pss: bt 17
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
అర్జునుడిట్లనియె:-
(17) శ్లో|| 1: సన్న్యాసస్య మహాబాహో ! తత్త్వ మిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీ కేశ ! పృథ క్కేశినిషూదన ! ||
(కార్య సన్న్యాసము, కర్మ త్యాగము)
భావము : ఓ కృష్ణా! సన్న్యాసము మరియు త్యాగము అనువాటి యొక్క నిజ తత్త్వమును వేరు వేరుగ విశదముగ తెలియకోరుచున్నాను.
వివరము: ఇక్కడ అర్జునునికి త్యాగము సన్న్యాసము అను రెండిటి మీద సంశయము వచ్చి రెండు వేరు వేరుగ ఉన్నాయనుకొని వాటి వివరమడిగాడు. త్యాగము సన్న్యాసము ఇంచుమించు ఒకే అర్థము నిచ్చునవైనప్పటికి వాటి పదములలో భేదముందని ఒప్పుకొనక తప్పదు. వదలుకోవడమని అర్థము నిచ్చు త్యాగ, సన్న్యాసములలో ఏమి తేడా కలదో క్రింది శ్లోకములో చూస్తాము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 2: కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||
(కార్య సన్న్యాసము, కర్మ త్యాగము)
భావము : కోరి చేయు పనులనెల్ల వదలి వేయడము సన్న్యాసమని కవులందురు. కోరి చేసిన పనులలోని ఫలితమును (కర్మను) వదలుకోవడము త్యాగమని జ్ఞానులందురు. (ఆత్మ సంయమ యోగములో 1, 2 శ్లోకములలో త్యాగమును కూడ సన్న్యాసమనియే చెప్పినట్లు గ్రహించవలెను).
వివరము: శరీరములో ఒక కార్యము జరుగుటకు కర్మవలన గుణములు పని చేయునని తెలుసుకొన్నాము. కర్మనుండి కార్యము గుణముల ద్వార మొదలవు చున్నప్పటికీ, ఎంతటి జ్ఞానికైన కర్మ ఏదో తెలియదు. ఫలానా గుణము నాలో పని చేయుచున్నదని గుణమును తెలుసుకోవచ్చును. అట్లే బుద్ధి వివరమును గమనించ వచ్చును. గుణముల దగ్గర నుండి జరిగే పనివరకు తెలుసుకోగల్గుచున్నాము. ఆ పనికి కారణమైన కర్మ, గుణము వెనుక ఉన్న దానివలన పూర్తి పని జరుగువరకు కర్మ ఎవరికీ ముందు తెలియదు. కావున మనకు కార్యము ఏ గుణములతో మొదలగుచున్నదని తెలియును. కాని దాని వెనుక ఎంత ప్రారబ్ధకర్మ ఉన్నది తెలియదు. ఇప్పుడు అసలు విషయానికొస్తాము. ఒక పని జరుగవలసియున్నప్పుడు బ్రహ్మయోగము ద్వార ఆ సమయములో ఆ పనిని చేయకుండ వదలుకోవడమును సన్న్యాసమని అందురు. ఇక్కడ పనికి కారణమైన ఆశ మొదలగు గుణములను వదలి వేయడము జరుగుచున్నది. ఒక్క బ్రహ్మయోగములో మాత్రము గుణములను నిరోధించుటకు వీలగుచున్నది. ఒక్క బ్రహ్మయోగి మాత్రమే బ్రహ్మయోగ సమయములోనే జరుగు పనులను నిరోధించ గల్గుచున్నాడు. ఏ గుణము పని చేయనిది, ఏ సంకల్పము బుద్ధికి లేనిది, చిత్తమునకు కార్య నిర్ణయములేనిది, ఇంద్రియములకు పనిలేనిది ఒక్క బ్రహ్మయోగ సమయము మాత్రమే. కనుక వాడు కామ్యాది పనులను వదలుకోవడము సన్న్యాసమని అంటున్నాము.
త్యాగము, సన్న్యాసము రెండు ఒకే అర్థము నిచ్చునవేయైనప్పటికి కార్యము జరుగక ముందు కార్యమునే వదులుకోవడమును సన్న్యాసమనియు, కార్యము జరిగిన తర్వాత అందులో వచ్చు కర్మను వదులుకోవడము త్యాగమనియు కొద్ది తేడాతో చెప్పవలసి వచ్చినది. త్యాగమను దానిని వివరించి చూచిన, ఒక కార్యము సర్వ సాధారణముగ గుణముల ప్రేరేపితము వలన జరిగినప్పటికి, ఆ కార్యములో వచ్చు ఫలితమైన పాపపుణ్యములను రాకుండ వదులుకోవడమును త్యాగమంటున్నాము. అట్లు చేయువానిని కర్మయోగి అంటున్నాము. ఈ విధానము ఒక్క కర్మయోగులకు మాత్రమే సాధ్యమగును. ఒక్క సమయములో కార్య ఫలితమును వదులుకోవడమును త్యాగమనియు, అదే విధముగ ఒక్క సమయములో కార్యమును వదలుకోవడమును సన్న్యాసమని అనుచున్నాము. రెండింటి ఉద్ధేశ్యము అర్థము ఒక్కటే అయినప్పటికి ఒకటి కర్మయోగమనియు, రెండవది బ్రహ్మ యోగమనియు తెలియవలెను. సన్న్యాసములో సంచితకర్మ, త్యాగములో ఆగామికకర్మ వదలబడుచున్నది. సన్న్యాసములో ఉన్న సంచితకర్మ లేకుండ పోవుచున్నది. త్యాగములో వస్తున్న ఆగామికకర్మ రాకుండ పోవుచున్నది. ఈ విషయము గూర్చి కర్మ సన్న్యాస యోగములో కూడ మొదటనే రెండిటి ఫలితము ఒక్కటేనని చెప్పబడినది. ఈ రెండు మోక్షమువైపు మార్గమును చూపునవై ఉన్నవి. ఇక్కడ వివరించి చెప్పు నిమిత్తము త్యాగమును సన్న్యాసమును వేరువేరుగ చెప్పవలసి వచ్చినది. గీతలో వెనుక అన్ని చోట్ల త్యాగమును కూడ సన్న్యాసమనియే చెప్పినట్లు గ్రహించవలెను.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17)శ్లో|| 3:- త్యాజ్యం దోషవ దిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్య మితి చాపరే ||
(కల్పితము)
(17)శ్లో|| 4:- నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ ! ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర ! త్రివిధ స్సమ్ర్పకీర్తితః ||
(కల్పితము)
(17)శ్లో|| 5:- యజ్ఞ దాన తపఃకర్మ న త్యాజ్యం కార్య మేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||
(కల్పితము)
(17)శ్లో|| 6:- ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యా నీతి మే పార్థ ! నిశ్చితం మత ముత్తమమ్ ||
(కల్పితము)
వివరము:ఈ నాల్గు శ్లోకములలో సారాంశము చూచిన యజ్ఞ, దాన, తపస్సు అనునవి మానవుని పావనము చేయు కార్యములని, వీటిని వదలకూడదని, వీటి వలన కర్మరాదని, ఈ మూడు మినహా సర్వ కార్యములందు కర్మలంటునని కొందరను చున్నారని చెప్పడమే కాక, ప్రత్యేకించి ఆరవ శ్లోకములో యజ్ఞ, తప, దానములనునవి కర్తవ్యములని, కోరిక లేకుండ చేయమనడము ఒక విధముగ అందరకి మంచిగ కనిపించినప్పటికి అందులో అసలైన సత్యమును కప్పిపుచ్చారు. ఈ శ్లోకము వలన చాలామంది తప్పుదారి పట్టుటకు అవకాశమున్నది. భగవంతుడు చెప్పిన దానికి ఈ శ్లోకముల భావము అన్యముగ కనిపిస్తున్నది. అది ఏమనగా! మానవుని నిత్య జీవితములో ఎన్నో రకముల పనులు జరుగుచుండును. వాటి వలన కర్మ వచ్చుననుట నిజమే. ప్రతి పనిలోను కర్మకలదను సూత్రము ప్రకారము యజ్ఞ, దాన, తపములలో కూడ కర్మ కలదు. అన్ని పనులవలె కర్మనంటగట్టు యజ్ఞ, దాన, తపములు మానవుని పావనము చేయు సాధనములెట్లయినవి? అంతేకాక యజ్ఞ, దాన, తపములను కోర్కె లేకుండ చేయమని, అవి తప్పనిసరిగ చేయవలసిన కార్యములని చెప్పి, మిగతా కార్యముల గురించి చెప్పక పోవడము వలన, చాలామంది మూడు కార్యములలో మాత్రము కర్మ అంటదని, మిగతా కార్యములలో కర్మ అంటునని తలచుటకు అవకాశము గలదు. మానవుడు చేయు సర్వకార్యములను సమానముగ చెప్పక ఈ విధముగ యజ్ఞ, దాన, తపములను ప్రత్యేకించి చెప్పడములో భగవంతుడు తెలియజేసిన కర్మయోగమునకు ముప్పు ఏర్పడుచున్నది. భగవంతుడు ఒక చోట చెప్పిన సూత్రబద్దమైన విషయమునకు వ్యతిరిక్తముగవున్న శ్లోకములు మధ్యలో మానవుడు కల్పించినవని సులభముగ అర్థమగుచున్నది. మానవుని బుద్ధిలో కార్యముల తేడాలున్నవి. కావున యజ్ఞ, దాన, తపములు పవిత్రమైన కార్యములన్నారు. భగవంతుడు ఎన్నో చోట్ల సర్వకార్యములందు కర్మ అంటుచున్నదని చెప్పి, అవి అంటని విధానములను కూడ బోధించియున్నాడు. కనుక మేము ప్రత్యేకించి ప్రక్కవారిచే చెప్పబడిన యజ్ఞ, దాన, తపముల శ్లోకములను బయటపెట్టి తీసివేయడము జరిగినది.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 7: నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||
(కల్పితము)
(17) శ్లో|| 8: దుఃఖ మిత్యేవ యత్కర్మ కాయక్లేశభయా త్త్వజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||
(కల్పితము)
భావము: నియత కార్యములను త్యజింప తగదు. ఆ కార్యములను అజ్ఞానము చేత త్యజించిన దానిని తామస త్యాగమందురు. అట్లే దుఃఖకరమైనదని శరీరమునకు చేయుటలో కష్టమైనదని వదలుట రాజస త్యాగమందురు.
