cloud హేతువాదము - ప్రతివాదము. updated on 15h Dec 24

 


హేతువాదము - ప్రతివాదము.


వాదము అను పదము వాక్యము అను శబ్దమునుండి పుట్టినది. వాదము అనునది అనేక రకములుగా ఉన్నది.

భాష నుండి భావము పుట్టినట్లు, వాక్యమునుండి వాదన పుట్టుకొచ్చినది. మనిషికి మనిషికీ మధ్యన భావమును

తెలుపునది వాదన లేక వాదము అగుచున్నది. ఒక విషయమును తెలుసుకొను నిమిత్తము ప్రశ్నించి అడగడమును

హేతు వాదము అంటాము. అడిగిన ప్రశ్నకు జవాబును ఎదుటి మనిషి అందివ్వడమును ప్రతివాదము అంటాము.

ప్రశ్నించడము హేతువాదము కాగా, దానికి జవాబు చెప్పడము ప్రతివాదముకాగా, జవాబు సరియైనదైనా దానిని

ఒప్పుకోక కాదని మొండిగా వాదించడమును అతివాదము అంటాము. ప్రశ్నకు చెప్పబడిన జవాబు సరియైనదైనా,

సరియైనది కాకపోయిన దానిని ఎదురు మాట్లాడక ఒప్పుకోకపోవడమును మితవాదము అంటాము. ఇంకా కొందరు

ఎలాగున్నారనగా! చెప్పబడిన జవాబు సరియైనదా కాదా అని ఏమాత్రము ఆలోచించక, విచక్షణా జ్ఞానము లేకుండా

తనకు తెలిసినదే సరియైనదనీ, ఇతరులు చెప్పినది సరియైనదికాదనీ, తన భావమునకు వేరుగానున్న వారందరినీ

హింసతో అణచివేయాలని చూచువాడు తీవ్రవాది అనబడుచున్నాడు. తీవ్రవాదులనే ఉగ్రవాదులని కూడా అనుచున్నాము.

హింసతో అణచి వేయాలని హింసించు వానిని తీవ్రవాది అని అనవచ్చును. అంతేకాకుండా ఇంకా మూర్ఖముగా

ఎదుటివానిని అంతమొందించువానిని ఉగ్రవాది అంటున్నాము. తీవ్రవాదికి ఉగ్రవాదికి కొద్దిపాటి తేడానే కలదు.

తీవ్రవాదము సులభముగా ఉగ్రవాదముగా మారగలదు.


ఈ విధముగా ఒక విషయము హేతువాదముతో మొదలై చివరికది మితవాదము వరకు పోయి నిలచిపోవచ్చును

లేక అతివాదము వరకైనా నిలిచిపోవచ్చును. అట్లుకాక తీవ్రవాదము ఉగ్రవాదము వరకైనా పోవచ్చును. ప్రపంచ

విషయములు ఏవైనా అతివాదము వరకే పోయి నిలచిపోవును. అంతకంటే ముందుకు పోవుటకు అవకాశములు

తక్కువ ఉన్నాయి. ఒకేవొక దైవవిషయములో మాత్రమే మనిషి ఉగ్రవాదము వరకు పోవుచున్నాడు. దైవవిషయములో

ధర్మములు అధర్మములుగా మారిపోయినందువలన, దైవవిషయము మతము అను ముసుగులోనికి వెళ్ళిపోయినది.

నేడు ప్రపంచములో దైవవిషయమంతా ఎటుచూచినా ఏదో ఒక మతములో చిక్కుకొని పోయినది. అందువలన అన్ని

మతములలో ఉగ్రవాదము వ్రేళ్ళు ప్రాకింది. నేడు శాంతివాదులని చెప్పుకొను మతమేది ఉన్నా, దానిలో కూడా

ఉగ్రవాదము ఉందనే అర్థము.


నేడు ఎన్నో మతములుండుట వలన ఒక మతము మీద మరొక మతము యొక్క ఉగ్రవాదము

కనిపించుచుండవచ్చును. భారతదేశములో ఇతర ఏ మతములేనినాడు, ఒకే ఒక హిందూమతము మాత్రమే ఉన్న

రోజులలో కూడా ఉగ్రవాదము ఉందనుటకు అనేక ఆధారములు కలవు. ఒకే హిందూమతములోని అద్వైత సిద్ధాంతమును

అనుసరించువారు, తర్వాత వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతమును అనుసరించువారు, ఒకరి మీద మరొకరు ఉగ్రవాద

చర్యలు చేపట్టి అనేక వందలమంది, వేలమంది చనిపోయిన సంఘటనలు కలవు. నేడు హిందుత్వములో త్రైత

సిద్ధాంత ధర్మమును ప్రతిపాదించిన మేము కూడా హిందువులలోనే మామీదికి వచ్చిన తీవ్రవాదులను చూడవలసి

వచ్చింది. ప్రస్తుతము భారతదేశములో ప్రత్యేకించి వీరు తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని చెప్పలేము. ప్రతి మతము

మరియొక మతము మీదికి తీవ్రవాదముగానో, ఉగ్రవాదముగానో కనిపిస్తున్నది. ప్రత్యేకించి మా అనుభవములో మేము

ఇందువులమే (హిందువులమే) అయినా మేము చెప్పు బోధలు అర్థము చేసుకోలేని హిందువులు మాకు తీవ్రవాదులుగా

కనిపిస్తున్నారు, హిందూమతములో ఈ రోగము ఇప్పుడే కాకుండా పూర్వము కూడా శైవులు వైష్ణవుల మధ్య


ఉగ్రవాదమును రేకెత్తించినది. ఇలాగే మరికొన్ని మతములలో కూడా అంతర్గతముగా తీవ్రవాదమున్ననే వున్నది.

దీనికంతటికి కారణము దైవ జ్ఞానమును అర్థము చేసుకొను గ్రాహితశక్తి మనుషులలో లేకపోవడమే కారణమని చెప్పవచ్చును.

ప్రపంచ విషయములలో ఎక్కడా కనిపించని ఉగ్రవాదము ప్రత్యేకించి దైవ విషయములలో మాత్రమే కనిపించుచున్నది.


మనిషి ఏ విషయములోనైనా ముందుకు పోవాలంటే తప్పని సరిగా హేతువాదము అవసరము. హేతువాదము

లేనిది మనిషి ప్రగతిని సాధించలేడు. హేతువు అనగా కారణము అని చెప్పవచ్చును. ప్రతి మనిషికీ చిన్నతనమునుండి

ప్రతి దానిని తెలుసుకోవాలని ప్రశ్న కలుగడముతో హేతువు మొదలైనదని చెప్పవచ్చును. శిశుదశలోనే తను పడుకొన్న

ఊయల ఎందుకు కదులుచున్నదని ప్రశ్నరాగలదు. ఎందుకు కదలుచున్నదో తెలుసుకోవాలనుకోవడమే హేతువును

వెదకడము అనుపించుకొనును. ఊయల కదిలేదానికి గల కారణము హేతువు అంటాము. శిశువు తన అనుభవముల

వలన కొన్నిటికి గల కారణములను తెలుసుకోగలడు. భాష మాట్లాడము వచ్చిన తర్వాత తనలోని భావమును

ప్రశ్నరూపముగా ప్రశ్నించి తెలుసుకోవాలనుకొనును. అలా ప్రశ్నించినది ప్రతీది హేతువాదమే అగును. దానికి

దొరికిన జవాబు ప్రతీది ప్రతివాద మగును. ప్రశ్నకు జవాబే సరియైన సమాధానము అనినట్లు, హేతువాదము నకు

ప్రతివాదమే సరియైన సమాధానమని చెప్పవచ్చును. ఊయల ఎందుకు ఊగుచున్నదో తెలియని శిశువుకు అమ్మ

ఊపుచున్నదను అనుభవము జవాబగుచున్నది. ఆకలికి ఆహారము సంతృప్తినిచ్చినట్లు, హేతువాదమునకు (ప్రశ్నకు)

ప్రతివాదము (జవాబు) సంతృప్తి నిచ్చుచున్నది. శిశుదశలో ప్రారంభమైన హేతువును వెదకడము ప్రతి మనిషి

జీవితములో కొనసాగుచున్నది. మనిషి బుద్ధినిబట్టి వారిలో హేతువాదము కొంత ఎక్కువ తక్కువగా ఉండవచ్చును.

చురుకైన బుద్ధిగల వానిలో హేతువాదము ఎక్కువగా కనిపించుచుండును. ప్రపంచ విషయములలోని ప్రశ్నలకు

జవాబులతోనే అందరూ సరిపెట్టు కొనుచుందురు. అయితే ఒకే ఒక ఆధ్యాత్మిక విషయము లోనే అతివాదము తీవ్రవాదము

ఉగ్రవాదము కనిపిస్తున్నది. దానికి గల కారణమేమని చూడగలిగితే ప్రపంచములోని ప్రతి విషయమునకు చివరికి

శాస్త్రము అను సమాధానము గలదు. ప్రతి విషయమునకు శాస్త్రము సమాధానమిస్తున్నది. అందువలన ప్రపంచ

విషయములలో ప్రతివాదము తోనే సరిపోవుచున్నది. చివరికి మితవాదము వరకే నిలిచిపోవుచున్నది.


ఆధ్యాత్మిక విషయములలో శాస్త్రమున్నదనీ, అది ఫలానా శాస్త్రమని ఎవరికీ తెలియదు. దైవవిషయములలో

(ఆధ్యాత్మిక విషయములలో) ఏది శాస్త్రమో తెలియని దానివలన, దానికి ఒక హద్దు పద్దూ లేకుండా పోయినది. ఎవరికి

ఇష్టమొచ్చిన దానిని వారు తమకు జవాబుగా లెక్కించుకొని మిగతావాటిని కాదనుకొనుచున్నారు. అందువలన

దైవవిషయములు లేక మత విషయములు ఉగ్రవాదము వరకు పోవుచున్నవి. ప్రపంచములో అన్ని శాస్త్రములకంటే

ముందు పుట్టిన శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము. బ్రహ్మ విద్యాశాస్త్రమనగా దైవవిషయములకు (ఆధ్యాత్మిక విషయములకు)

సంబంధించినది. తర్వాత ప్రపంచ సంబంధమైన మిగత ఐదుశాస్త్రములు పుట్టినవి. అయితే తర్వాత పుట్టిన శాస్త్రములను

మనిషి తెలియగలిగాడు. అన్నిటికంటే ముందు పుట్టిన బ్రహ్మవిద్యా (పెద్దవిద్యా) శాస్త్రమును తెలుసు కోలేకపోయాడు.

కొందరు తెలుసుకోవాలని ప్రయత్నించినా వారిలో తగిన గ్రాహితశక్తి లేనిదానివలన అది సరిగా తెలియకుండా

పోయినది. శాస్త్రములు ఎన్ని అని ప్రశ్నించుకొంటే షట్శాస్త్రములని (ఆరుశాస్త్రములని) చెప్పవచ్చును. గ ఖర భౌ

జ్యో బ్ర అను ఆరు అక్షరముల మంత్రము షట్ శాస్త్రములకు సూత్రముగా గలదు. గఖర్భజ్యోబ్ర అను అక్షర

మాలలోని అక్షరములను విడివిడిగా తీసుకొని చూస్తే ఆరు శాస్త్రములు బయట పడగలవు. 'గ' అను అక్షరమునకు

గణితశాస్త్రమును, ఖ అను అక్షరమునకు ఖగోళ శాస్త్రమును, 'ర' అను అక్షరమునకు రసాయన శాస్త్రమును, 'భౌ” అను


అక్షరమునకు భౌతిక శాస్త్రమును, 'జ్యో' అను అక్షరమునకు జ్యోతిష్య శాస్త్రమును, 'బ్ర' అను అక్షరమునకు బ్రహ్మవిద్యా

శాస్త్రమును జోడించి చెప్పవచ్చును. అలా చెప్పడము వలన గఖరభౌజ్యోబ్ర అను మంత్ర సూత్రమునకు ఆరు శాస్త్రములు

బయటపడగలవు.


ప్రపంచమునకు సంబంధించినవి మొదటి ఐదు శాస్త్రములనీ, పరమాత్మకు (దైవమునకు) సంబంధించినది

చివరి బ్రహ్మవిద్యా శాస్త్రమనీ ఎవరికీ తెలియకపోవడము వలన వ్యక్తులమధ్య మితవాదము లేకుండా పోయినది. నేడు

విద్యాసంస్థలలో ఒక్క జ్యోతిష్య శాస్త్రమును వదలి మిగత నాలుగు శాస్త్రములను బోధించడము జరుగుచున్నది. అందువలన

ప్రపంచ సంబంధ నాలుగు శాస్త్రములలో మనిషి ఎంతో ప్రగతిని సాధించాడు. ఈ నాలుగు శాస్త్రములకు సంబంధించిన

ప్రపంచ విషయములలో మనుషులు ఒకరికొకరు ప్రతివాదులై, తర్వాత మితవాదులై సర్దుకుపోవుచున్నారు. జ్యోతిష్యమును

ఎవరూ పట్టించుకోవడములేదు. ఇకపోతే వచ్చిన చిక్కంతా ఒకే ఒక దైవవిషయములలోనే. దైవశాస్త్రమొకటున్నదని

తెలియక పోవడమూ, తెలిసినా దానిని అర్థము చేసుకోకపోవడము వలన చివరకు మతద్వేషములు, ఉగ్రవాదములు

తయారైనవి. ప్రపంచ విషయములలో తీవ్రవాదము, ఉగ్రవాదముండదని చెప్పుకొన్నాము కదా! ఒక్క మత

విషయములలోనే తీవ్రవాదము ఉగ్రవాదమున్నదని చెప్పుచున్నాము. ఇక్కడ ఇంకొక విషయమును కూడ

చెప్పవలసియున్నది. అదేమనగా! దైవ విషయములలో మాత్రమే 1) హేతువాదము 2) ప్రతివాదము 3) అతి వాదము

4) మితవాదము 5) తీవ్రవాదము 6) ఉగ్రవాదమున్నదని మొత్తము ఆరువాదములను చెప్పుకొన్నాము. ఇవన్నియు

కాకుండా ప్రత్యేకించి ఒక వాదము కలదు. అదియే నాస్తికవాదము. నాస్తికవాదము ఒక్క ఆధ్యాత్మికములోనే కలదు.

దైవ విషయములలో మాత్రమే కొందరు ఆరు వాదములను వదలి నాస్తికవాదమునే మాట్లాడుచుందురు. అసలుకు

దేవున్ని లేడనడమే నాస్తికుల పనిగాయున్నది. అందువలన నాస్తికవాదములో హేతువాదము గానీ, ప్రతివాదముగానీ

ఉండదు. ఆధ్యాత్మికమంతా అసత్యమనుట వలన తర్వాత ఏ వాదన ఉండదు. దేవుడున్నాడను వారిలో హేతువాదము

మొదలుకొని ఆరు వాదములుండవచ్చునుగానీ, దేవుడే లేడను నాస్తిక వాదము తర్వాత ఏ వాదముండదు. అందువలన

నాస్తికవాదమును ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చును.


దేవుడున్నాడను వాడున్నప్పుడు, ఎలా ఉన్నాడని ప్రశ్నించు హేతు వాదముండవచ్చును. మొదటికే లేడను

వాడున్నప్పుడు ఎలా ఉన్నాడను కారణము అడుగుటకు అవకాశమే లేదు కదా? అందువలన హేతు వాదమున్నచోట

నాస్తికవాదముండదు. నాస్తికవాదమున్నచోట హేతు వాదముండదు. ఉన్నదాని ఉనికిని గురించి ప్రశ్నించు దానిని

హేతు వాదమన్నప్పుడు, అట్లే లేనిదానిని గురించి ప్రశ్నించడము అవసరము లేదనునది నాస్తికవాదమైనప్పుడు

హేతువాదము వేరని, నాస్తికవాదము వేరని చెప్పవచ్చును. హేతువాదము నాస్తికవాదము తూర్పు పడమర లాంటివి.

అయితే ప్రస్తుత కాలములో కొందరు నాస్తికవాదము హేతు వాదము ఒకటేనని అనుకోవడము జరుగుచున్నది. అలా

అనుకోవడము పొరపాటే. హేతువాదము నాస్తికవాదము ఒకే నాణానికున్న బొమ్మ బొరుసులాంటివి. అవి ఎప్పటికీ

ఒకదానితో ఒకటి కలువవు. రెండు వాదముల ఉద్దేశములే వేరు వేరుగా ఉన్నప్పుడు, రెండూ ఒకటని చెప్పుటకు

ఏమాత్రము వీలుపడదు.


ఒక మనిషి పుట్టాడు అంటే అతను కొన్ని సిద్దాంత సూత్రముల మీద ఆధారపడి పుట్టియుండును. అలాగే ఒక

వస్తువు తయారు చేయబడింది అంటే అది కూడా కొన్ని సూత్రముల మీద ఆధారపడి తయారు చేయబడి వుండును.

సిద్ధాంత సూత్రములనే శాస్త్రము అంటున్నాము. కనిపించు ప్రపంచమంతా గణిత, ఖగోళ, రసాయన, భౌతిక శాస్త్రముల


మీద ఆధారపడి సృష్ఠింపబడినది. కనిపించని మనస్సు మొదలుకొని జీవాత్మ పరమాత్మ వరకు బ్రహ్మవిద్యా శాస్త్రము

తెలియజేసిన జ్ఞాన ధర్మముల మీద ఆధారపడియున్నవి. మొత్తము మీద విశ్వమంతా శాస్త్రబద్ధత కల్గియున్నది. ఒక

దానిని గురించి ఉన్నదని చెప్పుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే లేదని చెప్పుటకు కూడా శాస్త్రము అంతే

అవసరము. ఒకటి సత్యమని చెప్పుటకు శాస్త్రము అవసరము. అట్లే ఒకటి అసత్యమని చెప్పుటకు కూడా శాస్త్రము

తప్పనిసరిగ అవసరము. శాస్త్రబద్ధత లేని దేనినైనా మూఢ నమ్మకమనవచ్చును. దేవుడున్నాడనుటకు శాస్త్రము ఎంత

అవసరమో అట్లే దేవుడు లేడనుటకు కూడా శాస్త్రము అంతే అవసరమని అంటున్నాము. శాస్త్రాధారము చూపకుండా

దేవుడు లేడు అనుట మూఢనమ్మకమగును. ఒక హేతువాదమైన ప్రశ్న శాస్త్రమును అనుసరించి ఉండాలి. అట్లే దానికి

జవాబు కూడా శాస్త్రమును అనుసరించి ఉండవలెను. అట్లు కాకుండా ప్రశ్న శాస్త్రబద్ధత లేనిదైనా, జవాబు శాస్త్రబద్ధత

లేనిదైనా రెండూ దారి తప్పినవగును. దైవ విషయమును బోధించుటకు బ్రహ్మవిద్యా శాస్త్రమున్నా దాని అవగాహన

లేనిదానివలన ప్రశ్న జవాబులు దారి తప్పిపోతున్నవి. అందువలన ఒక దైవ విషయములలోనే మనిషి తన విచక్షణను

కోల్పోయి తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మారిపోవుచున్నాడు.


భూమిమీద తీవ్రవాదముగానీ, ఉగ్రవాదముగానీ లేకుండా పోవాలంటే ఒకటే మార్గము కలదు. అదియే

బ్రహ్మవిద్యా శాస్త్రమును గురించి పూర్తిగా తెలిసి నడుచుకోవడము. అలా బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలిసిననాడు మత

భేదములుగానీ, మత ద్వేషములుగానీ రావు. అటువంట పుడు ఉగ్రవాదము వచ్చుటకు అవకాశమే ఉండదు. దేవుని

విషయములను శాస్త్రబద్ధముగా తెలుసుకోక పోవడము వలన ఒకే మతములోనే చీలికలు ఏర్పడి, ఒకే మతమువారే

ఒకరినొకరు చంపుకొంటున్నారు. హిందు మతములో శైవులు, వైష్ణవులు ద్వేషములు పెంచుకోగా, నేడు కూడా అన్ని

మతములలోనూ అదే జాఢ్యము పూర్తిగా ఇమిడిపోయి ఉన్నది. శాస్త్రబద్ధత లేని విషయములు ఒకే మతములోనే

హింసను రేకెత్తించినపుడు, అది ఇతరముల మీద ఎంత ఉగ్రవాదమును చూపునో మీరే ఆలోచించండి. అందువలన

ఉగ్రవాద జాడలు లేకుండా పోవాలంటే శాస్త్రబద్ధమైన జ్ఞానము తెలియాలి. అలా తెలియుట వలన జగత్తంతయు ఏక

కుటుంబము కాగలదు. ఏక కుటుంబముగానున్న ప్రపంచములోని ప్రజలందరు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి,

ఎటువంటి ద్వేష భావములు లేకుండా బ్రతక గలరు. శాస్త్రబద్ధత గల జ్ఞానము మనుషులకు తెలియనంతవరకు ఏ

దేశములోనైనా, ఏ కాలములోనైనా ఉగ్రవాదము సజీవముగా నిలువగలదు. ఉగ్రవాదమును ఏ దేశములోని ఏ

ప్రభుత్వముగానీ లేకుండా చేయలేదు. ఏ శాసనములు, ఏ చట్టములు ఉగ్రవాదమును లేకుండా చేయలేవు. ఉగ్ర

వాదమును లేకుండా చేయాలంటే, శాస్త్రబద్ధమైన జ్ఞానము ఒక్కటే ఆయుధమని తెలియవలెను. శాస్త్రబద్ధమైన జ్ఞానమను

ఖడ్గము లేనిదే ఎవరుగానీ ఉగ్రవాదమును లేకుండా చేయలేరు. నేడు అన్ని మతములలో దేవుడు చెప్పిన బ్రహ్మవిద్యా

శాస్త్రబద్ధమైన జ్ఞానము గీత, బైబిల్, ఖురాన్ అను మూల గ్రంథముల రూపములోయున్నా, ఆయా మతస్థులు వారి

గ్రంథములలోనున్న జ్ఞానమును శాస్త్రబద్ధముగా అర్థము చేసుకోక పోవడము వలన, అన్ని మతములలోను ఉగ్రవాదము

ఎంతో కొంతయున్ననే ఉన్నది. భూమిమీదనున్న ప్రతి దేశము ఏదో ఒక మత ముసుగులో చిక్కుకొని ఉండుట

వలన, ఆయా దేశములలో ఉగ్రవాదము తోడైయుండి ఇతర మతముల దేశములను అంతమొందించుటకు

మారణాయుధములను తయారు చేసుకొంటున్నవి. అటువంటి హింసా ప్రవృత్తి పోవాలంటే ప్రపంచమంతా ఒకే

కుటుంబముగా మారి ఒకరిమీద ఒకరు ప్రేమగా మెలగాలంటే, దేవుని చేత అందివ్వబడిన మూలగ్రంథములలో ఒకే

శాస్త్రబద్ధమైన జ్ఞానముందని తెలియాలి. అలా తెలిసిననాడే మతమూ ఉండదు, మతద్వేషమూ ఉండదు. ఆనాడు

అందరూ మతరహిత మనుషులే ఉంటారు.



నేడు భూమిమీదున్న ప్రజలకు దేవుడు తన జ్ఞానమును వేరువేరు సందర్భములలో, వేరువేరు దేశములలో,

వేరువేరు కాలములలో చెప్పియున్నాడు. ఎప్పుడు చెప్పినా, ఎలా చెప్పినా చెప్పబడినది ఒకే దేవుని జ్ఞానమే. అయినా

మనుషులు వేరువేరు కాలములలో చెప్పిన జ్ఞానమును వేరు వేరు మతములుగా పోల్చుకొని, వాటికి పేర్లు పెట్టుకొని

మా జ్ఞానము వేరు, మీ జ్ఞానము వేరను అభిప్రాయములోనున్నారు. చెప్పబడిన జ్ఞానము గీత, బైబిల్, ఖురాన్ గ్రంథముల

రూపములోయున్నా, అందులో ఉన్నది ఒకే దేవుని జ్ఞానమనీ, ఒకే శాస్త్రమునకు సంబంధించినదనీ, తెలుసుకోలేక

పోవడము వలన మతములు మతద్వేషములు ఏర్పడినవి. వాటితో పాటు తీవ్రవాదము ఉగ్రవాదములు బయలుదేరినవి.

ఉగ్రవాదము వలన బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు పెరిగిపోయాయి. దానివలన ప్రపంచమంతా హింసతో

కూడుకొన్నదై ఒకరిని చూస్తే ఒకరు భయపడవలసి వస్తున్నది. అటువంటి పరిస్థితినుండి బయటపడాలి అంటే,

శాస్త్రబద్ధమైన జ్ఞానము తెలియడము ఒక్కటే మార్గము. శాస్త్రబద్ధమైన జ్ఞానము అన్ని మత గ్రంథములలోను ఉన్నది.

అయినా దేవుడు చెప్పిన ఆ గ్రంథములను మనుషులు మతములకు సంబంధించినవనుకోవడము వలన వాటిలోని

శాస్త్రబద్ధత ఎవరికీ తెలియకుండ పోయినది. గీత, బైబిల్, ఖురాన్ గ్రంథములలో శాస్త్రీయత ఎలా ఉన్నదో తెలియుటకు

ఇప్పుడు మనము అనేక ప్రశ్నలను హేతువాద పద్ధతిలో అడిగి, శాస్త్రబద్ధమైన ప్రతివాద పద్ధతిలో తెలుసుకొందాము.

భూమిమీద ఉగ్రవాదమును లేకుండా చేయుటకు హేతుబద్ధమైన ప్రశ్నను, శాస్త్రబద్దమైన జవాబును చెప్పుకోవలసిన

అవసర మున్నది. అటువంటి ప్రయత్నములోనే “హేతువాదము-ప్రతివాదము” అను ఈ గ్రంథమును వ్రాయడము

జరిగినది.



ఒక విషయమును చూచి అది దేనికి సంబంధించినదో ఖచ్చితముగా తెలియలేకపోతే, ఒక్కొక్కరు ఒక్కొక్క

అభిప్రాయమును ఆ విషయమును గురించి వెలిబుచ్చితే, అక్కడే మనుషుల మధ్యలో భావ భేదములు రావడమే

కాకుండా వాద భేదములు కూడా వచ్చును. మనుషుల మధ్యలో భావ భేదములు చివరకు ఉగ్రవాదమువరకైనా

పోవచ్చును. అదియూ దైవ విషయములో అయితే మరీ వేగముగా ఘర్షణకు దారి తీయగలవు. ఒక విషయము

మనుషుల మధ్యలో అభిప్రాయభేదమునకు ఎలా దారి తీయుచున్నదో ఇక్కడ గమనిద్దాము. ఉదాహరణకు వేమనయోగి

తనకు తెలిసిన విషయమును పద్యముల రూపములలో వ్రాసియుంచాడు. వేమన చరిత్రను చదివినవారు ఆయన

చెప్పిన విషయమునంతటిని చూచిన తర్వాత మనుషులందరూ ఆయన చెప్పిన విషయమును ఒకే విధముగా అర్థము

చేసుకోక, అనేక విధముల అర్థము చేసుకోవడము వలన ఆయనను కొందరు యోగి అన్నారు, కొందరు మంచి జ్ఞాని

అని అన్నారు. మరి కొందరు ప్రజాకవి అన్నారు. ఇంకా కొందరు సమాజవాది అన్నారు. కొందరు నాస్తికవాది

అన్నారు. మరికొద్దిమంది ఆయనను సత్యవాది అన్నారు. కొందరు స్వామీజీలు వేమనయోగిని సర్వసంగపరిత్యాగిగా

లెక్కించి ఆయన ప్రతిమను వారి ఆశ్రమములలో ఉంచుకోగా, కొందరు నాస్తికవాదులు ఆయనను ముఖ్యమైన నాస్తికవాదిగా

లెక్కించి వారు వ్రాసిన నాస్తిక గ్రంథములలో మొదటి పేజీలోనే వేమన చిత్రమును ముద్రించుకొన్నారు. ఈ విధముగా

ఒక్క వేమనను గురించి ఇందరు ఇన్ని అభిప్రాయములు కలిగియున్నపుడు వారినందరినీ ఒక అభిప్రాయమునకు

తేవడము చాలా కష్టము కదా!


వేమన ఒక్కమారు తాను ధరించిన దుస్తులను కూడా వదలివేసి మౌనముగా మారిపోవడము వలన ఆయనను

తిక్కవానిగా చెప్పిన వారున్నారు. అంతేకాక ఆయన చెప్పిన సాహిత్యము నచ్చనివారు వేమనను అజ్ఞాని అనినవారు

కూడా కలరు.) వేమన బ్రతికియున్నప్పుడే ఆయనను గురించి చాలామంది చాలా అభిప్రాయములు వెలిబుచ్చగా,


వాటిని వినిన వేమన తనను ప్రజలు అన్ని విధములుగా అర్థము చేసుకొన్నందుకు నవ్వుకొని చివరికి ఒక పద్యమును

ఇలా చెప్పాడు.


వేయి విధము లమరు వేమన పద్యంబు

అర్థమిచ్చు వాని నరసి చూడ

జూడ జూడ గల్గు చోద్యమౌ జ్ఞానంబు

విశ్వదాభిరామ వినుర వేమా.


వేమన చెప్పిన పద్యమును బట్టి ఆయనను వేయిమంది వేయి విధములు అర్థము చేసుకొనినా, చివరకు ఆయన

చెప్పినది ఆశ్చర్యమును కల్గించు జ్ఞానమని తెలియబడుచున్నది. స్వయముగా వేమనే నేను ఫలానా విషయమును

చెప్పానని చెప్పినా, ఇప్పటికీ ఆయనను ప్రజాకవిగా, నాస్తికవాదిగా, సమాజవాదిగా లెక్కించుకొనువారు

చాలామందియున్నారు. ఒక్క వేమనయోగి చెప్పిన విషయము మీదనే మనుషులకు ఇన్ని అభిప్రాయములుండగా,

దేవుడు చెప్పిన విషయమును ఒక విధముగా అర్థము చేసుకోగలరా? వేమన కనిపించే మనిషిగా ఉండి ఒకే కాలములో

చెప్పిన విషయమే ఎన్నో అభిప్రాయములకు దారితీయగా, ఇక దేవుడు కనిపించనివాడైయుండి, మూడు విధములుగా

మూడు కాలములలో చెప్పిన జ్ఞానవిషయములు అర్థముకాక మేధావులను సహితము తికమక చేసినవి. అందువలన

దేవుని జ్ఞానము ఒక్కటే అయినా, దేవుడు ఒక్కడే అయినా ఎవరికీ దేవుడూ, దేవుని జ్ఞానమూ ఒక్కటిగా అర్థము కాలేదు.

అర్థము కాకపోవడము వలన దేవున్ని గురించి అనేక మతములు, ఆ మతములలోనే అనేక చీలికలు ఏర్పడినవి. అలా

ఏర్పడడము వలన వాదములు పుట్టుకొచ్చి అవి చివరకు ఉగ్రవాదము వరకు దారి తీసినవి.


కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము గడచిపోగా చివరిదైన కలియుగములో మూడు వేల

సంవత్సరముల వరకు మనుషుల మధ్యలో ఒక్క ఇందుత్వముండేది. ఇప్పటికి రెండువేల సంవత్సరముల పూర్వము

క్రైస్తవమతము బయటికి వచ్చినప్పుడు, ఇందుత్వమునకు ఇందూ మతమని పేరు వచ్చినది. ఇందూమతము చివరికి

నేడు హిందూమతముగా పిలువబడుచున్నది. సృష్ట్యాదిలోనే 'వాణి' ద్వారా తెలియబడిన దైవజ్ఞానము తర్వాత కనిపించే

మనిషి ద్వారా ఒకమారు, కనిపించని వ్యక్తి ద్వారా ఒకమారు తెలియపరచబడినది. ఇట్లు మూడుమార్లు ఒకే జ్ఞానమును

దేవుడు తెలియజేసినా, మనుషులు దానిని అర్థము చేసుకోలేక, ఒకరి మధ్య ఒకరు అభిప్రాయ భేదములు కల్గియున్నారు.

ఆ అభిప్రాయ భేదములు మతములుగా, మతములో చీలికలుగా మారిపోయి నేడు కనిపిస్తున్నవి. వేమన ఒకమారు

చెప్పిన జ్ఞానమే వేయి విధముల అర్థమైనపుడు, కనిపించని దేవుడు మూడుమార్లు, మూడు పద్ధతుల ద్వారా చెప్పిన

విషయము, మూడువేల చీలికలుగా మనుషులకు అర్థమైవుంటుంది. అటువంటి అన్ని చీలికలను ఒక్కటిచేసి, ఒకే

అభిప్రాయమునకు అందరినీ తెచ్చి, అందరినీ ఒకే భావములో ఉంచాలనునదే మా ఉద్దేశ్యము. అటువంటి ప్రయత్నములో

హేతువాదము, ప్రతివాదమును ఆధారము చేసుకొని అందరినీ ఒక దారికి తేవాలనుకొన్నాము. కావున ఈ గ్రంథములో

మేము హేతువాద పాత్రనూ, ప్రతి వాదపాత్రనూ రెండిటిని పోషించవలసి వచ్చింది. మేము ఎలా చెప్పినా ప్రజలను

జ్ఞానులుగా మార్చి, తీవ్రవాదము ఉగ్రవాదమునుండి బయటికి తీయాలనునదే ముఖ్య ఉద్దేశ్యము.


వేమన యోగి దైవజ్ఞానమును చెప్పినా అది కొందరికి నాస్తిక వాదముగా కనిపించింది కదా! అదే విధముగా

మేము చెప్పు బోధలు కూడా కొందరికి వేరువేరు విధములుగా కనిపించినా, మేము చెప్పునది స్వచ్ఛమైన దైవజ్ఞానమని

తెలియవలెను. మేము చెప్పు బోధలు ఎట్లుండునో తెలియుటకు ఉదాహరణకు రెండు వాక్యములను చెప్పెదను


చూడండి. ఒకటి దేవుడు నిజంగా లేడు. రెండు దేవుడు అబద్దముగా ఉన్నాడు. ఈ రెండు వాక్యములలో దేవుడు అను

పదము వదలితే నిజంగా లేడు, అబద్దముగా ఉన్నాడు అను రెండు మాటలు గలవు. రెండు మాటలలోను దేవుడు

లేడనియే పైకి కనిపిస్తున్నది. కొందరికి ఈ రెండు వాక్యములలో దేవుడు లేడను నాస్తికత్వము కనిపించినా మేము

చెప్పిన ఉద్దేశ్యము దేవుడు ఉన్నాడనియే. చెప్పిన పదములలోని భావమును లోతుగా చూచినప్పుడు అసలైన అర్థము

తెలియును. అలాగే చాలా విషయములలో లోతుగా చూడకనే ఒక నిర్ణయానికి చాలామంది వస్తూవుంటారు. అలా

తొందరపడి బుద్ధితో యోచించక ఒక నిర్ణయానికి రావడము వలన మనకు వచ్చిన నిర్ణయము తప్పుకావచ్చు లేక

ఒప్పుకావచ్చును. ఒప్పు అయితే ఫరవాలేదు, ఒకవేళ తప్పయితే అన్ని విధముల మార్గము తప్పిపోయి చివరకు

అనర్థము లేర్పడును. అందువలన ప్రతి విషయమును శాస్త్రబద్ధతతో లోతుగా చూడవలసియున్నది. అలా శాస్త్రమును

ఉపయోగించుకొని చూచుట వలన ప్రతి విషయములో దాగియున్న సత్యము బయటికి తెలియగలదు.


కొందరు ప్రత్యక్షముగా కనిపించు విషయములలోనే ఎటువంటి యోచన చేయక పొరపడుచుందురు. ఒక

వస్తువును చూచిన వెంటనే పొరపాటుగా తప్పుగా భావించుచుందురు. ఉదాహరణకు దూరముగా నున్న జమ్మి చెట్టును

తప్పుగా చింతచెట్టు అనుకోవడము. అలాగే దూరముగానున్న గాడిదను గుర్రముగా అనుకోవడము. మసక చీకటిలోని

తాడును పామని అనుకొన్నట్లు, చాలా విషయములలో తప్పుగా ఒకటుంటే మరొకటిగా నిర్ణయించుకొనుచుందురు.

ప్రత్యక్షముగా కనిపించు స్థూల విషయములలోనే ఈ విధముగా మనిషి పొరపాటు పడుచుండినప్పుడు, ఇక కనిపించని

సూక్ష్మ విషయములలో పూర్తిగా తప్పుదోవ పట్టిపోవుటకు అవకాశము గలదు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి

చూస్తే ఉగ్రవాదము వచ్చినదంటే దైవ విషయములనబడు మత విషయములలోనేనని చెప్పవచ్చును. దేవుడుగానీ,

దేవుడు సృష్టించిన జీవుడుగానీ, జీవునితో పాటు శరీరములోనున్న మనస్సుగానీ, బుద్ధిగానీ ఏదీ కనిపించునది కాదు.

జీవుడు స్థూలముకాదు, సూక్ష్మమైనవాడు. జీవుడే కనిపించని సూక్ష్మమైయున్నప్పుడు జీవున్ని తయారు చేసిన దేవుడు

పూర్తిగా తెలియనివాడు. దేవునికి ముఖ్యమైన మూడు వివరములు గలవు. అవి ఏవనగా! ఒకటి దేవునికి రూపములేదు,

రెండు దేవునికి పేరులేదు, మూడు దేవునికి పని లేదు. దీనినే ఒకే వాక్యముగా చెప్పుచూ దేవుడు రూప నామ క్రియ

లేని వాడని అన్నారు. రూప నామ క్రియారహితుడు దేవుడు అనుమాట బ్రహ్మ విద్యాశాస్త్రములో అతిముఖ్యమైనది.

దేవుని విషయమును గురించి ఎక్కడ మాట్లాడినా, ముఖ్యమైన దేవుని శాస్త్ర సూత్రమును వదలి మాట్లాడితే, అది

అశాస్త్రీయమైన మాట అగును. శాస్త్రమును అనుసరించిపోతే కనిపించనిది కూడా తెలియబడును. దేవుడు కూడా

సులభముగా తెలియగలడు. శాస్త్రబద్ధత లేకపోతే కనిపించే ప్రత్యక్ష విషయము కూడా సరిగా అర్థము కాకుండా

పోతుంది. అందువలన ఇప్పుడు మనము ప్రతి విషయమునకు శాస్త్రమును జోడించి చెప్పుకొందాము.


సహజముగా అందరూ పొరబడి ప్రక్కదారి పట్టిపోవు దైవ విషయములనే మనము తీసుకోవలసిన అవసరమున్నది.

దైవ విషయముల లోనే మనుషుల మధ్య అభిప్రాయ భేదములు వచ్చి చివరికవి హింస వరకు చేరుచున్నవి. దైవమార్గములో

అపోహలు పోవాలంటే ఆ విషయములనే తీసుకొని చూడవలసియున్నది. దేవుని విషయములను తీసుకొని చూస్తే,

దేవుని విషయములు రెండు భాగములుగా ఉన్నట్లు తెలియుచున్నది. ఒకటి స్థూలభాగము, రెండు సూక్ష్మభాగము.

దేవుడు సూక్ష్మమే అయినా సూక్ష్మమును కప్పియున్న స్థూలమును కూడా తెలియవలసియున్నది. ఉదాహరణకు గాలి

నింపిన బంతి అయిన పుట్బాల్ను గురించి పూర్తిగా తెలియాలంటే దానిలో నింపిన గాలితో సహా తెలియవలసి

వస్తున్నది. లోపల గాలిలేనిది బంతికి గుండ్రని ఆకారము రాదు. గుండ్రని తోలుతిత్తిలో గాలి నింపబడి తర్వాత అది


బంతిగా పిలువబడినది. తోలుతిత్తిలో నింపబడిన గాలి కొంత ఉండగా, తిత్తిలో నింపబడని గాలి బయట ఎంతో

గలదు. లోపల నింపబడిన గాలిని కొలిచి ఇంత కొలత ఉన్నదనీ, ఇంత బరువున్నదనీ చెప్పవచ్చును. అయితే

బయటగాలిని కొలువ లేము అలాగే దాని బరువును చెప్పలేము.


ఉదాహరణకు బంతిని తీసుకొని చూస్తే బంతి యొక్క పైకి కనిపించు ఆకారమైన తోలుతిత్తిగాయున్న దానిని

స్థూల భాగమనియూ, దానికి లోపల కనిపించకయున్న గాలిని సూక్ష్మభాగమనియూ చెప్పవచ్చును. ఈ విధముగా

బంతిని రెండు భాగములుగా విభజించవచ్చును. అలా రెండు భాగములుగానున్న బంతిని గూర్చి పూర్తిగా తెలియాలంటే,

బంతి అని చెప్పబడు రెండు భాగములను పూర్తి వివరముగా తెలిసియుండాలి. దేవుడు కూడా మనకు పూర్తిగా అర్థము

కావాలంటే, సూక్ష్మమును గురించి మరియు స్థూలమును గురించి తెలియాలి. బంతికి ఆకారమొచ్చుటకు కారణమైన

గాలిని గురించి తెలియకపోతే బంతియే అర్థము కాదు. అలాగే ఒక స్థూల శరీరములోనున్న సూక్ష్మమును తెలియకపోతే

మనిషీ అర్థము కాడు, మనిషిని సృష్టించిన దేవుడూ అర్థముగాడు. బంతిలో నింపబడినది కొంత గాలే, బయటనున్నది

ఎంతగాలో తెలియనట్లు, ఒక శరీరములో నింపబడినది జీవమను కొంత సూక్ష్మమే గలదు. శరీరము బయట ఎంత

సూక్ష్మము గలదో ఎవరికీ తెలియదు. ఈ విశ్వమంతయు కనిపించెడి స్థూలముతోను, కనిపించని సూక్ష్మముతోను

మిళితమైయున్నది. కనిపించెడి స్థూలము ప్రకృతికి సంబంధించినదై ఉండగా, కనిపించని సూక్ష్మము పరమాత్మకు

(దైవమునకు) సంబంధించినదై ఉన్నది. దైవమును తెలియాలంటే ప్రకృతినుండి మొదలు పెట్టాలి. బంతిని తెలియాలంటే

పై తోలుతిత్తినుండి మొదలు పెట్టినట్లు, దైవమును తెలియాలంటే ప్రకృతి నిర్మితమై స్థూలముగా నున్న శరీరమునుండి

మొదలు పెట్టవలసిందే.


నేడు అతివాదులు, నాస్తికవాదులు కనిపించెడి స్థూలమును మాత్రమే ఆధారము చేసుకొని, అది తప్ప ఏదీ

లేదనీ, కనిపించని దేవుడు లేనే లేడని అంటున్నారు. దేవుడు సూక్ష్మమైయుండగ స్థూలమును మాత్రము చూడగల్గు

వారికి దేవుడెలా తెలియగలడు? బంతిలో నింపిన గాలి కనిపించనంత మాత్రమున దానిని లేదని చెప్పగలమా?

అలాగే తమకు తెలియనంత మాత్రమున దేనినైనా లేదని చెప్పగలమా? కొందరు అతివాదులు మేము కనిపించెడి

భౌతికమునే ఒప్పుకొంటాము, కనిపించని అభౌతికమును ఒప్పుకోము అనువారు కలరు. భౌతికము సత్యము, అభౌతికము

అసత్యము అని చెప్పుచుందురు. అలా వారి మాట ప్రకారము అభౌతికము అసత్యమను వాదన సరియైనదనుకొంటే,

సువాసన అభౌతికముగా ఒకచోటనుండి మరియొక చోటికి ప్రాకుచున్నది. అటువంటపుడు సువాసనను అబద్ద మనాలి.

బుద్ధియున్నవాడు అభౌతికమైన సువాసనను అసత్యమని చెప్పలేడు. భౌతికము తప్ప అభౌతికమును ఒప్పుకోము అను

భౌతికవాదులు తమ చేతిలోనికి టి.వి. రిమోట్ తీసుకొని ఆన్ బటన్ను రిమోట్లో నొక్కితే పది అడుగుల దూరములోనున్న

టి.వి. ఆన్ అగుచున్నది. అప్పుడు రిమోట్ నుండి టి.వి. వరకు కనిపించని అభౌతికమైనదేదో ప్రయాణించి టి. విని

ఆన్ చేసినట్లు ఎవరైనా ఒప్పుకోగలరు. అటువంటపుడు దానిని మాయ మంత్రమని ఎవరూ చెప్పలేరు కదా! కేవలము

చిన్నశక్తి అయిన టి.వి. రిమోట్ కిరణమే కనిపించనపుడు, ఎంతో పెద్దశక్తి అయిన దేవుడు ఎలా కనిపిస్తాడు. టి.వి

రిమోట్ శక్తిని ఒప్పుకొంటే, ఎవడైనా దేవున్నయినా ఒప్పుకొని తీరవలసిందే. దేవున్ని ఒప్పుకోని ఏ భౌతికవాదయినా

టి.వి రిమోట్ శక్తిని కూడ ఒప్పుకోకూడదు. కొందరు మేము అభౌతికమును ఒప్పుకోము, దానిని ఎవరూ నిరూపించలేరని

అనుచుందురు. పువ్వులోని సువాసన అభౌతికము కాదా? టి.వి. రిమోట్ శక్తి అభౌతికము కాదా?


నేడు చాలా మతములలో మతపెద్దలమనుకొనువారికి కూడా అభౌతికమును గురించి తెలియదు. వారి (మత)

గ్రంథములో సూక్ష్మమైన అభౌతిక విషయములను ఎన్నిటినో చెప్పియుండగా, వాటిని కొందరు వదలి వేయుచున్నారు.

కొందరు సూక్ష్మమును కూడా స్థూలముగా భావించుకొని చెప్పుచున్నారు. కొందరు సూక్ష్మవిషయములనే చెప్పుకోకూడదని

అంటున్నారు. ఈ విధముగా కొందరు మత పెద్దలు కూడా అభౌతికవాదుల వలె భౌతికమునే సమర్థించుచూ, అభౌతికమును

పూర్తిగా వదిలివేయు చున్నారు. అభౌతికమును వదలి భౌతిక జ్ఞానమును మాత్రము ఆశ్రయించిన వారు, గాలిలేని

బంతిని పట్టుకొన్నట్లే, అలాగే జీవము లేని శరీరమును పట్టుకొన్నట్లే అగుచున్నది. కొందరు అభౌతికము అసత్యము,

భౌతికము మాత్రము సత్యమనుచూ, తాము ఎంతో తెలివైన మేథావులమని మురిసి పోవుచుందురు. సైన్సుకు పూర్తి

అర్థము తెలియకున్నా తాము సైన్సు ఆధారముతో వాదించుచున్నామనీ, తమకు తెలిసినవి మాత్రము సత్యమనీ, తమకు

తెలియనివన్నీ అసత్యమనీ అనుచుందురు. అటువంటి వారికి సైన్సు రెండు రకములుగా ఉన్నదనీ, తమకు తెలిసిన

సైన్సు జనరల్ సైన్సనీ (సామాన్యశాస్త్రము) తెలియని సూపర్ సైన్సు మరొకటున్నదనీ వారికి తెలియదు. కంటికి

కనిపించని దైవము, బుద్దికి తెలియని దైవము సామాన్య శాస్త్రమునకు తెలియదనీ, అసామాన్య శాస్త్రమైన బ్రహ్మవిద్యా

శాస్త్రమునకు మాత్రము తెలియునని చాలామందికి తెలియదు. ఇటు జనరల్ సైన్సును అటు సూపర్ సైన్సును తెలిసినవాడు

సులభముగా తన బుద్ధికి దేవుడు ఎటువంటివాడో గ్రహించుకోగలడు.


మీకు బాగా అర్థము కావాలంటే రెండద్దముల ఉదాహరణను చెప్పుతాను చూడండి. అద్దము అంటే తనకు

ఎదురుగా ఉన్నదేదైనా స్పష్టముగా చూపగలదు. ఎవడైనా అద్దము ముందర నిలబడితే వాని శరీర ముందర భాగమును

ముఖమును చూపగలదు. అంతేగానీ అద్దము ముందర నిలబడినంతమాత్రమున వాని శరీర వెనుక భాగములోనున్న

వీపును, తలను చూపలేదు కదా! అద్దము ముందర నిలబడి చూచిన వాడు తనకు కనిపించు ముఖము మాత్రము

సత్యము, కనిపించని వీపు అసత్యమనగలడా? అప్పుడు కనిపించక పోయినా తనకు వీపు భాగముందని నమ్మకము

మాత్రమున్నది. తనకు అంతవరకు కనిపించని వెనుక భాగమైన వీపు కూడా కనిపించాలంటే మరొక అద్దము కావాలి.

ఆ రెండవ అద్దము వెనుకవైపు ఉంచబడుతుంది. కావున ఆ రెండవ అద్దమును మాత్రము నిలుచున్న వాడు ప్రత్యక్షముగా

చూడలేడు. అయితే తనకు కనిపించక వెనుకవైపున్న అద్దము ముందర ఉన్న అద్దములో కనిపించును. అలా ముందర

అద్దములో కనిపించడమేకాక వెనుక వైపునున్న వీపు భాగము కూడా వెనుక అద్దములో కనిపించునట్లు ముందర

అద్దములోనే చూడవచ్చును. ఒక మనిషి తనకు వెనుకగల కనిపించని వీపు భాగమును కనిపించక వెనుకనేయున్న

అద్దములో ఎలా చూడగల్గుచున్నాడో, అలాగే ఒక మనిషి తనకు తెలియని సూక్ష్మమును కూడా తెలియవచ్చును. ఎదురుగా

ఉన్న అద్దము అందరికీ తెలిసిన జనరల్ సైన్సులాంటిది. దానిలో ప్రత్యక్షముగానున్న స్థూల విషయములు మాత్రమే

తెలియును. వెనుకవున్న అద్దము అందరికీ తెలియని సూపర్సైన్సులాంటిది. దానిలో ప్రత్యక్షముగా లేని సూక్ష్మవిషయములు

కూడా తెలియును.


కొందరు తమకు తెలిసిన సైన్సును ఆధారము చేసుకొని ముందరున్న అద్దములో ముఖమును చూచుకొన్నట్లు,

కనిపించే విషయము లను (స్థూల విషయములను) మాత్రమే తెలియగలుగుచూ, తమకు కనిపించని వెనుక తన శరీర

వీపు భాగమునే లేదన్నట్లు, తన శరీరములో భాగమైయున్న దైవమును కూడా ఎలా చూడాలో తెలియక దేవుడే లేడను

చున్నారు. కనిపించని శరీర వీపు భాగమును వేరొక అద్దముతో చూచినట్లు, కనిపించని శరీర అంతర్భాగమైన దైవమును

వేరొక సైన్సుతో చూడవచ్చని తెలియలేకపోవుచున్నారు. ముందర అద్దము మాత్రము తప్ప వెనుక అద్దము యొక్క


ఉపయోగము తెలియనివాడు ఎంత మూర్ఖుడో, అలాగే తనకు తెలిసిన ఒక సైన్సు మాత్రము తప్ప రెండవ సైన్సు

యొక్క ఉపయోగము తెలియని వాడు అంతే మూర్ఖుడగును. గణితము, ఖగోళము, రసాయనము, భౌతికము అను

నాలుగు శాస్త్రములు కలిసి ఒక సైన్సుకాగా, కేవలము బ్రహ్మవిద్యా శాస్త్రము (పెద్ద విద్యాశాస్త్రము) అనునది మాత్రము

రెండవ సైన్సగును. వెనుకనున్న రెండవ అద్దము ఎలా కనిపించదో అలాగే రెండవ సైన్సయిన సూపర్ సైన్సు కూడా

ఎవరికీ ప్రత్యక్షముగా కనిపించదు. కనిపించని రెండవ అద్దమును ఎదురుగానున్న మొదటి అద్దములో నుండే చూచి

దానిలోని తన వీపును చూడగల్గినట్లు, మనకు తెలిసిన విజ్ఞానము (సైన్సు) తోనే దైవజ్ఞానమును కూడా తెలియవలసియున్నది.

జనరల్ సైన్సుకు సంబంధించిన భౌతికశాస్త్రములోనే సూపర్ సైన్సును కూడ చూడకల్గి, దానిద్వారా ఎవరికీ తెలియని

దైవమును తెలియవచ్చును. ముందర అద్దము లేకపోతే వెనుకనున్న రెండవ అద్దము తెలియదు. రెండవ అద్దము

తెలియకపోతే నీ వీపు నీకు ఎప్పటికీ తెలియదు. అలాగే భౌతికశాస్త్రము అను సైన్సు తెలియకపోతే దానికి అతీతమైన

సూపర్సైన్సు తెలియదు. సూపర్ సైన్సు తెలియకపోతే నీ దైవము నీకు ఎప్పటికీ తెలియడు. నీ వెనుక శరీరముంటేనే

నీ ముందర శరీరమున్నట్లు, నీ శరీరములో కనిపించని దైవముంటేనే కనిపించే నీవున్నావని మరువకూడదు.


ఒక విషయమును చాలా విపులముగా తెలియజేసినప్పటికీ, శాస్త్రబద్ధముగా ఆధారములు చూపి వివరించినప్పటికీ,

కొందరికది పూర్తి అవగాహన కావచ్చునూ లేక కాకపోవచ్చును. చెప్పిన దానిని విని మౌనముగా ఆలోచించుచూ

ఎదురు మాట్లాడని మితవాదులు కొందరు ఉన్నారు. కొందరు అర్థమైనా తమను గొప్పగా ప్రకటించుకోవడానికి

ఎదుటివారు చెప్పిన దానిని ఒప్పుకోక మార్గము తప్పి విమర్శించుచుందురు. అటువంటి వారిని అతివాదులు

అంటున్నాము. చెప్పబడిన సమాధానము సరియైనదైనా, మొండిగా కాదని వాదించు వారిని అతివాదులనుచున్నాము

కదా! ఈ అతివాదమే ముదిరి తీవ్రవాదముగా, తర్వాత ఉగ్రవాదముగా మార గలదు. ఎలా అనగా ఒక విషయమును

విని లేక చదివి లేక తెలుసుకోగలిగి దానిని అడ్డముగా కాదనువారు అతివాదులు కాగా, అటువంటి అతి వాదులచే

ప్రేరేపింపబడి విషయమును చెప్పిన వారిమీదికి దాడులు చేసి హింసించు వారిని తీవ్రవాదులు అనవచ్చును. తీవ్రవాదులు

అతివాదులచే రెచ్చగొట్టబడినవారైయుందురు లేక ప్రేరేపింపబడినవారై యుందురు. అంతేతప్ప చెప్పబడిన విషయము

తప్పా, ఒప్పా, శాస్త్రబద్ధ మైనదా కాదా, సత్యమా అసత్యమా అని వారికి ఏమాత్రమూ తెలియదు. ఇటువంటి విచక్షణ

లేని తీవ్రవాదులనుండి రాటు తేలినవారే ఉగ్రవాదులు. ఉగ్రవాదులకు చావడము లేక చంపడము తప్ప విషయమేమిటనిగానీ,

తాము చేయుచున్న పని సరియైనదా కాదాయనిగానీ యోచించు స్థితిలో ఉండరు. ఎవడో చెప్పితే వానిమాట విని

హింసకు పూనుకోవడము తప్ప వేరు విధానమే వారిలో ఉండదు.


తాము గొప్ప అనిపించుకొనే దానికో, తమ మతము గొప్ప అనిపించుకొనే దానికో, సత్యమును కూడా

ఒప్పుకోనివాడు అతివాది. అటువంటి అతివాది తీవ్రవాదులను ఉగ్రవాదులను తయారు చేయుచున్నాడు. నేడు

తీవ్రవాదము, ఉగ్రవాదము భూమిమీద ఉంది అంటే, అది అతివాదము వలన పుట్టుకొస్తున్నదని తెలియవలెను. నేడు

ఉగ్రవాదమును అణచివేయలేక అనేక దేశములలోని ప్రభుత్వములు కూడా జుట్టు లాగుకొంటున్నవి. ఉగ్రవాదము

యొక్క జన్మస్థానమును తెలియనంత వరకు ఏ ప్రభుత్వము కూడా ఉగ్రవాదమును అణచివేయలేదు. పోలీసులనూ,

సైన్యమునూ, ధనమునూ ఉపయోగించినా ఉగ్రవాదము పెరుగుచూ పోవుచున్నది గానీ తగ్గుముఖము పట్టలేదని అందరికీ

తెలుసు. ఎవరైనా ఏ దేశమువారైనా ఉగ్రవాదమును లేకుండా చేయాలంటే స్వార్థవరులైన అతివాదులనుండి

తీవ్రవాదులనూ, ఉగ్రవాదులను వేరు చేయవలసిన అవసరమున్నది. తీవ్రవాదులుగానీ, ఉగ్రవాదులుగానీ ఇతరుల


ప్రేరణ వలన తయారగుచున్నారు తప్ప స్వంతముగా వారి భావజాలముతో కాదు. అందువలన ఎవరి వలన

ప్రేరేపింపబడుచున్నారో వారిని లేకుండా చేయాలి. ఏ భావమూ లేని సామాన్య మనిషి అతివాది చెప్పడము వలనగానీ,

అతను ఇచ్చు ధనము వలనగానీ, ఏదో ఒక బలహీనతతోగానీ ఇతరుల మాట విని వారు ప్రేరేపించినట్లు తనకు

ఏమాత్రము శత్రుత్వముగానీ, పరిచయము గానీ లేని మనుషులను ఘోరముగా చంపుచున్నాడు. ఉదాహరణకు ఒసామా

బిన్ లాడెన్ అను వ్యక్తి అతివాదిగా ఉండి అతను ఎందరినో ప్రేరేపించి ఉగ్రవాదులుగా తయారు చేశాడు. అలా

తయారైన ఉగ్రవాదులు కొందరు అమెరికా విమానములను హైజాక్ చేసి తమకు ఏమాత్రము పరిచయము గానీ,

శత్రుత్వముగానీ లేనివారిని చంపడమూ, వారు చనిపోవడమూ జరిగినది. ఆ సంఘటనలో కొన్ని వేలమంది చనిపోవడమూ,

కొన్ని కోట్ల ఆస్తి నష్టము జరిగినది. తీరికగా ఆలోచిస్తే ఉగ్రవాదులుగా మారి ఇతరులను చంపిన వారికి ఏ విధముగా

లాభము లేదు. ఒక అతివాది చేతిలో కీలుబొమ్మలుగా మారినవారే తీవ్రవాదులు, ఉగ్రవాదులు. వారు నూరిపోసిన

అసత్య మాటల వలన ఏదో తమకు వస్తుందని తలచి వారు ఆ పనికి పాల్పడడమూ, తమకు తెలిసి ప్రాణములను

పోగొట్టుకోవడమూ జరిగినది. చనిపోయిన తర్వాత నేరుగా దేవుని దగ్గరకు పోతారనో, ఎల్లప్పుడు స్వర్గములో

ఉంటారనో అతివాదులు చెప్పడము వలన ఆ మాటలు సత్యమా కాదా అని ఏమాత్రము ఆలోచించక, ఈ మాటలు

శాస్త్రబద్ధమైనవా కాదా అని కొద్దిమాత్రమైన చూడక, గ్రుడ్డివారు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచూ, ఉగ్రవాదులుగా తయారై

హింసకు పాల్పడినారు.


ముంబయి (బొంబాయి) లో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన విషయము అందరికీ తెలిసినదే.

పాకిస్థాన్లో ఎక్కడో ఎవరో ప్రేరేపించి పంపగా వచ్చిన వారు, ఇండియాలో తమకు ఏమాత్రము సంబంధములేని

వ్యక్తులనూ, తమవలె బ్రతుకుచున్న మనుషులనూ చంపడము జరిగినది. ఆ పోరాటములో ఒక ఉగ్రవాది పాకిస్థాన్లోనున్న

అతివాదితో ఫోన్లో మాట్లాడుచూ ఇలా ఒకమాట అన్నాడు. “నాకు ఇక్కడ పోలీసులు కాల్చిన కాల్పులలో తుపాకీ

గుండు తగిలింది, నేను చనిపోవుచున్నాను. నేను స్వర్గానికి పోవాలని అల్లాను (దేవున్ని) ప్రార్థించు” అని ప్రాణములు

వదలడము జరిగినది. నీవు ఇతరులను చంపుతూ చనిపోతే స్వర్గానికి పోతావు అని చెప్పినమాట వాస్తవమని నమ్మి,

తర్వాత వచ్చు స్వర్గము కొరకు ప్రస్తుతము తన ప్రాణమును పోగొట్టుకొన్నాడు. ఒకవేళ ఆ మాట అసత్యమైనా, దేవుడు

ఆ విధముగా తన గ్రంథములలో చెప్పియుండక పోయినా, ఉగ్రవాది అయినవాడు అతివాది చేతిలో మోసపోయినట్లే

కదా! దేవునిమీద విశ్వాసముగల మనుషులను దేవుడిలా చెప్పాడని నమ్మించి అతివాదులు మోసము చేయుచున్నారు.

తమలోనున్న మతాభిమానముతో గానీ, దేవుని మీదనున్న విశ్వాసముతోగానీ, ఇతరులు చెప్పిన మాటలను కొందరు

సులభముగా నమ్ముటవలన, ఏ సంబంధము లేనివాడు అనవసరముగా తీవ్రవాదిగా గానీ, ఉగ్రవాదిగా గానీ మారిపోవు

చున్నాడు. వాస్తవానికి ఉగ్రవాదులుగా మారిన వారందరూ అతివాదుల చేతిలో మోసపోయినవారేననీ, కేవలము ఏ

ఉద్దేశ్యములేని సామాన్య అమాయకులే ననీ, ఇతరులతో ఏ శత్రుత్వము లేని వ్యక్తులనీ, ఇతరులను చంపునపుడు

ఒకవైపు మనస్సు ఒప్పుకోకపోయినా, తనకు ఇష్టము లేకున్నా ఒప్పుకొన్న పనిని చేయవలసి వస్తున్నది.


ఈ మధ్యకాలములో మూడు నెలల క్రితము హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ బస్టాండు ఎదుట జరిగిన బాంబు

ప్రేలుడులో కొందరు చనిపోవడము ఎందరో తీవ్రముగా గాయపడడము జరిగినది. అక్కడ చనిపోయిన వారికిగానీ,

గాయపడిన వారికిగానీ ఏమాత్రము శత్రుత్వము లేని ఇద్దరు వ్యక్తులు రెండు సైకిళ్ళలో బాంబులు అమర్చి పోవడము

జరిగినది. అక్కడ తెచ్చి పెట్టిన వానికి ఎవరిమీద ఏ కసిగానీ, కక్షగానీ లేదు. ఒకవైపు ఘోరము జరిగిపోతుందని


తెలిసి వారికి కొంత బాధగా యుండినా, ఒకవైపు లోపల అయిష్టతయున్నా, విధిలేని పరిస్థితిలో అక్కడ బాంబు

పెట్టడడము జరిగియుంటుంది. హిందువులను చంపాలని బాంబు పెట్టినా, బాంబు పెట్టినవాడు ముస్లీమ్ అయినా,

వాడు కూడా మనిషే అయిన దానివలన లోపల ఏదో ఒక అయిష్టత ఉండనే ఉంటుంది. ఆ కార్యములో ముఖ్యపాత్ర

అంతయు పంపినవానిదే గానీ, చేసిన వానిది కాదని తెలివైనవారు గ్రహించగలరు. అటువంటపుడు ఉగ్రవాదమును

లేకుండా చేయాలంటే, ఉగ్రవాదులను పట్టుకొని శిక్షలు వేసినంత మాత్రమున సరిపోదు. ఎన్ని ఉరిశిక్షలు వేసినా

ఉగ్రవాదము పెరుగుతూనే ఉంటుంది గానీ తరగదు. ఒక వృక్షము యొక్క కొమ్మలను ఎన్నిటిని నరికినా క్రొత్తగా

చిగురించి కొమ్మలు పెరుగుచుండును. వృక్షము మొదలును లేకుండా చేస్తే తిరిగి కొమ్మలు పుట్టవు కదా! అలాగే

తీవ్రవాదము ఉగ్రవాదము అనునవి చిన్న పెద్దకొమ్మలుగా ఉండగా, అతివాదమనునది వృక్షము యొక్క మొదలుగా

ఉన్నది. మొదలుగాయున్న అతివాదమును లేకుండా చేస్తే, తీవ్రవాదము ఉగ్రవాదము దానంతట అది అణిగిపోవును.

ఈ సూత్రము తెలియనంత వరకు ఉగ్రవాదమును లేకుండా చేయలేము.


అతివాదమును లేకుండా చేయుటకు అది ఎక్కడుందో వెదకాలి. అతివాదమును ఎక్కువగా వెదకవలసిన

పనిలేకుండానే తెలిసిపోవును. ముందు కనిపించు మనుషులను ప్రేరేపించి పంపువాడు తాను కనిపించక వెనుకయున్నా

చివరకు సులభముగా వానిని తెలియవచ్చును. దానికి ఉదాహరణగా ఒక జరిగిన విషయమును వివరించుకొందాము.

మేము ఇప్పటికి 52 గ్రంథములను వ్రాశాము. అన్నియు ఒక ఆధ్యాత్మికమును తప్ప మరి ఏ విషయమును గురించి

లేవు. అందులో ముఖ్యమైనది భగవద్గీత. దాదాపు రెండు వేల సంవత్సముల పూర్వము కేరళ రాష్ట్రములో పుట్టిన ఒక

బ్రాహ్మణుడు ఆది శంకరాచార్యుడు అను పేరుకల్గి, హిందూ మతములో అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు.

తర్వాత కొంత కాలమునకు తమిళనాడులో పుట్టిన రామానుజాచార్యులు విశిష్టాద్వైతమను సిద్ధాంతమును ప్రచారము

చేశాడు. ఆ తర్వాత కర్నాటకలో పుట్టిన మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. ప్రస్తుత కాలములో

ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మేము త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాము. మేము చెప్పిన త్రైత సిద్ధాంతమును అనుసరించి

త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసి ఆంధ్రరాష్ట్ర మంతటా ఇల్లిల్లు తిరిగి భగవద్గీతను ప్రచారము చేయుచున్నాము. ఇంత

వరకు భగవద్గీతను ప్రచారము చేసినవారు మాతో సమానులు చరిత్ర అంతా వెదికినా కనిపించరు. అంతటి గొప్ప

కార్యమును మేము చేయుచు వుంటే, హిందూమతములోనే కొందరు అసూయపరులు మామీద ద్వేషము పెంచుకొని,

వారి వాదనను వారి ఉనికిని కాపాడుకొనుటకు అతివాదులై, మా మీద చెడుగా బోధించి త్రైతమంటే క్రైస్తవులదనీ,

హిందువుల ముసుగులో క్రైస్తవమును బోధిస్తున్నారనీ, హిందూ ధర్మరక్షణలో పని చేయువారిని ప్రేరేపించడము జరిగినది.

మామీద అసూయ కల్గిన స్వామీజీలు అతివాదులై ప్రేరేపించగా, మామీదికి దాడికి వచ్చిన వారిని ఏమనాలి? తీవ్రవాదులని

పేరుపెట్టాలి. హిందూ సమాజములో సిద్ధాంతకర్తగాయున్న మా మీదికే, దాడికి ప్రయత్నము చేసినవారు హిందూ

మతమును రక్షించుతామని చెప్పుకొనువారే. అనేకచోట్ల హిందువుల రక్షకులమనువారితోనే మాకు పేచీలు వచ్చాయి.

అయితే జిజ్ఞాసులైన కొందరు హిందువులు మా జ్ఞానమును తెలుసుకొని ఇది నిజమైన బోధ, నిజమైన జ్ఞానమని

సంతోషపడుటను చూచి, అన్ని ఆటంకములను అధిగమించి వచ్చాము. అతివాదులు మామీదికి ఎలా ప్రేరేపిస్తున్నారో

అందరికీ తెలియజేశాము. దానితో మామీదికి తీవ్రవాదము తగ్గిపోయి మేము చెప్పునదే అసలైన సత్యమని అందరూ

తెలుసుకోగల్గుచున్నారు.


అతివాదులతో ప్రేరేపింపబడిన వారివలన గుంతకల్లులో సరస్వతి విద్యామందిరమందు, మహానందిలోనూ,

హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోనూ కొన్ని ఆటంకములు ఏర్పడినవి. అయినా మా జ్ఞానముతో మేము వాటిని అతిక్రమించి

ధైర్యముగా ఇందూధర్మములను ఊరూరు తిరిగి, ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేయుచున్నాము. నేడు మా రచనలను

చూచి అన్ని మతముల వారు ఇందూధర్మమంటే ఏమిటో తెలుసుకోగల్గుచున్నారు. ఇతర మతముల వారికి కూడా

ఇందూధర్మమంటే ఏమిటో తెలియజేసిన ఘనత మాకు ఒక్కరికే దక్కినదని ధైర్యముగా చెప్పుచున్నాము. స్వయముగా

మాకు కల్గిన అనుభవముతో, తమ విధానమే గొప్పగా చెప్పుకొనువారు అతివాదులుగా తయారై ఇతరులను ఎలా

ప్రేరేపిస్తున్నారో తెలుసుకోగలి గాము. తర్వాత ప్రేరేపింపబడిన తీవ్రవాదమును ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకోగలిగాము.

త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి అని హంపి క్షేత్రమునకు ఒక కిలోమీటరు దూరములో వ్రాసిన దానికి, దానిని

పరమత ప్రచారముగా హిందువులు కేసుపెట్టితే హోస్పేట కోర్టు గ్రుడ్డిగా నేరము మోపి 22 రోజులు మా భక్తులను

జైలుకు కూడా పంపినది. అతివాదమును న్యాయస్థానము కూడా గుర్తించలేదనీ, ఉగ్రవాదమును ఏ ప్రభుత్వమూ

పూర్తిగా లేకుండా చేయలేదనీ తెలిసిపోయింది. అందువలన దానికి సరియైనమందు ఏదో మేమే తెలియజేయాలను

కొన్నాము. ఆ ప్రయత్నములో మనిషిలోని అజ్ఞానమును తీసివేసి జ్ఞానములో విచక్షణ కల్గువారిగా చేయడమే ముఖ్యమైన

పని అని తెలుసుకొన్నాము. ఎంతటి హింసనైనా జ్ఞానముతోనే మాన్పించవచ్చునని తెలిసి, మీకు కూడా అదే విధానమునే

చెప్పాలను కొన్నాము. అదే విధానమే ఇక్కడ చెప్పబోవుచున్నాము. మేము చెప్పు విధానమును ఏ దేశములో ఆచరించినా

ఆ దేశములో అతివాదమే ఉండదు. అతివాదమను మొదలు లేనప్పుడు తీవ్రవాదము, ఉగ్రవాదమను శాఖోపశాఖలు

అసలు ఉండవు.


భూమిమీద ఎక్కడైనా అతివాదమును లేకుండా చేయుటకు శాస్త్రము అవసరము. శాస్త్రము అనగా శాసనములతో

కూడుకొన్నదని అర్థము. ఇప్పుడు బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి ఉగ్రవాదమునకు పుట్టుకైన అతివాదమును

అణచివేయవచ్చును. అతివాదమును లేకుండా చేయుటకు స్థూలమును, సూక్ష్మమును రెండిటిని వివరముగా తెలియవలెను.

స్థూలము సూక్ష్మమునకు ఉదాహరణగా గాలి నింపిన బంతిని చెప్పుకొన్నాము. బంతి లేకున్నా గాలి ఉంటుందిగానీ,

గాలి లేకుండా బంతి ఉండదు అను సూత్రము ప్రకారము స్థూలము లేకున్నా సూక్ష్మముంటుంది గానీ, సూక్ష్మము

లేకుండా స్థూలముండజాలదు. సూపర్సైన్సు అనబడు దానిలో స్థూలమును సూక్ష్మమును రెండిటిని తెలియుటకు

ఉపమానముగా రెండు అద్దముల వివరమును చెప్పుకొన్నాము. ముందర స్థూలముగానున్న ముఖమును తెలియుటకు

ముందర అద్దమూ, వెనుక సూక్ష్మముగానున్న వీపును తెలియుటకు వెనుక అద్దమూ ఉపయోగపడినట్లు స్థూలమైన

జ్ఞానము తెలియుటకు నాలుగు శాస్త్రముల విజ్ఞానమూ, సూక్ష్మజ్ఞానము తెలియుటకు పెద్ద శాస్త్రము యొక్క సుజ్ఞానము

ఉపయోగపడుతుందని చెప్పుకొన్నాము. విజ్ఞానమును సామాన్యశాస్త్రమనీ (జనరల్ సైన్సనీ), సుజ్ఞానమును అసామాన్య

శాస్త్రమనీ (సూపర్ సైన్సనీ) చెప్పుకొన్నాము. కొందరికి ఇక్కడొక ప్రశ్నరావచ్చును. మాకు జనరల్ సైన్సు తెలియునుగానీ,

సూపర్ సైన్సు ఎక్కుడున్నదో, అదేమిటో కూడా తెలియదు. మీకు తెలుసా అని అడుగ వచ్చును. దానికి మా జవాబు

ఏమనగా!


మనుషులకు చూపబడినపుడు మనుషులు కనుగొని, మనుషుల ద్వారా బయటకు వచ్చినది సామాన్యశాస్త్రము.

శరీరములోనున్న అధిపతి ఆ మనిషి యొక్క లోదృష్ఠికి చూపినపుడు, ఆ వ్యక్తి నేను కనుగొన్నానని చెప్పునది సామాన్యశాస్త్రము

(జనరల్ సైన్సు) అంటాము. ఇక అసామాన్య శాస్త్రము అనబడు సూపర్సైన్సు మనిషి అనువాడు ఎవడూ చెప్పునది


కాదు. సూపర్ సైన్సు అనబడునది సృష్టి ఆదిలోనే చెప్పబడినది. అటు దేవుడుకాక, ఇటు మనిషికాక మధ్యలోనున్న

భగవంతుడు చెప్పినదే పెద్ద విద్యాశాస్త్రమనబడు సూపర్సైన్సు. అది ఎక్కడ వ్రాసి పెట్టబడియుంది అని ఎవరైనా

అడిగితే, దానికి జవాబుగా ఇలా చెప్పవచ్చును. నేడు మత గ్రంథములని పేరు పెట్టుకొని ఎవరి మతములో వారు

గొప్పగ చెప్పుకొను భగవద్గీత, బైబిల్, ఖుర్ఆన్ అనబడు మూడు గ్రంథములలోను బ్రహ్మ విద్యాశాస్త్రము (సూపర్

సైన్సు) కనిపించుచున్నది. ఈ నామాట కొందరికి నమ్మశక్యము కాకున్నా ఈ మాట నూటికి నూరుపాళ్ళు సత్యము.

ఇదేదో ఊహించుకొని చెప్పునది కాదు. అందువలన సత్యమని చెప్పుచున్నాము. ఇందులో ఎవరికీ తెలియని సత్యము

కూడా మరియొకటి గలదు. అదేమనగా! భూమిమీద మూడు రకముల బోధలుగా బ్రహ్మవిద్య తెలియ జేయబడినది.

ప్రకృతిలో ఒక భాగమైన ఆకాశమనబడు ఒక భూతము ద్వారా మొదట శబ్దరూపముతో ఆకాశములోనున్న అతిపెద్ద

గ్రహమైన సూర్యగ్రహమునకు తెలియజేయబడినది. మొదట బ్రహ్మవిద్యను తెలిసిన సూర్యుని ద్వారా సకల విశ్వమునకు

ఆ విద్య తెలియజేయబడినది. ఈ విషయము భగవద్గీతలో జ్ఞానయోగమందు మొదటి శ్లోకములోనే చెప్పియున్నారు.

తర్వాత ద్వాపరయుగము చివరిలో సాధారణ మనిషిగా కనిపించు కృష్ణుని ద్వారా చెప్పబడింది. తర్వాత కూడా

చెప్పబడుతుందని గీతలో కృష్ణుడే జ్ఞానయోగమందు ఎనిమిదవ శ్లోకములో చెప్పియున్నాడు. ఒకటి ప్రకృతి భాగమైన

ఆకాశమునుండి వాణి ద్వారా, రెండవది మనిషికి దేవునికి మధ్యలోనున్న భగవంతుని ద్వారా, మూడవది కనిపించని

తెరచాటు వ్యక్తి ద్వారా దేవుని జ్ఞానము మనుషులకు తెలియబడుతుందని కలదు. ఖుర్ ఆన్ గ్రంథమున 42వ

సురాయందు 51వ ఆయత్లో దేవుని జ్ఞానము మూడు మార్గముల (విధానముల) ద్వారా తెలియబడుతుందని తెలుపబడి

నది.


విజ్ఞానులని పేరుపొందిన వారికంటే మించిన విజ్ఞానము భగవద్గీతలో ఉందంటే, నేటి విజ్ఞానులు ఆ మాట

చెప్పినవానికి తిక్కవుందేమో అని అనుకొంటారు. నేడు ప్రత్యక్షముగా విజ్ఞానము (సైన్సు) ఎంతో పురోగతి సాధించి,

మనుషులకు ఎన్నో సౌకర్యములను అందించుచుంటే, దానికంటే మించిన విజ్ఞానము భగవద్గీతలో ఉందంటే, వారికి

నమ్మశక్యము కాదనియే చెప్ప వచ్చును. భగవద్గీత కేవలము ఒక గ్రంథముగా అర్థమైతే, భగవద్గీత అర్జునున్ని ప్రేరేపించి

యుద్ధము చేయించుటకు మాత్రమే చెప్పబడినదని అర్థమైతే, అందులో ఏ విజ్ఞానమూ కనిపించదు. కనీసము జనరల్

సైన్సు కూడా కనిపించదు. అటువంటపుడు భగవద్గీతలో సూపర్ సైన్సు ఉందని ఎవరూ నమ్మరు. నమ్ముటకు

ఆధారము కూడ దొరకదు. అప్పుడు జరుగుచున్న భారతయుద్ధమునకుగానీ, ఆ సమయములో వినిన అర్జునునికి

గానీ, సంబంధములేకుండా భగవద్గీతను చూచినప్పుడు, చెప్పబడిన ప్రతి మాట ఎంత లోతుగా చెప్పబడిందో

తెలియగలిగినప్పుడు, గీత సూపర్ సైన్సని తెలియగలదు. ఇంతవరకు భగవద్గీత ఎవరికీ అర్థముకానప్పుడు, అది

సూపర్ సైన్స్కాదని ఎలా చెప్పగలరు? సాంఖ్యయోగములో 19, 20, 21, 22, 23 శ్లోకములు సూపర్సైన్సు కాదని

ఎవరైనా చెప్పగలరా? ఇంతవరకు 22వ శ్లోకము యొక్క భావము ఎవరికీ అర్థము కాలేదని మేము చెప్పుచున్నాము.

22వ శ్లోకములో భౌతికశాస్త్రవేత్తలకే అర్థముగాని సైన్సు కలదు. భౌతికశాస్త్రమును మించిన పెద్ద శాస్త్రము

శ్లోకములో బయటపడి, అది ఒక సిద్ధాంతముగా ఉన్నది. ఈ విధముగా కొన్ని శ్లోకములలో మన భౌతికశాస్త్రవేత్తలు

వేయి సంవత్సరములు శ్రమించినా తెలియలేని సిద్ధాంతములుకలవని చెప్పవచ్చును. నేడు భూమిమీదున్న

నాస్తికత్వమునుగానీ, అతివాదము మొదలుకొని తీవ్రవాదము వరకుయున్న వాదములన్నిటిని లేకుండా చేయుటకు

హిందు (ఇందు)వులలో భగవద్గీత, క్రైస్తవులలో బైబిల్, ముస్లీమ్లలో ఖుర్ఆన్ గ్రంథము కలవని చెప్పవచ్చును.

భారతదేశములో ప్రస్తుతమున్న మూడు మతములలోని తీవ్రవాదమును, ఉగ్రవాదమును మూడు గ్రంథముల సారాంశమును


ఉపయోగించి లేకుండ చేయవచ్చును. మూడు మతములలోని అతివాదము మొదలుకొని ఉగ్రవాదము వరకున్న

మనుషులను మితవాదులుగా మార్చుటకు మేము ఎలా ప్రయత్నించామో, నా అనుభవమును ఒకదానిని వివరిస్తాను

చూడండి.


ఎదుటివాడు సత్యము చెప్పినా ఒప్పుకోక తన వాదనే గొప్పదని అడ్డముగా మాట్లాడువారిని అతివాదులంటాము

కదా! అటువంటి అతి వాదులు తమను తాము గొప్పగా చెప్పుకొనుచూ, ఎదుటి వాడు సత్యమును చెప్పినా, అది

సత్యమా, అసత్యమా అని ఏమాత్రము ఆలోచించకుండా తన వాదన విజ్ఞానముతో కూడుకొన్నదనీ, ఎదుటివాడు

చెప్పినది అజ్ఞానముతో కూడుకొన్నదనీ చెప్పుచుందురు. అటువంటి వారికి సత్యమును గురించి అర్థము

చేసుకోవడముకంటే, ఎదుటివాడు తక్కువ తాను ఎక్కువ అను స్వభావముండును. అటువంటి వారు తాము

సత్యాన్వేషకులమనీ, తమకంటే సత్యము తెలిసినవారులేరనీ చెప్పుకొనుచూ, సత్యాన్వేషణ సంఘములని బోర్డు పెట్టుకొన్నవారు

కూడా కలరు. అటువంటి అతివాదులకు ఎదుటివారు చెప్పునది కాదనుటయే పనిగా ఉండును. అటువంటి వారు

మాకు ఒకమారు తారసపడడము జరిగినది. 1980లో ఒకమారు నావద్దకు వచ్చిన అతివాది నాతో మాట్లాడడము

జరిగినది. అటువంటి అతివాదులు ముందే ఒక నియమము చెప్పుచుందురు. మీరు వాదనలో ఓడిపోతే, మీ

వాదనను వదలి మా వాదనను ఒప్పుకొని ప్రచారము చేయాలి. మేము మీ వాదనలో ఓడిపోతే, మా వాదన వదలి మీ

వాదననే సరియైనదని ప్రచారము చేస్తాము అని ఒప్పందము చేసుకొంటారు. దానికి పేపరు మీద వ్రాతగా కూడా

వ్రాసుకొందామంటారు. అలా బాండు పేపరు మీద వ్రాసుకొందామని ధైర్యముగా చెప్పుచున్నారంటే, మేము ఓడిపోము

అను విషయము వారికి ముందే నిర్ణయమైవుండునని అర్థమగుచున్నది. వాదన అన్న తర్వాత గెలుపు ఓటములుండవచ్చును

కదా! అటువంటపుడు అంత ఖచ్చితముగ ముందే ఒప్పందము చేసుకోవలసిన అవసరమేమొచ్చి నదని ఆలోచిస్తే,

అడ్డము మాట్లాడేవానికి ఓటమి ఉండదు కదా! అందువలన అంత ధైర్యముగా ముందే వ్రాసుకుందామనువారుంటారని

తెలియుచున్నది. 1980వ సంవత్సరములో మావద్దకే వచ్చిన ఒక అతివాదితో మేము అతని ఒప్పందమునకు ఒప్పుకొని

మాట్లాడినాము.


అటువంటి మొండివాదులు ఎలా మాట్లాడుదురో మాకు ముందు గానే తెలుసు. అటువంటివారు ప్రశ్నలు

అడగడమే పనిగా పెట్టుకొని, ఎదుటివాడు చెప్పిన దానిని ఏమాత్రము ఒప్పుకోక అడ్డముగా వాదించుచుందురు.

అందువలన అతనిని ఒక్క ప్రశ్న అడుగుటకు మాత్రము పరిమితి చేసి రెండవ ప్రశ్న నేను అడుగుతానని చెప్పాము.

ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నను అడుగవలెనని, ఏకధాటిగా ఒకరే ప్రశ్నలు అడుగరాదని ముందే చెప్పాము. మొదటి

ప్రశ్న ఆడుగుటకు అతనికే అవకాశమిచ్చాము. అప్పుడు అతనికి మాకు వాదన ఇలా సాగింది.


అతివాది :- దేవుడున్నాడా?

మేము :- దేవుడు నిజంగా లేడు, అబద్దమైన దేవున్ని నిజముగా ఉన్నాడనడము శాస్త్రవిరుద్ధమైన మాట.


(నేను అతని మాటకు దేవుడున్నాడు అని జవాబు చెప్పియుంటే, అతను నీవు చూచావా అని అడిగి చివరకు

దేవుడు లేడను తన వాదనే సరియైనదని చెప్పేవాడు. అయితే అతడు అనుకున్న దానికి భిన్నముగా దేవుడు నిజముగా

లేడు. దేవుడు అబద్దము అన్నాను. ఆ మాటకు నేను కూడా నాస్తికవాదివలె అతనికి కనిపించాను. నామాటను

పూర్తిగా గ్రహించుకొను శక్తిలేక దేవున్ని మొత్తానికే లేడనుకొన్నాడు. అయితే దేవుడు లేడని నేను అక్కడ చెప్పలేదు.

దేవుడు అబద్దముగా ఉన్నాడనియే చెప్పాను. నిజంగా లేడని మాత్రమే చెప్పాను. మొత్తానికి దేవుడు లేడని నేను


చెప్పలేదు కదా! రాముడు శుభ్రంగా లేడు అని అన్నామనుకోండి, ఆ మాటను పట్టుకొని రాముడు పూర్తిగా లేడు

అనుకుంటే విన్నవానిదే తప్పగును. చెప్పిన వానిది తప్పుకాదు. ఎందుకనగా రాముడు శుభ్రంగా లేడు అంటే అశు

భ్రముగా ఉన్నాడనియేగా అర్థము. అలాగే దేవుడు నిజంగా లేడు అంటే అబద్ధముగా ఉన్నాడనియేగా అర్థము. మేము

చెప్పిన మాటలో అర్థమును గ్రహిస్తే 'జ' అనగా పుట్టడము అని అర్థము. శబ్ధమునకు వ్యతిరేఖ పదము నిశ్శబ్ధము

అన్నట్లు ‘జ’ కు వ్యతిరేఖ పదము ‘నిజ’ అగును. ‘నిజ' అనగా పుట్టిలేదు, లేక పుట్టనటువంటిది లేక పుట్టుకే లేనిదని

అర్థము. అలాగే బద్దము అనగా బంధింపబడినది లేక కట్టివేయబడినదని అర్థము. బద్దమునకు వ్యతిరేఖపదము

అబద్దము అగుచున్నది. అబద్దము అనగా బంధింపబడనిది లేక కట్టివేయబడనిదని అర్ధముగానీ, పూర్తిగా లేడని

అర్థము కాదు కదా! దేవుడు ఇలా లేడు, ఇలా ఉన్నాడు అని చెప్పుచూ నిజంగా లేడు, అబద్దముగా ఉన్నాడని చెప్పాను

తప్ప పూర్తిగా లేడని చెప్పలేదు కదా! మేము చెప్పిన భావము పూర్తి అవగాహనకాక అతను దానికి ఏ మాట

మాట్లాడలేక, ఏ విధముగానూ నా మాటను ఖండించలేక నిలచి పోయాడు. అంతటితో అతని ప్రశ్నకు నా జవాబు

అయిపోయింది కదా! తర్వాత ప్రశ్న అడగడము నావంతు అయినది. అప్పుడు మేమిలా అడిగాము.)


మేము :- తల్లి గర్భములో కదలికలున్న తొమ్మిదవ నెల శిశువుకు ప్రాణము ఉన్నదా?

అతివాది :- గర్భములోని శిశువుకు ప్రాణమున్నదని ప్రతి తల్లికి తెలుసు, వైద్యము తెలిసిన ప్రతి డాక్టరుకు తెలుసు,

గర్భములోని శిశువుకు ప్రాణము ఉన్నదనుట జగమెరిగిన సత్యము (అతను ఏమాత్రము తడుముకోకుండా, ఆలస్యము

చేయకుండా, ఆలోచించకుండా టక్కున ఇచ్చిన జవాబది. జవాబు పూర్తి కాలేదు కాబట్టి, అది అసత్యమైన జవాబు

కాబట్టి, అతనిది సరియైన సత్యమైనవాదన కాదని తెలుపుటకు మేము ఇలా చెప్పాము. )

మేము :- తల్లి గర్భములో శిశువుకు ప్రాణముంటే, కొన్ని శిశువులు ప్రసవింపబడిన తర్వాత ఐదు లేక పది లేక ఇంకా

ఎక్కువ నిమిషముల కాలము వరకు ఎందుకు అరవడము లేదు? ఎందుకు శ్వాసించడము లేదు? శిశుశరీరములో

రక్తప్రసరణ ఎందుకు జరగడములేదు. శిశు శరీరములో ఏ కార్యముగానీ, ఏ కదలికగానీ ఎందుకు మొదలవలేదు?

అతివాది :- కొద్దిసేపు కదలనంతమాత్రమున శిశువుకు ప్రాణము లేదంటామా? తల్లిగర్భములోనే గుండెకొట్టుకుంటూ

వున్నది. అటువంటపుడు రక్తప్రసరణము జరగడము లేదు అనేది ప్రశ్నేకాదు.

మేము :- శిశువుకు తల్లిగర్భములో గుండె కొట్టుకోవడము లేదని మేము అనడము లేదు. కానీ అప్పుడే పుట్టి కదలని

శిశుశరీరములో గుండెకొట్టు కొంటూయుంటే రక్తప్రసరణము జరుగుతువుండాలి. అలా రక్తప్రసరణము జరుగుచున్నదా?

శ్వాస ఆడుచున్నదా? అని అడుగుచున్నాము. గుండె కొట్టుకోవడముగానీ, రక్తము ప్రసరణము జరగడముగానీ, శ్వాస

ఆడడము గానీ మీరు ప్రత్యక్షముగా చూచారా?

అతివాది :- నేను M.B.B.S డాక్టరును నాకు గర్భమును గురించి తెలియదా? శిశువును గురించి తెలియదా?

మేము :- మీరు డాక్టరు కాదుయనిగానీ, శిశువును గురించి తెలియదని గానీ చెప్పడము లేదు. పుట్టిన తర్వాత కదలని

మెదలని శిశువు శ్వాసించ డము మీరు చూచారా? అని అడుగుచున్నాను. దానికి సరియైన జవాబును చెప్పండి.

అతివాది :- కొంతసేపు కదలని శిశువు అపస్మారక స్థితిలో ఉండును, అందువలన కొంతసేపు కదలక పోవచ్చును.

అంతమాత్రమున ప్రాణమే లేదు, శ్వాసే లేదు అనడము పొరపాటు. అటువంటి శిశువుకు రక్తప్రసరణ ఉన్నది, శ్వాస

ఆడుచున్నది. గుండెకొట్టుకొంటే శ్వాస ఆడవలసిందే. గుండెకు శ్వాసకు ఒకదానికొకటి సంబంధమున్నది. గుండె


కొట్టుకోవడము తల్లిగర్భములోనే మొదలైనదని ఒప్పుకొన్నప్పుడు శ్వాస ఆడుచున్నదా అని మీరెలా అడుగుచున్నారు.

శ్వాస ఆడడము నాడికొట్టుకోవడమును ప్రత్యక్షముగా చూచాను. ఒక డాక్టరుగా తల్లిగర్భములోనే శిశువుకు ప్రాణమున్నదని

చెప్పుచున్నాను.


మేము :- ఇప్పుడు ఈ వాదనలో మీరు ఓడిపోయారు. మీరు ప్రసవింపబడి కొంతసేపు కదలని శిశువుకు

ప్రాణమున్నట్లుగానీ, శ్వాస ఆడుచున్నట్లు నిరూపించగలిగితే మీరు గెలిచినట్లగును. అంతవరకు మీకు తెలియని

విషయమును గురించి గ్రుడ్డిగా మాట్లాడుచున్నారని మేము చెప్పుచున్నాము.

అతివాది :- అయితే మేము పూర్తి ఆధారములతో ఒక నెలకు వచ్చి మేమే నెగ్గామని నిరూపించుకోగలము. నెల

తర్వాత మేము రాకపోతే మేము ఓడినట్లు మీరు గెలిచినట్లు, అంతవరకు మా ఓటమిని అంగీకరించము.


ఆ విధముగా మాట్లాడి పోయిన ఆ అతివాది తిరిగి మావద్దకు రాలేదు, తర్వాత అతని పేరు కూడా మేము

మరచిపోయాము. అలా కొన్ని సంవత్సరములు గడచిపోయాయి. ఒకమారు 2005 సంవత్సరము మాకు తెలియకుండానే

అదే వ్యక్తి దగ్గరికి ఇతరుల వెంట పోవడము జరిగినది. దాదాపు 25 సంవత్సరముల తర్వాత అతని రూపు రేఖలన్నీ

మారిపోయాయి. తలమీదున్న వెంట్రుకలన్నీ ఊడిపోయి పూర్తి పట్టనెత్తిగయున్న ఆ వ్యక్తిని మొదట నేను గుర్తించలేక

పోయినా, కొద్ది నిమిషముల తర్వాత అతను మాట తీరునుబట్టి ఆయనను నేను గుర్తించగలిగినా, అతను మాత్రము

నన్ను గుర్తించలేకపోయాడు. అక్కడికి నావెంట వచ్చిన వారు మీరు గొప్ప మేధావులనీ, మీకు తెలియని విషయమే

లేదనీ పొగడుచుంటే అతను ముసిముసి నవ్వు నవ్వుచూ మురిసిపోవుచుండుటను చూచి, నాకు ఏమీ తెలియనట్లు

మేము ఆయనను ఒక ప్రశ్న అడిగాము.

మేము :- శ్రీకృష్ణుడు గీతను బోధించాడు, ఏసు బైబిలును చెప్పాడు అయితే వారు చెప్పకుండా వదలివేసినవి ఏమైనా

ఉన్నాయా? ఏమైనా ఉంటే వారిరువురను మించి బోధించువారు ఈ కాలములో ఎవరైనా ఉన్నారా?

అతివాది :- కృష్ణుడు, ఏసూ చెప్పినది మీకేమైనా గొప్పగా కనిపించిందేమో, వారు చెప్పిన దానిలో ఏమి గొప్పతనము

లేదు. వారికంటే నేను ఎంతో మేలు, వారికి తెలియని ఎన్నో విషయములను చెప్పగలను. వారు సైన్సు అభివృద్ధి కాని

కాలములో పాతయుగములలో మాటలు మాట్లాడినారు. ఈ కాలములో వారు చెప్పినవి చాలా చిన్నవిషయాలే అని

నేను చెప్పు చున్నాను.


ఆ విధముగా అతని మాటలు వినిన నేను, అతను కృష్ణున్ని ఏసును తక్కువ చేసి మాట్లాడినందుకు, వీడు పూర్తి

మూర్ఖుడనుకొని అతనితో తర్వాత ఏమీ మాట్లాడక మౌనముగా ఉండి, తర్వాత అక్కడినుండి రావడము జరిగినది.

తర్వాత మూడు సంవత్సరములకు అతనితో మేమే పోయి కలిసాము. రెండవమారు తెలిసి అదే పనిగా ఆ వ్యక్తి వద్దకు

పోవడము జరిగినది. అతను సత్యవాద సంఘమును ఏర్పరచి, తనను హేతువాదిగా సత్యశోధకుడుగా చెప్పుకోవడము

చూచి, అతను సత్యశోధకుడుగానీ, హేతువాదిగానీ కాడని తెలిసి, నా జ్ఞానమును అనుసరించు కొందరితో కలిసి

అక్కడికి పోవడము జరిగినది. నేను ఎక్కడకు పోయిన నేను ఫలానా వ్యక్తినను గుర్తింపు ఏమాత్రము ఉండదు.

అందువలన నన్ను ఫలానాయని ఎవరూ గుర్తుపట్టలేరు. అడ్డముగా మాట్లాడి నేనే నెగ్గానని చెప్పుకోవడము అలవాటైన

అతను మేము పోయిన వెంటనే మాకు మాట్లాడే దానికి అవకాశమిచ్చి మాతో మాట్లాడను మొదలుపెట్టాడు. అప్పుడు

మా వ్యక్తులు ఆయన మాట్లాడుచుండగ మధ్యలో మేము కూడా మాట్లాడ వలసి వచ్చినది. అక్కడ వాదోపవాదములు

ఎలా జరిగాయో క్రింద చూడండి.


మా వ్యక్తి :- మేము హైదరాబాద్ నుండి మిమ్ములను కలిసిపోవాలని వచ్చాము, మా సంశయములకు జవాబులను మీ

ద్వారా తెలుసుకోవాలను కొన్నాము.

అతివాది :- మీరు వచ్చినందుకు సంతోషము. మీకు వచ్చిన సంశయము లేవో చెప్పండి.

మా వ్యక్తి :- భౌతికము అభౌతికము అంటారు కదా! ఇందులో ఏది సత్యము? లేక రెండూ సత్యమా?

అతివాది :- భౌతికము సత్యము, అభౌతికము అసత్యము. అభౌతికము సత్యవాదమునకు నిలబడదు. నిరూపణకు

రాదు. ఇతరులను మోసము చేయుటకు అసత్యమైన అభౌతికవాదము ఉపయోగపడుచున్నది. అంతతప్ప విజ్ఞానము

(సైన్సు) తెలిసిన వారెవరూ అభౌతికమును ఒప్పుకోరు. అభౌతికమును నిరూపించు వారికి పదిలక్షల రూపాయలు

ఇస్తామని మేము ప్రకటించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అందువలన భౌతికము సత్యమనీ, అభౌతికము

అసత్యమనీ చెప్పవచ్చును.

మా వ్యక్తి :- దేవుడు కనిపించనివాడు కదా! అటువంటి దేవుడు అభౌతికమే కదా! అలాంటపుడు మీ మాట ప్రకారము

దేవున్ని కూడా లేడని చెప్పవలసి వస్తున్నది కదా!

అతివాది :- విజ్ఞానము ప్రకారము దేవుడు లేడు. లేని దేవున్ని ఉన్నాడని అభౌతికవాదులు చెప్పుచుందురు. భౌతికవాదులు

ఎవరూ దేవున్ని ఒప్పుకోరు.

మా వ్యక్తి :- భగవద్గీత, బైబిలు, ఖురాన్ దేవుడున్నాడని బోధిస్తున్నవి కదా!

అతివాది :- విజ్ఞానశాస్త్రము సరిగా తెలియని కాలములో చెప్పబడినవి గీత, బైబిల్, ఖురాన్. ఈ కాలములో సైన్సు

ముందర అవన్ని తప్పుగా చెప్పబడుచున్నవి. కనిపించు భౌతిక ప్రకృతి తప్ప, కనిపించని అభౌతిక దేవుడు లేనే లేడు.

నేను :- కనిపించే భౌతికము మాత్రము విజ్ఞానమని, కనిపించని అభౌతికమును అజ్ఞానము అంటే, కనిపించకుండా ఉ

న్నవి ఎన్నో గలవు అవన్నియు లేనట్లేనా, మనస్సు కంటికి కనిపించదు, అంతమాత్రమున మనిషిలో మనస్సు లేదంటామా?

అతివాది :- ఆధ్యాత్మికవాదులు మనస్సుకు పేరును కల్పించారు. మనిషి శరీరములో మెదడు తప్ప మనస్సు లేదు.

నేను :- మీకు తెలియని దానిని వేరుగా పోల్చుకోవడము శాస్త్రబద్ధత అనిపించుకోదు. కొన్ని పక్షులు, భూమిలో వందల

అడుగుల లోతులోని నీటిని సూక్ష్మముగా గ్రహించి దాహము తీర్చుకొని బ్రతుకుచున్నవి. ఆ విషయము మీకు తెలియదు.

ఎంతో లోతులోని నీటిని ఒక అడుగు పొడవు కూడా లేని పక్షి ఎలా గ్రహించుకొంటున్నదో, వంద సంవత్సరములు

పరిశోధన చేసినా మీలాంటి భౌతికవాదులకు అర్థము కాదు. మీకు తెలిసినవి మాత్రము సత్యము, తెలియనివి అసత్యమను

సూత్రము ఎక్కడా వర్తించదు. భూమిలో రెండు లేక మూడు అడుగుల లోతులో వక్కపేడంత (పోక చెక్కంత) చిన్న

రాయిని పోలిన గడ్డ (దుంప) ఉంటే, దానినుండి కనిపించే ఏ ఆధారము లేకుండా చెట్టుమీద తీగ పెరుగుచున్నది. అది

ఏ చెట్టు మీదైనా పై భాగమున అల్లుకొని పెరుగగలుగుచున్నది. భూమిలోని గడ్డకు ఆకాశములోని చెట్టుకు అభౌతికమైన

సంబంధముతోనే అది పెరుగగలుగు చున్నది. చెట్టుమీద తీగ లేక చెట్టుమీద పాచి లేక ఆకాశవల్లి అను పేరుగల

తీగకు పుట్టుక స్థానము కనిపించనంత మాత్రమున మీలాంటి వారు అసత్యమనినా శాస్త్రబద్దముగా అది సత్యమే.

అతివాది :- మాకు తెలియనివన్నీ చెప్పి మీరు నమ్మమంటే మేము నమ్మము. ఏదైనా ప్రత్యక్షముగా పదిమందికి

అర్థమగునట్లు ఇది అభౌతికము అని తెలుపగలరా? పది అడుగుల దూరములోనున్న రాయిని తాకకుండ కదిలించగలరా?

అభౌతిక బలము చేత చూపుతో చెట్టుకున్న కాయను త్రుంచగలరా? ఏదైనా ఒక్కటయినా నిరూపించగలరా? సైన్సు

ప్రకారము అభౌతికమున్నదని చెప్పగలరా?



నేను :- నీకు తెలిసినది కనిపించే సైన్సే. సైన్సంటే ఏమిటో పూర్తి అర్థము తెలుసునా? కనిపించని దానిని కూడా

తెలియజేయునది సైన్సు. సైన్సులో అఆలు నేర్చుకొని, అంతా తెలుసునని భ్రమించు నీలాంటివారికి, సైన్సులో తెలియనిది

కొండంత ఉన్నదని తెలియదు. నీలాంటివారికి అర్థముగాని అభౌతికశక్తుల వలన ఎన్నో పనులు ప్రత్యక్షముగా

జరుగుచున్నవి. జరుగు చున్న వాటిని కాదని చెప్పగలవా? ఒకనికి నాగుపాము కాటువేస్తే, ఆ విషయమును వందకిలోమీటర్ల

దూరములోనున్న వ్యక్తికి ఫోన్ చేసి చెప్పితే, ఇక్కడ పాముకాటు విషము నివారించబడుచున్నది. ఇది అభౌతికముగా

కనిపించని వైద్యము ద్వారా నయము కాలేదనగలవా? సునామీ వస్తుందని నేటి శాస్త్రజ్ఞులు చెప్పకున్నా గంటముందే

దానిని తెలుసుకొన్న ఏనుగులు ఎత్తయిన కొండలు ఎక్కాయి. మనిషికి తెలియని విషయము కొన్ని జంతువులకు ఎలా

తెలిసిందో నీకు తెలిసిన కొద్దిపాటి సైన్సుతో చెప్పలేవు. ఒక చిన్న మొక్క (చెట్టు) వంద అడుగుల దూరములోనుండగానే

పాములు దాని దరిదాపుకు పోకుండా జాగ్రత్తపడగలవు. అలాగే తేలు కుట్టినవాడు విషముతో బాధపడుచుండగా ఆ

విషయమును వైద్యునికి చెప్పిన వ్యక్తికి వైద్యము చేస్తే, మందురాస్తే ప్రక్కననున్నవానికి తేలు విషము దిగి పోవుచున్నది.

ప్రత్యక్షముగా జరుగు ఈ పనిలో సైన్సు లేదంటావా?


అతివాది :- చివరిగా చెప్పిన ఈ విషయమును మీరు చూపించగలరా?

నేను :- నేను చూపించడము కాదు నీ చేతనే చేయించి నిరూపించగలను దానికేమంటావు?

అతివాది :- తేలు చేత నేనే కుట్టించి అప్పుడు మీరు చెప్పినట్లు పరీక్షించ గలను, మీకు సమ్మతమే కదా!

నేను :– మేము అన్నిటికీ సమ్మతమే. మాకు దానిలో సత్యమెంతవున్నదో తెలుసు. అందువలననే ధైర్యముగా చెప్పుచున్నాము.

మాకు స్థూలము సూక్ష్మము రెండూ తెలుసు. నీకు స్థూలము మాత్రము తెలుసు. అందువలన మీలాంటివారిని సగము

మేధస్సు కలవారనీ, పూర్తి మెదడు లేనివారనీ, ఆఫ్ నాలెడ్జి మనుషులని మేమంటుంటాము. చూపులేని వాడు ప్రపంచమే

లేదన్నట్లు, తనకు అవగాహన లేని విషయములన్నిటిని లేవను వారున్నారు. ఇప్పుడు నీ చేతనే తేలుచే కుట్టించి, నీ

చేతనే తేలు కుట్టిన వానికి కాకుండా ప్రక్కనున్న వానికి వైద్యము చేయిస్తాము. తేలు కుట్టిన వాడు నొప్పి పోయింది

అంటే దానికేమనగలవు?

అతివాది :- మీరు మసిపూసి మారేడు కాయను చేయాలనుకొంటున్నారు. అభౌతికముగానీ, అభౌతిక విద్యగానీ ఎక్కడ

నిరూపించబడలేదు. అది ఉన్నదని మీరు ఎంత చెప్పినా మేము నమ్మము.

నేను :- నిన్ను నమ్మించవలసిన అవసరము మాకు లేదు. నీలాంటి వారితో మాట్లాడడము వలన కాలము వృథా తప్ప

ఏమీ ప్రయోజనముండదు.

ఈ విధముగా అడ్డముగా మాట్లాడు అతివాదితో మేము మూడు మార్లు మాట్లాడడము జరిగిందని చెప్పాము

కదా! అటువంటి వారు ఎంతకాలమైనా వారి పట్టును వారు వదలక, తాము ఏమాత్రము మారకుండ మొండిగా

వాదిస్తుంటారు. పైగా అటువంటివారు తమదే సత్యవాదన అని చెప్పుకొంటూ ఉంటారు. మేము ఆ అతివాదితో

మాట్లాడిన మాటలన్నిటిని శాస్త్రమును జోడించి మాట్లాడాము. అటువంటి వ్యక్తితో మాట్లాడిన విధానమును ఇప్పుడు

చదివిన వారందరికీ అతివాదులు అసత్యవాదులనీ తెలిసిపోవుచున్నది. అలా తెలియడము వలన వారివలన ఎవరూ

ప్రేరేపించబడరు, వారి మాట ఎవరూ వినరు. అందువలన ఈ గ్రంథములో నాస్తికవాదులము, హేతువాదులము అని

తమకు తాము చెప్పుకొను వారినుండి ఎదురవు ప్రశ్నలను తీసుకొని, వాటికి శాస్త్రబద్ధమైన జవాబులు ఇవ్వడము

జరిగినది. దానివలన భూమిమీద అతివాదము, నాస్తికవాదము లేకుండా పోగలదు. అలా అతివాదము లేకుండా



పోవుట వలన తీవ్రవాదముగానీ, ఉగ్రవాదముగానీ పుట్టుటకు అవకాశమే ఉండదు. ప్రపంచములో మతద్వేషములుగానీ,

అజ్ఞాన బోధలుగానీ, లేకుండా పోగలవు. అలా జరుగుట వలన ప్రపంచమంతా దైవజ్ఞానముతో కూడుకొన్నదై

శాంతిని పొందగలదు. నేడుగల అశాంతినుండి బయటపడగలదు. అటువంటి స్థితి వచ్చుటకు ప్రతి ప్రశ్నకు

శాస్త్రబద్ధమైన జవాబును ఇవ్వవలసిన అవసరమున్నది.


ఇస్లామ్ సమాజములో అనగా ముస్లీమ్లలో కొందరు “జీహాద్” అను పదమును ఉపయోగించి మాట్లాడుచుందురు.

జీహాద్ అనగా పవిత్ర యుద్ధము అని అర్థము. అయితే నేడు పవిత్ర అను పదము పోయి, కేవలము యుద్ధము

మాత్రము మిగిలియున్నదని చెప్పవచ్చును. పవిత్రమైన దేవుని కొరకు చేయు దానిని పవిత్రయుద్ధమని పెద్దలు పూర్వము

చెప్పగా, నేడు పవిత్రయుద్ధమనుచు అపవిత్రమైన ప్రపంచ విషయముల కొరకు యుద్ధము చేయుచున్న వారు కలరు.

ఇస్లామ్లో పవిత్రయుద్ధము యొక్క అర్థము తెలియనివారు, తాము చేయుచున్నదే పవిత్రయుద్ధమని (జీహాద్ యని)

అనుకొంటున్నారు. క్రైస్తవములో పాపక్షమాపణ అను పదమును ఎక్కువమంది వాడుచుందురు. పాపక్షమాపణ అంటే

ఏమిటి? అది ఏ సందర్భములో చెప్పినమాట అని తెలియకనే, కొందరు క్రైస్తవులుగా మారితే ఎవనికైనా పాపక్షమాపణ

కలదని చెప్పువారూ గలరు. తమ మతములో పాపక్షమాపణ కలదనీ, పాపమును చేయువారూ కలరు. ఇక హిందూ

మతములోనికి వచ్చి చూస్తే, నేను హిందువునని చెప్పుకోవడానికి నాకే సిగ్గయితావున్నది. ఆ విధముగా హిందూమతము

అజ్ఞానములో కూరుక పోయినది. ఈ విధముగా అజ్ఞానములోనున్న మూడు మతములలోని వారిని బాగు చేయుటకు

మూడు మతస్థులనుండి వచ్చు ప్రశ్నలకు శాస్త్రబద్ధమైన జవాబులను ఈ గ్రంథములో ఇవ్వడము జరిగినది. ముందుగా

ఒక ముస్లీమ్ అడిగిన ప్రశ్నను తీసుకొని చూస్తాము.


ముస్లీమ్ := మీ మతములో రామున్ని దేవుడు అంటారు, రాముడు వాస్తవముగా దేవుడేనా?

జవాబు :- రాముడు త్రేతాయుగములో పుట్టాడు, రామునికంటే ముందు త్రేతాయుగములోనే ఎంతోకాలము గడచినది.

ఆ యుగముకంటే ముందు కృతయుగము 17,28,000 సంవత్సరములు గడచిపోయాయి. రాముడు పుట్టకముందు

కూడా దేవుడున్నాడని భగవద్గీత ద్వారా తెలియుచున్నది. దేవుడు అను పదమునకు బ్రహ్మవిద్యా శాస్త్రములో ముఖ్యముగా

ఒక ధర్మము కలదు. దాని ప్రకారము దేవుడు రూప, నామ, క్రియా రహితుడని తెలియు చున్నది. దానిప్రకారము

రూపమున్నవాడుగానీ, పేరున్నవాడుగానీ, పనిని చేయువాడుగానీ దేవుడుకాడని చెప్పదగును. దాని ప్రకారము దేవుడంటే

ఒక వ్యక్తికాదు, అదొక శక్తియని తెలియుచున్నది. రాముడు వ్యక్తి అయినందున ఆయనను వదలి, ఆయనకున్న పేరు

అయిన “రామ” అను శబ్ధములోనే దేవుడను అర్థముగలదని చెప్పవచ్చును. అల్లా అంటే దేవుడని మీరు అన్నట్లు, రామ

అను రెండక్షరములలో దేవుడను అర్థము ఇమిడి యున్నదని చెప్పుచున్నాము. ఈశ్వర్ అంటే అధిపతి అని అర్థము,

అన్నిటికీ అధిపతి దేవుడే, కావున దేవునికి ఈశ్వరుడను శబ్ధము సరిపోయినట్లు, రామ అను శబ్ధములో కూడా అర్థము

కలదు. 'మ' అంటే నేను అనియు 'రా' అంటే లేకుండా నశించడమనియు అర్థము. నేను అనువాడు లేకుండ పోతే

దేవునిలోనికి ఐక్యమైపోవును. అప్పుడు వాడు దేవునిగా మారిపోవును. అలాంటి అర్థమునిచ్చు శబ్ధము రామ అని

చెప్పబడుచున్నది. రామ అంటే అర్థము దేవుడనీ, వ్యక్తి అయిన రామునిలోని శక్తి దేవుడని చెప్పవచ్చును. ఏ వ్యక్తినైనా

భగవంతుడనవచ్చునుగానీ, దేవుడు అని అనడము బ్రహ్మవిద్యా శాస్త్రమునకు వ్యతిరేఖమవుతుంది. కనిపించే వ్యక్తి

మహాత్ముడు గావచ్చు, యోగికావచ్చు, జ్ఞానికావచ్చు, ప్రవక్తకావచ్చు, బ్రహ్మర్షికావచ్చుగానీ దేవుడు ఎప్పటికీగాడు. దేవుడు


అనగా కనిపించనివాడు, వినిపించనివాడు, అందువలన సూపర్ సైన్సు ప్రకారము వ్యక్తిని ఎప్పటికీ దేవుడు అనకూడదు.

కనిపించని దేవుడే మనిషిగా వస్తే, అతనిని భగవంతుడని అనవచ్చునుగానీ, దేవుడు అని అనకూడదు.


ఆ విధముగా మేము బ్రహ్మవిద్యా శాస్త్రము (సూపర్ సైన్సు) ప్రకారము సమాధానము చెప్పగ, దానికతను తృప్తి

చెంది ఇది ఎవరైనా ఒప్పుకోతగిన జవాబే అని చెప్పిపోయాడు. ఇక్కడ ముందుగా మూడు మతముల వారు అడిగిన

మూడు ప్రశ్నలకు జవాబును చెప్పడము జరిగినది. మూడు మతములవారు ఇతర మతముల మీద వేసిన ప్రశ్ననే

తీసుకొని చెప్పాము. ముందుగా మూడు సమాజముల వారికి సరియైన జవాబు దొరికితే, తర్వాత వారు ఈ గ్రంథమును

చివరివరకు చూచుటకు అవకాశము గలదు. అందువలన ముందుగా కొంత కఠినముగానున్న ప్రశ్నలను వ్రాయడము

జరిగినదని చెప్పుచున్నాము. ఇవి మూడు కఠినమైన ప్రశ్నలు, అలాగే జవాబులు కూడ కొందరికి నచ్చకపోయినా,

చెప్పినది పూర్తి శాస్త్రబద్ధతను అనుసరించి చెప్పినవని తెలియవలెను. ఏమాటకైన శాస్త్రము ప్రాణములాంటిది. శాస్త్రమును

అనుసరించి చెప్పనిమాట ప్రాణములేని మృత శరీరములాంటిది. ఒకవేళ ఎక్కడైన అతివాదులు దేనినీ ఒప్పుకోక వారు

తీవ్రవాదమును ప్రేరేపించినప్పటికీ, వారి ఉచ్చులో పడకుండా మీ స్వంత బుద్ధితో ఆలోచించి మేము చెప్పు మాట

శాస్త్రమో కాదో, సత్యమోకాదో చూడండి. ఇది శాస్త్రబద్ధమైన జ్ఞానము, కాబట్టి ఎవరూ దీనిని ఎదురాడలేరు. ఎవరూ

ఎదురాడని జ్ఞానమును అందిస్తానని దేవుడు తన గ్రంథములో చెప్పిన మాటను మనము మరువకూడదు. ఇప్పుడు

అటువంటి జ్ఞానమునే దేవుడు అందిస్తున్నాడని అనుకొందాము. ఇప్పుడు ఒక క్రైస్తవుడు అడిగిన ప్రశ్నను చూస్తాము.


ప్రశ్న :- ఖుర్ఆన్ను పవిత్రగ్రంథము అని ముస్లీమ్లందరూ అంటారు. వాస్తవానికి దేవుని గ్రంథమేనా?

జవాబు :- అజ్ఞానము చేత ఒక మతమువారు మరొక మతమును ద్వేషించడము సహజముగా జరుగుతుంటుంది.

అలాగే ఒక మతము వారు మరొక మత గ్రంథమును విమర్శించడము జరుగుతుంటుంది. ప్రపంచములో ఎన్నో

మతములుండినా ముఖ్యముగా హిందూ, ఇస్లామ్, క్రైస్తవమతముల గురించే నేను మాట్లాడగలను. నేను స్వచ్ఛమైన

ఇందువును (హిందువును) నేను చదివినది భగవద్గీతను. భగవద్గీత బ్రహ్మవిద్యా శాస్త్రము. బ్రహ్మవిద్యా శాస్త్రమును

నేను పూర్తిగా తెలియగలిగినపుడు, ఆ శాస్త్రము ఎక్కడయున్నా, ఏ గ్రంథరూపములోవున్నా సులభముగా గుర్తించగలను.

గీతలో నున్న శాస్త్రము బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో కూడా కనిపించడము వలన మూడు మతముల ప్రజలకు నేను

సులభముగా జవాబును ఇవ్వగలను. ఖుర్ఆన్ గ్రంథము అర్థము కావాలంటే చాలా కష్టము. నడి సముద్రములో నుండి

తీరమువైపుకు తెరచాపగానీ, తెడ్డుగానీ లేకుండా పడవను నడుపడము ఎంతకష్టమో ఖురాన్ అర్థము కావడము అంత

కష్టముగా ఉంటుంది. ప్రవక్త కాలములోనే ఆయనకు చదువురాని కారణమున ఖుర్ ఆన్ ఇతరుల చేత కూర్చబడి

వ్రాసిన గ్రంథము. అందులో వరుస క్రమము ఉండదు. అందువలన ఇస్లామ్ పండితులమని చెప్పుకొను వారికే అది

పూర్తి అవగాహన కాలేదని చెప్పవచ్చును. ఇస్లామ్ పండితులే తప్పుదారి పట్టి సరిగా అర్థము చేసుకోనప్పుడు, ఇతర

మతస్థులకది అర్థము కావాలంటే చాలాకష్టమని చెప్పవచ్చును. అయినా అది బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిన

గ్రంథము, కాబట్టి దానిని గురించి సులభముగా చెప్పగలను. అందరికీ కష్టమైనా నాకది చాలా సులభము. ఖుర్ఆన్

వాస్తవానికి దేవుని గ్రంథమేనా అని ముస్లీమ్కాని వ్యక్తి అడగడము జరిగినది. అదే ప్రశ్న ఏదో ఒక ముస్లీమ్లో కూడ

ఉండవచ్చును. ఖుర్ఆన్ దేవుని గ్రంథమే అని నేను చెప్పకముందే దీనిని గురించి కొంత ఇతరులు కూడా

తెలియవలసియున్నది.


దేవుడు సృష్ఠినంతటిని సృష్టించాడు అనుమాట వాస్తవమే, అయినా కొందరు దేవుడు సోమవారమునుండి


శనివారము వరకు ఆరురోజులు కష్టపడి విశ్వమునంతటిని తయారు చేశాడనీ, ఆరురోజులు పనిని చేసిన కారణమున

అలసిపోయి చివరి రోజైన ఆదివారము విశ్రాంతి తీసుకొన్నా డని చెప్పుచుందురు. వారమునకున్న మొత్తము ఏడురోజులలో

ఆరు రోజులు పనిచేసి, ఒకరోజు సెలవు పొందాడని చెప్పుకోవడములో ఎంత వరకు సత్యమున్నదని ఆలోచిస్తే, ఇంతవరకు

అందరికీ వున్న ఆ భావము పూర్తి తప్పు అని తెలిసిపోవుచున్నది. ఆదివారము వారములో చివరి రోజుకాదు. ఆదివారము

అను పేరులోనే ఆది అనగా మొదటిది అని అర్థముండగా దానిని చివరి దినమనడము పూర్తి తప్పు. అంతేకాక దేవుడు

మనవలె మనిషికాదు, మనవలె పనిని చేయువాడు కాదు. దేవున్ని మనిషివలె పని చేయువానిగా, అలసిపోవువానిగా,

విశ్రాంతి తీసుకొను వాడుగా చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడము వలన దేవున్ని తక్కువ చేసి మాట్లాడినట్లగును.

దేవునికి మనవలె పని చేయవలసిన అవసరము లేదు. ఆయన సంకల్పముతోనే అన్నీ ఒక్క క్షణములో జరిగిపోవును.

దేవునికి ఆరుదినములు పని దినములని చెప్పడము శాస్త్ర విరుద్ధము. ఆయన అనుకొంటే ఒక్క సెకండులో నూరవవంతు

కాలములోనే ఏమైనా జరిగిపోవును. ఈ విషయమునే భగవద్గీతయందు విభూతి యోగమను అధ్యాయమున ఆరవ

శ్లోకమందు ఇట్లు చెప్పారు. “మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః” “నా సంకల్పము చేతనే సమస్త

లోకము దానియందలి ప్రజలు పుట్టారు.” ఈ మాట శాస్త్రములోని శాసనము కావున దానిని ఎవరూ కాదనలేరు. ఇదే

విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో 2వ సురాలో 117వ ఆయత్నందూ, 36వ సురాలో 82వ ఆయత్నందూ, 40వ

సురాలో 68వ ఆయత్నందూ కూడా చెప్పారు.


2వ సురా అల్బఖరాలో 117వ వాక్యము "భూమ్యాకాశాలను ప్రప్రథమముగా సృష్టించినవాడు ఆయనే (దేవుడే).

ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నపుడు దానిని “అయిపో” అంటే చాలు, అది అయి పోతుంది.” ఈ విధముగా

ఉన్నప్పుడు దేవునికి ఆరురోజులు పని, ఒక రోజు సెలవు అనుమాట పై వాక్యములకు విరుద్ధమగును. కొందరు ఏది

శాస్త్రమో ఏది శాస్త్రము కాదో తెలియలేని స్థితిలో తికమక పడిపోవుచుందురు. ఎందుకనగా ఒకే గ్రంథములోనే రెండు

రకముల జ్ఞానము కనిపించినప్పుడు అటువంటి స్థితి ఏర్పడుతుంది. సురా 2, ఆయత్ 117లో పైన చెప్పిన వాక్యమునకు

వ్యతిరేఖముగా అల్లా ఆరురోజులు సృష్టించాడు అనుమాట అదే ఖుర్ఆన్ గ్రంథములో 7వ సురాలో 54వ ఆయత్నందూ,

11వ సురాలో 7వ ఆయత్నందూ, 32వ సురాలో 4వ ఆయత్నందూ, 50వ సురాలో 38వ వాక్యమందూ, 57వ

సురాలో 4వ వాక్యమందూ కలదు. ఉదాహరణకు 32.4లో "అల్లాయే ఆకాశములను, భూమినీ వాటిమధ్యనున్న

సమస్తమును ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్షను) అదిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ

సహాయకుడూ, మరే సిఫారసు చేసేవాడూ లేడు. అయినా మీరు హితబోధను గ్రహించలేకున్నారేమిటి?” అని కలదు.

ఈ మాట 2, 117లోని మాటకు పరస్పర విరుద్ధముగా కనిపించడము గలదు. ఎటువంటి జ్ఞాని అయినా ఎటుతేల్చుకోలేక

సందిగ్ధావస్థలో పడిపోవును. అటువంటి స్థితిలో ఎవరికైనా ఇది దేవుని గ్రంథమేనా అని ప్రశ్నరాగలదు. అటువంటి

సందర్భములో ఇతర మతస్థుడు ఎవడైన ఈ ప్రశ్నను అడుగగలడు. అందువలన మొదటనే నేను ఒకమాటను చెప్పాను.

అదేమనగా! ఇది దేవుని గ్రంథమేనని నేను చెప్పకముందే దీనిని గురించి ముందే కొంత తెలియవలసినదున్నదని

చెప్పాను. అలా చెప్పుటకు కారణము ఏమనగా!


ఖుర్ఆన్ గ్రంథములో పరస్పర విరుద్ధ వాక్యములన్నాయని తెలిసినా అది శాస్త్రబద్ధమైన దేవుని గ్రంథమేనని

ముందే నేనొక నిర్ణయానికి వచ్చి యున్నానని పై మాటతో తెలిసిపోగలదు. అయితే మీకు పరస్పర విరుద్ధ వాక్యములున్నట్లు

తెలియకముందే అది దేవుని గ్రంథమేనని నా నిర్ణయమును చెప్పినా, తర్వాత ఒకదానికొకటి వ్యతిరేఖ వాక్యములు


కనిపించినప్పుడు నా మాటను మీరు కాదనగలరు. అందువలన మీకు అనుమానము వచ్చు విషయమును ముందే

చెప్పి, దానిలోని ఆటంకములను తీసివేసితే తర్వాత ఎటువంటి సందిగ్ధము వచ్చినా, దానిని అతిక్రమించి నా మాటనే

విశ్వసించగలరు. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! పరస్పర విరుద్ధమైన మాటలు ముందు

తెలిసినా లేక తర్వాత తెలిసినా దానిమీద ఎవరికైనా అనుమానము రాకతప్పదు కదా! నీవు నీ నిర్ణయాన్ని చెప్పినా

మేము దానినెందుకు ఒప్పుకుంటాము అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇట్లున్నది. నేను ఇంకా చెప్ప

వలసినదున్నది. మీకంతా తెలిసిన తర్వాత నేను చెప్పకున్నా మీరే నా మాటలను చెప్పగలరు. అందువలన ఇంకా

ముందుకు పోయి తెలుసుకొందాము.


దేవుడు రూప, నామ, క్రియారహితుడు కదా! అటువంటపుడు సృష్ఠిని తయారు చేయాలను తలంపు రావడమూ,

అలాగే అయిపో అంటే అంతా తయారైపోవడము జరిగినా, తలంపు రావడముగానీ, దాని ప్రకారమే సంకల్పముతోనే

సృష్ఠిని నిర్మించడముగానీ పనియే కదా! అటువంటపుడు దేవునికి క్రియలేదనీ, దేవుడు క్రియారహితుడనీ మీరు ఎలా

చెప్పగలరని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! సృష్ఠి తయారు కాకముందు ఎవరూ లేరు,

అందువలన దేవుడు ఎటువంటివాడో ఎవరికీ తెలియదు. ఆయనను గురించి చెప్పుకొను వారేలేరు కదా! సృష్ఠి

తయారైన తర్వాత ఆయనను గురించి చెప్పవచ్చును. సృష్ఠి తయారైన తర్వాత దేవుడు అను వానికి రూపముగానీ,

పేరుగానీ, పనిగానీ ఏమాత్రము లేవు అనునది శాసనము. సృష్ఠి తయారు కాకముందు దేవుడు ఏమి చేసేవాడో,

ఎట్లుండే వాడో, ఏ పేరు కలిగివుండేవాడో ఎవరికీ తెలియదు. దానిని గురించి ఎవరూ చెప్పలేరు. సృష్ఠి తయారు

చేయబడిన తర్వాత దేవుడు ఎవరు? ఏమి చేస్తాడు? ఆయన ఎట్లున్నాడు? అను మూడు ప్రశ్నలకు ఎవరు అనే దానికి

ఫలానా అనుటకు పేరులేదు. ఏమి చేస్తాడో అనే దానికి ఆయనకు పనీలేదు. ఆయన ఎట్లున్నాడనుటకు ఆయనకు

ఆకారమే లేదు, అందువలన దేవున్ని రూప, నామ, క్రియలులేని వాడని చెప్పారు. అటువంటి దేవున్ని తెలుపుటకు

ఎవరికీ శక్యముకాదు, ఎవరూ చెప్పలేరు. అటువంటపుడు దేవుని విషయము మనుషులకు ఎలా తెలియునను

ప్రశ్నరాగలదు. దానికి జవాబుగా చెప్పితే ఇలా కలదు. దేవుని విషయమును దేవుడే చెప్పాలి. లేకపోతే ఎవరూ

చెప్పుటకు అవకాశము లేదని చెప్పవచ్చును. దేవుడు పని చేయనివాడు కదా! అటువంటపుడు ఆయన ఎలా చెప్పగలడను

ప్రశ్నకూడ రాగలదు. అందువలన దేవుడు విశ్వమును సృష్టించినపుడే, తన జ్ఞానమును ప్రజలకు తెలుపు నిమిత్తము,

తాను స్వయముగా తెలుపకుండా, వేరు విధానము ద్వారా తెలియబడునట్లు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు ముందే

నిర్ణయించిన విధానములు మూడు విధములుగా గలవు. ఈ మూడు విధానములలోను దేవుడు స్వయముగా ఏమాత్రము

తెలుపకున్నా, దేవుని జ్ఞానము మనుషులకు తెలియునట్లు చేశాడు.


మూడు విధానములలో ఒకటి ఆకాశవాణి ద్వారా దేవుని జ్ఞానము తెలియబడును. రెండు దేవుని అంశగల

వ్యక్తి దేవుని జ్ఞానమును తెలియ జేయును. మూడు కనిపించక తెరవెనుకనున్నవాడు చెప్పడము వలన దేవుని జ్ఞానము

ప్రజలకు తెలియగలదు. ఈ మూడు విధానములలో ఒకరు కనిపించే వ్యక్తి చెప్పగా, ఒకరు కనిపించని వ్యక్తి చెప్పగా,

మరొకరు వ్యక్తి కాకుండా పంచభూతములలో ఒకశక్తి అయిన ఆకాశము చెప్పడము జరుగునని, దేవుడు సృష్టికి పూర్వమే

దేవుడు నిర్ణయించాడు. దేవుని నిర్ణయము ప్రకారము మూడు విధములుగా దేవుని జ్ఞానము మనుషులకు తెలియుచున్నది.

కానీ దేవుడు స్వయముగా ఎక్కడా చెప్పలేదు. అందువలన క్రియారహితడను మాట ఆయనకు సరిపోయింది. ఇదే

విషయమునే ఖుర్ఆన్ గ్రంథమున 42వ సురాలో 51వ ఆయత్నందు ఇలా చెప్పడము జరిగినది. “ఏ మానవునితోనూ


దేవుడు నేరుగా మాట్లాడడు.” అయితే ఒకటి వాణి ద్వారా (ఆకాశ శబ్దము ద్వారా), రెండు తెర వెనుకనుండి ఒకరు

చెప్పడము వలన, మూడు తనదూత ద్వారా దేవుడు నిర్ణయించినట్లు దేవుని జ్ఞానము మనుషులకు తెలియుచున్నది.

నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు.


మనుషులు అధర్మవరులు కాకుండుటకు, భూమిమీద అధర్మములు చెలరేగి ధర్మములకు గ్లాని (ముప్పు)

ఏర్పడినపుడు నన్ను నేను సృజించుకొని వచ్చి యుగయుగములలోనూ ధర్మములను తెలియజేస్తానని భగవద్గీతా గ్రంథములో

జ్ఞానయోగమందు “యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత” అను ఏడవ శ్లోకములోనూ, “పరిత్రాణాయ సాధూనాం

వినాశాయ చదుష్కృతామ్” అను ఎనిమిదవ శ్లోకములోను భగవంతుడు చెప్పడము జరిగినది. (మీరు బాగా జ్ఞాపకము

పెట్టుకోవలసినదేమనగా! ఇక్కడ గీతలో భగవంతుడు చెప్పాడని చెప్పాముగానీ దేవుడు చెప్పాడని చెప్పలేదు. గీతలోనే

జ్ఞానయోగములో మొదటి శ్లోకములోనే “ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహ మవ్యయమ్” అని కూడా చెప్పబడినది.

ఈ శ్లోకములో ఆకాశము లోని సూర్యగ్రహమునకు జ్ఞానము చెప్పబడినదని కలదు. ఈ విధముగా భగవద్గీతలోనే

రెండు రకములుగా జ్ఞానము తెలియజేయడము జరిగినది. ఒకటి శూన్యములోని సూర్యునికి, రెండవది భూమిమీద

మనుషులకు చెప్పడము వలన రెండు విధముల జ్ఞానమును దేవుడు భూమి మీద తెలియజేసినట్లు తెలియుచున్నది.

వివరముగా మీకు అర్థము కావాలంటే 1400 సంవత్సరముల పూర్వము చెప్పబడి ఖుర్ఆన్ గ్రంథములో 42వ సురా

51 ఆయతియందు దేవుడు మూడు విధముల తన జ్ఞానమును తెలియునట్లు చేస్తాడు అన్నట్లు ఒకటి ఆకాశము తన

వాణి ద్వారా సూర్యునికి సృష్ఠి ఆదిలోనే చెప్పడము జరిగినది. పంచ భూతములలో ఒకటైన ఆకాశము భూతములలో

మహాభూతముగా చెప్పబడినది. ఖగోళములో గల ఉప భూతములు, భూతములు, మహాభూతములు అను మూడు

రకముల భూతములలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవి మహా భూతములుగా చెప్పబడుచున్నవి.

మహాభూతములలో మొదటిదైన ఆకాశము తన సూక్ష్మవాణి చేత సూర్య గ్రహమునకు చెప్పడము జరిగినది. విశ్వములోగల

గ్రహములు, ఉపగ్రహములు, మహాగ్రహములు అను మూడు రకములలో ఒక గ్రహమైన సూర్యునికి, మహాభూతమైన

ఆకాశము తన వాణి ద్వారా ఆదిలోనే దేవుని జ్ఞానమును చెప్పడము జరిగినది. దానితో దేవుడు మూడు విధముల తన

జ్ఞానము భూమిమీద తెలియుననుటలో ఒకటి వాణిద్వారా (వహీద్వారా) అను ఒక విధానము నెరవేరిందని చెప్పవచ్చును.


ఇకపోతే భగవద్గీత శ్రీకృష్ణుని చేత చెప్పబడినది. శ్రీకృష్ణుడు దేవుని సమాచారమును తెచ్చిన దూతవలె వచ్చి

(భగవంతునిగావచ్చి) దేవుని జ్ఞానమును తెలియజేయడము జరిగినది. ద్వాపరయుగము చివరిలో ఐదువేల సంవత్సరముల

పూర్వము భగవంతుడైన (అవధూతయిన) కృష్ణుడు చెప్పడము వలన, అదే అవధూత మరియొకమారు, మరియొక

పేరుతో రెండువేల సంవత్సరముల పూర్వము కూడా చెప్పడము వలన, దేవుడు తన దూత ద్వారా జ్ఞానమును

తెలియజేస్తానను విధానము కూడ నెరవేరింది. మరియొక విధానమైన తెరవెనుక నుండి చెప్పడము అనుమాట కూడా

చాలామార్లు నెరవేరింది. వివరముగా చెప్పితే చెప్పేవాడు ఒకడుండి, వాడు కనిపించకుండ చెప్పడమును తెరవెనుకనుండి

చెప్పడము అగుచున్నది. సూక్ష్మరూపములో కనిపించకుండ వుండి దేవుని జ్ఞానమును తెలిసినవారు ఎవరైనా మనుషులకు

చెప్పవచ్చును. సూర్యగ్రహము ఒకమారు చెప్పగా దేవుని పరిపాలనలోనున్న జిబ్రయేల్ అను సూక్ష్మముగా కనిపించని

గ్రహము రెండవమారు ముహమ్మద్ ప్రవక్తకు దేవుని జ్ఞానము చెప్పడము జరిగినది. అలా సూర్యుడు, జిబ్రయేల్

చెప్పడము వలన తెరవెనుకనుండి చెప్పడము అను విధానము కూడా నెరవేరిందని చెప్పవచ్చును. ఈ విధముగా దేవుని

జ్ఞానము వాణి ద్వారా సృష్ట్యాదిలో ఒకమారు, కనిపించే అవధూత (భగవంతుడు) చెప్పడము ద్వారా రెండుమార్లు,


అవ్యక్తమైన జిబ్రయేల్ మరియు సూర్యుడు కనిపించక తెర వెనుకనుండి రెండుమార్లు చెప్పడము వలన, దేవుని

జ్ఞానము మూడు విధముల భూమిమీద తెలియునను మాట నెరవేరింది. ఈ మూడు విధానములలో అవధూత చెప్పిన

భగవద్గీత, బైబిలు గ్రంథములు రెండు ఉండగా, తెర వెనుకనుండి చెప్పిన విధానమైన ఖుర్ఆన్ గ్రంథము కూడా

కలదు. అలాగే సృష్ట్యాదిలో వాణి ద్వారా చెప్పబడినదే భగవద్గీతయని తెలిసినది.


ఇప్పటికి కొంతవరకు మనకర్థమైన దానినిబట్టి ఖుర్ఆన్ దైవ గ్రంథమని చెప్పవచ్చును. ఒక్క ఖుర్ఆన్

గ్రంథమేగాక అవధూత రెండు మార్లు చెప్పిన గీత, బైబిలు రెండు గ్రంథములు కూడా దైవగ్రంథములని చెప్పవచ్చును.

ఇంకా బాగా చెప్పితే సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి చెప్పబడిన జ్ఞానమే భగవద్గీతలో చెప్పడము వలన

మూడు విధానముల సంపూర్ణ జ్ఞానమంతయు గీతలో కలదని తెలియుచున్నది. గీతయందు జ్ఞానయోగమున మొదటి

1,2,3 శ్లోకములలోనే సృష్ట్యాదిలో వాణి ద్వారా సూర్యునికి చెప్పిన జ్ఞానమునే చెప్పుచున్నానని ఉండడము వలన

భగవద్గీత జ్ఞానము ఆదిలో చెప్పిన జ్ఞానమని తెలిసిపోయినది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా!

భగవద్గీతలో నీవు చేసే పనులను బట్టి నీకు పాపపుణ్యములు వస్తాయని ఒకచోట చెప్పి, తర్వాత అన్నీ నేనే చేస్తున్నాననీ,

నీవు ఏమీ చేయలేదు అని చెప్పడము రెండు నాల్కల ధోరణి కాదా! అలాగే బైబిలులో ఒకచోట నావలన నీకు

పాపక్షమాపణ కలదని చెప్పి, మరొకచోట నేను ఎవని పాపమును క్షమించువాడని కాను అని చెప్పడము రెండు

విధముల మాట్లాడినట్లు కాదా! ఖుర్ఆన్ గ్రంథమలో 2వ సురా, 117 ఆయత్లో "భూమి ఆకాశములను సృష్టించిన

దేవుడు దేనినైనా అయిపో అంటే అది తయారైపోతుంది” అని చెప్పి తర్వాత 32వ సురా, 4వ ఆయత్లో “అల్లాయే

(దేవుడు) ఆకాశమును, భూమిని వాటి మధ్యనున్న సమస్తమును ఆరు రోజులలో సృష్టించాడు, తర్వాత సింహాసనాన్ని

అధిష్ఠించాడు” అని చెప్పారు. ఇది పరస్పర విరుద్ధ వాక్యములుగా, రెండు నాల్కల ధోరణిగా కనిపిస్తున్నది. అటువంటి

వాక్యములను దైవవాక్యములుగా, ఆ గ్రంథములను దైవ గ్రంథములుగా మీరు ఎలా చెప్పుచున్నారని? అడుగవచ్చును.

దానికి మా జవాబు ఈ విధముగా ఉన్నది చూడండి.


ఈ జవాబును చూడకముందే వినబోవు జవాబు బాగా అర్థ మగుటకు ముందు ఒక ఉదాహరణను

చెప్పుకొందాము. పట్టణములో ప్రజలు ఉద్యోగములు చేయుచూ, వ్యాపారములు చేయుచూ, అనేక విధ పనులు

చేయుచూ బ్రతుకుచుందురు. పట్టణములోని ప్రజలు బ్రతికే దానికి పల్లెలలో ప్రజలు పంటనూ, పాడినీ అభివృద్ధి

చేయుచుందురు. పంటనూ, పాలను పట్టణములో అమ్ముకొని తమ జీవనము సాగించు చుందురు. ఆ విధానములో

ఒక పట్టణములోని ప్రజలకు పాలను అమ్ము కొనుచూ జీవించు పల్లెలు దానికి ప్రక్కనే ఉన్నాయి. అటువంటి మూడు

సమీప గ్రామముల నుండి ప్రతి దినము పాలను తెచ్చి అమ్ముకొని పోవువారు ముగ్గురు కలరు. నేను చెప్పు ముగ్గురు

వ్యక్తులు ప్రక్కగ్రామములలోని ముగ్గురు రైతులవద్ద పాలనుకొని తెచ్చి పట్టణములో లాభమునకు అమ్ము కొని పాలవ్యాపారమే

తమ జీవనముగా సాగించుచున్నారు. ప్రక్కనున్న పల్లెటూరిలో కృష్ణప్రసాద్, ఏసుదాసు, ఆజ్ కల్ జిబ్రేల్ అను పేర్లుగల

ముగ్గురు రైతులు ఒక్కొక్కరు అరవై లీటర్ల పాలనిచ్చు ఒక గేదెను కలిగియున్నారు. ఆ గ్రామములో 60 లీటర్ల

పాలనిచ్చు ఒకే గేదె కల్గినవారు ఆ ముగ్గురు తప్ప ఎవరూ లేరు. మిగత వారివద్దయున్న గేదెలు ఐదు లేక ఆరు

లీటర్లకంటే పాలను ఎక్కువ ఇచ్చునవి లేవు. ఎక్కువ పాలిచ్చు గేదెలున్న దానివలన కృష్ణప్రసాద్, ఏసుదాసు, ఆజ్ కల్

జిబ్రేల్ అను ముగ్గురు రైతులు ఆ ప్రాంతములో పేరుపొందినవారైయున్నారు. పాల వ్యాపారము చేయు ముగ్గురు

వ్యక్తులు, ఆ ముగ్గురు రైతులవద్ద నుండి పాలను తెచ్చి అమ్ముకొనెడివారు. అలా వ్యాపారము చేయు ఆనందరావు,


డేవిడ్రరాజు, మహమ్మద్ బేగ్ అను ముగ్గురు మూడు కులముల వారుగా ఉన్నారు. వారిలో ఆనందరావు కృష్ణప్రసాద్

కులమునకు సంబంధించిన వాడు. అందువలన కృష్ణప్రసాద్వద్దనుండి పాలను తెచ్చి పట్టణములో తన కులము

వారందరికీ అమ్ముచుండెను. అంతేకాక కృష్ణప్రసాద్ ఇంటిలోని గేదె మంచి బలముగానున్నది, మంచి ఆరోగ్యముగా

ఉన్నది. ఈ పాలను త్రాగుటవలన అందరికీ మంచి ఆర్యోగము చేకూరునని చెప్పి కృష్ణప్రసాద్ పాలను గురించి బాగా

ప్రచారము చేసి అమ్ముచుండెను. పట్టణములో మిగతా వ్యాపారస్థులందరూ పాలను లీటరుకు పది రూపాయల

ప్రకారము అమ్ముచుంటే కృష్ణప్రసాద్ పాలను ఆనందరావు లీటరుకు పదకొండు రూపాయల ప్రకారము అమ్ముచుండెను.


