till 36




అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
31. సత్కార్యములు చేసే స్త్రీలు అయినా, పురుషులయినా స్వర్గములో ప్రవేశిస్తారు. (4-124)
ప్రతి మతములోనూ స్వర్గ నరకముల ప్రస్తావన కలదు. ప్రజలలో ఎక్కువ శాతము స్వర్గము కొరకు ప్రాకులాడవలెనని ప్రయత్నించుచుందురు. స్వర్గము ఆశతో కూడుకొన్న కోర్కెలాగ మనిషిలో గలదు. దానికి తోడు జ్ఞానబోధకులనువారందరూ జ్ఞానమును, దానివలన వచ్చు పరలోకమును బోధించక స్వర్గమును గురించి ఎక్కువగా బోధించుచున్నారు. స్వర్గములో సుఖముల నిలయము గలదని చెప్పడమేకాక, పురుషులు స్వర్గములో ప్రవేశిస్తే వారికి ప్రత్యేకముగా పరిచర్యలు చేయు అందమైన కన్నెపిల్లలుందురని ముఖ్యముగా చెప్పడము వలన యుక్తవయస్సు వారు, మధ్య వయస్సువారు, ముసలివారు అందరూ స్వర్గమునే కోరుకొనుచున్నారు. కొందరు చెప్పే సుఖములను గురించి చూస్తే స్వర్గము అనేది పవిత్రమైనదా, అపవిత్రమైనదా యను ఆలోచన రాకతప్పదు. ఒక విధముగా చూస్తే స్వర్గము అనునది ఒక వ్యభిచార లోకముగా కనిపిస్తాయున్నది. శారీరక సుఖ కేంద్రముగా కనిపించుచున్నది. అట్లున్నదని బోధించడము వలన, అందరికీ అలాగే అర్థము కావడము వలన ప్రతి మనిషి మనస్సులో స్వర్గచింతన తప్ప దైవచింతన లేకుండా పోయినది.

నేడు స్వర్గమును ఎరగా చూపి, మనుషులను చేపలవలె పట్టుకొని తమ పనులకు వినియోగించుకొనువారు గలరు. 'స్వర్గము' అను ఆశకు ప్రాణములను సహితము లెక్కచేయక చస్తే స్వర్గానికి పోతాము అని అనుకొంటున్నారు. స్వర్గము అనునది అసత్యము అనీ, అది ఎక్కడా లేదనీ, ఎవరికీ తెలియదు. ప్రతి దైవ గ్రంథములోనూ, ప్రతి ధార్మిక బోధలోనూ 'స్వర్గము' అనుమాటను ఇరికించి దానినే ముఖ్యముగా చెప్పడము వలన దైవ గ్రంథములలో దేవుని జ్ఞానముకంటే ముఖ్యముగా స్వర్గమే కనిపించు చున్నది. స్వర్గము కొరకు ఒక్క క్షణము చచ్చినా ఫరవాలేదు, శాశ్వితముగా స్వర్గములో ఉండవచ్చునని కొందరు చెప్పడము వలన, విన్నవారు ''ఒక్క క్షణము కష్టపడి చనిపోయినా శాశ్వితముగా అందమైన స్త్రీల సాంగత్యము లతో సుఖముగా యుండవచ్చును కదా!'' యని చావును వెతుక్కొంటూ పోతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో దేశము కొరకు, దేవుని కొరకు, మతము కొరకు ప్రాణ త్యాగము చేస్తే స్వర్గము వస్తుందని చెప్పడము వలన చాలామంది 'మతము కొరకని', 'దేవుని కొరకని' పేరు పెట్టుకొని ఉగ్రవాద కార్యములను చేయుచూ చనిపోవుచున్నారు. వారు అదే పనిగా స్వర్గము కొరకు చావును వెదకుకొనుచున్నారు. ''ఉగ్రవాదము వలన ఇతరులను చంపవచ్చును తాము చనిపోవచ్చును. ఇతరులు ఎంతమంది చనిపోయినా వారు పరమతము వారయిన దానివలన మేము మతము కొరకు, అల్లాహ్ కొరకు ఇతరులను చంపినట్లగును. తర్వాత మేము స్వర్గమునకు పోవచ్చును'' అని అనుకొనుచుందురు. ఎక్కువ భాగము పురుషులు మతము కొరకు, దేవుని కొరకు చనిపోతే స్వర్గానికి పోవచ్చుననే అనుకొనుచుందురు. అయితే దేవుడు ఎక్కడా అలా చెప్పలేదు. అల్లాహ్ ఏమి చెప్పాడనగా! సూరా నాలుగు, ఆయత్ 124లో చెప్పిన విషయమును చూస్తాము.

(4-124) ''సదాచరణ చేసేవాడు పురుషుడుగానీ, స్త్రీ గానీ అల్లాహ్‍ను విశ్వసించిన వారైయుంటే అలాంటి వారు తప్పకుండా, స్వర్గములో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయము కూడా జరుగదు.''

అల్లాహ్ నుండి వచ్చిన ఈ వాక్యమును చూచిన తర్వాత అందరూ అనుకొనులాగా జరగదని, స్వర్గము పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా వస్తుందని తెలిసిపోయినది. ముఖ్యముగా తెలిసినదేమంటే మతము కొరకో, దేవుని కొరకో చనిపోతే స్వర్గము వస్తుందని అనుకోవడము పూర్తి అసత్యమనీ, కేవలము మంచి పనులు చేయువారికి మాత్రమే స్వర్గము లభించునని చెప్పియున్నారు. మంచి పనులు చేయువారు స్త్రీగానీ, పురుషుడుగానీ ఇద్దరికీ స్వర్గము లభించునని వాక్యములో యుండుట వలన దీనిని గురించి కొంత ఆలోచించవలసిన అవసరమున్నది. స్వర్గ విషయమును గురించి ఆలోచించి చూస్తే ఈ విధముగా తెలియుచున్నది.

పై వాక్యములో 'సదాచరణ' అనునది ముఖ్యముగా యున్నది. మంచి పనులు చేయడమును సదాచరణ అని అనవచ్చును. మనిషి చేయు మంచి పనులుగానీ, చెడు పనులుగానీ ముందే అల్లాహ్ తీర్పు తీర్చి నిర్ణయించి పంపుచుండును. ప్రతి మనిషి చావు ముందే నిర్ణయింపబడి యున్నది అని సూరా మూడు, ఆయత్ 145 (3-145)లో చెప్పియున్నట్లు ప్రతి మనిషి చేయు ప్రతి కార్యమును వాని కర్మపత్రములో వ్రాసి పంపబడియుండును. కర్మపత్రములో అల్లాహ్ నిర్ణయించిన కార్యములేవి కలవో అవి మాత్రమే ఆ మనిషి చేయుచుండును. చావును ముందే నిర్ణయించినట్లు కార్యములను కూడా ముందే నిర్ణయించియుండును. దాని ప్రకారమే పనులు జరుగుచుండును. మనిషి జీవితములో కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు జరుగుచుండును. వాటిని ఆపే దానికి ఎవరి చేత కాదు. ముందే దేవుడు నిర్ణయించిన పనులు అయినందున అవి జరిగి తీరును. అందులో మనిషి ప్రమేయము ఏమీ ఉండదు. నేను చేయను అని ఎవడయినా ఊరక ఉండుటకు వీలులేదు. ఏవి జరుగవలసి యుండునో అవి తప్పక జరిగితీరును. మనిషి మంత్రముగ్ధునివలె ఆ పనులు చేసి తీరును. అందులో ఎవరి ఇష్టము గానీ, అయిష్టము గానీ పని చేయదు.

ఒక మనిషి కర్మపత్రములో అల్లాహ్ వ్రాసి పంపినట్లే పదిమందికి సంబంధించిన ఒక పని జరుగవలసియున్నది. అది ఆగదు కదా! జరిగినది. అల్లాహ్ ప్రతి పనిని ముందే నిర్ణయించియుండును. దానిప్రకారమే మనిషి జీవితములో అన్ని పనులు జరుగుచుండును. పది మందికి సంబంధించిన పని జరిగినప్పుడు ఆ పని వలన పదిమందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున లాభము వచ్చినది. అలాగే చేసిన వానికి కూడా లక్ష రూపాయలు లాభము వచ్చినది. అప్పుడు అతను చేసిన పని పదిమందికి లాభమును చేకూర్చినది. కావున దానిని మంచి పనియని చెప్పవచ్చును. ఈ పనిని మొదటే నిర్ణయించిన వాడు అల్లాహ్‍యే, అలాగే మనిషిలో ఉండి కార్యకర్తగా చేసినవాడు అల్లాహ్‍యే. సూరా ఆరు, ఆయత్ 102 (6-102) ప్రకారము అల్లాహ్ ప్రతి కార్యమును చేయుచున్నాడు. ఈ కార్యములో అంతా అల్లాహ్ ప్రమేయమేగానీ, మనిషి ప్రమేయము ఏమీ లేదు. అయితే అంతా మనిషి ప్రమేయము వలననే ఈ కార్యము జరిగినది అన్నట్లు తెలియుచున్నది. మనిషి జరుగుచున్న పనిని అంతా చూచాడు. తన శరీరముతోనే తాను చేసినట్లు అనుభూతిని పొందాడు. ఆ పనిని చేయడములోని కొంత కష్టమును అనుభవించాడు. అందువలన ఆ కార్యమును నేనే చేశాను అని మనిషి అనుకొంటున్నాడు. బయట చూచే వారికి కూడా ఆ మనిషే చేసినట్లు కనపడినది. అటువంటప్పుడు చేసిన మనిషి ఆ పనిని నేనే చేశాను అని అంటాడు. చూచినవాడు కూడా ఆ మనిషే చేశాడు అని అంటాడు. ఆ పనిని అల్లాహ్ చేశాడని గానీ, అల్లాహ్ నిర్ణయించిన పనియని గానీ ఎవరికీ తెలియదు. అల్లాహ్ కనిపించి చేయడము లేదు. అల్లాహ్ ఎవరికీ కనిపించడు. అల్లాహ్‍కు సంబంధించిన జ్ఞానము తెలియనివాడు అల్లాహ్ విషయమును పూర్తిగా మరచిపోయి, జరిగే కార్యములన్నీ నేనే చేశాను అని అనుకొంటున్నాడు. కార్యము జరిగే వరకు అది మనిషి జీవితములో అల్లాహ్ చేసే కార్యమే. అయితే మనిషి నేనే చేయుచున్నాను అని ఎప్పుడు అనుకొంటున్నాడో అప్పుడు అది వాడు చేసినట్లే లెక్కించ బడును. అల్లాహ్ జ్ఞానము తెలిసి అల్లాహ్‍యే చేశాడు అని అనుకొని యుంటే అది వాని ఖాతాలోనికి పడేది కాదు. అట్లు కాకుండా ఆ పనిని నేనే చేశాను అని అహము భావమును పొంది అనుట చేత అది వాడు చేసినట్లే యగుచున్నది.

అలా అనుకోవడము సులభమే అయితే దానివెనుక జరుగు కార్యము పెద్దది. అంతపెద్ద కార్యము ఏమి కలదని ప్రశ్నించిన, దానికి జవాబు ఈ విధముగా గలదు. ఎప్పుడయితే జరిగిన పని మనిషి ఖాతాలోనికి వస్తున్నదో అప్పుడే అది మంచి పనియైతే దానివలన పుణ్యమూ, చెడు పనియైతే దానివలన పాపము ఆ మనిషి లెక్కలోనికి వచ్చి చేరును. ఇప్పుడు జరిగినది పదిమందికి ఉపయోగపడిన పని, పది మందికి లక్ష రూపాయలు వచ్చునట్లు జరిగిన పని అయినందున నేను చేశాను అని అనుకొన్న మనిషికి పుణ్యము వచ్చినది. ఈ విధముగా ప్రతి కార్యములోనూ మనిషి భావమును బట్టి ఉండును. మనిషి అల్లాహ్ జ్ఞానము తెలిసి నేను ఏమాత్రము చేయలేదు. నా శరీరములోయున్న దేవుడే (6-102) వాక్యము ప్రకారము కార్యకర్తగా చేశాడు అని అనుకొంటే వానికి ఆ పనిలోని పాపముగానీ, పుణ్యముగానీ రాదు. ఇది దైవ నిర్మితమైన కర్మ సిద్ధాంతము. దీనిప్రకారమే ప్రతి మనిషికీ, ప్రతి జీవికీ జరుగుచుండును. ఒక మనిషి పాపాత్ముడుగానీ, పుణ్యాత్ముడుగానీ అగుటకు వానిలోని అహంభావమే కారణము. అహమ్ భావము వలన జరిగెడి ప్రతి పనిని నేనే చేశానని అనుకోవడము, దానివలన కర్మను సంపాదించుకోవడము జరగుచున్నది. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే వాని శరీరములో జరుగవలసిన పనులను నిర్ణయము చేసి పంపియుండును. ఆ లిఖితము అంతయూ మనిషిలోనే నిక్షిప్తమై యుండును. కాలము జరుగుకొద్దీ ఎప్పుడు ఏమి జరుగవలెనని నిర్ణయ ముండునో అది జరుగుచూవచ్చును. అక్కడే మనిషి కర్మలలో (పాప పుణ్యములలో) చిక్కుకోవడముగానీ, చిక్కుకోకపోవడముగానీ వాని భావమును బట్టి జరుగుచుండును.

మనిషి జీవితములో కష్టసుఖములను అనుభవించుట కొరకు కొన్ని మంచి చెడు పనులు జరుగునట్లు దేవుడు నిర్ణయించియుండును. దేవుడు శరీరములోయుండి, శరీర అవయవముల చేత ఆ పనులు చేయునప్పుడు అందులో యున్న సుఖమునుగానీ, బాధనుగానీ మనిషి అనుభవించు చుండును. అలా అనుభవించుటకే ఆ పనులను దేవుడు నిర్ణయించి వ్రాసిపెట్టాడు. కర్మపత్రములో వ్రాయబడిన కర్మరీత్యా ఆ పనులు జరుగుచుండును. జరుగుచున్నప్పుడు అనుభూతిని జీవుడే పొందవలసి యున్నది. దాని ప్రకారమే దేవుడు పని చేయుచుండగా, జీవుడు దాని అనుభవమును అనుభవించుచుండును. దైవజ్ఞానము తెలిసిన వానికి ఇదంతయూ తెలిసియుండును. అటువంటి వాడు జరిగెడి పనులకు నేనే కారణమని గానీ, నేనే చేయుచున్నాననిగానీ అనుకోడు. అటువంటి వానికి పాపము గానీ, పుణ్యముగానీ క్రొత్త కర్మ ఏదీ రాదు. అటువంటి విధానము తౌరాతు (భగవద్గీత) గ్రంథములోనూ, ఇంజీలు (బైబిలు) గ్రంథములోనూ, అట్లే ఖుర్ఆన్ గ్రంథములోనూ చెప్పబడియున్నది. అయినా మనిషి మతము, మత సాంప్రదాయములు అను వాటిమీద గల శ్రద్ధను, దేవుని జ్ఞానము మీద చూపడము లేదు. దైవ గ్రంథములలో ఏమి చెప్పారని చూడడము లేదు. ఖుర్ఆన్ గ్రంథములో (6-102) వ ఆయత్‍ను ఒక్కదానిని అర్థము చేసుకోగలిగితే తాను ఏమీ చేయలేదనీ, అంతా దేవుడే చేస్తున్నాడని తెలియ గలదు.

మనిషి తానే చేశానని, ఏ పనిని చేసినా అందులో కనిపించే ఫలితము, కనిపించని ఫలితము అని రెండు రకముల ఫలితములుండును. మనిషి ఒక పనిని చేస్తే దానికి కనిపించే ఫలితముగా ధనము లభించును. కనిపించేది పది మందికి పది లక్షలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ప్రకారము దొరికినది. అట్లే చేసిన మనిషికి కూడా లక్ష రూపాయల ఆదాయము వచ్చినది. మనిషి తాను పని చేశానని తలచడమే కాకుండా, కనిపించే ఫలితమును చూచి నేను సంపాదించాను అని మురిసిపోవుచున్నాడు. కనిపించే ఫలితమునే చూచాడుగానీ, కనిపించని ఫలితమైన పాపపుణ్యము లను లెక్కచేయలేదు. మనిషి నిత్యము జరిగే పనులలో అహమును పొందడము, కర్మను పొందడము జరుగుచున్నది. ఎవడయితే అహమును పొందడో వాడు పాపపుణ్య కర్మలను కూడా పొందడు. అయితే అది జ్ఞానము తెలిసిన వానికే సాధ్యమగును.

నేడు జ్ఞానము తెలిసినవాడు అంటే ఏమిటో తెలియదుగానీ, మనిషి దేవున్ని విశ్వసించి నమాజ్ (ప్రార్థన) చేయగల్గితే వాడు జ్ఞానియైనట్లే లెక్కింతురు. దేవుని మీద విశ్వాసము ప్రార్థన (నమాజ్) చేయడము బయటి జ్ఞానమగునుగానీ, శరీరము లోపలి జ్ఞానము కాదు. శరీరము లోపల జ్ఞానము తెలిస్తే మనిషి (జీవుడు) కర్మలను (పాపములను) అంటించుకోడు. శరీరము లోపలి జ్ఞానము తెలియకపోతే దేవుడు చేసే పనిని నేనే చేశాను అని అనుకోవడము జరుగును. దానివలన మనిషి క్రొత్త కర్మలను సంపాదించుకొనును. నేడు ముస్లీమ్ సమాజములో బయటి జ్ఞానము తప్ప లోపలి జ్ఞానమును తెలిసినవారు ఎవరూ లేరు. అందువలన కర్మను తప్పించుకోక, దానిని మూటకట్టుకుంటున్నారు.

పుణ్యమును ఎవరు సంపాదించుకొనినా వారికి స్వర్గము లభించుననుట వాస్తవమే. వాక్యములో సత్కార్యములు చేసే స్త్రీలయినా, పురుషులయినా స్వర్గములో ప్రవేశిస్తారు. వాస్తవముగా మూడు దైవ గ్రంథములు ఒకే జ్ఞానమునే బోధించుననుటకు గుర్తుగా మూడు దైవ గ్రంథములలోనూ స్వర్గ నరకముల ప్రసక్తి కలదు. చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో స్వర్గ నరకములను గురించి ఎక్కువగా చెప్పియున్నారు. అందువలన ఇందులోని వాస్తవమును తెలియగలిగితే స్వర్గము, నరకము రెండూ అర్థము కాగలవు. మంచి పనులు శరీరములో దేవుడే చేస్తున్నా దానిని మనుషులు తెలియక జరిగే పనులన్నీ తానే చేయుచున్నానని అనుకోవడము వలన వారికి పుణ్యము వస్తున్నది. ఇది కర్మ విధాన పద్ధతి. దేవుడు ఏర్పరచిన కర్మ సిద్ధాంతము ప్రకారము అహము వలన చేయుచున్న పనిలోని పాపమయినా లేక పుణ్యమయినా మనిషికి చేరుచుండును. అహము పురుషులకయినా, స్త్రీలకయినా రావచ్చును. అందువలన స్త్రీలకయినా, పురుషులకయినా కర్మ చేరుచుండును. మంచి పని జరిగినప్పుడు నేనే ఈ పనిని చేశానని ఒక స్త్రీ అనుకొంటే ఆమెకు పుణ్యము చేరును. చేరిన పుణ్యమును అనుభవించుటకు స్త్రీ కూడా స్వర్గమునకు పోవలసివచ్చును. పాపపుణ్యములు కర్మ సిద్ధాంతము ప్రకారము అహము లేని మనిషికి చేరవు. అహము గల మనిషికి స్త్రీకయినా, పురుషునికయినా చేరును. అందువలన స్త్రీ పురుషులు ఇరువురు వారు చేసుకొన్న కర్మప్రకారము స్వర్గము మరియు నరకమును అనుభవించవలసి వచ్చును. అలా స్వర్గ, నరకములకు పోకుండా పరలోకమునకు మనిషి పోవాలనునదే దైవజ్ఞానము.

దైవ జ్ఞానమున్నవాడు ఎవడయినాగానీ కర్మ అంటని విధానమును ఆచరించును. పాపమును సంపాదించుకొన్న తర్వాత ప్రార్థన చేసినా అది పోతుందను నమ్మకము లేదు. అందువలన శరీరములోని జ్ఞానమును తెలిసి పాపపుణ్యములను అంటకుండా చేసుకోవడమే మంచిది. ఒకవేళ స్వర్గమును పొందిన తర్వాత పురుషులకు గానీ, స్త్రీలకు గానీ సుఖములు సమానముగా యుండును. అయితే స్వర్గ సుఖములను గురించి అట్లే నరక కష్టముల గురించి ఖుర్ఆన్ గ్రంథములో కొంత వివరించారు. అయితే దానిని అర్థము చేసుకోవలసిన విధముగా మనుషులు అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ఉదాహరణకు పుణ్యము సంపాదించుకొన్న వాడు స్వర్గమునకు పోతాడు అని చెప్పుకొంటున్నారు. అయితే స్వర్గము అనునది ఎక్కడున్నది? ఎంతదూరము పోతున్నాము? స్వర్గము అనునది ప్రత్యేకమైన లోకమా? అక్కడ సుఖాలను అందించి సేవలు చేయు మనుషులు మనుషులా కాదా! వారు మనవలె పుట్టారా లేదా? వారు స్వర్గములో ఎందుకు పని చేయుచున్నారు? సుఖాలు అందించే అందమైన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వారు ఎందుకు మనుషులకు సేవ చేయుచున్నారు? పురుషులకు స్త్రీల వలన సుఖాలు అందితే, స్త్రీలకు సుఖాలు ఎట్లు అందుతున్నాయి? అను ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలిసినప్పుడు స్వర్గ నరకములంటే ఏమిటో తెలియగలవు.

''సదాచారము చేసిన స్త్రీ పురుషులు స్వర్గములో ప్రవేశిస్తారు'' అని ఉంది. ''వారికి రవ్వంత కూడా అన్యాయము జరుగదు'' అని ఉంది. అంటే పురుషులకు ఎటువంటి సుఖములు గలవో, స్త్రీలకు కూడా అవే సుఖములు అందించబడును, న్యాయముగా సుఖములను ఇవ్వడము ఉండును. అందులో కొంత మాత్రమయినా అన్యాయము జరుగదు అని చెప్పారు. అలా చెప్పడము వలన పుణ్యమును బట్టి పురుషునికి ఎంత సుఖము ఉండునో అంతే సుఖము స్త్రీకి కూడా ఉండును. అట్లే ఒక కష్టము పురుషునికి ఎంత ఉండునో, అంతే కష్టము స్త్రీలకు కూడా ఉండును అని అర్థమగు చున్నది. గ్రంథములో స్వర్గ సుఖములను గురించి వ్రాసియున్నారు. అయితే అవి అర్థము చేసుకొనుటకు వ్రాసినవేగానీ వాస్తవముగా అట్లే ఉండదు. స్వర్గము అనునది ప్రత్యేకమయిన లోకము కాదు. అందరి భావములో స్వర్గము, నరకము వేరువేరు లోకములు అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి ఆ రెండు లోకములే కాదు. అయినా అర్థము చేసుకోవడానికి 'లోకములు' అని గ్రంథములో చెప్పారు. వాస్తవముగా స్వర్గనరకములు మనమున్న చోటే కలవు.

ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో స్వర్గము ఒక లోకమని వ్రాశారు. అక్కడ పురుషులకు సపరిచర్యలు చేయడానికి అందమైన స్త్రీలు, కన్యలుగా యున్న స్త్రీలు గలరని చెప్పారు. పురుషులకు ప్రత్యేకించి అందమైన స్త్రీలు ఉన్నారని చెప్పినప్పుడు, రవ్వంత కూడా అన్యాయము జరుగకుండా స్త్రీలకు కూడా పరిచర్యలు చేయడానికి అందమైన చిన్నవయస్సులోని అబ్బాయిలు ఉండవలెనని చెప్పవచ్చును. గ్రంథములో అమ్మాయిలు ఉన్నారని చెప్పిన ఆయత్‍లు గలవు. అట్లే అబ్బాయిలు ఉన్నారని చెప్పిన వాక్యములు కూడా గలవు. అవి అట్లు వేరే లోకములో ఉండవచ్చునేమో గానీ, మీరు చెప్పినట్లు భూమిమీద స్వర్గము నరకము ఉంది అంటే వాక్యములో చెప్పినట్లు పరిచర్యలు, సేవలు చేసే అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ ఉండరు కదా! దీనికి మీరేమంటారు?

జవాబు :- గ్రంథములో ఎన్నో స్వర్గ సుఖములను వర్ణిస్తూ ఆ వర్ణణలో కొన్ని వాక్యములయందు అందమైన స్త్రీలు ఉంటారని, వారితో వివాహము జరిపిస్తామని మగవారికి చెప్పినట్లు కలదు. అక్కడ అమ్మాయిల విషయములో చెప్పినది చూస్తే (37-48, 49) వారి చూపులు క్రిందికి వాలియుండే పెద్దపెద్ద కన్నులు గల మగువలు ఉంటారు. (49) వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా కోమలముగా, స్వచ్ఛముగా ఉండే స్త్రీలు ఉంటారు.''

(55-58) ''ఆ స్వర్గ కన్యలు అందచందాలరీత్యా స్వచ్ఛమైన కెంపులు పగడాల మాదిరిగా ఉంటారు.''

(44-54) ''పెద్ద పెద్ద కన్నులుగల అందగత్తెలతో మేము వారి వివాహము జరిపిస్తాము.''

ఈ మూడు వాక్యములను చూచిన తర్వాత పురుషులు సంతోష పడుటకు స్వర్గములో స్త్రీలు ఉంటారని అర్థమగుచున్నది. స్త్రీలను పురుషులతో వివాహము చేస్తామని కూడా చెప్పియున్నారు. ఇది పురుషులకు జరిగే పనియైతే కొద్దిమాత్రము కూడా అన్యాయము జరుగని ఆడవారి విషయములో వారి సేవలు చేయడానికి అందమైన అబ్బాయిలు, యవ్వనములో యున్న అబ్బాయిలు ఉన్నారని చెప్పిన వాక్యములు కూడా గలవు. వాటిలో ఏమి చెప్పారో చూస్తాము.

(52-24) ''వారి సేవలో భద్రముగా దాచబడిన ముత్యాలలాంటి కుర్రాళ్లు తిరుగుతూ ఉంటారు.''

(76-19) ''వారి చుట్టూ నవనవలాడే పిన్నవయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వారు నిత్యము అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూచినప్పుడు చెదిరిన ముత్యాలా అని భావిస్తావు.''

ఈ రెండు వాక్యములలో అబ్బాయిలను గురించి చెప్పారు. పై వాక్యములు రెండు పురుషులకు అని తెలిసిపోయినది. అక్కడ అందమైన స్త్రీలు మగవారి సేవలు చేయుటకు ఉంటే ఇక్కడ అబ్బాయిలు ఆడవారి సేవకు ఉన్నట్లు అర్థమగుచున్నది. చాలామంది బోధకులు అలాగే బోధిస్తారు. పురుషులకు అందమైన స్త్రీల ఆశను, స్త్రీలకు అందమైన అబ్బాయిల ఆశను కల్పించి దాని కొరకు స్వర్గానికి పోవాలంటే మతము కొరకు, దేవుని కొరకు చనిపోయిన ఎవరికయినా స్వర్గము వచ్చునని చెప్పుట వలన స్వర్గము మీద ఆశ కల్గిన వారిని ఉగ్రవాదులుగా మార్చి ఇతరులను చంపమని చెప్పి ఆ కార్యములో చనిపోతే స్వర్గము వచ్చునని, స్వర్గ లోకానికి పోతారని చెప్పడము వలన అది సత్యమని నమ్మిన వారు అనవసరముగా ఇతరులను చంపి, వారు చనిపోవుచున్నారు. అయితే చనిపోయిన తర్వాత వారికి విన్నదంతా అసత్యమని తెలుస్తుంది. ఖుర్ఆన్ దైవ గ్రంథములో వ్రాసినది ఎలా అసత్యమగునని కొందరికి అనుమానము రావచ్చును. దానికి జవాబు ఏమనగా!

గ్రంథములో చెప్పినది వాస్తవమే. అయితే అక్కడ చెప్పిన వాక్యములను అర్థము చేసుకోలేక వాక్యములోని విషయమును ఏదో లోకములో ఉందని అనుకోవడము చేత పొరపడుటకు అవకాశము గలదు. స్వర్గము, నరకము ప్రత్యేక లోకములు అనుకోవడమే పెద్ద పొరపాటు. ఈ విషయము అర్థము కావాలంటే మరణము తర్వాత ఏమి జరుగుచున్నదో, జరిగేది ఎక్కడ జరుగుచున్నదో, ఎప్పుడు జరుగుచున్నదో వీటికి జవాబును తెలియగలిగితే స్వర్గము, నరకము ప్రత్యేక లోకములు అని అనుకోవడమే తప్పుయని, స్వర్గ నరకములు లోకములు కావని తెలియుచున్నది. స్వర్గము నరకము రెండు అనుభవములు అని తెలియవలెను. మనిషి సుఖమును అనుభవించితే అదే 'స్వర్గము', అట్లే మనిషి కష్టములు అనుభవించితే ఆ అనుభవమునే 'నరకము' అను పేరుతో చెప్పుచున్నాము. మనిషి యొక్క అనుభవముల భేదములను రెండుగా చెప్పుచున్నాము. ఆ రెండే స్వర్గ నరకములు. భూమిమీద మనిషి అనుభవములలో స్త్రీలతో కలిసి తిరగడము, అందమైన స్త్రీలు దగ్గరుండి సేవలు చేయడము జరిగినప్పుడు జీవుడు అనుభవించు సుఖ అనుభవములను స్వర్గము అను పేరుతో చెప్పవచ్చును. అంతేగానీ అది లోకము కాదు.

మంచి అనుభూతిని స్వర్గము అనీ, చెడు అనుభూతిని నరకము అని అంటున్నాము తప్ప ఆ రెండూ ప్రత్యేకమయిన లోకములు కావు. ఈ రెండు అనుభూతులను మనిషి పుట్టినప్పటి నుండి అనుభవించుచున్నాడు. స్వర్గ, నరక అను రెండు అనుభవములు నిత్యము భూమిమీద మనుషుల జీవితములలోనే జరుగుచున్నవి. అందువలన భూమిమీదనే మనిషి శరీరములోనే స్వర్గ, నరకములనునవి కలవని చెప్పవచ్చును. మనిషి శరీరములో సుఖ, దుఃఖములను అనుభవించువాడు జీవుడు. సుఖ (స్వర్గ), దుఃఖ (నరక)ములను జీవునికి అందించువాడు శరీరములో యమధర్మ రాజుగాయున్న ఆత్మేనని తెలియవలెను. (3-18) వాక్యము ప్రకారము శరీరములోని ఆత్మే మనుషులు ఆరాధించవలసిన దేవుడుగా యున్నాడు. ప్రథమ దైవగ్రంథములో ''దండనాధికారులలో యమున్ని నేనే'' అని చెప్పినట్లు శరీరములోని ఆత్మే యమునిగా కూడా యున్నది. ఆత్మ అన్ని పనులను శరీరములోని అవయవముల చేత చేయిస్తూ ఆ పనులలో లభించు సుఖ దుఃఖములను జీవునికి బుద్ధి ద్వారా చేర్చగా జీవుడు తనకు బుద్ధి ద్వారా లభించిన కష్ట సుఖములను అనుభవించుచున్నాడు. ప్రతీ సుఖమును మనిషి (జీవుడు) శరీరములోనే అనుభవించుచున్నాడు. అట్లే ప్రతి దుఃఖమును శరీరములోనే అనుభవించుచున్నాడు శరీరములో కష్టసుఖము లను ఇచ్చుటకు ఆత్మ అధిపతిగా యుండగా మనస్సు సుఖ దుఃఖములను బుద్ధికి అందివ్వగా, బుద్ధి తన ప్రక్కనేయున్న జీవునికి అందించుచున్నది. దీనినిబట్టి శరీరములోనే యముడు అయిన ఆత్మ ఉండగా, సుఖ దుఃఖముల అనుభవములను అందిచు యమభటులు అయిన మనస్సు, బుద్ధి శరీరములోనే ఉండగా, నీ శరీరములోనే స్వర్గమును, నరకమును అనుభవించుచున్నావు.

ఎక్కడ వెదకినా బయట కనిపించని స్వర్గము, నరకము రెండు శరీరములోనే కనిపించుచున్నవి. మనిషి అనుభవించు అనుభవములే స్వర్గ నరకములు. సుఖ దుఃఖ రెండు అనుభవములు. జీవుడుండేది శరీరములో, అనుభవించేది శరీరములో అందువలన శరీరములోనే సుఖ దుఃఖముల అనుభవములయిన స్వర్గ, నరకములు రెండూ కలవని చెప్పవచ్చును. మరణములో తీర్పు (జడ్జిమెంట్) జరిగేది శరీరములోనే. ఆ తీర్పు ప్రకారము జీవితములో శరీరములోనే సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు. మంచి పనులుగానీ, చెడు పనులుగానీ జరిగేది శరీరములోనే. ప్రతి మనిషికి ఆడగానీ, మగగానీ ఎవరికయినా న్యాయబద్దముగా తీర్పు జరుగును. రవ్వంత కూడా అన్యాయము జరుగదు. తీర్పు చేయువాడు దేవుడయిన ఆత్మే అయినందున ప్రతీ చిన్న కర్మను కూడా అహమును బట్టి నిర్ణయించి తీర్పు చేయును. మనుషులుగా పుట్టిన స్త్రీ అయినా, పురుషుడయినా శరీరములో జీవుడుగానే యున్నాడు. ఆత్మ శరీరములో ఏ జీవునికి కొద్దిగా కూడా అన్యాయము చేయక, సుఖ దుఃఖము లను నిర్ణయించి పంపుచున్నది. అందువలన (4-124) వాక్యములో ''ఎవరికీ రవ్వంత కూడా అన్యాయము చేయడు'' అని చెప్పియున్నారు. కర్మను (పాపపుణ్యములను) బట్టి స్త్రీలకయినా, పురుషులకయినా ఒకే తీర్పు విధానము ఉండును. అందువలన స్త్రీ పురుషులకు ఇరువురికీ సమానమైన అనుభవములుండును. ఏ అనుభవమైనా శరీరములోనే ఉండును. అందువలన స్వర్గ నరకము ఏది అయినా అది శరీరములోనే కలదనీ, శరీరము బయట లేదని తెలియవలెను.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
32. చాలామంది ప్రవక్తల వద్దకు మేము వహీని పంపుచున్నాము. (4-163)
వహీ అనగా వాణి అని అర్థము. వాణి అనగా శబ్దము అని అర్థము. శబ్దము అనగా వినపడునదని అందరికీ తెలుసు. వినపడే శబ్దము పెద్దది కావచ్చు లేక చిన్నది కావచ్చు లేక మధ్యరకము కావచ్చును. సృష్ఠ్యాదిలో దేవుడు సృష్ఠిని అంతటినీ తయారు చేసి, మనుషులకు దైవ జ్ఞానమును అందివ్వాలని తలచి ఆకాశము ద్వారా శబ్దమును పుట్టించి ఆ శబ్దముతో జ్ఞానమును చెప్పడమైనది. ఆకాశము ద్వారా వచ్చిన శబ్దమునే తెలుగులో వాణి అన్నారు. అరబ్బీ భాషలో 'వహీ' అన్నారు. వాణి అనగా శబ్దము అని అర్థము. దానినే ఆకాశ వాణి అని అనడము కూడా జరిగినది. ఆకాశము నుండి పుట్టిన శబ్దమును ఆకాశవాణి అని అన్నారు. ఆ శబ్దములో దైవజ్ఞానము ఇమిడియున్నదని చెప్పుచున్నాము. దైవజ్ఞానము ఇమిడియున్న శబ్దము ఆకాశము నుండి వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దములుగా వచ్చినది. ఆ విధముగా వచ్చిన శబ్దములు జ్ఞానముతో కూడినవైనా అవి మనుషులకు అర్థము కాలేదు. శబ్దములు అందరికీ వినిపించినా అందులో దైవజ్ఞానము యున్నదని ఏమాత్రము ఎవరికీ తెలియదు. సష్ఠ్యాదిలో చెప్పబడిన జ్ఞానమే ప్రతి సంవత్సరము ఆకాశ శబ్దము ద్వారా చెప్పబడుచున్నది. అలా వినిపించెడి శబ్దము పెద్ద శబ్దములుగా ఉన్నవని చెప్పుకొన్నాము. ఆ శబ్దములనే మేఘముల ఉరుములు అని అంటున్నారు. మేఘము తన ఉరుముల ద్వారా పుట్టించిన శబ్దములు ఆకాశము నుండి వచ్చుచున్నవి. అలా మొదట వచ్చిన జ్ఞానముతో కూడిన శబ్దములలోని జ్ఞానమును ఆకాశములో యున్న సూర్యగ్రహము గ్రహించగలిగినది. అందువలన సూర్యునికే ఆకాశ వాణి జ్ఞానము పూర్తిగా తెలిసినది.

