pss book:ద్వితీయ దైవగ్రంథములోరత్నవాక్యములు: దేవుని మార్గము: సృష్ఠి రహస్యము

  ద్వితీయ దైవగ్రంథములోరత్నవాక్యములు


  దేవుని మార్గము     ☞ఏసుప్రభువు భూమిమీదకు రాక పూర్వమే కొంత చరిత్ర గలదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా కొంత చరిత్ర గలదు. ఆయన రాకముందే వ్రాయబడిన చరిత్రను 'పాత నిబంధన' అనుచున్నాము. ఆయన వచ్చిన తర్వాత వ్రాయబడిన దానిని 'క్రొత్త నిబంధన' అనుచున్నాము. ఆయన జననమునకు పూర్వమున్న పాత నిబంధన, జననము తర్వాత క్రొత్త నిబంధనలో గల ఆయన జీవితము మరియు మరణము తర్వాత ఆయన భక్తులు క్రైస్థవ సంఘమును ప్రచారము చేసిన విధానము, రెండూ క్రైస్థవ సంఘము వారికి ముఖ్యమైనవిగా ఉన్నవి. ఈ పాత క్రొత్త రెండు చరిత్రలు వ్రాయబడిన గ్రంథమునే 'పరిశుద్ధ బైబిలు' అంటున్నాము. క్రైస్థవుల బైబిలుగానీ, హిందువుల భగవద్గీతగానీ మానవున్ని ఉద్ధరించుటకు, దేవుని వైపు నడిపించుటకు ఉద్దేశింపబడినవైనప్పటికీ బైబిలుకు, భగవద్గీతకు కొంత తేడా గలదు. భగవద్గీతలో కృష్ణుని వెనుక చరిత్రగానీ, ముందు చరిత్రగానీ ఏమాత్రము లేదు. కృష్ణుని బోధ మాత్రము గీతలో గలదు. పరిశుద్ధ బైబిలులో అలాకాక ప్రభువుకంటే ముందు చరిత్ర, ప్రభువు తర్వాత చరిత్ర రెండూ గలవు. క్రైస్థవ బోధకుల బోధనలలో ప్రభువుకంటే ముందుగల పాత నిబంధనలోని మాటలు, క్రొత్త నిబంధనలోని ప్రభువు తర్వాత ఆయన భక్తుల ప్రచారములు చోటు చేసుకొన్నాయి. ఇందులో తప్పేమి లేదుగానీ మనము బాగా యోచించితే మనిషి దేవుని మార్గములో నడచుటకు బైబిలులో కొంత భాగమే బాగా ఉపయోగపడగలదని తెలియుచున్నది. ఒక నాటకములో ఎందరో పాత్రదారులు నటించినా, అందరిలో ఒక పాత్ర మిగతా వారికంటే ఎక్కువగా నచ్చడము, నాటకములోని ఘట్టములలో ఏదో ఒక ఘట్టము చాలా బాగా నచ్చడము జరుగుచున్నది. అలాగే బైబిలు మొత్తము తీసుకుంటే అందులో క్రొత్త నిబంధనలో ఏసుప్రభువు భూమిమీదకు వచ్చినప్పటినుండి తిరిగి ఆయన వెళ్లిపోవు వరకు ఉన్న భాగము పరమ పవిత్రము, మానవుడు కడతేరుటకు ఉన్నతమైన ఘట్టము అని చెప్పవచ్చును. బైబిలులో అతి సారాంశమైన భాగము ఏసుప్రభువు చరిత్ర మాత్రమేనని ప్రతి మనిషి గ్రహించవచ్చును. ఏసుప్రభువు పలికిన మాటలు బైబిలు మొత్తములో వజ్రాల మూటలలాంటివి. బైబిలులో మానవుడు గ్రహించవలసినదంతా ప్రభువు మాటలతో కూడుకున్న మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్‌ సువార్త నాలుగు చూస్తే చాలు. మానవునకు కావలసిన దైవసాన్నిధ్యము ఈ నాలుగు సువార్తలలోనే దొరుకును. ఈ నాలుగు సువార్తలలో జ్ఞానములలోకెల్ల జ్ఞానము ఒక్క యోహాన్‌ సువార్తలోనే గలదని ఘంటారావముగా చెప్పవచ్చును. మానవుని బుర్ర అందుకోలేనంత జ్ఞానము 'యోహాను సువార్త'లో కనిపిస్తుంది. ఎంతో పెద్దదైన బైబిలు గ్రంథము 1029 పేజీల పుస్తకమైతే, అందులో క్రొత్త నిబంధనలోని ఏసు చరిత్ర కేవలము 102 పేజీలు మాత్రమే గలదు. బైబిలు గ్రంథమును పది భాగములుగా చేస్తే, అందులో ఒక్క భాగము మాత్రము తొమ్మిది భాగములకంటే గొప్పదని చెప్పవచ్చును. ఏసుప్రభువు విలువ తెలిసినవారు, నిజ జ్ఞానమును ఈ ఒక్క భాగములోనే గ్రహింతురు.


ఎంతో గొప్ప జ్ఞానముగల మత్తయి, మార్కు, లూకా, యోహాన్‌ సువార్తలలోని ప్రభువు మాటలను కొన్నిటిని వివరిస్తూ మేము వ్రాయడము జరిగినది. ఎంతోమంది ఫాదర్‌లు, పాస్టర్‌లు, బిషప్‌లు ఎందరో ప్రభువు మాటలను గూర్చి చెప్పుచున్నారు కదా! మీరు వాక్యములకు వివరము వ్రాయడమేమిటని కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలు వదలి మిగతా భాగములో ఎవరు ఏమి చెప్పినా వినవచ్చును. వాటిని అందరూ సమర్థముగానే బోధిస్తున్నారని చెప్పవచ్చును. కానీ ప్రభువు చరిత్ర కల్గిన నాలుగు సువార్తలలోని మాటలు వివరించడములో కొంత లోటు కలదనియే చెప్పవచ్చును. ఏ విధముగా హిందువులకు భగవద్గీతలోని రహస్యములు ఇంతవరకూ అర్థము కాలేదని చెప్పామో, ఆ విధముగానే ఏసుప్రభువు చరిత్రగల నాలుగు సువార్తలలోను క్రైస్థవులకు అర్థముకాని రహస్యములు ఎన్నో మిగిలి ఉన్నాయనే చెప్పవచ్చును. నేను ఈ మాటను బోధకుల మీద అసూయతో చెప్పడము లేదు. కానీ ప్రభువు మీద విశ్వాసముతో చెప్పుచున్నాము. ప్రభువు ప్రజలకు దగ్గరగా అర్థము కావాలని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఏమిటో తెలియాలని మేము యదార్థమును వివరించడము జరిగినది.


ప్రభువు పేరున్న మా గ్రంథములను చూచి హిందువులేమో ఇవి క్రైస్థవ పుస్తకములు వాటిని చదవకూడదని అనుకొంటున్నారు. మరి క్రైస్థవులేమో హిందువుల గురువు వ్రాసినవి వాటిని చదవకూడదనీ, మన క్రైస్థవులు వ్రాసినవే చదవాలని అనుకొంటున్నారు. క్రైస్థవ పుస్తకములను వ్రాసినవాడు హిందువే కాదని, హిందువులు మమ్ములను అసహ్యించు కొనుచుండగా, హిందూమతములోనికి మార్చడానికి ఈ పుస్తకములు వ్రాశారు, వాటిని చదవద్దండని కొందరు క్రైస్థవులు ఇతర క్రైస్థవులకు చెప్పుకొనుచున్నారు. క్రైస్థవులను హిందువులుగా మార్చుచున్నారని క్రైస్థవులు, హిందువులను క్రైస్థవులుగా మార్చుతున్నారని హిందువులు మమ్ములననుచున్నారు. వాస్తవముగా ఎవరినీ ఎవరుగా మేము మార్చలేదుగానీ, అసలైన దేవున్ని తెలుసుకోమని మాత్రము చెప్పుచున్నాము. దేవున్ని గురించి చెప్పే హక్కు దేవుని సంతతైన ప్రతి మనిషికీ గలదు. కనుక ఎవరు ఏమనినా మేము ఓర్పుగా దేవుని విషయములను తెలుపుతూనే పోవుచున్నాము.


నన్ను చూచి అసూయపడు వారందరికీ నేనొక ప్రశ్నవేయుచున్నాను. దేవుడు మనిషిగా భూమిమీదకు వచ్చాడు పోయాడు. పోయేటప్పుడు తిరిగి వస్తానని కూడా చెప్పాడు. ఒక్కమారే వచ్చాడు తిరిగి ఒక్కమారే వస్తాడని ఎవరైనా చెప్పగలరా? జ్ఞానముగల ఎవడూ ఆ విధముగా చెప్పలేడు. నా అవసరము భూమిమీద ఉన్నపుడంతా వస్తానన్నాడు. ధర్మములకు హాని కల్గినప్పుడు వస్తానన్నాడు. భగవద్గీతలో ఆ మాటే చెప్పాడు. బైబిలులో ఆ మాటనే చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఏ రూపములోనైనా భూమిమీదకు వచ్చి తన ధర్మములు తెలిపిపోవును. గీతలో వస్తానన్నట్లు కృష్ణుడు కృష్ణునిగనే రావలెననీ, వస్తాడనీ అనుకోవడము హిందువుల పొరపాటు. అలాగే బైబిలులో వస్తానని చెప్పాడు కదా! అని ఏసు ఏసుగా రావాలనీ, అలాగే వస్తాడనీ అనుకోవడము వారి పొరపాటు. దేవుడు రావాలనుకొంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపమను నిబంధన ఉండదు. ఆయనను ఎవరూ గుర్తించలేనట్లు క్రొత్తరూపములతో వస్తాడు. కానీ పాత జ్ఞానమే బోధిస్తాడు. ఎందుకనగా! కాలానుగుణముగా ధర్మములు మారునవి కావు. ధర్మములు ఎప్పటికీ మార్పు చెందనవి శాస్త్రబద్దమైనవి. కనుక ఎప్పుడు ఏ పేరుతో, ఏ రూపముతో, ఏ మతములో పుట్టినా ఒకే ధర్మములను తెలుపుచుండును.