వివరము: ఇక్కడ ఈ రెండు శ్లోకములు కూడ భగవంతుడు చెప్పిన జ్ఞానమునకు విరుద్ధమైనవి. కర్మ ప్రకారము నియమింపబడియున్న కార్యములను ఎవరైన తప్పక చేసి తీరవలసిందేనని వెనుక అధ్యాయములలో తెలుసుకున్నాము. ఎవడైన నేను చేయనని పట్టుబట్టినప్పటికి వానిచేత బలవంతముగ కర్మ చేయించునని కూడ భగవంతుడు తెల్పియున్నాడు. ఎవరి ఇష్టముల మీద సంబంధములేని కర్మ నిర్ణయమును నేను చేయనని, చేయకుండ ఎవడైన తప్పించుకొనువాడు గలడా? తప్పకుండ చేయవలెనని చెప్పిన పరమాత్మ ఇక్కడ అలా చేయకుండ వదలడము తామసత్యాగమని, రాజసత్యాగమని చెప్పునా? అలా ఎవనికి ఇష్టమొచ్చినది వాడు చేసి, ఎవనికి ఇష్టము కాని దానిని వాడు వదిలి వేసినట్లయితే, ఇక కర్మ యొక్క ప్రాబల్యము ఏమున్నది? కర్మ నిర్ణయమును ఎవడు అతిక్రమించలేడు. నీవు యుద్ధము చేయనను పట్టుపట్టినప్పటికి, విధి (కర్మ) బలవంతముగ నిన్ను ప్రేరేపించి నీచేత యుద్ధము చేయించి తీరునని చెప్పిన విధానమేమగును? భగవంతుడు చెప్పిన కర్మ సూత్రములకు ఈ రెండు శ్లోకములు కూడ విరుద్ధమైనవని తెలియుబడుచున్నవి. ఇంతేకాక తొమ్మిదవ శ్లోకమున నియతకర్మ ప్రకారము అహము లేకుండ, ఫలితము మీద ఆశలేకుండ, కార్యములను ఆచరించిన దానిని సాత్విక త్యాగమని చెప్పబడునన్నారు. 7, 8 రెండు శ్లోకములలో ఆచరించని దానిని త్యాగమనడమేమిటి? 9వ శ్లోకములో ఆచరించిన దానిని త్యాగమనడమేమిటి? ఇచటనే 7, 8 శ్లోకములకు 9వ శ్లోకమునకు పూర్తి వ్యతిరిక్తత ఉండడము అందరు గమనించవచ్చును. సంస్కృతమును తెలిసిన వారు వారికిష్టమొచ్చినట్లు శ్లోకములల్లి భగవద్గీతలో చొప్పించిపెట్టి భగవంతుని భావమునకు విరుద్ధ ప్రచారము చేశారు. గీతను చదువువారు వాటి తేడాలు గమనించకపోవడము మరీ విచిత్రము. భగవంతుని భావానికి విరుద్ధ భావము సృష్టించిన వారెవరోగాని, వారికి భయంకర పాపమంటుకొనును. ఇక్కడ వరుసగ ఆరు శ్లోకములు అశాస్త్రీయమైనవి కల్పితమైనవి. రెండవ శ్లోకము తర్వాత తొమ్మిదవ శ్లోకముతో భగవద్గీత మొదలగుచున్నది.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 9: కార్య మిత్యేవ య త్కర్మ నియతం క్రియతేఽర్జున ! ।
సంగం త్యక్త్వాఫలం చైవ స త్యాగ సాత్త్వికో మతః ||
(సాత్త్వికము)
భావము: కర్మ నియతమైనది కార్యమని, కార్యము చేయుటలో సంగము లేకుండ ఫలితము మీద ధ్యాస లేకుండ చేయుట సాత్త్విక త్యాగమని అందురు.
వివరము: ఇది భగవంతుడు చెప్పిన శ్లోకమనుటలో సంశయము లేదు. మనము నిత్యము చేయుపనులు ముందే నిర్ణయింపబడివున్నవి. గత జన్మల సంచితమను కర్మ నుండి ఇప్పటి జన్మకు కొంత కర్మ పుట్టినప్పుడే కేటాయించబడివుండును. దానినే ప్రారబ్ధకర్మ అంటున్నాము. ప్రారబ్ధకర్మ పొల్లు పోవునది కాదు. దీని ప్రకారము ఎవరైన ఆడి తీరవలసిందే. మన శరీరములోని తలయందు ఎన్ని వెంట్రుకలుండ వలెనను విషయము మొదలుకొని ఎప్పుడేమి చేయవలెనను విషయము వరకు ఒక జన్మకు పూర్తి నిర్ణయించబడి ఉండును. అలా నిర్ణయించబడివున్న ప్రారబ్ధకర్మను నియతకర్మ అంటున్నాము. నియతకర్మ ప్రకారము జరిగితీరునని తెలిసి జీవితములో తన చేత జరుగబడు కార్యములలో అహముతో కలువక, ఈ కార్యములలో పాపపుణ్య ఫలితము వచ్చునను ధ్యాస లేకుండ, తాను చేయవలసిన పని పద్ధతిగ చేసి తీరవలెనని నిమిత్తమాత్రముగ ఎవడు చేయుచున్నాడో, అట్టి దానిని సాత్త్విక త్యాగమని చెప్పుచున్నాము. ఇందులో వాడు విడిచినదేది? దేనిని త్యాగమంటున్నామని అడిగిన దానికి సమాధానమేమనగా! కర్మ ప్రకారము జరుగబడు కార్యములోను కంటికి కనిపించకుండ కర్మ పుట్టుకొస్తున్నది. ఆ క్రొత్త కర్మను ఆగామికర్మ అంటున్నాము. ఆ ఆగమికర్మను ఎవడైతే తనకు అంటకుండ వదలించుకొనుచున్నాడో దానిని త్యాగమంటున్నాము. క్రొత్తదైన ఆగమికకర్మను తగులుకోకుండ చేసుకొనుటకు భగవంతుడు కర్మయోగమను విధానము చెప్పియున్నాడు. దాని ప్రకారము రాబోవు కర్మమీద కూడ ధ్యాసలేకుండ అహమును వదలి చేయవలసిన పనిని చేయడము వలన క్రొత్తకర్మను వదలినవాడగుచున్నాడు. దానినే త్యాగమని కూడ అంటున్నాము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 10: న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్న సంశయః॥
(కర్మయోగము)
భావము: సత్త్వగుణ త్యాగియైనవాడు మేధావియై, సంశయములను ఛేదించు జ్ఞానము గలవాడై ఉండి, కార్యములలో కల్గు కర్మను నాశనము చేయగల అగ్ని గలవాడై ఉండును. తనకు సుఖము కలుగజేయు పనులయందు ఆసక్తి లేకుండా, దుఃఖము కష్టము కలుగజేయు పనులయందు అయిష్టతలేకుండును.
వివరము: జ్ఞానము తెలిసినవాడు నిర్ణయింపబడిన ప్రారబ్ధకర్మ ప్రకారము తన శరీరము ద్వార మంచి చెడు కష్టసుఖములను కలుగజేయునవి, పాపపుణ్యములను తెచ్చిపెట్టు పనులు జరుగుచుండునని తెలిసియుండును. మన ప్రమేయముతో సంబంధము లేకుండ కేవలము ప్రారబ్ధకర్మ ప్రమేయముతోనే జరుగు పనులయందు మన ఇష్టాయిష్ట సంబంధములేదని తెలిసినవాడు, మంచి పనులకొరకు ఆసక్తి చూపడముగాని, చెడు పనులయందు అనాసక్తి చూపుటగాని లేకుండును. అశుభ కార్యముల మీద ద్వేషముగాని, శుభకార్యములందు కోరికగాని లేనివాడు, కార్యముల వలన కల్గు కర్మలను కాల్చివేయు అగ్నిగలవాడు గొప్ప జ్ఞానిగ యోగిగ చెప్ప బడుచున్నాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 11: నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిధీయతే ||
(కర్మయోగము)
భావము: దేహము ధరించినవాడు సంపూర్ణముగ కర్మను వదలి పెట్టుటకు శక్యము కాదు. ఎవడు కర్మఫలత్యాగము చేయునో వాడు త్యాగి అనబడును.
వివరము: శరీరము ధరించిన ఏ జీవుడైనగాని తన జీవితకాలమునకు సరిపడునదిగ నిర్ణయింపబడిన ప్రారబ్ధకర్మప్రకారము జరగవలసిన పనులను వదులుటకు శక్యము కాదు. నిర్ణయింపబడియున్న కర్మలు కార్యరూపముగ జరిగి తీరవలసిందే. వాటిని చేయకూడదను వాడుగాని, చేయనను వాడుగాని కర్మ శాసనములను పూర్తిగ తెలియనివాడేనని చెప్పవచ్చును. నియత కర్మను ఆచరించకుండ ఉండుటకు ఎవరికీ వీలుకాదు. నియతమైన ప్రారబ్ధకర్మలో మంచి పనులున్నా, చెడు పనులున్నా తప్పక చేసి తీరవలసిందే. మంచిపనులను మాత్రము చేసెదను, చెడుపనులు చేయననుటకు వీలులేదు. ఒకవేళ చెడు పనులనే చేసెదను, మంచి పనులను చేయననుటకు కూడ వీలులేదు. ఆచరణకు ఏ పనులు వచ్చిన వాటిని కర్మ ప్రేరేపించి వానిచేత తప్పక చేయించును. కర్మచేతిలో కీలుబొమ్మవలే కదలుచున్న మానవుడు (జీవుడు) అన్ని పనులు చేయవలసి వస్తున్నది.
జ్ఞానియైనవాడు కర్మలవలన జరుగవలసిన పనులు చేయక తప్పదని తెలిసినవాడై, జరిగెడి పనులలో క్రొత్తగావచ్చు ఆగామికకర్మయను దానిని కర్మయోగ పద్ధతి ద్వారా రాకుండ చేసుకొనుచుండును. యోగపద్ధతి తెలిసి ప్రారబ్ధకర్మను పనుల రూపముగ ఆచరించుచు, ఆ పనుల ద్వారా వచ్చు ఆగామికకర్మను రాకుండ చేసుకొను వానిని త్యాగి అనవచ్చును. పాత కర్మలాచరించుచు క్రొత్త కర్మలు రాకుండ చేయువానిని కర్మయోగి అనియు కర్మత్యాగి అనియు అనవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 12: అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్య త్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||
(కర్మయోగము)
భావము: అనిష్టమనియు, ఇష్టమనియు, మిశ్రమమైనదనియు మూడు విధ కర్మలు త్యాగులు కానివారికి మరణానంతరము కలుగుచున్నవి. త్యాగియైనవానికి ఏ కర్మలు లేవు.
వివరము: ప్రపంచములో నిత్యము పనులు చేయువానికి చేసే పనులను బట్టి సుకర్మ, దుష్కర్మ, మిశ్రమకర్మ అని మూడు విధములైన కర్మలు తగులుకొనుచున్నవి. మరణానంతరము తర్వాత జన్మలలో ఆ మూడు విధముల కర్మములయొక్క ఫలితములైన సుఖములను, కష్టములను మరియు కష్టసుఖమిశ్రమములను జీవుడు అనుభవించవలసివుండును. ఇది సాధారణ మనుషులకు జరిగెడి విధానము. యోగులైన వారికి త్రివిధకర్మలు లేవు వాటి పనులు లేవు. ఎందుకనగా! కర్మయోగి అయినవాడు మొదట పనులు చేయునపుడే జాగ్రత్తకల్గి ఆ పనిలోని కర్మను అంటించుకొనడు. అందువలన ఏ కర్మ వానికి లేదు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
17) శ్లో|| 13: పంచైతాని మహాబాహో ! కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తని సిద్ధయే సర్వకర్మణామ్॥
(ప్రకృతి)
భావము: సర్వకర్మలు ఆచరించుటకు సాంఖ్యసూత్రము ప్రకారము ఐదు కారణములు ఉన్నవని చెప్పబడినవి. వాటిని వివరింతును తెలుసుకొనుము.
