన్మలో చనిపోయినప్పుడు జరిగిన తీర్పులో రెండవ అల్లాహ్ మనిషి చేత పాపమునకు తగిన బాధలు అనుభవించునట్లు నిర్ణయించియుండును. ఆ నిర్ణయము ప్రకారము శరీరము బయట పాపమును అనుభవించుటకు దేవదూతలు తగినట్లు పని చేయుచుందురు. మనిషి చేసుకొన్న పాపమునకు తగినట్లు రెండవ ఆత్మ తీర్పు తీర్చగా ఆ తీర్పు కాలము ఆసన్నమైనప్పుడు మూడవ ఆత్మలో సంకల్పము కల్గును. అప్పుడు మూడవ ఆత్మలో కల్గిన సంకల్పమును అనుసరించి బయట ప్రపంచములోని దేవదూతలు కొందరు పనిచేసి మనిషికి లేక మనుషులకు ఆపదలను కలుగజేతురు. అదే విధముగానే పై వాక్యములో 'అజ్ఞానుల మీదికి ఆకాశము నుండి ఆపదలు కలుగజేతును' అని చెప్పినట్లు ఆకాశ రూపములో యున్న మేఘములు పై నుండి మనుషులకు అనేక రూపములలో బాధలను కలుగజేయుచుండును. ఆకాశ మేఘముల రూపములో కూడా కోట్లాది మంది దేవదూతలు కలరు. దేవ దూతలు భూతములు, గ్రహములు అను రెండు రకములుగా గలరు. ఆకాశము నుండి భూతములుగానీ, గ్రహములుగానీ భూమిమీద ప్రకృతి ఉపద్రవములను కలుగజేయడమే కాకుండా, అనేక రోగములను ఆకాశము నుండే తెచ్చి భూమిమీద వదలడము జరుగుచుండును. భూమిమీద ఎక్కడా లేని సరిక్రొత్త రోగాన్ని తెచ్చి మనుషుల మధ్యలో వదలగా, మనుషులు ఆ రోగము వలన బాధపడడము, చనిపోవడము జరుగుచుండును. దేవ దూతలు ప్రపంచమంతా ఆవహించి యున్నారు. వారివలన తుఫానులు, సునామీలు, వరదలు, భూకంపములు, పిడుగులు మొదలగునవి చేయడమే కాకుండా అనేక రోగములను వ్యాపింపజేయుచుందురు. ఇదంతయూ మూడవ అల్లాహ్ ఆధీనములో యున్న భూతములు చేయుచుందురు. అందువలన సూరా 7, ఆయత్ 162లో ఇలా చెప్పారు చూడండి.


(7-162) ''వారిలో దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేస్తారు. అందువలన మేము వారిపై ఆకాశము నుండి ఆపదను పంపాము. ఎందుకనగా! వారు చాలా అజ్ఞానముగా ప్రవర్తించేవారు.''


ఈ వాక్యములో 'ఆకాశము నుండి ఆపదను పంపుదుమని' చెప్పిన మాటను మనము చెప్పుకొన్నాము. దానికి వారు చేసుకొన్న పాపమేయని తెలిసినది. వారు దేవుని మాటను కూడా మార్చి చెప్పుచూ అజ్ఞానముగా ప్రవర్తించుచుందురు. అందువలన వారిమీద శిక్షను అమలు చేయుదుమని చెప్పారు. దేవుడు ఇచ్చిన వాక్కును ఎలా మార్చుచున్నారని చెప్పుకుంటే ఉదాహరణకు దైవ గ్రంథములో 'మనిషికి మొదటి జన్మవలె రెండవ జన్మ కలదని' చెప్పినమాటను కాదని, మనిషికి రెండవ జన్మలేదని కొందరు చెప్పడమును గమనించవచ్చును. ఈ విధముగా దైవ గ్రంథములోని దేవుని వాక్కును మార్చి చెప్పువారికి శరీరము లోపలి అల్లాహ్ పాపమును అంటగట్టగా, సమయము వచ్చినప్పుడు మూడవ అల్లాహ్ సంకల్పము ద్వారా దేవదూతలు పనిచేసి ఆకాశము నుండి ఆపదను తెచ్చిపెట్టుదురు. పై వాక్యమును ఇంతవరకు వివరించుకొన్నాము. ఈ వివరమును బట్టి దైవ గ్రంథములలోని విషయమును భావమార్పిడి చేయకుండా అల్లాహ్ చెప్పిన ప్రకారము గ్రహించుకోవలెనని తెలుపుచున్నాము.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

55. దేవతలు, మనుషులు పూర్తి అజ్ఞానముగా ప్రవర్తించుచున్నారు. (7-179)

(7-179) ''ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకము కోసము పుట్టించాము. వారికి హృదయాలున్నాయి, కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కన్నులున్నాయి, కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులు ఉన్నాయి, కానీ వాటితో వారు వినరు. వారు పశువులలాంటివారు. కాదు వాటికన్నా ఎక్కువ గానే దారి తప్పారు. పరద్యానములో పడిపోయిన వారంటే వీరే.''


పై వాక్యములో 'జిన్నులు' అని దేవతలను చెప్పారు. దేవుడు మనుష జాతిని పుట్టించినట్లే, దేవత జాతిని కూడా పుట్టించాడు. దేవతలు (జిన్నులు) అనువారికి స్థూలశరీరము ఉండదు. వారికి సూక్ష్మశరీరము మాత్రమే ఉండును. స్థూల, సూక్ష్మ శరీరములతో పుట్టినవారు మనుషులు కాగా, సూక్ష్మశరీరములతో పుట్టినవారు దేవతలు. దేవతలు కూడా మనుషుల వలె జీవనము సాగించుచుందురు. ఆ విషయము చాలామందికి తెలియదు కనుక దేవతలను మనుషులకంటే గొప్పవారుగా భావించుకోవడము జరుగుచున్నది. దేవుని లెక్కలో మనుషులు, దేవతలు ఇద్దరూ సమానమే. ఎందుకనగా! ఇద్దరూ పాపమును సంపాదించుకొనుచున్నారు. ఇద్దరూ అనుభవించుచున్నారు. మనుషులు చేయు అన్యాయాలు, పాపపు పనులు మాత్రమే మనకు కనిపించుచున్నవి. అయితే దేవతలు చేయు పాపపు పనులు మనుషులు చూడలేకపోవుచున్నారు. మనుషులే చాలా హీనమైన పనులు చేయుచుండగా, దేవతలు మనుషులకంటే హీనమైన పనులు చేయుచున్నారు.


ఈ వాక్యము చివరిలో 'పరద్యానములో పడిపోయినవారు వీరేయని' చెప్పియున్నారు. పరద్యానము అంటే ఏమిటి? అని వివరముగా తెలియవలసిన అవసరమున్నది. దేవునికంటే వేరయిన దానిని 'పర' అని అనుచున్నారు. ఇక్కడ సందర్భమునుబట్టి దేవుడు, ప్రకృతియను రెండే రెండు విశ్వములో గలవు. ప్రకృతి దేవునికంటే భిన్నమైనది. ప్రకృతిలో ఎన్నో విషయములు గలవు. దేవునిలో మూడు ఆత్మల విషయము తప్ప ఏమీ ఉండదు. అందులో మొదటి జీవాత్మను వదలితే రెండు, మూడు ఆత్మల విషయమే ఎక్కువగా ఉండును. దానినే దైవజ్ఞానము అని అంటున్నాము. దైవజ్ఞానముకంటే వేరైనది ప్రపంచ జ్ఞానము లేక ప్రకృతి జ్ఞానము అని చెప్పవచ్చును. ప్రకృతి జ్ఞానములో మనిషి పుట్టినప్పటి నుండి ఉండును. చిన్నప్పటినుండి ప్రకృతి విషయములలో మెలగుచుండుట వలన ప్రకృతి జ్ఞానము లేక ప్రపంచ జ్ఞానము అంతయూ నేర్వకనే వచ్చి యుండును. ప్రపంచ జ్ఞానములో కూడా కొందరు పూర్తి ముందు ఉండగా, కొందరు వెనుకబడియుండుటను చూస్తూనేయున్నాము. కొందరు తమకు దైవజ్ఞానము లేకున్నా ప్రపంచ విషయములలో అన్యాయముగా పోకుండా న్యాయముగా పోవువారు, ఇతరులను మోసగించనివారు, దొంగ తనము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలలోనికి పోకుండా నీతిగా జీవించువారు ఉన్నారు. మరికొందరు అన్ని చెడు వ్యసనములలో యుంటూ అవినీతిగా బ్రతుకుచున్నారు. కొందరు తమ ధన బలముతో, అధికార బలముతో ఇతరులను అణచివేస్తూ ధనార్జనే ముఖ్యముగా పెట్టుకొని ఏమాత్రము పాపచింతన లేకుండా బ్రతుకుచున్నారు.


ప్రపంచ జ్ఞానములో యున్న వారందరికీ వారి ద్యాసయంతయూ ప్రపంచ ధనము మీదే ఉండగా దేవుడు, దైవము అనుమాటలను వినుటకు కూడా ఇష్టపడక అజ్ఞాన జీవితమునే గడుపుచున్నారు. కొందరు డబ్బు కొరకే పుట్టాము, డబ్బు కొరకే బ్రతుకుచున్నాము అన్నట్లు వ్యవహరించుచూ ధనము కొరకు ఏ అవినీతిపనైనా చేయుచున్నారు. ధనము కొరకు దేవునికి, దేవుని మార్గములో యున్న మనుషులకు హాని కల్గించుచూ వ్యతిరేఖముగా ప్రవర్తించుచుందురు. అజ్ఞానముతో కూడుకొన్నవారు, ప్రపంచ జ్ఞానములో యున్నవారు వారి అజ్ఞాన పనులలో హద్దూ పద్దూ లేకుండా ప్రవర్తించు చుందురు. మామూలు బలహీన ప్రజలను దోచుకొంటూ, పాపభీతి అనునది ఏ కోశములో లేకుండా బ్రతుకుచుందురు. తాను తన సంసారము బాగు పడితే చాలు మిగతావారంతా ఏమయిపోయినా ఫరవాలేదన్నట్లు ప్రవర్తించు చుందురు. తనకొద్దిపాటి సుఖము కొరకు ఇతరులను హత్య చేయడానికి కూడా వెనుకాడరు. ఇతరుల జీవితములు నాశనమయినా తాను క్షేమముగా యుండవలెనను వారికి ప్రపంచ జ్ఞానములోనే నీతి నిజాయితీ ఏమాత్రము ఉండదు. అట్టివారికి దేవుని జ్ఞాన విషయములు ఏమాత్రము పట్టుబడవు. ఎవరయినా దైవజ్ఞానమును చెప్పినా, ఆ మాటలు వారి చెవిలో దూరవు. వారికి కన్నులు ఉన్నా వారికి దేవుని జ్ఞానముగానీ, దైవ గ్రంథములు గానీ ఏమాత్రము కనిపించవు. ఒకవేళ బలవంతముగా చూపించినా, బలవంతముగా వినిపించినా వారి బుద్ధి విన్న మాటలను, చూచిన దృశ్యమును గ్రహించుస్థితిలో ఉండదు. వారికి హృదయములున్నాయి గానీ వారి బుద్ధి ఆలోచించని స్థితిలో ఉండుట వలన హృదయాలకు ఏమీ చేరదు. అజ్ఞానులను ఆలోచిస్తే వీరు మనుషులేనాయని అనుమానము రాక తప్పదు. అలా ఆలోచిస్తే అటువంటి అజ్ఞాన ప్రజలు పశువులకంటే హీనులుగా బ్రతుకుచున్నారని తెలియుచున్నది. అదే విషయమునే (7-179) వ వాక్యములో చెప్పియున్నారు. పశువులకంటే దిగజారిన వారిని ఎందరినో భూమిమీద చూడవచ్చును.


ఇకపోతే 'జిన్నులు' అని వాక్యములో చెప్పియున్నారు. జిన్నులు అను పేరు చాలామందికి క్రొత్తగా కనిపించినా అందులో విశేషము ఏమీ లేదు. మనుషులు దేవునితో సమానముగా లేక దేవునిగా నమ్మి పూజించు దేవతలనే ఖుర్ఆన్ గ్రంథములో జిన్నులు అని చెప్పడము జరిగినది. జిన్నులను దేవతలుగా చెప్పుకొంటే భూమిమీద పుట్టిన మనుషులకు దేవతల విషయము ఏమాత్రము తెలియదనియే చెప్పవచ్చును. మనుషుల లెక్కలో దేవతలు గొప్పవారిగా, మనుషులకంటే మహిమ గలవారిగా మనుషుల జీవితములను మార్చు వారిగా, మనుషులు కోరు కోర్కెలను నెరవేర్చు శక్తి వంతులుగా, ఆపదలో రక్షించు ఆపద్బాంధవులుగా లెక్కించి పూజించు చుందురు. మనుషులు చేయు ఆరాధనలన్నీ దేవతలకే అయివుండడము విచిత్రము. ముస్లీమ్ సమాజములోను, క్రైస్థవ సమాజములోను దేవతలను పూజించుట నిషేధముగా యున్నా, హిందూ సమాజములో అధిక శాతము దేవతలను ఆరాధించుటకు అలవాటు పడిపోయారు. దేవతలు ఏమీ చేయలేరనీ, ఏ శక్తి లేనివారనీ, ఏ మహిమ లేనివారనీ హిందువులలో అధిక శాతము మందికి తెలియదు. చాలామంది దేవతలను ఆరాధించుటకు అలవాటు పడిపోయారు. అటువంటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధించు చుందురో ఆ దేవతే వారి దృష్ఠిలో దేవునిగా యుండును. దేవుడు వేరు, దేవతలు వేరను విషయమే తెలియని మనుషులు పెద్దపెద్ద గుడులనుకట్టి అందులో దేవతలను ప్రతిష్ఠించి అనేక విధములయిన ఆరాధనలతో ఆరాధించడము పరిపాటిగా చేయుచున్నారు. మనుషులలో కొందరు ఒక దేవతను, మరికొందరు మరొక దేవతను ఆరాధించుటకు అలవాటు పడినారు. అందరూ ఒక దేవతను పూజించడము లేదు.


మనుషులు దేవతలను గొప్పగా పెట్టుకోగా, దేవతలు మనుషులను తమకంటే తక్కువవారిగా భావించి చూస్తున్నారు. వాస్తవానికి మనుషులు దేవతలు ఇద్దరూ దేవుని చేత సృష్ఠించబడినవారే. దేవతలు మనుషులు కర్మప్రకారమే పుట్టగా అందులో వక్తలు (బోధకులు), ప్రవక్తలు (గురువులు) మానవులలోనే పుట్టారు. దేవతలలో బోధకులుగానీ, గురువులుగానీ పుట్టడము లేదు. దేవతలు అందరూ దైవజ్ఞానము ఏమాత్రము తెలియని వారుగా పుట్టుచున్నారు. మనుషులలోనే అంతో ఇంతో జ్ఞాన సంస్కారము గలవారు పుట్టుచున్నారు. దేవతలుగా పుట్టిన తర్వాత కొందరు మనుషులు చెప్పు బోధలు విని అంతో ఇంతో జ్ఞానమును సంపాదించుకొనుచున్నారు. కొందరు తాము మనుషులకంటే గొప్పవారమను భావమును కల్గి మనుషులయిన బోధకులు, గురువులు చెప్పు మాటలను వినడము లేదు. కొందరయితే తామే దేవునికంటే గొప్పవారమనీ, తమకంటే ఏ దేవుడూ గొప్పకాదను అహము కల్గి నిజమైన దైవజ్ఞానము తెలిసి, నిజమైన దేవున్ని ఆరాధించు జ్ఞానులను సహితము ఇబ్బందులపాలు చేయుచున్నారు. తమను మ్రొక్కక దేవున్ని మ్రొక్కువారిని అనేక ఇబ్బందులు కలుగజేసి దేవున్ని మ్రొక్కడము మానివేసి తమనే మ్రొక్కవలెనని వారి శరీరములలో ప్రవేశించి రోగముల రూపములో బాధ పెట్టుచుందురు.


జిన్నులు (దేవతలు) మనుషులకంటే కౄరముగా ప్రవర్తించుచూ, మనుషులకంటే రెండింతలు పాపమును సంపాదించుచున్నారు. తమ దేవాలయము దగ్గర ఎంగిలి మూసాడని ఒక మనిషిని ఒక దేవత కాళ్లు చేతులు పడిపోవునట్లు చేయడమును చూచాను. తెలియక ఎంగిలి మూస్తే, అదియూ దేవాలయమునకు దూరముగా ఎంగిలి మూసినా, తప్పేయని చెప్పు దేవతలు మనుషులకంటే కౄరులు కాదా? ఒక బాలుడు పుట్టకు సమీపములో మూత్రము పోశాడని, తాను నివాసముంటున్న పుట్టకు దగ్గరగా మూత్రము పోయుటవలన పాముకాటుకు గురిచేసి చిన్నపిల్లలను సహితము చంపు దేవతలు మనుషులకంటే కఠినస్తులు కాదా? నా దేవాలయము దగ్గర అరుగు మీద సారాయి త్రాగి పడుకొన్నాడని పార్శ్వవాయువు రూపములో కాలు, చేయి, నోరు పడిపోవునట్లు చేయు దేవతకంటే కౄరులు కలరా? యని అడుగుచున్నాను. నాకు పూజలు మాని ఇంకొక దేవతను మ్రొక్కుచున్నారని రోగముల రూపములో బాధించు దేవతలకంటే మనుషులు నయము కాదా? ఈ మధ్య కాలములో నన్ను వదలి గురువుల వద్దకు పోయి జ్ఞానము తెలియుచున్నారని ఇంట్లో చిన్న పిల్లలకు మూర్ఛవచ్చునట్లు చేయు దేవతలకంటే అజ్ఞాన మనుషులు మేలు కాదా? అంతో ఇంతో దయ కల్గిన మనుషులకంటే ఏమాత్రము దయలేని కొందరు దేవతలు పూర్తి దుర్మార్గులు కారా? ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నీ నేను ప్రత్యక్షముగా చూచి చెప్పునవేయని మీరు తెలియండి. నేను గతములో ఎందరో దేవతలను చూచాను, వారు చేయు దుర్మార్గపు పనులను చూచాను. కొంతవరకు చాలామంది దేవతలను మీరు మనుషులకంటే దుర్మార్గముగా ప్రవర్తించు చున్నారని దండించిన సందర్భములు చాలాగలవు. మీరు నమ్మినా, నమ్మక పోయినా మనుషులకంటే దుర్మార్గములో ఎక్కువవారు దేవతలు అనుమాట సత్యము. మనుషులే పెద్ద దుర్మార్గులుగా యున్నారని అనుకొంటే, మనుషుల కంటే మించిన దుర్మార్గులు దేవతలని ఎవరికీ తెలియదు. మేము ఈ మాటను చెప్పితే హిందువులలో కొందరు మా మాటను నమ్మకపోగా, మా మీదికే పోట్లాటకు వచ్చినవారు కూడా యున్నారు.


నా అనుభవరీత్యా నేను చూచిన దానిలో దేవతలయందు కొద్దిమంది మాత్రము కొంత సాత్త్విక స్వభావము కల్గియున్నారు. అటువంటివారు అక్కడక్కడ బోధకులవద్ద గానీ, గురువులవద్ద గానీ దైవజ్ఞానమును విని కొంత దైవ జ్ఞానమును పొందినవారుగా యున్నారు. అట్లు తెలుసుకొన్న వారికి ఎంత పెద్ద గుడియున్నా, తనను ఎందరో వచ్చి పూజించుచున్నా దానినంతటినీ లెక్కచేయక దైవజ్ఞానమునకే ప్రాధాన్యతనిచ్చు దేవతలు గలరు. ఉదాహరణకు హైదరాబాదులో జూబ్లీహిల్స్‍లో పెద్దమ్మ గుడి పెద్దదిగా యున్నది. అక్కడ దేవాలయములో కొలువైయున్న పెద్దమ్మ దేవతను ఎందరో ధనికులు, రాజకీయ నాయకులు, గొప్పవారిగా పేరుగాంచినవారు పూజించడము తెలిసిన విషయమే. అంత పెద్ద హోదాలో యున్న దేవత దైవజ్ఞానము పట్ల ఆసక్తి కల్గినదై, ప్రతీ నెల ఒక గురువు దగ్గర జరుగు బోధలు వినేదానికి పోవుచున్నదంటే ఆశ్చర్యపడవలసిన విషయమే. చిన్న దేవతలు సహితము మేము గొప్పయను భావముతో అజ్ఞానముతో ఉండగా, ఎంతో పేరు ప్రఖ్యాతులు గల దేవత తనను తాను తగ్గించుకొని జ్ఞానమునకు విలువనిచ్చి దైవ జ్ఞానమును తెలుసుకోవడములో దాదాపు 400 కిలోమీటర్ల దూరము ఇతర మనుషులతో ప్రయాణము చేసిపోవుచున్నదంటే దేవతలకు కూడా జిజ్ఞాసకలదని తెలియుచున్నది. ఒక ప్రసిద్ధిచెందిన దేవత ఇతర మనుషుల వద్దకుపోయి జ్ఞానమును తెలియుచున్నదంటే, నేను మనుషుల కంటే తక్కువయను భావమున్నప్పుడే అది సాధ్యమగును. ఈ విధముగా దేవతలలో కూడా కొందరు జ్ఞాన శ్రద్దకలవారు ఉన్నారు.


మనుషులలో అందరూ దుర్మార్గులుగానీ, అందరూ అజ్ఞానులు గానీ లేరు. అలాగే దేవతలలో కూడా అందరూ దుర్మార్గులుగానీ, అందరూ అజ్ఞానులుగానీ లేరు. దేవతలు, మనుషులు అను రెండు జాతులలో మంచివారు గలరు, అట్లే చెడువారు గలరు. అయితే రెండు జాతులలోనూ అధికశాతము అజ్ఞానులు గలరని తెలియవలెను. ఇక్కడ దేవుడు పుట్టించిన మనుషులు, దేవతలను చెప్పాముగానీ, దేవదూతలను గురించి చెప్పలేదు. దేవదూతలు దేవుని పాలనలోని వారుకాగా, దేవతలు దేవుని చేత సృష్ఠింప బడినవారు. దేవదూతలకు మనుషులవలె చావు, పుట్టుకలు లేవు. అదే దేవతలకయితే మనుషులకున్నట్లు చావు, పుట్టుకలు గలవు. దేవతలు, మనుషులు ఇరువురూ దేవదూతల చేత పాలింపబడుదురు. దేవతలు కూడా పాపములను పొంది తిరిగి వచ్చు జన్మలలో శరీరములోని దేవుని (ఆత్మ) చేత, ప్రపంచములోని దేవదూతల చేత కష్టములను అనుభవించు చుందురు. అందువలన మనుషులను, దేవతలను వదలి అందరినీ సృష్ఠించిన దేవున్ని ఆరాధించమని చెప్పుచున్నాము.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

56. భూమిని ఆకాశమును సృష్ఠించిన వానిని మీరు గుర్తించలేరా? దీని తర్వాత మీరు దేనిని విశ్వసిస్తారు? (7-185, 186)

(7-185,186) ''ఏమిటి? ఆకాశాల మరియు భూమియొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్ఠించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలము దగ్గరపడి యుండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తర్వాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది? (186) అల్లాహ్ అపమార్గమున వదలిపెట్టిన వారిని సన్మార్గము వైపు ఎవరూ తీసుకరాలేరు. వారు తమ తలబిరుసుతనములోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదలివేస్తాడు.''


ఈ వాక్యము 185 పూర్తి సూక్ష్మజ్ఞానముతో కూడుకొనియున్నది. (186) పూర్తి స్థూలముగాయున్నది. (185) వ వాక్యమును స్థూలముగా చెప్పితే వాక్యములోని భావము ఏమీ తెలియకుండాపోవును. అందువలన (185)వ వాక్యమును సూక్ష్మముగానే వివరించి చెప్పుకొన్నప్పుడు అల్లాహ్ చెప్పిన విషయము పూర్తిగా అర్థము కాగలదు. అందువలన మొదట 185వ వాక్యమును సూక్ష్మ అర్థముతోనే చెప్పుకొందాము. దేవుడు ఒక యంత్రములాంటి వ్యవస్థను తయారుచేసి, ఆ వ్యవస్థ పూర్తిగా పనిచేయుటకు ఎన్నో వస్తువులను కూడా ఆ వ్యవస్థలో తయారు చేసియుంచాడు. అయితే ఆ యంత్రములాంటి వ్యవస్థ ఏమిటి?యని పరిశీలించి చూస్తే ఆకాశములు భూమితో కూడుకొన్న దైవ నిర్మితమైన వ్యవస్థను మనము నిత్యము చూస్తున్నాము. ఎంతో సామాగ్రితో నిండియున్న యంత్రము కొంతకాలము పనిచేసి చివరకు పనికిరాకుండా చెడిపోయినట్లు, దేవుడు నిర్మించిన వ్యవస్థ కూడా కొన్ని సంవత్సరములు పని చేసి చివరకు ఎప్పుడో ఒకప్పుడు పని చేయకుండాపోవును. బయటి యంత్రముతో సమానమైన వ్యవస్థలో ఏడు ఆకాములు గలవు. బయటి ఆకాశము ఒక్కటేయుండగా దేవుడు తయారు చేసిన వ్యవస్థలో ఒక రకమైన ఆకాశము కాకుండా ఏడు రకముల ఆకాశములు గలవు. బయట ఆకాశమును చూస్తే అందులో ఏమీ లేకుండా శూన్యముగా తెలియుచున్నది. ఆకాశము భూమినుండి పైకి వ్యాపించి యున్నది. ఆకాశములో ఏమీ లేదని, అది ఒక ఖాళీగా యున్న శూన్యమని ఇతరులు కూడా చెప్పుచున్నారు. ఆకాశము, గగనము, శూన్యము యని ఆకాశమును చెప్పుచుందురు. ఈ మూడు పదములలో 'శూన్యము' అనగా కనిపించకుండా ఉన్నదని అర్థము గలదు. కనిపించదు అనేది వాస్తవమేగానీ కనిపించకుండా ఉన్నది ఏదో ఎవరికీ తెలియదు. 'గగణము' అను పదమును తీసుకొని చూస్తే గణము అనగా గుంపుగా యున్నది. ప్రమథ గణములు అనగా గుంపులుగా యున్న మొదటివారని అర్థము. అట్లే 'గుణ గణములు' అనగా 'గుంపులుగా యున్న గుణములని' అర్థము. 'క్రోదము' అనగా 'కోపము'. కోపము అను గుణము ఎన్నో రకముల పెద్దవి, చిన్నవి గలవు. కోపము ఎన్నో రకములు ఉన్నట్లు, మిగతా గుణములు కూడా చిన్నవి, పెద్దవి ఎన్నో రకములు గలవు. ఒక గుణము తొమ్మిది రకముల గుంపుగా తలయందు కలవని ముందే చెప్పుకొన్నాము. దాని ప్రకారము 12 గుణముల గుంపులను గుణ గణములు అని అంటున్నాము. ఇకపోతే ఆకాశము అనగా ఎంతో గుంపుగలదని అర్థము. కోశము అనగా ఒక గుంపు పనులతో కూడుకొన్నదని అర్థము. అన్నమయ కోశము అనగా! జీర్ణాశయము, చిన్నప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణాశయములో ఊరే రసములు మొదలగునవన్నీ కలిపి అన్నమయ కోశము అని అంటున్నాము. అ అంటే లేదు అని అర్థము. ఆ అంటే ఉన్నదని అర్థము. ఆకాశమును విడదీసి చూస్తే ఆ+కోశము=ఆకాశము అని చెప్పుచున్నారు. ఎంతో గుంపుతో కూడుకొన్న దానిని ఆకాశము అని అంటున్నాము.


ఆకాశము అంటే పైన ఉండేదియని అందరికీ తెలుసుకానీ, ఇప్పుడు మనము చెప్పుకొన్న అర్థములు ఎవరికీ తెలియవు. అల్లాహ్ తన దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో ఆకాశములు, ఆకాశము అను పదములను చాలాచోట్ల ఉపయోగించి చెప్పుట వలన ఆకాశము అంటే ఏమిటి? అని పూర్తి వివరముగా చూడవలసివచ్చినది. మనకు కనిపించు బయటి ఆకాశములో ఏమీ లేనట్లు కనిపించినా, వాస్తవముగా మనకు కనిపించని ఎన్నో జీవరాసులు, ఎంతో నీరు, ఆ నీటిలో చేపలు, కప్పలు, పాములు మొదలగునవి ఎన్నో గుంపులుగా కలవు. ఆకాశము నుండి నీరు వర్షరూపములో కురియడము అందరికీ తెలుసు. అక్కడక్కడ అప్పుడప్పుడు చేపలు ఎన్నో పై నుండి క్రిందపడడము చూచేయుందుము. దానిప్రకారము కొన్నిచోట్ల అనేకరకముల జీవరాసులు ఆకాశమునుండి క్రింద పడడము గలదు. చెప్పుతూపోతే మనకు కనిపించు వృక్షజాతి, గడ్డిరకములు, తీగలు అన్నీ మొదట ఆకాశము నుండి క్రిందికి వచ్చినవే. ఒక ప్రాంతములో లేని జీవరాసులను, జంతువులను ఆకాశము తెచ్చి ఆ ప్రాంతములో క్రిందికి వదలుచున్నదని చాలామందికి తెలియదు. ఈ విధముగా బయట ఆకాశముండగా, దేవుడు సృష్ఠించిన లోపలి ఆకాశములు మరియు భూమితో కూడుకొన్న వ్యవస్థలో ఉన్నవన్నీ అవి ఆకాశమునుండి, భూమి నుండి పుట్టినవేయని తెలియుచున్నది. బయటి ఆకాశమునుండి సమస్త జీవరాసులు రాగా, భూమినుండి సమస్త వస్తువులు వచ్చాయి. అయితే దేవుడు నిర్మించిన లోపలి వ్యవస్థలో ఏడు ఆకాశములుండగా, అందులో ఏమి పుట్టినవో గమనించి చూడాలంటే దేవుడు చేసిన ఆ వ్యవస్థ ఏమిటో ముందు తెలియవలెను.


'సంస్థ' అను పదమునుండి 'వస్థ' అను పదము రూపాంతరము చెందినది. సంస్థ అనగా ఎంతోమందితో కూడుకొన్నదని అర్థము. 'వ్య' అనగా నశించునది లేక మరణించునది యని అర్థము. నాశనమగు గుంపుతో కూడుకొన్న దానిని వ్యవస్థ అని అంటాము. మానవ శరీరమును అల్లాహ్ తయారు చేశాడు. మానవ శరీరములో ఎన్నో అవయవములు, వాటికి అనుబంధ భాగములు సజీవముగా గలవు. సజీవముగా యున్న గుంపుతో కూడుకొన్నది మానవ శరీరము. అది కొంత కాలమునకు నశించును కనుక శరీరమును వ్యవస్థయని దైవ గ్రంథములో చెప్పారు. శరీరము అను వ్యవస్థలో ఏడు ఆకాశములు పైన, క్రింద భూమి కలదు. అంతేకాక భూమి ఆకాశముల మధ్యలో ఎన్నో శరీర భాగములు గలవు. అందువలన ఆకాశాలు మరియు భూమి యొక్క వ్యవస్థను ''భూమి, ఆకాశములు మధ్యలో గల వస్తువులను అల్లాహ్ సృష్ఠించాడు'' అని చెప్పారు. దానిని సూక్ష్మ భావముతో గమనించితే దేవుడు చేసిన వ్యవస్థ శరీరమే యని తెలియుచున్నది. శరీరములోని ఆకాశములలో ఎన్నో దాగియున్న సమాచారములు గలవు. శరీరములోని ఆకాశములు ఏడు గలవు. ఏడులో అన్నిటికంటే పెద్ద ఆకాశము తలయందు గలదు. మిగతా ఆరు ఆకాశములు వెన్నుపాము అను నాడియందు గలవు. ఈ ఏడు ఆకాశములు మరియు పాదములు మొదలుకొని యున్న శరీరమును భూమి యని అంటున్నారు. శరీరములోనే నాడీవ్యవస్థను ఆకాశములనీ, శరీరమును భూమియని దేవుడు నిగూఢముగా చెప్పాడు. శరీరమును భూమి అనుటకు సాక్ష్యముగా శరీరము మీద ఎక్కడ దిద్దినా భూమికి గుర్తుగా మట్టి వచ్చుచున్నది. ఈ విధముగా కనిపించే శరీరమును, కనిపించని నాడులను అన్నిటినీ కలిపి ఆకాశములు, భూమితో తయారయిన వ్యవస్థయని దేవుడు చెప్పాడు.


భూమి ఆకాశముల శరీర వ్యవస్థను అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియుండగా దానిని ఎవరూ గమనించకుండా, దానిని గురించి ఏమీ తెలియనివారుగా యున్నారు. వారు శరీర వ్యవస్థలో ఉన్నామనీ, అందులో కాలము దగ్గరపడుచున్నదనీ, మరణము వస్తే శరీర వ్యవస్థను వదలిపోవాలని వారు ఏమాత్రమూ ఆలోచించలేదు యని వాక్యములో చెప్పారు. భూమి ఆకాశములను గురించి ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా చెప్పియున్నారు. ఖుర్ఆన్ గ్రంథమే ఆఖరి దైవ గ్రంథము. కావున ఖుర్ఆన్ తర్వాత మనుషులు విశ్వసింపదగిన గ్రంథము ఇంకొకటి లేదు. అటువంటప్పుడు శరీర వ్యవస్థను గురించి ఆలోచించక, అందులో కొద్దికాలమే ఉంటాము, కాలము ప్రతి దినము దగ్గరపడుతున్నదని ఆలోచింపకయున్నారు. ఇతరులు ఆ విషయమును చెప్పినా అదియంతయూ అజ్ఞానము, అది అవసరము లేదు. మనిషి ఇతర దేవతలను కాకుండా అల్లాహ్‍ను ఒక్కనినే ప్రార్థించుచూపోవాలి. ప్రార్థన తప్ప వేరేది ఏమీ అవసరము లేదు అని అంటున్నారు. అలాగే ప్రార్థన చేయుచున్నారు. అయితే ఆ ప్రార్థన అడ్రస్లేని జాబులాంటిదని, శరీర అంతర్గతములో యున్న ఆత్మను, మనస్సును, బుద్ధిని తెలిసి వాటి ద్వారా చేసే ప్రార్థన చాలా శక్తివంతమయినదని నేడు చాలామందికి తెలియదు. అలా తెలియని వారిని హెచ్చరించుతూ, ''వారి కాలము దగ్గరపడియుండ వచ్చునన్న సంగతి గురించి కూడా వారు ఆలోచించ లేదా?'' అని వాక్యములో చెప్పారు.


శరీరములో నిర్ణయించబడిన కర్మ అయిపోవుకొద్దీ ప్రతి మనిషికి మరణము దగ్గరవుతూ వచ్చుచుండును. అలా మనిషికి (తమకు) పోయే కాలము దగ్గర పడిందేమోనన్న విషయము గురించి ఎవరూ ఆలోచించడము లేదు. దీనినిబట్టి ఏ మనిషి తమలోపలి వ్యవస్థను గురించి ఆలోచించడము లేదని, ఇతరులు చెప్పినా వినడము లేదని వారి తలబిరుసుతనముతో (అహముతో) ప్రవర్తించుచూ తమకు తెలిసినదే నిజమైన జ్ఞానమని అనుచూ సత్యమును చెప్పు జ్ఞానులను సహితము అజ్ఞానులుగా పోల్చి దూషించు చుందురు. అటువంటి వారిని అల్లాహ్ అజ్ఞాన మార్గమున పోవునట్లు చేయుచున్నాడు. అల్లాహ్ అలా ఎవరిని అపమార్గములో వదలివేశాడో వారు ఎంతకాలమయినా అదే మార్గములో ఉంటారు తప్ప జ్ఞానమార్గము లోకి రాలేరు. వారికి బయటి చూపు తప్ప లోపలిచూపు ఏమాత్రమూ ఉండదు. శరీరాంతర్గత వ్యవస్థను తెలియనివాడు బయట ఎంత గొప్ప జ్ఞానియని అనిపించుకొన్నా గురువుగా, బోధకుడుగా యున్నా వానిదారి తప్పుదారే యగును. వాడు ఎప్పటికీ మంచిదారిలోనికి రాలేడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

57. ఆయన ముందు సాష్టాంగపడుచూ ఉంటారు. (7-206)

భూమిమీద మూడు మతములు ముఖ్యముగా యున్నవి. మూడు మతములవారే ఎక్కువ సంఖ్యలో యున్నారు. ఇప్పుడు మనము చెప్పుకొను వాక్యము అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లోనిది. ఖుర్ఆన్ గ్రంథము సర్వమానవులది కాగా ముస్లీమ్‍లు తమ గ్రంథము అని అంటున్నారు. గ్రంథము ఏదైన ఏ మానవ సమాజమునకూ సంబంధము లేనిదై మనుషులందరికీ జ్ఞానమును చెప్పునదై యున్నది. మత సాంప్రదాయములు ఏ మతమునకు సంబంధించినవి ఆ మతమునకు ఉండునుగానీ, దేవుని జ్ఞానము మాత్రము మతసాంప్రదాయములవలె ఒక మతమునకు సంబంధించి యుండదు. నేడు భూమిమీద మనుషులు దేవుని జ్ఞానము కంటే ఎక్కువగా మతమునకు, మత సాంప్రదాయములకు ఎక్కువ విలువ నిచ్చుచున్నారు. మత సాంప్రదాయము ప్రకారము షరియత్ అను పేరుతో కొన్ని నియమములు గలవు. ఆ నియమముల ప్రకారము ఇస్లామ్ మత సాంప్రదాయము ప్రకారము అల్లాహ్‍కు తప్ప ఇతర మనుషులకు ఎవరికీ నమస్కరించకూడదు అన్నది నియమము. అయితే ఇస్లామ్ జ్ఞానము ప్రకారము అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్‍లో 15వ సూరాలో 29, 30, 31 ఆయత్‍లలో దేవుని చేత సృష్ఠించబడినవాడు, దేవుని ఆత్మయిన వాడు మనిషిగా వస్తే అతనికి అందరూ సాష్టాంగపడండియని స్వయముగా అల్లాహ్‍యే చెప్పాడు. అయితే అక్కడ చెప్పిన ఆయత్‍లకు వ్యతిరేఖముగా కొందరు దేవుడు మనిషిగా రాడు అని అంటున్నారు. దేవుడు తయారు చేసిన మనిషిలో, దేవుని ఆత్మను దేవుడే ఊది పంపినపుడు, వచ్చినవాడు దేవుడే యగును తప్ప వేరు కాడు. దేవుని ఆత్మతో కూడుకొన్న మనిషి దేవునితో సమానమైనవాడై వస్తే ఆయనకు నమస్కరించండియని దేవుడు చెప్పినా, తమ మత షరియత్ ప్రకారము అల్లాహ్‍కు తప్ప ఇతరులకు మ్రొక్కము అని అంటున్నారు. అదే విషయమునే సూరా 7, ఆయత్ 206 లో కూడా చెప్పడమైనది. ఆ వాక్యమును ఇక్కడ చూస్తాము.


(7-206) ''నీ ప్రభువుకు చేరువలో యున్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయముతో మెలగరు. పైగా వారు అణుకువతో ఆయన పవిత్రతను కొనియడుతూ, ఆయన ముందు సాష్టాంగ పడుచూ ఉంటారు.''


ఈ వాక్యములో అల్లాహ్ యొక్క ఆరాధనపట్ల గర్వపడక వినయముగా ఉంటారు అని వుంది కానీ అల్లాహ్ ఎవరికీ కనిపించేవాడు కాడు. ఆయనను ఎవరూ చూడలేదు. అయితే అల్లాహ్ అయినవాడు మట్టితో ఒక బొమ్మను చేసి తన ఆత్మతో పంపినప్పుడు శరీరములో ఉన్న వ్యక్తికి భక్తినిబట్టి అతనికి గౌరవము ఉండునుగానీ, శరీరమును బట్టి గౌరవము ఉండదు. అట్లే దేవుడు మనిషిగా వస్తే ఆ మనిషిలోని దేవుని పవిత్రతను పొగడవలసి యుంటుంది. అలాగే ఆయన ముందు సాష్టాంగ పడవలసి ఉంటుంది. అల్లాహ్ యొక్క ఆకారము కనిపించదు. కనిపించని ఆకారమును ఆరాధన రూపములో ప్రార్థించినా, అల్లాహ్ యొక్క కనిపించే ఆకారమును పొగడవలసిందే, అట్లే దేవుని ఆకారము ముందర సాష్టాంగ నమస్కారము చేయవలసిందేయని ఈ వాక్యములో చెప్పారు. దీనినిబట్టి అల్లాహ్ రెండు రకముల ఉన్నాడనీ, ఒకటి శరీరము లేకుండా నిరాకారుడుగా, మరొకటి శరీరము కలిగి సాకారరూపముగా యున్నాడని తెలియుచున్నది. కనిపించని అల్లాహ్‍ను ప్రార్థనతో ఆరాధించినా, అనగా నమాజ్ చేయడము చేత ఆరాధించినా, సాకారరూపముగా యున్న అల్లాహ్‍ను సాష్టాంగములతో నమస్కరించమని ఖుర్ఆన్ వాక్యములోనే చెప్పారు. అయితే నేడు ముస్లీమ్‍ల పెద్దలు ముస్లీమ్ సమాజానికి అనగా ముస్లీమ్‍లందరికీ దేవుడు ఎప్పటికీ ఆకారములేని నిరాకారుడేగానీ, ఆకారముగల సాకారుడు కాదని చెప్పడము వలన, ముస్లీమ్‍లందరినీ ఖుర్ఆన్ వాక్యము నుండి తప్పించి తప్పుదారి పట్టించారని తెలియుచున్నది. ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరాలోనేకాక 7వ సూరాలో మరియు 8వ సూరాలోనూ, 89వ సూరాలోనూ మరికొన్ని చోట్ల దేవుడు మనిషి రూపము కల్గి సాకారునిగా వస్తాడని చెప్పియున్నట్లు కలదు. అమాయక ముస్లీమ్‍లను అందరినీ తప్పుదారి పట్టించినవారిని దేవుడు క్షమించడు. దేవుడు భూమిమీదికి ఆకారముతో రావలసిన పని ఏమి అని కొందరు అనుకోవచ్చును. దానికి జవాబును వెతికితే దొరుకుతుంది. అయితే నీ ప్రశ్నకు నీవు జవాబును వెదకకుండా నీకు జవాబును దేవుడు (అల్లాహ్) అందివ్వగలడు. ఖుర్ఆన్ గ్రంథములో అనేకచోట్ల 'దేవుడు ఆకారముగల మనిషిగా వస్తాడు' అని యుండగా అల్లాహ్ ఎప్పటికీ రాడుయని ముస్లీమ్ బోధకులయిన ముస్లీమ్ పెద్దలు చెప్పడములో అజ్ఞానము తప్ప జ్ఞానము లేదని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

58. సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా నిగ్గు తేల్చాలన్నది ఆయన ఉద్దేశ్యము. (8-8)

(8-8) ''అపరాధులకు (అజ్ఞానులకు) ఎంత సహించరానిదైనా సరే సత్యం సత్యముగా, అసత్యం అసత్యముగా నిగ్గు తేల్చాలన్నది ఆయన అభిమతము.''


ఈ వాక్యము పూర్తి స్థూలముగా చెప్పబడినది. దేవుడు సూక్ష్మముగా, స్థూలముగా ఉంటాడు అని ఇంతకుముందు వాక్యములో చెప్పుకొన్నాము. అల్లాహ్‍ను అందరూ కనిపించనివానిగానే చెప్పుచుంటారు. అయితే ఈ వాక్యములో అల్లాహ్‍ను స్థూలముగా, శరీరము ధరించిన మనిషిగా చెప్పారు. దేవుడు ఒక శరీరమును ధరించి భూమిమీదికి రావలసిన అవసరమున్నది. భూమిమీద మనుషుల మధ్య అజ్ఞానము పూర్తిగా వ్యాపించిపోయి తమను తాము జ్ఞానులము అనుకొనుచూ, అధర్మములను ఆచరించుచూ వాటినే ధర్మములు అనుకొను సమయములో, భూమిమీద దైవ గ్రంథమున్నా దానిలో ప్రతి వాక్యమును తప్పుగా అర్థము చేసుకొన్నప్పుడు, దైవ గ్రంథములోని వాక్యమును సత్యసమేతముగా విప్పి చెప్పువారు భూమిమీద లేనప్పుడు, దేవుని జ్ఞానమును దేవుడే విప్పి చెప్పవలసియుండును. అయితే దేవుడు కనిపించువాడు కాదు. ఆయనకు శరీరముగానీ, ఆకారముగానీ లేదు. అందువలన 'ఆయన రూపమును ఎవరూ చూడలేదు, ఆయన స్వరమును ఎవరూ వినలేదు' అని ఒక దైవ గ్రంథములో కూడా చెప్పారు. అటువంటి దేవుడు తన జ్ఞానమును ప్రజలకు చెప్పాలంటే తప్పనిసరిగా కంఠశబ్దముతో చెప్పవలసియుండును. అందువలన తప్పనిసరిగా అల్లాహ్ ఒక శరీరమును ధరించవలసివచ్చినది.


అప్పుడు తనకోసము ప్రత్యేకముగా ఒక శరీరమును తయారు చేసుకొని అందులో తానే ప్రవేశించి, శరీరమును ధరించినవాడై ఆకారము తోనూ, మాటతోనూ పుట్టుచున్నాడు. అలా పుట్టినవాడు సాధారణ మనిషి కాకుండా ప్రత్యేకమైన మనిషిగా ఉండును. ఆ విధముగా శరీరమును ధరించి వచ్చిన దేవున్ని ప్రథమ దైవ గ్రంథములో ''భగవంతుడు'' అని అన్నారు. ఆకారము లేనివానిని దేవుడు అనియు, ఆకారమున్నవానిని భగవంతుడు అని ఆధ్యాత్మికములో చెప్పుచున్నారు. భగవంతునిగా వచ్చిన దేవుడు తన ధర్మములను జ్ఞానరూపములో బోధించును. అప్పుడు మనుషులలో కొంత జ్ఞానము ఏర్పడి ధర్మములకు బలము చేకూరును. అప్పుడు అజ్ఞానులు అజ్ఞానమునకు, అధర్మములకు అలవాటుపడి యుండుట వలన మనిషిగాయున్న దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పు మాటలు సరిపోకుండును. భగవంతుడు చెప్పు జ్ఞానమును అజ్ఞానులు వ్యతిరేఖించి మాట్లాడుచుందురు. అటువంటి అజ్ఞానులు ఎంత వ్యతిరేఖించినా, ఇతరుల ద్వారా ఎంతో వత్తిడి తెచ్చి భగవంతుడు జ్ఞానము చెప్పకూడదని ప్రయత్నించినా, ప్రభుత్వమును నడుపు రాజులవద్దకు పోయి భగవంతునిగా వచ్చినవాడు అజ్ఞానమును బోధించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని నేరారోపణ చేసినా, ఆయన మాత్రము సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా నిగ్గుతేల్చి చెప్పును. అలా సత్యసమేతమైన బోధను చెప్పుటకే ఆయన భూమిమీద శరీరమును ధరించి వచ్చాడని తెలియుచున్నది. ఈ వాక్యము ముస్లీమ్‍ల బోధకు పూర్తి వ్యతిరేఖముగా యున్నది. వారు 'దేవుడు పుట్టడు' అని పూర్తి ప్రచారము చేసుకొన్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో 'దేవుడు మనిషివలె పుట్టునని' చెప్పుటకు సుమారు ఏడు లేక ఎనిమిది ఆయత్‍లు మనకు కనిపించుచున్నవి. దేవుడు తన గ్రంథమందు చెప్పిన వాక్యమును విని అర్థము చేసుకోలేని వారికి ఎప్పటికీ జ్ఞానము అర్థము కాదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

59. సత్యమును తిరస్కరించి ఎప్పటికీ నమ్మనివారు అల్లాహ్ దృష్ఠిలో అత్యంత హీనమైన జంతువులు. (8-55)

దేవుడు భూమిమీద మనిషిగా పుట్టి, సత్యసమేతముగా జ్ఞానమును చెప్పితే, చెప్పినవాడు అజ్ఞానియనీ, అతను చెప్పిన బోధ అజ్ఞానముతో కూడుకొన్నదనీ, సరియైనది కాదని బయట ప్రచారము చేతురు. భగవంతునిగా వచ్చినవాడు తమ మతమునకు వ్యతిరేఖముగా బోధించు చున్నాడనీ, అతని మాటలు విని తమ మతమువారు చెడిపోవుచున్నారని అన్ని మతములవారు ఆరోపణ చేయుదురు. ఎందుకనగా! దేవుడయిన భగవంతుడు చెప్పు బోధను మిగతా మతములవారందరూ వ్యతిరేఖించు చుందురు. ఆయన చెప్పు బోధలు వారివారి మత గ్రంథములని చెప్పుకొను దైవ గ్రంథములలో ఉండినప్పటికీ, అవి ముందే వేరు భావముతో అర్థమయి ఉండుట చేత, భగవంతుడు చెప్పు సత్యమును ఒప్పుకోక తిరస్కరించు చుందురు. భగవంతుడు భూమిమీదికి వచ్చినప్పుడు సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా వేరుచేసి చెప్పును. అప్పుడు అసత్యము వైపు ఉండి, అదే జ్ఞానము అనుకొను వారికి సత్యము ఒంటబట్టదు. అందువలన వారు సత్యమును తిరస్కరించుచుందురు. అటువంటి వారు సత్యమును ఎప్పటికీ నమ్మరు. ఈ విషయమై సూరా 8, ఆయత్ 55లో ఇలా కలదు చూడండి.


(8-55) ''సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్ఠిలో అత్యంత హీనమైన జంతువులు''


ఈ వాక్యములో భగవంతుడయిన మనిషి చెప్పు సత్యము తమకు ఇష్టము లేనిదనీ, లేక తమ సాంప్రదాయములకు వ్యతిరేఖమయినదనీ, దానిని ఎప్పటికీ విశ్వసించని వాడు ఎవడయితే ఉన్నాడో వాడు భూమిమీద అత్యంత హీనమైన జంతువు అని అన్నారు. అటువంటి మనుషులను నీచమైన జంతువులుగా పోల్చి చెప్పారు. 'జంతువు' అనగా పుట్టినప్పటికీ వృథాగా బ్రతుకునదియని అర్థము. 'తు' అనగా వృథాగా, 'వు' అనగా ఉండునదని అర్థము. 'జ' అనగా పుట్టినయని అర్థము. దీనినిబట్టి జంతువు అనగా పుట్టి కూడా వృథాగా ఉండునది యని అర్థము. జంతువులు ఏవయినా తమ ఆహారము పట్ల పూర్తి శ్రద్ధను కలిగి తమ బుద్ధిని పూర్తిగా ఆహారమును సంపాదించుటలో ఉపయోగించునుగానీ, దైవము మీద చింతన ఏమాత్రమూ చేయవు. జంతువుల యొక్క చింతనయంతా తమ ఆహారమును ఎలా సంపాదించాలియనీ, తమ ఆహార జంతువుల మీద ఎలా దాడి చేయాలి యనీ ఆలోచించుచుండును. అంతతప్ప తమ జన్మను గురించిగానీ, దేవుని జ్ఞానమును గురించిగానీ యోచించు స్థితిలో ఉండవు. అజ్ఞానులు జంతువుల కంటే హీనమైనవారని దేవుడు చెప్పాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

60. అజ్ఞానులు జ్ఞానులుగా మారితే వారి పాపములు క్షమించబడుతాయి. మారకపోతే కర్మను అనుభవించక తప్పదు. (8-38)

(8-38) ''ఓ ప్రవక్తా! ఈ అవిశ్వాసులకు చెప్పు. వారు గనుక మానుకుంటే గతములో వారివలన జరిగిన పాపాలన్నీ క్షమించ బడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంభిస్తే గత జాతులపై విధింపబడిన ఉత్తర్వుల ఉపమానము ఉండనే ఉంది.''


ఈ వాక్యములో పాపములను చేయు అజ్ఞాన జనులు జ్ఞానులుగా మారిపోయి జ్ఞానమార్గమును అవలంభించితే గతములో వారు చేసుకొన్న పాపలములన్నీ వారు తెలిసిన జ్ఞానమునుబట్టి వారు ఆచరించుచున్న జ్ఞానమునుబట్టి క్షమించబడుచుండును. అట్లుకాకుండా వారు జ్ఞానమును తెలిసిన తర్వాత కూడా జ్ఞానము ప్రకారము ఆచరించక తమకు ఇష్టమొచ్చి నట్లు పూర్వపు పద్ధతుల ప్రకారమే పాపపు పనులు చేయుచున్నట్లయితే వారి పాపము క్షమించబడదు. అజ్ఞాన ప్రజలకందరికి విధించిన పాపమునే వారికి విధించబడుతుంది. అజ్ఞానులను దయదలచి దేవుడు జ్ఞాన మార్గమును అరుదుగా చూపుచుండును. అట్లు అరుదైన జ్ఞానము అజ్ఞానులకు దొరికినప్పుడు వారు జ్ఞానులుగా మారిపోయి, సక్రమముగా ఉంటే గతములో వారు చేసుకొన్న పాపములు కూడా క్షమించబడి లేకుండా పోతాయి. అరుదైన ఆ అవకాశమును జారవిడుచుకొన్న వారికి ఎప్పటికీ జ్ఞానము దొరకదు, వారు పాపములనుండి బయటపడలేరు. అటువంటి వారు జన్మజన్మకు అధోగతి పాలగుచూ పోవుచుందురు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

61. మంచి పనులు చేసేవాళ్లు పుణ్యాత్ములవుతారు గానీ జ్ఞానులు కాలేరు. అల్లాహ్ జ్ఞానులకు తప్ప పుణ్యాత్ములకు సన్మార్గమును చూపడు. (9-19)

(9-19) ''ఏమిటి, మీరు హజ్‍యాత్రికులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జీదె హరామ్‍లకు సేవలు చేయటాన్ని, అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించి అల్లాహ్ మార్గములో యుద్ధము చేసేవారితో సమానముగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్ఠిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గమును చూపడు.''


భూమిమీద మంచి పనులు చేసేవారు పుణ్యాత్ములవుతారు. చెడు పనులు చేసేవారు పాపాత్ములవుతారు. పుణ్యాత్ములను పాపాత్ములను ఇద్దరినీ కలిపి కర్మలను చేయువారని అనవచ్చునుగానీ, జ్ఞానులు అనే దానికి వీలులేదు. ఎందుకనగా! పాపపుణ్య కార్యములకు జ్ఞానము వేరుగా ఉంటుంది. జ్ఞానులు వేరు, ప్రపంచ కర్మలు సంపాదించుకొనువారు వేరు. మనకు తెలిసినంతలో హజ్‍యాత్రికులకు మంచినీళ్లు ఇచ్చువారు, మస్జీద్లకు సేవ చేయువారు మంచి కార్యములు చేయువారి క్రిందికి జమకట్టవచ్చును. అయితే వారు ఆ పనిని చేయుట చేత పుణ్యఫలితము రావచ్చును. ఇటువంటి కొన్ని మంచి పనులను దుర్మార్గులు తమ దుర్మార్గము చేత సంపాదించిన పాపపు సొమ్మును ఉపయోగించి దాహము పొందిన వారికి నీళ్లను, ఆకలిగొన్నవారికి అన్నమును పెట్టవచ్చును. మిక్కిలి మంచి పనులయినటువంటి హజ్‍యాత్రికులకు మంచినీళ్లు ఇచ్చినా, ప్రార్థనా మందిరములకు మరమత్తులు చేసినా, వారు గతములో చేసుకొన్న పాపములు క్షమించబడవు. కొందరు తమ పాపములను తగ్గించుకొను నిమిత్తము ఇటువంటి మంచిపనులు చేయుచుందురు. మంచివానికి సహాయము చేసినా, దేవుని ప్రార్థనామందిరములకు సహాయపడినా వాడు తన పాపపు సొమ్ముతోనే సహాయము చేయుచున్నాడు. అంతమాత్రమున ఎంతో గొప్ప జ్ఞానులతో సమానము కాడు. అటువంటివాడు తన పాపపు సొమ్ముతో మంచి పనులు చేయుట వలన వానికి పుణ్యము రావచ్చునుగానీ వానికి జ్ఞానము రాదు.


జ్ఞానము కొరకు ప్రాకులాడి అంతిమ దినమయిన మరణ దినముతో దేవుడు తీర్పుతీర్చునని తెలిసి, ఆ తీర్పునుండి తప్పించుకొని బయటపడుటకు దేవుని జ్ఞానము వలననే సాధ్యమవుతుందని తెలిసి, దేవుని జ్ఞానము కొరకు జీవితములో శ్రమించినవాడు జ్ఞాని కాగలడు. అలా శ్రమించి జ్ఞానము తెలిసినవాడు పుణ్య కార్యములను చేసినవాడు ఇద్దరూ ఎప్పటికీ సమానులు కారు. ప్రపంచ పనులలో ఎంత మంచి పనులు చేసినా, జ్ఞానము తెలియని వానిని దేవుడు అజ్ఞానిగానే లెక్కించును. అటువంటి అజ్ఞానులకు దేవుడు ఎప్పుడూ జ్ఞానమును ఇవ్వడు. జ్ఞానము మీద శ్రద్ధకల్గి శ్రమించిన వానికి జ్ఞానమును ఇచ్చును. అందువలన జ్ఞానము మీద శ్రద్ధ లేకుండా బయటి పనుల మీద ద్యాసకల్గి చేయువారిని, జ్ఞానులను దేవుడు సమానముగా చూడడు. అంతేకాక జ్ఞానము కొరకు శ్రమించనివారికి తన జ్ఞానమును ఎంతమాత్రము కలుగజేయడు. ప్రపంచ మార్గములో ఎన్ని మంచి పనులు చేసినా వారిని దేవుడు దుర్మార్గులవలె పరిగణించును. అందువలన 'దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గమును కలుగజేయడు' అని వాక్యములో చెప్పియున్నారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

62. దేవునికంటే ప్రపంచ విషయములే గొప్పగావుంటే, దేవుడు అవిధేయులకు సన్మార్గమును చూపడు. (9-24)

(9-24) ''ఓ ప్రవక్తా! వారికి చెప్పు. ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకము, మీకు ఎంతో ప్రియమయిన మీ గృహాలు మీకు అల్లాహ్కన్నా, ఆయన ప్రవక్తకన్నా, ఆయన మార్గములో సలిపే పోరాటముకన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకవచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గమును చూపడు.''


ఈ వాక్యములో ప్రపంచ విషయములలో ఆసక్తియుండి దేవుని విషయము మీద ఆసక్తి లేకపోతే అటువంటి వారు అల్లాహ్‍కు విధేయులు కారని చెప్పడమైనది. దేవునికి విధేయులు కాని వారికి దేవుని నుండి తప్పక శిక్ష ఎదురవుతుందని చెప్పియున్నారు. దేవునికి వ్యతిరేఖ దిశలో యున్న వారికి దేవుడు ఎప్పుడూ తన జ్ఞానమును ఇవ్వడు. ప్రపంచ విషయములనగా తల్లితండ్రులు మొదలగు బంధువులు మరియు భూములు, బంగారు, గృహములు మొదలగు ప్రపంచ ఆస్తులు, సజీవమైన, నిర్జీవమైన వాటిమీద ఆసక్తియుండువారికి దేవుని మీద, దేవుని జ్ఞానము మీద, దేవుని జ్ఞానమును చెప్పు ప్రవక్తల మీద శ్రద్ధయుండదు. దీనినిబట్టి మనిషికి ప్రపంచ శ్రద్ధ, పరమాత్మ శ్రద్ధ (దేవుని శ్రద్ధ) యను రెండు రకముల శ్రద్ధలు గలవని తెలియుచున్నది. ప్రపంచ శ్రద్ధయున్న వానికి ప్రపంచ సంబంధ పాప పుణ్యములు వచ్చుచుండును. దేవుని శ్రద్ధయున్న వానికి దేవుని జ్ఞానము లభ్యమగును. దేవుని జ్ఞానము లభ్యమయినవానికి ప్రస్తుతము వచ్చు పాపములుగానీ, గతములో ఉండు పాపములుగానీ అన్నీ క్షమించబడును. అదే ప్రపంచ శ్రద్ధయున్న వానికి వచ్చు పాపములకు (కర్మలకు) శిక్షలు తప్పక తీర్పు దినమున లభించును. దేవుడు మనిషియొక్క అంత్య దినమున, మనిషి దేవుని యొక్క శిక్షను తీసుకొని వచ్చి ప్రపంచములో పుట్టిన తర్వాత దానిని అనుభవించును. అలా అనుభవించేవారిని భూమిమీద చూస్తూనే యున్నాము. స్వర్గ, నరకములు భూమిమీదనే ప్రత్యక్షముగా అందరికీ కనిపించుచున్నవి. అట్లే అందరూ అనుభవించుచున్నారు. స్వర్గనరకములు ఇక్కడే గలవు. పరలోకము ఎక్కడో కలదు. దేవుని మీద శ్రద్ధగలవానికి కనిపించని పరలోకము లభించును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

63. దేవుని మార్గములో పోరాడి చంపుతారు చంపబడతారు. తన ప్రాణాలను పరలోకమునకు బదులుగా దేవుడు కొంటాడు. దేవునితో వ్యాపారము లాభసాటియైనది. పరలోకము వస్తుంది (9-111)

(9-111) నిస్సందేహముగా అల్లాహ్ ముస్లీమ్‍లనుండి (విశ్వాసుల నుండి) వారి ధన, ప్రాణములను కొంటున్నాడు. దానికి బదులుగా స్వర్గాన్ని (పరలోకమును) ఇస్తున్నాడు. విశ్వాస ప్రజలు దేవుని మార్గములో పోరాడుతారు, చంపుతారు, చంపబడతారు. ఈ విషయమై తౌరాతులోనూ (భగవద్గీతలోనూ), ఇంజీలులోను (బైబిలులోను), ఖుర్ఆన్‍లోను సత్యమైన వాగ్దానము చేయ బడింది. వాగ్దానాన్ని నెరవేర్చటములో అల్లాహ్‍ను మించిన వాడెవడుంటాడు. కాబట్టి ఖరారు చేయబడిన ఈ వర్తకానికి సంబరపడండి. ఘన విజయము అంటే ఇదే.''


ఈ వాక్యము పూర్తి ముతషాబిహాత్ (సూక్ష్మమైన) వాక్యముగా యున్నది. అందువలన ఈ వాక్యము అంతయూ నిగూఢముగా చెప్పబడినది. ఇక్కడ దేవుడు మనుషులతో వ్యాపారము చేయుచున్నాడు. డబ్బులిచ్చి వస్తువులు కొన్నట్లు, దేవుడు పరలోకము మోక్షము అను ధనమునకు మనుషుల సంపదలను, ప్రాణములను కొంటున్నాడు. దేవుడిచ్చు ముక్తి కొరకు జ్ఞానులయినవారు తమ ధనమును, ప్రాణములను దేవునికి సమర్పించుచున్నారు. అలా దేవుని వశము చేసిన తమ ధన, ప్రాణముల మీద ఆశ వదలి అవి మనవి కావు అని అనుకొని దేవుని మార్గములో అజ్ఞానముతో పోరాడుచున్నారు. అజ్ఞాన పోరాటములో తమ ధనము పోయినా, ప్రాణము పోయినా అవి తమవి కావు ముందే దేవునికి ఇచ్చేసినవని తెలిసి వెను తిరగని పోరాటము మాయతో కూడుకొన్న అజ్ఞానముతో చేయుచున్నారు. ఆ పోరాటములో మాయ రూపములో తమ శరీరములోయున్న ఎన్నో గుణములను వాటి ఆసక్తిని చంపి లేకుండా చేయడము జరుగుచున్నది. మాయతో చేయు పోరాటములో గుణములను, వాటి ధ్యాసలను చంపి లేకుండా చేయడమేకాక అప్పుడప్పుడు గుణముల దెబ్బలకు పోరాటము చేయువారు కూడా క్రిందపడిపోయి చనిపోవు చుండును. జీవిత రణరంగములో గుణములను శత్రువులతో పోరాటము చేయు వేళ ఒక్కొక్కప్పుడు విజయము, ఒక్కొక్కప్పుడు ఓటమి జరుగు చుండును. ఇది ధర్మపోరాటము, ధర్మములను ఆయుధములు తీసుకొని జీవిత రంగములో చేయు పోరాటం. ఈ పోరాటము వలన ముందే దేవునికి అమ్మివేసిన ధన ప్రాణములు పోయినా ఫరవాలేదు. ఎందుకనగా! దేవునితో ముందే ఒప్పందము చేసుకొన్న వ్యాపారము ప్రకారము ముక్తికి (పరలోకమునకు) బదులుగా పోరాడుచున్నాము.


