pss మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు. updated 16th dec 24
మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు.
ఇక్కడ శిరోఫలక వ్రాతలో ముందు మూడు గ్రంథములు అని ఉన్నది. తర్వాత ఇద్దరు గురువులు, ఒక
బోధకుడు అని కలదు. వరుస క్రమములో ముందున్న మూడు గ్రంథములను గురించి తెలుసుకొని, తర్వాత ఇద్దరు
గురువులు ఎవరో! ఒక బోధకుడు ఎవరో! తెలుసుకొందాము. సంఖ్యలలో 'మూడు' అనునది ప్రత్యేకమయిన
సంఖ్యగాయున్నది. ప్రపంచములోని ప్రజలందరూ మూడు లోకములుగాయున్నారు. అనగా మూడు గుణముల
గుంపులుగాయున్నారు. క్రింద ప్రజలు మూడు లోకములుగా యుండగా, పైన దేవుడు కూడా మూడు భాగములుగా
విడిపోయి, మూడు పేర్లతోయుంటూ విశ్వమును పాలించుచున్నాడు. క్రింద ప్రజలు పైన దేవుడు మూడు విభాగములుగానే
యుండుట వలన మధ్యలోయున్నది ఏదయినా ముఖ్యముగా మూడుతోనే సంబంధపడి యుండును. జీవునికి (ప్రజలకు)
దేవునికి మధ్య సంబంధము జ్ఞానము తప్ప ఏమీ లేదు. జీవునికి దేవునికి, ప్రజలకు పరమాత్మకు మధ్యలో యున్న
జ్ఞానమును కూడా దేవుడు మూడు విధములే తెలియజేశాడు. దేవుడు, దేవుని చేత సృష్టించబడిన మనుషులు
మరియు దేవునికీ మనుషులకూ మధ్యనయున్న జ్ఞానము మూడూ ముఖ్యమైనవే. ఈ ముఖ్యమైన మూడు, మూడు
విధములుగా విభజింపబడియున్నవి. అందువలన 'మూడు' అను సంఖ్య ఎంతో ప్రాధాన్యత చెందియున్నదని
తెలియుచున్నది. మనుషులు, జ్ఞానము, దేవుడు ముగ్గురు మూడు విధములుగా ఎట్లున్నది క్రింద చూస్తాము.
చిత్రమును 2 పేజీ లో చూడండి.
సృష్ఠిలో ముఖ్యముగాయున్నవి మూడేననీ అవియే ఒకటి జీవకోటి, రెండు దైవజ్ఞానము, మూడు దేవుడు అనీ
గుర్తించగలిగాము. అందువలన 'మూడు' అను సంఖ్య ప్రత్యేకమయినదని చెప్పవచ్చును. మూడు రకముల మనుషులకు,
మూడు విధముల జ్ఞానము తెలియబడినప్పుడు, ఆ మూడు విధముల తెలిసిన జ్ఞానము కూడా మూడు గ్రంథములుగా
తయారయినది. ఈ మూడు గ్రంథములు ముగ్గురు వ్యక్తుల ద్వారా బయటకు వచ్చినవి. ఆ ముగ్గురు వ్యక్తులు, మూడు
హోదాలలో, మూడు దేశములలో చెప్పడము జరిగినది.
చిత్రమును పేజీ 2 లో చూడండి.
మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు, ఒక బోధకుడు
ఈ విధముగా మూడు గ్రంథములు ముగ్గురు వ్యక్తులచేత మూడు హోదాలలో బోధింపబడినాయి. పైన
శిరోఫలకము మీద వ్రాసిన పేర్లే ఇక్కడ చెప్పడమైనది. ఇక్కడ 'మూడు' అనే పదమునకు ఆధ్యాత్మిక రంగములో
ప్రత్యేకమయిన గుర్తింపు ఉన్నట్లు తెలుసుకొన్నాము. ఇప్పుడు గ్రంథములు అను పేరులో ఏమయినా విశేషతయున్నదేమో
గ్రహిద్దాము. దేవునికి జీవునికి మధ్యలోయున్న జ్ఞానము మూడు గ్రంథముల రూపములో వెలువడినది. ఇక్కడ
గమనించవలసిన విషయమేమంటే, కొన్ని కాగితముల సమూహమును పుస్తకము అనవచ్చును, పుస్తకమునే గ్రంథము
అని కూడా అనవచ్చును. కొందరు పుస్తకములను శాస్త్రములని కూడా చెప్పుచుందురు. పుస్తకములు కూడా మూడు
రకములు గలవు. అవి ఇలా కలవు చూడండి.
పుస్తకములు:
వేదములు,
ఉపనిషత్తులు,
చరిత్రలు,
కథలు.
శాస్త్రములు:
గణిత శాస్త్రము
ఖగోళ శాస్త్రము
రసాయన శాస్త్రము
భౌతిక శాస్త్రము
జ్యోతిష్య శాస్త్రము.
గ్రంథములు:
భగవద్గీత
బైబిలు
ఖుర్ఆన్.
సంఖ్యలలో మూడు సంఖ్యకు ఎంత ప్రత్యేకతయున్నదో, అలాగే పుస్తకము, శాస్త్రము, గ్రంథములు అను
మూడింటిలో గ్రంథము అనునది ఎంతో అర్థముతో కూడుకొన్నదై ప్రత్యేకత కల్గియున్నది. గ్రంథమయిన భగవద్గీతగానీ,
బైబిలుగానీ, ఖుర్ఆన్గానీ మూడూ బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవే అయినా, వాటిని శాస్త్రములలో కలుపక
ప్రత్యేకించి గ్రంథములు అంటున్నాము. అలా అనుటకు కారణము గలదు. అదే మనగా! శాస్త్రములు రెండు రకములు
గలవు. ప్రపంచమునకు సంబంధించి నవనీ, పరమాత్మకు సంబంధించినవనీ రెండు రకములు గలవు. అందులో
ప్రపంచమునకు సంబంధించిన వాటిని మాత్రమే శాస్త్రములనీ, పరమాత్మకు సంబంధించిన వాటిని గ్రంథములనాలి.
భగవద్గీత బ్రహ్మవిద్యా శాస్త్రమే అయినా, షట్శాస్త్రములలో ఒకటయినా, దానిని శాస్త్రమని చెప్పినా గ్రంథమని
అనవచ్చును. అలాగే మిగతా ఐదు శాస్త్రములను శాస్త్రమని చెప్పవచ్చును లేక పుస్తకములని కూడా చెప్పవచ్చును.
సమాచారము వ్రాయబడియున్న దానిని పుస్తకము అనిగానీ, గ్రంథము అనిగానీ పిలువ వచ్చును. అందులోయున్న
సమాచారమునుబట్టి అది గ్రంథమునకు సంబంధించినదో లేక పుస్తకమునకు సంబంధించినదో చూచి చెప్పవచ్చును.
గ్రంథములు పుస్తకములు అను రెండు తెగలలోనికి శాస్త్రములనునవి కలియుట చేత ప్రపంచ సంబంధ ఐదు శాస్త్రములు
పుస్తకములగుచున్నవి. భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవే అయినా,
వాటిని ధర్మశాస్త్రములని పిలిచినా, చివరకు ఆ మూడు శాస్త్రములను గ్రంథములుగా పిలుచుచున్నాము. పుస్తకములు,
శాస్త్రములు, గ్రంథములు అని మూడు రకములుగాయున్నా వాటిలోని శాస్త్రములు సమాచారమునుబట్టి ఇటు
పుస్తకములలోనికయినా, లేక అటు గ్రంథములలోనికయినా కలిసి పోవుచున్నవి.
ఇప్పుడు పుస్తకము యొక్క అర్థమును, గ్రంథము యొక్క అర్థమును గురించి తెలుసుకొందాము. ముందు
పుస్తకమును గురించి తెలుసు కొందాము. పుస్తకము అను పేరు పూర్వము 'గుస్తకముగా' యుండెడిది. 'గుస్తకము'
అను పేరు కాలక్రమమున పలుకడములో 'పుస్తకము'గా మారి పోయినది. గుస్తకమును విడదీసి చూచితే
'గు+హస్తకము=గుస్తకము' అని గలదు. “గు” అనగా గుణములు అని అర్థము. 'హస్తకము' అనగా ఆధీనములో
ఉన్నదని అర్థము. మనము మాట్లాడునప్పుడు అతని ఆస్తి అంతయూ ధనికుని హస్తగతమైపోయింది అని అంటుంటాము.
'హస్త' అనగా 'చేయి” అని అర్థము. హస్తకము అనినా, హస్తగతము అనినా ఆధీనములోనున్నదని అర్థము. “గు”
అంటే గుణములయినప్పుడు గుణముల ప్రభావముచే వ్రాయబడినదేదయినా, గుణముల హస్తగతములో ఉండునదే
గావున దానిని 'గుస్తకము' అనెడివారు. గుస్తకములోనిది ఏదయినా మస్తకములోనిదని చెప్పెడివారు. మస్తకములో
వున్నది గుణములే కావున గుస్తకము అను మాట పూర్తి అర్థముతో సరిపోయెడిది. అయితే తర్వాత కాలములో
గుస్తకము పుస్తకముగా మారిపోయి నేడు అందరూ పుస్తకమే అంటున్నారు. నేడు మనచేత చెప్పబడు పుస్తకము అను
మాట పూర్వము గుస్తకముగాయుండెడిది అంటే, తెలియనివారికి అది కొంత ఆశ్చర్యమే! అయినా, పుస్తకము పూర్వము
ఒకప్పుడు గుస్తకముగాయున్న మాట నిజమేనని తెలియవలెను.
ఇక గ్రంథము అను పేరు యొక్క వివరమును తెలుసుకొంటే ఇలా కలదు. ఒక్క బ్రహ్మవిద్యాశాస్త్రము యొక్క
విషయములున్న దానిని మాత్రము గ్రంథము అంటున్నాము. శాస్త్రమయినదే గ్రంథమగుటకు అవకాశముగలదు.
ధర్మశాస్త్రము లేక బ్రహ్మవిద్యాశాస్త్రము అనబడు భగవద్గీతను గ్రంథము అని అనవచ్చును. భగవద్గీత ఆధ్యాత్మిక
విద్యను బోధించుచున్నది. ఆధ్యాత్మికమును బోధించు ఏ గ్రంథమయినా దానిని గ్రంథమనవలసి వచ్చుచున్నది.
ఆధ్యాత్మికము అంటే ఆత్మకు సంబంధించిన దని అర్థము. ఆత్మకు సంబంధించిన విషయమంతయూ శరీరములోనే
యుండును. శరీరములో ఆత్మ గ్రంథులందు వ్యాపించియుండి, తన కార్యములను చేయుచున్నది. మనిషి తల మధ్య
భాగములోగల పిట్యూటరీ గ్లాండ్ను తెలుగులో “గ్రంథిరాజము” అంటాము. గ్రంథిరాజము అను గ్రంథిని కేంద్రముగా
చేసుకొని ఇటు గ్రంథులలోనూ అటు నాడులలోనూ ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. శరీరములోని గ్రంథులన్నిటికీ
రాజులాంటిదయిన గ్రంథి, స్వయముగా 'గ్రంథి రాజము' అని పిలువబడు గ్రంథిని కేంద్రీకరించి, శరీరమును నడుపుచున్న
ఆత్మ విషయములు దేనిలో అయితే వ్రాయబడియుంటాయో దానిని గుస్తకము అనిగానీ, పుస్తకము అనిగానీ అనుటకు
వీలులేదు. అందులోయున్న విషయము గ్రంథులకు సంబంధించిన విషయము అయినందున, దానిని గ్రంథము అను
అర్థముతో కూడుకొన్న పేరుతో పిలువడము జరిగినది. ఆధ్యాత్మికమునకు సంబంధించిన విషయములుండుట వలన
భగవద్గీతనుగానీ, బైబిలునుగానీ, ఖుర్ఆన్న గానీ అర్థసహితముగా గ్రంథము అనుట సరియైన మాట యగును.
దీనినిబట్టి గుణములతో కూడుకొన్నవి పుస్తకములు (గుస్తకములు) అనియూ, ఆధ్యాత్మికముతో కూడుకొన్నవి గ్రంథములు
అనియూ వాటి భావములు తెలిసిన పెద్దలు పిలువడము జరుగుచున్నది. ఆ విధానము ప్రకారము మనకు
ధర్మశాస్త్రములయిన, లేక బ్రహ్మవిద్యా శాస్త్రములయిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు, మూడు గ్రంథములుగా
పిలువబడుచున్నవి. ధర్మశాస్త్రము కానివి, ప్రపంచ శాస్త్రమునకు సంబంధించినవి అయిన ఐదుశాస్త్రములను పుస్తకములని
చెప్పవచ్చును. నాలుగు వేదములు, పదునెనిమిది పురాణములు, ఎన్నో కావ్యములు, చరిత్రలు మొదలగునవన్నీ
పుస్తకములేయగును. అవి ఆధ్యాత్మికమునకు సంబంధించినవి కావు. కావున వాటిని అన్నిటినీ పుస్తకములే అనాలి.
గ్రంథముల విషయములో ఆధ్యాత్మికమునకు సంబంధించినవే గ్రంథములని తెలిసిపోయినది. ప్రపంచములో
ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథములు ఉండినా, అన్నిటికీ మూల గ్రంథములు మూడు మాత్రమే గలవు. అవి ఒకటి ప్రథమ
దైవగ్రంథము భగవద్గీత, రెండు ద్వితీయ దైవగ్రంథము బైబిలు, మూడు అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ అను మూడు
గ్రంథములే యని చెప్పవచ్చును. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీత ఇప్పటికి ఐదువేల (5000) సంవత్సరముల
పూర్వము పుట్టినది. మధ్య దైవగ్రంథమయిన బైబిలు రెండువేల (2000) సంవత్సరముల పూర్వము పుట్టినది.
అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ పదునాల్గువందల (1400) సంవత్సరముల పూర్వము పుట్టినది. భగవద్గీతను
శ్రీకృష్ణుడు చెప్పాడు, బైబిలును ఏసు చెప్పాడు. ఖుర్ఆన్న జిబ్రయేల్ చెప్పాడు. భగవద్గీతను చెప్పిన కృష్ణుడు,
బైబిలును చెప్పిన ఏసు ఇద్దరూ మనుషులే, ఖుర్ఆన్ను చెప్పిన జిబ్రయేల్ మాత్రము మనిషికాదు. జిబ్రయేల్ ఖగోళములోని
ఒక గ్రహము. కృష్ణుడు, ఏసు ఇద్దరూ మానవాకారములోయున్న వ్యక్తులే. అయితే ఖుర్ఆన్ను చెప్పిన వాడు వ్యక్తికాదు,
మానవాకారములో లేని గ్రహము అని చెప్పు కొన్నాము. జిబ్రయేల్ ఎవరన్న విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.
అతను ఒక దేవదూత అను విషయము మాత్రము అందరికీ తెలుసు. అయితే ఆయన స్వరూపము ఏమి? స్వభావము
ఏమి? అను విషయము ఎవరికీ తెలియదు. ఆయన ఒక దూత అను విషయము అందరికో లేక కొందరికో తెలిసినా,
దూత అనువాడు ఎట్లుంటాడు? ఎవనిని దూతయనాలి? అను విషయము మనకు తెలియదు.
దేవుని కార్యములు చేయు ప్రతి ఒక్కనినీ దూత అనియే అనవచ్చును. దేవుని పనులు చేయువారందరినీ
సేవకులుగా చెప్పవచ్చును. సేవకులనే దేవుని ప్రతినిధులుగా ఆయన కార్యము చేయువారిగా చెప్పవచ్చును. దూత
అంటే ప్రత్యేకించి దేవునివద్ద నుండి పంపబడినవాడు అని అర్థము చేసుకోకూడదు. దేవుని కార్యములను చేయువారందరినీ
దూతలు అని అనవచ్చును. అలాంటప్పుడు దేవునివద్దనుండి పంపబడిన వారు కూడా దేవుని పనినే చేయుచున్నారు
కాబట్టి. వారిని కూడా దూత లనడములో తప్పులేదుగానీ, వారు మాత్రమే దూతలు మిగతావారు కాదు అనకూడదు.
జిబ్రయేల్ దేవుని జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తకు చెప్పడము అను దేవుని పని చేశాడు. కావున అతనిని దూత
అనడములో తప్పులేదు. అదే విధముగా దేవుని నిమిత్తము పనులు చేసిన దేవుని సేవకులనందరినీ కూడా దూతలుయని
అనవచ్చును. కృష్ణుడు, ఏసు ఇద్దరూ మనుషులే, వారిలో కృష్ణుడు ధనికుడు, భోగపురుషుడు. ఏసు పేదవాడు
భోగభాగ్యములు ఏవీ ఆయనకు లేవు. వారి జీవితములను గమనిస్తే ఒకదానితో ఒకటి ఏమాత్రము పోలిక లేకుండా
తూర్పు, పడమరలాగాయుండును. బాహ్య జీవితములో ఎటువంటి పోలికలు లేకున్నా వారు చెప్పిన జ్ఞానము మాత్రము
దగ్గర పోలికలున్నదిగా యుండుట వలన, వారు ఇద్దరూ దేవుని జ్ఞానమునే చెప్పుట వలన, వారిద్దరినీ దేవుని దూతలుగానే
చెప్పవచ్చును. మనుషు లయిన కృష్ణుడు, ఏసు ఇద్దరూ దూతలే అయినట్లు ఖగోళములో పెద్ద గ్రహము అయిన
జిబ్రయేల్ను కూడా దూత అనియే అంటున్నాము. పెద్ద గ్రహమని జిబ్రయేల్ను, చిన్న మనుషులని కృష్ణున్ని, ఏసును
వేరువేరుగా ఏమయినా చెప్పామా? లేదుకదా! ఎంతటివారయినా, ఎవరయినా దేవుని పనులను చేయువారిని దేవుని
ప్రతినిధులుగా, లేక దేవుని దూతలుగా చెప్పవచ్చును.
దేవుని జ్ఞానమును చెప్పువానిని ప్రవక్తయని అనవచ్చునని ముందే "ప్రవక్తలు ఎవరు?” అను గ్రంథములో
చెప్పుకొన్నాము. దానినిబట్టి ప్రత్యేకించి ప్రవక్త అనువాడు ఒకడే వుండడనీ, పద్ధతి ప్రకారము దేవుని జ్ఞానమును చెప్పు
ఎవనినైనాగానీ ప్రవక్తయని అనవచ్చుననీ చెప్పుకొన్నాము. అలాగే దూత అనువాడు ప్రత్యేకముగా ఉండడనీ, దేవుని
పనిని చేయు ప్రతివాడూ దేవుని దూతగానే పరిగణించబడుననీ చెప్పవచ్చును. అసలు విషయానికివచ్చి చూస్తే భగవద్గీతను
చెప్పిన కృష్ణుడు, బైబిలును చెప్పిన ఏసు ఇద్దరినీ మొదట బోధకులనియే అనవచ్చును. బోధకులనే ప్రవక్తలు యని
కూడా అనవచ్చును. అలాగే పెద్ద గ్రహమయిన జిబ్రయేల్ కూడా దేవుని జ్ఞానమును భూమిమీద చెప్పాడు కావున
ఆయనను కూడా బోధకుడు అని అనవచ్చును. అలాగే ప్రవక్తయని కూడా అనవచ్చును. వీరు ముగ్గురు దేవుని పనినే
చేశారు కాబట్టి ముగ్గురినీ దేవుని దూతలని కూడా చెప్ప వచ్చును. ఇంకా వీరిలో ఏమయినా తారతమ్యములు (బేధములు)
ఉన్నాయా! అని చూచినట్లయితే ఈ ముగ్గురిలో ఎవరయినా గురువులున్నారా! యను ప్రశ్నరాగలదు. ప్రవక్త, దూత,
బోధకుడు అను పేర్లు సమానమే అయినాగానీ, గురువు అనునది ప్రత్యేకమయిన పేరు. ఎవరయినా ప్రవక్తలుగా, లేక
దూతలుగా, లేక బోధకులుగా పిలువబడవచ్చునుగానీ గురువులుగా పిలువబడలేరు. ఎందుకనగా! గురువు సాక్ష్యాత్తూ
దేవునితో సమానమైనవాడు కావున, ఒక ప్రవక్తను ఇతను గురువా! కాదా! యని చూడవలసి వస్తున్నది. అలాగే ఒక
దేవదూతను కూడా ఇతను గురువు అను పదమునకు అర్హుడా! కాదా! యని చూడవలసి వస్తున్నది. అట్లే బోధకుడు
ఎవరయినాగానీ అతను గురువో! కాదో! పరీక్షగా చూడవలసి యున్నది. ఈ విధముగా ప్రవక్తలు, దూతలు, బోధకులలో
ఎవరయినా గురువులున్నారా! యని చూడవలెను. అలా చూచినా గురువు అనువాడు అంత సులభముగా గుర్తించబడడు.
గురువు గుర్తింపబడనివాడయినా గురువు దేవునితో సమానమనీ, గురువు స్వయముగా బోధించగలడనీ,
గురువు ఇతరులను అనుసరించడనీ తెలియుట వలన ఉన్నవారిలో ఎవరికి గురువు యొక్క లక్షణములున్నాయో చూచి
తెలుసుకోవచ్చును. ఇప్పుడు మూడు గ్రంథములను చెప్పిన ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులుండగా, ఒకరు గ్రహముగాయున్నారు.
కృష్ణుడు, ఏసు ఇద్దరు వ్యక్తులుకాగా, జిబ్రయేల్ కనిపించే వ్యక్తియే కాదు. వ్యక్తి అనగా వ్యక్తమవువాడు, కనిపించువాడని
అర్థము. ఒక వ్యక్తికాని జిబ్రయేల్ను వక్త, ప్రవక్త, దూత, ప్రదూతయని చెప్పినా అతను గురువా! కాదా!యని చూడవలసిన
అవసరమున్నది. జిబ్రయేల్ ఎవరయినదీ తెలిస్తే ఆయన చెప్పిన బోధ ఎటువంటిదో తెలియవచ్చును. అందువలన
జిబ్రయేల్ గురించి తెలుసుకొందాము. మనుషులకు దేవునికి మధ్యలో సంబంధముగా యున్నది దేవుని జ్ఞానమని
చెప్పుకొన్నాము. దేవునికీ మనిషికీ మధ్యలో సంబంధ బాంధవ్యములు కల్పించు జ్ఞానమును మొదట ప్రజలకు దేవుడే
చెప్పాడు. దేవుడు భూమిమీద ప్రజలకు మూడు విధములుగా తన జ్ఞానమును తెలియ జేశాడని పవిత్ర ఖుర్ఆన్
గ్రంథములో 42వ సూరా, 51వ ఆయత్నందు చెప్పాడు. అది ఈ విధముగా కలదు. “దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ
మాట్లాడడు. దేవుడు తన జ్ఞానమును ఒకటి వహీ ద్వారా (వాణిద్వారా) తెలియజేస్తాడు, రెండు తెర వెనుకనుండి
తెలియబరుస్తాడు. మూడు తన దూత ద్వారా (తన ప్రతినిధి ద్వారా) జ్ఞానమును తన ఆజ్ఞానుసారము తెలియజేస్తాడు.
ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు" అని కలదు. ఈ వాక్యమును జిబ్రయేల్ ప్రవక్తగారయిన ముహమ్మద్ గారికి
తెలియజేశాడు. ఈ విషయమును మొదట దేవుడు చెప్పగా, దానినే జిబ్రయేల్ రెండవ వ్యక్తిగా ప్రవక్త గారికి హీరాగుహలలో
తెలియజేశాడు. చెప్పినది జిబ్రయేలే అయినా వాక్యమంతయూ, వాక్యములోని సారాంశమంతయూ దేవునిదే.
ఇక్కడ జిబ్రయేల్ చెప్పిన వాక్యములో దేవుడు తన జ్ఞానమును శబ్ధముద్వారా, ఆకాశవాణిద్వారా తెలియజేస్తానని
చెప్పాడు. ఇక్కడ బాగా వివరముగా తెలియగోరితే దేవుడు మనుషులకు జ్ఞానమును తెలియజేయాలని సంకల్పించుకొన్నాడు.
దేవుడు అనుకొనేవాడేగానీ చేసేవాడు కాడు. అలా దేవుడు అనుకొన్న వెంటనే ఆయన పనిని చేయుటకు ముందు
అవకాశము గలవారు మహాభూతములు, తర్వాత భూతములు, ఉప భూతములు, గ్రహములు, ఉపగ్రహములు ఒకరి
తర్వాత ఒకరు అవకాశము కొరకు చూచుచుందురు. అలాంటి స్థితిలోయున్న దేవుని పాలనలోని మహాభూతము
అయిన ఆకాశము మొదట దేవుని జ్ఞానమును స్వయముగా శబ్ధరూపముగా బయటకు పంపినది. అప్పుడు ఆ శబ్ధమును
ఖగోళములో ఆకాశమునకు ఆనుకొనియున్న సూర్యుడు వినడము జరిగినది. తర్వాత అతని ద్వారా దేవునిజ్ఞానము
భూమికి చేరినది. భూమికి సూర్యుని ద్వారా చేరిన జ్ఞానము గ్రంథరూపముగా వ్రాయబడలేదు. మొదట ఆకాశ
శబ్ధము ద్వారా ఒక విధముగా జ్ఞానము తెలియబడగా, రెండవ విధముగా తెరవెనుకనుండి భూమిమీద మనుషులకు
తెలియజేయడము జరిగినది. రెండవ విధానములో కూడా శబ్ధమే జ్ఞానమును చెప్పినా ఆ శబ్ధము తెరవెనుక కనిపించకుండా
వుండేవానినుండి వచ్చినది. అక్కడ ఎవరు మాట్లాడునది తెలియక, కేవలము మాటలు మాత్రము వినిపించుట చేత
దానిని తెరవెనుకనుండి చెప్పడము అని వర్ణించారు. తెరవెనుకనుండి అంటే అక్కడ గుడ్డ తెరగాయున్నదేమో! నని
అనుకోకూడదు. చెప్పేవాడు కనిపించలేదు కావున, దానిని అర్థము చేసుకొనుటకు తెరవెనుకనుండి అని చెప్పడము
జరిగినది.
ఖుర్ఆన్లోని 42వ సూరా, 51వ ఆయత్లోని ఈ వాక్యము కూడా అలాగే ముహమ్మద్ ప్రవక్తగారికి
వినిపించినదని తెలియవలెను. ముహమ్మద్ ప్రవక్తగారికి కనిపించకుండా జ్ఞానమును చెప్పినవాడు జిబ్రయేలేనని
జ్ఞాపక ముంచుకోవలెను. తెరవెనుకనుండి అని చెప్పితే కనిపించకుండా చెప్పడ మయినదని అర్థము చేసుకోవాలి.
చాలామంది ఈ వాక్యములో తెర అంటే అడ్డముగా కట్టిన గుడ్డయనీ, తెరవెనుకయంటే అడ్డముగా కట్టిన గుడ్డ వెనుక
భాగమనీ అర్థము చేసుకొంటున్నారు. అలా ఇంతవరకు జ్ఞానమును చెప్పేవారు గుడ్డ వెనుకనుండి ఎప్పుడూ చెప్పలేదు.
అలా చెప్పవలసిన అవసరమూ లేదు. ఇక్కడ కనిపించకుండా చెప్పినది జిబ్రయేల్ గ్రహమే. జిబ్రయేల్ అనునతడు
ఖగోళములో స్థూలముగాయున్న ఒక పెద్ద గోళము. గోళాకారమును కల్గియున్న జిబ్రయేల్ ఖగోళములో సూర్యుని వద్ద
తాను తెలుసుకొన్న జ్ఞానమును మనుషులకు తెలియజేయాలనుకొని, భూమిమీదికి వచ్చి తాను జ్ఞానము చెప్పవలసిన
వ్యక్తిని ఎన్నుకొని, తన జ్ఞానమును ముందునుంచి ఆ వ్యక్తికి చెప్పడము జరిగినది. అయితే ఇక్కడ గ్రహించవలసిన
విషయమేమనగా! జిబ్రయేల్ శరీరము ఒక గోళాకృతిలో యున్న గ్రహము. అందువలన తన స్థూలశరీరమును వదలి
సూక్ష్మ శరీరముతో భూమిమీదికి వచ్చి, జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పాడు. అయితే మనిషి కనిపించకుండా
మనిషి శబ్దము మాత్రము వినిపించుట వలన మొదట ప్రవక్తగారు పూర్తి భయపడిపోయాడు. దానితో ప్రవక్తగారికి
కొన్ని రోజులు జ్వరము రావడము కూడా జరిగినది. తర్వాత రెండవమారు జిబ్రయేల్ తాను భయపెట్టుటకు రాలేదనీ,
దేవునిజ్ఞానము చెప్పుటకు వచ్చాననీ ముందే చెప్పడము వలన, అప్పటినుండి ముహమ్మద్ ప్రవక్తగారు జిబ్రయేల్
కనిపించక మాట్లాడిన మాటలన్నిటినీ జాగ్రత్తగా విన్నాడు. ఆ దినము జిబ్రయేల్, అన్వేషణలో అక్కడున్న ప్రజలలో
అన్ని విధములా ఉత్తముడు ముహమ్మద్ ప్రవక్తగారయిన దానివలన, ముహమ్మద్ గారికి జ్ఞానము చెప్పాలని నిర్ధారించుకొని
జిబ్రయేల్ జ్ఞానము చెప్పడము జరిగినది. ఆ దినములలో ఒంటరిగా ఎవరూలేని స్థలములోయుండు వానికి జ్ఞానమును
చెప్పాలనుకొన్న జిబ్రయేల్కు అటువంటి వ్యక్తి ఒక్క ముహమ్మద్ ప్రవక్తగారే నని తెలిసిపోయింది. అప్పటికాలములో
ముహమ్మద్ ప్రవక్తగారు తన నివాసమునకు దూరముగాయున్న హీరా గుహలలోనికి పోయి ఒంటరిగా కాలము
గడుపుచూ దేవున్ని గురించి ఆలోచించెడివాడు. ఊరికి దూరముగా ఎవరూలేని చోట ప్రవక్తగారు జిబ్రయేల్కు
కనిపించగా ఆయనకే తాను జ్ఞానము చెప్పుటకు నిర్ణయించుకొన్నాడు. అప్పటికే మూడు సంవత్సరములనుండి హీరా
కొండగుహలలో ప్రవక్తగారు ఏకాంతముగా గడిపెడివాడు. రెండు మూడు రోజులు అక్కడేయుండి ఇంటికి వచ్చేవాడు.
ఏకాంతముగా ఉండే అతనిలోని దైవచింతనను చూచిన జిబ్రయేల్ అతనికే జ్ఞానమును చెప్పాలని నిర్ణయించుకోవడము
జరిగినది. అప్పుడు రంజాన్ నెల 21వ తేదీ ఉండగా క్రీ.శ॥ 10-08-610 అని చరిత్రలో వ్రాసి యుంచారు.
ప్రవక్తగారు జిబ్రయేల్ నుండి మొదటిమారు జ్ఞానము విని ఇప్పటికి 1404 సంవత్సరములు అయినదని తెలియుచున్నది.
అప్పటినుండి అప్పుడప్పుడు జిబ్రయేల్ నుండి 23 సంవత్సరములు జ్ఞానమును విన్నాడు. ప్రతిదినము జిబ్రయేల్
జ్ఞానమును చెప్పెడివాడు కాదు. వారమునకు ఒకమారో, రెండు వారములకొకమారో వచ్చి జ్ఞానమును చెప్పేవాడు.
ఒక్కొక్కమారు రెండు మూడు నెలలు కూడా మధ్యలో కాలము గడిచెడిది. ఈ విధముగా 23 సంవత్సరములు
ప్రవక్తగారికి జిబ్రయేల్ జ్ఞానము చెప్పడమైనది.
దురదృష్టవశాత్తు ప్రవక్తగారు చదువురానివాడైనందున జిబ్రయేల్ చెప్పుమాటలను వినిన తర్వాత ఇంటికిపోయి
తన అనుచరులకు చెప్పెడి వాడు. అలా విన్న దానిని అందరూ కలిసి ఒకమారు ఖుర్ఆన్ గ్రంథముగా వ్రాయడము
జరిగినది. అక్కడివారు అనేక దినములు విన్నదానిని, కొందరు వ్రాసుకొన్న దానిని ఒకచోట చేర్చి ఖుర్ఆన్ గ్రంథముగా
వ్రాయడము వలన ఖుర్ఆన్ గ్రంథములోని విషయములు వరుస క్రమములో లేకుండా యుండును. ఎవరికి జ్ఞాపకము
ఉన్నది వారు చెప్పడము వలన చెప్పిన విషయములనే రెండు మూడుమార్లు ఖుర్ఆన్లో కనిపించుచుండును. అంతేకాక
ఒక విషయమును చెప్పినప్పుడు దానికి క్రింద దాని అనుబంధ విషయముండదు. అక్కడ వేరే విషయము వచ్చియుండి,
మొదటి దానికి అనుబంధ విషయము మరొకచోట కనిపించడము జరుగుచుండును. అందువలన ఖుర్ఆన్ గ్రంథము
చదువు వారికి కొంత తికమకగా యుండును. ఓపికగా చదువుకొనువారికి అందులో దైవజ్ఞానము లభించగలదు.
జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి దైవజ్ఞానమును చెప్పాడు అన్నది వాస్తవమే. అప్పుడు చెప్పినదే మనముందర
ఖుర్ఆన్ గ్రంథముగా యున్నదీ నిజమే. అయితే జిబ్రయేల్ అనునతనికి దేవుని జ్ఞానము ఎలా తెలుసు? అను ప్రశ్న
రాక తప్పదు. ఇంతకుముందే జిబ్రయేల్ సాధారణ మనిషి కాదు అని చెప్పుకొన్నాము. జిబ్రయేల్ ఖగోళములోయున్న
భూతములు, గ్రహములలో ఒక పెద్ద గ్రహము. గ్రహము అంటే గ్రహించువాడు లేక గ్రహించునది అని అర్థము.
సృష్ట్యాదిలో దేవుడు తన జ్ఞానమును ఆకాశవాణి ద్వారా (వహీ ద్వారా) తెలుపగా దానిని మొదట వినినవాడు సూర్యుడు.
రెండవవాడు జిబ్రయేల్. మొదట వినిన సూర్యుడు భూమిమీద మనువుకు ఆ కాలములోనే తెలియజేశాడు అని చరిత్ర
గలదు. ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమును వినిన రెండవవాడు జిబ్రయేల్ అని అనుకొన్నాము కదా! అతడు
భూమిమీదకు వచ్చి ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పడము జరిగినది. ఇప్పటికి 1400 సంవత్సరముల క్రిందట జిబ్రయేల్
ముహమ్మద్ ప్రవక్త గారికి చెప్పిన జ్ఞానము ఎక్కడిది? అని ప్రశ్నించితే ప్రపంచములో సృష్ట్యాదిలోనే దేవుడు ఆకాశవాణి
ద్వారా చెప్పిన జ్ఞానమునే జిబ్రయేల్ తెలుసుకొని దానినే చెప్పాడని చెప్పవచ్చును. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు
చెప్పిన జ్ఞానమూ, ద్వాపరయుగ అంత్యములో కృష్ణుడు అర్జునునికి చెప్పిన జ్ఞానమూ రెండూ ఒకటేనని చెప్పవచ్చును.
ఖగోళములో ఆకాశము ద్వారా సృష్ట్యాదిలోనే సూర్యునికి చెప్పిన జ్ఞానమును సూర్యుడు అప్పటినుండి ప్రపంచమంతా
వ్యాపింపజేయుచున్నాడు.
సృష్ట్యాదిలోనే తనకు జ్ఞానము తెలిసిన వెంటనే సూర్యుడు భూమిమీదకు వచ్చి కృతయుగములోనే మనువు
అను ప్రముఖ వ్యక్తికి చెప్పడము జరిగినది. మనువు తాను సూర్యుని ద్వారా వినిన జ్ఞానమును ఇక్ష్వాకుడు అను రాజుకు
తెలియజేశాడు. ఇక్ష్వాకుడు అను రాజు ఇతర రాజులకు తెలియజేశాడు. అప్పుడు జ్ఞానము అలా ఒకరికొకరు చెప్పు
కోవడము వలన ప్రపంచములోని మనుషులందరికీ తెలిసిపోయినది. తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము
రెండు యుగములు గడువగా, మొదట అందరికీ తెలిసిన జ్ఞానము ద్వాపరయుగము చివరిలో అందరికీ తెలియకుండా
పోయినదని కృష్ణుడు అర్జునునితో చెప్పడము జరిగినది. అప్పటికి కృత, త్రేతా, ద్వాపర అను మూడు యుగముల
కాలమునకు సూర్యుడు భూమిమీద తెలియజేసిన జ్ఞానము లేకుండా పోవడము జరుగగా, ద్వాపరయుగ అంత్యములో
కృష్ణుడు వచ్చి ఆదిలో నేను సూర్యునికి చెప్పిన జ్ఞానమునే నీకు ఇప్పుడు చెప్పుచున్నాను విను! అని తిరిగి మొదటి
జ్ఞానమును పూర్తిగా భగవద్గీత రూపములో చెప్పడము జరిగినది.
సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే నీకు ఇప్పుడు చెప్పుచున్నానని కృష్ణుడు అర్జునునితో చెప్పడమేకాక, ఇప్పుడు
నీకు చెప్పుచున్న ఈ జ్ఞానమునే సృష్ట్యాదిలో సూర్యునకు నేను చెప్పియుంటిని అని కృష్ణుడు ఒక సంచలనమైన మాటను
చెప్పడము జరిగినది.
ఆ సంచలనమైన మాట భగవద్గీతలో జ్ఞానయోగమందు మొదటి శ్లోకములోనే యున్నది. ఆ
శ్లోకమును క్రింద చూడవచ్చును.
1) శ్లో॥
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్।
వివస్వాన్ మనలే ప్రాహ మనురిక్ష్వాకలేబ్రవీత్
ఏవం పరంపరాప్రాప్తమ్ ఇమం రాజర్షయో ఐదుః
2) శ్లో॥
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప॥॥
3) శ్లో॥
స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తిసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ |
భావము :- “నాశనములేని ఈ యోగమును (జ్ఞానమును) ఆదిలోనే సూర్యునికి నేను చెప్పియుంటిని. సూర్యుడు
మనువుకు చెప్పగా, మనువు ఇక్ష్వాకుడు అను రాజుకు చెప్పాడు. ఈ విధముగా ఒకరికొకరు చెప్పు కోవడము వలన
భూమిమీద గల రాజులు, ఋషులు అందరూ తెలుసుకో గలిగారు. అందరూ జ్ఞానులుగా చాలాకాలము యుండగా,
కాలక్రమేపీ జ్ఞానము లేకుండా పోతూవచ్చి నేడు పూర్తి లేకుండా పోయినది. ఇప్పుడు నేను చెప్పబోవు ఆ పురాతన
జ్ఞానము చాలా రహస్యమైనది, అందరికీ చెప్పరానిది ఇప్పుడు నీకు చెప్పుచున్నాను.” అని కృష్ణుడు చెప్పగా, అర్జునుడు
వెంటనే ఒక ప్రశ్నను అడిగాడు. సూర్యుడు సృష్ట్యాదిలోనే పుట్టాడు. నీవు పుట్టినది ఈ కాలములో, నీవు ఆదిలో పుట్టిన
సూర్యునికి జ్ఞానమును ఎలా చెప్పగలిగావు? అని అడిగాడు. అక్కడ జరిగిన సంభాషణనుబట్టి కొంత సంచలనమైన
విషయము అర్థమయినది. ఆ విషయమును అటుంచి సృష్ట్యాదిలో దేవుడు సూర్యునకు జ్ఞానము చెప్పాడని అర్థమయినది.
