హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు 6thOct24 Updated part2
పశువులకు ఏమి తేడా? ముస్లీమ్లు చిన్నాన్న కూతురును పెళ్ళి
చేసుకొంటారు. దేవుడు అసలైన విషయములను వివరించకుండా దేవున్ని
చేరే మార్గమే చెప్పితే అది అసంపూర్ణమేయగును. దీనికి మీరేమంటారు?
జవాబు :- దేవుడు ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోకూడదని
ఒక హద్దును ఏర్పరచుకొన్నాడు. నీతి, న్యాయములను గురించి ఏమాత్రము
ఆయన జోక్యము చేసుకోడు. అట్లు నీతి, న్యాయముల గురించి చెప్పితే
ప్రపంచ సంబంధ పెద్ద మనిషిగా దేవుడు తయారయినట్లేయగును. దేవుడు
దైవిక విషయములలోనే జోక్యము చేసుకొనును. అదియూ భగవంతుని
వేషధారణలో, దేవుడు దేవునిగానే యుంటూ సాక్షిగా అన్నిటినీ చూస్తున్నాడు
తప్ప ఆయన ఏమీ చేసే స్థితిలో, చెప్పే స్థితిలో లేడు.
92) చంద్రుడు ఉపగ్రహము అయినా జ్యోతిష్యములో చంద్రున్ని గ్రహముగానే
చెప్పారు. సూర్యుడు గ్రహమే కాదు మీరు గ్రహము అని అంటున్నారు.
అది ఎట్లు చెప్పుచున్నారు?
జవాబు :- భూమిమీద వస్తువుల విషయములను గ్రహించడము తిరిగి
మనుషులకు లభించునట్లు చేయడము రెండు పనులను చంద్రుడు,
సూర్యుడు చేయుచున్నారు కావున జ్యోతిష్యము ప్రకారము సూర్య చంద్రులను
గ్రహములు అని అనుచున్నారు. చంద్రుడు కొన్ని విషయములను గ్రహించి
తన ఆధీనములో పెట్టుకొన్నాడు. ఉదాహరణకు నీటికి సంబంధించిన
సమాచారమును చంద్రుడు గ్రహించి భూమిమీద మనుషులకు నీరు ఎవరికి
లభ్యము కావాలో, ఎవరికి లభ్యము కాకూడదో తెలిసి కొందరికి నీరును
అనుకూలము చేసి వానికి బాగా లభ్యమగునట్లు చేయుచున్నాడు. కొందరికి
సరిగా లభ్యముకానట్లు, కొందరికి నీటి విషయములో అనేక చిక్కులు,
బాధలు కల్గునట్లు చేయుచున్నాడు. జ్యోతిష్యము ప్రకారము చంద్రుడు
అనుకూలము లేనివారికి ఈ బాధలు తప్పవని చెప్పవచ్చును. చెప్పినట్లే
నీటి బాధలు వారు పొందుట సత్యముగా, సాక్ష్యముగా కనిపించుచున్నది.
అందువలన చంద్రుడు గ్రహమే అంటున్నాము. అట్లే సూర్యుడు కూడా
గ్రహమని నిరూపింపబడుచున్నది. భూమిమీద గల వస్తు సముదాయము
యొక్క అధికారమును గ్రహించి వారి ఆధీనములో ఉంచుకొన్నాడు. కావున
వారిని గ్రహించువారు గనుక గ్రహములు అని అంటున్నాము.
93) ప్రశ్న :- ఆవలింతలు ఒకరికి వస్తే ప్రక్క వారికి కూడా ఎందుకు
వస్తాయి?
జవాబు :- ఆవలింతలు అంటు రోగములాంటివి. అందువలన ప్రక్కవారికి
కూడా రోగమువలె వ్యాపించుచున్నవి.
94) “పితృదేవతలను కొలిచేవారు (ఆరాధించే వారు) పితృ దేవతలనే
చేరుదురు” అని భగవద్గీత చెప్పుచున్నది. పితృదేవతల విగ్రహాలున్నాయా,
పితృదేవతలు విగ్రహాలను ఆవహిస్తారా?
జవాబు :- పితృ దేవతలు విగ్రహాల రూపములో లేరు. అకాల మరణము
పొంది సూక్ష్మ శరీరములతో యున్నవారినే పితృదేవతలని అంటున్నాము.
వారిని పూజించగా వారు కూడా అకాల మరణమునే పొంది వారి పెద్దల
వద్దకు పోయి సూక్ష్మముగానే ఉందురని అర్థము చేసుకోవలెను.
95) ప్రశ్న :- అకాల మరణము పొందిన వ్యక్తికి శ్రాద్ధాది కర్మలు
కొన్నాళ్ళు చేసి, జ్ఞానమార్గములోనికి వచ్చిన తర్వాత మనము వారికి ఆ
కర్మలు చేయకుండా మానివేసి ఆహారము పెట్టడము, క్రొత్త గుడ్డలు
చూపించడములాంటివి మానివేస్తే వారు ఏమవుదురు? మనపైన కోపగించు
కొందురా? లేక ఎవరినైనా స్థూలముగా యున్నవారిని ఆవహించి వారి
ఆకలి తీర్చుకొందురా?
జవాబు :- శ్రాద్ధకర్మలు ఆపివేస్తే పితృదేవతలకు కోపము రావడము
సహజమే. కొందరు ఇతరుల శరీరములలో ఆవహించి మాకు గుడ్డలు
ఎందుకు పెట్టడము లేదనీ, మంచి గుడ్డలు పెట్టలేదనీ వాదించిన వారిని
చూస్తూనేయున్నాము. తప్పనిసరిగా ప్రతి సంవత్సరము క్రొత్త గుడ్డలు
పెట్టాలని ఒప్పందము చేసుకొనే వారిని చూచాము. తిండి విషయానికి
వస్తే ఇతరులను ఆవహించి ఆకలి తీర్చుకోవలసిన అవసరము వారికి
లేదు. ఎక్కడయినా సూక్ష్మముగానే వారు గ్రహించుకొందురు.
96) ప్రశ్న :- పితృదేవతలను పూజ చేసేవారు పితృదేవతలలోకి చేరుదురు
అంటే వారు ఎక్కడ ఉండెదరు? భూమిమీదనే ఉంటారా? భూమిమీదే
ఉంటే వారంతా మిగతా దయ్యాలకంటే గొప్పవారా? వారి సమూహము
వేరుగా ఉంటుందా?
జవాబు :- పితృదేవతలను పూజించెడి వారు చనిపోయిన తర్వాత దయ్యాల
గుంపులోనే చేరిపోవుదురు. వారి పెద్దలు దయ్యాలే కనుక వీరు కూడా
వారివద్ద చేరవలసిందే. దయ్యాలన్నీ భూమిమీదనే ఉంటాయి. పితృ
దేవతలని చెప్పినంత మాత్రమున వారు దేవతలేమి కాదు. వారు మిగతా
దయ్యాలతో సమానముగా యున్నారు. వారి సమూహము వేరుగా ఏమీ
లేదు.
97) ప్రశ్న :- సూక్ష్మ శరీరాలకు మరణావస్థ యుండునా? మనమైతే
శరీరమును వదలిపెట్టుదుము. తద్వారా ఆత్మ, జీవాత్మలు బయటపడును.
శరీరము, చర్మము లేని దయ్యములలో ఆత్మ, జీవాత్మలు ఎట్లు వేరు అగును?
వాటికి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలు ఉండునా? మూడు
సంవత్సరములలో హత్య చేయబడిన బాలుడు దయ్యముగా మారితే ఆయన
సూక్ష్మ శరీరధారియై వృద్ధాప్య దశ వరకు చేరునా?
జవాబు :- అకాల మరణము పొంది సూక్ష్మ శరీరములుగా మిగిలినవారు
తిరిగి మరణదశలో పూర్తి మరణము పొంది తర్వాత జన్మకు పోవుదురు.
శరీరము లేకపోయినా పదిహేను భాగములు సూక్ష్మ శరీరము గలదు.
స్థూల
కావున అందులో ఇప్పుడెట్లు ఆత్మ, జీవాత్మలున్నారో అప్పుడు కూడా
అట్లే ఉందురు. వారికి కూడా బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలు
ఉండును. బాల్యములో చనిపోయి సూక్ష్మ శరీరముగాయున్నవారు అదే
శరీరములో పెరిగి వృద్ధాప్యము వరకు జీవితమును సాగించుట కలదు.
98) ప్రశ్న :- మడి, మైలు అన్నవి ఉన్నాయా? దేవతా ఉపాసకుడు స్త్రీ
బహిష్ఠు సమయములో ఉన్నప్పుడు తాకితే ఆయన పొందిన సిద్ధులు
కోల్పోవునని కొందరు చెప్పుచుందురు. ఆ మాట వాస్తవమేనా?
