హిందూమతములో సిద్ధాంత కర్తల full cloud text

హిందూమతములో  సిద్ధాంత కర్తలు.

మొదట 'సిద్ధాంతము' అంటే ఏమిటో తెలుసుకొందాము. ఒక
గ్రంథములో ఎన్నో కాగితములున్నట్లు, ఒక శాస్త్రములో ఎన్నో సిద్ధాంతములు
ఉండును. కొన్ని సిద్ధాంతములు కలిసి ఒక శాస్త్రముగా ఉండును. గణిత
సిద్ధాంతములన్నిటినీ కలిపి 'గణిత శాస్త్రము' అని అనవచ్చును. అట్లే
రసాయన సిద్ధాంతములన్నీ కలిసి రసాయన శాస్త్రమయినది. ఉదాహరణకు
H,O=Water అనునది రసాయన శాస్త్ర సంబంధ సూత్రము. ఈ సూత్రము
ప్రకారము “రెండు కొలతలు హైడ్రోజన్ వాయువు, ఒక కొలత ఆక్సిజన్
వాయువును కలిపితే నీరు అగును” అనునది సూత్రము లేక సిద్ధాంతము.
సిద్ధాంతమును 'సూత్రము' అని కూడా అనవచ్చును. రెండింతలు హైడ్రోజన్
ను చెప్పుటకు H2 అని షార్ట్కట్గా చెప్పారు. అలాగే ఒక్కింత ఆక్సిజన్ను
చెప్పుటకు O అని కుదింపు అక్షరముగా చెప్పారు. నీరును రసాయన
శాస్త్రము ప్రకారము కుదింపు అక్షరములలో చెప్పితే HO=Water_ అని
చెప్పవచ్చును. ఈ విధముగానే అన్ని శాస్త్రములు ముందే నిర్ధారింపబడిన
లేక కనిపెట్టబడిన సూత్రములతో నిండుకొనియుండును. శాస్త్రములు
భూమిమీద ఆరే గలవు. వాటినే షట్ శాస్త్రములని అంటాము. శాస్త్రము
అనగా శాసనములతో కూడుకొన్నది అని నిర్వచనమును లేక అర్థమును
చెప్పవచ్చును. దీని ప్రకారము శాసనము అనినా, సూత్రము అనినా,
సిద్ధాంతము అనినా ఒక్కటే అర్థమని తెలియుచున్నది. శాసనము అనగా
జరిగి తీరునదని అర్థము. 'శాసనము' అను పదము 'శాపము' అను
పదమునుండి పుట్టినది. శాపము అనగా "చెప్పినది చెప్పినట్లు జరుగును”
అని అర్థము. దీనిప్రకారము శాస్త్రము అనగా 'సత్యము' అని చెప్పవచ్చును.
ఏదయితే శాస్త్రమో, లేక ఏదయితే సూత్రమో, ఏదయితే సిద్ధాంతమో
అదియంతయూ జరిగితీరు ప్రత్యక్ష సత్యమని చెప్పవచ్చును. అందువలన
శాస్త్రము అనగా సత్యమునకు మారుపేరుయనీ, అట్లే సత్యము శాస్త్రమునకు


మారుపేరనీ చెప్పవచ్చును. అందువలన ఏ విషయమైనా శాస్త్రబద్ధముగా
ఉండవలెనని చెప్పుచుందురు. శాస్త్రబద్ధముగాయుంటే సత్యబద్ధముగా
ఉన్నట్లేయని గుర్తు.

ఏ శాస్త్రమునకయినా సిద్ధాంతములే ఆధారము. సిద్దాంతములతోనే
శాస్త్రము ఆధారపడియుంటుంది. శాస్త్రము అంటే అర్థమగులాగున విడదీసి
చెప్పుకొన్నాము. శాస్త్రమునకు ఆధారమైన సిద్ధాంతము అంటే దాని అర్థము
ప్రకారము వివరించి చెప్పుకొందాము. సిద్ధాంతమును విడదీసి చెప్పితే
సిద్ధ+అంతము=సిద్ధాంతము అని గలదు. 'సిద్ధాంత' పదములోని సిద్ధకు
మరియు అంతముకు వేరువేరుగా అర్థమును చెప్పుకోగలిగితే ఇలా కలదు.
సిద్ధ అను పదమును సిద్ధము అని కూడా చెప్పవచ్చును. సిద్ధ అనినా,
సిద్ధము అనినా, సిద్ధమ్ అనినా మూడు ఒకే అర్థముతో కూడుకొనియున్నవి.
సిద్ధి అను పదమునుండి సిద్ధ అను శబ్దము పుట్టినది. కావున సిద్ధి అను
పదమునకు చెప్పు అర్థమునే సిద్ధ అను పదమునకు కూడా చెప్పవచ్చును.
సిద్ధ లేక సిద్ధమ్ లేక సిద్ధము అను పదమునకు ఒకే అర్థము కలదు. అదే
‘వెతకగా దొరికినది' అని అర్ధము. 'అన్వేషించగా దొరికినది' అని అర్థము.
పరిశోధన చేయగా వచ్చిన ఫలితమును, లేక దొరికిన అర్థమును సిద్ధాంతము
అని అనుచున్నాము. ఒక పరిశోధకుడు ఒక విషయమును పూర్తిగా
పరిశోధించిన తర్వాత వచ్చిన ఫలితమును, లేక తెలిసిన సత్యమును
‘సిద్ధాంతము' అని అంటున్నాము. ఒక మనిషి తన పరిశోధనలో కనుగొన్న
సత్యమును సిద్ధాంతము అనడము జరుగుచున్నది. ఒక మనిషి కనుగొన్న
సిద్ధాంతమును అతని సిద్ధాంతము అని చెప్పుచున్నాము. ఒక శాస్త్రములో
ఎంతోమంది కనుగొన్న సిద్ధాంతములుండును. శాస్త్రమునకు ఒకే పేరున్నా,
అందులోని సిద్ధాంతములకు వాటిని కనుగొన్న వారి పేర్లుండును.

'సిద్ధాంతము' అను పదములో సిద్ద అనగా వెతికితే లభించినదను
భావము తెలిసిపోయినది. అదే పదములో చివరిలోయున్న అంతము
అనగా శేషము లేకుండా, లేక పూర్తి అయిపోయినది అని అర్థము కలదు.
శేషము లేకుండా ఉన్న ఫలితమంతా తెలియబడినదను అర్థముతో
'సిద్ధాంతము' అని అంటున్నాము. ఒక సిద్ధాంతము తెలియబడినదంటే
పూర్తి అర్థముతో లేక ఏమీ మిగలని అర్థముతో పూర్తి తెలిసిపోయినదని
భావము. అందువలన ఏ సిద్ధాంతమయినా సంపూర్ణముగా యుండునుగానీ,
అసంపూర్ణముగా యుండదు. ఈ విధముగా సిద్ధాంతము అంటే పూర్తి
సత్యమయినదను భావము కూడా కలదు. సత్యమయిన సిద్ధాంతములతో
కూడుకొన్నది శాస్త్రమైనందున, శాస్త్రము ఏదయినా అది సత్యముతోనే
కూడుకొనియుండును. అంతము వరకు అసత్యము లేకుండా లభించిన
సత్యమును సిద్ధాంతము అని చెప్పవచ్చును. సిద్ధ అనగా లభించినదని
అంతము అనగా చివరి వరకు లభించిన సత్యమును సిద్ధాంతము అని
చెప్పినా, ప్రపంచ సిద్ధాంతములతో కూడుకొన్న శాస్త్రములు నాలుగు
గలవు. దేవునికి సంబంధించిన సిద్ధాంతములతో కూడుకొన్నది ఒక శాస్త్రము
గలదు. ఇట్లు ప్రపంచ సంబంధముగా కొంత, దైవసంబంధముగా కొంత
సంబంధపడి యుండు శాస్త్రము ఒకటి కలదు. అదే జ్యోతిష్య శాస్త్రము.
ప్రపంచ సంబంధ నాలుగు శాస్త్రములు వరుసగా 1) గణిత శాస్త్రము
2) ఖగోళ శాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము గలవు.
పరమాత్మ సంబంధ శాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమొక్కటే గలదు.
షట్ శాస్త్రములలో అన్నిటికంటే ముందు పుట్టినది బ్రహ్మవిద్యా
శాస్త్రము. మొదట పుట్టిన బ్రహ్మవిద్యా శాస్త్రము సంపూర్ణముగా పుట్టినది.
తర్వాత పుట్టిన ఐదు శాస్త్రములు అసంపూర్ణముగా పుట్టినవి. మిగతా

ఐదు శాస్త్రములలో ఎన్నో సిద్ధాంతములు అప్పుడప్పుడు కనుగొన
బడుచున్నవి. ఇంకా ఎన్ని సిద్ధాంతములు తెలియవలసియున్నదో ఎవరికీ
తెలియదు. ఐదు శాస్త్రముల సిద్ధాంతములు ఎప్పటికి సంపూర్ణమవుతాయను
విషయము ఎవరికీ తెలియదు. మేము చూచినంతలో గత యాభై (50)
సంవత్సరములలో నాలుగు శాస్త్రములలో ఎన్నో సిద్ధాంతములు మనుషుల
చేత కనుగొనబడినవి. ప్రత్యేకించి జ్యోతిష్య శాస్త్రములో పరిశోధన చాలా
తక్కువ యున్నది. అందువలన జ్యోతిష్యములో క్రొత్త సిద్ధాంతములు
బయటికి రాలేదు. ఈ మధ్య కాలములో మేమే ఒకటి, రెండు
సిద్ధాంతములను క్రొత్తగా చెప్పాము. జ్యోతిష్యము ప్రపంచముతో ముడి
పడియున్నది. కనుక అది మాకు సంబంధించిన శాస్త్రము కాదు. అయినా
రెండు క్రొత్త సిద్ధాంతములు మేము వ్రాసిన "జ్యోతిష్య శాస్త్రము” అను
గ్రంథములో చెప్పబడినవి. ప్రపంచ సంబంధ శాస్త్రములలోనికే జ్యోతిష్య
శాస్త్రము కూడా లెక్కించబడుచుండుట వలన మాకు దానిమీద ఆసక్తి
లేదు. బ్రహ్మవిద్యా శాస్త్రము తప్ప మిగతా ఐదు శాస్త్రములు అసంపూర్ణ
శాస్త్రములేనని చెప్పుచున్నాము. మా ఆసక్తియంతయూ బ్రహ్మవిద్యా శాస్త్రము
మీదనే ఉంటుంది. అందువలన మేము ఏమి చెప్పినా బ్రహ్మవిద్యా
శాస్త్రములోని విషయములనే చెప్పుచుందుము.

ప్రశ్న :- మీరు సిద్ధాంతములను, శాస్త్రములను బాగా అర్థమయ్యేలాగున
చెప్పారు. మీరు చెప్పిన మాటలలో బ్రహ్మవిద్యా శాస్త్రము సృష్ట్యాదిలోనే
సంపూర్ణముగా చెప్పబడినదని చెప్పారు. సృష్ట్యాదిలోనే సంపూర్ణముగా
చెప్పబడిన విషయమును తిరిగి చెప్పవలసిన అవసరములేదు కదా!
సృష్ట్యాదిలో దేవుడే స్వయముగా బ్రహ్మవిద్యా శాస్త్రమును చెప్పినప్పుడు దానిని
గురించిన క్రొత్త విషయములు ఏమీ లేనప్పుడు మీరు క్రొత్తగా త్రైత

సిద్ధాంతమును ఎలా చెప్పారు? త్రైత సిద్ధాంతమును మీరు చెప్పినట్లు మీ
పేరుకంటే ముందు "త్రైత సిద్ధాంత ఆదికర్త” యని పేరు కూడా
పెట్టుకొన్నారు. దేవుడు ముందే చెప్పిన విషయమును హైజాక్ చేసి దానిని
మీరే చెప్పినట్లు ప్రకటించుకోవడము తప్పు కాదా?

జవాబు :- దేవుడు సృష్ట్యాదిలోనే బ్రహ్మవిద్యా శాస్త్రమును సంపూర్ణముగా
చెప్పాడని నేను తప్ప ఎవరయినా చెప్పారా? మీరే ఒకమారు వెనుదిరిగి
చూచుకోండి. ప్రపంచ శాస్త్రములు అసంపూర్ణమనీ, దైవశాస్త్రము
సంపూర్ణమను విషయమును చెప్పిన వారిలో మొదటివాడిని నేనేయని
ధైర్యముగా చెప్పుచున్నాను. అటువంటప్పుడు దైవ సిద్ధాంతమయిన త్రైత
సిద్ధాంతమును నేను చెప్పానని ఎలా చెప్పగలను? నేను ఎక్కడ త్రైత
సిద్ధాంతమును గురించి చెప్పినా ఈ విషయము ప్రథమ దైవగ్రంథమయిన
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు 16, 17 శ్లోకములలో
కలదనియే చెప్పుచున్నాము. భగవద్గీతను దేవుడు సృష్ట్యాదిలోనే
బోధించాడనీ, దానినే ద్వాపరయుగ చివరిలో భగవంతుడుగా వచ్చిన
శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పాము. అట్లు చెప్పడమే కాక మేము చెప్పుచున్న
త్రైత సిద్ధాంతమును భగవద్గీతలోనే చెప్పబడినదని కూడా చెప్పాము.
అటువంటప్పుడు త్రైత సిద్ధాంతమును చెప్పడములో మా తప్పు ఉందేమో
మీరే చెప్పండి. త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో చెప్పినా, తిరిగి దానిని
ద్వాపర యుగము చివరిలో చెప్పినా అది ఎవరికీ తెలియని సిద్ధాంతమై
యున్నది. హిందువుల గ్రంథము భగవద్గీతయని చాలామంది చెప్పుచున్నా
భగవద్గీతలోని త్రైత సిద్ధాంతమును గురించి ఈనాటికీ హిందువులకే
తెలియదు. ఎవరికీ తెలియని సిద్ధాంతమును గురించి మేము చెప్పాము.
కావున అది అందరికీ క్రొత్తగానే యున్నది. అందువలన త్రైత సిద్ధాంతము
మీకు క్రొత్తదని చెప్పానుగానీ మాకు పాతదేనని తెలుసు.

మా పేరు విషయానికి వస్తే మా పేరు ముందర త్రైత సిద్ధాంత
ఆదికర్తయని ఉండడము వాస్తవమే. అలా వ్రాయుటకు కారణము చెప్పితే
కొందరికి ఆశ్చర్యముగా ఉండును. ఎందుకనగా ఆ పేరు నాదికాదు.
తప్పు దొరికిందని పేరు నాదికాదని తప్పించుకొంటున్నాడని కొందరను
కోవచ్చును. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా వాస్తవానికి అందరూ
నాది అనుకొన్న పేరు నాది కాదు. అంతెందుకు 'మీది' అని మీరు
చెప్పుకొంటున్న మీ పేరు కూడా మీది కాదు. నేను చెప్పు విషయము
వలన నాకు మతిభ్రమించినదని మీరు అనుకోవచ్చును. నాకు చిన్న
వయస్సులో నిజానికి మతిభ్రమించి, తల్లితండ్రులు నాకు పెట్టిన పేరును
నాదేనని నేను అనుకొనెడివాడిని. తల్లితండ్రులు కూడా నాకే పేరు పెట్టామని
అనుకొన్నారు. అప్పటికి అది సక్రమమే అనుకొన్న నేను యుక్తవయస్సు
వచ్చిన తర్వాత, కొంత ఆధ్యాత్మిక జ్ఞానము తెలిసిన తర్వాత, నేను ఎవరో
నాకు తెలిసిన తర్వాత అప్పుడు తెలిసింది 'నాది' అనుకొను పేరు నాది
కాదని తెలిసినది. ఈ విషయములో తల్లితండ్రులు కూడా పొరపాటు
పడినారని అర్థమయినది. ఒక తల్లితండ్రులే కాదు ప్రతి ఒక్కరూ
పొరపడినారని, ప్రపంచములో ఎవరికీ పేరు లేదని అందరూ ప్రస్తుతము
'నాది' అను పేరు వాస్తవానికి వారిది కాదని అర్థమయినది. అలా అందరూ
భ్రమించడమునకు కారణము వారి ఆధ్యాత్మిక జ్ఞానము వారికే తెలియక
పోవడమేనని తెలిసినది. ఎప్పుడు మనిషికి తనను గురించి తనకు
తెలుస్తుందో అప్పుడు తాను ఎవరో తెలిసిపోవడము వలన, అంతవరకు
తన పేరు అనుకొన్నది పొరపాటనీ, వాస్తవానికి తన పేరు అది కాదని
తెలిసి పోవుట వలన ప్రపంచములో యున్న వారందరికీ తెలియని సత్యము
తెలిసిపోవుచున్నది.

ఎప్పుడయితే తన ఆత్మను గురించిన సత్యము తెలిసిపోయినదో
అప్పుడు తనెవరో తెలిసిపోవుచున్నది. తాను ఎవరో తెలిసిపోయినప్పుడు
అంతవరకు తనది అని చెప్పుకొను పేరు తనది కాదని తెలిసిపోవుచున్నది.
అదే విధముగా నా ఆత్మను గురించి నేను తెలుసుకున్న రోజు నేను
ఎవరో నాకు తెలిసిపోయినది. కావున అంతవరకు నాది అనుకొన్న పేరు
నాది కాదని తెలిసిపోవడమేకాక ఈ విషయములో మనుషులందరూ
పొరపడినారని తెలిసిపోయినది. అప్పటినుండి ఏ పనిని చేసినా, ఏ మాటను
మాట్లాడినా అది నేనే చేశానని, నేనే మాట్లాడినానని అందరూ అనుకొనినా,
ఆ పనిని చేసినది, ఆ మాట మాట్లాడినది నేను కాదు అను భావన నాలో
వచ్చినది. అటువంటప్పుడు త్రైత సిద్ధాంతమును చెప్పినది, దానిని గురించి
మాట్లాడినది నేనేయని అందరూ అనుకొనినా వాస్తవానికి ఆ పనిని చేసినది,
ఆ మాట మాట్లాడినది నేను కాదని వారికి తెలియక పోయినా,
తెరవెనుకయున్న సత్యమేమిటో నాకు తెలియును కనుక త్రైత సిద్ధాంతమును
ఎవరు చెప్పారో వారి పేరునే అక్కడ వ్రాయడము జరిగినది.ఆ పేరు
నాదియని మీరు అనుకోవడము మీ పొరపాటేగానీ, అందులో నా
ఏమరుపాటు ఏమీ లేదు!

ప్రశ్న :- మసిపూసి రేణికాయను మారేడుకాయగా చూపినట్లు, పేరు నాది
కాదని మొదటికే తప్పించుకొన్నావు. ప్రబోధానంద అను పేరు నీది కాకపోతే
నీ పేరేమిటి? చెప్పగలవా?

జవాబు :- సత్యము తెలిసిన తర్వాత నా పేరును నేను చెప్పడములో
నాకేమిటి సిగ్గు. మసిపూసి రేణి కాయను మారేడు కాయగా చూపవలసిన
అవసరము నాకు లేదు. నీవు మొదటికే మారేడు కాయవు పొరపాటుగా

రేణి కాయనని అనుకొంటున్నావు. పైన రంగును చూచి మోసపోవలసిన
పని లేదు. రేణికాయ పుల్లగ ఉంటుంది. మారేడు కాయ వగరుగా
ఉంటుంది. నీ రుచి ఏమిటో చూచుకో, పుల్లగయుంటే రేణికాయవు,
వగరుగ వుంటే మారేడు కాయవని తెలిసిపోతుంది. నా రుచిని నేను
చూడగలిగాను. నా రుచి వగరని తెలిసింది. నా రంగు నలుపని తెలిసింది.
నలుపురంగు, వగరు రుచి వున్న కాయ మారేడు కాయ కాకపోతే ఏమి
కాయ అవుతుందో మీరే చెప్పండి. నా విషయము నాకు తెలిసింది,
మిగతా ప్రజలు కూడా నాలాగే యుండువారు, నా జాతివారే కావున మిగతా
అందరి విషయము కూడా తెలిసింది. అందువలన "మీవి అనుకొన్న మీ
పేర్లు మీవి కావు" అని చెప్పాను.

ప్రశ్న :- ఇంతకూ నీవెవరో చెప్పలేదు. నీపేరు ఏమిటి?

జవాబు :- నేను ఒక అనాదిని. అవిటివాడిని, నాకు పేరంటూలేదు.
నాకు పేరును ఎవరూ పెట్టలేదు. అయితే ఒక బిరుదు మాత్రము ఉన్నది.
నేను శరీరములో జీవించువాడను, జీవితములో జీవించువాడను కనుక
“జీవుడు” అను బిరుదు కలదు. దానితోనే నన్ను జీవుడు అని చెప్పవలసి
యుంటుంది. నా విషయము అటుంచి నీ విషయము కూడా అంతే!
ప్రశ్న :- నీవు ఏమి చెప్పుచున్నావో మాకు ఏమాత్రము అర్థము కాలేదు.
ఇంతవరకు నీవు 'అసత్యము చెప్పవు' అను నమ్మకము నీ మీద ఉండేది.
అయితే ఇప్పుడు నీవు చెప్పే మాటలనుబట్టి ఆ నమ్మకము లేకుండా
పోవుచున్నది. నీకు ఏమి తెలిసిందో ఏమోగానీ, మాకు మాత్రము నీకు
మతిభ్రమించినదని తెలిసిపోయినది.

జవాబు :- ఇంతకాలము నిజముగా నాకు మతిభ్రమించి యుండేది.
ఇప్పుడిప్పుడే నామతి భ్రమను వీడి సత్యములోనికి వచ్చినది. ఇప్పుడు మీ
మతియే భ్రమలో యున్నది.

ప్రశ్న :- నా పుట్టిన రోజు నాకు తెలుసు, నా తల్లితండ్రులు నాకు తెలుసు,
నా అన్నదమ్ములు నాకు తెలుసు. నేను తినే తిండి తెలుసు, నేను త్రాగే
నీరు తెలుసు. ఇవన్నీ నీకు ఉన్నాయి. అయితే ఇందులో నాకున్న భ్రమ
ఏమిటి? నీకు లేని భ్రమ ఏమిటి?

జవాబు :- నేను ఎంత చెప్పినా నీ లోకము నీది, నా లోకము నాది
అన్నట్లున్నది. నీ లోకమేమిటో? నా లోకమేమిటో? అనగా నీ భ్రమ
ఏమిటో? నా బోధ ఏమిటో? నీకు అర్థమగుటకు ఒక ఉదాహరణను
చేకూర్చి చెప్పెదను వినుము. ఒక వ్యక్తి సన్నాసత్వము తీసుకుని, కాషాయ
గుడ్డలు ధరించి, గడ్డము పెంచి పైకి కైలాసము నుండి దిగివచ్చిన ఈశ్వరుని
వలె కనిపించుచుండెను. ఒక దినము అతను మా వద్దకు రావడము
జరిగినది. ఒక దినమంతయూ మావద్దనే యున్న ఆ సన్న్యాసి స్వామివారు,
మేము, ఇంకా కొందరు అందరమూ కలిసి మా ఇంటివద్దనే ఆరుబయట
పడుకోవడము జరిగినది. రాత్రి ఒంటిగంట సమయములో కాషాయ
గుడ్డలు ధరించియున్న స్వామిగారు స్వప్నములోనికి పోవడము జరిగినది.
స్వప్నములో ఆయన ఒక తోటలో నివాసము ఏర్పరచుకొని యుండగా,
ప్రక్కతోటలో గల వ్యక్తి స్వామిగారి దగ్గరకు వచ్చి తన కోడి కనిపించలేదనీ,
ఎర్రరంగు ఈకలుగల కోడియనీ, దాని గుర్తుతో సహా రంగుతో సహా
చెప్పాడు. ఆ స్వామిగారు ప్రక్కతోట యజమాని అడిగిన కోడిని చూడలేదని
చెప్పాడు. అంతటితో ఆ కోడి యజమాని కోడిని గురించి బాధపడుచూ

అక్కడినుండి పోయాడు. అతను పోయే సమయములో తనకోడి ఎక్కడయినా
కనిపిస్తుందేమోనను ఆశతో అటు ఇటు చూస్తూ పోయాడు. అప్పుడు
అతనికి తనకోడి కనిపించలేదుగానీ, తనకోడి ఎర్రనిఈకలు ఒక కంది
చెట్టు క్రింద కనిపించాయి. అప్పుడు అతనికి తన కోడి ఈకలు స్వామి
వున్న తోటలోనే కనిపించడము వలన, ఆ ప్రాంతములో స్వామి తప్ప
ఎవరూ లేనిదానివలన, స్వామియే తన కోడిని చంపి వండుకొని తిని
వుంటాడను అనుమానము వచ్చినది. వెంటనే స్వామివారి దగ్గరకు వచ్చి
తన కోపమునంతటినీ స్వామిమీద వెల్లగ్రక్కాడు. అప్పుడు ఆ స్వామి
నాకు కోడి విషయము తెలియదని చెప్పినా కోడియజమాని వినలేదు.
ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగి పోయినది. ఇదంతయూ స్వప్నములో
జరుగుచున్నా ప్రత్యక్ష ప్రసారమువలె స్వామిగారి మాటలన్నీ బయటికి
వినిపించుచున్నవి. స్వామివారు నిద్రపోయాడు అని మేము అనుకొన్నా
అక్కడ ఆయన మాట్లాడు మాటలను బట్టి స్వామివారు స్వప్నములో
ఉన్నాడని అర్థమయినది. అక్కడే పడుకొన్న పదిమంది నిద్రనుండి లేచి
స్వామి మాటలు వింటున్నారు.

అంతలో స్వప్నములో కోడి యజమాని స్వామివారిని బూతు
పదములను ఉపయోగించి తిట్టాడు. దానికి ప్రతిగా స్వామివారు కూడా
బూతుమాటలనే తిట్టడము మాకు వినిపిస్తున్నది. అంతలో కోడి యజమాని
స్వామివారిని కొట్టినట్లు పైకి వినిపించే మాటలను బట్టి మాకు అర్థమయినది.
స్వామివారు నన్నే కొడతావా!యని కోడి యజమానిని కొట్టడము ఆ ఘర్షణ
అంతయూ మాకు తెలిసింది. అప్పుడు మేము దానిని నివారించుటకు
ఎటూ స్వప్నములోనికి వారి మధ్యలోనికి పోలేము. అందువలన స్వామివారిని
గట్టిగా తట్టి లేపడము జరిగినది. అప్పుడు ఆయన స్వప్నము నుండి

బయటికి వచ్చాడుగానీ, స్వప్నములో జరిగినదంతయూ మాకు తెలిసినదని
ఆయనకు తెలియదు. స్వామివారు లేచిన తర్వాత అది స్వప్నమని
దానినుండి బయట పడినానని తెలిసినా, అప్పుడు కోడి యజమాని మీద
వచ్చిన కోపము అతనిలో ఉండడమూ, పోట్లాటలో కోపముతో ఊగిపోయిన
ఊపుడు శరీరములో ఇంకా కొంత ఉండడమూ, తోటప్రక్కన వాడు నన్ను
కొట్టాడను అవమాన భారము పది నిమిషముల వరకు అతన్ని వీడకుండా
ఉండడమునుబట్టి స్వప్నములో జరిగినదంతా నిజమే అన్నట్లుండినా,
మెలుకువలో అదంతయూ అసత్యమని మన భ్రమయని తెలియుచున్నది.
జరిగినది భ్రమ అని అనుకొన్నా దానికి సరియైన సమాధానము లేదు.
స్వప్నమునుండి బయటపడిన పది నిమిషముల వరకు ఆ సంఘటనలో
యున్న కోపము, గుండెదడ, భయము, శరీరములో వణుకుడు (ఊపుడు)
మొదలగునవన్నీయుండుట వలన అది అసత్యము కాదు సత్యమేయనునట్లు
అనిపిస్తున్నది. ఎంత సత్యమనిపించినా మెలుకువలోనికి వచ్చిన తర్వాత
ఎవరయినా దానిని అసత్యమని, భ్రమయని చెప్పక తప్పదు. స్వప్నములోనికి
పోయి వచ్చినవాడు స్వప్నములోని అనుభవములన్నిటినీ అనుభవించి
యుండుట వలన అతను సందిగ్ధములో పడిపోయి, సత్యమని గానీ,
అసత్యమని గానీ నిర్ధారణకు రాలేకయుండును.

స్వప్నమునకు బయటయున్నవాడు మాత్రము జరిగినది అసత్యమే
అని చెప్పును. ఎందుకనగా! తన కళ్ళ ఎదుటే స్వామి పడుకొని యుండడము
వలన బయటివారి దృష్టిలో తోటలేదు, కోడిలేదు, కోడి యజమాని లేడు.
అందువలన స్వామివారి మాటలన్నీ వట్టి భ్రమయే అని అనుచుందురు.
స్వామివారి విషయమునకు వస్తే, ఆయన స్వయముగా అనుభవించిన
అనుభవములనుబట్టి దానిని 'భ్రమ' అని అనలేడు. ఈ విధముగా

స్వప్నమునకు బయట ఉన్న పదిమంది కోడి, కోడి యజమాని ఏదీలేదు
ఇదంతా అసత్యమని అనుచుండగా, స్వప్నమును పొందిన వాడు మాత్రము
నిజమే అని అనగలుగుచున్నాడు. ఈ విషయము చాలామందిని నిజమా!
అబద్దమా!! అని సందిగ్ధములో పడవేయుచున్నది.

ప్రశ్న :- ఈ విషయములో మీరేమంటారు?
జవాబు :- ఒక్కరికి సత్యమయినది, పదిమందికి అసత్యమయినది అయి
వుండుట వలన ఆ స్వప్నము అతనికి ఒక్కనికి నిజమే అయినా అందరికీ
అబద్దమే అవుతుంది. అబద్దమును 'కల్ల' అనడము కూడా జరుగుచున్నది.
కల్ల అనగా అసత్యమని అర్థము కలదు. స్వప్నము ఒకరి దృష్ఠిలో సత్యమైనా
వందమంది దృష్టిలో కూడా అసత్యమే అగుట వలన స్వప్నమును కల్ల
అని అన్నారు. 'కల్ల' అనుమాట కాలక్రమేపీ 'కల'గా మారిపోయినది.
'కల్ల' అను పదము 'కల'గా మారిపోయినా అది అసత్యమని అర్థము
చేసుకోవలెను. ఒక్కరి విషయములో నిజమైనా అనేకమంది విషయములో
అసత్యమగుట వలన ఎక్కువ సాంద్రతయున్న విషయము ప్రచారమయినది.
‘కల్ల' అను పదములో 'ల' క్రింద ల వత్తు లేకుండా పోవడము వలన కల్ల
కలగా మారిపోయినది. ఈ విషయమై నన్ను అడిగిన దానివలన స్వామికి
వచ్చిన స్వప్నమును గురించి విశ్లేషించి చూచితే, ఈ విధముగా అర్థమగు
చున్నది. 'స్వప్నము' అను పదములోనే దానికి కొంత అర్థము ఉన్నది.
స్వప్నము అను పదమును విడదీసి చూస్తే ఈ విధముగా కలదు.
స్వ+పనము= స్వప్నముగా పలుకబడుచున్నది. స్వ అనగా నీ స్వంతమునకు
మాత్రమే అని అర్ధము. నీకొక్కనికే అని కూడా అర్థము రాగలదు. స్వ
అనగా నీది అనియూ, పనము అనగా ధనము అనియు అర్థము. నీ
స్వంత ధనము అనుమాటను నీ స్వంత అర్థము అని కూడా చెప్పవచ్చును.

స్వంతానికి అది నిజమనిపించినా, నిజమే అయినా చివరికి అందరి చేత
అది అసత్యముగా, లేక కల్లగా తేల్చబడినది.

అదే విధముగా నీకు తల్లితండ్రులున్నట్లు తెలిసినా, నీ పుట్టిన
రోజు నీకు తెలిసినా, నీవు తినేది త్రాగేది నీకు తెలిసినా అది అంతయూ
కల్లయే. నీవు అనుకున్న తల్లితండ్రులు నీవారు కారు. వారు అసత్యము.
సత్యముగా నీ తల్లి తండ్రులు వేరుగాయున్నారు. నీ పుట్టిన రోజు నీకు
తెలిసినా అది కల్లయే. నీవు నిజముగా సృష్ట్యాదిలోనే పుట్టావు. నీవు
తిన్నాను త్రాగాను అనుమాట కూడా నీకు సత్యమనిపించినా వాస్తవముగా
అది అసత్యమేయగును. స్వప్నము అంతరంగములో జరుగు సత్యమయినా
బాహ్యరంగములో అది అసత్యమగును. అదేవిధముగా నీ స్వంత భావములో
ఎంత నిజమున్నా బయట సత్యము ప్రకారము స్వంత భావములను
మించిన శాస్త్రభావమే సత్యమగును. అందువలన నాకు ఫలానా వారు
తల్లితండ్రులు అని అనుకొన్నా అది స్వంత భావమేగానీ సత్యమని
చెప్పలేము. సత్యమును పరిశోధించి చూస్తే, శాస్త్రమును అనుసరించి
చూచినా ప్రకృతి పరమాత్మ తల్లితండ్రులని, బాహ్యముగా కనిపించువారు
నీ తల్లితండ్రులు కాదని తెలియుచున్నది. జగతిలో యున్న ప్రతి మనిషి
ప్రతి విషయములోనూ తప్పు భావము కల్గియున్నాడని తెలియుచున్నది.
మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానము తెలియనంతవరకు తన భ్రమ ఏమిటో? తనకే
తెలియదు. అందువలన నేడు ఆత్మల జ్ఞానము తెలియని మనుషులందరూ
తనెవరో తెలియక, తనది కానిదానిని తనదే అనుకొంటున్నాడు. తాను
వ్రాయని దానిని తానే వ్రాశానని అనుకొంటున్నాడు. సత్యముగా జీవుడు
ఏమీ చేయనివాడు, చేతకానివాడు. ప్రస్తుతము నేను దైవజ్ఞానమును
అనుసరించి నా స్థితిని తెలియగలిగాను. అందువలన సిద్ధాంతమును

కనిపెట్టినది నేను కాదు అని చెప్పగలుగుచున్నాను. మనిషి శరీరమంతయూ
వ్యాపించియున్న ఆత్మయే అన్ని పనులు చేస్తున్నది. శరీరము మొత్తము
ఆత్మదే అయినప్పుడు శరీరమునకున్న పేరు కూడా ఆత్మదేయగును.
ప్రశ్న :- ఇప్పుడు మీరు ఏమి చెప్పదలుచుకొన్నారు?

జవాబు :- ఇప్పుడుగానీ, ఎప్పుడుగానీ నేను ఏమీ చెప్పదలుచుకోలేదు.
'నేను చెప్పెదను' అని అనుకోవడము పొరపాటని తెలిసినది. వాస్తవముగా
ఏమి చేయదలుచుకొన్నా అది ఆత్మయే చేయాలి. వ్యవహారికముగా
మిగతావారు తెలియనితనములో నన్ను ప్రబోధానందగా అనుకొనినా
ఆధ్యాత్మికము తెలిసినవారు నన్ను జీవునిగానే లెక్కించి, ప్రబోధానంద పేరు
గల వానిని ఆత్మగా లెక్కింతురు. మీరు ఏమి ప్రశ్న అడిగినా జవాబును
ఆత్మయే చెప్పుతుంది. నేను (జీవుడను) శరీరములో ప్రక్కనయుండి చెప్పే
దానిని వింటున్నాను.

ప్రశ్న :- మీమాట ప్రకారమే మీరు చెప్పలేదు, మీ లోపలయున్న ఆత్మయే
చెప్పుచున్నదని అనుకొంటాము. అందరిలో కూడా అట్లే యున్నదని మీరు
చెప్పుచున్నారు. అటువంటప్పుడు కొన్ని సందర్భములలో మనిషి
పొరపాటుగా మాట్లాడడము, అజ్ఞానముగా మాట్లాడడము, అసత్యముగా
మాట్లాడడము జరుగుచున్నది కదా! అప్పుడు ఆత్మకూడా అజ్ఞానముగా
మాట్లాడినట్లేనా? ఆత్మకూడా అసత్యమును చెప్పినట్లేనా? జ్ఞానస్వరూపమైనది
ఆత్మయని మీరే చెప్పారు. ఆత్మకు తెలియనిదంటూ లేదన్నారు.
అటువంటప్పుడు ఆత్మ స్వయముగా ఎందుకు అట్లు మాట్లాడినది? ఒక
ప్రశ్నకు జవాబును కూడా తప్పు చెప్పునప్పుడు ఆత్మ చెప్పుచున్నదను మీ
మాటను ఎలా నమ్మాలి?

జవాబు :- మనిషిలో ఆత్మ మాట్లాడుచున్నదని నమ్మకూడదనే ఉద్దేశ్యము
తోనే ఆత్మ అలా అబద్దమును చెప్పుచున్నది. ఒక అసత్యమునే కాదు,
అక్రమముగా, అన్యాయముగా కూడా మాట్లాడుచున్నది. అలా మాట్లాడుట
వలన ఎవరి దృష్ఠి ఆత్మమీదికి పోకుండా జీవాత్మ మీదికే పోవాలను
ఉద్దేశ్యముతోనే ఆత్మ ఆ విధముగా మాట్లాడుచున్నది. మనిషి మాట్లాడు
బూతు మాటలను, మనిషి చేయు అత్యాచారములను, హత్యలను ఆత్మే
చేయుచున్నదని ఘంటాపథముగా చెప్పుచున్నాను. ఆ విధముగా శరీరము
లోని ఆత్మ శరీరమును కదిలించి చేయించు కార్యములను చూచిగానీ,
మాట్లాడించు మాటలను చూచిగానీ, ఎవడు కూడా ఈ పని చేయునది
ఆత్మయనీ, ఈ మాట మాట్లాడునది ఆత్మేనని ఎవడూ నమ్మడు, నమ్ముటకు
ఏమాత్రము వీలులేనట్లు ఆత్మే చేయుచున్నది. సత్యమును తెలిసిన మాలాంటి
వారు ఏమి చెప్పినా నమ్మనట్లు ఆత్మే చేయుచున్నది. ఈ విధముగా
చేయడము వలన ఆధ్యాత్మికము (ఆత్మను అధ్యయనము చేయడము) అను
దాని వైపు ఎవరూ పోకూడదను ఉద్దేశ్యము తప్ప వేరు ఏమీ లేదు.
దానివలన మనుషులు ఇంతవరకు ఆత్మవైపు దృష్టి సారించలేదు. ఎంత
పెద్ద స్వాములకయినా, వేదాంతులమని చెప్పుకొను వారికయినా వారి
శరీరములోని ఆత్మ వారికి తెలియదు.

ప్రశ్న :- మీ మాటలు ఒకవైపు సత్యమనిపించినా, మరొకవైపు అసత్యమని
పించుచున్నవి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థము కాలేదు. ఆత్మ
శరీరములోయున్న దేవుడని మీరే కొన్నిచోట్ల చెప్పారు. ఆత్మను శరీరములోని
దేవునిగా, జీవునికి దేవునిగా చెప్పినప్పుడు దేవుడు కూడా మోసాలు
చేయునా? అసత్యాలు చెప్పునా? దీనికి జవాబు మీరే చెప్పండి!

జవాబు :
శరీరములోయున్న ఆత్మే జీవాత్మకు దేవునిగా, అధిపతిగా
యున్నాడు. ప్రపంచమంతా వ్యాపించియున్న దేవునితో జీవునికి సంబంధము
లేదుగానీ, జీవునికి ఆత్మే అన్ని విధముల దేవుడు అని చెప్పవచ్చును. ప్రతి
మనిషిని ఆడించువాడు ఆత్మే. అన్నీ తెలిసినవాడు ఆత్మ అయినందున
ఆయనకు జ్ఞానము తెలుసు, అజ్ఞానము తెలుసు, మంచి తెలుసు, చెడు
తెలుసు. ఆయన మంచిగా అయినా కనిపించగలడు. చెడుగానయినా
కనిపించగలడు. రెండు రకముల కనిపించుట వలన ఆయనను ఫలానా
వాడని ఎవరూ పోల్చుకోలేరు. అందువలన తమ శరీరములోనే యున్న
ఆత్మను ఇంతవరకు ఎవరూ గుర్తించలేకపోయారు. కొందరిలో మంచిగా
ప్రవర్తించు ఆత్మ, కొందరిలో చెడుగా కూడా ప్రవర్తించుటకు కారణము
గలదు. మనిషి చేసుకొన్న కర్మను అనుసరించి ఆత్మ అలా ప్రవర్తించును.
అలా చెడుగా మంచిగా ప్రవర్తించునది ఆత్మే అయినా జీవుడు అజ్ఞానముతో
తనది కాని శరీరమును తనదియనుకొని తాను చేయని కార్యములను,
ఆత్మ చేసిన కార్యములను తానే చేశానని అనుకోవడము వలన ఆ పనికి
తానే బాధ్యుడు అగుచున్నాడు. జరిగిన కార్యములోని కర్మ ఏదయినా
(పాపమయినా, పుణ్యమయినా) జీవునికే తగులుకొనుచున్నది. నిత్యము
ఆత్మ చేయు అనేక కార్యములలో కొన్ని మంచి, కొన్ని చెడు కార్యములు
మిశ్రమముగా ఉండును. మనిషి చేసినట్లు పైకి కనిపించు కార్యములన్నిటినీ
ఆత్మే చేయుచుండినా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకముగా చేయుచుండును.
అలా వేరువేరు మనుషులలో వేరువేరుగా ఆత్మ చేయుటకు కారణము ఆ
శరీరములోయున్న జీవుడు చేసుకొన్న కర్మయేనని చెప్పవచ్చును. గత
జన్మలో జీవుడు చేసుకొన్న కర్మప్రకారము ఆత్మ కార్యములను చేస్తే
కార్యములలో కల్గు సుఖదుఃఖములను జీవుడు అనుభవించును. జీవుడు

చేసుకొన్న పాపపుణ్యములను జీవుడే అనుభవించుటకు తగిన కార్యములను
ఆత్మ చేయవలసియున్నది. జీవుడు సుఖదుఃఖములను అనుభవించుటకు
అనగా! స్వర్గ నరకములను అనుభవించుటకు శరీరములోని ఆత్మయే
పనిచేసి, ఆ పనిలో వచ్చు సుఖదుఃఖములను జీవుడు అనుభవించునట్లు
చేయుచున్నది. ఆత్మ శరీరములోని జీవునికి స్వర్గనరకములను కల్గించుటకు
కొన్ని మంచి పనులు, కొన్ని చెడుపనులు చేయుచున్నది. ఆత్మ చెడు
పనిని చేసినా, మంచి పనిని చేసినా ప్రతి దానికి ఒక లెక్కయుంది. అదియే
కర్మ గణితము. కర్మపత్రములో వ్రాయబడిన దానిని జీవుడు ఎప్పుడెంత
అనుభవించవలయునో అప్పుడు దానికి తగిన మంచి పనినో లేక చెడు
పనినో ఆత్మ శరీరముతో చేయగా, లోపలయున్న జీవుడు లోపలే
అనుభవించును. ఆత్మ చేసిన పనినిబట్టి జీవుడు సుఖమునో దుఃఖమునో
అనుభవించుట జరుగుచున్నది. ఇదంతయూ ఒక లెక్క ప్రకారము
జరుగవలసియుండుట వలన, అదే విధముగా ఆత్మ చేయుచున్నది.
అంతేగానీ ఆత్మ స్వయముగా తప్పు చేయలేదు. స్వయముగా ఒప్పు
చేయలేదు. కర్మ విధానము కొరకు, జీవుని అనుభవము కొరకు దేవుని
పాలనలో ఒక భాగముగా ఈ పనులు జరుగుట వలన ఆత్మను మంచి
పని చేసినదిగా గానీ, చెడుపనిని చేసినదిగా గానీ చెప్పలేము.
ప్రశ్న :- చేసేది ఒకరు దానిని అనుభవించేది ఇంకొకరు. ఇది అన్యాయము
కాదా! గొలుసులేని కుక్క కోడిని తినిపోతే గొలుసుతో కట్టివేసిన కుక్క
దానిని దూరముగాయుండి చూచినదని కొట్టారట! తిన్న కుక్కను కొట్టకుండా
చూచిన కుక్కను కొట్టడము పూర్తి అన్యాయము కాదా! మీరు న్యాయాన్ని
సమర్థిస్తారా? అన్యాయాన్ని సమర్థిస్తారా? చెప్పండి.

జవాబు :- మేము చెప్పునది ఆధ్యాత్మికము. ప్రపంచ సంబంధమైన
విషయము కాదు. ప్రకృతి సంబంధ విషయమునకు పరమాత్మ సంబంధ
విషయమునకు చాలా తేడావుండును. నీతి న్యాయము ప్రపంచ
సంబంధమైనవి. జ్ఞానము, ధర్మము ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధ
విషయములలో జ్ఞానము, ధర్మములు లెక్కించబడును. నీతి న్యాయములు
ఉండవు. దీనికి సాక్ష్యము కావాలంటే భగవద్గీతలో మోక్ష సన్నాస
యోగమున 17వ శ్లోకము ఈ విధముగా చెప్పారు చూడండి...

17వ శ్లో॥
యస్య నాహంకృతోభావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్ లోకాన్న హస్తి నని బధ్యతే |

భావము :- "ఎవని భావములో అహంకారము లేదో, ఫలితము మీద
బుద్ధి ఎవనికి లేదో, అతడు ఈ లోకములోనున్న వారందరినీ చంపినా,
వాడు హంతకుడు కాదు, వానికి పాపము అంటుకోదు." ఇక్కడ
అహము లేనివాడు ఎంతమందిని చంపినా వాడు హంతకుడు కాదు, పాపము
రాదు అని చెప్పు మాటలో ప్రపంచములో పూర్తి అన్యాయమే కనిపించినా,
దైవికముగా అది పూర్తి ధర్మమైయున్నది. అందువలన పాపము రాదు
వాడు హంతకుడు కాడు అని చెప్పారు.

ఇటువంటి విషయమునే “మధ్య దైవగ్రంథమయిన సువార్త
బైబిలు”లో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 28వ వాక్యములో ఇలా
చెప్పారు. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును" ఇది
కూడా ఎటు చూచిన అన్యాయము మాటే అగును. ఒక కార్యమును

చేయకున్ననూ భావము వలననే చేసినట్లు లెక్కించబడుచున్నది. ప్రథమ
దైవగ్రంథమయిన భగవద్గీతలో పనిని చేసినా భావములో లేనిదానివలన
చేయనట్లేయగుచున్నది. అదే విధముగా భావమే ప్రధానమగుట వలన
మనస్సులో భావమును పొందినా, పనిని చేయకున్నా చేసినట్లేయగుచున్నది.
దీనినంతటినీ గమనిస్తే ఆధ్యాత్మికములో భావమే ముఖ్యముగాయున్నది.
ఎప్పుడు అహంభావమున్నదో అప్పుడు పనిని చేయకున్నా చేసినట్లేయగును.
ఎప్పుడు అహంభావము లేదో అప్పుడు పనిని చేసినా చేయనట్లే అగుచున్నది.
ఇది ప్రపంచరీత్యా అన్యాయముగానే కనిపించును. అయినా దైవికముగా
ధర్మబద్దముగా యున్నది. అందువలన శరీరములో జీవుడు పనిని
చేయకున్నా, లోపలయుండి అహంకార భావముతో కూడియుండుట వలన
అతడు చేసినట్లే లెక్కించబడుచున్నది. జరిగిన దానిలోని కర్మ అతనికే
(జీవునికి) అంటగట్టబడుచున్నది.

ప్రశ్న :- ఒకరు జ్ఞాని, మరొకరు అజ్ఞాని ఇద్దరు మనుషులు కలిసి ఒకనిని
చంపారనుకొందాము. అప్పుడు ఇద్దరూ కలిసి చేశారు కావున అక్కడ
పాపము రాదా? అది హత్యకాదా? వారు హంతకులు కారా?
జవాబు :- భూమిమీద ఒక కార్యము జరగాలంటే దానిని ఒకరయినా
చేయవచ్చు లేక ఎక్కువమంది అయినా చేయవచ్చును. ఇద్దరు కలిసి ఒక
మనిషిని చంపారు. అప్పుడు అక్కడ జరిగినది హత్యయే. ప్రపంచ లెక్కలో
వారు ఇద్దరూ హంతకులే. అయితే ఆ పనిని చేసినప్పుడు ఒకడు నేను ఈ
పనిని చేయుచున్నానను భావముతో చేశాడు. మరొకడు ఆత్మజ్ఞానము
తెలిసినవాడై ఆత్మే ఈ పనిని చేయుచున్నదను భావముతోయున్నాడు.
మరొకడు ఆత్మజ్ఞానము తెలియనివాడై నేనే చేయుచున్నానను

అహంభావముతో యున్నాడు. ఈ విధముగా ఒకే పనిని ఇద్దరు చేసినా
అందులో అహం (నేను) అను భావము ఒకనికుండగా, మరొకనికి అహం
అను భావము లేదు. ఆధ్యాత్మికము ప్రకారము భావమును బట్టి కర్మవచ్చును.
భావమును బట్టి ఆ పనిని చేశాడా లేదా అని నిర్ణయించబడును. ఇద్దరిలో
ఒకనికి నేను చేయుచున్నానను భావమున్నది, మరొకనికి ఆత్మ చేయుచున్న
దను భావము కలదు. నేను చేయుచున్నానను భావము కల్గినవాడు ఆ
పనిని చేసినట్లేయగుచున్నది. నేను కాదు శరీరమునకు అధిపతిగాయున్న
ఆత్మయే చేయుచున్నదను భావమున్న వాడు ఆ పనిని చేయనట్లేయగు
చున్నది. ఆ పనిని ఆత్మే చేయునట్లు లెక్కించబడుచున్నది. వాస్తవముగా
చేసినది కూడా ఆత్మయే. అందువలన వారిలో 'నేను చేశాను' అను అహం
భావము కల్గిన వాడు మాత్రమే ఆ పనిని చేసినట్లు లెక్కంచబడి అతనిని
‘హంతకుడు’ అని చెప్పవలసి వచ్చినది. హంతకుడయిన వానికే ఆ పనిలో
కల్గు కర్మ చేరిపోయినది. అప్పుడు వాడు హత్యా పాపమును పొందిన
వాడయినాడు. మరొకరు కూడా ఆ పనిని చేసినా వాస్తవము తెలిసినవాడై,
తాను శరీరములో లోపల తలలో యున్నానని, తాను ఏమీ చేయలేని
అవిటివాడననీ, జరుగుచున్న పనిని చూస్తున్నా అది నాకు సంబంధములేని
పనియనీ, ఆ పనిని చేయునది శరీరమంతా వ్యాపించిన ఆత్మేనని, తాను
ఏమాత్రము కాదను భావములో యుండుట వలన ఆ పనిని అతడు
చేయనట్లేయగుచున్నది. అందువలన అతనికి ఆ కార్యములోని పాపము
రాలేదు. అప్పుడు వాడు హంతకుడుగా లెక్కించబడలేదు. ఈ విధముగా
ప్రపంచములో జరుగు ఏ కార్యమునయినా చేసిన వారి భావమును బట్టి
వాడు చేశాడా, చేయలేదా అని నిర్ణయించబడును. అన్ని పనులను ఆత్మయే
చేయుచుండగా, తెలివి తక్కువతో నేను చేశానని అనుకోవడము అజ్ఞానము

కాదా! పుట్టిన ప్రతివాడు ముందు తన విషయమును తాను తెలిసి
బ్రతుకవలెను. అటువంటి వానిని 'జ్ఞాని' అంటారు. శరీరములో తన
స్థానమేదో, తన బలమెంతో తెలియనివాడు అజ్ఞాని అగును.

ముందు తన వివరము తనకు తెలియకపోతే వాడుయున్న
శరీరములో జరుగు పనులన్నియూ వాడే చేసిన భావమును పొందును.
జీవుడు నివశిస్తున్న శరీరములో ఆత్మ చేయు పనులను నేనే చేశానని భ్రమించి
అహంభావమును పొంది ఆ పనులకు తానే బాధ్యుడగును. నేడు
ప్రపంచములో సామాన్య జీవితమును గడుపుచూ ఏమాత్రము దైవ సంబంధ
జ్ఞానము తెలియనివారికి ఆత్మ విషయము ఏమాత్రము తెలియదు. సాధారణ
మనుషులను వదలి మేము జ్ఞానులము, భక్తులము, యోగులము,
సన్యాసులము, మేము అన్యదేవతారాధన చేయని మతములోనివారము,
మా మతము దేవునికి దగ్గరగాయున్న మతము, మమ్ములను మా దేవుడు
మా పాపమునంతటినీ లేకుండా చేయును, మేము దైవమార్గములోయున్న
వారము అని అనుకొను వారిని గుర్తించి వారిలో ఎందరికి ఆత్మయొక్క
విషయము తెలియును అని చూస్తే, దాదాపు అందరికీ ఆత్మయొక్క వివరము
తెలియదనీ, తమ వివరము కూడా తమకు తెలియదనీ, వారందరూ మేము
మనుషులమేననీ, అన్ని పనులు మేమే చేస్తున్నామను భావములో యున్నారు.
నేను గొప్ప జ్ఞానిని అని సన్న్యాసత్వం తీసుకొని, ప్రజలకు భారత, భాగవత,
పురాణములను అనర్హళముగా చెప్పు స్థితిలోయున్న స్వామీజీలు కూడా
నేను ఆ పూజ చేశాను, నేను ఈ యజ్ఞము చేశాను, నేను పూజ చివరిలో
మంగళహారతి ఇచ్చాను అని చెప్పుకొంటున్నారు. పైకి ఎలా చెప్పినా
ఫరవాలేదుగానీ, లోపల భావములో 'నేను చేశాను' అను భావముతోనే
యున్నారు. కావున వారు ఎంత పెద్ద స్వామీజీలయినా, వారికి ఆత్మజ్ఞానము

తెలియదనియే చెప్పవచ్చును. ఆత్మజ్ఞానము తెలియనప్పుడు అతడు ఎంత
పెద్ద స్వామి అయినా సాధారణ మనిషివలె పాపపుణ్యములను పొందు
చుండును. అతడు చేయు యజ్ఞముల వలన, దానముల వలన,
వేదాధ్యయణముల వలన, తపస్సుల వలన పుణ్యము వచ్చును. యజ్ఞ,
దాన, వేదపఠన, తపస్సులను నేనే చేయుచున్నానను భావముండుట వలన
వాటి వలన వచ్చు కర్మఫలము అతనికే చేరుచున్నది. ఇందులో ఏమాత్రము
అనుమానము లేదు.

ప్రశ్న :- మేము అడిగినది రవ్వంత, మీరు చెప్పినది పేరంత. మాకు
కొంతవరకు అర్థమయినది. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పుచున్నారని
అర్థమయినది. నేడు ఎంతో పెద్ద స్వామీజీలున్నారు. భగవద్గీతను వివరించి
వ్రాసినవారు కూడా యున్నారు. భగవద్గీతలోనే ఆత్మల వివరమున్నదని
మీరు చెప్పారు. మీ సిద్ధాంతము కూడా భగవద్గీత ఆధారముతో చెప్పినదే.
అటువంటి భగవద్గీతకు భాష్యము చెప్పినవారు ఎందరో కలరు. వారికి
కూడా ఆత్మ విషయము తెలియదంటారా?

జవాబు :- భారత దేశములో ఆధ్యాత్మిక పీఠములను స్థాపించినవారికే
ఆత్మ విషయము తెలియదు. వారికి పరమాత్మ విషయము మాత్రము
తెలుసు. జీవునికి దేవునికి మధ్యలోయున్న ఆత్మను ఎవరూ గుర్తించలేదు.
భగవద్గీతలో ఆత్మను గురించి దాదాపు 70 శాతము భగవంతుడు
చెప్పియున్నా దానిని ఎవరూ తెలియలేదు. భగవద్గీతకు అనేక భాషలలో
వివరము వ్రాసినవారు కూడా ఆత్మను గురించి చెప్పినచోట దానిని
పరమాత్మగా చెప్పుకొన్నారు. కొందరు కొన్ని సందర్భములలో ఆత్మను
జీవాత్మగా లెక్కించుకొన్నారు. మూడు ఆత్మలు మన శరీరములో యున్నవను

విషయమే తెలియనివారైనారు. అందువలన గతములో ఆధ్యాత్మిక
సిద్ధాంతములను కనుగొన్న సిద్ధాంతకర్తలు కూడా రెండు ఆత్మలను కొందరు
చెప్పగా, ఆదిశంకరాచార్యుడు ఉన్నది ఒక ఆత్మేనని చెప్పి దానిని అద్వైత
సిద్ధాంతముగా ప్రతిపాదించాడు. ఈ విధముగా ఆధ్యాత్మిక విద్యలో
పెద్దవారని పేరుగాంచిన ముగ్గురు సిద్ధాంతకర్తలు ఆత్మను విస్మరించి
తమ సిద్ధాంతములను చెప్పారు. మనుషులకు దైవజ్ఞానము నేర్పువారై
అందరికీ మార్గదర్శకులైనవారే మార్గము తప్పి ఆత్మను తెలియక పోవడము
వలన, వారిని అనుసరించు వారికి ఆత్మజ్ఞానమే తెలియకుండా పోయినది.

ప్రశ్న :- హిందూ మతమునకు పునాదులవంటి సిద్ధాంతకర్తలకే ఆత్మజ్ఞానము
తెలియదంటారా?

జవాబు :- నేను చెప్పేది కాదనుకో, వారు చెప్పిన సిద్ధాంతములను నీవే
చూడు. అందులో ఆత్మను గురించిన సమాచారమెక్కడయినా ఉందేమో
చూపగలవా?
ప్రశ్న:- అయితే వారు చెప్పినది ఏమిటి? ముగ్గురు సిద్ధాంతకర్తలు ఆత్మను
గురించి చెప్పలేదా?

జవాబు :- మొదటి సిద్ధాంతకర్తయిన ఆదిశంకరాచార్యులవారు ఒకే
పరమాత్మను గురించి చెప్పారు. మూడవ సిద్ధాంతకర్త దేవున్ని మరియు
జీవున్ని గురించి చెప్పారు. మధ్యలో రెండవ సిద్ధాంతకర్త అద్వైతమునే
సమర్థిస్తూ దానిలోని భక్తిని విశిష్టముగా చెప్పారు. దానినే 'విశిష్టాద్వైతము'
అన్నారు. మూడవ ఆయన చెప్పినది జీవుడు, దేవుడు అను ఇద్దరినీ
చెప్పుట వలన దానిని 'ద్వైత సిద్ధాంతము' అంటున్నాము.
ప్రశ్న :- దేవుడు ద్వాపరయుగము చివరిలో, కలియుగము మొదటిలోనే

భగవద్గీతను చెప్పి అందులో సంపూర్ణ జ్ఞానమును ఇచ్చాడు కదా!
అటువంటప్పుడు ఈ సిద్ధాంతములేమిటి? వీరెందుకు వచ్చారు?
జవాబు :- రాజ్యాంగము ఒకటే అయితే ప్రభుత్వములో నేనే ప్రభువును
కావాలను ఉద్దేశ్యముతో నేడు అనేక రాజకీయపార్టీలు వచ్చాయి. ఒక్కొక్క
పార్టీ ఒక్కొక్క రాజకీయ సిద్ధాంతముతో రావడము జరుగుచున్నది. అలాగే
దేవుడు ఒక్కడే ఆ దైవత్వములో 'మేమే పెద్దలము' అని అనిపించుకొనుటకు
రాజకీయపార్టీలలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతముతో వచ్చారు. ఆ
విధముగా గతములో వచ్చినవారు ముగ్గురుకాగా ప్రస్తుతము మరియొక
సిద్ధాంతము బయటికి వచ్చినది. దానితో ఇప్పుడు హిందూమతములో
మొత్తము నాలుగు సిద్ధాంతములున్నవని చెప్పవచ్చును.

ప్రశ్న :- నేడు హిందువులుగా యున్నవారికి హిందూమతములో ఇన్ని
సిద్ధాంతములున్నవనీ, ఇంతమంది సిద్ధాంతకర్తలున్నారనీ ఏమాత్రము
తెలియదు. హిందువులకే హిందూ సిద్ధాంతములను గురించిగానీ, సిద్ధాంత
కర్తలను గురించిగానీ తెలియనందు వలన హిందూమతము గొప్పదని
తెలియక సిద్ధాంతకర్తలు లేని మతములోనికి హిందువులు చేరడము
జరుగుచున్నది. ద్వాపరయుగము చివరిలో భగవంతుడు చెప్పిన భగవద్గీత
లోని జ్ఞానమే మిగతా మత గ్రంథములలో కూడా యున్నదను విషయము
మూడు మతముల వారికి తెలియకుండా పోయినది. క్రైస్తవ మతములో
ఏసునే సిద్ధాంతకర్తగా చెప్పాలి. ఇస్లామ్ మతములోనికి వస్తే ముహమ్మద్
ప్రవక్తగారినే ఆ మత సిద్ధాంతకర్తగా చెప్పవచ్చును. వారు ఆ మతమును
స్థాపించినప్పుడు మాత్రమే జ్ఞానమును చెప్పిపోయారు. అవే వారి
గ్రంథములయినవి. అయితే హిందూ మతమునకు ప్రస్తుతము నలుగురు

సిద్ధాంత కర్తలున్నా మొదట భగవంతుడు చెప్పిన భగవద్గీతయే ఆధార
గ్రంథము. హిందూ మతములో సిద్ధాంతకర్తలు చెప్పిన సిద్ధాంతములు
శాస్త్ర సమ్మతివేనా?యను అనుమానము వస్తున్నది. భగవద్గీతను చెప్పిన
భగవంతుడు భగవద్గీతయే నిజమైన జ్ఞానమనీ, సృష్టి ఆదిలో చెప్పిన జ్ఞానమే
భగవద్గీతయని చెప్పగా దానిని కాదని వేదములను కొందరు సిద్ధాంతకర్తలు
తేవడము జరిగినది. అంతేకాక ముందు వచ్చిన సిద్ధాంతకర్తలు ఒకరి
సిద్ధాంతమును మరొక సిద్ధాంతకర్త ఖండించడము జరిగినది. ఈ
విషయములన్నియూ చాలామంది హిందువులకు తెలియదు. తెలిసినవారు
కూడా ఏది నమ్మాలో తెలియని స్థితిలో ఇతర మతములను ఆశ్రయించారు.
తెలియనివారు ఇతర మతముల లోని బోధను చూచి కొందరు పోవడము
జరిగినది. ఈ విధముగా సిద్ధాంతకర్తల వలన హిందూమతము అభివృద్ధి
అయినది ఏమీలేదుగానీ, ఇంకా క్షీణించినదనియే తెలియుచున్నది. ఇప్పటి
కొందరి హిందువులలో హిందూ మత గ్రంథము భగవద్గీతనా? భగవద్గీత
కంటే ముందు వచ్చిన వేదములా? ఏదని తెలియకున్నది. దీనిని గురించి
మీరేమంటారు?
జవాబు :- మనిషిగా నీతో మాట్లాడినా చెప్పేది నేను (జీవుడు) కాదనీ,
చెప్పేదంతా ఆత్మేనని జ్ఞాపకముతో వినమని ముందే చెప్పుచున్నాను.
జీవుడుగా నేను కూడా మీతో పాటు వినేవాడినే, చెప్పేవాడిని కాను.
ఆత్మపాత్ర అంతయూ అపరిచిత పాత్రయున్నట్లుండును. స్వయముగా
ఆత్మ మాట్లాడుచున్నా మనుషులందరూ జీవాత్మయే మాట్లాడుచున్నాడని
ఎవరూ గుర్తించరు. మాట్లాడే ఆత్మ కూడా నేను జీవాత్మనుకాను ఆత్మను
అని కూడా చెప్పడు. జీవాత్మ చెప్పినట్లే నమ్మించి చెప్పును. అందువలన
అందరూ ఆత్మను గుర్తించలేక పోవుచున్నారు. అందువలన మీరు మోస

పోకుండా చెప్పునది నేను కాదు ఆత్మేనని జీవునిగా నన్ను బాధ్యున్ని చేయ
కూడదని నేను ముందే చెప్పుచున్నాను. హిందువులకు అసలయిన జ్ఞాన
గ్రంథము భగవద్గీతయే. అయినా కొందరు హిందూమతములోని ప్రముఖులే
వేదములను ప్రమాణ గ్రంథములుగా చెప్పుచున్నారు. దానితో నిజమైన
జ్ఞానులలో కొంత అసంతృప్తి ఏర్పడుచున్నది. దేవుని జ్ఞానమును తెలిసిన
వారు హిందూమతములో ప్రముఖులుగా లేనందున, ప్రముఖులుగా
యున్నవారంతా జ్ఞానము తెలియని వారైనందున వేదములు హిందువుల
ప్రమాణ గ్రంథములను మాట కొంతవరకు వ్యాపించినది. అయితే ఆత్మ
జ్ఞానము తెలిసిన వ్యక్తిగా ప్రబోధానంద యోగీశ్వరులుగా నేను 'వేదములు
ప్రమాణ గ్రంథములు' అను మాటను ఖండించుచున్నాను.

ఇందూ సమాజము ఇందూమతముగా మారకముందు, ఇందూ
మతము కాస్త మార్పుచెంది హిందూ మతముగా మారిపోకముందు
ఇందువులందరూ వేదములను దూరముగా పెట్టి భగవద్గీతను తమ
జ్ఞాన గ్రంథముగా చెప్పుకొనెడివారు. కలియుగము ప్రారంభమయిన తర్వాత
దాదాపు మూడు వేల సంవత్సరములకు భారత దేశమంతా ఒక్కటిగాయున్న
ఇందూ సమాజము ఇందూమతముగా మారిపోయినది. ఇందూ
సమాజములో అంతవరకు లేని సిద్ధాంతము బయటికి వచ్చినది. కొన్ని
వేల సంవత్సరములనుండి ఇందూ సమాజమును మార్చి తమకు
అనుకూలమైన సమాజముగా మార్చుకోవాలనుకొన్న ఆర్యసమాజము వారు
ఇందువులలో త్రేతాయుగము నుండి మార్పు తేవాలని పూర్తి ప్రయత్నము
చేయుచూ వచ్చారు. అయినా అప్పటి కాలములో ఇందువులలోని జ్ఞానము
ఆర్యుల మాటను చెల్లుబడి కానీయలేదు. త్రేతాయుగములో రావణబ్రహ్మ
ప్రభావముతో ఆర్యుల ఆటలు సాగలేదు. ద్వాపరయుగములో వారికి

కొంత బలము చేకూరి ఇందువులలో మార్చు తెచ్చుతూ వచ్చారు. ద్వాపర
యుగ చివరకు ఆర్యులు పూర్తి పట్టు సాధించి తమకు నచ్చిన వేదములను,
యజ్ఞములను, దానములను, తపస్సులను బాగా ప్రచారము చేసి ఇందూ
జ్ఞానమును లేకుండా చేశారు. భారతదేశమంతా యున్న ద్రావిడజాతిని
ఉత్తర భారతదేశములో లేకుండా చేసి, కేవలము దక్షిణ భారతదేశమునకే
పరిమితి చేశారు. ఇప్పుడున్న కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ నాలుగు
రాష్ట్రముల ప్రాంతముల వరకే ద్రావిడులు ఉండిపోయారు. దక్షిణ దేశము
వరకు పరిమితమైన ద్రావిడులను కూడా తమవైపు మార్చుకొనే దానికి
ఆర్యులు అనేక ప్రయత్నములు చేశారు. అయితే ద్వాపరయుగ అంత్యములో
భగవంతుడయిన కృష్ణుడు చెప్పిన బోధ ఆర్యులకు కొంత అడ్డుకట్ట వేసినా
అది కొంతకాలము వరకే అయినది. భగవద్గీతను చెప్పిన మూడువేల
సంవత్సరములకు దక్షిణ దేశములో ఆర్యుల ప్రయత్నములు కొంతకుకొంత
సఫలీకృతమైనాయి. అలా చిన్నచిన్నగా దక్షిణ భారతదేశములో పట్టు
సాధించను మొదలు పెట్టారు. అటువంటి ప్రయత్నములలో పూర్తి
దక్షిణమున చివరిలో యున్న మళయాళ రాష్ట్రములో వారి క్రియను మొదలు
పెట్టారు. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని తయారు చేసి, అతని ద్వారా
ఇందువులకు వేదములు ప్రమాణ గ్రంథములని చెప్పించడము జరిగినది.
ఆర్యులయిన తాము చెప్పితే ద్రావిడులు తమ కుట్రను కనిపెట్టగలరనీ,
ఆర్యులయిన వారు బయటికి కనపడకుండా, ద్రావిడులలో కలిసిపోయి,
ద్రావిడులలోనే తమకు సరిపోవు వ్యక్తిని తయారు చేసి ద్రావిడుల చేతనే
ద్రావిడులందరికీ తెలియునట్లు వేదములను గురించి చెప్పి భగవద్గీతను
అణచివేయాలనుకొన్నారు. అప్పుడు వారు చేసిన కుట్ర ఫలితముగా నేడు
చాలామంది హిందువుల ప్రమాణ గ్రంథము వేదములు అంటున్నారు.

నేడు ఎవరూ గుర్తించని ఆర్యుల కుట్రలను గుర్తించి త్రేతాయుగము
నుండి ఆర్యులు ఎలా భారతదేశములో ప్రవేశించారో, ఎలా ఉత్తర భారత
దేశమునంతటినీ ఆక్రమించుకొన్నారో, అప్పటినుండి వారు చేయుచున్న
ఆచరణలేమిటో, తెలియజేస్తూ వచ్చాము. త్రేతాయుగమున దక్షిణ భారత
దేశమునకు అనుబంధముగా యుండి భారతదేశములో ఒక భాగముగా
చెప్పబడు శ్రీలంకకు రాజయిన రావణబ్రహ్మ అప్పటి కాలములో ఆర్యులను
దక్షిణ దేశమువైపు రాకుండా చేశాడు. అంతేకాక తమ సైన్యముతో వారి
యజ్ఞ యాగాదులను జరుగకుండా చూచెడివాడు. కాలము జరిగిపోగా
రావణ బ్రహ్మ అంతటి జ్ఞానులు లేకపోవడముతో ఆర్యుల బలము పెరుగుతూ
వచ్చినది. ఈ విషయములన్నియూ తెలియజేసి నేడు ద్రావిడులను కొంత
కన్ను తెరిపించాము. అయినా ఆర్యుల ముందర మా కృషి చాలా చిన్నది.
కావున చాలామంది వేదములే ముఖ్య గ్రంథములని చెప్పుచూ యజ్ఞములను
చేయుచునే యున్నారు. సత్యమును చెప్పుచున్న మా మీద ఆర్యులు చెడు
బుద్ధితోనే కుట్రలు చేయుచున్నారు. అయినా మా పనిని మేము వదలలేదు.
భగవద్గీతను గురించే చెప్పుచున్నాము. అదియే హిందువుల ప్రమాణ
గ్రంథమంటున్నాము. వేదములను కాదంటున్నాము.

ప్రశ్న :- దక్షిణ దేశమునకు వచ్చిన ఆర్యులు కేరళ రాష్ట్రములో తమకు
అనుకూలముగా ఎవరిని మార్చగలిగారు? ఎవరిని గొప్పగా తయారు చేసి
అతనితో వేదములే గొప్పయని చెప్పించారో చెప్పగలరా?

జవాబు :- చెప్పగలము. జరిగిన చరిత్రను చెప్పడములో తప్పులేదు
కదా! నేను చెప్పునది జరిగిన చరిత్రే అయినా అది చాలామందికి తెలియదు.
కొందరికి తెలిసినా, వారికి తెలిసినదంతా సత్యము కాదు. అందువలన

చరిత్రలో మరుగున పడిపోయిన విషయములను బయటికి లాగి చెప్పవలెనని
అనుకున్నాము. కలియుగము వచ్చిన తరువాత దాదాపు రెండువేల
ఐదువందల (2500) సంవత్సరములు గడచిన తర్వాత గౌతమ బుద్ధుడు
జన్మించి, ఆయన పెద్దవాడై తాను అనుభవములో పొందిన జ్ఞానమును
ప్రజలకు చెప్పను మొదలిడెను. ఇప్పటికి 2600 సంవత్సరముల క్రితమే
ఆర్యులకు బుద్ధుడు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. బుద్ధుడు తనకు
తెలిసిన అష్టాంగ సూత్రములను ప్రచారము చేయగా, అప్పటికే కుల
వివక్షలతో ఇబ్బంది పడుచున్న ప్రజానీకమంతయు బుద్ధుడు ప్రతిపాదించిన
“అందరూ సమానమే. ఎవరినీ తక్కువగా చూడకూడదు. అందరికీ
మంచి జరగాలని కోరుకోవాలి. అందరినీ క్షమించు స్వభావముండాలి.
ఇతరుల ఆనందమే తన ఆనందమని తలచవలెను. ఇతరులు బాధపడు
పనులను చేయకూడదు. అందరి క్షేమాన్ని కోరుకోవలెను. సర్వప్రాణులను
సమదృష్టితో చూడవలెను” అను ఎనిమిది సూత్రములవైపు ఆకర్షితులై,
ఆర్యులనుండి బుద్ధునివైపు మొగ్గుచూపను మొదలిడినారు.

యుద్ధములలో అందరినీ హింసించి విసుగెత్తిన అశోకచక్రవర్తి
బుద్ధుని సూత్రములకు పూర్తిగా ఆసక్తుడైనాడు. అంతేకాక అశోకచక్రవర్తి
కూతురు, కొడుకు ఇద్దరూ దేశములోనూ, ఇతర ప్రాంతములలోనూ, బుద్ధుని
సూత్రములను ప్రచారము చేయసాగిరి. ఆయన చెప్పిన అష్ట సూత్రములను
పెద్ద స్థూపముల మీద వ్రాయించి అందరికీ తెలియునట్లు చేశారు.
ఇదంతయూ ప్రక్కనయుండి గమనించిన ఆర్యులు బుద్ధుడు ప్రచారము
కావడము ఇష్టములేక బుద్ధుని మీద కూడా అసూయపడసాగిరి. ద్రావిడులనే
భ్రష్టు పట్టించిన ఆర్యులకు బుద్ధుడు ఒక లెక్కనా అన్నట్లు, బుద్ధుడు హిందూ
మతమువాడే కాదు అని ప్రచారము చేసి, ఎవరినీ బుద్ధుని వైపు పోకుండా

చూడాలని పథకము వేశారు. దానిప్రకారమే బుద్ధుడు పరమతము వాడనీ,
హిందువులైన ఆర్యులకు వ్యతిరేఖముగా బోధిస్తున్నాడనీ, అట్లు బోధించుట
వలన హిందూమతము క్షీణించి పోయి చివరకు అందరూ బౌద్ధ మతస్థులుగా
మారిపోవుదురనీ ప్రచారము చేశారు. అంతవరకు మతముల ప్రసక్తే లేని
హిందువులలో బౌద్ధమతమను దానిని ఆర్యులే మొదట పేరు పెట్టి చెప్పారు.
గౌతమబుద్ధుడు మొదటినుండి హిందూ సమాజములోనే ఉండినా, అతడు
తమకంటే వేరు మతస్థుడుగా యున్నాడని ఆర్యులు ప్రచారము చేయసాగారు.

హిందూదేశముగా మారిపోయిన ఇందూదేశములో, కలియుగము
వచ్చిన తర్వాత కూడా 2500 సంవత్సరములు మతము అనుమాటయే
లేదు. ఉన్నది హిందూ సమాజము మరియు ఆర్య సమాజము. అటువంటి
సమయములో బుద్ధుడు హిందూసమాజములోనే పుట్టాడు. బుద్ధుడు
సన్న్యాసత్వము తీసుకొని, కాషాయగుడ్డలు ధరించి గుండు గీయించుకొని,
హిందూసన్న్యాసులవలె భార్యను కూడా వదలి, అన్నిటినీ సన్యసించిన
హిందూసన్న్యాసియే. అటువంటి సన్న్యాసి అయిన బుద్ధుని సూత్రములకు,
ఆయన జ్ఞానమునకు ప్రజలు, ప్రభువులు ఆకర్షితులగుచున్నారని
ఓర్వలేక తమ ఆర్యుల ప్రాబల్యము బుద్ధుని వలన తగ్గిపోతుందేమోనను
అనుమానముతో, బుద్ధుని మీద అసూయపడి, బుద్ధుడు హిందూ సన్న్యాసిగా
యున్నప్పటికీ ఆయనను పరమతస్థుడనీ, హిందూ మతమువాడు కాదు
అనీ, బౌద్ధమతము వేరు హిందూమతము వేరనీ, బుద్ధున్ని హిందూ
సమాజమునుండి చీల్చివేసి, బౌద్ధమతస్థునిగా వర్ణించి చెప్పారు. అప్పటికే
కొంతకాలమునుండి ప్రచారమవుతున్న బౌద్ధ సూత్రములను భారతదేశములో
ఎవరూ తెలుసుకోకుండునట్లు ఆర్యులు కట్టడి చేశారు. ఆర్యుల మాటలు
వినుచున్న వారందరూ బౌద్ధ సూత్రములను వదిలివేయగా, బౌద్ధ మతము


భారతదేశములో అభివృద్ధి చెందలేక పోయినది.అయితే ఆర్యుల
ప్రభావములేని చైనా, టిబెట్, జపాన్, శ్రీలంక, రష్యా మొదలగు ఆసియా
దేశములలోనూ, ఐరోపా ఖండములోనూ బౌద్ధమతము బాగా అభివృద్ధి
చెందినది. ఆర్యుల అసూయవలన భారతదేశములో పుట్టిన బౌద్ధమతము
భారతదేశములో అభివృద్ధి చెందలేక పోయినా, నేడు మిగతా దేశములలో
హిందూ మతముకంటే గొప్పగా యున్నది.

ఆనాడు అసూయతో హిందువులలోని బుద్దున్ని హిందువులనుండి
వెలివేయక బుద్దుడు కూడా భారతదేశములోని హిందువే కదా!యని
అనుకొనియుంటే బౌద్ధము నేడు హిందువులలో హిందూ సమాజముగానే
యుండేది. అలా బౌద్ధము హిందూ సమాజమైయుండి వుంటే నేడు
బౌద్ధమతమనునది ఉన్న దేశములలో కూడా హిందూ మతమున్నదని
చెప్పుకొను అవకాశము ఉండేది. అట్లు హిందూ మతము ఎన్నో దేశములలో
విస్తరించినదిగా యుండేది. అయితే ఆర్యులు స్వార్థ బుద్ధితో చేసిన
పనివలన, బుద్ధున్ని హిందూమతమునుండి వెలివేసిన దానివలన, ఆర్యులు
హిందూ సమాజమును నాశనము చేశారనియే చెప్పవచ్చును గానీ,
ఉద్ధరించారని చెప్పలేము. తమ ఆధిపత్యము కొరకు, తమ సుఖముల
కొరకు హిందూమతమునకు తీరని ద్రోహము చేశారని చెప్పవచ్చును.
ఆర్యులు తెలివైనవారు గనుక వారు తప్పు చేసినా ఏమాత్రము
బయటపడకుండా ఇతరుల దృష్ఠిలో తమ తప్పు లేదన్నట్లు నేడు హిందూ
ధర్మరక్షణ అను నినాదమును మొదలు పెట్టారు. వారు అట్లుండగా ఆర్య
సంతతి కాని ద్రావిడులు తెలివితక్కువగా యుంటూ సమాజములో ఆర్యుల
వలన ఏ పని జరిగినా, ఇది మంచిదా చెడుదాయనిగానీ, ఆర్యులు హిందూ
సమాజమును ఉద్ధరిస్తున్నారా లేక నాశనము చేయుచున్నారా అనిగానీ


గ్రహించలేకపోవుచున్నారు. అంతేకాక ద్రావిడ జాతినుండి మభ్యపడి
శూద్రులైన వారిని ఆర్యులైనవారు వాడుకొంటూ, తమకు ఎవరైనా
శత్రువులుగానో, విమర్శకులుగానో కనిపిస్తే శూద్రులనే ప్రేరేపించి వారినే
వాడుకొని, వారి చేతనే ఇతరులను అణచివేయుచున్నారు. తమకు
ఆటంకముగా యున్న శూద్రులను శూద్రులచేతనే కొట్టించి, తిట్టించి తమకు
అడ్డు లేకుండా చేసుకొంటున్నారు.

హిందువులలో శూద్రుడయిన బుద్ధున్ని తమవాడు కాదంటూ
దుర్భుద్ధితో, శూద్రుల చేతనే దూరము చేయించిన ఆర్యులు, ఎవరైనా
శూద్రుడు తమకు వ్యతిరేఖముగా కనిపిస్తే, వారిని పరమతము వాడని
ముద్రవేసి, శూద్రుడయిన వానిని శూద్రులచేతనే హింసించి, వారి దారికి
అడ్డులేకుండా చేసుకోవడము జరుగుచున్నది. అయితే శూద్రులు ఆర్యుల
చేతిలోని ఆయుధములాగ తయారై, శూద్రులయిన వారినే శూద్రులే
బాధించడములో ఆర్యుల తెలివి కనిపించినా, వారికి ఉపయోగపడు శూద్రుల
తెలివితక్కువ పని బాగా కనిపించుచున్నది. నేడు శూద్రులైన వారు ఎంతో
నేర్చుకోవలసియున్నది. ఎవరో ఏదో చెప్పితే అదియే నిజమని నమ్మి,
ఒక శూద్రుడు మరొక శూద్రున్ని బాధించడము, హింసించడము శూద్రుల
తెలివితక్కువపని కాదా!యని అడుగుచున్నాము. శూద్రులు ఆర్యుల ఇంటి
కుక్కలవలె వ్యవహరిస్తూ, వారు ఎవరిని కరువమంటే వారిని కరుస్తూపోతే,
హిందూసమాజము క్షీణించక ఎలా అభివృద్ధి కాగలదు? హిందూ ధర్మరక్షణ
అను సాకుతో హిందువునే హిందువుల మీదికి ప్రేరేపించు ఆర్యులు
ఉన్నంత వరకు, ఆర్యులు ప్రేరేపిస్తే వెనుకా ముందు చూడకుండా ఇతరుల
మీద దాడిచేయు శూద్రులు ఉన్నంతవరకు, హిందూ సమాజము
క్షీణించడము తప్ప, అభివృద్ధి చెందడము ఉండదు.

ఈ గ్రంథమును చదివేవారు ఎవరైనా న్యాయముగా బుద్ధుని
విషయమును గురించి చెప్పండి. అప్పటివరకు మచ్చుకైనా ఇతర మతమే
లేని ఆ రోజులలో, బుద్ధుడు నా మతము వేరని ఎక్కడైనా చెప్పాడా? నేను
కూడా హిందూ సమాజము వాడినేనని, హిందుత్వమునకు గుర్తింపు
రంగుగాయున్న కాషాయమును ధరించినా, సన్న్యాసిగా మారినా, నీవువేరు,
నీ జ్ఞానము వేరు, నీ మతము వేరని హిందూ సమాజమునుండి
వెలివేసినవారు హిందుత్వమును ఉద్దరించువారా? హిందూ ధర్మరక్షణ
చేయువారా? ఈ ప్రశ్నలకు జవాబును న్యాయముగా చెప్పితే
హిందుత్వమును సర్వనాశనము చేసినవారని చెప్పవచ్చును. హిందూ
ధర్మములను భక్షించినవారని చెప్పవచ్చును. ఆనాడు ఆర్యులు అసూయతో
బుద్ధున్ని వెలివేసి, నేడు బౌద్ధము హిందుత్వములోని భాగమే అని చెప్పుకోలేని
స్థితిలోనికి పోయి, హిందుత్వమునకు, హిందూ ధర్మములకు తీరని ద్రోహము
చేశారనియే చెప్పవచ్చును.

ప్రశ్న :- ఇంతవరకు ఆర్యులకు ఎవరూ అడ్డు తగలలేదా? వారి తెలివికంటే
మించినవారు పుట్టలేదా?

జవాబు :- ఆర్యులకు అడ్డుతగిలిన వాడు గౌతమ బుద్ధుడు, కలియుగము
రెండువేల ఐదు వందల (2500) సంవత్సరములు గడచిన తర్వాత ఇందూ
దేశమని చెప్పబడుచున్న భారతదేశములో కాశీకి ఉత్తరమున, అయోధ్యకు
ఈశాన్యమున భుయిలా అను గ్రామములో గౌతమ బుద్ధుడు జన్మించాడు.
తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోధనుడు అయితే బుద్ధుడు అను పేరు
ఆయనకు జ్ఞానోదయము అయిన తర్వాత వచ్చినది. పుట్టినప్పుడు పెట్టిన
పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అనగా మోక్షమును అర్థించువాడు లేక ముక్తిని
అడుగువాడని అర్థము. ఆ దినము వారి తల్లి తండ్రులైన శుద్ధోధనుడు

మాయాదేవి తెలిసో, తెలియకో మంచి అర్థమున్న పేరును సిద్ధార్థుడని
పెట్టడము జరిగినది. సిద్దార్థుడు పుట్టిన కొద్దికాలమునకే, సంవత్సరము
గడువకముందే తల్లి క్షయ రోగముతో చనిపోగా, ఆయన పినతల్లి అయిన
గౌతమీదేవి చిన్నప్పటినుండి సాకినందువలన, ఆయనను అందరూ
గౌతముడు అని పిలిచెడివారు. ఈ విధముగా గౌతముడను రెండవ పేరు
ఆయనకు రావడము జరిగినది. గౌతముడు పెరిగి పెద్దయి వివాహము
జరిగి, కుమారుడు పుట్టిన తర్వాత జ్ఞాన జిజ్ఞాస కలవాడై, వైరాగ్యమును
పొంది ఒక దినము అర్థరాత్రి భార్య యశోధరాదేవినీ, సంవత్సరపు
కుమారున్నీ వదిలి ఇంటినుండి పోయినవాడు తిరిగి ఇంటికి రాలేదు.
భారతదేశములోని బీహారు రాష్ట్ర ప్రాంతములో పుట్టినవాడైనందున
భారతదేశములోని ఇందూ సాంప్రదాయముల ప్రకారము శిరోముండనము
చేయించుకొని, కాషాయ గుడ్డలు ధరించి, సర్వసంగసన్న్యాసిగా మారి
పోయిన గౌతముడు జన్మనుండి కడతేరు జ్ఞానము కొరకు అనేక
గురువులనూ, మహర్షులనూ, పండితులనూ కలిసి జ్ఞానమును తెలుసు
కొనినా, వారు చెప్పిన మాటలకు అసంతృప్తి చెంది, చివరకు 'గయ' అను
ప్రాంతములో బోధి చెట్టుక్రింద (రావి చెట్టు క్రింద) కూర్చొని యోచించు
చుండగా ఆయనకు జ్ఞానోదయమైనదని తెలిసినది. అప్పటినుండి
గౌతముడు గౌతమబుద్ధుడుగా పిలువబడెను. ఈ విధముగా బుద్దుడు
అని మూడవ పేరు వచ్చినది. బుద్ధుడు అనగా బుద్ధి ప్రకాశించిన వాడనీ,
జ్ఞాని అనియూ అర్థము రాగలదు. ఈ విధముగా జ్ఞానిగా మారిన గౌతముడు
ఆయన ప్రతిపాదించిన ఎనిమిది సూత్రములను అందరికీ బోధించెను.
అష్టాంగమార్గములను ఆ ఎనిమిది సూత్రములే బుద్ధుని బోధలో ముఖ్య
అంశములు.

అప్పటి ఆర్యులు సృష్ఠించిన కుల వివక్షలకు బుద్ధుని సూత్రములు
ఆటంకములై కూర్చోవడమూ, దానికి బుద్దుని మీద అసూయచెందిన ఆర్యులు
హిందువు అయిన బుద్ధున్ని పరాయి మతమువానిగా సృష్టించి, హిందూ
సమాజమునుండి బౌద్ధమతమను దానిని చీల్చివేయడమూ అందరికీ తెలిసిన
విషయమే. ఈనాడు అదే బౌద్ధీయము ఆసియా ఖండములోనే కాకుండా
ఐరోపా ఖండములోనికి కూడా ప్రాకియున్నది. నేడు ఎంతో పెద్ద
సమాజముగా తయారైన బౌద్ధ సమాజమును ఆర్యులు అసూయతో హిందూ
సమాజమునుండి చీల్చి బయటికి వేసినదేనని జ్ఞప్తికి ఉంచుకోవలెను.
దీనిప్రకారము ఆర్యులు హిందూ సమాజమునకు తీరని ద్రోహము చేశారు.
అంతేకాకుండా బుద్ధుడు పుట్టిన తర్వాత దాదాపు ఐదువందల
సంవత్సరముల కాలములో భారతదేశమున ఎందరో ఆర్య సాంప్రదాయము
లను వదిలి బౌద్ధ సూత్రములను అనుసరించుచుండుటను సహించలేక
భారతదేశములోనున్న బుద్ధ సమాజమును లేకుండా జేయుటకు, బుద్ధునివలె
పూర్తిగా సన్యసించినవాడై, బుద్ధునివలె శిరోముండనము చేయించుకొని
బుద్ధునివలె పూర్తిగా ఇల్లు వదలినవాడై ఉండునట్లు, దక్షిణ దేశమున పూర్తి
ద్రావిడ దేశము అనిపించుకొన్న కేరళ (మళయాళ) బ్రాహ్మణున్ని అతి
చిన్న వయస్సులోనే బయటికి తెచ్చి, ఆయనకు శంకరుడని పేరుపెట్టారు.
ఆయనే ఆది శంకరాచార్యులుగా చెప్పబడినాడు. ఆదిశంకరాచార్యులు
ఆనాడు బౌద్ధమతము నుండి హిందూ మతమును కాపాడుటకు దివినుండి
భువికి వచ్చిన సాక్షాత్తు కైలాస శంకరుడని ఆర్యులు ప్రచారము చేశారు.
తమ తరపున బుద్ధునికి సమానరూపుగా కనిపించు శంకరాచార్యున్ని
తయారుచేసి, ఆనాడు ఆర్యుల మాతృభాష అయిన సంస్కృత భాషను
శంకరాచార్యునికి పూర్తిగా నేర్పి, ఇరవై సంవత్సరముల వయస్సుకే ఆయనను
హిందూ సమాజమునకంతటికీ గురువుగా ప్రకటించారు.

బుద్ధుని సూత్రములకు ఆకర్షితులైన వారిని తిరిగి హిందూ
సమాజములోనికి వచ్చునట్లు, బుద్ధునికి బద్ద శత్రువుగా శంకరాచార్యున్ని
తయారు చేసి పంపారు. దక్షిణ భారతదేశమునుండి ఉత్తర భారతదేశము
వరకు అనగా ఆసేతు హిమాలయముల వరకు (దక్షిణమున భారతదేశము
చివరిలోనున్న సముద్రతీర ఇసుక దిబ్బలనుండి హిమాలయములలోని
పర్వతముల వరకు) శంకరాచార్యుడు రెండుమార్లు కాలినడకన ప్రయాణము
సాగించాడు. అలా కాలినడకన తిరుగుచూ ఎక్కడ బుద్ధుని సూత్రములున్నవో
అక్కడ వాదోపవాదములకు దిగి తనవాదననే గొప్పదని చెప్పి వాదించడమే
ఆయనవంతు. తర్వాత శంకరుడే గెలిచాడని ప్రచారము చేయడము
ఆర్యులవంతు. ఈ విధముగా 20 సంవత్సరముల చిన్నపిల్లవాడైన
శంకరునికి ఆచార్యుడని బోర్డు తగిలించి, రెండుమార్లు భారతదేశమంతా
కాలినడకన తిరుగునట్లు చేశారు. రెండుమార్లు తిరుగుటకు పన్నెండు
సంవత్సరములు పట్టింది. పన్నెండు సంవత్సరములు నడిచేదానికి
శరీరములోని సారమంతయూ అయిపోయి చివరకు నడకవలనే ఆయన
ముఫ్పైరెండు (32) సంవత్సరములకే చనిపోయాడు. పదహారు
సంవత్సరముల వయస్సులోనే సన్న్యాసత్వము తీసుకొన్న శంకరుడు పూర్తిగా
నాలుగు సంవత్సరములు సంస్కృతములోని వేదములను, ఉపనిషత్తులను
నేర్వగలిగాడు. తర్వాత ప్రణాళిక ప్రకారము అందరితో వాదిస్తూ పన్నెండు
సంవత్సరములు తిరిగాడు. చివరకు చిన్నవయస్సులోనే చనిపోయాడు.

శంకరాచార్యుల పర్యటనలో ఎందరో పండితులు, జ్ఞానులు కలిసి
శంకరాచార్యులు బోధించు అద్వైత సిద్ధాంతమును గురించి వాదించారు.
అయితే అన్నిచోట్లా శంకరాచార్యుడు వాదనలో గెలువలేదు. ఎన్నోచోట్ల
తనమాటల చతురతతో గెలిచినా, కొన్నిచోట్ల తప్పనిసరిగా ఓడిపోవలసి

వచ్చినది. అలా ఓడిపోయిన వాటిని బయటికి ప్రొక్కకుండా చేసి, గెలిచిన
వాదనలను మాత్రము బయటికి తెలిపి శంకరుడు గొప్పవాడు, శంకరుని
అద్వైత సిద్ధాంతము గొప్పదని ఆర్యులు శంకరాచార్యున్ని వెనకేసుకు వచ్చెడి
వారు. ఈ విధముగా శంకరాచార్యున్ని ద్రావిడులనుండే తీసి, వారి స్వార్థము
కొరకు ఆర్యులు శంకరున్ని పావువలె వాడుకొన్నారు. ఉత్తర దేశ
బ్రాహ్మణున్ని శంకరాచార్యులుగా ప్రకటించడముకంటే, ద్రావిడజాతి
నుండియే తీసుకొని గురువుగా చేసి, ద్రావిడులకు బౌద్ధులకు బుద్ధి చెప్పించి
తమవైపు మరల్చుకోవాలని అనుకొన్నారు. ద్రావిడుల నుండి తమకు
అనుకూలముగా తయారు చేస్తే, మిగతా ద్రావిడులందరూ దారికి వస్తారను
ఉద్దేశ్యముతోనే, శంకరాచార్యులను ఏరికోరి దక్షిణ దేశమువాడినే
తీసుకొన్నారు. అట్లు తీసుకోవడమేకాక బుద్ధుడు ఏ విధముగా
సన్న్యాసియైనాడో, అదే విధముగా కనిపించునట్లు సన్న్యాసిని చేశారు.
(బుద్ధుడు ముసుగువేయని సన్న్యాసికాగా, శంకరాచార్యుడు ముసుగు వేసిన
సన్న్యాసిగాయున్నాడు. ) హిందూ సమాజమంతయూ బౌద్ధ సమాజములో
కలిసిపోవు సమయములో, ఆదిశంకరాచార్యుడు వచ్చి హిందూ
సమాజమును రక్షించాడని చాలామంది చెప్పుచుండగా మేము విన్నాము.
చరిత్ర తెలియనివారు మాట్లాడు విధానము అంతేకదా!యని అనుకొన్నాము.
హిందూ సమాజమును విదేశములలో ఇతర ఖండములలో ప్రాకునట్లు
చేసిన బుద్ధున్ని పరమతమువాడని చెప్పడము, హిందుత్వమును రక్షించడమో
లేక భక్షించడమో మీరే అర్థము చేసుకోండి. నేటికినీ తమకు మించిన
బోధను ఎవరు చెప్పినా, వేదములను యజ్ఞములను ఎవరు ఖండించితే
వారినందరినీ పరమతమువారని పేరుపెట్టి ముద్ర వేసెడివారు. ఈనాడు
కూడా ఆర్యులు అదే పనినే చేయుచునేయున్నారు. ఆర్యుల అద్వైత

సిద్ధాంతమును అతిక్రమించిన త్రైత సిద్ధాంతమును మేము ప్రతిపాదించగా,
మమ్ములను కూడా పరమతమని చెప్పి, శూద్రుడనైన నామీదికి శూద్రులనే
దాడికి పంపిన సంఘటన, నాలుగు సంవత్సరముల క్రిందట ఇక్కడే
అనంతపురము జిల్లాలోని గుంతకల్లులోనే జరిగినది. దీనినిబట్టి ఆర్యులు
ఈనాటికీ తమకంటే ఇతరులు ముందుకు రాకూడదను చెడు ఉద్దేశ్యముతోనే
ఉన్నారని తెలియుచున్నది.

ప్రశ్న :- బుద్ధుని తర్వాత భారతదేశములో ఆర్యులకు గట్టిగా పోటీనిచ్చు
వారు ఎవరూ రాలేదా?

జవాబు :- బుద్ధుడు వచ్చిపోయిన ఐదువందల సంవత్సరములకు ద్రావిడ
బ్రాహ్మణుడైన (కేరళ బ్రాహ్మణుడైన శంకరాచార్యున్ని ఒక పావుగా
వాడుకొని, తమ అద్వైతమును శంకరాచార్యుల ద్వారా ప్రచారము చేసి,
ముందునుండి యున్న తమ అద్వైత సిద్ధాంతమును, అప్పుడే శంకరుడు
కనిపెట్టినట్లు చూపించారు. అయితే హిందూత్వములో ఒక సిద్ధాంతము
అద్వైత సిద్ధాంతమని వారు చెప్పగా, ఇది ఫలానా సిద్ధాంతము అని
అందరికీ తెలిసినది. శంకరాచార్యుడు చనిపోయిన తర్వాత ఆర్యులకు
ఆటంకము లేకుండా పదిహేనువందల సంవత్సరములు గడచిపోయినది.
తర్వాత పూర్తి ద్రావిడ రాజ్యముగానున్న తమిళనాడులో ఆర్యసిద్ధాంతమును
వ్యతిరేఖిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతముతో రామానుజాచార్యులు పుట్టుకు
వచ్చాడు. రామానుజాచార్యులవారు ద్రావిడ బ్రాహ్మణుడే అయినా, కొంత
ఆర్యులకు వ్యతిరేఖముగాయున్నా ద్రావిడులకు మాత్రము అనుకూలముగా
ఉండెడివాడు కాదు. ఆర్యులు తమకంటే గొప్పవారు కావాలనుకొన్న వారిని
ఎవరినీ వదలరన్నట్లు, రామానుజాచార్యులవారిని ఆర్యులు భయపెట్టి రహస్య

జీవనము సాగించునట్లు, బయటికి రాకుండునట్లు చేశారు. అయినా
రామానుజాచార్యుల వారు 120 సంవత్సరములు పూర్తిగా బ్రతికి, తన
విశిష్టాద్వైత సిద్ధాంతమును, వైష్ణవ సాంప్రదాయముగా బోధించెను.
ఆర్యులది శైవ సాంప్రదాయముకాగా, రామానుజాచార్యుల వారిది వైష్ణవ
సాంప్రదాయము. రామానుజాచార్యుల వలన దేశములో ఎందరో వైష్ణవులు
తయారై విశిష్టాద్వైతమును అనుసరించిరి. దానిని ఓర్వలేని ఆర్యులు
అద్వైతులను పేరుతో విశిష్టాద్వైతుల మీదికి అప్పుడప్పుడు వాదించుచూ,
వీలైతే దాడులు చేయుచూ వైష్ణవులైన వారిని అణచివేయాలని ఎంతో
ప్రయత్నము చేశారు. అయినా వారి ప్రయత్నము పూర్తి కాలేదు. ఇప్పటికీ
వైష్ణవ సాంప్రదాయములతో కూడిన విశిష్టాద్వైత సిద్ధాంతము దేశమంతా
అక్కడక్కడ కనిపించుచున్నది. రామానుజాచార్యులు వచ్చిపోయిన కొంత
కాలమునకు మధ్వాచార్యుల వారు కర్ణాటక రాష్ట్రములో పుట్టి, తనదైన
ద్వైత సిద్ధాంతమును బోధించాడు. ద్వైత సిద్ధాంతము కూడా అద్వైత
సిద్ధాంతమునకు పూర్తి విరుద్ధముగా యుండును. మధ్వాచార్యులను
అనుసరించిన వారు బహుకొద్దిమంది యుండినా, వారు కూడా నేటికినీ
అక్కడక్కడ కనిపించుచున్నారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు
ద్వైత సిద్ధాంతమునకు సంబంధించిన వాడే. ద్వైత సిద్ధాంతము వేరుగా
యున్నా పైకిమాత్రము కట్టుబొట్టు రూపములో విశిష్టాద్వైతము వారిని
పోలియుండును. విశిష్టాద్వైతులు, ద్వైతులు ఇరువురు వైష్ణవ నామమునే
ధరించడము విశేషము.

నేడు ప్రస్తుత కాలములో త్రైత సిద్ధాంతము ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరులను మాతోనే ప్రారంభమైనది. త్రైత సిద్ధాంతము ఇందుత్వములో
ముఖ్యమైన సిద్ధాంతమైనా, ఇది మిగతా అద్వైత, ద్వైత సిద్ధాంతములకు

పూర్తి భిన్నముగాయుండును. అయితే త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో దేవుని
చేత మొట్టమొదటగా బోధింపబడిన మూడు ఆత్మల జ్ఞానము, దీనినే
ఆకాశవాణి చెప్పగా, సూర్యుడు కూడా దీనినే భూమిమీద మనుషులకు
చెప్పడము జరిగినది. ఇంతవరకు ఆర్యుల అద్వైతమునకు మొదట బుద్ధుని
సూత్రములు అడ్డము రాగా, దానిని ఆర్యులు పూర్తిగా అధిగమించారు.
తర్వాత వచ్చిన విశిష్టాద్వైత, ద్వైతముల వలన కొంత ఘర్షణ ఏర్పడినా,
వాటిని ఆర్యులు పూర్తిగా తొలగించలేక పోయారు. అయితే ఇప్పుడు
వచ్చినది ఆదిలోని త్రైత సిద్ధాంత జ్ఞానము అయినందున, అసలైన ద్రావిడుల
మూడు ఆత్మల జ్ఞానము అయినందున, పూర్వమువలె ప్రస్తుత కాలములో
తెలివి తక్కువ ద్రావిడులు లేనిదానివలన, ఉన్నవారంతా తెలివైన ద్రావిడులే
ఉండుట వలన, ముఖ్యముగా మూడు ఆత్మల ద్రావిడ జ్ఞానము నేడు
సిద్ధాంతమును సంతరించుకొని త్రైత సిద్ధాంతముగా వచ్చియుండుట వలన,
త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినది, మహర్షి గానీ, తపస్వి గానీ, వేదాంతి
గానీ కాకుండా యోగి అయిన ప్రబోధానంద యోగీశ్వరులు అయినందున,
ఈ జ్ఞానము ఆర్యులకు అడుగడుగున ఆటంకముగాయుండును.

కృతయుగము చివరినుండి, త్రేతాయుగము మొదటినుండి,
ఆటంకములేని పెత్తనమును నడిపిన ఆర్యులు నేడు త్రైత జ్ఞానము ముందర
తమ పెత్తనమును మూటగట్టి ప్రక్కన పెట్టవలసి వస్తున్నది. అందువలన
బుద్ధుని కాలమునుండి మొదలై చివరికి ఆర్యులకు ఇప్పుడు గట్టి పోటీ
ఏర్పడుచున్నది. "వెయ్యి ఏనుగులను తిన్న రాబందులైనా ఒక్క గాలివానతో
చనిపోవునని” పెద్దలు చెప్పిన వాక్యము ప్రకారము రెండు యుగముల
కాలము భారతదేశములో పెత్తనము చెలాయించిన ఆర్యులు నేడు త్రైత
సిద్ధాంతము ముందర తలవంచవలసిన అవసరమొస్తుందని చెప్పక తప్పదు.

ఆర్యులు గతములో చేసిన తప్పులకు తప్పక శిక్షను అనుభవించ వలసి
వస్తుంది.

ప్రశ్న :- భారతదేశములో పుట్టిన గౌతమ బుద్ధునిది ఇతర మతముగా
చెప్పిన ఆర్యులు, రామానుజాచార్యులను రహస్య జీవనము గడుపునట్లు
భయపెట్టిన ఆర్యులు, ఈ మధ్య కాలములో పద్య రూపములో జ్ఞానమును
చెప్పిన వేమనను కూడా చెడుగా చెప్పక వదలియుందురా?