ఆయన వచ్చినప్పుడంతా భూమిమీద ఒక మతమును ఎప్పుడూ సృష్ఠించలేదు. మతమును గురించి బోధించనూ లేదు. దేవుడు ఏ ఒక్క మతమునకు సంబంధించినవాడు కాడు. ఆయన ధర్మములనే ఆయన తెల్పాడు కానీ, ఏ మతమును గురించి తెల్పలేదు. మానవులు సృష్ఠించు కొన్నవే మతములు. దేవునిదంతయూ మతములకతీతమైన బోధగా ఉండును. మతములలో పొరపాట్లు చేయువారిని చూచి, వారి పొరపాట్లను వేలెత్తి చూపించి, నీవు ఏ మతస్థుడవైనా దేవుని మార్గము ఇది, దానిని సక్రమముగా ఆచరింపుమనే దేవుడు తెలియజేసాడు. కానీ ఏ ఒక్క మతమును ఆయన సమర్థించలేదు. మనుషులు తెలుసుకొన్న జ్ఞానమును బట్టి, మాట్లాడుకొను భాషను బట్టి, నడచుకొను పద్ధతిని బట్టి మతములు ఏర్పరచుకొన్నారే గానీ, ధర్మముల వలన మతములు ఏర్పడలేదు.


ప్రతీ మతమునకు ఒక పద్ధతి, ఒక నియమిత దేవుని ఆరాధన ఉండును. ఆయా మతములలో ఉన్నవారు ఆ విధముగనే ఆచరించుట పరిపాటిగా ఉన్నది. ఇవన్నియూ మనుషుల ఆరాధన క్రమములు కాగా, దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఆయనకు మతముల అలవాట్లు, ఆచారములు ఉండవు. అలాగే ఆయన మరొక దేవున్ని ఆరాధించడము కూడా ఉండదు. మతములు, మతముల ఆచారములు, మనుషులకేగానీ దేవునికి కావు. మనుషులయందు భక్తిలోగల లొసుగులను తెలిపి సక్రమ మార్గమున నడిపించుట దేవుని కర్తవ్యము. అందువలన ఆయన మానవునిగా వచ్చినప్పుడు దేవుని గూర్చి, దేవుని ధర్మముల గూర్చియే చెప్పును. అలాకాక అందరి మనుషులవలె మరొక దేవుని పూజలయందు గానీ, ఆరాధనలయందుగానీ మునిగిపోడు.


ద్వాపర యుగములో దేవుడు కృష్ణునిగా వచ్చినప్పుడు ఆయన ఎవరినీ పూజించలేదు. సమయమొచ్చినప్పుడు పరమాత్మ జ్ఞానము సంపూర్ణముగా తెలిపాడు. అలాగే కలియుగములో ఏసుప్రభువుగా వచ్చినప్పుడు ఆయన కూడా ఎవరినీ పూజిస్తూ కూర్చోలేదు. ఆయన బోధించవలసినది మానవులకు తెలిపిపోయాడు. ఒక్క జ్ఞానము తెలుపడము లోనే ఆయన యొక్క గొప్పతనము, ఆయనలోని దైవత్వము తెలియును. మిగతా సమయములలో అందరితో సమానమైన మనిషిగానే కనిపించుచుండును. జ్ఞానము తెలియనివారు ఆయనను మనిషిగా లెక్కించుకొందురు. జ్ఞానమున్న వారు ఆయనను దేవునిగా గుర్తింతురు. సంపూర్ణ జ్ఞానమున్న వారు ఆయన భూమిమీదకు ఎప్పుడు వచ్చినా గుర్తించగలరు. మాయ ప్రభావమున్న వారు ఆయనను ఏ పరిస్థితిలోను గుర్తించలేరు. అంతేకాక సాటి మానవునిగా తలచి ఆయనను కూడా అవమానముపాలు చేయుదురు, కష్టపెట్టుదురు.


దేవుడు మనిషి రూపములో కొన్ని వేల సంవత్సరములకొకమారు భూమిమీదకు వస్తే సర్పసంతానమైన మనుషులు ఆయనను గుర్తించలేరు. గుర్తించలేకపోయినా ఫరవాలేదు కానీ, ఆయననే హింసించుటకు మొదలు పెట్టుదురు. గుర్తించలేనంతమాత్రమున ఎందుకు హింసిస్తారని కొందరికి ప్రశ్నరావచ్చును. తోటి మానవులను ఎవరూ హింసించలేదే అని అడుగ వచ్చును. దానికి సమాధానమేమనగా! దేవుడు మనిషిగా వస్తే సాటి మనిషిగా ఆయన జీవించడు. ఆయన జ్ఞానము తెల్పుటకు వచ్చాడు కావున దైవజ్ఞానమును ధర్మసహితముగా తెల్పును. అటువంటప్పుడు అధర్మకులకు, అజ్ఞానులకు, మాయజ్ఞానము గలవారికి ఆయన మీద ద్వేషమేర్పడును. ఆ ద్వేషమే మనుషుల చేత ఆయనను హింసించునట్లు చేయుచున్నది. ఏమీ చెప్పకపోతే ఏ విరోధముండదు. మనుషులలోని అధర్మములను వేలెత్తి చూపడము వలన తాము ధర్మవరులమనుకొను అధర్మవరులందరికీ కోపమే వచ్చును. కావున ఆయన వచ్చిన ప్రతి జన్మలోను మానవుల చేత అగౌరవపరచబడినాడు. ఏసు జన్మలో ఆయన బోధించు జ్ఞానమును చూచి ఓర్వలేనివారు ఈయన మాకంటే గొప్పవాడా! అని చివరకు మరణశిక్షయే విధించారు. జ్ఞానులమనుకొను మతాచారుల వలన కదా! ఆయన చనిపోయినది. సర్పసంతానము అజ్ఞానమనే విషము కల్గియుంటుంది. కాబట్టి ప్రభువు జన్మ సర్పసంతానము చేతిలోనే అంత్యమైనది.


దేవుని విషయము దేవునికే తెలుసును, మనుషులకు ఏమాత్రము తెలియదు. దేవుడు తెలిపితేనే మనిషికి దేవుని ధర్మములు తెలియబడుతాయి. ఏ మనిషీ స్వయముగా దేవుని విషయములను తెలియలేడు. కావున విశ్వమంతా అణువణువునా వ్యాపించిన దైవము నుండి కొంత భాగము లేక కొంత సాంద్రత వచ్చి మనిషిగా పుట్టుచున్నది. ప్రపంచములో కొంత కాలము బ్రతుకుటకు ఒక విధానము కావాలి దానినే 'కర్మ' అంటున్నాము. మనిషి పుట్టుకకు కారణమైన దానినే కర్మ అంటున్నాము. దేవునికి కర్మ యుండదు. కావున దేవుడే ఒక జన్మకు కావలసిన కర్మను సృష్ఠించుకొని పుట్టుచున్నాడు. అటువంటి వానినే స్వయంభు అంటున్నాము. స్వయంభు అనగా కర్మచేత కాక తనకు తానుగా పుట్టినవాడని అర్థము. ఆ విధముగా పుట్టిన వానినే భగవంతుడని, ఆదరణకర్తయని ఆధ్యాత్మిక భాషలో అంటున్నాము. ఎన్నోమార్లు దేవుడు భగవంతునిగా భూమిమీదకు వచ్చిపోయి ఉండవచ్చును. భూమిమీద ధర్మముల పునరుద్ధారణ ఎన్నిమార్లు జరిగినదో తెలియదు. పూర్వము లక్షల సంవత్సరముల ముందు మనకు తెలియని రహస్యములు ఎన్నో గడచిపోయినవి. కొన్ని వేల సంవత్సరముల నుండి మాత్రమే చరిత్రలు వ్రాయబడి ఉన్నాయి. అందువలన కొన్ని గత విషయములు, కొందరి చరిత్రలు తెలుసుకొనగల్గుచున్నాము. చరిత్రను పరికించి చూస్తే దేవుడు మనిషిగా భూమిమీదకు వచ్చిన సందర్భములు కనిపిస్తున్నవి.


దేవుడు భూగోళము మీద అప్పుడప్పుడు మనిషిగా ఉదయిస్తున్నాడని మనిషిగానే అస్తమిస్తున్నాడని తెలియుచున్నది. మనకున్న జ్ఞానముతో లోతుగా యోచించి చూచితే ఐదువేల సంవత్సరముల పూర్వము భారత దేశములోనూ, రెండు వేల సంవత్సరముల పూర్వము ఇజ్రాయిల్‌ దేశము లోనూ దేవుడు పుట్టినట్లు తెలియుచున్నది. ఆనాటి ఇజ్రాయిల్‌ దేశములో దైవము ఏసుప్రభువుగా పుట్టినది. ముందే తాను నిర్ణయించుకొన్న కర్మ ప్రకారము కేవలము ముప్ఫైమూడు సంవత్సరములు భూమిమీద ఉండి, మనుషుల మధ్య సంచరించి దైవాంశ వెళ్లిపోయినది. ముప్ఫైమూడు సంవత్సరములలో ముప్ఫై సంవత్సరములు సాధారణ జీవాత్మగా జీవించిన ప్రభువు, తర్వాత మూడు సంవత్సరములు అప్పుడప్పుడు ఆత్మగా జీవిస్తూ ఆత్మజ్ఞానమును బోధించాడు.


ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! దైవము భూమిమీద మనిషిగా పుట్టిందంటున్నారు. దైవము (దేవుడు) విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్నాడని అంటున్నారు. మనిషిగా పుట్టినప్పుడు విశ్వమంతా లేకుండా పోవుచున్నాడా? అన్నది ప్రశ్న. అంతేకాక అందరిలోను కూడా ఉన్నాడన్న దేవుడు భూమిమీద భగవంతునిగా పుట్టిన తర్వాత అందరిలో లేకుండా పోతాడా? అన్నది కూడా ప్రశ్నే. వీటికి జవాబును చూస్తాము. సముద్రములో నీరు అఖండముగా ఉన్నది. అదే నీటిని ఒక చెంబులోనికో లేక ఒక పాత్రలోనికో తీసుకున్నామనుకోండి. తీసుకొన్న పాత్రలో నీరుంది. అంతమాత్రమున సముద్రములో నీరు లేకుండా పోలేదు కదా! పాత్రలోని నీరును ఖండమైన నీరు అంటున్నాము. సముద్రములోని నీరును అఖండమైన నీరు అంటున్నాము. పాత్రలోనివి నీరే సముద్రములోనివి నీరే. నీటిలో ఖండింపబడినది, ఖండింపబడనిదను తేడా తప్ప నీటిలోని ధర్మములలో ఏ తేడా లేదు. అలాగే దేవుడు సముద్రములాంటి వానిగా భావించుకొందాము. సముద్రము నుండి పాత్రలో నీరు వేరైనట్లు దేవుడు నుండి భగవంతుడు వేరైనాడు. సముద్రములోని నీరు పాత్రలోని నీరు ఒక్కటే అయినట్లు దేవుడు, భగవంతుడు ఇద్దరూ ఒక్కటే అగుదురు. పాత్రలోనికి నీరు తీసుకొన్నంత మాత్రమున సముద్రములో మార్పురాదు. సముద్రములో నీరు లేకుండా పోదు. అలాగే దేవునిలోని కొంత అంశ భగవంతునిగా పుట్టినప్పుడు దేవుడు మొదట ఎట్లు వ్యాపించి ఉన్నాడో అట్లే ఉండును. దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు దేవునిలోగానీ, దేవుని ధర్మములలోగానీ, దేవుని వ్యాపకములో గానీ ఎటువంటి మార్పు ఉండదని తెలియవలెను. దేవుని అంశ భగవంతుడౌతున్నది గానీ దేవుడంతయూ భగవంతుడు కాలేదు కదా! అంశ అనగా కొంత భాగమే అనిగానీ, దేవుడంతయూ కాదు. కొంత భాగమైనా, అంతా అయినా ఒకే ధర్మము కల్గియున్నది. కావున దేవుని అంశ భూమిమీద పుట్టినప్పుడు దేవుడే పుట్టాడనుటలో తప్పులేదు. అందువలన ఏసును 'దేవుడు' అనడములో తప్పులేదు.


ఇక్కడ మరికొందరికి మరొక ప్రశ్న రావచ్చును. అదేమనగా! ఏసుప్రభువు దేవుడని మీరన్నట్లు దేవుడైతే ఆయనను మనుషులు బాధించినప్పుడు ఎందుకు బాధపడ్డాడు? మనుషుల చేత ఎందుకు హింసింపబడ్డాడు? మనుషుల చేత ఎందుకు అవమానించబడాలి? మనుషులు తన ఎడల చెడుగా ప్రవర్తించినప్పుడు తానెవరో తెలిపి, తన మహత్యము చేత వారిని శిక్షింపవచ్చును కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! ఈ విషయము అర్థము కావాలంటే ముందు మనమొక దైవరహస్యము తెలుసుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి శరీరములో మూడు ఆత్మలు గలవు. ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. ఈ మూడు ఆత్మలలో జీవాత్మ, ఆత్మ రెండూ శరీరము లోపల నివశిస్తున్నవి. శరీరము బయట ఏమాత్రము లేవు. మూడవదైన పరమాత్మ శరీరము లోపల మరియు శరీరము బయట అంతటా అణువణువునా వ్యాపించి కలదు. పరమాత్మ శరీరము బయటగానీ, శరీరము లోపలగానీ ఎటువంటి పని చేయకుండా ఊరక ఉన్నది. రెండవదైన ఆత్మ శరీరములో జరుగు కార్యములన్నిటినీ చేయుచున్నది. మొదటిదైన జీవాత్మ ఏ పనీ చేయక కేవలము సుఖము, దుఃఖము అను రెండు అనుభూతులను మాత్రము అనుభవిస్తున్నది. చాలామంది జీవాత్మలమైన మనమే అన్నీ చేస్తున్నాము అనుకుంటున్నాము. అలా ఏ శరీరములోను జరగడము లేదు. మనకు తెలియకుండా మన శరీరములో మనతో పాటు ఉన్న ఆత్మయే అన్ని పనులు చేయుచున్నది. ఆత్మ కూడా తన ఇష్టానుసారముగా పని చేయడము లేదు. కర్మ అను ఒక లెక్కాచారము ప్రకారము చేయుచున్నది. పనులకు కారణము కర్మ అను ఒక విధానము కలదు. కర్మ అను దాని ప్రకారము జీవుడు సుఖము, దుఃఖము అను అనుభూతులను అనుభవించవలెను. జీవుడు లోపల సుఖ దుఃఖములను అనుభవించాలంటే బయట వరకు యున్న ఆత్మ పని చేయుచున్నది. అంతేకాక శరీరములోపల ఆహారమును జీర్ణము చేయుట, గుండెను కదలించుట, రక్తము నుండి మూత్రమును, చెమటను వేరు చేయుట మొదలగు శరీరాంతర్గత కార్యములన్నీ చేయుచున్నది. ఆత్మ అన్ని కార్యములు చేయుట వలన జీవాత్మ శరీరములో మనగలుగుచున్నది. శరీరము లోపల గల జీవునికి ఏ పనీ లేక కేవలము అనుభవములను మాత్రము అనుభవిస్తున్నది. ఇదంతయూ ప్రతి మనిషి శరీరములో ఎప్పటికీ మార్పు చెందక శాసనబద్దమైన విధముగా ఉన్నది.


దేవుడు మనిషిగా పుట్టినప్పటికీ ఆ మనిషి శరీరములో కూడా అందరియందున్న విధానమే జరుగుచుండును. మిగతా శరీరములలో మాదిరి ఆ శరీరములో పరమాత్మ ఉండవలసిందే, ఆత్మ అన్ని పనులు చేయవలసినదే, జీవాత్మ అనుభవించవలసిందే. దేవుడు మనిషిగా వచ్చిన శరీరము లోపల జరిగే విధానమదే. దేవుడు ఏసుగా వచ్చినప్పటికీ జరిగినదంతే. సాధారణ మనిషికి ఆయనకు శరీరయంత్రాంగములో ఎటువంటి తేడా లేదు. అందువలన ఆయన అన్ని బాధలను, సుఖములను జీవునిగానే అనుభవించాడు. ఏసుప్రభువుకు జీవితములో అనేక కష్టములు ఎదురైనా అన్నిటినీ జీవాత్మగా ఆయన అనుభవించవలసి వచ్చినది. ఆ పనులు జరుగుటకు ఆ విధముగా అనుభవించుటకు తగిన కర్మను ఆయనే సృష్ఠించుకొని భూమిమీదకు ఒక మనిషిగా వచ్చాడు. ఇది ఆయన సాధారణ జీవితమైనప్పుడు ఆయనకు మనకు ఏమిటి తేడా? అని అడిగితే ఒకే ఒక తేడా గలదు. అదేమనగా! శరీరములో పని చేయునది ఒకే ఒక ఆత్మ అని తెలుసుకొన్నాము కదా! మనిషిగా వచ్చిన భగవంతుని శరీరములో కూడా అట్లేయుండునని అనుకున్నాము. కానీ కొన్ని సందర్భములలో మాత్రము ఒక విచిత్రమైన తేడా గలదు. భగవంతుని శరీరములో కొన్ని సమయములందు సాధారణ శరీరములో ఉన్నట్లు మూడు ఆత్మలు తమ తమ పని చేయక వేరు విధానముగా మారిపోవును. జీవాత్మ తటస్థముగా ఏ అనుభవములు అనుభవించు స్థితిలో లేకుండా నిలిచిపోయి, జీవాత్మ స్థితిలో ఆత్మ ఉండిపోవును. అప్పుడు ఆత్మగా మాట్లాడిన మాటలు పూర్తి ఆధ్యాత్మికముగా ఉండును. అసలైన ఆధ్యాత్మిక విషయములు, దేవుని ధర్మములు ఆత్మ స్వయముగా చెప్పినప్పుడే తెలియును. కొన్ని సందర్భములలో భగవంతుని శరీరమందు ఆత్మ స్వయముగా జ్ఞానమును పలుకును. అంతేకాక బహు అరుదుగా శరీరములో ఆత్మ, జీవాత్మలు తటస్థముగా ఆగిపోగా పరమాత్మే పలుకుట కూడా గలదు. భగవంతుని జీవితములో ఒకటి లేక రెండుమార్లు అటువంటి సందర్భములు జరుగవచ్చును. ఏసు ప్రభువు జీవితములో, కృష్ణుని జీవితములో, రావణ బ్రహ్మ జీవితములో పరమాత్మే మాట్లాడిన సందర్భములు గలవు. పరమాత్మ పలుకునపుడు ఆ పలుకుకు ప్రకృతియంతా లోబడియుండును. అలాగే ఆత్మ పలుకునపుడు అసలైన జ్ఞానమంతా ఆయనకు లోబడియుండును. 1) అందువలన వీరి జీవితములో ప్రకృతినే శాసించిన పరమాత్మ పలుకులు గలవు. 2) ఆత్మ జ్ఞానమును నిగ్గు తేల్చి చెప్పిన ఆత్మ మాటలు గలవు. 3) సుఖదుఃఖములను అనుభవించిన జీవాత్మ అనుభవములు గలవు. ప్రభువు జీవితములో తుఫానుతో చెలరేగిన సముద్రములో తుఫానును అణిగిపొమ్మన్నపుడు స్వయముగా పరమాత్మే పలికినాడని తెలియుచున్నది. ఆ మాటలను అనుసరించి ప్రకృతి కూడా నడుచుకొన్నట్లు కూడా తెలియుచున్నది. ఆయన ఆత్మగా స్వచ్ఛమైన జ్ఞానమును తెలిపినట్లు గలదు. అదే విధముగా జీవాత్మగా అనేక సుఖదుఃఖములు అనుభవించినట్లు కూడా గలదు. ఈ విధముగా శ్రీకృష్ణుని జీవితములో కూడా జరిగినది. సూర్యుని శాసించి సైంధవుని చంపాడు. విశ్వరూపము చూపి తాను పరమాత్మనని తెలిపిన సందర్భము కూడా కలదు. ఆత్మగా సంపూర్ణ జ్ఞానమైన గీతనే బోధించాడు. మిగతా సమయములలో జీవాత్మగా అన్ని అనుభవములను అనుభవించాడు. కేవలము ఒక్క భగవంతుని శరీరములో మాత్రమే కొన్ని సమయములలో మూడు ఆత్మల ఆట విడివిడిగా సాగుచున్నది. దైవము శరీరము ధరించడము బహు అరుదుగా వేల సంవత్సరములకో, లక్షల సంవత్సరములకో జరుగుచున్నది. దేవుడు భూమిమీద శరీరము ధరించి పుట్టినప్పుడు ఎక్కువ కాలము జీవాత్మవలె అందరివలె ఉండి, అవసరమొచ్చినప్పుడు ఏదో కొంత సమయములో మాత్రము సంవత్సరములో కొన్నిమార్లు ఆత్మగా మాట్లాడును. భగవంతుని జీవితములో ఒకటి లేక రెండుమార్లు బహు అరుదుగా మాట్లాడవచ్చును లేక మాట్లాడక పోవచ్చును. తాను ధర్మములను తెలుపుటకు వచ్చాడు కనుక ఆత్మగా తప్పక మాట్లాడును. ఇది దేవుని విధానమైతే మాయ విధానము మరొకలాగ ఉన్నది.