జవాబు :- మడి, మైలు అనేవి ఉన్నాయనే చెప్పవచ్చును. దేవాతారాధనలు
కొన్ని నియమములతో కూడుకొనియుండును. ఆ నియమముల ప్రకారము
నడచినప్పుడు దేవతారాధన వలన కొన్ని ఫలితములు (సిద్ధులు) కల్గుట
వాస్తవమే. అయితే నియమముల ప్రకారము నడువనప్పుడు ఆ సిద్ధులు
కోల్పోవడము కూడా జరుగును. నియమములలో బహిష్ఠు మనుషులను
తాకకూడదనేది కూడా ముఖ్యమైన నియమముగా ఉండుట వలన దానిని
తప్పనిసరిగా ఆచరించవలెనని చెప్పుచుందురు. బయటి దేవతల
ఆరాధనలన్నీ నియమములతో ఉండడము వాస్తవమే. వాటి ప్రకారము
మడి, మైలు అన్నవి కూడా వాస్తవమే. అయితే అసలయిన దేవుని
విషయములలో, ఆరాధనలో నియమములుండవు, సిద్ధులు ఉండవు. సిద్ధి
మాత్రముంటుంది. సిద్ధి అనగా మోక్షము.
99) ప్రశ్న :- ఈ ప్రపంచములో జవాబు లేని ప్రశ్న ఒక్కటే ఉంది, మిగతా
వాటికి జవాబులు గలవు అని ప్రసంగములో మీరు చెప్పారు. ఆ ప్రశ్న
ఏదో తెలుప ప్రార్థన?
జవాబు :- జవాబు లేని ప్రశ్న ఉన్నది నిజమే. ఈ ప్రపంచములో పెద్ద
ప్రశ్న, జవాబులేని ప్రశ్న, బ్రతికినన్నాల్లు వెదికినా జవాబు దొరకని ప్రశ్న,
“దేవుడు ఎవరు?” అన్నదే. దానికి జవాబు బ్రతికిన వారివద్ద లేదు?
100) ప్రశ్న :- జ్ఞానానికి చంద్రుడు అధిపతియైనప్పుడు చంద్రుని ద్వారా
మనకు జ్ఞానము అందివ్వకుండా దేవుడు సూర్యుని ద్వారా జ్ఞానము ఎందుకు
తెలియబరచాడు. దేవుడు సృష్ఠి ఆదిలో చంద్రునికే జ్ఞానము చెప్పవచ్చును
కదా?
జవాబు :- ఎలా తెలియబరచాడు అన్నది ముఖ్యము కాదు, ఎలా మనిషి
తలకు చేరుతుంది అనేది ముఖ్యము. సూర్యుని ద్వారా సృష్ట్యాదిలో
జ్ఞానమును బయటి ప్రపంచమునకు తెలియజేసినా అది మనుషుల తలలకు
చేరుటకు చంద్రుని అనుమతి అవసరము. చంద్రుని ఆధీనములో
జ్ఞానముండును. కనుక చంద్రుని గ్రహచారము మనిషివైపు ఉన్నప్పుడే
జ్ఞానము వాని తలకు తెలియును. చంద్రుని చూపులేని అనగా చంద్రుని
అనుకూలత లేని వానికి జ్ఞానము తెలియుట కష్టమగును. అటువంటి
వానికి జ్ఞానము మీద శ్రద్ధయుండదు. జ్ఞానము మీద శ్రద్ధను కల్గించి
జ్ఞానమును అందించు గ్రహము చంద్రుడేయని తెలియవలెను.
101) ప్రశ్న :- భారతదేశములో కృష్ణుడు పుట్టుటకు కారణము భారతదేశము
జ్ఞానుల దేశము కనుక ఈ దేశములో పుట్టాడని చెప్పవచ్చును. కానీ
ఏసుప్రభువుగా వచ్చినప్పుడు ఇజ్రయేల్ దేశములో పుట్టెను. ఆ దేశ
విశిష్టత ఏమి?
జవాబు :- భారతదేశము జ్ఞానుల దేశము అని గుర్తింపు ప్రజలకేగానీ,
దేవునికికాదు. దేవుడు జ్ఞానుల దేశములో పుట్టవలసిన పనిలేదు. అక్కడ
జ్ఞానముండుట వలన జ్ఞానుల దేశములో దేవుని అవసరముండదు. ఎక్కడ
అజ్ఞానముండునో అక్కడ దేవుడు అవతరించునుగానీ, జ్ఞానుల దేశమని
చూచి పుట్టడు. ఎక్కడ తన జ్ఞానము తెలియవలసిన అవసరమున్నదో,
ఎక్కడ అజ్ఞానమున్నదో అక్కడ దేవుడు ఉద్భవించునని విన్నాము. ద్వాపర
యుగములో భారతదేశమందు అధర్మములు తారాస్థాయికి చేరియుండుట
వలన భారతదేశములో పుట్టవలసిన అవసరము ఏర్పడినది అంతేగానీ
ఇది జ్ఞానుల దేశమని కాదు.
102) ప్రశ్న :- సూక్ష్మ శరీర జీవులు ఆహార పదార్థములలో పోషకాలను
గ్రహించునా? వాటి పరిమాణాన్ని స్థూలముగా తగ్గించునా?
జవాబు :- సూక్ష్మ శరీర జీవులలో అనేక జాతులు (అనేక రకములు)
కలవు. అందులో కొన్ని ఆహార పదార్థములలో పోషకాలను తీసుకొనునవి
గలవు. ఉదాహరణకు ఒక హోటల్లో రెండు సూక్ష్మములు (దయ్యములు)
ప్రవేశించి ఒక్కొక్కటి పది ఇడ్లీలను ఇద్దరు కలిసి 20 ఇడ్లీలను
తిన్నారనుకోండి. అప్పుడు 20 ఇడ్లీలు స్థూలముగా అట్లే కనిపించు
చుండును. అయితే వాటిలో సూక్ష్మముగా యున్న పోషక విలువలు లేకుండా
పోయివుండును. ఆ ఇరవై ఇడ్లీలను ఇతరులు తినినా వారికి కడుపు
నిండనట్లేయుండును. వాటి వలన శరీరమునకు బలము రాదు. ఇదంతా
కనిపించకుండా జరుగుచుండును. కొన్ని ఇళ్ళలో దయ్యాలు తినేదే ఎక్కువ
యుండును. అందువలన ఆ ఇంటిలోని వారు ఎంత తిన్నా బలహీనముగానే
ఉందురు. సూక్ష్మ శరీరములుగా యున్న వారిలో కొందరు స్థూలముగాయున్న
ధాన్యమును కూడా లేకుండా చేయగలరు. వారు దేవతా సంబంధ
సూక్ష్మములు. దేవతలుగా యున్నవారు పొలములో యున్న పంటను,
కల్లములోయున్న దాన్యమును దొంగిలించగలరు. అనగా స్థూలముగా
లేకుండా చేయు స్థోమత కల్గియుందురు. వారినుండి పంటను కాపాడు
కొనుటకు పొలములో 'పొలి' చేయుదురు. కల్లములో పొలిగీత గీయుదురు.
రాసిమీద కొడవలి లేక జిల్లెడు కొమ్మ, లేక భగవద్గీత పెట్టుచుందురు.
రాసి చుట్టూ గీతను గీయుచుందురు. దీనినిబట్టి దేవతలు స్థూలముగా,
దయ్యములు సూక్ష్మముగా అపహరించుచున్నవని తెలియుచున్నది.
103) ప్రశ్న :- నైవేద్యము అనే దానికి అర్థమున్నట్లే ప్రసాదమునకు కూడా
అర్థము కలదా?
జవాబు :- నైవేద్యము దేవతలకు ప్రసాదము మనుషులకు, ఆరాధన
ఫలితములోని శక్తి ప్రసాదములో చేరియుండునది కావున దానిని ప్రసాదము
అని అంటున్నారు. 'ప్ర' అనగా ముఖ్యమైన అనియు, 'సాదము' అనగా
తినునదియనియు, 'ప్రసాదము' అనగా ముఖ్యమైన శక్తితో కూడుకొన్న
ఆహారమనియూ చెప్పుకోవచ్చును.
104) ప్రశ్న :- కృష్ణ ప్రతిమలో ఎటువంటి సూక్ష్మశక్తి ప్రవేశించలేదు.
కనుక మనము చేసే పూజను పరమాత్మే స్వీకరించునా?
జవాబు :- వాస్తవమే కృష్ణప్రతిమ దగ్గర చేయు పూజ నేరుగా దేవునికే
చేరును. ఇంకొక రహస్యమేమనగా! భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య
యోగమున 23, 24 శ్లోకములను చూస్తే ఇలా గలదు.
శ్లో॥ 23.
శ్లో॥ 24.
యేష్యన్య దేవతా భక్తా యజస్తే శ్రద్ధయాన్వితాః ।
తేపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధిపూర్వకమ్ ॥
అహంహి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ
నతుమా మభిజానన్తి తత్త్వేనా తశ్వవర్తితే ॥
భావము :- “ఎవడు శ్రద్ధగలిగి అన్యదేవతారాధన చేసినా అతడు కూడా నన్నే
ఆరాధించు వానిగా లెక్కించును. అయితే వానిది దారి తప్పిన విధానము.
సర్వ దేవతలకు చేయు ఆరాధనలయందు, యజ్ఞములయందు ప్రభువును నేనే,
వారు ఇచ్చు వాటిని స్వీకరించు వాడిని నేనే, నన్ను నిజముగా తెలియని వారికి
ఫలితమున్నా దానిని వారు పొందలేరు" అని చెప్పాడు. అంతేకాక విజ్ఞాన
యోగములో 21, 22 శ్లోకములయందు ఈ విధముగా చెప్పియున్నారు
చూడండి.