డేవిడ్రాజు అనునతడు ఏసుదాసు ఇంటి గేదెపాలను తెచ్చి అమ్ముచుండెను. అలా అమ్ము పాలవ్యాపారి అయిన

డేవిడ్ రాజు తన వ్యాపారమును పెంచుకొను నిమిత్తము ఏసుదాసు గేదెను గురించి కొంత ప్రచారము చేశాడు.

ఏసుదాసు ఇంటిలోని గేదెకు పాలను పితుకు చనుకొనలు ఐదుకలవనీ, అలా ఐదువుండడము వలన ఆ గేదె చాలా

మహత్యములతో కూడుకొనియున్నదనీ, ఆ గేదెపాలను త్రాగువారందరికీ వారు చేసుకొన్న పాపములన్నీ పోతాయని

ప్రచారము చేసి తన వ్యాపారము ను అభివృద్ధి చేసుకొన్నాడు. వాస్తవానికి ఏసుదాసు ఇంటిలోని గేదెకు నాలుగే

చనుమొనలున్నా, వ్యాపారస్థుడైన డేవిడ్ రాజు లేనిది చెప్పి తన వ్యాపారమును ప్రతి దినము అభివృద్ధి చేసుకొంటున్నాడు.

డేవిడ్ రాజును చూచిన మహమ్మద్ బేగ్ అను వ్యాపారి తాను కూడా తన వ్యాపారమును పెంచుకోదలచుకొని, అజ్ కల్

జిబ్రేల్ అను రైతు ఇంటినుండి తాను పాలను తెస్తున్నాననీ, అయితే ఆ ఇంటిలోని గేదె అన్ని గేదెలకంటే భిన్నముగా

తెల్లగపుట్టిందనీ, అటువంటిది ఇంతవరకు ఎప్పుడూ పుట్టలేదనీ, తర్వాత భవిష్యత్తులో కూడా పుట్టదనీ చెప్పడమేకాక, ఆ

గేదె అమావాస్య రోజు రాత్రిపూట స్వయముగా తన యజమానితో మాట్లాడి, తన పాలను తాగిన వారు ఎవరైనా

నరకానికి పోరనీ, స్వర్గానికి పోతారనీ, స్వర్గములో రంభ, ఊర్వశి, తిలోత్తమలకంటేమించిన అందగత్తెలు ఐదుమంది

వచ్చి అన్ని రకముల సుఖములను అందిస్తారనీ, స్వర్గములో సుకుమారమైన అంద గత్తెలైన ఆడవారి పొందు కావాలంటే,

ఆజ్ కల్ జిబ్రేల్ అను రైతు ఇంటి నుండి తాను తెచ్చు పాలను కొని త్రాగండియని మహమ్మద్ బేగ్ అనునతడు

ప్రచారము చేసెను.



ఈ విధముగా ముగ్గురు పాల వ్యాపారులు అసత్యముగా చెప్పి తమ వ్యాపారమును పెంచుకొన్నారు. అయితే

గేదెల యజమానులైన కృష్ణప్రసాద్ నీ, ఏసుదాసుగానీ, ఆజ్ కల్ జిబ్రేల్గానీ తమ గేదెలను గురించి ఎప్పుడుగానీ

కల్పించి అసత్యములు చెప్పలేదు. అన్ని గేదెలకంటే తమ గేదెలు ఎక్కువ పాలిచ్చుచున్నవని సత్యమును చెప్పడము

తప్పు ఎప్పుడూ అబద్ధము చెప్పలేదు. కృష్ణప్రసాద్ అను రైతు ఇంటినుండి ఆనందరావు చిక్కని పాలను పాలడబ్బాలలో

తీసుకొని వస్తూ, మార్గమధ్యములో ఒక నదిని దాటవచ్చునప్పుడు అక్కడ ఆగి నదిలోని 40 లీటర్ల నీరును 60 లీటర్ల

పాలకు కలిపి సరిగా వందలీటర్ల పాలను చేసుకొనివచ్చి పట్టణములో అందరికీ పోయుచుండెను. పాలను తీసుకొను

వారికి అవి ఆరోగ్యమైన పాలనీ, ఆ పాలు త్రాగితే ఆరోగ్యముగా ఉంటారను నమ్మకము కల్గి ఇతరులకు కూడా అదే

విషయమును చెప్పెడివారు. ఏసుదాసు ఇంటినుండి పాలను తెచ్చు డేవిడ్ రాజు కూడా 60 లీటర్లపాలను తీసుకొని

పట్టణమునకు వస్తూ, మార్గము ప్రక్కనేయున్న బావిలోని నీరు 30 లీటర్లు తీసుకొని చిక్కని పాలలోనికి కలిపి తనవి 90

లీటర్ల పాలను చేసుకొని వచ్చి అందరికీ అమ్మడము జరుగుచున్నది. 30 లీటర్ల నీళ్ళు కలిసినా కనుక్కోని ప్రజలు

గ్రుడ్డిగా ఆ పాలు త్రాగితే పాపములు పోతాయను మూఢనమ్మకమును కల్గియున్నారు. ఇకపోతే మూడవవాడైన

మహమ్మద్ బేగ్ గ్రామములోని ఆజ్ కల్ జిబ్రేల్ ఇంటినుండి 60 లీటర్ల పాలను తీసుకొని వస్తూ, రోడ్డు ప్రక్కనేయున్న


బోరులోని నీరును 20 లీటర్లు తీసుకొని తనవద్దయున్న పాలలోనికి కలిపాడు. అప్పుడు తనవద్ద మొత్తము 80

లీటర్లపాలైనవి. ఆ 80 లీటర్ల పాలను పట్టణములో తనవద్ద నమ్మకముగా పాలను తీసుకొనే వారికే పోయడము

జరిగినది. మహమ్మద్ బేగ్ పాలు మిగత ఇద్దరి పాలకంటే చిక్కగాయున్నవి. అంతతప్ప వాటిలో స్వర్గమునకు పంపు

శక్తి ఏమీలేదు. చచ్చిపోయినా స్త్రీల సుఖమే కావాలనుకొనువారు ముహమ్మద్ బేగ్ పాలనే వాడెడివారు.

ఒకడు రోగాలు పోతాయని చెప్పడమూ, మరియొకడు పాపాలు పోతాయని చెప్పడమూ, ఇంకొకడు స్వర్గమునకు

పోతావని చెప్పడమూ, వారి మాటలను ప్రజలు వినడము కేవలము మూఢనమ్మకమని మేము కూడా చెప్పుచున్నాము.

గ్రామములు సత్యమే, ముగ్గురు పాలయజమానులు సత్యమే, గేదెలు సత్యమే, పాలు సత్యమే. పాలలోగానీ, గేదెలలోగానీ

వాటి యజమానులలోగానీ ఏ తప్పు లేదు. ఉన్న తప్పంతా ప్రజలకు గేదెలకు మధ్యలో పాలను అందించు

వ్యాపారులలోనేయున్నది. వారి వ్యాపారమును పెంచుకొనుటకు గేదెలమీద, గేదెల యజమానులమీద, వాటి పాలమీద

అసత్యమాటలను ప్రచారము చేశారు. ఈ కథంతా తెలిసిన మనకు ఎవరిది తప్పయినది తెలుసు. అయితే విషయమంతా

తెలియనివారు గేదె యజమానులనే తప్పువారని చెప్పు అవకాశము గలదు. ముగ్గురు వ్యాపారులు మూడు గ్రామములలో

ముగ్గురు యజమానులవద్ద ఒక్కొక్కరు 60 లీటర్ల పాలను సేకరించడము జరిగినది. తర్వాత మూడు గ్రామముల నుండి

వారువచ్చు మార్గములలోగల నీటిని తమవద్దయున్న పాలలో కలపడము జరిగినది. ఆనందరావు నదిలోని 40 లీటర్లను

కలిపి తనవి వందలీటర్లుగా చేసుకొన్నాడు. రెండవాడైన డేవిడ్ రాజు తన దారిలో వస్తూ దారి ప్రక్కన గల బావినుండి

30 లీటర్ల నీరును తనవద్దయున్న 60 లీటర్లతో కలిపి మొత్తము 90 లీటర్ల పాలను చేసుకొన్నాడు. తర్వాత మూడవవాడై

మహమ్మద్ బేగ్ 20 లీటర్ల నీటిని కలిపి మొత్తము తనవద్దయున్న పాలను 80 లీటర్లు చేసుకొన్నాడు. ఈ విధముగా

మధ్యవ్యాపారులు చేసిన తప్పు వలన, విషయము ఏమాత్రము తెలియని వారు, మొదటికి గేదె యజమాను లను

నిందించినట్లు, ప్రస్తుతము మేము నాస్తికులము, సత్యవాదులము, హేతువాదులము, విజ్ఞానము తెలిసినవారము

అనువారు దేవునికి సంబంధించిన విషయమును ఏమాత్రము తెలియకున్నా, ఎవరో మధ్యలో వచ్చిన ఆధ్యాత్మిక

వ్యాపారులైన వారు శాస్త్రమును కల్తీ చేసి, అశాస్త్రీయ పద్ధతిలో వారికి అనుకూలముగా చెప్పిన మాటలను పట్టుకొని,

మొదటికే బ్రహ్మవిద్యయే మూఢనమ్మకమనీ, దేవుడనువాడు కల్పితమనీ చెప్పడము పూర్తిగా పొరపాటగును.

ముగ్గురు పాడి పరిశ్రమను పెట్టిన యజమానులున్నట్లు, శ్రీకృష్ణుడు, ఏసు, జిబ్రయేలున్నారు. యజమానుల

వద్ద 60 లీటర్ల స్వచ్ఛమైన పాలను ఇచ్చు గేదెలున్నట్లు, ముగ్గురు ప్రవక్తల వద్ద స్వచ్ఛమైన జ్ఞానమునిచ్చు మూడు మూల

గ్రంథములున్నవి. గేదెలనుండి స్వచ్ఛమైన చిక్కని పాలు లభించినట్లు, మూల గ్రంథములనుండి స్వచ్ఛమైన శక్తివంతమైన

జ్ఞానము లభించుచున్నది. తమ స్వార్థములతో లాభము కొరకు స్వచ్ఛమైన పాలను నీటితో కల్తీ చేసి అమ్ము వ్యాపారులున్నట్లు,

నేడు పవిత్ర గ్రంథములలోని జ్ఞానములోనికి దేవుడు చెప్పని తమకు నచ్చిన విషయములను కల్తీచేసి ప్రజలకు చెప్పు

బోధకులున్నారు. తమ పాలవలన రోగములు పోతాయని ఒకడు, పాపములు పోతాయని మరొకడు, స్వర్గము వస్తుందని

చెప్పు ఇంకొకడు వ్యాపారులున్నట్లు, తాము చెప్పు బోధల వలన లాభములు కలుగుతాయనీ, సుఖాలు వస్తాయనీ,

దేవుడు కనిపిస్తాడనీ, నేరుగా స్వర్గానికి పోవచ్చుననీ, నరకానికి పోకుండా తప్పించుకోవచ్చనీ, ధనికులు కావచ్చనీ

అనేక రకముల ఆశలను బోధకులు కల్పించుచున్నారు. అశాస్త్రీయమైన వాక్యములను చెప్పుచున్నారు. అటువంటి

మాటలనే నేటి నాస్తికవాదులు తప్పు పట్టుచున్నారు. అటువంటి అవకాశమును నాస్తిక వాదులకు నేటి బోధకులు

ఇచ్చుచున్నారు. బోధకుల కల్తీ మాటలను వదిలి చూస్తే మూల గ్రంథములలో స్వచ్ఛమైన శాస్త్రబద్ధమైన జ్ఞానమున్నట్లు


తెలియుచున్నది. మూల గ్రంథములలోని స్వచ్ఛమైన జ్ఞానముచేత నాస్తిక వాదులుగానీ, హేతువాదులమని చెప్పుకొనువారు

గానీ, సత్యాన్వేషులమను వారుగానీ ప్రశ్నించు ప్రశ్నలకు సులభముగా జవాబులు చెప్పవచ్చును. నేడు దైవగ్రంథములను

విమర్శించువారికి ఆ గ్రంథముల పరిచయము ఏమాత్రము లేదనీ, వారికి తెలిసినది బోధకుల మాటలేననీ చెప్పుచున్నాము.

సైన్సును మించిన సైన్సు మూడు గ్రంథములలో కనిపిస్తూవున్నది. కల్తీ పాలను పొయ్యి మీద పెట్టి వేడిచేస్తే, పాలలో

కలిసిన నీరంతయు ఆవిరియైపోయి, చివరకు చిక్కని పాలు మిగిలినట్లు, మూడు గ్రంథములలో ఎక్కడైన అశాస్త్రీయ

జ్ఞానముంటే, అది కల్తీ జ్ఞానమని తెలిసి, నిప్పుచేత వేడిచేస్తే స్వచ్ఛమైన పాలు మిగిలినట్లు గ్రంథవచనములను శాస్త్రము

అను అగ్నిచేత పరిశీలన అను వేడిచేస్తే, కల్తీ జ్ఞానము నీరు ఆవిరైపోయినట్లు బయటపడి పోగలదు. అప్పుడు మూల

గ్రంథములలో స్వచ్ఛమైన జ్ఞానము లభించగలదు.


పొయ్యిమీద కల్తీ పాలను కాచి నీటిని ఇగురబెట్టి, చివరకు స్వచ్ఛమైన పాలను ఇంటిలో ఒకరు మాత్రము

బయటికి తీయవచ్చును. ఒకరు చేసిన కృషి వలన ఇంటిలోని వారందరు స్వచ్ఛమైన పాలను త్రాగవచ్చును. అలాగే

గ్రాహితశక్తియున్న ఒక వ్యక్తి కల్తీ జ్ఞానము మీద శాస్త్రము చేత పరిశీలన చేసి, అశాస్త్రీయమైన దానిని తీసివేసి

స్వచ్ఛమైన జ్ఞానమును ప్రజలందరికీ అందివ్వవచ్చును. శాస్త్రపరిశీలన చేయడము అందరికీ తెలియకున్నా పరిశీలన

చేసినవారు అందించిన జ్ఞానమును తెలియవచ్చును. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి చూస్తాము. మనకు ఒక

క్రైస్తవుని ద్వారా వచ్చిన ప్రశ్న ఖుర్ఆన్ దైవగ్రంథమా అని ప్రశ్నించుచూ, ఆ గ్రంథము లోని రెండు పరస్పర విరుద్ధమైన

అర్థముగల వాక్యములను అడిగి ఇందులో ఏది సత్యము అని అడిగారు. దానికి ఇప్పుడు పాల వ్యాపారుల విషయమంతా

చెప్పిన తర్వాత మేము జవాబు చెప్పినా మీకు సులభముగా అర్థముకాగలదు. నేను ఇందువుగా (హిందువుగా)

పుట్టినవాడను కనుక, నాకు తెలిసినంతవరకు భగవద్గీతలో కొన్నిచోట్ల కొన్ని అశాస్త్రీయ వాక్యములు కలిసినట్లు

కనబడుచున్నది. అలా కనిపించిన వాటిని మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత” అను గ్రంథములో తీసివేసి

వ్రాయడము జరిగినది. భగవద్గీత గ్రంథములోనే స్వార్థవరులైన కొందరు బోధకులు కలిపిన శ్లోకములుండగా, మిగతా

రెండు మూల గ్రంథములలో కూడా అంతో ఇంతో మిశ్రమ జ్ఞానముండవచ్చును. అందువలన జాగ్రత్తగా పరిశీలన

చేసి చూడవలసిన అవసరమున్నది.



ఏది దేవుని జ్ఞానమో ముందే తెలిసియుంటే, దానిలో ఏదైనా కలిసి యున్నది లేనిది సులభముగా తెలియగలదు.

అలా ముందే దేవుని జ్ఞానము తెలియకున్నా, శాస్త్రమంటే ఏమిటి? అని శాస్త్రమునకున్న నియమ నిబంధ నలైనా

తెలిసియుండాలి. అప్పుడు గ్రంథములోని విషయము శాస్త్ర బద్ధమైనదా కాదా అని చూచి, అశాస్త్రీయమైన దానిని

దేవుని జ్ఞానము కాదని తెలియవచ్చును. ఆ విధానము ప్రకారము ఖుర్ఆన్ గ్రంథములోని సృష్ఠిని దేవుడు సృష్టించిన

విషయములో వచ్చిన పరస్పర విరుద్ధ వాక్యములను తీసుకొని చూస్తే, ఆ రెండు వాక్యములలోనూ శాస్త్రవిరుద్ధమైన

జ్ఞానము కనిపించలేదు. బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములను చూడకముందే నేను భగవద్గీత గ్రంథమును చూచాను.

భగవద్గీతా గ్రంథములోని జ్ఞానమునూ, అందులోని బ్రహ్మవిద్యాశాస్త్రమునూ పూర్తిగా తెలుసుకొని, గీతలోని అశాస్త్రీయమైన

వాటిని నా గ్రంథము (త్రైత సిద్ధాంత భగవద్గీత) లో బయట పెట్టాను. ముందే ఇటు శాస్త్రమూ, అటు జ్ఞానమూ తెలిసి

యుండుట వలన, ఇతర రెండు గ్రంథములలోని విషయములను సులభముగా గ్రహించగలిగాము, వాటిలోని కల్తీ

భావములను కూడా తెలిసి ఇది శాస్త్రబద్ధమనీ, ఇది శాస్త్రబద్ధమైనది కాదనీ చెప్పగలుగుచున్నాము. ఖుర్ఆన్ గ్రంథములో

సురా 2, ఆయత్ 117లో వ్రాసినట్లు, దేవుడు దేనినైనా చేయదలచు కున్నప్పుడు దాన్ని అయిపో అంటే అయిపోతుందని


చెప్పడము, దేవునికున్న క్రియారహితుడు అను ధర్మము ప్రకారము దేవుడు పని చేయడనీ, ఆయన సంకల్పముతోనే

అన్నీ జరిగిపోవుననీ తెలియుచున్నది. దేవుడు రూప, నామ, క్రియారహితుడు అను ధర్మసూత్రమునకు పై వాక్యము

కట్టుబడి యున్నది. కావున ధర్మబద్ధమైనదని చెప్పినప్పుడు 32వ సురా, 4వ వాక్యములో దానికి విరుద్ధముగా, దేవుడు

ఆరు రోజులలో సమస్తమును సృష్టించి, తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు అని చెప్పడము అశాస్త్రీయము కాదా! అని

ఎవరైనా అడుగవచ్చును. వాస్తవానికది 2వ సురాలోని 117వ వాక్యమునకు పూర్తి వ్యతిరేఖముగా కనిపించుచున్నది.

అయితే వాస్తవానికి ఏది సత్యము అని చూచుటకు రెండు వాక్యముల మీద శాస్త్రమునుంచి చూడవలెను. ఒకటి

సత్యము అని సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒకటి అసత్యము అని చెప్పుటకు కూడా శాస్త్రము అంతే

అవసరమగును. అలాంటపుడు ప్రత్యక్షముగా ఒకదానికొకటి విరుద్ధముగా కనిపించు వాక్యములలో ఒకటి సత్యమైనపుడు,

రెండవది అసత్యమగునని సులభముగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ప్రత్యక్షముగా కనిపించినంత మాత్రమున

శాస్త్రమును వదలి నిర్ణయించకూడదు అను సూత్రము ప్రకారము పరిశీలించితే, 32వ సురాలోని 4వ వాక్యము కూడా

శాస్త్రబద్ధమైనదే అని తెలియుచున్నది.


32వ సురాలోని 4వ ఆయత్ను పరిశీలించుటకు మనము ఈ విధముగా ప్రశ్నించుకోవలసిన అవసరమున్నది.

ఆ ప్రశ్నలు ఇలా ఉంటాయి. ఆకాశమునూ భూమినీ వాటి మధ్యలోనున్న సమస్తమునూ ఆరు రోజులలో సృష్టించాడు

అనుమాట అందరికీ అర్థమగుచున్నపుడు, ఈ వాక్యము చివరిలో మీరు హితబోధను గ్రహించలేకున్నారేమిటి? అని

ప్రశ్నించడము కూడా ఉన్నది. ఇక్కడ అందరూ బుద్ధిని ఉపయోగించి చూచితే సమస్తమును ఆరు రోజులలో సృష్ఠించాడు

అనుట అందరూ గ్రహించగలిగినపుడు, ఆ వాక్యమును చెప్పిన జిబ్రయేల్ “మీరు హితబోధను గ్రహించ లేకున్నారెందుకు?”

అని ప్రశ్నవేశాడు. అక్కడ ఆయన ఆ మాట చెప్పాడంటే మనము ఆ వాక్యమును సరిగా అర్థము చేసుకోలేదని చెప్పకనే

తెలియుచున్నది. అయితే ఎక్కడ పొరపాటుపడినాము అని చూచుకోవలసి యున్నది. అప్పుడు మనలను మనమే

ప్రశ్నించుకొని వాటికి జవాబును వెదకవలసియున్నది. ఆకాశము అంటే పైన కనిపించేదేనా? భూమి అంటే క్రింద

ఉండేదేనా? వాటి మధ్యలో సమస్తము అంటే మనకు కనిపించే ప్రపంచమేనా? ఆరు రోజులే సృష్ఠి ఎందుకు జరిగినది?

తర్వాత సృష్టికర్త సింహాసనాన్ని ఎక్కాడని చెప్పారు. ఆ సింహాసనము ఎక్కడున్నది.? ఆయన తప్ప మనకు సహాయము

చేసేవాడు ఎవరూ లేరు అన్నట్లు, ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ లేడు అన్నారు. మనకు భూమిమీద ఎందరో

హితులు, స్నేహితులు, తల్లితండ్రులు సహాయము చేయువారుండగా ఆయన తప్ప ఎవరూ లేరు అని ఎందుకన్నారు?

కనీసము సిఫారసు చేసేవాడు కూడా లేడని ఎందుకున్నారు. అసలుకు మనమెక్కడున్నాము? దేవుడెక్కడున్నాడు? అని

ఈ విధముగా ఎన్నో ప్రశ్నలను వేసుకొని వాటికి జవాబును గ్రహించగలిగినపుడు, ఆయన హితబోధను

గ్రహించినవారగుదుము.


ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడైతే మనము తప్పుగా అర్థము చేసుకొను విషయములున్నాయో, ఎక్కడైతే శాస్త్రబద్ధముగా

గ్రహించలేని జ్ఞానమున్నదో, అక్కడ ఆ వాక్యము క్రింద మనలను హెచ్చరించు మాటలుంటాయి. ఉదాహరణకు 6వ

సురా 95వ వాక్యమును చెప్పి దాని చివరిలో “మీరు మార్గము తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు.” అని చెప్పడము

జరిగినది. అలాగే అదే సురాలో 98వ వాక్యము చివరిలో కూడా “విజ్ఞతయున్న వారి కొరకు మేము ఈ సూచనలను

స్పష్టపరిచాము” అని కలదు. అలా చెప్పడములో పై వాక్యములు మీకు సరిగా అర్థము కాలేదు, మీరు తప్పుగా అర్థము

చేసుకొంటున్నారు అని చెప్పినట్లే కదా! ఈ విధముగా చాలా వాక్యముల వెనుక దేవుడు మనలను తప్పుగా అర్థము


చేసుకోవద్దండి అని హెచ్చరించినట్లున్నది. 34వ సురా 4వ వాక్యములో చివరిలో కూడా "మీరు హితబోధను

గ్రహించలేకున్నారెందుకు?” అని ప్రశ్నించి చెప్పడము కూడా జరిగినది. ఏ వాక్యము క్రింద మనలను హెచ్చరించి

చెప్పారో, ఆ వాక్యములను స్థూల దృష్టితోనే కాకుండా, సూక్ష్మదృష్టితో కూడా చూడవలసి యున్నది. దేవుడు సింహాసనమును

అధిష్ఠించాడు అంటే, దేవుడు ఎంత పెద్దగ ఉన్నాడు? ఆయన సింహాసనము యొక్క విస్తీర్ణము ఎంత ఉంటుంది?

దేవుడు కనిపించే వాడు కానప్పుడు ఆయన సింహాసనము ఎలా కనిపిస్తుంది.? ఆరు రోజుల సృష్ఠి అన్నప్పుడు ఒక

రోజు ఎన్ని గంటలు కాలముంటుంది?


ఈ విధముగా కొన్ని ప్రశ్నలను తయారుచేసుకొని ఆలోచించి గానీ, ఇతరులను అడిగి వివరమును తెలుసుకొనిగానీ,

సమాధానములు స్వీకరించి జవాబులు శాస్త్రబద్ధము కాకపోతే, ఆ విషయమును సత్యమైనది కాదని నిర్ధారణ

చేసుకోవచ్చును. సమాధానము సరియైనదిగా శాస్త్రబద్ధముగా ఉంటే, దానిని తప్పక సత్యముగా గ్రహించవచ్చును.

ఖుర్ఆన్ గ్రంథములో చాలా వాక్యములు సూక్ష్మజ్ఞానముతో కూడుకొనియున్నవి. అటువంటి వాక్యములలో ఆరు రోజుల

సృష్ఠి తర్వాత దేవుడు సింహాసనమును అధిష్ఠించాడు అను మాటను స్థూల దృష్టితో చూడకూడదు. సృష్టిని దేవుడు తన

సంకల్పముతో ఒక్క క్షణములో చేశాడు అనుటకూ, ఆరు రోజులు శ్రమించి చేశాడు అనుటకు చాలా వ్యత్యాసము

కనిపించినా, ఆ మాటలో తప్పులేదని అర్థమగుచున్నది. మూడు మూల గ్రంథములలో ఎన్నో అశాస్త్రీయ వాక్యములను

గుర్తించిన మేము, ఇది శాస్త్రీయమైన వాక్యమే అనుటకు ఆధారము కలదు. ఈ మాటను సమర్థించుటకు ఏమి

ఆధారమున్నదో బహుశా ముస్లీమ్లుగానున్నవారికి కూడా తెలియదను కొంటాను. ఈ వాక్యమును ఎప్పుడైతే స్థూలముగా

అర్థము చేసుకొంటారో, అప్పుడు వారికి తప్పు వాక్యముగా కనిపించును. ఇదే ఖుర్ఆన్ గ్రంథములో సప్త ఆకాశములను

దేవుడు సృష్టించాడు అని వ్రాశారు. ఏడు ఆకాశములు బయట ఎక్కడ వెదికినా కనిపించవు. ఉన్నది ఒక్కటే ఆకాశము

కదా! అని నాస్తికవాదులు ఆ మాటను పూర్తిగా ఖండించుటకు అవకాశము కలదు. అలా స్థూలముగా కాకుండా

సూక్ష్మజ్ఞానముతోనే చూస్తే ఆరు రోజుల సృష్ఠి ఏడవరోజు విశ్రాంతి అను మాటకుగానీ, ఏడు ఆకాశములు అను

మాటకుగానీ సులభముగా అర్థము లభించగలదు.


ఇటువంటి సూక్ష్మ విషయములు మూడు మూల గ్రంథములలోను గలవు. ప్రత్యేకించి స్థూల సూక్ష్మ జ్ఞానమును

గురించి ఖుర్ఆన్ గ్రంథములో మూడవ సురా, ఏడవ ఆయత్నందు చెప్పడము జరిగినది. స్థూల విషయము లను

“ముహ్కమాత్” అనియు సూక్ష్మ విషయములను “ముతషా భిహాత్” అనియు చెప్పియున్నారు. ఇది ఫలానా గ్రంథమనీ,

ఈ గ్రంథములో ఈ విషయములున్నవనీ చెప్పడము స్థూలముగానున్న విషయముకాగా, ఖుర్ఆన్ గ్రంథములో

మూడువంతులు విషయములు సూక్ష్మజ్ఞానము కాగా, ఒక్క వంతు మాత్రము స్థూలజ్ఞానముగా ఉన్నదని మేము

చెప్పుచున్నాము. 3వ సురా 7వ ఆయత్లో సూక్ష్మజ్ఞానమైన “ముతషాభిహాత్" వాక్యముల వివరము దేవునికి తప్ప

ఇతర మనిషికెవనికీ తెలియదని కూడా చెప్పారు. సూక్ష్మజ్ఞానము దేవున్ని విశ్వసించువారికి కూడా తెలియదని దేవుడే

చెప్పినప్పుడు, అతివాదులకు, నాస్తికవాదులకు ఎలా తెలియగలదు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు.

అటువంటపుడు దేవుడు పనిచేయడు, చెప్పడు. అలాంటప్పుడు దేవుడు చెప్పనివాడైతే ఆయన జ్ఞానము మనకు ఎలా

తెలియునను ప్రశ్నరాగలదు. అటువంటి సమస్య రాకుండుటకు ఆదిలోనే దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిని సృష్ఠించాడు.

అతడు మనిషికాదు, అట్లని దేవుడూ కాడు. అతనే దేవుని సమాచారము తెలిసిన అవధూత. దూత అనువాడు వార్తను

తెచ్చువాడు. అవధిలేని దేవుని సమాచారమును తెచ్చువాడు అవ ధూత. అవధూత మనిషికీ దేవునికి మధ్యలోగలవాడు.


అవధూత ఇటు మనిషికాడు అటు దేవుడూ కాడు. అటువంటి దూత చేత దేవుడు తన జ్ఞానమును ప్రజలకు

తెలియునట్లు చేయును. అలా దూత ద్వారా తెలియజేసినప్పుడు, దేవుని జ్ఞానము మీద శ్రద్ధగలవాడు, దూత తెలిపిన

సూక్ష్మమైన దేవుని జ్ఞానమును తెలియగలడు. దూత ద్వారా తెలియకుండా ఎవరూ వాటిలోని సత్యమును తెలియలేరు.

అటువంటి అర్థము తెలియని వాక్యములను గ్రహించలేని అతివాదులు, నాస్తికవాదులు దేవుడే లేడని వాదించుచుందురు.

కొందరు అతివాదులు కూడా దేవుడూలేడు, దయ్యములేదు అని వాదించుచుందురు.


సూక్ష్మమైన జ్ఞానము సులభముగా ఎవరికీ అర్థముకాదు. దేవునికి మనిషికీ మధ్యవర్తి అయిన దూత లేక

అవధూత అని పిలువబడు వాడు వచ్చి చెప్పినప్పుడే, అదియూ శ్రద్ధకలవారికి మాత్రమే అర్థమగును. ప్రస్తుతము

మనము కూడా ఆరు రోజులు పని, ఒకరోజు విశ్రాంతి అను ఏడు రోజుల మాటను గురించి ఇప్పుడు చెప్పుకోకుండ

ప్రక్కన బెట్టి ఈ విషయమును తర్వాత చెప్పుకొందాము. దానికంటే ముందు మరికొంత జ్ఞానమును చూచిన తర్వాత

32వ సురా, 4వ వాక్యము సులభముగా అర్థము కాగలదని అనుకొంటున్నాను. అందువలన ఈ వాక్యమును గ్రంథము

చివరిలోగానీ, మధ్యలోగానీ సందర్భమునుబట్టి వివరిస్తాము. కాయ పక్వానికి రాకముందే తొందరపడి తింటే అది

పుల్లగ ఉంటుంది, తియ్యగ ఉండదు. అలాగే కొన్ని విషయములను పక్కన పెట్టి పక్వానికి వచ్చినప్పుడు పండును

తిన్నట్లు, సందర్భానుసారము చెప్పితే పూర్తిగా అర్థము కాగలదు. అందువలన అయిపో అంటే అయిపొయ్యే విషయమును,

ఆరు+ఒకటి ఏడు రోజుల విషయమును ప్రక్కన పెట్టుచున్నాము. ఇప్పుడు ఒక నాస్తికవాది ప్రశ్నించు ప్రశ్నను గురించి

చూస్తాము. “ప్రతి ముస్లీమ్ జీవితములో ఒకసారియైనా హజ్ యాత్రకు (మక్కాయాత్రకు వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి ముస్లీమ్

ముఖ్యముగా మూడు నియమాలు పాటించాలి. 1) కాబా చుట్టూ (పొడుగాటి గ్రానెట్ బ్లాక్న్ చుట్టూ) ఏడుసార్లు

ప్రదక్షిణలు చేయాలి. నాలుగు ప్రదక్షిణలు వేగముగానూ, మూడు ప్రదక్షిణలు నిదానముగా మాములుగా చేయాలి.

2) మక్కాకు ఎనిమిది (8) కిలోమీటర్ల దూరములో మీనా దగ్గరున్న మూడు దయ్యపు (సాతాను) స్థంభాలపైన ఏడు

(7) గులక రాళ్ళను విసరాలి. 3) తెల్లని పుణ్యదుస్తులను ధరించాలి. మక్కాకు పోయిన ప్రతి ముస్లీమ్ తప్పకుండా ఈ

నియమములను ఆచరించును.


పూర్వముకంటే ఇప్పటికాలములో మరస్టీమర్లు, విమానాలు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ముస్లీమ్లు

లక్షల సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్ళుచున్నారు. దాదాపు పది సంవత్సరములనుండి 25 లక్షలమందికి తక్కువ లేకుండా

మక్కాను దర్శించి వచ్చుచున్నారు. ప్రతి యాత్రికుడు అక్కడున్న సైతాన్ స్థంభాలపైన ఏడు రాళ్ళను విసురుతున్నారు.

ఇప్పటికి దాదాపు 1350 సంవత్సరములనుండి అక్కడున్న సైతాన్ స్థంభాలమీద గులకరాళ్ళ గుట్టలు పెరుగుచునే

ఉన్నాయిగానీ, ఇప్పటివరకు ఆ సైతాన్ చావలేదు, ఆ స్థంభాల దగ్గరనుండి అది పారిపోనూలేదు. మనము భౌతికముగా

ఒక మనిషిని నిలబెట్టి వానిమీదికి 25 లక్షలమంది రాళ్ళు విసిరితే, ఆ రాళ్ళ తాకిడికి వాడు చావడమేకాక అన్ని

రాళ్ళలో పూర్తిగా మునిగిపోయి ఊపిరాడక చస్తాడు. సైతాను అనునది భౌతికముగా లేదు, అదొక భ్రమ. మతము

కల్పించిన భ్రమల వంచన సమూహాలే ఈ మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు. భ్రమలకు అస్తిత్వములేదు అవి

అశాస్త్రీయ ఊహాకల్పనలే” అని హేతువాదినని పేరు పెట్టుకొన్న ఒక నాస్తికవాది ముస్లీమ్లనేకాక, హిందువులనూ,

క్రైస్తవులనూ భ్రమల భక్తిలోనున్న వారిగా చెప్పుచున్నాడు. హేతువాది అయినవాడు ప్రశ్నించి కారణమైన జవాబును

స్వీకరించి, చెప్పబడిన జవాబు సరియైనదైతే శాస్త్రబద్ధమైనదనియో, సరికానిదైతే శాస్త్రబద్ధముకానిదనియో చెప్పవచ్చును.

అశాస్త్రబద్దమైన జవాబును మూఢనమ్మకమూ లేక మూఢవిశ్వాసము అని అనవచ్చును. అట్లుకాకుండ ప్రశ్నించకనే,

జవాబును చూడకనే, తనకు తెలియని దానినంతటినీ అశాస్త్రీయమంటే, అలా అనువారిదే మూఢనమ్మకమగును.


ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును విమర్శించుటకు

కూడా శాస్త్రము అంతే అవసరమని తెలియనివారు, ఒక విషయమును శాస్త్రమును ఉపయోగించి విమర్శించ కుండా,

శాస్త్రబద్ధముగా అడుగకుండా, అశాస్త్రీయముగా ఖండించితే అటువంటి వారిని మూఢముగా మాట్లాడువారని

మూఢనమ్మకముగల వారని చెప్పవచ్చును. మక్కాయాత్ర వివరము గురించి ముస్లీమ్లందరికీ తెలుసునని చెప్పలేము.

ఎవడైనా తెలియని వ్యక్తి శాస్త్రబద్ధమైన జవాబు చెప్పలేకపోతే, అంతమాత్రమున ఆ విషయమును అశాస్త్రీయము

అనకూడదు. పూర్తి పరిశీలించి ఏదైనా ఒక నిర్ణయమునకు వచ్చువాడు వివేకవంతుడగును. శాస్త్రమునకు మతము

ఉండదు. అందువలన నేను హిందువునే (ఇందువునే) అయినా నాకు బ్రహ్మవిద్యాశాస్త్రము బాగా తెలుసు. కావున

నేను ఏ మతములోని ఆధ్యాత్మిక విషయమునైనా సులభముగా గ్రహించగలను. నాకు తెలిసిన శాస్త్రమువలన ముస్లీమ్ల

యాత్రలోని ఆచారములకు శాస్త్రబద్ధమైన అర్థమును తెలియగలను. మక్కాలోని ఆచారములన్నిటికీ ముస్లీమ్లకు అర్థము

తెలుసునో, తెలియదో నాకు తెలియదుగానీ, నాకు తెలిసిన శాస్త్రబద్ధమైన అర్థమును చెప్పగలను. పూర్వము ముస్లీమ్

పెద్దలు పెట్టిన ఆచారములు శాస్త్రబద్దమైనవేననీ, అశాస్త్రీయమైన కల్పనలుకాదనీ చెప్పగలను.


ఒక విషయమును గురించి మాట్లాడునప్పుడు, ఆ విషయము అర్థమగుటకు ఒక పోలికను పోల్చి, దానిని

ఉదాహరణగా చెప్పుదుము. ఒక గుడ్డను గురించి చెప్పునప్పుడు అది మెత్తని గుడ్డ అని చెప్పుటకు సిల్కు గుడ్డను

చూపించి దీనివలెనున్న మెత్తని గుడ్డయని చెప్పుచుందురు. ప్రత్యక్షముగా లేని గుడ్డను గురించి తెలియజెప్పునప్పుడు

ప్రత్యక్షముగనున్న మరియొక గుడ్డను చూపుచున్నాము. ప్రత్యక్షముగనున్న సిల్కుగుడ్డ స్థూలముగా కనిపించునదిగానున్నది.

ప్రత్యక్షముగా లేని మెత్తని గుడ్డ సూక్ష్మముగా కనిపించకుండా ఉన్నది. అప్పుడు అక్కడ ప్రత్యక్షముగా లేని గుడ్డను

అశాస్త్రము, అసత్యము అని అనలేము కదా! ప్రత్యక్షముగా లేకున్నా అది ఎట్లున్నదో తెలుపుటకే ప్రత్యక్షముగానున్న

గుడ్డను చూపుచున్నాము కదా! అసలు లేని దానిని గురించి ఎవరూ ఉదహరించి చూపలేరు. మనస్సు అధిక

చంచలమైనది, మనస్సనునది ఉన్నా అది కనిపించదు. సూక్ష్మమైన మనస్సు ఎలా చలనము కల్గినదో దానిని గురించి

తెలిసినవారు, మనస్సును కనిపించే కుక్కతో సమానముగా పోల్చి చెప్పారు. అలా చెప్పడము వలన కుక్కను సత్యమనీ,

మనస్సును అసత్యమని చెప్పవచ్చునా? కనిపించని మనస్సు సత్యమే, కనిపించే కుక్క సత్యమే. ఉదాహరణగానీ,

పోలికగానీ తెలియని దానిని గురించి తెలిసిన వారు ఇతరులకు తెలియునట్లు వారికి తెలిసిన దానిని పోల్చి చూపడమే

అగును. అటువంటపుడు స్థూలముగా తెలియునది ఎంత సత్యమో సూక్ష్మముగా తెలియనిది కూడా అంతే సత్యమగును.


మనిషికి ప్రపంచ జ్ఞానేంద్రియములు ఐదు కలవు. అవి వరుసగా కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక.

దృశ్యమును కన్నుతో చూడగలము. శబ్దమును చెవితో విని తెలియగలము. వాసనను వాసన శక్తి (ఘ్రాణశక్తి) ద్వారా

తెలియగలము. అలాగే స్పర్శను చర్మము ద్వారా రుచిని నాలుక ద్వారా తెలియగలము. కన్ను మాత్రము చూడగలదు.

మిగతా నాలుగు వాటి విషయములను అవి చూడలేవుగానీ, తెలియగలవు. ప్రపంచ విషయములను ఐదింటిని శరీరము

పైనగల ఐదు అవయవముల ద్వారా గ్రహించుచున్నాము. దృశ్యమును చూచీ, శబ్ద, వాసన, రుచి, స్పర్శలను తెలిసీ

గ్రహించుచున్నాము. అట్లే ప్రపంచ విషయములను కాకుండా ప్రపంచ మునకు అతీతమైన పరమాత్మ, ఆత్మ, జీవాత్మ

విషయములను పైనుండు ఐదు ఇంద్రియములతో తెలియలేము. పరమాత్మ విషయము తెలియుటకు బుద్ధికిగల

గ్రాహితశక్తి పనికివచ్చును. బుద్ధికి గల గ్రహింపు శక్తిని జ్ఞానదృష్టి అంటాము. బయటి ఐదు ఇంద్రియముల ద్వారా

ప్రపంచ విషయములు మనస్సుకు చేరి దాని జ్ఞాపకములోనున్నట్లు బుద్ధి ద్వారా గ్రహించబడు సూక్ష్మ విషయమైన


దైవజ్ఞాన విషయములు ఆత్మలో చేరిపోవును. కనిపించే ప్రపంచ జ్ఞానవిషయములు ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా

గ్రహింపబడి మనస్సు అను బ్యాంకులో నిలచిపోయినట్లు, కనిపించని దైవజ్ఞాన విషయములు బుద్ధి ద్వారా గ్రహించబడి

ఆత్మ అను బ్యాంకులో నిలువ చేయబడును. ప్రపంచ విషయములు మనస్సు నుండి తిరిగి జ్ఞాపకము వచ్చును. అలాగే

పరమాత్మ విషయములు ఆత్మనుండి జ్ఞాపకము వచ్చును. బుద్ధికి గల గ్రాహితశక్తిని జ్ఞానదృష్టి అని అనవచ్చును.

కొందరు బుద్ధికి గల జ్ఞానదృష్టిని మనోదృష్ఠి అని కూడా చెప్పుచుందురు.


కొందరు జ్ఞానులు చంచలమైన మనస్సును కుక్కతో సమానముగా పోల్చుచుందురు. అలాగే చురుకైన బుద్ధిని

పదునైన కత్తితో పోల్చుచుందురు. ఈ పోలికలు సూక్ష్మముగానున్న మనోబుద్ధుల సహజత్వమును తెలియ జేయుచున్నవి.

ఐదు ప్రపంచ విషయములను తెలుపు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అను ఐదు ఇంద్రియములు వాటి శక్తులు

విజ్ఞానము (జనరల్ సైన్సు)కు తెలియును. ఒక్క పరమాత్మ విషయమును తెలుపు బుద్ధి మరియు దానిశక్తిని తెలుపునది

సుజ్ఞానము (సూపర్ సైన్సు) విజ్ఞానమును మాత్రము తెలిసినవారు గణిత, ఖగోళ, రసాయనిక, భౌతిక శాస్త్రములను

మాత్రము తెలిసియుందురు. సుజ్ఞానమును తెలిసినవారు సూపర్సైన్సయిన బ్రహ్మవిద్యాశాస్త్రమును గురించి

తెలిసియుందురు. దైవ జ్ఞానమును సంపూర్ణముగా తెలిసియున్న, ఖగోళములోని కనిపించని ఒక గ్రహమైన జిబ్రయేల్

అనునతడు దాదాపు 1400 సంవత్సరముల పూర్వము ముహమ్మద్ ప్రవక్త అను వ్యక్తికి తనకు తెలిసిన దైవజ్ఞానమును

చెప్పడము జరిగినది. అలా చెప్పిన జ్ఞానము నేడు ఖుర్ఆన్ గ్రంథ రూపములోనున్నది. ఆ రోజులలో దైవజ్ఞాని లేక

దైవదూత అయిన జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము ప్రకారము ముహమ్మద్ ప్రవక్త ప్రవర్తించాడు. దైవజ్ఞానమును తెలియుటకూ,

దైవమును ప్రార్థన చేయుటకూ, ఆ రోజు మక్కాలో కాబా గృహము, ఏడు ప్రదక్షిణలు మూడు సాతాన్ స్థంభాలు, ఏడు

గులకరాళ్ళు విసరడమును ఆచరించారు.


ప్రపంచమునకంతా దేవుడు ఒక్కడే, ఆయన శాస్త్రము ఒక్కటే, ఆయన జ్ఞానము ఒక్కటే. దేవుని జ్ఞానము

గీతగాగానీ, బైబిల్గాగానీ, ఖుర్ఆన్ గాగానీ ఏ గ్రంథరూపములోనైనా ఉండవచ్చును. గ్రంథముల పేర్లు వేరైనంత

మాత్రమున వాటిలోని జ్ఞానము వేరుకాదనీ, అన్ని గ్రంథముల జ్ఞానములు ఒకే దేవున్ని గురించి తెలుపుచున్నవనీ మాకు

బాగా తెలుసు. అటువంటపుడు ఏ మతములోనున్న జ్ఞానమైనా, ఏ గ్రంథములలోనున్న జ్ఞానమైనా సులభముగా

అర్థము చేసుకోగలము. 1400 సంవత్సరముల పూర్వము జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన జ్ఞానమూ, 2000

సంవత్సరముల పూర్వము ఏసు చెప్పిన జ్ఞానమూ, 5000 సంవత్సరముల పూర్వము కృష్ణుడు చెప్పిన జ్ఞానము ఒకే

దేవునికి సంబంధించినవి అయినందున, గీతను తెలిసిన నాకు మిగతా గ్రంథముల జ్ఞానము సులభముగా అర్థమైనది.

అందువలన కాబా గృహమువద్ద నల్లని రాయికి గల అర్థముగానీ, ఏడు ప్రదక్షిణల అర్థముగానీ, మూడు సాతాను

స్థంభాల వివరముగానీ, ఏడు రాళ్ళతో కొట్టడము యొక్క ఉద్దేశ్యముగానీ, ప్రత్యక్షముగా కనిపించునట్లు తెలియుచున్నది.

మక్కాలోని వాటి వివరము ముస్లీమ్లకు ఏ విధముగా తెలియునో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన జ్ఞానార్ధమును

నేను హేతుబద్ధముగా, శాస్త్రబద్ధముగా చెప్పుచున్నాను. మేము చెప్పు విధానము మీకు సమ్మతమైతే నమ్మండి, మీకు

సమ్మతము కాకపోతే నా ఉద్దేశ్యమును నాకే వదలివేయండని ముందే చెప్పుచున్నాను.


సృష్ఠి తయారైన తర్వాత మహాభూతమైన ఆకాశమునుండి శబ్దము ద్వారా సూర్యగ్రహమునకు దైవజ్ఞానము

మొట్టమొదట చెప్పబడినది. సూర్యగ్రహము నుండి భూమి మీద ప్రజలకు దైవజ్ఞానము చేరినది. సూర్య గ్రహము

వినిన తర్వాత సూర్యుని ద్వారా జిబ్రయేల్ గ్రహము కూడా విని దైవజ్ఞానము తెలిసియున్నది. కలియుగములో 1400


సంవత్సరముల పూర్వము ముహమ్మద్ ప్రవక్తగారికి కనిపించకుండ జిబ్రయేల్ దైవ జ్ఞానమును బోధించాడు. సూర్యుడు

ఖగోళములో ఉంటూ, అటు ఖగోళములోనున్న గ్రహములకూ ఇటు భూమిమీదున్న మనుషులకూ దైవజ్ఞానమును

తెలిపాడు. ఒక అగ్నిగోళమైన సూర్యగ్రహము ఎలా చెప్పగలిగిందను ప్రశ్నకు మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”

గ్రంథములో సంపూర్ణమైన జవాబు గలదు. మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి, 23 సంవత్సరములు

అప్పుడప్పుడు జ్ఞానమును తెలియజేస్తూవచ్చాడు. మొదట మహాభూతమైన ఆకాశవాణి నుండి వచ్చిన జ్ఞానము

సూర్యగ్రహమునకూ, సూర్యగ్రహమునుండి భూమి మీద మనువుకూ తెలుపబడిన జ్ఞానము, ఖగోళములోని జిబ్రయేల్కు

కూడా తెలుపబడినది. మొదట సూర్యుని ద్వారా వచ్చిన జ్ఞానమే నేడు ప్రపంచ వ్యాప్తముగా అనేక మతములలోనూ,

వాటి మూల గ్రంథములలోనూ కనిపిస్తున్నది. సూర్యుని నుండి వచ్చిన జ్ఞానమునే తిరిగి చెప్పుచున్నానని శ్రీకృష్ణుడు

భగవద్గీత రూపములో చెప్పాడు. అట్లు చెప్పిన భగవద్గీతను చదవడము వలన, దానిని మేము సిద్ధాంత రూపముగా

వ్రాయడము వలన, అన్ని మతగ్రంథముల జ్ఞానము పూర్తిగా మాకు అర్థమైనది. మాకు అర్థమైన జ్ఞానము ప్రకారము

దేవునికి రూప, నామ, క్రియలు లేవనుట ముఖ్య సూత్రముగా కలదు. ఈ సూత్రము దేవుని జ్ఞానములో ముఖ్యమైనది.


రూప, నామ, క్రియారహితుడు దేవుడు అని తెలియనివారికి తెలుపు నిమిత్తము, కృతయుగములో మొదట

ముక్కు ముఖము అను ఆకారములేని ఒక రాయిని ఉదాహరణగా చూపి, దేవుడీవిధముగా ఆకారము లేకుండా

ఉన్నాడని తెలియజేశారు. అదే జ్ఞానము ప్రకారమే దేవుని గుర్తుగా కాబా గృహమువద్ద ముక్కు ముఖము ఆకారములేని

నల్లనిరాతిని పెట్టడము జరిగినది. అక్కడున్న నల్లని రాయి దేవుడుకాదు గానీ, దేవునికి ఉదాహరణగా పెట్టినదని

తెలియాలి. దేవుని చేత సృష్ఠింపబడి దేవుని పాలనలోనున్న భూమండల ప్రాంగణములో ప్రజలు కొందరు

ధర్మమార్గములోనూ, కొందరు అధర్మమార్గములోనూ, రెండు విధములుగా ఉన్నారనుటకు ఉదాహరణగా, కాబా గృహ

ప్రాంగణములో నాలుగు ప్రదక్షిణలు కొంత వేగముగా, మూడు ప్రదక్షిణలు నిదానముగా తిరగడము జరుగుచున్నది.

భూమిమీద నాలుగు అధర్మములు, మూడు ధర్మములు కలవు. సహజముగా అధర్మమార్గములోని ప్రజలు వేగముగ,

ఆటంకములేకుండా చలామణి అగుచుందురు. ధర్మ మార్గములలో ప్రయాణించు వారు అనేక ఆటంకములతో

నిదానముగా సాగుచుందురనుటకు ఉదాహరణగా, నాలుగు ప్రదక్షిణలు వేగముగా, మూడు ప్రదక్షిణలు నిదానముగా

తిరగడము జరుగుచున్నది. దీనివలన నాలుగు అధర్మములు, మూడు ధర్మములు కలవనీ, అధర్మములు వేగముగా

సాగుచుండగా, మూడు ధర్మముల మార్గములు నిదానముగా సాగుచున్నవని తెలియుచున్నది. కాబా గృహమువద్దనున్న

ఆకారములేని నల్లని రాయి ఆకారములేని దేవునికి గుర్తుగా ఉండగా, దేవుని సృష్ఠిలోని నాలుగు అధర్మములు, మూడు

ధర్మములు తెలియునట్లు ఉదాహరణకు నాలుగు ఒక విధముగా, మూడు మరొక విధముగా ప్రదక్షిణలు కలవని

తెలియు చున్నది.


ఇక మక్కాలో కాబా గృహమునకు ఎనిమిది కిలోమీటర్ల దూరములో (ఐదుమైళ్ళ దూరములో) నున్న సైతాన్

గోడలు లేక స్థంభములు మూడు కలవు. ఇస్లామ్లో సైతాన్, క్రైస్తవములో సాతాన్ అనియు ఇందుత్వము (హిందుత్వము)లో

మాయ అనియు అనబడునది ఒక్కటేనని తెలియవలెను. మాయ మూడు విధములుగా ఉన్నది. ప్రకృతి చేత తయారు

చేయబడిన గుణములు మనిషి శరీరములోనున్నవి. గుణములు మూడు తరగతులుగా ఉన్నవి. తామస, రాజస,

సాత్త్విక అను మూడు గుణ భాగములు మన తలలో కలవు. ఒక్కొక్క గుణభాగమందు 12 గుణములు కలవు. ఒక

భాగములోనున్న 12 గుణములలో ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు కలవు. మూడు భాగములలో


మొత్తము 36 గుణములు కలవు. తామస, రాజస, సాత్వికమను మూడు భాగముల లోని గుణములను కలిపి మాయ

అంటాము. ఇదే మాటనే భగవద్గీతలో విజ్ఞానయోగమున 14వ శ్లోకమందు "దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా

దురత్యయా” అని కూడా అన్నారు. “దేవుడనైన నేను తయారుచేసిన గుణములతో కూడుకొన్న నా మాయను జయించడము

అసాధ్యము” అని దీని అర్థము. మూడు గుణములనే మాయ అనడము జరగుచున్నది. మాయ మనుషుల తల

భాగములోనున్న గుణచక్రమందు కలదు. గుణ చక్రము మనిషి తలలో ఎలా ఉన్నది క్రిందగల చిత్రపటములలో

చూడవచ్చును.


మనిషి తలలోనే మాయ ఉన్నది. తలలోని గుణచక్రములోగల మూడు భాగములలో జీవుడు ఏదో ఒక

భాగములో ఉన్నాడు. దీనినిబట్టి మానవుడు ఎల్లప్పుడు మాయచేతిలో బంధింపబడియుండి, దేవునివైపు పోలేకున్నాడని

తెలియుచున్నది. దేవునివైపు మనిషి పోకుండా ఆటంక పరుచునది మాయ, లేక సాతాన్, లేక సైతాన్. మూడు


బ్రహ్మ చక్రము

కాల చక్రము

కర్మ చక్రము

గుణ చక్రము

బ్రహ్మనాడి

నాల్గు చక్రముల సముదాయము  36 చిత్రమును పేజీ లో చూడండి. 

గుణచక్రములోని మూడు భాగములు చిత్రమును 36  పేజీ లో చూడండి. 


మతములలో మూడు పేర్లతో పిలువబడు మాయను జయించడము దుస్సాధ్యమేనని “దురత్యయా” అని చెప్పిన దేవుడు

దానిని జయించుటకు ఉపాయముగా అదే శ్లోకములోనే “మామేవ యే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే” అని కూడా

అన్నాడు. “ఎవడైతే నన్ను ఆరాధించుచున్నాడో, వాడు మాయను సులభముగా దాటిపోగలడు” అని దాని అర్థము.


విజ్ఞానయోగము :-

14.

 శ్లోకము : దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా,

మామేవ యే ప్రపద్యన్తో మాయా మేతాం తరన్తితే.


ఈ శ్లోకము ప్రకారము మాయను తయారు చేసిన దేవున్ని తెలియుటకు మాయ ఆటంకముగా ఉన్నదనీ,

అటువంటి మాయను జయించడము దుస్సాధ్యమనీ, చెప్పిన దేవుడు తన జ్ఞానము వలన మాయను సులభముగా

దాటవచ్చునని చెప్పాడు. ఆయన జ్ఞానము ఏమిటి? ఎక్కడున్నది? ఎలా ఉన్నదనుటకు సమాధానముగా గీతలో మనిషి

శరీరములోనే తన జ్ఞానమంతా ఇమిడియున్నదనీ, ఒక విధముగా ఏడు నాడీకేంద్రములలో శక్తిగానూ, మరియొక

విధముగ ఏడు గ్రంథులలో శక్తిగానూనున్న శక్తిని తెలియగలిగితే, మూడు గుణ భాగములుగానున్న మాయను సులభముగా

జయించవచ్చునని తెలిపియున్నాడు. ఇటు ఏడు నాడీకేంద్రములలోని శక్తి, అటు ఏడు గ్రంథులలోని శక్తి ఒక్కటేనని

తెలియగలిగితే మూడు గుణముల మాయ సులభముగా జయించబడును. నాడీకేంద్రములుగా, గ్రంథులుగాయుండి

మనిషిని నడుపు చైతన్యశక్తిని తెలియనంతవరకు మాయ జయించబడదు. చైతన్యశక్తి ఏడు భాగములుగా ప్రతి మనిషి

శరీరములో ఉన్నది. ఏడు భాగములుగానున్న ఆత్మశక్తి చేత మూడు భాగములుగానున్న మాయను జయించవచ్చునని

తెలుపు నిమిత్తము, మూడు సైతాన్ (మాయ) గోడలను (స్థంభములను), మాయకు గుర్తుగా ఉంచడము జరిగినది.

మూడు భాగములుగానున్న మాయను, ఏడు భాగములుగానున్న చైతన్యశక్తిని తెలియడము వలన జయించ వచ్చుననుటకు

గుర్తుగా, ఏడు గులకరాళ్ళను మూడు స్థంభముల మీదికి విసురునట్లు చేయించారు. ఇదంతయు ముహమ్మద్ ప్రవక్తకు

దేవుని జ్ఞానమును తెలియ జేసిన జిబ్రయేల్ చెప్పియుండుట వలన, ముహమ్మద్ ప్రవక్త చేత కాబా గృహమూ మరియు

సైతాన్ స్థంభములు నిర్మింపబడినవని అర్థమగుచున్నది.


ఇంతవరకు నేను చెప్పిన జవాబు పూర్తిగా బ్రహ్మవిద్యా శాస్త్రము నకు సంబంధించినది. భూమిమీద ఉండేవి

ఆరు శాస్త్రములే, అందులో అన్నిటికంటే మొదటిదీ మరియు పెద్దదీ బ్రహ్మవిద్యా శాస్త్రము. తర్వాత వచ్చినవి గణిత,

ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్య అనునవి వరుసగా ఐదు కలవు. ఈ షట్శాస్త్రముల మినహా ప్రపంచములో ఏ

శాస్త్రములు లేవు. వాస్తుశాస్త్రము, వానశాస్త్రము, బల్లిశాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము, పాకశాస్త్రము, నాడీశాస్త్రము,

ప్రేమశాస్త్రము, కామశాస్త్రము, నీతిశాస్త్రము, న్యాయశాస్త్రము అని చెప్పబడునవి అనేకము కలవు. అవన్నియు పూర్తి

అసత్యమైనవనీ, ఆరు శాస్త్రముల మినహా ఏ శాస్త్రము లేదనీ చెప్పుచున్నాము. ప్రస్తుత కాలములో గణిత, ఖగోళ,

రసాయన, భౌతికమను నాలుగు శాస్త్రములు ఎక్కువగా ప్రచారమైనవి. జ్యోతిష్య శాస్త్రమనునది అక్కడక్కడ వినిపించినా

అది పేరుకు మాత్రమున్నది. గణిత, ఖగోళ, రసాయన, భౌతికశాస్త్రముల మీద పరిశోధన జరిగినట్లు, జ్యోతిష్యశాస్త్రము

మీద పరిశోధనలు జరగలేదు. అందువలన అది గణిత, ఖగోళ, రసాయన, భౌతిక శాస్త్రములవలె అభివృద్ధి కాకపోవడము

వలన, జ్యోతిష్యము శాస్త్రమా కాదా! అను అనుమానము ఏర్పడినది. కొందరైతే ఏకంగా జ్యోతిష్యము మూఢనమ్మకము,

శాస్త్రముకాదు అని అంటున్నారు. ఇకపోతే బ్రహ్మవిద్యా శాస్త్రము సృష్ట్యాదిలోనే తెలియజేయబడినప్పటికీ, దానిమీద

ఎవరికీ శ్రద్ధ లేని దానివలన, అదొక శాస్త్రమున్నదను విషయమే ప్రస్తుత కాలములో తెలియకుండా పోయినది. బ్రహ్మవిద్యా


శాస్త్రమును స్వయముగా దేవుడే సృష్ట్యాదిలోనే తన భూతము చేత చెప్పించాడు. మొదటి శాస్త్రమైన బ్రహ్మ విద్యా

శాస్త్రము దేవునికి సంబంధించిన వివరము గలది. దేవుని యొక్క శాసనములు కలది దేవుని శాస్త్రము. అది అన్నిటికంటే

పెద్ద విద్యా శాస్త్రమైన దానివలన దానిని బ్రహ్మవిద్యాశాస్త్రము అని అంటున్నారు.


బ్రహ్మవిద్యా శాస్త్రము ఎక్కువగా సూక్ష్మ విషయములనూ, తక్కువగా స్థూల విషయములను తెలుపగలదు. ఒక

సజీవ శరీరమును తీసుకొని బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చూస్తే స్థూలము కొంత, సూక్ష్మము కొంత, రెండు

భాగములుగా ఉన్నది. స్థూలము ఎంత భాగమూ, సూక్ష్మము ఎంత భాగమున్నదని చూచినట్లయితే 10 భాగములు

స్థూలమనీ, 33 భాగములు సూక్ష్మమని తెలియుచున్నది. శరీరములో ప్రత్యేకించి ఒక పనిని చేయు దానిని ఒక భాగము

అని అంటాము. ఒక భాగము పని చేయుటకు అనుబంధముగాయున్న అవయవ భాగములు ఎన్నియున్నా అవన్నియు

ఒక భాగము క్రిందికే లెక్కించవచ్చును. ఉదాహరణకు ముక్కు వాసన చూచు పనిని చేయు ఒక భాగముగా

ఉన్నప్పటికీ, దానికి అనుబంధముగానున్న ఊపిరితిత్తులు, గుండె మొదలగునవన్నీ ఒక భాగము క్రిందికే లెక్కించనగును.

ఈ విధముగా స్థూలముగానున్న శరీరమంతా కేవలము పది భాగములుగా లెక్కకు వస్తున్నది. తర్వాత సూక్ష్మముగా

కనిపించకుండాయున్న పదిహేను భాగములుగా లెక్కించబడుచున్నవి. సూక్ష్మముగా ఇంకా లోతుగా కేవలము జ్ఞానము

వలన మాత్రము తెలియునవి ఎనిమిది కలవు. చివరకు మొత్తము 43 భాగములుగా లెక్కించబడుచున్నది. వాటి

వివరమును క్రింద చూడండి( చిత్రమును 38 పేజీ లో చూడండి) .


ఇంతకుముందు గ్రంథములలో శరీరమును స్థూల సూక్ష్మములుగా విభజించి మొత్తము 25 భాగములుగా

చెప్పుకొన్నాము. సర్వసాధారణముగా అంతవరకు చెప్పకోవడమే మంచిది. ఇప్పుడు సాధారణ సైన్సు ముందర

సూపర్సైన్సు ఎలా ఉంటుందో చెప్పాలంటే, శరీరమును పూర్తిగా సూక్ష్మాతి సూక్ష్మముగా విభజించి చెప్పవలసియున్నది.

అట్లు చెప్పితే కనిపించనివి మొత్తము 33 ఉన్నవనీ, కనిపించే పది భాగములతో కలిపి ఒక సజీవ మానవ శరీరము

మొత్తము 43 భాగములుగా చెప్పవచ్చును. 43 అను మొత్తములో రెండు సంఖ్యలు గలవు కదా! అందులో మొదటిది

4, (నాలుగు). తర్వాతది 3 (మూడు). ఈ రెండు సంఖ్యలను కలిపితే 4+3=7 అగును. ఒక మనిషిలోని శరీర

భాగములను ఆధారము చేసుకొని ఏర్పరచిన సంఖ్య ఏడు (7). ఏడు అను సంఖ్య ఆధ్యాత్మిక రంగములో ముఖ్య

పాత్రపోషించు చున్నది. శరీరములో నాడీకేంద్రములు ఏడుగాయున్నవి. అలాగే గ్రంథులు ఏడుగానేయున్నవి. ఏడును

విభజించితే నాలుగు (4) మరియు మూడు (3) గానే విభజించాలి. నాలుగు సంఖ్య అధర్మములకూ, మూడు సంఖ్య

ధర్మములకు ప్రతీకగా ఉన్నవి. అందువలన సులభముగా నాలుగు అధర్మములు, మూడు ధర్మములు అని చెప్పవచ్చును.

ఇవన్నియు ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు కల్పితము చేసి చెప్పునవి కావు. ఇవన్నియు పూర్తిగా శాస్త్రమును అనుసరించి

ఉన్నవని తెలియవలెను. ఆధ్యాత్మికము శాస్త్రబద్ధ మైనదనీ, దానికి కూడా ఒక శాస్త్రమున్నదనీ తెలిసిన రోజు నాస్తికవాద

ముండదు. అప్పటికీ దేనికీ ఒప్పుకోని అతివాదులు బయటికి ఒప్పుకోక పోయినా వారి అంతరంగములలో ఒప్పుకొని

తీరుదురు. అందువలన వారి ప్రభావము చేత తయారగు తీవ్రవాదముగానీ, ఉగ్ర వాదముగానీ లేకుండా పోవును.


తన మతము గొప్పదనీ, తన మతములోని జ్ఞానము తప్ప మరి ఏ ఇతర మతములోని జ్ఞానమూ గొప్పది

కాదనీ, అనుకొని ఇతర జ్ఞానములను ఏమాత్రము ఒప్పుకోనివాడు అతివాది అగును కదా! అటువంటి అతివాది నన్ను

ఒక ప్రశ్న అడిగాడు. అతను అతివాది అని తెలిసినా అడిగిన ప్రశ్నకు సరియైన జవాబును చెప్పడము మా కర్తవ్యము.

కావున అతనికి సూత్రబద్ధమైన జవాబును చెప్పాము. మతవాది అయిన అతివాది అడిగిన ప్రశ్న ఇలాగ ఉన్నది.


మతవాది :- హిందూమతమునకు నేను ప్రవక్తనని చెప్పుకొనువాడుగానీ, లేక ఇతను ప్రవక్త అని చెప్పబడువాడుగానీ

లేడు. క్రైస్తవములో ఏసు దేవుని కుమారుడుగా చెప్పబడినాడుగానీ ప్రవక్తగా చెప్పబడలేదు. మా మతములో మాత్రమే

ప్రవక్త ఉన్నాడు. ఇతనే ప్రవక్త అని అందరిచేత చెప్పబడినాడు. మా మతములో ఫలానా వ్యక్తి ప్రవక్త అని అందరికీ

తెలుసు. ప్రవక్తయున్నది సరియైన మతమగును. ప్రవక్తలేని మతము మతమేకాదు. అందువలన మేము

హిందూమతమునుగానీ, క్రైస్తవమతమును గానీ ఒప్పుకోము. మా మతమొక్కటే దేవున్ని ప్రార్థించుచున్నదనీ, మిగతా

ప్రవక్తలేని మతములన్నిటిలో ప్రజలు సైతాన్ ను ఆశ్రయించుచున్నారని అంటాను. దీనికి మీరేమంటారు?


మేము :- ఒక విషయమును కాదు అనుటకుగానీ, అట్లే ఒక విషయమును అవును అనుటకుగానీ, ఎన్నో

ఆధారములుండవలెను. దేనినైనా సమర్థించు టకు శాస్త్రములోని సూత్రములు అవసరము. అట్లే దేనినైనా విమర్శించు

టకు, ఖండించుటకు కూడా శాస్త్రములోని సూత్రములు అవసరము. పద్ధతిగా ప్రవక్తను గురించి చెప్పుకొంటే, వక్త

అనగా చెప్పువాడు, బోధించు వాడని అర్థము. ప్రాముఖ్యమైన విషయములను బోధించువాడు ఎవడైనా గానీ ప్రవక్త

అని పిలువబడును. మనిషి జీవితములో అన్నిటికంటే ముఖ్యమైనది దైవము. దేవున్ని గురించి చెప్పబడు ఏ విషయమైనా

ముఖ్యమైనదే. అందువలన దేవున్ని గురించి తెలుపు జ్ఞానమును బోధించినవాడు ఎవడైనా ప్రవక్తయే అగును. వక్త

అనగా బోధించువాడు అని అర్థమొచ్చినపుడు, ప్రవక్త అనగా ముఖ్యమైన విషయమును చెప్పువాడని అర్థము. ఒక

సభలో బాగా మాట్లాడు వానిని మంచివక్త అంటారు. అలాగే చాలాముఖ్యమైన విషయములను గురించి మాట్లాడువానిని


“ప్రవక్త” అని అనవచ్చును. ఏ విషయములోనైనా మంచి వక్తలుండవచ్చును. కానీ ఇప్పుడు మనము ఆధ్యాత్మిక

విషయమును లేక మత విషయమును గురించి మాట్లాడుచున్నాము. కావున ఈ విషయములను బోధించు వానిని

ప్రవక్త అని అనవచ్చును. ఎవరిని ప్రవక్త అనాలి? ఎవరిని ప్రవక్త అని అనకూడదు? అను విషయము అందరికీ బాగా

అర్థమగుటకు, కొంత ప్రక్క దారిలోనికి పోయి ఒక కథను చెప్పుకొందాము.


వేయిమంది జనాభాగల కర్మపట్టు అను ఒక ఊరిలో ముగ్గురు ధనికులుండినా, 997 మంది పేదవారే కలరు.

ముగ్గురు ధనికులు కాల్ అను ఒక కంపెనీలో పని చేయుచున్నారు. ఆ కంపెనీ యజమాని తనకు వచ్చిన లాభమును

కూడా తనవద్ద పని చేయు వారికి భాగముగా ఇచ్చుట వలన, ఆ కంపెనీలో పని చేయు ముగ్గురు వ్యక్తులు ధనికులుగా

మారిపోయారు. కాల్ కంపెనీ ఓనర్ను (యజమానిని) ఎవరూ చూడలేదు. ఆయన ఎక్కడుంటాడో కూడా తెలియదు.

ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. కంపెనీ యజమాని కనిపించకుండా ఎక్కడో ఉన్నా, ఆయన పేరు ఏమిటో

తెలియకున్నా, ఆయన ఏమి చేస్తుంటాడో కూడా తెలియకున్నా, ఆ యజమాని క్రింద పని చేయువారు తమ యజమాని

మీద పూర్తి విశ్వాసము కల్గి పని చేయుచుందురు. కంపెనీ యజమాని అయిన తాను ప్రత్యక్షముగా లేకున్నా తన

ఉద్యోగులు తనమీద విశ్వాసముతో, ఎంతో శ్రద్ధగా పని చేయడము వలన యజమాని అయిన వాడు (నాకు కూడా

ఆయన పేరు తెలియదు. అందువలన నేను కూడా యజమాని అనియే చెప్పుచున్నాను.) తన పనివారిని తనకు వచ్చిన

లాభములో భాగస్వాములుగా చేసి, ముగ్గురు వ్యక్తులకు కంపెనీ లాభమును ఇచ్చుట వలన, కర్మపట్టు గ్రామస్థులు

ముగ్గురు ధనికులుగా మారియున్నారు.


కర్మపట్టు గ్రామములోని ముగ్గురు ధనికులు మూడు కులముల వారుగా ఉన్నారు. ఒకరి పేరు తిట్టుచౌదరి,

రెండవవాని పేరు పట్టుజాన్, మూడవవాని పేరు కొట్టు సాయబ్ అని కలవు. కర్మపట్టు గ్రామమునకు కొంత

దూరములోనున్న కాల్ కంపెనీలో పని చేయు ముగ్గురూ కంపెనీ ఇచ్చు ధనము వలన ఆ ఊరిలో వారు ధనికులుగా

పిలువబడుచున్నారు. కర్మపట్టు గ్రామములో అనేక కులముల వారున్నారు. వారందరు బీదవారే అయినందున అనేక

కష్టములు అనుభవించుచుండిరి. కర్మపట్టు ఊరిలోని ప్రజల కష్టములను చూచిన తిట్టుచౌదరి, ఊరి ప్రజల కష్టములను

తీర్చుటకు తనవద్దనున్న ధనమును వారికియ్యవలెనని అనుకొన్నాడు. అనుకొన్న వెంటనే తనకు సమీప బంధువైన తన

బావను పిలిచి "నేను నీకు కొంత ధనమును ఇస్తాను, నీవు దానిని తీసుకొని పోయి ఊరిలోని అన్ని కులముల వారికి

సమానముగా పంచు” అని చెప్పి తన బావను ఒప్పించి, కోటి రూపాయల డబ్బును ఇచ్చి పంపాడు.


ఆ విధముగా తిట్టుచౌదరి ధనమును తన బావకు ఇచ్చి పంపగా, ఆయన ఊరిలోని అన్ని కులములవారికి

సమానముగా పంచుటకొరకు తన బంధువులను కొందరిని పిలిచి, ఇది తన బావగారైన తిట్టుచౌదరి ఇచ్చిన ధనమనీ,

దీనిని ఊరిలోని ప్రజలందరికీ కులబేధము లేకుండా పంచవలెనని చెప్పి, కోటి రుపాయలను ఇచ్చి పంపాడు. అయితే

అక్కడ నుండి ధనమును తీసుకొనిపోయిన తిట్టుచౌదరి యొక్క బావ బంధువులు, ఊరిలోని అన్ని కులముల ప్రజలకు

సమానముగా పంచకుండా, తమ కులము వారికి మాత్రము పంచారు. అలా ఒక్క కులము వారికే పంచినప్పటికీ ఆ

ధనమును ఇచ్చినవాడు తిట్టుచౌదరేనని చెప్పారు. అయితే తిట్టు చౌదరి ధన సహాయము చేసినా, ఆయన అనుకొన్నట్లు

అది ఊరిలోని వారందరికీ సమానముగా పంచబడలేదు. కోటి రుపాయలు తమ చౌదరి కులము వారికే చెందవలెనను

ఉద్దేశ్యముతో, చౌదరి బంధువులు అలా చేశారు. తిట్టుచౌదరి నిస్వార్థముగా అందరికీ సమానముగా డబ్బును పంచవలెనను

ఉద్దేశముతో ఇచ్చిన కోటిరుపాయలు, కొందరికి మాత్రమే లభించినవి. ఆ విషయమును 20 రోజుల తర్వాత తెలుసుకొన్న


పట్టుజాన్ తనవద్దనున్న డబ్బును ఊరిలోని వారందరికీ సమానముగా ఇచ్చి ఆదు కోవలెననుకొన్నాడు. పట్టుజాన్ తానే

స్వయముగా కర్మపట్టు ఊరిలోని ప్రజలకు ధనమును పంచాలనుకొన్నాడు. అలాగే కొన్ని నెలల కాలము గడచిపోగా,

చివరకు తనకు తెలిసిన తన బంధువులను పదిమందిని పిలిచి, కోటిరుపాయలనిచ్చి, తన ఉద్దేశ్యమును తెలిపి, ఇది

ఒక కులమునకు సంబంధించిన డబ్బుకాదు. అన్ని కులముల వారికి సమానముగ చేరవలసిన డబ్బు అని చెప్పి

పంపగా, చివరకు ఆ డబ్బు అన్ని కులముల వారికి చేరినా, అది మోసపూరితముగా చేరినది. ఈ డబ్బు పట్టుజాన్

డబ్బని అందరికీ చెప్పి పంచిన పదిమంది ఇలా చెప్పారు. ఏ కులమువారైన ఫరవాలేదు, వారికి మేము డబ్బు ఇస్తాము,

అయితే తమ తమ కులమును వదిలి పట్టుజాన్ కులములోనికి వచ్చినవారికే ఇస్తామని నియమమును ఉంచగా, డబ్బు

ఆశకు చాలామంది పేదవారు తమ కులమును వదలి డబ్బు తీసుకొని పట్టుజాన్ కులములో చేరిపోయారు.


తిట్టుచౌదరి ఇచ్చిన డబ్బు అందరికీ చేరవలసియున్నా, అది వారి కులము వారికే చేరిపోయినది. అట్లు ఒకే

కులమునకు చేరకూడదను ఉద్దేశ్యముతో పట్టుజాన్ ఇచ్చిన డబ్బు ఇతర కులముల వారికి చేరినా, వారిని జాన్

కులములోనికే చేర్చినది. మొదట ధనికులైన తిట్టుచౌదరిగారు ఇచ్చిన డబ్బుగానీ, రెండవమారు ఇచ్చిన పట్టుజాన్ గారి

డబ్బుగానీ, వారి భావమునకు వ్యతిరేఖముగా పంచబడినది. ధనికుల ఉద్దేశ్యము ప్రకారము కాకున్నా, వేరు విధముగా

పంచబడినా, పంచబడిన డబ్బు ఫలానా తిట్టు చౌదరిదనీ, అలాగే ఫలానా పట్టుజాన్ నీ అందరికీ తెలుసు. తిట్టుచౌదరి,

పట్టుజాన్రు ఒక్కొక్కరు ఒక్కొక్క కోటిరుపాయలు పంచారు. చౌదరి గారి డబ్బు ఎంత విలువ, ఎంత సంఖ్య

కలిగియుందో అంతే విలువ, అంతే సంఖ్యగల జాన్ గారి డబ్బును కూడా ఇవ్వడము జరిగినది.

చౌదరిగారి డబ్బు తెల్లధనము (వైట్మనీ) అనిగానీ, జాన్ గారి డబ్బు నల్లధనము (బ్లాక్ మనీ) అనిగానీ ఏమీ తేడాలేదు. చౌదరిది

కోటికాగా, జాన్గారిది కూడా కోటియే. ఈ విషయమంతటిని 14 రోజుల తర్వాత కొట్టుసాయబ్ తెలుసుకొని, జరిగిన

మోసమును గురించి చింతించి, తాను కూడా సంపాదించుకొన్న డబ్బులో కోటిరూపాయలను కర్మపట్టు గ్రామ ప్రజలకు

ఇచ్చి, వారి కష్ట కర్మలనుండి లేక కర్మ కష్టముల నుండి ఆదుకోవాలను కొన్నాడు. అలా అనుకొన్న వెంటనే తాను

కూడా డబ్బును తయారుగా ఉంచుకొని ఈ మారు మోసము జరుగకుండా తానే స్వయముగా పంచా లనుకొన్నాడు.

అయితే కొట్టుసాయబు ఒక చిక్కువచ్చి పడింది. అది ఏమనగా! పగలుపూట తనకు కాల్ కంపెనీలో పనివుంటుంది.

సాయం కాలము ఆరు గంటలకు పని అయిపోయిన తర్వాత, రాత్రిపూట తానే స్వయముగా ఊరిలోనికి పోయి,

అందరికీ పంచుటకు కొట్టుసాయబ్ గారికి రేచీకటి రోగమున్నది. దానివలన రాత్రిపూట కళ్ళు కనిపించవు. ఇటువంటి

పరిస్థితిలో తాను చేయునది లేక, తనకు ఇష్టములేకున్నా, డబ్బును పంచు కార్యమును ఇతరులకు అప్పజెప్పవలసి

వచ్చినది.


తనడబ్బు విషయములో ఈమారు ఎటువంటి మోసము జరుగ కుండ ఉండుటకు, నీతివంతుడైన ఒక వ్యక్తిని

ఎన్నుకొని, ఈ విషయములో ఎటువంటి మోసము జరుగకూడదని హెచ్చరించి చెప్పడమేకాక, ఈ డబ్బు నీదికాదు

నీవు నిమిత్తమాత్రుడుగా పంచిపెట్టు అని మరీ మరీ చెప్పి పంపాడు. అన్నిటికీ తలవూపిన అతను డబ్బును

చూడకముందున్నట్లు డబ్బును చూచిన తర్వాత ఉండక, డబ్బంత తనదే అను భావము వచ్చినది. అలా అనిపించిన

తర్వాత తన డబ్బు తన ఇష్టము అను భావము కూడా వచ్చినది. కొట్టుసాయబ్ కోటిరూపాయల డబ్బును ఆ వ్యక్తికి

ఇచ్చినది ఎవరూ చూడలేదు. అందువలన డబ్బును తీసుకొన్న ఆ వ్యక్తి, ఆ డబ్బును ఇతరులకు ఇచ్చినా, అదంతయు

తన డబ్బేనన్నట్లు, తానే స్వయముగా ఇచ్చుచున్నట్లు ఇతరులకు కనిపించాడు. దానివలన ఆ వ్యక్తి నుండి డబ్బును


తీసుకొన్న వారందరు, అతని డబ్బునే ఇచ్చాడని అనుకొంటున్నారు గానీ, అ డబ్బు కొట్టుసాయబ్డిని ఎవరికీ తెలియకుండా

పోయినది. ఎవరైనా కొట్టు సాయన్తో కలిసివచ్చిన వారికి డబ్బు విషయమంతా తెలిసి, ఈ డబ్బు మీకు ఇచ్చిన వ్యక్తిది

కాదు, ఇది కొట్టుసాయబ్డిని చెప్పితే, చెప్పిన వానిదే తప్పన్నట్లు చూచువారు కలరు. అటువంటివారు నమ్మకపోయినా

ఫరవా లేదు గానీ, మాకు డబ్బు ఇచ్చిన వ్యక్తి మీద అసత్యము చెప్పుతావా అని దాడి చేయడానికి కూడా పూనుకొంటున్నారు.

డబ్బును తీసుకొన్న ప్రజలు మొదటికి డబ్బు ఇచ్చిన కొట్టుసాయబ్ మీద అభిమానము పెంచుకోక, మధ్యలో డబ్బు

ఇచ్చిన వ్యక్తి మీదనే గౌరవమును అభిమానమును పెంచుకొన్నారు.


ఇదంతయు గమనించితే ముగ్గురు ధనికులు సమానముగా ఒక్కొక్కరు కోటి రూపాయలను ప్రజలకు ఇవ్వాలను

మంచి ఉద్దేశ్యముతో ఇచ్చినప్పటికీ వారి ఉద్దేశ్యము పూర్తి నెరవేరకుండా పోయినది. మొదటి ధనికుడైన తిట్టుచౌదరి,

రెండవ ధనికుడైన పట్టుజాన్ గారి ఉద్దేశ్యము నెర వేరనప్పటికీ, ఇచ్చిన డబ్బు ఫలానా ధనికులదేనని ప్రజలందరికీ

తెలుసు. అయితే మూడవ ధనికుడైన కొట్టుసాయబ్ ఇచ్చిన ధనము ఫలానా వారిదను విషయము పూర్తిగా ఎవరికీ

తెలియకుండా పోయినది. అందువలన తిట్టు చౌదరికంటే, పట్టుజాన్ గారికంటే, కొట్టుసాయబ్రి విషయములో పూర్తి

అన్యాయము జరిగినదని చెప్పవచ్చును. ధనికులది మంచి ఉద్దేశ్యమే, దానివలన ప్రజలు కొంత లాభము పొందారు.

అయితే మధ్యలో డబ్బును పంచినవారి వంచన చాలా ఉన్నదని తెలియుచున్నది. ఇక్కడ ఎవరికీ తెలియనీ

విషయమొకటున్నది. అది ఏమనగా! ముగ్గురు ధనికులవద్ద యున్న డబ్బుగానీ, తమకు ఇచ్చిన డబ్బుగానీ అంతయు

ఊరుపేరు తెలియని యజమానిదనీ, ఆయన దయతలచి ఇచ్చిన డబ్బునే తమ మీద దయ దలచిన ధనికులు ఇచ్చారనీ,

ముగ్గురు ఇచ్చిన మూడుకోట్ల డబ్బు మొదటికి కాల్ కంపెనీ యజమానిదేనని ఎవరికీ తెలియదు.


తిట్టుచౌదరి, పట్టుజాన్, కొట్టుసాయబ్ గారి ముగ్గురి కథను చూస్తే ఈ కథ అంతయు నేటి మూడు మతములకు

సమ భావముగా ఉన్నట్లు తెలియుచున్నది. కథకు నేటి మతములకు ఉన్న సమత్వమును చూస్తాము. కర్మతో కూడుకొని

అనేక రక కర్మలను అనుభవిస్తూయున్న ఈ విశ్వమంత టినీ కర్మపట్టు గ్రామముగా పోల్చి చెప్పుకోవచ్చును. కాలమును

నడిపించు దేవుడే కాల్ కంపెనీ యజమాని, యజమాని పేరు, ఊరు కర్మపట్టు గ్రామము వారికి ఎవరికీ తెలియనట్లు,

దేవుని పేరు అడ్రసు (నామ, చిరునామ) విశ్వములో ఎవరికీ తెలియదు. దేవుని జ్ఞానము భూమిమీద ప్రజలకు మూడు

విధముల తెలియబడుతుందని ఖురాన్ గ్రంథములో 42వ సురా 51వ ఆయత్లో చెప్పినట్లు, ఎవరికీ తెలియని కాల్

కంపెనీ యజమాని యొక్క ధనము ముగ్గురు ధనికుల ద్వారా పంచబడినది. ఇక్కడ ధనమును జ్ఞానముగా, యజమానిని

దేవునిగా, ముగ్గురు ధనికులను ముగ్గురు ప్రవక్తలుగా పోల్చుకోవచ్చును. ముగ్గురు ధనికుల ధనము మూడు కులముల

వారికే పరిమితమైనట్లు, ముగ్గురు ప్రవక్తలు చెప్పిన జ్ఞానము మూడు మతములకే పరిమితమైపోయినది. తిట్టుచౌదరి

మొదట తన బావకు ధనమిచ్చి ప్రజలకు పంచమని చెప్పినట్లు, మొదట కృష్ణుడు గీతాజ్ఞానమును తన బావగారైన

అర్జునునికి చెప్పాడు. తిట్టుచౌదరి ధనము ఒక కులమునకే పరిమితమైనట్లు, మానవులందరికీ చెందవలెనని చెప్పిన

కృష్ణుని గీతా జ్ఞానము, ఒక హిందూ (ఇందూ) మతమునకు మాత్రము పరిమితమై పోయినది. పట్టు జాన్ తన

ధనమును పదిమంది అనుచరులకు ఇచ్చి ఊరిలోని వారికి పంచమని చెప్పినట్లు, ఏసు తన జ్ఞానమును తన పదిమంది

శిష్యులకు చెప్పడము జరిగినది. జాన్ గారి ధనముతో అతని అనుచరులు తమ కులమును అభివృద్ధి చేసుకొన్నట్లు,

ఏసుప్రభువు యొక్క జ్ఞానముతో క్రైస్తవులు వారి మతములోనికి ఇతరమతములను కలుపుకొని, వారి మతమును

అభివృద్ధి చేసుకొన్నారు. ఏసుప్రభువు జ్ఞానము క్రైస్తవులకేనని చెప్పారు.


తిట్టుచౌదరి ఇచ్చిన ధనముగానీ, పట్టుజాన్ ఇచ్చిన ధనముగానీ ఊరిలోని అందరికీ సమానముగా పంచబడక,

వారివారి కులములకేనని చెప్పుకొని పంచుకొన్నట్లు, కృష్ణుని భగవద్గీత జ్ఞానముగానీ, ఏసు యొక్క బైబిలు జ్ఞానముగానీ

మానవులందరికీయని చెప్పక, వారివారి మతములకే నని చెప్పుకొన్నారు. ఏది ఏమైనా తిట్టుచౌదరి ధనమూ, పట్టుజాన్ గారి

ధనము వారివారి కులములకే పరిమితమైనా, చివరికది తిట్టుచౌదరిదనీ వారి కులమువారికీ, పట్టుజాన్ గారిదనీ వారి

కులమువారికీ తెలిసినట్లు, హిందువులకు భగవద్గీత కృష్ణునిదనీ, క్రైస్తవులకు బైబిలు ఏసుప్రభువుదనీ తెలుసు. కథలో

కొట్టుసాయబ్ ఇచ్చిన ధనమును తీసుకొన్న వ్యక్తి ఒకే కులములో పంచినా, ఆ ధనమును తీసుకొన్న ప్రజలకు అది

కొట్టుసాయబ్ దని ఏమాత్రము తెలియదు. ధనమును తీసుకొన్న వారందరూ తమ చేతికి ఇచ్చినవానిదే అనుకొన్నారుగానీ,

కొట్టుసాయబ్డిని ఎవరూ అనుకోలేదు. తమకు చేరిన ధనము కొట్టుసాయబ్డిని ఎవరైనా చెప్పినా, ప్రజలు వినేస్థితిలో

లేరన్నట్లు, నేడు ఇస్లామ్లో ముస్లీమ్లకు చెప్పిన ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్లందరు ముహమ్మద్ ప్రవక్త గారిదే అనుకొన్నారు

గానీ, అది జిబ్రయేల్ ఇచ్చినదని ఎవరూ చెప్పుకోవడములేదు. ఎవరైనా ఖురాన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్తది కాదు

అని అంటే, ముస్లీమ్లు వినే స్థితిలో లేరు.


తిట్టుచౌదరి, పట్టుజాన్, కొట్టుసాయబ్ ధనికులైనారంటే ముగ్గురు దగ్గర ఉన్నది యజమాని డబ్బు కదా! ముగ్గురి

దగ్గర ఉన్న డబ్బులో ఏ తేడాలేదు. తిట్టుచౌదరి వద్ద ఏ నోట్లయితే ఉన్నాయో అవే నోట్లే మిగతా పట్టుజాన్, కొట్టుసాయబ్

దగ్గర కూడా ఉన్నవి. అదే విధముగా కృష్ణునివద్ద గానీ, ఏసువద్దగానీ, జిబ్రయేల్ దగ్గరగానీ ఒకే దైవజ్ఞానముండేది.

వారివద్ద యున్న జ్ఞానములో ఏ తేడాలేదు, కృష్ణుడు చెప్పిన జ్ఞానమునే మిగత ఏసు, జిబ్రయేల్ ఇద్దరూ చెప్పారు. కాల్

కంపెనీలో పని చేయుట వలన, కాల్ కంపెనీ యజమాని ఇచ్చిన ధనముతోనే తిట్టుచౌదరి, పట్టుజాన్, కొట్టు సాయబ్

ముగ్గురూ ధనికులైనారు. అదే విధముగా దేవుని జ్ఞానరాజ్యములో నున్న ముగ్గురు (కృష్ణ, ఏసు, జిబ్రయేల్) దేవుని

జ్ఞానమును సంపూర్ణముగా పొందియున్నారు. వారివద్దయున్నది విశ్వమునకంతటికి యజమాని, అధిపతి అయిన ఒకే

దేవుని జ్ఞానమని తెలియవలెను. ఈనాడు ప్రజల ముందరయున్న కృష్ణుడు చెప్పిన భగవద్గీతగానీ, ఏసు బైబిల్గానీ,

జిబ్రయేల్ చెప్పిన ఖురాన్ నీ మూడు ఒకే దేవుని జ్ఞానముతో కూడుకొన్నవని తెలియుచున్నది. భగవద్గీతను కృష్ణుడు

చెప్పాడనీ, బైబిలులోనున్నది ఏసు చెప్పినదనీ అందరికీ తెలుసు అయితే ఖుర్ఆన్ను చెప్పినది జిబ్రయేల్ అని చాలామందికి

తెలియదు. ముహమ్మద్ ప్రవక్త చెప్పినదే ఖుర్ఆన్ అని ముస్లీమ్లందరూ చెప్పుకోవడము జరుగుచున్నది.


నేటి సమాజములో మనుషులు ఏసును క్రైస్తవ ప్రవక్త అంటున్నారు. ముహమ్మద్ను కూడా ఇస్లామ్ ప్రవక్త అని

అంటున్నారు. కృష్ణున్ని ప్రవక్త అని ఎవరూ అనలేదు. కృష్ణుడు భగవద్గీతను చెప్పినా ఆయనను చాలామంది అల్లరివానిగా,

జారునిగా, చోరునిగా చెప్పుచుందురు. క్రైస్తవ సమాజములో ఏసుకు, ఇస్లామ్ సమాజములో ముహమ్మద్ ప్రవక్తకు

వారు ఇస్తున్న గౌరవములో కొద్దిపాటి గౌరవమును కూడా కృష్ణునికి హిందువులు ఇవ్వడము లేదు. ఏది ఏమైనా

కృష్ణుడు ప్రవక్తలలోనికి లెక్కించబడలేదు. గీతను చెప్పిన కృష్ణుడు, బైబిల్ను చెప్పిన ఏసు సమకాలికులు కాదుగానీ,

సమ బోధకులనీ ఒకే జ్ఞానమును చెప్పారనీ చెప్పవచ్చును. ఇప్పటికీ ఐదువేల సంవత్సరముల పూర్వము కృష్ణుడు

గీతను చెప్పగా, తర్వాత మూడు వేల సంవత్సరములకు అనగా ఇప్పటికి రెండు వేల సంవత్సరముల పూర్వము ఏసు

బైబిలును చెప్పాడు. తర్వాత 600 సంవత్సరములకు అనగా ఇప్పటికి 1400 సంవత్స రముల పూర్వము ఖుర్ఆన్

గ్రంథమును జిబ్రయేల్ చెప్పాడు. అయితే ఖుర్ఆన్ గ్రంథమువద్ద జిబ్రయేల్ పేరు లేకుండాపోయి ముహమ్మద్

ప్రవక్తగారి పేరువచ్చి చేరిపోయినది. ఇప్పుడు ప్రవక్తలను పేర్లలో కృష్ణుని పేరుగానీ, జిబ్రయేల్ పేరుగానీ లేదు.


ఏసును కొన్నిచోట్ల కొందరు ప్రవక్త అనినా, చాలామంది ఆ మాటను ఒప్పుకోకుండా, ఏసు దేవుని కుమారుడు అని

ప్రచారము చేశారు. ఇకపోతే అన్ని విధముల ముహమ్మద్ గారిని ప్రవక్త అంటున్నారు. అంతేకాకుండా ప్రవక్తయున్నదే

సరియైన మతమనీ, చివరకు ఎటుతిరిగి అన్నిటికంటే మించినది ఇస్లామ్ అని మిగతావారు కూడా దానినే అనుసరించి

దేవుని దృష్ఠిలో ముస్లీమ్లుగా మారిపొమ్మని కొందరు ముస్లీమ్ పండితులు చెప్పుచున్నారు. ఈ విషయమును గురించి

కొంత బుద్ధితో ఆలోచించినా, ఆత్మతో యోచించినా తెలియుచున్నదేమనగా!


వక్త అనగా చెప్పువాడనీ, ప్రవక్త అనగా ముఖ్యమైన విషయమును చెప్పువాడనీ, ముందే చెప్పుకొన్నాము.

దైవజ్ఞాన సంబంధ విషయములే అత్యంత ముఖ్యమైనందున, ఆ విషయములను చెప్పువాడు ఎవడైనా ప్రవక్తయే అవుతాడు.

ముఖ్యమైన దైవజ్ఞానమును చెప్పిన కృష్ణుడు, ఏసు, జిబ్రయేల్ను కూడా ప్రవక్తలనియే చెప్పవచ్చును. జిబ్రయేల్ చెప్పిన

జ్ఞానమును ప్రజలకు చెప్పిన ముహమ్మద్ కూడా ప్రవక్తయే అగును. ముహమ్మద్ తర్వాత జ్ఞానమును ప్రజలకు

బోధించిన వారిని వక్తలనియూ ప్రవక్తలనియూ చెప్పవచ్చును. కృష్ణునికంటే ముందు జ్ఞానమును చెప్పిన వారిని కూడా

ప్రవక్త అని అనవచ్చును. కాషాయమును ధరించిన వానిని సన్న్యాసి అని ఎలా అనుచున్నామో, అలాగే ముఖ్యమైన

జ్ఞానమును చెప్పువానిని ప్రవక్త అంటున్నాము. అంతేగాక ప్రవక్త చెప్పినదే జ్ఞానముగానీ, ప్రవక్త చెప్పినదే మతము

అనుటకు వీలులేదు. జ్ఞానము దేవునిదేగానీ మతముది కాదు. దేవుని జ్ఞానమునకు ఎల్లలులేవు. అందువలన జ్ఞానము

సముద్రములాంటిదనీ, అనంతమైనదనీ అంటుంటారు. అవధి లేనటువంటి వాడు దేవుడు మరియు దేవుని జ్ఞానము.

అటువంటి జ్ఞానమును తీసుకొని వచ్చినవానిని దూత అంటాము. దూత అనగా సమాచారమును తెచ్చువాడు. అవధిలేని

దేవుని సమాచారమును అందించువానిని అవధూత అంటాము. దేవుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, అంతేకాకుండ

దేవుని పేరు తెలియదు, ఆయన ఎట్లుంటాడో, ఏమి చేస్తుంటాడో ఎవరికీ తెలియదు. అటువంటి తెలియనివాని

సమాచారమును ఎవడైతే తెచ్చి అందించునో వానిని అవధూతయని అనవచ్చును. ఒక విధముగా అటువంటివారు

ఎవరున్నారని ఆలోచించిన, ఐదువేల సంవత్సరముల పూర్వము భగవద్గీత రూపములో దేవుని సమాచారమును అందించిన

కృష్ణున్ని అవధూత అనవచ్చును. అలాగే ఏసును, జిబ్రయేల్ను అవధూతలని చెప్పవచ్చును. మొదట అవధూతలు

అందించిన సమాచారమును తెలుసుకొని దానిని ఇతరులకు చెప్పువారు ప్రవక్తలు కావచ్చును. ముహమ్మద్ జిబ్రయేల్

చెప్పిన జ్ఞానమును విని ప్రవక్త అయినాడు. దీనిప్రకారము ప్రవక్త గొప్పవాడా? అవధూత గొప్పవాడా అని అంటే

ముమ్మాటికీ అవధూతయే గొప్పవాడని చెప్పవచ్చును. తర్వాత రెండవవానిగ ప్రవక్తను చెప్పవచ్చును. దేవుని జ్ఞానము

భూమిమీద ప్రజలకు అవధూతల ద్వారానే చేరుచున్నది. తర్వాత అది ప్రవక్తల ద్వారా పంచబడుచున్నది.


బ్రహ్మవిద్యా శాస్త్రములో ఒక ముఖ్యమైన సూత్రము గలదు. అది ఏమనగా! దేవున్ని తెలుపు, దేవుని జ్ఞానము,

దేవునికి తప్ప, మనుషులకెవరికీ తెలియదు అనునది ముఖ్యసూత్రము. మనిషి అయినవాడు ఎవడూ దేవుని జ్ఞానమును

స్వయముగా తెలియజేయలేడు. ఆ లెక్క ప్రకారము ముహమ్మద్ ప్రవక్తగారు కూడా జిబ్రయేల్ చెప్పిన దేవుని జ్ఞానమును

చెప్పాడుగానీ, తాను స్వయముగా చెప్పలేదు. ఇక్కడ బాగా ఆలోచిస్తే దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ

తెలియనప్పుడు కృష్ణుడు దేవుని జ్ఞానమును ఎలా చెప్పాడు? మిగతా ఏసు, జిబ్రయేల్ ఎలా చెప్పగలిగారు? కృష్ణుడు,

ఏసు సాధారణ మనుషులైనపుడు వారికి దేవుని జ్ఞానము తెలియదని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఆ ముగ్గురు చెప్పిన

గీత, బైబిల్, ఖురాన్ గ్రంథములు మూడు దేవుని జ్ఞానమును తెలియజేయు మూల గ్రంథములుగా దేవుడే తెలియజేశాడు.

ఒకవేళ ఆ మూడు గ్రంథములలో దేవుని జ్ఞానము నిక్షిప్తమైయుంటే, వాటిని చెప్పిన ముగ్గురూ సాధారణ మనుషులుకాదని


చెప్పాలి. కృష్ణుడు, ఏసు ఇద్దరూ ప్రత్యక్షముగా అందరికీ కనిపించు వ్యక్తులుగా ఉన్నారు. జిబ్రయేల్ మాత్రము

సాధారణ మనిషివలె కనిపించకుండ ఎక్కడో తెరవెనుకనుండి మాట్లాడినట్లు చరిత్ర కలదు. కావున ఆయనను ఒక

మనిషిగా లెక్కించకూడదు. దేవుని జ్ఞానమును గ్రహించిన ఒక గ్రహముగా జిబ్రయేల్ను గురించి చెప్పవచ్చును.

కృష్ణుడు, ఏసు, జిబ్రయేల్ అను ముగ్గురిలో జిబ్రయేల్ సాధారణ మనిషి కాదని తెలిసిపోయినది. ఇప్పుడు కృష్ణుడు,

ఏసు అను ఇరువురూ కనిపించు వ్యక్తులుగా ఉన్నారు కదా! అటువంటపుడు దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ

తెలియదను దేవునిమాటకు వ్యతిరేఖముగా మనుషులైన కృష్ణుడు, ఏసు ఎలా మూల గ్రంథరూపములలో జ్ఞానమును

అందించారు? అను ప్రశ్నరాగలదు. ఈ ప్రశ్నకు మా జవాబు ఏమనగా!


కృష్ణుడు సాధారణ మనిషిగా కనిపించినా, ఆయన మనిషికాడు. కృష్ణుడు తల్లిగర్భమునుండి సజీవముగా

పుట్టినవాడు. అందువలన ఆయనను భగవంతుడు అనవచ్చునని ఇంతకుముందు కూడా చాలా గ్రంథములలో

చెప్పాము. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు దేవుడా? భగవంతుడా? అను గ్రంథములో కృష్ణుడు ఎలా భగవంతుడయ్యాడో

వివరముగా చెప్పాము. కృష్ణుడు భగవంతుడైన దానివలన ఆయన సాధారణ మనిషికాదని చెప్ప వచ్చును. మనిషి

కానివాడు భగవంతుడగును. భగవంతుడైనవాడు దేవుని అంశతో కూడుకొనియున్నాడు. కావున వాడు కొన్ని సమయములలో

దేవుడు కూడా అగును. సాధారణ మనిషి పుట్టినప్పటినుండి చనిపోవు వరకు మనిషిగానే వుండి, మనిషిగానే జీవించి,

మనిషిగానే చనిపోవును. అయితే భగవంతునిగా పుట్టినవాడు మనిషిగానే ఉండును, అయినా మనిషి కాడు. భగవంతుడైన

మనిషి కొన్ని సమయములలో దేవునిగా ఉండును, అయినా దేవుడు కాడు. దేవుడూకాడని, మనిషీకాడని చెప్పబడు

భగవంతుడు ప్రత్యేకించి భగవంతునిగా కనిపించునా అంటే, భగవంతునికి ఎటువంటి గుర్తు ఉండదు కావున, అతను

భగవంతునిగా కూడ కనిపించక సాధారణ మనిషివలె కనిపించును. ఇవన్నీ నీకెలా తెలియును? నీ మాటను మేమెందుకు

నమ్మాలి? అని ఎవరైనా నన్ను అడిగితే దానికి సూటిగా నేను చెప్పు జవాబు ఏమనగా! నాకు తెలుసు కాబట్టి

చెప్పుచున్నాను. నీకెలా తెలుసు అను ప్రశ్నకు నేను జవాబు చెప్పినా, మీరు నమ్మరు. అయినా నేను చెప్పుమాటలు

గతములో జరిగినవో లేవో చూచుకోండి. అలా నెరవేరి సత్యమని రుజువుకాబడినప్పుడు నా మాటలు శాస్త్రబద్ధమైనవని

తెలుసుకోండి. ఇప్పుడు ఇంకా కొన్ని క్రొత్త విషయములను వివరించు కొందాము.


సాధారణ మనిషిని జీవాత్మగా, భగవంతున్ని ఆత్మగా, దేవున్ని పరమాత్మగా చెప్పవచ్చును. భగవంతుడు

భూమిమీద పుట్టినప్పుడు ఆయన అందరికీ సాధారణ మనిషిలాగే కనిపించును. అంతేకాక భగవంతుని శరీరములో

కూడా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనబడు మూడు ఆత్మలు ఉండును. భగవంతుడు తన జీవితములో ఎక్కువసార్లు

జీవాత్మగా గడుపును. దానివలన జీవాత్మలందరు సుఖదుఃఖాలనుభవించినట్లే భగవంతుడు కూడా సుఖదుఃఖములను

అనుభవించుచుండును. భగవంతుని జీవితములో దాదాపు మూడువంతుల కాలము జీవాత్మగా గడిపి మిగిలిన కొంత

కాలము ఆత్మగా గడుపును. అలా ఆత్మగా గడుపు సమయములో ఆయన భగవంతునిగా ప్రవర్తించుచూ, ఆత్మజ్ఞానమును

చెప్పగలుగును. సాధారణ మనిషిగా, జీవాత్మగా దాదాపు మూడువంతుల కాలము అని ఇక్కడ చెప్పినట్లే ఖచ్చితముగా

కాకుండా అవసరమును బట్టి కొంత ఎక్కువ ఉండవచ్చును. లేక కొంత తక్కువ ఉండవచ్చును. అలాగే భగవంతునిగా

జీవించడము కూడా ఆయన జీవితములో అవసరమును బట్టియుండును. మనిషి జీవితము ముందు గడచిపోయి

తర్వాత భగవంతుని జీవితము గడచును అని చెప్పుటకు వీలులేదు. చిన్నవయస్సు నుండే ఏది ఎప్పుడు గడచునో

చెప్పుటకు వీలులేదు. ఉదాహరణకు ఒక దినములో నాలుగుగంటలు మనిషిగా ఉండి జీవునిగా కష్టసుఖములను

అనుభవించినవాడు, తర్వాత ఒక గంటసేపు ఆత్మపాత్రలోయుంటూ భగవంతునిగా చలామణి అగుచూ, ఆ సమయములో


ఆత్మజ్ఞానమును బోధించి తిరిగి వెంటనే జీవునిగా చలామణి అగును. ఇట్లు జీవితములో ఆత్మపాత్రను ఎప్పుడైనా,

ఎంత కాలమైనా అవసరమునుబట్టి పోషించును. భగవంతునిగా పుట్టినవాడు తన జీవితకాలములో ఏ పాత్రను

ఎప్పుడు పోషించునో, ఎంత కాలము పోషించునో ఖచ్చితముగా చెప్పుటకు వీలులేదు. భూమిమీద ఎవరికీ తెలియని

మరొక విచిత్రమేమనగా! భగవంతుడు తన జీవితములో ఎక్కువ కాలము జీవాత్మగా, తక్కువ కాలము ఆత్మగా చలామణి

అగుచూ, జీవితములో ఒకమారుగానీ, రెండుమార్లుగానీ, ఎక్కువమార్లుగానీ, అవసరమునుబట్టి ఒక్క నిమిషముగానీ,

రెండు నిమిషములుగానీ అంతకంటే ఎక్కువ కాలముగానీ పరమాత్మగా మారిపోగలడు. భగవంతుని జీవితములో

మూడవ ఆత్మగా (పరమాత్మగా మారవచ్చును, లేక మారకపోవచ్చును. అదియు అవసరమును బట్టియేగానీ,

తప్పనిసరియని చెప్పడము లేదు. భగవంతుడు జీవాత్మగా ఉన్నపుడు కష్టసుఖములను అనుభవించినవాడు

ఆత్మగానున్నప్పుడు ఆత్మజ్ఞానమును చెప్పగలుగును. ఒకవేళ ఎప్పుడైనా భగవంతుని శరీరములోని ఆత్మ పరమాత్మగా

చలామణి అయితే, అది అధికారపూర్వకముగా ఉండును. ప్రకృతినే శాసించునదిగా ఉండును. భగవంతుని

శరీరములోనున్న ఆత్మ మూడవ ఆత్మగా అనగా పరమాత్మగా మారవచ్చును, లేక అటువంటి అవసరములేనప్పుడు

పరమాత్మగా మారక పోవచ్చును.



ఇక్కడ తెలివైనవారు ఎవరైనా నన్ను ఒక ప్రశ్నవేయవచ్చును, అదేమనగా! ముందు మీరే ఒకమాటను చెప్పి

దీనిని మరువకూడదని కూడ చెప్పారు. దేవుడు రూప, నామ, క్రియారహితుడు అన్నది మొదట మీరు చెప్పినమాట. ఆ

మాట ప్రకారము దేవుడు క్రియారహితుడు అనగా పని చేయడు అనుమాటకు విరుద్ధముగా భగవంతుని శరీరములో

పరమాత్మ (దేవుడు) కొన్ని సమయములలో ఉండుననీ, మాట్లాడుననీ, ఆ మాటలు అధికారపూర్వకముగా ఉండుననీ,

ప్రకృతినే శాసించునవిగా ఉండుననీ చెప్పుచున్నారు కదా! అది సాధ్యమా? అలా అయితే మీరు చెప్పిన దేవుని

సూత్రమునకే భంగము ఏర్పడును కదా! అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మీరు జ్ఞాపకశక్తియున్నవారై

తెలివిగా ప్రశ్నించినా, మేము తెలివి తక్కువగా జవాబు చెప్పము కదా! ఇప్పుడు మా జవాబును చూడండి. ఒక మనిషి

తాను పురుషునిగాయున్నందున సమాజములో పురుషునిగా చలామణి కాగలడు. పురుషుడైన అతడు తన పై వేషమును

మార్చుకొని నపుంసకునిగా కనిపించవచ్చును. వేషము మార్చి చూచువారికి నపుంసకునిగా కనిపించినంతమాత్రమున

అతను పూర్తిగా నపుంసకుడు కాదుకదా! కనిపించడములో చూచువారికి నపుంసకున్ని చూచిన అనుభూతి వచ్చినా,

నపుంసకునిగా కనిపించువాడు వాస్తవానికి పుంసకుడే (పురుషుడే). అలాగే అదే పురుషుడు స్త్రీవేషము ధరించినప్పుడు

తాను స్త్రీగా అందరికీ అర్థమగుటకు కొన్ని మాటలను మాట్లాడవలసి వచ్చును. అప్పుడు పై వేషమునే మార్చుకోవడముకాక,

లోపలి మనోభావమును కూడా మార్చుకొని తాను స్త్రీనను భావముతోనే మాట్లాడును. అప్పుడు ఎదుటివాడు నిజముగా

స్త్రీతో మాట్లాడినట్లు అనుభవమును కొన్ని అనుభూతులను పొందును. బయట ఇతరులు స్త్రీని చూచినంత సంతోషమును

పొందినా, స్త్రీగా కనిపించు వాడు, మాట్లాడువాడు నిజముగా స్త్రీ కాదుకదా! అతను పురుషుడే కదా! అదే విధానము

ప్రకారమే భగవంతుడు భూమిమీద శరీరముతో పుట్టినప్పుడు అతని శరీరములో జీవాత్మ ఉండదు. ఆ శరీరములో

ఆత్మ ఒక్కటే ఉండును. అందరి శరీరములోనున్న ఆత్మయే అన్ని పనులు చేయునట్లు, భగవంతుని శరీరములోనున్న

ఆత్మ కూడా అన్ని కార్యములను చేయు చున్నది. కావున భగవంతున్ని ఎవరూ గుర్తించుటకు వీలు ఏమాత్రము లేదు.

సాధారణ మనిషివలెనున్న భగవంతుని శరీరములో జీవుడు లేకున్నా, జీవునివలె సుఖదుఃఖములను అనుభవిస్తూ,

జీవునిపాత్రను ఆత్మ పోషించు చున్నది. ఒకడు ఒక పాత్రను పోషించినంతమాత్రమున అతడు మరొకడు కాడుకదా!

అలాగే జీవాత్మగా నటించినంత మాత్రమున ఆత్మ, జీవాత్మ కాదుకదా!


సాధారణ మనిషి శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని మూడు ఆత్మలు కలవు. భగవంతునిగా పుట్టిన

మనిషి శరీరములో ఆత్మ పరమాత్మలు రెండు మాత్రము కలవు, జీవాత్మ అనునది భగవంతుని శరీరములో ఉండదు.

భగవంతుని శరీరములో ఆత్మ శరీరములో లేని జీవాత్మగా, ఉన్న పరమాత్మగా నటించుచున్నది. ఎప్పుడు జీవాత్మ

పాత్రను పోషించాలో అప్పుడు జీవాత్మగా, ఎప్పుడు పరమాత్మ పాత్రను పోషించాలో అప్పుడు పరమాత్మగా నటించడమేకాక,

వారి ఇరువురి అవసరము లేనప్పుడు ఆత్మగానే తన విధిని తాను వర్తించుచున్నది. భగవంతుని శరీరములోని ఆత్మ

జీవాత్మ, పరమాత్మ పాత్రలను పోషించినంతమాత్రమున ఆత్మను జీవాత్మ అనిగానీ, ఆత్మను పరమాత్మ అనిగానీ చెప్పలేము

కదా! ఆత్మ పరమాత్మగా నటించినప్పుడు అదే ఆ హోదాలో బయటపని జరిగిపోవుచున్నది. అలా అయినప్పుడు

దేవుడు (పరమాత్మ) చేయలేదు కదా! ఆ పనిని చేసినది పరమాత్మ వేషములోనున్న (పాత్రలోనున్న) ఆత్మయనీ, దేవుడు

కాదనీ తెలియవలెను. భగవంతుడు ఏ యుగములో పుట్టినా, ఎప్పుడు పుట్టినా ఆయన జీవుడు కాడు. ఆత్మ పరమాత్మలతో

వచ్చు శరీరమును భగవంతుడు అనవచ్చును. భగవంతుడు దేవుడుకాడు, అయినా దేవునివలె భగవంతుడు పని

చేయుచున్నాడు. అలాగే భగవంతుడు జీవుడుకాడు, అయినా జీవునివలె కర్మలను అనుభవించుచున్నాడు. భగవంతుడు

జీవాత్మ, పరమాత్మకాని మధ్యలోని ఆత్మగాయున్నందున ఆయనకు ఏ కర్మలూ అంటవు.


భగవంతుని శరీరములోని ఆత్మ ఒకప్పుడు జీవునిగా, మరొకప్పుడు దేవునిగా నటించుచూ, మిగతా సమయములో

ఆత్మగానే ఉండి తన పనిని తాను చేయుచున్నది. అందువలన భగవంతుడైన కృష్ణుడు ఇటు దేవుడూ కాదు, అటు

మనిషీకాడు. దేవుడు చేయలేని పనిని మారువేషములోనున్న దేవునిగా, మనిషి చేయలేని పనులను మారువేషములోనున్న

మనిషిగా చేయగలడు. దేవుని జ్ఞానము ఏ మనిషికీ తెలియదని ఖుర్ఆన్ గ్రంథములో 3వ సురా 7వ ఆయత్లో చెప్పిన

వాక్యము ప్రకారము ఇక్కడ దేవుని వాక్యము మనిషికి తెలియదుకానీ, మారువేషములోనున్న భగవంతునికి తెలుసునని

చెప్పుచున్నాము. భగవంతుడైన మనిషి చెప్పితే బుద్ధి శ్రద్ధగల వారు దానిని గ్రహింతురు అని అదే సురా, అదే

ఆయత్లో చెప్పబడినది. బుద్ధి శ్రద్ధగల మనుషులు దేవుని జ్ఞానమును గ్రహించుటకు వారికి చెప్పు వాడున్నప్పుడే కదా!

వారు తెలియగలిగేది. అందువలన సృష్ట్యాదిలోనే దేవుడు తాను చెప్పకున్నా తన జ్ఞానము ప్రజలకు తెలుపుటకు

భగవంతుడను పాత్రను తయారుచేశాడు. భగవంతుడు దేవునికీ మనిషికీ మధ్యవర్తిలాంటి వాడు. అందువలన

భగవంతున్ని మనిషి అనిగానీ, దేవుడనిగానీ చెప్ప కూడదు. భగవంతునికి కర్మవుండదు. జీవునికి మాత్రమే కర్మ

అనునది ఉంటుంది. కర్మలేనివాడు భగవంతుడు. కావున ఆయనకు జాతకము (జాఫతకము) ఉండదు. కర్మలేని

భగవంతుడు భూమిమీద జీవునిగా ఏమి చేయాలో, ఏమీ అనుభవించాలో ముందే నిర్ణయించుకొని వచ్చును. అలా తన

నిర్ణయమైనట్లు తాను ప్రపంచములో నడుచుకొనుట వలన, ఆయనను చూచిన ఎవరైనా మనిషివలె లెక్కింతురు గానీ,

భగవంతుడని ఎవరూ గుర్తుపట్టలేరు. ఒకవేళ ఎవడైనా తెలిసి ఈయన భగవంతుడని చెప్పగలిగితే, వానిని బుద్ధి

భ్రమించిన వానిగా లెక్కించి మిగతా ప్రజలు సానుభూతిగా చూతురు.


మనిషి శరీరములో మూడు ఆత్మలున్నాయని మూడు మతముల వారికీ తెలియదు. అందరికీ తెలియుటకు

గ్రంథరూపమైన భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమను అధ్యాయములో 16, 17 శ్లోకములలో ముగ్గురు పురుషులను

గురించి క్షర, అక్షర, పురుషోత్తమ అని చెప్పియున్నారు. క్షర పురుషుడనగా జీవుడనీ (జీవాత్మయనీ), అక్షర పురుషుడనగా

ఆత్మయనీ, పురుషోత్తముడనగా పరమాత్మయనీ అక్కడే తెలియబడినది. భగవద్గీతలో 5000 సంవత్సరముల పూర్వమే

చెప్పిన అక్షర పురుషుడు అనువాడు ఎవడో ముఖ్యమైన ఆధ్యాత్మికవేత్తలకు కూడా తెలియదు. అక్షర పురుషుడనగా


శరీరములో ఆత్మయని ఎవరికీ తెలియకుండాపోయినది. ఆత్మ అనునది అందరి శరీరములలో ముఖ్యమైన పాత్రగా

ఉంటూ శరీరమును ఆడించుచున్నదనీ, ఆత్మే భగవంతుని శరీరములో భగవంతునిగా ఉన్నదనీ ఎవరికీ తెలియదు.

ఆత్మయే మనిషికీ దేవునికీ మధ్యనుండి కొంత సమయము దేవునిగా, కొంత సమయము జీవునిగా, కొంత సమయము

ఎవరికీ తెలియని ఆత్మగా భగవంతుని శరీరములో కాలము గడుపుచున్నది. ఇంతవరకు మేము చూచినంతలో

ఆధ్యాత్మికవేత్తలైన వారు, స్వామీజీలని పిలిపించుకొను వారు, గురువులమని పేరుగాంచినవారు, భగవంతునికి దేవునికి

తేడా తెలియక ఇద్దరూ ఒక్కరే కదా! అని అంటున్నారు. ఇప్పుడు చెప్పిన విధానము ప్రకారము భగవంతుడంటే ఎవరో

తెలియకున్నా, ఎట్లుంటాడో నను వివరమైనా తెలిసిందనుకుంటాను. అయినా ఇప్పటికీ మా మాటను నమ్మనివారు

చాలామంది ఉండడమేకాక, నీ మాటకు శాస్త్రప్రమాణమేమి అని అడుగగలరు. దానికి జరిగిన సంఘటనలను చరిత్రలో

చూపుచూ వివరించగలము కొంత ఓపికగా చూడండి.


సృష్ట్యాదినుండి భగవంతుడు కొన్నిమార్లు పుట్టి దేవుని జ్ఞానమునూ ధర్మములనూ తెలియజేసి పోయాడని

తెలుసు. అయితే ఫలానా పేరుగల వ్యక్తియే భగవంతుడని చెప్పలేము. కానీ ద్వాపరయుగము చివరిలో దాదాపు

ఐదువేల సంవత్సరముల పూర్వము శ్రీకృష్ణుడను పేరుతో భగవంతుడు వచ్చాడని చెప్పుచున్నాము. అయినా కృష్ణున్ని

భగవంతునిగా చాలామంది ఒప్పుకోవడములేదు. భగవద్గీతలో దేవుని జ్ఞానమును కృష్ణుడు భగవంతుని గా చెప్పాడు

అని మేమంటే, మా మాటలను ఖండించి, అర్జునుడు యుద్ధము చేయనని మొండికేస్తే, ఆయనను ప్రేరేపించి యుద్ధము

చేయించుటకు అవసరమునుబట్టి చెప్పిన మాటలు తప్ప అందులో జ్ఞానమేముంది అనువారు కూడా కలరు. కృష్ణుడు

భగవంతుడను విషయము ఎవరికి తెలిసినా, తెలియకపోయినా ఆయన భగవంతుడేనని మాకు తెలుసు. భగవంతుడు

మనిషికాదు, అట్లే దేవుడుకాడు అని చెప్పుటకూ, అట్లే భగవంతుడు మనిషివలె ఉంటాడు మరియు దేవునివలె ఉంటాడు

అనుటకూ ఉదాహరణగా కృష్ణుని చరిత్రను చెప్పుకోవచ్చును. కృష్ణుడు జీవునిగా ఎక్కువ సుఖములనూ, తక్కువ

దుఃఖములనూ అనుభవించాడు. కృష్ణుని జీవితము దాదాపు 80 నుండి 90 శాతము వరకు జీవునిగానే గడచి

పోయినది. 120 సంవత్సరముల ఆయన జీవిత కాలములో 90 సంవత్సరముల వయస్సు వరకు ఎక్కడా ఆయన

జ్ఞానిగా కూడా కనిపించలేదు. 90 సంవత్సరముల తర్వాత కృష్ణుడు తన బోధను తెలియజేశాడు. అందులో కృష్ణుడు

తనను ఆత్మగా కొన్నిచోట్ల చెప్పుకోవడమే కాకుండా, పరమాత్మగా చాలాచోట్ల చెప్పడము జరిగినది. ఒకప్పుడు జరాసంధుని

చేతిలో ఓడిపోయి, దొరికితే చంపుతాడను ప్రాణభయముతో మధురను వదలి ద్వారకకు పోయిన కృష్ణున్ని జీవునిగానే

చెప్పాలి. ఎవరికీ తెలియని ఆత్మ జ్ఞానమును యుద్ధసమయములో అర్జునునికి చెప్పినప్పుడు కృష్ణున్ని ఆత్మగా చెప్పాలి.

అంతేకాక భగవద్గీత ప్రతి అధ్యాయము చివరిలోనూ, గీత చివరిలోనూ నేనే దేవున్ని, నన్ను మించిన దేవుడు ఎవడూ

లేడనీ నన్నే పూజించు, నన్నే నమస్కరించు అని చెప్పినప్పుడు పరమాత్మగా (దేవునిగా) కృష్ణున్ని లెక్కించవలసి వచ్చినది.

కృష్ణుని శరీరములోనున్నది కేవలము రెండు ఆత్మలేనని, ఆయన శరీరములో జీవాత్మలేదని తెలిసిపోయినది. భగవద్గీత

బోధతో గ్రహించుకొనువాడు ఎంతైనా గ్రహించుకోవచ్చును. కృష్ణుని శరీరములోనున్న ఆత్మ జీవాత్మగా ఎంతో కాలము

నటించి, అందరికీ సాధారణ మనిషిగానే కనిపించినదని తెలియుచున్నది. అలా నటించి చాలామందికి సాధారణ

మనిషివలె కనిపించిన ఆత్మ, ఒకప్పుడు తాను ఆత్మగానేయుంటూ ఆత్మలజ్ఞానమును కూడా చెప్పినది. ఆత్మ ఆత్మల

జ్ఞానమును చెప్పడమే కాకుండా, కొన్ని సందర్భములలో నేనే దేవున్ననీ, నేను ఇటువంటి వాడను అనీ, దేవుని

విషయమునంతటినీ చెప్పడము జరిగినది. ఈ విధముగా కృష్ణుని జీవితములోనున్న ఆత్మ జీవాత్మగా, పరమాత్మగా


నటిండమే కాకుండా ఆత్మగా చెప్పడము కూడా జరిగినది. జ్ఞానముకల్గి చూచువానికి కృష్ణుని జీవితములో జీవాత్మ,

ఆత్మ, పరమాత్మ మూడుపాత్రలు గలవు.


భూమిమీద దేవుని విషయములను తెలుపుటకు భగవంతుడు ఎప్పుడైనా రావచ్చును. విదేశములో ఒకచోట

ఆత్మ భగవంతునిగా వచ్చినట్లు నాకు అర్థమైనది. మన దేశములో పుట్టిన భగవంతున్ని గురించి చెప్పితేనే అర్థము

చేసుకోలేనివారు, విదేశములో పుట్టిన భగవంతున్ని గురించి చెప్పితే వినగలరా? విని అర్థము చేసుకోలేనివారు అతివాదులై

చివరకు తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా మారు అవకాశము కలదు. కావున ఆ భగవంతుని పేరు నాకు తెలిసినా

నేను ఇక్కడ చెప్పడములేదు. భగవంతుడైన వాడు తల్లిగర్భములో సజీవముగా స్వదేశములోగానీ, విదేశములోగానీ,

ఎక్కడైనా, ఎప్పుడైనా పుట్టవచ్చును. అలా ఒక దేశములో పుట్టిన మనిషిని, పేదవాడైన మనిషినీ, నేను భగవంతునిగా

గుర్తించడము జరిగినది. ఆ వ్యక్తి తన జీవితములో అనేక కష్టములను అనుభవించునప్పుడు ఆయనను భగవంతునిగా

గుర్తించుటకు అవకాశమేలేదు. అదే వ్యక్తి ఎవరికీ తెలియని ఆత్మను గురించి బోధించునప్పుడు ఆయన శరీరములో

ఉన్నది ఆత్మయనీ ఇతరులు చెప్పకనే మాకు అర్థమైపోయినది. ఆయన భక్తులైన వారు కూడా ఆయన జీవునికీ దేవునికీ

మధ్యవర్తి అయిన ఆత్మయని తెలియలేక పోయారు. ఆయన భక్తులైనవారు కూడా ఆయనను దేవుని వారసుడని

అన్నారు గానీ, కొన్ని సమయములలో ఈయనే దేవుడను భావములోనికి వారు రాలేదు. కొన్ని సమయములలో

దేవునిగా ప్రవర్తించు ఆత్మయే భగవంతుని రూపముగానున్న వ్యక్తి ఈయనని ఎవరూ ఆయన బోధలను విన్న తర్వాత

కూడా తెలుసుకోలేక పోయారు. కొన్ని సమయములలో నేనే జీవమును అని తనను జీవునిగా, నేనే మార్గమును అని

మధ్యవర్తి అయిన తనను ఆత్మగా, నేనే గమ్యమును, నేనే సత్యమును అని తనను దేవునిగా చెప్పుకొన్నపుడు కూడా

ఆయనను గురించి ఎవరూ అర్థము చేసుకోలేదు. నేను దేవున్నేనని మీరు తెలియకపోతే, మీ పాపములలోనుండి మీరు

చనిపోవుదురని ఒక వాక్యములో చెప్పుచు “నేను ఆయనేనని మీరు విశ్వసించని ఎడల, మీరు మీ పాపములలోనుండి

చనిపోవుదురు.” “మీరు క్రిందివారు నేను పైనుండువాడను” “మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను

కాను.” అని చెప్పడమును చూస్తే మూడవ ఆత్మయిన పరమాత్మ చెప్పినట్లేయున్నది. క్షర, అక్షర, పురుషోత్తమ అను

ముగ్గురు పురుషులలో మధ్యవాడైన అక్షర పురుషుడు భగవంతుని శరీరములో ఒకప్పుడు క్షరపురుషుడైన జీవాత్మగా

నటించును. మరియొకపుడు పురుషోత్తముడైన దేవునిగా నటించును. ఆత్మ తన పనిని తాను చేసుకొంటూ

అవసరమొచ్చినప్పుడు జీవునిగా మరియు దేవునిగా ప్రవర్తించుచున్నది. ఒకేఆత్మ జీవాత్మగా, పరమాత్మగా నటించడము

భగవంతుని శరీరములో మాత్రము జరుగుచున్నదని జ్ఞప్తికుంచుకోవలెను.


ప్రతి మనిషి శరీరములోనూ మూడు ఆత్మలుండగా, వాటిలో పరమాత్మ కదలదు, మెదలదు. ఏ పనీ చేయదు.

పరమాత్మ దేవుడు అందరి శరీరములలో అంతటా వ్యాపించియున్నా తాను ఉన్నా లేనట్లుగానే ఉన్నాడు. జీవాత్మ తన

వరకు వచ్చిన విషయములను మాత్రము అనుభవించడము తప్ప వేరు పనిని చేయునది కాదు. ఇకపోతే శరీరము

లోపల జరుగు పనులూ, బయటి భాగములచేత జరుగు మొత్తము పనులన్నిటినీ ఆత్మే చేయుచున్నది. మనిషికున్న

నిద్ర, మెలకువ, స్వప్నము అను మూడు అవస్థలలో ఏమర పాటులేకుండా, ఒక్క క్షణము కూడా ఊరకుండక ఆత్మ

పనిని చేయుచునే ఉన్నది. మనుషులందరి శరీరములో అన్ని వేళల తన పనిని చేయు ఆత్మ, భగవంతుని శరీరములో

తన పనిని తాను చేయడమేకాక, జీవాత్మవలె ఒకమారు, పరమాత్మవలె ఒకమారు నటించుచున్నది. అందువలన

మూడు ఆత్మలలో మధ్యలోనున్న ఆత్మను మాత్రము నటించు ఆత్మ (ఆక్టింగ్ సోల్) అని అంటున్నాను. జీవునివలె


ఆత్మనటించినా అది బయటికి కనిపించని విషయముగా ఉన్నది. దానిని గురించి ఎవరూ పట్టించుకోరు. ఆ నటనలో

పెద్ద విశేషమేమీ లేదు. అయితే ఆత్మ పరమాత్మగా నటించడము బయటికి కనిపించు విషయముగా ఉన్నది. అలా

నటించడము పెద్ద విశేషతతో కూడుకొన్న విషయమైవున్నది. ఆత్మ ఆత్మగా ఎప్పుడు ఉంటుందో, పరమాత్మగా ఎప్పుడు

ఉంటుందో ఎవరికీ అర్థముకాదు. ఆత్మ అవసరమును బట్టి భగవంతుని శరీరములో పరమాత్మగా మాట్లాడగలదు.

అందువలన ప్రత్యేకించి ఆత్మ పరమాత్మగా మారగలదన్నట్లు గణితశాస్త్రములో సంఖ్యలను కూడా ఆత్మకు గుర్తుగా

ఆరును, పరమాత్మకు గుర్తుగా తొమ్మిదిని ఉంచడము జరిగినది. ముందు బ్రహ్మవిద్యాశాస్త్రము పుట్టినది, తర్వాత గణిత

శాస్త్రము పుట్టినది. అందువలన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు గుర్తుగా మూడు సంఖ్యలను నిర్మించుటకు అవకాశము

ఏర్పడినది.


గణిత శాస్త్రములో బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి సంఖ్యలను నిర్మించడము జరిగినది. బాగా గమనించితే

గణితశాస్త్రమునకు పునాది బ్రహ్మవిద్యాశాస్త్రమని చెప్పవచ్చును. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి గణిత శాస్త్రములోని

ఏక సంఖ్యలు తయారు చేయబడినవి. ఏక సంఖ్యలు ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక భావముతో కూడుకొని నిర్మింపబడినవి.

ఆ సంఖ్యలు మొత్తము పదిగా ఉన్నవి. అందులో ముందు తయారు చేయబడినది సున్న (0). గణితము బ్రహ్మవిద్యను

అనుసరించడము వలన రెండవ శాస్త్రముగా పుట్టిన గణిత శాస్త్రములో మొదట సున్న నిర్మింపబడినది. దాని తర్వాత

1,2,3,4,5,6,7,8,9 అను సంఖ్యలు తయారు చేయబడినవి. ఆది అంత్యము రెండూ దేవుడే అనునది బ్రహ్మవిద్యా

శాస్త్ర వచనము. ఇప్పుడు బ్రహ్మవిద్యను అనుసరించి గణిత శాస్త్రములో ఆదిలోనున్న సున్న (0) అంత్యములోనున్న

తొమ్మిది (9) అను రెండు సంఖ్యలు దేవుని గుర్తుగా పోల్చబడినవి. ఆదిలో దేవున్ని ఎటూ పోల్చలేము, ఫలానా అని

చెప్పలేము, ఆయన ఏ ఊహకు అందనివాడు, అన్నిటికీ అతీతుడు, ఎవరికీ తెలియని వాడు, అజ్ఞానులకు ఏ విలువ

లేనివాడుగా జ్ఞానులకు ఎంతో విలువైన వాడిగానున్న దేవున్ని సున్నగా పోల్చడములో ఎంతో అర్థము కలదు. ఒక

అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నలు ఉంచినా ఏమాత్రము విలువ లేదు. అంకె అంకెగానే ఉండును. అదే అంకెకు

కుడిప్రక్కన సున్నాలుంచితే అంకె అంకెగా ఉండక ఎంతో విలువగా మారిపోవును. ఉదాహరణకు ఒకటికి (1) ఎడమ

ప్రక్కన ఎన్ని సున్నాలుంచిన ఒకటి ఒకటిగానే ఉండును. దానికి ఏమాత్రము విలువ పెరుగదు. అట్లే ఒకటికి (1)

కుడిప్రక్కన సున్నాలుంచేకొద్దీ దానివిలువ మొదటి పదినుండి నూరువరకూ, నూరునుండి వెయ్యి వరకూ, వెయ్యినుండి

పదివేలవరకూ, పదివేలనుండి లక్ష వరకూ లక్షనుండి పది లక్షల వరకూ, పదిలక్షల నుండి కోటి వరకూ పెరుగుచూ

పోవును. కోటి తర్వాత కోటిని మినహా చెప్పుటకు ఏ పేరులేదు. అందువలన కోటికంటే విలువైన మొత్తము లేదు అని

చెప్పవచ్చును. ఒక అంకెపూర్తి కోటి విలువవరకు మారవలెనంటే దాని ప్రక్కన ఏడు సున్నాలు ఉండాలి. దానిని క్రింద

చూడండి.




10           దేవుని యొక్క ఒక భాగ శక్తిని లేక కొంతజ్ఞానమును            తెలిసినవాడు.

100  దేవుని యొక్క రెండు భాగముల శక్తిని లేక రెండింతల      జ్ఞానమును తెలిసినవాడు.

1,000 దేవుని యొక్క మూడు భాగముల శక్తిని లేక మూడింతల    జ్ఞానమును తెలిసిన వాడు.

10,000 దేవుని యొక్క నాలుగు భాగముల శక్తిని లేక నాలుగింతల జ్ఞానమును తెలిసినవాడు.

1,00,000      దేవుని యొక్క ఐదు భాగముల శక్తిని లేక ఐదింతల                జ్ఞానమును తెలిసినవాడు.

1,00,00,00   దేవుని యొక్క ఆరు భాగముల శక్తిని లేక ఆరింతల              జ్ఞానమును తెలిసినవాడు.

1,00,00,000 దేవుని యొక్క ఏడు భాగముల శక్తిని లేక ఏడింతల            జ్ఞానమును తెలిసినవాడు.









సున్నను విలువలేని, విలువయున్న దేవునిగా పోల్చుకొంటే దాని తర్వాత తయారు చేయబడిన ఒకటిని

జీవునిగా పోల్చుకోవచ్చును. ఒకటిని జీవునిగా పోల్చుకొని చూస్తే జీవుడు దేవున్ని తనకంటే తక్కువ వానిగా అజ్ఞాన

మార్గములో లెక్కించితే జీవుడు జీవునిగానే ఉండును. ఒకటికి ఎడమ ప్రక్కన సున్ననుంచితే ఒకటికి ఏమాత్రము

విలువ లేకుండా ఒకటి ఒకటిగానే ఉన్నట్లు, ఒక మనిషి దేవున్ని అజ్ఞాన మార్గములో చూస్తే దేవుడు ఏమీ విలువ

లేనివానిగా వానికి కనిపించును. అంతేకాక వాడు వాడుగానే ఉండును. వానికి కూడా అజ్ఞానమార్గములో ఏ

శక్తిగానీ, ఏ విలువగానీ లభించదు. అట్లే ఒకటికి కుడిప్రక్కన సున్ననుంచితే ఒకటి యొక్క విలువ పెరుగుచుపోవును.

చివరకు ఆఖరి మొత్తమైన కోటి వరకు చేరును. అదే విధముగ ఒక మనిషి దేవున్ని జ్ఞానమార్గములో చూస్తే దేవుడు

ఎంతో విలువైనవాడుగా కనిపించును. చివరకు వాడు ఆఖరిస్థితి అయిన మోక్షము వరకు చేరును. ఈ విధముగా

బ్రహ్మవిద్యా శాస్త్రములోని దేవున్ని గణిత శాస్త్రములో సున్నగా, జీవున్ని ఒకటిగా పోల్చడమైనది. దీనివలన బ్రహ్మవిద్యా

శాస్త్రమును అనుసరించి గణితశాస్త్రము పుట్టినదని చెప్పవచ్చును. గణితశాస్త్రములోనున్న సున్నను సృష్ఠికంటే ముందున్న

దేవునిగా పోల్చు కున్నాము. సృష్ఠి తర్వాత దేవుడు అన్నిటికంటే గొప్పనీ లేక పెద్ద అని (బ్రహ్మ అని) చెప్పుటకు దేవున్ని

సంఖ్యలలో పెద్దదయిన తొమ్మిదిగా (9) పోల్చి చెప్పాము. తొమ్మిదిని దేవునిగా పోల్చినప్పుడు మిగతా జీవాత్మకు,

ఆత్మకు కూడా గుర్తుగా సంఖ్యలను పెద్దలు ఏర్పరచినారు. వారు ఎలా ఏర్పరచినారనగా! ఇలా అని చెప్పవచ్చును.

మూడు ఆత్మల సిద్ధాంతము (త్రైత సిద్ధాంతము) ప్రకారము తొమ్మిది అంకెలను మూడు భాగములు చేశారు. సున్న

సృష్ఠికంటే ముందున్న దేవునిగా లెక్కించినప్పుడు సృష్ఠి తర్వాత పుట్టిన వాటినన్నిటినీ ఏకము అనేకముగా చెప్పవచ్చును.

సున్నను ఏకాగ్రముగా చెప్పవచ్చును. ఏకమునుండి అనేకము వరకు నున్న తొమ్మిది అంకెలనూ మూడు భాగములుగా

చేశారు.


జీవుని భాగ అంకెలు

1,

2,

3జీవాత్మ గుర్తు (జీవుని కోడ్)

ఆత్మ భాగ అంకెలు

4,

5,

6ఆత్మ గుర్తు (ఆత్మ కోడ్)

పరమాత్మ భాగ అంకెలు 7,8,9( పరమాత్మ గుర్తు (దేవుని కోడ్)).


మూడు భాగముల చివరిలోని 3, 6, 9 జీవునికి, ఆత్మకు, దేవునికి గుర్తుగా ఉన్నవి. ఈ మూడు భాగములలో

చివరివైన 3,6,9 మూడు ఆత్మల గుర్తుకాగా, మూడు భాగములలోను మిగిలిన రెండు అంకెలకు విశేష అర్థము కలదు.

మూడు భాగముల చివరి అంకెల యొక్క గూఢార్థమును తెలుపునట్లు మిగత రెండు అంకెలను తయారు చేశారు.

వాటిని ఎలా ఏ ఉద్దేశ్యముతో నిర్మించారో వివరించుకొని చూద్దాము. జీవుని భాగములోనున్న అంకెలు 1,2 కలవు ఈ

రెండు అంకెలను కూడితే అవి మూడుగా మారును. మన శరీరములో మాయ మూడు భాగములుగా ఉన్నది. కావున


రెండిటిని కూడగా వచ్చిన మూడు, మూడు భాగములుగా నున్న మాయకు గుర్తు. మొదటి భాగములో పై రెండు

అంకెలు కలిసి మాయను సూచించుచున్నవి. అలా మాయను సూచించడములో అర్థమే మనగా! మొదటి భాగములోని

మూడు అంకెకు గుర్తుగానున్న జీవాత్మ మాయ ధ్యాసలోనే ఉండి మాయలో ఒక భాగమై మెలగుచున్నదని తెలుపు

నట్లున్నది. రెండంకెల మొత్తము అర్థము తెల్పినట్లు జీవుడు కూడా మాయలో నివసిస్తూ మాయకు గుర్తుగా

ఉండిపోయాడు. ఒకటవ భాగములోని చివరి సంఖ్య మూడు జీవాత్మకు గుర్తుగా ఉన్నది కదా! అదే భాగములో మిగత

రెండు అంకెలు కలిసి మూడు సంఖ్యగా ఉన్నందున, రెండూ మూడైన దానివలన ఏది మాయయో, ఏది జీవుడో

గుర్తించలేని విధముగా మనిషి ఉండిపోయాడు. మాయ జీవుడు సమానముగా ఉండిపోయారని చెప్పవచ్చును.


ఇకపోతే రెండవ భాగమైన ఆత్మభాగములో చివరిదైన ఆరు (6) అంకె ఆత్మకు గుర్తుకాగా, మిగిలిన రెండు

అంకెలు 4, 5 గలవు. వాటిని రెండిటినీ కలిపితే తొమ్మిది (4+5=9) అగును. తొమ్మిది దేవునికి గుర్తని ముందే

చెప్పుకొన్నాము. అందువలన ఆత్మ దేవునివలె కూడా ప్రవర్తించ గలదు. ఆత్మ దేవునివలె నటించి దేవునిగా అందరినీ

నమ్మించగలదు. కొన్ని సమయములలో తానే దేవునిగా, దేవుడే తానుగా ఉన్నానని చెప్పగలదు. రెండవ భాగములోనున్న

ఆరు ఆత్మకు గుర్తుగాయున్నా పై రెండు అంకెల మొత్తము ఆత్మయొక్క విలువను, దాని విధానమును తెలియజేయుచున్నది.

దేవుడు ఏమీ చేయనివాడైనా దేవునికి గుర్తుగా శరీరములోనున్న ఆత్మ దేవుడు చేయవలసిన పనులను కూడా అప్పుడప్పుడు

చేయుచున్నదని మనము ముందే చెప్పుకొన్నాము. అందువలన శరీరములోని ఆత్మను తెలియగలిగితే, దేవున్ని సులభముగా

తెలియవచ్చునని చెప్పుచున్నాము. శరీరములోని ఆత్మశక్తియే ఏడు నాడీకేంద్రములలోనూ, ఏడు గ్రంథులలోను

ఉంటూ శరీరమును అన్ని విధముల నడుపుచున్నది. ఒకటికి కుడిప్రక్కన ఏడు సున్నలను చేర్చితే చివరికి పెద్ద సంఖ్య

కోటి అయినట్లు శరీరములోని ఏడు గ్రంథుల, నాడీ కేంద్రముల శక్తిని తెలుసుకొంటే చివరికి మోక్షమును పొందవచ్చును.