ఆకాశము రెండు రకములు గలదు. ఒకటి కనిపించని ఆకాశము, రెండు కనిపించే ఆకాశము. ఆకాశము శూన్యమని, అది కనిపించదని అందరికీ తెలుసు. అయితే రెండవది కనిపించే ఆకాశమును అందరూ చూస్తున్నా ఇది కనిపించే ఆకాశమని ఎవరికీ తెలియదు. ఆకాశము యొక్క రెండవ ఆకారము మేఘములు. మేఘములు ఆకాశములో ఒక భాగము. ఆకాశము యొక్క శబ్దము మేఘముల నుండి ఉరుముల రూపములో పెద్దపెద్ద శబ్దములుగా వచ్చినది. ఉరుములలో వచ్చిన జ్ఞానమును సూర్యుడు తెలియగలిగి దానినే భూమిమీద చాలామంది ప్రవక్తలకు తెలియునట్లు చేశాడు. ఆకాశము నుండి వచ్చిన శబ్దమును, దానిలోని జ్ఞానమును సూర్యుడు తెలియగలిగి దానినే భూమిమీదికి మొదట ఒక మనిషికి చేర్చగా, ఆ తర్వాత ఆ మనిషి ద్వారా మిగతా మనుషులకు తెలియబడినది. అట్లే భూమిమీద ప్రవక్తలందరికీ వహీ జ్ఞానము తెలియబడినది. ఏ ప్రవక్తకు జ్ఞానము చేరవేయబడినా అది సృష్ఠ్యాదిలో అల్లాహ్ (దేవుడు) ఆకాశవాణి ద్వారా చెప్పిన జ్ఞానమేయని తెలియవలెను.

ఆకాశవాణి ద్వారా చెప్పబడిన జ్ఞానము మొదట గ్రంథరూపములో లేదు. మొదట శబ్దముల రూపములో వచ్చిన జ్ఞానమును సూర్యుడు గ్రహించి దానినే శబ్దముల నుండి మాటల రూపములోనికి మార్చి చెప్పాడు. అలా మాటల రూపములో యున్న జ్ఞానము ద్వాపరయుగము చివరిలో, కలియుగము ప్రారంభములో గ్రంథరూపమైనది. అంతవరకు గ్రంథ రూపముగా లేని దానిని "జపర" జ్ఞానము అని చెప్పేవారు. మాటల రూపములో యున్న జ్ఞానము ''జపర'' అను పేరుతో పిలువబడేది గానీ, అది గ్రంథము పేరు కాదని తెలియవలెను. 'జపర' అను పదము కాలక్రమమున 'జబుర' అను పేరుగా మారిపోయినది. మొదట గల జపర అను పేరు ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొని యుండేది. తర్వాత మారిన పేరుకు అర్థము లేకుండా పోయినది. ''జపర'' అను పేరులో రెండు భాగములు కలవు. జ+పర=జపర అయినది. 'జ' అనగా పుట్టుట అని అర్థము. 'పర' అనగా వేరు అని అర్థము. 'జపర' అనగా పుట్టిన దానికంటే వేరయినది అని అర్థము. సృష్ఠి ఆదిలో సమస్తము సృష్ఠింప బడినది. సృష్ఠింపబడినది అంతా ప్రపంచమే, ప్రకృతికి సంబంధించినదే అయిన దానివలన దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకృతికంటే వేరయినది అగుట వలన దానిని జపర అని అన్నారు. దేవుని జ్ఞానము మాటల రూపములో యున్నప్పుడు జపర అని అనెడివారు. తర్వాత ద్వాపరయుగము చివరిలో జపర జ్ఞానము గ్రంథరూపమైనది. గ్రంథ రూపమైన జ్ఞానమును అల్లాహ్ స్వయముగా తౌరాత్ అని చెప్పాడు. అదే గ్రంథమును మనుషులు భగవద్గీతయని అన్నారు. అయితే దేవుడు గ్రంథరూపమైన జ్ఞానమును మోషే ప్రవక్తకు (మూసా ప్రవక్తకు) ఇచ్చినప్పుడు ఇది తౌరాతు గ్రంథమని చెప్పాడు.

నేడు తౌరాతు గ్రంథమే భగవద్గీతయనీ, భగవద్గీతయే జపర జ్ఞానమని చాలామందికి తెలియదు. ఈ విషయములు తెలియనివారు జపర పేరుమారి జబుర అను పేరుతో యుండగా, జబురను గ్రంథమని అనుకొంటున్నారు. జపర గానీ, జబుర గానీ గ్రంథము కాదని తెలియవలెను. మొదట జపర జ్ఞానము గ్రంథరూపముగా మారినది. అయినా ఇదే జ్ఞానమే వేరువేరు విధానముల చేత, వేరువేరు ప్రవక్తలకు అందివ్వబడినది. ఎవరికి అందించినా, ఎంతమందికి ఇచ్చినా, ఎంత కాలము వరకైనా సృష్ఠి మొదటిలో చెప్పిన జ్ఞానమే గానీ వేరే జ్ఞానమంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమే జపరగా ఉంటూ తర్వాత జబుర అయినది. ఆ తర్వాత భగవద్గీతగా పిలువబడినది తర్వాత అదే తౌరాతుగా పిలువబడినది. ఆ తర్వాత ఇంజీలుగా ఏసు దగ్గరకు వచ్చినది. ఇప్పుడు అంతిమ దైవ గ్రంథముగా వచ్చిన జ్ఞానము కూడా సృష్ఠ్యాదిలో వహీ ద్వారా వచ్చిన జ్ఞానమే. మొదట వహీ (వాణి) ద్వారా వచ్చిన జ్ఞానమే అనేక రకముల, అనేక విధముల, అనేక ప్రవక్తల వద్దకు చేరినది. ఎక్కడ చేరినా, ఎవరి వద్దకు చేరినా అది మొదట ఆకాశము నుండి వాణి (వహీ) రూపములో వచ్చిన జ్ఞానమేయని తెలియ వలెను. అందువలన ఈ విషయమును తెలుపు నిమిత్తము సూరా నాలుగు, ఆయత్ 163 లో ఈ విధముగా చెప్పారు చూడండి.

(4-163) ''(ఓ ప్రవక్తా!) మేము నూహ్ వైపు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తల వైపు దివ్యవాణి పంపినట్లే, నీ వైపుకు కూడా దివ్యవాణి (వహీ)ని పంపాము. ఇంకా మేము ఇబ్రహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకోబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులేమాన్‍ల వైపుకు కూడా దివ్యవాణిని పంపాము. ఇంకా మేము దావూదుకు జబూర (గ్రంథాన్ని) ఇచ్చాము.''

ఈ వాక్యములో ఎంతమందిని చెప్పారో అంతమంది దగ్గరకు వహీ ద్వారా వచ్చిన జ్ఞానమునే పంపాము అని చెప్పారుగానీ, వేరే ఏదీ చెప్పినట్లు లేదు. గతములో ప్రవక్తలందరికీ చెప్పినది ఒకే ఒక జ్ఞానము. అదే సృష్ఠ్యాదిలో దేవుడు వహీ ద్వారా చెప్పిన జ్ఞానము. రాబోవు కాలములో కూడా ఎవరికి చెప్పినా అదే జ్ఞానమునే అందించును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
33. నమాజ్‍ను నెలకొల్పండి. (4-103)
వాస్తవముగా వాస్తవమునే చెప్పుతాను. అవాస్తవమును చెప్ప వలసిన అవసరము నాకు లేదు. సత్యమును బోధించడము దేవుని సేవ యగును. అందువలన అల్లాహ్ జ్ఞానమును గురించి ఎవరు ఏమనుకొన్నా ఫరవాలేదు. వారికి అర్థము కాకపోయి నన్ను అపార్థము చేసుకొన్నా ఫరవాలేదు. అల్లాహ్ దృష్ఠిలో నేను సత్యమును చెప్పువానిగా ఉండవలెను. ఇతరుల దృష్ఠిలో నేను అసత్యమును చెప్పువానిగా కనిపించినా వారు నాకు మోక్షమును (పరలోకమును) ఇవ్వరు. పరలోకమును ఇచ్చువాడు అల్లాహ్ ఒక్కడే. అందువలన అల్లాహ్ దృష్ఠిలో నేను సత్యమును బోధించు వానిగా ఉండవలెనని తలచుచున్నాను. మనిషి జీవితములో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ''నమాజ్''. నమాజ్ అను పదము మరియు అల్లాహ్ అను రెండు పదములు స్వచ్ఛమయిన తెలుగు పదములు. పూర్వము ప్రపంచములో మొదటి భాష తెలుగు భాష. తెలుగు భాష నుండే మిగతా భాషలు పుట్టాయని చెప్పవచ్చును. కాలక్రమములో కొన్ని తెలుగు పదములు మిగతా అనేక భాషలలో చేరిపోవడము జరిగినది. అలా అరబ్బీ భాషలో చేరిపోయిన ముఖ్యమైన పదములు అల్లాహ్, నమాజ్. మిగతా కొన్ని తెలుగు పదములు అరబ్బీ భాషలోయున్నా అన్నిటికంటే ముఖ్యమైనవి దేవుడు (అల్లాహ్), దేవుని ఆరాధన (నమాజ్).

నేడు ఇస్లామ్ లో అల్లాహ్ అను పదమును, నమాజ్ అను పదమును తెలియని ముస్లీమ్‍లు ఎవరూ లేరు. ఈ రెండు పదములు అందరికీ తెలిసినా పూర్వము ఈ రెండు పదములు తెలుగు భాషలో పుట్టిన పదములని ముస్లీమ్‍లకు ఎవరికీ తెలియదు. తెలుగు భాషలో ప్రతి పదము భావముతో కూడుకొన్న పదమైయుండును. పదములోని శబ్దమును బట్టి అందులోని సారాంశము తెలియునదిగా ఉండును. అదే విధముగా అల్లాహ్ అను పదములో రెండు భాగములుగా భావమున్నదని తెలియుచున్నది. అ+ల్లాహ్=అల్లాహ్. ల్లాహ్ అనగా అంతు లేక గట్టు అని అర్థము. అ అనగా లేదు, కాదు అని అర్థము. ఈ అర్థముల ప్రకారము అంతులేని వాడు, హద్దులేనివాడు, లేక గట్టు లేనివాడు దేవుడు అని తెలియునట్లు చేయుచున్నది. అల్లాహ్ అంతు ఎవరికీ తెలియదు. అందువలన పూర్వము తెలుగు భాషలో దేవున్ని అల్లాహ్ అని అన్నారు. తెలుగులో దేవుడు అనినా వెతకబడేవాడు అని అర్థము గలదు. అల్లాహ్ అనినా, దేవుడు అనినా ఎవరికీ తెలియనివాడే యని అర్థమగుచున్నది.

'అల్లాహ్' అను పదము ఎట్లు అర్థపూరితమైనదో అట్లే నమాజ్ అను పదము కూడా అర్థముతో కూడినదై యున్నది. నమాజ్ అను పదమును విభజించి చూస్తే న+మ+జ్ అని మూడు భాగములుగా యున్నది. న అనగా లేదు, కాదు అని అర్థము గలదు. మ అనగా నేను, నా యొక్క అని అర్థము. జ్ అనగా పుట్టుక లేక జన్మయని అర్థము. దీనిని అంతటినీ కలిపి చూస్తే 'నాకు జన్మ వద్దు' అని అర్థము. 'నేను పుట్టడము లేదు' అని చెప్పవచ్చును. నమాజ్ అర్థము ద్వారా మనిషి దేవున్ని జన్మను కోర మోక్షమును (పరలోకమును) కోరుచున్నాడని చెప్పవచ్చును. ఈ విధముగా తెలుగు భాషలో నమాజ్ అను పదమునకు జన్మరాహిత్యమును తెలుపు అర్థము కలదని చెప్పవచ్చును. అయితే ఇంతవరకు అందరికీ నమాజ్ అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు. అట్లే అయినా ప్రార్థన వలన జన్మ రాహిత్యము ఏర్పడి పరలోకము లభించునని చెప్పవచ్చును. ఈ విధముగా ఇస్లామ్ సమాజములో నేడు అల్లాహ్, నమాజ్ ప్రత్యేకమైన స్థానములు సంపాదించుకొన్నవని చెప్పినా, అవి ఇప్పుడే కాదు పూర్వమే ఈ రెండు పదములు తెలుగు భాషలో అందరికీ సుపరిచయమైనవే. అయితే అవి తెలుగు పదములనీ, కాలము మారేకొలదీ నేడు అరబ్బీ భాష పదములుగా యున్నవనీ, తెలియకుండా పోయినది.

నేడు భూమిమీద ప్రార్థన చేయువారిలో అందరికంటే ముందున్న వారు ముస్లీమ్‍లేయని చెప్పక తప్పదు. అందువలన నమాజ్ అంటే ప్రార్థనయని ముస్లీమ్‍లందరికీ తెలుసు. ప్రార్థన చేయడము ముస్లీమ్‍లలో ముఖ్యమైన దేవుని పనిగా లెక్కించి ఆచరించుచున్నారు. భూమిమీద అత్యంత ఎక్కువగా ప్రార్థన (నమాజ్) చేయువారు ముస్లీమ్‍లే. ముస్లీమ్‍లు ప్రార్థన చేయడము మిగతా మతముల వారికి కూడా తెలుసు. ఒక దినము బహుశా శుక్రవారము అనుకొంటాను మధ్యాహ్నము ఒంటి గంట ప్రాంతములో నమాజ్‍కు పోయి, నమాజ్ చేసి వచ్చిన వ్యక్తిని, దాదాపు 50 సంవత్సరముల వయస్సు గల వ్యక్తిని, టీచర్ వృత్తి చేయు వ్యక్తిని ''నమాజ్ వలన మీకు ఏమి వస్తుంది?'' అని అడిగాను. అందులకు ఆయన ''మాకు ఫలానాది వస్తుందియని ఆశించి మేము నమాజ్ చేయడము లేదు'' అని అన్నారు. అప్పుడు నేను ''నమాజ్‍లో ఏమని ప్రార్థన చేస్తారు'' అని అడిగాను. అందులకు ఆయన ''మేము దేవున్ని జ్ఞాపకము చేసుకొని ఆయనను పొగడడము తప్ప ఏమీ చేయము'' అని అన్నాడు.

మిగతా మతములలో ఎవరు ఏ దేవున్ని ప్రార్థించినా వారు ఏదో ఒక కోరికతోనే చేస్తారు. ఏ కోర్కె లేకుండా దేవున్ని (అల్లాహ్‍ను) పొగడుచూ ఆరాధన చేయడము ఏ స్వార్థము లేకుండా చేయు ఆరాధన యగును. నిస్వార్థముగా ఆరాధన చేయువారు బహుశా ఒక్క ముస్లీమ్‍లేయని చెప్పవచ్చును. దేవున్ని ఎక్కువగా ప్రార్థన చేయువారు మరియు దేవున్ని నిస్వార్థముగా ఆరాధించువారు ముస్లీమ్‍లు తప్ప ఎవరూ లేరనియే చెప్పవచ్చును. ఎవరి ప్రార్థన అయినా ఆశలతో, కోర్కెలతో కూడుకొని యుండును. ముస్లీమ్‍ల ప్రార్థన పెద్దలు నిర్ణయించిన దానిప్రకారము జరుగుచుండును. నియమిత వేళలలో సామూహిక ప్రార్థన చేయడము ఒక్క ముస్లీమ్ మతములోనే కలదు. క్రైస్థవులు కూడా ఆదివారము సాముహిక ప్రార్థనను చర్చీలలో చేయుచుండినా సమయపాలన లేదని, ఒకే సమయములో కాకుండా కొంత ముందు వెనుక ప్రార్థన జరుగుచుండును. మూడు మతములలో ప్రార్థన విషయమునందు హిందువులకంటే క్రైస్థవులు, క్రైస్థవులకంటే ముస్లీమ్‍లే ఉత్తమరీతిలో ఉన్నారని చెప్పవచ్చును. ప్రార్థన విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 4, ఆయత్ 103లో ఈ విధముగా చెప్పియున్నారు చూడండి.

(4-103) ''మరిమీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహముగా నమాజును నిర్ధారిత వేళలలో చేయడము విశ్వాసులకు విధిగా చేయబడినది. ('అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'లో వ్రాయబడిన వాక్యము)

(4-103) ''మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూనే ఉండాలి. అయితే పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట నమాజును నెలకొల్పండి. నిశ్చయముగా సమయపాలన చేస్తూ నమాజును నెరవేర్చడము విశ్వాసులకు విధిగా చేయబడినది. ('ఖుర్ఆన్ మజీద్'లో వ్రాయబడిన వాక్యము)

(4-103) ''ఇక నమాజ్‍ను పూర్తి చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍ను స్మరిస్తూ ఉండండి. కానీ శాంతిభద్రతలు నెలకొన్న తర్వాత నమాజ్‍ను స్థాపించండి. నిశ్చయముగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడినది ('దివ్య ఖుర్ఆన్ సందేశము' గ్రంథములో వ్రాయబడిన వాక్యము)

ఒకే వాక్యము మూడు గ్రంథములలో తెలుగు అనువాదముగా వ్రాసినా కొన్ని పదములు వేరయినా, అర్థము అంతా ఒకే విధముగా యున్నది. (4-103) వ వాక్యము మూడు భాగములుగా యున్నది. నిర్ణయించబడిన కాలము ప్రకారము నమాజ్ చేయడము ఒక భాగము కాగా, నమాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా, ఎలా ఉన్నా దేవున్ని (అల్లాహ్) ను స్మరించుకోవడము రెండవ భాగము. నీకు అనుకూలమైనప్పుడు నమాజ్‍ను స్థాపించడము మూడవ భాగము. మొదటిదయిన నియమిత కాలము ప్రకారము నమాజ్ చేయడము ముస్లీమ్‍లందరికీ తెలుసు. నమాజ్ అయిపోయిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‍నే స్మరించుకొమ్మని చెప్పిన రెండవ విధానము మంచిదే అయినా ఎందరు ఆచరిస్తున్నారో చెప్పలేము. ఇక మూడవ విధానమయిన నమాజ్‍ను స్థాపించడము ఎవరూ చేయలేదని చెప్పవచ్చును. భూమిమీద ఎందరు ముస్లీమ్‍లుయున్నా వారందరికీ నియమిత కాలములో నమాజ్ చేయడమే తెలుసు కానీ, నమాజ్‍ను స్థాపించడము అంటే ఏమిటో, స్థాపింపబడే నమాజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ వాక్యములో చెప్పిన మూడు విధానములలో మొదటి విధానము తప్ప రెండవ విధానము కూడా కొందరికి తప్ప చాలామందికి తెలిసియుండదని చెప్పవచ్చును. మూడవ విధానమైన నమాజ్‍ను స్థాపించడము ఒక్కరికి కూడా తెలియదనియే చెప్పవచ్చును.

ఇస్లామ్ సమాజము అంతయూ మత సాంప్రదాయముల మీద, మత నియమ నిబద్దతల (షరియత్) మీద ఆధారపడియుండును. మత పెద్దలు ఎలా చెప్పితే అలా ఆచరించడము తప్ప, పెద్దల మాటను జవదాటని పద్ధతిలో ఇస్లామ్ సమాజమంతా యున్నదని చెప్పవచ్చును. అందువలన సమయ పాలనలో చేయు నమాజ్ తప్ప మిగతా దేనివైపు వారు చూడరు, దేనిని గురించి ఆలోచించరు. పెద్దలు చెప్పిన నమాజ్ ఒక్కటే, అదే నియమిత సమయములలో సామూహికముగా నమాజ్ చేయడము. ఇది వదలి వేరే నమాజ్ అనుమాట కూడా వారు వినరు. దానిని గురించి కొద్దిగా అయినా ఆలోచించరు. అటువంటప్పుడు మనిషి సామూహికముగా కాకుండా ఒక్కడుగా ప్రత్యేకమైన నమాజ్‍ను స్థాపించడము గ్రంథములో యున్నాగానీ దానిని ఖాతరు చేయరు. అటువంటప్పుడు ఒక వ్యక్తి స్థాపించు నమాజ్ అంటే ఏమిటో ఎవరికీ, ఏ ముస్లీమ్కూ తెలియదు. మొదట ముస్లీమ్ పెద్దలు ఏమి చెప్పారో దానిని వినడము, దానిని ఆచరించడము తప్ప స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినమాటను కూడా గమనించరు. 'దేవుడు పుట్టడు' అని పెద్దలు చెప్పారు. అదే వారిలో నిలిచి పోయినది. ఖుర్ఆన్ గ్రంథములో 'దేవుడు అవతరిస్తాడని' 15వ సూరాలోనూ, 89వ సూరాలోను చెప్పియున్నా దానిని ఏమాత్రము నమ్మరు. అలాగే ''మనిషి తిరిగి పుట్టుతాడు, పునర్జన్మ ఉంది'' అని గ్రంథములోయున్నా ముందు తమ పెద్దలు మనిషికి పునర్జన్మలు లేవు అని చెప్పిన మాటనే గట్టిగా నమ్మియున్నారు. ఇట్లు నమాజ్ విషయములో అందరికీ తెలిసినది, అందరూ చేయునదే తప్ప ఇతర నమాజ్ అంటే ఏమిటో తెలియదు. నమాజ్ అనే పదములో ఉండే ప్రతి అక్షరమునకు అర్థమున్నదని కూడా తెలియదు. నమాజ్ అంటే జన్మలు వద్దు, మోక్షము కావాలని చెప్పడమని తెలియదు. నమాజ్ అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు.

ఈ ఆయత్‍లో ముఖ్యమైన ఘట్టము ఏమనగా! ''పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట'' అనీ, దానినే ''శాంతిభద్రతలు నెలకొన్న తర్వాత'' అనీ, మరొక గ్రంథములో ''పరిస్థితులు కుదుట పడిన తర్వాత''యనీ వ్రాసియున్నారు. ఇట్లు ఒకే విషయమునే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పియున్నారు. ఇది ఎలా ఉందంటే బయట ప్రపంచములో గొడవలు జరిగినప్పుడు పోలీసువారు కర్ఫ్యూ విధించిన తర్వాత పరిస్థితులు చల్లబడి, శాంతిభద్రతలు కుదుట పడినప్పుడు కర్ఫ్యూ తొలగించే కార్యమును ఆలోచించి ఎట్లు చేయవలెనో, అట్లే ఇక్కడ ఒక మనిషి 'నమాజ్‍ను నెలకొల్పడము' అను కార్యము చేయవలసియున్నది. నమాజ్‍ను మనిషి ప్రత్యేకముగా నెలకొల్పడమేమిటని ఎవరికయినా ప్రశ్న రాగలదు? ఇదే ఆయత్‍లోనే నమాజ్‍ను చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍నే తలచుకొమ్మని చెప్పారు. మొదట నమాజ్ చేసిన తర్వాత అల్లాహ్‍నే స్మరించమని చెప్పారు కదా! అప్పుడు అందరితో కలిసి నిర్ణీత సమయములో నమాజ్ చేశారు కదా! మొదట చేసినది నమాజ్ అయినప్పుడు రెండవమారు పరిస్థితులు అనుకూలించినప్పుడు నమాజ్‍ను స్థాపించడము లేక నెలకొల్పడము అంటే ఏమిటి? నిజము చెప్పితే ఆచరించడము వేరు, స్థాపించడము వేరు. ఉన్న దానిని ఆచరించవచ్చును. లేనిదానిని స్థాపించవచ్చును. అలాగే ఉన్న దానిని నెరవేర్చవచ్చును, లేనిదానిని నెలకొల్పవచ్చును. నిర్ణీత సమయములో అందరూ కలిసి సామూహికముగా నమాజును చేయవచ్చును, నెరవేర్చ వచ్చును. అంతవరకు లేని క్రొత్తదానిని అయితే నెలకొల్పడము, స్థాపించడము చేయవచ్చును. (4-103) వాక్యములో చెప్పిన సమాచారమును బట్టి చూస్తే అంతవరకు ఎవరూ చేయని దానిని, నిర్ణీత సమయము లేనిదానిని ప్రత్యేకముగా చేయమని చెప్పడమే కదా! అలా క్రొత్త నమాజ్‍ను నెలకొల్పడము అంటే ఏమిటి? అన్నీ అనుకూలించినప్పుడు అంటే ఇతరులతో ఏ పేచీలు రానప్పుడు, సానుకూలమైన సమయములో నెలకొల్పబడు నమాజ్ ఎలా ఉంటుంది? అన్నది పెద్ద ప్రశ్నగా మిలిగిపోవుచున్నది.

ఈ వాక్యము సూక్ష్మ (ముతషాబిహాత్) వాక్యము కూడా కాదు. స్థూల వాక్యముగానే చెప్పబడియున్నది. అటువంటప్పుడు జవాబు చెప్పడములో కూడా సులభముగా యుండును. స్థూల వాక్యములోని అర్థము కంటికి కనిపించునట్లుగానే యుండును. నమాజ్ అనగా ప్రార్థనయని అందరికీ తెలుసు. ఆ ప్రార్థనను కొందరు ముస్లీమ్ పెద్దలు, జ్ఞాన పరిశోధన చేసిన వారు మూడు భాగములుగా విభజించి చెప్పారు. ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్''లో ''అల్ ఫాతిహా'' మొదటి సూరా నమాజ్‍లో పఠించడము ముస్లీమ్‍లకు అందరికీ తెలుసు. అక్కడ ఆ సూరాలో యున్న ఏడు ఆయత్‍ల వివరము చెప్పడములో వారి అభిప్రాయములను ఇలా చెప్పారు. ఇది ఖుర్ఆన్ గ్రంథము నుండి సేకరించి చెప్పుచున్నదే. నమాజ్ చేయడము అంటే ఫాతిహా సూరాలోని ఏడు ఆయత్‍లను పఠించడమేయని చెప్పవచ్చును. అలా పఠించు నమాజ్ నాలుగు రకములు కలదు. 1) నెమ్మదిగా చేసే నమాజ్ సిర్రీ నమాజు. 2) బిగ్గరగా చేసేది జహ్రీ నమాజు. 3) విధిగా చేసేది ఫర్జ్ నమాజు. 4) స్వచ్ఛందముగా చేసేది నఫిల్ నమాజు.

నమాజ్‍ను తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యని అనవచ్చును. ఏకేశ్వరోపాసన మూడు రకములు గలదని చెప్పవచ్చును. ఆ మూడు రకములనే ఈ విధముగా ముస్లీమ్ పెద్దలు చెప్పుచున్నారు. 1) తౌహిదే రుబూబియత్ 2) తౌహీదే ఉలూహియత్ 3) తౌహిదే అస్మా వ సిఫాత్ అని అంటున్నారు. అందులో 1) తౌహిదె రుబూబియాత్ అనగా! ఈ మొత్తము విశ్వానికి సృష్ఠికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకొని ఉన్నవాడు, వ్యూహ రచయిత అల్లాహ్ మాత్రమేయని అర్థము. 2) తౌహీదే ఉలూహియత్ అనగా! అన్ని రకాల ఆరాధనలకు, దాస్యాలకు, వేడుకోళ్లకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. 3) తౌహిదే అస్మావ సిఫాత్ అనగా! ఖుర్ఆన్, హదీసులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణ గణాలను లక్ష్యణాలను ఏమాత్రము వక్రీకరించకుండా వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథముగా అల్లాహ్‍ను అంగీకరించడము అని చెప్పవచ్చును.

ఈ మూడు దేవుని విధానాలలో దేవుని ప్రార్థనను గురించి చెప్పినది తౌహీదె ఉలూహియత్ అనునది. అందులో ఆరాధనను గురించి చెప్పారు. ఆరాధనను గురించి ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాదములో చెప్పినది ఇలా కలదు. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసము లేక అతని ప్రసన్నత కొరకు ప్రాకులాడుచూ అతని ప్రసన్నత లేకుండా పోతుందేమోనను భయముతో చేసే ప్రతి పనీ ఆరాధన గానే భావించబడుతుంది. అందుచేత నమాజ్, రోజా, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు. ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవడము, అతని పేర మ్రొక్కుకోవడము, మొక్కుబడులు తీర్చు కోవడము, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకొని నిలబడడము, అతని చుట్టూ ప్రదక్షణ చేయడము, అతని సమక్షములో భయభక్తులు ప్రదర్శించడము, అతను తమకేదయినా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించడము ఇవన్నీ ఆరాధన (ఇబాదత్) గానే లెక్కించబడుతాయి.

ఇదంతా చూస్తే ఇన్ని విధముల చేయు క్రియలు అన్నీ ఆరాధనలే, ప్రార్థనలే అయినప్పుడు నేడు ముస్లీమ్‍లు చేయు నమాజ్‍కానీ, హిందువులు చేయు ప్రదక్షణలు, పూజలుగానీ, క్రైస్థవులు చేయు ప్రార్థనలుగానీ అన్నీ తౌహీదె ఉలూహియత్‍కు సంబంధించినవనియే చెప్పవచ్చును. అటువంటప్పుడు హిందువుల ఆరాధనలకంటే ముస్లీమ్‍ల నమాజ్ గొప్పదనీ, ముస్లీమ్‍ల నమాజ్ కంటే క్రైస్థవుల ప్రార్థన గొప్పదనీ చెప్పుటకు వీలులేదు. అన్నీ ఒక కోవకు చెందినవేయనీ, అందరి ఉద్దేశ్యము ఒక్కటేయనీ తెలియుచున్నది. 4-103వ ఆయత్‍ను అనుసరించి చూస్తే, అక్కడ అల్లాహ్ (దేవుడు) చెప్పిన విధానమును గమనించితే మీరు చేయు ఆశపూరిత, స్వార్థపూరిత నమాజ్‍లకంటే, ఆరాధనలకంటే, ప్రార్థనలకంటే ప్రత్యేకమైన నమాజ్ ఒకటి కలదని చెప్పడమైనది. అయితే మీరు ఇప్పుడు అలవాటుపడిన నమాజ్‍లను ఆరాధన క్రమములను, ప్రార్థనలను వదలకుండా చేసుకొమ్మని చెప్పడమే కాక, మీరు ఏది చేసినా దానికంటే గొప్పది దేవుని స్మరణ. అందువలన మీరు నమాజ్‍ను సమయాను కూలముగా, సామూహికముగా మీరు అనుకొన్నట్లు చేసిన తర్వాత దేవున్ని (అల్లాహ్‍ను) స్మరించుచూ ఉండండి అని చెప్పాడు. అల్లాహ్‍ను స్మరించుట నిలుచుండినా, కూర్చుండినా, పరుండినా చేయవలసియున్నది. దీనినిబట్టి చూస్తే మనిషి ఎల్లప్పుడూ మూడు రకముల ఉంటూ కాలము గడుపుచుండును. నిలబడియైనా ఉండును. లేక కూర్చుని అయినా ఉండును. ఈ రెండు లేకపోతే పరుండి అయినా ఉండును. ఈ మూడు స్థితులలో మనిషి ఏదో ఒక స్థితిలో ఎల్లప్పుడూ ఉండును. దీనిప్రకారము మనిషి ఎట్లుండినా, ఎక్కడుండినా, ఏమి చేయుచుండినా, అల్లాహ్‍నే (దేవున్నే) స్మరించుకొంటూ ఉండవలెనని చెప్పారు. అయితే అది సాధ్యముకాని పని. నిలబడినప్పుడుగానీ, కూర్చున్నప్పుడుగానీ మనిషి ప్రపంచ పనులలో లగ్నమై ఉండును. పడుకొన్నప్పుడు పనులు లేకపోయినా నిద్రలోనికి పోవును. అందువలన నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకొన్నప్పుడు మూడు కాలములలో మనిషి దేవున్ని జ్ఞాపకము చేసుకోలేడు.

అలా శరీరము మూడు స్థితులలో యున్నప్పుడు కూడా మీ ఆరాధన అయిపోయిన తర్వాత దేవున్ని స్మరించమని చెప్పాడు అంటే అంతవరకు మీరు చేసిన ఆరాధన (నమాజు) దేవునికి సంబంధము లేనిదనేగా అర్థము. ఆ మాటను దేవుడే స్వయముగా చెప్పినట్లు కలదు. అంతకుముందు చేసిన నమాజు సక్రమమయినదే అయితే, అది నిజమైన దైవ ఆరాధనే అయితే, మీరు నమాజు చేసిన తర్వాత నిలబడినా, కూర్చున్నా, పరుండినా దేవున్ని స్మరించుకోమని అల్లాహ్ చెప్పేవాడు కాదు. అలా చెప్పాడు అంటే మనుషులు చేసే నమాజు నాకు ఇష్టము లేనిదనేగా అర్థము. అందువలన ఎవరితోనూ, ఏ ఆటంకము లేనప్పుడు, నీకు పరిస్థితులు అనుకూలించి నప్పుడు నీవు చేసే నమాజు అందరికీ ఇష్టము లేనిదైనా, క్రొత్తది అగుట వలన వారికి వ్యతిరేఖత లేనప్పుడు, శాంతిభద్రతలు ఉన్నప్పుడు, ఇతరుల విరోధము లేనప్పుడు, అన్నీ సక్రమముగా అనుకూలముగా యున్నప్పుడు నీవు నమాజును నెలకొల్పుము లేక స్థాపించుము అని చెప్పాడు. అలా చెప్పడము వలన దేవునికి ఇష్టమయిన నమాజు వేరే ఏదో ఉన్నదని తెలియుచున్నది. 4-103వ ఆయత్‍లో నీవు ప్రత్యేకముగా నమాజును నెలకొల్పుమని చెప్పినా, అది ఫలానా విధముగా ఉండునని చెప్పలేదు. ఎందుకనగా! అది మనిషికి గల దేవుని జ్ఞానమునుబట్టి స్వయముగా అర్థము చేసుకోవలసియున్నది. అందువలన దేవుడు తన నమాజును గురించి చెప్పలేదు. అది మనిషి వ్యక్తిగత జ్ఞానమునుబట్టి యుండును. అంతేకాక ముందు దైవగ్రంథములు అయిన తౌరాతు, ఇంజీలు గ్రంథములలో అసలయిన ఆరాధన (నమాజును) గురించి చెప్పియున్నారు. (5-68) వ వాక్యము ప్రకారము మూడు దైవ గ్రంథములను జీవితములో నెలకొల్పిన వానికి అసలయిన నమాజును గురించి తెలియును. అందువలన అల్లాహ్ ప్రత్యేకించి ఆయన స్వయముగా ఏమీ చెప్పలేదు.