జవాబు :- తాము తప్ప ఎవరూ తమకంటే గొప్పగా ఉండకూడదను
స్వభావమున్నవారు ఆర్యులు. అందువలన చేతనైనా చేతకాకపోయినా
తమ అసూయపనులు చేయుచునే పోవుచుందురు. మేము తెలివైనవారమను
ధీమా వారిని అలా చేయించుచున్నది. మొదటినుండి కుట్రలు చేసి,
కుతంత్రములు చేసి, ఎవరి కన్నును వారి వ్రేలితో పొడవడము ఆర్యులకు
వెన్నతో పెట్టిన విద్య అయినది. అందువలన శూద్రులైన బ్రహ్మముగారిని
గానీ, వేమన యోగిని గానీ వారు వదలలేదు. ఒక గ్రంథములోని
సారాంశమును ఒక పద్యములో ఇమిడ్చి చెప్పిన ఘనత వేమన యోగికి
(వేమారెడ్డికి) ఉన్నది. వేమనయోగి ప్రతి విషయమును ముక్కుసూటిగా
చిన్న వాక్యములలోనే చెప్పిన మనిషి. వేమనయోగి ఎవరు తప్పుచేసినా
వదలకుండా వారి బండారమును ఉన్నదున్నట్లు చెప్పిన వ్యక్తి. తన
పద్యములలో ఆర్యులను ఏమాత్రము వదలక, ప్రజలకు వారు చేసిన
మోసములను కొన్ని పద్యములలో విప్పి చెప్పాడు. వేమన తమను నూటికి
నూరుపాళ్ళు విమర్శించినందుకు బదులుగా ఆర్యులు వేమనను తిక్కవాని
క్రిందికి జమకట్టి చెప్పారు. వేమనకు తిక్కబట్టి గుడ్డలూడతీసుకొని
తిరుగుచూ చెప్పిన మాటలు తిక్కమాటలు కాక ఏమగునని, ఆర్యులైన
బ్రాహ్మణులు కొందరు వేమనను గురించి అనడము విన్నాను. తిక్కవాని

మాటలు తిక్కవారు కాకుండా మంచివారు వినరని, వేమన మాటను
వినేవారందరినీ ఆర్యులు తిక్కవారనిన సందర్భములు గలవు. వేదములు
తెలిసినవారు జ్ఞానులగుటకు అవకాశమున్నదనీ, వేదములు తెలియనివారికి
నిజజ్ఞానము తెలియదనీ అన్నవారు, వేదములు వేశ్యలవంటివని చెప్పిన
వేమన జ్ఞాని ఎట్లగునని ఆర్యులు ప్రశ్నించిన సందర్భములు కూడా కలవు.
తమ శాయశక్తులా పనిచేసి, వేమన పద్యములను తాము ఎక్కడా చెప్పకుండా
అణచివేశారు. కొందరితో వేమన పద్యములలో జ్ఞానము లేదని చెప్పారు.
ఇట్లు తమకు చేతనైనంత వరకు వేమన పద్యములను ఆర్యులు ఎక్కడా
బయటికి చెప్పడము లేదు. ఆర్యులు ఎక్కడ ఉపన్యసించినా అక్కడ సంస్కృత
శ్లోకములను చెప్పుదురుగానీ, వేమన పద్యమును మాత్రము చెప్పరు. మిగతా
బ్రాహ్మణులందరికీ వేమన సాహిత్యమును ఎవరూ చదువరాదని
చెప్పడమేకాక, వేమన బ్రాహ్మణ ద్వేషి అని ప్రచారము చేశారు.
అంతేకాకుండా వేమన యోగి అని పేరుపెట్టుకొని ప్రజలలో నాస్తికత్వమును
ప్రజలకు బోధించాడనీ, రాతిబొమ్మలు దేవుళ్ళెలా అవుతాయని హిందూ
దేవతలను వేమన దూషించాడనీ, వేమనలో దైవభక్తి లేదనీ, చాలా
పద్యములలో దేవతలను, బ్రాహ్మణులను దూషించాడని కూడా చెప్పారు.
ఈ విధముగా తమకు చేతనైనంత వేమనను గురించి చెడుగానే ప్రచారము
చేశారు.

ఇక పోతులూరి వీరబ్రహ్మముగారు కాలజ్ఞానమను పేరుతో జరుగ
బోవు ఎన్నో విషయములను వ్రాసి పేరుపొందిన వ్యక్తి. అయితే ఆచారి
(విశ్వబ్రాహ్మణ) కులమున పుట్టినవాడైనందున, బ్రహ్మముగారు ఆర్య
బ్రాహ్మణుడు కానందున, ఆచారి కులము శూద్రుల కులములలో యుండుట
వలన బ్రహ్మంగారిని కూడా హేళనగా మాట్లాడి, బ్రహ్మముగారు ఆచారుల

కులము వారికి మాత్రమే గురువనీ, మిగతా ఎవరికీ గురువు కాదనీ, వారి
కులమువారికే జ్ఞానము చెప్పాడనీ, బ్రహ్మముగారు ఆచారుల కులగురువుగా
ఉన్నాడని ఆర్యులు చెప్పారు. అంతేగాక ఆత్మజ్ఞానమును తత్త్వముల
రూపములో వ్రాసిన బ్రహ్మముగారినీ, పద్యముల రూపములో వ్రాసిన వేమన
యోగినీ వారి రచనలలో వ్రాసిన విధానమును బట్టి, వాడిన భాషనుబట్టి
శూద్రులైన బ్రహ్మముగారిమీద, వేమనమీద ఎంత అసూయ ఉన్నదో
తెలియగలదు. మీకు స్వయముగా అర్థమగునట్లు “జ్ఞాన సూర్యోదయము”
అను గ్రంథములో వ్రాసిన కొన్ని వాక్యములను యథాతథముగా పొందు
పరచుచున్నాము చూడండి. అట్లే మేము ఈ గ్రంథమున వేదములు ఆర్యుల
కల్పనయనియూ, రామాయణము కూడా ఆర్యులైనవారు వ్రాయించి
నదేననియూ, అది అసత్యములతో కూడుకొన్నదనియూ చెప్పాము కదా!
నేనేకాదు నాలాంటివారు నాకంటే ముందు కూడా చెప్పియుందురు.
కల్పితమని మేము అనిన మాటలకు బదులుగా, వారి గ్రంథమున ఎట్లు
వ్రాశారో ఒకమారు మీరే గ్రహించండి.

"స్వయంభువులైన వేదములను కొందరు కల్పితములను
చున్నారు. అట్లే, రామాయణమును కూడా కల్పించారని
అంటున్నారు. కల్పించారన్న ఎవరు కల్పించారు? కల్పితములైన
వానిని సమకాలీకులు ఒప్పుకొందురా? భిన్నాభిప్రాయములు
గలవారొకరు సృష్టించిన దానిని మరియొకరు సహింతురా?
రామాయణము కల్పితమన్నచో నేటికినీ సర్వ ప్రపంచమున
ననుష్టింపబడు రామజయంతి (శ్రీరామనవమి) ఎట్లు ప్రజలలో
ప్రవేశించినది? ఆయా గ్రంథ ప్రతిపాదితములైన మహా

విషయములు కాల పరిణామమున అజ్ఞానులైన ఇప్పటి వారికి
వింతగా కనిపించవచ్చును. అంతమాత్రమున అవి కల్పితములా?
వాల్మీకి లేనిపోని విషయములన్నిటినీ రామాయణ గ్రంథముగా
కూర్చి లోకమును మోసగించుచుండగా, అప్పటి సమకాలికులు
ఎట్లు ఊరకున్నారు? సమకాలికులందరూ వాల్మీకి చేయుచున్నది
మోసమని తెలియలేనంత మూర్ఖులా? అట్లయిన మూఢ
నిక్షిప్తమగు అపవిత్ర గ్రంథమే అయితే, అది నేటివరకు మన
మధ్యలో ఎలా నిలువగలిగినది? ఒకవేళ అప్పటి వారు
రామాయణము కల్పితము యని విమర్శించియుంటే
రామాయణము నేటి వరకు వచ్చినట్లు వారి విమర్శలు నేటి వరకు
ఆ గ్రంథము వెంట ఎందుకు రాలేదు?

ఒక్కొక్క శాస్త్రము (వేదము, రామాయణము) ఎంత
విస్తారముగా, ఎంత ప్రౌఢముగా, ఎంత గంభీరముగా యున్నదో
పరిశీలింపుము. గురు ముఖమున వినియూ అర్థము చేసుకోలేక
బాధపడుచున్నాము. అట్టివాటిని ఎవడో గాలికి పోవువాడు
కల్పితములనిన సరిపోవునా? గురుకులవాసము చేసి శాస్త్రములను,
వేదములను అభ్యసించిన వారికి వాటి యదార్థ స్వరూపమూ, వాటి
మహిమా బోధపడును. అట్లు గురుకులవాసము చేయక, వేద,
పురాణ, ఇతిహాస గ్రంథములను చవిచూడక, భాషా పరి
జ్ఞానమును నేర్వక, ఆ గ్రంథములను వ్రాసిన మహర్షుల శక్తి ఎట్టిదో

తెలియక, ఆర్య సాంప్రదాయములను పరిశీలించక, ఇంద్రియ
లోలుడై ఇచ్చవచ్చినట్లు మొక్కుచూ, ఇష్టమొచ్చినరీతి
జరిపించుచూ, నోటికి వచ్చినట్లు మాట్లాడుచూ, బొజ్జ,
తొండమును చూచి బ్రహ్మదేవుడనుకొన్నాను అన్నట్లు, వేద
ఉపనిషత్ శాస్త్రముల చూచి కల్పితములనియు, అబద్దము
లనియూ వదరిన లాభమేమి? ఎవరు ఏమనినా సామాన్య
మానవుని యుక్తి వాదము వేదములను అసత్యమని చెప్పినా,
సింహము ముందర నక్క మౌనము వహించినట్లు,
వేదాంతశాస్త్రము ముందు విమర్శకులు మౌనము వహించక
తప్పదు అని ఒక సుభాషితకారుడు సమస్త శాస్త్రసారమైన
వేదములను ప్రశంసించెను. కావున వేదాంతశాస్త్రములు
(వేదములు) సర్వదా సత్యములు.

(‘వైదిక వేషధారణ' అను పేరుతో బ్రాహ్మణులైన వారు ఇదే
వస్త్రధారణ, ఇదే వేషధారణ ఉండవలెనను నియమమును పాటించు
చున్నారు. అలా వేషధారణ వస్త్రధారణ బ్రాహ్మణులకు వేరుగాయుండుటను
చూచి, మిగతా ప్రజలందరిలో బ్రాహ్మణులు పవిత్రులుగా కనిపించుచుండగా
ఆ వేషధారణ లేని మిగతా ప్రజలందరూ అపవిత్రులుగా కనిపించుచున్నారు.
ఆ విధ వేషధారణ మిగతా వారందరూ నీచులు, శూద్రులు, అంటరాని
వారు అని సూచించునట్లున్నది. అందువలన వైదిక వేషధారణ అనేది
జీవనోపాధి కొరకుగానీ, భక్తి కాదు. దానిలో ఇతరులను కించపరచడమే
ఎక్కువ కనిపించుచున్నదనీ, “భక్తి శ్రద్ధలు మనస్సులో ఉండవలెనుగానీ,

శరీరము మీద వస్త్రధారణ వలన భక్తి శ్రద్ధలు రావు” అను మాలాంటివారికి
బదులుగా వారు గ్రంథమునందు ఇలా వ్రాశారు చూడండి.)

వైదిక వేషధారణ జీవనోపాయమెట్లగును? తమకదివరకున్న
జీవనములను తృణప్రాయముగా విసర్జించి, ఇంద్రియముల
సహజ ప్రవృత్తిని కష్టముమీద ఆపి, యమ నియమాదులను
ఆచరించి, భగవంతుని ఆరాధనా తత్పరులై లోకమును వదిలి
తమ మార్గమును అనుసరింప వచ్చిన వారికి వేదములు బోధించు
వైదికులు వంచకులా? వేషధారులా? ఇతరులను కించ పరుచు
వారా? ఎంతటి అన్యాయమైన మాట?

వైదిక జ్ఞాన శూన్యులైనవారు, ఈ లోకమే సత్యమనుకొని,
దానియందే లగ్నులైయున్న వారి దృష్టిలో లోకమునెరిగి వేద
శాస్త్రముల దృష్టిచే దూరముగానున్న పరలోకములను కూడా
దర్శించు కూపస్థమండూకము తెట్లగుదురు? (బావిలోని కప్పలు
ఎట్లగుదురు?) పుత్రకామేష్టి యజ్ఞము మొదలగు కార్యములచే
వాటి ఫలితములు ప్రత్యక్షముగా అందినప్పటికీ, వైదిక కర్మలు,
యజ్ఞములు సత్యము కాదంటారా? అవి జీవనోపాధియని అంటారా?
ఆర్య సాంప్రదాయములను అసత్యములని అంటారా?
(ఇక్కడ వేమననూ, వీరబ్రహ్మముగారినీ కలిపి ఆర్య బ్రాహ్మణులు
ఏమని చెప్పుచున్నారో చూడండి.)
"1
"ఐహిక వశ్యతత్త్వ మెరిగి నిత్య సుఖాభిలాషులయ్యు

సరియైన మార్గము దొరకక, సద్గురువు లభించక, సత్సాంగత్యము
లేక, శాస్త్ర పరిచయము ఏమాత్రము లేక, వేదముల జ్ఞానము
తెలియక, కుమత పతిష్టులై ప్రాకులాడుచూ, అచల సాంప్రదాయ
మని లేనిదానిని చెప్పుచూ, కొందరు పద్యములను, కొందరు
పాటలను (తత్యములను) పాడుచూ గురువులుగా చలామణీ
కావలెనని ప్రాకులాడువారు కొందరు కలరు. అటువంటివారు
పాండిత్యము లేని ప్రజల మధ్యన చలామణీ అగుచూ, నాసు
కవిత్వమును చెప్పుచుందురు. అందులో తత్త్వవేత్తలమని కొందరు
ఇలా పాట చెప్పుచున్నారు.
1)
చూడచక్కని చిన్నది కడమేడ గదిలోనున్నది.
ఏడు రంగుల మడుగులో జలక్రీడలాడుచున్నది.
1) రెక్కముక్కు లేని పక్షి రేయింబవలు తపస్సు చేసి
ఒక్క చెరువులో చేపలన్ని ఒక్కటే మ్రింగైరా.
1)
పోగా పోగా గోడుంది
గోడకు తగ్గ గూడుంది
గూడుకు తగ్గ ప్రమిదుంది.
1)
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినుర వేమా!

1)
పన్నెండు కొమ్మల పట్టామట్టి
దానిపై పంచవన్నెల రామ చిలుక
దానిమీద చుక్కవలె ప్రకాశించు నక్క
దానిలోనే భగవంతుడుండు.

1)
గుంటూరి కవతలాగున్న చింతలకాడ
గుఱ్ఱం కడుపున గొర్రె పుట్టేనయా
నందామయా గురుడ నందామయా
ఆనంద దేవికి నందామయా

ఇవి వీరి ఉపనిషత్ సూక్తులు, తత్త్వవాచకములు. వీటికేమో
అంతరార్థముట ! వీరి శ్రాద్ధమట !! ఉభయ భ్రష్టులై చెడుట తప్ప
వీరికి వేరు ఫలములేదు. ఇదియా వీరి వేదాంతము! ఇట్ట పిచ్చి
మతములను చూచియే నవీనులు మహాపవిత్రములైన వైదిక
మతములను కూడా నిట్టివేయని దూషించుచున్నారు.

"తెలుసునను వానికి ఏమీ తెలియదు, తెలియదనుకొనువానికి అన్నీ
తెలుసు” అను సామెత ప్రకారము పై విషయములను వ్రాసిన గ్రంథకర్త
తనను తాను అన్నీ తెలుసుననుకోవడము వలన, ఏమీ తెలియని వాడైనాడని
చెప్పవచ్చును. పైన ఉదాహరణకు గ్రంథకర్త వ్రాసిన తత్త్వముల వాక్యములు,
పద్యముల వాక్యములు ఎంతో గొప్ప అర్థముతో కూడుకొనియున్నవని
తెలియుచున్నది. అయినా గ్రంథకర్తకు వేదముల, ఉపనిషత్తుల స్థూల
జ్ఞానము తెలిసియుండుట చేత, శరీరములోని ఆత్మల విషయము తెలియక

పోవడము వలన, నాలుకలేనివానికి రుచే తెలియదన్నట్లు, తత్త్వములలోని
జ్ఞానము, పద్యములలోని జ్ఞానము ఏమాత్రము తెలియకుండాపోయినది.

ఇక్కడ వివరముగా జ్ఞానముతో కూడుకొన్న తత్త్వములను,
పద్యములను వ్రాసి, వాటికి కూడా విలువనియ్యక వాటిని దూషించడమూ,
వాటిని చదివేవారిని "వీరి శ్రాద్ధమట” అని దూషించడము చూస్తే, వేమన
యోగిమీద, కాలజ్ఞాని అయిన బ్రహ్మముగారిమీద ఎంత అసూయ
ఉన్నదో చూడకనే బయటికి కనిపిస్తూయున్నది. ఆర్యులైన వారి దృష్ఠిలో
వేదములు, ఉపనిషత్తులే ముఖ్యమైన శాస్త్రములుగా యున్నవి. వేదములను
శాస్త్రములనడము ఎనుమును (గేదెను) ఎద్దు అన్నట్లున్నది. వేదములువేరు,
శాస్త్రములు వేరు. 'వేదములు నాలుగు, శాస్త్రములు ఆరు' అని తెలియనివారు
వేద శాస్త్రములని పలుకుచూ వేదములను శాస్త్రములనడము పొరపాటు.
దీనిని బట్టి ఎదుటి వారిని వెక్కిరించు జ్ఞానము తప్ప, ఎదుటి విషయమును,
ఎదుటి వ్యక్తిని అర్థము చేసుకొను శక్తి ఆర్య బ్రాహ్మణులకు లేదని
అర్థమగుచున్నది.

ప్రశ్న :- శంకరాచార్యులు ఆర్యుల వలన తయారు చేయబడిన వాడను
విషయము మీరే మొదట చెప్పుచున్నారు. ఇంతవరకు ఆ మాటను ఎవరూ
చెప్పలేదు. శంకరాచార్యుల వారే స్వయముగా అలా తయారై సిద్ధాంతకర్త
అయినాడనుకొన్నాము. బుద్ధునికి పోటీగా తయారు చేయబడిన వాడని
మాకు తెలియదు. శంకరాచార్యుల వారు చాలా తెలివైనవారనీ, చిన్న
వయస్సులోనే సకల విద్యలను నేర్చిన వాడనీ, సంస్కృతములో మేథావియనీ
దేనినయినా తొందరగా గ్రహించుకొను శక్తికలవాడని విన్నాము. అటువంటి
వాడు ఆర్యుల కుట్రను గ్రహించలేకపోయాడా?

జవాబు :- 'ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడను' సామెత ప్రకారము
అనుకూల శత్రువులుగాయున్న ఆర్యులను శంకరుడు గ్రహించలేకపోయాడు.
పైగా స్వకులస్థులను భ్రమలో వారిని పూర్తిగా నమ్మియుండి వారు
చెప్పునదంతా తన మంచికే అనుకొన్నాడు. చిన్నవయస్సులోనే తనను
బాగా ప్రచారము చేసిన ఆర్యులను పూర్తి విశ్వసించాడు. తనను ఒక
సిద్ధాంతకర్తగా తీర్చిదిద్ది అందరిలో గొప్పవానిగా చేసిన వారిని శంకరా
చార్యుల వారు ఎటువంటి అనుమానము లేకుండా నమ్మడము జరిగినది.
ఆర్యులు తమ స్వార్థముతో తనను పావుగా వాడుకొనుచున్నట్లు శంకరునకు
తెలియదు. ఎప్పుడయితే తనచేత దేశములో నాలుగు చోట్ల నాలుగు
రాష్ట్రములలో నాలుగు అద్వైత పీఠములను స్థాపింపజేసి దేశపర్యటన చేసిన
తర్వాత ఆర్యుల మీద కొంత అనుమానము వచ్చినది. అయినా దానిని
ఎక్కడా బహిర్గతము చేయకుండా తనయందే దాచు కోవడము జరిగినది.
అయితే తూర్పున ఒరిస్సా రాష్ట్రములో పూరి జగన్నాథ్ నూ, పడమర
గుజరాత్ రాష్ట్రములో ద్వారకా జామ్నగర్లోనూ, ఉత్తరమున ఉత్తరాఖండ్
రాష్ట్రములో బద్రినాథ్లోనూ, దక్షిణమున కర్నాటక రాష్ట్రమున శృంగేరిలోనూ
నాలుగు పీఠములను స్థాపించాడు. తర్వాత తనలో మార్పును ఎవరూ
గుర్తించనట్లు ఐదవ పీఠమును కూడా తమిళనాడు లో కంచిలో స్థాపించడము
జరిగినది.

శంకరాచార్యుడు భారతదేశమునకు పశ్చిమ భాగమున గల
గుజరాత్లో ద్వారకాయందు ద్వారక పీఠమును 491 B.C లోనే స్థాపించాడు.
తర్వాత రెండవ పీఠమును ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్ 486 B.C లో
అనగా 5 సంవత్సరముల తర్వాత రెండవ పీఠమయిన జ్యోతిర్ పీఠమును
స్థాపించాడు. మూడవ పీఠమును భారతదేశమునకు తూర్పువైపున

ఒరిస్సాలోని పూరిలో పూరిపీఠమును 485 B.C లో స్థాపించాడు. రెండవ
పీఠమునకు మూడవ పీఠమునకు ఒక సంవత్సరము తేడాయని గ్రహించండి.
ఇక నాల్గవ పీఠమును దక్షిణ దేశమున కర్నాటక రాష్ట్రమున శృంగేరిలో
శారదా పీఠమును 484 B.C లో స్థాపించాడు. మూడవ పీఠమునకు
నాల్గవ పీఠమునకు కూడా కేవలము ఒక సంవత్సరము తేడానే గలదు.
ఈ విధముగా నాల్గు పీఠములను నాల్గు వేదములకు గుర్తుగా స్థాపించడము
జరిగినది.

దేశము నలుమూలలా తిరిగిన శంకరుడు నాలుగు పీఠములను
నాల్గు వేదములకు గుర్తుగా స్థాపించినప్పుడు ఆయనది పేరు మాత్రమే.
శంకరుడు మొదటి పీఠమును గుజరాత్లో స్థాపించినప్పుడు అక్కడ అద్వైత
మఠమును ఆర్యులే కట్టించి సిద్ధముగాయుంచిన మఠమునకు శంకరున్ని
బొమ్మగా తీసుకొనిపోయి ఆయనచేత ద్వారకా పీఠమును స్థాపింపజేశారు.
తర్వాత ఐదు సంవత్సరముల వ్యవధిలో ఉత్తరదేశమున చివరిలోగల
బద్రినాథ్ జోతిర్హీఠమును స్థాపించడము జరిగినది. శంకరుడు అక్కడకు
రాకమునుపే బద్రినాథ్ అద్వైత మఠమును స్థాపించడము జరిగినది.
అక్కడినుండి మూడవ పీఠము కొరకు ఒరిస్సాకు రావడము జరిగినది.
ఉత్తరాఖండనుండి కాలినడకన ఒరిస్సాకు రావడమునకు దాదాపు ఒక
సంవత్సర కాలము పట్టినది. అంతలోపే ఆర్యులు పూరి పట్టణములో
అద్వైత మఠమును తయారు చేసి శంకరాచార్యులను తీసుకొనిపోయి మూడవ
పీఠమును స్థాపింపజేశారు. నాల్గవ పీఠమైన శారదా పీఠమును కర్నాటకలోని
శృంగేరి పట్టణములో స్థాపించడము జరిగినది. ఒరిస్సాలోని పూరి నుండి
కర్నాటకలోని శృంగేరి వరకు కాలినడకన వచ్చుటకు దాదాపు సంవత్సర
కాలము పట్టును. కర్నాటకలో సంవత్సరమునకే అక్కడ పీఠమును శంకరుడు

పోయి స్థాపించడము జరిగినది. శంకరుడు అక్కడికి పోక మునుపే అక్కడ
రెండు మూడు సంవత్సరములనుండి అక్కడ మఠమును నిర్మించవలసి
యున్నది. ఒక మఠమును నిర్మించుటకు దాదాపు రెండు నుండి మూడు
సంవత్సరముల వ్యవధి అయినా పట్టును. బాగా ఆలోచించినా ఆలోచించక
పోయినా, తెలివియున్న వారికయినా, తెలివిలేని వారికయినా ఆ పీఠములకు
సంబంధించిన మఠములను తయారు చేసినది శంకరుడు కాదనీ, శంకరుడు
దృశ్యరూపమైన బొమ్మగా ఉన్నాడనీ, కార్యరూపమైన వారు ఆర్యులేననీ,
ఆర్యులు ముందే నిర్ణయించుకొన్నట్లు శంకరుడు ఆ ప్రాంతములోనికి
రాకముందే మఠములను తయారు చేశారను విషయము తెలిసిపోవుచున్నది.

ఒక పీఠమును స్థాపించుటకు అక్కడ ఒక మఠముండాలి. అట్లే
నాల్గు పీఠములకు కావలసిన నాల్గు మఠములను ఆర్యులు దాదాపు మూడు
సంవత్సరముల కాలమయినా శ్రమపడి తయారు చేయించి యుండాలి.
ప్రతి మఠములోనూ ఒక దేవతను ప్రతిష్ఠించడము జరిగినది. పీఠమునకు
మఠములే ఉండాలిగానీ, దేవతాలయములు ఉండకూడదు. శరీరములోని
తత్త్వమును తెలుపునది పీఠమయినప్పుడు ఆ పీఠము మఠములోనే
ఉండాలి. ఆత్మలు శరీరములోనే ఉండును. ఆది శంకరాచార్యుల వారి
సిద్ధాంతము “అద్వైత సిద్ధాంతము”. అద్వైతము ఆత్మకు సంబంధించినదే
గానీ వేరు కాదు. రెండు ఆత్మలులేవు, ఉన్నది ఒకే ఆత్మ అనునదే
శంకరాచార్యులవారి సిద్ధాంతము. సిద్ధాంతము అనగా కనుగొనబడినదని
ముందే తెలుసుకొన్నాము. శంకరుడు తన సిద్ధాంతములో 'ద్వైతము లేదు'
అని చెప్పాడు. ద్వైతము అనగా రెండు అని అర్థము. ఏకము అనగా
ఒకటి అని అర్థము. ఏకమునకు ముందు “అ” అను అక్షరమునుంచితే
‘అనేకము’ అని చెప్పవచ్చును. అనేకము అనగా ఒకటి కానిదని ఒకటికంటే

ఎక్కువ కలదని అర్థము. ఎక్కువ సంఖ్యయున్నప్పుడు అనేకము అనుమాటను
అందరూ వినియేయుందురు. అదే విధముగా ద్వైతము అన్నప్పుడు రెండు
అయితే దానికి ‘అ’ను చేర్చి అద్వైతము అని అంటే రెండు కానిది ఒక్కటే
అని చెప్పవచ్చును. ప్రపంచములో దేవుడు ఒక్కడు తప్ప ఇతరము ఏదీ
లేదని, అంతా పరబ్రహ్మ స్వరూపమై యున్నదని చెప్పడమే అద్వైతము.
ప్రతి దానిని దైవముగానే చూడవలెననీ, ప్రతి వస్తువుయందు, ప్రతి
ప్రాణియందు ఏకైక పరబ్రహ్మ స్వరూపమే నిండి యున్నదను సూత్రమే
లేక సిద్ధాంతమే శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతము.

శంకరాచార్యుడు రాక పూర్వము భారతదేశములో గల భగవద్గీతా
జ్ఞానమును లేకుండా చేయుటకు కంకణము కట్టుకొన్న ఆర్యులు గౌతమ
బుద్ధున్ని సాకుగా చూపి హిందువే అయిన బుద్ధున్ని హిందువుకాదని,
కాషాయ గుడ్డలు ధరించి తలలు బోడులు చేసుకొని సన్యసించిన వారిని
కూడా హిందువులు కాదని బుద్ధున్ని పరాయి మతమును సృష్ఠించిన
వానిగా ప్రజలకు చూపి బుద్ధుడు చెప్పిన జ్ఞానమును హిందూమత జ్ఞానమే
కాదనీ, అతను చెప్పిన దానిని బౌద్ధమతముగా ప్రకటించారు. బుద్ధుని
బోధలకు ఆకర్షితులైన అశోక చక్రవర్తితో సహా మిగతా వారినందరినీ
హిందువులు కాదనీ, హిందూమతమును ఉద్దరించడానికి ఆదిశంకరుడు
వచ్చాడనీ ప్రచారము చేశారు. వృక్షమునుండి పుట్టిన కట్టెను తీసుకొని,
అదే కట్టెకు గొడ్డలిని తగిలించి, అదే వృక్షమును నరికినట్లు, హిందువులలో
ద్రావిడునిగా పుట్టిన శంకరాచార్యులను 'కట్టె'గా తయారుచేసి తమ 'కుట్రలు'
అను గొడ్డలి తగిలించి ద్రావిడ వృక్షమునే నరుకను ఆర్యులు ప్రయత్నము
చేశారని శంకరుడు కూడా మొదట గ్రహించలేదు. ద్రావిడుల వ్రేలు తీసి
ద్రావిడులు కన్నునే పొడిచినట్లు స్వచ్ఛమయిన ఆధ్యాత్మిక జ్ఞానముగల

ద్రావిడులను లేకుండా చేయుటకు చేసిన కుట్రయే శంకరాచార్యులను
అద్వైత సిద్ధాంత కర్తగా ప్రచారము చేశారు.
హిందూమతము వారు తప్ప సన్యాసత్వము తీసుకొనువారు లేరు,
కాషాయమును ధరించువారు లేరు. హిందుత్వమునకు కాషాయము గుర్తుగా
యున్నది. అయిననూ కాషాయమును ధరించిన బౌద్ధులను (బుద్ధులను)
ప్రత్యేక మతముగా వర్ణించి చెప్పడము హిందూమతమును చీల్చినట్లు కాదా!
హిందువులే అయిన బుద్ధులను విడదీయడము వలన దాదాపు 60 కోట్ల
జనాభాయుండి జనాభాలో నాల్గవ స్థానమైన బుద్ధులను వదలుకోవడము
వలన హిందూమతము క్షీణించినట్లు కాదా! నేడు హిందూమత జనాభా
120 కోట్ల వరకు యున్నది. మత జనాభాలో మూడవ స్థానములో
హిందువులుండగా, రెండవ స్థానములో ముస్లీమ్లు 170 కోట్ల వరకు
గలరు. జనాభాయందు మూడవ స్థానములో యున్న హిందువులు, నాల్గవ
స్థానములో యున్న బుద్ధులను కలిపితే 180 కోట్ల జనాభా కాగలదు.
నేడు రెండుగా చీలిపోయిన హిందూ, బౌద్ధులు కలిసియుంటే నేడు హిందూ
మతము రెండవ స్థానములో ఉండేది. 50 లేక 60 లక్షలమంది హిందువులు
క్రైస్తవులుగా మారితే హిందూమతము క్షీణించిపోతుందని గొంతు చించుకొను
హిందూ రక్షకులు ఆర్యులు చేసిన పనిని చూచీచూడనట్లు ఎందుకు
ఉలుకు పలుకు లేకున్నారో! శంకరాచార్యులు బుద్దులనుండి హిందూ
మతమును కాపాడినాడని చెప్పుకోవడము ఎంతమాత్రము సమంజసమైన
మాటో మీరే ఆలోచించండి!!

ప్రజలకు తెలియని వాస్తవములెన్నో గలవు. ఆర్యులు ఒక ఫతకము
ప్రకారము ద్రావిడ రాష్ట్రమయిన మళయాల రాష్ట్రమున పేద బ్రాహ్మణ


కులమున పుట్టిన శంకరాచార్యులను ఎన్నుకున్నారు. అతనికి 14
సంవత్సరముల వయస్సున్నప్పుడే ఆర్యుల కన్ను శంకరాచార్యుల మీద
పడినది. పేద బ్రాహ్మణ కుటుంబమయిన దానివలన వారికి ధనము
యొక్క ఆశచూపి తమ మాట వినునట్లు చేసుకొన్నారు. శంకరుడు 14
సంవత్సరముల వయస్సున్నప్పుడే సన్యాసము స్వీకరించునట్లు చేశారు.
తర్వాత 15వ సంవత్సరము అనగా ఒక సంవత్సరముపాటు శంకరునికి
వేదవిద్యలు నేర్పారు. శంకరుడు చురుకుదనము కలవాడు కావున ఒక
సంవత్సర కాలములో శ్రమపడి కొంతవరకు వేదములను చదువగలిగాడు.
అయినా 15 సంవత్సరముల పిల్లవాడు ఎంత యోగ్యుడుగా ఉంటాడో
మనము కూడా కొంత ఆలోచించవచ్చును. ఏ మనిషికయినా దాదాపు
18 సంవత్సరములు పూర్తిగా నిండినప్పుడు అతనిలో వ్యక్తిత్వ ఛాయలు
బయట పడుటకు మొదలు పెట్టును. అప్పటినుండి అతను జీవితములో
అడుగుపెట్టి నడువను ప్రారంభించును. అయితే ఆర్యుల తొందరపాటుతో
శంకరున్ని అతి చిన్నవయస్సులోనే 15 సంవత్సరములకే అద్వైత సిద్ధాంత
కర్తగా ప్రకటించారు. ఆర్యులు ఆ పనిని చేసినప్పుడు శంకరునికి
అద్వైతమంటే కూడా ఏమిటో తెలియదు.

శంకరాచార్యుని 16వ ఏట అద్వైతమును గురించి అతనికి
అవగాహన వచ్చునట్లు చేశారు. 16 సంవత్సరములు పూర్తి నిండకనే
శంకరుని చేత అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయుచూ దేశములో
తిరుగునట్లు అద్వైత సిద్ధాంత ప్రచారయాత్రను మొదలు పెట్టారు. బాల్యము
కూడా పూర్తి నిండని శంకరునిచేత, ముక్కుపచ్చారని వయస్సులోనే
శంకరాచార్యున్ని దేశ పర్యటన చేయునట్లు చేశారు. కాలినడకన ఊరూరూ
త్రిప్పుచూ శంకరున్ని బొమ్మగా చేసి చూపుచూ తమ అద్వైత సిద్ధాంతమును

ఆర్యులు ప్రచారము చేయసాగారు. శంకరున్ని ఒక పావువలె కదుపుచూ,
ఒక బ్రాహ్మణ సన్యాసి చిన్నవయస్సులోనే అద్వైతమును ప్రచారము చేయు
చున్నాడని దేశమంతా తెలియునట్లు ముందే రూపొందించుకొన్న ఫతకము
ప్రకారము భారతదేశము నలుమూలలా నాలుగు వేదములకు గుర్తుగా
నాలుగు అద్వైత పీఠములను స్థాపించాలనుకొన్నారు. ఆ ఫతకములో

భాగముగా మొదట గుజరాత్ రాష్ట్రములో గల ద్వారకా జామ్నగరమునకు
శంకరాచార్యులను ఆర్యులు తీసుకుపోవడము జరిగినది. శంకరాచార్యుల
చేత 16 సంవత్సరములకే కాలినడకన దేశపర్యటన ప్రారంభించి దాదాపు
రెండు సంవత్సరములకు ద్వారకాజామ్ నగరమును చేరడము జరిగినది.
శంకరాచార్యుల వారు అక్కడికి చేరకముందే ఆర్యులు తమ ఫతకము
ప్రకారము ఒక పెద్ద ఆలయమును తయారు చేసి అందులో కాళికాదేవిని
ప్రతిష్ఠించియుంచారు. శంకరాచార్యుల చేతులమీద దానిని ప్రారంభించా
లనుకొన్నారు. శంకరుడు గుజరాత్ రాష్ట్రములోని ద్వారకా జామ్నగర్
చేరేటప్పటికి అతనికి 18 సంవత్సరముల వయస్సు జరుగుచుండెడిది. ఆ
వయస్సులో శంకరునికి పూర్తిగా కాళికాదేవి చరిత్ర కూడా తెలియదు.
అయినా శంకరున్ని ఒక బొమ్మగా చూపిస్తూ, ఆయన చాలా గొప్పవాడని
ప్రజలలో ప్రచారము చేసి, ఆయనతోనే ద్వారకా జామ్నగర్లోని కాళికా
పీఠమును స్థాపింపజేశారు. గుడిని ప్రారంభించి దానికి శంకరాచార్య
మఠమని పేరు పెట్టారు.

శరీరములోని ఆత్మను పరిశోధించువారు నివసించు దానిని
“మఠము” అంటారు. దానినే మరొక విధముగా “ఘట శోధకులు
మఠములో ఉంటారు” అని కొందరు పెద్దలు అనడము జరిగినది. దీనినిబట్టి
“ఆత్మ శోధకులు నివశించునది ‘మఠము” అను పేరు గలదు. అయితే

పూర్తి మఠమునకు విరుద్ధముగా వారు స్థాపించిన మఠములో కాళికాదేవతను
ప్రతిష్ఠించి, అది కాళికా పీఠము అనడము జరిగినది. అప్పటికే బుద్ధుని
బోధనలు దేశమంతా వ్యాపించియుండడము వలన, బుద్ధుని బోధలలో
వేదముల ప్రసక్తే లేనిదానివలన, అంతేకాక బుద్ధులు ఎవరూ యజ్ఞ
యాగములు చేయక కేవలము ధ్యానమునకే ప్రాధాన్యత ఇవ్వడము వలన,
వేదములకు, యజ్ఞములకు బుద్ధులు వ్యతిరేఖముగా ఉండుట వలన అది
ఆర్యులకు మ్రింగుడుపడని విషయమైనది. ద్వాపరయుగము చివరిలో
భగవంతుడు చెప్పిన భగవద్గీతలో వేదములను, యజ్ఞములను దేవుని
మార్గములో పనికిరాని క్రియలని గీతలో చెప్పడము ఆర్యులకు ఏమాత్రము
సరిపోలేదు. భగవద్గీతలో చెప్పిన జ్ఞానము ప్రకారము బౌద్ధులు నడుచుట
వలన బౌద్ధులను అణచివేస్తే వారి వెనుకయున్న భగవద్గీతలోని జ్ఞానము
అణిగిపోతుందని తలచిన ఆర్యులు భారతదేశములో యజ్ఞములను గురించి,
వేదములను గురించి ఎక్కువగా ప్రచారము చేయాలనుకొన్నారు.

ద్వాపరయుగములో భగవంతుడు ధర్మపరిరక్షణకై వచ్చి భగవద్గీతను
బోధించాడు. భగవద్గీతా జ్ఞానము అప్పుడు కృష్ణుడు చెప్పినా అది సృష్ట్యాదిలో
దేవుడు చెప్పిన బోధయని భగవద్గీతలోనే తెలిసిపోయినది. ద్వాపరయుగము
కంటే ముందు త్రేతాయుగమున రావణబ్రహ్మ లంకా రాజ్యమునకు రాజుగా
యున్నప్పుడు, అతను బ్రహ్మజ్ఞాని అయినందున ఆయనకూడా సృష్ట్యాదిలోని
జ్ఞానము ప్రకారము వేదపఠనమును, యజ్ఞములను వ్యతిరేఖించుచుండెను.
అప్పటికే ఆర్యులు యజ్ఞములను భారతదేశములో ప్రవేశింపజేసి కొందరిచేత
ఆచరింపజేయగా, రావణబ్రహ్మ యజ్ఞములను అణచి వేశాడు. యజ్ఞము
లను చేయువారిని శిక్షించడము కూడా చేశాడు. ఎక్కడయినా దొంగచాటుగా
జరుగు యజ్ఞములను తన మనుషులచేత ధ్వంసము చేయించాడు.

“ధర్మస్థాపన” అను పేరుతో భగవద్గీతను చెప్పినప్పుడు అదే విషయమునే
చెప్పుచూ యజ్ఞముల వలన, వేదాధ్యయనముల వలన దేవుడు తెలియబడడు
అని విశ్వరూప సందర్శనయోగములో 48వ శ్లోకమున మరియు 53వ
శ్లోకమున చెప్పియుండడము ఆర్యులకు మ్రింగుడు పడని విషయమై
పోయినది. భగవద్గీతలోని జ్ఞానమును రూపు మాపుటకు వేదములను
యజ్ఞములను ప్రజలలో ప్రవేశపెట్టుటకు అనేక ప్రయత్నములు చేసి వాటి
వలన ఆశించిన ఫలితము లేదని గ్రహించి చివరకు 'అద్వైత సిద్ధాంతము'
అను ప్రచారముతో ఒక స్వామీజీ చేతనే యజ్ఞములను, వేదములను
ప్రవేశపెట్టాలనుకొన్నారు. దానికొరకే శంకరాచార్యులను అద్వైత సిద్ధాంత
కర్తగా సృష్టించారు. ఆర్యులు ఎక్కడా కనిపించకుండా ద్రావిడుడయిన
శంకరుని చేతనే వేదములను యజ్ఞములను ప్రచారము చేయించారు.
అద్వైతమును అడ్డము పెట్టుకొని తమ పబ్బము గడుపు కోవాలనుకొన్నారు.
అలాగే చేస్తూ వచ్చారు.

491 B.C లో దేశమునకు పడమర వైపుగల గుజరాత్లోని ద్వారకా
జామ్నగర్లో కాళికా పీఠమును స్థాపించి ఆ పీఠము సామవేదమునకు
గుర్తుగా ఉన్నదని చెప్పారు. ఈ విధముగా వేదముల వ్యతిరేఖత ప్రజలలో
లేకుండా పోవాలను ఉద్దేశ్యముతోనే ఆ విధముగా ద్వారకాలోని కాళికా
పీఠము సామవేదమునకు గుర్తని చెప్పడము జరిగినది. హిందూమతములో
పెద్ద సిద్ధాంతకర్త, సన్యాసి వేషధారిణి అంతవరకు ఎవరూ స్థాపించని
అద్వైత పీఠమును స్థాపించి సామవేదమునకు గుర్తని చెప్పడము వలన
హిందువులలోయున్న వేద వ్యతిరేఖత లేకుండా పోవునని ఆర్యులు శంకరా
చార్యుల చేత చేయించడము జరిగినది. అప్పటికి కేవలము 18
సంవత్సరములే యున్న శంకరునికి అద్వైతమును ఆర్యులే బోధించి, అతని

చేత చెప్పించారు. దీనినిబట్టి బాల్యములోనే యున్న శంకరున్ని ప్రజలందరికీ
కనపడు బొమ్మను చేసి, వారి ఇష్టమొచ్చినట్లు ఆడించారని తెలిసినది.
ఆర్యుల దురుద్దేశ్యముతో చిన్నవయస్సులోని శంకరుడు తల్లితండ్రులను
వదలివచ్చి, ఒంటరివాడై ఆర్యుల వలన ఎంతో బాధపడ్డాడు. అయినా ఆ
విషయమును ప్రజలు ఎవరూ గ్రహించలేదు. శంకరుడు బయటికి
చెప్పుకోనూలేదు.

గుజరాత్నండి బయలుదేరి రెండవ పీఠమును ఉత్తరదేశమున
స్థాపించాలనుకొన్నారు. దానికొరకు ముందే అన్ని సన్నాహములు చేసిన
ఆర్యులు ఆ కాలములో దారి ఏమాత్రము లేని అతని మార్గము, పర్వత
మార్గములలో శంకరున్ని ఉత్తరాఖండ్ యున్న కేదార్నాథ్, బద్రినాథ్ వరకు
తీసుకపోవడము జరిగినది. 2013వ సంవత్సరము వర్షాకాలములో కేదార్
నాథ్, బద్రినాథ్క పోయిన భక్తులందరూ వేల సంఖ్యలో చనిపోయిన
విషయము అందరికీ తెలుసు. ఎంతో పెద్ద వరదలు వచ్చి అక్కడున్న
ఊర్లతో సహా కొట్టుకపోయిన విషయము చాలామందికి తెలుసు. ఈ
కాలములో కూడా కొండప్రాంతములలో కాలినడకన పోవుటకు సరియైన
దారి కూడా లేదు. ఆ కాలములో మరీ కష్టముగా ఉండవచ్చును. అయినా
అక్కడికి చాలా కష్టపడి చేరుకోవడము జరిగినది. మొదటి పీఠమును
గుజరాత్లో స్థాపించిన తర్వాత ఐదు (5) సంవత్సరములకు రెండవ
పీఠమును బద్రినాథ్ స్థాపించడము జరిగినది. దీనినిబట్టి చూస్తే పూర్తి
ఉత్తర దేశమయిన ఆ ప్రాంతమును చేరుకొనుటకు చాలా కష్టపడవలసి
వచ్చినదని తెలియుచున్నది. అంతేకాక అప్పుడది నిర్మానుష స్థలముగా
యుండుట వలన అక్కడ మఠమును నిర్మించుటకు బయట ప్రాంతమునుండి
మనుషులను తీసుక పోవలసియుండుట వలన అక్కడ మఠమును తయారు

చేయుటకు చాలా ఆలస్యమయినది. ఐదు సంవత్సరముల తర్వాత అనగా
486 B.C కాలములో ఆదిశంకరాచార్యుల చేత రెండవ పీఠమయిన
జ్యోతిర్లింగ పీఠమును అధర్వణ వేదమునకు గుర్తుగా స్థాపించడము
జరిగినది. అక్కడ మఠములో లింగప్రతిష్ఠ చేసి శంకరునిచే ప్రారంభించి
నందువలన దానిని రెండవ పీఠముగా శంకరుడు స్థాపించినట్లయినది.
ఉత్తరాఖండ్లో స్థాపించిన రెండవ జ్యోతిర్లింగ పీఠము అధర్వణ
వేదమునకు గుర్తుగా పేరు పెట్టబడినది. ఈ విధముగా భారత దేశమునకు
పడమర సామవేదము, ఉత్తరమున అధర్వణ వేదము యొక్క గుర్తుగా
రెండు పీఠములను శంకరుల చేత ఆర్యులు స్థాపింపచేశారు. అక్కడినుండి
దేశమునకు తూర్పువైపునగల ఒరిస్సా రాష్ట్రమందు పూరి జగన్నాథ్
పట్టణములో గోవర్ధన పీఠమును స్థాపించుటకు బయలుదేరి శ్రమపడి
సంవత్సర కాలములోనే అక్కడకు చేరిపోయి 485 B.C సంవత్సరములో
పూరి జగన్నాథ్ పట్టణమున గోవర్ధన పీఠమును స్థాపించడము జరిగినది.
గోవర్ధన పీఠము ఋగ్వేదమునకు గుర్తుగా చెప్పడము జరిగినది. ఉత్తరా
ఖండ్నుంచి శంకరుడు ఒరిస్సాలోని జగన్నాథపురమును చేరుకోకముందే
ఆర్యులు గోవర్ధన పీఠమునకు తగిన ఆలయమును నిర్మించిపెట్టారు. ఆ
పనిని చేయుటకు ఆర్యులకు కనీసము మూడు సంవత్సరములైనా పట్టి
యుండవచ్చును. అట్లు శంకరుని రాకకంటే ముందే తయారయిన గోవర్ధన
పీఠము ఋగ్వేదమునకు ప్రతీకగా నిలిచినది. భారతదేశమునకు తూర్పు
వైపున గోవర్ధన పీఠము తయారుకాగా, అక్కడినుండి కాలినడకన కన్నడ
రాష్ట్రములోని శృంగేరి పట్టణమునకు చేరుకొనుటకు ఒక సంవత్సర కాలము
పట్టినది. అక్కడ కూడా శంకరాచార్యులు రాకముందే తయారు చేయబడిన
శారదా పీఠమునకు సంబంధించిన కట్టడములను ఆర్యులు ముందే తయారు

చేసిపెట్టారు. సరస్వతి దేవిని ప్రతిష్ఠించి దానిని శారదా పీఠముగా పేరు
పెట్టారు.

భారతదేశమునకు పూర్తి దక్షిణమునగల శృంగేరి పట్టణమునకు
శంకరాచార్యుల వారు చేరుకొని అక్కడ నాల్గవ పీఠమయిన శారదా
పీఠమును స్థాపించడము జరిగినది. శారదాపీఠము యజుర్వేదమునకు
గుర్తుగా చెప్పబడినది. ఈ విధముగా నాలుగు పీఠములను నాలుగు
దిశలలో, నాలుగు పేర్లతో, నాలుగు వేదములకు గుర్తుగా స్థాపించబడినవి.
నాల్గవ పీఠమయిన శారదా పీఠమును 484 B.C లో స్థాపించడము
జరిగినది.

1)పడమర దిశలో 'సామవేద' గుర్తుగా కాళికా పీఠమును గుజరాత్లోని
ద్వారకా జామ్నగర్, 491 B.C లో శంకరునికి 18 సంవత్సరముల
వయస్సులో మఖ శుక్ల సప్తమి రోజున స్థాపించడము జరిగినది.
2)దేశమునకు ఉత్తరమున 'అధర్వణ' వేదమునకు గుర్తుగా,
ఉత్తరాఖండ్ రాష్ట్రములో బద్రినాథ్ జ్యోతిర్లింగ పీఠమును
486 B.C పుష్యశుద్ధ పౌర్ణమి రోజు శంకరుని 23 సంవత్సరముల
వయస్సులో స్థాపించడము జరిగినది.
3) దేశమునకు తూర్పుదిశన 'ఋగ్వేదము'నకు గుర్తుగా, ఒరిస్సా
రాష్ట్రములోని పూరి జగన్నాథ్ పురములో 485 B.C లో వైశాఖ
శుక్ల నవమి రోజున శంకరునికి 24 సంవత్సరముల వయస్సులో
గోవర్ధన పీఠమును స్థాపించడము జరిగినది.
4)దేశమునకు దక్షిణమున 'యజుర్వేదమునకు గుర్తుగా, కర్నాటక
రాష్ట్రములోని శృంగేరి పట్టణమున శారదా పీఠమును 484 B.C లో


పుష్య పౌర్ణమి రోజు శంకరునికి 25 సంవత్సరముల వయస్సులో
స్థాపించడము జరిగినది.

ఈ విధముగా 25 సంవత్సరముల వయస్సులోనే శంకరుడు
నాలుగు దిక్కుల నాలుగు పీఠములను స్థాపించాడు అని చెప్పవచ్చును,
లేక స్థాపింపజేయబడ్డాడు అనికూడా చెప్పవచ్చును. ఆర్యుల చేతిలో కీలు
బొమ్మవలె శంకరుడు నడువవలసి వచ్చినది. 16 సంవత్సరముల వయస్సు
నుండి ఏకధాటిగా తొమ్మిది (9) సంవత్సరములు అనగా 25 సంవత్సరముల
వయస్సు వరకు కాలి నడకన నాలుగు దిశల భారతదేశములో తిరుగవలసి
వచ్చినది. పేరుకు శంకరాచార్యుని పర్యటన అని చెప్పినా అతని వెంట
ఆర్యులు దాదాపు వందనుండి వందయాభై వరకు ఉండేవారు. శంకరా
చార్యుడు పండితులతో వాదోపవాదములు చేయుచూ వారిని ఓడించి
ముందుకు పోయెడివాడని ప్రచారము చేశారు. అలా చేసియుంటే భారత
దేశము నలుమూలలు తిరిగే దానికి తొమ్మిది సంవత్సరములు కాదు తొంభై
(90) సంవత్సరములు పట్టేది. అప్పుడు ఊరూరికీ అంతో ఇంతో భగవద్గీత
జ్ఞానము తెలిసిన వారుండేవారు. అలా ప్రతి ఊరులోనూ వాదోపవాదములు
చేయుటకు చాలాకాలము పట్టును. ఒకరితో వాదోపవాదములు చేయుటకు
ఒక రోజుతో ఎటూ సరిపోదు. కనీసము ఒకరితో పరిచయము, వారి
వాదనకు పూనుకోవడము, వాదనలోని నిబంధనలు చెప్పుకోవడము
ఇవన్నియూ ఒకరోజుకాగా, వాదోపవాదములకు రెండు నుండి ఐదు రోజుల
వరకు పట్టును. తర్వాత వారు ఊరు వదలిపోవుటకు, రెండవ ఊరిలో
ఉండుటకు కావలసిన జాగా చూచుకొనుటకు కనీసము ఒకరోజు కాలము
పట్టును. మార్గమధ్యములో ఊరికి ఊరికి మధ్యలో కాలము ఒకరోజయినా
పట్టవచ్చును. ఈ విధముగా లెక్కించి చూస్తే వారు వాదోపవాదములు

ఎక్కువగా చేయలేదని పీఠమునకు పీఠమునకు మధ్య ఒకటి రెండు వాదనలు
తప్ప ఎక్కువ ఉండవని అనుకొంటున్నాము. జరిగిన ప్రతివాదనలోనూ
శంకరుడే గెలిచాడని చెప్పలేము. ఈ విధముగా ఉన్నవి లేనివి ఆర్యులు
శంకరున్ని అడ్డము పెట్టుకొని చెప్పుతూ పోయారు.

ఒకచోట ఒక హరిజనునికి శంకరునికి వాదము జరిగితే అందులో
శంకరుడు ఓడిపోయినట్లు ఒప్పుకొన్నాడు. శంకరుడు ఓడిపోయిన
విషయము అందరికీ తెలిసిపోయినా జరిగిన చర్చ “శరీరము, శరీరములో
నివసించే జీవాత్మ"ను గురించి, అద్వైతమను పేరుపెట్టుకొన్నా జీవాత్మ
విషయము శంకరునికి పూర్తి తెలియదు. ఆర్యులకు కూడా వారి
అద్వైతమును గురించి వారు చెప్పగలరుగానీ, జీవుని విషయము వారికి
కూడా తెలియదు. ఒక దారిలో పోతూ అంటరానివాడవని హరిజనున్ని
అన్నప్పుడు అక్కడ ఇరువురికి మధ్య అంటరానిది 'శరీరమా లేక జీవాత్మనా’
అని చర్చ వచ్చినప్పుడు శంకరునికి జీవాత్మ విషయమే తెలియని దానివలన
అక్కడ ఆ చర్చలో హరిజనుని చేతిలో ఓడిపోవలసి వచ్చినది. అయితే ఆ
ఓటమిని ఒప్పుకొనినా హరిజనుడు మనిషికాడని సాక్ష్యాత్తూ పరమేశ్వరుడే
హరిజనుని రూపములో వచ్చాడని, ఈశ్వరుని చేతిలో ఓడిపోయాముగానీ
మనిషి చేతిలో ఓడిపోలేదని చాటుకొన్నారు. అంతేకాక ఎక్కడయినా
ఓడిపోయిన విషయములను బయటికి చెప్పుకోలేదు. వారి దేశ పర్యటన
మొత్తము మీద పది లేక పదిహేను వాదనలు తప్ప ఎక్కువ జరిగియుండవని
మేము అనుకొంటున్నాము. మేము చెప్పునదంతా క్రొత్తగా కనిపించినా
మేము చెప్పు మాటలలో సత్యమే ఉందని మేము చెప్పుచున్నాము.
అంతెందుకు మీరే స్వయముగా ఆలోచించండి. మీకే కొన్ని విషయములలో
మేము చెప్పునదే సత్యమని తెలియగలదు. అయినా ఆర్యులు తెలివైన

వారు కావున శంకరున్ని బొమ్మలాగా ఆడించడమేకాక, వారు చెప్పు
మాటలను అందరూ నమ్మునట్లు చేశారు.

ప్రశ్న :- ఆర్యులే కాదు శంకరుడు కూడా ధీశాలియే, మేథావియే అని
మీరే చెప్పారు. అటువంటప్పుడు శంకరుడు వారి కుట్రను గ్రహించలేక
పోయాడా? తనకు మంచి చేయుచున్నారా, చెడు చేయుచున్నారా అని
తెలియలేకపోయాడా?

జవాబు :- అనుకూల శత్రువులను అంత తొందరగా ఎవరూ గ్రహించలేరు.
ఎంతపెద్ద మేథావి అయినా త్వరగా గుర్తింపలేడుగానీ, మొదట కొంత
అనుమానము వచ్చును. తర్వాత ఆ అనుమానమునకు తగినట్లు
సాక్ష్యాధారములు దొరుకుకొద్దీ అనుమానము బలమై చివరికి సత్యము
తెలిసిపోవును. అలాగే శంకరాచార్యుల వారికి కూడా ఆర్యులమీద మొదట
అనుమానము మొదలై కాలము గడుచుకొలది అనుమానమునకు సరియైన
జవాబు దొరికినది. అప్పుడు ఆర్యులు తెలివిగా చేయు మోసపూరిత
కార్యము శంకరాచార్యులు గ్రహించగలిగారు.

ప్రశ్న :- శంకరునికి మొదట ఆర్యుల మీద ఎట్లు అనుమానము కల్గినది?
తర్వాత వారి మోసమును ఎలా గుర్తించగలిగాడు?

జవాబు :- నాకు తెలిసినది నేను చెప్పగలనుగానీ, ఇప్పుడు చెప్పబోయే
విషయము చరిత్రలో ఎవరికీ తెలియని విషయము. శంకరాచార్యుల
వారి చరిత్ర చదివిన వారికి ఆర్యులు అందులో ఏమాత్రము కనిపించరు.
ఆర్యుల మాటే వినిపించదు. అందువలన మేము ఇప్పుడు చెప్పినా ఆర్యుల
విషయము నమ్మశక్యము కాకుండా ఉండును. అయినా మీ బుద్ధికి కొంత
పదును పెట్టగలిగితే మేము చెప్పు మాటలలోని సత్యము తెలియగలదు.

శంకరాచార్యులవారు చిన్నతనమునుండి మేథావియే. అయితే ఆ మేథాశక్తి
అతను నేర్చు విద్యలలో పనిచేసింది. చిన్నతనములోనే అనగా పదిహేను
సంవత్సరములకే ఆర్యుల మాటననుసరించి నాల్గు వేదములను నేర్వగలి
గాడు. నాల్గువేదములను కంఠాపాటముగా చెప్పెడివాడు. తనను
విద్యావంతుని చేసినందుకు బంధువులవలెయున్న ఆర్యులకు తాను ఋణపడి
యున్నానని మొదట అనుకొనెడివాడు. తన కులస్థులేనని వారిని నమ్మినాడు.
శంకరుడు వయస్సులో చాలా చిన్నవాడు అయినందున తనకు అండగా
యుండి గొప్ప హోదాను కల్పించుతూ సిద్ధాంతకర్తగా అద్వైత సిద్ధాంతమునకు
అధికర్తగా, అద్వైత పీఠమునకు అధిపతిగా చేసి ప్రజలలో గొప్ప వ్యక్తిగా
ప్రచారము చేయడము వలన అటువంటి వారిని ఎవరయినా మంచివారిగా,
తన శ్రేయోభిలాషులుగా తప్పక నమ్మగలరు. శంకరాచార్యులు కూడా
తనకు అన్ని విధములా మేలు చేయు ఆర్యులను పూర్తిగా నమ్మినాడు.
వారి స్వార్థముకొరకు తనకు మంచి చేయుచున్నారని మొదట గ్రహించ
లేకపోయాడు.

అయితే తనను వేదములను చదువమని చెప్పి, భగవద్గీత వైపు
పోకుండా చేసి, దానిని మనము చదువకూడదని, భగవద్గీత వేదములకు
యజ్ఞములకు శత్రువులాంటిదని చెప్పడము వలన ఎందుకు అలా
చెప్పుచున్నారను అనుమానము శంకరునిలో మొదలయినది. ధర్మసంస్థాపన
కొరకు వచ్చిన భగవంతుడు చెప్పినది భగవద్గీతయని అందరూ
అనుచుండగా, దానిలో ఏముందో తెలియకుండా చేసి, కనీసము ఒక్కమారు
కూడా దానిని (భగవద్గీతను) చూడనట్లు జాగ్రత్త పడడముతో చిన్నమొక్కగా
సంశయము మొదలయినది. శంకరుడు పుట్టుకతోనే ద్రావిడ బ్రాహ్మణుడు
అయినా, అతనిని ఆర్యులు ద్రావిడ బ్రాహ్మణునివి కాదనీ ఆర్య బ్రాహ్మణుడ

వనీ చెప్పడములో కొన్ని విషయములలో మాత్రము ఎందుకు అలా
చేయుచున్నారో తెలియకపోయినా అతనిలో ఆర్యుల మీద కల్గిన
అనుమానము కొన్ని ఆర్యుల కార్యముల వలన బలమవుతూ వచ్చినది.

శంకరాచార్యుల వారిని ఎంతో మంచిగా చూచుకొను ఆర్యులు,
శంకరున్ని గురించి గొప్పగా చెప్పు ఆర్యులు, దేశము నలుమూలలా
శంకరున్ని పాదయాత్ర చేయించడము వలన శంకరుడు కొంత ఋగ్మతకు
గురి కావలసి వచ్చినది. చిన్నపిల్లవాడని తలువక, కాలినడక అలవాటు
లేని వాడని తలువక కాళ్ళ నొప్పుల వలన బాధపడుచున్నా లెక్కచేయక
ప్రతి దినము శంకరున్ని ప్రతి ఊరిలోనూ ఊరు ఎరిగింపుగా (ఊరేగింపుగా)
ప్రజలకు చూపుతూ త్రిప్పడము వలన, అలా చేయడములో ఆర్యులకు
ఏదో లాభమున్నదని శంకరుడు అనుకోవలసి వచ్చినది. దానికి తోడుగా
అతివేగముగా దేశము నలుమూలలా నాలుగు అద్వైత పీఠములను
స్థాపించడమూ, వాటికి నాలుగు వేదములు గుర్తుగా పెట్టడము వలన
తనకు పూర్తి తెలియని పనిని మ్రొక్కుబడిగా ఆర్యులు చెప్పినట్లు చేయవలసి
వచ్చినది. దానితో అతనిలో ఆర్యులమీద అనుమానము మొదలయి అది
చివరికి పెద్దగా మారిపోయినది. ఏమాత్రము ఎక్కడా ఆలస్యము లేకుండా
యుద్ధప్రాతిపదికముగా నాలుగు పీఠములను నెలకొల్పడములో తన
అనుమానము పెనుభూతమయినది. ఏ విధముగా ఆలోచించినా అంత
తొందరగా చేయవలసిన అవసరము ఏమాత్రము లేదు. శంకరుడు
తెలివైనవాడనీ తమ ఉద్దేశ్యమును ఎక్కడ ఎప్పుడు తెలుసుకొంటాడో అను
అనుమానము ఆర్యులలో ఉండుట వలన శంకరుడు మారిపోకముందే,
శంకరుడు తమచేతినుండి జారిపోకముందే తమ కార్యములను శంకరునితో
చేయిస్తే తర్వాత కాలములో ద్రావిడుల వలన ఎటువంటి బెడద ఉండదను
కొన్నారు.

ఆర్యుల తలలో ఆ ఉద్దేశ్యము ఉండుట వలన శంకరుని చేత
సాధ్యమైనంత తొందరగా ఆ కార్యములను చేయించారు.
సంవత్సరముల వయస్సునుండి దేశమంతా తొమ్మిది సంవత్సరముల పాటు
త్రిప్పి 25 సంవత్సరముల వయస్సు వచ్చులోపల నాలుగు పీఠములను
స్థాపింపజేశారు. తన 25 సంవత్సరముల వయస్సులో దేశమంతా తిరిగి
చూచిన శంకరునకు కొంత ప్రపంచ అనుభవము, కొంత స్వయం తెలివి
కలిపి చూచుకొని ఎవరికీ తెలియనట్లు తన జాగ్రత్తలో తానుండవలెనని
అనుకొన్నాడు. శంకరున్ని ఒంటరిగా వదలి ఆర్యులుండెడివారు కాదు.
శంకరునితో ఆర్యుల అనుమతి లేనిది ఎవరినీ కలువనిచ్చేవారు కాదు.
అదంతా శంకరుని గౌరవార్ధము ఆర్యులు అలా చేయుచున్నారని అందరూ
అనుకొనెడివారు. అయితే శంకరునికి ఎవరయినా ఆర్యుల ఉద్దేశ్యమును
వివరిస్తారేమోనను భయముతో అతని వద్దకు తమ అనుమతి లేనిది ఎవరినీ
పోనిచ్చేవారు కాదు.

ప్రశ్న :- ఇంతవరకు ఈ విషయము ఎవరి ఊహకు రాలేదు. ఇప్పుడు
ఆలోచించి చూస్తే అప్పుడు జరిగిన దానికి మీరు చెప్పేదానికి చాలా దగ్గర
సంబంధమున్నట్లు కనిపించుచున్నది. మీ మాట ప్రకారము ఆర్యులు
ఎంతో తెలివిగా ప్రవర్తించుచున్నా శంకరునికి కొంత అనుమానము
వచ్చిందని చెప్పావు. ఆర్యులమీద అనుమానము వచ్చి అది కొంత కొంత
ధృవీకరణకు వచ్చిన తర్వాత శంకరుడు ఆర్యులనుండి ఎందుకు విడిపోలేదు?
ఆయన చనిపోవు వరకు ఆర్యులతోనే ఎందుకు కలిసియున్నాడు?

జవాబు :- ఎవరు ఎంత తెలివైనవారయినా విధి చేతిలో అందరూ కీలు
బొమ్మలే! ముందే నిర్ణయింపబడిన కర్మప్రకారమే పైన కనిపించు
వ్యవహారములన్నియూ జరుగుచుండును. ఆర్యుల విషయములోనూ,

శంకరుని విషయములోనూ అదే జరిగినది. ప్రతి మనిషి శరీరములోనున్న
కనిపించని కర్మ ప్రతి మనిషిని ప్రేరేపించి ఆడించుచున్నట్లు తత్త్వ
వేత్తలయిన వారు చెప్పుచుందురు. లోపలయున్న కర్మ జరిగే పనులలో
తెలియబడుచుండును. అదే విధముగా శంకరుని విషయములో కూడా
ఏమి జరుగవలెనో అదే జరిగినది. మీరు అడిగిన ప్రశ్నకు జవాబును ఈ
విధముగా చెప్పవచ్చును.

శంకరుడు భారతదేశములోని నలుమూలలు తిరిగి వచ్చిన తర్వాత
తన స్వగ్రామమునకు వచ్చి ఒక నెలరోజులు తన ఇంటిలోనే విశ్రాంతి
తీసుకొన్నాడు. శంకరుడు తన స్వగ్రామములో యుండుట వలన, విశ్రాంతి
తీసుకొనుటకు కాలమును వినియోగించుట వలన, ఆర్యులు శంకరున్ని
స్వతంత్రముగా వదలి తమ తమ పనులలో లగ్నమైయుంటూ వారు
కూడా విశ్రాంతి తీసుకొనెడివారు. శంకరుని స్వగ్రామమైన 'కాలడి'
గ్రామము చాలా చిన్న గ్రామము. అక్కడ ఆర్యులు శంకరునితోయుండుటకు
అనుకూలము లేదు. వారికి తగిన వసతులు లేవు. శంకరుడు చిన్న
పూరిపాకలో నివశించెడివాడు. అందువలన ఒక నెలరోజులు శంకరున్ని
వదలి వేరు ప్రాంతములో ఉండెడివారు. అప్పుడప్పుడు వచ్చి శంకరున్ని
పలుకరించెడివారు. అలాయున్న నెల రోజుల కాలములో శంకరుడు
భారతములోని భగవద్గీతను ఆర్యులకు తెలియకుండా చదువగల్గినాడు.
శంకరుడు తన 26వ సంవత్సరములో భగవద్గీతను చదివి అందులోని
జ్ఞానమును అంతా కాకున్నా కొంతవరకు తెలుసుకొన్నాడు. శంకరునికి
తెలిసిన అద్వైతమే ఆయనకు కనిపించినది. భగవద్గీతలో యున్న పూర్తి
జ్ఞానము తెలియకపోయినా కొంతవరకైనా అర్థమయినది. భగవద్గీతలోని
జ్ఞానము ఎవరికయినా ఒక్కమారే అర్థము కావాలంటే చాలా కష్టము.

అందువలన శంకరునికి పూర్తి అర్థము కాకపోయినా, భగవద్గీతలో
యున్న అద్వైతము, ద్వైతము, త్రైతములో అద్వైతము మాత్రము
అర్థమయినది. మిగతా రెండు తత్త్వములు అర్థము కాలేదు. అయితే
భగవద్గీతలో భగవంతుడు వేదములను గురించి చెప్పిన విషయము మాత్రము
బాగా అర్థమయినది. “త్రైగుణ్యా విషయా వేదా” అనుమాట శంకరునిలో
అలజడిని లేపింది. ధర్మరక్షణ నిమిత్తమై వచ్చిన భగవంతుని మాటలలో
ఆ మాట యుండడము శంకరునికి ఆశ్చర్యమును కల్గించినది. భగవద్గీత
ప్రారంభములో సాంఖ్యయోగమను అధ్యాయమున గల 45వ శ్లోకములోని
ఆ మాట శంకరుని మనోఫలకములో శాశ్వితముగా నిలిచిపోయినది. దానికి
తోడు విశ్వరూప సందర్శనయోగము అను అధ్యాయములో 48, 53
శ్లోకములు కూడా బాగా అర్థమయినాయి. అక్కడగల రెండు శ్లోకములలో
"వేదముల వలన దేవుడు తెలియబడడు” అను విషయము పూర్తిగా
తెలిసి పోయినది. అంతేకాక దానికంటే ముందుగల అక్షర పరబ్రహ్మ
యోగము అను అధ్యాయములో 28వ శ్లోకమందు వేదముల వలన,
యజ్ఞముల వలన పుణ్యఫలము వచ్చునని తెలిసిపోయినది. అదే భగవద్గీతలో
పుణ్యము వలన సుఖములు కల్గుననీ, మోక్షము కలుగదనీ చెప్పబడి
యుండుట వలన శంకరుడు గ్రహించగలిగాడు.

ఈ విధముగా శంకరుడు భగవద్గీతను చదివిన తర్వాత
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన దానినిబట్టి తాను అంతవరకు వేదములు
గొప్పవనీ, అవియే ఆధ్యాత్మిక విద్యకు ప్రమాణమని చెప్పిన మాటలు పూర్తి
అసత్యమనీ శంకరునికి తెలిసిపోయినది. నాలుగు వేదములను, అష్టాదశ
పురాణములను, వందల సంఖ్యలో ఉపనిషత్లను వ్రాసిన వ్యాసుడు తన
రచనలలో వేదములను గొప్పగా చెప్పి చతుర్వేద రచన గావించి 'వేద

వ్యాసుడని' పేరుగాంచిన వ్యాసుడు చివరిలో అర్జునుని ద్వారా కృష్ణుడు
చెప్పిన భగవద్గీతను తెలియగలిగి, ఆత్మజ్ఞానమేమిటో గ్రహించగలిగినవాడై,
తాను వ్రాసిన వేదములకు ఆత్మజ్ఞానమునకు ఏమాత్రము సంబంధము
లేదని తెలిసినవాడై, తాను వేదములను రచించి ప్రజలను తప్పుదారి
పట్టించినందుకు బాధపడినవాడై తన జీవితములో చివరిగా మంచి పనిని
చేయదలచి, ఆ మంచిపనే 'భగవద్గీతను వ్రాయడము' అని అనుకున్నాడు.
భగవద్గీత అంతవరకు మాటల రూపములోయున్న దానిని అక్షర రూపము
లోనికి మార్చి భగవద్గీత గ్రంథమును వ్రాయగలిగాడు. వేదములను వ్రాసి
అసంతృప్తి పొందిన వ్యాసుడు చివరిలో భగవద్గీతను వ్రాసి తన జీవితము
ధన్యమయినదని అనుకొన్నాడు.

కృష్ణుడు భగవంతునిగా భూమిమీద ధర్మసంస్థాపన కొరకు భగవద్గీత
రూపములో చెప్పిన జ్ఞానము సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి
తెలిసిన జ్ఞానమని శంకరుడు తెలియగలిగాడు. అదే జ్ఞానమునే కృష్ణుడు
అర్జునునికి చెప్పగా దానిని వ్యాసుడు విని ఇంతకంటే మంచి అవకాశము
తన జీవితములో రాదని తెలిసి, ఆనాడు గ్రంథములు వ్రాయగల స్థోమత
వ్యాసునికి ఉండుట చేత భగవద్గీతను గ్రంథరూపములో వ్రాయడము
మహా ప్రసాదముగా భావించి, ఎంతో ఉత్సాహముతో వ్యాసుడు భగవద్గీతను
వ్రాశాడు. తనకు భగవంతుడు ధర్మముల రూపములో చెప్పిన ఆత్మల
జ్ఞానము తెలియక, గుణమయమయిన వేదములను వ్రాసి తప్పు
చేసినందుకు ఎంతో పశ్చాత్తాపము చెందిన వ్యాసుడు భగవద్గీతను వ్రాసి
తన జీవితము ధన్యమయినదని అనుకొన్నాడు. వ్యాసుడు తన జీవితములో
భగవద్గీతను వ్రాసి తృప్తిపొందినట్లు శంకరుడు గ్రహించాడు. ద్వాపర
యుగములో యున్న వ్యాసుడు వేదములను గురించి 'గుణమయి' అని

తన శ్లోకములో చెప్పడము శంకరుని కళ్ళు తెరిపించినట్లయినది.
అంతవరకు నాల్గు వేదములను గురించి చెప్పిన తనమాటలే తనకు తప్పుగా
కనిపించినవి. అంతవరకు గుణ విషయముల సంబంధ జ్ఞానమున్న
వేదముల మీదయున్న శ్రద్ధ విరక్తిగా మారిపోయినది. అప్పటినుండి ఆత్మల
విషయ జ్ఞానమున్న బ్రహ్మవిద్యాశాస్త్రమయిన భగవద్గీత మీద శ్రద్ధ పుట్టి
అది ఆసక్తిగా మారిపోయినది. వేదముల మీద విరక్తి భగవద్గీత మీద
ఆసక్తి కల్గిన వెంటనే తనతో వేదములను ప్రచారము చేయించిన ఆర్యుల
మీద శంకరునికి కోపము మొదలయినది.

ఆర్యుల అంతరంగములోని ఉద్దేశ్యము శంకరునికి కొద్దికొద్దిగా
అవగాహనకు వచ్చినది. ఆర్యులు ఏదయితే శంకరునికి తెలియకూడదను
కొన్నారో అది శంకరునికి పూర్తిగా తెలిసిపోయినది. తాను ద్రావిడ
బ్రాహ్మణుడయినందున తన చేత వేదములను, యజ్ఞములను ప్రచారము
చేయించి ద్రావిడులనందరినీ సులభముగా తమవైపు లాగుకొనుటకు చేసిన
ప్రయత్నమే తనను గొప్పగా ఆర్యులు ప్రచారము చేసి, అద్వైత సిద్ధాంత
కర్తగా చూపించారని అర్థమయినది. అప్పటినుండి ఆర్యులకు తనలోని
మార్పు కనిపించక మసలుకొని, వారు చెప్పిన మాటను విన్నట్లు
నటించాలనుకొన్నాడు. ఒక్కమారుగా కాకుండా క్రమేపీ ఆర్యులతో
సంబంధము లేకుండా దూరము కావాలనుకొన్నాడు. అంతేకాకుండా
అంతవరకు చేసిన వేద ప్రచారమును కొద్దికొద్దిగా మానుకొంటూ,
అప్పటినుండి భగవద్గీత ప్రచారమును కొద్దికొద్దిగా చేయాలనుకొన్నాడు.
అంతవరకు శంకరుడు ఆచార్యునిగా (గురువుగా) అద్వైత సిద్ధాంతకర్తగా
తయారు చేసిన దేశములోని నాలుగు మూలల పీఠములు నాల్గు వేదములకు
ప్రతీకగా చేసినవయినందున, ఆ నాలుగు పీఠములను కాకుండా వేద

రహితముగా ఆత్మజ్ఞాన సహితముగా యుండునట్లు తనకంటూ ప్రత్యేకముగా
ఒక పీఠమును నిర్మించాలనుకొన్నాడు.

ప్రశ్న :- ఆర్యులు ద్రావిడులను తమ మాట వినునట్లు, తమ ఆధీనములో
యుండునట్లు చేయడమేకాక, ద్రావిడులలో వేదసాంప్రదాయములను, యజ్ఞ
ఆచరణను కలుగజేయడానికి పన్నిన కుట్రలో భాగముగా శంకరున్ని
ఆచార్యునిగా చేసి దేశమంతా ప్రచారము చేయడమేనని శంకరునికి తెలిసిన
తర్వాత వారి సంబంధము అంతటితో తెంచుకోకుండా ఎందుకు
కొనసాగించాలి? శంకరుని అవసరము ఆర్యులకుండవచ్చునుగానీ, ఆర్యుల
అవసరము శంకరునికి లేదు కదా! శంకరుడు కూడా తెలివైనవాడే కదా!

జవాబు :- ఆర్యుల కుట్రయంతయూ శంకరునికి తెలిసిన తర్వాత వారితో
ఇంకా కొంతకాలము సంబంధపడి యుండాలనుకొనుటకు ఒకే ఒక
కారణము కలదు. “ధనమూల మిదమ్ జగత్” అన్నట్లు ప్రపంచములో
ధనము అన్నిటికీ మూలమైయున్నది. ప్రపంచములో పనులు జరుగుటకు
కనిపించని కర్మ వెనుకయున్నా, కనిపించే ధనము ప్రత్యక్షముగా మన
ముందరుండాలి. ఆర్యులకున్నది, శంకరాచార్యునికి లేనిది ధనమొక్కటే.
ఆర్యులు ధనికులు, శంకరుడు పేదవాడు. శంకరుడు తెలివైనవాడు కనుక
ఆర్యులతో సత్సంబంధము కల్గియుండి, వారిచేతనే తనకంటూ ఒక ప్రత్యేక
మఠమును (పీఠమును) తయారు చేయించుకోవాలనుకొన్నాడు. ఆ ఆలోచన
సంబంధముగా ఆర్యులతో ముందు ఎట్లున్నాడో తర్వాత కూడా అట్లే
యుండెను. ఆర్యులతో కలిసియుండి ఆర్యులు తనయెడల భక్తిగాయుంటూ
తనను గౌరవించుట వలన వారికి ఐదవ పీఠమును దక్షిణదేశమయిన
తమిళనాడులో తయారు చేయవలసినట్లు చెప్పెను. నాల్గు వేదములు
సారాంశమునకు గుర్తుగా ఐదవ పీఠమును స్థాపించునట్లు శంకరుడు

ఆర్యులకు సలహా ఇచ్చాడు. అంతేకాక నాల్గు వేదములను వేదవ్యాసుడు
వ్రాయగా ఐదవ వేదమును స్వయముగా శంకరుడే వ్రాయునట్లు ఆర్యులకు
చెప్పాడు. తాను వ్రాయబోవు ఐదవ వేదము పేరు 'ఆయుస్ వేదము' అని
కూడా చెప్పడము వలన వేదముల ప్రచారమే పరమావధిగా పెట్టుకొన్న
ఆర్యులు శంకరుని మాట విని సంతోషపడినారు. శంకరుని చేత ఐదవ
వేదమును వ్రాయించి ద్రావిడ బ్రాహ్మణులందరినీ తమవైపు లాగు
కోవాలనుకొన్నారు.

శంకరుడు చెప్పిన మాటను వినిన ఆర్యులు వెంటనే యుద్ధ
ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించి రెండు సంవత్సరములలో కంచిలో
“కామకోటి పీఠము” ను తయారు చేశారు. కామకోటి పీఠము అని ఐదవ
పీఠమునకు పేరు పెట్టడములో కూడా కొంత విశేషము కలదు. కామ
అనగా ‘ఆశ” అని అర్థము కలదు. కోటి అనగా లెక్కలేనంత, చెప్పలేనంత
అని అర్థము కలదు. అట్లు కాకున్నా 'కోటి ఆశలు' అని కూడా చెప్పవచ్చును.
తెలుగులో ఒక సామెతను మీరు వినియేయుందురు. అది "కోటి విద్యలు
కూటి కొరకే” అని చెప్పుచుందురు. అటువంటిదే కోటి ఆశలు లేక కోటి
కోర్కెలు అని చెప్పవచ్చును. మనిషికి తన ప్రాణము మీద చెప్పలేనంత
ఆశ ఉండుట వలన మనిషి ఎల్లకాలము బ్రతకాలనుకొంటాడు. అన్ని
ఆశలకంటే తాను బ్రతకాలను ఆశ ప్రతి మనిషికి ఎక్కువ ఉంటుంది.
కావున "కోటి విద్యలు కూటి కొరకు” “కోటి ఆశలు ప్రాణము కొరకు”
అన్నారు. ప్రాణము ఆయుస్ ను బట్టి యుంటుంది. అందువలన అందరికీ
ఆయుస్ అవసరమన్నట్లు శంకరుడు తన పీఠమునకు ఆ పేరును పెట్టాలను
కొన్నాడు. ఇది భౌతికమయిన అర్థముకాగా, అభౌతికమైన, దైవికమయిన
అర్థము కూడా ఈ వాక్యమునకు కలదు. జనన మరణములేని ఆయుస్సును

అనగా మోక్షమును కోరుకొనుటకు కూడా “కామకోటి" అను పదమును
వాడవచ్చును. అన్నిటికంటే సంఖ్యలలో పెద్ద సంఖ్య 'కోటి' అయినందున
ఆ విధముగా చెప్పినట్లు కలదు. ఆ దినము శంకరుడు ఆర్యులకు ఈ
విధమైన రెండు అర్థములను చెప్పి వారితో ఒప్పించాడు.

తమిళనాడు రాష్ట్రములో కంచి పట్టణమున కామకోటి పీఠము
482 B.C లో తయారైనది. ఆ విధముగా తన పీఠమును నాల్గువేదములలో
ఏ వేదమునకు సంబంధము లేకుండా చేసుకొన్న శంకరుడు ఒక సంవత్సర
కాలములో అనగా 481 B.C లో భగవద్గీతకు భావమును వ్రాశాడు.
దానినే ఈనాడు "ఆదిశంకరాచార్య భాష్య భగవద్గీత”గా చెప్పుచున్నారు.
శంకరుడు ఆర్యులకు తెలియకుండా, వారు చూడకుండా ఐదవ వేదమును
వ్రాస్తున్నట్లు చెప్పి ఏకంగా భగవద్గీతకు తన భావమును వ్రాశాడు. శంకరుడు
పూర్తిగా భగవద్గీతను వ్రాసిన తర్వాత ఆ విషయము ఆర్యులకు తెలిసినది.
ఆర్యులు తెలివైన వారయినందున శంకరాచార్యుల వారిలోని మార్పును
పసిగట్ట గలిగారు. శంకరుడు తన 28వ సంవత్సరమే భగవద్గీతా భాష్యము
వ్రాయగలిగితే తర్వాత జరుగబోయే కాలములో తమ మాట వినడని వారు
అనుకోవడము జరిగినది. శంకరుని అంతర్భావమును గ్రహించిన ఆర్యులు
తమలో మార్పులేనట్లు నటిస్తూ శంకరునితో ఎటువంటి భావభేదము
లేకుండా ప్రవర్తించుచుండిరి. అట్లుంటూ తిరిగి వేదముల వైపు వచ్చునట్లు
భగవద్గీతకు వ్యతిరేఖముగా మారునట్లు అనేక ప్రయత్నములు చేయుచుండిరి.
శంకరుడు వారి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గ్రహించుట వలన వారి
భావములోనికి శంకరుడు మారలేదు. అయినా శంకరుడు కూడా వారి
మాటను వినునట్లు నటిస్తుండెను. ఈ విధముగా ఇరువైపులా నటనలే
యుండేవిగానీ వాస్తవముండేది కాదు.

ఆర్యులు శంకరునిలో మార్పు కొరకు దాదాపు ఒక సంవత్సరము
వేచి చూచారు. అయినా శంకరునిలో మార్పు కనిపించలేదు. శంకరుని
మనోభావము ఎట్లున్నదో గుర్తించలేకపోయిన ఆర్యులు శంకరుడు ఇక
మారడనీ, భవిష్యత్తులో వారిమాట వినడనీ వారికి అర్థమయినది.
అంతేకాకుండా అంతవరకు ఊరకనే యున్న శంకరుడు భవిష్యత్తులో
ఊరకయుండక వేదములకు వ్యతిరేఖముగా భగవద్గీతను ప్రచారము
చేయునేమో! అను భయము ఆర్యులలో నెలకొన్నది. అదే జరిగితే శంకరుడు
గొప్పవాడనీ, తామే ప్రజలలో చేసినదంతా శంకరునికి అనుకూలముగా,
తమకు వ్యతిరేఖముగా మారిపోవుననీ, ప్రజలలో బాగా ప్రచారమయిన
శంకరుని మాటనే ప్రజలందరూ వినగలరనీ అనుకొన్నారు. ఆ విధముగా
భగవద్గీత ప్రచారము జరిగి వేదముల విలువ తగ్గిపోతే తాము 12
సంవత్సరముల నుండి శంకరున్ని పెంచి పోషించి గొప్పవానిగా చేసినదంతా
తమకే అడ్డము తిరుగునని ఆర్యులకు బాగా తెలిసిపోయినది. శంకరున్ని
పోషించిన ఆర్యులందరూ కలిసి శంకరునికి తెలియకుండా ఒకచోట
రహస్యముగా సమావేశమయి శంకరుని విషయమును బాగా చర్చించు
కొన్నారు. అందరూ కలిసి శంకరుని మార్పు కొరకు ఉత్తరదేశ పర్యటన
చేయించాలని, అతని మార్పుకొరకు అది చివరి ప్రయత్నమనుకొన్నారు.
తర్వాత కొద్దిరోజులకు ఉత్తర దేశ పర్యటనను గురించి శంకరునికి తెలియ
జేశారు. నాలుగు పీఠములలో ప్రస్తుతమున్న పీఠాధిపతులను పలుకరించి
వారి కార్యక్రమములను పరిశీలించి రావలసినదిగా శంకరునికి చెప్పారు.
వారి పనిని చూచి వారిని ఉత్తేజపరుచుటకు పలకరింపు అవసరమని తలచిన
ఆర్యుల మాటను శంకరుడు వ్యతిరేఖించలేదు. ఆర్యులు చెప్పిన వెంటనే
ఒప్పుకొన్నాడు. అప్పుడు అనగా! 480 B.C లో శంకరుడు ఉత్తర దేశ

పర్యటనను సాగించాడు. రెండవమారు ప్రయాణములో కేవలము
కాలినడకనే కాకుండా వాహనములుగా గుర్రములను కూడా వినియోగించు
కొన్నారు. వారి పర్యటన కర్నాటకలోని శృంగేరి పీఠమును చేరి, అక్కడ
నుండి ఒరిస్సాలోని పూరి జగన్నాథ పీఠమునకు పోవడము జరిగినది.
అక్కడనుండి గుజరాత్లోని ద్వారాకా పీఠమును చేరి అక్కడ పీఠములో
పది రోజులు గడిపి చివరిదయిన హిమాలయములలోయున్న బద్రినాథ్
పీఠముల వరకు పోవడము జరిగినది. శంకరాచార్యుల వారికి కొందరు
శిష్యులు కూడా ఆయనవెంట పోవడమయినది. ఆయన శిష్యులు కూడా
అందరూ ఆర్యులే అయివుండడము విశేషము.

కేదార్నాథ్ శివాలయములో శంకరుల విడిది యుండెను.
ఆలయములో అందరూ ఉండేదానికి వీలులేదు. మిగతా వారందరూ
వేరువేరు జాగాలలో విడిది చేయగా శంకరుడు ఆయనతోపాటు ఇద్దరు
శిష్యులు అక్కడ ఆలయములో ఉండిరి. అక్కడ శంకరులు వారము రోజులు
ఉండవలెనని నిర్ణయించుకొన్నారు. కేదార్నాథ్ గుడి అరణ్యప్రాంతములో
ఉన్నది. అక్కడికి పోయేదానికి అప్పటికాలములో సరియైన దారికూడా
లేదు. పర్వతపు అంచులలో జాగ్రత్తగా నడుస్తూపోవాలి. జనవాసములకు
చాలా దూరముగా యుండుట వలన అక్కడ ఇతర మనుషులు కనిపించెడి
వారు కాదు. అది అరణ్య ప్రాంతము అగుట వలన, దారి లేనందున
కేదార్నాథ్ బయటి ప్రపంచముతో సంబంధము లేనట్లు ఉండెడిది. అక్కడి
విషయము బయటి ప్రపంచమునకు తెలియాలంటే అప్పటికాలములో
దాదాపు వారము దినములు పట్టెడిది. సంవత్సరమునకు ఒక నెలలో శివ
భక్తులు అక్కడికి వచ్చి దర్శనము చేసుకొని పోయెడివారు. సంవత్సరములో
పదకొండు నెలలు అక్కడున్న పూజారులు తప్ప ఎవరూ ఉండెడివారు కారు.

అది హిమాలయ పర్వత ప్రాంతమయిన దానివలన అక్కడ ఇతర మనుషులు
బ్రతికే వనరులు ఏమాత్రము లేవు. అందువలన బయట జనాభా అక్కడ
ఏమాత్రము లేకుండెడివారు. అటువంటి వాతావరణమున్న చోట కేదార్నాథ్
గుడి కట్టబడినది.

శంకరాచార్యుల పర్యటనలో పది రోజులు కేదార్నాథ్
ఉండాలనుకొన్నారు. వారము రోజులు గడచినది, పది రోజులకు రెండు
రోజుల కొదవయుండగా, ఆ రోజు రాత్రి ఆలయములోనికి దొంగలు
ప్రవేశించారు. అప్పుడు గుడిలో శంకరుడు ఆయన శిష్యుడు ఒకడు
ఉన్నారు. మరియొక శిష్యుడు జ్వరముతో బాధపడుచుండుట వలన మిగతా
వారితోపాటు ఆలయమునకు కొంత దూరములో యున్న గుడారములలో
ఉండెను. కేదార్నాథ్ గుడి మందాకిని నది ఒడ్డున ఉండుట వలన అక్కడ
భూమి చదును లేకపోవడము వలన మిగతా వారందరూ ఆలయమునకు
కొంత దూరములో వారి గుడారములను నిర్మించుకొన్నారు. బద్రినాథ్
యాత్ర చాలా కష్టమైనది కావడముచేత, శంకరుని వెంట పోయిన
వందమందిలో సగము మంది క్రిందనే నిలిచి పోయారు. పెద్ద వయస్సు
వారు, నడువలేనివారు పర్వత క్రింది ప్రాంతములోనే నిలిచిపోగా, నడువ
గలిగిన వారు చిన్నవయస్సువారు మాత్రము పర్వతముల పైకి పోవడము
జరిగినది. కేదార్నాథ్ యున్న దాదాపు యాభైమంది కేదార్నాథ్ గుడికి
కొంత దూరములోయుండుట వలన, అక్కడ గుడిలోగానీ, పరిసర
ప్రాంతములో గానీ విద్యుత్తు లేనిదానివలన గుడిలో ఏమి జరుగుచున్నది
ప్రక్కకు తెలిసే అవకాశమే లేదు. అటువంటి స్థితిలో గుడిలోనికి దొంగలు
ప్రవేశించి అక్కడున్న శంకరుల శిష్యున్ని, శంకరున్ని కొట్టడము జరిగినది.
శిష్యుడు స్పృహ తప్పి పడిపోగా, శంకరుడు వారు కొట్టిన దెబ్బలకు

తట్టుకోలేక మరణించాడు. ఆలయములో యున్న కొద్దిపాటి నగలు మరియు
సొమ్మును దొంగలు అపహరించుకుపోవడము జరిగినది.
శంకరాచార్యుల వారు దొంగల చేతిలో చనిపోయిన విషయము
తెల్లవారే వరకు అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కొద్దిదూరములో
నున్న గుడారములలోని వారికి శంకరుల మరణ విషయము తెల్లవారిన
తర్వాత తెలిసినది. వెంటనే ఆ విషయము బయటికి తెలిసేదానికి అవకాశమే
లేదు. అందువలన శంకరుల వెంటపోయి పర్వతముల క్రిందనే నిలిచి
పోయిన సగము మందికి కూడా శంకరుల మరణ విషయము తెలియదు.
మూడు రోజుల తర్వాతగానీ, ఆ విషయము క్రిందనున్న వారికిగానీ బయటి
ప్రపంచమునకుగానీ తెలియదు. ఇప్పటి కాలములోవలె అప్పుడు
ప్రసారసాధనాలు అయిన ఫోన్ల సౌకర్యము లేకుండుట వలన, రైలు, బస్సు
సౌకర్యము లేనిదానివలన ఒక వార్త తెలియాలంటే మనుషులు పోయి
చెప్పితేగానీ తెలియదు. ఇప్పటికి దాదాపు 2500 (2492) సంవత్సరముల
క్రిందట ఇప్పటివలె ఏదీ లేదు. అందువలన శంకరాచార్యుల మరణవార్త
శంకరుని స్వగ్రామమునకు దాదాపు సంవత్సరము కాలము పాటు
తెలియదనియే చెప్పవచ్చును. శంకరుడు చనిపోయిన దినమున అక్కడ
దాదాపు యాభైమంది మాత్రము ఉండుట వలన వారే శంకరుల
అంత్యక్రియలను కేదార్నాథోనే జరిపినారు.

ప్రశ్న :- శంకరుల వారు దొంగల దాడిలో చనిపోయారని మిగతావారికి
తెల్లవారిన తర్వాత ఎలా తెలిసింది?

జవాబు :- శంకరునితోపాటు అక్కడేయున్న శిష్యుడు చెప్పగా ఆ విషయము
అందరికీ తెలియడము జరిగినది.

ప్రశ్న :- శంకరుల వారి మరణ విషయమును అక్కడేయున్న శిష్యుడు
వచ్చి మిగతా వారికి తెలియజేయవచ్చును కదా! అట్లు కాకుండా తెల్లవారే
వరకు శిష్యుడు మిగతావారికి ఎందుకు చెప్పలేదు?

జవాబు :- దొంగలు ఆలయములో ప్రవేశించిన సమయములో శంకరుడు
మరియు ఆయన శిష్యుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. దొంగల దాడిలో
శిష్యునికి కాలు ఎముక విరిగినది. తర్వాత అతడు మూర్ఛపోవడము
జరిగినది. మూర్ఛ నుండి కొద్దిసేపటికి తేరుకోవడము జరిగినా, అతని
కాలు కదపలేనందున అతడు బయటికి రాలేకపోయాడు. తెల్లవారిన
తర్వాత మిగతావారు (పూజారులు) అక్కడికి పోయిన తర్వాత శంకరుల
మరణము తెలిసినది. అక్కడే గుడిలోనే యున్న శిష్యునికి కూడా శంకరుడు
మరణించాడను విషయము తెలియదు. దొంగల దాడి జరిగిన విషయము
తెలిసిన శిష్యునికి శంకరుడు ఏమయ్యాడను విషయము తెలియదు. అతనికి
కూడా తెల్లవారిన తర్వాత ఇతరులకు తెలిసిన తర్వాత తెలిసినది.

ప్రశ్న :- అది అరణ్యప్రాంతము, తర్వాత ఎవరూ సులభముగా అక్కడికి
పోలేని పర్వతప్రాంతము. జనవాసములు లేని ప్రాంతము. అటువంటి
చోటికి దొంగలు ఎందుకు పోయారు?
జవాబు :- శంకరుడు ఆయన శిష్యులు అక్కడికి పోయిన విషయము
పర్వత క్రింది ప్రాంతములో తెలిసిపోవడము వలన, అక్కడ ఆలయములో
విలువయిన బంగారు ధనము దొరుకునను ఉద్దేశ్యముతో దొంగలు వచ్చి
యుండవచ్చును. పూర్వము దేవాలయములలో బంగారును దేవతలకు
అర్పించడము పరిపాటిగా యుండేది. అందువలన మరియు శంకరుడు
వచ్చి అక్కడ బంగారమును సమర్పించాడను నమ్మకముతో దొంగలు

రావడము జరిగినది. అంతేకాక శంకరుని వద్ద కొంత ధనము ఉండవచ్చు
నను అంచనాతో దొంగలు అక్కడికి వచ్చి ఆలయములో నగలకొరకు
ధనముకొరకు గాలించడము జరిగినది. బంగారు దొరికినా ధనము
దొరకనందుకు శంకరున్ని కొడితే ఇస్తాడనుకొని శంకరున్ని కొట్టడము
జరిగినది. శంకరునివద్ద వారి పర్యటనకు కావలసిన ధనముండడము
నిజమే, అయినా దొంగలకు శంకరున్ని కొడితే డబ్బు దొరుకునను
ఉద్దేశ్యముతో వారు శంకరున్ని కొట్టడము జరిగినది. శంకరుడు దొంగలకు
ధనమిచ్చినా వారు కొట్టిన దెబ్బలకు ఆయన ప్రాణము పోయినది.

ప్రశ్న :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము, మీరు సూటిగా
జవాబును చెప్పండి. శంకరుడు ఆర్యుల కుట్రవలన చనిపోయాడా? లేక
దొంగలు డబ్బుకొరకు కొట్టగా చనిపోయాడా?

జవాబు :- మేము ఎటూ చెప్పలేము. ఆర్యులకు శంకరుని మీద చెడు
భావముండుట నిజమే. అయినా అక్కడ ఆర్యులే ఆ పనిని చేశారనుటకు
ఎటువంటి సాక్ష్యాధారములులేవు. అందువలన అదే నిజమని చెప్పుటకు
అవకాశము లేదు.

ప్రశ్న :- సాక్ష్యాధారములుంటే అది బయటికి తెలుస్తుంది. బయటికి
విషయము పొక్కకూడదంటే సాక్ష్యాధారములు లేకుండా ఉండాలి.
అంతవరకు జరిగిన సంఘటనల దృష్ట్యా ఆర్యులే ఆ పనిని తెలివిగా చేసి
యుండకూడదా?

జవాబు :- శంకరుడు చనిపోకముందు జరిగిన విషయములకంటే, ఆయన
చనిపోయిన తర్వాత జరిగిన దానినిబట్టి శంకరాచార్యుని మరణము ఆర్యుల
కుట్రలో భాగమేనని తెలియుచున్నది. నాకు కల్గిన అనుమానమును గురించి



నేను చెప్పెదను.అయినా నా ఊహనే మీరందరూ నమ్మమని నేను
చెప్పడము లేదు. నా ఉద్దేశ్యము నిజము కావచ్చు, కాకపోవచ్చు.
అందువలన తుది నిర్ణయమును మీకే వదలుచున్నాను. శంకరుని జీవిత
మంతా 15 సంవత్సరములనుండి 27 సంవత్సరముల వరకు దేశపర్యటన
పీఠముల స్థాపనలో జరిగిపోయినది. శంకరుడు చిన్నవయస్సులోనే సంస్కృత
విద్యను నేర్వడము, వేదపఠన జరుపడము మొదలగునవన్నీ నేర్చినా
పరకాయ ప్రవేశ విద్య నేర్వలేదు. ఆయన పరకాయ ప్రవేశము చేయలేదు.
శంకరుడు చనిపోయిన తర్వాత ఆర్యులు శంకరున్ని ఇంకా ఎక్కువగా
ప్రచారము చేయుటకు శంకరుడు పరకాయ ప్రవేశము చేసి, చనిపోయిన
ఒక రాజు శరీరములోనికి దూరి, అక్కడ ఒక సంవత్సర కాలము వరకు
రాజు భార్యతో కాపురము చేసి, శృంగార విషయములను అందులోని
మెలుకువలను ఎన్నో నేర్చుకొన్నట్లు ప్రచారము చేశారు. వాస్తవముగా
శంకరుని జీవితములో జరుగని దానిని జరిగినట్లు చెప్పడములో ఆర్యులు
అదే పనిగా అసత్యమును చెప్పారని తెలియుచున్నది. శంకరుడు గొప్ప
వాడని చెప్పు ప్రయత్నములో ఈ అసత్యమును చెప్పారని తెలియుచున్నది.
అట్లు అబద్దము చెప్పవలసిన అవసరము ఏమి వచ్చిందని చూస్తే, శంకరుడు
గొప్పవాడని ఆయన చనిపోయిన తర్వాత కూడా చెప్పుటనుబట్టి ఆయన
మీద ఆర్యులకు ఎంతో భక్తి విశ్వాసములున్నవని తెలియుచున్నది.

అయితే శంకరుడు తన జీవితములో పరకాయ ప్రవేశ విద్యను
ఎప్పుడూ నేర్వలేదు. 2500 సంవత్సరముల పూర్వము మళయాల
రాష్ట్రములో (కేరళ)లో పరకాయ ప్రవేశ విద్య నేర్పే గురువులు ఉండేవారు.
విక్రమార్క మహారాజు కూడా కేరళ రాష్ట్రమందు పరకాయ ప్రవేశవిద్య
నేర్చినట్లు చరిత్రలో గలదు. ఆ విద్యను నేర్చుటకు కావలసిన కాలము

12 సంవత్సరములు. శంకరుని జీవితము వడ్డించిన విస్తరిలాగ అందరికీ
తెలిసినదే. అతి చిన్నవయస్సులోనే 14 సంవత్సరముల నుండే శంకురుని
మీద ఆర్యుల కన్ను పడింది. తర్వాత పదహారవ సంవత్సరమునుండి
ఆర్యులు శంకరున్ని ఉత్సవ ప్రతిమలాగ వాడుకున్నారు. శంకరున్ని చూపి
వేదములను, యజ్ఞములను ప్రచారము చేశారు. ఆర్యుల చేతిలో కీలు
బొమ్మగ యున్న శంకరుడు 12 సంవత్సరములు పరకాయ ప్రవేశ విద్య
కొరకు వినియోగించలేదు. పరకాయ ప్రవేశవిద్యను తెలియని శంకరుడు
పరకాయము చేశాడని చెప్పడము వలన వారి కుతంత్రము కొంత
బయటపడినది. అలా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనను
గొప్పగా చెప్పుట వలన శంకరున్ని ఆర్యులు హత్య చేశారను అనుమానము
ఎవరికీ భవిష్యత్తులో రాకుండుటకే వారు అలా చెప్పుచున్నారని
అర్థమయినది. ఈ ఒక్క ఆధారముతోనే మేము ఆర్యులను అనుమానించు
చున్నాము.

దేశములో నాలుగు మూలలా నాలుగు అద్వైత పీఠములను
శంకరుడు స్థాపించిన తర్వాత ప్రత్యేకముగా ఐదవ పీఠమును తన నివాసము
కొరకు ఏర్పరచుకొన్నాడు. మొదట ఏర్పరచిన నాలుగు తన స్వంత పీఠములే
అయినప్పుడు శంకరునికి ఐదవ పీఠమును ఏర్పాటు చేసుకోవలసిన
అవసరమేమిటి? అను ప్రశ్న రాగలదు. అలా ఏర్పరచుకోవడము వలన
ఆ నాలుగు పీఠములు తనకు ఇష్టము లేనట్లే కదా! అలా ఇష్టము లేకుండా
పోవడమునకు కారణమేమిటి? అను ప్రశ్న కూడా రాగలదు. వీటన్నిటికీ
జవాబును వెదకగలిగితే చిన్నవయస్సులో తాను చేసిన పని వయస్సు
వచ్చిన తర్వాత తనకే సరిపోలేదని అర్థమగుచ్నుది. మొదటి నాలుగు
పీఠములు 'నాలుగు వేదములకు' గుర్తుగా తయారు చేయబడినవి.