సూర్యునికి చెప్పిన తర్వాత ఆ జ్ఞానము సూర్యునిద్వారా మిగతా ప్రపంచము నకు తెలిసింది. అట్లే జిబ్రయేల్
గ్రహమునకు కూడా తెలిసినది. సూర్యుడు స్థూలశరీరమైన తన గోళమును వదలి భూమిమీదికి సూక్ష్మముగా వచ్చి
మనువు అను మహర్షికి చెప్పినట్లు, జిబ్రయేల్ కూడా తన స్థూల శరీరమును ఆకాశములోనే వదలి, సూక్ష్మశరీరముతో
భూమిమీదికి వచ్చి, ముహమ్మద్ ప్రవక్తకు తాను సూర్యుని ద్వారా తెలుసుకొన్న జ్ఞానమును చెప్పడమైనది. దీనినిబట్టి
సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానమూ, జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన జ్ఞానమూ రెండూ ఒకటేనని తెలియుచున్నది.
అయితే సూర్యునికి ఆదిలో చెప్పిన జ్ఞానమునే ద్వాపరయుగములో అర్జునునికి చెప్పడము వలన అక్కడ
భగవద్గీతగా తెలుపబడిన జ్ఞానమూ, ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన ఖుర్ఆన్గా తెలుపబడిన జ్ఞానమూ ఒకటేయని
అర్థమగుచున్నది. భగవద్గీతను చదివిన అందరికీ సృష్ట్యాదిలోని జ్ఞానమే భగవద్గీతలో యున్నదని తెలియును. అయితే
అదే జ్ఞానమునే జిబ్రియేల్ తెలుసుకొని ముహమ్మద్ ప్రవక్తకు చెప్పాడనీ, ప్రస్తుతము ఖుర్ఆన్గా యున్న జ్ఞానము
భగవద్గీతలోని జ్ఞానమే అని ఎవరికీ తెలియదు. ఇప్పుడు మేము చెప్పినా కొందరు నమ్మలేకపోవచ్చును. ఎవరు
నమ్మినా, ఎవరు నమ్మక పోయినా, భగవద్గీతలోని జ్ఞానమునే జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పడము జరిగినది.
భగవద్గీతలోయున్న ధర్మసూత్రములే ఖుర్ఆన్ గ్రంథములో యున్నవి. ఈ మాట వినిన తర్వాత ఎవరయినా ఖుర్ఆన్ను
చదివి చూస్తే వారికి భగవద్గీతలోని జ్ఞానమునకు, ఖుర్ఆన్లోని జ్ఞానమునకు ఎటువంటి సంబంధములేనట్లు కనిపించును.
నేను చదివి చూచినప్పుడు భగవద్గీతకు ఖుర్ఆన్కు ఏమాత్రము సంబంధము లేనట్లు తెలిసిపోయినది. రెండిటిలోనూ
ఒకే జ్ఞానమున్నదని ఎందుకు చెప్పుచున్నారని ఆలోచిస్తే, రెండు గ్రంథములలో ఒకే జ్ఞానమున్న మాట వాస్తవమేనని
తెలియుచున్నది. రెండిటినీ చదివి చూచినప్పుడు ఒకదానితో ఒకటి ఏమాత్రము సంబంధము లేనట్లు కనిపించినది
వాస్తవమే. తర్వాత కొద్దిగా యోచించి చూస్తే రెండిటియందు ఒకే జ్ఞానముండుట వాస్తవమే. ఎంతో విచక్షణా
జ్ఞానమున్న వారికి మాత్రమే రెండిటియందు ఒకే జ్ఞానమున్నదని తెలియగలదు.
ద్వాపరయుగములో అర్జునునికి చెప్పిన జ్ఞానము, జ్ఞానయోగము లోని మొదటి మూడు శ్లోకములలో చెప్పిన
ప్రకారము, ఆదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి చెప్పిన జ్ఞానమని తెలిసిపోయినది. అదే జ్ఞానమునే ద్వాపరయుగములో
అర్జునునికి చెప్పడము వలన అది భగవద్గీతయైనది. జిబ్రయేల్ అదే జ్ఞానమునే తెలుసుకొని చెప్పడము వలన
చివరికది ఖుర్ఆన్ రూపముగా బయటికి వచ్చినది. ఐదువేల సంవత్సరముల పూర్వము వచ్చిన భగవద్గీత, 1400
సంవత్సరముల పూర్వము వచ్చిన ఖుర్ఆన్ రెండూ ఒకే ధర్మములను తెలియజేయుచున్నా, నేడు గ్రహించలేని స్థితిలో
మానవుడుండి, రెండు గ్రంథముల ఆధారముతో రెండు మతములను అభివృద్ధి చేసుకొంటున్నాడు. దేవుడు చెప్పిన
జ్ఞానము ప్రకారము రెండు గ్రంథముల యందు మతము అనుమాట ఏమాత్రము లేదు. అయినా మనిషి ఖుర్ఆన్
లోని జ్ఞానమును లోతుగా యోచించక, పైకి అర్థమగు విధానము ప్రకారము మతమును తయారుచేసుకొని, దానిని
ఇస్లామ్ అనియూ ముస్లీమ్ మతమనియూ చెప్పుకొంటున్నాడు.
జిబ్రయేల్ భూమిమీద అందించిన జ్ఞానము గొప్పదే అయినా, అది భగవద్గీతలో దేవుడు చెప్పిన జ్ఞానమే
అయినా, జిబ్రయేల్ సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానమును చెప్పినందుకు అతనిని గురువు అనాలా, లేక బోధకుడు
అని అనాలా? అని ప్రశ్న వచ్చుచున్నది. దానికి జవాబును చూస్తే ఈ విధముగా చెప్పుకోవచ్చును. గురువు
గుర్తింపబడనివాడు, ఎవరూ ఆయనను గుర్తించలేరు. అందువలన జిబ్రయేల్ను వెంటనే గురువు అని చెప్పలేము.
దేవునిలోని అనేక అంశలలో ఒక్క అంశ సాక్ష్యాత్తూ భూమిమీద అవతరించినా అతనిని గురువు అనవచ్చును. గురువు
అయినవాడు స్వయముగా జ్ఞానము చెప్పునుగానీ, ఎక్కడో వినిన దానినిగానీ, చదివిన దానినిగానీ బోధగా చెప్పడు.
అలా చెప్పువాడు బోధకుడు అవుతాడుగానీ గురువుకాడు. జిబ్రయేల్ ఆకాశవాణి చెప్పిన దానిని స్వయముగా విని
అయినా, లేక సూర్యుడు చెప్పినప్పుడు విని అయినా, దానినే చెప్పుట వలన జిబ్రయేల్ బోధకుడగునని చెప్పవచ్చును.
అంతేగానీ గురువుగా లెక్కించకూడదు. గురువు అంటే ఎవరు? అను విషయము తెలియాలంటే మా రచనలలోని
“గురువు” అను గ్రంథము చదివితే భూమిమీద గురువు ఎవరయితారో బాగా అర్థమవుతుంది. అన్ని విధములా
ఆలోచిస్తే జిబ్రయేల్ తనకు తెలిసిన జ్ఞానమునే ముహమ్మద్ ప్రవక్తకు చెప్పడము వలన బోధకుడే అవుతాడు. జిబ్రయేల్
బోధకుడని తెలిసిపోయి నది. ఆయన చెప్పిన జ్ఞానమే ఖుర్ఆన్ గ్రంథములో ఉండుట వలన, జిబ్రయేల్ అందించిన
జ్ఞానమే ఖుర్ఆన్ రూపములో ఉండుట వలన, ఖుర్ఆన్ జ్ఞానము సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానమయినందున
జిబ్రయేలు ఏమీ లాభము లేదు. అంతపెద్ద జ్ఞానమును చెప్పినప్పటికీ అతనిని బోధకునిగానే చెప్పుచున్నాము గానీ,
గురువు అనుటకు వీలులేదు. మనము ఈ గ్రంథము యొక్క పేరులో “మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు, ఒక్క
బోధకుడు" అని చెప్పియున్నాము కదా! అందులో జిబ్రయేల్ ఒక్క బోధకుడుగా తెలిసిపోయాడు. మూడు గ్రంథములలో
ఖుర్ఆన్ గ్రంథము కూడా అసలయిన దైవగ్రంథముగా లెక్కించబడుట వలన అందులో ఒక గ్రంథము కూడా మనకు
తెలిసిపోయినది. ఇక తెలియవలసినది ఇద్దరు గురువులు, రెండు గ్రంథములు.
సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి జ్ఞానము తెలిసిందని చెప్పుకొన్నాము. మనము చెప్పుకొన్నది
కాదుగానీ, దేవుడే నేను ఆదిలో సూర్యునికి జ్ఞానమును చెప్పియుంటిననీ, అతని ద్వారా సమస్త ప్రపంచమునకు
జ్ఞానము తెలిసినదనీ, ఇప్పుడు ఆ జ్ఞానము లేకుండా పోయినదనీ, కావున ప్రస్తుతము సూర్యునికి గతములో నేను
చెప్పిన జ్ఞానమునే చెప్పుచున్నాను విను! అని అర్జునునితో చెప్పాడు. తర్వాత అర్జునుడు వినిన జ్ఞానమే భగవద్గీతగా
రూపొందినది. అందువలన భగవద్గీతను దైవగ్రంథము అనవచ్చును. మూడు దైవ గ్రంథములలో ఒకటి భగవద్గీతయని
కూడా తెలిసినది. జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము ఖుర్ఆన్ గ్రంథముగా తయారయిన దానివలన, ఖుర్ఆన్ గ్రంథములోని
జ్ఞానము కూడా కృష్ణుడు అర్జునునకు తెల్పిన జ్ఞానమే అగుట వలన ఇక్కడ భగవద్గీతను, అక్కడ ఖుర్ఆన్ గ్రంథమును
దైవగ్రంథములుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు మూడు గ్రంథములు అను మాటలో రెండు గ్రంథములు తెలిసిపోయినవి.
మూడవ గ్రంథము తెలియవలసియున్నది. అలాగే ఒక బోధకుడు తెలిసిపోయాడు. ఇక ఇద్దరు గురువులు
తెలియవలసియున్నది.
భగవద్గీత ద్వాపరయుగ అంత్యములో పుట్టినది. ఇప్పటికి దాదాపు 5000 సంవత్సరముల పూర్వము ఖచ్ఛితముగా
చెప్పితే భగవద్గీత పుట్టి ఇప్పటికి అనగా 2014 సంవత్సరము నాటికి 5152 సంవత్సరములు. భారత యుద్ధము
జరిగినది క్రీస్తు పూర్వము (3138) సంవత్సరములప్పుడు. కృష్ణుడు భగవద్గీత చెప్పినది కూడా అప్పుడే. అప్పటికి
కృష్ణుని వయస్సు (90) సంవత్సరములు. కృష్ణుడు గీతను చెప్పిన తర్వాత (36) సంవత్సరములు జీవించాడు.
కృష్ణుడు చనిపోయినది క్రీస్తు పూర్వము 2-2-3102. కృష్ణుని జీవిత కాలము (126) సంవత్సరములు. ఈ
సంవత్సరమునకు (2014) భగవద్గీత పుట్టి 5152 సంవత్సరములవుతుంది. అనగా భగవద్గీత వయస్సు (5152)
సంవత్సరములన్నమాట. ఖుర్ఆన్ పుట్టినది క్రీ.శ॥ 633 సంవత్సరములు ఇప్పటికి ఖుర్ఆన్ వయస్సు 1381
సంవత్సరములు. భగవద్గీతకంటే ఖుర్ఆన్ గ్రంథము 3771 సంవత్సరములు చిన్నదన్నమాట. క్రీ.శ॥ 633
సంవత్సరములప్పుడు తయారయిన ఖుర్ఆన్ గ్రంథము చివరి గ్రంథమని ఖుర్ఆన్లోనే చెప్పబడినది. ముహమ్మద్
ప్రవక్త చివరి ప్రవక్తయని చెప్పడముతో ఖుర్ఆన్ గ్రంథము చివరి దైవగ్రంథమని అర్థమగుచున్నది. దానిప్రకారము
భగవద్గీత ముందే పుట్టిన మొదటి గ్రంథమయిన దానివలన భగవద్గీతను ప్రథమ దైవగ్రంథముగా లెక్కించి చెప్పవచ్చును.
భగవద్గీత ప్రథమ దైవగ్రంథముగా, అట్లే ఖుర్ఆన్ గ్రంథము చివరి దైవగ్రంథముగా తెలిసిపోయినది. ఇక మధ్య దైవ
గ్రంథము తెలియవలసియున్నది. అదే విధముగా ఇద్దరు గురువులు ఎవరో తెలియవలసియున్నది.
ఖుర్ఆన్ గ్రంథమును చరిత్ర ప్రకారము 10-08-610 సంవత్సరము జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి
చెప్పను ప్రారంభించాడు. అప్పటినుండి 23 సంవత్సరములు ఖుర్ఆన్ గ్రంథము యొక్క బోధ కొనసాగింది. ఖుర్ఆన్
గ్రంథము ప్రారంభమయినప్పుడు ముహమ్మద్ ప్రవక్తగారి వయస్సు 40 సంవత్సరములు. ఆయన 63 సంవత్సరముల
వయస్సులో చనిపోయాడు. దానిప్రకారము 23 సంవత్సరములు ఖుర్ఆన్ బోధ జరిగినది. ప్రవక్తగారి చివరి దినములలో
ఖుర్ఆన్ు తయారు చేయడము జరిగినది. ముహమ్మద్ ప్రవక్తగారు ఖుర్ఆన్ గ్రంథమునకు లేక ఖుర్ఆన్ జ్ఞానమునకు
ప్రవక్తగాయున్నాడని తెలియుచున్నది. ఒక జ్ఞానము చెప్పిన వానిని ప్రవక్తయని అనవచ్చును, బోధకుడుయని అనవచ్చును
గానీ, గురువు అని అనకూడదు. గురువు అనుటకు ప్రత్యేకత యుండాలి. ఒక్కొక్క మతమునకు ప్రవక్తగానీ, బోధకుడుగానీ
ఉండవచ్చును. అయితే ఒక మతమునకు గురువు ఎప్పటికీ యుండడు. ఒక మతమునకు సంబంధించినవాడు
గురువు కాడు. గురువు అన్ని మతములకు సంబంధించిన వాడుగాయుండును. ఒక మతమునకు బాధ్యులుగా లేక
మత పెద్దగా, ఒకరు ఉండి వారి పేరుమీద మతము ఆధారపడియుండును. ఆ మతములోని వారందరూ మతపెద్ద
లేక మతబాధ్యుడు లేక మతప్రవక్త, లేక మతబోధకుడు ఎవడయివుంటాడో అతని పేరే చెప్పుకొనుచుందురు.
ఉదాహరణకు ఇస్లామ్ మతమును తీసుకొని ఆ మతస్థులను మీ మత ప్రవక్త ఎవరు? అంటే ఏమాత్రము ఆలస్యము
చేయకుండా ముహమ్మద్ ప్రవక్తయని చెప్పుదురు. ముహమ్మద్ ప్రవక్త చనిపోయినా మొదట ఆయన పేరేవుండుట
వలన ఇప్పటికీ ఆయనపేరే చెప్పుచున్నారు. తర్వాత కాలములో కూడా ఆయన పేరే చెప్పుదురు. బౌద్ధమతమును
గురించి ఆ మతస్థులను వారి ప్రవక్త లేక వారి బోధకుడు ఎవరు? అని అడిగితే వారు కూడా ఆ మతమును స్థాపించిన
గౌతమబుద్ధుని పేరు చెప్పుదురు. అట్లే క్రైస్తవులను మీ మతపెద్ద ఎవరు అనిగానీ, మీ మత ప్రవక్త ఎవరు అనిగానీ
అడిగితే ఆలోచించకుండా ఏసుప్రభువు అని చెప్పుదురు. అదే విధముగా ఒక మతము ఉన్నదంటే దానికి ఒక
బాధ్యుడు లేక ప్రవక్త యుండడము సహజమే. అయితే హిందూమతమునకు ఎవరు ప్రవక్త అంటే ఇతనేయని ఎవరూ
ధైర్యముగా చెప్పలేకపోవుచున్నారు. దానికి కారణము హిందూ మతము ఎప్పుడు పుట్టినదో, ఎవరు ఆ పేరు పెట్టారో
ఎవరికీ తెలియదు. అందువలన హిందూమతమునకు ప్రవక్తయున్నాడో! లేడో! కూడా తెలియదు.
ఒక్క హిందూ మతము తప్ప మిగతా మతములన్నిటికీ ప్రవక్తలు న్నారు. ఆ మతములు పుట్టిన సంవత్సరములు
కూడా ఉన్నాయి. నేడు హిందూమతము అనబడునది సృష్ట్యాదిలోనే “ఇందు” అను పేరుతో పుట్టినది. ఆ దినము
ఇందు అనునది ఒక మతముగా ఉండేదికాదు. ఆనాడు దేశములోని ప్రజలనందరినీ ఇందువులు అనెడివారు. ఇందువులు
అంటే జ్ఞానులు అని అర్థము గలదు. కృతయుగములోనే ప్రపంచ వ్యాప్తముగా అన్ని దేశములలోనూ హిందువులు
ఉండేవారు. మొదట ప్రపంచ వ్యాప్తముగా ఇందువులుండెడివారు అనుటకు ఆధారము కూడా కలదు. అలాయున్న
కృతయుగములో నుండి కాలక్రమేపీ ప్రపంచ వ్యాప్తముగా యున్న ఇందువులు లేకుండాపోయి, అజ్ఞానులు తయారై
చివరకు ఇందుత్వము లేని మతములను స్థాపించుకోవడము జరిగినది. కొన్ని దేశములలో ఏ మతమూ లేకుండా
ఉండేది. ఇందుత్వము మొదట పుట్టినది భారతదేశములోనే, అందువలన మిగతా అన్ని దేశములలో ఇందుత్వము
లేకుండా పోయినా, భారతదేశము కేంద్రముగా ఇందుత్వము ఇంకా నిలిచియున్నది. అయితే నేడు ఇందుత్వము లేక
ఇందూ సమాజము కాస్త పేరు మార్చుకొని హిందూమతముగా తయారయినది. నేడు ఇందుత్వము హిందూమతముగా
పేరుమార్చుకొనినా, చరిత్ర తెలిసిన మాలాంటివారు, మేము మరికొందరు, హిందూ పదమును ఒప్పుకోకున్నా,
మనము హిందువులము కాదు, ఇందువులము అని చెప్పినా, చరిత్రహీనులు మా మాటను లెక్కచేయకుండా తమను
హిందువులుగానే చెప్పుకొంటున్నారు. ముందుయుగములలో లేని అజ్ఞానము కలియుగములో ఉండుట వలన, పూర్వమున్న
ఇందూసమాజము లేకుండాపోయి, హిందూమతము తయారయి దానితో సహా దాదాపు పదకొండు మతములు
క్రొత్తగా తయారయినవి. ఇందూసమాజము తర్వాత ఇందువులు హిందూవులుగా తయారుకాగా, తర్వాత 1) క్రైస్తవ
మతము 2) ఇస్లామ్ మతము 3) బౌద్ధమతము 4) సిక్కు మతము 5) జైన మతము 6) షింటో మతము 7) జొరాస్ట్రియన్
మతము 8) బాహాయిమతము 9) జుడాయిజమ్ మతము (యూదులమతము) 10) టావో మతము 11) కన్ఫ్యూషియస్
అను మతములు తయారయినవి.
హిందూమతము తర్వాత తయారయిన పదకొండు (11) మతములను కలిపితే మొత్తము ప్రపంచవ్యాప్తముగా
పన్నెండు (12) మతములు కలవు. పదకొండు మతములలో ముఖ్యమైనవి మూడు మతములే గలవు. అవియే
1) హిందూ (ఇందూ), 2) ఇస్లామ్, 3) క్రైస్తవము. ఈ మూడూ ఆధ్యాత్మికరీత్యా ముఖ్యమైన మతములని చెప్పవచ్చును.
ఎందుకనగా మూడు మతములు ఒకే సృష్టికర్తను గురించి చెప్పుచున్నవి. మతముల పేర్లు, ప్రవక్తలు వేరయినా
వాటిలోయున్న మూలజ్ఞానము ఒక్కటే. అందువలన మూడు మతములను ముఖ్యమైన వాటిగా చెప్పవచ్చును. మిగతా
మతములు ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో ప్రయాణించుచున్నవి. కనుక వాటిని గురించి చెప్పలేదు. మిగతా మతములలోని
సారాంశముకంటే, జ్ఞానముకంటే ఇందూ, ఇస్లామ్, క్రైస్తవము అను మూడింటిలో ఎక్కువ జ్ఞానము, జ్ఞానశక్తి యున్నది.
కావున వాటిని గురించే ఎక్కువగా చెప్పుచున్నాము. మొత్తము ప్రపంచ వ్యాప్తముగా పన్నెండు మతములుండగా
వాటిలో 1) ఇందూయిజమ్ 2) జైనిజమ్, 3) సిక్కిజమ్, 4) బుద్ధిజమ్ అను నాలుగు భారతదేశములోనే పుట్టినవే.
మిగతా ఎనిమిదిలో రెండు చైనాలో పుట్టినవి. వాటిలో ఒకటి టావోయిజమ్, రెండు కన్ఫ్యూషియనిజమ్. ఇవికాక
మిగతా ఆరులో క్రైస్తవము మరియు జుడాయిజమ్ (యూదు మతము) ఇజ్రాయెల్ దేశములో పుట్టగా, ఇస్లామ్ మతము
అరబ్ దేశమయిన మక్కాలో పుట్టినది. మిగతా మూడులో షింటో మతము జపాన్లో పుట్టినది. జొరాస్ట్రియన్ మతము
మరియు బహాయిజమ్ రెండు మతములు ఇరాన్ (పర్షియా) దేశములో పుట్టినవి. ప్రపంచములోని పన్నెండు మతములలో
నాలుగు భారతదేశములోనే పుట్టినవి. రెండు చైనాదేశములో పుట్టినవి. రెండు ఇజ్రాయెల్ పుట్టినవి. రెండు ఇరాన్లో
పుట్టినవి. మిగతా రెండిటిలో ఒకటి జపాన్లో, మరొకటి అరబ్ దేశములో పుట్టినవి. ఇవన్నియూ ఏదో ఒక విధముగా
దేవుడున్నాడని చెప్పు మతములు కాగా, దేవుడు లేడని చెప్పు మతము కూడా కలదు. దానినే నాస్తిక మతము
అంటారు. నాస్తిక మతమునకు కూడా పుట్టుక భారతదేశమే అని తెలియవలెను.
1) క్రైస్తవ మతము.
1) మతము పేరు :క్రైస్తవ మతము
-
2) పుట్టిన దేశము :- ఇజ్రాయెల్ దేశము
3)పుట్టిన *సం|| - 30సం|| క్రీస్తుతర్వాత
4) మత ప్రవక్త - ఏసు
5) మత జనాభా - 210 కోట్లు
6) మత స్థానము - ప్రథమ స్థానము
7)వీరి దేవుడు : యెహావా.
8)విగ్రహారాధన లేదు.
9)స్వర్గ,నరకముల నమ్మకమున్నది.
10) జనన మరణముల నమ్మకము లేదు.
11) చర్చిలో ప్రార్థన చేయడము వీరి ఆరాధన.
12) బాప్తిస్మము వీరి ఉపదేశము.
2) ఇస్లామ్ మతము.
1) మతము పేరు - ఇస్లాం మతము
2) పుట్టిన దేశము - అరబ్ దేశము
3) పుట్టిన సం॥ - 622సం|| క్రీస్తుతర్వాత *
4) మత ప్రవక్త - ముహమ్మద్
5) మత జనాభా - 160 కోట్లు
6) మత స్థానము - ద్వితీయ స్థానము
7) ఏకేశ్వరోపాసన తప్ప, ఏమీ లేదు.
8)విగ్రహారాధన లేదు.
9) స్వర్గ నరకముల నమ్మకమున్నది.
10) జనన మరణములను నమ్మరు.
11) నమాజ్, జకాత్, వీరి ప్రార్థనా భాగములు.
12) మోక్షము గురించి తెలియదు.
8)
3) హిందూమతము
1) మతము పేరు - హిందూమతము
2) పుట్టిన దేశము - భారత దేశము
3) పుట్టిన సం॥ - ఎవరికీ తెలియదు
4) మత ప్రవక్త - దేవుడే ఎవరో తెలియదు.
5) మత జనాభా - 100 కోట్లు
6) మత స్థానము - తృతీయ స్థానము
7) దేవుడున్నాడని చెప్పుదురు.
8) విగ్రహారాధన ఉంది. దేవతల మీద భక్తి గలదు.
9) స్వర్గ, నరకముల నమ్మకమున్నది.
10) కర్మసిద్ధాంతము కలదు. వీరి గమ్యము మోక్షము.
11) జనన మరణములున్నాయని నమ్ముతారు.
12) యజ్ఞయాగాదులు, తపస్సులు, ధ్యానములు చేయుదురు.
4) బౌద్ధ మతము.
1) మతము పేరు - భౌద్ధమతము
2) పుట్టిన దేశము - భారత దేశము
3) పుట్టిన సం - -560సం|| క్రీ.పూర్వము
4) మత ప్రవక్త - గౌతమ బుద్ధుడు
5) మత జనాభా -36 కోట్లు
6) మత స్థానము - నాల్గవ స్థానము
7)దేవుడు ఉన్నాడని నమ్మరు.
8) వీళ్ళ బోధలో మనిషిని ప్రేమించండి, ఆశ మరియు కోపము వదలుకోమని ఉంటుంది.
9)ఈ జన్మలో చేసిన మంచి చెడు కార్యాలకు, వచ్చే జన్మలో అనుభవించాల్సింది ఉంటుంది.
10) నిర్యాణమ్ (మోక్షమ్) అనుస్థితిని చేరుకోవడం ముఖ్యగమ్యం, అప్పుడు మళ్ళీ జన్మించడం, అనుభవించడం
ఉండదు.
5) సిక్కు మతము.
1) మతము పేరు - సిక్కుమతము
2) పుట్టిన దేశము - భారత దేశము.
3) పుట్టిన సం॥ - 1500సం|| క్రీ॥తర్వాత
4) మత ప్రవక్త - గురునానక్
5) మత జనాభా - 2 కోట్ల 30 లక్షలు
6) మత స్థానము - ఐదవ స్థానము
7)ప్రపంచానికి ఒక్కడే దేవుడు.
8) దేవుడు ఎప్పుడు ప్రపంచములో కలిసివుండి, ప్రపంచాన్ని నడిపిస్తుంటాడు.
9) దేవునికి ఎటువంటి ఆకారం లేదు.
10) కర్మవల్లే జన్మలు ఉన్నాయి.
11) దేవుని గురించి తెలుసుకొని, ఐక్యం అయితే, మళ్ళీ జన్మ ఉండదు.
12) ఎల్లప్పుడు దేవుని ధ్యాసను పెట్టుకోవడం, సమాజంలో మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచి చేయడం ముఖ్య
కర్తవ్యం.
6) టావో మతము.
1) మతము పేరు - టావోమతము
2) పుట్టిన దేశము - చైనా
3) పుట్టిన సం॥ -550సం|| క్రీ.పూర్వము
4) మత ప్రవక్త - లావోట్టు
5) మత జనాభా - 2 కోట్లు
6) మత స్థానము - ఆరవ స్థానము
7)టావో అంటే దారి.
8)ఉన్నత శక్తి అనునది ఒకటి ఉంది, దానిని వర్ణించలేము.
9)ఆ శక్తినే టావో అంటాము.
10) ప్రపంచం అంతా 'యిన్' (చెడు) మరియు 'యాంగ్' (మంచి) శక్తితో సమతూకంగా ఉంది.
7) జుడాయిజమ్ (యూదు మతము).
1) మతము పేరు - జుడాయిజమ్
2) పుట్టిన దేశము - ఇజ్రాయెల్
3) పుట్టిన సం|| -1300సం|| క్రీ. పూర్వము
4) మత ప్రవక్త - 1) అబ్రహామ్,2) ఇస్సాక్,3) జాకోబ్
5) మత జనాభా - 1 కోటి 40 లక్షలు
6) మత స్థానము - ఏడవ స్థానము
7) ఒకే దేవుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడో వర్ణించలేము.
8) మోసెస్ ముఖ్యప్రవక్త, మోసెస్ వ్రాసినది తొరాహ్ దైవగ్రంథము.
9)దేవుడు అందరినీ గమనిస్తూ, చెడు చేసేవారికి శిక్ష, మంచి చేసేవారికి బహుమానం చేస్తాడు.
10) దేవుడు ఇచ్చిన 10 కమాండ్మెంట్సు (ఆజ్ఞలు) ద్వారా దేవుని దగ్గరికి చేరుకోవచ్చు.
11) కొంతమంది ఏసుప్రభువుని దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత అని నమ్ముతారు, కొంతమంది ఒప్పుకోరు.
8) బాహాయి మతము .
1) మతము పేరు- - బాహాయి మతము
2) పుట్టిన దేశము - ఇరాన్
3) పుట్టిన సం॥ 1863సం|| క్రీ.తర్వాత
4) మత ప్రవక్త - బహా ఉల్లాహ్
5) మత జనాభా - 70 లక్షలు
6) మత స్థానము ఎనిమిదవ స్థానము
7)ఒకే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు.
8)దేవుడు సర్వశక్తులు కలిగి, ఆరంభం, అంతు లేకుండా ఉన్నాడు.
9) కృష్ణ, ఏసుప్రభువు, మోసెస్, మహమ్మద్ ప్రవక్త, బుద్ధ అందరూ దేవుని గురించి తెలియచేయడానికి వచ్చిన దూతలు.
10) దేవుడిని చేరుకోవాలంటే దూతలు చెప్పినట్లు అనుసరించాలి.
11) అన్ని మతాలు ఒకే భావం మీద ఏర్పడినవి, భవిష్యత్తులో అన్ని మతాలు ఒక్కటే అవుతాయి అని నమ్ముతారు.
12) ఈ మత సంస్థాపకుడు బహై. ఉల్లాని దేవుడి దూత అని నమ్ముతారు.
9) కన్ఫ్యూషియస్ మతము.
1) మతము పేరు - కన్ఫ్యూషియస్
2) పుట్టిన దేశము - చైనా
3) పుట్టిన సం॥ 520సం|| క్రీ. పూర్వము
4) మత ప్రవక్త - కన్ఫ్యూషియస్
5) మత జనాభా - 60 లక్షలు
6) మత స్థానము - తొమ్మిదవ స్థానము
7)ఈ మతములో దేవుని గురించి ఎటువంటి మాట లేదు.
8)ఈ మతంలో కేవలం నీతిని బోధిస్తుంది.
10) జైన మతము.
1) మతము పేరు - జైన మతము
2) పుట్టిన దేశము - భారత దేశము
3) పుట్టిన సం॥- 550సం|| క్రీ. పూర్వము
4) మత ప్రవక్త - వర్థమాన మహావీర
5) మత జనాభా - 42 లక్షలు
6) మత స్థానము - దశమ స్థానము
7)ఈ మతంలో దేవుడు అనే ప్రత్యేక శక్తిని గురించి చెప్పారు.
8) అందరిలో ఆత్మ ఉంది, ఆ ఆత్మకి అన్ని తెలుసు.
9)వస్తువులకు దుమ్ము అంటుకున్నట్లు, ఆత్మకి కర్మ అంటుకుంది.
10) కర్మలు లేకుండా చేసుకున్న మనుషులని వాళ్ళకంటే పెద్దగా పూజిస్తారు.
11) షింటో మతము.
1) మతము పేరు - షింటో మతము
2) పుట్టిన దేశము - జపాన్
3) పుట్టిన సం॥ - 6వ.శ. క్రీ.పూర్వము
4) మత ప్రవక్త - తెలియదు
5) మత జనాభా - 40 లక్షలు
6) మత స్థానము - ఏకాదశ స్థానము
7) ప్రత్యేక దేవుడు అంటూ ఎవరూ ఉండరు.
8)‘కామి' అని పిలువబడే అదృశ్యశక్తులు జంతువులలోను, చెట్లలోనూ, కొండలలోనూ, మనిషిలోనూ ఉంటుంది.
9)'కామి'ని కొన్ని వ్యక్తుల రూపంలో చూపించి, వారినే దేవతలుగా పూజించారు.
12) జొరాస్ట్రియన్ మతము.
1) మతము పేరు – జొరాస్ట్రియన్
2) పుట్టిన దేశము - ఇరాన్ (పర్షియా)
3) పుట్టిన సం॥ - 6వ శతాబ్ధం,క్రీ.పూర్వము
4) మత ప్రవక్త -- జొరాస్టర్
5) మత జనాభా - 26 లక్షలు
6) మత స్థానము - చివరి స్థానము,ద్వాదశ స్థానము.
7)ఈ మతములో 'అహుర మజ్జా' ని దేవుడు అని చెప్తారు.
9)'అంగ్రవమైన్యు' అను మరొక శక్తి, “ఆహురమజ్జా" కి వ్యతిరేఖంగా ఉంది.
10) మంచి పనులు చేస్తే స్వర్గానికి, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు.
ఈ విధముగా మొత్తము ప్రపంచమంతా పన్నెండు మతములు వ్యాపించియున్నవి. అన్ని దేశములలోనూ
నాస్తిక మతము అనునది కూడా ఒకటి కలదు. నాస్తికమతములో దేవుడు లేడని వాదించడమే వారి పనిగా యున్నది.
పన్నెండు మతములలో బౌద్ధము తప్ప మిగత మతములు దేవుడున్నాడని వాదములు సలుపుచూ, వారివారి భావములను
వేరువేరు రూపములలో వెలిబుచ్చుట వలన, వారి భావమునుబట్టి వేరువేరు మతములుగా చెప్పబడుచున్నవి.
ఉదాహరణకు కదలని రాయినే దేవునిగా ఆరాధించవలెననీ, రాయిలో ఏ గుణ భావములు లేవు కావున, రాయిని
దేవునిగా భావించి పూజించవలెనని ఒకడు చెప్పగా వానిది రాయిమతమనీ, ప్రత్యేక మతమని పేరుపెట్టడము జరిగినది.
తర్వాత ఇంకొకడువచ్చి రాయిని రప్పను దేవునిగా భావించకూడదు. ప్రాణము లేని దానిని దేవుని గుర్తుగా పెట్టకూడదు.
ప్రాణమున్న దానినే దేవుని గుర్తుగా పెట్టవలెనని ఒక జంతువును దేవుని గుర్తుగా పెట్టాడనుకొనుము. అప్పుడు వాని
మతమువేరనీ, వానిది జంతువుమతమని అందురు. ఇంకొకడు వచ్చి దేవునితో సమానముగా ప్రపంచములో ఏదీలేదు.
దేవునితో సమానముగా దేనినీ ఉంచకూడదు. దేవుడు అన్నిటికంటే గొప్పవాడు, దేవుడు అన్నిటికంటే అతీతుడు,
అందువలన రాయినిగానీ, జంతువునుగానీ పూజించెడివారు అజ్ఞానులగుదురు. అందువలన నిరాకారమునే పూజించ
వలెననీ ఒకడు చెప్పగా, అప్పుడతనిది నిరాకార మతమనీ పిలువబడెను. ఈ విధముగా ప్రపంచ వ్యాప్తముగాయున్న
పన్నెండు మతములు పన్నెండు దారులను చూపుచున్నవి. అలా పన్నెండుమంది ప్రవక్తలు పన్నెండు దారులు చూపడమేకాక,
నా దారియే గొప్పదని ఒక ప్రవక్త అంటే, లేదు అందరికంటే నా దారే గొప్పదని మరొకప్రవక్త అనుచున్నాడు. ఈ
విధముగా పన్నెండు మంది పన్నెండు మతములను ఏర్పరచడము జరిగినది. ప్రస్తుతము భారత దేశములో పన్నెండు
మతములు లేకున్నా ఐదారు మత ప్రజలన్నాయున్నారు. అన్నిటికంటే ముఖ్యముగా మూడు మతములున్నాయి. హిందూ,
ఇస్లామ్, క్రైస్తవము అను మూడు మతములు భారతదేశములో ఎక్కడయినా కనిపించ గలవు.
జనాభాలోగానీ, జ్ఞానములోగానీ, హిందూ, ఇస్లామ్, క్రైస్తవము అను మూడు మతములే మిగతా అన్ని
మతములకంటే ముందంజలో యున్నాయి. మొదటి మూడు స్థానములను ఈ మూడు మతములే ఆక్రమించాయి.
మూడింటియందు క్రైస్తవము జనాభాలో ప్రథమ స్థానమున యుండగా, రెండవ స్థానముగా ఇస్లామ్ మతము గలదు.
మూడవ స్థానములో హిందూమతము గలదు. ఈ మూడు స్థానములలోయున్న మత గ్రంథములలో మూడవ
స్థానములోయున్న హిందూమతమునకు సంబంధించిన భగవద్గీత జ్ఞానములో ప్రథమ దైవగ్రంథముగా యున్నది.
మొదటి స్థానములోయున్న క్రైస్తవ మతగ్రంథము అయిన బైబిలు ద్వితీయ స్థానములోయున్నది. మధ్యస్థానములోయున్న
ఇస్లామ్ మతము యొక్క గ్రంథము ఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథముగా మూడవ స్థానములో యున్నది.
పన్నెండు మతములలో ఒక్క హిందూమతము పేరు మారియున్నది. మిగతా పదకొండు మతములు పుట్టినప్పుడు
పెట్టబడిన పేరుతోనేయున్నవి. ఒకే ఒక్క ఇందుత్వము లేక హిందూ సమాజము పేరుమార్చుకొని నేడు హిందూమతముగా
యున్నది. అది పేరుమార్చుకోలేదుగానీ మనుషులే దాని పేరును మార్చారు. ఎంతో గొప్ప అర్ధముతో కూడుకొన్న
పేరుపోయి, చివరకు అర్థములేని పేరు ఇందువులకు వచ్చి హిందువులుగా పిలువ బడుచున్నారు. ఇందువులు అంటే
జ్ఞానులు లేక జ్ఞానశక్తి కలవారు అని అర్థముండేది. అంతగొప్ప అర్థమున్న పేరు లేకుండాపోయి అర్థములేని పేరు
తగులుకొన్నది. నేడు పేరుమార్చుకొన్న హిందూమతము తప్ప మిగతా పదకొండు మతములు కలియుగములో
పుట్టినవే. ఒక్క హిందూమతము అనబడు ఇందూసమాజము నాలుగు యుగములకంటే ముందు ఎప్పుడు తయారయినది
ఎవరికీ తెలియదు. ఇందూ అను పేరు సృష్ట్యాదిలోనే వచ్చినది కావున హిందూమతము సృష్ట్యాదిలోనే పుట్టినదని
చెప్పవచ్చును. అయితే సృష్ట్యాది ఎప్పుడయినది ఎవరికీ తెలియదు. అందువలన హిందూమతము (ఇందూ సమాజము)
ఎప్పుడు పుట్టినది ఎవరికీ తెలియదు. దీనినిబట్టి ఇప్పుడున్న అన్ని మతములకంటే ఎంతో ముందు పుట్టినది, ఎంతో
అనుభవమున్నది హిందూమతమని తెలిసిపోవుచున్నది.