వివరము: ప్రారబ్దకర్మములో ఉన్న సర్వ కర్మలు కార్యరూపమై జగతిలో జరుగుటకు ముఖ్యముగ శరీరములో ఐదు భాగములు కారణమైవున్నవని, శరీర యంత్రాంగమును గూర్చి విపులముగ తెలిసినవారు చెప్పియున్నారు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
17) శ్లో|| 14: అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||
(ప్రకృతి)
భావము: శరీరమును అధిష్టించియున్న వాటిలో అనేక కార్యములు చేయు బాహ్య కరణములు, వివిధ కార్యములు చేయించు అంతఃకరణములు వీటిలో దైవమొకటి కలసి మొత్తము ఐదు కర్తలైయున్నవి.
వివరము: శరీరమను వేదిక మీద ప్రారబ్దకర్మ అమలై కార్యములు జరుగుటకు కారణము ముఖ్యముగ శరీరములోని ఐదు భాగములని ముందే తెలిపివున్నారు. అంతేకాక కర్మ కార్యముల మొత్తము తతంగమునకు వేదికగ శరీరమున్నది. శరీర వేదికలో కార్యము జరిగి కర్మ అమలు జరుగుటకు ముఖ్యకారణములైన భాగములు 1) మనస్సు 2) బుద్ధి 3) చిత్తము 4) శరీర బాహ్యయింద్రియములు. శరీరమునందు కార్యములు జరుగుటకు ముఖ్య సూత్రధారులైన ఈ నాలుగు బాహ్య ఇంద్రియములు, అంతఃకరణములు కాక మరొకటి కూడ గలదు అదియే ఆత్మ. ఆత్మ అన్నిటికి శక్తినిచ్చి పని చేయించుచున్నది. వివిధ పనులు చేయు యంత్రములకు కరెంటు ఎట్లు ఉపయోగపడుచున్నదో, అట్లే ఆత్మ యొక్క చైతన్యము చేతనే శరీరము మొత్తము బయటి లోపలి భాగములు పనిచేయుచున్నవి. ఇలా ఆత్మతో కలిపి మొత్తము ఐదు భాగములు ప్రారబ్ధకర్మ అమలు జరుగుటకు కర్తలైవున్నవి. ఇందులో ముఖ్యముగ జ్ఞాపకము పెట్టుకొనవలసినదేమనగా! శరీరములోని జీవునికి కార్యములు చేయుటలో ఏ పాత్రలేదు. జీవుడు శరీరములో కేవలము కష్టసుఖములను అనుభవించుటకు మాత్రమే ఉన్నాడు. పనులు జరుగుటలో వానికేమి సంబంధములేదు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 15: శరీరవాఙ్మనోభి ర్యత్కర్మ ప్రారంభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వాపంచైతే తస్య హేతవః ||
(ప్రకృతి)
భావము: మానవుడు మనోవాక్కాయములచే ప్రారంభించు కార్యములు న్యాయమైనవి గాని, అన్యాయమైనవిగాని వాటికి పైన చెప్పబడిన ఐదు భాగములు కారణములని చెప్పవచ్చును.
వివరము: మానవుడు చేయు ప్రతి పనికి శరీరములోని పది ఒక గుంపుగవున్న పది బాహ్యేంద్రియములైన కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు, మరియొక గుంపుగనున్న అంతఃకరణములైన మనోబుద్ధి చిత్తములను నాలుగు మరియు ఆత్మ ఒకటి కలసి ఐదు కర్తలైయున్నవి. మనిషి చేయు మంచిపనిగాని, చెడుపనిగాని, న్యాయమైనదిగాని, అన్యాయమైనదిగాని, కర్మ ప్రకారమున్న ఏదిగాని శరీరములో కార్యరూపముగ చేయుటకు ఈ ఐదే కర్తలని గ్రహించవలెను. జీవుడు ఏమాత్రము కర్తగాడు, జీవుడు సుఖదుఃఖములను అనుభవించు భోక్త మాత్రమేనని గుర్తుంచుకోవలెను.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 16: తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః ।
పశ్య త్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ||
(జీవాత్మ)
భావము : కర్మ కార్య విషయములందు కర్తలైదునుండగ, అజ్ఞానియైనవాడు అన్నిటికి జీవాత్మయే (తానే) కర్తయని తలచుచున్నాడు. అట్టివాడు తెలివి తక్కువవాడై తన నిజస్థితిని తెలియకున్నాడు.
వివరము : జగతిలో కర్మ ప్రకారము సర్వకార్యములను జరిపించునవి ఒకే గుంపుగ బయటవున్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనో, బుద్ధి, చిత్తము మరియు వాటికి శక్తి నిచ్చు ఆత్మవుండగ అజ్ఞానియైన జీవాత్మ అన్ని పనులకు తానే కర్తనని తలపోయుచుండును. చూస్తున్నవాడు చేస్తున్నానుకోవడము తప్పు గదా! జరుగు సంఘటనలోని అనుభవములను మాత్రము అనుభవిస్తు, పనులు ఇతరుల చేత జరుపబడుచున్నవని తెలియని జీవాత్మ, తానే కార్యములకు కర్తననుకొనుచున్నాడు. శరీర యంత్రాంగ వివరము తెలియనివాడు, శరీరములో తానెక్కడున్నానని తెలియనివాడు, శరీరములో తానేమి చేయుచున్నానని తెలియనివాడు, తనకు సమీపములో ఉన్న అహము యొక్క మాట విని అహంకారమగ్నుడై పనులన్నిటిని నేనే చేయుచున్నానని తలచుచున్నాడు. శరీరము మొత్తము నేనేనను భావము కల్గివున్నాడు. శరీరము మొత్తము నేనేనని అనుకోవడము వలన శరీరములో వెనుకటి కర్మరీత్య జరిగెడి పనులన్నిటిలోను క్రొత్త ఆగామికకర్మ తయారై జీవున్ని అంటుకొనుచున్నది. జీవుడు జరిగెడి పనులను నేనే చేయుచున్నాననుకోవడము వలననే క్రొత్తకర్మ అంటుకొనుచున్నది. అలా అనుకోకపోతే క్రొత్త కర్మ అంటుకొనెడిది కాదు. జగత్తులో అనేక హోదాలలో అనేక విధములుగ జీవించు జీవాత్మలందరు పనులకు నేనే కర్తననుకోవడము వలననే కర్మలు సంపాదించుకొని, వాటిని అనుభవించుటకు మరుజన్మలెత్తుచు, అక్కడ కర్మలననుభవిస్తు మరి క్రొత్త కర్మ సంపాదించుకొనుచు, వాటిని అనుభవించుటకు తిరిగి పుట్టుచు, జనన మరణమను విధానమును చక్రమువలె తయారు చేసుకొన్నారు. కర్మను అనుభవించడము సంపాదించుకోవడము ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నదానివలన, వాటినుండి బయటపడలేకున్నారు. ఎవడైతే శరీర యంత్రాగ నిజస్థితిని తెలుసుకొంటాడో, వాడు పాతకర్మను అనుభవిస్తు క్రొత్త కర్మను సంపాదించుకోడు. అటువంటి వాడు పాతకర్మ అయిపోయిన వెంటనే మోక్షమును పొంది పరమాత్మలోనికైక్యము కాగలడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 17 యస్య నాహంకృతోభావో బుద్ధి ర్యస్య న లిప్యతే ।
హత్వాపి స ఇమాన్ లోకాన్న హన్తి ననిబధ్యతే ||
(కర్మయోగము)
భావము: ఎవని భావములో అహము లేదో, ఎవని బుద్ధి ఫలితము మీద ఉండదో, వాడు జగత్తులోని అందరిని చంపినప్పటికి వానికి కర్మ అంటదు. వాడు హంతకుడు కాడు.
వివరము: జగత్తులోని కార్యములన్నియు కర్మరీత్య అంతర బాహ్యేంద్రియముల ద్వారా ఆత్మశక్తిచే జరుగుచున్నవని తెలిసినవాడై, నేను కర్తనను అహమును వదలి, వచ్చెడు లాభనష్టముల మీద బుద్ధినుంచకవుండునో అట్టివానికి ఏ కర్మ అంటదు. అదే సూత్రము ప్రకారము ఏ పని జరుగుచున్నప్పటికి కర్మ అంటదు. ఈ సూత్రము ప్రకారమే ఎందరినో హత్య చేసినప్పటికి వాడు హంతకుడు కాదు. హత్యాపాపము వానిని అంటదని చెప్పవచ్చును. ఇలాగే గొప్ప సత్కర్మ చేసినను వానికి పుణ్యము రాదు. అహములేనివాడు చేసిన పనులలో దుష్కర్మ, సుకర్మ అనబడు పాపపుణ్యములు వానికిరావు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 18: జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ||
(యోగము, వియోగము)
భావము: జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాతయని, కర్మచ్ఛేదనమునకు చేయునది, చేయువాడు, సంభవించునదియని కర్మ సంభవమునకు మూడు విధములున్నవి.
వివరము: ఇక్కడ శ్లోకములో 'కర్మచోదన' అను పదము ఉపయోగింపబడియున్నది. కర్మను చోదించుట లేక కర్మను తెలియుట అను అర్థమిచ్చు ఈ పదమిచ్చట సందర్భాను సారము సరిపోదు. వాస్తవముగ ఇచట ఉండవలసిన పదము కర్మచ్ఛేదనా అని ఉండవలెను. "కర్మచ్ఛేదనా" అనుటలో పొరపాటుగ కర్మచోదనా అనడము జరిగి ఉంటుందనుకొంటాము. కర్మచ్ఛేదన అనుటలో కర్మను లేకుండ చేయుట అని అర్థము గలదు.
తెలియజేయునది జ్ఞానము, తెలియబడునది జ్ఞేయము. తెలుసుకొనువాడు పరిజ్ఞాత. జ్ఞానము వలన జ్ఞేయమును తెలిసినవాడు కర్మచ్ఛేదనము చేయును. అట్లే చేయునది కరణం, చేయించునది కర్మ, చేయువాడు కర్త అనియు మూడు విధానములు గలవు. వీటివలన జీవునకు కర్మ సంభవించుచున్నది. మూడు విధములైన ఒక పద్ధతి వలన కర్మచ్ఛేదము. అట్లే మూడు విధములైన మరియొక పద్ధతి వలన కర్మ సంగ్రహము జరుగుచున్నది.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 19: జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావ ఛ్ఛృణు తా న్యపి ||
(గుణములు)
భావము : గుణ వివరణ సాంఖ్యమునందు గుణ భేదములను బట్టి జ్ఞానము, కర్త, కర్మ అనునవి మూడు విధములుగ ఉన్నవి. వాటి వివరమును చెప్పెద శ్రద్ధగ వినుము.