శ్లో॥ 21.
యోయో యాం యాం తనుంభక్త శ్రద్ధ యార్చితు మిచ్ఛతి
తస్య తస్యా చలాం శ్రద్ధాం తా మేవ విదధామ్యహమ్ ॥
భావము :- “ఎవడు శ్రద్ధతో ఏ దేవతను పూజింపవలెనని తలచుచున్నాడో
వానికి ఆ దేవతను పూజించు శ్రద్ధను నేనే కల్పించుచున్నాను.”
శ్లో॥ 22.
సతయా శ్రద్ధ యా యుక్తప్త స్యా రాధన మీహతే |
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ ॥
భావము :- “వాడు ఆ దేవతనే శ్రద్ధతో పూజచేయగా వాని మంచిని కోరి
వాని కోర్కెను నేనే నెరవేర్చుచున్నాను" దీనినిబట్టి ఏ దేవతను పూజించినా
అక్కడ ఆ పూజను స్వీకరించువాడు దేవుడేయని, ఆ దేవత ఏమీ చేయలేకున్నా
వాని కోర్కెను దేవుడే నెరవేర్చుచున్నాడని తెలియుచున్నది.
105) ప్రశ్న :- భగవంతునిగా వచ్చిన కృష్ణుడు మీరాబాయికి స్థూలముగా
కనిపించాడా? లేక మాటలే వినిపించాయా?
జవాబు :- ఈ విషయము చాలామందికి సందిగ్ధముగాయున్నా నాకు
తెలియును కనుక చెప్పుచున్నాను. మీరాబాయి స్థూలముగా చూడాలని
ఆశపడినది స్థూలముగానే కనిపించి మాట్లాడినాడు. ఇతరులకు ఆయన
మాటలు వినిపించాయిగానీ రూపము కనిపించలేదు. కృష్ణుడు భగవంతుడు.
భగవంతుడు అనగా దేవుని ప్రతినిధి. ప్రతినిధియనగా దేవునికి యున్నంత
శక్తి ఆయనకు ఉండును. అందువలన ఆయన తనకు ఇష్టమైతే స్థూలముగా
కనిపించి మాట్లాడగలడు. అదే మీరాబాయి జీవితములో జరిగినది.
106) ప్రశ్న :- మన వివాహ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమయినది.
జవాబు :- మనిషికి కొంతవరకు దైవజ్ఞానము తెలిసిన తర్వాత వివాహ
వ్యవస్థ ప్రారంభమయినది. ఇదంతయూ కృతయుగములోనే జరిగినది.
107) ప్రశ్న :- భార్యా భర్తలలో పురుషునికి పెద్ద వయస్సు ఎందుకు?
జవాబు :- జీవితములో భర్తదే ఆధిపత్యముండుటకు. వయస్సు కొంత
ఎక్కువ యుండుట వలన అన్ని విషయములలో భార్యకంటే ఆధిపత్యములో
ముందుండవలెనను ఉద్దేశ్యముతో పెద్ద వయస్సు ఉండవలెనన్నారు.
108) ప్రశ్న :- దైవ ప్రార్థనలలో శృంగారము సమంజసమా?
జవాబు :- శృంగారము దైవప్రార్థనలలో ఉండకూడదనే ఉద్దేశ్యముతోనే
అవన్నీ గాలిగోపురము వద్దనే వదలిరమ్మని గుడిముందర గల పెద్ద గోపురము
మీద అన్ని రంగములకు సంబంధించిన బొమ్మలను పెట్టియుందురు.
అందులో శృంగార బొమ్మలు కూడా ఉండును. పెద్దగోపురము వద్దనే
అన్ని విషయములు వదలి గర్భగుడివద్దకు చేరవలెనను సూచనగా వాటిని
భావించవలెను.
109) ప్రశ్న :- సృష్ఠి మొదటి దంపతులు ఎవరు?
జవాబు :- సృష్టి మొదటిలో దంపతులు లేరు. సృష్ఠి జరిగిన తర్వాత
సృష్ఠించబడినవారే దంపతులుగా తయారైనారు.
110) ప్రశ్న :- దైవబలము లేకుంటే మానవశక్తి సహకరించదా?
జవాబు :- మానవ శక్తి అనునదే లేదు. జరుగునదంతయూ దైవశక్తి
(ఆత్మబలము) చేతనే జరుగుచున్నది. అంతటా మధ్యాత్మ శక్తి తప్ప మానవ
శక్తి ఎక్కడా లేదు.
111) ప్రశ్న :- ఆది మానవులు అని చెప్పే కాలము కృతయుగపు కాలమా
లేక కలియుగపు మొదటి కాలమా?
జవాబు :- కృతయుగము కాలమునే ఆది మానవుల కాలమని చెప్పవచ్చును.
112) “బ్రెయిన్ డెడ్” లో లేదా కోమాస్థితిలో జీవుడు ఏ గుణ భాగములో
ఉండును. బుద్ధి, చిత్తము మొదలగునవి ఎందుకు పని చేయవు?
జవాబు :- ఏ గుణములో అయినా ఉండవచ్చును. ఆత్మ బుద్ధిని, మనస్సును
పనిచేయక యుండునట్లు చేయును. ఆత్మ శక్తి ఇచ్చి ఆడిస్తే ఆడేవి బుద్ధి,
మనస్సు. మనస్సు బయటి సమాచారములు ప్రతినిధి. బుద్ది లోపల
సమాచారముల ప్రతినిధి. ఈ రెండు ఆత్మ చైతన్యము చేత పని చేయు
చుండును. ఈ రెండు ఆత్మ ఆడిస్తే ఆడేటివి. ఆత్మ ఆడించలేదు.
అందువలన లోపల సమాచారము బయటికి రాదు. బయటి సమాచారము
లోపలికి పోదు. మనస్సు, బుద్ధి యొక్క సంబంధమే కోమా లేక బ్రెయిన్
డెడ్ అని అంటారు. ఆ స్థితిలో జీవుడు ఏ గుణములోనయినా ఉండవచ్చును.
ఇది జీవునికి ఏమాత్రము సంబంధము లేదు.
113) ప్రశ్న :- జీవులు లేని స్థితి దేవుని పగలు అని అన్నారు. బ్రహ్మ
చక్రము తిరగాలంటే ఏది కారణము?
జవాబు :- జీవులు ఉన్న స్థితి పగలు అని చెప్పాము. లేని స్థితి పగలు
అని చెప్పలేదు. జీవులు లేని స్థితి బ్రహ్మరాత్రి అగుట జరుగుచున్నది.
బ్రహ్మచక్రము ఆగితే కదా! ఎప్పటికీ అగదు. బ్రహ్మచక్రము తిరుగుటకు
క్రింది మూడు చక్రములు కారణము. పై చక్రము తిరుగుట వలన క్రింద
చక్రములు ఆగవు. నాలుగు చక్రములు ఒకదానితో మరొకటి అవినాభావ
సంబంధము కల్గియున్నాయి.
114) ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి కల్గిన కొన్ని దేశములు
కలవు కదా! వారికి రాత్రి పగలు అనే నిర్వచనాలు రోజూ మనలాగ
సరిపోవటము లేదు కదా!
జవాబు :- పగలు రాత్రి అను విధానము లోపలి చక్రముల గమనమును
బట్టియుండును. అంతేగానీ బయట జరిగేదానిని బట్టి యుండదు. ఆరు
నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండడము కూడా సరిపోవును. పగలు
రాత్రి గుర్తింపునవే, లోపల చక్రముల గమనమునుబట్టి చెప్పవచ్చును. మనిషి
ఎప్పుడు మెలుకువ కల్గునో అప్పుడు పగలు. ఎప్పుడు నిద్రలోనికి పోవునో
అప్పుడే రాత్రియగును. మనిషి నిద్ర మెలుకువలనే చావు పట్టుకలుగా
లెక్కించి, మెలకువను ప్రభవము అనియూ, నిద్రను ప్రళయము అనియూ
చెప్పడము ఆధ్యాత్మికములోనున్న పద్ధతి.
115) ప్రశ్న :- వర్ణములు అనేవి లేవు అని చెప్పి శ్రీకృష్ణుడు ఒక శ్లోకములో
స్త్రీలు, వైశ్యులు, శూద్రులు సహితము 'నా జ్ఞానము ద్వారా తరించెదరు'
అని చెప్పాడు. కులము పేరు చెప్పి వారిని జాలితో చూచినట్లా, దిగజార్చి
చెప్పినట్లా?
జవాబు :- కృష్ణుని లెక్కలో కులములు లేవు. ప్రజల లెక్కలో కులములు
ఉన్నాయి. ఫలానా వారు అని చెప్పాలంటే ఇతరులకు అలవాటైన భాషలోనే
చెప్పాలి. లేకపోతే ఎవరిని గురించి చెప్పేది తెలియదు. అందువలన
కులముల పేర్లతో సహా చెప్పవలసి వచ్చినది. అంతేగానీ అట్లు కులము
పేర్లు చెప్పడములో ప్రేమలేదు, అసూయ లేదు.