హిందూమతము ఎప్పుడు పుట్టినదో తెలియనట్లే దీనికి ప్రవక్త ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ప్రవక్తలేని
మతము మొదట భూమిమీద ఎలా వచ్చినదో, ఎవరు దానిని తెచ్చారో గమనించి చూద్దాము. నేడు హిందూమతముగా
యున్నది పూర్వము కలియుగముకంటే ముందే “ఇందూ సమాజము” అను పేరుతో యుండేది. సమాజము అంటే
సమముగా పుట్టినదని అర్థము. ఆనాడు ఇందువులందరూ సమానముగా, అందరూ సమాన జ్ఞానులైయుండెడివారు.
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము మూడు యుగములలో ఇందూసమాజముగాయున్న ఇందుత్వము
కలియుగములో మూడువేల సంవత్సరములు గడచిన తర్వాత, ఇందూ సమాజము పేరుమారిపోయి హిందూమతముగా
తయారయినది. మతమునకు ప్రవక్తయుంటాడు. మతముకాని దానికి ప్రవక్తయుండడు. మతము ప్రవక్తద్వారా
సృష్టించబడి, ప్రవక్త ద్వారా బయట ప్రచారమగు చున్నది. అయితే మొదట మతమేకాని ఇందుత్వమునకు ప్రవక్త
ఎవరూ లేరు. అయితే ఇందుత్వము అనేది ఎట్లు వచ్చినది అని ప్రశ్నించుకొని చూస్తే ఇందుత్వము అనేది దైవజ్ఞానము
అయినందున దానిని దేవుడే చెప్పాడని మనము చెప్పవచ్చును. మతము అనునది పూర్తి దైవజ్ఞానము కాకుండా,
దైవజ్ఞానముతో కలిసిన ప్రకృతి సాంప్రదాయములతో కూడినదై యున్నది. దైవజ్ఞానముకొంత, ప్రకృతి జ్ఞానము చాలా
కలిసియున్న దానిని మతము అనవచ్చును. నేడు కలియుగములో తయారైన పదకొండు మతములు కొంత దైవజ్ఞానము,
పెద్దింత ప్రపంచ జ్ఞానము కలిసి తయారైనవని చెప్పవచ్చును. ఇందూ సమాజము కృతయుగములో తయారై నప్పుడు
అంతా దైవజ్ఞానముతో నిండుకొనియుండెడిది. కలియుగములో మతముగా మారిన తర్వాత కొంత జ్ఞానరూపములోయున్నా,
ప్రకృతి జ్ఞానము కూడా కలిసి మతమునకు తగినట్లు తయారైనది.
సృష్ట్యాదిలోనే తయారయిన ఇందూసమాజము పూర్తి ఇందూ ధర్మములతో కూడుకొన్నదై తయారయినది. ఆనాడు
ఇందూ ధర్మములను నెలకొల్పి, ఇందూసమాజమును తయారు చేసినవాడు, ప్రపంచమునకు ఆదిగురువుగా
లెక్కింపబడుచున్న సూర్యుడేయని చెప్పవచ్చును. సూర్యుడు ఒక గ్రహము అయివుండియూ ఆనాడు ఆకాశవాణి నుండి
వచ్చిన జ్ఞానమును గ్రహించగలిగాడు. దేవుడు సూర్యుని ద్వారా ప్రపంచమునకు జ్ఞానము తెలియాలి అను ఉద్దేశ్యముతో
ఆకాశవాణి ద్వారా జ్ఞానమును సూర్యునకు తెలియజేశాడు. సూర్యుడు వాణి ద్వారా వచ్చిన జ్ఞానమును గ్రహించి, తాను
గ్రహించిన జ్ఞానమును మొట్టమొదట భూమిమీద మనువు అను వ్యక్తికి తెలియజేశాడు. అలా భూమిమీద మనుషులకు
జ్ఞానమును అందించిన మొదటివాడు సూర్యుడు. అందువలన సూర్యున్ని ఆ దినములలో ఆదిగురువు అని పిలిచెడివారు.
గురువునకు నమస్కరించవలెనను సాంప్రదాయమునకు అనుగుణముగా, ఆదిగురువైన సూర్యునికి మొదటి శిష్యులయిన
మానవజాతియంతయూ సూర్యునకు ఉదయము నమస్క రించెడి వారు. దానినే సూర్యనమస్కారము అను పేరుతో
చెప్పెడివారు. సూర్యుడు మానవజాతికి ఆదిగురువు అను భావముతో మనుషులందరూ పూర్వము సూర్యునకు ప్రతి
ఉదయమూ నమస్కరించెడివారు. ఉదయమే సూర్యనమస్కారము చేయు సాంప్రదాయము (50) యాభై సంవత్సరముల
క్రిందట కూడా యుండేది. ప్రస్తుత కాలములో సూర్యనమస్కారములు చేయు వారే కనిపించకుండా పోయారు.
ఇందుత్వము హిందూమతముగా మారిపోయిన తర్వాత మనుషులలోని జ్ఞానము కూడా మారిపోయి పూర్వమున్న
జ్ఞానులు నేడు మతస్థులుగా మారిపోయారు.
అంతిమ దైవగ్రంథములో 42వ సూరా, 51వ ఆయత్లో చెప్పిన వాక్యమును అనుసరించి చూస్తే “దేవుడు
ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడకుండానే తన జ్ఞానమును భూమిమీదయున్న ప్రజలకు మూడు విధముల
తెలియజేయును" అని ఉన్నది కదా! దానిప్రకారము ఒకటి వాణి ద్వారా జ్ఞానమును తెలియజేస్తాను అని అన్నాడు. ఆ
మాట ప్రకారము ఆకాశవాణి ద్వారా సూర్యునికి జ్ఞానమును తెలియజేశాడు. దేవుడు చెప్పిన మూడు విధానములలో
ఒక విధానమును సృష్ట్యాదిలోనే నెరవేర్చాడు. ఇక మిగిలినవి రెండు విధానములు. అందులో తెరచాటునుండి
జిబ్రయేల్ దేవుని జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తకు చెప్పినట్లు చెప్పుకొన్నాము. అప్పుడు అక్కడ ఒక గ్రంథము, ఒక
బోధకుడు తెలిసిపోయినట్లు కూడా చెప్పుకొన్నాము. దేవుడు తెల్పిన మూడు విధానములలో రెండు విధానముల ద్వారా
జ్ఞానము చెప్పినప్పటికీ చివరకు మనకు బయటపడినది ఒక బోధకుడు, ఒక గ్రంథము మాత్రమే. ఇక దేవుడు
తెలియజేయవలసిన విధానము ఒకటి మాత్రము మిగిలియున్నది. అయితే ఇక్కడ కొందరికి ఒక ప్రశ్నవచ్చి వారు ఇలా
అడుగవచ్చును. అదేమనగా! దేవుడు ఆకాశవాణి ద్వారా తన జ్ఞానము తెలియజేసినప్పుడు వినిన సూర్యుడు భూమిమీద
ప్రజలకు ఆ జ్ఞానమును తెలియజేశాడు కదా! ఆ విధముగా తెలియజేసిన సూర్యున్ని మీరు ఆదిగురువుగా ప్రజలు
లెక్కించి ప్రతి దినము ఉదయము సూర్యునికి నమస్కరించేవారని మీరే చెప్పారు కదా! అప్పుడు చెప్పిన మీ మాటప్రకారము
సూర్యుడు ఒక గురువుగా బయట పడినాడు కదా! దీనిప్రకారము ఇప్పటికి ఒక బోధకుడు, ఒక గురువు, ఒక గ్రంథము
తెలిసిపోయినది. ఇక తెలియవలసినది ఒక గురువు, రెండు గ్రంథములు మాత్రమేననీ. అట్లుకాకుండా మీరు ఇద్దరు
గురువులు తెలియవలసి ఉందనీ, ఇంతవరకు తెలిసినది ఒక బోధకుడు, ఒక గ్రంథము మాత్రమే అన్నారు. మీరు
చెప్పినట్లు తెలిసినది ఒక గ్రంథము, ఒక బోధకుడు అయితే సూర్యుడు ఎక్కడకు పోవాలి? సూర్యున్ని ఆదిగురువని
ప్రజలు మ్రొక్కినప్పుడు అతను గురువుగా లెక్కించబడును కదా!యని ప్రశ్నించ వచ్చును. దానికి మా జవాబు ఈ
విధముగా కలదు.
ఇక్కడ ఒక సూత్రమును ఉపయోగించి గురువును గుర్తించ వచ్చును. అట్లే సూర్యుడు గురువో, కాదో కూడా
లెక్కించవచ్చును. సూర్యుడు ప్రజలకు జ్ఞానము తెలియజేసిన మొదటి గురువని ఆనాడు ప్రజలు భావించారు. అయితే
ప్రజల భావము సరియైనదేనని చెప్పలేము కదా! ఎందుకనగా గురువును గుర్తించుట చాలా కష్టము. అందువలన
అప్పటి ప్రజల భావన తప్పుకావచ్చును, ఒప్పుకావచ్చును. దానివలన మనము సూర్యుడు గురువా! కాదా! యని
విశధీకరించి చూస్తే, సూర్యుడు తాను వినిన బోధను చెప్పాడుగానీ, తాను స్వయముగా జ్ఞానమును చెప్పలేదు కదా!
విని ఇతరుల ద్వారా తెలుసుకొన్న జ్ఞానమును తిరిగి చెప్పినవాడు బోధకుని క్రిందికి జమకట్టబడును. అందువలన
భూమిమీద అందరికంటే ముందు జ్ఞానమును చెప్పినా, సూర్యున్ని గురువు అనుటకు వీలులేదు. పద్ధతి ప్రకారము
సూర్యున్ని బోధకుడు అని చెప్పవచ్చునుగానీ, గురువు అని చెప్పకూడదు. అందువలన మనకు ఇంకా ఇద్దరు గురువులు
తెలియవలసియున్నదని చెప్పుకొన్నాము.
సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పినప్పుడు ప్రజలు జ్ఞానమును తెలుసుకోగలిగారు. కృతయుగములోనే
భారతదేశములోని ప్రజలు పూర్తి దైవజ్ఞానము కలవారనీ, దైవశక్తి కలవారనీ పేరుపొందారు. ఆ కాలములో భారతదేశములో
అందరూ జ్ఞానులే ఉండుట వలన అప్పుడు భారత దేశమును ఇందూదేశము అని ఇతర దేశస్థులు పిలిచెడివారు.
అయినా కాలక్రమేపీ అజ్ఞానము పెరుగుతూ పోయి, జ్ఞానము తగ్గుతూవచ్చి, ద్వాపర యుగము చివరిలో ఆదిలో
సూర్యుడు చెప్పిన జ్ఞానమునంతటినీ తెలియకుండా పోయారు. జ్ఞానులుగాయున్నవారు చనిపోయే కొలదీ, అజ్ఞానులు
పుట్టేకొలదీ, మార్పు చెందుతూవచ్చి చివరికి పూర్తి జ్ఞానము తెలియనిస్థితికి మనిషి చేరుకొన్నాడు. అటువంటి పరిస్థితిలో
దేవుడు తన మూడవ విధానము ప్రకారము భూమిమీద మనుషులకు తిరిగి తన జ్ఞానమును తెలియజేశాడు. మూడవ
విధానము ప్రకారము దేవుడు తన దూతను పంపి ప్రజలకు జ్ఞానమును తెలియజేయడము చేయాలి. ఇక్కడ మరికొందరికి
ప్రశ్నవచ్చి నన్ను ఈ విధముగా అడుగవచ్చును. “మీరు జిబ్రయేల్ను గురించి చెప్పినప్పుడు, జిబ్రయేల్ తాను తెలుసుకొన్న
జ్ఞానమును ప్రవక్తకు చెప్పాడు అని చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు జిబ్రయేల్ అను దూతను పంపి ప్రవక్తకు జ్ఞానమును
తెలియజేశాడు అని వ్రాశారు. ఎక్కడ జిబ్రయేల్ మాట వచ్చినా అక్కడ జిబ్రయేల్ దూత అని చెప్పడము జరిగినది. జిబ్రయేల్ను దేవుని
దూతగా చాలామంది చెప్పగా విన్నాము. మీరు వ్రాసినప్పుడు జిబ్రయేల్ సూర్యుని వలె ఒక గ్రహము అని చెప్పారు. మీరు దూతయని
చెప్పకున్నా అతను దేవుని దూతయేనని మేము నమ్ముచున్నాము. దీనికి మీరేమంటారు?" అని ప్రశ్నించవచ్చును.
దానికి మా జవాబు ఈ విధముగా గలదు. దేవుడు తన దూతను పంపి జ్ఞానమును తెలియజేయడము
మూడవ విధానమగును. జిబ్రయేల్ గ్రహము దేవుని రెండవ విధానము ప్రకారము తెరచాటునవుండి మాట్లాడిన
వాడు మాత్రమే. జిబ్రయేల్ గ్రహము దేవుడు చెప్పిన రెండవ విధానము లోనికి వస్తాడు. ఒకవేళ ఇటువంటి
పొరపాటుపడుటకు అవకాశమున్నదనీ, జిబ్రయేల్ను దూతగా చెప్పకుండా మేము గ్రహముగానే చెప్పుకొంటూ వచ్చాము.
వాస్తవముగా జిబ్రయేల్ ఖగోళములోని ఒక గ్రహము. అతను ప్రత్యేకముగా దేవునివద్దనుండి పంపబడినవాడు కాడు.
జిబ్రయేల్ సూర్య గ్రహములాంటి ఒక గ్రహము మాత్రమే. దేవుని దూతకాడు. ఇక్కడ కూడా కొందరు ఒక ప్రశ్నను
అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! "సూర్యుడు కూడా జిబ్రయేల్లాగా ఒక గ్రహమే కదా! జిబ్రయేల్
గ్రహము జ్ఞానమును ప్రవక్తకు చెప్పినప్పుడు తెరచాటునుండి చెప్పిన విధానము నెరవేరినదియని చెప్పారు. అంతకుముందు
కృతయుగములోనే సూర్యుడు తాను గ్రహించుకొన్న జ్ఞానమును భూమిమీదికి వచ్చి, జిబ్రయేల్ ప్రవక్తకు చెప్పినట్లు,
మనువుకు చెప్పిపోయాడు కదా! సూర్యుడు గ్రహమే మరియు జిబ్రయేల్ గ్రహమే అయినప్పుడు గ్రహము అయిన
జిబ్రయేల్ ప్రవక్తకు చెప్పినప్పుడు తెరచాటునుండి చెప్పినట్లయితే, అదే విధముగా సూర్యుడు మనువుకు చెప్పినప్పుడు
కూడా తెరచాటునుండియే చెప్పినట్లగును కదా! జిబ్రయేల్ కలియుగములో చెప్పాడు, సూర్యుడు కృతయుగములోనే
చెప్పాడు. అలాంటప్పుడు ముందు చెప్పిన సూర్యున్ని తెరచాటునుండి చెప్పాడనకుండా, వెనుక చెప్పిన జిబ్రయేల్ను
మాత్రము తెరచాటునుండి ప్రవక్తకు చెప్పాడు అని ఎందుకంటున్నారు? దేవుడు చెప్పిన రెండవ విధానము తెరచాటు
నుండి జ్ఞానము చెప్పడము సూర్యగ్రహము దగ్గరే జరిగిపోయినది కదా! అటువంటిది సూర్యుని దగ్గర చెప్పకుండా
జిబ్రయేల్ దగ్గర జరిగినదని మీరు అంటున్నారు. దానివలన మాకు సూర్యుడు చెప్పినది తెరచాటునుండి చెప్పినట్లా!
లేక జిబ్రయేల్ చెప్పినది తెరచాటునుండి చెప్పినట్లా! అని ప్రశ్న వచ్చినది. దీనికి మీరేమంటారు! అని అడుగవచ్చును.
దానికి మా జవాబు ఈ విధముగా యున్నది చూడండి.
సూర్యగ్రహము కృతయుగములో మనువు అనే వ్యక్తికి చెప్పినా, అది తెరచాటునుండి చెప్పినట్లు పరిగణించబడదు.
జిబ్రయేల్ గ్రహము కలియుగములో ప్రవక్తకు చెప్పినప్పుడు అది మాత్రము మొదటిమారు తెరచాటునుండి చెప్పినట్లయినది.
అప్పుడు దేవుడు చెప్పిన రెండవ విధానము నెరవేరినది. సూర్యుడు గ్రహమే, జిబ్రయేల్ గ్రహమే అయినప్పుడు
సూర్యుడు చెప్పినప్పుడు తెరచాటు కానిది, జిబ్రయేల్ చెప్పినప్పుడు మాత్రమే తెరచాటునుండి చెప్పినట్లు ఎందుకయినదని
ప్రశ్నించడము సమంజసమే! అయితే సూర్యుడు, జిబ్రయేల్ ఇద్దరూ గ్రహములే అయినా సూర్యుడు చెప్పిన దానికీ,
జిబ్రయేల్ చెప్పిన దానికీ చాలా తేడాయున్నది. జిబ్రయేల్ గ్రహము ప్రవక్తకు ఏమాత్రమూ కనిపించకుండా చెప్పడము
జరిగినది. వినే ముహమ్మద్ ప్రవక్తకు చెప్పే వ్యక్తి (జిబ్రయేల్) ఏమాత్రమూ కనిపించలేదు. జిబ్రయేల్ చెప్పేమాట
మాత్రము ప్రవక్తగారికి వినిపించేది. అటువంటప్పుడు జిబ్రయేల్ తెరచాటునయుండి కనిపించక మాట్లాడి జ్ఞానమును
చెప్పినట్లయినది. దీనిని తెరచాటునవుండి చెప్పడము అంటే ఎవరూ కాదనలేరు. జిబ్రయేల్కు ముహమ్మద్ ప్రవక్తకు
మధ్య సంభాషణ మాత్రము జరిగినది గానీ, జిబ్రయేల్ ఎవరో! ఎట్లుంటాడో! ప్రవక్తగారికి తెలియదు. ప్రవక్త 23
సంవత్సరములు జిబ్రయేల్ జ్ఞానము వినినా ఏనాడూ జిబ్రయేల్ను చూడలేదు.
జిబ్రయేల్ ఖగోళములో ఒక గ్రహమైనందున అతనికి మానవ శరీరము లేదు. ఆయన శరీరము ఒక
గోళాకృతి గల గ్రహముగా యుండేది. జిబ్రయేల్ దేవుని పాలనలోని ఒక సేవకుడు. అందువలన అతనికివున్న
ప్రత్యేకత వలన స్థూల శరీరమును వదలి సూక్ష్మశరీరముతో ఎక్కడికయినా పోయిరావచ్చును. అటువంటి ప్రత్యేకత
అన్ని గ్రహములకూ ఉన్నది. గ్రహములకే కాదు గుడులలోని విగ్రహములకు కూడా అటువంటి అనుకూలము కలదు.
అందువలన గ్రహములుగానీ, విగ్రహములుగానీ తమ స్థూలశరీరమును వదలి బయటికి ఎంతదూరమయినా పోయి
రాగలవు. అదే విధానమును జిబ్రయేల్ ఉపయోగించుకొని నెలకొకమారు, రెండు మూడు నెలలకొకమారు, పది
రోజలకు ఒకమారు హీరా కొండ గుహలలోనికి వచ్చి ముహమ్మద్ ప్రవక్తగారికి జ్ఞానము చెప్పి పోయెడివాడు. ఒకమారు
క్రిందికి వచ్చినప్పుడు రెండు మూడు రోజులయినా క్రిందనేయుండి ప్రవక్తకు జ్ఞానము చెప్పెడివాడు. ప్రవక్తకు
చదువురానందున చెప్పినది వ్రాసుకొనుటకు వీలులేదు. చెప్పినది విని జ్ఞాపకము పెట్టుకోవలసిందే. ఎక్కువ విషయములు
చెప్పితే ప్రవక్తకు జ్ఞాపకము పెట్టుకోవడము కష్టమవుతుందని, జిబ్రయేల్ ప్రవక్తకు చెప్పినప్పుడంతా రెండు మూడు
విషయములకంటే ఎక్కువ చెప్పేవాడు కాదు. జిబ్రయేల్ భూమిమీదికి వస్తే వరుసగా పది పదిహేను రోజులు
భూమిమీదనే యుండి ప్రవక్తతో ప్రతి దినమూ మాట్లాడిన సందర్భములూ యున్నవి. అట్లే ఒక్కొక్కమారు మూడు,
నాలుగు నెలలు క్రిందికి రాని సందర్భములు కూడా ఉన్నాయి.
ఇక్కడ కొందరు తెలివైనవారు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! ఖుర్ఆన్ గ్రంథములో
మొత్తము 6236 వాక్యములు గలవు కదా! అన్ని వాక్యములు చెప్పుటకు ఎన్నిమార్లు జిబ్రయేల్ క్రిందికి రావలసియుండును?
మీరు చెప్పినట్లు రెండు మూడు నెలలకొకమారు క్రిందికి వచ్చిన సందర్భములు కూడా కలవని చెప్పారు కదా!
విధముగా వచ్చియుంటే 6236 వాక్యములు 23 సంవత్సరములలో చెప్పేదానికి సాధ్యమవుతుందా? అని ప్రశ్నించవచ్చును.
దానికి మా జవాబు ఈ విధముగా కలదు. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు మాత్రమే జ్ఞానమును చెప్పాడు. ముహమ్మద్
ప్రవక్తగారు జిబ్రయేల్ చెప్పిన రెండు లేక మూడు వాక్యములను విని జ్ఞాపకము పెట్టుకొని, సమీపములో యున్న మక్కా
నగరములోనికి పోయి, తనవద్దకు వచ్చు తన సహచరులకు కొందరికి ఆ వాక్యములను చెప్పెడివాడు. అక్కడికి వచ్చిన
ప్రవక్త అనుచరులు లేక సహచరులలో ఒకరు లేక ఇద్దరికి చదువు వచ్చెడిది. మిగతావారు ప్రవక్త వలె చదువురానివారే
యుండెడివారు. చదువురానివారు ప్రవక్త చెప్పిన వాక్యమును విని పోయెడివారు. చదువు వచ్చినవారు వాటిని
వ్రాసుకొని పోయెడివారు. జిబ్రయేల్ చెప్పినది ప్రవక్తకు అర్థమైయుండవచ్చునుగానీ, ప్రవక్త చెప్పినది మిగతా మనుషులకు
పూర్తిగా అర్థమైయుంటుందని చెప్పలేము. ప్రవక్త చెప్పిన విషయము కొందరికి 90 శాతము అర్ధమైయుంటే, కొందరికి
60 లేక 70 శాతము అర్థమైయుంటుంది. మరికొందరికి 10 లేక 20 శాతము కూడా అర్థమైవుంటుందని చెప్పలేము.
నేడు మనము ఒక విషయమును చెప్పితే విన్నవానికి మనము చెప్పినది చెప్పినట్లు కాకుండా కొద్దిగా అయినా వేరుగా
అర్థమై యుండును. అదే విధముగా ప్రవక్త చెప్పిన విషయములు మిగతా వారికి నూటికి నూరుపాళ్ళు అర్థమై యుంటుందని
చెప్పలేము. 23 సంవత్సరములు జిబ్రయేల్ నుండి వినిన జ్ఞానమును ఖుర్ఆన్ రూపముగా ప్రవక్తగారు వ్రాయలేదు.
ఆయన చెప్పగా వినినవారు, వ్రాసుకొన్నవారు అందరూ కలిసి ఖుర్ఆన్ గ్రంథమును తయారు చేశారు. అలా వ్రాసిన
గ్రంథములో జిబ్రయేల్ నుండి ముహమ్మద్ ప్రవక్తగారికీ, ప్రవక్తగారినుండి ఆయన సహచరులకూ విషయము చేరవేయ
బడినది. ముగ్గురి ద్వారా మారి వచ్చిన విషయము ఉన్నది ఉన్నట్లు ఉంటుందని నాకు నమ్మకము లేదు. ఇక్కడ నా
ఉద్దేశ్యమును మాత్రము వ్రాయుచున్నాను. నేను అనుకొన్నది సత్యము కావచ్చును, అసత్యమూ కావచ్చును. అందువలన
ఈ ఒక్క విషయములో నామాటనే నమ్మవద్దని మీ యొక్క బుద్ధిని ఉపయోగించుకొని చూచుకోమని చెప్పుచున్నాను.
నాకు తోచింది నేను వ్రాయక తప్పదు కాబట్టి నా ఉద్దేశ్యమును నేను వ్రాయుచున్నాను. ప్రవక్తగారు చెప్పినది చెప్పినట్లు,
ఉన్నది ఉన్నట్లు ఖుర్ఆన్ గ్రంథములో ఉంటుందని నేను నమ్మడము లేదు. జిబ్రయేల్ చెప్పిన దానికీ, ప్రవక్త అనుచరులు
వ్రాసిన దానికీ, కొద్దిమాత్రమయినా మారియుండ వచ్చును లేక మారకనూ యుండవచ్చును. జిబ్రయేల్ చెప్పిన
వాక్యములకంటే ఎక్కువయుండవచ్చును లేక తక్కువయుండవచ్చును. అందువలన కొంతయినా తేడాయుండునని
నేను అనుకొంటున్నాను.
ఖుర్ఆన్ ఒక్క విషయములోనే నేను నా అభిప్రాయమును చెప్పడము లేదు. హిందువుల మూలగ్రంథమయిన
భగవద్గీతలో కూడా అలాగే జరిగియుండవచ్చుననుకొంటాను. భగవద్గీతలో దేవుడు చెప్పని విషయములు ఉండడము
మేము గ్రహించి, మా రచనలో వాటిని తీసివేసి వ్రాశాము. దేవుడు చెప్పని విషయములను భగవద్గీతలో మేము
గుర్తించినా, దేవుడు చెప్పిన విషయములు ఎన్ని లేకుండా పోయాయో మనకు తెలియుటకు అవకాశమే లేదు. ప్రథమ
దైవగ్రంథములోని విషయములను కృష్ణుడు అర్జునునకు చెప్పగా, అర్జునుడు వ్యాసునికి చెప్పగా మూడవ వ్యక్తి అయిన
వ్యాసుడు భగవద్గీతను వ్రాశాడు. అలా వ్రాసినప్పుడు కృష్ణుడు చెప్పిన విషయములను ఖచ్చితముగా అర్జునుడు వ్యాసునికి
చెప్పాడను నమ్మకము లేదు. అలాంటప్పుడు భగవద్గీతలో కల్పితములు ఉండవని చెప్పుటకు వీలులేదు. మేము
భగవద్గీతను అనువదించి వ్రాసినప్పుడు ఎన్నో కల్పిత శ్లోకములను నేను గుర్తించి వాటికి భావమును వ్రాయకుండా
వదిలి వేయడము జరిగినది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయములు చివరకు ఎన్ని లేకుండా పోయాయో
చెప్పలేముగానీ, ఎన్నో కల్పిత విషయములు ప్రత్యక్షముగా కనిపించాయని మాత్రము చెప్పగలము.
భగవద్గీతను వ్రాసినవాడు మూడవ వ్యక్తి. అలాగే ఖుర్ఆన్ గ్రంథమును వ్రాసిన వారు నాల్గవ వ్యక్తులని
చెప్పవచ్చును. భగవంతుడయిన కృష్ణుడు చెప్పగా రెండవవాడు అర్జునుడు విన్నాడు. అర్జునుడు చెప్పగా మూడవవాడయిన
వ్యాసుడు వ్రాశాడు. గీత విషయము అలా ఉండగా, ఖుర్ఆన్ విషయానికి వస్తే వాణి చెప్పిన దానిని రెండవవాడయిన
సూర్యుడు విన్నాడు. సూర్యుడు చెప్పిన విషయమును మూడవ వాడయిన జిబ్రయేల్ విన్నాడు. జిబ్రయేల్ చెప్పిన
విషయమును నాల్గవవాడయిన ప్రవక్త విన్నాడు. ప్రవక్త చెప్పగా ఐదవవారయిన అతని అనుచరులు విన్నారు. ఈ
విధముగా అయితే ఐదవవారయిన ప్రవక్త అనుచరులు వ్రాసినది ఖుర్ఆన్ గ్రంథ మయినది. లేదు వాణి చెప్పినప్పుడే
సూర్యునితో పాటు జిబ్రయేల్ కూడా విన్నాడు అంటే వరుస క్రమములో నాల్గవవారు ఖుర్ఆన్ను వ్రాసినట్లగును.
మూడవ వాడయిన వ్యాసుడు వ్రాసిన గీతా విషయములో దేవుడు చెప్పని జ్ఞానము వ్రాసియుండడమేకాక, ఒకచోట
తూర్పు అని వ్రాసిన విషయమునే మరొకచోట పడమర అని వ్రాసియుండడము జరిగినది. ఇట్లు తూర్పు అని
ఒకచోట, పడమర అని మరొకచోట, ఒకదానికొకటి పరస్పర విరుద్ధ వాక్యములుండుట చేత భగవద్గీతలో కలుషిత
వాక్యములు చేరినవని అర్థమగుచున్నది. అలాగే ఖుర్ఆన్ గ్రంథములో కూడా కొన్నిచోట్ల పరస్పర విరుద్ధ
వాక్యములుండుటను చూచి అవి మనుషులకు అవగాహన లోపము వలన వ్రాసిన వాక్యములని అనుకొన్నాము.
అందువలన ఖుర్ఆన్లో కొన్ని మనుషుల భావములు కలిసాయేమో! అని నేను అనుకోవడము జరిగినది. అయితే నేను
అనుకొన్నది సత్యము అని చెప్పలేము. అది నా భావము మాత్రమే, అది సత్యముకావచ్చును, అసత్యమూ కావచ్చును.
అందువలన మీ బుద్ధిని ఉపయోగించి చూడండి. నా మాటను నమ్మవద్దండని చెప్పుచున్నాను.
ఇక్కడ కొందరు నీకు ఖుర్ఆన్ మీద ఎందుకు అంత అనుమానము వచ్చినది, అందులో ఏమి లోపము
కనిపించినదని ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఇలా వున్నది చూడండి. ఖుర్ఆన్ గ్రంథములో ఒకచోట
దేవుడు తాను చేయదలచిన దానిని అయిపో! అంటే అయిపోతుంది అని వ్రాసినవారు మరియొక చోట ముందు చెప్పిన
వాక్యమునకు వ్యతిరేఖముగా దేవుడు ఆరు రోజులు శ్రమించి సృష్టినంతటినీ తయారు చేశాడు, తర్వాత ఏడవరోజు తన
సింహాసనముమీద కూర్చున్నాడని చెప్పారు. అయిపో అంటే అయిపోతుంది దేవుడు ఏమీ చేయడు అను వాక్యమునకు,
దేవుడు ఆరు రోజులు శ్రమించి సర్వమును సృష్టించాడను వాక్యమునకు పూర్తి వ్యతిరేఖత కనిపించుచున్నది. ఇలాంటి
వాక్యములే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఒకచోట అల్లా కఠినముగా శిక్షించేవాడు అని చెప్పి, మరొకచోట అల్లా
క్షమించేవాడు, అమితమైన దయగలవాడు అని చెప్పడము వలన, ఈ రెండు వాక్యములు ఒకదానికి మరొకటి విరుద్ధముగా
కనిపించుచున్నవి. అట్లే మరికొన్ని చోట్ల దైవత్వమునకు సంబంధములేని ప్రపంచ విషయములను చెప్పడము జరిగినది.
ఇటువంటివన్నీ గమనించిన తర్వాత భార్యాభర్తల కాపురములను, ఆస్తులు పంచుకోవడమును, విడాకులు తీసుకోవడమును,
పెళ్ళిళ్ళు చేసుకోవడమును దేవుడు చెప్పునా! అను అనుమానము రాకతప్పదు. ఒకవైపు ఖుర్ఆన్ గ్రంథము దైవగ్రంథమే
అని తెలిసినా, మరొకవైపు కొందరు తమ భావములను అందులో ఇరికించారేమోనని అనుమానము వస్తున్నది.
అలాంటి వాక్యములను వదలి మిగతావాక్యములు చదివితే ఖుర్ఆన్ నిజముగా దైవగ్రంథమేనని ఎవరికైనా తెలియ
గలదు. ఎవరి మతమును వారు గొప్పగా చెప్పుకొనినా, ఎవరి గ్రంథమును వారు గొప్పగా చెప్పుకొనినా మేము అలా
చెప్పుటకు వీలులేదు. మాకు అన్ని మతములూ సమానమే, అలాగే అన్ని మత గ్రంథములూ సమానమే. మేము
నిస్వార్థముగా ఎక్కడ తప్పువుంటే అక్కడ తప్పువుందని చెప్పక తప్పదు. అలాగే ఎక్కడ మంచివుంటే అక్కడ మంచి
ఉందని చెప్పక తప్పదు. మేము ఏమి చేయునదీ మమ్ములను గమనించువాడు ఒకడున్నాడని జ్ఞప్తితో మేము
నడుచుకోవలసియున్నది. ఒకవేళ తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా బయటి ప్రజలను నేను ఒప్పించినా లోపల
యున్న కాపలాదారున్ని ఒప్పించలేము.
మనము ప్రక్కకు పోకుండా అసలయిన విషయానికివస్తే, జిబ్రయేల్ గ్రహము చెప్పినప్పుడు మాత్రమే అది
తెరచాటునుండి చెప్పినట్లయినది. సూర్యుడు గ్రహమే అయినా, అతను చెప్పినది తెరచాటు జ్ఞానము ఎందుకు
కాలేదనగా! సూర్యుడు కూడా తన స్థూలశరీరమును ఆకాశములోనే వదలి భూమిమీదికి వచ్చి మనువుకు జ్ఞానము
చెప్పడము జరిగినది. సూర్యుని స్థూలశరీరము మండే అగ్నిగోళము. అంత పెద్ద శరీరమును వదలి సూక్ష్మ శరీరముతో
భూమిమీదికి వచ్చి జిబ్రయేల్ ప్రవక్తతో మాట్లాడినట్లు మనువుతో మాట్లాడలేదు. భూమిమీదికి వచ్చిన సూర్యుడు
ఒక్కమారు వచ్చినది తప్ప రెండవమారు కూడా రాలేదు. ఒక్కమారు భూమిమీదికి వచ్చిన సూర్యుడు ఒకే రోజు తనకు
తెలిసిన జ్ఞానమును చెప్పిపోవడము జరిగినది. ఒక్కమారే వచ్చిన సూర్యుడు మనువుతో తెరచాటునుండి మాట్లాడలేదు.
మనువు దగ్గరయున్న మరొక మనిషి శరీరములోనికి ఆవహించి, మనిషి శరీరముతో మాట్లాడడము జరిగినది.
నేటికాలములో అక్కడక్కడ దేవతలు, దయ్యములు మనుషులను ఆవహించి మాట్లాడినట్లు, సూర్యుడు కూడా ఆ రోజు
ఒక మనిషి శరీరములో ప్రవేశించి, ఆ మనిషిలోని జీవుడు నిద్రలోయుండగా, సూర్యుడు మనిషి శరీరమును
ఉపయోగించుకొని మాట్లాడడము జరిగినది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షముగాయుండి మాట్లాడినట్లగుచున్నది. సూర్యుని
హావభావము ముఖవర్చస్సులో కనిపించుచుండగా, సూర్యుడు ప్రత్యక్షముగా మనువుతో మాట్లాడడము జరిగినది. అప్పుడు
మనువు సూర్యుని ఎదురుగా వుండి సూర్యుడు చెప్పిన మాటలను వినినట్లయినది. అందువలన సూర్యుడు తెరచాటునవుండి
మాట్లాడినట్లు కాదు. సూర్యుడు మనిషిలో చేరకుండా, కనిపించకుండా మాట్లాడియుంటే తెరచాటునయుండి మాట్లాడినట్లు
అయ్యేది. చివరకు ఎన్ని విధముల లెక్కించి చూచినా సూర్యుడు ప్రత్యక్షముగా మాట్లాడినవాడే యగుచున్నాడు. అందువలన
కలియుగములో జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తతో మాట్లాడువరకు దేవుడు చెప్పిన రెండవ విధానమయిన తెరచాటునుండి
మాట్లాడడము జరుగలేదు. అది జిబ్రయేల్తోనే జరిగినది.
సూర్యుడు వాణి వలన వినిన జ్ఞానమును చెప్పినప్పటికీ అతను గురువుకాదని చెప్పాము. ఎందుకనగా ఒకరిచేత
వినినదానిని తిరిగి చెప్పు వాడు బోధకుడు అవుతాడుగానీ, గురువుకాడు. ఎవరిచేతా వినని బోధను, ఎవరూ చెప్పని
బోధను చెప్పువాడు గురువు అగును. సూర్యున్ని గురువు అని, ఆదిగురువు అని కొందరు అనినా అతడు నిజానికి
గురువుకాదని తెలిసిపోయినది. సూర్యుడు బోధకుడే అయినా అతడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపముకాలేదు కావున
అతనిని బోధకుడుగా కూడా ఎవరూ చెప్పలేదు. అతను చెప్పిన జ్ఞానము గ్రంథరూపముగా వ్రాయబడియుంటే,
అప్పుడు ఆ గ్రంథమును చెప్పినవాడు బోధకుడా, లేక గురువాయని చూచెడి వారము. జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము
ఖుర్ఆన్గా వ్రాయబడినది కావున అతనిని చూచి బోధకునిగా చెప్పుకొన్నాము. అతను విన్న బోధను చెప్పాడు కావున
జిబ్రయేల్ బోధకుడు అయ్యాడు. సూర్యుడు కృతయుగములోనే అదే జ్ఞానమును చెప్పినా, సూర్యుడు బోధకునిగా
గుర్తింపబడలేదుగానీ, ప్రజలచేత ఆదిగురువు అని పిలిపించుకొన్న ఘనత ఆయనకు దక్కినది. విధివిధానము ప్రకారము,
ఆధ్యాత్మిక చట్టము ప్రకారము, సూర్యుడు గురువు కాడు. సూర్యుడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపము కాలేదు, కావున
ఆయన బోధకునిగా పిలువబడలేదు.