వివరము : సాంఖ్యశాస్త్రము (శరీర యంత్రాంగము) అనుసరించి, తలలోని గుణచక్రములో గల భేదములను బట్టి ప్రతి మనిషి చేయు కార్యములలో కర్మ, కర్త, జ్ఞానము అను వాటియందు మూడు విధములు కలవు. పనిని చేయనప్పుడున్న జ్ఞానమును మూడు విధములైన గుణముల సంబంధముగ చెప్పుచు, అట్లే చేయుచున్న పనిని చేయుచున్న వానిని కూడ మూడు విధములుగ చెప్పుట జరిగినది. దానిని క్రింది శ్లోకములలో చూడగలము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 20: సర్వ భూతేషు యే నైకం భావ మవ్యయ మీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||
(సాత్త్వికజ్ఞానము)
భావము : సర్వ జీవరాసులందు ఉన్న పరమాత్మ నాశరహితమై ఒకే రూపముగ ఉన్నదని, వేరు వేరు ఆకారములుగ ఉన్న జీవశరీరములందు వేరువేరుగ విభజింపబడినదై ఏకముగ ఉన్నదని తెలుపు జ్ఞానమును సాత్త్విక జ్ఞానమందురు.
వివరము : అణువణువున వ్యాపించిన పరమాత్మను సర్వజీవరాసుల శరీరమందు అవ్యయునిగ ఎవడు చూచుచున్నాడో, మరియు అనేక విధములైన ఆకారములుగ విభజింపబడిన శరీరములలో ఒకే ఆకారముగ ఉండి విభజింపబడనిదై పరమాత్మ గలదని తెలుపు జ్ఞానము ఎవనికి కలదో, ఆ జ్ఞానమును సాత్త్విక జ్ఞానమందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 21: పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||
(రాజసజ్ఞానము)
భావము : సర్వ జీవరాసులందు భావమును బట్టి అందులోని పరమాత్మ కూడ వేరు వేరుగవున్నాడని తెలుపు జ్ఞానము రాజసజ్ఞానమగును.
వివరము : అన్ని జీవరాసులలో వాటి భావములు వేరైనప్పటికి, పరమాత్మ అంశ ఒకటిగానే ఉన్నదని తెలియక జీవుల భావములున్నట్లే పరమాత్మ కూడ అనేక విధములుగ ఉన్నదని తెలుపు జ్ఞానము రాజస జ్ఞానమని అనవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 22: యత్తు కృత్స్నవ దేకస్మిన్ కార్యే సక్త మహైతుకమ్ ।
అతత్త్వార్థవ దల్పం చ తత్తామస ముదాహృతమ్ ||
(తామసజ్ఞానము)
భావము : శాస్త్రబద్దము కానట్టిది, అసత్యమైనది, అల్పమైనదియునైన ఒక్క కార్యమే సర్వార్థసిద్ధియనుచు, ఆసక్తియంతయు దానియందుంచు జ్ఞానమును తామస జ్ఞానమందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 23: నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే ||
(సాత్త్విక కర్మ)
భావము : ఫలాపేక్ష లేక, సంగరహితముగ, ప్రేమ ద్వేషములులేకుండ చేయు నియతకర్మ (ప్రారబ్ధకర్మ)ను సాత్త్విక కర్మ అనబడును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 24: యత్తు కామేప్సునా కర్మ సాహంకా రేణ వా పునః ।
క్రియతే బహుళాయాసం త ద్రాజస ముదాహృతమ్ ||
(రాజసకర్మ)
భావము : కోర్కె కలవాడై మిక్కిలి ప్రయాసతో, కర్త తానన్న అహంభావముతో గర్వ పడుచు చేయు కర్మను రాజసకర్మయని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 25: అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహా దారభ్యతే కర్మ య త్త త్తామస ముచ్యతే ||
(తామసకర్మ)
భావము : తాను చేయు పనివలన కలుగు నాశనమును, హింసను ఆలోచించక, తన చేతనౌనో కాదోయని యోచించక, పౌరుషములచే అజ్ఞానభ్రాంతితో చేయు కర్మములను తామసకర్మలని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 26: ముక్తసంగోఽనహంవాదీ ధృత్యు త్సాహసమన్వితః ।
సిద్ధ్యసిద్ధ్యో ర్ని ర్వికారః కర్తాసాత్త్విక ఉచ్యతే ||
(సాత్త్విక కర్త)
భావము : సంగరహితుడై కర్త తానన్న అహంకారములేకుండ ధైర్యము ఉత్సాహము కల్గి, కార్యఫలములలో నష్టలాభముల మీద కలత చెందనివాడై, పనులు చేయు వానిని సాత్త్విక కర్తయని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 27: రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తారాజసః పరికీర్తితః ||
(రాజసకర్త)>
భావము : బంధువుల మీద ప్రేమ కలిగి కార్యములలో లాభమును కోరువాడై, లోభియగుచు హింస చేయువాడై, శుభ్రతలేనివాడై, సంతోష దుఃఖములకు చలించువాడు రాజసకర్తయగును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 28: అయుక్తః ప్రాకృత స్త్సబ్దః శఠో నైష్కృతి కోఽలసః ।
విషాదీ దీర్ఘసూ త్రీ చ కర్తాతామస ఉచ్యతే ||
(తామసకర్త)
భావము : అస్థిర స్వభావుడు, అనర్హుడును, శాస్త్రవిధానము తెలియని అవిద్యాపరుడును, ఏదీ ఆరంభించక ఉండువాడు, మోసగాడును, ఇతరులను చెరచువాడు, సోమరితనము గలవాడును, విషాదపరుడు, తొందరగ చేయవలసిన దానిని దీర్ఘకాలము వరకు చేయనివాడు తామసకర్తయని చెప్పబడును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 29: బుద్ధే ర్భేదం ధృతేశ్ఛైవ గుణత స్త్రివిధం శృణు ।
ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ! ||
(గుణములు)
భావము : మానవునికి ఉన్న త్రిగుణములనుబట్టి వానికున్న బుద్ధి మరియు ధైర్యములు మూడు విధములుగ ఉన్నవి. వాటిని మూడు విధములుగ ఒక్కొక్క దానిని వివరించి తెలిపెదను వినుము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 30: ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యా కార్యేభయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్థ ! సాత్త్వికీ ||
(సాత్త్వికబుద్ధి)
భావము : ఇది జన్మలు కల్గించునదని, ఇది జన్మరాహిత్యము చేయునదని, ఇది కార్యమని, ఇది అకార్యమనియు, ఇవి భయాభయములని, ఇది బంధము, ఇది మోక్షము అని వివరించి తెలుపు బుద్ధి సాత్త్వికబుద్ధి అని చెప్పవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 31: యయా ధర్మ మధర్మం చ కార్యం చాకార్య మేవ చ ।
అయథావ త్ర్పజానాతి బుద్ధిస్సా పార్థ ! రాజసీ ||
(రాజసబుద్ధి)
భావము : ఇది ధర్మమని, ఇది అధర్మమని, ఇది కార్యమని, ఇది అకార్యమని ఉన్నదున్నట్లు తెలియజేయలేక పొరపాటుగ వేరుదానిని సూచించు బుద్ధి రాజస బుద్ధియని చెప్పవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 32: అధర్మం ధర్మ మితి యా మన్యతే తమసాఽవృతా ।
సర్వార్థాన్ విపరీతాం శ్చ బుద్ధి స్సా పార్థ ! తామసీ ||
(తామసబుద్ధి)
భావము : అజ్ఞానము చేత అధర్మమును ధర్మమనిపించుచు, మరియు తెలియదగిన వాటినన్నిటికి విరుద్ధముగ తెలుపుచున్న బుద్ధిని తామసబుద్ధి అని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 33: ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేన్ద్రియక్రియాః ।
యోగే నావ్యభిచారిణ్యా ధృతి స్సాపార్థ ! సాత్త్వికీ॥
(సాత్త్వికధృతి)
భావము : శరీరములోని మనస్సు, ఇంద్రియములు, వాయువుల యొక్క పనులను నిలుపగల్గి వాటిని యోగమందు తగులుకొని నిలుచునట్లు చేయు ధైర్యమును సాత్త్విక ధైర్యమని చెప్పవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 34: యయా తు ధర్మకామార్థన్ ధృత్యా ధారయతేఽర్జున ! ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ ! రాజసీ ||
(రాజసధృతి)
భావము : మిక్కిలి ఆసక్తిగల ఫలాకాంక్షచే ధర్మముయందును ధనము కొరకు ఆశను కలుగజేయు ధృతిని రాజస ధైర్యము అనవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 35: యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ ।
న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ ! తామసీ ||
(తామసధృతి)
భావము : స్వప్నము, భయము, శోకము, విషాద, మదములు మొదలుగా గల విషయములందు మదిని విడవకుండ నిల్పు దుష్ఠునికున్న ధైర్యమును తామస ధృతి అనవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 36: సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ ! ।
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ||
(గుణములు)
భావము : అభ్యాసవశమున ఏ సుఖము కల్గుచున్నదో, దేనివలన దుఃఖములు సమసిపోవుచున్నవో, ఆ మూడు విధములైన సుఖములను వివరించెదను వినుము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 37: యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజమ్ ||
(సాత్త్విక సుఖము)
భావము : మొదట చూచిన విషతుల్యముగ తోచుచు, పోను పోను తుదకు అమృత తుల్యముగ కనిపించు, ఆత్మ విషయమందు యోచించు బుద్ధికి కల్గు సుఖమును సాత్త్విక సుఖమని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 38: విషయేన్ద్రియ సంయోగా ద్యత్త దగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విష మివ తత్సుఖం రాజసం స్మృతిమ్ ||
(రాజస సుఖము)
వివరము :విషయములు, ఇంద్రియములు కలిసి ఏకమై ఆదియందు అమృత సమానముగ తోచు సుఖము, పోను పోను పరిణామము చెందుచు చివరకు విషముతో సమానముగ కనిపించును, అట్టి సుఖమును రాజస సుఖమని అందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 39: య దగ్రే చానుబన్ధే చ సుఖం మోహన మాత్మనః ।
నిన్ద్రాలస్య ప్రమాదోత్థం త త్తామస ముదాహృతమ్ ||
(తామస సుఖము)
భావము : ఆదియందు అంత్యమందు కూడ నిద్ర, ఆలస్య, ప్రమాదములతో కూడి మనస్సును అజ్ఞానమందు ముంచు సుఖమును తామస సుఖమని చెప్పవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 40: న త దస్తి పృథివ్యాం వా దివి దేవేషు వాపునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి స్స్యాత్త్రిభిర్గుణైః ||
(గుణములు)
భావము : భూమి మీద గల సమస్త జీవరాసులలోను మరియు దైవత్వముగల దేవతలలోను ఎవడైననుగాని, ప్రకృతి జనిత గుణములను పూర్తి విసర్జించి చరించువాడు లేడు.