116) ప్రహ్లాద్ జానీ గారి శరీరములోయున్న ఆత్మ, ఆయన శరీరములో
యుండే దుర్గాదేవియే రక్షించింది అని ఎందుకు చెప్పింది? రక్షించినది
దుర్గాదేవా?
జవాబు :- ప్రహ్లాద్ జానీ శరీరములో ఆత్మే అన్నీ చేయుచున్నది. దుర్గాదేవికి
ప్రహ్లాద్ జానీ శరీరమునకు ఏమాత్రము సంబంధము లేదు. అయినా
అలా చెప్పడములో ఆత్మ బయటికి తెలియకుండా అణిగిపోవడానికే అలా
చెప్పారని తెలియుచున్నది.
117) ప్రశ్న :- ఒక స్త్రీ చివరి దశలో తన భర్తనే మరల జన్మలో భర్తగా
కావాలని కోరుకుని చనిపోయింది. కానీ భర్త మాత్రము వేరొక స్త్రీ భార్యగా
ఉండవలెనని కోరుకుంటూ చనిపోయాడు. ఇప్పుడు భగవద్గీత ప్రకారము
వీరి కోరిక ఎట్లు తీరగలదు. ఎందుకనగా! చివరిలో ఏది అనుకుంటే అదే
జరుగుతుంది కదా!
జవాబు :- చివరిలో అనుకొన్న దానినిబట్టి తర్వాత జన్మ రావడము జరుగు
తుందిగానీ, అనుకొన్న కోర్కెలు నెరవేరునని చెప్పలేదు. వారి వారి కర్మ
ప్రకారము వారికి జీవిత భాగస్వామి దొరుకును. అంతేగానీ వారు
కోరుకున్నట్లే జరుగదు. కర్మనుబట్టి జరుగడము ఖాయము. చివరి దశలో
అనుకొన్న కోర్కెలు నెరవేరునని భగవద్గీతలో చెప్పలేదు. చివరిగా అనుకొన్న
దానినిబట్టి జన్మ కల్గుతుంది. ఏ భావమును స్మరిస్తూ శరీరమును వదలు
చున్నారో అదే భావము ప్రకారము తర్వాత జన్మ కల్గును అని చెప్పారు
గానీ అనుకున్న కోర్కెలు నెరవేరునని చెప్పలేదు. ప్రపంచ సంబంధ
కోర్కెలు కర్మను బట్టి యుండును. తర్వాత జన్మ జ్ఞానిగా పుట్టుటకు నన్ను
స్మరించుతూ చనిపొమ్మని అక్షర పరబ్రహ్మయోగములో చెప్పడము జరిగినది.
జ్ఞానిగా పుట్టడము కర్మకు అతీతమైన విషయము.
118) ప్రశ్న :- మేఘము దేవుని సైనికులు కదా! మరి సత్యాన్వేషి కథలో
తపస్విబాబాగారి మాట వినినట్లుగా ఉంది ఎందుకు?
జవాబు :- 'మేఘములాంటి మేఘములను తనశక్తి చేత సృష్టించును’
అన్నాము గానీ నిజమైన మేఘములని చెప్పలేదు. మంత్రశక్తి చేత అవి
సృష్టించబడి కొద్దిసేపుయుండి మాయమగునవే గానీ శాశ్వతముగా ఉండునవి
కావు, నిజమైన మేఘములు కావు.
119) ప్రశ్న :- తత్త్వము అనగా నీకంటే వేరుగాయున్నది అని మీరు
చెప్పారు. కానీ సంస్కృతములో “త్త్వ” అంటే నేను అని అర్థము కదా! ఆ
విధముగా అర్థము చూస్తే “అది నేను” అని అర్థము కదా!
జవాబు :- 'అది నేను' అని చెప్పినది ఎవరో అర్థమయినదా జీవుడా?
ఆత్మనా? 'అది నేను' అని చెప్పినది ఆత్మ అయినందున నీకంటే వేరుగా
యున్నది ఆత్మయని చెప్పాము. తత్త్వము అనగా ఆత్మ అని అర్థము
చేసుకోవాలి గానీ ఆ పదమును జీవునకు చెప్పుకుంటే పూర్తి తప్పగును.
భావములన్నీ చెడిపోవును.
120) ప్రశ్న :- ఆదిత్య అనగా రెండవవాడు కానివాడని అర్థము చెప్పి
‘దిత్య' అనగా రెండు అని చెప్పారు. కానీ దిత్య అంటే రెండు కాదు, ద్విత్య
అంటే రెండు అని అర్థము. అదియునూ కాక రెండవ 'ఆ' ను మీరు
వ్యతిరేఖార్థము సూచించినట్లు తీసుకొన్నారు. మర్యాద అమర్యాద అని
ఒకటవ ‘అ’ వాడుదురు. మరి ఆదిత్య అనగా "అదిత్య" అనాలి కదా!
ఆకలి అను రెండవ పదమును చెప్పినప్పుడు రెండవ 'ఆ'ను ఇక్కడ
వ్యతిరేఖాన్ని సూచించేటట్లు చెప్పక “ఆకలి” అనే ఎప్పుడూ విశేషముగా
చెప్పారు. అట్లాగే 'ఆలోచన' అని చెప్పారు. 'ఆదిత్య' విషయములో
సందేహము తొలగింప ప్రార్థన ఆది అనగా మొదటిది అని అర్థముంటుంది.
కానీ ‘ఆదిత్య' అనే పదములో దిత్య అనగా రెండు అనే అర్థము దగ్గరే నా
సందేహము. భాషను విడచి భావాన్ని చూడాలని వుంది. అయితే కొందరు
నన్ను దీనిని గురించి అడిగారు. వారికి సమాధానము కొరకే ఈ ప్రశ్న.
జవాబు :- ఇక్కడ సంశయము ఏర్పడినది దిత్యకు ద్విత్యకు ఎంతో తేడా
యున్నది కదా! ద్విత్య అనగా రెండు కావచ్చును. దిత్య అని చెప్పడము
వలన ది ప్రక్కన వ వత్తు లేనిదాని వలన రెండు అని అర్థము రాదను
ప్రశ్న ఒకటి గలదు. అట్లే మొదటి 'అ' కు రెండవ 'ఆ' కు ఎంతో భేదమున్నది.
రెండవ ‘ఆ’ ను ఉపయోగించి ఆదిత్య అనుచోట 'అదిత్య' అని మీరన్నారని
వ్యతిరేకార్థమును ఇవ్వవచ్చునుగానీ ఆ అనునది వ్యతిరేఖార్థము ఇవ్వదు
కదా!యనినది రెండవ ప్రశ్న. ఇవి అందరికీ వచ్చు సహజమైన ప్రశ్నలే.
మర్యాద అమర్యాద అన్నప్పుడు అ వ్యతిరేఖార్థమును కల్గియున్నది. అదే
విధముగా రోగ్యము అనగా రోగము, లేక వ్యాధి అని అర్థము. వ్యాధి
లేదు, రోగము లేదు అని వ్యతిరేఖార్థమును చూపునప్పుడు “అరోగ్యము”
అని వ్రాయడము లేదు. రోగ్యము ఆరోగ్యము అని రెండవ దీర్ఘము
ను ఉపయోగించి చెప్పుచున్నాము. అంటే కలి అట్లే నాశనము అని
అర్థము. కడుపులో నాశనము కాని బాధ ఉన్నదని తెలుపు నిమిత్తము
అకలి అని చెప్పక రెండవ ఆ ను ఉపయోగించి ఆకలియని అంటున్నాము.
నాశనము కాని బాధ అని చెప్పు విషయములో ఆకలి అని రెండవ ఆ ను
‘కలి’కి వ్యతిరేఖార్థముగా వినియోగించుచున్నాము. మూడు అను భావమును
చెప్పుటకు త్రైతము, త్రిత్వము, త్రయము అని ఒకే అక్షరమును మూడు
నాలుగు విధముల త్ర, త్రి, త్రై, త్వి అని చెప్పినా మూడు అని అర్థమునే
సూచించుచున్నది. అలాగే అ మరియు ఆ రెండు సందర్భానుసారముగా
వాడినా వ్యతిరేఖార్థమునే సూచించుచున్నవి. అట్లే 'ద్వి' బదులు 'ది' ని
వాడినా ద్వంద్వమునే చూపుచున్నది. ద్వ, ద్వి, దో, ద్వౌ, ది అను అక్షరము
రెండును సూచించుచున్నది. మొదటివాడు సూర్యుడు 'ఆదిత్యుడు' అని
చెప్పుచున్నారు. గ్రహములలో మొదటివాడు అని అర్థము. అ ను, ఆ ను
సందర్భానుసారము వాడినట్లే మిగతా అక్షరములను కూడా సందర్భాను
సారముగా వాడుదురు. ఆరోగ్యములో రెండవ 'ఆ' వాడబడినది. ఆదిత్యలో
కూడా రెండవ ఆ నే వాడబడినది. ఆరోగ్యము అనగా 'రోగము లేనిది'
అని సందర్భమునుబట్టి ఆ ను వాడారు. సందర్భములను బట్టి చూడకపోతే
భావములు మారిపోవును. సూర్యుడు గ్రహములన్నిటిలో మొదటివాడు
అని చెప్పుటకు "ఆదిత్యాయచ” అని చెప్పారు. ఇక్కడ మొదటివాడను
అర్థము మీరు చెప్పినట్లయితే లేకుండా పోవును. ఆదిత్యుడు అనగా
సూర్యుడు అని అందరూ చెప్పగలరు.