ద్వాపరయుగము చివరిలో శ్రీకృష్ణుడు 90 సంవత్సరముల వయస్సులో ఒకే దినము, ఒకేమారు అర్జునునికి
జ్ఞానమును చెప్పాడు. అర్జునుడు విన్న జ్ఞానమును వ్యాసునికి చెప్పడము జరిగినది. కృష్ణుడు చెప్పిన జ్ఞానమును
అర్జునుని ద్వారా వినిన వ్యాసుడు గ్రంథరూపము చేసి, దానికి “భగవద్గీతయని” పేరు పెట్టాడు. ఒక జ్ఞానము గ్రంథరూప
మైనప్పుడు దానిని చెప్పినవానిని ఎవడని లెక్కించి చూడవలసియున్నది. భగవద్గీతా జ్ఞానమును వ్యాసుడు వ్రాసినా,
అర్జునుడు వ్యాసునికి చెప్పినా, అర్జునునికి కృష్ణుడు తెలియజేశాడు. అందువలన కృష్ణుడు బోధకుడా, గురువాయని
చూడవలసియున్నది. అలా చూస్తే కృష్ణుడు తాను చెప్పిన జ్ఞానమును ఎక్కడా వినలేదు. ఎక్కడా వినని బోధను
తనకుతానుగా చెప్పు వానిని బోధకుడుయని అనకూడదు. అందువలన కృష్ణుడు బోధకుడు కాడు అని తెలిసిపోయినది.
బోధకుడు కాకపోతే ఇక మిగిలినది గురువే. అందువలన కృష్ణున్ని గురువుయని అనవచ్చునా! అని ప్రశ్నించుకొని
చూస్తే తాను చెప్పిన బోధ అంతకుముందు ఎవరూ చెప్పియుండకూడదు. ఆ విధముగా చూస్తే కృష్ణుడు చెప్పిన బోధ
ముందే ఆకాశవాణి చెప్పినది. సృష్ట్యాదిలో ఆకాశవాణి నుండి వచ్చిన బోధనే కృష్ణుడు చెప్పాడు. అంటే కృష్ణునికంటే
ముందే ఆ బోధ చెప్పబడినది. అంతకుముందు “ఎవరూ చెప్పని బోధను చెప్పినవాడే గురువు" అను సూత్రము
ప్రకారము చూస్తే ఆకాశవాణి చెప్పిన బోధనే చెప్పిన దానివలన కృష్ణున్ని గురువు అనుటకు వీలులేదు అని ఎవరయినా
అనుకోవచ్చును. కానీ నేను మాత్రము అలా అనుకోను. కృష్ణుడు గురువే అంటాను. అడ్డముగా మాట్లాడుతున్నానని
అనుకోవద్దండి. నేను చెప్పునది పూర్తి సత్యము. కృష్ణుడు తన జీవితములో ఎప్పుడుగానీ, ఎవరికిగానీ జ్ఞానమును
చెప్పలేదు. ఒకే ఒకదినము అర్జునునికి యుద్ధసమయమున కంటే ముందు కొద్ది నిమిషములు మాత్రమే జ్ఞానమును
చెప్పాడు. ఒక్కరోజు, ఒక్కపూట మాత్రమే జ్ఞానమును చెప్పినవాడు గురువగునా? అను ప్రశ్న కూడా రాగలదు.
దానికిముందే గురువైన వానిని గురువగునా అని వేచిచూడవలసిన పనిలేదు అని జవాబును చెప్పవచ్చును. "ఒకరు
చెప్పిన జ్ఞానమును చెప్పినవాడు బోధకుడే" అను సూత్రము ప్రకారము కృష్ణుడు బోధకుడే అవుతాడని అందరూ
అనుకో వచ్చును. అలాగయినా అదే సూత్రము ప్రకారము కృష్ణుడు గురువే అవుతాడు తప్ప బోధకుడు కాడు. అదెలా? యని
అడిగితే, కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అంతకుముందు ఎవరూ చెప్పియుండలేదు. ఆకాశవాణి చెప్పిందికదా! యంటే
అక్కడ ఆకాశవాణిగా చెప్పినది కూడా కృష్ణుడే అయివున్నందున సృష్ట్యాదిలో చెప్పినా, ద్వాపరయుగములో చెప్పినా,
అది కృష్ణుడు చెప్పిన దేయగుట వలన సూత్రము ప్రకారము కృష్ణున్ని గురువుయని చెప్పవచ్చును.
కృష్ణుడు కంటికి కనిపించువ్యక్తి అయినా, ఆయనలో యున్న ఆత్మే ఆకాశములో చెప్పిన ఆత్మయని తెలియవలెను.
భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున మొదటి శ్లోకములలోనే "మొదట సూర్యునికి చెప్పిన జ్ఞానమునే నీకు
చెప్పుచున్నాను” అని కృష్ణుడు చెప్పాడు. దీనినిబట్టి సృష్ట్యాదిలో సూర్యునికి చెప్పినవాడు కృష్ణునిలోని ఆత్మేనని
తెలియుచున్నది. సూర్యునికి చెప్పినది తానే కావున, అర్జునునకు చెప్పునది కూడా ఆయనే కావున, ఇతరులు ఎవరూ
చెప్పని జ్ఞానమునే కృష్ణుడు అర్జునునకు చెప్పాడని అర్థమగుచున్నది. అంతేకాక ఇతరులు చెప్పిన జ్ఞానమును కృష్ణుడు
అర్జునునకు చెప్పలేదు కావున ఆయనను బోధకుడు అనుటకు వీలులేదు. ముందు చెప్పినది కూడా ఆయనే కావున,
తర్వాత చెప్పినవాడు కూడా ఆయనే కావున, కృష్ణున్ని బోధకుడు అనకుండా గురువనియే అనాలి. కృష్ణుడు చెప్పిన
జ్ఞానము భగవద్గీతయను పేరుతో గ్రంథముగా తయారయిన దానివలన దానిని చెప్పినవాడు ఎవడు? అని చూడవలసి
వచ్చినది. అలా చూస్తే కృష్ణుడు అన్ని విధములా గురువేయని తేలిపోయినది. ప్రపంచములో దేవుని జ్ఞానము
మొట్టమొదట గ్రంథరూపములో బయటికి వచ్చినది ద్వాపర యుగ అంత్యములోనేయని తెలియవలెను. అందువలన
భగవద్గీత ప్రథమ దైవగ్రంథముగా చెప్పబడుచున్నది. భగవద్గీతను చెప్పిన కృష్ణుడు గురువు అగుట వలన మొదట
గురువుగా కృష్ణుడు తెలియబడినాడు. ఈ గ్రంథములో ఇద్దరు గురువులని చెప్పుకొన్నాము. ఇద్దరిలో ఒక గురువు
ద్వాపరయుగములో వచ్చినట్లు తెలిసిపోయినది. అలాగే మూడు గ్రంథము లలో ద్వాపరయుగము చివరిలో వచ్చిన
“భగవద్గీతగా” ఒక గ్రంథము తెలిసిపోయినది. అలాగే కలియుగములో జిబ్రయేల్ బోధకుడు చెప్పిన జ్ఞానము ఖుర్ఆన్
గ్రంథరూపముగా తెలిసిపోయినది. ఈ విధముగా రెండు గ్రంథములు తెలిసిపోయినవి. ఒక బోధకుడు, ఒక గురువు
తెలిసిపోయారు. ఇంకా తెలియవలసినవి ఒక గ్రంథము, ఒక గురువు అని జ్ఞప్తిలో ఉంచుకోండి.
ద్వాపర యుగము చివరిలో ప్రథమ దైవగ్రంథము భగవద్గీత బయట పడినది. దానితోపాటు గురువు కూడా
బయటపడిపోయాడు. కలియుగము లో దాదాపు 1400 సంవత్సరముల క్రిందట జిబ్రయేల్ గ్రహము చెప్పిన బోధ,
ఖుర్ఆన్ గ్రంథముగా తయారయినది. అప్పుడు ఖుర్ఆన్ లోనే వ్రాయబడియున్న దానినిబట్టి అంతిమ దైవగ్రంథము
ఖుర్ఆన్ అని తెలిసిపోయినది. అంతిమ దైవగ్రంథమును చెప్పిన జిబ్రయేల్ బోధకుడు అని కూడా తెలిసిపోయినది.
ఈ విధముగా ద్వాపర యుగములో ప్రథమ దైవగ్రంథము, కలియుగములో అంతిమ దైవగ్రంథము బయల్పడినవి.
మూడు గ్రంథములలో రెండు గ్రంథములు తెలిసిపోగా ఒక గ్రంథము మాత్రము తెలియవలసియున్నది. అలాగే ఒక
గురువు కూడా తెలియ వలసియున్నది. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! ఒక గురువు తెలిసిపోయాడు,
ఇంకొక గురువు తెలియవలసియున్నది అని చెప్పారు కదా! ప్రపంచములో ఇద్దరు గురువులు ఉంటారా? వాస్తవానికి
ఎందరు గురువులుంటారు? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా యున్నది చూడండి. గురువు
అనువాడు ప్రపంచమున కంతటికీ ఒకడే యుంటాడు. ఇద్దరు లేక ముగ్గురు లేక వేరువేరు గురువులు ఉండుటకు
అవకాశములేదు. గురువు అంటే దేవుడేనని అర్థము. దేవునికి మారుపేరుగా గురువు అని చెప్పుచుందుము.
ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు ఉన్నట్లు, గురువు కూడా ఒక్కడేయుండును. గురువుకూ దేవునికీ ఏమాత్రము
తేడాయుండదు. అందువలన అందరూ గురువును గుర్తించ లేరని చెప్పాము. దేవున్ని దేవుడే అనవచ్చును కదా!
గురువు అని ఎందుకు అనాలి? అని ఎవరికయినా ప్రశ్నరావచ్చును. దానికి కూడా జవాబును ఇట్లు చెప్పవచ్చును.
నిరాకారముగాయున్న వానిని దేవుడు అనవచ్చును. అదే దేవుడే సాకారముగా వస్తే అలా వచ్చిన వానిని గురువుయని
అనవచ్చును. భూమిమీద జ్ఞానమును తెలియజేయుటకు కృష్ణుడు సాకార రూపమున వచ్చాడు. అలా వచ్చిన కృష్ణుడే
గురువుగా తెలియబడినాడు. తర్వాత ఎప్పుడయినాగానీ, ఏ రూపములోగానీ, ఏ పేరు గల మనిషిగా వచ్చినా, అతడు
మొదట వచ్చిన గురువేగానీ రెండవ గురువుకాదు. మొదటి గురువుకు రెండవమారు వచ్చిన గురువుకు ఆకారములోగానీ,
పేర్లలోగానీ తేడాయుండవచ్చును. అయితే లోపలయున్న ఆత్మలో తేడాయుండదు. మొదట వచ్చినవాడే రెండవమారు
వచ్చాడని చెప్పవచ్చును. భూమిమీద అవసరమునుబట్టి నిరాకారమైన దేవుడు కనిపించే గురువుగా ఎన్ని మార్లయినా
భూమిమీదకు రావచ్చును. ఎన్నిమార్లు వచ్చినది తెలియుటకు, ఎప్పుడు వచ్చి ఏమి చేశాడని తెలియుటకు మనము
ఒకటవ గురువు, రెండవ గురువు అని చెప్పుకోవచ్చును. అట్లు ఎంతమంది గురువులుగా చెప్పుకొనినా, గురువు
ఎన్నిమార్లు భూమిమీదికి వచ్చినా ఆయన మాత్రము ఒక్కడే. గురువులో బేధములు తేడాలు యుండవు. సూత్రము
ప్రకారము "కనిపించే దేవుడే గురువు". దేవుడు కనిపించితే గురువు అవుతాడు. కనిపించకపోతే దేవుడే అవుతాడు.
భగవద్గీతను చెప్పినప్పుడు వచ్చిన కృష్ణుడు కనిపించే వ్యక్తి అయినా ఆయన సామాన్యమైన మనిషికాదు.
ప్రపంచమంతా అణువణువున వ్యాపించియున్న దేవుడే ఆ రూపములో వచ్చి కృష్ణుడు అని పిలువబడి నాడు. అయినా
కృష్ణుడే దేవుడు అని ఎవరూ గుర్తుపట్టనట్లు నటించిపోయాడు. సామాన్యముగా కృష్ణున్ని దేవుడని ఎవరూ గుర్తించలేరు.
ఎంతో విశేషమైన జ్ఞానము తెలిసినవారే మనిషిగాయున్న దేవున్ని గురువుగా గుర్తించగలరు. జ్ఞానములేనివారు గురువును
గుర్తించలేరు. అందువలన మేము అన్నీ తెలిసి కృష్ణున్ని గురువు అనినా లేక దేవుడు అనినా ఇప్పటికీ ఒప్పుకోని వారు
చాలామంది యున్నారు. ద్వాపరయుగములో కృష్ణునిగా వచ్చిన వానిని సులభముగానో, లేక కష్టముగానో ఏదో
ఒకరకముగా గురువుగా, దేవునిగా గుర్తుపట్టగలిగాము. దేవుడు అటువంటి అవకాశమును ఇచ్చుటకు భగవద్గీతలో
జ్ఞానయోగమందు మొదటనే మొదట సూర్యునికి చెప్పిన జ్ఞానమునే ఇప్పుడు నీకు చెప్పుచున్నాను అని అర్జునునితో
అన్నప్పుడు ఆ మాటలో ఆధారము కొంత దొరికిపోయినది. దానితో కృష్ణుడు దేవుడేయని, కృష్ణుడు గురువేయని తేల్చి
చెప్పుచున్నాను.
భగవద్గీతను చెప్పినవాడు గురువు అని తెలిసిపోయినది. ఇక రెండవమారు గురువు ఎప్పుడు వచ్చాడు అని
చూడవలసిన అవసరమున్నది. రెండవమారు వచ్చినవానిని మొదటిమారు వచ్చినవానిని కలిపి ఇద్దరు గురువులు
అనినా ఇద్దరూ ఒకే గురువని జ్ఞాపకముంచుకోవలెను. ఇప్పుడు గురువు రెండవమారు వచ్చిపోయినట్లు తెలిసిపోవుచున్నది.
ఎందుకనగా ప్రథమ దైవగ్రంథము భగవద్గీతయైనప్పుడు, అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ అయినప్పుడు మధ్యలోని
గ్రంథము వచ్చియుండునని, దానిని బోధించుటకు గురువు రెండవమారు, రెండవ గురువుగా దేవుడు వచ్చియుండునని
అర్థమై పోవుచున్నది. అయితే హేతుబద్దముగా ఫలానావాడే రెండవ గురువనీ, ఫలానా గ్రంథమే రెండవ గ్రంథమనీ
చెప్పుటకు ఆధారము దొరికితే సులభముగా గ్రంథమునూ, గురువునూ గుర్తించవచ్చును. అందువలన మొదటి గ్రంథమయిన
భగవద్గీత తయారయిన కాలమునుండి, అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ తయారయిన కాలమువరకు మధ్యలోనున్న
కాలములో వచ్చిన ఆధ్యాత్మిక గ్రంథములేవి? వాటిని చెప్పినవారు ఎవరు? అని చూడవలసి వచ్చినది. ఆ లెక్కప్రకారము
ద్వాపరయుగము చివరినుండి కలియుగములో ఖుర్ఆన్ గ్రంథము వచ్చిన కాలము వరకు 3600 సంవత్సరముల
మధ్యకాలమును చూస్తే ఒక ఆధారము దొరుకుచున్నది. ఆ ఆధారము ప్రకారము గమనించితే కలియుగము ప్రారంభమయి
3000 సంవత్సరములు గడచిన తర్వాత ఇజ్రాయెల్ దేశములో పుట్టిన బైబిలు గ్రంథములో ఒకే ఒక వాక్యమును చూస్తే
భగవద్గీతకు ఖుర్ఆన్కు మధ్యలో వచ్చిన గ్రంథము బైబిలు అని తెలిసిపోవుచున్నది.
ప్రతి విషయానికి అది సత్యమనుటకు హేతుబద్ధత, శాస్త్రబద్ధత అవసరము. ద్వాపరయుగము చివరినుండి
కలియుగములోని 3600 సంవత్సరముల కాలములో తయారయిన గ్రంథములను పరిశీలించి చూస్తే బైబిలులోయున్న
ఎన్నో వాక్యములందు ఒక వాక్యము, ఆధారముగా దొరికినది. అప్పుడు దానిని చెప్పిన వ్యక్తి ఏసుయని తెలిసినది.
ఏసును చూస్తే ఏమీ తెలియదుగానీ, ఆయన చెప్పిన ఒక మాటయే ఎంతో ఆలోచింప చేసినది. ఆ వాక్యమును గురించి
చెప్పుకొనుటకు ముందు, ఆ వాక్యమున కున్న విలువను తెలియుటకు, కొంత వివరమును తెలియవలసియున్నది. ఏసు
అను వ్యక్తి భూమిమీద పుట్టి ఏ గుర్తింపులేని వ్యక్తిగా 30 సంవత్సరములు గడిపి తర్వాత మూడు సంవత్సరములు
మాత్రము జ్ఞానబోధను చెప్పి చనిపోయాడు. దీనినిబట్టి ఏసు కేవలము 33 సంవత్సరములు బ్రతికాడని చెప్పవచ్చును.
33 సంవత్సరములు బ్రతికిన ఏసు చనిపోయిన తర్వాత 33 గంటలకే తిరిగి లేవడము జరిగినది. అలా చనిపోయిన
తర్వాత బ్రతికి బయటికి వచ్చి 40 దినముల వరకు తన శిష్యులకు కనిపించడము, వారితో మాట్లాడడము జరిగినది.
ఆ విధముగా 40 దినములలో 33 మార్లు మాత్రమే ఆయన శిష్యులకు ఏసు కనిపించడము జరిగినది. తర్వాత
ఎప్పటికీ శిష్యులకు కూడా కనిపించకుండా పోయాడు.
ఏసు తన శిష్యులకు చిట్టచివరిగా కనిపించినది చనిపోయి లేచిన తర్వాత 33వ దర్శనములోనేయని చెప్పవచ్చును.
33వ మారు చివరిగా కనిపించిన ఏసు తన శిష్యులతో చివరిగా మూడు వాక్యములను చెప్పాడు. ఆ మాటలను
బైబిలుగ్రంథమున మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయ మందు 18, 19, 20 వాక్యములలో చూడవచ్చును. ఆ
వాక్యములు ఇలా కలవు. (18) పరలోకమందునూ, భూమిమీదనూ నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. (19)
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ
యొక్కయూ, నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుము. (20) నేను మీకు ఏయే సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని
గైకొనవలెనని వారికి బోధించుము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో
చెప్పెను. ఏసుప్రభువు చెప్పిన ఈ మూడు వాక్యములు ఆయన చిట్టచివరిగా పలికిన పలుకులు. అందువలన ఈ
మూడు వాక్యములు ఎంతో ప్రాధాన్యతతో కూడుకొనియున్నాయి. మూడు వాక్యములు ఆధ్యాత్మికములో గొప్పవే అయినా
వాటియందు మధ్యలో యున్న 19వ వాక్యమునుబట్టి మధ్య గ్రంథము బైబిలుయేనను ఆధారము దొరికినది.
వాక్యములో “తండ్రియొక్కయూ, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము
ఇచ్చుచూ సమస్త జనులను శిష్యులుగా చేయుము” అని కలదు. ఈ వాక్యములోని అంతరార్థమును గమనించితే
ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములలోని అర్థమునకు ఈ
వాక్యము సరిపోవుచున్నది. అలాగే అంతిమ దైవగ్రంథమయిన పవిత్ర ఖుర్ఆన్ గ్రంథమునందు 50వ సూరాలో 21వ
ఆయత్లోని అర్థమునకు పై వాక్యము సరిపోవుచున్నది. దేవుడు చెప్పిన ఆదిలోని జ్ఞానమే, ఆకాశవాణి జ్ఞానమే
మూడుచోట్ల, మూడు గ్రంథములుగా బయటికి వచ్చినది. అందువలన ముందే మనము మూడు గ్రంథములు అని
వ్రాసుకొన్నాము. ఒకే జ్ఞానము మూడు గ్రంథములలో యున్నదను సూత్రమును అనుసరించి మధ్య దైవగ్రంథము
ఫలానా గ్రంథమని తెలియగలిగాము. ఒకే జ్ఞానమూ, ఒకే జ్ఞాన వాక్యమూ మూడు గ్రంథములలో కనిపించడము
వలన ఒకటి ప్రథమ దైవగ్రంథమని, రెండవది మధ్య దైవగ్రంథమని, మూడవది అంతిమ దైవగ్రంథమని గుర్తించగలిగాము.
19వ
ఇక్కడ కొందరికి ఒక ప్రశ్నరాగలదు. అదేమనగా! భగవద్గీతలో ఎక్కడ కూడా ప్రథమ దైవగ్రంథమని పేరు
లేదు. అటువంటప్పుడు ప్రథమ దైవగ్రంథము భగవద్గీతయని మీరు ఎలా చెప్పగలుగుచున్నారు? లేని పేరును మీరెందుకు
పెట్టారు? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు. ఖుర్ఆన్కు ప్రవక్త ఎవరని చూచితే
ముహమ్మద్ గారు అని తెలిసినది. ముహమ్మద్ ప్రవక్తగారిని ఆఖరి ప్రవక్తయని ఖుర్ఆన్ గ్రంథములోనే చెప్పారు.
అలాగే ఖుర్ఆన్ గ్రంథమును కూడా అంతిమ దైవగ్రంథము అన్నారు. ఆఖరి ప్రవక్త అను వాక్యము ఆధారముతో ఆ
ప్రవక్త ద్వారా వచ్చిన గ్రంథము కూడా ఆఖరి గ్రంథమనుట జరిగినది. ఆ లెక్కప్రకారము ఖుర్ఆన్ గ్రంథమును
ఆధారము చేసుకొని చూస్తే, అన్నిటికంటే ముందు పుట్టిన ఆధ్యాత్మిక గ్రంథము భగవద్గీతయని తెలిసినది. అందువలన
భగవద్గీతను ప్రథమ గ్రంథముగా చెప్పుచున్నాము. ఖుర్ఆన్ అంతిమ గ్రంథమైనప్పుడు 3600 సం॥ ముందు పుట్టిన
భగవద్గీత ప్రథమ గ్రంథముగా లెక్కించబడుచున్నది. ఒక్క ఖుర్ఆన్ గ్రంథమునుబట్టి, ఖుర్ఆన్ గ్రంథమునకు ప్రవక్తయైన
ముహమ్మద్ గారిని ఆధారము చేసుకొని భగవద్గీత మొదటి దైవగ్రంథము కాగా, మధ్య గ్రంథము బైబిలుగా తెలియుచున్నది.
అంతిమ గ్రంథమని ఒక గ్రంథమునకు పేరుపెట్టగా మిగతా రెండు గ్రంథములలో ఏది మొదటి గ్రంథమో, ఏది మధ్య
గ్రంథమో సులభముగా తెలియబడినవి.
ద్వాపరయుగము చివరిలో, కలియుగము మొదటిలో భగవద్గీత బయల్పడగా, తర్వాత 3000 సంవత్సరములకు
బైబిలు గ్రంథము బయటకు వచ్చినది. ఆ తర్వాత 600 సంవత్సరములకు ఖుర్ఆన్ గ్రంథము బయటకు వచ్చినది.
ఈ మూడు గ్రంథములు ఒకే జ్ఞానముతో నిండుకొని వచ్చినవే అయినందున ప్రథమ, మధ్య, అంతిమ గ్రంథములని
పేరు పెట్టవలసి వచ్చినది. ప్రథమ దైవగ్రంథమునకు, అంతిమ దైవ గ్రంథమునకు మధ్యలో 3600 సంవత్సరముల
కాలము గడచిపోయినది. అయితే ఇక్కడ కొందరికి మరియొక ప్రశ్న వచ్చుటకు అవకాశము కలదు. అదేమనగా!
మూడూ ఒకే దేవుని జ్ఞానమునకు సంబంధించిన గ్రంథములని మీరు ఏ ఆధారముతో చెప్పుచున్నారని తిరిగి
ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా యున్నది. ఇంతకు ముందే చెప్పాను. బైబిలులోని ఒక వాక్యము
ఆధారముతో చివరి ఖుర్ఆన్ గ్రంథములోనూ, మొదటిదయిన భగవద్గీత గ్రంథములోనూ ఒకే జ్ఞానమున్నదని
తెలియుచున్నది. అదెలాయని వివరించి చెప్పితే ఈ విధముగా కలదు చూడండి.
ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము అను అధ్యాయమున 16, 17 శ్లోకములలో
ఇలా కలదు.
16వ శ్లో॥
ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవచ |
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే |
17వ శ్లో॥
ఉత్తమః పురుషస్వన్య: పరమాత్మే త్యుదాహృతః |
యోలోకత్రయ మా విశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
16) భావము :- (శరీర) లోకమున గల పురుషులలో రెండు రకముల పురుషులు గలరు. వారిలో ఒకడు
క్షరుడుగాయున్నాడు, మరియొకడు అక్షరునిగా యున్నాడు. సర్వజీవరాశులలోనూ క్షరుడు, అక్షరుడు ఇద్దరూ కూటస్థులుగా
యున్నారు.
17) భావము :- క్షరుడు, అక్షరుడను ఇద్దరు పురుషులకంటే ఉత్తమమైన పురుషుడు మరొకడు గలడు. అతను
పరమాత్మయని పిలువబడుచున్నాడు. మూడవ పురుషుడయిన పరమాత్మ ముల్లోకములు (విశ్వమంతా) వ్యాపించి,
నాశనము లేనివాడై, ఈశ్వరుడై యున్నాడు.
వివరము :- ఇక్కడ మొత్తము ముగ్గురు పురుషులను చెప్పడమైనది. పురుషులనగా మగవారని అనుకోకూడదు.
ఆత్మను పురుషుడనీ, ప్రకృతిని స్త్రీయనీ ఆధ్యాత్మిక విద్యలో చెప్పుచుందురు. అందువలన మూడు ఆత్మలను ముగ్గురు
పురుషులుగా భగవద్గీతలో చెప్పడమైనది. ప్రతి మనిషిలో, ప్రతి జీవరాశిలో క్షరుడను నాశనమయ్యేవాడు, అక్షరుడను
నాశనముకానివాడు ఇద్దరు పురుషులు (రెండు ఆత్మలు) ఉన్నారు. ఏ జీవరాశిలో అయినా క్షరుడు, అక్షరుడు ఇద్దరూ
కలిసియుందురు. ఈ రెండు ఆత్మలను జోడు ఆత్మలని అంటాము. ఈ రెండు ఆత్మలు (ఇద్దరు పురుషులు) ఒకరిని
వదలి మరొకరు ఉండరు. ఆత్మలేని జీవాత్మగానీ, జీవాత్మలేని ఆత్మగానీ ప్రపంచములో ఎక్కడా ఉండరు. సృష్ఠి
తయారైనప్పటినుండి ఇంతవరకు ఏ శరీరములోగానీ జోడు ఆత్మలు తప్ప ఒక ఆత్మ లేదని చెప్పవచ్చును. శరీరములో
జీవాత్మను ఆధారము చేసుకొని ఆత్మయుండగా, ఆత్మయుంటేనే జీవుడు శరీరములో బ్రతుకగలుగుచున్నాడు. అందువలన
ఈ రెండు ఆత్మలను కూటస్థ ఆత్మలన్నారు. మరణములో ఆత్మ వెంట జీవాత్మ శరీరమును వదలిపోవుచున్నది. పుట్టుకలో
ఆత్మ వెంట జీవాత్మ వస్తున్నది. చావు పుట్టుకలోనేకాక జీవితములో కూడా క్షర, అక్షర ఆత్మలు ఒకదానిని ఒకటి వదలి
ఉండలేవు. ఈ వివరము ఒక్క మనుషులయందే కాకుండా, సర్వ జీవరాశులలో అలాగేయున్నది. ఇది భగవద్గీతలో
అతి ముఖ్యమైన ఆత్మల విషయమని తెలియాలి. శరీరములో క్షర, అక్షర అను ఈ రెండు ఆత్మలే కాకుండా మరియొక
ఆత్మకూడా కలదు. మూడవ ఆత్మ క్షర, అక్షర పురుషులకంటే వేరుగా వారితో కలియకుండా ఉన్నది. శరీరములో
రెండు (జోడు) ఆత్మలకంటే వేరుగాయున్న మూడవ ఆత్మను లేక మూడవ పురుషున్ని పురుషోత్తముడు అంటున్నారు.
క్షరుడు, అక్షరుడు అను ఇద్దరు పురుషులకంటే మూడవ పురుషుడు ఉత్తమమైనవాడు అయినందున మూడవ పురుషున్ని
పురుషోత్తముడని ప్రత్యేకముగా పిలుచుచున్నారు. పురుషోత్తముడయిన మూడవ పురుషున్నే పరమాత్మయని కూడా
పిలుస్తున్నాము. పరమాత్మ అయిన మూడవ పురుషుడు లేక మూడవ ఆత్మ నాశనములేనిదై ప్రపంచమంతా వ్యాపించి
అన్నిటికీ సర్వజీవరాశులకూ అధిపతిగా, దేవునిగా యున్నది. మూడవ పురుషుడు అంతటా వ్యాపించినవాడై దేవుడుగా
యుండగా, క్షరుడు అక్షరుడు అను రెండు ఆత్మలు ఒక శరీరములోయుంటూ క్షరుడు కర్మను అనుభవించుచుండగా,
అక్షరుడు కర్మను అనుభవింపజేయుచున్నాడు.
క్షరుడు అనబడువాడు శరీరములో జీవాత్మగా పిలువబడుచున్నాడు. అక్షరుడు అనువాడు శరీరములోని
ఆత్మగా పిలువబడుచున్నాడు. క్షరుడు, అక్షరుడు లేక జీవాత్మ, ఆత్మ అనబడు రెండిటినీ పరమాత్మయను మూడవ
పురుషుడు సాక్షిగా చూస్తున్నాడు. మూడవ పురుషుడు శరీరములో ఏమి జరిగినా సాక్షిగా చూస్తున్నాడు. మూడవవాడు
చూస్తూయుంటే ఒకటవ వాడయిన క్షరుడు లేక జీవుడు ఒక విషయములో ఏడుస్తూయుంటే, రెండవ వాడయిన అక్షర
పురుషుడు మొదటివానిని ఏడ్పించుచున్నాడు. అంటే ఎవని కర్మను అనుసరించి ఆ శరీరములోని రెండవ ఆత్మ
పనిచేయుచున్నది. వివరముగా చెప్పుకొంటే శరీరములోని జీవాత్మ బలహీనమైనదై, ఏమీ చేయలేకయుంటే, అదే
శరీరములోని ఆత్మ బలముకలదియై అన్ని పనులూ చేయుచున్నది. అదే శరీరము లోపలా, బయటా రెండు జాగాలలోనూ
గల పరమాత్మయను మూడవ ఆత్మ శరీరములోని రెండు ఆత్మలకు సాక్షిగా యుంటూ, రెండు ఆత్మలకూ అధిపతియై
దేవునిగాయున్నది. శరీరములోని క్షరాక్షర రెండు ఆత్మలు ఆడించేది, ఆడేదిగా యుంటూ ప్రపంచమును నడుపుచుండగా
మూడవ ఆత్మ కేవలము చూచేదిగా యుంటూ ఉలకక, పలుకక, కదలక, మెదలక యున్నది.
శరీరములోని రెండు ఆత్మలలో మొదటిదయిన జీవుడు లేక జీవాత్మ యను వానిని వాని కర్మనుబట్టి రెండవ
ఆత్మయైన ఆత్మ ఆడించుచున్నది లేక నడుపుచున్నది. మూడవవాడు చూస్తూ ఏమీ సంబంధములేకుండా యున్నాడు.
శరీరములో అన్ని పనులు చేయు ఆత్మ స్త్రీ శరీరములో గర్భము నిలుచునట్లు చేసి, సంతతిని కలుగజేయుచున్నది.
సంతతి విషయములో గానీ, మరియే ఇతర విషయములలోగానీ, జీవునికి సంబంధము లేదు. అందువలన స్త్రీ
గర్భములో పుట్టిన బిడ్డకు అదే శరీరములో యున్న ఆత్మే తండ్రియని చెప్పవచ్చును. వాస్తవముగా జీవాత్మ ఏ సంతతికీ
తండ్రికాడు. ఒక మనిషిలోని జీవుడు తన భార్యకు పుట్టిన బిడ్డకు తానే తండ్రియని అనుకోవడము సహజమే. అయితే
వాస్తవానికి అతనికి తన సంతతి అనుకొనువారు ఎవరూ తనకు బిడ్డలు కాదని తనకు తెలియదు. ప్రతి బిడ్డకు తండ్రి,
మనకు తెలిసినా తెలియకున్నా శరీరములోని ఆత్మయే. ఈ మాటను జీర్ణింపజేసుకొనుటకు కొంత కష్టముగాయుండినా
మేము చెప్పుమాట నూటికి నూరుపాళ్ళు నిజము. అందువలన మూడు గ్రంథములలో ఒక గ్రంథమందు "బయట
కనిపించువారు ఎవరూ నీ తండ్రికాదు. తండ్రియని పేరు పెట్టి ఎవరినీ పిలువవద్దు. నీ తండ్రి పరలోకమందున్నాడు" అని
చెప్పారు. ఆ వాక్యమును అర్ధముచేసుకుంటే అందులో విశేషమైన జ్ఞానమున్నది. ఆ లెక్కప్రకారము మరియు మూడు
గ్రంథములలో చెప్పిన జ్ఞానము ప్రకారము ప్రతి మనిషికీ కనిపించువాడు తండ్రికాడు అని అర్థమగుచున్నది. మేము
“హేతువాదము-ప్రతివాదము" అను గ్రంథములో తండ్రి వీర్యకణముతోనే అందరూ పుట్టలేదనీ, వీర్య కణముతో సంబంధము
లేకుండా చాలామంది పుట్టుచున్నారనీ చెప్పాము. మేము చెప్పిన తర్వాత ఒక నెలకే అదే విషయమును పరిశోధనలో
కనుగొన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించడము కూడా జరిగినది. దానితో వీర్యకణ సంబంధము లేకుండా
పిల్లలు పుట్టుతారను విషయము శాస్త్రబద్ధమైనట్లు తెలియుచున్నది.
భగవద్గీతలో చెప్పిన ముగ్గురు పురుషులు లేక మూడు ఆత్మల విషయము ఈ విధముగా యున్నదని చెప్పినా
ఇప్పుడు మేము చెప్పునది చాలాకొద్దిగానేయని చెప్పవచ్చును. మూడు ఆత్మలను తెలుసుకొనేకొద్దీ ఎన్నో విషయములు
తెలియును. మూడు ఆత్మలలో మొదటి జీవాత్మ, చివరి పరమాత్మ పనిచేయకుండా ఉండగా మధ్యలోని ఆత్మయే సమస్త
కార్యములను చేయుచున్నది. కర్తగా పరమాత్మ, కర్మగా జీవాత్మ, క్రియగా ఆత్మయున్నదని చెప్పవచ్చును. ఇంతవరకు
భగవద్గీతలోని విషయమును చెప్పాను. ఇక అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ ఈ మూడు ఆత్మలను గురించి
తెలియజేసిన విషయమును వివరిస్తాము చూడండి. ఖుర్ఆన్ గ్రంథములో 50వ సూరాలో 21వ ఆయత నందు (1) "ప్రతి
వ్యక్తీ తనను తీసుకవచ్చేవాడు ఒకడు, సాక్ష్యమిచ్చేవాడు ఒకడు గల స్థితిలో వస్తాడు" అని ఉన్నది. ఇదే వాక్యమునే
మరియొక ఖురాన్ గ్రంథములో ఈ విధముగా అనువదించి యున్నారు చూడండి. (2) ప్రతి ప్రాణి లేక ప్రతి జీవి ఒక
తోలేవాడితో, మరియొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది" అనికలదు. మరియొక ఖుర్ఆన్ గ్రంథములో ఇట్లు
కలదు. (3) ప్రతి వ్యక్తీ తనవెంట ఒక తోలేవాడూ, మరొక సాక్ష్యం చెప్పేవాడు ఉన్న స్థితిలో వస్తాడు" ఈ విధముగా
మూడు ఖుర్ఆన్ గ్రంథములలో ఈ వాక్యమును తెలుగు భాషలోనికి అనువదించి వ్రాసియున్నారు. మూడు వాక్యములను
ఎటు చూచినా మూడూ ఒకే అర్థమును ఇచ్చుచున్నవి. ప్రతి మనిషిని లేక ప్రతి జీవిని తోలేవాడు ఒకడున్నాడు. వానిని
తోలేవాడు లేక నడిపేవాడు అని పై వాక్యములలో చెప్పారు. ప్రతి జీవిని నడిపేవాడు ఆత్మయనీ, నడిపింపబడేవాడు
లేక త్రోలబడేవాడు జీవాత్మయనీ తెలియ వలెను. మూడవవాడు సాక్ష్యముగా ఉండేవాడు దేవుడే అని అందరికీ తెలుసు.
నడుపబడేవాడు జీవాత్మయనీ, నడిపేవాడు ఆత్మయనీ, చూస్తూ ఊరక యుండువాడు పరమాత్మయనీ భగవద్గీత గ్రంథములోని
విషయమును చెప్పుకొన్నాము. ఇంకా వివరముగా చెప్పుకొంటే ప్రథమ గ్రంథము భగవద్గీతలోనూ, అంతిమ గ్రంథము
ఖుర్ఆన్లోనూ ఒకే జ్ఞానమున్నదనుటకు సాక్ష్యముగా ఈ మూడు ఆత్మల విషయము రెండు గ్రంథములలోనూ ఒకే
విధముగా యున్నది.
క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులుగా భగవద్గీతలో చెప్పినవారే ఖుర్ఆన్ గ్రంథములో
త్రోలబడేవాడు క్షరుడు, త్రోలేవాడు అక్షరుడు, సాక్షిగాయుండేవాడు పురుషోత్తముడు లేక పరమాత్మ యని తెలిసిపోయినది.
ఖుర్ఆన్లో జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విషయమును చెప్పుచూ వారి పాత్రలతో సహా చిన్న వాక్యములో చెప్పడము
జరిగినది. జీవాత్మ స్వయముగా ఏమీ చేయువాడు కాడు, ఆత్మే చేయిస్తే చేయువాడే ననీ, ఎల్లప్పుడూ ఆత్మ ఆధీనములో
జీవ్మాతయుండువాడేననీ తెలియునట్లు జీవుడు ఎప్పటికీ నడుపబడేవాడేననీ, ఆత్మ ఎప్పటికీ నడిపేవాడేననీ, పరమాత్మ
(దేవుడు) ఎప్పటికీ సాక్షిగా చూస్తూయుండేవాడేననీ ఖుర్ఆన్ గ్రంథములో మూడు ఆత్మలను గురించి 50వ సూరాలోని
21వ వాక్యమును చెప్పారు. ఆధ్యాత్మికరంగములో ఆత్మల విషయమే అత్యంత ముఖ్యమైనది. అతి ముఖ్యమైన ఆత్మల
విషయమును భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అను 15వ అధ్యాయమున 16, 17 శ్లోకములలో చెప్పగా, అదే
విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో 50వ సూరా, 21వ ఆయత్నందు చెప్పడమైనది. అయితే ఈ విషయమును మేము
చెప్పిన తర్వాత ఎవరికయినా అర్థమవుతుందేమోగానీ, సర్వసాధారణముగా చదువువారికి రెండు గ్రంథములలోని పై
రెండు వాక్యములు ఒకదానితో మరొకటి సంబంధముగా యున్నాయని తెలియవు. గీతలోని క్షరుడు, అక్షరుడు,
పురుషోత్తముడు అని చెప్పబడిన మూడు ఆత్మలే ఖుర్ఆన్లో ముగ్గురుగా చెప్పినప్పటికీ ఎవరూ గుర్తించలేనట్లు
ఉన్నాయి. అదేపనిగా నిశితముగా చూచేవారికే రెండు గ్రంథములలోని రెండు వాక్యములు ఒకే జ్ఞానమని తెలియగలదు.