దేవుడు సాధారణ మనిషిగా ఉన్నంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆత్మగా జ్ఞానము చెప్పినప్పుడే మాయ వ్యతిరేఖత కల్గుచున్నది. దేవుని జ్ఞానమంతయూ మాయకు వ్యతిరేఖమైనదే, కావున మాయ (సాతాన్‌) మనుషులను తనవైపు నుండి దేవుని జ్ఞానమువైపు పోకుండా చూసుకోవడములో బహు జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాక దేవుని జ్ఞానము మీద శ్రద్ధకల్గి కొంత జ్ఞానమును తెలుసుకొనిన వారిని గుర్తించుకొని తనవైపుకు లాగుకొనుటకు ప్రయత్నించుచుండును. అందువలన మాయ ప్రభావముతో అసలైన ఆత్మజ్ఞానము మీద ఆసక్తి కలవారు చాలా తక్కువ అని చెప్పవచ్చును. ఒకవేళ ఎవరైనా కొంత తెలుసుకొన్న వారుండినప్పటికీ వారు ఆ మార్గము నుండి తప్పిపోవడము జరుగుచున్నది. ఇక్కడొక ప్రశ్న కొందరికి రావచ్చును. అదేమనగా! నేడు ఎందరో భక్తిగలవారున్నారు కదా! ఎందరినో గురువులుగా ఆశ్రయించి వారివద్ద నుండి జ్ఞానము తెలుసుకొనుచున్నారు కదా! ఎంతోమంది దేవతలకు శ్రద్ధగా పూజలు చేయుచున్నారు కదా! కొద్దిపాటి నాస్తికులు తప్ప దేవుని మీద భక్తిలేని వారున్నారా? మీరు చెప్పినట్లు ఏమీ లేదే! సాయి భక్తులనుగానీ, అయ్యప్ప స్వామి భక్తులనుగానీ ఎవరైనా మార్చగలరా? దేశములో ఉన్న పాత దేవుళ్ల గుడులేకాక షిరిడిసాయి గుడులు, అయ్యప్పస్వామి గుడులు విపరీతముగా తయారగుచున్నాయి కదా! అక్కడ మాయ ఎవరినీ ఆటంక పరచలేదే! మీ మాట ఎలా నమ్మాలి? అని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా!


మాయ దేవుని మార్గమునకు, దైవజ్ఞానమునకు పూర్తి వ్యతిరేఖ మైనది. ఎంతో గొప్పదైన దేవుని జ్ఞానమునే వ్యతిరేఖించునది మాయ. కావున మాయ కూడా చాలా గొప్పదై ఉంటుందని తెలియుచున్నది. అందువలననే భగవద్గీతలో ''మాయా దురత్యయా'' అన్నారు. ''మాయను జయించుట దుస్సాధ్యమైన పని'' అని ఒకచోట దేవుడే అన్నాడంటే ఊహకు అందనిరీతిలో మానవున్ని మాయ మోసము చేయునని తెలియుచున్నది. ఇంతవరకు ఇది మాయ పని అనిగానీ, మాయపని ఇట్లుంటుందని కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. అందువలన మాయ దేవుని మార్గములో అందరినీ మోసము చేయుచున్నది. దేవుని జ్ఞానము వలె తన జ్ఞానమును తయారు చేసినది. దేవుడు భగవంతునిగా వేల సంవత్సరములకు ఒకమారు అరుదుగా భూమిమీదకు వస్తే, ఆయనను ఎవరూ గుర్తుపట్టనట్లు మాయ తన ప్రతిరూపములను భగవంతులుగా ఎందరినో భూమిమీదకు తెచ్చినది. మాయ ప్రవేశపెట్టిన ఎన్నో జ్ఞానములలో ఏది నిజ దైవజ్ఞానమో ఎవరికీ అర్థముకాక అన్ని జ్ఞానములు దేవునివే అని చాలామంది పొరపడుచున్నారు. అలాగే మాయతో కూడుకొన్న భగవంతులు ఎందరో భూమిమీద ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు వచ్చు భగవంతున్ని ప్రత్యేకముగా ఎవరు గుర్తిస్తారు? ఎన్నో మహత్యములు చూపించు భగవంతులుంటే జీవితములో ఏదో ఒకటో రెండో మహత్యములను చూపు వానిని ఎవరు గుర్తిస్తారు? ఎందరో మాయ భగవంతులలో అసలైన ఒక్క భగవంతున్ని ఎవరు గుర్తించగలరు? ఈ విధముగా దేవుని జ్ఞానమును గానీ, భగవంతున్ని గానీ గుర్తించుట దుస్సాధ్యమైన పనిగా ఉన్నది. ఇంతవరకు ఎవరూ చూడనిది, తర్వాత కూడా ఎవరూ తెలుసుకోలేనిది అని తన నిజస్థితిని దేవుడు విశ్వరూపముగా చూపితే, ఆ విధముగా కూడా గుర్తించనట్లు చాలామంది దేవతలు విశ్వరూపము చూపినట్లు, చివరకు సాయిబాబాను, వీరబ్రహ్మము గారు కూడా రెండు మూడుమార్లు విశ్వరూపము చూపినట్లు కొందరి చేత వ్రాయించినది. ఇంతమంది చూపిన ఇన్ని విశ్వరూపములలో భగవద్గీతలో కృష్ణుడు చూపిన విశ్వరూపమే గొప్పని ఎవరనుకుంటారు? అందువలన క్రైస్థవులలో కృష్ణున్ని, హిందువులలో ఏసుప్రభువుని భగవంతునిగా గుర్తించలేకపోయారు. ఒకవేళ హిందువులలో కృష్ణున్ని ఎవరైనా అసలైన దేవునిగా గుర్తించారా అంటే అదియూ లేదు. మిగతా అంతమంది దేవుళ్ళలో కృష్ణున్ని చివరి వానిగా కొంతమంది భావించితే, ఆయనవన్నీ అల్లరి పనులే ఆయనెట్లు దేవుడవుతాడని చాలామంది చిన్న దేవునిగా కూడా గుర్తించలేదు. షిరిడీ సాయిబాబా ముందర కృష్ణుడొక దేవునిగా కూడా ఎవరూ లెక్కించడము లేదు. ఇక క్రైస్థవులలోనికి పోయి ప్రభువును వారు ఏ విధముగా భావిస్తున్నారని చూచిన, ఆయనను దైవకుమారునిగా కొందరు లెక్కించి నప్పటికీ ఆయన వాక్యముల సారాంశము వారికి అర్థము కాలేదనియే చెప్పవచ్చును. మాయ ప్రభావము వలన ఆయనను వదలి, ఆయన చనిపోయిన శిలువను మ్రొక్కుచున్నారు. 'ప్రభువు ఆకారము' ను పెట్టుకుంటే హిందువులవలె లెక్కించబడుతామని శిలువ బొమ్మను పెట్టుకొన్నారు. ''నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లేనని'' ప్రభువు చెప్పగా కనీసము 'ఆయన ఆకారము' నైనా చూడక ఆయన మరణమునకు కారణమైన శిలువను చూడడము మాయ పని కాదా! ఈ విధముగా చెప్పుచూపోతే, దేవుని మార్గములో ఉన్నామనుకొనునట్లు చేసిన మాయ (సాతాన్‌) దేవుని మార్గమునకు ఎంతో దూరముగా మనిషిని పంపుచున్నది. తెలిసినవాడు చెప్పినప్పటికీ, వానినే తక్కువవానిగా లెక్కింపజేసి వాని మాటను విననట్లు చేయుచున్నది. మాయ మతములను కల్పించి దేవుడే వేరువేరన్నట్లు చేసినది. విశ్వమునకు అధిపతి ఒక్కడే అయినా మతములను చూపి మతమునకొక దేవుడని మనుషులకు తెలియునట్లు మాయ చేసినది. ఆ మాయ ప్రభావము మనుషులలో ఎంతో ఇమిడి ఉన్నది. కావున ఎందరో దేవుళ్లు, ఎన్నో మతములు తయారైనవి. క్రైస్థవ మతము ఒక్కటే అయినప్పటికీ అందులో మేరీమాత భక్తులు కొందరు, ప్రభువు భక్తులు కొందరుగలరు. అలాగే హిందూ మతమొక్కటే అయినప్పటికీ దేవుళ్లు అనేకముగా ఉన్నారు. ఇన్ని మతములలో, ఇన్ని దేవుళ్లలో ఎవరు అందరికీ అధిపతియో ఇప్పటికైనా తెలుసుకొనుటకు ప్రయత్నించమని తెలుపుచున్నాము. అట్లు తెలుసుకొనుట అంత సులభముగా లేదు. ముందు మాయను గురించి, దాని ఉనికిని గురించి తెలుసుకోగల్గితే తర్వాత దేవుని మార్గమును గురించి తెలుసు కోగలరు. అందువలన ఇప్పుడు మీరున్న మార్గము దేవుని మార్గమో, మాయ మార్గమో ఒక్కమారు వెనుదిరిగి చూచుకోండి.