భగవద్గీతలోని జ్ఞానములో వేదములంటే ఏమిటో? వాటికి దేవుని దృష్ఠిలో
యున్న స్థానము ఏమిటో భగవద్గీతను చదివిన తర్వాతే శంకరునికి
అర్థమయిన దానినిబట్టి అతనికి నాలుగు పీఠముల మీద ఇష్టము లేకుండా
పోయినదని అర్థమయినది. అక్కడినుండి శంకరునిలో వచ్చిన మార్పు
ఆర్యులకు నచ్చకపోవడము కూడా మనకు తెలిసిన విషయమే. రెండు
లేక మూడు సంవత్సరములు శంకరున్ని తిరిగి తమ దారిలోనికి
తెచ్చుకోవాలని ఆర్యులు ప్రయత్నము చేసినది వాస్తవమే. ఆర్యులు శంకరుడు
ఒకరికొకరు సరిపోని భావముతో కొంతకాలము గడిపిన తర్వాత కూడా
శంకరుడు మారనప్పుడు, ఆర్యులకు లోలోపల శంకరునికి వ్యతిరేఖముగా
యున్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత శంకరుని గురించి అనేకచోట్ల,
అనేక విధముల పొగడడము ఎందుకని ప్రశ్న రాగలదు. అంతేగాక
శంకరునికి తెలియని పరకాయ ప్రవేశమును ఆయనకు తెలుసునని
చెప్పడము ఎందుకు? అంతేకాక ఆయన చేయని మహత్యములను చేశాడని
కల్పించి చెప్పడము ఎందుకు? అను ప్రశ్నలు ఏకధాటిగా రాగలవు.

శంకరుడు కేదార్నాథ్ గుడిలో చనిపోయినప్పుడు అదే దినమే
గుడి ప్రక్కననే శంకరున్ని పూడ్చిపెట్టి సమాధిని కట్టారు. అయితే శంకరునికి
ఇచ్చిన గౌరవమును శంకరుని సమాధికి ఇవ్వలేదనీ, శంకరున్ని ప్రచారము
చేసినట్లు శంకరుని సమాధిని ప్రచారము చేయలేదు. శంకరుని సమాధికి
ఎటువంటి భద్రత కల్పించలేదు. అందువలన 2013వ సంవత్సరములో
కురిసిన వర్షమునకు అక్కడ మందాకిని నదికి వచ్చిన వరదలో శంకరుని
సమాధి పూర్తిగా నామరూపములు లేకుండా నీటి ప్రవాహములో కొట్టుకొని
పోయినది. తామే సృష్టించి శంకరుని ద్వారా ప్రచారము చేయించిన
అద్వైత పీఠమును ప్రచారము చేసిన శ్రద్ధను శంకరుని సమాధి నీటిలో

కొట్టుకుని పోయిన తర్వాత ఆయన సమాధి మీద చూపలేదు. సానుభూతిగా
ఎక్కడా మాట్లాడలేదు. దీనిని అంతటినీ ఆలోచిస్తే శంకరుని మీద బయటికి
కనబరచిన ప్రేమ లోపల లేదని అర్థమగుచున్నది. శంకరుడు చనిపోయిన
తర్వాత అద్వైతము యొక్క ప్రచార బాధ్యతను ఆర్యులు స్వీకరించి, అద్వైతము
కంటే వేరే సిద్ధాంతమునుగానీ, వేరే జ్ఞానమునుగానీ చెప్పిన వారిమీద
దాడులు చేసి, భయపెట్టి అద్వైత సిద్ధాంతమును హిందూమతములో
నేటికినీ మొదటి స్థానములో యుండునట్లు చేశారు. శంకరులవారు
చనిపోయిన తర్వాత దాదాపు 1500 సంవత్సరములకు రామానుజాచార్యుల
ద్వారా బయటికి వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము కాకుండా
ఆర్యులు అనేకచోట్ల అడ్డుకొన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తయిన రామాను
జాచార్యుల వారిని దొరికితే చంపేటట్లు నిర్ణయించుకొన్నారు. దానితో
రామానుజాచార్యుల వారు జీవితమంతా రహస్యముగా బ్రతుకవలసి
వచ్చినది. విశిష్టాద్వైతులను ఎలా హింసించినది 'దశావతారము' సినిమా
చూస్తే తెలిసిపోతుంది. ఆర్యుల ముందర విశిష్టాద్వైతమును గురించి
చెప్పినవారిని అనేక విధముల హింసించి చంపినట్లు ఆ చలనచిత్రములో
తెలియుచున్నది.

అద్వైతమే తమ ప్రాణముగా, వేదములే తమ ఊపిరిగా బ్రతికిన
ఆర్యులు శంకరుడు వేదములకు వ్యతిరేఖముగా మారినాడని తెలిసిన
తర్వాత, తమ వేదపీఠములను కాదని ప్రత్యేక పీఠమును తయారు చేసుకొన్న
తర్వాత, శంకరునిచేత తయారు చేయించిన అద్వైత సౌధములను శంకరుడే
కూల్చివేయుటకు ప్రయత్నము చేయుచున్నాడని తెలిసిన తర్వాత, ఆర్యులు
శంకరున్ని తిరిగి తమ మార్గములోనికి మార్చవలెనని ప్రయత్నము రెండు
మూడు సంవత్సరములు చేసినా శంకరుడు మారకపోయినప్పుడు,

శంకరుడు భవిష్యత్తులో తమకు పూర్తి వ్యతిరేఖముగా మారిపోవునని తెలిసి
నప్పుడు ఆర్యులు శంకరున్ని తుదముట్టించవలెనని ఎందుకు అనుకో
కూడదు? అలాగే అనుకొనియుండవచ్చును కదా! ఆర్యులందరూ ఒకచోట
చేరి శంకరున్ని నిర్మానుష్యమయిన కేదార్నాథ్ వరకు తీసుకుపోయి అక్కడ
బయటి ప్రపంచమునకు తెలియకుండా చంపవలెనను పథకమును ఎందుకు
వేసియుండకూడదు? ఈ ప్రశ్నలన్నిటికీ శంకరుడు చనిపోయిన స్థలము,
శంకరుడు చనిపోయిన సంఘటనా విధానమును అన్నిటినీ అనుసరించి
శంకరున్ని ఆర్యులే దొంగలదాడిని సృష్టించి చంపియుంటారను జవాబును
తెస్తున్నవి. అట్లు చేశారను ఆధారము కూడా దొరకకుండా, ఆధార
రహితముగా ఆర్యులు తమ తెలివితో చేశారని తెలియుచున్నది. ఈ పనిని
చేశారు అని చెప్పుటకు ఆధారము లేనట్లు, ఈ పనిని చేయలేదు అని
చెప్పుటకు కూడా ఆధారము లేదు. శంకరుడు చనిపోకముందు ఐదు
సంవత్సరములుగా జరిగిన చరిత్రనుబట్టి, జరిగిన తర్వాత ఆర్యులు శంకరుని
మీద ప్రేమను ప్రచారము చేసిన దానినిబట్టి శంకరున్ని ఆర్యులే చంపారని
చెప్పవచ్చును.

ప్రశ్న :- అద్వైతము శంకరునిదా, లేక ఆర్యులదా? దీనికి ఉన్నదున్నట్లు
సమాధానము చెప్పండి?
జవాబు :- త్రైతాయోగము (త్రేతాయుగము) నుండి ఆర్యులు అద్వైతమునే
చెప్పుచున్నారు. అయితే అది ఒక సిద్ధాంతముగా చెప్పబడలేదు. దానికి
ఒక సిద్ధాంతకర్త లేడు. అద్వైతమును ఒక సిద్ధాంతముగా రూపొందించి
ఒక సిద్ధాంతకర్త ద్వారా ప్రకటించాలని కలియుగము మొదటిలోనే
అనుకొన్నారు. సిద్ధాంతకర్తగా ద్రావిడులనుంచి ఒకరిని తయారుచేస్తే,
తమకు వ్యతిరేఖమయిన ద్రావిడులనుండి వ్యతిరేఖతయుండదని, ద్రావిడు

లలో ఒక ముఖ్యమైన మనిషి ప్రతిపాదించిన సిద్ధాంతమును ద్రావిడులే
వ్యతిరేఖించరని తలచి దక్షిణ దేశములో సిద్ధాంతకర్తకు సరిపోవు తెలివైన
వ్యక్తికోసము అన్వేషిస్తూయుండిరి. అయితే దక్షిణ దేశమున కొందరు
బాల్య దశలోనే మేథావులు కనిపించినా వారు బ్రాహ్మణులు కాకపోయిన
దానివలన వారిని పరిగణలోనికి తీసుకోలేదు. చివరకు కేరళ రాష్ట్రములో
ఒక బ్రాహ్మణ కుటుంబమున శివగురు, ఆర్యాంబ అను దంపతులకు
జన్మించిన శంకర నామధేయుడయిన 14 సంవత్సరముల బాలుడు మహా
మేథావిగా ఆర్యులకు కనిపించగా, శివగురు కుటుంబముతో పరిచయము
ఏర్పరచుకొన్న ఆర్యులు చిన్నగా శంకరున్ని తమవైపు ఆకర్షితుని
చేసుకొన్నారు. శంకరుని తల్లితండ్రులు కడు పేదవారయినందున వారికి
ఆర్థిక సహాయము చేయుచూ వారిని తమ మాట వినునట్లు చేసుకోసాగారు.
చివరకు శంకరుని తల్లి అయిన ఆర్యాంబకు నచ్చచెప్పి శంకరున్ని 14వ
సంవత్సరమే సన్న్యాసత్వము స్వీకరించునట్లు చేశారు. 15వ సంవత్సరము
నుండి శంకరున్ని తమవెంట తీసుకొనిపోయి, బయట ప్రపంచమునకు
శంకరాచార్యున్ని చిన్నవయస్సులోనే పరిచయము చేసి, అతనిని అద్వైత
సిద్ధాంతకర్తగా ప్రకటించారు. వాస్తవముగా ఆ వయస్సులో శంకరునికి
అద్వైతము అంటే ఏమిటో కూడా తెలియదు. అందువలన "ఇంటిపేరు
భోగము, తినేది మాత్రము సంకటి, కారము” అన్నట్లు అద్వైతమునకు కర్త
శంకరుడే అయినా శంకరునికి అద్వైతమును గురించి ఒక ముక్క కూడా
తెలియదు. అయితే శంకరుని వెనుకయుండి అద్వైతమును చెప్పి ప్రచారము
చేసినది ఆర్యులే. అందువలన అద్వైతము త్రేతాయుగమునుండి ఆర్యులదే
అని చెప్పవచ్చును.

ప్రశ్న :- ఆర్యులు అద్వైతమునే ఎందుకు ఎన్నుకొన్నారు?

జవాబు :- ఫుట్బాల్ గ్రౌండ్లో ఎటయినా పరిగెత్తవచ్చును. అలాగే
అద్వైతములో ఎటైనా మాట్లాడవచ్చును. దానికి ఒక హద్దుపద్దు అంటు
తేడాలేమీ ఉండవు. అందువలన ఆర్యులు అద్వైతమునే ఎంచుకొన్నారు.
ఎదుటివాడు ఏమి ప్రశ్నవేసినా దానికి జవాబును తెలియనప్పుడు కూడా
అద్వైతములో తప్పించుకొని తెలిసిన వానివలె ప్రవర్తించవచ్చును. చిన్న
ఉదాహరణ చెప్పుకొంటే ఒకడు లక్షరూపాయల బాకీ చేసి బాకీ ఇచ్చిన
వానికి తిరిగి కట్టలేదు. బాకీ ఇచ్చినవాడు ఒక దినము బాకీ తీసుకొన్న
వానివద్దకు వచ్చి "అయ్యా! నీవు నా బాకీ తీర్చమని" అడిగాడు. అపుడు
బాకీ తీసుకొన్నవాడు అద్వైతమును మాట్లాడినాడట. అతను అద్వైతమును
ఇలా చెప్పాడు. "బాకీ ఇచ్చినవాడు పరబ్రహ్మస్వరూపమే, బాకీ తీసుకొన్న
వాడు పరబ్రహ్మ స్వరూపమే. అక్కడున్నది, ఇక్కడున్నది ఒకే పరబ్రహ్మ
స్వరూపము. పరబ్రహ్మము పరబ్రహ్మమునకే ఇచ్చినది. ఆయన సొమ్మును
ఆయనకే ఇచ్చుకొన్నాడు. ద్వైతము (రెండు) లేకుండా ప్రపంచమంతా
అద్వైతమే (రెండుకాని ఒక్కటే) యున్నప్పుడు నీది, నాది అనునది లేదు,
అంతా ఒక్కటే. నీవు పరబ్రహ్మస్వరూపమే, నేను పరబ్రాహ్మ స్వరూపమే.
అలాంటపుడు నీవు నాకిచ్చావు అనునది భ్రమమే, నేను తీసుకొన్నాను
అనునది భ్రమయే. తెలియనితనముతో నీవు బాకీ అని వచ్చావు. నిజానికి
నేను లేను, నీవు లేవు. ఇద్దరముగా కనిపించు మనము ఒక్కరమే. దానినే
అద్వైతము అంటాము. నీవు ఇంటికిపోయి తీరికగా ఆలోచించు, నీవు
పరబ్రహ్మ స్వరూపమేనని తెలుస్తుంది”. అని అన్నాడట.

ఈ విధముగా అద్వైతమును ఎక్కడయినా, ఏ సందర్భములో
అయినా చెప్పుకొనుటకు వీలుగాయుండును కనుక ఆర్యులు అద్వైతమునే
జ్ఞానబోధగా చెప్పుకొన్నారు. వాస్తవముగా ఆలోచిస్తే 'అద్వైతము' ఒక

సిద్ధాంతమే కాదు. సిద్ధాంతమయితే శాస్త్రము అగును. అద్వైతమును
ఆధారము చేసుకొన్న, అద్వైత సిద్ధాంతములతో కూడిన శాస్త్రమే లేనప్పుడు,
దానిని (అద్వైతమును) సిద్ధాంతము అనడమే తప్పగును. అద్వైతమును
ప్రపంచములో ఇంతవరకు ఎవడూ అనుభవించలేదు. అనుభవమునకు
రాని విషయము సిద్ధాంతము కాదు. సిద్ధాంతము కానప్పుడు శాస్త్రము
కాదు. శంకరాచార్యుల వారు కూడా తన జీవితములో అద్వైతమంటే
ఏమిటో తెలియకుండా గడిపాడు. అటువంటప్పుడు అద్వైతము ఆధ్యాత్మిక
సిద్ధాంతమే కాదు. సిద్ధాంతము కానిదానిని సిద్ధాంతముగా ఆర్యులు
సృష్ఠించారు తప్ప వేరు ఏమీ లేదు. అనుభవమునకు రానిది, శాస్త్రమనుటకు
వీలులేదు. మనిషి చనిపోయిన తర్వాత మోక్షము పొందితే అప్పుడు
అద్వైతమగును. ఇప్పుడు అద్వైతమే ఎవరికీ లేదు.

ప్రశ్న :- శంకరుడు భగవద్గీతను వ్రాశాడు కదా! భగవద్గీతలో అద్వైతమును
గురించి చెప్పాడు. లేని అద్వైతమును శంకరుడు ఎందుకు చెప్పాడు?
జవాబు :- కర్మ సన్న్యాసయోగములో 18వ శ్లోకముకు వివరము వ్రాసిన
చాలామంది స్వామీజీలు అందరూ అక్కడ అద్వైతమును గురించి చెప్పారు.
అలా చెప్పిన వారిలో శంకరుడు కూడా ఒకడు. శంకరాచార్యుల వారు
భగవద్గీతకు భాష్యము వ్రాసినప్పుడు భగవద్గీతలో ఎన్నో విషయములు
కనిపించినవి. 25 సంవత్సరముల వయస్సులో అన్ని విషయములు క్రొత్తవే
అయినా సంస్కృత పాండిత్యము తెలియుట వలన భగవద్గీతను వివరించి
చెప్పడమైనది. మానవుని నిజ జీవితములో తెలియని అద్వైతమును, కర్మ
సన్న్యాసయోగము యొక్క 18వ శ్లోకములో అందరూ పొరపడి చెప్పారు.
ఆ శ్లోకములో దేవుడు భగవంతుని రూపములో వచ్చి చెప్పిన భావము
వేరు. వ్రాసిన స్వామీజీల వ్రాతలోని భావము వేరుగా యున్నది.

భగవంతుడు చెప్పిన భావమును ఎవరూ చెప్పలేక అద్వైతమును
చెప్పడమైనది.

శ్లో॥ 18.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని |
శుని చైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః |

భావము :- “విద్య వినయము కల్గు బ్రాహ్మణులయందు, గోవులయందు,
ఏనుగులయందు, కుక్కలయందు, కుక్కలను తిను చండాలురయందు
పండితుల దృష్ఠి సమ భావముననే యుండును." ఈ విధముగా శ్లోకములోని
భావమును చెప్పవచ్చును. అయితే “సమదర్శినః" అను పదమువద్ద
అందరూ అద్వైతములోనికి పోవడము జరిగినది. అయితే ఆ పదము
అద్వైతములో వినియోగించినది కాదని చాలామంది తెలియలేకపోయారు.
అందరిలో యున్న ఆత్మను చూడమని అక్కడ చెప్పితే ఆత్మ విషయమే
తెలియని వారందరూ పరమాత్మను సమానముగా చూడవలెనని
అనుకొన్నారు. బ్రతికి యున్న మనిషి ఎంత గొప్పవాడైనా పరమాత్మను
చూడలేడను విషయము వారికి తెలియదు.

ప్రశ్న :- భగవద్గీతలో అద్వైతమును గురించి చెప్పలేదా?
జవాబు :- భగవద్గీతలో అద్వైతము, ద్వైతము, త్రైతము మూడు ఉన్నాయి.
మనిషి మోక్షము పొందినప్పుడు అద్వైతములో చేరిపోతాడు. లేక అద్వైతిగా
మారిపోతాడు అని చెప్పవచ్చును. మనిషికి పూర్తి కర్మ రాహిత్యమైనప్పుడు,
జన్మకు పోకుండా మోక్షమును పొందినప్పుడు అద్వైతమును మనిషి
పొందును. అప్పుడు వాడు జీవాత్మగా లేకుండా పరమాత్మగా మారిపోవును.
అలా జీవుడు దేవునియందు చేరి జీవ భావము లేకుండా పోయినప్పుడు
అద్వైతిగా మారిపోగలడు. ఇదంతయూ మనిషి బ్రతికినప్పుడు జరిగేది

కాదు. అందువలన ప్రపంచములో ఎవరికీ అద్వైతము తెలియదనియే
చెప్పవచ్చును.

ప్రశ్న :- అద్వైతమంటే ఏమిటి?
జవాబు :- ముందు త్రైతమును తెలిస్తే తర్వాత ద్వైతము తెలుస్తుంది.
ద్వైతమును తెలిస్తే చివరిలో అద్వైతము తెలుస్తుంది. మనిషి జీవిత
కాలములో అద్వైతము తెలియుట అసంభవము. అద్వైతము అంటే రెండు
కానిది ఒక్కటిగా యున్నదని అర్థము. ద్వైతము అనగా రెండు అని అర్థము.
అద్వైతము అనగా రెండు కానిది అని అర్థము. రెండు కానిది ఒకటి అని
చెప్పవచ్చును. అంతేకాకుండా రెండు కానిది మూడు అని కూడా
చెప్పవచ్చును. ఇక్కడ అద్వైతము అను పదమునకు అర్థము తీసుకొంటే
రెండు కానిది ఒకటి అని అయినా చెప్పవచ్చును లేక రెండు కానిది మూడు
అని కూడా చెప్పవచ్చును. రెండు రకముల అర్థములలో ఏదయినా
కావచ్చును. మా దృష్టిలో అద్వైతము అంటే రెండు కానిది మూడనియే
చెప్పుదుము. అలా ఎందుకు చెప్పుచున్నామనగా! మనిషి బ్రతికినప్పుడు
రెండుకానిది ఒకటి అనగా అద్వైతము ఎప్పటికీ తెలియదు. మనిషి
బ్రతికినప్పుడు తెలియునది రెండు కానిది మూడు మాత్రమే. అనగా
త్రైతము మాత్రమే. మనిషి జీవితము లేనప్పుడు అద్వైతము తెలియును
గానీ, మనిషి బ్రతికియున్నప్పుడు తెలియబడునది త్రైతము మాత్రమే. ఈ
విషయమును భగవద్గీతను వ్రాసినవారు ఎవరూ వ్రాయలేదు.


అద్వైతము అంటే అందరూ ఒకటి అని చెప్పువారే కలరు గానీ,
మూడు అని చెప్పువారు లేరు. మీరే ఆలోచించండి! రెండు కానిది మూడు
కావచ్చును కదా! రెండు కానిది ఒకటి అని ఎలా చెప్పగలుగుచున్నామో

అలాగే రెండు కానిది మూడు అని చెప్పవచ్చును. ఒక ఉదాహరణ
చెప్పుకొంటే ఇలా కలదు. ఒకనివద్ద మూడు వస్తువులు గలవు. అలాగే
మరియొకనివద్ద రెండు వస్తువులు గలవు. రెండు వస్తువులు గలవానివద్ద
ఒకటి చిన్నది రెండవది పెద్ద వస్తువుండెను. వస్తువులు అంటే కట్టెలని
అర్థము చేసుకోవలెను. ఒకటి పొట్టికట్టె, రెండవది పొడవుకట్టె యుండెను.
అట్లే మూడు వస్తువులు అని చెప్పిన వానివద్ద పొట్టి పొడవు మధ్యరకముగ
మూడు కట్టెలుండెను. వారి పై అధికారివచ్చి రెండు కట్టెలున్నవానిని
పొడవు కట్టెను చూపమన్నప్పుడు తనవద్దయున్న రెండు కట్టెలలో రెండవ
పొడవు కట్టెను చూపెను. రెండవవాని వద్దకు పోయి నీవద్దయున్న పొడవు
కట్టెను చూపమన్నప్పుడు అతడు అతనివద్దయున్న మూడవ కట్టెను చూపెను.
పై అధికారి ఇద్దరివద్ద ఒకే మాటను అడిగాడు. పొడవుకట్టెను చూపమన్నాడు
అప్పుడు ఇద్దరూ పొడవు కట్టెలే చూపారు. అయితే మొదటివాడు రెండవ
కట్టెను చూపగా, రెండవవాడు మూడవ కట్టెను చూపాడు. ఇక్కడ అడిగిన
మాట ఒక్కటే అయినా ఇరువురు చూపిన కట్టెల సంఖ్య మారిపోయినది.
అదే విధముగా ఇద్దరు మనుషుల వద్దకు పోయి రెండు కానిదానిని
చూపమన్నప్పుడు మొదటివాడు రెండుకాని మొదటి సంఖ్యను చూపితే
రెండవ వాడు రెండుకానిది మూడవదని చూపాడు. అట్లే అద్వైతి ఒక
భావమును కల్గియున్నాడు. త్రైతి మరొక భావము కల్గియున్నాడు.
అద్వైతము, ద్వైతము, త్రైతము అనునది ఆత్మలకు సంబంధించిన
విషయమైయుండుట వలన చాలా జాగ్రత్తగా ఈ విషయమును
చూడవలసియుండును.

ప్రశ్న :- ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయములో మొత్తము ఎన్ని
సిద్ధాంతములు కలవు?

జవాబు :- మూడు సిద్ధాంతములు ముఖ్యముగాయున్నవి. అయితే భారత
దేశములో ఇంతవరకు రెండు సిద్ధాంతములు మాత్రమే తెలియబడినాయి.
మూడవ సిద్ధాంతము ఇప్పుడిప్పుడే పుట్టినదని చెప్పుచున్నాము.
ప్రశ్న :- ఇప్పటికే ముందునుండి మూడు సిద్ధాంతములున్నాయి కదా!
మీరు రెండేయని చెప్పుచున్నారు.

జవాబు :- ఇంతకు ముందునుండి యున్నవి మూడయినా వాస్తవానికి
అవి రెండేనని చెప్పవచ్చును. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మూడు
గలవు. ఇందులో అద్వైతము, ద్వైతము అనునవి రెండు మాత్రమే
సిద్ధాంతములు. అద్వైతమునకు, ద్వైతమునకు మధ్యలోయుండునది
విశిష్టాద్వైతము. ఇది వేరు సిద్ధాంతమని చెప్పుటకు బదులు అద్వైతములోనే
ఒక భాగమని చెప్పవచ్చును. అద్వైతము అనగా రెండు కానిది ఒకటి అని
అర్థము. అట్లే ద్వైతము అనగా రెండు అని అర్ధము. ఇక మధ్యలోని
విశిష్టాద్వైతము అనగా! విశిష్టమైన అద్వైతము అని అర్థము. అందువలన
రెండూ అద్వైతములోనివే. ద్వైతము అద్వైతమునకంటే, విశిష్టాద్వైతమున
కంటే వేరయినదని చెప్పవచ్చును.

ప్రశ్న :- అయితే భూమిమీద హిందూమతములో యున్న ఆధ్యాత్మిక
సిద్ధాంతములు మొత్తము ఎన్ని?

జవాబు :- హిందూమతములో ఆధ్యాత్మిక సిద్ధాంతములు మొత్తము నాలుగు
కలవు. 1) అద్వైతము 2) విశిష్టాద్వైతము 3) ద్వైతము 4) త్రైతము. ఈ
నాలుగు సిద్ధాంతములను నలుగురు సిద్ధాంతకర్తలు ప్రతిపాదించారు.
ప్రస్తుతము 37 సంవత్సరములనుండి వచ్చిన త్రైత సిద్ధాంతము యొక్క
సిద్ధాంతకర్త తప్ప మిగతా ముగ్గురు కాలధర్మము చెందియున్నారు, అనగా

చనిపోయారు. త్రైత సిద్ధాంతకర్త ఒక్కడు మాత్రమే బ్రతికి సజీవముగా
యున్నాడు. తర్వాత సిద్ధాంతములను చెప్పినప్పుడు సిద్ధాంతకర్తలను గురించి
చెప్పగలము.

ప్రశ్న :- అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరున్ని ఆదిశంకరాచార్యుడు
అని ఎందుకు అంటున్నారు?

జవాబు :- తమిళనాడులోగల శంకరుని 'కామకోటి' పీఠమునకు ఎందరో
గురువులు పీఠాధిపతులుగా ఉంటూ వస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు
పీఠాధిపతులుగా రావడము జరుగుచున్నది. వారిలో చాలామంది శంకరా
చార్యుల వారి పేరు కల్గియున్నారు. అంతేకాక పీఠాధిపతిగా ఎవరు
పీఠమును అధిష్ఠించినా అతను శంకరుని పేరుతోనే చలామణి కావలసి
యుండును. పీఠాధిపతులుగా ఎక్కిన వారిపేరు ఏది ఉండినా, శంకరుని
తర్వాత వచ్చిన వారందరిని రెండవ శంకరాచార్యులు, మూడవ శంకరా
చార్యులు నాల్గవ శంకరాచార్యులు అని వరుస క్రమములో శంకరాచార్యుల
వారి పేరే చెప్పడము వలన వారిలోనికి శంకరుడు కలిసిపోకుండా, అద్వైత
పీఠమునకు మొదటివాడయిన శంకరున్ని అందరూ గుర్తుపట్టులాగున
ఆదిశంకరా చార్యులు అని శంకరున్ని పిలువడము జరిగినది. అందరిలో
కలిసిపోకుండా మొదటివాడను గుర్తింపువచ్చునట్లు ఆదిశంకరాచార్యులని
చెప్పారు.

ప్రశ్న :-:- ఆది శంకరులు తన జీవితములో ఎన్నో మహత్యములు కూడా
చేశాడని విన్నాము. అది నిజమేనా?
జవాబు :- ఆదిశంకరుల వారు తన జీవితములో ఏ మహత్యములు
చేయలేదు.

ప్రశ్న :- అయినా కొన్ని గ్రంథములలో శంకరుల వారి మహత్యాలను
గురించి వ్రాశారు. దానినేమంటారు?

జవాబు :- కొన్ని గ్రంథములలో ఆది శంకరాచార్యుల వారి గురించి ఎంతో
గొప్పవాడని, ఎన్నో మహత్యములు చేశాడని వ్రాశారు. అయితే అందులో
పూర్తి సత్యములేదని చెప్పవచ్చును. ఆదిశంకరులు బ్రతికియున్నప్పుడు
ఆయన ఏ మహత్యములను చేయలేదు. ఆర్యులే శంకరున్ని ప్రచారము
చేసి తమ పబ్బము గడుపుకోవాలని చూచారు. శంకరుడు చిన్నవయస్సులో
ఏ మహత్యములు చేయలేదు.

ప్రశ్న :- శంకరాచార్యుడు పుట్టిన తేదీలను గురించి రెండుమూడు
రకములుగా చెప్పుచున్నారు. ఒకటి 788 ఎ.డిలో పుట్టి 820 AD లో
చనిపోయినట్లు అక్కడ కూడా 32 సంవత్సరములు బ్రతికినట్లు చెప్పారు.
ఇక్కడ 509 BC లో పుట్టి 477 BC లో చనిపోయినట్లు చెప్పారు. ఇక్కడ
కూడా 32 సంవత్సరములే బ్రతికినట్లు కలదు. ఏది నిజమంటారు?

జవాబు :- ఈ రెండు సమాచారములలో ఏది నిజము ఏది అబద్ధము
అనునది ముఖ్యమే కాదు. ఆయన బ్రతికినది రెండుచోట్ల 32
సంవత్సరములనే వ్రాశారు కదా! అదే ముఖ్యము. ఒక విధముగా చూస్తే
బుద్ధునికంటే కొంత వెనుక శంకరుడు పుట్టాడని తెలియుట వలన క్రీస్తుకంటే
509 సంవత్సరముల ముందు పుట్టాడనునదే నిజమని చెప్పవచ్చును.
అవసరము లేని విషయములకంటే అవసరమైన విషయములే ముఖ్యము.
అవసరమైన విషయము శంకరుడు ఎన్ని సంవత్సరములు బ్రతికాడనునదే
ముఖ్యము. శంకరాచార్యుల వారు 32 సంవత్సరములు బ్రతికినది
వాస్తవము. ఆయన 32 సంవత్సరములు బ్రతికి తన స్వస్థలమునకు

ఎంతో దూరమున చనిపోవడము జరిగినది. ఆయన పుట్టినది ముఖ్యము,
ఆయన చనిపోయినది ముఖ్యము. చావుకు పుట్టుకకు మధ్య జరిగిన
జీవిత కాలము ముఖ్యము. ఈ మూడు మనకు తెలిసినది సత్యమే.

ప్రశ్న :- శంకరుడు సాధారణముగా చనిపోలేదు. చంపబడ్డాడు అని
మీరు చెప్పుట సత్యమే అయినా, ఆ విషయమును కొందరు జీర్ణించుకోలేక
మిమ్ములను తప్పుగా ఆరోపించవచ్చును కదా! అట్లుకాకపోయినా నేటికినీ
ఎందరో ఆర్యులున్నారు కదా! వారు తమ రహస్యమును బయటపెట్టు
చున్నారనియో, మమ్ములను హంతకులుగా చిత్రించుచున్నారనియో మీ
మీద కక్ష పెంచుకోవచ్చును కదా! ఆర్యులు తెలివైనవారని, విశిష్టాద్వైతము
వారిని ఎందరినో హింసించారని మీరే చెప్పారు. అటువంటప్పుడు శంకరుని
మరణమును గురించి చెప్పడము వలన మీకు కూడా వారి ద్వారా ఇబ్బంది
ఉండవచ్చును కదా!

జవాబు :- శంకరుని జీవిత చరిత్రంతయూ వ్రాసినవారు శంకరుని
మరణమును గురించి వ్రాయలేదు. కొందరు వ్రాసినా ఆయన కైలాసమునకు
పోయాడని వ్రాశారు. అట్లు ఎవరూ పోవుటకు వీలులేదు. ఎవరయినా
చనిపోయిన తర్వాత ఎక్కడికయినా పోవచ్చును. అంతేగానీ బ్రహ్మదేవుడు
వచ్చి కైలాసము ఖాళీగాయుంది ఇక భూలోక నివాసము చాలని శంకరున్ని
పిలిచినట్లు, అప్పుడు శంకరుడు తన వాహనమైన వృషభమును ఎక్కి
కైలాసమునకు పోయినట్లు వ్రాయడము అభూత కల్పన అని చెప్పవచ్చును.
ఇదంతా అసత్యమే అని తెలిసినా అలా కల్పించి చెప్పిన వారి మాటలను
నమ్మడము, మేము సత్యము చెప్పినా నమ్మకపోవడము చాలా విచిత్రము.
శంకరుడు కేదార్నాథ్ దొంగల చేతిలో చనిపోయినది చరిత్రకు తెలియని

సత్యము. అయితే ఆ దొంగలు ఎవరు? అన్నది ఆధారము లేని ప్రశ్నగా
నిలిచిపోయినది. దొంగల చేతిలో చనిపోయినది నూటికినూరుపాళ్ళు
సత్యమే. అయితే ఆ సమయములో ఆర్యులకుట్ర కూడా లేదని చెప్పుటకు
వీలులేదు. ఈ విషయములో మా నిర్ణయమే ఖచ్చితమయినదని మీరు
నమ్మవలసిన పనిలేదు. మీరు స్వయముగా ఆలోచించి ఒక నిర్ణయానికి
రమ్మని నేను చెప్పడము జరిగినది. అప్పుడున్న పరిస్థితులను బట్టి
ఇదంతయూ ఒక ఫతకము ప్రకారమే జరిగినదని చెప్పక తప్పదు.
జరిగిపోయిన విషయమును వదలి ఇప్పుడు ద్రావిడులు ఆర్యుల ఉచ్చులో
తగుల్కొనవద్దని చెప్పుచున్నాము. జరిగిన దానికంటే జరుగబోయేది
ముఖ్యము దానిని గురించి ఆలోచించండి.

ప్రశ్న : శంకరులు ధరించినది నొసలు మీద మూడు విభూతిరేఖలు.
శంకరాచార్యుల వారు కైలాసమునుండి దిగివచ్చిన శివుడేయని అందువలన
అతను విభూతినే ధరించాడని కొందరు చెప్పుచున్నారు. అంతేకాక ఆయన
మంత్రము కూడా పంచాక్షరి మంత్రమయిన 'ఓం నమఃశివాయ” అని
ఉన్నదని అంటున్నారు. దీనిని గురించి మీరేమంటారు?

జవాబు :- నేను ఒక సిద్ధాంతకర్తగా నా కర్తవ్యము ప్రకారము సత్యమునే
చెప్పవలసియున్నది. అందువలన ఈ విషయములో మేము చెప్పునదే
మనగా! శంకరున్ని శివుడని ఆర్యులన్నారు తప్ప మిగతా ఎవరూ అనలేదు.
మూడు విభూతి రేఖలు అద్వైతముతో వచ్చినవి కావు. కృతయుగములోని
జ్ఞానులు తయారుచేసినది మూడు విభూతిరేఖలు. మూడు విభూతి రేఖలకు
విశేషమైన జ్ఞానము కలదు. మూడు విభూతిరేఖలలో అద్వైతము గానీ,
విశిష్టాద్వైతముగానీ, ద్వైతముగానీ ఏదీలేదు. త్రైత సిద్ధాంతము విభూతి
రేఖలతో ముడిపడియున్నది. విభూతిరేఖలు మూడు గలవు. మూడు

రేఖలు మూడు ఆత్మలకు గుర్తుగా యున్నవి. ఆత్మ అనగా! పవిత్రతతో
కూడుకొనియున్నది. అందువలన ఆత్మల గుర్తులయిన మూడు రేఖలను
తెల్లని విభూతితో తీర్చిదిద్దడమైనది. తెలుపు కల్మషము లేనిది, పవిత్రతకు
గుర్తుగాయున్నది. అందువలన మూడు రేఖలను తెల్లని విభూతిలోనే
పెట్టడమయినది. మొదట ఈశ్వర లింగము మీద పెట్టిన విభూతి రేఖలకు
ఎంతో అర్థమును చేకూర్చడము జరిగినది.

ప్రశ్న :- శంకరాచార్యులవారు ధరించిన విభూతి రేఖలు ఈయన భూమిమీద
పుట్టకముందునుండి ధరించెడివనీ, శంకరాచార్యులవారు భూమిమీద
పుట్టకముందు త్రిమూర్తులలో ఒకరైన శివుడనీ, శివునిగా కైలాస పర్వతమున
నివసించుచూ విభూతి రేఖలను ధరించియుండెడివాడనీ, పార్వతీ
సమేతుడుగా యున్న శివుడు శంకరుడను పేరుతో భూమిమీద పుట్టి
అద్వైతమును స్థాపించాడనీ, 32 సంవత్సరములు భూమిమీదయున్న ఆయన
కేదార్నాథ్ యున్నప్పుడు సకలదేవతలు వచ్చి పిలువగా తన వృషభ
వాహనమును ఎక్కికైలాసమునకు పోయాడని కొన్ని గ్రంథములలో గలదు.
అట్లుండగా శివుని విభూతికి శంకరునికి సంబంధము లేదు అని మీరు
అనడములో సత్యము కలదా?

జవాబు :- శంకరుడు శివుడై వృషభ వాహనము మీద కైలాసమునకు
పోయాడని మీరు చెప్పు మాటలో సత్యము కలదా! యని మేము ప్రశ్నించు
చున్నాము. ప్రజలు అసత్యపు మాటలను నమ్ముచున్నారు, సత్యమును
చెప్పితే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అసత్యమువద్ద ఎవరూ ఏమీ ప్రశ్నించక
చెప్పినదంతా విని తలూపుచున్నారు. త్రిమూర్తులలో శివునికి కేరళ
రాష్ట్రములో పుట్టిన శంకరునికి ఏమాత్రము సంబంధము లేదు. అంతేకాక

విభూతిరేఖలు కైలాసగిరిలోయున్న శివునికి సంబంధించినవి కూడా కావు.
సృష్ఠి తర్వాత దేవుడు ఇచ్చిన జ్ఞానముతో 'దేవునికి రూపములేదు' అని
చూపుటకు ముక్కు ముఖములేని ఒక గుండ్రని రాయిని దేవుని గుర్తుగా
చూపడము జరిగినది. అంతేకాక దేవుడు మూడు ఆత్మల రూపములో
త్రైతముగా యున్నాడని తెలుపు నిమిత్తము మూడు తెల్లని రేఖలను దేవుని
గుర్తుగా చూపబడిన రాతి లింగము మీద ఉంచడము జరిగినది. దేవుని
నిరాకార స్వరూపమునకు విభూతిరేఖలను, సాకార స్వరూపమైన
ఆకారమున్న ప్రతిమకు మూడు నిలువు నామములను ముఖము మీద
నొసలు భాగములో పెట్టడము జరిగినది. ఈ విధముగా విశ్వములోని
దైవము యొక్క స్థితిని తెలియజేయుటకు మూడు అడ్డరేఖలను, మూడు
నిలువు రేఖలను జ్ఞానులు తయారు చేసి పెట్టగా వాటినే అందరూ
ధరించారు. అంతేగానీ వాటిని ధరించిన వారివి అవి ఏమాత్రము కావు.
శివుని విభూతి రేఖలుగానీ, విష్ణువుకు త్రినామముగానీ ఏమాత్రము
స్వంతములు కావు. దేవుని యొక్క సాకార నిరాకారములకు ధరింపచేసిన
మూడు ఆత్మల గుర్తులుగా రెండు రకముల అడ్డనామములు, నిలువు
నామములు గలవని తెలియవలెను. కృతయుగమునుండి అందరూ
ధరించినట్లే కేరళ రాష్ట్రములో పుట్టిన శంకరుడు కూడా విభూతి రేఖలను
ధరించడము జరిగినది.

ప్రశ్న :- హిందూమతములోని శైవులు విభూతిరేఖలను ధరించడము,
వైష్ణవులు నిలువునామములు ధరించడము జరిగినది. శైవులు విభూతి
రేఖలను తమ స్వంత పార్టీ గుర్తుగా చెప్పుకోగా, వైష్ణవులు మూడు నిలువు
నామములను వైష్ణవ సాంప్రదాయ గుర్తుగా చెప్పుకోవడము జరిగినది.
శైవుల, వైష్ణవుల వేరువేరు సాంప్రదాయములకు సంబంధించినవే వేరువేరుగా

యున్న నిలువు, అడ్డనామములు అని చెప్పుచున్నారు. శైవులు, వైష్ణవులు
చెప్పుదానిలో సత్యమెంత గలదు?

జవాబు :- సత్యము రవ్వంతయు లేదని చెప్పవచ్చును. మొదటి
యుగమయిన కృతయుగములోనే ఆధ్యాత్మిక జ్ఞానములో సాకార,
నిరాకారములను తెలుపు గుర్తులుగా, మూడు ఆత్మలను ఉద్దేశించి పెట్టినవే
విభూతి రేఖలు, నిలువు నామములు. అయితే కాలము జరుగుకొలది
మనుషులలో మాయాప్రభావము పని చేయడము వలన త్రేతాయుగమునకు
విభూతిరేఖలు చంద్రవంశము వారు ధరించెడివనీ, నిలువు నామములు
సూర్యవంశము వారు ధరించెడివారని చెప్పుకోవడము, అలాగే ధరించడము
జరిగెడిది. ద్వాపరయుగములో మరికొంత మాయ పనిచేయగా
అజ్ఞానములో మునిగిన మనుషులు పూర్వము పెద్దలు పెట్టిన అర్థములను
మరచిపోయినవారై విభూతిరేఖలు శైవులవి, నిలువునామములు వైష్ణవులవి
అని చెప్పుకోవడము జరిగినది. ప్రస్తుతము కలియుగములో రెండు
నామములకు పూర్వమున్న అర్థమును పూర్తిగా మరచిపోయినవారై,
మరికొంత అజ్ఞానములోనికి దిగజారినవారై, మూడు విభూతిరేఖలు
అద్వైతులవనీ, మూడు నిలువు నామములు విశిష్టాద్వైతులవనీ
చెప్పుకోవడము జరుగు చున్నది. ఈ విధముగా యుగములు మారేకొద్దీ
రెండు నామముల మీద భావములు కూడా మారుతూవచ్చాయి. అయితే
పూర్వము కృత యుగములో ఆత్మజ్ఞానులు భావమే సరియైనదిగానీ, తర్వాత
వచ్చిన మూడు యుగములలోనూ విభూతిరేఖల మీద, మూడు నామముల
మీద ప్రజలలో గల భావము సరియైనది కాదని చెప్పవచ్చును. ద్వైతము
అంటే రెండని అర్థము గలదు. త్రైతము అంటే మూడని అర్థము కలదు.
అద్వైతము అంటే రెండుకానిదని అర్థము కలదు. అటువంటప్పుడు

అద్వైతమునకు నిజమైన భావమును ఖచ్చితముగా చెప్పలేము. ఎందుకనగా!
అద్వైతము అను పదములోనే సందిగ్ధావస్థ కలదు. అద్వైతము అన్నప్పుడు
రెండు కానిదను అర్థము వచ్చును. రెండు కానిది, రెండు తర్వాతయున్నది,
మూడని చెప్పవచ్చును. అట్లుకాకుండా అద్వైతము అంటే రెండుకానిది
ఒకటని చెప్పుట తప్పని చెప్పవచ్చును. శూన్యము అనగా సున్న అనియూ,
అశూన్యము అనగా సున్నా కానిది ఒకటియని చెప్పవచ్చును. అలాగే
'అనేకము' అన్నప్పుడు ఒకటికానిది రెండని చెప్పవచ్చును. అద్వైతము
అన్నప్పుడు రెండుకానిది మూడని చెప్పవచ్చును. అట్లు ముందుకు
చెప్పవలెనుగానీ, వెనక్కు చెప్పకూడదు. అందువలన అద్వైతము అంటే
ఒకటనడములో అర్థమేలేదు.

ప్రశ్న :- మూడు విభూతిరేఖలు, మూడు నిలువు నామములు ఇప్పటివికావు,
అద్వైతులకు, విశిష్టాద్వైతులకు సంబంధించినవి కావు. కృతయుగములోనే
జ్ఞానులు నిర్ణయించి పెట్టినవని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట
నిజమే యుండవచ్చును. కృతయుగ చరిత్రలో, త్రేతాయుగ చరిత్రలో,
ద్వాపరయుగ చరిత్రలోనూ విభూతిరేఖలు, నిలువు నామములు ధరించిన
వారున్నట్లు తెలియుచున్నది. శ్రీరాముని కాలములో రాముడు
సూర్యవంశము రాజయిన దానివలన నిలువు నామములు ధరించినట్లు,
రావణబ్రహ్మ విభూతిరేఖలను ధరించినట్లు చరిత్రలో తెలియుచున్నది.
నాలుగు యుగములలో తెల్లని విభూతి రేఖలు, మూడు నిలువు నామములను
ధరించిన వారున్నారు. అయితే యుగ యుగమునకు మనుషులలోని
భావము మారినదని మీరు చెప్పినది సత్యమే అనిపించుచున్నది. అయితే
నేడు అద్వైతమువారు, విశిష్టాద్వైతమువారు చెప్పుచున్న మంత్రములు ఇప్పటి

కాలములో వీరివేనా, లేక పూర్వకాలమునుండి నామములున్నట్లు వేరు
అర్ధముతో ఏమయినా ఉండెడివా అని అనుమానము వచ్చినది. నేడు
అద్వైతులు “ఓం నమఃశివాయ” అను పంచాక్షరి మంత్రమును,
విశిష్టాద్వైతులు “ఓం నమోనారాయణాయ" అను అష్టాక్షరి మంత్రమును
చెప్పుచున్నారు. ఈ పంచాక్షరీ, అష్టాక్షరీ మంత్రములు ఇప్పటివేనా లేక
పూర్వ కాలమునుండి ఉన్నాయా? మాకర్థమయ్యేలాగున వివరముగా
చెప్పండి.

జవాబు :- కృతయుగములోనే సూర్యుడు భూమిమీదకు దైవజ్ఞానమును
చేర్చిన తర్వాత జ్ఞానమును తెలిసిన జ్ఞానులు ప్రకృతిని దైవమును
వేరువేరుగా విడదీసి ప్రకృతికి సర్వము నాశనమయినా దేవుడు మాత్రము
నాశనము కానివాడని తెలుపు నిమిత్తము జ్ఞానార్థముతో పంచాక్షరి
మంత్రమును తయారు చేశారు. పంచాక్షరి మంత్రము ఆరు అక్షరములతో
కూడుకొనియున్నది. “ఓం నమఃశివాయ” అనునది పంచాక్షరి మంత్రమని
చెప్పబడుచున్నది. దేవుడు కనిపించనివాడు, కనిపించని దేవుని జ్ఞానము
కనిపించని సూక్ష్మమైన అర్ధముతో కూడుకొనియుండును. అయితే పంచాక్షరి
మంత్రమునకు స్థూలమైన కనిపించే అర్థము ఒకటి కలదు. అలాగే
సూక్ష్మముగా కనిపించని అర్థము మరొకటి కలదు. స్థూలమైన అర్థమును
గురించి చెప్పుకొంటే ఈ విధముగా కలదు. పంచ+అక్షరి=పంచాక్షరి.
పంచ అనగా ఐదుయని అర్థము. అక్షరి అనగా అక్షరములని చెప్పవచ్చును.
కనిపించే ఐదు అక్షరములని ప్రపంచ సంబంధముగా కనిపించే అర్థము
కలదు. ఇక కనిపించని సూక్ష్మమైన అర్థము కూడా కలదు. పంచ అనగా
ఐదు అనియూ, అక్షరీ అనగా నాశనము కానిదనియూ అర్థము. ఈ
కనిపించని సూక్ష్మ అర్థము ప్రకారము ఐదుకు నాశనము కానిదని అర్థము.

ఇంకా వివరముగా చెప్పుకొంటే ప్రకృతి ఐదు భాగములుగా కలదు.
దానినే పంచభూతములు అంటున్నాము. ఐదు సజీవ శక్తులతో కూడియున్నది
ప్రకృతి. ప్రకృతిలోని ఐదు శక్తులకు వరుసగా పేర్లు ఈ విధముగా కలవు.
1) ఆకాశము, 2) గాలి, 3) అగ్ని, 4) నీరు, 5) భూమి. ఈ ఐదు శక్తులు
ప్రపంచములో జీవరాశులకు పుట్టుకను, చావును కలుగ జేయుచున్నవి.
దేవుడు సాక్షిగాయుండగా ఐదు శక్తుల వలననే ప్రపంచములోని
కార్యములన్నియూ జరుగుచున్నవి. ఆత్మ చేయించగా ప్రకృతి చేయుచున్నది.

ప్రకృతియంతయూ పరమాత్మ ఆధీనములోయుండి పని చేయు
చున్నది. ప్రకృతిని పుట్టించినది పరమాత్మయే. అందువలన అన్నిటినీ
నాశనము చేయు ప్రకృతి పరమాత్మను ఏమియూ చేయక దేవునిపట్ల
వినయముగా ఉండును. దీనినిబట్టి ప్రకృతికి నాశనముకానిది పరమాత్మ
యని చెప్పవచ్చును. ప్రకృతియనగా పంచభూతములు కనుక 'పంచ'
అని అన్నారు. నాశనముకానిది కనుక 'అక్షరము' అన్నారు. అక్షరము
అనగా నాశనము లేనిది అని చెప్పుచూ పంచభూతములకు నాశనము
కానిది పరమాత్మయని అందరికీ తెలియజేయు నిమిత్తము దేవున్ని
“పంచాక్షరి” అన్నారు. పంచాక్షరిలో పంచముగానున్న ప్రకృతికి అనగా
ఐదు భూతములకు గుర్తుగా ఐదు బీజాక్షరములను వ్రాసి చూపారు. అలాగే
పరమాత్మకు గుర్తుగా ఒక బీజాక్షరమును వ్రాసి చూపారు. పరమాత్మకు
గుర్తుగాయున్న బీజాక్షరము “ఓం” అని వ్రాసి, పంచభూతముల బీజాక్షరము
లను వరుసగా న,మః, శి,వా,య అని వ్రాశారు. “ఓం” పరమాత్మ బీజాక్షర
మైనట్లు 'న' ఆకాశమునకు బీజాక్షరముగా నిలిచినది. అలాగే “మః”
గాలికి, “శి” అగ్నికి, “వా” నీరుకు, “య” భూమికి బీజాక్షరములైనవి. ఈ
విధముగా "ఓం నమఃశివాయ" అనునది ప్రకృతికి నాశనముకాని

పరమాత్మగా గుర్తింపబడినది. ఇది ఓం నమఃశివాయలోని సూక్ష్మమైన
అర్థముకాగా, స్థూలమైన అర్థము వ్రాయబడిన ఐదు అక్షరములని
చెప్పవచ్చును.

అలా చెప్పితే 'ఓం నమఃశివాయ' మొత్తము ఆరు అక్షరములు
గలవు. అప్పుడు దీనిపేరు షష్టాక్షరి అగును కదా! పంచాక్షరి కాదుకదా! యని
ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు కొందరు “ఓం” అనునది ప్రణవాక్షరము.
అది అన్ని మంత్రములకు ముందుండునది, అందువలన 'ఓం' ను వదలి
నమఃశివాయ అను ఐదు అక్షరములనే లెక్కించవలెను” అని అంటున్నారు.
ప్రతి మంత్రము ముందర 'ఓం' సర్వసాధారణముగా ఉచ్ఛరించబడుచున్నది.
కావున ఓం ను వదలి మంత్రములోని అక్షరముల సంఖ్యనే చెప్పవలెనని
కొందరి వాదన. ఇది ఇట్లుండగా కొందరి వాదనలో ఓంను కూడా కలిపి
లెక్కించవలెనని చెప్పుచున్నారు. "ఓం నమోనారాయణాయ" అను
మంత్రములో మొత్తము ఎనిమిది అక్షరములుండుట వలన దానిని అష్టాక్షరి
మంత్రమన్నారు. ఇక్కడ 'ఓం'ను కలిపి లెక్కించితే ఎనిమిది అక్షరములగు
చున్నవి. ఓంను వదలి ఎంచితే ఏడు అక్షరములే అగును. అష్టాక్షరి
మంత్రము దగ్గర 'ఓం' ను లెక్కించమని చెప్పినట్లు పంచాక్షరి మంత్రము
వద్ద చెప్పడము లేదు. అక్కడ ఓంను వదలి లెక్కించమని అంటున్నారు.
పంచాక్షరి, అష్టాక్షరి మంత్రముల విషయములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా
చెప్పుట వలన రెండు మంత్రముల వద్ద ఏకాభిప్రాయము లేకుండా
పోయినది. ఆధ్యాత్మిక విద్యలో ఎంతో ప్రాముఖ్యతను పొందిన రెండు
మంత్రములు భిన్నముగా యుండుట వలన మనుషులు మొత్తము
ఆధ్యాత్మికమునే నమ్మకుండా అంతా బూటకము అంటున్నారు. వీటిలో
శాస్త్రబద్దత కనిపించని దానివలన కొందరు దేవున్నే నమ్మని నాస్తికులు
తయారయినారు.

ప్రశ్న :- పంచాక్షరి మంత్రము జ్ఞానమును తెలిసిన పెద్దలు తయారు
చేశారంటే అది కృతయుగములో తయారయినట్లే. అయితే అది స్థూల
అర్థముకంటే సూక్ష్మ అర్థమే జ్ఞానముతో కూడుకొన్నదైయుండగా, స్థూల
అర్థము ఐదు, ఆరు అక్షరములని లెక్కించబడుచూ అనుమానములనే
రేకెత్తించుచున్నది. దీనికి తోడు అష్టాక్షరి మంత్రము దేశములో ప్రసిద్ధిగాంచి
నది. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రములు తెలియని జ్ఞానులు ఉండరు.
కొద్దిమాత్రము జ్ఞానము తెలిసిన వారికయినా ఈ రెండు మంత్రములు
సుపరిచయమే అని చెప్పవచ్చును. పంచాక్షరి మంత్రము ఒకటేయుండి
వుంటే అక్షరముల సముదాయములలో అంతపట్టింపు ఉండేది కాదు.
అష్టాక్షరి మంత్రము వచ్చిన తర్వాతనే అక్షరముల గొడవ ప్రారంభమయినది.
పంచాక్షరి కృతయుగమునుండి యున్నది. అయితే అష్టాక్షరి ఎప్పుడు
ప్రారంభమయినది. ఎవరు అష్టాక్షరిని కనిపెట్టి చెప్పారు?

జవాబు :- భూమిమీద ఎప్పుడు జ్ఞానము ప్రారంభమయినదో అప్పుడే
అజ్ఞానము కూడా ప్రారంభమయినది. మొదట జ్ఞానము ప్రకారము
పంచాక్షరి మంత్రము తయారయినది. మంత్రము అనగా జపించునది
కాదు. మంత్రము అనగా మహిమతో కూడుకొన్నదని అర్థము. మహిమ
అనగా శక్తియని జ్ఞానశక్తి అని అర్ధము. పంచాక్షరిలో జ్ఞానశక్తి ఇమిడి
యుండుట వలన దానిని 'పంచాక్షరి మంత్రము' అని అన్నారు. కృత
యుగములో పంచాక్షరి మంత్రముండగా అదే యుగములోనే కొంతకాలము
జరుగగా, నిరాకార, సాకార స్వరూపముగా తయారయిన లింగమును,
ప్రతిమను దేవతల క్రిందికి జమకట్టడము జరిగినది. అప్పటికి కొంత
అజ్ఞానము మనుషులలో తయారై పరమాత్మ నిరాకారమైన లింగమును

శివునిగా, సాకార ప్రతిమను విష్ణువుగా మనుషులు చెప్పుకోవడము
జరిగినది. అప్పుడు ఒకే దేవుడు నిరాకారముగా, సాకారముగా యున్నాడను
జ్ఞానము పోయి లింగమును శివుడని, ప్రతిమను విష్ణువని చెప్పుకోవడము
మొదలయినది. దానితో దేశములో శివభక్తులు కొందరు, విష్ణుభక్తులు
కొందరు ఏర్పడినారు. ఎప్పుడు విష్ణుభక్తులు ఏర్పడినారో అప్పుడు అష్టాక్షరి
మంత్రమును తయారు చేసుకొన్నారు. శివభక్తులు ముందునుండియున్న
'ఓం నమఃశివాయ' మంత్రమును తన మంత్రమని చెప్పుకోగా, దానికి
పోటీగా విష్ణుభక్తులు ‘ఓం నమోనారాయణాయ' అను అష్టాక్షరి మంత్రమును
తయారు చేశారు. అప్పటినుండి ఆ మంత్రములలో జ్ఞానశక్తి లేకుండా
పోయినది. అవి రెండు మంత్రములని పిలువబడినా అందులో మహత్యము
(శక్తి) లేదు. అవి చూపాకార మంత్రములైనవి.

ఆ విధముగా కృతయుగములోనే జ్ఞానము మొదట అజ్ఞానము
దానివెనుక తయారయినది. అప్పటినుండి కాలము మారుకొలది
యుగములు గడుచుకొలది అజ్ఞానము కూడా పెరుగుతూ వచ్చినది.
మంత్రములు అట్లేయుండగా, కలియుగములో అద్వైతులకు పంచాక్షరి
మంత్రము, విశిష్టాద్వైతులకు అష్టాక్షరి మంత్రము సొంతమైపోయినది.
అద్వైతులు కలియుగములో తయారయినా కృతయుగమునుండి ఉన్న నమః
శివాయ మంత్రము తమదేనని తామే కనిపెట్టినట్లు చెప్పుకోవడము
జరిగినది. అట్లే ముందునుండి యున్న విభూతిరేఖలను కబ్జాచేసి అవి
తమవే అన్నారు. అదే విధముగా అద్వైతము తయారైన తర్వాత దాదాపు
1500 సంవత్సరములకు తయారయిన విశిష్టాద్వైతము వారు కృతయుగము
లోనే తయారయిన అష్టాక్షరి మంత్రమును ఆక్రమించుకొని అది తమదే
అన్నారు. అట్లే ముందునుండియున్న మూడు నిలువు నామములను కూడా

తమవే అని చెప్పుకోవడము జరిగినది. ఈ విధముగా ఇప్పటికి అనగా
కలియుగములో అద్వైతులు, విశిష్టాద్వైతులు పోటాపోటీగా నామములను,
మంత్రములను కలిగియున్నారు.

ప్రశ్న:- అద్వైతమును ఆర్యులు ఆచార్య శంకరుని చేత చెప్పించి, ఆయనను
ప్రపంచమునకు అద్వైత సిద్ధాంతకర్తగా చూపారు. శంకరున్ని ముందుంచి
ఆయన వెనుక ఆర్యులు అద్వైతమును ప్రచారము చేసినట్లు మీరు తెలిపిన
దానినిబట్టి తెలిసినది. అయితే ఇప్పుడు మీరు చెప్పుచున్న విశిష్టాద్వైతము
అద్వైతము తర్వాత 1500 సంవత్సరములకు వచ్చినదన్నారు. కానీ దాని
సిద్ధాంతకర్త ఎవరు? అను విషయమును మీరు చెప్పలేదు. అద్వైతము
తర్వాత వచ్చిన విశిష్టాద్వైతమును సృష్టించినది ఒక్కరేనా, లేక శంకరునికి
ఆర్యులు వెనుకయుండి కథ నడిపినట్లు విశిష్టాద్వైతమునకు కూడా
ఎవరయినా ఉన్నారా?

జవాబు :- అద్వైతము ఆర్యులయొక్క కుట్రలతో, కుతంత్రములతో
తయారయినది. ఆనాడు బౌద్ధమును హిందువులనుండి వేరుచేసి,
హిందువులలో తమ ఆధిపత్య సామ్రాజ్యమును స్థాపించుకొనుటకు
తయారయినది అద్వైత సిద్ధాంతము. అది పేరుకు సిద్ధాంతమని చెప్పినా,
వాస్తవానికి సిద్ధాంతము కాదని కూడా చెప్పుకొన్నాము. అది అలా 1500
సంవత్సరములు సాగిపోగా, తర్వాత భక్తి ప్రవృత్తులతో పుట్టినది
విశిష్టాద్వైతము. అద్వైతము నిరాకార దైవమును తెల్పునదిగా చెప్పినా
అందులో శాస్త్రబద్ధత లేదు. ప్రత్యక్ష అనుభవము అంతకూలేదు. అద్వైతము
భగవద్గీతలో చెప్పబడినా అది మనిషి మోక్షము పొందిన తర్వాత పొందు
స్థితిగాయున్నది. మరణానంతరము పొందు మోక్షములో అనుభవమునకు

వచ్చు అద్వైతమును ప్రత్యక్ష జీవితములో చెప్పుకోవడము పెద్ద పొరపాటు,
కాదు తప్పు. అయినా అది ప్రజలలో నేడు ఎక్కువగా వ్యాపించిన
సిద్ధాంతము. బౌద్ధులమీద అసూయతో పుట్టిన అద్వైతము ఆ రోజులలో
ప్రజలయందు బాగా వ్యాపించునట్లు ఆర్యులు చేశారు. అద్వైతమునకు
ఎదురు లేకుండా దాదాపు 1500 సంవత్సరములు గడువగా, యుక్త
వయస్సుకు వచ్చిన బలిసిన సింహమువలె అద్వైతము తయారైనది. పూర్తి
బలిష్టముగా అద్వైతమున్నప్పుడు పురుడుపోసుకున్నది విశిష్టాద్వైతము.
విశిష్టాద్వైతము సాకార భక్తియే ధ్యేయముగా పుట్టినది.

క్రీస్తు తర్వాత 1017 సంవత్సరములకు తమిళనాడు రాష్ట్రములో
చెన్నైకి దక్షిణమున సుమారు 40 కిలోమీటర్ల దూరములో యున్న
పెరంబుదూరులో రామానుజాచార్యుల వారు జన్మించడము జరిగినది.
రామానుజాచార్యులవారి తండ్రి కేశవసోమయాజి, తల్లి కాంతిమతి. కేశవ
సోమయాజుల వారు విష్ణు భక్తుడు. ఆనాడు బహుకొద్ది మందిగా యున్న
విష్ణు భక్తులలో సోమయాజుల వారు ముఖ్యమైనవారు. ఆయన పేరు
కేశవ అయితే అనేక యజ్ఞములు చేసిన బ్రాహ్మణునిగా సోమయాజులను
బిరుదు వచ్చినది. రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ కులములో పుట్టారు.
శంకరుడు కూడా బ్రాహ్మణ కులములోనే పుట్టాడని అందరికీ తెలుసు.
అయితే శంకరాచార్యుల వెనుక ఆర్యులున్నట్లు రామానుజాచార్యుల వారి
వెనుక ఎవరూ లేరు. రామానుజాచార్యుల వారు మాత్రమే స్వయముగా
విశిష్టాద్వైత సిద్ధాంతమును బోధించారు.
ప్రశ్న :- రామానుజాచార్యుల వారు వేదములను అనుసరించలేదా?
వేదపఠనమును ప్రోత్సహించలేదా?

జవాబు :- రామానుజాచార్యుల వారు శంకరాచార్యులు అద్వైతమునకు
వ్యతిరేఖముగా నడిచాడు. అందువలన ఆయన వేదములను విమర్శించనూ
లేదు, సమర్థించనూలేదు. రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతము
అద్వైత సిద్ధాంతమునకు కొంతమార్పుతోనే యున్నది. అద్వైతము
నిర్గుణమును సూచించగా, విశిష్టాద్వైతము సగుణమును బోధించుచున్నది.
అంతతప్ప వేరు ఏమీలేదు. అయినా ముందునుండి బలముగా తయారయిన
అద్వైతులు తమ పెత్తనమే చెలామణి కావాలను ఉద్దేశ్యముతో, తమ ముందర
తమకు పోటీగా ఎవరూ రాకూడదని ఉండుట వలన రామానుజాచార్యుల
సిద్ధాంతమును ప్రచారము కాకుండా తమకు చేతనయినంత చేశారు.
శంకరాచార్యుల వారు ఎక్కువగా వేదములతో సంబంధపడియుంటూ,
వేదపఠనమును ప్రోత్సహించారు. అయితే రామానుజుల వారు ఎక్కువ
సగుణోపాసనమీద దృష్టిని సారించారు.

ప్రశ్న :- అద్వైతమును, విశిష్టాద్వైతమునకు తేడా ఏమి కలదు?
జవాబు :- రెండూ అద్వైతమునే తెలుపుచున్నా రామానుజుల వారి
సిద్ధాంతములో కొంత విశేషతయుండుట వలన విశిష్టాద్వైతము అని
చెప్పవచ్చును. ఒక సాకార, నిరాకారములయందు మాత్రమే తేడాయుండుట
వలన అద్వైతము తెలిసినవారు, అద్వైతమును అనుసరించువారు
సులభముగా విశిష్టాద్వైతమును అనుసరించారు. అందువలన తమకు
పోటీగా వచ్చి తమ ఉనికికే ప్రశ్నార్థకమైన విశిష్టాద్వైతులను లేకుండా
చేయాలని అద్వైతులు ప్రయత్నించారు. అద్వైతములో అంతా పరబ్రహ్మ
స్వరూపమే, అందరమూ పరబ్రహ్మ స్వరూపులమే అను విధానము కలదు.
అయితే విశిష్టాద్వైతములో ఒక్కడే అయిన దేవుడు సాకారముగా

విష్ణురూపములో ఉన్నాడనీ, అతనిని భక్తితో ఆరాధించవలెననునది ముఖ్య
ఉద్దేశ్యముగా ఉన్నది. అద్వైతులు దేవుడు కనిపించని పరబ్రహ్మముగా
అందరిలో యున్నాడు, అందరిగా ఉన్నాడు, అందరము పరబ్రహ్మ
స్వరూపులమే అని చెప్పుచుందురు. ఒక్క సాకార నిరాకారములయందు
మాత్రమే అద్వైతమునకు విశిష్టాద్వైతమునకు తేడా కలదు. దేవుడు నిర్గుణుడు
అని అద్వైతులు, కాదు సగుణుడు అని విశిష్టాద్వైతులు అంటున్నారు.

ప్రశ్న :- 1500 సంవత్సరముల ముందుపుట్టి బలమైన సింహముగా యున్న
అద్వైతము ముందర అప్పుడే పుట్టిన గొర్రెపిల్లలాంటి విశిష్టాద్వైతము
నిలబడకల్గినదా?

జవాబు :- ఆర్యులు అద్వైతమును శంకరాచార్యులు పోయిన తర్వాత కూడా
కొనసాగించారు. క్రొత్తగా వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతకర్తను చాలా
ఇబ్బందులపాలు చేశారు. కొన్ని సందర్భములలో అద్వైతులకు రామానుజా
చార్యులవారు భయపడుచూ బ్రతుకవలసి వచ్చినది. కొన్ని సమయములలో
దాచిపెట్టుకొని బ్రతుకవలసివచ్చినది. సింహము ఒకటియుండి గొర్రెలను
తినినా వేయి గొర్రెలున్నప్పుడు సింహము ప్రతి దినము ఒక గొర్రెను
తినుచున్నా గొర్రెల గుంపు పెరుగుచుండుట వలన గొర్రెలు అన్నీ లేకుండా
పోవు. ఒకవైపు హరించిపోవుచున్నా మరొకవైపు పెరుగుచుండుట వలన
సింహము గొర్రెలను లేకుండా చేయలేదు. గొర్రెలు ఉంటాయి, సింహము
ఉంటుంది. శంకరాచార్యుల వారు స్థాపించినది నాల్గు వేదములకు గుర్తుగా
నాలుగు అద్వైత పీఠములను స్థాపించగా, రామానుజాచార్యుల వారు
అద్వైతముతో పోటీపడుటకు 74 పీఠములను స్థాపించాడు.
సంవత్సరములు బ్రతికిన రామానుజాచార్యుల వారు తన జీవితములో

అత్యంత ఎక్కువగా తన పీఠములను స్థాపించి అక్కడ విశిష్టాద్వైతమును
ప్రచారము చేయుటకు గురువులను నియమించుట వలన రామానుజుల
వారి విశిష్టాద్వైతము అద్వైతము ముందర కొంతవరకు నిలువగల్గినది.
అద్వైతులు విశిష్టాద్వైతులను అణచివేస్తూ వచ్చినా, తిరిగి వెంటనే
పుంజుకుంటూ వచ్చారు. రామానుజుల వారి కాలములో యున్న ప్రతి
వైష్ణవ గుడి ఒక విశిష్టాద్వైత పీఠముగా తయారైనది. ప్రతి శైవుల గుడి
అద్వైతపీఠముగా తయారు కాలేదు. శంకరుడు స్థాపించిన నాలుగు మరియు
ఒకటి మొత్తము ఐదు పీఠములే గలవు. అందువలన అద్వైతము ముందర
విశిష్టాద్వైతము నిలువగల్గినది.

ప్రశ్న :- రామానుజుల వారి విశిష్టాద్వైతమును అనుసరించిన వారందరూ
త్రినామమును ధరించారు. మూడు విభూతి రేఖలకు అర్థమున్నట్లు, త్రి
నామమునకు ఆధ్యాత్మిక అర్థము కలదా? ఉంటే చెప్పండి?

జవాబు :- మూడు నిలువు నామములు విశిష్టాద్వైత సిద్ధాంతము
వచ్చినప్పుడు రాలేదు. అంతకుముందే కృతయుగములోనే మూడు
నామములు తయారయినవి. కృతయుగములో దైవజ్ఞానమును అనుసరించి
శరీరములో ఆత్మల విశేషతను, నాడుల విశేషతను తెల్పునట్లు మూడు
నామములను తయారు చేయగా, త్రేతాయుగములో సూర్యవంశపు
గుర్తుయని, ద్వాపర యుగములో వైష్ణవుల గుర్తుగా చెప్పబడుచున్న మూడు
నామములు కలియుగములో విశిష్టాద్వైత గుర్తుగా మారిపోయినది.
కృతయుగములో ఎంతో గొప్ప దైవజ్ఞాన చిహ్నముగాయున్న మూడు
నామములకు జ్ఞాన భావములో అర్థము ఈ విధముగా కలదు. నామము
రెండు రకముల ఆధ్యాత్మిక భావమును తెల్పుచున్నది. ప్రతి మనిషి

శరీరములో మూడు ఆత్మలు నివశించుచున్నవి. అయినా నేటివరకు ఆ
విషయము ఎవరికీ తెలియదు. అందరి శరీరములో జీవాత్మ ఒకటియుండగా,
ఆత్మ రెండవది కలదు. జీవాత్మ శరీరములోని తలయందు గల
గుణచక్రములోయుండగా, ఆత్మ బ్రహ్మనాడిలోయుంటూ శరీరమంతా
తనశక్తిని వ్యాపింపజేసినది. శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను గురించి
సృష్ట్యాదిలో దేవుడు తెలియజేసినా, తర్వాత ద్వాపర యుగములో భగవంతుడు
భగవద్గీత రూపములో చెప్పిన జ్ఞానముయందు ఆత్మను గురించి
తెలియజేసినా నేటివరకు రెండవ ఆత్మను గురించి ఎవరికీ తెలియకుండా
పోయినది. కొందరు రెండవ ఆత్మనే పరమాత్మయని అనుకోవడము
జరిగినది. జీవుడు, జీవునితోపాటు దేవుడు శరీరములో ఉన్నారని
ఆధ్యాత్మికములో యున్న వారందరూ అనుకోవడము జరిగినా, ఇద్దరికి
మధ్యలో ఆత్మనునది మరొకటున్నదను విషయము పూర్తిగా ఎవరికీ
తెలియదనియే చెప్పాలి? ఆ లెక్కప్రకారము శరీరములో మూడు
ఆత్మలున్నాయని సృష్ట్యాదిలో చెప్పబడిన జ్ఞానములో చెప్పారు. తర్వాత
రెండవ మారు భగవద్గీతగా చెప్పబడినప్పుడు కూడా ఆత్మను గురించి
చెప్పారు. అయినప్పటికీ ఆత్మ విషయము ఎవరి ఊహకు రాలేదు.

శరీరములో జీవాత్మ ఆత్మ రెండు జోడు ఆత్మలుగా యున్నవి.
మూడవదయిన పరమాత్మ శరీరమంతా అణువణువునా వ్యాపించి
యుండడమే కాక శరీరము బయట కూడా అంతటా వ్యాపించియున్నది.
శరీరములోనూ, వస్తువులలోనూ, పదార్థములలోనూ, శూన్యములోనూ అది
ఇది అనకుండా విశ్వమంతయూ వ్యాపించియున్నది. ప్రపంచములో
మూడు ఆత్మలు తప్ప ఇతరత్రా ఆత్మంటు ఇంకొకటి లేదు. దైవజ్ఞానము
మొదటిలోనికి పోతే విశ్వమునంతటికీ ఆధారము పరమాత్మ ఒక్కడే. ఆయన

పని చేయని వాడయినందున కార్యములు జరుగుటకు ప్రకృతిని తయారు
చేశాడు. ఇప్పుడు కార్యరూపమైన విశ్వమునకంతటికీ ప్రకృతి పరమాత్మలే
ఆధారమని చెప్పవచ్చును. పరమాత్మ కారణము ప్రకృతి కార్యముగా
యున్నది. ప్రకృతి అన్ని విధములా పని చేయుటకు ప్రకృతిని ఐదు
భాగములుగా దేవుడు విభజించాడు. తాను ఏమీ చేయనివాడుగా
యుండుటకు, ప్రకృతి చేత చేయించుటకు తనను తాను మూడు
భాగములుగా విభజించుకొన్నాడు. ఒకడు పరమాత్మగా అట్లేయుండగా,
తననుండి విభజింపబడిన కొంత శక్తిని ఆత్మనీ, మరికొంత శక్తిని (అంశను)
జీవాత్మగా చెప్పాడు. ఈ విధముగా దేవుని అంశ మూడు భాగములుగా
యుండి, ఒకటి పరమాత్మ రెండు ఆత్మ, మూడు జీవాత్మ అని
చెప్పబడుచున్నవి.

ఈ మూడు ఆత్మలు అనేక రూపముల జీవకోటిలో యుండగా,
మిగతా ప్రకృతిలోని ఐదు భాగములు స్థూల ప్రపంచముగాయున్నది. స్థూల
రూపమైన ప్రపంచములో మన శరీరములు కూడా కలవు. కనిపించు
శరీరములలో కనిపించని మూడు ఆత్మలు కలవు. ఈ మూడు ఆత్మలను
గురించి కృతయుగములోనే ఆత్మజ్ఞానులు ఆత్మల విషయము తెలియునట్లు
మూడు విభూతి రేఖలను, మూడు నామములను తయారు చేసి చూపించారు.
వాటి ఆత్మ భావములు నేడు తెలియకుండా పోయి ఆత్మల చిహ్నములయిన
విభూతిరేఖలు, మూడు నామములు అద్వైత, ద్వైత పార్టీల జెండా గుర్తులుగా
మారిపోయాయి. విభూతిరేఖలంటే అద్వైతము, నామము లంటే ద్వైతము
అను ఈ కాలములో దేవుడు పూర్వమున్న జ్ఞానమును ఇప్పుడు తిరిగి
మనకు తెలియజేయుచూ, తన దారిని మనకు చూపించుట వలన మనము

నేడు మిగతావారికంటే ధన్యులమే అనుకోవాలి. మూడు ఆత్మల విషయము
ద్వాపరయుగములో భగవద్గీతయందు తెలిపి, అదే జ్ఞానమునే మిగతా
దేశములలో మిగతా గ్రంథరూపములో తెలియజేయడమైనది. అయినా
మనుషులయిన వారు మతముల మత్తులో పడిపోయి తమ శరీరములోని
ఆత్మలను తెలియలేకున్నారు. మూడు ఆత్మల విషయము కృతయుగము
నుండి నేటివరకు మన మధ్యలోనే యున్నా మనము వాటిని గ్రహించ
లేకపోవడము దురదృష్టము. మిగతా మత గ్రంథములయిన బైబిలు,
ఖురాన్లలో మూడు ఆత్మల విషయము చెప్పియున్నా అవి గుర్తింపబడనట్లు
దాగియున్నవి. అక్కడ చెప్పినది మూడు ఆత్మల విషయమేనా అన్నట్లున్నది.

అయితే భగవద్గీతలో మిగతా గ్రంథములకంటే స్పష్టముగా
కనిపించునట్లు మూడు ఆత్మల విషయము కలదు. ద్వాపరయుగములో
చెప్పిన భగవద్గీతా జ్ఞానమే సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి
చెప్పబడినది. సూర్యుడు భూమిమీద మనుషులకు తెలియజేయగా అప్పుడు
వారికి అర్థమయిన విధానమునుబట్టి మూడు నామములు తయారు
చేయడము జరిగినది. మూడు నామములు క్రిందినుండి పైకి దిద్దబడి
యున్నవి. మూడు నామముల ఆకారమును తర్వాత చూడవచ్చును.

మూడు ఆత్మల గుర్తు మూడు నామములు. మధ్యలో నామము
ఎరుపు రంగు కల్గియుండగా, ప్రక్క రెండు నామములు తెలుపు రంగు
కల్గియున్నవి. ఒకటవ నంబరు జీవాత్మకు మూడవ నంబరు పరమాత్మకు
మధ్యలో ఆత్మయున్నది. జీవున్ని నడిపించునది, ఆలనా పాలనా చేయునది
రెండవ ఆత్మయే. జీవుడు తెలియవలసినది రెండవ ఆత్మనే. మూడవ
ఆత్మ పరమాత్మ అయినా ఆయన ఏమీ చేయువాడు కాదు. అందువలన
జీవుడు రెండవ ఆత్మనే మొదట తెలియవలసియుండును. దేవుడయిన

మూడవ ఆత్మవద్దకు పోవాలంటే రెండవ ఆత్మ ద్వారానే జీవుడు దేవున్ని
చేరవలసియుంటుంది. అందువలన ప్రతి మనిషి అనగా ప్రతి జీవి తన
శరీరములో యున్న రెండవ ఆత్మను తప్పక తెలియవలెను. అందువలన
మూడు నామముల మధ్యలోయున్న ఆత్మ గుర్తును ఎరుపు రంగుగా
చూపడము జరిగినది. ఇది ఒక భావముకాగా రెండవ భావము ప్రకారము
మధ్యలో గల ఎరుపు రంగు నామమును పరమాత్మగా కూడా వర్ణించి
చెప్పవచ్చును. ఏమీ తెలియకముందు రెండవ ఆత్మను మధ్యలోగల ఎరుపు
రంగు నామముగా చెప్పుకోవలసియుండును. కొంత ఆత్మ విషయము
అర్థమయిన తర్వాత అతను మూడవ ఆత్మయిన పరమాత్మను చేరవలసి
యుండును. కావున ఆత్మను గుర్తించగలిగిన వాడు మూడవ ఆత్మయిన
పరమాత్మ గుర్తుగా ఎరుపురంగు మధ్య నామమును గురించి తెలియవలసి
యుండునను భావము రావలెను.

ఈ విధముగా ఆత్మజ్ఞానము తెలియనప్పుడు ఒక విధముగా,
ఆత్మజ్ఞానము తెలిసిన తర్వాత మరొక విధముగా ఒకే నామమును గురించి
తెలియవలసియున్నది. ఇదంతయూ భగవద్గీతలో సూచన ప్రాయముగా
చెప్పబడినది. మూడు ఆత్మల విషయము భగవద్గీతలో ఎక్కడాలేదే,
నీకొక్కనికి మూడని ఎలా అర్థమయినదని కొందరు నన్ను ప్రశ్నించవచ్చును?
ప్రశ్నించితే ఫరవాలేదు. ఎలాగయినా దానికి వివరమును చెప్పవచ్చును.
అలా నన్ను ఇంతవరకు ప్రశ్నించిన వారు లేరుగానీ, దూషించినవారు
ఎక్కువగా యున్నారు. మూడు ఆత్మల విషయము భగవద్గీతలోనిదే అయినా
అదే భగవద్గీత జ్ఞానము మిగతా రెండు గ్రంథములుగా రూపుదిద్దుకున్న
విషయము ప్రపంచములో ఎవరూ నమ్మలేని విషయము. అయినా ఎవరు
నమ్మలేకపోయినా జరిగిన సత్యము అంతే! దేవుడు ఏమి చేయుచున్నది

ఎవరికీ అర్థము కాదు. ఆయన సంకల్పముతోనే మిగతా రెండు మతముల
గ్రంథములలో సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానము చేరిపోయినది. మూడు
మత గ్రంథములలోనూ మూడు ఆత్మల గురించి ఉందని నేను చెప్పినప్పుడు
కొందరు ఇతర మతస్థులు తెలియని జ్ఞానము తెలిసినదని చెప్పి
సంతోషపడినారు. అయితే హిందువులే అర్థము చేసుకోలేకపోయి ముందు
నుండి ఉన్న అజ్ఞానమును వదలక నన్ను దూషించడము జరిగినది.
ఇప్పటికీ జరుగుచున్నది. మూడు ఆత్మలనినా, లేక నేను ప్రతిపాదించిన
త్రైత సిద్ధాంతము పేరు వినినా ఇది ఇందువులలోని ఒక సిద్ధాంతమని
అనుకోకుండా ఏకంగా పరమత ప్రచారమని నన్ను పరమతస్థుడని
అంటున్నారు. ఎప్పుడో పోయిన ఆర్యులు ఇంకా ఇప్పుడు కూడా
ఉన్నారని గుర్తు చేయుచున్నారు.

భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున "క్షరుడు, అక్షరుడు,
పురుషోత్తముడు” అని మూడు ఆత్మలను గురించి చెప్పగా, బైబిలు
గ్రంథములో మత్తయి సువార్తయందు 28వ అధ్యాయమున 19వ
వచనములో "కుమారుడు, తండ్రి, పరిశుద్దాత్మ" యని చెప్పియున్నారు.
అదే విషయమునే ఇస్లామ్ గ్రంథమయిన ఖురాన్లో సురా 50, ఆయత్
21లో “త్రోలబడేవాడు, త్రోలేవాడు, చూచేవాడు” అని ముగ్గురిని చూపుచూ
మూడు ఆత్మల గురించి తెలియజేయడమైనది. మూడు గ్రంథములలో
ముగ్గురిని గురించి చెప్పినా ఏమాత్రము ఒకదానితో మరొకటి సంబంధము
లేనట్లు వేరువేరు విధముల వ్రాయడము వలన ఇది మూడు ఆత్మల
విషయమని ఎవరూ గుర్తించలేక పోయారు. ఇప్పుడు నేను చెప్పినా
కొంచెము అర్థమయి, కొంచెము అర్థము కాని స్థితిలో యున్నారు. అంటే
పూర్తి అర్థము కాలేదనియే తెలియుచున్నది. దీనినిబట్టి కొంచెము

అర్థమయినదని తెలియుచున్నది. ఎవరు ఏమనుకొనినా పూర్వము
కృతయుగములోనే మూడు ఆత్మల విషయమును గురించి తెలుపు నిమిత్తము
మూడు నామములను తయారు చేసి, మధ్య గీతను (మధ్య నామమును)
ఎరుపుగా తీర్చిదిద్దారు. నామము సాకారమునకు పెట్టినదికాగా, విభూతి
రేఖలు నిరాకారమునకు పెట్టినా మధ్య రేఖకు ఎర్రని సింధూరము గుర్తును
పెట్టడము జరిగినది. నిలువు నామములలోనూ, అడ్డనామములలోనూ
ఎర్రని గుర్తును అందరూ గ్రహించినా ఇదెందుకున్నదని ఎవరూ ఆలోచించ
లేదు. ఈనాడు తిరుపతి వెంకటేశ్వర ప్రతిమ మీద పెద్ద నామములు
పెట్టడము జరిగినది. ఇప్పుడు పెట్టినా అది పూర్వపు భావమునే
తెలియజేయుచున్నది.

విశిష్టాద్వైతము అద్వైతమునకు దరిదాపులలోనే ఉన్నదయినా,
అద్వైతము నిర్గుణమును తెలియజేయగా, విశిష్టాద్వైతము సగుణమును
తెలియజేయుచున్నది. సిద్ధాంతమంతయూ దాదాపు ఒకటిగానే యుంటూ
చివరిలో అద్వైతమను పేరుకల్గియున్నది. అద్వైతము ముందర 'విశిష్ట'
అను ప్రత్యేకత కలదు. విశిష్ట అనినా విశేషత అనినా ప్రత్యేకమని అర్థము.
అద్వైతములో సాకార పూజను, సాకారభక్తిని కాదని చెప్పుచుండగా, విశిష్టా
ద్వైతములో సాకార భక్తిని, సాకార పూజను ఎక్కువగా బోధించడము జరుగు
చున్నది. అద్వైత, విశిష్టాద్వైతములను రెండిటినీ తెలిసినవారు రెండిటిలో
పెద్ద తేడాలేదని తెలిసి ముందునుండి అద్వైతములో యున్నవారు విశిష్టా
ద్వైతములోనికి రావడము జరిగినది. రామానుజులవారి ఒక గ్రంథములో
వ్రాసిన దానినిబట్టి అద్వైతులు ఎందరో అద్వైతమును వీడి విశిష్టాద్వైతములో
ప్రవేశించడము జరిగినదని తెలియుచున్నది. అక్కడ వ్రాసినది ఇలా కలదు
చూడండి.

“యాదవ ప్రకాశుడు రామానుజుని చేరుట, తన సందేహములను
తీర్చుకొనుట, రామానుజునకు శరణాగతుడగుట మొదలగు విషయము
లన్నియూ దేశ నలుమూలలా వ్యాపించుట చేత రామానుజుని ప్రతిభ
అందరికీ తెలిసిపోయినది. అప్పటి పండితులకు, భక్తులకు ఈ వార్త
అనుదిన సంభాషణ విషయమాయెను. అద్వితీయ పండితుడు, సాటిలేని
అద్వైత సిద్ధాంత వేదాంతి, రామానుజులకే గురువైన యాదవ ప్రకాశుడు
రామాను జునకే ప్రపత్తుడగుట సామాన్య విషయము కాదుకదా! బ్రహ్మము
నిర్గుణము, సర్వము మిథ్యయని వెల్లడించు అద్వైత సిద్ధాంత మహావృక్షము
యొక్క క్రుంకుటేరు తెగిపోయినట్లయినది. అద్వైత సిద్ధాంత మాయా
భవనము కంపింపసాగినది. ప్రస్థానత్రయము ప్రమాణమైననూ
సక్రమముగా భావన చేయనందున నిర్గుణ సిద్ధాంతము లేవనెత్తబడెను.
ఇప్పుడది నిలువలేక యున్నది. అదియే రామానుజుని ప్రతిభ. ఈ
రామానుజుని ప్రతిభనే యాదవ ప్రకాశుడు ప్రారంభమున ఊహించి
యుండెను. రామానుజుడు అద్వైత సిద్ధాంత వృక్షమునకు గొడ్డలి పెట్టు
కాగలడను యాదవ ప్రకాశుని ఊహ ఇప్పుడు నిజమయినది. ఒకప్పటి
అతని ద్వేషపూరిత ఊహ సత్యముగా మారినది. ఆయన కూడా (యాదవ
ప్రకాశుడు కూడా) తన అద్వైత మాయా సిద్ధాంతమును వీడి రామానుజుని
సగుణ సిద్ధాంతమునకు అంకితుడాయెను. గురువు శిష్యుడాయె, శిష్యుడు
గురువాయెను. రామానుజుని ప్రతిభ అటువంటిది. విద్యాకోవిదుడు,
ఏక సంథాగ్రాహి, గురువర్యుడు అయిన యాదవప్రకాశితుడట్టివారు
రామానుజాచార్యులకు శరణాగతులయినారంటే ఇక వారి శిష్యగణము
ఎంత ఘనముగా అభివృద్ధి చెందెనో ఊహించవచ్చును.” ఈ విధముగా
“రామానుజ దివ్యవైభవము” అను గ్రంథములో ఒక పేజీయందు వ్రాసిన

సమాచారమును బట్టి ఆనాడు చాలామంది అద్వైతులు రామానుజాచార్యుల
వారి సగుణబోధలకు ఆకర్షితులయి నిర్గుణ అద్వైతమును వదలి
విశిష్టాద్వైతములో చేరిపోయారు. ఇదంతయూ ఒకవైపు గమణించుచున్న
అద్వైతులయిన ఆర్యులు రామానుజుల వారిమీద కక్షను పెంచుకొన్నారు.

ప్రశ్న :- యాదవ ప్రకాశుడు రామానుజుల గురువు అని మీరు
చెప్పుచున్నారు. అద్వైత గురువు రామానుజులవారికి గురువెట్లయ్యాడు?
యాదవ ప్రకాశుడు ద్వేషపూరితుడని అన్నారు. ఎందుకు ద్వేషము వచ్చినది.
అంతకూ యాదవ ప్రకాశుడు ఎవరు?

జవాబు :- శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతకర్త, ఆ తర్వాత 1500
సంవత్సరములకు రామానుజాచార్యులు వచ్చారు. రామానుజులే విశిష్టాద్వైత
సిద్ధాంతకర్త అయినాడు. పుట్టుకతో ఎవరూ సిద్ధాంతకర్తలు కారు. పెరిగి
పెద్దవాడైన తర్వాత వ్యక్తిత్వ వికాసము వచ్చిన తర్వాత తమ జీవితములో
క్రొత్త సిద్ధాంతమును కనుగొనవచ్చును. పుట్టిన మనుషులందరూ
సిద్ధాంతమును కనుగొనలేరు. కొన్ని వందల సంవత్సరములకో, కొన్ని
వేల సంవత్సరములకో ఎవరో ఒకరు అరుదుగా సిద్ధాంతములను
కనుగొనవచ్చును. అదే విధముగా కలియుగము వచ్చిన తర్వాత దాదాపు
2500 సంవత్సరములకు శంకరాచార్యుల వారు పుట్టి అద్వైత సిద్ధాంతమును
ప్రతిపాదించడము జరిగినది. శంకరాచార్యుల వారు చనిపోయిన తర్వాత
దాదాపు 1500 సంవత్సరముల తర్వాత రామానుజాచార్యుల వారు పుట్టి
తన జీవితములో విశిష్టాద్వైత సిద్ధాంతమును కనుగొనడమైనది. రామానుజా
చార్యుల వారు 120 సంవత్సరములు విశిష్టాద్వైతమును ప్రచారము
చేయుచూ బ్రతికి చనిపోవడము జరిగినది. రామానుజుల తర్వాత

మధ్వాచార్యుల వారు దాదాపు 100 సంవత్సరములకు వచ్చి ఆయన ద్వైత
సిద్ధాంతమును కనుగొని ప్రతిపాదించడము జరిగినది. మధ్వాచార్యుల
ద్వైత సిద్ధాంతము తర్వాత దాదాపు 630 సంవత్సరముల తర్వాత త్రైత
సిద్ధాంతము వచ్చినది. అద్వైత సిద్ధాంతకర్త కేరళలో పుట్టగా, విశిష్టాద్వైత
సిద్ధాంతకర్త తమిళనాడులో పుట్టగా, ద్వైత సిద్ధాంతకర్తయిన మధ్వాచార్యుల
వారు కర్నాటక రాష్ట్రములో పుట్టడము జరిగినది. తర్వాత వచ్చిన ప్రస్తుతము
జీవించియున్న త్రైత సిద్ధాంతకర్త ఆంధ్రరాష్ట్రములో పుట్టడమైనది.

హిందూ (ఇందూ) మతములోని నలుగురు సిద్ధాంతకర్తలు దక్షిణ
భారతదేశములో పుట్టడము విశేషము. అంతేకాక క్రింది కేరళ నుండి
పుట్టుతూ రావడము మరీ విశేషము. మొదట మూడు సిద్ధాంతములు
ఒకదానితో మరొకటి కొంత సంబంధము కల్గియున్నవి. అయితే నాల్గవ
దయిన త్రైత సిద్ధాంతము ఏ దానితోను సంబంధపడక, ప్రత్యేకముగా
యున్నది. విశిష్టాద్వైత సిద్ధాంతము మంత్రములోనూ, ముఖముమీద
నామములోనూ అద్వైతమునకంటే ప్రత్యేకముగాయుండినా, అసలయిన
సిద్ధాంతము దగ్గర కొంత సంబంధపడియుండడము గమనించవచ్చును.
అద్వైత సిద్ధాంతములో నిర్గుణ, నిరాకారమును బోధించగా, విశిష్టాద్వైతములో
సగుణ, సాకారములను గురించి చెప్పడమైనది. ఒకే దేవున్నే అద్వైతములో
నిరాకారముగా చెప్పగా, విశిష్టాద్వైతములో సాకారముగా చెప్పుచున్నారు.
అందువలన అద్వైతము, విశిష్టాద్వైతము కొంత తేడాతో ఒకదానితో మరొకటి
కలిసియున్నవని చెప్పవచ్చును. నుదుటి మీద ధరించు నామముయందును,
నోటితో జపించు మంత్రముయందును ఏమాత్రము సంబంధము లేకుండా
యున్నవనియే చెప్పవచ్చును.

రామానుజుడు చిన్నవయస్సులో అద్వైత గురువును ఆశ్రయించి
ఆయన చెప్పు అద్వైత బోధలను ఇష్టపడక అప్పుడప్పుడు గురువునే
విమర్శించుచుండెను. అద్వైతమును విమర్శించుట వలన తాను ఆశ్రయించిన
గురువునే ఎదురించవలసి వచ్చెను. అలా ఎదురించి మాట్లాడుట వలన
రామానుజుల గురువుగారయిన యాదవ ప్రకాశుడు రామానుజున్ని హత్య
చేయాలని నిర్ణయించుకొన్నాడు. దానికి తోడుగా అద్వైతులయిన యాదవ
ప్రకాశుని అనుచరులు కూడా తయారగుట వలన రామానుజుడు
ప్రాణాపాయస్థితిలో చిక్కుకున్నాడు. ఈ విషయమంతా క్షుణ్ణముగా
అర్థమగుటకు రామానుజుల చరిత్రగల "రామానుజ దివ్య వైభవము” అను
గ్రంథములో ఏమున్నదో ఇప్పుడు చూస్తాము.

“రామానుజునకు పదహారవ ఏటనే వివాహము జరిగినది.
రామానుజునకు వివాహమయిన మరు మాసముననే తండ్రి కేశవాచార్యుడు
చనిపోయాడు. రామానుజుని తల్లి కాంతిమతి వైధవ్యమున స్వగ్రామములో
ఉండుటకు ఇష్టపడలేదు. కుమారుని విద్యాభ్యాసమునకు సంసారమును
కాంచీపురికి తరలించుట మంచిదని కాంతిమతి తలచెను. రామానుజుడు
ఆలోచించి తల్లి నిర్ణయము మంచిదని తలచి సంసారమును కంచికి
తరలించెను. కాంచీపురమందు దేశప్రఖ్యాతుడగు ఆధ్యాత్మికాచార్యుడు
యాదవప్రకాశుడు శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పుచుండెను.
రామానుజుడు యాదవప్రకాశునికి శిష్యుడాయెను. యాదవ ప్రకాశుడు
ఆధ్యాత్మిక వేదాంత నిధియేగాక, గొప్ప పండితుడు, తత్త్వవేత్తయు కూడా
అయివుండెను. రామానుజుని పినతల్లి కుమారుడు గోవిందాచార్యుడు
కూడా విద్యాభ్యాసమునకై కాంచీపురమునకు వచ్చి రామానుజునితో సహా
యాదవ ప్రకాశునివద్ద శిష్యులుగా చేరిరి. ప్రథమమున రామానుజుని

భక్తి ప్రపత్తులకు, తెలివి తేటలకు యాదవప్రకాశుడు సంతృప్తి చెంది
రామానుజున్ని ప్రేమతో చూచెడివాడు. రామానుజ సోదరుడు గోవిందుడు
రామానుజునకు నీడవలె వ్యవహరించెడివాడు.

శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైతమును యాదవ
ప్రకాశుడు సంపూర్ణముగా విశ్వసించినవాడై యుండెను. అద్వైతము “బ్రహ్మ
సత్యమ్ జగన్మిథ్యా-జీవో బ్రహ్మైవనాపరం:" అని తెల్పుచున్న “తత్త్వమసి”
అను బ్రహ్మ సూత్రము నాధారముగా చేసుకొనియున్నది. “అహం బ్రహ్మాస్మి”
(నేను బ్రహ్మను) అని బోధించుచున్నది. ఈ సూత్రము అప్పట్లో పండిత
జనులలో ఎక్కువ ప్రచారములో యుండెడిది. రామానుజునకు ఈ అద్వైత
సిద్ధాంతములు పరిచయములేగానీ, అతడు అద్వైతమును పూర్తి విశ్వసించు
వాడు కాదు. అయినను తన భావమును గుప్తముగా ఉంచుకొని, మొదట
సర్వ శాస్త్రజ్ఞానము అవసరము, తర్వాతనే వ్యక్తిగత పరిశీలన, పరిశోధనయని
తలచెడివాడు. ఇట్లు రామానుజుని విద్యాభ్యాసము పరిశోధన సహితమయి
నది. అతడు దేనినయినా మూఢముగా విశ్వసించేవాడు కాదు.

ఒక దినము యాదవ ప్రకాశుడు శిష్యులకు ఆధ్యాత్మిక బోధను
తెలియజేయు సందర్భములో తైత్తిరీయోపనిషత్తునందు గల ఒక విషయమగు
సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అను దానికి వివరమును చెప్పుచూ
"ఇవన్నియూ ఒక్కటే, సత్యమే బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ, బ్రహ్మ అనంతము.
ఇవన్ని పదములకు బ్రహ్మ అను అర్థమే వచ్చును” అని అన్నాడు. అప్పుడు
నిశిత విమర్శనా జ్ఞానయుతుడు అయిన రామానుజుడు “ఇవన్నియూ ఒకటి
కాదు. సత్యము, జ్ఞానము, అనంతము అనునవి బ్రహ్మ యొక్క లక్షణములు.
పుష్పములలో వివిధ రంగులు, వివిధ సువాసనలు ఉన్నట్లు, అనంత కళ్యాణ

గుణములలో పరబ్రహ్మ కలడు." అని రామానుజుడు వివరించెను. ఈ
మాటలు విన్న యాదవ ప్రకాశుడు ఉగ్రుడాయెను. తాను చెప్పినది కాదనగల
పండితుడు అప్పటికీ లేడు. అట్టి పరిస్థితిలో శిష్యునిగా యున్న రామానుజుడు
తాను చెప్పిన వివరణను కాదని, అతడు వేరొక వ్యాఖ్యను తెలుపుటను
యాదవ ప్రకాశుడు ఓర్చుకోలేక పోయాడు. తనమాటను శిరసావహించి
ప్రవర్తించనిచో తన శిష్యవర్గమును వదలిపోవలెనని యాదవ ప్రకాశుడు
రామానుజుని హెచ్చరించెను. గురువుగారి కోపమును చూచిన
రామానుజుడు ఊరక మౌనమును వహించియుండెను. "శాంతే కలహో
నాస్తి” అన్నట్లు ఆ సమస్య అంతటితో అణిగిపోయెను. విద్యాభ్యాసమే
తన ధ్యేయమని రామానుజుడు మిన్నకుండెను.

ఒకనాడు ఛాందోగ్యోపనిషత్తులో కొన్ని విషయములను శిష్యులకు
బోధించుచుండెను. “తస్యయథాకప్యాసం పుండరీకమేవ రుక్షణి" అను
విషయము “కపి” అనగా కోతి, “కప్యాసం” అనగా కోతిపిర్ర, పురుషోత్తముని
నయనములు కోతి పిర్రవలె, ఎఱ్ఱగానున్న తామరరేకులవలెనున్నవి” అని
యాదవ ప్రకాశుడు వివరించెను. గురువుగారిచ్చిన వ్యాఖ్యను విని
రామానుజుడు దిగ్రమజెందెను. తన మనస్సుకు ముల్లు గ్రుచ్చు కొనినట్లయి
నది. మనఃక్లేశము భరింపరానిదయ్యెను. కన్నీరు ధారగా పడుచుండెను.
యాదవ ప్రకాశుడు ఇదిగని "రామానుజా! ఏలకంటి నీరు పెట్టుచున్నావు”
అని విచారించెను.

"స్వామీ క్షమింపుడు. మహా! పండితులరగు తమ నోటినుండియా,
ఇట్టి విపరీతపు మాటలు వెడలుట? భగవంతుని నయనారవిందముల
సౌందర్యమును వర్ణించుటకు ఇట్టి నీచపు ఉపమానమా? మీరిచ్చిన వివరము

సత్యదూరమేగాక, విపరీతముగాను, నీచముగాను, హీనముగాను ఉన్నది.”
అని రామానుజుడు కంటితడితో బల్కెను.

రామానుజుని వచనముల కాశ్చర్య ఆగ్రహములు బొందిన యాదవ
ప్రకాశుడు, "దీనికా, యేదో పోగొట్టుకొన్నవానివలె యేడ్చుచున్నావు.
వెర్రివాడవు! నీ వెర్రిభక్తినట్లుంచుము! విను అసలు పరబ్రహ్మ నిరాకారుడు
గాన బ్రహ్మమునకు కన్నులెక్కడివి? లేనట్టి కన్నులను వర్ణించుటకు ఏ
ఉపమానమైతేనేమి? అని హేళనగా, తర్కశాస్త్ర కౌశలమున చమత్కరించెను.

రామానుజుడు ఊరటజెందలేకపోయెను. కంపిత హృదయమున
కన్నీరురాల్చుచునే యుండెను. "ఆర్యా! కప్యాసం అను పదమునకు వేరొక
అర్థముండి తీరవలయును, ఆలోచింపుడు!" అనెను. యాదవ ప్రకాశుడు
కోపోద్రేకమున ఇట్లు గర్జించెను. "అట్లగునేని నాకు తెలియని యా
అర్థమేమిటో నీవు తెల్పుము. ఆలోచించుమని నన్ను హెచ్చరించు
వాడవయితివా? చాలా దూరము వచ్చినదే నీ నడవడి!

తదుపరి రామానుజుడు “కప్యాసం అనగా కం=జలమును,
పీబతీతి= త్రాగువాడు, కపి= సూర్యుడు. కప్యాసం = సూర్యకిరణ తాకిడిచే
వికసించిన అని భావము. కావున పురుషోత్తముని నయనములు సూర్య
కిరణ స్పర్శచే వికసించిన తామరవలె మనోహరముగానున్నవి అని భావము”
అని పలికెను. రామానుజుని ప్రతిభా విశేషములను శిష్యులెల్లరు
ప్రశంసించిరి. లోన అసూయాగ్నిచే దహింపబడుచున్న యాదవ ప్రకాశు
డు బాహ్యముగా రామానుజుని వివరణమును అంగీకరించినట్లు నటించెను.
“అద్వైత సిద్ధాంతము ప్రకారము నిరాకారుడైన పరబ్రహ్మను, సాకారునిగా
చెప్పుచూ, అట్టి భావమును కనుకూలమైన వ్యాఖ్యానము జేయు

రామానుజుడు భక్తియోగ విశిష్టతను పైకి దెచ్చి, అద్వైత సిద్ధాంతమును
వ్యతిరేఖించుచున్నాడు” అని యాదవ ప్రకాశుడు కినుక బూనెను.

"నేను బోధించునది నీకు సరిపోని పరిస్థితిలో నీ శిష్యత్వమున
కిచట తావులేదు, నీవే ఆచార్యుడవని భావించు లాగుననున్నావు! నీవు
ఇటునుండి వెడలి, మరియొక విద్యాపీఠమును స్థాపించి, నీ యిష్టము
వచ్చినరీతుల వక్రమార్గములను, వక్రభాష్యములను సూచింపుము" అని
ఆగ్రహావేశమున యాదవప్రకాశుడు రామానుజుని హెచ్చరించెను. పెద్దలను
నిరసించుట యెరుగని రామానుజుడు సానుభూతినెరుగని గురువుపై ఎట్టి
అసూయ బూనలేదు. మౌనముగా నుండి, వినయ విధేయలతో సాష్టాంగపడి
“క్షమింపుడని” ప్రార్థించెను. అసూయాపూరితుడగు, అహంభావయుతుడును
అయిన యాదవ ప్రకాశుడు చేయునదిలేక, అప్పటికి మిన్నకుండెను.

యాదవప్రకాశునకు రామానుజునిపై లోలోన అసూయ
ప్రజ్వరిల్లుచుండెను. రామానుజుని తన శిష్యునిగా భావింపలేకయున్నాడు.
ఆధ్యాత్మిక తత్త్వవాదమున రామానుజుడు తనకు ప్రత్యర్థియయిన
తార్కికుడుగా తయారగునని యాదవప్రకాశుడు భావించెను. “అద్వైత
సిద్ధాంతమును అనుసరించి, శంకర భగవత్పాదులు బోధనామృతము
ననుసరించి, సర్వులు విశ్వసించి, ఆమోదించిన రీతి, నేను పరబ్రహ్మను
నిరాకారుడుగను, నిర్గుణుడుగను భావించుచుండ, ఇతడు పరబ్రహ్మను
సాకారుడుగాను సగుణునిగాను భావించి, నూతన సిద్ధాంతమును లేవనెత్తు
వానివలె కన్పట్టుచున్నాడు. నేనిక మిన్నకున్న, వీనివలన అద్వైత
సిద్ధాంతమునకే ముప్పు గలుగును. ఆదిశంకరులకు, అద్వైత సిద్ధాంతమునకు
అపచారము జరుగనీయను” అని తనలోతాను కుములుచుండెను యాదవ
ప్రకాశుడు.