వివరము : ప్రతి మానవుడు బ్రతుకు తెరువుకోసము పని చేయవలసియున్నది. ప్రతిపని గుణప్రేరితమై జరుగవలసియున్నది. గుణములేనిది పనిలేదు. పని జరుగవలనంటే గుణముండితీరవలసిందే. అటువంటప్పుడు ఎవడైనగాని దేవతలలో గాని, రాక్షసులలోగాని మూడు గుణములను వదలి ఉండువాడులేడని తెలియుచున్నది. ఇక్కడ కొందరికొక ప్రశ్న రావచ్చును. అది ఏమనగా యోగము చేయు సమయములో మూడు గుణములు వదలియే కదా! ఉన్నది అని అడుగవచ్చును. దానికి సమాధానమేమనగా! సమాజములో వ్యవహరించు మనిషి గుణములు కలవాడని చెప్పాము, కాని వ్యవహరించకుండ యోగము చేయువారి యొక్క విషయము చెప్పలేదు. గుణములులేని వానిని యోగి అంటాము. అతడు కూడ కొద్దిసేపు యోగములో ఉండి, మరికొంత కాలము సాధారణముగ గుణములలోనే ఉండునని గ్రహించవలెను.
ఇక్కడ ఎనిమిది శ్లోకములు వరుసగ కల్పితము చేసి కలుపబడి యున్నవి. ఈ ఎనిమిది శ్లోకములలోని భావము భగవంతుడు చెప్పిన జ్ఞానమునకు పూర్తి వ్యతిరిక్తముగ ఉన్నది. కావున వీటిని బయటపెట్టవలసి వచ్చినది. భగవద్గీత కానటువంటి ఈ శ్లోకములు గీతవలె ఉన్నప్పటికి, వాటి భావము సంకుచితమైనది కావున సులభముగ గుర్తించుటకు వీలైనది.
పరమాత్మ మానవులను సృష్టించి తనను తెలుసుకొమ్మని చెప్పాడుకాని కులముల, మతముల పేరిట విభజించలేదు. నేడు భూమి మీదగల కులమతములు మానవుని సృష్ఠియేగాని పరమాత్మ సృష్ఠికాదని తెలియాలి. ఈ విషయమై మూడవ అధ్యాయమైన జ్ఞానయోగములో 13వ శ్లోకమున "చాతుర్వర్ణ్యం మయాసృష్టం" అను మాటవద్ద నాల్గువర్ణములనగా నాల్గుకులములుకాదని కూడ చెప్పియున్నాము. ఇక్కడ మరియు ఈ శ్లోకములలో నాల్గుకులములైన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుల గురించి చెప్పుచు వారి కులములను బట్టి పనులు నిర్ణయించి అవియే వారి స్వధర్మములని చెప్పడము చాలా విచిత్రము, జ్ఞానవిరుద్ధము. అంతేకాక కులమును బట్టి పని చేయడము స్వధర్మమాచరించినట్లని, స్వధర్మాచరణమైన వారి పనులకు కర్మ అంటదని చెప్పడము యోగశాస్త్రమైన భగవద్గీతకే వ్యతిరేఖము. భగవద్గీతలోనే భగవద్గీతకు వ్యతిరేఖ భావమునిచ్చు శ్లోకములుండడము గమనిస్తే దానిని గూర్చి ఏమని చెప్పాలో కూడ అర్థముకాదు. ఏది ఏమైనప్పటికి అవి బయటపడడము మన అదృష్టమని అనుకోవచ్చును. క్రింద వాటినెలా వ్రాశారో వాటిలోని భావమేమిటో చూచి వాటి వివరణ మన బుద్ధితో యోచిద్దాము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 41: బ్రాహ్మణ క్షత్త్రియవిశాం శూద్రాణాం చ పరన్తప !
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||
(కల్పితము)
భావము : బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూధ్ర జాతుల స్వభావములను బట్టి వేరువేరు పనులు గలవు వాటిని వివరింతును.
విమర్శ : కులమును బట్టి పనియని, ఆ పనులు వారి స్వభావజనితములైనవని, అవియే వారి స్వధర్మములనుట జ్ఞానము కాదు. కులముల వ్యవస్థయే జ్ఞానముకాదు. సర్వులకు సమానమైన పరమాత్మ హెచ్చుతగ్గు కులములు సృష్ఠించలేదు. జగత్తులోని సర్వజీవరాసులకు వర్తించు బోధ చెప్పి జగద్గురువని పేరుగాంచిన పరమాత్మ కేవలము మానవులయందు మాత్రము కులములనేర్పరిచి మిగతా జాతులను వదిలివేయడము జరుగదు. ఆయన ఏమి చెప్పిన అది అందరికి వర్తించునదిగ ఉండును. మనుషులకు అమలై జంతువులకు అమలుగాని కులముల వివరము భగవంతుడు చెప్పినది కాదు. అది జ్ఞానము కాదు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 42: శమోదమస్తప శ్శౌచం క్షాన్తిరార్జవ మేవచ ।
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మ కర్మ స్వభావజమ్ ||
(కల్పితము)
(17) శ్లో|| 43: శౌర్యం తేజో ధృతి ర్ధాక్ష్యం యుద్ధే చా ప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
(కల్పితము)
(17) శ్లో|| 44: కృషి గో రక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్ ।
పరి చర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||
(కల్పితము)
(17) శ్లో|| 45: స్వే స్వేకర్మణ్యభిరతః స్సం సిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతస్సిద్ధిం యథా విన్ధతి తచ్ఛృణు ||
(కల్పితము)
(17) శ్లో|| 46: యతః ప్రవృత్తిర్భూతానం యేనసర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||
(కల్పితము)
(17) శ్లో|| 47: శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||
(కల్పితము)
(17) శ్లో|| 48: సహజం కర్మ కౌన్తేయ ! సదోష మపిన త్యజేత్ ।
సర్వారమ్భా హిదోషేణా ధూమే నాగ్నిరివాఽవృతాః ||
(కల్పితము)
42 నుండి 44 వరకు ఉన్న శ్లోకముల భావము
భావము : శమ, దమములు, తపము, శౌచము, శాంతి, జ్ఞాన, విజ్ఞానముల ఆర్జవము, ఆస్తికత బ్రాహ్మణులకెల్ల సహజకర్మలగును. అట్లే శౌర్యతేజస్సులును, కార్యదక్షత ధైర్యము, యుద్ధమందు వెన్నుచూపకుండుట, దానము, ఆధిపత్యము వహించుట క్షత్రియులకు స్వభావకర్మ అనబడును. గోవులను రక్షించి పోషించుట, వ్యాపారము చేయుట, వైశ్యులకు సహజకర్మ అనియు, పరిచర్యలు చేయుటయే శూద్ర జనుల స్వభావకర్మ అని చెప్పబడివున్నది.
45 నుండి 48 వరకు ఉన్న శ్లోకముల భావము
భావము : వారివారి కర్మల పట్ల శ్రద్ధబూని చేయువారు మోక్షము పొందగలరు. నరుడు స్వధర్మము వలన సిద్ధి ఎట్లు పొందునో చెప్పెదను. ఎల్ల జీవరాసులకు సృష్ఠికర్తయైన పరమాత్మను స్వకీయకర్మ నాచరించుటచే పూజించినవాడై మోక్షము పొందవచ్చును. మంచిదని త్రోచు పరుల ధర్మమునకంటే స్వధర్మము శ్రేయస్కరము. తన కుల స్వభావజనితమైన కర్మ చేసెడి వానికి పాపము రాదు. అంతేకాక అగ్నికి పొగ అంటుకొనివున్నట్లు సర్వకార్యములకు కర్మయను దోషముండును. కాని కులమును బట్టి ఉన్న పని దోషము కలదియైనప్పటికి వీడరానిదైన చేయవలసి యున్నది. సహజ కర్మ చేయుటలో దోషములేదు.
42 నుండి 44 వరకు ఉన్న శ్లోకముల విమర్శ
విమర్శ : ఇలా కులములకు పనులు అంటగట్టి ఆ పనులే వారి సహజకర్మలని, అవి వారి స్వధర్మములని చెప్పుట పూర్తి జ్ఞానవిరుద్ధము. ఎందుకనగా! కర్మయోగము రెండవ అధ్యాయములో 35వ శ్లోకములో స్వధర్మ పరధర్మముల గూర్చి చెప్పియున్నాము. అచట ప్రకృతి కార్యములకు సంబంధించినవన్నియు పరధర్మములు అనియు, కేవలమొక్క ఆత్మ సంబంధముగ ఉన్నవి మాత్రమే స్వధర్మములనియు సూత్రబద్ధముగ చెప్పబడియున్నవి. వాటి సూత్రము ప్రకారము ఇక్కడ చెప్పిన నాల్గు జాతుల యొక్క పనులు ప్రకృతికి సంబంధించినవి. కావున అవి అన్నియు పరధర్మములేనని చెప్పవచ్చును. పరధర్మములైన వాటిని స్వధర్మములను కోవడము అజ్ఞానమని చెప్పవచ్చును. అందువలన ఈ శ్లోకములు గీతనుండి బహిష్కరింప బడుచున్నవి.