(5-68) ''ఓ ప్రవక్తా వారికి చెప్పు, గ్రంథవహులారా! మీరు తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన దానిని (ఖుర్ఆన్‍ను) మీ జీవితాలలో నెలకొల్పనంతవరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే.''

ఇక్కడ చెప్పినట్లు మూడు దైవ గ్రంథములు చదవనివారు ఏ ధర్మములో లేనట్లేయని చెప్పగా, ఏ మతస్థుడయినా మూడు గ్రంథములు చదివియుంటే అసలయిన నమాజును గురించి తెలియును. అలా తెలిసిన వాడు మిగతావారు దేవున్ని ఒకటి కొరితే, తాను మరొకటి కోరును. వారు కోరినది వీడు కోరడు, వీడు కోరినది వారు కోరరు. అదే విషయమును చెప్పుచూ సూరా నాలుగు ఆయత్ 104 లో ఇలా చెప్పుచున్నారు చూడండి.

(4-104) ''వారిని వెంబడించడములో ఏమాత్రము బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతముగా ఉన్నారనుకొంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతముగా ఉన్నారు. పైగా అల్లాహ్‍నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.''

ఇక్కడ 4-103 ప్రక్క ఆయత్‍లోనే 4-104లో 'వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు' అని ఉన్నది. ముస్లీమ్‍లందరూ నమాజ్ చేసినట్లే నీవు కూడా నమాజ్ చేయి. అప్పుడు వారికి నీకు ఏమీ తేడా లేదు. బయట పనిగానీ, నమాజ్‍గానీ చేయడములో వారి మాదిరి నీవు, నీ మాదిరి వారు ఉందురు. అదే విషయమునే వాక్యములో 'వారిని వెంబడించడములో ఏమాత్రము బలహీనతను ప్రదర్శించకండి' అని అన్నారు. అంతేకాక మీరు అవిశ్రాంతముగా ఉంటే, వారు కూడా అవిశ్రాంతముగా యుందురని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమనగా! 'వారు ఆశించని దానిని మీరు ఆశించుచున్నారు' అని కలదు. ఎవరు ఏమి కోరుచున్నది అల్లాహ్‍కు బాగా తెలుసు. ఆయన వివేచన కలవాడు. అందువలన ఎవరు అడిగిన దానిని వారికి ఇస్తాడు అని తెలియుచున్నది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. 4-103లో అందరితో పాటు నమాజు నెరవేర్చిన తర్వాత మీకు అనుకూలమైనప్పుడు నమాజ్‍ను స్థాపించండి అని వాక్యములో చెప్పడమైనది. తర్వాత 4-104లో అందరితో పాటు మీరు అన్ని కార్యములు చేయుచూ వారికంటే వెనుక పడకండి అని వున్నది. దానిప్రకారము చూస్తే నీవు, వారు అందరూ చేసినట్లే నమాజ్ చేయి అని చెప్పినట్లు అర్థమగుచున్నది. అంతేకాక వారున్నట్లే నీవుండు అని చెప్పుచూ, వారందరూ కోరని పరలోకమును నీవు కోరమని చెప్పడమైనది. వారందరూ పరలోకమును (మోక్షమును) ఎందుకు కోరలేదు అనగా! అందరికీ ఇష్టమైనది సుఖములను అందించు స్వర్గమే అయినందున ఎవరు కోరినా అందరూ స్వర్గమునే కోరుచున్నారు. అందువలన వారు కోరని దానిని నీవు కోరుచున్నావని చెప్పారు. దేవుడు వివేకవంతుడయిన దానివలన ఎవరు కోరిన దానిని వారికిస్తున్నాడు అని వాక్యములో అర్థమగునట్లు చెప్పాడు.

నీకు 4-103లో చెప్పినది అర్థమయి నిత్యము అందరితో పాటు నమాజు నెరవేర్చుచూ ప్రత్యేకమైన నమాజును నెలకొల్పి, ఇదే నిజమైన నమాజని నిర్ణయము చేసి ఇతరులకు చెప్పినా, నీ మాటను వారు ఖండించకుండా, నీ మాట సత్యమని నిరూపించుటకు ఈ గ్రంథాన్ని పంపు చున్నాను. నీవు సత్యమును వాదించు, అసత్యమును వాదించు వారి ప్రక్కన ఉండవద్దని అల్లాహ్ తన వాక్యములో తెలియజేశాడు చూడండి.

(4-105) ''ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు చూపిన విధముగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి గాను మేము నీవైపుకు ఈ గ్రంథాన్ని సత్యముతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి వైపున వాదిగా నిలబడకు.''

ఈ వాక్యమును చూస్తే నమాజును ప్రతి రోజు ఆచరించే వారికంటే ఏదో ఒక రోజు క్రొత్తగా అసలైన నమాజును నెలకొల్పి ఇదే నిజమైన నమాజు అని చెప్పితే దానికి ఆధారముగా సత్యసమేతముగా గ్రంథాన్ని (గ్రంథవాక్యాన్ని) పంపాము అని చెప్పారు. అయితే నీవు అసలయిన నమాజు ప్రక్కనే వాదించు, అసలయిన నమాజు లేదు అని దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పు ద్రోహానికి పాల్పడే వారి ప్రక్కన వాదించకు అని చెప్పడమైనది. నాల్గవ సూరాలోని 103, 104, 105 వాక్యములను చూచిన తర్వాత నేను అసలయిన నమాజు వైపు వాదించాలని అనుకొన్నాను. వాక్యములో దేవుడే స్వయముగా ప్రతి దినము మీరు నెరవేర్చే నమాజుకంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు అనుకూలము కుదిరినప్పుడు నమాజును స్థాపించు అని చెప్పిన మాటప్రకారము నిత్యము నమాజును చేసేవారి వైపుకంటే నమాజును స్థాపించేవారివైపు వాదిస్తాను. మనిషికి అవసరమైనది ప్రత్యేకముగా స్థాపించబడే నమాజు అని చెప్పు దేవుని మాటనే సత్యమని నేనూ నావంతుగా చెప్పుదును.

ప్రశ్న :- ప్రపంచములో ఉండే ముస్లీమ్‍లందరూ నిత్యము అందరూ చేయు నమాజునే చేయుచున్నారు. అల్లాహ్ నమాజ్‍ను చేయమని చెప్పాడు. ఐదు పూటల నమాజ్ చేయమని చెప్పాడు. అందువలన నిర్ణీత సమయములలో ప్రతి దినము ఐదుపూటల నమాజ్‍ను చేయుచున్నారు. ఇది నమాజ్ కాదా?

జవాబు :- ప్రతి దినము అందరూ చేయు నమాజ్‍ను అందరితోపాటు తప్పక చేయమనే వాక్యములో కూడా చెప్పారు. నిత్యము చేయునది నమాజు కాదని మేము కూడా చెప్పలేదు. ఇది చేస్తూ ఉండేది. నిత్యము నెరవేర్చే దానిని నెరవేర్చుచూ ఉండమని అల్లాహ్ చెప్పాడు. అలా నెరవేర్చుచూ ప్రత్యేకమైన నమాజును ఎల్లవేళల చేయు నమాజును నెలకొల్పమన్నాడు. నిత్యము నెరవేర్చు నమాజుకంటే ఏదో ఒక దినము నెలకొల్పు నమాజు శ్రేష్ఠమయినదని చెప్పినట్లు కలదు. అందువలన చేసే ప్రార్థన (నమాజు) ను చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు.

ప్రశ్న :- ప్రతి దినము చేసే నమాజుకు క్రొత్తగా నెలకొల్పే నమాజుకు ఏమి తేడా గలదు? నిత్యము చేసే నమాజున్నప్పుడు, క్రొత్త దాని అవసరము ఏమి ఉంటుంది? దీనిలో లేనిది దానిలో ఏముంది?

జవాబు :- 4-103వ వాక్యములో నమాజును చేసిన తర్వాత నిలబడినా, కూర్చుండినా, పరుండినా అల్లాహ్‍నే స్మరిస్తూ ఉండమని చెప్పారు కదా! నమాజు అంటే ఎల్లప్పుడూ అన్ని కాలములలో దేవున్ని స్మరించడమని చెప్పాడు. అది సాధ్యమేనా? అని చూస్తే ప్రత్యేకమైన నమాజువల్ల సాధ్యమవుతుంది గానీ సాధారణముగా స్మరించుకొనుటకు సాధ్యము కాదు. సాధారణముగా నిలబడి, కూర్చొని, పడుకొని ఎవరూ స్మరించుకోలేరు. అలా సాధ్యము కాదు కనుక, అది సాధ్యమగునది క్రొత్తగా స్థాపించబడే నమాజునందే కనుక ఇతరుల వలన ఏ ఇబ్బంది లేనప్పుడు, నీకు బాగా అర్థమయినప్పుడు, క్రొత్తగాయుండు నమాజును, క్రొత్తగా చెప్పబడు నమాజును స్థాపించండి అని చెప్పాడు. క్రొత్తగా స్థాపించబడు నమాజు ప్రతి రోజు ముస్లీమ్‍లందరూ చేయు నమాజ్‍కంటే చాలా ప్రత్యేకమైనది. అందువలన ఇది అది కాదు, అది ఇది కాదు. అది అదే, ఇది ఇదేయని చెప్పవచ్చును.

ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో నెరవేర్చబడు నమాజ్‍కంటే నెలకొల్పబడు నమాజ్ గొప్పదన్నట్లు చెప్పియున్నారు. (4-104) నిత్యము నమాజు చేయువారు కోరే దానికంటే క్రొత్తగా నమాజును స్థాపించేవారు కోరేది వేరుగాయుంటుంది అని క్రొత్త నమాజు ప్రత్యేకతను చాటి చెప్పారు. తర్వాత (4-105) లో మీరు నెలకొల్పినది గొప్పదని తేల్చి తీర్పుతీర్చి చెప్పినా, వినని వారికి నేను గ్రంథమును 'సత్యసమేతముగా సాక్ష్యముగా యుండునట్లు పంపుచున్నాను' అని చెప్పాడు. ఈ మూడు ఆయత్‍లు చూచుట వలన క్రొత్త నమాజు ఉన్నదని కొందరికి, క్రొత్త నమాజు అంటే ఏమిటో కొందరికి అర్థమయి ఉండవచ్చును. అయినా మాకు అర్థమగునట్లు నెలకొల్పబడు నమాజు అంటే ఇదియనీ, దాని వివరమును సంపూర్ణముగా తెలుపలేదు. ఈ విధముగా మూడు ఆయత్‍లు చెప్పి క్రొత్త నమాజును సూచించడమే తప్ప దానిని పూర్తి వివరముగా క్రొత్త నమాజు ఈ విధముగా ఉండునని చెప్పలేదు. అలాంటప్పుడు క్రొత్త నమాజును ఎలా నమ్మాలి?

జవాబు :- క్రొత్త నమాజు విషయము ప్రక్కన పెట్టి పాత నమాజు విషయమునకు (ప్రతి దినము చేసే నమాజు విషయమునకు) వచ్చి చూస్తే ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడా నమాజ్ నిర్వహించే క్రమము అని అల్లాహ్ చెప్పియుండలేదు. అయితే ముస్లీమ్ పెద్దలుగానీ లేక ముహమ్మద్ ప్రవక్తగారు గానీ, నమాజు చేయు పద్ధతిని తెలిసి ఆచరించి చూపుట వలన, వారి తర్వాత వీరు అలాగే చేయను మొదలుపెట్టారు. అల్లాహ్ ఆకాశవాణి ద్వారా (వహీ ద్వారా) దైవజ్ఞానమును అందించాడు. నమాజులో పఠించు ఏడు ఆయత్‍లను కూడా అల్లాహ్ చెప్పలేదు. మనుషులు అల్లాహ్ గొప్ప తనాన్ని నాలుగు వాక్యములుగా, మనుషుల అవసరమును కోరుచూ మూడు వాక్యములుగా చెప్పుకొన్నారు. అలా చెప్పిన వాక్యములనే నమాజ్‍లో మంత్రములుగా చెప్పుచున్నారు. ఏడు వాక్యములను చదవనిదే అది నమాజ్ అనిపించుకోదుయని చాలామంది ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు. నమాజ్‍లో ఏడు వాక్యములను తప్పనిసరిగా మంత్రపఠనము లాగా చదువవలసి యుండును. అయితే ఈ విషయమును అనగా ఏడు ఆయత్‍లను చదివే విషయమును దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ చెప్పినట్లు జిబ్రయేల్ ఎక్కడా ఏ సూరాలో, ఏ ఆయత్‍లో చెప్పలేదు.

వాస్తవముగా అల్ ఫాతిహా అను ఏడు ఆయత్‍లను మనుషులు ప్రార్థన కొరకు సృష్ఠించుకొన్నదేగానీ దేవుడు చెప్పినది గాదు. ప్రార్థన విషయమును ప్రత్యేకించి అల్లాహ్ చెప్పియుండలేదు. గడచిన మూడు యుగములలోనూ, తర్వాత గడచుచున్న కలియుగములోను అనేకులు అనేక ప్రార్థనలను చేయుచున్నారు. ముందే తయారయిన హిందూ మతములో అనేక దేవతారాధనలు గలవు. అట్లే ఇస్లామ్కంటే ముందు తయారయిన క్రైస్థవములో కూడా ప్రార్థనలు కలవు. కలియుగములో 3600 సంవత్సరముల తర్వాత ఇస్లామ్ సమాజము తయారయినది. అంతవరకు అందరూ చేయు ప్రార్థనలలాగే ముస్లీమ్‍లు నమాజు అను పేరుతో ప్రార్థనను తయారు చేసుకొన్నారు. అందులో మొదటి నుండి చివర వరకు చేయు విధానము, చదువు వాక్యములు అన్నియూ మనుషులు కల్పించుకొన్నవే. ఖుర్ఆన్‍ను గ్రంథముగా వ్రాయకముందే ముస్లీమ్‍లలో ప్రార్థన విధానమును ముహమ్మద్ ప్రవక్తగారు ప్రవేశపెట్టారని చెప్పవచ్చును. ముస్లీమ్ సమాజము ఏర్పడినప్పటి నుండి నమాజు అను ప్రార్థనయున్నా అది ఇతర మతస్థులు ఆచరించునట్లు ఆచరించుట వలన, అది ఒక విధమైన ప్రార్థనే అయినా, దానిని చేయువారు అట్లే చేస్తూ, క్రొత్త నమాజును స్థాపించమని 4-103లో చెప్పియున్నారు. పాత నమాజు వలన మనిషికి పరలోక ప్రాప్తి యుండదనీ, మిగతా మతముల వారు చేయు ప్రార్థనలకు కూడా మోక్షము (పరలోకము) లభించదని దేవుడు తెలియజేసినట్లు ఇంకొక నమాజును (ప్రార్థనను) చెప్పడమైనది.

పాత నమాజును చేస్తూనే క్రొత్త నమాజు అర్థమయినప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, నమాజును స్థాపించమన్నారు. పాత నమాజులోని లోపమును చూపిస్తూ నిలబడినప్పుడు, కూర్చుండినప్పుడు, పరుండినప్పుడు అల్లాహ్‍ను (దేవున్ని) స్మరించుము అన్నాడు. అలా స్మరణ ఉండుట కొరకే క్రొత్త నమాజు అవసరమైనది.

పాత నమాజు చేసినంతసేపు దేవుని జ్ఞాపకము ఉండును. చేయనప్పుడు దేవుని జ్ఞాపకము ఉండదు. అందువలన శరీరము మూడు స్థితులలో యున్నప్పుడు దేవుని స్మరణ చేయమని చెప్పిన అల్లాహ్, ఆ విధానమును నమాజ్ అని చెప్పుచూ, దానిని స్థాపించమని చెప్పాడు. ఆయన ప్రజలకు మంచి చేయుటకు, పరలోకము లభించునట్లు చేయుటకు నమాజ్‍ను స్థాపించమని చెప్పాడు కదా! మనిషికి ఆ నమాజు (ప్రార్థన) ఎలాగుండునో తెలియనప్పుడు ఎలా స్థాపించునను ప్రశ్న ఇప్పుడు అందరికీ వచ్చినది. అయితే దానికి జవాబుగా ఇట్లు చెప్పుటకు వీలుకలదు. ఇంతకు ముందు చెప్పిన జ్ఞానము ప్రకారము అనగా! రెండు, మూడు సూరాలలో చెప్పిన జ్ఞానము ప్రకారము మనిషి ఎల్లవేళల, మనిషికి జ్ఞాపకమున్న (ఎరుక యున్న) సమయములలో ఒక్క క్షణము కూడా దేవున్ని మరచిపోకుండా ఉండుటకు తగినది చెప్పబడియున్నది. రెండు సూరాలలోనేకాక, ఆరవ సూరాలో కూడా దేవుడు సూచించిన నమాజు కలదు. అందువలన ఖుర్ఆన్ చదివిన ఏ వ్యక్తి అయినా అంతకుముందు చేయు ఆరాధన చేయుచూ, దాని తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా చేయబడు నమాజును స్థాపించవచ్చును. అయితే దేవుడు చెప్పిన ఈ నమాజు ప్రార్థన మందిరములో చేయునది కాదు. బజారులో నిలబడినప్పుడుగానీ, హోటల్లో కూర్చున్నప్పుడుగానీ, పరుపు మీద పడుకొన్నప్పుడుగానీ దేవుడు సూచించిన నమాజును చేయవచ్చును. నిలబడి నడుస్తునప్పుడు బజారులోని దృశ్యములను చూస్తూ, కూర్చుండి మాట్లాడుచున్నప్పుడు, ఇతరులతో వాదించుచూ గానీ, పడకలో పరుండి భార్యాపిల్లలతో సంతోషముగా మాట్లాడునప్పుడుగానీ, పూర్తి నమాజుగాయుండు ఆరాధనను చేయవచ్చును.

పాత నమాజు ప్రతీ దినము నియమింపబడిన కాలములో చేయుచున్నా దానికి కొన్ని విధివిధానములు గలవు. క్రొత్త నమాజులో అటువంటివి ఏవీ లేవు. పాత నమాజులో ఏడు ఆయత్‍లు చదవడము, మోకాళ్ల మీద కూర్చొని వంగి తల భూమికి పెట్టి ప్రార్థన చేయడము గలదు. క్రొత్త నమాజులో అటువంటి క్రియలు ఉండవు. పాత నమాజులో నిర్ణీత సమయముండును. క్రొత్త నమాజులో సమయము ప్రత్యేకించి యుండదు. అన్ని సమయములలో ఆచరించునదిగా ఉండును. పాత నమాజులో సాముహికముగా జనముతో కూడి చేయడము గలదు. అయితే క్రొత్త నమాజులో ప్రక్క మనిషితో సంబంధము లేకుండా అడవిలో అయినా ఒక్కడే చేయవచ్చును. ఇట్లు ఎన్నో తేడాలు ఉండుట వలన పాత నమాజును చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అలా నెలకొల్పడము వలన పాత నమాజును చేసే సమయములో కూడా పాత నమాజును చేస్తూనే క్రొత్త నమాజును దానిలోనే మిళితముగా చేయవచ్చును. నీ శరీరము ఏమి చేయుచున్నా, నిలబడి గానీ, కూర్చుండిగానీ, పరుండి గానీ యున్నా ఏమి చేయుచున్నా దానిని వదలక క్రొత్త నమాజును చేయవచ్చును. ఇదంతా పెద్ద విచిత్రముగా ఏదో మాయాలాగా ముందు కనిపించినా, తెలిసిన తర్వాత క్రొత్త నమాజు ఎంతో సులభమైనదని అనిపించును.

ప్రశ్న :- నేడు ముస్లీమ్‍లు అల్లాహ్ (దేవుడు) అనినా, ముహమ్మద్ ప్రవక్త అనినా ఎంతో ఇష్టముగా యుండుటేగాక వారి మాటను ఎంతో గౌరవముగా స్వీకరిస్తారు, ఆచరిస్తారు. అటువంటప్పుడు ముస్లీమ్ సమాజములో నమాజు ఒక్కటే కలదు. దానిని నిర్ణీత సమయములలో అందరూ కలిసి సామూహికముగా, క్రమశిక్షణగా, శుచిశుభ్రతలతో, కాళ్లు, చేతులు, ముఖము కడుగుకొని ప్రార్థనలో (నమాజులో) పాల్గొని తృప్తి పొందుచున్నారు. కొందరికి వీలయితే ఐదుపూటలు నమాజ్ చేయువారు కలరు. అంతేకాక ముస్లీమ్‍లు అంటే విశ్వాసము, విశ్వాసము అంటే ముస్లీమ్‍లు అనునట్లు గలదు. ఖుర్ఆన్ గ్రంథమును ఎంతో గౌరవముగా చదివి దానిలో దేవుడు చెప్పిన సూచనలను తెలియుచుందురు. అంత భక్తిగా యున్నవారికి మీకు తెలిసిన రెండవ క్రొత్త నమాజు తెలియకుండునా?అట్లు యున్నట్లు హదీసు పండితులకుగానీ, ఖుర్ఆన్ బోధకులకు గానీ తెలియదా? మీరు చెప్పేంత వరకు వారికి తెలియదంటారా? మసీదులలో ఇమాంసాబ్‍లు నిత్యము ఖుర్ఆన్ పఠనము చేయుచుందురు. వారు కూడా మీరు చెప్పిన దానిని చెప్పలేదే? మీరు తెలుగులో వ్రాసిన ఖుర్ఆన్‍ను చదివి చెప్పుచున్నారు. ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలో వ్రాయబడినది. అరబ్బీ భాషా పండితులు మీరు చెప్పిన వాక్యమును చదివియుంటారు కదా! మీరు చెప్పిన (4-103) వాక్యములో ఇంకో నమాజును గురించి, దానిని నెలకొల్పమని చెప్పిన దానిని గురించి చెప్పినది తెలిసియుండదా? అరబ్బీ పండితులకు తెలియని విషయమును మీరు చెప్పుచున్నారా? అని మాకు అనుమానము (ప్రశ్న) వచ్చుచున్నది. దీనికి మీరు ఏమి జవాబు చెప్పగలరు?

జవాబు :- ఖుర్ఆన్ గ్రంథమును అరబ్బీ భాషలో వ్రాసిన మాట నిజమే. అరబ్బీ, తెలుగు తెలిసిన పండితులు అరబ్బీ భాషలోని ఖుర్ఆన్ గ్రంథమును తెలుగులో అనువదించి వ్రాశారు. అలా తెలుగు అనువాద గ్రంథములు నావద్ద ఏడు గ్రంథములు గలవు. అన్ని గ్రంథములలోను (4-103) ఆయత్‍ను చూస్తే అన్నీ ఒకే అర్థము ఇచ్చునవిగా గలవు. కొన్ని గ్రంథములలోని పదములు వేరుగాయున్నా అర్థము ఒకే విధముగా యున్నది. ఒక గ్రంథములో 'నమాజును స్థాపించండి' అని వ్రాశారు. మరొక గ్రంథములో 'నమాజును నిర్మించండి' అని గలదు. ఇంకొక దానిలో 'నమాజును నెలకొల్పండి' యని కలదు. మూడు తెలుగు అనువాద గ్రంథములలో వేరువేరు పదములుగా నిర్మించండి, స్థాపించండి, నెలకొల్పండి యని యున్నా అన్నీ ఒకే అర్థమును చూపుచున్నవి. అటువంటప్పుడు భాషను చూడక భావమును చూడవలెను. ఇటువంటి ప్రశ్న వస్తుందేమోనని ముందుచూపుగా ఒకే ఆయత్‍ను మూడు గ్రంథములనుండి సేకరించి మూడు విధముల వ్రాసి చూపాను. ఆ మూడు ఆయత్‍లు కొద్దిగా పదాలు వేరుగా యున్నా, భావములో అన్నీ ఒకే విధముగా యున్నవని చెప్పవచ్చును. తర్వాత ఇస్లామ్‍లో ఎందరో పండితులు భక్తులు ఉన్నారు. అయితే 4-103 లో క్రొత్త నమాజును కూడా పాత నమాజుగా వారు లెక్కించుకొని క్రొత్త దానిని కూడా పాతదానిగానే చెప్పుచున్నారు. ఎన్నిచోట్ల చెప్పినా ఉన్నది ఒకే నమాజు కదా!యని అంటున్నారుగానీ వాక్యములోని హెచ్చుతగ్గులను, సూక్ష్మాతి సూక్ష్మములను తెలియలేకున్నారు. అలా నమాజ్ ఒక్కటేయని, అల్లాహ్ ఒక్కడేయని నిర్ధారణలో ఉండుట వలన క్రొత్త నమాజ్ వారికి తెలియకుండా పోయినది.

ప్రశ్న :- ఇంత పెద్ద ముస్లీమ్ సమాజములో, ఖుర్ఆన్ వాక్యమునందు నమాజ్ స్థాపించండి, నెలకొల్పండి అని వ్రాసిన పదము అర్థముకాక చెప్పిన నమాజ్‍ను పాత నమాజ్ అనుకున్నారా? ఒక్కరు కాకపోతే మరొక్కరికయినా దాని భావము అర్థము కాలేదా? ఇస్లామ్ పండితులకంటే నీవు పెద్దవాడివా, వారికి అర్థము కానిది నీకు అర్థమయినదని మేము ఎట్లు నమ్మాలి? నీవు ఇందూ సమాజములోని వానివి. హిందూ సమాజములోని మనిషి (మీరు) ఖుర్ఆన్ గ్రంథము చదివి అర్థము చేసుకొన్న దానిని ఇస్లామ్ పండితులకు అర్థము కాలేదని చెప్పగలరా?

జవాబు :- సత్యమును సత్యముగానే చెప్పితే అల్లాహ్ సంతోషిస్తాడుగానీ, సత్యమును అసత్యముగా చెప్పితే అల్లాహ్ ఏమాత్రము ఒప్పుకోడు. దేవుడు అంటే నాకు ఎంతో భయము కలదు. అట్లే భక్తీ కలదు. సత్యము అంటే కూడా భయము కలదు. దేవుడు, దేవుని బోధలు సత్యసమేతముగా ఉండును. అందువలన సత్యమును అసత్యముగా చెప్పుట పెద్ద తప్పుగా భావింతును. వాస్తవముగా ఖుర్ఆన్ గ్రంథము నాకు అర్థమయినట్లు ఇతర ముస్లీమ్‍లకు అర్థము కాలేదనియే చెప్పుచున్నాను. హిందూ సమాజములో పుట్టిన వానికి అర్థము అయినప్పుడు, ముస్లీమ్ సమాజములో పుట్టినవారికి అర్థము కాకుండా పోవునా? ఇది నమ్మవలసిన మాటేనాయని అడుగవచ్చును. అట్లు అడగడములో తప్పులేదుగానీ సత్యము తెలిస్తే మీరు ఎవరూ ఈ మాటను అడుగరు. అందరికీ తెలియని సత్యము ఏమనగా!

ఖుర్ఆన్ గ్రంథములో ఎన్నో గొప్పవాక్యములు గలవు. ఇప్పుడు వజ్రవాక్యములను పేరుతో ఈ గ్రంథమును వ్రాయుచున్నా, వాస్తవముగా చూస్తే వజ్రవాక్యములు అను పేరు కూడా ఒక విధముగా ఈ గ్రంథమునకు తక్కువేయని చెప్పవచ్చును. వజ్రాలకంటే ఎక్కువ విలువయిన వాక్యములు ఖుర్ఆన్ గ్రంథములో గలవు. ఖుర్ఆన్ గ్రంథము ఏ మనిషికి అర్థము కావాలన్నా, మతముతో సంబంధము లేకుండా ముస్లీమ్‍కుగానీ, హిందువులకుగానీ, క్రైస్థవులకుగానీ ఎవరికి అర్థము కావాలన్నా మిగతా రెండు గ్రంథములు చదివిన వారికే అర్థమగును. ఎవడయితే మూడు దైవ గ్రంథములలో మిగతా రెండు గ్రంథములు చదవకపోతే ఖుర్ఆన్ అర్థము కాదు. మిగతా రెండు దైవగ్రంథములయిన భగవద్గీత, బైబిలు చదివి అర్థము చేసుకొనియుంటే వానికి ఖుర్ఆన్ గ్రంథము సులభముగా అర్థము కాగలదు. నేను భగవద్గీతను, బైబిలును వివరముగా చదువగలిగాను. చదవడమేకాక బాగా అర్థము చేసుకొన్నాను. అందువలన మూడవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథము బాగా అర్థమవుచున్నది. ముస్లీమ్‍లకు కూడా తెలియని రహస్య భావములు నాకు తెలియుచున్నవి. వాస్తవానికి (4-103) వ వాక్యము చిన్న వాక్యము. అందులో మూడే ముక్కలు గలవు. ఒకటి పాత నమాజును చెయ్యి, తర్వాత ఎక్కడున్నా ఏ పరిస్థితిలోయున్నా అని చెప్పుచూ నిలుచున్నా, కూర్చుండినా, పరుండినాయని అన్నారు. ఆ తర్వాత సమయము అనుకూలిస్తే, నమాజును నెలకొల్పమని చెప్పారు. నమాజును నెలకొల్పమని చెప్పినది అన్ని గ్రంథములలో గలదు. అందరూ దానిని చదివినా పాత నమాజును తప్పనిసరిగా శ్రద్ధగా ఆచరించడమే నమాజును నెలకొల్పినట్లు తలచుచున్నారు. గ్రంథములో మా బుద్ధికి క్రొత్త నమాజుగా కనిపించుచున్నది. దానికి ఒకే ఒక కారణము గలదు. అదే వారు ఖుర్ఆన్ గ్రంథమును అర్థము చేసుకోలేదని ఆ కారణము చేతనే క్రొత్త నమాజ్ కూడా పాత నమాజ్ మాదిరే అర్థమయినదని చెప్పవచ్చును. అలా అర్థము కాకపోవడానికి ముస్లీమ్‍లు భగవద్గీతను, బైబిలును చదవలేదు. రెండు గ్రంథములను చదవనిదే మూడవ గ్రంథము అర్థముకాదని నేను కొన్ని సంవత్సరములనుండి చెప్పుచూనే యున్నాను.

భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ మూడు దైవ గ్రంథములేయని చెప్పవచ్చును. ఒక దైవ గ్రంథము అర్థము కావాలంటే మిగతా రెండు దైవ గ్రంథములను తప్పనిసరిగా చదువవలసిందే. మనిషి ఏ ధర్మములో యున్నా ఆ ధర్మము వానికి తెలియాలంటే మిగతా రెండు గ్రంథములను చదవవలెను. ఇది అల్లాహ్ ఐదవ సూరాలో 68వ ఆయత్‍లో ఇలా ఆజ్ఞ చేసి చెప్పాడు చూడండి. అక్కడ చెప్పిన వాక్యము అనుసరించి మనిషి ధర్మము నిర్ణయించబడును.

(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు వద్ద నుండి వచ్చిన మీ వద్దకు పంపబడిన దానిని (ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే''

ఈ వాక్యము ఖుర్ఆన్ గ్రంథములో ముస్లీమ్‍లకే చెప్పియున్నారు కదా! అటువంటప్పుడు ముస్లీమ్‍లు భగవద్గీత, బైబిలు చదవనిదే ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍లు సక్రమముగా అర్థము కావు. దేవుని నియమము ప్రకారము నడుచుకోని వారికి వారి ధర్మము వారికే తెలియదు. ఇది ముస్లీమ్‍లకే కాదు, అన్ని మతముల వారికి వర్తించును. అందువలన తమ మత గ్రంథమని ఒక గ్రంథమును ఆశ్రయించి, మిగతా రెండు దైవ గ్రంథములను పరమత గ్రంథములుగా అసూయతో చూచువారికి, ఎంత కాలమునకయినా వారి గ్రంథములోని జ్ఞానమే అర్థము కాదు. నేడు హిందువులు బైబిలును పరమత గ్రంథము అని అసూయతో చూస్తున్నారు. అట్లే ఖుర్ఆన్ గ్రంథమును కూడా పరమత గ్రంథమని దూరముగా పెట్టారు. అందులో ఏమున్నది ఆ రెండు గ్రంథముల జ్ఞానము తెలియదు కావున అటువంటి వారికి భగవద్గీత జ్ఞానము కూడా తెలియదు. అంతేకాక మేము హిందువులమని చెప్పుకొనుచుండినా వారికి హిందూ ధర్మము ఏదో తెలియకుండును. ఒక దైవగ్రంథములోని జ్ఞానము అర్థము కావాలంటే మిగతా రెండు దైవ గ్రంథముల జ్ఞానము తెలిసియుండాలి. ఈ సూత్రము తెలియని దానివలన ముస్లీమ్‍లకు వారి ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍లు అర్థము కావడము లేదు.

నేను భగవద్గీత, బైబిలు రెండు గ్రంథములు చదివాను కావున ఖుర్ఆన్ అర్థమగుచున్నది. అలాగే ఖుర్ఆన్, బైబిలు చదివియుండుట వలన భగవద్గీత అర్థమగుచున్నది. అట్లే భగవద్గీత, ఖుర్ఆన్‍ను చదివి యున్నాను కావున నాకు బైబిలు సులభముగా అర్థమగుచున్నది. ముస్లీమ్‍లకు (4-103)లో యున్న వాక్యములో క్రొత్త నమాజ్ అర్థము కాలేదంటే, క్రొత్త నమాజు ఉన్నదని తెలియలేదంటే వారికి మిగతా రెండు గ్రంథముల జ్ఞానము తెలియదనే చెప్పవచ్చును. దేవుడు ఒక సూత్రమును ఒక దైవ గ్రంథములలో చెప్పితే మూడు దైవగ్రంథములలో ఆ సూత్రము ఉన్నట్లేయగును. మూడు దైవగ్రంథములలో ఒకే దేవున్ని గురించి చెప్పియుండుట చేత ఒక జ్ఞాన సూత్రము ఒక దైవ గ్రంథములో చెప్పితే అది మిగతా రెండు దైవగ్రంథములలో చెప్పినట్లుగా లెక్కించవలెను. చెప్పునది ఒకే దేవున్ని అయినందున ఒకే సూత్రము మూడు గ్రంథములలో సమానముగా వర్తించును.