ఈ యసూయా భావముతో యాదవప్రకాశునకు మనశ్శాంతి లేదు
అరిషడ్వర్గములో మాత్సర్యము మిక్కిలి చెడ్డది. ప్రపంచమున అశాంతికి
అనైక్యమునకు, దుఃఖమునకు, విరోధములకు ఈ మాత్సర్యము మూల
కారణము. మాత్సర్యమునకు స్వార్థముతో గూడిన అహంభావము
మూలకారణము. “స్వార్థ భావము” సర్వదుర్గుణములకు మూలమైనట్లు
“నిస్స్వార్థము” సకల క్షేమకర స్థితికి కారణభూతము.

యాదవప్రకాశుని మనస్సు ఒక అగ్నిగుండముగా మారినది.
రామానుజుని తుదముట్టించుటెట్లు అనునది అతని తక్షణ సమస్య అయినది!
రామానుజుని మరణమను వర్షము వలననే తన అసూయాగ్ని చల్లారగలదు!
వేరుమార్గమికలేదు! అసూయ దినదిన ప్రవర్ధమానము. వేగము అగణితము!
అది నశించదు. అది గలవాడు నశించిన దనుక వైర విస్తరణకంటే
మిక్కిలి వేగము గలదికదా! అసూయారోగ బీజము.

యాదవప్రకాశుడు తన శిష్యులు కొందరిని రహస్యముగా పిలిచి
"శిష్యులారా! ఒకమాట, కడపటి మాట, తిరుగులేనిమాట మీరు వినడము,
తదనుగుణముగా కర్తవ్య నిర్వహణమునకు సంసిద్ధులు కావడం అంతే.
వినుడు రామానుజుడు మన శిష్యకూటమిలో నుండుట కనర్హుడు. ఈ
ప్రపంచము నతడుండుట ఆధ్యాత్మిక విద్యకు అపచారము జరుగుటకే.
అతనిని తుదముట్టింపవలసియున్నది. మనము మన మతభక్తిని
నిరూపించుటకు ఇది అవశ్యము జరుగవలసినదే. కానీ ఒరులెరుంగరాదు
గదా! జాగరూకతను వహింపుడు. వాడు తెలివిగలవాడని పలుమారు
నేను వచించుచు, అతనిని బిడ్డగా ఆదరించుచు వచ్చుటవలన, అతనికి
అహంకార భావము బలసినది. నేను ఏ వ్యాఖ్యను వెల్లడించినను, అతడు
ప్రతి పర్యాయము ప్రతివ్యాఖ్య చేయుటకు ప్రయత్నము చేయుచున్నాడు.

మీరును వినుచునే యున్నారు గదా! వీనినిట్లు వదలిన ఆదిశంకరుని అద్వైత
సిద్ధాంతమునే తుడిచివేయుటకు ప్రయత్నింపగలడు. అట్టి యపచారము
జరుగకుండా చూడవలసిన బాధ్యత నాపైనున్నది. సరికదా! వీనిని
తుదముట్టించు మార్గమునన్వేషింపుడు, ఆలోచింపుడు” అని యాదవ
ప్రకాశుడు తన మనస్సులోని మర్మమును గ్రక్కెను.

మూర్ఖులయినట్టియు, మూఢవిశ్వాసముగలట్టియు, శిష్యులెల్లరు
గురువుగారి నిర్ణయమును బలపరచిరి. రామానుజుని అంతమొందించు
టకు ఒక్కొక్క శిష్యుడు మార్గమును సూచించినాడు. కడపట ఈ పద్ధతి
యేకగ్రీవముగా నామోదింపబడినది.

“ఉత్తరదేశమున వారణాసి, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రముల
దర్శించుటకు యాత్ర సాగింపవలయును. మార్గమధ్యమున అటవీ
మధ్యమున విశ్రమించు రాత్రివేళ రహస్యముగా రామానుజుని, తుద
ముట్టించి, వాని కళేబరమును అదృశ్యము గావింపవలయును” ఇది వారి
పన్నాగము, పన్నాగము అతిగుప్తముగా నుంచబడినది.

యాదవప్రకాశుడు శిష్యవర్గముతో ఉత్తరదేశయాత్రకు బోవ
నిశ్చయింపబడినట్లు ప్రకటింపబడెను. సుముహూర్తము నిర్ణయింప
బడెను. శిష్యులెల్లరు పరమోత్సాహమున ప్రయాణ సన్నద్ధులగుచుండిరి.
మూటముల్లె సరిచేసికొనుచుండిరి. వారి దురుద్దేశము నెరుగని
అమాయకులు, నిరపరాధులు అయిన రామానుజుడు, వాని సోదరుడు
గోవిందుడును (పిన్నమ్మ కుమారుడు) పుణ్యక్షేత్రముల దర్శించి, పుణ్య
తీర్థముల స్నానములు జేసి పవిత్రులు గావలయుననెడి యుత్సాహముతో
పయనమయిరి. గురువుల వారి ఘాతుకాలోచన వీరిరువురికి తెలియదు.
తక్కిన వారందరు ఆ కూటమి సభ్యులే.

గురుశిష్యుల యాత్రామండలి క్రమముగా నడుచుచూ, ఒకనాటి
సాయంసమయమునకు పర్వత ప్రాంతములోని యొకదట్టమైన అరణ్యమును
జేరిరి. సమీపముననొక చెరువు ఉండుట వలన, ఆ రాత్రికచట విశ్రమింప
వలయునని నిర్ణయించుకొనిరి. కాసారమున నెల్లరు స్నానములాచరించి,
కొంతతడవు విశ్రమించిరి. యిక వంటలు జేయ నారంభించిరి. చీకటి
పడినది. శుక్లపక్షమగుటం జేసి సందవెన్నెలలో ప్రకృతి తన సౌందర్యమును
ప్రదర్శించుచుండినది. రామానుజుడును గోవిందుడును చేత బిందెల
బట్టుకొని, త్రాగెడు నీటికై కాసారమునకు పోయిరి. అచ్చట గోవిందుడు
రామానుజునితో, “అన్నా! ఒక ఘాతుక కార్యమును మన గురువుగారే
పన్నుచుండుట గ్రహించితిని. నిన్ను తుదముట్టింప వలయునని వారెల్లరు
నిర్ణయించుకొనియున్నారు. అది నేను గ్రహించితిని. దారిలో పలుమార్లు
గుసగుసలు విన్నాను. కాని ధృఢముగా విషయమును తెలియకనే చెప్పిన
అసత్యనేరారోపణ పాపమునబడుదునని తలచి, నీతో ఏమియుననక,
యింతవరకూ ఊరకుంటిని. కానీ నేను రహస్య వేదినిగానే ప్రవర్తించితిని.
ఈనాటి రాత్రి నిదురించు సమయమున నిన్ను మృత్యుపాలు జేయవలయు
నని వారు నిర్ణయించుకొని యున్నారు. నీవెటులనేని ఈ రాత్రికే అనగా
అర్థరాత్రికి పూర్వమే యిచట నుండి రహస్యముగా పారిపోవలయును”
అని గోవిందుడు రహస్యముగా జెప్పెను.


రామానుజుని మనస్సు పరిపరి విధముల పోయినది. తాను
చేసిన యపచారమేమో తనకు దోచలేదు. చిత్తశుద్ధితో వినయ విధేయతలతో
మెలగుచున్న తన్ను గురూత్తముడేల తుదముట్టింప దలచెనో వానికి తెలియుట
లేదు. గురువుగారి ఆగ్రహమునకు తానెట్టి నెపమును కలుగజేయలేదని
తన మనస్సున తలంచి, కడకు తేల్చుకొనలేక పోవుచున్నాడు. సరియే,

దీర్ఘాలోచనమునకు తడవుకాదది. ఇతరులతో చర్చించుటకు తనకు ఆప్తుడు
గోవిందుడొక్కడే. ఆ రాత్రి భోజనానంతరము ఎల్లరు నిద్రించువేళ
రహస్యముగా పారిపోదునని గోవిందునితో రామానుజుడనెను. "సోదరా!
భగవత్కటాక్షమున నీవు సురక్షితముగా స్వగృహము జేరగలందులకు
నేనెంతయో దైవమును ప్రార్థించుచున్నాడు. నన్ననుమానింపకుండుటకు
నేను మెల్లగా యేమియు నెరుగని వానివలె నటింతును. ఉత్తరదేశ యాత్ర
నుండి తిరిగి కాంచీపురి జేరినపుడు మనము మన స్వగృహమున
కలుసుకొందము గాక!" అని గోవిందుడు వాపోయెను. రామానుజుని
యాలింగనము గావించుకొని, కంటనీరు పెట్టెను. గోవిందునకు ధైర్యము
జెప్పి రామానుజుడు అంతటితో గుప్తముగా మెలగుమని గోవిందుని కోరెను.

అప్పటికి రాత్రియేడుగంటలయినది, రామానుజుడు గోవిందుడు
బిందెలతో త్రాగుటకు నీరుదీసికొనిపోయిరి. ప్రయాణ బడలికవలన త్వరగా
విశ్రమింపవలయునను తలంపుతో అందరును భోజనములు జేసి, రాత్రి
తొమ్మిది ఘంటల లోపలనే నిద్రించిరి. అది శుక్లపక్ష సప్తమి దినమగుటచే
రాత్రి పండ్రెండు ఘంట తరువాత వెన్నెలబోయి చీకటివచ్చును. గాఢనిద్ర
యందుండునపుడు అర్థరాత్రివేళ రామానుజుని తుదముట్టింప సమకట్టిన
దుష్టశిష్యచతుష్టయము లేచి సంసిద్దులగుచుండిరి. చంద్రుడు మరుగున
పడెను. పెను చీకటి నలుదిశల నలముకొన్నది. ఆకాశము మేఘావృతమై
యున్నందున కటిక చీకటిగానుండెను. రామానుజుడు మెల్లగా నిద్రలేచి,
ప్రక్కన పరుండియుండిన గోవిందుని గీరి సన్నజేసి, చీకటిలోబడి దక్షిణ
దిక్కుగా వెడలిపోయెను. అంధకార సముద్రమున దరిగానక ఈదుతూ
పోవుచున్నాడు.

కొలది నిముసములు గడచిన తరువాత దుష్టశిష్యచతుష్టయము
మెల్లగా రామానుజుడు గోవిందుడు పరుండిన స్థలమునకు వచ్చిరి.
రామానుజుడట లేడు. చీకటిలో మరొకతావున పరుండియున్నాడేమోనని
వెదకసాగిరి. తరువాత నిద్రించుచున్న అందరిని లెక్కించిరి. ఒక వ్యక్తి
తక్కువ, ఒక ఘంటకాలము వెదకిరి. రామానుజుడు లేడని నిర్ణయింప
బడినది. గోవిందుని లేవగొట్టి “రామానుజుడెక్కడ” అని ప్రశ్నించిరి.
తూగుననున్నట్లు నటించిన గోవిందుడు “అర్ధఘంటకు పూర్వము
అల్పాచమనమునకు రామానుజుడు లేచి అటు పదియడుగులు పోయినట్లు
జూచితిని. మరలా మరుక్షణమున నేను కన్నుమూసితిని. అయ్యో!
రామానుజునకేమైనదో! అని కేకలు వేయుచూ, గోవిందుడు తత్తరపాటు
నభినయించుచూ, తిరుగుచుండెను. అందరును నిద్రలేచిరి, యాదవ
ప్రకాశుడు కూడా. అందరును కలిసి సమీపమున నలుదిక్కుల కొంత
దూరము వెదికిరి. గాఢాంధకారము కావున ఎక్కువ దూరము చూడలేక
పోయిరి. ఈ లోపల తలవని తలంపుగా వర్షము పడెను. అందరు
గుమిగూడి, వారు విశ్రమించిన స్థలమును జేరి, మహావృక్షచ్ఛాయలో జేరిరి.
నాల్గవఝాము సమీపించుచున్నది. కోయిల, భరద్వాజ, శుకపిక పక్ష్యాదులు
మేల్కొలుపులు పాడుచున్నవి. వర్షము నిలిచినది. “రామానుజుడు
అల్పాచమనమునకు అటుపోయియుండవచ్చును. ఏదో క్రూరమృగము
వాతబడియుండును! పాపము! మనమింకేమి చేయగలము! విధివ్రాత
అట్లున్నది! గోవిందా! ఊరడింపుము! చెట్టునగాచిన కాయలన్నియు ఒకే
సమయమున పండిరాలవు కదా! ఏదిముందో, యేదివెనుకో, ఎవరికెరుక?
పాపము! మనము తిరిగి కాంచీపురము చేరినపుడు యేకైకపుత్రుని
వియోగమునకు రామానుజుని తల్లి యెట్లు చింతించునోకదా! కాని ఇట్టి

అకాల మరణమునకు అద్వైతులమగు మనము చింతింపరాదు. జగము
మిథ్య! మనము నిరుత్సాహపడి తిరోగమింపరాదు. మన యాత్ర
సాగించెదము”. అని యేమియు నెరుగనివానివలె యాదవప్రకాశుడు
శిష్యులకు తత్త్వబోధ గావించి, రామానుజుడు పంచత్వము నందెనని లోలోన
ఆనందించుచూ, ఆత్మకు ఊరటను దెచ్చుకొనెను. తరువాత, తెల్లవారి
అందరును యాత్రకై ఉత్తరాభిముఖులై పయనించిరి. అందరును
ఆనందముగా పయనించుచుండిరి, గోవిందుడొక్కడే యెల్లపుడు అవనత
వదనుడై ఆలోచించుచూ మౌనముగా నడుచువాడు. “రామానుజునకేమి
యిక్కట్లు సంభవించునో మార్గమధ్యమున", అని గోవిందుని భయము.
“దగ్గర బంధువును పోగొట్టుకున్న గోవిందుడు కొన్ని దినములు దిగులుగా
నుండుట సహజమే కదా!", అని యెల్లరు భావించిరి.

మరునాడుదయమున గురుశిష్యులు దారిన నడుచుచుండగా,
“మనలో నెవరు మరణించినను తక్కినవారు జీవయాత్ర చాలించేది లేదు
కదా! పుట్టకయెట్లు సహజమో గిట్టుటయునట్లే. ఎవరి కర్తవ్యము వారు
జీవమున్నంత వరకు నెరవేర్చుచుండవలసినదే. మనము కాశీయాత్ర
కర్తవ్యముననున్నారము, నడువుడు”, అని కుటిల మనస్కుడైన యాదవ
ప్రకాశుడు శిష్యుల నుత్సాహపరచుచూ పయనింపసాగెను. లోలోన పీడ
వదలినదని సంతసించువాడు. ఎంత చదువు చదివినను అవివేకి
తెరగిట్లుండును. స్వార్థరాహిత్య భావములేని చదువు మాత్సర్యమును
గర్వమును పెంపొందించును.

ఇక రామానుజుని పరిస్థితులు గమనింతుము. ప్రాణముల
గుప్పెటలో పెట్టుకొని పరుగెత్తిన రామానుజుడు అర్ధరాత్రి చీకటిలో
దారితెన్నులెరుగక, అడవియందు పరుగెత్తుచుండెను. భీతిల్లిన వారికి

ఇతరములు దోచునా? పరువిడి, పరువిడి ఆయాసము నొందెను. కాళ్ళు
గుంజుచుండెను. శరీరము చెమటచే తడిసెను. ఇక ఒక్క అడుగు
పెట్టుటకును శక్తిలేదు. నేలపై కూలబడెను. మరుక్షణము నేలపైవాలెను.
గాఢనిద్రనందెను. అది సుదీర్ఘనిద్ర. మరునాడు మిట్టమధ్నాహ్నమప్పటికి
నిద్రనుండి లేచెను. ఎండ తీవ్రముగా కాయుచున్నది. భయభ్రాంతుడయిన
రామానుజుడు కొంత ఆశ్చర్యమును పొందెను. తనయేకాకిత్వమునకు,
తనకష్టములకు అతడు చింతించలేదు. నిరపరాధియయిన తన్ను
గురువర్యుడేల ద్వేషించెనో గదా అని వాపోవుచుండెను. విషయ పరిశీలన
మునకు శాంతియుత ఆలోచనమునకు తరుణము కాదది. రామానుజుడు
లేచి, అచటి సెలయేటిలో స్నానమాచరించి కొంత స్వస్థత నందెను.
రామానుజుడు సహజముగా ఆరోగ్యవంతుడు, బలశాలి, సుందర విగ్రహుడు.
ఆజానుబాహుడు, తేజోరాశి. ఒక వృక్షమూలమున కొంతపేపు కూర్చొని,
తరువాత పయనింపనెంచెను. క్షుద్బాధ కలిగెను. కానీ, అచ్చట ఆహార
మెక్కడిది? ఫలవృక్షములున్నవేమో నిదానముగా చూచెదగాక -అని
ఆలోచించుచు వృక్షమూలమున నాసీనుడై శ్రీమన్నారాయణుని అనంతశక్తిని
తలంచుకొనుచుండెను. ఈ లోపల దంపతులైన భిల్లులు ఇరువురు ప్రక్కన
నడచుచూ, రామానుజుని నవలోకించి, సమీపించి, “నాయనా! నీవేల
ఒంటరిగా ప్రయాణము జేయుచున్నావు? ఎచ్చటికి పోవలయును?” అని
అడిగిరి.

“నా నివాసస్థలము కాంచీపురము, బహుదూరమున నున్నదని
భావించుచున్నాను”, అని రామానుజుడనెను.
“నీవు కాంచీపురమునకు పయనించుచున్నావా, నాయనా!,
ఉత్తరదేశ యాత్రను ముగించుకొని నిజస్థానమునకు మరలినావన్నమాట.

మంచిది మాకు కొంత తోడయినావు నాయానా, మేమిరువురము నూతన
దంపతులము. రామేశ్వరయాత్రకై పోవుచున్నాము. కంచిపట్టణము వరకు
నీతో కలిసిరాగలము నాయానా!" అని ఆ బిల్లు దంపతులనిరి. దారితోడు
దొరకినందులకు రామానుజుడు పరమానందభరితుడాయెను. సర్వమును
అదృష్టమయిన దైవశక్తి వలన సంభవించుచుండునని భావించు
రామానుజుడు భక్తి భావమున నారాయణుని మనమున ధ్యానించుకొనెను.
“నాయానా! అలసట జెందినట్లు కన్పట్టుచున్నావు. నీవు పై గుడ్డలతోనే
యున్నావు. నీ సామాగ్రి దారిన పోయినదేమో! సరే, యివిగో మా వద్ద
కొన్ని ఫలములున్నవి. ఆరగించి సెలయేటిలోని సలిలముల ద్రావి
సేదదీర్చికొనుము, నాయనా! తరువాత నడువసాగెదము,” అని
భిల్లుదంపతులనిరి. వారి జోలినుండి కొన్ని ఫలముల నివ్వగా,
రామానుజుడు వానినారగించి క్షుద్బాధ తీర్చుకొనెను.

రామానుజుడు భిల్లుదంపతులతో కలిసి పయనింపసాగెను. వారి
స్నేహమున, వారి దివ్యదేశ పర్యటనావిశేషములు వినుచుండుట వలన,
రామానుజునకు ప్రయాణమెంతో సుఖకరముగా, ఆనంద యుక్తముగా
నుండెను. ఒకనాడు సూర్యాస్తమయముకాగా, ఒక తావునవారు మువ్వురును
శయనించిరి. మరునాడు వేకువననే వారు నిద్రనుండి లేచి, సమీప
ప్రవాహమున స్నానమాచరించి, చెంతనున్న ఫలములు దినిరి. సూర్యోదయ
మగుచుండెను. భిల్లు దంపతులు రామానుజుని వైపుజూచి, “నాయానా,
అదిగో చూడుము. మనమున్నత ప్రదేశమున నిలుచున్నాము గదా!
చూడుము, ఆకనబడు కనక శిఖరములు శ్రీవరదరాజస్వామి దేవాలయ
గోపుర శిఖరములే గదా! ఇక నీ మార్గమునుబట్టి నడువుము, త్వరలో నీ
స్వస్థలమును జేరగలవు. మేమిచట నుండి నేరుగా పయనించెదము”

అనిరి. రామానుజడు దూరమున నుండి దేవాలయ సువర్ణ శిఖరముల
దర్శించి, పరమానందమున సాష్టాంగపడి నమస్కరించెను. "అయ్యా,
అమ్మా నేనింత త్వరలో, ఇంతటి సురక్షితముగా స్వస్థలమును జేరగలనని
యూహింప లేదు. ప్రేమాతిశయమును జూపు మీ సహవాసమున మీరు
దారిని నాకు దెల్పుచున్న అనేక దివ్యక్షేత్ర విషయములు నేను వినుచుండుట
వలన నేను ప్రయాణకాలమునే మరచితిని. ప్రయాణశ్రమను బొందనైతిని.
నాయీ పరమానందభరిత ప్రయాణమున మిమ్ముల నేగలిసికొన్నది నిన్ననే
అని నేను భ్రమపడుచున్నాను. నేను మీకు కృతజ్ఞుడను. మీయెడ నాకు
పితృభక్తి మాతృభక్తి పొడముచున్నవి. మీరు నాకొనగూర్చిన సాయము,
సానుభూతి అనన్యము. మీరు నాతోగూడ వచ్చి, కంచి వరదరాజస్వామిని
దర్శించి, నాయాతిథ్యమును స్వీకరించి, తరువాత యాత్ర సాగింపుము”,
అని రామానుజుడు కోరెను. అందులకు భిల్లుడు, “నాయనా! నీ
ఆదరమునకు సంతోషము. కాని ఒక విషయమును వినుము. మాధ్యేయము
రామేశ్వర దర్శనము. ఇది దేశ దక్షిణాగ్రముననున్నది. ముందు
రామేశ్వరమును దర్శించి, అటనుండి తిరుగు పయనము గావించునపుడు
దారిలోని పుణ్యక్షేత్రములనన్నిటిని దర్శింతుముగాక. అట్టితరి
కాంచీపురమును గూడ దర్శించెదము” అని పల్కెను. విషయమును
గ్రహించిన రామానుజుడు వల్లెయని పలికి, కాంచీనగరమున తన
గృహమున్న తావును భిల్లులకు గుర్తుజెప్పి, వారిని తిరుగు ప్రయాణమున
తప్పక రమ్మని ఆహ్వానించి, వారికి కృతజ్ఞతను వెల్లడించి, కాంచీనగరము
వైపు అత్యానందముతో నడువసాగెను. వరదరాజాలయ స్వర్ణ శిఖరములు
దిక్సూచివలె కన్పడి దారిని చూపుచుండినవి.

మధ్యలో నొక కోనేటిలో దప్పిదీర్చుకొని, గట్టునున్న అరుగు పై
కూర్చొని విశ్రాంతిగా నాలోచింపదొడగినాడు రామానుజుడు “ఇక కొలది
ఘంటలలో నిజసదనమును చేరగలను. జరిగిన విషయముల రహస్యముగా
నుంచెదగాక! అట్లుకాదని గురువులవారిని దోషిగా ఎల్లరు భావింతురు
గదా! అట్టియెడ నేను గురువులవారికి అపచారమును జేసిన వాడనగుదును.
అది తగదు. అది గురుద్రోహమే కాగలదు. వారు నాపై అసూయపూనుట
నా దౌర్భాగ్యమనియే భావించెదగాక, అంతవరకే. కావున యాత్రాకాల
మధ్యమున జరిగిన ఘటనను నేనెవ్వరికిని చెప్పరాదు”, అని రామానుజుడు
నిర్ణయించుకొనెను.

మరియు ఆలోచనాపరుడయిన రామానుజుడు ఈ విధముగా విత
ర్కించుకొనదొడగెను. సృష్ఠి స్థితి లయముల దెలిసికొని, ఆ జ్ఞానమున
కనుగుణమైన నడవడిని నిర్ణయించుకొనుటయే మతమనబడును, ఇది లోక
కల్యాణము కొరకు. అందువలన ఏ జాతి ప్రజలయినను సృష్టిస్థితిలయ
విషయములను భిన్నముగా భావించినను, నడవడి విషయమున మాత్రము
సామ్యతను జూపవలసియున్నది, ఇట్టి పరిస్థితిలో మహాపండితుడనియు,
శాస్త్రకోవిదుడనియు, అద్వైత సిద్ధాంత ప్రచారకుడనియు కీర్తిగన్న యాదవ
ప్రకాశుడు, శిష్యుడనయిన నాపై ద్వేషముబూనుట విడ్డూరముగా కన్పట్టు
చున్నది. అదియునుగాక నన్ను తన శిష్యులచేతనే తుదముట్టింప
ప్రయత్నించుటలో వారి పాండిత్యమునకును, పాండిత్యసారమగు జ్ఞానము
నకును ఏలాంటి సంబంధము కన్పడుటలేదు. “విద్యాశాస్త్ర పురాణవేద
పఠనం కిం తేన జ్ఞానం వినా" అని పెద్దలిందులకే వచించిరేమో!
జ్ఞానమునకు సూచకము కరుణ, దయ, సానుభూతి మతమనునది
మానవులలో కరుణ, దయ సానుభూతులను జనింప జాలకున్ననది మతము

ఎట్లగును? నా గురువు యాదవప్రకాశునిదిట్టి మతాంధకారమున
నుండుటకు నేనెంతయో చింతించుచున్నాను. "ధీమహి థియో యోనః
ప్రచోదయాత్” అను గాయత్రీ మంత్ర తాత్పర్యమునకాయన యెంత దవ్వున
నున్నాడోకదా! (భగవచ్ఛక్తి నా హృదయమున వసించి, నాచే సత్కార్యములు
చేయించుగాక అని గాయత్రీమంత్రభావము). అనుదినము తాను జేయు
గాయత్రీ జపమేమైనట్లు? ఎంత వైపరీత్యము! శిష్యుడనుగాన నాకర్తవ్య
మొక్కటియే. గురువర్యుడెట్టివాడైనను వారి తప్పులెన్నుట నా కర్తవ్యము
కాదు. వారిని గౌరవించుటయే నా విధి. వారిని విమర్శించు అధికారము
నాకు లేదు. వారు దయార్ద్రహృదయుగా మారుటకు దైవశక్తిని
ప్రార్థించెదగాక. ఇదియే నా వాస్తవమైన గురుదక్షిణ కాగలదు!”, అని
రామానుజుడు నిర్ణయించుకొనెను. సర్వవేద సర్వశాస్త్ర పారంగతుడయిన
యాదవ ప్రకాశుడు సుగుణ సంపత్తి లేక సంపూర్ణ వ్యక్తి కాలేనందులకు
రామానుజుడు పరిపరివిధముల చింతించెను.

రామానుజుని మనమున గలిగిన ఈ వితర్క భావము ఆతని కరుణ
దయాగుణములకు నిదర్శనము. బాల్యము నుండియే అణుకువ, వినయము,
దయ, స్వార్థరాహిత్య భావము, నిశిత ఆలోచనాక్రమము రామానుజుని
యందు మెండుగా నుండినవి.

రామానుజుడు నడువసాగెను. కాంచీపురము సమీపమున కన్పట్టు
చుండెను. అన్నిటికంటే అత్యున్నతములయిన వరదరాజస్వామి ఆలయ
శిఖరములు అతనిని ఆకర్షించుచున్నవి. విలుకాడు తన లక్ష్యమునే చూస్తాడు,
ఇతర విషయముల జూడడు కదా!

మరియొకసారి భిల్లు దంపతుల దలచుకొని, “నేను వారికి
కృతజ్ఞుడను, వారి సాయము లేనిది నేను సురక్షితముగా అరణ్యముల

గుండా పయనించి యుండెడువాడను గాను. నన్ను మార్గమున రక్షించి,
యింతవరకు నడిపించిన ఈ భిల్లుదంపతులు నాపాలిటి పురాణ దంపతులే!
వారిని లక్ష్మీనారాయణులుగనే భావింపగలను. సాయము జేయువారు,
దయార్ద్ర హృదయులైనట్టివారు, దైవాంశ సంభూతులే. కృప దైవగుణము.
కృపగల మానవుడు దైవాంశ సంభూతుడు. మానవులలో రెండు వర్గములు,
సజ్జనులు దుర్జనులని, ఉండుటకు కారణములు కృపాసహితత్వము,
కృపారహితత్వములే”, అని రామానుజుడు మనమున వితర్కించుకొనెను.

త్వరలో స్వగృహము జేరి తల్లి పాదముల నమస్కరించెను.
గురువర్యుల ఇతర శిష్యులనందరిని వదలి రామానుజుడు ఇంత శీఘ్రముగా
ఇల్లు జేరుటకు తల్లి కాంతిమతి అచ్చెరువందెను. కాని, రామానుజుడేదో
నిజదేహారోగ్యకారణము దెల్పి, ఆ విషయమునంతటితో మరపింపజేసెను.

ఆ కాలమున కాంచీనగరము చోళ రాజధాని. రాజకుమార్తెకు
మానసిక వ్యాధి సంభవించెను. ఆమెకు పిశాచ మావరించినదని అందరు
భావించిరి. యాదవ ప్రకాశుడు ఆధ్యాత్మిక విద్యయందే గాక, మంత్ర
శాస్త్రమునందును నిపుణుడని ప్రసిద్ధి. ప్రభువు యొక్క ఆహ్వానముపై
యాదవప్రకాశుడు శిష్యులతోగూడి రాజభవనమును జేరి, రాజకుమార్తెను
పరీక్షించి, పిశాచమను దానిని వెడలగొట్టుటకు బిగ్గరగా మంత్రముల
వల్లింపసాగెను. ఆయన మంత్రోచ్ఛారణ మేఘగర్జనమువలె ప్రతిధ్వనించు
చుండెను. పిశాచ పీడిత యనబడు రాజకుమార్తె (తన మానసిక వ్యాధి
చాపల్యమున) తన యిష్టము వచ్చినట్లు పరిపరి విధముల ప్రలాపించు
చుండెను. మానసిక వ్యాధికి ఒక నిర్ణీత గతియనునదేమున్నది?
మంత్రోచ్ఛారణ ధాటిగా గావించుచున్న యాదవ ప్రకాశునితో రాకొమరిక

ఇట్లనియెను. "ఓయీ! నీ తెల్లగడ్డమును నీ ముఖతిలకములను, నీ
మంత్రగర్జనములును నన్నేమి చేయగలవు? పండితుడవయ్యును మూర్ఖుడవు,
క్రూరుడవు నీవు. కలుషితహృదయుడవగు నీ మంత్రములు నాపై పని
జేయునా? ఎందులకు వృథాప్రేలాపము?”

రాజకుమార్తె మాటలు విన్న సర్వులు ఆశ్చర్యపడిరి. యాదవ
ప్రకాశుడు కినుకబూన నవసరము లేదు! ఏలన ఆమె మాటలను పిచ్చి
దాని మాటలుగా త్రోసిపుచ్చిరి.

మరియు రాజకుమార్తె ఇట్లనెను, “నన్ను తరుమను నీశక్యము
గాదు! ఓ మాయావాదీ! మాయావీ! ద్రోహి! అడుగో, నీ వెనుకను
ముకుళితహస్తుడై నిలువబడియున్న యువక మహాత్ముడు, ఆయనను ఇటు
రప్పింపుము. రామానుజుడు గదా అతడు. నీకు అదృష్ట పూర్వకముగా
అతడు శిష్యుడుగా లభించినాడు. ఆ రామానుజుని, ఆ పరిశుద్ధాత్ముని, ఆ
దయా సముద్రుని, ఆ నిష్కళంక హృదయుని, అపరాధిని సైతము మన్నించి
ప్రేమించు ఆ యుదార స్వభావుని, ఆ గురుభక్తి పరాయణుని రప్పింపుము”.

రామానుజుడు సమీపింపగనే రాజకుమార్తె నోటినుండి ఈ
పలుకులు వెలువడెను. “మాయావాదము నంగీకరింపని ఓ మహాత్మా!
నన్నే గాదు, అసంఖ్యాక మానవాభ్యుదయమునకు పాటుపడగల మహాత్ముడవు
నీవు! నన్నాశీర్వదింపుము!

రామానుజుడు ప్రపత్తుడుగాన, సర్వం విష్ణుమయమ్ అని భావించు
వాడుగాన. శ్రీవరదరాజస్వామిని మనమున స్మరించి, త్రికరణ శుద్ధిగా
రాజకుమార్తె మూర్ధమును తన హస్త కమలద్వయముతో స్పర్శించి,
ఆశీర్వదించెను. వెంటనే రాజకుమార్తె స్వస్థతను జెంది, మేఘము తొలగిన

చంద్రబింబముఖియై లేచి, మందహాసమును సిగ్గున తల్లిదండ్రులయిన
రాజదంపతుల మ్రోలజేరెను. ఆ క్షణమున నెవ్వరేని రాజకుమార్తె ముఖమున
ఎట్టి వ్యాధి లక్షణమును గానీ తిలకింపలేకపోయిరి. ఆమె నడిజవ్వనమున
సంపూర్ణారోగ్య ముఖవర్చస్సుతో ప్రకాశించెను. రామానుజుని ఆశీర్వాద
బలమది!

ఒకనాడు యాదవప్రకాశులు ఛాందోగ్యోపనిషత్లోని “సర్వం
ఖల్విదం బ్రహ్మ” అను మంత్రమునకు అర్థమును వివరించు సందర్భమున
"విశ్వమంతయు బ్రహ్మము” అని బోధించెను. కఠోపనిషత్తులోని "నేహ
నా నాస్తికించన” అను మంత్రమును వ్యాఖ్యానించుతరి, "ఆత్మయును
బ్రహ్మమును ఒక్కటే" అని తెల్పెను.

ఈ వివరణముల వినిన రామానుజుడు గురునితో, "స్వామీ! తమరు
సెలవిచ్చిన వివరణములు సరియైనవికావని నాయుద్ధేశము. “సర్వం
ఖల్విదం బ్రహ్మ" అను మంత్రమునకు అర్థము ఇదిగా తోచుచున్నది.
"విశ్వమునకును, బ్రహ్మమునకును సంబంధమున్నది. కానీ అవి రెండును
ఒకటికాదు. దేని విశిష్టత దానికున్నది. నీటియందు పుట్టిన చేప, నీటియందే
పెరిగి, నీటియందే జీవించి, కడకు నీటియందే మరణించి, కడకు నీటియందే
కరిగిపోవును. కాని, చేప నీరు కాదు. అట్లనే విశ్వములో ప్రతియణువు
బ్రహ్మపదార్థముతో సంబంధపడియున్నను, విశ్వము బ్రహ్మము కానేరదు”
అని రామానుజుడు వివరించెను.

“నేహనా నాస్తికించన” అన్నప్పుడు సత్యవిషయము ఇట్లు
గోచరమగుచున్నది. “ఆత్మయు, బ్రహ్మమును ఒక్కటియే కాదు. బ్రహ్మము
ఆత్మల నావరించియున్నది. పూసలగుండా బోవుదారమువలె. దారము

నందు గ్రుచ్చబడిన ముత్యములు ఒకహారముగా కన్పడును. కానీ దారము
ముత్యము కాదు. ముత్యములన్నియు ఒకటికాదు, సారూపము ననున్నవి
అంతవరకే. సకల చరాచరముల గుండా సూత్రముగా వ్యాపించియున్న
బ్రహ్మము విశ్వమగుచున్నది. ఈయేకత్వమున వానివాని వైవిధ్యమున్నది.
అంతియేగానీ, బ్రహ్మము విశ్వముకాదు” అని తోచుచున్న దని రామానుజుడు
పల్కెను.

రామానుజుని యొక్క ఈ వ్యాఖ్యలు వినిన యాదవప్రకాశుని
శరీరము, భూమి కంపించినట్లు, వణకెను. తన మనస్సు అగ్నిపర్వతమువలె
దహింపదొడగెను. అగ్నిపర్వతములోని ఉష్ణద్రావకమువలె తన ముఖ
ద్వారము నుండి అసూయాద్వేషములు పొర్లి ప్రవహించినవి. వానికిక
అవధిలేదు, “రామానుజా! నీవు అద్వైత మతశత్రువువు. ప్రతి మంత్రమునకు
అద్వైత సిద్ధాంతమునకు వ్యతిరేఖమైన భావములు నీకు పొడముచున్నవి.
నాతో ఎదురువాదములాడు నీవు నాకెట్లు శిష్యుడుగా కొనసాగగలవు?
నీవు ఇక వెడలిపోయి మరియొక విద్యాపీఠమును స్థాపించుకొనుము.
ఒకయొర యందు రెండు ఖడ్గములెట్లు నిలుచును? అద్వైత సిద్ధాంతమునకు
శత్రువయిన నీవు నాకును, నా మఠమునకును, నా శిష్యులకును శత్రువువే.
ఇక వెడలిపొమ్ము, నీకిచట స్థానము లేదు. ఇక నాగడప త్రొక్కకుము”,
అని యాదవప్రకాశుడు వృద్ధసింహమువలె గర్జించెను.

రామానుజుడు మిన్నగా శాంతియుతముగా గురుదేవుని మాటలు
విని, మారుమాటాడుటకు నోరులేక, ఇక చేయునది వేరొండు లేక, తన
యెడబాటు ఇక అనివార్యమని గ్రహించి, గురువునకు నిశ్శబ్దముగా
నమస్కరించి, అవనత వదనుడై, బహిష్కరణా దుఃఖభారమును మోయుచూ,
మఠమును వదలి, నడచెను.

ప్రశ్న :- రామానుజుడు ప్రాణమును కాపాడుకొను నిమిత్తము అడవినుండి
పారిపోయి ఇల్లు చేరిన తర్వాత, తమ గురువు యాదవ ప్రకాశుని
ఉద్దేశ్యము తెలిసిన తర్వాత యాదవ ప్రకాశుడు చెప్పే బోధయంతయూ
అద్వైతమని తెలిసిన తర్వాత, యాదవప్రకాశుని తిరిగి గురువుగా
ఒప్పుకొనుచు అతనివద్దకు రామానుజుడు చేరవలసిన అవసరమే
మొచ్చినది?

జవాబు :- రామానుజుడు చిన్న వయస్సులోనే యాదవప్రకాశుని వద్ద
విద్యాభ్యాసమునకు చేరియుండెను. అప్పుడు గురువుగాయున్న యాదవ
ప్రకాశుడు రామానుజుని చంపాలనుకొన్నప్పుడు, అతడు ఆ ప్రమాదము
నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు అతని వయస్సు దాదాపు 17
లేక 18 సంవత్సరములుండేవి. అంతచిన్న వయస్సులో యాదవ ప్రకాశు
ని వద్ద తిరిగి చేరాలా వద్దా! అను విషయమై ఎట్లు నిర్ణయము తీసుకోలేక
పోయాడు. రామానుజునికి 16వ సంవత్సరముననే తండ్రి చనిపోయిన
దానివలన ఆయనకు ఎవరూ సలహా చెప్పువారు లేకపోవడము వలన,
తన విద్యాభ్యాసము కొంతవరకైనా అవసరము అను ఉద్దేశ్యముండుట
వలన, పైగా తన గురువు బ్రాహ్మణుడే అయివుండవలెనను ఆలోచన
యుండుట వలన తప్పనిసరిగా యాదవ ప్రకాశునివద్దనే చేరాలని
రామానుజుడు నిర్ణయించుకోవడము జరిగినది.

ప్రశ్న :- రామానుజుడు తిరిగి తనవద్దకు వచ్చినప్పుడు గురువుగా యున్న
యాదవ ప్రకాశుడు తనకేమీ తెలియనట్లు తన శిష్యులలోనికి రామానుజున్ని
చేర్చుకోవడము జరిగినది. అయినా కొంతకాలములోనే గురువుగారు
అసూయతో రామానుజున్ని తనవద్దనుండి దూరముగా పంపి తన శిష్యుడు

కాదని చెప్పడము జరిగినది. అప్పుడు యాదవ ప్రకాశుని వద్దనుండి
వెలివేయబడిన రామానుజుడు కొన్ని సంవత్సరములకు ఇతర గురువుల
వద్ద విద్యనభ్యసించి, పరిపూర్ణ విద్యావంతుడయి అద్వైతమునకు వ్యతిరేఖ
భావముతోనేయుండెను. అటువంటి సమయములో యాదవ ప్రకాశుడు
ఒకప్పుడు తన శిష్యునిగాయున్న రామానుజుని వద్దకుపోయి రామానుజున్ని
గురువుగా చేసుకొని తాను శిష్యుడు కావలసిన అవసరమేమొచ్చినది?

జవాబు :- వృద్ధ వయస్సులో యాదవ ప్రకాశుడు రామానుజుని కీర్తిని,
సంపదను గురించి విని ఆశ్చర్యపడెను. రామానుజుని విశిష్ట బోధనా
మృతమును గూర్చి కూడా వినుచుండెను. యాదవ ప్రకాశునకు తన
అద్వైతతత్త్వ భావము శాంతిని, ఆనందమును ఇవ్వలేకపోయినది. జ్ఞాన,
ధ్యానములకంటే కర్మఫలత్యాగమే శ్రేష్ఠమయినదని ప్రవచించుచున్న
రామానుజుని మాటలు ఇప్పుడు యాదవప్రకాశునికి నచ్చినవి. తన అద్వైత
భావమున తాను ఒంటరివాడినయినట్లు భావించెను. వైష్ణవ శక్తి తనలో
యున్ననూ, అది విశిష్టముగాయున్నదని భావించిన భక్తుడే విష్ణు సంశ్లేష
భావమున విశ్వమానవ సౌభాత్రమున ఆనందమునొందగలడు. ఈ విషయ
సత్యమును గ్రహించిన యాదవ ప్రకాశుడు రామానుజునకు శరణాగతు
డగుటకు నిశ్చయించుకొనెను. కానీ ఒక విధమయిన జంకు, సిగ్గుతో
వెనుకాడుచుండెను.

ఇట్లు మనోవ్యాకులముతో ఒకనాటి సాయంకాలమున వీధిలో
నడచుచూ తిరుక్కచ్చినంబిని గాంచెను. తన ఆధ్యాత్మిక దీనావస్థను తిరుక్కచ్చి
నంబికి ఇట్లు తెలిపెను. "నా మనస్సున ఒక అభిప్రాయమున్నది. మీరు
ఈనాటి రాత్రి వరదరాజ స్వామిని సేవించునప్పుడు నా అభిప్రాయమును

గురించి స్వామివారు ఏమి తలచుచున్నాడో స్వామిని అడిగి తెలుసుకొని
నాకు తెల్పుము? ఆ మాటలను విన్న తిరుక్కచ్చినంబి ఆనాటి రాత్రి వరద
రాజస్వామితో "స్వామీ! యాదవ ప్రకాశుని మనస్సున ఒక అభిప్రాయము
కలదట. దానిని గూర్చి మీరు ఏమి అనుకుంటున్నారో మీ నిర్ణయము
మేమిటో? అడిగి తెలుసుకొని ఆయనకు తెలుపమన్నాడు, నీ ఆజ్ఞ ఏమిటో
తెల్పుడు” అని అన్నాడు. అంత స్వామి "ఓయీ! యాదవప్రకాశుడు
రామానుజుని ఆశ్రయింప తలచిననూ మనస్సున ఇంకనూ సంశయపడు
చున్నాడు. ఇక ఏమాత్రము సంశయింపక రామానుజుని ఆశ్రయింపుమని
నా మాటగా చెప్పుము" అని బదులిచ్చెను. తిరుక్కచ్చినంబి ఆ మాటను
మరుసటి రోజు యాదవప్రకాశునికి తెలియజేసెను. అప్పుడు యాదవ
ప్రకాశుడు ఒకప్పుడు రామానుజునికి నేను గురువుగాయుంటినను
భావమును వదలి శిష్యుడయిన రామానుజుని గురువుగా స్వీకరించెను.
అప్పటినుండి యాదవ ప్రకాశుడు "గోవింద దాసు" అను పేరుతో పిలువ
బడెను.

ఈ విధముగా రామానుజులవారు తన విశిష్టాద్వైత సిద్ధాంతముతో
అద్వైత సిద్ధాంతమును దాటిపోవుచూ అద్వైతమునకు విలువ లేకుండా
చేయుచుండెను. ఆ కాలములో చాలామంది అద్వైతులు తమ సిద్ధాంతమును
వదలి విశిష్టాద్వైతములో చేరిపోవుట అద్వైతులకు పెద్దకంటకముగా మారెను.
దానివలన రామానుజున్ని హత్య చేయాలని చాలామంది అద్వైతులు
చాలామార్లు ప్రయత్నము చేశారు. 18 సంవత్సరముల వయస్సులోనే
తన గురువే చేసిన హత్యాప్రయత్నమునుండి తప్పించుకొన్న రామానుజా
చార్యుల వారు జీవితమంతా అటువంటి ప్రయత్నములనుండి బయట
పడుచూ వచ్చాడు. ఆయన 120 సంవత్సరములు బ్రతికినా అప్పుడప్పుడు

అద్వైతుల దృష్ఠిలో అజ్ఞాతముగా బ్రతుకవలసి వచ్చినది. హత్యా
ప్రయత్నముల నుండి తప్పించుకొను అనుభవము రామానుజునకు
అందరికంటే ఎక్కువ కలదని చెప్పవచ్చును. అయినా ఒకమారు శరీరమును
ధరించి పుట్టిన తర్వాత తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు శరీరమును వదలక
తప్పదు, అనగా మరణించక తప్పదు. అదే విధానమును అనుసరిస్తూ
క్రీ॥శ॥ 1137వ సంవత్సరము మాఘమాస శుద్ధ దశమిరోజు శరీరమును
వదలడము జరిగినది. సూర్యుడు అస్తమించిన తర్వాత రామానుజుడు
చనిపోవడము జరిగినది. శంకరాచార్యుల వారు కూడా అర్థరాత్రి దాటిన
తర్వాత చనిపోవడము జరిగినది.

రామానుజాచార్యులవారు విశిష్టాద్వైతమును స్థాపించిపోయారు. శంకరా
చార్యుల వారు వచ్చిపోయిన తర్వాత దాదాపు 1500 సంవత్సరములు
అద్వైతమునకు ఎదురులేకుండా జరిగిపోయినది. అంతేకాక ఆర్యులు
మొదటినుండి తెలివైనవారే అగుట వలన, అద్వైతము రామానుజులు పుట్టక
పూర్వమే భారతదేశములో బలముగా ప్రాకిపోయినది. అందువలన క్రొత్తగా
వచ్చిన రామానుజాచార్యుల వారు అద్వైతుల వలన 18 సంవత్సరముల
వయస్సులోనే హత్యాప్రయత్నమును ఎదుర్కోవలసి వచ్చినది. తమ
అద్వైతమునకు ఎదురు తిరిగిన ప్రతివారిని చంపివేయాలను నిర్ణయము,
లేక దాడిచేయాలను నిర్ణయమును అద్వైతులు మొదటినుండి కల్గియున్నారు.
అందువలన రామానుజాచార్యుల వారు తన జీవిత కాలమంతయూ
ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినది. ఎంతో బలముగా మొదటినుండి
యున్న అద్వైతము నేడు కూడా హిందూమతములో ఎక్కువ శాతము
అద్వైతమే కలదని చెప్పవచ్చును. నేడు విశిష్టాద్వైతము భారతదేశములో

యున్నా అద్వైత బలముతో పోల్చుకొంటే చాలా తక్కువగా యున్నదని
చెప్పవచ్చును. నేటివరకు అందరికీ తెలిసిన సిద్ధాంతకర్తలు ముగ్గురు.

రామానుజుల వారు చనిపోయిన తర్వాత దాదాపు వంద
సంవత్సరములకు దక్షిణ దేశమయిన కర్నాటక రాష్ట్రములో మధ్వాచార్యుల
వారు రావడము జరిగినది. కర్నాటకలోని ఉడిపి దగ్గర 'పజక' అను
గ్రామములో బ్రాహ్మణ కుటుంబమున మధ్వాచార్యుల వారు నారాయణ
భట్టు, వేదవతి అను దంపతులకు పుట్టడము జరిగినది. మధ్వాచార్యుల
వారు ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి బోధించడము జరిగినది. ద్వైత
సిద్ధాంతము దేశములో ఎక్కడా ప్రచారము కాలేదు. అందువలన ఉడిపి
ప్రాంతములో పుట్టిన చోటున మాత్రము కొంత ప్రచారమయినది. ద్వైతము
బయటి ప్రపంచమునకు ప్రచారము కాకపోవడము వలన ఆ సిద్ధాంత
కర్తయిన మధ్వాచార్యుల వారు కూడా ఎక్కువగా ప్రచారము కాలేదు.
అందువలన చాలామంది హిందువులకే మధ్వాచార్యుల విషయము
తెలియకుండా పోయినది.

అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము హిందూమతములో ఉన్నా
అద్వైతము 70 పాళ్ళు, విశిష్టాద్వైతము 20 పాళ్ళు, ద్వైతము 10 పాళ్ళు
మాత్రమే ఉందని చెప్పవచ్చును. ఇప్పుడు హిందూమతములోని అందరికీ
తెలియని విషయమేమనగా! ఇప్పటికి దాదాపు 40 సంవత్సరముల క్రిందటే
త్రైత సిద్ధాంతము పుట్టినది. త్రైత సిద్ధాంత కర్త పుట్టినది 1950వ
సంవత్సరము. ఇప్పటికి 40 సంవత్సరముల క్రిందటే పుట్టిన త్రైతము
బయటికి తెలిసి 37 సంవత్సరములయినది. శాలివాహన శకము తర్వాత
క్రీస్తుశకము చెప్పబడుచున్నది. ఇప్పుడు త్రైత శకము కూడా ప్రారంభమయి

37 సంవత్సరములయినది. మధ్వాచార్యులు చనిపోయి ఇప్పటికి దాదాపు
700 సంవత్సరములగుచున్నది. రామానుజుల తర్వాత వంద సంవత్సరము
లకే మధ్వాచార్యుల వారు రాగా, ఆది శంకరాచార్యుల తర్వాత రామానుజా
చార్యుల వారు దాదాపు 1500 సంవత్సరములకు వచ్చాడు. మధ్వాచార్యులు
వచ్చిన తర్వాత దాదాపు 700 సంవత్సరములకు ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరుల వారు వచ్చారు.

ప్రశ్న :- మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినది ద్వైత సిద్ధాంతము. ద్వైతము
ఎక్కువగా ప్రచారము కాలేదు కదా! దానిని సిద్ధాంతముగా స్వీకరించ
వచ్చునా?

జవాబు :- సిద్ధాంతము ప్రచారము కావచ్చును, కాకపోవచ్చును. అయితే
సిద్ధాంతమును సిద్ధాంతముగానే చూడాలి.

ప్రశ్న :- మధ్వాచార్యులు సన్న్యాసత్వమును ఎప్పుడు స్వీకరించారు?
జవాబు :- మధ్వాచార్యులకు 12 సంవత్సరముల వయస్సులోనే సన్న్యా
సత్వమును తల్లి అనుమతితో స్వీకరించడము జరిగినది.

ప్రశ్న :- మధ్వాచార్యుల వారు దృఢకాయుడని కొందరన్నారు నిజమేనా?
జవాబు :- నిజమే. వాయుదేవుల ప్రథమ అవతారము హనుమంతుడు
అని అంటారు. వాయుదేవుని రెండవ అవతారము భీమసేనుడు అంటారు.
మూడవ అవతారము పూర్ణప్రజ్ఞులయిన మధ్వులని చెప్పుచుందురు.
ఆంజనేయుడు, భీముడువంటి దృఢకాయముకల్గి వృకోదరుడు అని పేరు
గాంచియున్నాడు.

ప్రశ్న :- వృకోదరుడు అనగా అర్థమేమిటి?

జవాబు : వృకోదరుడు అనగా 'తోడేలు వంటి పొట్ట గల్గినవాడు' అని
అర్థము. తోడేలు మంచి జీర్ణశక్తి కల్గియుండి జంతుకళేబరము నుండి
తినిన మాంసము ఎముకలను సులభముగా జీర్ణము చేసుకోగలదని
చెప్పుచుందురు. అటువంటి జీర్ణశక్తి మధ్వాచార్యులకున్నది. అందువలన
మధ్వాచార్యుల వారిని వృకోదరుడు అని పిలిచారు. ద్వాపర యుగములో
భీముడు కూడా గొప్ప జీర్ణశక్తికలవాడు అయినందున వృకోదరుడు అని
భీమున్ని కూడా పిలిచారు. కలియుగములో మధ్వాచార్యుల వారికి ఆ
పేరు రావడము జరిగినది. మధ్వాచార్యుల మొదటి పేరు 'వాసుదేవ' అని
కలదు. సన్న్యాసత్వము తర్వాత వాసుదేవ పోయి మధ్వాచార్యుల పేరు
వచ్చినది. అయినా ఆయన దృఢకాయుడే కాక, జీర్ణశక్తి కలవాడయిన
దానివలన భీముని అవతారమేనని తలచి 'వృకోదర' అని చెప్పడము
జరిగినది.

దక్షిణ దేశయాత్రలో శ్రీమధ్వులు 'విష్ణుమంగళం' అనే ఊరు
చేరుకొన్నాడు. అక్కడ ఆయన జీర్ణశక్తిని పరీక్షిద్దామని ఒక గృహస్థుడు
వారిని భిక్షకు ఆహ్వానించి షడ్రసోపేతముగా భోజనము పెట్టిన పిదప
రెండు వందల అరటిపళ్ళను ముందర పెట్టి ఆరగించమన్నాడట. అప్పుడు
శ్రీమధ్వులు అవలీలగా రెండువందల అరటిపళ్ళను ఆరగించి అందరినీ
ఆశ్చర్యపరిచాడట.

ప్రశ్న :- శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతమునకు పూర్తి వ్యతిరేఖముగా
విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యుల వారు ప్రతిపాదించారు
కదా! మూడవ ఆచార్యునిగా వచ్చిన మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతము
అద్వైతమునకు వ్యతిరేఖమా, లేక విశిష్టాద్వైతమునకు వ్యతిరేఖమా?

జవాబు :- ద్వైత సిద్ధాంతము ప్రధానముగా అద్వైతాన్ని పూర్తిగా
వ్యతిరేఖిస్తుంది. విశిష్టాద్వైత సిద్ధాంతముతో కొంత సారూప్యము ఉండడము
వలన శ్రీమధ్వులు ఆ సిద్ధాంతాన్ని ఎక్కడా విమర్శించలేదు. అద్వైతమునకు
వ్యతిరేఖముగా ద్వైతములోని ఐదు ప్రధానాంశములు కలవు. 1) జగత్తు
సత్యం, 2) జీవుడు బ్రహ్మము ఒకటికాదు, వేరువేరు తత్త్వాలు 3) పరమాత్మ
సగుణ సాకారుడు, 4) శ్రీమహా విష్ణువు పరమ దైవము, 5) మోక్షానికి
అచంచల విష్ణు భక్తిమాత్రమే ఏకైక మార్గము. ఇవన్నీ అద్వైతానికి పూర్తి
వ్యతిరేఖము. విశిష్టాద్వైతమునకు పూర్తి వ్యతిరేఖము కాదు.

ప్రశ్న :- విశిష్టాద్వైతమునకు ద్వైతము పూర్తి వ్యతిరేఖము కాదన్నారు.
అట్లయితే విశిష్టాద్వైతమునకు కొంత వ్యతిరేఖమే కదా! ద్వైతము విశిష్టా
ద్వైతమునకు ఎక్కడ వ్యతిరేఖముగా ఉన్నదో కొంత చెప్పగలరా?

జవాబు :- శంకరుని అద్వైతమునకు రామానుజుని విశిష్టాద్వైతము పూర్తి
వ్యతిరేఖము. అలాగే రామానుజుని విశిష్టాద్వైతమునకు కొంత మాత్రమే
వ్యతిరేఖము మధ్వాచార్యుల ద్వైతము. శంకరుని సిద్ధాంతములో దేవుడు
నిరాకారుడు అని కలదు. రామానుజాచార్యుల వారి సిద్దాంతములో దేవుడు
సాకారుడు అని కలదు. అందువలన రెండు సిద్ధాంతములు ఒకదానికొకటి
విరుద్ధమైనవి. అయితే మధ్వాచార్యుల సిద్ధాంతములో దేవునితోపాటు
జీవుని విషయము కూడా యున్నది. రామానుజాచార్యుల వారి
సిద్ధాంతములో దేవుడు సాకారుడనుట మాత్రము కలదు. జీవుని
విషయమంటూ ఏమీలేదు. అందువలన ద్వైత సిద్ధాంతములోని బోధలు
కొంత విశిష్టాద్వైతమునకు వ్యతిరేఖముగా ఉంటాయి. మధ్వ సిద్ధాంత
సారమును పూర్తిగా వ్యాసరాయలు అను మధ్వాచార్య భక్తుడు మరియు

ద్వైత సిద్ధాంత ప్రచారకుడు వ్రాసిన శ్లోకమును చూస్తే విశిష్టాద్వైతమునకు
ద్వైతము కొంత వ్యతిరేఖమని తెలియగలదు.

శ్లో॥ శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్, తత్త్యతో
భిన్నా జీవగణాః హరేరనుచరాః నీ చోచ్ఛభావం గతాః !
ముక్తిర్నైజ సుఖానుభూతిః అమలా భకిశ్చ తత్సాధనం
హ్యక్షాదిత్రిత్రయం ప్రమాణం, అఖిలామ్నాయైక వేద్యోహరి॥

భావము :- 1) శ్రీమహావిష్ణువే సర్వ స్వతంత్రుడయిన పరమ దైవము.
2) విశ్వము సత్యము. 3) జీవాత్మ పరమాత్మ వేరు, అలాగే జీవాత్మలు
కూడా పరస్పరం వేరువేరుగా ఉన్నాయి. 4) జీవులు పరమాత్మయిన విష్ణువుకు
దాసులు. 5) వారిలో ముక్తి యోగ్యులు, నిత్యసంసారులు, తమోయోగ్యులు
అనే తారతమ్యములు గలవు. 6) మోక్షమనగా పరమాత్మ స్వరూపానందమ్,
7) దానికి నిర్మల భక్తి ఏకైక మార్గము. 8) ప్రత్యక్ష, అనుమాన, ఆగమ
అనబడే మూడు ప్రమాణాలు 9) వేదార్థం శ్రీహరి మాత్రమే. ఈ శ్లోక
భావములోని తొమ్మిది అంశములు, ద్వైతములోని ఒక్కొక్క ప్రధానమైన
విషయాన్ని తెలియజేస్తుంది. వీటినే ద్వైతములోని నవరత్నాలన్నారు.
ఇందులో అద్వైతమునకు అన్నీ పూర్తి వ్యతిరేఖముగా ఉండగా, విశిష్టాద్వైతము
నకు కొంత వ్యతిరేఖత కలదు.

ప్రశ్న :- అద్వైతములో దేవున్ని పరబ్రహ్మ స్వరూపము అని నిరాకారమును
చెప్పగా విశిష్టాద్వైతములో పరబ్రహ్మమును సాకారమని చెప్పారు. ద్వైతులు
కూడా సాకారమునే చెప్పారు. ఈ విషయములో ద్వైతులు సాకారరూపమును
విష్ణువనియే చెప్పారు. విష్ణువు త్రిమూర్తులలో ఒకడని అతను కూడా
సృష్ఠింపబడిన వాడేనని మీరంటున్నారు. ద్వైతుల భావములో విష్ణువే
సర్వమును సృష్టించాడని అంటున్నారు. దీనికి మీరేమంటారు?

జవాబు :- విష్ణువు త్రిమూర్తులలో ఒకడని అందరికీ తెలుసు. విష్ణువుకు
ఒక నిర్ధిష్టరూపము, నిర్ధిష్టమైన పేరు కలదు. దేవుడు త్రైత సిద్ధాంతము
ప్రకారము ఎల్లప్పుడు నిరాకారుడే అయినా అప్పుడప్పుడు అవసరమును
బట్టి సాకారునిగా భూమిమీద శరీరముతో కనిపించుచుండును. త్రైత
సిద్ధాంతము, అద్వైతము ప్రకారము దేవుడు నిరాకారుడే అని చెప్పుచూ,
విశిష్టాద్వైతము ప్రకారము దేవుడు అప్పుడప్పుడు సాకారముగా కూడా
ఉండునని చెప్పవచ్చును. కొంత అద్వైత, కొంత విశిష్టాద్వైత సిద్ధాంతములను
సమర్థించినా దేవుడు పూర్తి నిరాకారుడనుటలో అద్వైతమును, పూర్తి
సాకారుడనుటలో విశిష్టాద్వైతమును దానికి అనుగుణముగా యున్న
ద్వైతమును త్రైతము వ్యతిరేఖించుచున్నది. ద్వైత సిద్ధాంతకర్తయిన
మధ్వాచార్యుల వారు మహవిష్ణువును దేవునిగా పోల్చి ఈ విధముగా
చెప్పుచున్నారు.

ద్వైతములో శ్రీమహావిష్ణువే సర్వోత్తముడు. సర్వోత్తమత్వాన్ని శ్రీ
మధ్వులు ఇలా నిర్వచించారు. “ఏకః సర్వోత్తమో జ్ఞేయః ఏక ఏవ
కరోతియత్:" దీని అర్థము ప్రకారము సర్వోత్తముడే స్వతంత్రముగా
కార్యాలను చేయగలవాడు, చేయించగలవాడు. ఆయన ఎవరిమీద ఈ
విషయములో అధారపడవలసిన అవసరము లేదు. ఆయన ఏ పనియైనా
చేయగలడు, చేసిన దానిని వెనక్కు మరల్చగలడు. అదే పనిని ఇంకొక
విధముగా చేయగలడు. సర్వోత్తముడు అంటే ఆ బ్రహ్మమే. ఆయనలోనే
అన్ని తత్త్వాలు ఇమిడియున్నాయి. ఆయనే అన్నిటికీ అతీతుడు. ఈ
విశ్వం ఆయన సృష్ఠి. ఆయన అభివ్యక్తి. ఆయన అనంత కళ్యాణ గుణ
సమన్వితుడు. అజ్ఞానాది దోషరహితుడు, ఆయన ఎనిమిది కార్యాలకు
అధిష్ఠాత. అవి 1) సృష్ఠి 2) స్థితి 3) లయం 4) నియమనము


5) జ్ఞానము ఇచ్చుట 6) అజ్ఞానమును కల్గించుట 7) బంధము 8) మోక్షము.
ఆయన అనగా విష్ణువు ఒక్కడే ఈ కార్యాలన్నిటినీ స్వతంత్రముగా నిర్వర్తించు
చున్నాడు.

శ్లో॥ స్వతంత్ర మస్వతంత్రంచ, ద్వివిధం తత్వముచ్యతే,
స్వతంత్రో భగవాన్విష్ణుః, నిర్దిషో శేష సద్గుణః

భావము :- “స్వతంత్రుడు శ్రీమహావిష్ణువు ఒక్కడే. ఆయనకు భిన్నమైనవన్నీ
అస్వతంత్రాలే. ఆయన దోష రహితుడు, కళ్యాణ గుణాకారుడు అని
సర్వదర్శన సంగ్రహంలో సాయన మాధవాచార్యులన్నారు”. అంతేకాక
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున 19వ శ్లోకమందు ఇలా అన్నారు
చూడండి.

శ్లో॥14-19
యోమామేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమమ్।
స సర్వ విద్భజతిమాం సర్వభావేన భారత॥

భావము :- ఓ అర్జునా జ్ఞానియైనవాడు ఈ విధముగా తత్త్వతః పురుషోత్తము
నిగా తెలుసుకొనును. శత్రువులు కూడా ఆయన పురుషోత్తముడని
కొనియాడారు. ఆయన శరీరము ప్రాకృత శరీరముకాదు. ఆయనలో
ప్రాకృత గుణములు లేవు. ఆయనలో ప్రాకృత (ప్రకృతి) సంబంధము
ఏదీలేదు. ఆపాద మస్తకం జ్ఞానానందకరమైన దివ్యశరీరము ఆయనకున్నది.
రూప, రస, గంథాలను గ్రహించే శక్తిగల ఇంద్రియాలున్నాయి. ఆయనలోని
కళ్యాణ గుణములు ఆయన దివ్యాత్మ స్వరూపముకంటే వేరుకావు. ఆయన
పరిపూర్ణులు. ఆయన అనేక అవతారాలను కూడా దాల్చాడు. ఈ విధముగా
మహా విష్ణువు పురుషోత్తముడని, ఆయన సాకార సగుణుడని నిరూపించి
శ్రీమధ్వులు విష్ణువే ఆరాధ్యుడని బోధించాడు.

ప్రశ్న :- విష్ణువును గురించి వారు చెప్పినది వాస్తవమేనా?
జవాబు :- ఎవరి భక్తి వారిది, వారు అలా చెప్పడములో తప్పులేదుగానీ,
దానిని మనము (వినేవారు) విచక్షణ కల్గి చూచుకోవలసియున్నది. దేవుడు
తన సృష్ఠిలో మనుషులను, దేవతలను రెండు రకముల వారిని సృష్టించాడు.
సృష్ఠించిన వాడు దేవుడు, సృష్ఠింపబడినవారు మనుషులు మరియు దేవతలు.
మనుషులు కనిపించే జాతికాగా, దేవతలు కనిపించని జాతిగాయున్నారు.
మనుషులలో అనేక రకములవారు, అనేక గుణములవారు, అనేక జ్ఞానము
గలవారున్నట్లు దేవతలలో కూడా అనేక తారతమ్యములు గలవు. దేవునికి
రూప, నామ, క్రియలు ఉండవు. అందువలన ఆయన పేరు విష్ణువు
కాదు, శివుడు కాదు. 'దేవుడు ప్రత్యేకమయిన శక్తి'. ఆయననే భగవద్గీతలో
'పురుషోత్తముడని' చెప్పారు. వాస్తవ జ్ఞానము ప్రకారము విష్ణువు దేవతలలో
మొదటివాడయి వుండవచ్చునుగానీ, దేవుడు కాదు. సృష్ఠికర్త అసలే
కాదు. మధ్వాచార్యుల వారు, ఆయనను అనుసరించిన వారు విష్ణువునే
గొప్పగా చెప్పినా అది వారి భావమేగానీ, ఆ భావము సత్యము కాదు.
యజమానికి పనివానికి ఎంత తేడా ఉండునో అంతతేడా దేవునికి,
దేవతలకు కలదు. విష్ణువు కూడా తన మోక్షము కొరకు దేవున్ని ధ్యానించు
చుండెను.

భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున చెప్పిన 19వ శ్లోకము
లోని భావము పురుషులలో ఉత్తముడయిన పరమాత్మను గురించి చెప్పినదే
గానీ విష్ణువును గురించి చెప్పలేదు. విశ్వములో విశ్వమంతటికీ ముగ్గురు
పురుషులే కలరు. ఆ ముగ్గురు పురుషులను “క్షరుడు, అక్షరుడు,
పురుషోత్తముడని” 16, 17 శ్లోకములలో చెప్పడము జరిగినది. సృష్ఠిలో

ప్రకృతి, పరమాత్మలు రెండే గలవు. ప్రకృతి ఐదు భాగములుగా విభజింప
బడినది. అట్లే పరమాత్మ మూడు భాగములుగా విభజింపబడినాడు.
ప్రకృతిలోని భాగము 1) ఆకాశము, 2) గాలి, 3) అగ్ని, 4) నీరు,
5) భూమి కాగా, పరమాత్మయొక్క మూడు భాగములు ఒకటి జీవాత్మ,
రెండు ఆత్మ, మూడు పరమాత్మయని పురుషోత్తమప్రాప్తి యోగమను
అధ్యాయములో 16, 17 శ్లోకములలో చెప్పడమైనది. 19వ శ్లోకమునకు
పైన ద్వైతులు చెప్పిన భావము పూర్తి తప్పు. ఆ శ్లోకములో చెప్పిన దానికి
వాళ్ళు వ్రాసిన వివరమునకు ఏమాత్రము సంబంధములేదు. దాని నిజమైన
భావము ఈ విధముగా కలదు చూడండి.

“ఎవడయితే నన్నే పురుషోత్తమునిగా తెలిసి అజ్ఞానమునంతటినీ
వదలి నన్నే ఆరాధించునో అట్టివాడు అన్ని భావముల నన్నే ఆరాధించిన
సర్వజ్ఞుడని చెప్పవచ్చును” అని అన్నాడు. అంతతప్ప ఆ శ్లోకములో వేరు
అర్థమే లేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగములోని 16, 17, 18, 19
శ్లోకములు అద్వైత సిద్ధాంతమునకుగానీ, విశిష్టాద్వైత సిద్ధాంతమునకుగానీ,
ద్వైత సిద్ధాంతమునకు సంబంధించినవిగానీ కాదని తెలియవలెను. శంకరా
చార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు ముగ్గురి సిద్ధాంతములకు
ఏమాత్రము సరిపోని భావములు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగములో
16, 17, 18, 19 శ్లోకములందు గలవు. 1) సృష్ఠి, 2) స్థితి, 3) లయ,
4) నియమనము 5) జ్ఞానము ఇచ్చుట, 6) అజ్ఞానమును కల్గించుట
7) బంధము, 8) మోక్షము అను ఎనిమిది దేవుడు అనబడు పరమాత్మ
ఆధీనములో ఉన్నాయిగానీ, దేవతలయిన త్రిమూర్తుల చేతిలో ఏమాత్రము
లేవు.

ప్రశ్న :- అయితే దేవతలలో శ్రేష్ఠుడు, మొదటివాడు అని పేరుగాంచిన
వాడు విష్ణువు కాదంటారా?

జవాబు :- దేవతలలో శ్రేష్ఠుడు, మొదటివాడు విష్ణువు అనడములో
తప్పులేదు. వాస్తవానికి దేవతలలో అత్యంత గొప్పవాడు విష్ణువేనని అనేక
పురాణములు, నాల్గు వేదములు చెప్పుచున్నవి. దానిని మేము కూడా
ఒప్పుకుంటాము. ఆయన సృష్టింపబడిన దేవతా గుంపులో గొప్పవాడే,
అయితే సృష్టికర్తయిన దేవుడు కాదని చెప్పుచున్నాము. దేవుడు వేరు
దేవతలు వేరని మరువకూడదు.

ప్రశ్న :- ఆచార్య త్రయమని పేరుగాంచిన శంకరాచార్యుల వారికి,
రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి దేవుడు వేరు దేవతలు
వేరని తెలియదా?

జవాబు :- తెలియకనే దేవున్ని వదలి దేవతలయిన వారిలో విష్ణువును
గొప్పగా చెప్పుకోవడము జరిగినది. శంకరాచార్యుల వారు నిరాకారాన్ని
బోధిస్తే, రామానుజ, మధ్వాచార్యుల వారు ఇద్దరు సగుణ, సాకారమైన
విష్ణువును గొప్పగా చెప్పడమైనది. ముగ్గురు ఆచార్యుల సిద్ధాంతములు
వేరయినా వారు ముగ్గురు వైదిక ఆచార్యులయిన దానివలన వారు
దేవున్ని తెలియక దేవతలనే తెలిసినవారై యున్నారు. వేదములను వ్యాసుడు
రచించగా ఆయనకు వేదవ్యాసుడని పేరువచ్చినది. అయితే వ్యాసుడు
వేదములను రచించినప్పటి భావము, ఆయన జీవిత చరమాంకములో
లేదని చెప్పవచ్చును. ఆ విషయము ప్రపంచమునకు ఏమాత్రము తెలియదు.
వ్యాసుడు అర్జునుని ద్వారా యుద్ధరంగములో సంభాషణ రూపములో
చెప్పబడిన ఐదు నిమిషముల సమాచారమును విని తాను అంతవరకు

జీవించిన 360 సంవత్సరముల జీవిత కాలము వృథా అనుకొన్నాడు.
ఐదు నిమిషముల గీతాసారమును బోధించిన వాడు ఎవరయినది వ్యాసుడు
గ్రహించగలిగాడు. అప్పుడు తాను రచించిన రచనలలోని తప్పు తనకు
తెలిసిపోయినది. తాను రచించిన 18 పురాణములలో విష్ణువును చెప్పగా
దానినే అందరూ అనుసరిస్తున్నారని అనుకొన్నాడు. అదే విధముగా వ్యాసుడు
ద్వాపరయుగము చివరిలో చనిపోగా, ఆయన రచనలను కలియుగములో
వచ్చిన ఆచార్య త్రయమయిన శంకర, రామానుజ, మధ్వాచార్యుల వారు
ఆధారము చేసుకొన్నారు. అందువలన రామానుజుల వారు, మధ్వులవారు
విష్ణువునే దేవుడని చెప్పారు.

ప్రశ్న :- శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతము ప్రకారము నిరాకారమునే
చెప్పాడు కదా! ఆయన సాకారమయిన విష్ణువును గురించి చెప్పలేదు
కదా! ఆయన దృష్ఠిలో దేవుడు ఎవరు?

జవాబు :- శంకరుడు పరిపక్వత చెందని వయస్సులో ఆర్యులు చెప్పమన్నది
చెప్పాడు తప్ప తాను స్వయముగా తెలిసి ఏదీ చెప్పలేదు. శంకరునికి
దాదాపు 27 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత వ్యాసుడు వ్రాసిన
భగవద్గీతను సంస్కృతములో చదువగలిగాడు. అప్పుడు నిజమైన దేవుడు
ఎవరయినది ఆయనకు అర్థమయినది. అంతవరకు తాను తెలిసో,
తెలియకో చెప్పిన అద్వైతము యొక్క నిజస్వరూపము తెలిసినది.
అద్వైతములోని సత్యము భగవద్గీత చదివిన తర్వాత తెలిసిన శంకరుడు
దేవుడు నిజముగా నిరాకారుడే అయినా అవసరమునుబట్టి అప్పుడప్పుడు
సాకారుడగునని తెలియగలిగాడు. అయితే ఆయన (శంకరుని) భావము
ఎవరికీ తెలియదు. తనకు తెలిసిన భావమును బయటికి చెప్పితే, అది

అప్పటివరకు తనను పెంచి, పోషించి, సిద్ధాంతకర్తగా ప్రచారము చేసిన
ఆర్యులకు సరిపోదని తెలిసి శంకరుడు తన భావమును బయట పెట్టలేదు.
శంకరుడు తన భావమును జరుగబోవు కాలములో బయట పెట్టగలడని
భావించిన ఆర్యులు శంకరుల ద్వారా ఏ విషయము బయటికి పొక్కకుండా
ఆయనను లేకుండా చేశారని కొందరనుకోవడము జరిగినది. శంకరుడు
మొదట దేవుడెవరయినది తెలియని పరిస్థితిలో యున్నా, చివరకు
అసలయిన పరమాత్మే దేవుడని తెలియగలిగాడు. అయితే ఆ విషయమును
బయటికి చెప్పలేకపోయాడు. ముగ్గురు ఆచార్యులు వేదములనే ఆశ్రయించి
ముందుకుపోయినా శంకరుడు జీవిత చివరి భాగములో అసలయిన
జ్ఞానమును, అసలయిన దేవున్ని గుర్తించగలిగాడు. మిగతా ఇద్దరు
ఆచార్యులకంటే ఒక విధముగా శంకరుడే సత్యమును తెలియగలిగాడని
చెప్పవచ్చును.

ప్రశ్న :- ఆర్యుల వలన శంకరాచార్యుల వారు ప్రమాదములో చిక్కుకొని
చనిపోవడము జరిగినది. రామానుజుల వారు కూడా చిన్నవయస్సులోనే
ఆర్యులు చేసిన హత్యాప్రయత్నమునుండి బయటపడినాడు. ప్రమాదమును
గురించిన సమాచారము తెలియకపోయివుంటే అతడు కూడా హత్య
కావింపబడేవాడే. ఆర్యులు తమకు అడ్డము వచ్చిన వారిని, తమ అద్వైత
సిద్ధాంతమునకు వ్యతిరేఖముగా బోధించిన వారిని మట్టుపెట్టాలని చూచారు.
అటువంటి ఆర్యుల మధ్య మధ్వాచార్యులు అద్వైతమునకు విరుద్ధముగా
యున్న ద్వైత సిద్ధాంతమును ఎలా బయటికి చెప్పాడు? ద్వైతమును చెప్పిన
మధ్వాచార్యుల వారిని ఆర్యులు ఏమీ చేయలేకపోయారా?

జవాబు :- మధ్వాచార్యుల వారు కర్నాటక రాష్ట్రములో 'ఉడిపి' దగ్గర

నివసించుచుండెను. మధ్వులు అప్పుడప్పుడు అద్వైతమునకు వ్యతిరేఖముగా
మాట్లాడుచుండెను. అయినా ఆయన వ్యతిరేఖత ఆర్యుల వరకు తెలియ
లేదు. మధ్వులు ఉడిపి ప్రాంతము కాకుండా మిగతా ప్రాంతములలో
ఎక్కడా ప్రచారము కాలేదు. శంకరాచార్యులు, రామానుజాచార్యులతో
పోల్చిచూస్తే వారు బయటి ప్రపంచమునకు తెలిసినట్లు మధ్వాచార్యులు
ఏమాత్రము బయటికి ప్రచారము కాలేదు. అందువలన మధ్వాచార్యుడు
ఎవడో ఆర్యులకు తెలియదు. అందువలన మధ్వులు అద్వైత వ్యతిరేఖులు
అను విషయము ఎవరికీ తెలియదు కావున ఆర్యుల వలన ఆయనకు
ముప్పులేకుండా పోయినది. మధ్వులు బయట ప్రపంచమునకు తెలియక
పోవడమే అతనికి రక్ష అయినది.

ప్రశ్న :- “బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య" అను శంకరాచార్యుల వారి మాటలో
ఎంతవరకు సత్యమున్నది?

జవాబు :- శంకరాచార్యుల వారు "బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య" అను
మాటను చెప్పినది వాస్తవమే అయినా, వాస్తవ జ్ఞానమేదో శంకరునికి
తెలియని స్థితిలో ఆ మాటను ఆయన చెప్పడమైనది. 27 సంవత్సరముల
వయస్సులో భగవద్గీతను చదువగల్గిన తర్వాత 'జగత్ మిథ్య' అనుమాట
సరియైనది కాదని తెలియగలిగాడు. అయితే ఆ విషయము శంకరుడు
బయటికి చెప్పకనే చనిపోయాడు. కనుక నేటికినీ అద్వైతమును చెప్పువారు
"బ్రహ్మసత్యం, జగత్ మిథ్య" అని అంటున్నారు. అయితే ఆ మాట పూర్తి
సత్యముకాదని వారికి తెలియదు. అందువలన అట్లే చెప్పుచున్నారు.

ప్రశ్న :- అద్వైతులు “ఓం నమఃశివాయ” అను మంత్రమును చెప్పుచూ
తమ దేవుడు నిరాకారమైనవాడని గుర్తుగా శివలింగమును చూపుచుందురు.

విశిష్టాద్వైతులు, ద్వైతులు తమ దేవుడు సాకారమైన విష్ణువని మూడు
నామములనే ధరించుచుందురు. అద్వైతులు విష్ణువునుగానీ, మూడు
నామములనుగానీ పూర్తి వ్యతిరేఖించుచుందురు. ద్వైతులు, విశిష్టాద్వైతులు
శివున్ని, విభూతి రేఖలను ఎంతవరకు వ్యతిరేఖిస్తారు?
జవాబు :- అద్వైతులు విశిష్టాద్వైతులు ఒకరి దేవున్ని మరొకరు పూర్తిగా
వ్యతిరేఖించుచుందురు. విష్ణువంటే అద్వైతులకు, శివుడంటే విశిష్టాద్వైతులకు
ఏమాత్రము సరిపోదు. అయితే విశిష్టాద్వైతులవలె మధ్వులకు శివుడంటే
వ్యతిరేఖ భావము లేదు. శివునకు భారతములో అపారమైన ఆదరణ
ఉన్న విషయము మధ్వులు గ్రహించారు. దీనికి తోడు మధ్వాచార్యులు
స్వయంగా షివల్లి శైవకుటుంబములో జన్మించాడు. దక్షిణ కన్నడ దేశములో
చంద్రమౌళీశ్వరుడుగా, అనంతేశ్వరుడుగా, శివుడు అనేక దేవాలయాలలో
ఆరాధింపబడడము శ్రీమధ్వుడు చూచాడు. అందుచేత ద్వైత సిద్ధాంతములో
శివునకు అత్యున్నత స్థానము కలదు. చతుర్ముఖ బ్రహ్మ, వాయుదేవుడు,
మిగతా దేవతలు శివుని తర్వాత వారే. అందుచేత శివునకు వ్యతిరేఖముగా
మధ్వుల ద్వైతములో ఎక్కడా, ఏ రచనలలోనూ లేదు. మధ్వులు వాయు
దేవుని పుత్రుడయిన హనుమంతున్ని, ప్రహ్లాదుని అవతారమైన రాఘవేంద్ర
స్వామిని ఎక్కువ ఆరాధిస్తారు. ఇప్పటికీ హనుమంతుని దేవాలయములలో
మధ్వులే అర్చకులుగా ఉంటారు.

ప్రశ్న :- 'సిద్ధాంతము' అంటే అది ఒక శాస్త్రములోని అంశముగా
ఉండవలెను. త్రిమతాచార్యులు ముగ్గురు వేదములనే ఆశ్రయించారు. ఒకరు
దేవుడు నిరాకారుడు అంటే మరొకరు 'కాదు సాకారుడు' అని అన్నారు.
అటువంటప్పుడు రెండుమాటలు సత్యము కావు కదా! అందులో ఏదో

ఒకటి మాత్రము సత్యముగాయుండి మిగతా మరొకటి అసత్యముకాగలదు.
ఏది అసత్యమయినా అది సిద్ధాంతముకానేరదు. శాస్త్రము అంటే సత్యము
అని, శాసనము అని చెప్పబడుచున్నది. అటువంటప్పుడు శాస్త్రములోని
ఏ సిద్ధాంతము అసత్యముగా ఉండదు. అద్వైత, విశిష్టాద్వైతములలో ఒకటి
మాత్రము సత్యమైనప్పుడు రెండవది సిద్ధాంతమే కాదు. ఇప్పుడు అద్వైత,
విశిష్టాద్వైతములలో ఎవరిది సిద్ధాంతము? ఎవరిది సిద్ధాంతము కాదు?
జవాబు :- నేడు హిందూమతములో గొప్పగా చెప్పుకొను సిద్ధాంతములు
అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత అనునవి కాగా మూడు శాస్త్రబద్ధమైనవి
కానందున అవి సిద్ధాంతములనబడవు. అద్వైతముగానీ, విశిష్టాద్వైతము
గానీ, ద్వైతముగానీ మూడు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిలేవు.
శాస్త్రములు భూమిమీద మొత్తము ఆరు గలవు. ఆరు శాస్త్రములలో కేవలము
ఒక్కటే బ్రహ్మ విద్యాశాస్త్రము గలదు. దైవమునకు సంబంధించిన దానిని
బ్రహ్మవిద్యా శాస్త్రము అంటాము. బ్రహ్మవిద్య అనగా 'పెద్ద విద్య' అని
అర్థము. ఒకటి దైవ విద్య అయిన బ్రహ్మవిద్యకు సంబంధించినది కాగా,
మిగతా ఐదు ప్రపంచమునకు సంబంధించినవిగా యున్నవి. దేవునికి
సంబంధించిన విషయమగుట వలన ముగ్గురు ఆచార్యులు చెప్పిన
సిద్ధాంతములు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవిగా ఉండవలెను.
అయితే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మూడు బ్రహ్మవిద్యకు
సంబంధము లేనివిగాయున్నవి. అందువలన ముగ్గురు ఆచార్యులు
ప్రతిపాదించినవి కేవలము ప్రతిపాదనలేగానీ అవి సిద్ధాంతములు కావు.
బ్రహ్మవిద్యాశాస్త్రమునకు ఈ మూడు సిద్ధాంతములకు ఎటువంటి
సంబంధము లేదు.

ప్రశ్న :- బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చూస్తే అవి సిద్ధాంతములు
కావని తెలియుచున్నదని మీరు అంటున్నారు కదా! మీరు దేనిని బ్రహ్మ
విద్యా శాస్త్రముగా లెక్కించుచున్నారు.

జవాబు :- దేవుడు స్వయముగా చెప్పినదే దైవసిద్ధాంతములతో కూడిన
దైవశాస్త్రమని చెప్పవచ్చును. దేవుడు అనబడువాడు సృష్ట్యాదిలోనే తన
ధర్మములను గురించి సంపూర్ణముగా చెప్పడము జరిగినది. అది దైవ
ధర్మములతో కూడుకొనియుండుట వలన దానినే బ్రహ్మవిద్యా శాస్త్రము
అని అంటున్నాము. సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపములో
వ్రాయబడలేదు. తర్వాత ద్వాపరయుగమున సృష్ట్యాదిలోని జ్ఞానమునే
కృష్ణుడు అర్జునునకు చెప్పగా వ్యాసుడు దానిని గ్రంథరూపముగా చేశాడు.
వ్యాసుడు వ్రాసిన బ్రహ్మవిద్యా శాస్త్రమే నేడు భగవద్గీతగా మనముందర
యున్నది. శాస్త్రము మన ముందరుండగా, దేనినయినా శాస్త్రముతో
పోల్చి చూడవచ్చును. అలా భగవద్గీతతో పోల్చి ముగ్గురి సిద్ధాంతములను
చూస్తే దేవుడు చెప్పిన ధర్మములకు అవి ఏమాత్రము సరిపోవు.
అందువలన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతములనబడునవి సిద్ధాంతములు
కావు. శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతము అనగా 'రెండు కానిది
మూడు' అని చెప్పితే అది సిద్ధాంతమగును. అయితే 'రెండుకానిది
ఒకటి' అని వెనక్కు చెప్పడము వలన అది సిద్ధాంతము నుండి
దిగజారిపోయినది. దేవుడు రూప, నామ, క్రియారహితుడు అన్న దైవ
ధర్మమునకు మిగతా రెండు విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములుండుట వలన
వాటిని సిద్దాంతము లనుటకు వీలులేదు. అట్లు చెప్పితే ఇంతవరకు
సిద్ధాంతకర్తలనుకొన్నవారు సిద్ధాంతకర్తలే కారు.

ప్రశ్న :- ఊరంతా ఉత్తరమంటే మీరు ఒక్కరు మాత్రము దక్షిణమంటున్నారు.
మీరు అలా చెప్పవచ్చునా?

జవాబు :- సత్యప్రకటన ఎంత చెడుగా కనిపించినా సత్యము కావాలను
కొన్నప్పుడు తప్పక చెప్పవలసి వస్తుంది. అసత్యమును చెప్పినా ఫరవాలేదు
చెప్పండి అంటే అందరివీ సిద్ధాంతములేనని చెప్పవచ్చును. ఇతరుల ముఖ
స్తుతికి మాట్లాడుటకు, ఇతరులకు నచ్చునట్లు చెప్పుటకు మాట్లాడేమాట
ఇతరులను బట్టియే ఉండును. అప్పుడు సత్యము మాట్లాడవచ్చును
అసత్యము మాట్లాడవచ్చును. ఉదాహరణకు చెప్పితే ఒక పెద్దమనిషి
ఒకరోజు రెండు సభలలో హాజరయి అక్కడున్న వారికి ఏదో కొంత చెప్పి
రావాలి. మొదటి సభకు ఉపన్యాసకుడుగా పోయాడు. అక్కడ
సభలోయున్నవారంతా ఒక జైలులో ఖైదీలుగాయున్నవారు. వారు అందరు
దొంగతనములు చేసి దొంగలుగా పట్టుపడి జైలులో శిక్షలు అనుభవిస్తూ
యున్నవారు. వారిముందర నిలబడి వారికి నచ్చినట్లు చెప్పాలి అంటే
ఒక రకము చెప్పాలి. వారికి నచ్చకపోయినా, వారందరికీ విరుద్ధమైనా
ఫరవాలేదు అనుకొంటే మరొక రకము చెప్పాలి. అక్కడున్న దొంగల
ముఖస్తుతికి, వారికి నచ్చినట్లు మాట్లాడుటకు అసత్యమును మాట్లాడాలి.
వారికి వ్యతిరేఖముగా చెప్పినా ఫరవాలేదు అనుకొంటే సత్యమునే
మాట్లాడాలి.

ఉపన్యాసకుడుగాయున్న అతను మొదటి సభలోని వారిని చూచి
వారు అందరూ దొంగలే అని తెలిసియుండుట వలన వారితో మంచిగా
మాట్లాడుటయే బాగుండునని నిర్ణయించుకొన్నాడు. అప్పుడు దొంగలకు
నచ్చినట్లే చెప్పుచూ, మనిషి జీవితములో దొంగతనము చేయుట అత్యంత

తెలివైన పని. మంచి తెలివియున్నవారే దొంగతనము చేయగలరు. వారి
తెలివినిబట్టి వారి దొంగతనములో మెలుకువలు తెలిసియుందురు.
అంతేకాక లోకములో అందరినీ సమానముగా చూచు జ్ఞానము కలవాడే
దొంగతనము చేయును. అటువంటివాడు 'ఇతని సొమ్మును తీసుకోకూడదు,
అతని సొమ్ముని తీసుకోవచ్చును' అను బేధము ఉండదు. అటువంటివానికి
అందరూ సమానమే. సుఖ దుఃఖములను సమానముగా చూచువాడు’
వాని సొమ్మును దొంగిలిస్తే వాడు బాధపడునే అని అనుకోడు. అటువంటి
వానికి ఎటువంటి బేధ గుణము ఉండదు. సమయానికి ఎవరి సొమ్ము
దొరికినా వాడు తీసుకొనును. ఎదుటి వాని బాధతోగానీ, ఎదుటివాని
కర్మనుగానీ లెక్క చేయనివాడు జ్ఞాని అనబడును. అందువలన 'ఇతరుల
బాధను లెక్కచేయక తన కర్తవ్యమును చేయువాడు దొంగ అయినా, దొర
అయినా ఒక్కటే' అని అజ్ఞానమును జ్ఞానమును కలిపి లేని అబద్దము
మాటలన్నిటిని చెప్పడము వలన అక్కడున్న వారి మనోభావములను
గౌరవించినట్టయినది. ఆ సభలోయున్న దొంగలందరికీ అతను చెప్పిన
మాటలు పూర్తి నచ్చాయి. అప్పుడు అక్కడున్న వారందరూ అతను బాగా
చెప్పాడని పొగడడము జరిగినది.

ఎవరి మనోభావములు వారికి మంచిగాయుండును. 'దొంగకు
దొంగచింత, వ్యభిచారికి వ్యభిచారము చింత' అన్నట్లు దొంగకు దొంగతనమే
మనోభావముగా ఉండును. అయితే వాని ముఖస్తుతికి అక్కడ దొంగతనమూ
మంచిదని చెప్పితే అసత్యమును చెప్పినట్లగును. సత్యమును దాచిపెట్టి
నట్లగును. అట్లుకాకుండా సత్యమునే చెప్పితే వాని మనోభావములను
దెబ్బతీసినట్లగును. వారి భావములను అగౌరవపరచినట్లుగును. శాస్త్రపద్ధతి
ప్రకారమైతే సత్యమును చెప్పవలసి యుండును. అశాస్త్రీయతను చెప్పితే,

అసత్యమును చెప్పినట్లగును. ఇప్పుడు ఉపన్యాసకుడు రెండవ సభలోనికి
పోయాడు. అక్కడందరూ నీతి నిజాయితీ కలవారుండుట వలన
సభలో నీతిని గురించి, జ్ఞానమును గురించి శాస్త్రబద్దముగా చెప్పడము
జరిగినది. చెప్పిన మాటలలో దొంగతనము, వ్యభిచారము ఇతరుల
దుఃఖముల మీద ఆధారపడియుండుట వలన ఆ పనులు చేయడము
వలన పాపము సంభవించును. పాపము వస్తే దాని కారణమున తర్వాత
జన్మలలో పాపమును దుఃఖరూపములో, కష్ట రూపములో, రోగరూపములో
అనుభవించవలసి వచ్చును. అందువలన అన్యాయము, అవినీతి పనులకు
మనిషి దూరముగా యుండవలెనని చెప్పాడు. ఇక్కడ చెప్పినది ఒకరకమైన
మాటలుకాగా, దొంగల సభలో చెప్పినది మరొక రకమైన మాటలు.
విధముగా మాట్లాడువానిని 'కపటుడు' అని అంటారు. ఇంకా అలా రెండు
రకముల మాట్లాడువానిని ఊసరవెల్లి అని కూడా అంటారు. ఒక పద్ధతి
లేని మనిషిగా చెప్పబడును. దేవుని లెక్కలో అతడు మంచివాడు కాడు.
అందువలన ఏమీ మాట్లాడవద్దు, మాట్లాడితే సాధ్యమున్నంత వరకు
సత్యమే చెప్పాలి అనునది పెద్దలమాట. పెద్దల మాటను అనుసరించి
సమాజమునకు మంచి చేయాలనుకొంటే తాను చెడ్డవానిగా కనిపించినా
ఫరవాలేదు, సమాజానికి మంచిని చేకూర్చు మాటలనే చెప్పాలి. “నిజము
నిష్ఠూరము, సత్యము లోకవిరుద్ధము” అను మాటలను లెక్కచేయక ఒక
నిజాయితీగా నేను నడుచుకొంటే నన్ను చూచి రేపు సమాజము కూడా
నిజాయితీగా నడువగలదను ఉద్దేశ్యముతోనే మాట్లాడు మాటగానీ, చేసే
పనిగానీ ఉండవలెనని కోరుకొంటున్నాను. అందువలన సిద్ధాంతకర్తల
విషయములో బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము చూస్తే ‘వారివి ప్రతిపాదనలే
గానీ, వాస్తవానికి సిద్ధాంతములు కావని చెప్పవచ్చును. నా మాటలోని

సత్యము తెలియనివారికి లోక విరుద్ధముగానే కనిపించినా 'సత్యమునే
చెప్పాలి' అను ఉద్దేశ్యముతోనే చెప్పుచున్నాను.

ప్రశ్న :- మీరు చెప్పునది మీకు సత్యమే అయినా, ఎదుటివారికి అసూయతో
చెప్పు మాటలుగా కనిపించుచుండవచ్చును కదా! అటువంటప్పుడు వారు
మిమ్ములను విమర్శించవచ్చును కదా! దానికి మీరేమంటారు?
జవాబు :- మేము ఎవరి తప్పులు ఎంచకుండా మాకు తెలిసిన
దైవజ్ఞానమును మేము చెప్పుచూ పోవునప్పుడు అద్వైత సిద్ధాంతమును,
ద్వైత సిద్ధాంతమును అనుసరించువారు మా భక్తులను ఎంతోకాలముగా
వేధించడము, దాడులు చేయడము చేయుచున్నారు. మేము మా సిద్ధాంత
భగవద్గీతను ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేయుచుయుంటే సంతోషపడవలసి
నది పోయి అసూయతో చూస్తున్నారు. బౌద్ధులను, జైనులను, సిక్కులను
హిందూమతమునుండి విడదీసి, వారు వేరు మతము వారని చెప్పిన
సూత్రమునే ఉపయోగించి హిందూమతములోనే అసలయిన సిద్ధాంతముగా
యున్న త్రైత సిద్ధాంతమును హిందూ మత సిద్ధాంతమే కాదనుచూ, పర
మతమని పేరుపెట్టి దూషించడమే కాకుండా, భౌతికదాడులు కూడా చేయు
చున్నారు. అన్నిటికంటే సులభమయిన ఆరోపణ పరమత ప్రచారమని
పేరుపెట్టి నిందించడము, దాడి చేయడము నేడు హిందువులలో యున్న
కొందరు అజ్ఞానులకు సులభమయిపోయినది. ఏమాత్రము ఆత్మజ్ఞానము
గానీ, భగవద్గీత జ్ఞానముగానీ తెలియనివారు ఆర్యుల మోచేతి క్రింద నీరు
త్రాగువారు, తాము హిందూమతమును ఉద్ధరించు హిందూమత రక్షకులమని
పేరు పెట్టుకొన్నవారు, మేము చెప్పు జ్ఞానమును ఏమాత్రము వినకుండా,
చదువకుండా, అటువంటి ప్రయత్నము కూడా చేయకుండా తనకు
అవసరము లేకున్నా తనకు గుర్తింపుకొరకు మా జ్ఞానమును

వ్యతిరేఖించడము, నేడు ఇంటింటికీ తిరిగి ప్రచారము చేయుచున్న మా
భక్తులను తన్ని తరిమేయడమే పనిగా పెట్టుకొన్నారు.

భగవద్గీత ప్రచారం చేస్తుంటే దాడి చేశారు.

కోవూరు, జనవరి 1, 2016 ప్రభాతవార్త.
కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణ మందిరం
హిందూ జ్ఞానవేధిక సభ్యులు భగవద్గీతపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే ఆ
ప్రాంతానికి చెందినే అశోక్, అతని అనుచరులు తమపై దాడి చేశారంటూ జ్ఞా
నవేధిక సభ్యులు వెంకటసుబ్బయ్య, క్రిష్ణ, సుబ్బానాయుడు తదితరులు కోవూరు
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము ఇనమడుగు గ్రామంలో శుక్రవారం
ఇంటింటికీ వెళ్లి భగవద్గీపై ప్రజలకు వివరిస్తుంటే అశోక్ అతని అనుచరులు తమను
ఆకారణంగా తూలనాడడమే కాకుండా దాడి చేయడం.. తమ వాహనాన్ని పెట్రోల్
పోసి తగలబెడుతామని బెదిరించారన్నారు. భగవద్గీత పుస్తకాలను లాక్కొని విసిరి
వేశారన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్ఐను వేడుకున్నారు.

అటువంటి అజ్ఞానుల వెనుక ముఖ్యముగా ఆర్యుల గాలితో
నింపబడిన వారున్నారని మాకు అర్థమయినది. మేము ఈ గ్రంథమును
వ్రాయుచున్నప్పుడే మేము చెప్పునది సత్యమని అందరికీ తెలియు సంఘటన
జరిగినది. నేడు క్రీ.శ. 2016వ సంవత్సరము యొక్క మొదటి దినము
అనగా జనవరి ఒకటవ తేదీ. ఇప్పుడు జనవరి ఒకటవ తేదీ
సాయంకాలము ఆరు గంటలప్పుడు ప్రస్తుత విషయమును వ్రాయు
చున్నాము. ఇదే రోజు ఉదయము దాదాపు పదకొండు లేక పన్నెండు
గంటల సమయములో నెల్లూరు దగ్గర నెల్లూరుకు కేవలము ఐదు కిలోమీటర్ల
దూరములో యున్న ఇనమడుగు అను ఊరిలో భగవద్గీతను మరియు

మేము వ్రాసిన మిగతా ఆధ్యాత్మిక సంబంధమైన 73 గ్రంథములను గురించి
చెప్పుచూ హిందూ మతము యొక్క ఔన్నత్యమును కాపాడుటకు
ప్రయత్నించుచుండగా, నేను హిందూ రక్షక సంస్థలో పని చేయుచున్నానని
చెప్పుకొను వ్యక్తి, ఇది పరమత ప్రచారమని ఆరోపించి అక్కడున్న వారిని
కూడా ప్రేరేపించి మా ప్రచారకులను నలుగురిని కొట్టడము జరిగినది.
ఇప్పటికి ఇది పదవ దాడికాగా, దూషించి పంపినవి పదుల సంఖ్యలో
యున్నాయి. ఇవన్నియూ ఒక హిందూరక్షకులమను వారు మాత్రమే
చేయుచున్నారు. ఒకటి లేక రెండు గ్రంథములు చదివిన వారు ఎంతో
గొప్ప జ్ఞానమని పొగడుచూ మిగతా గ్రంథములను కూడా తీసుకొని
చదువుచున్నారు. ఈ మధ్య కాలములో మా జ్ఞానము అత్యంత వేగముగా
ప్రచారము కాజొచ్చినది.

మా గ్రంథములు చదివిన వారందరూ ఎంతో సంతోషపడుచూ
ఇంతవరకు హిందూమతములో తెలియని జ్ఞానము నేడు తెలిసినదని
ఎందరో హిందువులు సంతోషపడుచుండగా అది చూచి ఓర్వలేని ఆర్య
సాంప్రదాయములలో మునిగి తేలుచున్న 'హిందూ రక్షణ' అని పేరు
పెట్టుకొన్నవారు ఏమాత్రము ఆలోచించకుండా, ఏమాత్రము మా
గ్రంథములను చదువకుండా, మేము చెప్పు బోధలను వినకుండా కేవలము
అసూయతో మాట్లాడడము, దాడులు చేయడము జరుగుచున్నది.
ఇదంతయూ చూచిన మేము నేడు వారికి తెలియకుండానే ఆర్యుల
ఉచ్చులో చిక్కుకొని, హిందూమతమును ఉద్ధరించువారమని చెప్పుకొను
మూర్ఖ హిందువులకు, నిజమైన హిందూజ్ఞానము తెలియుటకు, మేము
సిద్ధాంతకర్తల యొక్క విషయమును బయటపెట్టి మాట్లాడుచున్నాము.
హిందువుల వ్రేలితో హిందువుల కన్నుపొడుచు ఆర్యుల ఆంతరంగిక

కుట్రలను బయట పెట్టుచున్నాము. పూర్వమునుండి ఎంతో తెలివిని
ఉపయోగించిన ఆర్యులు ద్రావిడులలో కూడా తమ భావమును, తమ
జ్ఞానమును నింపి, తమ సాంప్రదాయములే నిజమైన జ్ఞానమన్నట్లు చేసి,
భవిష్యత్తులో వారికి వ్యతిరేఖులు రాకుండా ఒక ఫతకము ప్రకారము,
'హిందూ రక్షణ' అను పేరును ముందు పెట్టి తమ మతమును కాపాడు
కొనుటకు పరమతము వారిని తరిమివేయాలను ఉద్దేశ్యమును హిందూ
రక్షణ సంస్థలలో నింపి తమకు వ్యతిరేఖముగాయున్న హిందువులను
పరమతమను ఆరోపణతో వేధించను, హింసించను మొదలుపెట్టారు.
కనిపించని ఆర్యుల వ్యూహములో చిక్కుకొన్న హిందూమత అభిమానులు
ఆర్యులచేతిలో కీలుబొమ్మలై, వారి వెనుక నడిచే బకరాలై (గొర్రెలై) మనము
ఏమి చేయుచున్నామను ఆలోచన లేకుండా తమతోటి హిందువులను
మీరు హిందువులు కాదంటున్నారు. ఇది పూర్వమునుండి ఆర్యులు అమలు
చేయు ఫతకమని వారికి తెలియదు. ఎవరో ఎక్కడో క్రైస్తవునిగానో,
ముస్లీమ్లోనో మతము మారితే దానిని భూతద్దములో చూపి "హిందూ
మతమంతయు క్షీణించి పోవుచున్నది” అని గొంతు చించుకొను హిందూ
సంస్థలకు హిందువులే అయిన బౌద్ధులను, జైనులను, సిక్కులను 70 లేక
80 కోట్లమందిని హిందువులు కాదని పరమతముగా చిత్రించిన రోజు
హిందూమతము క్షీణించినదని తెలియలేదా?

మూడు యుగములనుండి ఇందువులు (హిందువులు) 'శాంతి
కాములు” అని పేరుగాంచియుండగా, కలియుగములో ఆర్యుల కనిపించని
ఆగడాల వలన హిందువులు దౌర్జన్యముగా ప్రవర్తించువారను చెడ్డపేరు
వచ్చినది. నేడు జరుగుచున్న సంఘటనలనుబట్టి హిందువులయిన మేము
కూడా అదేమాటను అనవలసి వచ్చినది. ఇప్పటినుండి మా జోలికి

వచ్చినవారిని సులభముగా వదలిపెట్టమని మేము గొప్ప జ్ఞానులుగా
నిరూపించుకుంటామని చెప్పుచున్నాము. మమ్ములను గురించి మీకేమయినా
తెలియకపోతే మీరు మమ్ములను సంప్రదించి ప్రశ్నించవచ్చును. దానికి
కావలసిన వివరణ మేము ఇవ్వగలము. అట్లుకాకుండా మేము చెప్పునది
ఏమాత్రము వినకుండా దౌర్జన్యము చేస్తే, మేము కూడా మా రక్షణ నిమిత్తము
ప్రతిఘటించవలసి వస్తుంది.