దేవుడు జ్ఞానమున్నవారికి, గుర్తించేవారికి సులభముగా అర్థమయ్యేటట్లు, జ్ఞానములేని వారికి, దేవుని మీద శ్రద్ధలేనివారికి,
దేవుని విషయములకు ప్రాధాన్యత ఇవ్వనివారికి అర్థము కాని విధముగా రెండు వాక్యములు వేరువేరు రంగుపూసి
పెట్టినట్లు గలవు.
ప్రథమ, అంతిమ గ్రంథములలో ఒకే ఆత్మల విషయము వేరువేరు వాక్యములలో గుర్తింపబడునట్లు ఉన్నదనీ,
శ్రద్ధ, బుద్ధిగలవారికి మాత్రమే ఆ రెండు వాక్యములు ఒకే జ్ఞానమును బోధించుచున్నవని తెలియునని చెప్పుచున్నాము.
అంతేకాక మధ్య గ్రంథమును కూడా ఆత్మల విషయమును తెలుపు వాక్యమును ఆధారము చేసుకొని ఆ గ్రంథము
ఫలానా గ్రంథమని తెలియగలిగాము. మధ్య గ్రంథములోని వాక్యమును చూస్తే జ్ఞానమున్న వానికి ఇది మూడు
ఆత్మల విషయమని సులభముగా అర్థమయిపోగలదు. జ్ఞానము లేనివారికి అక్కడి వాక్యము ఏమాత్రము బయటపడకుండా,
ఇది ముగ్గురు పురుషులను గురించి చెప్పినదేనా!యని అనుమానము కల్గించ గలదు. ప్రథమ గ్రంథములో ఐదువేల
సంవత్సరముల పూర్వము చెప్పిన భగవద్గీత గ్రంథములో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనియూ జీవాత్మ, ఆత్మ,
పరమాత్మయనియూ చెప్పబడిన వాక్యము తోలబడేవాడు, తోలేవాడు, చూచేవాడు అని మారువేషములో 1400
సంవత్సరముల క్రిందట చెప్పబడిన ఖుర్ఆన్ గ్రంథములో వ్రాయడము జరిగినది. అదే మూడు ఆత్మల విషయమునే
2000 సంవత్సరముల క్రిందట చెప్పిన బైబిలు గ్రంథములో ఎవరూ సులభముగా గుర్తించనట్లు, గుడ్డనుచుట్టి
కనిపించకుండా చేసి చెప్పినట్లున్నది. ఖుర్ఆన్లో గీతలోని వాక్యమును మారు వేషములో చెప్పియుంటే, బైబిలులో
పూర్తి ముసుగువేసి చెప్పినట్లున్నది. బైబిలు గ్రంథములోని వాక్యమునకు ముసుగు తీసి చూస్తే అది భగవద్గీతలోని
ముగ్గురు పురుషుల వాక్యమని తెలియగలదు. అలాగే ఖుర్ఆన్లోని వాక్యము వేషము తీసి చూస్తే ఇది భగవద్గీతలోని
మూడు ఆత్మల విషయమని తెలియగలదు. ఒకే జ్ఞానము మూడు గ్రంథములలో, మూడు విధములుగా యున్నదను
విషయము ఎవరికీ తెలియకపోవడము వలన మనుషులలో మతముల మాయ పూర్తి నిండిపోయి దేవుడుగానీ, దేవుని
జ్ఞానముగానీ ఎవరికీ గుర్తింపబడకుండా పోయినది. మూడు ఆత్మల విషయము బైబిలులో ఏ విధముగాయున్నదో ఎట్లు
తెలియబడకుండా యున్నదో ఇప్పుడు కొంత వివరముగా తెలుసుకొందాము.
మూడు ఆత్మల విషయమును చూచి బైబిలును మధ్య దైవ గ్రంథముగా తెలియగలిగాము. బైబిలులో మూడు
ఆత్మల విషయము భగవద్గీత కంటే, ఖుర్ఆన్కంటే భిన్నముగా చెప్పబడియుండుట వలన దానిని చదివిన వారెవరూ
ఇది భగవద్గీతలో చెప్పిన క్షర, అక్షర, పురుషోత్తమ అను మూడు ఆత్మల విషయమని గ్రహించలేరు. మత్తయి సువార్త
28వ అధ్యాయములో 19వ వచనమున తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని చెప్పి వీరి నామమున బాప్తిస్మమిచ్చి
సర్వజనులను శిష్యులుగా చేయుము అని కలదు. బాప్తిస్మము అంటే ఉపదేశము అని అర్థము. ఉపదేశమిస్తే శిష్యులుగా
మారిపోవుదురు. నామమున అంటే జ్ఞానముతో అని అర్థము. మూడు ఆత్మల జ్ఞానముతో ప్రజలకు ఉపదేశమిచ్చి
శిష్యులుగా చేయమని అక్కడ చెప్పడమయినది. తండ్రి అనగా ఆత్మ అనియూ, కుమారుడు అనగా జీవాత్మ అనియూ,
పరిశుద్ధాత్మయనగా పరమాత్మయని అర్థము. ఆధ్యాత్మికము అనగా ఆత్మల విషయమును తెలియడమే ఆధ్యాత్మికము
అంటారు. అయితే బైబిలు గ్రంథమును చదివిన వారికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యము మూడు
ఆత్మల విషయమని తెలియదు. ఆ వాక్యమును మతముతో ముడిపెట్టుకొనియుండుట వలన కుమారుడు అంటే
ఏసుయని, తండ్రి అంటే దేవుడని లెక్కించుకొని దేవుని కుమారుడు ఏసుయని అనుకోవడము జరుగుచున్నది. పరిశు
ద్ధాత్మ విషయానికి వస్తే ఏసు పుట్టకముందు దేవున్ని పరిశుద్ధాత్మయనెడి వారని, ఏసు పుట్టిన తర్వాత పరిశుద్ధాత్మను
తండ్రియని చెప్పడము జరుగుచున్నదని లెక్క సరిచేసి చెప్పారు. వారి లెక్కలో తండ్రి అనినా, పరిశుద్ధాత్మ అనినా
రెండూ ఒక్కటేయని అర్థము. ఆ విధముగా చెప్పడము వలన దేవుని చట్టమునకు పూర్తి వ్యతిరేఖముగా
మాట్లాడినట్లగుచున్నది. మూడు ఆత్మలను దేవుడు చెప్పితే మనిషి వాటిని రెండు ఆత్మలుగా చెప్పుకోవడము అజ్ఞానమగును.
ఈ విధముగా క్రైస్తవ మతములో ఏసుని దేవుని కుమారునిగా చెప్పుకొనుచూ, తండ్రియనినా పరిశుద్ధాత్మయనినా
ఒక్కటేయని చెప్పుకోవడము పెద్ద అజ్ఞానమవడమే కాకుండా వాక్యములోని మూడు ఆత్మలను పూర్తిగా తెలియకుండా
పోయినట్లగుచున్నది. దేవుడు తన జ్ఞానమును మూడు ఆత్మల రూపములో తెలియజేసినా, దానిని మనిషి సూక్ష్మముగా
తీసుకోకుండా స్థూలముగా అర్థము చేసుకోవడము వలన బయట కనిపించు ఏసును కుమారునిగా లెక్కించి జ్ఞానమును
తప్పుగా అర్థము చేసుకోవడము జరిగినది. అందువలన బైబిలు గ్రంథములోని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను
వాక్యమునకు పూర్తి భావమును ఎవరూ గుర్తించలేకపోయారు. తండ్రి, కుమారుడెవరో క్రైస్తవులకు తెలియ కుండాపోయినది.
అలాగే తోలేవాడు, తోలబడేవాడు ఎవరో ముస్లీమ్లకు తెలియకుండా పోయినది. నాశనమయ్యేవాడు ఎవడో, నాశనము
కానివాడు ఎవడో హిందువులకు తెలియకుండా పోయినది. మొత్తానికి ఆత్మల విషయమే మూడు మతములవారికీ
తెలియకుండా పోయినది. ఆత్మల వివరము తెలియకుండా పోయినదానివలన అందరికీ ఆధ్యాత్మికమే తెలియ కుండా
పోయినది. ఆధ్యాత్మికము అనునది పేరుకు మాత్రమే ఉన్నది గానీ అవగాహనకు ఏమాత్రము లేదని చెప్పవచ్చును.
ప్రపంచములో దేవుని జ్ఞానము తెలియాలంటే అన్నిటినీ స్థూలముగా ఆలోచించకూడదు. దేవుని విషయమంతా
సూక్ష్మము మీద ఆధారపడియుంటుంది. అందువలన జ్ఞానమునంతటినీ సూక్ష్మముగానే యోచించవలసియుంటుంది.
ప్రపంచములో పన్నెండు మతములుండినా అన్నిటికంటే ముఖ్యమైనవి మూడు మతములు మాత్రమే. ఇందూ, ఇస్లామ్,
క్రైస్తవము అను మూడు మతములలో దేవుని జ్ఞానము కొంతయినా యున్నది. ఆ లెక్కకుపోతే మిగతా అన్ని మతములకంటే
ఈ మూడు మతములలో జ్ఞానము ఎక్కువగానే యున్నదని చెప్పవచ్చును. గ్రంథములలో చెప్పినదంతా జ్ఞానము
కాకపోయినా కనీసము నూటికి (100) ఇరవై (20) శాతము జ్ఞానమును గ్రహించగలిగితే మనిషి జ్ఞాని కాగలడు.
ఒక్కొక్క గ్రంథములో 20 శాతము జ్ఞానమున్నదనుకో దానిలో సగము తెలిసినా మనిషి క్రమేపి సంపూర్ణ జ్ఞాని
కాగలడు. ఉదాహరణకు భగవద్గీతలో నూటికి 75 శాతము జ్ఞానమున్నది. అందులో 25 శాతము అర్థమయినా
కాలము జరుగుకొలది పూర్తి 75 శాతము అర్థమగుటకు అవకాశము గలదు. అయితే మొదటనే 25 శాతము అజ్ఞాన
భావముతో అర్థము చేసుకొంటే మిగతా 50 శాతము కాలక్రమేపి అజ్ఞానముగానే అర్థము కాగలదు. మొదట అజ్ఞాన
దారిపట్టితే అదే దారిలో పోవడము జరుగుతుంది. అందువలన గ్రంథములోని విషయమును ఒక్కటి అర్థము చేసుకొన్నా
దానిని జ్ఞానముతో అర్థము చేసుకోగలిగితే తర్వాత తెలియునదంతయు జ్ఞానమార్గములోనే అర్థమగును. మొదట
ఒక్క విషయమును అజ్ఞానముగా అర్థము చేసుకొంటే అదే దారిలో మిగతా విషయమంతా అజ్ఞానములోనే అర్థమగును.
అందువలన గ్రంథములనుండి మనము ఎంత తెలుసుకొన్నామనునది ముఖ్యము కాదు, గ్రంథములనుండి జ్ఞానము
తెలిసినదా లేదా యన్నదే ముఖ్యము. ఆ మాటకు వస్తే మూడు ఆత్మల విషయము మూడు గ్రంథములలో యుండుట
వాస్తవమే అయినా, అందులోని ఆత్మల జ్ఞానము ఏ బోధకులకయినా అర్థమయినదా అని చూస్తే, అందులో
ఆత్మలున్నట్లు గానీ, ఆత్మల జ్ఞానమున్నట్లుగానీ బోధించు బోధకులకే తెలియకుండా పోయినది. బోధకులకే తెలియకుండా
పోయినప్పుడు, సామాన్య మానవులకు దానిని గురించి తెలియదనియే చెప్పవచ్చును. మూడు దైవ గ్రంథములలో
మనుషులు దైవజ్ఞానమును చూడకుండా, మత జ్ఞానమునే చూస్తున్నారు. గ్రంథములో చెప్పిన దానిని జ్ఞానముగా
అర్థము చేసుకోకుండా అజ్ఞానముగా అర్థము చేసుకోవడము వలన తర్వాత తెలియబడునది జ్ఞానముగా అర్థము
కాకుండాపోయి అజ్ఞానముగా అర్థమవగలదు.
బైబిలు గ్రంథములలోని ఒక వాక్యమును ఆధారము చేసుకొని బైబిలు దైవగ్రంథమని తెలియగలిగాము. దానితో
మధ్య దైవగ్రంథము ఏదయినదీ తెలిసిపోయినది. మధ్య దైవగ్రంథమునకు ప్రవక్తగా ఏసును చెప్పుకోవచ్చును. అయితే
ఏసు కేవలము బోధకుడా? లేక గురువా? అని తేల్చుకోవలసియున్నది. ఇంతకుముందు రెండు దైవగ్రంథములు
తెలిసినా వాటిని బోధించినవారు ఒకరు గురువు (శ్రీకృష్ణుడు), ఒకడు బోధకుడు (జిబ్రయేల్) అని తెలిసిపోయినది.
ఇప్పుడు మిగిలిన గ్రంథము కూడా తెలిసిపోయినది. ఆ గ్రంథములోని జ్ఞానమును బోధించినవాడు గురువా? లేక
బోధకుడా?యని నిర్ధారించుకొంటే ఈ గ్రంథము యొక్క పేరు పూర్తి కాగలదు. అందువలన మధ్య దైవగ్రంథము లేక
ద్వితీయ దైవగ్రంథము అయిన దానిని బోధించినవాడు ఎవడు? అని తప్పక చూడవలసి వచ్చినది. బైబిలు గ్రంథమును
చెప్పినవాడు మనిషే అయినందున గ్రహము అని చెప్పుటకు వీలులేదు. ఖుర్ఆన్ గ్రంథమును చెప్పినది మనిషికాదు.
అయితే బైబిలును చెప్పినది సాధారణ మనిషే. జ్ఞానమును బోధరూపముగా చెప్పినవాడు బోధకుడూ కావచ్చును,
ప్రవక్తయూ కావచ్చును, గురువూ కావచ్చును. బైబిలు గ్రంథములో బోధకుడుగా కనిపించు వానిని అనగా ఏసును
ఏమనాలి? అను ప్రశ్నకు జవాబును చెప్పుకోకముందు కొంత బైబిలు గ్రంథమును గురించి తెలుసుకొందాము.
బైబిలు గ్రంథమంటే ఏమిటో తెలియగలిగితే ఏసు అంటే ఎవరో? తెలియుటకు అవకాశమున్నది.
నేడు మనము చూస్తున్న బైబిలు ఒక పెద్ద గ్రంథముగా యున్నది. బైబిలు రెండు భాగములుగా యున్నది.
అందులో 'పాతనిబంధన' అను ఒక భాగముండగా, 'క్రొత్త నిబంధన'యను రెండవ భాగము కలదు. పాత నిబంధనయను
మొదటి భాగములో 39 పుస్తకములు గలవు. అలాగే క్రొత్త నిబంధనయను భాగములో 27 పుస్తకములు గలవు.
దీనిప్రకారము బైబిలులో మొత్తము 66 పుస్తకములు గలవు. క్రొత్తనిబంధన ఏసు పుట్టిన తర్వాత ప్రారంభమయినది.
ఏసు పుట్టకముందు ఉన్న పుస్తకములన్నీ పాతనిబంధనలోనివే. పాతనిబంధనలో 39 పుస్తకములు వ్రాయబడి యున్నవి.
ఏసు పుట్టిన తర్వాత క్రొత్తనిబంధనలో వ్రాయబడినవి 27 పుస్తకములు. క్రొత్తనిబంధనలో మొదటి నాలుగు పుస్తకములలో
మాత్రమే ఏసు బోధ కనిపించుచున్నది. తర్వాత ఏసు చనిపోవడము, తర్వాత కనిపించ కుండాపోవడము జరిగినది.
ఏసు పోయిన తర్వాత వ్రాసిన పుస్తకములు 23 మాత్రమే. క్రొత్తనిబంధనయను బైబిలు రెండవ భాగములో మొదటి
పుస్తకము మత్తయి, రెండవది మార్కు, మూడవది లూకా, నాల్గవది యోహాను అనునవి. ఈ నాలుగు పుస్తకములలో
మాత్రమే ఏసు చెప్పిన బోధకలదు. మిగతావన్నియు ఏసు తర్వాత మిగతా మనుషులు చెప్పిన బోధలు గలవు. అలాగే
పాతనిబంధనలోని 39 పుస్తకములలో ఏసుకంటే ముందు పుట్టిన వారు చెప్పిన సమాచారము గలదు.
క్రొత్తనిబంధనలో మొదటి నాలుగు పుస్తకములలో ఏసు బోధకలదని చెప్పుకొన్నాము కదా! అందువలన ఆ
నాలుగు పుస్తకములకు పేర్లతోపాటు, ప్రత్యేకమయిన బిరుదులు కలవు. నాలుగు పుస్తకములకు చివరిలో సువార్త యని
బిరుదు కలదు. దానిప్రకారము ఒకటవది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త,
నాల్గవది యోహాను సువార్త యను పేర్లతో గలవు. క్రొత్తనిబంధనలో నాల్గు సువార్తలు ప్రత్యేకముగా యున్నవి. నాల్గు
సువార్తలు అయిపోయిన తర్వాత ప్రారంభమయిన మొదటి పుస్తకము పేరు అపోస్తులుల కార్యములు, చివరి పుస్తకము
పేరు ప్రకటనల గ్రంథము. క్రొత్తనిబంధనలోని 5వ పుస్తకము అపోస్తులుల కార్యములుకాగా, 27వ పుస్తకము ప్రకటనల
గ్రంథము. 5వ పుస్తకమునుండి 27వ పుస్తకము వరకు మధ్యలోగల 23 పుస్తకములు పత్రిక అను పేరుతో గలవు.
ఇక్కడ మేము చెప్పునదేమనగా! నేడు బైబిలు అని చెప్పబడునది అనగా 62 పుస్తకములతో కూడుకొన్నది ఏసుకు
సంబంధించిన బైబిలు కాదు. ఏసు చెప్పిన బైబిలు కేవలము నాలుగు సువార్తలు మాత్రమే. అందువలన ఏసు బోధను
గుర్తించుటకు నాలుగు పుస్తకములే ప్రత్యేకముగా యున్నవని గుర్తించునట్లు వాటికి సువార్తలుయని పేరు పెట్టడము
జరిగినది. ప్రజలు ఏసుకు సంబంధించిన నాలుగు సువార్తలనే నిజమైన దైవగ్రంథముగా గ్రహించుటకు మేము
“సువార్త బైబిలు” అని ప్రత్యేకమయిన పేరుతో పిలుస్తున్నాము. మధ్య గ్రంథము సువార్త బైబిలు మాత్రమేగానీ బైబిలు
అంతయూ కాదు అని అర్థము చేసుకోవలెను.
ఇంతవరకు అందరూ చెప్పు బైబిలును మేము చెప్పడము లేదు. మేము నాలుగు సువార్తలుగల బైబిలును
గురించి మాత్రమే చెప్పుచున్నాము. మేము బైబిలులోని ఏ జ్ఞానమును మాట్లాడినా నాలుగు సువార్తలలోని విషయములనే
తీసుకొని మాట్లాడడము జరుగుచున్నదిగానీ, మిగతా 62 పుస్తకములలోని ఏ ఒక్క విషయమునూ తీసుకొని చెప్పడము
లేదు. అసలయిన ఆధ్యాత్మికమంతయూ ఏసు చెప్పిన నాలుగు సువార్తలలోనే కలదు. అందువలన నాలుగు పుస్తకములను
ప్రత్యేకించి “సువార్త బైబిలు" అని పేరుపెట్టుకొని అందులోని విషయములనే చెప్పుచున్నాము. మూడు దైవగ్రంథములలో
మధ్య దైవగ్రంథము లేక ద్వితీయ దైవగ్రంథము నాలుగు సువార్తలు గల సువార్త బైబిలుయని చెప్పవచ్చును. మేము
కొన్ని సంవత్సరముల ముందు నుండి ఈ విషయమును చెప్పుచూనే యున్నాము. మేము బైబిలులోని జ్ఞానము
చెప్పదలిస్తే నాలుగు సువార్తలలోని జ్ఞానము తప్ప ఇతర బైబిలులోని విషయములను ఎప్పుడూ చెప్పలేదు. ఇంతవరకు
బైబిలు అంటే ఏదియనీ, బైబిలులోని సువార్త బైబిలు ప్రత్యేకత కల్గినదనీ, నాలుగు సువార్తలను మాత్రమే ఏసు చెప్పాడనీ
బైబిలును గురించి చెప్పు కొన్నాము. ఇప్పుడు సువార్త బైబిలును చెప్పిన లేక సువార్త బైబిలుకు మాత్రము బోధకుడయిన
ఏసు గురువా! లేక బోధకుడా! యని చూచుటకు ప్రయత్నిద్దాము.
ఏసు ఇప్పటికి అనగా 2014వ సంవత్సరము నాటికి పుట్టి 2047 సంవత్సరములయినది. ఆయన చనిపోయి
2014 సంవత్సరములు అయినది. ఆయన జీవిత కాలము 33 సంవత్సరములు మాత్రమే. ఆయన బోధించిన
కాలము మూడు సంవత్సరములు మాత్రమే. ఆయన మరణము పొంది సమాధిలోయున్నది 33 గంటలు మాత్రమే.
సమాధినుండి బయటికి వచ్చిన తర్వాత 33 మార్లు మాత్రమే శిష్యులకు కనిపించాడు. ఈ విధముగా ఆయన
జీవితము ఎక్కువగా మూడు సంఖ్యతో ముడిపడియున్నది. ఏసు జన్మ ప్రత్యేకతను సంతరించుకొన్నది. తండ్రి వీర్యకణముతో
సంబంధము లేకుండా పుట్టినవాడు ఏసు. ఏసును ఆయన భక్తులు ఏసు ప్రభువు అనెడివారు. ఏసు బాహ్యతండ్రి
సంబంధము లేకుండా తల్లి మేరీమాతకు జన్మించాడు. ఆయన 30 సంవత్సరములు సాధారణ జీవితమును గడిపాడు.
తన కుటుంబముతో కలిసి వడ్రంగి పనిని వృత్తిగా చేయుచూ 30 సంవత్సరములు గడిపిన తర్వాత ఇల్లు వదలి
బయటికి వచ్చాడు. అంతవరకు ఏసుకు ఎటువంటి దైవజ్ఞానమూ తెలియదు. ఆయన 30 సంవత్సరముల సాధారణ
జీవితములో ఏనాడూ ఇతర గురువుల వద్దకో లేక బోధకుల వద్దకో పోయి జ్ఞానము వినలేదు. ఆ కాలములో ఒకటి
లేక రెండు సంవత్సరములు చిన్నవయస్సులో అక్షరాభ్యాసము చేసి అక్షరములను నేర్చుకొన్నాడు తప్ప గ్రంథములు ఏవీ
చదువలేదు. ఆయన ఇంటి వద్ద గడిపిన 30 సంవత్సరముల కాలము ఎక్కడికీ ఇల్లు వదలి పోయినది కూడా లేదు.
ఎంతో క్రమశిక్షణతో తన పనిని తాను చేసుకొనే వాడు. 30 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత బయటి
సమాజము లోనికి వచ్చి దైవజ్ఞానమును ప్రజలకు తెలియజేయాలనుకొన్నాడు.
మూడు (3) పదుల వయస్సు గడచిన తర్వాత మూడు (3) సంవత్సరములు ప్రజలలో జ్ఞానము చెప్పడము
జరిగినది. ఏమాత్రమూ జ్ఞానము తెలియని మనిషి ఒక్కమారు ప్రజలకు జ్ఞానము చెప్పడమునకు పూనుకోవడము
సామాన్యులతో అయ్యేపనికాదు. ఆ ఒక్క విషయములోనే ఏసు ఎవరని ప్రశ్న రాకతప్పదు. ఎక్కడా జ్ఞానమును వినకుండా,
స్వయముగా జ్ఞానము చెప్పువాడు, ఎవరి బోధలనూ ఆధారము చేసుకోకుండా జ్ఞానమును తెలియజేయువాడు వాస్తవముగా
గురువేయగును. ఒక్క గురువు తప్ప మిగతావారు ఎవరుగానీ స్వయముగా జ్ఞానమును చెప్పలేరు. దానితో ఏసు
సామాన్య మానవుడు కాదని తెలిసిపోవుచున్నది. ఏసు సాధారణ మనిషిగా కనిపించినా ఆయనలోనుంచి వచ్చిన
బోధను గురువు తప్ప ఎవరూ చెప్పలేరని, ఈయన గురువై ఉంటాడేమోనను అనుమానము ప్రజలకు కూడా
వచ్చియుండవచ్చును. ఏసును గురించి అందరి అనుమానములు తీరుటకు గతములో మేము వ్రాసిన "కృష్ణుని
మరణము లోకమునకు కనువిప్పు" అను పాఠమును ఇక్కడ చేకూర్చుచున్నాము.
కృష్ణుని మరణము లోకమునకు కనువిప్పు.
క్రీస్తుపూర్వము 02-02-3102వ సంవత్సరము కృష్ణుడు మరణించాడు. జనవరి 14వ తేదీ తర్వాత
ఉత్తరాయణ కాలము వస్తుంది. కావున కృష్ణుడు చనిపోయినది ఉత్తరాయణములోనని తెలియుచున్నది. ఒకనాడు
కృష్ణుడు ఒక చెట్టుపొదవద్ద కాలు మీద కాలు పెట్టుకొని పడుకొని కాలును కదిలించుచుండగా, ఆ ప్రాంతమునకు
వేటకు వచ్చిన బోయవాడు పొదచాటున కాలు కదులుటను చూచి, అక్కడ జింక కదులుతున్నదని తలచి పొరపాటుగా
బాణమును వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటన వ్రేలుకు తగిలింది. బొటనవ్రేలుకు చిక్కుకొన్న బాణము వలన
కృష్ణుని శరీరము నుండి రక్తము కారిపోయి ఆయన చనిపోవడము జరిగినది. విశ్వవ్యాప్తమై అణువణువునా ఉన్న శక్తి
ఏదో, ఆ శక్తిలోని భాగము ఒక శరీరమును ఏర్పరుచుకొని వచ్చి, 126 సంవత్సరములు మానవులతో సహజీవనము
చేసి తన ధర్మములను తెలిపి, శరీరములో లేకుండా అంతటావున్న తనశక్తిలో కలిసిపోయింది. అలా వచ్చి పోయినది
సాధారణ జీవాత్మకాదు, పరమాత్మ శక్తి అని ఒక్క భీష్మునికి తప్ప ఎవరికీ తెలియదు. భీష్ముడు కృష్ణునికంటే ముందే
చనిపోయాడు. అందువలన కృష్ణుడు చనిపోయినపుడు ఆ శరీరములోని జీవాత్మగా ఇంతకాలమున్నది దైవశక్తి అని
ఎవరికీ తెలియదు. 126 సంవత్సరములు శరీరముతో బ్రతికిన ఆ శక్తిపేరు "కృష్ణ" అను రెండక్షరములు మాత్రమే.
కృష్ణ అను శబ్దము యొక్క అర్థము నల్లని రంగు అని తెలియుచున్నది. కృష్ణ పదము నల్లని రంగును తెలుపుచున్నది.
చీకటి నల్లగా ఉండును. కటిక చీకటిలో ఏమీ కనిపించక నల్లని రంగు మాత్రము అగుపడుచున్నది. మనిషి ఎల్లప్పుడూ
ఏదో ఒకటి కనిపించు వెలుతురునే కోరుకొంటాడు. కానీ ఏమీ కనిపించని చీకటిని కోరుకోడు. అదే విధముగా
భూమిమీద ప్రతి మనిషి ఏదో ఒక విషయమును తెలియజేయు మాయనే కోరుకొంటాడు. కానీ ఏ విషయమూ లేని,
ఏ గుణమూలేని దైవమును కోరుకోడు. దేవుడు ఎవరికీ కనిపించువాడు కాడు. దేవున్ని ఎవరూ కోరుకోవడము లేదు
అని తెలియుటకు గుర్తుగా భగవంతుడు తన పేరుగా నల్లని రంగుకు గుర్తు అయిన నలుపు (కృష్ణ) అను పేరును
పెట్టుకొన్నాడు.
విశ్వమంతా వ్యాపించి ఎవరికీ తెలియని శక్తియే కృష్ణ శరీర మందుండి చివరికి మరణించింది. కృష్ణ శరీరములోని
శక్తియూ బయట విశ్వమంతా అణువణువున వ్యాపించియున్న శక్తియూ రెండూ ఒకటే. కావున నీరు నీరులో కలిసి
పోవునట్లు, బయటి శక్తి, కృష్ణ శరీరములోని శక్తి రెండూ ఒకటిగా కలిసిపోయినవి. పుట్టిన మనిషి ఎవడైనా చనిపోయిన
తర్వాత జన్మించకుండా మోక్షమును పొందాలంటే అనగా దేవునిలో కలిసిపోవాలంటే భగవద్గీతలో చెప్పిన సూత్రము
ప్రకారము చనిపోయిన వ్యక్తి యోగియై ఉండాలి. చనిపోయిన యోగి ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు, సూర్యరశ్మి
కలిగిన సమయములో చనిపోయి ఉండాలి. అటువంటి వాడు మాత్రము మోక్షమును పొందును. ఈ సూత్రమును
చెప్పిన కృష్ణుడు ఈ సూత్రము ప్రకారము చనిపోయాడా? అని అడుగవచ్చును. దానికి సమాధానము ఏమనగా!
గీతలో చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడు కర్మయోగియై ఉన్నాడు. ఉత్తరాయణములోనే పగటిపూటే, సూర్మరశ్మి
కలిగిన సమయములోనే చనిపోయాడు. కానీ ఆయన చనిపోయినది శుక్లపక్షములో కాదు. కృష్ణపక్షములో చనిపోయాడు.
మోక్షము పొందవలసిన యోగి శుక్లపక్షములో చనిపోవలసివుంది. కానీ కృష్ణుడు కృష్ణపక్షములో చనిపోవడము వలన,
భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడే మోక్షమునకు పోలేదనీ, తిరిగి జన్మకే
పోయాడనీ చెప్పవచ్చును. అయితే కృష్ణుడు దేవునిలోనికే పోయాడు, కానీ జన్మకు పోలేదు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో
చెప్పిన సూత్రము కృష్ణునికి వర్తించదా! అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నీరు నీరులో కలిసే
దానికి ఏ అడ్డంకులేదు. కానీ మంచు ముక్కలు నీటిలో కలియాలంటే అవి నీరుగా మారుటకు కొంత ఉష్ణోగ్రత
అవసరము. కృష్ణుడు చెప్పినది మంచుముక్కలు నీరుగా మారుటకు ఉష్ణోగ్రత అవసరమన్నట్లు మనుషులు దేవునిగా
మారుటకు ఫలానా సమయములోనే మరణము పొందాలి అని చెప్పాడు. కృష్ణుడు నీరులాంటివాడు కావున మరణకాల
నియమము ఆయనకు లేదు. కానీ మనుషులు మంచుముక్కలు లాంటివారు వారికి ఉష్ణము అను జ్ఞానము అవసరము.
కావున వారికి మరణకాలనియమము ఉన్నది. “జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల” అన్నట్లు కాలమే తానైన వానికి
మరణకాల నియమము వర్తించదు. కర్మ అను చలికి గడ్డకట్టిన మనుషులకు వేడి అను జ్ఞానము అవసరము. అందువలన
సాధారణ మనుషులకు మాత్రమే మరణకాల నియమము వర్తించునని తెలియాలి. మరణకాలము తనకు వర్తించదని
తెలుపు నిమిత్తమే ఆయన కృష్ణపక్షములోనే చనిపోయాడు.
పొదమాటున చల్లని నీడలో పడుకొనివున్న కృష్ణున్ని బోయవాడు వేట నిమిత్తము అక్కడికి వచ్చి, కదలుచున్న
కాలును లేడి అనుకొని బాణము వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటనవ్రేలిని తాకి రక్తము కారుచున్న సమయములో,
ఆ బోయవాడు వచ్చి చూచి నేను ఎంత పనిచేశానని రోదిస్తున్నపుడు, కృష్ణుడు ఇలా “నీవు బాధపడవలసినది ఏమీ
లేదు. నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచున్నవి. నా పుట్టుక, చావు రెండూ జరుగుటకు ఒక కారణమున్నది. నేను
అశుభ్రమైన స్థలములో చెరసాల నందు తల్లిప్రక్కన తండ్రి తప్ప ఎవరూ లేకుండా పుట్టవలెనను నిర్ణయమున్నది. ఆ
నిర్ణయము ప్రకారమే దీనస్థితిలో పుట్టాను. అలాగే మరణము కూడ ఒంటరినైన సమయములో, ఇతరుని ఆయుధము
వలన గాయపడినవాడినై రక్తముకారి చనిపోవలెనని నిర్ణయము కలదు. దాని ప్రకారమే ఇపుడు ఒంటరిగానున్న నన్ను
నీ బాణము గాయపరిచినది. పుట్టుక, చావు రెండూ ఇలా జరుగవలెనని ఉన్నది. కావున నీవు బాధ పడవలదు”
అన్నాడు. ఆ మాటలు విన్న బోయవాడు "మీరు ఎంతో కలిమి, బలిమి రెండూ కలవారు. మీరు ఏమీలేని వారివలె
దీనస్థితిలో పుట్టడము, అలాగే ఒంటరిగా గాయపడి ప్రక్కన ఎవరూ లేకుండా చనిపోవడము మీరు నిర్ణయమనినా
నాకు చెప్పలేని బాధకల్గుచున్నది” అన్నాడు. అలా బాధగా మాట్లాడిన బోయవానిని ఓదారుస్తూ కృష్ణుడు “దీనస్థితిలో
పుట్టిన నా జననము, గాయపడి ఒంటరినై మరణించు నా మరణము భావితరమునకు అవసరము. ఇప్పటి నుండి
కలియుగము ప్రారంభమగుచున్నది. కలియుగములో ఇంతవరకు లేని అజ్ఞానము ప్రారంభమగును. ఇంతవరకు లేని
మతములు కలియుగములో పుట్టుకొచ్చును. సృష్ట్యాదినుండి ప్రపంచ వ్యాప్తముగ ఉన్న ఇందూ ధర్మములు క్షీణించిపోయి,
మచ్చుకు మాత్రము ఇందూదేశములోనే మిగిలి అదియూ బలహీనముగా ఉండును. ఇందువులు తమ ధర్మములను
తామే తెలియక, తమను తాము హిందువులుగా చెప్పుకొందురు. ఇందూపథమును (జ్ఞానమార్గమును) హిందూమతముగా
ప్రకటించుకొందురు. 'పథము' అను శబ్దము చివరకు 'మతము' అను పదముగా మారిపోవును. పథము అనగా
మార్గము, మతము అనగా ఇష్టము ఇది నా మార్గము అను అర్థమును వదలి, ఇది నా ఇష్టము అను మాటను
చెప్పుదురు.
ఆదినుండి ఇందూధర్మములు విశ్వవ్యాప్తముగా ఉన్నవి. కలి యుగములో మతములు తయారై ఇందూపథము
యొక్క స్థానమును క్రైస్తవ మతము ఆక్రమించుకొనును. హిందువులందరూ ఒక్కొక్కరుగా ఆ మతములో చేరిపోవుచూ
హిందూమతము క్షీణించిపోవును. అటువంటి సందర్భములో హిందూమతమును కాపాడుకొనుటకు కొన్ని సంఘములు
ఏర్పడును. అటువంటి హిందూసంఘములకు, తమ మతమునకు సంబంధించిన ధర్మములు తెలియక పోవడము
వలన, వారి వలన హిందూ మతమునకు నష్టము ఏర్పడును. జ్ఞానములేని హిందూసంఘముల పనులను చూచి
హిందువులే ఏవగించుకొందురు. హిందూ దేశములో కూడా క్రైస్తవ మతము విరివిగా వ్యాపించి పోవును. అట్లు పెరిగి
పోవుచున్న మతమును చూచి ఆ మతప్రవక్తకు పూర్తి వ్యతిరేఖులుగా హిందువులు తయారగుదురు. తమ మతమును
హిందువులు కించపరుస్తున్నారని హిందువుల ప్రవక్తనైన నా గురించి క్రైస్తవమతము వారు అసూయగా వ్యతిరేఖముగా
మాట్లాడుదురు. మా దేవుడు గొప్ప, మీ దేవుడు దిబ్బ అని హిందువులు అనగా, మా దేవుడే గొప్ప అని క్రైస్తవులు
అందురు. క్రైస్తవమత ప్రవక్త అయిన ఏసును చూచినా, ఆయన పేరును వినినా హిందువులు కొందరు మండిపడుదురు.
అట్లే హిందువుల దేవున్ని, దేవతలను క్రైస్తవులు తక్కువ భావముతో మాట్లాడుదురు. ఇట్లు మా దేవుడు గొప్ప అని
క్రైస్తవులు అనగా, హిందూసంఘములోని వారు కొందరు మీ దేవుడు దేవుడే కాదని ఏసును దూషించుచుందురు.
హిందువులు క్రైస్తవ ప్రవక్త అయిన ఏసును దూషించే కొలదీ, క్రైస్తవులు తమ బైబిలులోని వాక్యములను చెప్పుచూ, వారి
మతప్రచారము చేయుదురు. జ్ఞానమును బోధిస్తూ మా మతములో రక్షణ ఉన్నదని చెప్పుచుండుట వలన, దేవతా భక్తి
తప్ప దేవుని భక్తి హిందూమతములో లేనిదానివలన, చాలామంది హిందువులు క్రైస్తవులుగా మారిపోవుదురు. చివరకు
హిందువులు తమ మతమును రక్షించుకొను ప్రయత్నములో పడిపోగా, క్రైస్తవులు తమ మతమును పెంచుకొందురు.