121) ప్రశ్న :- భగవద్గీత శ్లోకములో 'మశ్వత్థం' అని ఉన్నదానిని ‘అశ్వర్థము’
గా మార్చుకోవలెనా? అప్పుడే మీరు చెప్పే అర్థము సరిపోతుందా?
జవాబు :- సంస్కృత శ్లోకములోని పదము 'మశ్వత్థము' అని ఉండవలెను.
తెలుగు పదము వ్రాయునప్పుడు మాత్రము 'అశ్వర్థము' అని వ్రాయవలెను.
భాషలో పదము మారుచున్నది. అశ్వ శక్తి అని యంత్రశక్తిని కొలుచు
చుందురు. అశ్వర్థము అనగా అశ్వము యొక్క అర్థము అని అర్థము.
అశ్వము యొక్క అర్థము అనగా ధనము, బలము. అశ్వము యొక్క
బలమును ఇంగ్లీషులో హార్స్ఫవర్ అని అంటారు. తెలుగులో అశ్వర్థము
అని అంటాము. రావిచెట్టు చుట్టూ ఒక మీటరు పరిధి వరకు ఒక హార్సు
పవర్ శక్తి యున్నదని చెప్పుచూ దానికి అదే అర్థముతో అశ్వర్థము అని
అన్నారు. నా యంత్రము పది హార్సుపవర్ గలది యని చెప్పుటకు తెలుగు
భాషలో పది అశ్వర్థములు కలది అనేవారు.
122) ప్రశ్న :- స్థూలమైన కిల్లీలో (తాంబూలములో) ఉన్న పోషకాన్ని
స్థూల శరీరమును ఆవహించిన సూక్ష్మము గ్రహించితే, సూక్ష్మము తేలిపోయిన
తర్వాత స్థూల దేహములో శరీరమునకు తాంభూలము వలన ఎలర్జీ
ఎందుకు వచ్చినది?
జవాబు :- శరీరమును ఆవహించిన జీవున్నిబట్టి శరీరమునకు కొన్ని
పదార్థములు సరిపోవచ్చును. అదే ఇంకొక శరీరములో జీవున్నిబట్టి అతనికి
కొన్ని పదార్థములు సరిపోక ఎలర్జీ ఏర్పడవచ్చును. కొందరికి మాంసము
చాలా ప్రియమైన ఆహారము. అరుదుగా ఎవరికో ఒకనికి మాంసము
తింటే శరీరమంతా దద్దులు రావడము, చర్మము ఎర్రగా మారిపోవడము,
నవ్వలు రావడము జరుగును. ఆ జీవునికి కర్మనుబట్టి అలా జరుగు
చుండును. స్థూల శరీరములో చేరిన సూక్ష్మమునకు తాంభూలము అంటే
ఇష్టము అందువలన తాంభూలమును అడిగి ఇప్పించుకొని వేసుకోవడము
జరిగినది. సూక్ష్మ శరీరము స్థూలదేహములో ఉన్న అరగంటసేపు ఏమీ
జరుగలేదు. తర్వాత సూక్ష్మము ఆవహించియున్న స్థూలమును వదలిపోయిన
తర్వాత ఆ శరీరము మొదటినుండి యున్న జీవుని ఆధీనములోనికి వచ్చు
చున్నవి. ఆ జీవుని కర్మ ప్రకాము తాంభూలము సరిపోదు. కావున ఆ
జీవుడు పైకి రాగానే కర్మప్రకారము ఎలర్జీ ఏర్పడి తాంభూలము వాంతికి
రావడము జరిగినది. శరీరములో నివశించు జీవుని కర్మనుబట్టి ఆహారము
సరిపోయేది, సరిపోనిది ఉండును. అంతేగానీ శరీరములనుబట్టి ఎలర్జీ
ఉండదు.
123) ప్రశ్న:- సత్యాన్వేషి కథలో సత్యసాయిబాబా, సాయిబాబాలకు సమాన
గుర్తు ఫోటోలలో ఏది ఉన్నట్లు కనుగొన్నారు?
జవాబు :- తల భాగము కప్పియుంచినట్లు తెలిసింది. ఒకరు గుడ్డతో
కప్పగా, మరొకరు వెంట్రుకలతో కప్పివేశారు.
124) ప్రశ్న :- సాకార భగవంతున్ని చూపే ప్రయత్నములో “దేవాలయ
రహస్యములు” గ్రంథములో నాలుగు చేతులు ఎందుకు చూపారు?
జవాబు :- భగవంతుడు సాధారణ మనిషిగా వచ్చినా మనుషుల కంటే
గొప్పవాడని అజ్ఞానులు కూడా తెలియుటకు సాధారణ మనుషులకు రెండు
చేతులుండగా భగవంతునికి నాలుగు చేతులు పెట్టి చూపడము జరిగినది.
125) ప్రశ్న :- "త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి" అని చెప్పి పాలిథీన్
కవర్ల వలన పొల్యూషన్ జరుగును కదా! పొల్యూషన్ చేయుటలో మీరు
అందరి లాగే భాగస్వాములగును కదా! పైగా ఆ కవర్లు కాలువలో, మురికి
నీళ్ళలో పడితే మీ గ్రంథాన్ని మీరు అవమానించినట్లు కాదా?
జవాబు :- ఉద్దేశ్యము మంచిదయినప్పుడు మిగతా వాటిని గురించి
ఆలోచించనవసరము లేదు. మిగతా పనులన్నియూ కర్మనుబట్టి కర్మ
ప్రకారమే జరుగుచుండును. ప్రజలు జ్ఞానులు కావాలన్నదే మా ఉద్దేశ్యము.
కవర్లు కాలువలో పడునని మా ఉద్దేశ్యమును మానుకోము. దేవుని దృష్ఠిలో
అన్నీ సమానమేనని ముందు కూడా చెప్పాము. మనుషులమయిన మనకు
మంచి చెడు, శుభ్రము అశభ్రము ఉండునుగానీ, దేవునికి అవి ఏవీ లేవు.
126) ప్రశ్న :- ఆదిత్య అనగా అదితి పుత్రుడు ఆదిత్యుడని, దశరథపుత్రుడు
దాశరథ అని రామున్ని ఉద్దేశించి చెప్పినట్లు చెప్పియుండవచ్చు కదా!
జవాబు :- అవి పురాణ కథలు, నేను చెప్పునది యదార్థ విషయములు.
సూర్యుడు సృష్ట్యాదిలో ప్రకృతితో సహా దేవుని సంకల్పము చేత పుట్టినవాడు.
సూర్యుడు తల్లి తండ్రికి పుట్టినవాడు కాదు. బ్రహ్మాండమునుండి నేరుగా
పుట్టినవాడు. సూర్యునికంటే ముందు మనుషులు లేరు. సృష్ఠి తయారైన
తర్వాత సూర్యున్ని గురించి వ్రాసుకొన్న పురాణములలో అదితి పుత్రుడు
అదిత్యుడు అని వ్రాసుకోవడము జరిగినది. పుక్కిటి పురాణములను
నమ్ముతారా? యదార్థమును నమ్ముతారా? నీవే నిర్ణయించుకో.
127) ప్రశ్న :- దిత్య అనగా రాక్షసుడు అని కూడా అర్థము కలదు.
అట్లయిన అదితి పుత్రుడు అదిత్యుడు అనేది కూడా తప్పేయగును. సరైన
అర్థము వివరింప ప్రార్థన. ఈ ప్రశ్నకు జవాబును, భావ పండితులకు
కాకుండా భాషా పండితుల కొరకు చెప్పవలెను.
జవాబు :- ఇంతకు ముందు 120వ ప్రశ్నలో భాషా పండితులకే వివరము
చెప్పాము అక్కడ చూడండి.
128) ప్రశ్న :- ఒక జీవిని నిర్వీర్యము చేసి వేరొక సూక్ష్మజీవిని చంపటమే
యాంటిబయాటిక్ అని అంటున్నారు కదా! అంటే పెన్సిలిన్ నోటేటమ్
అనే శిలీంద్రజీవిని స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియాను చంపుటకు ఉపయో
గించాము. అదే పెన్సిలిన్ ఇంజక్షన్ మరి ఈ తరహా వైద్యము హోమియో
పతియా, అల్లోపతియా, అందరిపతా అని నా సందేహము.
జవాబు :- సద్ది అన్నము, దినము మారిన జొన్నరొట్టె, పెరుగు వీటన్నిటి
యందు ఈస్ట్ పెరుగుట వలన ఈ ఆహారములు మనిషికి తెలియకుండానే
వైద్యము అనిపించుకోకుండా మనిషికి మేలు చేయుచున్నవి. వీటిని అల్లోపతి,
హోమియోపతి అని చెప్పుటకు వీలులేదు. అందువలన అందరిపతియని
చెప్పడమే మంచిది. అలాగే అదే కోవకు పెన్సిలిన్ చెందియుండడము
వలన అది వైద్యమయినా దానిని అందరిపతియని చెప్పుటే ఉత్తమము.