45 నుండి 48 వరకు ఉన్న శ్లోకముల విమర్శ
విమర్శ : మానవులలో కుల విభజనచేసి ఆ కులములకు నిర్ణయించిన పనులను స్వధర్మమని, అవి ఆచరించుటయే పరమాత్మను ఆరాధించినట్లగునని, వైశ్యులు వ్యాపారము చేయుటలో దోషమున్నప్పటికి పాపమురాదని, అట్లే క్షత్రియులు రాజ్యము కొరకు ఎందరినో చంపుట పాపపు పనియైనప్పటికి పాపమురాదని, స్వభావ జనితమైన ఏ పనిలో కర్మ అంటదని చెప్పడము చోద్యము, విపరీత అజ్ఞానము, అధర్మము. కులములోని పనులు స్వధర్మములనుటయే పెద్ద అజ్ఞానము. అవి కర్మను తెచ్చిపెట్టునవైనప్పటికి వాటి ద్వారా మోక్షము పొందవచ్చని చెప్పడము మరీ అజ్ఞానము, అశాస్త్రీయము. కులమునుబట్టి ఉన్న స్వకర్మ దోషమున్నదైన ఆచరించుట మేలని చెప్పడము పూర్తి అజ్ఞానము. వ్యాపారము వైశ్యులుకాక ఇతరులు చేస్తే అధర్మమగునా? వ్యాపారములో ఎన్ని మోసములు చేసిన కర్మ అంటదా? ఇంతవరకు భగవంతుడెక్కడైన ఈ మాటలు చెప్పాడా? అహమును వీడి ఎవడేపని చేసినప్పటికి వానికి కర్మ అంటదన్నాడు, కాని యోగపద్ధతి కాకుండ కుల పనిని చేయడములో పాపమురాదని చెప్పడము యోగశాస్త్రమైన భగవద్గీతకు వ్యతిరేఖము కాదా? ఇలా వ్యతిరేఖ భావములు వ్రాసి గీతలో చేర్చడము వలన ఎందరో గీతవలన అజ్ఞానులగుటకు అవకాశమున్నది. ఈ శ్లోకములు ఇక్కడ ఉండడము వలన భగవంతుని భావమునకే ముప్పు తెచ్చిపెట్టుచున్నవి. పెద్ద పాత్రయందు గల పాయసములో చిన్న విష బింధువు కలసినట్లు, ఎన్నో శ్లోకముల రూపముగ చెప్పిన కర్మయోగపద్ధతిని ఈ ఎనిమిది శ్లోకములు చిన్నాభిన్నము చేయుచున్నవి. కావున ఇంత చెడును చేకూర్చు ఈ శ్లోకములను పూర్తిగ తీసివేయడము జరుగుచున్నది. నేను చెప్పడమే కాక మీరు కూడ యోచించి తెలుసుకోవడము ముఖ్యము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 49: అసక్తబుద్ధి స్సర్వత్ర జితాత్మావిగతస్పృహః ।
నైష్క ర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసే నాధిగచ్చతి ||
(కర్మయోగము)
భావము : దేనియందును ఆసక్తిలేనివాడవై, మనసునందు విషయస్పృహలను మాని కార్యము చేసిన, కర్మ అంటని సన్న్యాసముచే ఆత్మను జయించి (తెలుసుకొని)న వాడగుచున్నాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 50: సిద్ధిం ప్రాప్తో యథాబ్రహ్మతథాఽప్నోతి నిబోధమే ।
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||
(యోగము)
భావము : కర్మయోగసిద్ధిని పొందిన వానిని గూర్చి నేను తెల్పితిని. అట్లే బ్రహ్మయోగ పద్ధతి నానుండి తెలుసుకొనుము. ఇది జ్ఞాననిష్ఠలో శ్రేష్ఠమైనది.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 51: బుద్ధ్యావిశుద్ధయా యుక్తో ధృత్యాఽత్మానం నియమ్యచ ।
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||
(యోగము)
(17) శ్లో|| 52: వివిక్తసేవి లఘ్వాశీ యతవాక్కాయ మానసః ।
ద్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||
(యోగము)
(17) శ్లో|| 53: అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమ శ్శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే ||
(యోగము)
భావము : శుద్ధమైన బుద్ధికల్గి, విషయములను జయించి, ఆత్మయందునే మనస్సును నియమించి, శబ్దాది విషయముల త్యజించి, రాగద్వేష గుణములను వదిలి, ఏకాంత వాసము చేయుచు, మితముగ భుజించుచు, వాక్ మనోకాయముల పని చేయకుండు నట్లు చేసి, నిత్యము ధ్యానయోగ (బ్రహ్మయోగ)మునందే లగ్నమై, అహంకారము బలము, గర్వము, కామము, క్రోధము, బాహ్య వస్తువుల మీద ధ్యాస వదలి, మమకారములేక శాంతినొందువాడు పరబ్రహ్మమును పొందుటకు సమర్థుడగును.
వివరము : వెనుకటి అధ్యాయములో ఎన్నో శ్లోకములందు కర్మ బ్రహ్మయోగముల గురించి చాలా విపులముగ చెప్పబడివున్నప్పటికి చివరి అధ్యాయములో మరి ఇప్పుడు వాటిని గూర్చి జ్ఞప్తి చేయుచున్నాడు. ముందు కర్మయోగమును చెప్పి మరియు బ్రహ్మయోగమును గూర్చి కూడ చెప్పాడు. ఇంతటితో కర్మ, బ్రహ్మయోగము లను వివరించి చెప్పడము ముగిసినదనుకుంటాము. ఇన్నిమార్లు జ్ఞప్తి చేయడములో సారాంశము వీటిని మరువకూడదనియే. కనుక పరమాత్మను చేరుటకు యోగపద్ధతిలో రెండే మార్గములున్నవని మరువకూడదు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 54: బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి ।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||
(బ్రహ్మ, కర్మయోగములు)
భావము :బ్రహ్మభూతుడు, ఆత్మ ప్రసన్నుడు కోర్కెలను కోరడు. దుఃఖములను పొందడు, సర్వభూతములను సమముగ జూచువాడై ఉత్తముడగు నా భక్తవరుడగును.
వివరము : కర్మయోగము ఆచరించువాడు ప్రారబ్ధ కర్మరీత్య సర్వకార్యములు జరుగుచున్నవని, వాటివలననే కష్టసుఖములు కలుగుచున్నవని, తెలిసినవాడై కష్టమొచ్చిన దుఃఖపడడు, సుఖమురావలెనను కోర్కెయు కోరడు. అట్లే బ్రహ్మయోగి అయినవాడు ఆత్మ తనయందున్నట్లే సర్వులయందున్నదని తెలిసినవాడై, సర్వ జీవరాసులయందు ఆత్మను సమముగ చూచువాడైవుండును. వీరిరువురు పరమాత్మకు పరమభక్తిపరులని తలచవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 55:భక్త్యా మా మభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతోమాం తత్త్వతో జ్ఞాత్వావిశతే తదనన్త రమ్॥
(సాకార, నిరాకారము)
భావము : నేను నిశ్చయముగ ఎట్టివాడనో, ఎవ్వడనై ఉన్నానో పరమభక్తిచే తెలియగల్గినవాడు, నా యదార్థమంతయు తెలిసినవాడై తదుపరి నాయందే చేరిపోగలడు.
వివరము : పరమాత్మ యొక్క నిజస్థితి ఏమిటో తెలియుట చాలా కష్టము. విశేషమైన జ్ఞానమున్నవానికి మాత్రమే పరమాత్మను గురించిన జ్ఞానము తెలియబడును. లేకపోతే భూమిమీదున్న అనేకరక దేవతల మీదే ప్రతి ఒక్కరికి ధ్యాస, భక్తివుండును. ఎన్నో జన్మలనుండి జ్ఞానపరముగ ఆసక్తి కలవానికి చివరకు పరమాత్మ ఒకడున్నాడని అతను దేవతలందరికి దేవుడని తెలియును. కేవలము పరమాత్మ అనువాడు ఒకడున్నాడని తెలియుటకే ఎన్నో జన్మలు కావలసివస్తే, ఆయన యొక్క నిజస్థితి గురించి తెలుసుకోవాలన్న, ఆయన ఎవరైనది ఎట్లున్నది తెలియాలంటే కొన్ని జన్మలుగ జ్ఞానమార్గమున నడిస్తేకాని అర్థము కాదు. అలా ఎన్నో జన్మల జ్ఞానసముపార్జనతో చివరకు పరమాత్మ సమస్త సృష్ఠికర్త, స్థితికర్త, లయకర్త అనియు, ఆయన నిరాకారముగ అణువణువున అంతట వ్యాపించి ఉన్నాడనియు, ఆయనకు పేరు రూపములేదని తెలియవచ్చును. ఇంకనూ విశేషమైన జ్ఞానము సంపాదించుకొన్న వానికి పరమాత్మ నిరాకారుడైవుండి, అప్పుడప్పుడు సాకారరూపమున భూమిమీద పుట్టుచుండునని, పుట్టి తన ధర్మములను గూర్చి తానే తెలియచేసి పోవునని కూడ తెలియును. సాకారరూపము మీద మిక్కిలి భక్తికల్గినవారు ఆ జన్మను గుర్తించకల్గి, ఆ జన్మలోనే సాఫల్యము పొందగలరు. పరమాత్మ స్థితిగతులను తెలిసినవారు కర్మయోగ పద్ధతికాని, బ్రహ్మయోగ పద్ధతికాని అవలంభించి చివరకు మోక్షము పొందుదురు. భక్తియోగమను ప్రత్యేక మార్గమును అనుసరించిన వారు, సాకారమున ఉన్న పరమాత్మను గుర్తించినవారు ఒకే జన్మలో మోక్షము పొందగ, కర్మ బ్రహ్మయోగ మార్గములను అవలంభించువారు కొన్ని జన్మల తరువాత మోక్షము పొందుదురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 56: సర్వకర్మాణ్యపి సదాకుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ర్పసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయమ్ ||
(మోక్షము)
భావము : సర్వకర్మలను ఎల్లపుడు నా పద్ధతినాశ్రయించి చేయువానికి నా అనుగ్రహము వలన అవ్యయమైన శాశ్వతమైన పరమపదము లభించగలదు.
వివరము : పరమాత్మ తన ధర్మములను తెలియజేయు నిమిత్తము మానవ అవతారము ఎత్తినప్పుడు ఆయన ఏవిధమగు కార్యములు చేశాడో, కార్యములు చేయుచు ఏ విధముగ కర్మలంటని విధానమును అవలంభించాడో తెలిసి, ఆ పద్ధతులనే ఆశ్రయించినవాడై పనులు చేయుచు పోయిన పరమాత్మ ప్రసాదించు శాశ్వత మోక్షము పొందవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 57: చేతసా సర్వకర్మాణి మయిసన్న్యస్య మత్పరః ।
బుద్ధియోగ ముపాశ్రిత్యమచ్చిత్త సతతం భవ ||
(కర్మయోగము)
భావము : మనసుచే సర్వకార్యములు నాకే సమర్పించి, నీవు ఎల్లప్పుడు నాయందే చిత్తమును లగ్నము చేసి, నాకంటే ఇతరములేదని తలచి కర్మయోగమున ఆరాధించుము.
వివరము : ఇంతవరకు జ్ఞానమును వివరించి చెప్పిన భగవంతుడు ఇప్పుడు అర్జునునకు సలహా ఇస్తున్నాడు. నీవు ఇట్లే నడుచుకొనుమని చెప్పుచున్నాడు. అది ఏమనగా! మనస్సు ద్వారా అన్ని పనులను పరమాత్మకే సమర్పించి, అన్ని పనులను చేయించువాడు పరమాత్మేనని చిత్తము ద్వారా నిర్ణయించి, చేయుపనులన్ని పరమాత్మ నిర్ణయమేనని తలచుచు, పరమాత్మ కంటే వేరేది లేదని తలచి, జరుగుచున్నదంత ఆయన జరిపించునదేనని బుద్ధిచే అహమును అణచివేసి కార్యములను చేయమని చెప్పాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 58: మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి ।
అథచేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి ||
(కర్మయోగము)
భావము : నాయందే చిత్తముంచిన, నేను ప్రసాదించు ప్రసాదమువలన సర్వ దుఃఖములనుండి తరింతువు. అట్లుకాక ఆహంకారమునే కల్గి నామాట వినకున్న చెడిపోదువు.