అలా పోరాడితే చివరకు పోయేది ప్రాణమయినా వారికి లభించు నది ముక్తి. దేవునితో చేయు వ్యాపారములాంటిదయిన ఈ లావాదేవి చాలా మంచిదే, మంచి లాభసాటిదే. ఈ విషయములో దేవుడు ఏమీ మాట తప్పువాడు కాడు. తన ఒప్పందమును వాగ్దానరూపముగా మూడు దైవ గ్రంథములలో చెప్పియున్నాడు. భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు) మరియు చివరి దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో దేవుడు శాస్త్రబద్దముగా మీ ప్రాణ ధనములను లెక్కచేయక మాకిస్తే, మీకు మా సన్నిధానమైన పరలోకమును ఇస్తానని చెప్పియున్నాడు. అల్లాహ్ చెప్పిన మాటను నెరవేర్చక పోవడము అంటూ ఏదీ లేదు. చెప్పినమాటను నెరవేర్చడములో ఆయన కంటే మించినవాడెవడున్నాడు. ఏది ఏమయినా మనిషి యెడల దేవుడు చేసిన ఈ ఒప్పందము మనిషికి చాలా లాభసాటి అయినది. ఈ వాక్యములో మోక్షము లేక ముక్తి అని చెప్పవలసినచోట స్వర్గము అని చెప్పియున్నారు. అక్కడ శాస్త్రబద్దమైన జ్ఞానరీత్యా ముక్తి లేక మోక్షము అనియో ఇంకా పరలోకమనియో చెప్పడమే సత్యమైనదిగా ఉండును. స్వర్గము అని చెప్పకూడదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

64. నావద్ద అల్లాహ్ నిధులుగానీ, అగోచర జ్ఞానము గానీ లేదు. మీరు తక్కువగా చూచువారికి మేలు చెయ్యనని కూడా చెప్పలేదు. వారి అంతరాలలో ఉన్నది అల్లాహ్‍కు బాగా తెలుసు. ఒకవేళ నేను గనుక అలాంటి మాటయంటే నేను దుర్మార్గునిగా లెక్కించబడతాను. (11-31)

ఈ విషయమునకు సంబంధించిన వాక్యము అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా 11, ఆయత్ 31లో ఇలా గలదు.


(11-31) ''నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనడము లేదే! నావద్ద అగోచర జ్ఞానము కూడా లేదు. నేను దైవ దూతనని కూడా చెప్పడము లేదు. మీరు చిన్నచూపు చూస్తున్నవారికి అల్లాహ్ ఏ మేలు చెయ్యబోనని కూడా చెప్పలేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనుక అలాంటిమాట ఏదైనా అంటే నేను దుర్మార్గులలో ఒకడిగా పరిగణించబడతాను.''


పూర్వము సృష్ఠ్యాదిలో ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును మొదట ఆకాశములోని సూర్యుడు విన్నాడు. తర్వాత సూర్యుడు భూమిమీద మనువు అను వ్యక్తికి చెప్పగా అతని ద్వారా సూర్యుడు చెప్పిన జ్ఞానము అందరికీ తెలిసినది. మొదట భూమిమీద గల మనువు అను ఒక వ్యక్తిని ఎంచుకొని అతనికి కృతయుగములోనే సూర్యుడు జ్ఞానమును చెప్పాడు. ఆకాశములో మొదట జ్ఞానమును విన్నవాడు సూర్యుడయితే అతని వలన ఖగోళములో కూడా ఎందరో జ్ఞానమును తెలియగలిగారు. గతములో మోషే ప్రవక్త ద్వాపర యుగములో ఉండేవాడు. తర్వాత అతనికి మూసా ప్రవక్త యని పేరు మారిపోయినది. ఇంజీలు బైబిలుగా మార్చబడినది. భగవద్గీత తౌరాతుగా చెప్పబడినది. ఈసా తర్వాత ఏసుగా చెప్పబడినాడు. మనువే తర్వాత భీష్ముడుగా వచ్చాడు. ఇట్లు ఎన్నో పేర్లు ఎందరికో మార్చబడినాయి. అదే పద్ధతిలో కృతయుగములో సూర్యుడు అని చెప్పిన పేరును ఫలానా వాడని గుర్తించనట్లు సూర్యుడు తన పేరును ''జిబ్రయేలు'' అను పేరుగా చెప్పుకొని కలియుగములో ముహమ్మద్ ప్రవక్తగారికి ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పాడు.


జిబ్రయేల్ దూతకాదని నమ్మదగిన ఆత్మయని ఖుర్ఆన్ గ్రంథములో గలదు. జిబ్రయేలు తాను తెలియగల్గిన జ్ఞాన సమాచారమును ఒకమారు కృతయుగములోనే మనువు అను వ్యక్తికి అందించాడు. అట్లే కలియుగములో జిబ్రయేల్ అను పేరుతో 'మ' అను అక్షరము మొదటగల మహమ్మద్ (ముహమ్మద్) ప్రవక్తగారికి అందివ్వడము జరిగినది. దేవుడు నా యొక్క భక్తులు అని సూచించిన వారిని 'మ' అను అక్షరముతో ప్రారంభమగు పేర్లుగల వారిగా జిబ్రయేల్ గారికి తెలియజేయగా, ఆయన దేవుని సూచన మేరకు ఒకమారు మనువును, మరొకమారు ముహమ్మద్ ప్రవక్తను ఎన్నుకొన్నాడు. అలా ఎన్నుకొన్నవారికి తన జ్ఞానమును చెప్పాడు. చెప్పిన వాడు ఒక్కడే, అయితే రెండు కాలములలో రెండు పేర్లతో చెప్పబడుట ద్వారా ఆయనను ఒక్కడేయని చాలామంది గుర్తించలేకపోయారు. అందువలన నేను ఉన్న సత్యమును ఇప్పుడు చెప్పవలసివచ్చినది. నేను చెప్పిన సత్యము ప్రకారము కలియుగములో ముహమ్మద్ ప్రవక్తకు, కృత యుగములో మనువుకు చెప్పిన వ్యక్తి ఒక్కడే ఆయనే సూర్యుడు. సూర్యుడు జిబ్రయేల్గా కలియుగములో ప్రవక్తగారికి చెప్పినా, కృతయుగములో సూర్యునిగా మనువుకు చెప్పినా, తనకు తెలిసిన జ్ఞానము ఒక్కటే చెప్పాడు తప్ప వేరు ఏమీ చెప్పలేదు. చెప్పినది ఒక్కడే అయినందున ఆయన చెప్పినది ఒక్కటే జ్ఞానమని తెలియవచ్చును. దీనిప్రకారము భగవద్గీత (తౌరాతు) జ్ఞానము, ఖుర్ఆన్ జ్ఞానము వేరువేరు కాదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథము సూరా ఐదులో 44,46,48,68 ఆయత్‍లలో ఖుర్ఆన్ తౌరాత్ జ్ఞానమును ధృవీకరించుచున్నదని వాక్యములలో తెలియజేయబడినది.


జిబ్రయేల్ (సూర్యుడు) మనువుకు గానీ, ముహమ్మద్ ప్రవక్తకు గానీ ఏది చెప్పినా తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాడు తప్ప తాను స్వంతముగా ఏమీ చెప్పలేదు. అందువలన ఆయనవద్ద అల్లాహ్ నిధులున్నాయని గానీ, ఆయనవద్ద అగోచర జ్ఞానమున్నదనిగానీ, తాను దేవదూతనని గానీ చెప్పలేదు. అందరి హృదయాలలో ఉన్నది అల్లాహ్‍కు తెలుసునని చెప్పాడు తప్ప తనకు తెలుసునని చెప్పలేదు. ఒకవేళ ఎప్పుడయినా తాను స్వయముగా చెప్పిన జ్ఞానము ఎక్కడయినా ఉంటే తాను దుర్మార్గుడనవుతానని చెప్పాడు. దీనినిబట్టి జిబ్రయేల్ ప్రతీ జ్ఞానమును అల్లాహ్ చెప్పాడని చెప్పాడు తప్ప తాను చెప్పుతున్నానని ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పెద్ద వ్యక్తి తన మీద భారము పడకుండా దేవుడు చెప్పిన జ్ఞానమునంతటినీ దేవుడు ఈ విధముగా చెప్పాడని చెప్పాడు తప్ప తాను చెప్పుచున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అందువలన నేడు ఎంతో చిన్న వ్యక్తులమయిన మనుషులు దేవుని జ్ఞానమును దేవుడు చెప్పినట్లే చెప్పాలిగానీ, తాము చెప్పినట్లు మార్చి చెప్పకూడదు. అలా చెప్పితే అతడు మానవులలో దుర్మార్గుడుగా లెక్కించబడుతాడని జిబ్రయేల్ చెప్పినట్లు కలదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

65. దేవుడు మనుషులను, దేవతలను నరకములో నింపుతాడు. వారిని దానికే పుట్టించాడు. (11-119)

(11-119) ''నీ ప్రభువు అయిన దేవుడు దయచూపిన వారు తప్ప మిగతా వారినందరినీ ఆయన పుట్టించిందే అందుకొరకు, ''నేను నరకాన్ని జిన్నాతులు (దేవతలు) మరియు మనుషులతో నింపుతాను'' అని నీ ప్రభువు అన్న మాట నెరవేరింది.''


నేడు భూమిమీద మానవ జాతియంతా ఒక్కటే అయినా, మనుషులు మతాలను సృష్ఠించుకొని మతాలకు కొన్ని సాంప్రదాయములను పెట్టుకొని ఆ సాంప్రదాయముల ప్రకారము మనుషులు అనేక సమాజములుగా విడిపోయారు. ఇది హిందూసమాజము, అది క్రైస్థవ సమాజము, మరొకటి ముస్లీమ్ సమాజమని మొత్తము (12) పన్నెండు సమాజములుగా మనుషులు విడిపోయారు. ఇది కనిపించే ప్రపంచములోని మనుషుల యొక్క స్థితి. దేవుడు మనుషులను అందరినీ సమానమైన శరీరములతో పుట్టించాడు. దేవుడు తన సృష్ఠిలో కనిపించే మనుషులనేకాక కనిపించని మనుషులను కూడా సృష్ఠించాడు. స్థూల దేహములు లేకుండా సూక్ష్మ దేహములతోనే ఉండునట్లు మరొక మనుష జాతిని సృష్ఠించాడు. సాధారణ మనిషికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అను రెండు భాగముల శరీరముండును. రెండవ జాతి మనుషులను స్థూల దేహము లేకుండా సూక్ష్మ దేహము మాత్రముండునట్లు దేవుడు సృష్ఠించాడు. రెండవ జాతి అనగా రెండవ సృష్ఠి అయిన మనుషులకు కనిపించే దేహములు ఉండవు కావున వారు సాధారణ మనుషులకు కనిపించరు. స్థూల సూక్ష్మ రెండు దేహములున్న మనుషులకంటే, సూక్ష్మదేహము ఒక్కటి యున్నవారు తక్కువవారే యని చెప్పవచ్చును. దీనినిబట్టి కనిపించే మనుషులు, కనిపించని మనుషులకంటే గొప్పవారనీ, కనిపించని మనుషులు అన్ని విధములా తక్కువవారని చెప్పవచ్చును.


అయితే మనుషులలో మంచివారు, చెడువారు యున్నట్లు కనిపించని మనుషులలో కూడా మంచి చెడు రెండు రకముల మనుషులు కలరు. కనిపించే మనుషులను ప్రజలు అని పేరుతో చెప్పవచ్చును. 'జ' అనగా పుట్టుట. 'ప్ర' అనగా ముఖ్యముగా అని అర్థముగలదు. ప్రజలు అనగా ముఖ్యముగా పుట్టినవారు అని అర్థము. అదే రెండవ రకమైన సృష్ఠి అయిన కనిపించని వారిని జిన్నాతులని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పారు. అదే ప్రథమ దైవ గ్రంథములో దేవతలు అని చెప్పారు. ప్రజలు కనిపించే వారు కాగా, దేవతలు కనిపించనివారని తెలియవచ్చును. దేవతలు మనుషులకంటే బుద్ధిహీనులు, అజ్ఞానులని చెప్పవచ్చును. అయితే నేడు హిందూ సమాజములో దేవతలను గొప్పవారిగా తలచుచుందురు. అంతేకాక వారిని చాలామంది ఆరాధించుచుందురు. తెలివితక్కువ వారిని, తెలివి గలవారు ఆరాధించడమేమిటియని కొందరికి ప్రశ్నరావచ్చును. అదే మిగతా మత సమాజములలో అనగా క్రైస్థవ, ముస్లీమ్ సమాజములలోని మనుషులు దేవతలుగా యున్న వారిని గొప్పగా తలువరు మరియు పూజించరు (ఆరాధించరు). వారు తమ దైవ గ్రంథములుగా చెప్పుకుంటున్న బైబిలు, ఖుర్ఆన్‍లలో దేవున్ని తప్ప దేవతలను ఆరాధించమని చెప్పలేదు. అదే విషయమునే హిందూ సమాజము యొక్క గ్రంథమని అనుకొనుచున్న ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో దేవున్ని తప్ప దేవతలను ఆరాధించవద్దని చెప్పియున్నారు. అయినా ఆ విషయమును హిందువులు గాలికి వదలివేసి దేవతలను ఆరాధించుచున్నారు.


హిందూ సమాజములో దేవతలను గొప్పవారిగా తలచి ఆరాధించినా, దేవతలు మనుషులతో సమానముగా కాకుండా తక్కువ శరీరము కలిగి పుట్టారనీ, వారి మనస్తత్త్వము కూడా మనుషుల భావముల కంటే తక్కువయని చాలామందికి తెలియదు. దేవతలు మనుషులకంటే గొప్పవారను భావము హిందువులకందరికీ గలదు. మనుషులు చేయు పనులలో పాపపుణ్య కర్మలు వచ్చినట్లు, దేవతలు చేయు పనులలో కూడా పాపపుణ్య కర్మలు వచ్చుచుండును. సహజముగా ఎవరయినా మంచి పనిని చేస్తే పుణ్యము, చెడు పనిని చేస్తే పాపము రావడము సహజము. మనుషులు మంచికంటే ఎక్కువ చెడునే చేస్తున్నారనీ, అందువలన మనుషులలో ఎక్కువమందికి పాపము వస్తున్నదని చెప్పుచున్నాము. మనుషులకంటే ఎక్కువశాతము దేవతలు మంచికంటే చెడు పనినే ఎక్కువగా చేయుచుండుట వలన, మనుషులకంటే పాపమును ఎక్కువ సంపాదించు వారిలో మొదటివారుగా దేవతలున్నారు. పాపమును సంపాదించువారిలో ఎక్కువ శాతముమంది దేవతలు, తక్కువ శాతముమంది మనుషులు ఉన్నారు. 'దేవతలు' అను పేరు మధ్యలో వచ్చినదేగానీ మొదటినుండి ఉండు పేరు కాదు. దేవతలు అను పేరు రాకముందు 'కనపరాని మనుషులు'గా చెప్పబడేవారు.


మనుషులయినా, దేవతలయినా దేవుని సృష్ఠిలోనివారే. పాప పుణ్యములు సమానమే. వాటి వలన వచ్చు ఫలితములయిన కష్ట సుఖములూ సమానమే. ఇందులో దేవతలకు ఎటువంటి రాయితీ లేదు. అందువలన దేవుడు ఇలా అన్నాడు. ''నేను నరకాన్ని దేవతలు మరియు మనుషులతో నింపుతాను'' అన్నాడు. దేవుడు తన పాలనను సక్రమముగా నిర్వర్తించు చున్నాడు. అందువలన దేవతలకు, మనుషులకు స్వర్గ నరకములు సమానముగా ఉన్నాయి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

66. ఓ ప్రవక్తా నీకు వహీ ద్వారా ఈ ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పాము. ఇంతకుముందు దీనిని గురించి నీకు ఏమీ తెలియదు. (12-3)

(12-3) ''ఓ ప్రవక్తా! మేము నీవద్దకు వహీ ద్వారా ఖుర్ఆన్‍ను పంపి అత్యుత్తమమైన జ్ఞానమును నీకు చెబుతున్నాము. నిశ్చయముగా ఇంతకు మునుపు నీకు దీనిని గురించి ఏమీ తెలియదు.''


ఈ వాక్యములో జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పువరకు ప్రవక్తకు ఏమీ తెలియదని జిబ్రయేల్ చెప్పిన తర్వాత ప్రవక్తగారికి ఖుర్ఆన్ జ్ఞానము తెలిసినదని చెప్పాడు. దీనినిబట్టి అప్పుడు ఆ దేశములో ఏ మనుషులకూ జ్ఞానము తెలియదనీ, ప్రవక్తకు జ్ఞానము తెలిసిన తర్వాత ప్రవక్తగారు ప్రజలకు చెప్పితే ప్రజలకు ఖుర్ఆన్ జ్ఞానము తెలిసినదని అర్థమగుచున్నది. ఈ ఖుర్ఆన్ జ్ఞానమే ఇంజీలు జ్ఞానముగా యున్నది. ఇంజీలు జ్ఞానమే తౌరాతు జ్ఞానముగా యున్నది. తౌరాతు జ్ఞానమే జపర (జబుర) జ్ఞానముగా యున్నది. ఖుర్ఆన్, ఇంజీలు, తౌరాతు మూడు దైవ గ్రంథములుగా యున్నవి. మూడు దైవ గ్రంథముల లోని జ్ఞానము ఒకదానితో మరొకటి సంబంధపడి యుండుట వలన మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని చెప్పవచ్చును. ఈ జ్ఞానమంతయూ మొదట ఆకాశవాణి ద్వారా వచ్చినది. అప్పుడు గ్రంథరూపము కాకుండా మాటల రూపములోయున్న జ్ఞానము పేరు ''జపర'' యని చెప్పారు. జపర పేరు నేడు 'జబుర' అని చెప్పబడుచున్నది. తర్వాత అదే జ్ఞానమే గ్రంథరూపము కాగా వాటి పేర్లే భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ అను పేర్లు గల గ్రంథములుగా వచ్చాయి. భగవద్గీత గ్రంథమును (జ్ఞానమును) శ్రీకృష్ణుడు చెప్పగా, బైబిలు గ్రంథ జ్ఞానమును ఏసు చెప్పాడు. వీరిద్దరూ మనుష రూపములో యున్నవారే. అయితే ఖుర్ఆన్ గ్రంథ జ్ఞానమును జిబ్రయేలు (సూర్యుడు) అను ఆకాశ గ్రహము వచ్చి చెప్పినది. అదే జిబ్రయేలు (సూర్యుడే) కృతయుగములోనే మొట్టమొదట భూమిమీద మనుషులకు జ్ఞానమును చెప్పాడు. అక్కడ మొదట చెప్పినవాడే ఇక్కడ చివరిలో కూడా చెప్పాడు. అందువలన ఖుర్ఆన్‍ను అంతిమ దైవ గ్రంథము అని అంటున్నాము.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

67. నేను ముస్లీమ్‍గానే చనిపోవాలి. (12-101)

(12-101) ''నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్ఠికర్తా! ఇహంలోనూ పరంలోనూ నువ్వే నా రక్షకుడవు. ముస్లీమ్‍గా ఉన్న స్థితిలోనే నాకు మరణము ఇవ్వు. నన్ను సజ్జనులలో చేర్చు'' అని వేడుకున్నాడు.


దైవజ్ఞానము తెలిసిన తర్వాత ఒక జ్ఞాని దేవున్ని ఇలా వేడుకొన్నాడట. అతని ప్రార్థనలో ''నాకు ధన ధాన్యాలనిచ్చి ధనికుడు అను పేరు వచ్చునట్లు చేశావు. అయినా నాకు తృప్తిలేదు. అవన్నీ ప్రపంచ సంబంధమైనవే. మరణముతో అవి ఇక్కడే నిలిచిపోవును, నేను ఎక్కడికో పోవుదును. అందువలన వాటితో నాకు సంబంధము లేదు. అలాగే మనిషికి వచ్చే కలల భావాన్ని తెలిపే విద్యను నేర్పావు. అయితే కలల భావాన్ని తెలిసినంత మాత్రమున ఇతరుల దృష్ఠిలో నేను గొప్పవాడిగా కనిపించవచ్చు అయినా ఆ గొప్పతనము చనిపోవువరకే, చనిపోయిన తర్వాత నా వెంటరాని దానితో నాకు తృప్తి లేదు. ఇటు ప్రపంచములోను అటు పరలోకములోను నువ్వే నా దేవునివి. నేను ఎప్పటికీ నీ మీద విశ్వాసము గలవాడిగానే ఉండాలి'' యని వేడుకొన్నాడు.


ఇక్కడ వాక్యములో 'ముస్లీమ్‍గానే చనిపోవాలి' యను మాట గొప్ప సారాంశమైన మాటగాయున్నది. ముస్లీమ్ అనగా ఒక మతస్థుడుగా తలువ కూడదు. ముస్లీమ్ అనగా విశ్వాసియని అర్థము. దేవుని మీద ఎవరు విశ్వాసము కల్గియున్నారో వారు అందరూ ముస్లీమ్‍లేయగుదురు. ఆ లెక్క ప్రకారము ఏ మతములో అయినా ముస్లీమ్‍లు ఉండవచ్చును. ఒక్క ఇస్లామ్ మతములోనే ముస్లీమ్‍లు ఉంటారనుకోవడము పొరపాటు. ఇప్పుడు నేను హిందూ సమాజములో పుట్టాను అయినా దేవుని మీద విశ్వాసములో నేను మొదటివాడుగా యున్నాను. అందువలన నన్ను పెద్ద ముస్లీమ్యని ఎవరయినా అనవచ్చును. అట్లే దేవుని మీద విశ్వాసమున్న ప్రతివాడు ముస్లీమ్‍గానే యున్నాడు. నేను నా జీవితము చివరివరకు దేవునిమీద విశ్వాసముతోనే బ్రతికి, దేవుని మీద విశ్వాసముతోనే చనిపోవాలి యని నా కోర్కె. అప్పుడు నేను ముస్లీమ్‍గానే చనిపోవాలని నా కోర్కె. మిగతా వారు కూడా దేవుని మీద ఇష్టము, నమ్మకము కలిగి బ్రతకాలనీ, అలాగే చనిపోవాలని చెప్పుచున్నాను. మరణములో కూడా దేవుని మీద విశ్వాసము అట్లేయుండుట వలన అందరూ ముస్లీమ్‍లుగానే చనిపోవునట్లగును. దేవుని మీద విశ్వాసము జీవితాంతము సాగవలెనని కోరుకొంటున్నాను.





అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

68. భూమిలోనూ, ఆకాశములలోనూ ఎన్నో సూచనలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా సాగిపోతున్నారు. (12-105)

ప్రతి మనిషి ఏడు ఆకాశములు, ఒక భూమియందు జీవనము సాగించుచున్నాడు. భూమి, ఆకాశములు లేకుండా ఎవరూ బ్రతకలేరని చెప్పవచ్చును. భూమి మరియు ఏడు ఆకాశముల మధ్యలో వాటి గుండా వచ్చు ఎన్నో సూచనల ద్వారా బ్రతుకుచున్నాడు. అయినా ఆ సూచనలను గురించి ఏమాత్రము పట్టించుకోకుండా మనుషులందరూ బ్రతుకుచున్నారని సూరా 12, ఆయత్ 105లో చెప్పారు.


(12-105) ''ఆకాశాలలో భూమిలో ఎన్నో సూచనలున్నాయి. కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోవుచున్నారు.''


ఆకాశములు ఎన్నో లేవు. ఎంచుకుంటే ఏడే గలవు. అలాగే భూమి ఒకటే గలదు. ఆ ఏడు ఆకాశములు ఒక భూమి నీవు నివసించు నీ శరీరములోనే గలవని నీకు తెలియదు. నీవు ఏడు ఆకాశముల క్రింద భూమియందు నివశిస్తున్నావని అదే నీ శరీరమని తెలియదు. బయట ఆకాశము ఒక్కటే గలదు, అట్లే బయట భూమి ఒక్కటే గలదు. అయితే ఈ వాక్యములో చెప్పిన ఆకాశములు, భూమి ప్రత్యేకముగా ఉన్నాయి. బయట ఆకాశమును భూమిని ప్రతి మనిషి చూస్తూ బ్రతుకుచున్నాడు. బయటి భూమిలో పంట పండునని భూమిని పరిశీలించుచూ బ్రతుకు చున్నాడు. అట్లే బయటి ఆకాశమునుండి వర్షము వచ్చునని ఆకాశ మేఘములను జాగ్రత్తగా ఆశగా చూస్తున్నాడు. అయితే మనిషి లోపలి ఆకాశాలను, భూమిని ఏమాత్రము పట్టించుకోకుండా మనిషి బ్రతుకు చున్నాడు. తనలో ఏడు ఆకాశములు భూమి ఉండడమే కాకుండా వాటి మధ్యలో తనకు తెలియని ఎన్నో భాగములు కలవని తెలియలేకపోవు చున్నాడు. ఎంతటి పెద్ద మేథావులయినా వారి బుద్ధిని అంతా బయటికే వినియోగించుచున్నారు గానీ, లోపలికి ఏమాత్రమూ ఉపయోగించలేదు. లోపలయున్న ఆకాశములు, భూమి మీద ఏమాత్రమూ శ్రద్ధ చూపడము లేదు.


దేవుడు మనిషికి జ్ఞానమును తెలుపు నిమిత్తము మొదట బయట ఆకాశము నుండి జ్ఞానమును మేఘ గర్జనతో చెప్పడము జరిగినది. అలా చెప్పిన జ్ఞానము దైవ గ్రంథముల రూపములో మనుషుల ముందర యున్నప్పటికీ, వాటిలోని జ్ఞానమును పట్టించుకోకుండా, మనిషి మతములను అడ్డము పెట్టుకొని, తమ ద్యాసనంతా బయటే పెట్టుకోవడము జరిగినది. అటువంటి వారి చూపును, ద్యాసను శరీరము లోపలికి మార్చుటకు దేవుడు బయట ఆకాశములో 'ఇంద్రధనస్సు' అను పేరుతో ఏడు రంగుల అర్ధవలయమును చూపాడు. గొడుగు ఆకృతిని పోలిన ఆ ఏడు రంగుల వలయము నీవు ఏడు ఆకాశముల కింద ఉన్నావని గుర్తు చేయుచున్నది. ఏడు ఆకాశములు నీ శరీరములో ఉన్నాయని, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి కలిగియున్నదని ఏడు రంగుల వలయములు చూపబడినవి. ఏడు ఆకాశముల క్రింద భూమి ఆధారముతో యున్నావను జ్ఞానమును ఇంద్రధనస్సు చూపినా, మనిషి దానిని కూడా గ్రహించక చూచి వదలివేస్తున్నాడు. బయట కనపడు ఆకాశమునకు ఇంద్రధనస్సుయని పేరు కలదు. ఆ పేరును గురించి చూచినా కొంత జ్ఞానము అర్థము కాగలదు. ఇంద్రయనగా జ్ఞానము అని అర్థము. ఇందూ అనినా, ఇంద్ర అనినా ఒకే అర్థము గలదు. ధనస్సు అనగా నాశనము చేయునది అని అర్థము. జ్ఞానము వలన కర్మ నాశనమగునని, జ్ఞానము కర్మను నాశనము చేయునదియని అర్థమొచ్చునట్లు బయట కనిపించు ఏడు రంగుల అర్ధవలయమును ఇంద్రధనస్సు యని అన్నారు. ఇది నీ కర్మను లేకుండా చేయు జ్ఞాన సూచన అని అర్థమగునట్లు అలా చెప్పారని తెలియుచున్నది.


బయట దైవ గ్రంథములలో కర్మను కాల్చు జ్ఞానమున్ననూ, ఆ గ్రంథముల జ్ఞానములో ఏడు ఆకాశములు అని చెప్పిన వాక్యములున్నా, బయట ఆకాశములో ఇంద్రధనస్సు కనిపించినా మనిషి మాత్రము గ్రంథ రూపములో మరియు దృశ్యరూపములో యున్న జ్ఞానమును పట్టించు కోకుండా పూర్తి స్థాయిలో బయట మతమును పట్టుకొని దాని ప్రకారమే నడుస్తున్నాడు. తన తోటివారిని కూడా నడువమంటున్నాడు. ఇంకా ఇతర మతములవారిని కూడా తన మతములో చేరమంటున్నాడు తప్ప తన శరీరములోపల గల ఆకాశములనుగానీ, వాటి క్రిందయున్న మాంస, ఎముకలు, రక్తముగాయున్న భూమి ధాతువులనుగానీ గమనించడము లేదు. లోపలి ఆకాశములను భూమిని వాటి మధ్యలో యున్నవాటిని గమనించ గలిగితే మనిషి సంపూర్ణ జ్ఞాని కాగలడు. ఎప్పటికయినా శరీరములోనికి ద్యాస మళ్లనివాడు జ్ఞాని కాలేడు. మూడు దైవ గ్రంథములు శరీరములోని ద్యాసను గురించి చెప్పాయని తెలియక, పురాణ రూపములో చెప్పుకొన్న ద్యానములను, ప్రార్థనలను ఆచరించినా ఏమీ ప్రయోజనము ఉండదు, దేవుడు తెలియబడడు. దైవ గ్రంథములలో చెప్పిన ప్రకారము శరీరము లోనికి ద్యాసను మళ్లించితే గ్రంథములలో చెప్పిన శాస్త్రబద్దమైన ప్రార్థన ఏమిటో తెలియును. అప్పుడు నీవు సంపూర్ణ జ్ఞానివి కాగలవు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

69. భూమిలో అనేక ఫల వృక్షములు గలవు. వాటికి కాయు అన్ని ఫలములు ఒకే రుచిని కల్గియుండక ఒకదాని మించిన రుచిని మరొకటి గలవు. గమనించితే ఇందులో ఎన్నో సూచనలున్నాయి. (13-4)

(13-4) ''భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్షతోటలు ఉన్నాయి. పంట పొలాలు ఉన్నాయి. ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలియుండగా, మరికొన్ని వేరే రకముగా ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు సరఫరా అవుతున్నది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరో దానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయముగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.''


విజ్ఞులు అనగా జ్ఞానమున్నవారు అని అర్థము. జ్ఞానములో రెండు రకముల జ్ఞానములు గలవు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము గలవు. ఇక్కడ ప్రపంచ సంబంధమైన వృక్షములు, వాటి ఫలములను చెప్పారు. అదంతయూ ప్రపంచ జ్ఞానము వలన తెలియునవే. అయితే ఇందులో సూచనలున్నాయని చెప్పారు. అయితే అది ప్రపంచ జ్ఞానమునకు కనిపించవు. అందులోని సూచనలు తెలియుటకు పరమాత్మ జ్ఞానము అవసరము. ప్రపంచ జ్ఞానమును ప్రక్కన పెట్టి పరమాత్మ జ్ఞానము ప్రకారము వాక్యములో చెప్పినది చెప్పినట్లు కాకుండా మరొక అర్థముతో చూస్తే ''భూమిమీద అనేక రకముల నేలలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి'' అని వాక్యములో చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యమునకు నాలోని ఆత్మ (దేవుడు) ఈ విధముగా భావమును అందించుచున్నాడు. కావున వాటినే నేను చెప్పుచున్నాను. భూమిమీద అనేక రకముల నేలలు ఉన్నట్లు భూమిమీద అనేక రకముల మనుషులు ఉన్నారు. ''అనేక రకములైన నేలలు ఒకదానికొకటి అనుకొని ఉన్నాయి'' అని అన్నారు. ఆ మాట వాస్తవమే యని చెప్పవచ్చును. ఒక కుటుంబమును పరిశీలించి చూస్తే అనేక రకముల నేలలు ఒకదాని ప్రక్కన మరొకటి ప్రక్క ప్రక్కనే యున్నట్లు ఒకే కుటుంబములో ప్రక్క ప్రక్కనే అనేకమంది తల్లితండ్రిగా, అన్నతమ్ములుగా, అత్తాకోడల్లుగా, భార్యాభర్తలుగా అనేక విధముల దగ్గర సంబంధము కలవారై అనేకమంది యున్నారు. అనేకమంది ఒకే ఇంటిలో యున్నా వారిలో బుద్ధులు అనేక రకములుగా ఉన్నాయి. మనుషులలోని బుద్ధులు ఉన్నట్లు భూమిలోని అనేక నేలలలో ద్రాక్షతోటలు, ఖర్జూరపు చెట్లు, పంటపొలాలు అనేక రకములుగానే ఉన్నాయి. అనేక బుద్ధులు యున్నట్లు, అనేక రకములయిన చెట్లు, తీగలు, వృక్షములు గలవు. వారివారి బుద్ధులను బట్టి వారికి పాపపుణ్య కర్మ ఫలములు వచ్చినట్లు ఆయా వృక్షములను, చెట్లనుబట్టి పండ్లు, ఫలములు, గింజలు వస్తున్నవి. అనేక చెట్లకు అనేక పండ్లు కాయగా వాటిలో రుచిగలవి, రుచిలేనివి, తియ్యటివి, చేదువి యున్నట్లు, మనిషి సంపాదించుకొను కర్మ ఫలములు ఒకరకముకాగా, మనిషి సంపాదించు జ్ఞాన ఫలములు కూడా ప్రత్యేకమైనవి గలవు. వృక్షములు, చెట్ల ఫలములు ఒకదానిపై ఒకటి శ్రేష్ఠత కల్గియున్నట్లు, మనిషికి గల జ్ఞాన ఫలములలో ఒకదానిమించి మరొకటి కలదు. దీనినిబట్టి మనిషికి గల జ్ఞానము ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా యుంటూ ఒకరిని మించిన జ్ఞానము మరొకరి వద్ద గలదు.


భూమిమీద చెట్లు ఎన్నియున్నా భూమిలోపల వేర్లకు కాయు ఫలములు గలవు. అట్లే భూమి బయట చెట్ల కొమ్మలకు కాయు ఫలములు రెండవ రకము గలవు. అట్లే ప్రపంచములో మనుషులకు ప్రపంచ కర్మలు అను ఒక రకము ఫలితములు ఉండగా, రెండవ రకము జ్ఞాన ఫలములు కూడా కలవు. భూమిపైన కనిపించునట్లు కాయు ఫలములను కర్మ ఫలములుగా లెక్కించవచ్చును. అలాగే భూమిలోపల కనిపించక యున్న అనేక ఫలములను జ్ఞాన ఫలములుగా లెక్కించవచ్చును. జ్ఞానఫలములు వేరువేరుగా యుంటూ, వేరు చెనగ యున్నట్లు తీగ చెనగ యుండదు. రెండు వేరు చెనగే అయినా ఒకటి చెట్లు మొదలులో వచ్చే వేర్ల దగ్గర కాయునవి గుత్తు చెనగ కాగా, చెట్ల కొమ్మలు తీగలుగా భూమిమీద ప్రాకగా ఆ కొమ్మలకు దిగిన వేర్లలో కాయు వేరు చెనగను తీగ చెనగ అంటాము. గుత్తు చెనగ, తీగ చెనగ రెండు ఆకారములోనూ, రుచిలోనూ ఎంతో తేడా కల్గియున్నవి.


అదే విధముగా భూమిలో తయారగు ముర్లంగి గడ్డకు, ఉర్లగడ్డకు ఆకారములోనూ, రుచిలోనూ ఎంతో తేడా కలదు. రెండు గడ్డలు భూమిలోనే పెరిగినా, వాటి రుచులు వేరువేరుగా యున్నట్లు మనిషి యొక్క బుద్ధి గ్రహించు జ్ఞానము అనేక రకముల గలదు. మనిషి మనిషికి వారికున్న జ్ఞానములో తేడా గలదు. చెట్లన్నిటికి ఒకే నీరు అన్నట్లు అందరూ తెలియునది ఒకే దేవుని జ్ఞానమే అయినా అది వారికి లభించిన దానినిబట్టి యుండును. మనిషి చదువుతున్నది దైవగ్రంథమే అయినా దానిలో వారి బుద్ధికి అర్థమయినదానినిబట్టి వారికి జ్ఞానముండును. వారికున్న జ్ఞానమునుబట్టి వారికి జ్ఞానశక్తి లభించి యుండును. వారికున్న జ్ఞానశక్తి అందరిలో ఒకే రకము లేకుండా అనేక స్థాయిలలో కలదు. వారికున్న జ్ఞానశక్తి స్థాయినిబట్టి వారి కర్మలు కాలిపోవుచుండును. వారి కర్మలను కాల్చుటకు సరిపోవు జ్ఞానశక్తిని (జ్ఞానాగ్ని) కలవారు కొందరుండగా, ఇతరుల కర్మలను కూడా కాల్చగల స్థోమత యున్నవారు కూడా కొందరు గలరు. అటువంటివారిలో ఇతర కర్మలను కాల్చి కళ్ల చూపునిచ్చి గ్రుడ్డితనము లేకుండా చేసిన వ్యక్తి ఏసు ఒకడు కలడు. దీనినిబట్టి ఏసు యొద్ద యున్న జ్ఞానము (జ్ఞాన ఫలము) వేరు, మిగతా జ్ఞానుల వద్దయున్న జ్ఞాన ఫలము వేరని తెలియవచ్చును. ఇదంతయూ మనిషిలో యున్న నిగూఢ విషయము. కర్మలను ప్రపంచ ఫలితములుగా, జ్ఞానమును దైవిక ఫలితముగా లెక్కించవలెను. అట్లు లెక్కించినవాడు నిజమైన జ్ఞానియగును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

70. మనిషికి ముందు వెనుకా ఇద్దరు కాపలావాళ్లు ఉంటారు. ఎవరినయినా వారు శిక్షించాలంటే శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు ఎవరూ ఉండరు. (13-11)

(13-11) మనిషికి ముందూ వెనుకా కావలివాళ్లు అంటియున్నారు. వారు దైవాజ్ఞానుసారము అతనిని కనిపెట్టుకొని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయముగా తన మనోమయ స్థితిని మార్చు కోనంతవరకు అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఏ జాతినయినా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే యుండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు.''


ప్రతి మనిషికి ముందువెనుక కావలివాళ్లు అంటియున్నారని వాక్యములో చెప్పారు. అయితే అలా ఏ మనిషికి ముందు వెనుక ఎవరు ఉన్నట్లు కనిపించలేదు కదా!యని ఎవరయినా అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ఏ మనిషికీ బయటికి కనిపించు కాపలావాళ్లు ఎవరూ ఉండరు. అయితే వాక్యములో చెప్పిన విషయమును గమనిస్తే జ్ఞానరీత్యా తెలియగల్గితే, ప్రతి మనిషికి ఇద్దరు కాపలావాళ్లు కలరనే చెప్పవచ్చును. ఎలాగనగా! ప్రతి జీవాత్మకు శరీరము లోపల ముందు ఆత్మ, వెనుక పరమాత్మయను ఇద్దరు కాపలాగా కలరు. ఆత్మ జీవునికి ఆనుకొని ప్రక్కనే యుండగా, పరమాత్మ కూడా ఆత్మకు అంటిపెట్టుకొని యున్నారు. దీనిని బట్టి ప్రతి జీవునికి ఆత్మ, పరమాత్మ ఇద్దరు కాపలాగా యున్నారని, ఆత్మ పరమాత్మ దృష్ఠిని కాదని జీవుడు లేడని తెలియుచున్నది.


ఇదంతా అగోచర విషయములు. బయటికి కనిపించునవి కావు. ముందే పరమాత్మ నిర్ణయము ప్రకారము కర్మను అనుసరించి ఆత్మ జీవాత్మను అంటిపెట్టుకొని ఉండును. ఆత్మను అనుసరించి పరమాత్మ శరీరములో సాక్షిగా యున్నాడు. అలా జీవుడు ఆత్మ దృష్ఠిలో యుండగా, ఆత్మ పరమాత్మ దృష్ఠిలో యున్నది. ప్రతి శరీరమునందు జీవాత్మయుండగా, జీవాత్మతో పాటు ఆత్మ ఉండడము సహజము. ఆత్మయున్న చోట పరమాత్మ యుండడము కూడా సహజమే. శరీరములో అగోచరముగా యున్న జీవాత్మకు ముందు వెనుకా అనగా చుట్టూ ఆత్మ, పరమాత్మ అను ఇద్దరూ గలరు. ముందు వెనుకయని వాక్యములో వ్రాసియున్నా వారు ఇద్దరూ ఒక ప్రక్కనే లేరు. ఎటుచూచినా ముందు వెనుకగలరు. అందువలన అన్ని వైపులా కలరని చెప్పవచ్చును. శరీరములో జీవాత్మ పుట్టినప్పటి నుండి మరణము వరకు నివాసము చేయుచున్నది.


శరీరములో జీవుడు తలయందు గల నాలుగు చక్రములలో క్రింది చక్రము అయిన గుణచక్రమందు మూడు భాగములలో అతని కర్మకొద్దీ ఏదో ఒక భాగమున నివశిస్తూయున్నాడు. దీనినిబట్టి జీవుడు శరీరములో ఒకచోట రవ్వంత స్థలములో యున్నాడని తెలియుచున్నది. శరీరము ఎంత పెద్దదయినా జీవుడు మాత్రము కొద్దిగా సూదిమోపినంత జాగాలో యున్నాడు. అయితే శరీరములోని ఆత్మ శరీరమంతయూ గోర్లు, వెంట్రుకల వరకూ వ్యాపించియున్నది. మొదటివాడయిన జీవుడు శరీరములో ఒక్కచోట కొద్దిగాయుండగా, రెండవవాడయిన ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నాడు. ఇకపోతే మూడవవాడయిన పరమాత్మ శరీరము లోపల శరీరమంతా వ్యాపించి యుండడమేకాక, శరీరము బయట కూడా అణువణువునా వ్యాపించి యున్నాడు. దీనినిబట్టి విశ్వమంతయూ అల్లాహ్ వ్యాపించి అన్నిటికీ అతీతముగాయున్నాడు. అల్లాహ్ అను ఇద్దరిలో ఈయన మొదటి సృష్ఠికర్త, ఈయన ఎవరితో సంబంధము లేకుండా ఏ అక్కరా లేనివాడు. మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్ మనుషుల ఆరాధనలకు కూడా సంబంధము లేనివాడై, ఏ పనినీ చేయనివాడై యున్నాడు.


శరీరములో శరీరమంతా వ్యాపించిన అల్లాహ్ రెండవ అల్లాహ్ యగును. ఈ అల్లాహ్ అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడు. రెండవ అల్లాహ్ అందరి ఆరాధ్య దైవముగా ఉండడమేకాక శరీరములో జీవుని చుట్టూ ఆవహించి జీవుని కర్మప్రకారము కష్టసుఖములను అనుభవించునట్లు చేయుచున్నాడు. జీవుడు కష్ట సుఖములను అనుభవించుటకు అవసరమైన కార్యములను దేహము చేత చేయిస్తున్నాడు. ప్రతి క్షణము శరీరములో కార్యకర్తగా రెండవ ఆత్మయుండి కార్యములను చేయుచుండగా, మూడవ వాడయిన పెద్ద అల్లాహ్ లేక పరమాత్మ చూస్తూ సాక్షిగా యున్నాడు. మనిషియొక్క కర్మనుబట్టి రెండవ ఆత్మయినవాడు మరణములో తీర్పు తీర్చియుండును. కర్మనుబట్టి తీర్పులో శిక్షలు ఖరారు చేసియుండును. తాను (రెండవ ఆత్మ) విధించిన శిక్షను అమలు చేయువాడు కూడా రెండవ ఆత్మనే. మనిషి తన పద్ధతిని జ్ఞానము చేత స్వయముగా మార్చుకొను అవకాశము గలదు. దేవుని జ్ఞానమును తెలియుట చేత జ్ఞానమునకు కర్మను లేకుండా చేయు శక్తి యుండుట చేత, మనిషి తన విధానమును ప్రపంచము నుండి పరమాత్మ వైపు (అల్లాహ్ వైపు) మార్చుకోవచ్చును. అలా ఎవరంతకు వారు స్వయముగా జ్ఞానమును తెలియుట చేత మార్పు పొందవలసిందేగానీ అల్లాహ్ ఎవరినీ మార్చడు. మూడవ ఆత్మయిన పెద్ద అల్లాహ్ యొక్క జ్ఞానము చేత మార్పు చెందవచ్చునుగానీ, ఆయన జ్ఞానము లేకుండా ఎవడూ మారలేడు. ప్రపంచ ద్యాసలనుండి దేవుని ద్యాసలోనికి మార్పు చెందువాడు రెండవ అల్లాహ్‍ను ఆరాధించవలసిందే, మూడవ అల్లాహ్ యొక్క జ్ఞానమును తెలియవలసిందే. మనిషి మారాలంటే మూడవ అల్లాహ్ అయిన పెద్ద అల్లాహ్ జ్ఞానము చేతనే సాధ్యమగును.


రెండవ ఆత్మయిన ఆరాధ్యదైవము తానే స్వయముగా తీర్పుతీర్చి విధించిన శిక్షలను తప్పక అమలు చేసి జీవుడు అనుభవించునట్లు చేయును. ఆ విధముగా రెండవ అల్లాహ్ శిక్షను అమలు చేయాలనుకొన్నప్పుడు దానిని తొలగించే ప్రసక్తే యుండదు. ఆయన విధించిన శిక్షను ఆయనే తప్పక అమలు చేయవలసియున్నది. అందరికీ ఆరాధ్యదైవముగా యున్న అల్లాహ్ తనను ఆరాధించినా, తాను మాత్రము విధిని అనుసరించి జీవునికి కర్మను అమలు చేసి అనుభవించునట్లు చేయును. తన నిర్ణయమును తాను కూడా మార్చుకోలేడు. తనకంటే పైన పెద్ద అల్లాహ్ అయిన మూడవ అల్లాహ్ కలడు. అందువలన పెద్ద దేవుడు మొదట సృష్ఠ్యాదిలో నిర్ణయించిన నిర్ణయము ప్రకారము రెండవ అల్లాహ్ కూడా పనిని చేయవలసిందే. రెండవ అల్లాహ్ అమలు చేయు శిక్షను మూడవ అల్లాహ్ అయిన పెద్ద అల్లాహ్ తన జ్ఞానమును తెలిసినవాడిని మాత్రమే శిక్షనుండి రక్షించగలడు. మొదటి ఆత్మయిన జీవుడు కర్మను సంపాదించుకోగా, ఆ కర్మను అనుసరించి రెండవ ఆత్మ శిక్షను ఖరారు చేసి తీర్పు తీర్చగా, దీనినుండి రక్షించగలవాడు ఒకే ఒక దేవుడు గలడు. ఆయనే మూడవ ఆత్మయిన పరమాత్మయని చెప్పవచ్చును.


ఈ విషయము మూడు దైవ గ్రంథములలో వేరువేరు విధములుగా, మనుషులకు అర్థమగునట్లుగా చెప్పియున్నారు. అయితే మనుషులు ఈ విషయమును సరిగా అర్థము చేసుకోలేకపోయారు. ముస్లీమ్‍లుగా చెప్పుకొను ఇస్లామ్ మతమువారు శరీరములో జీవునికి కాపలాగా యున్న రెండు ఆత్మలను ఇద్దరు దేవదూతలుగా పోల్చుకొన్నారు. దేవదూతలు అనగా దేవుని క్రింద పని చేయువారు అని అర్థము. అయితే శరీరములో కాపలాగా యున్నవారు ఒకరి క్రింద పని చేయువారు కాదు. వారు ఇద్దరూ స్వయముగా అల్లాహ్‍లుగా యున్నారు. అందులో ఒకరు పెద్ద అల్లాహ్కాగా, రెండవవాడు అందరికీ ఆరాధ్య దైవముగా యున్న రెండవ అల్లాహ్గా యున్నాడు. మొదటి పెద్ద అల్లాహ్ భూమిమీద అంతటా వ్యాపించి యుండి, ఎవరి అక్కరా లేనివాడుగా, ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. మూడవ అల్లాహ్ అయినవాడు తాను ఏమయినా చేయదలచుకొన్నప్పుడు ఆ పని వెంటనే అయిపోవును. ఎందుకనగా! మూడవ అల్లాహ్ ఆధీనములో పని చేయు దేవదూతలు కోట్లాదిమంది వెంటనే దేవుడు అనుకొన్న పనిని చేయుచున్నారు. ఈ విధముగా మూడవ అల్లాహ్ క్రింద ఎంతోమంది పనిచేయు దేవదూతలు కలరు.


రెండవ ఆత్మయిన ఆరాధ్య దైవమయిన అల్లాహ్ క్రింద దేవదూతలు ఎవరూ ఉండరు. రెండవ అల్లాహ్ శరీరమువరకు లోపల మాత్రము ఉండేవాడు. ఆయన స్వయముగా కార్యములను చేయు కార్యకర్తగా యున్నాడని అంతిమ దైవగ్రంథములో (6-102) మరియు (2-255) లో చెప్పియున్నారు. రెండవ అల్లాహ్‍యే మీకు ఆరాధ్యదైవము అని మూడవ అల్లాహ్ అయిన పెద్ద దేవుడు అదే అంతిమ దైవగ్రంథములో (3-18) లోనూ మరియు (16-51) లోను చెప్పియున్నారు. రెండవ ఆత్మయిన దేవునికి దూతలు లేరు. మూడవ ఆత్మయిన దేవునికి దేవదూతలు ప్రపంచ వ్యాప్తముగా కోట్లాదిమంది కలరు. దేవదూతలు శరీరము బయట పెద్ద దేవుని ఆధీనములో పని చేయుచున్నారు. శరీరము లోపల ఎవరూ ఎంతమాత్రము పని చేయలేదు. శరీరము లోపల రెండవ ఆత్మయిన ఏకైక ఆరాధ్య దైవము మరియు మూడవ ఆత్మయిన దేవుడు, అందరికీ అధిపతిగా యున్న దేవుడు ఉన్నాడు. అంతేగానీ మిగతా ఎవరూ లేరు. అయితే కొందరు శరీరము లోపలి జ్ఞానము తెలియనివారు తర్వాత రెండవ, మూడవ ఆత్మల విషయము తెలియనివారు, శరీరములో యున్న ఇద్దరు దేవుళ్లను ఇద్దరు దూతలుగా చెప్పారు. అట్లు చెప్పుట పూర్తి అజ్ఞానమగును. దూతలు శరీరము బయటే ఉంటారుగానీ, శరీరము లోపల యుండరని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

71 ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే పిడుగులను పంపి తాను కోరినవారి మీద వేస్తున్నాడు. (13-13)

ఈ వాక్యము పూర్తి మూడవ పురుషుడయిన పరమాత్మను గురించి చెప్పినది. మూడవ ఆత్మ రెండవ ఆత్మను సృష్ఠించినవాడుగా యున్నాడు. ఆయన మనుషులందరూ ఆరాధించు రెండవ ఆత్మకంటే పెద్దవాడు, మొదటి సృష్ఠికర్తయిన దేవుడు. ఈయన శరీరము లోపల, శరీరము బయట అణువణువునా వ్యాపించి యున్నవాడు. ఈ మూడవ ఆత్మయిన దేవునికి (అల్లాహ్‍కు) ఆయన అనుకొన్నదానిని నెరవేర్చు దేవదూతలు కోట్లాది మంది విశ్వమంతా కలరు. వారిలో ఆకాశములో యున్నవారు కొందరు, భూమిమీద ఉన్నవారు కొందరు గలరు. ఆయనను ఆకాశములోని దేవ దూతలు ఎలా కొనియాడుచున్నారో క్రింది వాక్యములో కలదు చూడండి. మొదట ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథము నుండి తీసి చూపించుచున్నాము. దానినే మరియొక గ్రంథమయిన ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథములో అదే వాక్యములో ఉన్నదానిని కూడా చూపించుచున్నాము. రెండు గ్రంథములలో ఒకే వాక్యములో కొంత భాష తేడా యున్నా విషయము మాత్రము ఒక్కటే కలదని తెలియుచున్నది.


'అంతిమ దైవ గంథము ఖుర్ఆన్'లో సూరా 13, ఆయత్ 13 లో ఇలా కలదు చూడండి.


(13-13) ''ఉరుము సహితము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయన్ను ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతి వలన ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరినవారిపై పడ వేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయములో పిడివాదానికి దిగుచున్నారు. ఆయన మహాశక్తివంతుడు.''


'దివ్య ఖుర్ఆన్ సందేశము' గంథములో ఇలా కలదు చూడండి.


(13-13) ''ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయన స్తోత్రం చేస్తోంది. దైవదూతలు కూడా ఆయన భయముతో ఆయనను స్తోత్రం చేస్తున్నారు. ఆయన పెళపెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరినవారిని శిక్షిస్తాడు. అయినా సత్య తిరస్కారులు అల్లాహ్‍ను గురించి వాదులాడుచున్నారు. అల్లాహ్ అద్భుత యుక్తివంతుడు.''


రెండు గ్రంథములలోని ఒకే వాక్యము ఒకే భావమును కల్గియున్న దని తెలియుచున్నది. వాస్తవముగా మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ ప్రపంచ వ్యాప్తముగా అణువణువునా వ్యాపించి యున్నాడు. ఈయనను గురించి ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాయందు గల నాలుగు ఆయత్‍లలో పూర్తిగా చెప్పియున్నారు. అంతేకాక గ్రంథములో అక్కడక్కడా ఎన్నోచోట్ల చెప్పియున్నారు. అయినా ప్రజలు మూడవ ఆత్మయిన పెద్ద దేవున్ని గురించి సరిగా అర్థము చేసుకోలేక మూడవ ఆత్మను గురించి చెప్పినప్పుడు రెండవ ఆత్మగా అర్థము చేసుకొంటున్నారు. వారి లెక్కలో ఉన్నది ఒకే అల్లాహ్యని అంటున్నారు. ఆరాధ్య దైవము ఒక్కడేయను విషయము మేము కూడా చెప్పుచున్నాము. అయితే ఆరాధనలు కూడా అక్కర లేనివాడు, అన్నిటికీ అతీతముగా యున్న దేవుడు మరొకడున్నాడని చెప్పుచున్నాము. ప్రజల దృష్ఠి ఒక్క దేవుని మీద తప్ప ఇతర దేవుడు లేడని ఉండుట వలన వారికి ఇద్దరు దేవుళ్లున్నారని అందులో ఒకరు ఆరాధనకు అవసరమైనవాడనీ, మరొకడు ఆరాధనకు కూడా అతీతుడని తెలియని దానివలన ఒకే దేవుడను గ్రుడ్డి నమ్మకముతో వాస్తవముగా యున్న దేవుళ్ల విషయమును గ్రహించ లేకపోవుచున్నారు. నేడు ముస్లీమ్‍లందరు ఆరాధించు దేవుడు రెండవవాడని, ఆయననే అనగా రెండవ వానినే ఆరాధించమని చెప్పినవాడు పెద్దవాడయిన మూడవ ఆత్మగాయున్న పెద్ద అల్లాహ్యని తెలియలేకపోయారు. అంతేకాక పెద్ద దేవునికే ప్రపంచములో దేవదూతలు సేవకులుగా గలరని రెండవ అల్లాహ్‍కు దూతలు లేరని తెలియకున్నారు. మీకు బాగా అర్థము కావాలంటే (16-51) ఆయత్ చూడండి. అక్కడ పెద్ద అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను ఆరాధించమనీ, తనను కూడా ఆరాధించకూడదని ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి అని చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఈ విధముగా ఉన్న సత్యమును తెలియగలిగినప్పుడు ఇప్పుడు చెప్పిన (13-13) వ వాక్యము మూడవ అల్లాహ్‍ను గురించి చెప్పినదని తెలియగలరు. అందరికీ పెద్ద దేవుడయిన పరమాత్మయనబడు మొట్టమొదటి సృష్ఠికర్తయిన దేవున్ని గురించి ఏమి చెప్పుచున్నదో 13వ సూరా, 13వ ఆయత్నందు కలదు చూడండి.


ఆరాధ్య దైవముకంటే పెద్దవాడయిన, ఎవరికీ సంతతికాని వాడయిన, ఏకైక అధిపతిగా యున్న దేవుడయిన మొట్టమొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్‍కు విశ్వములో విశ్వవ్యాప్తముగా కోట్లాదిమంది దూతలు కలరు. ఆ దూతలలో ఆకాశమందు మేఘరూపములో యున్నవారు కూడా కలరు. మేఘములుగా యున్న దూతలు దేవుని జ్ఞానమును తెలియజేయు నిమిత్తము తమకు తెలిసిన భాష అయిన ఉరుములను శబ్దరూపములో దైవ జ్ఞానమును చెప్పడమేకాక దేవున్ని పొగడుచున్నారు. అట్లే ప్రార్థన కూడా చేయుచున్నారని వాక్యములో చెప్పారు. మిగతా దేవదూతలు కూడా పరమాత్మయిన మూడవ అల్లాహ్‍కు భయపడుచూ ఆయనను స్తుతిస్తున్నారు. 16-51 లో ''ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి'' అన్నట్లు మిగతా దేవదూతలు అందరూ మూడవ ఆత్మయిన అల్లాహ్‍కు భయపడి ఆయనను ప్రార్థించుచున్నారు. బయట ప్రపంచములో ఆకాశము వరకు వ్యాపించియున్న దూతలు కొందరు మేఘరూపములో ఉండి దేవుని సంకల్పమును అనుసరించి పిడుగులను తెచ్చి దేవుడు కోరిన వారిమీద పడవేయుచున్నారు. ఇదంతా తెలియని అజ్ఞానులు మరియు దేవుని జ్ఞానమును తిరస్కరించి మాట్లాడు సత్య తిరస్కారులు దేవుని విషయములో తమకు తెలిసినదే సత్యమని వాదించు చున్నారు. దేవుళ్లు ఇద్దరు లేరు ఒక్కడేయని అంటున్నారు. అయితే శరీరము లోపల దేవుడు ఆత్మని, శరీరము బయట దేవుడు పరమాత్మని వారికి తెలియదు. వారికి తెలిసినా తెలియకపోయినా విశ్వవ్యాప్తమైన బయటి దేవుడు శరీరము లోపలి దేవునికంటే పెద్దవాడని తెలియకయున్నారు. వారికి బయట వాని విషయము తెలిసినా తెలియకపోయినా ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన శక్తి వలననే అందరి కర్మలు కాలిపోవుచున్నవి. ఆయన దూతల వలననే భూమిమీద ఏమయినా జరుగుచున్నది. ఆకాశములో ఉరుములు, పిడుగులు కూడా ఆయన శక్తివలననే వస్తున్నవి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

72. అల్లాహ్ తాను కోరినదానిని చెరిపివేస్తాడు. తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథము ఆయనవద్దే కలదు. (13-39)

అల్లాహ్ 'తాను కోరినదాన్ని' అని రెండుమార్లు చెప్పడము విశేషముగా యున్నది. మనుషులు ఈ వాక్యములో చాలావరకు పొరపాటు పడిపోయారు. ముస్లీమ్ పెద్దలయిన వారు కూడా ఈ వాక్యములో పూర్తి క్రిందపడిపోయారు. చెప్పినది సులభమే అయితే వినపడినది కఠినముగా యున్నది. అంతటి గొప్పగా యున్న ఈ వాక్యమును క్రింద చూస్తాము.


(13-39) ''అల్లాహ్ తాను కోరినదానిని చెరిపి వేస్తాడు. అల్లాహ్ తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథము (లౌహె మహ్ ఫూజ్) ఆయనవద్దే కలదు.''


ఇక్కడ వ్రాసిన వాక్యము ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' లోనిది. ఇప్పుడు అదే వాక్యమునే ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను తెలుగు అనువాద గ్రంథములోనిది వ్రాసి చూపుతున్నాము. చూడండి.


(13-39) ''అల్లాహ్ తాను కోరినదానిని రద్దు చేస్తాడు. అట్లే తాను కోరినదానిని స్థిరపరుస్తాడు. మాతృగ్రంథము (ఉమ్ముల్ కితాబ్) ఆయన దగ్గరే ఉన్నది.''


ఈ వాక్యములో ఒక పురాతన గ్రంథము పేరు చెప్పబడినది. ఆ గ్రంథమును ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథములో తెలుగు అనువాదకుడు ''ముహమ్మద్ అజీజుర్రహ్మాన్'' గారు చెప్పినది మూల గ్రంథము పేరు 'లౌహె మహ్ ఫూజ్' అని చెప్పారు. మరియొక తెలుగు అనువాద గ్రంథమయిన 'దివ్య ఖుర్ఆన్ సందేశము' యొక్క అనువాదకుడు ''డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా'' గారు చెప్పిన మాతృగ్రంథము పేరు 'ఉమ్ముల్ కితాబ్' అని చెప్పాడు. మూలగ్రంథము అనినా, మాతృగ్రంథము అనినా రెండూ ఒకటే అర్థముతో యున్నవి. ఇద్దరు అనువాద గ్రంథకర్తలు తలా ఒక పేరును చెప్పినా, ఆ రెండు పేర్లు ఒకే గ్రంథము పేర్లే అయినందున, ఇద్దరు చెప్పినది ఒక్కటేయని తెలియుచున్నది. లౌహే మహ్ ఫూజ్ అనినా, ఉమ్ముల్ కితాబ్ అనినా రెండూ మొట్టమొదటి చేతి వ్రాతతో వ్రాయబడిన ఖుర్ఆన్ గ్రంథము పేర్లు. మొదట ఖుర్ఆన్ వ్రాతరూపములో వ్రాయబడినది. అలా వ్రాసిన దానిని అలాగే ఉంచి భద్రపరచారు. దానిని ఖుర్ఆన్ యొక్క మూల గ్రంథమనియూ, లేక ఖుర్ఆన్ యొక్క మాతృ గ్రంథమనియు చెప్పుచుందురు.


అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమనగా! జిబ్రయేల్ ఈ వాక్యము చెప్పిన రోజు ఈ పేర్లుగల గ్రంథమే లేదు. అందువలన వాక్యములో చెప్పిన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము కాదనీ, వాక్యము చెప్పిన రోజు ఖుర్ఆన్ గ్రంథము వ్రాయబడలేదనీ చెప్పుచున్నాము. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన వాక్యమును బాగా గమనిస్తే ''అల్లాహ్ తాను కోరినదానిని లేకుండా చేస్తాడు. అట్లే తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు'' అని ఉంది. ఈ వాక్యములో రెండుచోట్ల 'తాను కోరినదానిని' అని చెప్పబడినది. అందువలన ఇక్కడ కొంత ఆలోచన చేయవలసియున్నది. గతములో దాదాపు 35 సంవత్సరముల క్రిందట మా ఇంటి ప్రహరీ గోడమీద కొన్ని జ్ఞాన వాక్యములను వ్రాయించాను. అప్పుడు ఒక వాక్యమును వ్రాసి యుంచగా దానిని చూచినవారంతా తప్పుపట్టేవారు. ఆ వాక్యము ఇలా ఉన్నది.

''నేను అనుకొంటే నీవు అంతటా ఉంటావు.


నేను అనుకొంటే నీవు ఒక్కచోటే ఉంటావు.''


ఈ వాక్యములో 'నేను అనుకొంటే నీవు' అను పదములు రెండుచోట్ల వాడాము. ఒకచోట వాడినప్పుడు 'నీవు అంతటా ఉంటావు' అని ఒక విధానమును చెప్పి, రెండవమారు 'నీవు ఒకచోటే ఉంటావు' అని రెండవ విధానమును చెప్పాము. ఒకే వాక్యములో రెండు వ్యతిరేఖ పదములు (విధానములు) వాడినదానివలన చూచినవారు వాక్యమును అర్థము చేసుకోలేక తప్పు వ్రాశారు. మొదట 'నేను అనుకొంటే' అని వ్రాసి రెండవమారు కూడా అదే వ్రాశారు. కానీ అక్కడ రెండవచోట ఒక అక్షరమును మరచిపోయారు రెండవచోట నేను అనుకోకుంటే అని వ్రాయవలసింది. రెండవమారు 'కు' అను అక్షరమును లేకుండా చేశారు. దానిని సవరించి నేను అనుకోకుంటే యని వ్రాయండి అని చెప్పేవారు. అయితే మొదట నేను వ్రాసినది తప్పుకాదని నాకు తెలుసు. దేవుడు అనుకొంటే మనిషిని మోక్షములో చేర్చి అంతటా వ్యాపింపజేస్తాడని, అట్లే దేవుడు అనుకొంటే మనిషికి మోక్షము రాకుండా చేసి మనిషిగానే ఒక్కచోటే ఉండునట్లు చేస్తాడను భావముతో వ్రాసిన వాక్యమది. నేను చెప్పిన భావము సరియైనదే. అయితే భావమును వదలి భాషను చూచువారికి అది తప్పుగానే కనిపించుట సహజము. అందువలన ఎవరు తప్పని చెప్పినా, ఎంతమంది తప్పని చెప్పినా ఆ వాక్యమును నేను అలాగే ఉంచాను. ''ప్రబోధ తరంగాలు'' అను పేరు గల మా రచనా గ్రంథములో నేటికినీ ఆ వాక్యము అలాగే కలదు.


నేను 35 సంవత్సరముల క్రిందట చెప్పిన వాక్యములాగే 1400 సంవత్సరముల పూర్వము జిబ్రయేల్ ఖుర్ఆన్ వాక్యము చెప్పాడని నాకు తెలియదు. అయితే నేను వ్రాసిన భావమునకు సరిపోయిన వాక్యము ఖుర్ఆన్‍లో ముందే ఉండడము కొంత సంతోషమును కలుగజేసినా, నేడు ఖుర్ఆన్ వాక్యమును అనువాదకులు సహితము తప్పుగా అర్థము చేసుకోవడము నాకు కొంత బాధగానే ఉంది. దానికి నేను ఏమి చెప్పుచున్నా ననగా! దేవుడు రద్దు చేస్తాడు, లేక అలాగే ఉంచుతాడు అని ఒకదానికొకటి వ్యతిరేఖ కార్యములను చెప్పాడు. ఉదాహరణకు వంటమనిషి చేసినది కాఫీయని ఒకచోట చెప్పి, వంటమనిషి చేసినది ఏదీ లేదు అని చెప్పితే చేసే పని ఒకటే అయినప్పుడు రెండు వ్యతిరేఖమైన మాటలు ఎలా వచ్చాయి? అనునది ప్రశ్నగా మిగిలిపోతుంది. వంటమనిషి చేసే పని ఒక్కటే, అట్లే వంటమనిషి ఒక్కడే, ఇందులో అనుమానము లేదు. వంట మనిషి ఒక్కడే, చేసే పని ఒక్కటే, చేసే జాగా వంటగది. ఈ మూడు ఒక్కటే అయినప్పుడు పనిలో తేడా ఎలా వచ్చినది? అను ప్రశ్నకు జవాబును వెదకవలసి వచ్చినది. అయితే మధ్య కొందరు వచ్చి ఇలా అన్నారనుకోండి. వంట మనిషి చేసినది కాఫీయని చెప్పినప్పుడు ఆయన వంటగదిలో చేశాడనియే అందరూ అనుకొంటారు. అలాగే వంటమనిషి చేసినది ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా అతను వంటగదిలోనే ఏమీ చేయలేదని అనుకోవలసి యున్నది. అయితే అట్లుకాకుండా వంటమనిషి చేసినది పూజగదిలో కాఫీయని చెప్పినా, వంటమనిషి చేసినది పూజగదిలో ఏదీ లేదని చెప్పినా, వంటమనిషికి వంట గదితో సంబంధము గానీ, పూజగదితో ఏమి సంబంధమని ప్రశ్నరాక తప్పదు. దానితో వంటగదిలో వంట చేయవచ్చు, చేయకపోవచ్చు. అంతేగానీ పూజగదియని చెప్పడము పూర్తి తప్పు. పూజగదిలో వంట చేయరు అని తేల్చి చెప్పవచ్చును.