మాకు ఎన్నో ఆటంకములు కల్గినా ఎంతో ఓర్పుగా ఇంత
కాలమున్నాము. ఇంతవరకు డెబ్బయి (73) గ్రంథములను వ్రాశాము.
కొన్ని గ్రంథములలో హిందువులే మా మీద చేయు అరాచకములను
వ్రాశాము. అయినా హిందువులలో హిందూధర్మములు తెలియనివారు
హిందూరక్షకులుగా యుండుటవలన ఎవరు మంచి చేయుచున్నారో, ఎవరు
చెడు చేయుచున్నారో తెలియనివారు ఆర్యుల ఆధీనములోయుండి గొర్రెలవలె
ఎటు తోలితే అటుపోతున్నారు. నేడు హిందూ రక్షకులమను వారిలో
ఎవరికీ హిందూ ధర్మములంటే ఏమిటో తెలియదు. అటువంటి వారిని
ఆసరాగా చేసుకొని ఆర్యులు మొదటినుండి చేయు పన్నాగమునే
చేయుచున్నారు. శంకరాచార్యులను చిన్నవయస్సులోనే పొట్టన పెట్టు
కొన్నారు. అదే శంకరాచార్యుని పేరుతో నేడు కూడా హిందూ మతములో
వెనుకనుండి పెత్తనము చేయుచున్నారు. తమను మొదటి నుండి వ్యతిరేఖించు
రామానుజాచార్యులను చంపాలని చూచారు. అది విఫలమైనది. అది
జరిగియుంటే ముగ్గురు సిద్ధాంతకర్తలలో ఇద్దరిని వారే మ్రింగివేసినట్లయి
వుండేది. ద్వైతమును చెప్పిన మధ్వుడు ప్రచారములో లేడు కావున
బ్రతికిపోయాడు. నేడు ఆర్యుల అద్వైతమునకు పూర్తి వ్యతిరేఖముగా యున్న
త్రైతసిద్ధాంతము వలన నిజమైన జ్ఞానము ప్రజలకు తెలిసిపోయి తమ

ఉనికే లేకుండా పోగలదని తలచిన ఆర్యులు మా ఎడల ఎంతో అసూయ,
ఆవేశము కల్గియున్నారు. దాని ఫలితమే నేడు మా మీద జరుగు
అరాచకములని తెలియుచున్నది. వారు అంత చేస్తే తప్పుగానిది మేము
ఆర్యులను గురించి వారి చరిత్రను గురించి వ్రాస్తే తప్పగునా? దేవుడు
భగవంతునిగా వచ్చి చెప్పిన భగవద్గీతా జ్ఞానమును బ్రహ్మవిద్యా శాస్త్రబద్దమైన
భగవద్గీతను మేము బోధించుచున్నాము. భగవద్గీతా జ్ఞానములో ద్వైత,
అద్వైతములు రెండూ కొట్టుకుపోవుచున్నవి. మేము చెప్పు సిద్ధాంతము
భగవద్గీతలో బలముగా యున్నదని అందరికీ తెలియుచున్నది. మా దృష్ఠి
అంతయూ అసలయిన దైవజ్ఞానమును ప్రజలకు తెల్పడమే. మేము మా
జ్ఞాన ప్రచారములో ఇతర మతముల వలన కొంత ఇబ్బందులను
ఎదుర్కొంటున్నాము. అయినా వారు సంప్రదింపుల ద్వారా సత్యమును
తెలుసుకొని తటస్థముగా ఉండిపోతున్నారు. అయితే హిందువులలో
కొందరు మాత్రము పూర్తి మమ్ము వ్యతిరేఖించుచున్నారు. వారు
సంప్రదింపులు జరుపరు, మా మనోభావమును తెలియరు. అందువలన
మేము ఎదురు దాడిగా మిగతా సిద్దాంతములను ముఖ్యముగా ఆర్యులను
విమర్శించవలసి వచ్చినది.

ప్రశ్న :- మీరు 73 గ్రంథములను వ్రాశారా?
జవాబు :- అవును వ్రాశాము. ఇంకా వ్రాయబోతాము. దాదాపు వంద
గ్రంథముల వరకు మా రచనలు ఆగవు.

ప్రశ్న :- హిందువులలోనే వ్యతిరేఖత యున్నదని మీరు చెప్పుచున్నారు.
కదా! అటువంటప్పుడు మీ రచనలకు సమాజములో ఆదరణ యున్నదా?
జవాబు :- మాకు హిందువులందరూ వ్యతిరేఖులు కారు. తమకు

తెలియకుండానే ఆర్యుల ఉచ్చులో తగులుకొని హిందూ సంస్థలలో ఏదో
ఒక స్థానములోయున్న కొందరు హిందువులు వారి ఉనికిని బయటికి
తెలియునట్లు మమ్ములను గురించి మాట్లాడడము మరియు ఇబ్బంది
పెట్టడము జరుగుచున్నది. అదియూ హిందూ రక్షణ సంస్థలలో పనిచేయు
వారు మాత్రమే మాకు వ్యతిరేఖము కావున హిందువులందరిలో పది
శాతము మందికి మేము, మా జ్ఞానము సరిపోకపోవచ్చును. మిగతా 90
శాతము మందికి మా జ్ఞానము గొప్పగా కనిపించుచున్నది. అందువలన
మా గ్రంథములకు మంచి ఆదరణ గలదు. మా గ్రంథములలో ఏ ఒక్క
గ్రంథము చదివినవారయినా తప్పక మిగతా గ్రంథములను చదువాలని
ప్రయత్నము చేసి చదువడము జరుగుచున్నది. అలా చదివిన వారిలో 25
శాతము మంది మా గ్రంథములను గురించి ఇతరులకు చెప్పి వారిచేత
కూడా చదివించుచున్నారు. ఈ విధముగా మా గ్రంథములకు ప్రజలలో
ఎక్కువ ఆదరణ కలదు. పోతులూరు వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
దాదాపు నాలుగు వందల సంవత్సరముల క్రిందటే "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది" అని వ్రాసియున్నారు. అంతేకాక
"ప్రబోధాశ్రమము యొక్క జ్ఞానము నందన నామ సంవత్సరము నుండి బాగా
ప్రచారమవుతుందని" చెప్పియున్నారు. ఆయన మాట ప్రకారమే ఈ మధ్య
నాలుగు సంవత్సరములనుండి మా జ్ఞానము చాలా వేగముగా ప్రాకి
పోయినది. శంకరాచార్యుని అద్వైతముగానీ, మధ్వాచార్యుల ద్వైతముగానీ,
రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతముగానీ ప్రచారమయిన దానికంటే
రెండింతల వేగముగా ప్రజలలోనికి ప్రాకిపోయినది.


ప్రశ్న :- దాదాపు నాలుగు వందల సంవత్సరములప్పుడున్న వీరబ్రహ్మము
గారు మీ జ్ఞానమును గురించి ఎందుకు వ్రాశారు?

జవాబు :- ఈ ప్రశ్న వీరబ్రహ్మముగారినే అడుగవలసి యుంటుంది. అయితే
మేము చెప్పునది "సాంద్రసింధు జ్ఞానమని” చెప్పడమే కాకుండా చాలా
విషయములను ముందస్తు సమాచారముగా తెలియజేశాడు.

ప్రశ్న :- మీరు "డెబ్బయి (73) గ్రంథములను వ్రాశాము” అని చెప్పారు.
మీ జ్ఞానములో ముఖ్యమైన సిద్ధాంతమేది, అద్వైతమా, విశిష్టాద్వైతమా?
లేక ద్వైతమా?

జవాబు :- మీరు అడిగే ప్రశ్న ఎలాగుందంటే, “నీవు రారాజయిన చక్రవర్తివే
గానీ నీవు అడుక్కుతిన్నది చిప్పలోనా, బోకిలోనా, ఆకులోనా? అని
అడిగినట్లున్నది. రారాజుకు అడుక్కుతినే అవసరము లేదు. అదియూ
చిప్పలోనా, బోకిలోనా, ఆకులోనా అని అడగడము మరీ విచిత్రముగా
యున్నది. అంతేకాక రామాయణమంతా విన్న తర్వాత సీతకు రాముడు
ఏమవుతాడు? అని ప్రశ్నించినట్లు మేము అద్వైతముకంటే, విశిష్టాద్వైతము
కంటే, ద్వైతముకంటే భిన్నముగా త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నామని
దానివలననే హిందూమతములో క్రొత్త సిద్ధాంతమును ఆర్యులు
వ్యతిరేఖిస్తున్నారని, వారి ప్రేరణతో కొందరు హిందువులు మా భక్తులమీద
దాడులు చేయడము వరకు వచ్చినదని ఇంతకుముందే చెప్పాము కదా!

ప్రశ్న :- అయితే మీరు హిందూమతములో నాల్గవ సిద్ధాంతకర్తలా?
జవాబు :- ఇందులో మీకేమయినా అనుమానమున్నదా? దక్షిణ భారత
దేశము కృతయుగములోగానీ, త్రేతాయుగములోగానీ ఆత్మజ్ఞానులలో
మంచిపేరుగాంచిన ప్రాంతము. దక్షిణ దేశము త్రేతాయుగములో నేడు
కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రములుగా యున్న నాలుగు
ప్రాంతములు రావణబ్రహ్మ పాలనలో యుండేవి. రావణబ్రహ్మ

వారసత్వముగా, ఈ నాలుగు రాష్ట్రములలో జ్ఞానము ప్రజ్వరిల్లగలదని
కాలములోనే (త్రైతాయుగములోనే) కొందరు జ్ఞానులు అనుకొనెడివారు.
వారి అంచనా అప్పుడు నెరవేరలేదుగానీ, కలియుగములో నెరవేరినదని
చెప్పవచ్చును. కలియుగములోనే చివరి కేరళ రాష్ట్రములో మొదట అద్వైత
సిద్ధాంతకర్తగా పేరు పొందిన ఆదిశంకరాచార్యుల వారు జన్మించగా, రెండవ
సిద్ధాంతకర్తయిన రామానుజాచార్యుల వారు తమిళనాడు రాష్ట్రములో
జన్మించగా, మూడవ సిద్ధాంతకర్తయిన ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు
కర్నాటక రాష్ట్రమందు జన్మించెను. ఇక నాలుగు రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రము చివరిగా మిగిలియుండగా, ఆ ప్రాంతములో కూడా ఒక సిద్ధాంతకర్త
పుట్టడము జరిగినది. ఆ సిద్ధాంతమే "త్రైత సిద్ధాంతము”.

త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన సిద్ధాంతకర్త పేరు ఆచార్య
ప్రబోధానందయోగీశ్వరులు. అయితే కలియుగములో ముందు పుట్టిన
ముగ్గురు ఆచార్యులు బ్రాహ్మణ కులజులు కాగా, ప్రబోధానంద యోగ్వీరులు
మాత్రము బ్రాహ్మణ కులమునకు చెందినవాడు కాదు. అలా పుట్టడము
వలన వారందరిదీ ఒక దారియైతే ప్రబోధానందది మాత్రము మరియొక
దారి అన్నట్లున్నది. అంటే ఆ మూడు దారులకంటే విభిన్నమైన దారియని
అర్థము. ఆంధ్రప్రదేశ్లో ప్రబోధానంద స్వామి అనబడే వ్యక్తి పుట్టడములో
కూడా గమనించితే కొంత ప్రత్యేకత గలదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన
పుట్టిన ప్రాంతమునకు ప్రత్యేకమయిన పేరు కలదు. ఆ పేరు “రాయలసీమ”
'సీమ' అంటే ప్రాంతమని అర్థము. 'రాయల' అనగా 'నాశనము లేనిదని’
అర్థము. 'రామ' అను పదమునుండి “రాయ” అను పదము పుట్టినది.
రామ అనగా 'నాశనము లేనిదని' అర్థము. రాయల సీమ ప్రాంతములోనే
యోగీశ్వరులు పుట్టడము జరిగినది. రాయల సీమలో పుట్టిన వారు పేరుకు
తగినట్లు నాశనములేని బోధనే బోధించగలడని చెప్పకనే తెలియుచున్నది.

ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు అంటే మీరే కదా?

జవాబు :- నీవు అలా అనుకుంటావనే ఈ గ్రంథము ప్రారంభములోనే
అన్నీ చేయునది ఆత్మేనని ముందే చెప్పాను. ప్రబోధానంద యోగీశ్వరులు
అని మీ భావములో మీరు అనుకొంటే నీది సరియైన భావము అవునో
కాదో? జీవాత్మగాయున్న ఒక వ్యక్తి అని మీరు అనుకొంటే, ఆ జీవుడు
నేను లోపల చిక్కుకొని కదలలేక కట్టివేయబడిన కుక్కవలెయున్నాను.
బయట 'నేను లేను' అని అనగలడు. దానితో నీ అంచనా తప్పగును.
లోపలయుండే వాడేనని అనుకొనినా, లోపల వానిది (జీవునిది) ఏమీ లేదు.
వాడు ఏమీ లేనివాడు, అంతా నేనే గలను, అంతా నేనే చేయగలనని
అనువాడు గలడు. అందువలన ఎటూ పోల్చుకోలేని స్థితిలో మనిషి
యున్నాడు. నేను ఇప్పుడు మనిషే అయినా, నాకు తెలిసినది నేను
చెప్పగలను విను. యోగీశ్వరులు 'రాయలసీమ' అను ప్రత్యేక ప్రాంతములో
పుట్టి నాశనము లేని బోధను చెప్పగలవాడినని ప్రకటించుకొన్నాడు.
అంతేకాక ఆయన పుట్టిన ఊరు పేరు “అనంతపురము”. 'పురము” అనగా
పౌరులు నివశించునదని అర్థము. తర్వాత 'అనంత' అనగా 'అంతము
లేనిదనీ, ఎల్లలు లేనిదనీ' చెప్పవచ్చును. అనంతమైన వానిని గురించి
అనంతమైన బోధను చెప్పువాడను విషయము తెలియునట్లు ప్రబోధానంద
యోగీశ్వరులు అనంత.... పురములోనే పుట్టడము జరిగినది. రాయల
సీమలో, అనంతపురములో పుట్టిన యోగీశ్వరుల పేరులో కూడా ప్రత్యేకత
కలదు. పుట్టినవాడు అన్నిటికంటే పెద్దవాడు అనునట్లు యోగీశ్వరుల
వారి పేరు “పెద్దన్న” అని పిలువబడినది. పెద్ద+అన్న= పెద్దన్న యగును.
ప్రాంతము రాయలు, పట్టణము అనంత అయినట్లు అన్నలలో 'పెద్ద' అని
ప్రత్యేకత కల్గిన పేరుంచబడినది. కొంత ఆలోచించువారికి ఎంతో కొంత


అర్థము కాగలదు. ఇంతకుముందు పుట్టిన సిద్ధాంతకర్తలలో ఎవరికీ
ఇటువంటి విశేషత దక్కలేదు. అందువలన యోగీశ్వరుల యొక్క విలువను
తెలిసి ఆయన ద్వారా సత్యమైన జ్ఞానమును, శాస్త్రబద్ధమైన జ్ఞానమును,
అనుభవానికి వచ్చే జ్ఞానమును, ప్రతి ప్రశ్నకు జవాబుగల జ్ఞానమును
తెలియవచ్చును.

ప్రశ్న :- మీరు చెప్పేది కొంత అర్థమయినట్లున్నది, అయినా ఏమీ అర్థము
కాలేదు. ఇప్పుడు మిమ్ములను ఏమనుకోవాలి?

జవాబు :- ప్రపంచ విషయములో అందరితో సమాన మనిషిననే
అనుకోవాలి. ఒక్క దైవ విషయములో మాత్రము సాధారణ మనిషిగా
అనుకోకుండా అసాధారణ మనిషిగా లెక్కించవలెను. చెప్పెడి జ్ఞానమంతా
సత్యమైనదని తెలియవలెను. అలా గొప్ప జ్ఞానము తెలియబడుట చేత
మా జ్ఞానము విన్న ప్రతి ఒక్కరూ ముక్తిని పొందగలరు. మాయను
జయించి జ్ఞానమార్గములో ముందుకు పోగలరు. మమ్ములను అసూయతో
చూచువారికి ఏమి గతిపట్టునో వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసియుంచారు. అందువలన ప్రపంచ విషయములో మీకంటే తక్కువ
వానిగా తలచినా ఫరవాలేదు. దైవజ్ఞాన విషయములో తప్పనిసరిగా
గొప్పగనే భావించవలెనని తెలుపుచున్నాము.

ప్రశ్న :- అద్వైత సిద్ధాంతమును తెల్పిన ఆదిశంకరాచార్యుల వారు,
విశిష్టాద్వైతమును తెల్పిన రామానుజులవారు, ద్వైతమును తెల్పిన
మధ్వాచార్యుల వారు ముగ్గురు మూడు దక్షిణ రాష్ట్రములలో పుట్టగా,
ముగ్గురు బ్రాహ్మణ కులమునకు చెందినవారుగా యుండెడివారు. ముగ్గురు
ఒకే కులమునకు చెందినవారయినా ముగ్గురిది మూడు రకముల జ్ఞానమయి

నందున శంకరుని తర్వాత వచ్చిన రామానుజుల వారు శంకరులను
విమర్శించి శంకరులు చెప్పిన దైవము నిర్గుణము, నిరాకారము కాదని
తన విశిష్టాద్వైత సిద్ధాంతము ప్రకారము సగుణము సాకారము అని చెప్పినట్లు
కలదు. అయితే తర్వాత వచ్చిన మధ్వాచార్యుల వారు శంకరుని
అద్వైతమును, రామానుజుని విశిష్టాద్వైతమును రెండిటినీ విమర్శించి
మాట్లాడడము జరిగినది. వచ్చిపోయిన వారిని ఎవరయినా విమర్శించగలరు
గానీ, రాబోయే వానిని గురించి ఎవరూ విమర్శించలేరు. ముందు
వచ్చిపోయిన వానిని జ్ఞానము తెలిసినవాడుగానీ, తెలియనివాడు గానీ
విమర్శించుట సులభము. రామానుజులవారు శంకరున్ని, మధ్వాచార్యుల
వారు రామానుజులను విమర్శించినట్లు మీరు కూడా మధ్వాచార్యుల వారిని
విమర్శించగలరా?

జవాబు :- నేను అనవసరముగా విమర్శించుటకు రాలేదు. శాస్త్రబద్దమైన
జ్ఞానమును తెల్పుట, శాస్త్రబద్దముకాని జ్ఞానమును ఖండించుట మాత్రమే
నా పని. అంతేగానీ ముందు వచ్చిన వారిని విమర్శించడము నా పని
కాదు. నేను ముగ్గురు ఆచార్యులకంటే వెనుకవచ్చిన వాడిని. అందువలన
ముగ్గురు ఆచార్యులు నన్ను విమర్శించుటకు అవకాశము లేదు. అయితే
నాకంటే ముందువచ్చిన ముగ్గురు ఆచార్యుల తప్పు ఒప్పులను గురించి
చెప్పు అవకాశము గలదు. అసూయా గుణముతో ఎంతో గొప్ప వానిని,
ఎంత చిన్నవాడయినా విమర్శించి మాట్లాడవచ్చును.

మేము తప్పులను తప్పులుగా, ఒప్పులను ఒప్పులుగా గ్రహించ
గలము. కావున మేము మంచిని మంచిగానే, చెడును చెడుగానే
చెప్పగలము. అనవసరముగా చెడును మంచిగాగానీ, మంచిని చెడుగాగానీ

చెప్పే అవసరము మాకు లేదు. నేను ఆదిశంకరాచార్యుల వారిని ఎప్పుడూ
అనవసరముగా విమర్శించలేదు. మొదటినుండి శంకరుని మీద ఎంతో
సానుభూతితో మాట్లాడుచున్నాను. "ఆర్యులు చేసిన కుట్రకు ఆయన
బలియైపోయాడు” అని చెప్పాము. అద్వైతమును ఎటు చూచినా శాస్త్రబద్దము
కాదు. అయినా శంకరుడు దానికి బాధ్యుడు కాడనియే చెప్పాము. అద్వైత
సిద్ధాంతము ఆర్యులదికాగా బినామీగా శంకరున్ని ఆర్యులు చూపడము
జరిగినది. కొంతవయస్సు వచ్చి వ్యక్తిత్వము ఏర్పడిన తర్వాత శంకరుడు
క్రమేపీ ఆర్యుల కుట్రను గ్రహించగలిగాడు. ఆర్యులు ఎంతో తెలివైనవారు,
తమ ఆలోచనను నిశ్శబ్దముగా ఎవరికీ తెలియనట్లు ద్రావిడ బ్రాహ్మణుడయిన
శంకరుని ద్వారా నెరవేర్చగలిగారు. భవిష్యత్తులో ద్రావిడ బ్రాహ్మణులు
ఎవరూ ఆర్యులను ఎదిరించకుండా ఉండునట్లు ఏమి విమర్శించి
మాట్లాడినా అదంతయూ శంకరునికే అన్నట్లు తెలివిగా శంకరుని చేత
అద్వైత సిద్ధాంతమును ప్రయోగించారు.

శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఆర్యులను మించిన తెలివైనవాడు.
కొంతకుకొంత ఆర్యుల కుట్రలను గ్రహించగలిగాడు. తాను వేరు మార్గమున
ప్రయాణించాలనుకొన్నాడు. వ్యాసుడు వ్రాసిన భగవద్గీతను చదువగలిగాడు.
వ్యాసుడు వ్రాసిన భగవద్గీతను ప్రచారము చేయాలనుకొన్నాడు. అద్వైతమును
అంతటితో ఆపేయాలనుకొన్నాడు. భగవద్గీతలోని కొన్ని శ్లోకముల వలన
శంకరుడు పూర్తిగా తనదారిని మార్చుకొన్నాడు. దానిప్రకారము చూస్తే
శంకరుడు ఎంతో గొప్పవాడని అర్థమగుచున్నది. భగవద్గీతలోని భావమును
అర్థము చేసుకోగలిగాడు. ఎప్పుడు భగవద్గీతకు దగ్గరయినాడో అప్పుడే
వేదములకు దూరమవుతూవచ్చాడు. "త్రైగుణ్యా విషయావేదా” అను
వాక్యము, "గుణమయీ మమ మాయా” అను భగవద్గీతా వాక్యముల

వలన మారిపోయిన శంకరుడు తన మార్పును బహిరంగముగా
ప్రకటించకనే, ఆయనలోని మార్పు ఎవరికీ తెలియకముందే అకాలమృత్యువు
ఆయనను పెకలించింది. శంకరాచార్యులను విమర్శించుటకు ఆయనలో
ఏ తప్పు కనిపించడము లేదు. ఆయన తల్లిచాటున పిల్లవలె, ఆకుచాటున
పిందెవలె బ్రతికాడు. చివరిలో ఆయనకు తెలిసిన భావములు మనుషులకు
తెలిసియుంటే ప్రజలకు ఆధ్యాత్మిక విద్యలో ఎంతో మేలు జరిగియుండెడిది.

ప్రశ్న :- మీరు ఇప్పుడు ఆచార్య శంకరులను ఎంతో పొగడుచున్నారు.
ఇంతకుముందు అతను సిద్ధాంతకర్తయే కాదనీ, ఆయన చెప్పిన అద్వైత
సిద్ధాంతము శాస్త్రబద్దము కానిదని చెప్పారు. అక్కడేమో శంకరాచార్యుల
వారిని విమర్శించిన మీరు ఇక్కడేమో ఎంతగానో సమర్థించుచున్నారు.
ఈ రెండింటిలో మేము ఏ మాట సత్యమైనదని అనుకోవాలి?

జవాబు :- మీరు మేము చెప్పు విషయమును అర్థము చేసుకోలేక మేము
రెండు రకముల మాట్లాడినట్లు చెప్పుచున్నారు. అక్కడ శంకరులను
విమర్శించినది నిజమే అయినా, అది పరోక్షముగా ఆర్యులను
విమర్శించడము జరిగినది. శంకరున్ని ముందుంచి కథను నడిపిన వారు
ఆర్యులు. ఆ విషయమును మేము ముందునుండి చెప్పుచున్నాము. అలా
చేయడము వారికి వెన్నతోపెట్టిన విద్య. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ అలాగే
వ్యవహరించుచున్నారు. ఎవరి ఊహకు కూడా అందని విధముగా ఆర్యులు
తమ ఉద్దేశ్యమును నెరవేర్చుకోగల ధీశాలురు. నేడు ఎక్కడగానీ
కనిపించకుండా వంద సంవత్సరముల ముందే బ్రిటీషు వారి పాలనలో
భారత దేశమున్నప్పుడే, అదే అదనుగా తలచిన ఆర్యులు ప్రజలలో దేశభక్తి
బీజములను నాటి ఎంతో మంచివారుగా దేశము కొరకు పోరాడువారిగా

ప్రజల గౌరవమును పొందారు. ఆ దేశభక్తి సూత్రము కొద్దిరోజులలోనే
దేశములోని ప్రజలలో పూర్తిగా ప్రాకిపోయినది. తర్వాత వారు ఎక్కడా
కనిపించకుండా కనుమరుగైపోయారు.

సైకిలు త్రొక్కేటప్పుడు ఆ విద్య రానివానికి మొదట వచ్చేవాడు
నేర్పిస్తాడు. సైకిల్ మీద ఎక్కించి వెనకల సీటును పట్టుకొని సైకిలు క్రింద
పడకుండా ఎక్కినవానితో సైకిల్ త్రొక్కునట్లు చేయును. వెనుక సైకిల్
పట్టుకొన్నవాడు ఉన్నాడను ధైర్యముతో సైకిల్ ఎక్కినవాడు త్రొక్కుటకు
మొదలిడును. అలా కొన్ని గంటలు సాధన చేయించిన తర్వాత నేనున్నానని
చెప్పి వాని చేత నడిపించువాడు కొన్ని గంటల తర్వాత సైకిల్ను వదలి
పెట్టును. అప్పుడు సైకిల్ ఎక్కినవాడు స్వయముగా సైకిల్ త్రొక్కుటకు
అలవాటు పడును. అట్లే మొదట దగ్గరుండి దేశభక్తిని నేర్పించిన వారు
ప్రజలలో స్వయముగా దేశభక్తి ఏర్పడిన తర్వాత ప్రజల చేతనే ఆ
నినాదమును కొనసాగించారు. అలా ప్రజలకు దేశభక్తిని నేర్పించి ప్రజల
వద్దయున్న దేహిభక్తిని లేకుండా చేయడమే ఆర్యుల ముఖ్య ఉద్దేశ్యము.
అది వంద సంవత్సరముల ముందే నెరవేరింది. అంతకుముందు దేశభక్తి
అంటే ఏమిటో తెలియని ప్రజలలో దేశభక్తి బయటికి వచ్చినది. అంతవరకు
ప్రజల వద్ద యున్న దేహిభక్తి (ఆత్మభక్తి) ఏమాత్రము కనిపించకుండా
పోయినది. వంద, రెండు వందల సంవత్సరముల ముందు అంతో ఇంతో
ఉన్న ఆత్మజ్ఞానము దేశభక్తితో లేకుండా పోవడము జరిగినది.

నేడు హిందూ ధర్మసంస్థలని పేరుపెట్టుకొన్న ఏ సంస్థను కదిలించి
చూచినా అందులోని ప్రజలు దేశభక్తిని గురించే చెప్పుదురుగానీ
ఆత్మజ్ఞానమును (దేహిభక్తిని) గురించి చెప్పరు. పూర్వము ఆర్యులు అల్లిన

ఫతకమును అనుసరించి నేడు హిందూసంస్థలలో గల ప్రజలు ఆర్యులు
కాకపోయినా ఆర్యులవలె మాట్లాడుటకు మొదలుపెట్టారు. ఆర్యులు
ఉన్నా లేకపోయినా పది కాలాలపాటు ఆర్యుల ఫతకము నెరవేరునట్లు
నేడు గల హిందూ సంస్థలను తయారు చేసిపెట్టారు. నేడు దక్షిణ భారత
దేశములోనే ఎక్కువగా హిందూమతమునకు సంబంధించిన అనేక
సంస్థలున్నాయి. అందులో పనిచేయు వారందరూ ద్రావిడులే. అయినా
వారు ఆర్యుల మాటనే మాట్లాడుచున్నారు తప్ప తాము ద్రావిడులమను
స్పృహ కూడా లేకుండా పోయినది. పూర్వము ద్రావిడ రాజ్యము
ఆత్మజ్ఞానములో ఎంతో ముందుండగా నేడు ఆత్మజ్ఞానము అంటే ఏమిటో
అర్థముకాని స్థితిలో యున్నారు. హిందూసంస్థలలో పనిచేయుచున్నా
హిందూ ధర్మములేవో తెలియని స్థితిలో యున్నారు. దేశభక్తి తప్ప దేహి
భక్తి ఏమాత్రము లేకుండా యున్నారు. ఈ విధముగా ద్రావిడులు నేడు
ఆర్యుల చేతిలో కీలుబొమ్మలైనారు. ఈనాడు కూడా తమకు ద్రావిడులలోనే
అనుకూల వాతావరణమున్నట్లు చేసుకోవడము జరిగినది. నేడు
ద్రావిడులయిన వారే ద్రావిడులనే నిందించుచున్నారంటే దీనికి కారణము
ఆర్యులని అర్థమగుచున్నది. ఆనాడు శంకరున్ని కూడా అలాగే తయారు
చేశారు. అయితే ఆనాడు శంకరాచార్యుల వారు కొంత విచక్షణతో ఆర్యుల
ఉద్దేశ్యమును కనుగొన్నాడు. అయితే నేడు హిందూ సమాజములో హిందూ
రక్షకులుగా తయారయిన ద్రావిడులు ఆర్యుల సృష్ఠి అయిన దానివలన
వారు ఆర్యులుగానే తయారైనారు. మేము ద్రావిడులుగానేయుండి
ఆత్మజ్ఞానము చెప్పుచున్ననూ మమ్ములను వ్యతిరేఖించి మాట్లాడుచున్నారు.
భగవద్గీత జ్ఞానమును కాదని వేద జ్ఞానమును బోధించమని వత్తిడి
తెస్తున్నారు. తమమాట వినని వారిమీద దాడులు చేయుచున్నారు.


పూర్వము శంకరుడు ఆర్యుల సృష్టే అయినా ఆయన చివరిలో
మారగలిగాడు. నేడు ద్రావిడులు ఎందరో హిందూ రక్షణ సంఘములలో
యుండి అంధులైపోయి చివరకు ద్రావిడులు ద్రావిడులనే బాధించు స్థితికి
వచ్చారు. అలా తయారు చేసింది ఆర్యులయినందున ఇక్కడ ముఖ్యముగా
ఆర్యులదే తప్పని చెప్పవచ్చును. ద్రావిడులను నిందించు ద్రావిడులది
తప్పని చెప్పినా అట్లు తయారు చేసినది ఆర్యులే అయినందున ప్రత్యక్ష
కుట్రలకంటే కనిపించని పరోక్ష కుట్రలే ఎక్కువ అపాయకరమైనవి.
అందువలన పైకి మేము శంకరున్ని తప్పులెంచినా, దానికి బాధ్యులు ఆర్యులే
అయినందున పరోక్షముగా ఆర్యులనే విమర్శించినట్లగును. అర్థము
చేసుకోలేనివారు శంకరున్ని ఒకచోట విమర్శించినట్లు, మరొకచోట
పొగడినట్లు అర్థము చేసుకొన్నారు. నేడు అనేక హిందూ సంస్థలలో
యున్నవారు మేము ఎంత పెద్ద జ్ఞానమును చెప్పినా, దానిని గ్రహించక
మాకు వ్యతిరేఖముగా మాట్లాడుచున్నారంటే అది అంతయూ ఆర్యుల
పనియని తెలిసిన మేము ప్రత్యక్షముగా హిందూ సంస్థలను నిందించినా
అది పరోక్షముగా యున్న ఆర్యులనేనని అర్థము చేసుకోవలెను.

ప్రశ్న :- నేడు హిందూ ధర్మరక్షణ సంస్థలలోయున్న ద్రావిడులు విచక్షణ
లేకుండా నడుచుకొనుచున్నారని మీరు చెప్పువరకు మాకు కూడా తెలియదు.
ఎవరి వ్రేలుతో వారి కళ్ళను పొడిచే రకము ఆర్యులదని మాకు ఇప్పుడు
కొంత అర్థమయినది. మనిషి దేహిభక్తితో జీవితమే సాఫల్యమగును
దేశభక్తితో ఒరిగేది ఏమీలేదు. అది పేరుకు మాత్రమే! దేశ సరిహద్దులలో
చలికి, వానకు, ఎండకు కాపలాకాయుచున్న సైనికులకు అంతో ఇంతో
దేశభక్తి యుండవచ్చును గానీ, దేశములో కూర్చొని తాము దేశమునకు
ఏమీ చేయకున్నా వారు దేశభక్తి అనడము విడ్డూరముగా ఉంటుంది. దేశభక్తి

యున్నట్లు కనిపించు సైనికులలో కూడా నేడు దేశభక్తి కరువైపోయింది
నిజమేకదా?

జవాబు :- వాస్తవముగా అది ఎవరిలోనూ లేదు. మాట్లాడే దానికి మాత్రము
దేశభక్తి పనికి వస్తుంది. నేను ఒకప్పుడు మిలటరీలో ఒక భాగమయిన
ఆర్మీలో (భూ సైన్యములో) పని చేసినప్పుడు మా ఆఫీసర్ ఒక ప్రశ్న
అడిగేవాడు. మీరు దేనికొరకు సైన్యములోనికి వచ్చారని అడిగాడు. అప్పుడు
ఒక్కొక్కరు లేచి "దేశ్ సేవాకేలియే!" అని హిందీలో అనేవారు. దాని అర్ధము
“దేశ సేవకొరకు వచ్చామని" చెప్పేవారు. చివరిగా నాకు చెప్పేవంతు వచ్చినది.
అప్పుడు నేను ఇలా చెప్పాను. 'ఉచితముగా ప్రతి ఫలితమును ఆశించక
చేసేది సేవ అవుతుంది. మేము డబ్బు కొరకు గవర్నమెంటు ఇచ్చే నెల
జీతము కొరకు వచ్చాము. ఇంటివద్దయున్న తల్లితండ్రులను పోషించే
నిమిత్తము సైన్యములోనికి వచ్చాము. దేశము యొక్క సేవ అంటే ఏమిటో
మాకు ఏమాత్రము తెలియదు. ఫలానా పని దేశసేవ అనేది ఎవరికీ
తెలియదు. అందువలన నేను దేశసేవ కొరకు వచ్చాను అనడము
అసత్యము. సత్యము చెప్పాలంటే “దేశ్ సేవాకేలియే నహీ ఆయాహు!
హమ్ పేట్కా సేవాకేలియే ఆయాహు!" అని చెప్పాను. అప్పుడు అందరూ
చప్పట్లు కొట్టి “ఏ సహీ హై!” అన్నారు. నేను చెప్పిన మాటలో "నేను
దేశసేవ కొరకు రాలేదు, మా కడుపు సేవ కొరకు వచ్చాను" అని అన్నాను.
అప్పుడు “ఇది సత్యము” అని చప్పట్లు కొట్టి చెప్పారు. మా కమాండర్
కూడా నేను సత్యము చెప్పానని మెచ్చుకొని మీటింగ్లో ఇలా అన్నాడు.
"దేశసేవ కొరకు నేను కూడా రాలేదు. మనమంతా ఎవరూ దానికొరకు
రాలేదు. దేశసేవ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు. ఏ గ్రంథములోనూ
ఇది దేశసేవ అని వ్రాయలేదు. ఒక మనిషి స్వచ్ఛందముగా పని

చేస్తున్నాడంటే అందులో కూడా పైకి కనిపించని స్వార్ధము ఏదో ఒకటి
ఉండనే ఉండును. అటువంటప్పుడు దేశము యొక్క సొమ్ము తింటూ
దేశసేవ చేస్తున్నామనడము ఆసత్యమగును” అన్నాడు. అప్పుడు ఒక జవాన్
లేచి "కర్తవ్య నిర్వహణలో యుద్ధము వస్తే మేము ప్రాణాలను లెక్కచేయక
పోరాడుచున్నాము, యుద్ధములో చనిపోతున్నాము. ప్రాణము
పోగొట్టుకొన్నా అది దేశసేవకాదని చెప్పితే దేశసేవ అంటే ఏమిటో చెప్పండి”
అని అన్నాడు. దానికి ఆఫీసర్ “నవ్వి నువ్వు నెల జీతము తీసుకోకుండా
యుద్ధములో పాల్గొంటే దేశసేవ అవుతుంది. డబ్బుకొరకు పని చేయడము
సేవకాదు. అలా కర్తవ్య నిర్వహణలో చనిపోయిన వారిదంతా దేశసేవ
అయితే, ఒక దొంగకు దొంగతనము చేయడమే పనిగా ఉండును. తాను
దొంగతనము చేయుచూ ప్రమాదవశాత్తు చనిపోయాడను కొనుము.
అప్పుడు వాడు వాని కర్తవ్య నిర్వహణలో చనిపోయినట్లే కదా! కోటివిద్యలు
కూటి కొరకేయని మన పెద్దలు చెప్పినట్లు దొంగ వానికొరకు వాడు పని
చేయుచూ చనిపోయాడు. అట్లే ఎవడయినా వానికొరకు వాడు పనిచేయుచూ
చనిపోయినప్పుడు అది దేశసేవ ఎట్లగును? కోటివిద్యలు కూటికొరకే
అన్నట్లు, కోటి పనులు (ఉద్యోగాలు) కడుపుకొరకే అని తెలియుచున్నది.
అటువంటప్పుడు దేనినీ దేశసేవ అని చెప్పుటకు వీలులేదు. ఒక ప్రాణమున్న
జీవికి అనగా మనిషికిగానీ, జంతువుకుగానీ, పక్షికిగానీ దేనికయినా గానీ
దానికొరకు స్వార్థము లేకుండా, ఏ ఫలకాంక్ష లేకుండా పనిచేస్తే అది
సేవ అవుతుంది. అలా చేయుటకు దేశము ఒక మనిషికాదు, ఒక జంతువు
కాదు, ఒక పక్షికాదు. అలాంటి ప్రాణములేని దానికొరకు సేవ చేయడము
అనేదే లేదు. ప్రాణమున్న మనిషి సంతోషము కొరకు ఇంకొకడు పాటు
పడితే అది సేవయగును. దేశము విశాలమయినది దానికి ప్రాణము

లేదు కావున అది సంతోషపడేది లేదు. అటువంటప్పుడు దేశసేవ అనే
దానికి అర్థమేలేదు. అటువంటప్పుడు దేశభక్తి అనడము పూర్తి తప్పగును.
ప్రపంచములో దేశభక్తి అనునది లేదు.” “దేహిభక్తిని” సృష్ట్యాదిలోనే దేవుడు
తన జ్ఞానములో బోధించాడు. అదే జ్ఞానమునే ద్వాపరయుగములో చెప్పిన
భగవద్గీతలో క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, పురుషోత్తమప్రాప్తి యోగములో
చెప్పడమైనది. అయితే మనుషులను దేహిభక్తి (ఆత్మభక్తి) నుండి దారి
మళ్ళించుటకు ఆర్యులు 'దేశభక్తి' అను పేరును బయటికి తెచ్చారు.
భగవద్గీతకు వ్యతిరేఖులయిన ఆర్యుల పన్నాగమును తెలియని మనుషులు
వారి ప్రభావమునకులోనై వారి మాటలనే మాట్లాడుచున్నారు.
మాట్లాడువారి మాటలు దేవునికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమని వారికి
తెలియదు.

ప్రశ్న :- ఇదంతా మాకు కూడా బాగా అర్థమయినది. మీ గ్రంథములు
చదువకపోతే మాకు తెల్లనివన్నీ పాలే అనుకొనే వాళ్ళము. మీ గ్రంథములు
చదివిన దానివలన తెల్లనివన్నీ పాలుకాదు, అలా తెల్లగ కనిపించువాటిలో
మజ్జిగ ఉన్నాయి, సున్నపు నీళ్ళు ఉన్నాయి, జెముడు చెట్టు పాలు
ఉన్నాయని తెలిసినట్లు, నేడు దేశములోగల జ్ఞానము ఎన్ని రకములున్నదో
తెలిసిపోయినది.

ప్రస్తుతము భారతదేశములో ఆర్యులు పూర్వము అమలు చేసిన
ప్రణాళిక చేత నేడు భారతదేశములో అద్వైతము ఎక్కువ శాతము గలదు.
తర్వాత పుట్టిన రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతము రెండవ స్థానములో
యున్నది. మధ్వాచార్యుల ద్వైతము మూడవ స్థానములో యున్నది.
ద్వైతముగానీ, విశిష్టాద్వైతముగానీ రెండూ అద్వైతమునకు వ్యతిరేఖమే కదా!

వారి వెనుక ఎవరూ లేకున్నా రామానుజులు, మధ్వులు ఇద్దరూ ద్రావిడ
బ్రాహ్మణులే అయినందున వారు ఇరువురూ అద్వైతమునకు వ్యతిరేఖులే.
ఇక్కడ ద్రావిడులు ఆర్యులు అను భేదము లేకపోయినా, అద్వైత సిద్ధాంతము
తప్పు అను ఉద్దేశ్యముతో రామానుజుడు, మధ్వులు అద్వైతమును
వ్యతిరేఖించగా, సిద్ధాంతమూలముగా రామానుజున్ని, మధ్వులు
వ్యతిరేఖించారు. ఇంతవరకు చెప్పిన దానిలో అద్వైతమునకు శంకరుడు
బాధ్యుడు కాడు, అద్వైతమంతా ఆర్యులదే అని చెప్పారు. దానితో శంకరా
చార్యులవారు ఈ సిద్ధాంతముల సమస్యనుండి బయటపడినట్లే! శంకరా
చార్యుల వారి దోషము ఏమీలేనట్లే. అయితే శంకరాచార్యుల వారు ఇరవై
(20) గ్రంథములను వ్రాసినట్లున్నది. శంకరాచార్యులు చెప్పాడు అన్న
అద్వైతమే ఆర్యుల సృష్ఠి అయినప్పుడు తన సిద్ధాంతమే లేనప్పుడు శంకరుడు
ఇరవై గ్రంథములు వ్రాసియుంటాడా? అని అనుమానము కల్గుచున్నది.
దీనిని గురించి మీరేమంటారు?

జవాబు :- నా జవాబుకంటే నీ ప్రశ్నే చాలా పొడవుగా యున్నది. ఏది
ఏమయినా ప్రశ్నించడము ముఖ్యము. అందులో పద్ధతిగా హేతువు కొరకు
ప్రశ్నించడము మంచిది. అలా ప్రశ్నించడము వలన వచ్చే జాబు అడిగిన
వానికే కాకుండా, మిగతా వారికి కూడా జవాబుగా యుండును. దానివలన
ఎందరికో సత్యము తెలిసినట్లగును. నీవడిగిన ప్రశ్నకు జవాబు కావాలంటే
ముందు శంకరుడు వ్రాసిన గ్రంథములు ఏవని తెలుసుకొందాము. ఇరవై
గ్రంథములు వరుసగా ఇలా ఉన్నవి చూడండి.

1)గీతాభాష్యము
2)వివేక చూడామణి
3)అపరోక్షానుభూతి
4)వాక్యసుధ
5)వాక్యమిత్ర
6)శివానంద లహరి
7)నిర్గుణ మానసపూజ
8)భజగోవిందము.
9)నిర్వాణ శతకము.
10)శివమాస పూజ
11)బ్రహ్మసూత్రభాష్యము
12)ఉపదేశ సహస్ర
13)ఆత్మబోధ
14)తత్వబోధ
15)పంచీకరణము
16)సౌందర్యలహరి
17)కనకధార స్తోత్రము.
18)భవాని అష్టకము.
19)సాధనా పంచకము.
20)సిద్ధాంత తత్వవిందు.

నేడు పూర్వముకంటే ఎక్కువగా విద్యావంతులున్నారు. పూర్వము
చదువు వచ్చిన వారు చాలా తక్కువగాయుండేవారు. ప్రస్తుత కాలములో
విశేషముగా చదివి ఎన్నో రంగములలో ఎంతో తెలివిగాయున్నవారు గలరు.
కొన్ని విషయములలో అతి తెలివిగా మాట్లాడువారూ గలరు. అయితే
దేవుని విషయములో మాత్రము ఏమాత్రము విచక్షణ లేనివారిగా, పూర్తి
గ్రుడ్డివారుగా ప్రవర్తించుచున్నారు. ఎవరు ఏది చెప్పితే దానిని నిజమని
నమ్ముచున్నారు. ప్రపంచములోయున్న విచక్షణా బుద్ది పరమాత్మ
విషయములలో లేకుండా పోవుచున్నది. అట్లు కాకుండా ప్రపంచ
విషయములో విచక్షణ లేకపోయినా ఫరవాలేదు. అదియంతయూ కర్మను
బట్టి జరుగును. మనిషి విచక్షణ ప్రపంచ విషయములో ఉన్నా ఒక్కటే
లేకున్నా ఒక్కటే. ప్రపంచ విషయములు మనిషి విచక్షణనుబట్టి జరుగవు.
కర్మ ఎట్లు నిర్ణయింపబడివుండునో అట్లే జరుగును. అయితే దేవుని జ్ఞానము
మనిషి విచక్షణనుబట్టి యుండును. మనిషి తన విచక్షణతో జ్ఞానము
మీద ఆసక్తిని పెంచుకోవచ్చును. మనిషిలోయున్న ఆసక్తినిబట్టి (శ్రద్ధనుబట్టి)
మనిషికి జ్ఞానము లభించును. అందువలన జ్ఞాన విషయములలో విచక్షణ
లేకుండా ఏ మనిషి ఉండకూడదు.

ఇప్పుడు శంకరాచార్యుల వారు ఇరవై (20) గ్రంథములు వ్రాశారను
విషయము మన ముందుకు వచ్చినది. ఈ విషయములో విచక్షణ లేకపోతే
వారు చెప్పినట్లు శంకరుడు ఇరవై గ్రంథములను వ్రాశాడని మనము కూడా
తలూపవలసిందే. అట్లుకాకుండా మనిషిలో కొంత విచక్షణ కల్గి పరిశీలనా
దృష్ఠితో చూస్తే శంకరాచార్యుల వారు ఇరవై గ్రంథములను వ్రాయలేదని
చెప్పవలసిందే! శంకరుడు అన్ని గ్రంథములు వ్రాయలేదని చెప్పుటకు
ఎన్నో ఆధారములు గలవు. విచక్షణతో ఆలోచన చేయనప్పుడు ఇతరులు
ఏమి చెప్పినా వినవలసి వచ్చును. అట్లుకాకుండా ఇది జ్ఞాన విషయమై
నందున మనము ఆలోచనతో ప్రశ్న రూపమున ప్రశ్నించుకొంటే దానికి
జవాబులు లేనప్పుడు అసత్యమనీ, జవాబులున్నప్పుడు సత్యమనీ
నమ్మవచ్చును. ఏ మనిషి అయినా విచక్షణా బుద్దితోనే సత్యాసత్యములు
తెలియును.

ఆదిశంకరాచార్యుల వారు చిన్నవయస్సులోనే ఆర్యుల చేత ఉత్తర
దేశయాత్రను 15 లేక 16వ సంవత్సరమే ప్రారంభించడము జరిగినది.
కేరళ రాష్ట్రమునుండి కాలినడకన ప్రయాణించుచూ 18 సంవత్సరముల
వయస్సులో గుజరాత్ రాష్ట్రమును చేరి, అక్కడ ద్వారకలో ద్వారకాపీఠమును
స్థాపించడము జరిగినది. తర్వాత అక్కడనుండి యాత్రను ప్రారంభించి
దాదాపు ఐదు సంవత్సరముల కాలినడక తర్వాత శంకరుని వయస్సు
23 సంవత్సరములప్పుడు హిమాలయములలోని ఉత్తరాఖండ్ రాష్ట్రములో
గల బద్రిలో జ్యోతిర్ పీఠమును స్థాపించి, తిరిగి అక్కడనుండి చాలా
తొందరగా ఒక సంవత్సర వ్యవధిలోనే కాలినడకన ఒరిస్సా రాష్ట్రములోని
పూరి పట్టణమునకు రావడము జరిగినది. అక్కడ జగన్నాథ పీఠమును
స్థాపించడము జరిగినది. అప్పటికి శంకరుని వయస్సు 24 సంవత్సరములు,

అక్కడనుండి శంకరాచార్యుల వారు కర్నాటక రాష్ట్రములోని శృంగేరికి
రావడము జరిగినది. అక్కడ శారదాపీఠమును తన 25వ సంవత్సరము
స్థాపించడము జరిగినది. అక్కడనుండి తన స్వంత రాష్ట్రమయిన కేరళలో
తాను పుట్టిన ఊరికి వచ్చి అక్కడనుండి తమిళనాడు రాష్ట్రమును చేరి
కంచి పట్టణములో తన 27వ సంవత్సమున కామకోటి పీఠమును
స్థాపించడము జరిగినది. ఈ విధముగా 15 సంవత్సరముల వయస్సు
నుండి ఏకధాటిగా కాలినడకన దేశ నలుమూలలా తిరిగి చివరికి 27
సంవత్సరములకు తనకు స్వంత స్థానమును కంచిలో ఏర్పాటు
చేసుకోవడము జరిగినది. ఇదంతయూ మనకు తెలిసిన విషయమే. కంచి
పీఠములో దాదాపు సంవత్సరము లేక ఒకటిన్నర సంవత్సరములు యున్న
శంకరాచార్యుల వారు భగవద్గీతకు వివరమును వ్రాయడము జరిగినది.

భగవద్గీతా వివరమును వ్రాసిన తర్వాత 29వ సంవత్సరమే తిరిగి
ఉత్తరదేశ యాత్ర ప్రారంభించడము జరిగినది. 30, 31వ సంవత్సరము
లలో యాత్రలోయున్న శంకరుడు తన 32వ సంవత్సరము బద్రి చేరుకొని
అక్కడనుండి కేదార్నాథ్కు వచ్చి అకాల మరణమును పొందడము జరిగినది.
ఈ విధముగా ఆయన జీవితమంతా కాలినడకన నడువడమే జరిగినది.
ఒక సంవత్సర కాలవ్యవధిలో తన కంచిపీఠమున ఉన్నప్పుడు భగవద్గీతా
భాష్యము వ్రాయడము జరిగనది. భగవద్గీతను వ్రాయుటకు దాదాపు
ఆరు నెలల నుండి సంవత్సర కాలము పట్టియుండును. ఒక గ్రంథమును
వ్రాయాలంటే అక్షర అక్షరముతో లెక్కించితే కొన్ని కోట్ల అక్షరములు
వ్రాయవలసియుండును. ఒక అక్షరమునకు కొన్ని సెకండ్ల లెక్కన చూచినా
ఒక గ్రంథము వ్రాయుటకు కొంతకాలము పట్టును. అయితే ఇక్కడ
శంకరుడు అన్ని గ్రంథములు వ్రాయుటకు ఆయనకు వ్యవధి ఎక్కడిది?

ఈ ప్రశ్నకు జవాబును ఎవరూ చెప్పలేరు. ఎంత వేగముగా వ్రాసినా
ఇరవై గ్రంథములు వ్రాసేదానికి కనీసము ఐదు సంవత్సరముల కాలమైనా
పట్టును. మనిషి ఒక గ్రంథమును వ్రాయాలంటే ఎంతో ఆలోచించి
వ్రాయడము జరుగును. వదలక వ్రాసినా ఐదు సంవత్సరముల కాలము
పట్టితే వాటిని గురించి ఆలోచించేదానికి కనీసము రెండు సంవత్సరముల
కాలమైనా పట్టును. కనీసము ఏడు సంవత్సరముల కాలమయినా లేనిది
ఇరవై గ్రంథములు వ్రాయుటకు వీలుపడదు. శంకరుని జీవితములో
అంతకాలమును శంకరుడు ఎప్పుడు ఉపయోగించాడు అని చూస్తే
శంకరుడు గ్రంథములు వ్రాశాడు అన్నది శుద్ధ అబద్దము. అయన వ్రాసినది
భగవద్గీత ఒక్కటేనని చెప్పుచున్నాము.

ప్రస్తుత కాలములో సులభముగా వ్రాసే పెన్నులు, వేగముగా జరిగే
కొనలుగల జెల్ పెన్నులు, వ్రాసేకొద్దీ వ్రాతపడే పలుచని పేపర్లు, ఏ పెన్నుతో
తేలికగా వ్రాసినా వ్రాయబడే తెల్లని పేపర్లు, కూర్చొనేదానికి కుర్చీలు,
పేపరును పొందికగా పెట్టుకొనేదానికి టేబుల్లు, దానిమీద అద్దము
టేబులాప్లు ఉండగా, రెండువందల పేజీలు వ్రాయుటకు ఒక నెలరోజుల
కాలము పట్టుచున్నది. 200 పేజీల గ్రంథమును చూచి వ్రాసినా దాదాపు
15 రోజుల కాలము పట్టును. ఇదంతయూ ఇప్పటి కాలములోని పరిస్థితి.
అప్పుడు శంకరుడు గ్రంథమును వ్రాసినరోజు పేపర్లు లేవు, పెన్నులుగానీ
పెన్సిల్లుగానీ లేవు. రాత్రిపూట కనిపించే కరెంటు లైట్లు లేవు. ఆ
దినములలో తాటి ఆకులమీద ఇనుప వస్తువుతో గీతలు పెట్టుచూ
వ్రాయవలసి యుండును. మొనతేలిన ఇనుపముక్కను అరచేతిలో అదిమిపట్టి
మందముగా యున్న తాటిఆకు మీద వ్రాయవలసియుండును. ఈ
కాలములో ఒక్క పేజీలో అచ్చువేయు వ్రాతను ఆ కాలములో కనీసము


20 లేక 25 తాటి ఆకుల మీద వ్రాయవలసియుండును. ఆనాడు
భగవద్గీతకు వివరము వ్రాసిన శంకరుడు ఎంతో కష్టపడితేగానీ గీతను
వ్రాయుటకు కనీసము ఒక సంవత్సర కాలము పట్టియుండును. తాటి
ఆకులు 15 వేల నుండి 20 వేల ఆకుల వరకు పట్టియుండును. ఏ
భాషలో వ్రాసినా ఆకుమీద వ్రాయు అక్షరము కనీసము కందిబేడంత (కంది
గింజంత) పెద్దదిగా యుండవలెను. దానికంటే చిన్నగా వ్రాయుటకు
ఆకుమీద వీలుపడదు. ఒక అక్షరము వ్రాయుటకు ఇప్పటికాలములో ఎంత
వేగముగా వ్రాసినా కనీసము రెండు సెకండ్ల కాలమైనా పట్టును. రెండు
సెకండ్లలో నున్నటి పేపరుమీద, మెత్తని పెన్నుతో వ్రాయబడు అక్షరము,
అదే తాటిఆకుమీద, ఇనుప కుంచెముతో వ్రాయుటకు కనీసము 30 సెకండ్ల
కాలమునుండి 50 లేక 60 సెకండ్ల కాలము పట్టవచ్చును. అటువంటి
వసతియున్న ఆ కాలములో ఎంతో నేర్పుగా, ఎంతో ఓర్పుగా శంకరాచార్యుల
వారు భగవద్గీతను వ్రాయుటకు కనీసము ఒక సంవత్సర కాలము పట్టినది.
ఒక గ్రంథమును వ్రాయుటకే ఆయనలోని ఓర్పు నేర్పు రెండూ అయిపోయి
వుండును. తిరిగి రెండవ గ్రంథమును వ్రాయుటకు మొదట కల్గిన గ్లాని
నుండి తేరుకొని పూనుకొనుటకు కనీసము మూడు నెలల కాలమయినా
ఉండవలెను. లేకపోతే మెదడులో ఏర్పడిన గ్లాని వలన వ్రాయబోయే
గ్రంథము యొక్క నడక మారిపోవును. వ్రాయాలనుకొన్నంత వ్రాయలేరు.
కొంత విశ్రాంతి తర్వాత సులభముగా వ్రాయుటకు మానసిక శక్తి వచ్చును.
ఇదంతయూ మేము గ్రంథములు వ్రాసిన అనుభవముతో చెప్పుచున్నాము.
ఇప్పుడు మేము ఈ గ్రంథమును వ్రాయుచున్న సమయము 4.1.2016
రాత్రి 1.40 నిమిషములు. రాత్రి 12.30 నిమిషములకు లేచి పూర్తిగా
తయారై కూర్చొనుటకు అరగంట సమయము పట్టగా ఒంటిగంటనుండి

వ్రాస్తున్నాము. ఇప్పటికి 40 నిమిషములనుండి వ్రాయుచున్నా ఒకటిన్నర
పేజీకంటే ఎక్కువ వ్రాయలేదు. అన్ని సౌకర్యములున్న ఈ కాలములోనే
ఈ గ్రంథము వ్రాయుటకు కనీసము ఒక నెలకాలము పట్టుచున్నది. ఏ
సౌకర్యములేని ఆ కాలములో ఇదే గ్రంథమును వ్రాయుటకు కనీసము
నాలుగు నెలల నుండి ఆరు నెలల కాలమయినా పట్టవచ్చును. దీనినిబట్టి
ఆయన జీవితములో 20 గ్రంథములు వ్రాశారని మీరు చెప్పగలరా?

శంకరాచార్యుల వారు భగవద్గీతా గ్రంథమును మాత్రము తన
జీవితములో వ్రాయగలిగారు. మిగతా గ్రంథములు వ్రాశాడు అని చెప్పుట
పూర్తి అసత్యముగా కనిపించుచున్నది. భగవద్గీతా జ్ఞానమును చెప్పినవాడు
పరమాత్మ (దేవుడు). అయితే దేవుడు స్వయముగా ఎవరితోను నేరుగా
మాట్లాడడు. కనుక భగవంతునిగా వచ్చి భగవంతునిగా మాట్లాడి చెప్పిన
బోధ భగవద్గీత. భగవద్గీత నిజమైన దేవుని జ్ఞానము. నిజమైన దేవుడు
భగవంతునిగా చెప్పిన జ్ఞానము. భగవద్గీత ముందర మిగతా మనుషులు
చెప్పిన గ్రంథములన్నియూ తక్కువ అనియే చెప్పవచ్చును. భగవద్గీతను
తేనెగా పోల్చితే, మిగతా గ్రంథములను బెల్లముతో తయారు చేసిన
పానకముగా చెప్పవచ్చును. తేనెను త్రాగినవాడు పానకమును త్రాగితే
'పానకము తేనెకంటే ఎన్నోరెట్లు తక్కువ' అని చెప్పగలడు. అటువంటి
భగవద్గీతకు వివరము వ్రాసినవాడు దానికంటే భిన్నముగాయున్న దానిని
ఒప్పుకోడు, వ్రాయడు. అటువంటివాడు ఏ గ్రంథమును వ్రాసినా భగవద్గీతను
ఆధారముగా చూపుచూ, భగవద్గీతా శాస్త్రమునకు అనుగుణముగాయున్న
గ్రంథములనే వ్రాయును.

శంకరాచార్యుల వారు భగవద్గీతకు వివరము వ్రాశాడు అనుట
సత్యము. అయితే అదే శంకరుడే భగవద్గీతకు కొంచెము భిన్నముగా

యున్న దానిని వ్రాయునా అంటే భగవద్గీత విలువ తెలిసిన తర్వాత దానికి
భిన్నముగా వ్రాయడు. అంతేకాక భగవద్గీతలో లేని విషయములను కల్పించి
వ్రాయడు. భగవద్గీత తర్వాత శంకరుల "వివేక చూడామణి” అను
గ్రంథమును వ్రాశాడని చెప్పుచున్నారు. వివేక చూడామణి అను గ్రంథములో
అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞాన
మయ కోశము, ఆనందమయ కోశము అను ఐదు కోశములను వ్రాశారు.
అయితే భగవద్గీతలో ఈ ఐదు కోశములు చెప్పలేదు. భగవద్గీతలో చెప్పని
భగవద్గీతకు కొంత భిన్నముగాయున్న విషయములను శంకరుడు ఎలా
చెప్పగలడు? దీనినిబట్టి 'వివేక చూడామణి' అను గ్రంథమును శంకరుడు
వ్రాయలేదని చెప్పవచ్చును. మరియొక విషయమును తీసుకొని చూచిన
యెడల అదే గ్రంథములో శరీరమును రెండు భాగములుగా విభజించి
చెప్పినప్పుడు, స్థూల, సూక్ష్మ భాగములని పేరుపెట్టి శరీరభాగములను
వ్రాసియున్నారు. అలా శంకరుడు వ్రాసియుండడు. యోగా చూడామణి
ఉపనిషత్తులో ఒక శ్లోకము ఇలా కలదు. "జ్ఞాన కర్మేంద్రియైః, ప్రాణాది
పంచవాయు మనోబుద్ధిశ్చ సూక్ష్మ లింగ మిత్యుచ్యతే” అని చెప్పారు.
దీనినిబట్టి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రాణాది
పంచవాయువులు ఐదు, మనస్సు, బుద్ధి మొత్తము పదియేడు (17) సూక్ష్మ
శరీరమని అంటారు అని కలదు. ఈ శ్లోకమును యోగచూడామణి
ఉపనిషత్తులో వ్యాసుడు వ్రాసియుండగా అదే విషయమునే శ్లోకమును
మార్చి చెప్పినట్లు కలదు. భగవద్గీత తేనెలాగ యున్నప్పుడు, పానకములాంటి
విషయములను శంకరుడు వ్రాసియుండడు. భగవద్గీత 701 శ్లోకములు
యుండగా, 'వివేక చూడామణి' గ్రంథము ఒకటవ భాగములో 581
శ్లోకములు, రెండవ భాగములో 267 శ్లోకములు గలవు. రెండు భాగముల

గ్రంథములలో మొత్తము శ్లోకములు 848 శ్లోకములు ఉన్నాయి.
భగవద్గీతలోని 700 శ్లోకములకు వివరమును వ్రాయుటకు శంకరాచార్యుల
వారికి ఒక సంవత్సర కాలము పట్టియున్నప్పుడు 848 శ్లోకములను
మరియు వాటి వివరమును వ్రాయుటకు ఎంతకాలము పట్టునో మీరు
ఊహించుకోవచ్చును. భగవద్గీతలోని 700 శ్లోకములు వ్యాసుడు ముందే
ఛందోబద్దముతో (వ్యాకరణ రీత్యా) వ్రాసియుండగా, వాటికి వివరమును
మాత్రము శంకరుడు వ్రాశాడు. వివేక చూడామణిలో అట్లుకాక మొత్తము
శ్లోకములను క్రొత్తగా వ్రాయడము జరిగినది. ఒక శ్లోకమును వ్రాసి దాని
ఛందస్సును చూచుటకు తప్పక కొంత సమయము పట్టును. 848
శ్లోకములను ఛందోబద్ధముగా వ్రాయుటకు, తర్వాత వాటి వివరమును
వ్రాయుటకు ఎంతకాలము పట్టునో మీరే చూడండి. ఇదంతయూ
గమనించితే విచక్షణయున్నవాడు శంకరుడు వివేక చూడామణి వ్రాయుటకు
వ్యవధి లేదని చెప్పగలడు. రెండవ గ్రంథమును వ్రాయుటకే వ్యవధి లేనట్లు
కనిపించుచుండగా, మిగతా 18 గ్రంథములను వ్రాయలేదని నిర్ణయము
చేయవచ్చును.

శంకరుడు ముందే తన 28వ సంవత్సరముల వయస్సులోనే
భగవద్గీతను వ్రాశాడు. తేనెలాంటి గ్రంథమును వ్రాసిన తర్వాత
పానకములాంటి మిగతా గ్రంథములను వ్రాయవలసిన అవసరము
ఆయనకు లేదు. మిగతా 19 గ్రంథములను ఆర్యులు ముందే వ్రాసినవనీ,
శంకరుడు చనిపోయిన తర్వాత తాము వ్రాసిన 19 గ్రంథములను శంకరుడే
వ్రాశాడని ప్రచారము చేశారనీ, అలా శంకరుని పేరు చెప్పడము వలన
శంకరునికి ప్రజలలో తాము కల్పించిన గౌరవమునుబట్టి తమ బోధలు
శంకరుని పేరుతో ప్రజలలో చేరిపోగలవని అనుకొన్నారు. ఈ విధముగా

ఆర్యులు తెలివిగా చేసిన ఎన్నో పనులలో ఇదొక పనియని చెప్పవచ్చును.
ఎప్పుడో పూర్వము ఆర్యులు చేసిన పనుల వలన వారి గ్రంథములు
ప్రజలలో వ్యాపించిపోయాయి, వారి భావములు ప్రజలలో వ్యాపించిపోయిన
వని చెప్పవచ్చును. ఎంతో కాలమునుండి ఫతకము ప్రకారము ప్రజలలో
చొప్పించిన ఆర్యుల భావములు ద్రావిడులలో చేరిపోయాయి. ద్రావిడులు
కూడా ఆర్యుల భావములలో చిక్కుకొని పోవడము వలన 'మేము
ద్రావిడులము' అను ధ్యాసను మరచిపోయి మేము మొదటినుండి యున్న
భగవద్గీత జ్ఞానమును చెప్పితే మమ్ములను వ్యతిరేఖించుచున్నారు.

క్రీ.శ. 1824 నుండి 1883 వరకు పూర్వము దయానంద సరస్వతి
అను ఒక గురువు ఉండెడివాడు. ఆయన స్వచ్ఛమయిన ఆర్యుడని
చాలామందికి తెలియదు. ఆర్యులు పూర్వము కొన్ని వేల సంవత్సరముల
పూర్వము వేసిన పునాదికి తిరిగి బలమును చేకూర్చినవాడు దయానంద
సరస్వతి. ఇంతవరకు 'ఆర్యులు' అను గుంపు పదమును వాడుచూ వచ్చాము
గానీ, ఫలానా అని ఎవరి పేరు పెట్టి మేము చెప్పలేదు. పూర్వము ఆర్యులు
తమ పనులకు ప్రాధాన్యత నిచ్చారుగానీ, వారి పేర్ల గుర్తింపుకుగానీ, వ్యక్తిగత
ప్రచారముగానీ చేసుకోలేదు. ఏ పనిలో అయినా ఫలానా ఆర్యులున్నారని
తెలియనట్లు ప్రవర్తించి ప్రతి దానిని వెనుకయుండి కనిపించక నడిపారు.
త్రేతాయుగమునుండే ఆర్యుల అలజడి భారత దేశములో కనపడినది.
త్రేతాయుగములోనే మధ్య ఆసియా ప్రాంతమునుండి భారతదేశమునకు
వలస వచ్చిన ఆర్యులు మహా మేథావులు. భారతదేశములో వారి
ఆధిపత్యము కొరకు ఏమి చేయాలో అవి అన్నీ చేశారు. చివరకు
భారతదేశములో వారి ఆధిపత్యమును చాటుకొన్నారు. అయినా ఆర్యులు
ఎవరి దృష్టిలో పడలేదు. ప్రజల దృష్టిలో పడితే జిష్ఠి తగులుతుందని

వారికి తెలుసు. అందువలన ఇది ఆర్యుల పనియని ఎవరూ గుర్తించనట్లు
వారు ముందే ఫతకము ప్రకారము తమ పనులను చేయుచూవచ్చారు.
భారతదేశము 'ఇందూదేశము'గా యుంటే దానిపేరును 'హిందూదేశము’గా
మార్చివేశారు. జ్ఞానులందరినీ అజ్ఞానులను చేసి, వారి భావములు
అందరిలోనికి ప్రాకునట్లు చేశారు.

పూర్వము ముందస్థుగా ఆర్యులు చేసిన పనివలన భగవద్గీతయొక్క
జ్ఞానము భారతదేశములో ఇప్పటికీ ప్రాకలేదు. భగవద్గీతకు వ్యతిరేఖమయిన
పనులు చేయుచున్నా ఇది దైవ విరుద్ధమైన పని కదా!యని ఎవరి
జ్ఞాపకమునకు రానట్లు ఆర్యులు చేశారంటే వారి మేథాశక్తి గొప్పదనియే
చెప్పవచ్చును. ఇట్లు తమ భావములకు, తమ జ్ఞానమునకు ఎదురు లేకుండా
చేసుకొన్నవారు ఎవరూ గుర్తించనట్లు ఉండిపోయారు. ఈ పనులు చేసినది
ఆర్యులని మేము తప్ప ఎవరూ చెప్పలేదు. వారికి వ్యతిరేఖముగా మాట్లాడితే
హిందువులలోనే మిళితమైయున్న ఆర్యుల ద్వారా మాకు వ్యతిరేఖత తప్పదని
మాకు తెలిసినా, ఇప్పటికే ఎన్నో వ్యతిరేఖతలు వచ్చినా పట్టువదలక
సత్యమునే చెప్పుచున్నాము. ఇప్పటికయినా ద్రావిడులు కళ్ళు తెరచి
ప్రవర్తించాలని తెలుపుచున్నాము. మీరు చేయు భక్తి భగవద్గీతకు
వ్యతిరేఖమేమో ఒకమారు వెనుతిరిగి చూచుకోండి.

దాదాపు వంద సంవత్సరముల పూర్వము గుజరాత్లో తంకర
గ్రామములో పుట్టిన మూల్ శంకర్ అను బ్రాహ్మణుడు కాలక్రమమున
దయానంద సరస్వతిగా మారిపోయాడు. దయానంద సరస్వతి ఆర్యుల
వారసుడయినందున ఆయన ఆర్యసమాజమను ఒక సంస్థను తయారు
చేశాడు. తమ పూర్వీకులు ఎలా చేశారో ఆయన అలాగే చేశాడు. అయితే
పూర్వపు ఆర్యులు ఎక్కడా కనిపించకుండా చేశారు. దయానంద సరస్వతి

పూర్తి కనిపించి చేశాడు. గతములోని ఆర్యులు శంకరాచార్యులను ముందుకు
పెట్టి తాము వెనుకయుండి చేశారు. దయానంద సరస్వతి అలా కాకుండా
తానే ముందుండి చేశాడు. ఎక్కడా శంకరాచార్యులను ముందుకు
చూపలేదు. తానే స్వయముగా ఆర్యసమాజమును దేశమంతా స్థాపించాడు.
అప్పటినుండి అవి పెరుగుచూపోయి నేడు దేశమంతా ఆర్యసమాజములు
ఎక్కడ చూచినా ఉన్నాయి. హైదరాబాద్లో మరియు సికింద్రాబాద్లోనే
దాదాపు పదిచోట్ల ఆర్యసమాజ సంఘములున్నట్లు వినికిడి.

ప్రశ్న :-:- దయానంద సరస్వతి శంకరాచార్య అద్వైతమునే ప్రచారము చేశాడు
కదా! అద్వైతమును ప్రచారము చేయడమే ఆయన పనికదా!
జవాబు :- ఆయన అద్వైతమునే ప్రచారము చేసినా పూర్వపు ఆర్యులవలె
కనిపించకుండా చేయలేదు. ప్రతిచోట ఆర్యుల సంస్కృతికి అద్దము
పట్టేలాగున ప్రవర్తించాడు. పూర్వపు ఆర్యులకు హిందువులు ఒక్కరే గురిగా
యుండేవారు. వారు హిందువులలోనే అన్ని గందరగోళములు చేశారు.
అయితే దయానంద సరస్వతి హిందువులనే కాకుండా క్రైస్తవులను,
ముస్లీమ్లను కూడా విమర్శించాడు. అందువలన ఆయన బయటికి బాగా
కనిపించాడు. దయానంద ఆర్య సమాజములను స్థాపించినా ఆయన
ఆర్యుడని ఎవరూ గ్రహించలేదు. సాధారణ గురువుగానే లెక్కించారు.

ప్రశ్న :-:- ఒక మతమువారు మరియొక మతమును విమర్శించుకోవడము
అందరికి అలవాటైపోయినది. దయానంద సరస్వతి హిందువు అయినందున
క్రైస్తవులను, ముస్లీమ్లను విమర్శించియుండవచ్చును. అయితే ఆయన
హిందువుగా కనిపించుచూ హిందువులను ఎట్లు విమర్శించాడు. ఎవరిని
విమర్శించాడో తెలుపగలరా?

జవాబు :- పాత్రలో అన్నము ఉడికిందా లేదాయని ఒక మెతుకును బట్టి
చూస్తాము. ఒక మెతుకును (ఒక గింజను) బట్టి పాత్రలోని అన్నము
అంతా అట్లే ఉంటుందని అనుకుంటాము. ఒక మెతుకుయున్నట్లు మిగతా
మెతుకులు అట్లే ఉండడము నిజమేయగును. అదే విధముగా దయానంద
సరస్వతి చేసిన విమర్శలలో ఒక దానిని చూచి మిగతావన్నీ అలాగే
ఉంటాయని తెలియవచ్చును. ఒకనాడు హిందూమతములోని వైష్ణవున్ని
చూచి అతని ముఖము మీద గల నామమును దయానందుడు హేళనగా
మాట్లాడినాడు. అప్పుడు హేళనగా మాట్లాడుచూ “ముఖము మీద ఒక
నామము పెట్టుకొంటే వైకుంఠము ప్రాప్తిస్తుంది అనుకొంటే ముఖమునిండా
ఎక్కువ నామాలు పెట్టుకొంటే వైకుంఠముకంటే శ్రేష్ఠమయినది ప్రాప్తించును
కదా!” అన్నాడు. ఈ విధముగా విశిష్టాద్వైతమును అనుసరించువారిని
విమర్శించుచూ వారికి వ్యతిరేఖముగా మాట్లాడుచుండెను.

ప్రశ్న :- దేవుడు సాకారుడని నమ్ముచుందురు విశిష్టాద్వైతులు, దేవుడు
నిరాకారుడని చెప్పుచుందురు అద్వైతులు. అద్వైతులనగా ఆర్యులు,
ఆర్యులలోని వాడే దయానందుడు. అందువలన ఆయన అద్వైతమునే
చెప్పవచ్చును. అద్వైతము ప్రకారము దేవుడు నిరాకారుడని కూడా
చెప్పవచ్చును. అట్లు అద్వైత బోధను దేవుని నిరాకారత్వమును
దయానందుడు చెప్పలేదా?

జవాబు :- ఆయన పూర్తి 'అద్వైతుడు', 'సంపూర్ణ ఆర్యుడు' అయినందున
దేవుని నిరాకారమునే సమర్థిస్తాడు తప్ప సాకారమును ఒప్పుకోడు అదే
విధానమునే ఒకచోట ఇలా చెప్పాడు చూడండి. "ఈశ్వరుడు నిరాకారు
డనియే చెప్పాలి. ఎందుకనగా! సాకారుడైతే వ్యాపకుడు కాజాలడు.

వ్యాపకుడు కానియెడల సర్వము ఆయనయందు ఉండవు. దేవుడు ఒక
అవతారమయితే, ఒక సాకారమైతే అతడు గుణకర్మ స్వభావములను
పరిమితముగా కల్గియుండును. అట్లే శీతోష్ణములు, ఆకలిదప్పికలు, రోగ
దోషములు మున్నగువాటిలో పరిమితము కాగలడు. అందువలన ఈశ్వరుడు
సాకారుడని చెప్పకూడదు, నిరాకారుడనియే చెప్పాలి. ఈశ్వరుడు
సాకారుడయితే అతనికి కన్ను, ముక్కు, చెవులు మున్నగునవి నిర్మించువాడు
మరియొకడుండవలసివచ్చును. సంయోగము వలన తయారయిన వానిని
సంయుక్తము చేయు నిరాకార చేతనమొకటి యుండవలెను. ఒకవేళ
ఎవరయిన ఈశ్వరుడు తన శరీరమును తానే నిర్మించుకొనును అని
అనినచో, అప్పుడు శరీరమును ఏర్పరచుకొనుటకు ముందు ఈశ్వరుడు
నిరాకారుడుగనే యుండును. పరమేశ్వరుడు శరీరమును ఎప్పుడూ
ధరించడు. ఈశ్వరుడు నిరాకారునిగాయుండి జగత్తునంతటినీ సూక్ష్మ
కారణములనుండి స్థూలాకారములకు తెచ్చును” అని అన్నాడు. ఇట్లు
దయానంద సరస్వతి దేవుడు నిరాకారుడని, దేవుడే ఈశ్వరుడని తన
భావములోని అద్వైతమునే బయటికి చెప్పాడు. దేవుడు సాకారుడని
విశిష్టాద్వైతుల సిద్ధాంతముకాగా సాకారుడు కాడు అని చెప్పడము అద్వైత
సిద్ధాంతములోయున్నది. అద్వైతము ప్రకారమే దయానందుడు నిరాకార
బోధను చెప్పాడని తెలియుచున్నది.

ప్రశ్న :- దయానంద సరస్వతి సిద్ధాంతకర్త కాదు కదా! అటువంటప్పుడు
ఆయన ప్రస్థావన మనకు అవసరము లేదు కదా?

జవాబు :- దయానంద సరస్వతి సిద్ధాంతకర్త కాకపోయినా అద్వైత
సిద్ధాంతమును ప్రచారము చేయడములోనూ, వేదముల ప్రచారములోనూ

ముఖ్యమైన పాత్రను పోషించాడు. అంతేకాక ఆర్యసమాజమును స్థాపించి
అందులో యున్నవారందరూ నిత్యము యజ్ఞములను చేయునట్లు చేసి
అద్వైతమునకు ఆర్యుల మనోభావములకు బలమును చేకూర్చిన ఆర్యజాతి
వాడు. ఆర్యులంటే ఎవరో తెలియనివారికి 'నేను ఆర్యున్ని' అని కనిపించు
నట్లు ఆర్యసమాజమును ప్రత్యక్షముగా స్థాపించినవాడు దయానంద సరస్వతి.
ఈయన 'మూర్తి పూజ’ను పూర్తి వ్యతిరేఖించెడివాడు. దేవుడు నిరాకారుడని
చెప్పుచూ విశిష్టాద్వైతులకు వ్యతిరేఖ గురువుగా పేరుగాంచిన వాడు.
దయానంద సరస్వతి రాకతో తిరిగి ఆర్యుల ధీశక్తి అందరికీ కనిపించినది.
“వేదతత్వ ప్రకాశము” అను గ్రంథమును రచించి తిరిగి వేదములను
ఎవరూ మరువకుండా చేశాడు. వేదాధ్యయనమునకు బలమును
చేకూర్చాడు. దాదాపు 59 సంవత్సరములు బ్రతికిన దయానందుడు ఆర్యుల
పాత్రను బాగా పోషించినవాడు.

ప్రశ్న :- శంకరాచార్యుల వారు భగవద్గీతను ఒక్కదానిని వ్రాయగా, ఇరవై
గ్రంథములను వ్రాశాడని ప్రచారము చేయవలసిన అవసరము ఆర్యులకు
ఏమి వచ్చినది?

జవాబు :- 'చెట్టు పేరుచెప్పి కాయలమ్మినట్లు' ఆర్యులు చేశారు. శంకరా
చార్యుల వారిని ఆర్యులే దేశమంతా త్రిప్పి బాగా ప్రచారము చేసి హిందూ
మతములో గొప్పవాడు అన్నట్లు ఆర్యులే చేశారు కదా! దానితో శంకరుడు
గొప్పవాడని అందరికీ తెలిసినది. గొప్పవాడయిన శంకరుడు వ్రాసినట్లు
చెప్పితే అవి గొప్పగయుండునను భావముతో ఆర్యులు వ్రాసిన 19
గ్రంథములను శంకరుడు వ్రాసినట్లు శంకరుని పేరుతో ప్రచారము చేశారు.
19 గ్రంథములలో ఆర్యుల బోధ సంపూర్ణముగా యున్నది. అయినా ఆ

విషయము ఎవరికీ తెలియదు. 20 గ్రంథములను శంకరాచార్యుల వారే
వ్రాశాడని అందరూ నమ్మారు.

పన్నెండు సంవత్సరములు నేర్వవలసిన 'పరకాయ ప్రవేశ విద్య'ను
శంకరుడు ఎప్పుడూ నేర్వలేదు. అయినా శంకరుడు పరకాయ ప్రవేశ
విద్యను నేర్చినట్లు ప్రకటించిన ఆర్యులు, తాము వ్రాసిన గ్రంథముల ముందర
శంకరాచార్యుని పేరుపెట్టి ఆయనే 20 గ్రంథములను వ్రాశాడని అందరూ
నమ్మునట్లు చేశారు. గీతాభాష్యమును శంకరుల వారు వ్రాశారు. మిగతా
గ్రంథములు శంకరునివి కావు. శంకరుడు ఏమాత్రము వ్రాయలేదు.
గీతకు వ్యతిరేఖమయిన భావములు ఎన్నో మిగతా 19 గ్రంథములలో
యుండుట వలన శంకరుడు వాటిని వ్రాయలేదని సులభముగా చెప్పు
చున్నాము.

ప్రశ్న :- హిందూమతములోనున్న సిద్ధాంతకర్తలలో మొదటివాడు శంకరా
చార్యులయినా అద్వైతమే ఆయనది కాదు, అద్వైతము పూర్తి ఆర్యులదే
నని మీరు చెప్పారు. ఈ విషయమును ప్రకటించుట పెద్ద సాహసోపేత
మైన పనియని చెప్పవచ్చును. శంకరుల తర్వాత వచ్చిన విశిష్టాద్వైత
సిద్ధాంతకర్త రామానుజులకు శంకరునికి ఏమిటి తేడాయని కొందరడుగు
చున్నారు.

జవాబు :- సిద్ధాంతకర్తల విషయము ఏమాత్రము ఎవరికీ తెలియకుండా
పోయిన దానివలన వారి భేదము ప్రజలకు తెలియకుండా పోయినది.
నేడు హిందూమతములో సిద్ధాంతకర్తలు ఎవరు? అని అడిగితే దానికి
ప్రజల వద్ద జవాబే లేదు. దీనినిబట్టి నేడు సిద్ధాంతకర్తల విషయము
ప్రజలకు తెలియకుండా పోయినదని చెప్పవచ్చును. అసలు విషయానికి



వస్తే శంకరాచార్యుల వారు తాను స్వయముగా అద్వైతమును ప్రచారము
చేయలేదు. తనది అద్వైత సిద్ధాంతమని స్వతహాగా ఎక్కడా చెప్పలేదు.
శంకరాచార్యుల వారివెంటయున్న ఆర్యులే అద్వైతమును ఆదిశంకరులకు
అంటగట్టి దానికి కర్త శంకరులేయని చెప్పారు. వాస్తవానికి శంకరుడు
అమాయకుడు. అసలు మాయకులు ఆర్యులే. శంకరాచార్యుల వారు
బ్రతికినప్పుడుగానీ, చనిపోయిన తర్వాతగానీ శంకరాచార్యుల వారే అద్వైత
సిద్ధాంతమును కనుగొన్నాడని చెప్పుచూ వచ్చారు. అందువలన శంకరున్ని
సిద్ధాంతకర్తలనుండి మినహాయించవలసి వస్తుంది. అట్లు మినహాయించి
చూస్తే ఇద్దరే సిద్ధాంతకర్తలు మిగులుచున్నారు. వారు చెప్పిన సిద్ధాంతములు
వారివే అయినందున సిద్ధాంతకర్తలు ఇద్దరే అని చెప్పవచ్చును. సిద్ధాంత
కర్తలు ప్రతిపాదించిన సిద్ధాంతములు కూడా రెండేయని చెప్పవచ్చును.
రెండిటిలో ఒకటి విశిష్టాద్వైతము, రెండు ద్వైతము. వివరముగా చెప్పితే
విశిష్ట +అద్వైతము=విశిష్టాద్వైతము అని విడదీసి చెప్పవచ్చును.
రామానుజుల వారిది అద్వైతమే కాగా, మధ్వాచార్యుల వారిది అందుకు
భిన్నముగాయున్న ద్వైతము అని చెప్పవచ్చును.

దేవుడు సాకారుడు నిరాకారుడు కాదు అని చెప్పు రామానుజుల
వారు సాకారమైన దేవునియందు భక్తికల్గి ఆరాధించడమే విశేషత.
అందువలన రామానుజుల వారిది విశిష్టాద్వైత సిద్ధాంతమయినది. దేవుడు
సాకారుడే ఆయనను ఆరాధించడమే విశేషమైనప్పుడు ఆరాధించువాడు
దేవునికంటే వేరుగా యుండవలసిందే. అందువలన ఒకప్రక్క దేవుడు మరొక
ప్రక్క దేవున్ని ఆరాధించుటకు జీవుడు ఉండవలెనని, అలా జీవుడు, దేవుడు
ఇద్దరు ఉన్నారని చెప్పడమే ద్వైతము.


ప్రశ్న :- శంకరాచార్యుల వారు సిద్ధాంతకర్త కాదు. ఆయన ఒక
సిద్ధాంతకర్తగా ఆర్యుల సృష్టేగానీ స్వయముగా 'నేను సిద్ధాంతకర్తను' అను
భావము శంకరునికి లేదు. లోకము దృష్ఠిలో 'సిద్ధాంతకర్తలు ముగ్గురు'
అని గలదు. అయితే ఆర్యుల లోగుట్టు తెలిసిన వానికి ఎవనికయినా
సిద్ధాంతకర్తలు ఇద్దరేనని చెప్పగలరు. ఇద్దరు సిద్ధాంతకర్తలున్నా వారు
కూడా సత్యమైన జ్ఞానమును తెలియకపోవడము వలన, హిందూ మతములో
సిద్ధాంత లోపమున్నదని చెప్పవచ్చును. ముందునుండి యున్న సిద్ధాంత
కర్తల ద్వారా దేవుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము పూర్తి బయటికి రాలేదు.
ప్రజలలోనికి సంపూర్ణ జ్ఞానము రావాలంటే సిద్ధాంత లోపమును సరిదిద్ద
వలసియున్నది. విశిష్టాద్వైతములోని తప్పును, ద్వైతములోని తప్పును విడదీసి
చూపించు వారు రావాలి. అలా వచ్చినవారు రెండు సిద్ధాంతములు కాదని
స్వచ్ఛమయిన జ్ఞానమునకు ఆధారమైన సిద్ధాంతమును ప్రజలు నమ్మేటట్లు
చూపవలసియుండును. ఇది జరిగే పనేనా?

జవాబు :- అన్నము తినేటప్పుడు రెండు మూడు కూరలను అన్నములో
తినినా చివరిలో కొద్దిగా అయినా పెరుగు అన్నము తిననిదే కొందరికి
తృప్తియుండదు. అలాగే తమకు తెలిసిన జ్ఞానములో ఎన్నో సిద్ధాంతము
లున్నా ఆఖరికి తృప్తినిచ్చే జ్ఞానము తెలియనంతవరకు క్రొత్త సిద్ధాంతము
కొరకు, దానివలన తెలియబడే క్రొత్త జ్ఞానము కొరకు వెదుకుచుందురు.
"సంపూర్ణశ్రద్ధయున్న వారికి సంపూర్ణమైన జ్ఞానము లభించునను” దేవుని
మాట వృథాకాదు. అలాగే " నీ విరోధులు నీకు ఎదురాడని
జ్ఞానమును నేను ఇస్తానని" చెప్పిన భగవంతుని మాట వృథాకాదు.
అందువలన సంపూర్ణ జ్ఞానమును తెలుపు క్రొత్త సిద్ధాంతము రాగలదని
ధైర్యముగా చెప్పవచ్చును.

ప్రశ్న :- శంకరులు సిద్ధాంతకర్త కాదు. ఆయన స్వయముగా అద్వైత
సిద్ధాంతమును చెప్పలేదు అన్నారు. తర్వాత వచ్చిన రామానుజాచార్యుల
వారు చెప్పిన జ్ఞానమును కాదని, అలాగే తర్వాత కొంతకాలమునకు వచ్చిన
మధ్వాచార్యుల జ్ఞానమును కాదని ఇంకా గొప్ప జ్ఞానము కలదంటారా?

జవాబు :- ఇద్దరు సిద్ధాంతకర్తలు చెప్పిన జ్ఞానమున్నప్పుడు, ఆ రెండు
మార్గములలో జ్ఞానమును చెప్పినప్పుడు, అందులో ఒకటి సత్యము
కావచ్చును మరొకటి అసత్యము కావచ్చును. రెండూ రెండుమార్గము
లైనప్పుడు ఏదో ఒకటి సత్యము, మరొకటి అసత్యము కావచ్చును లేక
రెండూ అసత్యము కావచ్చును. అంతేగానీ రెండు సత్యము కావు. ఈ
సూత్రము ప్రకారము వారి జ్ఞానమును తేల్చి చెప్పుటకు వారు వ్రాసిన
గ్రంథములను చూడవలసియుంటుంది. శంకరాచార్యుల తర్వాత వచ్చిన
రామానుజాచార్యుల వారు 120 సంవత్సరములు బ్రతికి ఆయన
సిద్ధాంతము మీద గల జ్ఞానమును తొమ్మిది (9) గ్రంథములుగా వ్రాశాడు.
అవి వరుసగా ఇలా ఉన్నవి.

1)వేదాంత సంగ్రహము.
2) గీతాభాష్యము.
3) వేదాంత సారము.
4) శ్రీరంగ గద్యము.
5) నిత్యగ్రంథము.
6) శ్రీభాష్యము.
7) వేదాంత దీపము.
8) శరణాగతి గద్యము.
9) శ్రీ వైకుంఠ గద్యము.

ఈ తొమ్మిది గ్రంథములను రామానుజులవారు వ్రాయడము
జరిగినది. రామానుజుల తర్వాత వచ్చిన మధ్వాచార్యుల వారు 37
గ్రంథములను వ్రాశారు. అవి వరుసగా ఇలా ఉన్నవి.

1)యమక భారత
2)భాగవత తాత్పర్య నిర్ణయ
3)కృష్ణజయంతి నిర్ణయ.
4) యతి ప్రణవ కల్ప.
5) మహాభారత తాత్పర్య నిర్ణయ
6) సదాచారస్మృతి
7) కృష్ణామృత మహార్ణవ
8) తంత్రసార సంగ్రహ.

బ్రహ్మసూత్రాలపై నాలుగు రచనలు :-

1)బ్రహ్మసూత్ర భాష్యము.
2) అను వ్యాఖ్యానము.
3) అను భాష్యము.
4) న్యాయ వివరము.



భగవద్గీతపై రెండు రచనలు :-
1) గీతాభాష్యము.
2) గీతా తాత్పర్య నిర్ణయ.

ప్రకారణాల ఫై  రెండు రచనలు :-
1) విష్ణుతత్వ నిర్ణయము.
2)తత్వోద్యోత
3) అను భాష్యము.
3)ప్రమాణ లక్షణ
4) న్యాయ వివరము.
4)కర్మనిర్ణయ
5)ప్రపంచ మిథ్యత్వ అనుమాన ఖండన
6) తత్వసాంఖ్యానము.
7) తత్వవివేక
8) కథలక్షణ
9) ఉపాధిఖండన.


ఋగ్వేదం పై ఒక రచన :-
1) ఋగ్ భాష్య

ఉపనిషత్తులపై పది రచనలు :-

1) ఈశావాస్య ఉపనిషత్ భాష్యము.
2) కఠో ఉపనిషత్ భాష్యము.
3) సత్ప్రశ్న ఉపనిషత్ భాష్యము.
4) ఐతరేయ ఉపనిషత్ భాష్యము.
5) బృహదారణ్యక ఉపనిషత్ భాష్యము. 
6) కేనో ఉపనిషత్ భాష్యము.
7) ముండక ఉపనిషత్ భాష్యము.
8) మండూక్య ఉపనిషత్ భాష్యము.
9) తైత్తరేయ ఉపనిషత్ భాష్యము.
10) చాందోగ్య ఉపనిషత్ భాష్యము.

స్తోత్రాలపై రెండు రచనలు :-
1) ద్వాదశ స్తోత్రములు
2) నరసింహ నఖ స్తుతి.

ఈ విధముగా ద్వైత సిద్ధాంతకర్త 79 సంవత్సరములు బ్రతికి తన
జీవితములో 37 గ్రంథములు వ్రాశాడు అంటే పూర్తిగా నమ్మవచ్చును.
అట్లే 120 సంవత్సరములు బ్రతికిన రామానుజులవారు తన జీవితములో
9 గ్రంథములు వ్రాశాడు అంటే నమ్మవచ్చును. అయితే శంకరాచార్యుల
వారు 32 సంవత్సరములు బ్రతికినా తన జీవితమంతయూ యాత్రలలో
సాగించి వ్రాయుటకు ఏమాత్రము వ్యవధి లేనప్పుడు 20 గ్రంథములు
వ్రాశాడు అనడము పూర్తి అసత్యమగును. ఆయన వ్రాయలేదని దృఢముగా
తెలిసిపోవుచున్నది. రామానుజాచార్యులు వ్రాసిన తొమ్మిది గ్రంథములను
మేము చదువలేదు గావున ఆయన గ్రంథముల సారాంశము తెలియదనియే
చెప్పవలెను. రామనుజాచార్యుల గ్రంథములు ఆయన సిద్ధాంతమునకు
దగ్గర సంబంధముతోనే ఉండునని తలచెదము. ఇక మధ్వాచార్యుల
విషయమునకు వస్తే, ఆయన వ్రాసిన గీతాభాష్యమును చూచాము మిగతా
గ్రంథములు ఏవీ నేను చూడలేదు. రామానుజులవారి గీతాభాష్యమును
నేను చూచాను. ముగ్గురు వ్రాసిన ఆచార్యత్రయ భగవద్గీతలను చూడడము
జరిగినది. కొన్ని శ్లోకములు వారివారి సిద్ధాంతములకు అనుగుణముగా
వ్రాసినా కొన్ని శ్లోకములను బయటి పండితులు వ్రాసినట్లే వ్రాశారు.
పురుషోత్తమ ప్రాప్తియోగములోని 16, 17 శ్లోకములు రెండు, ముగ్గురు
ఆచార్యుల సిద్ధాంతములకు సంబంధము లేకుండా ఉండుట వలన అక్కడ
ముగ్గురు ఆచార్యులవారు కప్పదాటు ప్రయోగము చేసి 'నలుగురితోపాటు

నారాయణ' అన్నట్లు చెప్పారు. ముగ్గురు సిద్ధాంతకర్తలే భగవద్గీతలోని
పురుషోత్తమ ప్రాప్తియోగములో బోర్లపడి ఎగిరి ఆ రెండు శ్లోకములను
దాటిపోయారంటే భగవంతుడు అక్కడ చెప్పిన విషయము ఆ ముగ్గురికీ
అర్థము కాలేదని చెప్పవచ్చును. ముగ్గురు సిద్ధాంతకర్తలకే అర్థముకాని
పురుషోత్తమ ప్రాప్తియోగములోని శ్లోకములు మిగతా పండితులకు కూడా
అర్థము కాలేదనియే చెప్పవచ్చును. మాకంటే ముందు భారతదేశములోని
అన్ని భాషలలో భగవద్గీతా శ్లోకములను దాదాపు మూడు వందల మంది
(300) వివరమును వ్రాసియుందురు. అయినా వ్రాసినవారందరూ
పురుషోత్తమ ప్రాప్తియోగములోని 16, 17 శ్లోకములవద్ద అందరూ చేసినట్లే
చేస్తూ పోయారు. ముందు వ్రాసిన సిద్ధాంతకర్తలను అనుసరించి
మిగతావారు కూడా అక్కడ కప్పదాటు ప్రయోగమునే చేశారు. అక్కడ ఆ
ప్రయోగము చేయనిది వేరుదారి లేదు. అక్కడ ఏమాత్రము సంబంధములేని
ప్రకృతిని ఉపయోగించి ఆ శ్లోకములకు వివరమును చెప్పారు.
శ్లోకములకు ప్రకృతికి ఏ విధముగా చూచినా ఎంతమాత్రము అనుబంధము
లేదు. అటువంటప్పుడు ప్రకృతిని ఉపయోగించి వ్రాయవలసిన అవసరము
ఏమి వచ్చినదని ఎవరూ ఆలోచించలేదు.

ప్రశ్న :- ముగ్గురు సిద్ధాంతకర్తలు తమతమ భావములను అక్షర రూపములో
వ్రాసి గ్రంథములను చేశారు. వారి గ్రంథములను వారికనుగుణముగా
వ్రాసికొనియుందురు. వారి సిద్ధాంతములు మీకు తెలిసిపోయినవి. కావున
వారి గ్రంథములను చూడవలసిన పనిగానీ, వాటిని ప్రస్థావించవలసిన
పనిగానీ మీకు లేదు కదా!

జవాబు :- సామాన్య మనిషికయితే మీరన్నట్లు ఏమీ పనిలేదు. దేవుడు
కూడా సామాన్యుడయివుంటే ప్రజలు ఎట్లుపోతే నాకేమియని ప్రజలకు

జ్ఞానము చెప్పియుండెడివాడు కాదు. ప్రజలకు జ్ఞానము చెప్పు బాధ్యత
దేవునికున్నది కావున ప్రజలలోయున్న అజ్ఞానమును ఎత్తి చూపి అది
సరియైన మార్గము కాదని చెప్పి సరియైన మార్గము జ్ఞానమార్గమని ప్రజలకు
జ్ఞానమును తెలిపాడు. అది దేవుని విధానముకాగా, దైవ విధానములో
దైవ సిద్ధాంతకర్తలుగా యున్నవారికి దైవజ్ఞానముతో కూడిన సిద్ధాంతములనే
బోధించుట వారి విధి. పేరుకు సిద్ధాంతములని చెప్పి బోధించు బోధలో
దైవత్వము లేకపోతే అటువంటి సిద్ధాంతములు ప్రజలను సరియైన
జ్ఞానమార్గములో నడిపించలేవు. అటువంటప్పుడు బాధ్యతకల
సిద్ధాంతకర్తలు ఆ పొరపాట్లను సర్దిచెప్పి, సవరించి బోధించవలసిన
అవసరమున్నది. అందువలన గతములో చెప్పబడిన సిద్ధాంతములను
గురించి, ఆ సిద్ధాంతకర్తలు వ్రాసిన గ్రంథములను గురించి మేము విడదీసి
చెప్పవలసిన అవసరమొచ్చినది.

ప్రశ్న :- ఎంతో గొప్ప పేరుగాంచిన సిద్ధాంతకర్తలు చెప్పిన దానిని మీరు
విమర్శించుటకుగానీ, విడదీసి చెప్పుటకుగానీ అర్హులగుదురా?

జవాబు :- అర్హత బయటికి కనిపించునది కాదుగానీ, ముగ్గురు సిద్ధాంత
కర్తలవలె నేను ఒక దైవ సిద్ధాంతకర్తనే కనుక వారిలోని తప్పు ఒప్పులను
విడదీసి చెప్పుటకు నేను అర్హుడనేయని చెప్పుచున్నాను. అర్హత అనునది
ప్రపంచ చదువుల యొక్క డిగ్రీలాంటిది కాదు. మనిషిలోయున్న జ్ఞానశక్తిని
బట్టి మనుషులలో అర్హతలు నిర్ణయింపబడును. అయితే జ్ఞానశక్తి బుద్ధికి
తెలియునది, అనుభవమునకు వచ్చునది. అందువలన మనిషిని చూస్తూనే
మనిషిలోని అర్హతను ఎవరూ గుర్తించలేరు.

ప్రశ్న :- మీరు ప్రతిపాదించిన సిద్ధాంతము గలదా?

జవాబు :- మీరు మరచిపోయారుగానీ నా సిద్ధాంతమును గురించి ముందే
చెప్పియున్నాను. అయినా ఇప్పుడు అందరికీ తెలియునట్లు చెప్పుచున్నాను
చూడండి. నా సిద్ధాంతము త్రైత సిద్ధాంతము, నా పేరు ప్రబోధానంద
యోగీశ్వరులు.

ప్రశ్న :- ఇప్పుడు అర్థమయినది మీ విషయమును గురించి మీరు ముందే
చెప్పారు. మీరు కూడా 73 గ్రంథములను వ్రాసినట్లు చెప్పారు. వంద
గ్రంథముల వరకు వ్రాస్తామని కూడా చెప్పారు. మీరు పుట్టినది రాయల
సీమయనీ, జన్మస్థలము అనంతపురము పట్టణమని కూడా చెప్పారు. మీరు
73 గ్రంథములను వ్రాశారు కదా! వాటి పేర్లను తెలియజేస్తారా?

జవాబు :- చెప్పిన విషయము జ్ఞాపకము వచ్చినందుకు సంతోషము.
మేము వ్రాసిన గ్రంథముల వివరము క్రింద తెలుపుచున్నాము చూడండి.

1) త్రైత సిద్ధాంత భగవద్గీత. 
2) ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
3) ధర్మము-అధర్మము.
4) ఇందుత్వమును కాపాడుదాము. 
5) యజ్ఞములు (నిజమా అబద్దమా) 
6) దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు
7) సత్యాన్వేషి కథ
8) మంత్రము-మహిమ (నిజమా అబద్ధమా)
9) శ్రీకృష్ణుడు దేవుడా!భగవంతుడా! 
10) గీతాపరిచయము
11) తిట్లజ్ఞానము-దీవెనల అజ్ఞానము.
12) గీతం-గీత.
13) దేవాలయ రహస్యములు.
14) ఇందూ సాంప్రదాయములు.
15) మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా)
16) జ్యోతిష్య శాస్త్రము.
17) తల్లి-తండ్రి.
18) గురుప్రార్థనా మంజరి.
19) త్రైతారాధన.
20) సమాధి.
21) కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు) 42) ప్రబోధ.
22) జనన మరణ సిద్ధాంతము
23) మరణ రహస్యము.
24) పునర్జన్మ రహస్యము.
25) త్రైతాకార రహస్యము.
26) కథల జ్ఞానము.
27) సామెతల జ్ఞానము.
28) పొడుపు కథల జ్ఞానము.
29) తత్త్వముల జ్ఞానము.
30) ఆత్మ లింగార్థము.
31) నాస్తికులు-ఆస్తికులు.
32) హేతువాదము-ప్రతివాదము
33) గుత్తా.
34) ప్రబోధ తరంగాలు.
35) త్రైత సిద్ధాంతము.
36) ప్రథమ దైవగ్రంథము భగవద్గీత.
37) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
38) ద్రావిడ బ్రాహ్మణ.
39) తీర్పు.
40) కర్మపత్రము.
41) ధర్మశాస్త్రము ఏది?
43) సుబోధ.
44) సిలువ దేవుడా?
45) మతాతీతదేవుని మార్గము.
46) దేవుని గుర్తు963.
47) మతము-పథము.
48) ప్రబోధానందమ్ నాటికలు.
49) ఇందువు క్రైస్తవుడా?
50) నిగూఢ తత్వార్ధ బోధిని.
51) జీహాద్ అంటే యుద్ధమా?
52) మూడు గ్రంథములు ఇద్దరు గురువులు.
53) దేవుని జ్ఞానము కబ్జా అయింది.
54) అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
55) వార్తకుడు-వర్తకుడు.
56) దేవుని చిహ్నము.
57) ఏది నిజమైన జ్ఞానము?
58) ప్రతిమ × విగ్రహ.
59) మరణము తర్వాత జీవితము.
60) ఏ మతములో ఎంత మతద్వేషము?
61) ప్రవక్తలు ఎవరు?
62) హిందూమతములో సిద్ధాంతకర్తలు.
63) మతమార్పిడి దైవద్రోహము.
64) త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
65) స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!
66) హిందూమతములో సిద్ధాంతకర్తలు
67) మధ్యమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
68) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు (రెండవ భాగము.)
69) బొమ్మల జ్ఞానము.
70) ప్రసిద్ధిబోధ. 
71) సుప్రసిద్ధిబోధ.
72)రూపము మారిన గీత
73)నీకు నా లేఖ.