వివరము : పరమాత్మ భగవంతునిగ ఉండి, భగవంతునిగ నేను చెప్పు మాటలు వినకున్న చెడిపోదువని హెచ్చరించి చెప్పాడు. అదేమనగా! సాకారరూపమున భగవంతునిగా, పరమాత్మ అర్జునునికి కనిపించాడు. చెప్పువాడెవడైనది అర్జునునికి తెలుసు. భగవంతుడు యుద్ధము చేయమని చెప్పాడు. అర్జునునికి శరీరములోని చిత్తము నిర్ణయము ప్రకారము జరుగవలసివున్నది. ఆ నిర్ణయమేదైనకాని అక్కడ చిత్తములో నిర్ణయించునది పరమాత్మయేనని, ఆయనే ఎదురుగ ఉన్న భగవంతుడని తెలిసి, ఆయనమాట వినడమే చిత్తము యొక్క నిర్ణయమని అనుకొని భగవంతుడు చెప్పినట్లు నడుచుకోవడము అప్పటిపని. అయినప్పటికి అర్జునుడు నేను, నా నిర్ణయము, నేనెట్లు తలచితే అట్లేనని అహముతో కూడి అనుకుంటే, అంతవరకు విన్నది తెలుసుకొన్నది అంతా వృథాయేయగును. ఆ భావములో అర్జునుడేది చేసిన కర్మ అంటును. అతను జ్ఞానమార్గము నుండి చెడిపోయిన వాడగును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో !! 59: యద్యహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్త్వాం నియోక్ష్యతి ||
(ప్రకృతి)
భావము : అట్లు అహంకారమునే వహించి యుద్ధము చేయనని పట్టుబట్టిన నీ నిశ్చయము నిలువదు. ప్రకృతి నిన్ను నియోగించి పంపగలదు.
వివరము : అర్జునునికి 'నేన'ను భావము అట్లే ఉండి నేను యుద్ధము చేసిన, వారినందరిని చంపుదునని అనుకొని యుద్ధము చేయకుండుటే మేలని తలచి యుద్ధము చేయకుండ ఉన్నట్లయితే, ప్రారబ్ధకర్మ ప్రకారము యుద్ధము చేయవలసి ఉన్నపుడు శరీరములో అర్జునుని నిర్ణయము నిలువదు. కొంత వరకు యుద్ధము చేయననుకొన్నప్పటికి జరగవలసిన కర్మవున్నప్పుడు బుద్ధియోచనలలో చేయమని చెప్పు నిర్ణయమును చిత్తము నిర్ణయించును. బయట అర్జునుడు యుద్ధము చేయకుండినప్పటికి లోపల బుద్ధి చేస్తే బాగుండునా? చేయకపోతే బాగుండునా! అని యోచనలలో మునిగివుండును. అట్లు పరంపరగ సాగు బుద్ధి యోచనలలో ప్రారబ్ధకర్మప్రకారము జరుగవలసినదేదో దానిని చిత్తము నిర్ణయించును. చివరగ చిత్తము నిర్ణయించినదే శరీరము ద్వార జరుగును. ఆ సమయములో యుద్ధము అర్జునుడు చేయవలసిన కర్మవున్నది, కావున కర్మ ప్రకారము చెలరేగు గుణములను బుద్ధి యోచిస్తుండగ, కర్మప్రకారము జరుగవలసిన కార్యమును బుద్ధియోచనల నుండి చిత్తము నిర్ణయించి, యుద్ధము చేయుటకు ఆజ్ఞ ఇవ్వడము వలన అర్జునుని శరీరము అస్వతంత్రముగ కదలి యుద్ధము చేయును. జరుగవలసిన దానిని ఎవ్వరు ఆపలేరు. అలా ఆపు అధికారము జీవునకు లేదు. కర్మననుసరించి చిత్త నిర్ణయము ప్రకారము సర్వము జరుగవలసి ఉన్నది. అందువలననే నీవను కున్నట్లుండదు. ప్రకృతి జనిత గుణ ప్రేరేపితుడవై నీవు యుద్ధము చేయగలవు. ప్రకృతి నిర్మాణము అలా నీచేత చేయిస్తుందని భగవంతుడు చెప్పాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 60:స్వభావజేన కౌన్తేయ! నిబద్ధస్స్వేన కర్మణా ।
కర్తుంనేచ్ఛసి యన్మోహా త్కరిష్య స్యవశోఽపి తత్ ||
(ప్రకృతి)
భావము : అర్జునా! మోహముచే యుద్ధము చేయనను నీ నిర్ణయము నీ స్వభావములో నీయందే ఉన్న కర్మచేత కట్టివేయబడి, నీ ప్రయత్నము లేకనే అస్వతంత్రముగ యుద్ధము చేసెదవు.
వివరము : నేను నావారు అను మోహము చేత, అహము చేత అర్జునుడు యుద్ధము చేయకూడదనుకొన్నాడు. కాని అర్జునుని కర్మచక్రములో ఉన్న ప్రారబ్ధకర్మ అతనియందే అతని నిశ్చయమును కట్టివేసి, నీ నిర్ణయము పనికిరాదన్నట్లు చేయును. ఈ పద్ధతి అర్జునునికే కాదు అందరియందును జరుగునదే. మనకు ఇష్టమున్నా ఇష్టములేకున్నా కర్మనిర్ణయము ప్రకారము కొన్ని పనులు చేయవలసి ఉండును. అలాగే అర్జునునికి జరిగినది. ఎవనికైనకాని కర్మప్రకారము ఏ పనినైన, ఎంత నీచ కార్యమైన, తన మనసొప్పకున్నా తప్పక చేయవలసివచ్చును. దానిని బట్టి బుద్ధికలవాడు మన నిర్ణయమేమికాదు, కర్మ నిర్ణయము ప్రకారమే జరుగునని సులభముగ తెలుసుకోగలడు. తెలివిలేనివాడు ఒకరు చెప్పినప్పటికి, తాను అనుభవించినప్పటికి తెలుసుకోలేక అన్ని పనులు నా ఇష్టప్రకారమే జరుగుచున్నవనుకొనుచుండును. అటువంటివాడు నిజస్థితిని తెలుసుకోలేడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 61: ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జునతిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యన్త్రా రూఢాని మాయయా ||
(పరమాత్మ)
భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి, యంత్రమునెక్కి ఆడించువానివలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు.
వివరము : సర్వ జీవరాసులు అనేక విధములుగ కదలుచు కొన్ని ఆడుచుండగ, కొన్ని పోట్లాడుచుండగ, కొన్ని రమించుచుండగ, కొన్ని పరుగిడుచుండగ, కొన్ని ఎగురుచు కొన్ని దుముకుచున్నవి. అట్లు నానారకములుగ కనిపించు జీవరాసుల శరీరములలోని హృది స్థానములో పరమాత్మ నివాసముంటున్నాడు. శరీరమంతయు నాడులచే వ్యాపించి నాడులచే కదలింపబడుచున్నది. నాడులకన్నిటికి కేంద్రము మెదడు. మెదడు నుండి వచ్చు ఆదేశములు నాడుల ద్వార శరీరమంతయు ప్రాకి శరీరమును కదలించి, ఆడించి, పాడించి అనేకములుగ చేయుచున్నవి. మెదడు నుండి ప్రసారమగు ఆదేశము లెక్కడివి? ఎవరివి? అను ప్రశ్నవేసుకొనిన, మెదడు భాగమునే హృదయమనుచున్నాముకదా! హృదయములోనే పరమాత్మ ఉన్నది. కర్మచక్రములోని కర్మానుసారము మాయ అను పరికరములైన బుద్ధి, చిత్తము, మనస్సు ద్వార ఆదేశము పంపుచు దాని ప్రకారము నరములను లాగి శరీరమును ఆడునట్లు చేయుచున్నాడు.
యంత్రము మీద పని చేయువాడు యంత్రము (స్విచ్ లను) మీటలను త్రిప్పుచు యంత్రముచే పని చేయించినట్లు దేహారూఢుడైన (దేహమునెక్కి ఉన్నవాడైన) పరమాత్మ మొత్తము శరీరమను యంత్రములోని మనో, బుద్ధి, చిత్తములను గుణము లతో సరిచేర్చి ఉన్న కర్మప్రకారము ఆడించుచున్నాడు. పరమాత్మ శరీరమును ఆడించుటకు ఆత్మయను విద్యుత్తును, మనోబుద్ధి చిత్తములను ముఖ్య అనుబంధ మీటలను, గుణములను చక్రములను, కర్మయను పద్ధతిని ఉపయోగించి కష్టసుఖములను ఉత్పాదనలను తయారు చేయుచున్నాడు. ఈ విధానము తెలియని వారు పరమాత్మ శరీరమును నాడులచేత బొమ్మవలె ఆడించుచున్నాడని అనుకోక, అన్నిటికి తామే కారణమని అజ్ఞానులు తలపోయుచున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతిపని తామే చేసినట్లే అనిపించుచుండును. ఎందుకనగా బొమ్మలాటలో బొమ్మలను ఆడించువాడు కనిపించక బొమ్మలు కదలుట మాత్రమే అగుపించునట్లు, మనిషిచేత జరుగుచున్న కార్యములలో లోపల ఆడించు పద్ధతికాని, ఆడించువాడు కాని తెలియక, పైకి ఆడేవారు మాత్రము కనిపిస్తుండుట వలన, ప్రతి ఒక్కరు తమ చేత జరుగు పనులను తామే చేయునట్లనుకొనుచున్నారు. ప్రతి కదలిక ప్రతి పని నాదికాదు, నేను చేయలేదు, పరమాత్మ, ఆత్మ (బలము) చేత ఇంద్రియములు అనబడు శరీర భాగములను కర్మ ప్రకారము కదిలించుచున్నాడని, తానందుకు కారణము కాదని ఎవడు తెలియునో వాడు అహమును వదలిన వాడగుచున్నాడు. శరీరముతో ఏ పని జరిగిన దానికి తాను కర్తనుకాదని తెలుసుకొనుచున్నాడు. దానివలన జరుగు పనులకు వానికి సంబంధము ఏమాత్రములేదని చెప్పవచ్చును. ఈ సూత్రము ప్రకారము ఒక శరీరముచేత లోకములోని వారందరు చంపబడినప్పటికి అందులోని జీవుడు హంతకుడు కాడని, వానికి పాపమంటదని చెప్పాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 62: తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత! ।
తత్ప్రసాదాత్పరాంశాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||
(పరమాత్మ)
భావము : సర్వ భావములలో పరమాత్మను శరణువేడుము. ఆయన అనుగ్రహము వలన ప్రకృతికంటే అన్యమైన శాంతిని మరియు శాశ్వతమైన మోక్షస్థానమును పొందవచ్చును.