129) ప్రశ్న :- ఎంత వారైనా 'కాంత దాసులే' ఇది వందశాతము వాస్తవము.
స్త్రీలో అంత ఆకర్షణకు కారణమేమి?
జవాబు :- స్త్రీలో ఆకర్షణ ఉందనుకోవడము పొరపాటు. పురుషునిలోనే
ఒక విధమైన వత్తిడి, ఒక విధమైన బలహీనత రెండూ తోడైనప్పుడు
ఎంతవాడైనా కాంతదాసుడు కావలసి వస్తున్నది. శరీరములో ఆత్మే మనిషిని
అలా అదేపనిగా బలహీనున్ని చేయుచున్నది. ఇదంతా పురుషునిలోని
ప్రభావమే తప్ప స్త్రీలోని ఆకర్షణ ఏమీ లేదు.
130) ప్రశ్న :- దైవజ్ఞానము ఎంతో గొప్పదని తెలియజేసేందుకుగానూ,
అజ్ఞానుల కండ్లు తెరిపించుటకు గానూ, జ్ఞానులలో కొందరికయినా దూర
శ్రవణమూ, దూరదర్శనమూ, గాలిలో నడువడమూ, అజ్ఞానులు జ్ఞానులను
దూషించినా, దాడిచేసినా వారికి శిక్ష వేసే శక్తిలాంటివీ జ్ఞానులకు ఆత్మ
ప్రసాదించవచ్చును కదా! అప్పుడు జ్ఞానశక్తి ప్రభావము తెలిసి అజ్ఞానులు
కూడా జ్ఞానులుగా మారుటకు, తొందరగా జ్ఞాన ప్రచారము జరుగుటకు
అనుకూలించును కదా!
జవాబు :- దేవుడు భగవంతుడుగా వచ్చి తన ధర్మములను తెలియజేసి
పోతే, శరీరములోని ఆత్మ మనిషిని కర్మ ప్రకారము నడుపుట వలన మనిషిని
అజ్ఞానము వైపు తీసుకపోవుచున్నది. జ్ఞానము యొక్క విలువగానీ, తన
ప్రాధాన్యతగానీ బయటికి తెలియకూడదని ఆత్మ తలచుచున్నది. ఆత్మ
తలంపు ప్రకారము జ్ఞానశక్తి, జ్ఞానప్రభావము నీవు అడిగిన ప్రక్రియల
వలన తెలియుటకు అవకాశముండుట వలన అవి ఏవీ లేకుండా కనిపించ
కుండా చేసి తన ప్రభావమును కూడా కప్పిపుచ్చుకొని ఆత్మ శరీరములో
యున్నది. వాస్తవము చెప్పితే దేవుడు జ్ఞానమును ధర్మ యుక్తముగా
తెలియజేస్తే, ఆత్మ అజ్ఞానమును అధర్మయుక్తముగా బయటికి తెలియునట్లు
చేయుచున్నది. జ్ఞానమును తాను (ఆత్మను) ఎవరికీ తెలియకుండా
చేయునది. పూర్తి శ్రద్ధయున్న వానికే ఆత్మ తెలుపుటకు అవకాశము గలదు.
శరీరములో అయినందున ఆత్మ అనుకొన్నవే జరుగును.
131) ప్రశ్న :- ఏ పని చేయని వాడు, ఏ పని చేతగాని జీవుడు,
గుణచక్రములో ఒక గుణ భాగమునుండి మరొక గుణభాగములోనికి ఎలా
మారుచున్నాడు?
జవాబు :- జీవుడు ఏదీ చేతకాని వాడు అని చెప్పుట వాస్తవమే.
గుణచక్రములో గుణభాగములను మారు స్థోమత జీవునికి లేదు. జీవుడు
స్వయముగా తనశక్తితో గుణ భాగములను మారడములేదు. గుణచక్రములో
యున్న జీవున్ని గుణచక్రము పైన గల కర్మచక్రములోని కర్మ ఫోకస్ (కర్మ
కిరణములు) జీవుని మీద పడి ఏ సమయములో ఏ గుణములో
ఉండవలెనో కర్మే నిర్ణయించి జీవున్ని ఆ గుణములోనికి బలవంతముగా
త్రోసి గుణ భాగములో ప్రవేశింపజేయుచున్నది. కర్మే జీవున్ని గుణ
భాగములలో నడుపుచున్నది తప్ప జీవుడు స్వయముగా ఎక్కడికీ పోలేడు.
132) ప్రశ్న :- 108 కోట్ల సంవత్సరముల సృష్టి కాలము అని చెప్పారు.
అదియూ 12x9=108 అని చెప్పారు. ఇక్కడ ఒక గుణము తొమ్మిది
భాగములుగా చీలియున్నదని చెప్పారు. ఇక్కడ తొమ్మిదే ఎందుకు పది
భాగములుగా ఉండవచ్చును కదా! ఈ తొమ్మిది భాగములకు నవ
గ్రహములకు సంబంధమున్నదా?
జవాబు :- సృష్ఠికాలము 108 కోట్లని చెప్పిన మాట నిజమే. అది మనిషి
తలలోని పన్నెండు గుణములు తొమ్మిది భాగములుగా చీలి యుండడమును
బట్టి 12x9=108 అని చెప్పడము వాస్తవమే. అయితే సంఖ్యలో పెద్దది
(9) తొమ్మిది మాత్రమే. తొమ్మిదినే పరమాత్మ గుర్తుగా చెప్పాము.
మూడు (3) జీవాత్మ గుర్తుకాగా, ఆరు (6) ఆత్మ గుర్తుకాగా, తొమ్మిది (9)
దేవుని గుర్తని చెప్పాము. దేవుని గుర్తు తొమ్మిది కావున, అదే పెద్ద సంఖ్య
అగుట వలన దాని ప్రకారమే ప్రతి గుణము తొమ్మిది భాగములుగా
చీలిపోయినది. తొమ్మిది భాగములు సమానముగా చీలక పెద్ద భాగము
నుంచి చిన్న భాగము వరకు క్రమేపీ సైజువారిగా యున్నవి. పన్నెండు
గుణములు చీలడము వలన 108 సంఖ్య వచ్చినది. 108 సంఖ్యనే
ప్రపంచ ఆయుష్షులా నిలిచినది.
133) ప్రశ్న :- చిత్ర, మిత్ర గ్రహముల ప్రభావము జీవుని మానసిక
కర్మకే పరిమితమైతే, అది బాహ్య ప్రపంచ జీవనానికి సంబంధము లేనప్పుడు
జ్యోతిష్యములో వాటిని పరిగణించకపోతే నష్టమేమి లేనట్లే కదా?
జవాబు :- మనిషి సుఖదుఃఖములను తెల్పునది జ్యోతిష్యము. మానసిక
బాధ అయినా, శారీరక బాధ అయినా మనిషి సుఖ దుఃఖములలోనివే
కదా! అటువంటప్పుడు రెండూ జ్యోతిష్యములోనికే వచ్చును. మనిషికి
డబ్బులేని స్థితిని గురించి తెలుసుకొనుట శారీరక బాధకు సంబంధించినది
కాదు కదా! అది మానసికమునకు సంబంధించిన విషయమే కదా!
అందువలన మనిషి శారీరక మానసిక సుఖదుఃఖములను తెలియుటే
సంపూర్ణ జ్యోతిష్యమగును.
134) ప్రశ్న :- ఆనంద గురువుకు 'రామధర్మ రాజు కనకాభిషేకము
చేసేనయా' అని వ్రాశారు. ఒకవేళ ఆనంద గురువు తెలిసినచో రామ
ధర్మరాజు ఎవరై యుండవచ్చును. ఇంతకీ వీరబ్రహ్మము గారు ఎక్కడ
పుట్టినట్టు?
జవాబు :- ఇవన్నీ దైవ రహస్యములు వాటిని ఖచ్చితముగా ఎవరూ
చెప్పలేరు. బ్రహ్మముగారు 1980లో పుట్టాడని తెలిసినది గానీ ఎక్కడ
అను విషయము ఎవరికీ తెలియదు. వారు పుట్టియున్నా వారు ఎవరైనది
వారికే తెలియని స్థితిలో యుందురని బ్రహ్మంగారి కాలజ్ఞానములోనే
వ్రాసియున్నారు. వారికే వారి పరిస్థితి తెలియనప్పుడు మనకు తెలియుట
కష్టము.
135) ప్రశ్న :- మేఘము దేవుని సైనికులలో పెద్ద భూతము కదా! మరి
బాహ్యయజ్ఞములు చేసిన అనంతరము వర్షము వారు ఆశించినట్లుగానే
కురియును కదా! యోగుల మాట మాత్రము వినగల మేఘములు వేద
మంత్రములకు లొంగిపోవునా? ఈ విధముగా వారు యజ్ఞములను
ప్రోత్సహించి మరింత అజ్ఞానములో పడిపోతున్నారు. దీనికి మీ
సమాధానమేమిటి?