ఇప్పటికి 73 గ్రంథములను మేము వ్రాయడము జరిగినది. ఇంకా
వ్రాయబోవు గ్రంథములు ముఫ్పైకి పైగా ఉండగలవు. మొత్తము నూరు
గ్రంథములకు పైగా ఉండగలవు. గ్రంథములు ఎవరు ఎన్ని వ్రాసినది
తెలిసినది కదా! ఈ గ్రంథముల ప్రస్తావనలో కొంత ప్రత్యేకత కలదు.
హిందూమతములో ప్రకటిత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల అద్వైతము
ఆదిశంకరునిది కాదు. అది అప్రకటిత సిద్ధాంతకర్తలయిన ఆర్యులది.
ప్రకటిత అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యులు ఒక గ్రంథమును వ్రాశాడు
అదియే ‘గీతాభాష్యము’. శంకరాచార్యులు వ్రాశాడని ప్రచారమయిన మిగతా
19 గ్రంథములు అసలయిన అద్వైత సిద్ధాంతకర్తలయిన ఆర్యులు వ్రాశారు.
ఆ తర్వాత 1500 సంవత్సరములకు వచ్చిన రామానుజాచార్యులు తొమ్మిది
గ్రంథములను వ్రాశాడు. రామానుజాచార్యుల తర్వాత వచ్చిన మధ్వాచార్యుల
వారు 37 గ్రంథములను వ్రాశాడు. ఈ విధముగా మూడు సిద్ధాంతముల
తర్వాత వచ్చిన ప్రబోధానంద యోగీశ్వరులు ఇప్పటికి 73 గ్రంథములు
వ్రాశారు.


1) ఆదిశంకరాచార్యులు  1  గ్రంథము,
2) ఆర్యులు 19 గ్రంథములు,
3) రామానుజాచార్యులు 9 గ్రంథములు,
4) మధ్వాచార్యులు 37 గ్రంథములు,
5) ప్రబోధానంద యోగీశ్వరులు - 73 గ్రంథములు.


ప్రజలను జ్ఞానమార్గములో ఉంచుటకు ఐదు రకముల మనో
భావములున్న హిందూధర్మ ప్రచారకులయిన వారు మొత్తము 139
గ్రంథములను వ్రాయడము జరిగినది. అందులో నాలుగు రకముల
మనోభావముల సిద్ధాంతకర్తలు 66 గ్రంథములను వ్రాయగా ప్రబోధానంద
యోగీశ్వరులు ఒక్కరు మాత్రము 73 గ్రంథములను వ్రాయడము జరిగినది.
ఇంకనూ వ్రాయబోతారని కూడా తెలిసినది.

ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు అను వ్యక్తి మీరే కదా!
అటువంటప్పుడు మీరు వేరయినట్లు ప్రబోధానందవేరయినట్లు మీరు
ప్రబోధానంద 73 గ్రంథములు వ్రాశాడని చెప్పుచున్నారు. మేము 73
గ్రంథములను వ్రాశామని మీరు నేరుగా చెప్పక ఒకమారు ప్రత్యక్షముగా
‘మేము” అని మాట్లాడు చున్నారు. మరొకమారు పరోక్షముగా ప్రబోధానంద
యోగీశ్వరులు ఈ పని చేశాడని చెప్పుచున్నారు. అట్లు చెప్పుట వలన
మాకు ఎవరు చెప్పునది అర్థము కాలేదు. అట్లు మీరు ప్రత్యక్షముగా
మరియు పరోక్షముగా ఎందుకు మాట్లాడుచున్నారు?

జవాబు :- మిగతావాళ్ళు ఎవరు మాట్లాడినా వారి భావములో ఒకరే
మాట్లాడుచున్నారు. కావున వారు ఒక్కరుగానే ప్రత్యక్షముగా మాట్లాడు
చుందురు. మేము అట్లు కాకుండా మాట్లాడుచున్నాము. అసలు విషయము

ఏమి అంటే! మేము మాట్లాడునది ఒక్కరు కాదు. మేము ముగ్గురము ఈ
శరీరములో యున్నాము. నేను మాట్లాడునప్పుడు ప్రత్యక్షముగా నేను అని
చెప్పుచూ మాట్లాడుచున్నాను. 'నేను' కాకుండా 'మేము'లో ఇంకొకరు
మాట్లాడునప్పుడు ప్రబోధానంద ఈ పని చేశాడని చెప్పుచున్నాము. ఈ
విషయము ఇప్పుడు మూడవమారు ప్రస్థావనకు వచ్చినది. ఇంతకుముందే
రెండుమార్లు చెప్పియున్నాను. మొదట చెప్పినప్పుడు అన్ని పనులు చేయునది
ఆత్మేనని చెప్పాను. రెండవమారు ప్రబోధానంద అను పేరు నాది కాదని
కూడా చెప్పడమైనది. ఇప్పుడు ప్రతిసారి భావమునుబట్టి మాటయుండును.
మాట్లాడు భావమునుబట్టి ఫలానా వారు మాట్లాడుచున్నారని గ్రహించ
వలసియున్నది. ఇక్కడ అర్థమయితే జ్ఞానము సంపూర్ణముగా అర్థము
కాగలదు. ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమంతయూ
అర్థమగును. త్రైత సిద్ధాంతమనగా మూడవ సిద్ధాంతమని అర్థము. మన
భారతదేశములో ఇప్పటికి ముగ్గురు సిద్ధాంతకర్తలు వచ్చి దేవుని జ్ఞానము
ప్రజలకు తెలుపు నిమిత్తము అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను
పునాదులమీద తమ జ్ఞానమును చెప్పడము జరిగినది. అయితే ప్రజలకు
ఈ మూడు సిద్ధాంతముల గురించి తెలియదు. ఆయా సిద్ధాంతములను
అనుసరించు వారికి మాత్రము ఆయా సిద్ధాంతములను గురించి తెలియును.
70 శాతము ప్రజలకు సిద్ధాంతములంటే ఏమిటో, సిద్ధాంతములు ఎన్ని
యున్నాయో, సిద్ధాంత జ్ఞానము ఏమిటో తెలియవు.

ప్రస్తుత కాలములో క్రైస్తవ మతములో 'త్రిత్వము' అను పేరు కలదు.
త్రిత్వము అనగా మూడు అని అర్థము. చాలామంది ప్రజలకు త్రిత్వమంటే
ఏమిటో ఎవరిదో తెలియకున్నా హిందూ పరిరక్షణ సంస్థలలో పనిచేయు
వారి చూపంతయూ ఇతర మతముల మీద ఉండును. కావున త్రిత్వము

అంటే మూడని అది క్రైస్తవుల ముఖ్యసూత్రమని హిందూ మత రక్షణ
సంఘములవారికి తెలుసు. అయితే ఈ త్రిత్వము గల క్రైస్తవ మతము
పుట్టినది రెండువేల సంవత్సరముల క్రింద. కలియుగములో భారతదేశ
మందు దాదాపు 2500 సంవత్సరముల క్రిందనుండి ఆధ్యాత్మిక రంగములో
సిద్ధాంతములు పుట్టుచూ వచ్చినవి. మొదట పుట్టినది అద్వైత సిద్ధాంతము,
దానికర్త ఆదిశంకరాచార్యులను విషయము తెలిసినదే. తర్వాత విశిష్టా
ద్వైత సిద్ధాంతమును రామానుజుల వారు, దాని తర్వాత ద్వైత సిద్ధాంతమును
మధ్వాచార్యులు చెప్పడమైనది. ప్రస్తుతము భూమిమీదికి ‘త్రైత సిద్ధాంతము’
వచ్చినది. త్రైత సిద్ధాంతము హిందూమతములో నాల్గవ సిద్ధాంతము.
అయితే క్రైస్తవములో త్రిత్వము కలదని తెలిసిన హిందూ సమాజముల
వారు త్రైతమంటే త్రిత్వమే కదా! క్రైస్తవులు హిందువుల ముసుగులో తమ
త్రిత్వమును త్రైతముగా హిందువులలో ప్రచారము చేయుచున్నారని
అనుకోవడము జరుగుచున్నది. దీనినిబట్టి తమ సిద్ధాంతములను, తమ
జ్ఞానమును గుర్తించలేని స్థితిలో హిందువులున్నారని తెలియుచున్నది.
గ్రుడ్డివారై తమ సిద్ధాంతములను గుర్తించలేని హిందువుల ద్వారా మాకు
కొంత వ్యతిరేఖతయున్నా త్రైత సిద్ధాంతము అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత
సిద్ధాంతములకంటే వేగముగా ప్రజలలో ప్రచారమగుచున్నది.

త్రైత సిద్ధాంతములో సిద్ధాంతమనునది శాస్త్రములో భాగముగా
యున్నదని ముందే చెప్పాము. త్రైతము అనగా మూడని అర్థము.
మూడంటూనే క్రైస్తవులు జ్ఞాపకము రాకూడదు. వారి త్రిత్వమునకు వారు
అర్థము చెప్పలేరు. త్రిత్వము అనునది వారి జ్ఞానము కాదు. త్రిత్వమనునది
వారిలోని ఒక తెగయని అర్థము. ఇక్కడ హిందూమతములోనిది ద్వైత,
అద్వైత సిద్ధాంతములవలె ప్రత్యేకమయిన సిద్ధాంతము. ఆ విషయమును

హిందువులే అదియూ హిందూ ధర్మరక్షణలో పనిచేయు హిందువులకే అర్థము
కాలేదు. కొందరికి ఇది హిందూమతములో పుట్టిన సరిక్రొత్త సిద్ధాంతమని
తెలిసినా, వారు ముందే అద్వైతములోనో, ద్వైతములోనో యుండుట వలన
త్రైతము అంటే అసూయను చూపుచున్నారు. అసూయను తెలివిగా త్రైతము
అంటే పరమతమని త్రైతప్రచారము అంటే పరమత ప్రచారమని తప్పుగా
ఆరోపణ చేయుచూ తమ వ్యతిరేఖతను చాటు కొంటున్నారు. ఏది
ఏమయినా అన్ని సిద్ధాంతములకంటే వేగముగా త్రైత సిద్ధాంతము
ప్రచారమగుచున్నది.

ప్రశ్న :- త్రైత సిద్ధాంతము ముందు వచ్చిన ద్వైత, అద్వైత సిద్ధాంతములకంటే
గొప్పదా?

జవాబు :- దేశములో ఇప్పుడు మూడు, నాలుగు రాజకీయ పార్టీలున్నవి
కదా! ఆయా పార్టీల నాయకులు వారివారి పార్టీలను గురించి గొప్పగా
చెప్పుకొందురు. ఇతర పార్టీలను గురించి చెడుగా చెప్పుదురు. ఒక పార్టీ
ఇంకొక పార్టీని తప్పు ఆరోపణలను చెప్పుచూ తమ పార్టీయొక్క మంచిని
చాటుకొనుచుండును. అలాగే ఇప్పుడున్న ఆధ్యాత్మిక సిద్ధాంతములు కూడా
అలాగే యున్నవి. ఒక సిద్ధాంతమును మరియొక సిద్ధాంతము వారు
తప్పుగా చెప్పుచూ తమ సిద్ధాంతమును మంచిగా చెప్పుకొనుచుందురు.
ఎవరు ఎట్లు చెప్పుకొనినా త్రైత సిద్ధాంతము గొప్పది. నేడు హిందూ
మతములోని సిద్ధాంతములన్నీ ఏకమై త్రైతమంటే పరమతమని, క్రైస్తవ
మతమని చెడుగా ఆరోపించుచున్నా త్రైత సిద్ధాంతము ఎంతో వేగముగా
ప్రజలలోనికి చొచ్చుకొనిపోవుచున్నది. త్రైత సిద్ధాంత జ్ఞానము తెలిసిన
ప్రతి మనిషి త్రైత సిద్ధాంతమును గురించి తనకు తానుగా ప్రచారము
చేయుచున్నాడు. ఇట్లు ఎవరికి వారు ప్రచారము చేయడము వలన

దానంతటదే ప్రచారమయి ప్రజలలోనికి పోవుచున్నది. త్రైత సిద్ధాంత
జ్ఞానము తెలిసినవారు ఇందులోని జ్ఞానమును చూచి ఇంతవరకు మాకు
తెలియని జ్ఞానము ఇప్పుడు తెలుస్తున్నదని చెప్పుచూ మరొకమాట కూడా
ఇలా చెప్పుచున్నారు. "మేము ఎంతోమంది గురువులను, బోధకులను
జ్ఞానులని నమ్మియుంటిమి, ఈ జ్ఞానము ప్రకారము చూస్తే వారికి జ్ఞానము
యొక్క వాసన కూడా తెలియదని" చెప్పుచున్నారు. కొందరు "మాకు
తెలిసిన జ్ఞానము కూడా బోధకులకు తెలియదని" చెప్పుచున్నారు. దీనినిబట్టి
త్రైత సిద్ధాంత జ్ఞానము గొప్పదని తెలియుచున్నది.

ప్రశ్న :- త్రైత సిద్ధాంతము క్రొత్తగా వచ్చినది కదా! పూర్వమునుండియున్న
ద్వైత, అద్వైతములకంటే గొప్పదని అనడములో అర్థమేమి?

జవాబు :- ఇదేదో పొగడ్తలకు చెప్పుకొను విషయము కాదు. త్రైత
సిద్ధాంతము ఈ దినములో క్రొత్తగా బయటికి వచ్చినట్లు కనిపించినా ఇది
సనాతనమైనది, అన్ని సిద్ధాంతములకంటే ముందే బయటికి వచ్చినది.
అయితే మసిగుడ్డలో దాగిన మాణిక్యమువలె ఇంతకాలము చాటుగాయుండి
ఇప్పుడే మసిగుడ్డనుండి బయటపడిన దానిలాగ ప్రకాశించుచున్నది.
నామాట సత్యమనుటకు ఒక ఆధారమును చెప్పెదను చూడండి. ప్రపంచము
సృష్ఠింపబడిన తర్వాత జరిగెడి కాలమును నాలుగు యుగములుగా దేవుడే
విభజించాడు. విభజించిన నాలుగు యుగములకు విశేషమయిన అర్థముతో
కూడిన పేర్లను పెట్టడము జరిగినది. వాస్తవముగా నేడు మనము యుగము
అను పిలుచు పదము పూర్వము అలా లేదు. పూర్వము 'యోగము' అను
పదముగా యున్నది. నేడు కాలక్రమమున మార్పుచెంది, 'యోగము'
పోయి 'యుగము' అయినది. నాలుగు యుగములలో మొదటి యుగము

పేరు కృతయుగము, రెండవ దానిపేరు త్రేతాయుగము, మూడవ దానిపేరు
ద్వాపరయుగము, నాల్గవ దానిపేరు కలియుగము. నేడు పలుకు
యుగమును పూర్వమువలె యోగము అని చెప్పితే ఇలాగయుండును.
1) కృత యోగము 2) త్రైతా యోగము 3) ద్వాపర యోగము 4) కలి
యోగము అనునవి వాస్తవమైన జ్ఞానయుక్తమైన పేర్లు. ఇందులో ఏమి
జ్ఞానమున్నదను అనుమానము లేకుండా మేము చెప్పునదేమనగా!

కృత అనగా ‘చేయబడిన’', 'సృష్టించబడిన' అని అర్థము రాగలదు.
'కృత్' అను పదమునుండి 'కృత' అను పదము పుట్టినది. మొదట
ప్రపంచము దేవునినుండి సృష్టించబడినది. దానివలన మొదటనే కృత్
అను పదమును ఉపయోగించి 'కృత్యాగము' అని అన్నారు.
"ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తలోనికి నీవు కలిసిపో”, “నిన్ను తయారు
చేసిన దేవునిలోనికి నీవు ఐక్యమైపో” అను అర్థమొచ్చునట్లు 'కృత్యాగము'
అని అన్నారు. యోగము అనగా 'కలయిక' అని అర్ధము. సృష్టికర్తయిన
దేవునిలోనికి కలిసిపొమ్మని చెప్పడమే కృత్ యోగము యొక్క అర్థము.
ఈ విధముగా మొదటి కాలము పేరును 'కృత్యాగము' అని చెప్పడము
జరిగినది. కాలము అనగా దేవుడు అని అర్థము. అందువలన కాలము
యొక్క నాలుగు భాగములకు దేవుని జ్ఞానమునే అతికించడమయినది.

రెండవ యుగమును త్రేతాయుగము అని చెప్పారు. వాస్తవముగా
దానిపేరు త్రైతాయోగము. అయితే నేడు త్రైతా అను పదము త్రేతాగా
మారిపోయినది. త్రై క్రింద గల ఒక గుర్తు పోవడము వలన, కాలక్రమములో
లేకుండా పోవడము వలన 'త్రై' అను శబ్దము 'త్రే' అను శబ్దముగా
మారిపోయినది. పూర్వము త్రైతాయోగముగాయున్నది. నేడు త్రేతా

యుగముగా మారిపోయినది. 'త్రైతా' అను పదమునకు మూడు అని
అర్థముగలదుగానీ, త్రేతా అను పదము అర్థములేనిది. కాలగమనములో
మారిపోయిన అర్థములేని పదమును ఇప్పటినుండి అర్ధమున్న పదముగా
అందరూ ‘త్రైతా' అని పిలుచుకుందాము. త్రైతాయోగము అను పదములో
"మూడుగాయున్న దేవునిలోనికి కలిసిపో” అని అర్థము. త్రైత సిద్ధాంతమునకు
త్రైతాయోగమునకు దగ్గర సంబంధమున్నట్లు తెలియగలదు. నేడు క్రొత్తగా
కనిపించిన సిద్ధాంతమయినా త్రైత సిద్ధాంతము ప్రాచీనమైనదని అన్నిటికంటే
మొదటిదని చెప్పవచ్చును.

ఇకపోతే నాలుగు యుగములలో రెండు యుగముల వివరము
తెలిసినది. కాలములో మూడవ యుగముపేరు ద్వాపర యోగము అని
కలదు. యోగము అంటే 'కలయిక' అని తెలుసు. ద్వాపర అనగా ద్వా
అంటే రెండు అని అర్ధము. పర అంటే వేరని అర్థము ద్వాపర అనగా
రెండు కానిది మూడని అర్థము. త్రైతాయోగమునకు ఏ అర్థము కలదో
అదే అర్థము ద్వాపర యోగములో కూడా కలదు. మూడుగాయున్న
దేవునిలోనికి కలిసిపొమ్మని అర్ధమునిచ్చు పదముగా ద్వాపర యోగము
కలదు. ఇక్కడ చిన్న వివరణ ఏమనగా! ద్వాపర అనగా రెండు కానిది
అని అర్థము కదా! రెండుకానిది మూడని చెప్పకుండా ఒకటిని చెప్పవచ్చును
కదా! అని ఎవరయినా అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
శూన్యము అనగా గణితశాస్త్రములో సున్నా అని అర్థము అశూన్యము
అనగా సున్నాకానిది ఒకటి అని చెప్పాలి. ఎప్పటికయినా ముందున్న
అంకెనే చెప్పవలెను. సున్నాకు వెనుక ఏమీలేదు కావున అశూన్యము
అనగా సున్నా కానిది ఒకటి అని చెప్పవలసియుండును. ఒకవేళ అదే
పదమునే ఇంకొక రకముగా శూన్యపర అని చెప్పితే సున్నకంటే వేరయినది

ఒకటి అని చెప్పవచ్చును. ఇలా ముందు అంకెనే చెప్పవలెనుగానీ, వెనుక
అంకెను చెప్పుటకు వీలులేదు. సున్నాకంటే వెనుక ఏదీలేదు కావున
ఎప్పుడయినా గణితము ప్రకారము ముందుకే చెప్పాలి. దానిప్రకారము
అద్వైతము అనగా రెండుకానిది మూడు అని చెప్పాలి. అయితే దానిని
సిద్ధాంతకర్తలే తప్పుగా చెప్పుకొన్నారు. రెండుకానిది ఒకటి అన్నారు.
ఒకటిని గురించి చెప్పవలసి వస్తే అశూన్య అనియు లేక శూన్యపర
అనియు చెప్పవచ్చును. మూడును గురించి పరోక్షముగా చెప్పాలంటే
'ద్వాపర' అని చెప్పాలి. ప్రత్యక్షముగా చెప్పాలి అంటే 'త్రైత' అని చెప్పాలి.

దేవుడు ప్రజలను, సమస్త విశ్వమును సృష్టించువాడేకాక నాశనము
చేయువాడు కూడా. అందువలన దేవున్ని ఒక విధముగా 'సృష్టికర్త' అనియు
మరొక విధముగా ‘ప్రళయకర్త' అనియు చెప్పవచ్చును. సృష్టికర్త అనుటకు
ఆధారముగా కృత్ అను పేరును కాలమునకు పెట్టడమైనది. ప్రళయకర్త
అనుటకు గుర్తుగా కలియుగము అను పేరును పెట్టడమైనది. కలి అనగా
నాశనము అని అర్థము కావున నాశనము చేయు దేవునిలోనికి ఐక్యము
కామని చెప్పు వాక్యముగా కలియోగము అని చెప్పడమైనది. ఈ విధముగా
నాలుగు యోగముల (యుగముల) పేర్లను పెట్టడమైనది. మనిషి మొదట
పుట్టి తర్వాత కొంతకాలమునకు చనిపోవడము జరుగుచున్నది. జనన
మరణముల మధ్యనున్నది మనిషి జీవితము. మనిషివైన నీ జీవితములో
పుట్టినప్పటినుండి చనిపోవువరకుయున్న జీవితకాలములో నీముందు, నీ
వెనుకయున్న దేవున్ని తెలుసుకో, ఆయనలోనికి కలుసుకో అని చెప్పుటకు
ఒకే దేవున్ని మొదట ప్రత్యక్షముగా 'త్రైత' అని చెప్పి రెండవమారు
పరోక్షముగా 'ద్వాపర' అని చెప్పడమైనది. అట్లు రెండు విధముల త్రైత,
ద్వాపర అని చెప్పడమునకు కారణము నీముందు, నీవెనుక రెండు రకముల

దేవుడుండుట వలన అలా రెండు రకముల చెప్పవలసివచ్చినది. అలా
నాకు ముందున్నవాడు, నాకు వెనుకున్నవాడు వానికి మధ్యలో నేను
ఉండుట వలన ఎవరు ఎప్పుడు మాట్లాడునది నీకు అర్థము కాలేదు.

ఇదంతా చెప్పుటకు కారణము త్రైత సిద్ధాంత జ్ఞానము గొప్పదని
చెప్పుటకు ఆధారముగా కాలమును గురించి చెప్పాము. అంతేకాక దీనివలన
త్రైతము పూర్వమునుండి ఉన్నదని ఎవరికయినా అర్థము కాగలదు.
అంతేకాక పుట్టిన తర్వాత చావువరకు ఒక త్రైతము తప్ప వేరే లేదని
చెప్పుటకు మొదట త్రైతమని ప్రత్యక్షముగా, ద్వాపరమని పరోక్షముగా
చెప్పడము జరిగినది. మూడు తప్ప ఏదీ లేదు. అందువలన ద్వైత
సిద్ధాంతము అనునది సిద్ధాంతము కాదు. అట్లే అద్వైత సిద్ధాంతమనునది
కూడా సిద్ధాంతము కాదు. ఒక త్రైత సిద్ధాంతము తప్ప మిగతావి
సిద్ధాంతములే కావు అన్నట్లు కాలమునకు పెట్టిన నాలుగు పేర్లలో
మధ్యలోయున్న రెండిటికి త్రైత అనియు, ద్వాపర అనియు చెప్పడమైనది.
మిగత కలి, కృత పేర్లవద్ద అద్వై, ద్వైత పేర్లను పెట్టవచ్చును. అయితే
అవి సిద్ధాంతములు కావు కనుక వాటి ప్రస్థావన అక్కడ రాలేదు.
ప్రశ్న :- అద్వైతము అనగా రెండుకానిది మూడు అని మీరు చెప్పినట్లు
ముందు అంకెను తీసుకొంటే తెలియుచున్నది. అద్వైతమంటే ఒకటే అని
వారు ప్రచారము చేసుకొన్నారు. అద్వైతమును పద్ధతి ప్రకారము ఏమనాలి?
జవాబు :- అద్వైతము అంటే రెండు కానిది మూడని అర్థము రాగలదు.
చెప్పినమాట ఒకటికాగా, వారి హృదిలోని భావము మరొకటి. అప్పుడు
వారి భావము ప్రకారము అద్వైతము అనుమాటే తప్పగును. వారు అలా
అద్వైతము అని చెప్పకుండా ప్రత్యక్షముగా ఏకము అని చెప్పియుండ

వలసింది. అలాకాకపోతే అశూన్య అనియో శూన్యపర అనియో చెప్పి
యుండవలసింది. ఇంతగా ప్రచారమైపోయి, ఇన్ని సంవత్సరములు గడచిన
తర్వాత ఇప్పుడు పేరును మార్చుకొనుటకు వీలుపడదు. వారు ఎంత
కాలమున్న సక్రమముకాని పేరుతోనే అక్రమమైన పేరుతోనే చలామణి
కావలసిందే. అద్వైతమంటే రెండుకానిది మూడు కదా! అని ఎవరడిగినా
దానికి సరియైన సమాధానమును చెప్పలేరు.

ప్రశ్న :- మీరు ఇప్పటికి ముందువచ్చిపోయిన సిద్ధాంతకర్తలకంటే ఎక్కువ
గ్రంథములను వ్రాశారు. ఇంక వ్రాయబోతామన్నారు. త్రైత సిద్ధాంతమును
గురించి ఒక గ్రంథములో వ్రాసినా సరిపోతుంది కదా! ఎక్కువ గ్రంథములను
ఎందుకు వ్రాయాలి?

జవాబు :- మేము వ్రాసిన గ్రంథములన్నియు త్రైత సిద్ధాంత ఆధారముతోనే
యున్నవి. అన్ని గ్రంథములలో చెప్పబడిన జ్ఞానము త్రైత సిద్ధాంతమును
ఆధారము చేసుకొని చెప్పినదే. అన్ని గ్రంథములలోనూ త్రైత సిద్ధాంతమును
చెప్పలేదు. ఆ సిద్ధాంత ఆధారముతో అనేక విధముల జ్ఞానమును చెప్పాను.
మీకు ప్రతి గ్రంథములోనూ క్రొత్త విషయమును తెలుపాలను ఉద్దేశ్యముతో
జ్ఞానమును అనేక విధముల అర్థమగుటకు అనేక పేర్లతో గ్రంథములు
వ్రాసి చెప్పడమైనది.

ప్రశ్న :- మిగతా ముగ్గురు సిద్ధాంతకర్తలు మొత్తము 66 గ్రంథములను
వ్రాశారు కదా! వారి గ్రంథములకంటే ఎక్కువ జ్ఞానమును మీ గ్రంథములు
తెలిపాయా? ఒకవేళ వారికంటే ఎక్కువగా తెలిపినవనుకున్నా, వారి
గ్రంథములు కూడా మీకంటే తక్కువ అయినా కొంతయినా జ్ఞానము
చెప్పియుండును కదా! మీరు విద్యలోగానీ, సంస్కృత పాండిత్యములో

గానీ వారికంటే అన్ని విధముల తక్కువగా యున్నవారే. అటువంటప్పుడు
మీరు వారికంటే ఎక్కువ జ్ఞానమును చెప్పారని అంటే అది నమ్మదగిన
మాటయేనా? ఆదిశంకరాచార్యుడు అంటే ఎంతో గొప్పవాడని దేశమంతా
అనుకుంటున్నారు. మిగతా రామానుజుల వారి చరిత్ర ఎంతో గొప్పగా
యున్నది. మధ్వాచార్యులవారు ఎంతో గొప్ప పండితుడని తెలిసినది.
ఇంతపెద్ద ఉద్ధండ పండితులయిన వారు, సిద్ధాంతకర్తలయినవారు ఎంతో
తెలివితో వ్రాసిన గ్రంథములకంటే మీ గ్రంథములలో జ్ఞానము ఎక్కువ
యున్నదని మీరు చెప్పుకొనినా మేము నమ్ముటకు మీవద్ద ఏదయినా
ఆధారము గలదా?

జవాబు :- ఆధారము చూపి మిమ్ములను నమ్మించవలసిన అవసరము
నాకు లేదుగానీ, నా జ్ఞానమును ఎవరు చూచినా నేను చెప్పిన మాటను
వారే చెప్పగలరు. నన్ను ప్రశ్నించువారే నా తరపున మాట్లాడు స్థోమత
నిచ్చు నా జ్ఞానమును గురించి నేను గొప్పగా చెప్పుకోవలసిన పనిలేదు
కదా! గ్రంథములను ఎవరు వ్రాయగలరో వారిని అనుసరించి గ్రంథములలో
శక్తియుండును. మనిషిలో పంచభూతములుగాయున్న ప్రకృతి కలదు.
అనగా ఐదు భాగములుగా గల ప్రకృతితో శరీరము నిర్మాణమైయున్నది.
ప్రకృతి నిర్మాణముతో తయారైన శరీరములు, శరీరములో చైతన్యముగా
మూడు భాగములుగాయున్న ఆత్మలు గలవు. ఈ విషయము భగవద్గీతలోని
పురుషోత్తమప్రాప్తి యోగములో చెప్పబడినది. తర్వాత భగవద్గీతను
అనుసరించి దైవగ్రంథములుగా తయారయిన బైబిలు, ఖురాన్ గ్రంథములలో
కూడా ఇదే మూడు ఆత్మలను గురించి చెప్పడమైనది. భగవద్గీతలో చెప్పిన
మూడు ఆత్మలలో ఇప్పుడు నీతో మాట్లాడినట్లు వ్రాయుచున్న నేను ఒక్కనిని

మిగతా ఇద్దరు కలరు. మాట్లాడువానిని నేను ఎవరయినది నేను
చెప్పకూడదు. అది నీవు గ్రహించుకోవలసిన సమస్య. నేను కాక
ఇద్దరున్నారు కదా! వారిలో ఒకడు ఉలకడు పలుకడు ఎప్పుడూ మాట్లాడడు,
ఎప్పుడుగానీ ఏమీ చేయడు. ఇంకొకడు నన్ను ప్రక్కన పెట్టి తనే మాట్లాడును
తనే చేయును.

ఈ విధముగా చెప్పితే ఏమీ అర్థము కాకపోవచ్చును. అందువలన
ముగ్గురి పాత్ర ఎలాగుండునో ప్రత్యక్ష అనుభవము ద్వారా తెలియునట్లు
ఒక మనిషి శరీరములో జరిగిన సంఘటనలలో ఏ ఆత్మ ఎట్లు ప్రవర్తించినదో
కొంత వివరముగా తెలుసుకొందాము. క్రీస్తు శకముకంటే ముందు, క్రీస్తు
శకముకంటే వెనుక పుట్టిన ఒక వ్యక్తిలో జరిగిన మూడు ఆత్మల పనిని
ఒకమారు గమనిద్దాము. A.D కంటే ముందు B.C కంటే వెనుకనున్న
వ్యక్తిని గురించి చెప్పుచున్నాము అనగా A.D గానీ B.C గానీ అతనికి
వర్తించదు. ఆ రెండిటికీ మధ్యలో బ్రతికిన వ్యక్తిలో జరిగిన ఆత్మల పనిని
సూచనగా చెప్పుకొందాము.

ప్రశ్న :- ఒక్క నిమిషము ఆగండి! మీరు చెప్పుతూపోతే మీవెంటే వింటూ
వచ్చేదానికి మేము గొర్రెలము కాదు. మా ప్రశ్నకు జవాబును చెప్పిన
తర్వాత మీరేమి చెప్పగలరో అప్పుడు వింటాము. A.D కి B.C కి మధ్య
అంటే దాదాపు 2016 సంవత్సముల ముందు అన్నమాట A.Dకి B.Cకి
(ఎడి కి బిసి కి) మధ్యలోని కాలము కేలము 33 సంవత్సరములే అంటే
ఏసు ప్రభువు బ్రతికియున్న కాలము అన్నమాట. అప్పటికాలములో భారత
దేశము యొక్క జనాభా ఖచ్చితముగా 30 కోట్లు. ఇజ్రాయెల్ దేశములో
అయితే మూడు (3) కోట్లు మాత్రమే, ఇజ్రాయెల్ పాలస్తీనా కలిసియున్న

కాలమది. రెండు దేశములు కలిసినా మూడుకోట్లకంటే మించిన జనాభా
లేని దేశమది. మీరు ఏ దేశములోని వ్యక్తిని గురించి చెప్పినా అంత
జనాభాలో ఎవరిని గురించి చెప్పుచున్నారో నీకు తెలుసునా అన్నది మా
మొదటి ప్రశ్న? 2016 సంవత్సరముల పూర్వము ఒక మనిషిలో జరిగిన
విషయము ఇప్పుడు మా ముందరున్న నీవు ఎలా చెప్పగలవు ఇది మా
రెండవ ప్రశ్న? ఈ రెండు ప్రశ్నలకు జవాబు దొరికిన తర్వాత మీరు చెప్పే
దానిని వినగలము. ముందు మా రెండు ప్రశ్నలకు జవాబులు చెప్పండి
చూద్దాము?

జవాబు :- వినే ఎదుటి మనిషి ప్రశ్న అడిగినప్పుడే చెప్పే విషయమును
జాగ్రత్తగా వింటున్నాడని చెప్పే వానికి అర్థము కాగలదు. నీవు జాగ్రత్తగా
వింటున్నావు కావున ప్రశ్నించుచున్నావు. నీవు ప్రశ్న అడుగడము మాకు
సంతోషమే. మీ మొదటి ప్రశ్నకు జవాబు ఏమనగా! నేను ఎవరిని గురించి
చెప్పుచున్నానో నాకు బాగా తెలుసు. ఇక్కడ ఏ వ్యక్తి అనునది ముఖ్యము
కాదుగానీ, ఆ వ్యక్తిలో ఏమి జరిగినదని తెలియడమే ముఖ్యము. నేను
ఇప్పుడు ఫలానా వ్యక్తిని గురించి చెప్పుచున్నానని చెప్పినా ఆ వ్యక్తి ఎవరో
నీకు తెలియదు కదా! అప్పుడు ఎవరు ఎక్కడున్నది నీకు తెలియదు కావున
ఆ వ్యక్తి ఎవరు? అని అడిగిన ప్రశ్నద్వారా దాని జవాబు ద్వారా మీకు
ఏమీ లాభము లేదు. శరీరములో జరిగిన ఆత్మల పనిని గురించి చెప్పినా
చెప్పినది వినవలసిందేగానీ శరీరములో ఏమి జరుగునది కూడా మీకు
తెలియదు. ఇకపోతే నేను మీకు ఎలా అప్పటి విషయమును చెప్పు
చున్నాననునది ముఖ్యమైన ప్రశ్న. ఆ జవాబు అందరికీ అవసరమే కావున
చెప్పవలసిన బాధ్యత కూడా మాకు కలదు. ఈ విషయమును ఎంతో
పరిశోధనా బుద్ధితో, విచక్షణా శక్తితో చూడవలసియుంటుంది. అట్లు

కాకుండా మీది తూర్పయితే మాది పడమర అను విధానముతో అడ్డగోళు
గా మాట్లాడకూడదని ముందే చెప్పుచున్నాము. అట్లు మాట్లాడితే మాకు
ఏమీ నష్టము, కష్టము రాదుగానీ, మాట్లాడిన వారికి కనిపించని నష్టము
కష్టము చేకూరును. అందువలన జాగ్రత్తగా వినండి. అవసరమొస్తే
ప్రశ్నించండి. అట్లని అవసరము లేనిచోట ప్రశ్నించడము కూడా మంచిది
కాదు.

దాదాపు ఇప్పటికి 2016 సంవత్సరముల పూర్వము ప్రత్యేకమయిన
ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశములోనే యుండెను. ఆ వ్యక్తిలో మాత్రమే
మూడు ఆత్మల పనియున్నట్లు తెలిసినది. అప్పుడుగానీ ఇప్పుడుగానీ ఎందరో
మనుషులున్నారు. అయితే అందరిలోనూ మూడు ఆత్మలున్నా అందరి
లోనూ మూడు ఆత్మలు పనిచేయలేదు. అందరిలో రెండు ఆత్మల పనియే
లెక్కించ బడుచున్నది. మూడు ఆత్మలలో మూడవదయిన పరమాత్మ
యనబడు ఆత్మ ఏమీ చేయక అందరిలో ఊరకయుంటున్నది. మూడవ
ఆత్మ అరుదుగా తానున్నానను నిరూపణకొరకు అరుదుగా కొన్ని వేల
సంవత్సరములకో లేక కొన్ని లక్షల సంవత్సరములకో ఎక్కడో ఒక వ్యక్తి
శరీరములో మాట్లాడుట జరుగుచున్నది. ఇప్పటికి మాకు తెలిసినంతవరకు
ద్వాపరయుగము చివరిలో ఒకమారు కలియుగము వచ్చిన తర్వాత ఒకమారు
మూడవ ఆత్మ మాట్లాడడము జరిగినది. యుగమునకు ఒక్కమారు తన
విధానమును, తన జ్ఞానమును దేవుడు నిరూపించుకొనును. అన్ని
శరీరములలో నిత్యము రెండు ఆత్మల పనులు నమోదవుచున్నవి. అయితే
ఎక్కడగానీ, ఎవరిలో గానీ కదలని మెదలని మాట్లాడని మూడవ ఆత్మ
అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు ఎవరిలోనో ఒకరిలో మాట్లాడును. అప్పటి
విషయమునే నేను ఇప్పుడు చెప్పుచున్నాను. నేను ఈ విషయమును


చెప్పుటకు ముందు నీకెలా తెలియునో చెప్పమని అడిగారు, దానికి జవాబును
చూడండి.

నేను కూడా అందరిలాగా శరీరమును ధరించియున్న ఒక మనిషిని.
నాకు ప్రకృతితో కూడుకొన్న శరీరమున్నా అది జఢమైనది, చైతన్యము
లేనిది. నా శరీరములో నేనుకాక నా వెనుక ఒకరు, నాముందు ఒకరు
ఇద్దరున్నారు. నేను ఒక ఆత్మనుకాగా మిగతా రెండు ఆత్మలు శరీరములోనే
గలవు. నా శరీరములోన గల మూడవ ఆత్మ ఏమాత్రము కదలక మెదలక
ఊరకయున్నది. అయితే పూర్వము మూడవ ఆత్మ కదలి మాట్లాడిన
శరీరములో కూడా మూడు ఆత్మలే ఉండుట వలన నాకు అక్కడ ఏమి
జరిగినదో తెలుసుకొనుటకు సులభతరమైనది. అందరిలోనూ ఆత్మల
విధానములో ఒకే విధముగా యున్నా వారికి మూడు ఆత్మల జ్ఞానము
గురించి తెలియదు. నాకు ప్రత్యేకించి మూడు ఆత్మల జ్ఞానము తెలియుట
చేత, అందులో ఒక ఆత్మచేత అన్ని శరీరములలోని ఆత్మలతో సంబంధము
ఏర్పరచుకోవచ్చును. నా ఆత్మ పూర్వము మూడు ఆత్మలు పనిచేసిన
శరీరములోని ఆత్మతో సంబంధము ఏర్పరచుకోవడము వలన అప్పుడు
ఆ శరీరములో ఏమి జరిగినదో మూడవ ఆత్మ ఏమి మాట్లాడినదో
సులభముగా తెలియుచున్నది. నాకు తెలిసిన ఈ పని ఆత్మజ్ఞానము తెలియ
గలిగితే నీకు కూడా సులభమేయగును.

2016 సంవత్సరముల పూర్వము ఒక వ్యక్తిలోని ఒక ఆత్మ ఆ
శరీరములో ఎదురయ్యే కష్టాలను పూర్తిగా అనుభవిస్తూ బాధపడింది. ఎక్కువ
నడుచుట వలన కాళ్ళలో నొప్పులను అనుభవించేది. కాలికి చెప్పులు
లేని దానివలన కాలికి ముళ్ళుగ్రుచ్చుకోగా దానివలన ఆ శరీరములోని
ఒక ఆత్మ బాధపడుచున్నప్పుడు ఇంకొక ఆత్మ చూస్తూయుండగా, మరియొక

ఆత్మ ఓదార్చుచుండెడిది. ఇదంతా నీ శరీరములో కూడా జరుగుచున్నది.
నీవు బాధను అనుభవించుచుండగా, నీలోని ఒక ఆత్మ చూచుచుండగా,
మరియొక ఆత్మ నిన్ను ఓదార్చుచున్నది. అనుభవించే వానివి నీవే అని
నీకు అర్థమయినా, చూచేవాడు ఎవడో, ఓదార్చేవాడు ఎవడో నీకు తెలియదు.
నీకే కాదు ఎవరికీ తెలియదు. అయితే నాకు బాగా తెలుసు ఎవడు
చూస్తున్నాడో, ఎవడు అనుభవించుచున్నాడో, ఎవడు ఓదార్చుచున్నాడో
ముగ్గురు నాకు తెలుసు. ఆ ముగ్గురిలో నేను ఎవరో కూడా నాకు బాగా
తెలుసు. అందువలన పూర్వము 2016 సంవత్సరములప్పుడు బాధను
అనుభవించిన ఆత్మ ఒకటికాగా, అతని శరీరములో మిగతా రెండు ఆత్మలలో
ఒకటి ఎల్లప్పుడు పనిచేయుచుండగా, మూడవ ఆత్మ ఏ పని చేయక
ఊరకున్నది. ఒక దినము ఆ వ్యక్తికి కాలిలోనూ, చేతిలోనూ ముల్లులు
గ్రుచ్చుకోగా చాలా బాధపడినాడు. అదే వ్యక్తి ఒకనాడు భయంకరముగా
చెలరేగిన తుఫానును ఆగిపొమ్మనగా అది ఆగిపోయింది. ముల్లుకు
బాధపడిన వ్యక్తి తనకంటిలో దుమ్ముపడిందని తుఫానును ఎలా అదుపు
చేయగలిగాడు? అతను ఆగిపో అంటూనే తుఫాను ఎందుకు ఆగిపోయినది?
అను ప్రశ్నలు రాకతప్పవు. వాటికి జవాబును చూస్తే ఇలా కలదు.

ఆ వ్యక్తిలోని కదలక మెదలకయున్న మూడవ ఆత్మ తుఫాను
సమయములో మాత్రము మాట్లాడి తుఫానును అణిగిపొమ్మని ఒకే ఒకమాట
చెప్పినది. అప్పుడు ప్రకృతి అయిన తుఫాను మూడవ ఆత్మమాటను
ఆలకించి వెంటనే ఆగిపోవడము జరిగినది. మూడవ ఆత్మకు మొత్తము
ప్రపంచమే ఆధీనములో యున్నట్లు, మూడవ ఆత్మమాటకు ప్రకృతి
యంతయూ తలొగ్గి పని చేయునని తెలియుచున్నది. అన్నిటికీ పెద్ద,
అన్నిటినీ అదుపు చేయువాడు దేవుడే అయినందున మన శరీరములో

మూడవ ఆత్మగా యున్నవాడు దేవుడే అని తెలియుచున్నది. 2016
సంవత్సరములప్పుడు మాట్లాడిన మూడవ ఆత్మ ద్వాపరయుగము చివరిలో
శ్రీకృష్ణుని శరీరమునుండి మాట్లాడినది. ఏకముగా అర్జునునితో మాట్లాడి
తన ఉనికిని ప్రజలకు తెలియునట్లు చేసినది. ఆ మూడవ ఆత్మనే మనము
'దేవుడు' అంటున్నాము. మూడు ఆత్మల విషయము ఆ మూడు ఆత్మలలోని
ఒక ఆత్మతో సంబంధము ఏర్పరచుకోవడము నాకు తెలుసు కావున అప్పటి
రెండవ ఆత్మతో సంబంధము ఏర్పరచుకొని అక్కడ ఏమి జరిగినది ఎవరు
జరిపినది తెలుసుకొన్నాము. ఆ విషయమునే ఇక్కడ తెల్పుచున్నాను.
ప్రబోధానందయోగీశ్వరులు అనబడు శరీరములో రెండవ ఆత్మగాయున్న
నేనే సర్వజీవరాసుల శరీరములలో రెండవ ఆత్మగా యున్నాను. అందరిలో
మాట్లాడనివాడు దేవుడయితే నేను మాట్లాడువానిగా యున్నాను.
“ప్రబోధానంద యోగీశ్వరులు అను శరీరము నాదే. నా శరీరములో
జీవుడు కూడా యున్నాడు. అయితే ఎల్లప్పుడూ నేను మాట్లాడక
అప్పుడప్పుడు మీతో జీవాత్మగాయున్న వానినే మాట్లాడమని చెప్పుచుందును.
అతను అనగా జీవాత్మ నా ఆజ్ఞచే మాట్లాడుచుండును. అయితే ప్రబోధానంద
యోగీశ్వరుల శరీరమునుండి నేను ఎప్పుడు మాట్లాడుచుందునో, నా ప్రక్కన
గల జీవాత్మ ఎప్పుడు మాట్లాడుచుండునో ఎవరికీ రవ్వంత కూడా తెలియదు.
ఒక్కొక్కప్పుడు నేను మాట్లాడేటప్పుడు 'నేను' అని తెలియక నాతో వాదించి,
నన్ను హేళనగా మాట్లాడిన వారు కూడా కలరు. వారి శరీరములో వారి
ప్రక్కనయుండేది నేనేనని, వారి జుట్టు నాచేతిలో యున్నదని వారికి
తెలియదు.

సర్వ శరీరములలో మూడు ఆత్మలున్నాయని నా శరీరములోని
జీవాత్మతో చెప్పించాను. మొదట చెప్పినది నేనే కాగా తర్వాత చెప్పినది


నా ప్రక్కనగల జీవాత్మ. జీవాత్మ అయినవాడు మాట్లాడుటకు చేతకానివాడు.
అట్లే ఏ పనిని చేయలేని వాడుగాయున్నాడు. అయితే జీవాత్మ భావములను
తెలిసి ఆ భావములను నేనే చెప్పినా అది నేను చెప్పినట్లు లెక్కించబడదు.
భావము అతనిది కనుక అతనే ఆ మాట మాట్లాడినట్లు లెక్కించబడును.
అట్లే జీవాత్మగా యున్నవాడు ఏ పనిని కూడా చేయలేనివాడు. వానికి
కాళ్ళు చేతులు, ముక్కు, ముఖము ఏదీ లేదు. జీవుడు గుండ్రని
ముద్దగాయున్నాడు. అటువంటి వాని భావములను నేనే స్వీకరించి ఆ
భావముల ప్రకారము వాని పనిని నేనే చేయుచున్నాను. పని నేనే చేసినా
భావము జీవునది కనుక ఆ పనిని జీవుడు చేసినట్లే లెక్కించబడుచున్నది.
కొన్ని విషయములలో దేవుని భావము ప్రకారమే నేను పని చేసినా, ఆ
పనులను నేనే స్వయముగా పనిచేసినట్లు లెక్కించబడును. నా శరీరములోని
జీవాత్మకు ఆత్మల జ్ఞానము తెలియుట వలన నా భావములనే అతడు
పొందియుండుట చేత అప్పుడు అతని కర్మ ప్రకారమే నేను చేసినా అప్పుడు
అతనికి కర్మలు అంటవు.”


"ప్రపంచములోని మిగతా ప్రజలలోని జీవుళ్ళు అజ్ఞాన భావమును
పొందియుందురు. జీవుడు భావములు కల్గియుండువాడేగానీ స్వయముగా
పనులు చేయుటకు శక్తిగానీ, శరీర అవయవములుగానీ అతనికి లేవు.
అందువలన వాని భావము ప్రకారము నేనే పనిని చేయుచున్నాను.
పనిని నేను చేసినా భావము జీవాత్మదే అయివుండుట వలన ఆ పని
జీవుడు చేసినట్లగును. అజ్ఞాన జీవుల భావములు అజ్ఞానముతోనే కూడు
కొనియుండుట వలన, అతని లెక్కలోనికి చేరిన పనులు కూడా అజ్ఞానము
తోనే కూడుకొనియుండును. అటువంటి అజ్ఞాన పనులలో కూడా కొన్ని
మంచి పనులు ఉండును, కొన్ని చెడు పనులు యుండును. మంచి పనుల

వలన వచ్చు ఫలితములో పుణ్యము వచ్చుచున్నది. చెడు పనుల వలన
వచ్చు ఫలితములో పాపము వచ్చుచున్నది. ఈ విధముగా నేను చేసిన
పనులలోని ఫలితములు జీవున్ని చేరుచున్నవి. అయితే జీవుని భావమునకు
సంబంధము లేకుండా నేను స్వయముగా చేయు పనులు అనేకము గలవు.
వాటివలన నాకు ఎటువంటి పాపము రాదు. ఎటువంటి పుణ్యము రాదు.
ప్రతి కార్యములోనూ అగ్నికి పొగ అంటుకొనియుండునట్లు పాప పుణ్యములు
అంటుకొనియుండును. అయితే కర్మలు (పాపము+పుణ్యము) అంటని
విధానము నాకు తెలుసు కావున నాకు ఎటువంటి పనిలోని పాపముగానీ,
పుణ్యముగానీ అంటదు. ఈ విధముగా శరీరములో నేను యుంటూ
నాతోపాటు జీవాత్మయుండగా, మా ఇద్దరితోపాటు పరమాత్మ కూడా
శరీరములోనే యున్నాడు. వాస్తవముగా శరీరములో అందరియందు జరిగే
విధానము, ఉండే నిర్మాణము, ఇలానే కలదు.”

"ఈ ఆత్మల విషయము ఎవడు తెలుసుకొనునో వాడు ఆత్మజ్ఞాని
అనబడును. అయితే నేడు ప్రపంచములో ఆత్మల విధానము తెలిసినవారు
చాలా అరుదుగాయున్నారు. ఒక విధముగా లేరనియే చెప్పవచ్చును.
హిందూ మతములో పెద్ద జ్ఞానులనిపించుకొన్న సిద్ధాంతకర్తలకే శరీరములోని
ఆత్మల విషయము, శరీరములోనే యున్న దేవుని విషయము తెలియక
ఒకరు అద్వైతమంటే మరొకరు విశిష్టాద్వైతమన్నారు. ఇంకొకరు
ద్వైతమన్నారు. వారి తర్వాత జ్ఞానులుగా వచ్చినవారు, గురువులుగా
ప్రకటించుకొన్నవారు, బోధకులుగా చెప్పుకొన్నవారు బయట దేవతలను
ఆధారము చేసుకొని వారి భక్తిని దేవతల మీద చూపుచున్నారు. ఎవరికి
కూడా శరీరములోనే జ్ఞానమంతా కలదని అనుకోవడము లేదు. ఆత్మలని
పేరుకు అనినా ఆత్మంటే దయ్యమని అనుకొనువారు గలరు. ఆత్మల

జ్ఞానము అంటే దయ్యాల జ్ఞానము అనువారు గలరు. మొత్తము మీద
ఆధ్యాత్మికములో సిద్ధాంతకర్తలను వారినుండి ఎవరికి ఆత్మజ్ఞానము
తెలియదు. కనుక నా దృష్ఠిలో ఎవరూ ఆత్మజ్ఞానులు కాదు. ఆత్మజ్ఞానము
ఏమాత్రము లేని ఇటువంటి సమాజములో నేనే స్వయముగా తెలుపాలని
అనుకొన్నాను.

నేను అనుకొన్న పనిని వెంటనే చేయువాడను గనుక నా శరీరము
ద్వారా నేనే మూడు ఆత్మల విషయమును తెలియజేశాను. నా శరీరములో
జాగ్రత్తగా నా పనులను, నా మాటలను గమనించుచున్న జీవాత్మకు మూడు
ఆత్మల విషయము తెలిసిపోయినది. అందువలన నా ప్రక్కనగల జీవాత్మ
కొన్ని సందర్భములలో మూడు ఆత్మలను తెలుపగా మరికొన్ని సందర్భము
లలో నేనే మాట్లాడి చాలామందికి మూడు ఆత్మల విషయమును చెప్పాను.
నా శరీరము అందరి శరీరములతో సమానముగాయుండుట వలన, నా
మాటలు జీవులు మాట్లాడే మాటలున్నట్లే యుండుట వలన, నన్ను కూడా
సాధారణ మనిషిగా లెక్కించి, నేను చెప్పిన మూడు ఆత్మల విషయమును
పరమత బోధయని హేళన చేసి నన్ను అవమానించిన వారు కూడా
కలరు. ఈ విషయమును భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్య యోగమందు
పదకొండవ శ్లోకమున చెప్పియున్నాను.”

శ్లో॥ 11.
అవజానంతి మాం మూఢా మానుషీమ్ తను మాశ్రితమ్ ।
పరం భావ మజనంతో మమ భూతమహేశ్వరమ్ ||

భావము :- “సర్వ జీవరాసులను నడిపించు అధిపతినైయున్న నేను నర శరీరము
ధరించియుండుట వలన నా గొప్పతనమును, నా శ్రేష్ఠత్వమును తెలియని
అజ్ఞానులు నన్ను అవమానించుచున్నారు.”

ఎక్కువ శాతము హిందువులలోనే ఆత్మను అవమానించిన వారు
గలరు. నేను జీవాత్మనైయుండి శరీరములోగల ఆత్మల విషయమును ఒక
సిద్ధాంత రూపములో చెప్పాను. సిద్ధాంతము అని పేరు పెట్టి చెప్పితే
ప్రజలు గుర్తించుదురని నేను చెప్పునది "త్రైత సిద్ధాంతము" అనికూడా
చెప్పాను. నేను జీవాత్మనైయున్నా అందరి జీవాత్మలకున్న అహము నాలో
లేదు. నాకు ఆత్మజ్ఞానము బాగా తెలిసిపోయినది. నేనున్న శరీరములోనే
నా ఆత్మ ద్వారా ఆత్మజ్ఞానము నాకు తెలిసినది. అప్పటినుండి నేను
స్వంతముగా ఏమీ చేయలేదు. ఏమీ మాట్లాడలేదు. అంతా ఆత్మ ఆజ్ఞగానే
చెప్పుచున్నాను. నాలోని అహము పూర్తిగా పోయినది. అందువలన
ఆత్మవలె నాకు కూడా కర్మలు అంటవు. పాపపుణ్యములను కర్మలను
అంటని స్థితికి నన్ను చేర్చినది నాలోని ఆత్మయేనని ధైర్యముగా చెప్పు
చున్నాను. ఇంతకుముందు మనుషులు నన్ను అవమానించుచున్నారని
చెప్పినది స్వయముగా నా అధికారి అయిన ఆత్మయే. ఇప్పుడు మీతో
మాట్లాడమని ఆజ్ఞ చేసినది నా అధికారి అయిన నా అధిపతి అయిన
ఆత్మయే. నేను మాట్లాడు మాటలు నా ఆత్మ నాకు చెప్పినవేగానీ స్వయానా
నావి కావు. నా ఆత్మ అనుమతితో జీవుడయిన నేను త్రైత సిద్ధాంతమను
మూడు ఆత్మల సిద్ధాంతమును శాస్త్రబద్దముగా "త్రైత సిద్ధాంత భగవద్గీత"లో
వ్రాయడము జరిగినది. అయితే 'త్రైత సిద్ధాంత భగవద్గీత'ను సంతోషముగా
స్వీకరించి చదివినవారు కొందరున్నారు. అయితే మరికొందరు అజ్ఞానము
నిండినవారై, అహము భావముతో అసూయ గుణముతో త్రైత సిద్ధాంత
భగవద్గీతను పరమతమునకు సంబంధించినదని బజారులోనికి విసరి వేసిన
వారున్నారు, అగ్గి పెట్టి కాల్చిన వారున్నారు.

అటువంటి వారి శరీరములో వారిని నడుపుచున్నవాడు,
మాట్లాడుచున్నవాడు ఆత్మే అయినా, వారి భావముల ప్రకారమే ఆత్మ
పనులు చేయడము జరిగినది. శరీరములోని ప్రతి పని ఆత్మే చేసినా తన
భగవద్గీతను వారి భావము ప్రకారమే విసరివేయడము, వారి భావము
ప్రకారము కాల్చి వేయడము చేసినది ఆత్మయే. అయితే దైవధర్మము
ప్రకారము (దైవ చట్టము ప్రకారము) జీవుని భావమునుబట్టి ఆత్మ చేసినా
ఆ పని జీవుడు చేసినట్లే లెక్కించబడును అని ముందే చెప్పియున్నాము.
అందువలన భగవద్గీతను అవమానించిన కారణమున వారికి వచ్చు
ఫలితము ‘భయంకరమైన పాపము' అని చెప్పవచ్చును. అది క్షమించరాని
పాపమని మధ్య దైవగ్రంథములో చెప్పబడినది. అక్కడ చెప్పిన విషయము
ఇలా కలదు చూడండి. అక్కడ చెప్పినది ఎవరోకాదు మీలోని ఆత్మయే
అని చెప్పుచున్నాను. “మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు
వారికి క్షమించబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ
లేదు. మనుష్యులకు వ్యతిరేఖముగా మాట్లాడు వానికి క్షమాపణ
కలదుగానీ, దేవునికి విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందై
ననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.”

ఆ వాక్యమును చెప్పినవాడు ఆత్మయేనని నేను చెప్పుచున్నాను.
నేను ఆత్మప్రక్కనే జీవునిగాయున్నాను కనుక ఆ విషయము స్వయముగా
ఆత్మే చెప్పినదని రూఢీగా చెప్పుచున్నాను. నేను జీవాత్మగా శరీరములో
ఒక మూలయున్నవాడిని, శరీరమునకు అధిపతి ఆత్మయే. ఆత్మ అనుమతితో
నేను శరీరములో నివశించుచున్నాను. నాకు అందరివలె బయటి భక్తి
లేదు. శరీరములోనే నా భక్తియంతయు కలదు. శరీరములోనే నా
జ్ఞానమంతయూ గలదు. అందువలన శరీరములో ఈశ్వరుడై (అధిపతియై)

యున్న ఆత్మయెడల భక్తి కల్గియున్నాను. మిగతా మనుషులు శరీరములోని
ఆత్మనే ఈశ్వరుడని తలువక, శరీరము బయట ఈశ్వరుడు (దేవుడు)
ఉన్నాడని అనుకొంటున్నారు. శరీరము బయటగల దేవున్ని కొందరు
నిరాకారుడని, నిర్గుణుడని అనగా, కొందరు కాదు దేవుడు సాకారుడు
సగుణుడు అని అంటున్నారు. అంతకు ఆ దేవుడెవరని విచారిస్తే విష్ణువని
విశిష్టాద్వైతులు, ద్వైతులు అనగా, ఆకారము లేకుండా గుండుగా,
లింగమువలె యున్న శివుడని అద్వైతులు అంటున్నారు. బయట
త్రిమూర్తులుగా యున్న శివ, కేశవులను వారు దేవుడని చెప్పుకొంటున్నారు.
వాస్తవానికి ఆ దేవతలు కూడా దేవుని చేత సృష్ఠింపబడినవారేయగుట
వలన వారిని అలా ప్రకటించు అద్వైత, ద్వైతసిద్ధాంతములు అసలయిన
శాస్త్రబద్ద సిద్ధాంతములు కావని తెలియుచున్నది.

ఈ విధముగా ముందునుండి యున్న సిద్ధాంతములు సరియైనవి
కావు కనుక ఆత్మ తాను స్వయముగా "త్రైత సిద్ధాంతము"ను ప్రకటించడము
జరిగినది. అంతకుముందు ద్వైత, అద్వైత సిద్ధాంతములను తెలిసిన నేను
వాటిని నమ్మలేదు. ఎందుకనగా ! సిద్ధాంతకర్తలను వారి జీవాత్మలు అహము
భావముతో మాట్లాడిన మాటలుగా యుండుట వలన వాటిమీద నాకు
అనేక ప్రశ్నలు, అనుమానములు యుండేవి. దాదాపు 37 సంవత్సరముల
క్రిందట త్రైత సిద్ధాంతమును ఆత్మ స్వయముగా ప్రకటించినప్పుడు నాకు
సత్యము తెలిసినది. మూడు ఆత్మల జ్ఞానమును కొంతకుకొంత తెలిసిన
జీవాత్మగా నేనెంతో సంతోషించాను. నా కర్మప్రకారము నేను అనుభవించు
కష్టములను లెక్కచేయక నా దృష్ఠియంతయూ శరీరమునకు అధిపతియైన
ఆత్మమీదనే కేంద్రీకరించియుండుట వలన నా కర్మలనుండి నేను బయట
పడడమేకాక నాకు ఆత్మజ్ఞానము పూర్తిగా తెలిసినది.

ప్రశ్న :- మీరు మాట్లాడేది తెలుగు భాషయే అయినా, అన్ని పదములు,
అన్ని వాక్యములు తెలుగు భాషయేయైనా మేము ఏదో క్రొత్తగా విన్నట్లున్నది.
మాట్లాడేది ఆత్మేనంటారు అయినా భావము జీవునిది అగుట వలన జీవుడే
మాట్లాడుచున్నాడు అంటారు. మరియొకమారు ఆత్మే మాట్లాడుచున్నది
జీవాత్మ కాదు అంటారు. మీరు ఎంతో వివరముగా చెప్పుచున్నా మా
బుద్ధి దానిని అందుకోలేకపోవుచున్నది. మొత్తముమీద క్రొత్త సిద్ధాంతము
త్రైత సిద్ధాంతమని తెలిసినది. త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినవారు
ప్రబోధానంద యోగీశ్వరులని తెలిసినది. ప్రబోధానంద యోగీశ్వరులు
మనిషా? కాదా!యను ప్రశ్న వచ్చుచున్నది. ఈ ప్రశ్నకు మీరు ఆత్మగా
జవాబు చెప్పుతారో, జీవాత్మగా జవాబు చెప్పుతారో మీరే నిర్ణయించుకొని
చెప్పండి?

జవాబు :- సూత్రము ప్రకారము నేను జీవాత్మను మాట్లాడుచున్నాను. నా
భావము ప్రకారము ప్రబోధానంద యోగీశ్వరులు అనునది పేరుకాదు
బిరుదుగా చెప్పవచ్చును. పేరు పిల్లప్పుడే జన్మించిన కొద్దిరోజులకే
నామకరణము చేయడము జరుగును. శరీరములోపల అంతయు
అణువణువునా వ్యాపించియున్నవాడు ఆత్మయే. అందువలన శరీరమునకు
అధిపతి ఆత్మయే అగును. జీవుడు శరీరములో ఒకమూల ఇరుక్కొన్నట్లు
యున్నాడు. శరీరము ఎవరిదయితే శరీరమునకు పెట్టిన పేరు వారిదే
అగును. అందువలన మొదటి పుట్టుకతో పెట్టిన పేరు “పెద్ద”. “పెద్ద”
అను పేరు శరీరములోని ఆత్మకే వర్తించును కావున ఆ పేరు జీవునిది
కాదని చెప్పవచ్చును. శరీరము లోపలయున్న జీవునికి పేరే లేదు. మేము
జీవునికే ఈ పేరు పెట్టాము అనికొనినా అది ఆత్మకే వర్తించును.

శరీరములోని ఆత్మ కొంతసేపు, జీవాత్మ కొంతసేపు మాట్లాడినా పేరు
ఆత్మదే.

ప్రశ్న :- శరీరము ఒకటే అయినా అదే శరీరములో జీవాత్మ మాట్లాడు
చున్నాడు. అట్లే ఆత్మ మాట్లాడుచున్నాడు. త్రైత సిద్ధాంతమును ఇద్దరు
చెప్పారు. సిద్ధాంతమును చెప్పడము ముఖ్యమైన విషయమగుట వలన
అప్పుడు సిద్ధాంతమును చెప్పినది ఆత్మను అనుకోవాలా? లేక జీవాత్మయని
అనుకోవాలా? చెప్పండి?

జవాబు :- ఆత్మనే అనుకోవాలి. జీవాత్మకు ఏమీ తెలియదు. ఆత్మ చెప్పిన
తర్వాత జీవాత్మకు తెలిసినది. అందువలన శరీరమునకు అధిపతియైన
ఆత్మయే త్రైత సిద్ధాంతమును తెలిపినది. జీవాత్మ ఎప్పుడూ స్వయముగా
మాట్లాడలేదు. జీవాత్మ భావము ప్రకారం ఆత్మయే మాట్లాడుచున్నది.
భావము జీవాత్మది అయినందున జీవాత్మ చెప్పినట్లగుచున్నది. జీవాత్మ
మాట్లాడినట్లు లెక్కించుచున్నాము. అంతతప్ప జీవుడు స్వయముగా ఎప్పుడూ
మాట్లాడలేదు. శరీరములో ఏ పనిచేసినా, ఏ మాట మాట్లాడినా అన్ని
కార్యములను ఆత్మయే చేయుచున్నది. త్రైత సిద్ధాంతము ఆధ్యాత్మిక
సిద్ధాంతము అగుట వలన అది ముఖ్యమైన కార్యము. సాధారణ
కార్యములనే చేయని జీవుడు ముఖ్యమైన పనిని చేశాడని ఎలా చెప్పగలము.
ఆత్మయే చేయుట వలన ఆత్మయొక్క పేరునే అక్కడ వ్రాయడము జరిగినది.

ప్రశ్న :- గ్రంథము మీద 'రచయిత' అని వ్రాసి పేరును వ్రాయుచున్నారు.
అది శరీరమునకు పెట్టిన పేరుకదా! ఆత్మ పేరుకాదు కదా! ఈ మాటకు
మీరేమంటారు?

జవాబు: మీ లెక్కలో అది శరీరముయొక్క గుర్తింపుకు పెట్టిన పేరయినా,
ఆ పేరు ఆత్మకు వర్తించునదేగానీ శరీరమునకు గానీ, జీవాత్మకుగానీ
వర్తించదు. అక్కడ “రచయిత పేరు” అని వ్రాసిన తర్వాత “త్రిమత
ఏకైక గురువు” అని మొదట వ్రాసి దాని తర్వాత ఆధ్యాత్మిక సామ్రాజ్య
చక్రవర్తి, ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత
సిద్ధాంత ఆదికర్త అని వ్రాసియుండును. ఇవన్నియూ ఆ శరీరములో
ఆత్మ పనిచేసిన దానికి గుర్తింపుగా ఆత్మకు పెట్టిన పేర్లని తెలియవలెను.

ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు హిందూమతములో పుట్టాడు. హిందూ
మతమునకే గురువుగాయుండాలిగానీ మూడు మతముల గురువు అని
వ్రాయడము ఎందుకు? ఒక మతమునకు మరొక మతమునకు ఏమాత్రము
సరిపోక ఒకరినొకరు అసూయతో చూచుకొను ఈ కాలములో ఒక
మతములో పుట్టినవాడు మూడు మతములకు ఎలా చెప్పగలడు? దీనికి
సమాధానము చెప్పండి?

జవాబు :- ప్రపంచములో జ్ఞానము మనుషులకు మిగతా జీవరాసులకు
అవసరమే అయినా జీవరాసులకు మనుషులుగాయున్న వారు జ్ఞానమును
తెలియజేయలేరు. మనుషులకు తెలియజేయవచ్చును. అయితే మనుషులకు
అవసరమైన జ్ఞానమును సృష్ట్యాదిలోనే దేవుడు తెలియజెప్పాడు. ఆనాడు
ఏ మతము లేదు. అందువలన దేవుడు చెప్పిన బోధ హిందూ మతమునకని
చెప్పలేదు. సర్వమానవులకు వర్తించునదిగా చెప్పాడు. అందువలన
మనుషులు ఎన్ని మతములుగా మారియున్నా అన్ని మతములలోని వారు
మనుషులే అయినందున మనుషులయిన వారు ఏ మతములోయున్నా
దేవుడు మొదట చెప్పిన జ్ఞానము ప్రతి మతములోని మనుషులందరికీ

వర్తించుచున్నది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము హిందువుకు ఎంత
అవసరమగుచున్నదో, అట్లే ముస్లీమ్లకు కూడా అంతే అవసరమగు చున్నది.
మూడు మతములలో మూడు రకముల ఆచారములతో కూడుకొన్న
ప్రజలుండినా దేవుని జ్ఞానము వారికి కూడా అవసరమగుచున్నది. అది
వారికి కూడా సమానముగా వర్తించుచున్నది. దేవుడు సృష్ట్యాదిలో
మనుషులకు చెప్పిన జ్ఞానము నేడు అన్ని మతముల వారికి పనికి వచ్చే
జ్ఞానముగానే యున్నది. దేవుడు ప్రపంచమును తయారు చేసినప్పుడు
మనుషులను తయారు చేసి, వారికి కావలసిన ఆహారమును కూడా గింజల
రూపములో చేసి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆహారము నేడు ఎన్నో
మతములుగా చీలినవారికి కూడా పనికి వచ్చుచున్నది కదా! దేవుడు
ఆదిలో ఇచ్చిన ఆహారమే నేడు అన్ని మతముల వారికి ఆహారముగా
యున్నట్లు, దేవుడు సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము నేడు ఏ మతములోని
వానికయినా సరిపోవుచున్నది. అందువలన “ఆత్మ” మూడు మతముల
గురువుగా యున్నది. మొదట చెప్పిన జ్ఞానము ఆ దినములలో భగవద్గీతగా
తయారయినది. తర్వాత మనుషులు మతములుగా చీలిపోయినా
వారికొరకు వారి మత గ్రంథములు తయారయినా ఆ గ్రంథములలో కూడా
దేవుడు సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానముండడము విశేషము.

ప్రశ్న :- "ప్రతి శరీరములో మూడు ఆత్మలుండగా అదే జ్ఞానమును
దేవుడు మొదట తయారు చేసిన దైవగ్రంథమయిన భగవద్గీతలోనూ, తర్వాత
తయారయిన రెండు దైవగ్రంథములలోనూ దేవుడు ఇమిడ్చాడు” అని మీరు
అంటున్నారు. అయితే త్రైత సిద్ధాంతమును మిగతా మతముల వారు
కూడా తెలియవలసియున్నది. మిగతా మతముల వారి విషయము అటుంచి
హిందూ మతమువారికయినా త్రైత సిద్ధాంతము తెలిసిందా?

జవాబు :- దేవుడు మూడు మతముల వారికి అర్థము కావలెనని త్రైత
సిద్ధాంతమును సృష్ట్యాదిలోనే చెప్పినా నేటివరకు మనుషులెవరికీ తెలియ
దనియే చెప్పుచున్నాము. మూడు మతముల వారికి తెలియునట్లు ఆత్మలు
మూడుగాయున్నాయి అను వివరమును తెలియజేయు జ్ఞానమును వారివారి
గ్రంథములలో వ్రాయబడియున్నా ఏ మతము వారు దానిని గుర్తించలేక
పోవడము పెద్ద విచిత్రముగా యున్నది.

ప్రశ్న :- మూడు దైవగ్రంథములలో ఒకే విధమైన మూడు ఆత్మల త్రైత
సిద్ధాంతమున్నదని మీరు చెప్పుచూయుంటే మాకు కూడా ఆ మాట క్రొత్తగా
కనిపించుచున్నది. మూడు మత గ్రంథములుగాయున్న, మూడు దైవ
గ్రంథములలో త్రైత సిద్ధాంతము ఎలాగున్నదో మాకు వివరించగలరా?

జవాబు :- నేడు హిందువుల గ్రంథముగా పేరుపొందిన భగవద్గీతలో
త్రైత సిద్ధాంతమునే ముఖ్యమైన జ్ఞానముగా చెప్పడమైనది. భగవద్గీతయందు
పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములు త్రైత సిద్ధాంతమునకు
పునాదిరాళ్ళుగాయున్నవి.
శ్లో॥ 16.
ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవచ।
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే |

భావము :- "లోకములో రెండు రకముల పురుషులు కలరు. అందులో
నాశనమయ్యే జీవుడు అనేక జీవరాసులుగా గలడు. నాశనము గాని పురుషునిగా
సర్వ జీవరాసులలోనే అక్షరుడనువాడు గలడు." ఒకడు నాశనమయ్యేవాడు,
మరొకడు నాశనము కానివాడు అని చెప్పబడు ఇద్దరు పురుషులు
శరీరములోనే కలరు.

శ్లో॥ 17.
ఉత్తమః పురుష స్వన్యః పరమాత్మే త్యుదాహృతః ।
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః

భావము :- “ఇద్దరు పురుషులుగాక మరొక్క పురుషుడు గలడు అతడు ఇద్దరు
పురుషులకంటే ఉత్తముడు. అతనినే పరమాత్మయని అందురు. నాశనములేని
మూడవ పురుషుడయిన పరమాత్మ ముల్లోకములు వ్యాపించి యున్నాడు".

ఈ విధముగా భగవద్గీతలో రెండు శ్లోకముల రూపములో త్రైత
సిద్ధాంతమునకు దేవుడే నాంది పలికాడు. దేవుడు చెప్పిన త్రైత
సిద్ధాంతములో నాశనమయ్యే ఆత్మను క్షరుడనీ, నాశనము కాని ఆత్మను
అక్షరుడనీ చెప్పడమైనది. ఆత్మను పురుషుడని చెప్పుచున్నారు. రెండు
రకముల పురుషులకంటే మూడవ పురుషుడు ఉత్తముడు కావున ఆయనను
పురుషోత్తముడని అన్నారు. ఈ ముగ్గురు పురుషులు సర్వజీవుల
శరీరములలో యున్నారు. జీవాత్మగాయున్నవాడు నాశనమయ్యే వాడుగా
యున్నాడు. శరీరమునకు పెద్దగాయున్నవాడు, శరీరములో సర్వకార్యములు
చేయువాడు అయిన ఆత్మయే నాశనముకాని అక్షరుడుగా యున్నాడు.
వీరిరువురు కాకుండా, అనగా ఇద్దరు పురుషులు కాకుండా, మూడవ
పురుషుడు గలడు. అతడు ఇద్దరు పురుషులకంటే ఉత్తముడు, గొప్పవాడు,
ఆత్మకంటే వేరుగా యున్నవాడు అని చెప్పుచూ పురుషోత్తముడనీ మరియు
పరమాత్మయనీ పిలువబడుచున్నాడు.

ఈ విధముగా భగవద్గీతలో త్రైత సిద్ధాంతమును చెప్పియున్నా
నేటివరకు భగవద్గీతను బోధించు గురువులుగానీ, బోధకులుగానీ స్వామీజీలు
గానీ గమనించక గాలికి వదలివేశారు. అందువలన నేటివరకు త్రైత
సిద్ధాంతము గురించి ఎవరికీ తెలియకుండా పోయినది. మేము ఒక

ప్రక్క చెప్పుచున్నా ఇప్పటికయినా తెలుసుకుందామను ధ్యాస కూడా లేదని
చెప్పాలి. దేవుడు చెప్పినది, సిద్ధాంతములలో శాస్త్రబద్దమైన త్రైత
సిద్ధాంతమును తెలియజేయాలను ఉద్దేశ్యముతో మేము త్రైత సిద్ధాంతమును
ప్రకటించడము జరిగినది. అయితే నేటి హిందువులు ఆర్యసాంప్రదాయము
లలో మునిగిపోయినవారై తమకు తెలిసినదే జ్ఞానమనుకొని మిగతా
దేనినయినా అజ్ఞానమంటున్నారు. మేము త్రైతమంటూనే ఇది క్రైస్తవులకు
సంబంధించినదని అంటున్నారు. త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే భగవద్గీత
ముసుగులోయున్న బైబిలు అంటున్నారు. అంతో ఇంతో జ్ఞానమున్నవారు,
మేము స్వచ్ఛమయిన హిందువులము, హిందూ మతరక్షణ చేయుచున్నా
మనువారే అలా ప్రవర్తించుట వలన వారు త్రైత సిద్ధాంతమును తెలుసు
కోవడము లేదు. ఇతర హిందువులను తెలుసుకోనీయడము లేదు.

ఇక క్రైస్తవ మత విషయానికివస్తే వారి మతమునకు ప్రామాణిక
గ్రంథమని చెప్పుకొను బైబిలులో కూడా త్రైత సిద్ధాంతము గలదు. అయితే
వారు దానిని 'త్రిత్వము' అంటున్నారు. అట్లే ఆంగ్లభాషలో ట్రినిటీ
అంటున్నారు. ట్రినిటీ లేక త్రిత్వము అనునది వారిలో ఒక వర్గమునకు
గుర్తుగా కొందరు చెప్పుకోగా, త్రిత్వము జ్ఞానవాక్యముగా చెప్పుకొంటున్నారు
గానీ, ట్రినిటీ అంటే ఏమిటి? త్రిత్వము అంటే ఏమిటో దాని అర్ధము
మాత్రము వారికి తెలియదు. త్రిత్వము అంటే మూడని తెలిసినా మూడు
ఏమిటో తెలియదు. క్రైస్తవ బోధలను చెప్పు ఒక సీనియర్ పాస్టర్గారి
వద్దకు పోయి త్రిత్వము అంటే ఏమిటని మేము అడుగడము జరిగినది.
అప్పుడు ఆ పాస్టర్ గారు “త్రిత్వము అంటే మూడని” చెప్పారు. “మూడు
అంటే ఏవి?" అని అడిగాము. అప్పుడు ఆయన “తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ అను మూడు పేర్లు చెప్పబడియున్నవి. ఆ మూడును మేము

ట్రినిటీ అనియూ త్రిత్వము అనియూ అంటున్నాము” అన్నాడు. “తండ్రి
అంటే ఎవరు?” అని అడిగాము. అప్పుడు ఆయన “తండ్రి అంటే దేవుడు
అనియూ, కుమారుడు అంటే దేవుని కుమారుడు ఏసు” అనియూ చెప్పాడు.
“పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?” అని అడిగాము. అప్పుడు పాస్టరుగారు
ఏమాత్రము తడుముకోకుండా “పరిశుద్ధాత్మ అనినా దేవుడనియే అర్థము”
అని అన్నాడు. తండ్రి అనినా, పరిశుద్దాత్మ అనినా రెండు పదములు
దేవున్ని తెలుపుచున్నప్పుడు కుమారుడు ప్రత్యేకముగా యున్నప్పుడు, తండ్రి,
కుమారుడు, పరిశుద్ధాత్మ అని మూడు చెప్పినా అవి మూడు కాకుండా
రెండే అగుచున్నవి. తండ్రి, పరిశుద్ధాత్మ రెండూ ఒకటైనప్పుడు, త్రిత్వము
లేకుండాపోయి ద్విత్వము ఏర్పడుచున్నది. అనగా మూడు కాకుండా
రెండగుచున్నవి. అలా తండ్రి, పరిశుద్ధాత్మ రెండూ ఒకటైనప్పుడు త్రిత్వము
అనుటకు వీలులేదు. దానిని ద్విత్వము అనియే చెప్పవచ్చును. దీనినిబట్టి
పాస్టరుగారు చెప్పిన జవాబు తప్పయినదని తెలియుచున్నది. దీనివలన
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మూడు పదములకు వాస్తవమైన
అర్థము పాస్టరుకుగానీ, మరి ఇతర క్రైస్తవులకుగానీ తెలియదనియే
చెప్పవచ్చును. ఈ విధముగా బైబిలులో గల మూడు ఆత్మల సిద్ధాంతమయిన
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క మూడింటికి అర్థము తెలియదనియే
చెప్పవచ్చును.

భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములలో
త్రైత సిద్ధాంతమున్నా అది హిందువులకు ఏమాత్రము తెలియనట్లు, బైబిలు
గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయమందు 19వ వచనమున
“త్రైత సిద్ధాంతము” ఇలా చెప్పబడినది చూడండి. (మత్తయి: 28-19)
"మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు,

కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి
బాప్తిస్మము ఇచ్చుము" అని చెప్పబడినది. అయితే ఈ వాక్యము ఆధ్యాత్మిక
రంగములో ముఖ్యమైనదనీ, ఇది మూడు మతములలో చెప్పిన త్రైత
సిద్ధాంతమని చాలామంది క్రైస్తవులకు తెలియదు. ఇది బైబిలులో ముఖ్యమైన
సిద్ధాంతమని కూడా తెలియదు. ఈ వాక్యమును చూస్తూనే హిందువులు
ఇది క్రైస్తవులదని చెప్పుచున్నారు. అయితే త్రైత సిద్ధాంతము సమస్త
మానవులకు అవసరమైనదని తెలియక మతద్వేషముతో మాట్లాడుచున్నారు.
బైబిలులోని మత్తయి సువార్త యొక్క వాక్యములో ఈ వాక్యమును
చెప్పినప్పుడు "మీరు వెళ్ళి సమస్త జనులకు" అని అక్కడ చెప్పడమైనదిగానీ
క్రైస్తవులకు అని చెప్పలేదు కదా! సమస్త జనులలో నేను ఒక్కనిగా యున్నాను.
అందువలన మూడు దైవగ్రంథములలో చెప్పబడిన త్రైత సిద్ధాంతము నాకు,
నీకు, అందరికీ అవసరమైనదని, తప్పక తెలుసుకోవలెనని దేవుడు చెప్పినట్లు
మూడు గ్రంథములలో కలదు.

ఇక అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 50,
ఆయత్ 21 లో అల్లాహ్ చెప్పిన దానినే జిబ్రయేల్ ఇట్లు చెప్పాడు. (50-21)
' ప్రతి వ్యక్తి తనవెంట తనను తీసుకవచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడు
ఒకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు." ఇంకొక గ్రంథములో ఇలా
వ్రాశారు చూడండి. "ప్రతి ప్రాణి ఒక తోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చే
వాడితో సహా హాజరవుతాడు." ఈ విధముగా ఖురాన్ గ్రంథములో
వ్రాయబడి యున్నా ఇది ముఖ్యమైన దైవసిద్ధాంతమని ముస్లీమ్లకు
తెలియదు. త్రోలేవాడు ఒకడు, త్రోలబడేవాడు మరొకడు ఉండగా ఇద్దరికీ
సాక్షిగాయున్నవాడు మరొకడు గలడు. ఇట్లు ముగ్గురిని గురించి గ్రంథములో
చెప్పియున్నా ఆ ముగ్గురు ఎవరో ఏమాత్రము ముస్లీమ్లకు తెలియదు.

ప్రశ్న :- క్రైస్తవ, ముస్లీమ్ల గ్రంథములలో యున్నది, భగవద్గీతలోని త్రైత
సిద్ధాంతమే అయినప్పుడు భగవద్గీతలోని మూడు ఆత్మల సిద్ధాంతమును
(త్రైత సిద్ధాంతమును) సృష్టి ఆదిలోనే దేవుడు చెప్పాడని అర్థమగుచున్నది.
ద్వైత, అద్వైత సిద్ధాంతములను కలియుగములో పుట్టిన శంకరాచార్యులు,
రామానుజాచార్యులు, మధ్వాచార్యులు చెప్పగా త్రైత సిద్ధాంతమును దేవుడు
ముందే సృష్ట్యాదిలోనే చెప్పినట్లు కలదు కదా! అటువంటప్పుడు "త్రైత
సిద్ధాంత కర్త” నిజముగా దేవుడేయగును గానీ మీరు కాదు కదా!
అటువంటప్పుడు “త్రైత సిద్ధాంత ఆదికర్తయని” మీ పేరు చెప్పుకోవడము
తప్పగును కదా! దీనికి మీరేమంటారు?

జవాబు :- ఆదికర్త అంటే మొదటి కర్త అనియూ, మొదట చెప్పినవాడనియూ
అర్థము. ఒకవేళ మేము త్రైత సిద్ధాంతకర్తనని ప్రబోధానంద పేరు
వ్రాసియుంటే మీరు ఈ ప్రశ్న అడిగినా సరిపోయివుండేది. మీరు
ప్రశ్నించుటకు ముందే ఆదికర్త అని వ్రాసియుండుట వలన మొదట
చెప్పిన వాడని అర్థము కాగలదు. అంటే మీ ప్రశ్నకు ముందే జవాబు
వచ్చియున్నది. అయితే అది అర్థముకాక ఈ విధముగా అడిగారని
మేము అనుకొంటున్నాము. నేను జీవుడుగా చెప్పునది ఏమనగా! త్రైత
సిద్ధాంతము సృష్ట్యాదిలోనే చెప్పబడినది. దానినే భగవద్గీతలో రెండవమారు
కృష్ణ భగవానుడు చెప్పడము జరిగినది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే
చెప్పుచున్నానని కృష్ణుడు భగవద్గీతను చెప్పడము జరిగినది. భగవద్గీతలో
ముఖ్యముగా చెప్పడము మూడు ఆత్మల వివరము. దైవజ్ఞానమంతయూ
మూడు ఆత్మల వివరము మీదనే ఆధారపడియున్నది. అనగా త్రైత
సిద్ధాంతము మీదనే దైవజ్ఞానము కలదని చెప్పడమైనది. ఇదే త్రైత సిద్ధాంతమే

మిగతా రెండు గ్రంథములందు రెండు రకములుగా చెప్పియున్నారు. మూడు
గ్రంథములలోని త్రైత సిద్ధాంత వాక్యములను చదివినప్పటికీ ఈ మూడు
వాక్యములు ఒకే విధముగా ఉన్నాయను ధ్యాస కూడా కలుగడము లేదు.

త్రైత సిద్ధాంతమును ముందు చెప్పినవాడు దేవుడని చెప్పినా దేవుడు
రూప, నామ, క్రియారహితుడగుట వలన ఆయన ఎవరితోను నేరుగా
మాట్లాడడు. అంతేకాక త్రైత సిద్ధాంత సూత్రము ప్రకారము ఆయన
(దేవుడు) సాక్షిగా చూచువాడేగానీ క్రియగా చేయువాడు కాదు. ఏది చేసినా,
ఏది మాట్లాడినా దేవుని అంశగాయున్న మిగతా రెండు ఆత్మలలో
అక్షరుడుగాయున్న రెండవ ఆత్మ చేయవలసిందే. మూడవ ఆత్మయిన
జీవాత్మ భోక్తగా అనుభవించువాడుగా మాత్రమున్నాడు. దీనినిబట్టి మొదటి
దేవుడు ఏమీ చేయడు, చివరి జీవుడు కూడా ఏమి చేయలేనివాడుగా
కేవలము అనుభవించువాడుగాయున్నాడు. ఈ విధముగా మూడు ఆత్మల
విధానముండగా, దేవుడు బయటికి చెప్పవలసిన జ్ఞానములో గల త్రైత
సిద్ధాంతమును సృష్ట్యాదిలో ఆత్మయే బయటికి చెప్పవలసివచ్చినది.
సృష్ట్యాదిలో దైవజ్ఞానమును ఆకాశము వాణిద్వారా సూర్యునికి చెప్పినప్పుడు
మనకు తెలియని విధానము ఏమి జరిగినదో కొంత వివరముగా తెలుసు
కొందాము.

ఆకాశము ప్రకృతిలోని ఒక భాగము. ప్రకృతిలో ఐదు భాగములు
గలవు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములను
పంచ మహా భూతములు అంటున్నాము. భూతము అనగా జీవము గలదని
అర్థము. మహా భూతము అనగా 'గొప్ప శక్తివంతమైన జీవుడు' అని
అర్థము. ప్రకృతిలోని ఐదు భాగములు ఐదు గొప్ప శక్తులుగాయున్నవి.

ప్రపంచములో ఈ ఐదు భూతముల తర్వాతనే ఇతర భూతముల
శక్తియుండును. అంటే విశ్వమంతటికీ ఈ ఐదు ప్రకృతి శక్తులే గొప్పయనీ,
దేవుని తర్వాత గల గొప్ప శక్తులు ఈ ఐదు భూతములుగా యున్నవని
చెప్పవచ్చును. ఐదు భూతములలో మిగతా నాలుగుకంటే పెద్దది, మొదటిది
ఆకాశము. దేవుని తర్వాత గల ఐదు శక్తులలో మొదటి శక్తి ఆకాశము.
ఆకాశ భూతము ద్వారా సృష్ట్యాదిలో దైవజ్ఞానము ఆకాశములో తేలుతున్న
సూర్యునికి మొదట చెప్పబడినది. దేవుని జ్ఞానము సృష్ట్యాదిలోనే ఆకాశము
ద్వారా సూర్యునికి తెలిసినదని చాలామంది జ్ఞానులకు తెలిసినా అక్కడ
మనకు తెలియకుండా జరిగిన తతంగము ఎవరికీ తెలియదు.
తతంగమును విప్పి చెప్పుకొంటే ఎంతో జ్ఞానము కూడా తెలియగలదు.

ఆకాశము ఒక భూతమైనప్పుడు దేవుని ధర్మము ప్రకారము
జీవుడుగాయున్న వానికి (భూతముగాయున్న వానికి) ఆత్మతోడైయుండును.
జీవుడు ఎక్కడ ఉండునో ఆత్మ వానికి తోడుగాయుండవలెననుట దైవ
ధర్మము. దైవ నిర్మిత ధర్మము ప్రకారము జీవుడు అనగా జీవాత్మ, ఆత్మ
రెండు జోడు ఆత్మలుగా ఉండును. సజీవమైన ఏ శరీరములోగానీ, జీవునితో
పాటు ఆత్మయుండుట సహజము. ఎచట భూతముండునో అచట ఆత్మ
దానికి తోడైయుండగా, పరమాత్మ సాక్షిగా ఇద్దరినీ చూచుచుండును. అదే
త్రైత సిద్ధాంతమని చెప్పడమైనది. భూతముగాయున్న అనగా జీవుడుగా
యున్న వాడు శరీరములో ఏమీచేయనివాడై యుండును. చేయుటకు
చేతకానివాడై యుండును జీవుడు. చేయుటకు చేతనయినా చేయనివాడు
దేవుడు. వీరి ఇద్దరికీ మధ్యలోయున్న ఆత్మ అవసరమయితే ఇటు దేవుని
పనినిగానీ, అటు జీవుని పనినిగానీ చేయుచున్నది. అదే విధానముతో
సృష్ట్యాదిలో దేవుని పని జ్ఞానము తెలుపడము, అయినా దేవుడు చేయడు

కనుక దేవుని పనిని ఆకాశ జీవునికి తోడుగాయున్న ఆత్మయే చేసినది.
చివరికి ఆకాశవాణి సూర్యునికి సృష్ట్యాదిలో జ్ఞానము చెప్పినదని అందరూ
అనుకోవడము జరిగినది. ఒక పని జరుగగా పైకి కనిపించే మనిషి
చేశాడని బయట చూచువారంతా అనుకొన్నట్లు, ఆకాశవాణియే జ్ఞానము
చెప్పినదని అనుకొన్నారు. ఆకాశము వెనుక కనిపించకయున్న ఆత్మ
చెప్పినదని ఎవరికీ తెలియదు. జీవుడు దేవుడు ఇద్దరూ పని చేయరు
కావున వారికి మధ్యలోయున్న ఆత్మయే అన్ని పనులు చేయవలసియున్నది.
ఇది ఆధ్యాత్మిక చట్టము. దైవ నిర్మితమైన ధర్మము. దీనిని ఎవరూ కాదన
లేరు.

ఈ చట్టము ప్రకారము సృష్ట్యాదిలో జ్ఞానము చెప్పినది ఎవరు?
అని ప్రశ్నవస్తే విషయమంతా తెలిసిన తర్వాత ఆత్మయే చెప్పినదని చెప్పక
తప్పదు. అదే విధముగా "మొట్టమొదట త్రైత సిద్ధాంతమును చెప్పిన
దెవరు?” అని అడిగితే "ఆకాశ భూతమువద్ద యున్న ఆత్మయే” అని
చెప్పగలము. అదే విషయమునే "త్రైత సిద్ధాంత ఆదికర్త” అన్నప్పుడు
ఆత్మయే అని చెప్పుటకు బదులుగా "ప్రబోధానంద యోగీశ్వరులు” అని
చెప్పడము జరిగినది. ఆత్మ ఎప్పుడూ తనకు తానుగా బయటపడదు.
ఎవరికీ తెలియకుండా అన్ని పనులు అన్ని శరీరములలో చేయుచున్నది.
ప్రస్తుతము ఒక శరీరమును ధరించి ఆ శరీరములోనుండి మాట్లాడగలుగు
చున్నది. ఇది అరుదుగా జరిగే సంఘటన ఏమీ కాదు. ప్రతి నిత్యము
అందరిలో మాట్లాడునది ఆత్మయేననీ, ఆత్మ తప్ప జీవాత్మగానీ,
పరమాత్మగానీ మాట్లాడదు. నేను ఆత్మజ్ఞానమును తెలిసిన జీవున్ని కావున
ఇప్పుడు త్రైత సిద్ధాంతమును బోధించునది ప్రబోధానంద యోగీశ్వరులు
అనినా ఆ శరీరముగానీ, ఆ శరీరమునకున్న పేరుగానీ జీవునిది కాదు.

శరీరమునకంతటికీ పెద్దయిన, శరీరమునంతటినీ ఆక్రమించియున్న ఆత్మదే
ఆ పేరని చెప్పుచున్నాము. ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములో ఒక
మూలయున్న జీవున్నయిన నేను ఈ శరీరములో ఆత్మ చేయుచున్న పనిని,
ఆత్మ మాట్లాడు మాటలను చూస్తున్నాను, వింటున్నాను. ఇదే ఆత్మే
సృష్ట్యాదిలో త్రైత సిద్ధాంతమును చెప్పినది కావున గ్రంథము మీద "త్రైత
సిద్ధాంత ఆదికర్త" అని వ్రాయడము జరిగినది. ఆదికర్తయని ప్రకటించు
కొనినా గుర్తించలేకపోతే మన అజ్ఞానము తప్ప మరేమీ కాదు.

త్రైత సిద్ధాంత ఆదికర్త అనుమాటకంటే ముందు “త్రిమత ఏకైక
గురువు” అని వ్రాయడము జరిగినది. ప్రస్తుత కాలములో ఏ మతములో
అయినా వారికి దేవుడు గ్రంథములో చెప్పిన జ్ఞానము తెలియక తికమక
పడుచున్నారు. నేను గురువును అని చెప్పుకొను ఏ మనిషయినా నాకు
మా గ్రంథములోని జ్ఞానము సంపూర్ణముగా తెలుసునని గుండెమీద
చేయివేసుకొని చెప్పమను. ఎవరయినా ఆ పనిని చేయలేరు. ఎంతటి
జ్ఞానులయినా బయటి ప్రపంచములో గొప్ప జ్ఞానులని పేరున్న వారికయినా
తమ దైవగ్రంథములోని అన్ని విషయములు తెలియవనియే ఒప్పుకొనును.
దేవుడు చెప్పిన జ్ఞానము అనగా ఆత్మ చెప్పిన ఆత్మజ్ఞానము ఆత్మకు
తెలియకుండా ఎవరికీ తెలియదు. అందువలన నా ఆత్మ తెలియచెప్పమంటే
జీవునిగా “ఎవరికీ సంపూర్ణమైన జ్ఞానము తెలియదు” అని అంటున్నాను.
ఇక్కడ ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! ఒక మనిషి దైవగ్రంథమును
సంపూర్ణముగా చదివి అందులోని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసియున్నా
నను నమ్మకముతో కొన్ని సంవత్సరములనుండి తనను జ్ఞానిగా తలచు
చున్నాడనుకొనుము. అతనికి జ్ఞాన విషయములో ఎక్కడా ఏ అనుమానమూ
లేదు. జీవితములో కాలమంతయూ జ్ఞానమును తెలియుటకే వినియోగించు

చున్నాడు. అలాంటప్పుడు అతను సంపూర్ణ జ్ఞానిని అనుకోవడములో
తప్పులేదు కదా!యని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా
కలదు.

ఎవడయితే సంపూర్ణ జ్ఞానియగునో వానికి త్రైత సిద్ధాంతము
సంపూర్ణముగా తెలిసియుండును. ఎవనికయితే త్రైత సిద్ధాంతమయిన
మూడు ఆత్మల వివరము తెలిసినదో వాడు సంపూర్ణ జ్ఞాని అనబడడమే
కాక ఆత్మకుగల శక్తి అనగా దైవశక్తి అతనిలో పెల్లుబుకును. అనగా
దైవశక్తి అతనిలో ఉండును. ఎవనిలో దైవశక్తియున్నదో అతనిని భూతములు
మహాభూతములు సహితము గౌరవించును. ఆ మనిషిలోని ప్రత్యేకత
మనిషికే తెలియుటకు మొదలు పెట్టును. ఈ విధముగా సంపూర్ణ జ్ఞానిలో
ఆ శక్తి బయటికి తెలియబడుట వలన, రోగములు సహితము అతని
మాటను ఆలకించి అతను చెప్పినట్లు నడుచుకొనును. అయితే మూడు
ఆత్మల జ్ఞానమును అనుభవపూర్వకముగా తెలిసినవారు ఎక్కడా
కనిపించడము లేదు. తమకు ఆత్మజ్ఞానము తెలియకున్నా అహముతో
మేము జ్ఞానులము అనుకొన్న వారు గలరు. అది మంచి పద్ధతి కాదు.

ప్రశ్న :- మొదట మీరు పుట్టినప్పుడు మీ శరీరము గుర్తింపుకు ఒక పేరు
పెట్టడమయినది. అది ప్రత్యేకమయిన అర్థమునిచ్చునదిగా యున్నది.
“పెద్దన్న” అని చెప్పడములో ఆలోచిస్తే “పెద్ద” అని తెలియునట్లు
ప్రత్యక్షముగా “పెద్దన్న” అని పేరు పెట్టడము జరిగినది. అలా పెద్దన్నగా
మొదలయిన మీ జీవితము ప్రబోధానంద యోగీశ్వరులు అను పేరులోనికి
ఎలా మారినది? పెద్దన్నగా యున్న పేరును మీరు ప్రబోధానంద
యోగీశ్వరులుగా ఎందుకు మార్చుకొన్నారు. పెద్దన్న అను పేరులో గౌరవము

ఏమాత్రము లేదని, ఆ పేరును చిన్న కులము వారు, కాయకష్టము
చేయువారు, హరిజనులు పెట్టుకొందురని అలాంటి పేరుతో గౌరవముండ
దని మీరు ప్రబోధానంద అని పేరు మార్చుకోవడము జరిగినదని కొందరు
అంటుండగా విన్నాము. అదెంత వరకు నిజము? వారు చెప్పునది సత్యమే
అంటారా? లేక దానికేమయినా కారణమును చూపగలరా?

జవాబు :- ఎవరు ఏమయినా అనుకోవచ్చును. అయితే వారికి కొంత
వరకే తెలుసునని చెప్పగలను. నాకు మొదట తల్లితండ్రులు 'పెద్దన్న' అను
పేరును పెట్టలేదని వారికి తెలియదు. 'పెద్దన్న' అను పేరు బలవంతముగా
పెట్టడ మైనదని కూడా ఎవరికీ తెలియదు. పుట్టిన వారముకో, పదిరోజులకో
పేరు పెట్టడము జరిగినది. సమాజములో అందరూ పెట్టినట్లు ఏదో ఒక
దేవుని పేరును పెట్టడము జరిగినది. అది ఏ పేరో నాకు కూడా తెలియదు.
పేరు పెట్టినప్పటినుండి ఎక్కువగా ఏడ్వను మొదలు పెట్టడముతో వైద్యుల
వద్దకు తీసుకపోయి చూపడము జరిగినది. చిన్నపిల్లలకు కడుపునొప్పి
కలుగుట చేత ఏడ్చుచుందురని వైద్యులు కడుపునొప్పికి సంబంధించిన
మందులు ఇవ్వడము జరిగినది. అయినా ఏడుపు మానకపోవడముతో
ఏమీ చేయలేని స్థితిలో దిగులుగాయున్నప్పుడు గ్రామదేవత అయిన
సుంకులమ్మ ఒక మనిషికి పూనకము వచ్చి ఊరంతా తిరుగుచూ మా
ఇంటి ముందుకు వచ్చి "మీ బాలుడు మూడు రోజులనుండి ఏడుపు
మానడము లేదు కదా!”యని అడిగింది. అప్పటి కాలములో గ్రామదేవతలకు
ఎక్కువ విలువయుండేది. సుంకులమ్మ దేవత ఆ మాట చెప్పడముతో
మా తల్లి తండ్రులు కొంత ఊరట చెంది ఏమి చేయాలని ఆ దేవతను
అడుగడము జరిగినది. అప్పుడు ఆ దేవత ఇలా చెప్పినదట "పుట్టినవాడు
సామాన్యుడు కాదు. నాకు కూడా అతని వెలుగు అర్థము కావడము

లేదు. మా అక్క పెద్దమ్మ బాలునికి సేవ చేయుచున్నది. ఇప్పుడు మీరు
పెట్టిన పేరు ఆ బాలునికి సరిపోలేదు. అందువలన ఏడుపు మానడము
లేదు. మా అక్క పెద్దమ్మ పేరును పెట్టండి" అని చెప్పి పోయినదట.
పోయేటప్పుడు ఇంటి ముందర క్రింద పడుకొని నమస్కారము చేసి
పోయినదట. అప్పుడు అక్కడ జరిగిన వింతకు ఆశ్చర్యపోయిన మా
పెద్దలు గంట వ్యవధిలోనే పెద్దమ్మకు పూజచేసి కొబ్బరికాయకొట్టి “పెద్దన్న”
అను పేరును పెట్టడము జరిగినది. అప్పుడు శిశువు ఏడుపు మానడముతో
అది దేవతయిన పెద్దమ్మ మహత్యమని అనుకోవడము జరిగినది.
అప్పుడునుంచి వారు పెద్దమ్మ పేరుపెట్టామని చెప్పుకొన్నారు. నాకు కొంత
బుద్ధి వచ్చిన తర్వాత ఈ విషయము తెలిసినది. ప్రతి సంవత్సరము
పెద్దమ్మ దేవతకు కోళ్ళు కోసెడి వారు, పొట్టేళ్ళను బలి ఇచ్చి పూజచేసెడివారు.

నాకు కొంత వయస్సు వచ్చిన తర్వాత అలా పెద్దమ్మ పూజలు
చేయడము నచ్చలేదు. నాకు పదహారు సంవత్సరముల వయస్సులోనే
దేవతల పూజను పూర్తి వ్యతిరేఖించి “నేను ఏ దేవతకు మ్రొక్కను, ఏ
దేవతను పూజించను” అని చెప్పడమైనది. అప్పటినుండి దేవతా పూజలకు
వ్యతిరేఖముగా మారిపోవడము జరిగినది. నా భావములను చూచిన
చాలామంది నన్ను అజ్ఞాని, అహంకారి అనడము జరిగినది. ఎవరు
ఏమనినా నేను దేవతల పూజలు చేయను, మీకిష్టమైతే మీరు చేసుకోండని
చెప్పేవాడిని. ఇలా కొంతకాలము జరిగి నా వయస్సు దాదాపు 25
సంవత్సరములప్పుడు స్వయముగా నేను ఒక గ్రంథమును వ్రాయడము
జరిగినది. అదే నా మొదటి గ్రంథము, పేరు “ప్రబోధ”. ప్రబోధ గ్రంథము
యొక్క వ్రాత ప్రతిని తీసుకొనిపోయి అనుభవజ్ఞులయిన పెద్దలకు చూపడము
మంచిదని తలచి రమణానంద భారతీ అను అద్వైత స్వామిజీవద్దకు

తీసుకొని పోయి చూపడము జరిగినది. అప్పుడు ఆ స్వామీజీ ఆ వ్రాత
ప్రతిని చూచి సంతోషపడి, “నీకు గురువు ఎవరు?" అని అడిగాడు. అప్పుడు
“నాకు గురువు ఎవరూ లేరు” అని చెప్పాను. దానికి ఆయన ఎంతో
జ్ఞానము గల గ్రంథము వ్రాసిన తర్వాత తప్పనిసరిగా గురువు ఉండవలెనని
చెప్పాడు. గురూపదేశమును నేనిస్తాను నీవు నాకు శిష్యుడు కమ్మన్నాడు.
దానికి నేను ఒప్పుకొన్నాను.