ఒక బ్యాంకు లాకర్‍లో సొమ్మును దాచుకొన్నప్పుడు, బ్యాంకు లాకర్‍కు రెండు తాళము చెవులు ఉండును. ఒకటి ఖాతాదారునికి ఇచ్చి రెండవ దానిని బ్యాంకు మేనేజర్ ఆధీనములో ఉంచుకొనును. లాకర్‍లో సొమ్ము కావలసి వస్తే నీ వద్ద యున్న తాళము చెవితో మాత్రము లాకర్ తెరుచుకోదు. బ్యాంక్ మేనేజర్ వద్దయున్న తాళము చెవి నీవద్ద యున్న తాళము చెవి రెండూ ఉపయోగించినప్పుడు బ్యాంక్‍లాకర్ తెరుచుకొని అందులోని సొమ్ము లభించును. ఇక్కడ బ్యాంక్ లాకర్ తెరవటానికి రెండు తాళము చెవులు అవసరమైనట్లు ఒక తాళము చెవితో లాకర్ తెరుచుకోనట్లు ఒక గ్రంథము చదివితే దేవుని జ్ఞానము లభించదు. రెండు తాళములు ఉన్నప్పుడే లాకర్ తెరచుకొన్నట్లు ఎప్పుడయినా ఇతర మత గ్రంథములని అసూయ చెందక చదివినప్పుడు గ్రంథములోని వాక్యమందు గల జ్ఞానము లభించును. నేడు ఎక్కడ చూచినా ఒక మతము రెండవ మతము మీద ద్వేషము కల్గియున్నది. అందువలన ఎవరికీ దైవ గ్రంథములలోని జ్ఞానము అర్థము కావడము లేదు. దేవుడు అన్ని మతములకు ఒక్కడే అయినప్పుడు అన్ని మతములలోని జ్ఞానము ఒక్కటే యుండును గానీ, వేరుగా యుండుటకు అవకాశముండదు. ఆ విషయము తెలియక ప్రతి ఒక్కరూ మత ద్వేషమును కల్గి ఇతర దైవ గ్రంథములోని జ్ఞానము తెలియని దానివలన ఒక మతములోని జ్ఞానము ఆ మతములోనే అర్థము కాకుండా పోయినది. ముఖ్యముగా అదే కారణము చేత వాక్యములో నమాజును నెలకొల్పమని చెప్పినా, అది ఏ నమాజో ముస్లీమ్‍లకే అర్థము కాకుండా పోయినది.

ఖుర్ఆన్ గ్రంథములో ఈ మాట ఉన్నది. కావున ముస్లీమ్‍లకే ఈ విషయము బాగా అర్థము కావలసియున్నది. అయితే వారు చేయుచున్న నమాజ్‍కు, క్రొత్తగా స్థాపించబడవలసిన నమాజ్‍కు ఏమి తేడా యున్నదని వారు కొంచెమయినా ఆలోచించలేదు. (4-103) వ ఆయత్‍లో ఖుర్ఆన్ గ్రంథములో చేయుచున్న నమాజును గురించి చెప్పడమేకాక, క్రొత్తగా నెలకొల్పు నమాజ్‍ను గురించి కూడా చెప్పారు. ఇది అల్లాహ్ నుండి వచ్చిన జ్ఞానముకాగా, దానినే జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పాడు. ఈ జ్ఞానమును సృష్ఠి మొదలయిన తర్వాత కొంత కాలానికే వాణి (శబ్దము) ద్వారా వచ్చినది. ఆ శబ్దము ఆకాశము నుండి వచ్చినది. ఆ రోజు అది మాటల రూపములో రాలేదు. ఆకాశము నుండి ఎలా శబ్దము వచ్చునో అలాగే ఉరుముల రూపములో వచ్చినది. అలా ఉరుముల రూపములో వచ్చిన శబ్దమును విని, గ్రహించుకొన్న సూర్యుడు కొంతకాలానికి భూమి మీద 'మనువు' అను వ్యక్తికి తాను వినిన శబ్దములను మనుషుల మాటల రూపములోనికి మార్చి చెప్పాడు. సూర్యుడు ఏ శబ్దములోని భావమును గానీ, ఏ భాషలోని భావమునుగానీ గ్రహించుశక్తి గలవాడు, అలాగే ఏ భాషలోనయినా మాట్లాడు స్థోమత గలవాడు. అన్ని భాషలను గ్రహించుశక్తి ఆయనకు గలదు. అందువలన కృతయుగములోనే మొదటి భాష అయిన తెలుగు భాషలో మాట్లాడి, మనువుకు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును చెప్పడము జరిగినది. అలాగే కలియుగములో 1400 సంవత్సరముల క్రితము 'జిబ్రయేల్' అను పేరుతో క్రిందికి దిగివచ్చి, ముహమ్మద్ ప్రవక్తగారికి కృతయుగములో మనువుకు చెప్పిన జ్ఞానమునే చెప్పడము జరిగినది. మనువుకు చెప్పిన జ్ఞానమే చివరికి మారుచూ మారుచూ వచ్చి కలియుగము మొదటిలో ద్వాపరయుగము చివరిలో అనగా యుగ సంధిలో వ్యాసుని చేత 'భగవద్గీత' గ్రంథముగా వ్రాయబడినది. అలాగే అదే జ్ఞానమే 1400 సంవత్సరములప్పుడు 'ఖుర్ఆన్' గ్రంథముగా వ్రాయబడినది. దీనినిబట్టి చరిత్ర తెలిసిన వారికి రెండు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటేయని తెలియబడుచున్నది.

అందువలన ఖుర్ఆన్ గ్రంథములో (4-103) ఆయత్ ఒక్క ముస్లీమ్‍లకే గాక హిందువులకు, క్రైస్థవులకు వర్తించునదిగా యున్నది. దీనినిబట్టి చూస్తే హిందువులు ఏ ఆరాధన చేయుచున్నారో దానికంటే వేరే ఆరాధనను నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే క్రైస్థవులు ఏ ఆరాధన (ప్రార్థన) చేయుచున్నారో దానికంటే వేరుగా యున్న ప్రార్థనను నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే ముస్లీమ్‍లు వారు చేయుచున్న నమాజ్‍ను వారు చేయుచూ, దానిని కాదని ప్రత్యేకముగా మరొక నమాజును నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అంతవరకు చేయని క్రొత్త నమాజును నెలకొల్పుకోమని చెప్పడమైనది. అలాగే నెలకొల్పుకోవలసిన అవసర మున్నది. అయితే దేవుడు ఈ విషయమును వాక్యరూపములో చెప్పినా 'నాకు తెలిసినది ఇంతే, నాకు తెలియనిదాని జోలికి నేను పోను' అని దేవుడు చెప్పిన వాక్యమును కూడా లెక్కచేయనివారు, చూడనివారు గలరు. అటువంటి వారికి నాలాంటి వాడు ఎవడయినా వాక్యము ఇలా ఉన్నదని చూపినా, ఖుర్ఆన్ గ్రంథము జ్ఞానమును కూడా పెడచెవిన పెట్టి, మా పెద్దలు చెప్పినట్లు నడుచుకొనుచుందుమని చెప్పుచుందురు. పెద్దలు చెప్పినది వినడము మంచిదే అయినప్పుడు దేవుడు చెప్పినది వినడము మరీ మంచిదగును కదా! దేవునికంటే పెద్దలు కూడా చిన్నవారేయగుదురు. దేవుని మాటతో సమానముగా పెద్దల మాటలను పోల్చుకోకూడదు. దైవగ్రంథము లోని వాక్యమును వదలి, పెద్దలు పెట్టిన మత సాంప్రదాయములను అనుసరించి అట్లే నడచుకొంటే దేవునిమాటను గౌరవించని వారమగుదుము.

ప్రశ్న :- మీరు చెప్పినది మంచిదే. అయితే కొందరు విద్వాంసులయిన ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథములోని ప్రతి వాక్యమును తెలిసిన పండితులుగా యుంటున్నవారు ఈ విషయమును గురించి ఇలా అంటున్నారు. (4-103) వ వాక్యములో చెప్పినది అర్థము కావాలంటే (4-102) వ వాక్యమును చూడాలి. అక్కడ యుద్ధ సమయములో 'కొందరు నమాజ్ చేయండి, కొందరు నమాజ్ చేయకుండా శత్రువుల ఎడల అప్రమత్తముగా యుండండి అనీ, మొదట కొందరు నమాజ్ చేసినప్పుడు కాపలా యున్న మిగతావారు తర్వాత నమాజ్ చేయండి' అనీ చెప్పియున్నట్లు కలదు. అలా మొదట కొందరు, రెండవ మారు కొందరు నమాజు చేయడము జరుగుచున్నది. నమాజు చేసేవాడిని ఉద్దేశించి నమాజును నెలకొల్పండి అని అన్నారు. అంతేగానీ రెండవవారు చేయునది క్రొత్త నమాజ్ కాదు. మొదట చేయునది, తర్వాత చేయునది రెండూ ఒకే నమాజుగా యున్నది. అది తెలియక కొందరు రెండవమారు రెండవ గుంపు చేయునది క్రొత్త నమాజ్‍కాదు. రెండూ ఒకే నమాజ్‍యని తెలియవలెను.

(4-102) (ఓ ప్రవక్తా!) ''నీవు వారి మధ్యన ఉన్న సమయములో (యుద్ధము జరుగుతూ యుంటే) వారు నమాజ్ చేయటానికి సిద్ధమైనప్పుడు వారిలో ఒక వర్గము నీతోపాటు సాయుధులై నిలబడాలి. మరి వారు నమాజ్ చేయగానే మీ వెనక్కి వెళ్లిపోవాలి. అప్పటి వరకు నమాజ్ చేయని రెండవ గుంపు వచ్చి నీతోపాటు నమాజ్ చేయాలి. నమాజ్ చేసి ప్రక్కన యున్నవారు ఆయుధములు ధరించి అప్రమత్తముగా ఉండాలి'' అని ఉంది.

ఈ ఆయత్ యుద్ధసమయములో కూడా నమాజ్ చేయాలని, అప్పుడు అందరూ ఒకేమారు నమాజు చేయక రెండు గుంపులుగా చీలిపోయి ఒక గుంపు నమాజ్ చేయునప్పుడు మరొక గుంపు ఆయుధములు ధరించి నమాజ్ చేయువారికి కాపలా ఉండవలెననీ, అట్లే మొదటి గుంపు నమాజ్ అయిపోయినప్పుడు రెండవ గుంపు నమాజ్ చేయగా మొదటి గుంపు కాపలా ఉండవలెనని వాక్యములో చెప్పియున్నారు. మొదటి గుంపు నమాజ్ చేయగా తర్వాత రెండవ గుంపు చేయు నమాజ్‍ను 'నమాజ్‍ను నెలకొల్పమని' చెప్పారు. అందువలన ఉన్నది ఒకే నమాజ్, గుంపులు రెండు ఉండుట వలన ఒక గుంపు నమాజ్‍ను ఆచరించగానే రెండవ గుంపును నమాజ్ చేయమని చెప్పడములో అలా చెప్పారు తప్ప రెండవ నమాజ్ లేదు. నమాజు ఒకటే ఉండును దానినే అందరూ ఆచరిస్తున్నారు. రెండవ క్రొత్త నమాజు లేదని చెప్పుచున్నారు. పొరపడి రెండవ గుంపును చేయమని చెప్పినదే రెండవ నమాజ్‍గా అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారో చెప్పండి?

జవాబు :- దేవుడు (అల్లాహ్) అనుగ్రహించినట్లు దైవగ్రంథములోని జ్ఞానము అర్థమగుచుండును. అలాగే ఇస్లామ్ పండితులకు అర్థమయి ఉండవచ్చును. పండితులు చెప్పినట్లు రెండవ గుంపు నమాజ్ చేయడమును వాక్యములో గల రెండవ నమాజ్‍గా అర్థము చేసుకొని యుండవచ్చును. అయితే అల్లాహ్ మనిషికి ఇచ్చిన బుద్ధితో ఆలోచిస్తే నాకు ఈ విధముగా అర్థమగుచున్నది. నేడు ముస్లీమ్ సమాజములో ఉన్నది ఒకే ఒక నమాజ్. ఒకే విధమైన నమాజునే ముస్లీమ్‍లందరూ చేయుచున్నారు. ఎన్ని గుంపుల మనుషులు గుంపుల వారిగా, ఎన్నిమార్లు చేసినా ఒకే నమాజ్‍యేగానీ అది రెండవ నమాజ్‍గా యుండదు. నమాజు ఏడు ఆయత్‍ల పఠనముతో కూడుకొని యుండును. ఏడు ఆయత్‍ల పఠనము లేనిది నమాజ్ పూర్తికాదు. నమాజు ముందు చేసినా వెనుక చేసినా, వేరువేరు సమయములలో చేసినా నమాజ్ అనునది ఒక్కటే. నమాజు క్రమశిక్షణతో కూడుకొనియున్నది. సామూహికముగానయినా చేయవచ్చును. ఎవరూ లేనిచోట ఒంటరిగా అయినా చేయవచ్చును. ఎలా చేసినా, ఎప్పుడు చేసినా నమాజ్ ఒక్కటేగానీ రెండవది లేనేలేదు. అయితే (4-103) లో నెరవేర్చే నమాజు వేరు, నెలకొల్పబడే నమాజు వేరుగా చెప్పియున్నారు. ఆచరించబడే నమాజును నేడు అందరూ ఆచరించుచున్నారు. యుద్ధ సమయములో ఒక గుంపు ముందు చేసిన నమాజునే రెండవ గుంపు కూడా చేయుచున్నది. అంతేగానీ ముందు గుంపు ఒక నమాజు చేస్తే రెండవ గుంపు రెండవ రకము నమాజును చేయలేదు. వాక్యములో చెప్పిన సారాంశములో అందరూ ఆచరించు నమాజ్‍ను చెప్పడమేకాక క్రొత్తగా స్థాపించబడే నమాజును గురించి చెప్పారు. రెండవ క్రొత్త నమాజును బయటపెట్టడము వలన దానిని ఒప్పుకొంటే కొందరి వలన పేచీలు వస్తాయేమోనని తెలిసి, ముందే సమయము అనుకూలించినప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పారు. రెండవ నమాజు క్రొత్త నమాజు ఉందంటేనే అదేమిటని ఆలోచించకుండా దానిని గురించి వ్యతిరేఖముగా మాట్లాడు వారుందురు. అందువలన ముందే అనుకూలమైనప్పుడు అని చెప్పారు.

(4-102) వ వాక్యములో ఉన్న సమాచారములో క్రొత్త నమాజు లేనేలేదు, పాత నమాజును గురించే చెప్పారుగానీ అందరూ ఆచరించు నమాజ్‍కంటే వేరే నమాజును గురించి చెప్పలేదు. (4-103) లో మాత్రమే క్రొత్తగా స్థాపించవలసిన నమాజును గురించి చెప్పారు. అయినా ఆ క్రొత్త నమాజును ఇంతవరకు ఎవరూ స్థాపించలేదు. క్రొత్తగా స్థాపించవలసిన నమాజును గురించి ప్రత్యేకముగా అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ ప్రత్యేకముగా క్రొత్త నమాజు ఇలా ఉంటుందని చెప్పియుంటే ప్రజలు దానిని స్థాపించేవారు, తర్వాత అందరూ ఆచరించేవారు. దేవుడు ప్రత్యేకమైన క్రొత్త నమాజును స్థాపించుకొమ్మన్నాడు గానీ, ఇదే క్రొత్త నమాజు అని ఏమాత్రము చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదనగా! ముందు చెప్పిన రెండు దైవగ్రంథములలోనూ క్రొత్త నమాజును గురించి యున్నది. అట్లే చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో కూడా దానిని గురించి గలదు.

మూడు దైవగ్రంథములలో వెదికితే రెండవ రకమయిన క్రొత్త నమాజు కనిపించగలదు. అలా దైవగ్రంథములో వెదకకల్గి రెండవ నమాజును (ప్రార్థనను) తెలియగలిగినా, అది తెలిసిన వానికి ఒక్కనికే ఉపయోగపడును. ఏ మతస్థుడయినా మొదటినుండి అలవాటయిన, మొదటి నుండి తెలిసిన నమాజునే ఆచరించుచున్నాడు. అది ఒక్కటే నమాజు అని అనుకొనుచున్నారు. గ్రంథములలో నిక్షిప్తమైయున్న నమాజు ఏమిటో ఎవరికీ తెలియదు. ఒకవేళ దానిని ఎవరయినా విశధీకరించి ఇదే క్రొత్త నమాజు అని చెప్పినా, దాని విషయమును సంపూర్ణముగా తెలిసినా, దానిని అందరూ చేయలేరు. రెండవ నమాజును గురించి తెలిసినా, దానిని ఆచరించుటకు చాలామంది పూనుకొనినా, ఒకరు లేక ఇద్దరు ఆ నమాజ్‍ను చేయగలరేమో గానీ, అందరూ ఆచరించలేరు. దేవుని ఆరాధనను దేనినయినా నమాజ్‍గానే చెప్పవచ్చును అని ''తౌహీదె ఉలూహియత్'' అని ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు. అల్లాహ్ యొక్క రెండవ క్రొత్త ఆరాధన (నమాజు) ''తౌహీదె ఉలూహియత్'' కోవకు కూడా చెందినది కాదు. అదొక ప్రత్యేకమైన ఆరాధన. దానిని ప్రయత్నించి చేయలేక వదలివేసినవారు కూడా కలరు. పట్టుదల గల జ్ఞానసంపన్నులైన వారు దానిని సాధించి ఆచరించినవారు కూడా కలరు. తౌరాతు (భగవద్గీత), ఇంజీలు (బైబిలు) గ్రంథముల జ్ఞానమును చెప్పిన కృష్ణుడు, ఏసు ఇద్దరూ రెండవ నమాజ్‍నే ఆచరించారు. మా వలె మీరు కూడా ఆచరించమని కృష్ణుడు తన గ్రంథములో చెప్పియున్నాడు. మొదట వహీ ద్వారా వచ్చిన జ్ఞానములో రెండవ నమాజును గురించి యున్నది. అందువలన చివరిలో ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పిన జిబ్రయేల్ తన జ్ఞానములో రెండవ ఆరాధనను గురించి చాలాచోట్ల చెప్పాడు. అయినా ఖుర్ఆన్ గ్రంథములో రెండవ నమాజు వివరము గలదని ముస్లీమ్‍లకు తెలియకుండా పోయినది. అందువలన (4-103) లో ప్రత్యేకముగా నమాజును నెలకొల్పండియని చెప్పాడు. అయినా ఆ ఆయత్‍ను ముస్లీమ్‍లు చూచి ఆరాధన అంటే ఒకటేయనీ, ప్రార్థన (నమాజు) తాము చేయునదేయని అనుకొంటున్నారు.

ప్రశ్న :- మీరు చెప్పునది కొంత సత్యమే అనిపించినా ఒక ప్రక్క సత్యము కాదనిపించుచున్నది. మీరు సత్యమును చెప్పాలని తాపత్రయ పడుచు చెప్పుచున్న విధానమునుబట్టి మీరు చెప్పునది సత్యమే అనిపించినా ఇంకా మాకు ఆటంకముగా కనిపించు కొన్ని వాక్యములను బట్టి దీనికేమంటారు అని అడుగవలసి వచ్చినది. ఇంకొక చోట కూడా నమాజు స్థాపించండి అను పదముతోనే చెప్పారు. ఆ వాక్యమునుబట్టి మేము ఏమనుకోవాలో మీరే చెప్పండి.

(17-78) ''నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకొనే వరకు'' అని చెప్పబడియున్నది. దీనినిబట్టి నమాజును చేస్తూనే ఉండు అని ఉంది కదా! ఈ వాక్యములో చెప్పినది ఒకే నమాజు కదా! రెండవ నమాజు పేరు లేదు కదా! (4-103) లో చెప్పినట్లే నమాజును నెలకొల్పమని మొదటనే చెప్పారు. దీనిని చూచిన తర్వాత మీకు ఏమనిపిస్తావుంది? ఇక్కడ ఏ నమాజును గురించి చెప్పియున్నారు? అను ప్రశ్నలు వస్తున్నవి. దీనికి మీరేమంటారు?

జవాబు :- మిమ్ములను తప్పుదారి పట్టించాలనునది నా ఉద్దేశ్యము కాదు. సత్యము చెప్పాలనునదే నా ఉద్దేశ్యము. దాని ప్రకారము చెప్పుచున్నాను. పైగా ఒక ఆయత్‍కు తప్పు వివరము ఇస్తే ఘోరమైన పాపము వస్తుందని సూరా 41, ఆయత్ 40లో కలదు.

(41-40) ''మా వాక్యాల విషయములో వక్రవైఖరిని అవలంభించి అసత్యాలను కూర్చి చెప్పు వారిని మేము చూస్తూనే యున్నాము. అగ్నిలో పడవేయబడువాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితముగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు ఇష్టమొచ్చింది చేసుకొంటూ పోండి. ఆయన (అల్లాహ్) మీరు చేసే పనులన్నీ చూస్తూనే యున్నాడు.''

ఆయత్‍లో దేవుని వాక్యమునకు తప్పు భావమును వ్రాస్తే మరణానంతరము అగ్నిలో పడవేయబడుదురు అని చెప్పిన తర్వాత కూడా ఎవరూ ఆయత్‍ల జోలికి పోరు. సత్యము తెలిసియుంటే బయటికి చెప్పగలరు గానీ, వాక్యమును గురించి తెలియకపోతే ఊరకనే ఉండును. నాకు సత్యము తెలిసింది, కావున ధైర్యముగా బయటికి చెప్పుచున్నాను. బుద్ధి పెట్టి యోచించువారికి నా మాటలలోని సత్యము తెలియగలదు. ఇప్పుడు మీరు (17-78)వ ఆయత్‍లోని వాక్యమును చెప్పారు. ఇక్కడ నమాజును నెలకొల్పమని చెప్పారు. కావున క్రొత్త నమాజును గురించి చెప్పారని తెలియుచున్నది. తలమీది సూర్యుడు తిరిగినప్పటినుండి రాత్రి చీకటి పడే వరకు క్రొత్త నమాజ్‍ను వదలకుండా చేయవచ్చును. అదే పాత నమాజు అయితే నిర్ణయమైన కాలములలో క్రమశిక్షణగా సామూహికముగా నమాజు చేయవలసి యుండును. క్రొత్త నమాజుకు నియమాలు లేవు. మధ్యాహ్నము నుండి రాత్రివరకు ఏకధాటిగా చేయు నమాజ్ క్రొత్తదికాగా, పాత నమాజ్ ఏకధాటిగా చేయునది కాదు. దీనినిబట్టి (17-78) ఆయత్‍లో క్రొత్త నమాజును గురించి చెప్పియున్నారు గానీ పాత నమాజ్‍ను చెప్పలేదని తెలియుచున్నది. పాత నమాజ్ నియమములతో కూడినదనీ, ఏకధాటిగా చేయునది కాదని ముస్లీమ్‍లందరికీ తెలుసు. పాత నమాజును గురించి అందరికీ తెలుసు, క్రొత్త నమాజును గురించి ఎవరికీ తెలియదు. మేము చెప్పుతూయుంటే, ఇప్పుడే తొలిసారిగా క్రొత్త నమాజు అను పేరును వినుచుందురు. ఇప్పుడయినా గ్రంథములో చెప్పిన క్రొత్త నమాజును గురించి తెలియవచ్చును కదా! మూడు దైవ గ్రంథములలో మనకు తెలియని క్రొత్త నమాజ్‍ను గురించి ముఖ్యముగా చెప్పియున్నారు. మనిషికి బోధించిన జ్ఞానములో ప్రధానముగా క్రొత్త నమాజును గురించే గలదు. అటువంటప్పుడు క్రొత్త నమాజ్‍ను గురించి అందరూ తెలిసి గ్రంథములో చెప్పినట్లు ఏకధాటిగా నమాజ్‍ను చేయవచ్చును కదా!

మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజును గురించి యుండడము వాస్తవమేయని దానిని గురించి తెలిసిన మేము చెప్పుచున్నాము. ఇంకా వివరముగా చెప్పితే ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతలో క్రొత్త నమాజును గురించి ఎక్కువ శాతము చెప్పబడినది. ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలులో భగవద్గీతలో చెప్పిన దానికంటే కొంత తక్కువ చెప్పియున్నారు. అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్ గ్రంథములో ద్వితీయ దైవ గ్రంథములో కంటే తక్కువ చెప్పియున్నారు. తౌరాతు గ్రంథములో దాదాపు 60 శాతము కొత్త నమాజ్‍ను గురించి చెప్పగా, ఇంజీలు గ్రంథములో 30 శాతము చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో 15 శాతము చెప్పారు. మూడు దైవ గ్రంథములలో ఇంత శాతము చెప్పారని కొలత వేసి మేము చెప్పుచున్నా మంటే, అదేదో గ్రంథములో యున్నా చదివిన వారికి అర్థము కాలేదనేగా తెలియుచున్నది. మాకు తెలిసినది మీకు కూడా తెలియగలదు. అయితే మీకు తెలిసిన వరకే గోడకట్టుకొని ఇంతే ఉన్నది అనుకోకూడదు. దైవ గ్రంథములలో మనకు తెలియనిది ఎంతో గలదు. అందువలన బుద్ధిని ఉపయోగించి ప్రతి వాక్యమును చూడవలెనని తెలుపుచున్నాము.

ప్రశ్న :- మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజ్‍ను గురించి చెప్పి యున్నారని మీరు తెలుపుచుండగా మేము వింటున్నాము. మాకు ఎందుకు తెలియలేదో, మీకు ఎందుకు తెలిసిందో? మీకు తెలిసింది కదా! ఇప్పుడయినా అందరికీ ఆ నమాజును గురించి మీరు తెలియ చెప్పవచ్చును కదా! ఇంతవరకు మీరు ఆ క్రొత్త నమాజు ఇలా చేయవలెనని చెప్పలేదు. ఇప్పుడయినా ఆ క్రొత్త నమాజును ఎలా నెలకొల్పాలో? ఎలా ఆచరించాలో చెప్పవలెనని అడుగుచున్నాము. దయచేసి మీకు తెలిసినదంతా మాకు తెలుపవలెను.

జవాబు :- నాకు తెలిసినది నేను చెప్పగలను. అయితే గ్రంథములో ఎన్నోచోట్ల గల దానిని ఎవరంతకు వారు తెలుసుకొని ఆచరించినప్పుడు దానికి విలువ యుండును. నమాజ్ అను పేరుకు సార్థకము చేకూరును. క్రొత్త ప్రార్థన లేక నమాజు వలన మనిషి పరలోకమును చేరు భాగ్యము కల్గును. ''నాకు జన్మ వద్దు'' అను అర్థమును నమాజ్ అనే మూడు అక్షరములు తెల్పుచున్నవి. ఒకప్పుడు కృతయుగములోనే నమాజ్ అనునది స్వచ్ఛమయిన తెలుగు పదముగా ఉండేదని ముందే చెప్పుకొన్నాము. దాని అర్థము తెలుగులో న అంటే వద్దు. మ అంటే నాకు, జ్ అంటే జన్మలు. 'నాకు జన్మలు వద్దు' అను మాటను కుదించిన అక్షరములలో నమాజ్ యని అన్నారు. క్రొత్త నమాజ్ (ఆరాధన) అయితే దాని అర్థమునకు సరిపోవునదిగా యున్నది. అహర్నిశలు చేయునది ఒకే ఒక ఆరాధన కలదు. అదే క్రొత్త నమాజ్. నీకు క్రొత్త నమాజ్‍యని చెప్పుచున్నా నాకు మాత్రము అలవాటుపడిన పనిగా యున్నది. అందరికీ తెలిసిన పాత నమాజ్ దేవుని మీద విశ్వాసమున్న వారు అనగా ముస్లీమ్‍లు అదొక పనిగా చేయుచున్నారు. అయితే అందరి దృష్ఠిలో క్రొత్త నమాజ్‍గా గ్రంథములో చెప్పబడినది ప్రత్యేకించి చేయు కార్యము కూడా కాదు. అందరికీ అర్థమయ్యే దానికి నేను క్రొత్త నమాజ్‍ను చేస్తున్నాను అని చెప్పినా అది నేను చేయునది కాదు. అది అందరిలో జరుగుచున్నది. నాలో కూడా జరుగుచున్నది. జరుగుచున్న దానిమీద ధ్యాసను పెట్టుకొన్నాను. కావున అది నేను చేసినట్లగుచున్నది. అంతేగానీ క్రొత్త నమాజ్‍ను ప్రత్యేకించి పాత నమాజ్వలె చేయునది కాదు. ఎవరికి తెలిసినది వారు చేయుట అని చెప్పవచ్చును గానీ ప్రత్యేకముగా చేయునది కాదు కనుక సామూహికముగా చేయలేము. నియమిత కాలములో అనునదే ఉండదు. బయటికి కనిపించునది కాదు. పాత నమాజ్ బయటికి తెలియును. పాత నమాజ్‍ను చేయువారిని చూడ వచ్చును. క్రొత్త నమాజ్‍ను చేయువారు ప్రక్కలోయున్నా వారిని గురించి మనకు తెలియదు.

చాలామంది ముస్లీమ్ పెద్దలు అందరూ చేయు నమాజ్‍ను కుదించిన నమాజ్‍యని అనుచుందురు. భయముతో నియమముతో చేయు నమాజ్‍ను కట్టివేయబడిన నమాజ్, కుదించబడిన నమాజ్‍యని అనుచుందురు. క్రొత్తగా నెలకొల్పమని చెప్పిన నమాజ్ కుదించబడిన నమాజ్ కాదు. ఇంతే సమయములో ఇట్లే చేయవలెనను నియమము లేదు. అందువలన అందరూ ప్రతి దినము చేయు నమాజ్‍కంటే ప్రత్యేకమయినది. నిత్యము అందరూ ఒకచోట గుమికూడి చేయు నమాజ్ ఏడు ఆయత్‍ల పఠనముతో కూడుకొనియుండును. మిగతా మతములలో కూడా ఏవో మాటలతోనో, మంత్రములతోనో వారి ఆరాధనలు కూడుకొని యుండును. క్రైస్థవుల ఆరాధన మాటలతో, హిందువుల ఆరాధన మంత్రములతో కూడుకొన్నట్లు ముస్లీమ్‍ల ఆరాధన (నమాజ్) ఏడు వాక్యముల పఠనముతో కూడుకొని యుండును. ఆ ఏడు ఆయత్‍లలో ముందు నాలుగు అల్లాహ్‍ను పొగడునవి, తర్వాత మూడు అర్థించునవిగా యున్నవి. దేవుని ఆరాధనలో ఈ రెండు విధానములు అన్ని మతములయందు గలవు. పొగడడము, అడుగుకోవడము దేవుని వద్దే కాకుండా ప్రపంచ వ్యవహారములలో కూడా యున్నది. ప్రపంచ వ్యవహారములలో కూడా ఒకనిని ముందు పొగిడి తర్వాత అడిగితే వాడు ఏమయినా ఇవ్వగలడు. పొగడకుండా అడిగితే ఎవడూ ఏమీ ఇవ్వడు. అదే సూత్రమునే అందరూ దేవుని విషయములో కూడా ఉపయోగించారు. ముందు ప్రసన్నత కొరకు పొగడడము తర్వాత లబ్ధి కొరకు అర్థించడము జరుగుచున్నది. ప్రపంచములో ఉపయోగించు విధానమును దేవుని విషయములో ఉపయోగించడము దేవునికి ఇష్టము లేదు. దానివలన మనుషులను, దేవున్ని సమానము చేసినట్లగును.

అయితే మనుషులకు తెలిసిన విధానము ఒక్కటే అయినప్పుడు అదే విధానము ప్రకారము దేవుని ఆరాధన విషయములో ముందు పొగడడము తర్వాత అడగడము అను రెండు పద్ధతులు గల దానినే ఆచరించుచున్నారు. ఈ విధానము ఒక మతమునకే కాకుండా మనుషులున్న ప్రతీ మతములో గలదు. ఒక మనిషి నుండి లాభమును పొందవలసినప్పుడు వానిని పొగిడితే వాడు ప్రసన్నుడవును. తర్వాత వానిని అర్థించితే అప్పుడు వాడు ఇచ్చుట జరుగుచున్నది. ప్రపంచ విషయములో ముఖ్యమయిన దానినిగానీ, ముఖ్యముకాని దానినిగానీ అర్థించడము జరుగుచున్నది. దేవుని వద్ద కూడా మనిషి అలాగే అర్థించు చున్నాడు. అయితే దేవుని వద్ద అర్థించవలసినది ముఖ్యమైనదయిన పరలోకము. దానిని మోక్షము అని అంటున్నాము. ముఖ్యమైన ముక్తిని గురించి అడగడమును ప్రార్థన అని అనవచ్చును. 'ప్ర' అనగా ముఖ్యమైన అనీ, అర్థన అనగా అడుగుకోవడము అని చెప్పవచ్చును. ప్ర+అర్థన=ప్రార్థన అని అంటున్నాము. అయితే నేడు చాలామంది ముఖ్యముకాని దానిని దేవుని వద్ద అడుగుచూ, దానిని కూడా ప్రార్థనయని అంటున్నారు. ముఖ్యము కాని దానిని అడగడము దేవునికి కూడా సరిపోదు. అంతేకాక అందరినీ పొగడినట్లు తనను పొగడడము, అందరినీ అడిగినట్లు తనను అడగడము దేవునికి ఏమాత్రము సరిపోలేదు. అలా చేయడము వలన మనుషులను, దేవున్ని కలిపివేసినట్లగుచున్నది.

మనుషులలో హిందువులు ద్యానము అనీ, క్రైస్థవులు ప్రార్థనయనీ, ముస్లీమ్‍లు నమాజ్ అను పేర్లతో చేయు ఆరాధనలు ఏవీ దేవునికి (అల్లాహ్) కు సరిపోవు. అందువలన మూడు మతములలో యున్న మనుషులకు తనను ఎలా ఆరాధించవలెనో తెలుపుచూ నేడు దేవుని విధానములో చేయు ఆరాధనలన్నీ ఏవీ తనకు సరిపోవనీ, తనకు ఇష్టము లేదని తెలిపి తనకిష్టమైన విధానమును ప్రజలకు తన గ్రంథముల ద్వారా తెలియజేశాడు. మనిషి తనతో కలియవలెనని అనుకోవడమే తనకు ఇష్టమనీ, మిగతా ఏవీ తనకు ఇష్టము లేదని తెలియజేశాడు. అదే విషయమునే తన గ్రంథములలో కలయిక లేక ఐక్యము అను అర్థముతో తన ప్రార్థనను గురించి చెప్పాడు. దేవుడు తన మూడు గ్రంథములలో చెప్పిన దానిని నేడు క్రొత్త నమాజ్ అని అంటున్నాము. పాత నమాజ్ మనుషులు సృష్ఠించుకొన్నది. క్రొత్త నమాజ్ దేవుడు సృష్ఠించినది. అందువలన దైవ గ్రంథములలో క్రొత్త నమాజ్‍ను నెలకొల్పమని చెప్పాడుగానీ, పాత నమాజ్‍ను గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. పాత నమాజ్ ముస్లీమ్‍లలో, ద్యానము హిందువులలో ప్రార్థన అను పేర్లతో క్రైస్థవుల యందు ఉండుట సహజమే. అయితే మూడు మతముల ప్రజలలో అందరూ ద్యానము, ప్రార్థన, నమాజ్‍లను ఆచరించడము లేదు. దేవుని భయము యున్నవారు కొందరు, అట్లే దేవుని మీద భక్తియున్నవారు కొందరూ అనగా దేవుని మీద భక్తితోనో, భయముతోనో ప్రార్థన చేయుచున్నారు. మరికొందరు లాభము కొరకు చేయుచున్నారు. ఎలా చేసినా నూటికి నూరుమంది దేవుని ఆరాధనలు చేయడము లేదు. కొందరు మాత్రమే ఆరాధన చేయుచున్నారు. కొందరు దేవుడున్నాడని నమ్మకమున్నా ఆరాధనలు చేయకున్నారు. కొందరు దేవుడు ఉన్నాడను నమ్మకము కూడా లేకుండా నాస్తికులుగా యున్నారు. వారు ఆరాధనలు చేయరు, ఆరాధనలలో పాల్గొనరు.