పరమతమని హిందువులు క్రైస్తవమతమును, దాని ప్రవక్తను దూషించగా, క్రైస్తవులు హిందూమతము మాయ (సాతాన్)
మతమని హిందూమతమును, హిందువుల దేవుళ్ళను దూషించుదురు. ఈ విధముగా మత ద్వేషములు ఏర్పడి, దాని
వలన భూమిమీద మతహింసలు ఏర్పడును. భూమిమీద మతముల కొరకు యుద్ధములే వచ్చును. వీటన్నిటికీ మనిషి
ఆచరించదగిన ధర్మములేవో, మనిషి తెలుసుకోదగిన జ్ఞానమేమిటో, మతముల పేర్లు పెట్టుకొన్న మనుషులకు తెలియకుండా
పోవడమే ముఖ్య కారణము. ప్రతి మనిషీ పుట్టినప్పటి నుండి యుక్తవయస్సు వరకు బ్రతుకు తెరువుకొరకు చదువుకొని,
దాని తర్వాత ధనార్జనలో పడిపోయి, మిగతా కాలములో మతమును మతభక్తిని, మత ప్రచారమును చేయుచూ నా
మతము గొప్ప, నా మతము గొప్ప అని ద్వేషములు పెంచుకొందురు. క్రైస్తవులను చూస్తే హిందువులు, హిందువులను
చూస్తే క్రైస్తవులు ఒకరినొకరు అజ్ఞానులనుకొను స్థితి ఏర్పడును. ప్రతి మతము వాడు దేవుని పేరే చెప్పుచూ, దేవునివద్దకే
చేరాలని చెప్పినా వారివారి ప్రవక్తలు, వారివారి మతములు వేరువేరైన దానివలన వారివారి దేవుడు కూడా వేరువేరని
చెప్పు కాలమువచ్చును.
ఈ విధముగ భూమిమీద కలియుగమునందు మతముల పేరుతో అధర్మములు పెరిగి పోవును. వేరు మతములు
లేని ద్వాపరయుగములో ఒక్క ఇందువులకు సంబంధించిన ధర్మములనే నేను చెప్పాను. నేను చెప్పిన ధర్మములు
సర్వమానవులకు, సర్వమతములకు సంబంధించినవని ఎవరికీ, ఏ మతము వారికీ తెలియకుండా పోవుట వలన,
క్రైస్తవులు మా జ్ఞానము, మా ధర్మములు ప్రత్యేకమైనవని, మా ప్రవక్త చెప్పినవి కృష్ణుడు చెప్పినవి వేరని అనుకొందురు.
ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని ఎవరూ గుర్తించలేరు. ఇందూధర్మము లను
దేవుడు చెప్పాడనీ, ఇందూ ధర్మములులేని మతము భూమిమీదలేదనీ ఎవరూ గ్రహించలేరు. ఇందూధర్మములు దైవజ్ఞానము
తెలియాలనుకొను ప్రతి మతస్థునికీ అవసరమైనవే. ఎందుకనగా! వారి మత గ్రంథములలో ఏమి చెప్పారో అవియే
నేను చెప్పిన ఇందూ ధర్మములు, ఇందూ అనగా దైవ జ్ఞానము అని తెలియని ప్రతి మతమూ, తమ మతములకు
ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొందురు. చివరకు దైవజ్ఞానము (ఇందుత్వము) తెలియని ఇందువులు కూడా తమది కూడా
ఒక మతమనీ, దానిపేరును హిందూ మతమనీ చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములను తెలియక వేదములను
ఆశ్రయించి, మేము హిందువులము అని కొందరు చెప్పగా, అలాగే నేను చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని
తెలియక, తమది క్రైస్తవ మతమని కొందరు చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములలో కూడా కొన్ని అధర్మములు
కలిసిపోయి భగవద్గీతగా మీముందు నా బోధ ఉండును. నా బోధ అయిన భగవద్గీతలో కూడా అధర్మములు కలిసి
ఉండుట వలన, వాటినే కొందరు హిందువులు ఆశ్రయించి, నేను చెప్పిన ధర్మములను అర్థము చేసుకోలేరు.
విధముగా భగవద్గీత ఎవరికీ అర్థము కాకుండా పోతుంది.
జగతిలో అతి పెద్ద మతముగా క్రైస్తవమతము పేరుపొందినా, ఆ మత ప్రవక్త చెప్పిన బైబిలు గ్రంథములో
కూడా అధర్మములు కలిసిపోయి క్రైస్తవులు కూడా దైవజ్ఞానమును (ఇందుత్వమును) తెలియలేరు. బైబిలును చదివిన
ప్రతి క్రైస్తవుడు, బైబిలును బోధించిన ప్రతి బోధకుడు, అందులో వున్న నా ధర్మములను తెలియలేరు. అందువలన
క్రైస్తవ ప్రవక్త అయిన ఏసు ప్రజలనుద్దేశించి ఒక మాట చెప్పి పోవును. నేను చెప్పిన ధర్మములు మీకిప్పుడు అర్థము
కావు. నా తర్వాత కొంతకాలమునకు ఒక వ్యక్తి వచ్చి నేను చెప్పిన నా మాటలనే వివరముగా చెప్పును. అప్పుడు నేను
చెప్పిన మాటలు అర్థమగును అని చెప్పును. ఏ వ్యక్తి అయితే బైబిలు వాక్యములను వివరించి చెప్పునో, అదే వ్యక్తి
భగవద్గీతలో శ్లోకరూపములోనున్న నా ధర్మములను కూడా వివరించి చెప్పును. అంతవరకు భగవద్గీతకానీ, బైబిలు
గానీ సరిగా ఎవరికీ అర్థము కావు. ఇటు బైబిలును అటు భగవద్గీతను ఏక కాలములో చెప్పునతడే రెండు గ్రంథములలోని
ధర్మములు ఒక్కటేనని, ఆ రెండు గ్రంథములను ఒక్కడే చెప్పాడని సంచలన మాటను చెప్పును. రెండు గ్రంథములలోనూ
దేవుడు చెప్పిన ధర్మములతోపాటు, మనుషులు వ్రాసిన అధర్మములు కూడా ఉన్నాయని, వాటిని వదలి ధర్మములకు
మాత్రమే వివరమును చెప్పును. ఆ వ్యక్తి గురువుగా గానీ, స్వామిగా గానీ చలామణి కాడు. ఏ ఆధారమూలేని
ఆయనను గుర్తించుట చాలాకష్టము” అని కృష్ణుడు బోయవానికి చెప్పాడు.
ఇక్కడ మనము ఆలోచింపదగిన విషయమేమంటే దైవధర్మములను గీతరూపములో ధనుస్సు, బాణములు
ధరించిన అర్జునునికి మాత్రము చెప్పాడు. అక్కడ కృష్ణుడు అర్జునుడు తప్ప మూడవ వ్యక్తి లేడు. పైగా అర్జునుడు
ధర్మములను గురించి అడుగనూ లేదు. దారిన పోయేవానికి పిలిచి పిల్లను ఇచ్చినట్లు, ధర్మముల మీద ధ్యాసలేని
అర్జునునికి ధర్మములను గురించి కృష్ణుడు చెప్పాడు. అట్లే కలియుగములో జరుగబోవు భవిష్యత్తును గురించి, క్రైస్తవ
మతమును గురించి, హిందూమతము క్షీణించి పోవడమును గురించి, ధనుస్సు బాణములు ధరించియున్న బోయవానికి
చెప్పాడు. అర్జునునకు గీతా జ్ఞానమును చెప్పినట్లు, భవిష్యత్తును గురించి అడుగకున్నా బోయవానికి కలియుగ
ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పాడు. కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పునపుడు అక్కడ కృష్ణుడు,
బోయవాడు తప్ప మూడవ వ్యక్తి ఎవరూ లేరు. యుద్ధరంగమున గీతను చెప్పినపుడు కృష్ణుడు అర్జునునికి చెప్పగా,
తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పుట వలన గీత అర్జునుని ద్వారా బయటపడినదని చెప్పవచ్చును. కానీ కలియుగ
ఆధ్యాత్మిక భవిష్యత్తును కృష్ణుడు బోయవానికి చెప్పినపుడు అక్కడ మూడవ వ్యక్తి లేడు. చెప్పిన కృష్ణుడు వెంటనే
చనిపోయాడు. ఇక బోయవాడు మాత్రము మిగిలాడు కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు ఒక్క బోయవాని ద్వారానే
బయటికి రావాలి. కానీ బోయవాడు కూడా తాను చేసిన తప్పుకు అప్పుడే నిరాహారదీక్ష చేసి అక్కడ కృష్ణుని ముందరే
చనిపోయాడని వ్రాశారు. ఇక్కడ ప్రత్యేకించి నేను అడిగే ప్రశ్న ఏమంటే! నీ తప్పు ఏమీ లేదని, అంతా నా కర్మ
ప్రకారము జరిగిందని కృష్ణుడు బోయవానితో చెప్పినా, అతను వినకుండా నేను చేసిన తప్పుకు శిక్ష ఉండాలని,
నిరాహారదీక్ష చేసి వెంటనే చనిపోయాడని, తర్వాత కృష్ణుని రథసారధియైన దారకుడు అక్కడికి వచ్చాడని వ్రాశారు.
నిరాహారదీక్ష చేసి ఒక మనిషి చనిపోవాలంటే కనీసము 40 రోజులైనా పడుతుంది. అలాంటిది నిరాహారదీక్ష చేసి
నిమిషానికే చనిపోయాడని చెప్పడము పచ్చి అబద్దము కాదా?
భాగవతములో కృష్ణున్ని బాణముతో బోయవాడు కొట్టినట్లు వ్రాసిన వారు, జరిగిన సంఘటనను చూచి కృష్ణుడు
నివారించినా వినకుండా నిరాహార దీక్షతో చనిపోయాడని వ్రాశారు. కృష్ణుడు, బోయవాడు తప్ప అక్కడ ఎవరులేని
సమయములో ఏమి జరిగిందో, ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు. వాస్తవానికి బోయవాడు చనిపోలేదు. బోయవాడు
బాధపడగా కృష్ణుడు అంతా కర్మప్రకారమే జరిగిందని ఓదార్చిన తర్వాత కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి
కృష్ణుడు బోయవానికి చెప్పి, ఈ విషయమును నేను నీకు తప్ప ఎవరికీ చెప్పలేదన్నాడు. కృష్ణుడు చెప్పిన చివరి
సందేశమైన కలియుగములో ఆధ్యాత్మిక భవిష్యత్తును వినిన బోయవాడు, నేనెంతో అదృష్టవంతున్ని అని సంతోషపడినాడు.
నా జీవిత అంత్య భాగములో నేను చెప్పు పెద్ద రహస్యము ఇది. దీనిని నీవు తప్ప వినినవాడు ఎవరూ లేరని కృష్ణుడు
చెప్పిన మాటను బట్టి నేను గొప్పవాడినని బోయవాడు అనుకొన్నాడు. యుద్ధరంగమున కృష్ణుని ద్వారా గీతను విని, ఈ
రహస్యము నీకు తప్ప ఎవరికీ తెలియదని కృష్ణుడు చెప్పగా, అర్జునుడు తనకు తాను గొప్పగా ఊహించుకొన్నట్లు
కృష్ణుడు చెప్పిన కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు, దైవజ్ఞాన రహస్యమును విన్న బోయవాడు కూడా అర్జునుడు అనుకొన్నట్లు
అనుకొన్నాడు. ఆ కాలములో యుద్ధము అయిపోయిన తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పగా, అది వ్యాసుని ద్వారా
అందరికీ తెలిసినది. కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు వ్యాసునికి చెప్పినట్లు, భారతములోగానీ, భాగవతములోగానీ
వ్రాయలేదు. అయినా ఇట్లే జరిగింది, అర్జునుడే స్వయముగా వ్యాసునికి చెప్పాడని మేము చెప్పాము. ఇక్కడ బోయవానికి
కృష్ణుడు చెప్పిన విషయము కూడా భారత, భాగవతములలో వ్రాయలేదు. అయినా ఈ విధముగా జరిగిందని మేమే
చెప్పుచున్నాము. ఈ నా మాటవిన్న కొందరు పండితులు, కవులు ఈయన ఎవరు? స్వయముగా ఇట్లే జరిగిందని
చెప్పడానికి? అని అడుగవచ్చును. దీనికి జవాబును తర్వాత చెప్పెదము, కానీ ఈ ప్రశ్నలలో ఈయన ఎవరు? అను
ప్రశ్న నాకు బాగా నచ్చింది.
నేను సత్యమును చెప్పితే విశ్వసించలేని వారు నిరాహారదీక్షతో బోయవాడు చనిపోయాడన్నపుడు, నిరాహారదీక్షకు
నిమిషాలలో ఎవరూ చనిపోరు కదా! అని ఎందుకు అడుగలేకపోయారు? కృష్ణుడు రక్తస్రావము వలన చనిపోయాడను
సత్యమును మేము చెప్పితే నమ్మలేని వారు, కృష్ణుడు రథమునెక్కి వైకుంఠమునకు పోయాడు అని భాగవతములో
వ్రాసిన మాటను ఎలా నమ్మారని అడుగుచున్నాము. నిరాహారదీక్షతో నిమిషాల వ్యవధిలో చనిపోతాడను మాటగానీ,
కృష్ణుడు రథము మీద వైకుంఠమునకు పోయాడనుట గానీ పూర్తి అశాస్త్రీయము, అసత్యము. కల్పిత పురాణములను
గ్రుడ్డిగా నమ్మువారు ఆధారపూరిత విషయములను ఎందుకు నమ్మరని మేము అడుగుచున్నాము. కృష్ణుడు బోయవానికి
ఇంకా కొన్ని విషయములను చెప్పాడు. ఆ విషయములు క్రైస్తవ, హిందూమతములకు రెండిటికీ కనువిప్పు కల్గించు
విషయములుగా ఉన్నవి. కృష్ణుడు దేవుని ధర్మములను తెలియ బరచుటకు అవతరించి వచ్చాడు. ద్వాపరయుగ
అంత్యములో దైవ ధర్మములను భారతదేశములో తెలియబరిచాడు. అలాగే కలియుగ ప్రథమములోనే వచ్చి మరియొకమారు
ధర్మములను ఇతర దేశములో తెలియ బరుస్తానని చెప్పాడు. ఇజ్రాయెల్ దేశములో ఏసుగా ఉద్భవించి ధర్మములను
చెప్పిపోతాననీ, అవసరమునుబట్టి తర్వాత కూడా వస్తాననీ చెప్పాడు. బోయవానిని అడ్డము పెట్టుకొని చెప్పిన మాటలు
నేటికి సత్యములుగా కనిపిస్తున్నవి. ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నవి. "కృష్ణునిగా వచ్చిన నేను కలియుగ
ప్రథమాంకములోనే ఏసుగా వస్తాను. అలా వచ్చిన నన్ను ఎవరూ గుర్తించలేరు. ఇప్పుడు చెప్పిన గీతగానీ, అప్పుడు
చెప్పు వార్తగానీ రెండూ నా ధర్మములనే తెలియబరుచును. ఎక్కడా ఏ వాక్యమూ బేధము కల్గియుండదు. నేనే
ఏసును, ఏసే నేను అయినప్పటికీ శరీరములు, పేర్లు వేరైనా ఇద్దరూ ఒక్కరేనని ఎవరికీ తెలియదు. నా బోధ, ఏసు
బోధ రెండూ ఒక్కటే అయినప్పటికీ, గ్రంథములు వాటి పేర్లు వేరువేరైనప్పటికీ, రెండూ ఒక్కటేనని ఎవరూ గుర్తించలేరు.
అంతేకాక నేను చెప్పిన గీత, ఏసు చెప్పిన నాలుగు సువార్తలు తిరిగి వివరముగా మరొక వ్యక్తి చెప్పేంత వరకు ఎవరికీ
అర్థముకావు. ఆ వ్యక్తిని గురించి ఏసు చెప్పిన వార్తలలో ఆదరణకర్త అని వ్రాయబడివుండును. ఏసు చెప్పిన “ఆదరణకర్త”
అను పేరులోని మొదటి అక్షరము, చివరి అక్షరము రెండు అక్షరములు మొదటిది మొదలులోనూ, చివరిది చివరిలోనూ
ఉండు పేరు ఆయనకుండును. ఆ.....ర్త అను రెండక్షరముల పేరు కల్గినవాడే నేను చెప్పిన బోధనూ, అలాగే ఏసు
చెప్పిన వార్తలనూ ఏక కాలములో వివరించి చెప్పును. అలా చెప్పువాడే కాలజ్ఞానమును చెప్పిన వీరబ్రహ్మముగారికీ,
సమస్త మానవులకూ గురువగును.
ఏసుప్రభువును విశ్వసించిన వాడు నన్ను (కృష్ణున్ని) విశ్వసించడు. అలాగే గీతను చదివినవాడు ఏసును
విశ్వసించడు. ఇటు నేను అటు ఏసు ఉత్తర దక్షిణ ధృవములవలె కనిపించుచుండుట వలన హిందువులు క్రైస్తవులను,
క్రైస్తవులు హిందువులను ఏవగించుకొను స్థితిలో ఉందురు. ఆ సమయములో ఏసు చెప్పిన ఆదరణకర్త తప్ప ఎవరూ
రెండు మతములకు సమాధానములు చెప్పలేరు. అలాగే సమన్వయపరచలేరు. క్రైస్తవులలో ఆదరణకర్త, హిందువులలో
ఆ.....ర్త అయిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే రెండు మతములలోని ఏసు చెప్పిన వాక్యములకు, నేను చెప్పిన గీతకు
సరియైన భావమును చెప్పి, రెండు బోధలను ఒక్కటిగానే చూపును. రెండు మతములలో చెప్పిన నన్ను, ఏసును
ఒక్కనిగానే చూపించును. నేను మూడు వేలసంవత్సరముల తర్వాత పుట్టి, ఈ జన్మలో చెప్పినది తిరిగి అప్పుడు చెప్పగలను.
అలా చెప్పిన నేనే, ఏసు పేరుతో కొంతకాలముండి పోగలను. తర్వాత కొంత కాలమునకు వచ్చినవాడే రెండు జన్మలలో
ఉన్నది నేనేనని, చెప్పినది నేనేనని తెలియజెప్పును. అలా చెప్పుట వలన ఆయన ఇటు హిందువులకు, అటు క్రైస్తవులకు
వ్యతిరేఖిగా కనిపించును. సమాజములో ఎంత వ్యతిరేఖత వచ్చినా నా పని ఇదేనన్నట్లు ఆయన మాత్రము ఎవరికీ
జంకక తాను చెప్పవలసినది చెప్పి పోవును. రెండు బోధలనూ వివరించి చెప్పువాడు ప్రత్యేకించి రెండు మతములలో
ఇటు నేను, అటు ఏసు చెప్పక వదలివేసిన బోధలనూ తెలియజెప్పును. అంతేకాక ఆదినుండి తెలియని ఆధ్యాత్మిక
రహస్యములను తెలియజెప్పి, ఆయన ప్రత్యేకత ఏమిటో ఇతరులకు అర్థమగునట్లు చేసినా, ఆయనను ఎవరూ గుర్తించలేరు.
మానవునికి కావలసిన జ్ఞానమును నేను ఒక విధానముతో చెప్పగా, ఏసు దానినే మరొక విధముగా చెప్పగా, రెండూ
ఒకటేనని చెప్పిన ఆదరణకర్త, రెండిటినీ వివరించి చెప్పుచూ, రెండిటియందు ఉన్నదానినే తన విధానముతో చెప్పి
పూరించును.” అని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధానమును చూస్తే వచ్చే మూడవ వాడు ఎలా ఉంటాడో కొద్దిగా
అర్థమవుతుంది.
మనిషి బ్రతుకుటకు ఆహారము తినాలి. ఆహారములో మనము అన్నమును తింటున్నాము. అన్నమును ఒక్క
దానినే తినినా ఆకలి తీరును. కానీ అన్నములోనికి కూరను కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. అన్నము లోనికి
కూరను కలుపుకొని తిని ఆకలి తీర్చుకొనువారు చాలామంది ఉన్నా, కొంతమంది అన్నమును కూరతో తిన్న తర్వాత
చివరిలో మజ్జిగతో తింటారు. అలా మజ్జిగతో తింటే పూర్తి తృప్తిగా తిన్నట్లగును. ఈ విధముగా ఆహారమును మూడు
భాగములుగా చెప్పుకోవచ్చును. ఒకటి అన్నము, రెండు కూరలు, మూడు మజ్జిగ. ఈ మూడింటినీ సంపూర్ణమైన
ఆహారమని చెప్పవచ్చును. అన్నమును, కూరను, మజ్జిగను మూడింటినీ తిన్నవాడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండును.
మూడు ఆహార భాగములలోనూ పోషక పదార్థములు సంపూర్ణముగా ఉండుట వలన మూడు భాగముల ఆహారమును
తిన్నవాడు శరీరములో తృప్తిగా ఆరోగ్యముతో జీవించును. అన్నము, కూర, మజ్జిగను గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన
అవసరమేమొచ్చిందని కొందరనుకోవచ్చును. దీనిని ఉపమానముగా చెప్పుచున్నాము. ద్వాపర యుగములో కృష్ణుడు
గీతను చెప్పాడు. గీతను ఆధారము చేసుకొని ముందుకు పోవువారుండినా, కలియుగములో ఏసు కూడా జ్ఞానమును
చెప్పాడు. ఏసు చెప్పిన జ్ఞానమును ఆధారము చేసుకొని పోవువారు కూడా ఎందరో కలరు. ఈ రెండు జ్ఞానములను
ఆహారములోని రెండు భాగములుగా పోల్చి చూచుకొందాము. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమును ఆహారములో ఒకటవదైన
అన్నముగా పోల్చుకొందాము. అన్నము ఆహారములో ముడిపదార్థములాంటిది. అన్నము ఒకే రంగుకలిగి, ఒకే
రుచికల్గివుంటుంది. అన్నమును ఒక దానినే తినాలంటే కొంత కష్టముగా ఉంటుంది. అన్నమును ఒక దానినే
కడుపునిండా తినవచ్చును. అట్లు ఒక అన్నమును కడుపునిండా తినినా మనిషి బ్రతుకవచ్చును. కానీ తినే ఆహారము
రుచిగా ఉండుటకు, దేవుడు కృష్ణున్ని పంపి గీతాజ్ఞానమును చెప్పించినట్లు, ఏసును పంపి వార్తా జ్ఞానమును చెప్పించును.
ఏసు చెప్పిన వార్తా జ్ఞానము అన్నముతో సహా అన్నము కలుపుకొని తిను కూరలాంటిది. అన్నము రుచివేరు, కూర
రుచివేరు అయినా రెండూ మనిషికి అవసరమైన ఆహారపదార్థములే. ఏసు చెప్పిన జ్ఞానమును, కృష్ణుడు చెప్పిన
జ్ఞానమును అర్థము చేసుకోగలిగితే, అన్నమును వడ్డించిన వ్యక్తి, కూరను వడ్డించిన వ్యక్తి వేరు వేరైనా, అన్నము కూర
వేరువేరైనా రెండూ తినే పదార్థములేనని తెలుసుకోగలిగితే, రెండు పదార్థములను కలుపుకొని తినగలిగిన వాడు పొందు
రుచివలె, గీతా జ్ఞానమును, వార్తా జ్ఞానమును రెండిటినీ సమన్వయముగా అర్థము చేసుకోగల్గితే, ఎంతో అభిరుచి
తృప్తి ఏర్పడును. అట్లు కాకుండా అన్నము తెల్లగున్నది, కూర నల్లగున్నది అది వేరు ఇది వేరు నేను అన్నమును
ఒకదానినే తింటానని, అన్నమును మాత్రము తినినా కడుపు నిండును. అలాగే కూరను మాత్రము తింటానని కూరనొకదానినే
తినినా కడుపు నిండును. అలా తినడములో గల రుచివేరుగా ఉండును. రెండిటినీ కలుపుకొని తినడము వలన రుచి
వేరుగావుండి బాగుండును.
ఇప్పుడు భూమిమీద మేము అన్నమును మాత్రము తింటామన్నట్లు కృష్ణునియొక్క గీతా జ్ఞానమును మాత్రము
చదవగల్గిన హిందువులనువారు కొందరున్నారు. అలాగే మేము కూరను మాత్రము తింటామన్నట్లు ఏసు యొక్క వార్తా
జ్ఞానమును మాత్రము చదువగల్గిన క్రైస్తవులను వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయములో అన్నము కూర
రెండిటి విషయము తెలిసిన ఆదరణకర్త వచ్చి రెండిటి వివరమును వివరించి రెండిటినీ కలుపు కొమ్మన్నట్లు గీతలోని
జ్ఞానమును, వార్తలలోని జ్ఞానమును వివరించి చెప్పును. అంతవరకు కృష్ణుడు వేరు, ఏసు వేరని అట్లే గీతాజ్ఞానము
వేరు, వార్తాజ్ఞానము వేరని అనుకొనుచుందురు. భూమిమీద క్రైస్తవ పాస్టర్ ఫాదర్లను బోధకులకు, హిందూ గురువులను
బోధకులకు విభిన్నముగా అంతవరకు రెండిటియందు ఎవరికీ తెలియని వివరమును ఆదరణకర్త బోధించగా, వివరము
తెలిసినందుకు కొందరు మాత్రము సంతోష పడుదురు. చాలామంది బోధకులు ఆయనను వ్యతిరేఖిస్తారు. ఆయన
మీద దాడులు కూడా చేస్తారు. అయినా ఆయన ఎవరికీ భయపడకుండా తన పనిని తాను చేయునని కృష్ణుడు కూడా
చెప్పాడు. రెండిటికి సమన్వయకర్త అయిన ఆయనను ఏసు ఆదరణకర్త అని చెప్పగా, ఆయన పుట్టుక హిందూమతములో
ఉండుట వలన మరియు ఆయన రెండు మతములకు ఆదర్శముగా ఉన్న దానివలన, ఏసు చెప్పిన ఆదరణకర్త,
హిందువులలో “ఆదర్శకర్త” అను పేరుతో చలామణి అగునని కృష్ణుడు బోయవానికి చెప్పి పోయాడు. కృష్ణుడు చెప్పిన
ఆదర్శకర్త, ఏసు చెప్పిన ఆదరణకర్త ఇద్దరూ ఒక్కరేనని తెలిసిపోయినది. ఆదరణకర్త అయిన ఆదర్శకర్త అను పేరు
ఎవరికున్నదో వెతికితే ఆ పేరును బట్టి సులభముగా మూడవవ్యక్తిని గుర్తించగలము. ఆ పేరున్న వాడు వచ్చిపోయాడా!
లేక వచ్చివున్నాడా! లేక రాబోవు కాలములో వస్తాడా! అను విషయము మాత్రము అర్థముకాని విషయము.
ఆదర్శకర్త అను పేరున్నవాడు ఆదరణకర్తగా ఇటు ఏసు, అటు కృష్ణుని జ్ఞానమును వివరించి చెప్పునదేకాక,
ఇంకా అర్థము కాకుండా మిగిలియున్న ధర్మములను అనగా ఇంకా తెలియకున్న ధర్మములను క్రొత్త విధానములో
తెలిపి పూరించునని కృష్ణుడు చెప్పిపోయాడు కదా! ఆయన పూరించు ధర్మములను ఎలా పోల్చవచ్చునో
వివరించుకొందాము. మనిషికి సంతృప్తినిచ్చు పూర్తి భోజనము మూడు భాగములుగా ఉండుననీ, ఆ మూడు భాగములను
అన్నము, కూర, మజ్జిగ (పెరుగు) అని చెప్పుకొన్నాము. అన్నమును రుచికరమైన కూరతో తినినా, చివరిలో మజ్జిగతో
తింటేనే తృప్తిగా ఉంటుంది, పూర్తి భోజనము అయినట్లు ఉంటుంది. అలాగే రాబోవు ఆదర్శకర్త, కృష్ణుడు గీతను
చెప్పగా అందులో కూడా తెలియనిది ఏదైతో ఉందో, అట్లే ఏసు తన వార్తను చెప్పగా అక్కడ కూడా తెలియనిది ఏదైతే
ఉందో, రెండుచోట్లా తెలియక మిగిలిన దానిని పూర్తిగా తెలియజేయును. దేవుని ధర్మముల విషయములో ఎవరివద్ద
ప్రశ్న అనునది గానీ, సంశయమనునది గానీ లేకుండా చేయును. దీనినిబట్టి ఆదర్శకర్త అను పేరుతో వచ్చువాడు
నాస్తికులవద్దగానీ, హేతువాదులవద్దగానీ దేవుని గురించి అడుగు ప్రశ్నే లేకుండ చేయును. అందువలన ఆదర్శకర్త
ఇటు నాస్తికులకూ, అటు ఆస్తికులకూ తెలియని జ్ఞాన విధానమును తెలుపునని అర్థమగుచున్నది. ద్వాపరయుగములో
కృష్ణుడు చనిపోతూ చెప్పిన ఆదర్శకర్త, కలియుగములో ఏసు బోధిస్తూ చెప్పిన ఆదరణకర్త, ఎంతో గొప్ప జ్ఞానము కలిగి
క్రైస్తవులకు, హిందువులకు మ్రింగుడు పడనివాడై ఉండును. ఆదరణకర్త, ఆదర్శకర్త అయినవాడు చెప్పిన బోధను
గ్రహించిన హిందువులు, క్రైస్తవులు ఆయనలోనే కృష్ణున్ని, ఆయనలోనే ఏసును చూచుకొందురు. నేను ఇప్పుడు చెప్పిన
విషయములు హిందూ మత ప్రచారమునకో, లేక క్రైస్తవ మతప్రచారము కొరకో కాదు. రెండు మతములకు అతీతమైన
దేవున్ని గురించి తెలుపు విధానమని తెలియాలి. అంతేకాక కృష్ణుడు పోతూ పోతూ చివరిగా చెప్పిన కలియుగ
ఆధ్యాత్మిక భవిష్యత్తులో ఆదర్శకర్త పేరుండడము విశేషము. ఈ దినము భూమిమీదవున్న జ్ఞానమును గురించి,
అజ్ఞానమును గురించి, పుట్టుకొచ్చిన మతముల గురించి కృష్ణుడు ఆనాడే చెప్పాడు. ఇదంతయూ కృష్ణుడు చివరి
రోజున చెప్పిన భవిష్యత్తు వివరమని తెలియవలెను.
ఇప్పుడొక ప్రశ్నరాక తప్పదు. అదేమనగా! కృష్ణుడు యుద్ధరంగములో బోధ చెప్పగా వినిన అర్జునుడు తర్వాత
వ్యాసునికి చెప్పాడనీ, వ్యాసుని ద్వారా అందరికీ తెలిసిందని చెప్పారు. దానిని ఒక విధముగా సత్యమేనని ఒప్పుకోవచ్చును.
కానీ కృష్ణుడు చనిపోవు చివరి సమయములో కలియుగ ఆధ్యాత్మికమును గురించి చెప్పాడనీ, దానిని బోయవాడు
విన్నాడనీ చెప్పారు. అక్కడ ఎవరూలేని ఆ సమయములో కృష్ణుడు చెప్పిన సమాచారమును వినిన బోయవాడు ఆ
విషయమును తర్వాత ఎవరికీ చెప్పినట్లు ఆచూకీ లేదు. బోయవాడు చెప్పినట్లు ఎక్కడా లేనపుడు అక్కడ జరిగిన
విషయము మీకెలా తెలిసింది? మీరెలా ఈ విషయములన్నిటినీ చెప్పగలుగుచున్నారని ప్రశ్నించవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా! అర్జునుడు గీతను వ్యాసునికి చెప్పినట్లు కూడా భారతములోగానీ, భాగవతములోగానీ లేదు.
అక్కడ వ్యాసుడు తెలివిగా ప్రవర్తించి, అర్జునుడు చెప్పినట్లు తెలియకుండా చేసి, సంజయుడు దృతరాష్ట్రునికి చెప్పినట్లు
వర్ణించాడు. ఎలాగైతే ఏమి! చివరకు కృష్ణుడు అర్జునునికి చెప్పిన విషయము బయటికి వచ్చినది. కానీ ఇక్కడ
భాగవతములో బాణముతో కొట్టిన బోయవాని పాత్రను చంపివేసి బోయవానిని పూర్తిగా లేకుండా చేశారు. అందువలన
కృష్ణుడు చెప్పిన విషయము ప్రస్తావనకే రాలేదు, తర్వాత ఎవరికీ తెలియకుండా పోయినది. ఆ బోయవాడు తనకు
కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు తెలిసినా, ఆ విషయమును ఎవరికీ చెప్పాలనుకోలేదు. తనకు పరిచయమున్న వారంతా
నిత్యము వేటకు పోయి బ్రతుకువారే, కావున వారికి ఈ విషయము అవసరము లేదనుకొన్నాడు. ఎవరికైనా చెప్పాలను
కొనినా వీనికి చెప్పే దానికీ కుదరలేదు. ఈ విధముగ ఆ విషయము వానితోనే లేకుండా పోయినది. అలా వాడు ఆ
జన్మలో చనిపోయి తర్వాత జన్మలో పుట్టుతూవస్తూ అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో జన్మలు ఎత్తాడు. ఆ విధముగా
ఆ జీవుడు జన్మిస్తూ, మరణిస్తూ ఎన్నో జన్మలను ధరించినా అతని వెంట ఆత్మ వస్తూనే ఉండును. ఆ జీవుడు ఎన్ని
జన్మలు మారినా వానితో పాటు శాశ్వతముగా వున్న ఆత్మకూడ వాని వెంటనే ఉంటూ అన్ని జన్మలకూ సాక్షిగా ఉండును.
వెనుకటి జన్మ విషయము కూడ జీవునికి తెలియదు. కానీ ఆది నుండి అన్ని జన్మలకూ సాక్షిగానున్న ఆత్మకు అన్ని
జన్మల విషయములూ తెలియును. ద్వాపరయుగ అంత్యములో చివరిగా కృష్ణుడు బోయవానికి చెప్పిన విషయమంతా
అతని ఆత్మకు తెలియును. అతను ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఒక రోగముతో బాధపడుచూ నావద్దకు రావడము
జరిగినది. అప్పుడు నేను అతనికి కర్మను ఉదహరించుటకు దైవజ్ఞానమును చెప్పు సమయములో, ఆ జీవుడు
నిద్రావస్థలోనికి పోయి లోపలనున్న ఆత్మయే వినుటకు మొదలు పెట్టింది. నేను కృష్ణున్ని గురించి ఆయన చెప్పిన
జ్ఞానమును గురించి చెప్పు సమయములో, అతనిలోని ఆత్మ కృష్ణుని మరణ సమయములో జరిగిన వృత్తాంతమునంతటిని
వివరముగా నాకు చెప్పింది. కావున దానినే నేను మీకు చెప్పాను.
ఇదేదో కాకమ్మ గువ్వమ్మ కథలాంటిది అనుకోవద్దండి. మనిషికి జన్మలున్నది వాస్తవము, పునర్జన్మలో జ్ఞాపకము
అరుదుగా ఎవరికైనా రావచ్చును. అలా వచ్చిన సంఘటనలు కూడ ఎన్నో ఉన్నాయి. జరిగి పోయిన జన్మలలోని
విషయములు జ్ఞాపకము వచ్చుటకు ఒకే ఒక ఆత్మయే కారణము. జీవునికిగానీ, మనస్సుకుగానీ, బుద్ధికిగానీ గతజన్మ
జ్ఞాపకాలు ఉండవు. విషయములను జ్ఞాపకము పెట్టుకొను స్థోమత శరీరములోని మనస్సుకు మాత్రముండును.
మనస్సు చనిపోయిన జన్మలోనే పోతుంది. తర్వాత జన్మలో క్రొత్త మనస్సు వస్తుంది. కావున ప్రస్తుత జన్మలో గతజన్మ
జ్ఞాపకాలు ప్రస్తుతమున్న మనస్సుకు తెలియవు. మనస్సు తర్వాత జ్ఞాపకమును కలుగజేయునది ఆత్మ. ఒక మనిషి
నిద్రపోవు సమయములో మనస్సు బయట అవయవముల సంబంధము కోల్పోయి, బ్రహ్మనాడిలో అణిగి ఉండును.
అప్పుడు ఆ శరీరములోని ఆత్మ మనస్సువలె పనిచేసి ఎవరైనా పిలిస్తే, ఆ పిలుపును బుద్దికి జీవునికి చేర్చి నిద్రనుండి
లేచునట్లు చేయుచున్నది. అంతేకాక ఆత్మ శరీరములో రాత్రింబగళ్ళు అన్ని విషయములకు సాక్షిగా ఉన్నది. ఒక
మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా వానిని వీడకుండా ఉండునది ఆత్మ ఒక్కటియే. ఆనాడు కృష్ణుడు చనిపోయినపుడు
బోయవాని శరీరములో జీవునితో పాటు ఉన్న ఆత్మ, కృష్ణుని మరణ సమయములో ఏమి జరిగినది, ఏమి సంభాషణ
జరిగినది అన్నిటినీ చూచి ఉన్నది. ఇది సర్వ మానవులలో జరుగు ప్రక్రియయే. కానీ ఎవరికీ శరీరములోపల జరుగు
తతంగము తెలియదు. బోయవాని శరీరములోని ఆత్మ నాకు తెలియజెప్పడము కొందరికి వింతగా కనిపించినా, ఇది
వాస్తవముగా కొన్ని సందర్భములలో జరుగునదే. కృష్ణుని మరణమునకు ఆత్మ సాక్షి అయినందున అప్పటి విషయము
ప్రస్తుత జన్మనుండి, ప్రస్తుత వ్యక్తినుండి చెప్పడము జరిగినది. ఇక్కడ ఇంకొక విశేషము కూడా ఉన్నది. అదేమనగా!
ద్వాపరయుగములో కృష్ణుని మరణ సమయమున ఉన్న అప్పటి బోయవాడు అప్పటినుండి ఎన్నో జన్మలు ధరిస్తూ వచ్చి,
చివరికి ప్రస్తుత జన్మలో నా ముందరకు రావడము జరిగినది. అలా నా ముందరకు వచ్చిన ప్రస్తుత వ్యక్తి క్రైస్తవ
మతమునకు చెందిన వాడు. అప్పటి హిందూమతములోని బోయవాడు ఇప్పటి క్రైస్తవమతములోని వ్యక్తి అని తెలియుచున్నది.
ఇప్పటి క్రైస్తవుడు అప్పటి విషయమును చెప్పడమేమిటి! అని ఆశ్చర్యపోనవసరములేదు. మనిషి బ్రతికి
ఉన్నంతవరకే మతము, చనిపోయిన తర్వాత ఎవరు ఏ మతములోనైనా కర్మప్రకారము పుట్టవచ్చును. గత జన్మలోని
క్రైస్తవులు ఈ జన్మలో హిందువులుగా పుట్టవచ్చును. ఈ జన్మలోని హిందువులు రాబోవు జన్మలో క్రైస్తవులుగా పుట్టవచ్చును.
ఒక మనిషి ఏ మతములో మనుగడ సాగించాలో వాని కర్మే నిర్ణయిస్తుంది. దానిప్రకారమే కొందరు హిందువులుగా,
కొందరు క్రైస్తవులుగా పుట్టుచున్నారు. ఎవనికైనా పుట్టుకతో వచ్చిన మతము దేవుని సమ్మతితో వచ్చిన దానిగా
లెక్కించాలి. ఎవడైనా ఒక హిందువు, క్రైస్తవ మతములోనికి మారాలని తలచినా, ఒకవేళ క్రైస్తవునిగా మారినా, అది
దేవునికి వ్యతిరేఖ చర్య అగును. దేవుని పరిపాలనను ధిక్కరించినట్లగును. అట్లే ఒక క్రైస్తవుడు హిందువుగా మారాలనినా,
ఒకవేళ మారినా అతను కూడ దేవునికి వ్యతిరేఖి అగును. దేవుని పాలకులు అతని మీద కోపము కల్గియుందురు.