జవాబు :- మేఘము యజ్ఞములకు సంతోషపడి వర్షించును అనుమాట
అసత్యమని చెప్పవచ్చును. బాహ్య యజ్ఞములు అధర్మములని మేఘములకు
బాగా తెలుసు. అందువలన యజ్ఞము వలన వర్షము వస్తుంది అనుమాట
అభూత కల్పన. వర్షాకాలములో మేఘములకు ఇష్టమొచ్చిన చోట
వర్షించును. ఒకవేళ వింటే యోగుల మాటను వినవచ్చును. అయితే
యోగులు మేఘములకు పని చెప్పరు.
136) ప్రశ్న :- జ్ఞానము ద్వారా కర్మలను నశింపజేయు సమర్థత గల
రావణబ్రహ్మ గారు ఆర్యుడైన రాముని చేతిలో చనిపోయే కర్మను లేకుండా
చేసుకొనియుంటే రామున్ని దేవునిగా వ్రాయవలసిన అవసరము వాల్మీకికి
లేకుండా ఉండేది. తద్వారా రామున్ని కృష్ణున్ని ఏకం చేసే దౌర్భాగ్యము
లేకుండా చరిత్రవుంటే ఈ గొడవలే ఉండక రావణుడు ఎవరో తెలిసేది.
జవాబు :- జ్ఞానము వలన జీవితములో జరుగు దుఃఖములను జయించ
వచ్చునుగానీ మరణమును ఎవరూ దాటలేరు. మరణము ఎప్పుడు రావాలో
అప్పుడే వస్తుంది. ఎట్లు రావాలో అట్లే వస్తుంది. అది తెలిసిన యోగులు
మరణమును గురించి ఆలోచించరు. తమ జ్ఞానముతో మరణమును
దాటవలెనని అనుకోరు. జ్ఞానము వలన తమ కర్మలను లేకుండా
చేయవచ్చు, అట్లే ఇతరుల కర్మలను లేకుండా చేయవచ్చును గానీ తమ
మరణమునుగానీ, ఇతరుల మరణమునుగానీ లేకుండా చేయు ప్రయత్నము
చేయరు.
137) “ఓం” ఏ భాషలోనిది?
జవాబు :- స్వచ్ఛమయిన తెలుగు భాషలోనిది. మొదట పుట్టిన భాష
తెలుగు భాష, తెలుగు భాషలో మొదట పుట్టిన అక్షరము “ఓం”. అందువలన
“ఓం” అను అక్షరమును ప్రథమ అక్షరమనియూ, ప్రణవ అక్షరమనియూ
చెప్పుచుందురు.
138) ప్రశ్న :- ఉంగరాలలో, హారాలలో దేవతామూర్తులను పెట్టి,
వాటిని ధరించిన మనుషులు అజ్ఞాన పనులు, నీచమైన పనులు చేయుట
వలన పాపము వచ్చునా? ఉంగరాలలోయున్న మూర్తులలో సూక్ష్మములు
ఆవహించునా?
జవాబు :- మూర్తులు ఎక్కడయున్నా వాటియందు సూక్ష్మములు ఆవహించు
టకు అవకాశము గలదు. అయితే వాటిని ధరించి పనులు చేయడము
వలన ప్రత్యేకించి పాపము వస్తుంది అనుట ఏమీ లేదు. మనిషి చేసే
పనినిబట్టి ఉండే భావమునుబట్టి కర్మలు రావడము జరుగుచుండును.
139) ప్రశ్న :- భారతదేశములో మొత్తము పదహారు గీతలు గలవు. మరి
భగవద్గీతను వ్రాయకముందే ఆ గీతలను వ్యాసుడు వ్రాశాడు. అయితే
గీత అంటే హద్దు అను అర్థముతో వాటిని వ్రాయలేదు. అట్లే భగవద్గీతను
కూడా హద్దు అని వ్రాసియుండరు. గీత అంటే హద్దుయని వ్యాసునికి
తెలుసా?
జవాబు :- వ్యాసునికి తెలియకపోయినా తెలిసే వ్రాశాడు అని చెప్పవలెను.
ఆయన వ్రాశాడు, ఆయన వ్రాసిన దానినిబట్టి నేడు ఆయన చెప్పకున్నా
గీత అంటే హద్దు అని తెలిసినది. ఆయన వ్రాసిన విధానమునుబట్టి గీత
అంటే హద్దు అని మనము చెప్పుచున్నప్పుడు బహుశా ఆయనకు ఈ
విషయము తెలిసే యుంటుంది. అయితే కృష్ణుడు తన గీతను 'తౌరాతు'
అను పేరుతో ఇతరులకు చెప్పాడు. తన గ్రంథమునకు భగవద్గీతయని
వ్యాసుడు నామకరణము చేసినా కృష్ణుడు భగవద్గీతను వేరే దేశములో
మోషేకు (మూసాకు) ఇచ్చినప్పుడు భగవద్గీతయని చెప్పకుండా మూడు
రాత్రులు అను అర్థముతో 'తౌరాత్' అని అన్నాడు.
140) ప్రపంచ సృష్టికి కారణము ఏది?
జవాబు :- దేవుని సంకల్పము.
141) ప్రశ్న :- సాలగ్రాములను పరమాత్మకు చిహ్నముగా భావించ
వచ్చునా?
జవాబు :- సంఖ్యలో తొమ్మిదిని (9), శబ్దములో “ఓం”ను, దృశ్యములో
లింగమును, ముద్రలో కాల కర్మ చక్రములను పరమాత్మగా భావించవలెను
గానీ మిగతా దేనినీ పరమాత్మ చిహ్నముగా భావించకూడదు.
142) ప్రశ్న :- దైవజ్ఞానమును గురువు చెప్పుచున్నప్పుడు సూక్ష్మగ్రహములు
చేరి జ్ఞానమును వినును కదా! అదే విధముగా అదే జ్ఞానాన్ని ఒక జ్ఞాని
ఇతరులకు తెలియజేయునప్పుడు దేవతలుగానీ సూక్ష్మగ్రహములుగానీ అక్కడ
చేరగలవా? ఆ విధానము గురువువద్దనే జరుగునా? లేక ఇతరుల వద్ద
కూడా జరుగునా?
జవాబు : శ్రద్ధగల సూక్ష్మశరీరములు దైవజ్ఞానమును ఎవరు చెప్పినా
అక్కడికి పోయి వినగలరు. గురువువద్దనే వినవలెనను నియమము లేదు.
143) ప్రశ్న :- వివాహములో జీలకర్ర, బెల్లము యొక్క విశిష్టత ఏమి?
జవాబు :- ఆధ్యాత్మిక అర్థములలో దేనికిగానీ జీలకర్ర బెల్లము సరిపోదు.
అయితే జీలకర్ర బెల్లమును కలిపి తలమీద పెట్టు సాంప్రదాయము హిందూ
వివాహ వేదికలలో మొదటినుండి జరుగుచున్నది. ఆ విషయము వివాహము
చేయు పెద్దలనే అడుగుట మంచిది.
144) ప్రశ్న :- 108 మూలకములనే 108 పూసలుగా జపమాలలో
ఉండునట్లు వివరించారు. మరి కెమిస్ట్రీ చార్ట్లో 112 మూలకములు
కనుగొన్నట్లు గలవు. దీనికి మీ వివరణ ఏమి?
జవాబు :- జపమాలలో 108 గుణములకు గుర్తుగా 108 పూసలను
ఉంచినట్లు చెప్పాము. మిగతా వేరే సందర్భములో అప్పుడు 105
మూలకములే ఉన్నప్పుడు ఇంకో మూడు కనుగొనవచ్చును 108 సంఖ్యకు
సరిపడు మూలకములు రావచ్చును అని చెప్పాము. అయితే అవి ఇప్పుడు
112 అయినట్లు మీ వలననే నేను వింటున్నాను. మూలకములు మొత్తము
ఆధ్యాత్మిక సంఖ్యతో ముడిపడియుండును అను ఉద్దేశ్యముతో ఆ దినము
అలా చెప్పాము. ఇప్పుడు 112 అయినందున ఇంకా ఎనిమిది పెరిగి
120 సంఖ్యకు పూర్తి కావచ్చును అని అనుకుందాము.
145) ప్రశ్న :- కర్ణుని జీవితము శాపగ్రస్థమా?
జవాబు :- కర్ణుని జీవితము శాపములతో నిండుకొనుటకు కారణము
అతని ముందు జన్మ కర్మ ఫలితము అని తెలియుచున్నది. అందువలన
ఆయన జీవితము కర్మగ్రస్థమేయని చెప్పవచ్చును.
146) ప్రశ్న :- 'బీబీ నాంచరమ్మ కథ' వెంటటేశ్వరుని విషయములో
జరిగిందా? అందుకే ముస్లీమ్లు వెంకటేశ్వరున్ని దర్శించుచున్నారా?
జవాబు :- ముస్లీమ్లు వెంకటేశ్వరుని దర్శించడము నేను ఎప్పుడూ
చూడలేదు. విగ్రహారాధనకు వారు చాలా దూరముగా ఉంటారు. ఇకపోతే
'బీబీ నాంచారమ్మ కథ' పూర్తి కల్పితము. దానిని నమ్మకూడదు, అసత్యము.