రూపము, పేరులేని ఫలానా అని నిర్ణయించలేని అనంతమైన అతీతమైన శక్తి ఒకటుంది. దానిని మనము గుర్తింపునకు 'పరమాత్మ' అంటున్నాము. సర్వమునకు మూలమైన పరమాత్మ విషయము మానవులకు ఎవరికీ తెలియదు. అటువంటి స్థితిలో ఆ పరమాత్మయే వచ్చి తన విషయము ఫలానా అని తెలుపవలసియున్నది. పరమాత్మయేమో అణువణువునా వ్యాపించి ఉన్నవాడు, మనమేమో శరీరము ధరించి పంచ భూతములను తప్ప మిగతా దానిని తెలియు స్థితిలో లేము. ఇంద్రియములకు తెలియు దానినే చూడగలము, వినగలము. ఇంద్రియాతీతమైన దానిని ఏమాత్రమూ తెలియలేము. పరమాత్మ ఇంద్రియములకు గోచరము కానిది. అటువంటపుడు ఆ పరమాత్మయే మానవరూపు ధరించి వచ్చి, ఇంద్రియములకు గోచరించి ఆయన విషయము ఆయన తెలిపితేనే మనకు తెలియబడేది. లేకపోతే ఎవరూ ఆయన విషయము తెలిసినవారు లేరు, తెలుపువారు లేరు. అందువలన ఆ పరమాత్మయే మానవరూపు ధరించి, తన విషయములను ప్రకటించుకోవలసి వచ్చి ఉన్నది. ఒకమారు ఆయన తన ధర్మములను తెల్పి పోయాడనుకొందాము. అవి కొంత కాలమునకు మరుగుపడిపోతే తిరిగి ఆయనే వచ్చి పునరుద్ధరించి పోవలసియున్నది. ఇట్లు ఎన్నోమార్లు ఈ ప్రపంచమునే సృష్ఠించిన పరమాత్మయే తన్ను తాను మానవునిగా సృష్ఠించుకొని మానవునివలె సంచరించి, మానవునివలె కర్మములను అనుభవించి ఏదో విధముగా తన ఉద్దేశ్యమును తాను నెరవేర్చుకొనిపోవును. ఆ విధముగా వచ్చిన పరమాత్మను గుర్తించుట చాలా కష్టము. పరమాత్మ ఎన్నోమార్లు భూమిమీదకు వచ్చాడు పోయాడు. అయినప్పటికీ మానవుడు ఆనాటికీ, ఈనాటికీ గుర్తించలేని స్థితిలోనే ఉన్నాడు.


ఉన్నప్పుడు గుర్తించలేని వారు భగవంతుడు వచ్చి పోయిన తర్వాత వారిని గొప్పగా తలచుకొంటూ పూజించను మొదలు పెట్టుదురు. అదియు పరమాత్మ అని కాదు. జ్ఞానములో గొప్పవాడనో, లేకపోతే ఆయనను మ్రొక్కితే కోర్కెలు నెరవేరుతాయనో, ఏదో ఒక ఉద్దేశ్యముతో పూజిస్తూ ఉంటారు. కానీ అసలైన పరమాత్మయని అప్పటికీ తెలిసియుండరు. మనము ఆలోచిస్తే కొన్ని సూత్రముల ద్వారా పరమాత్మ అవతరించిన జన్మలను గుర్తించవచ్చును. ఆ విధముగా ఇప్పటికీ మనకు తెలిసినంతటిలో ద్వాపరయుగ అంత్యములో శ్రీకృష్ణునిగా, తర్వాత కలియుగములో ఏసుగా గుర్తించవచ్చును. తర్వాత కూడా వచ్చి ఉండవచ్చును కానీ మనకు తెలియలేదు.


పరమాత్మ ఎన్ని జన్మలుగా వచ్చినా ఒక జన్మకు మరియొక జన్మకు ఆయన ధర్మములలో తప్ప మిగతా వాటిలో ఏమాత్రము పొంతన ఉండదు. ద్వాపరయుగమున పుట్టిన కృష్ణునిలోనూ, కలియుగమున పుట్టిన ఏసులోనూ ఒకే అంశ ఉండినప్పటికీ పై జీవితములు మాత్రము ఎంతో తేడా కల్గి ఉన్నవి. శ్రీకృష్ణుడు ఎనిమిది మంది స్త్రీలను భార్యలుగా చేసుకొని అష్ట ఐశ్వర్యములను అనుభవించడమేకాక మొదటి భార్యను ఆమె ఇష్టముతోనే అపహరించి తెచ్చుకోవడమేకాక శత్రువులను సహితము వధించడము జరిగినది. ఆయన జీవితములో అసత్యము, మోసము అన్నీ చోటు చేసుకొన్నాయి. వీటినన్నిటినీ గమనించిన ఎడల ఆయనను పరమాత్మ అంశ నిండిన భగవంతునిగా ఎవరూ గుర్తించలేరు.


కలియుగములో పుట్టిన ఏసుప్రభువు జీవితములో అసత్యములు మోసములు లేవు. శత్రువు ఒక చెంపకు కొట్టితే మరియొక చెంప చూపమని చెప్పిన సాత్త్వికుడు. స్త్రీల ఎడల కామ దృష్ఠి లేనివాడు. కృష్ణునికి ఏసుకు నూటికి నూరుపాళ్లు ప్రపంచ విషయములలో తేడా గలదు. ఇద్దరి విషయములలో రెండు మతములలో గురువులుగా ఉన్నవారు సహితము పొరపడుచున్నారు. ఇందూ గురువులు ఏసుప్రభువును విమర్శించడము ప్రపంచ సంబంధ విషయములను చూపిస్తూ ''దేవుడైతే తనను తాను రక్షించు కొనక సామాన్యుల చేతిలో చిక్కి చావడమెందుకని, ఆయన వద్ద దైవశక్తి ఉండి చనిపోయినవానిని లేపినపుడు ఆయనెందుకు చనిపోవలసి వచ్చినదనీ, చేతికి ములుకులు కొట్టునపుడు బాధ ఎందుకు కల్గినదనీ'' అడుగుచున్నారు. అలాగే క్రైస్థవ మతములోని ఫాదర్‌లు, పాస్టర్లు శ్రీకృష్ణుని గూర్చి విమర్శించుచూ ''అంతమంది భార్యలు కల్గినవాడు దేవుడెట్లగునని'' వాదిస్తున్నారు. ఈ విధముగా ఇరు జీవితములలోనున్న ప్రపంచ విషయము లను ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడుచున్నారే కానీ, వారి జీవితములలో అటువంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకొన్నాయని ఎవరూ యోచించడము లేదు. పరమాత్మ భూమిమీదకు వచ్చినప్పుడు ఆయననెవరూ గుర్తించలేరని ఆయనే చెప్పాడు. గుర్తించలేనట్లు నటించడమే ఆయన పని. ఆయన మన మధ్య గుర్తింపు లేకుండా దొంగవలె ఉండి మన అజ్ఞానమును దోచుకొని పోవడమే ఆయన పని.


ప్రపంచ విషయములను చూచితే దేవుడు ఎవరికీ అర్థము కాడని మొదటనే చెప్పుకొన్నాము. దేవున్ని దేవుని విషయములలోనే చూడాలి. అప్పుడైతేనే ఆయనను గుర్తించనగును. ఈ సూత్రము తెలియక గురువులమని చెప్పుకొనువారు కూడా ప్రపంచ విషయములతో దేవున్ని కొలుచుటకు ప్రయత్నించుచున్నారు. కావున దేవుడు భూమిమీదకు వచ్చినప్పటికి ఎవరికీ తెలియకున్నాడు. ప్రపంచ విషయములతో చూచుట వలన ప్రపంచములో కంటికి కనిపించు మహత్యములను చేయువారే గొప్పగా కనిపిస్తూ వారే దేవుళ్లుగా అర్థమగుచున్నారు. అటువంటప్పుడు అసలైన వానిని విస్మరించడము జరుగుచున్నది. అందువలననే ఎవరూ గుర్తించుటకు వీలులేకున్నది. బాహ్య ప్రపంచ విషయములను బట్టి చూస్తే ఏమాత్రము దేవుని జన్మలను గుర్తించలేము. ధర్మములనుబట్టి మాత్రము గుర్తించ వీలగును. భగవద్గీతలోనూ, ఏసు వాక్యములలోనూ ఒకే ధర్మము కనిపించుచున్నది. కావున వారిద్దరినీ ఒక్కరిగా గుర్తించవచ్చును. కానీ బాహ్య విషయములలో ఏమాత్రము పొంతన ఉండదు.