అదే విధముగా (13-39) వాక్యములో 'దేవుడు రద్దు చేయునది, రద్దు చేయక అలాగే యుంచునది' మూల గ్రంథములో యను మాట వాస్తవమేగానీ, మూల గ్రంథము అనగానే ఖుర్ఆన్ యొక్క మాతృగ్రంథము పేరు ఉమ్ముల్ కితాబ్ యని చెప్పడము పెద్ద తప్పు. ఇక్కడ బాగా అర్థము చేసుకుంటే ''దేవుడు అనుకొంటే మనిషిని సన్మార్గములో (జ్ఞానమార్గములో) అయినా పంపగలడు. అలాగే దేవుడు అనుకొంటే మనిషిని చెడు మార్గములో (అజ్ఞాన మార్గములో) అయినా పంపగలడు.'' మనిషి భావమును బట్టి ఇదే ప్రపంచములో దేవుడు రెండు విధములా చేయగలడు. ఇంకా చెప్పితే దేవుడు క్షమాశీలుడు, దేవుడు మనిషి చేసుకొన్న పాపమును క్షమించి లేకుండా చేయగలడు. మనిషి జ్ఞానమార్గములోనికి వచ్చినప్పుడు అతనికున్న గత పాపముల చిట్టానుండి పాపములను లేకుండా చేయగలడు. మనిషి మారకుండా అలాగే అజ్ఞాన మార్గములో ఉంటే దేవుడు అతని పాపమును అతని పాపముల చిట్టానుండి తీసివేయక అలాగే ఉంచగలడు. అదే విషయమునే పై వాక్యములో చెప్పియున్నారు. దేవుడు తాను కోరిన దాన్ని (పాపమును) రద్దు చేస్తాడు. అలాగే తాను కోరిన దాన్ని (పాపమును) అలాగే ఉంచుతాడు. రద్దు చేసేది కానీ, రద్దు చేయనిది కానీ మనిషియొక్క కర్మ చిట్టాయను గ్రంథములో గలదు. మనిషి చేసుకొన్న ప్రతి పాపమును, ప్రతి పుణ్యమును శరీరములోని దేవుడు (రెండవ ఆత్మ) 'కర్మపత్రము' అను గ్రంథములో వ్రాసియుంచుతున్నాడు. తర్వాత దాని ప్రకారమే మనిషి బ్రతుకును దేవుడే క్షణక్షణము నడుపుచున్నాడు. కర్మలిఖితము ఒక గ్రంథమందు వ్రాసియుంచువాడు నీవు ఆరాధించు దేవుడు. ఆ కర్మ లిఖితమును కర్మగ్రంథము నుండే మూడవ ఆత్మయిన దేవుడు క్షమించి తీసివేయగలడు, లేక అలాగేనయినా ఉంచగలడు. ఈ వాక్యములో చెప్పవలసిన గ్రంథము కర్మపత్రమను గ్రంథమునేగానీ, ఖుర్ఆన్ మాతృ గ్రంథము కాదు. కర్మ నిలువయున్న కర్మ యొక్క మూలగ్రంథమని తెలియాలి. ఒకవేళ లేదు కాదు మీ మాట సరికాదు అని ఎవరయినా అనినా ఈ వాక్యము చెప్పినప్పుడు ''ఉమ్ముల్ కితాబ్'' అను ఖుర్ఆన్ గ్రంథమే తయారు కాలేదు కదా!యని అడుగవచ్చును. అందువలన వాక్యములో భాషను గమనించక భావమును గ్రహించమని కోరుచున్నాము. మొత్తానికి ఈ వాక్యములో ముస్లీమ్ పెద్దలు కూడా తప్పుదారి పట్టడము గమనార్హము.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

73. ఖుర్ఆన్ మానవుల కొరకు ఒక సందేశము. ఆరాధ్యదైవము ఒక్కడేయని గ్రహించటానికి. (14-52)

(14-52) ఈ ఖుర్ఆన్ సమస్త మానవుల కొరకు ఒక సందేశము. దీని ద్వారా వారిని హెచ్చరించటానికి, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము అని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు (మేథావులు) గ్రహించుటకు''


ఈ వాక్యమును చూస్తే సులభముగాయున్నా, ఎంతో తెలివియున్నా కూడా ఇది అర్థము కాదని చెప్పుటకు సాక్ష్యముగా వాక్యము చివరిలో ''విజ్ఞులు గ్రహించటానికి'' అని చెప్పియున్నారు. దీనినిబట్టి కొంత లోతుగా ఆలోచించగా! నేడు ముస్లీమ్ అయిన వారందరూ దేవుడు ఒక్కడే ఆరాధ్య దైవము అని పూర్తి విశ్వాసము కల్గియున్నారు. హిందువులకు ఆ మాట చెప్పితే వారు ఎలాగూ నమ్మరు. అది ముస్లీమ్‍లకు చెప్పినమాట, ముస్లీమ్ గ్రంథము ఖుర్ఆన్‍లోని మాటయని అంటారు. అట్లే వారి మాటప్రకారమే ముస్లీమ్‍లకే చెప్పినమాట ప్రకారము తీసుకొనినా, ముస్లీమ్‍లు దేవుడు ఒక్కడేయనీ అతనే ఆరాధ్యదైవమని నమ్మియున్నారు కదా! అయితే వాక్యము చివరిలో మేథావులు తెలియుటకు అని ఉంది. అంతేకాక ఇది మానవులకు సందేశము మరియు మనుషులను హెచ్చరించటానికి అని చెప్పి అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని గ్రహించటానికి అన్నారు.


పూర్వము సృష్ఠ్యాదిలో దేవుడు ప్రపంచ నాటకమునకు జీవున్ని సృష్ఠించాడు. జీవున్ని నడుపుటకు జీవునికి దేవుడయిన వానిని, జీవునికి ఆరాధ్య దైవమయిన వానిని సృష్ఠించాడు. అప్పుడు జీవునికి దేవుడు ఒక్కడే యనీ, అతనే ఆరాధ్య దైవమని మొదటి సృష్ఠికర్తయిన దేవుడు జ్ఞానమును చెప్పాడు. జీవున్ని, అతనికి దేవున్ని సృష్ఠించినవాడు సృష్ఠ్యాదిలోని దేవుడు. అప్పుడు జీవుడు ఒక్కడే అయినా దేవుళ్లు ఇద్దరున్నట్లయినది. ఒకడు జీవునికి ఆరాధ్యదైవము కాగా, అతనిని సృష్ఠించిన మొదటి దేవుడు కూడా ఉండుట వలన మనుషులు ఎవరిని ఆరాధించవలెనను సంశయము ఏర్పడును. అందువలన 16-51లో ''ఇద్దరు అల్లాహ్‍లను ఆరాధ్య దైవముగా పెట్టుకోకండి. మీకు ఆరాధ్య దైవము ఒక్కడేయని'' మొదటి సృష్ఠికర్తయిన పెద్ద అల్లాహ్ చెప్పియున్నాడు. మేథావులు సహితము పొరపాటు పడు అవకాశముండుట వలన (14-52) లో సమస్త మానవులకు ఇది ఒక సందేశముగా వాక్యమును చెప్పాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

74. భయపడకు నీకు జ్ఞానసంపన్నుడగు కుమారుడు పుట్టునని చెప్పుచున్నాను. ఏమిటి వృద్ధాప్యము వచ్చిన తర్వాత మీరు శుభవార్తను చెప్పుచున్నారా! దీనిని మీరు ఎలా వినిపిస్తున్నారు? (15-53, 54)

భూమిమీద దేవుడంటే భక్తి కాకుండా, భయము కూడా కలవారున్నారు. కొందరిలో భయము, భక్తి రెండూ ఉండగా, కొందరిలో భక్తిమాత్రముండి భయము లేకున్నది. మరికొందరిలో భయము మాత్రముండి భక్తి లేనివారు కలరు. ఇంకా కొందరిలో భయములేదు, భక్తి లేదు. ఈ విధముగా యున్న నాలుగు రకముల వారికి చెప్పునదేమనగా! భక్తి, భయము రెండూ ఉండువారే మంచి మార్గములో యున్నవారని చెప్పవచ్చును. భయము, భక్తి యున్నవారిలో కూడా శ్రేష్ఠులు, శ్రేష్ఠులు కానివారు కలరని చెప్పవచ్చును. ఎలాయనగా! అల్లాహ్ యనువాడు ఒక్కడేయని ఆ ఒక్కని మీదనే భయము, భక్తి చూపువాడు పూర్తి శ్రేష్ఠుడు కాదని చెప్పవచ్చును. అల్లాహ్ ఒక్కడేయని, అతనే ఆరాధ్య దైవమని నమ్మినా ఆ దేవునికి భక్తి మాత్రము అవసరము, ఆయనపట్ల భయము ఉండకూడదు. అందువలన అతడు పూర్తి శ్రేష్ఠుడు కాదని చెప్పవచ్చును. అయితే శ్రేష్ఠుడు ఎవరనగా!


సృష్ఠి పూర్వము ఒక అల్లాహ్ ఉండేవాడనీ, ఆయన మొట్టమొదట భూమిని ఆకాశమును తయారు చేశాడనీ, తర్వాత ప్రాణకోటిని తయారు చేయుటకు ఆయన మరొక ఆత్మను సృష్ఠించాడనీ, ఆ ఆత్మే సర్వమానవులనూ సృష్ఠించాడనీ మనుషులను సృష్ఠించినవాడే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడని, అందరికీ ఆరాధ్య దైవముగా యుండమని ఆత్మను నియమించిన వాడు మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మయనీ చెప్పవచ్చును. మానవులను సృష్ఠించిన ఆత్మకు కూడా తండ్రిగా యున్న పరమాత్మ తనకు భయపడమనీ, తన ఆత్మను ఆరాధించమని (16-51) వ ఆయత్‍లో చెప్పియున్నాడు. ఆయన మాటప్రకారము సృష్ఠి పూర్వము ఉన్న పరమాత్మయను అల్లాహ్‍ను, సృష్ఠి తర్వాత మనుషులను తయారు చేసిన ఆత్మయను అల్లాహ్‍ను ఇద్దరినీ తెలిసి మానవులను సృష్ఠించిన ఆత్మ యెడల భక్తియు, ప్రపంచము అయిన ప్రకృతిని సృష్ఠించిన పరమాత్మ యెడల భయమును కల్గియున్నవాడు నిజమైన జ్ఞానియగును. సృష్ఠిరహస్యమును పూర్తిగా తెలియకుండా అందరివలె ప్రార్థన ఒకటే చేయుచుంటే అది కేవలము భక్తియగును. ప్రప్రథమముగా విశ్వమును సృష్ఠించిన దేవున్ని తెలియకపోతే వాడు సంపూర్ణ జ్ఞాని కాలేడు.


దేవుడంటే భయమున్న వానికి దేవునిమీద భక్తి ఆరాధన చేయు జ్ఞానము ఉండదు. ఎందుకనగా! అతనికి ఒకే దేవుడున్నాడని తెలియును గానీ, ఇద్దరు దేవుళ్లున్నారని తెలియదు. ముఖ్యముగా భయమున్న వానికి మూడవ ఆత్మయిన పరమాత్మ మనిషికి ఇద్దరు దేవుళ్ల జ్ఞానమును ఇవ్వాలి. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మల జ్ఞానము తెలిసినప్పుడు మనిషికి భయము లేకుండాపోయి సంతోషము కల్గును. అటువంటివానికి పెద్ద దేవుడయిన మూడవ ఆత్మమీద కొంత భయము, రెండవ ఆత్మ మీద కొంత భక్తియుండును. దేవుడంటే భయము, భక్తి సమానముగా ఉండుట వలన ఏదీ పైకి కనిపించదు. అప్పుడు వానియందు జ్ఞానము వృద్ధి కాగలదు. అటువంటివాడు తాను మూడు ఆత్మల జ్ఞానము తెలియుటకు వయస్సు ముదిరి ముసలివాడు కావచ్చును. అటువంటి వానికి దేవుడు ఏమి చెప్పుచున్నాడనగా! అంతిమ దైవ గ్రంథములో సూరా 15, ఆయత్ 53, 54 యందు ఇట్లు చెప్పుచున్నాడు చూడండి.


(15-53, 54) ''భయపడకు. మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడుతాడన్న శుభవార్తను అందజేయుచున్నాము.'' అని వారన్నారు. ''ఏమిటి, వృద్ధాప్యము వచ్చిన తర్వాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు?'' అని అతడు అన్నాడు.


ఈ వాక్యములోని సారాంశము ఏమనగా! మనుషులకు రెండు రకముల సంతానము కలదు. ఒక రకమును బిందుపుత్రుడుయని అనవచ్చును. మరొక రక సంతానమును నాదపుత్రుడుయని అనవచ్చును. బిందు పుత్రుడనగా తండ్రి వీర్యబిందువుకు పుట్టువాడని చెప్పవచ్చును. అట్లే నాదపుత్రుడు యనగా! చెప్పే జ్ఞానము వలన శిష్యుడుగా తయారయిన వానిని గురువుకు కొడుకుతో సమానమగుట వలన అతనిని నాదపుత్రుడు యని అందురు. నాదపుత్రుడు వ్యక్తి వృద్ధాప్యమును పొందిన తర్వాత అయినా కూడా వచ్చుటకు అవకాశము గలదు. ఎంత వృద్ధాప్యము వచ్చినా కొన్ని వందలమంది నాదపుత్రులను పొందు అవకాశము గలదు. అందువలన ఈ వాక్యమును చెప్పి వాక్యములో జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడని చెప్పుట గమనార్హముగా యున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

75. రంగు రంగుల వస్తువులను ఆయన మీకోసము సృష్ఠించాడు. అందులో పెద్ద సూచన ఉంది. (16-13)

(16-13) ''ఇంకా రంగు రంగు వస్తువులను ఎన్నింటినో ఆయన (దేవుడు) మీ కోసము భూమిలో సృష్ఠించాడు. నిస్సందేహముగా గుణపాఠము గ్రహించే వారి కోసము ఇందులో చాలా పెద్ద సూచన ఉంది.''


భూమిమీద సృష్ఠించిన ఎన్నో వస్తువులను చూచి మనిషి దైవ జ్ఞానమును తెలియాలను ఉద్దేశ్యముతో చంద్రున్ని, అనేక రంగు వస్తువులనూ, అత్తపత్తి చెట్టును మొదలగు వాటిని తయారు చేసి పెట్టాడు. దేవుని ఉద్దేశ్యము గొప్పదయినా, మనిషి దేవుడు సృష్ఠించిన వాటిని చూచి వాటి సూచన ప్రకారము ఏమాత్రమూ జ్ఞానమును గ్రహించడము లేదు. ఉదాహరణకు చంద్రున్ని తీసుకొని చూస్తే చంద్రుడు జ్ఞానమునకు గుర్తుయని చెప్పుచుందురు. చంద్రున్ని ఇంద్రుడు అనుట కూడా కలదు. ఇందు అనగా చంద్రుడని, చంద్రుడనగా జ్ఞానమనీ, జ్ఞానము కల్గిన వానిని ఇందువు అని చెప్పుచుందురు. జ్యోతిష్య శాస్త్రములో కూడా జ్ఞానమునకు అధిపతిగా చంద్రున్ని చెప్పడమైనది. జ్ఞానముగల స్త్రీని ఇందుమతియని పేరుపెట్టి పిలువడము కూడా కలదు. మనిషిలో జ్ఞానము చిన్నగా మొదలయి మనిషి శ్రద్ధనుబట్టి పెద్దగా తయారవుతూపోవును. అందువలన చంద్రుడు అమావాస్య తర్వాత చిన్నగా మొదలయి పెరుగుచూపోవునని, పెరిగే జ్ఞానమునకు గుర్తుగా చంద్రున్ని దేవుడు చూపాడు. పూర్తి జ్ఞానము గల్గిన వానిని ఇందువు అని చంద్రుని పేరే పెట్టడమైనది. ఇందువు, ఇందుమతి అనగా జ్ఞానికి పెట్టిన పేర్లు అయినందున జ్ఞానమునకు చిహ్నముగా పెరిగే చంద్రున్ని శివుని నెత్తిన పెట్టి చూపడము కూడా జరిగినది. అట్లే చెట్లలో అత్తపత్తి చెట్టును చూపడమైనది. ఏ పనిని చేసినా 'నేను' అను అహము లేకుండా చేసిన దానిని పెద్దగా చెప్పుకోకుండా ఉండునట్లు అత్తపత్తి చెట్టును చూచి తెలుసుకోవచ్చును.


అత్తపత్తి చెట్టు చిన్న చెట్టు. దానిని ఇంగ్లీషు భాషలో Touch me not అని కూడా అనుచుందురు. ఆ చెట్టును కొద్దిగా తగిలితే అది వెంటనే ఆకులను ముడుచుకొనును. పెద్దగా కనిపించునది చిన్నగా కనిపించును. దానిని చూచిన మనిషి జ్ఞానమును గ్రహించవచ్చును. తాను చిన్న పనిని చేసి పెద్దగా చెప్పుకొనుచుండును. అత్తపత్తి చెట్టును చూచిన తర్వాత పెద్ద పనిని చేసినా చిన్నగా చెప్పుకోవలెననీ, తన్ను తాను తగ్గించుకోవలెనని తెలియగలదు. జ్ఞానమును తెలియాలను శ్రద్ధయున్నవానికి బయట ప్రపంచములో ఎన్నో సూచనలు కనిపించును. జ్ఞానము మీద ధ్యాస లేనివానికి బయట ఎన్ని సూచనలున్నా ఏమీ ప్రయోజనముండదు. వాడు వాటిని చూచి ఏమీ గ్రహించడు. శ్రద్ధయున్నవాడు గ్రహించుటకు దేవుడు చేసిన సూచనలలో ఆయన ఎన్నో రంగు రంగు వస్తువులను భూమిమీద సృష్ఠించాడు. జ్ఞానము మీద శ్రద్ధగలవాడు సూచనలు గ్రహించగలిగితే ఇందులో ఎంతో జ్ఞానసందేశము గలదు.


మన శరీరములో మనము అనగా జీవుడు తలయందు ఒకచోట నివాసము చేయుచున్నాడు. జీవుడు నివాసము చేయు జాగాను 'గుణచక్రము' అని అనుచున్నాము. ఇదంతా జ్ఞానము తెలిసినవారు తెలియగలిగినది. అంతేకాక భగవద్గీతలో (ప్రథమ దైవగ్రంథము) లో చెప్పిన విషయము అని తెలియవలెను. మనిషి తలలో జీవునిగా గుణచక్రమందు నివాసము చేయుచుండగా! అక్కడ గుణచక్రములో గల మూడు భాగములందు జీవుడు ఏదో ఒక భాగమున నివాసము చేయుచున్నాడు. గుణచక్రము మూడు భాగములందు గుణములు నిండుకొని యున్నవి. ఒక్కొక్క భాగమున పన్నెండు (12) గుణముల ప్రకారము మూడు భాగములలో (36) గుణములు గలవు. ఒక్క భాగమున ఆరు మంచి, ఆరు చెడు గుణములు మొత్తము పన్నెండు (12) గుణములు గలవు. దేవుడు బయట ప్రపంచములో అనేక రంగు వస్తువులను సృష్ఠించినట్లు, గుణచక్రములోని గుణములు కూడా అనేక వర్ణములుగా (రంగులుగా) తయారు చేశాడు. అందువలన ప్రథమ దైవ గ్రంథములో గుణ భాగములను గురించి చెప్పుచూ ఒక శ్లోకములో ''చాతుర్వర్ణము'' అను పదమును వాడాడు. 'వర్ణము' అనగా 'రంగు' అని తెలియగలిగితే బయట ఎన్నో రంగుల వస్తువులను తయారు చేసినట్లు శరీరములో దేవుడు 'ఎన్నో రంగులు' అను భావములు గల గుణములను తయారు చేశాడు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రంగు కలిగియున్నట్లు శరీరము లోని ఒక్కొక్క గుణము ఒక్కొక్క ప్రభావమును కల్గియున్నది. అందువలన గుణములను రంగులతో పోల్చి చెప్పారు. మనిషి తలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు చెడు గుణములు, అట్లే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అను ఆరు మంచి గుణములు గలవు. ఈ ఆరు + ఆరు = పన్నెండు ఒక్కొక్కటి ఒక్కొక్క భావమును, ప్రభావమును చూపుచున్నవి. అందువలన గుణములను పన్నెండు రంగులతో పోల్చి చెప్పారు. బుద్ధి యున్నవాడు బయట దేవుడు సృష్ఠించిన రంగులను బట్టి శరీరములోని గుణములను గ్రహించగలడు. అందువలన వాక్యములో 'గుణపాఠము గ్రహించేవారికోసము' అని కూడా చెప్పియున్నారు. ఆ మాటనుబట్టి బయటి రంగులనుబట్టి లోపల గుణములను తెలియవచ్చు నని సూచనగా తెలిపారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

76. దైవమార్గములో దౌర్జన్యానికి గురియై ఇల్లు వాకిలి వదలిపోయిన వారికి ప్రపంచములో ఉత్తమ నివాసము లభించగలదు. (16-41)

(16-41) ''దౌర్జన్యానికి గురియైన తర్వాత దైవమార్గములో ఇల్లు వాకిలి వదలి వలస పోయిన వారికి మేము ప్రపంచములోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకొంటే ఎంతో బాగుండును.''


ప్రపంచములో దైవమార్గము, మాయ మార్గము అని రెండు రకముల దారులు కలవు. మాయ మార్గము చాలా విశాలమైనది. అందులో ఎటువంటి ఆటంకము లేకుండా మార్గము సాగిపోవుచుండును. దైవ మార్గము చాలా ఇరుకైనదిగా యుండును. అందులో అనేక నష్టములు, అనేక కష్టములతో దారి సాగుచుండును. దైవమార్గములో ఇల్లు వాకిలి కూడా పోవచ్చును. అలాగే ఎంతో నష్టము కలుగవచ్చును. అయితే ఇవన్నీ దైవమార్గములో పోయే మనిషికి పరీక్షల్లాంటివి. ఈ పరీక్షలో నెగ్గినవానికి చాలా దైవికమైన లాభము కలుగబోవును. ఉదాహరణకు పొలములో ఎంతో ఖరీదైన విత్తనములను చల్లి నష్టపోవుచున్నాము. రైతుగా యున్నవారు అప్పులపాలై పంటను పెట్టుట చూస్తూనే యున్నాము కదా! అప్పటికీ రైతు నష్టము పొందినవానివలె గింజలను భూమిలో చల్లినా, విత్తనముల కొరకు అప్పులపాలైనా, తర్వాత కొంత కాలమునకు పంటపండి చల్లిన విత్తనములకంటే వందరెట్లు ఎక్కువగా గింజలు వచ్చును. కొంత కాలము శ్రమ అయినా పంట వచ్చిన తర్వాత రైతు సుఖమును పొందవచ్చును. అలాగే దైవమార్గములో నష్టపోయినవాడు చివరకు తన నివాసమైన ఇల్లు వాకిలిలాంటి శరీరమును పోగొట్టుకొన్నా అనగా దైవమార్గములో మరణించినా తర్వాత అతనికి దేవుని తీర్పులో విశేషమైన దైవిక లాభము కల్గును. తర్వాత జన్మలో మంచి ఆరోగ్యమైన శరీరమును దేవుడిచ్చును. ఇహములో కొంత తృప్తిగల జన్మవచ్చి ఆ జన్మలో జ్ఞాన సముపార్జన వలన పరము లభించును. అనగా మోక్షము లభించును. పరము అనునది ప్రపంచ లాభములకంటే, ప్రపంచ సుఖములకంటే ఎన్నోరెట్లు మేలయినది. మాయ మార్గముకంటే దేవుని మార్గము ఎంతో గొప్పదని తెలుసుకొంటే ఎంతో లాభము పొందగలడు. ఈ విషయము మనుషులు తెలియక మాయ మార్గములోనే పోవుచూ తాత్కాలిక సుఖముల కొరకు ప్రాకులాడుచున్నారు. అటువంటి వారు పై వాక్యమును చూచి అయినా బాగుపడగలరని దేవుడు ఈ వాక్యమును చెప్పాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

77. పైన ఆకాశము క్రింద భూమి ఉన్నాయి. అందులో నిదర్శనము కలదు. అలాగే పశువు కడుపులో పేడ, రక్తము మధ్యలో పాలున్నాయి. (16-65, 66)

(16-65,66) ''అల్లాహ్ ఆకాశము నుండి నీళ్లను కురిపించి దానిద్వారా ఎండిపోయిన భూమినుండి తిరిగి పంటను బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసము నిశ్చయముగా ఇందులో నిదర్శనము కలదు.'' (66) ''మీ కోసము పశువులలో కూడా ఒక గుణపాఠమున్నది. వాటి కడుపులోయున్న పేడకు, రక్తానికి మధ్యలో మంచి స్వచ్ఛమైన పాలను మీకు త్రాగిస్తున్నాడు. త్రాగే వారికి అది కమ్మగా ఉంటుంది.''


మనము పైన ఆకాశమును క్రింద భూమిని చూస్తున్నాము. పైన ఆకాశము ద్వారా వర్షము కురుస్తున్నది. వర్షము కురిసిన తర్వాత కొన్ని రోజులకు భూమిలో పంటపండి మనిషి చివరకు ధనవంతుడగుచున్నాడు. ఆకాశములో ధనములేదు, భూమిలో ధనములేదు. అయినా భూమి ఆకాశముల ద్వారా మనిషి ధన లాభమును పొందుచున్నాడు. అట్లే శరీరములో పైన ఆత్మ, ఆత్మ క్రింద శరీరము ఉన్నట్లు ఆవు కడుపులో ఒక ప్రక్క పేడ, మరొకప్రక్క రక్తము యున్నా ఆవు పాలను ఇస్తావున్నది. పాలను త్రాగి అందులోని కమ్మని రుచిని మనిషి పొందుచున్నాడు. ఆవు కడుపులో పనికిరాని పేడ, పనికిరాని రక్తమున్నట్లు మనిషిలో పైన కనిపించని ఆత్మ, క్రింద కనిపించని మాయ యున్నది. మాయ ఆవు కడుపులో పేడవలె యున్నా, ఆత్మ ఆవు జీవించుటకు ఆధారమైన రక్తమువలె యున్నా పేడ, రక్తము మధ్యలో పాలువచ్చినట్లు, మాయ, ఆత్మ మధ్యలో మనిషి శ్రద్ధనుబట్టి ముక్తి (పరలోకము) లభించుచున్నది. భూమి ఆకాశముల మధ్య లభించు దాన్యము వలన ధనము దొరికినట్లు, ఆవు కడుపులో పేడ రక్తము మధ్య లభించు పాలవలన కమ్మని రుచి లభించినట్లు, శరీరములో ఆత్మ, మాయ మధ్యలో లభించు జ్ఞానము వలన మోక్షము లేక ముక్తి లభించుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

78. పనికి రానివాడు, పనికి వచ్చువాడు ఇద్దరూ సమానమేనా? (16-75, 76)

అల్లాహ్ ఒక ఉపమానమును చెప్పి దానిని గమనించితే కొంత జ్ఞానము కల్గునని అదే పనిగా ఒక ఉదాహరణను ఇచ్చుచున్నాడు. అల్లాహ్ ఇచ్చిన ఉదాహరణలో ఏమి తెలియునో ప్రయత్నించి చూద్దాము. అయితే అల్లాహ్ చాలామందికి తెలియదనియే చెప్పుచున్నాడు. (16-75) ''అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇతరుల యాజమాన్యములో యున్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారమూ లేదు. కాగా మరోవ్యక్తి యున్నాడు అతనికి మేము మా వద్దనుండి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుండి అతను రహస్యము గానూ, బహిర్గతముగానూ ఖర్చుపెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలియదు. (16-76) అల్లాహ్ మరో ఇద్దరి వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు. వారిలో ఒకడు మూగవాడు, ఏదీ చేయలేడు. పైగా అతను తన యజమానికి భారముగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకరాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. అతను సన్మార్గమున ఉంటున్నాడు. వీరిద్దరూ ఒకటేనా?''


వీరి సంగతి తెలియాలంటే ముందు మనకు తెలిసిన విధానములో ఒక విషయమును చెప్పుకొందాము. మాయ ఆధీనములో గల ఒక మనిషి యున్నాడు. అతనికి స్వతంత్రత లేదు. ఏమి చేయాలన్నా తన యజమాని అనుమతి లేనిది చేయకూడదు. అతని బ్రతుకు బానిస బ్రతుకులాంటిది. ఏదయినా కావాలని అడిగే స్వతంత్రత కూడా అతనికి లేదు. శరీరములోని జీవుడు బానిస బ్రతకు బ్రతుకుచున్నాడు. అయితే అదే శరీరములోనే పూర్తి స్వతంత్రత కలిగి తన ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయుచూ బ్రతుకువాడు మరొకడున్నాడు. బానిస బ్రతుకు బ్రతుకువాడు జీవాత్మకాగా, రహస్యముగా, బహిర్గముతగా ఖర్చు చేయుచూ బ్రతుకుటకు కావలసిన ఉపాధి ఆయన పొంది యున్నాడు. తన యజమాని అయిన పరమాత్మ తనకు ఉపాధిని కల్పించగా, తనకున్న దానిలో తన ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయు ఆత్మ మరొకడు కలడు. జీవాత్మ యజమాని మాయకాగా, ఆత్మ యజమాని పరమాత్మ అయి ఉన్నది. వీరు ఇద్దరూ ఒకేచోట యున్నా అనగా ఒకే శరీరములో యున్నా ఒకడు బానిస, మరొకడు స్వతంత్రుడు. వీరు ఇదే రీతిలో ఉంటే ఎప్పటికీ సమానులు కాలేరు.


ఇంకొక ఉపమానములో ఒకడు మూగవాడు అతను ఏదీ చేయలేడు. పైగా అతని యజమానికి అతని వలన భారము (ఇబ్బంది) ఏర్పడుచున్నది. దీనిని గమనించితే ఒక జీవుడు కర్మను అనుభవించుచూ తాను బాధపడడమేకాక తన యజమాని అయిన ఆత్మను కూడా ఇబ్బంది పెట్టుచున్నాడు. అటువంటి జీవుని వలన ఆత్మ తన పనిని తాను చేయలేదు. ఇంకొక శరీరములో జీవుడు అన్ని విధములా బాగుండి దైవజ్ఞానము తెలిసి పూర్తి సన్మార్గములో యున్నాడు. ఈ విధముగా యున్న ఇద్దరు జీవుళ్లు ఎప్పటికీ సమానము కారని చెప్పవచ్చును. ఇక్కడ అల్లాహ్ రెండు ఉపమానములను చెప్పాడు. అందులో మొదటిది ఒకే శరీరములో యున్న జీవాత్మ, ఆత్మను గురించి చెప్పినది. దానికి జవాబు సమానులు కారని చెప్పాము. రెండవ ఉపమానము రెండు శరీరములలో యున్న ఇద్దరు జీవాత్మలను గురించి చెప్పిన విధానము కలదు. ఒకరు కర్మను అంగలోపముతో అనుభవించు జీవాత్మకాగా మరొకరు కర్మ అనుభవము లేని జ్ఞానిగా యున్నాడు. ఈ ఇద్దరు జీవుళ్లు కూడా సమానులు కారని చెప్పుచున్నాము. దేవుడు ఉపమానరీతిలో చెప్పినది జీవాత్మ, ఆత్మ విషయము. ఇంకా జీవాత్మ మరియు జీవాత్మ విషయమును గురించి చాలామంది వివరించి తెలుసుకోలేకపోతున్నారు. అందువలన ఈ రెండు ఉపమానముల జవాబు సమానము కాదని తెలిసినా, ఎట్లు సమానము కావను వివరము తెలియదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

79. ప్రళయము రెప్పపాటు కాలములో జరుగుతుంది. అల్లాహ్ అన్నిటికీ అధికారిగా యున్నాడు. (16-77)

(16-77) ''ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్‍కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారము రెప్పపాటు కాలములో లేదా అంతకన్నా తక్కువ సమయములోనే జరిగి పోతుంది. నిశ్చయముగా అల్లాహ్ అన్నిటిపై అధికారము గలవాడు.''


ఈ వాక్యములో అల్లాహ్ అను పదము వచ్చినది. ఇక్కడ ఏ అల్లాహ్ యొక్క విషయము గలదని ఒకమారు చూచుకొంటే ఇద్దరి అల్లాహ్‍లలో అందరికీ ఆరాధ్య దైవమయిన రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍ను గురించి చెప్పియున్నదని తెలియుచున్నది. అలాగే ఈ వాక్యములో ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమనగా! ఆకాశము అని ఒక ఆకాశమును చెప్పక ఆకాశములలోనూ అని బహువచనములో చెప్పియున్నారు. ఆకాశములు ఏడున్నాయనీ, ఆ ఏడు ఆకాశములు మనిషి శరీరములో సప్త నాడీకేంద్రములుగా యున్నవనీ, అందులో పెద్ద ఆకాశము మెదడుగా పైన గలదనీ, దాని తర్వాత ఆరు ఆకాశములు కలవని తెలియుచున్నది. అయితే నేటికాలములో మనుషులకు ఏడు ఆకాశముల విషయము ఏమాత్రమూ తెలియదు. ఏడు ఆకాశములు మన శరీరములో ఉన్నాయని తెలియనప్పుడు భూమి శరీరములో ఎలాగున్నది ఏమాత్రము తెలియదు. ఆకాశములు, భూమి రెండూ శరీరములో ఉన్నాయని తెలియనప్పుడు శరీరములోనే ప్రళయము జరుగునని ఏమాత్రము తెలియదు. భూప్రళయము అనగా భూమి ఆకాశములు అన్నీ లేకుండా పోవు ప్రళయము శరీరములోనే జరుగుననీ, అది సెకనులో పదవవంతు కాలములో జరుగునని చాలామందికి తెలియదు.


నేను గతములో చాలామార్లు ప్రళయము అంటే మనిషి శరీరము నాశనం అగుట అనగా మరణము పొందుట అనియూ, మరణము ఎవరికయినా ఒక సెకనులో పదవవంతు సమయములో సంభవించునని చెప్పాము. మరణమును గురించి చాలా విషయములు ''మరణ రహస్యము'' అను గ్రంథమందు మరియు ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథమందు వ్రాసియున్నాము. ఆకాశములోను భూమిలోను గల నిగూఢ విషయములు అల్లాహ్‍కు మాత్రమే తెలుసు అని వాక్యములో అన్నారు. ఆ మాట వాస్తవమే. ఎందుకనగా! శరీరమును తయారు చేసినది రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍యే. భూమి ఆకాశములలోని విషయాలు అనగా శరీర అంతర్గత విషయములని అర్థము. శరీరము బయటి విషయములు మనుషులకు తెలియును గానీ శరీరము లోపలి విషయములు అందరికీ తెలియవు. శరీర అంతర్గత విషయములు రహస్యములుగా యున్నవి చాలా గలవు. శరీరములో మనస్సు ఎలా ఉందో, అది ద్రవ పదార్థమో, ఘన పదార్థమో ఎవరికీ తెలియదు. ప్రతి దినము మనము చెప్పుకొను బుద్ధి విషయము, దాని ఆకారము రహస్యముగా యున్నదని చెప్పక తప్పదు. శరీరములో ముఖ్యముగా నివశించు జీవుడు లేక జీవాత్మ ఎలాగున్నది ఎవరికీ తెలియదు. ఈ విధముగా ఎంతో రహస్యమైన శరీర విషయములు ఏవీ మనుషులకు తెలియవు. శరీరములో జరిగే చావుకుగానీ, పుట్టుకు గానీ అట్లే శరీరములో గల సమస్తమునకు గానీ శరీరములోని ఆత్మ, పరమాత్మలను ఇద్దరు దేవుళ్లలో ఆత్మయను దేవుడే అధిపతిగా ఉన్నాడు. సమస్త శరీరములకు ఆత్మ అధిపతికాగా, పరమాత్మ బయట ప్రపంచములో అధిపతిగా ఉన్నాడు. పరమాత్మ అన్నిటినీ అనగా సర్వ ప్రపంచమును సృష్ఠించిన మొదటి సృష్ఠికర్తకాగా, ఆత్మ శరీరములను సృష్ఠించిన రెండవ సృష్ఠికర్తగా యున్నాడు. శరీరము, శరీరములను సృష్ఠించిన ఆత్మకు అధిపతి పరమాత్మే అయినా, శరీరము బాధ్యత అంతా ఆత్మకే పరమాత్మ అప్పజెప్పాడు. శరీరములో ఆత్మ తప్ప జీవాత్మ, బుద్ధి, చిత్తము, అహము ఎలాగున్నది చిత్రపటముగా గీచి చూపవచ్చును. ఇంతకుముందు మేము వ్రాసిన ''త్రైత సిద్ధాంత భగవద్గీత'' యను ప్రథమ దైవ గ్రంథమున జీవాత్మ, బుద్ధి, చిత్తము, అహము అను నలుగురి ఆకారములు చూపడము జరిగినది. అదే చిత్రమును క్రింద చూపుచున్నాము చూడండి.



జీవుని చిత్రము


ఈ చిత్రములో మనస్సు చిత్రము లేదు. జీవుడు శూన్యమైనవాడే అయినా ప్రకృతితో తయారయిన బుద్ధి, చిత్తము, అహము అను మిగతా మూడు జీవుని చుట్టూ ఆవహించి ఉండుట వలన అందులో మధ్యనగల శూన్యము కూడా ఆకారమునకు దొరికినది. మూడు పొరల మధ్యన గలవాడు జీవుడనీ, జీవునికి ఆనుకొని మొదటి పొరగా యున్నది బుద్ధియనీ, రెండవ పొరగాయున్నది చిత్తముయనీ, మూడవ పొరగాయున్నది అహము యనీ తెలియవలెను. శరీరములో అత్యంత రహస్యముగా యున్నది మనస్సు దానిని చిత్రీకరించి చూపుటకు సాధ్యపడదు. ఎందుకనగా! నిద్రలో ఒక ఆకారము, మెలకువలో మరొక ఆకారమును కల్గి రెండు అవస్థలలో అనగా నిద్ర, మెలుకువ అను రెండు స్థితులలో రెండు ఆకారములుగా మనస్సు కలదు. మెలుకువలో శరీరమంతా ఆత్మతో సమానముగా వ్యాపించియున్న మనస్సు, నిద్రలో ఒక్కచోట చేరి ఒక బిందువు ఆకృతిని పోలియుండి బ్రహ్మనాడిలో చేరిపోవుచున్నది. ముఖ్యమైన ఈ ఐదు జీవునితో సహా ఉన్నవి చాలా రహస్యములయినా మిగతా భాగములు కూడా ఎవరికీ తెలియనివిగా గోప్యముగా యున్నవని చెప్పవచ్చును.


మరణమును ప్రళయము అని దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చాలాచోట్ల చెప్పియున్నారు. ఎక్కడ చెప్పినా ప్రళయము శరీరము బయట జరగదనీ, శరీరములోనే ఉన్న వ్యవస్థలన్నీ పాడయిపోవడమే ప్రళయమనీ, ఇంకొక విధముగా చెప్పితే శరీరములోని వ్యవస్థలన్నీ పని చేయని స్థితి ఏర్పడడము ప్రళయము అనీ తెలియవలెను. ప్రళయమే మరణము మరణములోను, పుట్టుకలోను, శరీరము జీవించియున్నప్పుడు శరీర వ్యవస్థకు అంతటికీ ఆరాధ్యదైవమైన ఆత్మయే (అల్లాహ్) అధిపతిగా యున్నారు. శరీరమునకు ఆత్మ తప్ప వేరు అధికారి ఎవరూ లేరు. ఆత్మయే ఆరాధింపతగిన అల్లాహ్యని చెప్పబడుచున్నది. ఆత్మ అందరికీ అధికారి కావున అందరిలో ఆయనకు తెలియని రహస్యమంటూ ఏదీ లేదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

80. తల్లిగర్భములో శిశుశరీరమును పెంచి ప్రసవింపజేసినవాడు ఆత్మయే. (16-78)

(16-78) ''అల్లాహ్ మిమ్ములను మీ మాతృగర్భాలనుండి మీకే తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని అనుకొన్నాడు.''


దేవుడు ఎవరికీ అంతుబట్టనివాడు. అందువలన తెలుగు భాషలో దేవుడనీ, అల్లాహ్యని పిలువబడుచున్నాడు. చాలామంది అల్లాహ్యను పదము అరబ్బీ భాషలోనిదని అనుకోవచ్చును. అయితే అది తెలుగు పదమనీ, కృతయుగములోనే ఆ పేరున్నదని చాలామందికి తెలియదు. అంతులేనివాడు అల్లాహ్యనీ, దేవులాడబడేవాడు దేవుడనీ అర్థముతో కూడుకొన్న దేవుడు మానవ శరీరములో కార్యకర్తగా యున్నాడు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవు వరకు అన్ని పనులను ఆత్మే చేయుచున్నాడు. శరీర అవయవములందు ఆవహించియుండి, అవయవములలో చైతన్యశక్తిగా (కదిలే శక్తిగా) యుంటూ శరీరమును కదలించి, అన్ని అవయవముల ద్వారా పనిని చేయిస్తున్నాడు. అన్ని అవయవములలో తానుండి పని చేయుట చేత శరీర వ్యవస్థ అంతయూ పని చేయుచున్నది. శరీరములో ఎవరు పనిని చేయుచున్నది తెలియని మనిషి (జీవుడు) శరీరములో జరిగే పనులన్నిటినీ తానే చేయుచున్నానని భ్రమించుచున్నాడు. భ్రమ చేత తాను కార్యముల కర్తగా యున్నానని జీవుడు అనుకొనినా, నిజమైన కార్యకర్త అల్లాహ్‍యే. శరీరములో జీవాత్మ మొదటి ఆత్మగా ఉండగా, రెండవ ఆత్మగా అందరూ ఆరాధించు అల్లాహ్యున్నాడు. మూడవ ఆత్మయిన పరమాత్మ శరీరములో సాక్షిగా అన్నిటినీ చూస్తూ యున్నాడు. జీవాత్మ తాను చేయుచున్నానని భ్రమించు పనులన్నిటినీ ఆత్మ చేయుచున్నది. ఆ పద్ధతిలో కార్యకర్తగా యున్న ఆత్మ, స్త్రీ గర్భములో జరుగు కార్యములను కూడా చేయుచున్నాడు. స్త్రీ గర్భము ధరించిన మొదటి రోజు నుండి గర్భములో శిశువును పెంచుతూ వస్తున్నది శరీరములోని అల్లాహ్ అయిన రెండవ ఆత్మేనని తెలియవలెను. ఆత్మ శిశువు యొక్క తల మొదలుకొని కాళ్ల వరకూ అన్ని అవయములను క్రమబద్ధముగా గర్భములో పెంచుతూ యుండడమేకాక శిశువు యొక్క కార్యకర్తగా కూడా తయారగుచున్నాడు. తల్లిగర్భములోని శిశు శరీరములో ప్రాణము లేదు, జీవుడు కూడా లేడు.


తల్లి శరీరములోని ఆత్మే తల్లిని ప్రసవింపజేయుచున్నాడు. తల్లి శిశువును ప్రసవించినప్పుడు శిశువు మృతదేహమువలె యుండును. అంతవరకు శిశువుకు కూడా తల్లి శరీరములోని ఆత్మే సంరక్షణగా యున్నది. శిశు శరీరము ప్రసవింపబడు సమయములో గానీ, ప్రసవింపబడిన తర్వాత గానీ, ప్రసవింపబడిన కొంతసేపయిన తర్వాతగానీ ఆత్మ జీవునితో సహా వచ్చి శిశువులో చేరుచున్నది. అప్పటినుండి ఆత్మ శిశు శరీరములో కార్యకర్తగా ఉండిపోవుచున్నది. ఇన్ని పనులు చేసి తల్లి శరీరములో శిశు శరీరమును పెంచి, తర్వాత ప్రసవింపబడిన శరీరములో చేరి, జీవితమును సాగించుటకు చైతన్యముగా యున్న ఆత్మను (అల్లాహ్‍ను) ఎవరూ గుర్తించటము లేదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

81. దేవుడు తలచుకొంటే అందరినీ ఒకే సమాజముగా పుట్టించేవాడు. (16-93)

సమాజము అనగా గుంపుగా ఉండేవారని అర్థము. అయితే సమాజములు రెండు రకములుగా గలవు. ఒకటి బయటి సమాజము. రెండు లోపలి సమాజము అని అనవచ్చును. శరీరము బయట, శరీరము లోపల రెండు సమాజములు గలవు. శరీరము బయట మనుషుల గుంపులు, శరీరములోపల ఇంద్రియముల గుంపులు గలవు. ఇక్కడ దేవుడు సమాజము అను పదమును వాడాడు. అయితే ఏ సమాజమును గురించి ఆ మాట చెప్పాడో కొంత ఆలోచించి చూడవలసియున్నది. (16-93) వ వాక్యములో ఏమి చెప్పారో ముందు చూస్తాము.


(16-93) ''అల్లాహ్ గనుక తలచుకొంటే మీ అందరినీ ఒకే సమాజముగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గానికిలోను చేస్తాడు. తాను తలచిన వారికి సన్మార్గము చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నిటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు.''


ఇక్కడ బాగా గమనిస్తే మీ అందరినీ ఒకే సమాజముగా పుట్టించే వాడినని చెప్పలేదు. ఒకే సమాజముగా చేసి ఉండేవాడిని అని అన్నాడు. ఈ రెండు మాటలలో ఎంతో తేడా గలదు. ఒకే సమాజముగా పుట్టించే వాడయితే ఒక మతము గుంపులోనో, లేక ఒక కులము గుంపులోనో పుట్టించేవాడు. అప్పుడు అది బయట సమాజము అయిపోయేది. అట్లు బయట సమాజముగా అందరినీ దేవుడు చేయలేదు. అలా ఎప్పటికీ చేయడు. బయట సమాజము అంతా మనుషులు తయారు చేసుకొన్నదేగానీ, దేవుడు చేసినది కాదు. పుట్టిన మనుషులను ఒకే సమాజముగా దేవుడు తలచుకొంటే చేసేవాడు. అలా చేయుటకు మనిషి ఏ మతములో పుట్టినవాడయినా, వాడు మనుషులు ఏర్పరచుకొన్న ఏ సమాజములో ఉండినా ఆ సమాజము నుండి తీసి తాను ప్రత్యేకమైన సమాజముగా చేసేవాడినని దేవుడు చెప్పాడు. దేవుడు తలచుకొంటే ఎవడు ఏ సమాజములో ఉండినా అతడు దేవుడు నిర్మించిన సమాజములోనికి రావలసిందే యని తెలియుచున్నది. దేవుడు మనిషిని జ్ఞానిగా మార్చుతూపోగా, చివరికి మనుషులు జ్ఞానులుగా మారిపోయి జ్ఞానుల సమాజము ఏర్పడగలదు. అందులో బయట సమాజములోని వాడు ఎవడయినా మారిన మనిషిగా తయారయి ఉండును. దేవుని జ్ఞానము తెలిసినవారందరూ తమతమ కుల, మత భేదములను వదలి ఒకే సమాజముగా ఉందురు.


అయితే దేవుడు అలా మనుషులనందరినీ ఒకే సమాజముగా తయారు చేయగలిగే స్థోమతయున్నా అలా చేయలేదు. ఎందుకనగా! మనుషులు అనేక కర్మలతో కూడుకొన్నవారై, అనేక గుణములకు అలవాటు పడినవారై యుండుట చేత అందరినీ జ్ఞానమార్గములో పంపి జ్ఞాన సమాజముగా తయారు చేయలేదు. శరీరములో యున్న దేవుడు శరీరములో జీవుడు చేసుకొన్న కర్మ చిట్టాను చూచి వానిని నడుపుచుండును. అందులవన కర్మనుబట్టి వానికున్న జ్ఞానమునుబట్టి దేవుడు మనిషిని నడుపు చుండును. అందువలన వారి శ్రద్ధ, బుద్ధినిబట్టి, కర్మనుబట్టి మనిషిని అపమార్గములో (అజ్ఞాన మార్గములో) పంపగలడు. లేకపోతే సన్మార్గము (జ్ఞానమార్గము) లోనయినా పంపగలడు. మనిషి తన కర్మప్రకారము నడుచుకొనుచుండును. వాస్తవముగా ఆత్మే నడుపుచుండును. అయితే జీవుడు ఆత్మ చేసిన ప్రతి పనినీ తానే చేయుచున్నాడని అనుకోవడము వలన, జీవుడు ఆ పనిని చేసినట్లు బాధ్యత వహించడము వలన, ఆ పనిలోని పాపపుణ్యములను జీవుడు పొందుచున్నాడు. శరీరములో ఆత్మ అన్ని పనులు చేయుచుండినా జీవుడు నేను చేశానని అనవసరముగా అనుకొంటున్నాడు. అయినా ఏ పనిని అయినా దేవుడయిన ఆత్మ తప్ప మిగతావారు ఎవరూ చేయలేదు. అదే విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇలా చెప్పారు చూడండి.


(మత్తయి 10-20) ''మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాటాలాడు చున్నాడే గానీ, మాటలాడువారు మీరు కాదు.''


ఈ వాక్యమును బట్టి జరుగుచున్న కార్యములన్నీ ఏ మనిషీ చేయలేదని శరీరములోని దేవుడయిన ఆత్మే చేయుచున్నాడని తెలియుచున్నది. అయితే మనిషి ఆ విషయములో దేవున్ని మరచిపోయి నేనే చేస్తున్నానని అనుకొంటున్నాడు. అందువలన దేవుడు వారివారి కర్మనుబట్టి కొందరిని అజ్ఞానులుగానూ, కొందరిని జ్ఞానులుగాను చేయుచున్నాడు. ఒకే సమాజముగా చేయుటకు వీలుపడలేదు. దేవుడు చేసే ప్రతి పనిని జీవుడు నేను చేస్తున్నానని అనుకోవడము వలన వాడు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు వానినే బాధ్యున్ని చేసి శిక్షించవలసివచ్చినది. దేవుడు శరీరములలో కార్యములను చేయడమేకాక మనిషిని (జీవున్ని) శిక్షించడము మొదలగు పనులనూ చేయవలసియున్నది.





అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

82. అల్లాహ్ అమితముగా క్షమించేవాడు, అమితముగా శిక్షించేవాడని తెలియవలెను. (15-49, 50)

(15-49,50) ''ఓ ప్రవక్తా! నేను అమితముగా క్షమించేవాడిననీ, అపారముగా కరుణించేవాడిననీ, నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు''


శరీరములో అల్లాహ్ కార్యకర్తగా యుండి ప్రతి చిన్న పనినీ, అలాగే ప్రతి పెద్ద పనినీ చేయుచున్నాడు. దేవుడు శరీరములో కార్యకర్తగా పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక జరిగే పనులన్నిటికీ నేనే కర్తను అనుకోవడము వలన ఆ పనులను గురించి దేవుడు అంత్య దినమున అనగా ప్రళయము దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటున తాను చేశానని ఒప్పుకొన్న పనులన్నిటికీ తీర్పుతీర్చుచున్నాడు. ఆ తీర్పు ప్రకారము ఆత్మే జీవునికి అమితముగా శిక్ష వేయుచున్నాడు. శిక్ష వేయడమేకాక జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలను కూడా అమితముగా క్షమించుచున్నాడు. ఆత్మ క్షమించే పనిని, శిక్షించే పనిని చేయుచున్నాడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

83. మీ దగ్గరున్నదంతా నశించేదే. అల్లాహ్ దగ్గరున్నది మాత్రము మిగిలి ఉండేది. (16-96)

మనుషులు తమకు బుద్ధి వచ్చినప్పటినుండి ప్రపంచ ధనము మీద శ్రద్ధను పెంచుకొందురు. అప్పటినుండి ధనము, బంగారు, వాహనములను చరాస్థిని, ఇల్లు, భూములు అను స్థిరాస్థులను సంపాదించుకొని నాకు ఇంత ధనమున్నదని, నావద్ద ఇన్ని స్థిరాస్థులు ఉన్నాయని అనుకొను చుందురు. అయితే అవన్నీ లేకుండాపోయేవని వాక్యములో చెప్పుచున్నారు చూడండి.


(16-96) ''మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్ వద్ద యున్నదే మిగిలి యుండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకు గాను మంచి ప్రతిఫలితమును తప్పక ఇస్తాము.''


మనిషి సంపాదించు స్థిర చరాస్థులు నశించేవని వాక్యములో చెప్పడమేకాక అల్లాహ్వద్ద (దేవునివద్ద) యున్నవే మిగిలి ఉండేవని చెప్పారు. నాస్తి అంటే లేదని, ఆస్తి అంటే ఉన్నట్లు కనిపిస్తు భ్రమను కల్పించేదియని పెద్దలు చెప్పుచుందురు. ఆ మాటప్రకారము ఎంత ఆస్తియున్నా అది అప్పటికి కనిపిస్తావున్నా, ఉన్నదను భ్రమ మాత్రమే. తర్వాత అదయినా పోతుంది లేక వాడయినా దానిని వదలిపోతాడు. లేనివానికి ఎటూ లేదు కాబట్టి అది పోయేదీ లేదు, వీడు పోయేదీ లేదు. అందువలన వాక్యములో మీవద్ద యున్నదంతా నశించేదియని అన్నారు. అయితే అల్లావద్ద యుండేది మాత్రమే చివరకు నీ వద్ద మిగిలి యుండేది అని చెప్పుచూ, అల్లాహ్ వద్ద యుండేదే మిగిలియుంటుంది అని చెప్పారు. దేవుని వద్ద యుండేది జ్ఞానధనము. జ్ఞాన ధనమును ఎవ్వరూ లాగుకొనరు. మనమే ఎవరికయినా ఇచ్చినా ఎంత ఇస్తే అంతవరకు చేకూరి ఉంటుంది. అందువలన ఎందరికి ఇచ్చినా వెలితిపడునది కాదు. జ్ఞానధనము మనిషి చనిపోతే వానివెంట పోవునదిగా ఉండును. జ్ఞాన ధనమును కొంత సంపాదించుకొన్నవాడు ప్రపంచ ధనము మీద ద్యాసను వదలి పూర్తి ద్యాసను జ్ఞానధనము మీదనే కేంద్రీకరించును. అందువలన జ్ఞానధనము మనిషికి తొందరగా చేకూరగలదు. ప్రపంచ ధనము కర్మనుబట్టి వచ్చునది కావున మనిషి ఎంత ఆశపడినా, ద్యాసనంతా దాని మీదనే పెట్టుకొనినా అది చేకూరునను నమ్మకము లేదు. కర్మనుబట్టి రాబడియుండును కనుక వచ్చే కర్మయుంటే వస్తుంది. రాని కర్మయుంటే ఎంత ప్రయత్నించినను రాదు. అదే జ్ఞాన ధనమునకు ఎంత సదాచరణయుంటే అంత ఎక్కువగా అది సమకూరగలదని వాక్యములో చెప్పారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

84. విశ్వసించిన వారికి జ్ఞానము తెలియుటకు నీ ప్రభువు అల్లాహ్ వద్ద నుండి సత్యసమేతమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ (పరమాత్మ) పంపాడు. (16-102)

భూమిమీద బోధకులు అనేకులు గలరు. అట్లే బోధలు అనేకము గలవు. ఒక బోధకునికి మరొక బోధకునికి కొంచెమయినా వ్యత్యాసము కల్గిన బోధ ఉండును. ఇద్దరు ఒకే సిద్ధాంత బోధను చెప్పినా దానిలోనే ఎన్నో తేడాలతో చెప్పుచుందురు. మేథావులు అని చెప్పుకొను కొందరు మత పెద్దలు కూడా తమ మతమును ఉద్ధరించుటకు జ్ఞానమును మతములో కలిపి చెప్పుచుందురు. ఎక్కడయినా స్వచ్ఛమయిన దేవుని బోధ వుంది అనుటకు అవకాశమే లేదు. అలాంటప్పుడు దేవున్ని విశ్వసించిన వారికి సరైన బోధ దొరకదా?యను ప్రశ్నవస్తే 'దొరుకుతుంది' అను జవాబు వచ్చును. భూమిమీద అంతా కల్తీ బోధ అయినప్పుడు తన భక్తులకు దేవుడు (భగవంతుడు) వచ్చి సరియైన బోధను చెప్పునట్లు మూడవ ఆత్మయిన పరమాత్మ అనగా పరిశుద్ధాత్మ చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ నుండి వచ్చిన భగవంతుడు విశ్వాసులకు సరియైన బోధను అందించును. ఆ విషయమును అంతిమ దైవ గ్రంథములో సూరా 16, ఆయత్ 102 లో ఇలా చెప్పారు చూడండి.


(16-102) ఓ ప్రవక్తా! వారికి చెప్పు ''విశ్వసించిన వారికి నిలకడను ఒసగటానికి, ముస్లీమ్‍లకు సన్మార్గమును చూపడానికి, వారికి శుభవార్తను వినిపించటానికి, నీ ప్రభువు వద్దనుండి పరిశుద్ధాత్మ (జిబ్రయేల్) దీన్ని సత్యసమేతముగా అవతరింపజేశాడు.''


ఈ వాక్యములో పరిశుద్ధాత్మయన్నచోట బ్రాకెట్లో జిబ్రయేల్ అని వ్రాయడము జరిగినది. చాలా తెలుగు అనువాద గ్రంథములలో పరిశుద్ధాత్మయని వ్రాశారు. అయితే దాని ప్రక్కనే జిబ్రయేల్ అని వ్రాశారు. ఏదో ఒక గ్రంథములో పరిశుద్ధాత్మయని వ్రాసారు, ప్రక్కన ఏమీ పెట్టలేదు. మిగతా గ్రంథములన్నీ పరిశుద్ధాత్మయని వ్రాశారుగానీ దాని ప్రక్కనే జిబ్రయేల్ అని వ్రాయడము జరిగినది. పరిశుద్ధాత్మ అనగానే జిబ్రయేల్ మీదికి ద్యాస పోవడానికి కారణము పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఖచ్చితమైన వివరము తెలియనప్పుడు వారికి అందరికీ తెలిసిన పేరు మతికి వచ్చినది. వాక్యములో నీ ప్రభువు వద్దనుండి అనగా దేవుని వద్దనుండి అను అర్థము సరిపోతుంది. నీ ప్రభువు వద్దనుండి పరిశుద్ధాత్మ దీన్ని సత్యసమేతముగా పంపాడు లేక అవతరింపజేశాడు అని అన్నప్పుడు అవతరింపజేయువాడు దేవుడు కదాయను మాటను మరచిపోయారు. సత్యసమేతముగా పంపాడు అని ఉంది. పంపాడు అనినా అవతరింపజేశాడు అనినా ఒకే భావమే అయినా పంపువాడు, అవతరింపజేయువాడు దేవుడుకాగా, దానిని మోసుకొని వచ్చినవాడు జిబ్రయేల్ అనడములో తప్పులేదు. అట్లు కాకుండా అవతరింప జేసినవాడు జిబ్రయేల్ అనడము పూర్తి తప్పుగా యున్నది. 'నీ ప్రభువు (నీ దేవుడు) వద్దనుండి వచ్చినది' అన్నప్పుడు అందరికీ దేవుని వద్దనుండి వచ్చినది అని తెలిసిపోయినది. అయితే ఎవరు పంపారు అను విషయములో అందరూ పొరపడి పోయారు. అక్కడ వాక్యములో స్పష్టముగా పరిశుద్ధాత్మ యని గలదు. పరిశుద్ధాత్మయను పదమును మొట్టమొదట సృష్ఠిని తయారు చేసిన మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మకు ఆ పదమును వాడుదురు.


నేను ఇంతకుముందే చాలామార్లు చెప్పాను. భగవద్గీతలో ఆత్మ, పరమాత్మయని చెప్పబడిన దేవుళ్లు, బైబిలులో తండ్రి, పరిశుద్ధాత్మయని చెప్పారు. ఇలాగే ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరినీ అల్లాహ్యను ఒక పేరుతోనే పిలిచారు. అందులో ప్రజలకు దేవుడు ఆరాధ్య దైవము భగవద్గీతలో ఆత్మయని చెప్పబడినవాడు, బైబిలులో తండ్రియని చెప్పబడినవాడు, ఖుర్ఆన్‍లో అల్లాహ్ అని అంటున్నారు. ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లను మొదటి అల్లాహ్, రెండవ అల్లాహ్యని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ వాక్యములో నీ ప్రభువు అన్నచోట అల్లాహ్ అనుమాట సరిపోతుంది. పరిశుద్ధాత్మయనుచోట మొదటి అల్లాహ్‍ను గుర్తుచేసుకోవలసినది పోయి బోధను మోసుకొని వచ్చినవాడు, దేవుని చేత సృష్ఠింపబడినవాడు అయిన జిబ్రయేల్‍ను చెప్పడము పూర్తి పొరపాటగును. సత్యసమేతముగా జ్ఞానమును తన ప్రతినిధియైన భగవంతుని ద్వారా పరమాత్మయను పెద్ద దేవుడు పంపాడు అని అర్థము చేసుకోవలసియున్నది.


మనిషి తనకు దేవుని జ్ఞానము కావాలని కోరుకొన్నప్పుడు దేవుడు తప్పకుండా జ్ఞానమును కలుగజేయవలసి యున్నది. సత్యసమేతమైన జ్ఞానమును అందివ్వవలసి యున్నది. దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలసి యుండగా, మూడవ ఆత్మగా యున్న పరమాత్మ లేక పరిశుద్ధాత్మ తన జ్ఞానము పూర్తి తన ప్రతినిధి ద్వారా తెలుపును. పరమాత్మ ప్రతినిధిగా వచ్చినవాడు భగవంతుడు యనబడును. పరమాత్మ మారువేషమునే భగవంతుడు యని అనవచ్చును. శరీరములోని ఆత్మ (దేవుడు) కర్మనుబట్టి ప్రవర్తించుచూ, శ్రద్ధనుబట్టి జ్ఞానమును తెలుపవలసియుండును. కర్మ పరిమితినిబట్టి, మనిషి శ్రద్ధనుబట్టి జ్ఞానమును పరిమితిగా తెలుపవలసి యున్నది. అయితే భగవంతునికి అటువంటి నియమములు ఏవీ లేవు. భగవంతుడు సత్యసమేతమైన జ్ఞానమును తెలిపిపోగా అది దేశానికంతటికీ ఉత్తమోత్త జ్ఞానముగా ఉండును. మనిషి బుద్ధినిబట్టి యోచించగలిగి తనకు కావలసినంత జ్ఞానమును తెలియవచ్చును. బయట మనిషి కర్మనుబట్టి జ్ఞానముండదు. మనిషి శ్రద్ధనుబట్టి జ్ఞానము తెలియుచుండును. పరమాత్మ లేక పరిశుద్ధాత్మ పంపిన సత్యసమేతమైన జ్ఞానమును నీకు ప్రభువైన భగవంతుని నుండి వచ్చుచుండును. భూమిమీద భగవంతుడు ఉన్నప్పుడు ఆయనను గుర్తించగలిగితే సులభముగా మోక్షము లభించగలదు. అలా గుర్తించుటకు సాధ్యమయ్యే పనికాదు. అయితే ఆయన చెప్పు బోధలనుబట్టి, ఆయన తెలుపు ధర్మములనుబట్టి ఫలానావాడు భగవంతుడు అని గుర్తించుటకు వీలుగలదు. అయినా మాయా ప్రపంచములో భగవంతున్ని గుర్తించుటకు వీలుపడదు. అందువలన పరమాత్మను చెప్పవలసిన చోట మనిషివలెయున్న గ్రహమైన జిబ్రయేల్‍ను చెప్పారు.