భారతదేశములోనే మొట్టమొదట దేవుడు మరియు దయ్యమును గురించి తెలిసినది. అప్పుడు హిందూ సమాజము కలదు. అప్పుడు కొందరు జ్ఞానులు తమకున్న జ్ఞానము చేత దయ్యమును వదలి దేవున్ని ఆరాధించవలెనని తెలుసుకొన్నారు. ఆ క్రమములో దేవుడు ఎవరో తెలియక దయ్యములను అనేక దేవతలుగా ఆరాధించను మొదలుపెట్టారు. ఆ సమయములో దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలియబరచుటకు ఆకాశ వాణి ద్వారా జ్ఞానమును పంపడము, చివరికది సూర్యుని ద్వారా భూమికి చేరడము జరిగినది. అయినా భూమిమీద దేవుని జ్ఞానము మనుషులందరికీ తెలియుటకు చాలా కాలము పట్టినది. కొందరికి దేవుని జ్ఞానము తెలిసినా ముందునుండి అలవాటు పడిన పనులనే చేయుచూ దైవజ్ఞానము తెలియుట వరకే అన్నట్లుండిరి. కొందరు మాత్రము దేవుని జ్ఞానము తెలిసి, జ్ఞానము ప్రకారము నడుచుకొనేవారు. మొదట దైవజ్ఞానము కొంతవరకు భారతదేశమంతా ప్రాకినా తర్వాత మాయ ప్రభావము వలన జ్ఞానము, అజ్ఞానముల మధ్యలో కొందరు అటు, కొందరు ఇటు మారుచూ చివరికి అజ్ఞానమే ఎక్కువగా పెరిగిపోయినది.

అటువంటి పరిస్థితులలో మనిషి దేవుని వద్దనుండి కొందరు, దేవతల వద్దనుండి చాలామంది కోర్కెలను కోరను మొదలుపెట్టారు. ఇతరులను ఏదయినా అడుగునప్పుడు అడిగేవారు అడుగవలసిన వాని మెప్పును పొందితే, అడిగినది తప్పక ఇచ్చునను ఉద్దేశ్యముతో కోర్కెలతో కూడుకొన్న వారు తాము ఆరాధించు దేవున్నిగానీ, దేవతలనుగానీ ముందు బాగా పొగిడేవారు. తర్వాత తమ కోర్కెలను వెలిబుచ్చి అడిగేవారు. దానినే మొదట ఆరాధనయని అన్నారు. ఆ రోజులలో ధనమే అన్నిటికీ మూలము అని ధనము ఉంటే అన్ని పనులు జరుగునని తలచి దేవతా పూజలలోగానీ, దేవుని పూజలోగానీ చివరకు ధనమునే కోరుచుండిరి. ధనమును కోరుటకు చేయవలసిన ఆరాధనలను మనిషి ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఈనాడు చేయు పూజలను ఆరాధన యనుటలో అర్థము గలదు. ఆరాధన పదమును విభజించి చూస్తే చివరిలో 'ధన'యని కలదు. దేవతల వద్ద తమకు కావలసిన ధనము కొరకు ఆరా తీయడమును ఆరాధనయని చెప్పడము జరుగుచున్నది. మొదట ఆ విధముగా దేవతలవద్ద ఆరాధనలు తయారు కాగా, చివరకు దేవునివద్ద కూడా అదే ఆరాధనను చేయుటకు మొదలు పెట్టారు. వాస్తవముగా దేవునివద్ద చేయు ఆరాధన వేరు, దేవతల వద్ద చేయు ఆరాధన వేరు.

దేవతల వద్ద చేయు ఆరాధన ప్రపంచ ధనమును ఆశించి చేయునది యని చెప్పవచ్చును. అదే దేవుని వద్ద చేయు ఆరాధన జ్ఞాన ధనమును ఆశించి చేయునదియని చెప్పవచ్చును. రెండూ ఆరాధనలే అయినా ఒకటి దేవుని వద్ద, రెండవది దేవతల వద్ద చేయునదిగా యున్నది. దీనినిబట్టి ఆరాధనలు రెండు తెగలని చెప్పవచ్చును. దేవునివద్ద చేయు ఆరాధన జన్మలు లేని మోక్ష స్థితికి అనగా పరలోకమునకు తీసుకొని పోవును. దేవతల వద్ద చేయు ఆరాధన జన్మలకు తీసుకొని పోవునదిగా యున్నది. మనుషులు ఎక్కువగా జన్మలు కలుగజేయు దేవతా ఆరాధనలే చేయు చున్నారు. జన్మలు లేకుండా చేయు ఆరాధనలు దేవుడు నిర్ణయము చేసి చెప్పియున్నాడు. దేవుడు చెప్పినట్లు చేయు ఆరాధనలు జన్మలు లేకుండా చేయును. కనుక అటువంటి ఆరాధనలను ''నమాజ్'' అని పేరుపెట్టి చెప్పడము జరిగినది. నమాజ్ అనగా జన్మలు లేకుండా పోవడము అని అర్థమును తెలుపుచున్నది. 'న' అనగా వద్దు, 'మ' అనగా నాకు, 'జ' అనగా జన్మలు అని చెప్పవచ్చును. దేవుని ఆరాధనను నమాజ్ అని పూర్వము కృతయుగములోనే హిందువులు చెప్పేవారు. భూత కాలములో లేదు, భవిష్యత్తు కాలములో లేదు అని చెప్పుటకు ''న భూతో న భవిష్యత్'' అని చెప్పినట్లు ''జన్మల విషయములో జన్మలు వద్దు, జన్మలు లేవు'' అని చెప్పుటకు నమాజ్ అని చెప్పారు. జన్మలు లేకుండా దేవునిలోనికి ఐక్యమగు కోర్కెను తెలుపునదే నమాజ్ అని అర్థము. అయితే నేడు దేవుని ప్రార్థనలో కూడా ఏవో ప్రపంచ కోర్కెలను ఆశించి చేయు ఆరాధనను నమాజ్ అని అంటున్నారు.

ప్రపంచ ధనమును ఆశించి దేవతలను పూజించువారు తమ పూజలను ఆరాధనయని అన్నట్లు అట్లే పరమాత్మ ధనమును ఆశించి పూజించు వారు కూడా తమది ఆరాధనేయని చెప్పుచున్నట్లు రెండు రకముల ఆరాధనలను దేవుడు దేవతల పట్ల చేసినట్లు, రెండు రకముల నమాజ్‍లను దేవునివద్ద చేయుచున్నారు. దానినే ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో గల అందరూ చేయు పాత నమాజు అనియూ, ఒక్క మనిషి అయినా క్రొత్తగా నెలకొల్పు దానిని క్రొత్త నమాజు అనియూ రెండు రకములు గలవు. ఆ రెండు రకములు తెలియక ముస్లీమ్‍లు నమాజ్ ఒక్కటేయని అనుకొన్నారు.

ద్వాపరయుగము వరకు భూమిమీద మతములు లేవు. ఉన్న వారందరూ ఇందువులే యగుట వలన ఈ దేశమును ఇందూదేశము అని అన్నారు. ఇందూ అను పేరుతో ఇందువులు ఉండేవారు. ఈ మధ్య కాలములో దాదాపు 100 నుండి 150 సంవత్సరముల క్రితము 'ఇందూ' అను శబ్దము, 'హిందూ' అను శబ్దముగా మారిపోయినది. కలియుగము ప్రారంభమయిన తర్వాత మూడువేల సంవత్సరములకు మతములు అనునవి పుట్టుకొచ్చినవి. అలా పుట్టిన వాటిలో మొదటిది క్రైస్థవ మతము. మొదట అది సంఘముగా తయారయి, క్రైస్థవ సంఘము గుంపు పెరిగేకొద్దీ అది మతముగా మారిపోయినది. క్రైస్థవ మతము తయారయిన తర్వాత ఇందూ సమాజముగా యున్నవారు తమది ఇందూమతము అని చెప్పారు. ఇట్లు ఇందూమతముగా తయారయ్యే వరకు ఇందూ సమాజముగా యున్నవారు తమ కోర్కెల నిమిత్తము అనేక దేవతలను ఆశ్రయించి వారిని ఆరాధించడము జరిగేది. అప్పటి దేవతలను ఆరాధించకూడదని కలియుగము మొదటిలోనే తౌరాతు జ్ఞానము (భగవద్గీత జ్ఞానము) బయటికి వచ్చినది. అయినా తౌరాతు జ్ఞానమును కొందరే అర్థము చేసుకోగలిగి దేవుడు వేరు, దేవతలు వేరని తెలియగలిగినా చాలామంది దేవతారాధకులే ఉండేవారు. ఆనాడు తౌరాత్ జ్ఞానము వలన దేవుడు, దేవతలు అని రెండు భాగములు చేసి, దేవుని ఆరాధన వేరు, దేవతల ఆరాధన వేరని చెప్పియున్నా, ప్రపంచ ధనమును ఇచ్చు దేవతలనే ఆశ్రయించి ఆరాధించడము ప్రజలకు అలవాటై పోయినది.

కలియుగములో భగవద్గీత ప్రథమ దైవగ్రంథముగా బయటికి వచ్చినా, అంతకు ముందు యుగములనుండి దేవతా పూజలకు అలవాటు పడిన ప్రజలు భగవద్గీత మాటను లెక్కచేయక దేవతారాధనయందే ఆసక్తిని చూపుచుండిరి. అటువంటప్పుడు దేవతారాధనలలో రెండు ఆరాధనలు పేరుగాంచియుండేవి. ఈ రెండు ఆరాధనలను పేరుతో పిలుస్తున్నా వాటిలో తేడాలుండేవి. ఆ తేడాలనుబట్టి వాటికి పేర్లు కూడా పెట్టారు. వాటిని యజ్ఞములు మరియు తపస్సులుగా చెప్పేవారు. యజ్ఞములు దేవతారాధన లలో ఒకటయినా యజ్ఞములను చేయు విధానము వేరు, తపస్సులను చేయు విధానము వేరుగాయుండేది. తపస్సు చేయడములో ఏదో ఒకటి తలచుటయో, జపించుటయో జరుగుచుండును. తపస్సు చేయువారు జపించే మంత్రముగానీ, తలచే మాటగానీ బయటికి తెలియకుండా జపించేవారు. తపస్సు చాలావరకు మౌనముగా సాగేది. యజ్ఞములకంటే తపస్సులు చేయువారు గొప్పవారు అను భావము ఉండేది. తపస్సు చేయువారు తపశ్శక్తిని పొందేవారు. తపశ్శక్తికి దేవతలు సహితము భయపడేవారు. దేవతలను ఆరాధించగా వచ్చిన తపశ్శక్తికి దేవతలే భయపడేవారంటే దేవతల ఆరాధనలలో గొప్ప ఆరాధన తపస్సని చెప్పవచ్చును. ఇది ఎవరికి వారు చేసేదేగానీ సామూహికముగా చేయునది కాదు. ఎవరి సహాయము లేకుండా చేయునది తపస్సు.

యజ్ఞములు చేయడము ఒక విధమైన దేవతారాధనయని చెప్పవచ్చును. ముందే ఒక కోర్కెను ఉద్దేశ్యములో పెట్టుకొని దేవతల కొరకు చేయు ఆరాధన యజ్ఞము అని చెప్పవచ్చును. యజ్ఞము ద్వారా ఒక దేవతనుగానీ లేక ఎక్కువమంది దేవతలను గానీ ఆరాధించుచూ చేయునది యజ్ఞము. యజ్ఞము మౌనముగా తపస్సువలె చేయునది కాదు. యజ్ఞము ఒకే వ్యక్తి చేయలేడు. కొందరితో కలిసి ఒక దేవున్ని గానీ, ఎక్కువ మంది దేవుళ్ళనుగానీ ఆరాధించవచ్చును. యజ్ఞములో అగ్నిని రగిల్చి అగ్నిలో ఆహుతి చేసి ప్రతి వస్తువు వారు సంకల్పించుకున్న దేవతకు చేరునని చేయువారి నమ్మకము. యజ్ఞము ఒక్కరు చేయునది కాదు సామూహికముగా చేయునది. యజ్ఞము చేయువారు వేదమంత్రములను చదువుచుందురు. వేదమంత్రములు లేని యజ్ఞము ఎక్కడా చేయబడదు. యజ్ఞములతో వేదములు సంబంధపడియుండును. అట్లే తపస్సుతో ఏదో ఒక మంత్రము సంబంధపడియుండును. మంత్రము వేరు, తపస్సు వేరయినట్లు, యజ్ఞము వేరు వేద పఠనము వేరుగా యున్నది. మనుషులు చేయు దేవతల ఆరాధనలలో యజ్ఞములు, తపస్సులు ముఖ్యపాత్రను పోషించుచున్నవి.

తపస్సులు, యజ్ఞములు రెండూ కృతయుగము నుండి వచ్చుచున్నవే. యజ్ఞములు ఒక హిందూమతములోనే ఉండగా, తపస్సులు అన్ని మతముల లోనూ ఉన్నవి. యజ్ఞములు మొదటినుండి యజ్ఞములుగానే చెప్పబడు చున్నవి. వాటి పేరులోగానీ, ఆచరణలోగానీ ఏ మార్పు లేదు. అయితే తపస్సులు తపస్సులుగా చెప్పబడడము లేదు. కొందరు తపస్సుయనగా, కొందరు ద్యానము అంటున్నారు. తపస్సు అన్ని మతములలోనికి చొచ్చుకొని పోయినదంటే వినేవారందరికీ ఆశ్చర్యముగా ఉండును. ఎవరు ఏమనుకొన్నా తపస్సు అను ఆరాధన అనేక రూపములలో, అనేక పేర్లతో అన్ని మతములలో ఉన్నదనుట సత్యము. తపస్సును గుర్తించుట చాలా సులభము. తపస్సు ఎక్కడున్నా దానికి చిన్న మంత్రమో, లేక పెద్ద మాటయో తగిలించబడియుండును. ఆ లెక్కప్రకారము ఎక్కడ అయితే మంత్ర పఠనగానీ, మాటల పలుకులు తలచుటగానీ ఉండునో అక్కడ తపస్సు ఉన్నదని చెప్పవచ్చును. నేడు ద్యానము అని కొందరూ, మెడిటేషన్ అని కొందరూ అనుచున్నా అది తపస్సు క్రిందికే జమకట్టబడును. క్రైస్థవుల ప్రార్థనలయందు చెప్పబడు మాటలను చేర్చి వారి ప్రార్థనను తపస్సుయని చెప్పవచ్చును. తపస్సు అనునది ఒక నిమిషము నుండి ఒక సంవత్సరము వరకు చేయవచ్చును. తపస్సుకు కాలపరిమితి లేదు. ఎక్కడ చేసినా, ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా మంత్రముతో కూడి చేయునది తపస్సే యగును.

నేడు ముస్లీమ్ మతములో అనగా ఇస్లామ్ సమాజము వారు తమ ప్రార్థనా మందిరములయిన మజీద్‍లలో నిలబడిగానీ, కూర్చుండిగానీ ఖుర్ఆన్ గ్రంథములో మొదటి సూరా అయిన అల్ఫాతిహా సూరాలో ఏడు ఆయత్‍లను పఠించుచూ చేయు నమాజ్ అను ఆరాధన కూడా ఒక రకముగా తపస్సనియే చెపవ్పచ్చును. తపస్సు అను పదము ముస్లీమ్‍లలో గానీ ఖుర్ఆన్ దైవగ్రంథములోగానీ చెప్పకున్నా, అలా మాటల పఠనతోగానీ, చిన్న మంత్ర పఠనతోగానీ చేయు ఆరాధన తపస్సుకు సంబంధించినదే యగును. ఏదయితే ఏమి, అది దేవుని ఆరాధనే కదా!యని ఎవరయినా అనవచ్చును. అది దేవుని ఆరాధనగానీ, దేవతల ఆరాధనగానీ అది దైవిక మైన ఆరాధన కాదు. ప్రథమ దైవగ్రంథములో తపస్సు అధర్మములలో ఒకటిగా చెప్పబడినది. ద్వాపరయుగము వరకు దేవుని మార్గములో ఆటంకములు కల్గించు అధర్మములు ముఖ్యమైనవి నాలుగేయుండేవి. కలియుగములో నేడు అధర్మముల సంఖ్య పెరిగి ఆరుకు చేరినది. అందులో ఒకానొక అధర్మము తపస్సు. ప్రథమ దైవగ్రంథమయిన తౌరాతు గ్రంథములో తపస్సు వలన దేవుడు తెలియబడడు అని ఖచ్చితముగా చెప్పబడినది.

నేడు అధర్మములు మనుషుల అజ్ఞానమును ఆధారము చేసుకొని వారు చేయు ఆరాధనల లోనికి చొచ్చుకొనిపోయి మనుషులు చేయు ఆరాధనలు అధర్మములైనవిగా యున్నవి. మనుషులు తాము చేయు ఆరాధనలు సక్రమమైనవేయని చేయుచున్నారు. అలాంటి నమ్మకమును అధర్మములు మనుషులలో కల్గించినవి. నేడు ముస్లీమ్‍లు ఎంతో విశ్వాసముతో దేవున్ని ప్రార్థించాలను ఉద్దేశ్యముతో ఖుర్ఆన్ గ్రంథములో మొదటి సూరాలోని ఏడు ఆయత్‍లను పఠించుచూ నమాజ్ చేయుచున్నారు. అలా చేయు నమాజ్‍ను మనుషులు బోధించారు గానీ, దేవుడు బోధించలేదు. మనుషుల బోధలలో దూరిన అధర్మములు చివరకు ప్రార్థనలో కూడా చేరినవి. తపస్సుగాయున్న ఏ ఆరాధన వలనగానీ దేవున్ని తెలియుటకు శక్యముకాదు అని ప్రథమ దైవగ్రంథములో చెప్పబడియున్నది. దాని ప్రకారము నేడు ముస్లీమ్‍లు చేయు నమాజ్ వలన దేవుడు తెలియబడడు. దానివలన పరలోకము లభించదు. ఈ విషయము మనుషులకు తెలియకున్నా దేవునికి అన్నీ తెలుసు. అందువలన మనుషులు తనను చేరుటకు నిజమైన ఆరాధన, నిజమైన నమాజ్‍ను తెలియజేయాలనుకొన్నాడు.

దేవుడు తనవద్దకు చేరాలనుకొన్న వారికి నిజమైన నమాజ్‍ను తెలియజేస్తూ (4-103) వ వాక్యములో 'నమాజ్‍ను నెలకొల్పండి' అన్నాడు. దానివలన పాత నమాజ్‍ను మీరు ఎప్పుడు చేసినా ఫరవాలేదు. నియమ నిబంధనలు లేని, మంత్ర పఠన లేని, నిర్ణీత సమయము లేని నమాజ్‍ను సూచించాడు. అయినా మనుషులు దానిని గుర్తించలేక దానిని కూడా పాత నమాజ్ క్రిందికే జమకట్టుకున్నారు. దేవుడు ఒకవైపు పాత నమాజును చేస్తూ మరొకవైపు క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అదియూ బయట ప్రపంచములో అనుకూలమైనప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పినా ఇదేదో ప్రత్యేకమయినది అని అనుకోవడము లేదు. ఈ విధముగా ఒక్క ముస్లీమ్ మతములోనే కాదు అన్ని మతములలో వారివారి ఆరాధనలను వదలుకోలేక పోవుచున్నారు. మనుషులు ఏర్పరచిన ఆరాధన కాదని, దేవుడు చెప్పిన ఆరాధనను స్వీకరించడము లేదు. ఒకవేళ మాలాంటి వారు మీరు చేయుచున్న ఆరాధనలో మంత్రములున్నవి. మంత్రములుగానీ, మాటలుగానీ లేని ఆరాధనను దేవుడు కోరుకొంటున్నాడు అని చెప్పినా వినకున్నారు.

మనుషులుగా యున్నవారు సత్యమును చెప్పినా సాటి మనుషులు వినకున్నారు. ఇది ఇప్పుడు సమస్యకాదు పూర్వమునుండి అనగా సృష్ఠ్యాది నుండి ఉండే సమస్యయే. ప్రతీ విషయానికి దేవుడు వచ్చి చెప్పడము సాధ్యము కాదు. దేవుడు వచ్చి స్వయముగా బోధించడు. దేవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనముగా ఉండువాడే. అందువలన మొదట తన పాలకులయిన ఆకాశము ద్వారా తన జ్ఞానము చెప్పించాడు. ఆకాశము తన శబ్దము ద్వారా దేవుని జ్ఞానమును తెలియజేసింది. దేవుడు ఆకాశ వాణి ద్వారా తెలియజేయడమేమిటి యని మనుషులు అనుకొను అవకాశమున్నది. కావున అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా 42, ఆయత్ 51 లో ఇలా చెప్పాడు చూడండి.

(42-51) ''దేవుడు ఏ మానవునితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా (వహీ ద్వారా) లేక తెరవెనుక నుంచి, మనిషికి చేరవేస్తాడు. లేదా తాను కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు.''

ఈ వాక్యమును బట్టి దేవుడు గతములో శబ్దము ద్వారా జ్ఞానమును తెలియజేశాడని నిరూపణ అయినది. దేవుడు వాణి ద్వారాయే కాక మిగతా రెండు విధముల జ్ఞానమును తెలిపినా, మొదట వాణిద్వారా వచ్చిన జ్ఞానమునే చెప్పుతూ వచ్చాడు. అయినా మనిషి దేవుని జ్ఞానమును తెలిసిన, జ్ఞానిని అనుకొంటున్నాడుగానీ, దేవుడు చెప్పిన జ్ఞానమును ఏమాత్రము అందుకోలేక పోవుచున్నాడు. ఆ మాట వాస్తవమనుటకు ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు 'నమాజును నెలకొల్పండి' యని చెప్పినా దానిని గ్రహించలేకపోయాడు. ఈ విధముగా మనిషి అజ్ఞానములో మొదటినుండి ప్రయాణిస్తూ నేను జ్ఞానములోనే ఉన్నానని ఊహించుకొంటున్నాడు. మనిషికి ఒకమారు చెప్పితే సరిపోలేదని గ్రహించిన దేవుడు, తాను మనుషులకు తెలియజేయు మూడు విధానములను ఒక్కమారుతో ఆపకుండా మరీమరీ ఆ మూడు విధానముల ద్వారా చెప్పుచున్నాడు. సూర్యగ్రహము మనకు తెలిసినంతలో రెండుమార్లు భూమిమీదికి వచ్చి జ్ఞానము చెప్పాడు. అలాగే దేవుని ప్రతినిధి మానవ రూపములో రెండుమార్లు భూమిమీదికి వచ్చి జ్ఞానమును చెప్పిపోయాడు. ఇకపోతే ఆకాశవాణి ప్రతీ సంవత్సరము తన శబ్దము ద్వారా జ్ఞానమును గ్రహములకు, భూతములకు తెలియజేస్తూనే యున్నది. వాణి ద్వారా అందుకొన్న ఆజ్ఞను అనుసరించి గ్రహములు, భూతములు తమ చేతనయినంత వరకు మనుషులు జ్ఞానమార్గములో నడుచునట్లు చేయుచున్నారు.

ఆకాశవాణి మేఘరూపములో గర్జించుచూ, పెద్దపెద్ద శబ్దములను కల్గించుచున్నది. ఆ శబ్దములలోని అర్థము మనుషులకు తెలియదు. గ్రహములు, భూతములు మాత్రము గ్రహించగలుగుచున్నవి. మేఘములు ఆకాశము రెండూ ఒక్కటే. ఆకాశము అప్పుడప్పుడు మేఘముల రూపములో దర్శనమిచ్చుచుండును. మేఘములు గర్జించునప్పుడు వర్షము వచ్చును. వర్షము వచ్చినప్పుడు బయట ప్రదేశములో పనులన్నీ వదలుకొని మనుషులు ఊరక నిలుచుందురు. అప్పుడు మేఘముల శబ్దములు వినే అవకాశము దొరుకును. మేఘముల శబ్దములే ఆకాశవాణి యని చెప్పుచున్నాము. ఆ శబ్దమునే వహీ అని ఖుర్ఆన్‍లో అన్నారు. వహీ అంటే వారి భాషలో చెప్పిన వాక్యము అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. మనము మాట్లాడు భాషలో ఎప్పుడూ వహీ రాలేదు. మాటల రూపములో వహీ వచ్చిందని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. అలా ఎప్పుడూ రాలేదు. ఆకాశము నుండి వహీ లేక వాణి సంవత్సరమునకు ఒకమారు రావడము నేడు అందరికీ తెలుసు. ఈ రోజులలో ఎట్లు శబ్దము ఉరుముల రూపములో వచ్చినదో ఆ రోజు కూడా అలాగే ఉరుముల రూపములోనే వాణి రావడము జరిగినది. నేడు మనకు మేఘముల శబ్దము ఎలా అర్థము కాలేదో ఆనాడు కూడా ఎవరికీ అర్థము కాలేదు. దానిని ఆకాశములోని సూర్యుడు (జిబ్రయేల్) గ్రహించి భూమిమీద మనుషులకు మనుషుల భాషలో తెర చాటునుండి చెప్పడము జరిగినది. ఆనాటి నుండి నేటివరకు దేవుడు మొదట మేఘముల ద్వారా పంపిన జ్ఞానమే మూడు దైవ గ్రంథములయందు చెప్పబడినది. ఈ కాలములో కూడా ప్రతీ సంవత్సరము ఆకాశవాణి తన శబ్దము ద్వారా తన సందేశమును తెలియజేస్తూనే యున్నది. ఆ భాష ఎవరికీ తెలియదు. ఆకాశ భాష తెలిసినవారు గ్రహములు, భూతములని చెప్పాము. నేడు భూమిమీద దేవుని పాలనను నడుపుచున్నవి గ్రహములు, భూతములే. అవి ఎక్కడో ఆకాశములోనే ఎప్పుడూ లేవు. భూమిమీద మన మధ్యనే ఉంటూ, మనలను బయట కష్టసుఖములకు లోను చేస్తున్నవి. గ్రహములు, భూతములు మన మధ్యలో ఉంటూ ఎన్నో కార్యములను మనకు తెలియకుండా చేస్తున్నవి.

మనకు ఆకాశవాణి భాషరాదు. ఆ భాష దేవుని పాలనలో పాలనను సాగించు పాలకులయిన గ్రహములకు, భూతములకు తెలుసు. వారు ప్రతీ సంవత్సరం ఆకాశము చెప్పు సూచనలను వారి భాషలో గ్రహించు చుందురు. అలా వారు తెలియగలిగిన సమాచారములు మనకు తెలియాలంటే దేవుని పాలకులు ఫలానావారు, ఫలానాచోట ఉన్నారని తెలియగలిగితే తమకు తెలిసిన జ్ఞానమును మాకు తెలుపమని వారిని వేడుకొంటే వారు స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమును తెలుపగలరు. అలా వారి భాష తెలియగలిగితే వారు ముందు మనిషిని జ్ఞానమును తెలియమని హెచ్చరించుచున్నారు. మీరు జ్ఞానము తెలియకపోవడమే కాక, దేవుని జ్ఞానమును నిందించడము జరుగుచున్నదని, అలా చేయుట వలన మేము చాలామందిని చంపివేశామని చెప్పుచున్నారు. దైవజ్ఞానమును నిందించిన వారిని వారు నిందించిన 24 గంటలలో చంపివేశామని చెప్పుచున్నారు. వారు దేవుని జ్ఞానమును చెప్పే దానికంటే వారు వేయుచున్న శిక్షలను వింటే చాలా భయము పుట్టుకొస్తున్నది. దేవున్ని వదలి, దేవున్ని ఏమాత్రము తలచను కూడా తలచక, దేవుని జ్ఞానమునుగానీ, దేవుని గ్రంథములను గానీ అపహాస్యము చేసినవారిని, దేవుని ఆరాధనను చేయక దేవతల ఆరాధనను చేయువారిని, దేవతల గుడులకు పోవునప్పుడు వారిని రోడ్డు ప్రమాదములలో చంపివేయుచున్నామనీ, కొందరిని అంగహీనులను చేస్తున్నామనీ చెప్పుచున్నారు. ఎక్కువగా దేవాలయములకు భక్తిగా పోవువారి మీద దృష్ఠి కేంద్రీకరించి ఎక్కువగా వారినే రోడ్డు ప్రమాదములలో ప్రమాదములకు గురి అగునట్లు చేయుచున్నామని తెలుపుచున్నారు. అదే విధముగా పెళ్లి సంబంధమునకు గానీ, పెళ్లికిగానీ పోవువారిని కూడా ప్రమాదముల పాలు చేయుచున్నామని చెప్పుచున్నారు.

దేవుని పాలనను నడుపు గ్రహములు, భూతములు ప్రతీ మనిషి వెంట ఉండి వారు చేయుచున్న ప్రతీ పనిని చూస్తూనే యున్నవి. అవసరమునుబట్టి ఒక్కొక్క సమయములో పదుల సంఖ్యలో ఉండడము, ఒక్కొక్కమారు ఎవరూ లేకుండా పోవడము కూడా జరుగుచున్నది. దైవ దూషణ చేసినప్పుడు ఒకవేళ ఆ సమయములో అతనివద్ద గ్రహములు ఉంటే ఆ గ్రహముల వలన అతనికి బాధలు తప్పవు. ఒకవేళ ఆ సమయములో భూతములు అక్కడవుండి అతను దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడినది చూస్తే వారు అతనిని అదును చూచి తప్పక చంపివేయుదురు. ఐదు తేళ్లు కుట్టిన బాధవరకు గ్రహములు కలుగజేయ గలవు. అంతేగానీ చంపుటకు అధికారము లేదు. భూతములయితే ఏకముగా చంపు అధికారమును కల్గియున్నాయి. ఈ విషయము ద్వితీయ దైవ గ్రంథములో వ్రాయబడియున్నది. ఈ విషయములన్నీ సులభముగా తెలియవచ్చును. దేవున్నిగానీ, దేవుని జ్ఞానమునుగానీ నిందించిన వారికి గ్రహముల వలన, భూతముల వలన శిక్షలు తప్పవు.

దేవుని ఆరాధన విషయములో గ్రహములు, భూతములు మనుషులను చూస్తూనే యుందురు. దేవున్ని వదలి దేవతలను పెద్దగా తలచి ప్రపంచ సుఖముల కొరకు వారిని ఆరాధిస్తే అనేక సమయములలో అనేక ఇబ్బందులు కలుగజేయుచుందురు. అయినా దానివలనే ఈ బాధలని మనుషులకు తెలియదు. దేవుని పాలకులకు 24 గంటల ముందు చేయవలసిన పనులకు ఆజ్ఞ ఇవ్వబడుచున్నది. దేవుని ఆజ్ఞను గ్రహించిన పాలకులు మనుషులకు ముందే నిర్ణయించబడిన కర్మను రద్దు చేసి శిక్షలు విధించగలరు. దేవతలను ఆశ్రయించి, దేవున్ని వదలిన వారికి శిక్షలు వేయుచుందురు. దేవున్నే విశ్వసించి సరియైన జ్ఞానము తెలియక దేవున్ని ఆరాధించు క్రమము తెలియక పోయిన వారిని గ్రహములు, భూతములు గ్రహించుచుండును గానీ వారిని ఏమీ అనరు. వారికి దేవుడు జ్ఞానము తెలియు అవకాశమిచ్చినప్పుడు వారు తెలియకపోతే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అను ధోరణిని అవలంభించి, నాకు తెలిసినదే నేను చేస్తానని జ్ఞానమును తెలియకపోతే అప్పుడు వారిని గ్రహములు, భూతములు కష్టాలకు గురి చేస్తారు. అంతకంటే ఎక్కువ శిక్షను వేయరు. అట్లుకాకుండా జ్ఞానమును దూషిస్తే కఠినముగా శిక్షలు వేస్తారు. దేవుని పాలకులు దేవుడనినా, దేవుని జ్ఞానమనినా ఎంతో ఇష్టపడుతారు. జ్ఞానులను చూచి సంతోషిస్తారు.

గత జన్మల పాపము వలన అనుభవించవలసిన కర్మను తీర్పు చేయబడి పెద్దపెద్ద రోగముల చేత పీడింపబడువారు దేవుని జ్ఞానమును తెలియగలిగి దేవుని మీద విశ్వాసము పొంది, దైవజ్ఞానమును తెలియుటకు ఇష్టపడు వారిని రక్షించు పనిని కూడా పాలకులు చేయుచున్నారు. దేవుని పాలకులు శిక్షించు వారేకాదు రక్షించువారు కూడా యని తెలియవలెను. మాకు తెలిసినంత వరకు దేవుని జ్ఞానమును దూషించిన వారిని 24 గంటలలోపు కొందరినీ, వారము సమయములో కొందరినీ, నెల లోపల కొందరినీ అక్కడక్కడ పాలకులు చంపిన సంఘటనలు గలవు. కొందరు క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు రోగము ముదిరిపోయిన వారు దేవుని జ్ఞానము తెలిసి దానినే ఆశ్రయించడము వలన, నిజమైన ఆరాధన చేయడము వలన, ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో చెప్పినట్లు అసలయిన నమాజును చేయడము వలన, వారి శరీరములో క్యాన్సర్, ఎయిడ్స్ రోగములు కూడా మాయమైపోయి. వారు సంపూర్ణ ఆరోగ్యము గలవారుగా మారడము వెన దేవుని పాలకుల హస్తముందని తెలియుచున్నది. అందువలన ఇప్పటినుండయినా దేవుని ఆరాధనను దేవుడు చెప్పినట్లే చేస్తాము.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
34. ఇద్దరు అల్లాహ్‍లు ఎవరిని ఆరాధించాలి? (3-18)
ప్రశ్న :- ఇంతకుముందు 4-103 వ ఆయత్‍లో బాగా పరిశోధించి చూస్తే రెండు నమాజులు కనిపించాయి. అందులో ఒకటి ప్రతి దినము అందరూ సామూహికముగా చేయునది కాగా, రెండవ దానిని దేవుడు నెలకొల్పమని చెప్పాడు. ముస్లీమ్ సమాజములో 'ఒకే నమాజు, ఒకే అల్లాహ్' అని చెప్పుచుందురు. మీరు రెండవ నమాజు మరొకటున్నదని చెప్పారు. ప్రతి దినము ముస్లీమ్‍లందరూ చేసే నమాజుకంటే ముఖ్యమైనది రెండవ నమాజుయని మీరు చెప్పారు. మీరు చెప్పడమేకాక గ్రంథములో కూడా చూపారు. రెండు నమాజులున్నప్పుడు ఇద్దరు అల్లాహ్‍లు ఉండాలని చెప్పారనుకుందాము. ఇద్దరు అల్లాహ్‍లు అనే దానికి ఏమయినా ఆధారమున్నదా? నమాజ్‍లను గురించి చెప్పినప్పుడు, నమాజ్‍ను నెలకొల్పమని చెప్పినప్పుడు అది క్రొత్తదే అని మాకు అర్థమయినది. అయితే క్రొత్త నమాజ్ ఎలాగుండవలెనో చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పినప్పుడు వారిని గురించిన వివరమును చెప్పకపోతే మేము ఎలా నమ్మాలి?