అందువలన రెండవ భాగమైన ఆత్మ భాగములో ఆరు మోక్షమునకు గుర్తుగా కూడా ఉన్నదని చెప్పవచ్చును. మూడు

జీవునికి గుర్తయినా మాయగా కనిపించునట్లు, ఆరు ఆత్మకు గుర్తయినా దేవునిగా 4+5=9 తొమ్మిదిగా లెక్కించబడుచున్నది.


తర్వాత మూడవ భాగమైన పరమాత్మ భాగములో చివరిలో తొమ్మిది (9) ఉండగా, మిగిలిన రెండు అంకెలు 8,

7 ఉన్నవి. ఏడు ఎనిమిదిని కలిపితే (7+8=15) పదిహేను అగుచున్నది. అందులో చివరి స్థానములో నున్న ఐదును

తీసుకొంటే, ఐదు పంచభూతములైన ప్రకృతికి గుర్తుగా యున్నది. తొమ్మిది దేవుని గుర్తయినా ఆ భాగములోనున్న

రెండు అంకెలు ఐదును చూపిస్తున్నవి. ప్రకృతిని జ్ఞప్తికి తెస్తున్నవి. దానిని బట్టి దేవుడు దేవునిగా ఎక్కడా కనిపించక

ప్రకృతిగానే తెలియబడుచున్నాడని తెలుస్తున్నది. దేవుడు ఏమాత్రము కనిపించక ప్రకృతియంతా ఆవహించి ప్రకృతియను

మారువేషములో ఉన్నాడని అర్థమగుచున్నది. ఈ విధముగా మొదటి సున్నాను వదలిపెట్టితే తర్వాతనున్న అంకెలను

మూడు భాగములు చేసి ఒకటి జీవుని భాగముగా, రెండు ఆత్మభాగముగా, మూడు పరమాత్మ భాగముగా గుర్తించినా,

ఆ భాగములలోని మిగతా రెండు అంకెలు కలిసి జీవున్ని మాయగా, ఆత్మను దేవునిగా, పరమాత్మను ప్రకృతిగా మార్చి

చూపుచున్నవి. అందువలన ప్రపంచములో మూడు ఆత్మలైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విషయము ఎక్కడా తెలియకుండా

పోవుచున్నది. వేరుగా అర్థమగుచున్నది. గతములో మేము భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తియోగమను అధ్యాయ

మందుగల 16,17 శ్లోకములను చూపిస్తూ దేవుని కోడ్ 9 6 3 అనీ, అలాగే దైవాసుర సంపద్విభాగ యోగమను

అధ్యాయమందుగల 14వ శ్లోకమును చూపిస్తూ మాయకోడ్ 6, 6, 6 అని ఒక చిన్న గ్రంథమును వ్రాయడము


జరిగినది. గణితశాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి ఉండుట వలన దేవుని గుర్తును (దేవుని కోడు)

మాయగుర్తును (మాయ కోడు) సంఖ్యల రూపములో వ్రాయడము జరిగినది.


సృష్ట్యాదిలో బ్రహ్మవిద్యా శాస్త్రము ఆకాశము అను మహా భూతము చేత చెప్పబడినది. దానివలన మొదట

పుట్టిన శాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమని చెప్పుచున్నాము. తర్వాత గణితశాస్త్రము రెండవ శాస్త్రముగా పుట్టినది. తర్వాత

పుట్టిన గణిత శాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి పుట్టడము వలన సున్న సృష్ఠి తయారుకాక ముందున్న

దేవుని గుర్తనీ, తొమ్మిది సృష్ఠి తయారైన తర్వాత ఏర్పడిన గుర్తనీ గణిత శాస్త్రము ప్రకారము కూడా అంకెలను చూపుచున్నాము.

సృష్ఠి తర్వాత, బ్రహ్మవిద్యా శాస్త్రము తర్వాత తయారైన శాస్త్రము గణితమే, కావున అది సత్యమనునట్లు ప్రతి

పిల్లవాడు చిన్నవయస్సులోనే, వానికేదైనా ఇస్తే నాకు ఇంతేనా? నీకు ఎక్కువ, నాకు తక్కువనా, అని లెక్కాచారము

ప్రకారము మాట్లాడును. కొద్దిగ వయస్సు వచ్చుకొలది తనకు ఏ శాస్త్రము తెలియకున్నా నాకు ఒకటి నీకు రెండాయని

అడగడమో, నాకు కొన్ని నీకు చాలానా అని అడగడమో చూస్తుంటాము. దీనినిబట్టి చిన్న వయస్సులోనే అందరికీ

ముందు కొంత గణితమే తెలియుచున్నదని అర్థమగుచున్నది. తర్వాత చిన్నవయస్సులోనే ఖగోళానికి సంబంధించిన

సూర్యచంద్రులలో ముందు చంద్రున్ని చందమామగా గుర్తించుచున్నాడు. ముందు పుట్టినది బ్రహ్మవిద్యా, తర్వాత

గణితము, ఆ తర్వాత ఖగోళము, రసాయన, భౌతిక, జ్యోతిష్యముకాగా ముందు పుట్టిన బ్రహ్మవిద్యా చివరికిపోయి

వరుస క్రమములో ముందు గణితము, ఖగోళము, రసాయనము, భౌతికము, జ్యోతిష్యము వచ్చినవి. బ్రహ్మవిద్యాశాస్త్రము

చివరికి వెళ్ళిపోయినది. వాస్తవానికి బ్రహ్మవిద్యా శాస్త్రమును బాల్యములో మొదటనే తెలియవలసియుండగా, కొందరు

వృద్దాప్యములో తెలుసుకొంటే సరిపోతుందని చివరకు పెట్టుకొన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన శాస్త్రము బ్రహ్మ

విద్యాశాస్త్రముకాగా, దానినే చివరికి వేసుకోవడము మనిషియొక్క అజ్ఞానమని చెప్పవచ్చును. ఇప్పటికాలములోని

మనుషులు చివరికైనా బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలియాలి అని అనుకోవడము లేదు. అందువలన ఆ శాస్త్రము యొక్క

పేరే శాస్త్రజ్ఞులకు తెలియకుండా పోయినది.


మనుషులైన వారికి బ్రహ్మవిద్యా శాస్త్రము యొక్క ఉనికి తెలియ కుండా పోయినప్పుడు, మొదట తెలుపబడిన

దేవుని ధర్మములు అధర్మములుగా మారినప్పుడు, తిరిగి ఆ బ్రహ్మవిద్యా శాస్త్రమును శాసన బద్ధముగా, ధర్మయుక్తముగా

తెలుపువాడు భగవంతుడని చెప్పవచ్చును. భగవంతుని శరీరములోనున్న ఆత్మ దేవుని ధర్మములను దేవునివలె తెలుపును.

ఎవడైతే దేవుని ధర్మములను తెలుపుచున్నాడో వానినే అవధూత అనియూ, లేక భగవంతుడు అనియూ అనవచ్చును.

అటువంటివాడు ప్రవక్తకాడు. ప్రవక్త ఎవడైనా, ఏ మనిషైనా కావచ్చును. ప్రవక్త ఎవరైనా జీవాత్మగానే కర్మబద్ధుడై

ఉండును. ప్రవక్త తాను తెలుసుకొన్న జ్ఞానమును లేక తాను విన్న జ్ఞానమును తెలుపును గానీ, స్వయముగా ఇది

ధర్మమని చెప్పలేడు. ఖురాన్ గ్రంథమును చెప్పిన ముహమ్మద్ ప్రవక్తగారు తాను జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును

చెప్పాడుగానీ, స్వయముగా స్వంత నిర్ణయముగా దైవజ్ఞానమును చెప్పలేదు. దేవుడు చెప్పినది విశ్వములోని మానవులందరికీ

(జీవరాసులందరికీ) వర్తించునదిగా ఉండును. అయితే మొదట అవధూత ద్వారా విన్న జ్ఞానమును ప్రవక్తలు మార్చి

చెప్పడము వలన, అది మతములుగా తయారైనది. కృష్ణుడు మొదట చెప్పిన గీతలో మతములేదు. అయితే అది

ఇతరుల ద్వారా చెప్పబడిన తర్వాత హిందూమతముగా మారిపోయినది. అలాగే ఏసు చెప్పిన జ్ఞానములో మతములేదు.

తర్వాత దానిని బోధించువారు క్రైస్తవమతముగా బోధించారు. అలాగే జిబ్రయేల్ దూత ముహమ్మద్ గారికి బోధించిన

బోధ సర్వ మానవులకు వర్తించు ధర్మములుగా ఉన్నది. అయితే తర్వాత అది ఇస్లామ్ లేక ముస్లీమ్ మతముగా


తయారైనది. ఈ దినము ఏ బోధ అయినా ఒక మతముగా కనబడుచున్నది. మతము మాయతో కూడుకొన్నది.

మతమును దూతలు చెప్పలేదు, మతమును బోధకులు చెప్పారు. కొన్ని మతములలో ప్రవక్తలు బోధించిన బోధలుగానే

అందరికీ తెలియబడుచున్నవి. ఉదాహరణకు కృష్ణుడు భగవద్గీతను అర్జునునికి బోధించాడు, అందువలన ఓ అర్జునా

వినుము అని భగవద్గీతలో చాలాచోట్ల చెప్పడము కనిపిస్తున్నది. అలాగే జిబ్రయేల్ ఖురాన్ గ్రంథములోని వాక్యములను

ముహమ్మద్ ప్రవక్త గారికి చెప్పడము జరిగినది. ఖురాన్ గ్రంథములో కూడా భగవద్గీతలో ఓ అర్జునా వినుము అని

చెప్పినట్లు, ఓ ప్రవక్త వినుము అని అనేకమార్లు చెప్పడము కనిపిస్తున్నది. ముహమ్మద్ ప్రవక్తగారు మంచి నిజాయితీపరుడైన

దానివలన జిబ్రయేల్ ఎట్లు చెప్పాడో అట్లే ఖురాన్ గ్రంథములో ఓ ప్రవక్తా వినుము అనియే వ్రాయించాడు. అది

జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమని అందరికీ తెలియునట్లు ముహమ్మద్ ప్రవక్తగారు చేశారు. అయితే తర్వాత వచ్చిన ఖురాన్

బోధకులు దానిని ముహమ్మద్ ప్రవక్తగారు చెప్పినట్లే ప్రచారము చేశారు. అందువలన ఖుర్ఆన్ గ్రంథమును జిబ్రయేల్

చెప్పినట్లు కొందరికి తెలియకుండాపోయినది. ఇట్లు చివరికది మతగ్రంథముగా ప్రచారమైనది. వాస్తవానికి ఖురాన్

గ్రంథము మతగ్రంథము కాదు. నా మాటను బలపరుచుటకు ఖురాన్ గ్రంథములో 81వ సురా, 27వ ఆయత్లో ఇలా

వ్రాశారు. "ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశము” ఈ వాక్యముతో ఖురాన్ గ్రంథము సకలలోకముల

వారికొరకు బోధింపబడినదని తెలియక, అది కేవలము ఒక మతగ్రంథమని అనుకొనుచున్నారు.


ఏ బోధనైనా మతముగా బోధించువారు అవధూతలు (భగవంతులు) కారు. బోధకులను ప్రవక్తలని కూడా

అనవచ్చును. అయితే అవధూతలు జ్ఞానమును బోధించినప్పటికీ ప్రవక్తలకంటే మించిన స్థాయిలో ఉంటారు. భగవంతుడు

తనకు తానుగా జ్ఞానమును బోధించును. బోధకుడు లేక ప్రవక్త తాను విన్న దానిని బోధించును. అందువలన

సాధారణ ప్రవక్తకు దూత లేక అవధూతకు ఎంతో తేడా ఉండును. హిందూమతములో తిక్క పట్టి తిరుగు వారిని,

గుడ్డలు లేకుండా మురికిగా ఉన్నవారినీ అవధూత అనుకోవడము జరుగుచున్నది. తిక్కవారు ఎప్పటికీ అవధూతలుకారు.

వారికి ఏ జ్ఞానమూ ఉండదు. అవధూత అనగా స్వయముగా దేవుని ధర్మములను బోధించుటకు వచ్చిన భగవంతుడని

తెలియవలెను. మనుషులు బోధకులు ప్రవక్తలు కావచ్చునుగానీ, అవధూతలు కాలేరు. అవధూత అనగా సాక్షాత్తు

రెండవ ఆత్మయినవాడు, మూడవ ఆత్మగా మాట్లాడి బోధించగలడలని అర్థము. ఇంకొక విధముగా చెప్పితే

ఆరుగానున్నవాడు తొమ్మిదిగా ప్రవర్తించడము అని అర్థము. ఆ విధముగా ఒక్క భగవంతునికి మాత్రము చెల్లును.

ఒకవేళ ఎవరైనా అలా నటించినా భగవాన్ అని పేరు పెట్టుకొనినా జీవాత్మగానే ఉంటారు, రెండవ ఆత్మగా ఉండరు.


ఒక విషయమునకు సంబంధించిన కారణమును (హేతువును) క్రమపద్ధతిగా అడుగువానిని హేతువాది అంటారు.

అడిగిన ప్రశ్నకు శాస్త్రబద్ధముగా సరియైన జవాబును ఇచ్చువాడు ప్రతివాది అగును. ఒక ప్రశ్న ఉన్న తర్వాత దానికి

జవాబు తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక రోగమున్న తర్వాత దానికి ఎక్కడో ఒకచోట నివారణ ఉంటుంది.

అయితే రోగమున్నవాడు సరియైన వైద్యునివద్దకు పోకుండా, వైద్యము తెలియనివానివద్దకు పోయి, వైద్యము చేయించుకొన్నా

తన రోగము పోకపోతే, అంతమాత్రమున తన రోగమునకు వైద్యమే లేదనీ, ఉన్న వైద్యులందరూ చేతకానివారనీ

చెప్పడము ఎట్లుండునో, అట్లే ఒక ప్రశ్నకు జవాబు దొరకనంతమాత్రమున తన ప్రశ్నకు జవాబే లేదనడము, తన

ప్రశ్నకు సమాధానము చెప్పువాడు ఎవడూ లేడన్నట్లుండును. ప్రస్తుతము తాను అడుగవలసింది ఎవరివద్ద అడుగవలెనో

తెలియకనే, అలా మాట్లాడడము సమంజసము కాదుకదా! చెవి రోగముగలవాడు పంటి డాక్టరు వద్దకు పోయినా వాని

సమస్య తీరదు. ఇతను కూడా డాక్టరే కదా అంటే ఎలాగుంటుందో అలాగే దేవున్ని గురించిన ప్రశ్నను పూజారిని


అడిగినంతమాత్రమున వానికి సరియైన జవాబు లభించియుండక పోవచ్చును. అంతమాత్రమున దేవుడే లేడు, నా

ప్రశ్నకు జవాబే లేదు అన్నట్లుండును. దేవున్ని ఆరాధించే విషయమును పూజారిని అడగాలి. అలాగే దేవున్ని గురించిన

విషయమును ఆధ్యాత్మికవేత్తను అడగాలి. అట్లు కాకుండా దేవున్ని గురించీ పూజారినీ, పూజను గురించి ఆధ్యాత్మికవేత్తనూ

అడిగినట్లుండును.


నేడు హేతువాదమునకు అర్థము తెలియనివారు కూడా తాము హేతువాదులమని చెప్పుకొంటున్నారు. దైవమంటే

మనిషికాదని తెలియని వారు కూడా దేవునికి ఆకలి దప్పులుంటాయా? కష్టసుఖములుంటాయా? అని అడుగుచున్నారు.

దేవుడు మనిషే కానప్పుడు ఆకలి దప్పులు ఎలా ఉంటాయి అని వారిని అడిగితే, మాకు జవాబు చెప్పలేక ఇట్లు

అడుగుచున్నా రని అనుకొంటున్నారు. ప్రశ్న అడిగేటప్పుడే తమ ప్రశ్న సమంజసమైనదో కాదో, హేతుబద్ధమైనదో

కాదో ఆలోచించి అడగాలి. అట్లు కాకుండా గాడిదకు ఎన్ని రెక్కలుంటాయి అని అడిగితే, అడిగే వానిది ప్రశ్నే కాదనీ,

వానికి ఏమాత్రము గాడిద విషయము తెలియదనీ, అటువంటి వానికి జవాబుగా గాడిదకు రెక్కలు లేవని చెప్పినా తప్పే,

ఉన్నాయని చెప్పినా తప్పేయగును. ఏదో ఒకటి చెప్పకపోతే నా ప్రశ్న గొప్పదనీ, నేను గొప్ప మేధావిననీ

అడిగినవాడనుకొనును. అటువంటి వారిని గురించి పూర్వము ఒక కవి ఇసుకలో తైలమును తీయవచ్చును, కుందేలు

కొమ్మును సాధించ వచ్చును, ఎండమావులలో నీరు త్రాగవచ్చును అటువంటి అడ్డ ప్రశ్నలడుగు మూర్ఖునికి జవాబు

చెప్పి తృప్తిపరచలేము అన్నాడు. నేడు మూర్ఖ ప్రశ్నలడుగు మూర్ఖులు కూడా ఎందరో ఉన్నారు. అట్టివారిని వదలి

సరియైన హేతుబద్ధమైన ప్రశ్నలకు మనము జవాబు ఇవ్వడము మంచిది.


రాముడు దేవుడా అని ఒక ముస్లీమ్ అడిగిన ప్రశ్నకు జవాబును చెప్పుకొన్నాము. ఖుర్ఆన్ దైవగ్రంథమా?

అని ఒక క్రైస్తవుడు అడిగిన ప్రశ్నకు జవాబును చెప్పుకొన్నాము. ప్రవక్త అంటే ఎవరు? మతమంటే ఏమిటి? అని ఒక

సిక్కు అడిగిన ప్రశ్నకు జవాబును చెప్పుకొన్నాము. ఇప్పుడు ఒక హిందువు అడుగు ప్రశ్నకు మతాల సంబంధము

కాకుండా శాస్త్రబద్ధమైన జవాబును చెప్పుకొందాము. శాస్త్రబద్ధముగా చెప్పు జవాబు ఎంతకాలమునకైనా ఖండించని

జవాబుగా, ఎవరైనా ఎదురాడని జవాబుగా, హేతువాదులకు తృప్తినిచ్చు జవాబుగా ఉండును. ప్రశ్న ఏమిటో క్రింద

చూస్తాము.


హిందువు :- ఏసు కన్య గర్భములో పుట్టాడా? నేటికాలములో భౌతిక శాస్త్రమునకు ఈ మాట పూర్తి వ్యతిరేఖము కాదా!

ఇటువంటి అశాస్త్ర విషయములను గొప్పగ చెప్పుకొని మా మతము గొప్పది, కన్య గర్భములో పుట్టిన ఏసు గొప్పవాడు

అని చెప్పడము మూర్ఖత్వము కాదా! దీనిని శాస్త్రీయమైన జవాబుతో సత్యమందురా? లేక అసత్యమందురా?


మేము :-నేడు భౌతికశాస్త్రమును కొంత తెలిసినవారు ఒక స్త్రీ కన్యగా నున్నప్పుడు ఆమెకు శిశువు పుట్టాడనుట

అసత్యము అందురు. పురుష సంపర్కము లేకుండా గర్భము తయారగుననుట భౌతిక శాస్త్రవిరుద్ధమనీ, అందువలన

అది అసత్యమైన మాటయనీ భౌతికశాస్త్రవేత్తలనవచ్చును. శాస్త్రవేత్తలే కాకుండా కొందరు సాధారణ మనుషులు కూడా

భర్త లేకుండా పిల్లలు పుట్టుట అసంభవమని చెప్పుచుందురు. వీరందరి మాట ప్రకారము ఏసు పుట్టుటకు కారణమైన

మనిషి ఫలానావాడు అని తెలియకున్నా, ఎవడో ఒకడు ఉండి ఉంటాడు అని కొందరనుకోవచ్చును. వీటన్నిటికీ

జవాబుగా! అందరి సంశయములకు జవాబుగా మా మాటలు ఇలా ఉన్నవి. భౌతికశాస్త్రము ప్రకారము మనిషి పుట్టితే

ఒప్పుకుంటారు, అట్లే చనిపోతే ఒప్పుకుంటారు. వారికి అది తెలిసిన భౌతికశాస్త్రమును అనుసరించి ఉండును. మనిషి

ఇప్పటి వరకు భౌతికశాస్త్రమును పూర్తిగా తెలిసియున్నాడా? అని ప్రశ్నించుకొని చూస్తే, భౌతికశాస్త్రము ఇప్పటి వరకు


కొంత తెలియబడినది, ఇంకా తెలియవలసినది ఉన్నది. కాలము గడుస్తున్న కొద్ది శాస్త్రము కొంతకొంత క్రొత్తగా

తెలియుచూ పోవుచుండును. ఇంతవరకు బ్రహ్మవిద్యా శాస్త్రము తప్ప మిగత ఐదు శాస్త్రములు ఏది కూడా పూర్తిగా

మనిషికి తెలియబడ లేదు. భౌతికశాస్త్రము పూర్తిగా ఇంతవుంది అని తెలియని కారణమున మేము అంతా తెలుసుకొన్నామని

అనుకొంటున్నారు. మాకు అంతా తెలుసు అనుకోవడము వలన తెలియని దానిని గురించి వెదకడము మానివేసి

శాస్త్రములో పూర్తి పురోగతిని, అభివృద్ధిని సాధించలేక పోతున్నారు. ఏసు జననము అశాస్త్రీయము అని అనకముందు

మనకన్ని విషయములు శాస్త్రీయముగా తెలుసునా? అని ప్రశ్నించుకోవలసిన అవసరము ప్రతి శాస్త్రవేత్తకు వుంది.

నేడు శ్వాస ఆడని వానిని చనిపోయాడు అని అందరూ అంటున్నారు. వీడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారణ పత్రమును

ఇస్తున్నారు. అలా బాగా తెలిసిన డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత పది, పన్నెండు గంటలు గడచిన పిమ్మట ఎందరో

సజీవముగా లేచి కూర్చున్నారు. కొందరు కొన్ని దినముల తర్వాత బ్రతికిన యదార్థసంఘటనలు కూడా కలవు. అలా

ఏదో ఒకటి కాకుండా, ఎన్నో జరిగినా వాటిని గురించి శాస్త్రము ఏమి చెప్పుతుందో పరిశోధించి చూడక, తెలిసినా

తెలియనట్లు వాటిని పట్టించుకోని భౌతికశాస్త్రవేత్తలు, తండ్రి లేకుండా కన్య గర్భములో పుట్టిన సంఘటనను అశాస్త్రీయము

అనడములో అర్థములేదు. కన్య గర్భములో పుట్టిన ఏసును అశాస్త్రమని చెప్పినప్పుడు, చనిపోయి పన్నెండు గంటల

తర్వాత బ్రతికిన వ్యక్తిని అశాస్త్రమని అనలేక చూచినా చూడనట్లు, తెలిసినా తెలియనట్లు ఎందుకు వదలివేయుచున్నారు?

ప్రసవింపబడిన శిశువును అరగంటసేపు నలుగురు డాక్టర్లు పరీక్షించి గర్భములోనే చనిపోయాడని నిర్ధారించిన తర్వాత

కొన్ని గంటలకు ఆ శిశువు బ్రతికిన సంఘటనలు ఎన్నో ఉండగా, ఆ సంఘటన శాస్త్రబద్ధమైనదా, అశాస్త్రబద్ధమైనదా

అని తేల్చి చెప్పలేనివారు ఏసు జననమును అశాస్త్రీయమని ఎలా చెప్పగలుగు చున్నారు?


ఏదైనా ఒక విషయమును శాస్త్రమని చెప్పగలిగినప్పుడు, అట్లే ఇంకొక విషయమును కూడా అశాస్త్రమని

నిర్ధారించు విధానముండాలి. ఒక విషయమును మూఢనమ్మకమని చెప్పుటకు కూడా కారణము శాస్త్రబద్ధ ముగా

ఉండాలి. ఏ విషయమునైనా శాస్త్రము ఆధారము లేకుండా ఖండిచనూకూడదు. అట్లే సమర్థించనూకూడదు అనునది

సూత్రముగా పెట్టుకోవలెను. ఎక్కడైనా ఏదైనా ఒక అరుదైన సంఘటన జరిగితే దానిని ఏమాత్రము ఆలోచించకుండా

వదలివేయడము జరుగుచున్నది. సత్యముగా జరిగిన దానిని గురించి నోరు మెదపనివారు కొన్నిటిని మూఢనమ్మకమన

డములో అర్థమేలేదు. తనకు దూరముగా జరిగిన దానిని మూఢనమ్మకమనీ, తనకు ఎదురుగా జరిగిన దానిని గురించి

నోరు మెదపకపోవడము విజ్ఞానమని అనిపించుకోదు, దానిని అజ్ఞానము అని అనవచ్చును. ఇంతకు ముందే సైన్సు

స్థూలముగా మరియు సూక్ష్మముగా రెండు రకములున్నదని చెప్పుకొన్నాము. స్థూలముగా కనిపించే సైన్సే తెలియని

వారికి సూక్ష్మముగా నున్న సైన్సు తెలియుటకు అవకాశమే లేదు. గర్భములోనే చనిపోయాడని చెప్పిన శిశువు కొన్ని

గంటల తర్వాత బ్రతికినా, చచ్చి పోయాడని చెప్పిన వ్యక్తి కొన్ని దినముల తర్వాత బ్రతికినా, వాటిని అరుదుగా జరుగు

సంఘటనలని వదిలివేయుచున్నారు. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరిగాయి, దానికి గల కారణమేమని హేతువాదులు

ఎందుకు ప్రశ్నించు కోలేకపోవుచున్నారు. యదార్ధముగా జరిగిన సంఘటనను మూఢనమ్మక మనీ, మేము నమ్మమనీ

అనడము తప్పించుకొను ధోరణి కాదా? ఏసు కన్య గర్భములో పుట్టాడు అనుట యదార్థసంఘటనగా ఎందుకు తీసుకో

కూడదు. వీర్యకణములేనిది గర్భము రాదు అనునది భౌతికసూత్రమని తెలిసినంత మాత్రమున, ఏసు కన్య గర్భములో

పుట్టాడను మాటను ఖండించవచ్చునా? తల్లి అయిన మరియమ్మ నాకు ఏ పురుషుని తోనూ సంబంధములేదు అని

ప్రత్యక్ష సాక్ష్యము చెప్పుచున్నా, ఆమె మాటను అసత్యమని చెప్పడము అవివేకము కాదా! ఒకవేళ ఆమెకు పురుషునితో


సంబంధము లేదు అను మాట సత్యమే అయివుండవచ్చునని ఎందుకు ఆలోచించకూడదు. ఆమె మాట సత్యమే

అయినప్పుడు వీర్యకణము లేకుండా గర్భము వచ్చినట్లే అవును కదా! అట్లు వచ్చుటకు మనకు తెలియని కారణమేమైనా

ఉన్నదేమోనని ఎందుకు వెదకకూడదు? ఒక విషయమును పూర్తిగా పరిశీలన చేయకుండా దానిని అసత్యమంటే,

ఒకవేళ అది సత్యమైయుంటే అప్పుడు అసత్యమన్నవాడే అసత్యవాది అవుతాడు. అందువలన మూర్ఖముగా దేనినీ

ఖండించకూడదు. ఆహారముగానీ, నీరుగానీ ముట్టకుండా కొన్ని దినములు తప్ప ఎక్కువ బ్రతుకుటకు అవకాశము

లేదు అని చెప్పడము సులభమే. అయితే ఆహారమును తీసుకోకుండా, నీరును త్రాగకుండా 75 సంవత్సరము లనుండి

బ్రతుకుచున్న వ్యక్తి ప్రత్యక్షముగా మనముందరే ఉన్నప్పుడు అందులో మనకు తెలియని సైన్సు (శాస్త్రము) ఏమైనా

ఉందేమోనని చూడక, అలా బ్రతకడము అసత్యమని అంటే, అది విజ్ఞానముకాదు అజ్ఞానమగును. అటువంటి వానిని

మూఢనమ్మకముగలవాడని అనవచ్చును. అలా బ్రతుకుటకు వీలులేదు అను డాక్టర్లు 40 మంది బృందముగా ఏర్పడి

అతనిని గురించి ఆరు నెలలు ఒక్క నిమిషము కూడా వదలకుండా దగ్గరుండి పరీక్షించి అతను ఆహారము నీరు

లేకుండా బ్రతుకగల్గుచున్నాడనీ, దానికి గల కారణము తమకు అర్థము కాలేదనీ ప్రకటించారు. ఒక విషయము

సత్యమైనప్పుడు, దానిని గ్రహించుకొను విజ్ఞానము మనిషివద్ద లేకుండా పోయినంత మాత్రమున, ఆ విషయము అసత్యము

కాదుకదా! ఒక సత్య విషయమును గ్రహించుకొను విజ్ఞానము మనిషియొద్ద ఉండవచ్చును లేక ఉండక పోవచ్చును.

తనవద్ద విజ్ఞానము ఉన్నప్పుడు దానిద్వారా సత్యమును తెలుసుకోవచ్చును. విజ్ఞానములేనప్పుడు జరుగుచున్నది

సత్యమైనప్పుడు దానిని గ్రహించుకొను విజ్ఞానమును సంపాదించుకోవాలి. అట్లు కాకుండా తనకు తెలియని సత్యమును

అసత్యమనడము సత్యమును వధించినట్లు కాదా! అటువంటి వాడు అసత్యవాది కాదా! ఒక విషయములోని హేతువును

గురించి అనేక కోణములనుండి చూడడము హేతువాది (సత్యవాది) యొక్క లక్షణమగును.


సత్యాన్వేషణ సంఘము అని పేరుపెట్టుకొని దానికి అధ్యక్షుడనని చెప్పుకొను వ్యక్తి ఒకమారు నాకు తెలిసిన

సత్యమును ఒప్పుకోక దానిని అసత్యమన్నాడు. తాము అసత్యవాదులైయుండి, సత్యాన్వేషకులమని పేరు పెట్టుకొని,

తమను తాము ప్రచారము చేసుకొను ఇటువంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారని అప్పుడు నాకు అర్థమైనది.

అటువంటి వారు సైన్సును అడ్డము పెట్టుకొని, తమకు పూర్తి సైన్సు తెలియకున్నా యదార్థ సంఘటనలను

ఖండించుచుందురు. ఏసు జననమును భౌతికశాస్త్రము ఒప్పుకోదు అనువారు, భౌతికశాస్త్రము తమకు పూర్తిగా

తెలుసునా తెలియదా అని ఎందుకు ఆలోచించకూడదు? ఎవడైనా ఏ శాస్త్రమునైనా నాకు పూర్తిగా తెలుసుననువాడు

ఉన్నాడా? అలా ఉన్నాడు అంటే అది తప్పగును. ఎందుకనగా సైన్సు నిత్య పరిశోధనతో కూడుకొన్నదై ఉన్నది.

దానిలో ఇంకా తెలియని విషయములు ఎన్నో ఉన్నవి. కాలము గడుచుకొలది కొన్నిటిని కనుగొనగల్గుచున్నాము.

అందువలన ఒక సత్య విషయము అరుదుగా జరిగినప్పుడు, అది తనకున్న విజ్ఞానమునకు అర్థముకానప్పుడు, దానిని

అసత్యమనక దానికి తగిన విజ్ఞానమును మనిషి సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏసు పుట్టుక ఒక అరుదైన సంఘటనగా

ఉన్నది. ఏసు పుట్టుకే కాకుండా ఏసు మరణము కూడా ఒక వింతైన అరుదైన సంఘటనగా ఉన్నది. ఆయన మరణ

విషయములో కూడా కొందరు ఆయన శిలువ మీద చనిపోయాడనీ, మరికొందరు శిలువ మీద చనిపోలేదనీ వాదించు

కొనుచున్నారు. చనిపోయి లేచాడని కొందరూ, చనిపోలేదు మూర్ఛలో ఉండి లేచాడనువారు కొందరూ

వాదించుకొనుచున్నారు. అక్కడ జరిగిన వాస్తవము ఎవరికీ తెలియకుండా పోయినది. వాస్తవానికి ఇద్దరి వాదన పూర్తి


తప్పని చెప్పవచ్చును. మరణమును గురించిన విజ్ఞానము పూర్తిగా తెలియని వారికి, ఏసు మరణ రహస్యము తెలియకుండా

పోయినది. అట్లే జనన రహస్యము తెలియని వారికి ఏసు యొక్క జననములోని వివరము కూడా తెలియకుండా

పోయినది. అందువలన చాలామంది క్రైస్తవులు భక్తితో తమకు అర్థము కాకున్న విషయమును ఒప్పుకొన్నా, మిగతావారు

ఆ విషయమును ఒప్పుకోకుండా, మరియమ్మ పురుష సంబంధము తోనే ఏసును కని వుంటుంది అని అంటున్నారు.

వాస్తవానికి అలా జరుగలేదు. మరియమ్మ ఏ పురుషుని సంబంధము లేకుండానే ఏసును కనిందని సూపర్సైన్సు

చెప్పుచున్నది.


హిందువులు, ముస్లీమ్లు తమది వేరు మతమైన దానివలన ఏసు మరణమును గురించిగానీ, ఏసు జననము

గురించిగానీ ఒప్పుకోకపోయినా, జరిగిన సత్యము మాత్రము ఎవరి అంగీకారమునకు సంబంధము లేకుండా ఉన్నది.

సత్యము సర్వమానవులకు సంబంధించినదిగా ఉంటుంది గానీ, ఒక మతమునకు సంబంధించినదిగా ఉండదు.

అందువలన ఏసు జననమును మతమునకు అతీతముగా, సైన్సును (శాస్త్రమును అనుసరించి చూస్తాము.

బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో విభూతియోగమును అధ్యాయమున 39వ శ్లోకము ఈ విధముగా గలదు.



శ్లోకము :యచ్చాపి సర్వభూతానాం బీజం తదహ మర్జున,

న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్.


భావము : “సర్వ జీవరాసులకు బీజము నేనే, కావున ఆ జన్మలకు నేనే కారణమగుదును. ఈ చరాచర జగతిలోపల నా

బీజము వలన పుట్టని జీవరాసి ఏదియులేదు.”


భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగమను అధ్యాయమున 3,4 శ్లోకములు ఇలాగున్నవి.


శ్లోకము :3. మమ యోని ర్మహద్భహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్,

సంభవ స్సర్వభూతానాం తతోభవతి భారత !


శ్లోకము :4. సర్వ యోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః,

తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా||


3వ భావము :-"ఈ అచేతన ప్రకృతియంతయు నాకు భార్యగాయున్నది. ఈ ప్రకృతియను స్త్రీకి నేను బీజదాతగా

ఉన్నాను. నా వలననే ఈ భూమి మీద సకల జీవరాసులు పుట్టుచున్నవని తెలుసుకో”


4వ భావము :- “సకల గర్భములందు జన్మించు సకల జీవరాసులకు తల్లి ప్రకృతికాగా, బీజదాతనైన నేను తండ్రినని

తెలియవలెనను.”


ఇప్పుడు ఈ మూడు శ్లోకముల భావము వలన ప్రపంచములో ఒక మానవజాతియే కాకుండా, సకల జాతుల

జీవరాసులకు కనిపించని తల్లిగా ప్రకృతి ఉన్నదనీ, కనిపించని తండ్రిగా పరమాత్మ ఉన్నాడనీ తెలియు చున్నది. ఇక్కడ

జగతిలోని సర్వజీవులకు బీజదాత పరమాత్మయనీ అలాగే ప్రకృతి తల్లియనీ తెలిసిపోయింది. ప్రకృతి పరమాత్మల

సంబంధము లేకుండా జగత్తులో ఏ జీవరాసి పుట్టలేదనీ, ఎక్కడ ఏ జీవరాసి పుట్టినా, ఏ మనిషి పుట్టినా, వారికి

కనిపించని అసలైన తల్లి ప్రకృతియనీ, అలాగే కనిపించని తండ్రి పరమాత్మయని తెలిసిపోయినది. ఈ సమాచారమంతయు

మొదట పుట్టిన శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రములోనిది. ఈ శాస్త్రము తర్వాత నాల్గవ శాస్త్రముగా పుట్టినది భౌతికశాస్త్రము.

భౌతికశాస్త్రము ప్రకారము తల్లియొక్క రజోకణముతో (అండముతో) తండ్రియొక్క వీర్యకణము కలిసినప్పుడు ఆ వీర్యకణము


శిశువుగా తయారగునని చెప్పబడినది. ఇక్కడ కనిపించే తల్లి, కనిపించే తండ్రి ఇద్దరూ ఉన్నారు. బ్రహ్మవిద్యా

శాస్త్రములో ప్రకృతి కనిపించేదైనా, పరమాత్మ కనిపించనివాడుగా ఉన్నాడు. ఇక్కడ రెండూ శాస్త్రములే, రెండూ రెండు

రకములుగా చెప్పినట్లు కనిపించుచున్నది. శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నది. తప్పనిసరిగ జరుగునది,

సత్యమైనదని తెలిసినప్పుడు, రెండూ రెండు దారులు చూపినప్పుడు దేనిని నమ్మాలి అను ప్రశ్నరావచ్చును. దానికి

మా జవాబు ఏమనగా! శాస్త్రమును నమ్మడము నమ్మకపోవడము అని ఉండదు. శాస్త్రము అనునది సత్యమై యుంటుంది,

కనుక దానిని ఆచరించడమే కర్తవ్యము. ముందు తెలిసిన బ్రహ్మవిద్యాశాస్త్రము సకల జీవరాసుల తల్లి తండ్రుల

గురించి తెలిపినది. తర్వాత తెలియబడిన భౌతికశాస్త్రములో గర్భము ఎలా తయారవుతుందో చెప్పారు. రెండు

శాస్త్రములు ఒకే విధానమును తెలుపుచున్నవిగానీ, రెండు విధానములను చూపలేదు. అండము గర్భముగా తయారగుటకు

వీర్య కణము అవసరమని భౌతికశాస్త్రము చెప్పినది. తల్లి అండములోనున్న సూక్ష్మశక్తినీ, తండ్రి వీర్యకణములోని

సూక్ష్మశక్తినీ బ్రహ్మవిద్యాశాస్త్రము తెలిపినది.


ఒక బంతిని ఉదాహరణముగా స్థూల సూక్ష్మములను గురించి ముందు చెప్పుకొన్నాము. అక్కడ స్థూలము

లేకున్నా సూక్ష్మముంటుందిగానీ, సూక్ష్మము లేకుండా స్థూలముండదని చెప్పుకొన్నాము. భౌతికమైన తల్లిదండ్రుల

శరీరములలో తల్లి కడుపులోని అండమునందు ప్రకృతి శక్తి సూక్ష్మముగా ఉండగా, అలాగే తండ్రియొక్క వీర్యకణములో

పరమాత్మశక్తి సూక్ష్మముగా ఉన్నది. భౌతిక తల్లితండ్రుల అండము వీర్యకణము ఉన్నా వానిలోని శక్తి లేనప్పుడు వారికి

సంతతి కలగదు. వీర్యకణములోని పరమాత్మశక్తి వలననే తల్లి అండము శిశువుగా మారుటకు మొదలిడును. అందువలన

గీతలో “సకల జీవరాసులకు బీజదాతను నేను” అని దేవుడు చెప్పడము జరిగినది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న రాగలదు.

అదేమనగా! స్థూలమైన తల్లికి స్థూలమైన తండ్రియున్నప్పుడే కదా! అతని వీర్యకణములోని పరమాత్మశక్తి వలన

సంతతి కలుగును. స్థూలమైన తల్లియైన మరియమ్మ ఉన్నా ఆమెకు వివాహమేకాలేదు, ఏ పురుష స్పర్శ లేదు.

అలాంటపుడు మరియమ్మ కడుపులో రజోకణమున్నా (అండమున్నా), ఆ కణముతో కలియుటకు పురుషుని యొక్క

వీర్యకణము లేదు. మొదటికి వీర్యకణము లేనప్పుడు అందులోని శక్తి కూడా లేదు కదా! అటువంటపుడు మరియమ్మ

కు గర్భము వచ్చుటకు అవకాశమే లేదుకదా! అయినా విచిత్రముగా గర్భము వచ్చింది, ఆమె ఏసును కనడము

జరిగినది. ఈ విషయము ఒకదానికొకటి ఏమాత్రము పొంతనలేనిదిగా ఉన్నది. వీర్యకణము లేనిది గర్భమెలావచ్చింది

అను ప్రశ్న చాలా బలముగా మిగిలిపోవుచున్నది. దీనికి మీరేమంటారు అని అడుగవచ్చును. దానికి మా జవాబు

ఏమనగా! 1400 సంవత్సరముల క్రితము చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములో ఆల్హజ్ అను 22వ సురాలో 8వ వాక్యమందు

జిబ్రయేల్ చెప్పిన విషయమిలా గలదు. “మానవులలో కొందరు ఏ జ్ఞానము తెలియక పోయినా, ఏ మార్గదర్శకత్వము

లేకపోయినా, జ్యోతిని ప్రసాదించే ఏ గ్రంథమూ లేకుండానే, తల బిరుసు తనముతో దేవున్ని గురించి వాదించుచుందురు.”

ఈ వాక్యముకంటే ముందు 3600 సంవత్సరముల క్రిందట ఇప్పటికి 5000 సంవత్సరముల పూర్వము భగవంతునిగా

పుట్టిన కృష్ణుడు చెప్పిన భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగయోగమును అధ్యాయమున 23వ శ్లోకమందు ఇలా

చెప్పాడు.



23వ  శ్లోకము :

యశ్శ్యాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః,

నససిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్.


భావము :- “శాస్త్రవిధానమును వదలి ఇష్టమొచ్చినట్లు మాట్లాడువాడు దేనినీ తెలియలేడు, దేనిని పొందలేడు. అటువంటి


వానికి జ్ఞాన సుఖముగానీ, దేవుని విధానముగానీ తెలియదు.” ఈ రెండు వాక్యములను అనుసరించి చూస్తే శాస్త్రాధారము

లేకుండా దేనిని గురించీ మాట్లాడకూడదనీ, దేవుని విషయములో పూర్తిగా శాస్త్రమును ఆధారము చేసుకొని మాట్లాడవలెనని

తెలియుచున్నది కదా! అందువలన ఇటు భౌతికశాస్త్రమును అనుసరించి మరియు అటు బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి

మేము జవాబును చెప్పుకోవలసియున్నది. భౌతికశాస్త్రమును అనుసరించి స్త్రీయొక్క అండమును, పురుషునియొక్క

వీర్యకణమును ఆధారము చేసుకొని మాట్లాడ వలసిన అవసరమున్నది. గర్భము వచ్చింది అంటే స్త్రీ పురుష సంబంధ

అండము వీర్యకణము తప్పనిసరిగా ఉండవలసిందే. వీర్యకణము లేకుండా గర్భమురాదని మేము కూడా చెప్పుచున్నాము.

వీర్యకణము లేకుండా గర్భము వచ్చిందని అంటే అది భౌతికశాస్త్రమునకు విరుద్ధమగును. మేము ఎప్పుడుగానీ శాస్త్రమును

వదలిగానీ, శాస్త్రమునకు వ్యతిరేఖముగా గానీ మాట్లాడము.


ఇప్పుడు ఈ విషయము బాగా అర్థమగుటకు భగవంతుడైన కృష్ణుని జన్మను తీసుకొని చూస్తాము. శ్రీకృష్ణుడు

తల్లితండ్రులైన దేవకీదేవి, వసు దేవుని ఎనిమిదవ సంతతిగా కృష్ణుడు పుట్టాడు. అప్పటికే వారికి పుట్టిన ఏడుమంది

సంతానమును వారు పొగొట్టుకొన్నారు. ఎనిమిదవ సంతానము ను కంసుడు వదలక చంపునని కూడా వారికి తెలుసు.

అటువంటి బాధా కరమైన పరిస్థితులలో వారి తలలలో శృంగారమనునదే మెదలకుండా పోయినది. ఒకవేళ ఉన్నా

అది అరుదుగా ఉండేది. పైన మనుషులు ఎట్లున్నా శరీరములోపల జరిగే పనులు కొన్ని జరుగుచుండును. అదే

ప్రకారము దేవకీదేవి శరీరములో అండము విడుదలయై గర్భముగా మారుటకు వీర్యకణము కొరకు వేచియున్నది. ఈ

విధానము స్త్రీ శరీరములో స్త్రీ బహిష్టి అయిన తర్వాత 14వ రోజు ఉండునని, భౌతికశాస్త్రమును తెలిసినవారందరికీ

తెలుసు. స్త్రీ గర్భము దాల్చుటకు బహిష్ఠి తర్వాత 14వ రోజు మాత్రమే అనుకూలముండును. అయితే కృష్ణ గర్భము

వచ్చినపుడు అంతకుముందు ఏడవ రోజే అండము యొక్క సూక్ష్మము (ప్రకృతిశక్తి)లో వీర్యకణము యొక్క సూక్ష్మము

(పరమాత్మ శక్తి) గర్భముగా నిలిచి సూక్ష్మముగా ఉన్నది. దేవకీదేవికి 14వ రోజు అండము విడుదలయైనా

మాసమంతయు వారి కలయికే జరుగలేదు. దేవకీదేవి తన భర్తతో కలియక పోయినా, ఆమె శరీరములోనికి వీర్యకణము

చేరకున్నా, ఒక నెలలో 14వ రోజు ఆమె కడుపులోని అండములోనికి సూక్ష్మ గర్భము చేరిపోయి, స్థూలగర్భముగ

పెరుగుటకు మొదలు పెట్టింది. ఆ విషయము పైనుండు తల్లితండ్రులకు వెంటనే తెలియదు. తల్లి కడుపులో గర్భము

నిలిచిన తర్వాత రెండవ నెలలో ఆ విషయము తెలియును. అట్లు తెలిసినా 14వ రోజే తాము కలిశామా లేదా అను

విషయమును ఎవరూ ఆలోచించరు. అట్లు ఆలోచిస్తే స్త్రీలందరూ భౌతికశాస్త్రము ప్రకారమే 14వ రోజే గర్భము

ధరించినా, ఖచ్చితముగా వారి భర్తలైన పురుషులు వారితో శారీరకముగా ఆ రోజే కలిసియుందురను నమ్మకము లేదు.

ఆ దినము కలిసిన వారు కూడా కొందరుండవచ్చును. భర్త కలియక పోయినా 14వ రోజు గర్భధారణ ఎలా జరిగింది

అని మీరు నన్ను అడుగవచ్చును. మీకే కాదు ఎవరికైనా ఈ ప్రశ్నరాగలదు. దానికి మా సమాధానము ఇలా ఉన్నది.

మీకు తెలియని విషయము మరొకటున్నది. అదేమనగా! ప్రపంచమంతా నున్న మనుషుల జనాభాలో 14వ రోజు

గర్భము ధరించిన స్త్రీలలో కేవలము 30 శాతము మందే ఆ దినము తమ భర్తతో కలిసారనీ, దాదాపు 70 శాతము

మంది ఆ దినము సంపర్కము (సంయోగము, సంభోగము) చేయనివారున్నారనీ చెప్పవచ్చును. 30 శాతము మంది

తమ పురుషులతో కలిసారు కావున భౌతికశాస్త్రము ప్రకారము 14వ రోజు గర్భము ధరించారనడములో తప్పులేదు.

అయితే అత్యధికముగా 70 శాతము మంది ఆ దినము తమ భర్తలతో కలియకున్నా 14వ దినమే గర్భము నిలువడము

జరుగుచున్నది. అలా జరుగుటకు రెండు రకముల కారణములున్నవి. ఒకటి స్త్రీతో తన భర్త 14వ దినము కలియకున్నా


అంతకముందు 13వ రోజుగానీ లేక 12వ రోజుగానీ కలిసియుంటే ఆ వీర్యకణములు రెండు లేక మూడు రోజుల

వరకు స్త్రీ కడుపులో ఉండుటకు అవకాశముగలదు. అటువంటి వీర్యకణము చేత కూడా స్త్రీ 14వ రోజు గర్భము

ధరించుటకు అవకాశము గలదు. అయితే 12,13 రోజులలో జరిగిన సంపర్కము వలన వచ్చిన వీర్యకణములు అనేక

కారణముల వలన చాలా వరకు చెడిపోయి గర్భముగా మారుటకు అను కూలము లేకుండును. ముందు జరిగిన

కలయికతో వచ్చిన వీర్యకణములు దాదాపు సగముకు పైగా తమ సామత్యమును కోల్పోయి ఉండును. ఒకవేళ

అటువంటి వీర్యకణములు కొన్నియున్నా వాటివలన గర్భము రావడము కేవలము 20 శాతము మందికి మాత్రమే

జరుగుచుండును. స్త్రీ బహిష్టి అయిన తర్వాత 14వ రోజు అండము (పిండముగా మారుటకు అనుకూలమైన పదార్థము)

తయారై స్త్రీ కడుపు ముందు భాగము (యోని ముందు భాగము) వద్దకు వచ్చియుండును. అండము తయారై వచ్చిన

తర్వాత కేవలము ఒక దినము మాత్రమే (24 గంటలు మాత్రమే) పిండముగా మారుటకు అవకాశముండును. 24

గంటల తర్వాత అండము యోని లోపలి భాగములోనికి పోయి నిలుచును. యోని ముందు భాగములో ఉన్నప్పుడు

అదియు 24 గంటల కాలమున వీర్యకణము వలన గర్భము వచ్చుటకు అవకాశము కలదు. కొందరి స్త్రీల శరీరములో

అండము 24 గంటలలో కాకుండా వారివారి ఆరోగ్యమునుబట్టి 22 గంటలలోగానీ, 23 గంటలలోగానీ గర్భము

దాల్చు అవకాశమున్నది. ఇదంతయు భౌతికశాస్త్రమును అనుసరించి చెప్పుచున్నాము.


స్త్రీకి బహిష్ఠి అయిన దినమునుండి 12,13,14 దినములలో కలయిక జరిగియున్నా వీర్యకణములలోని అనేక

లోపముల వలన ఆ కలయికలలోని వీర్యకణములు ముందుకు పోలేక అండమును చేరలేక పోవుచున్నవి కూడా

చాలామందిలో ఉండవచ్చును. ఇన్ని విధముల అన్ని రకములుగా గ్రహించిన తర్వాత ఒక స్త్రీకి తన పురుషుని ద్వారా

50 లేక 40 శాతము 14వ రోజు గర్భము ధరించుటకు వీలుకలదు. 12,13 రోజులలో జరిగిన సంపర్కము ద్వారా

వచ్చిన వీర్యకణముల వలన 20 శాతము 14వ రోజు జరిగిన సంపర్కము ద్వారా వచ్చిన వీర్యకణముల ద్వార 30 లేక

20 శాతము కలిపి మొత్తము మీద 50 లేక 40 శాతము మంది మాత్రము తమ భౌతిక భర్తల ద్వారా గర్భము

ధరించడము జరిగినది. మిగతా 50 శాతము మంది స్త్రీలకు (సగము మంది స్త్రీలకు) వారి భౌతిక భర్తల వలన

వీర్యకణము రాకున్నా, 12,13, 14 రోజులలో సంపర్కము జరుగకున్నా, 14వ రోజు 50, 40 శాతము మంది స్త్రీలు

గర్భము ధరించడము జరుగుచున్నది. ప్రపంచము మొత్తము జనాభాలో నూటికి యాభైమంది లేక నలభై మంది

మాత్రము వారి భౌతిక తండ్రి వీర్యకణముతో పుట్టారు. మిగతా వారి పుట్టుకకు కారణము పురుషుని వీర్యకణము

కాదనియే చెప్పవచ్చును. స్త్రీకి పురుషుని సంపర్కముతో సంబంధము లేకుండా స్త్రీకి 14వ రోజు గర్భధారణ జరుగు

విధానము కూడా కలదు. భౌతిక పురుషుని వీర్యకణముతో గర్భము దాల్చు విధానము భౌతికశాస్త్రము నకు సంబంధించినది.

ఇది మనుషులందరికి తెలిసిన సైన్సు లేక విజ్ఞానము అనవచ్చును. అయితే మనుషులందరికీ తెలియని విధానము

మరియొకటి గలదు. అది సాధారణ సైన్సుగా కాకుండ సూపర్ సైన్సుగా ఉన్నది. సూపర్ సైన్సు యొక్క విధానములో

అనగా బ్రహ్మవిద్యాశాస్త్ర విధానములో భౌతిక పురుషుని సంబంధములేకుండా స్త్రీ రుతుక్రమము నుండి 14వ రోజు

గర్భము ధరించుచున్నది. అలా భౌతికమైన వీర్యకణము లేకుండా పుట్టినవారు నేడు భూమిమీదున్న జనాభాలో

50,60 శాతము మంది గలరు. మిగతా 50,40 శాతము మంది వారి భౌతిక తండ్రి వీర్యకణముతో పుట్టిన వారని

చెప్పవచ్చును. ఈ విషయము ఎవరికీ తెలియని రహస్యముగా ఉన్నది.


వివాహమైయుండి తమ భర్తలున్న స్త్రీలకు గర్భము నిలిచినప్పుడు, ప్రతి భర్త నా వలనయే నా భార్యకు


గర్భమువచ్చింది అనుకుంటాడు. ఏ స్త్రీ అయినా నా భర్త వలన గర్భము వచ్చింది అనుకుంటుంది. అయితే అలా

గర్భము వచ్చుటకు 40, 50 శాతము మాత్రమే అవకాశము కలదు, అని ఎవరికీ తెలియదు. అందువలన పదిమంది

పిల్లలున్న తల్లి అందులో నలుగురో, ఐదుగురో నా భర్త వీర్యకణముతో (నా భర్త సంబంధముతో) పుట్టారనీ, మిగత

ఐదు ఆరు మంది నా భర్త సంబంధములేకుండా పుట్టారని ఎలా అనుకో గలదు? అయితే ఉన్న సత్యమునూ, జరుగుచున్న

వాస్తవ విధానమునూ తెలియక పోవడము వలన, అందరూ తెలియని విధానములో ఉన్నారు. పెళ్ళైన వారు తమ భర్త

వలననే సంతతి జరిగిందని అనుకోవడము తెలియని విధానమేగానీ, అలా అనుకోవడములో తప్పులేదు, దానిని

ఎవరూ విమర్శించరు. అయితే ఒక స్త్రీకి వివాహము కాకమునుపే, తనకు భౌతిక పురుషుడు లేకముందే, పురుష

శరీరముతో సంబంధము లేకముందే గర్భమువస్తే, అది భర్త వలన రాలేదని, పెళ్ళికాని స్త్రీకి భర్త లేనిదానివలన ఆమె

గర్భము అక్రమ సంబంధము వలన వచ్చినదని అనుకొనుటకు నూరుశాతము అవకాశమున్నది. అటువంటి

అవకాశముండుట వలన ఎవరికీ వివాహము కాకముందు గర్భము వచ్చునట్లు దేవుడు చేయడము లేదు. అయితే

తన విధానము మరొక్కటి ఉన్నదని తెలుపు నిమిత్తము, ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఆధారమును చూపవలసిన

అవసరమున్నది. అలా చూపకపోతే బ్రహ్మవిద్యా శాస్త్రము యొక్క విధానము ఎవరికీ తెలియకుండా పోతుంది. అందువలన

భూమిమీద ఒకచోట వివాహముకాని స్త్రీ, ఏ భౌతిక పురుషునితో సంబంధము లేని స్త్రీ అయిన మరియమ్మ ఏసును శిశు

వుగా ప్రసవించినది. అయితే అది ఎలా జరిగింది అను ప్రశ్నకు మనుషులందరూ అనుకొన్నట్లే అనుకోవడము

జరిగినది.


మనుషులందరూ పురుషులు తమను తమ స్త్రీకి భర్తగా, స్త్రీలు తమ పురుషునికి భార్యగా చెప్పుకోవడము

అలవాటు, భౌతికముగా ఉన్న సంబంధము కూడా అంతే. ఒక జంటలోని పురుషుడు భర్తగా, స్త్రీ భార్యగా చెప్పుకోవడము

తప్పులేదు. అయితే ప్రతి స్త్రీకి పెళ్ళికాకముందే ఒక భర్త ఉన్నాడను విషయము తెలియదు. ప్రతి స్త్రీకి కనిపించని

భర్తగా దేవుడు చిన్నప్పటినుండి ఉండగా, తర్వాత యుక్తవయస్సులో మరియొక భర్తను పెళ్ళి చేసుకొంటున్నది. పెళ్ళైన

స్త్రీకి కనిపించే భర్త మధ్యలో వచ్చినవాడు కాగా, కనిపించని భర్త మొదటినుండి ఉన్నాడు. మధ్యలో వచ్చిన భర్త

మధ్యలో పోవడము కూడా జరుగుచున్నది. అయితే శాశ్విత భర్త అయిన దేవుడు ఎవరినీ మధ్యలో వదలిపోడు.

భౌతికముగా కనిపించు భర్త ఇంటిలో ఉండగా, అభౌతికముగా కనిపించని భర్త తన వంటిలోనే ఉన్నాడు. భౌతిక భర్త

కనిపించి మాట్లాడును. అభౌతికభర్త కనిపించడు, మాట్లాడడు. భర్త ద్వారా భార్యకు సంతతి కలుగును అను సూత్రము

ప్రకారము కనిపించే భర్త ద్వారా పిల్లలు పుట్టినట్లే, కనిపించని భర్త ద్వారా కూడా పిల్లలు పుట్టడము జరుగుచున్నది.

అయినా ఎవరికీ ఈ విధానము తెలియదు. ఎక్కడైనా పెళ్ళికాకున్న స్త్రీకి సంతతి కల్గితే అది అక్రమ సంబంధమే అని

అందరూ అంటున్నారు. పెళ్ళి కాకముందు సంతతి కల్గినవారు కొందరున్నా, అక్కడ క్కడ అటువంటి సంఘటనలు

జరిగినా, అవి అన్నీ మనకు తెలియవు. అయితే మనకు ఇప్పుడు ప్రశ్నగా వచ్చిన ఏసు జననము మాత్రము చాలా

మందికి తెలుసు. అయితే అందులోని వాస్తవము ఎవరికీ తెలియదు.


రెండువేల సంవత్సరముల పూర్వము మరియమ్మ అను స్త్రీకి పెళ్ళి కాకుండానే, ఏ పురుషునితో సంబంధము

లేకుండానే గర్భము రావడము జరిగినది. చివరికి ఆమె ఏసును ప్రసవించడము జరిగినది. అయితే ఇప్పుడు ఒక స్త్రీకి

భర్తయున్నా భౌతిక భర్తతో ఎటువంటి సంబంధముగానీ, సంపర్కముగానీ లేకుండా గర్భమువచ్చి కుమారున్ని ప్రసవించినది.

అయితే ఇక్కడ మంగమ్మ అను స్త్రీకి పెళ్ళయినది భర్తయున్నాడు. అక్కడ మరియమ్మకు పెళ్ళికాలేదు, భర్తలేడు. లోపల


పురుష సంబంధము లేకుండా పురుష వీర్యకణముతో సంబంధము లేకుండా గర్భము వచ్చినది. లోపల శరీరములో

వీర్యకణముతో సంబంధము లేకుండా గర్భము వచ్చినది. ఇక్కడ అక్కడ ఇరువురికి ఒక్కటే విధానముతో జరిగినది.

ఇక్కడ మంగమ్మకు జరిగినా, అక్కడ మరియమ్మకు జరిగినా ఇద్దరికి కనిపించని భర్త వలననే గర్భము వచ్చినది.

అయితే ఇక్కడ మంగమ్మకు పెళ్ళి అయినది కనిపించే భర్తయున్నాడు. అక్కడ మరియమ్మకు పెళ్ళికాలేదు, కనిపించే

భర్తలేడు. మంగమ్మకు భర్త ఉన్నా, మరియమ్మకు భర్తలేకున్నా ఇద్దరికి కనిపించని భర్తయిన వానివలననే గర్భము

వచ్చినది. సూపర్సైన్సు ప్రకారము భౌతిక భర్త సంపర్కము లేకుండా, వీర్యకణముతో సంబంధము లేకుండా

మంగమ్మకుగానీ, మరియమ్మకుగానీ గర్భము ఎలా వచ్చింది? అని ప్రశ్నించు కొని దానికి జవాబును చూస్తే ఇలా

కలదు.


స్థూలము, సూక్ష్మము అని రెండిటిని ముందే చెప్పుకొన్నాము. స్థూలమును భౌతికము అనియు, సూక్ష్మమును

అభౌతికము అనియు చెప్పు కోవచ్చును. భౌతికము కనిపిస్తుంది, అభౌతికము కనిపించదు. భౌతికము సత్యము

అభౌతికము అసత్యమని వాదించువారు భూమిమీద చాలామంది ఉన్నా అభౌతికము ఉన్నది వాస్తవమే. అయితే దానిని

గురించి ఏ జ్ఞానము అభౌతికవాదులకు తెలియదు. స్థూల, సూక్ష్మములను గురించి చెప్పినప్పుడు ఒక బంతిని

ఉదహరిస్తూ చెప్పడము జరిగినది. స్థూలముగా బంతి కనిపించినా అందులో కనిపించని గాలి ఉన్నదనీ, కనిపించని

గాలియే బంతిలో సూక్ష్మముగా ఉన్నదనీ, కనిపించే బంతి యొక్క పై భాగమైన తోలుతిత్తి దాని స్థూలమని చెప్పుకొన్నాము.

అంతేగాక సూక్ష్మమైన గాలి ఉన్నప్పుడే బంతి ఉండగలదుగానీ, గాలి లేకుండ బంతి ఉండదు. బంతి లేకున్నా గాలి

ఉన్నది. గాలి లేకుంటే తోలుతిత్తి ఉంటుంది గానీ బంతి ఉండదు. బంతిని విడదీసి చూస్తే స్థూల తోలుతిత్తి,

సూక్ష్మగాలి ఉన్నట్లు ప్రతి దానిలోనూ స్థూల సూక్ష్మములున్నవని ముందే చెప్పుకొన్నాము. ఒక కనిపించే వీర్యకణములో

పై ఆకారము దాని స్థూలముకాగా, దానిలోని కనిపించని శక్తి సూక్ష్మమై ఉన్నది. వీర్యకణములో పరమాత్మ శక్తి

కనిపించనిదై ఉన్నది. వీర్యకణములోని పరమాత్మశక్తి అందులోనే కాకుండా అణు వణువునా వ్యాపించియున్నది. ప్రతి

పదార్ధములోనూ వ్యాపించియున్న పరమాత్మ శక్తి వీర్యకణములో వీర్యశక్తిగా ఉన్నది. గాలి బంతిలో ఉన్నది. బయట

కూడా ఉన్నది. బయట గాలి సర్వసాధారణముగా ఉన్నది. బంతిలోని గాలి బంతిని ఎగురునట్లు, దొర్లునట్లు చేయుచున్నది.

గాలి లేని బంతి ఎగరదు, దొర్లదు. అలాగే పరమాత్మ శక్తి దేనిలో పని చేసినా దానిగానే మారిపోవును. అలాగే

వీర్యకణములోనున్న శక్తి సంతానమును కల్గించునదిగా ఉండును.


బంతిలోని గాలి బంతిగా ఎగరగలిగినట్లు, వీర్యకణములోని శక్తి సంతానముగా మారగల్గుచున్నది. బంతిలోని

గాలిని తీసివేస్తే ఆ గాలి బంతి బయటకు వచ్చి గాలి గాలిగానే ఉండును అయితే బంతి బంతిగా ఉండదు. స్థూలము

లేకున్నా సూక్ష్మముంటుంది గానీ, సూక్ష్మము లేకుండా స్థూలముండదనునది సూత్రము. సూత్రము ప్రకారము

బంతిలోనున్నప్పుడు ఎగురగల్గు శక్తినిచ్చిన గాలి, బంతి బయట ఉన్నప్పుడు కూడా గాలి పైకి క్రిందికి ఎగరగల్గుశక్తి

కల్గియున్నది. అలాగే స్థూలమైన వీర్యకణములో లేని పరమాత్మశక్తి బయట ఉన్నా వీర్యకణశక్తి కల్గియున్నది. భగవద్గీతలో

విభూతియోగము 39వ శ్లోకములో "సర్వజీవరాసులకు బీజమును (వీర్యకణ శక్తిని) నేనే, వారి జన్మలకు కారణమైన

వీర్యశక్తిని నేనే కావున ఈ చరాచర ప్రపంచములో నా సంతతి కానివారు లేరు.” అని చెప్పడము జరిగినది. స్థూలమైన

వీర్యకణము లేకున్నా సూక్ష్మమైన వీర్యశక్తిగానున్న దైవశక్తి స్థూలముగానున్న స్త్రీ అండములోనికి ప్రవేశించుట వలన

అండము ఫలదీకరణ చెంది ఏక కణముగానున్న అండము రెండుగా చీలిపోయి, తర్వాత రెండు నాలుగుగా, నాలుగు


ఎనిమిదిగా చీలిపోతూ కణ విభజన జరిగి పెరుగుచూ వచ్చి శిశువుగా మారిపోవును. వీర్యకణము స్థూలముగా

కనిపించెడి స్థూల భర్తనుండివచ్చును. అలాగే సూక్ష్మమైన వీర్యశక్తి సూక్ష్మముగా కనిపించకయున్న పరమాత్మనుండి

వచ్చును. ఆ విధముగా సగము జనాభా అంతయు స్థూల వీర్యకణము లేకుండా దైవశక్తితో పుట్టారని చెప్పవచ్చును.

నూటికి యాభైమంది అలాగ పుట్టినప్పుడు ఏసు ఒక్కడు అలాగ పుట్టితే అదేమి వింతకాదుగానీ, ఏసును కన్నతల్లికి

స్థూల భర్త లేకపోవడము ఒక వింతయినది. శాస్త్రము తెలిసిన వారికి ఈ విషయము వింతకాకపోయినా, శాస్త్రము

తెలియనివారికి ఏసు జన్మ వింత గానే కనిపించియుండవచ్చును.


స్థూలమైన తండ్రికి సంతతి కల్గినదని నమ్ము ఈ సమాజములో 50, 60 శాతము మంది స్థూల తండ్రికి

పుట్టలేదు అని చెప్పినప్పుడు ఎవరు స్థూల తండ్రికి పుట్టారు? ఎవరు సూక్ష్మతండ్రికి పుట్టారనీ తెలియుటకు అవకాశమున్నదా?

అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. పుట్టిన సంతతి స్త్రీయొక్క స్థూల అండ కణ

విభజన ద్వారా పుట్టుచున్నది. కనుక సూక్ష్మశక్తికి పుట్టినవారు కూడా స్థూలముగా కనిపించుచున్నారు. అటువంటి

సంతతిని మూడు భాగములుగా విభజించవచ్చును. అందులో ఒకటి పూర్తి తల్లి పోలికలున్నవారు. రెండు పూర్తి తండ్రి

పోలికలున్నవారు. మూడు తల్లి పోలికలు కొన్ని, తండ్రి పోలికలు కొన్ని కలిసి పుట్టినవారు గలరు. ఈ మూడు

రకములుగా కనిపించు వారిని గురించి చెప్పుటకు శాస్త్రబద్ధత లేదుగానీ, ప్రత్యక్ష సత్యముగా ఉన్నందున వివరించి

చెప్పుకోవచ్చును. ఫలదీకరణ దినమైన 14వ రోజు స్థూలముగానున్న రజోకణముతో (అండముతో) స్థూలముగానున్న

వీర్య కణము చేరి గర్భముగా మారి పెరుగుచు వచ్చిన శిశువు పుట్టిన కొంత కాలమునకు పూర్తిగా తల్లితండ్రుల

ఇరువురి పోలికలను కల్గివుండును. భౌతిక తల్లి, భౌతిక తండ్రి యొక్క ఇద్దరి పోలికలు ఎవరిలో కనిపించునో వారు

తల్లి అండముతో, తండ్రి వీర్యముతో పుట్టారని చెప్పవచ్చును. అలాగే భౌతిక తండ్రి యొక్క వీర్యకణముతో కాకుండా,

అభౌతిక తండ్రి అయిన దేవుని వీర్యశక్తి భౌతిక తల్లి యొక్క గర్భములో 14వ రోజు చేరి గర్భముగా మారడము

జరిగినప్పుడు భౌతిక తండ్రి పోలికలు ఎక్కువ కల్గిన సంతానము పుట్టుదురు. అటువంటి వారిలో తల్లి పోలికలు

ఉండవు. అలాగే 14వ రోజు అండము విడుదలయైన తర్వాత పన్నెండు గంటలు గడచిపోయిన తర్వాత సూక్ష్మమైన

దైవము యొక్క వీర్యశక్తి స్థూలమైన అండమును చేరి గర్భముగా మారిన శిశువు పెద్దయిన తర్వాత ఎక్కువగా తల్లి

పోలికలు కల్గియుండును. అండము విడుదల తర్వాత 12 గంటల వరకు చేరిన వీర్యశక్తి ఎక్కువ స్థూలతండ్రి పోలికలను

కల్గించగా, 12 గంటల తర్వాత అండములో చేరిన దైవశక్తి ఎక్కువ స్థూలతల్లి పోలికలనుగల్గి పుట్టిన సంతతి కల్గించును.

ఎక్కడైనా తండ్రి పోలికలు తల్లి పోలికలు కలిసి పుట్టిన శిశువు భౌతికశాస్త్రమును అనుసరించి పుట్టినవాడని చెప్పవచ్చును.

ఎక్కడైనా తల్లి పోలికలు మాత్రమే ఉండి తండ్రి పోలికలు లేనివాడుగానీ, తండ్రి పోలికలుండి తల్లి పోలికలు లేనివాడుగానీ

ఉంటే అట్టివాడు అండము స్థూలముదే అయినా, వీర్యకణముతో వాడు పుట్టలేదనీ, వాడు కనిపించని వీర్యశక్తితో

పుట్టాడనీ చెప్పవచ్చును. ఇదంతయు సాధారణ మనుషుల విధానముకాగా, భగవంతుడు పుట్టినప్పుడు అండములోని

సూక్ష్మశక్తి, వీర్యకణములోని సూక్ష్మశక్తి రెండూ కలిసి సూక్ష్మగర్భముగా ఉండి, స్థూల శరీర తల్లియొక్క కడుపులో స్థూలముగా

అండము విడుదలయైనప్పుడు సూక్ష్మముగానున్న గర్భము స్థూలముగానున్న అండములోనికి ప్రవేశించి స్థూల శరీరముగా

పెరగను మొదలుపెట్టును. అటువంటి శరీరమునకు గర్భములోపలే జీవశక్తి ఉండి సజీవముగా పుట్టును. సజీవముగా

ఎవడు పుట్టునో వాడే భగవంతుడు.


అండము లేకున్నా అండములోని ప్రకృతిశక్తితో, వీర్యము లేకున్నా వీర్యకణములోని పరమాత్మశక్తి కలిసినప్పుడు


సూక్ష్మగర్భములోనే శక్తులు రెండూ కలిసి ఆత్మగా తయారై పోవుచున్నది. అందువలన భగవంతుని శరీరము మాత్రము

తల్లి గర్భమునుండి సజీవముగా పుట్టుచున్నదని తెలియుచున్నది. తల్లి గర్భము నుండి సజీవముగా పుట్టువానిని భగవంతుడు

అని ఇంతకుముందే చాలామార్లు చెప్పుకొన్నాము. భగవంతుని శరీరములో మొదటి దినమే, గర్భము ఫలదీకరించిన

సమయములోనే ఆత్మ కదలక మెదలక ఉన్నదని తెలియుచున్నది. అటువంటి శరీరములో ఆత్మ తప్ప జీవుడు

ఉండడు. కృష్ణుని జన్మ ఎలా జరిగినదో అలాగే ఏసు జన్మ కూడ జరిగినది. ఏసు తల్లి అయిన మరియమ్మ గర్భములో

ఏమి జరిగినది క్రైస్తవ పండితులకే తెలియదు. ఆయన కృష్ణునివలె రెండు సూక్ష్మశక్తుల కలయికతో ఏసు పుట్టాడని

వారికి తెలియదు. ఏసును దేవుని కుమారుడని కొందరనుచున్నా ఆయన దేవుని కుమారుడెట్లయ్యాడో నేటి క్రైస్తవులకు

ఎవరికీ ఏమాత్రము తెలియదు.


మానవులుగా పుట్టువారి యొక్క శరీరములు భౌతికశాస్త్రమును అనుసరించి పుట్టుచుండును. దైవాంశ మానవ

ఆకారములో భగవంతునిగా పుట్టినప్పుడు ఆ పుట్టుకంతయు బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించి ఉండును. ఇదంతయు

వినిన తర్వాత కొందరికి మరియొక్క ప్రశ్నవచ్చి దానిని ఈ విధముగా అడుగుచున్నారు. "భగవంతునిగా పుట్టినవానికి

దైవాంశ కల్గియున్నదని అతడు స్థూల తండ్రి సంబంధము లేకుండా పుట్టు చున్నాడని చెప్పారు. అలాగే కొందరు

మనుషులు పుట్టినప్పుడు కూడా దేవుని వీర్యశక్తి తల్లి అండములో చేరి పుట్టుచున్నారు. అటువంటివారు తండ్రి

పోలికనుగానీ, తల్లి పోలికనుగానీ కల్గి ఉంటారనీ, వారిలో తల్లితండ్రి యొక్క ఇద్దరికి పోలికలు ఉండవనీ చెప్పారు.

అలా వారు పోగా నూటికి యాభైమంది భౌతిక తల్లితండ్రులకే పుట్టారనీ వారి అండముతో కలిసిన వీర్యమునకే పుట్టారనీ

చెప్పారు. సగము మంది మనుషులు వీర్యముతో పుట్టగా సగము జనాభా దేవుని వీర్యశక్తితో పుట్టినవారున్నారని

చెప్పారు. దానికంటే ముందు ఎవరు ఎక్కడ పుట్టినా, వారు నా బీజముతోనే పుట్టుదురని దేవుడు భగవద్గీత విభూతి

యోగములో 39వ శ్లోకమందు, గుణత్రయ విభాగ యోగములో 3, 4 శ్లోకములందు చెప్పినట్లు తెలియజేశారు.

గీతలో ఎవరు ఎక్కడ పుట్టినా నా బీజముతోనే అని చెప్పగా ఇక్కడ మీరు 40, 50 శాతము మంది తండ్రి వీర్యమునకు

పుట్టుచున్నారు మిగతా 50, 60 శాతము మంది దేవుని సూక్ష్మమైన వీర్యశక్తికి పుట్టుచున్నారని అన్నారు. దేవుని

వీర్యశక్తికి పుట్టిన వారందరినీ దేవుని బీజమునకు పుట్టినట్లు, మనుషుల వీర్యమునకు పుట్టినవారందరినీ మనుషుల

బీజమునకు పుట్టినట్లు లెక్కించ వచ్చును. అలాంటపుడు గీతలో దేవుడు అందరూ నా బీజమునకే పుట్టుచున్నారను

మాట అసత్యమగును కదా!” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.


భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున చెప్పిన త్రైత సిద్ధాంతము ప్రకారము ప్రతి మానవుని (జీవరాసి)

శరీరములో మూడు ఆత్మలు కలవు. వాటికి అంకెల గుర్తు 3,6,9 అని కూడా చెప్పుకొన్నాము. జీవాత్మ, ఆత్మ,

పరమాత్మ అని వాటిని గుర్తించుకొన్నాము. మధ్యలోగల ఆత్మ శరీరములో శరీరమంతా వ్యాపించి ఎల్లప్పుడు పని

చేయుచున్నదని చెప్పుకొన్నాము. శరీరములో ఒక్కచోట ఉన్న జీవాత్మగానీ, శరీరమంతటానున్న పరమాత్మగానీ రెండూ

శరీరములో కదలి పని చేయునవి కావు. జీవుడు తన వరకు వచ్చిన సుఖదుఃఖములను ఆస్వాదించును. పరమాత్మ

ఏమీ చేయడు. పరమాత్మను ముందే రూప, నామ, క్రియా రహితుడని చెప్పుకొన్నాము కదా! పరమాత్మ అనబడు

దేవుడు శరీరములో ఏమీ చేయక ఊరక ఉండువాడు మాత్రమే. ఇకపోతే ఆత్మ అనబడునది లేక అనబడువాడు

(ఆత్మను స్త్రీలింగముగా, పులింగముగా రెండు విధముల చెప్పవచ్చును. ) శరీరమంతా వ్యాపించి చిన్న పనిని మొదలుకొని

పెద్దపని వరకు అన్ని పనులను చేయుచున్నాడు. దేవుని వలననే అన్నీ జరుగునని పైకి మనము చెప్పుకొనినా దేవుడు


ఏమీ చేయడు. సర్వజగత్తును నేనే సృష్ఠించుచున్నాను, పాలించుచున్నాను, నాశనము చేయుచున్నానని దేవుడు చెప్పినా

అది మన తృప్తి కొరకేగానీ వాస్తవముగా దేవుడు ఏమీ చేయువాడు కాడు. అన్నీ నేనే చేస్తానంటాడు, కానీ ఏదీ చేయడు.

అట్లని సృష్ఠించువాడు దేవుడు కాదా అంటే జవాబుగా దేవుడే అని చెప్పాలి. పాలించువాడు దేవుడు కాదా అని అడిగితే

దేవుడేనని చెప్పవలసిందే. ఆయన చేయనప్పుడు ఆయనను ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించితే దానికి జవాబు ఇట్లు

కలదు. ఆయన చేయకున్నా ఆయన ఇతరుల చేత చేయించాడు, కావున ఆ పనికి కారణమైన వానినే చెప్పవలసి

వచ్చినది. కార్యమై చేసిన వానిని చెప్పకుండా వదలివేయవలసి వచ్చినది. అర్థమగుటకు ఒక విషయమును

ఉదాహరణగా చెప్పుకొందాము.


ఒక ఊరిలో పదిమంది ఒకేమారు హత్యకావింపబడ్డారు. వారిని చంపినది పదిమంది హంతకులు. పదిమంది

హంతకులను ప్రేరేపించి తన శత్రువులైన వారిని చంపమని చెప్పి పంపిన వ్యక్తి ఆ ఊరి ధనికుడు. కార్యము చేసినది

పదిమంది హంతకులైనా చేయించినవాడు ధనికుడు ఒక్కడే. పదిమందిని చంపినది ఎవరు అని క్రొత్తవారు అడిగితే

చంపించిన వాని పేరే ఎవరైనా చెప్పగలరు గానీ, చంపిన వారిపేరు చెప్పరు. చంపిన వారు కిరాయికి పని చేసినవారు,

కావున వారిని ఎవరూ చెప్పక ఆ పనికి కారణమైన ధనికున్నే చెప్పుదురు. భద్రాచలములో సీతారాముల పెళ్ళి

జరుగుచున్నదని చెప్పినా, అక్కడ పెళ్ళిలో రాముడు స్వయముగా సీత మెడలో తాళిని కట్టడము లేదు. తాళికట్టే పనిని

అక్కడి పురోహితుడు చేసినా, దానిని పురోహితుని పెళ్ళి అనకుండా రాముల పెళ్ళి అంటున్నారు కదా! అలాగే దేవుడు

కర్తగాయుండి తాను ఏ కార్యము చేయకున్నా, తన పనిని వేరెవరు చేసినా, దానిని ఆయన చేసినట్లే అగుచున్నది.

దేవుని పనిని చేయుటకు చేతన అచేతన ప్రకృతి ఉన్నది. ఇదే విషయమునే భగవద్గీత యందు విజ్ఞానయోగమను

అధ్యాయములో 6వ శ్లోకమున ఇలా కలదు.


శ్లోకము 6:

ఏత ద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ,

అహం కృత్స్నప్య జగతః ప్రభవః ప్రళయస్తథా.


భావము : “సర్వ జీవరాసులు జన్మలను చేతనా చేతన ప్రకృతులు చేయు చుండును. సర్వ ప్రపంచ ప్రళయములకు

మరియు ప్రభవము (పుట్టుక)కు నేను కారణముగా ఉన్నాను.” అని చెప్పాడు. దేవుని పనిని చేయటకు ప్రకృతి

సంసిద్ధముగా ఉన్నది. దేవుని పనిని ప్రకృతియే చేయును. దేవుడు దేనినీ చేయడు. ప్రకృతి రెండు భాగములుగా

చేతనా ప్రకృతిగా, అచేతనా ప్రకృతిగా ఉన్నది. కదలెడు ప్రకృతిని చేతన ప్రకృతి అనియూ, కదలని ప్రకృతిని అచేతన

ప్రకృతియనియూ చెప్పవచ్చును. కదలెడు ప్రకృతిలో కనిపించని ఆత్మయుండి కదిలించుచున్నది. శరీరము ప్రకృతి

చేత తయారు చేయబడివున్నది. శరీరములో ఆత్మ చైతన్యము కదలి పని చేయుచున్నది. అందువలన శరీరమును

చేతనా ప్రకృతి అంటాము. శరీరములో దైవము నుండి అన్నిటీకి కారణమై ఉన్నది. పరమాత్మ కారణమైయున్నా అది

పని చేయదు. పని చేయునది శరీరములోని ఆత్మయే. ఆత్మ జీవునిగా, దేవునిగా పని చేయుచున్నది. జీవుడు చేయకున్నా

జీవుడు చేసినట్లు కొన్ని పనులనూ, దేవుడు చేయకున్నా దేవుడు చేసినట్లు కొన్ని పనులనూ ఆత్మే చేయుచున్నది. జీవుడు

కొన్ని దేవుడు కొన్ని చేసినట్లు అనిపించినా, ఇటు జీవుడుగానీ, అటు దేవుడుగానీ ఏ పనినీ చేయడము లేదు. జీవుడు

కొన్ని పనులను దేవుడు కొన్ని పనులను చేసినట్లు మనుషులు అనుకొనినా, అందరినీ ఆ విధముగా భ్రమింపచేసి,

ఎవరికీ తెలియకుండా ఆత్మే అన్ని పనులను చేయుచున్నది. గర్భధారణ విషయములో జీవునియొక్క స్థూల వీర్యకణము

పాత్ర ఉందని చెప్పినా, లేక దేవుని యొక్క సూక్ష్మవీర్యశక్తి ఉందని చెప్పినా వాటిని పద్దతి కొరకు చెప్పవలసిందేగానీ


స్థూల వీర్యకణములోగానీ, సూక్ష్మ వీర్యశక్తిలోగానీ ఉన్నది ఆత్మయే, ఆత్మ శరీరమంతయు వ్యాపించి అన్ని కార్యములను

చేయుచున్నది. శరీరములో జరుగు పనులన్నీ ఆత్మ వలన జరుగుచున్నవి. ఆత్మలేనిది ఏ కదలికా లేదు, ఏ కార్యమూ

లేదు. కొన్ని పనులను కర్మను అనుసరించి చేయు ఆత్మ, కొన్ని పనులను మాత్రము దేవునివలె కర్మకు అతీతముగా

చేయును. మనుషులలో చాలామంది జ్ఞానులు సహితము శరీరములో, శరీరము ద్వారా జరిగెడు పనులను చూచి,

వాటిలో కొన్నిటిని జీవుడు చేయుచున్నాడనీ, మరికొన్ని ప్రత్యేకమైన కార్యములను దేవుడు చేయుచున్నాడని అనుకోవడము

జరుగుచున్నది. అంతేగానీ మధ్యలో ఒక ఆత్మయున్నదనీ, అదియే అన్నిటినీ చేయుచూ అందరినీ భ్రమలో

ముంచివేయుచున్నదనిగానీ ఎవరికీ తెలియదు.


జీవుడూకాక దేవుడూ కాక మధ్యలో ఎవరికీ తెలియని ఆత్మ అన్నీ చేయుచుండినా, ఎక్కడా ఆత్మ బయటపడలేదు.

ఎంతో జాగ్రత్తగా శరీరములో కార్యములను చేయు ఆత్మయే స్త్రీ గర్భధారణ విషయములో కూడా పని చేయుచున్నది.

ఇంతకుముందు మనుషులు గర్భధారణ విషయములో భౌతిక తండ్రియొక్క వీర్యకణము అండమును చేరితే అది

భౌతిక తండ్రి చేత వచ్చిన గర్భమనీ, భౌతిక తండ్రియొక్క వీర్యకణము కాకుండా, కనిపించని దేవుని శక్తి యొక్క

వీర్యశక్తి అండమును చేరితే అది అభౌతిక తండ్రి అయిన దేవుని వలన వచ్చిన గర్భమనీ చెప్పుకొన్నాము. ఇప్పుడు

అసలు రహస్యమును విప్పి ఈ రెండు విధముల చర్యలు చేసినది ఆత్మయే ననీ, అయినా అది ఎవరికీ తెలియని

దానివలన అందరూ కొన్ని గర్భము లకు కారణము జీవుడనీ, కొన్ని గర్భములకు కారణము దేవుడనీ అనుకోవడము

జరుగుచున్నదని చెప్పుచున్నాము. వీర్యకణము లేకుండా గర్భము వచ్చినట్లు చేసినదీ ఆత్మయే. అలాగే వీర్యకణము

ద్వారానే గర్భము వచ్చునట్లు చేయునదీ ఆత్మయే. ఒక గర్భ కార్యమును వీర్యకణము లేకుండానే బ్రహ్మవిద్యాశాస్త్రమును

అనుసరించి ఆత్మే చేసినది. అలాగే ఒక గర్భ విషయములో వీర్యకణము ద్వారానే గర్భము వచ్చునట్లు భౌతిక శాస్త్రమును

అనుసరించి ఆత్మే చేసినది. మరియమ్మకు పెళ్ళికాకముందే గర్భము వచ్చునట్లు చేసినది దేవుడూకాదు, మనిషీకాదు,

అలా చేసినవాడు ఆమె శరీరములోనున్న ఆత్మయే. ఆత్మనునది గొప్ప జ్ఞానులకే తెలియక పోతే, సూక్ష్మమును ఏమాత్రము

నమ్మని నాస్తికులకు, అతివాదులకు ఎలా తెలియును? అందువలన బయటి ప్రజలకు మరియమ్మ పెళ్ళికాక ముందే

గర్భము ధరించడము చర్చనీయాంశమైనది. ఎవరికి తోచినది వారు అనుకోవడము జరిగినది. ఎవరికీ అసలు

సమాచారము తెలియదు.


మేము విజ్ఞానులమనువారు ఇటువంటి విషయములను కొట్టి వేయుచూ అన్నిటికీ సైన్సు కారణము. సైన్సు

వలన జరిగెడు పనులను దేవునికి అంటగట్టడము మూఢనమ్మకమని చెప్పుచుందురు. ఇతరులను మూఢనమ్మకులని

అనుచున్నవారే చాలా విషయములలోని సత్యమును తెలియక, వాటికి సరియైన వివరణ ఇవ్వలేక, మూఢముగా ఖండించు

చుందురు. అటువంటి వివరణలేని ఖండనను కూడా మూఢనమ్మకమనియే చెప్పవచ్చును. చనిపోయి కొన్ని గంటల

తర్వాతగానీ, కొన్ని దినముల తర్వాతగానీ బ్రతికిన సంఘటనలు ఎన్నో భూమిమీద జరిగాయి. అన్నిటికీ కారణము

సైన్సని చెప్పువారూ, విజ్ఞానులమనువారూ చనిపోయిన వాడు తర్వాత ఎలా బ్రతికాడో సైన్సు ప్రకారము ఎందుకు

చెప్పలేకపోయారు? మొదటికి వాడు చనిపోలేదు, వాడు చనిపోయినట్లు పొరపడి అనుకోవడము జరిగివుంటుంది.

సజీవముగా మూర్ఛలో ఉన్నవాడు తిరిగి జ్ఞాపకము వచ్చి లేచివుంటాడు అని చెప్పుచున్నారు. చనిపోయిన వాడు తిరిగి

లేచాడు అన్నది సత్యమైనప్పుడు, వాడు మూర్ఛలో ఉంటాడు, దానిని గమనించక చనిపోయాడని అనుకొన్నారని చెప్పడము

మూఢనమ్మకముతో చెప్పినట్లు కాదా! బోడిగుండు వేరు, మోకాలు వేరని తెలియక బోడిగుండును మోకాలును రెండిటినీ


ఒకటి అనుకోవడము వివేకము కాదు. అలాగే భౌతిక శాస్త్రముకూ, బ్రహ్మవిద్యాశాస్త్రముకూ తేడా తెలియక మోకాలిని

బోడిగుండే అని అనుకొన్నట్లు, బ్రహవిద్యాశాస్త్రమును కూడా భౌతిక శాస్త్రమనుకొంటే అది అవివేకమగును. శాస్త్రమును

సైన్సు అనవచ్చును. శాస్త్రములు ఎన్ని రకములున్నవో తెలియగలిగితే, సైన్సు అన్ని రకములున్నట్లు తెలియును. ఒకటి

లేక రెండు శాస్త్రములను తెలిసినంతమాత్రమున సైన్సంతా తెలియుననుకోవడము తెలివితక్కువ కాదా! శాస్త్రములలో

పెద్ద శాస్త్రమని పేరుగాంచిన శాస్త్రమొకటుండగా, దానిని ఏమాత్రము తెలియని వారు పూర్తి విజ్ఞానులెలా అవుతారు.

పూర్తి విజ్ఞానులు కాకుండా పావు భాగమో, సగభాగమో విజ్ఞానము తెలిసినవారికి అన్ని విషయములలోని శాస్త్రవిధానము

తెలియదు. అటువంటపుడు తమకు తెలియకున్నా తెలుసునని ఒప్పించుకొనుటకు శాస్త్రమును వదిలి మూఢముగా

మాట్లాడు దురు. అదే విధముగా పురుష సంబంధము లేకుండా సంతానము కలుగదని మరియమ్మ విషయములో

చెప్పారు.


ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క వివరమును ఇస్తుంది. సాధారణ మనిషి నుండి దేవుని వరకు శాస్త్రములు ప్రమాణముగా

ఉన్నవి. శాస్త్రములు ఆరుకాగా వాటిలో ముందు పుట్టినది మరియు పెద్దది బ్రహ్మవిద్యాశాస్త్రము. ఈ శాస్త్రము దేవుని

విషయములకు ప్రమాణముగా ఉన్నది. బ్రహ్మవిద్యా శాస్త్రము తెలియనివారు దైవ విషయములను, వాటి జ్ఞానమును

తెలియలేక దైవ విషయములలో అనేక అనుమానములు కల్గి, ఎన్నో ప్రశ్నలను అడుగు చుందురు. అటువంటి

ప్రశ్నలలో ఇప్పుడు ఒకదానిని తీసుకొని చూస్తాము. హేతువాదినని పేరు పెట్టుకొనిన నాస్తికవాది అడిగిన ప్రశ్న ఇలా

ఉన్నది.


ప్రశ్న :- దేవుడున్నాడా? ఉంటే దేవుడు ఎవరు? ఎందుకు కనిపించడు?

జవాబు :- ఒక ఇంటిలోనికి దొంగ ప్రవేశించాడని తెలిసి కొందరు ఆ ఇంటిలోనికి ప్రవేశించి వెదకను మొదలుపెట్టారు.

దొంగ అయిన వాడు తాను ఎవరికీ తెలియనట్లుండవలెనని తలచి, తలుపుచాటున ఉండి ఇంటిలోనికి బయట మనుషులు

వచ్చినప్పుడు వారిలో కలిసిపోయి అందరూ దొంగను వెదకినట్లే దొంగకూడా వెదుకుచుండెను. అందరూ కలిసి

ఇల్లంతయు చూచిన తర్వాత బయటనుండి ఒకడు వచ్చి “దొంగ ఉన్నాడా? ఉంటే దొంగ ఎవరు? దొంగ ఎందుకు

కనిపించలేదు.?” అని అడిగాడట. ఒక ఇంటిలోని దొంగను కనుగొనలేక ఎలా ప్రశ్నించాడో అలాగే దేవుడున్నాడా?

ఉంటే దేవుడు ఎవరు? ఎందుకు కనిపించలేదు? కనిపించ లేదు కాబట్టి దొంగ విషయములో అడిగిన ప్రశ్నలనే దేవుని

విషయములో కూడా అడుగవచ్చును. దొంగ ఇంటిలో ఉన్నది వాస్తవమే, కావున దొంగ ఉన్నాడా అను ప్రశ్నకు దొంగ

ఉన్నాడనుటయే సరియైన సమాధానమైనట్లు దేవుడు విశ్వములో ఉన్నది వాస్తవమే, కావున దేవున్ని కూడా ఉన్నాడనియే

చెప్పవచ్చును. దొంగ కూడా మనిషే, కావున దొంగ కొరకు ఇంటిలోనికి ప్రవేశించిన మనుషులలో దొంగ కలిసిపోవడము

వలన అంతమందిలో ఎవరు నిజమైన దొంగ అని వెదకవలసి వచ్చినది. అంతమందిలో కలిసిపోయిన దొంగను

గుర్తించగలిగితే కనిపించినట్లే కదా! అలాగే నేడు ఎంతోమంది దేవతలలో దేవుడెవరో తెలియని స్థితిలో మనిషి

ఉన్నాడు. ఇంతమంది దేవతలలో అసలైన దేవున్ని గుర్తించగలిగిన రోజు నీవు దేవున్ని చూచినట్లే కదా! ఇప్పుడు నీవు

వెదకి గుర్తించలేదు కాబట్టి దేవుడు కనిపించ లేదు. ఎందుకు కనిపించవు అని అడిగేదానికంటే నేను ఎందుకు గుర్తించ

లేదు అని అనుకో. దేవుడు ఎవరు అని తెలియకపోవడము, ఆయనను చూడకపోవడము మన అన్వేషణ మీద

ఆధారపడియున్నది. అలా కాకపోతే పోలీసు “ఎవరు దొంగ? ఎందుకు కనిపించడు” అని అడిగినట్లుంటుంది. దొంగ

పోలీసుకుగానీ, ఇతరులకుగానీ ఎలా కనిపించకుండా ఉంటాడో, ఉండాలని అనుకుంటాడో, అలాగే దేవుడు కూడా


దొంగలాగ ఎవరికీ తెలియకుండా ఉండాలనుకుంటాడు, అలాగే ఉంటాడు. అందువలన ఆయనను దేవుడు అంటారు.

దేవుడు అనగా దేవులాడబడేవాడు అని అర్థము. దేవులాడడము అనగా వెదకడము అని అర్ధము. కొన్ని ప్రాంత

ములలో (తెలంగాణా ప్రాంతములో) వెదకడము అను పదమునకు బదులుగా దేవులాడడము అనియే ఎక్కువగా వాడుదురు.

దేవుడు ఎప్పటికీ వెదకబడే వాడే, అందువలన దేవుడు ఎవరో! ఎట్లుంటాడో! ఎవరికీ తెలియకుండా పోయాడు.

వెదకంగా వెదకంగా ఏదైనా దొరికితే తిరిగి దానిని వెదక వలసిన పనిలేదు. అదే విధముగా దేవున్ని అన్వేషించగా

అన్వేషించగా చివరికి ఎప్పటికో ఒకప్పటికి దొరుకును. అలా దొరికిన తర్వాత ఇక వానికి వెదకవలసిన పని ఉండదు.


పోలీసు “ఎవరు దొంగ, ఉంటే ఎందుకు కనిపించడు” అని అడిగితే దొంగ వచ్చి “నేనే దొంగను, ఇట్లున్నాను

చూడు” అని ఎలాగనడో, అలాగే ఒక భక్తుడుగానీ లేక నాస్తికుడుగానీ ఎవరు దేవుడు అని ప్రశ్నించినంత మాత్రమున

వెంటనే దేవుడు వచ్చి నేనే దేవున్ని అని చెప్పడు. ఒక దొంగను కనుగొనుటకు ఎంతో అన్వేషణ అవసరము. అలాంటపుడు

దొంగకంటే ఎంతో గొప్పవాడైన దేవున్ని కనుగొనుటకు ఎంత అన్వేషణ అవసరమో మీరే యోచించండి. ఎందరో

సన్న్యాసులుగా మారిపోయి గోచీలు పెట్టి, జుట్టులు బిగించి సాధనలు చేసినా వారికే తెలియబడని దేవుడు, ఒక నాస్తికుడు

అడిగితే వానికి తెలియుటకు వచ్చి దేవుడు కనిపిస్తాడా? అట్లు ఎప్పటికీ జరుగదు. దేవుడున్నాడను వారికిగానీ, లేడను

వారికిగానీ ఇంతవరకూ కనిపించలేదు. మరియు ఇంటరాగేషన్ (విచారణ) అవసరమైనట్లు, దేవున్ని తెలియుటకు

ఎంతో యోచన మరియు యోగము అవసరము. ఎంతో పరిశీలన విచారణ చేసిన తర్వాత దొంగ తెలిసినట్లు, ఎంతో

యోచన (ఆత్మజ్ఞానము) యోగము (ఆత్మకలయిక జరిగిన తర్వాత దేవుడు ఫలానాయని తెలియును.

తెలియగలిగినప్పుడు దేవుడు ఎవరు అను ప్రశ్నకు, దేవుడు ఎలాగున్నాడు అను ప్రశ్నకు జవాబు దొరక గలదు.

జవాబు దొరికినప్పుడు ఆ జవాబు విచిత్రముగా ఉండును. ఎందుకనగా ఎవరుగానీ, ఎప్పుడుగానీ దేవున్ని తెలియలేరు

అనునట్లు జవాబు దొరుకును. దేవుడు ఉన్నాడా అనుటకు ఉన్నాడు అని జవాబు తెలిసినా, ఎట్లున్నాడు అనుటకు

ఇట్లున్నాడు అని జవాబు తెలిసినా, అది విచిత్ర సమాధానముగా తెలియును. దేవుడు అంతటా ఉన్నాడు, అయితే

ఆయనకు రూపముగానీ, పేరుగానీ, పనిగానీ లేదు. దేవుడు రూప నామ క్రియారహితుడైన సర్వవ్యాపి అని తెలియుచున్నది

అందువలన దేవుడు అందరి మనుషులవలె లేడు అని తెలియుచున్నది. ఈ జవాబు నాస్తికులకు ఆస్తికులకు అందరికీ

ఒకటేనని తెలియుచున్నది. ఇది బ్రహ్మవిద్యలోనున్న జవాబు అందువలన దీనిని శాస్త్రబద్ధమైన జవాబుగా చెప్పవచ్చును.


దేవున్ని గురించి ప్రశ్నించు వానికి ఒక మతమంటూ ఉండదు. నాస్తిక భావములు గలవారుగానీ, ఆస్తిక

భావములు గలవారుగానీ ఏ మతములోనైనా ఉండవచ్చును. నాస్తికుడైనవాడు ఒక మతములోని దేవున్నే విమర్శిస్తాడని

అనుకోకూడదు. నాస్తికుడు దేవుడు అను పదమును వినిన చోటంతా వాడు ప్రశ్నించుచూనే ఉండును. అతనికి

దేవునియొక్క నిజమైన జ్ఞానము తెలియక పురాణముల మాటలు విని ప్రశ్నించుచుండును. దేవుడూ, దేవుని జ్ఞానమూ

శాస్త్రబద్ధమైనదనీ అతనికి తెలియదు. అందువలన అతడు (నాస్తికుడు) దేవున్ని గురించి విమర్శించుచుండును, అలాగే

అనేకముగా ప్రశ్నించుచుండును. ఇంతకుముందు మనము చెప్పుకొన్న వాటిలో మూడు మతములకు సంబంధించిన

ప్రశ్నలు జవాబులు గలవు. ఇప్పుడు కూడా నాస్తికవాదుల ప్రశ్నలుగానీ, హేతువాదుల ప్రశ్నలుగానీ మూడు మతములకు

సంబంధించినవిగానే ఉండును. దేవున్ని గురించిన ఒక మతమునే సూచిస్తూ ప్రశ్న అడిగినా, దేవుడు అన్ని మతములకు

ఒక్కడే గావున, చెప్పబడే జవాబు అన్ని మతముల వారికీ సరిపోవును. ఇప్పుడు ఒక హేతువాది అడిగిన ప్రశ్నను

గురించి జవాబును వివరించు కొందాము. ముందు ప్రశ్న ఇలా ఉన్నది చూడండి.


హేతువాది ప్రశ్న :- దేవుడు దయామయుడు, కృపాశీలుడు అయితే కొందరిని బీదవారిగా ఎందుకుంచాడు? వారికి

ఆకలికి అన్నము, దేహమునకు దుస్తులు, నివాసమునకు ఇల్లు ఎందుకివ్వడము లేదు. భూమిమీద అన్ని దేశములలోనూ

అన్ని మతములలోనూ కూడూ, గుడ్డా, ఇల్లు లేనివారుండగా, అందరూ దేవున్ని కరుణామయుడు, దయామయుడు

అనుట సరియైన మాటయేనా?


జవాబు :- దేవుడు దయామయుడు అనుమాట అన్ని మతములలోనూ చెప్పుచున్నారు. కొందరు ప్రేమే దేవుడని కూడా

అంటున్నారు. దేవుడు అపార కృపాశీలుడు, అనంత కరుణామయుడు అని ఎక్కువగా ఇస్లామ్ గ్రంథమైన ఖురాన్

గ్రంథమును చదువు ప్రతి ఒక్కరూ మొదట ఈ వాక్యమును చెప్పి తర్వాత గ్రంథమును చదువుటకు ప్రారంభింతురు.

అలా చేయడము ఒక విధముగా ఎంతో మంచి పద్ధతియే కాకుండా అలా చేయడము వలన దేవునిమీద విశ్వాసము

లేనివారికి కూడా గ్రంథ ప్రారంభములోనే దేవుని మీద విశ్వాసము, దేవుడంటే భయము, భక్తి రెండూ కల్గును. అయితే

సమాజములో దొంగను కొట్టి దొంగతనమును నివారించినా, అత్యాచారము చేయువానిని గాయపరచి మానభంగమును

జరుగకుండా నివారించినా, అవి మంచి పనులే అయినా అప్పుడు సమయా సందర్భానుసారము దొంగనూ, అత్యాచారము

చేయువానినీ దండించి కొట్టడము చట్టము దృష్ఠిలో నేరమైనట్లు గ్రంథపఠనము మొదటిలో దేవున్ని ఏదో ఒక మాటతో

తలచుకోవడము మంచిపనే అయినా, అలా మొదట తలుచుకోవడము తప్పుకాదుగానీ, అక్కడ చెప్పుమాటను శాస్త్రము

ఒప్పుకోదు. శాస్త్రము ఒప్పుకోదు అంటే అది దేవుని దృష్ఠిలో కూడా తప్పనియే అర్థము. ఇక్కడ అందరూ బాగా

అర్థము చేసుకోవలసిన అవసరమేమనగా! ముఖ్యముగా మొదట దేవున్ని తలచుకోవడము చాలా మంచిపని, అయినా

దేవున్ని దేవునిగానే తలచుకోవాలి. ఆయన (దేవుని) గౌరవమునకుగానీ, దేవుని ధర్మమునకు గానీ, భంగము కలిగించని

ఏ వాక్యముతోనైనా, ఏ మాటతోనైనా ఆయనను తలచుకోవచ్చును, తలచుకొని ప్రారంభించవచ్చును. అలా చేయడయు

అందరి కర్తవ్యము. అయితే మనము ఏ మాటతో దేవున్ని తలచుకొంటున్నామో, ఆ మాట దేవుని యొక్క ధర్మమును

తెలియ జేయునదిగా ఉండవలెను. అట్లు కాకుండా దేవుని ధర్మమునకు, దేవుని సహజత్వమునకు వ్యతిరేఖముగా

ఉండకూడదు. అట్లు ఎక్కడైనా ఉంటే దానిని సవరించుకొని దేవుని ధర్మమునకు భంగము కలుగకుండా చూడడము

ప్రతి ఒక్కరి కర్తవ్యము.


భౌతిక తండ్రిమీద అందరికీ ప్రేమ గౌరవము ఉండును. తండ్రిని గౌరవించు కొడుకు ఇతరులకు తన

తండ్రిని పరిచయము చేయునప్పుడు వీడు నా తండ్రి అని చెప్పితే ఆ మాట గౌరవప్రదముగా ఉండదు. వీడు

అనుచోట ఈయన అను పదము వాడితే బాగుండును. ఒకవేళ వీడు అనకుండా ఈయన అను పదమునుపయోగించి

చెప్పినా ప్రక్క పదమును సరిగా వాడకపోయినా బాగుండదు. ఈయన నా అమ్మకు మొగుడు అనినా లేక ఈయనగారు

నన్ను పుట్టించినవాడు అనినా, ఈయన నా అన్నకు తండ్రి అనినా, ఇవన్నియు గౌరవమైన వాక్యములు కావు. అట్లు

కూడా కాకుండా తన తండ్రిని గొప్పవానిగా చెప్పుకొనుటకని నా తండ్రి గొప్ప హంతకుడు, అందరూ ఆయనకు

భయపడుతారని చెప్పినా, నా తండ్రికి అందరూ నమస్కరిస్తారు లేకపోతే తంతాడని అందరూ వంగి నమస్కరిస్తారని

చెప్పినా, ఆ వాక్యములు పూర్తిగా తప్పగును. అందరూ ఆయనకు భయపడుతారని చెప్పడము మంచిదే, అందరూ

నమస్కరిస్తారని చెప్పడమూ మంచిదే, అయితే దానికి ముందరవాడిన పదములు తండ్రి గౌరవమునకు భంగము

కల్గించునని చెప్పక తప్పదు. అలాగే ఎవరైనా తెలియకగానీ, పొరపాటుగా గానీ, అందరూ అనినట్లే అనవలెననిగానీ

చెప్పడము జరిగితే దానిని తప్పని చెప్పడములో తప్పులేదు. దేవుని గౌరవమును ధర్మమును గొప్పగ ఉంచుటకే


చెప్పుచున్నాముగానీ వేరు ఉద్దేశ్యములేదు కదా! అందువలన ఇక్కడ ఒక హేతువాది అడిగిన ప్రశ్నకు జవాబును

చెప్పుచున్నాము.


మనుషులు కొంత వయస్సు వచ్చినప్పటినుండి ప్రతి క్షణము ఏదో ఒకటి సంపాదించుకోవాలను ఉద్దేశ్యముతో

ఉందురు. దాని ప్రకారమే పనులు చేయుచు ధనమును, బంగారమును సంపాదించుకొని మిగిలిన దానినంతటినీ

బ్యాంకులో దాచుకొనియుందురు. తనకు అవసరమొచ్చి నప్పుడు బ్యాంకులో నిలువయుంచుకొనిన ధనమునుగానీ,

బంగారమును గానీ వాడుకొనుచుందురు. దొర అను ఒకడు గ్రామీణ బ్యాంకులో తాను వయస్సులో ఉన్నప్పుడు

సంపాదించుకొన్న ధన కనకములను రెండిటినీ దాచుకొన్నాడు. దాచుకొన్న ధనమునూ, బంగారమును వాడుకొనుచూ

తన వృద్ధాప్యమును గడుపుచుండెను. అలా తన సంపాదనను గ్రామీణ బ్యాంకునుండి వాడుకొనుచూ, కాలము గడుపుచున్న

దొర గ్రామ సర్పంచిని చూచి “ఊరికి ప్రెసిడెంట్ అంటే ఊరి ప్రజలకు సహాయము చేయాలి కదా! గ్రామ సర్పంచి

అంటే గ్రామములోని వారందరికీ మేలు చేయాలి కదా! అటువంటి గ్రామ సర్పంచి ఊరిలోని ఎవరికీ ఒక రూపాయి

కూడా ఇచ్చి సహయపడ లేదు. ఊరిలో ఎందరో బీదవారున్నారు. గ్రామసర్పంచి గ్రామములోని వారందరినీ ఆదుకొని

అందరికీ కూడూ గుడ్డ ఇవ్వాలి కదా! గ్రామ ప్రజలను పట్టించుకోని వాడు గ్రామమునకు సర్పంచి అని ఎలా

చెప్పుకుంటాడు” అని అన్నాడట. అలా అనడమే కాదు తనకు సహాయము చేయలేదని దూషించడము కూడా జరిగినది.


గ్రామసర్పంచి అయినవాడు తనకున్న అధికారము ప్రకారము గ్రామములోని వీధులనూ, వీధిదీపములనూ,

త్రాగునీటి సౌకర్యమునూ, గ్రామ వీధులలో చెత్తాచెదారము పేర్కొనకుండా చూడడమూ మొదలగు గ్రామ సౌకర్యములు

చేయువాడుగా ఉంటాడుగానీ, గ్రామములోని వ్యక్తులకు వ్యక్తిత్వ సహాయము చేయువాడుగా ఉండడు. ఊరిలోని

పేదవారికి కూడూ గుడ్డ ఇవ్వాలని గ్రామ సర్పంచి విధులలో లేదు. గ్రామ సర్పంచి (ఊరి ప్రెసిడెంట్) అయినవాడు

గ్రామమునకు ప్రభుత్వము తరపున సహాయ కారిగా ఉంటాడుగానీ, గ్రామములోని వ్యక్తుల వ్యక్తిగత అవసరములకు

సహాయకారిగా ఉండడు. అలాగే దేవుడు అనువాడు విశ్వమును పాలించు వాడుగానీ, మనుషులకు ఉపయోగపడువాడు

కాడు. ఒక గ్రామములో దొర అనువాడు తన వయస్సులో సంపాదించుకొన్న ధన కనకములను గ్రామీణ బ్యాంకులో

దాచుకొన్నట్లు మనిషి అనువాడు ప్రతి ఒక్కడూ తన గత కాలములో సంపాదించుకొన్న పాపపుణ్యములను 'విధి విధాన

బ్యాంకు' అనబడు ప్రారబ్ధకర్మములో ఉంచుకొన్నాడు. అలా ప్రారబ్ధకర్మలో ఉన్న పాపపుణ్యములను తిరిగి మనిషి

అనుభవించుచుండును. ఇది సర్వసాధారణ ముగా అందరికీ ఉన్న పద్ధతి. సృష్టినంతటినీ సృష్టించిన సృష్టికర్త అయిన

దేవుడు సృష్ఠినంతటినీ పాలించు అధికారము కల్గియుండునుగానీ, సృష్ఠిలోని జీవులైన మనుషులకు వ్యక్తిగత కోర్కెలను

తీర్చుటకు దేవుడు లేడు. మనిషి కోర్కెలను తీర్చడము దేవుని విధానములో లేదు. అందువలన దేవుడు ఎవరికీ

వ్యక్తిగత సహాయము చేయడు. అటువంటపుడు దేవుడు సహాయము చేయలేదనడముగానీ, బీదవారిని ఆదుకోలేదనడము

గానీ మంచి పద్ధతి కాదు. దేవుని విధానమునకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును. అలాగే దేవున్ని సహాయకారి

అనడము వలన ఆయన చేయని పనిని ఆయనకు అంటగట్టి చెప్పినట్లుగును. దేవుడు గుణరహితుడైనప్పుడు ఆయనకు

కొన్ని గుణములను అంటగట్టి చెప్పడము ఆయనను కించపరచినట్లు కాదా! ఏమాత్రము దొంగతనము చేయని వానిని

దొంగ అనడము వలన అతనిని తప్పుగా ఆరోపించినట్లగుచున్నది. అలాగే ఏ గుణములేని దేవున్ని దయామయుడు

అనడము ఆయన (దేవుడు) చేయని పనిని ఆయన మీద ఆరోపించడము ఆయనను అవమానపరచినట్లు కాదా!


ఏమాత్రము చెవుడు లేని వానిని చెవిటివాడు అనడము ఎంత తప్పో, అలాగే బాగా చూచువానిని గ్రుడ్డివాడు

అనడము ఎంత తప్పో. బాగా నడిచేవానిని కుంటివాడు అనడము ఎంత తప్పో, అలాగే ఏ గుణము లేని గుణరహితుణ్ణి,

గుణము కలవాడనడము అంతే తప్పగును. దయా రహితుణ్ణి దయామయుడు అనడము పూర్తి తప్పగును. దేవుడు

రూప, నామ, క్రియా రహితుడు. అంతేకాక దేవుడు గుణరహితుడు, కర్మరహితుడు, జన్మరహితుడు. మనిషికి రూపమున్నది

కావున ఆ రూపమునకు తప్పనిసరిగా పేరు ఉంటుంది. రూపమున్న వానికి పేరున్నట్లే, పేరున్నవానికి పని కూడా

ఉంటుంది. ఈ విధముగా రూప, నామ, క్రియలు ఒకదానితో మరొకటి సంబంధము కల్గియున్నాయి. అంతేకాక

ఎక్కడైతే ఎవరికైతే రూప, నామ, క్రియలున్నాయో అక్కడ వారికి గుణ, కర్మ, జన్మలుండును. మనిషికి రూప నామ,

క్రియలున్నాయి కావున గుణ, కర్మ, జన్మలున్నాయి. దేవునికి ఏవిలేవో మనిషికి అవి అన్నియు ఉన్నాయి. మనిషికున్న

రూప నామ క్రియలు మరియు గుణ, కర్మ, జన్మలు దేవునికి లేవు. ఎవరికైతే గుణములు ఉండునో వారికి కర్మలుండును,

ఎవరికి కర్మలుండునో వారికి తప్పక జన్మలుండును. ఈ విధముగా గుణ, కర్మ, జన్మలు ఒకదానితో ఒకటి సంబంధము

కల్గియున్నవి. దేవునికి రూప నామ క్రియలు లేకుండుట వలన గుణ, కర్మ, జన్మలు కూడా లేవని చెప్పవచ్చును.

అందువలన బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి పైకి స్థూలముగా కనిపించు రూప, నామ, క్రియ, జన్మలుగానీ, పైకి

కనిపించని గుణ కర్మలుగానీ, దేవునికి లేవు అని చెప్పవచ్చును. రూప, నామ, క్రియలుగానీ, గుణ, కర్మ, జన్మలు గానీ

మనిషికుండును. ఈ ఆరులో ఏ ఒక్క దానినైనా దేవునికున్నవని చెప్పితే ఆ మాట దేవుని గౌరవమును భంగపరచినట్లుగును.

దేవున్ని తక్కువ చేసి మనిషిస్థాయికి దిగజార్చి మాట్లాడినట్లగును. అందువలన దేవునికి దయ అను గుణమున్నట్లు

చెప్పకూడదు. అట్లు దేవున్ని కరుణామయుడు అని తెలియకముందు అనినా ఆయనను గురించి తెలుసుకొన్న తర్వాత

ఎవరుగానీ దేవున్ని దయ లేక కరుణ కలవాడని అనడము తప్పగును.



మనిషి దేవుని విధానము అయిన జ్ఞానమును, ధర్మమును సరిగా తెలియనివాడై, దేవుని మీద గౌరవముతోనే

దేవున్ని తప్పుగా ఉచ్ఛరించితే అది తప్పే అగును. అందువలన తెలిసిగానీ, తెలియకగానీ, దేవున్ని కించ పరచడముగానీ,

ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడడముగానీ చేయకూడదు. దేవుని గ్రంథములలో ఎక్కడగానీ దేవుడు తనను దయకలవాడని

చెప్పుకోలేదు. దేవున్ని గురించి మనిషి చెప్పిన వాక్యములలో దేవున్ని దయకలవాడని చెప్పడము జరిగినది. భగవద్గీత

దేవుని గ్రంథమైనా అందులో మొదట గల అర్జున విషాదయోగము దేవుడు చెప్పినది కాదు. అర్జున విషాధయోగము

మనిషి అయిన అర్జునుడు చెప్పినది. అలాగే ఖురాన్ గ్రంథము దైవగ్రంథమైనా అందులో మొదటి సురా ‘అల్ ఫాతిహ’

సురాకంటే ముందు వ్రాసిన వాక్యము మనుషులు వ్రాసినదేగానీ దేవుడు చెప్పినది కాదని తెలియాలి. మొదటి

సురాలోని ఏడు వాక్యములు దేవున్ని మనుషులు కొనియాడునవి మాత్రముగా ఉన్నవి. అవి దేవున్ని పొగడు వాక్యములేగానీ,

దేవుని జ్ఞానమును తెలుపు వాక్యములు లేవు. కొన్ని దేవున్ని పొగడునవిగా ఉన్నవి. దేవుడు పొగడ్తలకు లొంగడు.

ఆయన జ్ఞానమునకు మాత్రము వశుడుకాగలడు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన దేవుని

పేరుతో మొదలు పెట్టుచున్నానని ముస్లీమ్లు ఖురానన్ను చదువను మొదలు పెట్టుదురు. అయితే దేవున్ని గౌరవించుటకు

ఆ వాక్యమును వాడినా, అవి వాస్తవముగా దేవుని గౌరవమునకు భంగమును కల్గించు చున్నవి. దేవుని జ్ఞానము

తెలియని నాస్తికులు కొందరు, దైవభక్తులు దేవున్ని దయామయుడు అంటే, వారు చెప్పినదే నిజమని నమ్మినవారై

విమర్శించు ధోరణిలో దేవుడు దయామయుడైతే అందరికీ సమానముగా ఎందుకు సహాయపడలేదని అడుగుచున్నారు.

వాస్తవముగా దేవుడు వ్యక్తి గత సహాయము చేయువాడుకాదని, తెలియని వారు చెప్పిన మాటలనుబట్టి కొందరు


దేవుడు అందరికీ సమానముగా ఎందుకు సహాయపడలేదని అడిగియుండవచ్చును. దైవజ్ఞానమును తెలియగలిగితే

దేవుని ధర్మము ప్రకారము దేవుడు దయామయుడుగానీ, కృపాశీలుడుగానీ కాడని తెలియబడుచున్నది.


దేవున్ని గురించి ఎంతో ప్రయత్నించి సంపూర్ణముగా జ్ఞానమును తెలిసినామని ఎవరైనా అనుకొనినా, దేవుడు

అనంతుడు కావున ఆయన జ్ఞానము కూడా అనంతమైనదిగానే ఉండును. అందువలన దేవుని జ్ఞానమును సంపూర్ణముగా

తెలిసినవారు ఎవరూలేరని చెప్పవచ్చును. కొందరు దైవ జ్ఞానమును పూర్తి తెలిసామని మాట్లాడినా, వారి మాటలు

అసంపూర్ణముగా, అశాస్త్రీయముగా ఉండవచ్చును. అటువంటి మాటలను కొందరు సాకుగా తీసుకొని దేవుడు

కల్పితుడు, అబద్ధుడు, దేవుడున్నాడనుట అసత్యము అనువారు కూడా కలరు. కొందరు చెప్పిన జ్ఞానమును, కొందరు

వ్రాసిన పురాణములను, వేదములను ఆసరాగా చేసుకొని పురాణములలో శాస్త్రము లేదని తెలిసి, పురాణముల ప్రకారము

దేవున్ని విమర్శించు నాస్తిక వాదులు కలరు. అటువంటివారికి మేము తెలుపునది ఏమనగా! అష్టాదశ పురాణములను

(18 పురాణములను) వదిలి బ్రహ్మవిద్యాశాస్త్రమును చదవండి. బ్రహ్మవిద్యాశాస్త్రము శాస్త్రబద్ధమైనదై అన్నిటికీ జవాబుగా

ఉన్నది. బ్రహ్మవిద్యాశాస్త్రము దేవుని విధానమును ఖచ్చితముగా తెలుపుచుండగా ఎవరూ ప్రశ్నవేయలేరు. బ్రహ్మ

విద్యాశాస్త్రములో జ్ఞానికానటువంటి వానికి దేవుని మీద ప్రశ్నలు వేయుటకు బుద్ధి పుట్టును. అలా కొందరు నాస్తికులుగానీ,

ఆస్తికులుగానీ ప్రశ్నించినపుడు దానికి దేవుని విధానముతో పూర్తి జవాబులు శాస్త్రబద్ధముగా రాగలవు.


హిందువులలో నాస్తికులు కొందరుండగా, ఆస్తికులు ఎందరో ఉన్నారు. నాస్తికులు దేవున్ని విమర్శిస్తూ ప్రశ్నలను

అడుగగా, ఆస్తికులైన వారు ఇతర మతములను గురించి, ఇతర దేవుళ్ళను గురించి విమర్శిస్తూ ప్రశ్నించుచుందురు.

అటువంటి పద్ధతిలో ఒక ఆస్తిక హిందువు క్రైస్తవ మతములోని ఆస్తికులను విమర్శిస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న

గతములో మాకు కూడా వచ్చినది, అప్పుడు ఆ ప్రశ్నకు జవాబుగా “శిలువ దేవుడా?" అను పేరుతో ఒక చిన్న

గ్రంథమును వ్రాయడము జరిగినది. ఇక్కడ ఆ ప్రశ్నకు కొద్దిపాటి జవాబును ఇవ్వగలను దానిని చూచి గ్రహించు

కోగలరని అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన జవాబు సరిగా అర్థము కాకపోతే మేము వ్రాసిన గ్రంథమును

చూడండి.


ఆస్తిక ప్రశ్న :- మేము హిందువులము, మాకు అనేకమంది దేవతలున్నారు. మా ఇంటి దేవుడు నరసింహస్వామి.

అందువలన అడవిలోని అహోబిలము నరసింహస్వామిని మేము పూజించి ముడుపులు సమర్పించుచుందుము. మమ్ములను

చూచిన క్రైస్తవులు మీరు విగ్రహాలైన బొమ్మలను పూజిస్తారు, అవి కనబడుతానే వంగి నమస్కరిస్తారు. మా మతములో

ఏ బొమ్మనూ పూజించము, గౌరవించము. మీరు పూర్తి మనిషి ఆకారము కూడా లేని నరసింహుడు, ఆంజనేయుడు

మొదలగు దేవతలను పూజిస్తున్నారు. మేము ఎవరినీ పూజించక ఎహోవా దేవున్ని ఒక్కన్నే ప్రార్థిస్తున్నాము అని

హేళనగా మాట్లాడినారు. అప్పుడు నాకు కోపము వచ్చి మీరు శిలువ బొమ్మను గౌరవించడము లేదా? కళ్ళకు

హత్తుకొని మెడలో వేసుకొని అప్పుడప్పుడు చూచుకోవడము లేదా? మేము జంతువుల తలకాయలున్న దేవుళ్ళను

మ్రొక్కితే, మీరు పొట్టికట్టె ఒకటి, పొడవు కట్టె ఒకటి (మేము పిల్లప్పుడు ఆడుకొను చిల్లకట్టెలాంటి) రెండు కట్టెల

ఆకారమైన శిలువకు మ్రొక్కడము లేదా! అని అడిగాను. నామాట ప్రకారము వారు ఆంధ్రానుండి అమెరికా వరకు

మెడలో శిలువను వ్రేలాడదీసుకొన్నారు. ఒక నిలువుకట్టెకు ఒక అడ్డకట్టె నుంచి అది శిలువయని దానిని గౌరవించినపుడు

మేము విగ్రహము లకు మొక్కడము తప్పా? వారు శిలువను గుడిలో పెట్టి పూజించకున్నా మెడలో వేసుకొని గుడిలోని

దేవునికంటే ఎక్కువ గౌరవముగా చూచు కొంటున్నారు కదా! వారి శిలువ వారికి కూడా విగ్రహములాంటిదే కదా!

దీనికి మీరేమంటారు?


మా జవాబు :- హిందువులు దేవుడను నమ్మకముతో దేవుడుకాని వారిని పూజించుచున్నారనడములో తప్పులేదుగానీ,

క్రైస్తవులు కూడా దేవుడుగాని శిలువను గౌరవించుచూ హిందువులకంటే పెద్ద తప్పు చేయుచున్నారు. దేవునికి శాస్త్రీయమైన

ఒక విధానమున్నది. అది ఏమనగా! మనిషికి తెలిసిన రూప, నామ, క్రియలుగానీ, మనిషికి తెలియని గుణ, కర్మ,

జన్మలు గానీ దేవునికి లేవు. అవి లేనటువంటి వాడు దేవుడు అనునది బ్రహ్మవిద్యా శాస్త్రములోని సూత్రము. ఈ

సూత్రమునకు వ్యతిరేఖముగానున్న హిందువు ఆచరణగానీ, క్రైస్తవుల ఆచరణగానీ, ముస్లీమ్ల ఆచరణగానీ తప్పగును.

మంచి చెడులనునవి అన్ని మతములలోనూ ఉన్నవి. అయినా గురిగింజ నలుపు కనిపించక క్రింద ఉండుట వలన

తాను అంతా ఎర్రగా ఉన్నానని అనుకొన్నట్లు, ప్రతి మతస్థుడు తన తప్పును మరచిపోయి, ఎదుటివారి తప్పును వ్రేలెత్తి

చూపుచుందురు. హిందువులు విగ్రహారాధన తప్పుయి నప్పుడు, క్రైస్తవులు శిలువను ధరించడము కూడా తప్పగును.

అట్లే ముస్లీమ్లు దర్గాలకు మ్రొక్కడము కూడా తప్పగును. హిందువులది భగవద్గీత ప్రకారము విగ్రహారాధన తప్పే.

అట్లే బైబిలు ప్రకారము క్రైస్తవులు శిలువ ధరించడము తప్పే. అలాగే ఖురాన్ ప్రకారము ముస్లీమ్లు దర్గాల పూజ

చేయడము తప్పే. ఎవరి తప్పులను వారు మరచి, మూడు మతముల వారు వారివారి గ్రంథములను మరచిపోయి,

అందులోని జ్ఞానము తెలియక, తమ తప్పును తాము గుర్తించక, ఎదుటివారిని తప్పుపట్టడము సరియైన పద్ధతి కాదు.

విగ్రహాలను మ్రొక్కడము తప్పు అని హిందువును విమర్శించిన క్రైస్తవులు, తాము శిలువను ధరించడమూ, చర్చీల మీద

శిలువను పెట్టుకోవడమూ తప్పనీ, అది కూడా విగ్రహారాధనలాంటిదేనని అనుకోవడము లేదు. క్రైస్తవులు శిలువను

గొప్పగా పెట్టుకోవడము ఎంత తప్పగునో, హిందువులు విగ్రహారాధన చేయడము అంతే తప్పగును. క్రైస్తవులది ఎలా

తప్పగుచున్నదో వివరిస్తూ “శిలువ దేవుడా?” అను గ్రంథములో వ్రాయడము జరిగినది. క్రైస్తవులుగానీ, హిందువులుగానీ

తమ తప్పును గ్రహించుకొని, విగ్రహాలను హిందువులు వదలి అసలైన దేవున్ని ఆశ్రయించాలి. అలాగే క్రైస్తవులు

శిలువను వదలి అసలైన దేవున్ని అనుసరించాలి. అంతవరకూ ఇద్దరిదీ తప్పగును.


ఆస్తికుని ప్రశ్న :- కొంతకాలముగా జన విజ్ఞానవేదిక అను ఒక సంస్థ ప్రజలలో చైతన్యము తెచ్చి, మూఢనమ్మకములను

నమ్మకుండ మేల్కొలుపు పనిని చేయాలను ఉద్ధేశ్యముతో పని చేయుచున్నది. అందులోని సభ్యులు మూఢనమ్మకములను

ఖండించుచూ శాస్త్రీయమైన విధానమును బోధించు దుమని చెప్పుచుందురు. ఈ మధ్యకాలములో ఉబ్బసవ్యాధికి

చేపమందు అను దానిమీద వారి దృష్టిని కేంద్రీకరించి చేపమందు మందుకాదనీ, ప్రజలు మూఢముగా దానిని మందని

నమ్ముచున్నారనీ, చేపమందులో ఎటువంటి శాస్త్రీయమైన మందులేదనీ ప్రచారము చేయుచున్నారు. మీరు కూడా

ప్రతిమాటకు శాస్త్రీయత అనిగానీ, శాస్త్రము ఆధారముగా ఉండవలె నని గానీ చెప్పుచుందురు కదా! అటువంటపుడు

మీకు తెలిసిన శాస్త్రపద్ధతి ప్రకారము చేపమందు మూఢనమ్మకమేనా? దానిని గురించి మీరేమందురు?


మా జవాబు :- శాస్త్రము అనునది అందరికీ సమానమే అగును. శాస్త్రీయత లేని దానిని ఎవరైనా ఖండించవచ్చును.

అయితే ఇక్కడ ఒక ఉదాహరణ ప్రకారము ఖాకీడ్రస్సు వేసుకొన్న వారందరూ పోలీసులుగారు (రక్షకభటులు కారు).

ఖద్దరుగుడ్డలు ధరించిన వారందరూ పొలిటీషియన్స్ కారు (రాజకీయ నాయకులు కారు) అదే విధముగా సైన్సు అని

మాట్లాడిన వారందరూ విజ్ఞానులు కారు, శాస్త్రము అని చెప్పువారందరూ శాస్త్రవేత్తలుగారు. జన విజ్ఞానవేదిక వారు

చేపమందులో శాస్త్రీయత లేదు, దానిలో సైన్సు ప్రకారము మందులేదు అనినంతమాత్రమున వారు చెప్పిన మాటను

మనము మూఢముగా నమ్మకుండా, వారు చెప్పినమాట శాస్త్రమును అనుసరించి ఉందా, సైన్సును అనుసరించి ఉందా

అని పరిశీలించి చూడాలి. అలా చూడకుండా వారు చెప్పారు మనము విన్నాము అంటే అది మూఢనమ్మక మౌతుంది.

అటువంటి పరిశీలనలో మనము విజ్ఞానము అంటే ఏమిటో మొదట తెలుసుకొందాము.


ఏదైనా ఒక విషయమును గురించి వివరమును ఇచ్చునది జ్ఞానము. ఒక విషయమును వివరముగా

తెలియబరుచునది జ్ఞానము. తెలియబడిన వివరము ప్రకారము లేక జ్ఞానము ప్రకారము అనుభవమునకు వస్తే అది

విజ్ఞానమగును. తెలియబడునది జ్ఞానము, అనుభవానికి వచ్చునది విజ్ఞానము. జ్ఞానము అనగా తెలియబడునది

అయినప్పుడు విశేష జ్ఞానము కలదానిని విజ్ఞానము అంటాము. అనుభవముతో తెలుసుకొన్న దానిని విజ్ఞానము

అనుచున్నాము. జ్ఞానము బుద్ధికి తెలియునది కాగా విజ్ఞానము జీవుని అనుభవమునకు వచ్చుచున్నది. ఏ విషయ

వివరమైనా అనుభవానికి రాకముందు జ్ఞానమగును. అనుభవానికి వచ్చిన తర్వాత విజ్ఞానమగును. ఉదాహరణకు

లడ్డు తియ్యగ ఉండును అను వివరము జ్ఞానమగును. లడ్డును తిన్నప్పుడు అది తియ్యగా ఉందను వివరము

ప్రకారము తెలిసి పోవడము విజ్ఞానమగును. ఒకడు లడ్డును తినకున్నా వానికి లడ్డు తియ్యగ ఉంటుందని ఇతరుల చేత

తెలియబడినది. ఇంకొకనికి లడ్డు విషయమే తెలియదు, అటువంటి వానికి లడ్డు దొరికింది, తినడము జరిగింది.

అప్పుడు బెల్లమువలె లడ్డు తియ్యగా ఉందని అనుభవము ద్వారా తెలుసుకొన్నాడు. అనుభవము లేకున్నా లడ్డు

తియ్యగా ఉండునని ఇతరుల ద్వారా తెలుసుకొని చెప్పుమాటగానీ, లడ్డును తిని అనుభవము ద్వారా లడ్డు తియ్యగా

ఉందని చెప్పుమాటగానీ రెండూ సత్యమే అగును. అందులో ఒకటి జ్ఞానముగా ఉన్నది, రెండవది విజ్ఞానముగా

ఉన్నది. ఇంతవరకు జ్ఞానమంటే ఏమిటి మరియు విజ్ఞానమంటే ఏమిటని అర్థమయ్యిందనుకొంటాను.


ఇప్పుడు శాస్త్రము మరియు శాస్త్రీయత అను విషయము గురించి చెప్పుకొందాము. శాసనము అను శబ్దమునుండి

పుట్టినది శాస్త్రము. శాసనము అనగా అమలు చేయబడునదని అర్ధము. శాస్త్రము అనగా జరిగి తీరునదని అర్థము.

శాస్త్రము చెప్పినట్లు అమలు జరిగిన దానిని 'శాస్త్రీయత' అంటారు. జరుగబోవు దానియొక్క నియమములను శాస్త్రము

అనగా శాస్త్రముయొక్క నియమముల ప్రకారము జరుగడమును శాస్త్రీయత అంటారు. మరొక విధముగా చెప్పితే

శాస్త్రము అనగా జ్ఞానము అనియూ, శాస్త్రీయత అనగా విజ్ఞానము అనియూ చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే

శాస్త్రము అనగా సత్యమనియూ, శాస్త్రీయత అనగా అనుభవ సత్యము లేక ప్రత్యక్ష సత్యమనియు చెప్పవచ్చును. సత్యము

కాని దానినీ, అనుభవమునకు తెలియని దానినీ అసత్యము లేక అశాస్త్రము అనవచ్చును. శాస్త్రము అనునది సత్యమునకు

మారుపేరనీ, అశాస్త్రము అనగా అసత్యమనీ తెలిసిపోవుచున్నది. ఒక సత్యమును ఇతరుల ద్వారా తెలుసుకొనినా లేక

ప్రత్యక్షముగా అనుభవించినా దానిని అసత్యమనుటకు వీలులేదు. ఒక సత్యమును అనుభవించైనా తెలుసుకోవచ్చును,

లేక వినైనా తెలుసుకో వచ్చును. ఇతరులు అనుభవించిన అనుభవమును తెలుసుకొనినా, లేక తాను స్వయముగా

అనుభవము ద్వారా తెలుసుకొనినా రెండూ సత్యమే, రెండూ శాస్త్రసమ్మతమే అగును. అందులో తెలుసుకొన్నది శాస్త్రము

అయితే, అనుభవముతో తెలుసుకొన్నది శాస్త్రీయత అంటాము. శాస్త్రము అనినా శాస్త్రీయత అనినా రెండూ సత్యమే

అగును. అవి రెండూ సత్యమునకు మారుపేరులాంటివి.


ఇప్పుడు ఒక విషయమును తీసుకొని అందులోని శాస్త్రము ఏమిటో శాస్త్రీయత ఏమిటో పరిశీలిద్దాము. రామయ్య

అనువాడు తోటయ్య అను వానితో “నాకు తేలు కుట్టింది, తేలు విషము చాలా బాధగా ఉంటుందని నాకు బాగా

అర్థమైనది. బాధను ఇరవై నిమిషములు అనుభవించిన తర్వాత తేలు విషమునకు మందువాడితే అప్పుడు బాధ

తగ్గిపోయినది. అలా జరిగిన సరిగా నెల తర్వాత మరియొకమారు తేలు కుట్టడము జరిగినది. అప్పుడు కూడా తేలు

విషముతో చాలా బాధపడినాను. ఆ సమయములో తేలు విషమునకు మందు ఎక్కడా లభించలేదు. చివరకు అరగంట

తర్వాత ఔషధవైద్యుడు కాకుండ మంత్రవైద్యుడు దొరికాడు, అయితే నేను మంత్రమును నమ్మేవాడిని కాను, అయినా


బాధను తట్టుకోలేక అతనితో వైద్యము చేయించుకొనేదానికి అతనివద్దకు పోయాను. అప్పుడు అతను ఏదో చిన్న

మంత్రమును పది లేక పదకొండుమార్లు ఉచ్ఛరించి తర్వాత గాలిని నీటిలోనికి ఊది, గ్లాస్ లోని నీరును త్రాగమన్నాడు.

అప్పుడు నేను ఆ గ్లాస్లోని నీటిని త్రాగిన వెంటనే, అర నిమిషములోపలే అప్పటి వరకు బాధించుచున్న విషము పని

చేయకుండా పోయి బాధ పూర్తిగా తగ్గిపోయింది. అంతవరకు మంత్రములను నమ్మని నేను ప్రత్యక్ష అనుభవము వలన

మంత్రములున్నవని నమ్ముచున్నాను. అంతేకాక తేలు విషమును గురించి దాని బాధను గురించి ఇతరులు చెప్పుతూవుంటే

దానిని కూడా పూర్తి నమ్మేవాడిని కాను. ఇప్పుడు నేను స్వయముగా అనుభవించిన తర్వాత విషము బాధ తెలిసిపోయింది,

అట్లే మంత్రము యొక్క పనితనము తెలిసి పోయినది. ఇప్పుడు నాకు అర్థమైనదేమంటే, నేను నమ్మనంతమాత్రమున

సత్యము అసత్యము కాదనీ, ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సత్యము ఎప్పటికీ సత్యమేనని తెలిసిపోయింది" అని

అన్నాడు. ఇది ఒకరి ఎడల యదార్థముగా జరిగిన సంఘటన అయినందువలన దీనిని అందరూ ఒప్పుకొని తీరవలసిందే.


అయితే ఈ విషయము సత్యమని ఎవరు ఎంత అరచి మొరపెట్టు కొన్నా దానిని మేము నమ్మముగాక నమ్మము

అను వారు కూడా ఎందరో కలరు. అటువంటి వారిలో మనకు తెలిసిన జన విజ్ఞాన వేదికవారు ముఖ్యులు. వారు

తేలును నమ్మినా, తేలు విషబాధను నమ్మినా, ఆ బాధ మంత్రముతో పోయిందను మాటను మాత్రము నమ్మరు. వారు

నమ్మనంత మాత్రమున అది అసత్యమా అంటే అలా కూడా కాదు. తేలు విషబాధ మంత్రముతో నివారించబడినదనుట

పూర్తి సత్యము, యదార్థముగా జరిగిన ప్రత్యక్ష విషయము. జరిగిన ప్రత్యక్ష సత్యమును శాస్త్రీయత అంటాము. ఆ

విషయము యొక్క వివరము తెలియడమును శాస్త్రము అంటాము. అనుభవమును శాస్త్రీయత అంటున్నామని ముందే

చెప్పుకొన్నాము. ఇప్పుడు తేలు విష బాధ మంత్రము చేత తగ్గుతుందని అనుభవము ద్వారా తెలిసిన వానికి శాస్త్రీయతయనీ,

వాడు చెప్పినది శాస్త్రమని చెప్పక తప్పదు. అయితే మాకు సైన్సు తెలుసు మేము దేశ విజ్ఞానులము, ప్రపంచ

విజ్ఞానులమని చెప్పుకొనువారికి పూర్తి సైన్సు తెలియదు. కొంత సైన్సే తెలియును. అందువలన కొన్ని శాస్త్రములు

మాత్రమే వారికి తెలియును, కొన్ని శాస్త్రములు తెలియవని చెప్పవచ్చును. ప్రపంచములో ఉన్నవన్నీ ఆరు శాస్త్రములే

కాగా, చాలామంది విజ్ఞానులకు నాలుగు శాస్త్రములే తెలుసు, మిగత రెండు శాస్త్రములు తెలియవు. నాలుగు

శాస్త్రములే సర్వస్వమనుకొన్న వారికి ప్రపంచములో జరుగు ప్రత్యక్ష విషయములకు జవాబుగానీ, వివరము గానీ

తెలియదు. తమకు తెలియని ఎన్నో సత్యములను వారు అసత్యములనీ, కల్పితములనీ, నాటకములనీ, బూటకములనీ,

రోగములనీ పేరుపెట్టి దాట వేయుచుందురు. ముమ్మడివరములో బాలయోగి కదలక మెదలక కొన్ని సంవత్సరములనుండి

కూర్చున్నా దానికి వివరము తెలియనివారు తాము విజ్ఞానులమని చెప్పుకొనుచూ బాలయోగి అట్లుండుటకు కారణము

అది ఒక రోగలక్షణమని చెప్పుచున్నారు. గుజరాత్లో 75 సంవత్సరములుగా ఆహారముగానీ, నీరుగానీ తీసుకోకుండా

ఆరోగ్యముగానున్న ప్రహ్లాద్ జానీని బూటకము, నాటకమని అంటున్నారు. ఎవరికీ తెలియకుండా ఏదో ఒకటి

తీసుకొంటుంటాడని చెప్పుచున్నారు.


నీరులేకుండా కొన్ని గంటలు, ఆహారము లేకుండా కొన్ని రోజులు మాత్రము మనిషి బ్రతకగలడు. ఆహారము

నీరు లేకుండా 75 సంవత్సరముల నుండి ఉన్నాడనడము అబద్దము అంటున్నారు. భౌతిక శాస్త్రము ప్రకారము అలా

ఉండుటకు వీలులేదు అంటున్నారు. ఆ మాటకొస్తే భౌతికశాస్త్రము ప్రకారము నీరు ఆహారము లేకుండా ఉండుటకు

సాధ్యము కాదని మాకు కూడా తెలుసు. అయితే మరియొక శాస్త్రము ప్రకారము, మరియొక సైన్సు ప్రకారము అలా

బ్రతుకగలుగుటకు సాధ్యమని మాకు తెలుసు. తమకు తెలియని శాస్త్రములు మరికొన్ని ఉన్నాయనీ, తమకు అన్ని


శాస్త్రములు తెలియవనీ, అందువలన కొన్ని సత్యములకు వివరము తెలియదనీ జన విజ్ఞానులుగానీ, దేశ విజ్ఞానులు

గానీ అను కోవడము లేదు. కళ్ళ ఎదుట జరుగుచున్న సత్యములకు ఎందుకు వివరము తెలియదని వారు

ఆలోచించడములేదు. గర్భములో చనిపోయాడని డాక్టర్లు చెప్పిన శిశువు రెండు మూడు గంటల తర్వాత ఊపిరిపోసుకొని

బ్రతికితే! ఎందుకు అలా జరిగిందని అనుకోక డాక్టర్లు పొరపాటుపడినారని చెప్పుచున్నారు. అక్కడ జరిగిన సత్యమును

గాలికి వదిలివేయుచున్నారు. అలాగే చనిపోయినాడని డాక్టర్లు చెప్పిన తర్వాత చనిపోయిన శవము కొన్ని గంటలకు,

కొన్ని దినములకు బ్రతికి మాట్లాడి, లేచి నడువగల్గినా, జరిగిన సత్యమునకు వివరమును వెదకకుండా, అతను

చనిపోయివుండడు. మూర్చపోయివుంటే పొరపాటుగా చనిపోయాడని అనుకొన్నారని చెప్పి, జరిగిన యదార్థమునకు

వివరము తెలియక తిరిగి బ్రతికిన సత్యమును సమాధి చేయుచున్నారు. ప్రసవింపబడిన శిశువు కొన్ని గంటల తర్వాత

ప్రాణము పోసుకుంటే అది భౌతికశాస్త్రము కాదనువారు, అలాగే చనిపోయిన కొన్ని గంటలైన తర్వాత బ్రతికిన విధానమును

భౌతిక శాస్త్రము కాదనువారు, వీటికి వివరము ఇంకొక శాస్త్రములో ఏమైనా ఉందేమోనని ఎందుకు ఆలోచించలేదు?