దీనికంతటికీ కారణము దేవుడు భగవద్గీతలో చెప్పినట్లు, బైబిలులో చెప్పినట్లు, ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు దేవుళ్లకు వేరువేరు పేరు పెట్టకపోవడము వలన, ఇద్దరు దేవుళ్లను ఒకే పేరు అయిన అల్లాహ్యని పిలువడము వలన, వాక్యములో అల్లాహ్యని చెప్పిన చోటంతా ఒకే అల్లాహ్యని అందరూ అనుకొని పొరపడుట వలన ఇప్పుడు నీ ప్రభువు అయిన రెండవ ఆత్మయిన లేక భగవంతుడయిన దేవున్ని గుర్తించక, అట్లే పరిశుద్ధాత్మయని చెప్పినప్పుడు మూడవ ఆత్మయిన పెద్ద అల్లాహ్యని గుర్తించక అందరినీ ఒకటే అల్లాహ్యని లకూర గంపవలె చేసుకొని, ఇది ఫలానాదియని స్వచ్ఛముగా తెలియక పొరపాటు పడడము వలన మనిషికి ఆత్మ, పరమాత్మల జ్ఞానము, లేక తండ్రి, పరిశుద్ధాత్మల యొక్క జ్ఞానము, లేక అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క జ్ఞానము తెలియక అజ్ఞానములోనే కూరుకపోయాడు. మా యటువంటివారు ఇద్దరు దేవుళ్ల తారతమ్యమును చెప్పిన, మనిషి గ్రహించలేని స్థితిలో యున్నాడు. ఉన్నది ఒక దేవుడేయని మొండివాదన చేయుచున్నారు. ఆరాధ్య దైవము ప్రజల కందరికీ ఒక్కడేయను మాట వాస్తవమే అయినా, ఆయనను సృష్ఠించిన దేవుడు మరొకడున్నాడని చెప్పినా, దైవ గ్రంథములలోని మాటను కూడా వినడము లేదు. ముఖ్యముగా ముస్లీమ్‍లకు చెప్పడమేమనగా! ఈ వాక్యములో చెప్పిన 'నీ ప్రభువు దేవుడే', అట్లే 'పరిశుద్ధాత్మ దేవుడే'యని తెలియవలెను. జిబ్రయేల్‍కు పరిశుద్ధాత్మ యను పేరు వర్తించదు. జిబ్రయేల్ సాధారణ జీవాత్మయిన ఒక ఖగోళగ్రహము అని తెలియవలెను. ఆ గ్రహమును పూర్వము అందరూ సూర్యుడు అని అనెడివారు. సూర్యుని పేరునే ఖుర్ఆన్ గ్రంథములో జిబ్రయేల్ అన్నారు. ప్రథమ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్లను ఆత్మ, పరమాత్మ యని అన్నారు. ద్వితీయ దైవ గ్రంథములో ఇద్దరు దేవుళ్లను తండ్రి, పరిశుద్ధాత్మ యని అన్నారు. అంతిమ దైవ గ్రంథములో ఇద్దరినీ ఒకే పేరుతో పిలిచారు. ఇద్దరు దేవుళ్లను అల్లాహ్ మరియు అల్లాహ్ అని పిలువడము వలన ఎవరు ఏ దేవుడు అని తెలియక ఆరాధ్య దైవము ఒక్కడేయను మాట ఆధారముగా ఇద్దరు దేవుళ్లు లేరు, ఉన్నది ఒక్కడే దేవుడు ఆయనే అల్లాహ్ అంటున్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో పని చేయు అల్లాహ్ ఒకరు, పని చేయని అల్లాహ్ మరొకరు ఉన్నారని చెప్పినా, ఆ ఇద్దరి అల్లాహ్‍ల భేదమును తెలియక దేవుడు ఒక్కడేయని చెప్పుచూ, దేవునికి సంబంధించిన జ్ఞానములో పూర్తి వెనుకబడిపోయారు. మనిషి పూర్తిగా దేవునికి సంబంధించిన జ్ఞానము తెలియనంత వరకు పూర్తి జ్ఞాని కాలేడు. పరలోకమునకు పోలేడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

85. విశ్వసించిన తర్వాత ఎవరయితే అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ప్రకటిస్తారో వారికి పెద్ద శిక్ష గలదు. (16-106)

(16-106) ''ఎవరయితే విశ్వసించిన తర్వాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతారో, ఎవరయినా హృదయపూర్వకముగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రము వారిమీద దైవాగ్రహము పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష వుంది.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)


(16-106) ''ఎవడయితే విశ్వసించిన తర్వాత అల్లాహ్‍ను తిరస్కరిస్తాడో, ఎవడయితే హృయపూర్వకముగా సత్యతిరస్కారానికి పాల్పడుతాడో, అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహము (కోపము) విరుచుకు పడుతుంది. వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)


దేవున్ని విశ్వసించినవాడు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించవచ్చు గానీ, దేవున్ని తిరస్కరించలేడు. ఒకమారు దేవుని మీద విశ్వాసము పొందినవాడు ఏదయితే సత్యమైన జ్ఞానమున్నదో దానిని తిరస్కరించుటకు అవకాశము గలదు. ఎందుకనగా! దేవున్ని గురించి మాట్లాడు ప్రతివాడు దేవుని జ్ఞానమును ఒప్పుకోవడము లేదు. తాను దేవున్ని విశ్వసించినట్లే అసత్యమైన జ్ఞానమును విశ్వసించి, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు వ్యవహరించుచూ, సత్యసమేతమైన జ్ఞానమును తిరస్కరించుచూ, అది కాదు నేను చెప్పునదే సత్యము అని అనుచుందురు. అజ్ఞానియు కూడా దేవుడు ఉన్నాడని చెప్పుచున్నాడు. అయితే జ్ఞానులు చెప్పినట్లుగానీ, దేవుడు చెప్పినట్లుగానీ దేవున్ని గురించి ఒప్పుకోవడము లేదు. వారి అజ్ఞానము ప్రకారము ఎలా ఊహించుకొనివుంటే అలాగే ఉన్నాడని వాదించుచుందురు. ఉదాహరణకు దేవుడు ఒక్కడే ఉన్నాడనీ, దేవున్ని ఒక్కన్నే ఆరాధించవలెననీ చెప్పుచుందురు. అది వారికి తెలిసిన విధానము. అయితే వారికి తెలియని విధానము ప్రకారము, దేవుడు చెప్పిన సత్యసమేత జ్ఞానము ప్రకారము ఆరాధ్య దైవము ఒక్కడే అయినా, ఆరాధ్య దైవమును తయారు చేసిన దేవుడు, ఆరాధ్య దైవమునకు తండ్రియైన దేవుడు మరొకడున్నాడను సత్యమును పూర్తి తిరస్కరించుచుందురు.


మనిషికి తండ్రియైనవాడు దేవుడు. ఆయనే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడు. ఆరాధ్యదైవముగా, అందరికి తండ్రిగాయున్న దేవుడు ఉండడము వాస్తవమే. అయితే తండ్రియైన దేవునికి తండ్రియైన దేవుడు కూడా ఉన్నాడను సత్యమును వారు పూర్తి తిరస్కరించుచుందురు. తండ్రి, తండ్రికి తండ్రియైన పరిశుద్ధాత్మను గురించి దైవ గ్రంథములో సంపూర్ణ సమాచారమున్నా, దానిని ఏమాత్రము ఒప్పుకోక సత్యతిరస్కారమునకు పాల్పడుచుందురు. మనిషి 'దేవుడు లేడనుట' అజ్ఞానము కాదు. దేవుడు ఉన్నాడని చెప్పుచూ తన బుద్ధికి తోచినట్లు చెప్పు జ్ఞానమునుబట్టి మనిషిని అజ్ఞాని అని అంటున్నాము. ప్రతి మనిషి దేవుడున్నాడని అంటూనే సత్యసమేతమైన జ్ఞానమును ఒప్పుకోక తిరస్కరించుచూ, తనకు తెలిసిన జ్ఞానమే అందరూ సమ్మతించవలెనని అంటున్నాడు. అప్పుడు వాని హృదయ పూర్వకముగా వాడు సత్యమును తిరస్కరించినట్లగును. ప్రార్థనామందిరము లలో యున్న బోధకులు సహితము అల్లాహ్ ఒక్కడేయని చెప్పుచూ, తాను అనుకున్న అల్లాహ్కంటే పెద్ద అల్లాహ్ ఉన్నాడను మాటను తిరస్కరించు చున్నారు. అప్పుడు ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములలో చెప్పిన ఆత్మ, పరమాత్మలలో, మరియు తండ్రి, పరిశుద్ధాత్మలలో ఖుర్ఆన్‍లో చెప్పిన ఇద్దరు అల్లాహ్‍లలో ఒక్కరిని మాత్రము ఒప్పుకొని తమ జ్ఞానము ప్రకారము, తమకు తెలిసిన జ్ఞానము ప్రకారము దేవుడు ఒక్కడే ఇద్దరు లేరు అంటున్నారు. అప్పుడు మూడు దైవ గ్రంథములలో యున్న సత్యసమేతమైన జ్ఞానము ప్రకారమున్న పెద్ద దేవున్ని తిరస్కరించుచూ, ఆరాధ్య దైవమయిన చిన్న దేవున్ని మాత్రము ఒప్పుకొంటున్నారు. ఇదంతయూ గమనిస్తే బోధకులుగా యున్నవారు, దేవుడున్నాడనువారు తమకు తెలిసినదే జ్ఞానమనీ ఇతరులు చెప్పునది, దైవగ్రంథములలోనిది జ్ఞానము కాదను ధోరణిలో ఉండుట వలన వారు పూర్తి సత్యతిరస్కారులని చెప్పవచ్చును. అటువంటి వారిమీద దేవుని కోపము ఉండును. దేవుని కోపము వలన వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

86. వారు పరలోకముకన్నా ప్రాపంచిక విషయాన్నే ఎక్కువ ప్రేమించారు. అవిశ్వాసులకు అల్లాహ్ సన్మార్గము చూపడు. (16-107)

(16-107) ''ఎందుకంటే వారు పరలోకము కన్నా ప్రాపంచిక జీవితమునే ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయముగా అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గము చూపడు.''


ఈ వాక్యములో 'పరలోకము' అన్న పదము గలదు. పరలోకము అని చెప్పినమాటకు మోక్షము అని అర్థము. మనిషి ఇహలోకములో జన్మ తీసుకొని ఉండకుండా, పరలోకములో జనన మరణము లేకుండా ఉండ వచ్చును. పరలోకము అనగా ముక్తి, మోక్షము అని జన్మలు లేని స్థితియని చెప్పుట వాస్తవమైన విషయము. అయితే చాలామంది మనుషులకు పరలోకము అను జనన మరణ రహితమైన స్థితి ఒకటి కలదని వారికి తెలియదు. వారికి తెలిసినదంతా స్వర్గము. పరలోకము అంటే స్వర్గము అని అర్థము చేసుకొనువారు 90 శాతము ప్రజలు గలరు. చాలామంది దేవుని మీద విశ్వాసము ఉంటే దేవుడు తమను తీర్పుదినమున స్వర్గానికి పంపుతాడుయని నమ్ముచున్నారు. దేవుని విశ్వాసమునకు స్వర్గమునకు సంబంధము లేదని వారికి తెలియదు. అంతేకాక దేవుని మార్గములో దేవుని కొరకు పోట్లాడినా, యుద్ధము చేసినా, వారికి మరణము తర్వాత స్వర్గము వచ్చునని అనుకొని, దేవుని కొరకు పోరాడవలెనని తలచి, తమ మతము కాని వారందరూ దేవుని వ్యతిరేఖులని తలచి, ఇతర మతముల వారిని చంపడమే దేవుని మార్గములో పోరాడినట్లగునని, దానివలన చనిపోతే స్వర్గమునకు పోవచ్చునని, స్వర్గము కొరకు ఆశపడి ఉగ్రవాద చర్యలు చేయుచూ ఇతర మతస్థులను పీడించి వేధించువారు కూడా కలరు. వారి దృష్ఠిలో స్వర్గమును మించినది లేదని, అన్ని సుఖములు స్వర్గము ద్వారా లభించునని స్వర్గము కొరకు దుర్మార్గము చర్యలను కూడా మంచివేయని చేయుచున్నారు.


దేవుని విద్యను బ్రహ్మవిద్యయని అంటారు. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య యని అర్థము. పెద్ద విద్యయిన దేవుని విద్యలో స్వర్గము వేరు, పరలోకము వేరు. స్వర్గమునకు పరలోకమునకు తూర్పు పడమరకు వ్యత్యాసమున్నట్లు వ్యత్యాసము కలదు. మనిషి జీవితములో పాపమును సంపాదించుకొంటే తర్వాత జీవితములో పాపమునకు ఫలితముగా నరకమును అనుభవించవలసియుండును. అట్లుకాకుండా జీవితములో పుణ్యమును సంపాదించుకొంటే స్వర్గమును అనుభవించును. స్వర్గము అనగా సుఖములను అనుభవించుట, నరకము అనగా కష్టములను అనుభవించుట. మనిషి ఎక్కడ, ఎప్పుడు సుఖమును అనుభవించుచుండినా అక్కడ అప్పుడు అతను స్వర్గమును అనుభవించుచున్నాడని చెప్పవచ్చును. అట్లే మనిషి ఎప్పుడు ఎక్కడ దుఃఖమును అనుభవించుచుండినా అక్కడ అప్పుడు అతను నరకమును అనుభవించుచున్నాడని చెప్పవచ్చును. దీనినిబట్టి స్వర్గ, నరకములు ప్రత్యేకమయిన లోకములు కావుయనీ, భూమి మీదనే స్వర్గము, నరకము రెండూకలవని తెలియుచున్నది. స్వర్గములో సుఖములున్నవని గ్రంథములో వ్రాసియుండుట నిజమే. అయితే స్వర్గము భూమిమీద లేదని అక్కడ చెప్పలేదు కదా! స్వర్గమును 15 నిమిషములు అనుభవించిన మనిషి దాని తర్వాత నరకమును కూడా అదే స్థలములో అనుభవించవలసియుండును. 15 నిమిషముల స్వర్గము తర్వాత తేలుకుట్టి దాదాపు గంటసేపు నరకమును అనుభవింపవలసి యుండును. అప్పుడు స్వర్గము తర్వాత నరకము అనుభవానికి వచ్చినది. దీనినిబట్టి మనిషి నివశించు భూలోకములోనే స్వర్గము, నరకము రెండూ ఉన్నట్లు తెలియుచున్నది.


ఇక పరలోక విషయానికి వస్తే అది స్వర్గ నరకములవలె కనిపించునది కాదు. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టకుండాపోతే వాడు పరలోకమునకు పోయినట్లు చెప్పుచుందురు. పరలోకప్రాప్తి చెందాడు అంటే వాడు మోక్షమును పొందాడుయని అర్థము. లోకము అనగా మనిషి గుణములతో నివశించునది లేక అనుభవించునదియని అర్థము. దీని భావము ప్రకారము చనిపోయిన మనిషి గుణరహితునిగా తయారయితే వాడు లోకములో లేనట్లేయగును. మనుషులు నివశించుదానిని లోకము అని అంటున్నాము. ఈ లోకము అందరికీ తెలియునదిగా ఉన్నది. లోకముకంటే వేరయిన నివాసస్థలమును పరలోకము అని అనవచ్చును. లోకము కాని లోకము, లోకముకంటే వేరయిన లోకము పరలోకము. పరలోకము స్వర్గనరకములకు భిన్నమైనది. లోకముకంటే వేరయినది. చాలామందికి పరలోకము ఉన్నదను విషయమే తెలియదు. దేవున్ని ఆరాధిస్తే స్వర్గము వస్తుందనీ, ఆరాధించనివారికి నరకము వస్తుందనీ అంటున్నారు. అయితే దేవుని ఆరాధనకు స్వర్గమునకు ఏమాత్రమూ సంబంధము లేదు. మనిషి మంచి పనులు చేస్తే పుణ్యము వచ్చును. ఆ పుణ్యము వలన తర్వాత జన్మలో స్వర్గ సుఖములు లభ్యమగును. అంతేగానీ స్వర్గమునకు దేవుని ఆరాధనకు ఎంతమాత్రమూ సంబంధము లేదు.


నేడు మనిషి అయినవాడు ప్రాపంచిక సుఖముల కొరకే ప్రాకులాడు చున్నాడుగానీ, పరలోకము కొరకు ప్రయత్నించలేదు. అయితే దేవుడు అవిశ్వాస జనులకు స్వర్గ, నరకములను ఇస్తూ, పరలోకమునకు దూరము చేయుచున్నాడు. పరలోకము అనునది ఉందని కొందరికి చెప్పితే అది స్వర్గముకంటే చిన్నదనో లేక అది మనిషికి అవసరము లేదనో చెప్పు చుందురు. పరలోకము మీద విశ్వాసము లేనివారు దేవుని మీద విశ్వాసముంచినా, వానికి పరలోకము లభించదు. స్వర్గ నరకములను ఎంతకాలము అనుభవించినా చివరకు మనిషి దేవునియందు చేరి పరలోకమును పొందవలసినదే. పరలోకము మీద విశ్వాసము లేనివానికి దేవుడు పరలోకము అంటే ఏమిటో తెలియకుండా చేయును. దేవుడు అవిశ్వాసులకు దైవజ్ఞానమును ఇవ్వడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

87. దేవుడు వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్లపై ముద్ర వేశాడు. (16-108)

(16-108) ''వారి హృదయాలపై వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్ ముద్రవేశాడు. పరద్యానానికి గురయినవారంటే వీరే.''


మనిషికి చెవులు, కళ్లు బయట విషయములను తెలియజేయును. దేవుని ధర్మములు జ్ఞానబోధల రూపములో ఉండును. బోధకుడు లేక గురువు జ్ఞానబోధలను చెప్పితే కళ్లు బోధకున్ని చూస్తే, చెవులు బోధకుడు చెప్పు మాటలను వినగలుగును. కళ్లు, చెవులు పనిచేయగా బయట చెప్పు జ్ఞానము లోపలి బుద్ధికి చేరును. బుద్ధి జీవునితోపాటు బ్రహ్మనాడిని అంటుకొనియున్న గుణచక్రములో ఉండును. బ్రహ్మనాడిలోనే ఆత్మకూడా యుండును. హృదయము అను బ్రహ్మనాడిలో యున్న బుద్ధికి జ్ఞానము తెలియవలసియుండును. అయితే అవిశ్వాసులు దేవుడనే వానిని విశ్వసిస్తున్నాము అని దేవుని జ్ఞానమును విశ్వసించరు. అటువంటి వారికి గురువు జ్ఞానబోధ చెప్పినా, వారిలోనికి అది వినిపించినా బుద్ధి గ్రహించదు. దైవ గ్రంథములోని జ్ఞానమును సక్రమముగా గ్రహించక తమకు తెలిసినదే జ్ఞానమనుచూ దైవజ్ఞానమును తిరస్కరించువారికి దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినా ఆ బోధ వాడు వినడు, వినినా వాని బుద్ధి గ్రహించదు. అందువలన దేవుడు వాని కళ్లను, చెవులను మూసివేసి ఎవరూ తెరవని విధముగా అనగా ఎవరు చెప్పినా అర్థముకాని విధముగా ముద్రవేసి మూసివేశాడు. వాని హృదయము కూడా మూసివేయబడియుండుట చేత వాని బుద్ధికి జ్ఞానము ఏమాత్రమూ చేరదు. ప్రపంచ ద్యాసలో ఉన్నవారు వీరే యని చెప్పవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

88. ఆ రోజు ప్రతి ఒక్కడు తన ఆత్మరక్షణ కోసము వస్తాడు. అప్పుడు వారు చేసుకొన్న కర్మల ఫలితమును ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయము జరుగదు. (16-111)

(16-111) ''ఆ రోజు ప్రతి ఒక్కడు తన ఆత్మరక్షణ కోసము వాదు లాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ అతను చేసుకొన్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయము జరుగదు.''


ఈ ఆయత్‍లో 'ఆ రోజు' అని చెప్పాడు. అది ఏ రోజో ముందు తెలియగలిగితే తర్వాత తెలుసుకోవలసిన విషయము సులభముగా అర్థము కాగలదు. మనిషికి ముఖ్యమైనవి రెండు దినములు కలవు. ఆ రెండు దినములు చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా! జీవితము ప్రారంభమయ్యే దినము, అట్లే జీవితము అంత్యమయ్యే దినము. ఇవి ప్రతి మనిషికి రెండు దినములు ఉన్నట్లు తెలియుచున్నది. అయితే మా లెక్కలో రెండు దినములను కలిపి ఒక్క దినముగా చెప్పుచున్నాము. జీవితము ప్రారంభమయ్యే దినము మనిషి పుట్టిన దినము. మనిషి జీవితమునకు చివరి రోజు మరణ దినము. అయితే ఈ రెండు దినములు మనిషికి ఎంత ముఖ్యమైనవి అయినా మనిషి పుట్టిన రోజుగానీ, మనిషి చనిపోయిన రోజుగానీ ఎవరికీ జ్ఞాపకము ఉండదు. ఇది నా పుట్టిన రోజు అని ఈ రోజు చెప్పినా పుట్టినప్పుడు నీకుగానీ, ఎవరికిగానీ జ్ఞాపకము ఉండదు. అట్లే చనిపోయిన రోజు కూడా చనిపోయిన సమయములో ఎవరికీ జ్ఞాపకముండదు. అందువలన పుట్టుకలో గానీ, చావులోగానీ మనిషి అనుభవము ఎట్లున్నదీ ఎవరూ చెప్పలేరు. ఇంకా వివరముగా చెప్పితే పుట్టుకగానీ, చావుగానీ ఎవరి అనుభవములో లేదాయని ప్రశ్నించి చూస్తే అప్పుడు పుట్టిన సమయమును, చనిపోయిన సమయమును జీవుడు అనుభవించియుండును. అయితే అప్పటి అనుభవమును చెప్పుటకు ఆ రెండు సమయములు ఎవరికీ జ్ఞాపకముండవు, ఎందుకనగా! పుట్టిన సమయములో మనస్సు ఉండినా, అది జ్ఞాపకము పెట్టుకొని తర్వాత చెప్పేంత శక్తి దానికి లేదు. పుట్టిన శిశు శరీరములోని మనస్సు కూడా శిశు దశలోనే ఉండును. దానికి జ్ఞాపకము పెట్టుకొను స్థోమత లేనిదిగా ఉండును. అందువలన పుట్టిన దినముగానీ, పుట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరముల వరకుగానీ మనస్సుకు మననము చేయు శక్తి ఉండదు.


పుట్టుకలో మననము చేయు స్థోమత లేని మనస్సు మరణములో పూర్తిగా నాశనము చెందుచున్నది. అందువలన మరణము తర్వాత మరణములో ఏమి జరిగినది తెలియుటకు అవకాశము లేదు. జరిగిపోయిన విషయములను తెలియజేయు మనస్సు మరణములో లేకుండా నశించి పోవడము వలన మరణ సమయ అనుభవమును తెలియుటకు అవకాశమే లేదు. ఈ విధముగా పుట్టుకను గురించిగానీ, మరణమును గురించి గానీ ఏ మనిషి తెలియుటకు అవకాశము లేదు. అందువలన ఆ రోజు ఈ రోజు మనవెంట యున్న ఆత్మ తెలియజేస్తేనే అప్పటి విషయములు ఇప్పుడు తెలియగలవు. మరణ సమయములో ఒక సెకను కాలములో పదవవంతు కాలములోనే తర్వాత జన్మకు కావలసిన 'కర్మ నిర్ణయము' అను తీర్పును ఆత్మ తీర్చి రెండవ జన్మకు పంపుచున్నది. అంత తక్కువ కాలములో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవువరకు చేసిన పాపపుణ్యములన్నియూ లెక్కించి, తగిన విధముగా తీర్పు చేయబడును. మనకు తెలిసినంతవరకు ఒక సెకను కాలములో మరీ తక్కువ పదవవంతు కాలములోనే తీర్పులన్నియూ తీర్చబడును. అయితే మనకు తెలియని విషయము ఏమనగా!


మరణములో తీర్పు జరుగు కాలము జీవునికి ఒక దినమంతయూ జరిగినట్లు కనిపించుచుండును. మనకు బయట సెకను కాలము కూడా పట్టని కొద్ది సమయము లోపల జీవునికి ఎక్కువ సమయముగా (ఒక దినముగా) తీర్పు జరిగినట్లు తెలియుచుండును. అప్పుడు ప్రతి మనిషి చేసుకొన్న ప్రతి పాపము వానికి తెలియాలను ఉద్దేశ్యముతో దేవుడు అలా తెలియు అవకాశమును ఇచ్చాడు. అప్పుడు జీవుడు తన రక్షణకోసము అది తప్పుకాదు, ఇది పాపము కాదుయని తీర్పు చేయు ఆత్మతో (దేవునితో) అడుగుచుండును. అయినా అతనికి ఆత్మ ఏమీ జవాబు చెప్పక వాడు చేసుకొన్న కర్మల ఫలితము అంతా వానిని చూచుకోమని ఇవ్వబడుతుంది. కర్మల నిర్ణయములో ఎవరికీ ఎలాంటి అన్యాయము జరుగకుండా అన్నీ జీవునికి చూపి కర్మల ప్రకారమే నిర్ణయము చేయడము జరుగుతుంది. కర్మల నిర్ణయము చేయువాడు రెండవ ఆత్మయిన దేవుడు. మూడవ ఆత్మయిన దేవుడు ఏమీ చేయక అన్నీ చూస్తూయుండును. అందరికీ ఆరాధ్య దైవమయిన ఆత్మకు 'తీర్పు తీర్చు అధికారమును', 'మృతులను తిరిగి జన్మలకు పంపు అధికారమును' మూడవ ఆత్మయిన పరమాత్మ రెండవ ఆత్మయిన దేవునికి ఇచ్చియుండును. అందువలన పరమాత్మ సమక్షములో ఆత్మ ఎవరికీ అన్యాయము జరుగకుండా తీర్పును తీర్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

89. మనిషి యొక్క ఆహార విషయము. (16-114,115, 116)

(16-114, 115, 116) ''మీరు అల్లాహ్‍ను మాత్రమే ఆరాధించే వారయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండి. అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞత చూపండి.'' (115) ''నిశ్చయముగా ఆయన చచ్చిన పశువు, రక్తము, పందిమాంసము, అల్లాహ్ పేరుమీదకాక ఇతర దేవతల పేర్లు ఉచ్ఛరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరయినా ఇష్టముతో కాకుండా అల్లాహ్ చెప్పిన దానిని మితిమీరిపోయే ఉద్దేశ్యము లేకుండా, గత్యంతరము లేని పరిస్థితిలో తిన్నట్లయితే దానిని అల్లాహ్ క్షమిస్తాడు.'' (116) ''ఏ వస్తువయినా తమ నోటితో ఇది ధర్మసమ్మతమనీ, ఇది నిషిద్ధమనీ ఇష్టమొచ్చినట్లు అబద్దము చెప్పేసి, అల్లాహ్‍కు అబద్దాలు ఆపాదించకండి. అల్లాహ్‍కు అబద్దాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని (పర లోకమును) పొందలేరు.''


ఈ మూడు ఆయత్‍లలో (వాక్యములలో) చెప్పిన విషయమును చూచి అంతో ఇంతో జ్ఞానులు అయినవారు సహితము పొరపాటు పడే అవకాశము ఉన్నది. ఇంతవరకు ఈ వాక్యములను చదివినవారు అందరూ తప్పులో కాలువేసి, తప్పుగా అర్థము చేసుకోవడము జరుగుచున్నది. స్వయముగా దేవుడు చెప్పిన మాటలను తప్పుగా అర్థము చేసుకొని, అదే రీతిలో ఆహార నియమములు పాటిస్తున్నారు. దేవుడు చెప్పునది ఏదయినా ధర్మ సంబంధ జ్ఞానమునే చెప్పును తప్ప, ప్రపంచ సంబంధ పనులను గురించి చెప్పడు అను దేవుని ప్రథమ సూత్రమును ఎవరూ మరచిపోకూడదు. బాగా గమనించితే ఈ వాక్యములో మొదటనే 114వ వాక్యములో ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారమును గురించి ఆత్మయిన దేవుడు చెప్పియున్నాడు. తర్వాత 116వ వాక్యములో కూడా ఇది నిషిద్ధమనీ, ఇది ధర్మ సమ్మతమనీ మీ ఇష్టమొచ్చినట్లు మీరు నిర్ణయము చేసుకొన్న వాటిని నేను చెప్పానని, నా మీద ఆపాదించవద్దండి అనికూడా చెప్పాడు. 114లో ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండియని చెప్పాడుగానీ, ఇది ధర్మసమ్మతమైనదనీ, ఇది కాదనీ చెప్పలేదు. ఒకవేళ మీరు అట్లు దేవుడు చెప్పాడని చెప్పితే, అబద్దాలు దేవుని మీద ఆపాదించినట్లేయని కూడా చెప్పాడు. అటువంటప్పుడు ఎంతో జాగ్రత్తగా దేవుడు ఏమి చెప్పాడని చూడాలి తప్ప, మనుషులకు తోచినది ధర్మసమ్మతమని, ధర్మసమ్మతము కానిదని చెప్పకూడదు.


పూర్వము ఒక యోగి తన అనుభవ జ్ఞానమును పద్య రూపములో చెప్పాడు. ఆయన చెప్పినది విని ప్రజలు తాను ఆచరించినట్లే ఆచరించ వలెనను ఉద్దేశ్యముతో పద్యమును చెప్పాడు. ఈ పద్యము మా రచనలలోని ''నిగూఢ తత్త్వార్థ బోధిని'' అను గ్రంథములో గలదు.


పద్యము :- కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు

పందిని తిన్నవాడు పరమయోగి

ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో

విశ్వదాభిరామ వినురవేమా.


ఈ పద్యములో పైకి కనిపించు అర్థము ఒక విధముగాయున్నా, దానిలోపల నిగూఢముగా ఇమిడియున్న అర్థము మరొక విధముగా యున్నది. లోపల నిగూఢముగా యున్న అర్థము కొద్దిమందికి మాత్రమే తెలుసు, అయితే బయటికి కనిపించు అర్థము అందరికీ తెలుసు. లోపలి సూక్ష్మ అర్థము అందరికీ తెలియకూడదు, జ్ఞానము కోసము శ్రమించు వారికే తెలియాలను ఉద్దేశ్యముతో వేమనయోగి గారు తన జ్ఞానమునంతయూ నిగూఢముగా పద్యములలో ఇమిడ్చి చెప్పాడు. శ్రద్ధలేనివానికి జ్ఞానము తెలియకూడదని, శ్రద్ధయున్నవానికే జ్ఞానము తెలియునని చెప్పిన దేవుని వాక్యమును అనుసరించి, వేమన తాను ప్రజలకు చెప్పిన హితబోధ అయిన జ్ఞానమునంతటిని ఎవరికీ సులభముగా అర్థముకాని విధముగా, పైకి ఒక రకము, లోపల మరొక రకమైన అర్థము ఉండేటట్లు పద్యమును సమకూర్చాడు. వేమన చెప్పినది గొప్ప జ్ఞానమే అయినా అది బాహ్యార్థముగా ఒక రకముగా, అంతరార్థముగా మరొక రకముగా యుండును. ఆ విధముగా వ్రాయుట చాలా కష్టమైన పనియే అయినా, శ్రమించి అలా వ్రాశారు. శ్రద్ధయున్న వానికే జ్ఞానము తెలియవలెననీ, శ్రద్ధ లేనివారికి దేవుని జ్ఞానము లభించకూడదని, సులభముగా తెలియబడు జ్ఞానమునకు ప్రజలు విలువనివ్వరని, కష్టపడి యోచన చేయువారికే జ్ఞానము తెలియునట్లు ఆ విధముగా పద్యరూపములో వేమనయోగి చెప్పాడు. ఈ పద్యమును చదివిన కొందరు తమకు ఇష్టమొచ్చినట్లు ఊహించుకొని, పద్యములోని నిగూఢమైన భావమును వదలి, బయట భావమును తెలిసి అదే విధముగా ఇతరులకు చెప్పడము, వినకపోతే వారితో వాదించడము చేసెడివారు.


అటువంటి మనుషులు ముగ్గురు ఈ పద్యమును చూచి అందులో ఒకరు నేను గురువును కావాలనుకొన్నాడట. రెండవవాడు గొప్పయోగి కావాలనుకొన్నాడట, మూడవవాడు మంచి సుజ్ఞాని కావాలనుకొన్నాడట. ముగ్గురి ఉద్దేశ్యము మంచిదే. అయితే గురువు కావాలనుకొన్నవాడు కుక్క మాంసమును తినేదానికి మొదలుపెట్టాడు. అది చూచిన కొందరు అతనిని విమర్శించగా ఇది మహాయోగి అయిన వేమన యోగి చెప్పిన విధానము అని చెప్పాడట. అట్లే గొప్పయోగి కావాలనుకొన్న రెండవవాడు పంది మాంసమును తినేదానికి మొదలు పెట్టాడు. ఇక మూడవవాడు సుజ్ఞాని కావాలని ఏనుగు మాంసమును తినేదానికి మొదలు పెట్టాడు. ఎవరయినా అడిగితే దానికి వేమనయోగి చెప్పిన జ్ఞాన సూత్రమని చెప్పేవారు. ఇదంతయూ గమనించిన వేమనయోగి ఆత్మ, దేవుని ఆజ్ఞతో వచ్చి ఇంకొక మనిషిలో దూరి, ఆ ముగ్గురితో సంభాషించినాడట. ఆ సంభాషణ ఎలాగున్నదో మీరు జ్ఞానులగుటకు నేను కల్పించి వ్రాయునది చూడండి. వేమనయోగి పాత్రలో నేనే ప్రశ్నలను అడుగుచున్నానని తెలియండి. ఈ సంభాషణ తెలియగలిగితే ఖుర్ఆన్‍లో 16-114, 115, 116 ఆయత్‍లకు సులభముగా అర్థము తెలియును.


వేమన :- మీకు నా పద్యము తప్పుగా అర్థమయినదని అనుకొంటున్నాను.


ప్రజలు :- అట్లేమీ లేదు. మీరు ఎలా చెప్పారో అలాగే అర్థమయినది, అలాగే ఆచరించుచున్నాము.


వేమన :- నేను మనుషులకు దైవజ్ఞానమును నిగూఢముగా చెప్పాలను కొన్నాను, అలాగే చెప్పాను. అయితే మీరు ఇలా అర్థము చేసుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు.


ప్రజలు :-మీరు చెప్పిన దానికి విలువనిచ్చి మీరు చెప్పినట్లే చేయుచున్నాము కదా! ఇందులో మీరు ఊహించనిది ఏమి గలదు?


వేమన :- నేను దైవజ్ఞానమునే బోధించాను. ప్రపంచ జ్ఞానమును బోధించలేదు. దేవుని జ్ఞానమును దేవుడు చెప్పిన పద్ధతిలో చెప్పవలెనని, చెప్పవలసిన సత్యమును నిగూఢముగా చెప్పాను. దేవుని జ్ఞానము ప్రపంచ విషయములకు అతీతముగా ఉంటుంది. ప్రపంచ విషయములతో సంబంధము లేనిదిగా ఉంటుంది. దేవుడు చెప్పినా తన ధర్మములకు సంబంధించిన జ్ఞానమునే చెప్పునుగానీ, ప్రపంచ విషయములను చెప్పడు కదా! మీరు దేవుని విషయమనుకొని ప్రపంచ విషయమైన తిండి (ఆహార) విషయమును అర్థము చేసుకొన్నారు. అది తప్పు.


ప్రజలు :- మీరు చెప్పినదే మేము చేస్తున్నాము తప్ప వేరు చేయలేదు కదా! చెప్పేదంతా చెప్పి ఇప్పుడు మమ్ములను తప్పు అనడములో మీ ఉద్దేశ్యమేమో మాకు తెలియలేదు. మేము దేవుని మీద విశ్వాసముతో గురువు కావాలనుకొన్నాము, యోగి కావాలనుకొన్నాము మరియు సుజ్ఞానిగా మారాలనుకొన్నాము. మా ఉద్దేశ్యము తప్పా, మేము కోరుకొన్నది దైవికమయిన విధానమునే కదా! మాకు దేవుని మీద విశ్వాసమున్నది, కావున మాకు ఇష్టమున్నా లేకపోయినా మీరు చెప్పినవే కష్టపడి తింటున్నాము. నాకు కోడికూర అంటే ఇష్టము, అయినా కష్టపడి కుక్కకూర తింటున్నాను. అట్లే మిగతా ఇద్దరికి పొట్లికూర అంటే ఇష్టము అయినా మా ఇష్టములను ప్రక్కన పెట్టి మేము యోగులము, జ్ఞానులము కావాలని పందికూరను, ఏనుగుకూరను తింటున్నాము. ఇప్పుడు మమ్ములను చూచి ఓర్చుకోలేక మీరు అలా అంటున్నారు.


వేమన :-నేను చెప్పిన పద్యము సత్యమే. మీరు అర్థము చేసుకొన్న భావము అసత్యమైనది. నేను ఎప్పుడు చెప్పినా దైవ ధర్మమునే చెప్పుదును గానీ ప్రపంచ విషయమును చెప్పను. మీరు తినే ఆహార విషయములన్నీ ప్రపంచ సంబంధమైనవగును. దైవ ధర్మములతో స్థూల ఆహారము ఉండదు, సూక్ష్మ ఆహారముండును. నేను చెప్పినది ధర్మయుక్తమైన, పవిత్ర మైన ఆహారమును చెప్పానుగానీ, అధర్మయుక్తమైన ప్రపంచ ఆహారమును చెప్పలేదు. మీ ఇష్టమొచ్చిన దానిని మీరు ఆచరించుచూ, మీరు ఇదే చెప్పారని అబద్దమును నా మీద ఆరోపించవద్దండి.


ప్రజలు :- అయితే మీరు చెప్పిందే మేము చేస్తున్నామా? మీరు చెప్పనిది చేస్తున్నామా?


వేమన :-నేను చెప్పింది చేస్తున్నామని మీరు అనుకొంటున్నారు. అయితే మీరు అనుకొన్నది నేను చెప్పలేదు. దాని పోలిక చెప్పాను. కుక్క యొక్క పోలికను చెప్పానుగానీ, కుక్కను తినమని చెప్పలేదు. కుక్కను తిన్నవాడు గురువు అని అన్నాను. అది నా మాటలలో పోలికయే గానీ స్థూలముగా యున్న కుక్కను తినమని చెప్పలేదు. ఒకవేళ ఎవరయినా కుక్కను తిన్నా వానిలో గురువు లక్ష్యణములు రావు.


ప్రజలు :- మీరు చెప్పినది చేయాలని చేశాము, మీరు ఇప్పుడు అది పోలిక మాత్రమే వాస్తవము కాదు అని అంటున్నారు. ఇప్పుడు మేము ఏమి చేయాలి? దేశములో మేమే పొరపడినామా, మాలాగా ఇంకా ఎవరయినా పొరపడినారా?


వేమన :- మీలాగా పొరపడినవారు చాలామంది యున్నారు. వారి విషయములో నేను ఏమి చెప్పుచున్నానో మీరు సావధానముగా వింటే మీకు స్వచ్ఛమయిన జ్ఞానము, నిగూఢమైన జ్ఞానము తెలియగలదు. అందువలన శ్రద్ధగా వినండి. ఈ విషయమును ఈ గ్రంథ రచయిత చెప్పును చూడండి. ఈ విధముగా వారి సంభాషణ జరుగగా! ఈ గ్రంథములో ఏమి వ్రాయుచున్నారో యని వారు కూడా శ్రద్ధగా చూడను మొదలు పెట్టగా మేము ఈ విధముగా చెప్పుచున్నాము చూడండి.


పద్యము యొక్క భావము :- మన శరీరములో మనస్సు కుక్కవలె అతిచంచలమైనది. ఒక్క క్షణము కూడా స్థిరముగా ఉండక కుక్క ఇల్లిల్లూ తిరిగినట్లు మనస్సు కూడా అనేక విషయముల మీదికి చరించుచుండును. కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగా గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును 'కుక్కను తిన్నవాడు గురులింగడని' పోలికతో పై పద్యములో చెప్పారు.


మనస్సు చంచలమైనదియేకాక పరమ నీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును. అందువలన దీనిని పందితో సమానముగా పోల్చి దానిని జయించినచో పరమయోగి అని తెల్పుచూ 'పందిని తిన్నవాడు పరమ యోగి' అని వర్ణించారు.


మనస్సు చంచలమైనది, నీచమైనదియేకాక దృఢ (బల) మైనదిగా కూడా ఉన్నది. దానిని జయించవలయునని ప్రయత్నము చేసినవారికి సులభముగా లొంగదు. ఎంత బలముగా మనస్సును నిలుపవలయునని ప్రయత్నము చేసినా, అది బలమైనది కనుక నిలువక పోవుచునే ఉండును. ప్రయత్నమను పగ్గములకు నిలబడక మనలను సులభముగా లాగుకొని పోవు మనస్సు బలమైనదిగా వర్ణించుచూ దానిని ఏనుగుగా పోల్చి చెప్పినారు. అటువంటి బలమైన మనస్సును జయించినవాడు సుజ్ఞాని అని చెప్పుచూ 'ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో' అని పోల్చి అన్నారు.


మనస్సు చంచలమైనది కనుక కుక్కగను, నీచమైనది కనుక పందిగను, బలమైనది కనుక ఏనుగుగా వర్ణించి దానిని జయించుటను 'తిని లేకుండా చేయడమని' లెక్కించి చెప్పారు.


ఈ పద్య భావములో చెప్పినట్లే ఖుర్ఆన్ వాక్యములో కూడా చెప్పారు. వాక్యములో 'ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారము తినండి' అని ఉన్నది. దానికంటే ముందు 'మీరు అల్లాహ్‍ను మాత్రమే ఆరాధించే వారయితే' అని కూడా చెప్పియున్నారు. దేవున్ని ఒక్కనినే ఆరాధించే వారయితే కొంతవరకు దేవుని జ్ఞానమును తెలిసినవారై ఉంటారని చెప్పుకోవచ్చును. గ్రుడ్డిగా దేవుడు ఒక్కడేయనువారికంటే వివరమును తెలిసినవాడు దేవుడు ఒక్కడే యను విశ్వాసమును గట్టిగా కల్గి ఉండును. జ్ఞానరీత్యా ఈ వాక్యమును చెప్పుకొంటే దేవుడు ధర్మబద్దుడు, జ్ఞానశీలియని చెప్పవచ్చును. దేవుడు ధర్మములను జ్ఞానముతో బోధించుటకు వస్తాడు తప్ప ప్రపంచ విషయములను చెప్పుటకు రాడు. ప్రపంచ విషయములన్నీ ప్రకృతి సంబంధ విషయములగును. ప్రపంచములో నిద్ర, మెలుకువ, ఆహారము, మైథునము, కష్టసుఖముల అనుభవములు మొదలగునవన్నీ ప్రకృతి విషయములేగానీ పరమాత్మ జ్ఞాన విషయములు కావు. అంతేకాక ఆత్మ, పరమాత్మ విషయములు తప్ప మిగతా జీవుని అనుభవమునకు సంబంధ విషయము లన్నీ ప్రకృతికి సంబంధించినవే గానీ దేవునికి సంబంధించినవి కావు.


ప్రకృతి సంబంధ జీవుని అనుభవ విషయములన్నీ మరణ సమయములో కర్మనుబట్టి తీర్పు తీర్చియుండును. అందువలన జీవుని ప్రతి విషయము, ప్రతి అనుభవము ముందే అల్లాహ్ నిర్ణయింపబడిన కర్మప్రకారముండును. మనిషి ఏమి తినాలి? ఏమి త్రాగాలి, ఏమి మాట్లాడాలి, ఏమి చేయాలి, ఎప్పుడు ఎక్కడికి పోవాలి అను మొదలగు విషయములు అన్నియూ మరణ సమయములో ఆత్మ తీర్పు తీర్చి జన్మకు పంపియుండును. గత జన్మ మరణము ప్రస్తుత జన్మ జననము ఒక సెకనులో పదవవంతు కాలములో జరిగిపోయివుండును. మనిషి ఆరాధించు ఆరాధ్య దైవముయైన రెండవ ఆత్మగాయున్న అల్లాహ్ తీర్పు తీర్చి నిర్ణయించిన దానిప్రకారము మనిషికి ప్రతి ఒక్కటి లభ్యమగుచుండును. ఎప్పుడు ఏమి తినాలి, ఏమి ఆహారము దొరుకుతుంది అను విషయము దేవుడు ముందే నిర్ణయించి యుండుట వలన, మనిషి ప్రమేయము లేకుండా అవన్నీ కర్మ నిర్ణయము ప్రకారమే జరగుచుండును. ముందే నిర్ణయించబడిన కర్మ నిర్ణయము ప్రకారము రుచికరమైన ఆహారముగానీ, రుచికరము కానిదిగానీ, నీచమైనదిగానీ, మాంసాహారముగానీ, శాఖహారముగానీ లభించుచుండును. అంతేగానీ మనిషి అప్పటికప్పుడు తన నిర్ణయము ప్రకారము సంపాదించు కొన్నట్లు కనిపించినా, అదంతయూ ముందే దేవుని దర్శకత్వము చేత స్క్రీన్‍ప్లే (దృశ్య నిర్ణయము) చేయబడియుండును. అందువలన తప్పక ప్రతీదీ నిర్ణయము ప్రకారము జరుగుచుండును. అటువంటప్పుడు అన్నీ తెలిసిన దేవుడు, ఎవరికి ఏ ఆహారము అని ముందే నిర్ణయించిన దేవుడు, ఇది తిను ఇది తినవద్దు యనీ, ఇది నిషేధము అనీ నిషేధము కాదు అనీ ఎలా చెప్పును. మీరు కొంత యోచించండి. చట్టమును చేసిన రాజు తన చట్టమును అతిక్రమించమని ఇతరులకు చెప్పునా! అలా చెప్పాడు అంటే అది అర్థము లేని మాటయగును. దేవుడు ఎంతో విచక్షణశాలి, వివేకవంతుడు. వివేకవంతుడయిన దేవుడు మనిషి ఆహారమును ముందే నిర్ణయించిన దేవుడు, సమస్త జీవరాసుల జీవితములను క్షణ క్షణమూ తానే నడుపుచున్న దేవుడు మనిషి ఇష్టము ప్రకారము నడువమని చెప్పునా? చెప్పడు.


అందువలన దేవుడు మనిషి తిను ఆహారమును గురించి ఇది ధర్మసమ్మతము, ఇది పవిత్రము అని చెప్పాడు అని నేను కూడా ఒప్పుకొంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయ మేమనగా! దేవుడు చెప్పినది ఏ ఆహారమును గురించి అని ప్రశ్నించుకొని చూడవలసిన అవసరమున్నది. అలా ప్రశ్నించుకొని చూస్తే మనిషి తీసుకొను ఆహారములు రెండు రకములుగా యున్నవి. ఒకటి ముందే నిర్ణయించబడిన ప్రపంచ సంబంధ ఆహారము. అది అందరికీ తెలిసినదే, మనిషి కర్మ నిర్ణయము ప్రకారము శాఖాహారమునో, మాంసాహారమునో తీసుకోగలుగు చున్నాడు. దేవుడు దానినే ఇస్తున్నాడు. అయితే మనిషి కర్మ నిర్ణయమునకు సంబంధము లేనిది, మనిషి స్వయముగా కోరుకొని, తన శ్రద్ధ ప్రకారము, తన ఇష్టము ప్రకారము తీసుకొను ఆహారము గలదు. అది స్వయముగా మనిషి కోరుకొను దానినిబట్టి యుండును. మనిషి తీసుకొను ప్రపంచ సంబంధ ఆహారము అయిన శాఖాహారముగానీ, మాంసాహారముగానీ మనిషి కడుపు నిండినంతే కర్మ నిర్ణయము ప్రకారము తినవలసియుండును. కడుపు పరిమితి మించి తినలేరు. అయితే కర్మ నిర్ణయమునకు సంబంధము లేనిదయిన ఆహారమును మనిషి పరిమితి అనునది లేకుండా తన ఇష్టమొచ్చినంత తీసుకోవచ్చును. ప్రకృతి సంబంధముకాని 'పరమాత్మ జ్ఞానము' అను దానిని మనిషి ఎంతయినా పొందవచ్చును. జ్ఞాన సంబంధ ఆహారము ఇతరుల బోధవలన గానీ, దైవగ్రంథములలోని రచన వలనగానీ లభించుచుండును. దైవ జ్ఞానమును తృప్తిగా పొందవచ్చును. ఎవరికి ఎంత ఇష్టమున్నదో, ఎవరికి ఎంత శ్రద్ధయున్నదో అంత పొందవచ్చును. ప్రకృతి సంబంధము కాని జ్ఞానమును మనిషియొక్క రెండవ ఆహారముగా తెలిసిన దేవుడు అందులో సారాంశమైన మంచి సంతోషదాయకమైన జ్ఞానమును పొందమని మనుషులకు చెప్పాడు. మనిషి అనేకచోట్ల, అనేక బోధలు వినుచుండును. అందులో కొన్ని బోధలు ఎంతో గొప్పవిగా ఉండును. కొన్ని సర్వసాధారణ జ్ఞానమును ఇచ్చునవిగా ఉండును. అవి బోధించే వానినిబట్టి జ్ఞాన ఆహారమును నిర్ణయించవచ్చును. ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలులో దైవజ్ఞానమును 'జీవాహారము' అని కూడా చెప్పారు. శరీరమునకు ఆహారము ప్రపంచ సంబంధమైన ఆహారముకాగా, శరీర లోపలి జీవునికి ఆహారము పరమాత్మ సంబంధమైన జ్ఞానము అని తెలియవలెను.


జీవాహారమైన జ్ఞానమును కొన్నిచోట్ల వినేకొద్దీ లేక కొందరి గ్రంథములలో చదివేకొద్దీ జ్ఞానములో లభించే రుచినిబట్టి జీవుడు పొందే ఆనందమునకు కళ్లవెంట ఆనంద భాష్పములు వచ్చుచుండును. ఆనందము పట్టలేనంత రుచిని పొందు ఆహారమును మీరు తినవలెనని మా అభిలాష. అందువలన నేను మీకు రుచికరమైన జ్ఞానమును అందివ్వాలని ప్రయత్నమును చేయుచున్నాను. నాది చిన్న ప్రయత్నము కాగా దేవుడు మనకు అందరికీ బలమైన, రుచికరమైన ఆహారమును ఇవ్వాలని ఎల్లప్పుడూ కోరుకొంటున్నాడు. దానిలో భాగముగానే ఈ వాక్యములో 'ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండి' అని చెప్పాడు. తర్వాత 'చనిపోయిన జంతువులను, పశువులను తినవద్దండి' అని చెప్పాడు. అంతేకాక 'రక్తము, పందిమాంసమును తినవద్దని' చెప్పాడు. ఇంకా దేవుని (అల్లాహ్) పేరు మీద కాకుండా 'ఇతర దేవతల పేరుమీద ఉచ్ఛరించబడినవి' అని ప్రత్యేకముగా చెప్పి ఇవి మీకు నిషేధించాడు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్పిన విషయమును పైకి చూస్తే వాడు పెడదారి పట్టిపోవును. సక్రమముగా ఆలోచించి చూస్తే దేవుడు చెప్పిన గొప్ప సూచన అర్థము కాగలదు.


మనిషి వినే బోధను అనేక బోధకులు అనేక రకములుగా చెప్పుచుందురు. అందరిలో ఉత్తమమైన బోధలను కొందరు చెప్పుచుందురు. కొందరు జ్ఞానశక్తి తక్కువగా యున్న బోధలను చెప్పుచుందురు. కొందరు చెప్పు బోధలలో ఏమి సారాంశము లేనివై, ఆత్మ విషయములు లేనివై ఉండును. అందరూ చెప్పు బోధలు దేవున్ని గురించేననీ, దేవుని భక్తిని గురించేయని చెప్పుచుండినప్పటికీ అందులో ఆత్మ, పరమాత్మ సంబంధము లేనివయిన బోధలు, దేవుడుకాని దేవతల బోధలు చెప్పుచుందురు. మరి కొందరు అనవసరమైన ఆరాధనలు చేసి భూత ప్రేతములకు చెట్టు చేమలకు, పుట్టలకు, పురుగులకు మ్రొక్కమని కూడా చెప్పుచుందురు. మరికొందరు జంతు బలులను చేయిస్తూ, మాంసాహారమును పంచి పెట్టుచూ ఇదే నిజమైన పూజ, ఇదే నిజమైన భక్తియని కూడా చెప్పుచుందురు. ఇవన్నీ గమనించిన తర్వాత దేవుడు 16-115వ వాక్యములో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దేవుడు చెప్పిన వాక్యము మొదట అర్థము కాకపోయినా ఇప్పుడు బాగా అర్థమయినది, అది ఏమనగా!


దేవుడు చెప్పిన మాటలలో 'చచ్చిన పశువును తినవద్దని' చెప్పాడు కదా! దానిని గురించిన వివరము ఏమనగా! ఆత్మ ప్రతి శరీరములో కదలిక శక్తిగా (చైతన్య శక్తిగా) యుండి జీవరాసుల శరీరములను కదలించు చున్నది. ఆత్మ లేని శరీరము కదలదు, మెదలదు. అందులో జీవుడు ఉండడు. ఆత్మ ఉన్నచోట జీవాత్మ, జీవాత్మ ఉన్నచోట ఆత్మ ఉండడము సహజము. అందువలన జీవాత్మ, ఆత్మలను జోడు ఆత్మలని అంటాము. ఆత్మజ్ఞానము లేని ఏ బోధలయినా అవి చనిపోయిన పశువుల్లాంటివే. అందువలన 'ఆత్మజ్ఞానము లేని బోధలు వినవద్దని' తెలుపుచూ 'చచ్చిన జంతువులను రక్తమును తినవద్దు' అని అన్నారు. బయట చనిపోయిన జంతువులను పోల్చి జ్ఞానమును చెప్పారుగానీ, బయట చనిపోయినవి తినవద్దని అర్థము చేసుకోకూడదు. అలా అర్థము చేసుకొంటే దేవుని జ్ఞానము చట్టబద్దత, శాస్త్రబద్దత లేనిదియగును. ఎక్కడయినా బ్రతికిన జంతువును చంపిన తర్వాతనే దాని మాంసమును ఆహారముగా అందరూ తీసుకొంటున్నారు కదా! కోళ్లను చంపిన తర్వాత ఆహారముగా తీసుకోవడము జరుగుచున్నది కదా! అటువంటప్పుడు దేవుడు అలా ఎందుకు చెప్పును?


ఇంకా చెప్పిన విషయములలో పందిమాంసము నిషేధమని కూడా చెప్పారు. దీనినిబట్టి నీవు తెలుసుకొనే జ్ఞానము అపవిత్రముగా ఉండకూడదని చెప్పుచూ దాని పోలికగా పందిమాంసము అని అన్నారు. మనిషి వినే జ్ఞానము లేక చదివే జ్ఞానము జంతు బలులతో కూడుకొన్నదై, క్షుద్రదేవతల పూజలుగా ఉండకూడదు. క్షుద్రము అనగా నీచము అని అర్థము. అందువలన క్షుద్రమైన పూజలు, బలులతో కూడుకొన్న పూజలు, రక్తసిక్తమైన ఆరాధనలు మొదలగువాటిని పందిమాంసమంత నీచమైన వాటిగా పోలిక చెప్పారు. అంతేగాక దేవుడు కాదని, ఆత్మ పరమాత్మల సమాచారము ఏమాత్రము లేకుండా చేయు ఆరాధనలను ఇతర దేవతల పేర్లమీద చేయు పూజలని పోల్చి చెప్పారు. చనిపోయినది అనగా ఆత్మ జ్ఞానము లేనిది, నీచమైన ఆరాధనలను పందిమాంసముగా పోల్చి చెప్పారు. దేవుడయిన పరమాత్మ, ఆత్మ జ్ఞానము కాక, ఇతరత్రా దేవతల జ్ఞానమును కూడా నిషేధముగా ఇతర దేవతల పేర్లు ఉచ్ఛరించిన ఆహారమును తినకూడదని చెప్పారు. మనిషి శరీరమునకు ఆహారము నోటితో తినునవి, అలాగే మనిషిలోని జీవునికి ఆహారము బుద్ధితో గ్రహించునవి. ఈ విధమైన రెండు రకముల ఆహారములు ఉండుట వలన బయటి ఆహారమును పోల్చి రెండవ ఆహారమైన ధర్మసమ్మతమైన, పవిత్రమైన జ్ఞానమను ఆహారమును తీసుకోవలెనని, ధర్మసమ్మతముగాని పవిత్రత లేని వాటిని తినకూడదని బయట ఆహారముల పోలికను తెలియజేశారు. అయితే వాక్యములో చెప్పిన నిగూఢ విషయమైన జ్ఞానాహారమును వదలి అపవిత్రతతో కూడిన కర్మసంబంధమైన ఆహారమును తినకూడదని చెప్పుకోవడము పొరపాటు. నీవు తినకూడదు అనుకున్నా కర్మ నిర్ణయమైనప్పుడు తప్పక తినవలసి వచ్చును.


అలా నీచమైన పందిమాంసము మొదలగునవి ఇష్టము లేకున్నా తప్పని పరిస్థితిలో తిన్నా దేవుడు ఏమీ అనుకోడు అని వ్రాశారు. దానిని గురించిన నిగూఢ సమాచారము ఏమనగా! నీవు జ్ఞానివై ఇతర దేవతలను ఆరాధించనివాడవయినా పదిమంది అజ్ఞానులతో కలిసియున్నప్పుడు, వారితో పాటు గుడికి పోవలసివచ్చును. అట్లే గుడిలోని విగ్రహములకు మ్రొక్కవలసి వచ్చును. అప్పుడు అలా మ్రొక్కకపోతే ప్రక్కనయున్న వారందరికీ చెడుగా కనిపించును. అందువలన కొన్ని సమయములలో ఇష్టము లేకున్నా తప్పనిసరిగా ఇతర దేవతలను మ్రొక్కవలసివచ్చినా ఫరవాలేదు. అతడు జ్ఞాని అయినందున కొన్నిచోట్ల నటించినా ఫరవాలేదని దేవుడు చెప్పుచూ అలా అన్నాడు. ఈ మూడు వాక్యములు బయటి ఆహారమును గురించి చెప్పలేదు. లోపలి ఆహారమైన జీవాహారమును గురించి చెప్పినదని తెలియవలెను.


అయితే నేడు 16వ సూరాలో చెప్పిన 114, 115, 116 ఆయత్‍లను చదివినవారు మాకు దేవుడు వీటిని తినవద్దని, చచ్చిన పశువును, రక్తమును, పందిమాంసమును, ఇతర దేవతల పేరుమీద ఉచ్ఛరించిన ప్రసాదములను తినకుండా వదలివేశారు. బయట లభించు స్థూలమైన ఆహారములు ఏవయినా చచ్చినవయినా, బ్రతికినవయినా, ద్రవ పదార్థమయినా, ఘనపదార్థమైనా దేవుడు నిర్ణయించిన కర్మనుబట్టి లభించునవేగానీ, మనిషి ఇష్టము మీద ఆధారపడి లభించునవి కావు. ఏవయితే నిషేధ ఆహారమని అనుకొంటున్నారో వాటినే తిని బ్రతకవలసిన వారు చాలామంది కలరు. పశువులను, ఆవులను తినువారు వాటిని చంపిన తర్వాత, అవి చనిపోయిన తర్వాతనే తింటున్నారు. పశువులను దేవుని పేరు చెప్పి తినమని దైవగ్రంథములో చెప్పలేదు. చనిపోయిన వాటిని తినకూడదను మనిషి నిర్ణయము నిలబడుతుందను నమ్మకము లేదు. అయినా దేవుడు తన గ్రంథములో బయటి ఆహారములను గురించి చెప్పలేదు కదా! బాగా ఆలోచించుకొని చూడండి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

90. ప్రజలు హితము గ్రహించటానికి మేము ఖుర్ఆన్‍ను విడమరచి చెప్పాము. దాని మూలముగా వారు సత్యమునకు మరింత దూరమయినారు. (17-41)

(17-41) ''ప్రజలు హితవు గ్రహించటానికి గాను మేము ఈ ఖుర్ఆన్‍లో విషయమును పలు విధములుగా విడమరిచి చెప్పాము. కానీ దాని మూలముగా వారిలో సత్యముపట్ల దూరమే మరింత పెరుగుతోంది.''


అల్లాహ్ (దేవుడు) ప్రజలకు మంచి చేయాలను ఉద్దేశ్యముతో ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞాన విషయములను ఎన్నో రకముల విడమరచి చెప్పాడు. ఉదాహరణకు 16-114, 115, 116 వాక్యములను ఇంతకు ముందు గ్రహించాము కదా! అందులో మనుషులకు అర్థము కావాలను ఉద్దేశ్యముతో చచ్చిన పశువును, పంది మాంసమును సూచనగా చెప్పి ధర్మములేనివి, అపరిశుద్ధమైనవి తినకూడదని పోలికగా చెప్పాడు. ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమునే తినండి అని చెప్పాడు. అయితే మనిషి ధర్మసమ్మతమైన ఆహారము ఏదో, పరిశుద్ధమైన ఆహారము ఏదో తెలియక మరింత అజ్ఞానము వైపు పోయాడు. దేవుడు చెప్పినది జీవునకు ఆహారమైతే, మనుషులు శరీరమునకు అవసరమైన ఆహారమును ఎంచుకొన్నారు. ఈ విధముగా దేవుడు ప్రతి విషయమును వివరముగా ఎన్నో విధముల పోలికలతో పోల్చి చెప్పినా, దానిని గ్రహించుకోలేక సత్యమైన జ్ఞానమునకు శాస్త్రబద్దమైన జ్ఞానమునకు దూరమగుచున్నారు. ఆ విషయమును అల్లాహ్‍యే స్వయముగా తెలియజేసినా లెక్కచేయక, నేడు కొందరు ముస్లీమ్ పెద్దలు మేము ఖున్ఆన్ గ్రంథములో అక్షర అక్షరమునకు, పద పదమునకు జ్ఞానము తెలిసియున్నామని ఏకంగా మమ్ములను ఎదిరించి మాట్లాడుచూ, మేము గ్రంథములో వ్రాసిన జ్ఞానము సరికానిదని నిందారోపణ చేయుచున్నారు. అటువంటి నిందారోపణను నేను లెక్క చేయను. కనుక వారు అలా మాట్లాడిన తర్వాత కూడా నేను అంతిమ దైవ గ్రంథములోని ఆయత్‍లకు వివరమును ఇంకా విడమరచి వ్రాయుచున్నాను. అల్లాహ్‍యే నా చేత శాస్త్రబద్దమైన జ్ఞానమును వ్రాయించి నన్ను అజ్ఞానియని ఆరోపణలు చేసిన వారినే తప్పుదారిలో యున్నట్లు చూపించాడు. ఆహార నియమములను పాటించువారు సత్యమునకు దూరమైనవారిగా చూపించాడు. అంత్య కాలములో అల్లాహ్ తీర్చిన తీర్పు కాదని మీరు స్వతంత్రముగా ప్రవర్తించగలరా? మేము ఇది తింటాము, ఇది తినము అంటారా? అని అడుగుచున్నాడు. ఏదీ నీ స్వతంత్రతలో లేదని నీకు తెలియదా?యని అడుగుచున్నాడు. మీ ఇష్టమొచ్చినవి ధర్మసమ్మతమని అనుకొనుచూ, నేను చెప్పినట్లు నా మీద నిందవేస్తే అల్లాహ్ మీద అబద్దాలు ఆరోపించినట్లు కాదాయని అడుగుచున్నాడు. ఇదంతయూ గమనిస్తే దేవుడు ఎన్ని రకముల విడదీసి చెప్పినా, మనిషి దేవుడు చెప్పిన సత్యనమునకు దూరమగుచూ మాకు ఖుర్ఆన్‍లోని ప్రతీ పదమునకు జ్ఞానము తెలుసు అనడము సిగ్గచేటు కాదా!



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

91. సప్తాకాశాలు, భూమి వాటిలోయున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతనే కొనియాడుతున్నాయి. అయితే అది ఎవరికీ తెలియదు. (శరీరములోని ప్రతి భాగము దేవున్ని స్తోత్రము చేయుచున్నాయి. అయితే అది ఎవరికీ తెలియదు.) (17-44)

(17-44) ''సప్తాకాశములు, భూమి వాటిలో యున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతనే కొనియాడుచున్నాయి. ఆయన స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీలేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమా గుణము కలవాడు.''


ఈ వాక్యము చాలా నిగూఢమైనది. దీని భావము చాలా సూక్ష్మమైనది. అందువలన దేవుడే మీరు దానిని గ్రహించలేదుయని తేల్చి చెప్పాడు. అంత నిగూఢమైన విషయము ఏమున్నదని కొందరు అనుకోవచ్చును. పూర్వము పెద్దల నానుడిగా ఒక మాటను అనేవారు. ''గంటుముడి విప్పితే ధనము, విప్పకపోతే నిధనము'' అని అన్నారు. నిధనము అనగా ధనము లేదుయని అర్థము. ఈ విషయమును పూర్తి తెలియుటకు గంటు విషయమును ఒకమారు చెప్పుకోవలసినదే. పూర్వము ఒక భక్తుడు దేవున్ని ధనము కావాలని కోరిక కోరుచూ తపస్సు చేశాడట. కోర్కెలతో కూడుకొన్న ప్రార్థనను తపస్సుయని అంటారు. అప్పుడు అల్లాహ్ అతని మొర ఆలకించి ధనముగల ఒక మూటను అతనికి ఇచ్చి మూటకు గల ముడి విప్పుకొంటే ధనము లభించును, విప్పుకోకపోతే నిధనము అని అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు సంతోషపడి గంటును (మూటను) తీసుకొని దాని ముడి విప్పి, అందులోని ధనము తీసుకోవాలని అనుకొన్నాడట. అప్పుడు అతను విశ్వ ప్రయత్నము చేసి ఆ మూట ముడి విప్పాలని చూచాడు. అయితే ఆ మూట ముడిని విప్పేదానికి సాధ్యపడలేదు. మూటలో ధనమున్నట్లు తెలిసినా, ముడి విప్పకపోవడము వలన ధనము లభించలేదు. గంటు ముడి విప్పితే ధనము, విప్పకపోతే నిధనము అన్నట్లు అయినందున దేవుడు ధనము మూట ఇచ్చినా, ముడివేయబడిన మూట అయినందున ధనము లభించలేదని తలచి, మూటలోని ధనమును పొందుటకు ఆ మనిషి క్రొత్త ఆలోచన చేసి, తనకు తోచిన ఉపాయముతో కత్తిని ఉపయోగించి మూటను చించితే ముడి విప్పనవసరము లేకుండా ధనము లభించునని తలచి కత్తితో మూట క్రింది భాగమును చించాడట. అప్పుడు మూటలోనిది బయటపడినా అది ధనమువలె కనిపించక చెత్త కాగితములవలె కనిపించాయి. అప్పుడు దేవుడు చెత్త కాగితములను ఇచ్చి తనను మోసము చేశాడని అనుకొని, అదే విషయమునే దేవున్ని అడగదలచి తిరిగి తపస్సు చేశాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఎందుకు నన్ను గురించి తపస్సు చేశావని అడుగగా నా మూటలో చెత్తకాగితములు తప్ప ధనము లేదని చెప్పాడట. అప్పుడు దేవుడు ''నేను నీకు మూటను ఇచ్చి దాని ముడి విప్పుకొంటే ధనము దొరుకుతుంది లేకపోతే నిధనము అని చెప్పాను కదా! నీవు ముడి విప్పక చించి చూచావు. కావున అందులో నీకు ధనము కనిపించలేదు. నా మాట ప్రకారము చేసినప్పుడే ధనము లభించునుగానీ నీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ధనము లభించదు'' అని చెప్పాడు.