జవాబు :- రెండు నమాజ్‍లను గురించి చెప్పినది వాస్తవమే. అయితే అది గ్రంథములో అల్లాహ్ చెప్పిన మాటేగానీ మామాట కాదు. గ్రంథములో రెండవ నమాజ్‍ను గురించి అల్లాహ్ ఇప్పుడు చెప్పలేదు. ఎందుకనగా! ముందే తన జ్ఞానములో క్రొత్త నమాజ్‍ను గురించి చెప్పియుండుట చేత ప్రత్యేకించి ఇప్పుడు దానిని గురించి చెప్పలేదు. అల్లాహ్ జ్ఞానము తెలిసినవారందరికీ రెండవ క్రొత్త నమాజ్ ఏమిటో అర్థమయినది. అట్లే మాకు కూడా ఆ వాక్యము చదివిన వెంటనే రెండవ నమాజ్ అంటే ఏమిటో అర్థమయినది. 6-102వ వాక్యము ఎప్పుడయితే అర్థము కాగలదో అప్పుడే క్రొత్త నమాజ్ (రెండవ నమాజ్) సగము అర్థమయిపోగలదు. అట్లే 2-255వ వాక్యము ఎప్పుడు అర్థము కాగలదో అప్పుడే 4-103 లో చెప్పిన వాక్యము పూర్తి అర్థము కాగలదు. అందువలన 'క్రొత్త నమాజ్' అను వాక్యమునకు ప్రత్యేకమైన వివరమును అల్లాహ్ చెప్పలేదు. అదే కారణము చేత మేము కూడా చెప్పలేదు. ప్రథమ దైవగ్రంథమున, ద్వితీయ దైవగ్రంథమున మరియు ఇప్పుడు చెప్పిన తృతీయ దైవ (అంతిమ దైవ) గ్రంథమున 'నెలకొల్పమని' చెప్పిన రెండవ నమాజ్‍ను గురించి సంపూర్ణముగా చెప్పబడియున్నది. అందువలన దానిని గురించి ప్రత్యేకముగా చెప్పలేదు. ఖుర్ఆన్ గ్రంథములో ఉదాహరణకు 6-102, 2-255 చెప్పియున్నాము కదా! ఈ రెండు ఆయత్‍లే కాక మిగతా చాలా ఆయత్‍లలో ఈ రెండవ నమాజ్‍ను గురించి చెప్పబడి యున్నది. ప్రథమ దైవగ్రంథములో ద్వితీయ దైవగ్రంథములోకంటే, ఖుర్ఆన్ గ్రంథములో కంటే నమాజ్‍ను ఎక్కువ చెప్పియున్నారు. ముందు వచ్చిన ప్రథమ, ద్వితీయ గ్రంథములను చదువగలిగితే అంతిమ దైవగ్రంథములో గల క్రొత్త నమాజ్ పూర్తి అర్థము కాగలదు. ఉదాహరణగా చెప్పితే ముందు వచ్చిన రెండు గ్రంథములలో అన్నములో కలుపుకొని తినుచున్న సాంబారులో ఇంగువను వాడుదురు అని ఉందనుకో, అప్పుడు తర్వాత వచ్చిన మూడవ గ్రంథములో సాంబారు అను పదమును చెప్పకుండా ఇంగువ అనే పదమును చెప్పినంత మాత్రమున సాంబారు అను పేరు జ్ఞప్తికి వచ్చినట్లు, రెండవ నమాజ్‍ను చెప్పిన వెంటనే భగవద్గీత, బైబిలులో చెప్పిన రెండవ ప్రార్థన ఏమిటో తెలియగలదు. అదే విధముగా ఖుర్ఆన్‍లో నెలకొల్పమని చెప్పిన వెంటనే అది ఏమిటో ముందు వచ్చిన రెండు గ్రంథములు చదివిన వారికి తెలిసిపోవుచున్నది.

ఇక ఇద్దరు అల్లాహ్‍లను గురించి ముందు వచ్చిన రెండు గ్రంథములలో చెప్పడమేకాక, ఖుర్ఆన్ గ్రంథములో అనేకమార్లు చెప్పి యున్నారు. మీరు ఆరాధించవలసిన అల్లాహ్ ఈయనేయని, ఆరాధ్య యోగ్యమైనవాడు ఈ అల్లాహ్ ఒక్కడేయని అనేకమార్లు రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పడమేకాక మొదటి అల్లాహ్‍ను గురించి ఏ ఆరాధన, అవసరము లేనివాడు అన్నట్లు 112వ సూరాలో రెండవ ఆయత్‍లో ''ఈయన ఏ అక్కరా లేనివాడు'' అని మొదటి అల్లాహ్‍ను గురించి చెప్పియున్నారు. ఎంతో వివరముగా మొదటి అల్లాహ్‍ను, రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పియుండగా, ఆ వ్యత్యాసమును గ్రహించలేకపోతే, రెండవ అల్లాహ్‍ను గురించి తెలియలేరు. ద్వితీయ దైవ గ్రంథము ఇంజీలులో తండ్రియని ఒకరినీ, కుమారుడని ఒకరినీ పోల్చి చెప్పారు. అట్లే ప్రథమ దైవ గ్రంథమున మొదటి ఆయనకు, రెండవ ఆయనకు తేడాను చెప్పి మొదటి ఆయనకు పేరు లేదని, రెండవ ఆయనకు పేరు కలదని తెలియజేయడమైనది. ఇట్లు ముందు వచ్చిన రెండు గ్రంథములలో ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పడమేకాక వారి తేడాను కూడా చూపడమైనది. అదే విధముగా అంతిమ దైవ గ్రంథములో కూడా చెప్పడమైనది.

మొదట భగవద్గీతలోనే పరమాత్మ, ఆత్మను సూచించినా హిందువులు ఆ విషయమును గుర్తించలేకపోయారు. క్రైస్థవులు తమ గ్రంథములో పరిశుద్ధాత్మ (తండ్రి), ఆత్మను (కుమారున్ని) సూచించినా దానిని గ్రహించలేకపోయారు. ముస్లీమ్‍లలో వారికిచ్చిన గ్రంథము ఖుర్ఆన్‍లో మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్ కార్యకర్తయైన దేవున్ని (అల్లాహ్‍ను) ప్రకటించినా వారు కూడా రెండవ అల్లాహ్‍ను కనుగొనలేకపోయారు. మూడు మతములవారు అందరూ ఆరాధింపదగిన దేవుడు ఒక్కడేయని అంటున్నారు. ఆ ఒక్క దేవున్ని ఎవరు చూపించారు? ఆ ఒక్క దేవున్ని ఎవరు ఆరాధించమన్నారు? మనము ఆరాధించే దేవుడు మొదటినుండీ ఉన్నవాడా? లేక మధ్యలో సృష్ఠింపబడినాడా? మనము ఆరాధించే ఏకైక దేవుడు మధ్యలో సృష్ఠింపబడియుంటే, ఆయనను సృష్ఠించినవాడు ఎవరు? మనము ఆరాధించే దేవున్ని సృష్ఠించిన దేవదేవున్ని (పెద్ద దేవున్ని) ఎందుకు మనము ఆరాధించడము లేదు? అందరికంటే పెద్ద, మొదటివాడు అల్లాహ్‍యే అయితే అల్లాహ్కంటే పెద్దవాడు ఉన్నాడా? ఆరాధింపతగిన దేవుడు ఒక్కడే యుండగా! ఆయనకంటే పెద్ద దేవుడు ఉండవలసిన అవసరము ఏముంది? ఇన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకొంటే, అప్పుడు దేవుని విషయము తెలియును. అలా తెలిసినప్పుడు దేవుడు ఒక్కడా, ఇద్దరాయని తెలియును. బహుశా ఈ ప్రశ్నలు భూమిమీద మొదట ఇక్కడే వచ్చియుండునని చెప్ప వచ్చును. ఎందుకనగా! ఇంతవరకు దేవుని విషయములో చెప్పింది వినేవారే గానీ తిరిగి ప్రశ్న వేసినవారు లేరు. అందువలన ఇవి మొదటి ప్రశ్నలని తెలియవలెను. ఈ ప్రశ్నలు వేయుటకు అవసరమైన సంశయములు గలవు. అందువలన ప్రశ్నలు వేయడము జరిగినది.

ఇప్పుడు ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబు తెలియగలిగితే దైవ గ్రంథములలోని సత్యము ప్రజలకు తెలియగలదు. సత్యము తెలియగలిగితే మూడు గ్రంథములలోని వాక్యములకు మంచి వివరణ దొరుకును. కొన్ని ఆయత్‍లకు వివరము దొరుకుట వలన దేవుని విషయమే కాకుండా దానితో పాటు మిగతా జ్ఞానము కూడా తెలియును. దేవుని విషయములో సంశయము కల్గించు వాక్యములు దైవ గ్రంథములో కనిపించినా, వాటిని గ్రుడ్డిగా చదువుతున్నారు తప్ప పూర్తి వివరముగా తెలియడము లేదు. అట్లు సంశయము కల్గించు వాక్యమును ఇప్పుడు చెప్పుకొందాము. ఆ వాక్యము సూరా మూడు, ఆయత్ 18లో ఇలా కలదు చూడండి.

(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)

(3-18) ''నిశ్చయముగా ఆయన తప్ప వేరొక ఆరాధ్యనీయుడు లేడని అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు. ఆయనే న్యాయపరిరక్షకుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)

ఈ రెండు ఆయత్‍లు దేవునిమీద ప్రశ్నను రేకెత్తించుచున్నవి. అయితే కొందరు ఇందులో ప్రశ్న ఏమున్నది? నేను తప్ప వేరే దేవుడు లేడని దేవుడే చెప్పాడు కదా! యని అడుగుచున్నారు. లేదు సృష్ఠిర్తయిన దేవుడు తనను గురించి చెప్పక, తాను సృష్ఠించిన వానిని అల్లాహ్యని చెప్పుచూ, ఈ అల్లాహ్‍నే ఆరాధించమనీ, ఈయన తప్ప వేరొక ఆరాధ్య దైవము లేడని చెప్పారని మేము అంటున్నాము. ఇందులో ఏది నిజము అని తెలియుటకు ముందు వచ్చిన దైవ గ్రంథములలో ఇంజీలు గ్రంథమును ఆధారము చేసుకొని చూచిన అందులో ఏమి చెప్పారో దాని ప్రకారము సత్యమును తెలియవచ్చును. అట్లే ఇదే ఖుర్ఆన్ గ్రంథములో మరొక చోట వ్రాసిన దానిని బట్టి సత్యమును నిర్ణయించవచ్చును. రెండవ దైవ గ్రంథమయిన ఇంజీలు గ్రంథములో ఏమి వ్రాశారో మొదట చూస్తాము. ఇంజీలులో యోహాన్ సువార్త ఐదవ అధ్యాయమునందు గల 21 నుండి 26 వరకు ఉన్న సమాచారమును చూస్తే ఖుర్ఆన్‍లో ఇద్దరు అల్లాహ్‍ల సమస్య తెగిపోవును.

(యోహాన్ 5-21 నుండి 26 వరకు)

(5-21) ''తండ్రి మృతులను ఏలాగు లేపి బత్రికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బత్రికించును.''

(5-22) ''తండ్రి యెవనికి తీర్పు తీర్చడుగానీ''

(5-23) ''తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు, కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.''

(5-24) ''నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాస ముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''

(5-25) ''మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''

(5-26) ''తండ్రి యేలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగహ్రించెను.''

ఈ వాక్యములో తండ్రి, కుమారుడు అని చెప్పబడడమేకాక అన్ని అధికారములు తండ్రి ద్వారా కుమారుడు పొందియున్నాడు అని తెలియు చున్నది. తండ్రి తన కుమారున్ని అందరూ ఆరాధించమని చెప్పాడు. తన కుమారున్ని గౌరవించి ఆరాధిస్తే తనను గౌరవించి ఆరాధించినట్లేయని చెప్పాడు. అదే విధముగా ఖుర్ఆన్ గ్రంథములో సృష్ఠికర్తయైన దేవుడు తన చేత సృష్ఠింపబడిన ఆత్మను దేవునిగా తెలియజేస్తూ ఆత్మయే మీకు ఆరాధింపదగిన అల్లాహ్యని చెప్పాడు. ఇంజీలు గ్రంథములో తన ఆత్మను ఆరాధించమని చెప్పినట్లు, ఇక్కడ ఖుర్ఆన్ గ్రంథములో 3-18లో తాను చెప్పిన అల్లాహ్‍ను ఆరాధించమని స్వయముగా అల్లాహ్‍యే చెప్పారు. రెండవ అల్లాహ్‍యే అందరి ఆరాధ్య యోగ్యుడు అని అన్నారు.

ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలు (బైబిలు) లో రెండవ అల్లాహ్ ఉన్నాడనుటకు కొంత ఆధారము దొరికినది. బుద్ధి గ్రాహితము ఉన్న ఏ మనిషికయినా బైబిలు సమాచారము చూచిన తర్వాత 3-18లో చెప్పినది కూడా అదే విషయమేయని తెలియగలదు. అంతేకాక ఇదే ఖుర్ఆన్ గ్రంథములో 32-4లో మరియు 2-255లో పని చేసే దేవున్ని చెప్పి 2-117 లో పని చేయని దేవున్ని చెప్పడమైనది. ఈ విధముగా రెండు రకముల అల్లాహ్‍లను (దేవుళ్ళను) చెప్పడమైనది. ఈ వాక్యములనుబట్టి రెండు రకముల దేవుళ్ళున్నారని తెలియుచున్నది. పని చేసే దేవున్ని గురించి అనేకమార్లు చెప్పియున్నారు. ఉదాహరణకు...

(2-255) ''అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవము. ఆయన తప్ప ఇంకో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారము. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమి, ఆకాశములలోని సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా, ఆయన సమక్షములో సిఫారసు చేయగల వాడెవడు? వారికి ముందున్న దానిని, వెనుకయున్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధి లోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.''

ఈ వాక్యములో పని చేసే అల్లాహ్‍ను గురించి చెప్పడమైనది. పని చేయని అల్లాహ్‍ను గురించి 2-117 వాక్యము (ఆయత్)లో చెప్పారు. పని చేయని దేవుడు, పని చేసే దేవుడు ఇద్దరున్నారని ఈ మాటతో స్పష్టమైపోవుచున్నది.

(2-117) ''భూమి ఆకాశములను ప్రప్రథమముగా సృష్ఠించినవాడు దేవుడే. ఆయన ఏ పనియైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దాన్ని అయిపో అంటే చాలు, అది అయిపోతుంది.''

ఈ ఆయత్‍లో చెప్పిన దానిని గమనిస్తే మొదటి దేవుడు అర్థమయి పోవుచున్నాడు. 2-255 వాక్యమును గమనించితే రెండవ దేవుడు తెలియు చున్నాడు. ఈ విషయము అర్థము కావాలంటే ఉదాహరణ చూస్తాము. ఒక యజమాని తాను చేయవలసిన పనిని తన గుమస్తా చేత చేయించును. యజమాని పనిని చేయడు. యజమాని చేయవలసిన పని ఏదయినా ఉంటే తన గుమస్తా చేత చేయించును. అదే విధముగా మొదట యజమాని తన గుమస్తాకు తన పేరునే పెట్టాడు. ఏ పనిని చేసినా అతని పేరు చెప్పినా అది తన పేరులాగే ఉండునట్లు అందరికీ కనపడవలెనని, అప్పుడు తాను చేయకున్నా తానే చేసినట్లు అందరూ అనుకోవలెనని యజమాని తన గుమస్తాకు తన పేరే పెట్టాడు అనుకొనుము. యజమాని పేరు అజా, అట్లే గుమస్తా పేరు కూడా అజా గానే పిలువబడుచున్నది. యజమాని పేరు, గుమస్తా పేరు రెండూ ఒక్కటే. అట్లే యజమాని తనకు రావలసిన డబ్బులు తన గుమస్తాకు ఇచ్చునట్లు, అట్లే తాను ఇవ్వవలసిన డబ్బులు తన గుమస్తానే ఇచ్చునట్లు సర్వ హక్కులు (పవర్ పట్టా) తన గుమస్తా పేరు మీద వ్రాసి ఇచ్చాడు. తన యజమాని ఇచ్చిన పవర్ పట్టా వలన యజమాని చేయు పనులన్నీ గుమస్తానే చేయుచుండెను. యజమాని పేరు, గుమస్తా పేరు రెండూ ఒక్కటే అయిన దానివలన ఏ పని జరిగినా అందరూ యజమాని అయిన అజా నే చేశాడని అనుకొనేవారు. గుమస్తా అయిన అజా చేశాడని ఎవరూ అనుకొనేవారు కాదు. డబ్బుల వ్యవహారము ఇవ్వడము తీసుకోవడము అజా అనే వ్యక్తి చేయుట వలన అందరూ యజమాని అజా నే చేశాడని పొరపడెడివారు. అన్ని పనులు తన గుమస్తా అజా చేయుట వలన యజమాని అయిన అజా ఏమీ చేయక ఊరక యుండెను. ఏదయినా చేయవలసి వస్తే ఆయన చెప్పి ఊరకుండెడి వాడు. అప్పుడు ఆ పనిని గుమస్తా నే చేయుట వలన యజమాని అనుకొను పనులన్నీ జరిగి పోవుచుండును. బయట ప్రజలకు యజమానియే డబ్బులు బాకీ ఇచ్చినట్లు చెప్పుకొనెడి వారు. అట్లే బాకీ డబ్బులను కూడా యజమానికి ఇచ్చి తమ బాకీని తీర్చివేశాము అని చెప్పుచుండిరి. అందరూ యజమాని పేరు చెప్పినా ఆ పనిని చేయువాడు గుమస్తానేయని చాలామంది తెలియక పొరపడుచుండిరి. ఇద్దరి పేరు ఒకటే అయిన దానివలన యజమాని అజా ఏమీ చేయలేదనీ, అన్నీ చేశానని చెప్పు అజా, గుమస్తా అజా యని తెలియకయుండిరి. యజమాని, గుమస్తా అను ఇద్దరి సమాచారమున్నట్లే దేవుని విధానములో కూడా ఇద్దరి అల్లాహ్‍లు కలరు.

దేవుడయిన అల్లాహ్ మొదట ఆకాశము, భూమిని సృష్ఠించిన అల్లాహ్ ఏ పనినీ చేయకున్నా, ఆయన అనుకున్న పనులన్నీ అయిపోవాలంటే అయిపోవుచుండును. అయితే యజమాని అల్లాహ్ ఏమీ చేయడనీ, గుమస్తా అల్లాహ్ అన్నీ చేయునని ఎవరికీ తెలియదు. అదే విషయమునే 2-117 లో చెప్పడమైనది. అన్నీ తన గుమస్తా అల్లాహ్‍యే చేయుననీ, ఏమి అడిగినా తన గుమస్తానే అడగమని చెప్పిన విషయమే (3-18) లో కలదు. మీరు అడగవలసిన వాడు ఇతనేయని తన గుమస్తాను చూపి చెప్పినది 3-18లో కలదు. ఆయన తప్ప మీ పనులు చేయువాడు ఇంకొకడు లేడనీ, ఆయనే మీ పనులన్నీ చేసి పెట్టుననీ, అందువలన అందరూ ఆయన వద్దకు పోయి ఆయననే ఆశ్రయించమని చెప్పిన విషయము 2-255 లో గలదు. తాను ఏమీ చేయని వాడిననీ (అల్లాహ్ ననీ), అన్నీ చేయు అల్లాహ్ తాను కాదని చెప్పినా మనుషులు అర్థము చేసుకోలేక 'అల్లాహ్ ఒక్కరే, ఆయనే మా దేవుడు' అని అంటున్నారు. పవర్ ఆఫ్ పట్టా పొందినవాడు అన్ని పనులు చేయుచున్నాడు. అతను ఆరాధ్యుడుగా యున్నాడు. అలా ఉండుటకు ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన అల్లాహ్ తనకు ఇష్టమైన వానికి అధికారమిచ్చాడు. మొదటి సృష్ఠికర్త అయిన అల్లాహ్ ఏమీ చేయడు. యజమాని ఊరకయుంటే, యజమాని పనులన్నీ గుమస్తానే చేసినట్లు మొదటి అల్లాహ్ పనులన్నింటినీ రెండవ అల్లాహ్ చేయుట నమ్మలేని సత్యముగా యున్నది. ఇది నిజము యని ఎన్నో ఆయత్‍లు సాక్ష్యము చెప్పినట్లు కనిపిస్తూ యున్నా వాటిని మనిషి బుద్ధి అందుకోలేకున్నది.

యజమాని పేరు, యజమాని చేయవలసిన పనులను చేయు గుమస్తా పేరు రెండూ ఒకటే అయిన దానివలన ఎవరు పెద్ద, ఎవరు చిన్నయని తెలియక ఇద్దరు లేరు ఒక్కరే యున్నారని చెప్పుచున్నారు. ఒక్కడు ఉండేది వాస్తవమే. మాకు అర్థమయినది గుమస్తా మాత్రమే యజమాని కాదు. మీరు ఆరాధించుచున్నది, గౌరవించుచున్నది గుమస్తా సీటులో యున్న అల్లాహ్‍ను మాత్రమే. అయినా ఇస్లామ్ మతము పుట్టినప్పటి నుండి అల్లాహ్ ఒక్కడేయను మాటనే వినిన ముస్లీమ్‍లు నేడు ఒక్కమారుగా అల్లాహ్ అను వారు ఇద్దరు అని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన మాటను చెప్పితే మా మాటను ఏమాత్రము నమ్మలేకున్నారు. 2-255 ఆయత్‍లో అల్లాహ్ అన్ని పనులు చేయుచున్నట్లు ఆయన ఎప్పటికీ అలసిపోడు, ఆయనకు కునుకు గానీ, నిద్రగానీ రాదు. రాత్రింపగళ్లు పని చేయుచున్నాడు అని చెప్పియున్నారు. పని చేయని యజమానిగా యున్న అల్లాహ్ ఏ పనీ చేయనివాడై యున్నాడని సాక్ష్యము చెప్పినట్లు సూరా 112లో గల నాలుగు ఆయత్‍లు వ్రాయబడియున్నవి. అందులో దేవుడు ఏ అక్కరా లేనివాడనీ చెప్పినప్పుడు ఆయన దేని కొరకు పని చేయనివాడని తెలిసిపోవుచున్నది. యజమాని పనిని గుమస్తా చేసినట్లు 2-255లో చెప్పినా, 6-102లో అల్లాహ్ కార్యకర్త యని చెప్పినా ఈయన వేరు, ఆయన వేరు అని తెలియలేక పోయారు. పని చేయని ఆయన (అల్లాహ్) ఒకరుండగా, పనిని చేయు అల్లాహ్ మరొకరున్నారని ఇంతవరకూ తెలియకుండా పోయినది. ఇప్పుడు చెప్పినా వినే స్థితిలో లేరు.

అల్లాహ్ ఒక్కడే ఉన్నాడని అనుకోవడము వలన యజమానిని, గుమస్తాను ఇద్దరినీ కలిపివేసినట్లున్నది. పని చేయని అధికారిని, పని చేయు గుమస్తాను ఒక్కరేయని తలచుట ఎంత తెలివితక్కువ యగునో అలాగే నేటి ముస్లీమ్‍ల పరిస్థితి యున్నది. ఎవరయినా సత్యమును చెప్పితే దానిని వినకుండా మా గ్రంథమును గురించి మీరు చెప్పకూడదు అని మొండిగా మాట్లాడుచున్నారు. ఈ విషయమై ఇంకా లోతుగా చూచినట్లయితే సూరా 50, ఆయత్ 21లో మనిషి పాత్ర ఏమిటో? గుమస్తా అల్లాహ్ అనగా పని చేయు అల్లాహ్ పాత్ర ఏమిటో, యజమాని అల్లాహ్ అనగా పని చేయని అల్లాహ్ పాత్ర ఏమిటో వ్రాయబడియున్నది. దానిని ఒకమారు చూడండి.

(50-21) ''ప్రతీ వ్యక్తి తనవెంట తనను తీసుకొచ్చినవాడొకడు సాక్ష్యమిచ్చే వాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు.''

ఇక్కడ ప్రతీ మనిషి వెంట ఇద్దరున్నారని చెప్పారు. ఆ ఇద్దరినే మేము ఇంతవరకు యజమాని, గుమస్తాతో పోల్చి చెప్పాము. ఈ వాక్యములో నిన్ను తీసుకవచ్చేవాడు గుమస్తా దేవుడుకాగా, సాక్షిగా చూస్తూ ఊరకయుండువాడు యజమాని దేవుడుగా చెప్పవచ్చును. ఒక జీవున్ని (మనిషిని) జన్మలోనికి తెచ్చి వానిని మరణము వరకు నడిపించుచూ ప్రతీ దినము, ప్రతీ పని చేసి అందులోని కష్టసుఖములను జీవుని చేత అనుభవింపజేయువాడు నిత్యము మనతో సంబంధపడియుండి పని చేయు దేవుడు. ఏ పనినీ చేయక శరీరములో జీవునికి దేవునికి సాక్షిగా యున్న దేవుడు సృష్ఠికర్తయైన దేవుడు, సృష్ఠి తర్వాత ఏ పనీ చేయక ఊరక ఉండిపోయాడు. సృష్ఠి తర్వాత కార్యములన్నీ జరుపుటకు తన చేత సృష్ఠింపబడిన దేవున్ని నియమించి ఆయనకు తన అధికారములన్నీ ఇచ్చి తనంతటి దేవునిగా తయారు చేశాడు. అలా సృష్ఠించిన దేవుడు యజమానిగా, సృష్ఠింపబడిన దేవుడు గుమస్తాగా యున్నాడనుకొనుము. ఇద్దరు దేవుళ్ళు, ఒక మనిషి మొత్తము ముగ్గురున్నారని 50-21 లో చెప్పబడినది.

ప్రపంచమంతా ప్రకృతితో కూడుకొన్నదైయుండగా, అందులో తోలబడే జీవుడు (మనిషి), తోలే గుమస్తా (అల్లాహ్), చూచే యజమాని (దేవుడు) ముగ్గురూ కలరు. జీవుడు, దేవుడు అను ఇద్దరూ సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడగా, ప్రకృతియగు నిర్జీవమైన జఢపదార్థము జీవునికంటే, దేవునికంటే ముందే సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడినది. ఎవరి చేత సృష్ఠింపబడని దేవుడు ప్రపంచమంతా వ్యాపించిన ప్రకృతిని మొదట తయారు చేసి, తర్వాత ఒక దేవున్ని తయారు చేశాడు. తయారు చేసిన దేవునికి అన్ని అధికారములు ఇచ్చి ఆ దేవుని చేత కోట్లాది జీవుళ్ళను తయారు చేయించాడు. అలా తయారు చేయబడినదే మనము చూస్తున్న ఈ ప్రపంచము. సృష్ఠికర్తయైన దేవుడు సృష్ఠిలో మరొక దేవున్ని తయారు చేసి, తన అధికారములన్నీ సృష్ఠింపబడిన దేవునికి ఇచ్చి ఆయన చేత మొత్తము జీవరాశులను సృష్ఠింపజేసి వారిని అందరినీ నడిపించు బాధ్యత సృష్ఠిపంబడిన దేవునికే ఇచ్చాడు. సృష్ఠికర్తయైన దేవుడు ప్రకృతిని మరియు తనలాంటి దేవున్ని తయారు చేసిన తర్వాత అన్ని పనులు తాను తయారు చేసిన దేవునికి అప్పజెప్పి తాను ఏ పనినీ చేయనివాడుగా ఉండిపోయాడు. తాను తయారు చేసిన దేవుని చేతనే సర్వజీవరాశులను తయారు చేయించి అందరికీ దేవునిగా చేశాడు. అప్పటినుండి తయారు చేయబడిన దేవుడు, అందరినీ తయారు చేసి, శరీరధారులను పరుగెత్తించుచున్నాడు. ఇదే విషయమునే సూరా 50, ఆయత్ 21 లో ఇలా చెప్పారు చూడండి.

(50-21) ''ప్రతి జీవాత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది.''

ప్రతీ ప్రాణిని తోలేవాడు సృష్ఠింపబడిన దేవుడుకాగా, సృష్ఠింపబడిన దేవుని చేత సృష్ఠింపబడిన ప్రాణులు తోలబడుచున్నవి. ఇద్దరినీ చూస్తున్నవాడు దేవున్ని సృష్ఠించిన దేవుడు. ఈ ముగ్గురి విషయము మూడు దైవ గ్రంథములలో చెప్పబడినది. అయితే ఇద్దరి దేవుళ్లను మనుషులు అర్థము చేసుకోలేకపోవుచున్నారు. తౌరాతు (భగవద్గీత) గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'అక్షరుడు' అని చెప్పారు. సృష్ఠించిన అల్లాహ్‍ను 'పురుషోత్తముడు' అని అన్నారు. ఇంజీలు (బైబిలు) గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'కుమారుడు' అని అన్నారు. మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్‍ను 'తండ్రి' యని అన్నారు. ఖుర్ఆన్ గ్రంథములో సృష్ఠింపబడిన అల్లాహ్‍ను 'తోలేవాడు' అని అన్నారు. సృష్ఠించిన అల్లాహ్‍ను 'సాక్షి' యని అన్నారు. మూడు గ్రంథములలో ఒక మనిషిని, ఇద్దరు దేవుళ్ళను చెప్పడమైనది. తౌరాతు గ్రంథములో 15వ అధ్యాయములో 16, 17 శ్లోకములలో చెప్పడమైనది. ఇంజీలు గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యములో చెప్పారు. అట్లే ఖుర్ఆన్ గ్రంథములో 50-21లో 'ఇద్దరు దేవుళ్లను, మనిషిని' గురించి చెప్పడమైనది. ఒక దైవ గ్రంథమును చదివినవారికి పూర్తి జ్ఞానము అర్థము కాదు. మూడు దైవ గ్రంథములు చదివిన వారికే సంపూర్ణ జ్ఞానము తెలియగలదు. దేవుడు చెప్పిన సత్యము తెలియుటకు మూడు దైవ గ్రంథములు చదువవలసిందే. అప్పుడే హిందువులకు, క్రైస్థవులకు, ముస్లీమ్‍లకు ఇద్దరు దేవుళ్లను గురించి తెలియును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
35. తౌరాత్ అంటే ప్రథమ దైవ గ్రంథము. (5-44)
తౌరాత్ గ్రంథము 'పూర్వము ప్రజల కొరకు దేవుడు పంపిన 'గ్రంథమని' చాలామంది నమ్మకము. నేటి ముస్లీమ్‍లు ఎవరూ తౌరాత్ గ్రంథమును చూచియుండలేదు. అయితే ముస్లీమ్‍లు తౌరాతు గ్రంథము తమ పెద్దల వద్ద యుందని చెప్పుకొనుట చూచాము. ముస్లీమ్ పెద్దలను అడిగితే ఇప్పుడు మనవద్ద లేదు, అరబ్ దేశములో ఉందని కొందరు, మక్కాలో ఉందని కొందరు, మదీనాలో ఉందని కొందరు చెప్పుచుందురు. మొత్తానికి తౌరాతు గ్రంథము ఉందని ఎందరు అనుకొన్నా, ఎవరూ దానిని చూడలేదు. సూరా ఆరు, ఆయత్ 91లో ''తౌరాతు గ్రంథమును ఇచ్చినవాడు, అవతరింప చేసినవాడు అల్లాహ్‍యే'' అని కలదు. అల్లాహ్ ఇచ్చిన గ్రంథము నేడు ఏమయినది? అని ప్రశ్నించుకొంటే తౌరాతు గ్రంథము వెనుక పెద్ద చరిత్ర దాగియున్నది. ఆ చరిత్ర మూడు మతముల వారికి ఏమాత్రము తెలియదు. నేడు మనము ఆ చరిత్రను కదిలించితే ఎన్నో క్రొత్త విషయములు తెలియుచున్నవి.

తౌరాతు గ్రంథము 5000 సంవత్సరముల పూర్వము మోషేకు ఇవ్వబడినది. మోషే పేరు బైబిలు గ్రంథములో చూడవచ్చును. మోషే ఒక ప్రవక్త. 'మోషే ధర్మశాస్త్రము' అను పేరుతో తౌరాతు గ్రంథములోని విషయములు ఆ కాలములో ప్రజలకు తెలియజేశాడు. మోషే చెప్పిన ధర్మశాస్త్రము వలన ఆ కాలములో కొందరు దైవజ్ఞానమును తెలియగలిగారు. మోషే పోయిన తర్వాత ఆయన ధర్మశాస్త్రము ఆగిపోయినది. బైబిలులో మోషే అని పిలువబడిన మోషేయే ఖుర్ఆన్ గ్రంథములో మూసా ప్రవక్తగా చెప్పబడినాడు. అయితే మోషే, మూసా ఇద్దరూ ఒక్కరేయను విషయము చాలామందికి తెలియదు. బైబిలులో యున్న మోషే వేరు, ఖుర్ఆన్ గ్రంథములో యున్న మూసా వేరని కొందరు అంటున్నారు. చరిత్ర తెలియని వారు ఎట్లు మాట్లాడినా అది లెక్కించబడదు.

మోషే ప్రవక్త యుక్తవయస్సులోనే తౌరాతు గ్రంథమును పొంద గలిగాడు. 6-91లో తౌరాతు గ్రంథమును అల్లాహ్‍యే మూసాకు ఇచ్చాడు అని కలదు. అప్పుడు జరిగినదే ఖుర్ఆన్ గ్రంథములో వ్రాయబడినది. తౌరాతు గ్రంథము 5000 సంవత్సరముల పూర్వము ఇంకొక పేరుతో గ్రంథముగా వ్రాయబడినది. అలా వ్రాయబడిన గ్రంథమునకు పెట్టబడిన పేరు అల్లాహ్‍కు నచ్చలేదు. ఆ రోజులలో అల్లాహ్ చెప్పినట్లు తెలియకుండా చెప్పబడిన గ్రంథము తౌరాతు గ్రంథము. అయితే 'అల్లాహ్ చెప్పిన గ్రంథము' అను అర్థముతో యున్న పేరును గ్రంథమునకు పెట్టడము వలన ఆ పేరుతో ఇది దేవుడు చెప్పిన గ్రంథమని తెలియగలదు. అలా తెలియుట అల్లాహ్‍కు ఇష్టము లేదు. అందువలన మోషేకు గ్రంథమును ఇచ్చినప్పుడు పాతపేరు చెప్పకుండా క్రొత్తపేరు చెప్పబడినది. ఆ క్రొత్త పేరే 'మూడు రాత్రులు' అని అర్థమొచ్చునట్లు 'తౌరాత్'యని చెప్పాడు. ముందున్న పేరు ఏమిటి? ముందు గ్రంథమును వ్రాసినవారు ఎవరు? అని ప్రశ్నించుకొని చూస్తే, తౌరాత్ గ్రంథమును గురించి ఎవరికీ తెలియని క్రొత్త విషయములు, చరిత్రలో మరుగున పడిపోయిన విషయములు తెలియగలవు.