ఒకవేళ తమకు తెలిసినాదనుకొను భౌతికశాస్త్రములోనే తమకు తెలియని విధానము ఇంకా మిగిలి ఉందేమోనని

ఎందుకనుకో కూడదు? ఒక అణువులోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లను వాటి రసాయనక్రియను తెలిసినంతమాత్రమున

అన్ని శాస్త్రములను తెలిసినవారిగా ఎందుకు భావించుకోవలెనని మేము ప్రశ్నించుచున్నాము.


భూమిమీద మేధావులైన విజ్ఞానులు కొందరు తమకు తెలియని సైన్సు ఇంకా ఎంతో ఉన్నదని చెప్పుచుండగా,

అరకొర సైన్సును తెలిసిన వారు, మేము విజ్ఞానులమనుకొనుచున్నారు. శాస్త్రమునకు అర్థము తెలియని వారు, శాస్త్రములు

ఎన్నో తెలియనివారూ మేము శాస్త్రజ్ఞులమని చెప్పు కోవడము జరుగుచున్నది. అటువంటివారు జన విజ్ఞానవేదికలో

ఎక్కువ మంది ఉండుట వలన నేడును చేపమందును మందుకాదంటున్నారు. చేపమందులో ఏ ఔషధము ఉన్నట్లు

శాస్త్రీయమైన ఆధారము లేదంటున్నారు. వారికి తెలిసిందే శాస్త్రము, వారికి దొరికిందే ఆధారము అంటే, మీకు తెలిసిన

శాస్త్రములు తప్ప వేరే శాస్త్రములే లేవా అని మేము అడుగుచున్నాము. అలాగే మీకు దొరికిన ఆధారములు తప్ప

కళ్ళకు కనిపించే సత్యములు మీకు ఆధారము కావా అని మేము అడుగుచున్నాము. మందులే లేని ఎయిడ్స్ రోగము,

సరియైన చికిత్సలేని క్యాన్సర్ జబ్బు, మందులకు కూడా అలవాటుపడి మందుకు లొంగక మనిషినే చంపు టి.బి రోగము

భౌతిక శాస్త్రము ప్రకారము మందులతో కాకుండా, భౌతిక విధానము ప్రకారము ఏ చికిత్స చేయకుండా దైవజ్ఞానశక్తితో

తొలగించుకోగల విధానము కూడా భూమిమీద ఉన్నది. రోగాలు కూడా కొన్ని భూతాలేనని, ఆ భూతాలు దైవము మీద

ఎంతో భక్తిశ్రద్ధలు కలిగియున్నాయని, ఏ మనిషయితే దేవుని మీద భక్తిశ్రద్ధలను పెంచుకొంటాడో అతనిని పెద్ద

రోగములుగా పేరు గాంచిన ఎయిడ్స్, కాన్యర్స్, టి.బి. మొదలగు రోగములు (భూతములు) గౌరవించి, వానిని ఏమీ

చేయక వదలిపోవునను ఒక విధానము కలదు. దైవజ్ఞానమును గౌరవించు రోగ భూతములు వారినుండి దూరము

పోవుననుట గ్రుడ్డిగా చెప్పునది కాదు. అలాగే అశాస్త్రీయముగా చెప్పునది కాదు. ప్రపంచములోనే అన్ని శాస్త్రములకంటే

పెద్దశాస్త్రము యొక్క ఆధారముతో చెప్పిన మాటగా తెలియవలెను. పెద్ద శాస్త్రముతో పెద్ద పనులను సాధించవచ్చును.

అటువంటి శాస్త్రము ఏదో, ఎట్లుంటుందో తెలియనివారు శాస్త్రవేత్తలెలా అవుతారు. మొదటిది పెద్దది అయిన బ్రహ్మ

విద్యాశాస్త్రములోని విజ్ఞానమును ఏమిటో తెలియనిదే, ఎవడూ విజ్ఞాని కాలేడు. అందువలన అన్ని ప్రశ్నలకు జవాబులను

చెప్పలేరు.


ప్రపంచములోని ఏ పదార్థమైనా రెండు రకములుగా విభజింపబడి యున్నదనుమాట ప్రాథమికముగా అందరూ


తెలియవలసినది. విజ్ఞానము ప్రకారము ఏ పదార్థముగానీ, స్థూలము, సూక్ష్మము అను రెండు భాగములతో నిర్మింపబడి

ఉన్నది. జీవమున్నదిగానీ, జీవము లేనిది గానీ ఏదైనా రెండు భాగములుగా విభజింపవచ్చునను మాట శాస్త్రబద్ధమైనది.

ప్రాణములేని చిన్న రాయిని తీసుకొని చూచినా, అందులో స్థూలము సూక్ష్మము ఇమిడి యున్నది. అలాగే ప్రాణమున్న

మనిషిని చూచినా శాస్త్రపద్ధతి ప్రకారము స్థూలము సూక్ష్మము అను రెండు భాగములుగా విభజింపబడియున్నవి. ఈ

విషయము మొదటి శాస్త్రము తెలియని వారికి తెలియదు. అందువలన ప్రపంచ సంబంధమైన గణిత, ఖగోళ, రసాయన,

భౌతికమను నాలుగు శాస్త్రములను తెలిసిన వారికి స్థూలము యొక్క విషయము తెలిసి యుండవచ్చునుగానీ, సూక్ష్మ

విషయము ఏమాత్రము తెలియదు. ఏ మనిషికైనా స్థూలము తెలిసి సూక్ష్మము తెలియకపోవడము వలన, ఒక

పదార్ధము యొక్క మొత్తము సమాచారములో సగము తెలిసి, మిగతా సగము తెలియదని చెప్పవచ్చును. అటువంటి

వానికి ఒక పదార్థములోని స్థూల భాగము యొక్క విషయము మాత్రము తెలిసియుండునుగానీ, సూక్ష్మ భాగముయొక్క

విషయము ఏమాత్రము తెలియదు. ఏ పదార్థములోనైనా స్థూలము కనిపించు కరెంటు వయర్లాంటిది. అలాగే

సూక్ష్మము కనిపించే వయర్లో కనిపించకయున్న కరెంటులాంటిది. వయర్లోని కరెంటులాగ సూక్ష్మమున్నదని

తెలియనివారికి, ఏ పదార్థములోనైనా ఉన్న సూక్ష్మము తెలియదనియే చెప్పవచ్చును.




ఆస్తమా వ్యాధికి నివారణగా ఇచ్చు చేపమందు స్థూలముగా కనిపించుచున్నా. అందులో ఎవరికీ తెలియని

సూక్ష్మము కూడా ఇమిడి యున్నది. కరెంటు తీగను పట్టుకొన్నవాడు చనిపోయాడు అంటే వాని చావుకు కనిపించు తీగ

కారణము కాదు. తీగలో సూక్ష్మముగా కనిపించక యున్న కరెంటని చెప్పవచ్చును. అలాగే చేపమందుతో ఆస్తమా

వ్యాధి నయమవుతుందని అంటే, స్థూలముగా కనిపించు చేపమందు వలన కాదు. ఆ చేపమందులోని కనిపించక

సూక్ష్మముగా అణిగియున్న శక్తి వలన అని తెలియవలెను. చేపమందులో భౌతికశాస్త్రము ప్రకారము మందు లేక

పోవచ్చును. అయితే అభౌతిక శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము అందులో సూక్ష్మమైన ఔషధమున్నది.

ఇప్పుడు సూక్ష్మమైన ఔషధమున్నదని ఎలా చెప్పగలుగుచున్నారని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చును. అంతేకాక మీరు

ఔషధమున్నట్లు ఆధారమును చూపగలరా అని అడుగవచ్చును. ఆ మాటకు మా జవాబు ఇలాగ ఉన్నది. సూదికున్న

దారమును అనుసరించి దారముయొక్క చివరికొనను కనుగొనవచ్చును. లేకపోతే దారము కొననుండి దారమును

అనుసరించి వచ్చి చివరకు సూదినైనా కనుగొన వచ్చును. శాస్త్రమూ, శాస్త్రీయత రెండు సూది దారములాంటివి.

సూదినుండి దారము కొననుగానీ, దారము కొననుండి సూది మొదలునుగానీ కనుగొన్నట్లు, శాస్త్రమును అనుసరించి

దాని ఫలితమైన శాస్త్రీయతను కనుగొనవచ్చును. లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యమైన శాస్త్రీయతను అనుసరించి శాస్త్రమునైనా

కనుగొనవచ్చును. ఇక్కడ అసలు విషయానికి వస్తే చేపమందు వలన ఆస్తమా రోగము బాగైనట్లు ఆధారములున్నవి.

ఆస్తమా రోగ నివారణ అనునది ప్రత్యక్ష సాక్ష్యమైన శాస్త్రీయత అయినందువలన కనిపించు శాస్త్రీయతను అనుసరించి

చివరికది ఏ శాస్త్రమో తెలియవచ్చును. జరిగిన సత్యము శాస్త్రబద్ధమైనప్పుడు, ఆ సత్యమును అనుసరించి దానికి

సంబంధించిన శాస్త్రమును తెలియవచ్చుననునది సూత్రముకాగా, ఆ సూత్రము ప్రకారము పరిశీలించి చూస్తే అక్కడ

భౌతికశాస్త్రము కనిపించడము లేదు. ఏ ఔషధ గుణములేని మందు ద్వారా రోగ నివారణ కావడమును చూస్తే అక్కడ

అభౌతికమైన బ్రహ్మవిద్యా శాస్త్రము కనిపించుచున్నది.


బ్రహ్మవిద్యాశాస్త్రమును ఎంతమంది తెలియగలిగారను ప్రశ్నకు కొన్ని లక్షలమందికిగాను ఒక్కరు తెలిసినారనుట

కూడా అరుదుగాయున్న దని చెప్పవచ్చును. కొన్ని కోట్లమందిలో ఒకరిద్దరికి అరుదుగా ఈ శాస్త్రము తెలిసియుండవచ్చును.


అటువంటపుడు దైవజ్ఞానమంటే అలర్జీగాయున్న కొందరికిగానీ, అసూయగానున్న మరికొందరికి గానీ, పెద్దశాస్త్రమైన

బ్రహ్మవిద్యా శాస్త్రము అర్థముకాదు. కావున ప్రపంచములో అన్ని శాస్త్రములను నేర్చినట్లు దీనిని ఎవరూ తెలియలేరు.

బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలియుటకు భక్తి శ్రద్ధలు పూర్తి అవసరము. ప్రపంచము మీదనే శ్రద్ధగలవారికి దైవజ్ఞానము

లభించదు. నేడు దైవము మీద విశ్వాసము ఏమాత్రము లేనివారు మేము ఎంత విజ్ఞానులమని చెప్పుకొనినా, వారికి

ఆదిశాస్త్రము అర్థము కాదు. ఆదిలో పుట్టిన శాస్త్రము అర్థముకానిది అందులోని సూక్ష్మశక్తి అర్థముకాదు. సూక్ష్మశక్తి

యొక్క ఫలితము ప్రత్యక్ష ప్రమాణముగా కనిపించుచుండినా, దానిని వారు అనుసరించక కనిపించు దానిని అసత్యమనీ,

బూటకమనీ, అదొక రోగములాంటిదనీ అనేకముల ఆరోపణలను చూపిస్తూ దానికి దూరముగా పోతారుగానీ, దానిని

అనుసరించి చివరికది శాస్త్రమని తెలియ లేరు. ఒక సత్యము వెనుక ఒక శాస్త్రముంటుందను సూత్రమునుగానీ, అలాగే

ఒక శాస్త్రము వెనుక ఒక సత్యముంటుందనిగానీ తెలియక మూర్ఖముగా మూఢనమ్మకముతో మాట్లాడుచుందురు.

వారు దేవుడుగానీ, దైవశక్తిగానీ లేదని మూఢముగా వాదించుచూ, వారు మూఢ నమ్మకముగలవారై, మిగతావారిని

మూఢ నమ్మకముగలవారని అనుచుందురు. అటువంటివారికి శాస్త్రము తెలియదని చెప్పవచ్చును. అన్ని శాస్త్రములకు

ఆది శాస్త్రమైయుండి, అన్ని శాస్త్రములు పుట్టుటకు కారణమైన బ్రహ్మవిద్యాశాస్త్రము తెలియని వారికి దేవుడుగానీ,

దేవునిశక్తిగానీ ఏమీ తెలియదు. అటువంటి వారికి చావు పుట్టుకల బేధము తెలియదు. వానికి శాస్త్రముగానీ దాని

ఆచరణ అయిన శాస్త్రీయతగానీ, సత్యముగానీ తెలియదు దానినే భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగమున 7,8

శ్లోకములలో కూడా చెప్పారు.


 శ్లోకము : 7. 

ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసురాః |

న శౌచం నాపి చాచారో నసత్యం తేషు విద్యతే ||


 శ్లోకము : 8.

అసత్య మప్రతిష్ఠంతే జగదాహు రనీశ్వరమ్ |

అపరస్పర సంభూతం కిమన్య త్కా మహేతుకమ్||


భావము :- “అజ్ఞానులైన వారికి చావు పుట్టుక యొక్క వివరము తెలియదు. శాస్త్రమే తెలియనివారికి దాని ఆచరణగానీ,

అందులోని సత్యముగానీ ఏమాత్రము తెలియదు. అటువంటివారు మేము విజ్ఞానులమనీ, ఖగోళ శాస్త్రము ప్రకారము

భూమండలము ఆకాశములో ఏర్పడిన పరస్పర రసాయనచర్యల వలన పుట్టిందనీ, దీనిని ఏ దేవుడూ సృష్ఠించలేదనీ,

దేవుడు సృష్ఠించాడనము హేతుబద్ధముకాదనీ, దేవుడనువాడు లేనే లేడని చెప్పుచుందురు.” ఈ విధముగా ఖగోళ,

రసాయనిక శాస్త్రము తెలిసిన వారు ఆ శాస్త్రములను ఆధారము చేసుకొని మాట్లాడుచుందురు. దైవము, దైవసృష్ఠి అన్నీ

ఖగోళ, రసాయనిక శాస్త్రములకు సంబంధించిన విషయముకాదనీ, దైవము, దైవసృష్ఠి బ్రహ్మవిద్యాశాస్త్రమునకు

సంబంధించిన దనీ వారికి తెలియదు. వారికి తెలిసిన నాలుగు శాస్త్రముల ప్రకారము స్థూలముగానున్న కొన్ని విషయములు

మాత్రమే తెలియును. సూక్ష్మముగా నున్న అనేక విషయములు వారికి తెలియవు.


ఈ సృష్ఠి మొత్తము స్థూల సూక్ష్మముల మీద ఆధారపడియున్నది. అందువలన సృష్ఠి రహస్యము తెలియాలంటే

స్థూల సూక్ష్మ రెండు భాగములు తెలియాలి. స్థూలమును అందరూ తెలియగలరు. సూక్ష్మమును తెలియా లంటే

అందరికీ సాధ్యముకాదు. అన్నీ మాకు తెలుసు అని వాదించుచూ, దేవుడని చెప్పు అందరినీ మోసగాళ్ళని ప్రచారము

చేయువారు వాస్తవానికి విజ్ఞానులు కాకున్నా, విజ్ఞానులమని చెప్పుకొనుచుందురు. వారికి సూక్ష్మ జ్ఞానము ఏమాత్రము


తెలియదు. సూక్ష్మము అంటే ఏమిటో అందరికీ అర్థమగుటకు మేఘమును ఉదాహరణగా తీసుకొని చూస్తాము.

ఆకాశములో ఒక మేఘము కనిపించినప్పుడు అది స్థూలముగా ఒక ఆకారముతో కొంత విస్తీర్ణముతో కనిపించును

అలా కనిపించిన మేఘము కొన్ని నిమిషములకు దాని స్థూల ఆకారము మారిపోవును. విస్తీర్ణము తగ్గడమో ఎక్కడమో

జరుగును. తర్వాత కొంత సమయమునకు అది పూర్తి కనిపించకుండా మాయమైపోవును. దీనినిబట్టి ఒక మేఘము

కొంతసేపు స్థూలముగావుండి తర్వాత సూక్ష్మముగా కనిపించకుండా పోగలదని తెలియుచున్నది. ఆకాశములో స్థూల

సూక్ష్మములుగా కనిపించుటలో ఒక రహస్యము కలదు. స్థూలముగా భూమిమీదగల ఏ వస్తువునైనా, ఏ జీవరాసినైనా

మేఘము సేకరించి, దానిని కనిపించకుండా సూక్ష్మముగా మార్చుకొని తనయందు దాచిపెట్టుకొనుచున్నది. ఈ మాట

విజ్ఞానులమనుకొను కొందరికి ఆశ్చర్యముగ ఉన్నా, నమ్మశక్యముగాకున్నా మేము చెప్పినది నూటికి నూరుపాళ్ళు

సత్యము. భూమండలములో స్థూలముగానున్న దేనినైనా సూక్ష్మముగా మార్చుకోగలనని మనకు తెలియునట్లు మేఘము

స్థూలముగా కనిపించి సూక్ష్మముగా మాయమైపోవు చున్నది. ఈ విషయమును పూర్తిగా తెలియాలంటే మా రచనలలోని

“దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథమును చదవండి.


ఆకాశము శూన్యము అయినా స్థూలమైన నీళ్ళు వర్షముగా వస్తున్నవి. మంచు పడుచున్నది, చేపలు, కప్పలు,

పాములు వగైరా జీవులెన్నో ఆకాశమునుండి వచ్చి క్రిందపడుచున్నవి. శూన్యమైన ఆకాశము నుండి స్థూలమైనవి ఎన్నో

వస్తున్నవి. అయినా ప్రతి నిత్యము మనకు కనిపించే మేఘమును గురించే మనకు తెలియదు. ఇంతవరకు ఏ

పరిశోధకుడూ మేఘముల యొక్క సమాచారమును తెలుసుకోలేదు. అటువంటపుడు మనకు తెలియని ఎన్నో విషయములలో

సూక్ష్మమైనదేదీ తెలియదు. ఏ వస్తువులో ఏ సూక్ష్మమున్నదో ఎవరికీ తెలియదు. అటువంటపుడు స్థూలముగా కనిపించు

చేపమందులో ఏ సూక్ష్మమున్నదో ఎలా తెలియగలదు? చేపమందులోని ఔషధము రోగమును లేకుండా చేసినట్లు

ప్రత్యక్ష సాక్ష్యముగా ఎందరో చెప్పుచున్నప్పుడు, దానిని శాస్త్రీయతగా ఎందుకు తెలుసుకో కూడదు? కనిపించే

శాస్త్రీయతనుబట్టి అది ఏ శాస్త్రమునకు సంబంధించి నదో ఎందుకు తెలుసుకోకూడదు? శివుని (ఈశ్వర లింగము)

గుడిలో మారేడు (బిల్వపత్రి) చెట్టు ఆకులను నీటిలో వేసి, ఆ నీటిని గుడిలో తీర్థముగా ఇచ్చుట వలన, తీర్థమును

నిత్యము నలభై (40) రోజులు తీసుకొన్న వారికి ఉబ్బసవ్యాధి (ఆస్తమా) తగ్గుముఖము పట్టడము చూచి, ఆ ఆకును

కొందరు ఔషధముగా గుర్తించారు. మొదట మారేడు ఆకులు తగిలిన నీళ్ళలో ఆస్తమాకు తగిన ఔషధమున్నదని ఎవరికీ

తెలియదు. ఆ నీటిని తీర్ధముగా పుచ్చుకొనుట వలన ప్రత్యక్ష సత్యముగా ఆస్తమా తగ్గడము తెలిసిన తర్వాత, అందులో

ఆస్తమాకు ఔషధమున్నదని తెలిసినది. అంతవరకు మారేడు ఆకులను శివుని పూజకు మాత్రము ఉపయోగించవలెననుట

మాత్రము తెలుసు. మారేడు ఆకులో ఆస్తమాకు ఏదో తెలియని ఔషధమున్నదని కొందరు పూజారులు మొదట

గ్రహించగలిగారు. మారేడు నీరు ఈనాటికీ తీర్థముగానే ఇస్తున్నారు తప్ప దానిని ఒక మందని ఎవరూ చెప్పడము

లేదు. ఈనాటి జన విజ్ఞానవేదిక వారు అప్పటి కాలములో లేరు. ఒకవేళ ఉంటే మారేడాకును కూడా మూఢనమ్మకమని

చెప్పెడివారు. చిన్నవయస్సు లోనే ఆస్తమా ఉన్నవారికి కొన్ని దినములు వదలకుండ మారేడు ఆకుల నీటిని త్రాగితే అది

పూర్తిగా నయమైపోగలదు. ఈ విషయమును కొందరు పూర్తిగా తెలుసుకొని, మారేడు ఆకునుండి ఆయుర్వేదములో

ఒక ఔషధమును కూడా తయారుచేసి వాడడము జరుగుచున్నది. అయితే ఆ ఔషధము మారేడు ఆకునుండి తయారైనదని

చాలామందికి తెలియదు. శివునిగుడిలో మారేడు నీరు పూజార్లు తీర్థము అను పేరుతో ఇస్తే ఆస్తమా నయమైనప్పుడు,

అలాగే హైదరాబాద్లో చేపమందని చెప్పబడు దానిని చేప ప్రసాదమని బత్తిన సోదరులు ఇస్తే, ఆస్తమా నయమవుచున్నదని


ప్రత్యక్షముగా అందరూ చెప్పుచున్నప్పుడు, మధ్యలో జన విజ్ఞానవేదిక వారికి వచ్చిన ఇబ్బందేమిటి? అదేపనిగా పనిగట్టుకొని

అది మందుకాదు అని ప్రచారము చేయవలసిన అవసరమేమిటని ప్రజలు అనేకచోట్ల ప్రశ్నించుచున్నారు.


విజ్ఞానమనునది వాస్తవమైనది, ఎందుకనగా అది శాస్త్రము. ఆరు శాస్త్రములకు ఆరు విజ్ఞానములున్నవి.

అయితే విజ్ఞానులమనుకొను వారికి శాస్త్రము ఎంత తెలిసినదో అంతే వారిలో విజ్ఞానముండును. ఒక శాస్త్రమును

కొంత తెలిసితే కొంత విజ్ఞాని అని, ఎక్కువ తెలిస్తే ఎక్కువ విజ్ఞానముగలవాడని చెప్పవచ్చును. ఉదాహరణకు మిలటరీ

(సైన్యము) అను దానిలో ఆర్మీ అనునది ఒక భాగము, దానిలో అందరూ ఒకే రంగు కల్గిన దుస్తులు కలిగియుంటారు.

అందరినీ మిలటరీవారే అని అనవచ్చును. అయితే అందులో చిన్న ఉద్యోగి ఉన్నాడు, అలాగే పెద్ద ఉద్యోగి ఉన్నాడు.

అలాగే సైన్సు తెలిసిన వారిని విజ్ఞాని అనినా వారిలో ఎక్కువ తెలిసినవాడు ఉన్నాడు, తక్కువ తెలిసినవాడు ఉన్నాడు.

అందరూ సమానము కాదుకదా! జన విజ్ఞానవేదికలో ఎంతస్థాయి విజ్ఞానమున్న వారున్నారో మాకు తెలియదు గానీ,

పూర్తి తెలియని విషయమును గురించి తెలిసినామని మాట్లాడు వారు చాలామంది ఉన్నట్లు బాగా కనిపిస్తున్నది. కనిపించే

సత్యములో సైన్సు లేదంటే "కళ్ళుమూసుకొన్న పిల్లి లోకమే లేదన్నట్లుంది.” సైన్సు సత్యమైనప్పుడు సత్యము ఎక్కడున్నా

అది సైన్సేనని చెప్పవచ్చును. ఒక సత్యము ఆరుశాస్త్రములలో ఏ శాస్త్రమునకు సంబంధించిన సైన్సయినా

అయివుండవచ్చును. ఒక ప్రత్యక్ష సత్యము ఫలానా శాస్త్రమునకు సంబంధించినదని తెలియనంతమాత్రమున, దానిని

శాస్త్రముకాదని చెప్పడము మూర్ఖత్వము మరియు మూఢత్వము అగును.


అర్ధము*

గంజాయి ఆకు మత్తును కల్గిస్తుంది, రావి ఆకు మత్తును లేకుండా చేస్తుంది. నల్ల ఈశ్వరి ఆకు నిద్రను

కల్గిస్తుంది. తెల్ల ఈశ్వరి ఆకు నిద్రను లేకుండా చేసి మెలుకువగా ఉంచగలదు. తీటగంజరి ఆకు నవ్వను (దురదను)

కల్గిస్తుంది. ఆట గంజరి (పిప్పంటి) ఆకు దురదను లేకుండా చేస్తుంది. కొందరికి కొన్ని ఆకులలోని ఔషధ గుణములు

ఏవున్నవో తెలుసు. కొన్ని ఆకులలో ఏ ఔషధమున్నదో ఎవరికీ తెలియదు. తెలిసినవన్నీ ఔషధములనీ, తెలియనివన్నియు

మూఢనమ్మకములని అనవచ్చునా? సత్యము కనిపిస్తున్నది కావున, వాటిని మూఢ నమ్మకమని అంటే అది తెలివితక్కువ

పని అగును. చాలామందికి అర్థము గాని విషయములెన్నో కలవు. అందులో ఉదాహరణకు ఒక్క దానిని ఇక్కడ

చెప్పుకొందాము. జిల్లేడు చెట్టువద్దకు ఒళ్ళునొప్పులున్నవాడు భక్తిగా పోతే శరీరములో నొప్పులు తగ్గుముఖము పట్టుతాయి.

శరీరములో నొప్పులు లేనివాడైనా చెట్టుమీద కోపముగా అసూయగా పోయి చెట్టును పెరికినా, దాని ఆకులను పెరికినా

నొప్పులు రావడము జరుగును. ప్రత్యేకించి ఒక నక్షత్రకాలములోనే అలా జరుగును. అలా ఎందుకు జరుగుచున్నదో

ఎవరూ హేతుబద్ధముగా చెప్పలేరు. చెప్పలేనంతమాత్రమున, ఎవరికీ తెలియనంత మాత్రమున, దానికి హేతుబద్ధత

శాస్త్రబద్ధత లేదందుమా? అలా జరుగుటకు ఏదో ఒక కారణముంటుంది, అది మనకు తెలిసియుండవచ్చు లేక

తెలియక ఉండవచ్చును. ఇప్పటికీ పాము కరిచిందని ఫోన్ చేస్తే అక్కడనుండే పాము విషమును నివారించు విధానము

కలదు. ఇప్పటికీ తేలు విషమునకు ఇతరులకు వైద్యము చేస్తే కుట్టినవానికి బాధ తగ్గిపోవుట కలదు. వీటన్నిటిలో

జరిగెడి సత్యమే శాస్త్రీయత. అయితే అది ఏ శాస్త్రమునకు సంబంధించినదో తెలియదు. ఇంకొక విధానము ప్రకారము

ఒక బావిలోని నీరును ఒకరు ప్రభావితము చేసి (యాక్టివేషన్ చేసి) ఆ నీరు త్రాగిన వారికి పాము విషము విరగడ

అయిపోవునట్లుంచారు. అప్పటినుండి ఆ ప్రాంతము వారు ఏ పాము కరిచినా ఆ బావి నీరును త్రాగడము జరుగుచున్నది.

ఎంతో దూరమునుండి విష నివారణ చేయువారు, ఇతరులకు చికిత్స చేసి రోగిని బాగుచేయువారు, ఎంతోకాలము ఒకే

బావినీరు పాము విషమునకు ఔషధముగా పని చేయునట్లు ప్రభావితము చేసినవారూ, మనదేశములో ఉన్నందుకు


చెప్పలేరు.*


మనము గర్వించవచ్చును. ఈ విధముగా పూర్వమునుండి సమాజమునకు ఎంతో నిస్వార్థముతో సేవలందించిన

వారుండగా, నిన్నకాక మొన్న కళ్ళు తెరిచి ఆవలించినవారు, తలలో ఏ గుణము ఎప్పుడు మెదలు తుందో చెప్పలేనివారు,

విజ్ఞానులు కాకున్నా, మేము విజ్ఞానులమని చెప్పు కొనుచూ, ఇతరులను రూపాయి కూడా అడుగకుండా ఉచితముగా

మందును ఇచ్చువారిని ప్రజలను మోసగించువారనడము సమంజసమా అని ప్రశ్నించుచున్నాను. చేపమందులో ఎటువంటి

శాస్త్రీయత లేదనడము విజ్ఞతాయని ప్రశ్నించుచున్నాము. ప్రత్యక్ష సత్యము ఎక్కడుందో అదే శాస్త్రీయతగానీ, ప్రత్యేకించి

ఇది శాస్త్రీయత అని ఎక్కడా ఉండదు. శాస్త్రీయతగా కనిపించు సత్యము ఏ శాస్త్రమునకు సంబంధించినదో తెలుసుకోవడము

మనిషి యొక్క కర్తవ్యము. అట్లుకాక సత్యమును విమర్శించడము బాధ్యతారహితమని చెప్పవచ్చును.


ఇప్పటికీ ఒక గ్రంథమును ముట్టుకొని భక్తిపూర్వకముగా దగ్గరుంచు కొంటే కొన్ని రోగములు పోవుచున్నవి.

ఒక స్థలములో నిద్రించితే వారికున్న రుగ్మతలు ఎన్నో లేకుండా పోవుచున్నవి. కొన్ని గ్రంథములలోని విషయము లను

వదలకుండ చదివి తెలుసుకోగలిగితే క్యాన్సర్, హెచ్.ఐ.వి. మొదలగు భయంకర రోగములు చికిత్స లేకుండా

నయమైపోవుచున్నవి. అయితే ఆ గ్రంథములలో ఏ ఔషధమూ కనిపించదు. ఆ జాగాలో ఎటువంటి ప్రత్యేకతా

ఉండదు. అంతమాత్రమున దానికి హేతువు లేదనగలమా? దానిని సైన్సు కాదనగలమా? అది శాస్త్రబద్ధత కాదనగలమా?

తెలియనంత మాత్రమున దేనినీ కాదనుటకు వీలులేదు. పై పనులు ఏ శాస్త్రమునకు సంబంధించినవో మాకు తెలుసు

అందువలన దానిని సైన్సనీ, సూపర్ సైన్సనీ చెప్పగలుగు చున్నాము. అటువంటి సైన్సు ఏమిటో చేపమందు ఇచ్చువారికి

కూడా తెలియదుగానీ, చేపమందులో ఎవరికీ తెలియని శక్తి దాగివున్నది. ఆ మందులోనికి ఆ శక్తి ఒక బావినీటినుండి

వచ్చినది. అదే ఈ దినము చేపమందు పంపిణీ చేయు బత్తిన సోదరుల ఇంటిలోని బావి. వారి ఇంటి యందుగల

బావిలోని నీరు పూర్వము ప్రత్యేకమైన వ్యక్తిచేత శాశ్వితముగా ఆస్తమా రోగమునకు ఔషధముగా మారునట్లు ప్రభావితము

చేయబడినది. ఒక వ్యక్తి చేత నింపబడిన శక్తి ఆ నీటిలో ఉంది. ఆ శక్తియే నేటికినీ దివ్యఔషధముగా పని చేయుచున్నది.

ఈ విషయమును చేపమందును ఇచ్చువారు కూడా ఒప్పుకొంటున్నారు. పూర్వము వారి ఇంటిలోని బావికి ఆ శక్తిని

నింపిన వ్యక్తి నిస్వార్థముగా సేవ చేయమని చెప్పినమాటను జవదాటకుండా, ఆ ఇంటివారు ఏమాత్రము ధనాపేక్ష

లేకుండా, చేప మందును పంపిణీ చేయడము గమనార్హము. ఇటువంటి కార్యమునూ, ఎంతోమందికి పైసా ఖర్చులేకుండా

చికిత్స చేయబడు విధానమునూ అందరూ ప్రోత్సహించవలెను. సంవత్సరమునకు ఒక దినము మృగశిరకార్తె మొదటి

దినము మాత్రము ఉచితముగా పంపిణీ చేయడము ఎంతో శ్రమతో కూడుకొన్న కార్యము. ఆ కార్యమును వదలకుండా,

శ్రమ అనుకోకుండా ప్రతి సంవత్సరము మందు పంపిణీలో ఎంతో కృషి చేయువారిని ప్రోత్సహించాలిగానీ

నిరుత్సాహపరచకూడదు. అంత శ్రమతో కూడుకొన్న పనిని మనము చేయగలమేమో ఒకమారు ఆలోచించండి.


ఇప్పుడు మేము చెప్పిన విషయములను చూచి కొందరు నమ్మక పోగా, మీరు చెప్పినవి నిరూపిస్తారా? నిరూపిస్తే

పదికోట్లు పందెము కట్టుతాము. మీరు గెలిస్తే పదికోట్లు ఇస్తామని సవాలుకు పిలువడము కొందరికి అలవాటైపోయినది.

వాస్తును గురించి ప్రచారము చేయు వారివద్దనో, మహత్యములు చూపుతామని చెప్పువారివద్దనో అటువంటి ప్రకటనలు

చేసినా, అవి ఎటూ అసత్యము కావున వారు ఎటూ పోటీకి రారు. దానితో ప్రకటన చేసినవారు మేము గెలిచాము

మిగతావారు ఓడిపోయారని ప్రచారము చేసుకొనుచుందురు. ఇక్కడ మేము లేని దానిని ఉన్నట్లుగానీ, ఉన్నదానిని

లేనట్లుగానీ, లేక మహత్యములనుగానీ, లేని వాస్తునుగానీ చెప్పడము లేదు. మేము చెప్పునది సైన్సు. దానిని పోటీకి

పెట్టనవసరములేదు. కావాలంటే తెలుసుకోవచ్చును ఫలితమును పొందవచ్చును. సైన్సు అందరికీ సమానమైనది,



ఒక్కరికే పరిమితి కాదు. అటువంటి దానిని విధేయతతో అడిగితే వివరించి చెప్పదగినదిగానీ, డబ్బుకు పందెముగాచు

గారడీవిద్యలాంటిది కాదు. సూక్ష్మముగానున్న విజ్ఞానము శక్తితో కూడుకొన్నది. వినయముతో అడిగి తెలుసుకోతగినదిగానీ,

వాదించి తెలుసుకోతగినది కాదు. వాదించి తెలుసుకోవాలనుకొన్న వానికి ఏమాత్రము అర్థము కాదు. అర్థించి

తెలుసుకొనువానికి ఎంతైనా అవగాహన కాగలదు. అందువలన కోట్లు పందెము పెట్టి నిరూపించండి అంటే పని

జరుగదు. అయితే ఒక్క పైసా ఖర్చు కాకుండా ఆసక్తితో ఎవరైనా తెలుసుకోవచ్చును, ఫలితమును పొందవచ్చును.

శాస్త్రసంబంధ విజ్ఞానమును ఎవరూ డబ్బుతో కొనలేరు. అందువలన శ్రద్ధతో తెలియవలెనని తెలుపు చున్నాము.


చేపమందులో ఇంగువ, పసుపు, ఏదో పిండి తప్ప ఆకులు కూడ అందులో ఉన్నట్లు కనిపించడము లేదు. ఆ

మందులో ఏ పేరుపొందిన ఔషధమూ కనిపించదు. కదలని నీరు అనగా బావిలో నిలిచిన నీరు ఆ మందులో

కలిసియుండడము వలన అందులో ఒక విశేషత కలదని చెప్పవచ్చును. కదలని నీరుతో కలిపిన వస్తువులను కదిలెడు

నీటిలో లేక విశాలమైన నీటిలో కదలుచూ తిరుగుచున్న చేపనోటిలో ఉంచినప్పుడు ఆ మందుకు పూర్తి విశేషత ఏర్పడి

అది ఆస్తమాకు ఔషధముగా మారుచున్నదని మేము అనుకొంటున్నాము. మందులో బావిలోని నీరు ముఖ్యపాత్రను

పోషించుచున్నా, అది చేప నోటిలోనికి పోయినప్పుడు పూర్తి ఔషధముగా మార్పుచెందుచున్నది. చేప లేకుండా మందు

పూర్తి శక్తిని పొందదని తెలియుచున్నది. మందుగా కనిపించు పదార్థములలోనున్న నీటితేమ చేపతో కలిసినప్పుడు,

విద్యుత్తు ధనధృవము (పాజిటివ్) ఋణధృవము (నెగిటివ్) కలిసినప్పుడు బల్బు వెలిగినట్లు ఔషధముశక్తి ప్రకాశించును.

ఆ శక్తి శరీరములోని ఉబ్బసవ్యాధికి పని చేయుచున్నది. సంవత్సరములో ఒక్కమారు చేపతో సహా మందును తినడము

వలన, మందులోని తేమ అనునది పాజిటివ్గా చేపలోని తేమ నెగిటివ్ గా పనిచేసి, మందు గొంతులోనికి జారుచుండగనే

ఔషధజ్యోతి వెలిగి, దాని కిరణములు శరీరమంతా ఒక్కమారుగా ప్రాకుచున్నవి. అందువలన ఒక్కమారు చేప+మందు=

చేపమందును తినుట వలన వారి శరీరములో రోగము ఒకేమారు అంతగానీ లేక కొంతగానీ సడలిపోవుచున్నది.

ఒకమారు తినుటతోనే రోగము పూర్తి పోకపోతే రెండవ సంవత్సరముగానీ, మూడవ సంవత్సరము గానీ వరుసగా

రెండు మూడుమార్లు తినవచ్చును. చేప లేకుండా మందు గానీ, మందు లేకుండా చేపగానీ ఆస్తమా రోగమునకు పనికి

రాదు. వారిలో ఔషధజ్యోతి ప్రకాశించదు. ఖచ్ఛితముగా ఇలానే జరుగుతున్నదని చేప మందును ఇచ్చువారికి కూడా

తెలియదు. బావిలోని నీటిని ప్రభావితము చేసిపోయిన మహర్షి చెప్పినట్లు చేయడమే వారియొక్క ముఖ్యకర్తవ్యముగా

ఉన్నది. మందును చేపతోనే ఇవ్వమని పూర్వము తమ ఇంటికి వచ్చిన మహర్షి చెప్పినట్లు చేయుచున్నారు గానీ,

చేపతోనే ఎందుకివ్వాలి అను విషయము వారికి కూడా తెలియదు. చీకటిగల గదిలో బల్బు వెలగాలంటే రెండు

విద్యుత్తు తీగలు అవసరము. అలాగే రోగము గల శరీరములో ఔషధజ్యోతి వెలుగుటకు మందు+చేప అను రెండూ

ఉండాలి. అందువలన దానిని చేపమందు అంటున్నారు. తర్వాత చేపనోటిలోనికి పెట్టుమందును విడిగా ఇచ్చి 15

రోజులకు ఒకమారు ఆ మందును వాడమని చెప్పుచున్నారు. దానివలన మందును పూర్తిగా 45 రోజులు వాడినట్లగును.

తర్వాత మూడుమార్లు వాడు మందు మొదటి మందుకు అనుబంధశక్తి ఇచ్చుచున్నది.


ఇంతవరకు చేపమందులోని వాస్తవికతను గురించి తెలుసుకొన్నాము. మేము చేపమందును గురించి ఇచ్చిన

వివరము హేతువాదుల మని చెప్పుకొనుచూ, నాస్తికవాదమునకు దగ్గరగానున్న విజ్ఞానవేదిక అను వారికి పూర్తి

సమాధానమై ఉన్నది. ఇప్పుడు నాస్తికవాది అయిన వ్యక్తి మనిషి శరీరములోని మనస్సును గురించి ఈ విధముగా

చెప్పుచున్నాడు.


నాస్తికవాది :- మనస్సు అనగా ఆలోచించడమూ, నిర్ణయములు తీసు కోవడమూ, తెలివి తేటలు, భావములు, ఆవేశములు,

మాటతీరు ఇవన్నియు మనస్సు వలన కల్గుచున్నవనీ, ఈ పనులన్నిటికీ మారుపేరు మనస్సు అని అనవచ్చును.

(ఈ విధముగా అతను అనుకోవడము వలన ఎవరికీ ఏమీ నష్టమూ రాదు. కానీ ఆధ్యాత్మిక విషయములలో

మనస్సు గురించి తెలియకపోతే తప్పుదారి పట్టు అవకాశమున్నది. కావున మనము ఇప్పుడు మనస్సును గురించి

సమూలాగ్రముగా తెలుసుకొందాము. మనస్సును గురించి వివరించుకోవడము వలన దీనిని తెలిసి నాస్తికులు కూడా

మారుటకు అవకాశముగలదు.)


మేము :- మనస్సు శరీరములోని అంతర్గత భాగము. రూపముంటే నామ ముంటుంది, నామముంటే రూపముంటుంది

అనునది సూత్రము. మనస్సుకు అనేక పేర్లున్నవి మనస్సును 'మది' అనికూడ పిలుచుచున్నారు. అంతేకాక 'మన్'

అనియు 'మానసి' అనియు మొదలగు పేర్లు గలవు. నామముంటే (పేరుంటే) రూపముంటుంది అను సూత్రము

ప్రకారము శరీరములోని మదికి (మనస్సుకు) రూపము కూడా ఉన్నది. మనస్సు ఏ రూపములో ఉన్నదీ ఇంతవరకు

ఎవరూ చెప్పకున్నా, మనకు తెలియకున్నా పేరున్న మనస్సుకు రూపము కూడా ఉన్నది. మనస్సు శరీరములో

మెలుకువగాయున్నప్పుడు ఫలానారూపములో ఉంటుందనీ, నిద్రలో ఉన్నప్పుడు మరియొక రూపములోనికి

మారియుంటుందని ముందే అనేకమార్లు చెప్పుకొన్నాము. దీనినిబట్టి మనస్సుకు రెండు రూపములు ఉన్నవనీ, అవి

నిద్ర మెలుకువలనుబట్టి మారుచుండునని తెలిసిపోయినది. రూపము, పేరుగల దానికి పని (క్రియ) కూడా ఉంటుంది.

దేవునికి మాత్రము పేరులేదు, రూపములేదు, క్రియలేదు. దేవునికి తప్ప మిగత అన్నిటికీ రూప, నామ, క్రియలు

కలవనియే చెప్పవచ్చును. మనస్సుకు పేరుంది మరియు రూపముంది. ఈ రెండూ మనుషులకు తెలిసినా,

తెలియకపోయినా ఏ సమస్యాలేదు. అయితే మనస్సు యొక్క క్రియ (పని) ఏమైనది తెలియకపోవడము వలన

ఆధ్యాత్మికరంగములో అనేక అడ్డంకులు, అజ్ఞానములు పుట్టుకొస్తున్నవి. మనిషి జీవితములో శరీరమునందు ముఖ్యపాత్ర

పోషించు భాగములలో మనస్సు కూడా ఒకటి. మనస్సు శరీర అంతరంగములో ఎవరికీ కనిపించకయుండి అనేక

విషయములలో ముఖ్యపాత్రను పోషించుచున్నా, ఆధ్యాత్మికరంగములో మాత్రము మనస్సు విశేషమైనపాత్రను

పోషించుచున్నది. అందువలన మనస్సు అన్ని విధముల శరీరములో ముఖ్య భాగముగా ఉన్నదని చెప్పవచ్చును.


మనస్సును గురించి తెలియాలంటే శరీరములోపల పరిశోధన చేయాలి. శరీరములోపల మనస్సెక్కడున్నదో

తెలియకుండా పరిశోధన చేయుటకు వీలులేదు. అందువలన మనస్సును గురించి తెలియాలనుకొన్న వారు కొందరు

కొంతవరకు దాని సమాచారమును సేకరించినా, పూర్తి సమాచారమును సేకరించలేక పోయారనియే చెప్పవచ్చును.

అందువలన దాని రూపమును ఎవరూ చెప్పలేకపోయారు. అలాగే దాని పూర్తి పనినీ, పని కాలమునూ చెప్పలేకపోయారు.

మనస్సును గురించి ఏమాత్రము తెలియని వారు కూడా మనస్సు పేరును వాడుకొని మాట్లాడుచుందురు. ఉదాహరణకు

ఒక కాలేజీ యువకునికి మనస్సును గురించి కొద్దిగ కూడా తెలియకున్నా, తాను ప్రేమించిన తన ప్రియురాలికి ప్రేమలేఖ

వ్రాస్తూ అందులో “నా మనస్సు నీకిచ్చేశాను, నా మనస్సు నావద్దలేదు, అది ఎప్పుడు నీ చుట్టూ తిరుగుచున్నది, నీవు

లేకపోతే నేను బ్రతుకలేను. అందువలన నా మనస్సును స్వీకరించి నన్ను ప్రేమించు” అని వ్రాశాడు. ఆ ప్రేమలేఖను

చూచిన యువతి ఒక దినము ఆ యువకుని దగ్గరకు వచ్చి, " నీ మనస్సు నాకెప్పుడు ఇచ్చావు? నీ మనస్సు నీవద్ద

లేకుండా నా చుట్టు తిరుగుచూ ఉన్నదని చెప్పావు. నీ మనస్సును ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదే, అదెలా ఉంది?

నీ మనస్సును స్వీకరించి నిన్ను ప్రేమించమని వ్రాశావు. అదెక్కడుందో చెప్పు స్వీకరిస్తాను తర్వాత ప్రేమిస్తాను. నీ


మనస్సు నాకు కనబడితే, నేను గుర్తు పట్టేదానికి అది తెల్లగున్నదా? లేక నల్లగున్నదా?” అని అడిగిందట. ఆ మాటలను విన్న

యువకుడు తాను ఏమీ చెప్పలేక పోయాడట. ఈ విధముగా కొందరు మనస్సు గురించి ఏమాత్రము తెలియకున్నా

కవులవలె దానిని వర్ణించి మాట్లాడుచుందురు. ఎవరు ఏ విధముగా మాట్లాడినా మనస్సును గురించి సమాచారము

వారివద్ద ఉండదు.


కొందరు ఆధ్యాత్మికవేత్తలైన వారు, వారి సాధనలో మనస్సు యొక్క ఆటంకమును కనుగొని దానిని జయించడము

దుర్లభమని చెప్పారు. అంతేకాక మనస్సు ఎంతో బలమైనదనీ, దానిని కొందరు ఏనుగుగా పోల్చి చెప్పగా, కొందరు

మనస్సు అతి చంచలమైనదనీ దానిని కుక్కగా పోల్చారు. మరికొందరు మనస్సు నీచమైన ఆలోచనలనిస్తుందనీ దానిని

పందిగా పోల్చి చెప్పారు. పూర్వము బ్రహ్మయోగసాధన చేసినవారికి మాత్రము మనస్సు యొక్క వివరము కొంత

తెలిసియుండును. అయినా వారికి కూడా అది ఎక్కడున్నదనిగానీ, ఏ ఆకారముతో ఉందనిగానీ తెలియదు. దాని

పనిని మాత్రము కొంత తెలిసియుందురు. అటువంటి బ్రహ్మయోగులకే సాధ్యముకాని విషయమును ఒక నాస్తికుడు

నాకు తెలుసునని చెప్పడమూ, శరీరములో మనస్సు చేయని పనులను కూడా దానికి అంటగట్టడమూ జరిగినది.

వాస్తవముగా అతడు చెప్పిన పనులను మనస్సు కొన్నిటిని చేయడము లేదు. మనస్సు శరీరములో ఏమి చేయుచున్నదో

తెలియాలంటే దానికంటే ముందు మనస్సు ఏమి చేయలేదో తెలుసుకోవాలి. పూర్వము ఎందరో మహర్షులు మనస్సును

గురించి అధ్యయనము చేసి చివరకు దాని పనులను కొన్నింటిని మాత్రము తెలియగలిగారు. అంతతప్ప మనస్సు

విషయములో పూర్తి పురోగతి సాధించలేనప్పుడు, దానిని గురించి మనము ఎలా తెలియగలగాలి అను ప్రశ్న కొందరికి

రాగలదు. బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలియగలిగితే, మనస్సు యొక్క పూర్తి కార్యములను తెలియవచ్చును. అంతేకాక

మనస్సు యొక్క నివాస స్థలమునూ, దాని ఆకారమును కూడా తెలియవచ్చును. బ్రహ్మవిద్యా శాస్త్రపద్ధతి ప్రకారము

నాకు తెలిసిన విషయమేమంటే !


శరీరములో ప్రత్యేకమైన పనిని చేయుదానిని ప్రత్యేక భాగముగా గుర్తించుచున్నాము. శరీరము కొన్ని భాగముల

కలయికగా ఉన్నది. వాటిని వాటి పనులనుబట్టి విభజించవచ్చును. శరీరములోని జీవాత్మను, ఆత్మను, పరమాత్మను,

గుణములనూ మొత్తము కాల, కర్మ, గుణచక్రములను వదలిచూస్తే మిగత శరీరములోని భాగములు 24 గలవు.

ఆత్మలను గుణములను కలిపి చూస్తే 24+16+3=43 భాగములు కలవు. శరీరము మొత్తము 24 భాగములుగా

చెప్పబడగా, శరీరములో తలయందుగల నాలుగుచక్రముల సముదాయములో 19 భాగములు ఉన్నట్లు తెలియుచున్నది.

మనస్సు అనునది శరీరములోని 24 భాగములలోనికి లెక్కించబడుచున్నది. అంతఃకరణములని పేరుగాంచిన మనస్సు,

బుద్ధి, చిత్తము, అహము, జీవాత్మ అను ఐదింటిలో మనస్సు తప్ప మిగత నాలుగు గుణచక్రములో ఉండగా, మనస్సు

మాత్రము శరీరములోనే లెక్కించబడినది. అట్లని మనస్సు పూర్తిగా శరీరములోని భాగమని చెప్పలేము. మనిషి

మెలుకువలో శరీరమందు నివాసమున్న మనస్సు, మనిషి నిద్రావస్థలో ఉన్నప్పుడు గుణచక్రములో చేరి బ్రహ్మనాడియందు

నివాసముండును. నిద్రలోనూ, స్వప్నములోనూ గుణచక్రమునకు మధ్యనగల బ్రహ్మనాడియందు నివశించుచున్నది.

ఈ విధముగా మనస్సుకు శరీరములో నిద్ర, స్వప్నమందు బ్రహ్మనాడియందూ, మెలుకువలో శరీరమందూ, రెండు

నివాసములుగల వని చెప్పవచ్చును. మనము ఇప్పుడు చాలా సులభముగా చెప్పుకొన్న విషయమును పూర్వము

మనుషులెవరూ తెలియలేక పోయారు.


ఇప్పుడు మనస్సుకు శరీరములో రెండు నివాస స్థలములు కలవని తెలుసుకొన్నాము. శరీరములో రెండు


నివాసములు కలది ఒకే ఒక మనస్సు మాత్రమే కలదు. శరీరములో ముఖ్యపాత్రను పోషించు మనస్సుకు ప్రత్యేకించి

రెండు నివాసములు ఉండడమే కాకుండ, మనస్సుకు పనులు కూడా రెండు రకములు గలవు. పనులేకాదు ఆకారములు

కూడా రెండు కలవు. పూర్వము బ్రహ్మయోగ సాధకులైనవారు మనస్సుయొక్క ఒక పనిని మాత్రము బాగా గుర్తించారు.

రెండవ పనిని గుర్తించలేకపోయారు. ఎక్కడైన మనస్సుయొక్క రెండు పనులను గుర్తించిన వారు అరుదుగా

ఉండవచ్చునేమోగానీ, మనస్సు యొక్క రెండు ఆకారములనూ, మనస్సు యొక్క రెండు నివాసములనూ గుర్తించిన వారు

ఎవరూ లేరని చెప్పవచ్చును. మనస్సుయొక్క రెండు ఆకారములనూ, రెండు నివాసస్థలములను గురించి చాలాచోట్ల

చాలా గ్రంథములలో మేము వ్రాయడము జరిగినది. మా బోధలలో తప్ప మిగత ఎక్కడా మనస్సుకు ఆకారముందనిగానీ,

అదియూ రెండు ఆకారములనిగానీ, మనస్సుకు నివాస స్థలముందనిగానీ, అదియు రెండు నివాసములనిగానీ ఎవరూ

చెప్పలేదని జ్ఞాపకముంచుకోవలెను.


ఇప్పుడు మనము ముఖ్యముగా మనస్సు చేయుచున్న రెండు రకముల పనులను గురించి చెప్పుకోవలసియున్నది.

అందులో ఒక పనిని గురించి చెప్పుకొందాము. మనిషి బయటి కార్యములను చేయునప్పుడు, కర్మ ఆచరణ

ఉన్నప్పుడు శరీరమునకు బయటనున్న కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అను ఐదు జ్ఞానేంద్రియములు తెలియజేసిన

సమాచారమును మనస్సు స్వీకరించి, ఆ సమాచారమును లోపల గుణచక్రములోనున్న బుద్దికి చేర్చును. శరీరమంతా

అణువణువునా వ్యాపించియున్న మనస్సు ఐదు జ్ఞానేంద్రియములలో ఏ ఒక్క దాని సమాచారమునైనా లోపలగల బుద్ధికి

చేర్చగా, బుద్ధి గుణములనుబట్టి ఆలోచించగా, మంచిగుణములు ఒకవైపు, చెడు గుణములు ఒకవైపు చెప్పిన రెండు

విధానములలో ఏదో ఒక దానిని అక్కడేయున్న చిత్తము నిర్ణయించగా, నిర్ణయించిన విషయమును బుద్ధి మనస్సుకు

తెలుపగా, మనస్సు లోపల బుద్ధి అందించిన సమాచారమును బయట శరీరమునకుగల కర్మేంద్రియము లైన కాళ్ళు,

చేతులు, నోరు, గుదము, గుహ్యము అను వాటికి తెలియజేసి కార్యమును జరుగునట్లు చేయుచున్నది. ఈ విధముగా

మనిషి మెలుకువలో నున్న సమయములో బయటి జ్ఞానేంద్రియములు ఇచ్చిన సమాచారమును లోపలి బుద్ధికి చేర్చుచున్నది.

అలాగే లోపలి బుద్ది అందించిన సమాచారమును బయటి కర్మేంద్రియములకు అందించుచున్నది. శరీరమంతా వ్యాపించి

యున్న మనస్సు శరీరములోని సమాచారమును రవాణా చేయుచున్నది. మనిషి మెలుకువ సమయములో

సమాచారమున్నప్పుడు దానిని లోపలికి బయటికి చేర్చు పనిని చేయుచూ, పని ఏమీ లేనప్పుడు, మనిషి ఒకచోట

కూర్చొనో, పండుకొనో విశ్రాంతి తీసుకొనునప్పుడు, మనస్సుకు సమాచారమును రవాణా చేయు పని ఉండదు.

అటువంటి సమయములో గతములో జరిగిన విషయములన్ని టిని జ్ఞాపకముంచుకొన్న మనస్సు, ఆ విషయములను

ఒక్కొక్క దానిని జ్ఞాపకము తెచ్చి బుద్ధికి చూపించు చుండును. అప్పుడు బుద్ధి మనస్సు చూపిన విషయములలో లగ్నమై

పోవుచుండును. బుద్ధి మనస్సు అందించిన విషయమును చూచు సమయములోనే మనస్సు మరియొక విషయమును

కూడా అందించును. అలా మనస్సు అందించిన జ్ఞాపక విషయమును బుద్ధి చూస్తున్నంత కాలము మనస్సు విషయములను

మార్చి మార్చి బుద్ధికి చూపుచుండును. ఇట్లు జ్ఞాపకము తర్వాత వేరొక విషయ జ్ఞాపకమును బుద్ధికి అందించును.

ఒకవేళ బుద్ధి ఒకే విషయముమీద లగ్నమైనప్పుడు మనస్సుకు అందులో జ్ఞాపకము చేసి చూపునది ఏదీ లేనప్పుడు,

క్రొత్త విషయమును అందించును. అంతటితో బుద్ధిముందున్న విషయము లేకుండాపోయి క్రొత్త విషయములోనికి

బుద్ధియొక్క ధ్యాస మళ్ళును. ఈ విధముగా మనస్సు బుద్ధికి విషయ జ్ఞాపకములను ఎడతెరపి లేకుండా మార్చి మార్చి

చూపుచుండును. కొన్ని సమయములలో బుద్ధి ఈ సమాచారములు నాకు వద్దు అనుకొనినా మనస్సు మాత్రము


ఊరకుండక బుద్ధిముందర విషయములను ఒకదాని తర్వాత ఒకదానిని పడవేయుచుండును. మనస్సు అందించిన

విషయము లను చూడలేక బుద్ధి వేడెక్కినా మనస్సు వదలదు. మనస్సు తనంతకు తాను తన పనిని వదిలి ఖాళీగా

శరీరములో ఎప్పుడూ ఉండదు. మనస్సు శరీరము అంతటా వ్యాపించియున్నప్పుడు మొదటి పని అయిన సమాచారమును

లోపలికి బయటికి చేరవేయు పనిని చేయుచుండును. ఆ పని లేనప్పుడు తన రెండవ పని అయిన విషయ జ్ఞాపకములను

బుద్ధికి అందించుచుండును.


ఎప్పుడైతే శరీరపు చర్మపు అంచువరకు వ్యాపించియున్న మనస్సు, శరీరమంతటా లేకుండా కొద్దికొద్దిగా

ముకుళించుకొని, ఒక చిన్న బిందువు ఆకారములోనికి మారిపోవునో, అప్పుడు తన రెండు కార్యములను చేయదు.

మనస్సు తన రెండు రకముల కార్యములను వదలి ఒక బిందువుగా మారిపోయినప్పుడు, శరీరములో లేకుండా

గుణచక్రమునకు మధ్యలోనున్న బ్రహ్మనాడిలో చేరిపోయి, ఏ పనినీ చేయక ఉండును. దానినే మనిషి నిద్రస్థితి అంటాము.

నిద్రస్థితిలో మనిషిలోని మనస్సు బ్రహ్మనాడిలో కేంద్రీకృతమై ఒక బిందువుగా ఉండి రెండు పనులలో ఏ పనినీ చేయదు.

అటువంటి సమయములో బుద్ధికి ఏ సమాచారమూ అందదు. కావున బుద్ధికి కూడ విశ్రాంతి లభించును. శరీరములో

బుద్ధి ప్రక్కనేయున్న జీవుడు ఎల్లప్పుడూ బుద్ధికి చేరిన విషయములన్నిటిని చూచి నవ్వడమో, ఏడ్వడమో చేయుచుండును.

బుద్ధికి సమాచారము లేనందున, నిద్ర సమయములో జీవునికి సుఖదుఃఖములు లేకపోవడము వలన, జీవుడు కూడా

విశ్రాంతి పొందుచుండును. బుద్ధికి జీవునికి విశ్రాంతి దొరకాలంటే అది మనస్సు యొక్క స్థితినిబట్టియుండును.

కొందరి మనస్సు ఎల్లప్పుడూ చురుకుగా ఉండి సమాచారములను గానీ, సమాచార జ్ఞాపకములనుగానీ అందించుచుండును.

అటువంటి మనస్సున్న శరీరములోని బుద్ధికి దాని ప్రక్కనున్న జీవునికి ఏమాత్రము విశ్రాంతి ఉండదు. కొందరి

శరీరములలోని మనస్సు ఎక్కువ చురుకుతనము లేనిదై, ఎక్కువ కాలము శరీరమంతా వుండక బ్రహ్మనాడిలో చేరిపోయి

విశ్రాంతి తీసుకోవడము (నిద్రపోవడము) వలన ఆ శరీరములోగల జీవుడు కూడా ఎక్కువ నిద్రలోనే గడిపినట్లు

అగుచున్నది. ఈ విధముగా మనస్సుకు ఎప్పుడు నిద్రవస్తే, అప్పుడు బుద్ధికి జీవునికి కూడా నిద్రవచ్చినట్లే అగుచున్నది.



ఇక్కడ అందరికీ తెలియని మరొక రహస్యము కూడా ఒకటున్నది. అదేమనగా! మనస్సు పని చేయకుండా

బ్రహ్మనాడిలోనికిపోయి ఒక బిందువుగా ఉండిపోయినప్పుడు మనస్సుకు కొంత మెలుకువ వచ్చి కొంత నిద్రమత్తు

ఉండగా బ్రహ్మనాడిలోనే ఉంటూ ఆ మత్తులోనే ఏదో ఒక విషయమును బుద్ధికి అందించును. అలా ఐదు లేక పది

నిమిషములుగానీ, అరగంట లేక గంటవరకుగానీ మనస్సు బ్రహ్మనాడిలోనే ఉండి తనకు అక్కడ తెలిసిన సమాచారమును

బుద్ధికందివ్వగా దానిని జీవుడు కూడా చూస్తుండును. బ్రహ్మనాడిలోని మనస్సుకు బయటి ఇంద్రియ సమాచారములు

అందవు. అది నిద్రమత్తులో ఉన్నందువలన గత జ్ఞాపకములు కూడా మనస్సుకు రావు. అటువంటపుడు మనస్సు

సమాచారమును బుద్ధికి చూపుచున్నది? అను ప్రశ్న రాగలదు. దానికి మా సమాధానము ఏమనగా! బ్రహ్మనాడిలో

ఆత్మ నివాసమున్నది. బ్రహ్మనాడిలో చేరి నిద్రమత్తులోనున్న మనస్సుకు బ్రహ్మనాడిలోని ఆత్మయే స్వయముగా కొన్ని

విషయములను చూపుచుండును. ఆత్మ బ్రహ్మనాడిలో మనస్సుకు తెలుపు సమాచారము కొన్నిమార్లు వేగముగా

జరిగినట్లుండును. కొన్నిమార్లు నిదానముగా జరిగినట్లుండును. ఆత్మ వింత వింత సమాచారమును మనస్సుకు

అందివ్వగా, ఆ సమాచారమును జీవుడు కూడా చూస్తూ ఉండును. అలా తెలిసినదే స్వప్నము. మనస్సు బ్రహ్మనాడిలో

ఉండగా మనస్సుకు ఆత్మ తెలుపు విషయమునే స్వప్నము అంటాము. స్వప్నములో బుద్ధికి చేరు విషయములు జీవునికి

తెలియుచుండును. కావున జీవుడు మెలుకువలో జాగ్రత్తావస్థను అనుభవించినట్లే ఆత్మ తెలుపు స్వప్నావస్థలో కూడా


జీవునికి స్వప్నములోని విషయ సుఖదుఃఖములు తెలియుచుండును. ఆ సమయములో స్వప్నములో జీవుడు ఆత్మ

తెలుపు క్రొత్త విషయముల వలన వచ్చు క్రొత్త అనుభవములను అనుభవించును. అందువలన నిద్రలోని స్వప్నములో

అసాధారణ విషయములు అనుభవానికి వచ్చును. ఈ విధముగా మనస్సు నిద్ర, స్వప్నము, మెలుకువ అను మూడు

అవస్థలను పొందుచూ, ఆ మూడు అవస్థలలోని విషయములనే లోపల గుణచక్రములోగల బుద్ధికీ, జీవునికీ తెలుపుచుండును.

అప్పుడు జీవుడు ఆ మూడు స్థితులలో లభించిన వాటినే అనుభవించును. మనస్సు ఎప్పుడైతే బ్రహ్మనాడిని వీడి బయటి

శరీరములోనికి వచ్చునో, అప్పుడు మనస్సు మెలుకువలోనికి వచ్చినట్లు లెక్కించవలెను. మనస్సు ఎప్పుడైతే మెలుకువ

లోనికి వచ్చిందో, అప్పుడు మనస్సు తన పనిని తాను చేయుటకు ప్రారంభించును. శరీరములో మనస్సుకు మాత్రమే

నిద్ర, మెలుకువ, స్వప్నములున్నవి. బుద్ధికిగానీ, జీవునికిగానీ నిద్ర, మెలుకువ, స్వప్నములు లేవు. మనస్సు అందించిన

వాటిని బుద్ధి తెలుసుకోగా, బుద్ధి అందించిన వాటిని జీవుడు పొందుచున్నాడు. మనస్సుకున్న నిద్ర మెలుకువలను

జీవుడు అజ్ఞానముచేత తనవిగా భావించుకొంటున్నాడు. ఇంతవరకు మనస్సుకు సంబంధించిన సమాచారము

సమూలాగ్రముగా చెప్పడము జరిగినది.


ఇప్పుడు పై ప్రశ్నలో మనస్సునకు ఇవి ఉన్నవని ఒక నాస్తికవాది చెప్పినమాట నిజమో కాదో చూస్తాము.

నాస్తికవాది తనమాటలలో నిర్ణయము మనస్సుదే అన్నాడు. అతను ఈ మాటను గ్రుడ్డిగా చెప్పినదేగానీ, పూర్తి తెలిసిగానీ,

శాస్త్రబద్ధముగాగానీ చెప్పలేదని తెలిసిపోవుచున్నది. ఎందుకనగా! శరీరములో మనస్సుకు నిర్ణయమును తీసుకొను

అధికారము గానీ, అవకాశముగానీ లేనే లేదు. చిత్తము నిర్ణయించిన విషయమును బుద్ధి గ్రహించి, దానిని మనస్సుకు

తెలుపగా, మనస్సు బయట శరీర అవయవములకు తెలియజేయుచున్నది. అంతేగానీ మనస్సుకు ఎటువంటి సందర్భములో

కూడా స్వంత నిర్ణయములు తీసుకొను అధికారముగానీ, అవకాశముగానీ లేదు అని చెప్పుచున్నాము. నాస్తికవాది

మనిషికున్న తెలివితేటలన్నీ మనస్సు వలన కల్గుచున్నవని చెప్పాడు. నాస్తికవాది అయినవాడు భౌతికశాస్త్రమును చదివి

అంతా తనకు తెలుసు అను భ్రమలో చెప్పినమాటలని తెలియుచున్నది. భౌతికశాస్త్రమును చదివితే భౌతికముగా నున్న

గుండె, కాలేయము, మూత్రపిండములను గురించి తెలియునేమోగానీ, కనిపించని మనస్సును గురించి ఏమీ తెలియదు.

మనస్సు అభౌతికమునకు సంబంధించినది. కావున నాస్తికవాదికి మనస్సుయొక్క సామత్యమేమిటో తెలియదు. అందువలన

తెలివితేటలు మనస్సువని చెప్పాడు. తెలివితేటలు బుద్ధికి ఉంటాయిగానీ మనస్సుకు ఉండవు. మనస్సుకు రెండు

పనులు తప్ప ఇతర ఏ పనులూ తెలియవు. బుద్ధియొక్క చాకచక్యమును బట్టి మాటతీరు ఉండును. అయితే

నాస్తికవాది మాటతీరు కూడా మనస్సుదే అన్నాడు. ఆ మాట చాలాపొరపాటు. భావములు, ఆవేశములు కూడా

మనస్సువేనని అతడు చెప్పడము జరిగినది. ఆ మాట కూడ పూర్తి తప్పగును. మనిషికి భావములు గుణముల వలన

వచ్చునుగానీ, మనస్సు వలన రావు. ఆవేశము అనునది కోపగుణమగును. కోపము గుణచక్రములోని 12 గుణములలో

ఒక గుణమగును. మనస్సుకు గుణమునకు ఏ సంబంధమూ లేదు. మనస్సంటే ఏమిటో తెలియనివారు, కొన్ని

చదువులు చదివి తమకంటే మేధావులు, విద్యావంతులులేరను భావముతో, తమ స్థాయిని తాము గుర్తించుకోలేక,

అందరికంటే గొప్పవారమనుకొని, మనస్సును గురించి చెప్పిన మాటలు తలా తోక లేకుండ మాట్లాడిన మాటలని

అర్థమగుచున్నది.


ఎంతో శాస్త్రబద్ధముగా మాట్లాడవలసిన మాటలను ఏమాత్రము శాస్త్రీయతగానీ, వివేకముగానీ లేకుండా మాట్లాడి,

తమకు తెలిసినంత ఎవరికీ తెలియదనుకోవడము నేడు కొందరికి అలవాటైపోయినది. వారి దృష్ఠిలో వారిని వారు


గొప్ప విజ్ఞానులమనుకొని, మిగతా వారినందరినీ శాస్త్రము తెలియనివారుగా పోల్చుకొంటున్నారు. చివరకు వారు

పూర్తిగా శాస్త్రమును వదలి ఏమాత్రము శాస్త్రీయతలేని మాటలను మాట్లాడుచున్నారు. అటువంటి శాస్త్రీయతలేని

మాటలను ఆధారము చేసుకొని, దేవుడు లేడనీ ఉన్నాడని ఎవరూ నిరూపించలేరనీ చెప్పుచున్నారు. దేవున్ని ఎవరూ

నిరూపించలేరని మేము కూడా చెప్పుచున్నాము. ఎందుకనగా దేవునికి రూపము లేదు, ఆయన తెలియునట్లు

ఉన్నాడని మేము కూడ చెప్పలేదు కదా! ఎవరో ఏమో చెప్పితే దానిప్రకారము మాట్లాడి మేము నాస్తికులము,

విజ్ఞానులము అని మాట్లాడితే, వారికి నాస్తికులను పేరు చెల్లుతుందిగానీ, వారికి విజ్ఞానులు అను పేరు సరిపోదు.

వారిని ఒక విధ అజ్ఞానులని చెప్పవచ్చును. విజ్ఞానులైన వారు దేనినైనా శాస్త్రబద్ధముగా మాట్లాడుచూ అందులో

సత్యముండునట్లు చూచుకొంటారుగానీ, తమకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడరు. దేశములో ఎందరో అజ్ఞానులు మేము

ఆస్తికులమని చెప్పుకొనుచూ, స్వామీజీలుగా కనిపిస్తూ, దేవున్ని గురించి వారికి తెలియని విషయములను శాస్త్ర ఆధారము

లేకుండా చెప్పితే, కొందరు వారి బ్రతుకుతెరువు కొరకు మేము గురువులము మాకు దేవుని విషయము తెలుసు, దేవుడు

మేము చెప్పినట్లు పుల్లగా తెల్లగా ఉన్నాడని చెప్పితే, అటువంటి వారిమాటలను ఆధారము చేసుకొని అందరికీ ఇంతమటుకే

తెలుసు వారు చెప్పినమాటలలో ఏమాత్రము శాస్త్రీయతలేదని ప్రచారము చేయవచ్చును. అలా చెప్పిన గురువుల

మాటలలో శాస్త్రీయత లేకపోయి నంతమాత్రమున దేవున్ని గురించి ముందే చెప్పిన శాస్త్రమును లేదంటారా? బ్రహ్మవిద్యా

శాస్త్రము ప్రకారము దేవున్ని గురించి చెప్పువారు లేరంటారా? నాస్తికులు, దేశ విజ్ఞానులమనువారు కొందరు గురువులు

చేయు మోసములను బహిర్గతము చేసి సమాజమునకు చూపించి, దేవున్ని గురించి చెప్పేవారందరూ ఇట్లే ఉంటారనడము

అశాస్త్రీయమైన మాటయగును. దేవుని పేరు చెప్పి మోసము చేయు బూటకపు స్వాములు, గురువులు ఉన్నంతమాత్రమున

దేవుడు లేకుండాపోవడము లేదు. అట్లే దేవుడు కళంకుడు కాడు.


మేము ఈ విధముగా చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఒక స్వామీజీ విషయమును గురించి, ఆ స్వామీజీ ఇస్తానన్న

దైవశక్తిని గురించి ఎన్నో ప్రశ్నలను అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్నను క్రింద చూడండి.

ప్రశ్న :- కొందరు స్వామీజీలు తాము తపశ్శక్తి సంపన్నులమనీ, తాను ఇతరులను తాకడము వలన వారిలోనికి

శక్తిపాతము జరుగుననీ, అప్పుడు వారికి కోటిసంవత్సరములు తపస్సుచేసి సంపాదించుకొన్న శక్తికంటే ఎక్కువ శక్తి

లభిస్తుందనీ, అలా శక్తిపాతము జరుగుట వలన వారికున్న సమస్యలన్నీ తన శక్తి వలన తీరిపోవుననీ, అలాగే వారి

రోగములు కూడా పోవుననీ చెప్పుచూ, తాము శక్తిపాత స్వాములుగా పేరు తెచ్చుకొన్నారు. అలా తమ శక్తిని ఇతరులలోనికి

పంపడము సాధ్యమా? ఆయనగారు (ఆ స్వామి గారు చెప్పినదంతా సత్యమా?


జవాబు :- జలపాతము అంటే పైనున్న నీరు అడ్డు అదుపు లేకుండా క్రిందికి దూకడము అని అర్ధము. శక్తిపాతము

అనగా పైనున్న శక్తి క్రిందికి దూకడమో, ప్రాకడమో అని అర్థము. నీరంటే అందరికీ తెలుసు నీరు ఎత్తునుండి క్రిందికి

పడుననీ తెలుసు. అలా పడే నీరు ఎక్కడినుండి వచ్చినదో కూడా అందరికీ తెలుసు. అయితే ఒక మనిషినుండి (ఒక

స్వామినుండి) మరియొక మనిషిలోనికి ప్రవహించు లేక దూకునను శక్తి ఎక్కడిదను విషయము ఎవరికీ తెలియదు.

అంతేకాక శక్తి అనునది ఉన్నదా? ఉంటే అది ఏ శక్తి? ఆ శక్తి ఎక్కడినుండి పుట్టివచ్చినది? మరియొక మనిషిలోనికి

ప్రవహించిన శక్తి ఆ మనిషిలో ఏమి చేయగలదు? చివరికి ఆ శక్తి చేరినమనిషిలో ఏమైపోగలదు? ఇన్ని ప్రశ్నలకు

శాస్త్రబద్ధమైన జవాబును పొందగలిగితే వారు చెప్పినవన్నీ నమ్మవలసిందే. ఒకవేళ శాస్త్రబద్ధమైన జవాబు లేకపోతే


అదంతయు అసత్యమని చెప్పవలసిందే. ఒకవేళ కొన్ని ప్రశ్నలకు మాత్రము జవాబుండి కొన్ని ప్రశ్నలకు జవాబు

లేకపోతే అది కొంతే సత్యము అనియూ, మిగతాది అసత్యమనియూ చెప్పక తప్పదు. మేము కూడా ఈ దినము

11.06.2013 సోమవారము న్యూస్ పేపరులో శక్తిపాతము అను వార్తను చూచాను. అందువలన నాకు తెలిసినంతవరకు

శక్తిని గురించి, శక్తిపాతమును గురించి వివరించ దలచుకొన్నాను.


బయట సమాజములో కూలిపనికి పోయి కష్టపడితే దానికి తగిన ఫలితము (కూలి) కొంత డబ్బురూపములో

వచ్చును. దినకూలి ఒకనికి 100 రూపాయలుంటే, అదే పని నెల జీతముగా 3000 రూపాయలుండును. అలాగ

వారు వారు చేయు పనులనుబట్టి ఫలితముండును. కనిపించే పనికి కనిపించే ఫలితమున్నట్లే, కనిపించని ఫలితము

కూడా ఉంటుంది. ఒక పొలములోనికి కూలిపనికి పోతే పనిచేసిన వానికి ఫలితమును కనిపించు డబ్బురూపముగానో,

ధాన్యరూపముగానో ఇచ్చుట ఆనవాయితీగా ఉన్నది. అలాగే ఒక మనిషి ఏ కార్యము చేసినా దానికి కనిపించని దేవుడు

కనిపించని ఫలితమును ఇచ్చుచున్నాడు. కనిపించే ఫలితము ధనముగానో, ధాన్యము గానో ఉన్నట్లు దేవుడిచ్చు

కనిపించని ఫలితము కూడా పాపపుణ్యములను రెండు రకముల ఫలితముగా ఉన్నది. ప్రపంచ కార్యములలో ఏ పని

యందైనా, ఎవరికైనా కనిపించెడు ఫలితము కొందరికి దినకూలి పేరుతో డబ్బురూపములో వస్తున్నది. కొందరికి నెల

జీతము అను పేరుతో డబ్బు రూపమున వస్తున్నది. కనిపించే ఫలితము దినకూలిగాగానీ, నెల జీతముగా గానీ

పంచాయితీలో పారిశుద్య ఉద్యోగినుండి దేశమునకు ప్రెసిడెంట్ వరకు ధనరూపములో పొందుచున్నారు. అయితే

గ్రామమునుండి దేశ రాజధాని వరకు ఎవరు పని చేసినా వారికి కనిపించే ఫలితము జీతము రూపములోనే కాకుండా,

కనిపించని ఫలితము కర్మరూపములో వస్తున్నది. ఈ విషయము చాలామందికి తెలియదు.


ఒక కార్యములో కనిపించే ఫలితము ద్వారా ఆ పనిని చేసినవాడు తృప్తి పొందుచున్నాడు. అదే కార్యములో

వచ్చిన కనిపించని ఫలితమైన పాపపుణ్యములను గురించి కార్యము చేసినవానికి తెలియదు. కావున పాపపుణ్యములను

గురించి ఎవడూ చెప్పుకోడు. ఒక కిరాయి హంతకుడు ఒక హత్యను చేయుటకు కోటి రూపాయలకు ఒప్పుకొన్నారు.

అడ్వాన్సుగా పదిలక్షలు తీసుకొని, నిత్యము అదే పనిని చేయుటకు కాచుకొనివుండి, ఒకరోజు అన్నీ అనుకూలించినప్పుడు,

అతని ఒప్పందము ప్రకారము మనిషిని హత్యచేయడము జరిగింది. హత్య చేసిన హంతకుడు తన స్నేహితునివద్దకు

పోయి “నాకు ఈ హత్యలో ఏమీ ఖర్చు కాలేదు. అడ్వాన్సు పది లక్షలు తీసుకొనినా అందులోనుండి పూర్తిగా యాభైవేలు

కూడా అయిపోలేదు. నేను పనికిపూనుకొన్న తర్వాత నాలుగురోజులకే పని పూర్తి అయినది. అందులోనూ చాలా

సులభముగా జరిగిపోయినది. అందువలన ఈ హత్యా ఒప్పందములో నాకు బాగా లాభము వచ్చినది. నీకు నేను

బాకీయున్న లక్షరూపాయలు తీసుకో” అని అన్నాడట. ఇక్కడ హంతకుడు తనకు వచ్చిన ఫలితమును గురించి తన

స్నేహితునికి చెప్పాడుగానీ, తనకు వచ్చిన పాపమును (కర్మను) గురించి ఏమాత్రము ప్రస్తావించలేదు. ఆ కార్యములో

తనకు తెలిసిన ఫలితము, కనిపించే ఫలితము ధనము. కావున దానిని గురించి చెప్పాడు. పాపఫలితము కనిపించదు

కావున దానిని గురించి చెప్పలేదు.


ఈ విధముగా మనిషి ఏ పనిని చేసినా అందులో కనిపించే ఫలితమే కాక, కనిపించని కర్మ ఫలితము కూడా

ఉంటుంది. జరిగిన పని మంచిదైతే కనిపించని ఫలితముగా పుణ్యము వస్తున్నది. ఒకవేళ చేసిన పని చెడుదైతే దాని

ఫలితముగా కనిపించని పాపము వస్తున్నది. పాపపుణ్యములను రెండిటిని కలిపి కర్మ అంటాము. ఆ విధముగా


వర్తమాన కాలములో (జరుగుచున్న జీవితములో) సంపాదించుకొన్న కర్మను ఆగామికర్మ అంటాము. ఇదంతటినీ

గమనిస్తే కార్యాచరణలో ఎవరికైనా కనిపించే ఫలితము ధనము లేక ఇతర రూపములో ఉండగా, కనిపించని ఫలితము

పాపపుణ్యరూపములో ఉన్నదని తెలియుచున్నది. కనిపించే ఫలితమైన ధనమును దాచి పెట్టుకొనుటకు బ్యాంకు

ఉన్నది. కనిపించని ఫలితమును గురించి కార్యము చేసి దానిని సంపాదించుకొన్న వానికి తెలియదు. కావున అతను

దానిని దాచుకోకున్నా అదియే (కర్మయే) వాని తలలోనికి చేరి అక్కడ నాలుగు చక్రముల సముదాయములో క్రింది

నుండి రెండవ చక్రముగా చెప్పబడుచున్న కర్మచక్రములో చేరిపోవుచున్నది. ఇదంతయు ఒక కార్యము ఎడల జరుగు

విధానము.


ఈ ప్రపంచమంతయూ ప్రకృతి మరియు పరమాత్మల చేత సృష్టింప బడినది. పరమాత్మ సృష్టికర్తకాగా ఆయనకు

సహకరించునది ప్రకృతియని గీతలో తెలిసిపోయినది. ప్రకృతి కనిపించుచున్నది. పరమాత్మ కనిపించడు, ఆయన

కనిపించువాడు కాడు. ఈ విశ్వమంతయు కనిపించే ఆకృతిగా ప్రకృతి ఉండగా, కనిపించని పరమాత్మ ప్రకృతియంతయు

ఆవహించి ప్రకృతికి శక్తినిచ్చుచున్నాడు. ఈ విధముగా సృష్ఠి రెండు భాగములుగా ఉన్నది. పరమాత్మ ప్రకృతి అను

రెండు భాగములచేత ఏర్పడిన సృష్ఠిలో జరుగు కార్యములను కూడా రెండు విధములుగా విభజించవచ్చును. వాటిని

ప్రకృతి కార్యములనీ, పరమాత్మ కార్యములనీ చెప్పవచ్చును. మనిషి తన జీవితములో తన బ్రతుకుతెరువు కొరకు

చేయు పనులన్నిటినీ, ప్రకృతి పనులని చెప్పవచ్చును. నూటికి 99.9 శాతము మందికి దైవజ్ఞానము (పరమాత్మ

జ్ఞానము) తెలియదు, కనుక వారందరూ తాము జీవించుటకు ప్రకృతియొక్క కార్యములనే చేయుచుందురు. దైవజ్ఞానమును

తెలిసినవారు 0.1 శాతము కూడా అరుదుగా ఉన్నారు. కావున ఎవరో పరమాత్మ జ్ఞానము మీద ఆసక్తికలవారు

మాత్రమే దైవమును తెలియుట కొరకు ఆచరించెడు పనులను దైవకార్యములని అంటున్నాము. ప్రకృతి కార్యములను

చేయు వారికి వచ్చు ఫలితము కనిపించెడు మరియు కనిపించని రెండు రకములని చెప్పుకొన్నాము. తన కొరకుగానీ,

ఇతరుల కొరకుగానీ దైవసంబంధము లేకుండా చేయు కార్యములన్నీ ప్రపంచ కార్యములగును. ఆ కార్యములలోనే

స్థూలధనముగానీ, సూక్ష్మకర్మగానీ వచ్చునని చెప్పుకొన్నాము. కార్యము వలన వచ్చు స్థూలధనమును మనిషి తనకు

తెలిసి ఎక్కడైనా దాచుకోవచ్చును. అయితే సూక్ష్మముగా కనిపించక వచ్చిన కర్మను మనిషి దాచుకోకున్నా దానంతకదే

తలలోని కర్మచక్రములో చేరి నిలువయుండును. ఇదంతయు ప్రకృతి కార్యముల విషయములో చెప్పుకొన్న సమాచారమని

తెలియవలెను.


పరమాత్మను చేరుటకు ఆత్మజ్ఞానమును సంపాదించుకోవలెను. ఆత్మజ్ఞానమును తెలియుటకు జీవాత్మ దైవసంబంధ,

యోగసంబంధ, ఆత్మ సంబంధ, మాయసంబంధ జ్ఞానములన్నియు తెలియవలెను. దైవికమైన జ్ఞానము తెలియుటకు

ఎన్నో పనులను, ఎంతో కాలము చేయవలసియున్నది. అలా దైవసంబంధ కార్యములను చేసినప్పుడు, ఆ కార్యములకు

కూడ ఫలితము వచ్చును కదా! ఆ ఫలితము కూడా సూక్ష్మమైనదై, కంటికి కనిపించనిదై ఉండును. కంటికి కనిపించని

కర్మ ఫలితమువలె పాపపుణ్య అను రెండు భాగములవలె కాకుండా ప్రత్యేకముగా ఉండును. దైవ కార్యములలో వచ్చు

ఫలితమును జ్ఞానశక్తి అంటాము. దానినే జ్ఞానాగ్ని అనికూడా భగవద్గీతలో చెప్పడము జరిగినది. దానినే మరియొక

పేరులో దైవశక్తి అనికూడా అన్నారు. దేవుని కొరకు అని పేరు పెట్టి చేయు ప్రకృతి కార్యములలో కూడా శక్తివచ్చును.

అయితే అది పూర్తి దేవుని కార్యము కానందునవలన వచ్చిన శక్తి దైవశక్తి కాదు. దైవ సంబంధ కార్యములు దేవుని

ధర్మములతో కూడుకొని ఉండును. అలాగే కొందరు దైవసంబంధ కార్యములని నమ్మి అధర్మములతో కూడిన కార్యములను

చేసినా వారికి శక్తి లభించుచున్నది. అయితే అది దైవమునకు సంబంధించినది కాకుండా వేరుశక్తిగా ఉండును.


దేవుని శక్తికి సంబంధించిన ధర్మములు మూడు ఉండగా, అధర్మములు నాలుగుయున్నవి. దేవుని ధర్మములు మూడూ

మూడు యోగముల రూపములో ఉండగా, ధర్మములకు వ్యతిరేఖదిశలో నున్న నాలుగు అధర్మములు నాలుగు ఆరాధనల

రూపములో ఉన్నవి. దేవుని ధర్మములు వరుసగా కర్మ, బ్రహ్మ, భక్తియోగములుకాగా, అధర్మములు వేదాధ్యయన,

యజ్ఞ, దాన, తపస్సులుగానున్నవి. దైవ ధర్మములైన మూడు యోగములలో లభించు దైవశక్తి మనిషి కర్మను నాశనము

చేసి మోక్షమును చేర్చునదిగా ఉండును. మిగతా నాలుగు అధర్మముల వలన వచ్చుశక్తి ప్రకృతిశక్తికాగా, అది వారు

ఆచరించు ఆచరణనుబట్టి లభించును. యజ్ఞములు చేస్తే యజ్ఞశక్తి, తపస్సులు చేస్తే తపశ్శక్తి, దానముల వలన దాన

శక్తి, వేదాధ్యయనము వలన ఆధ్యాయన శక్తి వచ్చునుగానీ అది చాలా తక్కువశక్తిగా ఉండును. యజ్ఞముల వలన

వచ్చుశక్తి దానముల వేదాధ్యయనముల వలన వచ్చు శక్తికంటే కొద్దిగ గొప్పగ ఉండును. తపస్సు వలన వచ్చు శక్తి

యజ్ఞముల వలన వచ్చుశక్తికంటే, ఎక్కువ బలముకల్గిన శక్తిగా ఉండును. తపోశక్తి, యజ్ఞశక్తి, దానశక్తి, ఆధ్యాయన

శక్తులు ఏవీ దైవశక్తికి సమానము కావు.


నాలుగు అధర్మముల వలన వచ్చుశక్తి నాలుగు రకముల ఉండును. అధర్మముల కార్యముల వలన ఫలితము

వచ్చినా, అది కర్మలను నాశనము చేయునదిగా ఉండదు. మూడు ధర్మములైన ధర్మకార్యములలో అనగా యోగకార్యములో

వచ్చుశక్తి కర్మను కాల్చివేయునదిగా ఉండును. నేడు చాలామంది స్వామీజీలుగా, గురువులుగా, బాబాలుగా

ఉన్నవారూ, మిగతావారు అందరు దేవుని ధర్మములేవో తెలియక అధర్మము లను ధర్మములని నమ్మి వాటినే ఆచరిస్తూ,

తమది మంచిమార్గమని తలచు చున్నారు. నాలుగు అధర్మకార్యములే నేడు ధర్మములుగా ప్రచారమై పోయాయి.

వాటినే ధర్మములని అందరూ ఆచరించుచూ అసలైన ధర్మములను మరచిపోయారు. ధర్మముల స్థానములో అధర్మములు,

అధర్మముల స్థానములో ధర్మములు చేరిపోయినవి. అందువలన నేడు భక్తి, జ్ఞానము అనువారుగానీ, స్వామి గురువులు

అనువారుగానీ ఎక్కువగా నాలుగు అధర్మములలో తపస్సు అను దానినే ధ్యానము అనీ తపోసాధన అనీ, మెడిటేషన్

అనీ అనేక రకముల పేర్లతో ధ్యానసాధన చేయుచున్నారు. అలా చేయుట వలన వారు తపస్సు చేసినట్లగుచున్నది.

దానివలన వారికి తపోశక్తి వచ్చుచున్నది. ధ్యానము గొప్పదని అనుకొనినా దానివలన దైవశక్తి రావడములేదు. ధ్యానము

చేయుట వలన కొద్దిపాటి తపోశక్తి లభించినట్లు అర్థమైనవారు తాము భూమిమీద గొప్పవారమనీ, తాము దైవముతో

సమానమనీ, గొప్ప గురువులమనీ, పెద్ద స్వాములమనీ ప్రచారము చేసు కోవడము పరిపాటయినది. అటువంటివారిని

గూర్చి గొప్ప స్వామీజీలని ప్రచారము చేయుట వారి శిష్యులకు అలవాటైపోయినది.


అటువంటి స్వామీజీలలో కొందరు తమకు శక్తియున్నదని, ఆ శక్తిని మీకు ఇస్తామని చెప్పుచుందురు. అలా

తమ శక్తిని గురించి చెప్పుకొని ఆధ్యాత్మికమును వ్యాపారవృత్తిగా మార్చువారు కూడా కలరు. ఒకవేళ అటువంటి

వారివద్ద శక్తి ఉంటే తపోశక్తి తప్ప మరొకటి ఉండదు. ఆ శక్తి వలన ప్రపంచ పనులు నెరవేరవచ్చునుగానీ, కర్మలు

నశించవు. ధ్యానము చేయక యోగమాచరించిన యోగులు యోగశక్తిని పొందియుందురు. యోగశక్తిని దైవశక్తి

అనియూ, జ్ఞానశక్తి అనియూ అనవచ్చును. దైవశక్తి యోగిలో చేరి అతని శిరస్సులోని బ్రహ్మనాడిలో ఇమిడియుండును.

దైవ జ్ఞానము తెలిసి ధర్మముల ప్రకారము యోగమాచరించిన వారు యోగశక్తిని ఇతరులకు దానము చేయరు. అట్లు

దానము చేయుట అధర్మమగును. అందువలన దైవశక్తిని దానము చేయరు. పూర్వము గొప్ప యోగులైనవారు

దైవశక్తికి కర్మలను కాల్చు సామర్థ్యమున్నదని చెప్పిన భగవద్గీతమాట సత్యమైనదని ఆధారము చూపుటకు, తమ జీవితములో

ఏదో ఒక సందర్భములో తాము స్వయముగా ఇతరుల కర్మమీద శక్తిని ఉపయోగించి, వారికర్మను కాల్చివేసినవారు


గలరు. అదియు వారి జీవితములో ఏదో ఒకమారు నిరూపించడము కొరకు చేసినది తప్ప తర్వాత మరెప్పుడూ వారు

చేయలేదని చరిత్రలో తెలియుచున్నది. బైబిలులో ఏసు ఒక గ్రుడ్డివానికి చూపువచ్చునట్లు చేశాడు. తర్వాత రెండవ

గ్రుడ్డివానిని ఎక్కడా బాగు చెయ్యలేదు. అలాగే ఒక కుష్టురోగియొక్క పాపములను క్షమించుచున్నానని చెప్పి అతనిని

ఆ రోగమునుండి విముక్తుని చేశాడు తప్ప రెండవ కుష్టురోగిని ఎక్కడా బాగుచెయ్యలేదు. ఈ విధముగా గత చరిత్రలో

ఎందరో గొప్ప యోగులైనవారు తమ యోగశక్తి చేత నిరూపణ నిమిత్తము ఒక సందర్భములో ఎవనికో ఒకనికి కర్మను

కాల్చివేసి, జ్ఞానశక్తికి ఇటువంటి సామర్థ్యమున్నదని చూపించారు. అలా చూపించగా చూచినవారు దానిని ఆధారము

చేసుకొని దైవశక్తి కొరకు వారు కూడా ప్రాకులాడుచు దైవమార్గములో ప్రయాణించెడి వారు. ఇతరులను దైవమార్గములోనికి

మళ్ళించడానికి కొందరు యోగులు అలా చేసి చూపించారు. అలా చేసినది సాధారణ యోగులైన వారు కాకుండా

భగవదంశతో కూడినవారు మాత్రమే అలా చేయగలిగారు. అజ్ఞానులను జ్ఞానమువైపు మళ్ళించి దైవమార్గములో

ప్రయాణించడానికి వారు ఎక్కడో ఒకచోట అలా తమ యోగశక్తిచేత ఇతరుల కర్మను కాల్చి చూపించారు.


ఇప్పుడు ఒక స్వామీజీ శక్తిపాతము అను పేరుతో డబ్బులకు శక్తిని ఇతరులకు ఇస్తాననడము ఆధ్యాత్మికరంగములో

చోద్యమైన మాటగా ఉన్నది. కొందరు అజ్ఞానులను జ్ఞానమార్గములో ప్రవేశింపజేయుటకు జ్ఞానశక్తి ఇటువంటి

సామర్థ్యముగలదని చూపించు నిమిత్తము పూర్వము చేయబడిన కార్యము, నేడు అంగడి వస్తువుగా ఏమాత్రము దైవజ్ఞానము

మీద ఆసక్తి లేనివారికి డబ్బుకు శక్తిని దానము చేస్తాననడము, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ, శక్తిపాతము

చేస్తాననడము వింతగాక ఏమగును? యోగశక్తి ఎటువంటిదో, దానివిలువ ఏమిటో, అది ఎలా లభిస్తుందో యోగులకు

మాత్రమే తెలుసు. యోగులు కానివారికి ఆ శక్తి ఏమిటో ఎట్లుంటుందో, ఎలా లభిస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు

శక్తిపాతము చేస్తానని, శక్తిపాత స్వామీజీ అనిపేరు పెట్టుకోవడములోనే ఇతను యోగికాడు అని తెలిసిపోవుచున్నది.

అతను స్వామీజీగా ప్రచారమైనా, వాస్తవానికి అతను ఒక భక్తుడు. దేవుడెవరో తెలియక మహత్యములను చూపువానినే

దేవుడని నమ్మి, అతనిని ఆరాధించుచూ, అతని పాటలనే పాడుకొనుచూ ఫలానా వారి అనుగ్రహముతో ఉన్నవాడినని

చెప్పు కొన్నప్పుడు, అతనిని యోగి అని అనుకోవలసిన అవసరములేదు. యోగి అయిన వాడు రూప, నామ, క్రియలులేని

దేవున్ని గురిచి ఆయన జ్ఞానమును గురించి చెప్పునుగానీ, రూప నామ క్రియలుగల వ్యక్తులను గురించిగానీ, దేవతలను

గురించిగానీ చెప్పడు. శక్తిపాత స్వామీజీ అని పేరుగాంచిన స్వామిని ఒక భక్తునిగా చెప్పవచ్చునుగానీ యోగిగా

చెప్పుటకు ఏమాత్రము వీలులేదు. అటువంటి స్వామీజీల ముందర సూక్ష్మశరీరముగల దయ్యములు పూనకమువచ్చి

కొందరు ఊగుతూయుండగా, కొందరు తూగుతూ, కొందరు కదలుచూ, కొందరు ఎగురుచూ ఉందురు. దయ్యములు

అటువంటి స్వామీజీల ముందర తమ ఉనికిని చాటుకొనుటకు ఏమాత్రము భయము లేకుండా ప్రవర్తించుచుండును.

ఈ వివరము తెలియని ప్రజలకు అదియొక వింతగా కనిపించును. ఆ వింత ఆ స్వామీజీ యొక్క గొప్పతనమని

అనుకొనుచుందురు. యోగులను చూస్తూనే దయ్యములుగానీ, చిన్నచిన్న దేవతలుగానీ, భయపడి దూరముగా పోవుదురు.

యోగులుకాని వారిదగ్గరే అలా అన్ని వికారములను ప్రదర్శించుచుందురు. ఒకవేళ యోగులైన వారిముందుకు దయ్యములు

వచ్చినా భయపడుచూ వినయ విధేయతలు కల్గియుండును. ఆ విషయము తెలియనివారు ఏ స్వామీజీ వద్ద దయ్యములు

భయము లేకుండా వచ్చి తమ ఇష్టమువచ్చినట్లు ప్రవర్తించుచుండునో, ఆ స్వామీజీలనే గొప్పగా చెప్పుకొనుచుందురు.

అటువంటి స్వామీజీలు దైవజ్ఞానము విలువ తెలియక, దైవశక్తిని సంపాదించుకోవలెనని ప్రయత్నము చేయక, ప్రపంచ

ధనమును సంపాదించుకోవడములో లగ్నమైపోయి, దేవుడు చెప్పిన జ్ఞానమును తుంగలో త్రొక్కి, వారికి అనుకూలమైనది,


ప్రజలకు సులువైనది మరియు వారికి కావలసిన దానిని చెప్పుచూ, తాము డబ్బును సంపాదించుకోవడములోనే

లగ్నమైపోవుదురు. ఈ విధానమును చూచిన హేతువాదులనువారికి, నాస్తికవాదులను వారికి జ్ఞానమార్గమంటే అదేనేమోనని

తెలిసి జ్ఞానమార్గమును దైవశక్తిని గురించి ప్రశ్నించి, వారికి సరైన సమాధానము దొరకనప్పుడు దేవుడు, జ్ఞానము

అనునవి బూటకము అందులో ఎటువంటి సత్యములేదు అని చెప్పుటకు వారికి వీలుకల్గుచున్నది. కనిపించు ధనార్జన,

సమాధానములేని ఆచరణ, ప్రశ్నించితే జవాబివ్వక నీవు అర్హుడవు కాదు అని దాటవేసి మాట్లాడుట, పొంతనలేని

కథలను జ్ఞానమని చెప్పుట, శాస్త్రము యొక్క ఆధారము ఏమాత్రము లేకుండా మాట్లాడుట మొదలగు కార్యములన్నిటిని

చూచిన తర్వాత, హేతువాదులకు ఇది సరియైన పద్ధతి కాదని తెలిసిపోవుచున్నది.


అసలు విషయానికి వచ్చి శక్తిని గురించి చెప్పితే శక్తి అనునది స్థూలముగా ఉన్నది, సూక్ష్మముగా ఉన్నది.

స్థూలముగానున్నవి ముఖ్యముగా రెండు కలవు. ఒకటి ధనశక్తి, దేహశక్తి వాటినే ధనబలము, శరీర బలము అనికూడ

అనవచ్చును. ఇతరులకు ఉచితముగా డబ్బులిస్తే ధనమును దానము చేసినట్లగును. తర్వాత ఇతరుల కొరకు శరీర

బలమును ఉపయోగించితే దానిని శ్రమదానము అంటాము. ధనమునుగానీ, బలమును గానీ సులభముగా దానము

చేయవచ్చును. ధనశక్తి, దేహశక్తి రెండూ స్థూలమైనవే కావున వాటిని తెలిసి ఇతరులకు దానము చేయవచ్చును.

సూక్ష్మమైనశక్తి దైవశక్తి. సూక్ష్మమైన శక్తులు భూమిమీద ఎన్నో ఉన్నాయి. అయినా వాటన్నిటిలో ఉత్తమమైనది, పెద్దది

దైవశక్తి మాత్రమే. దైవశక్తిని కష్టపడి ధర్మముల ప్రకారము సంపాదించుకోవచ్చును. అయితే స్థూలశక్తులైన ధన, దేహ

బలములను ఇతరులకు ఇచ్చినట్లు దైవబలమును ఇతరులకు ఇచ్చుటకు వీలుపడదు. ఒక మనిషి యోగమాచరించి

ధర్మము ప్రకారము దైవశక్తిని సంపాదించితే, అది ఆ మనిషి శరీరములోని తలయందు చేరి అక్కడ బ్రహ్మనాడిలో

నిలిచిపోవును. బ్రహ్మనాడిలో ఆత్మయున్నది. బ్రహ్మనాడిలో చేరినశక్తి అక్కడేయున్న ఆత్మ ఆధీనములో ఉండిపోవును.

ఆత్మ అనుమతి లేనిదే దైవశక్తి అక్కడినుండి బయటికి రాదు. శరీరమందు ఆత్మ ఆధీనములో ఉన్నశక్తి కావున దానిని

ఆత్మశక్తి అనికూడా అనవచ్చును. వాస్తవానికి యోగము వలన లభించిన శక్తిని అర్థమగుటకు పరమాత్మశక్తి, దైవశక్తి

అని చెప్పాము. వాస్తవానికి అలా చెప్పకూడదు. దేవుడు ఏమీకానివాడు కావున ఆయన శక్తి అని కూడా చెప్పకూడదు.

లభించిన యోగశక్తిని ఆత్మశక్తి అని అనుట మంచిది. ఆత్మశక్తి ఎంతటి భయంకరమైన పాపమునైనా కాల్చి బూడిద

చేయగలదు. అయినా ఆ పని జీవాత్మ ఇష్టము ప్రకారము జరుగదు. ఆత్మకు ఇష్టమైనప్పుడు ఆత్మశక్తి బయటకు వచ్చి

ఇతరుల కర్మను కాల్చగలదు.


ఎక్కడైనా ఎవరిలోనైనా ఆత్మశక్తి వలన కర్మపోయిందంటే అది ఆత్మకు తెలియకుండా జరుగలేదని, జరిగినది

సాక్షిగాయున్న దేవునికి తెలుసునని గ్రహించవలెను. అలాగే సాక్షిగా చూస్తున్న జీవునికి కూడా తెలియును. అయితే

పూర్తి శరీర అంతర్గత జ్ఞానములేనివాడు జరిగిన పనిని తానే చేశాననీ, తాను ఇతరుల కర్మను లేకుండా చేశాననీ

అనుకొనును. ఆత్మను గురించిన జ్ఞానమును తెలిసినవాడు, ఆ పనికి తాను కర్తను కాదనీ, ఆత్మయే దానికి కారణమని

అనుకొనును. స్థూలశక్తి అయినా, సూక్ష్మశక్తి అయినా, ఒకరినుండి ఒకరికి చేరితే అవి జీవునికి తెలిసే చేరుచున్నవి.

అంతమాత్రమున జీవుడు ఆ పనిని నేనే చేశాను, నేనే ఇచ్చాను అనుకొంటే పొరపాటే అగును. శరీరములో జీవుడున్నా

శరీరమునకు అధిపతి ఆత్మయే. ఆత్మ అనునది ఒకటి ఉన్నదను విషయము కూడా తెలియనివారు అన్ని పనులను

తామే చేస్తున్నామని అనుకొంటున్నారు. శరీరములో ఏ చిన్న పని జరిగినా, పెద్ద పని జరిగినా, ఏదైనా ఆత్మకు తెలిసే

జరుగును. ఆత్మ చేస్తేనే జరుగును. ఆత్మ చేయనిది శరీరములో ఏ పనీ జరుగదు. అందువలన ఇతరులకు ధనమును


ఇచ్చినా, దైవశక్తిని ఇచ్చినా అన్నీ ఆత్మ ఇవ్వవలసిందే. ఆత్మ నేను అని బయటపడకుండా కార్యములను చేయుచుండగా,

శరీరములోని పనులన్నీ తనకు తెలిసి జరుగుచుండుట వలన, శరీరములో తాను తప్ప ఆత్మనునది మరొకటున్నదని

తెలియని దానివలన జీవాత్మ అన్నిటినీ నేనే చేస్తున్నానని అనుకోవడము జరుగుచున్నది. ఒక స్వామీజీగాయున్న

జీవుడు తన శరీరములో ఆత్మ అన్ని పనులు చేయుచున్నదని తెలియక, తానే శక్తిపాతము చేయుచున్నానని పొరపాటుగా

అనుకొని తన పేరుముందర శక్తిపాతము అని వ్రాసుకోవడము జరిగినది.


పూర్తి జ్ఞానము తెలియగల్గితే ఆత్మశక్తి (దైవశక్తి) అనునది పాతము కాదనీ, పైనుండి నీరువలె క్రిందపడు

జలపాతములాంటిది కానేకాదని తెలిసిపోవుచున్నది. అటువంటి శక్తిని శక్తిపాతము అని పేరు పెట్టడమే తప్పగును.

దైవజ్ఞానము ఎంతో శాస్త్రీయమైనది, అందువలన ఏ హేతువాది గానీ, ఏ నాస్తికవాదిగానీ దానిని విమర్శించలేడు.

శాస్త్రబద్ధము లేనిదానిని ఎవరైనా విమర్శించవచ్చునుగానీ, శాస్త్రీయమైన దైవజ్ఞానమును ప్రశ్నించ లేరు. ప్రశ్నించినా

అన్నిటికీ అన్ని జవాబులుండును. కావున దైవజ్ఞానమును ఎవరూ తప్పుబట్టలేరు. స్వామీజీలు తప్పుకావచ్చునుగానీ,

జ్ఞానము ఎప్పటికీ తప్పుకాదు, పూర్తి శాస్త్రీయమైనది.


ఇంతవరకు శక్తిపాతమును గురించి చెప్పుకొనుచూ, శక్తిపాతము జరుగుననుట శాస్త్రవిరుద్ధమని చెప్పుకొన్నాము.

దేవుని జ్ఞానమంతయు శాస్త్రబద్ధమైయున్నదనీ, దానిని ఆ విధముగా దేవుడే చెప్పాడనీ అందువలన అశాస్త్రీయమైనది

ఏదిగానీ దేవుని జ్ఞానముకాదని చెప్పుకొన్నాము. అంతేకాక ఎవరో కొందరు దేవుని ధర్మములలో లేనివాటిని ప్రచారముచేసి

ఇదే జ్ఞానమని, మేమే జ్ఞానులమనీ, సిద్ధపురుషులమని చెప్పుకొన్నంతమాత్రమున వారిని ఆధారము చేసుకొని, జ్ఞానము

అట్లుంటుందని అనుకోకూడదు. దేవుని జ్ఞానము ఎప్పుడైనా శాస్త్రబద్ధమైవుంటుందిగానీ, ఇతరులు విమర్శించునంత

అశాస్త్రీయమై ఉండదు. మేము అశాస్త్రీయమైన దానినికానీ, అశాస్త్రీయముగా ప్రచారమగుచున్న స్వాములను, గురువులను

గానీ ఒప్పుకోము. అలాగే మూఢముగా దేవుని విషయము అసత్యమను నాస్తికులనుగానీ, విచక్షణ లేకుండా

మాట్లాడువారినిగానీ, మేము సత్యవాదుల మని అసత్యములను మాట్లాడువారినిగానీ ఏమాత్రము ఒప్పుకోము. ఏ

విధముగానైన దేవుని జ్ఞానమునకు అగౌరవమేర్పడినా, దేవుని హోదాకు ధర్మమునకు భంగమేర్పరచువారుండినా,

అటువంటివారు స్వాములుగావున్నా, నాస్తికులుగావున్నా, హేతువాదులమను పేరుతోవున్నా, సత్యవాదులమని

చెప్పుకొనుచున్నా, మేము మాత్రము వారి మాటలనూ, వారి విధానమునూ ఏమాత్రము సమ్మతించక పూర్తిగా

ఖండించుచుందుము. అదే పద్ధతిలో మేము విజ్ఞానులమనీ, సైన్సును గురించి తప్పుగా మాట్లాడుచున్నవారినీ, ఇప్పుడు

మేము ఖండించి చెప్పవలసి వచ్చినది. కొందరు విజ్ఞానులు సైన్సును గురించి ఏమంటున్నారో, మేము ఎలా వారిని

కాదంటున్నామో ఇప్పుడు సమగ్రముగా వివరిస్తాము. ఇప్పుడు ఈ వివరమును ఇవ్వడము వలన మేము ఎవరి

పక్షముకాదనీ, శాస్త్రమును వదలి మాట్లాడువారిని ఎవరినైనా ఖండించుదుమనీ అందరికీ అర్థము కాగలదు. ఒక

విజ్ఞాని ఏమంటున్నాడో దానికి మేము ఏమంటున్నామో క్రింద చూడండి.


విజ్ఞాని :- సైన్సు ప్రకారము తెలుసుకోవడము, మార్చుకోవడము, దిద్దుకోవడము నిరంతరము జరిగేపని. సైన్సు

ఎప్పటికీ ఒకేలాగ ఉండదు. పవిత్ర గ్రంథాల పేరిట అంతా అందులోనే ఉన్నదని సైన్సు ఏనాటికీ అనదు. అందువలన

సైన్సు మానవాళికి తోడ్పడుతుంది. పారాసైకాలజీ మానవ అభివృద్ధికి దోహదం చేసిన ఉదాహరణ ఒక్కటి కూడా

లేదు. (ఈ విషయమును ఒక విజ్ఞాని 2001 సంవత్సరము జూలై నెలలో 'మిసిమి' అను మాస పత్రికయందు చెప్పాడు.)


మేము :- సైన్సు అంటే పైకి చెప్పుకుంటే విజ్ఞానము అనియూ, లోతుగా చెప్పుకుంటే శాస్త్రము అనియూ చెప్పవచ్చును.


సైన్సు ఒకమారు తెలియ బడితే అది ఎప్పటికీ మారదు. అందువలన దానిని శాస్త్రము అని అంటున్నాము. సైన్సు

రుజువు చేయబడినది. ఒకమారు రుజువు చేయబడినది తర్వాత మారునది కాదు. అలా మారునదియైనా, అప్పు

డప్పుడు మార్చుకోవడము, దిద్దుకోవడము జరిగినా అది సైన్సేకాదు, అటువంటి దానిని సైన్సు అని అనకూడదు.

నిరంతరము ఒకేలాగున ఉండునదే సైన్సు. సైన్సు లేక శాస్త్రము సిద్ధాంతములు అను శాసనముల మీద

ఆధారపడియుండును. సిద్ధాంతము మారదు. అందువలన సైన్సు మారదు. సైన్సు అయినా (సామాన్యశాస్త్రమైనా),

సూపర్ సైన్సు అయినా (అసామాన్యశాస్త్రమైనా) రెండూ శాస్త్రములే కావున రెండూ మారునవి కావు. సైన్సు గణిత,

ఖగోళ, రసాయన, భౌతిక అను నాలుగు సామాన్య శాస్త్రముల రూపములో ఉన్నది. సూపర్ సైన్సు అనునది ఒకే ఒక

బ్రహ్మవిద్యాశాస్త్ర రూపములో ఉన్నది. సూపర్సైన్సు ముఖ్యముగా మూడు గ్రంథముల రూపములో ఉన్నది. భగవద్గీత,

బైబిల్, ఖురాన్ గ్రంథముల రూపములో బ్రహ్మవిద్య (సూపర్సైన్సు) కలదని చెప్పవచ్చును. ఈ మూడు గ్రంథములు

మూడు మతములలో పవిత్ర గ్రంథములని పేరుగాంచినవి. పవిత్ర గ్రంథములని పేరుగాంచిన వాటిలో గ్రంథమంతా

సూపర్సైన్సుగా ఉండదు. పూర్తి విజ్ఞానమునకు సంబంధించిన వాక్యములు అక్కడక్కడ ఉండును. గ్రంథములో

ప్రతి వాక్యములోనూ పవిత్రత లేకున్నా, అక్కడక్కడ కొన్ని వాక్యములలో పవిత్రత ఉండుట వలన, వాటిని పవిత్రగ్రంథములని

చెప్పుచున్నాము. మూడు గ్రంథములలోనూ కొద్దిగ ఎక్కువ తక్కువగా ఒకే పవిత్రత ఉండుట వలన వాటికి

పవిత్రగ్రంథములని పేరువచ్చినది. పవిత్ర గ్రంథములలో అంతా ఉందని సైన్సు ఏనాటికీ అనదు అని పైన విజ్ఞాని

చెప్పిన మాటను తప్పుపట్టవచ్చును. పవిత్రగ్రంథము కూడా ఒక సైన్సు అయినప్పుడు, ఆ గ్రంథమును సైన్సు

ఒప్పుకోదు అనడము తెలివి తక్కువ పనియగును.



పవిత్రగ్రంథములలో చెప్పిన వాటిని ఎన్నటికో తర్వాత కాలములో ఎందరో పరిశోధకులు కనుగొన్నారు. అలా

కనుగొన్నవి కొన్నియుండగా, ఇప్పటికీ పవిత్రగ్రంథములలో చెప్పిన విషయములు కనుగొనబడనివి చాలా ఉన్నాయి.

ఉదాహరణకు భగవద్గీతలో సాంఖ్యయోగమందు చెప్పిన 22వ శ్లోకమునకు, ఖురాన్ గ్రంథమున 6వ సురా 95వ

వాక్యమునకు నేటి భౌతిక శాస్త్రవేత్తలు వేయి సంవత్సరములు కృషిచేసినా కనుగొనలేని సైన్సు కలదు. ఇంతవరకు

కనుగొనలేని విషయములు ఆ గ్రంథములలో ఉన్నప్పుడు, అంతా అందులోనే ఉన్నదని చెప్పడములో తప్పేముంది.

ఉదాహరణకు భగవద్గీతను తీసుకొని చూస్తాము. అందులో ఒక శ్లోకమును తీసుకొని చూస్తే పైకి అందులో ఏ సైన్సూ

కనిపించదు. అదే శ్లోకమును పూర్తిగా విశధీకరించి లోతుగా చూచితే అది పూర్తి విజ్ఞానముగా కనిపించును. భూమిలో

ఒక రకము రాయి కనిపించినప్పుడు అది ఇనుముగా కనిపించదు. ఆ రాయిని బాగా పరిశీలించి దానిని వేడిచేసి

ఇనుపలోహముగా మార్చవచ్చును. మొదట సాధారణ రాయిగా కనిపించినది, చివరకు ఇనుముగా తయారైనది.

అలాగే భూమినుండి బంగారు ఒకేమారు బంగారుగా లభించదు. అలాగే రాయినుండి ఇనుము, మట్టినుండి బంగారు

లభించినట్లు శ్లోకమునుండి గానీ, వాక్యమునుండిగానీ ఎంతో విలువైన విజ్ఞానము కనిపించుచున్నది. భగవద్గీతలో

సాంఖ్యయోగమునగల 22వ శ్లోకము, ఖురాన్ గ్రంథములోని 6వ సురాలోని 95వ వాక్యము రెండూ ఒకే భావముకలవనీ,

వాటిని చదివినవారు ఎవరూ గ్రహించలేరు. పైకి ఏమాత్రము రెండూ ఒకే వివరము నిచ్చునవని, రెండు ఒకే విషయమును

గురించి చెప్పునవని ఎవరికీ తెలియనట్లు కలవు. అంతేగాక గీతలోని సాంఖ్యయోగమునందుగల 22వ శ్లోకము,

ఖురాన్లోని 6వ సురా 95వ వాక్యమూ రెండూ ఇంతవరకు ఎవరూ కనుగొనలేని విజ్ఞానము వాటిలో కలదని ఎవరికీ

తెలియదు. ఇప్పటికేగాక తర్వాత వేయిసంవత్సరములకు గానీ అందులోని సైన్సును (విజ్ఞాన సిద్ధాంతమును) శాస్త్రజ్ఞులు

కనుగొంటారని కూడా చెప్పలేము. ఒకవేళ వేయి సంవత్సరములకో లేక రెండువేల సంవత్సరములకో పరిశోధకులు


గీతలోని సిద్ధాంతమును కనుగొనినా అది ముందే గీతలోనూ, ఖురాన్ గ్రంథములోనూ చెప్పబడివున్న దని అప్పుడు

కూడా చెప్పలేరు. అలాగే నేడు అభివృద్ధి చెందిన సైన్సు మూడు గ్రంథములలో ఎక్కడో ఒకచోట నిక్షిప్తమైయున్నదని

ఎవరికీ తెలియదు. భవిష్యత్తులో 'జనన సిద్ధాంతమును' ఎవరైనా ఎంతకాలమునకైనా కనుగొనినా ఆ విషయము

గీతలో సాంఖ్యయోగమున 22వ శ్లోకమునందు, ఖురాన్లో సురా ఆరులో ఆయత్ 95 లోనూ కలదని తెలియకపోవచ్చును.


మూల గ్రంథములయందు కొన్ని వాక్యములలో ఎంతో విజ్ఞానము ఇమిడి యున్నదని తెలియునట్లు, మా మాట

అందరికీ సాక్ష్యముగా ఉండునట్లు భగవద్గీతలోని సాంఖ్యయోగమను అధ్యాయములోగల 22వ శ్లోకమును తీసుకొని,

అందులో దాగియున్న సైన్సును వివరిస్తూ, జనన సిద్ధాంతమును తెలుపుచూ “జనన మరణ సిద్ధాంతము” అని ఒక చిన్న

గ్రంథమును వ్రాసియున్నాము. భవిష్యత్తులో ఎవరైనా తమ పరిశోధనలలో జనన సిద్ధాంతమును కనుగొనినా, అది

ఇప్పటికి 33 సంవత్సరముల క్రితము అనగా క్రీ.శ. 1980వ సంవత్సరములోనే మేము భౌతికశాస్త్రమును అనుసరించి

మరియు బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి వ్రాసినట్లు, వారు కనుగొన్నది మేము ముందే చెప్పిన విషయమేనని

తెలిసిపోవును. అటువంటపుడు మూలగ్రంథములలో అంతా ఉన్నదనీ, నేడు వాటిలో ఏమీ లేదనిన వారికి కూడా

తెలియును. నేడు విజ్ఞానులు చెప్పినట్లు సైన్సు మానవాళికి తోడ్పడుతుంది అని మేము కూడా చెప్పుచున్నాము. సైన్సు

అనునది ఒక శాస్త్రమునకు సంబంధించినది కాదు. సైన్సు ఆరు శాస్త్రములకు సంబంధించినది. ఆరుశాస్త్రములు

మనిషికి ఉపయోగ పడినప్పుడు సైన్సు అన్ని విధములా ఉగయోగపడుచున్నదని చెప్పవచ్చును.


పై ప్రశ్నలో "పారాసైకాలజీ మానవ అభివృద్ధికి తోడ్పడిందని చూపించుటకు ఒక్క ఉదాహరణ కూడా లేదు”

అని అన్నారు. ఆ మాటను కూడా మేము ఖండించుచున్నాము. పై మాటను అన్నవారు విజ్ఞానులే అయినా, వారికి

ఆరుశాస్త్రముల గురించి తెలియదు. వారికి తెలిసినది నాలుగు శాస్త్రముల గురించి మాత్రమే. మిగతా రెండు

శాస్త్రముల గురించి తెలియదనియే చెప్పవచ్చును. నేడు విజ్ఞానులమని చెప్పుకొను వారికి బ్రహ్మవిద్యాశాస్త్రమును

గురించి, అలాగే జ్యోతిష్యశాస్త్రమును గురించి తెలియదని చెప్పుచున్నాము. ఎందుకనగా! వారికి జ్యోతిష్యము మీద

నమ్మకములేదు. తర్వాత వారికి బ్రహ్మవిద్యాశాస్త్రము అనునది ఉన్నట్లు కూడా తెలియదు. కొందరు జ్యోతిష్యమును

శాస్త్రముకాదని చెప్పుచున్నారు. అటువంటివారు గణిత, ఖగోళ, రసాయన, భౌతిక నాలుగుశాస్త్రములు తప్ప మరేవీ

లేనట్లు చెప్పుచుందురు. అందువలన సైకాలజీగానీ, పారా సైకాలజీగానీ ఏ శాస్త్రములకు సంబంధించినవో వారికి

తెలియవు. భౌతికశాస్త్రములో సైకాలజీ అనునది ఒక భాగమని కొందరు విజ్ఞానులు చెప్పుచున్నా, పారాసైకాలజీ

అనునది లేనేలేదనీ, అది మూఢనమ్మకమని చెప్పుచుందురు. సైకాలజీ అనునది భౌతికములో ఒక భాగమని చెప్పువారు

కూడా గలరు. భౌతికశాస్త్రము ప్రకారము సైకాలజీ అను పాఠమును (కోర్సును) చదివి సైకాలజీ డాక్టర్లుగా ఉన్నవారు

ఎందరో కలరు. అటువంటి వారిలో అరుదుగా పారాసైకాలజీని ఒప్పుకొనువారుండినా, చాలామంది అది లేనేలేదను

వారు కూడా కలరు. చాలామందికి పారాసైకాలజీ అనునది ఒకటున్నదనీ, అదికూడ ఒక శాస్త్రమునకు సంబంధించినదని

తెలియదు. అటువంటివారే పారాసైకాలజీ వలన ఎటువంటి మేలుకలుగలేదని చెప్పు చుందురు.


సైకాలజీ అంటే మనస్తత్త్వమని అర్థము. కొందరు సైకాలజీనీ (మనస్సు అను దానిని) నమ్మకుండ మూఢత్వము

క్రిందికి జమకట్టుచున్నారు. పారాసైకాలజీ అంటే సైకాలజీవలె, దానిని అనుసరించి, దానివలె ఉండున దని అర్థము.

సైకాలజీలో జీవుడు బుద్ధి, మనస్సు అను వాటిని గురించి చెప్పుచుండగా, పారాసైకాలజీలో దేవుడు, దయ్యము, ఆత్మ

అను వాటిని గురించి చెప్పుచున్నాము. మొదటికి సైకాలజీ మీద నమ్మకములేనివారు పారాసైకాలజీని గురించి


ఏమాత్రము నమ్మరు. సైకాలజీని కొందరు భౌతికశాస్త్రమని ఒప్పుకొనుచున్నా, పారాసైకాలజీని ఒప్పుకోవడములేదు.

అయితే ఇక్కడ మేము చెప్పునది ఏమనగా! ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోక పోయినా, పారాసైకాలజీ అనునది

బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించిన దని చెప్పుచున్నాము. భగవద్గీతగానీ, బైబిల్గానీ, ఖురాన్ నీ మూడు గ్రంథములలో

కొంత సైకాలజీకి సంబంధించిన విషయములుండగా, ఎక్కువ భాగము పారాసైకాలజీకి సంబంధించిన విషయములే

ఉన్నవి. అందువలన ప్రతి ఒక్కరూ సైకాలజీని నమ్మవలసిందే. అలాగే పారాసైకాలజీని నమ్మవలసిందే. ఇటువంటి

ప్రశ్ననే మరొక దానిని క్రింద చూస్తాము.


ప్రశ్న :- అతీంద్రియశక్తి కొన్నిసార్లే పనిచేయడము, కొన్నిసార్లు పని చేయకపోవడము జరుగుతుంది. ఎందుకలా

జరుగుతుంది? వాస్తవానికి అతీంద్రియశక్తులు అనేవి ఉన్నాయా?


జవాబు :- ఇంద్రియము అనగా శరీరములో ఒక భాగము అని చెప్పవచ్చును. శరీరములో పది ఇంద్రియములు

అందరికీ కనిపించునట్లు గలవు. అవి ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు అను రెండు భాగములుగా

ఉన్నవి. కాళ్ళు, చేతులు, నోరు, గుదము, లింగము అను పనిచేయు ఐదు ఇంద్రియములను కర్మేంద్రియములని

అంటాము. అలాగే కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అను ఐదు బయట విషయములను తెలియజేయు

ఇంద్రియములను జ్ఞానేంద్రియములని అంటాము. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములను కలిపి మొత్తము

భౌతికశరీరము అంటున్నాము. పది ఇంద్రియములు బయటికి కనపించునవిగా ఉంటూ శరీరమునకు ఆకారమును

చేకూర్చినవి. కావున పది భాగములను స్థూలశరీరము లేక భౌతికశరీరము అంటున్నాము. కనిపించని ఇంద్రియములు

మరికొన్ని శరీరములో గలవు. వాటిని సూక్ష్మ శరీరము అంటున్నాము. సూక్ష్మశరీరము లేక అభౌతిక శరీరము అను

దానిలో మొత్తము 14 భాగములు లేక 14 రకముల కనిపించని ఇంద్రియములు కలవు. మనిషి శరీరము బయటికి

కనిపించు స్థూల శరీరముగా కొంత, బయటికి కనిపించని సూక్ష్మశరీరముగా కొంత ఉన్నది. శరీరములో జీవాత్మను

ప్రక్కన ఉంచితే శరీరము భాగములు స్థూలముగా 10, సూక్ష్మముగా 14 మొత్తము 24 కలవని తెలియుచున్నది. 24

భాగములను ఇంద్రియములను పేరుతోనే పిలుస్తాము. బాహ్యేంద్రియ ములు, అంతరేంద్రియములని బయటున్న వాటిని

లోపలున్నవాటిని చెప్పు చుంటాము. ఎలాగైతేనేమి ఇంద్రియము అను పేరు 24 భాగములకు గలదు.


మొదట ఇంద్రియము అను దానికి పూర్తి అర్థము తెలుసుకొంటే, తర్వాత అతీంద్రియము అంటే అర్థమేమిటో

సులభముగా తెలియగలదు. ఇంద్రియము అను పదమును రెండు భాగములుగా విభజించవచ్చును.

ఇంద్+రియము=ఇంద్రియము అగుచున్నది. 'ఇంద్' అనగా ఆత్మ లేక ఆత్మ శక్తి అని అర్థము. ఇందు అనగా చంద్రుడు

అని అర్థము గలదు. చంద్రుడు జ్ఞానమునకు చిహ్నముగా ఉన్నాడు. రాత్రిపూట కనిపించని సూర్య కిరణములు

చంద్రుని మీదపడి చంద్రకిరణములుగా మారి వెన్నెల రూపములో భూమిమీద వ్యాపించుచున్నవి. అలాగే కనిపించని

పరమాత్మ శక్తి ఆత్మమీదపడి అది జ్ఞానశక్తిగా మారి శరీరమంతా వ్యాపించియున్నది. సూర్యకిరణము చంద్రకిరణమై

వెన్నెలగా భూమిమీద ప్రకాశించునట్లు, పరమాత్మశక్తి ఆత్మశక్తిగా మారి అది ఇంద్రియముల జ్ఞానముగా ప్రకాశించు

చున్నది. శరీర భాగమునకు ఆత్మశక్తి చేరినప్పుడు అది ఇంద్రియశక్తిగా తయారగుచున్నది. శరీరములో ఏ భాగమునైనా

ఆత్మశక్తి చేరియుండుట వలన దానిని ఇంద్రియము అంటున్నాము. ఈ విధముగా స్థూలముగా 10 భాగములనూ,

సూక్ష్మముగా 14 భాగములనూ మొత్తము 24 భాగములను 24 ఇంద్రియములని చెప్పుచున్నాము. బాహ్యేంద్రియములు

మరియు అంతరేంద్రియములు రెండూ ఆత్మశక్తి వ్యాపించినవిగా ఉన్నవి. శరీరములో ప్రతి భాగమునకు ఇంద్రియశక్తి


ఉన్నది. కావున దానిని ఇంద్రియము అంటున్నాము. పుట్టుకతోనే సహజముగా ప్రతి ఇంద్రియము నకు శక్తి ఉన్నది.

అది ఇంద్రియమునకు సంబంధించిన జ్ఞానశక్తిగాయున్నా దానిని ఆత్మశక్తి అంటున్నాము. ఆ ఆత్మశక్తినే మార్పుచెందిన

పరమాత్మశక్తి అంటున్నాము. దీనినిబట్టి పరమాత్మశక్తి ఆత్మశక్తిగా, ఆత్మశక్తి జ్ఞానశక్తిగా మారియున్నదని అర్ధము.


భూమిమీదగానీ, విశ్వములోగానీ దేవుడూ దేవునిశక్తినీమించిన శక్తి ఏదీలేదు. శరీరములోనున్న పరమాత్మశక్తి

ఆత్మశక్తిగా మారి, ఆత్మశక్తి ఇంద్రియశక్తిగా ప్రతి శరీర భాగములోనూ ఉన్నదని తెలుసుకొన్నాము. శరీరములో

పరమాత్మయున్నా ఆయన రూప, నామ, క్రియా రహితుడుగా ఉన్నాడు. కావున శరీరములోని పరమాత్మ ఏమీ చేయక

సాక్షిగా ఊరక యున్నాడు. దేవుడైన పరమాత్మ శరీరములో ఊరకవుండి పోగా, పరమాత్మశక్తిని పొంది చైతన్యవంతమైన

ఆత్మ, తనశక్తిని శరీరమంతా వ్యాపింపజేసి, శరీరమునకు అధిపతిగా ఉంటూ, శరీరమును కర్మప్రకారము పాలించుచున్నది.

పరమాత్మ దేనికీ పనికిరాక, ఏమీ చేయక, ఊరక శరీరములో ఎందుకుండవలెనని ప్రశ్నించుకొనిన, దానికి ఈ విధముగా

సమాధానము దొరుకుచున్నది. చంద్రుడు ప్రకాశించవలెనంటే చంద్రుని మీద సూర్యకిరణములు పడవలెను. చంద్రుని

మీద పడిన సూర్యకిరణములు చంద్రకిరణములుగా భూమిమీదకు వెన్నెల రూపములో వస్తున్నవి. రాత్రిపూట చంద్రుడు

ప్రకాశించునప్పుడు సూర్యుడు ఎక్కడా కనిపించడు. అలాగే ఆత్మ శరీరభాగములన్నిటిని కదలించి పని చేయించునప్పుడు

పరమాత్మ జోక్యము ఎక్కడా ఉండదు. ఆత్మ పని చేయుచున్నదనినా, ఆత్మ శరీరము నకు అధిపతిగా ఉన్నదనినా,

దేవుడు చేయవలసిన పనులన్నిటిని దేవునివలె ఆత్మ చేయుచున్నదనినా, అది పరమాత్మశక్తి వల్లనే ఆత్మకు సాధ్యమవుచున్నది.

పరమాత్మ (దేవుడు) ఎక్కడగానీ, ఏ పని దగ్గరగానీ కనిపించడు. అన్నిటివద్ద ఆత్మయే కనిపిస్తున్నది. ఆత్మ శరీరమంతా

వ్యాపించియుండుటకు కారణము పరమాత్మ. పరమాత్మ శరీరమంతా ఆవహించియుండి తాను ఎక్కడా కనిపించక

ఆత్మను శరీరమంతా విస్తరింపజేసినది. దైవశక్తియే శరీరమంతా యున్నా అది ఆత్మశక్తిగా తెలియుచున్నది.

సూర్యకిరణములు చంద్రుని మీద పడి, సూర్యకిరణముగా కాకుండా చంద్రకిరణమువలె భూమిమీద వ్యాపించినట్లు,

శరీరమంతా వ్యాపించియున్న దైవశక్తి, శరీరమంతా వ్యాపించిన ఆత్మమీద పడి ఆత్మశక్తివలె కనిపిస్తూ, దైవశక్తిగా

ఎక్కడా కనిపించక, శరీరమంతా ఆత్మ చైతన్యమను పేరుతో వ్యాపించియున్నది. ఆత్మశక్తి అను పేరుతో వ్యాపించియున్న

పరమాత్మశక్తి (దైవశక్తి) ప్రతి అవయవమునకు ప్రాకియున్నది. శరీరములోని బయట మరియు లోపలి అవయవములు

24 ను ఇంద్రియములను పేరుతో పిలుస్తున్నాము. ఇంద్రియములనగా ఆత్మశక్తితో కూడుకొన్నవనియు లేక దైవశక్తితో

కూడుకొన్నవనియు చెప్పవచ్చును.


ప్రతి ఇంద్రియము ఆత్మశక్తితో కూడుకొన్నది, కావున అది కొంత పనిని చేయుచున్నది. ప్రతి ఇంద్రియము

కొంత పరిమితితో కూడుకొన్న పనిని చేయుచున్నది. ఏ ఇంద్రియము ద్వారా ఏ పని జరిగినా, అది ఆత్మశక్తి చేతనే

(దైవశక్తిచేతనే) జరుగుచున్నది. ఇది సర్వసాధారణముగా శరీరములో జరుగు ఇంద్రియ యంత్రాంగము. అయితే

గమనించదగిన విషయమొకటిగలదు. ఒక వ్యక్తి స్పర్శతో ఇంకొకని శరీరములోని రోగము పోయినా, ఒకని చూపుతో

ఇంకొకరిలోనున్న దయ్యములు పారిపోయినా, ఒకరి నోటి మాటతో విచిత్రము జరిగినా, ఆ మనిషిని ప్రత్యేకమైనవాడు

అందురు. వానికి అతీంద్రియశక్తులున్నాయని అందురు. అంతటితో అటువంటి ఇంద్రియములు గల వ్యక్తి తనకు

తానుగా గొప్పగా భావించుకొనును. కొన్ని సందర్భములలో తానే దేవుడనని అనుకొనును. ఇప్పుడు మనకు ఒక

ప్రశ్నరాగలదు. అదేమనగా! ఒక మనిషి ఇంద్రియములకు అతీంద్రియశక్తులుంటాయా? అటువంటి ఇంద్రియములున్న

వ్యక్తి దేవునితో సమానమా? అని ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.


మనిషి పుట్టుకతోనే అతని శరీరమునకున్న 24 భాగములకు ఆత్మశక్తి ప్రాకుచున్నది. 24 భాగములలో

ఆత్మశక్తియుండుట చేత వాటిని ఇంద్రియములు అంటున్నాము. ఎక్కడైనా అరుదుగా 24 ఇంద్రియములలో శరీరమునకు

బయటగల మూడు జ్ఞానేంద్రియములు వాటికున్న శక్తికంటే ఎక్కువ శక్తిగలవిగావుంటూ వాటిచేత కొన్ని ప్రత్యేకమైన

పనులు జరుగును. అట్లే శరీరములోపల గల మనస్సుకు కూడా బయటి మూడు జ్ఞానేంద్రియము లకు వున్న ప్రత్యేకత

వచ్చును. శరీరము బయటగల కన్ను, చర్మము, నాలుకకు ప్రత్యేకత రావచ్చును. అలాగే శరీరములోపల ఈ మూడు

జ్ఞానేంద్రియములతో సంబంధమున్న మనస్సుకు కూడా ప్రత్యేకత కలుగ వచ్చును. ఈ నాలుగు ఇంద్రియములలో

ఒక్కటైనా ఎక్కువశక్తి కలదిగా కనిపించవచ్చును. అలా కనిపించడము వలన వానిని అతీంద్రియ శక్తికలవాడని

అనడము జరుగుచున్నది. అయితే మేము ఏమంటున్నా మంటే! శరీరములో ఒక ఇంద్రియమునకు ఆత్మశక్తి పుట్టుకతోనే

వచ్చియున్నది. మధ్యలో కొందరికి ఎక్కువ అనిగానీ, కొందరికి తక్కువ అనిగానీ ఉండడము జరుగదు. ఎక్కడైనా

ప్రత్యేకమైన పనిని చేయు ఇంద్రియములు ఎవరికైనా ఉండినా, వానిని గొప్పవాడనిగానీ, దేవునితో సమానుడనిగానీ

చెప్పుటకు వీలులేదు.


మానవుని శరీర భాగములలో ఆత్మశక్తి ఇంద్రియశక్తిగా నిలిచినది. ఆత్మశక్తి పరమాత్మశక్తి అయినందున

దానిని మించినశక్తి ఉండదు. మనిషికున్న ఇంద్రియము స్థోమతకుమించిన ఎక్కువ పని చేసినా, సాధారణ పని చేసినా,

అద్భుతమైన కార్యమును చేసినా, అన్ని పనులు ఆత్మశక్తియే చేయుచున్నది. ఆత్మ అనుకొంటే ఒక ఇంద్రియము

ద్వారా ఎంతటి అద్భుత కార్యమునైనా చేయవచ్చును. ఆత్మకు అసాధ్యమైన పనంటూ ఏదీ లేదు. ఆత్మకు అన్నీ

సాధ్యమైన పనులైనప్పుడు ఇంద్రియశక్తికి మించిన శక్తితో పనిలేదు కదా! ఎంతటి పని అయినా అవయవమునకున్న

ఇంద్రియశక్తియే చేయగలదు. అటువంటపుడు అతి + ఇంద్రియ = అతీంద్రియశక్తి అవసరము లేదు. ఏ మనిషిలోనైనా

ఆత్మ అనుకొంటే ఎంతటి అద్భుత కార్యమునైనా క్షణాలలో చేయగలదు. ఆత్మజ్ఞానము తెలిసినవానికి అన్నిటినీ ఆత్మే

చేయుచున్నదని తెలిసినా, ఆత్మ వెనుక పరమాత్మ ఉన్నదనీ, పరమాత్మ శక్తియే జీవులనందరినీ ఆత్మచేత ఆడించుచున్నదనీ

వానికి తెలియును. శరీరములో జరుగు పనులన్నీ ఆత్మ వలన జరుగుచున్నా, ఆత్మ పనులను చేయుచున్నట్లు ఎక్కడా

కనిపించదు. శరీరములో ఆత్మ అన్ని పనులనూ చేయుచున్నా ఏమాత్రము బయటికి తెలియడము లేదు. అలాగే

ఆత్మకు ఆధారముగానున్న పరమాత్మకూడా ఎవరికీ తెలియడము లేదు. శరీరములో ముఖ్యపాత్రలను పోషించుచున్న

ఆత్మ మరియు దానివెనుకలనున్న పరమాత్మ కూడా ఎవరికీ తెలియకపోవడము వలన ఏ కార్యమూ చేయని జీవాత్మ,

ఏ శక్తీలేని జీవాత్మ తానే అన్నీ చేయుచున్నానని తలచుచున్నది. నేనే చేయుచున్నానని ఇతరులతో కూడా చెప్పుచున్నది.

తనకు ఏ శక్తీ లేకున్నా, తాను ఏ పనులూ చేయకున్నా, ఎప్పుడైనా తన ఇంద్రియముల ద్వారా ఏదైనా అద్భుత కార్యము

జరిగితే, ఆ అద్భుతమును తానే చేసినట్లు, ఆ శరీరములోని జీవుడు అనుకోవడము జరుగుచున్నది. తాను అద్భుత

కార్యములను చేశానని అనుకొనినవాడు తనను తాను గొప్పగ చెప్పుకొనుటకు మొదలుపెట్టును. దానితో తనను ఎంత

గొప్పవానిగానైనా పోల్చుకోవచ్చును. చివరికి తననే దేవునిగానైనా ఊహించుకోవచ్చును.


ఇంద్రియముల ద్వారా ఆత్మ మహత్యమైన లేక అద్భుతమైన కార్యములను చేసినా, అది ఆత్మ ఇష్టము ప్రకారము

జరిగిన పనేగానీ, ఇంద్రియములకున్న ప్రత్యేకశక్తి వలన కాదని తెలియవలెను. ఇంద్రియము లకు ఆత్మశక్తి తప్ప

ప్రత్యేకించి ఏ శక్తీ లేదు. అందువలన ఇంద్రియములకు అతీంద్రియశక్తులు లేవనీ, ఇంద్రియములు అనుకొంటే ఏమీ

జరుగదనీ చెప్పుచున్నాము. శరీరములో పరమాత్మశక్తి అన్నిటినీ చేయగలదనుటకు గీతలో విభూతియోగమందు గల

20వ శ్లోకములో ఇలాగలదు.

----

 శ్లోకము : 20.

అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః

అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ.


భావము :- "అన్ని జీవరాసులకు ఆత్మను నేనే అగుచు వాటికి ఆధారముగా ఉన్నాను. భూమిమీద సృష్టిని, స్థితిని,

మరణమును జీవరాసులు నా చేతనే పొందుచుండును.” ఈ శ్లోకములో స్వయముగా పరమాత్మయే తాను అన్ని జీవ

శరీరములలోనూ ఆత్మగాయున్నాననీ, అవన్నీ పుట్టుటకు, బ్రతుకుటకు, చచ్చుటకు ఆత్మగాయున్న తన శక్తియే

కారణమైయున్నదని తెలిపాడు.


పరమాత్మ ఏది అనుకొంటే అది శాసనమై జరిగితీరును. ప్రపంచములో మనిషి శరీరమందు దేవుడువున్నా

ఆయన ఉనికి ఎక్కడా ఎవరికీ తెలియలేదు. అన్నీ నేనే చేస్తాను అని అంటాడు కానీ ఏమీ చేయడు. అన్నిటినీ తన

ఆత్మచేత చేయిస్తాడు. ఆత్మశక్తిగా అన్ని శరీరములలోనున్న పరమాత్మ శరీర ఇంద్రియములకు శక్తినిచ్చి నడిపించుచున్నాడు.

అందరినీ ఆడించువాడు దేవుడే అయినా, తాను ఏమీ చేయనట్లు అన్నీ ఆత్మే చేయుచున్నదనీ, ఆత్మశక్తియే శరీర

అవయవములను నడిపించుచున్నదని బోధించాడు. భగవద్గీతలో మోక్షసన్న్యాస యోగమను అధ్యాయమున 61వ

శ్లోకము ఇలా కలదు.


 శ్లోకము : 61.

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి !

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.


భావము :- “సర్వజీవరాసులను ఫలానావాడు దేవుడు అని తెలియకుండా భ్రమింపజేయుచూ, వాని శరీరములోని

హృదయములో మధ్యలోగల బ్రహ్మనాడిలో నివశిస్తూ, మాయ అను దానిచేత యంత్రగాడు బొమ్మలను ఆడించునట్లు

సర్వజీవులను నేను ఆడించుచున్నాను.” అని దేవుడు చెప్పడము జరిగినది. ఎవరికీ తెలియని విధముగా మాయ అను

గుణముల చేత భ్రమింపజేయుచూ శరీరములో బ్రహ్మనాడియందు ఆత్మగా నివసిస్తూ అందరినీ బొమ్మలనాడించునట్లు

ఆడించుచున్నాడు. అయినా నేను కార్యము చేయనివానినని ఆత్మయే అన్నియు చేయుచున్నదని చెప్పుచున్నాడు. నేను

ఏమియు చేయలేదని చెప్పుచున్న పరమాత్మ, అన్నీ తానే చేయుచున్నట్లు తాను చెప్పకున్నా, తనను అన్వేషించు కొందరికైనా

తెలియుటకు, ఎక్కడైనా ఎప్పుడైనా మనిషి శరీరములోని అవయవములచేత అద్భుతకార్యములు జరుగునట్లు చేయును.