అదే విధముగా దేవుడు తన సూక్ష్మ జ్ఞానముతో చెప్పిన వాక్యములో ఎంతో గొప్ప జ్ఞానమున్నా దాని వివరమును విడమరచి తెలియకపోతే, వాక్యములో చెప్పిన జ్ఞానము ఏమిటో ఎవరికీ అర్థము కాదు. నేడు మేము బోధకులము అన్నవారికి సహితము దేవుని జ్ఞానము అర్థముకాకుండా పోయినది. అదే విషయమునే వాక్యములో ''మీరు వాటి స్థితిని గ్రహించలేరు'' అని అన్నాడు. వాస్తవముగా అల్లాహ్ తన ఆయత్‍లో చెప్పిన జ్ఞానమును మనిషి ముడివిప్పుకోలేని పరిస్థితిలో అర్థముకానివారై నిలచిపోయారు. అయినా తనకు తోచినది ఏదయితే, అదే జ్ఞానమనుకొంటున్నాడు. ముడి విప్పలేనప్పుడు దొరుకునది చెత్త కాగితములన్నట్లు మనిషికి దొరికినది అజ్ఞానమే అయినది. ఎంతకాలమునకు ముడివిప్పుకోలేని మనిషి మూటను ముడి విప్పు స్థోమత, యుక్తి, శక్తి గలవానివద్దకు తీసుకపోయి మూటను విప్పమని అడిగితే అతను గంటు యొక్క ముడిని విప్పి అందులోని ధనమును వెలికితీసి ఇవ్వగలడు. అయితే మనిషి గర్వముతో మూటను నేను విప్పగలనని భ్రమ చెంది, మెలుకువలో కాకుండా కలలో ముడి విప్పినట్లు ధనమును తీసుకొన్నట్లు అనుకొనినా, నిద్రలేచి చూచేటప్పటికి ధనము ఉండదు. అందువలన తమకు తాము జ్ఞానులము అని భ్రమించుట కంటే దేవుడే దిగివచ్చి తన జ్ఞానమును తాను చెప్పినట్లు, మనకు చేతకానప్పుడు దేవుడే వచ్చి తన మూటను తాను విప్పగలడు.


ఇప్పుడు దేవుడు తన గ్రంథములో జ్ఞానధనమున్న ఎన్నో మూటలను మనము అడుగకనే ఇచ్చాడు. నాకు తెలిసినంతవరకు ప్రథమ, ద్వితీయ దైవ గ్రంథములలో దేవుడు తన జ్ఞానమును బాహ్యముగా మూటగట్టకుండా ఇచ్చాడు. ఒక అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో మాత్రమ ఎక్కువ ముడి వేసిన మూటలు గల జ్ఞానమును ఇచ్చాడు. అయితే ఖుర్ఆన్ మాది అను ముస్లీమ్‍లు మూటల ముడులు విప్పుకోలేక అలాగే పెట్టుకొన్నారు. సూక్ష్మ వాక్యముల జోలికి పోకూడదు అను మాటను వారు ప్రచారము చేసుకొని ఇతరులను విప్పనివ్వరు, తాము విప్పరు. దైవ గ్రంథములోని మూటలను అలాగే యుంచుకొన్నారు. దైవ గ్రంథము ఏదయినా ఒక మతమునకు, ఒక సమాజమునకు ప్రత్యేకించి చెప్పినది కాదు. దైవ గ్రంథము ఏదయినా సర్వమానవాళికి సంబంధించినది, అది అందరి సొత్తు. గ్రంథము నుండి ఎవరు ఎంత జ్ఞాన ధనమునయినా గ్రహించుకోవచ్చును. ఇది నాది అనుటకు ఎవరికీ హక్కు లేదు. అందువలన అంతిమ దైవగ్రంథములోని జ్ఞాన మూటలను చాలా వాటిని తీసుకొని మూటల ముడి విప్పి పెట్టాను. మూటల ముడిని విప్పుటకు తగిన ఉపాయమును నా శరీరములో యున్న అల్లాహ్‍ను అడుగగా ఆయన నాకు జవాబుగా చెప్పిన ఉపాయము చేత మూటల ముడులను సులభముగా విప్పగలుగుచున్నాను. (2-186)వ ఆయత్‍లో దేవుడు ''మీకు నేను అత్యంత సమీపమున ఉన్నాను. మీరు అడిగే ప్రతి మాటకు జవాబు ఇస్తానని'' చెప్పాడు కదా! ఆ మాట ప్రకారము నాకు ఆయన (దేవుడు) జవాబు ఇచ్చిన దాని ప్రకారము ఇప్పుడు ప్రత్యేకమైన మూటవలె యున్న (17-44) వ ఆయత్ ముడులను విప్పుకొని చూద్దాము.


వాక్యములో ''సప్తాకాశములు, భూమి వాటిలోయున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడుచున్నాయి'' అని అన్నారు. ఏడు ఆకాశములు, భూమి అనునవి కనిపించు మానవ శరీరముగా యున్నాయి అని మనము ముందే చెప్పుకొన్నాము. శరీరములోపల కనిపించక ఎన్నో అవయవములు వాటి అనుబంధములు కలవు. అందువలన సప్తాకాశములు, భూమి మరియు వాటిలో యున్నవన్నీయని వాక్యములో చెప్పారు. ఈ విధముగా ఏడు ఆకాశములు, భూమియని చెప్పియున్న మొదటి ముడిని మనము దేవుడు ఇచ్చిన ఉపాయము చేత సులభముగా విప్పుకోగలిగాము. ఈ వాక్యము అను మూటకు గల మొదటి ముడిని విప్పగలిగినా రెండవ ముడి చాలా గట్టిగా, విప్పుటకు చాలా కష్టముగా యున్నది. అయినా ఆ ముడిని విప్పుటకు మన బుద్ధికి తెలియని దానివలన శరీరం లోపలగల నాకు అత్యంత సమీపమునగల దేవున్ని ఉపాయమడుగగా, ఆయన చెప్పిన జవాబు ప్రకారము కష్టమైన రెండవ ముడిని విప్పుకోగలుగుచున్నాము. అది ఎట్లనగా!


శరీరము లోపల కనిపించని అవయవ భాగములు పేర్లుగలవి మొత్తము పదిహేను (15) గలవు. ఆ పదిహేనుకు అనుబంధముగా శరీరమంతా వ్యాపించిన మూడు లక్షల యాభైవేల నాడులు, 25 లక్షల కోట్ల ధాతుకణములు గలవు. ఇవన్నీ దేవుని స్తోత్రమును చేస్తున్నాయి. ఆయన స్తోత్రమును చేస్తూ, ఆయన పవిత్రతను కొనియాడనిది ఏదీ లేదు. శరీరములో మనిషికి తెలియకుండానే దేవుని స్తోత్రము చేయడము దేవుని పవిత్రతను కొనియాడడము జరుగుచున్నది. అది ఎలా జరుగుచున్నదో రెండవ ముడిని విప్పితే తెలుస్తుంది చూడండి. శరీరము లోపల నాడులు లక్షల సంఖ్యలో, ధాతుకణములు కోట్ల సంఖ్యలో గలవు. అంతేకాక పదిహేను అవయవములు వాటికి అనుబంధముగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము అను మొదలగు అవయవములు దాదాపు (70) ఉన్నట్లు చెప్పవచ్చును. శరీరములోపల జీవుడు మినహయున్న 14 అవయవములకు ఒక్కొక్క దానికి ఐదు అనుబంధములున్నట్లు తెలియుచున్నది. దాని ప్రకారము 14I5=70 ప్రధాన, ఉప అవయవములు గలవు. ఇవన్నియూ సప్తాకాశములు, భూమి వాటిలోపల గలవు. లోపల డెబ్బయి (70) బయట పది (10) మొత్తము ఎనబైకాగా, వాటి మధ్యలో చిక్కుకొన్న జీవుడు ఒకడు గలడు. జీవునితో సహా శరీరమును లెక్కించితే (81) భాగములుగా యున్నది. ఈ 81 భాగములు కాకుండా శరీరములోనే ఆరాధ్య దైవమయిన అల్లాహ్ ఒకరు. ఆయనను సృష్ఠించిన సాక్షిభూతుడయిన అల్లాహ్ మరొకరు వేరుగా గలరు. వారు ఇరువురూ పవిత్రమైన దేవుళ్లు కావున వారిని శరీరము కంటే వేరుగా చూడాలి. ఈ విధముగా ఎనభై ఒక్క (81) భాగములుగా యున్న శరీరమును ఏడు ఆకాశములు, భూమి, వాటి మధ్యలోయున్న సమస్త వస్తువులు అని అంటున్నాము.


సజీవమైన శరీరములో ఆరాధ్య దైవమయిన రెండవ ఆత్మయిన అల్లాహ్ ఉండగా, ఆయనను మొత్తము శరీర భాగములుగా యున్న ఎనభై ఒక్క (81) భాగములు స్తోత్రము చేయుచున్నవి. అదే విషయమునే వాక్యములో చెప్పారు. వాక్యములో దేవుడే చెప్పినట్లు శరీరములో ఏమి జరుగుచున్నదో చూస్తాము. దేవుడు చెప్పిన మాట సత్యమని గ్రహిద్దాము. శరీరములో బయట కనిపించునవి మొత్తము పది భాగములు గలవు. అవి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములుగా గలవు. అట్లే శరీరములోపల కనిపించని ఐదు వాయువులు గలవు. అట్లే ఐదు జ్ఞానేంద్రియ శక్తులు గలవు. ఇంకా నాలుగు అంతఃకరణములు గలవు. వాటిని పేర్లతో సహా చెప్పుకొంటే ఇలా గలవు.

ఐదు జ్ఞానేంద్రియములు :- కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక


ఐదు కర్మేంద్రియములు :- కాళ్లు, చేతులు, నోరు, గుదము, గుహ్యము


ఐదు వాయువులు :- వ్యాన వాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణ వాయువు, అపాన వాయువు.


ఐదు ఇంద్రియ శక్తులు :- చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ


నాలుగు అంతఃకరణములు :- మనస్సు, బుద్ధి, చిత్తము, అహము


కర్మ ఆధీనములో, గుణముల మధ్యలో చిక్కుకొన్న వాడు :- జీవుడు


శరీరములో దేవుళ్లు ఇద్దరు :- ఆత్మ (ఆరాధ్య దైవము), పరమాత్మ (ఏ అక్కర లేనివాడు)


ఈ విధముగా యున్న శరీరము ఏడు ఆకాశములు ఒక భూమితో యుండగా వాటి మధ్యలో 81 భాగములు గలవు. అటువంటి శరీరములో ప్రాణవాయువు శరీరములోని ఊపిరితిత్తులనుండి ముక్కు బయటికి అడుగు దూరము వరకు వస్తూ లోపలికి పోవుచూ నిత్యము ఒక్క క్షణము కూడా ఊరక ఉండక చలించుచునే యున్నది. మనుషులు ఏ మతములోయున్నా ఏ ఆచారముల మధ్యలోయున్నా ప్రాణవాయువు శ్వాస రూపములో ఆడుచునే యున్నది. ముస్లీమ్ శరీరములో ఎట్లు శ్వాస చలించుచున్నదో అట్లే హిందువు శరీరములోనూ, మిగతా వారి శరీరములలోనూ ఆడుచున్నది. శరీరములో చైతన్యముగా రెండవ ఆత్మ యున్నది. ఆ రెండవ ఆత్మయే అందరూ ఆరాధింపతగిన అల్లాహ్గా యున్నాడు. అంతేకాక సూరా ఆరు, ఆయత్ 102 లో చెప్పినట్లు ''ఆయనే మీ ఆరాధ్య దైవము, ఆయనే మీ కార్యకర్తగా యున్నాడు'' అని కలదు. అందువలన శరీరములో సర్వ కార్యములను చేయుచున్న ఆత్మయే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నది. ఆత్మ శరీరము లోని ఊపిరితిత్తులను కదలించుచూ, శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస ఆడు విషయము అందరికీ తెలిసినదే. అయితే దానిని ఆడించువాడు రెండవ ఆత్మయని చాలామందికి తెలియదు.


ప్రతి మనిషి శరీరములోను శ్వాస ఆడుచున్నది. శ్వాస ముక్కు రంధ్రములలో పోవునప్పుడు రెండు రంధ్రముల ద్వారా పోవుచున్నది. లోపలికి పోయిన శ్వాస తిరిగి బయటికి వచ్చునప్పుడు ఒక రంధ్రము ద్వారా వచ్చి రెండుగా చీలి బయటికి వస్తున్నది. అందువలన శ్వాస లోపలికి పోవునప్పుడు ఒక శబ్దము, బయటికి వచ్చునప్పుడు మరొక శబ్దము కల్గి ముక్కు రంధ్రములలో చలించుచున్నది. లోపలికి పోవునప్పుడు ''సో'' అను శబ్దము కల్గి పోవునట్లు బాగా గమనించితే తెలియుచున్నది. అట్లే శ్వాస బయటికి వచ్చునప్పుడు గమనించితే ''హం'' అను శబ్దముతో వచ్చునట్లు తెలియుచున్నది. ఒకమారు శ్వాస శరీరము లోపలికి పోయి బయటికి వచ్చు లోపల ఏర్పడు రెండు శబ్దములను కలిపి చూస్తే ''సోహం'' అను శబ్దము ఏర్పడుచున్నది. కొందరికి అర్థమయినా అర్థము కాకపోయినా ఆడే శ్వాసలో ఏదో శబ్దమున్నట్లు అయినా తెలియగలదు. ఆ శబ్దము యొక్క అర్థము ఎల్లప్పుడూ ఉండునది లేక ఎల్లప్పుడు ఉండువాడని చెప్పవచ్చును. 'సో' అనగా ఎల్లప్పుడు, 'హం' అనగా ఉండువాడు అని చెప్పవచ్చును. ఎల్లప్పుడూ ఉండువాడు పరమాత్మయిన మొదటి దేవుడు. రెండవ ఆత్మను సృష్ఠించినవాడు సృష్ఠ్యాది నుండి యున్నవాడని చెప్పవచ్చును. శరీరములో కార్యకర్తగా అన్ని పనులు చేయుచున్న ఆత్మకు దేవుడు పరమాత్మ. అందరికీ ఆరాధ్యదైవము ఆత్మకాగా, ఆత్మకు ఆరాధ్య దైవము పరమాత్మ. అందువలన ద్వితీయ దైవ గ్రంథములో పరమాత్మను పరిశుద్ధాత్మయని చెప్పుచూ ఆత్మను పరిశుద్ధాత్మకు కుమారుడుగా చెప్పారు. ఈ విషయము యోహాన్ సువార్త ఐదవ అధ్యాయములో 21 నుండి 27వ వాక్యము వరకు ఈ విషయము గలదు.


శరీరములో ఆత్మ ఊపిరి తిత్తులను కదలించుచూ శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస ఒక్క క్షణము కూడా ఆగకుండా నిత్యము జరుగుచునే యున్నది. నిత్యము శ్వాస ఆడునప్పుడల్లా ప్రతి శ్వాసకు ''ఎల్లప్పుడూ ఉండువాడు'' అను శబ్దముతో ఆత్మ పరమాత్మను స్తోత్రము చేయుచున్నది. ప్రతి క్షణము ఆత్మ పరమాత్మను స్తోత్రము చేయడమును (17-44) వ వాక్యములో సప్తాకాశములు భూమి వాటిలో యున్న సమస్తమును పరమాత్మను 'ఎప్పటికీ ఉండువాడా' యని స్తోత్రము చేయుచున్నవి. శరీరములో యున్న అవయవములు కదలలేనివి. ఆత్మ వాటిని కదలించి పని చేయించుచున్నది. అట్లే శరీరములో శిరస్సునుండి మొదలయిన ఆత్మశక్తి చివరకు శ్వాసగా తయారయి, ఆ శబ్దములో పరమాత్మను స్తుతిస్తున్నది. శరీరమంతా ఆత్మయుండి నడుపుచున్నది. కావున సోహం శబ్దమునకు ఆత్మే కారణమయినందున ఆత్మే, పరమాత్మను నిత్య శ్వాసతో స్తోత్రము చేయుచున్నదని తెలియుచున్నది.


ఇట్లు స్తోత్రము చేయడమేకాక శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ పరమాత్మ పవిత్రతను పొగడుచున్నది. నిత్యము ఎల్లవేళలా ఆత్మ పరమాత్మను శ్వాసతో స్తోత్రము చేసినట్లు, ఒక్క సెకను కూడా ఆగకుండా దేవుని పవిత్రతను పొగడుచున్నది. దేవుని స్తోత్రము బయట శ్వాస ద్వారా జరుగుట వలన స్తోత్రము యొక్క శబ్దమును మనము వినగలుగుచున్నాము. నిశ్శబ్ద స్థలములో శ్వాస శబ్దము వినినట్లయితే ''సోహం'' అను శబ్దము తెలియుచున్నది. అదే ఆయన పవిత్రతను కొనియాడడము, శరీర ధాతువులలో జరుగుచుండుట వలన అది వినిపించదు. పరమాత్మ పవిత్రత యొక్క విషయమును గమనించి చూస్తే శరీరములోగల కోట్లకొలది ధాతు కణములలో జరుగు క్రియలో ఏర్పడు శబ్దము పరమాత్మను కొనియాడు శబ్దముగా యున్నది. శరీరములో ప్రతి ధాతుకణము ఒక సైనికుడుగా పని చేయుచున్నది. పరమాత్మశక్తి జ్ఞానశక్తియనీ, జ్ఞానాగ్నియని చెప్పవచ్చును. శరీరములోని ఒక ధాతుకణమును పరిశీలించి చూస్తే అక్కడ నిత్యము మండుచుండును. ఆ మంట ఎప్పటికీ ఆరిపోవునది కాదు. చిన్నగనో పెద్దగనో ఎల్లప్పుడూ మండుచుండును. శరీరములోని ధాతుకణములన్ని మండుచుండుట వలన శరీరము ఎల్లప్పుడూ ఒకేరకమైన వేడి కల్గి యుంటుంది. ధాతుకణములో మంట మండుటకు శ్వాసలోని ప్రాణ వాయువు (ఆక్సిజన్), ఆహారములోని పిండి పదార్థములు ఉపయోగ పడుచున్నవి. ఎలాగయితేనేమి ధాతుకణములు ఎల్లప్పుడూ మండుచున్నవి. మండేమంట కొంత శబ్దమును చేయుచూ మండుచున్నది. శరీరములోని ధాతుకణములో మండే మంటయొక్క శబ్దము బయటికి వినిపించనిదై యున్నది. ఆ వినిపించని శబ్దమే దేవుని పవిత్రతను పొగిడినట్లు కలదు.


మండే మంట ఎక్కడయినా కొంత శబ్దము చేయుచూ మండు చుండును. శరీరములో శరీరమంతా మండే అగ్నిని పరమాత్మ యొక్క అగ్ని అనవచ్చును. దానిని మండించువాడు ఆత్మ. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవువరకు ఒక్కక్షణము కూడా ఆరిపోకుండా మండుచూ కొంత శబ్దము చేయుచుండుట వలన శరీరములో నిత్యమూ ఎల్లవేళలా పరమాత్మ పవిత్ర అగ్నిని, ఆత్మ ఆహారమును గాలితో మండించుచూ ఆయన పవిత్రతను ఎల్లప్పుడూ కొనియాడుచున్నది. ప్రపంచములోని మనుషులంతా ఆత్మను ఆరాధ్య దైవముగా ఎంచుకొని ఆరాధించుచుండగా, ఆత్మ శరీరము లోపల పరమాత్మను శ్వాస ద్వారా, ధాతుకణముల ద్వారా ఆరాధించుచున్నది. పరమాత్మ, ఆత్మే మీ ఆరాధ్యదైవమని అందరికీ చెప్పి, ఆత్మను మనుషుల చేత ఆరాధింపజేయుచుండగా, ఆత్మ మాత్రము ఎవరికీ తెలియకుండా తాను పరమాత్మను శరీరములోనే ఆరాధించుచున్నది. పరమాత్మ ఆరాధనకు అతీతముగా యున్నా శరీరములో తనను సృష్ఠించిన పరమాత్మను, ఆత్మ స్తోత్రము చేయుచున్నది. ఆయన పవిత్రతను పొగడుచున్నది.


శరీరములో జీవుడు (జీవాత్మ) కర్మలను అనుభవించేది తప్ప ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. శరీరములోని జీవాత్మను కర్మలకు అనుగుణముగా నడుపుచూ బాధలను, సుఖములను అనుభవింపజేయుచూ, ఎల్లప్పుడూ శరీరములో కార్యకర్తగా ఆత్మ పనిని చేయుచూ, మరొకవైపు తనకంటే పెద్దయిన పరమాత్మను రెండురకముల ఆరాధించుచున్నది. జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మను కాల్చు జ్ఞానాగ్నిని జీవునికి ఆత్మ ద్వారా పరమాత్మ ఇచ్చుచున్నది. అందువలన జీవునికి దేవుడయిన పరమాత్మకు మధ్యవర్తిగా ఆత్మకలదని తెలియుచున్నది. పరమాత్మ జీవుల కర్మలను లేకుండా చేయు జ్ఞానాగ్ని అను శక్తి కలవాడు. అందువలన ఆయనను 'క్షమాశీలుడు, సహనశీలుడు' అని అంటారు. ఖుర్ఆన్‍లో అల్ ఫాతిహా అను మొదటి సూరాలో గల మొదటి మూడు వాక్యములను పరమాత్మయిన మూడవ ఆత్మకు సంబంధించినవిగా గలవు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

92. వారు మేల్కొని ఉన్నారని అనుకున్నావు. వారు మేల్కొని లేరు. వారి గుహ ద్వారము దగ్గర కుక్క ఒకటి గలదు. (18-18)

(18-18) ''వారు మేల్కొని ఉన్నారని నీవు భావిస్తావు. కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకొనేలా చేస్తూయున్నాము. వారి కుక్క కూడా గుహ ముఖ ద్వారము వద్ద తన ముందు కాళ్లను చాపి కూర్చొని ఉంది. ఒకవేళ నీవు వారిని తొంగిచూస్తే వెను తిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యము నిన్ను భయకంపితున్ని చేస్తుంది.''


ఈ వాక్యము కూడా సూక్ష్మభావముగల వాక్యమేయని చెప్పవచ్చును. మాకు ఇది సులభముగా యున్నా మిగతవారు ఎటు చూచినా అర్థము కాని వాక్యముగా యున్నది. గుహ ఏమిటో, గుహ ద్వారమువద్ద కుక్క ఏమిటో తెలియకున్నదని అంటారు. వాస్తవముగా ఇది అర్థముకాని విధముగాయున్నా నాకు అర్థమయిన విధముగా తెలిపెదను. నేను చెప్పిన దానిని మీరు గ్రహించుకోగలరని అనుకొంటున్నాను. పై వాక్యమును బాగా ఆలోచించి చూచిన కొందరు గుంపుగల గుహలో వారు మేల్కొని ఉన్నారని భావించినా వారు నిద్రపోతూ ఉంటారని చెప్పాడు. వారిని త్రిప్పి పడుకోబెట్టేది నేనేయని దేవుడు చెప్పుచున్నాడు. అంతేకాక గుహ ముఖ ద్వారము వద్దనే వారి కుక్క తన ముందరి కాళ్లను చాపి కూర్చొని ఉంది అన్నారు. ఒకవేళ పొరపాటుగా లోపలి వాళ్లను తొంగిచూస్తే వారి గాంభీర్యమునకు వెను తిరిగి పారిపోతావు అని ఉంది. దీనిని అంతటినీ గమనిస్తే శరీరము ఒక గుహలాగా ఉన్నదని అర్థమగుచున్నది. శరీరములో మొత్తము 25 మంది గలరు. వారు నిద్రపోతూ ఉన్నప్పుడు అనగా శరీరము నిద్రపోయేటప్పుడు శరీరమును లోపల యున్న ఆత్మే కుడి ప్రక్కగానీ, ఎడమ ప్రక్కగానీ, ఒత్తిగిలి గానీ త్రిప్పి పడుకోబెడుతున్నది. నిద్రలో మనిషికి మూడు ప్రక్కలా తనకు తెలియకుండానే పొర్లుతున్నాడు. అనగా శరీరములోని ఆత్మయిన దేవుడు మనిషిని త్రిప్పి పడుకోబెడుతున్నాడు.


మనిషి శరీరము నిద్రలోయున్నప్పుడు లోపలయున్న దేవుడే మనిషి శరీరమును త్రిప్పి పడుకోబెట్టడము జరుగుచున్నమాట వాస్తవమే. శరీరములో 25 మంది అవయవములు అను పేరుగల వారున్నారు. శరీరమునకు తొమ్మిది రంధ్రములున్నాయి. అందువలన శరీరమును గుహవలె పోల్చి, ఆ గుహలో 25 మంది యున్నట్లు చెప్పవచ్చును. శరీర ద్వారములలో అన్నీ మూసుకొనియుండగా చెవులు ముక్కు ద్వారములు (రంధ్రములు) తెరుచుకొని యుండును. అందులో చెవులు ఇంచు లోపల పూడిపోయినట్లు మూసివేయబడియున్నాయి. చివరకు ముక్కులు గుహ లోపలి వరకు రంధ్రము కల్గియున్నాయి. ముక్కు రంధ్రముల వద్ద శబ్దము చేయు శ్వాసయను కుక్క తన ముందరి కాళ్లను బయటికి, వెనుక కాళ్లను లోపలికి చాపి పడుకొని యున్నదని చెప్పారు. శ్వాస బయటికి లోపలికి ఆడుచుండుట వలన కుక్క ముందరి కాళ్లను గుహ బయటికి, వెనుక కాళ్లను గుహలోపలికి చాపి పడుకొని ఉందని చెప్పుటలో తప్పులేదు. శ్వాసను కుక్కతో పోల్చి చెప్పారు. అయితే మనిషి నిద్రపోవునప్పుడు గుహ ముఖ ద్వారము వద్దకు పోయి లోపలయున్న వారిని తొంగిచూస్తే వారు నిద్రలో చేయు గురక అను శబ్దమునకు భయపడి పారిపోతావు అని అన్నారు. నిద్రపోయే వారి ముక్కు దగ్గర చెవి పెట్టి చూస్తే వారు వేసే గురకకు తప్పనిసరిగా భయపడవలసి వస్తుందని చెప్పారు.


ఒక మనిషి నిద్రను అతని శరీరమును, దానికున్న రంధ్రములను, అతని గురకను పోల్చి చెప్పిన మాటలు ఈ వాక్యములో గలవు. మనిషి శరీరమును ఒక గుహలాగ పోల్చి శరీరమునకున్న తొమ్మిది దారులలో ఎల్లప్పుడూ తెరచుకొని ఉండేది, లోపలికి బయటికి పోవు దారివలె ముక్కులు ఉండగా శ్వాసను కుక్కగా పోల్చి చెప్పారు. 25 మంది గల గుహలో నేను ఒక్కనిగా ఉన్నానని నీవు తెలుసుకొని చూస్తే ఇక్కడ చెప్పినదంతా అర్థమవుతుంది. మానవ శరీరమను గుహను గురించి ఇంకా క్రింది వాక్యములో ఏమి చెప్పారో చూడండి.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

93. గుహలో ఎంతమంది యున్నారని ప్రత్యక్షముగా చూడలేక అంచనాగా చెప్పుకొనుచున్నారు. (18-22)

(18-22) ''వాళ్లు ముగ్గురు నాల్గవది వారి కుక్కయని కొందరు అంటారు. వారు ఐదుగురు ఆరవది వారి కుక్కయని మరికొందరు అంటారు. వారు తమకు తెలియని విషయములో ఉహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు ఎనిమిదవది వారి కుక్కయని ఇంకా కొందరు అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగును. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నీవు వారి విషయములో స్థూలంగా మాత్రమే వాదించు. గుహలోని వాళ్లను గురించి వీళ్లలో ఎవరినీ అడుగకు.''


శరీరమే ఒక గుహగా యున్నదని, అందులో జీవునితోపాటు 24 మంది యున్నారని చెప్పుకొన్నాము. అంతేకాక ఆ గుహకు తొమ్మిది ద్వారములున్నాయని కూడా చెప్పుకొన్నాము. అయితే చాలామందికి శరీర గుహలో ఎంతమంది ఉన్నది తెలియక మొదటనే కనిపించు శ్వాసను కుక్కగా పోల్చుకొని చెప్పుచూ, లోపల ఉన్నవారు ముగ్గురు వారి కుక్క ఒకటి నాల్గవదియని కొందరు అంటున్నారు. మరికొందరు లోపలయున్న వారు ఐదుమంది ఆరవది వారికుక్క యని అంటున్నారు. కాదు కాదు వారు ఏడుగురు ఎనిమిదవది వారి కుక్కయని ఇంకా కొందరు అంటున్నారు. ఈ విధముగా బయటికి తెలియు శ్వాసను ఒక దానిగా (కుక్కగా) అందరూ చెప్పుకొనినా శరీర గుహలో ఎంతమంది యున్నది తెలియక అంచనాల మీద మాట్లాడుచున్నారు. అయితే శరీరము లోపలయున్న వారి సంఖ్య పూర్తిగా శరీరమునకు అధిపతియైన ఆత్మకే తెలుసు. ఆత్మే శరీరములో అందరికీ పెద్దగా యున్నాడు. ఆత్మ శరీరములోయున్న ప్రతి ఒక్కరిని (ప్రతి ఒక్క అవయవమును) తెలిసియున్నది. శరీరములో ఎంతమంది యున్నది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. శరీరములో 24 మంది జీవునితోపాటు యుండగా, జీవుడు మరియు మిగతావారు అందరూ మొత్తము 25 మందికి అధిపతిగా ఆత్మ కలదు. ఈ విషయము రూఢిగా ఎవరికీ తెలియదు కావున నీవు స్థూలముగా కనిపించువాటిని గురించి మాట్లాడు. కనిపించని వారిని గురించి మాట్లాడవద్దు. బయటికి తెలియునవి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఒక కుక్కవలె యున్న శ్వాస మొత్తము పదకొండు మందిని గురించే మాట్లాడు మిగతా 14 మందిని గురించి మాట్లాడవద్దని హితము చెప్పినట్లు వాక్యములో గలదు. శరీర వ్యవస్థను ఒక గుహగా పోల్చి, శరీరములోని భాగములన్నిటినీ గుహలో యున్నవారిగా పోల్చి చెప్పారని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

94. ప్రజల వద్దకు మార్గదర్శకము వచ్చిన తర్వాత విశ్వసించనివారు దేవుడు ఒక మనిషిని ప్రవక్తగా (గురువుగా) పంపునాయని అంటారు. (17-94)

(17-94) ''ప్రజలవద్దకు మార్గదర్శకము వచ్చిన మీదట విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమెల్లా ఒక్కటే ''అల్లాహ్ ఒక మానవున్ని ప్రవక్తగా పంపాడా?'' అని వారన్నారు.''


అంతిమ దైవ గ్రంథములో 'ప్రవక్త' యని చెప్పిన పదమును, ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలులో 'మనుష్య కుమారుడు' యని చెప్పియున్నారు. అదే ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతయందు 'భగవాన్' యని చెప్పియున్నారు. భగవాన్ యనగా భగవంతుడుయని అర్థము. దేవుడు మనిషిగా తన ప్రతినిధిని పంపినప్పుడు అనగా వివరముగా చెప్పితే మూడవ పురుషుడయిన పరమాత్మ మారువేషములో మనిషిగా వచ్చినప్పుడు అతనిని ప్రవక్తయని గానీ, మనుష్యకుమారుడుయని గానీ, భగవంతుడుయని గానీ అనవచ్చును. దేవుడు ప్రత్యేకమైన మనిషిని చేసి, అందులో తన ఆత్మనే ఊది పంపుదును యని ఇదే ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరా, 28, 29, 30 ఆయత్‍లలో చెప్పియున్నాడు. పరమాత్మయిన పెద్ద దేవుడు మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పినా, ఆయనను దేవుని అవతారమని ఎవరూ గుర్తించలేదు. అందుకు అనేక కారణములున్నా ముఖ్య కారణము ఏమనగా! మనిషిగా దేవుడు రాడుయనీ, దేవుడు మనిషిగా వచ్చునాయని అనుకోవడమే కారణము. దేవుడు ఇప్పటికి మాకు తెలిసి మూడు యుగములలో ముగ్గురుగా మూడుమార్లు వచ్చాడు. నాకు తెలిసిన వారి పేర్లు చెప్పి వీరే భగవంతుడుగా వచ్చినవారని నేనంటే వారి పేరు వింటూనే అసూయతో, అక్కసుతో వారిని గురించి చెడుగా మాట్లాడువారు గలరు. కలియుగములో మతముల ప్రభావముండుట వలన హిందువుగా పుట్టిన కృష్ణున్ని క్రైస్థవులు ఒప్పుకోరు. అట్లే క్రైస్థవుడని అనుకొనుచున్న ఏసు పేరు చెప్పితే అలర్జీ వచ్చినవారివలె మారిపోయి దూషించు హిందువులు గలరు. ఇక త్రేతాయుగములో భగవంతునిగా వచ్చిన వానిని గురించి చెప్పితే అన్ని మతముల వారు వ్యతిరేఖించుచున్నారు. దీనికంతటికీ ముఖ్య కారణము దేవుడు మనిషిగా రాడని చాలామంది అనుకోవడమేయని చెప్పవచ్చును.


ఎవరు ఏమనుకొనినా అల్లాహ్ తన జ్ఞానమును దైవ గ్రంథముల రూపములో ఇచ్చాడు. అయితే దాని వివరమును మనుషులు చెప్పలేరు. అందువలన దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలి యను వాక్యము (3-7) లో యున్నట్లు దేవుడు మనిషిగా ఏదో ఒక పేరుతో వచ్చి, తన జ్ఞానమును తానే వివరముగా చెప్పవలసియుండును. అలా చెప్పవలసియుండుట వలన దేవుడు ఎక్కడో ఒకచోట మనిషిగా వచ్చి జ్ఞానమును చెప్పవలసి యుండును. అయితే అలా వచ్చిన ప్రతిసారీ దేవున్ని ఎవరూ గుర్తించక పోవడము, ఆయన చెప్పిన బోధను ఎవరూ గ్రహించకపోవడమును చేయుచున్నారు. అందువలన నేడు ప్రజలందరూ జ్ఞానులు కాలేకపోయారని చెప్పవచ్చును. దేవుడు మనిషి రూపములో వచ్చినప్పుడు మాత్రమే మనుషులకు భూమిమీద సంపూర్ణ జ్ఞానమును తెలియజేయును. దేవుడు మనిషిగా వస్తే జ్ఞాన విషయములో పూర్తి మార్గదర్శకుడుగా యుండును. దేవుడు మార్గదర్శకునిగా ఉన్నప్పుడే మనుషులు దైవ జ్ఞానమును తెలియవచ్చును. అయితే దేవున్ని మనిషిగా లెక్కించని ఎవడుగానీ జ్ఞానమును తెలియలేడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

95. మనుషులకు మనుషులను, దూతలకు దూతలను ప్రవక్తలుగా పంపుదును. (17-95)

(17-95) ఓ ప్రవక్తా! వారికి చెప్పు! ''ఒకవేళ దైవదూతలు భూమండలము మీద తిరుగుతూ నివాసము ఏర్పరచుకొంటూ ఉన్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశమునుంచి దైవదూతనే ప్రవక్తగా పంపియుండేవారము.''


భూమిమీద దేవుడు కనిపించే మనుషులను, కనపరాని దేవతలను తయారు చేశాడు. ఈ రెండు జాతులు భూమిమీద నివాసము ఏర్పరచుకొని ఉన్నాయి. దేవతలు, మనుషులు అను రెండు జాతులు కర్మప్రకారము పుట్టింపబడి, కర్మను అనుభవిస్తూ జీవించుచున్నారు. వీరి కర్మను పాలించుటకు శరీరము బయట అనుభవములను, శరీరము లోపల అనుభవములను దేవుడు ఏర్పరచాడు. మనుషులు, దేవతలు బయట లోపల అనుభవములను పొందుటకు శరీరములో ఆత్మను, శరీరము బయట దైవదూతలను మూడవ ఆత్మయిన పరమాత్మ ఏర్పరచాడు. శరీరము లోపల అనుభవించవలసిన కర్మలను శరీరములోని ఆత్మ అనుభవింప జేయుచున్నది. అట్లే శరీరము బయటి కర్మలను అనుభవరూపములో పొందుటకు బయట ప్రపంచములో ఎన్నో కోట్లకొలది దైవ దూతలను దేవుడు నిర్మించాడు. ఈ విధముగా శరీరము బయట, శరీరము లోపల జీవుడు కర్మలను అనుభవించుచున్నాడు.


కర్మలను అనుభవించువారు, కర్మలను అనుభవింపజేయువారు అని రెండు రకముల గలరు. అనుభవించువారు దేవతలు, మనుషులుకాగా, అనుభవింపజేయువారు శరీరములోని ఆత్మ, శరీరము బయట ఖగోళము లోని దైవదూతలు గలరు. ఆత్మ శరీరములోపల యుండగా, దైవదూతలు ఆకాశములో యున్నారని చెప్పుకొన్నాము. దైవ దూతలు భూమండలము మీద నివాసము ఏర్పరచుకొనియుంటే అనగా అజ్ఞానులై మనుషులలో, దేవతలలో నివాసము ఏర్పరచుకొనియుంటే వారికి జ్ఞానమును బోధించుటకు వారివద్దకు ఆకాశమునుండి దైవదూతనే ప్రవక్తగా దేవుడు పంపియుండేవాడు అని చెప్పియున్నారు. దీనినిబట్టి ఏ జాతివారికి జ్ఞానము లేకపోయినా అదే జాతివారినే ప్రవక్తగా పంపేవాడినని దేవుడు చెప్పాడు. మనుషులవద్దకు మనిషిగా యుండి, వారు మాట్లాడే భాషనే మాట్లాడు ప్రవక్తను దేవుడు పంపును. అలా పంపినప్పుడే మనుషులలో మనిషిగా యున్న ప్రవక్త వారిలో గుర్తింపు లేనివాడిగా కలిసిపోయి, వారిలో ఎవరికి జ్ఞానము అవసరమో వారికి జ్ఞానము చెప్పును. అందువలన ఏ జాతి వారికి ఆ జాతివానినే ప్రవక్తగా దేవుడు పంపునని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

96. అల్లాహ్‍కు కొడుకులుగానీ, భాగస్వామి అయిన వేరొక ఆరాధ్య దైవము గానీ లేడు. (23-91)

(23-91) ''అల్లాహ్ ఎవరినీ కొడుకులుగా చేసుకోలేదు. ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు ఎవడూ లేడు. ఒకవేళ అలాంటిది ఏదయినా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్ఠించిన వాటిని వేరుగా తీసుకొని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్‍కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు.''


ఇక్కడ ముఖ్యముగా ఈ వాక్యము ఏ అల్లాను గురించి చెప్పాడో ముందు గమనించవలసిన అవసరమున్నది. అల్లాహ్యని పిలువబడు వారు ఇద్దరుగలరు. అందులో మొదటి సృష్ఠికర్తయినవాడు ఒకడు గలడు. అతడు ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. రెండవ అల్లాహ్ శరీరములో అన్ని కార్యములను చేయువాడుగా యున్నాడు. ఏ కార్యములు చేయని అల్లాహ్‍కు సంతతి లేదు. సంతతిలేని అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను సృష్ఠించి ఆయనకు పనిని కల్పించాడు. శరీరము లోపల పని చేయు అల్లాహ్‍ను కాదని అన్నిటికీ అతీతునిగా మొదటి అల్లాహ్ గలడు. రెండవ అల్లాహ్‍కు ఏ లక్షణాలు గలవో వాటికి అన్నిటికీ మొదటి అల్లాహ్ అతీతుడుగా యున్నాడు. చాలామందికి ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలియదు. మొదటి అల్లాహ్ ఆరాధనలకు అతీతుడు అయినందువలన ఆయనతో భాగస్వామిగా వేరే దైవము భాగస్వామిగా లేడు. ఆయన తయారు చేసిన రెండవ ఆత్మయిన అల్లాహ్ సమస్త ప్రజలకు ఆరాధ్య దైవముగాయున్నాడు. మొదటివాడయిన పరమాత్మకు భాగస్వామిగా యున్నవాడుగానీ, సమానమైనవాడుగానీ ఎవడూ లేడు. మొదటి అల్లాహ్ అయినవాడు విశ్వవ్యాప్తముగా అణువణువునా ఉండగా, ఆత్మగా యున్న రెండవ అల్లాహ్ శరీరముల లోపల మాత్రము గలడు. జ్ఞాని అయినవాడు ఇద్దరు అల్లాహ్‍ల విషయము తెలిసియుండాలి. అందరూ ఆ విషయమును తెలియాలను ఉద్దేశ్యముతోనే ప్రత్యేకించి అల్లాహ్‍ను గురించి ఆయనకు కొడుకులు లేరని చెప్పారు. రెండవ అల్లాహ్‍కు సమస్త మానవులు సంతతిగాయున్నారు. మొదటి అల్లాహ్‍కు సంతతి ఏమాత్రము లేదు. ఆయననుండి పుట్టినవి, ఆయనలోని భాగాలే తప్ప ఆయన సంతానమునకు సంబంధించినవి ఏవీ లేవు. మూడవ ఆత్మయిన పరమాత్మకు (అల్లాహ్‍కు) సమానమైనవాడు ఎవడూ లేడని చెప్పవచ్చును. అంతేకాక సృష్ఠిపూర్వము నేడు అందరికీ ఆరాధ్య దైవముగా యున్న ఆత్మ (అల్లాహ్) లేనేలేడు. ఆ రోజు ఉన్నవాడు పెద్దవాడు మొదటివాడయిన అల్లాహ్ మాత్రమే. ఆయన సృష్ఠి పూర్వము ఎవ్వరూ లేనప్పుడు కూడా, ఈ విశ్వముగానీ రెండవ అల్లాహ్గానీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అందువలన ఆ అల్లాహ్‍ను ఎల్లప్పుడూ ఉన్నవాడని చెప్పవచ్చును. సృష్ఠి పూర్వము ఆయన ఒక్కడేయుండుట వలన ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో మొదటి వాక్యములోనే ''ఆయన ఒక్కడే గలడు'' అని చెప్పి యున్నారని గమనించవలెను. అంతేకాక 112వ సూరాలో మిగతా మూడు వాక్యములు (ఆయత్‍లు) ప్రత్యేకించి పరమాత్మయైన దేవున్ని (మొదటి అల్లాహ్‍ను) గురించి చెప్పినవేయని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

97. మేము బరువైన గాలులను పంపుచున్నాము. మేమే వర్షాన్ని కురిపించి నీటిని త్రాగిస్తున్నాము. మా వలన కాకపోతే మీరు జలమును సంపాదించుకోలేరు. (15-22)

(15-22) ''మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశము నుండి వర్షమును కురిపించి దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమకూర్చుకోవడము అన్నది మీ వలన కాని పని.''


ఈ వాక్యము కూడా సూక్ష్మజ్ఞానముతో కూడుకొన్నదే. పైకి వ్రాసినది ఒక్కటైతే లోపల అర్థము చేసుకోవలసినది మరొకటియుండును. దేవుడు ఏమి చెప్పినా, ఎట్లు చెప్పినా తన జ్ఞానమును గురించే చెప్పును. అందువలన చెప్పిన మాటలలో మనము కనిపించని జ్ఞానమునే వెతకాలి. అందువలన ఈ వాక్యములో చెప్పిన మాటలకు జ్ఞాన సంబంధమైన అర్థమునే తీసుకొందాము. దానిప్రకారము 'బరువైన గాలులు' అనగా మనకు ఊపిరి ఆడక ఇబ్బంది పెట్టునవని అర్థము. దీని అర్థము ప్రకారము ప్రపంచములో ఎన్నో కష్టములతో కూడిన సంఘటనలు అని చెప్పవచ్చును. దేవుడు మనిషిని వాని కర్మప్రకారము కష్టపెట్టుచుండును. కష్టపెట్టడమే కాకుండా కష్టములకు కారణమైన పాపకర్మలు లేకుండా పోవుటకు దైవ జ్ఞానమును కూడా ఇచ్చాడు. దైవజ్ఞానము దేవుని నుండి కనిపించని స్థలము నుండి వచ్చుచున్నది. కావున ''ఆకాశము నుండి వర్షమును కురిపిస్తున్నాను'' అని అన్నాడు. వర్షము ద్వారా నీరు లభించును. దేవుని ద్వారా వచ్చిన జ్ఞానమును ఆకాశ వర్షముగా చెప్పాడు. 'తినేది, త్రాగేది' అన్నప్పుడల్లా గ్రంథమును చదివేది, లేక వినేది, తర్వాత త్రాగే దానిని జ్ఞానమును గ్రహించుకోవడము అని అర్థము చేసుకోవలెను. దేవుడు అందించిన జ్ఞానమును గ్రహించుట వలన మనిషిలో యున్న కర్మలు కాలిపోవును. అనగా క్షమించబడును. ఆ విధముగా జ్ఞానమును మనము స్వయముగా పొందలేమని దేవుడు సమకూర్చడము వలన మాత్రమే జ్ఞానమును పొందగలమని తెలియుచున్నది. ఈ వాక్యములో బరువైన గాలులు అనగా మనిషి పడే కష్టాలు అని అర్థము చేసుకోవాలి. అట్లే ఆకాశము నుండి కురిసే వర్షము అనగా, దేవుడు పై నుండి (పైన తలనుండి) అందించే జ్ఞానము అని అర్థము చేసుకోవాలి. నీరును త్రాపుచున్నాడు అనగా జ్ఞానమును అర్థము అగునట్లు చేయుచున్నాడు అని చెప్పవచ్చును. జలమును సమకూర్చుకోవడము మీ వలన కానిపని యని చెప్పడములో అర్థము ఏమనగా! దేవుని జ్ఞానమును మీరు స్వయముగా తెలియలేరు అనీ, దేవుడు అందిస్తేనే అది మీకు లభించునని చెప్పినట్లున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

98. ప్రాణము తీసేవాడు మరియు ప్రాణము పోసేవాడు దేవుడే. అంతకు ముందున్న వారినీ తర్వాత వచ్చేవారినీ తెలిసినవాడు దేవుడే. దేవుడు అందరినీ సమీకరిస్తాడు. ఆయన మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. (15-23, 24,25)

(15-23,24,25) ''ప్రాణము పోసేది, ప్రాణము తీసేది కూడా మేమే. చివరికి వారసులము కూడా మేమే. మీకు పూర్వము సాగిపోయిన వారినీ మేము ఎరుగుదుము. తర్వాత వచ్చే వారిని కూడా మేము ఎరుగుదుము. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. నిశ్చయముగా ఆయన మహా వివేకవంతుడు. అన్నీ తెలిసినవాడు.''


దేవుడు రక్షించేవాడే కాదు శిక్షించేవాడు కూడా. అంతేకాదు ఆయనే ప్రాణమును పోస్తున్నాడు, ఆయనే ప్రాణమును తీస్తున్నాడు. అయితే ఈ పనిని చేసేది ఒక దేవుడే. ఇంకొక దేవుడు అన్నీ చూస్తూయున్నాడు. ప్రాణము తీసేది, ప్రాణము పోసేది, అందరికీ ఆరాధ్య దైవము, శరీరములో నివశిస్తూ శరీరమునకు అధిపతిగాయున్న రెండవ ఆత్మయని తెలియవలెను. మొదటి ఆత్మ జీవాత్మకాగా, జీవాత్మకు శరీరములో రెండవ ఆత్మ తోడుగా యున్నది. మూడవ ఆత్మ అయిన పరమాత్మ ఏమీ చేయక అన్నిటినీ చూస్తూ సాక్షిగా యున్నాడని ఇంతకుముందే చెప్పుకొన్నాము. అయితే ఈ వాక్యములో ఆత్మ స్వయముగా ప్రాణము పోసేది, ప్రాణము తీసేది నేనేయని చెప్పుచున్నది. అంతేకాక గతములో చనిపోయిన వారు ఎవరో, భవిష్యత్తులో పుట్టేవారు ఎవరో నాకు తెలుసు అని ఆరాధ్యదైవమయిన అల్లాహ్ అనుచున్నాడు. చనిపోయిన వారిని తిరిగి జన్మకు తీసుకవచ్చేది ఆత్మనే అయినందున గతములో చనిపోయినవారు అందరూ ఇప్పుడు జీవితములో ఎవరుగా యున్నారో పుట్టించిన ఆయనకే తెలుసు. ఈ విషయము చాలామందికి తెలియక చనిపోయినవారు వేరు, తర్వాత ఇప్పుడు పుట్టినవారు వేరు అని అనుకొను చుందురు. గతములో చనిపోయినవారే వెంటనే పుట్టి ఇప్పుడు జీవనము సాగించుచున్నారని తెలియదు.


చనిపోయిన వారందరూ తిరిగి పుట్టలేదనీ, పుట్టువారందరూ క్రొత్త వారని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. ముస్లీమ్‍లలో ఈ విధముగా అనుకోవడము గలదు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడా ఆ విధముగా వ్రాసియుండలేదు. వ్రాయని విషయమును బోధల రూపములో కొందరు తెలిసీ తెలియక చెప్పగా, ఖుర్ఆన్ గ్రంథములో చనిపోయిన వాడు తిరిగి పుట్టుచున్నాడని అల్లాహ్ చెప్పిన వాక్యములను కూడా లెక్కచేయక మా పెద్దల మాటే ముఖ్యము అని అంటున్నారు. ఖుర్ఆన్‍లో చెప్పిన మాటకు వ్యతిరేఖముగా చెప్పువారు పెద్దలు కాదు. వారు వయస్సులో పెద్దయినా జ్ఞానములో చిన్నయనే తలవండి. దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍కు విలువ నిచ్చుచూ చెప్పితే, చనిపోయినవానికి మొదటి జన్మవలె మలి జన్మను కల్గించుచున్నానని అల్లాహ్ ఆయత్‍ల రూపములో చెప్పిన వాక్యములను విశ్వసించి తీరవలసిందే. దైవ గ్రంథము ప్రకారము చూస్తే చనిపోయిన వాడు తిరిగి రెండవ జన్మకు వచ్చుచున్నాడని తెలియుచున్నది. దాని ప్రకారము చూస్తే క్రొత్త విషయములు క్రొత్త కోణములో తెలియుచున్నవి. ఇక్కడ ప్రాణము తీసేది నేనే, ప్రాణము పోసేది నేనేయని దేవుడన్నాడు. అయితే దేవుడు అయిన ఆత్మ ఎవరికి ప్రాణము పోస్తున్నాడు, ఎవరికి ప్రాణము తీస్తున్నాడు అని ఆలోచించితే ప్రాణము కనిపించలేదుగానీ, పోసే ప్రాణము శిశువులోను, తీసే ప్రాణము చనిపోవు శరీరములలోను అని తెలియుచున్నది. జీవుడు కనిపించలేదు, చనిపోయే శరీరము, జన్మించే శరీరము రెండూ కనిపించుచున్నవి. కనిపించు శరీరములను వదలి పుట్టే జీవుడు, చనిపోయే జీవుడు ఎవరు? అని ఆలోచించిన ఇట్లు తెలియుచున్నది. ఉదాహరణకు చెప్పుకొంటే త్రేతాయుగములో రాముడున్నాడు, రావణుడు ఉన్నాడు. వారిద్దరికీ యుద్ధము జరిగిన విషయము అందరికీ తెలుసు. శ్రీరాముని ప్రక్కన కోతుల సైన్యము కలదనీ, రావణబ్రహ్మ ప్రక్కన ఆయన సైన్యము కలదని చెప్పుచుందురు. ఇరువైపులా కొన్ని వేలమంది కలరని చరిత్రలో కలదు. అయితే అప్పుడు యుద్ధములో ఇరువైపులా చనిపోయినవారు గలరు. వారు వెంటనే మరుజన్మకు పోయి పుట్టి యుందురు. అక్కడ కొంత కాలము బ్రతికి అక్కడ చనిపోయి, ఇంకొక జాగాలో పుట్టి అక్కడ కొన్ని సంవత్సరములు బ్రతికి, తిరిగి దేవుని చేత చంపబడి, తిరిగి దేవుని చేత మరొక జాగాలో పుట్టుతూ వస్తూ వస్తూ ఆ రోజు రాముని ప్రక్కనయుండి యుద్ధము చేసినవారు మరియు రావణుని ప్రక్కనయుండి యుద్ధము చేసినవారు ఇరువురూ ఒకే ఊరిలో పుట్టారు. అయినా వెనుక జన్మల జ్ఞాపకములు ఎవరికీ ఉండవు కనుక ముందు ఎన్నో జన్మలను పొంది, చనిపోతూ వస్తూ నేడు ఇప్పటికి ఇక్కడున్నామని ఎవరికీ తెలియదు. అయితే దేవుడయిన ఆత్మ అందరినీ సమీకరిస్తాడు. ఎవరినీ వదలక అందరినీ సమీకరించి ఎవరిని ఎక్కడ పంపాలో అక్కడ పంపుచుండును. అందువలన రాముని ప్రక్కన యుద్ధము చేసినవారు ఎక్కడున్నారో, అట్లే రావణ బ్రహ్మ ప్రక్కన యుద్ధము చేసినవారు ఎక్కడున్నారో అల్లాహ్‍కు బాగా తెలుసు. గతములో చనిపోయిన వారిని సమీకరించి ఒకే ఇంటిలో, ఒకే కుటుంబములో కూడా పుట్టియుండునట్లు చేసియుండ వచ్చును. అట్లు ఎవరిని ఎక్కడ పుట్టించాలో, అల్లాహ్ బాగా తెలిసినవాడు. అందువలన అల్లాహ్‍ను వివేకవంతుడనీ, అన్నీ తెలిసినవాడని వాక్యములో చెప్పియున్నారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

99. వారి హృదయాలపై తెరలు వేస్తాము. వారి చెవులు మొద్దుబారి పోయాయి. (17-46)

(17-45) ''ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు మేము నీకూ, పరలోకాన్ని నమ్మనివారికీ మధ్య కనిపించని ఒక తెరను వేస్తాము. (46) అంటే వారు దానిని అర్థము చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేస్తాము. వారి చెవులు మొద్దుబార చేస్తాము. నువ్వు ఈ ఖుర్ఆన్‍లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని (తౌహీద్‍ను) ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తము చేస్తూ వెను తిరిగి వెళ్లిపోతారు.''


ఈ వాక్యము చూచేదానికి సులభముగా యున్నది. అయితే అర్థము చేసుకోవడములో కొంత కష్టముగా యున్నది. మనిషికి జ్ఞానము అర్థము కావాలంటే ముందు మనిషి అల్లాహ్‍కు ఇష్టమయి ఉండాలి. అల్లాహ్‍కు ఇష్టము లేనివారికి అల్లాహ్‍యే తన జ్ఞానము అర్థము కాకుండా చేస్తాడు. అందువలన వారి హృదయాల మీద తెరను వేస్తాను అన్నాడు. అంతేకాక వారి చెవులు మొద్దుబారి వినిపించకుండా చేస్తాను అని అన్నాడు. అలా చెప్పడములో అర్థము ఏమనగా! తన జ్ఞానము, తనమీద విశ్వాసము లేనివారికి అర్థము కాకుండా చేస్తాను అని అన్నాడు. అయితే మాకు అల్లాహ్ మీద విశ్వాసము ఉన్నదని అందరూ అంటున్నారు. అందరూ దేవున్ని ప్రార్థన చేస్తున్నామని అంటున్నారు. అటువంటప్పుడు అలా అనువారికి కూడా దేవుని జ్ఞానము అర్థము కాకుండా పోయినది. గ్రంథములో దేవుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన వాక్యములను వినకుండా వారి పెద్దలు చెప్పినట్లు వినుచున్నారు. షరియత్ అను పేరును అడ్డము పెట్టుకొని దేవునిమాటను కాదని ఇతర మనుషులు చెప్పినమాటను నమ్ము వారికి దేవుడు తన జ్ఞానమును ఏమాత్రమూ అర్థము కాకుండా చేయును. ఈ వాక్యములో అల్లాహ్ యొక్క ఏకత్వమును చెప్పితే విసుగుకొను వారున్నారంటే వారికి దేవుడు తన జ్ఞానమును ఎందుకు ఇచ్చును అని మనము అనుకోక తప్పదు. చాలామంది మేము అల్లాహ్ యొక్క ఏకత్వమును నమ్ముచున్నాము అని అనినా వారు నమ్ముచున్న అల్లాహ్ వేరు, వాక్యములో చెప్పిన అల్లాహ్ వేరని తెలియుచున్నది. వారు ఆరాధించు అల్లాహ్ ఒక్కడేయని, రెండవవాడు లేడుయని అనుచున్నారు. అయితే ఈ వాక్యములో చెప్పిన అల్లాహ్ యొక్క ఏకత్వమును నమ్మలేరని ఏ దేవున్ని గురించి చెప్పుచున్నారని ఆలోచించడము లేదు. మూడవ అల్లాహ్‍ను ''అల్లాహ్ ఏకైకుడు'' అని 112వ సూరాలో మొదటి వాక్యములోనే చెప్పియున్నారు. అయితే ఆరాధించబడు అల్లాహ్ రెండవవాడనీ, మూడవ వాడయిన అల్లాహ్ సృష్ఠి ముందునుండి ఏకైకుడుగా ఉన్నాడంటే ఆ మాట చాలామందికి అర్థము కాకుండా పోయినది. సృష్ఠి ముందునుండి ఉన్నవాడు ఎవరో తెలియనివారు సృష్ఠి తర్వాతయున్న రెండవ అల్లాహ్‍ను ఒక్కడిని మాత్రమే విశ్వసించి మొదటినుండి ఏకైకుడుగా యున్న ఆయనను విశ్వసించడము లేదు. మేము పరమాత్మయిన వాని ఏకత్వమును చెప్పితే రెండవవానిగా పుట్టిన ఆత్మను ఆరాధించడమే ఏకత్వము అని అంటున్నారు. ఆరాధ్య దైవము ఒక్కడేయని మేము కూడా ఒప్పుకొంటున్నాము. అయితే ఆయనకంటే ముందున్నవాడు ఒక్కడేయున్నాడు అని చెప్పితే వారు తీవ్ర అయిష్టతను వ్యక్తము చేస్తున్నారని వాక్యములో చెప్పారు. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమిటంటే! మేము జ్ఞానులము అని అనుకొన్న వారంతా ఆరాధింప బడు అల్లాహ్‍ను మాత్రమే నమ్మి, మిగతా అల్లాహ్ సృష్ఠి పూర్వము నుండి ఉన్నాడని తెలియకపోవడమే వారికున్న పెద్ద అజ్ఞానమయినది. అందువలన వారి హృదయాల మీద తెరలు వేస్తానని మూడవ అల్లాహ్ అయిన పరమాత్మ చెప్పుచున్నాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

100. ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నిటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి శ్రేష్ఠత కల్పించాము. ఇంకా దావూదుకు జబూరను ఇచ్చాము. (17-55)

(17-55) ''ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నిటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము. ఇంకా మేము దావూదుకు జబుర (గ్రంథము) వొసగాము.''


ఆకాశము భూమి అని చెప్పినప్పుడు బయట ప్రపంచములో కనిపించే ఆకాశము, కనిపించే భూమిగా లెక్కించవలసి యుండును. అట్లు కాకుండా ఆకాశములు అని బహువచనము చెప్పినప్పుడు శరీరము లోపల కనిపించకయుండే ఆకాశముగా లెక్కించవలెను. అనగా శరీరమును గురించి చెప్పుచున్నారని గుర్తించుకోవలెను. ఇప్పుడు ఈ వాక్యములో చెప్పిన దానినిబట్టి దేవునికి శరీరములో యున్నదంతా బాగా తెలుసు అని చెప్పారు. శరీరములో కనిపించనివి చాలాయున్నాయి. ఏడు ఆకాశములు కనిపించవు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, జీవుడు ఇవేకాక ఇంకా కనిపించనివి చాలాయున్నాయి. శరీరమును గురించి దేవునికి బాగా తెలుసు అన్నప్పుడు ఏ దేవునికి అను వివరము మనకు తెలిసియుండాలి. దాని తర్వాత వాక్యములో ''మేము ప్రవక్తలలో కొందరికి మరికొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము.'' అని అన్నప్పుడు ఈ మాటను చెప్పినవాడు శరీరములోని రెండవ ఆత్మయని అర్థమగుచున్నది. దానివలన నీ ప్రభువుకు శరీరమును గురించి బాగా తెలుసుయని చెప్పినవాడు ఆత్మకాగా శరీరమును తెలిసినవాడు పరమాత్మ యని, ఆయననే ప్రభువు అని ఉచ్ఛరించి రెండవ ఆత్మ చెప్పడమైనదని తెలిసినది. శరీరములోని ఆత్మ ప్రవక్తలలో కొందరిని పెద్ద ప్రవక్తలను చేసి, వారిలో శ్రేష్ఠత్వమును చూపుచున్నది. అలాగే దావూదు అను ప్రవక్తకు 'జబుర' అను జ్ఞానబోధను మాటల రూపములో ఆత్మయే చెప్పినది. జబుర ను చెప్పినది, ప్రవక్తలను కొందరిని గొప్పగా చేసినది ఆత్మకాగా, మనిషి శరీరము మొత్తమును తెలిసినవాడు పరమాత్మయని ఆత్మయే ఈ వాక్యములో చెప్పినది. అయితే కొందరు జబుర అనునది గ్రంథము పేరని చెప్పారు. వాస్తవముగా జబుర అనునది జ్ఞానమునకు పెట్టిన పేరేగానీ గ్రంథము పేరుకాదని తెలియవలెను. దేవుడు సృష్ఠి ఆదిలో మొట్టమొదట చెప్పిన జ్ఞానము పేరే జబుర. అయితే అది మొదట ''జపర'' యను పేరుతో చెప్పబడేదని, తర్వాత కాలక్రమమున దానిపేరు జపర పోయి జబుర గా చెప్పబడుచున్నది. జబుర అనునది భూమిమీద మొదట మనువు అను వ్యక్తికి చెప్పబడినది. అప్పటి మనువును ఖుర్ఆన్ గ్రంథములో పేరుమార్చి దావూదు అని చెప్పారు. మొదట సూర్యగ్రహము మనువు (దావూదు) అను వ్యక్తికి జ్ఞానము చెప్పాడు. అదే సూర్యగ్రహమే కలియుగములో జిబ్రయేల్ అను పేరు మార్చుకొని ముహమ్మద్ అను ప్రవక్తకు జ్ఞానమును చెప్పాడు. సూర్యుడు జిబ్రయేల్గా, మనువు దావూద్ గా, మోషేను మూసాగా, ఏసును ఈసాగా, బైబిలును ఇంజీలుగా ఖుర్ఆన్ గ్రంథములో పేర్లు మార్చి చెప్పారు. వాస్తవానికి జబుర అనునది గ్రంథము కాదు మాటల రూపములోయున్న జ్ఞానము.






అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

101. వీర్యకణము లేకుండా పిల్లలు పుడతారు. (19-20, 21, 22)

(19-20,21,22) ''నాకు పిల్లవాడు కలగడమేమిటి? నన్ను ఏ మగాడు కనీసము తాకనైనా లేదే! నేను చెడునడత కలదానిని కూడా కాదే! అని ఆమె అన్నది.'' (21) ''జరిగేది మాత్రము ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతనిని జనుల కోసము సూచనగా మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయము అని నీ ప్రభువు సెలవిచ్చాడు. అని అతను వివరించాడు.'' (22) ''అంతే, ఆమె గర్భవతి అయినది. ఈ కారణముగా ఆమె ఏకాంతము కోసము దూరప్రదేశానికి వెళ్లి పోయినది.''


పరమాత్మ తెలిపాడని ఆత్మ చెప్పుచున్నది. ఈ రెండు ఆత్మల (అల్లాహ్‍ల) విషయము అర్థము కాకపోతే జ్ఞానము అర్థము కాదు. మరియ అను స్త్రీకి అల్లాహ్ (దేవుడు) నీకు కొడుకు పుట్టుతాడు అని చెప్పగా ఆమె ఆశ్చర్యపడి నేను ఏ పురుషున్నీ తాకనుకూడా తాకలేదే అదెలా సాధ్యము అని అడుగగా! అది మాకు సులభము, మేము అతనిని (ఏసును) జనుల కొరకు సూచనగా ప్రత్యేక కృపగా చేయదలచుకొన్నాము, ఇదొక నిర్ధారిత విషయము అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అన్నాడు. పరమాత్మ నిర్ణయించి ఒక మనిషిని తయారు చేయబోతున్నాడు అని ఆత్మ చెప్పినది. పరమాత్మ నిర్ణయించగా ఆత్మ తల్లి శరీరములో శిశువును పెంచుతున్నది. పురుష సంపర్కము లేకున్నా స్త్రీలకు గర్భము వచ్చునని ఈ విషయములో నిరూపించబడినది. పరమాత్మ తన ప్రతినిధిగా భూమిమీదికి భగవంతున్ని ప్రజలకు జ్ఞానము తెలుపుటకు పంపునని ఈ వాక్యములో తెలియజేశాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

102. అల్లాహ్‍కు సంతానము లేదు. (19-35), (21-26)

(19-35) ''అల్లాహ్‍కు సంతానము ఉండటమనేది ఎంతమాత్రమూ తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకొన్నప్పుడు ''అయిపో'' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.''


(21-26) ''కరుణామయునికి సంతానము ఉందని వారు చెప్పు తున్నారు. అది నిజము కాదు. ఆయన పవిత్రుడు. పైగా దైవ దూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు.''