ద్వాపర యుగము చివరిలో 5150 సంవత్సరముల పూర్వము కృష్ణుడు అర్జునునకు దైవ జ్ఞానమును బోధించాడు. అలా చెప్పిన జ్ఞానమును తర్వాత వ్యాసుడు గ్రంథరూపము చేశాడు. గ్రంథరూపము చేసిన దానికి 'భగవద్గీత' యను పేరు పెట్టబడినది. అదే మొదట తయారయిన దైవగ్రంథము. అందువలన దానిని 'ప్రథమ దైవగ్రంథ'మని చెప్పడమైనది. మోషేకు 20 సంవత్సరముల వయస్సులో స్వప్నావస్థలో భగవద్గీత జ్ఞానమును చెప్పిన కృష్ణుడు భగవద్గీత గ్రంథమును ఇవ్వడము జరిగినది. అలా ఇచ్చినప్పుడు ఆ గ్రంథము పేరు భగవద్గీతయని చెప్పకుండా దానిపేరు మార్చి 'తౌరాత్' గ్రంథమని చెప్పాడు. అప్పటినుండి మోషే దానిని తౌరాతు గ్రంథమని చెప్పుచుండెను. నేడు భగవద్గీత భారతదేశములో ప్రత్యక్షముగా యున్నా, ఇదే ఆ తౌరాతు అని ఎవరికీ తెలియదు. ఈ విషయము ఆనాడు మోషేకు కూడా తెలియదు. ఇక్కడ భగవద్గీతగా చెప్పబడునది, అక్కడ ఇజ్రాయెల్ దేశములో తౌరాతుగా చెప్పబడేది. ఇంకొక రహస్యమేమనగా! మోషేకు తౌరాతు గ్రంథమును ఇచ్చినవాడు కృష్ణుడే అయినా అది ప్రత్యక్షముగా మెలుకువలో జరుగలేదు. జరిగినది స్వప్నములో జరిగినది. తర్వాత మోషేకు ఒక్కనికి మాత్రమే తౌరాతు గ్రంథము ప్రతీ దినము స్వప్నములోనే కనిపించేది. అప్పుడు మోషే ప్రతి రోజు తౌరాతు గ్రంథమును చదివేవాడు. అట్లు 34 సంవత్సరములు కనిపించగా ఎన్నోమార్లు పూర్తిగా చదవడమైనది. తౌరాతు గ్రంథములోని జ్ఞానము ఒక్క మోషేకు తప్ప ఎవరికీ తెలియదు.

మోషే తప్ప తౌరాతు గ్రంథమును ఎవరూ చూచినవారు లేరు. భారతదేశములో సంస్కృతములో వ్రాయబడిన భగవద్గీత మోషేకు తౌరాతు యను పేరుతో ఇవ్వబడడమే కాక స్థానిక భాషలో గ్రంథమును ఇవ్వడము జరిగినది. మోషే చదువగల్గిన భాషలో లభ్యమయిన గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూచుటకు అవకాశమే లేదు. మోషేకు స్వప్నములో కనిపించినా గ్రంథములోని విషయములు మెలుకువలో కూడా బాగా జ్ఞాపకముండేవి. అందువలన మోషే గ్రంథములోని ధర్మములను ప్రజలకు తెలియజేసెడివాడు. అలా తెలియజేయబడినదే మోషే ధర్మశాస్త్రము అని బైబిలులో చెప్పబడినది. తౌరాతు గ్రంథములోని ధర్మములను చదివినవాడు, గ్రంథమును చూచినవాడు ఒక్క మోషే తప్ప ప్రపంచములో ఎవరూ లేరు. మోషే తర్వాత తౌరాతు గ్రంథము ఎవరికీ కనిపించలేదు. అందువలన అందరూ తౌరాతు గ్రంథము పేరును విన్నారు గానీ, తౌరాతు గ్రంథమును చూచినవారు అప్పటినుండి ఇప్పటివరకు ఎవరూ లేరు.

తౌరాతు గ్రంథము ఇప్పటికీ భారతదేశములో భగవద్గీత యను పేరుతో సజీవముగా యున్నా, ఈనాటి భగవద్గీతయే ఆనాటి తౌరాతు యని ఎవరికీ తెలియదు. చరిత్ర తెలియని వారు నేడు మేము చెప్పేమాటను నమ్మలేకయున్నారు. తౌరాతు గ్రంథము ఉంది అని వాదించువారు కూడా కలరు. అటువంటి వారిని మీరుగానీ, గతములో మీ పెద్దలుగానీ చూచారా? అని అడుగుచున్నాము. అట్లే ప్రపంచములో ఏ భాషలోగానీ, ఏ దేశములో గానీ, ఏ మనుషులుగానీ చూచినట్లు ఆధారము కలదా!యని ప్రశ్నించు చున్నాము. తౌరాతు అంటే ఏమిటో తెలియనివారు చాలామంది దానిని గురించి ఊహించుకొని చెప్పడమేగానీ, ప్రత్యక్షముగా చూచి మాట్లాడు వారు ఎవరూ లేరు. అయితే బైబిలుయందు మోషే ధర్మశాస్త్రము అను పేరుతో చెప్పబడిన దానిని ఖురాన్ గ్రంథములో మూసాకు ఇవ్వబడిన తౌరాత్ గ్రంథముయని వ్రాసియుండుట కలదు. అయితే ఖుర్ఆన్‍లో చెప్పబడిన మూసా, బైబిలులో చెప్పిన మోషే ఇద్దరూ ఒక్కరేయని ఎవరికీ తెలియదు. అట్లే బైబిలులో చెప్పిన మోషే ధర్మశాస్త్రము ఖుర్ఆన్‍లో చెప్పబడిన తౌరాతు గ్రంథము రెండూ ఒక్కటేనను విషయము కూడా ఎవరికీ తెలియకుండా పోయినది.

తౌరాతు గ్రంథములో చెప్పబడిన జ్ఞానమును వ్యాసుడు వ్రాసినా, కృష్ణుడు చెప్పినా, కృష్ణుడు తనమీద పెట్టుకోక అందులోని జ్ఞానమును నీకు జ్ఞాపకము చేయుచున్నానని చెప్పాడు. అందులోని జ్ఞానమంతయూ సృష్ఠి ఆదిలో ఆకాశవాణి చెప్పిన జ్ఞానమని చెప్పాడు. సృష్ఠి మొదలయిన తర్వాత మొట్టమొదట ఆకాశవాణి ద్వారా దేవుని జ్ఞానము చెప్పబడినది. ఆకాశము ఉరిమి ఉరుములుగా ఇచ్చిన జ్ఞానమును మనుషులు గ్రహించ లేదుగానీ, ఆ భాషను, ఆ శబ్దములోని భావమును ఆకాశములోని సూర్యుడు గ్రహించి, తర్వాత భూమిమీద మనుషులు మాట్లాడు భాషలో 'మనువు' అను వ్యక్తికి వాణి ద్వారా వచ్చిన జ్ఞానమును తెలిపాడు. మనువుకు తెలిసిన జ్ఞానము చివరకు భగవద్గీతగా తయారయినది. వాణి ద్వారా వచ్చిన జ్ఞానమే తర్వాత 'బైబిలు' గ్రంథముగా తయారయినది. దానివలన తౌరాతు యనబడు జ్ఞానము, అనగా! భగవద్గీత యనబడు జ్ఞానమే బైబిలుగా వచ్చినదని తెలియుచున్నది. అట్లే భగవద్గీతలోని జ్ఞానమే 'ఖుర్ఆన్'గా కూడా వచ్చినది. అయితే ఖుర్ఆన్ చదివే వారికి ఇది భగవద్గీత (తౌరాతు) జ్ఞానమేయని తెలియకున్నది. అట్లే బైబిలు చదివే వారికి ఇది తౌరాతు జ్ఞానమేయని తెలియదు. ఖుర్ఆన్‍లో తౌరాత్ జ్ఞానమే ఉన్నదని తెలియునట్లు కొన్ని ఆయత్‍లు చెప్పబడినవి చూడండి.

(5-46) ''ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యం కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథమును ఇచ్చాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథమును ధృవీకరించేది.''

(5-48) ''మేము నీవైపుకు సత్యసమేతముగా ఈ ఖుర్ఆన్ గ్రంథమును అవతరింపజేశాము. ఇది తమకన్నా ముందు వచ్చిన భగవద్గీత (తౌరాతు), ఇంజీలు (బైబిలు) గ్రంథాలను సత్యమని ధృవీకరించుచున్నది.''

ఈ విధముగా తౌరాతు (భగవద్గీత) ను గొప్పగా చెప్పడము జరిగినది. తౌరాతు గ్రంథములోని జ్ఞానమే మాయందు గలదని ఖుర్ఆన్ మరియు బైబిలు రెండూ ధృవీకరించుచున్నవి. ముందు చెప్పిన 5-46 వాక్యములో బైబిలు, భగవద్గీతను సత్యమని ధృవీకరించుచున్నదని చెప్పారు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములలో భగవద్గీత రెండు గ్రంథములకు పుట్టినిల్లులాగ యున్నది. రెండు గ్రంథములలోనూ మొట్టమొదట ఆకాశవాణి చెప్పిన జ్ఞానమే కలదు. మొదట ఆకాశవాణి జ్ఞానము భగవద్గీతగా తయారయినది. తర్వాత బైబిలు, ఖుర్ఆన్‍లుగా తయారయినది. అందువలన భగవద్గీతలోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములయందు కలదని ఆకాశవాణి జ్ఞానమును భూమిమీద చెప్పిన సూర్యుడే (జిబ్రయేల్) చెప్పుచున్నాడు. తౌరాత్ గ్రంథమును గురించి ఇంకనూ ఏమి చెప్పు చున్నారనగా!

(5-68) ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభువు మీ వద్దకు పంపిన ఖుర్ఆన్ గ్రంథములను మీరు చదివి మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''

(5-44) ''మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఈ తౌరాతు గ్రంథ ఆధారముగానే ముస్లీమ్‍లైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు.''

(62-5) ''తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి నప్పటికీ దానికి అణుగుణముగా ఆచరించనివారు ఎన్ని గ్రంథములు అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథము లను వీపుమీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్ఠాంతము చాలా చెడ్డది.''

తౌరాతు (భగవద్గీత)ను గురించి ఇంత గొప్పగా చెప్పారని ఎవరికీ తెలియదు. ముస్లీమ్‍లకయితే ఏమాత్రము తెలియదు. మొదటికి తౌరాతు భగవద్గీత రెండూ ఒక్కటేయని మిగతా మతస్థులకు కొద్దిగా కూడా తెలియదు. స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పియుండడము వలన నేడు మనకు తెలిసినది. ఖుర్ఆన్ గ్రంథములో మతసామరస్యము కలదు. అందువలననే ఖుర్ఆన్, ఇంజీలు రెండు గ్రంథములు తౌరాతును సమర్థించుచున్నవి. అయితే గ్రంథములలో ఎక్కడా 'మతము' అను ప్రసక్తి లేదు. మూడు గ్రంథముల జ్ఞానము ఒకదానితో మరొకటి కలిసియున్నది. అయినా మనుషుల మధ్య గ్రంథముల జ్ఞానము పెరుగక, మాయతో కూడుకొన్న మతము పెరిగినది. దానివలన కొందరిది ఒక మతము, మరికొందరిది ఇంకొక మతము అనుచూ, అంతటితో ఆగక మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని అంటున్నారు.

అందరికీ ఒక్కడే దేవుడు, అందరికీ ఒక్కటే జ్ఞానము అని ఎవరూ అనడము లేదు. సృష్ఠ్యాదిలో చెప్పిన జ్ఞానము మొదటి గ్రంథముగా వచ్చినది. ఆ గ్రంథమునకు మొదటి పేరు వ్యాసుడు పెట్టాడు. రెండవ పేరు కృష్ణుడు పెట్టాడు. కృష్ణుడు జ్ఞానమును బోధించినవాడు, రెండవ పేరు తౌరాతుయని పెట్టాడు. వ్యాసుడు కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపములో వ్రాశాడు. అప్పుడు వ్యాసుడు తాను వ్రాసిన గ్రంథమునకు 'భగవద్గీత'యను పేరు పెట్టాడు. అయితే ఈ విషయము ఎవరికీ తెలియకపోవడము వలన తౌరాతు గ్రంథము వేరు, భగవద్గీత గ్రంథము వేరని అందరూ అనుకొన్నారు. భవద్గీతయను పేరు వ్యాసుని చేత చెప్పబడినది. తౌరాతుయను పేరు స్వయముగా కృష్ణుడే చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు చెప్పిన రెండు సంవత్సరములకు తయారుకాగా, తర్వాత కృష్ణుడే స్వయముగా మూసాకు (మోషేకు) గ్రంథము ఇచ్చి దాని పేరు 'తౌరాతు'యని చెప్పాడు. తౌరాతు యను పేరు ఖుర్ఆన్‍లో వినిపిస్తూయున్నది.

'మూడు దైవ గ్రంథముల ఉద్దేశ్యము ఒక్కటే' అను విషయము మూడు మతముల వారికీ తెలియదు. ఆ విషయము తెలియక అజ్ఞానముతో భేదాభిప్రాయములు కల్గియున్నారు. వాస్తవమును తెలియగల్గితే అటువంటి భేదాభిప్రాయములు ఉండవు. అయితే దైవ గ్రంథముల బోధలోని ఉద్దేశ్యమేమిటి? అని తెలియువారు ఎవరూ లేరు. ముస్లీమ్‍లు 'మా ఖుర్ఆన్ గ్రంథమే గొప్ప, దీనిలోనే సత్యమైన జ్ఞానము కలదనీ, ఖుర్ఆన్ ముస్లీమ్‍ల గ్రంథమనీ' అనుకొంటున్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో 81-27లో ''ఇది (ఖుర్ఆన్) సమస్త ప్రజలకు హితోపదేశము'' అని చెప్పబడి యున్నది. దీనినిబట్టి ఖుర్ఆన్ ఒక మతమునకు సంబంధించినది కాదు అని తెలియుచున్నది. ఖుర్ఆన్ ఒక్కటే కాకుండా మిగతా రెండు గ్రంథములు కూడా ప్రజలందరికీ యని చెప్పియున్నారు. బైబిలులో ''సమస్త మానవులారా నావద్దకు రండి''యని చెప్పబడి యున్నది. అందువలన ఇది అది అనకుండా మూడు గ్రంథములు మతాలకు సంబంధము లేకుండా ప్రజలందరికీ అవసరమని తెలియుచున్నది. దీనినిబట్టి గీత హిందువులది కాదు, బైబిలు క్రైస్థవులది కాదు, ఖుర్ఆన్ ముస్లీమ్‍లది కాదు అని తెలియడమేకాక మూడు దైవగ్రంథములు ప్రజలందరికీ సంబంధించినవనీ, ఏ ఒక్క మతమునకు సంబంధించినవి కాదని తెలియుచున్నది.

మూడు దైవ గ్రంథములలో ముఖ్యమైన, రహస్యమైన ఒక ఉద్దేశ్యము గలదు. ఆ ఉద్దేశ్యమును ప్రజలలో ఎవరూ గ్రహించ లేకపోయారు. దేవుడు సృష్ఠ్యాదిలో ప్రకృతిని తయారు చేశాడు. తర్వాత తననుండి తన అంశగాయున్న ఆత్మ, జీవాత్మలను తయారు చేశాడు. ఆత్మకు తన అధికారములన్నీ ఇచ్చి దేవునిగా చేసి జీవున్ని పాలించమన్నాడు. జీవులందరికీ ఆత్మ దేవుడు కాగా, సృష్ఠికర్తయైన పరమాత్మ సాక్షిగా యున్నాడు. జీవాత్మ అనుభవించేవాడు కాగా, ఆత్మ అనుభవింపజేయు దేవుడుకాగా పరమాత్మ సాక్షిగా యున్నాడు. ప్రతి జీవి శరీరములో నివాసముండగా శరీరములోని ఆత్మచేత జీవుడు ఆడింపబడుచూ కర్మఫలమును అనుభవించు చున్నాడు. అందువలన ప్రతి మనిషి శరీరములో త్రోలబడేవాడు, త్రోలే వాడు, చూచేవాడు యున్నాడని ఖుర్ఆన్‍లో 50-21 యందు గలదు. అదే వాక్యమునే పదములు మార్చి బైబిలు గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయములో 19వ వచనమునందు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యని చెప్పియున్నారు. త్రోలబడేవాడు జీవాత్మకాగా, త్రోలేవాడు ఆత్మకాగా, సాక్షిగా చూచేవాడు పరమాత్మ అని తెలియుచున్నది. ఆ ముగ్గురినే బైబిలులో చెప్పారు. జీవాత్మ కుమారుడు అనియూ, ఆత్మ తండ్రి అనియూ, పరమాత్మను పరిశుద్ధాత్మ అని చెప్పారని తెలియుచున్నది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విషయము భగవద్గీతలో చెప్పియున్నారు. మూడు గ్రంథములలో మూడు ఆత్మలను గురించి చెప్పినా, పేర్లు మార్చి చెప్పియుండుట వలన మూడు గ్రంథములలో ఒకే సమాచారమును చెప్పారని ఎవరి దృష్ఠికీ రాకుండా పోయినది. భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని చెప్పియుండుట వలన భగవద్గీతలో చెప్పిన ముగ్గురినే మిగతా రెండు గ్రంథములలో రెండు వేరువేరు విధములుగా చెప్పియున్నారు. ఎక్కడ చెప్పినా మూడు ఆత్మల విషయమేయని తెలియక వాటిని వేరువేరు విషయములుగా తలచారు.

మూడు ఆత్మలలో జీవాత్మను భగవద్గీతలో క్షరుడు అని చెప్పారు. క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము. ఆత్మను అక్షరుడు అని అన్నారు. అక్షరుడు అనగా నాశనము లేనివాడని అర్థము. పరమాత్మను పురుషోత్తముడు అని అన్నారు. పురుషోత్తముడనగా పరమాత్మయని అర్థము. భగవద్గీతలో మూడు ఆత్మల విషయమును గ్రహించితే ప్రకృతి స్త్రీ సంబంధము కాగా, పురుషుడయిన పరమాత్మ తన నుండి ఇద్దరిని విడదీసి క్షరుడు, అక్షరుడు అని అన్నారు. పరమాత్మ ''మమైవాంశో'' అని అనుట వలన పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీ కాగా, పరమాత్మనుండి విడివడిన క్షరుడు, అక్షరుడు అను ఇద్దరూ పురుషులే. అయితే క్షరుడు నాశనమయ్యే పురుషుడు, అక్షరుడు నాశనము లేని పురుషుడు. ఇద్దరి పురుషులకంటే ఉత్తముడు పరమాత్మ అయినందున పరమాత్మను పురుషోత్తముడు అని అన్నారు. మూడు గ్రంథములలోనూ ముగ్గురు పురుషుల జ్ఞానమును వేరువేరు పదములతో చెప్పియుండుట వలన మూడు ఆత్మల విషయమును తెలియజేయు జ్ఞానముగల మొదటి గ్రంథమయిన భగవద్గీతను కృష్ణుడు తౌరాతు యని అన్నాడు. మూడు తెలియని చీకటి రాత్రులను పోల్చి మూడు ఆత్మలను తౌరాత్‍యని చెప్పడమైనది. తౌరాత్ అనునది ప్రత్యక్షముగా భగవద్గీతయందు, పరోక్షముగా బైబిలు ఖురాన్‍ల యందు గలదు. ఎలాగయితేనేమి మూడు ఆత్మల విషయము ఎక్కడయితే యున్నదో అక్కడంతా తౌరాతు గలదని చెప్పవచ్చును. 'తౌ' అనగా మూడుయని తెలుగు భాషలో అర్థము గలదు. సంస్కృతములో కూడా ఇదే అర్థము గలదు. అరబ్బీ దేశములోని అరబ్బీ భాషలో కూడా 'తౌ' అంటే మూడు అని అర్థము గలదు. మొదటికి 'తౌ' అను అక్షరము తెలుగు అక్షరము. 'తౌ' అను తెలుగు అక్షరము మిగతా భాషలలోని అక్షరముగా చెప్పబడుచూ చివరకు అరబ్బీ భాషలో కూడా ఇదే పదము నిలిచిపోయినది. దానివలననే తౌరాత్‍యని ఖుర్ఆన్ గ్రంథములో వ్రాశారు. తౌరాత్ అంటే ముఖ్యముగా మూడు కనిపించని ఆత్మలని అర్థము.

మూడు ఆత్మలను తెలియజెప్పడమే ముఖ్యముగా మూడు దైవ గ్రంథములలోని ఉద్దేశ్యము. దైవ గ్రంథముల బోధయంతయూ మూడు ఆత్మల చుట్టూ ఆవహించి యుండును. ఒక దైవ గ్రంథములో ఒకే వాక్యముగా మూడు ఆత్మలను వేరువేరు వాక్యములుగా చెప్పియున్నా, ఆ గ్రంథమంతా దానిని బోధించుటకేయని తెలియుచున్నది. దైవ గ్రంథములో ఒకే వాక్యముగా చెప్పియున్నా, ఆ వాక్యమే ఆ గ్రంథమునకంతటికీ తలమాణిక్యములాగ యున్నది. ఈ విషయము గ్రంథము చదివిన వారికి సామాన్యముగా తెలిసియుండదు. ప్రతి మనిషియందు, ప్రతి జీవరాసియందు ఈ మూడు ఆత్మలేయున్నవి. మూడు ఆత్మలు లేనిది జీవము లేనిది యని పిలువబడును. జీవమున్నది యంటే జీవమును అంటుకొని ఆత్మయుండును, ఆత్మను అంటుకొని పరమాత్మయుండును. ఈ మూడు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధముగా ఉండును. మొదట పుట్టిన ప్రకృతిలోని ఆకాశములోగానీ, గాలిలోగానీ, అగ్నిలోగానీ, నీరులోగానీ, భూమిలోగానీ ఈ మూడు ఆత్మలే గలవు. మూడు ఆత్మలు లేని జీవరాసి ఏదీ లేదు. అందువలన దైవ గ్రంథములో మూడు ఆత్మలు ప్రత్యక్షముగా ఒకే వాక్యములో మాత్రమే చెప్పియున్నా, పరోక్షముగా గ్రంథమంతా చెప్పియున్నట్లు కలదు. అందువలన ప్రథమ దైవ గ్రంథమునకు భగవద్గీతయను పేరు సరిపోలేదని తెలిసిన కృష్ణుడు దానికి స్వయముగా 'తౌరాత్' యని పేరుపెట్టి మోషేకు ఇవ్వడము జరిగినది. మొదటి దైవ గ్రంథమునకు మూడు అక్షరముల పేరు తౌరాతుయని పేరు పెట్టిన తర్వాత, తౌరాతులోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలోనూ ఉండుటను బట్టి ఆ రెండు గ్రంథములకు కూడా మూడు అక్షరముల పేర్లే చెప్పబడినవి. అందువలన 'తౌరాత్' అను పదమునకు అర్థము మూసిపెట్టి చెప్పితే మూడు రాత్రులనీ, తెలిసి చెప్పితే మూడు ఆత్మలనీ చెప్పవచ్చును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
36. అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించే వారికి భయము లేదు. (5-69)
నేడు మనుషులు నిర్మించుకొన్న 12 మతములలో ముఖ్యమైనవి మూడే గలవు. హిందూ, క్రైస్థవ, ముస్లీమ్ అను మూడు మతములలోని మనుషులలో ఒక్క హిందూమతము పురాతనమైనది. ప్రపంచములో ఎక్కువ దైవజ్ఞానము గలదిగా ఒకప్పుడు ఇందూ సమాజమే ఉండేది. ఇందూ సమాజము కలియుగములో ఇందూమతముగా తయారయినది. ఆ తర్వాత ఇందూ మతము కాస్త మారిపోయి హిందూ మతముగా చెప్పబడుచున్నది. ఈ పేర్లు ఎలా మారుతూ వచ్చాయో అలాగే హిందువులు అజ్ఞానులుగా మారుతూ వచ్చారు. అందువలన నేడు హిందువులకు దేవుడు ఎవరో తెలియదు. ముఫ్పైమూడు కోట్ల దేవతలను ఆశ్రయించి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధించుచున్నారు. ఒక కుటుంబములో పదిమంది యుంటే ఇంటి అందరికీ ఇంటి దేవుడు ఒకడుండును. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్ట దేవుడు ఉండును. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత దేవత యుండును. మానవజాతిని దేవుడు సృష్ఠించినట్లే, దేవతజాతి జీవరాసులను కూడా దేవుడు సృష్ఠించాడు. మనుషులు కనిపిస్తారు, దేవతలు కనిపించరు. దీనినిబట్టి కనిపించే మనుషులను, కనిపించని మనుషులను రెండు రకముల వారిని దేవుడు సృష్ఠించాడు. దేవతలను ఖుర్ఆన్ గ్రంథములో 'జిన్నాతులు' అని అన్నారు. ఖుర్ఆన్‍లో సూరా 51 ఆయత్ 56లో ఇలా కలదు.

(51-56) ''నేను జిన్నాతులను మరియు మనుషులను సృష్ఠించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.''

దేవుడు ఈ విధముగా మనుషులను, దేవతలను (జిన్నాతులను) సృష్ఠించినది ఆయనను ఆరాధించడానికే గానీ, ఇతరులను ఆరాధించడానికి కాదు. అయితే మనుషులు కనపరాని జిన్నాతులను (దేవతలను) గొప్పగా తలచి, దేవున్ని వదలి దేవతలను ఆరాధించుచున్నారు. ఇదే విషయమును అంతిమ దైవగ్రంథములో సూరా 72 ఆయత్ 6లో ఇలా చెప్పారు. చూడండి.

(72-6) ''అసలు విషయమేమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతులను ఆరాధించేవారు కలరు. ఈ కారణముగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.''

ఈ వాక్యము ప్రకారము నేడు హిందువులు తమతోపాటు పుట్టి, తమతోపాటు పెరిగి, తమతో పాటు చనిపోవు దేవతలను గొప్పవారుగా నమ్మి అజ్ఞానముతో అసలయిన దేవున్ని వదలి, దేవునికి చేయవలసిన ఆరాధనలు దేవతలకు చేయుచున్నారు. వాస్తవముగా 'ఆరాధ్యదైవము దేవుడు ఒక్కడే.' అయినా మనుషులు అజ్ఞానముతో తమతోపాటు చావు పుట్టుకలు గల దేవతలను గొప్పగా తలచి, దేవుని విషయము తెలియక దేవతలను ఆరాధించుచున్నారు. దానివలన దేవతలు కూడా మనుషులవలె అజ్ఞానములో పడిపోయి, తాము మనుషులతో సమానముగా పుట్టినవారమే నని మరచిపోయి, తమను గొప్పగా ఊహించుకొని వారు కూడా దేవున్ని మరచి పొగరుపోతులై తిరుగుతున్నారు. దేవుడు చేయు పనులను తామే చేసినట్లు తలచుచున్నారు. మనుషులు కోరిన కోర్కెలు ఏవయినా నెరవేరితే అవి తమ వలననే నెరవేరినవని అనుకొంటున్నారు. ఈ విధముగా మనుషులు, దేవతలు ఇరువురూ అజ్ఞానములో కూరుకపోయి ఉన్నారు. తమను సృష్ఠించినది దేవుడే యను మాటను మరచిపోయారు. ఈ విధముగా నేడు హిందువుల మనుషులలోనూ, హిందువుల దేవతలలోనూ జరుగు చున్నది. ఎక్కడయినా అరుదుగా కొన్ని లక్షల దేవతలకొకరు తాను దేవతా జన్మ ఎత్తినా, దేవున్ని గురించి తెలుసుకొని, దేవుని మార్గములో ప్రయాణిస్తూ, దేవున్ని ఆరాధించుచున్నారు.

మూడు మతస్థులలో ఏ మతస్థుడయినాగానీ, ఏ దేవతను పూజించినా అతడు దేవున్ని ఆరాధించనట్లేయగును. దేవుడు ఎవరో తెలిసి, దేవతలు ఎవరో తెలిసినప్పుడు దేవతలను వదలి దేవున్ని ఆరాధించ వచ్చును. సృష్ఠికర్తయిన దేవుడు ఎవరో? ఆరాధనకు యోగ్యుడయిన లేక ఆరాధనకు అనుమతి పొందిన దేవుడు ఎవరో? అనుమతి పొందిన దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలెవరో తెలిసినప్పుడు మనుషులు ఆరాధించవలసిన దేవున్ని ఆరాధించగలరు. ఇప్పుడు చెప్పినవారిని మూడు రకములుగా విభజించి చెప్పవచ్చును. మొట్టమొదట భూమిని, ఆకాశమును సృష్ఠించిన దేవుడు, రెండవది సృష్ఠ్యాదిలో సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడిన దేవుడు, మూడవది సృష్ఠింపబడిన దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలు. ఈ మూడు భాగములుగా యున్న వారిలో ఎవరిని ఆరాధించవలెనో, మనుషులు ఆరాధించుటకు తగిన దేవుడు ఎవరో తెలిసి ఆయననే ఆరాధించడమును నిజమైన జ్ఞానమగును. ఇంతవరకు దేవతల విషయము తెలిసిపోయినది. సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించవద్దని చెప్పాము. దేవతలు మనుషులు ఇద్దరూ సమానమేనని చెప్పబడినది. అయితే దేవతలను వదలి చూస్తే సృష్ఠి ఆదిలో భూమిని, ఆకాశమును మొట్టమొదట సృష్ఠించిన దేవుడు మొదటివాడు కాగా, సృష్ఠికర్తయైన దేవుని చేత సృష్ఠింపబడిన దేవుడు రెండవవాడు. ఈ రెండవ దేవుడు కూడా మనుషులు, దేవతలు సృష్ఠింప బడినట్లే మొదటి దేవుని చేత సృష్ఠింపబడినవాడు. దేవతల విషయము తెలిసిపోయింది.

ఇప్పుడు సృష్ఠించిన దేవుడు, సృష్ఠించబడిన దేవుడు ఇద్దరున్నారు. ఈ ఇద్దరి దేవుళ్లలో ఎవరిని ఆరాధించవలెనో తెలిస్తే, అంతిమ దినమున ఎవరు తీర్పు తీర్చుదురో తెలిస్తే అతనినే విశ్వసించి ఆరాధించవచ్చును. అందువలన అంతిమ దైవ గ్రంథములో సూరా ఐదు ఆయత్ 69లో ఇలా చెప్పారు చూడండి.

(5-69) ''ముస్లీమ్‍లైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్థవులు) అయినా, ఎవరయినా సరే వారు గనుక అల్లాహ్‍ను (దేవున్ని) మరియు అంతిమ దినమును విశ్వసించి సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయముగానీ, చింతగానీ ఉండదు.''

ఈ వాక్యములో ఏ మతస్థుడయినా వాడు ఆరాధించవలసిన దేవుడు ఎవరో తెలిసిన మనిషి చనిపోవు అంతిమ దినమున దేవుడే మళ్లీ జన్మకు కర్మ తీర్పు తీర్చి పంపునని తెలిసి, తన దేవున్ని ఆరాధించుచూ సక్రమ మార్గములో ఉంటూ, ప్రతీ దినము దేవున్ని ఆరాధించు సదాచరణ చేయుచూ యున్న వానికి కర్మలు అంటుకోవు, పాపపుణ్యములు రావు. వాడు రెండవ మారు అంతిమ దినమున తీర్పులోనికి రాడు. అందువలన వానికి భయముగానీ, చింతగానీ ఉండదు అని చెప్పవచ్చునన్నాడు. భయము చింతలేని మాట వాస్తవమే! అయితే ఇక్కడ సదాచరణ అంటే ఏమిటి, అల్లాహ్ అంటే ఎవరో తెలియాలి. నేడు ముస్లీమ్‍లందరూ మేము అల్లాను 'విశ్వసించాము' అని ప్రతి దినము నమాజ్ చేస్తున్నారు. సదా ఆచరించడమును సదాచరణ అంటారు. సదా అనగా ఎల్లప్పుడు అని కూడా అర్థము కలదు. ఎల్లప్పుడు ఆచరణ కల్గి యుండడమును సదాచరణ అని అనవచ్చును. ముస్లీమ్‍లు నమాజ్‍ను చేయడమును సదాచరణ అని అనవచ్చును. అయితే ఇక్కడ ముఖ్యముగా ఒక ప్రశ్న వచ్చుచున్నది. అది ఏమనగా! ముస్లీమ్‍లు అందరూ అల్లాహ్‍ను విశ్వసించారు సరే. సృష్ఠించిన అల్లాహ్ ఒకరు, సృష్ఠింపబడిన అల్లాహ్ మరొకరు గలరు. ఈ ఇద్దరి అల్లాహ్‍లలో నేటి ముస్లీమ్‍లు ఏ అల్లాహ్‍ను విశ్వసించారు? అని అడుగుచున్నాము. అల్లాహ్ ఒక్కడే అయివుంటే ఆ ఒక్కనినే ముస్లీమ్‍లు అందరూ విశ్వసించారు అని చెప్పవచ్చును. ఇప్పుడు ప్రశ్న వచ్చినది. జవాబును వారినే అడిగి తెలుసుకోవలసి యున్నది.

ఈ ప్రశ్న ఒక ముస్లీమ్ మతస్థులకే కాదు. దైవ గ్రంథములు గల మిగతా రెండు మతములవారికి కూడా అడుగుచున్నాము. ఒక గ్రంథములోగల విషయము ఏదయినా, మిగతా రెండు గ్రంథములకు వర్తించును. దైవ గ్రంథములో దైవ సంబంధమైన విషయమే ఉండును గానీ, ప్రపంచ సంబంధ విషయములు ఏవీ ఉండవు. ఎవరయినా ఏ దైవ గ్రంథములోనికైనా ప్రపంచ సంబంధమైన విషయము కలిపియుంటే దానిని దైవ గ్రంథమునకు సంబంధించినదిగా లెక్కించకూడదు. ఇది దేవుని విషయమైనందువలన ప్రతి దైవ గ్రంథమునకు వర్తించును. వర్తించును అని చెప్పడమేకాక మిగతా రెండు దైవ గ్రంథములలో ఇద్దరు దేవుళ్లను గురించి చెప్పబడియున్నది. అయినా ఏ గ్రంథములోని విషయము గానీ, ఏ మతస్థుడుగానీ గ్రహించకుండా తమకు ఒకే దేవుడున్నాడని చెప్పుచున్నారు. ప్రతి గ్రంథములోనూ భగవద్గీత, బైబిలు, ఖురాన్‍లలో ఇద్దరు దేవుళ్లను గురించి చెప్పడమైనది. అయినా అది ఎవరికీ తెలియకుండా పోయినది. మిగతా రెండు మతములను గురించి తర్వాత చెప్పుకొందాము. ఇప్పుడు ముస్లీమ్ మతము వారిని ఈ ప్రశ్న వేస్తే, గ్రంథములో యున్న ప్రశ్నే అని అడిగితే వారివద్ద ఏమీ ఖచ్చితమైన జవాబు ఉండదు. ప్రతి ముస్లీమ్ ఈ విషయములో తమ పెద్దల మాట విని మోసపోయినారు. తమను తమవారే మోసము చేయుచున్నారని తెలియలేకపోయారు. అందుకు సంబంధించిన ఆయత్‍ను చూపి ప్రశ్నించితే ఈ ప్రశ్నే వారికి క్రొత్తగా కనిపించుచున్నది. ప్రశ్న ఎలా కనిపించినా మూడు మతముల వారికి ఇద్దరు దేవుళ్లు కలరనుట సత్యము. అయితే ఇంతవరకు రెండవ దేవున్ని గురించి ఆలోచించలేదు. ఏ దేవున్ని ఆరాధించవలెనను ప్రశ్న కూడా వారికి రాలేదు.