ప్రపంచమునకంతటికీ సర్వమానవులకు ఉన్నది ఒకే ఒక దేవుడనీ, ఆ దేవుడే మానవున్ని తనవైపు మరల్చుటకు మానవునిగా అనేకమార్లు, అనేక పేర్లతో, అనేక రూపములతో వస్తున్నాడని గ్రహించని మానవులు మతములు సృష్ఠించుకొని మా దేవుడు, మీ దేవుడు అని వాదించుకొనుచున్నారు. మన మతములో ఉన్న దేవుడు ఇతర మతములలో చెప్పుకొను దేవుడు ఒక్కడేనని తెలియక నిజ దేవుడు మా దేవుడంటే మా దేవుడని వాదించుకొనుచున్నారు. మానవులలో మతముల మీద గల మమకారము దేవుని మీద లేకుండా పోవుచున్నది. అలాంటి అజ్ఞానములో మానవుడు పడకూడదు. మనము వేరువేరుగా చెప్పుచున్న దేవుడు ఒక్కడేనని తెలియవలయును. సమయము సందర్భమునుబట్టి, దేశమును మనుషులనుబట్టి తన పాత్ర ఎలాగ ఉండవలయునో తానే నిర్ణయించుకొని, పరమాత్మ భూమిమీదకు భగవంతునిగా వస్తున్నాడు. అటువంటప్పుడు జన్మకు జన్మకు ఏమాత్రమూ పోలిక ఉండదు. కానీ తాను వచ్చిన ఏ జన్మలోనైనా తన ధ్యేయమొక్కటే ఉండును. అదియే తన ధర్మములను తెల్పడము. ప్రభువుగా వచ్చినా, అంతకు ముందు కృష్ణునిగా వచ్చినా, ఆయన మానవులకు తెల్పిన ధర్మములు ఒక్కటే. కానీ వ్యక్తిని బట్టి, పేరునుబట్టి, ఆయన ఉన్న దేశమును బట్టి, అన్ని వేరు వేరైన దానివలన దేవుడు కూడా వేరు వేరుగానే కన్పిస్తున్నాడు. పేరు, వ్యక్తి, దేశము వేరు వేరైన దానివలన ఆయన ధర్మము కూడా వేరు వేరుగా కన్పిస్తూ ఉన్నది.


ఉదాహరణకు పరమాత్మ తెల్పిన ఒక ధర్మమును తీసుకొందాము. శ్రీకృష్ణుడు గీతలో ''పరితాణ్రాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్‌'' సాధుజనులను పెంపొందిస్తాను, దుష్కృతులను నాశనము చేస్తానన్నాడు. ఆ మాటనుబట్టుకొని క్రైస్థవ మతములోని కొందరు బోధకులు, మీ ఇందూ మతములో మీకు రక్షణ లేదు. మీ మతములో మీ దేవుడు పాపాత్ములను సంహరిస్తానని చెప్పుచున్నాడు. మా మతములో ఎంతటి పాపాత్మునికైనా రక్షణ కలదు. పాపులను రక్షించు నిమిత్తమే ఏసు భూమిమీదకు వచ్చానని చెప్పాడు. కావున మీరు ఎంత పాపులైనా, ఎంత దుర్మార్గులైనా మా మతములో మీకు రక్షణ కలదు. మీ మతములో మీ దేవుడు పాపాత్ములను, దుర్మార్గులను వినాశనము చేస్తాననగా, మా దేవుడు నీకు రక్షణ నిస్తానన్నాడు. కావున మా దేవుడే నిజమైన దేవుడని చెప్పుచున్నారు. ఈ విషయములో ఏసుప్రభువు చెప్పిన అసలు అర్థము క్రైస్థవులకుగానీ, గీతలో కృష్ణుడు చెప్పిన ఆ శ్లోకమునకు అర్థము ఇందువులకుగానీ బోధపడక, ఆయన మాట వేరు, ఈయన మాట వేరు అన్నట్లు కన్పిస్తున్నది. దానివలన ఇద్దరూ వేరు వేరు అని వారికి గాఢముగా అర్థమైనది. కానీ ఇద్దరూ ఒక్కరేనని ఇద్దరిలో ఒకే అంశ యున్నదనీ, వారు ఇద్దరూ చెప్పిన ఆ రెండు వాక్యములు ఒకే అర్థము నిచ్చుచున్నవనీ తెలియలేకపోయారు. ఇద్దరి మాటలలో ఉన్న అర్థము పాపులను, దుర్మార్గులను లేకుండా చేయడము అనడములో 'బోధ' అను ఆయుధముతో 'పాపము, దుష్టత్వము' అను కర్మను లేకుండా చేసి పవిత్రులుగా చేయడమేనని, దుర్మార్గులు పవిత్రులుగా మారుట వలన పాపములలో చిక్కుకొనక సన్మార్గులుగా మారుట వలన, దుష్టులు లేకుండా పోవుట జరుగుచున్నది. గీతలో దుష్టులను లేకుండా చేస్తానని, బైబిలులో పాపములు మిమ్ములను అంటకుండా, పాపముల నుండి రక్షణ కల్పిస్తానని చెప్పడము ఒక్కటి కాదా!


భాష వేరైనా భావమొక్కటేనని, పేర్లు వ్యక్తులు వేరయినా వారు చెప్పిన మాటలో ఉద్దేశ్యమొక్కటేనని తెలియక, ఆయన భావమును అవగాహన చేసుకోలేక ఎవరికి ఇష్టమొచ్చిన పద్ధతిలో వారు చెప్పుకొని, ధర్మము చెప్పిన వానినే వేరువేరని విభజించారు. ఇందువులు ఏసును విమర్శించినప్పుడు, క్రైస్థవులు కృష్ణున్ని దేవుడు కాదన్నప్పుడు, పరమాత్మయైన వాడు పరలోక రాజ్యమేలువాడు, పరలోక తండ్రి, విశ్వాధిపతి, పురుషోత్తముడై విశ్వమంతా వ్యాపించి మనయందు కూడాగల ఆ దేవుడు ఈ ప్రజలు కళ్లున్న గ్రుడ్డివారనుకొని నవ్వుకొనుచున్నాడు. 'అధర్మములు చెలరేగి ధర్మములకు ముప్పు కల్గినపుడు వస్తుంటానని' గీతలో కృష్ణుడు చెప్పాడుగా, అలాగే నెమలి పింఛముతో, మురళితో, చక్రముతో ముందు మాదిరి వస్తేనే ఈయన ఆ దేవుడేనని ఇందువులు గ్రహిస్తారు. అట్లుకాక వేరే రూపముతో పుట్టితే దేవున్ని కూడా నీవు మా దేవుడవు కావుపో! అంటారు. బైబిలులో తిరిగి నా రెండవ రాక ఉన్నదని చెప్పిన ప్రభువు 'పూర్వము పుట్టినట్లే పుట్టి, చేతిలో ములుకుల గాయపు గుర్తులు, డొక్కలో సూలముతో పొడిచిన గాయము గుర్తు ఉంటేనే' ప్రభువని క్రైస్థవులు గుర్తిస్తారు. అలా కాకుండా వేరు రూపముతో ఉండిన నీవు మా ప్రభువు కాదుపో! అంటారు. పోలికలు, ప్రవర్తనలు వేరుగా ఉండుట వలన శ్రీకృష్ణుడే ప్రభువని ఇందువులు, ప్రభువే కృష్ణుడని క్రైస్థవులు గుర్తించ లేకపోయారు. అందువలననే గీతలో దేవుడు ''నన్ను నా మహత్యము తెలియక ప్రజలు నన్నవమానింతురని'' చెప్పాడు. ప్రభువుగా వచ్చినప్పుడు ప్రజలు అదే పని చేశారు. ధర్మముల బోధించు నిమిత్తమొస్తానని చెప్పిన కృష్ణుడు వచ్చినా, నీకు జ్ఞానము చెప్పి ఉపదేశమిస్తామను ఇందూ గురువులు, ప్రభువు రెండవ రాక జరిగినా ఎవరూ గుర్తించలేక వేరు ఆకారములోనున్న ప్రభువుకు బాప్తిస్మము ఇస్తామను క్రైస్థవ బోధకులుగలరు. కృష్ణుడు రూపము, పేరు మార్చుకొని వస్తే ఆయనకే జ్ఞానము నేర్పు గురువులున్నంతవరకు ఇందూమతములో అజ్ఞానమున్నదనీ, అలాగే శరీరము మార్చుకొని ప్రభువు ఎదురుగా వచ్చినా ఆయనకే వాక్యముల గురించి చెప్పు క్రైస్థవులున్నంత వరకూ వారికి దేవుని విషయము పూర్తి అవగాహన కాలేదనియే చెప్పవచ్చును.


దేవుడు భూమిమీదకు వచ్చినా ఎంతో జ్ఞానులైన వారు కూడా ఆయనను గుర్తించలేకపోవడానికి ఆయన జ్ఞానమును అర్థము చేసుకోలేక పోవడానికి బలమైన కారణము కలదు. ఆ కారణమేమిటని తెలియుటకు ముందు కంటికి కనిపించు సృష్ఠిని గురించి తెలుసుకోవాలి. దేవుడు అర్థము కాకుండా పోవడానికి దేవునికి వ్యతిరిక్తమైన ప్రధాన ప్రతిపక్షమొకటి గలదు. దానినే క్రైస్థవులు 'సాతాన్‌' అనియు, ఇందువులు 'మాయ' అనియు, ఇస్లామ్‌ మతమువారు 'సైతాన్‌' అనియు చెప్పుచున్నారు. మాయ, సైతాన్‌, సాతాన్‌ అను పేర్లు కల్గినదేదో దాని రహస్యము తెలియాలంటే మొదట సృష్ఠి రహస్యము తెలియాలి. దాని వివరము క్రింద చూస్తాము.