ఇక్కడ బాగా ఆలోచిస్తే శరీరములో ఏ కార్యమును చేసినా ఆత్మే చేయవలెను. అయితే ఆత్మ ఆ శరీరములోని జీవాత్మ

కర్మను అనుసరించియే చేయవలెను. తన ఇష్టప్రకారము చేయుటకు వీలులేదు. కర్మనుబట్టి శరీరమును కదలించి,

కర్మను జీవుడు అనుభవించునట్లు చేయడము ఆత్మయొక్క విధి విధానము. ఉదాహరణకు ఒక జీవుడు చేసుకొన్న

కర్మప్రకారము (పాపము ప్రకారము) భయంకరమైన క్యాన్సర్ రోగముతో కౄరముగా బాధ అనుభవించి చనిపోవడము

జరుగవలసి యున్నది. అప్పుడు కర్మప్రకారము అతని శరీరములోని ఆత్మ వానికి క్యాన్సర్ రోగము వచ్చునట్లు చేసి

కొంతకాలము బాధను అనుభవించునట్లు చేసినది. కొన్ని సంవత్సరములు క్యాన్సర్ బాధను అనుభవించినవాడు

కృంగి కృశించిపోయి చివరకు మరణమునకు దగ్గరయ్యాడు. అతనిని చూచినవారందరూ అతడు కొద్దిరోజులలో

చనిపోతాడని అనుకొన్నారు. ఆ క్యాన్సర్ రోగి కూడా తాను వారములేక పదిరోజులకంటే ఎక్కువ బ్రతకనని అనుకొన్నాడు.

అదే విషయమునే డాక్టర్లు కూడా అతని బంధువు లకు చెప్పిపంపారు. శరీరములోని ఆత్మ కూడా వాని కర్మానుసారము

వానిని చంపవలసియున్నది. రేపు అతను చనిపోతాడు అనివుండగా మిగతా ప్రజలకు అందరికీ తెలియునట్లు ఒక

అద్భుతము జరిగినది. అది ఏమనగా!


క్యాన్సర్ రోగివున్న ఇంటికి ఊహించని విధముగా అనుకోకుండా ఒక వ్యక్తి రావడము జరిగినది. వచ్చినవ్యక్తి

ఆధ్యాత్మికమును బాగా తెలిసిన వాడు. తానెవరో తనకు తెలిసి, తాను కానివాడెవరో కూడా బాగా తెలిసినవాడు.

అటువంటి వ్యక్తి రోగియున్న ఇంటికివచ్చి అతను పడుచున్న బాధను చూచి, ఆ రోగికి కొంత జ్ఞానమును తెలియజేశాడు.

పోయిన జన్మలో చేసుకొన్న పాపము ఈ జన్మలో రోగమైవచ్చినదని తెలిపాడు. అజ్ఞానము చేత చేసుకొన్న పాపమును

అనుభవించకుండా తప్పించుకొనుటకు అవకాశమున్నదనీ, ఆ విషయమునే భగవంతుడు భగవద్గీతలో జ్ఞానయోగమను

అధ్యాయమున 36,37 శ్లోకములలో ఇలా చెప్పాడని తెలియజేశాడు.


 శ్లోకము : 36. అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః, |

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి ॥


 శ్లోకము : 37.

యథైధాంసి సమిద్ధోగ్ని ర్భస్మసాత్కురు తేర్జున,

జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥


భావము :- “పాపములను చేసినవారిలో అందరికంటే నీవు ఎక్కువ పాపము చేసియున్నవాడివైనాగానీ, పాపము అను

గొప్ప సముద్రమును జ్ఞానము అను చిన్న పడవచేత దాటగలవు.”


“అగ్నియందు ఎన్నికట్టెలు వేసినా అవి మండి బూడిదైపోయినట్లు, జ్ఞానమను అగ్నియందు అన్ని పాపములు

(అన్నికర్మలు) పూర్తిగా కాలిపోయి భస్మమైపోవును.” ఇక్కడ చెప్పినది బాగా గ్రహించితే పాపములు ఎక్కువ చేసుకొన్నవాడు

బాధలు అనుభవించక తప్పించుకొనుటకు వీలులేనివాడు, ఎంతటి కర్మనైనా అనుభవించువాడు, చివరకు చావు దగ్గరకు

వచ్చినవాడు ఎవడైనా, ఎంతటి పాపాత్ముడైనా దైవజ్ఞానము అను దానిచేత ఆ కర్మనుండి తప్పించుకోవచ్చునని చెప్పడము

జరిగినది. ఆ విషయము అర్థమగుటకు మురికి సముద్రమునైనా చిన్న పడవచేత దాటినట్లు పాపము అను సముద్రమును

జ్ఞానము అను పడవచేత దాటవచ్చును అని ఉదాహరణ చెప్పడము జరిగినది. అలాగే అగ్నిలో ఎన్నికలైనా కాలిపోయినట్లు,

జ్ఞానమను అగ్నియందు ఎంతో భయంకరమైన పాపములు కూడా పోవునని కూడా ఉదహరించి చెప్పడము జరిగినది.

శరీరములోని ఆత్మగా ఉంటూ పాపములను అనుభవింపజేయు దైవము, నేను చేయకనే ఇంకొక పనిని కూడా చేయుదుననీ,

ఇక్కడ ఆత్మగా అనుభవమును పొందించు వాడిని ఇంకొక విధముగా కర్మల అనుభవమునుండి తప్పించువానిగా

ఉన్నానని కూడా చెప్పాడు. ఆత్మగా ఉండి అనుభవింపజేయువాడు, ఆత్మజ్ఞానముగా ఉండి తప్పించువాడుగా కూడా

ఉన్నాడు.


తన ఆత్మ ఎంతో కఠినమైనదనీ ఏమాత్రము దయాదాక్షిణ్యము లేకుండా కౄరముగా పాపమును

అనుభవింపజేయుననీ చెప్పినవాడే, తన గీతలో, తన శ్లోకములలో, తన జ్ఞానము ఎంతటి కర్మనైనా లేకుండా చేయగలదని

చెప్పి, దానిని నిరూపించుటకు క్యాన్సర్ రోగముతో రేపు చనిపోవువాని ఇంటికి జ్ఞానమును తెలిసిన వ్యక్తిని పంపాడు.

అలా పోయిన వ్యక్తి జ్ఞానముయొక్క గొప్పతనమును గురించి క్యాన్సర్తోగికి చెప్పి, నీవు ఇప్పటినుండి జ్ఞానము తెలుసుకొమ్మనీ,

అలాగైతే నీ రోగము పోగలదనీ చెప్పడము జరిగినది. రోగి ఇంటికిపోయిన జ్ఞాని చెప్పిన మాట వాస్తవమే అయినా,

వాడు జ్ఞానము తెలుసుకొనుటకు కనీసము సంవత్సరకాలమైనా పట్టును. వాడు జ్ఞానమును తెలుసుకొని, వాని కర్మను

వాడు పోగొట్టుకొనుటకు అంతవరకు వాడు బ్రతికే అవకాశమేలేదు. రేపే చనిపోవాలి. కర్మప్రకారము వాని శరీరములోని

ఆత్మ వానిని చంపితీరాలి. అటువంటపుడు జ్ఞానము ఎంతటి కర్మనైనా తీసివేయగలదని వానికి ఎలా తెలియగలదు?


దేవునిమాట నిజమని రోగికి తెలియాలంటే వాడు బ్రతకాలి. కర్మప్రకారము ఆత్మ బ్రతుకనివ్వదు. అప్పుడు ఏదో ఒక

అద్భుతము జరిగి తీరాలి. అటువంటి సందర్భములో రోగి ఇంటికిపోయిన జ్ఞాని, రోగిని తన ముందర కూర్చోమని

అతనిని ఒకమారు జాగ్రత్తగా (నిఘాగా) చూడడము జరిగినది. అలా చూచినప్పుడు జ్ఞాని కంటనుండి వెలువడిన

ఇంద్రియశక్తి రోగి శరీరములోనికి పోయి, అతని కర్మను (పాపమును) కాల్చివేయడము జరిగినది. అలా ఒక్కమారుగా

అతను రోగరూపములో అనుభవిస్తున్న కర్మంతయు కాలిపోవడము వలన, ఆత్మకు అతనిని చంపు కార్యము తప్పి

పోయినది. అందువలన వాడు చావకపోవడము జరగడమేకాక, అప్పటి నుండి పూర్తిగా ఆరోగ్యమును పొందాడు.

అప్పటి నుండి అతను దేవుని జ్ఞానము మీద నమ్మకము కలిగి జ్ఞానమును తెలుసుకోగలిగాడు.


రోగికి తాను చనిపోతానని తెలిసిపోయింది. డాక్టర్లు కూడా అతడు చనిపోతాడని నిర్ధారించారు. అతని

శరీరములో కర్మప్రకారము అతడు రేపు చనిపోవలసియున్నది. అటువంటి సమయములో ఒక జ్ఞాని యొక్క కంటిచూపు

ద్వారా జ్ఞానశక్తి అతనిలోనికి ప్రవేశించి అతని కర్మను కాల్చి వేయడము జరిగినది. అలా జరిగిన దానిని అద్భుతమనియే

చెప్పవచ్చును. కంటిలోని ఇంద్రియశక్తి చూపుద్వారా పోయి అతని కర్మను లేకుండా చేసినది. కంటిలోని ఇంద్రియశక్తిని

ఆత్మశక్తియే అని అనవచ్చును. ఆత్మశక్తిగాయున్న ఇంద్రియశక్తి ఎదుటివానిలో చేరి, జ్ఞానశక్తియై కర్మను కాల్చివేసినదని

అర్థమగుచున్నది. శరీరములో కర్మను అమలు చేయునది అదియే (ఆత్మయే), అలాగే శరీరములోని కర్మను నాశనము

చేయునదీ అదియే (ఆత్మయే). ఒకే శక్తి రెండు విధముల పని చేయుచున్నది. ఇక్కడ కర్మమీద పనిచేసిన శక్తి జ్ఞాని

శరీరమునుండి బయటికి వచ్చిన జ్ఞానశక్తి అని తెలియుచున్నది. జ్ఞాని సంపాదించుకొన్నది ఆత్మజ్ఞానము, అతను చేసిన

సాధన యోగసాధన. అందువలన అతనికి యోగశక్తి లభించియున్నది. ఆ యోగశక్తియే కంటి చూపునుండి బయటికి

వచ్చి, రోగి శరీరములో చేరి, అతని రోగమును లేకుండా చేయడము జరిగినది.


అయితే కొందరు జ్ఞానమనీ, సాధనయనీ పొరబడి మంత్రములను జపించు వారికి మంత్రశక్తి వచ్చును.

ధ్యానము చేయువారికి తపోశక్తి వచ్చును. మంత్రశక్తి, తపోశక్తి ప్రపంచములోని కార్యములను నెరవేరునట్లు చేయును

గానీ, వాటికి కర్మను కాల్చుశక్తిలేదు. యోగశక్తి యోగము చేయువారికి మాత్రమే వచ్చును. ధ్యానము చేయువారికి

యోగశక్తి రాదు. యోగశక్తియే దైవశక్తి కావున, దానిని జ్ఞానశక్తి అనియూ, ఆత్మశక్తి అనియూ, ఇంద్రియ శక్తి

అనియూ జ్ఞానాగ్ని అనియూ చెప్పవచ్చును. ధ్యానము లేక మెడిటేషన్ చేయువారికి యోగశక్తి రాదు. "తపస్విభ్యోధికోయోగీ”

అని గీతయందు ఆత్మసంయమయోగమను అధ్యాయమున 46వ శ్లోకమున చెప్పినట్లు “తపస్సులు చేయువారికంటే

యోగి అధికుడు” అను మాటను మరువరాదు. అంతో ఇంతో తపస్సు చేసినవారికి కొంత తపోశక్తి యుండవచ్చును.

అంతమాత్రమున వారు యోగులు కాజాలరు. వారిలో యోగశక్తి ఉండదు. నేడు శక్తిపాత మహర్షులని పేరుగాంచినవారే

స్వయాన “మీరు కోటి సంవత్సరములు చేసినా పొందలేని తపోశక్తిని మేము చేయు శక్తిపాతము ద్వారా పొందవచ్చును”

అని చెప్పుచున్నారు. అలా వారు చెప్పు మాటలలోనే వారివద్దయున్నది తపోశక్తియని తెలిసిపోవుచున్నది. అటువంటి

వారిది శక్తిపాతమైనా, వారి మాట సత్యమే అయినా, ఆ శక్తి కర్మలను కాల్చు యోగశక్తి కాదని తెలిసిపోయినది.

క్యాన్సర్ రోగి ఇంటికి వచ్చిన జ్ఞాని అయినవాడు ఆత్మల వివరము తెలిసినవాడు అయినందున, అతడు యోగమును

ఆచరించినందున, అతని శరీరములోని యోగశక్తి లేక దైవశక్తి ఇంద్రియశక్తిగా కన్ను అను ఇంద్రియమునుండి

బయటికిపోయిన దని తెలుసుకొన్నాము. అతడు వాస్తవముగా నిజయోగి అయినందున అతనిలోని శక్తి కర్మలను


కాల్చునదిగా ఉన్నది. అతని కంటిచూపుతో క్యాన్సర్ వదలిపోగా, అతని నోటిమాటతో నేడు భయంకర రోగముగా

పేరుపొందిన ఎయిడ్స్ రోగము కూడా అతని మాటప్రకారము ఎయిడ్స్ రోగినుండి బయటికిపోవడము జరిగినది.

అలాగే అదే యోగి స్పర్శతో క్షయ లేక టి.బి (ట్యుబర్క్యులోసిస్) అను రోగము రోగినుండి దూరము పోవడము

జరిగినది. ఆ యోగి జ్ఞానమును బోధించి జ్ఞానమునకు ఇటువంటి శక్తి ఉందని నిరూపించు నిమిత్తము వారి

రోగములను పొమ్మని చెప్పెడివాడు. అంతేతప్ప ఎప్పుడైనా డబ్బుకు ఆ పని చేయలేదు. జ్ఞానప్రచారములో ఒక

భాగముగా అదియూ అరుదుగా అలా చేసెడివాడు. అంతేతప్ప ఎటువంటి స్వార్థముతోనూ తన జ్ఞానమును

వినియోగించలేదు. అటువంటి గొప్ప జ్ఞాని అయిన ఆయన యోగి అంటే ఇలా ఉండవలెనను నట్లు యోగికి చిహ్నముగా

ఉండెడివాడు.


ఆ యోగి అంతగొప్పవాడు కనుక అతనిని దర్శించుట వలన, అతనిని ముట్టుకొనుట వలన, అతనితో

మాట్లాడుట వలన కొన్ని రోగములు పోయెడివి. అటువంటి శక్తివరుడైనా, అతను తనను తాను గుర్తుపెట్టుకొని,

ఆత్మజ్ఞానము బాగా తెలిసినవాడై, ఏనాడు అహమును పొందక జీవనమును సాగించుచుండెను. ఎవరైనా తేలుకుట్టితే

ఆయనవద్దకు వచ్చి ఆయనను చూచినంతమాత్రమున వారి తేలు విషము లేకుండా పోయి బాధనుండి బయటపడెడివారు.

అయితే ఒక దినము ఒక వృద్ధుడు తేలునొప్పితో బాధపడుచు ఆ యోగివద్దకు వచ్చాడు. యోగిని వృద్ధుడు చూచినా,

యోగి వృద్ధున్ని చూచినా ఆ బాధపోలేదు. అప్పుడు యోగి అయిన ఆయన తానే స్వయముగా వృద్ధుని చేయిపట్టుకొని,

తేలుకుట్టిన చోట తాకి ఆ విషపు బాధ లేకుండా పోవలెనని చెప్పినప్పటికీ, ఆ బాధ అలాగే ఉండినది. ఆ యోగి చెప్పితే

దయ్యములు పారిపోతాయి, రోగములు నయమైపోతాయి. అటువంటిది ఆ యోగి వచ్చి స్వయముగా ముట్టుకొనినా,

తేలు బాధ పోలేదు. యోగి శరీరములోని యోగశక్తిని యోగి సంకల్పించుకొనినా, తేలుబాధ అలాగే ఉండిపోయింది.

అప్పుడు ఆ యోగి దానిని ఏమీ చేయలేక అలాగే వదలివేసెను. దానిని చూచిన కొందరు హేతువాదులు, నాస్తికవాదులు

ఇలా ప్రశ్నించను మొదలు పెట్టారు.


నాస్తికవాది, హేతువాది :- ఒక పరిశోధకుడు దేనినైనా క్రొత్త విషయమును సిద్ధాంతముగా కనుగొన్నప్పుడు అది

శాస్త్రసంబంధమైవుండును. అది ఒకరికి ఎట్లు ఉపయోగపడితే అందరికీ అట్లే ఉపయోగపడును. ఒకమారు ఎలా

ఉపయోగపడితే తర్వాత రెండవమారు కూడా అలాగే ఉపయోగ పడును. శాస్త్రబద్ధమైనది అందరికీ ఒకే విధానము

కల్గియుండును. శాస్త్రము కానిదానిని శాస్త్రమని నమ్మించితే అది సాగినన్నాళ్ళు సాగుతుంది. ఎప్పుడో ఒకమారు అది

జరుగకుండా పోతుంది. ఇంతవరకు చేసినది మోసము అని తెలిసిపోతుంది. దానితో అది శాస్త్రముకాదనీ, సత్యముకాదనీ

తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు ఆ యోగి విషయములో జరిగినది. అతను తాను గొప్పవాడినని తాను చెప్పినా,

ముట్టుకొనినా రోగములు పోయాయన్నప్పుడు, అది అందరికీ సమానముగా ఎందుకు జరుగలేదు. కాన్సర్, ఎయిడ్స్

మొదలగు రోగములు దీర్ఘకాల రోగములు కావున ఒక్కమారు అవి పోయినదీ తెలియదు, పోకున్నదీ తెలియదు. అందువలన

వాటి విషయములో పోయాయి అని మసిపూసి మారేడుకాయ చేసినారు. తేలునొప్పి అప్పటికప్పుడు కనిపిస్తూవుండేది,

కావున దాని విషయములో యోగిననుకొను వాని విషయము బయటపడింది. అతను యోగికాదని తెలిసిపోయినది.

ఒకవేళ యోగి అయినా అతనికి రోగములను పోగొట్టు శక్తిలేదని అర్థమైపోయినది. కొందరు ఆస్తికులు ఇటువంటి

యోగులను అడ్డము పెట్టుకొని మాట్లాడుచుందురు. అటువంటి వారందరికీ తేలు బాధ తగ్గకపోవడము మంచి

గుణపాఠముగా ఉన్నది. శాస్త్రీయతలేనిది ఏదైనా, ఈ విధముగా ఏనాడో ఒకనాడు బయటపడిపోవును. అది శాస్త్రబద్ధత

లేనిదని తెలిసిపోవును.


(ఈవిధముగా హేతువాది, నాస్తికవాది ఇద్దరూ తోడై వారికి అవకాశమున్నదంతా మాట్లాడి యోగమును యోగిని

హేళనగా మాట్లాడి, యోగము అనునది శాస్త్రముకాదనీ, అందులో ఏ శక్తీలేదని ఋజువై పోయిందని చెప్పారు. దీనినంతటిని

గమనించిన మేము, మొదటినుండి యోగము అనునది శాస్త్రబద్ధమైదని తెలియజేసిన మేము, యోగము హేళన

కావింపబడడము ఓర్చుకోలేక, ఇంతవరకు మాట్లాడిన వారికి జవాబు ఇవ్వదలచుకొని ఈ విధముగా చెప్పాను.)

నేను :- యోగము అయినా దానికి సంబంధించిన విషయములైనా చాలా రహస్యములైనవి. అందరికీ అంత సులభముగా

అర్థముకావు. అందువలన భగవద్గీతలో యోగవిషయములను తెలుపునప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు తన శ్లోకములో

ఇలా చెప్పాడు. భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమందు 1,2 శ్లోకములను క్రింద చూస్తాము.



 శ్లోకము : 1.

ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే,

జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్.



 శ్లోకము : 2.

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్.

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖమ్ కర్తుమవ్యయమ్.


1,2 భావములు :- “ఇది అతి రహస్యమైన జ్ఞానము. ఎవరికీ తెలియక రహస్యముగనున్న జ్ఞానమును విజ్ఞానసహితముగా

విశదీకరించి చెప్పెదను శ్రద్ధగా వినుము. దీనిని తెలియుట చేత అన్ని అశుభముల ప్రశ్నలు లేకుండాపోవును.” “అన్ని

విద్యలయందు మరియు అన్ని రహస్యముల యందు ఉన్నతమైనది మరియు ఉత్తమమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా

తెలియబడునది, నాశనములేని ధర్మముగాయుంటూ, అందరూ ఆచరించ దగినది సంతోషములలో మిక్కిలి మంచి

సంతోషమైనది అయిన దానిని తెలుపుచున్నాను వినుము.”


కృష్ణుడు తాను భగవద్గీతను చెప్పునప్పుడు యోగవిద్య చాలా రహస్యమైనదనీ మొదలు పెట్టి, ఇది అన్ని విద్యలలోకెల్ల

ఉత్తమమైన విద్య అని చెప్పాడు. భగవంతుడైన కృష్ణుడు చెప్పిన విద్య ఏమిటో భగవద్గీతలో తెలుసుకోగలిగితే, ఏ

ప్రశ్నకైనా జవాబును చెప్పవచ్చును. అందువలన యోగము, యోగి విషయములో ఎన్నో ప్రశ్నలను ప్రశ్నించిన హేతువాదికి

నాస్తికవాదికి అర్థమగునట్లు విశధీకరించి చెప్పవలెనని ఈ విధముగా చెప్పుచున్నాను. గొప్పయోగి అను పేరుగాంచినవాడు

ఒక చిన్న విషయములో తేలు బాధను నివారించలేకపోయాడని కొందరు విమర్శించ డములో కొంత మంచియున్నది,

కొంత చెడుయున్నది. సంశయము వచ్చినప్పుడు ప్రశ్నించడము మంచిదే అయినా, ముందూ వెనుకా ఆలోచించ

కుండా, ఒక విషయమును గురించి సమగ్రముగా చూడకుండా, అవకాశము వచ్చినది కదాయని అడ్డముగా ప్రశ్నించడము

పూర్తి చెడుగా ఉన్నదని చెప్పుచున్నాము.


యోగి యొక్క శరీరములో యోగశక్తి నిలువ ఉండుట వాస్తవమే. యోగశక్తి అనునది యోగి తన శక్తిని

దానము చేయాలనుకొన్నప్పుడు గానీ, ఒక రోగినుండి రోగమును లేకుండా చేయాలనుకొన్నప్పుడు గానీ, తనలోని

యోగశక్తి (జ్ఞానశక్తి) రోగి శరీరములోనికి పోయి అతని రోగమును లేకుండ చేయగలుగుననుట వాస్తవమే. అయితే ఆ

సమయములో యోగి శరీరములో ఏమి జరుగుచున్నదీ యోగికి తెలుసు. ఎంతో రహస్యమైన జ్ఞానమును ఏమాత్రము

తెలియని మనుషులు, తెలియని విషయమును గురించి మాట్లాడడము అవివేకమగును. వివేకముతో ఆలోచించితే,

యోగశాస్త్రము అయిన బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము గమనించితే, యోగి అయినవాడు యోగమును ఆచరించుట

వరకు తన ఇష్టము ప్రకారము చేయవచ్చును. యోగమును ఆచరించుట, జ్ఞానము తెలియుట, జీవుని యొక్క ఇష్టాయిష్టము


మీద (శ్రద్ధాశ్రద్ధలమీద) ఆధారపడియుండును. జీవుడు శ్రద్ధగలిగి దేవుని జ్ఞానమును తెలియవచ్చును. అలాగే యోగమును

ఆచరించవచ్చును. యోగమును ఆచరించుట వరకే జీవుని ఇష్టము. తర్వాత యోగశక్తి లభించడముగానీ,

లభించకపోవడముగానీ జీవుని ఇష్టము మీద ఆధారపడియుండదు. యోగశక్తి (జ్ఞానశక్తి) అనుబడు దైవశక్తి లభించడము

దేవుని ఇష్టము మీద ఆధారపడియుండును. దైవశక్తి అనబడు యోగశక్తి దేవునినుండి లభించునది, కావున యోగి

ఇష్టము మీద ఆధారపడియుండదు. యోగము చేయుట వలన ఫలితముగా యోగశక్తి లభించును అని చెప్పాము గానీ

ఇంత వస్తుందని చెప్పుటకు వీలులేదు. అది ఇచ్చే వానిని బట్టి యుంటుంది.



యోగి అయినవాడు యోగము చేయుటయందే స్వతంత్రుడుగానీ, యోగశక్తిని సంపాదించుటలో స్వతంత్రుడు

కాడు. అందువలన యోగమును ఆచరించిన యోగికి ఎంతశక్తి లభించినదో తెలియదు. అలాగే కొంత కాలము

నుండి యోగసాధనలోయున్నవానికి ఎంత యోగశక్తి తనవద్ద యున్నదో తెలియదు. యోగశక్తిని సంపాదించుటలోను,

నిలువపెట్టు కోవడములోనూ స్వతంత్రతలేని యోగికి ఖర్చు పెట్టడములోనూ స్వతంత్రత లేదు. యోగి అయినవాడు

సంపూర్ణ జ్ఞాని అయివుండును, కనుక ఈ విషయములన్నియూ యోగికి తెలిసియుండును. శక్తిని సంపాదించడము

లోనూ, ఇతరులకు ఇవ్వడములోనూ యోగియొక్క ప్రమేయము ఏమాత్రము ఉండదు. అది అంతా దేవునికి సంబంధించిన

విషయము. శక్తిని దానము చేసి, రోగమును నయము చేయడము, తన ఇష్టము ప్రకారము జరుగుపని కాదని, యోగి

అయిన వానికి తెలుసు. కావున ఏసు యోగశక్తితో ఒక కుష్టురోగిని బాగు చేశాడు. రెండవ వానిని బాగుచెయ్యలేదు.

అలాగే ఒక గ్రుడ్డివానిని బాగు చేసాడుగానీ, రెండవ గ్రుడ్డివానిని బాగుచేయుటకు కనీసము ప్రయత్నము కూడా చేయలేదు.

ఎందుకనగా ఆ పనులు తన ఇష్టప్రకారము జరుగునవి కావని ఆయనకు తెలుసు.


యోగము చేయు సమయములో లభించు శక్తి కావున దానిని యోగశక్తి అని అంటున్నాము. యోగశక్తి

అనునది వాస్తవానికి దైవశక్తియే నని చెప్పవచ్చును. దైవశక్తిని జీవుడు యోగము చేసినందుకు ఫలితముగా పొందుచున్నాడు.

జీవుడు పొందినా అది జీవశక్తి అనబడదు, దైవశక్తిగానే చెప్పబడుచున్నది. దైవశక్తి మీద జీవునకు ఏమాత్రము అధికారము

లేదు, దైవశక్తిమీద పూర్తి అధికారము దేవునిదే అయినా ఆయన ఏమీ చేయువాడు కాడు. అందువలన ఆయన

అధికారము ఆత్మకు అప్పగించబడినది. ఆత్మ ఆత్మగా కాకుండా దేవునివలె నటించుచూ, ఆయన కార్యములను చేయు

చున్నది. మనుషులలో కొందరు దేవునికి ఇష్టముగా ఉన్నారు. కొందరు అయిష్టులుగా ఉన్నారు. దేవునికి ఇష్టులు

అయిష్టులుగా అగుట వారివారి జ్ఞానమునుబట్టియుండును. కర్మలున్న వానిమీద యోగి శక్తిని దానము చేసినా, దైవశక్తి

ఆత్మశక్తిగావుంటూ ఇంద్రియశక్తిగా మారి పాపము గల వాని శరీరములో చేరును. ఇంద్రియశక్తి ఎంత చేరింది?

ఎదుటి వాని పాపమును ఎంత లేకుండా చేసింది అనునది దేవుని ఇష్టము మీద ఆధారపడియుండును. మనిషి

ఇష్టము మీద ఆధారపడియుండదు. అందువలన యోగి అయినవాడు ఒకప్పుడు క్యాన్సర్ రోగమును పోగొట్టినా,

ఎయిడ్స్ రోగమును నోటిమాటతో చెప్పి పంపినా, ఎన్నో పెద్దకర్మలను లేకుండా చేసినా, ఒకానొక సమయములో చిన్న

కర్మయిన తేలు నొప్పిని కూడా నివారించలేకపోవును. అలా అగుటకు కారణమేమని చూచిన ఎదుటి మనిషి కర్మలు

పోవడమూ, పోకపోవడమూ రెండూ యోగి ఇష్టము మీద ఆధారపడియుండవనీ, అది అంతయు దేవుని ఇష్టము మీద

ఆధారపడి యుండుననీ తెలియుచున్నది. తేలు బాధ యోగి ప్రయత్నించిననూ పోక పోవడమునకు కారణము దేవునికి

ఇష్టములేని దానివలన అలా అయినదని చెప్పవచ్చును. అతను బాధను అనుభవించవలసిందేనను నిర్ణయము దేవునికి

ఉన్నది, కనుక ఆత్మ ఇంద్రియశక్తిగా తనశక్తిని విడుదల చేయలేదు. అందువలన అతనికి దేవునిశక్తి లభించలేదు.

వానికర్మ పోలేదు.



ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! తేలు విషము యొక్క బాధ ఒక గంటలేక రెండు

గంటలుండును. క్యాన్సర్, ఎయిడ్స్ రోగము యొక్క బాధ కొన్ని సంవత్సరములు అనుభవించవలసియుండును. ఎయిడ్స్

రోగమున్న వానిని, తేలు కుట్టినవానిని ఇద్దరిలో ఎవడు ఎక్కువ పాపము చేసినవాడని లెక్కించితే, తేలు కుట్టిన వానికంటే

ఎయిడ్స్ రోగముతో బాధపడవాడు ఎన్నో రెట్లు ఎక్కువ పాపము చేసినవాడుగా ఉన్నాడు. తేలు కుట్టిన వాడు కొద్ది

పాపమును చేసుకొనివుండగా ఎయిడ్స్ రోగముకలవాడు భయంకరమైన పాపము చేసికొనియున్నాడు. ఎంతో పెద్దపాపము

చేసుకొన్న ఎయిడ్స్ రోగిని బాగుచేయుటకు ఇష్టపడిన దేవుడు చిన్నపాపము చేసుకొన్న తేలుకుట్టిన వానిని బాగుచేయుటకు

ఎందుకు ఇష్టపడలేదు? అని ప్రశ్న వచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఈ విషయములో ఎవరికైనా ఈ

ప్రశ్నరావడములో తప్పులేదు. అయితే మనము ఇక్కడ తెలుసుకోవలసిన దేమనగా! దేవునికి మనుషులందరూ సమానమే,

అయితే వారివారి పాపములనుబట్టి వారివారి కర్మలనుబట్టి కొందరు దేవునికి దూరముగా, కొందరు దగ్గరగా

ఉందురు. ఆ లెక్కప్రకారమైనా ఎక్కువ పాపము చేసిన ఎయిడ్స్ రోగి దూరముగా, తక్కువగా పాపము చేసుకొన్న తేలు

విషముతో బాధపడు వాడు దగ్గరగా ఉందురని చెప్పవచ్చును. ఆ లెక్కప్రకారము అయినా ఇక్కడ జవాబు సరిపోదు.

ఇక్కడ మనము చూడవలసినది ఎవరు దగ్గర, ఎవరు దూరము అనికాదు. మనము చూడవలసినది దేవునికి ఎవరు

ఇష్టులు, ఎవరు అయిష్టులు అని చూడవలసిన అవసరమున్నది. ఆ విధముగా చూడగలిగితే ఎయిడ్స్ రోగికంటే తేలు

కుట్టినవాడు దేవునికి అయిష్టునిగా ఉన్నాడు. ఎయిడ్స్ రోగిది పెద్దపాపమైనా అది క్షమించబడు పాపము. జ్ఞానాగ్ని చేత

కాలిపోవునదిగా ఉన్నది. తేలుకుట్టిన వానిపాపము చిన్నదైనా అది క్షమించరాని పాపముగా ఉన్నది. అది జ్ఞానాగ్ని చేత

కాలిపోవునది కాదు. ఈ విధముగా వారి గత చరిత్రలుండుట వలన వారి చరిత్రలను బట్టి దేవునికి కొందరు

ఇష్టులుగా, కొందరు అయిష్టులుగా ఉన్నారు. దానినిబట్టి వారి పాపములు పోవునది, పోకుండ ఉండునది జరుగుచుండును.

వెనుకటి చరిత్రలు తెలియని మనుషులకు, జరుగుచున్న వర్త మానము మాత్రము కనిపించుచుండును. జరిగిపోయిన

భూతకాలము కనిపించదు. కావున కొన్నిమార్లు పని చేసిన శక్తి, కొన్నిమార్లు ఎందుకు పని చేయడములేదు అని

అనుకోవడము జరుగుచున్నది. కర్మలను దహించు దైవశక్తి (జ్ఞానాగ్ని)లో ఏ లోపమూలేదు. అది అన్నిటికీ సమానమే.

అయస్కాంతము ఇనుమును ఆకర్షించుకోవడములో అన్ని ఇనుపముక్కలకు సమానమే అయినా, త్రుప్పుపట్టిన

ఇనుపముక్కలను, త్రుప్పుపట్టని ఇనుప ముక్కలను ఆకర్షించుకోవడములో తేడావచ్చును. త్రుప్పులేనిది ఆకర్షింప

బడినట్లు త్రుప్పు ఉన్నది ఆకర్షింపబడదు. అదే విధముగా క్షమించబడు పాపము జ్ఞానాగ్నికి కాలిపోయినట్లు, క్షమించబడని

పాపము జ్ఞానాగ్నికి కాలిపోదు. అగ్నిలో తేడా లేకున్నా పాపములలో తేడావున్నదని తెలియుచున్నది. కావున ఒకమారు

పని చేసిన ఇంద్రియశక్తి (ఆత్మశక్తి) మరొకమారు పని చేయకుండ పోవుచున్నది.


ఇంద్రియశక్తి అతీంద్రియశక్తి అనువాటిని గురించి ఇంతవరకు వివరముగా చెప్పుకొన్నాము. ఇపుడు బైబిలులోని

ఒక సమస్యను గురించి ఉన్న అనుమానమును నివృత్తి చేసుకొనుటకు ఒక వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నను తీసుకొని చూస్తాము.

ప్రశ్న :- బైబిల్లో చెప్పే సృష్టివాదము శాస్త్రీయముగా ఎక్కడా నిలువదు. అయితే బైబిల్ చెప్పినదంతా సత్యము అని

మూర్ఖముగా పట్టుబట్టితే, శాస్త్రజ్ఞులకు నమ్మకస్తులకూ ఘర్షణ రాక తప్పదు. శాస్త్రమా, లేక నమ్మకమా దేనిని మీరు

ఒప్పుకుంటారు?


జవాబు :- భూమిమీద సత్యవాదులు, అసత్యవాదులు అని రెండు రకముల మనుషులున్నారు. సత్యవాదులకు సత్యమును

తెలియజేయుటకు శాస్త్రమును చెప్పాలి. అసత్యవాదులకు సత్యమును తెల్పుటకు అసత్యమును చెప్పాలి. అసత్యము


ద్వారా సత్యమును వినగలుగువారు చాలామంది ఉన్నారు. సత్యమును చెప్పుటకు శాస్త్రమును ప్రమాణముగా చూపి

చెప్పితే సత్యమును తెలుసుకొనువారు గలరు. అసత్యవాదులైన కొందరికి సత్యము అసత్యముగా కనిపించుతుంది,

అప్పుడు సత్యమును అనేకరకములుగా ప్రశ్నింతురు. సత్యవాదులైన కొందరికి సత్యము శాస్త్రముగా కనిపించుతుంది.

అందువలన వారికి ఎక్కువగా ప్రశ్నలురావు. ఉదాహరణకు మనిషి సత్యము, అయితే మనిషి పుట్టుక విషయము సత్య

అసత్యవాదనలతో కూడుకొని ఉన్నది. కొందరు అసత్యవాదనను సమర్థించుతారు. మరికొందరు సత్యవాదనను

సమర్థించుతారు. కొందరికి తమవాదన అసత్యమని తెలిసినా అదియే సరియైన వాదనయనీ అసత్యము ద్వారానే

సత్యము తెలుస్తుందని అంటారు. కొందరికి తమ వాదన సత్యమైనదని అర్థమైనా తమ వాదనకు శాస్త్రము అవసరమనీ,

శాస్త్రము లేకుండా సత్యమును చెప్పలేమని అంటుంటారు. ఈ విధముగా ఒక విషయమును అసత్యము ద్వారా

కొందరు నమ్మితే, సత్యము ద్వారా కొందరు నమ్ముచుందురు.


విశ్వము సృష్ఠింపబడినది అను విషయమును తెలియజేయుటకు అసత్యవాదులు పురాణముల ద్వారా విశ్వమును

దేవుడు సృష్టించాడని కట్టు కథలను చెప్పి ఒప్పించారు. సృష్ఠి విషయములో సత్యవాదులైనవారు శాస్త్రము ద్వారా

శోధించి పరిశోధన ద్వారా విశ్వమును దేవుడు సృష్టించాడు అని చెప్పగలుగుచున్నారు. దేవుడు విశ్వమును సృష్ఠించాడు

అనుమాట పూర్తి వాస్తవమే అయినా, దానిని పురాణముల ద్వారా అసత్యవాదులు, శాస్త్రము ద్వారా సత్యవాదులు

చెప్పుకొనుచున్నారు. విశ్వము దేవుని ద్వారా సృష్టింప బడినది అనుమాట నూటికి నూరుశాతము సత్యమే. అయితే ఆ

విషయము మనిషికి తొందరగా తెలియుటకు అసత్యములతో, కల్పిత కథలతో కూడిన పురాణములను చెప్పుకోవలసి

వస్తున్నది. సత్యమును తొందరగా తెలియుటకు అసత్యమార్గమును అనుసరించవలసియున్నది. సత్యమును తొందరగా

కాకుండా ఆలస్యముగా అయినా తెలియుటకు శాస్త్రమును అనుసరించాలి. ఇంకొక విధముగా చెప్పుకొంటే మనిషికి

అవగాహనశక్తి తక్కువయున్నప్పుడు అతనికి కల్పిత కథలతో, అసత్య మాటలతో సత్యమును తొందరగా

తెలియజేయవచ్చును. గ్రాహితశక్తిలేని మనుషులకు శాస్త్రము ప్రకారము సత్యమును తెలియుట కష్టమగును. అందువలన

శాస్త్రము వలన ఆలస్యముగా, పురాణముల వలన తొందరగా సత్యము తెలియుచున్నది. వివరముగా చెప్పాలంటే

అసత్యము ద్వారా తొందరగా, సత్యము ద్వారా ఆలస్యముగా ఒక విషయము తెలియబడుచున్న దని చెప్పవచ్చును.


ఉదాహరణకు ఒక విషయమును చెప్పుకొందాము. ఒక కుటుంబములో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు

ఉన్నారు. వివరముగా చెప్పుకొంటే కుటుంబములో భార్యాభర్త ఇద్దరు పెద్దలుండగా నాలుగు సంవత్సరముల పిల్లవాడు

ఒకడు, పది సంవత్సరముల పిల్లవాడు మరొకడు మొత్తము నలుగురు కలరు. వారున్న ఇంటికి రెండు ప్రవేశ ద్వారములు

కలవు. ఒకటి ఉత్తరమువైపు, రెండవది దక్షిణవైపు గలదు. ఉత్తరమువైపు ద్వారము ముందర మురికి నీరు ప్రవహించుటకు

మునిసిపాలిటీవారు క్రొత్తగా కాలువను త్రవ్వినారు. దాని పని అంతయు ముగియుటకు ఒక నెల కాలము పట్టును.

అంతవరకు అటువైపు ద్వారము ద్వారా బయటికి పోవుటకు కష్టముగాయుండును. పెద్దలు బయటికి పోవడానికే

కష్టముగా యున్నప్పుడు పిల్లలు బయటికి పోవడము ప్రమాదము. కాలువలోనికి పడిపోవు ప్రమాదము కలదు.

అందువలన పెద్దలు ఇద్దరు దక్షిణమువైపు ద్వారము ద్వారా బయటికి పోవడము జరుగుచుండెను. పది సంవత్సరముల

పిల్లవానికి బుద్ధి పెరిగినది. కావున ప్రమాదమును గురించి చెప్పితే అర్థము కాగలదు. అందువలన పెద్దపిల్లవానికి

ఉత్తరమువైపు ద్వారము ద్వారా బయటికి పోవద్దనీ, కాలువయున్నందున కాలువలో పడి ప్రమాదము జరిగే అవకాశమున్నదనీ

చెప్పారు. పెద్దపిల్లవాడు తల్లితండ్రులు చెప్పినమాటను అర్థము చేసుకోగలిగి, అటువైపు పోకుండా దక్షిణ ద్వారమువైపు


బయటికి పోతానని చెప్పాడు. ఇకపోతే నాలుగు సంవత్సరముల పిల్లవాని విషయము లోనే కొంత ఆలోచించవలసి

వచ్చినది. ఉత్తర ద్వారమువైపు బయట ప్రమాదముంది అని చెప్పితే గ్రహించుకొను స్థోమత లేదు. అందువలన ఆ

పిల్లవానికి ప్రమాద విషయము అర్థముకాదు. అటువంటప్పుడు అతను బయటికిపోకుండా ఉండుటకు అతనికి

అర్థమగునట్లు, అర్థమగు విధానములో చెప్పాలి. అతను బయటికి పోకుండా ఉండడము ముఖ్యమైన ఉద్దేశ్యము.

అందువలన ఆ పిల్లవాడు బయటికి పోకుండుటకు సత్యము చెప్పితే అర్థము కాదు, అర్థము చేసుకొను స్థోమత లేదు.

కావున అతనికి అసత్యమును చెప్పితే దానిని అతడు సులభముగా నమ్మును. కావున అతనికి సత్యము బదులు

అసత్యము చెప్పవలసి వచ్చినది.


చిన్నపిల్లవాడు బయటికి పోకుండుటకు అతనికి అర్థమగు విధానములోనే ఏదో ఒక అసత్యమును కల్పితము

చేసి చెప్పవలసి వచ్చినది. అప్పుడు అతనికి అర్థమగులాగున ఒక విషయమును చెప్పారు. ఏమి చెప్పారనగా!

ఉత్తరమువైపు తలుపు దాటి బయటికిపోతే అక్కడ ఒక బూచోడు ఉన్నాడనీ, ఆ బూచోడు నల్లని కంబళి కప్పుకొని

ఉన్నాడనీ, బూచోనికి పొడవాటి చేతులున్నాయనీ, పొడవాటి చేతులకు పొడవుగానున్న గోర్లు ఉన్నాయనీ, ఇంట్లోని

పిల్లలు బయటికి వస్తే బూచోడు కంబళి కప్పి ఎవరూ చూడకుండ ఎత్తుకొని పోతాడనీ, లేని విషయములను కల్పించి

అసత్యమును చెప్పడము జరిగినది. అలా చెప్పగా ఆ పిల్లవానికి అటువైపు పోకూడదని బాగా అర్థమైనది. అటువైపు

పోతే ప్రమాదమనీ, బూచోడు ఎత్తుకొని పోతాడని తెలిసినది. అప్పటినుండి ఆ పిల్లవాడు అటువైపు రాలేదు. బయటికి

పోకూడదను సత్యము పిల్లవానికి అసత్యము ద్వారా తెలిసినది. బయట ప్రమాదముందనునది ముఖ్య అంశము. అదే

విషయమును పెద్ద పిల్లవానికి ఉన్నదున్నట్లు చెప్పడము వలన అతనికి ప్రమాద విషయము తెలిసిపోయినది. పెద్దపిల్లవానికి

సత్యము ద్వారా ఉన్న విషయమును తెలియజేయగా, అదే విషయమునే చిన్నపిల్లవానికి అసత్యము ద్వారా తెలియజేయడము

జరిగినది. ఒక విషయమును ఇద్దరికి తెలియజేయడానికి ఒకటి శాస్త్రమును (సత్యమును) రెండు పురాణమును

(అసత్యమును) ఎంచుకోవలసివచ్చినది. ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది అని అడిగితే ఒకటి సత్యము రెండవది

అసత్యము అయినా వినేవారినిబట్టి, వినేవారి బుద్ధియొక్క గ్రాహితశక్తిని బట్టి రెండు సరియైన విధానములే అని

చెప్పవచ్చును.


ఇందూ, క్రైస్తవ, ఇస్లామ్ సమాజములలోని ప్రజలలో చిన్న పిల్లవానివలె బుద్ధియొక్క గ్రాహితశక్తి లేనివారు

ఉన్నారు. అలాగే పెద్ద పిల్లవానివలె చెప్పే విషయమును విని బాగా గ్రహించుకొనువారు కూడా కలరు. అందువలన

ఆయా సమాజముల వారి మూల గ్రంథములలో సృష్టిని గురించి ఒక చోట సత్యమును బోధించారు. మరొకచోట

అసత్యమును బోధించారు. చెప్పబడే విషయమును తెలివితక్కువ వారు కూడా గ్రహించుకొనునట్లు, బూచోనికథను

పిల్లవానికి చెప్పినట్లు, కల్పిత అసత్య విషయమును చెప్పవలసివచ్చినది అట్లే చెప్పారు. పరిశుద్ధ బైబిలు గ్రంథమునందు

సృష్టివాదము పూర్తి అసత్యముగా, అశాస్త్రీయముగా కనిపించుచున్నది. అదే విషయమునే మేము వ్రాసిన “సృష్టికర్తకోడ్

963” అను గ్రంథములో విమర్శించడము జరిగినది. ఆదికాండములో వ్రాయబడిన సృష్ఠి విషయమంతా పూర్తి అసత్యమని

మేము చెప్పడము జరిగినది. మా దృష్ఠిలో అక్కడ చెప్పిన సృష్ఠి విధానమంతయు పూర్తి అసత్యము. అదే సృష్ఠి

విషయమును భగద్గీతలో విభూతి యోగమను అధ్యాయమున ఆరవ శ్లోకమందు సృష్ఠిరహస్యము కలదు. గీతలో

ఉన్నది పైకి కనిపించదు. అందువలన దానిని పూర్తిగా వివరించి తెలుసుకోగల్గితే పూర్తి శాస్త్రబద్ధమైన సృష్టి విధానమంతయు

అందులో గలదు. బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములో ఒక విధముగా, భగవద్గీత గ్రంథములో మరొక విధముగా విశ్వము


సృష్టించబడిన విధానము చెప్పబడినది. సృష్ఠి విషయము మానవులందరికీ తెలియునట్లు, తెలివితక్కువ వారికిగానీ,

తెలివిగలవారికి గానీ అర్థమగునట్లు ఒకచోట శాస్త్రబద్ధముగా, మరియొకచోట శాస్త్రబద్ధత లేకుండా పురాణాలవలె

చెప్పడము జరిగినది. మూల గ్రంథములను వ్రాసిన జ్ఞానులు రెండు రకముల మనుషులను దృష్టిలో పెట్టుకొని అలా

కావాలనే వ్రాశారు. అందువలన ఇది సరియైనది, ఇది సరికానిది అని చెప్పుటకు వీలులేదు. ఒక ఇంటిలోని ఇద్దరు

పిల్లలకు ఇంటిముందున్న ప్రమాదమును గురించి పెద్దలు రెండు రకములుగా ఎందుకు చెప్పవలసి వచ్చినదో, అలాగే

ఒకే మానవజాతికి సృష్టిని గురించి రెండు రకములుగా చెప్పవలసివచ్చినది. అందువలన ఒక దానిని సమర్థించుట

మరొక దానిని విమర్శించుట వృథా అనుకుంటాను. అందులో ఒకటే కరెక్టు, రెండవది తప్పు అని ఎవరైనా అంటే,

అప్పుడు విమర్శించి అడుగవచ్చును. క్రైస్తవులు తమకు తెలిసిన జ్ఞానము గొప్పయని, మిగతా తక్కువయని అనినప్పుడే,

నేను సృష్ఠిని గురించి బైబిలులో అసత్యము వ్రాశారని చెప్పడము జరిగినది.


మూలగ్రంథములలో ఉన్నవన్నీ సత్యములని మేము చెప్పడము లేదు. కొన్నిచోట్ల అసత్యము కూడా ఉన్నది.

బైబిలులో సృష్ఠి ఆరు దినములలో జరిగిందని అసత్యము చెప్పినట్లు మిగతా గ్రంథములలోనూ కొంత అసత్యము

కలిసియుండవచ్చును. భగవద్గీతలో యజ్ఞములను గురించిన అసత్యము ఎక్కువగా ఉన్నది. ఖురాన్లో స్వర్గ నరకములను

గురించిన విషయము ఎక్కువగా వక్రీకరించబడినది. ఇవన్నియు దేవునికి తెలియకుండ ఏమీ జరిగియుండవు. దేవునిమీద

దేవుని జ్ఞానముమీద శ్రద్ధయున్న వానికి ప్రతి విషయములోను సత్యము అర్థమగుచుండును. మూలగ్రంథములో దేవుని

జ్ఞానము ఉన్నట్లే, మాయజ్ఞానము కూడా కొంత యుండును. మనిషియొక్క శ్రద్ధనుబట్టి దేవుని జ్ఞానము అర్థముకావడమూ,

కాకపోవడమూ జరుగును. శ్రద్ధలేనివానికి మాయజ్ఞానము సులభముగా అర్థమగును. దేవుని జ్ఞానము అర్థము కాదు.


ఇప్పుడు ఒక హేతువాది క్రైస్తవమతములో ముఖ్యముగా ప్రచారము కాబడిన వాక్యమును గురించి కారణమును

అడుగుచున్నాడు. క్రైస్తవ మతములో సాధారణ వ్యక్తి మొదలుకొని ఫాస్టర్ల వరకు, ఫాదర్ మొదలుకొని బిషప్ల వరకు

చెప్పుకొను మాట ఏసు పాపుల కొరకు రక్తము చిందించాడు. ఏసు రక్తము పాపుల పాపమును లేకుండా చేసినది.

పాపుల పాప క్షమాపణ కొరకు ఏసు తన రక్తమును శిలువమీద బలిదానము చేశాడని చెప్పు చుందురు. ఒకరి

రక్తమును చిందించితే మరొకరి పాపము ఎలా పోవును అని హేతువాదులు ప్రశ్నించుచున్నారు. వారి ప్రశ్నకు శాస్త్రబద్ధమైన

సమాధానము ఇచ్చినప్పుడు దానికి హేతువు దొరికినట్లగును. అలా సరియైన జవాబు లభించకపోతే ఆ మాటను

ఎందరు చెప్పినా అసత్యమనియే చెప్పవచ్చును. ఇప్పుడు హేతువాది ప్రశ్నను గమనిద్దాము.


ప్రశ్న :- ఏసుక్రీస్తు పాపకుల రక్షకుడనీ, ఆయన రక్తము వలన పాపములు పోవుననీ, క్రైస్తవులందరూ అనుమాట పూర్తి

అసత్యమని హేతువాదము అంటున్నది. అది నిజమే అని ఏసు ఎక్కడైనా బోధించాడా?

మేము :- హేతువాది అడుగు ప్రశ్నకుగానీ, నాస్తికవాది అడుగు ప్రశ్నకుగానీ జవాబు శాస్త్రబద్ధముగా ఉండవలెను.

అలా లేకపోతే ఏ విధమైన జవాబును చెప్పినా అది అసత్యమైన జవాబగును. ఈ ప్రశ్న క్రైస్తవ సమాజములో చాలా

ప్రాముఖ్యముగల ప్రశ్న. దాని జవాబు కూడా ఎందరికో జ్ఞానము కల్గించునదిగా, అజ్ఞానముగా ఉన్నవారి కళ్ళు

తెరిపించునదిగా ఉండును. అందువలన ఈ ప్రశ్నకు జవాబును అందరికీ అర్థమగులాగున, శాస్త్రబద్ధముగా

ఉండునట్లు చెప్పుకొందాము.


నేడు క్రైస్తవులందరూ అర్థము చేసుకొన్నట్లు ఏసు తన రక్తము ద్వారా మనుషుల పాపములు క్షమించబడునని


బైబిలు గ్రంథములో ఎక్కడా చెప్పలేదు. తాను శిలువ వేయబడుటకు ముందురోజు తన 12 మంది శిష్యులతో కలిసి

భోజనము చేయునప్పుడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో “దీనిలోనిది మీరందరూ త్రాగుడి,

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింప బడుచున్న నిబంధన రక్తము” అని ఏసు

అన్నాడు. ఇదే విషయమునే మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వాక్యములో “ఇది నా నిబంధన విషయమై

అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము” అని అన్నాడు. బైబిలులోని ఈ వాక్యములు ఎంతో ప్రాధాన్యత

కల్గియుండగా, వాటిని తమ ఇష్టము వచ్చినట్లు చెప్పుకొనే దానికి మనుషులు అలవాటుపడి పోయారు. "మొప్పికి

మొగలిరేకు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకొన్నాడట" అన్నట్లు ఎంతో జ్ఞానసందేశముతో కూడుకొన్న వాక్యమును ఏసుప్రభువు

చెప్పితే, దానిని ఎలా అర్థము చేసుకోవాలో అలా చేసుకోకుండా, తమకు అనుకూలముగా, తమ మత ప్రచారమునకు

అనుకూలముగా, దేవుని ధర్మమునకు వ్యతిరేఖముగా చెప్పుకొనుచున్నారు. అలా చెప్పుకోవడము వలన దేవుని

జ్ఞానమును తప్పుదోవ పట్టించినట్లగును. భగవంతుని ఉద్దేశమును మార్చినట్లగును.


పండ్రెండు మంది శిష్యుల మధ్యలో కూర్చున్న ఏసు ఒక గిన్నెలో ద్రాక్షరసమును వారికి ఇచ్చి "ఇది పాపక్షమాపణ

నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధనరక్తము” అన్నాడు. ఇక్కడ ఏసుప్రభువు తన శరీర రక్తము అని

ఏమాత్రము చెప్పలేదు. నా నిబంధన రక్తము అని అన్నాడు. ఎంతో స్వచ్ఛముగా అందరికీ అర్థమయ్యేలాగున “నా

నిబంధన రక్తము” అని ఏసు చెప్పియుండగా, దానిని బోధకులు ఆయన శరీర రక్తముగా మార్చి చెప్పవలసిన

అవసరమేమొచ్చినదని మేము అడుగు చున్నాము. అంతేకాక నేను చనిపోవునప్పుడు చిందింపబోవు రక్తమని ఆయన

చెప్పలేదు కదా! ప్రస్తుతము వర్తమాన కాలములో అనగా జరుగుచున్న కాలములో “చిందింపబడుచున్న రక్తము” అని

చెప్పాడుగానీ, రాబోవు కాలములో చిందింపబోవు రక్తమని చెప్పలేదు. నేడు ప్రపంచములోగల ఎంతో తెలివైన బోధకులు

ఏసు (భగవంతుడు) చెప్పిన వాక్యమును తెలివితక్కువగా ఎందుకు అర్థము చేసుకొన్నారని ప్రశ్నించుచున్నాను. మనుషుల

పాపము కొరకు ఆయనెందుకు రక్తమును చిందించాలి? అనికూడా అడుగుచున్నాను. ఆయన చెప్పినది ఏ రక్తమో

తెలియక, గ్రుడ్డిగా మాట్లాడు వారికి దేవుని జ్ఞానము ఎంతవరకు తెలిసియుంటుందో ఆలోచించుకోండి.


దేవుని ధర్మముల ప్రకారము, దేవుని ప్రతినిధిగా వచ్చినవాడు, దేవుని జ్ఞానమును తెలియజెప్పితే, దానివలన

జ్ఞానసంపన్నులై జ్ఞానాగ్ని కలవారై తమ కర్మలను (పాపములను) లేకుండ చేసుకోవచ్చును. జ్ఞానము వలననే పాపములు

నశించునుగానీ మతము మారితేనో, మనిషి రక్తము పూసుకొంటేనో, జంతువు రక్తమును కార్చితేనో పాపములు పోవు.

దేవుడు మనుషుల పాపములను లేకుండా చేస్తానని ఏ గ్రంథములోగానీ, ఏ సందర్భములోగానీ చెప్పియుండలేదు.

అలా చెప్పడము అధర్మమగునని దేవునికి తెలుసు. దేవుని ధర్మములను తెలియని మనిషి దేవునికి కళంకము తెచ్చు

మాటలను మాట్లాడుచున్నాడు. దేవుని జ్ఞానమును దేవుడే చెప్పినా, దానికి భిన్నముగా వక్రీకరించి చెప్పితే దేవునికి

వ్యతిరేఖముగా అధర్మమును బోధించినట్లగును. అప్పుడు దానివలన పాపము సంభవించుచున్నది. ఈ విధముగా

చాలామంది బోధకులు తమకు తెలియకున్నా, ఏమాత్రము యోచించకుండా దేవుని జ్ఞానమును అధర్మయుక్తముగా,

దేవుడు చెప్పిన దానికి వ్యతిరేఖముగా చెప్పడము వలన, బోధకులని పేరుగాంచిన వారికైనా, దేవుని విషయములో

అక్రమమైన పనిని చేసినట్లగును. అందువలన బోధకులైనవారు తమకు సంపూర్ణముగా తెలిసిన జ్ఞానమునే బోధించమని

చెప్పుచున్నాము. ధర్మములకు వ్యతిరేఖమైన దానిని, శాస్త్రబద్ధత లేనిదానిని బోధించకూడదని తెలుపుచున్నాము.

దేవుని జ్ఞానము తన శరీరములో ప్రవహించు రక్తముతో సమానమని ఏసు చెప్పుచూ, దానిని నిబంధన


రక్తము అని అన్నాడు. దేవుని జ్ఞానము అందరికి ముఖ్యమైనదే. అందువలన ఏసు దేవుని జ్ఞానమును రక్తముతో

సమానముగా పోల్చి చెప్పాడు. అది పోలికయేగానీ, నిజముగా శరీర రక్తమని చెప్పలేదు. ఆయన ప్రతి దినము దేవుని

జ్ఞానమును ప్రజలకు పంచుతూ, బోధిస్తూవుండుట వలన, అనేకుల కొరకు చిందిస్తున్న నిబంధన రక్తము అన్నాడు.

దేవుని జ్ఞానమును నిబంధన రక్తము అని చెప్పడము జరిగినది. దేవుని జ్ఞానము వలన పాపములు కాలిపోవును, కనుక

మనుషుల పాపములు పరిహారమై పోవుటకు, ఆయన జ్ఞానమును వెదజల్లుతూ ఉండెడివాడు. అందువలన అనేకుల

పాపక్షమాపణ కొరకు చిందింపబడు (వెదజల్లబడు) నా నిబంధన రక్తము అన్నాడు. దేవునియందు ఆయన, ఆయనయందు

దేవుడు కలిసియున్నారు. కావున దేవుని జ్ఞానమును నా జ్ఞానము అన్నాడు. ఆ ఉద్దేశ్యముతోనే నా నిబంధనరక్తము

అన్నాడు. ప్రపంచములో అన్నియు కర్మ ఆధీనములో ఉన్నవి. కర్మ ఆధీనములో లేనిది దేవుని జ్ఞానమొక్కటే. అన్నిటినీ

బంధించు కర్మ, జ్ఞానమును మాత్రము బంధించలేదు. జ్ఞానమే కర్మను బంధించగలదు. ఏ కర్మ బంధనము లేనిది

దేవుని జ్ఞానము, కనుక దేవుని జ్ఞానమును "నిబంధన రక్తము” అన్నాడు. ప్రతి దినము జ్ఞానమును ఏసు బోధిస్తున్నాడు.

కావున చిందించుచున్న లేక చింధిపబడుచున్న నిబంధన రక్తమని, అప్పటి వర్తమాన కాలమునకు సంబంధించి

సరిపోవునట్లు చెప్పినమాటయని తెలియవలెను. అక్కడ చిందించబోవు రక్తమని చెప్పలేదని ప్రతి ఒక్కరూ జ్ఞాపకముంచు

కోవలెను.


ఏసుప్రభువును శిలువమీద ఉంచి, కాళ్ళకు చేతులకు ములుకులు కొట్టినప్పుడు ఆయన శరీరమునుండి

కారినది సాధారణముగా అందరి శరీరములలోనున్న రక్తములాంటి రక్తమే కారినది. శరీర రక్తములో ఏ మహత్యముగానీ,

ఏ ప్రత్యేకత గానీ లేదు. కావున భౌతిక రక్తమును గురించి చెప్పుకొనుటకు ఏమాత్రము వీలులేదు. మనము పాపము

చేస్తే, ఆ పాపమును మనమే లేకుండా చేసుకొనుటకు, అవసరమైన జ్ఞానమును ప్రపంచమంతా ఆయన వెదజల్లి

పోయాడు. ఆయన వెదజల్లిన జ్ఞానము నేడు గ్రంథరూపములో మనముందర ఉన్నది. ఆ దినము ఆయన చిందించానని

చెప్పిన నిబంధన రక్తమనునది నేడు బైబిల్లో గ్రంథ రూపములో ఉన్నది. నేడు దానిని తెలుసుకోగల్గితే తెలుసుకొన్నవాడు

ఎవడైనాగానీ, వాడు కూడా కర్మ బంధముల నుండి బయటపడి నిబద్ధుడై మోక్షమును పొందును. అయితే క్రైస్తవులలో

పెద్ద బోధకులైన వారికే నిబంధన రక్తమేదో, సాధారణ రక్తమేదో తెలియకుండాపోయినది. అటువంటి స్థితిలో ఏసే

తిరిగివచ్చి నేను చెప్పినది అది కాదు, ఇది అని చెప్పినా, మనిషి వినే పరిస్థితిలో లేడు. అలా వచ్చి ఆయనే చెప్పినా

వినకపోగా, మా మతములో చేరితే నీకు కూడా పాపక్షమాపణ జరుగును. క్రైస్తవులైన వారందరికీ, ఏసును ఒప్పుకొన్న

వారందరికీ, పాప పరిహారమగును అని చెప్పి, ఏసును కూడా వారి మతములో చేరమని చెప్పుదురు. నేడు క్రైస్తవ

సమాజములోని వారందరూ, బైబిలు గ్రంథములలోనున్న జ్ఞానమును తెలియడము లేదుగానీ, క్రైస్తవమతమును

విస్తరింపజేయవలెనను చింతలోనే ఉన్నారు. ఈ రోగము ఒక్క క్రైస్తవమతములోనేకాక మొత్తము అన్ని మతములలోనూ

కలదు.


ఏసుప్రభువు బ్రతికియున్న రోజులలో కూడా ఆయన ఇతరుల పాపములను లేకుండా చేస్తానని చెప్పలేదు.

దేవుని జ్ఞానమును తెలిసి దానిని ఆచరించడము వలన, ఎంతటి పాపములైనా తొలగిపోవునని తెలియ జేశాడు. అంతేకాక

తన బోధలో నేను ఉన్నప్పుడే జ్ఞానము తెలియకపోతే, నేను పోయిన తర్వాత నన్ను వెదకినా ఏమీ ప్రయోజనము

ఉండదు. అని యోహాన్ సువార్త 8వ అధ్యాయములో 21వ వ్యాసమునందు చెప్పాడు. “నేను వెళ్ళి పోవుచున్నాను.

మీరు నన్ను వెదకుదురుగానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో




చెప్పెను.” అదే సువార్తలో అదే అధ్యాయములో 23, 24 వాక్యములలో కూడా ఇలా కలదు. (23) “మీరు క్రింది వారు,

నేను పైనుండువాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కావున మీ

పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. (24) నేను ఆయనేనని (దేవుడనేనని) మీరు విశ్వసించని

ఎడల, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను.” ఏసుప్రభువు బ్రతికి యున్నప్పుడు ఆయనే

స్వయముగా చెప్పిన మాటలివి. మీరు జ్ఞానము తెలియకపోతే మీ పాపములోనే చనిపోతారని చెప్పాడు. అంతేకాక ఈ

లోకము అజ్ఞానముతో నిండియున్నదని, పై లోకము జ్ఞానముతో నిండి యున్నదనీ, జ్ఞానముకల ఆయన పై లోక

సంబంధుడనీ, జ్ఞానము తెలియని వారు క్రిందిలోక సంబంధులై పాపములలోనే చనిపోవుదురని చెప్పాడు. ఇంకా

దేవుని జ్ఞానము చెప్పువాడు, దేవుడే అయివుంటాడని నమ్మనివారు పాపములలోనే ఉండి చనిపోవుదురని చెప్పాడుగానీ,

తన రక్తము చేత పాప క్షమాపణ కలదని చెప్పలేదు. దైవజ్ఞానము తెలియనివారు పాపముల నుండి బయటపడక,

వాటిలోనే చనిపోవుదురని ఆయన ఎన్నోమార్లు బైబిలు గ్రంథములోనే చెప్పియున్నారు. అలాంటప్పుడు ఏసు రక్తము

మనకొరకు కార్చాడనీ, ఏసు మనకొరకు చనిపోయాడనీ, చెప్పుకోవడము పొరపాటు కాదా!


యోహాన్ సువార్త 9వ అధ్యాయమందు 41వ వాక్యములో “మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవునుగానీ,

చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు, గనుక మీ పాపములు నిలచియున్నవని చెప్పెను.” ప్రపంచ విషయములో

మీరు గ్రుడ్డివారైతే అప్పుడు దేవుని విషయమైన జ్ఞానము తెలియుననీ, ప్రపంచ విషయములో మీకున్న ధ్యాసను వదులుకోక,

మిక్కిలి ధ్యాసతో ప్రపంచమునే చూచుచున్నామని మీరు చెప్పుచున్నారు. అందువలన మీ పాపములు నశించిపోవుటకు

వీలులేదని ఏసు చెప్పి యున్నాడు. అంతేగానీ మీరు ఎలావున్నా ఫరవాలేదు, నా రక్తము వలన మీరు పాపముల నుండి

రక్షింపబడుతారని ఎక్కడా చెప్పలేదు. బైబిలు గ్రంథములో లేని మాటను ఉన్నదనీ, ఏసు చెప్పాడనీ నేటి బోధకులు

చెప్పడమేకాక, హిందువుల వేదాలలో కూడా “రక్త ప్రోక్షణం పాపపరిహారం" అని ఉన్నదని చెప్పడము వారి అజ్ఞానమునకు

నిదర్శనము. వీటినన్నిటినీ గమనించితే క్రైస్తవులు బైబిలు గ్రంథముయొక్క జ్ఞానమునకు ఎంత దూరముగాయున్నారో

తెలిసిపోవుచున్నది. ఇప్పటికైనా మించిపోయినది లేదు, క్రైస్తవులు బైబిలు గ్రంథము చదివి అందులో అసలు జ్ఞానమును

తెలుసుకోగల్గితే, అలాగే హిందువులు గీతను చదవగల్గి అందులోని జ్ఞానమును తెలియగల్గినా, ముస్లీమ్లు దేవుని

ప్రార్థన చేయడమేకాక ఖుర్ఆన్ గ్రంథములో ఏమి చెప్పారని చూడగల్గితే కొంతవరకైనా జ్ఞానము తెలియగలదు.

జ్ఞానము తెలియుకొద్దీ దానిని చెప్పిన వ్యక్తి ఈ లోక సంబంధుడుకాడనీ అర్థము కాగలదు. ఇంకా ముందుకు

పోవుకొద్దీ దేవుడే దానిని చెప్పాడనీ, ఆయనే ఈయననీ తెలియగలదు. అలా తెలియగల్గిన నాడు మనుషులు తమతమ

పాపములనుండి విముక్తి పొంది నిబద్ధులై, నిబద్దముగాయున్న దేవునియందు కలిసిపోగలరు.


ప్రశ్నించడము అందరిహక్కు, వీరు అడుగవచ్చు, వీరు అడగకూడదు అను నియమము ఏమీ ఉండదు. అడిగే

ప్రశ్న పదిమందికి ఉపయోగ కరమైనదిగా ఉండాలి. ప్రశ్న ఎంత మంచిదైతే దాని జవాబు కూడా అంతే మంచిగయుండును.

వాన పైనుండి వచ్చి ఎక్కడపడుతుంది? అనునది కూడా ప్రశ్నయే. అయితే దానివలన ఎవరికీ ఏమీ ప్రయోజనముండదు.

పై నుండి వచ్చినవాన పడేది క్రిందనే కదా! అది అందరికీ తెలిసిన విషయమే. దానివలన క్రొత్తగా ఎవరికీ ఏమీ

తెలిసినట్లు కాదు. అడిగే ప్రశ్న సంచలనముగాయుంటే, వచ్చే జవాబు లోకానికి క్రొత్తగా, కనువిప్పుగా ఉంటుంది.

అందువలన మీకు మంచి ప్రశ్నలూ, అలాగే క్రొత్త జవాబులు లభించేటట్లు ప్రయత్నించి ఈ గ్రంథమును వ్రాయడము

జరుగుచున్నది. ఈ విధానములో కుల మతములకు అతీతముగా, సమాజములోని అందరికీ ఉపయోగపడునట్లుగా


ప్రశ్నలను తీసుకొని జవాబులివ్వడము జరుగుచున్నది. అందువలన చదివేవారు ప్రతి విషయమును విచక్షణతో,

వివేకముతో చూడవలెనని తెలుపుచూ ఇప్పుడు మనుషులందరికీ ఉపయోగపడు ప్రశ్నను తీసుకొందాము. ఒక

నాస్తికవాది ఆత్మను గురించి ఏమంటున్నాడో క్రింద చూస్తాము.



నాస్తికవాది :- ఆత్మ అనునది పెద్ద అబద్ధము. ఆత్మ అనునది పదార్థ పరిణామ దశలలో ఎక్కడా గోచరించలేదు. కనుక

ఆత్మకు అస్తిత్వము లేదు. కాబట్టి ఆత్మ అభౌతికము, అపాకృతము, ఆత్మ పదార్థము కాదు. స్థల కాలాదులలో ఆత్మ

కనబడదు. అందువలన ఆత్మ అబద్ధము. జీవులలో ఆత్మ చేసే పని ఏమీ లేదని తెలిసిపోయింది. ఆత్మవాదులు తమ

మానసిక భ్రమలకు రకరకాల పేర్లను ఆత్మకు అంటగట్టి పిలుస్తూ, జనాలను మోసగించుచూ, కాసులపంట

పండించుకొంటున్నారు. ఇవిగో వాళ్ళు పిలువబడే ఆత్మలు పరమాత్మ, పరిశుద్ధాత్మ, పావనాత్మ, పరాత్మ, ప్రేతాత్మ,

భూతాత్మ, బ్రహ్మాత్మ, భ్రష్టాత్మ, తదాత్మ, అంతరాత్మ, దురాత్మ, దుష్టాత్మ అని పిలుస్తున్నారు. ఇదంతా భావవాద ముసుగు

ప్రవాహములోనుండి దొర్లిన అసత్య పదజాలం. ఉపనిషత్తులలో ఆత్మకు పిచ్చివాగుళ్ళతో కూడిన నిర్వచనా లెన్నో

వ్రాసిపెట్టారు. నేటి భౌతికవాదులేకాక పూర్వము చార్వాకుడు, లోకాయతులు, బౌద్ధులు, ఆత్మ ఉనికిని అంగీకరించలేదు.

అయితే మీరు ఆత్మను ఉందంటారా? లేదంటారా?


మా జవాబు :- ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ఆత్మను ఉందనినా, లేదనినా ఆత్మకు వచ్చిన నష్టము ఏమీలేదు. మేము

చెప్పునది ఏమనగా! ఆత్మను ఎవరు లేదనినా, ఎవరు ఉందనినా వారు గ్రుడ్డిగా చెప్పక శాస్త్రమును ఆధారము

చేసుకొని చెప్పవలసియుంటుంది. అప్పుడే అది శాస్త్రీయత అవుతుంది. ఆత్మను ఉందనుటకు శాస్త్ర ఆధారములుండవలెను.

అట్లే లేదను వారు కూడా శాస్త్ర ఆధారములను చూపవలెను. అట్లు కాకుండా చార్వాకుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు

వాళ్ళ అల్లుడు కూడా చెప్పాడు అంటే సరిపోదు. అది శాస్త్రీయత కాదు. ఒకే దారిలో పోయిన నలుగురు గ్రుడ్డివాళ్ళకు

దారి ప్రక్కనే పడుకొనియున్న పాము కనిపించనపుడు, వారి మాటలనుబట్టి పాము లేదనవచ్చునా? వాస్తవముగా పాము

ఉంది కావున గ్రుడ్డివారు చూడనంతమాత్రమున పాము ఉందనుట అవాస్తవము కాదు కదా! అట్లే ఆత్మ ఉన్నప్పుడు

జ్ఞానదృష్టి లేనివారు, అజ్ఞానాంధకారులు చూడలేనప్పుడు, ఉన్న సత్యమును అసత్యమన లేము కదా! పైన ప్రశ్నలో

చెప్పిన నాస్తికవాది ఆత్మ పదార్థముకాదు అన్నాడు. ఆత్మ స్థలకాలాదులలో కనపడదు అన్నారు. ఆత్మ పదార్థము

కాదనుటకు ఆధారమున్నదా? ఆత్మకు స్థలము కాలము లేదనుటకు శాస్త్రీయమైన ఆధారము ఏదైనా ఉన్నదా? అని

ప్రశ్నించుచున్నాను. ఆత్మను గురించి మేము చెప్పునది ఏమనగా! ఆత్మ ఒక పదార్థము కాదు అనుటను మేము కొంత

సత్యమని, కొంత అసత్యమని చెప్పుచున్నాము. అదెలాయనగా! పదార్థము అనునది రెండు భాగములుగా ఉండును.

కొంత స్థూలభాగముగా, కొంత సూక్ష్మభాగముగా ఉండును. స్థూల సూక్ష్మ రెండు భాగములను కలిపి ఒక పదార్థము

అంటున్నాము. ఉదాహరణకు ఒక గుడ్డను తీసుకొందాము. గుడ్డ ఒక పదార్థమైనా, దానిలో కనిపించు గుడ్డ

స్థూలము, కనిపించని గుడ్డ సూక్ష్మముగా ఉన్నదని చెప్పవచ్చును. మనిషి శరీరము కూడా ఒక పదార్థముతో తయారైనదే,

దానిలో కూడా స్థూలము, సూక్ష్మము రెండూ ఉన్నాయి. స్థూలమును పద అనియూ, సూక్ష్మమును అర్థము అనియు

చెప్పవచ్చును. పద + అర్థము = పదార్థము అని చెప్పవచ్చును. ఆత్మ విషయములోనికి వస్తే ఆత్మ స్థూలముగాలేదు,

సూక్ష్మముగా ఉన్నది. అందువలన ఆత్మను కేవలము అర్థము అని అనవచ్చునుగానీ, పూర్తిగా పదార్థము అని అనకూడదు.


ఆత్మ సూక్ష్మమైనదైనప్పుడు, ఆత్మ అర్థముగా ఉన్నప్పుడు, దానికి కూడా ఆకారముందనియే చెప్పవచ్చును.

ఆకారమున్నప్పుడు దేనికైనా పేరు, పని రెండూ ఉంటాయి. అలాగే ఆత్మకు ఆకారమేకాక, పేరు, కార్యములు రెండూ


కలవు. దీనినిబట్టి రూప, నామ, క్రియలు ఆత్మకు ఉన్నవని చెప్పవచ్చును. జీవులలో ఆత్మ చేసే పని ఏమీ లేదని తెలిసి

పోయిందని ఇప్పుడు ప్రశ్నించిన వారు అన్నారు. దానికి బదులుగా ఆత్మ పని చేయలేదని మీకు ఎలా తెలిసింది? అని

నేను అడుగుచున్నాను. ఆత్మ పనిని చేయలేదని ఏ శాస్త్రము ప్రకారము చెప్పుచున్నారని అడుగుచున్నాను. ఆత్మ పని

చేయలేదనడము మూఢనమ్మ కముతో చెప్పిన మాటగానీ, శాస్త్రబద్ధమైన మాటకాదని మేము చెప్పుచున్నాము. మనిషి

శరీరము లోపలి, శరీరము బయట ఇంద్రియముల ద్వారా జరిగెడి పనిని చేయునది ఆత్మయేననీ, ఆత్మ తప్ప పని

చేయువారు ఎవరూ లేరనీ చెప్పుచున్నాము. జీవుడు శరీరములో ఏ పనిని చేయువాడు కాడు. కనుక నిత్యము జరుగు

పనులన్నిటిని ఆత్మయే చేయుచున్నది. అయినా పనులన్నీ ఆత్మ చేయుచున్న దని ఎవరికీ తెలియదు. ఆత్మజ్ఞానము

తెలియని మనిషి జరిగిన పనులన్నిటినీ నేనే చేశాను అనీ, జరుగుచున్న పనులనూ నేను చేయుచున్నాననీ అను కొంటున్నాడు.

వాస్తవానికి జీవుడుగానీ, దేవుడుగానీ ఏ పనులనూ చేయలేదు. పనులు జరిగాయి మరియు జరుగుచున్నాయి అంటే

అవన్నియు ఆత్మ వలననే జరిగాయనీ, అట్లే జరుగుచున్నాయని తెలియవలెను. ఆత్మ అశాస్త్రీయమైనది కాదు. ఆత్మ

ఆరవశాస్త్రము మరియు ఆదిశాస్త్రము అని పేరుగాంచిన బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి యున్నది. శాస్త్రములు

ఎన్నో కూడా తెలియనివారు తమను తాము విజ్ఞానులమని చెప్పుకొంటున్నారు. శాస్త్రజ్ఞానమే సరిగా తెలియనివారు

విజ్ఞానులెలా అగుదురు? పరమాత్మ చేయవలసిన పనులన్నీ ఆత్మే చేయుచున్నది. అట్లే జీవాత్మ కర్మను (పాపమును లేక

పుణ్యమును) అనుభవించుటకు జరుగవలసిన పనులన్నిటినీ ఆత్మే చేయుచున్నది. అటువంటపుడు ఆత్మ ఏ పనినీ

చేయదు అనుట గ్రుడ్డిగా, మూర్ఖముగా, మూఢముగా, అశాస్త్రీయముగా మాట్లాడిన మాటయగును. అందువలన

ఆత్మను గురించి అది పని చేయదు, ఆకారము లేదు అను నాస్తికవాదుల వాదనను మేము పూర్తిగా ఖండించుచున్నాము.

కరెంటుకు ధనదృవము, ఋణదృవము (పాజిటివ్, నెగిటివ్) ఎట్లు అవసరమో అట్లే శరీరము సజీవముగా ఉండాలంటే,

శరీరములో జీవప్రక్రియ జరగాలంటే, జీవాత్మతోపాటు ఆత్మ ఉండాలి. ఆత్మలేకుండా జీవాత్మ ఒంటరిగా ఏ శరీరములోనూ

లేదు. జీవాత్మ ఆత్మ రెండు జోడు ఆత్మలని పేరుగాంచినవి. మేము ప్రతిపాదించిన త్రైత సిద్ధాంతములో శాస్త్రబద్ధముగా

మూడు ఆత్మలున్నవి. ఆత్మనునది అహేతుకమైనదని మాట్లాడిన వారిలో ఆ మాటలను మాట్లాడించినది కూడా

ఆత్మయే. ఆత్మ లేనిది కనురెప్పకూడా కదలదు, శ్వాసకూడా ఆడదు. ఆత్మను అధ్యయనము చేయడమే ఆధ్యాత్మికము

అంటాము.



ఇప్పుడు మరియొక ప్రశ్నను తీసుకొని చూస్తాము. మే నెల, 1989 హేతువాది అను పత్రికలో ఒక హేతువాది

అనునతడు వేదముల గురించి వ్రాశాడు. అందులో అతడు వ్రాసిన సారాంశములో వేదముల గురించి అతని ఉ

ద్దేశ్యమును చెప్పినప్పటికీ, అతడు వేదములను గురించి వేసిన ప్రశ్న స్పష్టముగా కనిపిస్తున్నది. ఆ ప్రశ్న ఏమిటో క్రింద

చూస్తాము.


హేతువాది :- దయానందుడు ఆర్యసమాజమును పెట్టి, హిందువులందరినీ వేదాలలోనికి నడిపించాలనుకొన్నాడు.

మిగిలిన వాటినన్నిటినీ కాదని దయానందుడు వేదాలను పట్టుకోవడానికి అందులో ఆయనకు ఏమి కనిపించిందో?

ప్రాచీనకాలములో ఎందరో ఆలోచిస్తూ, ఆడుతూ, పాడుతూ, కంఠస్తము చేసిన విషయములే వేదాలలో ఉన్నాయి. అవి

సాంప్రదాయ బద్దముగా విన్నంత, జ్ఞాపకమున్నంత ప్రచారములోనికి వచ్చాయి. ఏ ఒక్కరూ వేదములను పేర్చికూర్చలేదు.

అందువలన వేదముల మూల రచయిత ఎవరూ లేరు. రానురాను కొందరు బ్రాహ్మణులు వీటికి దివ్యత్వమును అంటగట్టారు.


వీటిని మనుషులు వ్రాయలేదు దేవుడే వ్రాశాడని, వేదములను అపౌరుషేయాలన్నారు. దేవుడు చెప్పిన ప్రమాణము

లన్నారు. వేదాలు ఎప్పుడు బయటికి వచ్చాయో ఖచ్చితముగా ఎవరూ చెప్పలేరు. అందువలన వేదములను ఎవరూ

రచించలేదు. వాటికి గ్రంథకర్తలేడు అనుచున్నాము. ఒకరి రచనాగానీ, ఒకరి ఉద్దేశ్యముగానీ లేనివాటిని మనుషులు

వ్రాయలేదు, దేవుడు వ్రాశాడనడము సత్యమా? అసత్యమా తెలిసియుంటే చెప్పండి చూద్దాము.


జవాబు :- అన్ని నీవే చెప్పి చివరిలో మీరు చెప్పండి అంటే ఎలా? నీవు చెప్పినవాటిలో బ్రాహ్మణులు వేదాలకు

దివ్యత్వము అంటగట్టారు, అనుమాట తప్ప ఒకటికూడా సత్యము లేదు. నీకు తెలియని విషయములను చెప్పుతాను

బాగా చూచుకో. వేదములు సంపూర్ణముగా బయటికి వచ్చినది ద్వాపర యుగ అంత్యములో, భగవద్గీతను కృష్ణుడు

చెప్పకముందు, అనగా భారత యుద్ధముకంటే, ఎనభై (80) సంవత్సరముల ముందు, వేదములు సంపూర్ణముగా

వ్యాసునిచే కూర్చబడి, తాళపత్ర (తాటిఆకుల) గ్రంథములుగా బయటికి వచ్చినవి. వాటిని వ్రాసినవాడు వ్యాసుడే,

అయినా అన్ని విషయము లను ఆయన వ్రాయలేదు. వేదములలోని ఉపనిషత్లను తప్ప మిగతవాటిని వ్యాసుడు

వ్రాశాడు. ఉపనిషత్లను సేకరించి తాను వ్రాసిన వేదముల చివరిలో చేర్చాడు. వ్యాసుడు వేదములను వ్రాశాడు,

కావున ఆయనకు వేదవ్యాసుడు అనుపేరు వచ్చినది. వ్యాసుడు వేదములనేకాక వాటికంటే ముందు 18 పురాణములను

వ్రాశాడు. పురాణములను వ్రాసిన వ్యాసుడు వేదములను కూడా వ్రాసి “వేదవ్యాసుడు” అను పేరు తెచ్చుకొన్నాడు.

తర్వాత అర్జునుని ద్వారా తెలుసుకొన్న భగవద్గీతను శ్లోకముల రూపములో 700ల శ్లోకములుగా వ్రాశాడు. భగవద్గీతను

వ్రాసి తృప్తిచెందిన వ్యాసుడు ఆరు శాస్త్రములను కూడా కొద్దిగా వ్రాయగలిగాడు. భగవద్గీతను వ్రాసిన వ్యాసుడు

బ్రాహ్మణుడే అయినా, బ్రాహ్మణ సమాజమునకు కొంత వ్యత్యాసముగా, వ్యతిరేఖముగా కనిపించాడు. అందువలన

వ్యాసుడు చనిపోయిన తర్వాత ఆయనకు వ్యతిరేఖులుగా మారిన బ్రాహ్మణులు, వ్యాసుడు వ్రాసిన భగవద్గీతలో తమకు

అనుకూలమైన కొన్ని శ్లోకములను కలిపి వాటిని ఎవరూ గుర్తించకుండా చేశారు. గీతలో వ్యాసునికి వ్యతిరేఖులైన వారు

కొన్ని శ్లోకములను కలిపినది మేము తప్ప ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు.


వేదములకు వ్యతిరేఖముగా వ్యాసుడు భగవద్గీతను వ్రాయడము ఆనాటి బ్రాహ్మణ సమాజమునకు ఏమాత్రము

సరిపోలేదు. అందువలన వారు వేదములను ఎక్కువగా ప్రచారము చేయదలచుకొని భగవద్గీతను ప్రచారము

చేయదలచుకోలేదు. భగవద్గీతను దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినా, దానిని దేవుడు చెప్పినదని ప్రచారము చేయక

మనుషులు వ్రాసిన వేదములను దేవుడు చెప్పినవని అపౌరుషేయములని అన్నారు. దాని అర్థము వేదములను ఏ

పురుషుడు చెప్పలేదని, వాటిని దేవుడే చెప్పాడని భావము వచ్చునట్లు అలా చెప్పారు. వేదములు బ్రాహ్మణులకు అనుకూల

మైనవిగాయున్నాయి. అందువలన ప్రతి శుభకార్యములోనూ వేదమంత్రము లనే చదువుచుందురు. దయానందసరస్వతి

బ్రాహ్మణుడు అయినందున 19వ శతాబ్దము (1824-1883) లో 59 సంవత్సరములు బ్రతికిన దయానందుడు

భగవద్గీతకు ప్రాధాన్యత ఇవ్వకుండ వేదములకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వాటిని ప్రచారము చేయదలచి ఆర్యసమాజమును

స్థాపించాడు. ఆయన స్థాపించిన ఆర్యసమాజము నేటికినీ వేదములను ప్రచారము చేయుచునే ఉన్నది. వేదములకు

దివ్యత్వమును అంటగట్టిన బ్రాహ్మణ సమాజము, భగవద్గీతను స్వయముగా దేవుడే భగవంతునిగా వచ్చి చెప్పినప్పటికీ,

దానిని అసూయతో చూడడము నేటికినీ గలదు. ఎక్కడైనా ఎవరి ఇళ్ళలోనైనా కృష్ణార్జునులుయున్న భగవద్గీత సన్నివేశమును

గుర్తుచేయు చిత్రపటమువుంటే, అది ఇంటిలో ఉండకూడదు, ఉంటే మంచిదికాదు. వారికి యుద్ధము వచ్చినట్లు

కుటుంబములో కూడా పోట్లాటలు వచ్చునని గీతను గురించి చెడుగా చెప్పి ఆ ఫోటోను దేవాలయములో పెట్టండి


అలాకాకపోతే నదిలోనైనా వేయమని చెప్పుచుందురు. భగవద్గీత గ్రంథము ఎవరి ఇంటిలోనైనా కనిపిస్తే దానిని

చదవకూడదనీ, దానిని పూజగదిలో ఉంచి పూజించవలెనని చెప్పుచుందురు. ఇదంతయు ఆర్యసమాజము ద్వారా

దయానంద సరస్వతియే బ్రాహ్మణ సమాజమునకు నేర్పించిపోయాడు. గీత పటమును దేవాలయములో ఉంచమనడము

లేక నదిలో వేయమనడము ద్వారా గీతమీద ఎవరికీ ధ్యాస లేకుండా చేయడమేనని, ఇది వారి కుట్రయని మిగతా

ప్రజలకు ఎవరికీ తెలియదు. అలాగే భగవద్గీత గ్రంథమును చదువకూడదనీ, దానిని పూజించవలెనని చెప్పడమూ,

ఒకవేళ చదివితే గీతలోని అధ్యాయములను చదవకుండా చివరిలోని గీతామహత్యము చదవండని చెప్పడము కూడా

గీతయొక్క జ్ఞానము ఎవరికీ తెలియకుండ చేయడమే వారి ఉద్దేశ్యమని ఎవరికీ తెలియదు. భగవద్గీతలో వేదములకు

వ్యతిరేఖమైన శ్లోకములున్నవని తెలిసిన బ్రాహ్మణులు ఈ విధముగా భగవద్గీతను ఎవరూ చదవకుండా, ఎవరూ చూడకుండ

చేయవలెనని వారి ఉద్దేశ్యము. స్వయముగా వేదము లను వ్రాసిన వ్యాసుడు కొంతకాలము తర్వాత భగవద్గీతను తెలిసి,

దానిని వ్రాసి, భగవద్గీత యొక్క గొప్పతనమును, దానిలో దేవుడు చెప్పిన జ్ఞానమును చూచిన తర్వాత వేదములను

వ్రాసినందుకు ఎంతో చింతించాడు. వేదము లను వ్రాసి వేదవ్యాసుడని పేరు తెచ్చుకొన్నందుకు పశ్చాత్తాపపడి, చివరికి

గీతను వ్రాసి తృప్తిపొందాడు. వ్యాసుడు బ్రాహ్మణుడైనా తమకు వ్యతిరేఖవచనములున్న గీతను వ్రాసినందుకు

బ్రాహ్మణులు వ్యాసుని మీద కోపము కల్గియుండి, వ్యాసుడు చనిపోయిన తర్వాత గీతకు వ్యతిరేఖముగా వారికి

అనుకూలముగాయున్న శ్లోకములను గీతలో కలుపడము జరిగినది. ఈ మధ్యకాలములో వేదవ్యాస్ అను పేరుతో

వచ్చిన ఒక బ్రాహ్మణుడు తమ పెద్దలు చేసింది చాలదు అన్నట్లు, తాను ఇంకా 44 శ్లోకములను కలిపి గీతను విడుదల

చేయడము జరిగినది. నేడు సమాజములో భగవద్గీత ప్రచారము కాకపోవడానికీ, హిందూమతము క్షీణించిపోవడానికీ

ఇలా బ్రాహ్మణులే కారణము అంటే ఆశ్చర్యపోనవసరములేదు.


ప్రశ్న :- ఒక వ్యక్తి దైవజ్ఞానము తెలిసి, దానిని ఆచరించి యోగిగా మారి, యోగశక్తిని సంపాదించుకొన్నాడు. అతను

దేవుని జ్ఞానమును ప్రచారము చేయుటే పనిగా పెట్టుకొన్నాడు. దేవుని ధర్మముల ప్రకారము నడుచుకొను ఆ యోగిని

చూచి దయ్యములు, దేవతలు భయపడి ఆయన చెప్పినట్లు నడుచుకోవడము, వైదొలగిపోవడము జరిగెడిది. అంతేకాక

ఆయనవద్దకు వచ్చిన రోగియొక్క రోగములు కూడా లేకుండా పోయేటివి. ఏవైనా మొండి రోగములను ఆయన

పొమ్మని చెప్పితే పొయ్యేవి. అటువంటి గొప్పశక్తి గల వ్యక్తికి గుండెజబ్బు వచ్చింది. దానితో అంతవరకు ఆయనను

గొప్పగా అనుకొన్నవారు, తర్వాత ఆయన అంతగొప్పవాడు కాదులే అని అనుకొన్నారు. ఇతరుల రోగములను

నిస్వార్థముగా లేకుండా చేసిన ఆయన, ఎందుకు ఒక్కమారుగా శక్తిహీనుడయ్యాడనీ, ఆయనకు గుండెజబ్బు ఎందుకు

వచ్చిందని అడుగుచున్నారు. మీరు ఈ విషయమును ఏమని వివరిస్తారో తెలుసుకోవాలనివుంది.


జవాబు :- యోగి అయిన వానికి యోగశక్తి లభించడము వాస్తవమే. అటువంటి శక్తిగల యోగిని భూతములైన

రోగములు గౌరవించి యోగియున్న చోట గౌరవముగా లేకుండా పోవడము జరుగుచుండును. ఎప్పుడైనా ఏ రోగమైనా

యోగి చెప్పినట్లు విని, ఆయన మాటను గౌరవించి రోగినుండి దూరము పోవడము కూడా జరుగుచుండును. ఇవన్నీ

సత్యమైన విషయములే. ఇకపోతే అటువంటి గొప్పయోగికి గుండెజబ్బు ఎందుకు వచ్చిందనునదే సహజముగా ఎవరికీ

అర్థముకాని విషయమైవుంటుంది. దాని విషయములో మేము చెప్పు సమాధానము ఏమనగా! మనిషి కర్మను అనుసరించి

అతనిని బాధించు రోగములు భూమిమీద ఉండడము అందరికీ తెలిసిన విషయమే. ఆ రోగములు శరీరములలో

ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా వ్యాపించి మనిషిని బాధించునవిగా ఉన్నవి. ఒక రోగమునకు మరియొక రోగమునకు


ఎంతో తేడాయుండును. క్షయరోగము ఒక విధముగా బాధించితే, క్యాన్సర్ రోగము మరొక విధముగా బాధించును.

ఈ రెండు రోగములున్నట్లు ఎయిడ్స్ రోగముండదు. దాని లక్షణములన్ని వేరుగా ఉండును. ఈ విధముగా భూమిమీద

అనేక రోగములు, అనేక రకములుగా మనిషిని బాధించుచున్నవి.


రోగములు ఎన్నియున్నా అవి అన్నియు జీవముగల భూతములే. భూతములు అనగా జీవరాసులని అర్థముగానీ

దయ్యాలో, పిశాచాలో అని అనుకోవద్దండి. రోగము ఒక భూతముగాయున్నది. భూతమైన ప్రతి రోగము మనిషికంటే

ఎంతో తెలివైనవిగా ఉన్నవి. మనుషులు అజ్ఞానులుగా, జ్ఞానులుగా రెండు రకములుగాయున్నా భూతములైన రోగములు

మాత్రము అన్నియు దైవజ్ఞానముకలవిగాయున్నవి. అందువలన రోగములను జ్ఞానులుగా లెక్కించవచ్చును. దైవజ్ఞానముగల

రోగములు అజ్ఞానులను పీడించినట్లు నిజమైన జ్ఞానముగల వారిని పీడించవు. మనిషికి జ్ఞానము లేక ముందు

అజ్ఞానిగా ఉన్నప్పుడు రోగము వచ్చి అతనిని కర్మ రీత్యా బాధించుచుండినా, ఒకవేళ ఆ మనిషి జ్ఞానమును తెలియగలిగితే,

దేవుని మీద శ్రద్ధనూ జ్ఞానముమీద ఆసక్తిని పెంచుకోగలిగితే, అటువంటి వానిని తాను బాధించుట విరమించుకొని,

వానినుండి తొలగిపోవును. ఈ విషయమంతయు ఆశ్చర్యముగా ఉన్నా ఇదంతా అక్షరసత్యము. ఒక రోగము ఎన్నో

మందులు వాడినా నయము కాకున్న, ఈ కాలములో కూడా మందుల ప్రమేయము ఏమాత్రము లేకుండా ఎవరి

రోగమును వారు దైవజ్ఞానముతో తొలగించుకోవచ్చును. ఇదంతయు దగా, మోసము అనుటకు అవకాశమే లేదు.

ఎందుకనగా ఒకడు ఇంకొకనికి రోగమును పోగొట్టడములో మోసముండవచ్చును. అలాకాకుండా ఎవరి ప్రమేయము

లేకుండా ఎవరికివారు తమ రోగములను పోగొట్టుకోవడములో మోసమేమి గలదు?


జ్ఞానవిషయములలో ఎన్నో సలహాలు ఇస్తూ, జ్ఞానముయొక్క గొప్పతనమును తెలియజేస్తూ నిస్వార్థముగా

తనమీద రోగములకున్న గౌరవము చేత, ఇతరుల శరీరములోని రోగమునకు చెప్పి వైదొలగించిన సంఘటనలు పూర్వము

కూడా కొందరు చేసి చూపించారు. అలా చూపించడము యొక్క ఉద్దేశ్యము జ్ఞానమునకు ఇంత గౌరవమున్నదని

ఇతరులు తెలియుటకేనని అర్థము చేసుకోవలెను. ఒక వ్యక్తి ఒక యోగిగాయుంటూ, జ్ఞానమార్గములో ఇతరులకు

కల్గిన సంశయములకు జవాబిస్తూ, ఇతరుల రోగముల చేత కూడా గౌరవింపబడువాడు స్వయముగా రోగగ్రస్థుడు

కావడము జరుగదు. ఇతరుల వద్దయున్న రోగములే ఒక యోగికి గౌరవమిస్తూ, అతని సలహా మేరకు నడుచుకొన్నప్పుడు,

అటువంటి రోగములు ఎంతో తెలివిగలవై యుండి, ఎంతో జ్ఞానముకలవియైయుండి, యోగియొక్క విలువ తెలిసి,

అతని శరీరములోనికి పోయి అతనిని పీడించడము జరుగదు. తాము గౌరవించు వ్యక్తిని తామే ఇబ్బంది పెట్టవు.

అయితే అటువంటి శక్తిగల యోగికి గుండెజబ్బు వచ్చి అతను బాధపడడము జరుగుచున్నది కదా! అదెలా జరిగినదని

అందరికీ ప్రశ్న రావచ్చును. దానికి మా జవాబు ఏమనగా! శరీరమును బాధించునవి రోగములున్నవి మరియు శరీర

లోపములు ఉన్నవి. రోగముల విషయము తెలిసిపోయినది. రోగములు దైవజ్ఞానమును గౌరవించుననీ, యోగుల

విషయములో చాలా తెలివిగాయుండుననీ తెలుసుకొన్నాము. మనిషిని పీడించునవి శరీర రోగములే కాదు, శరీర

లోపములు కూడాయున్నవని అర్థమైనది. చాలామందికి శరీరములో రోగములేవో, లోపములేవో సరిగా తెలియదు.

రోగములు క్రిముల వలన కలుగునవని అర్థమగుచున్నది. అలాంటి వాటిలో కలరా, మశూచి, హెచ్.ఐ.వి. (ఎయిడ్స్),

క్షయ, మలేరియా, చికెన్గునియా మొదలగు చిన్నపెద్ద ఎన్నో రోగములు గలవు. అలాగే కణముల వలన కలుగు

క్యాన్సర్ కూడా రోగముల జాబితాలోనికి వచ్చును. ఈ విధముగా మనకు తెలిసినవి కొన్ని రోగములుండగా, తెలియని

రోగములు ఎన్నో గలవు. కొన్ని రోగములు క్రొత్తగా పుట్టుకొచ్చునవి కూడా ఉండును. రోగములకంటే భిన్నముగా

ఉండునవి శరీరలోపములు.



శరీర లోపములు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువయుండును. కొన్ని లోపములు అందరికీ సమానముగా

ఉండును. అటువంటి వాటిలో ముఖ్యముగా వృద్ధాప్యము, వెంట్రుకలు తెల్లబడుట, దంతములూడుట, కళ్ళు

కనిపించకుండాపోవుట, చెవులు వినిపించక పోవడము, చర్మము ముడుతలు పడుట, ఎముకలు అరిగిపోయి కీళ్ళ

బాధలువచ్చుట, గ్రంథుల పని తగ్గి దానివలన మధుమేహము (షుగర్) వచ్చుట, కిడ్నీలు మెత్తబడి పని చేయకపోవడమూ,

గుండెలో కవాటములు (గేట్లు) సరిగా లేకుండా పోవడము, రక్తనాళములు పూడిపోయి రక్తము గుండెకు సరిగా సరఫరా

కాకపోవడము మొదలగు ఎన్నో గలవు. రోగముల వలన శరీరములో బాధకలిగినట్లు, శరీర లోపము వలన కూడా

శరీరములో జీవుడు బాధ పొందవలసివచ్చును. ముఖ్యముగ గమనించవలసినదేమంటే లోపములు రోగములు కావు.

అలాగే రోగములు లోపములుకావు. అయినా చాలామంది తెలియని తనముతో శరీర లోపమును కూడా రోగముగా

భావించుకోవడము జరుగుచున్నది. ఉదాహరణకు ఆస్తమా (ఉబ్బసము లేక ఆయాసం) ఉన్నవారు దానిని కూడా

రోగముగా తలచి ఉబ్బసరోగము అని అంటున్నారు. ఇన్సులిన్ ఊట క్లోమరసగ్రంథిలో తగ్గిపోవడము వలన కలుగు

మధు మేహమును సుగర్వ్యాధి అంటున్నారు. అలాగే గుండెలోని కవాటములు బలహీనమైనా, రక్తనాళములు సరిగా

పనిచేయకపోయినా వచ్చు బాధను గుండెజబ్బు అంటున్నాము. వాస్తవానికి గుండె జబ్బు రోగము కాదు, ఆస్తమా

రోగము కాదు, సుగర్ వ్యాధి రోగము కాదు. ఈ మూడు శరీర లోపములే అయినా వాటిని కూడా రోగముల క్రిందికి

జమకట్టడము జరుగుచున్నది. మనిషికి తెలియక లోపమును రోగమనినా, లోపము రోగము కాదు. లోపములు

లోపములుగానే ఉండును. రోగములు రోగములుగానే ఉండును.


రోగములు జీవముతో కూడుకొన్నవి మరియు తెలివైనవి, దైవ జ్ఞానముకలవి అని చెప్పుకొన్నాము. అంతేకాక

యోగులను గౌరవించును అని కూడా చెప్పుకొన్నాము. దైవజ్ఞానము మీద శ్రద్ధగలిగి జ్ఞానమును సంపాదించుకొనునవని

కూడా చెప్పుకొన్నాము. శరీర లోపములు జీవము లేనివి. వాటికి రోగి అనిగానీ, యోగి అనిగానీ, జ్ఞాని అనిగానీ

ఏమాత్రము తేడావుండదు. శరీర లోపములు సహజముగా వచ్చునవి. అందువలన రోగములను శాసించి చెప్పు

యోగికి శరీర లోపమైనదేదైనా రావచ్చును. ఒక గొప్ప యోగికి గుండెనొప్పి రావడములో ఆశ్చర్యపడవలసినదేదియు

లేదు. యోగులకు శరీరలోపములలో ఏదైనా రావచ్చును. యోగులకు రోగముల మీద నియంత్రణ ఉండునుగానీ,

శరీర లోపముల మీద నియంత్రణ ఉండదు. అటువంటపుడు ఒక గొప్ప యోగికి గుండెజబ్బు వస్తే అతనిలో శక్తి

లోపించిందని అనుకోవడము పొరపాటగును. యోగి లోని యోగశక్తి రోగములను నియంత్రించవచ్చునుగానీ, లోపములను

నియంత్రించ లేదు. యోగి అయినవానికి శరీర లోపముల ఎడల మరియొక అవకాశము కలదు. అదేమనగా! శరీర

లోపములను శాసించలేని యోగి లోపముల వలన కల్గు బాధను అనుభవించకుండా తప్పించుకోగలడు. సాధారణ

వ్యక్తి శరీర లోపముతో నూరుశాతము బాధను అనుభవించవలసి యుండగా! యోగి అయినవాడు కేవలము ఇరవై

(20) శాతముగానీ అంతకంటే తక్కువగానీ అనుభవించి మిగతా దానిని అనుభవించకుండా బాధనివృత్తిని పొందగలడు.


యోగి శరీరములోనికి కర్మరీత్యా ఒక రోగము రావలసియుంటే అది యోగి యొక్క ఆత్మ అనుమతిని పొందివచ్చును.

యోగిలోని ఆత్మ అనుమతి లేకపోతే ఆ రోగము అతనిలో పూర్తిగా ప్రవేశించదు. ఆత్మ అనుమతిలేనిదే రోగము యోగి

శరీరములోనికి రాదు. ఒకవేళ పొరపాటుగా యోగి శరీరములోనికి రోగము ప్రవేశించినా, అది తాను ప్రవేశించినది

యోగియొక్క శరీరమని వెంటనే తెలియగలుగును. అలా తెలియగలిగిన రోగము యోగి శరీరమునుండి కొన్ని గంటల

వ్యవధిలోనే తనకు తానుగా బయటికిపోవును. ఈ విషయములన్నియు మేము ఊహించుకొని చెప్పునవి కావు. ఇవి


అన్నియు ప్రత్యక్ష అనుభవమైనవి మరియు శాస్త్రబద్ధమైన విషయములుగా ఉన్నవని తెలియవలెను. యోగి అయినవాడు

యోగశక్తి కలవాడైయుండుట వలన, రోగములు అతనిని అతనివద్దయున్న జ్ఞానమును, జ్ఞానశక్తిని గౌరవించి అతనివద్ద

నుండి తొలగిపోవడము జరుగును. అట్లుకాకుండా ఒక అజ్ఞానికి రోగమున్నా, అతను జ్ఞానమును తెలియుట వలన

మరియు యోగియొక్క ఆశీర్వాదము పొందుట వలన, రోగము అతనినుండి కూడా వదలిపోవును. ఇవన్నియు ప్రత్యక్ష

యదార్థసంఘటనలే. యోగి అయినవాడు శరీర లోపముల వలన బాధింపబడవచ్చునుగానీ, రోగముల వలన

బాధింపబడడు. యోగికి శరీర లోపము కల్గినప్పుడు దానిని ఆసరాగా తీసుకొని యోగివద్ద శక్తిలేదు అనీ, శక్తి

అంతయూ అయిపోయిందనీ అనుకోకూడదు. యోగి శక్తిని సంపాదించుకోవచ్చును గానీ, ఖర్చు చేయడము ఆయన

చేతిలో ఉండదు. అందువలన యోగివద్ద శక్తి అయిపోయిందనీ అనుకోకూడదు. శరీర లోపములు యోగులకుగానీ,

సామాన్య మనుషులకుగానీ, ఇద్దరికీ సమానముగా ఉండును. శరీర లోపమునుబట్టి యోగులను తక్కువగా లెక్కించకూడదు.

ఈ విషయమును ఇంతటితో ఆపి మరొక ప్రశ్నను చూస్తాము.


ప్రశ్న :- సైంటిఫిక్ విధానానికి యోగానికి సంబంధము లేదు. యోగమును మూఢనమ్మకము అనవచ్చును. యోగము

శాస్త్రమునకు సంబంధించినదని ఎవరూ చెప్పలేరు. శాస్త్రముకానిది మూఢనమ్మకముకాక ఏమగును? (యోగమును

గురించి నాస్తికులైనవారు నాస్తికయుగము అను పత్రికయందు మే 2001 సంచికలో ఇలా వ్రాశారు. "యోగమును

శాస్త్రీయమైనదని చెప్పేటంతవరకు కొందరు సాహసిస్తున్నారు. శాస్త్రీయపద్ధతికి యోగం ఎన్నడూ పరీక్షకు పెట్టలేదు.

సైంటిఫిక్ విధానానికీ యోగానికీ సంబంధము లేదు. యోగము కేవలము మూఢనమ్మకముగానే నాడు నేడు ప్రచారములో

యున్నది. ఆ విషయములో స్పష్టత అవసరము.)


మా జవాబు :- మూఢనమ్మకము అను పదమును ఉపయోగించినవారే మూఢనమ్మకముతో మాట్లాడుచున్నారని

అర్థమగుచున్నది. ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అలాగే ఒక విషయమును విమర్శించుటకు

కూడా శాస్త్రము అంతే అవసరమని మేము చాలామార్లు చెప్పుతూ వచ్చాము. శాస్త్రము యొక్క ఆధారము లేకుండా

యోగమును మూఢనమ్మకము అనడము, మూఢనమ్మకముగా చెప్పినట్లే అగును. యోగము అంటే అర్థము తెలియదు,

యోగము యొక్క విధానము తెలియదు. దాని ఆచరణ తెలియదు. దాని అనుభవమును ఎన్నడూ అనుభవించి

చూడలేదు. అటువంటివారు గ్రుడ్డిగా యోగమును గురించి ఎందుకు మాట్లాడాలి? నిన్న మొన్న కళ్ళు తెరచినవారు,

సైన్సు ఎప్పుడు పుట్టిందో తెలియనివారు, సైన్సులో ఓనమాలు తెలిసినంతమాత్రమున సైన్సు అంతా తెలుసు అనుకొని

మాట్లాడడము పొరపాటు. సముద్రమును దాటు కొంగను చూచి, అటు ఇటు ఎగురు కాకి హేళన చేసినట్లు యోగము

యొక్క సంపూర్ణతను తెలియనివారు యోగమును గురించి హేళనగా మాట్లాడడము వివేకముకాదు, అవివేకమగును.


ప్రపంచములో మొదట పుట్టిన విజ్ఞానము యోగము, సృష్ట్యాదిలో దేవుని చేతనే చెప్పబడిన మొట్టమొదటి

శాస్త్రము యోగమునకు సంబంధించిన బ్రహ్మవిద్యాశాస్త్రము. శాస్త్రమును సైన్సు అనియూ, విజ్ఞానమనియూ అనవచ్చును.

మొదట పుట్టిన సైన్సు తర్వాత, మిగతా సైన్సులు (శాస్త్రములు) బయటికి వచ్చాయి. అలా వచ్చిన ఐదు శాస్త్రములకంటే

ముందు పుట్టినది బ్రహ్మవిద్యాశాస్త్రము అనబడు యోగశాస్త్రము, అటువంటి యోగశాస్త్రమును సైన్సుకాదనీ

మూఢనమ్మకమనీ ఎలా చెప్పగలుగుచున్నారు. అడిగేవారు లేరనీ, మేము బాగా చదువుకొన్నామని ఇష్టమొచ్చినట్లు

మాట్లాడడముకంటే, మీకు తెలిసిన సైన్సు ద్వారా యోగము శాస్త్రముకాదని నిరూపించగలరా? ఒక మనిషి చనిపోయిన

తర్వాత వానిని భూమిలో పూడ్చిపెట్టిన నాలుగు రోజుల తర్వాత, శవమును బయటికి తీసి శవపరీక్షకు ఆసుపత్రికి


తీసుకపోయి, పరీక్ష మొదలు పెట్టి ఒకవేటు కొట్టగానే, శవముగా ఉన్నవాడు లేచి సజీవునిగా కూర్చుంటే వాడు ఎలా

బ్రతికాడో చెప్పలేని మీరు సైన్సు అను మాటను మాట్లాడనేకూడదు. ఒకచోట చనిపోయిన శవముమీది సొమ్మును

తీసుకొనుటకు పూడ్చిపెట్టిన శవమును బయటికి తీసిన దొంగలు శవము మీది ఉంగరాలను, గొలుసును తీసుకొంటున్నపుడు

శవము బ్రతికిన సంఘటనకు, అది ఎలా జరిగింది? చనిపోయి శవమై పూడ్చిపెట్టిన తర్వాత శవము ఎలా సజీవమై

లేచింది? అను ప్రశ్నలకు ఏమాత్రము జవాబు చెప్పలేనిది మీరు నేర్చుకొన్న భౌతిక సైన్సు! మీరు నేర్చుకొన్న సైన్సులో

లేని విజ్ఞానము యోగశాస్త్రములో ఉంది. యోగశాస్త్రములో చనిపోయిన వాడు తిరిగి బ్రతికిన దానికి వివరమును

ముందే చెప్పబడియుండగా, జవాబు చెప్పలేనివారిది సైన్సు అయినప్పుడు జవాబు చెప్పగలిగేది సైన్సు కాదా? వాస్తవానికి

ఒక సంఘటనకు వివరణ ఇవ్వలేనిది సైన్సుకానేకాదు. వివరణ ఇచ్చునదే అసలైన సైన్సు. ఆ లెక్క ప్రకారము

మరణించినవాడు తిరిగి ఎలా లేవగల్గునో ముందే ఆ వివరణ యోగశాస్త్రమునకు సంబంధించిన “మరణ రహస్యము”

అను గ్రంథములో చెప్పబడియున్నది. “మరణ రహస్యము” అను గ్రంథములో చెప్పినట్లు అనేక సంఘటనలు జరిగాయి.

వాటన్నిటికి సూత్రమైన వివరణ యోగశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములో వివరించిన

సూపర్ సైన్సు తెలిసినవారుండగా, సామాన్య సైన్సు తెలిసినవారు తెలిసీ తెలియక మాట్లాడితే అది తెలివితక్కువ

అగును.


మేము స్వయముగా హైదరాబాద్ నందు ఆంధ్రప్రదేశ్ నాస్తిక సంఘములో పేరుపొందిన కన్నయ్య అను వ్యక్తిని

కలిసి మాటల సందర్భములో శాస్త్రములు ఎన్ని అని ప్రశ్నించాను. అతను ముందు రెండు అని చెప్పి తర్వాత మూడు

అన్నాడు. ద్వాపర యుగము చివరిలోనే ఆరుశాస్త్రములు వ్రాయబడియుండగా, నేటికినీ వాటి సంఖ్య కూడా

తెలియనివారివద్ద ఎంతమటుకు శాస్త్రీయత ఉంటుందో ఊహించవచ్చును. కొన్నిచోట్ల సైన్సనీ, కొన్నిచోట్ల శాస్త్రమనీ

మాట్లాడు వారికి శాస్త్రములు ఎన్నో తెలియవు. సైన్సు ఎంతో తెలియదు. అటువంటి వీరు సైన్సు పేరును, శాస్త్రము

పేరును చెప్పుకొంటూ అడ్డము మాట్లాడడము తప్ప వారివద్ద విజ్ఞానము ఏమీ ఉండదు. ఇటువంటివారు ఎవరైనా

అభౌతికమును గానీ, అతీంద్రియశక్తులనుగానీ నిరూపిస్తే ఐదుకోట్లు ఇస్తామని దేవున్ని చూపిస్తే పదికోట్లు ఇస్తామని

ప్రకటనలను ఇచ్చి వారి పోటీకి ఎవ్వరూ పోకపోతే మేమే గెలిచాము, మాకు సర్వస్వము తెలుసు అంటుంటారు.

మెత్తగానున్న రాయిని చూపిస్తే ఎంతయినా ఇస్తానన్నట్లు వారి ప్రకటన వుందని వారికి తెలియదు. దేవుడుగానీ,

అభౌతికముగానీ ఇంద్రియశక్తులు గానీ కనిపించునవి కావు. కనిపించని వాటిని చూపించమంటే వారికి ఎవరు

చూపిస్తారు. వారు ఎలా చూడగలుగుతారు. ఆ ప్రకటనను చూస్తూనే అది తెలివితక్కువ ప్రకటన అని అర్థము

కాగలదు. అటువంటి ప్రకటనలను ఇచ్చి మాకు పోటీకి ఎవరూ రాలేరనీ, మా వాదనకు ఎవరూ నిలువలేరని ప్రగల్భాలు

పలుకువారికి మేము కూడా ప్రకటన ఇస్తున్నాము. గర్భములోనే శిశువు చనిపోయాడని డాక్టర్లు చెప్పిన తర్వాత

గంటకు, రెండు గంటలకు ప్రాణముతో కదలిన శిశువులు కలరు. దానికి సైంటిఫిక్ వివరణ ఇవ్వగలరా? అలాగే

చనిపోయాడని ఆసుపత్రిలో డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత, ఆ శవాన్ని తీసుకొని పోయి పూడ్చిపెట్టిన తర్వాత మూడు

రోజులకు శవాన్ని బయటికి తీస్తే, ఆ శవము తిరిగి ప్రాణముతో లేచిన సంఘటనలు గలవు. దానికి సైన్సు ప్రకారము

వివరణ ఇవ్వగలరా? మీరు సరియైన వివరణ ఇవ్వగలిగితే మేము కూడా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాము.

వేయి సంవత్సరములకు కూడా వివరణ ఇవ్వలేరు. దానికి వివరణ ఇవ్వాలంటే మొదటిదైన బ్రహ్మవిద్యాశాస్త్రము తెలిసి

యుండాలి. బ్రహ్మవిద్యాశాస్త్రము పూర్తిగా జ్ఞానులకే తెలియనప్పుడు విజ్ఞానులమని పేరు పెట్టుకొన్నవారికి ఎలా

తెలియగలదు?


యోగము అంటే కలయిక అని అర్థము. దేనికలయిక? దేనితో కలయిక? అను ప్రశ్నలకు జీవాత్మ కలయిక

అనియూ, జీవాత్మ ఆత్మతో కలయిక అని తెలియుచున్నది. మనిషిలో నేను అను భావముగలవాడే జీవాత్మకాగా,

శరీరములో అంతటా వ్యాపించి శరీరము లోపల అవయవ ములందును, శరీరము యొక్క బయటి అవయవములందును

ఆత్మ పని చేయుచున్నది. శరీరములో ఒకచోట ఒక బిందువుగా జీవాత్మ ఉండగా, ఆత్మ శరీరమంతటా వ్యాపించి అన్ని

పనులు చేయుచున్నది. ఏ పనినీ చేయని జీవాత్మ ఆత్మతో కలిసిపోవడమును యోగము అంటాము. యోగము

అనునది ఎన్నో ధర్మములతో కూడుకొన్నదై, యోగశక్తి అను ఫలితమును ఇచ్చునదైయుండగా, యోగమును

అశాస్త్రీయమనడము పూర్తి అజ్ఞాన మగును. ఆ మాట అనడమే అశాస్త్రీయము అని చెప్పవచ్చును. ప్రపంచములో

విజ్ఞానమును తెలియాలంటే కొన్ని సంవత్సరములు పట్టును. శరీరములో జరుగు యోగమును తెలియాలంటే జీవితకాలము

పట్టును. అలాంటప్పుడు ఏది పెద్దదో సులభముగా చెప్పవచ్చును. ఎన్నో సూత్రములతో కూడుకొన్నది, తెలియుటకే

ఎంతోకాలము పట్టునదియైన యోగమును అశాస్త్రము అనడము పూర్తి తప్పు. ఆరోగ్య ఆసనాలు యోగములు కాదు.

నిజమైన యోగము శాస్త్రమునకు సంబంధించియున్నది.


ప్రశ్న :- పూనకాలు ఎందుకు వస్తాయి? దేవతలు, దయ్యాలు మూఢ నమ్మకము కాదా?


జవాబు :- ఆ ప్రశ్నను అడగడము అందరికీ హక్కుగా ఉన్నది. దయ్యాలను దేవతలను గురించి ఏమాత్రము తెలియనివారు

కూడా ఈ ప్రశ్నను అడుగు చుందురు. దీనికి జవాబు చెప్పేవాడు ఎంత కష్టపడి చెప్పినా, వినేవాడు నేను నమ్మను

అనుమాటతో చెప్పిన వానిమాటను సులభముగా కొట్టివేయు చుండును. అనాదినుండి దయ్యములనూ, దేవతలనూ

నమ్మనివారు ఉన్నారు. అలాగే వాటిని గురించి చెప్పువారూ ఉన్నారు. దయ్యములను గురించి ముందు తెలుసుకొంటే,

తర్వాత దేవతలను గురించి అర్థమగును. జీవము గల మనిషిని రెండు భాగములుగా విభజించవచ్చును. మనిషి

స్థూలశరీరము, సూక్ష్మశరీరము అను రెండు రకముల శరీరములలో నివసిస్తున్నాడు. స్థూల శరీరము 10 భాగములు

ఉండగా, సూక్ష్మశరీరము జీవునితో సహా 15 భాగములుగా ఉన్నది. పది స్థూల భాగములు, పదిహేను సూక్ష్మ భాగములు

కలిసియున్నప్పుడు మనిషి సజీవముగా ఉండును. పది స్థూల భాగముల శరీరముపోయి పదిహేను భాగములు

మిగిలిపోయినప్పుడు వానిని అకాల మరణము చెందినట్లు చెప్పుచుందురు. అకాలమరణము పొందినవాడు కనిపించు

స్థూలశరీరములేక సూక్ష్మశరీరముతో ఉండును. అటువంటి సూక్ష్మశరీరముతో జీవించియున్నవానిని మనిషి అనకుండా,

వానిని దయ్యము అంటున్నాము. స్థూల శరీరములేనివాడు కనిపించడు కాబట్టి వానిని చనిపోయినట్లు లెక్కించి,

దయ్యముగా మారిపోయాడని చెప్పుచుందురు. పూర్తిగా చనిపోక అకాలమరణము అను సగము శరీరమునకు మరణము

పొంది, మిగతా సగము శరీరముతో కనిపించకయుండుట వలన, వానిని దయ్యము క్రిందికి జమకట్టి వానిని దయ్యమనియే

అందురు. అటువంటి వానిని దయ్యము అనినా వాడు మామూలు కనిపించని మనిషే.


గుడిలోని దేవతలు ప్రతిమలోయున్నంత వరకు స్థూలశరీరము కలిగియుందురు. ప్రతిమనుండి దేవత బయటికి

వచ్చినప్పుడు ఆ దేవత కూడా దయ్యమే అగును. సూక్ష్మశరీరమును (కనిపించని శరీరమును) ధరించిన దేవత కూడా

దయ్యమే అగును. ప్రతిమలోయున్నంతవరకు దేవత అయితే, ప్రతిమనుండి బయటికి వచ్చిన తర్వాత దయ్యమగును.

అలాగే మనిషి శరీరములో జీవుడు ఉన్నంత వరకు మనిషే అగును. శరీరమునుండి బయటికి వచ్చిన మనిషి దయ్యముగా

పిలువబడును. లెక్కప్రకారము మనిషిగానీ, దేవతగానీ స్థూలశరీరమును వదలిన తర్వాత దయ్యముగానే పిలువబడుదురు.

అప్పుడు దేవత దయ్యముగానీ, మనిషి దయ్యముగానీ రెండూ సమానమే అగును. దయ్యములుగానున్నవారు బ్రతికియున్న


ఇతరుల శరీరములలోనికి ప్రవేశించి మాట్లాడినప్పుడు, పూనకము వచ్చిందని అంటారు. సగము చచ్చిపోతే మనిషిగానీ,

దయ్యమే అగును. దయ్యముగా నున్న మనిషిగానీ, ప్రతిమనుండి బయటికి వచ్చిన దేవతా దయ్యముగానీ ఇతరుల

లోనికి చేరడమును పూనకము అంటున్నాము. ఈ విషయము తెలియనప్పుడు ఎవరికైనా ఇది మూఢనమ్మకముగా

కనిపించును. పూర్తి తెలియ గలిగితే యదార్థసత్యమని తెలియును. మనిషిగానీ, దేవతగానీ భౌతికముగా కొంత

అభౌతికముగా కొంత ఉన్నదని తెలియగలిగినప్పుడు పూనకములు, దయ్యములు అసత్యము కాదని తెలియును. అంతవరకు

ఎవరికైనా ఈ విషయము మూఢనమ్మకముగానే కనిపించుచుండును.


ప్రశ్న :- పునర్జన్మలు అనుమాట వాస్తవమా? కర్మప్రకారము పునర్జన్మలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అలాగైతే

ఏది మంచి, ఏది చెడు అనేది ఎక్కడ ఎవరు నమోదు చేస్తారు? దానినిబట్టి ఫలితము నిర్ణయించే తీరు ఎలా

ఉంటుంది? నిర్ణయాలు ఎవరు తీసుకొన్నా వాటిని అమలు పరిచేదెలా? అంటే లోగడ చేసిన పనులకు వచ్చే జన్మలో

ఫలానా మనిషిగా పుట్టాలని నిర్ణయిస్తే, అదెలా అమలు జరుగుతుంది? భూకంపములో వేలాది మంది చనిపోవడము

కర్మవలనా? టెర్రరిస్టులు కొందరిని చంపడము కర్మ సిద్ధాంతమా? కర్మను వెనుకేసుకొచ్చే మీలాంటివారు వీటికి సమాధానము

చెప్పగలరా?


పునర్జన్మలు కర్మప్రకారము వస్తాయని కొందరు నమ్మినా, ఉత్త రోత్తరా జన్మలకు తగిన దేహాలను ఎలా

వెలికితెస్తారో చెప్పలేకపోతున్నారు. మూకుమ్మడి హత్యలు, భూకంపాలు న్యాయంగా కర్మప్రకారము సంభవించాయని

చెప్పగలరా? అలాగైతే కోట్లాది యూదులను నాజీలు హతమార్చడము కర్మప్రకారము న్యాయమంటారా?


మా జవాబు :- కర్మలను ఎవరు నమోదు చేస్తున్నారు? ఎవరు అమలు పరుస్తున్నారు? ఎవరు ఫలితమును నిర్ణయిస్తున్నారు?

అను ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? అని అడిగిన దానికి మాకు ఒక్కమారు నవ్వు వచ్చినది. ఈ ప్రశ్నలకు ఎన్నోమార్లు

జవాబు చెప్పిన మాకు ఏమీ తెలియని పసిపిల్లవాడు మా ముందరకు వచ్చి అమాయకముగా అడిగినట్లుంది. వారు

అడిగిన ప్రశ్నలకు, అడగని ప్రశ్నలకు మావద్ద జవాబులు సంసిద్ధముగా ఉన్నాయి. కర్మ వెనుక జరిగే తతంగమంతా

మాకు సులభముగా తెలుసు. ఆ విషయము వారికి తెలియక దీనికి జవాబు చెప్పలేరను భావముతో ప్రశ్నలడగడము

మాకు వింతగా, అమాయకముగా కనిపించినది. ఇప్పుడు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు వరుసగా జవాబును చెప్పెదను

చూడండి. మొదటి ప్రశ్న కర్మను ఎవరు నమోదు చేస్తారు? దానికి జవాబు ఏమనగా! ఎవరి శరీరములోని కర్మను వాని

శరీరములోనున్న ఆత్మయే నమోదు చేస్తుంది అని చెప్పవచ్చును. ఎవరు అమలు పరుస్తారు? అను ప్రశ్నకు జవాబుగా

శరీరములో అణువణువునా వ్యాపించి, శరీరమునకు అధిపతిగాయున్న ఆత్మయే కర్మను జీవుడు అనుభవించునట్లు

శరీరములో అమలుపరుస్తాడు అని చెప్పవచ్చును. సజీవమైన శరీరములోని ఆత్మయొక్క పాత్ర ఏమిటి? అని తెలియకపోతే

ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకదు. శరీరములో ఆత్మ అన్ని పనులూ చేయుచూ శరీరమునకు అధిపతియై ఉన్నదని

తెలియక పోతే ప్రయోజనముండదు, జవాబులు దొరకవు.


పునర్జన్మలున్నాయా అను ప్రశ్నకు జవాబుగా పునర్జన్మలు మనుషు లకే కాదు జంతువులకు, పక్షులకు, సకల

జీవరాసులకు ఉన్నాయని చెప్పుచున్నాము. శరీరములో నమోదైన కర్మప్రకారము పునర్జన్మలుంటాయి. అయితే కర్మను

నమోదు చేయువాడు శరీరములోని ఆత్మయే. ఆత్మ శరీరములోని తలయందుగల, నాలుగుచక్రముల సముదాయములో,

క్రింది నుండి రెండవ చక్రమైన కర్మచక్రములో, జీవుని కర్మను నమోదు చేసి ఉంచుతున్నది. జరుగుచున్న జన్మలోని


కర్మను నమోదు చేయునది ఆత్మయని తెలిసింది కదా! జరుగుచున్న జన్మలోని పాపపుణ్యములను ఆత్మ నమోదు చేసి,

నమోదు చేసిన కర్మకు ఆగామికర్మ అను పేరుపెట్టి, కర్మచక్రములో నిలువచేయును. అలా నిలువ చేసిన కర్మ మరణములో

సంచితకర్మ అను పేరుగల కర్మకూడలిలో కలిసిపోవును. అనేక జన్మల నుండి కర్మనిధిగా ఉన్నదానిని సంచితకర్మ

అంటున్నాము. ఆగామికర్మ సంచితకర్మలో కలిసి పోయిన తర్వాత మరణించిన వెంటనే కలుగు జన్మ కొరకు సంచితకర్మ

అను మిశ్రమమునుండి ప్రారబ్ధకర్మ అనునది బయటికి తీయబడును. మనిషి మరణమును పొందిన తర్వాత సెకండులోనే

(మరుక్షణములోనే) ఆగామి సంచితములో కలిసిపోవడము, సంచితమునుండి ప్రారబ్ధము బయటికి రావడము

జరుగుచున్నది. చాలావేగవంతముగా జరుగు ఈ కార్యము ఎవరి ఊహకు కూడా అందకుండా జరుగుచున్నది.

జీవునికి మరణము జననము రెండూ క్షణకాలములో జరిగిపోవుచున్నవి. చనిపోయినవాడు లంకలో చనిపోయినా,

వాడు అమెరికాలో పుట్టవలసియున్నా, మరుక్షణము లోనే అమెరికాలో జన్మకలుగును. ఎంతదూరములోనున్న జన్మయినా,

క్షణములో ఏమాత్రము ఆలస్యము లేకుండా జరిగిపోవును. ఆ విధమైన అమరిక కర్మ విధానములో కలదు. ఇది ఒక

మనుషులకే కాదు. సమస్త జీవరాసులకు ఒకే విధముగా జరుగుచుండును.


ప్రస్తుత జన్మలో అనగా జరుగుచున్న జన్మలో వచ్చు క్రొత్త కర్మను ఆగామికర్మ అంటున్నాము. అలాగే జరుగుచున్న

జన్మలో అనుభవించు కర్మను ప్రారబ్ధకర్మ అంటున్నాము. పుట్టినప్పటినుండి చనిపోవువరకు ఏ కర్మయితే అనుభవించుటకు

నిర్ణయింపబడియున్నదో, దానికి ప్రారబ్ధకర్మ అని పేరు పెట్టాము. పుట్టినప్పటినుండి చనిపోవువరకు సంపాదించబడే

కర్మ ఏదైతే ఉందో, దానిని ఆగామికకర్మ అంటున్నాము. ఇకపోతే మధ్యలో సంచితకర్మనునది ఎందుకున్నది? దాని

అవసరమేమి? అని అడుగవచ్చును. దానిని వివరముగా చెప్పుకొంటే ఇలా కలదు. ఉదాహరణతో వివరించుకొందాము.

ఒక దినము ఉదయమే ఆరుగంటలకు బయటకుపోయి పాల ప్యాకెట్లు తెచ్చి పెట్టాము. తర్వాత ఎనిమిది గంటలకు

కాయకూరల మార్కెట్టుకుపోయి నాలుగు రకముల కూరగాయలను తెచ్చామనుకోండి. తర్వాత తొమ్మిది గంటలకు

కిరాణాషాప్కు పోయి పప్పు దినుసులు, బియ్యము, నూనె తెచ్చామనుకోండి. ఈ విధముగా వివిధ సమయములలో

వివిధ స్థలములో తెచ్చిన ఆహార పదార్థములన్నిటినీ కలిపి మధ్యాహ్నము 12 గంటలప్పుడు బియ్యమును వండి అన్నము

చేయడము, కాయకూరలను మిగతా ఉప్పు, కారము, మసాలాలు అన్నిటిని కలిపి సాంబారు చేయడము జరిగినది.

వంటవాడు యజమాని తెచ్చిన వాటినే వంటకు వినియోగించి మూడు పూటలా భోజనమునకు పెట్టడము జరిగినది.

అలా వంట చేయడము వలన ఉదయము తెచ్చిన పాలు, ఎనిమిది గంటలప్పుడు తెచ్చిన కాయకూరలు, పది గంటలప్పుడు

తెచ్చిన కిరాణా సరుకులు అన్నీ వంటలో కలిసిపోయి భోజనములో వినియోగింపబడ్డాయి. ఒకమారు చేసిన వంట

దినమంతటికి సరిపోయినది. వేరువేరు సమయములలో, వేరువేరు స్థలములలో తెచ్చిన సామగ్రి తర్వాత తినుటకు

ఎట్లు సాంబారుగా భోజనముగా మార్చబడి వినియోగపడినదో, అలాగే ప్రస్తుత జన్మలో సంపాదించబడిన ఆగామికర్మ,

మరణ సమయములో సంచితకర్మగా మారిపోయి, ప్రారబ్ధకర్మగా బయటికి వస్తున్నది. పోయిన జన్మలో అప్పుడప్పుడు

అనేక సమయములలో సంపాదించుకొన్న ఆగామికర్మ మరణములో కలిసిపోయి సంచితకర్మగా మారిపోయి,

సంచితమునుండి ఒక జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మ బయటికి వస్తున్నది. సంచితము నుండి ఒకే జన్మలో

అయిపోవు కర్మరావచ్చును లేక కొంత సంచితములోనే మిగిలి పోవచ్చును. అలా మిగిలిన దానిని వంట అంటాముగానీ,

భోజనము అనము. ముందు రోజు తెచ్చుకొన్న సామగ్రితో రెండవ రోజు వంట చేసుకొని తింటున్నాము.


అలాగే ముందు జరిగిన జన్మలో వేరువేరు సమయములలో, వేరు వేరు స్థలములలో, కొన్న సరుకులను

ఉదయమే వంటలో వినియోగించి, రెండవ రోజు ఆహారముగా తీసుకొన్నట్లు, ముందు జరిగిన జన్మలో, అనేక

సమయములలో అనేక స్థలములలో, సంపాదించుకొన్న ఆగామికర్మ మరణములో సంచితములో కలిసిపోయి,

సంచితమునుండి ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మ నిర్ణయింపబడి బయటికి వస్తున్నది. పోయిన జన్మ

ఆగామికర్మ జన్మ ప్రారంభములోనే (మరణములోనే) సంచితకర్మగా మారిపోయి ఆగామి అను పేరులేకుండా పోవుచున్నది.

సంచిత కర్మనుండి ప్రారబ్ధకర్మ తయారై (నిర్ణయింపబడి) బయటికి వచ్చుచున్నది. అలా తయారై వచ్చిన ప్రారబ్ధకర్మను,

మనిషి తర్వాత జన్మంతయు అనుభవించుచున్నాడు. దీని ప్రకారము చూస్తే ఆగామి కర్మలేనిది, సంచితకర్మలేదు.

సంచితకర్మ లేనిది ప్రారబ్ధ కర్మలేదు. ప్రారబ్ధమును అనుభవిస్తుండగనే తిరిగి అగామికర్మ తయారగుచున్నది. కనుక

ప్రారబ్ధములేనిది ఆగామికర్మనునది లేదని చెప్పవచ్చును. ఇట్లు కర్మలు ఒకదానితో ఒకటి సంబంధపడియున్నవని

తెలియుచున్నది.


కర్మవిధానము బాగా అర్థమగుటకు మరియు జ్ఞాపకముండుటకు ఈ విధముగా వ్రాసియుంచుకోవచ్చును.

కర్మ మూడు పేర్లలో ఉన్నది. కావున మూడు భాగములుగా వ్రాసుకోవచ్చును. ఇంతవరకు చెప్పుకొన్న ఉపమానమును

కర్మలకు జోడించి వ్రాసుకొంటున్నాము.


1)తెచ్చిన సరుకులు -ఆగామి కర్మ

2)వండిన వంట - సంచిత కర్మ

3)తినే తిండి - ప్రారబ్ధ కర్మ

1) ఆగామి కర్మ - జీవాత్మ ఇష్టముగా తెచ్చుకొన్న సరుకులు అను కర్మలు.

2)సంచిత కర్మ - ఆత్మ పనిమనిషిగా సరుకులను కలిపి చేసిన వంట అను కర్మలు.

3)ప్రారబ్ధ కర్మ - జీవుడు కష్టముగా, సుఖముగా తినుచున్న ఆహారమను కర్మ.


పట్టికను  చిత్రమును 125 పేజీ లో చూడండి. 

కర్మసిద్ధాంతము బ్రహ్మవిద్యాశాస్త్రములో ఒక సూత్రముగా ఉన్నది. కర్మ సిద్ధాంతము ప్రకారము సంపాదించు

కొనువాడు, అనుభవించు వాడు ఒక్కడే, వాడే జీవాత్మ. జీవాత్మ కర్మలను అనుభవించుటకు కావలసిన కార్యములన్నిటినీ

చేయునది ఆత్మయే. శరీరములో ఆత్మ అన్ని కార్యములను చేయగా వచ్చిన ఫలితమును జీవాత్మ అనుభవించుచున్నది.

ఈ విధానము నంతటిని కర్మసిద్ధాంతము అంటున్నాము. పై ప్రశ్నలో కర్మను వ్రాసిపెట్టు వాడు, తిరిగి అనుభవింపజేయు

వాడు ఎవడు? అనేదానికి జవాబుగా ఆత్మ అని తెలిసిపోయినది. ఏ కర్మ ఎలా అనుభవానికి వస్తున్నదనుటకు ఒక

ఉదాహరణను కూడా చెప్పుకొన్నాము. చేసిన పనిలో ఎంత కర్మ వచ్చినది ఎవరికీ తెలియదు. అలాగే వచ్చిన కర్మ ఏ

అనుభవానికి కారణమైనదని కూడా ఎవరికీ తెలియదు. ఫలానా కర్మ లేక ఫలానా పాపము, ఫలానా అనుభవమునకు

కారణమైనదని చెప్పుటకు వీలులేదు. ఎందుకనగా సంపాదించుకొన్న కర్మ అలాగే ఎట్లున్నదట్లే అనుభవమునకు

రాలేదు. అది సంచితముగా మారి అనుభవానికి రావలసియుంది. సంచితముగా మారినప్పుడు కర్మలన్నీ కలిసిపోయి,

మార్పుచెంది ప్రారబ్ధమను పేరుతో అనుభవానికి వస్తున్నది. అందువలన ఫలానా ఆగామి, ఫలానా ప్రారబ్ధముగా

వచ్చినదని చెప్పలేము.


సంపాదించేది ఆగామికర్మ, అనుభవించేది ప్రారబ్ధకర్మ అయినప్పుడు, సంపాదించుకొన్న కర్మనే నేరుగా

ప్రారబ్ధముగా అనుభవించ వచ్చును కదా! ఎవరు చేసుకొన్నది వారు అనుభవించాలన్నప్పుడు, ఎవరు ఎంత చేసుకొంటే

అంత అనుభవించాలన్నప్పుడు, ముందు చేసుకొన్న ఆగామిని ఇప్పుడు ప్రారబ్ధముగా ఎందుకు అనుభవించకూడదు?

మధ్యలో సంచితకర్మ అనునది ఎందుకు వచ్చినది? అను ప్రశ్న కొందరికిరావచ్చును. దానికి మా జవాబు ఇట్లున్నది.

ఈ ప్రశ్న మీకే కాదు, మాకు కూడా వచ్చినది. జవాబుకొరకు మేము కొంతకాలము వేచి చూడవలసివచ్చినది. తర్వాత

దానికి జవాబు తెలిసింది. సంపాదించుకొన్న ఆగామికర్మ నేరుగా అనుభవించు ప్రారబ్ధముగా మారిపోతే, మనిషి

జీవితము అంతా గందర గోళము అయిపోవును. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనునవి ఉండవు.


జననము మరణములుండి జన్మలు మారినా వరుస క్రమములేని జీవితమగును. యవ్వనములో జరుగవలసినవి

బాల్యములో గానీ, వృద్ధాప్యములోగానీ జరుగును. వృద్ధాప్యములో జరుగవలసిన కార్యములు యవ్వనములో జరుగవచ్చును.

శిశుదశలోనే యవ్వన కార్యములు జరుగును. దానిని గురించి చెప్పితే మనిషి జీవితమే మారి పోతుంది, మనుషులకు

మనుషులకు మధ్య సమన్వయము ఏర్పడదు. సుఖము అనుభవించేలోపల దుఃఖమువచ్చి సుఖమును మధ్యలో ఆపి

కార్యము పూర్తి కాకుండా చేయును. ఇంతవరకు మానవ సమాజము అనుభవించని ఇబ్బందులన్నీ వచ్చును. పుట్టినప్పుడు

శరీరము శిశువుదైనా ఆగామికర్మ ప్రకారము ప్రారబ్ధము వస్తే శిశువు కూడా యవ్వనములోనున్న భార్య కావలెనని

అడుగును. అడగడమే కాదు, వానికర్మ అలా వరుసకు వచ్చినది, కావున శిశువు యవ్వనములోనున్న యువతి

పొందును అనుభవించును. కర్మల వరుస క్రమము అయిన దానివలన, ఎప్పుడూ కనని విననివన్నీ జీవితములో

జరుగును. వీటన్నిటినీ దేవుడు దృష్టిలో పెట్టుకొని, మనిషి చావుపుట్టుకలకు తగినట్లు, బాల్య, యవ్వన, కౌమార,

వృద్ధాప్య దశలకు తగినట్లు, కర్మలను మిశ్రమము చేసి ప్రారబ్ధమగునట్లు చేయుచున్నాడు. అలా చేయడము వలన

శరీర దశలకు తగినట్లు కర్మలు పొందింపబడియున్నవి.


బజారులో తెచ్చుకొన్నవాటిని వంట చేసుకోకుండా పచ్చివి పచ్చిగా, ఎండినవి గట్టిగా వాడితే ఎలా శరీరములో

సరిపోదో, అలాగే జీవితములో కూడా వచ్చిన కర్మలను వచ్చినట్లే, ఉన్న కర్మలను ఉన్నట్లే వాడితే జీవితములో సరిపోదు.

మార్కెట్టులో మాంసమును తెచ్చుకొన్న తర్వాత మసాలాలను తెచ్చుకొన్నాననీ, తెచ్చుకొన్న వాటిని తెచ్చుకొన్నట్లు వాడుతాననీ,

ముందు మాంసమును తిని, తర్వాత మసాలాలను తింటే శరీరము జీర్ణించుకోలేదు. పచ్చిమాంసమును తెచ్చుకొన్నానని,

పచ్చి మాంసమును తింటే అది జీర్ణము కాక కడుపునొప్పి వచ్చును. తెచ్చుకొన్న మాంసమునకు మసాలాలకు కలిపి

వండడము ఎంత అవసరమో, అలాగే తెచ్చుకొన్న పాపపుణ్యములకు సంచితమను మిశ్రమము అంతే అవసరమగును.