ఖుర్ఆన్ గ్రంథములో దేవునికి దగ్గరగా చెప్పిన వాక్యములు గలవు. దేవునికి దగ్గరగా తీసుకపోయిన వాక్యములో 5-69 కూడా ఒకటి. ఎందుకనగా! ఈ వాక్యము చూచేదానికి చిన్నగయున్నా ''అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించిన'' అని చెప్పియున్నారు. ఆ చిన్న మాటను లోతుగా ఆలోచిస్తే ఎంతో గొప్ప జ్ఞానము తెలియగలదు. దేవుడు ప్రతి ప్రాంతమునకు ఒక గ్రంథమును ఇచ్చాడు. చదివేదానికి అక్షర జ్ఞానాన్ని ఇచ్చాడు. యోచించే దానికి బుద్ధిని ఇచ్చాడు. నీకు, దైవ గ్రంథమునకు మధ్యలో ఎవరినీ లేకుండా చేసుకొని, నీవు చదివి తెలుసుకోవచ్చును కదా! ఎవరో నాకు చెప్పలేదు అనే దానికంటే నీవే ఎందుకు తెలుసుకోకూడదు? ఒక ముస్లీమ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాడు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయి, ''ఇది మా పెద్దలు చెప్పలేదే!'' యని అంటున్నాడు. నీకు గ్రంథములోని విషయము ఎలా తెలియదో అలాగే మీ పెద్దలకు కూడా తెలియదు. అందువలన ''తౌరాతులోని జ్ఞానము మీకుగానీ, మీ పెద్దలకు గానీ తెలియదు'' అని ఖుర్ఆన్ గ్రంథములో 6-91 వాక్యములో చెప్పి యున్నారు. అందువలన నీకు తెలియదను నిందను నీ పెద్దల మీద వేయక నీవు చదివి తెలుసుకోవడము నీ బాధ్యత. ఇట్లు తెలియనివారు ముస్లీమ్ సమాజములో చాలామంది యున్నారని తెలిసిన అల్లాహ్ (దేవుడు) ''అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యములు'' అను పేరుతో ఈ వ్రాతను వ్రాయించుచున్నాడు.

ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. అంతిమ దినము అనునది పుట్టిన ప్రతి మనిషికీ యున్నది. అంతిమ దినము ఉన్నవానికి ప్రథమ దినము, ప్రథమ దినము ఉన్నవానికి అంతిమదినము ఉండుట అనివార్యము అని తౌరాతు గ్రంథములో చెప్పబడినది. ఇప్పుడున్న ప్రతి మనిషికీ, ప్రతి జీవరాసికీ అంతిమ దినము తప్పదు. అంతిమ దినమంటే ఒక జీవితమున చివరి దినము అని చెప్పవచ్చును. ఏదయితే అంతిమ దినము కలదో అదే రెండవ జీవితమునకు ప్రథమ దినము అవుతున్నది. ఒక్క క్షణములో అంతిమ దినము ముగియుచుండగా, అదే క్షణములోనే ప్రథమ దినము మొదలవుచున్నది. ఈ విషయమును కొందరు నమ్మినా నమ్మకపోయినా పూర్తి సత్యబద్దమై యున్నది. అంతిమ దినమునకు ప్రథమ దినమునకు అధిపతి, అధికారి ఒక్కడే. ఆయనే అల్లాహ్. అల్లాహ్ అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న కర్మనుబట్టి తీర్పు తీర్చి రెండవ జన్మకు పంపును. ఇదంతా ఒక్క క్షణములో జరిగిపోవుచున్నది. అలా తీర్పు తీర్చు అధికారము అల్లాహ్‍కు ఒక్కనికే కలదు. అయితే ఆ ఒక్క అల్లాహ్ ఎవరు? సృష్ఠించిన అల్లాహ్నా లేక సృష్ఠింపబడిన అల్లాహ్నా? ఇక్కడ ఇద్దరిలో ఎవరు? అను ప్రశ్నకు జవాబు లేదు. అల్లాహ్‍ను విశ్వసించిన వారు ఆయన చేసే తీర్పును తప్పక విశ్వసించును. అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించే వానికి భయము, చింత లేదు అనుట వాస్తవమే.

అంతిమ దినమును విశ్వసించక తప్పదు. అయితే అంతిమ దినమున నీకు తీర్పు తీర్చువాడు ఎవడు? అన్నదే ముఖ్యమైన ప్రశ్న. వాక్యము చిన్నదే ప్రశ్న మాత్రము పెద్దదే! ప్రశ్న లేకపోతే చిన్నదయినా, పెద్దదయినా మనిషికి ప్రయోజనము లేదు. మనిషికి ఈ వాక్యము వలన ప్రయోజనముండాలి యంటే అంతిమ దినమునకు అధిపతి ఎవరో తెలియాలి. అలా ఆలోచిస్తే ఎవడయితే మనుషుల చేత ఆరాధింపబడు చున్నాడో, ఎవడయితే ఆరాధనకు యోగ్యుడో, ఎవడయితే మానవులకు కావలసిన కార్యములన్నియూ చేయుచూ కార్యకర్తగా యున్నాడో, ఎవడయితే సృష్ఠికర్తయైన అల్లాహ్ చేత సృష్ఠింపబడినాడో, ఎవడయితే సర్వజీవరాసులను సృష్ఠించు కార్యమును చేయుచున్నాడో, ఎవడయితే మూడు దైవ గ్రంథముల లోనూ ఎక్కువగా చెప్పబడినాడో, అతడే అంతిమ దినమునకు, అంతిమ తీర్పుకు అధికారిగా యున్నాడు. అతనే అందరికీ దేవుడు. ఆ ఒక్క దేవున్ని తెలియుట చేత మనిషికి సంబంధించిన జ్ఞానమంతయూ తెలిసి, అజ్ఞానము కొద్దిగా కూడా లేకుండా పోవును. ఎప్పుడయితే అజ్ఞానము లేదో అప్పుడు మనిషిలోని భయము లేకుండా పోవును. ఎప్పుడయితే భయము లేదో అప్పుడు భవిష్యత్తును గురించి చింతన యుండదు. అదే విషయమునే పై వాక్యములో చెప్పియున్నారు. మేము ఎంత చెప్పినా మీకు ప్రశ్నను రేకెత్తించునంత వరకే, జవాబును మీరు తెలియవలసిందే యని తెలుపుచున్నాము. కొందరికి మా మాటలు చెడును బోధించినట్లు, అజ్ఞానము వైపు పంపునట్లు కనిపించుచుండవచ్చును. అలా చేయుట వలన నాకు ఏమీ ప్రయోజనము లేదు. పైగా అల్లాహ్ ఆయత్‍కు తప్పుగా అర్థము చెప్పితే అల్లాహ్ ఆగ్రహమునకు గురికాక తప్పదు. అందువలన మేము ఏమి చెప్పినా దానిని బాగా ఆలోచించి చెప్పుచున్నాము తప్ప, వేరు భావముతో ఎక్కడా చెప్పలేదని తెలియాలి.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
37. ఆహార విషయము. (5-87, 88), (5-3)
విశ్వములో ఒకటి కనిపించే ప్రపంచము, రెండు కనిపించని దేవుడు తప్ప మూడవది ఏదీ లేదు. ఒకటి ఉంది అంటే అది ప్రపంచమునకు సంబంధించినదియైనా ఉంటుంది లేక దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి నదియైనా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినది కాకుండా ఏదీ లేదు. ఒక మనిషి పుట్టాడు అంటే అతను కొంత ప్రపంచమునకు సంబంధించి, కొంత దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి పుట్టియున్నాడు. ప్రపంచములో ఒక మనిషే కాకుండా ఏ జీవరాసి పుట్టినా రెండింటికీ సంబంధించి పుట్టును. బాగా గమనించితే జీవముగలదేది అయినా ప్రపంచమునకు, దేవునికి సంబంధించి యుండును. జీవము లేనిది ఏది అయినా కేవలము ఒక్క ప్రపంచమునకు మాత్రము సంబంధించినదై యుండును. ఇదే విధముగా స్థూల వస్తువులే కాకుండా సూక్ష్మ విషయములు కూడా ఏ దానికో ఒక దానికి సంబంధించి యుండును. విషయములు కూడా రెండే గలవు. ఒకటి ప్రపంచ విషయము, రెండు దేవుని విషయము. ఇంకొక విధముగా చెప్పితే ప్రపంచ వస్తువుకు సంబంధించిన విషయము ప్రపంచమునకు సంబంధించిన విషయముగానే ఉండును. అట్లే దేవుని విషయములు ఉండును. ఒక మాటను చెప్పితే అది దేవుని విషయమా, లేక ప్రపంచ విషయమా తేల్చి చెప్పవచ్చును.

ఇప్పుడు ఆహార విషయమును గురించి అడిగితే అది ప్రపంచ సంబంధ విషయము తప్ప దేవుని విషయము ఏమాత్రము కాదుయని ఎవరయినా చెప్పగలరు. కనిపించే పదార్థముగానీ, వస్తువుగానీ ప్రపంచ సంబంధమైనదే అయి ఉంటుంది. ఆ లెక్క ప్రకారము భార్య విషయమును దైవికము కాదు ప్రపంచ విషయమని చెప్పవచ్చును. భార్య, పుత్రులు మొత్తము శరీర సంబంధమైన వారు ఎవరైనా ప్రపంచ సంబంధమైన వారు గానే చెప్పాలి. శరీర సంబంధ ప్రత్యక్ష పరోక్ష విషయములేవి యున్నా అవి ప్రపంచ విషయములేయని చెప్పవచ్చును. ఆహారము శరీర సంబంధమైనది యగుట వలన దానిని ప్రపంచ సంబంధ విషయముగా చెప్పవచ్చును. ఈ విధముగా సృష్ఠిలోయున్న వాటినన్నిటినీ రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. ప్రపంచములోయున్న కనిపించేవి, కనిపించనివి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయములుగానే యున్నవి. ఈ రెండు విషయములలో ప్రపంచ విషయమును దేవుడు ముందే నిర్ణయించి యుండును. దానిలో ఎవరూ జోక్యము చేసుకోలేరు. ఎవరి జోక్యము వలన అవి మారునవి కావు. దేవుని మొదటి నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచుండును. ఇప్పుడు నేనున్నాను అయితే నా ఆహార విషయమును నేను మార్చుకొనుటకు వీలుపడదు. ముందే దేవుడు నిర్ణయించినట్లు జరుగుచుండును. దేవుడు ముందే నిర్ణయించిన నిర్ణయము ప్రకారమే ప్రతీదీ జరుగును. నా మరణము కూడా నిర్ణయము మీద ఆధారపడి యుండును. అందులో దేవుని నిర్ణయము తప్ప మన నిర్ణయము ఏమాత్రము పని చేయదు.

ప్రపంచము, దేవుడు అను రెండు విషయములలో ప్రపంచ విషయములన్నియూ ముందే నిర్ణయించబడి యుండును. దేవుడు వాటిలో జోక్యము చేసుకోడు. వాటిని గురించి రెండవమారు చెప్పడు. ఒకమారు నిర్ణయము తర్వాత రెండవమారు దేవుడు చేయునది ఏమీ లేదు. దేవుని నిర్ణయము మనిషి పుట్టినప్పుడే మనిషి చావులోనే జరిగియుండును. అదే అంతిమ దిన తీర్పు. ఆ తీర్పును దేవదూతలు అమలు చేయుచుందురు. ఆ తీర్పు మనిషి పుట్టినప్పటినుండి తిరిగి చనిపోవు వరకు అనుభవించవలసి యుండును. ఇది దేవుడు భూమిమీద మనుషుల జీవితములో పెట్టిన విధానము. దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. తీర్పు విధానము అంతయూ ఇటు దేవదూతలు, అటు మనుషుల మీదనే యుండును. దేవుడు ఆ విషయములలో జోక్యము చేసుకోడు. కోర్టులో న్యాయమూర్తి (జడ్జి) తీర్పు చేసిన తర్వాత దానిని అమలు చేయడము పోలీసుల చేతిలో ఉన్నట్లు, మనిషికి దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. మనిషికి వేయబడిన శిక్ష చట్టము ప్రకారము మనిషి అనుభవించి తీరవలసిందే. ఒకవేళ సత్ప్రవర్తన వలన అతని శిక్ష తగ్గే అవకాశమున్నట్లు, మనిషి జీవితములో మనిషి దైవమార్గమును అవలంభించితే దేవుడు వేసిన శిక్ష కొంత తగ్గే అవకాశము ఉండును. ఖైదీ మంచి ప్రవర్తన ఖైదీ చేతిలో యున్నట్లు, మనిషి దైవిక ప్రవర్తన మనిషి చేతిలో యుండును. అందువలన వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే శిక్షమారే అవకాశమున్నట్లు, మనిషి దైవిక మార్గమును అనుసరించు పద్ధతినిబట్టి వానికి నిర్ణయించబడిన శిక్షలో కొంతవరకు మార్పు జరుగవచ్చును.

దైవికమైన ప్రవర్తనను గురించి ఏది సరియైన విధానమో, ఏది నిజమైన దైవమార్గమో దేవుడు తెలియజేయును తప్ప మనిషికిచ్చిన తీర్పులో ఆయన స్వయముగా మార్పుచేయడు. అలా మనిషి దైవికమైన విధానమును తెలియజేయు బాధ్యత దేవునిదే అయివుండుట వలన ఆయన తన బోధల వలన తన జ్ఞాన విధానమంతయూ తెలియజేశాడు. మనిషి అంతిమ దినమున దేవుని తీర్పును పొందిన తర్వాత దైవజ్ఞానమును ఏమాత్రము తెలియకుండా బ్రతికితే వానికి నిర్ణయించబడినవి జరిగితీరును. వాడు దైవ జ్ఞానమార్గములోనికి పోయి దైవజ్ఞానము ప్రకారము నడుచుకోగలిగితే అప్పుడు వానికి నిర్ణయించబడిన విధానము కొంతవరకు మారు అవకాశము గలదు. అందువలన వాని ప్రవర్తన వాని చేతిలోనే యున్నదని దానిని ఎవరూ మార్చలేరని చెప్పవచ్చును. ఇప్పుడు మనిషి జీవితములో ఆహార విషయమును గమనించితే, వాడు ఎప్పుడు ఏమి తినాలని ముందే నిర్ణయించ బడియుండును. మనిషి అంతిమ దినమును పొందినప్పుడే ఆ నిర్ణయము జరిగిపోయి ఉండును. దానిప్రకారము మనిషి తొలి రోజునుండి అనగా శిశు దశ నుండి ఆ నిర్ణయము అమలు జరుగును.

ఒక మనిషికి అంతిమ దిన తీర్పునుబట్టి తన జీవితములో ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనునది వ్రాసిపెట్టబడి యుండును. దాని ప్రకారమే వానికి ఆహారములు లభించుచుండును. కొందరికి వాని తీర్పునుబట్టి సుఖమైన ఆహారములు, రుచికరమైన ఆహారములు లభించుచుండును. కొందరికి కష్టముతో కూడుకొన్న ఆహారములు, రుచిలేని ఆహారములు, రోగప్రదమైన ఆహారములు లభించుచుండును. ఇదంతయూ వానివాని కర్మనుబట్టి అనగా కర్మ తీర్పునుబట్టి యుండును. మనిషి అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి దేవుడు తీర్పు తీర్చి యుండును. ఆ తీర్పు ప్రకారమే అతనికి అమలు జరుగుచుండును. కొందరి జీవితములో ఏమాత్రము కష్టము లేకుండా సుఖవంతమైన, రుచికరమైన ఆహారములు దొరుకుచుండును. కొందరికి వారి జీవితములో ఎంత కష్టపడినా మంచి ఆరోగ్యమైన ఆహారము దొరకదు, రుచికరమైన ఆహారము దొరకదు. ఇదంతయూ మనము అనుభవ పూర్వకముగా చూస్తున్న విషయములే. దీనిని ఎవరూ కాదనలేరు. దేవుడు కూడా తన జ్ఞానములో అదే చెప్పాడు. దేవుడు ఎప్పుడూ సత్యబద్దమైన జ్ఞానమునే చెప్పునుగానీ, అసత్యమైన జ్ఞానమును చెప్పడు. ఒకచోట ఒక రకము, మరొక చోట మరొక రకము చెప్పడు.

దేవుని జ్ఞానము ప్రకారము దేవుడు ప్రపంచ విషయములను గురించి చెప్పడు. దేవుడు దేవుని విషయములను గురించి మాత్రమే చెప్పును. దేవుడు దేవుని సంబంధ జ్ఞాన విషయములు తప్ప ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోడు. ఇప్పుడు ముఖ్యముగా చెప్పదలచు కొన్నదేమనగా! కొందరు దేవుడు తిండి విషయము చెప్పాడు, ఫలానా వస్తువులను తినమన్నాడు, ఫలానావి తినవద్దని చెప్పాడు అని అంటున్నారు. వారు చెప్పే దానినిబట్టి దేవుడు తన ధర్మమును వదలి తాను చేయను అన్న పనులు చేసినట్లగును. దేవుడు దేవుని విషయములనే బోధిస్తాడు తప్ప ప్రపంచ విషయములను బోధించడు. ప్రపంచ విషయములను మనిషి యొక్క అంతిమ దినముననే తీర్పు చేసి చెప్పాడు. ఫలానా వయస్సులో, ఫలానా దినము, ఫలానా పూట, ఫలానా ఆహారము తినవలెనని వ్రాసిపెట్టియుండును. అలా తీర్పులో చెప్పినప్పుడు దానిని కాదని చెప్పే దానికి ఎవరికీ వీలులేదు. ఇంకెవరయినా వచ్చి సంజాయిషీ చెప్పి సరి చేయడానికి వీలులేదు. తీర్పులో చెప్పినది చెప్పినట్లు జరిగితీరును. ''దేవుడు కొన్నింటిని తినవద్దు అని చెప్పాడు'' అని కొందరు అంటున్నారు. దేవుడు ప్రపంచ విషయాలలో జోక్యము చేసుకోడు అన్న మాటకు తినవద్దని చెప్పడము వలన భంగము ఏర్పడును. దేవుడు మాట తప్పినవాడగును. అందువలన మనము వాక్యమును అర్థము చేసుకోవడములో ఏమయినా పొరపడినామేమో కొద్దిగా ఆలోచించండి. దేవుని జ్ఞానమును తేలికగా తీసుకోకూడదు.

దేవుడు ఎక్కడయినా ఫలానా వాటిని తిను, ఫలానా వాటిని తినవద్దు అని చెప్పాడా? అను ప్రశ్నను వేసుకొందాము. ఫలానావి తినమని ఎక్కడా ఏ వాక్యములోనూ చెప్పలేదు. పాపము చేసుకొన్నవాడు తినే తిండిని గురించి చెప్పాడు తప్ప నిన్ను తినవద్దని చెప్పలేదు, అట్లే తినమని కూడా చెప్పలేదు. ఫలానా ఆహారము పాప కార్యములు అని అన్నాడు. ఘోరమైన పాపములు అని కూడా చెప్పాడు. దీనిని బాగా అర్థము చేసుకొంటే ఘోరమైన పాపములు చేసినవారు ఈ ఆహారమునే తినెదరు. పాపకార్యములు చేసినవారికి శిక్షగా ఈ ఆహారమునే ఇస్తాను, ఈ ఆహారము దొరుకునట్లు తీర్పులో నిర్ణయించుతాను అని చెప్పాడని ఎందుకు అర్థము కాదు? పాపము చేసినవారికి దొరుకు ఆహారమును చెప్పాడు తప్ప నిన్ను ఇది తిను, ఇది తినవద్దు అని చెప్పలేదు. నీ కర్మ నిర్ణయములో అనగా తీర్పులో పాపకార్య ఆహారము లభించినా దానిని అహము లేకుండా ఉద్దేశ్య పూర్వకముగా కాకుండా తినినా, దానివలన తిరిగి పాపము రాదు. పాపము చేత నిర్ణయమైన ఆహారమును సత్యతిరస్కారులు, దేవుని ధర్మమును విశ్వసించని వారు తింటే వానికి తిరిగి ఘోరమైన పాపము వచ్చును. అందువలన పాపము చేత నిర్ణయింపబడిన ఆహారము అంతయూ తిరిగి పాపమునే తెచ్చి పెట్టును. అందువలన ఇవి ధర్మసమ్మతము కానివి అన్నారు. ధర్మ సమ్మతము కానివియైనా ఒకవేళ తినినా అహంభావము లేకుండా తిన్నట్లయితే వానికి పాపము రాదు అని చెప్పబడినది.

ఆహార పదార్థముల విషయమై సూరా ఐదులో ఆయత్ 87, 88లో ఈ విధముగా చెప్పారు.

(5-87) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతము (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయముగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.''

(5-88) ''అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థములను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‍కు భయపడండి.'' ఈ రెండు ఆయత్‍లలో మొదటి 87వ వాక్యము ఆహార సంబంధమైనది కాదు. తర్వాత 88వ వాక్యము ఆహార సంబంధమైనది. దేవుడు ప్రపంచములో ఏ వస్తువునయినా నీకు దేవుని ధర్మము ప్రకారము తీర్పు తీర్చబడియుంటే అదే నీకు లభ్యమవుతుంది. ధర్మసమ్మతము చేయబడినది అనగా! దేవుడు నీకు కేటాయించబడినది ఏదయితే వుందో దానిని నీవు నిషేధించుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ భాషను కొంత అర్థము చేసుకోవలసియున్నది. దీనిని నేనే సంపాదించుకొన్నాను అని ఏ వస్తువును అనుకొన్నా ఆ వస్తువును నీవు నిషేధించుకొన్నట్లే అనగా దేవుని ధర్మమును (తీర్పును) నిషేధించుకొన్నట్లగును. దేవుడు ఇచ్చినదే నాకు దొరికింది అని ఇల్లు, భూమి, ధనము, బంగారు విషయములలో అనుకొంటే అది ధర్మమును సమ్మతించినట్లేయగును. అట్లుకాకుండా నేనే సంపాదించుకొన్నాను అనుకొంటే దానిని ధర్మము నుండి నిషేధించి నట్లగును, అప్పుడు అది ధర్మసమ్మతము కాదు, కనుక ఆ వస్తువు విషయములో క్రొత్తగా పాపము వచ్చును. దేవుని ధర్మమును అతిక్రమించు వానిని, అనగా తీర్పు విషయము తెలియని వానిని దేవుడు ఇష్టపడడు అని చెప్పాడు.

ఇకపోతే 88వ వాక్యములో పూర్తి ఆహారమును గురించి చెప్పాడు. దేవుడు తన ధర్మము ప్రకారము తీర్పు తీర్చిన (నిర్ణయించిన) ఆహారమును భుజించమని చెప్పాడు. దానినే మీకు ధర్మసమ్మతము చేయబడి ప్రసాదించిన పరిశుద్ధమైన పాపము రాని వాటినే తినండియని చెప్పాడు. ఇక్కడ 87వ వాక్యములో చెప్పినట్లు ఆహారమును నేనే సంపాదించుకొన్నాను అని అనుకొంటే ధర్మమును మీరిపోయినట్లేయగును. అప్పుడు దానిలోని పాప రహితమును లేకుండా చేసుకొన్నట్లగును. దానినే నిషేధించుకొన్నట్లగును. ఈ రెండు వాక్యములు దైవజ్ఞానము తెలిసిన వారికి, దేవుని చట్టము తెలిసిన వారికి సులభముగా అర్థము కాగలవు. దేవుని ధర్మములు తెలియని వారికి ఈ వాక్యములు అర్థము కావనియే చెప్పవచ్చును. దేవుని చట్టము (ధర్మము) తెలిసినవాడు చెప్పిన జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోగలడు. ధర్మములు తెలియనివానికి అర్థమగుట దుర్లభము అని చెప్పవచ్చును. ఆహార విషయము చెప్పుటకు ముందు దేవుడు ఇచ్చిన వస్తువులను నిషేధించు కోకండియని ముందే హెచ్చరించి చెప్పాడు. ఏ వస్తువయినా దేవుడిచ్చినదే యనుకోవడము ధర్మసమ్మతము. అట్లు అనుకోకపోతే ధర్మమును నిషేధించుకొన్నట్లేయగును. దానివలన లేని పాపము వచ్చి అంటుకొనును. ఆహార సంబంధ విషయము ఐదవ సూరాలో మూడవ ఆయత్‍లో కూడా చెప్పాడు.

దానియందు పాపమును తెచ్చిపెట్టు ఆహారములను గురించి చెప్పాడు. ఈ ఆహారము వలన పాపము వస్తుంది కావున వాటిని నిషేధ పదార్థములుగా అనగా పాపసంబంధ పదార్థములుగా చెప్పబడినవి. ధర్మముల మీద విశ్వాసము లేనివారికి పాపభీతియే ఉండదు. అందువలన వారు పాపము వచ్చు వాటినయినా వదలక తినుచుందురు. ఇది దేవుడిచ్చినది యని అనుకోకుండా ధర్మములకు నీళ్లు వదలి, అధర్మము ప్రకారము ఆహారమును తీసుకొనుచుందురు. ధర్మము తెలిసినవాడు తనలో అహమును లేకుండా ఉండి ఏదయినా దేవుని నిర్ణయము వలన లభించినదని అనుకొంటే దేవుడు చెప్పిన పాపపు ఆహారమును తినినప్పటికీ వానికి పాపము రాదుయని చెప్పాడు. దీనినే కర్మ కాలిపోవడము అని తౌరాతు గ్రంథములో చెప్పియున్నారు. దానిప్రకారమే వాని పాపమును దేవుడు క్షమించును అని చెప్పారు. ఈ విషయము ఐదవ సూరా మూడవ ఆయత్‍లో చెప్పియున్నారు. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము లేని వారికి ఈ వాక్యము కూడా అర్థము కాదు. స్థూలముగా కనిపించునదే తెలియును. దానిప్రకారము ఇవి తినకూడదు, మిగతావి అన్నీ తినవచ్చునని అనుకుంటారుగానీ, అందులోని దేవుని ధర్మము ఏమాత్రము తెలియరు. 'ధర్మసమ్మతము' అనుదానికి అర్థము తెలియని వారికి ఇవి తినకూడదని మాత్రము తెలుసు. ఇప్పుడు వాక్యమును చూస్తాము.

(5-3) ''మీ కొరకు నిషేధింపబడిన వస్తువులు ఇవి, మృత పశువు రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుగాక వేరు ఇతరుల పేరు ఉచ్ఛరింపబడునది. గొంతు పిసకబడటం వలన చనిపోయిన పశువు. దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన ప్రదేశము నుండి క్రిందపడి చనిపోయినది, కొమ్ములు తగిలి చనిపోయినది, కౄర మృగాలు చంపి చీల్చి తినటము వలన చనిపోయిన పశువు. కానీ మీరు ఒకవేళ జిబహ్ చేస్తే అది మీకొరకు నిషిద్ధము కాదు. ఇలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధముగా బాణాల ప్రయోగము ద్వారా అదృష్టాన్ని పరీక్షించు కోవడము కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యములు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మము గురించి ఇక ఆశను వదలుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణము గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లామ్‍ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవరయినా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడి పోతూ, గత్యంతరము లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశ్యము లేకుండా వుండి పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే నిస్సందేహముగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.''

ఈ విధముగా 5-3 వాక్యము చెప్పబడినది. ఈ వాక్యము ఎవరికి ఎట్లు అర్థమయినా 'అల్లాహ్ అంతిమ దినమున నిర్ధారించిన ఆహారమే మనిషికి లభించును.' చివరిమాటలో పాపము అని చెప్పినవే తినవలసి వస్తే అన్నప్పుడు 'నీ ప్రయత్నములు ఏమీ పనికి రావు. నేను నిర్ధారించినట్లే జరుగును' అని అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవుని ధర్మమును గురించి తెలియకపోతే అది పాప కార్యమేయగును. ఎప్పుడయితే ధర్మము తెలియునో అప్పుడు వానికి ఏ కార్యములో కూడా స్వంత భావము, స్వంత ఉద్దేశ్యము ఉండదు. స్వంత భావము లేకుండా తిన్నవానికి పాపము క్షమించబడును అని చెప్పాడు. ఈ వాక్యము మేము సహితము ధర్మములను గుర్తు పెట్టుకొని చదవడము వలన అర్థమవుచున్నది గానీ ధర్మములు తెలియకపోతే ఈ వాక్యము ఉల్టాగా అర్థమగును.

అంతిమ దినమున తీర్పు చేసిన దేవుడే తన తీర్పును తప్పక అమలు చేయును. తప్పు చేసిన వారికి తీర్పునివ్వడమే కాకుండా అల్లాహ్ కఠినముగా శిక్షించేవాడు. అల్లాహ్ తన ధర్మము ప్రకారము మనుషుల అంతిమ దినమున వారు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు అనుగుణముగా న్యాయబద్దముగా తీర్పును ఇచ్చి తర్వాత మొదటి దినము నుండి చివరి దినము వరకు తన తీర్పును అమలు చేయును. తీర్పును అమలు చేయడములో ఎక్కడగానీ రాజీపడడముగానీ, సర్దుకపోవడము గానీ ఉండదు. ఎంత శిక్షవుంటే అంత అమలు ఉండును. ఈ విషయము అంతా తెలియడమే దేవుని ధర్మములు, దేవుని జ్ఞానము తెలియడము. దేవుని జ్ఞానము తెలిసినప్పుడు పాప క్షమాపణ కూడా ఉండును. పాప క్షమాపణ తీర్పు తీర్చిన అల్లాహ్ చేయునా అంటే అటువంటి పని ఆయన పరిధిలో లేదు. ఆయన తీర్పు తీర్చడము, అమలు చేయడము తప్ప క్షమాపణలు ఆయన చేయువాడు కాదు. అయితే పాపముతో కూడిన ఆహారమును 'నేను' అను భావము లేకుండా దేవుడు ఇచ్చినది అని తినునో అటువంటి వాని పాపమును క్షమించువాడు అల్లాహ్‍యే. అయితే తీర్పు తీర్చిన అల్లాహ్ క్షమించడు. తీర్పు తీర్చని అల్లాహ్ క్షమించగలడు. ఈ రహస్యము దేవుడు తన గ్రంథములలో అనేకమార్లు సూచించినా ఎవరూ తెలియలేదు. ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని మొత్తము మానవాళికి తెలియదు. ఒకరు సృష్ఠికర్తయైన అల్లాహ్, ఆయన పని చేయడు. మరొకరు సృష్ఠింపబడిన అల్లాహ్, ఆయన అన్ని పనులు చేయును.
1 సృష్ఠికర్తయైన అల్లాహ్ ఎవరు? సృష్ఠించబడిన అల్లాహ్ ఎవరు?

2 మనుషులు ఆరాధించని అల్లాహ్ ఎవరు? మనుషులు ఆరాధించే అల్లాహ్ ఎవరు?

3 మనుషుల ఆరాధనలకు దూరముగాయున్న అల్లాహ్ ఎవరు? మనుషుల చేత ఆరాధింప తగిన అల్లాహ్ ఎవరు?

4 పనిని చేయని అల్లాహ్ ఎవరు? పనిని చేసే అల్లాహ్ ఎవరు?

5 అంతిమ దినమునకు సంబంధము లేని దేవుడు ఎవరు? అంతిమ దినమున తీర్పును తీర్చు దేవుడు ఎవరు?

6 ధర్మములు లేని అల్లాహ్ ఎవరు? ధర్మములు గల అల్లాహ్ ఎవరు?

ఈ విధముగా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలిసి, మనిషి ఆరాధించవలసినది ఒక్కనినేనని తెలిసి, ఒక్క అల్లాహ్‍నే ఎవరు ఆరాధించునో వాడు దైవమార్గములో ఉన్నట్లేయగును. ఇదే విషయమునే అనగా ఇద్దరు అల్లాహ్‍ల విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇంకా విపులముగా ఇచ్చారు. ప్రథమ దైవ గ్రంథములో కూడా ఇదే విషయమును చెప్పారు. అయితే మూడు మతముల వారు ఇద్దరిని గుర్తించలేకపోయారు. ఇద్దరినీ ఎన్నో తేడాలతో గ్రంథములో చెప్పియున్నా, తెలియని గ్రుడ్డివారుగా మనుషులున్నారు. ద్వితీయ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చాలా దగ్గరగా చెప్పారు. అయితే ప్రపంచములో ఎన్నో తెలివిలుగల మనుషులు, ఎంతో చదువు చదివిన వారు, మేథావులు అని పేరుపొందిన వారు సహితము ఇద్దరు దేవుళ్లను గుర్తించక ఇద్దరినీ కలిపి ఒకే దేవుడు అని అంటున్నారు.

'ఇద్దరు దేవుళ్లు' అను విషయము మూడు గ్రంథములు చదివిన వారికే తెలియుటకు అవకాశము గలదు. ఒక గ్రంథమును చదివిన వారికి రెండవ దేవున్ని గురించి తెలియు అవకాశమే లేదు. అందువలన చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్యందు ఐదవ సూరాలో నాలుగైదు చోట్ల 'మూడు గ్రంథములను చదవమని' అల్లాయే చెప్పినట్లు కలదు. ఒక ఆయత్‍లో 'మూడు దైవ గ్రంథములను చదువకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే'యని కూడా చెప్పడమైనది. ఒకమారు ఖుర్ఆన్ గ్రంథములో సూరా ఐదు, ఆయత్ (68) లో ఏమి చెప్పారో చూడండి.

(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతు, ఇంజీలు మరియు మీ ప్రభువు తరపునుండి మీ వద్దకు పంపబడిన ఖుర్ఆన్‍ను మీ జీవితములలో నెలకొల్పువరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''

ఈ వాక్యములో స్పష్టముగా 'మూడు గ్రంథములను మీ జీవితములలో నెలకొల్పుకోమని' చెప్పాడు. అలా కాకుండా నాది ఒక గ్రంథమేయని, ఒక మతమువారు ఒక గ్రంథమును మాత్రమే ఆశ్రయించి దానిని మాత్రమే తెలిసి, దానిప్రకారమే మేమున్నాము అనినా, మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము తెలియనిదే వాడు జ్ఞానములో పరిపూర్ణుడు కాలేడు. ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. ఇద్దరు దేవుళ్ల విషయము నీ గ్రంథములోయున్నా, మిగతా రెండు గ్రంథములు చదవనిదే అది నీకు తెలియబడదు. అంతేకాక నీ గ్రంథములోని జ్ఞానము కూడా నీకు సరిగా అర్థము కాదు. అందువలననే ఆహార విషయములోని విధానము తెలియకుండా పోయినది. ఇది తినకూడదు అని మనిషి అనుకోవడము జరుగుచున్నది. ముందే దేవుడు నిర్ణయించియుండును, మనిషి నిర్ణయము పనికిరాదు అని తెలియలేకపోయారు. అంతేకాక 'ప్రపంచ విషయములను గురించి దేవుడు (అల్లాహ్) తన బోధలో చెప్పడు' అను మాట కూడా మరచిపోయారు. ఆహార విషయము మూడు దైవ గ్రంథములలో ప్రస్తావించ బడినది. మూడుచోట్ల చెప్పిన విషయమును గ్రహించినప్పుడే ఆహారము యొక్క అసలు విషయము తెలియును. అంతవరకు ఒక గ్రంథమును చదివిన వారికి అర్థము కాదు. తౌరాతు గ్రంథములో సాత్త్విక, రాజస, తామస ఆహారములని చెప్పారు. ఇంజీలు గ్రంథములో అక్షయ, క్షయ ఆహారము అని చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో పాపముతో కూడుకొన్న ఆహారము అని చెప్పారు. మూడు గ్రంథముల విశ్లేషణ వలననే ఆహార విషయము సంపూర్ణముగా అర్థము కాగలదు. అప్పుడు ఆహారమునకు సంబంధించిన ధర్మములు తెలియును. అప్పుడు మనిషి ఒక తోలుబొమ్మ మాత్రమేయనీ, స్వయం నిర్ణయము ఈ బొమ్మకు లేదనీ, అన్నీ నిర్ణయించు వాడు, నిర్ణయించినవాడు, సృష్ఠించబడిన, అందరూ ఆరాధించదగిన అల్లాహ్ యని తెలియును.

నేడు ప్రతి మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన నియమాలనే ఎక్కువగా ఆచరించుచున్నాడు. అలా మనుషులు చెప్పిన నియమాలల

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024