అందువలన మతమార్పిడి మహాపాపమని, దైవ నిర్ణయమునకు విరుద్ధముగా చేసినట్లగు నని తెల్పుచున్నాము. నేటి
కాలములో మత మౌఢ్యము అన్ని దేశములలో ప్రాకిపోయినది. దానివలననే యుద్ధములు జరుగుచున్నవి. హింస
చెలరేగు చున్నది. ఒకరినొకరు కొట్టుకొని చస్తున్నారు. చివరకు మాలాంటివారిని కూడ అగౌరవముగా మాట్లాడుచున్నారు.
ఇటువంటి కాలము వస్తుందని ద్వాపరయుగములోనే కృష్ణుడు చెప్పాడు, అలాగే వచ్చింది. నాది క్రైస్తవము నీది
హిందుత్వము అను అజ్ఞాన రోగము పోవుటకు, ఆ రోజే మందును కూడ తయారుచేసి ఇచ్చిపోయినట్లు తెలియుచున్నది.
ఆనాడు కృష్ణుడు రాబోవు మత రోగమును గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ రోగము వచ్చింది. అయితే
రోగమును గురించి చెప్పినపుడే, రోగము వ్యాప్తి చెందకుండా, రోగము పూర్తి నివారణ అగుటకు ఔషధ జ్ఞానమును
కూడా తెలిపాడు. మతమను రోగమునకు, జ్ఞానమను ఔషధము ఏమిటో ఆ రోజు ఆయన సూచించినా, ఈ రోజు
దానిని తెలియలేని స్థితిలో ఉన్నాము. అందువలన మత రోగము ముదిరి పోవుచున్నది. అలా కాకుండా ఇప్పుడు
మనము కృష్ణుడు సూచించిన విధానమును తెలుసుకొందాము.
దేవుడు మతాన్ని సృష్ఠించలేదు. దేవుడు తన జ్ఞానాన్ని ధర్మముల రూపములో తెలిపాడు. దేవుడు తన శక్తిని
తన వ్యక్తిగ మలచి భూమిమీద జ్ఞానాన్ని బోధించునట్లు చేశాడు. అలా వచ్చిన వ్యక్తిని భగవంతుడని హిందువులు,
ప్రవక్త అని క్రైస్తవులు అంటున్నారు. ఎవరు ఏమనినా వచ్చిన వ్యక్తి దేవుని శక్తియేనని జ్ఞాపకముంచుకోవలెను.
అపారమైన దైవశక్తిలో కొంత భాగము వ్యక్తిగా వచ్చినపుడు, ఆ వ్యక్తికి కూడా ప్రపంచములో గుర్తింపు కొరకు పేరుండును.
ఒక కాలములో ఒక ఊరిలో ఉన్న ప్రవక్తకు గానీ, భగవంతునికి గానీ ఒక పేరుండును. ద్వాపరయుగములో దైవ
భాగములలో ఒక భాగమై వచ్చిన వ్యక్తి పేరు కృష్ణ. కృష్ణుడు ద్వాపర యుగములో ఉత్తర భారతదేశమున మధురలో
పుట్టాడు. భగవంతుడైన కృష్ణుడు దేవుని ధర్మములను తెలిపిపోయాడు. ఆయన పోయిన తర్వాత దాదాపు మూడు వేల
(3000) సంవత్సరములకు దైవశక్తి కలియుగమున ఇజ్రాయెల్ దేశమున జెరూసలేము నగరమున ఒక వ్యక్తిగా
పుట్టినది. ఆ వ్యక్తి ఏసు అను పేరుతో పిలువబడినాడు. ద్వాపరయుగములో పుట్టిన దైవశక్తి పేరు కృష్ణ అను రెండు
అక్షరములు. కలియుగములో పుట్టిన దైవశక్తి పేరు ఏసు అను రెండక్షరములు. దైవశక్తి భూమిమీదకు రావడమే
అరుదు. కొన్ని లక్షల సంవత్సరములకొకమారు వచ్చు దైవశక్తి, మూడువేల సంవత్సరములకు రెండవమారు రావడము
ఆశ్చర్యపడవలసిన విషయము. భగవద్గీతలో కూడా ధర్మములకు ముప్పు ఏర్పడినపుడు, అధర్మములు చెలరేగినపుడు,
అధర్మములను అణచివేసి తిరిగి ధర్మములను తెలియ జేయుటకు యుగయుగమందు వస్తానన్నాడు. ఆయన మాట
ప్రకారము చూచినా ఒక్కొక్క యుగము కొన్ని లక్షల సంవత్సరముల కాలముంటుంది. అలాంటపుడు అవసరమొచ్చి
ప్రతి యుగమునందు వచ్చినా, ఒక రాకడకు మరొక రాకడకు కొన్ని లక్షల సంవత్సరముల వ్యవధి ఉండును. అలాంటిది
ద్వాపరయుగము అంత్యములో వచ్చిన భగవంతుడు, వెంటనే కలియుగమున కేవలము మూడువేల సంవత్సరములకే
రావడము ఆశ్చర్యపడవలసిన విషయమే అగును. ఒకమారు భూమిమీదకు దైవశక్తి అయిన భగవంతుడు వచ్చి
ధర్మములను నెలకొల్పి పోతే, తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని లక్షల సంవత్సరములు పట్టును. ఆ నేపథ్యములో
ఒక్కొక్కమారు భగవంతుని రాక దాదాపు పది యుగములకు ఒకమారు ఉండవచ్చును. అటువంటిది కృష్ణుడు చనిపోతూనే
కలియుగము వెంటనే ప్రారంభమైనది. భగవంతుడు వచ్చి ధర్మములను తెలియజేసి పోయిన తర్వాత మూడు వేల
సంవత్సరములకే తిరిగి దైవశక్తి భూమిమీద పుట్టిందని చెప్పితే, మూడు వేల సంవత్సరములకే ధర్మములు
అధర్మములైనాయా? అను ప్రశ్నరాగలదు. ఒకవేళ అంతతొందరగా ధర్మములు, అధర్మములుగా మారిపోతే, దైవశక్తి
భగవంతునిగా ధర్మములను తెలియజేయుటకు ఒక యుగములోనే ఎన్నో వందలమార్లు భూమిమీదకు రావలసివస్తుంది.
అలా జరుగుతుందా? ఒక యుగములోనే ధర్మములు అధర్మములుగా ఎన్నో వందల మార్లు మారిపోవునా? అని
ప్రశ్నించుకొంటే దానికి జవాబు ఈ విధముగా గలదు.
దైవశక్తి భగవంతునిగా రావాలంటే అధర్మములు ఒక స్థాయికి పెరగాలి. అధర్మములు ఒక స్థాయిని
అందుకొంటూనే భగవంతుని జన్మ తనకు తానుగా వచ్చును. అలా భగవంతుడు భూమిమీదకు వచ్చి ఒకమారు
ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని యుగముల కాలము పట్టును. ఒక అంచనా
ప్రకారము దాదాపు పది యుగములకు ఒకమారు దైవశక్తి మనిషిగా భూమిమీదకు రావచ్చును. దీనినిబట్టి దాదాపు
ఒక కోటి సంవత్సరముల తర్వాత 8 లక్షలనుండి 10 లక్షల సంవత్సరముల లోపల భగవంతునిరాక ఉండవచ్చునని
అను కుంటాము. ఒకమారు భూమిమీద ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు దాదాపు
పదియుగముల కాలము పట్టునని తెలియుచున్నది. దీనినిబట్టి భగవంతుని రాక తొందరగా ఉండదని తెలియుచున్నది.
అలాంటపుడు కృష్ణుని తర్వాత కేవలము మూడువేల సంవత్సరములకే తిరిగి ఏసుగా పుట్టాడని చెప్పడమేమిటి? అని
కొందరు నన్ను ప్రశ్నించ వచ్చును. దానికి మా వద్దనుండి వచ్చు జవాబు ఏమనగా! దేవుడు భూమిమీద ఒకమారు
ధర్మములను నెలకొల్పుటకు కొంతకాలము పట్టును. ద్వాపరయుగ అంత్యములో కృష్ణుడు వచ్చి ఒకమారు అర్జునునికి
మాత్రము ధర్మములను తెలిపాడు. అదియూ ఆయన వచ్చిన తర్వాత, సమయమును చూచి దాదాపు 90 సంవత్సరముల
వయస్సులో కేవలము ఒక్కమారు చెప్పడము జరిగినది. ధర్మములను నెలకొల్పుటకు దాదాపు కోటి 10 లక్షల
సంవత్సరములకు ఒకమారు వచ్చు భగవంతుడు కేవలము పది నిమిషముల లోపల ధర్మములను బోధించునా? అలా
బోధించడము సంపూర్ణముగా అధర్మములను లేకుండా చేసినట్లగునా? ధర్మములను నెలకొల్పడము ఎంతో ఉన్నతమైన
పనికాగా, ఆ పని కృష్ణుని జన్మలోనే చేశాడా? ఒకమారు నెలకొల్పబడు ధర్మములు పది కాలములకు పైగా అనగా పది
యుగములకు పైగా ఉండవలసి వస్తున్నది. అంత దీర్ఘ కాలముండవలసిన ధర్మములు అంత సులభముగా కేవలము
కొన్ని నిమిషములలో బోధించునా! అని యోచించవలసిన పని ఉన్నది.
అలా యోచిస్తే తెలియు రహస్యమొకటి కలదు. ఈ రహస్యము సులభముగా తెలియుటకు ఒక చిన్న
ఉదాహరణను తీసుకొందాము. ఒక వ్యక్తికి పది లీటర్ల పాలను అమ్మవలెనని అతని యజమాని చెప్పాడు. అప్పుడు ఆ
వ్యక్తి ఒక ఊరిలోనికి పోయి పాలను అమ్మడము మొదలు పెట్టాడు. పాలు ఎవరికి అవసరమో అడిగి పాలను
అమ్మినాడు. కానీ ఆ ఊరిలో కేవలము ఐదులీటర్ల పాలనే అమ్మినాడు. ఇంకా ఐదు లీటర్ల పాలు మిగిలి ఉన్నాయి.
అప్పుడు ప్రక్క గ్రామానికి పోయి మిగిలిన పాలను అమ్మాడు. అమ్మిన పాలు పది లీటర్లు, తిరిగిన ఊర్లు రెండు,
అమ్మినవాడు ఒక్కడే. కానీ ఇక్కడ ఒక తతంగమును గమనిద్దాము. మొదట పాలు అమ్మిన ఊరిలో అందరూ శూద్రులే
ఉన్నారు. కాబట్టి అమ్మేవాడు ఏ ఆటంకం లేకుండా అమ్మేశాడు. రెండవ ఊరిలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారు.
వారు బ్రాహ్మణులు అమ్మే పాలనే కొంటారు. కానీ శూద్రులు అమ్మే పాలను కొనరు. అమ్మేవాడు బ్రాహ్మణుడు కాడు.
కానీ అమ్మవలసిన పాలు ఐదు లీటర్లు మిగిలి ఉన్నాయి. అందువలన అమ్మవలసిన వ్యక్తి పై అంగీని తీసివేసి, ఒక
జంధ్యమును మెడలో వేసుకొని, పంచెకట్టుకొని ఆ ఊరిలోనికి పోయి పాలను అమ్మినాడు. అంగీలేకుండా క్రింద పంచె
మాత్రము కట్టుకొని వుండుట వలన, అతను బ్రాహ్మణునివలె కనిపిస్తున్నాడు. పైగా తన పేరు శంకరయ్య అయితే
శంకరశాస్త్రి అని చెప్పుకొన్నాడు. పేరులోనూ, ఆకారములోనూ బ్రాహ్మణునిగా కనిపించి అమ్మడము వలన అతని ఐదు
లీటర్ల పాలను అక్కడి బ్రాహ్మణులు కొన్నారు. పది లీటర్ల పాలను అమ్మిన తర్వాత పాలవానికి జంధ్యముతో పనిలేదు
అలాగే పంచెతో పనిలేదు. అందువలన వాడు ఇంటికి పోయి జంధ్యమును, పంచెను తీసివేసి తాను ఎప్పుడూ కట్టుకొనే
లుంగీని కట్టుకొని పడుకొన్నాడు. అక్కడ పది లీటర్ల పాలను అమ్మడము ముఖ్యమైన ఉద్దేశము. ఎన్ని ఊర్లలో
అమ్మినావు అనిగానీ, ఎంతసేపుకు అమ్మినావు అనిగానీ పాల యజమాని అడుగడము లేదు. పాల యజమాని యొక్క
పాలను పాలవాడు (పాలను అమ్మువాడు) అమ్మి పెట్టాలి అన్నది నియమము. అంతేగానీ ఈ వీధిలోనే అమ్మాలి, ఆ
ఊరిలోనే అమ్మాలి, గంటలోపే అమ్మాలి, అరగంటలోపే అమ్మాలి అను నియమము లేదు. అందువలన పాలవాడు పది
లీటర్ల పాలను అమ్మితే పాల యజమాని లెక్కలో పాలవాడు ఒకరోజు పని చేసినట్లగును.
పై విధముగ పోల్చుకుంటే పాలయజమాని ఉన్నట్లు పరమాత్మ ఉన్నాడు. పాలవాడు ఉన్నట్లు భగవంతుడున్నాడు.
పాలవాడు అమ్ము పాలు పాలయజమానివి అయినట్లు, భగవంతుడు బోధించు ధర్మములు పరమాత్మవి (దేవునివి).
అమ్మవలసిన పాలు పదిలీటర్లు అయినట్లు తెలుప వలసిన ధర్మములు నూరు శాతము. పాలవాడు పాలను రెండు
ఊర్లలో అమ్మినా ఫరవాలేదు అన్నట్లు, భగవంతుడు నూరు శాతము ధర్మములను రెండు దేశములలో చెప్పినా ఫరవాలేదు.
పదిలీటర్ల పాలను అమ్మినపుడే పాలవానికి ఒకరోజు పని అయినట్లు లెక్కించబడును. నూరు శాతము ధర్మములను
తెలపినపుడే భగవంతునికి ఒకమారు ధర్మములను బోధించి నట్లగును. పాలవాడు పది లీటర్ల పాలను అమ్ముటకు
రెండు ఊర్లలోనికి పోయి రెండు ఊర్లలో కనిపించినట్లు, భగవంతుడు నూరుశాతము ధర్మములను తెలుపుటకు రెండు
దేశములలోనికి పోయి రెండు దేశములలో కనిపించును. ఒక ఊరిలో శూద్రునిగా, ఒక ఊరిలో బ్రాహ్మణునిగా
కనిపించినట్లు ఒక దేశములో ఒక హిందువుల ప్రవక్తగా, మరొక దేశములో క్రైస్తవ ప్రవక్తగా కనిపించును. పాలవాడు
ఉదయము ఆరు గంటలకు ఒక ఊరిలో కొన్ని పాలను అమ్మి, తర్వాత కొంతసేపటికి ఏడు గంటలకు రెండవ
ఊరిలోనికి పోయి అక్కడ వారి కులస్థునిగా కనిపించి, ఏడు గంటలకు పాలను అమ్మినట్లు, భగవంతుడు కృష్ణునిగా
ద్వాపరయుగ చివరిలో దేవుని ధర్మములను బోధించి తర్వాత కొంత కాలమునకు (మూడువేల సంవత్సరములకు)
ఇజ్రాయెలు దేశములోనికి పోయి అక్కడ వారి మతప్రవక్తగా కనిపించి, కలియుగములో దైవధర్మములను బోధించాడు.
పది లీటర్ల పాలను రెండు ఊర్లలో అమ్మినపుడు పాలవానికి ఒకరోజు పని అయినట్లు, భగవంతుడు వేరు వేరు
సమయములలో వేరు వేరు దేశములలో నూరుశాతము ధర్మములను బోధించినపుడే ఆయనకు ఒక అవతారము
పనిపూర్తి అయినట్లగును. పాలవాడు యజమాని పాలను ఎన్ని ఊర్లలో అమ్మినా, ఎంత సమయములో అమ్మినా
పదిలీటర్ల పాలను అమ్మినపుడే యజమాని దృష్టిలో ఒకరోజు పాలవాడు పనిచేసినట్లు లెక్కించబడును. అదే విధముగా
భగవంతుడు ఎన్ని దేశములలో ధర్మములను చెప్పినా, ఎంత కాలములో చెప్పినా, నూరుశాతము ధర్మములను తెలియ
జేసినపుడే, దేవుని దృష్ఠిలో భగవంతుడు ఒకమారు భూమిమీద ధర్మములను బోధించినట్లగును.
పాల యజమాని -
పాలు - ధర్మములు
పాలవాడు - భగవంతుడు
పదిలీటర్ల పాలు - నూరుశాతము ధర్మములు
రెండు ఊర్లు - రెండు భూ భాగములు
ధర్మములకు అధిపతి అయిన దేవుడు -
భగవంతుడు కృష్ణుడు
శంకరయ్య - కృష్ణ
శంకరశాస్త్రి - ఏసు
పాలవాడు (శూద్రుడు) - భగవంతుడు కృష్ణుడు
పాలవాడు (బ్రాహ్మణుడు) -భగవంతుడు ప్రవక్త
అమ్మిన సమయము - బోధించిన కాలము
ఆరు గంటలపుడు - ద్వాపరయుగములో
ఏడు గంటలపుడు - కలియుగములో
పాలను అమ్మడము - ధర్మములను బోధించడము
ఒక రోజు పని - ఒక అవతారము యొక్క పని
పాలను కొన్నవారు - ధర్మములను తెలుసుకొన్న వారు
పాలను కొన్న ఒక ఊరు -మొదట ధర్మములను తెలిసిన దేశము, భారత దేశము.
పాలను కొన్న రెండవ ఊరు - తర్వాత ధర్మములను తెలిసిన దేశము ,ఇజ్రాయెల్ దేశము.
ఆ రేఖకు రెండు ధృవములుండును. ఆ రెండు ధృవములను
కలుపు మధ్యరేఖ ఉండును. రేఖ అనగా గీచిన గీత అని అందరికీ తెలుసు. ఒక గీతకు రెండు ధృవములు, ఆ రెండు
ధృవములను కలుపు గీత ఉండును. క్రిందగల చిత్ర పటములో చూడుము.
చిత్రమును 51 పేజీ లో చూడండి.
చిత్రములో కనిపించు ఒకటవ కొన ఉత్తర ధృవము, అలాగే రెండవకొన దక్షిణ ధృవము. ఒకటి రెండు
కొనలను కలుపుచున్న రేఖను రెండు ధృవములను ఏకస్థాయిగా సమతలముగా చూపుగీత అని అంటున్నాము. గీత ఉ
ంది అంటే ధృవములుంటాయి. రెండు ధృవములు ఉన్నాయి అంటే చూచే దానికి అవి ఒకదానికొకటి వ్యతిరిక్త
దిశలలో ఉండును. వ్యతిరేఖ దిశలలో రెండు ధృవములున్నా, రెండిటినీ సమానముగా చూపు గీత ఉండును. మొత్తము
మీద చెప్పాలంటే ఒక గీత మూడు భాగములుగా ఉన్నదని చెప్పవచ్చును. దీనినిబట్టి గీయబడిన గీత కూడ త్రైతముతో
కూడుకొని ఉన్నదని తెలియుచున్నది. ఇపుడు అసలు విషయానికి వస్తాము. భగవంతుడు తెలియ చెప్పినది భగవద్గీత,
భగవంతుడు చెప్పిన గీతకు కూడ త్రైతము వర్తిస్తున్నది. భగవంతుని గీత మూడు భాగములుగా ఉంటూ ముగ్గురు
పురుషులను తెలియజేస్తున్నది. భగవంతుని చేత గీయ బడిన గీతకు కూడా రెండు ధృవములు కలవు. భగవద్గీత
కూడా ఒకకొన ఉత్తర ధృవముగా, రెండవకొన దక్షిణ ధృవముగా ఉన్నది. ఉత్తర ధృవము దేవుడు, దక్షిణ ధృవము
జీవుడని దీని అర్థము. ఉత్తర ధృవముగానున్న మొదటికొన భాగము పరమాత్మయని, దక్షిణ ధృవముగానున్న రెండవ
కొన భాగము జీవాత్మయనీ, వాటికి మధ్యలోనున్న గీత జీవాత్మను పరమాత్మను ఏకము చేయు ఆత్మ అని తెలియుచున్నది.
సమస్త జగతిలో ఏ జీవాత్మ అయిన పరమాత్మను చేరాలంటే ఆత్మ ద్వారానే సాధ్యమగును. జీవాత్మకు దారి ఆత్మయే.
ఆత్మ దారిలో ప్రయాణిస్తేనే పరమాత్మ అను గమ్యమును చేరవచ్చును. అందువలన దేవున్ని చేరాలను ఏ జీవుడైనా
ఆత్మను అధ్యయనము చేసి తీరాల్సిందే, ఇది శాసనము. ఆత్మను గూర్చి ఆధ్యయనము చేయడమునే ఆధ్యాత్మికము
అంటాము. ఆధ్యాత్మికము తెలియనిది జగతిలో ఎవనికీ ముక్తి లభించదు.
గీయబడిన గీత మూడు భాగములుగా ఉన్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉన్నది. తన గీత
త్రైతముతో కూడుకొన్నదనీ, మూడు భాగములుగా ప్రజలకు తెలియబడునని తెలిసిన కృష్ణుడు, ఆ రహస్యమును చివరిలో
బోయవానికి చెప్పిపోయాడు. పాలవాడు రెండు ఊర్లలో పాలు అమ్మినట్లు, భగవంతుడు రెండు సమయములలో
రెండు దేశములలో తన బోధను తెలుపవలసి ఉన్నది. భోజనము చేయువాడు మజ్జిగతో తిన్నపుడే అది సంపూర్ణ
భోజనమని అనుకొనునట్లు, చివరిలో మూడవ మారు బోధయొక్క వివరమును తెలిపినపుడు సంపూర్ణముగా చెప్పినట్లు
అగును. గీయబడిన గీత మూడు భాగములున్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉండాలి. అలాగే
చెప్పబడిన గీత మూడు ఆత్మలను తెలుపునదిగా ఉండాలి. ఈ సూత్రము వర్తించినపుడు అది భగవంతుడు మానవునికి
బోధించిన బోధ అగును. ఎప్పుడైతే కృష్ణుడు అర్జునునకు ధర్మములను యుద్ధరంగములో తెలియజేశాడో, అప్పుడు
పాలవాడు తన పాలను ఒక ఊరిలో అమ్మినట్లైనది. ఇంకా కొన్ని ధర్మములనుగానీ లేక ఒక ధర్మమునుగానీ మరియొక
కాలములో మరియొక దేశములో చెప్పవలెననీ కృష్ణునికి తెలుసు. అలా రెండవ మారు రెండవ చోట తానే చెప్పవలెనని,
అలా చెప్పిన దానినే మూడవమారు తానే వివరించవలెననీ కూడా కృష్ణునికి తెలుసు. అలా మూడుమార్లు చేసినపుడు
తాను ఒకమారు భూమిమీద ధర్మములను తెలియజేసినట్లగును. అందువలన తన ప్రణాళికను లేక పథకమును
ముందే తెలియజేసినట్లు ఆధారము కొరకు, బోయవానికి తన రెండవ రాకను, మూడవ రాకను గురించిన సమాచారమును
తెలియజెప్పి పోయాడు. ఆ సమాచారముతో బోయవానికి ఏమాత్రము అవసరములేదు. అయినా కృష్ణుడు తన
మరణకాలములో చెప్పాడు. రెండవమారు వచ్చినపుడు ఈ సమాచారమును చెప్పితే ఎవరూ నమ్మరు. కృష్ణుని పేరు
చెప్పుకొని ఏసు గొప్పవాడనిపించుకొన్నాడని ఎవరైనా అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఉద్యోగి
నేను పోయిన జన్మలో మహాత్మాగాంధీనని చెప్పుకొంటే ఎవరూ నమ్మరు. ఆ ఉద్యోగి చెప్పినట్లు, అతను పోయిన జన్మలో
నిజంగా గాంధీయే అయినప్పటికీ ఎవరూ నమ్మే సిద్ధిలో ఉండరు. పైగా ఆ మాటను చెప్పుట వలన వీడు తన
అధికారుల వద్ద గౌరవమును సంపాదించుకొనుటకు అలా బొంకుచున్నాడని అందురు. అట్లుకాక గాంధీ బ్రతికి
ఉన్నపుడు, చనిపోకముందు రాబోవు జన్మలో ఫలానా వ్యక్తిగా పుట్టి, ఫలానా ఉద్యోగము చేస్తానని చెప్పియుంటే
ప్రస్తుత కాలములో ఆ వ్యక్తి ఆ ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఎవరైనా ఈయన ఫలానా గాంధీ అని గుర్తించగలరు మరియు
గౌరవముగా చూడగలరు.
ఏదైనా జరుగకముందు చెప్పితే చెప్పినవానికి జరిగిన కార్యమునకు విలువ ఉంటుంది. అట్లుకాక జరిగిన
తర్వాత చెప్పితే జరిగిన పనికి గానీ, చెప్పిన వ్యక్తికిగానీ విలువ ఉండదు. అందువలన కృష్ణుడు జరుగబోవు దానిని
గురించి ముందే చెప్పాడు. ఆ విలువైన సమాచారమును వినిన వ్యక్తి అప్పుడే బయటికి చెప్పకపోయినా, తర్వాత
చెప్పుట వలన కృష్ణుడు చెప్పిన సమాచారమునకు విలువ చేకూరినది. కృష్ణుడు బ్రతికివున్నపుడు చెప్పిన గీతయందు,
నేను ధర్మములను సంస్థాపన చేయుటకు యుగ యుగమునందు, నన్ను నేను సృజించుకొని వస్తానని చెప్పాడు.
అలాగే ఏసుగా వచ్చిన సమయములో కూడా తర్వాత నేను వస్తానని చెప్పాడు. కృష్ణునిగా వచ్చినశక్తి, ఏసుగా వస్తానని
భగవద్గీతలోనూ, ఏసుగా వచ్చిన వ్యక్తి ఆదరణకర్తగా ఫలానా అడ్రస్లో వస్తానని బైబిలులోనూ చెప్పలేదు. ముఖ్యముగా
ఈ కారణము చేత కృష్ణుని భక్తులైన వారు ఏసును, ఏసు భక్తులైన వారు కృష్ణున్ని ఏమాత్రము నమ్మకున్నారు. కృష్ణున్ని,
ఏసును వేరు వేరు వ్యక్తులుగా లెక్కించి కృష్ణున్ని క్రైస్తవులు, ఏసును హిందువులు అసూయతో దూషిస్తున్నారు. ఇరువురు
రెండు మతాలను సృష్ఠించుకొని మతముల మబ్బులో ఒక మతమునకు మరొక మతము విరోధము అన్నట్లు
ప్రవర్తించుచున్నారు. దీనికంతటికీ కారణము కృష్ణ అను పేరుతో ఐదువేల నూటపదిహేడు (5117) సంవత్సరముల
క్రితము వచ్చిన వ్యక్తియే, రెండువేల పద్నాలుగు (2014) క్రిందట ఏసుగా వచ్చాడని ఎవరూ గుర్తించలేక పోయారు.
ఇపుడు నేను చెప్పు ఈ సమాచారము కొంతమంది క్రైస్తవులకు నచ్చక పోవచ్చును. అలాగే కొంతమంది హిందువులకు
కూడ నా మీద కోపమును తెప్పించును. అయినా దేవుని విషయమును తెలిసి, సత్యమును మూసిపెట్టి బయటికి
చెప్పకపోతే అది భయంకర పాపమగును. అందువలన ఎవరు ఏమనుకొనినా తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినది.
"సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యముకాదు” అను సూత్రమును అనుసరించి చూస్తే, ఎందరు
కాదు లేదు అనినా సత్యము జీవించియే ఉంటుంది. చివరకు ఎవరైనా సత్యమును ఒప్పుకోక తప్పదు. కృష్ణుడు ఏసుగా
వచ్చాడని చెప్పుట సత్యము, కనుక ఆ మాటను ఆలోచించి చూస్తే ఎవరికైనా సత్యముగా కనిపించును. కృష్ణుని
జీవితము గడిచిపోయి 5117 సంవత్సరములైనది. అలాగే ఏసు జీవితము గడచిపోయి ఇప్పటికి 2014 సంవత్సరములైనది.
ఇద్దరి జీవితములు గడచిపోయినవే కనుక గడచిన వారి చరిత్రను ఎవరూ కాదనలేరు. కృష్ణుడు పుట్టాడు, అలాగే ఏసు
పుట్టాడు. ఎవరికైనా జీవితములో జననము మరియు మరణములు రెండూ ముఖ్యమైన ఘట్టములు. ఇప్పుడు ముఖ్య
ఘట్టమైన కృష్ణుని పుట్టుకను, ఏసు పుట్టుకను గమనించి చూస్తాము. కృష్ణుడు పాతబడిన చెఱసాలలో, అశుభ్రమైన
చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూలేని దీనస్థితిలో పుట్టాడు. ఏసు కూడా పాతబడిన పశువులశాలలో, అశుభ్రమైన
చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూ లేని దీనస్థితిలో పుట్టాడు. జీవితము యొక్క ప్రారంభ ఘట్టములో జరిగిన
విధానమును ఇటు హిందువులు, అటు క్రైస్తవులు యుక్తినుపయోగించి యోచిస్తే కృష్ణుడు, ఏసు ఇద్దరూ ఒక్కరే
అనుటకు మొదటనే సాక్ష్యము దొరుకుచున్నది. తర్వాత చూస్తే కృష్ణుడు పుట్టడము ప్రమాద సమయము, అలాగే ఏసు
పుట్టడము కూడా ప్రమాద సమయమే. కృష్ణుడు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు ఆ దేశరాజు సిద్ధముగా
ఉన్నాడు. అలాగే ఏసు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు కూడా ఆ దేశరాజు సిద్ధముగా ఉన్నాడు. కృష్ణుడు
పుట్టగానే కొద్దిసేపటికే పుట్టిన చోట లేకుండా తండ్రిగానున్న వసుదేవుడు ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు. అలాగే
ఏసు పుట్టిన కొద్దిసేపటికే ఆయన తండ్రిగానున్న యోసేపు, పుట్టిన చోట లేకుండ ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు.
కృష్ణుడుగానీ, ఏసుగానీ ఇద్దరూ రాత్రిపూటే పుట్టారు. రాత్రి పూట పుట్టినవారు ఆ రాత్రికే పుట్టిన స్థలములో లేకుండా
పోయి అక్కడికి దూరముగా కొంతకాలము అజ్ఞాతముగా పెరిగారు. కృష్ణుడు ఏసు ఇద్దరూ ఒకటేనని తెలియుటకు
ఒకే పోలికగల సంఘటనలు వారు పుట్టిన రోజు చోటు చేసుకొన్నాయి. కొంచెము తెలివిని ఉపయోగించి చూచినా,
వారిరువురి జనన రహస్యము తెలిసిపోతుంది. వారు ఇద్దరు ఒక్కరుకాదు అనుటకు వీలులేకుండా, వారిరువురి పుట్టుకలు
ఒకే విధముగా జరిగాయి.
పై సమాచారమును చూచిన తర్వాత ఏసు అను వ్యక్తి సాక్షాత్తూ శ్రీకృష్ణుడేయని తెలియుచున్నది. ఈ
సమాచారముతో ఏసు కూడా గురువే అని తెలియుచున్నది. దీనితో గ్రంథములో పైన వ్రాసుకొన్న “మూడు గ్రంథములు,
ఇద్దరు గురువులు, ఒక బోధకుడు" పూర్తిగా తెలిసిపోయినది. మూడు గ్రంథములను చెప్పినవారిలో కృష్ణుడు, ఏసు
ఇద్దరూ గురువులు కాగా, జిబ్రయేల్ బోధకుడుగా యున్నాడు. కృష్ణుడు, ఏసు ఇద్దరూ సామాన్య మనుషులుకాగా
జిబ్రయేల్ గ్రహముగా యున్నాడు. బోధకుడయిన జిబ్రయేల్ దేవుని పాలనలోని ఒకడుకాగా, కృష్ణుడు, ఏసు ఇద్దరూ
దేవుని పాలనలోనివారు కాకుండా దేవుని పాలనచేత పాలింపబడువారుగా యున్నారు. కృష్ణుడు ద్వాపరయుగములో,
ఏసు కలియుగములో యున్నా వారు సాధారణ మనుషులవలె కష్టసుఖములను అనుభవించుటవలన మిగతా ప్రజలు
వారిని సాధారణ వ్యక్తులుగానే లెక్కించారు. ద్వాపర యుగములో కృష్ణుడు చనిపోయిన తర్వాత “భగవద్గీత” బయటికి
వచ్చినది. కలియుగములో ఏసు కూడా చనిపోయిన తర్వాత "సువార్త బైబిలు” బయటికి వచ్చినది. భగవద్గీతను
ఆనాటి వ్యాసుడు వ్రాయగా, కలియుగములో ఏసు బ్రతికియున్నప్పుడు ఆయనవద్ద వుండి ఏసు మాట్లాడినప్పుడు వినిన
వాక్యములను ఆయన శిష్యులు నలుగురు నాలుగు సువార్తలుగా వ్రాశారు. నేడు భగవద్గీత హిందువుల గ్రంథమయినా
కొందరు హిందువులకు భగవద్గీత తమకు ప్రమాణ గ్రంథమని తెలియదు. భగవద్గీతయంటే సరిపోని హిందువులు
చాలామంది కలరు. తమ గ్రంథమేదో, తమ దేవుడెవరో తెలియని స్థితిలో నేటి హిందువులున్నారు. క్రైస్తవుల విషయానికి
వస్తే వారి గ్రంథము బైబిలుయని వారు నమ్మియున్నారు. అట్లే వారి దేవుడు “యెహోవా” అని చెప్పుచున్నారు.
ఇందూమతము ఎప్పుడు పుట్టినదో ఎవరికీ తెలియదు. క్రైస్తవ మతము రెండు వేల (2000) సంవత్సరముల
పూర్వము పుట్టినది. అయినా ముందు పుట్టిన హిందూమతముకంటే వెనుక పుట్టిన క్రైస్తవమతము చాలా వేగముగా
అభివృద్ధియై నేడు హిందూమతముకంటే పెద్దగా యుండడమేకాక, ప్రపంచములోనే పెద్ద మతముగా యున్నది. నేడు
హిందూమతములోని మనుషులకు జ్ఞానము తెలియక పోవడము చేత హిందూమతము క్షీణించుచున్నది. క్రైస్తవులు
బైబిలు బోధలు ప్రచారము చేయుచూ వారి మతమును అభివృద్ధి చేసుకొంటున్నారు. వారి దృష్టి మతమును అభివృద్ధి
చేయడములో ఎక్కువగాయున్నదిగానీ, బైబిలు జ్ఞానమును తెలుసుకోవడములో లేదనియే చెప్పవచ్చును. భగవద్గీతలో
ఎంతో జ్ఞానముయున్నా హిందువుల దృష్టి జ్ఞానముమీద లేదు. ఎవరికయినా కొంత దేవుని మీద ధ్యాస కల్గితే ఆ
ధ్యాసను అసలయిన జ్ఞానము మీద ఉపయోగించక పోవడము వలన ఎవరు దేవుడో తెలియక కొందరు రాముడే
దేవుడని నమ్మియున్నారు. కొందరు వేదములే తమ గ్రంథములని నమ్మియున్నారు. చివరికి హిందువుల దృష్ఠి దేవుని
మీద కాకుండా ఎంతోమంది దేవతల మీద ఉన్నది.
దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడి విశ్వవ్యాప్తముగా కదిలెడి ప్రపంచమును తయారు చేశాడు. తాను
కదలనివాడైనా, పనిచేయని వాడైనా తనలోని ఒక భాగమును కదలునట్లు, పనిచేయునట్లు చేసి తాను కదలనట్లు
యుంటూ తన ధర్మమును తప్పిపోక యున్నవాడై, ఒకవైపు తనే అన్నీ చేయునట్లు తన ఆత్మను నిర్మించాడు. తాను
కర్తగాయుంటూ క్రియగా తన ఆత్మను వుంచాడు. కర్మగా కూడా తనలోని జీవాత్మయను భాగమును నిర్మించి కర్మ
అనుభవించువానిగా చేశాడు. దేవుడు దేవునిగానే యుంటూ కర్త, కర్మ, క్రియగా తానేయున్నాడు. దేవుడు కర్మ, కర్త,
క్రియగా ఉన్నాడని ఎవరికీ తెలియకుండా పోయినది. దేవునియొక్క మూడు భాగములను పూర్తిగా తెలియగలిగితే
వాడు సంపూర్ణ జ్ఞానియగును. తన మూడు హోదాలను, తన మూడు ఆత్మల విధానమును మనిషి తెలియడమే
ఆధ్యాత్మికమగును. దేవుడు తన విషయము తానే తెలియును. దేవుని విషయము ఏ మనిషికీ తెలియదు. అటువంటి
స్థితిలో మనిషికి ఆధ్యాత్మికము (దేవుని మూడు భాగముల విషయ జ్ఞానము) తెలియాలంటే దానిని దేవుడే
చెప్పవలసియుండును. మొదటికి దేవుని విషయము మనిషికి తెలియదు. దేవుడే తన విషయమును తెలిపినా,
తెలుసుకొను యోగ్యత, శక్తి ఏమాత్రము మనిషికి లేవు. అందువలన దేవుడు తనకు ఇష్టమైన మనిషికి తనను తెలియు
యోగ్యతను కల్గించుచున్నాడు. మనిషి స్వయముగా తెలియలేని దానిని దేవుడే తెలియునట్లు మనిషికి యోగ్యత
నిచ్చుచున్నాడు.
దేవుడు తన మూడు ఆత్మల విషయమును తెలియజేయుటకు మూడు గ్రంథములను తయారు చేయించాడు.
ఆ మూడు గ్రంథములే ప్రథమ దైవగ్రంథము భగవద్గీత, ద్వితీయ దైవగ్రంథము సువార్త బైబిలు, అంతిమ దైవగ్రంథము
ఖుర్ఆన్ గ్రంథమని తెలిసిపోయినది. దేవుడు కర్త, కర్మ, క్రియ మూడు తానేయైనప్పుడు మనిషికి తెలియజేయాలనుకొన్న
వాడు దేవుడే, మనిషికి తెలియజేసినవాడూ దేవుడే, తెలుసుకొన్న మనిషీ దేవుడే. అయితే ఈ మాట కొందరికి
విచిత్రముగాయున్నా దేవుడే జీవాత్మ, ఆత్మగా, పరమాత్మగా యున్నప్పుడు తెలుసుకొన్న జీవాత్మ కూడా ఆయనే కదా!