ఇక్కడ అల్లాహ్ అనబడే పరమాత్మకు సంతానము లేదనే చెప్పాలి. ఆయన ఏ పనిని చేయదలచుకున్నా, అది కార్యరూపముగా ఉండదు. ఆయన సంకల్పముతోనే అయిపోతుంది. అలాగే పరమాత్మ ప్రత్యేకమైన మనిషిని తయారు చేసి తన ఆత్మనే అందులో ఊది భూమిమీదికి ప్రత్యేక మైన మనిషిని పంపుచున్నాడు. పరమాత్మకు సంతానము ఉండదు. ఎవరూ సంతానముగా లేరు. మనుషులందరూ ఆత్మ యొక్క సంతతి కాగా, పరమాత్మకు సంతతి లేదు. దేవదూతలు అనబడువారందరూ పరమాత్మ సేవకులుగా యున్నా, ఆత్మకు సంబంధము లేనివారుగా యున్నా వారు పరమాత్మయొక్క దాసులు మాత్రమే. సర్వజీవరాసులకు ఆత్మ మాత్రమే బీజదాతగా యున్నాడు. కావున ఆత్మే అందరికీ తండ్రి. ఖుర్ఆన్ గ్రంథములో ఆత్మను, పరమాత్మను ఇద్దరికీ అల్లాహ్ అను ఒకే పేరు ఉండుట వలన ఖుర్ఆన్‍ను చదివినవారంతా ఇద్దరు అల్లాహ్‍ల తారతమ్యము తెలియక 'అల్లా' అను ఒకే పేరునుబట్టి అల్లాహ్ ఒకడేయని అనుకొంటున్నారు. ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ ఒకడు, ఆరాధనలకు అతీతుడయిన అల్లాహ్ మరొకడు ఉన్నాడని తెలియలేకపోయారు. అలాగే పనిని చేయు అల్లాహ్ ఒకడు ఉండగా, పని చేయని అల్లాహ్ మరొకడున్నాడని తెలియలేక ఆరాధ్య దైవము ఒక్కడే యని అంటున్నారు. ఇద్దరిలో ఆరాధ్య దైవము ఒక్కడేయని పెద్ద అల్లాహ్ చిన్న అల్లాహ్‍ను చూపాడు. అయినా 'జాడతప్పను బోడిమామా' యను సామెత ప్రకారము మొదట విన్నదే నిజమనీ, తమ పెద్దలు చెప్పినదే నిజమని అనుకోవడము వలన ముస్లీమ్‍లకు చాలామందికి ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

103. అధర్మవరులు వీరే. (23-53)

(23-53) ''వారు తమ ధర్మం విషయములో పరస్పర భేదా భిప్రాయములు కల్పించుకొని విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి వర్గము వారు తాము అనుసరించే దానితో సంతోషపడు తున్నారు.'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)


(23-53) ''అయితే వారంతటవారే విభేదించుకొని తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసుకొన్నారు. ప్రతి వర్గము వారు (ప్రతి మతము వారు) తమవద్దయున్న దానితోనే సంబరపడిపో సాగారు.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)


ఇక్కడ రెండు తెలుగు అనువాద ఖుర్ఆన్ గ్రంథముల నుండి ఒకే ఆయత్ ఎలా ఉన్నదో వ్రాసి చూపించాము. రెండు వాక్యములలో కొన్ని పదములు వేరుగా యున్నా, భావము రెండిటియందు ఒకటే యున్నది. దేవుడు మనుషులను ఒకే సమాజముగా పుట్టించాడు. అంటే ఒకే జాతిగా పుట్టించాడు. మనిషి ఒక శరీరము ధరించి పుట్టితే ఆ శరీరము నల్లగా తెల్లగా యున్నా, పొడవు పొట్టిగా యున్నా, శరీరము బయటి అవయవము లలో గానీ, అట్లే శరీరము లోపలి అవయవములలోగానీ ఏ తేడా లేకుండా దేవుడు పుట్టించాడు. అందరికీ శరీర నిర్మాణము చేసి అందులో జీవితమును ఇచ్చినవాడు శరీరములోనే నివశించుచున్న ఆత్మని చెప్పుచున్నాము. మనుషులకు ఆత్మే దేవుడు. అందరూ ఆరాధించవలసిన వాడు ఆత్మయను దేవుడే. ఆత్మయను దేవుడు ఆయనకంటే వేరుగా (పరముగా) యున్న దేవుని చేత నిర్మితమైనవాడు, ఆత్మకంటే వేరుగా యున్న దేవుడు అయిన పరమాత్మను, ఆత్మను ఇద్దరినీ ఖుర్ఆన్ గ్రంథములో ఒకే పేరు అయిన 'అల్లాహ్' అను పదము (శబ్దము) పిలుచుచున్నారు. పరమాత్మయిన వాడు కనిపించే భూమిని, కనిపించే ఆకాశమును మొత్తము నిర్జీవ ప్రపంచమును తయారు చేశాడు. తర్వాత జీవులను (మనుషులను) అన్ని రకముల జీవరాసులను తయారు చేయదలచి, ఆ పని నిమిత్తము ఆత్మను సృష్ఠించి మనుషులను పుట్టించడము, అట్లే మరణింప జేయడము, జీవన మరణముల మధ్యలో జీవితమును ఇచ్చునట్లు అన్ని అధికారములను ఆత్మకు పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ బయటి ప్రపంచమును సృష్ఠించిన, తర్వాత తాను ఏమీ చేయనివాడై జీవుల సృష్ఠినంతటిని సృష్ఠించుటకు, పాలించుటకు అన్ని అధికారములు ఆత్మకు ఇచ్చి తాను సాక్షిగా ఊరక ఉండిపోయాడు.


పరమాత్మ ఆజ్ఞ ప్రకారము ఆత్మ సర్వమానవులను తయారు చేయడము జరిగినది. ఆత్మ చేసిన మానవ సమాజము అంతా ఒకే సూత్రబద్దముగా తయారు చేయబడినది. ఒక వాక్యమును ఎవరు వ్రాసినా, వాక్యములోని అక్షరములన్నీ ఒకే విధముగా యున్నా, వ్రాసినవారి చేతి కదలిక వేరువేరుగా యుండుట వలన వ్రాయబడిన అక్షరములు పొడవుగా పొట్టిగా, పెద్దవిగా చిన్నవిగా ఉండును తప్ప వాక్యములో ఏ విధమైన మార్పు ఉండదు. ఉదాహరణకు 'దేవుడు' అను మూడు అక్షరముల పదమును పదిమంది చేత వ్రాయించితే, వారు వ్రాసిన మూడు అక్షరములు ఒకే విధ అక్షరములు ఉండును. అయితే వ్రాసినవారి చేతి కదలికలనుబట్టి వ్రాత వేరువేరుగా యున్నట్లు కనిపించును. ప్రత్యేకముగా చూస్తే దేవుడు అను మూడు అక్షరముల పదము పది రకములుగా యున్నట్లు కనిపించుచున్నది. చూడండి.

దేవుడు దేవుడు

దేవుడు దేవుడు

దేవుడు దేవుడు

దేవుడు దేవుడు

దేవుడు దేవుడు


ఈ విధముగా ఆత్మ (అల్లాహ్) మనుషులను సృష్ఠించాడు. అయితే మనిషి ఆకారములో తేడాలుయున్నా, లోపల యున్న మిషనరీ (యాంత్రిక) నిర్మాణములో ఏ మార్పు ఉండదు. శరీరము 25 భాగములుగా యుండి పని చేయునట్లు ఆత్మ (దేవుడు) మనిషిని నిర్మించాడు. మనిషి జననము లోనూ, అట్లే మనిషి మరణములోనూ, జీవనములోనూ అందరూ ఒకే సూత్రమును అనుసరించి, ఒకే సూత్రము ప్రకారము నడుచుచున్నారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము వరకు మనుషులందరూ ఒకే సంఘముగా బ్రతుకుచూ, ఒకే భక్తిభావము కల్గి తమలో ఎటువంటి భేదములు లేకుండా మనుషులంతా ఒకటేయను సూత్రము ప్రకారము జీవించెడివారు. మూడు యుగములనుండి మనుషులు ఒకరికొకరు హెచ్చుతగ్గుల ఆహారమును తింటూ, హెచ్చుతగ్గుల కష్టసుఖములను అనుభవించుచూ ఒకే మానవ సంఘముగా యుండేవారు. అయితే కలియుగము అయిన ప్రస్తుత యుగములో మనుషులు తాము బ్రతుకుచున్న ఒకే ధర్మములో భేదములను కల్పించుకొని, ఆ భేదముల ప్రకారము వేరువేరు సంఘములుగా (గుంపులుగా) చీలిపోయి, చీలిపోయిన గుంపుకు 'మతము' అను పేరు పెట్టుకొని, ప్రస్తుతము పన్నెండు మతములుగా అనగా పన్నెండు చీలికలుగా తయారయిపోయి ఎవరి మతమును వారు సమర్థించు కొనుచున్నారు. ఎవరి మతములో వారు సంతోషపడుచూ మా మతమే పెద్దయని ఒకరి కొకరు పోటీపడుచున్నారు. ఆ పోటీలో ఆధిపత్యమును సంపాదించు కొనుటకు ఒక వర్గమువారు మరొక వర్గమును చంపుటకుకైనా వెనుకాడడము లేదు. వాటినే మత ఘర్షణలు అని అంటున్నారు. అదే విషయమునే (23-53) లో వ్రాశారు.


ఈ వాక్యముకంటే ముందు వాక్యములో అనగా (23-52) లో ఏమున్నదో ఒకమారు చూస్తే దేవుడు మనుషులను తయారు చేసిన ఉద్దేశ్యము వేరు, మనుషులు ప్రవర్తించే ప్రవర్తన వేరని తెలియుచున్నది.


(23-52) ''నిశ్చయముగా మా ఈ ధర్మము ఒకే ధర్మము. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి.''


ఈ వాక్యమును చూస్తే నేను ముందు చెప్పినట్లు మనుషులందరినీ దేవుడు ఒకే సమాజముగా తయారు చేసి, అందరికీ ఒకే ధర్మమును తయారు చేసి ఇచ్చాడు. అందరికీ ఆయనే దేవుడు. అయినా మనుషులు మతమను మాయలో పడిపోయి, తమ మానవ సమాజమును ముక్కలుగా చీల్చు కొన్నారు. తన ధర్మమును వేరు వేరుగా చీల్చుకోవడమేకాక దేవున్ని కూడా వేరువేరుగా చెప్పుకొంటున్నారు.





అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

104. వెనుక జన్మ జ్ఞాపకము ఉండదు. (23-99, 100)

(23-99, 100) ''చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కు పంపించు, నేను వదలివచ్చిన లోకములోకే వెళ్ళి సత్కార్యము చేస్తాను అని అంటాడు. ముమ్మాటికీ అలా జరుగదు. అది అతడు అనుకొంటున్న ఒకమాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉంటుంది.''


ఇంతకుముందు మరణమును గురించి పూర్తిగా చెప్పియున్నాము. అదే విషయమునే తిరిగి ఇక్కడ చెప్పుచున్నాము. మనిషి మరణ సమయము ఒక్క క్షణకాలము కూడా ఉండదు అని చెప్పాను. మనిషికి వెనుకటి జన్మ జ్ఞాపకాలు ఉంటే పై వాక్యములో చెప్పినట్లు అడిగేవాడే. అయితే మనిషి మరణ సమయములోనే మనస్సు కూడా నశించి పోయి ఉండుట వలన మరణముతోనే వెనుకటి జ్ఞాపకాలన్నీ పోయి ఉండును. ఆ సమయములో ఏమీ తెలియని స్థితిలో మనిషియుండును. ఆ స్థితిలో మనిషిని ఒక గుడ్డలో వేసి మూసివేసినట్లు ఉండుట చేత ఏమీ అడగలేని స్థితిలో ఉండును. శిశు శరీరములో ప్రవేశించినప్పుడు ఏ భాష తెలియక తన భావమును తెలుపుటకు ఏమి చేయాలో తెలియకపోవడము వలన తనకున్న కష్టమును ఏడ్పుతో తెలుపుట తప్ప ఏమీ చేయలేకయున్నప్పుడు, అతను ఏ గుణములు పని చేయని అయోమయ స్థితిలో ఉండును. వెనుకటి జన్మ యొక్క సమాచారమును ఏమీ తెలియకుండా ఒక అడ్డుగుడ్డ వేసి మూసివేసినట్లు ఉండును. ఒక్కమారు పాత జ్ఞాపకములన్నీ మూసివేయడము వలన ఏమీ తెలియని స్థితిలో జీవుడు ఉండిపోయి తనదంతా పోయినదను భావముతో ఏడ్చను మొదలు పెట్టును. అంతటితో వెనుకటి సంబంధమంతా జ్ఞాపకము లేని, జ్ఞాపకము రాని స్థితిలో ఉండిపోవును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

105. దేవుడు దీపము, దేహము చిమ్నీ. (24-35)

(24-35) ''అల్లాహ్ ఆకాశాలకూ భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలియున్నది. ఆ గూటిలో ఒక దీపము ఉంది. ఆ దీపము ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రము మాదిరిగా ఉంది. ఆ దీపము శుభప్రదమైన ఒక జైతూను వృక్షము నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షము తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు. దాని నూనె అగ్ని తగలక పోయినా దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లాహ్ తానుకోరిన వారికి తన కాంతివైపు మార్గదర్శకత్వము వహిస్తాడు. ప్రజలకు అర్థము అవటానికి ఈ ఉపమానములను అల్లాహ్ విశధపరుస్తున్నాడు. అల్లాహ్‍కు అన్ని విషయములు క్షుణ్ణంగా తెలుసు.''


ఈ వాక్యము చూచేదానికి చాలా కష్టముగా యున్నట్లు కనిపించు చున్నది. కొందరికి ఈ వాక్యము కొడి గోత్రము లేనిదిగా కనిపించిననూ మాకు మాత్రము సులభముగా యున్నట్లు కనిపించుచున్నది. నా లెక్క ప్రకారము మనిషి శరీరములోనే ఈ వాక్యమునకు వివరము గలదు. ఎప్పుడయితే వాక్యములో ''ఆకాశములు'' అని బహువచనములో చెప్పారో అప్పుడు శరీరములోనికి ద్యాస పోవలసియున్నది. ఆకాశములు భూమికి కాంతియని చెప్పారు. ఆ కాంతియే అల్లాహ్యనీ చెప్పారు. శరీరమంతా వ్యాపించియున్న కాంతి అల్లాహ్ యని చెప్పారు. గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లు గలరు. అందులో పెద్ద అల్లాహ్‍ను గురించి ఆయన శరీరములో వ్యాపించియున్న కాంతిగా చెప్పారు. ఒక దీపము ఉంటే ఒకచోట కొంత పరిధిలో వెలుగుయుండును. శరీరమంతా వెలుగు ఉంటే శరీరమంతా ఎన్నో కోట్ల దీపములు ఉన్నట్లు చెప్పవచ్చును. ఎన్నో దీపములు శరీరమంతా ఎన్నో కాంతి పుంజములుగా యున్నవి. కావున శరీరమంతా కాంతియున్నది. ఒక కాంతి ఒకగూటిని పోలియున్నది. శరీరములో గల కాంతి ఎన్నో దీపములుగా యుండగా, ఒక్కొక్క కాంతి ఒక గుండ్రని గూటిలో యున్నది. గుండ్రని గూడు గాజు చిమ్నీలాగా ఉన్నది. అలాగ గుండ్రని గూడు గాజు చిమ్నీలాగా ఉండుట వలన గూటిలో దీపము బయటికి కనిపించడమే కాక దీపము కాంతి గూటి నుండి బయటికి వ్యాపించి యున్నది. గాజు చిమ్నీగా యున్న గూడు మెరిసే నక్షత్రముగా జ్ఞానుల దృష్ఠికి కనిపించుచున్నది. నక్షత్రము అనగా మోక్షము అని అర్థము. ఒకగూడు గాజు చిమ్నీలాగా యున్నా అది పరమాత్మ శక్తితో నిండుకొని యుండుట వలన నక్షత్రము అని పోల్చి చెప్పారు. దీపము వెలుగుచున్నదంటే దానికి రెండు ముఖ్యమైన పదార్థములు కావలెను.


ఒకటి మండే వాయువు, రెండు కాలే పదార్థము. కాలే పదార్థము ఒక నూనెవలె చెప్పారు. నూనె శరీరమంతా వ్యాపించే ఆహారములో లభించుచున్నది. ఆహారమును వృక్షముగా చెప్పారు. ఆహారము శరీరమంతా వ్యాపించి కుడి ఎడమ రెండువైపులా వ్యాపించియుండుట వలన ఆ వృక్షము ఒక వైపుకు కాకుండా రెండువైపులా వ్యాపించి యుండుట వలన వృక్షము తూర్పుకు చెందదు, పడమరకు చెందదు అని చెప్పారు. శరీరములోని ఆహారములో కాల్చబడు భాగముగా మనము తిన్న ఆహారములో పిండిపదార్థములని (గ్లూకోజ్) యని చెప్పవచ్చును. మండే నూనెగా గ్లూకోజ్ యుండగా, మండించే వాయువుగా ప్రాణవాయువు ఉన్నది. శరీరమంతా వ్యాపించిన ధాతుకణములు ఒక్కొక్కటి ఒక గాజు చిమ్నీగా యుండడము, అందులో నూనెవలె యున్న ఆహారములో గల పిండిపదార్థములుండగా పిండి పదార్థము శరీరమంతా వ్యాపించిన ప్రాణవాయువు చేత దానంతట అదే మండుచున్నట్లు తెలియుచున్నది. శరీరమంతా ధాతుకణములు ఒకదానిమీద ఒకటి పేర్చినట్లు కలదు, కావున వాటినుండి వచ్చే కాంతిని కాంతిపై కాంతి ఉన్నది అని అన్నారు. అల్లాహ్ తాను కోరినవారికి తన కాంతివైపు మార్గదర్శకత్వము వహిస్తాడు అని వాక్యములో చెప్పారు. శరీరము అంతా వ్యాపించిన కాంతిని పరమాత్మగా చెప్పుకొంటే శరీరములో ఒకచోట యున్న జీవుడు పరమాత్మలో ఐక్యమగునట్లు దేవుడు దర్శకత్వము చేయును. దేవుడు అనుకొంటే ఒక్కచోట యున్న జీవుడు శరీరమంతా వ్యాపించిన కాంతిలో (దేవునిలోనికి) ఐక్యమై పోవును. శరీరములో జీవాత్మ పరమాత్మలోనికి ఐక్యమైపోయి తాను కూడా శరీరమంతా వ్యాపించిపోవుచున్నాడు. మనిషి శరీరములోనే వ్యాపించిన పరమాత్మలోనికి ఐక్యమగు విధానమును శరీరములోని కాంతిలో కలిసిపోవునట్లు ఉపమానముగా తెలిపారు. ప్రజలకు అర్థమగుటకు ఈ ఉపమానమును అల్లాహ్ విశధపరుస్తున్నాడు అని చెప్పారు. అంతేకాక దేవునికి అన్ని విషయములు వివరముగా తెలుసు, కావున శరీరములో అందరికీ ధాతుకణములలో జరిగే విధానమును వర్ణించి చెప్పాడు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

106. రేయింబగళ్లు మార్చుతున్నాడు మేఘముల విషయము. (24-43, 44)

(24-43, 44) ''అల్లాహ్మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరము కలపటాన్ని ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలుపొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించడము లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షము కురిపించటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే వడగండ్ల పర్వతాలనుండి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరినవారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాలనుండి వెలువడే మెరుపుతీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.''


(24-44) ''అల్లాహ్ రేయింబగళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠము ఉంది.''


ఈ రెండు వాక్యములలో చెప్పిన విషయము అందరికీ క్రొత్తగా యున్నా, ఇందులో గుణపాఠము ఏమి యున్నదో తెలియకున్నా, ఈ విషయములను కొన్ని సంవత్సరముల పూర్వమే నేను చెప్పియుండడము వలన ఇక్కడ వాక్యములలో యున్నది నాకు సులభముగా అర్థమయినది. గతములో ''మేఘము ఒక భూతము'' అనియూ, ''భూతము ఒక రోగము'' అనియూ చెప్పిన ప్రసంగములు గలవు. వాటి ఆధారముతో ఇప్పుడు చెప్పునది ఏమనగా! శరీరము లోపల దేవుడయిన ఆత్మ శరీరము లోపల గల 25 భాగములకు అధిపతిగా దేవుడుగాయుంటూ శరీర పాలన చేయుచున్నాడు. శరీరము బయట అణువణువునా వ్యాపించిన పరమాత్మ బయట ప్రపంచమునకు దేవుడయినా ఆయన స్వయముగా పని చేయువాడు కాడు. శరీరములో ఆత్మ 25 భాగముల చేత పనిని చేయిస్తూ శరీర యంత్రాంగమును నడిపినట్లు, బయట ప్రపంచమును పరమాత్మ నడుపకున్ననూ ఆయన ఏ జోక్యము చేసుకోకున్ననూ, ఆయన ఆధీనములో యున్న కోట్లాది మంది గ్రహములు, భూతములు బయట ప్రపంచ కార్యములను చేయుచున్నవి. అందులో భాగముగానే ప్రపంచమంతా మేఘములు వర్షమును కురిపిస్తుయున్నవి. అంతేకాక వడగండ్ల వాన కూడా వస్తున్నది. పరమాత్మ ఆధీనములోని మేఘములు అను భూతములు బయట ప్రపంచములో అనేక కార్యములను చేయుచున్నవి.


ప్రపంచములో ఎక్కడ సునామీలు వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ తుఫానులు వచ్చినా, ఎక్కడ భూకంపములు వచ్చినా అవన్నియూ భూతముల వలన జరుగుచున్నవి. భూమిమీద పెద్దపెద్ద ప్రమాదములు, రోడ్డు ప్రమాదములు, యుద్ధములు, సామూహిక మరణకాండ మొదలగునవి ఎక్కడ జరిగినా అవి అన్నియూ గ్రహముల వలన జరుగుచున్నవని తెలియుచున్నది. ఇది మాత్రమేకాక మనకు తెలియని ఎన్నో కార్యములను గ్రహములు, భూతములు చేయుచున్నవి. భూమిమీద క్రొత్త రోగములు రావాలన్నా, పాత రోగములు పోవాలన్నా భూతముల పాత్ర ఎంతో యున్నదని చెప్పవచ్చును. గతములో ఎప్పుడూలేని కొత్త రోగము భూమిమీద ప్రజలలోనికి రావాలంటే అది ఒక్క భూతముల చేతనే యగునని చెప్పవచ్చును. అంతవరకూ ఎక్కడా లేని క్రొత్త రోగ క్రిమిని భూతములు తయారు చేసి పంపుచున్నవి. గ్రహములు, భూతములు రెండు జాతులు పరమాత్మ ఆధీనములో యుండి, పరమాత్మ సేవకులవలె పనులు చేయుచుండినా, బయటికి మాత్రము పరమాత్మకు, భూతములకు, గ్రహములకు ఎటువంటి సంబంధము లేనట్లే యుండును. దేవుడు (పరమాత్మ) తాను స్వయముగా భూతములకు, గ్రహములకు ఎటువంటి ఆదేశములు ఇవ్వకున్నా పరమాత్మ మనస్సులోని తలంపులను గ్రహించిన భూతములు, గ్రహములు వెంటనే ఆ పనిని చేయుచున్నవి. అందువలన అల్లాహ్ అనుకొన్న వెంటనే ఆ పనులు అయిపోవుచున్నవని చాలా వాక్యములలో వ్రాశారు.


గ్రహముల వలన పిడుగులు పడుచున్నవి. వడగండ్లు కురియు చున్నవి. వర్షము వర్షించుచున్నది. మెరుపులు పుడుతున్నవి, పిడుగులు పడుచున్నవి. ఎక్కడ వర్షము కురియాలో, ఎక్కడ పిడుగులు పడాలో, ఎప్పుడు మెరుపులు మెరియాలో అన్నీ అల్లాహ్యైన పరమాత్మకు తెలియకుండా ఏమీ జరుగవు. సంకల్పము దేవునిదే అయినా కార్యములను చేయునది గ్రహములు, భూతములు. మూడవ పురుషుడయిన పరమాత్మ ఏ గ్రహముతోనూ, ఏ భూతముతోనూ ప్రత్యక్ష సంబంధముగానీ, పరోక్ష సంబంధముగానీ పెట్టుకొన్నట్లు ఎక్కడా కనిపించదు. ఏ సంబంధము లేని వానిగా పరమాత్మయున్నా, ఆయన అనుకొన్న పనులన్నియూ గ్రహముల వలన భూతముల వలన వెంటనే జరిగిపోవుచుండును. పగలు రాత్రి మారడములో గ్రహముల పని, చావు పుట్టుకలు కలుగడములో భూతముల పని, ఇట్లు బయట జరుగు మార్పులన్నిటికి పరమాత్మ పాలనలో సాగు భూతములు, గ్రహములు కారణమని తెలియుచున్నది.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

107. గీటురాయిని అవతరింపజేసినవాడు అల్లాహ్‍యే. (25-1)

(25-1) ''సమస్త లోకవాసులను హెచ్చరించే వానిగా ఉండటానికి గానూ, తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.''


భూమిమీద తన జ్ఞానమును తెలుపు నిమిత్తము మూడవ పురుషుడు, భగవద్గీతలో పరమాత్మ, బైబిలులో పరిశుద్ధాత్మయనబడుచూ ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యను పేరుతో చెప్పబడువాడు అయిన దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలియజెప్పు నిమిత్తము మొదట ప్రథమ దైవ గ్రంథముగా భగవద్గీతను తయారు చేయించాడు. వ్యాసునిచే వ్రాయబడిన గ్రంథమునకు భగవద్గీతయని వ్యాసుడు పేరు పెట్టాడు. భగవద్గీతను చెప్పినవాడు శ్రీకృష్ణుడు కాగా, వ్రాసినవాడు, పేరు పెట్టినవాడు మనిషి అయిన వ్యాసుడు. భగవద్గీతగా వ్రాయబడిన దేవుని జ్ఞానమునకు దానిని చెప్పిన కృష్ణుడు ''తౌరాతు'' యని పేరుపెట్టి భగవద్గీతను మోషే ప్రవక్తకు ఇవ్వడము జరిగినది. అలా తౌరాతుయని పేరు మార్చబడిన తర్వాత అందులోని జ్ఞానమే ఇంజీలుగా (బైబిలుగా) తయారైనది. తర్వాత తౌరాతు లోని జ్ఞానమే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్గా తయారయినది. పేర్లు మార్చి వ్రాయబడినా, భాష మార్చి వ్రాయబడినా ప్రాంతములనుబట్టి వ్రాసే విధానమును మార్చి వ్రాసినా మూడు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని చెప్పవచ్చును. మూడు దైవగ్రంథముల పేర్లు వేరయినా, భాష వేరయినా భావము ఒక్కటేయని తెలియుచున్నది.


మూడు దైవగ్రంథములను చదివినవాడు అరుదుగా ఉండగా, మూడిటిలో ఒక్కదానిని చదివినవారు కొందరు గలరు. హిందువులు భగవద్గీతను చదువగా, క్రైస్థవులు బైబిలును చదువగా, ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును చదివారని చెప్పవచ్చును. అట్లని హిందువులు అందరూ భగవద్గీతను చదవలేదు. అట్లే క్రైస్థవులు అందరూ బైబిలును చదవలేదు. ముస్లీమ్‍లందరూ ఖుర్ఆన్ గ్రంథమును చదవలేదు. ఆయా మతములలో ఆయా గ్రంథములను తమ గ్రంథములని చెప్పుకొని కొందరు చదివిన వారు గలరు. అయితే ఆ గ్రంథములనుండి వారికి అర్థమయినది బహు స్వల్పమని చెప్పవచ్చును. మాకు అంతా అర్థమయినది అని చెప్పువారున్నా వారికి అర్థమయినది అంతా తప్పుదారి అయిన అపమార్గమే అర్థమయినది. వారికి అర్థమయిన దానిప్రకారము తమకు తెలిసినదే సత్యము అని అనుకొనుచుందురు. అపమార్గములో అర్థమయినదే నిజమైన జ్ఞానమనుకొని, నిజమైన జ్ఞానమును జ్ఞానమే కాదన్నట్లు మాట్లాడుచూ, జ్ఞానులను సహితము హేళనగా మాట్లాడువారు తయారైనారు. అటువంటి వారిని ఎదురించి జ్ఞానమును జ్ఞానముగా, అజ్ఞానమును అజ్ఞానముగా తేల్చి చెప్పుటకు శాస్త్రబద్దత యను గీటురాయిని ముందే మూడు దైవగ్రంథముల యందు దేవుడు ఇమిడ్చియున్నాడు. దైవ గ్రంథములలోని గీటురాయిని ఉపయోగించి ఏది దైవ జ్ఞానమో, ఏది దైవజ్ఞానము కాదో తేల్చి చెప్పవచ్చును. గీటురాయి అను పేరును బంగారును పరీక్షించుటలో ఉపయోగించు దానికి పెట్టిన పేరని తెలియవలెను. గీటురాయి అనగా పరీక్షించు రాయి అని అర్థము. బంగారు అత్యంత విలువైన లోహము. ఆ లోహములో ఇతర లోహములను కలిపి అది అంతయూ స్వచ్ఛమయిన బంగారుగా నమ్మించుచుందురు. అటువంటి సమయములో వారు చేయు మోసమును గుర్తించుటకు, స్వచ్ఛమయిన బంగారును పరీక్షించుటకు, వారు అందులో ఏవయినా లోహములు కలిసియుంటే తెలియజెప్పుటకు గీటురాయిని ఉపయోగించి చూస్తుందురు. దానివలన బంగారులోని స్వచ్ఛత, అసలు, నకిలీ రెండూ తెలిసిపోవును. దేవుడు మనుషులను గీటురాయివలె దైవగ్రంథములలోకి శాస్త్రబద్దతను ఇచ్చాడు. శాస్త్రబద్దతను గీటురాయిగా ఉపయోగించి ఎంతటి జ్ఞానమునయినా చూడవచ్చును. అందులోని స్పష్టతను తెలియవచ్చును.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

108. భూమి ఆకాశముల రహస్యము తెలిసినవాడు. (25-6)

(25-6) ''ఓ ప్రవక్తా! వారికి చెప్పు, భూమి ఆకాశాలలో ఉన్న రహస్యాలన్నిటినీ ఎరిగినవాడు, దీనిని (ఖుర్ఆన్‍ను) అవతరింప జేసాడు. ఆయన అమితముగా క్షమించేవాడు, అపారముగా కనికరించేవాడు.''


ఈ వాక్యములో చివరిలో దేవుడు అమితముగా క్షమించేవాడు, అపారముగా కనికరించేవాడు అని వున్నది. క్షమించేవాడు కనికరించేవాడు అను పదములు దాదాపు ఒకే అర్థమునే ఇచ్చునవిగా నిపించుచున్ననూ కొద్దిపాటి తేడా కలదని చెప్పవచ్చును. కనికరించేవాడు సహాయమును చేయగలడు. క్షమించేవాడు ఉన్న తప్పులను లేకుండా క్షమించగలడు. కనికరము చేయువాడు సహాయము చేయగా, క్షమించువాడు ఉన్న తప్పును లేక ఉన్న పాపమును క్షమించి లేకుండా చేయగలడు. ఖుర్ఆన్ గ్రంథమును అవతరింపజేసిన దేవుడు అనగా మూడవ ఆత్మయిన పరమాత్మయని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథమును తయారు చేయుటకు శరీరములో జీవుడు, ఆత్మ, పరమాత్మ ఎలాగున్నారని తెలిసియుండాలి. శరీరములోని యంత్రాంగమును, అందులోని జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను పూర్తిగా తెలిసినవాడు ఖుర్ఆన్ గ్రంథమును తెలియజేశాడు అని తెలియుచున్నది. శరీర అంతర్గత జ్ఞానమే ఖుర్ఆన్‍లో ఎక్కువ శాతము ఉండుట చేత, దానిని చెప్పినవాడు అల్లాహ్యని చెప్పుచూ ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు యని చెప్పారు.


మనిషి చేసుకున్న పాపములను క్షమించేవాడు దేవుడు. మనిషి పాపము క్షమించబడుటకు మనిషి దేవునికి ఇష్టునిగా ఉండవలెను. దేవునికి ఇష్టుడుగా మారుటకు మనిషి దేవుని జ్ఞానము పూర్తి తెలిసియుండాలి. అలా మనిషి జ్ఞాని అయినప్పుడు దేవుడు మనిషి పాపమును క్షమించగలడు. అలా దేవుడు పాపమును లేకుండా చేయుటకు, మనిషి జ్ఞానిగా మారుట అవసరము. మనిషి జ్ఞానిగా మారుటకు దేవుడు కనికరించి దైవజ్ఞానమును కొంతవరకు తెలియజేయును. మనిషి జ్ఞాని అగుట వలన మనిషి పాపము లేకుండా పోవును. అందువలన వాక్యములో దేవుడు క్షమించేవాడు, కనికరించేవాడు అని చెప్పారు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

109. ఆరు దినముల సృష్ఠి. (25-59), (32-4)

(25-59) ''ఆయనే ఆకాశాలనూ, భూమిని వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినములలో సృష్ఠించాడు. ఆ తరువాత అధికార పీఠము పై ఆశీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే ఆయనను గురించి తెలిసిన వానిని అడుగు.''


(32-4) ''అల్లాహ్‍యే ఆకాశాలనూ, భూమినీ వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి?''


ఈ వాక్యములలో ''ఆకాశాలను భూమిని వాటి మధ్యయున్న సమస్తమును ఆరు దినములలో సృష్ఠించాడు'' అని ఉన్నది. ఇది పూర్తి సూక్ష్మ జ్ఞానముతో కూడుకొన్న వాక్యము అయినందున వాక్యములో పైకి చెప్పినది ఒకటి ఉండగా, దాని అంతరార్థము మరొకటి ఉండును. ఆకాశములు, భూమి అనగా శరీరము అని అర్థము చేసుకోవాలని ముందే చాలామార్లు చెప్పాము. ఆకాశములు భూమి మధ్యలోగల సమస్త వస్తువులు అనగా తల, కాళ్లు మధ్యలోగల అన్ని అవయవములు అని అర్థము. దీనినిబట్టి మొత్తము శరీరమును దేవుడు తయారు చేశాడు. ఇక్కడ బాగా ఆలోచిస్తే బయట ప్రపంచమును సృష్ఠించిన దేవుడు శరీరములను తయారు చేయుటకు మరొక దేవున్ని సృష్ఠించాడు. ఆయనే ఆత్మ. ఆత్మను సృష్ఠించిన మొదటి దేవుడు ఆత్మకంటే వేరుగాయున్న పరమాత్మ. పరమాత్మ ఆత్మను సృష్ఠించి జీవరాసులను పుట్టించుటకు, చంపుటకు, చనిపోయిన తర్వాత తిరిగి పుట్టించుటకు తగిన అధికారమును ఇచ్చాడు. సర్వ జీవరాసులను సృష్ఠించిన ఆత్మయే సర్వ జీవరాసులకు ఆరాధ్య దైవముగా ఉండునట్లు పరమాత్మయిన దేవుడు ఆత్మ దేవున్ని నియమించాడు. మొదటి దేవుడయిన పరమాత్మను ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యని అంటున్నారు. అదే విధముగా రెండవ దేవుడయిన ఆత్మను కూడా ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ అని అంటున్నారు. మొదటి దేవున్ని, రెండవ దేవున్ని ఇద్దరినీ ఒకే పేరుతో ఉచ్ఛరించడము వలన వాక్యములలో అల్లాహ్ అను పదము వచ్చినప్పుడు అక్కడ చెప్పబడినది ఏ అల్లాహ్యని ఆలోచించి చూడవలసిన అవసరమున్నది.


మొదటి అల్లాహ్ బయటి ప్రపంచమును సృష్ఠించినప్పుడే రెండవ అల్లాహ్‍ను తయారు చేసి ఆయనకు సర్వ అధికారములు ఇచ్చాడు. దేవుని చేత అధికారములు పొందిన దేవుడు సర్వ జీవరాసుల శరీరములను తయారు చేశాడు. శరీరములను తయారు చేయుటకు ఆరు దినముల వ్యవధి పట్టిందని వాక్యములో చెప్పినట్లు కలదు. ఇది సూక్ష్మవాక్యము అని మరువకూడదు. అందువలన దీనిలోని అర్థమును తెలియుటకు ప్రయత్నము చేయాలి. దాని ప్రకారము చూస్తే ఒక పగలు, ఒక రాత్రి కలిసి ఒక దినముగా చెప్పవచ్చును. అలాగే లోపలి శరీరములో ఒక నాడీకేంద్రము, ఒక గ్రంథి రెండూ కలిసి శరీరమును నడుపుటకు ఉపయోగపడు ముఖ్యస్థానములు. ఇవి శరీరములో ఆరు జతలు కలవు. ఈ ఆరు జతలను ఆరు దినములుగా చెప్పారు. ఇక ఏడవ జోడీని రెండిటినీ కలిపి అధికార పీఠము అని అన్నారు. ఏడవ నాడీకేంద్రము మెదడుకాగా, ఏడవ గ్రంథి తల మధ్య భాగములో అనగా మెదడు మధ్య భాగములో కలదు. అందువలన తలయే శరీరమును సృష్ఠించిన అల్లాహ్‍కు నివాస కేంద్రముగా యున్నదని చెప్పవచ్చును. దేవుడు ఆరు రోజులు శరీరమును తయారు చేసి, అధికార పీఠము మీద అధిష్ఠించి విశ్రాంతి తీసుకొంటున్నాడని వ్రాసిన దానినిబట్టి దేవునికి ఆరు రోజుల శరీరమును సృష్ఠించలేదని, ముందే సృష్ఠించబడిన ఆరు నాడీకేంద్రములను ఒక్క క్షణములో ఆత్మ ఎక్కిపోయి ఏడవ కేంద్రములో స్థానము ఏర్పరచుకొనుచున్నది. తల్లిగర్భములో తొమ్మిది నెలలుగా పెంచిన శరీరములో ఒక్కమారుగా ఆత్మ జీవునితో సహా చేరుచున్నది. ఆరు దినములు అని చెప్పినది తయారు చేయు కాలము కాదని, తయారు చేసిన స్థానములని తెలియవలెను.


జనన సమయములో ఆత్మ జీవాత్మను తీసుకొని వచ్చి తల్లిగర్భములో తయారుకాబడి బయటికి వచ్చిన శరీరములో చేరుచున్నది. అలా చేరినప్పుడు ఒక్క క్షణములోనే ఆరు కేంద్రములను దాటి ఏడవ కేంద్రమయిన తలలోనికి జీవుడు, ఆత్మ చేరడము జరుగుచున్నది. ఏడవ కేంద్రమయిన తలయే ఆత్మకు అధికార స్థానము, జీవునికి అనుభవ స్థానము. అలా చేరిన ఆత్మ తనను నిర్మించిన దేవుని ఆజ్ఞను అనుసరించి జీవున్ని కర్మానుసారము శిక్షించడము జరుగుచుండును. అట్లే సుఖములను ఇవ్వడము జరుగుచుండును. అంతేకానీ రెండవ ఆత్మ కరుణించడముగానీ, దయ చూపడము గానీ ఉండదు. కరుణామయుడుగా, దయామయుడుగా క్షమాశీలుడుగా, కృపాకరుడుగా ఆత్మను నిర్మించిన పరమాత్మ ఉండును గానీ, ఆత్మ నిబద్దతతో కూడుకొని పని చేయుచుండును. ఆత్మ కరుణామయుడు కాదు. పరమాత్మ శిక్షించువాడు కాదు.



అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

110. పరలోకానికి సంబంధించిన జ్ఞానము స్థంభించి పోయినది. (27-66)

(27-66) ''అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానము స్థంభించి పోయింది. పైగా దాని గురించి వారు సంశయములో పడియున్నారు. కాదు, దానిపట్ల వారు అంధులై పోయారు.''


ఇది సూక్ష్మ జ్ఞానవాక్యము కాకపోయినా చెప్పినది చెప్పినట్లు అర్థము చేసుకొంటే చాలు. మనుషులకు తెలిసిన లోకములు ముఖ్యముగా రెండు గలవు. అందులో ఒకటి స్వర్గలోకము, రెండు నరకలోకము. ఈ రెండు పేర్లు తెలిసినంత మాత్రమున ఏమీ ఒరిగిపోయినది ఉండదు. ఆ రెండు లోకములు ఎక్కడున్నాయో తెలియుట ముఖ్యము. అయితే అందరూ సులభముగా ఆ లోకములను గురించి చెప్పుచూ స్వర్గ, నరకములు రెండూ పైన యున్నాయని చెప్పుచుందురు. స్వర్గలోకములోనికి 'దేవుని ఆరాధన నమాజ్ చేసినవారు పోవుచుందురని' చెప్పుచుందురు. జ్ఞానమార్గములో యున్న వారందరినీ అల్లాహ్ స్వర్గమునకు పంపుననీ, జ్ఞానమార్గములో లేని వారందరినీ అల్లాహ్ నరకమునకు పంపునని చెప్పుచుందురు. చాలా మంది నోట స్వర్గ, నరక లోకములుండునుగానీ 'పరలోకము' అను మాటే యుండడము లేదు. చాలామంది ఖుర్ఆన్ గ్రంథమును చదవకుండానే, దానిలో జ్ఞానము ఏమి ఉందని తెలియకుండానే, వారు వినిన మాటలను బట్టి స్వర్గ, నరకములను గురించి మాట్లాడుచుందురు. వారు చెప్పునది తప్పని తెలిసి అట్లుకాదు, మీరు అనుకొనేది తప్పు అని చెప్పితే ఆ మాటను ఏమాత్రము లెక్కచేయక మా పెద్దలు అల్లాహ్ చెప్పిన విషయమునే చెప్పు చుందురు. అందువలన మా పెద్దలు చెప్పిన మాటనే చెప్పుచున్నాము అని అంటారు.


ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు చెప్పినది ఏముందో చూడకుండా, వారి పెద్దల మాటలనే నమ్ముచుందురు. ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినది అర్థము కానంతవరకూ ఎవరూ జ్ఞానములో పెద్దవారు కాదు. వయస్సులో పెద్దవారు అయినంత మాత్రమున ఏమీ ప్రయోజనము లేదు. వయోవృద్ధులు ఎందరున్నా ఏమీ ప్రయోజనము ఉండదు. జ్ఞానములో వృద్దులు అయిన వారు చిన్నవయస్సు కలవారైనా ఫరవాలేదు. అందువలన జ్ఞానవృద్ధుల మాటనే వినవలెనని చెప్పుచున్నాము. అందరికీ అలవాటైపోయిన విషయము ప్రకారము మనిషి చనిపోతే అతడు ప్రళయ కాలము వచ్చు వరకు పూడ్చిపెట్టిన గోరీలలోనే ఉండుననీ, ఎప్పుడో ప్రళయము వచ్చినప్పుడు భూసమాధిలో యున్నవారిని దేవుడు లేపి, వారు చేసుకొన్న తప్పులను అన్నిటిని లెక్కించి నరకమునకు, అతడు చేసిన మంచి పనులను లెక్కించి స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు. ఐదు పూటల నమాజు చేసినవారిని దేవుడు తప్పక స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు. ఈ విధముగా దేవుని జ్ఞానము కల్గిన వారంతా స్వర్గమునకు పోవుదురని అనుకొనుచున్నారు తప్ప వారికి పరలోకము ఒకటున్నదనీ, అది స్వర్గనరకములవలె కాకుండా అది ఒక ప్రత్యేకమైన లోకమని తెలియకుండానే అందరూ స్వర్గమును గురించి చెప్పుచున్నారు.


ఖుర్ఆన్ గ్రంథములో పరలోకమును గురించి చెప్పియున్నా 'పరలోకము' అనుమాటను స్వర్గలోకమేయని అనుకొంటున్నారు. వారి పెద్దలు చెప్పిన మాటలు వారిలో గట్టిగా నిలిచిపోయాయి. అందువలన వారు స్వర్గలోకమును మించిన లోకము లేదని, మనిషి దేవున్ని ఆరాధించినా అతను చివరికి స్వర్గమునకే పోయి అక్కడ హాయిగా ఉండునని అనుకొంటున్నాడు. ప్రపంచ సంబంధ పుణ్యములకు స్వర్గము, అట్లే ప్రపంచ సంబంధ పాపములకు నరకము వచ్చుననీ, దేవున్ని ఆరాధించినవాడు పరలోకమును చేరునని ఎవరికీ తెలియకుండా పోయినది. మేము స్వర్గ నరక లోకమునకు అతీతమైనది 'పరలోకము' అని చెప్పినా ప్రజలు అజ్ఞానములో కూరుకొని పోయి ఉండుట వలన మా మాటను లెక్క చేయడము లేదు. స్వర్గము, నరకములు అనునవి ప్రత్యేక లోకములుగా లేవని, అవి భూమిమీద మనుషుల అనుభవములనుబట్టి ఉండునవే తప్ప వేరుగా యుండు లోకములు కాదని తెలియలేకపోయారు. మనిషి గతజన్మలో చేసుకొన్న పాపమునుబట్టి నరకరూపములో యున్న కష్టములను అనుభవించుచుండును. అట్లే మనిషి చేసుకొన్న ప్రపంచ సంబంధ పుణ్యమును బట్టి స్వర్గరూపమైన సుఖములను అనుభవించడము జరుగు చుండును. మనిషి అనుభవించే కష్ట సమయమును నరకమనీ, అట్లే మనిషి అనుభవించే సుఖ సమయమును స్వర్గమని అనవచ్చును. అంతేగానీ స్వర్గ, నరకములు ప్రత్యేక లోకములుగా లేవు. అట్లే పరలోకము అనునది కూడా ఎక్కడోయున్న లోకము అని అనుకోకూడదు. ఎవడయితే కర్మలు లేకుండా చేసుకొని, జనన మరణములకు అతీతుడుగా మారిపోయి పరమాత్మయందు ఐక్యమైపోవునో వానిని పరలోకమును పొందాడు అని అనుచున్నారు. అంతేగానీ పరలోకము కూడా ప్రత్యేకమైన లోకము కాదు. పరమాత్మ ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి యున్నాడు. దేవుని లోనికి ఐక్యమై ముక్తి పొందినవాడు కూడా దేవుడు వ్యాపించిన చోటంతా వ్యాపించియున్నట్లే లెక్కించబడును.


ముక్తి లేక మోక్షము పొందినవాడు పరలోకము పొందినవాడని చెప్పవచ్చును. దీనినిబట్టి పరలోకము కూడా ఒక లోకము కాదని వారు ఉన్న స్థితిని లోకము అని అంటున్నాము తప్ప లోకమనునది ప్రత్యేకమైన దేశములాంటిదో, రాజ్యములాంటిదో కాదని తెలియవలెను. మనిషి సుఖములను అనుభవించు స్థితిని స్వర్గలోకము అని, దుఃఖములు పొందు స్థితిని నరకలోకమని, దేవునియందు ఐక్యమైయున్న స్థితిని మోక్షమని (పరలోకమని) చెప్పుచున్నారు. మనిషి ఎంతసేపు సుఖమును పొందు స్థితిలో ఉండునో, అంతసేపు స్వర్గలోకములో యున్నట్లు లెక్కించబడును. ఒక మనిషి ఒక అరగంట కాలము సుఖమును పొంది తర్వాత కష్టములను పొందు స్థితిలో చిక్కుకొనినట్లయితే, అతడు అరగంట కాలము స్వర్గ లోకములో యుండి, తర్వాత నరకలోకములోనికి ప్రవేశించినట్లగును. ఈ విధముగా ఒకరోజే అనేకమార్లు స్వర్గమును, అనేకమార్లు నరకమును మనిషి పొందుచున్నాడు. అందువలన మనిషికి స్వర్గనరకములు శాశ్వితముగా ఉండక కొద్దికాలము సుఖము (స్వర్గము), కొద్దికాలము దుఃఖము (నరకము) ఉండును. స్వర్గనరకములను పొందుచూ ఏ దానియందు స్థిరముగా లేకుండా మనుషులు ఉందురు. స్థిరత్వము లేని స్వర్గ నరకములు మనిషి జీవితములో నిత్యము వస్తూ, నిత్యము పోతూ ఉంటాయి. అయితే పరలోకము అలా కాకుండా ఒకమారు పరలోకమును పొందితే దానిని వదలిపోవునది అంటూ ఉండదు. పరలోకము స్వర్గ నరకములవలె అశాశ్వితమైనది కాదు. ఒకమారు పరలోకమును పొందితే అది శాశ్వితముగా నిలిచిపోవును. స్వర్గ, నరకములు శాశ్వితము కాదు కావున శాశ్వితము కాని వాటిని వదలి శాశ్వితమైన పరలోకమును పొందుటకు మనిషి ప్రయత్నము చేయాలి. అయితే నేడు పరలోకానికి సంబంధించిన జ్ఞానమే మనిషికి తెలియకుండా పోయినది. పై వాక్యములో చెప్పినట్లు పరలోకమును గురించిన సంశయములో పడిపోయిన మనుజులు అది ఉందా లేదాయనుకొనుచూ దాని విషయములో పూర్తి గ్రుడ్డివారై పోయారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

111. మేము లోగడ ఎవరికి గ్రంథమును ఇచ్చామో వారు దీనిని కూడా విశ్వసిస్తారు. (28-52)

(28-52) ''మేము లోగడ ఎవరికయితే గ్రంథము నిచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్)ను కూడా విశ్వసిస్తారు.''


అల్లాహ్, సృష్ఠికర్త, పరమాత్మ అను మూడు బిరుదులచేత పిలువబడు దేవుడు ప్రజలకు తన జ్ఞానమును తెలుపు నిమిత్తము మొదట కృతయుగములోనే 'జపర' అను పేరుతో మాటల రూపములో, పాటల రూపములో యున్న జ్ఞానమును చెప్పియున్నాడు. ఆనాడు దేవుడు తన సేవకులయిన ఆకాశ మేఘముల ద్వారా ఉరుములతో, మెరుపులతో జిబ్రయేల్‍కు (సూర్యునికి) చెప్పిన జ్ఞానము ఆనాడు గ్రంథరూపము కాలేదు. చివరకు ద్వాపర యుగమున అదే జ్ఞానమునే శ్రీకృష్ణుడు అను పేరుతో యున్న భగవంతుడు (దేవుని చేత పంపబడిన మనిషి) అర్జునుడు అను వ్యక్తికి చెప్పగా, అతడు వ్యాసుడు అనునతనికి తిరిగి చెప్పాడు. అర్జునుని ద్వారా వినిన వ్యాసుడు విన్న జ్ఞానమునంతటినీ గ్రంథరూపముగా వ్రాశాడు. అలా వ్రాసిన గ్రంథము పేరు వ్యాసుడు పెట్టిన మొట్టమొదటి పేరు ''భగవద్గీత''. తర్వాత భగవంతుడయిన కృష్ణుడే స్వయముగా పెట్టిన రెండవ పేరు ''తౌరాతు''. ఇది ఒక యుగము ముందు అనగా గడచిపోయిన ద్వాపర యుగములో దేవుడు ఇచ్చిన గ్రంథము. అప్పటి గ్రంథమును నేడు ఎవరు చదివినా ఇది మా జ్ఞానమేయని దానిని విశ్వసిస్తారు. అట్లే నేడు ఇచ్చిన అంతిమ దైవగ్రంథమును ద్వాపరయుగములో యున్నవారు నేడు చదివినా ఇది మా గ్రంథమేయని విశ్వసిస్తారు. మొదట దేవుడు ఇచ్చిన గ్రంథము పేరు భగవద్గీత లేక తౌరాతుయని చెప్పబడినా, దానిని జ్ఞానులు ప్రథమ దైవగ్రంథమని చెప్పుచున్నారు. నేడు దేవుడిచ్చిన గ్రంథము పేరు ఖుర్ఆన్ అయినా దానిని జ్ఞానులు అంతిమ దైవగ్రంథము అని అంటున్నారు. ముందు వచ్చినది, వెనుక వచ్చినదియని ప్రథమ, అంతిమ అని చెప్పినా అవి రెండూ సమానముగా దైవ గ్రంథములే అయిన దానివలన నేటి దానిని ఆనాటివారు చదివినా, ఆనాటి దానిని నేటివారు చదివినా రెండూ ఒకటేయని చెప్పుచూ రెండిటిని విశ్వసించగలరు. ఇదే విషయమునే క్రింది వాక్యములో కూడా చెప్పుచున్నారు చూడండి.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

112. మేము కృతయుగము నుండి ముస్లీమ్‍లుగా యున్నాము. (28-53)

(28-53) ''వారికి దీనిని (ఖుర్ఆన్‍ను) చదివి వినిపించినప్పుడు ''ఇది మా ప్రభువు తరపునుండి వచ్చిన సత్యము అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లీమ్‍లుగా యున్నాము'' అని వారు చెబుతారు.


ముస్లీమ్ అనగా దేవుని మీద విశ్వాసము గలవాడు యని అర్థము. నేడు ఇస్లామ్ మతము వచ్చిన తర్వాత ముస్లీమ్‍లు ఏర్పడినారని చెప్పుటకు వీలులేదు. ముస్లీమ్ అనే పదము, నమాజ్, జకాత్, రోజా అను పదములు కృతయుగము నుండి ఉన్నాయి. మొట్టమొదట ప్రపంచములో పుట్టిన భాష తెలుగు భాష. మొదటి భాషయిన తెలుగుభాషలోని తెలుగు పదములే నేడు చెప్పుచున్న నమాజ్, జకాత్, రోజా, ముస్లీమ్ అను పదములు. అవి ఈ మధ్య కాలములో తయారయిన అరబ్బీ భాషలో పలుకబడు పదములుగా యున్నా అవి కృతయుగములోనే తెలుగులో చెప్పబడిన పదములు అని చెప్పవచ్చును. ఇప్పుడు ఖుర్ఆన్‍ను చదివిన మేము ఇది ఆదిలోనే దేవుడు చెప్పిన సత్యమని గుర్తించగలిగినట్లు పూర్వపు జ్ఞానము కల్గిన వారు నేడు ఖుర్ఆన్ గ్రంథమును చదివినా ఇది ప్రథమ దైవగ్రంథములోని సత్యముయని చెప్పగలరు. నేడు అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ జ్ఞానమును ద్వాపర యుగములో తయారయిన ప్రథమ దైవ గ్రంథములోనిదేయనీ, దీని ప్రకారము మేము ముందుగానే ముస్లీమ్‍లుగా యున్నామని మేము, మాలాంటి వారు అందరూ చెప్పుచున్నారు. అంతేకాక నాతో సమానమైన ముస్లీమ్‍లు కొందరే ఉన్నారనీ, మిగతా వారంతా సంపూర్ణ జ్ఞానము తెలియని దానివలన సంపూర్ణ ముస్లీమ్‍లు కాదని చెప్పవచ్చును. మూడు దైవ గ్రంథముల జ్ఞానమును తెలిసినవాడే అసలయిన ధర్మములో యున్నట్లు, అసలయిన ముస్లీమ్ అయినట్లు అని చెప్పవచ్చును.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

113. పట్టణ వాసులపై ఆకాశము నుండి శిక్షను విధిస్తాము. (29-34, 35)

(29-34,35) ''మేము ఈ పట్టణ వాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణముగా ఆకాశమునుండి శిక్షను అవతరింపజేయు చున్నాము. మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసము స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము.''


ఈ పట్టణవాసులు అనగా కొంత అర్థము చేసుకోవలసిన అవసరమున్నది. వాసులు అనగా నివసించువారు అని అర్థము. పట్టణము అనగా! అనేకమంది నివశించుచున్న స్థలము అని అర్థము. ఏకము అనగా ఒకటియనీ, అనేకము అనగా ఒకటి కాకుండా ఒకటికంటే ఎక్కువమంది నివశించునది యని అర్థము. దీని ప్రకారము ఆధ్యాత్మిక అర్థము ప్రకారము మనము నివశించు శరీరమే పట్టణముగా యున్నదని తెలియుచున్నది. శరీరములో నివశించు జీవులు, దేవుడు చెప్పిన జ్ఞానమును లెక్కచేయక తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుచూ, తమకు తెలిసిన జ్ఞానమే గొప్పదని మాట్లాడుచుందురు. అలా మాట్లాడడము వలన దైవ గ్రంథములో చెప్పిన జ్ఞానమునకు పూర్తి వ్యతిరేఖమగుట వలన, వారి కోసము దేవుడు శిక్షను ఖరారు చేసి వారి మీదికి పంపుచున్నాడు. దేవుడు ఖరారు చేసిన శిక్ష వారి మీదికి ఆకాశమునుండి వచ్చుచున్నది. ఆకాశము శరీరములోనే ఏడు భాగములుగా యున్నది. ఏడు భాగములనుండి అనేక రోగముల రూపములో శిక్షలు అమలు చేయబడును. గతజన్మలలో దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడి, తమకు తెలిసిన అజ్ఞానమునే జ్ఞానముగా చెప్పు వారికి ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఏడు నాడీ కేంద్రముల ఆధీనములో యున్న శరీర భాగములకు రోగరూపములో శిక్షలు వచ్చుచుండును. దానివలన ఏ నాడీకేంద్ర పరిధిలో గల శరీర భాగములకయినా రోగములు రావచ్చును. అలా వచ్చు రోగములన్నిటిని ఆకాశము నుండి వచ్చు శిక్షలుగా చెప్పవచ్చును. ఈ విధముగా శిక్షలు అమలు జరుగడము బుద్ధిగల జీవులు ఆలోచిస్తే కొంత జ్ఞానమున్న వారు తెలుసుకొను గుణపాఠముగా యున్నది. దేవుని శిక్షలు ఎప్పుడు ఎలాగయినా శరీరములో ఏర్పడవచ్చును. శరీరములో ఏర్పడు బాధలన్నీ శరీర ఆకాశమునుండి వచ్చునవిగా చెప్పవచ్చును. ఆ బాధలన్నీ బుద్ధిగల వారు గ్రహించి దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడకుండుటకు గుణపాఠముగా ఉన్నవి.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

114. తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడము లేదు. (30-8)

(30-8) ''ఏమిటి, వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడము లేదా? అల్లాహ్ భూమి ఆకాశములనూ, వాటి మధ్యనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలము కొరకు మాత్రమే సృష్ఠించాడు. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు.''


మనిషి జీవితమును దైవిక ధ్యేయము లేకుండా గడుపుచున్నాడు. మనిషికి ఉన్న ధ్యేయము దైవిక ధ్యేయము కాకుండా ప్రపంచ సంబంధమైన ధ్యేయము కలదు. అదే ధనమును సంపాదించవలెనను ధ్యేయము తప్ప ఏమీ లేదు. తన జీవితమును గురించి తన పుట్టుకను గురించి మనిషి లోతుగాగానీ, పైపైనగానీ ఆలోచించడము లేదు. తనను గురించి తాను మరచిపోయి బయట ప్రపంచ ద్యాసలలోనే మనిషి బ్రతుకుచున్నాడు. మనిషి ఎట్లు ఏ ఆలోచనలలో బ్రతికినా నిర్ణీత గడువు వరకు మాత్రమే ఉండును. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే ఒక గడువు వరకు మాత్రమే బ్రతుకునట్లు శరీరమును తయారు చేసి పంపియుండును. దేవుడు శరీరమును భూమి ఆకాశములను శరీరములో ఉండునట్లు తయారు చేశాడు. అంతేకాక భూమి ఆకాశముల మధ్యలో సమస్త వస్తువులతో సహా శరీరమును తయారు చేశాడు. ఆకాశము తలకాగా, భూమి పాదములు కాగా, మధ్యలో యున్న అవయవములన్నీ సమస్త వస్తువులుగా యున్నవి. ఈ విధముగా దేవుడు శరీరమును అత్యుత్తమ రీతిలో తయారు చేశాడు. ఎంత ఉత్తమ రీతిగా చేసినా శరీరము నిర్ణీత గడువు వరకు బ్రతుకులాగున శరీరములో అవయవములను పొందుపరచి చేశాడు. కొంత వరకు బ్రతుకు శరీరములో నివసించు జీవుడు జీవితమున్న సమయములోనే, శరీరముతో బ్రతుకు సమయములోనే దేవున్ని గురించి తెలుసుకోవాలని, తమను సృష్ఠించిన దేవున్ని తెలుసుకొని కలుసుకోవాలని ఏమాత్రము అనుకోవడము లేదు. ఎవరయినా జ్ఞానులు ఆ విషయమును గుర్తు చేసినా దానిని తిరస్కరించు చున్నారు. అలా దేవుని సాన్నిధ్యమును తిరస్కారముగా మాట్లాడువారు తమను గురించి తమ జన్మను గురించి, తమ శరీరమును గురించి కొద్ది మాత్రము కూడా ఆలోచించకుండా బ్రతుకుచున్నారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

115. ప్రళయము గురించి అల్లాహ్కే తెలుసు. (33-63), (43-85)

(33-63) ''ప్రళయము గడియ గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా! ఆ సంగతి అల్లాహ్కే తెలుసునని వారికి చెప్పు. నీకేమి తెలుసు? బహుశా ప్రళయము అతి సమీపములోనే ఉందేమో!''


(43-85) ''ఇంకా ఆయన గొప్ప శుభకరుడు, భూమి ఆకాశాల లోను, వాటి మధ్యగల సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యము ఆయనదే. ప్రళయ గడియ గురించిన జ్ఞానము కూడా ఆయన వద్దనే ఉంది.''


ప్రళయము అంటే బయట కనిపించు భూమి, ఆకాశము, వాటి మధ్యలోగల గాలి, నీరు, అగ్ని అన్నీ చెలరేగిపోయి అన్నీ సర్వనాశనము అయిపోవడము ప్రళయము అని చాలామంది అనుకొనుచుందురు. బయట కనిపించు భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు అను పంచభూతములు మూడవ పురుషుడయిన పరమాత్మ ఆధీనములో గలవు. పరమాత్మ ఆధీనములో యున్న ప్రతీదీ ఆయన సేవ నిమిత్తమే ఉన్నాయి. అందువలన బయటి ప్రకృతియైన ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నీరు అనువాటికి ప్రళయము ఎప్పటికీ ఉండదు. ఆకాశము, భూమి మొదలగు వాటి చేత శరీరము తయారయినది. శరీరము రెండవ పురుషుడయిన ఆత్మ ఆధీనములో యున్నది. శరీరము దేవుని సేవ నిమిత్తము ఉండునది కాదు. కావున శరీరములో యున్న (శరీర రూపములో యున్న) ఆకాశము, భూమి వాటి మధ్యలో యున్న సమస్తము పూర్తిగా నాశనము చెందు అవకాశము గలదు. శరీరము నాశనము అగుటనే గ్రంథములో ప్రళయము అని అన్నారు. శరీర రూపములో యున్న ప్రకృతి ప్రళయమును పొందునట్లు ఆత్మయే చేయుచున్నది. శరీరమును నాశనము చేయువాడు ఆత్మయేనని తెలియవలెను. శరీరము మరణము పొంది ఎప్పుడు నాశనమగునో శరీరములోని ఆత్మకే తెలుసు. ప్రళయము గురించి జీవాత్మకు ఏమాత్రము తెలియదు. అందువలన ప్రళయ గడియ రెండవ ఆత్మయిన అల్లాహ్కే తెలుసు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

116. పరిశుద్ధులు మాత్రమే నన్ను ముట్టుకోగలరు. (56-77, 78, 79)

(56-77,78,79) ''నిశ్చయముగా ఈ ఖుర్ఆన్ చాలా గౌరవ ప్రదమైనది. అదొక సురక్షితమైన గ్రంథములో నమోదై ఉన్నది. పరిశుద్ధులు మాత్రమే దానిని ముట్టుకోగలరు.''


అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ సురక్షితమైన గ్రంథములో నమోదైయున్నది. అయితే ఈ మాటను చాలామంది అర్థము చేసుకోలేక ఖుర్ఆన్ గ్రంథము ఒక గ్రంథములో వ్రాసిపెట్టారని దానిని మాతృగ్రంథము అని అంటారని చెప్పుచున్నారు. చాలామంది ఖుర్ఆన్ మాతృగ్రంథములో నమోదై ఉంది అంటున్నారు. ఇక్కడ బాగా అర్థము చేసుకొంటే ఖుర్ఆన్ మొదట ఒకచోట వ్రాసిపెట్టారు. వారు వ్రాసిన తర్వాత అది గ్రంథము అయినది. వ్రాయకముందు గ్రంథము కాలేదు కదా! వ్రాసిన తర్వాత గ్రంథమయినది కదా! దానిని మొదటి గ్రంథమని, మాతృగ్రంథమని, ఉమ్ముల్ కితాబ్యని అంటున్నారు. అయితే అలా వ్రాసిన గ్రంథమును గురించి ''ఈ గ్రంథము ఇంకొక గ్రంథములో నమోదై ఉన్నది'' అన్నారు. ''అది ముందే ఉన్న సురక్షితమైన గ్రంథము'' అని కూడా చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథము తయారైనప్పుడు దానికంటే ముందే కొన్ని సంవత్సరముల నుండి యున్న గ్రంథములో వ్రాసిపెట్టబడియున్నది అని చెప్పారు. దీనిని నేరుగా చెప్పితే ''ఈ ఖుర్ఆన్ గ్రంథము ముందే వ్రాసిపెట్టబడిన గ్రంథములోనే యున్నది'' అని అర్థము. ముందే తయారైన గ్రంథము తౌరాతు గ్రంథము. ఆ తౌరాతు గ్రంథములోని వాక్యములు ఖుర్ఆన్‍లో ఉన్నాయనిగానీ, లేక ఖుర్ఆన్‍లోని వాక్యములు తౌరాతులో ఉన్నాయనిగానీ చెప్పడమే, ముందే యున్న ఒక సురక్షితమైన గ్రంథములో ఉన్నదని అన్నారు. సూరా ఆరు, ఆయత్ 91లో (6-91) లో ''మూసా తెచ్చిన తౌరాతు గ్రంథమును ఎవరు అవతరింపజేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వము. మీరు దానిని వేరువేరు కాగితములుగా (వేరువేరు గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు.''