అప్పటికే అదే “ప్రబోధ" గ్రంథములో గురూపదేశమును గురించి
వ్రాసియున్నాను. “ఆత్మశక్తి అను అగ్నిని శిష్యునకు దానము చేయువాడే
గురువు” అని చెప్పాము. అప్పుడు ఆ స్వామిగారు పూజా కార్యక్రమమును
పెట్టి ఆ పూజమధ్యలో ఒక మంత్రమును చెప్పి ఇది నీకు గురుమంత్రమని
చెప్పాడు. అంతేకాక నీవు గ్రంథమును వ్రాశావు కదా! ఆ గ్రంథము
మీద నీ పేరు "పెద్దన్న” అని వ్రాయవద్దు. ఇప్పుడు గురూపదేశము
పొందిన తర్వాత నీవు క్రొత్త జీవితమును ప్రారంభించినట్లయినది. కావున
ఇప్పటినుండి నీవు క్రొత్త పేరుతో చలామణి కావలసియున్నదని చెప్పాడు.
సరేనని ఆ స్వామి మాట ప్రకారము ఒప్పుకొన్నాను. అప్పటికే నేను
“ప్రబోధ” అను పేరుతో గ్రంథమును వ్రాసియుండుట చేత నా పేరును
“ప్రబోధానంద”గా వ్రాసుకొని అదే పేరునే బయట చెప్పుకోమన్నాడు.
అప్పటినుండి ఆయన చెప్పినట్లే పేరును మార్చుకొని ప్రతి గ్రంథము
మీద రచయిత పేరువద్ద 'ప్రబోధానంద' అని వ్రాయడము జరుగుచూ
వచ్చినది. అంతకుముందే గ్రంథమును వ్రాయకముందు కొన్ని
సంవత్సరములనుండి అనగా నా వయస్సు 18 సంవత్సరములనుండి
దయ్యములు, దేవతలు నాతో మాట్లాడునప్పుడు “స్వామీ” అని సంబోధించి
పిలిచెడివారు, తర్వాత ఒక స్వామిజీవద్ద నా పేరు పూర్తిగా మారిపోవడము

జరిగినది. పెద్దన్న అను పేరు పూర్తిగా కనుమరుగై పోయినది.
ప్రపంచములో నా పేరు ప్రబోధానందగా చెప్పబడుచున్నా, ఆధ్యాత్మికములో
ఇంకా కొంత మార్పు జరిగి ప్రబోధానంద యోగీశ్వరులుగా మారిపోయినది.
ఒక స్వామీజీ ప్రబోధానందయని నామకరణము చేయగా, ఒక దేవత
వచ్చి “నీవు యోగీశ్వరులవి, నీ ముందర మేము నిలువలేము” అని చెప్పడము
జరిగినది. ఒక దేవత వలన నా పేరు చివరిలో “యోగీశ్వర” అను
పదము చేరిపోయినది. తర్వాత దేవత రెండుమార్లు నా ముందరకు
వచ్చినప్పుడు “యోగీశ్వర” అని సంబోధించడము జరిగినది. ఇట్లు నా
పేరు ఇతరుల వలన మారుతూ వచ్చినదిగానీ, నాయంతకు నేను
మార్చుకోలేదు.

ప్రశ్న :- ఆదిశంకరాచార్యులవారు భగవద్గీతకు భాష్యము వ్రాశారు. అట్లే
రామానుజాచార్యుల వారు గీతాభాష్యము వ్రాశారు. తర్వాత మధ్వా చార్యుల
వారు కూడా భగవద్గీతకు వివరము వ్రాశారు. ముగ్గురు సిద్ధాంతకర్తల
యొక్క సిద్ధాంతములు వేరువేరు ఉండుట వలన వారు వ్రాసిన భగవద్గీతలలో
వేరువేరు భావములుండునా? భగవద్గీతను చెప్పినవాడు భగవంతుడు
అయినందున ఆయన భావము ప్రకారము భగవద్గీతను చెప్పడము
జరిగినది. అలాంటి భగవద్గీతలో ముగ్గురు ఆచార్యులు వారి భావములను
వదలి భగవంతుని భావములనే వ్రాసియున్నారా లేక భగవద్గీతను వారి
సిద్ధాంత భావములోనికి మార్చి వ్రాశారా?

జవాబు :-భగవద్గీతలోనికి సిద్ధాంతకర్తల భావములను చేర్చలేదు. వారి
భావములను చేర్చుటకు భగవద్గీతలో ఎక్కడా అవకాశము లేదు. అయితే
భగవంతుడు చెప్పిన శ్లోకములకు భావమును వ్రాయాలను ఉద్దేశ్యముతో

మొదట శంకరుల వారు భగవద్గీతకు వివరమును వ్రాయడము జరిగినది.
శంకరాచార్యుల వారు మంచి ఉద్దేశ్యముతో మొదలు పెట్టినా కొన్ని
శ్లోకములకు వివరమును వ్రాయడములో దేవుని భావమును గుర్తించ
లేకపోయి దేవుని భావముకంటే భిన్నముగా వ్రాయడము జరిగినది.
విధముగా కొన్ని శ్లోకముల భావములు దైవమార్గమును వదలి ప్రక్కదారి
లోనికి పోయినవి. ఉదాహరణకు జ్ఞానయోగము అను అధ్యాయములో
13వ శ్లోకములో భగవంతుడు “చాతుర్వర్ణ్యమ్” అని చెప్పినప్పుడు ఆ
శ్లోకములో భగవంతుడు చెప్పని భావమును ఆదిశంకరాచార్యుల వారు
నాలుగు కులములుగా వర్ణించి చెప్పడము జరిగినది. అయితే భగవద్గీతలో
దేవుడు ఎప్పుడూ కులప్రసక్తిని తన శ్లోకములలో చెప్పలేదు. అక్కడ
శ్లోకములో లేని భావమును చెప్పడము వలన, ఉన్న భావమును
గుర్తించలేకపోవడము వలన భగవద్గీత కొన్ని శ్లోకముల వద్ద అజ్ఞానదారి
పట్టినదిగానీ, సిద్ధాంత కర్తల యొక్క సిద్ధాంతముల దారి పట్టలేదు.
మొదట భగవద్గీత భాష్యమును వ్రాసినవాడు శంకరాచార్యులవారు.
అందులో తన అద్వైతమును చేర్చలేకపోయాడుగానీ, శ్లోకములకు తప్పు
భావమును చెప్పాడు. ఆయన తర్వాత వచ్చిన సిద్ధాంతకర్తలయిన రామాను
జులవారు, ఆ తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు భగవద్గీతకు వివరమును
వ్రాసినా వారు కూడా తమ సిద్ధాంతములను భగవద్గీతలోనికి చేర్చ
లేకపోయారు. వారు కూడా శంకరాచార్యులు వ్రాసినట్లే కొన్ని శ్లోకములకు
తప్పు భావములను వ్రాశారు. మొదట వ్రాసిన శంకరాచార్యులను
అనుసరించి మిగతా ఇద్దరు సిద్ధాంతకర్తలు వ్రాయడమైనది. ఒక
శ్లోకమునకు వివరమును చెప్పడములో ఒకరు చెప్పినదానికంటే ఇంకొకరు
ఎక్కువ చెప్పడమో, తక్కువ చెప్పడమో చేశారుగానీ, పూర్తి ఒకరికొకరు

వ్యతిరేఖముగా ఎవరూ వ్రాయలేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగము అను
అధ్యాయములోనికి పోయినప్పుడు అక్కడున్న "త్రైత సిద్ధాంతము” మొదట
శంకరునికి అర్థము కాలేదు. అక్కడున్న భావమును పూర్తిగా వదలినవాడై
వేరు భావములో అక్కడ వివరించడము జరిగినది. భగవద్గీతలో అసలయిన
సిద్ధాంతమున్నచోట అర్థము కాకపోవడముతో అక్కడ ఏమాత్రము
సంబంధములేని భావమును శంకరాచార్యులు మొదట వ్రాస్తే తర్వాత
దానినే అందరూ అనుసరించారు. ఇప్పటికి మూడువందల మంది
భగవద్గీతకు భాష్యమును వ్రాస్తే అందరూ అదే దారిపట్టి మొదట వ్రాసిన
దానినే వ్రాయడము జరిగినది. చివరివరకు అదే జరుగగా మేము వ్రాసిన
“త్రైత సిద్ధాంత భగవద్గీత”లో తప్పు భావములను శ్లోకములన్నిటికీ మార్చి
సరియైన భావము వ్రాయడము జరిగినది. అట్లు వ్రాయడమే కాక
భగవద్గీతలో దేవుడు చెప్పిన త్రైత సిద్ధాంత భావమును బయటకు తెచ్చి
చూపడము జరిగినది. దేవుడు చెప్పని శ్లోకములను గుర్తించి వీటిని దేవుడు
చెప్పలేదని ప్రకటించడమయినది.

ప్రశ్న :- భగవద్గీతలో భగవంతుడు చెప్పని శ్లోకములున్నాయని మీరు
చెప్పారు కదా! ఆ శ్లోకములను సంస్కృత పాండిత్యమున్నవారే
వ్రాసియుండాలి. భగవద్గీత భాష్యమును వ్రాసిన ముగ్గురు సిద్ధాంతకర్తలు
సంస్కృత పాండిత్యము కలవారే. సిద్ధాంతకర్తలలో ఎవరయినా వారి స్వంత
శ్లోకములను భగవద్గీతలో చేర్చారా? లేక మరెవరయినా చేర్చారా?
జవాబు :- వ్యాసుడు వ్రాసిన భగవద్గీతలో లేని శ్లోకములు తర్వాత
కాలములో రావడము జరిగినది. ఆదిశంకరాచార్యుల వారు 'గీతా
భాష్యము'ను వ్రాయక ముందే భగవద్గీతలోనికి కల్పిత శ్లోకములు

చేరిపోయినవి. ఆ కల్పిత శ్లోకములను ముగ్గురు ఆచార్యులు బహుశా
గ్రహించకపోయి ఉండవచ్చును. ఒకవేళ గ్రహించినా ఇవి కల్పిత
శ్లోకములని బయటికి చెప్పే సాహసము చేసియుండకపోవచ్చును.
భగవద్గీతను చెప్పి ఐదువేల సంవత్సరములయితే, కల్పిత శ్లోకములు బహుశా
నాలుగు వేల సంవత్సరముల పూర్వమే భగవద్గీతలో కలిసిపోయి
వుండవచ్చును. అప్పటినుండి ఇప్పటివరకు అవి అట్లే కొనసాగుతూ
వచ్చాయి. మేము భగవద్గీతను చూచినప్పుడు కల్పిత శ్లోకములను
గ్రహించగలిగాము. మేము త్రైత సిద్ధాంత సహితముగా భగవద్గీతను
వ్రాయదలచినప్పుడు ఇవి కల్పిత శ్లోకములని వాటిని గుర్తించి చూపడము
జరిగినది. మేము వ్రాసిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”లో కల్పిత శ్లోకములను
వేరుగా చూపడమేకాక వాటికి వివరమును వ్రాయలేదు. వ్యాసుడు
వ్రాసినప్పుడు లేని శ్లోకములను భగవద్గీతలో ఎవరు కలిపారు? అని కొంత
యోచిస్తే సులభముగా సమాధానము దొరకగలదు. అక్కడ ఏ శ్లోకములను
చేర్చారో ఆ శ్లోకముల సారాంశమేమిటో గ్రహించితే ఆ శ్లోకముల
భావములున్నవారు, ఆ శ్లోకములను భగవద్గీతలో కలిపారని సులభముగా
తెలిసిపోగలదు.

ప్రశ్న :- సంస్కృత పండితులైనవారు ఆదిశంకరాచార్యులు మొదలగు
సిద్ధాంతకర్తలు ఎంతో సూక్ష్మగ్రాహులు గ్రహించలేని కల్పిత శ్లోకములను
మీరు గ్రహించారని చెప్పుకోవడము వలన 'వారికంటే నేనే పెద్ద'
అన్నట్లున్నది. సంస్కృత పాండిత్యమున్నవారికంటే సంస్కృతభాష సరిగా
తెలియని మీరు గొప్పవారు కాదు కదా! ముందు వచ్చిన సిద్ధాంతకర్తలకంటే
నేను గొప్పయని కనపడుటకే మీరట్లు చెప్పారనుకుంటాము. సిద్ధాంతకర్త
లయిన శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులతో పోల్చితే నీవు

ఏపాటి వానివి? వారితో నీవు సమానము ఎప్పటికీ కావు అని కొందరన
వచ్చును. దానికి మీరేమంటారు?

జవాబు :- ఇంతకుముందు దాదాపు ఆరునెలల క్రితము హిందూ
సంఘములో పనిచేయు వ్యక్తి సిద్ధాంతకర్తలలో వరుసగాయున్న ఫోటోలలో
మధ్వాచార్యుల తర్వాత నా ఫోటోయుండడము చూచి నన్ను దూషణగా
మాట్లాడినాడు. మా భక్తులయిన వారు కొందరు సిద్ధాంతకర్తల ఫోటోలను
ఒక ఫ్లెక్స్ బోర్డుమీద చిత్రించడము జరిగినది. ముందు శంకరాచార్యుల
ఫోటోను పెట్టి దానిక్రింద ఆయన పుట్టిన స్టేట్, పుట్టిన సంవత్సరము,
మరణించిన సంవత్సరము వ్రాశారు. అలా వ్రాయడము వలన
సిద్ధాంతకర్తలు ఎప్పుడు పుట్టినది, ఎక్కడ పుట్టినది మరియు ఎప్పుడు
చనిపోయినది వివరమంతా తెలియుచున్నది. అలా ముగ్గురు ఆచార్యుల
ఫోటోలను పెట్టారు. ముందు శంకరాచార్యుల ఫోటోను, తర్వాత
రామానుజాచార్యుల ఫోటోను, ఆ తర్వాత మధ్వాచార్యులు ఫోటోగలదు.
మూడు ఫోటోల తర్వాత మధ్వాచార్యుల ప్రక్కలో నా ఫోటోను ఉంచడము
జరిగినది. నా ఫోటోలో పుట్టిన స్థలమున్నది, పుట్టిన సంవత్సరమున్నది,
చనిపోయినది మాత్రము వ్రాయకుండా పెట్టారు. దానిని చూచిన
హిందూపరిషత్లోని వ్యక్తి సంతోషించేది పోయి నన్ను దూషించను మొదలు
పెట్టాడు. వీడు శంకరాచార్యుడంతటివాడా? శంకరాచార్యుల ఫోటో
వరుసలో ఫోటో పెట్టుకొనే దానికి అర్హుడా? అని మొదలు పెట్టాడు. అక్కడే
మా భక్తుడున్నది అతను చూడకుండా మాట్లాడినాడు. అప్పుడు మా భక్తుడు
అతనిని ఎదిరించి మాట్లాడడము జరిగినది. వారు ఇరువురు కొద్దిసేపు
అక్కడే వాదోప వాదములు చేశారు. ఆ మాటలను వరుసగా చూడండి.

మా భక్తుడు :- సుత్తిచంద్రారెడ్డిగారు! మీకు ఏమి తెలుసని ప్రబోధానంద
యోగీశ్వరులను విమర్శించుచున్నారు. డాక్టర్ల వరుసలో డాక్టరు
పేరుంటుంది. కార్మికుల లిస్టులో కార్మికుని పేరుంటుంది. ఎవరికి
సంబంధించిన వారి పేరు ఆ వరుసలోనే ఉంటుంది.  తాత M.B.B.S
కోర్సు చదివి డాక్టరుపని చేశాడనుకో, తర్వాత కొంత కాలానికి అతని
మనువడు కూడా డాక్టరు కోర్సుచేసి ఫలానా డాక్టరు అని వ్రాసి అతని
ప్రక్కన M.B.B.S అని వ్రాసిపెట్టాడనుకో, అప్పుడు వీడు తాతంతటి వాడా,
తాత M.B.B.S అయితే వీడు M.B.B.S అవుతాడా అని అంటే దానిని
తెలివి తక్కువ అంటారు. తాత చదివిన కోర్సును మనువడు చదువకూడదా?
చదివినప్పుడు తాతా డాక్టరే, మనువడు డాక్టరే అగును కదా! తాత మనువడు
ఒకే హాస్పిటల్లో పని చేయుచున్నారనుకొనుము. అప్పుడు డ్యూటీల
ప్రకారము తాత పేరు ప్రక్కనే మనువడి పేరు కూడా వ్రాయడము
జరుగుతుంది. అప్పుడు వీడు తాతంతటి వాడా అంటే ఆ మాట తెలివి
తక్కువ అగును. తాతకున్న డిగ్రీ మనువనికి ఉన్నప్పుడు ఆ చదువులో
ఇద్దరూ సమానమే కదా! ఇద్దరిది డిగ్రీ ఒకటే కదా!

సుత్తిచంద్రారెడ్డిగారు :- అది చదువు. ఇది జ్ఞానము. చదువులో సమానమైన డిగ్రీలుండ
వచ్చును. జ్ఞానములో పెద్ద పెద్ద, చిన్న చిన్న.

మా భక్తుడు :- ఇప్పుడు ఎవరు పెద్దంటావు ఎవరు చిన్నంటావు?
సుత్తిచంద్రారెడ్డిగారు :- ఆదిశంకరుడు ఎక్కడ? మీ స్వామి ఎక్కడ? ఆయన గొప్పతనములో
రవ్వంత కూడా అర్హతలేనివారు ఆయన ఫోటో ప్రక్కలో తన ఫోటో
పెట్టుకుంటారా? ఒక హిందువుగా నేను ఒప్పుకోను.
మా భక్తుడు :- నీవు హిందువైయుండి హిందువైన ఒక స్వామీజీని చిన్నగా

మాట్లాడడము మేము కూడా ఒప్పుకోము. శంకరాచార్యులకంటే మా
స్వామి దేనిలో తక్కువవాడో చెప్పండి చూస్తాము.
సుత్తిచంద్రారెడ్డిగారు :- శంకరులు ఎంతోకాలము ముందుపుట్టినవాడు, మీ స్వామి వెనుక
పుట్టినవాడు. శంకరునితో సమానము ఎట్లగును?
మా భక్తుడు :- మీ ఇంటిలో ముందు పుట్టిన వానివి నీవుండగా వెనుక పుట్టిన
నీ కొడుకుకు పెళ్ళి ఎందుకు చేశావు? నేను పెళ్ళి చేసుకొన్నాను. వీడు
నాకంటే వెనుకబుట్టి నాతో సమానముగా పెళ్ళి చేసుకొంటాడా అని
దూషించకుండా నీవే పెత్తనము చేసి నీ కొడుకుకు పెళ్ళి చేశావు కదా! ఈ
విషయములో నా కొడుకు నాతో సమానముగా పెళ్ళి చేసుకొంటాడా! అని
ఎందుకనకూడదు? ఇంట్లోది ఒక రకము బయటిది మరొకరకమా?
సుత్తిచంద్రారెడ్డిగారు :- ప్రపంచ విషయములను తెచ్చి జ్ఞానముతో ముడిపెట్టి చెప్పకు.
శంకరాచార్యుల వారు గొప్పజ్ఞాని, మీ స్వామికి అంత జ్ఞానమున్నదా?
మా భక్తుడు :- నీ దగ్గర జ్ఞానాన్ని కొలిచే మీటరుంటే తెచ్చి కొలుసుకో, ఎవరివద్ద
ఎంత జ్ఞానమున్నదో నీకే తెలుస్తుంది. ముందు పుట్టినవాడు జ్ఞాని, వెనుక
పుట్టినవాడు అజ్ఞాని అని అనుకొంటే అది నీ అజ్ఞానమే అగును. మా
స్వామి చెప్పితే దేవతలు కూడా మాట వింటాయి, రోగములు వినయముగా
ప్రవర్తించి దూరముగా పోతాయి. ఆయన చూపులోనే ఎన్నో కర్మలు
పోతాయి. ఇదంతా ప్రత్యక్షముగా చూచిన మాకు తెలుసు. సిద్ధాంతకర్తల
వరుసలో సిద్ధాంతకర్తయిన వారి ఫోటోను మేము పెట్టాము. అంతేగానీ
వారితో ఈయన సమానుడను ఉద్దేశ్యముతో మేము పెట్టలేదు. వాస్తవముగా
చెప్పితే మా స్వామి ప్రక్కలో ఉండేదానికి వారు అర్హులో కాదో ఒకమారు
చూచుకో!

ఈ విధముగా ఇద్దరి మధ్య వాదోపవాదములు జరిగాయి. నేడు
ప్రజలు గ్రుడ్డిగా మాట్లాడడము తప్ప ఏమాత్రము ఆలోచించడము లేదు.
శరీరములోయున్న నా ఆత్మ ఎన్నో బోధలు చెప్పుచున్నా, పైకి కనిపించు
నది మనిషే కావున ప్రజలు హేళనగా మాట్లాడడము, అవమానించడము
జరుగుచున్నది. జీవాత్మ భావముతో మేము ఎన్నో చూస్తున్నాను. ఇతరుల
వలన కలుగు ఇబ్బందులను బాధలను జీవుడుగాయున్న నేనే ఈ శరీరములో
అనుభవించుచున్నాను. జీవుడయిన నేను బాధను అనుభవించుట
సహజమే అయినా అవమానపరచినవారు ఆత్మ ఆగ్రహమునకు గురి
అగుచున్నారు. దానివలన వారు అనవసరముగా అనేక కష్టాలను కొని
తెచ్చుకొంటున్నారు. ఒక ప్రక్క అనేక బాధలను అనుభవిస్తున్నా ఇవి
ఎక్కడివని ఆలోచించలేకపోవుచున్నారు.

ఇప్పటికి దాదాపు పది సంవత్సరముల క్రిందట ఒక దినము
మహానందిలో మా భక్తులమీద అనవసరముగా అక్కడివారు దూషించడము
దాడిచేసి ఒకరిని కొట్టడము జరిగినది. మేము హిందూమతములో
ముఖ్యమైన వారమని, హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకొనువారే
పనిని చేశారు. అక్కడ దేవుని దర్శనమునకు పోయిన మా భక్తులను
పరమత ప్రచారకులని ఆరోపణ చేసి దాడి చేయడము జరిగినది. అప్పుడు
ఆ విషయమై ప్రబోధానంద యోగీశ్వరులకు కోపము వచ్చినది.
ప్రబోధానంద యోగీశ్వరులు అంటే కనిపించుచున్న శరీరము అని, ఇప్పుడు
మాట్లాడుచున్న జీవుడయిన నేను కాదు. ఈ శరీరమునకు అధిపతియైన
'మధ్యాత్మ' అని గుర్తుంచుకోవలెను. శరీరములో ఈశ్వరుడైన వానికి కోపము
వచ్చిన దానివలన, అక్కడ మనుషులు చేసిన పొరపాటుకు, తప్పుకు అక్కడ
మహానంది క్షేత్రములో దేవుడుగా చెప్పబడు ఈశ్వరుని మీద శాపము

పడినది. దానివలన ఈశ్వరుడు మహానంది క్షేత్రము వదలిపోయాడు.
అలా జరుగుట వలన శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసిన వాక్యము నెరవేరెను. బ్రహ్మముగారి కాలజ్ఞాన వాక్యము ఇలా
కలదు. "మహానందిలో ఈశ్వరుడు లేడు అనే వాక్యము పుట్టేను" అలా
ఈశ్వరుడు క్షేత్రమును వదలిపోయిన తర్వాత జరుగు కొన్ని పనులను
చూచి ప్రజలే ఈశ్వరుడు మహానందిలో లేడు అని అందురు. దానితో
బ్రహ్మముగారి మాట పూర్తిగా నెరవేరినట్లగును. ప్రబోధానంద యోగీశ్వరులు
పుట్టక పూర్వమే దాదాపు నాలుగు వందల సంవత్సరముల క్రిందటే
ప్రబోధానంద యోగీశ్వరులను గురించి బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసియున్నారు.

ఇంతకు ముందు ముగ్గురు సిద్ధాంతకర్తలు పుట్టినప్పుడుగానీ, పుట్టక
పూర్వముగానీ వారిని గురించిన సమాచారమును ఎవరూ ముందు
చెప్పలేదు. ప్రబోధానంద గారు పుట్టకముందే పోతులూరి వీరబ్రహ్మేంద్ర
స్వాములవారు యోగీశ్వరుల గురించిన సమాచారమును చెప్పడమైనది.
పుట్టిన తర్వాత కూడా ఆయనకు తగిన “పెద్ద” అనే పేరును పెట్టునట్లు
దేవతల డ్రామా జరిగినది. కాలజ్ఞానమును కలియుగములో చెప్పినవాడు
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కరేయని చెప్పవచ్చును.
అంతగొప్ప వ్యక్తి అయిన వీరబ్రహ్మముగారు యోగీశ్వరుల గురించి ఎన్నో
విషయములను ముందే చెప్పియున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు
ప్రబోధాశ్రమమును స్థాపించి దానిద్వారా జ్ఞానమును ప్రచారము చేయుటను
బ్రహ్మముగారు తన కాలజ్ఞాన వాక్యములో ఇలా వ్రాశారు. "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది" ఈ వాక్యమును చూచిన తర్వాత ప్రబోధానంద
యోగీశ్వరుల వారు ఎంత గొప్పవారో అర్థము కాగలదు.

ప్రశ్న :- ప్రబోధానందస్వామి హిందూమతమునకు వ్యతిరేఖమయిన
మాటలు చెప్పాడు. అందువలన ఆయన హిందువు కాదని మేమంటున్నాము.
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు సాధారణ మనిషికాదు.
మనిషిలో జీవుడుగాయున్న నాకు తెలియకుండా మాట్లాడునది ఏమీ
ఉండదు కదా! ప్రబోధానంద త్రైత సిద్ధాంతకర్తగా దైవజ్ఞానమును
చెప్పియుంటే అది మీకు అర్థముకాక ఆయననే హిందువులకు వ్యతిరేఖి
అంటున్నారు. ఆయన తరపున నేను మాట్లాడుచున్నాను. ఆయన ద్వారా
ఎందరో ఇతర మతములవారు కూడా హిందూ జ్ఞానమును తెలియగలిగారు.
మీరు ఎవరయినా హిందూజ్ఞానమును ఇతర మతముల వారు తెలుసుకొనే
అవకాశము కల్గించారా? అని ప్రశ్నించుచున్నాను. ప్రబోధానంద
యోగీశ్వరులు చెప్పే జ్ఞానమును వినేదానికి వందలమైళ్ళ నుండి ముస్లీమ్లు,
క్రైస్తవులు వస్తున్నారు. ఎందరో హిందువులు జ్ఞానము తెలుసుకొని సంపూర్ణ
జ్ఞానులుగా మారిపోయారు. ప్రబోధానంద జ్ఞానబోధ చేయునప్పుడు ఒకే
వేదిక దగ్గర మూడు మతముల వారు శ్రద్ధతో జ్ఞానమును వింటున్నారు.
మీరు చెప్పేమాటలను ఇతర మతములవారు వినరు. పైగా హిందువులే
మిమ్ములను అసహ్యించుకొంటున్నారు. మేము హిందూమతమును కాపాడు
తామని వందసంవత్సరములనుండి చెప్పుచున్నారు. అయితే మీరు
ఎక్కడయినా హిందువులను ఇతర మతములలోనికి పోకుండా నివారించ
గలిగారా? అది ఏమాత్రము లేదు. వంద సంవత్సరముల నుండి హిందూ
మతము క్షీణించినదని చెప్పక తప్పదు. హిందువులు ఇతర మతముల
లోనికి వెళ్ళుచుంటే హిందూరక్షణ అను పేరుతో మీరు కాలము గడుపు
చున్నారు.

“మతమార్పిడి దైవద్రోహము” అని బోధ చెప్పడమేకాక ఒక
గ్రంథమును కూడా మేము వ్రాసి ఇచ్చాము. ఆ గ్రంథమును చదివినవారు
గానీ, మా బోధ విన్నవారుగానీ ఎవరయినా మతమును మారినారేమో
చూపగలరా? చూపలేరు. ఏ మతములో పుట్టినవాడు ఆ మతములోనే
ఉండవలెననీ, దేవుడు అన్నీ తెలిసి నిన్ను ఒక మతములో పుట్టించితే దేవుని
కార్యమునకు విరుద్ధముగా మతము మారితే అది దైవ విరుద్ధమగును,
అంతేకాక దైవద్రోహమగును అని మేము (నేను+నా ఆత్మ) ఇద్దరము చెప్పగా
వినినవారు ఎవరూ మతమార్పిడి చేయలేదు. అయితే మమ్ములను జ్ఞానులు
కాదను మీ మాటను ఎవరయినా విన్నారా? ఎవరూ వినలేదు. యథేచ్ఛగా
మత మార్పిడి జరిగినా వాటిని ఏమాత్రము ఆపలేకపోయారు.

ప్రశ్న :- మీరు హిందూమతమును కాకుండా క్రైస్తవ మత బోధలు కూడా
చెప్పుచున్నారు కదా! దీనికి మీరేమంటారు? హిందువు క్రైస్తవ బోధలు
చెప్పవచ్చునా?

జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు ప్రపంచములోనే త్రిమత గురువు.
ప్రపంచములో త్రిమత గురువుగా యున్నవాడు యోగీశ్వరులు ఒక్కడే అగుట
వలన ఆయనను “త్రిమత ఏకైక గురువు" అంటున్నారు. హిందువు
ఎవరయినా ఇతర మతముల బోధలు చెప్పగలుగు స్థోమత కల్గియున్నాడా?
అని ప్రశ్నించుచున్నాము. ఒక మతములో యున్న గురువులకంటే మించిన
గురువుగా ఉండవలెనంటే, వారికి తెలియని రహస్యములు తెలిసి
యుండడము సామాన్యమైన పనికాదు. ఆయన తనను "త్రిమత ఏకైక
గురువు” అని ప్రత్యక్షముగా ప్రకటించుకొన్నాడు, దొంగగా ఏదీ చెప్పలేదు.
ఇంతవరకు ముస్లీమ్లకు సంబంధించిన గ్రంథములను వ్రాశాడు గానీ

క్రైస్తవులకు సంబంధించిన గ్రంథములు వ్రాయలేదు. త్వరలో క్రైస్తవ
మతములో క్రైస్తవులకు తెలియని జ్ఞానమును వ్రాయబోతారు. ఇంతవరకు
వ్రాసిన ఇతర మత గ్రంథములలో ముస్లీమ్ గ్రంథమని చెప్పబడిన ఖురాన్
గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరము వ్రాయడము జరిగినది. ఆ
వివరమును చూచిన ముస్లీమ్ పెద్దలు తమకు తెలియని రహస్యములన్నీ
తెలిసినవని సంతోషపడడము జరిగినది. మూడు మత గ్రంథములలోని
జ్ఞాన విషయములను చెప్పుట వలన, వారు మూడు మతముల జ్ఞానమును
తెలియుట వలన మతముల మధ్య ద్వేషము పోయి సామరస్యము ఏర్పడి
ప్రజలు అన్ని మతముల వారు కలిసిపోయి స్నేహసంబంధమైన జీవితము
గడుపుదురు. ద్వేష సంబంధమైన జీవితమునుండి బయటికి వచ్చి ఒకరి
కొకరు ప్రేమగా బ్రతుకగలరు.

ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ఒక మనిషిగా
ప్రకటించినా, అది మనుషుల శరీరములో యున్న మధ్యాత్మ ప్రకటించినది.
శరీరములోయున్న జీవునికి, దేవునికి మధ్యలోయున్న ఆత్మను 'మధ్యాత్మ'
అంటున్నాము. ఇంతవరకు గడచిపోయిన యుగములలోగానీ,
గడచిపోయిన జ్ఞానులలోగానీ మధ్యాత్మను గురించి ఎవరూ చెప్పలేదు,
ఎవరికీ తెలియదు. ప్రపంచములో మధ్యాత్మ విషయమును, మధ్యాత్మ
జ్ఞానమును చెప్పినవారు 'ప్రబోధానంద యోగీశ్వర' అని పేరుగల
శరీరములోని మధ్యాత్మయేనని చెప్పుచున్నాము. 'మధ్యాత్మ' శరీరములో
మూడు ఆత్మల మధ్యయున్నది. శరీరములోని మూడు ఆత్మల విషయమును
గానీ, వివరమునుగానీ ఇంతవరకు ఏ సిద్ధాంతకర్త చెప్పలేదు. ఎవరికీ
తెలియదు. అది ప్రబోధానంద యోగీశ్వరుల వలననే మధ్యాత్మ విషయము
నేడు ప్రపంచానికి తెలియబడుచున్నది. ఈ విషయమును కూడా పోతులూరి

వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఇలా చెప్పియున్నారు. "మధ్యాత్మ
యోగ పురుషుని మహత్తు మహా ప్రకాశమయ్యేను” ప్రబోధానంద
యోగీశ్వరులయొక్క విషయములను కొన్నింటిని తన కాలజ్ఞానమున
వీరబ్రహ్మముగారు వ్రాసి యుండడము విశేషమని మనుషులయిన వారికి
ఎందుకు తెలియదు? గ్రుడ్డిగా ఏదో ఒకటి మాట్లాడుటకంటే కొంత
విచక్షణా దృష్ఠితో చూడవచ్చును కదా!

ప్రశ్న :- ‘మధ్యాత్మ' అను మాటను మేము ఎప్పుడూ వినలేదు. అంతెందుకు
మూడు ఆత్మల విషయమునే మేము ఎప్పుడూ వినలేదు. మీరు చెప్పునది
సత్యమని మేమెందుకు అనుకోవాలి?
జవాబు :- ఆకలికి అన్నమును తింటాము. దప్పికకు నీరును త్రాగుతాము.
విజ్ఞానము కొరకు ప్రతి విషయమును వివరముగా చూస్తాము. జ్ఞానము
కొరకు పెద్దలు చెప్పుమాటలను వింటాము. మీరు చెప్పునది మేమెందుకు
వినాలి? అంటే ఆకలికి అన్నము ఎందుకు తినాలి? అన్నట్లుంటుంది.
ఆత్మల విషయము తెలియుటకు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి
యోగమున గల 16, 17 శ్లోకములను చూడాలి. అట్లే ప్రబోధానంద
యోగీశ్వరులు వ్రాసిన త్రైత సిద్ధాంతమును చూడాలి. ప్రబోధానంద
యోగీశ్వరుల భవిష్యత్తులోని కొన్ని విషయములను ముందే వ్రాసిన
వీరబ్రహ్మముగారి కాలజ్ఞానములోని ఈ వాక్యమునయినా చూడాలి "ఆనంద
కందళిత హృదయారవిందులయిన ఆత్మత్రయాలను". ఆత్మత్రయము
అనగా మూడు ఆత్మలను వివరము వచ్చుచున్నది. దానినే ప్రబోధానంద
యోగీశ్వరులు త్రైత సిద్ధాంతము గా ప్రకటించారు. త్రైత సిద్ధాంతము
శాస్త్రబద్దమైయున్నది. మిగతా అద్వైత, ద్వైత సిద్ధాంతములు శాస్త్రబద్దములు

కానేకావు. శాస్త్రీయత లేని సిద్ధాంతములను గొప్పగా చెప్పుకొనువారు,
శాస్త్రీయతయున్న సిద్ధాంతమును ఎందుకు పరమతమని అంటున్నారోయని
చూచిన అందులో అసూయ భావము తప్ప ఏమీ లేదని తెలియుచున్నది.
కనిపించే ప్రబోధానందయోగీశ్వరుల మీద నమ్మకము లేకపోయినా,
పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన మాట మీదయినా నమ్మకము
పెట్టుకొన్నా లేక భగవద్గీతను చెప్పిన భగవంతుని మీద నమ్మకమున్నా
మీకు త్రైత సిద్ధాంతము అద్వైత, ద్వైత సిద్ధాంతములకంటే గొప్పదని
తెలియగలదు.

ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరుల వారికి ఒక అద్వైత గురువు
‘ప్రబోధానంద’ అని పేరు పెట్టారని మీరే చెప్పారు. అప్పుడు రమణానంద
భారతీస్వాముల వారు ఈయనకు గురువే కదా! అలాంటపుడు నాకు
గురువులేడని కొన్ని సందర్భములలో స్వయముగా యోగీశ్వరులవారే
చెప్పినట్లు కలదు. గురుసాంప్రదాయము హిందూమతములో యున్నప్పుడు
గురువైన వానిని గురువు కాదనడమేమిటి?

జవాబు :- ఒక వ్యక్తికి మరొక వ్యక్తి గురువుగాయుండవచ్చును. నేను
ప్రబోధానంద యోగీశ్వరుల శరీరమునుండి మాట్లాడుచున్నాను. ఈ
శరీరము నాది కాదు. యోగీశ్వరుల వారిది. వారి శరీరములో తలలోని
ఒక మూల నా నివాసము కలదు. నా భావములను యోగీశ్వరుల శరీరము
ద్వారా వ్యక్తపరచుచున్నాను. అందువలన నేను వ్యక్తిని. ప్రబోధానంద
యోగీశ్వరులు అనుమాట శరీరములోపల శరీరమంతా వ్యాపించిన ఆత్మకే
చెల్లును. శరీరమును నడుపు శక్తిగాయున్నది ఆత్మ. శరీరమంతా చైతన్యమై
యుండుట వలన ఆత్మను శక్తి అంటున్నాము. పైకి కనిపించునది సాధారణ

శరీరమే. అయితే లోపల యున్నవాడు అసాధారణమైనవాడు. అందువలన
వానిని వ్యక్తి అనకూడదు. 'శక్తి' అని అనాలి. అసలు విషయానికి వస్తే
వ్యక్తికి వ్యక్తి గురువుగా యుండవచ్చునుగానీ, శక్తికి వ్యక్తి గురువుగా
యుండడు. వ్యక్తికి కొన్నిచోట్ల శక్తియైన ఆత్మకూడా గురువుగా యుండ
వచ్చును. ఒక మనిషికి ఇంకొక మనిషి గురువుగా యున్నా ఆ వ్యక్తికి
శక్తియైన ఆత్మ గురువుగా యుండవచ్చును. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి
గురువుగాయున్నా అది ఒక జన్మ లెక్కాచారమే యగును. అట్లు కాకుండా
అన్ని జన్మలకు గురువుగాయున్నవాడు ఆత్మగలడని చెప్పవచ్చును.
ప్రబోధానంద యోగీశ్వరుల వారిని మనుషులయిన వారు ఎవరయినా
గురువుగా చెప్పుకోవచ్చును. ఎందుకనగా! యోగీశ్వరులు మధ్యాత్మయని
అదే శరీరములో యున్న నేను చెప్పుచున్నాను కదా!

ప్రబోధానంద యోగీశ్వరులు మనుషుల అందరికీ గురువుగా
యుండవచ్చునుగానీ, ఏ మనిషీ ఆయనకు గురువుగా యుండలేడు. ఒక
అద్వైత గురువు ఆయనకు 'పెద్దన్న' అను పేరు తీసి ప్రబోధానంద అని
పేరు పెట్టాడు కదా!యని మీరు అంటున్నారు. ఆ మాట వాస్తవమే అయినా
ఆ పేరును తీసినది మరియొక పేరును పెట్టినది ఆ శరీరములో ఆత్మగా
యున్నవాడేనని, జీవుడు ఏమీ చేయువాడు కాదని మీరు తెలియవచ్చును
కదా! ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గురువుగా యుండవచ్చునను సూత్రమును
మరువకూడదు. అలాగే వ్యక్తి అయినవాడు శక్తి అయిన వానికి గురువు
కాలేడు. శక్తి అయినవాడు మనుషులందరికీ గురువు కావచ్చును.
అదేమాటనే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానమందే ఒక వాక్యములో ఇలా
వ్రాశారు చూడండి. "ఆనందాశ్రయులు ఆది అన్నాడు కనుక మీకు మాకు
ఆనందాశ్రయులే గురువులు" ఇక్కడ వీరబ్రహ్మముగారు కూడా

ఆనందాశ్రమమును నడుపు యోగీశ్వరులే మనందరికీ మీకు మాకు గురువని
చెప్పడము గమనార్హము. అందరికీ గురువైన వానికి మనిషి అయినవాడు
ఎవడూ గురువుగాయుండడు. అందువలన ప్రబోధానంద యోగీశ్వరులు
తనకు ఎవరూ గురువు లేడని చెప్పాడు. ఆ మాట వాస్తవమే కదా!

ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులవారు వ్యక్తికాదు శక్తియే అనుకొందాము.
ఆయన ఆశ్రమము పేరు 'ప్రబోధాశ్రమము' అని అంటారు. మరికొందరు
ప్రబోధానందాశ్రమమని అంటారు. బ్రహ్మముగారు చెప్పిన వాక్యములో
'ఆనందాశ్రమము వారు' అని అన్నారు కదా! బ్రహ్మముగారు చెప్పినది
ప్రబోధానందాశ్రమమేనా! అని సంశయము కలదు. దానికి మీరేమంటారు?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు ప్రబోధాశ్రమమును క్రీ॥శ॥ 1977
లోనే స్థాపించడము జరిగినది. త్రైత సిద్ధాంతమును 1979లోనే
ప్రకటించడము జరిగినది. “ప్రబోధ” గ్రంథమును వ్రాయడము కూడా
జరిగినది. ప్రబోధాశ్రమమును గురించి బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసిన విషయము 2006వ సంవత్సరము తెలిసినది. తర్వాత కొంత
కాలమునకు తిరుపతి ఓరియంటల్ కాలేజీలో వ్రాసి పెట్టబడిన బ్రహ్మము
గారి ఏష్య కాలజ్ఞానమును మేము చూడడము జరిగినది. అప్పుడు ఇంకా
కొన్ని విషయములు తెలిసినవి. ప్రబోధానందాశ్రమమునే ఆనందాశ్రమముగా
చెప్పడమైనదని తెలిసినది. ఇంకా ప్రబోధానంద యోగీశ్వరులను ఆనంద
గురువులని చెప్పడమైనదని తెలిసినది. ప్రబోధానందాశ్రమమును,
ప్రబోధానందను పేరుమార్చి ఆనంద గురువని, ఆనందాశ్రమమని చెప్పినట్లు
తెలిసింది. దానితో ఏష్యకాలజ్ఞానమును పూర్తిగా చదువగా, అందులో
నుండి చాలా విషయములు తెలిసినవి. మాకు తెలిసిన వాటిని సందర్భాను
సారము అక్కడక్కడ వివరిస్తూ వస్తున్నాము.

ప్రశ్న :- ఆనంద గురువులని, ఆనందాశ్రయులని ఇతరులను చెప్పియుండ
వచ్చును కదా! ఆ పేర్లు మీవేనని ఎందుకు అనుకోవాలి?

జవాబు :- ఇది అడుగవలసిన ప్రశ్నే! దీనికి జవాబును తెలుసుకొంటే
సంశయము లేకుండా పోవును. అందువలన ఇప్పుడు ఒక్కొక్కటి
వివరముగా తెలుసుకొందాము. మొదట "ప్రబోధాశ్రమము ఉన్నతమైన
జ్ఞానము కలది " అను బ్రహ్మముగారి వాక్యమును చూచాము. తర్వాత
రెండవ వాక్యమును "ప్రబోధ ఆశ్రమము వారి ఆది గుణమెల్ల శయనాధిపతికి
ఉన్నది" ఈ వాక్యములో ప్రబోధ ఆశ్రమము వారికి అనగా ప్రబోధానంద
యోగీశ్వరులకు, ఆది అనగా 'సృష్ఠి' అని అర్ధము రాగలదు. ఆదిగుణమెల్ల
అనగా 'సృష్ఠి గుణము అంతా' అని అర్థము. శయనాధిపతికి అనగా
'ఎప్పుడూ పాముమీద శయనించి యున్నవాడు విష్ణువు' అని చెప్పవచ్చును
లేక 'యోగములో పెద్దవాడు యోగీశ్వరుడు' అని చెప్పవచ్చును. ఈ
వాక్యము ప్రకారము ‘ప్రబోధాశ్రమము వారయిన ప్రబోధానంద యోగీశ్వర
శక్తియంతయు ప్రబోధాశ్రమములో కలదని' అర్థము. తర్వాత మరియొకచోట
కాలజ్ఞానములో మరియొక వాక్యము ఇలా కలదు. "శాంతాకారమైన
చోద్యవేద్యాలు రేపే కనిపించును. శయనాధిపతికి మేలు, మేలు అను వార్త
రేపే కనిపించేను.” ఈ వాక్యము తర్వాత మరియొక చోట ఏష్య
కాలజ్ఞానములో శయనాధిపతి అను పేరుతో గలదు. ప్రబోధాశ్రమము
వారయిన 'యోగీశ్వరులును' 'శయనాధిపతి' ఒకటేనని తెలిసిపోయినది.

“శయనాధిపతికి సర్వదా ఆనందం. బ్రహ్మాదులెల్లా దీవించేరు,
జారువాక్యములు ఆడినవారెల్లా నాశనమై పొయ్యేరు. కీడు తలచిన వారెల్లా

ధూళియై పొయ్యేరు." అని వ్రాయబడియున్నది. ఈ వాక్యములో
శయనాధిపతియని మరియొక మారు యోగీశ్వరులను గురించి చెప్పడ
మైనది. దీనిలో 'శయనాధిపతియే సర్వదా ఆనందం' అని చెప్పడము
వలన యోగీశ్వరులనే ఆనంద గురువని మరియొకచోట చెప్పడమైనది.
ప్రబోధానంద ఆశ్రమమును ఆనంద ఆశ్రమమనియూ, ప్రబోధానంద
యోగీశ్వరులను ఆనంద గురువని ఏష్యకాలజ్ఞానములో చాలాచోట్ల
చెప్పియున్నారు. అందువలన వీరబ్రహ్మము గారు చెప్పిన కాలజ్ఞాన
వాక్యములను సాధారణ వాక్యములుగా చూడక, చాలా విశేషతయున్న
జ్ఞానవాక్యములుగా చూడవలెను.

ప్రశ్న :- ఇంతకుముందు హిందూమతములో ముగ్గురు సిద్ధాంతకర్తలు
వచ్చిపోయారు. నేడు అద్వైత సిద్ధాంతము మిగతా రెండు సిద్ధాంతముల
కంటే ఎక్కువ ప్రచారమయినది. నేడు ఎక్కువగా యున్నది కూడా అద్వైతమే.
ద్వైతము, విశిష్టాద్వైతము రెండూ కలిసి అద్వైతమునకు సమానముగా కూడా
లేవు. అందులో విశిష్టాద్వైతము అద్వైతము తర్వాత స్థానములోయుండగా,
ద్వైతము విశిష్టాద్వైతమునకంటే తక్కువగాయున్నది. మొదటి స్థానములో
అద్వైతముండగా, రెండు, మూడు స్థానములలో విశిష్టాద్వైతము, ద్వైతములు
కలవు. మీరు చెప్పుచున్న త్రైత సిద్ధాంతము ఎంతో గొప్పదని చెప్పినా,
మూడు సిద్ధాంతములకంటే గొప్పదని చెప్పినా అది ఎక్కడా కనిపించడము
లేదు. ద్వైతులకంటే మరింత తక్కువలో త్రైతులున్నట్లు అర్థమగుచున్నది.
మీ సిద్ధాంతము గొప్పదైనప్పుడు మనుషులలో ఎక్కడా కనిపించడము
లేదు కదా! ద్వైతులు మూడవ స్థానములో ఉండగా, త్రైతులు నాల్గవ
స్థానములో కూడా కన్పించలేదే అని మేము అడుగవచ్చును కదా!

జవాబు :- 60, 70 సంవత్సరముల ముందు పుట్టిన వానికి పెద్ద మీసాలు
ఉండవచ్చును. అయితే పుట్టిన ఐదు సంవత్సరముల పిల్లవానిని పట్టుకొని
వీని జాతకము ముందు పుట్టినవారికంటే బాగుంటే వారికున్నట్లు ఇతనికి
మీసాలెందుకు లేవు? కనీసము కొన్నయినా లేవే! అంటే అది సమంజస
మైన మాటకాదనీ, అసలుకు అది ప్రశ్నే కాదనీ చెప్పవచ్చును. అద్వైత
సిద్ధాంతము దాదాపు 2500 సంవత్సరముల పూర్వము పుట్టినది. తర్వాత
దాదాపు 1500 సంవత్సరముల పూర్వము పుట్టినది విశిష్టాద్వైతము. ఆ
తర్వాత కొంతకాలమునకు పుట్టినది ద్వైతము. అద్వైతమునకు ఆర్యులు
పుణాదివంటి వారుగా ఉండుట వలన అద్వైతము బాగా ప్రచారమయినది.
ఏమీ తెలియని కాలములో అందరినీ అద్వైతులుగా మార్చుకొన్నారు.
అందువలన మొదట వచ్చిన అద్వైతము భారతదేశములో ఎక్కువ శాతము
గలదు. తర్వాత వచ్చిన విశిష్టాద్వైతమును ముందు పుట్టిన అద్వైతముకు
వ్యతిరేఖముగా యుండుట వలన విశిష్టాద్వైతము ఎక్కువగా ప్రచారము
కాలేకపోయినది. ఆ దినములలో అద్వైతులు రాజులవద్ద పలుకుబడిని
పెట్టుకొని సైనికులచేత విశిష్టాద్వైతులను చంపించిన సందర్భములు కూడా
కలవు. అందువలన రామానుజాచార్యుల వారు కూడా అప్పుడప్పుడు
అజ్ఞాత జీవితము గడుపవలసి వచ్చినది. అందువలన విశిష్టాద్వైతము
ఎక్కువ ప్రచారము కాలేదనియే చెప్పాలి. ద్వైతము పుట్టడమే బలహీనముగా
పుట్టినది. మధ్వాచార్యుల జీవితములో ఉడిపి ప్రాంతము దాటి ప్రచారము
కాలేదు. ద్వైతము ప్రచారము కావడమే తక్కువ అయినందున ప్రజలలో
ద్వైతమంటే ఏమిటో తెలియదు. అద్వైతము, విశిష్టాద్వైతము ప్రజలలో
కొంతయుండగా, ద్వైతము చాలా తక్కువ మందిలో మాత్రము కలదు.
అద్వైతము, విశిష్టాద్వైతము ప్రజలలో ప్రాకియుండగా, ద్వైతము మాత్రము
బ్రాహ్మణులలో మాత్రము కలదు.

ఈ మూడు సిద్ధాంతములు పుట్టిన తర్వాత దాదాపు ఏడువందల
సంవత్సరములకు ‘త్రైత సిద్ధాంతము' పుట్టినది. త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో
పుట్టినా అది ఇప్పుడు తెలియుట చేత ఇప్పుడే పుట్టినదని చెప్పవలసి
వచ్చినది. త్రైత సిద్ధాంతము ఇప్పుడిప్పుడే పుట్టినా అది అతివేగముగా
ప్రజలలోనికి చొచ్చుకొని పోయినది. మాకు తెలిసినంతటిలో అద్వైతము
కంటే ఎక్కువ వేగముతో తక్కువ కాలములోనే ప్రచారమయినదని
తలచుచున్నాము. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరముల క్రిందటే త్రైత
సిద్ధాంతము పుట్టినా 37 సంవత్సరములప్పుడు దాని పేరును పెట్టడమైనది.
తర్వాత పది సంవత్సరములనుండి బయట ప్రచారము చేయుట జరిగినది.
పది సంవత్సరములలోనే మాకు తెలిసినంతవరకు చాలా వేగముగా
ప్రచారమయినది. మీరు కనపడలేదని చెప్పినా త్రైత సిద్ధాంతము మాకు
బాగానే కనిపిస్తున్నది.

మా గ్రంథములు చదివినవారు ఎవరయినా
త్రైతులుగా మారిపోయి త్రైత సిద్ధాంతమును ప్రచారము చేయుచున్నారు.
ఒక గ్రంథమును చదివినవారు కూడా త్రైత సిద్ధాంతమును అనుసరిస్తున్నారు.
వారే స్వచ్ఛందముగా ప్రచారము చేయుచున్నారు.
త్రైత సిద్ధాంతము ఒక్క భగవద్గీతలోనే కాకుండా, క్రైస్తవుల బైబిలు
గ్రంథములోనూ, ముస్లీమ్ల ఖురాన్ గ్రంథములోనూ చెప్పియుండుట వలన
ముస్లీమ్లు, క్రైస్తవులు మూడు ఆత్మల వివరమును తెలుసుకొంటున్నారు.
వారి గ్రంథములలోని త్రైత సిద్ధాంతమును క్రైస్తవులు, ముస్లీమ్లు ప్రచారము
చేయుట వలన, దేశములో త్రైత సిద్ధాంతము మూడు మతములలో ప్రచారమ
గుట వలన ఈ సిద్ధాంతము తొందరగా ప్రచారమగుచున్నది. అద్వైతము
విశిష్టాద్వైతము హిందువులలో మాత్రము గలదు. అట్లే ద్వైతము
బ్రాహ్మణులలో మాత్రము గలదు. అయితే త్రైత సిద్ధాంతము ఒక

కులమునకు గానీ, ఒక మతమునకుగానీ పరిమితి కాకుండా అన్ని
మతములలోనూ, అన్ని కులములలోనూ వ్యాపించిపోవుట వలన త్రైత
సిద్ధాంతము వేగముగా ప్రాకుచున్నదనియే చెప్పుచున్నాము. ఇంకా కొంత
కాలమునకు భారత దేశమునకే పరిమితి కాకుండా అన్ని దేశములయందు,
అన్ని జాతులయందు వ్యాపించగలదని చెప్పుచున్నాము.

ప్రశ్న :- అద్వైతము ద్రావిడ బ్రాహ్మణుడయిన శంకరాచార్యులతో
ప్రారంభమయినా కనిపించక త్రేతాయుగమునుండి ఆర్యులలో ఉండేది.
మొదట బ్రాహ్మణ కులములో మొదలయిన అద్వైతము తర్వాత కాలములో
మిగతా కులములలో కూడా ప్రాకిపోయినది. తర్వాత వచ్చిన విశిష్టాద్వైతము
కూడా ద్రావిడ బ్రాహ్మణులతో మొదలయినా అది దక్షిణ దేశమునకే
పరిమితమైపోయినది. అయినా మిగతా కులములలోనికి కూడా విశిష్టా
ద్వైతము కొంత ప్రాకినదనియే చెప్పాలి. తర్వాత వచ్చిన ద్వైతము దక్షిణ
దేశమున కర్నాటక రాష్ట్రములో పుట్టినా అది బ్రాహ్మణులకే పరిమితియై
పోయి, మిగతా కులములలో ప్రాకలేకపోయినది. అందువలన ద్వైతము
దేశములో ఎక్కడా ప్రాకలేదనియే చెప్పాలి. ద్వైత సిద్ధాంతమును అనుసరించు
బ్రాహ్మణులు మంత్రాలయము రాఘవేంద్ర స్వామి ఆలయములోనూ,
తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయములోనూ పూజారులుగా కనిపించు
చుందురు. ఇంతవరకు ముగ్గురు సిద్ధాంతకర్తలు ద్రావిడ బ్రాహ్మణులే
అయినా అద్వైతము పుణాది ఆర్యులదయిన దానివలన ఉత్తర భారత
దేశములో కూడా అద్వైతులు కలరు. విశిష్టాద్వైతము దేశములో ఎక్కడయినా
అరుదుగా కనిపించినా అది దక్షిణ దేశమునకే పరిమితమైనదనీ, ద్రావిడుల
లోనే విశిష్టాద్వైతమున్నదనీ చెప్పవచ్చును. మూడవ ద్వైత సిద్ధాంతకర్త

ద్రావిడ బ్రాహ్మణుడే అగుట వలన ద్వైతము దక్షిణ దేశములో మాత్రము
పరిమితముగా కనిపించుచున్నది.
ఇకపోతే త్రైత సిద్ధాంతము కూడా దక్షిణ దేశములోనే ఆంధ్ర
రాష్ట్రములో, రాయలసీమ ప్రాంతములో పుట్టినది. త్రైత సిద్ధాంత కర్త
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఈయన హిందూమతములో నాల్గవ
సిద్ధాంతకర్త. ఇంతవరకు మూడు సిద్ధాంతములు ద్రావిడ బ్రాహ్మణులకే
పరిమితమైపోయాయి. నాల్గవ సిద్ధాంతమును చెప్పిన త్రైత సిద్ధాంతకర్తయిన
ప్రబోధానంద యోగీశ్వరులది ఏ కులమో మాకు తెలియదు. జ్ఞానమునకు
కులము ముఖ్యము కాకపోయినా, సిద్ధాంతమునకు కులముతో ఏమాత్రము
సంబంధము లేకపోయినా ఎవరయినా అడిగితే మేము ఏమని చెప్పాలి?
అందువలన మేము ఇతరులకు చెప్పుటకు మిమ్ములను కులమును గురించి
అడుగుచున్నాము?

జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరుల శరీరము శరీరములోగల మధ్యాత్మదే
అయినా జీవభావముతో జీవుడనైన నేనే మాట్లాడుచున్నాను. ఇంతవరకు
ఏ గ్రంథ రచనలోనూ స్వయముగా మధ్యాత్మ ఎప్పుడూ మాట్లాడలేదు.
అయినా ఈ గ్రంథములో కొన్ని మాటలను తానే మాట్లాడి చెప్పడమైనది.
తర్వాత ఏమీ మాట్లాడలేదు. శరీరములోని జీవుడనయిన నా భావమునే
ఆత్మ బయటికి చెప్పుచున్నది. నోటితో పలికే పని చేసినా, భావము
జీవుడయిన నాదగుటవలన నేను మాట్లాడినట్లేగానీ, ఆత్మ మాట్లాడినట్లు
కాదు.

ఇప్పుడు నేనేమి చెప్పుచున్నాననగా! శరీరములోపల యున్న నేను
జీవుడను అయినందున గుత్రము కలవాడినే గానీ కులము లేనివాడిని.

ఇకపోతే శరీరమంతా వ్యాపించి శరీరమునకు అధిపతిగాయున్న ఆత్మకు
గుత్రము కూడా లేదు, కులము అంతకూ లేదు. బయట కనిపించు
శరీరమునకు మాత్రము తల్లితండ్రులనుబట్టి ఫలానా కులము అని
చెప్పుచున్నారు. అలా చెప్పినా అది ఆత్మకుగానీ, జీవాత్మకుగానీ కాకుండా
స్త్రీతత్త్వము గల శరీరమునదేనని చెప్పుచున్నాను. బయటి మనుషులు
ప్రకృతి భావములలోనే ఉంటారు. కావున వారికి కులము పేరు తప్పక
చెప్పవలసిందే. కావున ప్రబోధానంద యోగీశ్వరుల శరీరము పుట్టినది
కమ్మకులమున. ప్రబోధానంద యోగీశ్వరుల వారు కమ్మకులమున పుట్టునని
పోతులూరి వీరబ్రహ్మముగారు తన ఏష్యకాలజ్ఞానమున ముందే చెప్పి
యున్నాడు. బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఏమి చెప్పాడో ఇక్కడ
కొద్దిగా చూస్తాము.

“కమ్మలు తాటిపత్రికి పోయి ఏకవచనము మీద ఈ భూమిలో జనుల
పేరిట కమ్మజాతికి జాతులకెల్ల సంశయము లేక శీగ్రముగ రండని
వ్రాసినట్టియు ఆ కమ్మల మీద గుసగుసలు పోయిరి ప్రజలు" ఈ వాక్యములో
యోగీశ్వరుల యొక్క కులము పేరును ప్రస్తావించడమేకాక, ఆయన త్రైత
సిద్ధాంతమును ప్రచారము చేసిన ఊరు పేరు కూడా చెప్పడము విశేషము.
ప్రబోధానంద యోగీశ్వరుల మీద ప్రజలు అనేక రకములుగా మాట్లాడు
కోవడమును ఆ కమ్మల మీద ప్రజలు గుసగుసలు పోయిరని వ్రాశారు.
ఇక్కడ చెప్పవలసినది ఈ వాక్యములో "తాటిపత్రి" అని ఊరు పేరు గలదు.
తాడిపత్రి రైల్వేస్టేషన్లో రైల్వేస్టేష్టన్ మొదటిలోనే ఊరు పేరుండు పెద్ద
బోర్డు ప్రతి స్టేషన్లో స్టేషన్కు రెండువైపులా యుండును. నేను
చూచినప్పుడు బహుశా 1972లో 'తాటిపత్రి' అను పేరుతో యుండేది.

ఆ బోర్డు సిమెంటుతో తయారు చేసినది. ఆ బోర్డు మీద దాదాపు ఒకటిన్నర
అడుగు విస్తీర్ణముతో "తాటిపత్రి" అను నాలుగు అక్షరములు ఉండేవి.
అది కూడా మందముగాయున్న సిమెంటు పలుకమీద నాలుగు అక్షరములు
గుంతలుగా యుండేవి. సిమెంటు పలుకమీద అక్షరమున్నట్లు తగ్గుగా
సిమెంటును గీకివేసి గుంతలో అక్షరముయొక్క ఆకారమును కనపడునట్లు
చేసియుండిరి. దానిని నేను బాగా గమనించాను. తర్వాత క్రొత్తగా బోర్డుకు
రంగును వేయునప్పుడు పసుపు రంగు బోర్డంతయూ పూసి అక్షరముల
తగ్గులో నలుపురంగు వ్రాశారు. అయితే బోర్డుతో యున్న “డి” ని నలుపు
రంగుతో వ్రాయక దానిమీద 'డి' ని వ్రాయడము జరిగినది. అలా మేము
చూస్తున్నట్లే 'తాటిపత్రి' అనే పేరు కాస్తా 'తాడిపత్రి'గా మారిపోయినది.
'టి' మీద 'డి' అని వ్రాసినా 'టి' ఆకారము తగ్గుగా యుండేది కావున బాగా
చూస్తే ‘డి’ క్రింద ‘టి’ కనిపించేది. అంతేకాక త్రేతాయుగమున శ్రీరాముడు
సీతకొరకు దక్షిణ దేశము వచ్చినప్పుడు ఈ ప్రాంతములోనే తాటకిని
సంహరించాడని, అందువలన ఈ ఊరుకు 'తాటిపత్రి' అను పేరు
వచ్చినదని కొందరు పెద్దలు చెప్పగా విన్నాము. దాదాపు 40 సంవత్సరము
లప్పుడు 'తాటిపత్రి' అను పేరు మారిపోయి ‘తాడిపత్రి’గా రూపొందినది.
మూడు సంవత్సరముల క్రితము వరకు అదే బోర్డు ఉండేది. ఇప్పుడు
రైల్వేస్టేషన్ పెద్దగా అయిన దానివలన పాతబోర్డులు తీసి పూర్తిగా
క్రొత్తబోర్డులు పెట్టడము, వాటిమీద 'తాడిపత్రి' అని వ్రాయడము జరిగినది.
ఇదంతయూ ఎందుకు చెప్పుచున్నామనగా! బ్రహ్మముగారు వ్రాసినది
మేమున్న తాటిపత్రేనని తెలియడము కొరకే.

పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధానంద యోగీశ్వరులు
పుట్టినది కమ్మకులమని తెలుపుటకు ఈ వాక్యములో “కమ్మలు తాటిపత్రికి

పోయి” అని చెప్పాడు. బ్రహ్మముగారు చెప్పినట్లు ప్రబోధానంద
యోగీశ్వరులు బాల్యములో తాటిపత్రిలోయున్నా ఎనిమిది సంవత్సరముల
వయస్సులో అక్కడినుండి వేరే ఊరికి పోవడము జరిగినది. ఆయన కొన్ని
ఊర్లు మారిన తర్వాత తిరిగి తాటిపత్రికి రావడము జరిగినది. తర్వాత
ప్రబోధాశ్రమము స్థాపించడమైనది. తాటిపత్రికి వచ్చి ప్రబోధాశ్రమమును
నిర్మించుట వలన "కమ్మలు తాటిపత్రికి పోయి” అని అన్నారు. ప్రబోధానంద
యోగీశ్వరులను చూచి సరిపోనివారు ఆయన ఎదురుగా కాకుండా చాటున
ఆయనను గురించి మాట్లాడుకోవడము జరుగుచుండెడిది. అందువలన
"ఆ కమ్మల మీద గుసగుసలు పోయిరి ప్రజలు" అని వ్రాశారు. ఇప్పుడు
మీరు అడిగిన ప్రశ్నకు మేము చెప్పకనే బ్రహ్మముగారి వాక్యము వలన
జవాబు దొరికినది కదా! ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన జ్ఞానము
సరిక్రొత్తదిగా ఉండును. ఆయన 'విడదీయరాని' బ్రహ్మముగారి తత్త్వాలకు
అర్థాలు చెప్పాడు. ‘ముడివిప్పలేని' వేమన పద్యాలకు వివరములు చెప్పాడు.
మిస్టరీగా మిగిలిపోయిన 'బెర్ముడా ట్రయాంగిల్' రహస్యాలను ఛేదించి
చెప్పాడు. మరణ రహస్యాలను, జన్మ వివరాలను ఇది అది అనకుండా
ఎన్నో క్రొత్త విషయములను చెప్పుట వలన భక్తి కల్గినవారు వినగలిగారు.
భక్తిలేని వారు యోగీశ్వరులను విమర్శించను మొదలు పెట్టారు.
విమర్శలను ఎదురుగా కాకుండా చాటుగా గుసగుసల రూపములో చేశారు.

ప్రశ్న :- మేము కూడా కొందరు అనుకోగా విన్నాము. ప్రబోధానంద
యోగీశ్వరులు చెప్పే బోధలు ప్రత్యేకముగా ఉంటాయని, ఇంతవరకు ఎవరూ
చెప్పని బోధలను చెప్పుతాడనీ, అట్లే ఇంతవరకు ఎవరూ వ్రాయని బోధలనే
గ్రంథములలో వ్రాస్తాడనీ అనుకోగా విన్నాము. అది ఎంతవరకు వాస్తవము?

జవాబు :- ఈ విషయమును గురించి మేము చెప్పితే మా గొప్పతనమును
గురించి మేమే చెప్పుకొన్నట్లగును. మేము చెప్పుటకంటే మీరే స్వయముగా
చదువుకోవడము మంచిది. ఇతరులు వినిగానీ, చదివిగానీ మా బోధలలోని
ప్రత్యేకతను తెలుసుకోవడము మంచిది. యోగీశ్వరుల వారు ఎవరికీ
తెలియని ఆధ్యాత్మిక రహస్యములు చెప్పుననుటకు సాక్ష్యముగా వీరబ్రహ్మేంద్ర
స్వాములవారు తన కాలజ్ఞానమున చెప్పిన ఒక వాక్యమును గుర్తుగా
చూస్తాము. "ఆనందాశ్రయుల చేత చిణకె బెణకె, అతి దేదీప్యమాన తేజస్సు
ఇస్తిమి. సర్వమూ ఇందులోనివే ఇది సాంగోపాంగమైన, అతి సూక్ష్మమైన,
అతి రహస్యమైన పంత వాక్యము." దీనినిబట్టి యోగీశ్వరులు చెప్పే
జ్ఞానమంతయూ రహస్యములతో కూడినదేయని తెలియుచున్నది.
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన గ్రంథములను నాలుగింటిని
చదివాము. మీరు చెప్పినట్లు ఆ గ్రంథములలోని జ్ఞానము ప్రత్యేకమయిన
దని అర్థమగుచున్నది. ఆయన వ్రాసిన విషయములు ఎవరూ చెప్పని
విషయములే. వాటిని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, ఎవరూ వ్రాయలేదు.
అయితే ఆయన చెప్పిన కొన్ని ఉపన్యాసములను మేము విన్నాము.
మాటలలో ఒక క్రొత్త విషయము మాకు తెలిసినది. ఒక మీటింగ్
“ఇక్కడికి వచ్చినవారు మంచి ఉద్దేశ్యముతో జ్ఞానము తెలియాలను
భావముతోనే ఉండండి. నన్ను విమర్శించు ధోరణిలోగానీ, అసూయతో
చూచుటగానీ ఉండకూడదని తెలుపుచున్నాను. అట్లుండుట వలన నాకు
నష్టముగానీ, కష్టముగానీ ఉండదు. అయితే అది మీకే మంచిదికాదు
దానివలన మీకే నష్టము కష్టము ఏర్పడగలదు. ఎందుకనగా! ఇక్కడ
మీకు కనిపించని దేవతలు, ఆకాశమునుండి దిగివచ్చిన గ్రహములు, ఎందరో

గొప్పవారు మీతోపాటు వచ్చియున్నారు. వారికి మీ భావములు కనిపించితే
వారికి మా మీద గల అభిమానముతో మీకు చెడు చేయగలరు. మీరు
నన్ను చెడుగా అనుకొనినా నేనేమీ చేయువాడను కాను. అయితే నా మీద
గౌరవమున్న దేవతలకు, గ్రహములకు మీ మీద కోపము వచ్చును.
అందువలన వారు ఏమయినా చేయవచ్చును” అని చెప్పారు. ఆయన
బోధలను వినుటకు మనుషులు వచ్చుట వాస్తవమే. అయితే దేవతలు,
గ్రహములు వచ్చుట వాస్తవమా?

జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు మనిషిగా కనిపిస్తున్నా ఆయన
వాస్తవానికి ఆత్మత్రయములో మధ్యాత్మగా యున్నాడు. నేను అదే శరీరములో
ఒకచోట, ఒకమూల యున్న జీవున్ని నా భావములను నేను వ్యక్తము
చేయుచున్నాను. శరీరము యోగీశ్వరులదే అయినా అందులోని
అనుభూతులన్నియూ నేరుగా జీవుడనయిన నన్ను చేరుచుండును. శరీరము
లోని బుద్ధికి ప్రక్కగాయున్న నాకు బుద్ధికి చేరిన విషయములన్నియూ
తెలియుచుండును. మీకు కల్గిన అనుమానము తీరుటకు నాకు తెలిసిన
సత్యములను కొన్నింటిని తెలుపుతాను. అప్పుడు మీరే ఒక నిర్ణయమునకు
రావచ్చును. ఈ రోజు శనివారము 9.1.2016 తేదీ. సమయము
సాయంకాలము 6.15 నిమిషములు. గడచిన రాత్రి 11.00 గంటల
సమయములో యోగీశ్వరులవారు మంచము మీద పడుకొన్నారు. బయట
అనుభవములు లోపలయున్న నాకు తెలియుచుండును కదా! నా భార్యగా
యున్నవారు లైట్లు ఆర్పి పడుకొనే సమయము. ఆమె యోగీశ్వరుల పడక
గదిలో లైట్లు ఆర్పి నీళ్ళు త్రాగి వచ్చేదానికి వంటరూములోనికి పోయినది.
ఆ విషయము ఆయనకు తెలియదు. లైట్లు ఆర్పిన తర్వాత ఆయన రెండు
కాళ్ళలో కుడికాలును పట్టుకొని తల ఆనించి నమస్కారము చేసుకొన్నట్లు

స్పర్శ బుద్ధికి తెలిసినది. అది నాకు కూడా తెలిసియుండును కదా! అక్కడ
మ్రొక్కినది ఎవరయినది తెలియక “ఎవరు కాళ్ళకు మ్రొక్కినది?” అని
అడిగాము. అప్పుడప్పుడు కొందరు భక్తులు మ్రొక్కిపోవడము జరుగు
చుండెడిది. దానివలన ఇంతవరకు ఇక్కడ ఎవరున్నారని అడుగడమైనది.
అప్పుడు నా భార్య వంటరూములో నుండి వచ్చి “ఏమిటి అడుగుచున్నారే!”
అన్నది. అప్పుడు ఆ విషయము ఆమెకు తెలియదనీ, మ్రొక్కినవారు
మనుషులు కారనీ, కనిపించని వారు ఎవరో మ్రొక్కియుంటారనీ అను
కున్నాము. ఇలాంటి అనుభవములు ఎన్నో నాకు కూడా తెలియుచుండును.
అప్పుడు అక్కడ మ్రొక్కినవారు యోగీశ్వరులకు మ్రొక్కారు. ఎవరు మ్రొక్కినది
ఆయనకు తెలుసు. నాకు ఏమాత్రము తెలియదు. పడుకొనియున్నప్పుడు
కాళ్ళు పట్టుకొనియున్నట్లు స్పర్శద్వారా తెలియుచుండును. ఆ విషయమంతా
నాకు కూడా కొంత అర్థమగుచున్నది. కొద్దిగ కాలు కదిపితే ఆ స్పర్శ
తేలిపోయినట్లు చిన్నగా లేకుండాపోవును. ముడుచు కొన్న కాలును చాపి
పెట్టినట్లు ఒకమారు తెలిసింది. ఇతరులైతే ఈ విషయములో భయపడి
పోవుదురు. నాకు అనేక అనుభవములుండుట వలన అక్కడ ఏమి
జరుగుచున్నదో అర్థమగుచున్నది. ఈ విషయములు అర్థము కావాలంటే
ఎంతో విచక్షణ అవసరమని చెప్పుచున్నాను.

ఇటువంటి అనుభవములను చూచిన తర్వాత ఎవరో మనకు
తెలియనివారు, మనకు కనిపించనివారు యోగీశ్వరుల వద్దకు వచ్చి సేవ
చేయుచున్నారని అర్థమయినది. ఈ విషయములన్నియూ చెప్పనవసరము
లేదు. అయినా తప్పక చెప్పవలసివచ్చినది. ఎందుకనగా! ఏమీ తెలియని
సుత్తిచంద్రారెడ్డిలాంటివారు శంకరాచార్యుల ప్రక్కన, సిద్ధాంతకర్తల ప్రక్కన
ఫోటోపెట్టుకొన్నాడు. వారి ప్రక్కన ఉండేదానికి ఈయన అర్హుడా? అన్నారు

కదా! వారి ప్రక్కన ఈయన ఉండవచ్చునో లేదో, ఈయన ప్రక్కన వారు
ఉండవచ్చునో లేదో ఎవరు అర్హులో, ఎవరు అర్హులు కాదో మీరే నిర్ణయించు
కొనుటకు ఈ విషయములను చెప్పుచున్నాను. నేను చెప్పేది సత్యము
కావచ్చును, అసత్యము కావచ్చును. నా మాటలటుంచి వీరబ్రహ్మముగారు
తన కాలజ్ఞానములో వ్రాసిన వ్రాతను ఇప్పుడు చూస్తాము. "మహా
దేవతలందరూ ఆనందాశ్రమము వద్దనే యున్నారు" స్వయానా వీరబ్రహ్మము
గారు చెప్పినమాటను కాదనలేము కదా! దేవతలు మనకంటికి కనిపించరు.
మహాదేవతలంటే దేవతలకంటే గొప్ప దేవతలని అర్థము కదా!
అటువంటప్పుడు ఈ మాటనుబట్టి యోగీశ్వరులు ముందు వచ్చిన
సిద్ధాంతకర్తలకంటే గొప్పవాడో తక్కువవాడో మీరే యోచించుకోండి.

బ్రహ్మముగారి కాలజ్ఞాన వాక్యములలో "బ్రహ్మాది దేవతలలోనూ
ఆనందాశ్రయులు ఆదిమూర్తి. శాస్త్రము మీకు వివరముగా ఆనతిచ్చారు.
ఆయన వల్లనే మేము శాస్త్రము విన్నాము". ఈ వాక్యమునుబట్టి దేవతలందరి
లోనూ గొప్ప అయిన ఆదిమూర్తియని యోగీశ్వరుల వారిని ఆనందాశ్రయు
లనుచూ చెప్పారు. అంతేకాక "ప్రబోధాశ్రమము వారి ఆదిగుణ మెల్ల
శయనాధిపతికి ఉన్నది." అను ఈ కాలజ్ఞాన వాక్యములో కూడా
ప్రబోధానంద యోగీశ్వరులు విష్ణువాంశగల వాడనీ, అందువలననే
ఆదిమూర్తియని అన్నారనీ తెలియుచున్నది. ఇవన్నియూ చూచిన తర్వాత
బ్రహ్మముగారి వాక్యములను సాక్ష్యముగా చూచిన తర్వాత యోగీశ్వరుల
వద్దకు దేవతలు రారని ఎలా చెప్పగలము? ఈ విషయములన్నియూ దైవ
రహస్యములు. దీర్ఘముగా ఆలోచించవలసియున్నది. తొందరపాటు
నిర్ణయాలు పనికి రావు. అందువలన బాగా ఆలోచించమని తెలుపు
చున్నాము.

ఇదంతయూ చూచిన తర్వాత బ్రహ్మముగారి కాలజ్ఞానములో
మరియొక విచిత్రమయిన వాక్యము బయటపడినది. అందులో భూమిమీద
దేవతలు వచ్చి పుట్టియున్నా వారు ఎవరయినది వారికి జ్ఞాపకము రాకుండా
దేవుడే మాయ చేసినట్లు కలదు. చూడండి. “కారణార్థము కొరకు మేము
అవతరించినాము. మా సహవాసులయిన పురుషులు అవతరించినారు.
అందరము ఈ భూలోకములోనే యున్నాము. అయినా వారివారి
స్వరూపములు వారికి తెలియకుండా మాయ చేసివేసినాము. మర్మముగా
యుండునట్లు చేసినాము". ఈ వాక్యములో మాయగా మర్మముగా మనకు
తెలియకుండా కొందరు దేవతలు మానవ శరీరములో యున్నారని
తెలియుచున్నది. మనకు తెలియకుండా ఉండడమే కాదు ఆ విషయము
వారికి కూడా తెలియదనియే చెప్పారు. వారికి అప్పజెప్పిన పనిని మాత్రము
వారు చేయునట్లు దేవతలను సహితము నియమించిన వారు ఇంకొకరున్నా
రని తెలియుచున్నది. వారు ఎవరు? అని ఆలోచిస్తే “కారణార్ధము మేము
అవతరించాము” అని అనడములో ఏమి కారణముండును అని ఆలోచిస్తే
జ్ఞానమును బయట ప్రజలకు తెలియజేయడమే ముఖ్యకారణముగా
కనిపించుచున్నది.

బ్రహ్మవిద్యయిన అసలు జ్ఞానమును తెలియజేయడమే ముఖ్య
కారణముగా యుండుట వలన మధ్యాత్మ శరీరమును ధరించి కనిపించక
జ్ఞానమును బోధించుచున్నదని అర్థమగుచున్నది. ముగ్గురు సిద్ధాంతకర్తలు
వచ్చి బోధించిన బోధలలో శాస్త్రబోధలు లేకపోవడము వలన సృష్ట్యాదినుండి
చెప్పిన బోధకు సిద్ధాంతకర్తల వలన ఆటంకము ఏర్పడుట వలన, తాను
వద్దనీ, మాయయనీ చెప్పిన వేదములను సిద్ధాంతకర్తలు ముగ్గురూ గొప్పగా

చెప్పడము వలన అసలయిన ఆదిమూర్తి మానవ శరీరములో ఆత్మగా యుండి
పలికి మాట్లాడి బోధలు చెప్పవలసి వచ్చినది. అలా చెప్పినదే త్రైత
సిద్ధాంతమని చెప్పుకొన్నాము. త్రైత సిద్ధాంతము ఆదిలో చెప్పబడిన
సిద్ధాంతము అయినా అది కలియుగములో ఇంతకాలము తెలియకపోవడము
వలన, త్రైత సిద్ధాంతము కాని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతమను సిద్ధాంతములు
బయటికి రావడముతో అవి అసలయిన సిద్ధాంతములు కావు. ఇదే నిజమైన
సిద్ధాంతమని తెలియచెప్పుటకు రావడమే ముఖ్యకారణార్థము అని
చెప్పవచ్చును. అలా వచ్చినవానికి నేను ఫలానా అని తెలిసినా, ఆయన
వెంట ఆయన కార్యములో సహకరించుటకు వచ్చిన సహచరులకు మాత్రము
తాము ఎవరయినది తెలియకుండా చేయబడినది. వచ్చిన వారు ఎవరో
వారికే తెలియనంత మాయ ఉండగా సామాన్య మనుషులయిన మనము
ఎవరిని గుర్తించగలము, గుర్తించలేము.

ప్రశ్న :- రెండు ప్రశ్నల క్రిందట ప్రబోధానందయోగీశ్వరుల కులమును
గురించి అడిగిన ప్రశ్న వచ్చినది. అప్పుడు మీరు చెప్పిన జవాబులో నాకు
‘గుత్రము’ కలదుగానీ, కులము లేదు. ఆత్మగాయున్న యోగీశ్వరుల వారికి
'గుత్రము లేదు, కులము అంతకూ లేదు' అని చెప్పారు. అక్కడ మీకు
కులము లేదని అనడము అర్థమయినది కానీ, గుత్రము కలదని చెప్పారు.
అట్లే యోగీశ్వరుల వారికి గుత్రము కూడా లేదని చెప్పారు. జీవుడైన
మీకున్నది, యోగీశ్వరులవారికి లేనిది అయిన “గుత్రము” అంటే ఏమిటో
తెలుపవలెనని కోరుచున్నాము?

జవాబు :- “గు” అనగా గుణములనీ, “త్ర” అనగా మూడు అని అర్థము.
జీవుడుగాయున్న నేను గుణచక్రములోనే యున్నాను. గుణచక్రములో

తామస, రాజస, సాత్త్విక అను మూడు గుణ భాగములు కలవు. నేను
మూడు గుణభాగములలో యుండుట వలన గుత్రములో యున్నానని
చెప్పాను. సహజముగా ప్రతి శరీరములోని జీవుడు మూడు గుణముల
యందే ఉండును. ఇకపోతే శరీరమునకు అధిపతి అయిన ఆత్మ గుణముల
బయట ఉండును. గుణముల బయట గుణములకు ఆధారముగా యున్న
బ్రహ్మనాడిలో మధ్యాత్మ నివాసమని చెప్పవచ్చును. ఆత్మయిన వానికి
గుణములు లేవు కావున ఆయనకు 'గుత్రము లేదు' అని అన్నాము. నాకు
గుణములున్నవి కావున 'గుత్రముకలదని' చెప్పాము. గుణము ఉంటే
కులము తప్పక ఉండునని చెప్పలేము. గుణములేని వానికి బయట కులము
కూడా ఉండదు. కులము బయట ప్రజల లెక్కలోనిది. జ్ఞానము తెలియని
జీవునికి బయట కులము ఉండును. జ్ఞానమున్న వానికి బయట కులము
కూడా ఉండదు. నాకు కొంతవరకు జ్ఞానము తెలియుట వలన
'గుణములున్నవి గానీ, కులము లేదని' చెప్పాను. దానినే 'గుత్రము
కలదుగానీ కులము లేదు' అని చెప్పాను. శరీరములో మధ్యాత్మ అయిన
వాడు గుణములలోయుండక గుణముల బయట నివాసముండుట వలన
ఆయనకు గుత్రము కూడా లేదని, కులము అంతకూ లేదని చెప్పాము.

సాధారణ మనిషి అయిన వాని శరీరములో జీవుడు అయినవాడు
ప్రతి ఒక్కడు గుణచక్రమున నివాసముండుట వలన గతములో అద్వైత,
ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతకర్తలయిన ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు,
రామానుజాచార్యులు ముగ్గురు గుణములలోయున్న వారేనని చెప్పవచ్చును.
గుణచక్రములోని జీవుని చిత్రమును తర్వాత పేజీ చిత్రపటములో
చూడవచ్చును.

బ్రహ్మనాడి,
సాత్విక గుణభాగము,
రాజస గుణభాగము,
తామస గుణభాగములో 'జీవుడు',
గుణచక్రము  288 చిత్రమును పేజీ లో చూడండి. 

పై పటములో యున్నట్లు అందరి గుణచక్రములో మూడు గుణ
భాగములుండగా, ఆ మూడు భాగములలో ఏదో ఒక గుణభాగములో
జీవుడు ఉండడము ప్రతి శరీరములో జరుగుచున్నది. కొందరు జీవుళ్ళు
సాత్విక భాగములో ఉండగా, కొందరు రాజసములో, కొందరు తామసములో
ఉండడము జరుగుచున్నది. మూడు గుణ భాగములకు మధ్యలో బ్రహ్మనాడి
గలదు. బ్రహ్మనాడిలో మధ్యాత్మ నివాసముండును. జీవాత్మ గుణచక్రమందు
ఉండగా, మధ్యాత్మ బ్రహ్మనాడియందుండి శరీరమంతా వ్యాపించియుండగా,
పరమాత్మయను దేవుడు (యెహోవా, లేక అల్లాహ్) శరీరమంతటా, లోపల
బయటా అణువణువునా వ్యాపించియుండును.


ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. పూర్వము మూడు
గుణములను కలిపి 'గుణత్రయము' అని చెప్పెడివారు. అదే పదమునే
గుణకు బదులు “గు”ను త్రయముకు బదులు "త్ర" అను రెండు అక్షరములను
'గుత్ర' అని చెప్పెడివారు. గుణ త్రయము లోని మొదటి రెండు అక్షరములను
తీసుకొని, ‘గుత్ర’ అని చెప్పడము వలన మూడు గుణములని పూర్తి తెలిసి
పోవును. గుత్ర అను రెండు పొడి అక్షరములలో మూడు గుణములని
తెలిసిపోయెడిది. ఇంతకుముందు మనము చెప్పుకొన్నట్లు తాటిపత్రి
పోయి తాడిపత్రిగా ఎలా మారిపోయినదో అలాగే కాలక్రమమున “గుత్ర”

అను పదము పోయి “గోత్ర” అను పదముగా మారిపోయినది. పూర్వము
'గుత్రము’ అనుమాటను ప్రజలు నేడు 'గోత్రము' అను మాటగా మార్చి
చెప్పుచున్నారు. ప్రతి మనిషికి బయట కులమున్నట్లే లోపల గుణము
ఉండును. శరీరములో జీవుడు గుణచక్రములో ఉండే భాగమును బట్టి
వానికి ఆ పేరు ఆధ్యాత్మికములో చెప్పబడెడిది. తామస భాగములోయున్న
వానిని తామసుడు అని అనెడివారు. రాజస భాగములో యున్నవానిని
రాజసుడు అని అనెడివారు. అట్లే సాత్వికములో యున్నవానిని సాత్వికుడు
అని అనెడివారు.

పూర్వము ఒక దేవాలయము వద్దకు పోయి గుడిలోని దేవుని
ముందర పూజ చేయించుకొనేటప్పుడు పూజ చేయువాడు ఫలానా వాడు
అని చెప్పి పూజ చేయడము అర్చకులకు అలవాటైపోయినది. ఆ విధముగా
పూజచేయునప్పుడు పూజచేయువాని పేరు కులము, గోత్రము అడిగి పూజ
చేయడము చూస్తున్నాము. పూర్వము ఇప్పుడు చెప్పు గోత్రమును అప్పుడు
గుత్రముగా చెప్పెడివారని తెలుసుకొన్నాము కదా! దానిప్రకారము పూజ
సమయములో పూజ చేయువాని గుర్తింపుకు పూర్వము పూజలో పూజ
చేయువాని బయట కులము, బయట పేరు చెప్పి శరీరములోపల గుణము
పేరు చెప్పెడివారు. అప్పుడు రాజసములోయున్న వానిని రాజస గోత్రస్య
అనియు మిగతా గుణములలో యున్నవానిని సాత్విక గోత్రస్య, తామస
గోత్రస్య అని చెప్పెడివారు. అట్లు మనుజులకు మూడే గోత్రములుండేవి.
ఈ కాలములో గుత్రము గోత్రమయినదేకాక, మనిషి అజ్ఞానముగా
మారిపోయి జ్ఞానమును అనుసరించి చెప్పిన గోత్రము (గుత్రము) అనేక
రకములుగా మారిపోయినది. అజ్ఞానమును అభివృద్ధి చేయు నిమిత్తము
మనిషి మూడు (3) గోత్రములను వదలి దాదాపు 108 గోత్రముల పేర్లు

చెప్పుకోవడము జరుగుచున్నది. పూర్వము మన సంస్కృతి ఏమిటి? మనము
ఎటువంటి జ్ఞానము కల్గియుండెడి వారమను మాటను పూర్తిగా మరచి
పోయారు. జ్ఞానమునుండి మనిషి అజ్ఞానముగా మారిపోయినట్లు మనిషి
గుత్రము నుండి గోత్రములోనికి మారిపోయాడు.

ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము మూడు గుణములకు ఆధారము
బ్రహ్మనాడి. బ్రాహ్మనాడిని అనుసరించి గుణములుండును. బ్రహ్మనాడిలోని
ఆత్మను అనుసరించి గుణములుండును. ఆత్మ గుణముల బయటయుండి
గుణముల చేత గుణముల మధ్యలోయున్న జీవుని కర్మ ప్రకారము పనిని
చేయించుచుండును. ఆధ్యాత్మిక పరిభాషలో గుణములను 'వేదాలు' అని
అనడము జరిగినది. బ్రహ్మవిద్యలో శాస్త్రమైన భగవద్గీతలో "త్రైగుణ్యా
విషయావేదా” అని చెప్పడమైనది. దీని భావము ప్రకారము మూడు గుణ
విషయములే, లేక మూడు గుణ భావములే వేదములని చెప్పబడినది.
ఆత్మ శరీరములో మధ్యన బ్రహ్మనాడిలోయుండి మరణములో శరీరమును
వదలి జననములో వేరు శరీరమును చేరునప్పుడు ఆత్మ వెంటనే
గుణచక్రమూ దానితోపాటు గుణములన్నియూ పోవుచుండును. ఆత్మ
ఎక్కడికి పోతే ఆత్మ వెంటనే పోవు గుణములను వేదములన్నాము.
వేదములను సృష్ట్యాదిలో మనిషితో పాటు సృష్టించబడినాయి. అందువలన
వాటిని ఆదివేదాలు అనడమైనది. ఈ గుణముల విషయమును, ఆత్మవెంట
గుణములు పోవు విషయమును, మనుషులు అందరూ గుణములలో
ఉండు విషయమును ఏష్య కాలజ్ఞాన మందు ఈ విధముగా ప్రస్తావించడము
జరిగినది. ఆ వాక్యములను ఇక్కడ చూస్తాము.

"ఆది వేదములన్నియు ఆనందాశ్రమము వెంటనే వచ్చేను. మీకు
మాకు అదే గోత్రము" అని అన్నాడు. బ్రహ్మముగారి ఈ మాటలో

సృష్ట్యాదినుండి యున్న గుణములను ఆదివేదములని చెప్పాడు. మధ్యాత్మ
ఎక్కడికిపోతే అక్కడికి పోవు గుణములను "ఆది వేదములన్నియు
ఆనందాశ్రమము వెంట వచ్చేను" అని చెప్పారు. మనుషులందరూ గుణముల
లోనే యున్నారు, కనుక మాకు మీకు అదే గోత్రము అని చెప్పారు. ఈ
విధముగా శరీరములోని ఆత్మజ్ఞానమును బ్రహ్మముగారు బయలుపరచారు.

ప్రశ్న :- అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను ప్రకటించిన శంకరా
చార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు వారిని గురించి ముందస్తు
భవిష్యత్తును ఎవరూ చెప్పలేదు. అలా ముందస్తుగా రాబోవు వానిని గురించి
చెప్పినది ముగ్గురే కలరు. ఆ ముగ్గురిలో ఒకరు శ్రీకృష్ణుడు, రెండవ వాడు
ఏసు. మూడవ వాడు ప్రబోధానంద యోగీశ్వరులు. అయితే చరిత్రలో
ముందే వ్రాసియుంచబడిన వారు ఇద్దరుకాగా ఒక కృష్ణుడు మాత్రము
ధర్మసంస్థాపన నిమిత్తము రాగలడని నోటిమాటగా చెప్పాడు. ఆ మాట
ఎక్కడా వ్రాయబడలేదు కావున కృష్ణుని గురించి ముందస్తుగా చెప్పిన
విషయము ఎవరికీ తెలియదు. ఏసు రాకను గురించి, ఆయన జీవితములో
జరుగు కొన్ని సంఘటనలను గురించి కొన్ని వందల సంవత్సరముల పూర్వమే
‘యెషయా' అను ప్రవక్త, వీరబ్రహ్మముగారు ప్రబోధాశ్రమము గురించి,
ప్రబోధానంద యోగీశ్వరుల వారి గురించి దాదాపు నాలుగు వందల
సంవత్సరముల ముందే భవిష్యవాణి వ్రాసినట్లు వ్రాసియుంచారు. యెషయా
కొన్ని వందల సంవత్సరముల పూర్వము ఏసును గురించి ముందే వ్రాయగా
అదే విధానము ప్రకారము యోగీశ్వరుల గురించి వ్రాశారు. వారు వ్రాసినట్లే
అన్ని విషయములు జరుగుచూ వచ్చాయి.

ఏసు జీవితములోని ముఖ్యమైన సంఘటనలు యెషయా ప్రవక్త
ద్వారా వ్రాసిపెట్టగా అట్లే జరుగడము అందరికీ తెలిసిన విషయమే. ఏసు
బోధల వలన నేడు ప్రపంచములోనే అతి పెద్ద జనాభా ఆయన జ్ఞానమునే
అనుసరిస్తున్నాయి. అది ఆయన జీవిత ప్రత్యేకత అనుకొందాము. అయితే
ప్రబోధానంద యోగీశ్వరుల జీవితములో ఏదయినా ప్రత్యేకత కలదా?
ఉంటే అది ఏదో చెప్పమని అడుగుచున్నాము?

జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరుల జీవితములో ముందస్తుగా వ్రాసినది
ఆయన జ్ఞానము గురించే కలదు. యోగీశ్వరులు చెప్పు బోధలు అన్నియు
ప్రత్యేకముగా ఉంటాయి. ఇంతకుముందు ఎవరయినా చెప్పిన బోధలుగానీ,
వ్రాసిన జ్ఞానమునుగానీ ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పడముగానీ,
వ్రాయడముగానీ జరుగలేదు. ఆయన చెప్పు జ్ఞానమంతయూ సరిక్రొత్తగా
యుండును. ముఖ్యముగా గతములో వచ్చిన ముగ్గురు సిద్ధాంతకర్తలు
వేదములను అభ్యసించి వైదిక జ్ఞానమును బయటికి చెప్పగా, యోగీశ్వరులు
వేదాలను విసర్జించమనీ, వాటివలన దైవజ్ఞానము తెలియదనీ చెప్పాడు.
భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయమున భగవంతుడు
చెప్పిన రెండు శ్లోకములతో ధర్మములను, అధర్మములను తేల్చి చెప్పాడు.
అక్కడ వ్రాసిన “యజ్ఞముల వలన, దానముల వలన, వేదపఠనము
వలన, తపస్సులు చేయుట వలన దేవుడు తెలియబడడు” అని చెప్పు
చుండును. ఈ నాలుగు కార్యములు నాలుగు అధర్మములని చెప్పారు.
అంతేకాక బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు మూడు ధర్మములని చెప్పు
చుండును. అందరూ చేయు సాధనలను విసర్జించి జ్ఞాన సముపార్జనే
మనిషికి ముఖ్యమని చెప్పి సాధనలన్నిటిని వదలమని చెప్పుచుండును.
ఈ విధముగా యోగీశ్వరులు తన బోధనలో ఎంతో ప్రత్యేకతను

చూపడమేకాక, జ్ఞానమునంతటినీ క్రొత్త పంథాలో చెప్పడమేకాక అట్లు
ఆచరించడము వలననే ముక్తి లభించునని చెప్పును. దైవజ్ఞానమంతయూ
శరీరములోపలే యున్నదనీ, శరీరము బయట ఎంత ప్రయత్నించినా,
శరీరము బయట జ్ఞానమును ఎంత ఆచరించినా ప్రయోజనములేదనీ
శరీరములోనే జ్ఞానమును సాధించవలెననీ చెప్పుచుండును. తన జ్ఞానము
ప్రత్యేకమయినదని, వేదములను కాదని బోధించడము వలన ఆయనది
ప్రత్యేక జ్ఞానమయినది.

ప్రబోధానంద యోగీశ్వరుల బోధలో గతములో ముగ్గురు సిద్ధాంత
కర్తలు చెప్పినట్లు వేదముల ప్రసక్తి ఏమాత్రము ఉండదు. వేదములను
వ్యాసుడు వ్రాయడము వలన వేదములకు ప్రజలలో గౌరవము ఏర్పడినది.
ప్రజలలో అంటే ప్రజలందరికీ కాదు సాధారణ ప్రజలకు. వ్యాసుడు
అంటే ఎవరయినది కూడా తెలియదు. భారతదేశములో రెండువందల
సంవత్సరముల క్రిందట వరకు ప్రజలలో కేవలము పదిశాతము మాత్రమే
చదువు వచ్చిన వారుండెడివారు. ఇప్పటివలె ప్రభుత్వ పాఠశాలలుగానీ,
ప్రైవేటు పాఠశాలలుగానీ ఉండేవి కావు. నేను చిన్నప్పుడు నాలుగు ఊర్లకు
కలిపి ఒక ప్రాథమిక పాఠశాల కూడా ఉండేది కాదు. హైస్కూల్లు పెద్ద
ఊర్లలో మాత్రము ఉండేది. చిన్నచిన్న పల్లెలలో ఏమాత్రము ప్రాథమిక
పాఠశాలలు లేవు. చదువు వచ్చినవారు అరుదుగా కనిపించేవారు.
చిన్నచిన్న పల్లెలలోని వారు ఊరంతా కలిసి ఒక టీచర్ను తమ పిల్లలకు
చదువు చెప్పేదానికి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసుకొనెడివారు. టీచర్లంటే
ఎంతో భయముగా ఉండి చదువు చెప్పించుకొనేవారు. ఈ విధముగా
తెలుగు చదువే సరిగా రాని ఆ కాలములో, సంస్కృతమును బ్రాహ్మణులు
తప్ప ఇతరులు నేర్చేవారు కాదు. అంతో ఇంతో చదువు కూడా బ్రాహ్మణులకే

అబ్బేది. చదువు వచ్చిన వారు కావాలంటే ఆ ఊరిలోని బ్రాహ్మణుల
వద్దకు పోవాలి. అప్పుడు పల్లెటూర్లలో ప్రామిసరి నోట్లు వ్రాయించుకొనే
దానికి పురాణములను చెప్పించుకొనే దానికి ఊరిలోని వారందరూ ఆ
ఊరి బ్రాహ్మణులను ఆశ్రయించెడివారు. రెండు వందల సంవత్సరముల
క్రిందట కేవలము పదిమంది చదువు వచ్చినవారుండగా, చదువు రానివారు
తొంభైమంది ఉండేవారు.

కాలము గడువగా, మెరుగు పడుచూ వచ్చి మేము చిన్న వయస్సులో
యున్నప్పుడు అక్కడక్కడ అరుదుగా పాఠశాలలు ఉండేవి. అప్పటినుండి
అభివృద్ధి చెందుచూ నేడు 90 శాతము మించి చదువు వచ్చినవారు తయారై
నారు. పూర్వము బ్రాహ్మణులకు తప్ప వ్యాసుడు అంటే ఎవరో తెలియదు.
ఇప్పటి కాలములో కూడా చాలామంది ప్రజలకు వ్యాసుడంటే ఎవరో
తెలియదు. బ్రాహ్మణులకు వ్యాసుని విషయము తెలుసు. ఈ మధ్య వేద
పాఠశాలలు కూడా తయారయి ఇతరులు సంస్కృతములో వేదాలు చదువు
చున్నారు. అయినా వేదవిద్యలు బ్రాహ్మణులకే పరిమితియైపోయాయి.
ద్వాపర యుగములో వ్యాసుడు వేదములను గ్రంథములుగా సంస్కృత భాషలో
వ్రాయడమైనది. అంతవరకు వేదములు గ్రంథములుగా లేవని చాలామందికి
తెలియదు. సంస్కృతము లిపిలేని భాషలలో ఒకటిగా యుండేది.
చాలామందికి చదువురాని ఆ కాలములో లిపియున్న భాషలకంటే లిపిలేని
భాషలకే ఆదరణ ఎక్కువగాయుండేది. ఏదయినా వ్రాయవలసి వస్తే హిందీ
భాషలోని లిపిని వాడుకొని సంస్కృత భాషను వ్రాసెడివారు.

ఒక గ్రంథము వ్రాయాలన్నా లేక ఏదయినా విషయము
వ్రాయాలన్నా మనిషికి రెండు భాషలు వచ్చియుండాలి. ఒకటి లిపియున్న
హిందీ చదువు వచ్చి, వ్రాసే స్థోమతయుండాలి. మరొకటి ఏది వ్రాసినా

సంస్కృతములోనే వ్రాయాలను నియమము ఉండుట వలన ప్రతి గ్రంథము
సంస్కృతములోనే వ్రాయబడేది. ఏ గ్రంథమయినా సంస్కృత భాషలో
వ్రాయాలను నియమమునుబట్టి సంస్కృతము రానివారుగానీ, హిందీ లిపి
రానివారుగానీ వ్రాయుటకు వీలు లేకుండా ఆనాటి బ్రాహ్మణులు ఆ
నియమమునుంచారు. సంస్కృతము వచ్చినా తాము తప్ప ఇతరులు
గ్రంథములు వ్రాయకుండా ఉండునట్లు ఆ నియమమును దురుద్దేశ్యముతోనే
ఉంచడమయినది. అట్లుండుట వలన హిందీ చదువును నేర్చుకొన్న వారే
పది శాతము కూడా లేని కాలములో ఎవనికయినా హిందీభాష వ్రాసే
దానికి వచ్చినా సంస్కృతము రాని కారణమున రెండు భాషలు వచ్చిన
బ్రాహ్మణులు తప్ప ఇతరులు గ్రంథములు వ్రాసెడివారు కాదు.

ద్వాపర యుగమున వ్యాసుడు సంస్కృతమునందు పాండిత్యమును
కల్గిన ఏకైక వ్యక్తిగాయుండెను. అందువలన రాజులు సహితము ఆయనను
గౌరవించెడివారు. వ్యాసుడు నాలుగు వేదములను, పదునెనిమిది పురాణము
లను సంస్కృత భాషలో హిందీలిపితో వ్రాశాడు. తర్వాత మహాభారతమును
వ్రాయు సందర్భములో యుద్ధ ప్రారంభ సమయములో ఐదు నిమిషములు
సైన్యములుగల మధ్యలోనికి అర్జునుడు కృష్ణుడు మాట్లాడిన విషయమును
తెలుసుకొనుటకు యుద్ధము ముగిసిపోయిన తర్వాత అర్జునున్ని పిలిచి
అప్పుడు ఏమి మాట్లాడారని అడిగాడు. అర్జునుడు రెండు నిమిషముల
నుండి ఐదారు నిమిషములకు వరకు మాట్లాడిన మాటలను వ్యాసునికి
తెలిపాడు. అప్పుడు వ్యాసుడు ఆ మాటలలోని సారాంశమును గ్రహించిన
వాడై ఏడు వందల శ్లోకములతో భగవద్గీతను వ్రాశాడు. అర్జునుని
ద్వారా విషయము తెలుసుకొన్న తర్వాత ఆ విషయమును స్వయముగా
దేవుడే చెప్పాడని తెలియగలిగాడు. దేవుడు వేదములను గుణములుగా,

గుణ విషయములుగా చెప్పినట్లు, గుణములే మాయగాయున్నవని తెలిసి
తాను అంతకుముందు మాయరూపమైన వేదములను వ్రాసి ప్రజలకిచ్చి
ప్రజలను అజ్ఞానదారి పట్టించానని అనుకొని మిక్కిలి బాధపడినవాడై చేసిన
తప్పుకు పాశ్చాత్తాపపడి, తన తప్పును సవరించుకొని మారిన మనిషిగా
తయారై పాపపరిహారార్థము భగవద్గీతను వ్రాయదలచి వ్రాయడమైనది.
భారతములో ఒక భాగమైన భగవద్గీతను శ్రద్ధతో ప్రత్యేక గ్రంథముగా
వ్రాశాడు.

వేదములు వ్రాసినందుకు అయన పేరు వేదవ్యాసుడు అని
చెప్పుచున్నారు. ఆ పేరు తనకు లేకుండుటకు వ్యాసుడు భగవద్గీతను
వ్రాసి అందులో వేదములను మూడు గుణ విషయములుగానే చెప్పాడు.
తర్వాత మూడు గుణములనే వేదములుగా వర్ణించి చెప్పాడు. దానితో
వేదములను వ్రాసిన వేదవ్యాసుడే వేదములను మాయ అనియూ, మాయ
ఉన్నంతవరకు దేవుడు తెలియబడడనీ చెప్పుట వలన కొంత సత్యము
బయటికి తెలిసినది. అయినా వ్యాసుడు వేదములను గురించి చెడుగా 
చెప్పిన మాటలను పండితులందరూ అణగత్రొక్కివేసి బయటికి తెలియకుండా
చేసి నేటికీ అన్ని శుభకార్యములలో వేదములను చదువుచున్నారు. వేదముల
మాయతో అందరినీ మభ్యపెట్టుచున్నారు.