అనేక పండ్లను కలిపి రసము తీయుటకు మిక్సీ ఎంత అవసరమో, అనేక సరుకులను కలిపి పక్వము చేయు వంట

ఎంత అవసరమో, అలాగే అనేక కర్మలను కలిపి సమన్వయము చేసి, జీవితమునకు సరిపడు విధముగా చేయు సంచిత

ప్రక్రియ అంతే అవసరమగును. సంచితము అనునది మనిషికి అంటుకొను ప్రత్యేకమైన కర్మకాదు. మనము చేసుకొన్న

కర్మలను కలిపి అనుభవించు టకు తగిన పాకముగా లేక పరిపక్వముగా చేయు ప్రత్యేకమైన పనిని సంచితకర్మ అని

అంటున్నాము. ఆగామికకర్మ సంచితములో పడి ప్రారబ్ధముగా మారిన తర్వాత, పోయిన జన్మలో చేసుకొన్న పాపము

ప్రస్తుత జన్మలో ఏ రూపములో కష్టముగా లేక బాధగా వచ్చునో చెప్పలేము. అట్లే పోయిన జన్మలో చేసుకొన్న పుణ్యము,

ప్రస్తుత జన్మలో ఏ విధమైన సుఖముగా లేక సంతోషముగా అనుభవానికి వచ్చునో చెప్పలేము.


పోయిన జన్మ ఆగామికకర్మ ఈ జన్మలో ఏ ప్రారబ్ధమైనదో చెప్పుటకు సాధ్యముకాకున్నా, కొన్ని కర్మలను

మాత్రము గుర్తించవచ్చును. అలా గుర్తించడము కూడా అరుదుగా జరుగును. పోయిన జన్మలో చేసుకొన్న కొన్ని

పాపములను మాత్రము ప్రస్తుత జన్మలో, ఫలానా కష్టములుగా వస్తున్న వని గుర్తుపట్టుటకు అవకాశమున్నది. అలా

గుర్తు పట్టడము వలన, ఫలానా పాపము వలన ఫలానా శిక్ష అమలు జరుగుచున్నదని తెలియడము వలన, మనము

చేసుకొన్నది తప్పనిసరిగా మనమే అనుభవించవలెనను కర్మసిద్ధాంతము మనిషికి కొంతవరకు అర్థము కాగలదు.

అందువలన కొన్నిటిని మాత్రము గుర్తించు అవకాశము దేవుడు కల్పించాడు. మనము బజారులో తెచ్చుకొన్న అనేక

రకముల సరుకులను కలిపి వంట చేసినప్పుడు, సాంబారులో వేసిన పప్పుదినుసులు, కాయకూరలు, ఉప్పు, కారము,

చింత పండు మొదలగు వాటిని బాగా ఉడికించినప్పుడు వాటి రూపము, పేరు, రుచి మారిపోయి గుర్తుపట్టుటకు


వీలులేకుండా పోవును. దానిలో ఇది కారము, ఇది ఉప్పు అని ప్రత్యేకముగా చూపలేము. అయితే అందులో వేసిన

ఒకటి, రెండు కాయకూరలు ఎక్కడైనా గుర్తు పట్టునట్లు పూర్తి ఉడకకుండ ఉండును. అలాగే ప్రత్యేకించి కొన్ని పాపములు

సంచితమునుండి వచ్చినా, కొద్దిగా గుర్తుపట్టునట్లుండును. అటువంటివాటిలో జ్ఞానులను అవమానపరచి మాట్లాడిన

పాపము తప్పనిసరిగా రాచపుండుగా (క్యాన్సర్గా) వచ్చి బాధించుచున్నది.


నేరము చేయని వానిని ఉద్దేశ్యపూర్వకముగా నేరస్థునిగా చిత్రించిన వాడుగానీ, యోగశక్తి గల జ్ఞానులను

అవమానముగా మాట్లాడిన వాడుగానీ చేసుకొన్న పాపము రాచపుండు (క్యాన్సర్) రోగముగా అమలు జరిగి అనుభవానికి

వస్తున్నది. నేడు ఎక్కడైనా క్యాన్సర్ రోగి కనిపిస్తే గతజన్మలో అతను, నేరము చేయనివానిని నేరస్థునిగా చిత్రించినవాడైనా

ఉండాలి. లేకపోతే యోగినిగానీ, జ్ఞానినిగానీ అజ్ఞానిగా చిత్రించి మాట్లాడియుండాలి. అటువంటి వానికే ఆ రోగము

వస్తున్నట్లు కొన్ని అనుభవముల ద్వారా అర్థమైనది. ఏ కర్మకు ఏ ఫలితము అనునది కర్మ రహస్యము, ఎవరికీ తెలియని

విషయము. అయినా దేవుడు ఇది సత్యమని నిరూపణకు వచ్చుటకు ఎక్కడైనా కొన్ని ఫలితములకు కారణము ఏమైనది

తెలియునట్లు చేశాడు. ఆ విధానములో ఒక రోగము మాత్రము ఎలా వస్తున్నదో దానికి కారణమైన కర్మ ఏదో

తెలుసుకోగలిగాము. మిగతా కొన్నిటిని కూడా తెలియవచ్చును గానీ, మాకు తెలిసినది, మా నిర్ధారణకు వచ్చినది ఒక

క్యాన్సర్ రోగము మాత్రమే.


ఆగామికర్మ, ప్రారబ్ధకర్మ మధ్యలో సంచితమున్నదనీ, ఆగామి ప్రారబ్ధముగా మారాలంటే, సంచితముగా తయారైన

తర్వాత ప్రారబ్ధముగా వచ్చునని తెలియడమే, కర్మ విధానములో అతి పెద్ద రహస్యము దేవుడు మనకు తన జ్ఞానమును

భగవద్గీత, బైబిలు, ఖురాన్ రూపములలో అందించియున్నాడు. ఈ మూడు మూలగ్రంథములలో లేని అనేక విషయములు

ప్రస్తుత కాలములో మనకు తెలియబడినాయి. దేవుడు ముందే తన మూడు గ్రంథములలోని ఒక గ్రంథములో “నేను

మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవు.” అన్నాడు. అందువలన అప్పుడు చెప్పని విషయములనూ,

మూడు గ్రంథములలో లేని విషయము లనూ, ఇప్పుడు తెలుపుచున్నాడని నేను అనుకొంటున్నాను. ఒక కర్మ విషయములోనే

కాకుండా, జన్మ విషయములోనూ, మరణ విషయములోనూ ఇంతవరకు ఎక్కడా ఏ గ్రంథమునందుగానీ, చెప్పని

విషయములు తెలియ బడినాయని అనుకొంటున్నాను. ముఖ్యముగా జీవునిగా మరియు దేవునిగా నటించు ఆత్మను

తెలుసుకోలిగాము. ఆత్మ ఎక్కడా తెలియబడకుండా, అన్నీ తానై చేయుచున్నా, అది ఏమిటో ఎవరికీ తెలియదు.

అటువంటి ఆత్మయే తెలియబడినప్పుడు, దేవుడు తన గ్రంథములలో నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు

కలవు అన్నాడు కదా! ఆ సంగతులలో కొన్ని మాత్రమైనా తెలిసాయి, ఇంకనూ తెలియవలసినవి ఉన్నాయని

అనుకొంటున్నాను.


ఆగామికర్మ ప్రారబ్ధముగా మారుటకు మధ్యలో జరుగు తతంగమే సంచితకర్మ అని తెలిసిపోయినది. ప్రారబ్ధము

తయారైనది అంటే మళ్ళీ జన్మ ఉన్నట్లే, మళ్ళీ జన్మ ఉందంటే క్రొత్త ఆగామి ఉన్నట్లే, ఆగామి ఉందంటే అది మరణములో

సంచితమై జన్మలో ప్రారబ్ధమై పోవుచున్నది. ఆగామి ప్రారబ్ధముగా మారుటకు సంచితములో ఒక్క సెకను కాలము

పట్టునని తెలిసిపోయినది. ఈ కర్మ విధానమును గమనించిన తర్వాత చనిపోయిన వానికి పునర్జన్మలేదని చెప్పుటకు

వీలులేదు. మరణించిన వాడు తప్పక తర్వాత సెకండులోనే జన్మను తీసుకొనును. మరణించిన క్షణములోనే రెండవ

జన్మ పొందుచున్న మనిషి (జీవుడు) స్వర్గమునకు, నరకమునకు ఎప్పుడు పోవునని కొందరడుగవచ్చును. దానికి మా

జవాబు ఏమనగా! మరణించినవాడు స్వర్గానికీ పోతాడు, నరకానికీ పోతాడు, అక్కడ స్వర్గములో ఆడవారితో నాట్యమూ


చేస్తాడు. తర్వాత నరకములో తన్నులూ తింటాడు అనుట, కాకమ్మ గువ్వమ్మ కథలులాంటివి. దేవుడు తన గ్రంథములలో

ఎక్కడా అలా చెప్పలేదు. మూడు గ్రంథములలోనూ స్వర్గ, నరకములను చెప్పడము జరిగింది. అయితే మనుషులకు

దేవుడు చెప్పినది అర్థముకాక, స్వర్గనరకములను తమ ఇష్టమొచ్చినట్లు ఊహించు కొన్నారు. అందువలననే మనుషులు

చెప్పు స్వర్గ నరకములను కాకమ్మ, గువ్వమ్మ కథలుగా పోల్చాను. వాస్తవానికి కర్మవిధానము తెలిస్తే జన్మవిధానము

తెలుస్తుంది. జన్మ విధానము తెలిస్తే జన్మలోనున్న స్వర్గ, నరకములు తెలుస్తాయి. జన్మ, కర్మ విధానములు అర్థము

కాకపోతే పైన స్వర్గము, క్రింద నరకమున్నట్లు తెలియును. అటువంటివానికి జన్మ కర్మ రెండూ తెలియనప్పుడు స్వర్గ

నరకములు కూడా తెలియవనియే చెప్ప వచ్చును. ఇంతటితో ఈ విషయమును ఆపి తర్వాత ప్రశ్నలో ఏముందో

చూస్తాము.


ప్రశ్న :- హేతువాదానికి మతానికి సరిపోతుందా?


జవాబు :- నేడు హేతువాదము నాస్తికవాదము అను ముసుగులోనికి వెళ్ళిపోయినది. అయినా అక్కడక్కడ నిజమైన

హేతువాదము ఉండనే ఉన్నది. హేతువాదము అనునది మనిషిలో చిన్నప్పుడే మొదలవుతుంది. చిన్న వయస్సులోనే

చిన్న చిన్న ప్రశ్నలతో మొదలైనది హేతువాదమని అప్పుడు తెలియకపోయినా, పెద్దయిన తర్వాత కొంతకాలమునకైనా

తెలియ గలదు. నా అనుభవములోయున్న ఒక విషయమును చెప్పుతాను వినండి. బహుశా నా వయస్సు పది లేక

పదకొండు సంవత్సరములుండవచ్చును. అప్పుడు మా అమ్మ నాన్నయిన తాతగారివెంట సాయంకాలము గుడికి వెళ్ళి

అక్కడ కొంతసేపు కూర్చొనేవాళ్ళము. మేము పోయిన గుడి చాలా పెద్దది, చాలా పురాతనమైనది. 'పామిడి' అను

ఊరులో పెన్నానది ఒడ్డున ఆ దేవాలయము ఉన్నది. ప్రతి దినము ఆ దేవాలయమునకు పోయెడి వారము. అది ఏ

దేవాలయమో నాకు జ్ఞాపకము లేదు. కానీ పెద్ద దేవాలయము అనిమాత్రము గుర్తుంది. మా తాతగారు ఆధ్యాత్మిక

చింతన కలవాడు. ఉదయము సాయంకాలము అరగంటసేపు జపమాల త్రిప్పుచు ధ్యానము చేసెడివాడు. అలాంటి

తాతగారి వెంట గుడికిపోయి అక్కడ కూర్చున్నప్పుడు నాకు ప్రశ్నలు వచ్చేవి. వచ్చిన ప్రశ్నలను తాతగారిని అడిగి

తెలుసుకొనెడివాడిని. తాతగారికి ఆ కాలములోనే టీచర్గా పని చేసిన అనుభవమున్నది. పాతకాలము చదువులు

చెప్పినవాడు కావున ఆయనకు భారత, భాగవత, రామాయణ గ్రంథములను చదివిన అనుభవము ఉన్నది. అంతేగాక

భగవద్గీతను, పురాణములను చదివిన అలవాటు కూడా ఉన్నది. అటువంటి వ్యక్తితోయున్న నేను ప్రశ్నించగా ఆయన

జవాబులు చెప్పేవాడు. ఒకదినము మా ఇరువురి మాటలు ఇలా సాగాయి.


నా ప్రశ్న :- తాతగారు! గుడి ఎందుకు కట్టారు?

దేవుడున్నాడని తెలియుటకు. గుడికి వచ్చిన ప్రతివాడూ దేవునికి నమస్కారము చేసుకొని పోవుటకు.

అంతేగాక కొందరు పూజలు చేసిగానీ, చేయించిగానీ పోవుచుందురు. ఈ విధముగా వచ్చిన ప్రతివాడు గుళ్ళోనున్న

దేవున్ని పూజించో, నమస్కరించో, దేవునికి తమ విధేయతను తెలియజేసి పోవుచుందురు. అలా చేయుట వలన

తమకేకాక తమ వెంట వచ్చు పిల్లలకుగానీ, మిగతా భక్తి భావములు లేనివారికిగానీ దేవుడున్నాడను భావము వచ్చును.

నేను :- ఇక్కడ ఈ గుడి పెద్దగాయున్నది. ఈ గుడిలోని దేవుడు మగ దేవుడు. మా ఊరిలోనున్న గుడి చిన్నగాయుంది,

ఆ గుడిలోనున్న దేవుడు ఆడదేవుడు. పెద్ద గుడులలో మగదేవుడు, చిన్న గుడిలో ఆడ దేవుడు ఉంటాడా?

తాత :- అట్లంతా ఏమీ ఉండదు. పూర్వము కట్టినవి పెద్దవిగా ఉంటాయి. ఈ మధ్యకాలములో కట్టినవి చిన్నవిగా

ఉంటాయి. పెద్ద చిన్న గుడులలో ఏమీ తేడావుండదు. ఆడ, మగ అనునది అక్కడ పెట్టిన ప్రతిమనుబట్టి యుంటుంది.


నేను :- ఒకచోట ఆడ దేవున్ని, ఒకచోట మగ దేవున్ని ఎందుకు పెట్టారు? అసలు దేవుడు మగవాడా, ఆడవాడా?

తాత :- దేవుడు మగవాడే, అందుకే ఆయన్ని దేవుడు అంటున్నాము. దేవునికి భార్యగానున్న ఆమెను దేవత అంటున్నాము.

దేవత అంటే ఆడ అనీ దేవుడు అంటే మగ అనీ అర్థము చేసుకోవలెను.

నేను :- తిరుపతి వెంకటేశ్వరుడు, గోరంట్ల మాధవరాయుడు, కసాపురము ఆంజనేయుడు అని వేరువేరు ఊర్లలో

వేరువేరు పేర్లు గల దేవుళ్ళు ఉన్నారు కదా! వీరు ముగ్గురు సమానమైన దేవుళ్ళేనా లేక వీరిలో కూడ హెచ్చు

తగ్గులుంటాయా? వీరిలో అసలైన దేవుడు ఎవరు?

తాత :- (ఆయన కొంత తటపటాయించి) వీళ్లందరూ దేవుడున్నాడని గుర్తుకే ఉన్నారు గానీ, వీరు ఎవరూ అసలైన

దేవుడు కాదు. దేవుడు ఉన్నాడని అందరికీ తెలియుటకు గుడులను, దేవతలను ఉంచారు. అంతేగానీ గుడులలో ఉన్న

వారంతా దేవుడు కాదు.

నేను :- వీరందరు దేవుడు కాకపోతే అసలైన దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు?

తాత :- అసలైన దేవున్ని దేవుడనియే అంటారు. ఆయనకు వేరే పేరు ఏమీలేదు. ఆయన సర్వాంతర్యామి. అంతటా

అన్నిచోట్లా ఉంటాడు. ఇక్కడ కూడా ఉన్నాడు.

నేను :- దేవుడు అన్నిచోట్ల ఉంటే, ఇక్కడ కూడా ఉంటే, ఇప్పుడు మనకు ఎందుకు కనిపించలేదు?

తాత :- దేవుడు ఎవరికీ కనిపించడు, ఎందుకంటే ఆయనకు మనకు మధ్యలో మాయ అను తెర వున్నది. దానిని తీసి

చూచితే అప్పుడు దేవుడు కనిపిస్తాడు.

నేను :- దేవుడు కనిపించకుండా మాయ అడ్డముగా ఉంటే అదైనా కనిపించాలి కదా! అది కనిపిస్తే కదా, దానిని

తొలగించి చూచేది. మాయ అనే గుడ్డ ఎక్కడా కనిపించలేదే?

(అప్పుడు ఆయన జవాబు చెప్పడములో కొంత తటపటాయించాడు. అప్పుడు ఆయన నన్ను చూచి నవ్వి ఇలా

అన్నాడు. )


తాత :- ఇప్పుడు నీది చిన్నవయస్సు కదా! అందువలన మాయ అంటే ఏమిటో ఎలా అడ్డముందో కనిపించదు.

వయస్సు పెరిగిన తర్వాత బాగా కనిపిస్తుంది. అప్పుడు మాయ అనే తెర దేవునికి అడ్డముగా ఉందని తెలుస్తుంది.

దానికొరకు కొంత వయస్సు వచ్చు వరకు కాచుకొని ఉండాలి.


ఆయన చెప్పునది అబద్ధమనీ, ఇప్పుడు కనపరాని మాయ వయస్సు వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుందనీ,

ఆయన సరియైన జవాబును చెప్పలేక అలా దాటవేస్తున్నాడనీ నాకు అర్థమైనది. అంతటితో ఆ విషయమును వదలివేశాము.

నాకు కొంత వయస్సు వచ్చిన తర్వాత తాతగారు చెప్పినది సత్యమేననిపించింది. కనిపించడమంటే కంటికే కనిపించాలని

ఎందుకను కోవాలి, బుద్ధికి తెలిసినా కనిపించినట్లే కదా! ఉద్దేశ్యముతో చెప్పి వుంటాడనుకొన్నాను. ఆయన ఒక

విధముగా ఆధ్యాత్మిక మార్గములో పోతూ కొంత మార్గము తప్పి జపము, ధ్యానము చేసెడివాడని అర్థమైనది. ఆయన

జ్ఞానియేనని ఆయన చావులో నాకు కొంతవరకు తెలిసినది. మేము అలా మాట్లాడిన తర్వాత దాదాపు మూడు లేక

నాలుగు సంవత్సరము లకు ఆయన చనిపోయాడు. ఆ సమయములో నేను అక్కడే ఉన్నాను. ఆయన రేపు చనిపోతానని

ఈ రోజే చెప్పగలిగాడు. రేపు ఈ సమయానికి చనిపోతాను, నాకు ఆ విషయమును సరస్వతి అమ్మ చెప్పుతూయున్నది.

మీకు వినిపించడము లేదా, అమ్మ మీకు కనిపించడము లేదా అని ఆయన అడిగిన మాటలు ఇప్పటికీ నాకు బాగా


జ్ఞాపకమున్నాయి. ఆయన అప్పుడు చెప్పినట్లే రెండవ రోజు చనిపోవడమును చూచిన తర్వాత ఆయన చెప్పిన

మాటలు సత్యమనీ, ఆయనకు సరస్వతీదేవి కనిపించి ముందే ఆయన మరణ విషయమును చెప్పిందని అర్థమైనది.

ఆయన బాగా మాట్లాడుచున్నా, మీకు కనిపించలేదా, వినిపించలేదా అని అడుగుచున్నా, ఆ మాటలను తేలికగా తీసుకొని

ఆయనకు ఆరోగ్యము బాగాలేక అలా మాట్లాడుచున్నాడని అనుకొన్నాము. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన బోధకుడుగాయుండి

(టీచర్ గాయుండి) ప్రతి సంవత్సరము సరస్వతి పూజ చేసెడివాడు. ఆయన ఇష్టదేవత సరస్వతి పూర్వము పల్లెటూర్లలో

బడిలేకున్నా తాతయ్య ఎందరికో విద్యను నేర్పించాడు, ఆ కాలములో భారత, భాగవతములను చదివి వినిపించేవాడు.

అందువలన ఆయనకు ఇష్టదేవతయిన సరస్వతీదేవి అంత్యకాలములో కనిపించి రేపు చనిపోతావని చెప్పడము జరిగిందని

అనుకొన్నాను. ఆయన మరణములో జరిగిన విషయమును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నాకుమాత్రము ఆ

విషయము గొప్పగా గుర్తుండిపోయినది. అలా నేను గుర్తుంచుకొనుటకు కారణము నాలో హేతువాద దృష్ఠి ఉంది.

ప్రతి దానికి సమాధానమును, కారణమును వెదుకువానిని, కారణమును గురించి ప్రశ్నించుటను హేతువాదము అంటాము.


హేతువును (కారణమును) ప్రశ్నించడము జవాబును స్వీకరించ డము హేతువాదము అంటాము. హేతువాదము

ప్రతి ఒక్కరిలో చిన్నప్పటి నుండి మొదలైనా, పెద్దవయస్సు వచ్చేకొద్ది అది వారిలో తగ్గిపోవును. కొందరిలో మాత్రము

అలాగే ఉండును. కొందరిలో మాత్రము వయస్సు పెరిగేకొద్ది హేతువాద దృష్ఠి పెరుగుతూ వచ్చును. అటువంటివారు

అన్వేషణ చేస్తూ చివరికి దేనినైనా తెలియగలరు. హేతువాద దృష్ఠిలేనివారు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు,

క్రొత్త విషయమును ఏమీ తెలియక సర్వసాధారణ ముగా ఉందురు. హేతువాదము లేని జీవితము అర్థములేని

జీవితమగును. హేతువాదమున్నవాడే జ్ఞాని కాగలడు. అందువలన మనిషికి హేతువాదము ముఖ్యమని అంటున్నాము.

నేడు నాస్తికవాదులైనవారు దేవుడే లేడనువారు అడ్డ ప్రశ్నలు వేస్తూ వాటినే హేతువాదము అనుకొంటున్నారు. నేడు

హేతువాదులు కనిపించడములేదుగానీ, హేతువాదులమని చెప్పుకొను నాస్తికవాదులు కనిపించుచున్నారు. నాస్తికవాదములో

అన్వేషణ ఉండదు. నాస్తికవాదములో తనకుతానుగా నిర్ణయమును తీసుకోవడము జరుగు చుండును. తనకు అర్థమైనదంతా

సత్యము, అర్థముగానిదంతా అసత్యము అని నాస్తికవాదులు అనుచుందురు. వారికి దేవుడు అర్థము కాలేదు. కాబట్టి

దేవుడు లేడు అనుట వారి విధానము. అట్లే ఏది అర్థము కాకపోతే అది అంతయు లేదనడము వారి నాస్తికవిధానముగా

ఉన్నది.


హేతువాదమునకు మతమునకు పొత్తు కుదురుతుందా? అనునది మనకు ప్రశ్న. ఇంతవరకు హేతువాదమును

గురించి తెలుసుకొన్నాము. మతమునకు హేతువాదమునకు పొత్తు ఏమాత్రము కుదరదనియే చెప్పవచ్చును. మతము

అనునది వ్యాపించుకొను ఉద్దేశ్యముతో తయారు చేయబడినది. పూర్వము రాజులు రాజ్యకాంక్షతో ఎటువంటి అన్యాయమున

కైనా పాల్పడి సింహాసనమును అధిష్ఠించినట్లు మతము ప్రజలలో విస్తరించుటకు ఎటువంటి పద్ధతినైనా అవలంబించును.

చివరకు హింసతో నైనా మతమును వ్యాప్తి చెందునట్లు చేసుకొనును. అటువంటి పద్ధతిలో మతమునకు ఒక సిద్ధాంతమంటూ

ఉండదు. నేడు భూమిమీదున్న మతములన్నీ అలాగే పోటీపడుచు, చివరకు హింసామార్గమును అనుసరిస్తు న్నవి.

హేతువాదము సత్యమును అన్వేషిస్తున్నది. మతము వ్యాప్తి కొరకు సత్యమును వీడి ద్వేషముగా, హింసగా ప్రవర్తించుచున్నది.

అందువలన మతమునకు హేతువాదమునకు పొత్తు కుదరదు. మతముది, హేతు వాదముది రెండు వేరువేరు మార్గములు.


ప్రశ్న :- ఆకాశమునుండి చేపలు, రాళ్ళు, మంచుగడ్డలు, మొసళ్ళు, తాబేళ్ళు, క్రొత్తరకమైన జంతువులు పడుతున్నాయి,

అలా ఎందుకు జరుగుచున్నది? అవన్నీ ఎక్కడినుండి వచ్చాయి?


జవాబు :- అవన్నియు పైనుండి క్రిందపడ్డాయి అని మీరే చెప్పుచున్నారు కదా! ఆ పైకి ఎలా వచ్చాయి అనునది

అడుగవలసిన ప్రశ్న. దానికి జవాబు ఈ విధముగా కలదు. గగనము శూన్యము అని అందరికి తెలుసు. ఆకాశము

శూన్యమైనది. అందులో ఏమీ ఉండవు. పైన మనము చెప్పుకొన్న వస్తువులుగానీ, ప్రాణులుగానీ ఉండుటకు ఆధారములేదు,

అవకాశములేదు. అయితే ఆకాశములో ఏ ఆధారము లేకుండా ఉండగలిగినవి మేఘములు మాత్రమే. మేఘములను

చిన్నప్పటినుండి చూస్తున్నాము. అయినా వాటిని ఎవరూ పట్టించుకోవడములేదు. మేఘములు ఆకాశములో ఎలా

తేలగల్గు చున్నాయో కూడా సరియైన వివరము లేదు. మేఘములను గురించి వర్షము కురియుటకు పనికివస్తాయని

చెప్పడము తప్ప, అవి ఇంకా ఏమైనా చేయగల్గుచున్నాయా? అని వాటిమీద ఎవరూ ఎటువంటి పరిశోధనలు చేయలేదు.

అందువలన మేఘములను గూర్చిన పూర్తి సమాచారము ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భములో మూడు

సంవత్సరముల క్రిందటే “మేఘము ఒక భూతము” అని మేము మొట్టమొదటిగా మేఘమును గురించి చెప్పాము.

తర్వాత “దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథములో మేఘములను గురించి పూర్తిగా వ్రాయడము

జరిగినది. అప్పుడు ఆ గ్రంథములో మేఘాలనుండి కప్పలు, చేపలు, పాములు, తాబేళ్ళు, మంచుగడ్డలు, రాళ్ళు

ఏమైనా పడగలవని చెప్పాము. అంతేకాక అవి ఆకాశములోని మేఘములలోనికి ఎలా చేరుతాయో కూడా చెప్పాము.


ఇదంతయు ఎవరికీ తెలియని విషయమైనా, మాకు ఎప్పుడో తెలిసిన విషయము. మేఘములు తమ

ఇష్టమొచ్చినచోట వర్షించగలవు. వాటికి ఇష్టము అనునది ఉన్నది, కావున మేఘమును ప్రాణముగలదిగా, ఒక జీవునిగా

చెప్పవచ్చును. మేఘము ఒక జీవుడైతే, ఆ జీవునికి కొన్ని పనులు కూడా వుండును. అంటే మేఘమునకు ప్రకృతిలో

కొన్ని పనులు నిర్ణయించబడినవి. మేఘము ఏమి పనులు చేయునది ఎవరికీ తెలియదను కొన్నాము కదా! అయితే

మేఘము మనము ఊహించని పనులనుకూడా చేయు చున్నది. భూమిమీదున్న మనుషుల పాలన మీద ఎంతో

అధికారము కల్గినది మేఘము. అందువలన మనుషుల జీవితాల మీద క్రొత్త రోగములను ప్రవేశింపజేయునది కూడా

మేఘమేనని తెలియవలెను. మేఘముల వలన రోగములు వస్తాయనడము అందరికీ క్రొత్తగాయున్నా అది మాత్రము

వాస్తవము. మేఘము ఒక జీవుడు కావున, ఆ జీవుడు దేవుని పాలనలో యున్నవాడు కావున, ఎవరిని ఎంత శిక్షించాలి,

ఎంత రక్షించాలి అని తెలిసి పనిచేయును. ప్రకృతిలో ఖగోళమందు ఎన్నో భూతములు, గ్రహములు గలవు. అవన్నియు

శక్తివంతమైనవే. ఖగోళములో మేఘములు కూడా ఒక భాగముగా ఉండడమేకాక ఎక్కువ పనిని చేయునవైయున్నవి.


రోగములను తెచ్చి మనుషుల మధ్య వదులునవి మేఘములే, తర్వాత వాటిని మనుషుల మధ్యనుండి తిరిగి

తీసుకొని పోవునవి కూడా మేఘములే. మేఘములు ధూళిగా, పొగగా కనిపించినా వాటిలో ఎవరికీ కనిపించకుండా

ఎన్నో ఘనపదార్థములు గలవు. కొన్ని నెలల కాలమైనా కొన్ని వేల జీవరాసులను తనయందు దాచుకోగలదు.

మేఘములోనున్న జీవరాసులకు ఆకలిదప్పులు ఉండవు. కర్మ ఆచరణ ఆగియుండును. ఒక మొసలి గర్భముతో

ఉన్నప్పుడు గుడ్లు పెట్టవలసిన కాలములో మేఘము దానిని తీసుకొనిపోతే, అది మేఘములో ఉన్నంతవరకు గుడ్లను

పెట్టదు. మేఘములో ఎంతకాలమున్నది దానికి ఏమాత్రము తెలియదు. పూర్తి నిద్రావస్థలో ఉండును. ఈ విధముగా

ఏ ప్రాణి అయినా అందులో ఉండగలదు. మేఘమును గురించి సంపూర్ణముగా తెలిసినవారు ఎవరూ లేరు. ఎంత

తెలిసినా ఇంకా తెలియనిది ఎంతో ఉండును. భూమిమీద మనుషుల మనుగడకు మేఘములు ఎంతో సంబంధపడియున్నవి.

అలాగే భూతముల, మహాభూతముల, గ్రహముల, మహాగ్రహముల జోక్యము మానవ మనుగడతో సంబంధమున్నదని

ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలములో బహుశా పదిరోజుల క్రిందట ఒక టీ.వీ. ఛానల్లో మేఘమును గురించి


చెప్పుచూ కొందరు పరిశోధకులు కొంత పరిమాణమున్న మేఘమును ఎంత బరువున్నదని ఒక యంత్రముతో తూకము

చూచారట. అప్పుడు ఆ మేఘము వారు ఊహించని రీతిలో కొన్ని లక్షల టన్నుల బరువు తూగిందట. ఆ మేఘము

అంత బరువు ఎందుకున్నది వారికి అర్థము కాలేదట. మేఘము కేవలము పొగలాగ ఉండును. అదియూ పలుచని

పొగలాగ ఉండును. అటువంటిది అంత బరువు ఎలా తూగిందో ఏమాత్రము తెలియలేదు.


మేఘము కంటికి కనిపించు ధూళిలాంటిదైనా, అందులో ఏముందో ఎవరికీ తెలియదు, ఒక చిన్న మేఘము

తనయందు ఎంత నీటినైనా దాచు కోగలదు. అలాగే ఎన్ని వస్తువులనైనా, ఎన్ని జీవరాసులనైనా ఉంచు కోగలదు.

పరిశోధకులు తూచిన మేఘములో ఏమి ఉన్నదో, ఉన్న దానిని బట్టి దాని బరువు తెలిసియుండునని నేను అనుకొంటున్నాను.

మరొక వింత ఏమిటంటే భూమికి ఆకర్షణశక్తియున్నదని “న్యూటన్” అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. అది నేటికినీ

సిద్ధాంతముగా చెప్పబడుచున్నది. భూమికి ఉన్న ఆకర్షణశక్తి ఒక వస్తువు యొక్క బరువును తెలియజేయుచున్నది.

భూమి ఆకర్షణ శక్తి ఒక వస్తువును క్రిందికి లాగుటకు ఎంత ఉపయోగ పడుచున్నదో దానిని వస్తువు యొక్క బరువు

అంటున్నాము. ఒక రాయిగానీ, ఒక లోహముగానీ వేరువేరు బరువులుగా కనిపించుచున్నవి. ఒక రాయిని లాగుటకు

భూమికి ఎంతశక్తి అవసరమో దానిని ఆ రాయి యొక్క బరువు అనినప్పుడు అదే రాయి పరిమాణమున్న ఇనుపముక్కను

తూకము వేచి చూస్తే రాయికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కనిపించుచున్నది. రాయిని కొంతశక్తిని ఉపయోగించి

భూమిలాగుచున్నదనీ, ఆ ఉపయోగపడేశక్తినే దానిబరువు అంటున్నామనీ తెలిసిపోయినది కదా! రాయి ఇంతబరువు

ఉంది అనుచున్నామంటే, దానిని తనవైపు లాగుకొనుటకు భూమికి ఇంత శక్తి ఉపయోగపడిందని అర్థమగుచున్నది.

దీనినిబట్టి రాయి బరువు = భూమి ఆకర్షణ అని చెప్పవచ్చును. రాయి పరిమాణమున్న ఇనుప లోహమును (ఇనుపముక్కను)

లాగుటకు భూమికి ఎక్కువ శక్తి ఖర్చగు చున్నది. కావున ఇనుపముక్క ఎక్కువ బరువు తూగినది. అలా ఎందుకు

ఇనుప ముక్కను లాగుకొనుటకు ఎక్కువ శక్తి ఉపయోగపడింది? అని ప్రశ్నించుకొని చూస్తే నా వరకు కొంత సమాచారము

తెలియుచున్నది.


ప్రతి వస్తువులోనూ భూమికి వికర్షణగా ఒక శక్తి పని చేయుచున్నది. రాతిలో కొంత వికర్షణశక్తియుంటే,

ఇనుములో మరికొంత వికర్షణశక్తి యుండును. ఈ విధముగా వేరువేరు వస్తువులలో, వేరువేరు పదార్థములలో

వేరువేరు వికర్షణ శక్తులువుండును. అందువలన భూమికి వాటిని తనవైపు లాగుకొనుటకు, వేరువేరు పరిమాణములో

శక్తులు ఉపయోగపడుచుండుట వలన, ఆ వస్తువులు వేరువేరు బరువులు తూగుచున్నవి. ఒక రాయిని లాగుటకు

రాతికి వ్యతిరేఖముగా పని చేయు భూమిశక్తికంటే అదే పరిమాణమున్న ఇనుపముక్కను లాగుటకు దాని వికర్షణకు

వ్యతిరేఖముగా భూమికి ఎక్కువ శక్తి వినియోగింపబడుచున్నది. అందువలన ఒకే పరిమాణమున్న రాయికంటే ఇనుము

ఎక్కువ బరువు తూగుచున్నది. అలాగే మేఘము యొక్క వికర్షణశక్తి, భూమి యొక్క ఆకర్షణశక్తికంటే ఎక్కువ ఉండుట

వలన, మేఘమును భూమి క్రిందికి లాగలేకున్నదని చెప్పు చున్నాము. ఇది కేవలము నా ఉద్దేశ్యము మాత్రమే. నా

మాటమీద నమ్మకము లేనివారు నా ఉద్దేశ్యమును వదలివేయవచ్చును. కొన్ని మేఘములు భూమికి చాలా ఎత్తుగా,

కొన్ని మేఘములు భూమికి పూర్తి దగ్గరగా రావడములో వాటిలో నున్న వికర్షణ శక్తుల వలన అలా జరుగుచున్నదని

తెలియుచున్నది. రెండు మేఘములలో ఒకటి క్రింద, ఒకటి దానికంటే పైన ఉండుటకు కారణము మేఘములు

తమయందు నింపుకొన్న వస్తువులనుబట్టి ఉండునని తెలియుచున్నది. నా పరిశీలనలో రోగములను నింపుకొన్న

మేఘములలో వికర్షణశక్తి తక్కువయుండును. కావున అటువంటి మేఘములు భూమికి దగ్గరగా వచ్చుచుండునని


తెలియు చున్నది. అటువంటి మేఘములే సుడిగాలి మేఘములుగా (టోర్నడోలుగా) భూమిమీదికి వచ్చుచున్నవి.

మనుషులను హింసించుటకే అటువంటి మేఘములు క్రిందికి వస్తున్నవి. కావున సుడి మేఘములు ఎక్కువగా జనవాసముల

మీదికే వచ్చుచుండుటను గమనించవచ్చును. ఈ విధముగా మనుషులను సంతోషపెట్టుటలోనూ, హింసించుట లోనూ

మేఘములు ఎన్నో పాత్రలు పోషించుచున్నవి. అందువలన మానవుల కర్మలనుబట్టి మేఘములు వర్షించడమేకాక

ఎన్నో రకముల వస్తువులను, పదార్థములనూ, జీవరాసులనూ తెచ్చి వదులుచున్నవి. కొన్ని కౄర జంతువులను కూడా

మేఘములు తెచ్చి వాటి సంచారములేనిచోట వాటిని వదులుచున్నవి. అందువలన జంతువులులేని ప్రదేశములో కూడా

ఉన్నట్లుండి అవి కనిపించడము జరుగుచున్నది. ఈ విధముగా మేఘములు మనకు తెలియని ఎన్నో కార్యములను

చేయుచున్నవి.


మేఘము ఒక భూతము అని ముందే చెప్పుకొన్నాము. భూతము అనగా శక్తివంతమైన జీవుడు అని అర్థము.

దేవుని జ్ఞానమును బాగా తెలిసిన జీవుడుగా మేఘమున్నది. దేవుని విలువను తెలిసి, దేవుని జ్ఞానమును సంపూర్ణముగా

తెలిసినవి మేఘములు. భూమిమీద మానవుల జీవితముల మనుగడలతో సంబంధము కల్గియున్న మేఘములు, పై

నుండి మానవుల జీవితములను ప్రవర్తనలను చూస్తున్నవి. మేఘములు శక్తివంత మైన భూతములు, కావున వాటి

ఆజ్ఞలతో మెలగుశక్తులు, గ్రహములు ఎన్నో గలవు. భూమిమీద కనిపించక తిరుగుచున్న కొన్ని గ్రహశక్తులు మేఘముల

ఆదేశముల ప్రకారము నడచుకొనుచుండును. మనిషి యొక్క కర్మను అనుసరించి దేవుని పాలనలో పనిచేయుచున్న

ఆకాశములోని ద్వాదశ గ్రహములే కాక, క్రింద చిన్నచిన్న గ్రహములు కోట్ల సంఖ్యలో గలవు. మనిషి అన్యాయముగా,

అవినీతిగా ఎటువంటి చెడు ప్రవర్తనను కలిగియున్నా భూతములుగానీ, గ్రహములుగానీ పట్టించుకోవు. వాని కర్మకు

వానిని వదిలివేసి, వాడు ఆగామికర్మను సంపాదించుకొంటూవుంటే గమనించుచుండును. అయితే దేవునికి, దేవుని

జ్ఞానమునకు వ్యతిరేఖముగా ప్రవర్తించు వారిమీద ఎక్కువ కోపము కల్గినా, కొంతవరకు ఓర్పుగా ఉందురు. మేఘములకు

ఎక్కువ వ్యతిరేఖమైన కార్యములు మనుషుల వివాహములు, తీర్థయాత్రలు. వివాహములుగానీ, దేవతల దర్శనార్థము

చేయు తీర్థ యాత్రలుగానీ పూర్తిగా దేవుని జ్ఞానమునకు సంబంధించిన విషయములు. దేవాలయములు దేవుని జ్ఞాపకార్ధము,

దేవుని జ్ఞానము తెలియు నిమిత్తముండగా, జ్ఞానము మీద ఏమాత్రము దృష్ఠిలేకుండా, దేవుని ధ్యాస ఏమాత్రము

లేకుండా చేయు తీర్థయాత్రల మీద మేఘములకు కోపమువచ్చును. అలాగే పెళ్ళి పూర్తిగా దేవుని జ్ఞానమునకు

సంబంధించిన పనులతో కూడుకొన్నది. అయినా ఆ పనులను చేయుచూ దేవుని జ్ఞానమును ఏమాత్రము జ్ఞాపకము

చేసుకోకుండా ప్రవర్తించు వారిమీద మేఘముల కోపము తీవ్రముగా ఉండును. కొంతవరకు ఓర్చుకొన్న మేఘములు

ఈ రెండు కార్యములలో (పెళ్ళిల్లు, తీర్థయాత్రలు) భూమిమీదయున్న గ్రహశక్తులకు తమ కోపమును తెలుపును. మేఘముల

కోపమును గ్రహించిన గ్రహములు, ఆ కార్యములలో లగ్నమైయున్న వారికి ఏదో ఒక విధముగా ప్రమాదమును

కల్గింతురు. ఆ ప్రమాదములలో మనుషుల ప్రాణములు సహితము పోవచ్చును. భూమిమీద గ్రహములు మేఘముల

ఆదేశము ప్రకారము వివాహములు, తీర్థయాత్రలు చేయువారికి రోడ్డు ప్రమాదమును కల్గించుచున్నవి. ఎక్కువకంటే

ఎక్కువగా రోడ్డు ప్రమాదములు ప్రత్యేకించి ఈ రెండు కార్యముల ప్రయాణములలోనే జరుగుచున్నవి. భూమిమీద

ఘోరముగా జరుగు రోడ్డు ప్రమాదములు ఎక్కువగా పెళ్ళిళ్ళు, దేవతాయాత్రల విషయములలోనే జరుగుచుండునని

తెలియవలెను. మేఘములు ప్రపంచములో పైనుండి వర్షమును వర్షించుటయేగాక, క్రింద భూమిమీద ఎన్నో పనులు

జరుగుటకు మరియు మూకుమ్మడిగా ప్రాణనష్టమును కల్గించు ప్రమాదములు జరుగుటకు కారణమైయున్నవి. ఈ


సంవత్సరము (త్రైత శకము - 35, క్రీస్తు శకము 2013) ఉత్తరకాశి అనబడు అమరనాథ్, బద్రినాథ్, గంగోత్రి,

యమునోత్రి యాత్రలలో జరిగిన ఘోరప్రమాదములైన వర్షము కురువడమూ, నదులు ప్రవహించడమూ, కొండలు

విరిగి పడి పోవడమూ మొదలగు అన్ని కార్యములు మేఘముల కనుసన్నలలో జరిగిన ప్రమాదములని తెలియవలెను.

దేవతల మీద భక్తి అను ఉద్దేశ్యముతో యాత్రలో పాల్గొన్న వేలమంది యాత్రికులందరూ ప్రమాదములో చిక్కుకొని

ఎందరో మరణించగా, ఎందరో నీరు, ఆహారము లేక, ఉండేదానికి కొద్దిపాటి జాగా కూడాలేక చాలా ఇబ్బంది పడిపోయారు. 

ఇటువంటి ప్రమాదములను దైవజ్ఞానమును మరచిన వారిమీద మేఘములు కల్గించుచునే ఉన్నవి. అలా చేయడము

వలన తమ తప్పును తెలుసుకొని, దైవజ్ఞానమునకు విలువనిచ్చి, దైవజ్ఞానమును తెలియుటకు మనుషులు ప్రయత్నింతురని

మేఘముల ఉద్దేశ్యము. ఈ విధముగా మేఘములు దైవజ్ఞానము అభివృద్ధి అగుటకు ఎన్నో పాత్రలను పోషించుచున్నవని

తెలుపుచున్నాము.


ప్రజలకు తెలియని విషయములను ప్రశ్నగా ప్రశ్నించి జవాబుగా చెప్పడము మంచిదనుకొన్నాము. ప్రశ్నను

ఎవరైనా అడుగవచ్చును కానీ, జవాబును కొందరే చెప్పగలరు. కొన్ని ప్రశ్నలకు జవాబును ఒక్కరే చెప్పగలరు.

ప్రపంచ సంబంధ ప్రశ్నలకు కొందరు జవాబు చెప్పగలిగినా, దైవసంబంధ ప్రశ్నలకు ఒక్కరే జవాబు చెప్పగలరు.

సూత్రము ప్రకారము దేవుని విషయములు దేవునికే తెలియును. దేవుని విషయములు దేవునికి తప్ప మిగతా ఏ

మానవునికీ తెలియవు. అప్పుడు ఆ విషయములను దేవుడు ఒక్కడే చెప్పవలసి ఉంటుంది. దేవుడు నేరుగా ఎవరితోనూ

మాట్లాడడు. అందువలన దేవుడు దేవునిగా కాకుండా, మనిషిగా కాకుండా భగవంతుడు అను ప్రత్యేక వ్యక్తి ద్వారా

చెప్పును. చెప్పబడు విషయము ప్రపంచ సంబంధమా లేక దైవసంబంధమా చూడవలసివుండును. ప్రపంచ సంబంధమైన

విషయమైతే అది ఎవరికీ తెలియకున్నా, దానిని దేవుడు మనిషి చేతనే చెప్పించును. దైవసంబంధ విషయమైతే ఇటు

మనిషి, అటు దేవుడు కాకుండా, మధ్యలోగల భగవంతుని చేత దేవుడు చెప్పించును. ఇప్పుడు ప్రశ్నగా అడగబోవు

విషయము దైవసంబంధముగా కనిపించు చున్నా, దానిని ప్రపంచసంబంధమైనదిగానే చెప్పవచ్చును. ప్రశ్నను క్రింద

చూస్తాము.


ప్రశ్న :- పల్లెటూర్లలో వర్షమును గురించి వర్షము వస్తుందా, రాదా? ఏ కార్తెలో వస్తుంది? ఎంత వర్షము వస్తుంది?

అను ప్రశ్నలను వ్యవసాయమును చేయు రైతులు అడుగుచుందురు. అడిగెడు ప్రశ్నలను ఎవరైనా జ్యోతిష్యున్ని అడగడమూ,

వారు ఏదో ఒకటి చెప్పడమూ జరుగుచుండును కదా! అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నలు జ్యోతిష్యులను అడగలేదు. ఒక

మట్టి కడవనో, లేక ఒక రాగి చెంబునో ప్రశ్నించుచుందురు. ఆ ప్రశ్నలకు జవాబులను మట్టి కడవ, రాగి చెంబులు

చెప్పుచుండును. అదెలా సాధ్యమని ప్రశ్నరాక తప్పదు. ఈ ప్రశ్న నాస్తికవాదులకు, ఆస్తికవాదులకు అందరికీ వచ్చును.

ఇప్పుడు దానిని గురించి తెలుసుకొందాము.


జవాబు :- చెంబు జ్యోతిష్యమును వినడమేగానీ నేను ఎప్పుడూ చూడలేదు. అయితే కడవ జ్యోతిష్యమును ప్రత్యక్షముగా

చూశాను. నేను చిన్న వయస్సులోనున్నప్పుడు, కడవను అడిగి వర్షము రాకను కొందరు రైతులు తెలుసుకోవడము

చూశాను. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ విధానము నంతటినీ జాగ్రత్తగా చూడడము వలన, నేటికినీ ఆ దృశ్యములన్నీ

నాకు బాగా జ్ఞాపకమున్నాయి. ఆ దినము ప్రత్యక్షముగా కడవ జ్యోతిష్యము జరిగినదంతా చూచినా, అది ఎలా

జరిగింది? అలా జరుగుటకు సాధ్యమేనా? అను ప్రశ్నలు ఎన్నోమార్లు నాకు కల్గినవి. అప్పటిలో ఎవరిని అడిగినా

దానిని గురించి సరియైన సమాధానము చెప్పలేదు. తర్వాత ఇంత కాలమునకు నేను దానిని గురించి వివరించు


స్థితికి వచ్చాను. నేను ఎప్పుడో చిన్న వయస్సులో చూచిన దానిని మీరు నమ్మవచ్చును, నమ్మకపోవచ్చును. అయితే

అందరూ నమ్మితీరునట్లు నిన్నటి దినము అనగా! సోమవారము జూన్ 24, 2013 ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన

సమాచారము “లండన్, మాంఛెస్టర్ మ్యూజియమ్ ఈజిప్టుకు చెందిన 4000 ఏళ్ళక్రిందటి విగ్రహం ఉన్న చోటనే

తనంతట తాను తిరుగుతోంది. దీన్ని గుర్తించిన అక్కడి అధికారులు అది ఎలా సాధ్యమో అర్థముకాక తలలు పట్టుకొన్నారు.

ఈజిప్టులో లభ్యమైన 10 అంగుళాల పొడవైన ఈ విగ్రహం 80 ఏళ్ళుగా మాంఛెస్టర్ మ్యూజియంలో ఉంది. ఈ

నేపథ్యములో కొన్ని వారాల క్రిందట మ్యూజియం అధికారులు ఆ విగ్రహం దిశమారినట్లు గుర్తించారు. అనుమానం

వచ్చిన వారు ఆ విగ్రహాన్ని కొన్ని రోజులపాటు కెమెరాలలో పర్యవేక్షించారు. అప్పుడు ఆ విగ్రహం నెమ్మదిగా

తిరుగుతున్నట్లు వీడియోల్లో నమోదైంది. నెబ్-సేను అను పేరుగలిగిన ఈ విగ్రహం పగటివేళ మాత్రమే తిరుగుతున్నట్లు

తేలింది. ఈ మేరకు ఈ విగ్రహము వివరాలను "మాంఛెస్టర్ ఈవెనింగ్ న్యూస్" వెల్లడించింది. మ్యూజియంలో

సందర్శకుల కాళ్ళ చప్పుడులకు తలెత్తే ప్రకంపనాల వల్ల ఈ విగ్రహం తిరుగుతుండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.”

ఈ విషయమంతా “నమ్మండి నమ్మకపోండి ఈ విగ్రహం తిరుగుతోంది.” అను హెడ్డింగ్ క్రింద వ్రాయబడినది.


పేపర్ కట్  మొదలు.

సోమవారం జూన్ 24, 2013

మ్యూజియంలో నెబ్-సేను విగ్రహం (అంతర చిత్రంలో)

నమ్మండి నమ్మకపోండి..

ఈ విగ్రహం తిరుగుతోంది!

లండన్: మాంఛెస్టర్ మ్యూజియంలో ఈజిప్టుకు

చెందిన 4000 ఏళ్ల కిందటి విగ్రహం ఉన్న చోటనే

తనంతట తాను తిరుగుతోంది. దీన్ని గుర్తించిన అక్కడి

అధికారులు అది ఎలా సాధ్యమో అర్థంకాక తలలు పట్టు

కుంటున్నారు. ఈజిప్టులో లభ్యమైన 10 అంగుళాల

పొడవైన ఈ విగ్రహం 80 ఏళ్లుగా మాంఛెస్టర్ మ్యూజి

యంలో ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని వారాల కిందట

మ్యూజియం అధికారులు ఆ విగ్రహం దిశ మారినట్లు

గుర్తించారు. అనుమానం వచ్చిన వారు ఈ విగ్రహాన్ని

కొన్ని రోజుల పాటు కెమెరాలతో పర్యవేక్షించారు.

అప్పుడు ఈ విగ్రహం చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్లు

వీడియోల్లో నమోదైంది. నెబ్ సేను అనే పేరు కలిగిన

ఈ విగ్రహం పగటి వేళ మాత్రమే తిరుగుతున్నట్లు

తేలింది. ఈ మేరకు ఈ విగ్రహం వివరాలను “మాంఛె

స్టర్ ఈవెనింగ్ న్యూస్" వెల్లడించింది. మ్యూజియంలో

సందర్శకుల కాళ్ల చప్పుడుకు తలెత్తే ప్రకంపనల వల్ల ఈ

విగ్రహం తిరుగుతుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

పేపర్ కట్  ముగింపు .


నేను ఎప్పుడో చిన్నప్పుడు తొమ్మిది లేక పది సంవత్సరముల వయస్సులో చూచిన కడవ జోస్యమును కొందరు

నమ్మకపోయినా, “నమ్మండి నమ్మకపోండి" అను హెడ్డింగ్ క్రింద వ్రాసిన విషయము అందరూ సత్యమని ఒప్పుకోక

తప్పదు. అక్కడ పరిశోధించిన నిపుణులు సందర్శకుల కాళ్ళ చప్పుడుకు వచ్చే ప్రకంపనల వలన విగ్రహం

తిరుగుతుండవచ్చని, వారి అభిప్రాయమును వెలిబుచ్చారు. అది వారి అభిప్రాయమేగానీ సత్యము కాదని చెప్పవచ్చును.

మొదట కడవ ఎందుకు తిరుగుచున్నదో తెలియ గలిగితే, మ్యూజియంలో ప్రతిమ తిరుగుటకు కారణమేమిటో, సులభముగా

చెప్పవచ్చును. ఇప్పుడు మనము నా చిన్నవయస్సులో నేను చూచిన ప్రత్యక్ష కడవ జోస్యమును గురించి తెలుసుకొందాము.

ఎనిమిది అడుగుల చతురస్రాకారముగా శుభ్రము చేసిన స్థలములో కొన్ని పేర్ల ధాన్యమును కుప్పగా పోసి, పసుపు

కుంకుమలతో బొట్లు పెట్టిన క్రొత్త కడవను ధాన్యపు కుప్పమీద ఉంచుదురు. నీరు నిండుగా నింపిన కడవను ధాన్యము

మీద మధ్యలో పెట్టగా, ధాన్యము కడవకు కుదురుగాయుండి కడవ ఎటూ వొరిగి పోకుండా నిలుచును. ఆ విధముగా

అమర్చిన కడవకు పూలు పెట్టి కొబ్బరికాయకొట్టి పూజ చేసెదరు. పూజ ముగిసిన తర్వాత స్నానము చేసివచ్చిన

ఐదుమంది పెళ్ళికాని యువకులు, కడవకు నమస్కరించి వారి కుడిచేతి చూపుడువ్రేలును కడవ కంఠము అంచుమీద

ఆనించి పెట్టుకొని వుందురు. అలా ఐదుమంది యువకులు సగము వంగి కుడి చేతివ్రేళ్ళను కడవ మీద ఆనించి

పెట్టకముందే, మృగశిరకార్తె మొదలుకొని తర్వాత వచ్చు కార్తెల పేర్లను ఒక దానిని చెప్పి, ఆ కార్తెలో వర్షము

వస్తుందా, రాదా? అని అడిగెడివారు. అలా అడిగిన ప్రశ్నకు జవాబుగా, వారు అడిగిన కార్తెలో వర్షము వచ్చే

అవకాశముంటే, కొద్దిసేపటి తర్వాత అనగా అరనిమిషమునుండి నిమిషములోపల లేక రెండు నిమిషముల లోపల

కడవ కదిలి తిరుగుటకు మొదలుపెట్టును. వారు అడిగిన కార్తెలో వర్షము రాని పక్షములో ఆ కడవ తిరుగదు. ఒక

కార్తెను గురించి అడిగిన తర్వాత మరొక కార్తెను గురించి అడిగెడివారు. వారు అడిగిన కార్తెలో వర్షము తక్కువగా వచ్చే

సూచనయుంటే, కడవ తనంతకు తాను కొద్దిగా తిరిగి నిలిచిపోవును. కడవ తిరుగుటకు మొదలుపెట్టినప్పుడు,

కడవమీద చేతివ్రేళ్ళనుంచి వంగున్న యువకులు కడవతోపాటు తాము కూడా తిరుగవలసియుండును. కడవ అంచుమీద

చేతివ్రేలును ప్రక్కకు తీయకుండ అలాగే పెట్టుకోవడము వలన ఐదుమంది యువకులు కడవతోపాటు తిరుగుచుందురు.



ఐదుమంది యువకులు అడిగిన కార్తెలో వర్షము ఎక్కువ వచ్చేటట్లయితే, కడవ వేగముగా తిరుగను

మొదలుపెట్టును. అలా వేగముగా తిరుగునప్పుడు దానితోపాటు ఐదుమంది యువకులు వంగొని తిరగలేనంత వేగముగా

తిరుగును. ఒక్కొక్కప్పుడు మామూలుగా నడువడమేకాక అంతకంటే వేగముగా చిన్న పరుగులాగ తిరుగవలసివచ్చును.

అలా తిరుగునప్పుడు కడవ కొద్దిగా ప్రక్కకు వరిగి, కొద్దిగా కడవలోని నీరు క్రిందపడడము కూడా జరుగును. అలా

కడవలోని నీరు క్రిందపడితే వర్షము ఎక్కువగా వస్తుందని రైతులు అంచనగా వేసుకొందురు. ఈ విధముగా ఉన్న ప్రతి

కార్తెలోని వివరమును అడిగి వర్షము వస్తుందా రాదా అనీ, వస్తే ఎప్పుడు వస్తుందనీ, వర్షము వస్తే ఎంత వస్తుందనీ

అన్ని విషయములు వారు అడిగిన కడవ జోస్యములో తెలిసిపోవును. కడవ జోస్యము వలన తెలిసిపోయిన సమాచారము

భవిష్యత్తులో జరుగునా? అను ప్రశ్నకు వస్తే బాగా అనుభవమున్న రైతులు కడవ జోస్యము నూటికి తొంభైపాళ్ళు

సత్యమగునని చెప్పెడివారు. ఆ పది పాళ్ళు కూడా వారు అంచనాలో తప్పుగానీ, కడవ జోస్యములో తప్పులేదు అని

చెప్పెడివారు. కడవ తిరిగి కొంతవరకు వర్ష సూచన చేయగా, దానిని తాము ఎక్కువగా చెప్పుకోవడము వలన మా

అంచనా తప్పగుచున్నది తప్ప, కడవ జోస్యము నూటికినూరుపాళ్ళు సత్యము అంటున్నారు.


కడవ జోస్యములో స్థూలముగా జరిగెడి విధానమంతయు కంటికి కనిపిస్తున్నది. అలా జరిగెడి విధానములో


కడవ తనంతకు తాను ఎలా తిరుగుచున్నదనునది ముఖ్యమైన ప్రశ్న. జరుగబోయే భవిషత్తులోని వర్షపు సమాచారమును,

కడవ తిరుగడములో ఎలా తెలుపుచున్నది? కడవకు ముందు జరుగబోవు వర్ష సమాచారము ఎలా తెలుసు? అనునది

కూడా ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు జవాబులను తెలియుటకు కనిపించెడి స్థూలమును వదలి, కనిపించని సూక్ష్మ

విధానములో ఏమి జరుగుచున్నదో చూడవలెను. సూక్ష్మ విధానమును చూచుటకు జ్ఞానదృష్ఠి (సూక్ష్మదృష్టి) అవసరము.

శరీరములో ఆత్మ అందించిన సూక్ష్మదృష్టి వలన, నాకు తెలిసినదే మనగా! ఖగోళములో ఎన్నో కోట్ల సంఖ్యలో భూతములు,

స్వల్పభూతములు, గ్రహములు, ఉపగ్రహములు గలవు. వాటిలో స్వల్ప భూతములకు వర్షము ఎప్పుడు వచ్చునది,

ఎంత వచ్చునది, ఏ ప్రాంతములో వచ్చునది అన్ని విషయములు తెలియును. ఎందుకనగా స్వల్పభూతములుగా

మేఘములు కూడా ఉన్నవి. స్వల్ప భూతములైన మేఘములు ఎక్కడ, ఎప్పుడు, ఎంత వర్షమును కురువాలో తమకు

ముందే తెలుసు. అటువంటి మేఘముల వలన ఉపగ్రహములు కొన్ని వర్షము సమాచారమును గ్రహించి మేఘాల

ఆదేశానుసారము భూమిమీద ఎక్కడ కడవ జోస్యము జరుగుచున్నదో, అక్కడకు వచ్చి రైతులు వినయ విధేయతగా

అడుగు ప్రశ్నలకు జవాబులు చెప్పుచుందురు. కడవ జోస్యమును అడుగువారికి తమ జవాబును తెలుపుటకు,

ఉపగ్రహము కడవలో ప్రవేశించి కడవను త్రిప్పుచుండును. వర్షము యొక్క సమాచారమంతయు ఉపగ్రహమునకు

తెలియును కనుక వారు అడిగిన కార్తెలో వర్షము వస్తే కడవను త్రిప్పును. వర్షము రాకపోతే కడవను త్రిప్పదు.

వర్షము వచ్చే దానినిబట్టి ఎంత వేగముగా తిప్పాలో ఉపగ్రహము తెలిసియుండును. ఈ విధముగా ఉపగ్రహము

కడవలో చేరి, వర్షము యొక్క రాకడను గురించి ముందే తెలియజేయును. కడవ జోస్యము తెలియనివారికి ఏదో గొప్ప

కార్యముగా అనిపించినా, అది కనిపించడములో సర్వసాధారణముగా ఉన్నది. అయితే ఖగోళములోని ఉపగ్రహము

అక్కడికి వచ్చి కడవను కదిలించుచూ, తమకు జోస్యమును చెప్పుచున్నదని ఎవరికీ తెలియదు. ఈ రోజు ఎవరైనా

ఉపగ్రహ విషయమును తెలిసినవారైయుండి, కడవ జోస్యములో ఇలా జరుగుచున్న దని తెలిపినా, ఉపగ్రహముల

విషయము తెలియనివారు ఏమాత్రము నమ్మరు. ఖగోళములో స్థూలముగా కొన్ని గ్రహములు, ఉపగ్రహములు, సూక్ష్మముగా

కొన్ని గ్రహములు, ఉపగ్రహములు ఉన్నాయని తెలియనివారు కడవ జోస్యములో ఉపగ్రహపాత్ర ఉన్నదను మాటను

నమ్మలేరు.


కడవ జోస్యములో కడవ తిరుగుటకు కారణము తెలిసింది. కావున లండన్ లో ఈజిప్టు ప్రతిమ తనచుట్టు

తాను తిరగడమును సులభముగా అర్థము చేసుకోవచ్చును. భగవద్గీతలో మనిషియొక్క పునర్జన్మను వివరిస్తూ, మనిషి

తన జీవితములో ఎక్కువగా దేనిమీద ధ్యాసకల్గియుంటాడో, అటువంటి జన్మనే పొందునని తెల్పుచూ “రాజవిద్యా రాజగుహ్య

యోగము” అను అధ్యాయములో 25వ శ్లోకమున "యాన్తి దేవవ్రతాన్ దేవాన్" అని ఉన్నది. "దేవతా పూజ పొందించు

దేవతలనే” అన్నట్లు గతజన్మలో విగ్రహారాధనను ఎక్కువగా చేసినవారికి విగ్రహములో చేరు జన్మ కలుగవచ్చును. అదే

విధముగా దేవాలయములలోని ప్రతిమలలోనికి అనేకమంది ప్రవేశించి కొంతకాలముండి, తిరిగి చనిపోవుచుందురు.

ప్రతిమలను పూజించిన జీవుడు ఎవరైనా, లండన్లోని మ్యూజియంలోగల ప్రతిమయందు చేరి యుండవచ్చును. అలా

చేరినవాడు తన ఉనికిని తెలియజేయు నిమిత్తము అలా తిరిగియుండవచ్చును. అలా తిరిగిన బొమ్మ ఎల్లకాలమూ

తిరగదు. తనను గుర్తించుటకు మాత్రమే తిరగడము జరిగినది. ఆ తిరగడము అను పని కొన్ని దినములనుండి లేక

కొన్ని నెలలనుండి జరిగిన పని మాత్రమే. ఈ మధ్యకాలములో తిరుగుచున్న ప్రతిమ, తనను ఇతరులు గుర్తించిన


తర్వాత తిరగడము ఆగిపోవును. ప్రతిమ క్రింది భాగము భూమిలో పాతిపెట్టబడిన ప్రతిమలు తిరుగలేవు. గుడులలోని

ప్రతిమలు కొంత భూమిలో పాతిపెట్టబడియుండుట చేత అవి వాటి ఉనికిని వేరే విధానము చేత తెలియజేయును.


కొన్ని ప్రతిమలలోని జీవులు తాము బయటికి తెలియబడాలని కొన్ని ప్రయత్నములు చేయుచుందురు. కొన్ని

ప్రతిమలలోని జీవులు తాము ఎవరితోను సంబంధము పెట్టుకోకుండా, ఎవరికీ తెలియబడకుండా ఉందురు. అటువంటి

ప్రతిమలు భూమిమీదయున్నా తిరుగవు. మనుషులలో అనేక ఇష్టములు, అనేక మనస్తత్వములు ఉండుట వలన,

మనుషులే ప్రతిమలలో జీవులుగా పుట్టుట వలన, అక్కడ కూడా వేరువేరు మనస్తత్వములుగా ప్రవర్తించుచుందురు.

అటువంటి వాటిలో ఒక జీవుడున్న ప్రతిమ తిరుగడములో ఆశ్చర్యము లేదు. ప్రతిమలలో చేరిన జీవుడు కొంతకాలము

బ్రతికి అక్కడ చనిపోవడము జరుగును. అప్పుడు తిరిగి మనిషి జన్మలోనికి రావచ్చును. ప్రతిమ జన్మలో ఏ జీవుడూ

శాశ్వితముగా ఉండడు. ప్రతిమలలో కూడా చావడము, పుట్టడము జరుగుచుండును. మనిషి శరీరము రక్తమాంసములతో

కూడుకొన్నది. కావున జీవుడు పోయిన వెంటనే చెడిపోవును. అంతేకాక మనిషి శరీరమునకు నాలుగు దశలు కలవు.

ప్రతిమ శరీరమునకు దశలు ఏమాత్రము లేవు. ప్రతిమ రాతితో లేక లోహముతో చేయబడినది. కావున అందులోని

జీవుడు బయటికి పోయినా, చనిపోయినా ఆ ప్రతిమ చెడిపోదు. అందువలన అదే ప్రతిమలో మరొక జీవుడు జన్మ

తీసుకోవచ్చును. ప్రతి ప్రతిమలోను జీవుడుండును. తిరుపతిలోని మూలవిరాట్ వెంకటేశ్వరస్వామి ప్రతిమలో ఒక

జీవచైతన్యము ఉండగా, అక్కడే ఉత్సవ విగ్రహమను మరొక ప్రతిమలో మరొక జీవ చైతన్యముండును. అనగా అక్కడ

ఒకే వెంకటేశ్వరుడు అనుకొను గర్భగుడి లోని ప్రతిమయందూ, ఊరేగింపు చేయు ఉత్సవ ప్రతిమయందు వేరువేరు

జీవుళ్ళు, వాటితోపాటు ఆత్మయున్నది. ఈ విధముగా ప్రతిమలలో జీవుళ్ళు చేరియుండగా, ప్రతిమలు లేనిచోట కడవ

జోస్యము, చెంబు జోస్యములాంటి వాటివద్ద అప్పటికప్పుడు అంతరిక్షములోని గ్రహములుగానీ, ఉపగ్రహములుగానీ

వచ్చి తాత్కాలికముగా పనిచేసిపోవుచుండును. ప్రతిమలలో ఉన్నవి జీవాత్మలుకాగా, కడవజోస్యములో పనిచేసినది

దేవుని పరిపాలన లోని గ్రహములని తెలియవలెను.



స్థూలము మాత్రము తెలిసి సూక్ష్మము తెలియని వారిని, బయటి కన్నులుమాత్రముండి లోపల జ్ఞానదృష్టిలేని

వారిగా లెక్కించవచ్చును. అటువంటి వారికి భౌతికము మాత్రము తెలియును, అభౌతికము తెలియదు. వారికి

శరీరము యొక్క పై రూపము తెలియునుగానీ, శరీరములోని మనస్సు బుద్ధి యొక్క రూపము తెలియదు. మనస్సు

బుద్ధి ఉన్నట్లు కూడా ఖచ్చితముగా తెలియదు. అటువంటి భౌతికవాదులకు వారి శరీర రూపము తెలియును గానీ,

వారి స్వంతరూపము వారికి ఏమాత్రము తెలియదు. భౌతికవాదులకు వారి శరీరములోని అభౌతికమే తెలియదు.

అందువలన మ్యూజియమ్ బొమ్మ తిరుగుతుందంటే, దానికి అభౌతికమైన ఆత్మ జీవాత్మ కారణమని చెప్పక, అక్కడికి

వచ్చు సందర్శకుల పాదశబ్దమునకు అలా తిరుగుతుండ వచ్చునని జవాబు చెప్పారు. వారు చెప్పిన ఆ జవాబు పూర్తి

తప్పు. సందర్శకుల పాఠశబ్దమునకో, పాదస్పర్శకో, పాదతాకిడికో అలా ప్రతిమ కదలుతుందని చెప్పితే, అదొక్క

ప్రతిమయే ఎందుకు కదులుచున్నదనీ, మిగతా ప్రతిమలు ఎందుకు కదలలేదనీ మేము అడుగుచున్నాము. దానికి

వారు చెప్పలేరు.


నేడు దేశములో భౌతికవాదులు తొంభై (90) శాతము ఉండగా, పది (10) శాతము మంది మాత్రము

అభౌతికవాదులు కలరు. భూమిమీద స్థూలజ్ఞానము, సూక్ష్మజ్ఞానము అని రెండు రకముల జ్ఞానములు కలవు. స్థూల

జ్ఞానమును భౌతిక జ్ఞానమనీ, భౌతికవాదమనీ అనుచుండగా, సూక్ష్మ జ్ఞానమును అభౌతిక జ్ఞానమనీ, అభౌతికవాదమనీ


అనుచుందురు. ఇంకొక రకముగా చెప్పితే భౌతికమును హార్డ్వేర్ అనియూ, అభౌతికమును సాఫ్ట్వేర్ అనియూ

చెప్పవచ్చును. స్థూల, సూక్ష్మమను రెండు రకముల జ్ఞానములను తెలిసినవానిని సంపూర్ణజ్ఞాని అనవచ్చును. అట్లుకాక

స్థూలము తెలిసి, సూక్ష్మము తెలియని వానిని అసంపూర్ణ జ్ఞాని అని అనవచ్చును. నేడు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్

రెండిటిని తెలిసిన సంపూర్ణ జ్ఞానులు నూటికి పదిమందియుండగా, కేవలము హార్డ్వేర్ (స్థూలమును) మాత్రము

తెలిసిన అసంపూర్ణ జ్ఞానులు తొంభైశాతముయున్నారు. అసంపూర్ణ జ్ఞానులైనవారు సంపూర్ణ జ్ఞానులైనవారిని హేళనగా

మాట్లాడుచూ, తామే పూర్తి జ్ఞానులమని తలచుకొనుచూ, అనేక పేర్లుగల సంఘములను స్థాపించుకొన్నారు. సూక్ష్మము

యొక్క ప్రస్థావన ఎక్కడ వచ్చినా దానిని లేనేలేదనీ, స్థూలము మాత్రము సత్యమనీ, సూక్ష్మము అసత్యమనీ వాదించుచుందురు.

అటువంటి వారు లోకములో జరుగుచున్న ఎన్నో సంఘటనలకు సమాధానమివ్వలేక, వాటన్నిటినీ అసత్యమని

చెప్పుచుందురు. లండన్ మ్యూజియమ్ లో ప్రతిమ తిరుగుచున్నదంటే దానిని అసత్యమనీ, కావాలని ఇతరులు ఏవో

ఏర్పాట్లు చేసి, ఎవరికీ తెలియకుండా బొమ్మను తిరుగునట్లు చేసియుందురనీ, సైన్సు ప్రకారము బొమ్మ తనంతటతాను

తిరగదనీ, అదంతయు బూటకమనీ తాము నిరూపణ చేయగలమనీ చెప్పుచుందురు.


భూమిమీద ఎక్కువ శాతముకల్గిన ఆధ్నాలెడ్జి మనుషులు (సగము జ్ఞానముగలవారు) మిగత పూర్తి

జ్ఞానముగలవారిని జ్ఞానము తెలియని వారిగా, మూఢనమ్మకముగలవారిగా లెక్కించి మాట్లాడడము జరుగుచుండును.

అటువంటివారికి విజ్ఞానమంటే ఏమిటో తెలియదుగానీ, మేము విజ్ఞానులమని చెప్పుచుందురు. అంతేకాక వారికి

శాస్త్రములెన్నో కూడా తెలియదుగానీ, మేము శాస్త్రజ్ఞానముగలవారిమని చెప్పుకొనుచుందురు. మనిషికి కావలసిన

విజ్ఞానము స్థూలరూపములోనిదా, లేక సూక్ష్మరూపము లోనిదా అని తెలియదుగానీ, మేము మనుషులలో విజ్ఞానులమని

చెప్పు కొనుచుందురు. అటువంటివారికి మనిషిలోనున్న సూక్ష్మశక్తి ఏమిటో తెలియదు. పుట్టిన సమయములో జాఫతకము

ప్రకారము (జాతకము ప్రకారము) బుధగ్రహము అనుకూలముగాయుండి, పుట్టిన సమయమునకు అనగా లగ్నమునకు

ఐదవ స్థానములో బుధగ్రహము చూడడముగానీ, ఉండడముగానీ జరిగియుంటే, జన్మించినవాడు కన్యాలగ్నములోగానీ,

మిథునలగ్నములోగానీ పుట్టియుంటే అటువంటివాడు సూక్ష్మజ్ఞానముగల వాడగును అని ముందే ఆ వ్యక్తియొక్క జాతకములో

వ్రాసిపెట్టవచ్చును. అటువంటి వ్యక్తికి జాతకములో చంద్రుడు, కేతువు అను రెండు గ్రహములు అనుకూలించియుంటే

దైవజ్ఞానములో ఎవరికీ తెలియని సూక్ష్మవిషయము లను ఎన్నిటినో తెలిసియుండునని చెప్పవచ్చును. ఈ విధముగా

భవిష్యత్తులో జరుగు కొన్ని విషయములను చెప్పగలుగు సూత్రములు గలది జ్యోతిష్య శాస్త్రము. జ్యోతిష్యశాస్త్రము ఆరు

శాస్త్రములలో ఒకటి. అయితే కొందరు సగము మెదడుగలవారు జ్యోతిష్యము శాస్త్రమేకాదని చెప్పుచున్నారు.

అటువంటివారు వర్షము యొక్క విషయమును ముందే తెలియజేయు కడవ జోస్యమును మూఢనమ్మకమని, అసత్యమని

చెప్పుదురు. అటువంటి వారే మ్యూజియమ్లో ప్రతిమ తిరుగుచున్నదంటే, దాని విషయము ఏమాత్రము తెలియకున్నా

దానిని అసత్యమందురు. ఇతరులు అలా చేసియుందురని చెప్పుదురు. అటువంటి వారు ఎప్పటికీ పూర్తి జ్ఞానులు

కాలేరు. వారికి ఎన్నటికీ సూక్ష్మజ్ఞానము తెలియదు. ఇప్పుడు జ్యోతిష్యమును గురించి కొందరు అడుగు ప్రశ్నను

తీసుకొని వారికి కూడా సమాధానము ఇస్తాము.


ప్రశ్న :- జ్యోతిష్యము అబద్ధము కాదా? రాగిరేకులు, అంత్రాలు, మంత్రాలు మూఢనమ్మకము కాదా? వాస్తు వలన

కష్టాలు పోతాయా, సుఖాలు వస్తాయా? వాస్తుశాస్త్రమా?

జవాబు :- పూర్తి జ్ఞానము కల్గిన మనిషి ప్రశ్నించే దానికీ, సగము జ్ఞానము కల్గిన మనిషి ప్రశ్నించేదానికీ ఎంతో తేడా


ఉంటుంది. పూర్తి జ్ఞానము కల్గినవాడు ఏవి ప్రశ్నలో తెలిసి ప్రశ్నించవలసిన దానినే ప్రశ్నించును. అదే సగము

జ్ఞానముకల్గినవాడు ప్రశ్నించవలసిన ప్రశ్ననే కాకుండా ప్రశ్నలు కానివాటిని కూడా ప్రశ్నించును. ఇక్కడ జ్యోతిష్యము

అబద్దము కాదా? అను ప్రశ్న కూడా అలాగే ఉంది. శాస్త్రములు ఎన్ని, పురాణములు ఎన్ని అను విషయము తెలియకుండా

వాటికి సంబంధించిన ప్రశ్నలడగడము సంగీత జ్ఞానము ఏమాత్రము లేనివాడు రాగమంటే ఏమిటి? తాళమంటే ఏమిటి?

రాగము నిజమైతే తాళము అబద్దముకాదా? అని ప్రశ్నించి నట్లుంటుంది. సంగీతములో రాగము తాళము మనిషికి

గాలి నీరులాంటివి. వాటిలో ఒకటి సత్యము మరొకటి అసత్యము అని ప్రశ్నించితే, అది పూర్తి అజ్ఞానముతో ప్రశ్నించిన

ప్రశ్న అగును. అలాగే శాస్త్రములు సత్యముతో కూడుకొన్నవి, పురాణములు అసత్యముతో కూడుకొనియున్నవను విషయము

తెలియకుండా శాస్త్రములు సత్యమా? అని ప్రశ్నించినట్లు పై ప్రశ్న గలదు.


షట్ శాస్త్రములు, అష్టాదశపురాణములు అని తెలియకనే వాటిని గురించి ప్రశ్నించితే ఆ ప్రశ్న హాస్యాస్పదము

కావచ్చును. అలాగే శాస్త్రములు ఎన్ని? అవి ఏవి? అని కనీస ప్రాథమిక జ్ఞానము తెలియకుండానే జ్యోతిష్యము

అబద్దము కాదా! అని ప్రశ్నించారు. షట్ శాస్త్రములలో జ్యోతిష్యము ఒకటి అయినప్పుడు శాస్త్రమును అబద్దమని

మేము ఎలా చెప్పగలము? అడిగే వానికి హద్దు పద్దూ లేకున్నా, చెప్పేవానికి రెండూ ఉండవలసిందే. కావున శాస్త్రము

సత్యము, పురాణము అసత్యముతో కూడుకొన్నదను నియమమును చెప్పేవాడు మరువకూడదు. జ్యోతిష్యము ఒక

శాస్త్రమైనప్పుడు అది పూర్తి సత్యమగును. అయితే ముఖ్యముగా గమనించవలసిన విషయమేమంటే గణితశాస్త్రము

ఎంతో అభివృద్ధి చెందినది. దానిలో ఎన్నో సూత్రములను ఎందరో కనుగొనడము జరిగినది. ఈ మధ్యకాలములోనే

గణితములో ఎన్నో క్రొత్త సూత్రములను కనుగొని క్రొత్త విధానముగా లెక్కించడము జరుగుచున్నది. అటువంటి

వాటిలో ఆల్జీబ్రా, అబాకస్ అనునవి కూడా కలవు. అయితే జ్యోతిష్యములో అలాంటి పరిశోధన జరుగలేదు. అందువలన

జ్యోతిష్యశాస్త్రము పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందకపోవడము వలన జ్యోతిష్యమునుండి పూర్తి ఫలితమును

మనము పొందలేకపోవుచున్నాము. వెలగపండును ఎలా తినాలో తెలియక దానిని పండేకాదు, ఇది చెట్టుకు కాసినదేకాదు

అంటే ఎలాగుండునో, జ్యోతిష్యమును శాస్త్రమేకాదు అనడము అలాగే ఉండును.


నేను చిన్నప్పటినుండి హేతవాద దృక్పథము ఎక్కువగా కల్గిన వానిని. ఏదైనా ఒక విషయమును పూర్తిగా

తెలుసుకునేంతవరకు దానిని గురించి వదలేవాడినికాదు. ఆ విధముగా జ్యోతిష్యములోని సత్యమును తెలుసుకోవడానికి,

దానికి సంబంధించిన సూత్రములు ఏవి ఉన్నవో తెలుసుకోవడానికి, జ్యోతిష్యులని పేరుగాంచిన వారివద్దకు పోయి,

వారు ఏ సూత్రముల ఆధారముతో జ్యోతిష్యమును చెప్పుచున్నారో గమనించేవాడిని. పొట్టకూటికొరకు కొందరు

జ్యోతిష్యమను పేరును వాడుకొనుచు గద్దె, శుద్ధి, చిలుకజోస్యము అని కొందరు చెప్పుకొనుచుండగా, కొందరు బ్రతుకు

తెరువుకొరకు జ్యోతిష్యాలయములని బోర్డుపెట్టుకొని ఈ ప్రశ్నకు ఇంతరేటు అని డబ్బులు లాగువారు కూడా కలరు.

మేము ఎందరో జ్యోతిష్యులను చూచిన తర్వాత అందరూ చెప్పునది జ్యోతిష్యము కాదు. కొందరు చెప్పునది మాత్రమే

జ్యోతిష్యమని గ్రహించగలిగాము. అన్నీ చూచిన తర్వాత జ్యోతిష్యము అందరూ అనుకొన్నట్లు మూఢనమ్మకముకాదు,

అది ఒక శాస్త్రము అని గుర్తించగలిగాము. నేడు భూమిమీద గల శాస్త్రములలో కొన్ని వెనుకబడిపోయాయి, కొన్ని

బాగా ముందుకు పోయాయి. గణితము, ఖగోళము, రసాయన, భౌతికశాస్త్రములు నాలుగు నేడు బాగా అభివృద్ధి

చెందాయి, ఇంకా అభివృద్ధి చెందుచునే ఉన్నాయి. వాటిని గురించి నిరంతర పరిశోధనలు జరుగుచునే ఉన్నాయి. ఈ

నాలుగు శాస్త్రములు ఎంతో ఉన్నత స్థాయిలో మనిషికి ఉపయోగపడుచున్నవి. అయితే ఆరు శాస్త్రములలో కేవలము


రెండు మాత్రము ఎటువంటి పోషణ లేక, ఎటువంటి అభివృద్ధి లేక మనిషి ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నవి. ఆ

రెండు శాస్త్రములే ఒకటి జ్యోతిష్యశాస్త్రము, రెండవది బ్రహ్మవిద్యాశాస్త్రము. ఈ రెండిటిలో జ్యోతిష్యశాస్త్రము యొక్క

పేరును చాలామంది వాడుకొనుచూ, మేము జ్యోతిష్యులము అని చెప్పుకొంటున్నారు. అలాగే బ్రహ్మవిద్యాశాస్త్రము

యొక్క పేరుకూడా తెలియనివారు కొందరు మేము స్వామీజీలము అని ప్రచారమైనారు. అయితే జ్యోతిష్యులమను

వారిలో ఎవరో ఒకరు నిజమైన జ్యోతిష్యుడు ఉండవచ్చును. అలాగే స్వామీజీలమను వారిలో ఎవరో ఒకరు నిజమైన

దైవజ్ఞానము తెలిసిన స్వామి ఉండవచ్చును.


భూమిమీద ఉండే స్వామీజీలకంటే జ్యోతిష్యులు అనేకరెట్లు ఎక్కువగా యున్నారు. జ్యోతిష్యులైన వారిలో

జ్యోతిష్యమును శాస్త్రముగా లెక్కించేవారు కొందరు గలరు. జ్యోతిష్యమును శాస్త్రముగా గుర్తించినవారు శాస్త్రబద్దమైన

విధానమునే అనుసరిస్తూ, దానిద్వారా మంచి ఫలితమును పొందుచున్నారు. కొందరు జ్యోతిష్యులు కొందరు నాస్తికులు

అడుగు ప్రశ్నలకు సరియైన జవాబును ఇవ్వలేకపోవడము వలన, జ్యోతిష్యము మూఢనమ్మకము అని ప్రచారమైనది.

ఒక న్యూస్ ఛానల్లో జ్యోతిష్యము మీద కొందరు నాస్తికులు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు పంచాంగకర్తలని

పేరుపొందినవారే సరియైన జవాబు ఇవ్వలేకపోవడము, జ్యోతిష్యము శాస్త్రముకాదు మూఢనమ్మకము అనునట్లయినది.

అప్పటినుండి ఆ న్యూస్ ఛానల్వారు జ్యోతిష్యము మూఢనమ్మకము అని ప్రకటించడము మొదలు పెట్టారు. నాకు

తెలిసినంతవరకు జ్యోతిష్యము అబద్దముకాదు, మూఢ నమ్మకము అంతకూకాదు. జ్యోతిష్యము ఒక శాస్త్రము, అది

సత్యము. శాస్త్రము సత్యముతో కూడుకొన్నదనీ, పురాణము అసత్యముతో కూడుకొన్న దను సూత్రమును తెలియకపోతే,

జ్యోతిష్యమును కూడా ఒక పురాణము క్రిందికి లెక్కించడము జరుగుతుంది. అలా కాకుండా ఆరు శాస్త్రములలో

జ్యోతిష్యము ఐదవ శాస్త్రమని తెలియవలెను.


సత్యమైన జ్యోతిష్యమే శాస్త్రముగా గుర్తింపబడని ఈ కాలములో, అసత్యమైన వాస్తు అనునది వాస్తుశాస్త్రముగా

గుర్తింపు పొంది, బాగా ప్రచారమైపోవడము మాకు చాలా ఆశ్చర్యముగా ఉంది. ఈ మధ్యకాలములో బాగా ప్రచారమైన

వాస్తుశాస్త్రమనునది ఏ విధముగా చూచినా అది శాస్త్రము కాదు. వాస్తువలన కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి

అనడము పూర్తి భ్రమ అని చెప్పవచ్చును. వాస్తును శాస్త్రముగా చెప్పుకొనుచూ, నివసించే ఇల్లు ఇలాగుంటే ఇలాంటి

ఫలితముందని చెప్పడము పూర్తి అసత్యము. ఆ మాట శాస్త్రబద్ధమైనది కాదు. అయినా మనుషులకున్న ఆశలను

గ్రహించిన కొందరు, తాము వాస్తును తెలిసిన జ్యోతిష్యులమని చెప్పు కొనుచూ, వాస్తును చెప్పడమే పనిగా పెట్టుకొని,

ఆ పని ద్వారా విపరీతముగా డబ్బులు సంపాదించుకొన్నవారు కలరు. ఎవరు ఎలా ఉన్నా వాస్తు అనునది అవాస్తవము.

అది శాస్త్రము ఏమాత్రము కాదు. జ్యోతిష్యము పూర్తి శాస్త్రముగా ఉన్నది. కావున మనిషియొక్క భవిష్యత్తులో వానికున్న

స్థిర చరాస్థులు కూడా జ్యోతిష్యము వలన కొంతవరకు తెలియవచ్చును. అప్పుడు ఒక మనిషికి స్థిరాస్తి అయిన ఇల్లు

ఎలా ఉంటుందో ముందే చెప్పవచ్చును.


జ్యోతిష్యములో ఇల్లు ఎలా ఉంటుందో చెప్పవచ్చునుగానీ, ఇంటి వలన సుఖదుఃఖములు, లాభనష్టములు

కల్గునని చెప్పుటకు వీలులేదు. మనిషి శరీరములో నిర్ణయింపబడిన ప్రారబ్ధకర్మను తెలియుటకు జ్యోతిష్యము

ఉపయోగపడును. అంతతప్ప జ్యోతిష్యము వలన కర్మను మార్చుకొనుటకు గానీ, కర్మను లేకుండా చేసుకొనుటకుగానీ

వీలుపడదు. మనిషి జీవితము లోని ప్రారబ్ధమును మనిషి అనుభవించవలసినదే గానీ, జ్యోతిష్యము వలన ముందుగా

తెలుసుకొని తప్పించుకొనుటకు వీలుపడదు. శాస్త్రమైన జ్యోతిష్యములోనే కర్మను తప్పించుకొనుటకుగానీ, మార్చు


కొనుటకుగానీ వీలులేనప్పుడు, శాస్త్రమేకానటువంటి వాస్తువలన కర్మ మారునని, కష్టముల నుండి తప్పించుకోవచ్చునని

చెప్పడము పూర్తి తప్పగును మరియు ప్రజలను మోసగించినట్లగును. వాస్తువలన ఫలితము లభించలేదనీ, వాస్తు

జ్యోతిష్యము లోని భాగమని తలచి, వాస్తునుబట్టి ఫలితము లేని దానివలన జ్యోతిష్యమును కించపరచి మాట్లాడడము,

జ్యోతిష్యమును శాస్త్రము కాదనడము సరియైన పద్ధతి కాదు. వాస్తుకు జ్యోతిష్యమునకు ఏమాత్రము సంబంధములేదు.

అందువలన వాస్తును శాస్త్రముకాదని చెప్పవచ్చునుగానీ, జ్యోతిష్యమును శాస్త్రముకాదని చెప్పకూడదు.


ఇకపోతే ఈ ప్రశ్నలో అంత్రాలు, మంత్రాలు మూఢనమ్మకము కాదా? అని అడిగారు. జ్యోతిష్యమును వాస్తును

కలుపుకొని అవి శాస్త్రమా, సత్యమా అని అడిగిన దానికి వాస్తును మూఢనమ్మకమనీ, జ్యోతిష్యమును శాస్త్రమని మేము

చెప్పడము జరిగినది. మనకు తెలియనివన్నీ మూఢనమ్మ కములనీ, అసత్యములనీ, తెలిసినవన్నిటినీ సత్యమని చెప్పడము

నేడు చాలామందికి అలవాటై పోయినది. మనకు తెలియకున్నా కొన్ని సత్యములని మరువకూడదు. ఆ విధానములో

మంత్రములు, అంత్రములు మూఢనమ్మ కము కాదు అని చెప్పుచున్నాము. చిన్నప్పటినుండి చదువుతప్ప మిగత

విషయములు ఏమీ తెలియనివారు దయ్యములను, అంత్రములను, మంత్రములను నమ్మరు. దయ్యములు, అంత్రములు,

మంత్రములు అంటే ఏమిటో తెలియనివారు మూఢముగా వాటి విషయములను ఖండించు చున్నారు. మూర్ఖముగా

లేవనీ, మేము నమ్మమనీ చెప్పడము తప్ప శాస్త్రీయముగా అవి లేవు అని ఏ ఆధారమును చూపలేరు. వాస్తవముగా

భౌతికశాస్త్రమును అనుసరించి దయ్యములు ఉన్నవి. కావున దయ్యములను శాస్త్రబద్ధమైనవని మూఢనమ్మకము

కాదని చెప్పవచ్చును. దయ్యముల విషయములను సంపూర్ణముగా తెలియాలంటే, మా రచనలలోని “దయ్యాల-భూతాల

యదార్థసంఘటనలు” అను గ్రంథమును చూడ వచ్చును.


ఇక మంత్రాలు, యంత్రాలు అను విషయానికి వస్తే, వాటిని గురించి చాలామందికి తెలియదనియే చెప్పవచ్చును.

అంత్రాలను వ్రాసి కట్టువారిని అంత్రాల విషయమును గురించి అడిగినా, వాటిని గురించి సరియైన సమాచారము

చెప్పలేరు. దానితో వాటిని గురించి పూర్తిగా వారికి కూడా తెలియదని తెలిసిపోవుచున్నది. అలాగే మంత్రాల

విషయానికి వస్తే మంత్రించు వారికి కూడా వాటి సంపూర్ణ విషయము తెలియదు. ఆ పనిని చేయువారు వాటిని

గురించి చెప్పలేనంతమాత్రమున అవి అసత్యములు కావు. అంత్రములు సత్యమే, మంత్రములు సత్యమే. అంత్ర

మంత్రములను గురించి నా బుద్ధికి తెలిసిన విషయమును తెలుపుచున్నాను జాగ్రత్తగా వినండి”. “రం” అను శబ్దము

నాశనము అనుదానికి బీజాక్షరముగా ఉందని మేము చాలామార్లు చెప్పాము. “ర” అను శబ్ధము నాశనము చేయునదని

అర్థమునిచ్చుచున్నది. అంత్రము అను పదమును విడదీసి చూస్తే అంత+రము అని కలదు. అంత అనగా లోపల లేక

కనిపించక అని అర్థము. రము అనగా నాశనము చేయునది అని అర్థము. పూర్తిగా చెప్పితే లోపల నాశనము

చేయునది అని అర్ధము. లోపల కాబట్టి బయటికి కనిపించదు. అందువలన శరీరము లోపలయున్నదేనినో నాశనము

చేయునది అంత్రము. అలాగే మంత్రమును విడదీసి చూస్తే మంతరము అని ఉన్నది. మాటలలోనున్న శక్తిని

'మంత' అని చెప్పవచ్చును. మాటలలోనున్న శక్తికి నాశనము చేయగల్గుశక్తి ఉన్నది. కనుక దానిని మంత్రము

అంటున్నాము. అంతరములు శరీరములోని దయ్యమును లేకుండా చేస్తాయి. మంతరములు శరీరములోని రోగములను

సహితము లేకుండా చేస్తాయని కొందరికి తెలుసు. అందువలన వాటికి అంత్రము అనియూ, అలాగే మంత్రము

అనియూ పేరు పెట్టడము జరిగినది. అంత్రము మరియు మంత్రము రెండూ కొంత శక్తి కల్గినవైయున్నవి. ఆ శక్తి

మనకు తెలియకుండావున్నా కొంత కర్మను కనిపించకుండా చేయుచున్నది.



కొన్ని శబ్దములను అక్షరరూపముతో వ్రాస్తే దానిని అంత్రము అంటాము. అలాగే కొన్ని శబ్దములను

మాటరూపముగా చెప్పితే మంత్రము అంటాము. అంత్రము వ్రాతరూపములో ఉండును. మంత్రము మాట రూపములో

ఉండును. చెప్పడములో వేరువేరు పదములుగాయున్నా రెండిటిలోనూ శక్తియుండును. ఉదాహరణకు “ఓం శ్రీం

హ్రీం రం స్వాహా” అను శబ్దములను అక్షరములుగా వ్రాస్తే అది అంత్రమగును. అవే శబ్దములనే మాటగా చెప్పితే

మంత్రమగును. ఒకే శబ్దమునే అంత్రముగానైనా లేక మంత్రముగానైనా ఉపయోగించుకోవచ్చును. ఎలా

ఉపయోగించుకొన్నా అందులోగల శక్తి ఉపయోగపడును. ఒక శబ్దములోని శక్తి దీర్ఘ కాలముగా పనిచేయుటకు, ఆ

శబ్దమును అక్షరరూపముగానున్న అంత్రముగా వ్రాయవలసియుండును. అలాగే శబ్దములోని శక్తి తాత్కాలికముగా పని

చేయుటకు, ఆ శబ్దమును మాటరూపముగానున్న మంత్రముగా చెప్పవలసి యుండును. ఒక మందును నోటి ద్వారా

ఇస్తే మాత్ర (టాబ్లెట్) అవుతుంది. అదే మందును చర్మము ద్వారా కండరములలోనికి ఇస్తే సూదిమందు (ఇంజక్షన్)

అవుతుంది. ఈ విధముగా ఒకే శబ్దము వ్రాస్తే అంత్రము, చెప్పితే మంత్రము అగుచున్నది. అంత్రమైనా మంత్రమైనా

దైవజ్ఞానమున్న వాడే దానిని సృష్టించవలెను. అలా యోగిచేత సృష్టింపబడిన వాటికి శక్తియుండును. ఒక మంత్రము

చేతగానీ లేక అంత్రము చేతగానీ ఒకనికిగల శరీరములోని కడుపునొప్పి పోయినప్పుడు అది మంత్రము వలన లేక

అంత్రము వలన జరిగిన యదార్థసంఘటన కాదా? ఒక అంత్రముతో ఒకని బాధ నివారణ అయితే, ఒక మంత్రముతో

ఒకనిలోని దయ్యము తొలగిపోతే అప్పుడు అంత్రముగానీ, మంత్రముగానీ యదార్థమని జరిగిన సంఘటననుబట్టి

తెలియుచున్నది కదా! అలా తెలుస్తున్నా దానిని మూఢనమ్మకము అంటే అంతకంటే తెలివితక్కువ మాట ఉండదు.

అన్ని విధముల అంత్రము మంత్రము రెండూ సత్యమనీ, మూఢనమ్మకము కాదనీ తెలియుచున్నది. ఇప్పుడు అంత్రము

మంత్రమును గురించి పూర్తి అర్థము తెలుసుకోగలిగాము. మంత్రములను ఉచ్ఛరించువాడు మంత్రగాడు అని

పిలువబడుచున్నాడు. మంత్రమును తయారు చేయువాడు యోగి అగును. యోగులు ఏ మంత్రమునైనా తయారు

చేసి, శరీరములోని ఒక రోగమును ఆ మంత్రము ద్వారా లేకుండా చేయగల శక్తిగలవారైయుందురు. ఇప్పుడు

యంత్రమునకు సంబంధించిన క్రొత్త ప్రశ్నను గురించి చూస్తాము.


ప్రశ్న :- అంత్రము, మంత్రము అనువాటికి అర్థము చెప్పారు. ఏది అంత్రమో, ఏది మంత్రమో తెలియునట్లు చెప్పారు.

కొందరు అంత్రమును యంత్రము అని అనుచుందురు. అంతేకాక బయట ప్రపంచములో పని చేయు పరికరములుగా

అనేక యంత్రములు కలవు. ఒక పరికరముగా, ఒక పని చేయునదిగాయున్న యంత్రమునకు అర్థము కలదా? వ్రాస్తే

అంత్రము, చెప్పితే మంత్రము అయినప్పుడు, వ్రాతగాగానీ, మాటగాగానీ లేని యంత్రమును ఏమనవచ్చును? చెప్పగలరా?


జవాబు :- వ్రాతగాయున్నది అంత్రము, మాటగాయున్నది మంత్రము అయినప్పుడు చేతగాయున్నది యంత్రము

అగుచున్నది. చేత అనగా చేయునది అని అర్థము. ప్రకటించే భావములో అంత్రము, మంత్రము, యంత్రము అను

వాటియందు తేడాయున్నా, వాటి మూడిటి ముందు గల అం, మం, యం అను అక్షరములలో మాత్రము తేడాగలదు.

మూడు పదములలో చివరిలోగల 'త్రము' అను అక్షరములలో మాత్రము ఏ తేడా లేదు. త్రము లో ముఖ్యముగా ఉన్నది

“ర” అను అక్షరము. రము అనినా “రమ్” అనినా నాశనము చేయునదని అర్థము. ఆ విధముగా అంత్రముతో చిన్న

బాధ, మంత్రముతో పెద్ద బాధ లేక ఏదో ఒక బాధపోయినట్లు తెలియుచున్నది. కనుక అంత్రము, మంత్రము యొక్క

విధానములు వేరైనా, ముఖ్యమైన పని కొంత బాధను నాశనము చేయడమేనని తెలియుచున్నది. ఉన్న బాధ అంత్రము,

మంత్రములో లేకుండా నాశనము చెందినట్లు, యంత్రములలో ఇంధనము అనునది లేకుండా పోవుచున్నది. ప్రతి


యంత్రములో కూడా నాశనము జరుగుచున్నది. కొన్ని యంత్రములలో ఇంధనముగా చమురు (ఆయిల్) ఉండగా,

కొన్ని యంత్రములలో విద్యుత్తు (కరెంటు) అయిపోవుచున్నది. మరికొన్ని యంత్రములలో వంటచెరుకు (కట్టెలు)

అయిపోవుచున్నది. మరికొన్నిటిలో గ్యాస్ లేక ఆవిరి ఖర్చవుచున్నది. ఈ విధముగా యంత్రములలో కూడా ఏదో

ఒకటి నాశనము చెందడము జరుగుచున్నది. అందువలన ఆ మూడు పదముల చివరిలో “రము” అని చెప్పడము

జరిగినది.


యంత్రములో కనపించునది (స్థూలముగా ఉన్నది) ఇంధనముగా ఉన్నది. అంత్రములో, మంత్రములో

కనిపించనిది (సూక్ష్మముగా ఉన్నది) ఇంధనముగా ఉన్నది. కనిపించే దానిని తెలియుటకు కొద్దిపాటి తెలివి యుంటేచాలు

సరిపోతుంది. కనిపించని దానిని తెలియుటకు కొద్దిపాటి తెలివి (కొద్దిపాటి బుద్ధి) సరిపోదు. ఎంతో తెలివి అవసరము.

సమాజములో కొంత తెలివియున్నవాడు కూడా తనను తాను మేధావిగా లెక్కించుకొను చుండును. అటువంటి వారి

కొద్దిబుద్ధికి సూక్ష్మమైనది తెలియకపోవడము వలన అభౌతికము లేనే లేదు అని చెప్పుచుందురు. అధిక బుద్ధియున్న

వారికి కనిపించని చిన్న విషయమైనా (సూక్ష్మ విషయమైనా) తెలియు చుండును. అందువలన వారు అభౌతికమును

గురించి చెప్పుచుందురు. అటువంటివారిని అభౌతికవాదులని అనుచుందుము. దీనినిబట్టి మనిషిలో నున్న బుద్ధి

హెచ్చుతగ్గులను (ఎక్కువ తక్కువలను) బట్టి భౌతికవాది, అభౌతిక వాదియని చెప్పవచ్చును. నేడు మేము విజ్ఞానులము,

మేథావులము, సైన్సు మాకు బాగా తెలుసు అను వారికి (సూక్ష్మమైన) అభౌతికము తెలియదు. కావున వారిని మనము

తెలివితక్కువ వారి క్రిందికి జమకట్టవచ్చును. తమంతకు తాము మేధావులమని చెప్పుకొనుచున్నా, ఇతరులచేత పొగడ

బడుచుండినా, విశ్వవిద్యాలయములలో మేథావులుగా గుర్తింపు పొందినా, చివరికి వారు సూత్రము ప్రకారము మేథావులు

కారు.


మనిషి ఒక రోగము చేత ప్రత్యక్షముగా బాధపడుచుండడము కనిపిస్తున్నది లేక తెలియుచున్నది. రోగము

ఉన్నట్లు తెలియుచున్నా, రోగమునకు కారణమైన క్రిములు కనిపించవు. రోగమునకు కారణమైన క్రిములను చూచుటకు

ప్రత్యేకించి “మైక్రోస్కోపు” అను దానిని ఉపయోగి స్తున్నాము. పైకి కనిపించు బాధను లేక రోగమును చూచునది కన్ను.

కన్ను పైన స్థూలముగానున్న కొన్నిటిని మాత్రము చూపగలదు. సూక్ష్మముగా నున్న కొన్నిటిని చూపలేదు. అందువలన

కనిపించని రోగక్రిములను చూచుటకు మైక్రోస్కోపును వినియోగించవలసివచ్చినది. అదే విధముగా మనిషికి పైనుండు

విషయములను తెలియుటకు బుద్ధి ఉపయోగపడినా, సూక్ష్మమైన కనిపించని విషయములను చూచుటకు కంటికి మైక్రోస్కోపు

జోడైనట్లు, మనిషి బుద్ధికి జ్ఞానము తోడు కావలెను. అప్పుడు జ్ఞానదృష్టి ఏర్పడును. కనిపించని సూక్ష్మవిషయములు,

కర్మలు మొదలుకొని జన్మ రహస్యముల వరకు జ్ఞానదృష్టికి తెలియును. అప్పుడే యంత్రమునకు, అంత్రమునకు,

మంత్రమునకు తేడా తెలియును.


ప్రశ్న :- భూమిమీద ఏదో ఒక దేశములో, ఒక ప్రాంతములో అంతవరకు ఎక్కడాలేని క్రొత్త రోగము ప్రజలలో

వ్యాపించి చనిపోవునట్లు చేయుచున్నది. క్రొత్త రోగమైన దానివలన దానికి మందులు ఉండవు. మందులు లేనిదానివలన

రోగము శరీరమంతా వ్యాపించి మనుషులను చంపగలుగు చున్నది. క్రొత్తగా వచ్చిన రోగమును పరీక్షించి తిరిగి దానికి

మందులు తయారు చేయునంతవరకు ఆ క్రొత్త రోగము మనుషులను పీడించుచునే ఉండును. ఎక్కడాలేని రోగము

ఎలా తయారై వస్తున్నదని ప్రశ్నిస్తే, దానికి జవాబు ఈ విధముగా ఉన్నది.


జవాబు :- దేవునికి తెలియకుండా ఏమీ జరుగదు. అన్నిటికీ సృష్ఠికర్త దేవుడే. దేవుడు సృష్టికర్త అయినా ఆయన పని


చేయడు, దేనినీ సృష్టించడు. దేవుడు తన పరిపాలనలోని భూతముల వలనగానీ, గ్రహముల వలనగానీ దేనినైనా

సృష్ఠించుచున్నాడు. క్రొత్త రోగ క్రిమిని దేవుడు తన పాలనలోని మేఘముల వలన తయారు చేయుచున్నాడు. కొన్ని

మేఘములు తమయందు క్రొత్త క్రిమిని తయారుచేసి, ఒక రోగమును బయటికి వ్యాపింపజేయునవిగా ఉన్నవి. భూమిమీద

ఎక్కడా లేని క్రొత్తరోగమును మేఘములు సృష్ఠించుచున్నవని తెలియుచున్నది. అంతేకాక మేఘము భూమికి దగ్గరగా

కొన్ని ప్రాంతములలో రావడము జరుగుచున్నది. అలా వచ్చినప్పుడు క్రొత్త రోగము వ్యాప్తిచెందుటకు అవకాశము

కలదు. అలాగే ఒక రోగము భూమిమీద ఎక్కడా కనిపించకుండా పోవుటకు కారణము మేఘమేనని చెప్పవచ్చును.

మేఘములు మనుషులకు తెలియనన్ని ఎన్నో పనులను చేయుచున్నవి. అందులో భాగముగా కొన్ని లేని రోగములను

తెచ్చి పెట్టుచున్నవి. కొన్ని ఉన్న రోగములను లేకుండా తీసుకుపోవుచున్నవి. మేఘము వలన రోగము వస్తున్నదని,

ఇంతవరకూ ఏ శాస్త్రవేత్తా కనుగొన లేకపోయాడు.


ప్రశ్న :- నీరుగానీ, ఆహారముగానీ, లేకుండా మనిషి బ్రతుకగలడా? ఆహారమును, నీరును ఏమాత్రము తీసుకోని

మనిషికి శరీరములో శక్తి (క్యాలరీస్) ఎలా తయారగును? అలాంటి మనిషి బలహీనుడు కాడా? అనారోగ్యము పాలు

కాడా? ముప్పయి లేక నలభై రోజులకంటే ఎక్కువ కాలము ఆహారములేకుండా మనిషి ఉండగలడా?


జవాబు :- ఒక మనిషి జీవించుటకు కావలసిన పోషకములు శరీరము లోనికి చేరుటకు శరీరమునకు రెండు

మార్గములున్నవి. మనిషి బ్రతుకుటకు రెండు మార్గముల ద్వారా శరీర పోషకములు శరీరములోనికి చేరునట్లు దేవుడు

శరీరమును తయారు చేశాడు. మనిషి జీవించుటకు శరీరము లోపలికి చేరిన పోషకములు శరీరమునకు వినియోగపడిన

తర్వాత మార్పు చెంది, ఏ ఉపయోగమూ లేని వృథా పదార్థములుగా శరీరమునుండి నాలుగు మార్గముల ద్వారా

బయటికి వస్తున్నవి. శరీరమునకు ఉపయోగపడు పోషకములను మూడు రకములుగా విభజించవచ్చును. మూడిటిని

విభజించి చెప్పితే ఒకటి వాయురూపములో ఉండగా, రెండవది ద్రవ రూపములో, మూడవది ఘనపదార్థరూపములో

ఉన్నది. ఈ మూడు రకముల శరీర పోషకములు శరీరములోనికి రెండు దారులలో చేరుచున్నవి. వాయురూపములోనున్నది

ముక్కు రంధ్రము అను ద్వారము గుండా శరీరములోని ఊపిరితిత్తులకు చేరుచున్నది. మిగత ద్రవ, ఘనరూపములో

నున్నవి నోరు అను ద్వారము గుండా శరీరములోని జీర్ణాశయమును చేరుచున్నవి. నోరు అను మార్గము ద్వారా

ద్రవముగానున్న నీరు, పదార్థముగాయున్న ఆహారము జీర్ణాశయమును చేరుచుండగా, ముక్కు అను మార్గము ద్వారా

వాయువైన ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరు చున్నది. ఈ విధముగా శరీరములోనికి చేరిన మూడు రూపముల

పోషకములు, శరీరములో శరీర పోషణకు ఉపయోగపడి, రూపము మారి వృథా పదార్థములుగా మారిపోవుచున్నవి.

అలా వృథాగా మారిపోయిన వ్యర్థ పోషకములు శరీరమునుండి నాలుగు మార్గముల ద్వారా బయటికి వస్తున్నవి.


ముక్కు, నోరు అను రెండుదారులలో శరీరములోనికి పోయిన మూడు రకముల పోషకములు ముఖ్యముగా

నాలుగు మార్గముల గుండా బయటికి వస్తున్నవి. వృథాగామారిపోయిన వాయువు తిరిగి నిశ్వాస అను పేరుతో ముక్కు

ద్వారానే బయటికి వస్తున్నది. వ్యర్థపదార్థముగా మారిపోయిన ఆహారము మలము అను పేరుతో గుద ద్వారము

గుండా బయటికి వస్తున్నది. అలాగే శరీరములో పనికిరాని ద్రవముగా మారిపోయిన నీరు మూత్రము అను పేరుతో

మర్మావయవము (లింగము లేక యోని) ద్వారా బయటికి వస్తున్నది. కొందరికి చెమటరూపములో చర్మము ద్వారా

కూడా బయటికి వస్తున్నది. ఈ విధముగా వాయువు పోయిన దారిలోనే తిరిగిరాగా, ఆహారము క్రొత్తదారిలో రాగా,

నీరు రెండు క్రొత్త దారులలో బయటికి వస్తున్నది. శరీరములోనికి పోవునప్పుడు రెండు మార్గముల ద్వారా పోయిన


మూడు రకముల పోషకములు, శరీరము బయటికి వచ్చునప్పుడు నాల్గు మార్గము లలో వస్తున్నవి. ఇప్పుడు సజీవ

శరీరమును ఒక ఊరుగా పోల్చుకొని చెప్పుకొందాము.


ఒక ఊరిలోనికి కొన్ని దారులుండును, అలాగే బయటికి కొన్ని దారులుండును. గ్రామ ప్రవేశద్వారములు

రెండుకాగా గ్రామమునుండి బయటికి వచ్చు దారులు నాలుగు కలవు. దాదాపు మైలు పొడవు దక్షిణము వైపుకు

భూమి ఏటవాలుగాయున్న ప్రదేశములో, జ్ఞానక్షేత్రము అను ఊరు కలదు. ఆ ఊరికి ఉత్తరమువైపు రెండు దారులున్నవి.

దక్షిణము వైపు నాలుగు దారులున్నవి. జ్ఞానక్షేత్రమను ఆ ఊరు ఏటవాలు ప్రదేశములో ఉండుట వలన ఉత్తరమువైపున

ఉన్న దారులు పై నుండి క్రిందికి వచ్చునట్లు ఉండును. దక్షిణమువైపు నాలుగు దారులు పై నుండి క్రిందికి పోవునట్లు

ఉండును. ఆ విధముగానున్న ఆ ఊరిలోనికి ప్రతి దినము ఉత్తరము వైపునుండి అటువైపునవున్న రెండు దారులలో,

ఒక దానియందు ఒక ఎద్దులబండిలో పొయ్యిలోనికి ఉపయోగించు కట్టెలు వచ్చెడివి. రెండవ దారిలో ఒక రిక్షాబండిలో

పదిలీటర్ల కిరోసినాయిల్ వచ్చేది. ఏటవాలుగా యుండుట వలన ఉత్తరమువైపునుండి వచ్చు రిక్షాగానీ, ఎద్దులబండిగానీ

తగ్గుకు సులభముగా దొర్లుతూవచ్చేవి. అలా వచ్చిన రెండు బండ్లు వచ్చిన దారిలో తిరిగిపోవాలంటే మిట్టకు

ప్రాకినట్లు బరువుగా ఉండును కనుక రెండవ దక్షిణమువైపునున్న దారులలో పోతే సులభముగా క్రిందికి దొర్లి

పోయినట్లుండును. కనుక కట్టెలను తెచ్చిన ఎద్దులబండి, కిరోసినాయిల్ తెచ్చిన రిక్షా రెండూ వచ్చిన ఉత్తరమువైపు

దారిలో పోకుండా దక్షిణమువైపు దారిలో పోయెడివి. ఈ విధముగా ఆ ఊరిలోనికి వచ్చే దారులు రెండు, ఊరి

బయటికి పోయే దారులు నాలుగు అని అనవలసివచ్చినది. జ్ఞాన క్షేత్రమను ఆ ఊరిలోనున్న వంద కుటుంబములకు

ప్రతి దినము వంట చేసుకొనుటకు బండికట్టెలూ, వాటిని అంటించుకొనుటకు పదిలీటర్ల కిరోసిన్ ఆయిల్ ఖర్చయ్యేది.


జ్ఞానక్షేత్రమను ఆ ఊరిలోని గ్రామపెద్ద లింగమయ్య తన ఊరిలోని ప్రజలకు ఏదొక సహాయము చేయవలెనని

తలచి, కొంతకాలమునకు ఊరిలోనివారందరికీ కట్టెల ఖర్చు లేకుండా చేశాడు. కట్టెలను ఉపయోగించ కుండా వంట

చేసుకొనుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఊరిలోనికి వచ్చు పది లీటర్ల కిరోసిన్ ఆయిల్తోనే, ఊరందరి వంటలు

తయారగునట్లు చేశాడు. పది లీటర్ల కిరోసిన్తో వంద కుటుంబములకు వంట ఎలా తయారయ్యేదని ఇక్కడ ప్రశ్నరాగలదు.

దానికి జవాబు ఈ విధముగా కలదు. జ్ఞానక్షేత్ర గ్రామ యజమాని లేక గ్రామపెద్ద అయిన లింగమయ్య తన తెలివితో,

ఎవరికీ అర్థముకాని క్రొత్త విధానమును కనిపెట్టాడు. ఆ విధానము వలన పదిలీటర్ల కిరోసిన్తోనే అందరి వంటలు

తయారయ్యేవి అలా కిరోసిన్ వలన అందరికీ కట్టెల అవసరము లేకుండాపోయింది. దాని కొరకు ప్రతి ఇంటికి

లింగమయ్య ఒక గ్యాస్ పైపును అమర్చాడు. ఆ పైపులన్నీ ఊరి మధ్యలోని ఒక పైపుతో కలిపాడు. ఆ పైపు భూమిలో

వంద అడుగుల లోతువరకు పోయి, రెండవకొన తిరిగి బయటికి వచ్చి నాలుగు అడుగుల ఎత్తులో ఉండేది. భూమినుండి

ఒక అడుగు ఎత్తులో వెయ్యిలీటర్ల నిలువయుంచు పెద్ద పీపాలాంటిది (పెద్దట్యాంకులాంటిది) ఉండేది. ఆ పీపా నుండి

పైపు కొన నాలుగు అడుగుల ఎత్తు ఉండేది. అలాంటి నిర్మాణమును తయారుచేసిన లింగమయ్య, వారి ఊరికి సమీప

కొండలో లభ్యమైన ఒక రకమైన రాళ్ళను తెచ్చిపెట్టుకొని, వాటినుండి నాలుగు చిన్నరాళ్ళను ఆ పీపాలోనికి వేసి

పదిలీటర్ల కిరోసిన్ న్ను పైపులో పోసెడివాడు. అలా చేయుట వలన పీపాలో వేయబడిన ప్రత్యేకమైన రసాయన

రాళ్ళమీద కిరోసిన్ పడడము వలన, ఆ రాళ్ళు చిన్నగ కరుగుతూ వాటిలో నుండి వంట గ్యాస్ (మండించే వాయువు)

వెలువడి, అక్కడినుండి పైపుల ద్వారా ప్రతి ఇంటికి చేరి, ప్రతి ఇంటిలోను మండుచు వారి వంటకు ఉపయోగపడేది.


ఈ విధముగా జ్ఞానక్షేత్ర గ్రామపెద్ద కనిపెట్టిన విధానము ఊరిలోని వారందరికీ ఉపయోగపడి ఎవరికీ కట్టెల


ఖర్చులేకుండా చేసినది. లింగమయ్య కనుగొన్న క్రొత్త విధానము భూమిమీద ఎక్కడ లేనిదానివలన, ఆ పద్ధతి ఏమిటో

ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఎంతోమంది ఇతర గ్రామస్థులు లింగమయ్య మాదిరి చేసిచూచినా అది వారికి సాధ్యము

కాలేదు. లింగమయ్యవలె పైపులు అమర్చారు. లింగమయ్యవలె ఆయన ఉపయోగించు రాళ్ళనే ఉపయోగించారు.

అన్నీ ఆయన చేసినట్లే చేసినా వంటగ్యాస్ తయారుకాలేదు. లింగమయ్య కూడా తాను దాచుకోకుండా తన

ప్రయోగమునంతటినీ మిగతా గ్రామస్థులకు వివరించి చెప్పాడు. ఆ విధానమునంతటినీ అందరికీ తన గ్రామములో

చూపించాడు. జ్ఞాన క్షేత్రములో చూచిన విధానమునే అమలు చేసినా, ఎవరికీ ఆ ప్రయోగము ఫలించలేదు. ఇక్కడ

ఎవరికైనా ప్రశ్న రాగలదు. అదేమనగా! ఒక ప్రయోగములో జరిగినది ఏదైనా విజ్ఞానమునకు (సైన్సుకు సంబంధించి

యుండును. అటువంటి ప్రయోగము ఎవరు చేసినా అది జరిగితీరవలెను. అందరికీ ఒకే ఫలితమును ఇయ్యవలెను.

అయితే ఇక్కడ లింగమయ్యకు మాత్రము చేసిన పని నెరవేరడము, మిగతా వారికి నెరవేరలేదనడమును చూస్తే అది

విజ్ఞాన సంబంధించిన విషయముకాదనీ, లింగమయ్య తాను నేర్చుకొన్న ఏదో విద్యవలన అలా చేయగలిగాడని

కొందరనవచ్చును. అలా అనుకోవడము కూడా పొరపాటే. లింగమయ్య ఎటువంటి స్వార్థము లేకుండా తనకు

తెలిసినదంతా చెప్పాడు. అక్కడ జరిగినదంతా రసాయనక క్రియయే. ఒక లీటరుకు వంద కిలోగ్రాముల (100 కేజీల)

గ్యాస్ తయారవడము పూర్తి విజ్ఞానమే. దానిని సైన్సుకాదని అనుటకు అవకాశమే లేదు.


అక్కడ జరిగినది నూటికి నూరుపాళ్ళు సైన్సే, అయినా (విజ్ఞానమే అయినా) అందరికీ ఆ కార్యము ఎందుకు

నెరవేరలేదు అన్నది అందరికీ ప్రశ్న అయినది. అప్పుడు మిగతా గ్రామముల వారందరూ వచ్చి లింగమయ్యను ఇట్లు

అడిగారు.


ప్రక్క గ్రామస్థులు :- లింగమయ్యా! మీరు చెప్పినట్లు మేము చేశాము. అయినా మాకు నెరవేరలేదు మేము కట్టెలు

కొనక తప్పలేదు. నీవు ఏదో ప్రత్యేకమైన విద్యను నేర్చి, దానిద్వారా అలా చేయుచున్నావని అనుకొన్నాము. ఆ విద్యను

మాకు కూడా నేర్పించి నీవు పుణ్యము కట్టుకోవచ్చును కదా!


లింగమయ్య : - మీరు పొరపడుచున్నారు. అలాంటిదేదైనా ఉంటే మీకు ముందే చెప్పి నేర్పియుండేవాడిని. వాస్తవానికి

ఎటువంటి విద్యగానీ, ఎటువంటి మంత్రతంత్రములుగానీ ఇందులో లేవు. నేను చూపించిన ప్రత్యేకమైన ఖనిజమైన

రాళ్ళకు కిరోసిన్ కలిపితే, కిరోసిన్ కంటే వందరెట్లు ఎక్కువ గ్యాస్ తయారగుచున్నది. అలా తయారైన గ్యాస్ భూమిలోనికి

పైపుద్వారా వంద అడుగుల వరకు పోవుట వలన బాగా వేడెక్కి మండుటకు సామర్థ్యము కల్గియుండుట వలన, అది

అందరి ఇళ్ళలోను మండుచున్నది. ఇంతతప్ప ఇందులో నేను దాచినది ఏమీలేదు. అలా దాచాలనుకొంటే ఈ

విధానమును ముందే మీకు చెప్పేవాడినే కాదు కదా!


గ్రామస్థులు :– నీవు నిజాయితీవరుడవు, అబద్ధము చెప్పువాడవు కావు, అందరికీ బుద్ధి చెప్పు నీవు ఎంతో గొప్పవ్యక్తివని

మాకు తెలుసు, అయినా మా అనుమానమును నివృత్తి చేసుకొనుటకు అడిగాము.


లింగమయ్య :- ఈ ఊరిలో అందరికంటే ఉత్తముడు, మహాజ్ఞాని అయిన పరంధామయ్య ఉన్నాడు కదా? ఆయన

దైవజ్ఞానములోనేకాక ప్రపంచ జ్ఞానములో కూడా బాగా తెలిసినవాడు. ఇప్పుడు మనకు తెలియని ఈ విషయమును

గురించి పరంధామయ్యను అడిగితే, ఆయన తప్పక దీని రహస్యమేమిటో తెలియజేయగలడు. మనమందరము ఇప్పుడే

పోయి ఆయనను వినయముగా ప్రశ్నించి తెలుసుకొందాము.

(ఈ విధముగా మాట్లాడుకొనిన లింగమయ్య మరియు ప్రక్క గ్రామస్థులు అందరూ కలిసి జ్ఞానక్షేత్రములోనే


ఉన్న పరంధామయ్య దగ్గరకు పోయి తమ సంశయమును ఆయనకు తెలియజేశారు. వారు చెప్పినదంతా వినిన

పరంధామయ్య తనలో తాను నవ్వుకొని ఇలా చెప్పాడు.)


పరంధామయ్య :- ఈ విషయమును ప్రక్కనుంచి మరొక విషయమును చెప్పెదను వినండి. నేను చెప్పే విషయమును

మీరు విని అర్థము చేసుకోగలిగితే, ఇప్పుడు మీకు వచ్చిన విషయము సులభముగా అర్థము కాగలదు. అందువలన

నాకు తెలిసిన ప్రత్యక్ష విషయమును చెప్పెదను వినండి. నాకు ఇప్పటికి 63 సంవత్సరముల వయస్సు వచ్చినది. నా

వయస్సు ఇరవై సంవత్సరములు ఉన్నప్పుడు అనగా నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు, అప్పటి పరిస్థితినిబట్టి ప్రక్క

రాష్ట్రములో ఒక పల్లెటూరిలో నివసించేవాడిని. మా ఇంటి ప్రక్కనే మరొక కుటుంబము ఉండెడిది. ఆ కుటుంబములో

50 సంవత్సరముల వయస్సున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని పట్టుకొనెడివాడు. అట్లే

ఎక్కడైనా తేలు కనిపించినా, దానిని కూడా పట్టుకొనెడివాడు. అలా అతనికి అలవాటై పోయినది. పెద్ద సైజువున్న

తేళ్ళను ఎవరికైనా చూపించుటకు చిన్న డబ్బీలలో వేసుకొని, దగ్గరుంచుకొని తిరిగెడివాడు. అతనికి హస్తములో

గరుడరేఖ ఉందనీ, అందువలన పాములను తేళ్ళను అతను భయము లేకుండా పట్టుకొనుననీ ఎవరో సాధువు చెప్పాడట.

చెప్పడమే కాకుండా హస్తములో నున్న చిన్న రేఖను కూడా చూపించి ఇదే గరుడరేఖ, ఈ రేఖ ఉండడము వలన

పాములు కరుచవు, తేళ్ళు కుట్టవని చెప్పాడట. అంతకు ముందు కొంత భయముతో పామును తేళ్ళను పట్టుకొను

అతను అప్పటి నుండి ఏమాత్రము భయము లేకుండా పట్టుకొనుటకు మొదలుపెట్టాడు. తనకు గరుడరేఖ ఉందని

అవసరమొస్తే ఇతరులకు తన చేతిలోని రేఖను చూపేవాడు.


అలా చూపడములో తన హస్తములో రేఖవలె రేఖయున్న మనిషి వచ్చి తనది నీ చేతిలో రేఖవలెవున్నది. ఇది

గరుడరేఖయేనా? అని అడిగాడు. అప్పుడు మా ఇంటిప్రక్క మనిషి అతని హస్తములోని రేఖను చూచి అది గరుడరేఖయేనని

చెప్పాడు. ఇద్దరి హస్తములోనూ ఒకే రేఖ ఉండడముతో అందరూ దానిని గరుడరేఖ అని గుర్తించారు. తన హస్తములో

గరుడ రేఖయున్నదని గ్రహించిన వ్యక్తి తాను కూడా తేళ్ళనూ, పాములనూ నిర్భయముగా పట్టుకోవచ్చని అనుకొన్నాడు.

ఒక దినము అతని ఇంటి ముంగిటిలో తేలు కనిపించగా దానిని పట్టుకోబోయాడు. అంతే తేలు అతనిని కుట్టింది.

తేలు విషముతో అతను బాధపడుచుండగా ఇతరులు మందుపూసి అతనిని తేలు బాధనుండి బయటపడునట్లు చేశారు.

అలా జరుగడము వలన గరుడరేఖయున్నదనిన మొదటివాడు పామును తేలును పట్టుకొనుచుండగా, అదే గరుడరేఖయున్న

రెండవవాడు తేలుతో కుట్టించు కొన్నాడు. మొదటి వానికి భయపడినట్లు రెండవవానికి తేలు భయపడలేదు. గరుడరేఖ

ఉంటే ఎవరికైనా పాములు తేళ్ళు భయపడును అనుమాట అసత్యమైనది. దానితో గరుడరేఖకు పాముకు, తేలుకు

ఏమాత్రము సంబంధము లేదని తెలిసిపోయినది. గరుడరేఖ ఉన్న వానికి తేలుకుట్టిన ప్రత్యక్ష సంఘటన వలన

గరుడరేఖ అనునది మూఢనమ్మకము అని తెలిసిపోయినది. గరుడరేఖ మూఢనమ్మకమైతే, దానికి ఏ ప్రభావము

లేకపోతే, మా ఇంటి ప్రక్కవానికి పాములు, తేళ్ళు ఎందుకు భయపడుచున్న వని నాకు ఆ రోజే ప్రశ్నవచ్చినది. నాకు

ప్రశ్నవస్తే దాని జవాబును దొరుకునంతవరకు నేను వదలను. అప్పటినుండి గరుడరేఖలోనున్న శాస్త్రబద్ధత ఏమిటి?

అని వెదకసాగాను. చివరికి గరుడరేఖ అనునది శాస్త్రబద్ధమైనదికాదని తెలిసిపోయినది. వాస్తవానికి గరుడరేఖ

అనునదే లేదని అర్థమైనది. ఒక వ్యక్తికి పాములు భయపడితే, వానికి గరుడరేఖ యున్నదని కొందరు కల్పించి

చెప్పుచూ, చేతిలో ఏదో ఒక రేఖను చూపి ఇదే గరుడరేఖ అని నమ్మించుచున్నారనీ, నిజంగా గరుడరేఖ అనునది

కల్పితమనీ తెలిసిపోయినది.


గరుడరేఖ అసలుకు లేదనీ, గరుడరేఖకు పాములు భయపడడము నకు ఏమాత్రము సంబంధములేదని

అర్థమైపోయినప్పుడు, మా ఇంటి ప్రక్కనయున్నవానికి ఏ కారణము చేత పాములు తేళ్ళు భయపడుచున్నవని ప్రశ్నవచ్చినది.

ఆ ప్రశ్నకు జవాబును అన్వేషిస్తే ఈ విధముగా తెలియు చున్నది. ప్రతి మనిషికీ వ్రేలిముద్రలు వేరువేరుగా ఉండును.

అందరి చేతిలోనూ చిన్న గీతలున్నా, ఆ గీతలు మనిషి మనిషికీ కొద్దిపాటి భేదము కల్గి వేరువేరుగా ఉండును. ఒక

మనిషికున్న ఒక వ్రేలి గుర్తు ఎక్కడా రెండవవానికి ఉండదు. ప్రతి మనిషికీ ప్రత్యేకమైన రేఖలుండుట వలన వ్రేలి

గుర్తునుబట్టి కొన్ని కోట్లమందిలో కూడా ఒక మనిషిని గుర్తించవచ్చును. ఈ సూత్రమును అనుసరించి చేతిముద్ర

(వ్రేలిముద్ర) సహాయముతో పోలీసులు దొంగలను గుర్తించగలుగుచున్నారు. మనిషి మనిషికీ వేరువేరు గుర్తులు

చేతివ్రేలిమీద ఉన్నట్లు, ప్రతి మనిషికీ ఒక వాసన సహజముగా ఉండును. అలాగే మనిషి మనిషికీ వాసన కొంత తేడా

కల్గి వేరువేరుగా ఉండును. ఏ విధముగా ఒకే వ్రేలిగుర్తులు మరొక మనిషికి ఉండవో, అట్లే ఒక మనిషికున్న వాసన

ప్రపంచములోని జనాభా మొత్తములో రెండవ వ్యక్తికి ఉండదు. ఈ విధముగా భూమిమీద ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన

వాసన కల్గియున్నాడు. వాసనను గ్రహించుశక్తి కల్గిన కుక్కలు ఒక వస్తువుకు అంటుకొనియున్న మనిషి వాసననుబట్టి

ఆ మనిషి ఎంతమందిలో ఉన్నా అతనిని గుర్తించగలుగుచున్నవి. ఈ విధముగా హస్తముయొక్క గీతలుగానీ, శరీరము

యొక్క వాసనగానీ మనిషి శరీరమునుబట్టి వేరువేరుగా ఉండును. మనిషి బాహ్యశరీరమునుబట్టి వాసన, చేతి గీతలు

ఉండగా, అంతరంగములో నున్న జీవున్నిబట్టి శక్తియుండును. శరీరములోని శక్తి ఒకనికున్నది మరొకనికి ఉండక

వేరువేరు స్థాయిలలో ఉండును. శరీరమున కున్న వాసన, హస్తము గీతలు వేరువేరుగా ఉన్నట్లు, శరీరములోని జీవుల

కున్న శక్తికూడా వేరువేరు కొలతలలో ఉండును. ఒకే స్థాయిగల శక్తి ఇంకొక మనిషికి ఉండదు. శరీర వాసనను

పోలీసు కుక్కలు గుర్తించగలిగినా, వ్రేలి గుర్తులను పోలీసులు గుర్తించగలిగినా, శరీరమునకు కాకుండా శరీరము

లోపలగల జీవునకున్న శక్తి తేడాను యంత్రములుగానీ, జంతువులు గానీ, సాధారణ వ్యక్తులుగానీ గుర్తించలేరు. ఒకే

ఒక భగవంతుడు గుర్తించ గలడు.


మన అన్వేషణలో ప్రతి మనిషికీ ప్రత్యేకమైన వాసన, ప్రత్యేకమైన వేలిముద్రలు, ప్రత్యేకమైన శక్తియుంటుందని

తెలుసుకొన్నాము. ఒక మనిషికి పాములు, తేళ్ళు భయపడుచున్నవంటే వానిలో అది ఒక ప్రత్యేకతయేనని చెప్పవచ్చును.

మనిషిలో సర్వసాధారణముగా మూడు ప్రత్యేకతలుగలవు కదా! ఆ మూడు ప్రత్యేకతలలో ఏదో ఒకటి, పాములు

భయపడుటకు కారణమై ఉంటుందని తెలియుచున్నది. దానిని పరిశీలించి చూచితే మనిషికున్న ఒక రకమైన వాసన,

పామును భయపడునట్లు చేయుచున్నదని తెలియుచున్నది. మనిషికున్న వాసన పాముకుగానీ, తేలుకుగానీ తగలగానే

వాటి మెదడు మొద్దుబారిపోవును. అవి ఏమీ ఆలోచించని స్థితిలో భయములో ఊరక నిలిచిపోవును. ఆ సమయములో

మనిషిని కరవాలని గానీ, భయపెట్టాలనిగానీ అనుకోవు. ఒక మూలిక ప్రభావము పని చేసినట్లు మనిషి వాసన

వాటిమీద ప్రభావము చూపుచున్నదని అర్థమగుచున్నది. తెల్లఈశ్వరివేరు ప్రభావము పాముమీద పని చేయగా పాము

బలమును కోల్పోయి కదలలేని స్థితిలో నిలిచిపోవును. కనీసము బుసకొట్టడము కూడా చేయలేదు. తెల్లఈశ్వరి మూలిక

ప్రభావమునకు పాము విషగ్రంథులు కూడా ముడుచుకొనిపోవును. అదే విధముగా ఒక మనిషిలోని వాసన తెల్లఈశ్వరి

మూలికతో సమానముగా పనిచేయడము వలన, పాములు భయముతో వణికిపోవును, కదలక నిలిచిపోవును. అటువంటి

స్థితిలోయున్న పామునుగానీ, తేలునుగానీ వాటికి సరిపోని వాసనగల మనిషి సులభముగా వాటిని పట్టుకోగలుగుచున్నాడు.

పామును మనిషి పట్టుకోవడమూ, అది వానిని కాటువేయకపోవడమూ, అంతయు మనిషికున్న వాసన మీద

ఆధారపడియున్నదిగానీ, మనిషికున్న హస్తరేఖలమీద ఆధారపడిలేదు. ఈ విషయమంతయు పూర్తి తెలియనివారు


మనిషి హస్తములోని గరుడరేఖ వలన అలా జరుగుతుందని చెప్పినా, అది సత్యముకాదు కనుక, గరుడ రేఖయున్నదని

తేలును పట్టుకొన్నవానిని తేలు కుట్టడము జరిగినది. గరుడ రేఖవుందనుకొన్నవాడు కూడా తేలు విషబాధను

అనుభవించడము జరిగినది. కావున గరుడరేఖ అనునది అసత్యమనీ, మనిషి పామును పట్టుకోవడములో వానికున్న

వాసన వలనే సాధ్యమవుచున్నదని తెలిసి పోయినది.



భూమిమీద ఒకనికున్న వాసన మరొకనికుండదని చెప్పుకొన్నాము కదా! అటువంటపుడు పాముకు వాసన

సరిపోని వ్యక్తి ఒకడుంటే వానివలె ఎవడూ ఉండడు కదా! అయితే పది లక్షలమంది యాభైలక్షల జనాభా లోపల ఒక

వ్యక్తి అక్కడక్కడ పాములను పట్టుకోవడము జరుగుచున్నది. అలా పట్టుకొనువాడు ఏ ఔషధమునుగానీ, ఏ మూలికనుగానీ,

ఏ మంత్రమునుగానీ వాడడము లేదు. అందువలన పాముకు సరిపోని వాసన కలవారు కోటి జనాభాలో కనీసము

ఒకరు లేక ఇద్దరుగానీ లేక ముగ్గురు గానీ ఉండవచ్చునని అర్థమగుచున్నది. ఒకే వాసన ఉన్నవాడు ఒకడు తప్ప

రెండవవాడు ఉండడని ముందు చెప్పుకొన్నాము కదా! అలాంటప్పుడు కోటికి ఇద్దరు లేక ముగ్గురు ఎలా వచ్చారని

ఎవరైనా ప్రశ్నను అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! పాము విషమును హరించుశక్తిగల మూలికలు

భూమిమీద దాదాపు పది రకములు గలవు. తెల్లఈశ్వరి ప్రత్యేకమైన ప్రభావము కల్గియున్నట్లు ఒక్కొక్క మూలిక

ఒక్కొక్క ప్రభావము కల్గియుంటుంది. అయితే అన్ని మొక్కలు తెల్లఈశ్వరితో సమానముగా ఉండక, వేరువేరు ప్రభావము

కల్గియున్నవి. వేరువేరు ప్రభావము కల్గిన పది మొక్కల వరకు పాముకు సరిపోని విధముగా, మనుషులలో కూడా

దాదాపు పది, పదిహేను మంది వాసనలు పాముకు, తేలుకు సరిపోవడము లేదు. అందువలన చాలాచోట్ల చాలామందికి

అవి భయపడుచున్నవని తెలియుచున్నది. దేశములో ఎంతమంది పామును పట్టుకొనువారున్నా వారివద్ద వారికున్న

వాసనతప్ప వేరు విధానముగానీ, గరుడరేఖ ప్రభావము గానీ లేదు. ఒక ఊరిలో ఒక విధమైన వాసనకల్గిన వ్యక్తికే

పాములు భయపడుచున్నవి తప్ప, గరుడరేఖయున్నవానికి భయపడడము లేదు.


పాము భయపడుటకు గరుడరేఖ కారణముకాదనీ, మనిషికున్న ప్రత్యేకమైన వాసనే కారణమనీ, ఆ వాసన

ఉన్న వానికే పామును పట్టు కోవడము సాధ్యమైనదనీ తెలిసిపోయినట్లు, కట్టెలు, కిరోసిన్, గ్యాస్ విషయమును

పరిశీలించినప్పుడు అక్కడ కూడా మనకు తెలియని విధానము ఒకటి అర్థమగుచున్నది. మనిషికి ఏ విధముగా

వాసనలు ప్రత్యేకముగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నట్లు చేతి రేఖలుగానీ, మనిషిలోని శక్తిగానీ ప్రతి ఒక్కరిలో వేరువేరుగా

ఉండునని తెలుసుకొన్నాము. జ్ఞానక్షేత్రమను ఊరిలో లింగమయ్య అను వ్యక్తి వేసిన రాళ్ళు మాత్రము కిరోసిన్లో

గ్యాస్ గా మారడము నాటకము, బూటకము కాకున్నా, పూర్తి విజ్ఞానముతో కూడుకొన్న విషయమైనా, అదేపనిని

ఇతరులు చేసినప్పుడు జరుగకపోవడము వెనుక మనకు తెలియని రహస్యము ఏదో ఉన్నదని అర్థమగుచున్నది. అది

ఏమని పరిశీలించితే! ఈ విధముగా తెలియుచున్నది. మిలటరీలో మూడు విభాగములున్నవి. ఒకటి ఆర్మీ

(భూతలసైన్యము) రెండు నేవీ (సముద్రతల సైన్యము) మూడు ఎయిర్ఫోర్స్ (ఆకాశతల సైన్యము) మూడు విభాగములను

కలిపి మిలటరీ అనినా, మూడు వేరువేరు విధానములు, వేరువేరు గుర్తింపులు, నైపుణ్యతలు కల్గియుండును.

ఉదాహరణకు ఆర్మీని తీసుకొందాము. భూతల సైన్యము (ఆర్మీ)లో కూడా కొన్ని భాగములుగా సైన్యము పని చేయుచున్నది.

ఒక మనిషి సైనికుడుగా ఏ భాగములో ఉన్నా వానికి ఒక గుర్తింపు నంబరు ఉంటుంది. అక్కడి ఆఫీసర్ ఆ నంబరు

సైన్యములోనికి ప్రవేశించినప్పుడే ఇస్తాడు. ఒక నంబరు ఒక సైనికునికి ఉంది అంటే అది వానికే పరిమితి. ఆ నంబరు


వేరొకనికి ఉండదు. ఆ నంబరు వానికి సైన్యములో అడ్రసులాంటిది. ఉదాహరణకు ఒక సైనికుని నంబరు 1251860

అయివుంటే అది వాడు సైన్యములో పనిచేసినంతకాలము ఆ నంబరుతో వాడు పూర్తి సంబంధము కల్గి యుండును.

అది వానితో ముడివేయబడినట్లుండును. ఆర్మీలో ఒక సైనికునికి ఏ విధముగా ఒక నంబరు నిర్ణయించబడి వాడు

సైనికునిగా ఉన్నంతవరకు అది మారకుండునో, అలాగే ఒకడు మనిషిగా పుట్టినప్పుడే ఒక నంబరులాంటి గుర్తును

దేవుడు మనిషికి ఇస్తాడు. అది సంఖ్యతో కూడుకొన్న నంబరు కాకున్నా, నంబరులాంటి గుర్తని తెలియవలెను. సైనికునికి

ఇచ్చిన నంబరు అతడు సైనికునిగా ఉన్నంత వరకు మారనట్లు, మనిషికి కేటాయించబడిన గుర్తు అతడు మనిషిగా

జీవించియున్నంతకాలము ఉండును. పుట్టుకతో వచ్చిన నంబరులాంటి గుర్తునే వేలిముద్రలు అంటాము. ఒక్కొక్క

సైనికునికి ఒక్కొక్క నంబరును ప్రవేశములోనే ఇచ్చినట్లు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నంబరులాంటి గుర్తును జన్మ

ప్రవేశమైన పుట్టుకతోనే దేవుడిచ్చివుండును. మనిషికున్న ప్రత్యేకమైన గుర్తును ఆ మనిషియొక్క కోడ్ అని చెప్పవచ్చును.