ఈ వాక్యమును చూచిన తర్వాత తౌరాతు గ్రంథములోనిదే ఖుర్ఆన్ అని అర్థము కాగలదు. అందువలన ఖుర్ఆన్ మరొక గ్రంథములో నమోదై యున్నది అని అన్నారు. అంతేగానీ వ్రాసిపెట్టబడిన ఖుర్ఆన్‍లో ఖుర్ఆన్ ఉందని చెప్పలేదు. ముందు తయారు చేయబడినది తౌరాతు గ్రంథము. దానినే ప్రథమ దైవ గ్రంథము అని అంటున్నారు. ప్రథమ దైవ గ్రంథములోని జ్ఞానమే అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఉందని చెప్పడము కొరకే ఖుర్ఆన్ ముందే యున్న గ్రంథములో నమోదైయున్నదని చెప్పారు. అంతేకాక (43-4) లో ''నిశ్చయముగా ఇది మాతృ గ్రంథములో యున్నది. మావద్ద అది ఎంతో ఉన్నతమైన వివేకముతో నిండిన గ్రంథముగా యున్నది'' అని అన్నారు. ఇక్కడ విషయమును అర్థము చేసుకుంటే చాలా సులభముగా యున్నది. అర్థము చేసుకోకపోతే అనుమానముతో కూడుకొన్న విషయమై పోవును. ఖుర్ఆన్ తౌరాత్‍లో యుండుట వలన అది ఎవరికీ కనిపించని విధముగా యున్నది. ఎవడయితే పవిత్రమైన బుద్ధిగలవాడో వాడే దానిని చూడగలడు. దానిని తాకగలడు. పవిత్రమైన బుద్ధి లేనివానికి అది కనిపించదు, దానిని తాకలేడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

117. ఖుర్ఆన్ కల్పితగాథ కాదు. తన పూర్వ గ్రంథములను ధృవీకరిస్తున్నది. (12-111)

(12-111) ''నిశ్చయముగా వీరి గాథలలో విజ్ఞత గలవారికి గుణపాఠము ఉన్నది. ఈ ఖుర్ఆన్ కల్పితమైన విషయము ఎంతమాత్రము కాదు. పైగా ఇది తన పూర్వమున్న గ్రంథాలను ధృవీకరిస్తూవుంది. ప్రతి విషయమును స్పష్టముగా విడమరచి చెబుతున్నది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గము, కారుణ్యము.''


ఖుర్ఆన్ కల్పిత గ్రంథము కాదు. ఇది దైవ గ్రంథము. ఇది పూర్వమున్న తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానమును ధృవీకరిస్తున్నది. ప్రతి విషయము వివరముగా చెప్పబడినది. ఇందులోని జ్ఞానము గుణపాఠముగా యున్నది. గుణపాఠము అనగా మాయను గురించి తెల్పునదియని అర్థము. మాయను ఇబ్లీసు యని గ్రంథములో చెప్పినా, మాయ అంటే దేవుని మార్గములో పోకుండా పూర్తి ఆటంకము చేయునది. దేవుని మార్గమును ఆటంకము చేయు మాయను ఎవరూ జయించలేరు. అయితే దైవ గ్రంథమును చదువుట వలన మాయను జయించుటకు తగిన ఉపాయము దొరుకును. మాయను గురించి ప్రథమ దైవ గ్రంథములో ఇలా చెప్పారు చూడండి.


దేవుని చేత తయారు చేయబడిన, గుణములతో కూడుకొన్న నా మాయను జయించుట దుస్సాధ్యము అని దేవుడే చెప్పుచున్నాడు. ఎవడయితే నన్ను ఆరాధించుచున్నాడో వాడు మాత్రమే దుస్సాధ్యమైన మాయను దాటిపోగలడు. దేవున్ని తెలిసి, దేవుని జ్ఞానమును తెలిసి, ఆయనను ఆరాధించుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ చదువుట వలన సాధ్యము కావచ్చును. అందువలన విజ్ఞత గలవారికి ఇందులో గుణపాఠము గలదని చెప్పారు. ''గుణమయీ మమ మాయా'' అని భగవద్గీతలో చెప్పియుండుట వలన మన తలలోని గుణములనే మాయయని చెప్పవచ్చును. ఖుర్ఆన్‍ను విశ్వసించి చదివే వారికి మాయను జయించు శక్తి లభించును. ముందు వచ్చిన భగవద్గీత, బైబిలులోని జ్ఞానమే ఖుర్ఆన్‍లో కూడా ఉండుట వలన మనిషికి మాయను జయించుశక్తి లభించగలదు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

118. చనిపోయిన వానిని అల్లాహ్ లేపునని కొందరు అంటారు. లేపడని మరికొందరు అంటారు, ఏది నిజము? (16-38)

(16-38) ''చనిపోయిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు'' అని వారు అల్లాహ్ పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? తప్పకుండా తిరిగి బ్రతికించి లేపుతాడు. ఇది ఆయన వాగ్దానము. దీన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కానీ చాలామందికి ఈ విషయము తెలియదు.''


ముస్లీమ్ సమాజములో మనిషి చనిపోతే వాడు వాని శరీరముతో పాటు గోరీలయందే ఉండుననీ, అలా ఉండగా ప్రళయ కాలము వచ్చినప్పుడు దేవుడు వచ్చి సమాధులలో యున్న వారినందరినీ వారివారి శరీరములతోనే లేపునని, అప్పుడు మనిషి చేసిన పాప పుణ్యముల విచారణ చేయునని పాపము చేసిన వారిని నరకమునకు, పుణ్యము ఎక్కువ చేసిన వారికి స్వర్గమును పొందునట్లు చేయునని చెప్పుచుందురు. దేవుడు అట్లు చేయునా? అని విచారిస్తే అలా చేయడని తెలియుచున్నది. దేవుడు చనిపోయిన వానిని తిరిగి జన్మించునట్లు చేయుచున్నాడు తప్ప భూసమాధుల నుండి లేపడమనునది జరగడము లేదు. దేవుడు చేయని పనిని దేవునికి అంటగట్టడము వలన అటువంటి వారిని చూచి దేవుడు విసిగించుకొనును. అంతేకాక దేవునికి అబద్దములు అంటగట్టు వానిని తర్వాత జన్మలో దేవుడు అతనిని అజ్ఞాన మార్గములో పోవునట్లు చేయును. అదే అతనికి దేవుని నుండి వచ్చు శిక్షయని చెప్పవచ్చును.


ప్రతి మనిషి (జీవుడు) చనిపోయినప్పుడు అతని శరీరమును వదలి జీవుడు దేవునివద్ద వెంటనే తీర్పు పొంది, మరుక్షణమే ఇంకొక జన్మలోనికి పోవుచున్నాడు. చనిపోయిన జీవుడు వేరే శిశు శరీరమును చేరిన తర్వాత కొంతసేపటికి అనగా కొన్ని గంటలకు అతని మరణ శరీరమును భూమిలో పూడ్చిపెట్టడము జరుగుతాయున్నది. శరీరమును వదలిపోయిన జీవునికి, మృత శరీరమునకు ఏమాత్రము సంబంధము ఉండదు. ఒకమారు శరీరము నుండి జీవుడు బయటికి పోతే తిరిగి ఆ శరీరమువైపు వచ్చు అవకాశమే ఉండదు. మరణమును పొందిన జీవుడు దేవుని చేత తీర్పు తీర్చబడి ఎక్కడికో పోయి జన్మించగా, ఒక్క క్షణములో అతడు దేవుని చేత జన్మను పొందగా, అతని శరీరము కొన్ని గంటల తర్వాత భూమిలో పూడ్చబడి కుళ్లిపోవుటకు ప్రారంభించును. ఆరు నెలల లోపల ఎముకలు తప్ప శరీరమంతయూ పూర్తిగా నాశనము అయిపోవు చున్నది. ఒక సంవత్సరమునకు ఎముకలు కూడా పూర్తిగా శిథిలమయి పోవుచున్నవి. అటువంటప్పుడు ఎంతోకాలము శరీరములో నివాసమున్న జీవునితో మృత శరీరము సంబంధము లేకుండా మార్పుచెంది కుళ్లిపోయి ఏమాత్రము మిగలకుండా నశించిపోవుచున్నది. జీవుడు ఎక్కడో వాని కర్మకొద్ది పోయి పుట్టి, పాతశరీరముతో ఏమాత్రము సంబంధము లేకుండా పోయినప్పుడు దేవుడు ప్రళయములో అదే శరీరముతో, అదే మనిషిని భూసమాధి నుండి సజీవముగా లేపును అనుట దేవున్ని, దేవుని పనిని హాస్యాస్పదముగా మాట్లాడినట్లు కాదా!


చనిపోయిన జీవున్ని దేవుడు తిరిగి తల్లిగర్భము నుండి వచ్చిన శరీరములో శిశువుగా లేపుచున్నాడు. చనిపోయిన జీవున్ని తిరిగి బ్రతికించి లేపడము దేవుడు తన విధిగా చేయుచున్న పని. అయితే ఆయన ఎప్పుడు ఏ విధముగా జీవున్ని తిరిగి బ్రతుకునట్లు చేయుచున్నాడో తెలియక ఎవరో చెప్పిన కట్టుకథలను నమ్మి ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన జ్ఞానమును కూడా లెక్క చేయడము లేదు. మనుషులు మూర్ఖులుగా ప్రవర్తించుచూ, దేవునికి కూడా అబద్దములు అంటగట్టుచున్నారు. ఆకాశములు, భూమి అంటూనే బయట ఆకాశమా, శరీరము లోపలి ఆకాశమా అని ఆలోచించకుండా బయట ఆకాశముగా లెక్కించుచున్నారు. ప్రళయము అంటూనే బయట ప్రళయము జరుగదని, జరిగేది శరీరము లోపలి ప్రళయమేయని తెలియక ప్రళయములో మనిషి తిరిగి లేచును అని బయట లెక్కవేయుచున్నారు. బయట ప్రళయము ఎప్పటికీ జరుగునది కాదని తెలియక మాట్లాడుచున్నారు. మరణమే ప్రళయమనీ, అది శరీరములో శరీరమునకు జరుగు ప్రళయమనీ, శరీర నాశనమను ప్రళయములో జీవుడు మరొక శరీరమును చేరి క్రొత్త జన్మ పొందుచున్నాడని, దేవుడే జీవున్ని అలా క్రొత్త జన్మలో లేపుచున్నాడనీ తెలియకపోవుటయే కాక దేవుడు చనిపోయిన దేహములోనే లేపును అని అంటున్నారు. అలా జరుగుట అసంభవము. అందువలన దేవుడు దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఏమి చెప్పాడో బాగా గమనించమని తెలుపుచూ, దేవునికి అబద్దములు అంటగట్టవద్దని చెప్పుచున్నాము.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

119. ఖర్జూరము, ద్రాక్షనుండి మత్తుపాణీయమును తయారు చేస్తారు. అట్లే వాటినుండి మంచి ఆహారమును చేస్తారు. ఇందులో విజ్ఞత గలవారికి సూచనలున్నాయి. (16-67)

(16-67) ''ఖర్జూరము, ద్రాక్షపండ్లనుండి మీరు మత్తుపాణీయమును తయారు చేస్తారు. వాటినుండి మంచి ఆహారమును కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత కలవారి కోసము ఇందులోనూ గొప్ప సూచన ఉంది.''


పాము విషము మనిషి ప్రాణమును తీయగలదని విన్నాము. నాగుపాము విషము వలన చాలామంది చనిపోయిన వారున్నారు. పాము విషము మనిషి శరీరములోనికి ప్రవేశిస్తే మరణము తప్పదని ఎందరో చెప్పిన మాటను విన్నాము. అంతేకాక అక్కడక్కడ పాముకాటుకు గురియైన వారు చనిపోవడము చూస్తూనే యున్నాము. నాగుపాము అంటే భయపడు సమయములో ఒక వ్యక్తి వచ్చి ''పాము విషము వలన మనిషి అస్వస్థతకు గురియై గంటలోపే చనిపోవుట వాస్తవమే. అదే పాము విషము వలన అనారోగ్యమునకు (అస్వస్థతకు) గురియైన వారు కూడా ఆరోగ్యమును పొందుట కూడా వాస్తవమే'' అని ప్రచారము చేయుచుండెను. అప్పుడు అతనితో ఇంకొక వ్యక్తి వచ్చి ''పాము విషముతో అనారోగ్యమునకు గురియై చనిపోవుట వాస్తవము అయితే, నీవు అనారోగ్యము గలవాడు, చనిపోవుటకు సిద్ధముగా యున్నవాడు, పాము విషము వలననే తిరిగి ఆరోగ్యమును పొంది జీవించునని, చనిపోవు ప్రమాదమునుండి బయటపడునని ఎలా చెప్పుచున్నారని'' అడిగెను. దానికి అతను ఈ విధముగా సమాధానమును చెప్పాడు. ''పాము విషము పాముకాటు ద్వారా మనిషి శరీరములోనికి చేరి రక్తములోనికి కలిస్తే ఆ మనిషి చనిపోవుట సత్యము. అదే విషమునే నోటిద్వారా శరీరములోనికి పంపితే ఆ విషము అతనిలోని అనారోగ్యములను లేకుండా చేసి పూర్తి ఆరోగ్యమును ఇచ్చుచున్నది. ఒకే విషము మనిషిని చంపుటకు, మనిషిని బ్రతికించుటకు ఉపయోగపడుటకు కారణమయినది. అదెలాయనగా! పాము విషము కాటు ద్వారా శరీరములోనికి చేరి రక్తములో కలిస్తే మనిషి చనిపోవును. అదే విషము నోటి ద్వారా శరీరములోనికి చేరి రక్తములోనికి కలిస్తే మనిషి పూర్తి ఆరోగ్యముగా తయారై జీవించును. ఇది సత్యము.


అదే విధముగా ఖర్జూరము, ద్రాక్ష మనిషికి మంచి ఆహారముగా ఉపయోగపడుచూ ఆరోగ్యమును ఇచ్చుచున్నది. అదే ద్రాక్ష, ఖర్జూరమును మత్తుపాణీయముగా చేసుకొని త్రాగితే అది అనారోగ్యమును కల్గించును. మత్తును కల్గించి మనిషి చేత చేయరాని పనులను చేయించును. అట్లే మనిషి చేత మాట్లాడరాని మాటలను మాట్లాడించును. ఖర్జూరము, ద్రాక్ష రెండు మంచి రుచికరమైన ఫలములే. అయితే వాటిని ఉపయోగించు కోవడములో తేడా వస్తే ఉపయోగించిన మనిషిలో కూడా తేడా వచ్చును. ఒకే విషమే మనిషిని చంపుటకు, బ్రతికించుటకు రెండు విధముల ఎట్లు ఉపయోగపడుచున్నవో, అట్లే ఒకే ఖర్జూరము, ద్రాక్ష రెండూ మంచి రుచికరమైన పండ్లు అయినా వాటిని ఉపయోగించడములోని మార్పునుబట్టి మనిషిలోని గుణములలో మార్పు తెచ్చుచున్నది. ఖర్జూరములు, ద్రాక్ష ఆహారముగా ఉపయోగపడితే ఆరోగ్యమును ఇచ్చుచున్నది. పాణీయముగా త్రాగితే అనారోగ్యములను కల్గించుచున్నది. అదే విధముగా దేవుని జ్ఞానమును అర్థము చేసుకోగలిగితే మనిషిని మోక్షమునకు పంపును. అదే జ్ఞానమును అర్థము చేసుకోక అపార్థము చేసుకొంటే మనిషిని జన్మలకు పంపును. ఒక విధముగా ముక్తి జ్ఞానము వలన కల్గుచున్నది. అట్లే మరొక విధముగా కర్మతో కూడుకొన్న జన్మలు కల్గుచున్నవి.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

120. విశ్వసించి సత్కార్యములు చేసినవారికి మంచి ప్రతి ఫలము ఇవ్వడానికి ప్రళయము వస్తుంది. (34-3,4)

(34-3,4) ''మాపై ప్రళయము వచ్చిపడదు'' అని అవిశ్వాసులు అంటున్నారు. ''ఎందుకు రాదు? అగోచర జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా అది ఆకాశములలో యున్నా, భూమిలోయున్నా ఆయన నుండి గోప్యముగా లేదు. దానికన్నా చిన్నవస్తువైనా, పెద్ద వస్తువైనా ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథములో లిఖిత పూర్వకముగా ఉంది అని వారికి చెప్పు.''


(34-4) ''విశ్వసించి సత్కార్యములు చేసినవారికి మంచి ప్రతి ఫలమే ఇవ్వడానికి ప్రళయము వస్తుంది. ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవ ప్రదమైన ఉపాధి ఉన్నాయి.''


దేవుని మీద విశ్వాసము లేని అజ్ఞానులు ''మాపై ప్రళయము వచ్చి పడదు'' అని అంటారు. ప్రళయము అంటే ఏదోయని చాలా దూరముగా యోచించుకొనియున్నారు. ప్రళయము అంటే మరణము అని వారు అనుకోవడము లేదు. మనుషులు చేయు చిన్నపనైనా, పెద్దపనైనా దేవునికి తెలియకుండా లేదు. ప్రతి పనియొక్క ఫలితమును కర్మపత్రము అను గ్రంథములో లిఖించబడియున్నాయి. మనిషి అవిశ్వాసియై పాపపుణ్య కర్మలను నమ్మకపోయినా, అలాగే మనిషి విశ్వాసియై సత్కార్యములను చేసినవారికి మంచి ఫలితమును ఇవ్వడానికి వారికి మరణమును ఇచ్చి మరణములో తర్వాత జన్మకు సరిపడు గౌరవప్రదమైన ఉపాధిని దేవుడు కల్పించుచున్నాడు. ఈ వాక్యములో బాగా గమనించితే, ఒక మనిషి మంచిగా దేవుని జ్ఞానమును తెలిసి జ్ఞానిగా మసలుకొంటూ, ఎన్నో మంచి పనులు చేయగా ఎంతో గొప్ప జ్ఞానమును ఇతరులకు తెలుపగా అతనికి దైవ సంబంధమైన ఫలము అతని నొసటిలోపల యున్న కర్మగ్రంథము అను కర్మచక్రములో కర్మ గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కర్మ ఫలమును ఇచ్చుటకు దేవుడు ఒకమారు మరణమును కల్పించును. ఆ మరణములో తీర్పు తీర్చడములో అతను తిరిగి జన్మకు పోవుటకుగానీ, జన్మకు పోకుండా మోక్షము పొందుటకుగానీ నిర్ణయము చేయబడి మనిషికి గౌరవ ప్రదమైన జన్మనయినా ఇచ్చును. లేకపోతే జన్మకు పోకుండా పరలోకప్రాప్తి కల్గించి, దేవుని సాన్నిధ్యములో చేరిపోవునట్లు చేయును. అట్లు చేయుటకు ఆ మనిషికి మరణము రావలసియున్నది. మరణమును శరీర ప్రళయము అని అనవచ్చును. ప్రళయము రానిదే తర్వాత జన్మగానీ, పరలోక ప్రాప్తి అయిన ముక్తిగానీ లభించదు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

121. పన్నెండు తెగలు, పన్నెండు మతాలు, పన్నెండు గుణాలు. (7-160)

(7-160) ''మేము వారిని పన్నెండు తెగలుగా విభజించి, వేరువేరు సమూహములుగా చేశాము. మూసా జాతివారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు ''నీ చేతికర్రను ఫలానా రాతిపై కొట్టు'' అని మేము అతనిని ఆదేశించాము. అంతే అతను కర్రతో కొట్టగానే ఆ రాతిబండనుండి పన్నెండు ఊటలు చిమ్ముకు వచ్చాయి. ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకొన్నారు. మేము వారిపై మేఘ మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై మన్న, సల్వాలను ఆహారముగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థములను తినండి అని వారికి చెప్పాము. అయితే వారు మాకు చేకూర్చిన నష్టము ఏమీలేదు. వారు తమ స్వయానికే నష్టము చేకూర్చుకొనేవారు.''


దేవుడు మనుష్య జాతిని పన్నెండు తెగలుగా విభజించి, పన్నెండు మతములుగా చేశాడు. ఇవి బయట కనిపించు పన్నెండు మతములుగా కనిపించడమేకాక శరీరము లోపల పన్నెండు గుణములతో మనుషులు పన్నెండు రకముల మాయలో ఉన్నారు. పన్నెండు జాతులలో ఒక తెగవారు నీళ్లు అడిగినప్పుడు రాతినుండి పన్నెండు ఊటల నీళ్లు వచ్చాయి. పన్నెండు ఊటల నీళ్లు పన్నెండు రకములుగా ఉన్న మాయకు విరుగుడుగా ఉన్నాయి. అంతేకాక పన్నెండు రకముల గుణములను నిరోధించునట్లు దేవుడు జ్ఞానము అనే ఆహారమును ఇచ్చాడు. అలా ఇవ్వడమే కాకుండా మీరు మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారమునే తినండియని చెప్పాడు. అయితే వారు సక్రమముగా జ్ఞానమును తెలియడము లేదు. దానివలన దేవునికి ఏమీ నష్టము ఉండదు. అయితే మనుషులు తమకు తాము స్వయానా అజ్ఞానము వైపు పోవుచున్నారు. మనుషుల తలలో యున్న గుణచక్రములో పన్నెండు గుణములు ఇలా కలవు.



పన్నెండు గుణములు గుణచక్రములో ఈ విధముగా గలవు. అందులో మంచి గుణములు అనబడునవి వాటికి వ్యతిరేఖమయినవి మొత్తము పన్నెండు మంచి, చెడు గుణములు వరుసగా ఇలా గలవు.


మంచి గుణములు (6) చెడు గుణములు (6)

1) దాన X 1) కామ (ఆశ)

2) దయ X 2) క్రోధ (కోపము)

3) ఔదార్య X 3) లోభ (పిసినారి తనము)

4) వైరాగ్య X 4) మోహ (నా అనునది)

5) వినయ X 5) మద (గర్వము)

6) ప్రేమ X 6) మత్సర (అసూయ)

ఈ విధముగా రెండు గుంపులుగా యున్న గుణములు ఒక్కొక్కటి తొమ్మిది భాగములుగా యున్నవి. దీనిప్రకారము 6I9=54 మొత్తము గుణములు మంచివి 54, చెడువి 54 మొత్తము 54+54=108 గుణములు గలవు. పన్నెండు గుణములు తనయందున్నాయి అని తెలియువరకు దేవుని జ్ఞానము మనిషికి తెలియదు. అందువలన మనుషులు వారికివారే స్వయానా నష్టమును తెచ్చుకొంటున్నారన్నారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

122. మూసాకు తొమ్మిది మహిమలను ఇచ్చాము. (17-101)

(17-101) ''మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది మహిమలను ఇచ్చాము. కావాలంటే నీవు స్వయముగా ఇస్రాయీల్ వంశీయులను అడుగు.''


(17-102) ''మూసా ఇలా సమాధానమిచ్చాడు. గుణపాఠముతో కూడుకొన్న ఈ సూచనలను భూమి, ఆకాశముల ప్రభువు తప్ప మరెవరూ అవతరింపజేయలేదన్న విషయము నీకు తెలుసు.''


ఐదువేల సంవత్సరముల పూర్వము మోషే అను ప్రవక్త ఒకడు ఉండేవాడు. అప్పటి మోషే ఇప్పటి కాలములో మూసాయను పేరుతో చెప్పబడుచున్నాడు. మూసా మోషేగా చెప్పబడు కాలములో, అనగా ఆయన బ్రతికియున్న కాలములో దాదాపు 20 సంవత్సరముల వయస్సులోనే పరమాత్మయిన దేవుడు భగవంతునిగా తన జ్ఞానమును తౌరాతు గ్రంథరూపములో ఇచ్చాడు. తౌరాతు గ్రంథము యొక్క మొదటి పేరు భగవద్గీత. దేవుడు అయిన పరమాత్మ భగవంతునిగా వచ్చి ఇచ్చిన గ్రంథము తౌరాతు. తౌరాతులో దేవుని జ్ఞానము అంతయూ గలదు. దేవుని జ్ఞానమును గురించి వచ్చిన మొదటి గ్రంథము తౌరాతు. అందులో దేవుని సమస్త జ్ఞానము సంపూర్ణముగా గలదు. దైవ జ్ఞానములో ఏ సంశయము వచ్చినా దానికి జవాబు తౌరాతు గ్రంథములో దొరుకును. ఇప్పుడు ఖుర్ఆన్ (17-101) లో చెప్పిన వాక్యమునందు చెప్పబడిన తొమ్మిది మహిమలు కూడా తౌరాతు జ్ఞానములో తెలియునవే. దేవుడయిన పరమాత్మకు తొమ్మిది మహిమలు, ఆత్మకు ఆరు మహిమలు, జీవాత్మకు మూడు మహిమలు గలవని తౌరాతు గ్రంథములోనే తెలియుచున్నది. దేవుడు తెలియజేసిన తన తొమ్మిది సూచనలు గుణపాఠముతో కూడుకొని యున్నవి. ఆ సూచనలను దేవుడు తప్ప ఎవరూ అవతరింపజేయలేదని తెలియుచున్నది. ఇప్పుడు దేవుడు, జీవుడు, మధ్యలో గల దేవుడు యొక్క మహిమలను తెలుసుకొందాము. అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మయను ముగ్గురి సూచనలు తెలుసుకొందాము.

జీవాత్మ సూచనలు (మహిమలు)


1) దేవుని మీద ఇష్టము కల్గియుండుట.


2) దేవుని జ్ఞానమును తెలియుట.


3) దేవుని లోనికి ఐక్యమగుట.



ఆత్మ యొక్క సూచనలు (మహిమలు)


1) జీవులకు జన్మలను ఇచ్చుట.


2) జీవులకు మరణమును ఇచ్చుట.


3) జీవులకు జీవనమును ఇచ్చుట.


4) జీవులకు మరణములో తీర్పు తీర్చుట.


5) జీవులకు ఆరాధ్య దైవముగా ఉండుట.


6) జీవులకు వెంట ఉండుట.


పరమాత్మ సూచనలు (మహిమలు)


1) ఆయన ఒక్కడే ఇతరుల సంబంధము లేకుండా యున్నాడు.


2) ఆయన సంతతి లేనివాడు, ఆయన తాతేగానీ తండ్రికాడు.


3) ఆయన ఏ అవసరము, ఎవరి అవసరము లేనివాడు.


4) ఆయన అన్ని ఆరాధనలకు అతీతుడు.


5) ఆయన మోక్షముగా యున్నాడు. మోక్షమును ఇచ్చువాడుగా యున్నాడు


6) ఆయన మొదటి సృష్ఠికర్త, ఆయనకంటే ముందు ఎవరూ లేరు.


7) ఆయన అధికారముగల అధికారేగానీ, అహంకారి కాడు.


8) ఆయన దర్శకుడేగానీ కార్యకుడు కాడు.


9) ఆయన ఎవరి అంచనాకు తెలియడు.


జీవాత్మ = 3 3 + 6 = 9 - 9


ఆత్మ = 6 9 + 9 = 18 - 9


పరమాత్మ = 9 1 + 8 = 9 - 9



పరమాత్మ ఎటుచూచినా 9 గానే యున్నాడు. పరమాత్మను గురించి తెలియుటకు ముందు జీవాత్మను, ఆత్మను గురించి తెలిసియుండాలి. ముగ్గురి విషయమును తెలియక దేవున్ని ఆరాధించుచున్నామని చెప్పువారు ఎవరిని ఆరాధించుచున్నారో తెలిసి ఆరాధించితే మంచిది. పరమాత్మ విధానము తెలియక ఆరాధన ఒక్కటే మా విశ్వాసము అనినా వానిని దేవుడు ఒప్పుకోడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

123. దేవుని సంతాన విషయము వారికి గానీ, వారి ముత్తాతలకు గానీ తెలియదు. (18-4, 5), (21-26)

(18-4) ''అల్లాహ్ సంతానము కలిగి యున్నాడని పలికేవారిని హెచ్చరించటానికి ఈ గ్రంథము అవతరింప చెయ్యబడినది.''


(18-5) ''యదార్థానికి వారికిగానీ, వారి తాతముత్తాతలకుగానీ, ఈ విషయము ఏమీ తెలియదు. వారి నోటివెంట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్దమే.''


(21-26) ''రుణామయునికి సంతానము ఉందని వారు చెప్పుతున్నారు. ఇది నిజము కాదు. ఆయన పవిత్రుడు. పైగా దైవదూతలయిన వారంతా గౌరవింపబడిన ఆయన దాసులు.''


దేవుడయిన పరమాత్మకు కరుణామయుడు, క్షమాశీలుడు, దయా శీలుడు అను బిరుదులు గలవు. ఈ మాటలు ఆరాధ్య దైవమైన రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍కు చెప్పకూడదు. మూడవ ఆత్మయిన పరమాత్మకు మాత్రమే చెప్పునవని జ్ఞాపకములో ఉంచుకోవలెను. ప్రతీదీ క్షుణ్ణముగా తెలిసినప్పుడే దేవుని జ్ఞానము అర్థము కాగలదు. శరీరములో గల అల్లాహ్ ఒకడనీ, ఆయనే అందరికీ ఆరాధ్యదైవముగా ఉన్నాడనీ, ఆయనకే మనుషులంతా సంతానముగా గలరనీ, ఆయనే అందరినీ పుట్టించుచున్నాడు, ఆయనే అందరినీ చంపుతున్నాడనీ, ఆయన అందరి శరీరములలో గల దేవుడని తెలియాలి. అట్లే శరీరము బయట మరొక అల్లాహ్ యున్నాడనీ, ఆయన దేవుడయినా ఎవరికీ ఆరాధ్యదైవము కాదనీ, ఆయన ఆరాధనలతో అక్కర లేనివాడనీ, ఆయన ఎవరినీ పుట్టించువాడు కాడు అలాగే చంపువాడు కాదనీ, ఆయనకు ఎవరూ సంతతి కాదనీ, ఆయనతో పాటు ఆదినుండి యున్న దేవదూతలందరూ ఆయన పరిపాలనా నిమిత్తము నిర్మించుకొన్న ఆయన దాసులనీ తెలియవలెను. ఇట్లు మానవులకు ఇద్దరు దేవుళ్లు కలరు. అయితే మొదటి దేవునికి భార్య లేదు, సంతతీ లేదు.


సృష్ఠి లేకపూర్వము కూడా అల్లాహ్ అను దేవుడు యున్నాడు. అప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఏకైకుడు. ఆయనకు రెండవ వ్యక్తే లేడు. అలాంటప్పుడు ఆయనకు భార్య ఎలా వస్తుంది? సంతానము ఎలా కల్గుతుంది? ఈ ప్రపంచములోని జీవరాసులు అందరూ రెండవ అల్లాహ్ యొక్క సంతానము. మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను సృష్ఠించి, ఆయనకు భార్యగాయున్న ప్రకృతిని సృష్ఠించి, వారికి జీవరాసులు సంతానము కల్గునట్లు పథకమును రచించి అమలు చేశాడు. రెండవ అల్లాహ్‍నే అందరికీ ఆరాధ్య దైవముగా చేసి తాను ఏమీ సంబంధము లేనట్లు మొదటి అల్లాహ్ ఉండిపోయాడు. తననుండి మిగతావారిని సృష్ఠించక వారిని తననుండి విభజించాడు. అందువలన మొదట దేవునికి ఎవరూ సంతానము కాదు అని చెప్పారు. ఆయన సృష్ఠి పూర్వము నుండి ఒక్కడేయున్న దేవుడు. అందువలన ఆయన ఎవరికీ సంతానము కాదు అని కూడా చెప్పారు. ఆయన ''స్వయంభూ'' అనగా స్వయముగా తనకు తానుగా పుట్టిన దేవుడు. ఆ శక్తి ఒక్క ఆది దేవునికి తప్ప ఎవరికీ లేదు. ప్రపంచములో పన్నెండు మతములవారికి దేవుడను భావమున్నది గానీ, దేవుని జ్ఞానము తెలియదు. అందరూ దేవున్ని ఆరాధించుచున్నారు, ప్రార్థన చేయుచున్నారుగానీ దేవుడు ఒక్కడేయని అనుకొంటున్నారు గానీ ఇద్దరు అని తెలియదు. అన్ని మతముల వారికి ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. అందువలన దైవ గ్రంథములను చదువమని దేవుడు అనేకచోట్ల చెప్పియున్నాడు. దేవున్ని గురించి తెలియనిదే దేవుని గురించి ప్రార్థన చేస్తే, అది అడ్రస్ వ్రాయని ఉత్తరమువలె వృథా అయిపోతుందని మేము చాలామార్లు చెప్పాము. దేవుడు అదే విషయమునే తెలియజేస్తూ నీవు ఎవరిని ప్రార్థించుచున్నావని ప్రశ్న వేయుచున్నాడు. ఖుర్ఆన్‍లో 16-51లో ''ఇద్దరు దేవుళ్లను ఆరాధించకండి. నేను సృష్ఠించిన అల్లాహ్‍ను ఆరాధించండి. నాకు మాత్రము భయపడండి'' యని రెండవ దేవుని ఆరాధనను, మొదటి దేవుడయిన తనకు భయపడమని చెప్పడము జరిగినది. దానివలన ఇద్దరున్నామని చెప్పినట్లయినది. అయినా అన్నీ చదివినా దానిని గ్రహించుకొను శక్తిని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. దానికి కారణము మనుషులు దేవున్ని పూర్తి నమ్మలేదు. నమ్మినట్లు చెప్పుచున్నారు తప్ప దేవుని మీద పూర్తి విశ్వాసము లేదు. మొదటి దేవుని మీద విశ్వాసమున్నప్పుడే రెండవ దేవున్ని ప్రార్థించినా ఆ ప్రార్థన ఫలించుతుంది. ''మొదటి దేవుని విషయము గాలికి వదిలివేసి రెండవ దేవునికి ప్రార్థన చేయమని చెప్పిన మొదటి దేవుని ధ్యాస లేకుండా రెండవ దేవున్ని ఎంత ప్రార్థించినా ప్రార్థనకు ఫలితమిచ్చువాడు పరలోకమును (మోక్షమును) ఇచ్చువాడు మొదటి దేవుడే అయినందున అటువంటి ప్రార్థన ఫలించదు'' అని చెప్పాము. అల్లాహ్ ఒక్కడేయను మాటను గట్టిగా మాట్లాడు ముస్లీమ్‍లు గలరు. అయితే ఆరాధింపతగిన వాడు ఒక్కడేయనీ, దానికి ఫలితమిచ్చువాడు మొదటి అల్లాహ్యని తెలియనివారుండుట వలన వారు చేసే ప్రార్థనలన్నీ వృథాయగుచున్నవని చెప్పవచ్చును. నాకు జ్ఞానము బాగా తెలుసుయను బోధకులకు కూడా మొదటి మరియు రెండవ అల్లాహ్‍ల విషయము తెలియదు. వారికి తెలిసినదంతా ఒక దేవుడే. అంతమాత్రమున మనుషులకు జ్ఞానమున్నదనుకోవడము పొరపాటు.


దేవుడు ఇద్దరిగా యుండి రెండవవానిచేత అన్నీ మనుషులకు ఇచ్చువాడు మొదటి దేవుడే. మొదటి దేవుడే మోక్షమును కూడా ఇచ్చుచున్నాడు. మొదటి దేవుడే నీ కర్మను లేకుండా చేయు క్షమాశీలుడు. ఆయనే నిన్ను దయతలచి పరలోకమునకు చేర్చువాడు. పేరుకు మీరు ఆరాధించేది రెండవ దేవున్నియని తెలియనివారికి మూడవ దేవుని విషయము ఏమాత్రము తెలియదు. ఇది సామాణ్యులకు కాకుండా, పెద్దపెద్ద బోధకులకు కూడా అర్థముకాని విషయముగా యున్నది. అంతపెద్ద దేవుడయిన మొదటి దేవుడు, నీకు ఆరాధ్య దైవముగా యున్న దేవునికి కూడా గొప్పవాడయిన దేవుడు, నీకు తెలిసిన రెండవ దేవునికి అన్ని అధికారములు ఇచ్చిన మొదటి దేవుడు, ఎవరో నిత్యము జ్ఞానులము అని చెప్పుకొనువారికి కూడా తెలియదు. అంతేకాదు జ్ఞానులని బోర్డు పెట్టుకొని బోధలు చెప్పువారికి కూడా మొదటి దేవుని విషయము తెలియదు. ఇది ఖుర్ఆన్‍లోని విషయమే యని మాలాంటి వారు చెప్పినా వినకుండా మొదటి దేవుని విషయమును చెప్పిన మాలాంటి వారిని కూడా దూషించడము, అజ్ఞానులని ప్రచారము చేయడమును గ్రహించిన మొదటి దేవునికి అటువంటి వారిమీద కోపము రాదా? వస్తుంది. అందువలననే వారికి దైవ గ్రంథములోని విషయము తెలియకుండా చెవులకు, కన్నులకు ముద్రవేసి మూసివేశాడు. వారి బుద్ధికి తెలుసుకోవాలన్న శ్రద్ధ లేదు కావున వారికి అవగాహన లేకుండా చేశాడు. అందువలన వాక్యములో వారికిగానీ, వారి ముత్తాతలకుగానీ మొదటి దేవుని విషయము తెలియదని చెప్పారు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

124. ఆ రోజు ఒక్క చావు కోసము అరవకండి. అనేక చావుల కోసము అరవండి. (25-14)

(25-14) ''ఆ రోజు ఒక్క చావుకొరకు అరవకండి. అనేక చావుల కోసము అరుస్తూ ఉండండి.''


మనిషికి జీవితము చివరిలో చావు వస్తుంది. మనిషి జీవితము జననముతో మొదలయితే మరణముతో ముగుస్తుంది. ఒక్క జీవితమునకు ఒక మరణము తథ్యము. అయితే మనిషికి ఒక జీవితముతో వాడు లేకుండా పోతాడా? ఒక్క జీవితముతో లేకుండా పోవాలంటే అది మోక్షము పొందడముతోనే సాధ్యమగును. మోక్షము లభించాలంటే మనిషికి దేవుని జ్ఞానము అవసరము. దేవుని జ్ఞానము లభించాలంటే మనిషికి దేవుని దయ అవసరము. అయితే మనిషికి దేవుని మీద శ్రద్ధ లేదు కావున దేవునికి కూడా మనిషి మీద దయ లేదు. అందువలన మనిషికి దేవుని జ్ఞానము తెలియదు. దేవుని జ్ఞానము తెలియని కారణమున అతనికి ముక్తి (మోక్షము) లభించదు. ముక్తి లభించని కారణమున మనిషి మళ్లీ మళ్లీ పుట్టుచూ, మళ్లీ మళ్లీ చస్తూ ఉండాలి. అటువంటప్పుడు ఒక చావులో వచ్చు బాధకు ఏడ్చితే అది అంతటితో అయిపోదు కదా! అందువలన అనేక చావులకు, అనేకమార్లు ఏడ్చవలసియుండును. అందువలన ముందుగానే ఏడ్పునకు అలవాటు పడవలసియున్నది. ఒక్కచావు ఒక్క ఏడుపు కాకుండా, అనేక చావులు అనేక ఏడుపులు మనిషికి తప్పవు. ఒకవేళ చావు, పుట్టుకల నుండి తప్పించుకొని ఏడుపుల నుండి తప్పించు కోవాలంటే మనిషికి దేవుని జ్ఞానము అవసరము. మనిషికి దేవుని జ్ఞానము లభించాలంటే దైవ గ్రంథములను నమ్ముకో. మనుషులు చెప్పు మాటలను దైవ జ్ఞానమనుకోవద్దు. అలా నమ్మాలంటే దేవుడు భూమిమీదికి మనిషిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్పు మాటలను జ్ఞానమని నమ్ము. అలా నమ్ముటకు దేవుడు మనిషిగా వచ్చినా, ఆయన మనకు తెలియడు. అది అరుదుగా జరిగేపని. అందువలన ఇప్పుడు మూడు దైవ గ్రంథములు తప్ప ఏవిగానీ, ఎవరుగానీ జ్ఞానమును చెప్పు స్థితిలో లేరు. నేడు దైవ గ్రంథములు అందుబాటులో ఉన్నాయి. అందులోని జ్ఞానమును అందుబాటు లోనికి తెచ్చుటకు దేవుడే శరణ్యమని ఆయనను విశ్వసించి, ఆయన మీదే ఆధారపడడము మంచిది. అన్యదా వేరే దారి లేదు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు





అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

126. ఏ ప్రమాణము లేకుండానే అల్లాహ్ నిదర్శనాల గురించి వాదిస్తారు. అది దేవునికి సరిపోదు. వారికి ముద్ర పడుతుంది. (40-35)

(40-35) ''వారు తమవద్దకు వచ్చిన ఏ ప్రమాణము లేకుండానే అల్లాహ్ నిదర్శనాల విషయములో మొండిగా వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకర మైనది. ఈ విధముగా గర్విష్టి మరియు కౄరుడైన ప్రతి వ్యక్తి హృదయముపై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు.''


నిదర్శనము అనగా కనిపించనిది. కనిపించని ఏ జ్ఞానమయినా ప్రమాణములతో కూడుకొని యుండుట సహజము. కనిపించే దానికి ప్రమాణము అవసరము లేదు. దేవుడు అనేకమైన తన నిదర్శన జ్ఞానమునకు అనేక ప్రమాణములను చెప్పియున్నాడు. ఉదాహరణకు మనస్సును గురించి చెప్పినప్పుడు ''గాలి లేనిచోట దీపము వెలిగినట్లు'' అని చెప్పాడు. మనస్సు నిదర్శనముతో కూడుకొన్నదై యున్నది. దానికి గాలి లేనిచోట దీపము వెలిగినట్లు అనునది ప్రమాణముగా యున్నది. అలా ప్రమాణమును చెప్పినప్పుడు కనిపించని నిదర్శన విషయము కూడా కనిపించునట్లు తెలియబడును. అయితే కొందరు కౄరులైనవారు, గర్విష్టులయినవారు ఏ ప్రమాణము లేకుండా కొన్ని నిదర్శన విషయాలను గురించి మాట్లాడు చుందురు. అటువంటివారికి దేవుడు వారి హృదయాలపై అనగా వారి బుద్ధిపై దేవుడు ముద్రవేస్తాడు. ముద్ర వేయడము అనగా ఉన్న గ్రహింపు శక్తి కూడా లేకుండాపోవును. వారి హృదయాలలో ఆత్మ, పరమాత్మ ఉండడమే కాకుండా ముఖ్యముగా బుద్ధి కూడా ఉండును. అలా హృదయములో యున్న బుద్ధికి ఉన్న శక్తిని దేవుడు లేకుండా చేయును. దేవుడు అను ధ్యాస వచ్చినప్పుడు ఏ ప్రమాణమును లేకుండా వాదించు వారు మొండిగా వాదించువారుగా యున్నారు. అటువంటి వారికి ఎప్పటికీ జ్ఞానము అర్థము కాకుండా దేవుడు చేయుటకు వారి బుద్ధికి గ్రహింపు శక్తి లేకుండా ముద్ర వేయును.





అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

127. భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్‍దే. తాను కోరినది సృష్ఠిస్తాడు. కొందరికి ఆడ పిల్లలను ఇస్తాడు. మరికొందరికి మగ పిల్లలను ఇస్తాడు. (42-49)

(42-49) ''భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్ఠిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లలనిస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు.''


(42-50) ''లేదా వారికి ఆడ పిల్లల్ని, మగ పిల్లల్ని కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేస్తాడు. ఆయన మహా జ్ఞాని, సంపూర్ణ అధికారము కలవాడు.''


ఈ రెండు ఆయతులలో రెండవ ఆత్మయిన వాడు, అందరికీ ఆరాధ్య దైవముగా యున్నవాడు, శరీర సామ్రాజ్యమునకు సంపూర్ణ అధికారిగా యున్నవాడు, సమస్త జీవరాసులకు బీజదాతగాయుండి నిజమైన తండ్రిగా యున్నవాడు అయిన దేవున్ని గురించి ఇక్కడ చెప్పియున్నారు. ప్రథమ దైవ గ్రంథములోనే గుణత్రయ విభాగ యోగమున మూడు, నాలుగు శ్లోకములలో ఈ అల్లాహ్‍ను గురించి ఏమి చెప్పారో చూడండి.

శ్లో|| 3. మమ యోని ర్మహద్భహ్మ్ర తస్మిన్ గర్భం దధామ్యహమ్ |

సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత! ||


భావము :- శరీర రూపములో యున్న ప్రకృతి నాకు భార్యగా ఉండగా, నేను ప్రకృతికి బీజదాతగా యున్నాను. అందువలన భూమిమీద జీవరాసులు పుట్టుచున్నవని చెప్పుచున్నాను.

శ్లో|| 4. సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః |

తాసాం బహ్మ్ర మహద్యోనిః అహం బీజపద్రః పితా ||


భావము :- సకల గర్భములయందు పుట్టుచున్న సర్వ జీవరాసులకు బీజదాతనైన నేను తండ్రికాగా, ప్రకృతి తల్లిగా యున్నది. ఈ విధముగా సర్వజీవులకు తల్లితండ్రులు ప్రకృతి పురుషులని తెలియవలెను.


ఈ రెండు శ్లోకములలో అల్లాహ్ (దేవుడు) పుట్టిన జీవరాసుల కందరికీ నేను తండ్రిని, ప్రకృతి తల్లిగా యున్నదని, అయితే తమ నమూనాగా బయట కనిపించు తల్లి తండ్రులున్నారనీ ఆత్మజ్ఞానము (దైవజ్ఞానము) తెలియనివారికి బయట తల్లితండ్రులే కనిపించుచుందురనీ, వారి వెనుక కనిపించకయున్న తండ్రియైన తానుగానీ, తల్లియైన ప్రకృతిగానీ కనిపించడము లేదని చెప్పాడు. ఇదంతయూ ప్రథమ దైవ గ్రంథములోని విషయముకాగా, అదే విషయమునే అంతిమ దైవగ్రంథములో (42-49, 50) ఆయత్‍లలో చెప్పారు. సర్వులకు ఆరాధ్య దైవమైన అల్లాహ్ మరియు శరీరములో ఆత్మగాయుండి అన్నీ చేయుచూ, బీజదాతగా యున్న అల్లాహ్‍యే సర్వజీవరాసులకు తండ్రియని తెలియక, లోపలి వారి నమూనాను చూపునట్లున్న బయటి తల్లితండ్రులనే అందరూ తల్లి తండ్రులుగా లెక్కించు చున్నారు. వాస్తవముగా నిజమైన తల్లి తండ్రులను తెలియు నిమిత్తము బయట తల్లి తండ్రులను దేవుడు చూపుచున్నాడు. బుద్ధి వికాసములేని వారు, ఆత్మజ్ఞానము తెలియనివారు బయట కనిపించు మనుషులనే తల్లి తండ్రిగా గుర్తించగా, ఆత్మజ్ఞానము గలవాడు దైవగ్రంథములలోని జ్ఞానమును గ్రహించి, గ్రహించిన జ్ఞానము ప్రకారము కనిపించక శరీరములోనే యున్న తల్లి తండ్రులను గుర్తించుచున్నాడు.


దైవ గ్రంథములలో దేవుడు తెల్పిన జ్ఞానము ప్రకారము జీవరాసులు ఎక్కడ ఏ గర్భములో పుట్టినా, వాటికన్నిటికీ నిజమైన తల్లితండ్రులు ప్రకృతి పురుషులని తెలియుచున్నది. వాక్యములో భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్‍దేయని చెప్పారు. దాని ప్రకారము భూమి, ఆకాశములు అని చెప్పగానే జీవుడు ధరించు శరీరమని తెలియవలెను. దానిప్రకారము మనము శరీరములో నివశించుచున్నాము. అయినా మనము నివశించు శరీరమునకు యజమాని ఆత్మయిన దేవుడే. బయటి ఇంటిలో కిరాయికి మనమున్నామనుకోండి. ఇంటిలో ఉన్నది మనమే అయినా ఇంటి యజమాని ఇంకొకరున్నారు. ఆయనకు ఇంటి కిరాయిని (బాడుగను) కట్టి ఉంటున్నాము. అలాగే శరీరములో నివశించు మనకు శరీరము నాదేయను భావముండినా, వాస్తవముగా శరీరము మనదికాదు. శరీరమునకు యజమాని శరీరమంతా వ్యాపించియున్న అల్లాహ్‍యే. నిత్యము ఆహారము అను కిరాయిని కట్టుచూ, ఇల్లును శుభ్రము చేసినట్లు ప్రతీ రోజు స్నానము, పళ్లు తోమడము, ముఖము కాళ్లు కడుక్కోవడము మొదలగు పరిశుభ్రత పనులు చేయుచూ శరీర గృహములో నివశించుచున్నాము. ఈ శరీరమునకు యజమానిగాయున్న అల్లాహ్‍యే నీకు తండ్రిగా, ప్రకృతి తల్లిగా యున్నది.


తండ్రియైన అల్లాహ్ శరీర సామ్రాజ్యమునకు అధిపతిగా యున్నాడు. అందువలన ఆయన అనుకొంటే ఆడ పిల్లలను ఇస్తాడు. అట్లే ఆయన అనుకొంటే కొందరికి మగ పిల్లలను ఇస్తాడు. ఆడ మగ పిల్లలను ఎవరికి ఎట్లు ఇవ్వాలని బాగా తెలిసినవాడు శరీరములో ఆత్మగా వ్యాపించి యున్న దేవుడు. ఆయన ఎవరి కర్మకు తగినట్లు వారికి ఆడ పిల్లలనుగానీ, మగ పిల్లలను గానీ ఇవ్వడము జరుగుచుండును. అట్లుకాకుండా ఆయన అనుకుంటే కర్మననుసరించి ఆడ, మగ పిల్లలను కలిపి కూడా ఇవ్వగలడు. కొందరికి అందరినీ ఆడ పిల్లలను ఇచ్చినవాడు, కొందరికి అందరినీ మగ పిల్లలనే ఇచ్చును. అంతేకాక ఇంకా కొందరికి సంతానము కలుగకుండా చేసి గొడ్రాళ్లుగా చేయును. సంతతికి ఆయనే తండ్రి అయినందున ఎవ్వరికి ఏ విధముగానయినా సంతానమును ఇవ్వవచ్చును. ఏ సంతానమునకయినా, ఎక్కడపుట్టిన సంతానమునకయినా, ఏ జాతిగా పుట్టిన సంతానమునకయినా, దేవుడే తండ్రియని తెలియవలెను. రెండవ ఆత్మకు మార్పు చెందే ప్రకృతికి సంతానము కలదుగానీ, మొట్టమొదటి ప్రకృతిని (ప్రపంచమును) సృష్ఠించిన పరమాత్మయను దేవునికి సంతతి లేదని జ్ఞాపకముంచుకోవలెను.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

128. ఘనమైన రాత్రి అంటే ఏమనుకొన్నావు? ఏదనుకొన్నావు? (97-1, 2, 3, 4, 5)

(97-1, 2, 3, 4, 5)


(1) నిశ్చయముగా మేము దీనిని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము.


(2) ఘనమైన రాత్రిని గురించి నువ్వు ఏమనుకొన్నావు?


(3) ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది.


(4) రాత్రియందు దేవదూతలు, ఆత్మ తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వాహణ నిమిత్తము దిగివస్తారు.


(5) ఆ రాత్రి మొత్తము (ఆసాంతము) శాంతియుతమైనది. తెల్లవారే వరకు అది శాంతియుతముగానే ఉంటుంది.


ఈ సూరాలో ఐదు వాక్యములున్నవి. ఈ ఐదు ఆయత్‍లలో మొదటి దానియందు, నాల్గవదానియందు దేవుడు చెప్పినది చెప్పినట్లు కాకుండా కొంత మానవ జోక్యముతో చెప్పబడినట్లు కన్పించుచున్నది. సామాణ్యముగా దానిని ఎవరూ గమనించలేరు. అట్లే ఇంతకుముందు కొన్ని సూరాలలోని ఆయత్‍లను కూడా జిబ్రయేల్ చెప్పిన దేవుని వాక్యమును అట్లేయుంచక బ్రాకెట్లలో తమకు తోచినది వ్రాశారు. ఖుర్ఆన్ మాతృగ్రంథములో గలదు అని చెప్పిన వెంటనే ఉమ్ముల్ కితాబ్ అని వ్రాశారు. (56-78) లో సురక్షితమైన గ్రంథములో ఖుర్ఆన్ నమోదై ఉన్నది అని చెప్పిన వెంటనే ఉమ్ముల్ కితాబ్ అని వ్రాయడము పెద్ద పొరపాటుగా కనిపించుచున్నది. అలాగే ఆత్మ అను పేరు వస్తూనే ఆత్మ విషయము పూర్తిగా తెలిసినట్లు ఆత్మను బ్రాకెట్లో ''జిబ్రయేల్'' అని వ్రాశారు. అట్లే (28-52) లో కూడా దీనిని అనగానే ఖుర్ఆన్ అని అక్కడ చెప్పని గ్రంథము పేరు చెప్పడమైనది. అదే విధముగా 97వ సూరాలో 1,4 ఆయత్‍లలో అలాగే వ్రాయడము జరిగినది. ఒకటవ ఆయత్‍లో అక్కడ చెప్పని ఖుర్ఆన్ పేరు చెప్పడము జరిగినది. అలాగే నాల్గవ ఆయత్‍లో ఆత్మని చెప్పిన చోట ''జిబ్రయేల్'' అని అనవసరపు పేరుని వ్రాసి ఆయత్‍లోని జ్ఞానమును దారిమళ్లించడము జరిగినది. అదేపనిగా ఇది తెలిసి చేసిన తప్పుకాదు. పాఠకులకు బాగా అర్థము కావాలని చేసిన మంచి ప్రయత్నములో దొర్లిన తప్పుగా మేము అనుకొంటున్నాము. నేను కూడా సాధ్యమైనంత దగ్గరగా పాఠకులకు అర్థము కావాలని ప్రయత్నము చేసి చెప్పుచున్నాము. అయితే మేము ప్రతి వాక్యములోను శాస్త్రబద్దతను విధిగా ఉండునట్లు చూస్తున్నాము. అల్లాహ్ తన ప్రతి వాక్యములోనూ శాస్త్రబద్దత యున్నట్లు చేశాడు. శాస్త్ర విధానము లేని చిన్న వాక్యము కూడా దేవుని బోధలో కనిపించదు. అందువలన మేము చాలా జాగ్రత్తగా శాస్త్రబద్దతను కల్గిన వివరమునే చెప్పుచున్నాము గానీ, అశాస్త్రీయముగా ఎప్పుడూ చెప్పలేదు. ఆ విధానములో మా పద్ధతి ప్రకారము మేము చెప్పుచూ ఎక్కడయితే దేవుని వాక్యములోని అర్థము తప్పుదారి పట్టుచున్నదో, ఎక్కడయితే శాస్త్రబద్దత లేని వివరము చెప్పబడుచున్నదో, అక్కడ జోక్యము చేసుకొని పక్షపాతము లేకుండా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పుచున్నాము.


దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే. అలాగే మనిషి జాతి ఒక్కటే మనుషులలోని మాయ ఒక్కటే. దేవుని జ్ఞానమును గురించి దైవ గ్రంథములలో విపులముగా చెప్పబడినదిగానీ, మనిషిలోని మాయను గురించి ప్రథమ దైవగ్రంథములో విపులముగా చెప్పబడినా, అది హిందువులకే సరిగా అర్థము కాలేదు. అంతిమ దైవగ్రంథములో దేవుని జ్ఞానమును విపులముగా చెప్పినా, మాయ ప్రభావము వలన దైవ జ్ఞానము అర్థము కాని పరిస్థితి ఏర్పడినది. అటువంటి పరిస్థితిని అతిక్రమించుటకు దేవుడు తన జ్ఞానమును నా బుద్ధికి అందించగా దానినే నేను మీకు అందించు చున్నాను. ఇందులో నా స్వార్థము ఏమీ లేదు. సత్యము ప్రకటించడమే దేవుని పనిగా చేయుచున్నాము. సత్యసమేతమైన జ్ఞానము దేవునిదే, చెప్పించు వాడు దేవుడే. మధ్యలో నేను బొమ్మను మాత్రమే. ఇప్పుడు (97)వ సూరాలోని ఐదు ఆయత్‍లను శ్రద్ధతో చూస్తాము.


మొదటి ఆయత్‍లో ఘనమైన రాత్రియని చెప్పబడినది. ఆ ఘనమైన రాత్రియందు అవతరింపజేయబడినది ఒకటి గలదు. ఈ వాక్యములో రెండే ముఖ్యమైనవి గలవు. అందులో ఒకటి ఘనమైన రాత్రి, రెండవది ఉద్భవించినది. ఈ రెండును జాగ్రత్తగా గమనించవలసియున్నది. అయితే రెండవ దానిని ఖుర్ఆన్ గ్రంథము అని బ్రాకెట్లో వ్రాసియున్నారు. వారు వ్రాసినది అటుంచి మనము తెలియవలసినది ఏమిటో జాగ్రత్తగా చూడవలెను. మిగతావారు వ్రాసిన వాక్యము ఇలా కలదు చూడండి.


(97-1) నిశ్చయముగా మేము దీనిని (ఖుర్ఆన్‍ను) ఘనమైన రాత్రియందు అవతరిపంజేశాము. (అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్)


ఈ వాక్యములో దీనిని అనుచోట ఖుర్ఆన్ అని వ్రాయడమే కాక మరియొక గ్రంథమయిన 'దివ్య ఖుర్ఆన్ సందేశము' అను గ్రంథములో ఘనత గల రాత్రి యని చెప్పుచూ రంజాన్ నెలలో చివరి పది రోజులలో బేసి రాత్రులలో ఒకటని చెప్పారు. ఆ మాటను చాలా హదీసులలో వ్రాశారు అని చెప్పారు. ముస్లీమ్ పెద్దలు చెప్పిన మాటలు అయినందున అందరూ నమ్మవలసి వచ్చినది. అయితే ఇక్కడ సత్యాసత్య వివరము తప్పదని చెప్పుచూ ముందు రాత్రిని గురించి చెప్పుచున్నాము. ఒక దినము రెండు భాగములుగా గలదు. ఒకటి పగలు, రెండు రాత్రి. దినములో పగటిపూట సూర్యుడుండుట చేత వెలుగుయుండును. ఆ వెలుగులో అన్నీ స్పష్టముగా కనిపించు చుండును. ప్రతి వస్తువు యొక్క రూపురేఖలు సక్రమముగా తెలియు చుండును. అదే చీకటితో నిండిన రాత్రిలో ఏదీ తెలియదు. ఇతరులు చూడకుండా చేయు రహస్య కార్యములను రాత్రిపూట చేయుచుందురు. అందువలన రాత్రి యనగా తెలియని స్థితి కల్గించునదని ఒక విధమైన అర్థమును చెప్పవచ్చును. ఇంకా 'రా' అంటే లేనిది, తెలియనిది అని చెప్పుకొంటే రాత్రి అనగా మూడు తెలియనిది అని అర్థము. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విషయములు తెలియనిది. రాత్రి అంటే తెలియని రహస్యము అనీ, ఏమీ తెలియకుండా చేయు అంధకారమని చెప్పవచ్చును. చీకటిలో ఒక పనిని చేస్తే అది ఇతరులకు తెలియదను నమ్మకము గలదు. అంటే ఇతరులకు తెలియనిది అని చెప్పవచ్చును. ఇతరులకు తెలియని రహస్యము ఏదయినా ఉంటే దానిని చీకటి రాత్రితో పోల్చి చెప్పవచ్చును.


97వ సూరాలో రెండవ వాక్యమునందు ఘనమైన రాత్రిని గురించి నువ్వు ఏమనుకొన్నావు? అని ప్రశ్నించి అడుగడము కూడా జరిగినది. దేవుడు ప్రశ్నించిన రాత్రి సాధారణ చీకటి రాత్రికాక ఘనమైన రాత్రియని చెప్పబడినది. అది ఎవ్వరికీ తెలియదు కావున ఘనమైన రాత్రి అంటే నువ్వు ఏమనుకొంటున్నావు? అని ప్రశ్నించడము కూడా జరిగినది. అంతేకాక ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది అని మూడవ ఆయత్‍లో చెప్పారు. ఆ రాత్రి మొత్తము శాంతితో కూడుకొన్నదని చివరి ఐదవ వాక్యములో చెప్పారు. అంతపెద్ద గొప్పగా ఆ రాత్రిని గురించి చెప్పారు అంటే, అదేదో గొప్ప సారాంశమయిన రాత్రియని అనుకోక తప్పదు. అయితే నాల్గవ వాక్యములో ఘనమైన రాత్రిని గురించి కొంత విషయము తెలిసినది. అందులో సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము తమ ప్రభువు ఆజ్ఞ మేరకు దేవదూతలు, ఆత్మ దిగి వస్తారు అని చెప్పియున్నారు. అలా వారు దిగి వస్తున్న రాత్రి అయినందున అది ముఖ్యమైన రాత్రి అయినది. దానినే ఘనమైన రాత్రియని చెప్పారు. దేవదూతలు మరియు ఆత్మ దిగి వచ్చారు అని వ్రాసియుంది. అలా వ్రాసిన దానినిబట్టి (1) ఎక్కడ నుండి దిగి వచ్చారు? (2) ఎంత ఎత్తునుండి దిగి వచ్చారు? (3) పైన ఎవరున్నారు? (4) పైన ఉన్నవారు క్రింద లేరా? (5) పై నుండి వచ్చిన దేవదూతలు, ఆత్మ కార్యనిర్వాహణ నిమిత్తము ఎవరు పంపగా వచ్చారు? (6) పంపినవారు ఎవరు? (7) కార్యముల నిర్వాహణ నిమిత్తము వచ్చారు అనగా అవి ఏ కార్యములు? (8) వీరే ఎందుకు చేయాలి? (9) వచ్చినవారికి ఆ కార్యములకు ఏమి సంబంధము? అని తొమ్మిది ప్రశ్నలకు సమాధానమును తెలిసినట్లయితే ఈ ఐదు వాక్యముల 97వ సూరాలోని అంతరార్థము పూర్తిగా తెలియును.


ఇంతవరకు 97వ సూరాలో చెప్పుకొన్న ఐదు ఆయత్‍లను మరచిపోయి, జవాబులులేని ఆ ప్రశ్నలను వదలివేసి, బుర్ర బద్దలు చేసుకొన్నా అర్థముకాని వాటిని వదలివేసి ఇప్పుడు మనము క్రొత్త కథను, రహస్యమైన కథను, అంతో ఇంతో జ్ఞానము గలవారు మాత్రమే విశ్వసించు కథను, అజ్ఞానులు ఏమాత్రము ఒప్పుకోని కథను, అందరికీ ఆశ్చర్యమును సంతోషమును కల్గించు కథను చెప్పుకొందాము. ఈ కథను సృష్ఠి రహస్యమని కొందరు, దేవుడు చేసిన మొదటి పనియనీ, అదే చివరి పనియనీ, కొందరు చెప్పుకొన్నట్లున్న కథను, సత్యమునకు నూరుపాళ్లు దగ్గరగా యున్న కథను, శాస్త్రబద్దతతో కూడిన కథను చెప్పుకొందాము. ఒకమారు వింటే అర్థముకాని కథను, ఇది నిజమాయని ఆశ్చర్యమును కల్గించు కథను, రహస్యములలో కెల్ల రహస్యమైన కథను నువ్వు చెప్పడమేమిటి? యని అందరిచేత అనిపించు కథను ఇప్పుడు నా చేత చెప్పబడుచున్నది చూడండి.


అనగనగా ఒకరోజు. ఆ రోజు పగలు కాదు, రాత్రి కాదు. అది ఒక సమయము, ఆ సమయములో అంతవరకూ చేయని ప్రత్యేకమైన పనిని ఒకడు చేయాలనుకొన్నాడు. అప్పుడు ఆ ఒక్కడుతప్ప ఎవరూ లేరు. ఆ ఒక్కడు మాయల మరాఠికంటే గొప్పవాడులాగా కనిపించుచున్నాడు. అతని వేషధారణనుబట్టి ఆడాకాదు, మగకాదు అన్నట్లు ఆడ, మగ రెండు లక్ష్యణములు కలిసియున్నవానిగా కనిపించుచున్నాడు. అతడు ఉండు స్థలము పైన ఆకాశమూ కాదు, క్రింద భూమీ కాదు. అనగా ఆకాశముగానీ, భూమిగానీ లేనిచోట ఆయన ఉన్నాడు. నీ పేరు ఏమి అని అడిగితే నాకు పేరు లేదు అన్నాడు. నీకు భార్యలేదా, పిల్లలు లేరాయని అడిగితే లేరని చెప్పాడు. నీకు తల్లితండ్రులు లేరాయని అడిగితే నేను ఎవరికీ పుట్టలేదు అన్నాడు. నీవు ఏమి చేస్తావు అని అడిగితే నేను చేసేది నీవు చూస్తావు, అయినా నేను చేసేది నీకు అర్థము కాదు. తర్వాత ఎప్పటికీ ఏమీ చేసేవాడిని కాను అని చెప్పాడు. ఆయన చెప్పినదానినిబట్టి నీవు దేవునివా అని అడిగితే, అది నీవు అనే మాటేగానీ నేను దేవున్ని కూడా కాను అని అన్నాడు. నిన్ను ఎలా అర్థము చేసుకోవాలియని అడిగితే, నేను ఎవరికీ అర్థము కాను కదా! యని అన్నాడు. చివరకు నేను అంతగా అడిగాను కదా! నాకు తృప్తి కల్గించుటకు, నా కోసమయినా నీవు ఎవరో పూర్తిగా కాకుండా కొద్దిగా అయినా చెప్పు అని అడిగితే అప్పుడు అతను ఒకమాట చెప్పాడు. ''నేను నేనే, నేనే పెద్ద'' అని రెండు మాటలు చెప్పాడు. అయితే ఎంత పెద్దయని గానీ, ఎవరికి పెద్దయనిగానీ చెప్పలేదు. తర్వాత ప్రశ్నించితే నేను ఇంతవరకు చెప్పిన జవాబు సరిపోదాయని అన్నాడు.