☜ సృష్ఠి రహస్యము   

జగతి లేకముందు పరమాత్మ (దేవుడు) స్త్రీ కాదు, పురుషుడు కాడు. ఏదీకాని పరమాత్మ జగతిని సృష్ఠించదలచుకొని స్త్రీ తత్త్వము కల్గిన ప్రకృతిని, మాయను లేక సాతాన్‌ను తయారు చేశాడు. దానికుండవలసిన లక్ష్యణములను, ఉండవలసిన పద్ధతులను అన్నిటినీ నిర్ణయించాడు. ప్రకృతి స్త్రీ స్వరూపమైనది కావున దానికంటే పూర్తి విలక్షణముగా నిలచాడు. ఆ లక్ష్యణమే పురుషుడు. తనకు ప్రకృతి, ప్రకృతికి తాను పూర్తి వ్యతిరిక్త దిశలలో ఉండునట్లు తలచిన పరమాత్మ ఇద్దరూ సమవుద్దీగా ఉన్నప్పుడే తాను ఆడు ఆట రసవత్తుగా ఉండునని, తనకు సమానముగా ప్రకృతికి అధికారము లిచ్చాడు. ప్రకృతి (సాతాన్‌) పరమాత్మకు విరుద్ధమే కానీ శత్రువు కాదు. దేవుడు, సాతాన్‌ (పరమాత్మ, ప్రకృతి) చేతిలో విరుద్ధతను ఎదుర్కొనుట సహజమే అయినా ఒకరికొకరు శత్రువులు కారు.

ఒకప్పుడు ప్రకృతిని పుట్టించిన పరమాత్మ, తిరిగి ఒకప్పుడు తనయందే లీనము చేసుకొని ప్రకృతిని లేకుండా చేయును. ప్రకృతిని పుట్టించినవాడు, పోషించువాడు, తిరిగి లేకుండా చేయువాడు పరమాత్మయే. పుట్టించిన తండ్రిగా, భరించు భర్తగా, నశింపజేయు కాలుడుగా ప్రకృతికి అన్నీ తానైయుండి ప్రకృతిలోని శక్తిగా కూడా తానై పరమాత్మ ఉన్నాడు. ఎంతో విశాలముగా ఉన్నవాడు కొంత విశాలమైన ప్రకృతిని తయారు చేసి 'జగతి' అను ఆటను ఆడుచున్నాడు. ఈ ఆటలో ఏదీకాని పరమాత్మ పురుషుని వేషధారియైపోయాడు. 'జగతి' అను నాటకము ప్రకారము పరమాత్మ పురుషుడు. నాటకమునకతీతముగా చూస్తే స్త్రీ, పురుషుడు ఏదీకానివాడు. ప్రకృతిని పంచభూతములుగా చేసి ప్రపంచము అన్నాము. ప్రపంచమును సృష్ఠించిన పరమాత్మ, చావు పుట్టుకలు గల జగతిని సృష్ఠించదలచుకొన్నాడు. పుట్టుక చావులు గల జీవరాసులను ఆత్మచేత సృష్ఠించి ప్రపంచములో జగతిని నిర్మించాడు. 'జ' అనగా పుట్టునది 'గతి' అనగా చావునదని, జగతి అనగా పుట్టుక, చావులు గలదని తెలియునట్లు జీవసముదాయమునకు 'జగతి' అని పేరు పెట్టారు.

ప్రకృతియను ప్రపంచమును తయారు చేసిన పరమాత్మ, ప్రకృతిలో జగతి అను జీవరాసులను తయారు చేశాడు. ప్రకృతి, పురుషులు సమానమైనవారు కాగా, అనగా ప్రపంచము, పరమాత్మ సమానమైన వారు కాగా, తర్వాత ప్రత్యేకముగా పుట్టి వచ్చినది జగతి. ఇప్పటికి పరమాత్మ ప్రపంచమును, జగతిని రెండిటినీ సృష్ఠించాడు. తనతో కలుపుకుంటే మూడవుతాయి. మొదట ఏదీకాని పరమాత్మ, ప్రకృతిని తయారు చేసి, తాను పురుషుడై ఆత్మగా యుంటూ ప్రకృతిని భార్యగా చేసుకొని, తాను భర్తగా ఉంటూ జగతి అను ప్రత్యేకమైన సంతానమును తయారు చేశాడు. ఈ వావి వరుసలు లేకుండా చూస్తే ఏదీకాని పరమాత్మ తన నుండి మూడు భాగములను సృష్ఠించాడు. ప్రకృతిని, పురుషుడను, జగతిని. ప్రకృతిని స్త్రీ, పరమాత్మ పురుషుడు, జగతి నపుంసకుడని తలచవలెను. మధ్యలో ఉన్న నపుంసకున్ని ఇటు ప్రకృతి తనవైపు లాగుకొనడము, అటు పరమాత్మ తనవైపు లాగుకొనడము ముఖ్యమైన ఆటగా యున్నది. ఆటకంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆట పద్ధతులను నిర్ణయించి ఆటను పెట్టిన పరమాత్మ తాను అన్నిటికీ సృష్ఠికర్త, పెద్ద అయినప్పటికీ ఆత్మను సృష్ఠించి తాను నిర్ణయించిన పద్ధతుల ప్రకారము ఆట ఆడుచున్నాడు. ఈ ఆటకు మిగతా ఆటలవలె కొంత కాల నిర్ణయమున్నది. ఫుట్‌బాల్‌కు ఒకటిన్నర గంట, క్రికెట్‌కు యాభై ఓవర్లు అన్నట్లు, జగతి అను ఆటకు వేయి యుగములు లేక 108 కోట్ల సంవత్సరములు పరిమితి ఉన్నది. రాత్రిళ్ళు విరామము, పగలు ఆట సాగడము జరుగుచున్నది. ఆట సమయము 108 కోట్ల సంవత్సరములు, విరామము కూడా అంతే సమయము.

ఏదీ కానివాడు, ఫలానా అని ఎవరి చేత చెప్పబడనివాడు, మొదట ప్రపంచమును, తర్వాత జీవరాసులను తయారు చేశాడు కదా! ప్రకృతిని తయారు చేసి తాను 'పురుషుడు' అను గుర్తింపు తెచ్చుకొన్నాడు. పురుషుడై ఆత్మను సృష్ఠించి ఆత్మ బీజమును భరించబడి గర్భము దాల్చు ప్రకృతిని ఐదు భాగములు చేశాడు. అటువంటి ప్రకృతినే పంచభూతములనీ, ప్రపంచమనీ అంటున్నాము. తన చేతనే తయారు కాబడిన ఆత్మను, జీవాత్మను మూడుగా విభజించాడు. జీవరూపమైన జగతి జీవాత్మయనీ, ఆత్మయనీ, పరమాత్మయనీ మూడు విధములుగా విభజించిన వాడు, జీవాత్మలను, ఆత్మను తయారు చేసి తాను పరమాత్మనను గుర్తింపు తెచ్చుకొన్నాడు. ప్రకృతి ప్రక్కన పురుషుడుగా ఆత్మల ప్రక్కన పరమాత్మగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ప్రకృతి ఉన్నప్పుడు, ఆత్మలు ఉన్నప్పుడు మాత్రమే పురుషుడు, పరమాత్మ అని పిలుచుటకు ఆధారమున్నది. అవి లేకుంటే ఆయనను ఏమని చెప్పుటకు వీలుకాదు. ఏదీ కానివాడు ప్రపంచముతో పురుషుడనీ, ఆత్మలతో పరమాత్మనీ అర్థమయిందనుకొంటాను. ప్రకృతి, పురుషుడయిన ఆత్మకు పుట్టినది జీవ సముదాయమైన జగతి. జగతిలో తల్లితండ్రులైన ప్రకృతి, పురుషుల లక్ష్యణములు ఉండునట్లు పరమాత్మ చేత అమర్చబడినది.

ప్రకృతిలో పురుషునికంటే విరుద్ధ లక్ష్యణములున్నట్లు అమరిక గలదు. జగతిలో మాత్రము ప్రకృతి పురుషుల రెండిటి లక్ష్యణములు మిళితమై ఉన్నవి. జీవరూపమైన జగత్తులో పరమాత్మ సంబంధిత జీవాత్మ, ఆత్మలు, ప్రకృతి సంబంధితమైన శరీరములు, గుణములు రెండూ గలవు. అంతేకాక దేవుడున్నాడను నమ్మకము ఆత్మవైపు, లేడని దేవునికి వ్యతిరేఖత ప్రకృతివైపు రెండూ గలవు. జగతిగా ఉన్న మానవులలో ప్రకృతి, పురుషుల లక్ష్యణములుండి ప్రకృతి, పురుషులిలా కలరని తెలుపు నిమిత్తము ప్రకృతికి ప్రతి రూపముగా స్త్రీ శరీరములు, పరమాత్మకు ప్రతి రూపముగా పురుషుని శరీరములు తయారైనవి. ప్రకృతి పరమాత్మలేకాక జగత్తు కూడా కలదని తెలియునట్లు జగత్తుకు ప్రతి రూపముగా నపుంసకులు కూడా తయారైనారు. స్త్రీలు, పురుషులు, నపుంసకులు అను ముగ్గురు ప్రకృతి, పరమాత్మ, జగతి అను వాటి ప్రతి రూపములై ఉన్నారు. ప్రకృతి=స్త్రీ, జగతి=నపుంసకుడు, పరమాత్మ=పురుషుడు (మగాడు). పుట్టిన ప్రపంచమునకు ఆడవారు, జగత్తుకు నపుంసకులు, పరమాత్మగా ఉన్నవానికి మగవానిని గుర్తింపుగా పెట్టి తన సృష్ఠి ఇలా ఉందని అందరికీ తెలియునట్లు చేశాడు. అంతేకాక ఆత్మకు, ప్రకృతికి రెండిటి చేతనే జగత్తు పుట్టినదని తెలియునట్లు ఆడ, మగకు సంతానము పుట్టునట్లు చేశాడు. అందరికీ కనిపించు తల్లి, తండ్రి, సంతానము ఆదియందు సృష్ఠి విధానముగా యున్నది. అన్నిటియందు బుద్ధిని ఉపయోగించు మానవుడు స్త్రీకి భిన్నముగా ఉన్న పురుషుని గురించి, వారికి కల్గు సంతానమును గురించి ఎందుకిలా ఉన్నదని ఏమాత్రము యోచించడము లేదు. ఆధ్యాత్మిక విద్యలో అక్షరాభ్యాసమైన ''సృష్ఠి రహస్యము'' ను తెలియకపోతే ఆధ్యాత్మికమే తెలియక పోవును.