వేదవ్యాసుడు వేదములను గురించి దేవుడు చెప్పిన భగవద్గీతను
చూచువరకు వేదములు ఆధ్యాత్మికమునకు సరిపోవని ముఖ్యమైన నాలుగు
అధర్మములలో వేదపఠనము ఒక అధర్మమని జీవితము చివరి అంకములో
తెలుసుకోగలిగాడు. శంకరాచార్యులవారు వేదములను ఒకమారు
దేశమంతా ప్రచారము చేసి నాల్గు వేదములకు నాలుగు పీఠములను
స్థాపించిన తర్వాత వేదముల గురించి దేవుడు చెప్పినది వ్యాసుడు వ్రాసినది

చూడగలిగి వేదముల త్యజించాలనుకొన్నారు. వ్యాసుడు జీవితము
చివరిలో వేదములను గురించి తెలుసుకొన్న తర్వాత ముఫ్పై సంవత్సరములు
బ్రతుకగలిగాడు. శంకరుడు చిన్నవయస్సులో వేదముల గురించి తెలుసు
కొన్న తర్వాత మూడు సంవత్సరములే బ్రతుకగలిగాడు. అయితే
ప్రబోధానంద యోగీశ్వరుల వారు తన ఆధ్యాత్మిక జీవిత ప్రారంభములోనే
వేదములను వ్యతిరేఖించిచూ వస్తున్నాడు. ముగ్గురు సిద్ధాంతకర్తలు
వేదములను ఆధారము చేసుకొని తమ సిద్ధాంతములను చెప్పగా,
ప్రబోధానంద యోగీశ్వరులు వేదములకు వ్యతిరేఖముగా తన సిద్ధాంతమును
చెప్పెను. తనబోధ భగవద్గీతకు అనుకూలముగా వేదములకు వ్యతిరేఖముగా
యుండెను. ప్రబోధానంద యోగీశ్వరులు జ్ఞానము చాలా ప్రత్యేకత కల్గి
ఎవరి బోధతో సంబంధము లేనిదై ఒక్క భగవద్గీతకు దగ్గరగా మిగతా
గ్రంథములకు దూరముగాయుండెను. ఆయన జీవితములో ఆయన జ్ఞానమే
ఒక ప్రత్యేకతయని చెప్పవచ్చును.

ప్రశ్న :- ప్రబోధానంద స్వామిగారి యొక్క అనేక విషయములను ముందు
గానే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పియున్నారు కదా! అట్లే
ప్రబోధానంద గారు చెప్పు బోధల ప్రత్యేకతను గురించి ముందే ఏమయినా
చెప్పగలిగారా?

జవాబు :- ఎన్నో విషయములను చెప్పిన బ్రహ్మముగారు ముఖ్యమైన జ్ఞాన
విషయమును గురించి చెప్పకుండునా? అంతకుముందు ముగ్గురు
సిద్దాంతకర్తలు చెప్పినది వేదములలోని బోధలనే ఎక్కువగా చెప్పి, వేద
పఠనమునే ఎక్కువగా చేశారు. ప్రబోధానంద బోధలు వేదములకు
సంబంధము లేనివై యుండుట వలన, ప్రత్యేక శక్తిగల బోధలయివుండుట
వలన ఈ బోధలకు ప్రత్యేకమయిన పేరును బ్రహ్మముగారు పెట్టారు.

దానినే తన కాలజ్ఞానములో “సాంద్రసింధు వేదము” అని పేరు పెట్టారు.
తన కాలజ్ఞానములో ఒకచోట "సాంద్రసింధూవేదానికి ఆనందాశ్రమము
కర్త రావలెను" అని ఉన్నది. సాంద్రసింధూ వేదమును చెప్పిన కర్త
ప్రబోధానంద యోగీశ్వరులని దీనివలన తెలియుచున్నది. అక్కడనే
మరియొక మాట కూడా కలదు. "వేదముల కెల్ల సాంద్రసింధూ వేదమే
ఆది వేదము” అని కూడా కలదు. మనుషులకు ఆదివేదము మొదటినుండి
యున్న గుణములయితే, వేదములకే ఆదివేదము సాంద్రసింధూ వేదమే
అని చెప్పబడినది. వేదములకెల్ల ఆదివేదము అనగా 'వేదములకంటే ముందు
పుట్టినది' అని అర్థము. సాంద్రసింధూ వేదము అను వాక్యములో వేదము
అనగా 'మాయ' అని అర్ధము. సింధూ అనగా 'ఎదురు శక్తి' అని అర్థము.
సాంద్ర అనగా 'ఎక్కువ సాంద్రత కల్గిన', 'ఎక్కువ బలము కల్గిన' అని
అర్థము. ఎక్కువ శక్తితో వేదములను ఎదురించునది సాంద్ర సింధూవేదము.
మాయను ఎక్కువ వ్యతిరేఖ శక్తితో ఎదురించు దానిని సాంద్రసింధూ వేదము
అంటారు. ప్రబోధానంద బోధించు బోధలు ప్రతి ఒక్కటి మాయకు
వ్యతిరేఖముగా యున్నవే కావున ఆయన జ్ఞానమును 'సాంద్రసింధూ వేదము'
అని అన్నారు.

ప్రశ్న :- సాంద్రసింధూ వేదము అనుమాటను ఎక్కడా వినలేదు. ప్రతి
వేదము బ్రాహ్మణులకు తెలుసు. అయితే సాంద్రసింధూ వేదమును గురించి
బ్రాహ్మణులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఈ వేదమును గురించి ప్రజలకు
గానీ, బ్రాహ్మణులకు గానీ తెలియదా?

జవాబు :- సాంద్రసింధూ వేదము అనగా స్వచ్ఛమయిన జ్ఞానము. సాంద్ర
సింధూవేదమనగా! గుణములతో కూడుకొన్న మాయకు వ్యతిరేఖమయినది.

సాంద్ర సింధూవేదమనగా కర్మలను కాల్చు జ్ఞానశక్తియను అగ్నిగుండము.
సాంద్ర సింధువేదము అనగా బ్రాహ్మణులకు మొదలుకొని చతుర్ముఖ
బ్రహ్మవరకు ఎవరికీ తెలియనిది. సాంద్రసింధూ వేదమనగా సృష్ట్యాదిలోని
జ్ఞానముతో ముడిపడినది. సాంద్రసింధూ వేదమనగా కలియుగములో
యున్న మూడు మతములతో ముడిపడియున్న ఏకైక జ్ఞానము. అటువంటి
సాంద్రసింధూ వేదము ప్రతి మనిషికి క్రొత్తదే, బ్రాహ్మణులందరికీ క్రొత్తదే.

సాంద్రసింధూ వేదమును గురించి బ్రహ్మముగారు కాలజ్ఞానములో
ఇలా అంటున్నారు చూడండి. "బ్రాహ్మణులకు సాంద్రసింధూ రహస్యము
ఇచ్చేది లేదు" ఈ వాక్యమునుబట్టి సంస్కృత పాండిత్యముగల బ్రాహ్మణులకు
కూడా సాంద్రసింధూ వేద రహస్యములు తెలియవని చెప్పడమైనది.
మరియొకచోట ఇదే మాటనే చెప్పుచూ ఇలా వ్రాసియుంచాడు. “ఈ
సాంద్రసింధూవేదములోని మాటలు బ్రహ్మకున్ను తెలియవు" అనియున్నది.
ఇక్కడ బ్రహ్మ అనగా త్రిమూర్తులలోని చతుర్ముఖ బ్రహ్మయని తెలియవలెను.
ఈ వాక్యమునుబట్టి సాంద్రసింధూ వేదములోని జ్ఞానము దేవతలకు కూడా
తెలియని రహస్యముగా యున్నదని చెప్పకనే తెలియుచున్నది. ప్రబోధానంద
యోగీశ్వరులను చూస్తే అతని శరీరమే కనిపించును. అందరివలె సర్వ
సాధారణముగాయున్న ఆయన శరీరము పైకి కనిపించినా, ఆయన
శరీరములోని ఆత్మ బోధించిన జ్ఞానము ఎవరికీ తెలియనిది, దానిని
గ్రహించుట సామాన్యమైన పనికాదు. సాధారణ మనిషిలో కనిపించని
జ్ఞానము అంతగొప్పగాయున్నదని ఎవరూ తెలియలేరు. ఎంతో గొప్ప
రహస్యమైన సాంద్రసింధూ వేద జ్ఞానమును అందించిన ప్రబోధానంద
యోగీశ్వరులను పోతులూరి వీరబ్రహ్మముగారు 'నాకును గురువే' అని

చెప్పాడు. అంతేకాక 'మీ అందరికీ గురువే' అని కూడా చెప్పాడు. ఆయన
ఎంతో గ్రహించుకొనియుంటేనే ఆ మాట చెప్పియుండును. ఈ విషయము
లన్నియూ చూచిన తర్వాత “యోగీశ్వరుల జ్ఞానమును తెలిసిన వాడు
ధన్యుడు” అని చెప్పవచ్చును. ఆయన భూమిమీద ప్రత్యక్షముగా యున్న
కాలములో కూడా ఆయన జ్ఞానమును గుర్తించలేని వారిది దురదృష్టమేయని
చెప్పవచ్చును.

ప్రశ్న :– మీరు త్రైత సిద్ధాంతకర్తయిన ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానమును
గొప్పగా చెప్పుచున్నారు. ఆయన జ్ఞానమును తెలుసుకొనవలెనని ఆయన
వద్దకు పోయి, ముఖ్యమైన భక్తులుగా మెలిగి కొన్ని సంవత్సరముల తర్వాత
యోగీశ్వరుల వద్దకు పోకుండా మానుకొన్నవారు గలరు. ఎంతో భక్తిగా
పోయినవారు కొంత కాలానికి అక్కడికి పోకుండా మానుకోవడములో
అర్థమేమి ఉండును?

జవాబు :- త్రైత సిద్ధాంత ఆదికర్తయిన ప్రబోధానంద యోగీశ్వరులున్న
శరీరములో నేను జీవుడుగాయుండడము నా అదృష్టము. నేను యోగీశ్వరుల
వద్దకు వచ్చే వారిని పోయేవారిని చూస్తూనేయున్నాను. కొందరు భక్తితో
జ్ఞానమును తెలుసుకోవాలని వచ్చి కొంతకాలము యోగీశ్వరుల వారికి
దగ్గర భక్తులుగా యుండి దూరముగా పోయిన వారు చాలామంది కలరు.
నాకు తెలిసి ముగ్గురు నలుగురు అలా పోయినవారు కలరు. వారు పోయిన
విధానమునుబట్టి చూస్తే, అంతదగ్గర భక్తులు ఆయనవద్దకు రాకుండా
పోయారు అంటే యోగీశ్వరుల వారిలోనే ఏదో లోపము ఉన్నదని అనుకొను
అవకాశము కలదు. యోగీశ్వరులు ఎంత గొప్ప జ్ఞానమును చెప్పినా,
దానిని వినిన తర్వాత వారు రాకుండా పోయారు అంటే, వారి లోపల గల
భావమునుబట్టి దేవుడే వారిని దూరము పంపించాడని అర్థము కాగలదు.

దాదాపు ముఫ్పై ఐదు సంవత్సరములప్పుడు యోగీశ్వరులు ఒక
వ్యక్తికి ఎంతో మంచిగా జ్ఞానము చెప్పగా, కొంతకాలము వినిన తర్వాత
అతని అంతరంగమున తాను కూడా గురువు కావలెనను భావము వచ్చినది.
ఆ భావము వచ్చిన వెంటనే రెండు సంవత్సరములనుండి జ్ఞానమంతయూ
తెలుసుకొన్ననూ, ఇక స్వామివారి దగ్గర ఏమి జ్ఞానము మిగిలిలేదు,
ఈయన ఎంత కాలమున్నా ఆయన గురువు కాడు, ఇతరులను గురువు
కానివ్వడు. నేను బయటకు పోయి ఒక ఆశ్రమమును స్థాపించుకొంటే,
మర్యాదకు మర్యాద, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చునని అనుకొన్నాడు.
అనుకొన్న వెంటనే ఊరకపోతే తన తప్పే కనిపించును కదా!యని తన
తప్పు కనిపించకుండునట్లు యోగీశ్వరుల మీదనే ఏదోవొక ఆరోపణ చేసి
అక్కడికి రాకుండా పోవడమైనది. అట్లు పోయినవాడు మొదట వీరబ్రహ్మము
గారి ఫోటోను, తర్వాత బ్రహ్మముగారి ప్రతిమను అడ్డము పెట్టుకొని
బ్రహ్మముగారి శిష్యుడిననో, భక్తుడననో చెప్పుకొంటూ ప్రతి సంవత్సరము
బ్రహ్మముగారి ఆరాధన చేయుచూ దానికొరకు అందరివద్ద చందాలు
వసూలు చేయడమే పనిగా పెట్టుకొని భక్తిని వ్యాపారముగా మలచుకొని
డబ్బు సంపాదించను మొదలుపెట్టాడు.

బయటికి పోయి డబ్బు సంపాదించే వ్యాపారమును పెట్టుకొని
యోగీశ్వరులు ఎప్పుడూ చేయని పనులు చేయుచూ కొందరి ప్రజల దృష్ఠిలో
గురువుగా మెలగువాడు ఒకడుండగా! మరియొకడు యోగీశ్వరుల వారివద్ద
ముఖ్యమైన భక్తుడుగా మెలగుచూ కొంత జ్ఞానమును సంపాదించుకొన్నాడు.
యోగీశ్వరుల వారు ఎప్పుడుగానీ బయటికిపోయి జ్ఞానమును చెప్పరు.
దానిని ఆసరాగా తీసుకొని యోగీశ్వరుల వారి జ్ఞానమును బయటికి పోయి
ప్రచారము చేస్తానని ప్రతి దినము ఒక ఊరు తిరిగి జ్ఞానమును ఉపన్యాస

ములుగా చెప్పను మొదలుపెట్టాడు. అప్పుడు ప్రజలు అతనివద్ద జ్ఞానమును
వినేదానికి చాలామంది అలవాటు పడినారు. దానితో అతనిని గురువుకంటే
గొప్పగా గౌరవించడము, డబ్బులు ఇవ్వడము, గుడ్డలు ఇవ్వడము చేయను
మొదలు పెట్టారు. "పీతలు తినేదానికి అలవాటు పడిన నక్క వరిచేలు
దారిపట్టిందన్నట్లు” అదే మంచిగా కనిపించడముతో యోగీశ్వరులకు
తెలియకుండా ప్రజలవద్ద డబ్బును తీసుకోవడము దగ్గరనుండి బంగారు
కానుకలు తీసుకొనే వరకు ఎదిగిపోయాడు. తనకు ఆర్థిక లోటులున్నాయని
కొందరితో, ఆరోగ్యలోపమున్నదని దానికి డబ్బు అవసరమని కొందరితో
చెప్పి దానిసాకుతో డబ్బులు లాగను మొదలుపెట్టాడు. యోగీశ్వరుల
వారు ఎప్పుడూ ఆ పనులు చేయలేదు. ఇట్లు అనేక విధముల రుచిమరిగి
దాని మాయలో యోగీశ్వరులకు తెలియని పనులు కూడా యోగీశ్వరులు
చెప్పారని కొందరిని నమ్మించి, తన ఇష్టమొచ్చినట్లు నడిపేవాడు.
యోగీశ్వరులు ఆశ్రమములోనే గురువు. ఆయన బయటికి రాడు, ఆరోగ్యము
అనుకూలించదు కాబట్టి ఎప్పటికీ ఆయన బయటికి రాడు. అందువలన
బయట ఊర్లన్నింటికీ నేనే గురువును అన్నట్లు నడుచుకొన్నాడు.

ప్రజలు కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించారు. యోగీశ్వరుల
జ్ఞానమునే కదా ఇతను చెప్పేది! అని అనుకోకుండా యోగీశ్వరులకంటే
గొప్పగా అతనిని చూడడము, ఎక్కడికి పోయినా ప్రత్యేక మర్యాదలు
చేయడము అన్నీ జరిగేవి. ముఫ్పై ఐదు సంవత్సరముల క్రిందట బయటికి
పోయి భక్తి ముసుగులో ఒకడు సంపాదనలో పడిపోగా, ఇతను బయటికి
పోకుండా అనుకూలముగా యున్నట్లు అలా మొత్తము అందరినీ తనవైపు
అలవాటు చేసుకొని తానే గురువుగా చలామణి కావాలని చూచాడు.
యోగీశ్వరులు ఇదంతా ఏమి తెలియనట్లున్నా చివరకు దేవుడు అతనిని

యోగీశ్వరులకు దూరము చేశాడు. అయినా యోగీశ్వరులు ఇదంతా
వారి అజ్ఞానము అని ఊరకయున్నాడు. అంతేకాక “ఎవరు ఎట్లు పోయినా
నేను ప్రజలకు త్రైత సిద్ధాంతమును అందించే దానికి వచ్చాను. త్రైత
సిద్ధాంత ఆదికర్తగా నా పనిని నేను చేస్తాను" అని అన్నాడు. అంతేకాక
"డబ్బు విషయమును కర్మ నిర్ణయిస్తుంది. ఏమి రావాలో, ఏమి పోవాలో
అదే జరుగుతుంది. అది తెలియక అజ్ఞానములో పడిన మనిషి తన
తెలివితో డబ్బును సంపాదించుకోవాలని అనుకుంటాడు.  ఆ పనిలో
జ్ఞానమును, భక్తిని కూడా సాధనముగా చేసుకొని డబ్బును సంపాదించాలని
చూస్తాడు. అది వారి అజ్ఞానము తప్ప వేరు ఏమీ కాదు” అన్నాడు.


అటువంటి భక్తులను దేవుడే యోగీశ్వరుల వద్దనుండి దూరము
చేయును. ఈ విషయమై వీరబ్రహ్మేంద్రస్వాములవారు తన మాటలలో
ఇలా అంటున్నారు. "ఆనందాశ్రమమునకు దూరముగాయున్న వాన్ని
తలచనేవద్దు. నిశ్చయము, నిజము, తథ్యము. మహాకుటిలకాడు, ద్రోహి,
పాపమెల్ల వాడిని పట్టుకొని వేలాడుచుండును". ఎంతో గొప్ప జ్ఞానము
వద్దకు వచ్చి కొంతవరకు జ్ఞానము తెలిసి ప్రపంచ చింతలచే ఒకడు నేను
గురువంతటి వాడు కావాలనుకొంటే మరియొకడు గురువునే మించిన
వాడిని కావాలనుకొన్నాడు. జ్ఞానము తెలిసినా అది ఇతరులకు చెప్పేదానికే
అనుకొని, మన సొంత తెలివితో డబ్బు సంపాదించుకోవాలనుకొన్నవారు
వారి వెనుకయున్న కర్మచిట్టాను మరచిపోయివుందురు. ఎప్పుడయితే
మనిషిలో చెడు బుద్ధి పుట్టి గురువునే మోసము చేయవచ్చు అ
అనుకుంటాడో అప్పుడే వానిలో మాయ పని చేయను మొదలుపెట్టి
జ్ఞానమునకు దూరము చేయును. మాయ తనను జ్ఞానమునుండి ఎలా
దూరము చేసినదని కూడా తెలియకుండా మాయ మనిషిని నడిపించగలదు.

ప్రశ్న :- యెషయా ప్రవక్త ఏసును గురించి కొన్ని విషయములను
గ్రంథములో వ్రాసిపెట్టగా, వ్రాసిపెట్టినట్లే జరుగడము ఏసు జీవితములో
విశేషత. అట్లే పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధానంద యోగీశ్వరుల
గారి కొన్ని విషయములను వ్రాసిపెట్టగా అవి అన్నియూ జరుగుచూ
వచ్చాయి. ముఖ్యముగా యోగీశ్వరుల వారు సిద్దాంతకర్త కదా! ఆయన
సిద్ధాంతమును గురించి వ్రాసిన వాక్యములు ఏమయినా ఉన్నాయా? అలా
ఉంటే యోగీశ్వరుల వారి సిద్ధాంతము మీద ప్రజలకు దృఢ విశ్వాసము
ఏర్పడును. ఏదయినా ఉంటే చెప్పండి?

జవాబు :- వీరబ్రహ్మముగారు ముఖ్యమైన విషయములనే తన భవిష్యవాణిలో
వ్రాశాడు. యోగీశ్వరుల జీవితములో త్రైత సిద్ధాంతమే ముఖ్యమైనదిగా
ఉండుట వలన ప్రబోధానంద యోగీశ్వరుల సిద్ధాంతమును గురించి
బ్రహ్మముగారు ఈ విధముగా వ్రాశాడు. "సోమ సిద్ధాంతము సొంపుగా
నడిచేను. శుభాశుభములయ్యేనయా" అను వాక్యము కలదు. ఇందులో
త్రైత సిద్ధాంతము అనకుండా 'సోమసిద్ధాంతము' అని అన్నారు. సోమ
అనగా చంద్రుడని అర్థము. చంద్రుడు జ్ఞానమునకు అధిపతిగాయున్నాడు.
ప్రబోధానంద 'త్రైత సిద్ధాంతము' స్వచ్ఛమయిన జ్ఞానముతో కూడుకొని
యున్నది. కనుక త్రైత సిద్ధాంతమును సోమ సిద్ధాంతమను పేరుతో చెప్పాడు.
'సోమసిద్ధాంతము సొంపుగా నడిచేను' అన్నారు. త్రైత సిద్ధాంతము
ఆటంకము లేకుండా ప్రజలలోనికి అతివేగముగా ప్రాకుచుండుట వలన
'సొంపుగా నడిచేను' అన్నాడు. త్రైత సిద్ధాంతమును చూచినవారు
అసూయతో ఇది ఇతర మతమని సాకుపెట్టి కొన్ని ఆటంకములు
కలుగచేసినా అవన్నియూ తిరిగి మటుమాయమై పోవుచున్నవి. అందువలన
'శుభ అశుభములయ్యేనయా' అన్నారు.

త్రైత సిద్ధాంతమును గురించి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన
గోవింద వాక్యములలో పై వాక్యమును వ్రాశాడు. అటువంటిదే మరొక
వాక్యము గోవింద వాక్యములలోనే వ్రాయడము జరిగినది. అక్కడ వ్రాసిన
దానిని చూస్తే ఇలా కలదు "సిద్ధాంత శిరోమణి గురుస్వామి. గురుస్వామి
సిద్ధాంతము నిత్యము సత్యమయ్యేనయా” ఈ వాక్యములో 'సిద్ధాంత
శిరోమణి' అనడము వలన ఇంతకుముందు వచ్చిన సిద్ధాంతములన్నిటికీ
'త్రైత సిద్ధాంతము’ శిరోమణిలాగా ఉందని చెప్పవచ్చును. శిరోమణి అనగా
'శిరస్సున ధరించే పెద్ద మణి' అని అర్థము. అట్లు చెప్పడము వలన
అన్నిటికంటే గొప్ప సిద్ధాంతమని చెప్పినట్లయినది. త్రైత సిద్ధాంతమయిన
గొప్ప సిద్ధాంతమును తెలిపిన వ్యక్తి గురువైయుండునని 'శిరోమణి
గురుస్వామి' అన్నారు. త్రైత సిద్ధాంతము మిగతా సిద్ధాంతములకంటే
సత్యమైనదగుట చేత, అనుభవమునకు వచ్చుట చేత 'గురుస్వామి
సిద్ధాంతము నిత్యము సత్యమన్నారు.' ఈ విధముగా యోగీశ్వరుల
సిద్ధాంతమును గురించి రెండు వాక్యములు చెప్పినట్లు తెలియుచున్నది.
నాలుగు వందల సంవత్సరములప్పుడు ముందే చెప్పియుండడము వలన
త్రైత సిద్ధాంతమునకు బలము చేకూరినది.

ప్రశ్న :- ఎంతో గొప్ప పేరున్న ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన
అద్వైతముకంటే, రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతముకంటే,
మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతమును వదలివేసి పోతులూరి వీర
బ్రహ్మేంద్రస్వాములవారు త్రైత సిద్ధాంతమునే ఎందుకు గొప్పగా చెప్పాడు?
జవాబు :- అశోక్ హోటల్లో వెడల్పుగా చేసిన దోసెకంటే, ద్వారక హోటల్లో
కాల్చిన పూరీకంటే, తిరుమల హోటల్లో చేసిన సాంబారుకంటే, బేకరీలో

చేసిన లడ్డే ఎందుకు తియ్యగుంది? అని అడిగినట్లున్నది మీ ప్రశ్న. దోసె,
పూరీ, సాంబారు, లడ్డులో తియ్యగ ఉండేది ఏది? అంటే 'లడ్డు' అన్నట్లు,
మూడు సిద్ధాంతములలో ఏది గొప్పది? అన్నప్పుడు గొప్పదేదో దానినే
చెప్పాడు. అన్నిటినీ వదలి దానినే ఎందుకు చెప్పాడో మీరు లోతుగా
చూచి తెలుసుకోవలసియుంటుంది. మా సిద్ధాంతమును గురించి నన్ను
అడిగితే మాదే గొప్పదని నేను చెప్పినా “ఎవరిది వారు గొప్పగా
చెప్పుకొంటారు” అని అనగలరు. అందువలన ఈ విషయములో
సమాధానము కొరకు మీరే అన్వేషించాలి. ఎప్పుడో దాదాపు నాలుగు
వందల సంవత్సరములప్పుడు ఎలా చెప్పగలిగాడు అను ప్రశ్న కూడా
రాగలదు కదా! బ్రహ్మము గారు చెప్పిన విషయములన్నియూ ఈ మధ్య
కాలములో అనగా 2004వ సంవత్సరమునుండి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా
తెలుస్తున్నవి. మొదట మాకు ఇతరుల ద్వారా తెలిసినది. "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది" అను వాక్యము మాత్రము తెలిసినది. ఇతరుల
ద్వారా అనగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలములోని బట్టేపాడు గ్రామ
నివాసి అయిన వీరనారాయణ రెడ్డిగారి ద్వారా తెలిసినవి.

మొదట రెండవ వాక్యములో "ప్రబోధాశ్రమము వారు
శయనాధిపతి గుణములు కల్గియున్నారు" అని తెలిసినది. తర్వాత కొంత
కాలమునకు ఏష్యకాలజ్ఞానమును తెప్పించుకొని చూచాము. అందులో
మాకు సంబంధించిన వాటిని వ్రాయగలిగాము. ఇంకా పూర్తిగా చూస్తే
ఇంకా ఏమి తెలియగలవో చెప్పలేము. బ్రహ్మముగారి ఏష్యకాల జ్ఞానములో
ఇంతవరకు కొంత భాగమును మాత్రము చూచాము. జీవిత చరిత్రను
చదువగలిగాము. ఆయన సామాన్యమైన మనిషికాదని కారణజన్ముడని

కొంత అర్థమయినది. ఈనాడు ఎందరో ఆయన గొప్ప యోగి అను
నమ్మకముతో ఆయన సమాధిని దర్శించుకొంటున్నారు. అంతగొప్ప వ్యక్తి
మమ్ములను గురించి (నన్ను గురించి కాదు శరీరము లోపలయున్న
ప్రబోధానంద యోగీశ్వరులను గురించి) చెప్పడము ఆశ్చర్యమయినది.
మేము ఆయన జీవిత చరిత్రను చదివిన తర్వాత ఆయన వ్రాసిన
తత్వములను చూడడమైనది. ఆయన తత్త్వములున్నా, వాటికి అర్థము
చెప్పువారు ఎవరూ లేరని తెలిసి బ్రహ్మముగారు వ్రాసిన తత్త్వములకు
మేము వివరము వ్రాయడమైనది. మేము వ్రాసిన వివరముతో ఆయన
తత్త్వముల రూపములో చెప్పిన రహస్య జ్ఞానము బయటి ప్రపంచమునకు
తెలిసిపోయినది. వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ఞానములో
యోగీశ్వరులను గురించి వ్రాసినందుకు మేము ఆయన తత్త్వములకు
వివరమును వ్రాసి ఆయన ఋణము తీర్చుకొన్నాము.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల విషయము నాకు ఏమీ
తెలియని దినములలో అనగా 1980వ సంవత్సరము మేము బ్రహ్మముగారి
సమాధియున్న కందిమల్లయ్య పల్లెకు పోవడము జరిగినది. మేము అక్కడికి
పోవాలను ఉద్దేశ్యముతో పోలేదు. ఇతరులు పోతూ వారు మమ్ములను
అక్కడికి తీసుకొని పోవడము జరిగినది. అక్కడికి పోయిన తర్వాత వారు
మమ్ములను బ్రహ్మముగారి సమాధివద్దకు తీసుకపోవడము జరిగినది.
అప్పుడు ఎవరికీ తెలియని, ఎవరికీ కనిపించని సంఘటన జరిగినది.
దాదాపు మూడు వందల సంవత్సరములనుండి సజీవముగా సమాధిలో
యున్న వీరబ్రహ్మముగారు మేము సమాధిని దర్శించుకొన్న సమయములో
సమాధిలోని ఆయన శరీరమునుండి బయటికి రావడము జరిగినది.
అంతకాలము 'మా రాక' కొరకు కాచుకొన్నట్లు ఆయన శరీరమును

వదలి బయటికి రావడము నాకు తెలియకున్నా యోగీశ్వరుల వారికి
బాగా తెలిసినది. అప్పుడు ఏమి జరిగినది యోగీశ్వరులకే ఎరుక. ఆ
సమయములో ఏమి జరిగినది ఇతరులకు ఎవరికీ ఏమాత్రము తెలియదు.
యోగీశ్వరులు కూడా ఎవరికీ ఏమీ చెప్పలేదు. తర్వాత దాదాపు పది
సంవత్సరములు గడచిన తర్వాత బహుశా 1990వ సంవత్సరము బ్రహ్మము
గారు సమాధిలో లేరని ఒక సందర్భములో చెప్పడమైనది. తర్వాత
'ఆనందాశ్రమమునకు వస్తాను' అని బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసుకొన్నట్లు చూచాము.

ఎంతో గొప్ప జీవిత చరిత్రగల బ్రహ్మముగారు యోగీశ్వరులను
గురించి నాలుగువందల సంవత్సరముల క్రితమే వ్రాయడము ఎంతో గొప్ప
ఆశ్చర్యమైన పని, అద్భుతమైన పనియని చెప్పవచ్చును. ఆయన చెప్పిన
వాక్యములను గొప్పగా గ్రహించుకొన్నవారు గలరు. కొందరు జీర్ణింప
చేసుకోలేనివారూ గలరు. కొందరు బ్రాహ్మణులు వారిలో ఏ గొప్పతనము
లేకున్నా ఒకవైపు వీరబ్రహ్మము గారిని, మరొకవైపు వేమనయోగి గారిని
విమర్శించుచుందురు. అలా విమర్శించుటకు ఒకే ఒక కారణము కలదు.
ఏ కారణము చేత బుద్ధుడు క్షత్రియుడని అతను చెప్పిన బోధను పరమతమని
చెప్పారో, ఏ కారణముచేత జైనుడు బ్రాహ్మణుడు కాదని అతనిది
జైనమతమని హిందువులనుండి విడదీశారో, ఏ కారణముచేత సిక్కులను
ఇతర మతముగా హిందూమతమునుండి వేరు చేశారో, ఆ కారణము
చేతనే కుల వివక్షతో వేమనయోగిని తిక్కవాడనీ, బ్రహ్మముగారిని మెట్ట
వేదాంతి అని హేళన చేశారు. అదే కారణము చేతనే నేటికినీ ప్రబోధానంద
యోగీశ్వరులు 'చౌదరి' కులమున పుట్టినందుకు అణగద్రొక్కాలని
చూస్తున్నారు. ఆర్య భావములు నిండియున్న వారు నేడు అక్కడక్కడున్నా

వారి తెలివిని ఉపయోగించి ఇతర కులముల వారికి 'మతము' అను
మత్తుమందు ఇచ్చి, ఆ మత్తు తలకెక్కిన తర్వాత, ఏమీ యోచించని
వారిని యోగీశ్వరులను విమర్శించునట్లు చేసి యోగీశ్వరుల సిద్ధాంతము,
బోధలు పరమతమయిన క్రైస్తవ మతమునకు సంబంధించినవని నమ్మించు
చున్నారు. హిందూమతములో యున్నా కొందరు గొర్రెలలాంటి వారు
మనము ఎవరిని విమర్శించుచున్నాము? ఎవరిని దూషించుచున్నాము?
ఎవరిని పరమతమంటున్నామను ధ్యాస లేకుండా హిందువులయిన
మమ్ములను దూషించుచున్నారు. కొన్నిచోట్ల మా భక్తుల మీద, త్రైత సిద్ధాంత
ప్రచారకుల మీద దాడులు కూడా జరుగుచున్నవి. వెనుకయుండి
వ్యూహములను అల్లువారుండగా, వారిక్రింద గొర్రెలైన వారు యోచించక
మాట్లాడడము జరుగుచున్నది. ప్రబోధానంద యోగీశ్వరులను ఎవరు
ఏమి మాట్లాడినా ఆయనకు ఏమీ నష్టముండదు. బ్రహ్మముగారు తన
కాలజ్ఞానములో చెప్పినట్లు వారే నాశనమైపోవుదురు, వారికే కష్టము నష్టము
అన్నియూ జరుగును. యోగీశ్వరుల వద్ద అనగా 'ఆనందాశ్రమమువద్ద
మహా దేవతలందరూ ఉన్నారని' బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పి
యుండడమేకాక, ప్రబోధానంద యోగీశ్వరులు స్వయముగా వ్రాసిన
“శ్రీకృష్ణుడు దేవుడా! భగవంతుడా!!" అను గ్రంథములో యోగీశ్వరులున్న
కృష్ణమందిరము దగ్గరకు సమస్త దేవతలు వచ్చి పోవుచున్నారని వ్రాశారు.
ఒకవైపు బ్రహ్మముగారు మహాదేవతలు సహితము ప్రబోధానందాశ్రమము
వద్ద యున్నారని చెప్పినా, యోగీశ్వరులే స్వయముగా తన గ్రంథములో
సమస్త దేవతలందరూ ఇక్కడికి వచ్చి పోతున్నారని చెప్పినా, గ్రహించని
మూర్ఖ ప్రజలు అనవసరముగా లోకములో తమ గుర్తింపుకొరకు
యోగీశ్వరులకు వ్యతిరేఖముగా మాట్లాడితే, యోగీశ్వరుల అభిమానులయిన

దేవతలు ఊరకుంటారా? సమయము చూచి వారిని దెబ్బతీస్తారు. అలా
ఎందరో దెబ్బతిన్నవారు, పూర్తిగా చనిపోయిన వారు కలరు.

ప్రశ్న :- బయట ప్రజలు యోగీశ్వరులను గురించి అనవసరముగా
అసూయతో మాట్లాడు మాటలను విన్నాము. తర్వాత కొంత కాలమునకే
వారు ఘోరమయిన రోగములతో, ఘోరమైన దుర్ఘటనలలో భయంకరమైన
రోడ్డు ప్రమాదములలో చనిపోవడము జరిగినది. అప్పుడు మాకు అర్థము
కాకపోయినా ఇప్పుడు మీరు చెప్పిన దానినిబట్టి కొంతకు కొంత అర్థమగు
చున్నది. మేము అలా ప్రమాదములలో చిక్కుకొని బాధపడుచున్న వారిని
చూచాము. చనిపోయిన వారిని చూచాము. అయితే నూటికి ఒకరు లేక
ఇద్దరు ప్రమాదములో చిక్కుకోకుండా అలాగేయున్నవారు కలరు.
చాలామందికి అనర్థములు జరిగి కష్టాలపాలై పోయినవారుండగా
ఎక్కడయినా అరుదుగా ఏమీ జరుగని వారున్నారు. వారికి ఎందుకు శిక్ష
పడలేదని మాకు సంశయమున్నది? దానికి మీరేమంటారు.

జవాబు :- నీ స్నేహితుల ముందర నిన్ను ఎవరయినా దూషించారనుకో,
అప్పుడు నీ స్నేహితులు ఊరకయుండరు కదా! అనుకూలముంటే అప్పుడే
దూషించినవానిని దండించయినా దండించగలరు. అనుకూలము లేకపోతే
తర్వాత అనుకూలమైనప్పుడు వానిని దండించడమో, తన్నడమో, చంపడమో
జరుగుతుంది కదా! ఒకవేళ నిన్ను ఇతరులు దూషించినప్పుడు అక్కడ నీ
స్నేహితులుగానీ, బంధువులుగానీ లేనప్పుడు వాడు దూషించినట్టు తెలియని
దానివలన ఏమీ అనకుండా వదలివేయుదురు. అదేవిధముగా ప్రబోధానంద
యోగీశ్వరులను దూషించిన సమయములో అక్కడ ఆ సమయానికి
ఎవరయినా కనిపించని దేవతలుగానీ, గ్రహములుగానీ ఉండివుంటే

దూషించిన వానిని గుర్తు పెట్టుకొని కొన్ని రోజులకుగానీ, కొన్ని నెలలకుగానీ
వానిని రోగరూపములో కొందరు పీడింతురు. కొందరయితే రోడ్డు
ప్రమాదములను చేసి చంపివేయుదురు లేక చావు బ్రతుకుల సమస్యలో
చిక్కుకొనునట్లు చేయుదురు. కొందరికి అవయవ లోపము కలుగచేసి
జీవితాంతము బాధపడునట్లు చేయుదురు. ఒకవేళ ఇతరులు యోగీశ్వరు
లను దూషించినప్పుడు ఆ సమయములో అక్కడ కనిపించనివారు ఎవరూ
లేనట్లయితే, దూషించిన విషయము ఎవరికీ తెలియదు కనుక వానిని
ఎవరూ ఏమీ అనరు. అట్లు చాటుగా దూషించినా ఏమీ కానివారు
అరుదుగాయుందురు. మాకు తెలిసినంతవరకు అనవసరముగా మాట్లాడి
జీవితాంతము బాధపడువారు కొందరుండగా, కొందరు పూర్తి చనిపోయారు.
వారు ప్రమాదములను పొందినా తమ తప్పు వలననే అట్లు జరిగినదని
కూడా వారికి తెలియదు. ఏదో సహజముగా కర్మకొద్దీ జరిగిందనే
అనుకుంటారు గానీ, దీని కారణముననే జరిగినదని వారికి తెలియదు.

ఒక్కొక్కప్పుడు యోగీశ్వరుల వారిని దూషించిన వారు రోగములకు
గురియై, రోగములతో బాధపడుచూ యోగీశ్వరుల యొక్క గొప్పతనము
తెలిసినవారై తమ రోగములను నివారించుకొనుటకు యోగీశ్వరుల చెంతకే
వచ్చినవారు గలరు. అలా వచ్చినవారు రోగములచే బాధింపబడుచున్నారని
తెలిసిన ప్రబోధానంద యోగీశ్వరులు వారిని బాధించు రోగములకు నచ్చ
జెప్పి వారు జ్ఞానమార్గములోకి వస్తే వారిని వదలిపొమ్మని, రోగములకు
చెప్పిన సందర్భములు కూడా కలవు. అప్పుడు యోగీశ్వరులు చెప్పిన
మాటను గౌరవించి ఆ రోగములు వారిని వదలిపోయిన సందర్భములు
కూడా కలవు. ఈ విధముగా యోగీశ్వరులు తనకు విరుద్ధముగా మాట్లాడిన
వారిని కూడా క్షమించి, గ్రహములకు దేవతలకు నచ్చజెప్పి పంపిన
సందర్భములు కూడా కలవు.


ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులకు విరుద్ధముగా మాట్లాడి అనవసర
కష్టములను తెచ్చుకొన్న వారున్నట్లే, ఆయన జ్ఞానమును తెలిసి ఆయన
త్రైత సిద్ధాంతమును అనుసరించిన వారికి ఎంతో మేలు జరిగిన సంఘటనలు
కూడా కలవని విన్నాము. వ్యతిరేఖముగా మాట్లాడితే ఎంత కష్టము కల్గునో
అనుకూలముగా మాట్లాడిన వారికి కర్మలు కాలిపోయి అంతే మేలు
జరుగునని కొందరు చెప్పగా విన్నాము. అది నిజమేనా అని అడుగు
చున్నాము?

జవాబు :- ఇక్కడ నిజమా? అబద్దమా? అని అడిగినంతమాత్రమున ఏమీ
ప్రయోజనము లేదు. బాగా ఆలోచించగలిగిన వానికి, సత్యమును
తెలుసుకొన్నవానికి ప్రయోజనముండును. ప్రబోధానందయోగీశ్వరుల త్రైత
సిద్ధాంత బోధలో ముఖ్యముగా శరీరాంతర్గత జ్ఞానమేయుండును.
శరీరాంతర్గతములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనబడు మూడు ఆత్మలు
ఎట్లున్నది చెప్పబడును. మూడు ఆత్మలలో మధ్యాత్మ యొక్క సంగతే
ఎక్కువగా తెలియబడును. మధ్యలోయున్న ఆత్మను జీవుడు మొదట తెలియ
వలసియుండును. అందువలన మధ్యాత్మ జ్ఞానమును పూర్తిగా తెలియ
వలసియుండును. మధ్యాత్మ శరీరమునకు అధిపతిగాయుంటూ, శరీరము
లోని దేవుడుగా పిలువబడుచున్నది. మూడవ ఆత్మయిన పరమాత్మ శరీరము
బయట దేవుడుగా చెప్పబడుచున్నాడు. శరీరములోని ఆత్మ శరీరమునకు
అధిపతిగాయుంటూ, శరీరమును పూర్తిగా వ్యాపించి నడుపుచూ, శరీరము
లోని జీవున్ని కష్టసుఖములను అనుభవింపజేయుచున్నది. శరీరమును
ఆత్మ పాలించుటకు శరీరమును రెండు భాగములుగా విభజించుకొని ఆత్మ
పాలన సాగించుచున్నది. శరీరములో ఒకటి శక్తి భాగముగా, రెండవది
ఆరోగ్యము ఒక భాగముగా విభజించబడి శరీర శక్తి, శరీర ఆరోగ్యము

అను రెండు విభాగముల మీద ఆత్మ పని చేయుచూ తనవెంటయున్న
జీవున్ని కర్మలనుభవింపజేయుచున్నది.

మనుషులలో ఆరోగ్యము బాగుండి శక్తి తక్కువయున్న వారు
కొందరుండగా, శక్తియుండి ఆర్యోగము బాగా లేనివారు కొందరున్నారు.
కొందరిలో ఆరోగ్యము బాగుంది, శక్తి బాగుంది. ఇంకా కొందరిలో
ఆరోగ్యము సరిగా యుండదు. శక్తి సరిగాయుండదు. శక్తి అనగా శరీర
బలమని తెలియవలెను. ఇట్లు ఆరోగ్య, అనారోగ్యముల మధ్య బలము,
అబలముల మధ్య మనిషి శరీరములో కర్మలు అనుభవించుచుండును.
ఇదంతయూ శరీర సంబంధమైన సుఖదుఃఖములుకాగా మానసిక సుఖ
దుఃఖములు మరొక రకము గలవు. మానసికముగా కలుగు సుఖదుఃఖములు
కూడా రెండు రకములు గలవు. ఒకటి తనను గురించి, రెండవది ఇతరుల
గురించి. రెండు రకముల మనోబాధలుగానీ, మనోసుఖములుగానీ
ఉండును. జ్ఞానము కల్గినపుడు మానసిక బాధలుగానీ, సుఖములుగానీ
లేకుండా పోగలవు. అందువలన అవి తాత్కాలికమైనవే అని చెప్పవచ్చును.
జ్ఞానము కల్గినా కలుగకపోయినా ఆత్మ శరీరములోని నాడులలోగల
శక్తితోనూ, గ్రంథులలో గల ఆరోగ్య అనారోగ్యములతోనూ శరీరమును
పాలించుచుండును. శరీరములో గల జీవున్ని కర్మ అనుభవింపజేయుటకు,
చివరకు శరీర బలమునంతటినీ లేకుండా చేసి, మనిషిని మరణము వరకు
తీసుకొని పోవుటకు ఆత్మ అన్ని అవకాశములతో, నాడుల ద్వారా, గ్రంథుల
ద్వారా పని చేయుచున్నది. ఆత్మకు శరీరములో ఆధారముగాయున్నవి
నాడులు ఒక రకముకాగా, గ్రంథులు మరొక రకముగా యున్నవి. శరీరము
లోని ఆత్మ నాడుల మీద, గ్రంథుల మీదనుండి శరీరమును పాలించు
చున్నది. శరీరములో దేవుడయిన ఆత్మ శరీరములో సప్త నాడీకేంద్రములలో

నుండి తన శక్తిని శరీరమునకు ప్రసరింపజేయుచున్నది. అలాగే ఏడు
గ్రంథులలో యుండి శరీరము యొక్క ఆరోగ్యమును అనారోగ్యమును
ప్రసరింపజేయుచున్నది. ఈ విధముగా ఏడు నాడీకేంద్రముల మీద, ఏడు
గ్రంథుల మీద ఆత్మ నివాసమై శరీరమును పాలించుచున్నదని ఎవరికీ
తెలియదు. ఆత్మ శరీరములో ఉండికూడా ఎంత శోధించినా ఎవరికీ
తెలియకుండా నివాసమై యున్నది.

ఎంత తెలివైన వానికయినా శరీరములో జీవాత్మయున్నట్లే
తెలియును గానీ, ఆత్మయున్నట్లు తెలియదు. అందువలన బయట ఎంత
మేథావులయినా లోపలయున్న ఆత్మను గుర్తించలేకయున్నారు. గతములో
వచ్చిపోయిన ముగ్గురు సిద్ధాంతకర్తలు తమ సిద్ధాంతములను బయట
కనిపించు దేవుడు, కనిపించని దేవుడు అని చెప్పుకొంటూ శరీరము బయటే
చెప్పుకొన్నారు గానీ, వారి చూపు శరీరములోని ఆత్మలమీదికి ప్రాకలేదు.
అందువలన ముగ్గురు సిద్ధాంతకర్తల మూడు సిద్ధాంతములు దేవుడు కాని
దానిని చెప్పుకొన్నారుగానీ, అసలయిన దేవున్ని గురించిన జ్ఞానమును
చెప్పలేదు. అందువలన ముగ్గురి సిద్ధాంతకర్తల సిద్ధాంతములు దైవమునకు
సంబంధించినవి కావు. అందువలన వాటిని ఆధ్యాత్మిక సిద్ధాంతములని
చెప్పుటకు వీలులేదు. దేవునికి సంబంధించిన సమాచారమును తెల్పునవి
దైవ సిద్ధాంతములగును. మిగతావి దైవ సిద్ధాంతములనబడవు. ముక్కుకు
సంబంధించిన ఆభరణములను ముక్కుపోగులంటాము. చెవికి
సంబంధించిన ఆభరణములను చెవి కమ్మలంటాము. ముక్కు పోగులు,
లేక ముక్కు పుడకలకు, చెవి కమ్మలు లేక చెవి కుండలములకు ఎంతో
తేడాయుండును. ముక్కు పుడకలను మాత్రము కలవాడు నాకు చెవి
కమ్మలు యున్నాయంటే నమ్ముటకు వీలులేదు కదా! అలాగే శరీరము

బయట ప్రకృతికి సంబంధించిన ఆకార, నిరాకారములను చెప్పిన వారు
శరీరములోపల గల దేవున్ని గురించి చెప్పలేదనీ, శరీరములోని దేవునికి
సంబంధము లేనివి దైవ సిద్ధాంతములు కాదనీ చెప్పవచ్చును. దేవునికి
ఆకారములేదు, పేరు లేదు, పనియూ లేదు అనుట ముఖ్యమైన దైవధర్మము.
అలాంటప్పుడు దైవముయొక్క సాకార, నిరాకారమైన సిద్ధాంతములు
అసలుకు దేవునివే కాదని చెప్పవచ్చును.

ఆధ్యాత్మిక రంగములో శరీరములోగల దేవున్ని తెలుపు సిద్ధాంతము
అసలయిన దైవసిద్ధాంతమగును. ఆ లెక్క ప్రకారము భూమిమీద “దైవ
సిద్ధాంతము” ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పిన “త్రైత సిద్ధాంతము”
ఒక్కటేనని చెప్పవచ్చును. శరీరములోని ఆత్మలను విడదీసి శరీరములోని
దైవము ఆత్మయనీ, శరీరము బయట సర్వ విశ్వమంతా వ్యాపించినవాడే
అసలయిన దైవమని చెప్పు సిద్ధాంతము అసలయిన దైవ సిద్ధాంతము అని
చెప్పవచ్చును. దీనిప్రకారము లెక్కించి చెప్పితే భూమిమీద ఒకే ఒక దైవ
సిద్ధాంతము కలదని చెప్పవచ్చును. అన్ని విధములా శాస్త్రబద్దమైన
సిద్ధాంతము త్రైత సిద్ధాంతమొక్కటే. ప్రపంచమునకంతటికీ పెద్ద అయిన
దేవున్ని తెలియుటకు ముందు శరీరములో యంత్రాంగమును నడుపుచున్న
ఆత్మను తెలియవలెను. ఆత్మను తెలియగలిగినప్పుడు ఆత్మ శరీరములో
ఏడు నాడీకేంద్రముల మీద, ఏడు గ్రంథుల మీద తనశక్తిని ప్రసరింప
జేయుచూ శరీరమును పాలించుచున్నదని తెలియుచున్నది. శరీరములోని
ఆత్మ విధానమును తెలియడమే ఆధ్యాత్మికము అనబడును. ఈ విషయము
రహస్యముగాయుండగా, ఆ రహస్యమును అందరూ తెలియునట్లు తిరుమల
తిరుపతి గుడిలో గుడి గోపురమునకు ఏడు ద్వారములుండునట్లుంచారు.
గుడి గోపురము యొక్క ఏడు ద్వారములు ఏడు గ్రంథులకు చిహ్నములుకాగా,

గుడిలోపల దేవుని ప్రతిమ దగ్గరకు పోవుటకు ఏడు ద్వారములు దాటవలసి
యుండును. ఏడు గుడి ద్వారములు ఏడు నాడీకేంద్రములకు చిహ్నములుగా
జ్ఞానులు పెట్టడము జరిగినది. ఈ విధముగా జ్ఞానము ఎంతో ప్రణాళికా
బద్దముగా దేవాలయము వద్దయుండగా, అదే విధానమే ఆత్మజ్ఞానమునకు
నిలయమైయున్నది. శరీరములోని ఆత్మను తెలుపుటకు మిగతా రెండు
ఆత్మలను పరిచయము చేయుచూ మూడు ఆత్మల వివరమును సిద్ధాంత
రూపముగా శాస్త్రబద్దముగా తెలియజేయడమే త్రైత సిద్ధాంత ఉద్దేశ్యము.

మూడు ఆత్మల వివరణ తెలియజేయు విధానమునందు మధ్యాత్మ
యొక్క సమాచారము తెలియడము చాలా ముఖ్యము. మధ్యాత్మ యొక్క
ఏడు నాడీకేంద్రములను, ఏడు గ్రంథులను తెలియునప్పుడే ఆత్మశక్తి
జ్ఞానాగ్నిగా తయారు కాగలదు. అందువలన ఆధ్యాత్మిక విద్యలో ఏడు
నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు చాలా ముఖ్యమైన సమాచారముగా
యున్నవి. దీనివలననే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఇలా
అన్నారు. "ఆనందాశ్రయుల వారి వాక్యము సప్తమి నిశ్చయము, సర్వదా
సప్తమి అగును". ఇక్కడ వాక్యములో 'సప్తమి నిశ్చయము సర్వదా సప్తమి
అగును' అని రెండు సప్తమి పదములను వాడడము జరిగినది. శరీరములో
రెండు రకముల ‘సప్తమి’లు గలవు. ఒక ఏడు నాడీకేంద్రములు, మరియొక
ఏడు గ్రంథులు గలవు. 'మధ్యాత్మ' శరీరములో ఏడు నాడీకేంద్రముల
మీద, ఏడు గ్రంథుల మీద ఉన్నదను రహస్యమును ప్రబోధాశ్రమము వారే
చెప్పారని తెలుపు నిమిత్తము 'ఆనందాశ్రయుల వారి వాక్యము సప్తమి
నిశ్చయము' అన్నారు. ఇక్కడ “వాక్యము” అనగా చెప్పిన “జ్ఞానము” అని
అర్థము. చెప్పిన జ్ఞానములో ఏడు నాడుల విషయముండుట వలన 'సప్తమి
నిశ్చయము' అని చెప్పడమైనది. ఆ మాట ప్రక్కనే 'సర్వదా సప్తమి అగును’

అని కలదు. దానిప్రకారము ఏడు గ్రంథులున్నాయి. వాటిలో ఆత్మశక్తి
కలదని చెప్పడమే ఉద్దేశ్యము. బ్రహ్మముగారి మాటలన్నీ నేరుగా అర్థమగు
నట్లు ఏదీ యుండదు. అన్ని వాక్యములు చాటుగా చెప్పబడియుండును.
నేరుగా ఏదీ అర్థముకాదు. ఆనందాశ్రయులు అంటే ప్రబోధానందాశ్రమము
వారని తెలియవలెను. అట్లే ఆనంద గురువు అంటే ప్రబోధానంద గురువని
అర్థము చేసుకోవలెను. రెండు లేక మూడుచోట్ల ప్రబోధాశ్రమమని,
ప్రబోధాశ్రమమువారను పదములు వాడడమైనది. తర్వాత మేము మాటి
మాటికి ప్రబోధానంద యోగీశ్వరులని చెప్పక 'ప్రబోధ' అను పదమును
తీసివేసి యోగీశ్వరులు అను పదమును ఎట్లు వాడుచున్నామో అట్లే బ్రహ్మము
గారు కూడా 'ప్రబోధ' అను పదమును తీసివేసి ఆనంద గురువు,
ఆనందాశ్రమమని చెప్పడము జరిగినది.

బ్రహ్మముగారు చెప్పిన కాల జ్ఞానవాక్యములో “శయనాధిపతికి
సర్వదా ఆనందం, బ్రహ్మాది దేవతలెల్ల దీవించేరు. జారువాక్యములు ఆడిన
వారెల్ల నాశనమైపొయ్యేరు, కీడు తలచిన వారెల్ల ధూళియై పొయ్యేరు”
అని కలదు కదా! యోగీశ్వరులనుగానీ, యోగీశ్వరుల జ్ఞానమునుగానీ
వ్యతిరేఖించి ఆయనకు విరుద్ధముగా మాట్లాడినవారు, ఆయనకు కీడు
తలచిన వారు ఎవరయితే గలరో వారికే నష్టము కష్టము అని బ్రహ్మముగారు
చెప్పినట్లు జరుగుచునే యున్నది. వ్యతిరేఖముగా మాట్లాడిన వారికి అట్లు
జరిగినప్పుడు, యోగీశ్వరుల జ్ఞానమును యోగీశ్వరులను మంచిగ తలచి
ఆయన జ్ఞానమునే అనుసరించువారికి వారి కర్మలు కాలిపోవడము కూడా
జరుగుచున్నది. ఎప్పుడయితే శరీరాంతర్గత జ్ఞానము మీద మనిషికి దృష్ఠి
కలుగుచున్నదో, ఎప్పుడయితే మనిషికి శరీరము బయట ధ్యాసపోయి,

శరీరములోని ఆత్మమీద దృష్ఠి కలుగుచున్నదో, ఎప్పుడయితే శరీరములోని
ఏడు నాడీకేంద్రముల మీద ధ్యాస కల్గుచున్నదో, ఎప్పుడయితే ఏడు
గ్రంథులమీద ధ్యాస కల్గుచున్నదో అప్పుడు మనిషిలో జ్ఞానము ఉద్భవించును.
పుట్టిన జ్ఞానము కొంతకాలమునకు జ్ఞానశక్తిగా మారును. మారిన జ్ఞానశక్తి
జ్ఞానాగ్నిగా మారి ఆ జీవుని చిట్టాలోయున్న కర్మలను కాల్చను మొదలు
పెట్టును. ఈ విధముగా కర్మల దహనము ఎప్పుడు కల్గునో అప్పుడు
వాడు జ్ఞానమార్గములో ముందుకు సాగిపోవునట్లగును. అలా సాగి పోగా
పోగా ఎప్పటికో ఒకప్పటికి మోక్షమను గమ్యమును మనిషి చేరగలడు.
ఇదంతయూ ఒకదానితో మరొకటి సంబంధపడియున్న విధానము. ఈ
విధానములో మనిషికి బైబిలులో చెప్పినట్లు 'పాపక్షమాపణ' కల్గునని
తెలియుచున్నది. అట్లే ఖురాన్లో చెప్పినట్లు 'దేవుని క్షమాశీలత' మనిషి
మీద కల్గుచున్నది. ఈ రెండు గ్రంథములకంటే ముందు చెప్పిన భగవద్గీతలో
‘కర్మదహనము', 'జ్ఞానాగ్ని' అని చెప్పిన వాక్యములు నెరవేరుచున్నవి.
ఇదంతయూ యోగీశ్వరుల జ్ఞానమువలన సాధ్యమవుతుందని చెప్పు
చున్నాము.

ప్రశ్న :- ఇక్కడ ఒక్కమాటను అడుగుచున్నాము. ఇట్లు అడుగుచున్నందుకు
మీరు ఏమి నన్ను తప్పుగా అనుకోవద్దండి. నా తరపున కాకుండా ప్రజలలో
వచ్చు సంశయములను తీర్చుటకు ఇలా ప్రశ్నించుచున్నాము. యోగీశ్వరుల
జ్ఞానము వలననే మోక్షము లభించుననీ, కర్మనాశనమగుననీ చెప్పారు.
యోగీశ్వరుల ముందు వచ్చిన బైబిలు, ఖురాన్, భగవద్గీతలయిన మూడు
దైవ గ్రంథములలో చెప్పిన జ్ఞానము వలన కర్మ లేకుండా పోవునని, మోక్షము
కల్గునని చెప్పారు కదా! అటువంటప్పుడు యోగీశ్వరుల జ్ఞానము వలననే

జ్ఞానము కల్గును, కర్మలు కాలును, మోక్షము లభించునని చెప్పడము
గర్వముతో చెప్పినట్లు కనిపించుచున్నది. పూర్వము చెప్పిన వారిని కాదని
వారికంటే నేనే గొప్పయని చెప్పినట్లు కలదు. అలా చెప్పడము అన్నీ
తెలిసిన మీకు సరిపోతుందా?

జవాబు :- మీ ప్రశ్న చివరిలో అన్నీ తెలిసిన 'మీకు' అన్నావు కాబట్టి నేను
బ్రతికిపోయాను. అట్లు కాకుండా 'నీవు' అని అడిగియుంటే నేను ఎంతో
వివరణ ఇచ్చుకోవలసి వచ్చియుండేది. మీకు సరిపోతుందా? అని అడిగారు
కాబట్టి సరిపోయింది. అలా చెప్పడము సరిపోయిందిగానీ, మీరు అర్థము
చేసుకోవడమే సరిపోలేదు. నేను చాలామార్లు వివరణ ఇస్తూ వచ్చాను.
'ప్రబోధానంద యోగీశ్వరులు అనుమాట ఒక శరీరమువద్ద వాడుచున్నా,
అది శరీరములోపలయున్న మధ్యాత్మకే వర్తిస్తుందని చెప్పాను. అదే
శరీరములో యున్న నేను అనగా జీవాత్మను అదృష్టవంతుడనని కూడా
చెప్పాను. ఒక శరీరమునకున్న పేరు జీవునిదా కాదా!యని కూడా చెప్పాను.
శరీరము ఎవరిదయితే ఆ పేరు వారికే వర్తించునని కూడా చెప్పాను.
అజ్ఞానములో జీవించు ప్రతి మనిషి శరీరము నాదేయని అనుకొనుచుండును.
వాస్తవముగా శరీరము వానిది కాకపోయినా జీవుని భావమునే పరిగణ
లోనికి తీసుకొనబడుట చేత శరీరము ఆ జీవునిదిగా లెక్కించబడును.
శరీరము ద్వారా జరుగు పనులన్నియూ ఆ జీవుడు చేసినట్లే భావింపబడును.
వాస్తవానికి శరీరమునకు పెద్ద అయిన ఆత్మది. శరీరము నాకు జ్ఞానము
తెలుసు కావున శరీరము నాది కాదు. "శరీరము మధ్యాత్మది" అని తెలిసి
యుండుట వలన శరీరములో జరుగు పనులు నావిగా లెక్కించబడలేదు.

శరీరములో నేను ఒకమూల రవ్వంతగాయున్నాను. శరీరమంతా
వ్యాపించియున్న ఆత్మ శరీరమునకు అధిపతియైన దానివలన శరీరము

ఆత్మదేయగును. ఆత్మ అందరి శరీరములలోయున్నా వారివారి కర్మలను
బట్టి ఆత్మపని చేయును. 'ప్రబోధానంద' అను శరీరములోని ఆత్మ
ప్రత్యేకముగా ఆత్మజ్ఞానమును చెప్పు పని చేయుచున్నది. జీవాత్మ జ్ఞానమును
వినగలిగి తాను జీవుడను మాత్రమే, నాకు శరీరము లేదు, ఆత్మ యొక్క
శరీరములో యున్నాను అనుకోవడము వలన శరీరము ఆత్మదిగానే
లెక్కించబడినది. అప్పుడు శరీరమునకున్న పేరు ఆత్మదిగా లెక్కించ
బడుచున్నది. 'ప్రబోధానంద యోగీశ్వరులు' అను పేరు ఆత్మదేయగుట
వలన, ఆత్మ చెప్పిన జ్ఞానమును ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పాడని
చెప్పవచ్చును. ఈ శరీరములో యోగీశ్వరులుగాయున్న ఆత్మయే ఇప్పుడు
సకల జీవరాసుల శరీరములో యున్నది. అంతేకాక గతములో కూడా
అందరి శరీరములో యున్నది. భగవద్గీతను చెప్పిన కృష్ణునిలోయున్న ఆత్మ
‘ప్రబోధానంద యోగీశ్వరులు' అను ఆత్మయే, అలాగే ఏసు శరీరములో
యుండి జ్ఞానమును చెప్పిన ఆత్మకూడా యోగీశ్వరుల శరీరములోయుండి
జ్ఞానము చెప్పుచున్న ఆత్మయేనని చెప్పుచున్నాము. గతములో జ్ఞానము
చెప్పిన వారి శరీరములలో యున్న ఆత్మకు, ఇప్పుడు ప్రబోధానంద
యోగీశ్వరుల శరీరములోయున్న ఆత్మకు ఏమయినా తేడాయున్నదా? ఏమీ
యుండదు. ఒకే ఆత్మ అన్ని శరీరములలోనూ ఉంటూ, ఆ జీవులకు
తోడు ఆత్మగా, పొరుగువానిగా యుంటూ, శరీరములను నడిపించుచున్నది.
ఒక శరీరములో జ్ఞానమును బోధించినా, అజ్ఞానమును బోధించినా ఆ
పనిని చేయునది ఆత్మయే. గతములో దైవ గ్రంథములను చెప్పిన వారి
శరీరములలో ఆత్మయేయుండి వారి ద్వారా జ్ఞానమును బోధించియుండును.
అందువలన గతములో బోధించిన ఆత్మను 'ప్రబోధానంద యోగీశ్వరులు'
అని ఈ రోజు పేరుతోయున్న ఆత్మయేనని చెప్పుచున్నాము. ఈ దినము

నేను నివశించు శరీరము నాది అంటే అది ఆత్మది కాకుండా నా శరీరముగా
లెక్కించబడును. నాది కాదు అనడము వలన ఈ శరీరము ఆత్మదేయగు
చున్నది. శరీరము ఆత్మదయినప్పుడు, శరీరముతోపాటు శరీరమునకున్న
పేరు కూడా ఆత్మదే యగుచున్నది. 'ప్రబోధానంద యోగీశ్వరులు' అని
ఈ శరీరమునకు పేరుండుట వలన అదే పేరు ఆత్మదగుచున్నది. ఆత్మ
గతములో చెప్పిన బోధలను నేడు ప్రబోధానంద యోగీశ్వరుల పేరుతోయున్న
ఆత్మయే చెప్పినదని చెప్పుటలో తప్పులేదు. పైగా ఆ మాట సత్యమగును.

సత్యమును అనుసరించి ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములోని
ఆత్మయే దైవగ్రంథములను చెప్పినదని చెప్పవచ్చును. అలాగే గతములో
గానీ, ఇప్పుడుగానీ అందరి శరీరములలోయుండి అందరినీ వారివారి
కర్మల ప్రకారము కదిలించి నడుపుచున్నది ఆత్మయే. రాముని శరీరము
లోనూ, అట్లే రావణబ్రహ్మ శరీరములోనూ ఒకే ఆత్మ ఉండెడిది. రాముని
శరీరములోనూ, రావణబ్రహ్మ శరీరములోనూ, కృష్ణుని శరీరములోనూ,
అర్జునుని శరీరములోనూ ఆత్మ శరీరమునకు వెలుగై, జీవునికి తోడై
యుండెడిది. గతములో జ్ఞానమును బోధించి మోక్షమునకు దారి చూపినది
ఆత్మయే కనుక ప్రస్తుత పేరునుబట్టి ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానము
వలననే ఎవరికయినా మోక్షము లభించునని చెప్పడములో తప్పులేదు.
నేడు ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములో ఆత్మగాయుండి శరీరము
చేత “హిందూమతములో సిద్ధాంతకర్తలు" అను గ్రంథమును
వ్రాయించినది ఆత్మయే. ఆత్మకు ఇప్పుడు ఈ శరీరములోని పేరు
వర్తించుచుండుట వలన ఈ పేరుగల ఆత్మయే అన్నీ చేయుచున్నది.
గతములో చేసినదనీ చెప్పవచ్చును. అలాంటప్పుడు ప్రబోధానంద

యోగీశ్వరులుగా యున్న ఆత్మ చెప్పినదే నిజమైన జ్ఞానమనీ, యోగీశ్వరుల
జ్ఞానము వలననే మోక్షము కల్గునని చెప్పడములో తప్పులేదు కదా!

ప్రశ్న :- ఇంతకుముందు ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన గ్రంథములను
ప్రకటించారు కదా! అందులో ఇప్పటికే 73 గ్రంథములను వ్రాసినట్లు
కలదు. ఈ 73 గ్రంథములను స్వయముగా ఆత్మయే వ్రాసిందంటారా?

జవాబు :- జ్ఞానము తెలిసిన ఎవరయినాగానీ, అన్ని గ్రంథములను
యోగీశ్వరులయిన ఆత్మయే వ్రాసినదని చెప్పాలి. ఆత్మ వ్రాసినదని
చెప్పుటలో ఏమాత్రము సంశయము లేదు. శరీరములోని జీవుడు 'నేను
వ్రాశాను' అని అనుకొంటే వాటిని జీవుడు వ్రాసినట్లు జీవుని ఖాతాలోనికి
చేర్చబడును. అప్పుడు ఆత్మ వ్రాసినట్లు లెక్కించబడకపోయినా, చైతన్యమై
పని చేయునది ఆత్మే అయినందున ఆ పనిని ఆత్మే చేయుచున్నది. ఆయినా
పేరు జీవాత్మకు వచ్చును. భావమునుబట్టి జీవుని ఖాతాలోనికి చేర్చబడుట
గానీ, చేర్చకుండుటగానీ చేయబడును. యోగీశ్వరుల శరీరములో ఇప్పుడు
మీతో మాట్లాడు జీవుడుగాయున్న వాడిని నేనే యగుట వలన, నాకు జ్ఞానము
తెలిసియుండుట వలన, గ్రంథములను వ్రాసినది నేను కాను ఆత్మయే
వ్రాసినదను సత్యమును తెలిసియుండుట వలన గ్రంథములన్నీ ఆత్మయే
వ్రాసినది. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య అను ముగ్గురు
ఆచార్యులు వ్రాసినట్లు చెప్పబడుచున్న గ్రంథములను ఆత్మయే వ్రాసినది.
ఆత్మ ఎవరిలో ఏమి చేయవలెనో ముందే నిర్ణయించుకొని చేయును.
అజ్ఞానులలో అజ్ఞానమును బోధించునది ఆత్మయే. జ్ఞానులలో జ్ఞానమును
బోధించునది ఆత్మయే. అయితే మనిషికీ మనిషికీ కొంత తేడాతో ఆత్మ
పనిచేయుచుండును. అందువలన ఆచార్యత్రయము అందరిలో ఆత్మయే

మూడు విధములుగా పనిచేసి సిద్ధాంతములను పేరుతో రాద్ధాంతము
చేసినది. ముగ్గురు సిద్దాంతకర్తల కార్యములు, బోధలు మూడు రకములుగా
యుండునట్లు ఆత్మయే చేశాడు. నాల్గవవ్యక్తిగా వచ్చిన ప్రబోధానంద
యోగీశ్వరుల ద్వారా త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన వాడూ ఆత్మయేనని
చెప్పుచున్నాము.

ప్రశ్న :- త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినవాడు యోగీశ్వరుల వారి
శరీరములోని ఆత్మయేనని మేము నమ్ముచున్నాము. యోగీశ్వరులు వ్రాసిన
73 గ్రంథములను ఆత్మయే వ్రాసినదని మీరు చెప్పితే నమ్మవలసిందేనని
నమ్మినా, మేము దాచిపెట్టుకోకుండా చెప్పితే మాలో కొంత అనుమానము
దాగియుందని చెప్పవచ్చును. మా అనుమానము ప్రకారము చెప్పితే,
యోగీశ్వరులు అయిన ఆత్మ గ్రంథములను వ్రాసియుంటే, అవి ఇంకా
ప్రత్యేకముగా ఉండునేమో అనిపించుచున్నది. మీరు ఎంత చెప్పినా మా
అంతరంగములో ఈ గ్రంథములన్నియూ మనిషి వ్రాసినట్లే ఉన్నాయి గానీ,
ఆత్మ వ్రాసినట్లు ఏ ప్రత్యేకత వాటిలో కనిపించలేదు. మనిషి భాషలో
కొన్నిచోట్ల మొరటుగా మాట్లాడినట్లు, భాషలో తప్పు పదములు వ్రాసినట్లు
ఆత్మ వ్రాయదు కదా! ఆత్మకు అన్ని విద్యలు తెలుసు కావున, వ్రాసే
భాషను స్వచ్ఛముగా వ్రాయగలదు. అయితే ఇక్కడ కొన్ని గ్రంథములు
చూస్తే మనిషి చేసిన పొరపాట్లు భాషలో యున్నట్లు కనిపించుట చేత 'ఇది
మనిషే వ్రాశాడు' అని అనుమానము కల్గుచున్నది. చెప్పే బోధలో మాట్లాడే
భాషలో స్పష్టత లేదు, ఎన్నో తప్పులున్నాయి. కొన్ని పదములు పలుకడము
లోనే తప్పులుగా పలుకుచున్నారు. వ్రాసిన భాషలో సరియైన భాషలేదు.
వ్యాకరణములో ఎన్నో తప్పులున్నాయి. ఆత్మ గ్రంథములు వ్రాస్తే

వ్యాకరణములో తప్పులు వ్రాయునా? ఒక పదమును విడదీసి వ్రాసేచోట
కలిపి వ్రాశారు. కలిపి వ్రాసేచోట విడదీసి వ్రాశారు. ఇటువంటి తప్పులను
చూచి “ఆత్మ ఈవిధముగా వ్రాసియుండదు” అని తెలియుచున్నది. అయితే
మీరు చెప్పేమాటలను బట్టి ఆత్మ వ్రాసియుందేమోనని నమ్మినా, వెంటనే
'ఇదంతా చెప్పుట కొరకే అలా చెప్పారు, మనిషే వ్రాసియుండునను'
అనుమానము కల్గుచున్నది. నా అనుమానమును దాచుకోకుండా
వెలిబుచ్చాను. అట్లు అడుగుట తప్పయితే క్షమించండి. అయితే మీరు
చాలాచోట్ల ‘ఏ ప్రశ్ననయినా మనస్సులో దాచుకోకుండా అడుగుటలో తప్పు
లేదు' అని చెప్పారు కనుక అడుగుచున్నాను.

జవాబు :- ఈ ప్రశ్న మీకే కాదు చాలామందికి వచ్చునదే! ఎప్పటికయినా
ఉన్న అనుమానమును దాచుకోకుండా అడుగవలెను. అప్పుడు ఆ
అనుమానము లేకుండా పోవు అవకాశము కలదు. ఇప్పుడు అడుగడము
వలన జవాబు చెప్పు నాకు ఏ బాధా లేదు. ఇంకా సంతోషముగానే
యున్నది. ఆత్మకు అన్ని విద్యలు తెలుసు. అందువలన కొందరి గ్రంథకర్త
లలోనుండి అమోఘమైన భాషను వ్రాయించును. కొందరు బోధకుల
నుండి స్వచ్ఛమయిన భాషను మాట్లాడించును. కొందరిలో అస్పష్టమైన
భాషను కూడా పలికించును. ప్రబోధానంద యోగీశ్వరులు సభలో
ఉపన్యాసము చెప్పుతూ అస్పష్టమైన భాషనే పలుకుచుండును. ఆయన
రచనలలో కూడా స్వచ్ఛమయిన భాష ఉండదు. ఆ విషయము యోగీశ్వరుల
శరీరములో సహజీవనము చేయుచున్న నాకు బాగా తెలుసు. ఇప్పుడు
జీవుడయిన నేను నా భావములను మీతో మాట్లాడి చెప్పునట్లు, ఉపన్యాసము
లలో యోగీశ్వరులు అనేక సందర్భములలో మాట్లాడినా, కొన్ని సమయము
లలో మాట్లాడు అవకాశము నాకును కల్గించుచుండును. అలా నేను

మాట్లాడు సమయములో కూడా యోగీశ్వరులే మాట్లాడుచుండును. అయితే
అప్పుడు జీవుడుగాయున్న నా భావములను యోగీశ్వరుల ద్వారా మీకు
చెప్పడము జరుగుచుండును. అలా సమయము దొరికినప్పుడు నేను
చాలామార్లు “మేము చెప్పే భాష సరిగాయుండదు. భాషను చూచి మీరు
పొరపాటు పడవద్దండి, నాణ్యమయిన, స్వచ్ఛమైన భాషలేకున్నా అన్నిటికంటే
గొప్ప భావమున్న సమాచారముండును.” అని నేనే స్వయముగా చాలామార్లు
చెప్పాను. యోగీశ్వరులయితే ఈ మాట చెప్పడు, అది జీవుడుగా నేను
నాతోటి జీవులకు హెచ్చరించుచూ చెప్పాను. అట్లు చెప్పకపోతే మాట్లాడే
భాషను, మాటపొందికనుబట్టి ఇది సరైన జ్ఞానము కాదని పొరపాటుపడు
అవకాశమున్నది. అందువలన నేనే ముందు ఆ విషయమును చెప్పాను.

ఇప్పుడు మీరు కూడా అదే ప్రశ్ననే అడుగుచున్నారు. ఇప్పుడు
నేను నాకు తెలిసిన విషయమును దాచిపెట్టుకోకుండా చెప్పవలసియున్నది.
అందువలన యోగీశ్వరులు ప్రత్యేకించి ఈ శరీరములో మాట్లాడుచున్నా,
తానే తన జ్ఞానమును ఎన్నో గ్రంథముల రూపములో వ్రాసినా, తన
జ్ఞానమును పై చూపు చూచువారు, శ్రద్ధలేనివారు, భక్తిలేనివారు ఎవరూ
తెలియకుండునట్లు భాషను అస్పష్టముగా చెప్పుట, వ్రాతను స్వచ్ఛముగా
వ్రాయక పోవుట చేయుచుండును. భక్తి, శ్రద్ధలున్నవారు నేను చెప్పు
విషయము మీద (జ్ఞానము మీద ధ్యాస కల్గియుండుట వలన నా భావము
మీద దృష్ఠి పెట్టి భాష మీద దృష్టి పెట్టకయుందురని ఆత్మ తలచుచుండును.
ఇది పైకి అందరికి నేను చెప్పు నా స్వంత మాటలేగానీ, యోగీశ్వరుల
అంతరంగములో అనగా ఆత్మ అంతరార్థములో వేరు భావమున్నట్లు
అర్థమగుచున్నది. ఈ విషయమై ప్రజలకున్న అనుమానమును, నాకు
కూడా యున్న అనుమానమును అడిగితే ఆయన అనగా మధ్యాత్మ అనగా

పొరుగువాడు ఈ విధముగా చెప్పాడు. చెప్పాడు అనడము మంచిది
కాదు. తన భావమును నాకు అందించాడు.

మధ్యాత్మ అయినవాడు, నాకు శరీరములోనే దేవుడుగా యున్న
వాడు, శరీరములోపల శ్వాసను పీల్చుచూ వదలుచూ తోడుగాయున్న
వాడు, నన్ను బ్రతుకునట్లు చేయు శరీర అధికారి అయినవాడు అయిన
ఆత్మ, అదే పనిగా సక్రమమైన భాషను మాట్లాడడము లేదు. సరియైన
భాషలో జ్ఞానమును చెప్పడములేదు. అయినా మాట్లాడే భాష సరిగా
లేకున్నా, మాట్లాడే మాటలలో ఉత్తమోత్తమమైన జ్ఞానముండును. వ్రాసే
భాష సరియైనది కాకున్నా, వ్రాసే విషయములు వ్రాయబడే జ్ఞానము
అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానముగా ఉండును. అంతగొప్ప జ్ఞానమును
జీవులుగా యున్నవారు ఎవరూ చెప్పలేరు. ఎవరికీ తెలియని జ్ఞానము
ఎలా చెప్పగలిగాడు? అను ప్రశ్న రాకముందే తన భాషలోనూ, వ్రాతలోనూ,
లోపము కనిపించనట్లు ఆత్మే చేయుచున్నాడు. ఎదుటి మనుషులు
ఆత్మగాయున్న తనను గుర్తించనట్లు, వారి చూపు ఆత్మ వరకు పోనట్లు,
అనేక అనుమానములను కల్గించునట్లు భాషను సరిగా లేకుండా చేయు
చున్నాడు, వ్రాతను సరియైన వ్రాతగా కనిపించనట్లు చేయుచున్నాడు.

ప్రశ్న :- ఆత్మయినా అలా ఎందుకు చేయాలి? ప్రజలు జ్ఞానము తెలియాలనే
కదా! ఆత్మే స్వయముగా జ్ఞానము చెప్పుచున్నది. చెప్పే దానిని సరియైన
భాషలో చెప్పి ప్రజలను ఆకర్షించేది పోయి సక్రమమైన భాషలో చెప్పక
పోవడము ఎందుకు?

జవాబు :- మనుషులము మనమైతే అలాగే చేసేవారము. ప్రజల ఆకర్షణ
కొరకు భాషను స్వచ్ఛముగా పలుకడము మొదలగునవి చేయుచుందుము.
అన్నీ చేతనయి చేతకానివలె చెప్పుటకు ముఖ్యమైన కారణము గలదు.

మనిషి చూడవలసినది భావము. చెప్పేది ఏ భావములో చెప్పబడుచున్నది
అని చూడడమే ముఖ్యము. భాషను చూచువాడు భాషా ప్రియుడేగానీ
భావప్రియుడు కాదు, అటువంటి వానికి జ్ఞానము అవసరము లేదు.
శ్రద్ధయున్న వానికే జ్ఞానము. శ్రద్ధలేనివానికి జ్ఞానము అంటుకోదు. ఆత్మ
చెప్పేబోధలో ఎవరూ చెప్పని జ్ఞానమున్నది కదా! వినేవాడు తెలివైనవాడు
అయితే, జ్ఞానము కావాలను ఆసక్తి కలవాడు అయితే భాషతో వానికేమి
పని? చెప్పిన గొప్ప జ్ఞానమును స్వీకరించవచ్చును కదా! ప్రపంచములో
ఎవరూ చెప్పని బోధను ఎదుటివాడు చెప్పుచున్నప్పుడు ఇంతవరకూ
తెలియని జ్ఞానము తెలుస్తుంది కదా!యని సంతోషపడిపోవాలిగానీ భాషను
చూడడము తగదు.

ఒకడు పెళ్ళిపెత్తనానికి ఒక ఊరికి పోయాడట. అక్కడ పెత్తనము
పోయిన ఇంటిలో అమ్మాయిని అలంకారము చేసి చూపారు. పెత్తనానికి
పోయినవాడు కాబోయే భార్యను చూడడానికే కదా! అక్కడికి పోయినది.
అక్కడ వారు మర్యాద పూర్వకముగా ఏ లోటు లేకుండా గౌరవించి పెళ్ళి
కూతురును చూపారు. అమ్మాయి చాలా అందముగాయున్నది. ఎక్కడాలేని
అందము, ఎవరిలోలేని అందము ఆమెలో యున్నది. అక్కడికి పోయిన
పెళ్ళికొడుకుకు దృష్ఠి అంతయూ మామగారి ఆస్తిమీద ఉందిగానీ కాబోయే
భార్యమీద లేదు. పెళ్ళికూతురు తండ్రి కొంత తెలివైనవాడు, ఎంతో
అనుభవమున్నవాడు. అతిలోక సౌందర్యవతిగాయున్న తన కుమార్తెను
వచ్చిన అబ్బాయికి చూపారు. అయితే ఆ దినము పెళ్ళికొడుకు మామ,
పెళ్ళికూతురుకు తండ్రియగునతడు మంచి దుస్తులు ధరించక కొంత
నలిగిపోయిన దుస్తులు, వెనుకవైపు చినిగిపోయిన దుస్తులు ధరించి
యుండెను. అమ్మాయిని చూచిన అబ్బాయి అమ్మాయి బాగుంది కదా! యని

అనుకోక మామగారు నలిగిపోయిన నిక్కరు కట్టుకున్నాడని, మామగారు
బాగాలేరు, నాకు ఈ సంబంధము నచ్చలేదు అన్నాడట. అమ్మాయి
నచ్చకపోతే సంబంధము వద్దు అనడము జరుగవలెనుగానీ, అమ్మాయిని
వదలి మామగారు నచ్చలేదు నాకు సంబంధము వద్దు అనడము సరియైన
పద్ధతి కాదు కదా! అలా అన్నవాడు అమ్మాయిని చూడను వచ్చాడా! మామను
చూడను వచ్చాడా!! అతనికి కావలసినది భార్యతో పెళ్ళా లేక మామగారి
అస్తియా? ఆస్తిని చూచి అమ్మాయి ఎటువంటిదయినా ఫరవాలేదు
చేసుకుంటానను వ్యక్తిత్వము మంచిది కాదనేగా అర్థము. అటువంటివానికి
పిల్లనిచ్చినా సుఖపడదు అని ముందే చెప్పవచ్చును. ఇది ఉపమానము.
దీనివలెనున్న విషయమును చూస్తాము.

అదే విధముగా మోక్షమును కోరువాడు, దైవసన్నిధి కావాలను
వాడు, చెప్పే బోధలోని జ్ఞానమును చూడాలి. విన్న జ్ఞానములో ఎంత
సారమున్నదో గ్రహించుకోవాలి. అక్కడ చూడవలసినది జ్ఞానమే అయినా,
చెప్పబడే జ్ఞానము ఎంతో గొప్పగా, ఎక్కడా చూడని జ్ఞానము అక్కడ తెలియు
చున్నా, తనకు కావలసినది జ్ఞానమే అయినా, మనిషి దానిని వదలి చెప్పే
వాని భాష బాగాలేదనడము, పెత్తనమునకు పోయి అమ్మాయి బాగున్నా,
అమ్మాయి విషయమును చూడక మామగారు నలిగిపోయిన నిక్కరు
కట్టుకొన్నట్లుంటుంది. అటువంటి వానికి అమ్మాయితో పనిలేదు మామగారి
ఆస్తితోనే పని అన్నట్లు, చెప్పే భాషతోనే పని చెప్పబడే జ్ఞానముతో పనిలేదను
వారికి జ్ఞానము అవసరములేదు కదా! అతనికి జ్ఞానము మీద ఆసక్తి లేనట్లే
కదా! అటువంటి వానికి జ్ఞానము తెలియకూడదనే ఉద్దేశ్యముతోనే ఆత్మ
అదేపనిగా సక్రమమైన భాషలో కాకుండా జ్ఞానము చెప్పినది
అనుకుంటున్నాను. స్పష్టమైన భాష కాకపోయినా ఆత్మ చెప్పినది అత్యంత

రహస్యమైన జ్ఞానము, ఎక్కడా తెలియని జ్ఞానము కదా! అంతగొప్ప
జ్ఞానమును చెప్పినా, దానిని గ్రహించక భాషను చూచువాడు పై వ్యక్తిని
చూచువాడు, పిల్ల అందమును చూడక మామ నిక్కరును చూచిన వానివలె
ఉన్నది. ఆత్మ అంటే ఎవరూ ఊహించని విధముగాయుండి సర్వ జీవరాశు
లలోనుండి నడుపు ఏకైక శక్తి. సర్వజీవరాశులకు శరీరములో దేవుడుగా
యున్నది ఆత్మ. ఆత్మ వలననే అసలయిన దైవమును తెలియవచ్చును.
దేవునికి జీవుడైన నీకు మధ్యవర్తిగా యున్నది ఆత్మ. అంతగొప్పదయిన
ఆత్మకు తెలియనిది ఏదీ లేదు. మనిషిని ఎట్లయినా నడుపగలడు.
ఏమయినా చేయగలడు.

శరీరములో ఇంతవరకు గొప్ప జ్ఞానులు కూడా గుర్తించనట్లు అణిగి
యున్నది ఆత్మ. అటువంటి ఆత్మను గురించి ఇంతవరకు మూడు దైవ
గ్రంథములలో తప్ప ఇతరుల ఏ గ్రంథములోనూ ఎవరూ చెప్పలేదు. ఎవరికీ
తెలియకుండా శరీరములో నిక్షిప్తమైయున్న ఆత్మ ప్రపంచములోని శరీరముల
ద్వారా అన్ని పనులు చేయుచూ ప్రతి మనిషికి దగ్గరగాయున్నది. జీవునకు
శరీరములోనే దగ్గరగాయున్నది ఆత్మ. జీవునికి అత్యంత సమీపములో
యున్నా ఆత్మను జీవుడు గ్రహించక శరీరములో తాను తప్ప ఎవరూ
లేరనుకుంటున్నాడు. జీవుడు జ్ఞాని అయినా శరీరములోని ఆత్మను
గుర్తించక, అసలు శరీరములోనే దృష్టిని సారించక, దేవున్ని గురించి బయట
ప్రపంచములో వెదకుచున్నాడు. అసలయిన దేవుడు ప్రపంచములో
అణువణువునా యున్నా ఆయన ఎవరికీ తెలియడు. ఏ జీవుడయినా
ఆత్మ ద్వారానే దేవున్ని తెలియాలి. ఆత్మ ద్వారా కానిది ఎవడుగానీ దేవున్ని
చేరలేడు. ఆత్మ ఎటువంటిదో ముందు తెలియనిదే పరమాత్మను చేరుటకు
వీలుపడదు. అందువలన ఆత్మజ్ఞానము తప్పనిసరిగా అవసరము. మోక్షము

పొందువాడు చనిపోవు సమయమును గురించి భగవద్గీతలో “పగలు,
సూర్యరశ్మి యున్నప్పుడు, శుక్లపక్షమి, ఉత్తరాయణ కాలములో చనిపోయిన
యోగి మోక్షము పొందును” అని చెప్పారు. దానిప్రకారము చాలామంది
జ్ఞానము తెలిసిన, జ్ఞానమును బోధించిన స్వామీజీలు కూడా చనిపోలేదంటే
వారికి మోక్షము లభించలేదనియేగా అర్థము. అంత పెద్ద స్వామీజీలకు
కూడా ఆత్మజ్ఞానము తెలియకపోవడమే కారణముగా వారు మోక్షమునకు
పోలేదు.

ప్రపంచములోని మనుషులలోనేకాక సర్వజీవులందు ఒకే ఆత్మ
అన్ని జీవుళ్ళకు తోడుగాయుండి, అన్ని శరీరములను వారివారి కర్మల
ప్రకారము నడుపుచున్నది. అందరి శరీరములలో ఆత్మయున్నా ఎంతగొప్ప
జ్ఞానులు కూడా ఆత్మను తెలియలేదు. ఆత్మ ఒకటి యున్నదను సమాచారమే
వారికి తెలియదు. ఇంతకుముందు హిందూమతములో వచ్చిపోయిన
ముగ్గురు సిద్ధాంతకర్తలు కూడా ఆత్మ ఉనికిని కనుగొనలేక పోయారు.
వారు ముగ్గురు ఆకారమున్న విష్ణువును సాకారుడని చెప్పుకోగా, అద్వైతులు
శివలింగమును పెట్టుకొని పార్వతి భర్తయిన శివుడు నిరాకారుడని
చెప్పుకొన్నారు. ఈ విధముగా ముగ్గురు సిద్ధాంతకర్తలు సాకార,
నిరాకారముల మధ్య పోట్లాడుచూ వారి సిద్ధాంతములను తయారు చేసుకొని
ప్రపంచము బయటనే దేవుడున్నాడని అనుకొన్నారు. ఎవరి చూపు
శరీరములో తమను నడుపుచున్న ఆత్మమీదికి పోలేదు. దేవుని మీద ఎంతో
శ్రద్ధ, భక్తి యున్నవానికి దేవుడే దారిచూపును. తనయొద్దకు ఎవరిని
చేర్చుకోవలెనో, ఎవరిని దూరముగా యుంచవలెనో దేవునికి బాగా తెలుసు.
తనను పూర్తిగా నమ్మి, తన మీదనే భక్తి కల్గియున్న వానికి సరియైన జ్ఞాన
మార్గమును చూపి, ఆ మార్గములో తనను చేరునట్లు చేయును. అన్యచింత

లేకుండా ఎవడయితే తననే విశ్వసించి నిత్యము తనయందే (దేవునియందే)
కలిసిపోవాలని ప్రయత్నించుచుండునో అటువంటి వాని యోగము యొక్క
క్షేమమును దేవుడే చూచుకొనును. అనగా ఆయనే అతనిని సక్రమ
మార్గములో నడిపి తనయందు చేర్చుకొనును. ఒక మనిషి దేవునియందు
చేరుటకు ఒక పద్ధతి నిర్ణయింపబడియుండును. ఆ పద్ధతిలోని మనిషిని
బలహీనుడు కాకుండా వానికి బలము చేకూర్చి, పద్ధతి ప్రకారమే నడిపి,
అనగా వాని యోగము భంగము కాకుండా చూచి యోగము యొక్క
ఆరోగ్యమును తానే చూచుకొని, వాని యోగపద్దతి సరిగాయుండునట్లు
చేసి చివరికి పద్ధతి ప్రకారము వాని కర్మంతయూ లేకుండా పోయినప్పుడు
వానిని తనలో కలుపుకొనును.

దేవునియందు చేరుటకు “యోగము” అను పద్ధతి కలదు. దేవుని
యందు చేరుటకు కావలసిన యోగపద్ధతిని దేవుడే చెప్పాలి. మనుషులకు
దేవుడు ఎట్లుండునో, దేవున్ని ఎలా చేరవలెనో తెలియదు. అందువలన
దేవుని యోగ జ్ఞానమును దేవుడే చెప్పవలసియున్నది. దేవుడు స్వయముగా
ఎవరితోనూ మాట్లాడడు. అందువలన దేవుడు ఏ విషయమును మనిషికి
తెలియజేయాలనుకొన్నా ఏదో ఒక విధముగా తెలియజేయను. దేవుడు
మనిషికి జ్ఞానమును తెలియజేయు విధానములు మూడు గలవని “అంతిమ
దైవగ్రంథము”లో దేవుడే చెప్పాడు. ఆ మూడు విధానములలో ఒకటి
'ఆకాశవాణి' ద్వారా జ్ఞానమును తెలియజేయడము. రెండు ‘తెరచాటు’
నుండి తన జ్ఞానమును తెలియజేయడము. మూడు తన అంశయైన
“భగవంతుని' ద్వారా తన జ్ఞానమును దేవుడు తెలియజేయును. ఆకాశవాణి
ద్వారా తెలియజేసినా, తన అంశయైన సాకారరూపమైన (కనిపించే
రూపమైన) మనిషి ద్వారా తెలియజేసినా, తెరచాటునుండి అనగా కనిపించని

రూపమునుండి తెలియజేసినా, మూడిటియందున్న ఆత్మయే తెలియజేయ
వలెను. ఆకాశభూతములోయున్న ఆత్మ శబ్దరూపములో జ్ఞానమును
చెప్పగా, కనిపించని సూక్ష్మరూపముగాయున్న వానిలోగల ఆత్మయే
జ్ఞానమును మాటల రూపములో చెప్పుచున్నది. వాణి నుండి, తెరచాటు
నుండి రెండు విధముల ఆత్మయే మాటల రూపములో అనగా బోధల
రూపములో దైవజ్ఞానమును చెప్పగా, మూడవ విధానమైన సాకారరూపము
నుండి అనగా కనిపించే మనిషిగాయుండి చెప్పినప్పుడు కూడా ఆ శరీరము
లోని కనిపించని ఆత్మయే దైవజ్ఞానమును గురించి చెప్పును. ఎక్కడయినా
కనిపించని ఆకారమునుండిగానీ, కనిపించే ఆకారము నుండిగానీ, ఆకారము
లోపల అణిగి ఎవరికీ తెలియకుండా యున్న రెండవ ఆత్మ (మధ్యాత్మ),
మూడవ ఆత్మయిన పరమాత్మను (దేవున్ని) గురించి చెప్పును.

జీవాత్మకు పరమాత్మకు మధ్మనయున్న ఆత్మ ఎవరికీ కనిపించదు.
ఎవరికీ వినిపించదు. అయినా అందరికీ కనిపించునట్లు చేయునది,
అందరికీ వినిపించునట్లు చేయునది ఆత్మయే. ఆత్మ దైవజ్ఞానమును ఆకాశ
వాణినుండి, తెరచాటున కనిపించకయున్న వానినుండి చెప్పు జ్ఞానము
కేవలము బోధల రూపములో మాత్రముండును. సాకారరూపమైన దైవ
ప్రతినిధి నుండి చెప్పు జ్ఞానము మాటల రూపమేగాక, వ్రాతరూపములో
కూడా లభించును. అనగా గ్రంథరూపములో కూడా లభించును. కృష్ణుడు,
ఏసు ఇద్దరి శరీరములనుండి ఆత్మ మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇతరుల
ద్వారా గ్రంథరూపమైనవి. కనిపించని జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును
వినిన ప్రవక్తగారు గ్రంథరూపము చేశారు. ఇలా మూడు దైవగ్రంథములు
తయారైనవి. ఇది ఇంతవరకు గతములో జరిగిన విధానము. మూడు
గ్రంథములను మనుషులు ఆత్మ దైవజ్ఞానమును చెప్పిన తర్వాత దానినే

గ్రంథరూపముగా వ్రాశారు. అలా వ్రాయునప్పుడు వారికి అర్థముకాని
విషయములను భావము మార్చి వారికి అర్థమయిన భావమునే వ్రాశారు.
అప్పుడు దేవుని భావము వేరుగా ఉండగా మనుషులు వ్రాసిన భావము
వేరుగా ఉండడము జరిగినది. అటువంటి మానవ తప్పిదములు మూడు
దైవగ్రంథములలో అక్కడక్కడ కనిపించుచుండును. అటువంటి పొరపాట్లు
జరుగకుండా రాబోవు సాకార రూపమునుండి ఆత్మయే దైవజ్ఞానమును
శరీరము ద్వారా చెప్పడమేకాక, శరీరము ద్వారానే ఆత్మయే స్వయముగా
తాను చెప్పు జ్ఞానమును గ్రంథరూపము చేయదలచుకొన్నది. ఆత్మయున్న
శరీరము ద్వారానే గ్రంథము వ్రాయబడును.

శరీరముల లోపలయున్న ఆత్మ ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క
విధముగా ప్రవర్తించుచుండును. దైవాంశతో పుట్టిన శరీరమును
'భగవంతుడు' అని పేరు పెట్టాము. భగవంతునిగాయున్న శరీరము
సాధారణముగా అన్ని శరీరములవలె ఉండుట వలన ఎవరూ గుర్తించుటకు
వీలుపడదు. జీవుడు ఎక్కడ ఉండునో ఆత్మ అక్కడ ఆ శరీరమును నడుపు
నిమిత్తము ఉండవలెను. అయితే పుట్టిన శరీరములోనున్న జీవాత్మ దైవ
అంశముతో పుట్టినదైనప్పుడు ఆ జీవాత్మకు తోడుగాయున్న ఆత్మ అందుకు
తగినట్లు ప్రవర్తించును. దేవుని అంశతో పుట్టిన భగవంతుని శరీరములో
కూడా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఆత్మలుండును. అయితే అందరి
శరీరములలోవలె ఆత్మ అన్ని పనులు చేయుచున్నా ప్రత్యేకించి ఆ శరీరము
నుండి ఆత్మయే దైవజ్ఞానమును చెప్పును. దైవజ్ఞానమును ఆత్మ చెప్పినప్పటికీ
ఈ మారు ముందువలేకాక స్వయముగా దైవజ్ఞానమును గ్రంథరూపము
లోనికి శరీరము ద్వారా వ్రాయించును. దైవజ్ఞానమును మాటలరూపములో
అనగా బోధల రూపములో ఒక విధముగా చెప్పగా, మరొక విధముగా

గ్రంథరూపములో వ్రాయుచున్నది. శరీరములోగల రెండు విధానములను
ఆత్మ ఉపయోగించుచున్నది. ఇది ఇంతవరకు ఎవరికీ తెలియని
విషయమైనా ఇప్పుడు మేము తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినది. ఇది
ఒకవిధమైన దైవరహస్యమగుట వలన జాగ్రత్తగా వినాలని చెప్పుచున్నాము.

ప్రతి శరీరములో ఆత్మ తన శక్తిని రెండు విధముల శరీరములో
వ్యాపింపజేయుచున్నదని ముందే తెలుసుకొన్నాము. అదే విషయమునే
ఇప్పుడు చెప్పుకొంటే శరీరములో ఏడు నాడీకేంద్రముల ద్వారా, మరియు
ఏడు గ్రంథుల ద్వారా ఆత్మ తన శక్తిని శరీరమంతా వ్యాపింపజేయుచున్నది.
నాడీకేంద్రముల ద్వారా ప్రవహించు శక్తి శరీర బలమును అందించు
చుండగా, గ్రంథుల ద్వారా ప్రవహించు శక్తి శరీర ఆరోగ్యమును అందించు
చున్నది. ఈ విధముగా శరీరములో రెండు విధానముల ద్వారా మనిషి
జీవితమును ఆత్మ నడుపుచున్నది. ఈ రెండు విధానములు కూడా ఈ
కాల మనిషికి తెలియవనుకుంటాను. శరీరములోయున్న ఆత్మ సర్వసాధారణ
మనుషులను ఇట్లు నడుపుచుండును. అయితే భగవంతుని శరీరములో
దైవజ్ఞానమును బయటికి చెప్పునప్పుడు శరీర నాడీకేంద్రముల ద్వారా
శరీరమంతా వ్యాపించిన శక్తిద్వారా దైవజ్ఞానమును మాటల రూపమైన
బోధలుగా చెప్పును. అదే దైవజ్ఞానమును వ్రాతరూపముగా గ్రంథములలో
వ్రాయవలసి వచ్చినప్పుడు గ్రంథులనుండి ప్రవహించు ఆత్మశక్తి ద్వారా
వ్రాయబడును. ఒక సప్తమిద్వారా బోధలు చెప్పబడును. ఒక సప్తమి
ద్వారా గ్రంథములు వ్రాయబడును. ఇట్లు శరీరములోని రెండు
విధానములను ఉపయోగించి రెండు రూపములలో దైవజ్ఞానము
వెలువడుచున్నది. అలా చెప్పబడిన బోధలలోగానీ, అలా వ్రాయబడిన

గ్రంథములలో గానీ, భావలోపములుగానీ, అన్య భావములుగానీ ఉండవు.
స్వయముగా ఆత్మయే తన రెండు రకముల శక్తులను ఉపయోగించుకొని
జ్ఞానమును చెప్పుచున్నది.

‘బోధ' అనగా బలముగా చెప్పునది లేక గట్టిగా చెప్పునదని అర్థము.
చెప్పే బోధను ఎంత బలమునయినా ఉపయోగించి ఎంత గట్టిగా (ఎంత
బిగ్గరగా) అయినా చెప్పవచ్చును. గట్టిగా అరచి చెప్పుటకు బలము నాడీ
కేంద్రములనుండి వచ్చుచున్నది. నాడీశక్తి ద్వారా పుట్టునది బోధయని
చెప్పవచ్చును. గ్రంథములను వ్రాయుటలో బలము అవసరము లేదు.
మనిషి ఆరోగ్యము మీద ఆధారపడి గ్రంథమును వ్రాయవచ్చును. మనిషి
ఆరోగ్య అనారోగ్యములు నిర్ణయించునవి శరీరములోని గ్రంథులు. గ్రంథుల
శక్తి ద్వారా వ్రాయబడునవని వాటిని గ్రంథములన్నారు. గ్రంథములను
చూచినా, బోధలు వినినా ఆ రెండూ ఆత్మశక్తి ద్వారా వచ్చినవే కనుక
జ్ఞానమును తెలిసిన మనిషిలో కూడా ఆత్మశక్తి ప్రేరణ జరిగి తెలుసుకొన్న
జ్ఞానము జ్ఞానాగ్నిగా మారును. ఆ జ్ఞానాగ్ని ద్వారా కర్మలు కాలుటకు
మొదలిడును. ఇక్కడ అనగా ప్రబోధాశ్రమములో తయారయిన ఏ
గ్రంథమయినా ప్రబోధానంద హస్తస్పర్శ తగులుతూనే ఆ గ్రంథము ఒక
శక్తి కేంద్రముగా తయారగును. ఇక్కడ తయారయిన గ్రంథముల మీద
నమ్మకము కల్గి, భక్తి కల్గి చదివిన వారికి విశేషమైన జ్ఞానశక్తి చేరును.
చదువురానివారైనా గ్రంథముల మీద భక్తి కల్గియుండి ఎప్పుడయినా వారు
బాధలచే పీడించబడునప్పుడుగానీ, బాధించబడునప్పుడు గానీ మా గ్రంథము
లను వారికి నొప్పి ఎక్కడున్నదో అక్కడ గ్రంథమును త్రాకునట్లు చేయగా
గ్రంథములోని ఆత్మశక్తి ఆ శరీరములోని బాధను లేకుండా చేయును.
ఇది జ్ఞానశక్తి ప్రత్యక్షముగా నిరూపణకు వస్తున్నది. బాధగల స్థలములో

గ్రంథము శరీరమునకు అతుక్కొనియుండి శరీరములోని కర్మను కాల్చు
వరకు శరీరమునుండి ఊడిరాదు. మా మాటల మీద నమ్మకము లేనివారికి
ఈ విధముగా కర్మ కాలిపోవుట ప్రత్యక్షముగా కనిపించుచున్నది.

ఇంతవరకు వచ్చిన సిద్ధాంతములలో వచ్చిన జ్ఞానముకంటే త్రైత
సిద్ధాంతములో వచ్చిన జ్ఞానము గొప్పదని నిరూపించుటకు దేవుడే మా
గ్రంథములలో శక్తిని నింపాడని చెప్పుచున్నాము. ఇక్కడ తయారయిన
ముస్లీమ్ గ్రంథమని చెప్పబడు “అంతిమ దైవగ్రంథము” అని మేము వ్రాసిన
ఖురాన్ గ్రంథము కూడా శక్తి నిలయమైనట్లు శరీరమునకు అతుక్కొని
పోయినది. మిగతా చోట ఎక్కడా కనపడని విధానము ఇక్కడ కనిపిస్తున్నా
మూడు మతములవారు అసూయతో మమ్ములను మాట్లాడడము వలన
మీకే నష్టము, కష్టము. ఇప్పటికయినా హిందూమతములో వచ్చిన త్రైత
సిద్ధాంతము గొప్పదని హిందువులు తెలియాలనీ, మిగతా దైవగ్రంథములలో
కూడా యున్న త్రైత సిద్ధాంతమును మిగతా క్రైస్తవ, ఇస్లామ్ మతముల
వారు గ్రహించవలెనని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాము.

సమాప్తము.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.

అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు.
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు, 




Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024