వివరము : బయటి ప్రపంచములో ఎవడెంత గొప్పదనము, హోదాకల్గి ఉన్నప్పటికి, లోపల పరమాత్మ వలననే సర్వము జరుగుచున్నవని తెలిసి, అన్నిటికి మూలకర్తయైన పరమాత్మను తనకున్న అన్ని మనోభావముల ద్వారా శరణువేడి, గొప్పగ తలచుకొని, తనదేమీలేదని ఉన్నదంత పరమాత్మదేనని, తాను పరమాత్మ ఆడించునట్లు ఆడు ఆట బొమ్మలాంటివాడినని తలచి, ఆయనకున్న అనేక అంశలలో ఒక అంశచేతనే సర్వప్రపంచమును నడుపగల గొప్పవాడని, నేను అనుకొంటే నీవు నీవుగానే ఉంటావు, నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అను వాక్యము ప్రకారము ఆయన తలచితే జీవుడు జీవుడుగానే ఉండగలడని, ఆయన తలచితే జీవుడు అంతటా అణువణువున వ్యాపించి పరమాత్మయందైక్యము కాగలడని తెలిసి మ్రొక్కుట వలన, ఆరాధించుట వలన ఎవడైనకాని పరమాత్మ అనుగ్రహము పొంది, ఆయన ప్రసాదించు శాంతిని పొంది, ప్రకృతికంటే అన్యమైన మోక్షమును (పరమాత్మను) పొందగలడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 63: ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైత దశేషేణ యధేచ్ఛసి తథాకురు ||
(జ్ఞానము)
భావము : రహస్యములలోకెల్ల అత్యంత రహస్యమైన జ్ఞానమును నీకు నేను చెప్పితిని. దీనిని శేషము లేకుండ వివరించుకొని చూచి ఎట్లు నీకిష్టమో అట్లు చేయుము.
వివరము : ఇంతవరకు భగవంతుని చేత చెప్పబడిన జ్ఞానము చాలా రహస్యమైనది. ఒక విధముగ విప్పి చెప్పిన అర్థముకానిది. పరమాత్మకు తప్ప ఎవరికి తెలియనిది. పరమాత్మ ద్వారా విన్నప్పటికి కొందరికి అర్థముకాక రహస్యముగనే ఉండును. కావున రహస్యములలోకెల్ల రహస్యమైనదని చెప్పవచ్చును. ఇంతటి గొప్ప జ్ఞానము తెలియవలెననిన, ఎన్నో జన్మలు జ్ఞానసంబంధ సుకృతముంటేనే సాధ్యమగును. లేకపోతే ఈ జ్ఞానము దగ్గరికే రాదు. ఒకవేళ ఈ వివరములు దగ్గరికొచ్చిన చదువువారే దూరమగుదురు. ఇంత వివరముగ చెప్పబడినదియు హద్దులు గీచి చూపిన గీతను ఎవరైన వినిన చదివిన అంతటిని విశధీకరించి బాగా యోచించి ఎట్లు మీకిష్టమో అట్లే నడుచుకోవచ్చును. భగవంతుడు తెల్పెడి జ్ఞానమునంతటిని తెల్పి ఎవరిని ఇట్లే నడుచుకోమని బలవంతపెట్టక నీ ఇష్టమన్నాడు. జ్ఞానము కర్మాతీతమైనది. జ్ఞానము కర్మను బట్టి నిర్ణయింపబడి నీకు అంటునది కాదు. జ్ఞానము శ్రద్ధానుసారము లభ్యమగునది. శ్రద్ధ ఎవరి ఇష్టానుసారము వారికి పుట్టునది. స్వయముగ పుట్టునది (స్వయంభూ) శ్రద్ధ అయిన దానివలన నీ ఇష్టమని చెప్పాడు.
భగవంతుడు జ్ఞానము అజ్ఞానము అనియు, ప్రకృతి పరమాత్మ అనియు, మాయ ఈశ్వరుడు అనియు రెండు మార్గములు సూచించి నీవు ఏ మార్గములో పోతావో పొమ్మన్నాడు. ఆయన మన మీదనే బాధ్యత ఉంచినప్పటికి, నిజ జ్ఞానము తెలిసినవాడు నేను అను అహమును పొందక, నా ఇష్టమని మోహమునబడక, సర్వము పరమాత్మయేనని నమ్మి భక్తినంతయు ఆయన మీదనే చూపుచు, శరణు పొందిన ఆయన మరియు ఆయన జ్ఞానము సులభముగ అర్థమగును. అటువంటి శరణ్యము లేకుండ నా బుద్ధిని ఉపయోగించి జ్ఞానము తెలుసుకొంటాననుకోవడము కూడ పొరపాటే. అట్లు పరమాత్మ జ్ఞానము తెలుసుకొనుటకు చాలా కాలము పట్టును. శరణువేడిన వానికి తొందరగ జ్ఞానము లభ్యమగుటయే కాక ఆ జన్మలోనే మోక్షము దొరుకును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 64: సర్వగుహ్యతమం భూయ శ్శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసిమేదృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||
(గీతా సారాంశము)
భావము : సర్వ రహస్యములలో ఉత్తమమగు పరమవచన సముదాయమును మరల వినుము. నీవు నాకు మిగుల ఇష్టుడవగుటచే హితము కోరి చెప్పుచున్నాను.
వివరము : వాస్తవానికి ముందు చెప్పిన 63వ శ్లోకముతోనే భగవద్గీత అయిపోయినప్పటికి నిజానికి మన హితము కోరి గీతయొక్క సారాంశమును రెండు శ్లోకముల రూపముగ భగవంతుడు చెప్పాడు. వాటికంటే ముందున్న ఈ శ్లోకములో నీవు నాకు ఇష్టుడవని, నీ మేలుకోరియని చెప్పడము విశేషము. పరమాత్మ ఎందుకు పనికిరాని మనలను గొప్పగ గుర్తించి అలా చెప్పాడంటే ఆయనలోని గొప్పతనమేమిటో చెప్పనలవికాదు. ఆయన అంతగ చివరిలో మన మీద శ్రద్ధవుంచి చెప్పిన గీత మొత్తము సారాంశమేదో క్రింద చూచెదము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 65: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ||
(గీతా సారాంశము)
భావము : నన్ను నీ మనస్సున తలంపుము. నీవు నా భక్తునిగ ఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
వివరము : ఎవడైతే పరమాత్మను మనసులో తలచుచుండునో, పరమాత్మకు భక్తునిగ ఉంటూ ఆయననే పూజించి, నమస్కరించుచున్నాడో వాడు పరమాత్మనే పొందగలడు. వాడే పరమాత్మకు మిక్కిలి ప్రియుడు. ఆ మాట నిజము. అంత గొప్ప పరమాత్మకు ఇంత చిన్నవాడు ప్రియుడా అను అనుమానము పెట్టుకోవలసిన అవసరములేదు. ఎందుకనగా పరమాత్మయే స్వయంగా ప్రతిజ్ఞ చేసి చెప్పాడు.
పరమాత్మ నిరాకారముగ ఉన్నప్పుడు కాని లేక పరమాత్మ సాకారరూపమున ఉన్నప్పుడుకాని ఆయన మీదే భక్తి, ఆయన మీదే ఆరాధన, ఆయన మీదనే నమస్కారము, ఆయన మీదనే మనోధ్యాస కల్గియుండడమే మహాభాగ్యమగును. వాని పద్ధతే వానిని పరమాత్మునికి ప్రియుని చేసి ఆయన సన్నిధికి చేర్చును. ఇది ఎంతో గొప్ప సారాంశమైన సందేశము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ మోక్ష సన్న్యాస యోగము
☞
(17) శ్లో|| 66: సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ||
(గీతా సారాంశము)
భావము : సర్వధర్మములను సంపూర్ణముగ వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము. నిన్ను పాపనియచంబులో నుండి ముక్తుని చేతును. దుఃఖింపకుము.
వివరము : భగవద్గీత అంతయు ధర్మములు బోధించి, వాటిచేతనే కర్మయోగము బ్రహ్మయోగమును సూచించి, ఆ రెండు యోగముల ద్వారా కర్మను నాశనము చేసుకొని మోక్షము పొందమని తెలిపిన భగవంతుడు, గీత మొత్తము సారాంశములో ఇంతవరకు చెప్పిన యోగధర్మములను వీడి నన్నే శరణు పొందమన్నాడు. రెండు యోగములపద్ధతులు పరమాత్మను చేర్చుమార్గములు కాగా, చివరిలో చెప్పిన సారాంశములో సూక్ష్మములో మోక్షమని చాలా దగ్గర దారిలో పరమాత్మను చేరు ఉపాయమును చెప్పాడు. గీత సారాంశమైన రెండు శ్లోకములలో ముందు చెప్పినది పరమాత్మ సాకారముగ ఉన్నప్పుడే కాక నిరాకారముగ ఉన్నప్పుడు కూడ ఆచరించ వలసిన భక్తిమార్గము బోధించగ, ఇక్కడ చివరి మాటగా పరమాత్మ కేవలము సాకారముగా లేక భగవంతునిగ సాధారణ మానవఆకారములో ఉన్నపుడు, ఏ గుర్తింపులేనివాడై కనుగొనుటకు కష్టమైనపుడు కనుగొన్నప్పటికి, కొద్ది అనుమానమున్న దానిని పెద్దది చేసి తనకు దూరముగ పంపు సాకారమును అతికష్టము మీద తెలిసి, అనుమానము లేని భక్తిగలవారికి చెప్పిన మాటలని గ్రహించాలి.
సాక్షాత్తు పరమాత్మ అయిన సాకారమును కనుగొన్నవానికి ధర్మములతో కూడ పనిలేదు. గీత పొడవున విన్న ధర్మములను కూడ వదలి గీత చివరిలో పరమాత్మను భగవంతునిగ శరణుపొందిన వానిని, ఆయన వాని కర్మనంతటిని క్షమించి లేకుండచేసి తనయందే చేర్చుకొనును. రెండు యోగముల ద్వారా కొన్ని జన్మలవరకు అయిపోని కర్మ, మూడవదైన భక్తియోగముతో ఒకే జన్మలో అయిపోయి ఆ జన్మలోనే పరమతండ్రి పరలోక రాజ్యాధిపతి అయిన పరమాత్మను చేరవచ్చును. కర్మయోగము బ్రహ్మయోగముల ద్వారా కర్మ కాలిపోవలసి వున్నది. కాని చివరిలో చెప్పిన భక్తియోగములో జ్ఞానాగ్నిలేదు, యోగసాధనలేదు, యోగికృషిలేదు. కేవలము శరణు వేడి తన్నుతాను పూర్తి సమర్పించుకొని తానూ శూణ్యముగా నిలిచిపోవడమే. అంతమాత్రముననే భయంకర కర్మలన్ని నిష్ఫలమై పోవును. పరమాత్మయే స్వయంగా కర్మలన్నిటిని క్షమించివేసి తనవద్దకు చేర్చుకొనును.
☞