ఇది ఒక కథే అయినా యదార్థమువలె జరిగిపోయినది. కలలో వలె నేను అడుగడము, ఆయన చెప్పడము జరిగినది. అందువలన ఈ కథ చాలా ఆసక్తికరమైనది. ఒక విధముగా ఇది కథే అయినా, కలలో నాకు తెలుస్తూ జరిగినది కావున ఒక విధముగా యదార్థమని చెప్పవచ్చును. కల యదార్థమైనా, చూచినవానికి యదార్థమే అయినా, మిగతా వారికందరికీ యదార్థము కాదు, కల ఒక్కరి అనుభవమునకే వచ్చునది. నా కల మిగతా వారందరికీ యదార్థము కానిదయినా నాకు ఒక్కనికి సత్య అనుభవము. కలలో అంతవరకూ కనిపించిన వ్యక్తి చెప్పలేనంత విశాలముగా మారిపోయి తననుండి పెద్ద ప్రపంచమును తీసి చూపించాడు. అలా చూపబడిన ప్రపంచములో జీవరాసులు ఒక్కటి కూడా లేవు. మనుషులుగానీ, జంతువులుగానీ, ఈగ, దోమగానీ, చిన్న పురుగుగానీ ఏదీ లేని జీవరహిత ప్రపంచముగా ఉండేది. అలా ఒక్కటే ఒకటి చేసిన ఆయనను చీమగానీ, దోమగానీ ఏదీ లేనిది దేనికి? అని అడుగగా! అప్పుడే కొన్ని కోట్లమంది దేవదూతలను, ఒకే ఒక్క ఆత్మను తననుండి బయటికి తీసి చూపి ఆయన కదలక, మెదలక, ఏమీ మాట్లాడక ఊరికే ఉండిపోయాడు. ''నేనే పెద్ద, నేను నేనే'' యనిన ఆయన తర్వాత నాతో ఏమీ మాట్లాడక మౌనము వహించి ఊరక ఉండిపోయాడు. అప్పుడు నేను అడుగు అనేక ప్రశ్నలకు ఆత్మగా వచ్చిన ఆయన నీ ప్రశ్నలకు నేను జవాబును చెప్పుదును కదా! నన్ను అడుగు నీ ప్రశ్నలకు జవాబు చెప్పేదానికే మేము వచ్చాము అని అత్మ చెప్పాడు.


మీరు తప్ప ఎవరూ కనిపించలేదేయని ఆత్మను అడిగితే అయితే చూడు అని జీవరూపమైన సమస్త జీవరాసులను, మనుషులను ఆత్మ తయారు చేసినది. ఒకే దినము ఒకే స్వప్నములో జీవరహిత ప్రపంచమును ''నేను నేనే, నేనే పెద్ద'' యనువాడు చేయగా, ఆయన తన నుండి ఆత్మను, దేవదూతలను కూడా బయటికి తీశాడు. అప్పుడు ఆత్మయినవాడు జీవరూప శరీరములోనికి చేరి నేను ఒక్కనినే శరీరములో పని చేయుదును. కోట్లాదిమంది బయట ప్రపంచములో పని చేయుదురు. మమ్ములను సృష్ఠించినవాడే మాకు సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము పంపాడని చెప్పాడు. అందువలన నా కంటే పెద్ద, ప్రప్రథమముగా పుట్టించినవాడు అయిన ఆయన మాట ప్రకారము మేము పనులు చేయుచుందుము అని చెప్పాడు. నీవు ఆత్మవు కదా! స్వప్నములో కనిపించిన నీవు మెలుకువలో నాకు కనిపిస్తావా? అని అడుగగా అలా నేను ఎవరికీ కనిపించను. ఎవరికి కనిపించినా స్వప్నములోనే కనిపిస్తాను. అయితే నేను ఆత్మనని వారికి తెలియదు. వారు నన్ను గుర్తించలేరు. అయితే తర్వాత నిన్ను ఎప్పుడు చూడాలి? అని అడిగితే నన్ను చూచుటకు నన్ను తెలియు విద్య ఒకటి గలదు దానినే ఆత్మను అధ్యాయనము చేయు విద్య అని అంటారు. దానినే ఆధ్యాత్మిక విద్యయని కూడా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక విద్యను నేర్వాలంటే దేవుడిచ్చిన దైవ గ్రంథములను చదువు. అప్పుడు నేను తెలియగలను అని అన్నాడు.


నా స్వప్నము సృష్ఠ్యాదిలో దేవుడు అనబడువాడు. నేను దేవున్ని యని ఒప్పుకొననివాడు. నేను నేనేయని, నేను పెద్దయని చెప్పినవాడు. నాకు చెప్పినది సృష్ఠ్యాదిలోనే జ్ఞాపకము గలదు. దేవుడు అనినా నేను దేవున్ని కాను అను పరమాత్మ, ఆత్మను తయారు చేసి ఇతనే మీ దేవుడని అందరికీ ఆ రోజే చెప్పాడు. అప్పటి నుండియున్న ఆత్మే అందరిలో యుంటూ శరీర కార్యములన్నీ చేయుచూ, శరీరములో కార్యకర్తగా యున్నానని చెప్పాడు. ఇదంతయూ ఎవరికీ తెలియకుండా జరిగినది. కావున అది ఘనమైన రాత్రియనీ, ఆ రాత్రి ఈ ప్రపంచమును అవతరింపజేశాను అని అన్నాడు. పెద్దవాడయిన ఆయన ప్రపంచమును అవతరింపజేశానని చెప్పగా, ఏమీ తెలియనివారు ఖుర్ఆన్‍ను అని చెప్పడము పొరపాటు కాదా?


ఖుర్ఆన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్తగారికి కలియుగములో దాదాపు 1400 సంవత్సరముల కిందట జిబ్రయేల్ అను గ్రహము ఆకాశము నుండి వచ్చి చెప్పగా తయారయినది. 97వ సూరాలో చెప్పినది సృష్ఠి మొదట జరిగిన సమాచారము. అది ఎవరికీ తెలియని సమాచారము అని తెలియునట్లు ఘనమైన రాత్రి జరిగినదని చెప్పబడినది. సృష్ఠి మొదటి రోజు విశ్వమునకు చక్రవర్తి అయిన పరమాత్మ మొదట జీవరహిత ప్రపంచమును తర్వాత ఆ ప్రపంచములో తన పాలన సాగించుటకు కోట్లాది దేవదూతలను ఒక ప్రక్క, ఆత్మను ఒక ప్రక్క సృష్ఠించి ఆత్మ ద్వారా సర్వ జీవరాసులను తయారు చేయించాడు. తాను మాత్రము ఏమీ చేయక అవసరమైన దానిని సంకల్పించుకోగా దేవదూతలు ఆ పనిని చేసేవారు. దేవదూతల సైన్యము బయట ప్రపంచములో ఉండగా, సర్వ శరీరముల లోపల ఆత్మయుండి దేవుని పాలనను సాగించుచున్నారు. తర్వాత జరుగునది దేవుని పాలనే అయినా, మొదట సృష్ఠి జరిగిన విధానమును ఈ ఐదు వాక్యములలో చెప్పారు. మీకు అర్థమయ్యే నిమిత్తము నేను స్వప్నములో చూచాను, ఇట్లే ఆ దినము జరిగినది అని చెప్పాను. నేను చెప్పినట్లు జరిగినది వాస్తవమే. అయినా ఇప్పుడు చెప్పే నేనుగానీ, వినే మీరుగానీ ఆ రోజు లేము. అయినా నేను ఉన్నట్లు చెప్పినా, చెప్పకున్నా ఆ రోజు జరిగినది సత్యము.


మీరు ఆ రోజు లేకున్నా అప్పుడు జరిగిన విషయము సత్యము అని ఎలా చెప్పగలుగుచున్నారని అడుగవచ్చును? మీరు అడుగు ప్రశ్న సమంజసమైనదే. ఆ దినము జీవము అనునది ఏదీ లేదు. అటువంటి అగోచర చీకటి సమయములో మొదట నేనే పెద్ద అనునతని నుండి (పరమాత్మ నుండి) ప్రకృతి తయారు చేయబడినది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగముల ప్రకృతి జీవరహితముగా ఉండగా, ప్రకృతిని చేసిన తర్వాత తాను పనిని చేయదలచుకోని దేవుడు తన పనిని చేయు ఆత్మను, అట్లే బయట ప్రపంచములో తన పాలనను సాగించుటకు కోట్లాది దూతలను (దేవుని సైన్యమును) తయారు చేశాడు. పరమాత్మయను దేవుని నుండి బయటికి వచ్చిన ఆత్మ జీవ శరీరములను తయారు చేసి శరీరముల లోపల పాలన సాగించగా, శరీరము బయట దేవదూతలు పాలనను సాగించారు. సృష్ఠ్యాదిలో ఆత్మ, దూతలు తయారయిన తర్వాత నేను నువ్వు మనమందరము తయారు చేయబడినాము. అప్పుడు ఏమి జరిగినది నీకు తెలియని చీకటి రాత్రిగా అది యున్నది. సృష్ఠి తయారయిన మొదటి దినము కావున దానిని ఘనమైన రాత్రియని అన్నారు. దేవుని పాలన సూర్యోదయముతో ఆదివారము ప్రారంభము అయినది. సృష్ఠియంతయూ ఆదివారము సూర్యోదయము కాకముందే జరిగినది. కావున రాత్రి జరిగినదని అది ముఖ్యమైన రాత్రి, ఘనమైన రాత్రియని అన్నారు. దేవుడు తన సృష్ఠిని రాత్రి సాగించగా తన సృష్ఠిలో సూర్యుడు, గ్రహములు, భూతములు అన్నీ పూర్తిగా తయారయినవి. అందువలన దేవుని సృష్ఠియొక్క మొదటి దినము చైత్రమాసమయిన మొదటి మాసముతో మొదటి దినమైన ఆదివారముతో ప్రారంభించడము జరిగినది. తర్వాత గ్రహములనుబట్టి శనివారము వరకు తయారు చేయబడినాయి. సృష్ఠి తయారయిన తర్వాత ఆదివారము నుండి శనివారము వరకు తయారైనవి. మొదట శనివారము లేదు. ఆదివారము లేదు. సృష్ఠి ప్రారంభమైన తర్వాతే వారములు, నెలలు వచ్చాయి. దీనినిబట్టి శనివారము రాత్రి సృష్ఠి తయారై ఆదివారము ఉదయము మొదలయినదని చెప్పవచ్చును. శనివారము విషయములో ఎవరు విభేదించుకొన్నారో వారికి మాత్రమే దాని విశిష్ఠత విధించబడినది అని సూరా 16లో ఆయత్ 124లో కూడా చెప్పియున్నారు.


సృష్ఠి ప్రారంభ దినమును అనగా తెలియని ఆ రాత్రిని ఘనమైన రాత్రి అని అనుటకు కారణము తెలిసినది. అయితే ఆ ఘనమైనరాత్రిని గురించి నీవు ఏమనుకొన్నావు? అని ప్రశ్నించారు. అంతేకాక మూడవ ఆయత్‍లో ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది అని అన్నారు. ఆ మాట చెప్పడములో ఒక నిగూఢ భావము అందులో గలదు. సంఖ్యలో పెద్ద సంఖ్య కోటి అయినా అందరూ సర్వసాధారణముగా పెద్ద సంఖ్యగా వేయి నే చెప్పుచుందురు. ఇక్కడ వేయి నెలలు అని చెప్పడములో ఒక రహస్య భావము గలదు. వేయి నెలలు 83 సంవత్సరముల 4 నెలలు అగును. అనగా దాదాపు ఒక మనిషి జీవితము అని అర్థము. మనిషి 83 సంవత్సరములు బ్రతుకవచ్చును, బ్రతుకకపోవచ్చును. అనగా ఒక జీవితకాలములో కూడా ఘనమైన రాత్రిని గురించి తెలియలేడను అర్థముతో అలా చెప్పారు. ఘనమైన రాత్రి వేయి నెలలకంటే కూడా మేలయినది అని అన్నాడు. ఘనమైన సృష్ఠి రాత్రి యొక్క రహస్యము వేయి నెలలకయినా తెలియలేనంత గొప్పదని అర్థము చేసుకోవలెను.


ఇకపోతే నాల్గవ ఆయత్‍లో తమ ప్రభువు ఉత్తర్వుల మేరకు అనగా పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము అని చెప్పారు. దాని ప్రకారము దేవుని ఆజ్ఞ మేరకు పాలన సాగించు నిమిత్తము దేవదూతలు, ఆత్మ దేవుని నుండి దిగివచ్చారు అని అర్థము చేసుకోవలెను. ఆ దినము జరిగినది అంతే. ఎంతో ప్రశాంతముగా సృష్ఠి జరిగినది. అందువలన ఆ రాత్రి మొత్తము శాంతియుతమైయున్నది అన్నారు. తెల్లవారేవరకు శాంతిగానే యున్నది. తెల్లవారిన తర్వాత రాత్రి తయారయిన సృష్ఠిపాలన దేవదూతల వలన బయట ప్రపంచములో, ఆత్మ వలన శరీరములో సాగుట వలన అంతా అశాంతిమయమైపోయినది. అందువలన తెల్లవారేవరకు శాంతియుతముగానే యున్నది అని అన్నారు. దాని అర్థము ప్రకారము తెల్లవారిన తర్వాత శాంతిలేదు అని అర్థము. సృష్ఠి జరిగినప్పుడు నేను లేను, సృష్ఠి తర్వాత నేనున్నాను. అయినా గత జన్మ జ్ఞాపకము ఎవరికీ ఉండదు. పోయిన వంద సంవత్సరముల క్రిందట నేను ఎక్కడున్నది నాకే తెలియదు. అటువంటప్పుడు సృష్ఠి జరిగిన సమయమును గురించి ఎలా చెప్పగలుగుచున్నారు? అని ప్రశ్న రాగలదు. ఒకవేళ నాలోని ఆత్మయినా చెప్పుటకు ఆత్మ పుట్టక ముందు ప్రకృతి తయారయినదని చెప్పుచున్నారు. అందువలన మొదట జీవరహిత ప్రకృతి తయారయినప్పుడు ఆత్మలేదు. అప్పుడున్నది పరమాత్మ ఒక్కడే. అప్పటి విషయమును పూసగ్రుచ్చినట్లు ఎట్లు చెప్పుచున్నారని ఎవరయినా అడుగవచ్చును. దీనికి జవాబు నాకు తెలుసు. అయినా నేను చెప్పను.


సృష్ఠి జరిగిన రాత్రి ఆదివారము ఉదయముకంటే ముందుగల రాత్రి అనగా శనివారము రాత్రి అగును. శనివారమునకు శని అధిపతియని చెప్పుచుందురు. శని ద్వాదశ గ్రహములలో ఒకడు, ఘనమైన రాత్రికి అనగా శనివారము రాత్రికి శని పేరే చెప్పియుండుట వలన, ఘనమైన రాత్రి ఎవరికీ తెలియని చీకటి రాత్రియని చెప్పుట వలన, పదకొండు గ్రహములకు లేని నల్లని రంగును శనికి పూసిపెట్టారు. దానివలన శని నల్లగా ఉంటాడు అని చెప్పుచుంటారు. ఎక్కడయినా శని విగ్రహమును పెట్టితే నల్లగా ఉండే విగ్రహమునే పెట్టుదురు. సృష్ఠి రహస్యము తెలియనిది అని నల్లని రంగును చూపడము జరిగినది. అంతేకాక ఘనమైన రాత్రి వేయి నెలలకంటే గొప్పదియని అన్నారు. ప్రత్యేకించి వేయి సంఖ్యను తీసుకొని చెప్పడములో కూడా కొంత అర్థము గలదు. అది ఏమనగా! వేయి సంఖ్యను వ్రాస్తే ముందు ఒకటి యుండి తర్వాత మూడు సున్నాలు ఉండును. దేవుడు మూడు ఆత్మలుగా యున్నాడు కావున మూడు సున్నాల సంఖ్యను చూపారు. దేవుడు పరిపూర్ణుడు అందువలన ఆయన జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా యుండుట వలన, ఆత్మలు సంపూర్ణమైనవి అయినందున, వాటి గుర్తుగా మూడు సున్నాల వేయి సంఖ్యను వ్రాయడమైనది. ఆత్మలు మూడు పురుషులుగా యున్నవి. అట్లే ప్రకృతి స్త్రీగా యున్నది. పురుషులయిన ఆత్మలకు సున్నాలు, స్త్రీతత్త్వమైన ప్రకృతికి ఒకటి సంఖ్యను పెట్టి వేయిగా చూపి ''వేయి నెలలు గడచినా ప్రకృతి, పురుషులు అను నాలుగు భాగములుగా యున్నవానిని తెలియలేరు'' అని చెప్పడమైనది.



సృష్ఠి తర్వాత దేవుడు నాలుగు భాగములుగా ఉన్నాడని వేయి సంఖ్యను చూపడమైనది అని తెలియవలెను.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

129. నీపై పర్యవేక్షకులు నియమితులైయున్నారు. (82-10,11,12)

(82-10) నిశ్చయముగా మీపైన పర్యవేక్షకులు నియమితులై యున్నారు.


(82-11) వారు మీ కర్మలను నమోదుచేసే గౌరవనీయులైన లేఖకులు.


(82-12) మీరు చేసేదంతా వారికి తెలుసు.


ఈ మూడు వాక్యములు ఒకే విషయమునకు సంబంధించినవై యున్నవి. 'మీపై మిమ్ములను చూస్తూ కాపలా కాయు పర్యవేక్షకులు గలరని' చెప్పారు. పర్యవేక్షకులు అనగా ప్రతీదీ గమనించువారని అర్థము. మనుషుల మీద నియమితులైన పర్యవేక్షకులు ఎవరని గానీ, ఎక్కడ నుండి వారు తమను గమనిస్తున్నారని గానీ మనుషులకు తెలియదు. పర్యవేక్షకులు ఎంతమంది యున్నారని గానీ తెలియదు. చాలామందికి తమ మీద నిఘాపెట్టిన పర్యవేక్షకులు ఎవరికీ తెలియకుండా తమను పూర్తి గమనించుచూ, మనుషులు చేయు ప్రతి పనిని, ప్రతి మాటను నమోదు చేసుకొంటున్నారు. అందువలన మీరు చేసేదంతా వారికి తెలుసుయని 12వ ఆయత్‍లో చెప్పియున్నారు. పర్యవేక్షకులయిన వారు మనుషులు చేయు ప్రతి పనిని చూస్తూ ఉన్నారు. సి.ఐ.డి పోలీసులు తెలియకుండా గమనిస్తున్నట్లు పర్యవేక్షకులయిన వారు గమనించుచున్నారు. అయితే ఆ విషయము మనుషులకు తెలియదు. తనకు తెలియకుండా నన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరూ నన్ను గమనించుటకు వీలులేదని అనుకొంటున్నారు. చాలామంది ఈ ఆయత్‍లలో చెప్పిన మాటలను నమ్మునట్లు లేదు. అయినా మనిషి నమ్మినా, నమ్మకపోయినా నిన్ను నన్ను అందరినీ గమనించుచున్న పర్యవేక్షకులు ఉన్నారనుట వాస్తవము.


మనుషుల మీద నియమితులైన పర్యవేక్షకులు మనుషులు చేయు ప్రతి పనినీ గమనిస్తూ, వారు చేయు పనులు మంచివా! చెడువాయని చూస్తున్నారు. మంచి పనులు అయితే వాటికి తగిన పుణ్యమును, చెడు పనులైతే వాటికి తగిన పాపమును పర్యవేక్షకులయినవారు నమోదు చేయుచున్నారు. పర్యవేక్షకులు ఒక్కొక్క మనిషికి ఒకొక్క పుస్తకమును ప్రత్యేకముగా పెట్టుకొని అందులో మనుషులు చేయు ప్రతి పనినీ, ప్రతీ మాటను నమోదు చేయుచున్నారు. ఆ పుస్తకము పేరు కర్మ పుస్తకము లేక కర్మ గ్రంథము అని అనవచ్చును. వారు ప్రతి విషయమును కర్మ గ్రంథములో న్యాయబద్దముగా నమోదు చేయుచున్నారు. అందువలన వారు 'గౌరవనీయులయిన లేఖకులు' అని అంటున్నారు. వారు మనుషులు చేయు విషయములను తూకము వేసినట్లు కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువగానీ లేకుండా వ్రాయుచుందురు. ప్రతి మనిషి మీద నిఘాపెట్టి చూస్తూ వారి కర్మలను, కార్యములను కర్మపత్రము అను గ్రంథములో వ్రాయుచూ, మనిషికి తెలియకుండా యున్నవారు లెక్కించితే 324 మంది గలరు. 324 మంది మూడు విభాగములుగా విభజింపబడి యున్నారు. ఒక్కొక్క విభాగమునకు 108 మంది విభజింపబడి యున్నారు. ఇట్లు మూడు విభాగములవారు అహర్నిశలు మనుషుల మీద నిఘాను కొనసాగించు చున్నారు. అయితే మనిషికి తన మీద పర్యవేక్షకులున్నారను విషయము తెలియక తాను చేయు పనులు మంచివా కాదా!యని ఆలోచించకుండా చేయుచున్నాడు. మనిషి చేయు కర్మలను నమోదు చేయువారు ఒక సెక్షనుకు 108 మంది యుండగా అలాంటి సెక్షనులు మూడు గుంపులుగా పని చేయుచున్నవి. మొత్తము 324 మంది పర్యవేక్షకులు అన్నీ గమనిస్తూ ప్రతీదీ వ్రాసిపెట్టుచుండగా, గతజన్మలో వ్రాసిపెట్టబడిన పనులకు అంత్య దినమున (మరణ దినమున) తీర్పు తీర్చి పంపియుండును. దేవుని తీర్పును అమలు చేయువారు బయట ప్రపంచములో కోట్లాదిమంది దైవదూతలు గలరు. శరీరము లోపల అయితే ఒకే ఒక ఆత్మ గలదు. సృష్ఠ్యాదిలో దేవుని చేత పంపబడిన దైవ దూతలు, ఆత్మ మనిషి యొక్క కర్మనుబట్టి పరమాత్మ పాలనను సాగించుచున్నవి. పరమాత్మ పాలన దేవుడు నియమించినట్లు దేవదూతలు మరియు ఆత్మ నిర్వాహణ సాగించుచున్నారు. మనిషి చేయు పాపపుణ్యములను కర్మపత్రములో వ్రాయుచున్న పర్యవేక్షకులు 108 మంది ప్రకారము మూడు గుంపులుగా మొత్తము 324 మంది యుండగా, పాలనను కొనసాగించు దైవ దూతలు కోట్ల సంఖ్యలో బయట పనిచేయుచుండగా, శరీరము లోపల ఆత్మ ఒక్కడే దేవుడై పనిచేయుచున్నాడు. ఆయనే అందరి ఆరాధ్య దైవముగా యున్నాడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

130. తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు. (86-4)

(86-4) ''తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు.''


దూత అనగా సేవకుడు అని అర్థము. దూతలు అనగా సేవకులు అని అర్థము. ప్రపంచములో రాజు యున్నాడు. రాజు అనగా యజమాని అని అర్థము. యజమాని క్రింద సేవకులు కూడా యున్నారు. యజమాని క్రింద ఒక సేవకుడు ఉండవచ్చును లేక అనేకమంది సేవకులు ఉండ వచ్చును. పూర్వము రాజుల వ్యవస్థ ఉండేది. భూమిమీద చిన్న పెద్ద రాజులు ఎందరో ఉండేవారు. అనేకమంది రాజులు చిన్నచిన్న రాజ్యములు ఏర్పరచుకొని యుండగా, వారి క్రింద ఎందరో దూతలు సైనికులుగా కొందరూ, వార్తాహరులుగా కొందరూ, పండితులుగా కొందరూ, వైద్యులుగా కొందరూ, అంతఃపుర కార్యకర్తలుగా కొందరూ, రాజుకు అంగరక్షకులుగా కొందరూ, ప్రజల సౌకర్యార్థము వీధులను శుభ్రము చేయువారు కొందరూ ఇట్లు రాజు క్రింద మంత్రినుండి సేనాధిపతి వరకు, కరణము నుండి కాటి పాపడు వరకు అందరూ అనేక స్థానములలో సేవలందించుచూ ఉండేవారు. వారందరినీ రాజదూతలు అనేవారు. ఒక రాజు క్రింద ఎందరో దూతలు ఉండగా, ఒక దేశములో ఎందరో రాజులు ఉండేవారు. రాజులందరి మీద రాజుగా చక్రవర్తి అనునతడు దేశమునకు అంతా పెద్దగా ఉండేవాడు. చక్రవర్తి క్రింద ఎందరో రాజులు, సామంత రాజులు ఉండగా, రాజుల, సామంత రాజుల క్రింద ఎందరో దూతలు (సేవకులు) ఉండేవారు.


అదే విధముగా పరమాత్మయను చక్రవర్తి క్రింద రాజులు, సామంత రాజులవలె భూతములు, గ్రహములు ఉండగా వారి క్రింద ఉపభూతములు, ఉపగ్రహములు అను దూతలు ఎందరో కలరు. మొత్తానికి అందరికీ పెద్ద చక్రవర్తి అయినట్లు, పరమాత్మయను పెద్ద క్రింద శరీరము లోపల ఆత్మ, ఆత్మ పరివారము, శరీరము బయట భూతములు, గ్రహములు వారి పరివారము పని చేయుచూ విశ్వసామ్రాజ్యమును నడుపుచున్నారు. శరీరము ఒక వ్యవస్థవలె కొందరితో కూడి పనిచేయుచున్నది. శరీరములో ఎన్నో రకముల కార్యములు చేయువారుండడము వలన శరీరమును ఒక వ్యవస్థ అని అంటున్నాము. శరీరములో జీవుడు నివశించుచున్నాడు. శరీరములో నివశించు జీవుడు కొంతకాలము వరకే శరీరములో యుండునట్లు నిర్ణయము చేయబడి, ఒక ఒప్పందము ప్రకారము ఇన్ని రోజులు, ఇన్ని గంటలవరకే శరీరములో నివాసముండునట్లు శరీర యజమాని అయిన ఆత్మ చేత నిర్ణయము చేయబడి శరీరములో జీవుడు నివాసము చేయుచున్నాడు. శరీరములో జీవుడు నివాసము చేయుచున్నంత కాలము శరీర గృహ యజమాని అయిన ఆత్మ తన కొందరి సేవకులతో ఇంటిలోనే ఉంటూ శరీరములో నివశించుచున్న జీవునకు ఎటువంటి ఆటంకములు తన ఇంటిలో కలుగకుండా చూచుకొనుచుండును. అంతేకాక తన ఇంటిలో నివశించు జీవుడు ఏమి చేస్తున్నాడో చూస్తూ జీవునికి తోడుగా, జోడు ఆత్మగా శరీరములో ఆత్మ యున్నాడు. శరీరములో ఆత్మ చేయు పనులు ఎన్నో యున్నా, అవి అన్నియూ శరీరములో నివాసమున్న జీవునికి తెలియవు. పట్టణములో అందరూ నిద్రపోయిన తర్వాత పట్టణ వీధులన్నీ పురపాలక సంఘమువారు శుభ్రము చేసినట్లు జీవుడు నిద్రలో యున్నప్పుడు గానీ, మెలకువలో యున్నప్పుడుగానీ జీవునికి తెలియకుండా శరీరములో ఆత్మ ఎన్నో పనులను చేయుచుండును. శరీరములో జోడు ఆత్మగా (తోడు ఆత్మగా) యున్న ఆత్మ తాను అందరికీ ఆరాధ్య దైవము అను విషయము కూడా జీవునికి తెలియకుండా మసలుకొనుచుండును.


శరీరములో నివశించుటకు ముందే నిర్ణయము చేయబడిన జీవుడు శరీరములో నివశించుచున్నా నేను శరీరమునకు యజమానిని కాను యను ఎరుక లేకుండా, తానే యజమానిని అన్నట్లు ఏ సంకోచము లేకుండా వ్యవహరించుచుండును. జీవుడు తాను శరీర యజమాని కాకున్నా యజమానివలె భావించుకొని, శరీరమునకు తాను తప్ప ఇతర యజమాని లేడు అను అహముతో వ్యవహరించుచుండును. అదంతయూ గమనించు చున్న నిజమైన శరీర అధిపతియైన ఆత్మ జీవునికి శరీర నివాస గడువు అయిపోవునంతవరకు ఏమీ చెప్పకూడదు అన్నట్లు తాను యజమానిని అని శరీరములోనే జీవునికి తెలియకుండా ఉండును. శరీరములో నివశించు ప్రతి జీవునికి ఆత్మ యజమానిగానే ఉండడము జరుగుచున్నది. ముఖ్య విషయము ఏమనగా! ఆత్మ శరీరమునకు యజమానే కాకుండా, ఆ శరీరములోని జీవునికి, మిగతా శరీరములలోని కోట్లాది మంది జీవులకు ఆత్మే దేవుడుగా యున్నాడు. ఆత్మే అందరి ఆరాధ్య దైవముగా యున్నాడు. ఆత్మను ఆరాధించు విధానములు బయట ప్రపంచములో గలవు. అల్లాహ్ అయిన ఆత్మను ప్రార్థించు ప్రార్థనా మందిరములు, ప్రార్థనా విధానములు (నమాజ్ చేయు విధానములు) ఎన్నో ఉన్నాయి. అయితే బయట ఆచరణ ప్రకారము ప్రార్థనా మందిరమునకు పోయి వారివారి మతాచారముల ప్రకారము ప్రార్థన చేయుచున్నా తాము ప్రార్థన చేయు దేవుడు, తాను నివశించు శరీరములోనే ఉన్నాడను ద్యాస గానీ, భయముగానీ, భక్తిగానీ లేకుండా జీవుడున్నాడు.


బయటి ప్రపంచములో భక్తిని ప్రదర్శించు జీవుడు, దేవుడున్నాడు అని చెప్పుకొను జీవుడు, తాను శరీరములో దేవుని ప్రక్కనే యున్నానని తెలియలేకపోయాడు. శరీరములో ఏమాత్రమూ దేవుని మీద భక్తిలేని మనిషి, బయటనే దేవుడున్నాడని చెప్పుకొనుచూ బయటనే ఆరాధనలు, ప్రార్థనలు చేయుచున్నాడు. శరీరములో తానే యజమానిని అను అహము కల్గి తాను చేయు పనులన్నీ తన ఇష్టము ప్రకారమే చేయుచున్నానని తలచి, తన శక్తి యుక్తి చేతనే ధనవంతుడను అయ్యాననీ, అధికారము గల వాడినయ్యాననీ, ఇంకా ఏమయినా సాధింతుననీ, నేను చేయు పనుల చేత మిగతా ప్రజలకంటే గొప్పవాడిగా యున్నాననీ, మిగతా వారికంటే అధికారిగా యున్నాననీ, రాజకీయ హోదాలో యున్నాననీ అనేక రకముల అనుకోవడము జరుగుచున్నది. అవన్నియూ పుట్టుక పూర్వమే తనకు నిర్ణయము చేయబడిన పనులని, ఆ నిర్ణయము ప్రకారమే శరీరములోని దేవుడే తనకు అన్నీ సమకూర్చాడని మనిషి తెలియక అంతా తన తెలివి వలన కల్గినవే అనుకోవడము పెద్ద పొరపాటు.


ఆత్మ ప్రతి మనిషిలో ఆ మనిషికి తెలియకుండా ఉంటూ ఎల్లప్పుడూ ఆ జీవుని నిమిత్తము పనులు చేయడము జరుగుచున్నది. ఆత్మ దేవుడైయున్నా తాను కార్యకర్తగా శరీరములో పనులు చేయుచూ, జీవుని జీవనములో శరీరములో జరుగవలసిన కార్యములన్నీ చేయుచున్నాడు. దేవుడు మనిషి నిద్రపోవునప్పుడు కూడా కార్యములను చేయుచూ, తన అనుచరుల చేత చేయిస్తూ ఉండడము వలన ఒక విధముగా దేవుడుగాయున్న ఆత్మ కూడా జీవునికి దూతగా (సేవకునిగా) పని చేయుచున్నాడని చెప్పక తప్పదు. ఆత్మ దేవుడుగా యున్నా, దూతగాయున్నా ప్రపంచములో ఆ విషయము ఎవరికీ తెలియకుండానే యున్నాడు. ప్రపంచములో ఏ జీవుడయినా ఆత్మయను దూత లేకుండా భూమిమీద పుట్టడము లేదు. ఆత్మ దూత కాదు, వాస్తవముగా యజమానియే. జీవునికి తొంభై తొమ్మిది శాతము దేవుడుగా యున్న ఆత్మ ఒక్కశాతము అతని కొరకు కార్యములు చేయుచూ దూతగాయున్నది. శరీరములో కార్యకర్తగా కనిపించు ఆత్మ జీవున్ని చంపుటకు, పుట్టించుటకు, శిక్షించుటకు, రక్షించుటకు దేవుడుగా యున్నది. దేవుడయిన ఆత్మనే శరీరములో జీవునికి పొరుగువాడని ద్వితీయ దైవ గ్రంథములో చెప్పియున్నారు. దైవ గ్రంథముల సాక్షిగా దేవుడైన ఆత్మ జీవునికి శరీరములో కార్యకర్తగా యున్నాడని అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియున్నారు. దీనినిబట్టి జీవున్ని కనిపెట్టుకొని శరీరములో యుండే దూత (ఆత్మ) లేకుండా ఏ ప్రాణి లేదని పై వాక్యములో (86-4) లో చెప్పియున్నారు. ఈ వాక్యములోని భావమును తెలియగల్గితే ఎవడయినా జ్ఞాని కాగలడు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

   ☞

131. 19 మంది దేవదూతలు కలరు. (74-30, 31)

(74-30) ''దానిపై పందొమ్మిదిమంది దైవదూతలు నియమితులై ఉన్నారు.''


(74-31) మేము నరకపాలకులుగా దైవ దూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకము కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసములో మరింత ముందంజ వేయడానికి, గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి (అనుమానానికి) గురికాకుండా ఉండడానికి మేమిలా చేశాము. ఇంకా హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, ''ఇంతకీ ఈ (19) దృష్ఠాంతము ద్వారా అల్లాహ్ ఏమి చెప్ప దలచాడు?'' అని చెప్పటానికి కూడా మేము ఈ విధముగా చేశాము. ఈ విధముగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు. తాను కోరినవారికి సన్మార్గమును చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ వృత్తాంతము మానవమాత్రుల బోధనార్థము ప్రస్తావించ బడింది.''


పరమాత్మ తన సృష్ఠిని పాలించుటకు బయట దైవదూతలను తయారు చేసుకొన్నాడు. శరీరము లోపల జరుగు కార్యములన్నీ శరీరములోని ఆత్మే చేయునట్లు ఏర్పాటు చేశాడు. బయట మనుషులకు కష్టసుఖములను కల్గించుటకు కోట్ల కొలది దైవపాలకులు సైన్యమువలెయున్నారు. అయితే దేవుని సైన్యము ఎంతమంది కలరని చెప్పుటకు వీలులేదు. దేవుని దూతల సైన్యము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు. అందువలన వాక్యములో నీ ప్రభువు సైన్యాలను స్వయముగా ఆయన తప్ప ఇతరులు ఎరుగరు అని అన్నారు. మనుషుల నరకమును కష్టరూపములో విధించువారు ఎందరో దేవదూతలు కలరు. అట్లే స్వర్గ సుఖమును అందించు వారు కూడా లెక్కలేనన్ని మంది దైవదూతలు కలరు. ఈ విధముగా అల్లాహ్ యొక్క దూతల సైన్యమును ఎవరూ చెప్పలేరు.


ముఖ్యముగా దేవుని మీద విశ్వాసము గలవారు, దేవుని మీద ఇష్టము గలవారు, దేవుని సాన్నిత్యమును కోరువారు అయిన మనుషులు ఉన్నప్పుడు దేవుడు వారిని స్వయముగా సన్మార్గములోనికి పంపును. సన్మార్గములోనికి దేవుడు పంపుట వలన వారికి అప్పటి వరకు అర్థముకాని జ్ఞానము, అప్పటి వరకూ తెలియని జ్ఞానము తెలియుటకు, అర్థమగుటకు మొదలవును. అలా కొంత కాలము గడువగా వారు దేవుని జ్ఞానములో ఉన్నతస్థాయికి చేరుకొందురు. దేవునిమీద అవిశ్వాసముగా యున్నవారు, దేవుని జ్ఞానము అంటే సరిపోనివారు, దేవుని గురించి హేళనగా మాట్లాడువారు, దేవుని మార్గములో యున్న జ్ఞానులను సహితము చాలా ఇబ్బందులకు గురిచేయువారు ఎవరున్నారో వారిని దేవుడు అదే పనిగా అజ్ఞాన మార్గములోనే పోవునట్లు, ఎప్పటికీ వారికి దైవ జ్ఞానము తెలియ కుండునట్లు చేయుటకు పూనుకొనును. అటువంటి అజ్ఞాన మనుషులను పూర్తిగా తప్పుదారి పట్టించి, తనకు దూరముగా పోవునట్లు దేవుడు చేయుచున్నాడు.


దేవుడు నరక పాలకులుగా దైవదూతలను నియమించాడు. అయితే వారి సంఖ్య దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే దేవుడు చెప్పినట్లు అవిశ్వాసులను అపవర్గ మార్గమును పట్టించుటకు, అవిశ్వాసులను పరీక్షించి వారి భావమునకు తగినట్లు వారికి అజ్ఞానమునే అంటగట్టుటకు దేవుడు ప్రత్యేకించి పందొమ్మిది (19) మంది దూతలను నియమించాడు. పందొమ్మిది (19) మంది దైవదూతలు ప్రత్యేకముగా నియమింపబడిన వారై యుండుట వలన ఈ (19) మందికి అజ్ఞానులను పరీక్షించుటకు, జ్ఞానులకు సహకరించుటకు తగిన జ్ఞానము గలవారై యుందురు. దేవుని నరకపాలన, స్వర్గపాలన సాగించుటకు కోట్లమంది నియమితులై ఉండగా, దేవుని మార్గములో దారితప్పినవారిని అదే పనిగా ప్రక్కకు పంపుటకు, దేవుని మార్గములో ఇష్టము కల్గినవారికి, దేవుని మీద విశ్వాసమున్నవారికి దేవుని మార్గములో ఆటంకములు కలుగకుండా చేయుటకు, తర్వాత ఎక్కడయినా దేవుని జ్ఞానములో అనుమానములు రాకుండా ఉండుటకు, దేవుని మార్గములో ముందుకు పోవడానికి కావలసిన జ్ఞానమును అందించి వారి మార్గమును ఆటంకము లేని మార్గముగా చేయుటకు పందొమ్మిది మంది (19) దేవదూతలు అహర్నిశలు పనిచేయుచున్నారు. పందొమ్మిది (19) మంది ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన దేవదూతలు. మిగతా కోట్లాది మంది దూతలవలె కాకుండా ప్రత్యేకమైన విజ్ఞతకల్గి పని చేయుచున్నారు.


దేవుడు తన కోట్లాది మంది సేవకులయిన దూతలలో పందొమ్మిది (19) మంది సంఖ్యనే ఎందుకు ఎంచుకొన్నట్లు? అని ప్రశ్నించుకొని చూస్తే అది మానవులు తెలియు నిమిత్తమే పందొమ్మిది (19) సంఖ్యను ఎంచుకొన్నా డని అర్థమగుచున్నది. దేవుడు అందించిన యోచన ప్రకారము ఆలోచించి చూస్తే ప్రకృతి ద్వారా మానవ శరీరము తయారయినది. ప్రకృతితో తయారయిన శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఆత్మలు నివశించుచున్నవి. మూడు ఆత్మలు పురుష సంబంధమైనవి. ప్రకృతి సంబంధ శరీరము అంతయూ స్త్రీ సంబంధమైనది. ప్రకృతి సంబంధ శరీరమును మాయకు గుర్తుగా చెప్పుకోవచ్చును. అట్లే ప్రకృతితో తయారయిన స్త్రీతత్త్వమైన శరీరములో పురుషతత్త్వమైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు నివశించుచున్నారు. ఆత్మలు మూడు అని తెలిసిన విషయమే. అయితే ప్రకృతి ఐదు భాగములుగా యున్నది. శరీరముగా యున్న ప్రకృతిలో ఐదు భాగములు ఉన్నప్పటికీ అవి ఏమాత్రము తెలియకుండా శరీరములో అణిగియున్నాయి. ప్రకృతితో తయారయిన గుణములలో ఆత్మసంబంధ జీవుడు చిక్కుకొనియున్నాడు. గుణములలో తయారయినది మాయ అయితే, ప్రకృతి జనితములైనవి గుణములు. సృష్ఠ్యాదిలో ప్రకృతిని తయారు చేసినవాడు దేవుడే. ప్రకృతిని మాత్రమే కాకుండా, ప్రకృతితో గుణములను కూడా తయారుచేశాడు. గుణములను మాయ అని కూడా చెప్పుచున్నాము. మాయ దేవుని మార్గమునకు పూర్తి వ్యతిరేఖమైనది. దేవుని మార్గము నుండి దూరముగా పంపునది మాయ. ఉన్న సత్యము ప్రకారము చూస్తే గుణరూపముగా యున్న మాయను తయారుచేసినవాడు దేవుడే. అందువలన దేవుడు ప్రథమ దైవ గ్రంథములో ''గుణమయీ మమ మాయా దురత్యయా'' అని విజ్ఞాన యోగము అను అధ్యాయములో 14వ శ్లోకములో చెప్పియున్నాడు.

14వ శ్లో|| దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |

మామేవ యే పప్రద్యన్తే మాయా మేతాం తరన్తితే ||


భావము :- ''నేను తయారు చేసిన గుణములతో కూడుకొన్న నా మాయను దాటుట దుస్సాధ్యమైన పనియగును. నా మాయను జయించి ముందుకు పోతాను అనువాడు ఎవడూ లేడు. ఎవడయితే నన్ను విశ్వసించి ఆరాధించునో వాడు నా మాయను సులభముగా దాటిపోగలడు.''


దేవుడు తన జ్ఞానమును సృష్ఠ్యాదిలోనే మనుషులకు ఆకాశము ద్వారా తెలియజేశానని చెప్పాడు. తన జ్ఞానమును చెప్పిన దేవుడు తన జ్ఞానమునకు పూర్తి విరుద్ధముగా యున్న మాయను, దానిని జయించుటకు ఎవరికీ చేతకాని దుస్సాధ్యమైన మాయను దేవుడు తయారు చేసి మనిషి తలలో గుణముల రూపములో పెట్టాడు. తన జ్ఞానమును తయారు చేసినవాడు దేవుడే. తన జ్ఞానమునకు వ్యతిరేఖ మాయను తయారు చేసినవాడు దేవుడే. అలా ఎందుకు చేశాడు అనగా! ''తాను అనుకుంటే దైవమార్గములో పంపుదునని, తాను అనుకుంటే అజ్ఞాన మార్గములో పంపుదునని'' చెప్పినమాట గుర్తుకు రాగలదు. అందువలన జ్ఞానమును నా జ్ఞానము అని అన్నాడు. అట్లే మాయను మమ మాయ (నా మాయ) అని కూడా అన్నాడు. జ్ఞానము దేవునిదే, మాయ దేవునిదేయని స్వయముగా దేవుడే చెప్పాడు. అందువలన దేవుడు అనుకొంటే తన జ్ఞానములోనికి మనిషిని పంపగలడు. అట్లే దేవుడు అనుకొంటే తన మాయలోనికి కూడా పంపగలడు అని పై వాక్యములో కూడా చెప్పియున్నాడు. దేవుడు ముందుచూపుకల్గి, మాయను తయారు చేసి మానవుని తలలో గుణములుగా పెట్టాడని అర్థమగుచున్నది. అట్లే దేవుడు తన జ్ఞానమును కూడా తయారు చేసినవాడై, జ్ఞానమును కూడా మనిషి తలలోనే ఉంచాడు.


దేవుడు ప్రపంచములో స్వర్గ నరకపాలనను సాగించుటకు శరీరము బయట కోట్ల దైవదూతలను సృష్ఠించియుంచాడు. అయితే అజ్ఞానము అయిన మాయలోనికి పంపుటకు, దైవికమైన తన జ్ఞానములోనికి పంపుటకు కేవలము పందొమ్మిది (19) మంది దేవదూతలను మాత్రమే నియమించాడు. అలా పందొమ్మిది (19) మందిని మాత్రమే నియమించుటకు కారణము ఏమియని చూచిన దేవుడే అందించు ఆలోచన ప్రకారము ఇలా తెలియు చున్నది. మనిషికి జ్ఞానము కలగాలన్నా, కలుగకూడదన్నా ఆ పనిని దేవుడు మాయకు అప్పజెప్పాడు. దేవుడు తన మాయ ద్వారానే మనుషులను ఇటు అజ్ఞానము వైపుగానీ, అటు జ్ఞానమువైపుగానీ పంపగలుగుచున్నాడు. మాయ ప్రకృతి జనితమైనది. ప్రకృతి కనిపించు శరీర రూపముగా యున్నది. మాయ అగోచరమైనది అయినా శరీరము గోచరముగా యున్నది. కనిపించే శరీరములో మూడు ఆత్మలను తీసివేసి చూస్తే 24 భాగములుగా ఉన్నది. అందులో కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదుగా యున్నాయి. ఇవి బయటికి కనిపించునవిగా యున్నవి. కనిపించక శరీరము లోపల యున్నవి ఐదు వాయువులు, నాలుగు అంతఃకరణములు గలవు. జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములకు ఉన్న శక్తులను విడదీసిచూడకుండా లెక్కించితే బయట పది, లోపల తొమ్మిది గలవు. జ్ఞానేంద్రియములలో శక్తులు కలిసిపోయి ఉండుట వలన వాటిని ప్రత్యేకముగా లెక్కించడము లేదు. ఆ విధముగా చూస్తే మాయకు నిలయమైన ప్రకృతి శరీర రూపములో పందొమ్మిది (19) భాగములుగా యుండుట వలన ఆ పందొమ్మిది సంఖ్య గల దేవదూతలే మాయ తరపున దేవుడు నియమించి మనిషి ఇటు జ్ఞానము లోనికిగానీ, అటు అజ్ఞానములోనికి గానీ పంపు బాధ్యతను మాయకే అప్పజెప్పాడు.


పాపపాలన, పుణ్యపాలన చేస్తూ మనిషికి సుఖదుఃఖములను అందించు దూతలు కోట్ల సంఖ్యలో యుండగా, ఇటు పాపమునకు, అటు పుణ్యమునకు సంబంధము లేకుండా జ్ఞానమునుగానీ, అజ్ఞానమునుగానీ కల్గించు మాయ గుణముల రూపములో ఉండగా, గుణములు ప్రకృతితో తయారయి ఉండగా, ప్రకృతితో తయారయిన శరీరము యొక్క ముఖ్యమైన భాగములు పందొమ్మిదేయుండగా మాయ ప్రతినిధులుగా పందొమ్మిది (19) సంఖ్యగల దూతలనే నియమించాడు. ఈ పందొమ్మిది దూతలే దేవుడు చెప్పినట్లు మనిషిని జ్ఞానమార్గములోనికిగానీ, అజ్ఞాన మార్గములోనికి గానీ పంపుచున్నారు. మనుషుల శరీరములో యున్న మాయ దృష్ఠాంతమును చూపుటకే పందొమ్మిదిమంది దూతలను నియమించినట్లు తెలియుచున్నది. ప్రపంచములో మాయయే మనిషిని దేవుని మార్గములో ఆటంకపరచి తనను జయించుట దుస్సాధ్యమని తెలియజేయుచున్నది. దేవుడు అయినవాడు పురుషుడు, ప్రకృతి స్త్రీగా యున్నదని ముందే చెప్పుకొన్నాము. ప్రకృతికి పతిగా యున్నవాడు దేవుడే. దేవునికి సతిగాయున్నది ప్రకృతి. దేవుడు తనకు ఇష్టమైన వానిని తనవైపు పంపమని ప్రకృతికి చెప్పగా, ప్రకృతియైన మాయ మనిషిని దేవునివైపు పంపును. దేవునికి ఇష్టములేని వానిని తనను దాటిపోకుండా మాయ చూడగలదు. దేవునికి సతిగాయున్న మాయయే దేవునికి నచ్చినవారినే దేవునివైపు పంపుచూ, నచ్చనివారిని పంపకుండా ఉండుటకు తన శరీరములో భాగములుగా యున్న వారికి సంబంధించిన సంఖ్యనే ఎన్నుకోవడము వలన పందొమ్మిది మంది దేవదూతలు మాత్రమే దేవుని పనిని మాయ ద్వారా పూర్తి చేయుచున్నవి.


ఇప్పటినుండి మాయ మనకు వ్యతిరేఖమయినదని తలచకుండా, దేవుని జ్ఞానమునకు దూరముగా పంపుటకు కారణమున్నదని తెలిసి, దేవునికి అత్యంత సమీపమున ఉండి దేవుని పనిని చేయడములో మాయ మొదటికి ఉన్నదని తెలిసినవాడు దేవునికి ఇష్టునిగా మారగలిగితే సులభముగా మాయకు కూడా ఇష్టునిగా మారవచ్చును. మాయకు ఇష్టునిగా మారగలిగితే మాయయే సులభముగా ఏ ఆటంకము లేకుండా దేవునివైపు పంపగలదు. అందువలన దేవుడు, మాయ ఇద్దరూ దగ్గరివారేయనీ పతి ఇష్టమునుబట్టి సతియైన మాయ ప్రవర్తించుచున్నదని తెలియుచున్నది.


మనిషి దేవుని జ్ఞానము తెలియుచూ మాయను దూషించుచున్నాడు. హిందువులు మాయయనీ, క్రైస్థవులు సాతానుయనీ, ముస్లీమ్‍లు సైతాన్ లేక ఇబ్లీసుయనీ చెప్పుచూ ఈ మూడు పేర్లతో చెప్పబడుచున్నది దేవునికి వ్యతిరేఖమయినదని చెప్పుచూ, మాయయొక్క గొప్పతనము తెలియక మాయను దూషించుచున్నారు. అట్లు చేయుట వలన సాతానును అసహ్యించుకోవడము వలనగానీ, సైతాన్ను దూషించడము వలనగానీ, మాయను నిరోధించవలెనని అనుకొనినా అది పరోక్షముగా దైవ దూషణే యగును. దానివలన దేవునికి మరింత దూరమగుటయే గానీ, దగ్గరగుటకు కుదరదు. మాయ దైవ నిర్మితమైనదే, అది దేవుని మాయయే, దేవున్ని ఎలా గౌరవించుచున్నామో అలాగే మాయను కూడా గౌరవించవలసి యుండును. అలా గౌరవించకపోతే ప్రత్యేకముగా నియమింపబడిన పందొమ్మిది మంది దూతలకు కోపము రాగలదు. దానివలన నష్టము తప్ప లాభము లేదు. అందువలన నేను ఎప్పుడూ దేవున్ని (ఆత్మను) తండ్రిగా, మాయను తల్లిగా గౌరవించుచున్నాను. అందువలన నాకు పందొమ్మిది మంది పాలకులయిన దేవదూతలు నాకు చెడును చేయక జ్ఞానమును అందించుచున్నారు. అదే జ్ఞానమునే మీకు తెలుపుచున్నాను. నాకు దేవుడు, దేవుని మాయ ఇద్దరూ సమానమే. మీరు కూడా దేవున్ని గౌరవించినట్లే మాయ అనుకొను సైతాన్నో, సాతాన్నో గౌరవించండి. అప్పుడు దేవుని మార్గము సులభతరము కాగలదు.




అంతిమ దైవగ్రంథములో

వజ్ర వాక్యములు


☜ వజ్ర వాక్య వివరము  

  

132. ఏడు రాత్రులు, ఎనిమిది పగల్లు అంటే ఏమిటి? (69-1 నుండి 7)

(69-1) జరిగి తీరేది.


(69-2) ఏమిటా జరిగి తీరేది?


(69-3) ఆ జరిగి తీరేదానిని గురించి నీకేమి తెలుసు?


(69-4) తట్టేటటువంటి విపత్తును సమూదు, ఆదు జనులు ధిక్కరించారు.


(69-5) సమూదు వారు అత్యంత భయంకరమైన కేక శబ్దము ద్వారా అంతమొందించబడ్డారు.


(69-6) ఆదువారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనము చేయబడ్డారు.


(69-7) వాటిని (శబ్దమును, గాలులను) అల్లాహ్ వారిపై నిరంతరము ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు చెట్టువలె నేలకొరిగి పడి ఉండడము చూసేవాడివి.


69వ సూరాలో మొదటి ఏడు ఆయత్‍లను తీసుకొని చూస్తున్నాము. అందులో ఒకటి, రెండు ఆయత్‍లలో జరిగి తీరేది అని చెప్పి జరిగి తీరేది ఏమిటి?యని ప్రశ్నను అడిగారు. దానికి సమాధానమును కొందరు వెతికి చెప్పవచ్చును. నేనయితే వెతకకుండా చెప్పుచున్నాను. అదేమనగా! మొదటి దైవగ్రంథము అయిన తౌరాతులో సాంఖ్యయోగమను అధ్యాయమున 27వ శ్లోకములో ఇలా చెప్పారు చూడండి.

27వ శ్లో|| జాతస్య హి ధువ్రో మృత్యుర్ధువ్రం జన్మ మృతస్యచ |

తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి ||


భావము :- 'పుట్టుట ఎప్పటికయినా చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, అనివార్యమైన సంగతి గురించి ఎవరూ బాధపడరు.''


దీనిభావము ప్రకారము జరిగి తీరేది జననము మరణము. జరిగి తీరే దానిని గురించి పుట్టితే చావక తప్పదు. చస్తే పుట్టక తప్పదు అని తెలుసు. చావు పుట్టుకలు రెండూ శరీరములోనే జరుగుచున్నవి. శరీరములో జీవుడు జీవించుట అలాగే మరణించుట జరుగుచున్నది. బయట విజ్ఞానము గానీ, లోపల జ్ఞానముగానీ తెలిసినవాడు మనిషి శరీరములో ఏడు నాడీ కేంద్రముల మీద, ఏడు గ్రంథుల మీద ఆధారపడి బ్రతుకుచున్నాడు. మనిషిలో ఏడు నాడీకేంద్రముల ద్వారా శరీరమునకు బలమును, ఏడు గ్రంథుల ద్వారా ఆరోగ్యమును ఇవ్వడము జరుగుచున్నది. దీనినిబట్టి ఏడు నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు మనిషికి ఆయుష్షును, జీవనమును ఇచ్చుచున్నవి. ఏడు నాడీకేంద్రములు పని చేయకపోయి, ఏడు గ్రంథులు పని చేస్తూయుంటే మనిషి కోమాలోనికి (అపస్మారక స్థితిలోనికి) పోవును. ఒకవేళ గ్రంథులు ఆగిపోయి, నాడీకేంద్రములు పని చేస్తూయుంటే మనిషి జ్ఞాపకములో (మెలకువలో) యుండునుగానీ, ఏమీ మాట్లాడక మెదడు పని చేయని స్థితిలో ఉండును. గ్రంథులు పనిచేయక నాడులు పని చేస్తే జ్ఞాపకముండి చూస్తూ మాట్లాడక ఉండును. అట్లే నాడీకేంద్రములు పని చేయక గ్రంథులు పనిచేయకపోతే కోమాలో ఉండి మాట్లాడకపోవును. ఎటయినా సగము చనిపోయినట్లగుచున్నది. పూర్తి చనిపోయినప్పుడు ఏడు నాడీకేంద్రమలు, ఏడు గ్రంథులు పూర్తి పని చేయక నిలిచిపోయివుండును. దానినే మరణము అంటాము.


సమూదు జాతివారు అనగా ఏడు నాడీకేంద్రములుయనీ, ఆదు జాతివారు అనగా ఏడు గ్రంథులని తలచవలెను. ఆదు, సమూదు అని గ్రంథి, నాడీకేంద్రములు బాగున్నప్పుడు మనిషి చావును వెక్కిరించుచూ శరీరములో బలముగా, ఆరోగ్యముగా ఉండును. దేవుడు అనుకొంటే నాడీకేంద్రములు పని చేయవు. అట్లే గ్రంథులు పని చేయవు. సమూదు యను నాడీకేంద్రములను పని చేయకుండా నిలిపివేయుటకు శరీరములోనే శబ్దమును కల్పించి నాడీకేంద్రములను పనిచేయకుండా చేయును అని (69-5) లో వ్రాయడము జరిగినది. ఆదు అను గ్రంథులను పని చేయకుండా చేయుటకు శరీరములోనే చలి గాలులను సృష్ఠించి, ఆ గాలులకు గ్రంథులు పనిచేయకుండా నిలిచిపోవునట్లు చేయునను విషయమును (69-6) లో వ్రాశారు. శరీరములో ఏడు నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు నిలిచిపోవడమునే మనిషి చనిపోవడము అని అంటారు.


దేవుడు తన జ్ఞానమును చాలాచోట్ల నిగూఢముగా చెప్పాడు. తన జ్ఞానము మీద శ్రద్ధ లేనివారికి అర్థము కాకూడదనే జ్ఞానమును నిగూఢముగా చెప్పడము జరుగుచున్నది. పైకి చెప్పేది ఒకటికాగా, దాని అంతరార్థము ఇంకొకటియుండును. అలాగే ఇప్పుడు 69వ సూరాలో ఒకటి నుండి ఏడు వరకు గల వాక్యములన్నీ అలాగే యున్నవి. సమూదు, ఆదు అను రెండు మనుషుల జాతుల పేర్లు చెప్పారు. అయితే వాటికి లోఅర్థము నాడీ గ్రంథుల పేర్లను సరిచేశారు. అట్లే ప్రతి విషయము పైకి కనిపించునది ఒకటికాగా చెప్పిన ఉద్దేశ్యము మరొకటి యుండును. అదే పనిగా దేవుడు తన జ్ఞానమును అందరూ గుర్తించకూడదని, ఎవనికి శ్రద్ధయుందో వాడే గ్రహించవలెనను ఉద్దేశ్యముతోనే చెప్పాడు. నాడీకేంద్రములు, గ్రంథి కేంద్రములు బాగున్నంత కాలము మనిషి జీవించియుండగలడు. అవి రెండు సరిగా లేకుండా పోయి వాటి పనులకు ఆటంకము ఏర్పడినప్పుడు మనిషి చనిపోవును. ఆ విషయమును తెలియునట్లు చేయుటకు ఈ విధమైన ఆయత్‍లను చెప్పారు. నాడీకేంద్రములను, గ్రంథి కేంద్రములను దేవుడు (ఆత్మ) తనశక్తితోనే నడుపుచున్నది. పైకి శబ్దము, గాలులు కారణము చూపినట్లు, లోపలి గ్రంథులు, నాడీకేంద్రములు పనిచేయకుండా తన శక్తిని వాటికి లేకుండా చేయుచున్నాడు. శరీరములో అన్ని భాగములు ఆత్మ శక్తితోనే పనిచేయుచున్నవి. అందువలన నాడీకేంద్రములలో గ్రంథి కేంద్రములలో యున్న శక్తిని లేకుండా చేసిన వెంటనే మనిషి చనిపోవు చున్నాడు. అందువలన మనిషి చనిపోక తప్పదని చెప్పుచూ అది జరిగి తీరేదేయని (69-1) వ వాక్యములోనే చెప్పారు. అట్లే చివరి ఏడవ వాక్యములో ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు సమూదు, ఆదు జనులపై శబ్దమును, గాలులను వదలి వారిని లేకుండా చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన ఏడు, ఎనిమిది అనువాటికి అర్థము ఏమిటి? అని చూడవలసి యున్నది. ఈ రెండింటి అర్థము తెలియగలిగితే వాక్యములోని నిగూఢత అంతా అర్థము కాగలదు.


సమూదు జాతి మనుషులు ఏడుమంది యనీ, అట్లే ఆదు జాతి మనుషులు ఏడుమంది అని చెప్పుకొన్నాము. సమూదు అనగా ఏడు నాడీకేంద్రములనీ, ఆదు అనగా ఏడు గ్రంథి కేంద్రములని చెప్పుకొన్నాము. అర్థము చేసుకొనుటకు మొదట అలాగే చెప్పుకొనినా, ఉన్న సత్యము ప్రకారము నాడీకేంద్రములు ఏడే అయినా, గ్రంథులు మాత్రము ఏడుకంటే ఎక్కువనే ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటిని లెక్కించి ఏడని చాలామంది చెప్పారు. అట్లు ముఖ్యమైనవి ఏడుకాదు ఎనిమిది గలవు. అయితే ఎనిమిదిలో పీయూష గ్రంథి అనగా పిట్యూటరీ గ్లాండ్ అనునది ఏమి చేయునది ఎవరికీ తెలియదు. అంతేకాక అందులోనుండి ఏ ఊటలు ఊరవు. అయినా ఆ గ్రంథిని అన్నిటికంటే ముఖ్యముగా కొందరు చెప్పుచుందురు. సాధారణముగా పనిచేయు గ్రంథులు ఏడే అయినా పని చేయనిది అన్నిటికంటే ముఖ్యమైనది యని చెప్పుకొను పిట్యూటరీ గ్రంథిని కలిపి ఎనిమిదిగా చెప్పుకొంటున్నారు. చివరకు మేథావులందరూ గ్రంథుల సంఖ్య ఎనిమిదిగానే నిర్ధారించారు. నాడీకేంద్రములు ఏడేయని కూడా చెప్పుచున్నారు. ఏడు నాడీకేంద్రములలో గానీ, ఎనిమిది గ్రంథులలోగానీ ఆత్మశక్తియే వాటిలో యుండి పనిని చేయిస్తూ యున్నది. దేవుడు అయిన ఆత్మ ఏడు నాడీకేంద్రములలోనూ, ఎనిమిది గ్రంథులలోనూ తన శక్తిని లేకుండా చేయడము వలన అవి పని చేయకుండా పోవుచున్నవి. అలా ఎప్పుడు ఏడు నాడీకేంద్రములు, ఎనిమిది గ్రంథులు పనిచేయవో అప్పుడు మనిషి మరణించును. మరణము చెందిన వెంటనే చెట్టు అంత మనిషి కూడా కుప్పకూలిపోవును. అదే విషయమునే (69-7) లో ''బోసిపోయిన ఖర్జూరపు చెట్టువలె నేలకొరిగి పడిపోవడమును నీవు చూడగలవు'' అని అన్నారు. అనగా చెట్టంత మనిషి చనిపోయి పడిపోవును అని చెప్పుటకు అలా వాక్యములో చెప్పారు.


(69-7) వ వాక్యములో ''ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు అనారోగ్యము చేయడము జరుగును'' అని చెప్పుచూ ''శబ్దము గాలుల వలన ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధింతుము'' అని అన్నారు. దీని ప్రకారము శబ్దము, గాలి అనునది శరీరములో లేకున్నా బయట శబ్దము గాలికి మనుషులు చనిపోయినట్లు ఏడు నాడీకేంద్రములు, ఎనిమిది గ్రంథులకు కలుగు శక్తిహీనత వలన శరీరము మొత్తము చైతన్య రహితమై, ప్రాణము లేనిదై చనిపోవడము జరుగుచున్నది. శరీరములో ఏడు నాడీ కేంద్రములకు, ఎనిమిది గ్రంథులకు శక్తిని ఇచ్చునది ఆత్మే అయినా నాడీ కేంద్రముల నుండి శక్తి గ్రంథులకు ప్రాకవలసియున్నది. అట్లే ఎనిమిది గ్రంథులనుండి ఆత్మశక్తి ఆరోగ్యరూపములో ఏడు నాడీకేంద్రములకు ప్రాకవలసి యున్నది. అందువలన నాడీ కేంద్రములు, గ్రంథులు ఒక దానిమీద ఒకటి ఆధారపడి పనిచేయుచున్నవి. అలా పని చేయు రెండూ నిలిచిపోవడము వలన నాడీకేంద్రములను ఏడు రాత్రులు యనీ, గ్రంథులను ఎనిమిది పగళ్లుయనీ మరుగుపెట్టి వాటి అసలు పేర్లను మూసిపెట్టి చెప్పారు. బుద్ధి, శ్రద్ధయున్నవాడు గ్రహించుకోగలడని అలా చెప్పారు. నాడీ కేంద్రములు, గ్రంథికేంద్రములు ఒకదానికొకటి ఎలా అనుసంధానమై యున్నాయో క్రింద చిత్రమును చూచి గ్రహించవచ్చును.



ఈ విధానమును తెలియాలంటే శరీరములోని ఆత్మజ్ఞానము తెలిసి యుండాలి. భగవద్గీతయైనా, బైబిలు అయినా, చివరికి ఖుర్ఆన్ అయినా దేహములోని దేవున్ని, బయట ప్రపంచములోని పరమాత్మను, శరీరములో కాపురము చేయుచున్న జీవున్ని తెలియజేశాయని తెలియవలెను. శరీరమునకు సంబంధించిన జ్ఞానము తెలియనిదే, శరీరములోని మూడు ఆత్మల విషయము తెలియనిదే ఎవరూ జ్ఞానికాలేరు. అంతర్ముఖ జ్ఞానమునే మూడు గ్రంథములు బోధించాయి. మూడు గ్రంథముల జ్ఞానము తెలియక, లోపలి ఆరాధనను తెలియక బయట ఆరాధనను ప్రార్థనను చేయువానికి పరలోక ప్రాప్తి కలుగదు, దేవుడు తెలియడు. మీరు మంచి జ్ఞానులు కావాలని, దేవునివైపు పోవాలను ఉద్దేశ్యముతో ఈ గ్రంథములోని జ్ఞానమును తెలిపాముగానీ వేరు ఉద్దేశ్యము కాదు. ఇందులో మత ప్రచారముగానీ, మత ప్రసక్తిగానీ లేదనీ, సర్వమానవులకు సంబంధించిన బోధ మాత్రమే కలదని గ్రహించవలెను.

సమాప్తము




Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024