అలీబాబా నలభై దొంగలు అను కథను అందరూ వినియే ఉందురు. అందులో తనవారు పరాయివారు అను

భేదము లేకుండా మంత్రమును ఎవరు చెప్పినా పని జరుగుచుండును. దొంగల గుహ ద్వారమునకు అడ్డముగాయున్న

పెద్దరాతిగుండు ప్రక్కకు పోవుటకు మంత్రమును చెప్పితే మంత్రమును వింటూనే గుండు ప్రక్కకు పోవడము

జరుగుచుండును. అక్కడ రాయికి మంత్రము మాత్రము ప్రక్కకు పోవుటకు గుర్తుగా తెలియుచున్నది. మంత్రము

యొక్క గుర్తు తప్ప మనుషులు ఎవరు అను గుర్తు ఆ రాతిగుండుకు లేదు. అక్కడ దారికి అడ్డముగానున్న రాతిగుండుకు

మంత్రము ఒక కోడ్ (గుర్తుగా) పనిచేయుచున్నదని చెప్పవచ్చును. మనుషులు ఎవరు చెప్పారను విషయము అక్కడ

వదిలి వేయబడుచున్నది. గుహలో ధనమును దాచుకొన్న దొంగలు చెప్పినా లేక వేరేవారు చెప్పినా గుండు ప్రక్కకు

పోవును. రాతిగుండుకు కావలసిన గుర్తు మంత్రము మాత్రమేనని అర్థమగుచున్నది. అలాగే కెమికల్ రాళ్ళు కిరోసిన్లో

పడినప్పుడు వాటిని కిరోసిన్లో ఎవరు వేశారని ఆ రాళ్ళు చూడలేదు. తమకు తెలిసిన గుర్తు వేసిన వ్యక్తిలో ఉందా

లేదా అని మాత్రము ఆ కెమికల్ రాళ్ళు గమనిస్తున్నవి. తమ కెమికల్ (రసాయనిక చర్య) చర్య ప్రారంభమగుటకు ఒక

కోడ్ మాత్రము (ఒక గుర్తు మాత్రము) అవసరమని తెలిసిన ఆ రాళ్ళు, తమకు సరిపడు కోడల వ్యక్తులు తమను తాకి

కిరోసిన్లో వేసినప్పుడే ఆ రాళ్ళలోని రసాయనిక చర్య ప్రారంభమై వాటినుండి రసాయన వాయువు (గ్యాస్) బయటికి

వచ్చును. తమకు సరిపడు కోడ్ లేని వ్యక్తులు ఆ రాళ్ళను తాకి కిరోసిన్లో వేసినా, వాటిలో రసాయనిక చర్య

జరుగదు, వాయువు రాదు. వాటి రసాయనిక చర్యకు సరిపడు కోడ్ (గుర్తు) గల వ్యక్తులు భూమిమీద ఇద్దరుగానీ

ముగ్గురుగానీ ఉండరు. ఒక కోడల వాడు మరొకడు ఉండడు. లింగమయ్యకున్న కోడ్ (గుర్తు) వేరొకరికి లేనందున

లింగమయ్య తాకినప్పుడు మాత్రమే రాళ్ళనుండి గ్యాస్ రావడము జరుగుచున్నది. ఇతరులు ఎవరూ అదే రాళ్ళను తాకి

కిరోసిన్లోనికి వేసినా, అవి రసాయనిక క్రియ చెందడము లేదు, గ్యాస్ రావడములేదు. మనిషికున్న గుర్తుకు

రసాయన రాళ్ళకు సంబంధముందని తెలియని వారు లింగమయ్య రాళ్ళను వేస్తే గ్యాస్ వస్తావుంది, మేము వేస్తే

ఎందుకు రాలేదని అనుమానము రావడము వలన మీరు ఇక్కడకు వచ్చి నన్ను అడుగుచున్నారు. (ఈ విధముగా

పరంధామయ్య చెప్పిన మాటలను వినిన గ్రామస్థులు తమకు తెలియని ఒక రహస్యమును పరంధామయ్య చెప్పడము

విని సంతసించి ఇలా అన్నారు.)


గ్రామస్థులు :- పరంధామయ్యగారూ! మీరు చెప్పిన విషయము మాకు వివరముగా అర్థమైనది. ఈ విషయము ఎవరికీ

తెలియని రహస్యము. ఈ రహస్యము తెలియని దానివలన లింగమయ్య ఏదో విద్య నేర్చుకొని ఎవరూ చేయలేని పనిని


చేస్తున్నాడనీ, ఆ విద్యను మాకు చెప్పలేదనీ మేము అనుకొన్నాము. వాస్తవానికి ఆయనకు తెలిసినది ఆయన చెప్పాడనీ,

ఆ పనికి ఆయన ఒక్కడే అర్హుడని ఇప్పుడు అర్థమైనది, ఇప్పుడు మీరు చెప్పిన వివరము అత్యంత రహస్యమైనది.

అంతటి రహస్యమును మీరు సులభముగా అర్థమగునట్లు చెప్పడము మాకు చాలా సంతోషము.


పరంధామయ్య :- ఇటువంటి రహస్యములు మనుషులకు ఏమాత్రము ఊహకు కూడా అందనివి ఎన్నో ఉన్నవి. మీరు

ఈ విషయమును గూర్చి పూర్తిగా తెలియనప్పుడు లింగమయ్యను మోసగాడు అనే పరిస్థితిలో ఉండేవారు. అసలు

విషయమంతా తెలిసిన తర్వాత లింగమయ్యది ఎటువంటి తప్పూలేదు. ఆయనను తప్పుగా అనుకోవడము పొరపాటని

అనుకొన్నారు. అలాగే భూమిమీద చాలామంది తాము తెలివైనవారమను కొని, విజ్ఞానులమనుకొని తమకు తెలియని

విషయములవద్ద తప్పుగా అంచనావేసుకొని, తమకు తెలిసినవి సత్యము, తెలియనివి అసత్యమనుకొను వారు గలరు.

అటువంటివారు తప్పు భావములో పడి, తమకు తెలియనిది ఇంకా ఎంతో ఉన్నదను విషయమును మరచిపోయారు.

వారికి తెలిసినంత వరకే హద్దును ఏర్పరచుకొన్నారు. అలా కాకుండా తమకు తెలిసినదే హద్దు అనుకోక, తెలియనిది

ఎంతో ఉన్నదను భావముతో అన్వేషించువాడే సత్యాన్వేషి కాగలడు. అతడు దేనినైనా తెలియగలడు. ఒక విషయములో

తనకు తెలిసినదే హద్దు అనుకొనువాడు, ఎప్పటికీ రహస్యములను తెలియలేడు. సత్యాన్వేషకులు కాలేరు. అటువంటివారి

అల్పబుద్ధికి సూక్ష్మశరీరములు (దయ్యములు) అంటే ఏమిటో తెలియవు, అలాగే దేవతలు అంటే ఎవరో తెలియదు.

దయ్యాలను, దేవతలను తెలియనివారికి, వాటికంటే పెద్ద అయిన దేవుడు ఎలా తెలియగలడు. రోగిని చూచిన డాక్టరుకు

రోగమును గురించి తెలిసిన దానివలన, రోగమును గురించి చౌకగా మాట్లాడుచున్నాడుగానీ, రోగమునకు కారణమైన

కర్మను గురించి తెలుసు కోవాలనుకోవడములేదు. తనకు రోగము వరకు తెలుసు అంతవరకే హద్దు అనుకోవడము

వలన డాక్టరుకు ముందు చూపులేకుండా పోయినది. అలాగే చాలామంది చాలా విషయములలో, తమకు తెలిసిన

దానికంటే మించి ఏమీ లేదు అనుకోవడము వలన, వారు అక్కడికే పరిమితియై పోవుచున్నారు. తమకు తెలియని

ఎన్నో రహస్యములను తెలియలేకపోవు చున్నారు. ఇప్పుడు లింగమయ్య మిమ్ములను నావద్దకు తెచ్చాడు కాబట్టి మీరు

వినగలిగారు. ఇదే విషయమునే లింగమయ్య స్వయముగా చెప్పినా, దీనిని కట్టుకథగా భావించి యుండేవారేమో!


ఈ విధముగా వారి సంభాషణ జరిగినది. ఇదంతయు వినిన మనము తిరిగి మన ప్రశ్నను గురించి ఇప్పుడు

చెప్పకోవడము మంచిది. అన్నము తినకుండా ఒక మనిషి ఎన్ని రోజులు బ్రతుకగలుగుతాడు? అన్నది మనకు ఇక్కడ

ముఖ్యమైన ప్రశ్న. శరీరమును గురించి మాకు బాగా తెలుసునన్న డాక్టర్లు మనిషి ఆహారము తీసుకోనప్పుడు “శరీరములో

నిల్వయున్న కొవ్వు గ్లైకోజ్గమారి, తర్వాత గ్లైకోజ్ గ్లూకోజ్గమారి శరీరమునకు ఆహారముగా ఉపయోగపడును. ఆ

విధముగా శరీరములో నిల్వయున్నదంతా ఉపయోగపడినా మనిషి నలభై (40) రోజుల కంటే ఎక్కువ బ్రతకలేడు.” అని

అంటున్నారు. ఈ మధ్యకాలములో ఆహారము తినకుండా బ్రతుకుచున్న మనిషి అని గుజరాత్ రాష్ట్రమందు అహమ్మదాబాద్

లోవున్న ప్రహ్లాదానీ అను 85 సంవత్సరముల వయస్సున్న వ్యక్తిని గురించి బాగా ప్రచారమైనది. కంప్యూటర్లలో

అతనిని గురించి ఎన్నో వెబ్సైట్లు కూడా ఉన్నవి. ఆయనను గురించిన సమాచారము నెట్లో ఎంతో ఉన్నది.

చిన్నవయస్సులో తొమ్మిది సంవత్సరముల వరకు ఆహారమును తీసుకొన్న ప్రహ్లాదానీ తర్వాత పదవ సంత్సరమునుండి

ఆహారము నీరు రెండిటినీ తీసుకోవడము మానివేశాడు. ఆహారము నీరు లేకుండా 75 సంవత్సరముల నుండి సజీవముగా

ఉంటూ తన కార్యములను తాను నిరాటంకముగా చేసుకొంటున్నాడు. అతని మెదడు యుక్తవయస్సు గల వారి


మెదడువలె చురుకుగా పని చేయుచున్నది. ఇంతవరకు అతనికి ఏ రోగములూ రాలేదు. 85 సంవత్సరములో

యువకునివలె చురుకుగానున్న అతనిని చూచి ఆశ్చర్యపడనివారు లేరు.


నేటికినీ సజీవముగానున్న ప్రహ్లాదాజానీని చూచిన సైంటిస్టులు "అతను ఎవరికీ తెలియకుండ ఆహారమును

ఏదో ఒక రూపములో తీసుకొను చుండును. అలా తీసుకోకుండా ఉండేదానికి అవకాశమేలేదు” అంటున్నారు. ఇంతవరకు

ఎవరికీ సాధ్యముకాని పని అతనికి ఎలా సాధ్యమవుతుంది. శరీరములో వేడివుంటేనే మనిషి బ్రతుకగలడు. వేడికావాలంటే

నోటి ద్వారా ఆహారమును, ముక్కుద్వారా పీల్చుకొను గాలి మండించగలిగాలి. శరీరములో జీర్ణాశయమునందు మార్పు

చెందిన ఆహారము గ్లూకోజ్గమారును. అలా ఊపిరితిత్తులలో మార్పుచెందిన గాలి ఆక్సిజన్ మారును. ఇటు

గ్లూకోజ్, అటు ఆక్సిజన్ వాయువు రెండూ శరీరమంతాయున్న కోట్లాది ధాతు కణముల వరకు పోయి మండే

ఫ్యాక్టరీగాయున్న ప్రతి ధాతుకణములోనూ గ్లూకోజ్ ఆక్సిజన్ వాయువుతో కలిసి మండుచుండుట వలన శరీరమంతా

వేడిగా ఉండగల్గుచున్నది. అలా కాకుండా కాల్చబడే గ్లూకోజ్ అను ఆహారము లేకుండా, శరీరములో వేడి ఉండే

అవకాశమే ఉండదని డాక్టర్లు చెప్పుచున్నారు. ఆహారమును తినకుండా ప్రత్యక్షముగా 75 సంవత్సరముల నుండి

ఉన్న వ్యక్తిని నమ్మలేకున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆహారమునుగానీ, నీరును గానీ వాడకుండా, మల

మూత్ర విసర్జన లేకుండా ఒక మనిషి ప్రత్యక్షముగా బ్రతుకుచుండడము పూర్తి సత్యము. అయితే ఎవరికీ సాధ్యముకానిది

అతనికి ఎలా సాధ్యమైనదని, ప్రశ్న సహజముగా ఎవరికైనా రావచ్చును. దానికి జవాబును సైన్సు ప్రకారము చూస్తే

మనము ముందు చెప్పుకొన్న సమాచారములో, ఎవరికీ మార్పుచెందని రాళ్ళు లింగమయ్యకే ఎందుకు మార్పుచెందాయి

అను ప్రశ్నకు జవాబును చూచిన, వివరములో లింగమయ్యకు మాత్రమే అతని కోడ్కు సరిపోవురకముగా రాళ్ళు

ఉండుట వలన రాళ్ళు రసాయన మార్పు చెందాయి అని తెలుసుకొన్నాము. అక్కడ లింగమయ్యకు సరిపోయిన

జవాబులాగానే ఇక్కడ ప్రహ్లాదానీకి కూడా జవాబు కలదు.


మండే ఇంధనమైన కట్టెలు లేకుండా లింగమయ్య గ్యాస్తో మండించగల్గుచున్నాడు. అలాగే మండే ఇంధనమైన

గ్లూకోజ్ లేకుండా ప్రహ్లాదానీ శరీరములో ఊపిరితిత్తులనుండి వచ్చిన ఆక్సిజన్ మాత్రము ధాతుకణములలో తనంతకుతాను

మండిపోవుచున్నది. కట్టెలు కిరోసిన్ వలన అందరికీ వంట తయారవుచుండగా, జ్ఞానక్షేత్రమను ఊరిలో లింగమయ్య

అను ఒక్క వ్యక్తి వలన కట్టెలు లేకుండా, ఒక కిరోసిన్తో మాత్రము మంట మండి వంట వండబడుచున్నది. అలాగే

గుజరాత్లో ప్రహ్లాదానీ అను ఒక్క వ్యక్తిలో మాత్రము ఆహారమైన గ్లూకోజ్ లేకుండా ఒకే ఆక్సిజన్తో మాత్రము

ధాతుకణములలో మండి శరీరములో వేడి వస్తున్నది. అక్కడ ఒక్క లింగమయ్యకే సాధ్యమైన రసాయనికచర్య, ఇక్కడ

ప్రహ్లాదాజానీకీ మాత్రము సాధ్యమగుచున్నది. ఆయన శరీరములో ఆత్మశక్తితో నిండుకొన్న ధాతుకణములకు ప్రపంచములో

ఎవరికీలేని ప్రత్యేకమైన రసాయన ప్రభావముండుట వలన ఆహారము లేకుండా అక్కడకు (ధాతు కణములకు) చేరిన

వాయువు మండిపోవుచున్నది. ప్రహ్లాదానీ శరీరములో ప్రత్యేకమైన ప్రభావముందనీ, ఆ ప్రభావము శరీరములోని

ఆత్మవలన కల్గినదనీ తెలియనివారు, ప్రత్యక్షముగానున్న వ్యక్తిని చూచి నమ్మలేక పోవుచున్నారు. ఒక దినము ప్రహ్లాదానీని

గురించి టీ.వీ ప్రొగ్రామ్లో జరుగుచర్చలో డాక్టర్ సమరముగారు (నాస్తికవాది) ప్రహ్లాదానీ విషయము పూర్తి అసత్యమనీ,

అలా ఉండడము అసంభవమనీ, ఇదంతయు అసత్య ప్రచారమనీ చెప్పడము నేను విన్నాను. తమకు తెలిసిందే

విజ్ఞానము అని హద్దు ఏర్పరచుకొన్నవారికి ప్రత్యక్ష సత్యము అసత్యముగానే కనిపించును. ఎందుకనగా సత్యమును

తెలుసుకొను విచక్షణగానీ, సత్యమును చూడగల్గు జ్ఞానదృష్టిగానీ వారికి ఉండదు. ఆత్మ అంటూ ప్రత్యేకముగా మన

శరీరములో ఒకటున్నదని తెలియనివారికి ఆత్మవలన కలుగు అనేక పనులు అర్థముకావు.


ప్రతి మనిషికి ప్రత్యేకమైన గుర్తులున్నప్పుడు, వాటినే మనము కోడ్గా చెప్పుకొనినా, సంఖ్యగా చెప్పుకొనినా

వానికున్న కోడ్ లేక సంఖ్య మరొకనికి లేదని చెప్పుచున్నాము. ఒక మనిషికున్న వేలి గుర్తులు మరొక మనిషికి

లేనప్పుడు, ఒక మనిషికున్న ఆత్మశక్తి మరొక మనిషికి ఉండదనియే చెప్పవచ్చును. ప్రతి మనిషికీ మూడు ప్రత్యేకమైనవి

ఉండునని అవియే ఒకటి వాసన, రెండువేలి గుర్తులు, మూడు శక్తి (ఆత్మశక్తి) అని చెప్పు కొన్నాము. మనిషికున్న

వాసనలలో ప్రత్యేకమైన వాసనగల ప్రత్యేకమైన వ్యక్తికి పాములు, తేళ్ళు భయపడినట్లు, అలాగే ఒకరిలోనున్న ప్రత్యేకమైన

గుర్తు (కోడ్) వలన, ప్రత్యేకమైన రసాయనచర్య జరిగినట్లు, మనిషికున్న ప్రత్యేకమైనశక్తి వలన, ప్రత్యేకమైన గుర్తింపుగల

కార్యము అతనిలో జరుగుచున్నది. ఇక్కడ ప్రహ్లాదానీ శరీరములో అణువణువునున్న ధాతుకణములలో గల శక్తి

వలన, దహింపబడు పదార్థము లేకుండానే అక్కడికి చేరిన వాయువు దానంతటది మండిపోవుచున్నది. (ఈ విషయమును

గురించి పూర్తి వివరముగా మా రచనలలోని “త్రైతాకార రహస్యము” అను గ్రంథములో వ్రాయబడివున్నది.) ప్రత్యక్షముగా

జరుగునది ఏదైనా సైన్సే. సత్యమును సైన్సుకాదని చెప్పుటకు వీలులేదు. ఎవరిలోనూ జరుగకుండా కేవలము ఒక

వ్యక్తిలోనే జరుగడము ఆశ్చర్యముతో కూడుకొన్న పనియైనా, అది లోపల సూక్ష్మముగా కనిపించక జరుగు కార్యమైన

దానివలన దానిని సూపర్సైన్సుకు సంబంధించిన విషయమని చెప్పవచ్చును. ఆహారము, నీరు లేకుండా ఒక మనిషి

75 సంవత్సరములుగా బ్రతికి యున్నట్లు, ఒక వింతైన కార్యమును దేవుడు చేసి చూపించి, ఒక మనిషిలోని ప్రత్యేకమైన

శక్తికలదని దేవుడు నిరూపించి చూపించాడు. అలాగే ఒక మనిషికున్న గుర్తు వేరొక మనిషికి ఉండదని కూడా

చూపించాడు. ఇంకా ఒక మనిషికున్న వాసన మరొకరికి ఉండదని కూడా తెలియజేశాడు. ఈ విధముగా ప్రతి

మనిషిలోనూ త్రివిధ భేదములను దేవుడుంచి, ఆ తేడాలను మనుషులు గమనించునట్లు, వారిలో ప్రత్యేకమైన కార్యములు

జరుగునట్లు చేశాడు. దీనినిబట్టి ఎక్కడైన మన మేధస్సుకు అందనిదేదయినా కార్యముంటే, అది ఎవరికీ చేతకాక

ఒక్కనికి మాత్రము సాధ్యమైనప్పుడు, దానిని బూటకమనీ, మూఢనమ్మకమని కొట్టివేయక అక్కడ ఎదైనా మనకు తెలియని

రహస్యముంటుందని యోచించి చూడండి. గ్రుడ్డిగా దేనిని ఖండించవద్దండి.


ప్రశ్న :- నేటికాలములో ఎందరో విశ్వవిద్యాలయములో (యూనివర్శిటీలో) ఉన్నత విద్యలను చదివినవారున్నారు.

అటువంటి విద్యావంతులే ఎక్కువగా నాస్తికులుగా తయారగుచున్నారు. చదవనివాడు దేవుడున్నాడని నమ్మినా, బాగా

చదివినవాడు దేవుడే లేడు అంటున్నాడు. నాకు తెలియక అడుగు చున్నాను. యూనివర్శిటీ అంటే అర్థము ఏమిటి?

యూనివర్శిటీలో చదువులు చివరికి దేవుడు లేడని బోధిస్తాయా?


జవాబు :- యూనివర్శిటీ అను పదము ఆంగ్లభాషకు సంబంధించినది. దానినే తెలుగుభాషలో విశ్వవిద్యాలయము

అంటారు. విశ్వము అనగా జీవరాసులతో కూడిన ప్రపంచము అని అర్థము. ఇంకొక విధముగా అంతటా

వ్యాపించియున్నదని కూడ చెప్పవచ్చును. మొత్తము మీద చరా అచరా ప్రకృతి ఎంతవరకున్నదో, దానినంతటినీ

విశ్వము అంటాము. విశ్వమంతా వ్యాపించియున్న దానిని గురించి నేర్చుకొను విద్యను విశ్వ విద్య అంటాము. విశ్వవిద్య

ఎక్కడైతే చెప్పబడుచున్నదో, దానిని విశ్వ విద్యాలయము అని అనవలెను. విశ్వవిద్యాలయము అను పేరును చెప్పుచున్నాము.

మన రాష్ట్రములో పదుల సంఖ్యలో విశ్వవిద్యాలయము లున్నాయి. అయితే అక్కడ విశ్వమంతా వ్యాపించియున్నదేదో,

దానిని గురించి చెప్పడము జరుగుచున్నదా అని ప్రశ్నించుకొని చూస్తే, దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు రాగలవు.

అందులో మొదటిది విశ్వమంతా వ్యాపించియున్న దేది? అను ప్రశ్న గలదు. దానికి జవాబును చూచిన ఈ విధముగా

ఉన్నది.


విశ్వము రెండు విధములు గలదు. ఒకటి కనిపించే విశ్వము, రెండు కనిపించని విశ్వము. కనిపించే

విశ్వమును ప్రకృతి అంటున్నాము. కనిపించని విశ్వమును పరమాత్మ (దేవుడు) అంటున్నాము. కనిపించే విశ్వమైన

ప్రకృతిని ఐదు భాగములుగా విభజించి చెప్పవచ్చును. కనిపించని విశ్వమైన పరమాత్మను లేక దేవున్ని మూడు

భాగములుగా విభజించి చెప్పవచ్చును. ప్రకృతిని ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని ఐదు భాగములుగా,

దేవున్ని పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని మూడు భాగములుగా చెప్పవచ్చును. ప్రస్తుతము విశ్వవిద్యాలయము అను

పేరుగల్గిన వాటిలో కనిపించే ప్రకృతికి సంబంధించిన ఐదు భాగములను గురించిన విద్యలను మనిషికి నేర్పుచున్నారు.

ఐదు భాగములకు సంబంధించిన విద్యలనే విశ్వవిద్యయనీ, వాటిని చెప్పు స్థలములనే విశ్వవిద్యాలయములని చెప్పడము

జరుగుచున్నది. నేడు బయటి ప్రపంచములో ఎక్కడ ఏ విశ్వవిద్యాలయము ఉన్నా అది ప్రకృతిని బోధించునదిగాయున్నది.

ప్రకృతి విద్యలను నేర్చిన వానికి పరమాత్మ విద్య పట్టుబడదు. కనిపించే ప్రకృతిని గురించి అనేక విషయములను

తెలిసిన మనిషి, తాను పెద్ద విద్యావేత్తనని అనుకొనును. వాస్తవానికి అతను పెద్ద విద్యావేత్తకాడు, అతను నేర్చినది పెద్ద

విద్యకాదు. అతడు నేర్చినది చిన్న విద్యయే. పెద్దవిద్యను బ్రహ్మవిద్య అంటారు. బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము.

ప్రకృతికంటే గొప్పది, ప్రకృతిని సృష్టించినది అయిన పరమాత్మకంటే అన్ని విధముల ప్రకృతి చిన్నది. అన్నిటికంటే పెద్ద

విద్య అయినందున, పరమాత్మ విద్యను బ్రహ్మవిద్య అని అంటారు. నేడు ప్రకృతిబోధను బోధిస్తున్న విశ్వవిద్యాలయములలో

తాము ఎన్ని సంవత్సరములు చదివినా, ఎన్నో కోర్సులు నేర్చి డిగ్రీలు తీసుకొన్నా అవన్నియు ప్రకృతి సంబంధ చిన్న

విద్యలేనని తెలియనివారు, మేము పెద్ద చదువులు చదివామని చెప్పుకొనుచుందురు. అలా వారు తమ చదువులను

పెద్ద చదువులని చెప్పుకొనినా, వాస్తవానికి అవి పూర్తి చిన్న చదువులే. వారు చదవని చదువు, అన్నిటికంటే పెద్ద

చదువు మరొకటి కలదు. అదియే బ్రహ్మ (పెద్ద) విద్య.


ప్రకృతి సంబంధ విద్యను నేర్చినవారు కేవలము నాలుగు శాస్త్రము లను గురించే తెలుసుకొంటున్నారు. శాస్త్రములు

అన్నీ ఆరు వుండగా, నేడుగల యూనివర్శిటీలలో ఎన్ని రకముల విద్యలను నేర్చినా అవన్నియు ఎటు తిరిగి నాలుగు

శాస్త్రములతో సంబంధపడియుండును. గణిత ఖగోళ, రసాయన, భౌతిక అను నాలుగు శాస్త్రములలోని విద్యలనే విశ్వ

విద్యాలయములలో బోధించడము జరుగుచున్నది. ఉదాహరణకు న్యాయ సంబంధ విద్యను కొన్ని సంవత్సరముల

కోర్సుగా నేర్చినా, దానిని న్యాయ శాస్త్రమని చెప్పుకొనినా, శాస్త్రములలో న్యాయశాస్త్రములేదు. ఉన్నవి షట్శాస్త్రములే.

అందువలన మనము న్యాయశాస్త్రమని పేరుపెట్టుకొని చదివినా, చివరికది అది శరీర సంబంధమైన భౌతికశాస్త్రము

నకు సంబంధించినదే అగును. ఇట్లు వేరువేరు పేర్లు పెట్టుకొని, వేరువేరు విద్యలు నేర్చినా, అవన్నియూ ప్రపంచసంబంధ

విద్యలే అగును. ప్రపంచ సంబంధవిద్యలన్నియూ కేవలము నాలుగు శాస్త్రములతోనే ముడిపడి యున్నవి. ఆరు

శాస్త్రములలో పూర్తి ప్రకృతికి సంబంధమైన శాస్త్రములు నాలుగుయుండగా, పరమాత్మకు సంబంధించినది ఒకటియున్నది,

అదియే బ్రహ్మవిద్యాశాస్త్రము. ఇక మిగిలినది జ్యోతిష్యశాస్త్రమనబడునది ఐదవశాస్త్రము ఒకటి గలదు. అది అటు

పూర్తి ప్రపంచ విద్యయూకాక, ఇటు పరమాత్మ విద్యయూ కాకుండా మధ్యలో రెండిటితో సంబంధపడియున్నది.

అందువలన గణిత, ఖగోళ, రసాయన, భౌతికశాస్త్రములను నాల్గింటిని ఒక ప్రక్క చేర్చగా, బ్రహ్మవిద్యశాస్త్రమును

మరొక ప్రక్క చేర్చగా, రెండిటికి మధ్యలో రెండిటికీ సంధిలాగ జ్యోతిష్యశాస్త్రము నిలిచిపోవుచున్నది. అన్ని శాస్త్రములకంటే

ఎటూగానిదైన జ్యోతిష్యశాస్త్రము ఏమాత్రము అభివృద్ధి చెందలేకపోయినది. కొందరు దీనిని శాస్త్రముగానే లెక్కించడములేదు.

అన్నిటికంటే పరిశోధనలో వెనుకబడిపోయినది, పరిశోధకులు లేని శాస్త్రము జ్యోతిష్యశాస్త్రమని చెప్పవచ్చును.


ప్రకృతి సంబంధ గణిత, ఖగోళ, రసాయన, భౌతికశాస్త్రములు నాలుగు బాగా అభివృద్ధి చెందిన శాస్త్రములుగా

ఉన్నవి. ఈ నాలుగు శాస్త్రములలో ఎంతోమంది పరిశోధకులు నిత్యము పరిశోధన చేయు చున్నారు. అందువలన

మనుషుల మెదడులో నాలుగుశాస్త్రములు బాగా గుర్తింపు పొందియున్నవి. ప్రతి విశ్వవిద్యాలయములోను నాలుగు

శాస్త్రములను గురించి పరిశోధన చేయుచునేయున్నారు. అయితే ఒక్క బ్రహ్మవిద్యాశాస్త్రము మాత్రము మనుషుల

పరిశోధనకు దూరముగా యున్నది. బ్రహ్మవిద్యాశాస్త్రమును గురించిన బోధలు ఏ విశ్వవిద్యాలయములలోనూ

చెప్పడములేదు. షట్శాస్త్రములలో బ్రహ్మవిద్యాశాస్త్రమునకు తప్ప మిగతా ఐదు శాస్త్రములకు విద్యాలయములుండవచ్చును,

గురువులు ఉండవచ్చును గానీ, ఒక్క బ్రహ్మవిద్యాశాస్త్రమునకు ఏ మనిషి గురువుగా ఉండడు. ఏ విద్యాలయములలోనూ

అది బోధించబడదు. బ్రహ్మవిద్యకు మనుషులు గురువులుగా ఉండుటకు వీలులేదు. ఎందుకనగా బ్రహ్మవిద్యా శాస్త్రము

దేవునికి తప్ప మనుషులకెవరికీ తెలియదని అదే శాస్త్రములో గలదు. మనిషి ఎవడైనా గ్రహించుకొను శిష్యుడుగా లేక

విద్యార్థిగా ఉండవలసిందేగానీ, బోధించు గురువుగా అర్హుడుకాడు. ఒకవేళ తాను గురువునని ఎవరైనా చెప్పుకొనినా,

ఆ మాట వినడమునకు సరిపోవునుగానీ, వాస్తవానికి అతను గురువు కాడు. ఎక్కడైనా ఎప్పుడైనా బ్రహ్మవిద్యను

చెప్పుటకు దేవుడు గురువుగా మారవలసియుంటుంది. అలా దేవుడు గురువుగా వచ్చినా, అతను దేవుడుగా రాడు,

మారు రూపములో (మారు వేషములో) మారు పేరుతో వస్తాడు. అలా వచ్చిన వానికి గుర్తింపులేదు. అతను ఎవరికీ

తెలియకుండా ఉంటాడు. కావున ఆయన బోధించుటకు విద్యాలయములు ఉండవు. బ్రహ్మవిద్య అంతా ప్రత్యేకతతో

కూడుకొని యున్నా, దానిని బోధించువాడు మాత్రము ఏ ప్రత్యేకత లేనివాడై, ఏ గుర్తింపులేనివాడై తాను చెప్పవలసిన

దానిని చెప్పిపోవును.


విశ్వము అనగా స్థూలము సూక్ష్మముతో కూడుకొనియున్నదనీ, అందులో స్థూలమైన ప్రకృతిని గురించి తెలుపు

విద్యను నేర్పుటకే నేటి విశ్వవిద్యాలయములున్నవనీ, సూక్ష్మమైన పరమాత్మను తెలుపు విద్య, పేరు పెట్టబడిన

విశ్వవిద్యాలయములో చెప్పడములేదనీ, అది ఎక్కడ చెప్పబడు తుందో, ఎవరు చెప్పెదరో ముందు ఎవరికీ తెలియదని

చెప్పుకొన్నాము. ఎక్కడ బ్రహ్మవిద్య చెప్పబడితే, అక్కడే నిజమైన విశ్వవిద్యాలయమున్నదని గ్రహించవలెను. అలాగే

ఎవరు చెప్పగలరో, వానినే గురువుగా లెక్కించ వలెను. ప్రకృతి సంబంధ ఐదు శాస్త్రములు, 64 విద్యలు ప్రపంచము

పుట్టినప్పటినుండి బోధించబడుచునే ఉన్నవి. షట్శాస్త్రములలో ఒక్క బ్రహ్మ విద్యాశాస్త్రము మాత్రము సృష్ఠి ఆదిలోనే

సంపూర్ణముగా బోధించబడినది. సృష్ట్యాదినుండి ఐదుశాస్త్రములు ఎడతెరపిలేకుండా బోధించబడుచున్నా, అవి ఇంతవరకు

పూర్తిగా బోధించబడలేదనీ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉన్నదని తెలియుచున్నది. బ్రహ్మవిద్య సృష్ట్యాదిలోనే

బోధించబడినా అది సంపూర్ణముగా ముందే తెలియబడినా, దానిని మనిషి మరచిపోవుచున్నాడు. అందువలన బ్రహ్మ

విద్మను అప్పుడప్పుడు తిరిగి జ్ఞాపకము చేయవలసి వచ్చినది. బ్రహ్మవిద్యను ఎప్పుడు జ్ఞాపకము చేసినా, అప్పుడైనా

దానిని గురువే చెప్పును. గురువు చెప్పిన దానిని తర్వాత మనుషులు ఎవరైనా బోధకులుగా చెప్పవచ్చునుగానీ,

గురువులుగా చెప్పుటకు వీలులేదు. గురువుగా ఒక్క భగవంతుడొక్కడే చెప్పగలడు. ఈ విషయమును ఇంతటితో ఆపి

మరొక ప్రశ్నను చూస్తాము.


ప్రశ్న :- ఆరోగ్యరంగములో అశాస్త్రీయ చికిత్సలు బయటపెట్టడానికి ఒక సంఘము పనిచేస్తూవున్నది. విలియమ్

జార్విస్ దానికి అధ్యక్షుడు. అక్యుపంక్చర్, హోమియో, కైరోప్రాక్టీస్ మొదలైన వైద్య విధానముల వలన కలుగు హానిని,

అశాస్త్రీయతను (శాస్త్రీయ హేతువాదము, జనవరి 1998లో) బయటపెట్టారు. ఈ విషయమును గురించి మీరేమంటారు?


జవాబు :- మీరు ఏ ప్రశ్న అడిగినా అది ఆధ్యాత్మికమునకు సంబంధించిన ప్రశ్నను అడగండి. అట్లుకాకుండా ఇతర

రంగములకు సంబంధించిన ప్రశ్నలకు నేను జవాబును ఇవ్వలేను. మీరు అడిగిన ప్రశ్నలో కొంతైనా ఆధ్యాత్మికమునకు

సంబంధించినదియైవుంటే దానినుండి పూర్తి జవాబును పొందవచ్చును. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పూర్తి వైద్యరంగానికి

సంబంధించినదియైనా, ఇందులో కొంత సూక్ష్మజ్ఞానము ఇమిడియున్నది. కావున ఈ ప్రశ్నకు జవాబును చెప్పెదను

చూడండి. రోగమును గురించి తెలిసి, ఆ రోగమును బాధితుని (రోగి) శరీరములో లేకుండా చేయుటకు చేయు

విధానమును వైద్యవిధానము అంటాము. ఏ వైద్య విధానమైనా రోగమును శాంతింపజేయుటకే ఉన్నదని చెప్పవచ్చును.

అటువంటి వాటిలో ఈ మధ్య కాలములో చైనానుండి అక్యుప్రెసర్, అక్యుపంచర్ వైద్యమూ, జర్మనీనుండి హోమియోవైద్యమూ

వచ్చాయి. అమెరికానుండి అల్లోపతి వైద్యము వచ్చినా, అరబ్ దేశమునుండి యునాని వైద్యము వచ్చినా,

ఉత్తరకొరియానుండి సుజోక్ థెరపి మొదలగు వైద్యములున్నా ఇందూ దేశమైన భారతదేశములో పూర్వమునుండి

ఆయుర్వేదవైద్యమున్నది. అంతేకాక మంత్రవైద్యము, అంత్రవైద్యము అనునవి కలవు. ఈ మూడు వైద్యములకు

ముందు పుట్టినిల్లు భారతదేశములోని కేరళరాష్ట్రమనియే చెప్పవచ్చును. ముందునుండి మూడు వైద్యములు మనదేశములో

ఉన్నా, నాగరికత పెరుగుకొలది స్వదేశవైద్యము మీద ఆసక్తి తగ్గి, విదేశీవైద్యము మీద శ్రద్ధ పెరిగినది. అందువలన

ఇతర దేశ వైద్యవిధానములు అన్నీ మన భారతదేశములో గలవు. ఎన్ని వైద్యములున్నా వాటిలో అల్లోపతి వైద్యమును

శాస్త్రబద్ధమైనదనీ, మిగత విధానములన్నిటినీ అశాస్త్రీయతకల్గిన వని చెప్పడము కొందరికి అలవాటైపోయినది. శాస్త్రీయత

అంటే ఏమిటో తెలియనివారు కూడా తమకు నచ్చని వాటిని, తమకు తెలియనివాటిని అశాస్త్రీయమైనవి అంటున్నారు.

ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును విమర్శించుటకు కూడా

శాస్త్రము అంతే అవసరమను మాటను మరచిపోయినవారు, ఏమాత్రము శాస్త్రపద్ధతితో కొట్టివేయకుండా,

మిగతవాటిలోనున్న అశాస్త్రీయత ఏమిటో చెప్పకుండా, మూఢముగా తమకు తెలియనివాటిని మూఢనమ్మకము,

అశాస్త్రీయము అంటున్నారు.


అల్లోపతి వైద్యమును సమర్థించువారు, హోమియోపతి వైద్యమును విమర్శించుచున్నారు. హోమియో వైద్యములో

మందే లేదనీ, హోమియో వైద్యము పూర్తి అశాస్త్రీయమని అంటున్నారు. అల్లోపతి వైద్యము పూర్తి శాస్త్రబద్ధమైనప్పుడు,

హోమియో ఎలా అశాస్త్రీయమైనదో వివరించకుండా, అందులో మందేలేదు అనడము సరియైన విధానమా! అని

అడుగుచున్నాము. హోమియోవైద్యము శాస్త్రబద్ధతలేనిదైతే, దానిని అనుసరించి అల్లోపతి వైద్యము కూడా శాస్త్రబద్ధత

లేనిదనియే చెప్పవచ్చును. ఎట్లనగా! ఉదాహరణకు అల్లోపతివైద్యములో ఒక రోగము భవిష్యత్తులో రాకుండుటకు

టీకాలు వేయుచుందురు. మశూచి (పెద్ద అమ్మవారు) అను రోగమును లేకుండా చేయుటకు, ఆ రోగము భవిష్యత్తులో

ఎప్పుడు రాకుండుటకు మనిషి శరీరములో రోగనిరోధకశక్తిని పెంచుటకు ముందుగా ఇచ్చుమందును టీకా అంటాము.

టీకామందు సూదిరూపములో ఉండవచ్చును లేక చుక్కల రూపములో ఉండవచ్చును. పోలియో రోగము రాకుండుటకు

ముందుగానే పోలియోమందును చుక్కలరూపములో చిన్నవయస్సులోనే ఇవ్వడము అందరికీ తెలిసిన విషయమే. అదే

విధముగా మశూచి రోగము రాకుండుటకు సూదిరూపములో మందును శరీరములోనికి పంపుచున్నారు. ఇక్కడ

కొందరికి ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! ఎప్పుడో పది సంవత్సరముల తర్వాత రోగము రాకుండుటకు ఇప్పుడు

మందువేస్తే అంత కాలము ఆ మందు శరీరములో ఉండునా? భౌతికశాస్త్రము ప్రకారము శరీరములోనికి చేరిన

మందుకూడా అప్పుడు మాత్రమే వినియోగించబడి తర్వాత మార్పుచెందినదై మూత్రము ద్వారా బయటికిపోవునని

తెలుపబడినది. అలాంటప్పుడు ముందుగా మందువాడితే అది భవిష్యత్తులో ఎప్పుడో పది లేక పదిహేను సంవత్సరముల


తర్వాత వచ్చు రోగమును నిరోధించ గలదా? అంతకాలము శరీరములో మందు ఉండదు కదా! అని అడుగుటకు

అవకాశము గలదు. దానికి మా జవాబు ఈ విధముగా కలదు.


శరీరములో రోగమున్నప్పుడు రోగమునకు వ్యతిరేఖముగా, రోగ క్రిములు చనిపోవునట్లు మందును ఇవ్వడము

జరుగుచున్నది. రోగమునకు వ్యతిరేఖముగా ఇచ్చిన మందు అప్పుడున్న రోగమును శరీరము నుండి లేకుండా చేయుటకు,

ఆ రోగమునకు వ్యతిరేఖదిశలో పని చేయుచున్నది. టీకారూపములో ముందుగానే ఇచ్చుమందు రోగమునకు

అనుకూలముగా ఉండునది. రోగమున్నప్పుడు ఇచ్చుమందు రోగమునకు ప్రతికూలముగా ఉండును. రోగక్రిములను

చంపునదిగా ఉండును. అయితే టీకాలో ఇచ్చుమందు రోగక్రిములను కల్గి, రోగమును కల్గించునదిగా ఉండును.

రోగమును భవిష్యత్తులో రాకుండ చేయుటకు ఇప్పుడే ఆ రోగమును శరీరములోనికి కొంత ఎక్కించడమును టీకావేయడము

అంటాము. టీకా పద్ధతి భవిష్యత్తులో రోగమును లేకుండా చేయుటకు అని అన్నప్పుడు ఇప్పుడే రోగక్రిమిని శరీరములోనికి

ఎక్కించడము ఏమిటి? అను ప్రశ్న రాగలదు కదా! దానికి జవాబు ఏమనగా! బలహీనపరచిన రోగక్రిమిని శరీరములోనికి

పంపడము వలన, శరీరములో సహజశక్తి అయిన రోగనిరోధకశక్తి తయారుకాగలదను సూత్రము ప్రకారము, టీకాపద్ధతిలో

రోగమునే శరీరములోనికి ఎక్కించడము జరుగుచున్నది. ఆరోగ్యమైన శరీరములోనికి బలహీనమైన రోగక్రిమిని పంపడము

వలన, శరీరములో ఆ రోగమునకు వ్యతిరేఖమైన మందు తయారై, ఆ క్రిమిని చంపివేయడము వలన, శరీరములోనికి

భవిష్యత్తులో ఎప్పుడు ఆ రోగక్రిమి ప్రవేశించినా, శరీరములోని రోగనిరోధకశక్తి వెంటనే గుర్తించి రోగక్రిమిని చంపివేయును.

అట్లు శరీరములో ముందే ఆ రోగ క్రిమి విషయము టీకా ద్వారా తెలిసియుండుట వలన, శరీరము సులభముగా ఆ

రోగక్రిమికి వ్యతిరేఖమైన మందును శరీరములోనే తయారు చేసుకొనుచున్నది. అందువలన ముందే టీకావేయబడిన

రోగములు తర్వాత శరీరములోనికి రాలేవు. రోగక్రిమిని ముందే శరీరమునకు చూపించుటకు రోగక్రిములను

శరీరములోనికి పంపించడమే టీకాపద్ధతి అంటున్నాము.


అల్లోపతివైద్య విధానములో ప్రస్తుత రోగమునకు వ్యతిరేఖముగా మందు ఇవ్వడము జరుగుచున్నది. అలాగే

భవిష్యత్తులో రాబోవు రోగమునకు ముందే శరీరములో రోగనిరోధకశక్తిని తయారు చేయుటకు రోగమునకు అనుకూల

మందును వాడడము జరుగుచున్నది. అల్లోపతిలోనున్న రెండు విధానములను తెలిసిన యం.డి డాక్టర్ (అల్లోపతి

డాక్టర్ సామ్యూయేల్) అల్లోపతిలోని టీకాపద్ధతిని లేక టీకా సూత్రమును మాత్రము తీసుకొని దానిని ఒక్కదానినే

అభివృద్ధిపరచి, దానిని ప్రత్యేకమైన వైద్యముగా హోమియో పతి వైద్యము అన్నాడు. వాస్తవానికి అల్లోపతి వైద్యములోని

ఒక భాగమే హోమియోపతి. అటువంటపుడు హోమియో అశాస్త్రమెలా అవుతుంది? అల్లోపతి శాస్త్రమైనప్పుడు

హోమియోపతి కూడ శాస్త్రమే అగును. హోమియోపతి యొక్క పూర్వాపరాలు తెలియనివారు, నోటితో పెద్దగ మాట్లాడితే

పాట, చిన్నగ మాట్లాడితే మాట అని చెప్పినట్లున్నది. ఒక్క ప్రక్క మాట్లాడితే మాట అనుచూ, పెద్దగ మాట్లాడితే పాట

అనడమేమిటి? నోటితో పెద్దగమాట్లాడినా, చిన్నగ మాట్లాడినా మాటయే అనబడునుగానీ, పాట అనబడదు కదా! అదే

విధముగా అల్లోపతిలో రెండు భాగములున్నప్పుడు ఒక భాగము శాస్త్రమైతే, మరొక భాగము కూడా శాస్త్రమే అగునుగానీ

అశాస్త్రమెట్లగును? అలా అశాస్త్రమంటే దానిని తెలివితక్కువ మాటయని అనవచ్చును. హోమియోలో ఔషధము లేదు

అనుచున్నారు, దానిని విన్న చాలామంది ఆ మాట నిజమేనేమో అని అనుకొనుచున్నారు. హోమియో లోని వాస్తవికతను

తెలియుటకు దానిని గురించి కొంత వివరముగా తెలుసుకొందాము.


మనిషి శరీరములోనికి ప్రవేశించిన రోగమును ఎదుర్కొని దాని నుండి రక్షణ కల్పించునది ఔషధము. రోగమునకు

వ్యతిరేఖమైనది ఔషధము. ఒక రోగమునకు పూర్తి వ్యతిరేఖమైన ఔషధము రెండు రకములు గలదు. ఒకటి మనిషి

తయారు చేయునది. రెండు శరీరములో ఎవరికీ తెలియని ఆత్మ తయారు చేయునది. బాహ్యములోనున్న మనిషి

ద్వారా తయారు చేయబడు ఔషధములు నేడు మందులషాపులలో లభ్యమగుచున్నవి. ఒక వ్యక్తికి ఒక రోగము వస్తే,

డాక్టరు ఆ రోగమునకు సరిపడు మందును సూచించితే, దానిని తీసుకొని వాడడమూ, రోగమును లేకుండా చేసు

కోవడమూ జరుగుచున్నది. ముగ్గురు మనుషులకు ఒకే రోగము, ఒకే రోజు వచ్చింది అనుకొనుము. వారిలో ఇద్దరు

ఒకే డాక్టరు దగ్గరికి పోతే డాక్టరు ఔషధమును ఇవ్వగా, ఆ ఔషధమును ఇద్దరూ క్రమము తప్పకుండ వాడడము

జరిగినది. మూడవవాడు తనయొద్ద డబ్బులేనందున డాక్టరువద్దకు పోలేదు, ఔషధమును వాడలేదు. డాక్టరువద్దకు

పోయి రోగమునకు మందువాడిన వారిలో, ఒకనికి మూడు రోజులకు ఆ రోగము నయమై పోయినది. రెండవ వానికి

ఐదు రోజుల వరకు మందులు వాడగా, ఐదు రోజులకు పూర్తిగా నయమైపోయినది. మూడవవాడు డాక్టరువద్దకు

పోలేదు, మందులు వాడలేదు. అయినా అతని రోగము నాల్గు రోజులకు పూర్తిగా నయమైపోయినది. ఇక్కడ బాగా

గమనించితే ఒకే రోగము ఒకే దినము ఒకే జాతి మనుషులకు వచ్చినప్పుడు, ఒకే ఔషధమును వాడిన ఇద్దరిలో ఒకరికి

మూడు రోజులకు, రెండవ వానికి ఐదు రోజులకు రోగము పోయినది. ఇద్దరు వ్యక్తులు ఒకే మందునువాడినా, ఒకనికి

మూడు దినములకు పోయిన రోగము, మరొకనికి రెండు రోజులు ఆలస్యముగా నయమైనది. అక్కడ రెండు రోజులు

తేడా ఎందుకు వచ్చినదను ప్రశ్న రాగలదు. అంతేకాక అసలుకు ఏమాత్రము మందేవాడని వానికి నాల్గు రోజులకే

పూర్తి నయము కావడములో కూడా మనకు అదెలా జరిగినదను ప్రశ్నరాగలదు. ఔషధమును వాడిన వారిలో ఐదు

రోజులకు ఒకనికి రోగముపోతే, ఔషధము వాడని వానికి ఒకరోజు ముందే పోవడము ఎలా సాధ్యమైనదని ఎవరైనా

అడుగవచ్చును. దానికి జవాబును చూస్తే, ఈ విధముగా గలదు.


ఏ రోగమునకైనా ఔషధము రెండు రకములుగా తయారగుచున్నదని తెలుసుకొన్నాము. ఒక రకము ఔషధమును

మనిషి బాహ్యముగా చేయుచున్నాడు. రెండవ రకముగా ఔషధమును శరీరములోని ఆత్మయే చేయుచున్నది. ఔషధము

వలన రోగము నిరోధించబడుచున్నది. ఇప్పుడు రోగము వచ్చినవారు ముగ్గురు, ఔషధములు రెండు రకములు,

ఔషధమును వాడినవారు ఇద్దరు, వాడని వాడు ఒక్కడు అని అనుకొన్నాము కదా! ఇక్కడే మనలెక్క తప్పయినది.

రోగులు ముగ్గురు వాస్తవమే, ఔషధములు రెండు రకములు, ఒకటి బాహ్యంగా మనిషి తయారు చేసినది, రెండు

అంతరంగమున ఆత్మ చేసినది. రోగమునకు మందువాడినవారు బయటికి తెలిసి ఇద్దరయినా, ఒకరు వాడకున్నా

వాస్తవానికి ముగ్గురూ వాడినారనియే చెప్పవచ్చును. బాహ్యముగా మూడవ వాడు డాక్టరు దగ్గరకు పోలేదు, మందును

తీసుకోలేదు. అయినా అంత రంగములోనే అనగా శరీరములోనే మూడవవానికి స్వయముగా ఆత్మయే మందు ఇచ్చినది.

రోగము వచ్చిన రోజు మొదటి ఇద్దరు రోగులు బాహ్యముగానున్న డాక్టరువద్ద మందును తీసుకోగా, అది పూర్తిగా పని

చేయుటకు ఒకనికి మూడురోజుల వ్యవధి పట్టినది. రెండవవానికి ఐదురోజుల వ్యవధి పట్టినది. వాస్తవానికి సరియైన

మందుకు ఒక్కరోజు వ్యవధిలోనే ఆ రోగము నయము కావలసియుండగా, సరియైన మందువాడినా ఒకనికి మూడు,

మరొకనికి ఐదు రోజుల కాలము పట్టినది. అయితే మూడవవానికి రోగము వచ్చిన మూడవరోజు ఆత్మ ఔషధమును

శరీరములో అందివ్వడము జరిగినది. ఆత్మ అందించిన ఔషధమునకు మరుసటి దినమే రోగము పోయినది. బాహ్యముగా

ముగ్గురికి ఒకే దినము రోగము వచ్చినా, వారిలో ఇద్దరు బయటనున్న డాక్టరు ఇచ్చిన మందునువాడగా, మూడు

రోజులకు ఒకనికి, ఐదు రోజులకు రెండవవానికి రోగము పోవడము జరుగగా, బయటి మందునువాడని వానికి ఆత్మ


అందించిన మందువలన రోగము మరుసటి దినమే అనగా నాల్గవరోజు పోవడము జరిగినది. ఆత్మ ఇచ్చిన మందుకు

రెండవ రోజే రోగముపోగా, డాక్టరు ఇచ్చిన మందుకు ఒకరికి మూడు రోజులు, రెండవవానికి ఐదురోజుల కాలము

పట్టినది.


ఒకే డాక్టరే, ఒకేమందును ఇవ్వగా ఒకనిలో మూడు రోజులకు, రెండవవానిలో ఐదురోజులకు పని చేయడములోని

హేతువు ఏమిటో మనుషులకు తెలియదు. ఈ విషయమును ఒక ప్రశ్నగా తీసుకొని చూస్తే, దానికి జవాబు ఈ

విధముగా కలదు. రోగము వచ్చినది శరీరమునకు, శరీరమునకు అధిపతి, లేక యజమాని ఆత్మ. శరీరములో జరుగు

ప్రతి పనిని ఆత్మయే చేయుచున్నది. ఆత్మకు తెలియకుండా మరియు ఆత్మ అనుమతిలేనిది శరీరములో ఏమీ జరుగుటకు

వీలులేదు. అన్నియు ఆత్మకు తెలిసి, ఆత్మ అనుమతితోనే జరుగుచుండును. ఇక్కడ రోగి శరీరములోనికి బయటనుండి

ఔషధమును వాడినప్పుడు, అది ఆత్మకు తెలిసే లోపలికి పోవుచున్నది. అలా వాడిన మందు ఆత్మ అనుమతితోనే

శరీరములో పని చేయవలసియుండును. ఇద్దరు వ్యక్తులు ఒకే రోగమునకు, ఒకే దినము మందును డాక్టరువద్ద

తీసుకొనినా, ఆ మందు శరీరములోగల ఆత్మ అనుమతితోనే పని చేయవలసియుండును. ఆత్మ ఒప్పుకొన్నప్పుడే ఔషధ

ప్రభావము రోగముమీద చూపును. ఆత్మ ఒకని శరీరములో రెండు రోజులకు మందును ఒప్పుకోగా, మూడవరోజు

వానికి రోగము నయము కావడమైనది. రెండవవానికి వాని శరీరములోని ఆత్మ వాడు తీసుకొనిన మందును

నాల్గవరోజు ఒప్పుకోగా, ఐదవరోజు అతని రోగము పోయినది. అందువలన రోగము ఇద్దరిలో నయము కావడానికి

ఒకనికి మూడురోజులు, మరొకనికి ఐదురోజుల కాలము పట్టినది. ఇద్దరు వ్యక్తులు బాహ్యమందును వాడినా ఒకని

శరీరములో వాడబడినమందు రెండు రోజులు వృథా అయిపోయినది. రెండవ వాని శరీరములో నాల్గురోజులు వాడబడిన

మందు ఆత్మ అనుమతి పొందలేదు. అందువలన ఆ నాల్గురోజుల మందు వృథా అయిపోయినది.


ఆత్మ అనుమతి లేనిది శరీరములో ఏ పనీ జరుగదు. అందువలన వాడబడిన మందులన్నీ అందరి శరీరములలో

ఒకే విధముగా పని చేయడములేదు. మందులు వాడినా చనిపోయిన వారు కలరు. మందులు వాడకున్నా బ్రతికినవారు

కలరు. ఆత్మ అనుకొంటే ఏమైనా చేయగలదు. ఒక మాత్రలోగానీ, ఒక సూదిమందులోగానీ, ఏ ఔషధమున్నదీ

డాక్టర్లకు తెలిసినా, అది ఎవరిలో ఎంతమేరకు పనిచేయునో ఖచ్ఛితముగా చెప్పలేరు. అందువలన కొందరు అనుభవమున్న

డాక్టర్లు “మేము చేసేదంతా చేశాము, తర్వాత మనిషి బ్రతుకుతాడో లేదో, రోగము పోతుందో లేదో, అది మా చేతిలో

లేదు” అని అంటుంటారు. బయటి మందులన్నీ డాక్టర్లకు తెలిసినా, తన ఇంటిలో తన కొడుకుకు రోగమువస్తే,

తనకు తెలిసిన మందులు వలన రోగమును పొగొట్టుతాననీ, తనకొడుకును రోగమునుండి రక్షించు కుంటానను నమ్మకము

డాక్టరుకేలేదు. పూర్వము వైద్యరంగములో పండితుడని పేరుగాంచిన ఒక యం.డి. డాక్టరు తన కొడుకుకు వచ్చిన

రోగమును పోగొట్టుటకు విశ్వప్రయత్నము చేసి, తనకు తెలిసిన మందులన్ని టినీ వాడి చూచాడు. ఆ రోగమునకు

నిర్దేశింపబడిన ఏ మందూ ఆ రోగము మీద పనిచేయలేదు. చివరకు ఆయన కుమారుడు చనిపోవడము జరిగింది.

కుమారుడు చనిపోవడము వలన ఆ డాక్టరుగారు చాలా బాధపడి పోయాడు. ఆ డాక్టరు కొంత ఆధ్యాత్మికచింతన

కల్గినవాడు, కనుక శరీరములోని రోగమును శరీరములోనున్న దేవుడే నయము చేయాలిగానీ, మనిషి ఎంత పెద్ద

డాక్టరైనా నయము చేయలేడను ఉద్దేశ్యములోనికి వచ్చాడు. అటువంటపుడు డాక్టరుగాయున్నవాడు మనిషికున్న రోగమును

లోపలికి తెలిపి, ఈ రోగము నయము చేయమని కోరుకోవాలిగానీ, నేను నయము చేస్తాను అని అనుకోకూడదు

అనుకొన్నాడు. ఇక్కడ డాక్టరుగారు అనుకొన్నది మంచి ఉద్దేశమే అయితే దేవుడు ఏమీ చేయడనీ, దేవుని స్థానములో


ఆత్మ ఉండి అన్ని పనులూ చేస్తున్నదని తెలియదు. అలా తెలియకపోయినా ఫరవాలేదు, తాను చేస్తానని అనుకోవడములేదు,

అలా నేను అను అహమును వదలుకోవడము ముఖ్యము. ఏ విధముగానైతేనేమి తాను ఏమీ చేయలేననీ

శరీరములోనున్నవాడు రోగమును నయము చేయుననీ, రోగమును గురించిన అభ్యర్థన మాత్రము చేయడము డాక్టరు

యొక్క ముఖ్యమైన పని అనీ అనుకొన్నాడు. ఈ మనిషికి ఈ రోగమును నయము చేయమనుటకు, మనిషికున్న

రోగమునకు గుర్తుగా శరీరములోనికి డాక్టరైన వాడు రోగము యొక్క గుర్తును పంపాలనుకొన్నాడు. రోగికి ఏ రోగముంటే

అదే రోగక్రిమిని ఆ రోగమునకు గుర్తుగా శరీరములోనికి పంపడము వలన, ఆ రోగమును నయము చేయమని దేవున్ని

అడిగినట్లగునని అనుకొన్నాడు. అలా అభ్యర్థిస్తే లోపలయున్న దేవుడు ఆ రోగమును తప్పక నయము చేస్తాడను

నమ్మకములోనికి ఆ యం.డి. డాక్టరు వచ్చాడు.


నమ్మకమనునది సత్యము కావచ్చును లేక అసత్యమూ కావచ్చును. నమ్మకము సత్యమైతే అది యదార్థమగును.

అసత్యమైతే మూఢనమ్మక మగును. తన నమ్మకము మూఢనమ్మకమా, సత్యమైన యదార్థమా అని తెలియుటకు

ఒకమారు తన అనుభవములోనికి నమ్మకమును తెచ్చుకొని చూడవలెను. దానికొరకు యం.డి. డాక్టర్ ఒక రోగికున్న

రోగక్రిమి నమూనాను రోగి శరీరములోనికి పంపి, శరీరములోపలయున్న దేవున్ని (ఆత్మను) ఆ రోగమును నయము

చేయమని అడిగాడట! అప్పటినుండి ఆ రోగము నయము అవుటకు మొదలు పెట్టినది. మనిషికున్న రోగము పూర్తిగా

నయమగునంతవరకు ఆ డాక్టరుగారు రోగము యొక్క గుర్తును శరీరము లోనికి పంపుచుండగా ఆ విషయమును

ప్రతి దినము దేవున్ని అడిగినట్లుండు నని అనుకొని అలాగే చేశాడు. కొన్ని దినములకు ఆ రోగము రోగియొక్క

శరీరములో లేకుండా పోయినది. అంతేకాకుండా రోగము రాకముందే ఒక రోగము యొక్క నమూనాను శరీరములోనికి

పంపితే, ఆ రోగమునకు ముందుగానే శరీరములో దేవుడు మందును తయారు చేసిపెట్టునను సూత్రము కూడా ఆ

యం.డి డాక్టరుగారు చెప్పడము జరిగినది. అలాగే చేసి చూచి అది సత్యమని తేల్చి చెప్పడము జరిగినది. ఇదంతయు

శరీరమను ఇంటిలో ఆత్మయను ఇంటి యజమాని వలన జరుగు పని కావున ఈ వైద్య విధానమునకు ఇల్లు జ్ఞప్తివచ్చులాగున

ఇంగ్లీషులో హోమ్ అను పదమువచ్చునట్లు హోమియోపతి అన్నారు. కరోడ్పతియంటే కోటికి యజమాని అన్నట్లు

హోమియోపతి అంటే ఇంటియజమాని అని అర్థము చేసుకోవచ్చును.


హోమియోపతి వైద్యము మొదట మొదలు పెట్టిన సూత్రమును ఆధారము చేసుకొని ఇంకా ముందుకుపోయినది.

ఆ నేపథ్యములో హోమియో వైద్యము మూడు పొటెన్సీలుగా తయారైనది. నేడు హోమియో మందులు మూడు

రకముల బలమైన స్థాయిలలో దొరుకుచున్నవి. క్రొత్త దనమును సంపాదించుకొన్న హోమియోపతి మందులు 30

పొటెన్సీ, 200 పొటెన్సీ, 1000 పొటెన్సీ అను మూడు పొటెన్సీలలో దొరుకుచున్నవి. పొటెన్సీ అనగా ఆ మందుయొక్క

శక్తి అని అర్థము చేసుకోవలెను. మూడు స్థాయిలలో హోమియోమందులు నేడు లభ్యమగుచున్నవి. పొటెన్సీ అంటే

దేవున్ని వేడుకొను అభ్యర్థన అని మనము అర్థము చేసుకోవలసివుంటుంది. 30 పొటెన్సీమందు అంటే శరీరమను

ఇంటిలోని (బాడీహోమ్లోని) దేవున్ని లేక ఆత్మను ముప్పయిమార్లు అభ్యర్థించినట్లు అర్థము. 200 పొటెన్సీ అంటే

ఆత్మను లేక దేవున్ని 200 మార్లు అడిగినట్లు అర్థము. 1000 పొటెన్సీ అనినా దేవున్ని 1000 మార్లు రోగమునుండి

కాపాడమని అభ్యర్థించినట్లు అర్థము.


దేవున్ని అభ్యర్థించడములో సమానమని పొటెన్సీ యొక్క అర్థము చెప్పుకొన్నాము కదా! హోమియోలో ఒక

పొటెన్సీ ఎలా తయారు చేస్తారో తెలుసుకోగలిగితే మూడు రకములైన 30, 200, 1000 పొటెన్సీల విషయము


తెలిసిపోవును. అందువలన ఇక్కడ పొటెన్సీ విషయమును తెలుసుకొందాము. ఇక్కడ అందరికీ అర్థమగుటకు

ఉదాహరణగా ఇక్కడ చక్కెర నీళ్ళను గురించి చెప్పుచున్నాను. చెప్పెడి నమూనానుబట్టి హోమియో పతి వైద్యముంటుంది

అని తెలుసుకొవలెను. ఒక స్పూన్ (ఒక చెంచా) చక్కెరను తీసుకొని దానికి ముప్పయి స్పూన్ల నీరు కలిపితే అది

చక్కెర ద్రవమగును. అలా కలిపిన నీటిలో చక్కెరశాతము చాలా తక్కువగా ఉండుట వలన ఆ నీరులో తీపి కనిపించీ

కనిపించనట్లు ఉండును. నూరులో 3.33 శాతము మాత్రము చక్కెర ఉన్నదని చెప్పవచ్చును. అయితే ఇక్కడ లోకవిరుద్ధమైన

మాటలను చెప్పవలసి వచ్చినది. దైవజ్ఞానమంతయు లోకవిరుద్ధముగా ఉండును. కనుక మనము ఇప్పుడు కొంత

లోకవిరుద్ధమైన, దైవసంబంధమైన విధానమును అనుసరించి చెప్పుకొందాము. తనను తాను తగ్గించుకొనువాడు

హెచ్చించబడును అను దైవ సూత్రము ఒకటి కలదు. ప్రపంచములో తనను తాను తగ్గించుకొన్నవాడు దైవమార్గములో

ఎన్నో రెట్లు హెచ్చింపబడును. దీనినిబట్టి దైవమార్గములో తగ్గితే ప్రపంచ మార్గములో లక్షరెట్లు ఎక్కువ కనిపించుననీ,

ఒకవేళ ప్రపంచమార్గములో తగ్గితే దైవమార్గములో లక్షరెట్లు ఎక్కువగుననీ కొందరు జ్ఞానులు చెప్పగా కూడా విన్నాము.

అదే విధముగా ప్రపంచములోని అర్థాలను తగ్గించి దైవమార్గములో గొప్ప అర్థాలుగా చెప్పుకొన్నాము. తెలుగుభాషలో

పతియనగా భర్తలేక యజమాని అని చెప్పవచ్చును. కరోడ్పతి అను ఇతర భాష పదమును తెలుగులో కోటీశ్వరుడు

అని చెప్పుకొన్నట్లు, హోమియోపతి అను పదమును కూడా ఆ భాషలోని అర్థమును వదలివేసి అడ్డముగా ఇంటి

యజమాని అని అర్థము చెప్పుకొన్నాము. ఇప్పుడు ఒక భాగము చక్కరను ముప్పయి భాగముల నీటికి కలిపి చక్కరను

ముప్పయి భాగములుగా పలుచన చేసాము అనకుండా, దానినే త్రిప్పి మాట్లాడుచూ, చక్కర ముప్పయి భాగముల

దృఢముగాయున్నదని చెప్పడము లోక విరుద్ధము. లోకవిరుద్ధమైతే దైవ అనుకూలమగునను సూత్రము ప్రకారము

చెప్పుచున్నామని అర్థము చేసుకోండి. ఒక స్పూన్ చక్కరకు రెండు వందల రెట్లు నీళ్ళు కలిపి చక్కెరను పూర్తి పలుచన

చేసి కాదు చక్కరను 200ల రెట్లు బలము చేశానని చెప్పుచున్నాము. రెండు వందల రెట్లు నీళ్ళు కలిపి పలుచన

చేశామనునది ప్రపంచ సత్యము. రెండు వందలరెట్లు నీళ్ళు కలిపి రెండు వందల రెట్లు బలముగా చేశాననడము

ప్రపంచ విరుద్ధము మరియు అసత్యము. దైవ మార్గములో అదేమాట పూర్తి సత్యము. హోమియోపతి విధానములో

లోక విరుద్ధమైన మాటనే చెప్పడము జరిగినది. ఒక భాగము చక్కరకు వేయి భాగముల నీరు కలిపి, ఆ ద్రవములో

చక్కరశక్తి వేయిరెట్లున్నదని చెప్పడము జరుగుచున్నది. అది ప్రపంచములో అసత్యమనీ, దైవికముగా సత్యమనీ చెప్పడము

జరుగుచున్నది.


స్థూలముగాయున్న అల్లోపతినుండి సూక్ష్మముగానున్న హోమియో పతిని చెప్పడము జరిగినది. అందువలన

హోమియోపతి విషయము కొందరికి అర్థముకాక, అందులో మందే లేదు అనడము జరిగినది. ప్రపంచమునకు

దగ్గరగానున్న అల్లోపతినుండి ప్రపంచమునకు సులభముగా అర్థముకాని హోమియోపతి బయటకు వచ్చినది. అల్లోపతిని

స్థూలముగా హోమియోపతిని సూక్ష్మముగా అర్థము చేసుకోవాలి. మన శరీరములో సూక్ష్మమైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు

మూడు అన్నట్లు హోమియోపతి లోని మందు మూడు శక్తులుగా విభజింపబడినది. వాటినే 30 పొటెన్సీ, 200

పొటెన్సీ, 1000 పొటెన్సీలని చెప్పవచ్చును. మూడు భాగములుగా నున్న పొటెన్సీలు ఎలా ఏర్పడ్డాయి అనగా! ఒక

రోగమునకు సంబంధించిన రోగక్రిమినిగానీ, రోగమునకున్న ఏ భాగమునైనాగానీ కొద్ది భాగమును మాత్రము శరీరములోనికి

పంపగా ఆ శరీరములోని ఆత్మ, ఆ రోగమును గ్రహించి దాని నివారణకు కావలసిన రోగ నిరోధకశక్తిని సమకూర్చును.

రోగ నిరోధకశక్తి శరీరములో తయారగుట వలన అప్పుడు ఆ రోగముంటే లేకుండా పోవును. అప్పుడు లేకపోయినా

దానికి కావలసిన నిరోధకశక్తి సమకూరియుండుట వలన, ఆ రోగము ఎప్పటికీ వానికిరాదు. దీని విధానమునంతటిని


గ్రహించితే హోమియోపతి వైద్యములో రోగమును ఎదురించి నయము చేయు మందు ఉండదుగానీ, ఆ రోగమునకు

సంబంధించిన ధాతువే అందులో ఉండును. అందువలన హోమియోపతి వైద్యములో రోగ ధాతువు ఉండుట వలన,

రోగము వచ్చుటకు అవకాశ ముండునుగానీ, రోగము పోవుటకు అవకాశములేదు. మనిషి ఇచ్చు హోమియో వైద్యములో

అంతో ఇంతో రోగము కల్గును. అందువలన హోమియో మందువాడిన వానికి ఉన్న రోగము ఎక్కువ అవడముగానీ,

రోగము లేకున్నా దాని లక్షణములు కనిపించడముగానీ జరుగును. అప్పుడు శరీరములోని ఆత్మ ఆ రోగమునకు

ఔషధమును లోపలే తయారు చేసి ఇవ్వడము వలన రోగము పూర్తిగా లేకుండాపోవును. ఆత్మ ఇచ్చిన ఔషధము

అన్నిటికంటే శ్రేష్ఠమైనదీ, రోగమునకు పూర్తిగా సరిపోవునదియైనందువలన రోగము పూర్తిగా పోవును. ఈ విధముగా

జరుగు దానినిబట్టి హోమియో మందువాడితే మొదట రోగము ఎక్కువై తర్వాత తగ్గుతుందని చెప్పుచుంటారు.


ఒక రోగక్రిమినిగానీ, రోగ కణమునుగానీ, లేక రోగమును కల్గించు దేనినైనాగానీ తీసుకొని దానికి ముప్పయి

భాగములు ఎక్కువగా ఆల్కాహాలును చేర్చి కొద్ది రోజులు దానిని ఆల్కాహాలులో కలియత్రిప్పుచుండగా అది ఆల్కాహాలు

(సారాద్రవములాంటిది)లో పూర్తిగా కలిసిపోయి శరీరములో ఆత్మ గ్రహించునట్లుగా మారిపోవును. ఆత్మ గ్రహించునట్లుగా

అనుటకంటే ఆత్మను అభ్యర్థించునట్లుగా మారిపోవును అనుట సమంజసము. ఆ విధముగా ఒక రోగ భాగమునకు

ముప్పయి భాగములు ఆల్కాహాలు కలిసిన దానిని ముప్పయివంతులు శక్తిగల హోమియోమందుగా చెప్పుకొను చుందురు.

అలాగే ఒక భాగమునకు రెండు వందల భాగములు ఆల్కాహాలు ను కలిపి కొద్దిరోజులు బాగా కలియత్రిప్పుచుండగా,

అది రెండువందల రెట్లు శక్తివంతముగా తయారగునని హోమియో సిద్ధాంతకర్తలైనవారు చెప్పుచుందురు. అలాగే

వేయి భాగములు ఆల్కాహాలును కలిపి కొద్ది దినములు కలియత్రిప్పుచుండిన అది వేయివంతుల శక్తివంతముగా తయారై

నదని చెప్పుచుందురు. ఈ విధముగా హోమియో వైద్యము మూడు రకముల శక్తులలో (మూడు రకముల పొటెన్సీలలో)

లభించును. ఇక్కడ కొందరికేకాక అందరికీ ఒక ప్రశ్నరాగలదు. ఒక భాగమునకు ముప్పయి భాగములు తోడుచేసినప్పుడు

అది ముప్పయివంతుల పలుచనైపోవును గానీ, ముప్పయివంతులు శక్తివంతమెట్లగునని అడుగవచ్చును. అట్లే రెండు

వందల భాగములను, వేయి భాగములను రోగక్రిమికి లేక ధాతువుకు కలుపగా అది రెండు వందల భాగములుగా,

వేయి భాగములుగా పలుచన పడిపోవును కదా! అట్లు కాకుండా ఎంత పలుచన చేస్తే అంత బలము చేకూరుననడము

లోకవిరుద్ధము కాదాయని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా ఉన్నది.


ఒక భాగము రోగ ధాతువుకు ముప్పయి భాగముల ఆల్కాహాలు కలుపడము వలన అది ముప్పయివంతులు

పలుచన కాకుండ, ముప్పయి వంతుల శక్తివంతము అగుటకు కొన్ని కారణములు కలవు. రోగ ధాతువు నీటిలోగానీ,

ఇతర పానీయములలో కలిసియుంటే అది వాస్తవముగా పలుచనై పోయేదే. అయితే ఇక్కడ కలిసినది ఆల్కాహాలు

కావున, అది పలుచన కావడములేదు. దానికి కారణము ఏమనగా! రోగములు పుట్టుకొస్తున్నది మాంస సంబంధ

పదార్థముల వలన లేక మాంససంబంధ పదార్థముల యందని చెప్పవచ్చును. రోగములకు విరుద్ధముగా ఔషధగుణమును

కలిగియున్నవి వృక్ష సంబంధ పదార్థములు. వృక్షములకుగానీ, చిన్న మొక్కలకుగానీ, తీగలకు గానీ ఔషధ గుణము

ఆకాశమునుండి చంద్రుని ద్వారా కల్గుచున్నవి. జ్ఞాన స్వరూపుడు, అమృతస్వరూపుడైన చంద్రుని నుండి చంద్రకిరణములు

భూమిమీదున్న అనేక మొక్కలకు అనేక ఔషధగుణములను అందించుచున్నవి. అందువలన పూర్వము పెద్దలు ప్రతి

ఆకు ఔషధమే అన్నారు. అయితే ఏ ఆకు ఏ ఔషధమో నేడు చాలామందికి తెలియదు. కొన్ని ఆకుల విషయములు

దేవునికి తప్ప ప్రపంచములో ఎవరికీ తెలియవనియే చెప్పవచ్చును. స్వచ్ఛమైన ఆల్కాహాలు ద్రవములో అన్ని వృక్షములకు


సంబంధించిన వాసన, రుచి కలిసియుండుట వలన హోమియో విధానములో ఆల్కాహాలులోనే ఒక రోగధాతువును

పలుచన చేయుచున్నారు. రోగధాతువు ఎంత పలుచనైతే ఆల్కాహాలు అంత శక్తివంతమగునని హోమియో సిద్ధాంతకర్తలకు

వచ్చిన ఊహా ప్రకారము చేసిచూశారు. రోగము ఎక్కువగాయున్నప్పుడు ఆ రోగమునకు సంబంధించిన ధాతుకణమును

వేయివంతులు పలుచన చేయబడిన ఆల్కాహాలును ఔషధముగా వాడడము జరుగుచున్నది.


ఒక రోగ ధాతువును ఆల్కాహాలులో పలుచన చేయబడినప్పుడు 30, 200, 1000 పొటెన్సీలుగా (రెట్లుగా)

శక్తివంతము చేయుచున్నారు. అలా చేయబడిన ఆల్కాహాలును మదర్ టించర్ అని చెప్పుచున్నారు. మదర్ టించర్

(తల్లి ద్రావకము) కేవలము వృక్షసంబంధమైనదేనని తెలియవలెను. వృక్షసంబంధ మదర్టించర్ను మాంస సంబంధ

శరీరములోని రోగములను నివారించుటకు వాడుచున్నారు. మదర్ టించర్లోని శక్తి సూక్ష్మమైనది. కావున దానిని

శ్రద్ధతో కొద్ది పరిమాణములో వాడినా ఫరవాలేదుగానీ, దానిని పవిత్రముగా వాడవలసియుంటుంది. హోమియోపతి

ఔషధమును మాంస సంబంధమైన మన చేతులతో ముట్టుకోకుండా ఆకులోగానీ, పేపరులోగానీ వేసుకొని నోటిలో

వేసుకోవడము మంచిది. అలా చేస్తే రోగము తొందరగా నయమై పోతుంది. హోమియోపతి మందును తయారు

చేయడములోనూ, దానికి హోమియోపతి అని పేరు పెట్టడములోనూ, దానిని వాడడములోనూ, ఎన్నో సూత్రములను

అనుసరించబడుచున్న విధానము హోమియో విధానము. దానిని కనిపెట్టిన సిద్ధాంతకర్త అల్లోపతి వైద్యములో యం.డి.

చదివినవాడు. స్వంత కొడుకునే ఒక రోగమునుండి రక్షించుకోలేని జర్మనీ దేశ డాక్టర్ అనిమున్ సామ్యూల్ అనునతడు

అధికారముగా దాదాపు 200 సంవత్సరముల పూర్వము హోమియో విధానమును బయటపెట్టడము జరిగినది. ఆనాటి

డాక్టర్ సామ్యూల్ ఉద్దేశ్యమును తెలియని ప్రజలు హోమియోపతిని అనుసరించక ఎక్కువగా అల్లోపతినే

అనుసరించుచున్నారు. హోమియోపతి వైద్యము యొక్క విధానమునుగానీ, అందులోని ఆధ్యాత్మికత గానీ, మందుమీదున్న

భావముగానీ తెలియని కొందరు విజ్ఞానులు హోమియోలో మందే లేదు అంటున్నారు. స్థూలముగా హోమియో విధానములో

మందులేదుగానీ, సూక్ష్మముగా అందులో రోగమును నిరోధించు శక్తి తయారైవున్నది.. హోమియోవైద్యము సూక్ష్మదృష్టితో

తయారు చేయబడినది. అందువలన స్థూలముగానున్న అల్లోపతికంటే బలహీనముగా కనిపించినా, రోగమును

లేకుండా చేయడములో బలమైనదేనని చెప్పవచ్చును.


ఇక ఆక్యుపంచర్ వైద్య విధానమును గురించి చెప్పుకొందాము. ఇది చైనాదేశములో కనిపెట్టబడిన వైద్యము.

శరీరములోనున్న రోగమును అనుసరించి శరీరములో కొన్ని కేంద్రములను గుర్తించి ఆ కేంద్రములలో చిన్న సూదులను

కొద్దిగా గ్రుచ్చిపెట్టడమును ఆక్యుపంచర్ వైద్యము అంటాము. అలా కొన్ని కేంద్రములలో సూదులను గ్రుచ్చిపెట్టడమువలన,

ఆ శరీర కేంద్రములలోనున్న శక్తి మేల్కొలపబడి, ఆ శక్తి శరీరములోని రోగమును లేకుండా చేయుననునది ఇందులోని

ముఖ్య సూత్రము. ఇక్కడ కూడా శరీరములోని శక్తియే రోగనివారణకు ఉపయోగపడుచున్నదని చెప్పుచుండుట గమనార్హము.

ఈ వైద్యము చైనాలో కనిపెట్టబడినదని చెప్పినా, వాస్తవానికి దాని మూలము భారతదేశములోనిదే అని చెప్పవచ్చును.

ఎందుకనగా! పూర్వము కొన్ని రోగములకు శరీరములో కొన్ని ప్రత్యేకమైన జాగాలను గుర్తించి, శరీరములోనున్న

రోగమునకు శరీరములోన గుర్తించిన భాగమునకు సంబంధమున్నదని చెప్పి, ఆ శరీర భాగము మీద ఒక వాతను

పెట్టెడివారు. మనుషులకైతే సూదిని కాల్చి, వేడిగానున్న సూదితో వాత పెట్టెడివారు. అలా చేయడము వలన శరీరము

లోని రోగము లేకుండా పోయేది. ఇదే విధానమునే పశువులకు కూడా ఉపయోగించేవారు. పశువులకు వేడిచేసిన

పెద్ద ఇనుపకడ్డీతో వాతలు పెట్టెడి వారు. దీనిని వాతల వైద్యము అనెడివారు. నేటికినీ కామెర్లకు చేతిమీదగానీ,


మెడమీదగానీ కాల్చడము కలదు. ఇప్పటికీ కొన్ని పల్లెప్రాంతములలో పిల్లలు పుట్టగానే భవిష్యత్తులో కొన్ని రోగములు

రాకుండుటకు సూదితో కాల్చడము జరుగుచున్నది. ఇండియాలోని వాతల వైద్యమును గ్రహించిన చైనీయులు దానిని

కొంతమార్పుచేసి, ఇది ఇండియా వైద్యమని ఎవరికీ తెలియకుండుటకు, శరీరములోని కొన్ని ప్రాంతములలో సూదులను

కొద్దిసేపు గ్రుచ్చిపెట్టడము జరుగుచున్నది. ఇండియాలోని వాతల వైద్యము చైనాలో కొంత నవీనము చేయబడి,

సూదులవైద్యముగా మార్చబడి చైనా వైద్యమైనది.


పూర్వము శరీరములోని నరాలను గుర్తించి నరముగల ప్రాంతము లలో నరము మీద వాత పెట్టుట వలన

వెంటనే రోగము పొయ్యేది. మారుమూల పల్లెప్రాంతములలోనూ, అడవి ప్రాంతములలోను వాతల వైద్యము ఎక్కువ

ప్రచారములోవుండెడిది. అల్లోపతివైద్యములేని ఆ దినములలో, ఆయుర్వేద వైద్యము కూడా కరువైన జాగాలలో ఎక్కువగా,

వాతలవైద్యులు ఉండెడివారు. నేడు అల్లోపతి రాకతో వాతలవైద్యము కనిపించకుండా పోయినది. ఇక్కడ మాయమైన

వైద్యము చైనాలో సూదుల వైద్యముగా బయలుదేరి ఆక్యుపంచర్ అను పేరుతో తిరిగి ఇండియాకు వచ్చినది. చరిత్ర

తెలియనివారు, వాతల వైద్యము యొక్క విషయమే తెలియనివారు సూదుల వైద్యము చైనాదని చెప్పుకోవడము జరుగుచున్నది.

వాతలతో కాల్చేదిపోయి, సూదులతో గుచ్చేది వచ్చినా, వైద్యము మాత్రము ఒక్కటేనని చెప్పవచ్చును. వాతలు పెట్టినప్పుడు

రోగము నయమైపోయినట్లే, సూదులతో గ్రుచ్చు వైద్యము వలన కూడా రోగములు నయమైపోవుచున్నవి. చైనాదేశములో

ఎక్కువ ప్రచారములోనున్న ఆక్యుపంచర్ వైద్యము నేడు ఇండియాలో కూడా ప్రచారము చెందుచున్నది. రోగము

నయమగుచున్నది కావున ఈ విధానమును కూడా వైద్యముగా లెక్కించవలసిందే. దీని విషయము పూర్తి తెలియని

కొందరు విజ్ఞానులు ఆక్యుపంచర్ అనునది వైద్యము కాదనినా యదార్థముగా జరుగు దానినిబట్టి వైద్యమనియే చెప్పవచ్చును.


ప్రశ్న :- కొందరు క్రైస్తవులుగానీ, క్రైస్తవ గురువులుగానీ, మాకు ఏసు కనిపించాడు, మాతో మాట్లాడాడు అని అంటున్నారు.

మరికొందరు క్రైస్తవులుగా మారినవారు మాకు ఏసు కనిపించి క్రైస్తవమతములోనికి రమ్మని చెప్పాడు. అందువలన

మేము క్రైస్తవులుగా మారినాము అని కూడా ప్రచారము చేయుచున్నారు. ఇదంతయు వాస్తవమేనా, ఎప్పుడో చనిపోయిన

ఏసు ఇప్పుడు కనిపించి మాట్లాడడము జరుగుతుందా? ఈ విషయమును గురించి మీరేమంటారు?


జవాబు :- లోకములో అనేక మనస్తత్వములుగలవారున్నారు. వారివారి మనస్తత్వములనుబట్టి వారు మాట్లాడుచుందురు.

కొందరు సత్యమును ఎక్కువగా మాట్లాడుచూ, అసత్యమును చాలా తక్కువగా మాట్లాడుచుందురు. కొందరైతే అసత్యమునే

ఎక్కువగా మాట్లాడుచూ, సత్యమును తక్కువగా మాట్లాడుచుందురు. కొందరు ప్రపంచ విషయములలో అసత్యమును

చెప్పినా, దైవవిషయములో మాత్రము అసత్యము చెప్పరు. కొందరు దైవ విషయములోనే ఎక్కువ అసత్యము చెప్పుచుందురు.

మరికొందరు సమాజములో గురువులుగా, బోధకులుగా, స్వాములుగా, జ్ఞానులుగా చెప్పుకొనువారు తాము

దైవవిషయములను బాగా తెలిసినవారమని ఇతరులను నమ్మించుటకు చాలా పెద్దపెద్ద అబద్దములను చెప్పుచుందురు.

దైవ విషయములు అందరికీ అంతగా తెలియవు, కావున కొంత జ్ఞానులుగా కనిపించువారు ఏమి చెప్పినా సామాన్య

ప్రజలు వినేస్థితిలో ఉందురు. కావున దైవవిషయములలో చాలామంది అసత్యములను చెప్పి నమ్మించు చున్నారు.


నేను ఒక దినము ఒక క్రైస్తవ పాస్టర్గారితో కలిసాను. ఆ సమయములో ఆయన ఒక రోగికి స్వస్థత చేకూర్చుటకు

ఏసును ప్రార్థించు చుండెను. ఆ పాస్టర్గారు కొంత దైవశక్తిగలవాడని, ఆయన ప్రార్థన చేస్తే ఇతరుల రోగములు

నయమవుతాయని కొంత ప్రచారము గలదు. అదే నమ్మకముతో ఆయనవద్దకు కొందరు రోగులు వచ్చి పోయెడివారు.


ముఖ్యమైన వ్యక్తిగా క్రైస్తవ సమాజములో పాస్టరుగా పేరుపొందిన ఆయనను మేము కలిసినప్పుడు ఆయనను మేము

కొన్ని విషయములను అడుగగా ఆయన సమాధానము ఇవ్వడము జరిగినది. మా సంభాషణ ఈ విధముగా సాగింది,

చూడండి.


నేను :- మీరు క్రైస్తవులుగా మారి ఎంత కాలమైనది?

పాస్టరు :- నేను క్రైస్తవునిగా మారానని మీరెందుకు అనుకుంటున్నారు. మేము మొదటినుండి క్రైస్తవులమే.

నేను :నా వయస్సు 63 సంవత్సరములు. నాకు పది (10) సంవత్సరముల చిన్నవయస్సునుండి మతములను

గురించిన జ్ఞప్తి బాగావున్నది. దాదాపు 50 సంవత్సరముల పూర్వము తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ

మతము కేవలము రెండు శాతము ఉండెడిది. ప్రస్తుత కాలములో క్రైస్తవ మతమును క్రైస్తవులు ఎక్కువగా ప్రచారము

చేయడము వలన 22 శాతము క్రైస్తవులున్నారు. 50 సంవత్సరముల కాలములో దాదాపు 20 శాతము క్రైస్తవులు

పెరిగారు. ఇప్పుడు మీ వయస్సు దాదాపు 45 సంవత్సరములు ఉండవచ్చును. నూటికి రెండుమంది పూర్వపు

క్రైస్తవులు ఉండవచ్చును. మిగతావారందరు ఈ 50 సంవత్సరములలో క్రైస్తవులుగా మారిన వారుంటారు. పూర్వము

రెండు శాతముమంది కూడా ఇక్కడి హిందువులే అయివుంటారు. మీరు మీ జీవితములో క్రైస్తవులుగా మారియుండవచ్చును.

లేకపోతే మీకంటే ముందు మీ పెద్దలైనా క్రైస్తవులుగా మారియుండవచ్చును. పూర్వము 60 లేక 70 సంవత్సరముల

క్రితము మారినవారు కేవలము క్రైస్తవులుగానే మారియుందురు. ఆనాడు చదువుకొన్నవారు తక్కువ, కాబట్టి

హిందువులనుండి క్రైస్తవులుగా మారినవారు క్రైస్తవులుగానేయున్నారు. ఎవరి కైనా చర్చిలవద్ద వాచ్మ్యాన్గా ఉద్యోగము

దొరికియుండవచ్చును. అయితే ఈ మధ్యకాలములో క్రైస్తవులుగా మారినవారు చాలామంది ఫాదర్లుగా, పాస్టర్లుగా,

బోధకులుగా తయారైనారు. మీరు పాస్టర్లుగా ఉన్నారు కాబట్టి మా అంచనా ప్రకారము మీరు ఈ మధ్యకాలములో

క్రైస్తవులుగా మారి యుండవచ్చుననుకుంటాను. నా అంచనా తప్పో, ఒప్పో మీరే చెప్పాలి.

రజక కులము.


పాస్టర్ :- (ఆయన కొంత నవ్వి) మీ అంచనా కరెక్టే. నేను పది సంవత్సరముల క్రితము హిందువునే. నా కులము

కులము కారణముగా మా ఊరిలో కొందరు అగ్రకులస్థులు నన్ను చౌకబారుగా, హేళనగా

మాట్లాడుచుండెడివారు. నేను బాగా అభిమానమున్నవాడిని కనుక వారి మాటలు నాకు కోపమును విసుగును తెచ్చేవి.

అటువంటి పరిస్థితిలో నేను మా ఊరువదలి హైదరాబాద్ చేరిపోయాను. అక్కడ కొందరి పరిచయముతో క్రైస్తవ మత

విషయములు బాగా తెలిసిపోయాయి. అప్పుడు హిందువులలో హెచ్చుతగ్గు కులములున్నాయి. కులము తక్కువ వారికి

మర్యాదలేదు. క్రైస్తవ మతములో అందరూ సమానముగా ఉన్నారు. అందులో కుల ప్రసక్తేలేదు కదా! హిందువుగా

ఉండుటకంటే క్రైస్తవునిగా మారడము మంచిదేమో అనిపించింది అయినా కొంతకాలము హిందూ మతమును వదలలేదు.

పూర్వమునుండి ఉన్న హిందూమతమును వదలి క్రైస్తవమతములోనికి చేరలేక అలాగే కొంత కాలముండిపోయాను.

నేను :- క్రైస్తవ మతములోనికి మారడానికి ఇష్టము లేనప్పుడు చివరకు క్రైస్తవులుగా ఎలా మారగలిగారు. ఎప్పుడు

మారారు?


పాస్టరు :- నేను హైదరాబాద్ చేరిన తర్వాత సినీ ఫీల్డులోనికి పోయాను. ఒక డైరెక్టర్ క్రింద కోడైరెక్టర్గా పని చేశాను.

ఆ సమయములో నాకు చాలామందితో పరిచయాలు ఏర్పడినాయి. అంతవరకు మత్తు పానీయములు త్రాగడము

అలవాటులేని నేను త్రాగుటకు అలవాటు పడినాను. ఒక దినము రాత్రి సమయములో నేను నా స్నేహితులు


అందరము కలిసి జీపులో హైదరాబాద్ నుండి బెంగుళూరు పోవుటకు బయలుదేరాము. అప్పుడు ఫోర్వే రోడ్డులేదు,

వెడల్పయిన ఒకే రోడ్డు ఉండేది. కర్నూలు దాటి కొంత దూరము పోయిన తర్వాత ఒక ఊరిలో రోడ్డుమీద స్పీడ్ బ్రేకర్స్

ఉండడము వలన జీప్ వేగమును తగ్గించి స్పీడ్ బ్రేకర్సన్న డ్రైవర్ దాటించాడు. అప్పుడు జీపులో డ్రైవర్ తప్ప అందరము

బాగా త్రాగియున్నాము. నేను జీపు చివరిలో కూర్చొని ఉన్నందువలన స్పీడ్ బ్రేకర్సన్న జీపు దాటునప్పుడు పూర్తి

మత్తులోనున్న నేను జీపు వెనుకల డోర్ దగ్గరనుండి రోడ్డుమీదకు పడడము జరిగినది. నేను క్రింద పడడమును డ్రైవర్

గమనించలేదు. అయితే నా ప్రక్కనున్న వ్యక్తి నేను క్రింద పడినది చూచాడు. వెంటనే అతను "డ్రైవర్ నీవు వెనక్కురా”

అని అన్నాడు. బ్రేకర్స్ దాటిన తర్వాత ముందుకు పోబోయిన డ్రైవర్ ఎందుకు అనినా అతను నేను పడిన విషయము

చెప్పకుండా వెనక్కురా అని చెప్పడముతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి స్పీడ్గా వెనక్కు వచ్చాడు. అప్పటికి క్రిందపడిన నేను

లేచుటకు ప్రయత్నము చేయుచున్నా లేవలేక పోవుచున్నాను. అంతలో రివర్స్లో వచ్చిన జీపు వెనుక చక్రాలు నామీద

ఎక్కి దిగినాయి. క్రింద పడినప్పుడు తలకు గాయమవగా, జీపు నామీద ఎక్కినప్పుడు కాళ్ళు చేతులు విరిగి పూర్తి

ప్రమాదస్థితిలోనికి వెళ్ళిపోయాను.


డ్రైవర్ తప్పు ఏమాత్రము లేదు. త్రాగిన మైకములో మేము చేసుకొన్న తప్పువలన నాకు పెద్ద ప్రమాదము

జరిగినది. నా స్నేహితులు వెంటనే నన్ను జీవులోనికి వేసుకొని తిరిగి వెనక్కు కర్నూలుకు రావడము జరిగినది. నేను

అపస్మారక స్థితిలో ఉండిపోయాను. నేను బ్రతకనని అందరూ అనుకోవడము జరిగినది. రెండవ రోజు నా భార్య

పిల్లలు అందరూ కర్నూలులోని హాస్పెటల్కు వచ్చి నన్ను చూచి ఏడుస్తున్నారు. వారు ఏడ్చేది నాకు కనిపిస్తున్నా నేను

వారితో మాట్లాడలేకపోయాను. నా భార్యతో కూడా నాకు చికిత్స చేయు డాక్టరు నేను బ్రతకనని చెప్పాడట. అందరినీ

చూడగల్గుచున్నా నేను ఎవరితోనూ మాట్లాడలేకపోవుచున్నాను. అటువంటి స్థితిలో ఏసు నాకు కనిపించి “నీవు మారు

మనస్సు పొందుము. నీవు నాకు ఇష్టునిగా ఉండగలవు.” అని అన్నాడు. ఆ మాటను మాత్రము చెప్పిన ఏసు తర్వాత

కనిపించలేదు. రెండవ రోజే నేను అందరితోనూ మాట్లాడడము జరిగినది. వారము రోజులలోపల పూర్తి బాగైపోయాను.

అలా నేను కోలుకోవడము అక్కడి డాక్టర్లకు ఆశ్చర్యమైనది. ఏసుప్రభువే నన్ను ప్రమాదమునుండి కాపాడాడని అర్థమైనది.

ఆ సంఘటననుండి పూర్తిగా కోలుకొన్న నేను, అదే నెలలోనే ఏసును విశ్వసించి క్రైస్తవ మతము లోనికి చేరడము

జరిగినది. అప్పటినుండి నేను సినీఫీల్డునుండి బయటికి వచ్చి, ఏసు జ్ఞానమును బోధించుటకు మొదలుపెట్టాను. నేను

ప్రార్థన చేయగా చాలామంది రోగములు నయమవుతూ వచ్చాయి. తర్వాత పాస్టర్గా మారిపోయాను.


నేను :- ఒక్కమాట. మీరు ఏసును గాలిగా చూచారా? ధూళిగా చూచారా? పొగగా చూచారా? నీడగా చూచారా?

సర్వసాధారణ మనిషిగా చూచారా? లేక ఆకాశములో బొమ్మగా చూచారా?


పాస్టరు :- ఇప్పుడు మిమ్ములను చూచినట్లే చూచాను. ఇప్పుడు ఏ విధముగా మీరు ఎదురుగా ఉండి కనిపించి

మాట్లాడుచున్నారో అదే విధముగా ఏసు నాకు కనిపించడమూ, నాతో మాట్లాడడమూ జరిగినది. నేను ఆ సమయములో

ఎటువంటి భ్రమలో లేను. ఏసు బ్రతికియున్నప్పుడు కనిపించినట్లే కనిపించాడు.


నేను :- మీరు ఇప్పుడు క్రైస్తవ బోధకులుగా ఉన్నారు. కావును బైబిలు గ్రంథములోని విషయములన్నియు క్షుణ్ణముగా

తెలిసివుంటాయి. బైబిలు గ్రంథములో యోహాను సువార్తయందు 16వ ఆధ్యాయము 16వ వాక్యము ఇలా కలదు.

“కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.” ఈ


వాక్యములో “కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు.” అని స్వయముగా ఏసుయే చెప్పాడు కదా! అలాంటప్పుడు

ఆయన పోయి రెండువేల సంవత్సరము లైన తర్వాత మీకెలా కనిపించాడు? అను ప్రశ్న నాకు వచ్చినది, నా ప్రశ్నకు

దయచేసి జవాబివ్వండి.


పాస్టరు :- ఇప్పుడు మీరు చెప్పిన వాక్యములో ముందు కొంత భాగము మాత్రమే చెప్పారు. పూర్తి వాక్యములో రెండవ

భాగమునందు కామా తర్వాత “మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.” అని ఉన్నది గదా! ఆయన

వాక్యము ప్రకారము ఆయన పోయిన తర్వాత ఇప్పుడు నాకు కనిపించాడని మీరెందుకు అనుకోకూడదు.


నేను :- ఏసు స్వయముగా ఈ వాక్యమును చెప్పిన దినమున ఈ వాక్యమును విన్న ఆయన శిష్యులలో కొందరు

(యోహన్ 16,17) “కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను

తండ్రి యెద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని” ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

(యోహాన్-16-18) “కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని

చెప్పుకొనిరి? ఈ విషయము బైబిలులోనే అదే సువార్తయందు 17,18 వాక్యములలో కలదు. తర్వాత (యోహాన్-

16-19,20,21,22 లో) తన శిష్యులు అనుకొనుచున్న విషయమును గ్రహించిన ఏసు వారికి ప్రసవ వేదన పడు స్త్రీని

గురించిన ఉపమానమును చెప్పెను. తర్వాత కూడా తాను చెప్పిన విషయము వారికి పూర్తి అర్థము కాలేదను

ఉద్దేశ్యముతో అదే 16వ సువార్తలో 25వ వాక్యములో ఇలా “ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే

నేనిక ఎన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజేయు గడియవచ్చుచున్నది.”

అని అన్నాడు. 16వ వాక్యమునుండి 24వ వాక్యము వరకు ఆయన చెప్పిన ఉపమానముతో సహా ఎవరికీ అర్థము

కాలేదను ఉద్దేశ్యముతో 25వ వాక్యమునందు "నేను ఈ సంగతులను గూఢార్థముతో మీకు చెప్పితిని” అన్నాడు. ఏసు

చెప్పిన ఈ మాటనుబట్టి ఆయన చెప్పిన మాటలో మనము అర్థము చేసుకొన్నది తప్పని తెలియు చున్నది. గూఢార్థముగా

అని చెప్పినప్పుడు ఆ విషయము పూర్తి అర్థము కాలేదని స్పష్టమగుచున్నది. అందువలన ఆయన పోయిన తర్వాత

ఇప్పుడు కనిపించాడని ఎందుకు అనుకోవాలి? మీరిక నన్ను చూడరు అనినట్లు ఆయన ఎప్పటికీ కనిపించడు అని

ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు కనిపించాడు అనడము ఏసు మాట ప్రకారము తప్పుకాదా? దీనికి మీరేమంటారు?

పాస్టరు :- ఏసు చెప్పిన 16వ అధ్యాయము 16వ వాక్యములో "కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు.” అని

చెప్పిన మొదటి మాటలో నేను భూమిమీద లేకుండా పోతాను అని పూర్తి అర్థమగుచున్నది. "కొంచెము కాలమునకు

నన్ను చూచెదరు.” అనిన రెండవ మాటలో తర్వాత కొంత కాలమునకు కనిపిస్తానని అర్థమగుచున్నది. ఇందులో

అర్థముకాని విషయము ఏమున్నది.


నేను :- అర్థము కాని విషయమున్నదనియేగా అదే సువార్తలో అదే అధ్యాయములో, ఆ మాట తర్వాతే 25వ వాక్యమునందు

“నేను ఈ సంగతులను గూఢార్థముగా చెప్పితిని” అన్నాడు. దీనినిబట్టి 16వ వాక్యములో గూఢార్థము లేదు అంటే ఏసు

చెప్పినమాట తప్పయివుండాలి. ఆయన చెప్పినమాట ఎప్పటికీ అసత్యముకాదు, ఆయన మాట ఎప్పటికీ సత్యము అని

నీవు ఒప్పుకొంటే నీవు అర్థము చేసుకొన్నది, నీవు ఏసును చూచానని చెప్పిన విషయము తప్పయి ఉండాలి. ఇప్పుడు

ఏసు చెప్పినది సత్యమా? మీరు చెప్పినది సత్యమా? మీరే చెప్పండి.


పాస్టరు :- ఏసు మాట సత్యమని నేను ఒప్పుకుంటాను. కొందరికి అనగా! ఇతర మతస్థులకు ఏసు చనిపోయిన

తర్వాత కనిపించడు అనేవారికి ఆయన మాటలు అర్థము కాలేదని చెప్పవచ్చును. అటువంటివారికి ఆయన మాటలు

గూఢార్థముగా ఉండును. అలాకాకుండా ఏసు చెప్పినమాట సత్యమను మాలాంటి వారికి ఎలా గూఢార్థమగును? మీరే

చెప్పండి.


నేను :- పాస్టరుగారు! మీరు బైబిలు బోధకులు, మీలాంటివారు ఎక్కడా పొరపడకూడదు. ముఖ్యముగా గమనించదగిన

విషయమేమంటే ఏసు చెప్పిన 16వ వాక్యము నీకుగానీ, నాకుగానీ కాదు. ఆ రోజు ఆయన సమీపములోనున్న

పదకొండుమంది శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటని మరచి పోకూడదు. 17వ వాక్యము మొదటిలోనే ఆయన

శిష్యులలో కొందరు అని ఉన్నది. అందువలన ఆ దినము ఆయన శిష్యులు అనుకొను మాటను చెప్పుకొనుచున్నాము.

18వ వాక్యము మొదటిలోనే కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? అని శిష్యులు అనుకొను మాటకు

సమానముగా 19 నుండి 24 వాక్యము వరకు ప్రసవవేదన పడు స్త్రీని ఉపమానముగా చెప్పడమే కాకుండా 25వ

వాక్యములో ఈ సంగతులు మీతో గూఢార్థముగా చెప్పితిని, రాబోవు కాలములో స్పష్టముగా తెలియ జేయు కాలము

వచ్చునని చెప్పాడు. అక్కడ చెప్పినది శిష్యులకనియే ఉన్నదిగానీ, నీకు అనిగానీ, ఇతర మతస్థులకనిగానీ చెప్పబడలేదు.

ఆ దినము 16వ వాక్యమునందు మొదట కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు అన్నాడు. ఆయన

మాటలోని గూఢార్థము ఏమనగా! మరుసటి దినము అనగా రెండవదినము ఆయన శిలువ వేయబడును. మూడవరోజు

ఆయన తిరిగి లేచును. తిరిగి లేచిన తరువాత నలుబది (40) దినములు శిష్యులకు కనిపించును. ఆ తర్వాత ఆయన

కనిపించకుండ పోవును. మొత్తము మీద ఈ విషయమునంతటిని రెండు ముక్కలుగా చెప్పడము జరిగినది. రేపటి

దినము వరకు మీ ముందున్న నేను శిలువవేయబడి లేకుండా పోయి, మూడు రోజులకు కనిపింతును అని చెప్పబోయిన

విషయమును గూఢార్థముగా మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని శిష్యులకు చెప్పాడు. జరుగబోవు విషయమును

ఏసు చెప్పాడని అప్పుడు వారు గ్రహించ లేకపోయారు. మూడు రోజులకు తిరిగి నేను కనిపిస్తానని ఆయన చెప్పిన

భావము గూఢార్థముతో కూడుకొన్న దని ఒప్పుకోకతప్పదు. ఇక్కడ బాగా గమనించితే ఏసు శిలువ వేయబడినది శు

క్రవారము. ఆయన తిరిగి లేచినది ఆదివారము ఆయన కనిపించకుండా ఉన్నది శుక్రవారము సాయంకాలమునుండి

మరియు శనివారము రెండు రోజులు కూడా పూర్తిలేదు. ఆదివారము ఉదయము తెల్లవారకముందే కనిపించాడు. ఈ

లెక్కప్రకారము ఆయన కనిపించకుండా ఉన్నది రెండు రోజులు మాత్రమే. చివరిగా ఆయన తన శిష్యులతో మాట్లాడినది

గురువారము. ఆయన చెప్పిన దినము అయిన గురువారము నుండి లెక్కించితే ఏసు లేచినది మూడవ రోజగును.

ఆయన మాట్లాడిన మాటలలో గూఢార్థముగా నేను మూడు రోజులకు కనిపిస్తానని చెప్పుచూ “మరి కొంచెము కాలమునకు

నన్ను చూచెదరు.” అని అన్నాడు. ముందు జరుగబోవు విషయమును గూఢార్థముగా చెప్పడమేకాక ఆ విషయమును

16వ వాక్యములో రెండవ భాగములో చెప్పడము జరిగినది. ముందు జరుగబోవునది వెనుక, వెనుక జరుగబోవునది

ముందు చెప్పడము వలన, వాక్యము అర్థముకాని స్థితిలో నిలిచిపోయినది.


16వ వాక్యములో మొదటనే "కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు.” అని ఉన్నది కదా! దానిని

పరిశీలించి చూచితే, ఏసు శిలువ వేయబడి కొంచెము కాలమనబడు రెండు రోజులకు అనగా ఆది వారము కనిపించునని

అర్థము. అలా మాట్లాడినప్పటినుండి మూడు రోజులకు లేక శిలువ వేయబడినప్పటి నుండి రెండు రోజులకు తిరిగి

కనిపించిన ఏసు నలుబది (40) దినముల వరకు శిష్యులకు కనిపించి తర్వాత శాశ్వితముగా కనిపించ కుండా


పోయాడు. ఇదే విషయమునే గూఢార్థముగా "కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు.” అని అన్నాడు.

వాక్యము గూఢార్థముగా ఉండుటకు ఒకే వాక్యములోనే ముందుది వెనుక, వెనుకది ముందు చెప్పడము జరిగినది. అది

గూఢార్థమైన విషయమని వారికి తెలియదు. కావున నేను మీతో గూఢార్థముగా చెప్పితిని అని 25వ వాక్యములో

చెప్పాడు. అదే 25వ వాక్యము చివరిలో "స్పష్టముగా తెలియజేయు గడియ వచ్చుచున్నది” అని కూడా అన్నాడు. ఆ

గడియ వచ్చింది కాబట్టే మనకు ఆ దినము చెప్పిన నిగూఢమైన విషయము సులభముగా అర్థమైపోయినది. ఇప్పుడు

మనకు స్పష్టముగా అర్థమైన దానినిబట్టి, ఆ దినము ఏసు శిష్యులతో మాట్లాడిన తర్వాత మరుసటి దినము శిలువ

వేయబడి రెండు రోజులకు అనగా కొంచెము కాలమునకు ఆయన తిరిగి కనిపించాడు. అది జరిగిన తర్వాత అనగా

కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు అన్నట్లే, శిష్యులకు వారి జీవితాంతము వరకు కనిపించకుండా

పోయాడు. అందువలన 16వ వాక్యము ఆ దినము శిష్యులకు చెప్పినది గానీ, మనకు చెప్పినది కాదు. దీనినిబట్టి ఆ

దినము ఏసు చెప్పినట్లు ఎవరికీ కనిపించలేదు.


పాస్టరు :- మీరు చెప్పినట్లు నాకు కనిపించినది అసత్యమే అయివుండ వచ్చును. అయితే నావలె ఏసును చూచాను,

ఏసు మాట్లాడాడు అని చెప్పువారు చాలామంది కలరు కదా! వారి విషయమేమంటారు?


నేను :- నీవలె వారు కూడా పొరపాటు పడియుండవచ్చును. ఎవరినో చూచి, ఎవరినో అనుకొనియుండవచ్చును. ఏసు

బ్రతికియున్న సమయము లో ప్రత్యక్షముగా చూచిన వారికి తప్ప, ఆయన ఎట్లుంటాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడున్న

మనుషులకు ఆయన నిజమైన ఆకారము ఎట్లుండేదో తెలియనప్పుడు, కనిపించిన మనిషిని ఏసేనని (ఆయనేనని)

చెప్పడము పొరపాటు కాదా! ఒకమారు మానవ శరీరమును వదిలిన ఎవడుగానీ, తిరిగి అదే రూపముతో కనిపించుటకు

వీలులేదు. ఎవరంతకు వారు ఊహించుకొని భ్రమ చెందియుండవచ్చునుగానీ, ఆయనను ఎవరూ చూడలేదు. ఇదే

విషయమునే యోహాన్ సువార్త 16వ అధ్యాయములో 16వ వచనమునందు స్పష్టముగా చెప్పుచూ "కొంచెము కాలమైన

తర్వాత మీరిక నన్ను చూడరు.” అని అన్నాడు. ఆయన మాట అసత్యముకాదు, కావున ఎవరుగానీ ఏసును చూచాను

అనడము తప్పగును.


పాస్టరు :- మీరు చెప్పేదంతా బాగానే ఉన్నదిగానీ, మీరు ఏదైనా పొరపాటుగా చెప్పుచున్నారా! అను అనుమానము

నాలో కొంతయున్నది. ఎందుకనగా! మీ మాటను శంకించుటకు నాకు బైబిలులో ఒక ఆధారము కలదు. అది

యోహాను సువార్త 14వ అధ్యాయములో మూడవ (3) వచనముయందు "నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున

మరల వచ్చి నావద్ద యుండుటకు మిమ్ములను తీసుకొనిపోవుదును.” అని అన్నాడు కదా! అటువంటపుడు ఆయన

వస్తానని చెప్పినమాటను మీరు సత్యమని ఒప్పుకోకతప్పదు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనను చూచినట్లే

కదా! ఆయన మనకు కనిపించినట్లే కదా! దీనికి మీరేమంటారు?


నేను :- ఏమంటాను! మీరు తిరిగి పప్పులో కాలువేశారని అంటాను. ఆయన చెప్పిన ప్రతిమాట సత్యమే, అయితే నేను

వచ్చి మిమ్ములను తీసుకొనిపోవుదును అన్నాడుగానీ, మీరు నన్ను చూస్తారని చెప్పాడా? అక్కడ ఆయన ఆ మాటను

చెప్పలేదు. యోహాను 14  అధ్యాయము 18వ వాక్యము ఇలా కలదు చూడండి. "మిమ్ములను అనాథలుగా

విడువను, మీవద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరినన్ను ఎన్నడూ చూడదు” అని అన్నాడు కదా! ఈ

దినము మనము కూడా దేవున్ని చూడాలని ఉన్నాము. అయితే దేవుడు కనిపిస్తాడా? దేవునికి రూపమే లేదు కావున



కనిపించేవాడు దేవుడే కాడు. అందువలన మనము దేవున్ని ఎప్పటికీ చూడలేము. ప్రపంచములో ఎవడైనాగానీ

మనిషిగా కాకుండా ఉండగలిగితే అప్పుడు దేవున్ని చూడగలడు, తెలియగలడు. “దేవుని విషయము దేవునికే తెలుసు”

అను సూత్రము ప్రకారము నీవు మనిషిగా కాకుండా దేవునిగా మారగలిగితే అప్పుడు నీవు, దేవుడు వేరుకాదు కనుక

నీకు దేవుడెవరో తెలియబడును. అప్పుడు నీవు దేవున్ని చూచినట్లే. అంతవరకు నీవెవరో నీ ఆకారమేమిటో నీకే

తెలియదు, దేవుడెట్లు నీకు తెలియును.


దేవుడు నిన్ను తనయందు కలుపుకోవాలనుకొన్నప్పుడు ఆయనయే నీవద్దకు వచ్చి నిన్ను తనలో కలుపుకొంటాడు.

అంతవరకు ఆయన ఎవరో తెలియని నీవు దేవునివద్దకు పోలేవు, ఆయనలో ఐక్యము కాలేవు. దేవుని యందు ఐక్యమైపోయిన

ఏసు తనవలె తన శిష్యులను మార్చుటకు వచ్చును. ఆయన శరీరము లేకున్నా జీవించియున్నాడు. అంటే దేవునిగా

మారి సర్వము వ్యాపించియున్నాడని అర్థము. తన శిష్యులను కూడా తనవలె జీవింపనెంచి అనగా దేవునియందైక్యమగునట్లు

చేయుటవలన అప్పుడు శిష్యులు ఆయనను చూచినట్లగును. అప్పుడు గురువు శిష్యులను బేధము లేదు, అందరు

ఒక్కటే అయివుందురు. అందువలన 14వ అధ్యాయములోని 19వ వాక్యములో “అయితే మీరు నన్ను చూతురు, నేను

జీవించియున్నాను గనుక మీరునూ జీవింతురు” అన్నాడు. అలా చూడడము అప్పుడే జరుగును. అంతకుముందు

ఎవరూ దేవున్ని చూచియుండనట్లు దేవునియందైక్యమైన ఏసును ఆయన శిష్యులు కూడా చూచియుండలేదు. అందరూ

ఒక్కటై కలిసిపోయినప్పుడు మాత్రమే దేవుడెవరైనదీ మనిషికీ, గురువు ఎవరైనదీ శిష్యునికీ తెలియును. అందువలన

అదే 14వ అధ్యాయములో 20వ వాక్యమున “నేను నా తండ్రి (దేవుని యందునూ, మీరు నాయందునూ, నేను

మీయందునూ ఉన్నామని ఆ దినము మీరెరుగుదురు” అన్నాడు. ఇది అన్నిటికంటే పెద్దవాక్యమని ప్రతి క్రైస్తవుడు

ముఖ్యముగా గుర్తు పెట్టుకోవలెను. ఇప్పుడు చెప్పిన వాక్యములలోని వివరము అర్థము కాకపోతే ఇంతకంటే వివరముగా

మరెప్పుడూ చెప్పబడదని కూడా జ్ఞాపకముంచు కోండి.


ఇంతవరకు చెప్పినది క్రైస్తవులకనీ, తమకు సంబంధములేదనీ, ఇతర మతములవారనుకొనుటకు అవకాశము

కలదు. మాయ మనిషిని ఎటైనా మార్చగలదు. చివరకు నన్ను కూడా క్రైస్తవునిగా చూపించి, ఈయన ఇందువే

(హిందువు)కాదని, మీ చేతనే అనిపించనూ గలదు. ఎవరేమను కొనినా, నేను ఎప్పటికీ ఇందువునే, ఆదినుండి

ఇందువునే, నా విషయము అటుంచి మీ విషయములో ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన విషయము ఒక్క క్రైస్తవులకేగాదు.

అన్ని మతముల వారికి ఒకే సూత్రము వర్తిస్తుంది. ఇదే విషయము భగవద్గీతలో కలదు, ఖురాన్లో కలదు. అయితే

ఈ విషయమంతయు నిగూఢముగా ఉండుట వలన, మేము జ్ఞానులము అనుకొన్న వారికి సహితము అర్థము

కాకుండాపోయినది. నేను భగవద్గీతను సంపూర్ణముగా చదివాను. తర్వాత త్రైత సిద్ధాంత భగవద్గీతగా వివరించి

వ్రాశాను. భగవద్గీతలోని జ్ఞానము నా స్వంతమైపోయినది. అందులో దేవునికి సంబంధించిన ధర్మములన్ని నాలో

నిలిచిపోయినవి. దేవుని జ్ఞానము నా స్వంత ధనముగా, దేవుని ధర్మములు నా స్వంత ఆస్తిగా తయారై పోయినందున,

నేను ఏ మతములోని జ్ఞానమునైనా సులభముగా వివరించగలను. నాకు మతములతో సంబంధములేదు. అందులోని

దేవుని జ్ఞానముతో సంబంధమున్నది. కావున దేవుని జ్ఞానము ఏ మతములోనిదైనా, అది నాకు సులభసాధ్యమే.

స్పష్టముగా చెప్పబోవు గడియ రాబోవుచున్నదన్నట్లు, ఆ గడియ వచ్చినదని నేననుకొంటున్నాను. అందువలన

గూఢార్థముగానున్నది అర్థముకాని జ్ఞానము ఉండుటకు అవకాశమేలేదు. అయినా మనిషి తన అహముచేత ఇతరులు

చెప్పిన దానికంటే, నాకు ఎక్కువ తెలుసు అనుకొంటే వాని కర్మకు వాడే బాధ్యుడు. ఈ జ్ఞానము నిజముగా దేవుని


జ్ఞానమే అని తెలియకపోతే, మీ కర్మలనుండి మిమ్ములను రక్షించు జ్ఞానమే ఉండదు. ఇదంతయు మీ బాగును కోరి

చెప్పునదిగా తెలియవలెను.


ప్రశ్న :- జ్ఞాపకశక్తికి జ్ఞానశక్తికి ఏదైనా సంబంధమున్నదా? జ్ఞాపకశక్తియున్న వానికి మంచి జ్ఞానముండడమూ, జ్ఞాపకశక్తి

లేనివాడు జ్ఞానములో వెనుక బడిపోవడము ఉండునా? చదువురాని వానికీ, చదువు వచ్చిన వానికీ జ్ఞానములో

తేడాయుండునా? దయచేసి వివరముగా చెప్పగలరని కోరు చున్నాము.


జవాబు :- జ్ఞాపకశక్తి అనునది శరీరములోని మనస్సునుబట్టియుండును. శరీరములో బయట అవయవములు,

లోపల అవయవములని రెండు రకములుండును. లోపలి అవయవములు సూక్ష్మముగా కనిపించవు. బయటి

అవయవములు మొత్తము పది పేర్లు కల్గినవి బయటికి కనిపించు చుండును. శరీరములోని కనిపించని లోపలి

అవయవములలో మనస్సు మరియు బుద్ధి అను ముఖ్యమైనవి రెండు గలవు. మనస్సుకు బలము జ్ఞాపకము, బుద్ధికి

బలము జ్ఞానము అని చెప్పవచ్చును. మనస్సు ఎంత దృఢముగా ఉంటే దానికి జ్ఞాపకశక్తి కూడా అంతే బలముగా

ఉండును. మనస్సు బలహీనమైతే జ్ఞాపకశక్తి కూడా తక్కువగా ఉండును. అదే విధముగా బుద్ధి కూడా ఎంత

దృఢముగా ఉంటే దానికి జ్ఞానశక్తి కూడా అంత బలముగా ఉండును. శరీరములోపల గల మనస్సుకు, బుద్ధికి

పేరున్నప్పుడు నామ ముంటే (పేరుంటే) రూపముంటుంది, రూపముంటే నామముంటుంది అను సూత్రము ప్రకారము

శరీరములోని రెండు ముఖ్యమైన అవయవములకు పేరున్నది, కావున వాటికి రూపమున్నదనియే చెప్పవచ్చును.

అయితే వాటి రూపము కంటికి కనిపించునట్లు స్థూలముగా ఉండదు. కంటికి కనిపించకుండా మరియు ఏ యంత్రదృష్టికీ

తెలియకుండా సూక్ష్మరూపము కల్గియున్నవి. బుద్ధి సూక్ష్మమైన ఆకారమును కల్గియున్నదని ప్రత్యేకించి త్రైత సిద్ధాంత

భగవద్గీతలో చెప్పుకొన్నాము. బుద్ధికి గల సూక్ష్మరూపమును మేము గ్రహించగలిగాము. కాబట్టి మేము గ్రహించిన

బుద్ధియొక్క సూక్ష్మ రూపమును స్థూలముగా అందరికీ తెలియునట్లు చిత్రించి చూపించాము. బుద్ధికి ఉన్న రూపము

అందరిలో ఒకే విధముగాయున్నా, మందము పలుచన అను తేడాలుగా అందరిలో ఉన్నట్లు చెప్పుకొన్నాము. మనిషి

శరీరములో బుద్ధి ఎక్కడ స్థానము కల్గియున్నది, ఏ ఆకారముతోయున్నది, ఏమి పని చేయుచున్నది, అన్నిటినీ క్షుణ్ణముగా

త్రైత సిద్ధాంత భగవద్గీతలో మేము చెప్పడము జరిగినది. ఇంతవరకు ఎవరికీ బుద్ధియొక్క ఆకారమును గురించి

తెలియదు, దాని స్థానమును గురించి తెలియదు. సూక్ష్మముగా ఎవరికీ తెలియకుండాయున్న బుద్ధియొక్క ఆకారమును,

స్థానమును చెప్పడము వలన త్రైత సిద్ధాంత భగవద్గీత మంచి పేరు సంపాదించుకొన్నది. ఒక్క బుద్ధి యొక్క ఆకారమునే

కాకుండా శరీరములో ముఖ్యపాత్ర పోషించుచున్న జీవునియొక్క ఆకారమును కూడా త్రైత సిద్ధాంత భగవద్గీత తెలియజేసినదని

గర్వంగా చెప్పుచున్నాను. అంతేకాక ఎందరో జ్ఞానులు సహితము మనస్సును గురించి పూర్తి విషయమును తెలియలేక

దానిని అనేక రకములుగా పోల్చుకొని చెప్పుకొన్నారు. అయినా అది ఏమిటో అర్థము కాక జుట్టు పెరుక్కున్నారు.

అటువంటి అర్థముకాని మనస్సుకు సహితము అర్థము చెప్పి, ఆకారమును కూడా చెప్పినది త్రైత సిద్ధాంత భగవద్గీత.


శరీరములో కనిపించని బుద్ధికీ, జీవునికీ ఆకారమున్నదని చెప్పడమే కాక, వాటికి ఆకారమును అందరి స్థూల

కన్నులకు తెలియునట్లు చిత్రపటము గీచి చూపడము జరిగినది. అయితే ఆ దినము మనస్సుకు ఆకారమున్నదని

చెప్పిన మేము మనస్సు యొక్క ఆకారమును బొమ్మగా గీచి చూపలేకపోయాము. త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనస్సు

యొక్క ఆకారమును చూపలేకపోవుటకు కారణము అది ఒక ఆకారములో స్థిర స్థాయిగా ఉండదు. మనిషిలో జరుగు

మూడు అవస్థలలో మూడు రకముల ఆకారమును పొందుచుండును. నిద్రలో ఒక రకము ఆకృతితోయున్న మనస్సు,


మెలుకువలో రెండవ ఆకారమును పొందును. అలాగే స్వప్నములో నిద్ర, మెలుకువలోనున్న ఆకారములుగా ఉండక

మారియుండును. అందువలన అక్కడ చూపలేదు. ఇక్కడ మనస్సును గురించిన ప్రస్థావన వచ్చినది కాబట్టి అది

నిద్రలోనున్న ఆకారమునైనా ఇక్కడ స్థూలముగా చూపదలిచాము. తర్వాత ప్రచురింపబడు త్రైత సిద్ధాంత భగవద్గీతలో

మూడు ఆకారములను చూపడము జరుగునని తెలుపుచున్నాము. మనస్సుకు ఒక సొంత ఆకారమున్నది. అది మిగత

రెండు సమయములలో ఆకారమును మార్చుకొనినా, నిద్రలోనున్నప్పుడు తన స్వంత ఆకారము లోనికీ, స్వంత స్థలములోనికి

వచ్చును. మనస్సు యొక్క స్వస్థానము బ్రహ్మనాడియని, అక్కడి దాని ఆకారమును బిందువు ఆకారమని త్రైత సిద్ధాంత

భగవద్గీతలో ముందే చెప్పుకొన్నాము.


మాచే వ్రాయబడిన గీతలో బుద్ధిని గురించి చెప్పి, దాని స్థానమును గురించి చెప్పి, చివరకు ఆకారమును

ముద్రించి చూపించాము. దానితో బుద్ధియొక్క రూపము మా భగవద్గీతను చదివిన వారందరికీ ఒక విధముగా

తెలిసిపోయింది. బుద్ధియొక్క స్వరూపము మనిషికి మొట్టమొదట తెలిసినది మా త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే, చంద్రుని

మీద మనిషి మొదట అడుగు పెట్టి చంద్రుడు ఇలా ఉన్నాడని తెలియజేస్తే, దానికి ఎన్నో రెట్లు సంతోషించిన మనుషులు,

మేము ఎవ్వరికీ తెలియని బుద్ధి ఆకారమును మొట్టమొదట చూచి, ఇలా ఉందని దాని బొమ్మను చూపినా మనుషులలో

కొంచెమైనా చలనము లేదు. చంద్రబింబములో ఎవడో అడుగుపెట్టితే, తనకు ఎటువంటి ప్రయోజనము లేకున్నా,

సంతసించి తాము గొప్ప జయమును పొందినట్లు చెప్పుకొన్నవారు. తన శరీరములో తన బుద్ధియొక్క ఆకారమును

తెలియగల్గినప్పుడు, అదేదో తన సంబంధములేని విషయమన్నట్లు, దానివలన తనకు ఏమీ ప్రయోజనము లేనట్లు

మనుషులుండడము వారిలోని తెలివి తక్కువ పని కాదా అంటున్నాము. తెలివి తక్కువ అంటే బుద్ధి తక్కువ అని

అర్థము. మనిషి కొన్ని విషయములలో తెలివిగా ప్రవర్తించడము, కొన్ని విషయములలో తెలివితక్కువగా ప్రవర్తించడము

జరుగుచున్నదని అందరికీ తెలుసు. అమెరికా శాస్త్రవేత్త ఒకడు చంద్రుని మీద మొదట దిగినాడు అని వార్త తెలియగానే,

తన తెలివినంతటిని ఉపయోగించి ఆ విషయమును తెలియనివారికి కూడా తెలియబరచి సంతసించిన వ్యక్తి, తన

శరీరములోని బుద్ధి విషయమును మొట్టమొదటగా బొమ్మరూపములో చూచినప్పుడు ఎందుకు సంతసించలేకపోయాడు?

ఎందుకు చురుకుగా తెలివినంతటిని ఉపయోగించి మిగతావారికి ఆ విషయమును తెలుపలేకపోయాడు అని ప్రశ్నించుకొని

చూస్తే దాని విషయము ఇలా ఉంది.


ప్రతి మనిషిలోని బుద్ధి ఒకటే అయినా, దానికి రెండు ఆకారములు కలవు. ఇంతకుముందు మూడు సిద్ధాంతముల

భగవద్గీతలో మేము బుద్ధి యొక్క ఆకారమును చిత్రపటము ద్వారా చూపించాము. అక్కడ చూపించినది బుద్ధియొక్క

ముందు ఆకృతియని తెలియవలెను. మనిషికి ముందువైపు నుండి ఒక ఆకారము, వెనుక వైపునుండి ఒక ఆకారము

ఉన్నట్లు, బుద్ధికి వెనుక వైపునుండి చూస్తే మరియొక ఆకారముగా కనిపించును. బుద్ధికి ముందు వెనుక వైపుల

ఆకారము వేరువేరుగాయున్నట్లు తెలియుచున్నది. బుద్ధికి రెండు ప్రక్కలా రెండు ఆకారములుండుట వలన, అది రెండు

ముఖముల ప్రభావము కల్గినదై ఒకవైపు ఒక విధముగా, మరొకవైపు మరొక విధముగా పని చేయుచున్నది. ముందువైపు

భాగమునకు ఒక రకము బలము ఉండగా, వెనుకవైపు ఆకారమునకు మరొక బలము ఉన్నది. అందువలన ప్రతి

మనిషిలోని బుద్ధి రెండు రకముల పని చేయుచున్నది. అంతేకాక బుద్ధి ఒక విషయమును ఒకవైపు నుండి ఆలోచిస్తే,

అదే విషయమునే మరొకవైపునుండి మరొక విధముగా ఆలోచించును. ఒకే విషయమును బుద్ధి రెండు రకములుగా

ఆలోచించునని మనము ముందే చెప్పుకొన్నాము. ఈ విధముగా బుద్ధియొక్క రెండు ముఖములు పని చేయుచుండడమేకాక,


మరొక విధానమును కూడా కల్గియున్నవి. బుద్ధి యొక్క ముందువైపు ఆకారము ప్రపంచ సంబంధ విషయముల మీద

ఎక్కువ ఆసక్తిని చూపితే, వెనుకవైపు ఆకారము ముందువైపు దానికి వ్యతిరేఖముగా దేవుని విషయముల మీద ఆసక్తిని

చూపును. (ఈ విషయము మీకు బాగా అర్థమగుటకు బుద్ధియొక్క రెండువైపుల ఆకారమును ముందు నుండికాక ప్రక్క

వైపునుండి చూపుచున్నాను క్రిందగల చిత్రపటములో చూడండి.)

బుద్ధి యొక్క ముందరవైపు ఆకారము,బుద్ధి యొక్క వెనుక ఆకారము  చిత్రమును  175 పేజీ లో చూడండి.


మనిషిలోని ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా చేరునవి రెండు రకముల జ్ఞానములు కలవు. అందులో ఒకటి

ప్రపంచ జ్ఞానము, మరొకటి పరమాత్మ జ్ఞానము. ఈ విధముగా రెండు రకముల జ్ఞానములు మనిషి శరీరములోనికి

చేరుటకు అవకాశము కలదు. అయితే బుద్ధియొక్క ముందువైపు ఆకారము ఎక్కువ ఆసక్తికల్గియుండును, వెనుకవైపు

భాగము తక్కువ ఆసక్తి కల్గి యుండును. దానినే తెలివి ఎక్కువ, తెలివి తక్కువ అని అంటున్నాము. శరీరములోనికి చేరు

రెండు రకముల జ్ఞానములలో ముందువైపు ఆకారము లేక భాగము దైవజ్ఞానము మీద ఎక్కువ ఆసక్తిని లేక ఎక్కువ

తెలివిని చూపితే, వెనుకవైపు ఆకారము దానికి వ్యతిరేఖముగా ప్రపంచములో తక్కువ ఆసక్తిని చూపును. ముందువైపు

భాగము ప్రపంచ విషయ జ్ఞానముల మీద ఎక్కువ శ్రద్ధకలిగి స్వీకరించగలిగితే వెనుకవైపు ఆకారము ముందు వైపు

ఆకారమునకు వ్యతిరేఖముగా పరమాత్మ విషయ జ్ఞానముల మీద తక్కువ శ్రద్ధకలిగి స్వీకరించును. ముందు ఆకారమునకు

వెనుక ఆకారము వ్యతిరేఖ భావములను స్వీకరించినా, అది వెనుకవైపు ఆకారములో బలహీనముగా ఉండుట వలన


తక్కువ శ్రద్ధతోనే స్వీకరించును. ఏదైనా ముందు దానికి వెనుకది వ్యతిరేఖ దిశలో పనిచేయును. (బుద్ధి యొక్క ముందు

వెనుక ఆకారములను ముందువైపునుండి చిత్రించి క్రిందగల చిత్రపటములో చూపుచున్నాము)


పైన బుద్ధి యొక్క ముందర పొర,లోపలి బుద్ధి యొక్క వెనుక పొర చిత్రమును  176 పేజీ లో చూడండి.


ఈ విధముగా బుద్ధియొక్క ముందు పొర, వెనుక పొరకంటే బలముగాయుండడము వలన బుద్ధి ముందు పొర

తీసుకొను భావములకు వ్యతిరేఖ భావములను వెనుక పొర తీసుకొనినా, ముందు పొర తీసుకొన్న విషయములకంటే

తక్కువగా వెనుక పొర తీసుకొను విషయములుండును. జీవునకు స్వంత హక్కుగాయున్న శ్రద్ధ ముందువైపుగల

బలమైన బుద్ధిపొరకు సొంతముకాగా, అశ్రద్ధ బుద్ధికి వెనుకవైపుగల బలహీనమైన పొరకు స్వంత మైనది. అందువలన

మనిషి జీవితములో ప్రపంచ విషయముల మీద ఎక్కువ ఆసక్తికలవాడు, పరమాత్మ విషయముల మీద తక్కువ ఆసక్తిని

కల్గియుండును. అలాగే పరమాత్మ విషయముల మీద ఎక్కువ శ్రద్ధగలవాడు దానికి వ్యతిరేఖమైన ప్రపంచ విషయముల

మీద తక్కువ శ్రద్ధకల్గియుండును. ఈ విధముగా లోపలగల బుద్ధి పొరలనుబట్టి, మనిషికున్న శ్రద్ధనుబట్టి బయట

జీవితము కనిపించుచుండును. లోపల కనిపించకుండయున్న బుద్ధి ఎటువంటిదో బయట మనిషి ప్రవర్తననుబట్టి

చెప్పవచ్చును. జీవునికి దైవజ్ఞానము మీద శ్రద్ధ వాని ఇష్టమునుబట్టియుండును. ఇష్టము అనినా శ్రద్దనియే అర్థము.

అందువలన జీవునికి స్వంత హక్కుగాయున్న దేవుని మీద శ్రద్ధను మనిషి ఉపయోగించుకొనిన, అది బుద్ధి యొక్క

ముందు పొరను చేరి దైవవిషయములను ఎక్కువ స్వీకరించును. అప్పుడు వాడు ప్రపంచ విషయములను వెనుక

పొరనుండి స్వీకరించవలసివచ్చును. బుద్ధి వెనుకపొర బలహీనమైన దానివలన, అది తక్కువ విషయములను స్వీకరించును.

మనిషికి హక్కుగాయున్న దైవశ్రద్ధ కర్మకు ఆధీనమైనది కాదు. ఒకవేళ మనిషి పరమాత్మ శ్రద్ధకంటే ప్రపంచ శ్రద్ధమీద

మొగ్గుచూపితే ప్రపంచ విషయములు వానికి ఎక్కువగా చేరును. దైవవిషయముల మీద శ్రద్ధ తక్కువ ఉండుట వలన,

దైవవిషయములు తక్కువ చేరును. దైవ విషయములను వానికి బలవంతముగా చెప్పినా, వాని బుద్ధి దానిని గ్రహించదు.

ప్రపంచ విషయములను చెప్పకున్నా గ్రహించును. ప్రపంచ శ్రద్ధ కర్మాధీనమైనది కావున, కర్మప్రకారము విషయములు

చేరడమూ, వాటిలో వాని బుద్ధి లగ్నమైపోవడమూ ఎక్కువగాయుండును. అటువంటి వాడు ప్రపంచ విషయములనుండి

బయటపడలేడు, పరమాత్మ విషయములు గ్రహించలేడు.


ఒక మనిషి నాస్తికునిగా గానీ, ఆస్తికునిగాగానీ, హేతువాదిగాగానీ, మితవాదిగాగానీ, మరి ఏ ఇతర వాదిగాగానీ

తయారగుటకు వాని శరీరము లోని బుద్ధియే కారణమని తెలియాలి. ఒక మనిషికున్న ఆసక్తి, అనాసక్తినిబట్టి వాని

బుద్ధి యొక్క ముందు వెనుక పొరలు పని చేయును. మనిషి యొక్క శ్రద్ధనుబట్టి బుద్ధియుండగా, బుద్ధియొక్క బలమునుబట్టి

వానికి శక్తి చేకూరగలదు. మనిషికి పరమాత్మ జ్ఞానము మీద శ్రద్ధయుంటే వానిబుద్ధి దైవజ్ఞాన విషయములను

ఎక్కువగా గ్రహించునట్లు చేసి దైవశక్తిని ఆర్జించి పెట్టును. అందువలన మనిషియొక్క బుద్ధినిబట్టి వానికి దైవశక్తియుండును.

దైవశక్తి కర్మ ఆధీనములో లేనిది, కావున మనిషి ఇష్టమును బట్టి సంపాదించుకోగలడు. ప్రపంచ విషయములలో బుద్ధి

పనిచేస్తే, దానికి ప్రపంచ శక్తి రాగలిగినా, అది మనిషి ఇష్టమునుబట్టియుండదు. ముందే నిర్ణయింపబడిన వాని

కర్మనుబట్టియుండును. అందువలన ప్రపంచ విషయములుగానీ, ప్రకృతిశక్తిగానీ, మనిషి ఇష్టమునుబట్టియుండదు.

ఒక మనిషిలోని ప్రపంచ జ్ఞానమునుగానీ, పరమాత్మ జ్ఞానమునుగానీ, బయటికి చూపునది వానిలోని బుద్ధియని

తెలియవలెను. బుద్ధినిబట్టి మనిషిలో ఏ జ్ఞానమున్నది తెలియవచ్చును. అంతేకాక మనిషిలో దైవజ్ఞానము ఎంత

వున్నదని కూడా తెలియవచ్చును. ఒకని బుద్ధి అంతుబట్టని జ్ఞానము కల్గియుంటే, వానిలోని దైవశక్తి కూడా

అంతుబట్టలేనంత అపారముగా ఉండును. మనిషిలోని బుద్ధినిబట్టి ప్రపంచ విషయములలో కూడా ఆరితేరిన వారు

ఉండవచ్చును. అయినా అదంతయు వాని ఇష్టము ప్రకారము జరుగక, కర్మప్రకారము జరుగునని తెలియవలెను.

ప్రపంచ విషయములలో వారికున్న బుద్ధినిబట్టి ఎందరో మేధావులు కలరు. ప్రకృతి సంబంధ గణిత, ఖగోళ, రసాయన,

భౌతికశాస్త్రములలో ఆరితేరిన శాస్త్రవేత్తలూ మరియు ఎన్నో రంగములలో పని చేయువారూ కలరు. అటువంటివారు

ప్రపంచములో ఎంతో గొప్ప మేధావులైనా, పరమాత్మ విషయములలో వారి బుద్ధి పనిచేయదు. దేవుని జ్ఞాన విషయములను

గ్రహించుకొను స్థోమత లేని బుద్ధికలవారైయుందురు. వారి అంతరంగములలో బుద్ధి ముందు పొర ప్రపంచ విషయముల

మీద, బుద్ధి లోపలి పొర పరమాత్మ విషయముల మీద ఉండడము వలన, వారు ప్రపంచ విషయములను గ్రహించునట్లు

పరమాత్మ విషయములను గ్రహించ లేకపోవుచున్నారని తెలియుచున్నది.


మనిషిలోని బుద్ధి మనిషియొక్క రెండు రకముల జ్ఞానములలో ఏదో ఒకదానిని చూపించునదై ఉండును.

దీనినిబట్టి మనిషియొక్క బుద్ధి మనిషిలోని జ్ఞానమును బహిర్గతము చేయునని చెప్పవచ్చును. అట్లు కాకపోతే మరొక

విధముగా, మనిషిలోని జ్ఞానమునకు (పరమాత్మ జ్ఞానమునకుగానీ, ప్రపంచ జ్ఞానమునకుగానీ) బుద్ధి చిరునామాగా లేక

కేర్ ఆఫ్ అడ్రస్గాయున్నదని చెప్పవచ్చును. మనిషిలోని బుద్ధిని బట్టి జ్ఞానమున్నట్లు (ఏదో ఒక జ్ఞానమున్నట్లు),

మనిషిలోని మనస్సునుబట్టి వానికి జ్ఞాపకశక్తియుండును. మనిషిలోని జ్ఞానశక్తి, జ్ఞాపకశక్తి వేరువేరుగా ఉండునని

చెప్పవచ్చును. శరీరములో అదృశ్యముగానున్న బుద్ధినిబట్టి జ్ఞానశక్తియుండగా, బుద్ధివలె అదృశ్యముగా శరీరములోనున్న

మనస్సును బట్టి జ్ఞాపకశక్తియుండును. మనస్సుకున్న బలమునుబట్టి మనిషికి జ్ఞాపక శక్తియుండునని చెప్పవచ్చును.

మనస్సు యొక్క స్వస్థలము ఆత్మ కేంద్రమైన బ్రహ్మనాడియని ముందే చెప్పుకొన్నాము. మనిషి నిద్రావస్థలోనున్న

మనస్సు బ్రహ్మనాడిలో నివాసముండును. బ్రహ్మనాడిలో నున్నప్పుడు మనస్సు తన స్వంత ఆకారమును

12 50.

మనస్సు

యొక్క స్వంత ఆకారము ఒక బిందురూపములో ఉండును. నిద్రలోని మనస్సు యొక్క

చిత్రపటమును తర్వాత పేజీలో చూడవచ్చును.



బ్రహ్మనాడిలోనున్న మనస్సుయొక్క ఆకారము చిత్రమును  178 పేజీ లో చూడండి.


నిద్రలోనున్నంతవరకు మనస్సు ఒక గుండ్రని బిందువుగా కనిపించి కనిపించనంత చిన్నగయుండి, నిద్రనుండి

మెలుకువ వచ్చినప్పుడు జాగ్రత్తావస్థలోనికి వచ్చును. నిద్రలో గుండ్రని బిందువుగానుండు మనస్సు మెలుకువలోనికి

వచ్చునప్పుడు బ్రహ్మనాడిలో పొడవుగా సాగిపోయి బ్రహ్మనాడియంతా వ్యాపించి, అక్కడినుండి నాడుల ద్వారా శరీరమంతా

కొన్ని సెకండ్లలో ప్రాకిపోవును. అలా శరీరమంతా వ్యాపించిన మనస్సు శరీరమంతాయుండి పూర్తి శరీర ఆకృతిని

పోలియుండును. మెలుకువలోనున్న మనస్సు ఆకారమును క్రిందగల పటములో చూడవచ్చును.


ఈ విధముగా మనస్సు రెండు స్థితులలో, రెండు విధముల ఆకారముతో ఉంటున్నది. నిద్ర, మెలకువ అవస్థలు

జీవునికుండుననీ, మనస్సు బ్రహ్మనాడిలోయుండినప్పుడు జీవుడు నిద్రను పొందునని, మనస్సు జాగ్రత్తలోనికి వచ్చిన

జీవుడు మేల్కొనునని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి జీవునికి నిద్రలేదు,

నిద్రను పొందుట జీవునికి తెలియదు. నిద్రగానీ మెలుకువగానీ జీవునికి ఏమాత్రము ఉండవు. అలాగే బుద్ధికి కూడా

నిద్ర, మెలకువలు ఉండవు. మనస్సును బట్టి మనిషిలో నిద్ర, మెలకువలు ఏర్పడుచున్నవి. శరీరములోని మనస్సు

స్వంతస్థానమైన బ్రహ్మనాడిలోనికి పోకుండా ఉండలేదు. ప్రక్క ఊరికి పోయిన మనిషి తన ఊరికి పోవాలని ఎలా

అతృతపడుచుండునో, అలాగే శరీరమంతా వ్యాపించి కొన్ని గంటలుండిన మనస్సు, తిరిగి తన స్వంత స్థానమైన

బ్రహ్మనాడిలోనికి వచ్చుటకు అతృత చెందుచుండును. శరీరములో కార్యములను ముగించుకొని తన స్వంతస్థానమునకు

జాగ్రదావస్థలో మనస్సు శరీర ఆకృతిలో ఉన్న దృశ్యము చిత్రమును  178పేజీ లో చూడండి.