అయితే
అలాగే తెలియజేసిన ఆత్మకూడా ఆయనే, తెలియజేయాలను కొన్న పరమాత్మ కూడా ఆయనే. దేవుడు ముగ్గురు
పురుషులుగా యుంటూ ఎవరి పాత్ర వారు పోషించునట్లు నిర్ణయించాడు. ఈ విధముగాయున్న దేవుని విధానము
దేవుని అనుగ్రహము పొందినవారికి సులభముగా తెలియబడును. దేవుని అనుగ్రహము లేనివారికి తెలియుట చాలా
కష్టమగును. అందువలన మనిషి దేవుని మీద, దేవుని జ్ఞానము మీద శ్రద్ధకల్గియుంటే, అతనికి యున్న శ్రద్ధనుబట్టి
దేవుడు తన జ్ఞానమును అర్థమగునట్లు చేయును. దేవుడు చేయును అని చెప్పినా దేవుడు ఏమీ చేయడు, దేవుని
పాలనలోని వారే దేవుని ఇష్టమునుబట్టి చేయుచుందురు. దేవుని జ్ఞానము అర్థము అగుటకుగానీ, అర్థము కాకుండా
పోవుటకుగానీ మనిషిలోని మాయనుబట్టి యుండును. మనిషిలోని మాయను వాడుకొని మాయచేత జ్ఞానమునకు
దూరము చేయువాడు లేక మాయ చేతనే దేవుని జ్ఞానమునకు దగ్గర చేయువాడు వారిలోని ఆత్మేనని ఎవరికీ తెలియదు.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! క్రియ ఆత్మయే అయి అన్ని పనులను
చేయిస్తున్నప్పుడు లేక చేయుచున్నప్పుడు అన్ని సందర్భములలో అన్ని పనులనూ ఆత్మే చేయుచున్నదని మీరు చెప్పక,
అన్నీ దేవుడే చేస్తున్నాడని అంటున్నారు. గ్రంథములో దేవుడు ఈ విధముగా చెప్పాడు అని మీరే అంటున్నారు. ఏమి
చేసినా దేవుడే చేస్తాడు అని మీరే అంటున్నారు. దేవుడు ఏమీ చేయనివాడు అని మీరే చెప్పి తర్వాత అన్ని సందర్భములలో
అన్నీ దేవుడే చేసినట్లు ఎందుకు చెప్పుచున్నారు? అలా చెప్పడము వలన అక్కడొకమాట, ఇక్కడొకమాట చెప్పినట్లగును
కదా! దీనికి మీరేమంటారు? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. దేవుడు ఏమీ చేయనిమాట
వాస్తవమే. దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడు. క్రియలులేనివాడు అంటే ఏ పనులూ చేయని వాడని అర్థము.
పనులు చేయువాడు ఆత్మయేనని చెప్పుచున్నాము. ప్రపంచములోని సర్వ కార్యములను చేయువాడు ఆత్మయేనని నాకు
బాగా తెలుసు. ఆత్మ ఇటువంటిదని ఎవరికీ తెలియని ఆత్మవిధానమును మేమే మొదటిసారిగా చెప్పుచున్నాము.
అయినా మాటల సందర్భములో దేవుడు ఇట్లు చెప్పాడనీ, దేవుడలా చేశాడనీ చెప్పుచుందుము. వాస్తవముగా దేవుడు
ఏమీ చేయడని తెలిసినా మాటల సందర్భములో దేవుడు చెప్పాడు, చేశాడు అని చెప్పుటకు కారణము కలదు. దేవుడు
అన్నిటికీ కర్త అయినా దేవుని గౌరవార్ధము దేవుడు చేయని పనిని కూడా దేవుడే చేశాడు అని చెప్పాలి. అలా చెప్పకపోతే
దేవున్ని మరచిపోయినట్లగును, దేవున్ని గౌరవించ నట్లగును. అన్నిటికీ దేవుడు మూలపురుషుడు కావున ఆత్మచేయు
అన్ని పనులనూ సందర్భానుసారము దేవుడు చేశాడు అని చెప్పవలసియున్నది. దేవుడు వాన కురిపిస్తాడు అనియూ,
దేవుడు కొన్నిచోట్ల వానలేకుండా చేసి పైర్లు ఎండిపోవునట్లు చేస్తాడు అనికూడా చెప్పుచుంటాము. వాస్తవానికి ఆ
పనులను ఆత్మే చేయుచున్నది గానీ ఎంత తెలిసినవాడయినా దేవుని గౌరవించినట్లు ఆ పనులను దేవుడే చేశాడు అని
చెప్పాలి. అట్లు చెప్పుటలో తప్పులేదు.
దేవుడు సృష్ట్యాదిలో తన జ్ఞానమును సూర్యునికి చెప్పాడు అని మనము ఇతరులకు చెప్పుచున్నాము. దేవుడు
మాట్లాడనివాడు అయినప్పుడు దేవుడు సూర్యునికి జ్ఞానమును ఎట్లు చెప్పాడని ప్రశ్నవేయక తప్పదు. వాస్తవానికి
“దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు" అను సూత్రము ప్రకారము సూర్యునికి దేవుడు చెప్పలేదు. అయినా
ఆయన గౌరవార్ధము అలా చెప్పుచున్నాము. దేవుడు చెప్పకున్నా ఆయన పాలనలో మొదటి వాడయిన ఆత్మయే
ఆకాశము యొక్క శబ్ధముతో జ్ఞానమును చెప్పినది. ఆకాశము పంచ మహాభూతములలో ఒక భూతము. ఆకాశమను
మహా భూతములో కూటస్థుడుగా ఆత్మయున్నది. ఆకాశముయొక్క ఆత్మయే సూర్యునికి జ్ఞానమును చెప్పడము జరిగినది.
పనిచేయువాడు ఆత్మే అయినప్పుడు, అప్పుడు జ్ఞానమును చెప్పినవాడు కూడా ఆత్మయేనని తెలుసు. అయినా అక్కడ
ఆ
'దేవుడు జ్ఞానమును సూర్యునికి చెప్పాడు' అని చెప్పాము. దేవుడు చేయలేదని, ఆత్మే చేసినదని తెలిసినా చెప్పునప్పుడు
దేవుడే చేశాడని చెప్పవలెను. దేవుని విషయములోనే కాకుండా ప్రపంచ విషయములలో కూడా కొన్నిచోట్ల చేసింది
ఒకరయితే, చేసినవారిని గురించి చెప్పక చేయించిన వాని పేరే చెప్పుదురు. ఒక పట్టణములో ఒక అందమైన
సినిమాహాల్ ఉందనుకొనుము. అక్కడికి పోయిన ఒకవ్యక్తి ఈ సినిమా హాల్ ఎవరు కట్టారు? అని అడిగాడనుకొనుము.
అప్పుడు ఫలానా వ్యక్తి కట్టాడని దాని ఓనర్ (యజమాని) పేరు చెప్పుచున్నారు. సూర్యప్రకాశ్ అనునతనిది
సినిమాహాల్ అయినప్పుడు సూర్యప్రకాశ్ ఆ హాల్ను కట్టాడు అని చెప్పుదురు. అయితే సూర్యప్రకాశ్ ఏనాడూ దానిని
కట్టలేదు. సూర్యప్రకాశ్ ప్రక్కనయుండి డబ్బులిచ్చి హాల్ను కట్టమని ఒక ఇంజనీర్కు ఒప్పచెప్పితే, ఆ ఇంజనీర్
పనిమనుషుల చేత కట్టించాడు. కట్టించే బాధ్యత ఇంజనీర్ కాగా, కట్టినవారు బిల్డింగ్ కట్టే తాపీమేస్త్రీలు. సూర్య
ప్రకాశ్ యజమాని మాత్రమే ఆయన కట్టమని ఆదేశమివ్వగా మిగతా నిర్మాణ వ్యక్తులు దానిని నిర్మించారు. సూర్యప్రకాశ్
సాక్షిగా అప్పుడప్పుడు ఆ హాల్ను చూచేవాడు, అంతేగానీ ఏనాడూ కొద్దిమాత్రము కూడా నిర్మాణ పనిని చేయలేదు.
అయినా అడిగే వ్యక్తి ఈ హాలు చాలా అందముగా యున్నది ఎవరు కట్టారు? అని అడిగితే, ఫలానా సూర్యప్రకాశ్
కట్టాడని మనుషుల విషయములో చెప్పినప్పుడు, సర్వమునకు యజమాని అయిన దేవున్ని అయనే చేశాడు అని అనడములో
తప్పులేదు. కూలీలు చేసిన పనిని యజమాని చేయకున్నా, యజమాని పేరే చెప్పినట్లు దేవుని విషయములో దేవుడు
చేయకున్నా, దేవునిపేరు గౌరవార్ధముగానే చెప్పుచున్నాము. కొన్నిచోట్ల యజమాని కూడా నేనే కట్టానని చెప్పినా, అది
నేను యజమానినని చెప్పు భావమేగానీ వేరు కాదని తెలియాలి.
శ్రీకృష్ణుడు అర్జునునకు భగవద్గీతను చెప్పినప్పుడు ఒకమాట అన్నాడు అది ఏమనగా! అర్జునా! మొదట
సూర్యునికి ఈ జ్ఞానమును చెప్పియుంటిని, తర్వాత ఇప్పుడు నీవు నాకు ఇష్టుడవు కావున నీకు నేను చెప్పుచున్నాను
అన్నాడు. ఇందులో ఎవరికీ ఏ తప్పు కనిపించదు. అయితే ఒక దైవగ్రంథములో "దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ
మాట్లాడడు" అని ఉన్నది. దానిప్రకారము చూస్తే కృష్ణుడు చెప్పినది తప్పగును. ఎందుకనగా కృష్ణుడు తనను
దేవునిగా భగవద్గీతలో ప్రకటించుకొన్నాడు. అదే భగవద్గీతలోనే దేవున్ని ఎవరూ చూడలేరు అని కూడా చెప్పాడు.
అయినా నేను సూర్యునికి చెప్పియుంటిని అదే జ్ఞానమునే నీకు చెప్పుచున్నాను అన్నాడు. అయితే ఇక్కడ మనము
అర్థము చేసుకోవడములో ఎంతో తెలివిని ఉపయోగించాలి. అట్లు కాకపోతే సూర్యప్రకాశ్ బిల్డింగ్ కట్టినాననునది
తప్పే. కృష్ణుడు నేను జ్ఞానమును చెప్పానన్నదీ తప్పేయగును. ఇట్లు జ్ఞాన విషయములలో అనేకచోట్ల యోచించి
తెలుసుకోవలసినది ఎంతో యున్నది. ఆధ్యాత్మిక విషయములో స్థూల భావమువద్ద స్థూలము గానే తెలియవలెను. అట్లే
సూక్ష్మ భావమువద్ద సూక్ష్మముగానే తెలియవలెను. అట్లుకాకుండా స్థూల, సూక్ష్మముల వద్ద పొరపాటుపడితే జ్ఞానము
ఎప్పటికీ అర్థముకాదు. దేవుడు ఎప్పటికీ తెలియబడడు.
మనిషి దేవుని జ్ఞానమును తెలియుటకు పన్నెండు మతాలను సృష్టించుకొన్నాడు. అందులో దేవుడే ముఖ్యమని
కొందరన్నారు. కొందరు నీతియే ముఖ్యమనుకొన్నారు. ఈ పన్నెండు మతములలో మూడు మాత్రము ఒకే దేవున్ని
గురించి చెప్పినవనీ, పుట్టినవనీ చెప్పవచ్చును. నాకు తెలిసి నంతవరకు, దేవుడు చెప్పినంతవరకు మూడు మతములు
సిద్ధాంతముతో కూడుకొన్నవి, మిగతా తొమ్మిది మతములు రాద్ధాంతముతో కూడుకొన్నవి. సిద్ధాంతములో శాస్త్రముంటుంది.
కావున ఈ మూడు మతములలో ఏ ఒక్క మతములోయున్నా ఫరవాలేదు ముక్తిని పొందవచ్చును. అయితే నేడు మూడు
మతములలో యున్నవారే తప్పుదోవపట్టి అజ్ఞానమువైపు పోవుచున్నారు. అట్లుకాకుండా అందరూ సరియైన మార్గమును
అనుసరించి ముక్తిని చేరాలన్నదే మా ఉద్దేశ్యము. అసలయిన దైవగ్రంథములయిన ఈ మూడు గ్రంథములకు సంబంధించిన
వారందరూ అదృష్టవంతులే. నేను ఆ మూడు గ్రంథముల ఔన్నత్యమును తెలియజెప్పడమే నా కర్తవ్యము అనుకొన్నాను.
ఇప్పుడు మనుషులవైపునుండి మాట్లాడడము లేదు. దేవుని వైపునుండి మాట్లాడుచున్నాను. దేవుడు తన జ్ఞానమును
మనుషులకు మూడు విధములుగా తెలియజేస్తానన్నాడు. అట్లు మూడు విధములుగా తెలియజేసిన జ్ఞానమే మూడు
గ్రంథములుగా రూపొంది, ఆ మూడు గ్రంథములూ మూడు పేర్లతో మనముందున్నాయి. దేవుడు ప్రసాదించిన మూడు
గ్రంథములను సమానముగా చూడకుండా మతమును ముఖ్యముగా పెట్టుకొని నాది గొప్ప గ్రంథము, మీది చిన్న
గ్రంథము అంటే అది ఇతర మతము వారిని అన్నట్లుండినా వాస్తవముగా దేవున్నే నిందించినట్లగును. ఎందుకనగా!
మూడు గ్రంథములు దేవుని మూడు విధానములచేత తయారయినవే అగుటవలన, మూడు దైవగ్రంథములని
చెప్పబడియుండుట వలన, మూడింటినీ ఒకే దేవుడు ఇచ్చినవగుటవలన ఒక్క గ్రంథమును తక్కువగా చూచినా మిగతా
రెండు గ్రంథములను తక్కువగానే చూచినట్లగును. ఒక్క గ్రంథమును హేళనగా చూచినా, తక్కువ భావముతో చూచినా
అది ఘోర పాపమునకు దారితీయును. అందువలన నీ గ్రంథమును నీవు గౌరవించినట్లు ఇతర గ్రంథములను
గౌరవించక పోయినా ఫరవాలేదుగానీ, అగౌరవ పరచకూడదు, తక్కువగా చూడకూడదని చెప్పుచున్నాను.
మేము ఎందుకు మూడు గ్రంథముల విషయములో అంతగా చెప్పు చున్నామనగా! దేవుడు తన విషయమునంతటినీ
ఆ మూడు గ్రంథముల లోనే యుంచాడు. దేవుని గుట్టు రట్టు రెండూ ఆ మూడు గ్రంథములలోనే ఉన్నాయి. మనిషి
శరీరములో గుండె, కాలేయము (లివర్), ఊపిరితిత్తులు మూడు ఎంత ముఖ్యమో, దేవుని ఆధ్యాత్మిక సామ్రాజ్యములో
మూడు గ్రంథములు అంతే ముఖ్యమైన సారాంశము గలవి. మూడు గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానము నిక్షిప్తమైయున్నది.
అయితే మనుషులు మూడు గ్రంథములను చదువలేకపోవుట వలన, ఎవరయినా చదివితే ఒక గ్రంథమును చదువుట
వలన, మిగతా రెండు గ్రంథములలో ఏమున్నదీ తెలియదు. హిందువు ఎంత జ్ఞాని అయినా నేను హిందువును అని
మతమును అడ్డము పెట్టుకొనుట వలన భగవద్గీతను తప్ప బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములను చదవడము లేదు. మిగతా
రెండు గ్రంథములు పరమతము నకు సంబంధించినవని చదవడములేదు. దానివలన మిగతా రెండు గ్రంథములలో
ఉన్న జ్ఞానమేదో తెలియకుండా పోయినది. అలాగే క్రైస్తవులు తమ మతమునకు సంబంధించిన బైబిలును మాత్రము
చదివి మిగతా రెండు గ్రంథములను ముట్టకుండా యున్నారు. అదే విధముగా ముస్లీమ్లయినవారు కూడా తమ
ఖుర్ఆన్ గ్రంథమును చూచినట్లు మిగతా రెండు గ్రంథములను చూడలేదు. ఒకవేళ చూచినా అందులోని జ్ఞానమును
చూపి దానికంటే తమ గ్రంథములోని జ్ఞానమే గొప్పగాయున్నదని చెప్పు చుందురు. మిగతా గ్రంథములను చూచినా
అందులోని ఏదో ఒక వాక్యమును గొప్పగా యున్నదని అనుకోవడము లేదు. తమ గ్రంథముకంటే తక్కవ భావముతో
చూడడము జరుగుచున్నది. మరొక విషయము ప్రకారము ఒక మతమువారికి ఇంకొక మతములోని గ్రంథము
__చదివితే అది వారికి అర్థము కావడములేదు. అర్థమయినా తమ జ్ఞానమునకు విరుద్ధముగా యున్నదను భావముండును.
ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా కనిపించడము వలన, మనిషి మిగతా గ్రంథములలోనిది కూడా తన
జ్ఞానమేయని తెలియలేకపోవుచున్నాడు.
దేవుడు తన మూడు గ్రంథములలోని జ్ఞానమును ఒకే విధముగా కాకుండా మూడు కోణములనుండి చూపించాడు.
ఇక్కడ చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. త్రిమూర్తులలో విష్ణు, ఈశ్వర, చతుర్ముఖ బ్రహ్మయను ముగ్గురు ఉన్నారు
కదా! వారిలోని నాలుగు తలల బ్రహ్మ బొమ్మను ఒక మైదానములో ప్రతిష్ఠించి, దారిలో పోయేవారందరూ బ్రహ్మను
చూచి పోవునట్లు చేయాలనుకొన్న ఒక హిందూ భక్తుడు, ఆ విధముగానే ప్రతిష్ఠించాడు. నాలుగు తలల బొమ్మను
ప్రత్యేకముగా తయారు చేశాడు. ఆ ప్రత్యేకత ప్రకారము బ్రహ్మ ముఖము మీదయున్న తిలకము బొట్టు సూర్యరశ్మికి
మెరుస్తూ కనిపించేది. ఎండకు బొట్టు మెరిసే ప్రత్యేకతయున్న ఆ ప్రతిమను అటువైపు పోయేవారందరూ చూస్తూ
పోయెడివారు. అశోక్ అనునతడు ఉదయము ఏడు గంటలకే తూర్పువైపు నుండి పడమరవైపుకు దారిలో పోతూ
చతుర్ముఖ బ్రహ్మను చూచాడు. బొమ్మకు నాలుగువైపులా తల యుండుట వలన, ఉదయము తూర్పు వైపునుండి
సూర్యకిరణములు బొమ్మ ముఖమునకు ఎదురుగా పడుట వలన, ఆ ముఖము మీది బొట్టు నిగనిగ మెరియుచూ
కనిపించినది. బ్రహ్మ ముఖము మీది బొట్టు యొక్క మెరుపును దారిన పోయే ఆశోక్ చూచాడు. అశోక్ పోయిన
పదినిమిషము లకు తరుణ్ అనే వ్యక్తి పడమరనుండి తూర్పువైపు పోతూ బ్రహ్మముఖమును చూస్తూపోయాడు. పడమర
వైపునుండి వచ్చినవానికి ఆ సమయములో పడమరవైపు నుండి ఎండ (సూర్య కిరణములు) లేనిదానివలన బ్రహ్మ
ముఖము మీది బొట్టు మెరుస్తూ కనిపించక సాధారణముగా కనిపించినది. తర్వాత అశోక్ గానీ, తరుణ్ నీ ఎప్పుడూ
ఆ దారిలో రాలేదు. వారు ఇరువురు ప్రక్క గ్రామస్థులు కావున ఆ వైపుకు రాలేదు. వారు ఇద్దరూ వచ్చి పోయిన మూడు
నెలల తర్వాత మొదట వచ్చిన అశోక్ నాన్నగారు బ్రహ్మ బొమ్మయున్న దారిలోనే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు
సరిగా పగలు పన్నెండు గంటల సమయమగుట వలన, ఎండ తలపై భాగమున యుండుట వలన, సూర్యకిరణములు
బొమ్మ బొట్టుమీద పడే అవకాశములేని దానివలన, బొట్టు మెరుపు ఏమాత్రమూ అతనికి కనిపించలేదు. అతడు
సాధారణముగా బొమ్మను గమనించుచూ ప్రక్కనే పోయాడు. తర్వాత ఒక నెలకు అశోక్, తరుణ్, అశోక్ నాన్నగారు
ముగ్గురూ వారి ఊరిలోనే ఒకచోట కలియడము జరిగినది.
అప్పుడు ముగ్గురూ ప్రక్క ఊరిలో దారిప్రక్కన పెట్టిన నాలుగు తలల బొమ్మను గురించి మాట్లాడుచూ అశోక్
ఇలా అన్నాడు. "ప్రక్క ఊరిలోని బ్రహ్మ ప్రతిమ చాలా బాగున్నది. బ్రహ్మముఖము మీద కుంకుమ బొట్టు ధగధగ
మెరుపు కల్గియున్నది” అని చెప్పాడు. అప్పుడు వెంటనే తరుణ్ ఇలా అన్నాడు. “నేను కూడా ఆ బొమ్మను చూశాను.
నీవు చెప్పినట్లు ముఖముమీది బొట్టు ఏమీ మెరియడములేదు. అనవసరముగా అబద్దము ఎందుకు చెప్పుతావు” అని
అన్నాడు. అప్పుడు అక్కడే ప్రక్కనే యున్న అశోక్ నాన్నగారు కూడా తరుణ్ చెప్పిట్లే తాను కూడా చూచానని
బ్రహ్మముఖము మీది బొట్టు ఏమీ మెరువలేదన్నాడు. ఇప్పుడు అశోక్ చెప్పినది సత్యమే అయినా, ఇద్దరి లెక్కలో అది
అసత్యమైనది. తరుణ్ మరియు అశోక్ నాన్నగారు కూడా అబద్దము చెప్పక సత్యమునే చెప్పు చున్నారు. అట్లే అశోక్
కూడా సత్యమే చెప్పాడు. అశోక్ లెక్కలో అశోక్ మాట సత్యమే. అట్లే తరుణ్, అశోక్ నాన్నగారి మాట కూడా
వారిరువురి లెక్కలో సత్యమే. ఇక్కడ ఎవరికి వారిది సత్యమేగానీ ఎవరిదీ అబద్దము కాదు. అయినా అశోక్ లెక్కలో
అశోకాన్నగారు, తరుణ్ ఇద్దరూ అసత్యము చెప్పువారిగా లెక్కింపబడినారు. అట్లే తరుణ్, అశోక్ నాన్నగారి దృష్ఠిలో
అశోక్ అబద్దము చెప్పినవాడిగా లెక్కింపబడినాడు. వారికి సూర్యకిరణముల విషయము తెలియకపోవడము వలన,
వారు ఎప్పుడు పోయామని పోయిన సమయమును, పోయిన దిశను అడగక పోయినదానివలన సత్యము అసత్యముగా,
అసత్యము సత్యముగా కనిపించినది. అదే విధముగా మూడు మతములవారు మూడు గ్రంథములను ఏ దృష్ఠితో
చదివాము అని చూడకుండా ఒకరి గ్రంథమును మరొకరు తప్పుపట్టుచున్నారు. వాస్తవానికి మూడు గ్రంథములు
సత్యమునే తెలియజేస్తున్నవని ఒప్పుకోలేక పోవుచున్నారు.
దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథముల రూపములో ఇచ్చాడు. దేవుడు అలా ఎందుకు ఇచ్చాడు?
మూడు గ్రంథములు ఒకే విధముగా ఉండునట్లు ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచిస్తే దానికి అంతర్ముఖముగానున్న ఆత్మే
ఇలా జవాబిస్తున్నది ఆ జవాబు ఇలా కలదు. దేవుడు త్రైతసిద్ధాంతము ప్రకారము మూడు విధముల విభజింపబడి
జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా యున్నాడు. అందువలన తన గ్రంథములను మూడు ఆత్మలవైపునుండి చెప్పునట్లు చేశాడు.
జీవాత్మ దైవజ్ఞానమును చెప్పితే ఎట్లుంటుందో ఆ విధముగా ఒక గ్రంథమును, ఆత్మ దైవజ్ఞానమును చెప్పితే ఎట్లుంటుందో
అదే విధముగా మరియొక గ్రంథమును చెప్పడమేకాక, స్వయముగా పరమాత్మగా తన జ్ఞానమును చెప్పితే ఎట్లుంటుందో
ఆ విధముగా కూడా ఒక గ్రంథమును చెప్పడము జరిగినది. పరమాత్మ (దేవుడు) చెప్పితే ఎట్లుంటుందో అందరికీ
తెలియునట్లు ప్రథమ దైవగ్రంథమును కృష్ణుని చేత చెప్పించడము జరిగినది. సృష్ట్యాదిలో ఆకాశ ఆత్మనుండి వాణి
ద్వారా చెప్పబడిన దేవుని జ్ఞానమును మూడు విధములుగా ముగ్గురి చేత చెప్పించడము జరిగినది. ఇదే విషయమునే
చిన్న ఉదాహరణతో చెప్పుతాను చూడండి. ఒక కేజీ గోధుమపిండిని ఆకాశము అనువానినుండి సూర్యుడు అనునతడు
ఉచితముగా తెచ్చుకొన్నాడు అనుకొనుము. ఆకాశము అనువాని నుండి తెచ్చుకొన్న పిండిని సూర్యుడు ముద్దగా కలిపి,
ఎవరయినా ఆ పిండి ముద్దను రొట్టెగా కాల్చుకొని తినునట్లు సిద్ధముచేసి, భూమిమీదగల మనువుకు ఇచ్చాడు అనుకొనుము.
అలా ఎప్పుడో కొన్ని యుగముల క్రింద ఇచ్చిన పిండిని ఎవరూ తినకుండా అలాగే చెడిపోకుండా ఫ్రిజ్లో
ఉంచుకొన్నాడనుకొనుము. 5000 సంవత్సరములప్పుడు ఆ పిండి ముద్దనుండి 70 పాళ్ళ ముద్దను తీసుకొని కృష్ణుడు
చపాతీగా కాల్చి ప్రజలకు తినేదానికి ఇచ్చాడనుకొనుము. తర్వాత 3 వేల సంవత్సరములకు ఏసు ప్రభువు వచ్చి 30
పాళ్ళ పిండిలో 20 పాళ్ళ పిండిని తీసుకొని పూరీగా కాల్చి ప్రజలకు ఇచ్చాడనుకొనుము. అది అయిన 600 సంవత్సరముల
తర్వాత జిబ్రయేల్ అనునతడు వచ్చి ఉన్న పదిపాళ్ళ పిండిని పరోటాగా కాల్చి ప్రజలకు ఇచ్చాడనుకొనుము. అప్పుడు
కలియుగము మొదటి (5000 సం॥) నుండి చపాతీని తినువారు యున్నారు. రెండు వేల (2000) సంవత్సరముల
నుండి పూరీని తినువారుయున్నారు. 1400 సంవత్సరముల నుండి పరోటాను తినువారున్నారు. అయితే ఇక్కడ
పరోటా తినువారు నాది గోధుమపిండి పరోటా, వారి పూరి మైదాపిండిది, ఇంకొకరి రొట్టె జొన్నపిండి అని ఆరోపించు
చున్నాడు. అట్లే పూరీ తినువాడు నాది నిజమైన గోధుమపిండితో చేసిన పూరీ, మిగతావారిది గోధుమపిండేకాదు,
ఒకరిది సెనగపిండి, మరొకరిది రాగిపిండి అంటున్నాడు. ఇకపోతే ఐదువేల సంవత్సరములనుండి గోధుమ రొట్టెను
తినువాడు నాదే అసలయిన గోధుమపిండి, మొదట గోధుమపిండి రొట్టెను తీసుకొన్నది నేనే. మిగతా వారిది గోధుమపిండి
కాదనుకొంటాను. వారిది గోధుమపిండి అయితే వీని పూరి తెల్లగా, వాని పరోటా ఎర్రగా ఎందుకున్నవి అని
అంటున్నారు.
మొదట ఆకాశమునుండి సూర్యుడు తెచ్చుకొన్నది గోధుమపిండి అయినప్పుడు. దానినే హెచ్చుతగ్గులుగా,
ముందు వెనుకగా తీసుకొని చపాతీగా కాల్చుకొన్నా, పూరీగా కాల్చుకొన్నా, పరోటాగా కాల్చుకొన్నా అందులో యున్నది
గోధుమపిండే. అదే విధముగా మొదట ఆకాశమునుండి సూర్యుడు విన్నది దైవజ్ఞానమైనప్పుడు అదే జ్ఞానమునే
మూడింతలుగా, మూడు కాలములలో చెప్పుకొని మూడు పేర్లు పెట్టుకొన్నారు. ఎలా ఎన్ని పేర్లు పెట్టుకొనినా, ఎందరు
చెప్పుకొనినా అందులోయున్నది. ఆదిలో దేవుడు చెప్పిన జ్ఞానము తప్ప ఏమీలేదు. ఆ విషయమును నేటి ప్రజలు
గుర్తించలేకపోయారు. మొదట ఆకాశవాణి సూర్యునికి చెప్పిన జ్ఞానమునే కృష్ణుడు భగవద్గీతగా తిరిగి రెండవమారు
అర్జునునకు చెప్పడము జరిగినది. దానినే ప్రథమ దైవగ్రంథము అంటున్నాము. తర్వాత కొంతకాలమునకు ఏసువచ్చి
సువార్తబైబిలును చెప్పడము జరిగినది. అప్పుడు ఆ గ్రంథమును ద్వితీయ దైవగ్రంథము అని అన్నాము. తర్వాత
కొంతకాలమునకు జిబ్రయేల్ అను గ్రహము భూమిమీదికి వచ్చి ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పడము జరిగినది. అప్పుడు
ఆ గ్రంథమును అంతిమ దైవగ్రంథము అని అనడము జరిగినది. ఈ విధముగా ద్వాపరయుగ చివరినుండి అనగా
కలియుగము మొదటినుండి మూడు గ్రంథములను దేవుడిచ్చాడు. మూడు గ్రంథములు మూడు కాలములలో, మూడు
దేశములలో బయల్పడి వచ్చినా, అందులో యున్నది సూర్యునికి చెప్పిన జ్ఞానముతప్ప మరొకటి లేదు. మూడు
గ్రంథములలోనూ ఒకే జ్ఞానమున్నా దానిని మనుషులు సరియైన బుద్ధితో గ్రహించలేక, మూడు గ్రంథములలోని
జ్ఞానమును వేరువేరు దేవుళ్ళ జ్ఞానమనుకొన్నారు. ఆకాశమునుండి భూమిమీదకు వచ్చినది ఒకే జ్ఞానమయినప్పుడు
దానిని వేరువేరు జ్ఞానములుగా వర్ణించి చెప్పడము పూర్తి తప్పగును.
దేవుడు భూమిమీదికి పంపిన జ్ఞానము ఒక్కటే అయినా, అది మూడు కోణములనుండి చెప్పబడినదని ముందే
చెప్పుకొన్నాము. అందులో మొట్టమొదట కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ప్రథమ దైవగ్రంథముగా చెప్పుకోవచ్చును.
ప్రథమ దైవగ్రంథము అని ఎందుకు చెప్పుచున్నామనగా, భగవద్గీతను ముగ్గురు పురుషులలో పురుషోత్తముడయిన
పరమాత్మ నుండి చెప్పబడిన జ్ఞానమగుటచేత దానిని ప్రథమ దైవగ్రంథము అంటున్నాము. దేవుడు మూడు విధముల
విభజింపబడినప్పుడు అందులో ఒకటి జీవాత్మ, రెండవది ఆత్మ, మిగిలినది పరమాత్మయనీ, పరమాత్మే ముల్లోకములు
ఆవహించిన దేవుడనీ, భగవద్గీతలో చెప్పుకొన్నాము. మూడింటిలో పెద్ద అయిన పరమాత్మను ప్రథమ దైవమనీ,
రెండవవానిని ద్వితీయ దైవమనీ, మూడవ దానిని మూడవ లేక అంతిమ దైవమనీ అనవచ్చును. జీవాత్మగా యున్నవానిని
అంతిమదైవమనీ, ఆత్మను మధ్య దైవము లేక ద్వితీయ దైవమనీ, అట్లే మూడవవాడయిన పరమాత్మను ప్రథమ
దైవమనీ అంటున్నాము. ఈ సూత్రమును అనుసరించి పరమాత్మ స్వయముగా చెప్పిన గ్రంథమును ప్రథమ దైవగ్రంథమని
అనవలసివచ్చినది. అట్లే రెండవదయిన ఆత్మ తరపునుండి చెప్పిన గ్రంథమును ద్వితీయ దైవ గ్రంథమనియూ లేక
మధ్య దైవగ్రంథమనియూ చెప్పడమైనది. ఇకపోతే జీవాత్మ తరపునుండి చెప్పిన గ్రంథమును అంతిమ దైవగ్రంథము
అని అనవలసి వచ్చినది. ఈ విధముగా మూడు ఆత్మల పాత్రలచే చెప్పించబడిన జ్ఞానమును, ఆత్మలకు తగిన హోదాలో
ఫలానా దైవగ్రంథములని చెప్పారు.
అసలయిన విషయానికి వస్తే ప్రథమ దైవగ్రంథములోని జ్ఞానమును పరమాత్మే ఎలా చెప్పాడో కొద్దిగ గమనిద్దాము.
అలా గమనించుట వలన మిగతా రెండు గ్రంథములలో ఆత్మ, జీవాత్మ ఎట్లు చెప్పినవో సులభముగా గ్రహించవచ్చును.
పరమాత్మ చేత చెప్పబడిన మొదటి గ్రంథము భగవద్గీత. భగవద్గీత మిగతా ఆత్మ, జీవాత్మలు చెప్పిన గ్రంథమునకు
ఆధారముగా యున్నది. అందువలన మిగతా రెండు గ్రంథములకు భగవద్గీత మాతృ గ్రంథమని చెప్పవచ్చును. భగవద్గీత
పరమాత్మ చేత చెప్పబడినది కాబట్టి అధికారపూర్వకముగా కొన్ని వాక్యములుండడమును గ్రహించవచ్చును. అంతేకాక
చెప్పినది పైకి కనిపించు కృష్ణుడే అయినా, సాక్ష్యాత్తూ దేవుడు చెప్పినట్లే భగవద్గీతలో కనిపించును. మోక్షసన్న్యాసయోగము
66వ శ్లోకములో "సర్వ ధర్మములను వీడి నన్నుమాత్రము శరణుజొచ్చినవానిని సర్వపాపములనుండి తప్పించి ముక్తిని
ఇస్తాను” అనడము మూడవ పురుషుడైన పురుషోత్తమునితో కాక ఎవరి చేతనగును? పురుషోత్తమ ప్రాప్తి యోగమున
ఎవడయితే తనలోని అజ్ఞానమును తొలగించుకొని నన్నే పురుషోత్తమునిగా తెలిసి అన్ని విధముల నన్నే ఆరాధించునో
వానిని సర్వజ్ఞుడని చెప్పవచ్చును. ఈ మాటను పరమాత్మ తప్ప మిగతావారు చెప్పుటకు వీలగునా? అంతేకాక గుణత్రయ
విభాగ యోగమున ప్రకృతికి నేను భర్తను సర్వజీవరాశులకు తల్లి ప్రకృతి కాగా, నేను తండ్రిని అని దేవుడు తప్ప ఎవరు
చెప్పగలరు? ఇంద్రియాగోచరుడనై ఈ జగమంతా వ్యాపించియున్న నేను సర్వజీవరాశులకు ఆధారమైయున్నానని నేను
వాటిమీద ఆధారపడలేదని దేవుడు తప్ప ఇతరులు చెప్పగలరా? అట్లే సర్వము తానైన విశ్వరూపమును ప్రదర్శించినవాడు
మూడవ పురుషుడైన పురుషోత్తముడు కాక ఎవరగును? నన్నే మ్రొక్కుము, నన్నే నమస్కరించుము, నన్నే పొందగలవని
దేవుడు తప్ప ఇతరులు చెప్పగలరా? ఈ విధముగా చూస్తే భగవద్గీత గ్రంథమును స్వయముగా పరమాత్మగానే చెప్పాడు.
అందువలన అది ప్రథమ దైవగ్రంథమయినది.
రెండవ గ్రంథమయిన సువార్తబైబిలును చూస్తే బైబిలు గ్రంథము లోని వాక్యములన్నిటినీ జీవాత్మ, పరమాత్మల
మధ్యలోని ఆత్మ బోధించినదని తెలియును. సువార్త బైబిలుకుగాను ఒక వాక్యమును సాక్ష్యముగా తీసుకొని చూస్తాము.
యోహాన్ సువార్త 14వ అధ్యాయము 20వ వాక్యము "నేను నా తండ్రియందునూ, మీరు నాయందునూ, నేను మీ
యందునూ ఉన్నానని మీరెరుగుదురు” అన్నాడు. ఈ వాక్యములో మీరు అనగా ప్రజలని అర్థము కాగలదు. నేను నా
తండ్రియందునూ అను వాక్యములో తండ్రియనగా దేవుడు. ఆయన తండ్రి దేవుడు. ఆత్మ దేవుని యందు మరియు
ప్రజలయందు రెండువైపులా యున్నదనీ, అదియే దేవునికీ మనుషులకూ మధ్యయుండు ఆత్మయనీ, ఆత్మయే
బైబిలుగ్రంథమును బోధించినదనీ ఆ గ్రంథమందు అనేక వాక్యములు కనిపించుచున్నవి. అంతిమ దైవగ్రంథమును
చూస్తే జీవాత్మగా జిబ్రయేల్రాయుండి ఖుర్ఆన్లోని ప్రతి వాక్యమును జీవుడు చెప్పినట్లే చెప్పాడు. ఖుర్ఆన్ గ్రంథములో
దేవుడు చెప్పినట్లుగానీ, ఆత్మ చెప్పినట్లుగానీ యుండక, సాటి మనిషి ఇంకొక వ్యక్తికి చెప్పినట్లు, ముహమ్మద్ ప్రవక్తకు
బోధించినట్లు గలదు. ఈ విధముగా మూడు గ్రంథములలో పరమాత్మచేత అధికారముగా చెప్పబడినట్లు భగవద్గీత
గ్రంథముండగా, ఆత్మ చెప్పినట్లు బైబిలువుండగా, జీవాత్మ చెప్పినట్లు ఖుర్ఆన్ గ్రంథము గలదు. ఇప్పటినుండి చూచినవారికి
మూడు గ్రంథములలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు బోధించిన తేడాలు కనిపించగలవు. అందువలన విచక్షణ కల్గి
మూడు గ్రంథములను చదువమని చెప్పుచూ ఇంతటితో చాలించుచున్నాము.
సమాప్తము.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.
ఆధారమున్న ప్రతిదీ సత్యము కాదు,
ఆధారము లేని ప్రతిదీ అసత్యము కాదు.
గ్రంథములనుండి మనము ఎంత తెలుసుకొన్నామనునది ముఖ్యము కాదు,
గ్రంథములనుండి జ్ఞానము తెలిసినదా లేదా యన్నదే ముఖ్యము.