ఇది ఒక ఆటయని దేవునికి, ప్రకృతికి మధ్యన జరిగే శత్రుత్వ రహిత పోరాటమనీ తెలియాలి. ప్రకృతి, పరమాత్మల ఆటలో జీవున్ని ఎవరివైపు వారు లాగుకొనుటకు చూస్తుందురు. పరమాత్మ తన జ్ఞానమును బోధించి తనవైపు వచ్చునట్లు చేసుకోవడము తన ఆటలో కర్తవ్యముకాగా, ప్రకృతి మాయగా యుంటూ తన ఆయుధములైన గుణములతో మనిషికి తీరిక, ఓపిక లేకుండా చేసి దేవున్ని గురించి యోచించు అవకాశమే మానవునికి లేకుండా చేయుచున్నది. అందరినీ వారివారి పనులలో ఇరికించి, ధ్యాసనంతయూ ఆ పనుల మీదికి మళ్ళించి, ఆశ చేత దానికి అనుబంధ గుణముల చేత, మనిషిని దేవునివైపు పోకుండా చేయుచున్నది. సృష్ఠిలో పరమాత్మ, ప్రకృతి మధ్య జరిగే అతి పెద్ద ఈ ఆటకు పేరు లేదు. ప్రకృతి మాయ రూపములో తనను ఎవరూ గుర్తించలేనట్లు ఆడుచూ, అందరినీ తనవైపు లాగుకొనుచున్నది. జగత్తులో ఎవడైనా దేవుని ధ్యాస కల్గినట్లయితే దేవున్ని గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నించిన వానిని, మాయ (ప్రకృతి) ప్రత్యేకముగా వాని మీద దృష్ఠి సారించి వానిని కూడా తన బుట్టలో వేసుకొంటున్నది. దేవుడు, మాయ (సాతాన్‌) యొక్క పోరాటము నందు ప్రస్తుత కాలములో మాయకే ఎక్కువ బలమున్నట్లు దానివైపే 99 శాతము మనుషులున్నట్లు తెలియుచున్నది. ఇటువంటి సందర్భములలో దేవుని ఓటమి తప్పదేమోననిపించు సమయములో పరమాత్మ కూడా తాను బాగా ఆడి గెలిచేదానికి ప్రయత్నించాలి కదా!

అందువలన ఆయన ప్రయత్నములో భాగముగా మనిషిగా, మనుషుల మధ్యలోకి వచ్చి తనను గూర్చి తానే చెప్పుకొని తనవైపు మళ్ళించు కోవడానికి ప్రయత్నించును. ఆట అనగా గెలుపు ఓటమిల మధ్య సాగే పోరాటము కదా! ముందే చెప్పుకొన్నాము ఇది శత్రుత్వ రహిత యుద్ధమని. ఈ పోరాటములో ఎవరి ప్యూహము వారిది. మనిషిలోనే సాతాన్‌ (మాయ) దేవుడు ఇద్దరూ ఉండినప్పటికీ వారి విషయము మనిషికి తెలియకున్నది. అందువలన మనిషి దేవున్ని గానీ, మాయను గానీ గుర్తించలేకున్నాడు. తను ఎటువైపు ఉన్నానని కూడా తెలియదు. తమకు తెలియకున్నా మాయ చేతిలో చిక్కిన మనుషులను దానినుండి విడిపించాలని దేవుడు కూడా ప్రయత్నించుచుండును. ఆ ప్రయత్నములోనే పరమాత్మ మారురూపములో దేవుని కుమారునిగా భూమిమీద పుట్టవలసి వస్తున్నది. కానీ ఆట నియమముల ప్రకారము తాను దేవుని కుమారుడనని మనుషులకు తెలియకూడదు. తెలియకుండానే తాను మనిషిలాగే పరమాత్మను (యెహోవా) గూర్చి తానే చెప్పవలసి వస్తున్నది. తన విషయము తానే చెప్పుచున్నప్పటికీ, తన ధర్మములను పునరుద్ధరించినప్పటికీ, సాతాన్‌ (మాయ) తాను కూడా తన వ్యూహము ప్రకారము వచ్చి దేవుని కుమారున్ని మనుషులలో అధమునిగా, అజ్ఞానిగా చూపుచున్నది. ఆయన మాటలు అధర్మములనీ, తమవే నిజమైన ధర్మములనీ బోధించునట్లు గురువులనే (కైపాలాంటి వారిని) తయారు చేసి పెట్టింది. మాయయే స్వయముగా గురువులు, స్వాముల రూపములో దేవుని కుమారునికి పోటీగా వస్తున్నది. తన తియ్యటి మాటలను దైవ జ్ఞానముగా వర్ణించి, దేవుని జ్ఞానమును నమ్మనట్లు, తాను చెప్పు జ్ఞానమునే నమ్మునట్లు చేయుచున్నది. ఏవి దేవుని ధర్మములో తెలియనట్లు తాను కూడా పరమాత్మ, మోక్షము, జ్ఞానము, సాధన అను పదములుపయోగించి చెప్పుచునే తన అధర్మములను మానవులకు అంటించుచున్నది. సాతాన్‌ యొక్క అధర్మముల ముందు దేవుని ధర్మములకు గుర్తింపు లేనట్లు చేయుచున్నది.

దేవుని వైపు పోవాలనుకొన్న వానికి ఏవి ధర్మములో, ఏవి అధర్మములో తెలియనట్లు చేసి, ఎవరు ఏమి చెప్పినా నమ్మునట్లు చేయుచున్నది. ''మాయ (సాతాన్‌), దేవుడు ఇద్దరిలో ఎవరు అవతరించినా వారి ఉనికిని చెప్పుకోకూడదు'' అన్నది ఆట నియమము. పరమాత్మ భూమిమీద భగవంతునిగా అవతరించి, తాను పరమాత్మనని చెప్పు కోకూడదు. నియమము ప్రకారము ప్రకృతి కూడా భూమిమీద జన్మించి తాను మాయనని చెప్పుకోదు. మాయ అవతరించినా నేను భగవంతుడనని చెప్పుకోవచ్చు, ఆ సూత్రము ప్రకారము మానవునికి తానే భగవంతుడనని (దేవుని కుమారుడనని) తెలియచేస్తూ ఎన్నో మహత్యములను చూపుచూ, ఎందరో స్వాములుగా మాయ (సాతాన్‌) అవతరిస్తున్నది. పరమాత్మ భూమిమీద ఒక్కచోట భగవంతునిగా అవతరించితే, ప్రకృతి భూమిమీద ఎందరినో భగవంతుడను పేరుతో తయారు చేయుచున్నది. తన ధర్మములను తెలుపుటకు పరమాత్మ ఒక చోట పుట్టి తాను భగవంతుడనని గుర్తింపు లేకుండా ఉంటే, మాయ మాత్రము ఆయన జన్మకు ముందునుంచే ఎందరినో భగవంతుడను పేరు కల్గిన వారిని తయారు చేసి, వారి మాటలనే వినునట్లు నిజమైన భగవంతుడు చెప్పిన మాటలను కూడా విననట్లు చేయుచున్నది. ఎవరి ప్రయత్నము వారిదన్నట్లు మాయ పని మాయ, దేవుని పని దేవుడు చేసుకొంటూ పోవుచున్నారు.

మాయ ఎల్లపుడూ గుణముల రూపములో మనిషి శరీరములో ఉండగా, దేవుడు కూడా ఆత్మ రూపముగా గలడు. మాయ, పరమాత్మలు భూమిమీద మనుషుల రూపములో వస్తారనుకొన్నాము కదా! అట్లు వచ్చు వారు ఏ శరీరములు ధరించి వస్తారని తెలియవలసి ఉన్నది. మాయ భూమిమీద పురుష శరీరము ధరించి భగవంతునిగా, అట్లే స్త్రీ శరీరము ధరించి భగవతిగా వచ్చుచున్నది. పరమాత్మ మాత్రము పురుష శరీరము ధరించి వచ్చుచున్నాడు. పరమాత్మ వాస్తవానికి పురుషుడే కావున పురుష శరీరము మాత్రము ధరించుచున్నాడు. ప్రకృతి స్త్రీయే కావున స్త్రీ శరీరము ధరించుచున్నది. అలాగే తాను కూడా పురుషుడనే అని మభ్య పెట్టుటకు పురుష శరీరము కూడా ధరించుచున్నది. భగవతి, భగవంతులలో ఎవరు నిజమైన భగవంతుడో అర్థము కాకుండా పోవుచున్నది. మొత్తానికి భగవంతుడు పురుషునిగనే జన్మించునని తెలియాలి. పరలోక తండ్రియైన పరమాత్మ పురుషాకారములోనే ఏసుగా పుట్టాడు. ఆయన స్వయముగా పుట్టువాడు, ఆయనను పుట్టించువాడు మరొకడు లేడు. అందువలన పురుష వీర్యముతో సంబంధము లేకుండా కన్య గర్భమందు జన్మించాడు. పరమాత్మ తన అవసరము భూమిమీద గలదన్నప్పుడు తానే స్వయముగా అపుడపుడు పుట్టుచున్నాడు. అలా పుట్టిన వాడే ఏసు. తర్వాత కూడా పుట్టి వచ్చును.

ఒకే పరమాత్మ ఎన్ని అవతారములుగా జన్మించినప్పటికీ ఒకే ధర్మములను తెలియజేసాడని తెలియజెప్పుటకే మేము ఈ గ్రంథమును వ్రాశాము. బైబిలు క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఏసు వాక్యములలో సారాంశమైన వాటిని ఏరి, గీతకు సమన్వయపరచి చదువరులకు అర్థమగునట్లు ఈ గ్రంథము వ్రాయబడినది. దీనిని చదువుట వలన ఏసుప్రభువులోని ఔన్నత్యమును, కృష్ణునిలోని అంతరాత్మను తెలుసుకోగలరని ఆశిస్తూ ముగించుచున్నాము.

ఇట్లు

త్రిమత ఏకైక గురువు, త్రైత సిద్ధాంత ఆదికర్త, శతాధిక గ్రంథకర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు


Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024