ప్రతి దినము వచ్చు చుండును. ఒకవేళ శరీరములో కార్యములు అయిపోకపోయినా, వాటిని మధ్యలో వదలిపెట్టి

బ్రహ్మనాడిలోనికి చేరి విశ్రాంతి తీసుకొనును. అందువలన అన్నము తింటూ తింటూ నిద్రపోయే వారినీ, మాట్లాడుచూ

మధ్యలో నిద్రపోయేవారినీ, చేస్తున్న పనిని వదలి కూర్చొని నిద్రపోయే వారినీ, పుస్తకమును చదువుచూ అలాగే పుస్తకము

చేతిలో పట్టుకొని నిద్రపోయే వారిని మనము చూడవచ్చును.


శరీరములో నిద్ర దేనికీ లేదుగానీ మనస్సుకు మాత్రము నిద్ర కలదు. మనస్సుకు మెలుకువ, స్వప్నము అను

రెండు పనులు కలవు. మనస్సుకు మిక్కిలి పెద్దపని మెలుకువలో ఉండగా, మిక్కిలి చిన్నపని స్వప్నములో ఉండును.

ఈ రెండు పనులను మానుకొని మనస్సు ఎప్పుడు విశ్రాంతి తీసుకొనునో అదియే నిద్ర. మనస్సుకు నిద్రవస్తే శరీరములో

జీవుని ముందర పూర్తి చీకటి ఏర్పడి జీవునికి ఏమీ తెలియకుండా పోవును. అందువలన చాలామంది జీవునకే

నిద్రవస్తున్నదను భ్రమలో పడిపోయి వాడు నిద్రపోవుచున్నాడనీ, వీడు మేల్కొన్నాడు అనీ అంటున్నారు. వాస్తవానికి

వాడు వీడు అనబడు జీవునకు నిద్ర లేదనీ వారికి తెలియదు. మనస్సు తాను చేయు పనినుండి విశ్రాంతి తీసుకోవడమునే

నిద్ర అంటున్నాము. కావున శరీరములోని మనస్సుకే నిద్ర అని తెలియుచున్నది. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న

రావచ్చును అదేమనగా! మనస్సు తన పనిని వదలివేయడమే నిద్ర అయితే, శరీరములో కనిపించని మనస్సు చేయుచున్న

పనేమిటి? అని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు జవాబుగా ఇంతకుముందు గ్రంథములలో మనస్సు చేయుచున్న పనేమిటో

చెప్పాము. అయినా ఇప్పుడు కూడా కొంచెము వివరముగా చెప్పుచున్నాము. శరీరములో బ్రహ్మనాడి యందు

నిద్రించుచున్న మనస్సు తిరిగి బ్రహ్మనాడి ద్వారా బయటికి వచ్చి శరీరమంతా వ్యాపించి, తన కార్యమును చేయను

మొదలుపెట్టును. మెలుకువలో మనస్సుకు ముఖ్యముగా రెండు పనులు కలవు. ఒకటి శరీరమునకు స్థూలముగానున్న

ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనునవి ఐదు అందించు సమాచారమును మనస్సు

స్వీకరించి లోపలయున్న ముఖ్య అవయవమైన బుద్ధికి తెలియజేయును. అలా తెలియజేయగా బుద్ధి మనస్సు అందించిన

దానిని స్వీకరించి గుణములకు, గుణముల మధ్యలోనున్న జీవునికి తెలియజేయును. బుద్ధి తెలియజేసిన విషయమునకు

గుణ భాగములనుండి సమాధానమురాగా, ఆ సమాచారమును బుద్ధినుండి మనస్సు స్వీకరించి బయటనున్న

కర్మేంద్రియములకు తెలియజేయును. ఈ విధముగా బయటి జ్ఞానేంద్రియ విషయములను లోపలి బుద్ధికీ, లోపలి బుద్ధి

తెలియజేసిన విషయములను బయట కర్మేంద్రియములకు తెలియజేయుచుండును. బయటగల స్థూల వ్యవస్థకూ,

లోపలగల సూక్ష్మవ్యవస్థకూ మధ్యలో వార్తలను చేరవేయు వార్తాహరుడుగా లేక రాయబారిగా, మధ్యవర్తిగా మనస్సు పని

చేయుచున్నది. మనస్సుకు మెలుకువలో గల పనిలో రెండు రకముల కార్యములు చేయుచున్నది.


మనస్సు ఎక్కువగా పనిచేసి అలసిపోవునది మెలుకువలోనే మెలుకువలో అలసిపోవుట వలన నిద్రలో విశ్రాంతి

తీసుకోవలసిన అవసరము ఏర్పడుచున్నది. మెలుకువలో అలసిపోవునంతగా రెండు కార్యములను ఒకదాని తర్వాత

మరొక దానిని చేయుచున్నది. అందువలన మెలుకువలో ఎడతెరపిలేని పనిని మనస్సు చేయుచున్నది. మనస్సు చేయు

రెండు కార్యములలో ఒకటి బయటి విషయములను లోపలి బుద్ధివరకు చేర్చుట, బుద్ధి చెప్పిన దానిని బయటి ఇంద్రియముల

వరకు చేర్చుట. ఇది మెలుకువలో మనస్సు చేయు పనులయందు ఒకటికాగా, దీనికంటే ముఖ్యమైనది రెండవ

కార్యము కలదు. అదేమనగా! మనిషి బయట వ్యవహారములలో వ్యవహరించునపుడు, బయటి విషయములు లోపలకీ,

లోపలి విషయములను బయటికీ అందించు మధ్యవర్తిగా మనస్సు పని చేయుచుండును కదా! అదే మనిషి ఎల్లకాలము

బయట పనులు చేయడము జరుగదు. అతను కొన్ని గంటలు శరీరముతో పని చేసిన తర్వాత కొన్ని గంటలు పని


లేకుండా గడపడము జరుగుచుండును. మనిషి పని లేకుండా ఊరకుండునప్పుడు బయటి విషయములు లోపలికీ

లోపలి విషయములు బయటికీ అందించు కార్యము కూడా మనస్సుకు ఉండదు. ఆ సమయములో బయట మనిషి పని

చేయకున్నా, అంతరంగములోని మనస్సు పని చేసి తీరవలసిందే. మనస్సు పని చేయడమే మెలుకువ, మెలుకువలో

మనిషికి పనిలేకున్నా మనస్సుకు మాత్రము పనివుండును. మనస్సుకు పని లేకపోతే అది నిద్ర అగును. అందువలన

మెలుకువలోనున్న మనస్సు ఎప్పటికీ పని చేయుచునే ఉండును. మెలుకువలో మనుషులందరూ పని చేయుచున్నారా?

అని ప్రశ్నించుకొంటే, చాలామంది పని చేయకుండా కాలము గడుపు చున్నారు. మనిషికి పని లేకుండా ఊరక కళు

ఎమూసుకొని కూర్చున్న వాని శరీరములోని మనస్సు ఏమి పని చేయుచుండునని కొందరడుగ వచ్చును? దానికి సమాధానము

ఈ విధముగా కలదు. మనస్సు పని చేయడమే మెలుకువ అయినప్పుడు, మనిషి మెలుకువలోయున్నప్పుడు వానిలోని

మనస్సు పని చేయకుండా ఒక్క క్షణమైనా ఊరకుండదు.


మనస్సుకు గల ముఖ్యమైన పని వలన దానికి ఆ పేరు రావడము జరిగినది. మనస్సు అనగా పేరుకు తగినట్లు

మననము చేయునది అని అర్థము. మననము అనగా జ్ఞాపకము అని అర్థము గలదు. మనస్సు యొక్క రెండవ

పనినిబట్టి దానికి ఆ పేరు రావడము వలన, ఆ పని మనస్సుకు ముఖ్యమైదని తెలియుచున్నది. అందువలన మనస్సును

జ్ఞాపకాల పుట్టయని కూడా కొందరు చెప్పుచుందురు. మనస్సు మనిషి ఖాళీగా ఉన్న సమయములో ఇంతకుముందు

గడచిపోయిన కాలములో ఐదు జ్ఞాన ఇంద్రియములకు తెలిసిన విషయములను మనిషి అంతరంగము లోనికి

పంపియుండును. అంతరంగములోని బుద్ధి తెల్పిన మూడు గుణముల విషయములను బయటికి తెచ్చియుండును

కదా! ఆ విషయములన్నిటినీ మనస్సు తనలో ఇమిడ్చి పెట్టుకొనుచుండును. ఆ విధముగా అన్ని విషయములను

తనయందు ఇమిడ్చుకొని ఉంచుకోవడము మనస్సుకు గల యోగ్యత అని చెప్పవచ్చును. మనస్సుకుగల యోగ్యతనే

అర్హత అని కూడా అని అనవచ్చును. మనస్సుకు పుట్టుకతోనే వచ్చిన దాని యోగ్యతనే దానికి గల శక్తి అంటున్నాము.

మనస్సుకున్న యోగ్యతనుబట్టి వాని మనస్సుకున్న శక్తిని నిర్ణయించవచ్చును. మనస్సు ఎంత ఎక్కువగా విషయములను

సేకరించి దానియందు దాచుకొను స్థోమతకల్గియుంటే, దానిని అంత ఎక్కువ దృఢము కల్గినదని చెప్పవచ్చును. దాని

స్థోమతను బట్టి దృఢమైనదని, బలమైనదని మనస్సును చెప్పవచ్చును. కొందరు మనుషులలో దృఢమైన మనస్సు

ఉండును. కొందరిలో బలహీనమైన మనస్సు ఉండును. మనస్సు గడచిన విషయములను ఎంతగా సేకరించి తనయందు

దాచుకొను స్థోమతయుంటే అంత దృఢమైనదిగా చెప్పవచ్చునని చెప్పుకొన్నాము కదా! ఎవరిలో ఎంత దృఢమైన

మనస్సుకలదని ఎలా తెలియనగును అని మనకు ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.


బయట సమాజములో ఎవడైనా ఎక్కువ విషయములను తన జ్ఞాపకములో ఉంచుకొని తిరిగి చెప్పగలిగితే,

వానిలోని మనస్సు ఎక్కువ బలమైనదని చెప్పవచ్చును. బయట సమాజములో ఎవడైతే విషయములను మరచిపోతూ

తిరిగి జ్ఞాపకము తెచ్చుకొని చెప్పలేకపోవుచున్నాడో, వానిలోని మనస్సు బలహీనమైదని చెప్పవచ్చును. కొందరిలో

జ్ఞాపకశక్తి పూర్తి బలహీనముకాక, పూర్తి బలమైనదీ కాకుండా ఉండడమును మనము గ్రహించవచ్చును. అటువంటి

వారిలో మనస్సు మధ్యరకముగా ఉన్నదని చెప్పవచ్చును. మనస్సుకు మననము చేయు స్థోమత జాతకరీత్యా (కర్మ

రీత్యా) పుట్టుకతోనే వచ్చియుండును. దృఢమైన మనస్సుగలవారు భూమి మీదగల ఏ మతములోనైనా పుట్టియుండవచ్చును.

అందువలన అన్ని మతములలోనూ దృఢమైన మనస్సుకలవారు కనిపించుచున్నారు. ఇస్లామ్ సమాజములోనున్న

ముస్లీమ్లలో కొందరు దృఢమైన మనస్సుగలవారు కలరు. అటువంటి వారు తమకున్న జ్ఞాపకశక్తిని ఆసరాగా చేసుకొని


ఇతర మత గ్రంథములలోని విషయములను కూడా పూర్తిగా చదివి వాటిని జ్ఞాపకములో ఉంచుకొన్నారు. కొందరు

ముస్లీమ్లు వేదాలలోని శ్లోకాలను వరుసగా చెప్పుచున్నారు. ఒక్క వేదాలే కాకుండా ఉపనిషత్లు, పురాణములు,

భగవద్గీత, బైబిలు, ఖురాన్ విషయములన్నిటిని బాగా జ్ఞాపకము పెట్టుకొని ఏ గ్రంథములో ఏ విషయమున్నదీ, ఏ

గ్రంథములోని ఏ పేజీలో ఏ శ్లోకమున్నదీ సులభముగా చెప్పగలుగుచున్నారు. అన్ని విషయములను, అన్ని

సమయములలోనూ జ్ఞాపకముంచుకోవాలంటే వారిలోని మనస్సు చాలా బలమైనదిగా ఉండవలెను.


నేటికాలములో కొందరు ఇతర మతములవారు, తమ మతమును అభివృద్ధి చేసుకొనుటకు హిందువుల

ఉపనిషత్లను, వేదాలను, భగవద్గీతను చదివి అందులో ఏ పేజీలో ఏ శ్లోకమున్నదీ చెప్పుచూ, ఆ శ్లోకములను సులభముగా

నోటికి చెప్పగలుగుచున్నారు. అలా చెప్పడము ఎలా సాధ్యమవు చున్నదో వారికి ఏమాత్రము తెలియదు. వారికి

తెలిసినదంతా తాము అందరికంటే ఎక్కువ జ్ఞాపకశక్తిగలవారమని తెలుసు. తమకున్న మేధస్సు గొప్పదని

అనుకొనుచుందురు. దానికి తమ తెలివి కారణముకాదనీ, మనోబలము చేత అలా చెప్పగలుగుచున్నామని ఏమాత్రము

అనుకోవడము లేదు. వాస్తవానికి వారికి మనస్సును గురించిగానీ, బుద్ధిని గురించిగానీ తెలియదు. వారు ఒక్కమారు

చదివితే దానిని వారి మనస్సులో పెట్టుకొని, తిరిగి మననము చేసుకోవడము వలన సులభముగా చెప్పగలుగుచున్నారు

తప్ప, అది వారి బుద్ధి (తెలివి) విశేషతకాదనీ, కేవలము మనస్సు యొక్క బలము వలన అలా జరుగుచున్నదని వారికి

తెలియదు. జ్ఞాపకశక్తికి బుద్ధికి ఏమాత్రము సంబంధములేదు. జ్ఞాపకశక్తి ఒక్క మనస్సుకు సంబంధించినది మాత్రమే.

మనస్సు బలముగాయున్నవారికి బుద్ధి బలముగాయుండునను నమ్మకము లేదు. జ్ఞాపకశక్తికలవారికి బుద్ధిబలము

తక్కువగాయుండును. బుద్ధి బలముగాయున్నవారికి మనస్సు బలహీనముగా ఉండవచ్చును. అందువలన

ఆత్మజ్ఞానముగానీ, పరమాత్మజ్ఞానముగానీ గలవారు కొంత మతిమరుపు గలవారై బలహీనమైన మనస్సుగలవారై

ఉందురు.


ప్రస్తుతము మీకు బ్రహ్మజ్ఞానమును (దైవజ్ఞానమును) వ్రాసి చెప్పుచున్న నేను కొందరికి గొప్పజ్ఞానిగా కనిపించినా,

వాస్తవముగా నాలోని మనస్సు చాలా బలహీనమైనదని చెప్పుటకు నేను సిగ్గుపడడములేదు. నేను యోగినే అయినా,

నా మనస్సు బలహీనమైనందున, నేను ఎక్కువ మతిమరుపుగలవానిగా ఉన్నాను. నేను భగవద్గీతను త్రైతసిద్ధాంత

భగవద్గీతగా వ్రాసినా, ఎవరికీ తెలియని ఎన్నో గూఢార్థ విషయములను సులభముగా విపులీకరించినా, జ్ఞానములో

ఎంత మేధావినైనా, భగవద్గీతలోని ఒక్క శ్లోకము కూడా జ్ఞాపకమువచ్చి నోటికి చెప్పలేను. బైబిలులోని రహస్యమైన

జ్ఞానమును విడదీసి చెప్పగలను. అయితే ఆ వాక్యము ఏ అధ్యాయములో ఉందో తెలియదు. చూచి చదివేంతవరకు

ఆ వాక్యమును చెప్పలేము. అలాగే నేడు ఖురాన్ గ్రంథములో ఇంతవరకు ముస్లీమ్లకు కూడా అర్థముకాని వాక్యములను

వివరించి విపులముగా అన్ని మతముల వారికి అర్థమగులాగున చెప్పాము. కానీ ఆ వాక్యమును చూచి చెప్పంది నోటికి

చెప్పలేము. దీనినిబట్టి దీనినిబట్టి నా మనస్సు బలహీనమైనదని నాకే తెలిసిపోయినది. నా మనస్సు బలహీనమైనదని నేను

బాధపడడము లేదుగానీ, నా బుద్ధి గొప్పదని సంతోషించుచున్నాను. నా బుద్ధియొక్క ఆసక్తి అంతయు పరమాత్మ

విషయముల మీద ఉండుట వలన నేను సంతోషించుచున్నాను. దైవ విషయములను సులభముగా చెప్పగల్గినందుకు

సంతోషించుచున్నాను. ఇక్కడ కొందరు నన్ను ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. అదేమనగా!


మీరు మూల గ్రంథములలోని విషయములను శ్లోకముల రూపములోగానీ, వాక్యముల రూపములోగానీ

చెప్పడములేదు. దానికి మీకు జ్ఞాపకశక్తి లేదు, మీ మనస్సు బలహీనమైనదని చెప్పుచున్నారు. అయితే అధ్యాత్మిక


విషయములలో ఏ ప్రశ్నను అడిగినా, ప్రశ్న అయిపోయిన వెంటనే జవాబు చెప్పుచున్నారు. జ్ఞాపకశక్తి లేనివారికి

అదెలా సాధ్యమగును. ఎంతో జ్ఞాపకముంటేగానీ సాధ్యముగానీ జ్ఞానమును మీరు చెప్పు చున్నప్పుడు, మీరు మీ

మనస్సు బలహీనమైనదంటే మేము నమ్మాలా? మీరు ఇప్పటికి దాదాపు 52 గ్రంథములను వ్రాశారు. అందులో ఎక్కడ

కూడ ఒకచోట ఒకరకము, మరొకచోట మరొకరకముగా చెప్పలేదు. అంతేకాక శాస్త్రబద్ధతను వదలి ఎక్కడా చెప్పలేదు.

మీరు చెప్పు విషయములు మూల గ్రంథములలో కూడా ఉన్నాయని చెప్పుచున్నారు. ఇదంతయు జ్ఞాపకశక్తిలేని వారికి

సాధ్యమంటారా? మీ మనస్సు బలహీనమైనదైతే 52 గ్రంథములు ఎలా వ్రాశారు. 100 ఉపన్యాసములు ఎలా

చెప్పగలిగారు? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! మా మనస్సు బలహీనమైనదనుట నూటికి

నూరుశాతము సత్యము. ఇంతవరకు నా సెల్ఫోన్ నంబరు నాకు జ్ఞాపకముండదు. ఇతరుల సెల్ఫోన్ నంబరుగానీ

కనీసము ఒక్కరిదైనా, ఒక్క ఫోన్ నంబరైనా జ్ఞాపకములో ఉండదు. నా సెల్ఫోన్లో రికార్డయిన నంబర్లకు పేర్లు

పెట్టుకొని, ఆ పేర్ల ప్రకారము ఎవరికైన ఫోన్ చేయడము జరుగుచున్నది. ఏదైనా ఆపద సమయములో సెల్ఫోన్ పోతే,

కనీసము నా భార్యకైనా ఫోన్చేసి చెప్పుటకు ఆ నంబరు కూడా నామదిలో లేదు. అలాంటపుడు నేను జ్ఞాపకశక్తిలో

చాలా బలహీనున్నని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఇకపోతే మేము 52 గ్రంథములు వ్రాసినది, 100 ఉపన్యాసములు

చెప్పినది వాస్తవమే. అయితే అక్కడ వ్రాసినది చెప్పినది దైవజ్ఞానము. దైవజ్ఞానమును వ్రాయుటకుగానీ, చెప్పుటకుగానీ

మనిషి జ్ఞాపకశక్తితో సంబంధముండదు.


మనస్సుకు ప్రపంచ విషయములందు మాత్రమే బలము, బలహీనము ఉండునుగానీ, దైవ విషయములు

దానికి ఏమాత్రము సంబంధము లేదు. మనిషి శరీరములోనికి ఐదు ద్వారముల ద్వారా ప్రవేశించిన విషయములను

ప్రపంచ విషయములని చెప్పవచ్చును. ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అను ఐదు

ఇంద్రియముల ద్వారా ప్రవేశించిన ప్రపంచ విషయముల మీద మనస్సు యొక్క బలము, బలహీనమును గురించి

చెప్పవచ్చును. అయితే ఆత్మ, పరమాత్మకు, సంబంధించిన విషయములు ప్రపంచ సంబంధముకావు. అవి దైవ

సంబంధ విషయములు అందువలన మనో జ్ఞాపకమునకు ఏమాత్రము సంబంధముండదు. ఇక్కడ కొందరికి మరొక

ప్రశ్న రావచ్చును, అదేమనగా! ముస్లీమ్లు వేదాలలోని, భగవద్గీతలోని శ్లోకాలు చెప్పితే అది వారి మనోశక్తి అన్నారు.

ఇక్కడేమో దైవ సంబంధ జ్ఞానము మనస్సుకు సంబంధములేదు అంటున్నారు. వారు చెప్పినది దైవసంబంధ శ్లోకాలు,

వాక్యాలనే కదా! అలాంటపుడు అవి వారికి మనోబలమునకు సంబంధించినవి ఎలా అయినవి? దైవసంబంధములైనవి

ఎందుకు కాలేదు? ఇప్పుడు మీరు చెప్పినవి దైవసంబంధ విషయములనీ, మనో జ్ఞాపకమునకు అవి సంబంధము లేదు

అంటున్నారు. మీరు చెప్పునది సరిగా మాకు అర్థము కావడము లేదు. దైవసంబంధ విషయములకు మనో జ్ఞాపకముతో

సంబంధము లేకపోతే మీరు ఏ జ్ఞాపకముతో 100 ఉపన్యాసములు చెప్పారు. 52 గ్రంథములు ఏ జ్ఞాపకముతో

వ్రాశారు? అని అడుగవచ్చును. దానికి నా సమాధానము ఈ విధముగాయున్నది. శ్లోకాలు, పద్యాలు, గూఢార్థవాక్యములు

జ్ఞానసంబంధమైనవైనప్పటికీ అవి వివరముగా అర్థమైనప్పుడే నీకుగానీ, నాకుగానీ, ఎవరికైనాగానీ జ్ఞాన మగును.

వాటి వివరము అర్థముకానప్పుడు వేదాల మంత్రాలుగానీ, గీతశ్లోకాలుగానీ, బైబిలు వచనములు గానీ, ఖురాన్

ఆయత్లుగానీ అక్షర సముహములేగానీ జ్ఞాన సముదాయములు కావు. ముస్లీమ్లు నేర్చుకొన్న శ్లోకాలు అయినా,

క్రైస్తవులు చదువు వాక్యాలైనా వివరము తెలియకపోతే వాటిని దైవ విషయములుగా లెక్కించము. అందువలన

ముస్లీమ్లు వేదాల మంత్రాలను, గీత శ్లోకాలను, బైబిలు వాక్యములను మనోబలముతోనే చెప్పుచున్నారని చెప్పుచున్నాము.

వారు చెప్పు శ్లోకాలలో మనోబలము కనిపించుచున్నది. బుద్ధిబలము కనిపించడములేదు. ఎందుకనగా! దేవుడు


చెప్పిన భావము ఒకటుండగా శ్లోకములను చెప్పువారు వాటికి వేరు భావమును కల్గియున్నారు. అందువలన వారికి

జ్ఞాపకశక్తియున్నదిగానీ, జ్ఞానశక్తిలేదు అని చెప్పవచ్చును. వారు చెప్పు శ్లోకములు దైవసంబంధమే అయినప్పటికీ,

వాటి నిజ భావము తెలియనందువలన అవి మనలెక్కలో ప్రపంచ సంబంధ చదువుగా లెక్కించబడుచున్నవి. ప్రపంచ

సంబంధ చదువులుగా లెక్కించబడు కంఠాపాట శ్లోకములను, వాక్యములను మనోబలముతో చెప్పునవిగా చెప్పుచున్నాము.


మేము చెప్పిన జ్ఞానము దైవసంబంధమైనది, కావున అది మనో జ్ఞాపకమునకు సంబంధములేదు. బుద్ధి

దైవజ్ఞానమును గ్రహించుకొనినా, జ్ఞానమును మనస్సు జ్ఞాపకము చేయలేదు. మనోజ్ఞాపకమంతా ప్రపంచ విషయముల

వరకేనని ముందే చెప్పుకొన్నామని జ్ఞప్తికుంచుకోవలెను. నేను చెప్పిన ఉపన్యాసములు, వ్రాసిన గ్రంథములు ఉన్నప్పటికీ,

వాటిని గురించి చెప్పునప్పుడు నేను చెప్పినదేమనగా! అట్లే నేను వ్రాసినదేమనగా! అని ఊచ్చరించక మేము

వ్రాసినదేమనగాయనిగానీ, మేము చెప్పునది ఏమనగా అనిగానీ వ్రాసియుందుము. నేను అని వ్రాయవలసిన చోట

ఏకవచనమైన నేను అని వ్రాయక, బహువచనమైన మేము అని వ్రాసియున్నాము. అలా వ్రాయడమునకు కారణమేమనగా!

అక్కడ వ్రాయబడిన గ్రంథముగానీ, చెప్పబడిన ఉపన్యాసముగానీ వాస్తవముగా నేను చెప్పినది, వ్రాసినదికాదు. జ్ఞాపకశక్తే

లేని నేను గ్రంథమును వ్రాయలేననీ, ఉపన్యాసమును చెప్పలేదననీ చెప్పవచ్చును. అయితే పైకి కనిపించినట్లు మీ

దృష్ఠికి నేను వ్రాసినా, నా భావములో నేను మరియు నా ఆత్మ ఇద్దరము కలిసి వ్రాసినవిగా ఉండును. అలాగే నా ఆత్మ

చెప్పినదిగా లెక్కించుచున్నాను. కావున చాలాచోట్ల బహువచనమైన మేము అను పదమును వ్రాసియుందుము. నా

శరీరము పైకి మీకు కనిపించుచుండినా, నా శరీరములోపల కనిపించని ఆత్మయున్నది. నాచే వ్రాయించినది, చెప్పించినది

ముమ్మాటికి నాలోపలి ఆత్మయని తెల్పుచున్నాను. అంతేకాక అందరికీ తెలియని విషయము ఒకటున్నది. అదేమనగా!

దైవ సంబంధ విషయములను జ్ఞాపకము చేయునది శరీరము లోని ఆత్మేనని ఎవరికీ తెలియదు. ప్రపంచ సంబంధ

విషయములను మనస్సు తెలుపగా ఆత్మ సంబంధిత (దైవసంబంధిత) జ్ఞాన విషయములను ఆత్మ తెలుపుచున్నది. ఆత్మ

తెలియజేయు జ్ఞానము శ్లోకముల రూపములో, వాక్యముల రూపములో చెప్పబడకపోయినప్పటికీ, చెప్పిన జ్ఞానము

మూల గ్రంథములలో ముందే చెప్పిన శ్లోకములకు, వాక్యములకు సమానముగా యుండును. అంతరంగమునుండి

ఆత్మే మాట్లాడుచున్నప్పుడు మధ్యలో నా జ్ఞాపకశక్తితో పనేలేదు. అన్ని జ్ఞాపకశక్తులను ఆత్మే అప్పటికప్పుడు కలుగజేయును.

దైవజ్ఞానమునకు కావలసిన మాటలను పలికించునది, వ్రాతలను వ్రాయించునది ఆత్మయే, కావున దైవజ్ఞానమునకు

మనస్సు యొక్క జ్ఞాపకశక్తి అవసరము లేదు. ముస్లీమ్లు చెప్పిన శ్లోకములు వారి కంఠాపాటముగా చెప్పినా, వారు

నేను బాగా చెప్పానను వ్యక్తిగత ఉద్దేశ్యములోనే ఉందురు. వారు చెప్పిన శ్లోకములలోని భావము వారు నేర్చుకొని

చెప్పినా, అది నిజభావము కాకపోవడము వలన, వారిది ప్రపంచ చదువు క్రిందకే జమకట్టబడును. అందువలన

వారికి మనస్సుయొక్క జ్ఞాపకశక్తి ఎక్కువయున్నదని చెప్పాను. వాస్తవానికి జ్ఞాపకశక్తిలో పూర్తి వెనుకబడిన నేను చెప్పిన

జ్ఞాన విషయములు నావి కావనీ, ఆత్మ చెప్పినవనీ, నాకు బాగా తెలుసు. అందువలన దైవ సంబంధ విషయములు

ఎవరికైనా జ్ఞాపకశక్తి ప్రమేయము లేకుండా జ్ఞానశక్తి ప్రమేయముతోనే తెలియబడునని మరి మరి చెప్పుచున్నాను.

జ్ఞాపకశక్తియున్నవాడు ఎక్కువగా ప్రపంచములో చిక్కుకొనిపోవును. జ్ఞానశక్తియున్న వానికి శ్లోకములు రాకపోయినా,

వాక్యములు తెలియకపోయినా, వాటిలోని నిజజ్ఞానము అతనికి తెలియ గలదు.


ఇకపోతే చదువురాని వానికి, చదువు వచ్చిన వానికి జ్ఞానములో ఏమైనా తేడాయుండునా అని మొదట అడిగిన

ప్రశ్నలో కలదు. దానిని గురించి చెప్పే ముందు ఒక సూత్రమును చెప్పుకొందాము. అదేమనగా! మనిషిలోని


మనస్సునుబట్టి జ్ఞాపకమూ, బుద్ధినిబట్టి జ్ఞానమూ లభించునని చెప్పునది సూత్రము. సూత్రము ప్రకారము మనిషియొక్క

బుద్ధినిబట్టి జ్ఞానమని చెప్పడము జరిగినదిగానీ, చదువునుబట్టి జ్ఞానమని చెప్పలేదు కదా! మనిషిలోని బుద్ధి వాని

కర్మను అనుసరించి ఉండును. కర్మను అనుసరించి పుట్టుకతో వచ్చిన బుద్ధికి ప్రపంచ జ్ఞానవిషయముల మీదే ఆసక్తి

ఎక్కువగాయుండును. బుద్ధి కర్మనుబట్టి వచ్చినా గతజన్మల సంస్కార బలమునుబట్టి దైవమార్గము మీద ఆసక్తి (శ్రద్ధ)

వాని బుద్ధికి పట్టుబడు అవకాశము కలదు. అందువలన కొందరి బుద్ధికి ప్రపంచ జ్ఞానము మీద ఎక్కువ శ్రద్ధయుండగా,

కొందరి బుద్ధికి పరమాత్మ విషయముమీద ఆసక్తి ఎక్కువగా ఉండును. గతజన్మలలో దైవవిషయముల మీద ఆసక్తిగలవానికి

ఈ జన్మలో చదువువచ్చినా, చదువురాకున్నా దైవజ్ఞానము పుష్కలముగా లభించును. అందువలన చదువుకు దైవజ్ఞానమునకు

సంబంధము లేదనీ, ఆసక్తియుంటే చదువురాని వానికైన జ్ఞానము వచ్చునని చెప్పవచ్చును. చదువు బాగా వచ్చినప్పటికీ

దైవజ్ఞానము ఏమాత్రము లేనివారు భూమిమీద ఎందరో గలరు. చదువురానివానికంటే చదువువచ్చినవానికి జ్ఞానముమీద

అనుమానములు ఎక్కువ. కావున చదివినవానికి దైవజ్ఞానము వస్తుందను నమ్మకము లేదు.



ప్రశ్న :- ఒక వస్తువు కనిపించకుండ మాయమైపోతుందనీ, మాయము చేయగలమనీ కొందరంటుంటారు. ఒక

వస్తువును కంటికి కనిపించకుండా హస్తలాఘవము చేత దాచి, మాయమైపోయిందని కొందరు ఇతరులను

నమ్మించుచుంటారు. అలాగే కొందరు తాము దాచియుంచిన వస్తువును హస్తలాఘవము చేత కనిపించునట్లు చేసి,

వస్తువును సృష్టించామని అంటున్నారు. ఇదంతయు ఇతరులను మోసము చేయడము తప్ప, ఏదీ వాస్తవము కాదనీ,

నిజానికి మాయము లేక అదృశ్యము అనునది లేనే లేదనీ కొందరు జనవిజ్ఞానవేదిక వారు, మరికొందరు హేతువాదులమని

పిలువబడువారు అంటున్నారు. వాస్తవానికి మాయము అనునది జరుగు తుందా? జరుగదా? కనిపించే వస్తువు ఏ

ప్రక్రియ ద్వారానైన కనిపించ కుండా పోవుటకు అవకాశము కలదా? వివరించి చెప్పవలసినదిగా కోరుచున్నాము.


జవాబు :- మాయము అనగా తెలియబడునది తెలియకుండా పోవుటయనియూ, కనిపించునది కనిపించకుండా పోవుట

అనియూ, ఉన్నది లేనట్లు తోచడము అనియూ అర్థము చెప్పవచ్చును. దీనిని గురించి విపులముగా తెలుసుకొంటే

“మాయ” అను పదమునుండి మాయమ్ అను పదము పుట్టినది. మాయ అనగా మన తలలో మూడు గుణభాగములలోని

36 గుణముల సమ్మేళనమని చెప్పవచ్చును. మన శరీరములోని గుణములు కనిపించవు. అందువలన మాయ కూడ

కనిపించదు. శరీరములోని తలయందుగల మాయయందు ప్రతి జీవుడు నివాసమున్నాడు. శరీరములో జీవుని

నివాసస్థలము మూడు గుణభాగములే, కనుక మాయలో జీవుడున్నా డని చెప్పవచ్చును. మాయలోనున్న ప్రతి జీవునికి

ఉన్న దేవుడు లేనట్లు, జీవునికి మాయయే భ్రమింపజేయుచున్నది. పరమాత్మనుండి పుట్టినది ప్రకృతి. ప్రకృతినుండి

పుట్టినవి మూడు గుణభాగములలోని 36 గుణములు. ప్రకృతికి మారుపేరుగా మూడు గుణభాగములలోని గుణములను

ఆవహించి యున్నది మాయ. మాయ యొక్క లక్షణము ఉన్నదానిని లేకుండా, లేని దానిని ఉన్నట్లు చూపడము. ఈ

నిర్ణయము దేవుడు చేసినదేనని తెలియ వలెను. దేవునికి తెలియకుండా ఏదీ జరుగుటకు వీలులేదు. ఆయన నిర్ణయించిన

నిర్ణయము ప్రకారము మాయ పని చేయుచున్నది. ప్రపంచ మంతా వ్యాపించియున్న దేవున్ని ఎవరికీ తెలియకుండా

చేసినది మాయయే. ఉన్న దేవున్ని ఎవరికీ తెలియకుండా చేసినట్లు, ఉన్నది ఏదైనా అది ఉండి కూడా తెలియకుండా

పోయినప్పుడు దానిని “మాయమ్" అయిపోయింది అనడము జరుగుచున్నది. ఉన్నది ఎక్కడైనా లేకుండా

తెలియకుండాపోతే అది మాయయొక్క విధానము వలన జరిగిన క్రియవలె ఉండుట వలన, దానిని మాయకు

దగ్గరగాయున్న పదమును ఉపయోగించి “మాయమ్” అను శబ్ధముగా చెప్పడము జరిగినది.




కొందరు ఒక వస్తువును హస్తలాఘవము చేత దాచిపెట్టి కనిపించ కుండాచేసి ఆ వస్తువును పూర్తిగా మాయము

చేశానని చెప్పుకొనుచుందురు. ఇది ఇతరులను మభ్యపెట్టు విధానమేనని చెప్పవచ్చును. అయితే ఒక వస్తువును పూర్తి

కనిపించకుండ మాయము చేయు విధానము కూడా కలదు. అయితే ఆ విధానమును తెలియని కొందరు ఒక

వస్తువును ఎదుట వ్యక్తికి తెలియకుండ దాచి ఆ వస్తువు అతనికి కనిపించనప్పుడు దానిని మాయము చేశానని

నమ్మించుచుందురు. ఇది చేతి ప్రావీణ్యత వలన చేయు విధానము. వస్తువు మాయము కాకున్నా మాయమైనట్లు

నమ్మించడము కూడా ఒక విద్యయేనని చెప్పవచ్చును. దానినే పూర్వము టక్కుటమారా విద్య అనెడివారు. టక్కు అంటే

అబద్ధము. టమారా అంటే అబద్ధముగా చెప్పిన దానిని నమ్మునట్లు చేయడము. ఒక విధముగా ఇది ఎదుటి మనిషిని

మోసగించడమేనని చెప్పవచ్చును. టక్కుటమారా విద్య వలన ఉన్నదానిని లేనట్లు భ్రమింప చేయవచ్చును. అయితే

ఉన్న వస్తువును పూర్తి కనిపించకుండ మాయము చేయగల విద్య కూడ భూమిమీద కలదు. దానినే పూర్వము ఇంద్రజాల

మహేంద్రజాల విద్య అనెడివారు. ఒక గుంపుగా మూడు విద్యలను మనిషి నేర్చుకొనెడివారు. ఆ మూడు విద్యల పేర్లనే

టక్కు టమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ విద్యలని పిలిచెడివారు. పూర్వము ఒక గుంపుగాయున్న

మూడు విద్యలను నేర్పు గురువులు కూడా ఉండెడివారు. అయితే ఈ విద్యలు పూర్తి ప్రపంచ సంబంధమైనవేగానీ,

పరమాత్మ సంబంధమైనవికాదు. ప్రపంచ సంబంధ విద్య అయినా ఒక వస్తువును పూర్తి కనిపించకుండ చేయు

విధానము కలదు. కొందరు ఈ విషయమును నమ్మలేకపోయినా మా మాట వాస్తవము.


ఒక వస్తువును దాచివేయకుండా అది ఉన్నా కంటి చూపుకుగానీ, చేతి స్పర్శకుగానీ తెలియకుండా చేయడమును

మాయము చేయడమని చెప్పవచ్చును. ఇది ఇంద్రజాల మహేంద్రజాల విద్య వలన సాధ్యమగును. అయితే ఆ

విద్యలను నేటికాలములో నేర్చినవారు లేరు, నేర్పించు గురువులూ లేరని చెప్పవచ్చును. నాకు తెలిసినంతవరకు

ఎవరూ లేరుగానీ, ఎక్కడైనా ఉండవచ్చునేమో చెప్పలేము. మాయమ్ చేయుట అనునది ప్రపంచములో ఒక విద్య

అయినా, ప్రకృతి సిద్ధముగా మన శరీరములోనే ఆ విధానము అమరియున్నదని చెప్పవచ్చును. ఉన్న వస్తువును

మనిషికి కనిపించకుండ చేయు విధానమును “మాయమ్” అనగా, ఉన్న దేవున్ని మనిషికి తెలియకుండ చేయు విధానమును

“మాయ” అంటున్నాము. మాయ అను శబ్ధమునుండి పుట్టినదే మాయమ్ అనికూడా ముందే చెప్పుకొన్నాము. అయితే

మాయమ్ అనునది భౌతికమైనది, మాయ అనునది అభౌతికమైనది. వివరముగా చెప్పితే కనిపించే మనిషి ఉన్న

వస్తువును కనిపించకుండా చేయడమును మాయమ్ అంటున్నాము. కనిపించని గుణములు ఉన్న దేవున్ని తెలియ

కుండా చేయడమును మాయ అంటున్నాము. మాయమ్ చేయు విద్యను తెలియగలిగితే వస్తువు ఎలా కనిపించలేదో

వివరము తెలిసినట్లు, మాయ చేయు గుణములను తెలియగలిగితే దేవుడు ఎలా తెలియబడలేదో అర్థమగును. మాయమ్ను

తెలియుట ప్రపంచవిద్య అగును. మాయను తెలియుట బ్రహ్మవిద్య అగును. ఇదంతయు వినిన తర్వాత కూడా

కొందరు మేము విజ్ఞానులమనువారు, ఇదంత మేము నమ్మము, దృశ్యముగానున్న ఒక వస్తువు అదృశ్యముగా మారిపోవునని

చెప్పుట సైన్సుకు పూర్తి విరుద్ధము. ఈ విషయమును సైన్సు ఖండించుతుంది. అందువలన మాయమ్ అను విధానమును

మేము నమ్మము అని కొందరనవచ్చును. దానికి మేము ఏమనుచున్నామంటే, ప్రతి దానినీ నమ్మకపోవడము

మూఢత్వమునకు సంబంధించిన విషయము. శాస్త్రమునకు సంబంధించిన విషయముకాదు. నమ్మకముగానీ

నమ్మకపోవడముగానీ శాస్త్రబద్ధతకు లోబడియుండవలెను. ఒక విషయమును నమ్మించుటకు శాస్త్రమును ఆధారము

చేసి ఎట్లు చూపగలుగుచున్నామో, అలాగే ఒక విషయమును నమ్మకపోవడానికి కూడా శాస్త్రమును ఆధారము చేసి


చూపవలసి యుంటుంది. అలా కాకుండా ఒక విషయమును సమర్థించినా, ఖండించినా అది మూఢత్వమగునుగానీ,

విజ్ఞానమనిపించుకోదు.


మీకు బాగా అర్థమగుటకు ఒక సూత్రమును చెప్పెదను చూడండి. ఏదైతే సత్యమో అది శాస్త్రమగును, ఏదైతే

అసత్యమగునో అది శాస్త్రమని పించుకోదు. ఈ సూత్రము ప్రకారము సత్యా అసత్యములనుబట్టి శాస్త్ర అశాస్త్రములు

తెలియును. అట్లుకాకుండా నాకు తెలిసినదంతా శాస్త్రమనీ, తెలియనిదంతా అశాస్త్రమనీ చెప్పుటకు వీలులేదు. అట్లే

ఎవడుగానీ, తనకు తెలిసినది శాస్త్రమనీ, తెలియనిది అశాస్త్రమనీ అనకూడదు. నేడు చాలామంది విజ్ఞానులమనువారు

తమకు తెలిసినదే శాస్త్రము, తెలియనిది శాస్త్రముకాదని అంటున్నారు. రూపాయిలో రెండు పైసాలంత విజ్ఞానము

తెలిసినవారు మేము పూర్తి విజ్ఞానులమని భ్రమచెంది, మాకు తెలియనిది ఎంతో ఉందని (98 పైసాలంతవుందని)

తెలియక మాయమ్ అనునది అసత్యము అంటున్నారు. వారిమాట ప్రకారము మాయమ్ అసత్యమైతే మాయకూడా

అసత్యమే కావలెను. అయితే మాయ మన శరీరములో ఉండుట, అందరు దానిచే భ్రమించి మాయలో మునిగియుండుట

సత్యము. మన శరీరములోని మాయ సత్యమైనప్పుడు, బయట ప్రపంచములో మాయమ్ కూడా సత్యమై ఉంటుంది.

బయట ప్రపంచములో మాయము అనునది మనుషులు చేయునదే కాకుండా, దేవుని చేత సృష్టించబడిన ప్రకృతికూడా

బయట మాయము చేస్తూనే ఉంది. ప్రకృతి శరీరములోనే కాకుండా బయట కూడా ఉన్నది. శరీరములోవున్న ప్రకృతిని

చేతనా ప్రకృతి అంటున్నాము. బయటనున్న ప్రకృతిని అచేతనా ప్రకృతి అంటున్నాము. చేతనా ప్రకృతి శరీరములో

మాయగా ఉండగా, అచేతనా ప్రకృతి శరీరము బయట మాయముగా ఉన్నది.


ప్రకృతి అంటే ఏమిటి? అని కొందరు అర్థముకాక అడుగవచ్చును. సంగీతము నేర్చుకొనువానికి రాగము,

తాళము, పల్లవి అంటే ఏమిటో తెలియకపోతే, వాడు సంగీతమును నేర్చుకొనలేడు. ఎందుకనగా సంగీత మంతా

రాగము, తాళము, పల్లవిమీద ఆధారపడియుంటుంది. అలాగే దైవజ్ఞానము తెలుసుకొను వానికి ప్రకృతి, పరమాత్మ,

ఆత్మ తెలియకపోతే జ్ఞానమును తెలియలేడు. అందువలన ముందు శరీరములో ప్రకృతి ఎలా చేతనా ప్రకృతిగాయున్నదో

తెలుసుకొందాము. అలాగే శరీరము బయట అచేతనా ప్రకృతిగా ఎట్లున్నదో తెలుసుకొందాము. ప్రకృతి అంటే

అక్షరముల వివరము ప్రకారము “కృతి” అంటే చేయబడినది, ప్ర అంటే ముఖ్యమైనదనీ, లేక విశేషతకలదనీ చెప్పవచ్చును.

ప్రకృతియనగా విశేషతతో చేయబడిన దని అర్థము. అట్లే ముఖ్యముగా చేయబడినదని కూడా చెప్పవచ్చును. చేయబడినది

ప్రకృతికాగా, చేసినవాడు పరమాత్మయని చెప్పవచ్చును. దేవుని చేత (పరమాత్మచేత) చేయబడిన ప్రకృతి ఐదు

భాగములుగాయున్నది. ఆ ఐదు భాగములను వరుసగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని చెప్ప వచ్చును. ఈ

ఐదు భాగములుగాయున్న కృతిలో ప్ర ఏమిటి అని కొందరు అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ప్ర అనగా

ఐదు భాగములుగానున్న కృతిలో ఏదైతే ముఖ్యముగా లేక విశేషముగాయున్నదో దానినే ప్ర అని చెప్పడము జరిగినది.

ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములలో దైవశక్తి అయిన ఆత్మ ఐదు బలములుగా తయారై ఉన్నది.

ఉదాహరణకు అగ్నిలోనున్న కాల్చేశక్తియే దానిలోని ఆత్మశక్తి అని తెలియవలెను. అలాగే ఐదు భాగములలో ఐదు

విశేషమైన శక్తులుండుట వలన వాటిని కలిపి ప్రకృతి అన్నాము. ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను

జ్ఞానేంద్రియములకు తెలియు ఐదు భాగములుగా ఉండుట వలన ప్రపంచము అని అన్నాము. పంచము అంటే ఐదని

అర్థము. అందరికీ తెలియునట్లు బయట ప్రపంచమున్నది. ఎవరికీ తెలియకుండా ప్రకృతిలోని ఐదు భాగములచే

శరీరముగా తయారైనవి. శరీరములోనికి వచ్చేటప్పటికి ప్రకృతిలోని ఒక్కొక్క భాగము ఐదు భాగములుగా విడిపోయి,


ఐదు భాగములు 25 భాగములుగా తయారైనవి. అలా 25 భాగములుగా విడిపోయిన కృతులు ఆత్మశక్తితో కూడి 25

శరీర భాగములుగా తయారై చేతనా ప్రకృతియని పేరు పొందియున్నది.


సృష్ఠింపబడినది ప్రకృతి, సృష్టించినవాడు పరమాత్మ. ప్రకృతి ఒకవైపు ప్రపంచముగా కనిపిస్తూ, మరొకవైపు

సకల జీవరాసుల శరీరములుగా కూడాయున్నది. చేయబడినది ప్రకృతికాగా, చేసినవాడు పరమాత్మకాగా, పరమాత్మశక్తి

ఆత్మగా తయారై చేతనా ప్రకృతిలోనూ, అచేతనా ప్రకృతిలోనూ ఉంటూ, రెండు రకముల ప్రకృతులలో ఇమిడియున్నది.

జీవుడు ఎక్కడ ఏ శరీరములో నివసించినా అక్కడ ఆత్మ ఉండునట్లు ప్రకృతితో జత చేయబడినది. చరాచర ప్రపంచమును

తయారు చేసిన దేవుడు సృష్ఠి తర్వాత రూప, నామ, క్రియలు లేనివాడైపోయాడు. అనగా దేవునికి పేరు లేదు,

ఆకారములేదు, పనీలేదని అర్థము. పనియే చేయని దేవుడు సకల జీవరాసులను పాలించడు, కావున జీవరాసులను

జీవింపజేయుటకు ఒకవైపు ప్రకృతిని మరొకవైపు ఆత్మను నియమించుకొన్నాడు. జీవరాసులు చావుపుట్టుకలను దేవుడు

చూడకున్నా, దేవుని ఆధీనములోనున్న ప్రకృతీ, ఆత్మలూ రెండూ జీవురాసుల చావుపుట్టుకలనూ మొత్తము జీవితమునూ

కర్మప్రకారము నడుపుచున్నవి. ప్రకృతిలో ఒకభాగమైన ఆకాశములో కొన్ని భూతములూ, గ్రహములూ పనిచేయుచూ

భూమిమీద జీవరాసులను కర్మప్రకారము నడిపించుచున్నవి. ఈ విధముగా ప్రకృతి ఆధీనములో దేవుని పాలన

మొదలైనది. శరీరములో ఆత్మ పనులు చేయుచుండగా, ప్రకృతి మాయ రూపములో ప్రేరేపణ చేయుచున్నది. ఒకవైపు

ఆత్మ కార్యాచరణలో నిమగ్నముకాగా, ప్రకృతి శరీరములో మాయగా, శరీరము బయట 'మాయము'గా ప్రవర్తించుచు

సృష్ఠిని నడిపించుచున్నది. శక్తికీ కార్యములకూ ప్రకృతి ఆత్మను ఉపయోగించుకోగా, ప్రతి కార్యము వెనుక ప్రేరేపణగా

ప్రకృతి ఎంతో తతంగమును నడుపుచూ, శరీరము లోపలగానీ, శరీరము బయటగానీ ఉన్న దేవున్ని తెలియకుండ

చేయుచున్నది. అంతే కాకుండా అంతటా వ్యాపించిన దేవునికి ఏ కార్యములేకుండా అన్ని కార్యములనూ ప్రకృతే

చూచుకొనుచున్నది. శరీరములో మాయగానున్న ప్రకృతి శరీరము బయట మాయముగా ఉన్నదనుటకు ఒక రుజువును

పరిశీలించవచ్చును. ఇప్పుడు మనము తెలుసుకోబోయే ఉదాహరణగానున్న సత్యమును గ్రహించితే మాయ అంటే

ఏమిటో, మాయము అంటే ఏమిటో తెలియగలదు. 'మాయము' అనగా అదృశ్యము అని చెప్పుకొన్నాము కదా! ఒక

వస్తువు ఉన్నా అది కనిపించకుండా అదృశ్యమైపోవడమును మాయమ్ లేక మాయము అంటున్నాము. ఉన్న వస్తువు

మాయము కాదు అనువారు కొందరు కలరు. అటువంటివారికి కనువిప్పుగా విశ్వములో ప్రకృతి చేయు మాయము

ఏమిటో కొన్ని ప్రత్యక్ష యదార్థ సంఘటనలద్వారా తెలుపుచున్నాము. బయట ప్రపంచములో జరుగు మాయమును

గురించి తెలుసుకోగలిగితే, లోపలి ప్రపంచమైన శరీరములో ప్రకృతి ఎలా మాయ చేయుచున్నదో, మిగతావారికి

సులభముగా తెలియగలదు.


ఆకాశములో కనిపించెడి గ్రహములున్నట్లే, కనిపించని గ్రహములు కూడా ఎన్నో కోట్లుయున్నవి. అట్లే ఎన్నో

కనిపించని భూతములు కూడా కలవు. గ్రహములు మరియు భూతములు రెండూ జీవముగలవే అయినప్పటికీ, కొన్ని

లక్షణములలో కొంత బేధము కల్గి యున్నవి. అందువలన వాటిని గ్రహములు, భూతములు అని రెండు భాగములుగా

విడదీసి చెప్పుచున్నాము. గ్రహము అనగా గ్రహించునదని, భూతము అనగా తనరూపును మార్చుకోగలదను అర్థమును

చెప్పుకోవచ్చును. మనిషి కూడా జన్మజన్మకు శరీర రూపమును మార్చుకొని పుట్టుచున్నాడు, కావున మనిషిని భూతము

అని చెప్పవచ్చును. అలాగే మనిషి విషయములను గ్రహించుకోగలుగుచున్నాడు, కావున మనిషిని గ్రహము అని కూడ

చెప్పవచ్చును. ఖగోళములో విషయములను గమనించు వారిని మరియు గ్రహించు వాటిని గ్రహములనియూ, మనుషులకు


శిక్షలను అమలు చేయుటకుగానీ, మనుషులను పాలించుటకు తగిన పనులు ఆచరించడములోగానీ, తన రూపును

సమయానుకూలముగా మార్చుకొను వారిని లేక వాటిని భూతములనియూ అంటున్నాము. ఖగోళములోనున్న కొన్ని

గ్రహములను గురించి కొందరికి తెలిసియున్నది. అయితే అదే ఖగోళములోని భూతములను గురించి బహుశా ఎవరికీ

తెలియదను కొంటాను. గత నాలుగు సంవత్సరముల క్రితము మేము వ్రాసిన “దయ్యాల - భూతాల యదార్థ సంఘటనలు”

అను గ్రంథములో భూతాలను గురించి కొంతవరకు చెప్పడము జరిగినది. అక్కడ మాటిమాటికి రూపమును మార్చుకొనుచు

దేవుని పాలనలో భాగస్వాములుగానున్న మేఘములను భూతములని వర్ణించి చెప్పడము జరిగినది. అంతేకాక "మేఘమొక

భూతము” అను పాఠమును గురించి మరియు “రోగమొక భూతము” అను విషయమును గురించి మేము చెప్పిన

ఉపన్యాసములు కూడా కలవు. మేఘములు ఆకాశములో ఉంటూ, ఎవరూ ఊహించలేని విధముగా, ఎవరికీ తెలియని

రహస్య కార్యములను ప్రవర్తించుచున్నవనీ, మేఘములు వాస్తవముగా భూతముల కోవకు చెందినవనీ, భూతములైన

మేఘములే భూమిమీద రోగక్రిములుగా రూపమును మార్చుకొని రోగముల రూపములో ప్రజల యందు వ్యాపించి పాప

పరిపాలన చేయుచున్నవనీ చెప్పాము.


ప్రకృతి కనిపించు మరియు కనిపించని ప్రపంచముగా ఉన్నది. విశ్వములో జరుగుచున్న మొత్తము పనులన్నిటినీ

ప్రకృతి చేయుచున్నది. దేవుడు (పరమాత్మ) ఏ చిన్న కార్యమును కూడా చేయడము లేదు. ముఖ్యమైన దేవుని ధర్మము

ప్రకారము దేవుడు రూప, నామ, క్రియారహితుడు. వివరముగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పితే దేవునికి పేరులేదు,

పేరున్న వాడు దేవుడుకాడు. దేవునికి రూపములేదు, రూపమున్నవాడు దేవుడు కాడు. అలాగే దేవునికి పనిలేదు,

పనిచేయువాడు దేవుడుకాడు. ఈ ధర్మము ప్రకారము దేవుడు అనునతడు ఎట్లుంటాడో, ఏ పేరుతో ఉంటాడో, ఏమి

చేయుచుంటాడో ఎవరికీ తెలియదు. ఎట్లుంటాడో అను ప్రశ్నకు ఏ విధముగా ఉంటాడో రూపములేని ఆయన ఎవరికీ

తెలియడు. ఏ పేరుతో ఉంటాడో అను ప్రశ్నకు ఆయనకు పేరేలేదు అను సూత్రము ప్రకారము ఏ పేరుతో పిలువబడువాడు

కాడు. అందువలన పేరునుబట్టి గుర్తించలేము. అలాగే ఏమి చేయుచుంటాడో అను ప్రశ్నకు, ఆయనకు పనియేలేదు

అను సూత్రము ప్రకారము ఏ పనినీ చేయని వాడు దేవుడు. అందువలన పనిని చూడవలసిన అవసరమే లేదు. పని

ద్వారా ఆయన తెలియబడడు. ఈ విధముగా గుర్తించుటకు అవకాశమున్న ఆకారముగానీ, పేరుగానీ, పనిగానీ

లేనివానిని ఎవరూ గుర్తించుటకు వీలులేదు. ఇదంతయు బ్రహ్మవిద్యా శాస్త్రబద్ధముగా దేవుని వాస్తవికత అని తెలియుచున్నది.

అయితే ఇక్కడ దేవున్ని గురించి మరొక ముఖ్యమైన విషయమును చెప్పితే భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్యయోగమను

అధ్యాయములో 19వ శ్లోకములో భగవంతుని వేషములోనున్న దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు.


19వ శ్లో :

తపామ్యహ మహం వర్షం నిగృహ్న మృత్యుజామిచ,

అమృతం చైవ మృత్యుశ్చ సదస చ్చాహ మర్జున.


భావము :- “నేను తపియింపజేయుచున్నాను. నేనే భూమిమీద జలములను స్వీకరించి మరల వర్షరూపములో

విడుతును. సకల జీవరాసులకు మృత్యువును నేనే. అమృతమైన ఆరోగ్యమును నేనే. సత్తు నేనే, అసత్తు నేనే.”


పై శ్లోకము యొక్క భావమును చూస్తే స్వయముగా భగవంతుడైన దేవుడే "భూమిమీద వేడిమికి మనుషులను

తపియించునట్లు నేనే చేస్తాను అన్నాడు. అంతేకాక భూమిమీదగల నీటిని తీసుకొని, నావద్ద పెట్టుకొని నాకు త్రోచినప్పుడు

ఆ నీటిని వర్షముగా భూమిమీద విడుచుచున్నాను. సకల జీవులకు చావుకు కారణమైన రోగమును నేనే, అలాగే


ఆరోగ్యమునకు కారణమైన అమృతము నేనే. అంతేకాక అందరిలోనున్న సత్తు అయిన ఆత్మను నేనే మరియు అసత్తు

అయిన ప్రకృతి నేనే”యని చెప్పియున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పినది బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీత. పైన చెప్పిన

దేవుడు రూప, నామ, క్రియారహితుడు అనుమాట దేవుని ముఖ్యమైన ధర్మములలోని విషయము. దేవుని ధర్మము

కూడా బ్రహ్మవిద్యా శాస్త్రము లోనిదే. శాస్త్రము ఎప్పటికీ సత్యముగా ఉంటుంది. అయితే ఇక్కడ శాస్త్రములోని మాటలే

ఒకదానికొకటి పరస్పర విరుద్ధముగా ఉన్నవి. ఈ వాక్యములు ఉన్న దానినిబట్టి చూస్తే అందులో ఒకటి సత్యమైతే

మరొకటి అసత్యముగా ఉండవలెను. పని చేయువాడు దేవుడుకాడు అన్నది దేవుని ధర్మమైతే, నేనే భూమిమీద

జలమును స్వీకరించి మరల వర్షరూపములో కురిపించుచున్నాను అన్నప్పుడు దేవుడు వర్షమును విడచు పనిని చేయు

చున్నాడని తెలుస్తున్నది. ఒక చోట చేయను అంటాడు, మరొకచోట నేనే చేస్తున్నాను అంటాడు. ఇందులో ఏదో ఒకటి

అసత్యమగుటకు అవకాశము కలదు. "అసత్యమైనది ఏదైనా శాస్త్రముకాదు” అను సూత్రము ప్రకారము ఈ రెండు

మాటలలో ఒకదానిని ఖండించవలసియున్నది. అయితే ఇక్కడ రెండుమాటలను ఖండించుటకు వీలులేదు. ఎందుకనగా!

అర్థము చేసుకొంటే రెండూ శాస్త్రబద్ధమైన మాటలే అగును.


వాస్తవముగా దేవుడు ఏ పనినీ చేయడములేదు. ఆయన బ్రహ్మ విద్యాశాస్త్రమును అనుసరించి ఉన్నాడు.

దేవుడు ఏ పనినీ చేయకున్నా తన క్రిందయున్న వారిచేత పనిని చేయించడము వలన ఆ పనిని తానే చేసినట్లుగుచున్నది.

దేవుడు సృష్ట్యాదిలోనే తనక్రింద పని చేయు వారిని ఎందరినో ఉంచుకొన్నాడు. అలాగే దేవుని ఆధ్వర్యములో దేవుని

పనిని చేయువారందరినీ దేవుని పరిపాలనయందున్న వారిగా లెక్కించవచ్చును. దేవుని పనిని చేయుటకు మొదట

నిర్ణయింపబడినది ప్రకృతి. ప్రకృతి తనతోపాటు పనిచేయుటకు కొంత సమూహమును తయారు చేసుకొన్నది. అలా

తయారైన సమూహములో మహాభూతములుగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములుగా ప్రకృతి

విడిపోయివుండగా, తర్వాత భూతములు, ఉపభూతములు, గ్రహములు, ఉపగ్రహములు కొన్ని కోట్ల సంఖ్యలో తయారై

ఉన్నవి. ఇవన్నియు దేవుడు సృష్టించిన జీవ సముదాయమును పాలించుటకు నిర్ణయింపబడినవని చెప్పవచ్చును. ఈ

విధముగా దేవుని రాజ్యమైన విశ్వములో పాలించువారు, పాలించబడువారు అను రెండు భాగములు తయారైనవి.

ప్రజలు, ప్రభుత్వము అని మన దేశములో ఎలా ఉన్నదో, అలాగే విశ్వ రాజ్యములో కూడా కర్మజీవులు, కర్మాతీత

జీవులు అని రెండు రకములుగా ఉన్నారు. కర్మ జీవులైనవారు క్రిమి, కీటక, పశు, పక్షి, మృగ, మర్కట, మానవ

జాతులుగానున్నవనీ, కర్మాతీతమైన వారు మహాభూత, భూత, ఉపభూత, గ్రహ, ఉపగ్రహములుగా ఉన్నవనీ చెప్పవచ్చును.

కర్మాతీతమైన భూతములు గ్రహములు పాలన యంత్రాంగమును నడుపుచుండగా, కర్మకు ఆధీనములోగల జీవరాసులన్నీ

పాలన యంత్రాంగములో చిక్కుకొని పాలింపబడుచున్నవని చెప్పవచ్చును.


సకల జీవరాసుల శరీరములలో ఆత్మయున్నట్లే మహాభూతములు మొదలుకొని భూతములు, ఉపభూతముల

వరకు గ్రహములు మొదలుకొని ఉపగ్రహములవరకు వాటి ఆకారములలో కూడా ఆత్మకలదు. కర్మాధీన సకల

జీవరాసుల శరీరములలో ఆత్మ వాటి శరీరమునకు శక్తినిచ్చునదేకాక కర్మను క్రమముగా అమలు చేయుచున్నది.

కర్మాతీత భూతములలో, గ్రహములలో ఆత్మయున్నప్పటికీ వాటికి ఆత్మ శక్తినిచ్చునదిగా మాత్రమే యున్నది. భూతములకు,

గ్రహములకు కర్మలేదు, అందువలన వాటిని అనుభవించునట్లు చేయు అవసరము ఆత్మకు లేదు. కర్మాధీన జీవరాసులలో

ఆత్మ పనిచేయుటకు శక్తినివ్వడమూ మరియు కర్మను అనుభవింపజేయడమూ అను రెండు పనులు చేయుచుండగా,

కర్మలేని భూతముల గ్రహములలోగల ఆత్మ వారికి శక్తినివ్వడము అను ఒక పనిని మాత్రము చేయుచున్నది. ఇప్పుడు



మీరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! అగ్నికి ధూమము అంటుకొనియున్నట్లు, కార్యమునకు కర్మ అంటుకొని

యుండునని ముందు చెప్పుకొన్నాము కదా! కర్మసిద్ధాంతము ప్రకారము ఏ కార్యము చేసినా, అందులో ఫలితముగా

కర్మవచ్చునని మీరే చెప్పారు కదా! మీరు చెప్పిన కర్మసిద్ధాంతము ప్రకారము, మనుషులు పని చేసినప్పుడు కర్మరావడము

జరుగుచున్నది కదా! అదే భూతములు గ్రహములు వారిపాలనలో ఎన్నో కార్యములు వారు చేయునప్పుడు, వారి

కార్యములకు కర్మ ఎందుకు రాలేదు? వారు ఎందుకు కర్మబద్ధులు కాలేరు? అని అడగవచ్చును. దానికి మా జవాబు

ఈ విధముగా కలదు.


మన ప్రభుత్వములో కూడా మనము పరిపాలించబడుచుండగా దేశరక్షణ కొరకు సైన్యము కూడా కలదు

కదా! సైన్యములో వారి విధులలో శత్రువులుగా లెక్కించబడు వారిని ఎంతమందిని చంపినా వారు నేరస్థులుగా

లెక్కించబడరు. అదే విధముగా దైవధర్మములకు రక్షణ కల్పించుచూ పాలించు పాలకులైన భూతములకు, గ్రహములకు

కార్యమున్నది గానీ దానిని అంటుకొని కర్మయుండదు. అందువలన వారికి పాపపుణ్యమను కర్మలు రావు. వారు

ఎప్పటికీ కర్మాతీతులే. వారి స్వార్థమునకు కాకుండా దేవుని కార్యములో భాగస్థులై పనిని చేయు గ్రహములకు భూతములకు

కర్మలేదు. అందువలన వారు అనుభవించడము అంటూ ఏమీ ఉండదు. భూతములకు, గ్రహములకు కర్మను

అంటగట్టు పనిని ఆత్మ చేయడము లేదు. వారిలో ఆత్మ శక్తిని ఇచ్చు పనిని మాత్రము చేయుచున్నది. భూతములలో

మహాభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అందరికీ తెలిసినట్లే కలవు. ఇవి అన్నిటినీ కలిపితే ప్రకృతి

అనుచున్నాము. దేవునికి సేవకురాలిగా సతిగాయున్న ప్రకృతి, తాను మరికొన్ని భూతము లను, గ్రహములను

వినియోగించుకొని దేవుడు చేయవలసిన పనినంతటినీ చేయుచున్నది. దేవుడు సృష్టించి నియమించినది ప్రకృతికాగా,

ప్రకృతి దేవుని ఆధ్వర్యములో దేవుని కార్యములన్నిటినీ చేయుచున్నది. ఏ పనినైనా యజమాని చేయకున్నా, అతని

క్రింద సేవకులు పని చేసినా, చివరకు ఆ పనిని యజమాని చేసినట్లే లెక్కించబడును. ఒక పనిని కాంట్రాక్టర్ అను

వ్యక్తి చేయకున్నా, అతను నియమించిన పని మనుషులు చేసినా, చివరకది ఆ కాంట్రాక్టర్ చేసినట్లే లెక్కించబడును.

అదే విధముగా దేవుడు ఏ కార్యమును చేయకున్నా, దేవుడు సృష్టించి నియమించిన ప్రకృతి మరియు దాని సమూహము

భూతములు, గ్రహములు చేసినా, ఆ పనినంతటినీ చివరకు దేవుడు చేసినట్లే లెక్కించబడుచున్నది. అందువలన దేవుడు

స్వయముగా చేయని పనిని కూడా నేనే చేశానని చెప్పడము జరిగినదని అర్థము చేసుకోవాలి. అందువలన శాస్త్రబద్ధముగా

దేవుడు ఏమీ చేయనివాడేనని చెప్పవచ్చును. అట్లే అన్నిటినీ చేయువాడని కూడా చెప్పవచ్చును. చివరకు ఎవరికీ ఎటూ

అంతుచిక్కనివాడని కూడా చెప్పవచ్చును.



ఇప్పుడు ముఖ్యముగా మనము చెప్పుకొను విషయమేమనగా! దేవుడు అన్ని కార్యములు నేనే చేస్తున్నానని

గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 19వ శ్లోకములో చెప్పడము శాస్త్రవిరుద్ధముగా కనిపించినా ఆ మాట

చివరకు సత్యమేయగుచున్నది. అలాగే నేను ఏమీ చేయలేదు అన్నీ ప్రకృతియే చేయుచున్నదని భగవద్గీత విజ్ఞానయోగములో

అరవ (6)వ శ్లోకమున చెప్పడము జరిగినది.


6. శ్లో

ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ ।

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా |


భావము :- “సర్వ జీవరాసులకు జన్మలను నా సతియైన ప్రకృతియే చేయుచుండును. నేను ఏమీ చేయక సర్వజీవుల

చావుకు మరియు పుట్టుకలకు కారణముగాయున్నాను.”


ఈ శ్లోకములో చెప్పిన భావము ప్రకారము జీవులు పుట్టింది మొదలు మరణించు వరకు చిన్నపెద్ద పనులను,

హింస అహింస కార్యములను, సుఖదుఃఖ పరిస్థితులను, వినోదము మరియు విషాదములకు సమస్తము అన్నిటికీ

కారణము దేవుడుకాగా ఆయన ఏమీ చేయకుండా ఆయన తరపున అన్ని కార్యములను కనిపించు కనిపించని

ప్రకృతులుగాయున్న చేతనా అచేతనా ప్రకృతియే చేయుచున్నది. అన్నీ నేనే చేయుచున్నానని రాజవిద్యా

రాజగుహ్యయోగములో 19వ శ్లోకమున చెప్పిన మాటకు విరుద్ధముగా ఇక్కడ విజ్ఞానయోగము 9వ శ్లోకము కనిపించినా

వివరించి తెలుసుకొంటే రెండు మాటలు శాస్త్రబద్ధమైనవేనని తెలియుచున్నది. పైకి కనిపించుటకు రెండూ రెండు

విధముల అశాస్త్రీయముగా కనిపించినా, జ్ఞానదృష్టితో చూడగల్గితే రెండూ శాస్త్రబద్ధమైన వచనములే అని తెలియుచున్నది.

ఎంతో శాస్త్రబద్ధముగాయున్న దేవున్ని మేము శాస్త్రవేత్తలము అనువారు కూడా తెలియకుండా పోవుటకు, దేవుని

జ్ఞానము వారికి అర్థము కాకుండా పోవుటకు, కారణము మాయ అని చెప్పాము. మాయ అనునది ప్రకృతికి

మారురూపులాంటిది. ప్రకృతిచే తయారు చేయబడిన గుణములే మాయరూపముగా ప్రతి మనిషిలోను ఉన్నవి.

శరీరములోని మాయ దేవున్ని ఎలా తెలియకుండా చేయుచున్నదో మనకు బాగా అర్థమగుటకు బయట ‘మాయము’

అను పదము కలదని చెప్పాము. 'మాయము' అనునది సత్యమా అసత్యమా అనునదే మనకు ముఖ్యమైన ప్రశ్న.

దానికి జవాబు అర్థమగుటకు ప్రకృతినంతటిని విప్పి చెప్పుకోవలసి వచ్చినది.


ప్రకృతిని విడదీసి చెప్పుకొంటే అది భూతములు, గ్రహములుగా విభజింపబడియున్నదని తెలుసుకొన్నాము.

భూతములలో, మహా భూతములు, భూతములు, స్వల్పభూతములు లేక ఉప భూతములని మూడు భాగములుగా

ఉన్నవని కూడా చెప్పుకొన్నాము. అందులో భూతములు అని పేరుగాంచిన మేఘములను గురించి నాలుగు సంవత్సరముల

క్రితము మేము వ్రాసిన “దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథము లో కొంతవరకు వ్రాశాము.

అప్పుడు మేఘములు ఏ జంతువునైనా, ఏ వస్తువునైనా, ఎంత పెద్దదైనా, ఎంత భారముకలదైనా, ప్రాణమున్నదానిని,

ప్రాణములేనిదానిని దేనినైనా భూమిమీద నుండి పైకి ఆకాశములోనికి తీసుకొనిపోవునని చెప్పాము. అలా తీసుకుపోయిన

దేనినైనా తిరిగి భూమిమీదికి, తన ఇష్ట మొచ్చినప్పుడు, తనకిష్టమొచ్చినచోట వదలగలదని కూడా చెప్పాము. భూమిపై

నుండి ఆకాశములోనికి తీసుకొను పోవునప్పుడు గానీ, ఆకాశము నుండి భూమిమీదికి తెచ్చి వదులునప్పుడుగానీ,

తీసుకు పోబడిన దానికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండ వదలునని కూడా చెప్పాము. ఆకాశము నుండి మేఘము

ఒక మంచుగడ్డను క్రిందికి వదలినప్పుడు అది పగిలి పోకుండా, ఉన్నది ఉన్నట్లు భూమిమీదకు చేరునట్లు చేయును.

అదే ఒక జీవరాసి అయిన పెద్దకప్పనుగానీ, పెద్దచేపనుగానీ భూమిమీదకు వదలినప్పుడు కూడా వాటికి ఏ హాని

కలుగకుండా క్రిందపడినట్లు కూడా తెలియకుండా వదలగలదు. అంతేకాక నీటిలోనున్న మొసలిని మేఘము పైకి

తీసుకొనిపోయినప్పుడు, ఆ మొసలిని తిరిగి భూమి మీదగల వేరే ఖండము మీదికి చేర్చుటకు సముద్రమునంతటిని

దాటి పోవుటకు పదిరోజుల కాలము పట్టినా, నెల రోజుల కాలముపట్టినా, అంతవరకు తనలో పెట్టుకొన్న మొసలికి

ఆకలిబాధ కలుగకుండ ఉండునట్లు మేఘము జాగ్రత్తపడగలదు. ఒక్క మొసలి కూడాలేని ప్రాంతమును గుర్తించి,

అక్కడ కూడా మొసళ్ళు ఉండునట్లు తాను మోసుకొనిపోయిన మొసలిని లేక మొసళ్ళను వదలుచున్నది. భూమిమీద

కనిపించు మేఘములు ఎవరికీ తెలియకుండా, తెలియుటకు అవకాశమే లేకుండా ఎంతో తతంగమును నడుపుచున్నవి.


స్థూలముగా కనిపించు వస్తువులనుగానీ, జంతువులనుగానీ మేఘము తీసుకొని పోవునప్పుడు, స్థూలముగానున్న

దేనినైనా మేఘము మాయము చేయుచున్నది. కనిపించు దానిని కనిపించకుండ చేసి తనయందు ఉంచుకొనుచున్నది.



చిత్రమును 192 పేజీ లో చూడండి.


మాయము అనగా ఉన్నదానిని ఉన్నట్లే కనిపించకుండా చేయడము అని అర్థము. అంతవరకు కనిపించుచుండిన

వస్తువుగానీ, జంతువుగానీ అది ఉన్నా కనిపించకుండా పోవడమునే మాయమైపోవడము అని చెప్పవచ్చును. ఉ

దాహరణకు 18 అడుగుల మొసలిని మేఘము తీసుకొని పోవాలనుకొన్నప్పుడు, మొసలి పెద్దనీటి మడుగులో ఉంటే, ఆ

నీటి మడుగుమీదికి మేఘము వచ్చి దూదిపింజ విడిపోయినట్లు చిన్న పోగులుగా విడిపోయి, ఒకదానితో ఒకటి చుట్టుకొనుచు

ఒక ధారగా ఏర్పడి, ఆ ధార నీటిమడుగు ఉపరితలము మీదికి చేరును. అలా మేఘముయొక్క అంచు నీటి మడుగును

చేరిన తర్వాత మడుగులోని కొంత నీటిని, ఆ నీటితో సహా మొసలిని కూడా తన ధారలోనికి తీసుకొనును. అప్పుడు

మేఘము తీసుకొన్న నీరుగానీ, మొసలిగానీ అంతవరకు కనిపించు చుండినా మేఘము తాకిన తర్వాత ఏమాత్రము

కనిపించకుండా అదృశ్యమై పోవును. అదృశ్యము అంటే కనిపించునది కనిపించకుండా పోవడమేగానీ పూర్తి లేకుండా

పోయిందని కాదు. అంతవరకు మడుగులోనున్న మొసలి, నీరూ రెండూ మేఘములో యథాతధముగా చేరిపోయినవి.

అప్పుడు మొసలి పరిమాణము, నీటి పరిమాణము రెండూ నీటిమడుగులో తగ్గిపోవును. మడుగులో తగ్గిపోయిన

నీరుగానీ, మొసలిగానీ రెండూ మేఘములో సురక్షితముగా చేరిన తర్వాత మేఘము యొక్క ధార తిరిగి పైకి పోయి

మేఘములో కలిసిపోవును.


ఈ విధముగా జరిగెడు విధానమును దృశ్యరూపములో చిత్ర పటము (x) నందు చూడవచ్చును. నేడు

భూమిమీద కురియు వర్షపు నీరంతయు మేఘములు సముద్రమునుండి తీసుకొన్నవేనని తెలియవలెను. రాట్నములో

దూదినుండి నూలును తీయునప్పుడు, రాట్నము తిరుగుచుండగా దూది నుండి నూలుధారము దూదిపోగులు కలిసి

చుట్టుకొనుచు దారము ఏర్పడినట్లు, పైన దూదివలె కనిపించు మేఘమునుండి దారమువలె క్రిందికి మేఘము యొక్క

ధార ఏర్పడడము వలన, ఆ మేఘములను దూదిపింజ మేఘములు అని అనవచ్చును. అటువంటి మేఘములను

చిత్రమును 193 పేజీ లో చూడండి.



సుడిమేఘములని కూడా అనవచ్చును. భూతము రూపమును మార్చుకొనునని చెప్పాము. మేఘము భూతమైనందువలన

మేఘము సుడిమేఘముగా కొద్దిసేపు కనిపించి తర్వాత కనిపించకుండా పోగలదు. చిత్రపటము (X) లో చూచిన

దూదిపింజ మేఘములు నీరునుగానీ, నీటిలోని జీవరాసులను గానీ తీసుకోగలదు. అటువంటి దృశ్యములు

సముద్రమునందు బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో నిత్యము కనిపించుచుండును. భూభాగము మీద కురియు వర్షపు

నీరంతయు మూడువంతులు త్రైతాకార సముద్ర ఆవరణములో (బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో) మేఘములు తీసుకొన్న

దేనని తెలియవలెను. సముద్రములో దృశ్యరూపములో కనిపించుచుండిన నీరు దూదిపింజ మేఘము (సుడిమేఘము)

లోనికి చేరునప్పుడు, నీరు అదృశ్యమై మేఘములో నిలిచిపోవుచున్నది. కొన్ని కోట్ల టన్నుల బరువున్న నీటిని మేఘములు

అదృశ్యరూపముగా తనయందు చేర్చుకొనిపోవుచున్నవి. అదృశ్యరూపముగా తనయందు ఉంచుకొన్న నీటిని తిరిగి

దృశ్యరూపములో వర్షముగా మేఘము కురియుచున్నది. మేఘములు నీరును తీసుకోవడమూ, తిరిగి వదలడమూ,

సర్వసాధారణముగా ప్రతి సంవత్సరము జరుగుచునే యున్నది. ఎన్నో వస్తువులను, చేపలను, కప్పలను, నీటిని మేఘము

మాయము చేయుచున్నది. నేడు మాయము చేయుట అనునది అబద్ధమని అనువారు మేఘములో కనిపించని ఇన్ని

నీళ్ళు ఎక్కడినుండి వచ్చాయని చెప్పగలరా? వర్షములో చేపలు, కప్పలు, పాములు అప్పుడప్పుడు పడడము చూస్తూనే

ఉన్నాము. అవి కనిపించకుండ పైన మేఘములో ఎలా ఉన్నాయో చెప్పగలరా? దృశ్యముగానున్న దానిని అదృశ్యముగా

మార్చుట గానీ, అదృశ్యముగానున్న దానిని దృశ్యముగా మార్చుటగానీ మన ముందరే మేఘములు చేయుచున్నవి.

సముద్రములో మాయమైన వస్తువుగానీ, నీరుగానీ ఎక్కడున్నాయో? ఎంత కాలమున్నాయో ఎవరైనా చెప్పగలరా?

చెప్పలేము, మాయమును గురించి తెలియాలంటే మేఘముల వద్ద ప్రత్యక్షముగా చూడవచ్చును. మాయను గురించి

తెలియాలంటే శరీరములో చూచుకో, చూచుకొనేది రాకపోతే, చూచే జ్ఞానమును నేర్చుకో. అట్లే మాయమును గురించి

తెలియాలంటే మేఘములో చూచుకో. ఇదంతా ఏదో కాకమ్మ గువ్వమ్మ కథయని అనుకోవద్దండి. మేము ఇంతవరకు

చెప్పినది నూటికి నూరుపాళ్ళు సత్యమైనది, యదార్థముగా జరుగుచున్నది. ఇంతవరకు మనుషులు ఎంతో

విజ్ఞానులమనుకొనినా, ఇంకా మనకు తెలియని పెద్ద విజ్ఞానము ఒకటున్నదనీ, దాని ప్రకారమైతేనే మనిషి దేనినైనా

సంపూర్ణముగా తెలియగలడనీ చెప్పుచున్నాము. అయితే మనిషి కొద్దిపాటి విజ్ఞానమును తెలిసినంత మాత్రముననే,

నాకు అన్నీ తెలుసునని భ్రమపడి నేను తెలియవలసినది ఏదీలేదను అభిప్రాయముతో హద్దును ఏర్పరచుకొని, అందులోనే

ఉండిపోతున్నాడు. అలాంటి వారికి కొంత కనువిప్పు కలుగుటకు నా పరిశోధనలో తెలియబడిన దైవసంబంధ

సత్యములను మీకు తెలియ జేయడము జరిగినది. ఇంతటితో ఈ విషయమును ఆపివేసి ఈ గ్రంథము మొదట 71వ

పేజీలో మధ్యలో ఆపివేసిన ప్రశ్నకు జవాబును పూర్తిగా వ్రాయదలచాము. అందువలన అక్కడ వదిలిన విషయమును

గురించి చెప్పుకొందాము.


అక్కడ ఖురాన్ గ్రంథములోని రెండవ (2) సురాయందు నూట పదిహేడవ (117) ఆయత్లో “భూమ్యాకాశములను

ప్రథమముగా సృష్టించినవాడు ఆయనే (దేవుడే), ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించు కొన్నప్పుడు దాన్ని అయిపో

అని అంటే చాలు, అది అయిపోతుంది.” అని ఉన్నది కదా! దానికి వ్యతిరేఖముగా 32వ సురా 4వ ఆయత్లో దేవుడు

సమస్తమును ఆరు రోజులలో సృష్టించి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు అని చెప్పడము శాస్త్రవిరుద్ధము కాదా

అనునది సమస్య. పరస్పర విరుద్ధముగాయున్న ఈ రెండు మాటలను ఎలా వివరించుకోవాలి అని ప్రశ్న వచ్చినది.

దానికి ఇప్పుడు సమాధానము చెప్పుకొందాము. 32వ సురాలో 4వ వాక్యమును మరియొకమారు పరిశీలిద్దాము.

"దేవుడే ఆకాశములను భూమినీ వాటి మధ్యనున్న సమస్తమును ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని


అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ మరే సిఫారసు చేసేవాడూ లేడు. అయినా మీరు ఆయన

హితబోధను గ్రహించరేమిటి?” అని కలదు.



2-117లోయున్న వాక్యములో కష్టమైన పదములు లేవు, దేవుడు ఏదైనా అయిపో అంటే అయిపోతుందనీ,

ఆయన ఏ పని చేయవలసిన అవసరములేదనీ సులభముగా అర్థమైనది. ఇకపోతే 32-4లో కూడా ఉన్న వాక్యమంతా

సులభముగా అర్థమయ్యేలాగున ఉంది. దేవుడు సమస్తమును ఆరు రోజులలో సృష్టించాడనీ తర్వాత సింహాసనము

మీద కూర్చొన్నాడనీ ఉన్నది. ఇది ఈ 4వ వాక్యములో సగము మాత్రమే. ఈ సగము వాక్యము 2-117లో చెప్పిన

మాటకు పూర్తి విరుద్ధముగా ఉన్నది అయినా వీటిలో అర్థముకాని పదములు ఏమీ లేవు. తర్వాత అదే వాక్యములో

ముందు చెప్పిన వాక్యమునకు సంబంధముగానీ, అనుకరణగానీ లేకుండా, విషయమునంతటిని మార్చివేసి ఆయన

తప్ప మీకు సహాయం చేసేవాడు గానీ, కనీసము సిఫారసు చేసేవాడుగాని (సపోర్టుగా మాట్లాడేవాడు గాని) ఆయన

తప్ప ఎవరూ లేరని చెప్పడము జరిగినది. మధ్యలో ఈ మాటను ఎందుకు చెప్పారో చాలామందికి అర్థము కాలేదు.

అక్కడ ఆ మాట అసందర్భమే ననిపిస్తావుంది. అయితే ఆ మాట చెప్పినది సామాన్యమైనవాడు కాదు. ఖగోళములో

గొప్పజ్ఞానియైన జిబ్రయేల్. అక్కడ అదే వాక్యములో ముందు మాటకు వెనుక మాటకు ఏమాత్రము అనుబంధము

గానీ, సందర్భముగానీ లేనేలేదు. అంతేకాక అదే గ్రంథములో 2-117 వాక్యమునకు 32-4వ వాక్యమునకు ఏమాత్రము

సంబంధము లేకుండా వుండి ఒకదానికొకటి విరుద్ధ భావమును ప్రకటించాయి. ఈ విషయము రెండు వాక్యములను

చదివిన ప్రతివారికి అర్థమగును. అయితే 2-117లో ఎటువంటి వారికీ కూడా అర్థముకాని విషయము మరొకటి

గలదు. అదేమనగా! మీకు సహాయము చేసేవాడు, సిఫారసు చేసేవాడు ఆయన తప్ప ఎవరూలేరని చెప్పిన తర్వాత

అయినా “ఆయన హితబోధను మీరు ఎందుకు గ్రహించ లేకున్నారని” చెప్పడము అర్థముకాని విషయము మరియు

ఆశ్చర్యపడవలసిన విషయముగా ఉన్నది. 32-4 లో ఆకాశములు మొదలుకొని భూమివరకు సమస్తమును దేవుడు

ఆరు దినములలో సృష్టించాడు, తర్వాత ఏడవ దినములో సింహాసనమును అధిష్ఠించాడు అని అనుకోవడము తప్పాయని

అనుకొంటే అది ఆయన చెప్పిన విషయమే కదా! అందులో తప్పుగా గ్రహించుకొన్నదేముంటుంది. ఒకవేళ మనకు

సహాయము చేయువారు నేను తప్ప ఎవరూ లేరని చెప్పారు. వాస్తవముగా ఆయన ఎవరో మనకు తెలియదు. మనకు

కనిపించునట్లు తెలియునట్లు ఒక మనిషికి వాని తల్లిదండ్రులో, అన్నదమ్ములో, చివరికి ప్రాణస్నేహితులో ఎవరో ఒకరు

ఎప్పుడో ఒకప్పుడు సాయపడుచుందురు కదా! కనపడు వారిని వదలి కనపడని దేవున్ని సహాయపడ్డారని ఎలా

చెప్పాలి. ఒకనికి ఆపదలో అతని తల్లి పూర్తిగా సహాయపడి ఆ ఆపదనుండి బయటపడునట్లు చేసినది తన తల్లియని

తెలిసినా, పై వాక్యమును అనుసరించి దేవుడు తప్ప ఎవరూ సహాయము చేయలేదంటే అతను పూర్తి అబద్ధము చెప్పినట్లే

అగును. అతని తల్లికూడా ఆ విషయమును చూచి తాను ఎంతో సహాయము చేయగా, తన కొడుకు నేను సహాయము

చేయలేదని చెప్పడము అన్యాయము కాదా అని అడుగవచ్చును. మనము ఈ వాక్యమును ఎక్కడైనా తప్పుగా అర్థము

చేసుకొన్నామా అని ఆలోచించుటకు అవకాశము లేకుండా, మీకు ఈ విషయమే అర్థముకాలేదు అన్నట్లు “ఆయన

హితబోధను మీరు ఎందుకు గ్రహించలేకున్నారు” అని జిబ్రయేల్ చెప్పడము జరిగినది.


జిబ్రయేల్ 32–4లో చివరిగా చెప్పిన మాటతో ఈ వాక్యమునకు పూర్తి వ్యతిరేఖముగానున్న 2-117లోని

విషయమును మేము గ్రహించలేక పోయామా! లేక ఇక్కడ 32-4లోనున్న వాక్యములోని విషయమును

గ్రహించలేకపోయామా! అని సందిగ్ధములో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. ఇవన్ని మనకు బాగా అర్థమైనట్లు


ఉన్నాయి కాబట్టి ఖురాన్లో పొరపాటుగా వ్రాశారా అని ప్రశ్న కూడా రాగలదు. వీటిన్నిటినీ పరిశీలించితే 32-4లోనే

కాకుండా ఖురాన్ గ్రంథములో మనకు అర్థముకాని విషయములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా మీరెందుకు

తప్పుగా అర్థము చేసుకొన్నారని హెచ్చరించుచూ, మీరెందుకు సత్యమునుండి దూరముగా పోవుచున్నా రనియో, లేక

మీరెందుకు హితబోధను గ్రహించలేకున్నారనియో చెప్పడము జరిగినది. మనుషులు గ్రంథములోని విషయమును

అర్థము చేసుకొనుటకు ముఖ్యమైన సమాచారమున్న చోటంతా దేవుడు హెచ్చరించినట్లు చెప్పడము జరిగినది. ఇక్కడ

2-117 వాక్యముకంటే 32-4వ వాక్యము ఎక్కువ సారాంశముతో కూడుకొన్నదిగా ఉన్నది. ఈ వాక్యమును తప్పుగా

అర్థము చేసుకొనటకు కూడా అవకాశము కలదు. అందువలన జిబ్రయేల్ ద్వారా దేవుడే హెచ్చరించుచు సరిగా

అర్థము చేసుకొమ్మని చెప్పినట్లు ఉన్నది. అందువలన వాక్యములో ఏమీ లోటులేదు, ఉన్న లోపమంతా మనలోనే అని

తెలిసిపోవుచున్నది. మనలో లోపమును సరిచేసుకొని 32-4 వాక్యమును అర్థము చేసుకోగలిగితే 2-117వ వాక్యమునకు

ఇందులో వ్యతిరేఖత ఏమీ లేదని తెలియుచున్నది. మనకు సహాయము చేసేవాడు ఎవడో స్పష్టముగా తెలియుచున్నది.


2-117వ వాక్యములో కష్టమైన పదములులేవు, అర్థముకానిది ఏమీ లేదు. దేవుని ధర్మము ప్రకారము ఆయన

దేనినీ కార్యముగా చేయడు అని మనము భగవద్గీత విజ్ఞానయోగములో కూడా చెప్పుకొన్నాము. విజ్ఞాన యోగములో

ఆరవ (6) శ్లోకములోనూ, అట్లే విభూతియోగమునందు ఆరవ శ్లోకములోనూ చెప్పిన భావమునే జిబ్రయేల్ దూత

ఖురాన్ 2వ సురాలో 117వ ఆయత్లో చెప్పాడు. ఈ వాక్యములో ఎటువంటి గూఢార్థములేదు. అందరికీ

అర్థమయ్యేలాగున దేవుడు పని చేయువాడు కాదు అని బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము చెప్పబడినది. ఇకపోతే

ఖురాన్ గ్రంథములో 32వ సురాలో 4వ ఆయత్నందు చెప్పిన వాక్యము మూడు భాగములుగా ఉన్నది. మూడు

భాగములుగా ఉండడమే కాకుండా, మూడు భాగములు వాక్యములు మూడు గూఢార్థములతో కూడుకొని ఉన్నాయి.

ఆధ్యాత్మిక విద్యలో ఆరితేరిన వారికి సహితము సులభముగా అర్థముకానంత గూఢార్థముగా ఉండుట వలన,

వాక్యములోని ఒక్క భాగము కూడా ఎవరికీ అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఇటువంటి వాక్యములతో ముందుకు

పోను పోనూ చిక్కు సమస్యలు వచ్చి ఏమీ అర్థముకాని స్థితి ఏర్పడుతుందని గ్రహించిన కొందరు ముస్లీమ్ బోధకులు,

అటువంటి వాక్యములను చెప్పుకోకూడదని నియమమును పెట్టుకొన్నారు. ఇటువంటి సూక్ష్మజ్ఞానముగల వాక్యములు

ఎక్కడున్నా వాటికి “ముతషభిహాత్” వాక్యములని పేరుపెట్టి వాటిని వదలివేశారు. వాస్తవముగా అవి గూఢార్థము గల

వాక్యములే అయినందున, వాటి వివరము మనుషులకు తెలియదని దేవుడు కూడా చెప్పాడు. ఖుర్ఆన్ 3వ సురాలో

7వ ఆయత్నందు జిబ్రయేల్ దూత సూక్ష్మజ్ఞానముగల వాక్యముల వివరము దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియదని

చెప్పడమేకాక వాటిని (దేవుడే వివరించి చెప్పగా) బుద్ధిగల వారు గ్రహించుకోగలరని కూడా అదే వాక్యములో చెప్పాడు.

అయితే దేవుని యొక్క విధానమును పూర్తిగా తెలియని ముస్లీమ్లకు దేవుడు ఎలా వచ్చి చెప్పుతాడో తెలియకపోవడము

వలన, దేవుడు మనిషివలెకాక భగవంతునిగా (అవధూతగా) వస్తాడని తెలియలేకపోయారు. భవిష్యత్తులో దేవుడు

దూతగావచ్చి ఏ మనిషికీ తెలియని ఖుర్ఆన్లోని జ్ఞానమును చెప్పినా ముస్లీమ్లు ఆయన చెప్పిన జ్ఞానమును వినేటట్లులేరు.

ఎందుకు నమ్మలేకున్నారనగా దేవుడు ఎలా వచ్చి చెప్పునో వారికి తెలియదు, కావున వారు నమ్మేస్థితిలోగానీ, వినే

స్థితిలోగానీ లేరు. అయితే 3వ సురా 7వ ఆయత్లో బుద్ధి శ్రద్ధయున్నవారు నా బోధలను గ్రహించగలరు అని

దేవుడన్నట్లు, దేవుడు ఎలా వచ్చి చెప్పినా ఆయన వివరించిన జ్ఞానమును తెలుసుకోగలవారు ఎక్కడైనా, ఏ మతములోనైనా

ఉండవచ్చును. ఏ మతస్థుడైనా దేవుడు తెలిపిన వివరమును గ్రహించుకోవచ్చును. అయితే ఇది ఖుర్ఆన్ జ్ఞానమని


ఇతర మతస్థుడు కూడా అసూయపడక తెలుసుకో గల్గును. 3-7లోనున్న వాక్యములో బుద్ధిశ్రద్ధ గలవాడు గ్రహించుకొనును

అని వ్రాసియున్నప్పుడు. గ్రహించుకొనుటకు చెప్పేవాడు ఉండాలి కదా! యను యోచనను ముస్లీమ్లు మరచిపోయారు.

వినేవాడు ఉన్నాడు అంటే చెప్పేవాడు ఉండాలి కదా! బోధించేవాడు ఉంటే వాడు ఎవడై యుండినా వినేవాడు

గ్రహించుకోవచ్చును. మొదటికి వినేదే లేకపోతే చెప్పేవాడు ఎలా తెలియబడుతాడు? ఏడవ వాక్యములో దేవునికి తప్ప

ఏ మనిషికీ అసలైన సూక్ష్మజ్ఞానము తెలియదు అన్నాడుగానీ నేను చెప్పనని చెప్పాడా? ఎవరికీ తెలియనిది శ్రద్ధ

బుద్ధిగలవానికి తెలియాలంటే దేవుడు చెప్పితేనే కదా తెలిసేది అని ఊహించలేకపోయారు. ఈ విషయమును కొందరు

ముస్లీమ్లవద్ద మేము లేవనెత్తితే వారు ఇలా అన్నారు.


ముస్లీమ్ :- ఖుర్ఆన్ గ్రంథములో 42వ సురాలో 51వ ఆయత్ను చూడండి. అక్కడ “అల్లాహ్ (దేవుడు) ఏ మానవునితోనూ

ముఖాముఖి మాట్లాడడు” అని ఉన్నది కదా! అలాంటప్పుడు దేవుడు ఏ మనుషులకూ కూడా చెప్పడనియేగా అర్థము.

ఈ వాక్యములో దేవుడే స్వయముగా నేను నేరుగా ఎవరితోనూ మాట్లాడను అన్నప్పుడు మీరు ఆయన మాటనుకాదని

దేవుడు నేను చెప్పనని అన్నాడా? అని అడుగుచున్నారు. నేను మాట్లాడను అంటే నేను చెప్పననియే అర్థము. ఈ

మాటకు మీరేమంటారు.


మేము :- "నేను ఎవరితోనూ నేరుగా మాట్లాడను” లేక “నేను స్వయముగా ఎవరితోనూ మాట్లాడను" అని 42-51లో

చెప్పిన వాక్యమును నేను దేవుని వాక్యముగా ఒప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ కూడా ఆయన చెప్పిన సూక్ష్మజ్ఞానము

మీకు అర్థముకాలేదని చెప్పుచున్నాను. నేను స్వయముగా మాట్లాడను అన్నాడుగానీ పరోక్షముగా చెప్పనన్నాడా, నేను

నేను కాకుండా వేరుగాయుండి చెప్పనన్నాడా? అదే వాక్యములోనే ఆయన తన జ్ఞానమును మూడు విధములుగా

మనుషులకు తెలియజేస్తానని చెప్పాడు కదా! అందులో ఒకటి వాణి (వహి) ద్వారా అని చెప్పాడు. రెండు తెరవెనునుండి

అన్నాడు. మూడు దూతను పంపడము ద్వారా అని కూడా చెప్పాడు. ఇక్కడ చెప్పిన ఈ వాక్యములో మూడవ పద్ధతైన

దూతను పంపడము కలదు కదా! దేవునివద్దనుండి వచ్చిన దూత ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా మనిషిగానే వస్తాడు

కదా! మనిషిగావచ్చిన వాడు ఆయన జ్ఞానము చెప్పువాడుగా ఉంటాడు కదా! అలాంటప్పుడు మనిషి చెప్పిన దానిని

విని మనుషులు గ్రహించుకోవలసిందే కదా! అప్పుడు దేవుడు మనిషి ద్వారా పరోక్షముగా తన జ్ఞానమును మనుషులకు

తెలియజేసినట్లే కదా! ఈ విధానమును ఎవరూ కాదనడానికి వీలులేదు కదా! ఎవరైనా మనిషి చెప్పిన జ్ఞానమును నేను

ఒప్పుకోను అంటే, ఆ మాట ఖుర్ఆన్ గ్రంథములోని 42వ సురా 51 ఆయత్ను ఒప్పుకొనూ అన్నట్లగును. అందువలన

మనుషులందరూ చెప్పు జ్ఞానమును వినమని చెప్పడములేదు. దేవుడు మనిషిగా పంపిన వాని జ్ఞానమును విని దేవుడు

చెప్పిన గూఢార్థములు గల వివరమును తెలుసుకొమ్మని చెప్పుచున్నాను.


ముస్లీమ్ :- దేవుడు తన దూతను మనిషిగా పంపుతానని చెప్పాడుగానీ వచ్చిన దూత జిబ్రయేల్ అని తెలిసిపోయినది

కదా! ఆయన మనిషికాదు కదా! దేవదూత కదా! అలాంటప్పుడు మనిషిని దూతయని ఎందుకు నమ్మాలి?

మేము :-

దేవుడు తన జ్ఞానమును మూడు విధముల భూమిమీద మనుషులకు బోధిస్తానని లేక తెలియజేస్తానని,

ఖుర్ఆన్ గ్రంథములో 42వ సురా 51వ ఆయత్లో చెప్పియున్నాడని నేనుగానీ, మీరుగానీ అందరూ ఒప్పుకొనుచున్నాము.

దేవుడు చెప్పిన మూడు విధానములలో మూడవ విధానములో “ఒక దూతను పంపడము ద్వారా” అని అన్నాడు. దూత

అంటూనే అందరికి దేవునిదూత అయిన జిబ్రయేల్ జ్ఞాపకము వస్తున్నాడు. సరే మీ మాటప్రకారమే దూత అంటూనే

జిబ్రయేల్ అని అనుకొనుటకు కొన్ని ప్రశ్నలు అడ్డువస్తున్నవి. నాకు వచ్చిన ప్రశ్నలను అడుగుతాను జవాబును చెప్పండి.


జిబ్రయేల్ను దేవదూతయని మనము పిలిచినా, ఆయన దేవుడు పంపగా వచ్చిన వాడా? లేక ముందునుండి ఇక్కడే

ఉన్నవాడా? జిబ్రయేల్ మహమ్మద్ ప్రవక్తగారికి రూపముతో కనిపిస్తూ మాట్లాడాడా? లేక ఆకారము లేకుండా మాట్లాడాడా?

నేను దేవుని దగ్గర నుండి వచ్చిన దూతననిగానీ, దేవుడు పంపగావచ్చిన దూతననిగానీ చెప్పాడా? వీటికి తెలిసిన

సమాచారము చెప్పండి.


ముస్లీమ్ :- జిబ్రయేల్ దేవదూతయని మాకు తెలుసుగానీ, ఆయన అప్పుడు దేవుడు పంపగా వచ్చినవాడనియే

నమ్ముచున్నాము. అంతేగానీ ఆయన ముందునుండి ఇక్కడే ఉన్నాడను విషయము మాకు తెలియదు. జిబ్రయేల్ దూత

ప్రవక్తగారికి కనిపించే మాట్లాడాడు అని అనుకొంటున్నాము. జిబ్రయేల్ దేవుని దూత అని తెలుసు అంతేగానీ, ఆయన

నేను దేవుడు పంపగా వచ్చిన దూతయని ఎక్కడా ప్రత్యేకముగా చెప్పినట్లు లేదు.


మేము :- సరే నేను అడిగిన మూడు ప్రశ్నలకు మీరు మీకు తెలిసిన జవాబును చెప్పారు. దానికి సంతోషము.

ఎందుకనగా ముస్లీమ్లలో నేడు జిబ్రయేల్ను గురించి మాకు తెలిసినంత కూడా చాలామందికి తెలియదు. కొందరికి

జిబ్రయేల్ అంటే ఎవరో కూడా తెలియదు. వారికి మహమ్మద్ ప్రవక్తగారు మాత్రము తెలుసు. ప్రవక్తగారే ఖురాన్

చెప్పారని మాత్రము వారికి తెలుసు. ఖుర్ఆన్లోని విషయములు కూడ సరిగా వారికి తెలియవు. ఇటువంటి సమయములో

మీరు మిగతవారికంటే కొంత గొప్పగా తెలిసినవారైనందుకు మాకు సంతోషము. ఇప్పుడు మీరు చెప్పిన జవాబులలో

మొదటి జవాబుకు మా మాట ఏమనగా! మీరు జిబ్రయేల్ దేవుడు పంపగా వచ్చినవాడని నమ్ముచున్నాము అన్నారు.

అయితే సత్యమేమనగా! జిబ్రయేల్ సృష్ట్యాదిలోనే భూమిమీద దేవుని చేత సృష్ఠింపబడి దేవుని పాలనలో భాగములో ఒక

గ్రహముగాయున్నాడు. రెండవ ప్రశ్నకు జవాబుగా జిబ్రయేల్ ప్రవక్తగారికి కనిపించే మాట్లాడాడు అని అను కొంటున్నాము

అన్నారు. దానికి నా మాట ఇలావుంది. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు కనిపించకుండా మాట్లాడాడు. అందువలన

ముహమ్మద్ ప్రవక్తగారు మొదట భయపడిపోయాడు. మొదటిరోజు ఆయన భయపడినందుకు ప్రవక్తగారికి చలి

జ్వరము కూడా వచ్చినది. ఇకపోతే మూడవ ప్రశ్నకు జవాబుగా జిబ్రయేల్ దేవుని దూతయని తెలుసుగానీ దేవుడు

పంపగా వచ్చినవాడని ఎక్కడా చదవలేదని అన్నారు. మీకు తెలిసినది మీరు చెప్పారు. అయితే దానికి నేనేమనుచున్నాననగా!

జిబ్రయేల్ను దేవుని దూత అని చెప్పడములో తప్పులేదుగానీ, ఆయన దేవుడు పంపగా వచ్చినవాడు కాడు. దేవుని

విషయములను చెప్పువారిని దూత అనిగానీ, దేవదూత అనిగానీ అనడములో తప్పులేదు. అయితే దేవుడు ప్రత్యేకముగా

తన జ్ఞానము చెప్పుటకొరకు పంపినవాడు నిజమైన దేవదూతయగును. ప్రవక్త అని దేవుని జ్ఞానమును చెప్పువారిని

అనవచ్చును. అయితే అప్పుడు పంపబడినవాడు దూతయగును. మిగతావాడు ప్రవక్త అగును.


ముస్లీమ్లు :- ఎలాగైతేనేమి జిబ్రయేల్ దేవదూత అని మీరు కూడా చెప్పు చున్నారు కదా! ఆయన అల్లాహ్ జ్ఞానమునే

చెప్పాడు కదా!

మేము :- జిబ్రయేల్ గారిని దూత అనడములో తప్పులేదు. ఆయన దేవుని జ్ఞానమునే చెప్పాడు అనడములో తప్పులేదు.

ఆయన కనిపించి చెప్పాడంటే తప్పగును. దేవుడు తన బోధను మూడు విధముల భూమిమీద బోధింతును అన్నాడు

కదా! అందులో రెండవ విధానములో "తెర వెనుక నుంచి” అని ఉన్నది కదా! ఆ రెండవ విధానము ప్రకారము

జిబ్రయేల్గారు ఎవరికీ కనిపించకుండా తెరవెనుకనుండి బోధించాడు. ఉండి కనిపించక పోవడమును తెరవెనుకనుండి

అని అనడము జరిగినది. జిబ్రయేల్ దూత రెండవ విధానము ప్రకారము దేవుని జ్ఞానమును చెప్పాడు. ఇకపోతే


మూడవ విధానము ప్రకారము కనిపించి బోధించువాడు, దేవునిచే పంప బడినవాడు అని తెలిసిపోయినది. అ

అయినా కనిపించి బోధించువాడు మనిషిగా వస్తాడని ఒప్పుకోక తప్పదు.


ముస్లీమ్ :- 32 సురా, 4వ ఆయత్లోని వాక్యములో మూడవ భాగము మేము సరిగా గ్రహించలేకపోయాము అనునది

అర్థమైనది. అందువలన ఖుర్ఆన్ మాట సత్యమై నిరూపించబడినది. అయితే రెండవ భాగములోని దేవుడు తప్ప

మీకు సహాయము చేసేవాడుగానీ, సిఫారసు చేసేవాడుగానీ లేడని చెప్పడమైనది. మాకు దేవుడు (ఆయన) ఎవరో

తెలియదు ఆయన మాకు సహాయము ఎలా చేయుచున్నాడు. నేను తప్ప అని గట్టిగా చెప్పాడు కదా! ఇది మాకు

అర్థముకాలేదు, మీరే దీనిని గురించి చెప్పండి.


మేము :- అయ్యా మీరు ముస్లీమ్లు, నేను హిందువును ఖుర్ఆన్ విషయము నాకంటే మీకే బాగా తెలిసియుండాలి.

అటువంటిది మీరు అడగడము మేము చెప్పడము బాగుండదు. నేను కూడా పూర్తి తెలిసిన వాడినికాను. ఒకవేళ నేను

ఇప్పుడు చెప్పినా, నేను చెప్పిన జ్ఞానము సత్యము కావచ్చు లేక అసత్యమును కావచ్చు. నేను చెప్పునది సత్యమని నేను

చెప్పడములేదు. అందువలన నేను చెప్పిన జ్ఞానము సత్యమైతే దానిని మీరు స్వీకరించండి లేకపోతే వదలివేయండి.

నీవు పుట్టినప్పుడు నీకు తోడుగా ఎవరూ రాలేదు. అలాగే చనిపోవునప్పుడు కూడా నీవు ఒక్కనివే పోవలసివుంటుంది.

అప్పుడు కూడా బయట ప్రపంచములో నిన్ను ప్రేమించువారు ఎవరూ నీవెంటరారు. దీనినిబట్టి బయట ప్రపంచములోని

మనుషులు ఎవరూ నీకు సంబంధము లేదని తెలియుచున్నది. బయట సంబంధము తాత్కాలికమైనదేగానీ

శాశ్వితమైనదికాదు. నీకు ఒక రోగము వచ్చి బాధపడుచుంటే నీ ప్రక్కనున్న వారు నీ బాధను కొంచెమైన తీసుకొని

నీకు సహకరించలేరు. సహాయము బయట చేయునది కాదు. బయట ఇతరులు చేయు సహాయము జీవునకు

సంబంధపడదు. జీవుని వ్యధను తీర్చలేదు. జీవుని బాధను తీర్చు సహకారము బయట ప్రపంచములో ఎక్కడా లేదు.

తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు ఎవరైనాగానీ నీకు డబ్బు ఇచ్చి ఆపదలో ఆదుకుంటే అది ఆదరణ అవుతుంది.

నిన్ను తల్లిగానీ, తండ్రిగానీ, అన్నగానీ, తమ్ముడుగానీ ఎవరైనా ఆదరించవచ్చును. కానీ సహాయము చేయలేరు. ఇప్పుడు

మీకు ఒక ప్రశ్నవచ్చి దానిని అడుగవచ్చును. అదేమనగా! తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు, మీరు జ్ఞానమును

మాట్లాడుటలో ముదిరిపోయి పదాలకు భావమునే మార్చి వేయుచున్నారే అని అడుగ వచ్చును. ఒకనికి డబ్బునిచ్చి

వానికి ఉపయోగపడితే అది సహాయము కాదా! అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఆపదలోనున్న

వానికి డబ్బు ఇచ్చినా, బాకీలున్నవానికి డబ్బులిచ్చినా వానిని ఆదుకోవడ మగును. ఆపదలోనే ఎవరైనా బయటవారు

ఆదుకోవచ్చునుగానీ సహాయపడడము గానీ, సహకరించడముగానీ జరుగదు. సహాయము అనినా సహకారము అనినా

దానికి మనము పోల్చుకొన్న అర్ధము లేదు, కాదు. దేవుని లెక్కలో అర్థము వేరుగాయున్నది. ఆలోచిస్తే మనము కూడా

దాని అర్థములో పొరపడినామని తెలియగలదు. ఖురాన్ వాక్యములో "మీకు ఆయన తప్ప సహాయము చేయువారు

ఎవరూ లేరు” అని చెప్పిన తర్వాత “ఆయన హితబోధను ఎందుకు గ్రహించలేకున్నారని” చెప్పడము జరిగినది. అల

చెప్పడము వలన సహాయము అను దానిని మీరు ఎందుకు అర్థము చేసుకోలేకున్నా రన్నట్లున్నది. ఆయన హితబోధను

గ్రహించితే ఆయన సహాయము తెలిసిపోగలదు. ఇప్పుడు దేవుని హితము ప్రకారము సహాయమునకు వాస్తవ

అర్థమును తెలుసుకొందాము.


బ్రతికిన మనిషిని ఆత్మపరముగా విభజించిచూస్తే ప్రకృతితో తయారైన శరీరము ఆత్మకు పరముగాయున్నదని

చెప్పవచ్చును. శరీరము మినహా మనిషిలో చెప్పుకోదగ్గది జీవాత్మయూ, దానికి జోడుగా ఆత్మయు కలదు. మూడవది


పరమాత్మ అనునది సాధారణముగా ఉండునది. అది బ్రతికిన శరీరములో కాకుండా చనిపోయిన శరీరములో కూడ

యున్నది. అంతేకాక శరీరములోనే కాకుండా శరీరము బయట కూడాయున్నది. అందువలన బ్రతికిన శరీరము

అనినప్పుడు శరీరముకంటే వేరుగా, ఆత్మయు మరియు జీవాత్మయు ఉన్నవని చెప్పవచ్చును. ఆత్మ జీవాత్మలకు జోడు

ఆత్మలని విడదీయని బంధముతో చెప్పబడుచున్నవి. జీవాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మ తప్పనిసరిగా ఉండవలసిందే.

ఆత్మలేని జీవాత్మ, జీవాత్మలేని ఆత్మ ఏ శరీరములో ఉండవు. కర్మబద్ధుడు జీవాత్మకాగా, కర్మబద్ధముగా జీవాత్మను ఆత్మ

నడిపించుచున్నది. ఈ రెండు ఆత్మలు విడదీయనివి శరీరములో ఒకేమారు మరణమును పొందుచూ, ఒకేమారు

జన్మించుచున్నవి. రెండు ఆత్మలు ఒకదానికొకటి సహచరులుగా శరీరములో ఉన్నవి. సహచరులుగా ఉండడమేకాక

ఆత్మ జీవాత్మకు సహాయకుడుగా కూడ ఉన్నది. జీవాత్మ నివసించు శరీరమునకు శక్తినిచ్చి ఆత్మయే నడిపించు చున్నది.

ఎప్పుడైనా జీవాత్మకు ఇష్టమైతే దైవజ్ఞానమును ఆత్మయే జీవాత్మకు బోధించుచున్నది. జీవాత్మకు దైవజ్ఞానమును

బోధించడమేకాక, దైవశక్తిని జీవునికి చేకూర్చుచున్నది. జీవుడు తన ఆసక్తిని దేవుని జ్ఞానమువైపు ఎంత మళ్ళించుకుంటే,

అంత దైవజ్ఞానమును అందించడమేకాక, అంతమేరకు దైవశక్తిని ఆత్మ చేకూర్చుచున్నది. అలా జీవుని ఆస్తిగా వచ్చిన

దైవశక్తిని ఉపయోగించి జీవుని కర్మను కాల్చివేయుచున్నది. జీవుడు దైవజ్ఞానమును తెలుసుకొనుచూ, దేవునికి ఇష్టునిగా

మారితే వాని కర్మనంతటిని కాల్చి వేయడమేకాక జీవునికి దేవునికి మధ్యవర్తిగా మారిపోయి చివరికి జీవున్ని దేవునియందు

కలుపుచున్నది. ఈ విధముగా జీవునికి చావు బ్రతుకుల్లో వెంటవుంటూ వచ్చు ఆత్మ జీవునికి ఎల్లప్పటికీ సహాయకారి,

సహచారి మరియు సహజీవియై ఉన్నది. సహాయకారి, సహచారి, సహజీవి అను మాటలలో సహ అను శబ్ధము

సామాన్యముగాయున్నది. సహాయకారి అనగా తనతో సమానముగా చూచువాడు అని భావము. సహాయము అనగా

తనతో సమానము లెక్కించుట అని అర్థము. జీవునికంటే ఆత్మ ఎంతో పెద్దదైనా, ఆత్మ చేయు పనులన్నిటినీ నేనే

చేయుచున్నానను భావమును జీవుడు పొందియున్నా, శరీరములో నేనే గొప్పయని జీవుడు అంటున్నా ప్రక్కనేవుంటూ

అతని మీద ఏ కక్ష లేకుండా సమానముగా చూచుచూ ఇనుములో అగ్ని కలిసియున్నట్లు ఎంతో ఓపికగాయున్న ఆత్మ

జీవునితో సహజీవనము చేయుచూ సహాయకారిగాయున్నది.


ఆత్మ తాను జీవునివలె కొన్ని సమయములలో ప్రవర్తించుచూ, చిన్న పెద్ద అనేక కార్యములను చేయుచూ,

తాను గొప్ప ఆత్మనను మాటను వదలి, బయటికి జీవునివలె నటించు ఆత్మ కొన్ని సమయములలో దేవుని పాత్రను

కూడా పోషించుచూ, దేవుడు చేయవలసిన కార్యములను చేయుచున్నది. దేవుడు ఏ కార్యములను చేయకున్నా

దేవునివలె నటించు ఆత్మ దేవుడు చేయవలసిన కార్యములను చేయుచున్నది. ఆ పద్ధతిలో దేవుడు చెప్పవలసిన

జ్ఞానమును ఆత్మే చెప్పుచున్నది. అటువంటి సమయములో పరమాత్మ అయిన దేవునితో సమానముగా మారిపోయి

దేవుని కార్యములను చేయు ఆత్మ కొన్ని సమయములలో జీవుడు అనుభవించ వలసిన పనులను జీవుని కొరకు

చేయుచున్నది. అంతేకాక శరీరములో ఇటు జీవునిగా నటించు ఆత్మ, అటు దేవునిగా కూడా నటించుచున్నది. దేవునిగా

ఉన్నప్పుడు ఎంతటి రహస్య జ్ఞానమునైనా సులభముగా చెప్ప గలుగుచున్నది. ఈ విధముగా శరీరములో అన్ని

విధముల పనిచేయు ఆత్మ నేనున్నానని ఎక్కడా బయటపడలేదు, ఎవరికీ ఆత్మవుందను విషయము కూడా తెలియకుండా

ఉన్నది. ఆత్మ చేయు పనులనన్నిటినీ ఏమి చేయని జీవుడు నేనే చేశానని చెప్పినా మౌనముగాయున్న ఆత్మ జీవుని మీద

ఎటువంటి అసూయ, కక్ష లేకుండా ఉన్నది. దేవునిగా మారియున్న ఆత్మ ఎల్లప్పుడు జీవునికి సహాయకారిగాయున్నందున

ఖుర్ఆన్ గ్రంథములో 32వ సురా 4వ వాక్యములో జిబ్రయేల్ ఆయన తప్ప సహాయము చేయువాడులేడు అన్నాడు.


ఇప్పుడు చెప్పండి ఆయనతో పాటు ఎవరైనా సహాయము చేసే వాడున్నాడా? శరీరములో జీవుడు దేవునియందు

ఐక్యమగుటకు సిఫారసు చేసేవాడు కూడా ఆత్మయే అందువలన ఆయనతో పాటు సిఫారసు చేసేవాడు గానీ, ఆయనతో

పాటు సహాయము చేసేవాడుగానీ ఎవడూ లేడని చెప్పవచ్చును చూచారా ఖుర్ఆన్ గ్రంథములోని ఒక్క వాక్యమునకు

సూక్ష్మముగా ఎంత భావము కలదో!


సహా అను రెండు అక్షరములకు విశేష అర్థమున్నదనీ, ఆ అర్థమును తెలియక మనకు (జీవునికి) శరీరములో

ఎవరు సహాయము చేయుచున్నారో, ఎవరు సిఫారసు చేయుచున్నారో, తెలియని దానివలన ఆయన చెప్పిన దానిని

గ్రహించరెందుకు (ఆయన చెప్పిన దానిని ఆలోచించరెందుకు) అని అదే వాక్యము చివరిలో చెప్పడము జరిగినది.

ఇంతవరకు 32వ సురా, 4వ ఆయత్లోని వాక్యమునందుగల మూడు భాగములలో చివరి రెండు మాటలకు భావమును

చెప్పుకొన్నాము. మొదటి మాట అయిన దేవుని సృష్టి ఆరురోజులు జరిగినదని చెప్పబడినది. ఆ వాక్యము ఇలా కలదు.

“అల్లాహ్ (దేవుడే) ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్తమునూ ఆరురోజులలో సృష్టించాడు. ఆ తరువాత

సింహాసనాన్ని అధిష్ఠించాడు (అధికార పీఠాన్ని అధిష్ఠించాడు) ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ, మరే సిఫారసు

చేసేవాడూ లేడు. అయినా ఆయన చెప్పిన బోధను గ్రహించరేమిటి?” ఈ వాక్యము మొత్తములో మొదటి భాగమున

"దేవుడు ఆకాశాలను భూమినీ వాటిమధ్యనున్న సమస్తమును” అని ఉన్నది కదా! మనకుగానీ, ఇంకా ఖగోళ

శాస్త్రజ్ఞులకుగానీ, ప్రపంచములో ఇతరు లెవరికైనాగానీ, పైన ఉన్నది ఒక్క ఆకాశము తప్ప రెండు మూడు ఆకాశము

లున్నట్లు తెలియునా, ఒకటికంటే ఎక్కువ ఆకాశములున్నట్లు ఎవరైనా గుర్తించగలిగారా? అని ప్రశ్నించితే ఎవరూ అట్లు

గుర్తించినట్లు చెప్పరు. ప్రపంచములో ఉన్నది ఒక్క ఆకాశమే, తెలియబడునది ఒక్క ఆకాశమే. అయితే ఇక్కడ ఖుర్ఆన్

గ్రంథములో ఆకాశాలను అని బహువచనములో చెప్పడము దేనికి అని ప్రశ్నించితే, బహుశా ఎవరి వద్ద సమాధానము

ఉండదుగాక ఉండదు. క్రింద కనిపించేది ఒకే భూమిగా ఉన్నది. అలాగే పైన కనిపించేది ఒకే ఆకాశముగాయున్నది.

విమానములో గానీ, రాకెట్లో గానీ, ఆకాశ నౌకలైన ఉపగ్రహ వాహనములలోగానీ ఎంత పైకి పోయినా, ఒకే ఆకాశము

కనిపించుచున్నది. ఏ విధముగా చూచినా ఒకటికంటే మించిన అనేక ఆకాశములు లేనేలేవు. అలాంటప్పుడు దేవుని

గ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథములో అదియూ మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ చెప్పినమాట అసత్యముగా ఉంటుందా? అని

ఆలోచిస్తే అలా ఎప్పటికీ అసత్యముండదనీ, జిబ్రయేల్ చెప్పినది పూర్తి సత్యమై ఉంటుందని చెప్పవచ్చును.


ముస్లీమ్లు :- మా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు ముష్కమాత్ (స్థూల అర్థముగలవి) ముతషాభిహాత్ (సూక్ష్మ

అర్థముగలవి) అను రెండు రకముల వాక్యములలో ఈ వాక్యమును కూడా ముతషాభిహాత్ తెగకు చెందిన వాక్యముగా

లెక్కించవచ్చును కదా! ఈ వాక్యమునకు స్థూలముగా ఏ విధముగా సమాధానము దొరకదు. దీనికి కూడ అర్థమును

మీరే చెప్పాలి.


మేము :- మేము ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా ముతషాభిహాత్ వాక్యములున్నాయని మొదటినుండి చెప్పాము.

ముస్లీమ్లు కొందరు ఆ వాక్యములతో పనేలేదు వాటిని వదలిపెట్టి స్థూలముగా ఉండే ముష్కమాత్ వాక్యములనే

చెప్పుకోవాలని అనుకొనడమేకాక, ఖుర్ఆన్ మొత్తమును ముష్కమాత్ వాక్యములుగానే చెప్పుకవచ్చారు. ప్రతి వాక్యమునకు

స్థూలముగా అర్థము చెప్పుచూ వచ్చారు. అందువలన దేవుడు చెప్పిన ఉద్దేశ్యముగానీ, భావముగానీ ప్రజలకు, మిగత

ముస్లీమ్లకు తెలియకుండ పోయినది. మేము ఎక్కడైనా సూక్ష్మముగాయున్న వాక్యములకు సూక్ష్మమైన వివరమును


చెప్పితే, దానిని కాదనువారు కూడా కలరు. అందువలన నేను కూడా ముందే చెప్పుచున్నాను. నన్ను విశ్వసించి నేను

సత్యమునే చెప్పుతానని తెలిసినవారు నా మాటలను వినండి. అటువంటి వారికొరకే నా జ్ఞానము కలదు. మిగతావారికి

నేను చెప్పినది సత్యముకావచ్చును లేక అసత్యమూ కావచ్చును. గ్రుడ్డిగా దేనిని నమ్మవద్దండి. ఆలోచించి చూచి

అప్పుడు నిర్ణయానికి రమ్మని చెప్పుచున్నాను. ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ (దేవుడు) ఈ గ్రంథములో ముష్కమాత్

(స్థూల) ముతషాభిహాత్ (సూక్ష్మ) జ్ఞానముగల వాక్యములు గలవని 3వ సురా, 7వ ఆయత్లో చెప్పియున్నాడు. అక్కడ

ఆయన మాటలను అనుసరించి ఖుర్ఆన్ గ్రంథములోని ఏ ఒక్క వాక్యమునకు నేటి బోధకులు సూక్ష్మమైన భావమును

తీసుకోక, అన్ని వాక్యములకు స్థూలముగానే భావమును చెప్పుచూ పోయారు. అలా చెప్పడము వలన మనము దేవుని

మాటను గౌరవించినట్లు అగునా? అని అడుగుచున్నాను. సూక్ష్మభావముగల వాక్యములకు సూక్ష్మమైన వివరము

చెప్పడము బోధకుల యొక్క బాధ్యత. అలాంటిది వారు చెప్పకున్నా మేము దేవుని గౌరవమునకు భంగము కలుగకుండ

సూక్ష్మ వివరమును చెప్పితే మమ్ములను తప్పుపట్టు వారు కూడా కలరు.


32వ సురా, 4వ ఆయత్లో గల మూడు భాగముల వాక్యము పూర్తి ముతషాభిహాత్ కోవకు చెందిన వాక్యమైన

దానివలన, ఎవరూ దీనికి ఏ విధముగా స్థూల భావమును జోడించి చెప్పలేరు. సూక్ష్మ భావముతో వివరణ ఇచ్చినప్పుడే

ఈ వాక్యము ప్రకాశించగలుగును. అందువలన నా శాయశక్తులా ఈ వాక్యమునకు గూఢార్థము ఏమిగలదో దానిని

వివరించ దలచుకొన్నాను. బయట ప్రపంచములో ఒక ఆకాశము తప్ప కనీసము రెండు ఆకాశములులేవు. అయితే

ఖుర్ఆన్ గ్రంథములో కొన్నిచోట్ల ఏడు ఆకాశములు కలవని వాటి సంఖ్యను కూడా చెప్పడము జరిగినది. ప్రవక్త గారు

“మేరాజ్” అను గగనయాత్రలో ఏడు ఆకాశములను చూచినట్లు బహుశా 53వ సురాలో వ్రాశారు. అయినా అది పూర్తి

ఖుర్ఆన్ వాక్యముగా అనుటకంటే హాదీసు వాక్యముగా లెక్కించడము మంచిది. ఎలాగైతేనేమి ఏడు ఆకాశములని

ఖుర్ఆన్లో చెప్పబడినది. ఏడు ఆకాశములనూ క్రింద భూమినీ తయారుచేయుటకు దేవునికి ఆరు రోజులు పని, ఏడవ

దినము విశ్రాంతి అయినది. ఇదంత అటుంచి మనము శరీర లోతుల్లోనికి పోయి చూస్తే, మన శరీరములోని

3,50,000 నాడులలో అన్నిటికంటే పెద్దవాడిని బ్రహ్మనాడి అనియు, వెన్నుపాము అనియు ఇంగ్లీషు భాషలో స్పైనల్కార్డు

అనియు అంటున్నాము. బ్రహ్మనాడి అను నాడి ఏడు నాడీకేంద్రములుగా విభజింపబడియున్నదని చాలామందికి

తెలుసు. ఆధ్యాత్మిక విద్యలో బ్రహ్మనాడి క్రింది కేంద్రముకంటే క్రింద భూమి అనియు ఏడుకేంద్రములను ఏడు

ఆకాశములనియు వర్ణించడము జరిగినది. ఏడు నాడీకేంద్రముల నుండి ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీరమును

నడుపుచున్నది. శరీరములోని ఆత్మ ఏడవ స్థానమును స్వస్థానముగా తన కేంద్రస్థానముగా చేసుకొని అక్కడినుండి

మిగతా ఆరు కేంద్రముల ద్వారా శరీరమంతా వ్యాపించి సమస్త కార్యములను చేయుచున్నది. ప్రతి శరీరములోను

ఆత్మ ఆరు స్థానములనుండి వ్యాపించి సమస్త కార్యములను చేయునట్లు సమస్త జీవరాసులను దేవుడు సృష్టించాడు.

ఏడవ నాడీ కేంద్రమును కేంద్రముగా చేసుకొని ఆరు కేంద్రముల ద్వారా జీవులనందరినీ దేవుడు నడిపించుటను గుర్తు

చేయుటకు లేక తన నిర్మాణమిట్లున్నదని తెల్పుటకు ఖుర్ఆన్ పైన ఏడు ఆకాశములను క్రింద భూమిని మధ్యలో

సమస్తమును దేవుడు సృష్టించాడని గూఢార్థముగా చెప్పడము జరిగినది. శరీరములో గల ఏడు నాడీకేంద్రములను

ఏడు ఆకాశములనుగా చెప్పుకొన్నప్పుడే ఆయత్లోని జ్ఞానము అర్థము కాగలదు. ఆరు నాడీకేంద్రముల ద్వారా

శరీరమంతా నడుపబడుచున్నదనీ, శరీరము నంతటిని నడుపు ఆత్మ ఏడవ కేంద్రమును స్వస్థానముగా తిష్ట వేసుకొన్నదని

చెప్పుటకు, దేవుడు సృష్టినంతటిని ఆరు రోజులు తయారు చేసి తర్వాత విశ్రాంతిగా తన సింహాసనమును ఎక్కాడు

అని చెప్పడము జరిగినది. ఇదంతయు శరీరములో దైవశక్తి ఆత్మశక్తిగా మారి మనుషులను మరియు సకల జీవరాసులను


ఎలా నడుపుచున్నదో తెలుసుకొనుటకు జిబ్రయేల్ గూఢార్థముగా చెప్పిన వాక్యము 32వ సురాలో 4వ ఆయత్లోకలదని

చెప్పవచ్చును. ఈ విధముగా ఈ వాక్యము సూక్ష్మ జ్ఞానముతో చెప్పబడినది. ఈ విధముగా దేవుడు భగవద్గీతలో చెప్పిన

జ్ఞానమును బైబిల్, ఖురాన్ గ్రంథములలో కూడా చెప్పాడని తెలియుచున్నది.


చివరిలో మూడు మూల గ్రంథముల పేర్లు వచ్చాయి, కావున ముందే చెప్పలేదనకుండా ఒక విషయమును

చెప్పుతాను చూడండి. ఇప్పుడు చివరిలో చెప్పు విషయము కూడా నా మీద విశ్వాసమున్నవారు మాత్రమే సత్యమని

నమ్మండి, లేకపోతే లేదు. నావలె మీరు కూడా జ్ఞానులు కావలెన ఉద్దేశ్యముతో ఈ విషయమును చెప్పుచున్నాను.

దేవుడు దేశ కాల సందర్భములను బట్టి తన జ్ఞానమును మూడు గ్రంథముల రూపములో మనకు అందించాడు.

రెండు గ్రంథములలోని జ్ఞాన విషయములు దేవుడు పంపిన ఇద్దరు దూతల చేత చెప్పబడినవై ఉండగా, ఒక గ్రంథము

మాత్రము తెరవెనకనుండి చెప్పబడిన గ్రంథముగా ఉన్నది. తెర వెనుక నుండి జిబ్రయేల్ ద్వారా చెప్పబడినది ఖుర్ఆన్

గ్రంథముకాగా, దేవుని చేత పంపబడిన దూతలైన ఇద్దరు వ్యక్తుల ద్వారా చెప్పబడినవి భగవద్గీత మరియు బైబిల్

గ్రంథములు. ఈ రెండు గ్రంథములలో భగవద్గీత మాత్రము సృష్ట్యాదిలోనే వాణి ద్వారా సూర్యునికి చెప్పబడినది.

మొట్టమొదట ఆదిలోనే సూర్యునికి దేవుడు వాణి ద్వారా చెప్పిన జ్ఞానము భూమిమీదికి వచ్చినది. అలా మొదట

ఒకమారు భూమిమీదికి వచ్చిన జ్ఞానమునే ఐదు వేల సంవత్సరముల పూర్వము కృష్ణుడు, రెండు వేల సంవత్సరముల

పూర్వము ఏసు, 1400 సంవత్సరముల పూర్వము జిబ్రయేల్ తిరిగి చెప్పడము జరిగినది. మొదట సూర్యునికి చెప్పిన

రోజు దేవుని జ్ఞానము గ్రంథరూపముగా రాలేదు. దానికి పేరు కూడా పెట్టబడలేదు. అలా గ్రంథ రూపములో లేని

జ్ఞానము కొంతకాలము బాగా ప్రజలలో వ్యాపించియుండి, తర్వాత క్షీణించిపోయి, చివరకు దేవుని జ్ఞానమే భూమిమీద

లేకుండా పోవు స్థితికి వచ్చినది. ద్వాపరయుగ చివరిలో దేవుని ధర్మములు తెలియకుండాపోయి ధర్మములవలె నున్న

యజ్ఞ, దాన, వేద, తపస్సులు పూర్తి ప్రచారమైపోయినవి. యజ్ఞ, దాన, వేద, తపస్సులు అధర్మములని తెలియని

మనుషులు వాటినే ఎక్కువగా ఆచరించను మొదలుపెట్టి ధర్మములను మరచి పోయారు. అప్పుడు తన ధర్మములు

భూమిమీద పూర్తి నశించి పోకుండుటకు దేవుడు కృష్ణుడు అను వ్యక్తి చేత (దూతచేత) తన జ్ఞానమును చెప్పించాడు.

దూత అయినవాడు సాధారణ మనిషికాడు. దూతను జ్ఞానము ప్రకారము అర్థముతో భగవంతుడు అని అనవచ్చును.

తల్లిగర్భము (భగము) నుండి పుట్టినవాడు భగవంతుడు అని అర్ధము. ఆ దినము కృష్ణుడు దేవుని జ్ఞానమును చెప్పాడని

అనకుండా, భగవంతుడు చెప్పాడని అందరికీ అర్థమగునట్లు ద్వాపరయుగములో చెప్పిన జ్ఞానమునకు “భగవద్గీత”

అని పేరు పెట్టడము జరిగినది. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినదని అర్థము. భగవంతుడు అంటే దేవుని చేత

పంపబడిన దూత అని అర్థము. దేవుని దూతచేత చెప్పబడిన జ్ఞానము అయినందున దానిని భగవద్గీత అనడములో

పూర్తి అర్థమున్నది.


భగవద్గీతను చెప్పినది భారతదేశములో, అందువలన అది భారత దేశమునకే పరిమితి అయిపోయినది.

భగవద్గీతను చెప్పిన తర్వాత మూడువేల సంవత్సరములకు ఇజ్రయేల్ దేశములో దేవుని జ్ఞానము అవసరమొచ్చినప్పుడు,

దేవుడు ఏసు అను తన దూతను పంపి అక్కడ తన జ్ఞానమును అతని ద్వారా చెప్పించాడు. అప్పుడు కూడా సృష్ట్యాదిలో

వాణి ద్వారా సూర్యునికి చెప్పిన జ్ఞానమునే ఏసు ద్వారా చెప్పించాడు అక్కడ చెప్పిన జ్ఞానము బైబిలు అను గ్రంథరూపములో

బయటికి వచ్చినది. మొదట సూర్యునికి చెప్పిన జ్ఞానమే భారతదేశములో చెప్పబడినది, తర్వాత ఇజ్రయేల్ దేశములో

చెప్పబడినది. చెప్పిన దూతల పేర్లు కృష్ణుడు, ఏసు అని రెండుగా ఉండినా ఇద్దరు చెప్పినది ఒకే జ్ఞానమే. అయితే


భారత దేశములో చెప్పినప్పుడు, దానిని కృష్ణుడు చెప్పినది అనకుండా, దూత చెప్పినది అను అర్థము వచ్చులాగున

భగవద్గీత అన్నాము. తర్వాత ఇజ్రయేల్ దేశములో చెప్పినది కూడా దూత అనబడువాడే చెప్పాడు, కావున దానిని

కూడా అర్థము చెడకుండా భగవద్గీత లేక దూతగీత, దూతబోధ అని చెప్పాలి. అయితే దానిని దూత చెప్పినట్లు గుర్తు

లేకుండా బైబిల్ అని పేరు పెట్టడము జరిగినది. దానితో ఇజ్రయేల్ దేశములో ఏసు చెప్పిన జ్ఞానముగా ప్రచారమైనదిగానీ,

భగవంతుడు (దూత) చెప్పిన జ్ఞానముగా ప్రచారము కాలేదు. అంతేకాక సృష్ట్యాదిలో సూర్యునికి వాణి ద్వారా చెప్పిన

జ్ఞానమే బైబిలులో చెప్పబడినదని ఎవరికీ తెలియకుండా పోయినది. ఇదంతయు దేవునికి తెలిసే జరిగినది.


సృష్ట్యాదిలో ఆకాశవాణి ఆ రోజు సూర్యునికి ఏమి చెప్పిందో ఎవరికీ తెలియదు. అప్పుడు ఏమి చెప్పినది

ద్వాపరయుగములో భగవద్గీత చెప్పబడిన తర్వాత తెలిసినది. భగవద్గీతలోనే భగవంతుని ద్వారా దేవుడు తన జ్ఞానమును

చెప్పునప్పుడు, జ్ఞానయోగము అను అధ్యాయములో మొదటి శ్లోకమందే ఈ జ్ఞానమును ఆదిలో సూర్యునికి చెప్పియుంటిని

అని ఆయనే చెప్పినప్పుడు, భగవద్గీతలో చెప్పిన జ్ఞానమంతయు మొదట వాణి ద్వారా చెప్పబడిన జ్ఞానమని తెలిసిపోయినది.

రెండు వేల సంవత్సరముల పూర్వము ఇజ్రయేల్ దేశములో చెప్పిన జ్ఞానము కూడా దూత ద్వారా చెప్పించినదే, కావున

దానిని కూడా సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము క్రిందికే లెక్కించుకోవాలి. భారతదేశములో చెప్పిన జ్ఞానమే అక్కడ కూడా

చెప్పబడినదని అర్థమగుచున్నది. తర్వాత కొంతకాలమునకు అనగా ఇప్పటికి 1400 సంవత్సరముల ముందు అరబ్ దేశమైన

మక్కా మదీనాలో తిరిగి దేవుని జ్ఞానము చెప్పబడినది. అయితే ఇక్కడ దేవుని చేత పంపబడిన దూత (భగవంతుడు)

చెప్పలేదు. సృష్ట్యాదిలో సూర్యుని ద్వారా విన్న గ్రహము (మహా జ్ఞాని అయిన జిబ్రయేల్) అను నతడు కనిపించకుండా

తెరచాటున వుండి ముహమ్మద్ ప్రవక్తగారికి దేవుని జ్ఞానమును చెప్పడము జరిగినది. సృష్ట్యాదినుండివున్న జిబ్రయేల్

చెప్పినది సూర్యుని ద్వారా విన్నదే. ద్వాపరయుగములో పంపబడిన దూత అయిన కృష్ణుడు చెప్పినది మొదట సూర్యునికి

చెప్పిన జ్ఞానమే. తర్వాత వచ్చిన దూత అయిన ఏసు చెప్పినది కూడా సూర్యుడు చెప్పిన జ్ఞానమే. ఒకమారు మొదట

వాణి ద్వారా చెప్పబడినదీ, రెండవమారు దూతయిన కృష్ణుని ద్వారా చెప్పబడినదీ, మూడవ మారు కూడా దూతయిన

ఏసు ద్వారా చెప్పబడినదీ, నాల్గవమారు తెర వెనుకనుండి కనిపించక మహాజ్ఞాని జిబ్రయేల్ చెప్పినదీ ఒకే జ్ఞానమని

తెలిసిపోయినది. తాను స్వయముగా ఎవరితో మాట్లాడక మూడు మార్గముల ద్వారా చెప్పించినది దేవుడేనని

తెలిసిపోయినది. ఖుర్ఆన్ 42వ సురా 51 ఆయత్లో చెప్పిన వాక్యము ప్రకారము దేవుడు మూడు విధముల తన

జ్ఞానమును తెలియజేసాడు. మూడు విధములైనా నాలుగు మార్లు చెప్పడము జరిగినది. భూమిమీద తన జ్ఞానము

లేకుండా పోయినప్పుడంతా ఈ మూడు విధానముల ప్రకారమే ఎన్నిమార్లయినా దేవుడు తెలియజేయ వచ్చును. ప్రస్తుతము

మనముందరున్న భగవద్గీత, బైబిల్, ఖుర్ఆన్ గ్రంథములలోని దేవుని జ్ఞానము అర్థము కాకుండా పోయి, వాటిని

ప్రజలు మూడు మతములుగా చీల్చుకొన్నారు. మూడు గ్రంథములలోనిది ఒకే దేవుడు చెప్పినది, ఒకే జ్ఞానముగా

ఉన్నది. అయినా మనుషులు తమ అజ్ఞానముచేత భిన్నముగా అర్థము చేసుకొన్నారు. మా దేవుడువేరు, మా జ్ఞానమువేరు,

మా మతము వేరని, వేరువేరు భావములు కల్గియున్నారు. అంతేకాక ఏమీకాని దేవునికీ మతమును అంటగట్టారు.

ఇంతకంటే అజ్ఞానము లేదని అన్నిటినీ గమనిస్తున్న దేవునికి తెలిసిపోయినది. భూమిమీద మరొకమారు దేవుని

జ్ఞానము ఇది అని చెప్పవలసిన అవసరము ఏర్పడినది. ఇటువంటి సమయములో దేవుడు దేవునిగా (స్వయముగా)

కాకుండా తన దూత ద్వారా మరొకమారు జ్ఞానమును తెలియజేయవలసి వచ్చినది.



ఇప్పుడు దేవుడు దూతను పంపితే ద్వాపరయుగములో కృష్ణునిగా వచ్చిన దూతను పంపుతాడా, లేక కలియుగములో

పంపిన ఏసుగా వచ్చిన దూతను పంపుతాడా? అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! దూత



ఎప్పటికైనా ఒక్కడే ఉంటాడు. ఆయనవద్ద ఎక్కువమంది దూతలు లేరు. వాస్తవము చెప్పాలంటే ఆయన (దేవుడు)

ఎక్కడున్నాడో, ఎట్లున్నాడో ఎవరూ చెప్పలేనప్పుడు, ఎవరికీ తెలియనప్పుడు ఆయనకు దూతలెక్క డుంటారు.

విషయము మనకువద్దుగానీ, ఆయనవద్ద నుండి ఎప్పుడు వచ్చినా ఒకే దూత వస్తాడు, రెండవవాడు వచ్చేదానికి అవకాశమే

లేదు. ఆ విషయము నాకు మాత్రమే తెలుసు. వచ్చే దూత ఎన్నిమార్లు వచ్చినా ఎవరూ గుర్తుపట్టనట్లు రూపము

మార్చుకొని, పేరు మార్చుకొని వస్తాడుగానీ, ఒకమారు వచ్చిన రూపముతో రెండవమారు రాడు. అందువలన వచ్చిన

దూతను ఎవరూ గుర్తుపట్టలేరు. వచ్చినవాడు ఎలా వచ్చినా తెలియజేయు నది మాత్రము దేవుని జ్ఞానమే. ఉన్నది ఒకే

దేవుడు, వచ్చినది ఒకే దూత, చెప్పబడేది ఒకే దేవుని జ్ఞానము. ఈ మారు దేవుని విషయమును తెలియకుండా నేను

ముస్లీమ్న, నేను క్రైస్తవున్ని, నేను హిందువును అనుకొంటూ మీరు ఉంటే, మీ కర్మలో మీరు ఉంటారు. చేతిలోనికి

వచ్చిన అమృతమును జారవిడుచుకొన్నట్లేయగును. అందువలన జాగ్రత్తపడండి...


*** సమాప్తము ***.


ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే

ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,


సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.



ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024