147) ప్రశ్న :- గోవింద నామము ఎప్పటిది?
జవాబు :- మనిషి వద్ద ఏమీ లేకుండా పోయినప్పటిదని బయటి అర్థముతో
చెప్పవచ్చును. ఆధ్యాత్మికరీత్యా అయితే మనిషికి గల కర్మలన్నీ లేకుండా
పోయినప్పుడు గోవింద నామము ఉచ్ఛరించబడుతుంది. ఎటు చూచినా
ఏమీ లేని స్థితిని తెల్పునది గోవింద నామము.
148) ప్రశ్న :- దేవతల వాహనముల మర్మము ఏమిటి?
జవాబు :-మంత్రములతో నడిచేటివి దేవతల వాహనములు. మంత్రసిద్ధి
వలన దేవతల వాహనము గాలిలో తేలిపోయేది.
149) ప్రశ్న :- వేదాలలో సైన్సు అంతా వుంది అంటున్నారు, అది నిజమా?
జవాబు :- శుద్ధ అబద్దము. 'వేదాలలో మాయ వుందని' భగవద్గీత
చెప్పుచున్నది. వేదాలలో సైన్సు ఏమాత్రము లేదు అని మేము అంటున్నాము.
సైన్సుగలదని ఎవరయినా నిరూపించగలరా? నిరూపించలేరు. వేదాలలో
మంత్రాలున్నాయి. మంత్రసిద్ధి కలదు. మంత్రసిద్ధి వలన కొన్ని పనులు
జరుగును తప్ప అది ఏ కోణములోనూ సైన్సు కాదు.
150) సృష్ఠి ఎందుకు జరిగింది?
జవాబు :- దేవుడు సంకల్పించిన జగన్నాటకము జరగటానికి తప్ప
వేరుకాదు. అయితే అందరూ పాత్రలు మరచి ఆడుచున్నారు, కాదు
ఆడింపబడుచున్నారు. జగన్నాటక నిర్మాత దేవుడయితే, దర్శకుడు ఆత్మ,
పాత్రధారుడు జీవుడు. సన్నివేశములు కష్టసుఖములు, ముగింపు
(శుభము) మోక్షము. ముగింపయిన మోక్షము రాదు. నాటకము అయిపోదు.
ఆడించే దర్శకుడు ఆటను ఆపడు, పాత్రధారుడు తన్నుతాను మరచిపోయి
నాటకములో లగ్నమయిపోయాడు. జీవున్ని జ్ఞప్తి చేయాలని పాత్రధారుని
గానే ఆడమని చెప్పే ప్రయత్నములో అప్పుడప్పుడు జ్ఞాపకము చేయు
జ్ఞానమును చెప్పినా వాడు వినే స్థితిలో లేడు. నిర్మాత చూస్తూ కూర్చున్నాడు.
ఈ జగన్నాటకము ఇప్పుడే ముగిసేటట్లు లేదు.
151) ప్రశ్న :- అమీబా, మానవుడు ఒకేసారి జన్మించారా?
జవాబు :- జీవ పరిణామ సిద్ధాంతమును కనుగొన్న శాస్త్రవేత్తలు మొదట
అమీబా అను ఏకకణ జీవి పుట్టిందని దాని తర్వాత పరిణామ క్రమములో
అందరూ పుట్టారని చెప్పుచున్నారు. శాస్త్రవేత్తలు అన్న బిరుదును బట్టి
అందరూ వారి మాటనే నమ్ముచున్నారు. మనిషికి అనగా జీవునికి ఏమీ
తెలియదు అని ముందే చెప్పుకొన్నాము. మనిషిలోగల బుద్ధి ఏమి చెప్పితే
దానిని మనిషి బయటికి చెప్పును. బుద్ధికి ఆత్మ అందించు విషయములే
తెలియును. ఆత్మ అందించునదే సిద్ధాంతము. ఒక క్రొత్త విషయమును
కనుగొనాలంటే ఆత్మ చెప్పితే మనిషికి తెలియుచున్నది గానీ మనిషి కనుగొన
లేడు. ఆత్మ అందించిన దానిని తన బుద్ధి ద్వారా తెలియగా మనిషి తానే
స్వయముగా కనుగొన్నానని చెప్పుకొనుచున్నాడు. మానవునికి సుఖములను
అందించు నిమిత్తము కుట్టు మిషను మొదలుకొని ప్రతి యంత్ర నమూనాను
లోపల ఆత్మ తెలియజేయగా, దానిప్రకారము చేసి బయట తయారయిన
దానిని తానే కనుగొన్నానని చెప్పుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా
కంప్యూటర్ల వరకు, ఆకాశములో వేగముగా పోవు రాకెట్ల వరకు, యుద్ధ
రంగములో మిసైల్స్ వరకు కనుగొన్నాము. వాటిని వినియోగించుకొని
బ్రతుకుచున్నాము. ఇన్ని యంత్రములను వాటి నమూనాను మనిషి బుద్ధికి
అందించినవాడు మనలోని ఆత్మయని ఎవరూ అనుకోవడము లేదు. బయటి
యంత్రములను ఎన్నో ఊహకు అందని వాటిని అందించిన ఆత్మ తన
ఆధ్యాత్మిక విషయమును సక్రమముగా అందించడము లేదు. తాను అన్నీ
చేయుచున్నా తాను ఎవరికీ తెలియబడకూడదని ఆత్మ అభిప్రాయము.
తనకు సంబంధించిన విషయములలో ముందే తప్పుదారి పట్టించి
అందరి చూపు ప్రక్కకు త్రిప్పవలెనని ఆయన ఉద్దేశ్యము. అందువలన
మొదటనే జీవపరిణామ సిద్ధాంతమును మనిషికి నేర్పినవాడు ఆత్మయే.
తన విషయములో తప్పుదారి పట్టిస్తాడని చెప్పినట్లు మొదట మనిషి
పుట్టలేదని, అమీబాలాంటి ఏకకణ జీవులు పుట్టాయని వాటి వలన పరిణామ
క్రమములో మనిషి పుట్టాడని చెప్పుచుందురు. జీవపరిణామ సిద్ధాంతము
అనునది తప్పు అని నేను గత నలభై సంవత్సరముల నుండి చెప్పుచున్నాను.
మొదట మనిషి సృష్ఠింపబడ్డాడు. మనిషి తర్వాత చిన్న పెద్ద జీవులన్నీ
పుట్టాయి. ఆ క్రమములోనే మనిషి పుట్టిన తర్వాత చాలా రోజులకు
అమీబా క్రిమి పుట్టింది. అందువలన అమీబా మనిషి ఎవరు ముందు
పుట్టారు అని అంటే మనిషియని చెప్పవచ్చును.
152) ప్రశ్న :- దేవుడున్నాడని తెలిపేందుకు సృష్టి జరిగిందా?
జవాబు :- కాదు దేవుని సృష్ఠి అంటే ఇలా ఉంటుంది అని అందరూ
తెలియుటకు సృష్ఠి జరిగినది. సృష్టి జరిగిన తర్వాత సృష్టి ఎంత విచిత్రముగా
యున్నదో కొంతకొంత ఇప్పుడిప్పుడే మనిషికి అర్థమగుచున్నది.
కొందరికయితే ఏమాత్రము అర్థము కాలేదు.
153) ప్రశ్న :- కర్మవలన జన్మవస్తే, ఏ కర్మలేని స్థితిలో సృష్ఠి జరిపి
బలవంతముగా కర్మను అంటగట్టడము తెలివి తక్కువ పనికాదా?
జవాబు :- పైకి తెలివితక్కువ పనిలాగనే కనిపించుచుండినా ఆలోచిస్తే
ఎంతో ప్రణాళికాబద్దముగా సృష్ఠిని దేవుడు తయారు చేశాడని తెలియు
చున్నది. తాను పని చేయనప్పుడు మనుషుల సృష్ఠి జరుగుటకు కర్మను
ఏర్పరచాడు. వాస్తవముగా కర్మలేని సమయములో మనిషిని తయారు
చేయడము గొప్పపనిగా యున్నది. సృష్ఠి తర్వాత దేవుడు తన ధర్మము
ప్రకారము పనిని చేయనివాడైనందున మనిషిని పుట్టించువాడు ఎవడూ
లేడని, మనిషిని సృష్ఠించుటకు తనబదులు కర్మను అధిపతిగా పెట్టాడు.
జన్మలు తిరిగి మరీమరీ కలుగుటకు కర్మయే కారణము. కర్మను అనుసరించి
ఆత్మను పని చేయునదిగా దేవుడే తయారు చేశాడు. దేవుడు మనిషిని
సృష్ఠించిన తర్వాత దేవుడు సృష్టించడము లేదు. కర్మనుబట్టి ఆత్మే మనిషిని
తర్వాత జన్మలకు పంపుచున్నది. దేవుడు మనిషిని సృష్టించినందుకు ఆట
ప్రకారము జీవితము కలదని తెల్పి ఆ కర్మ నుండి బయటపడుటకు కావలసిన
జ్ఞానమును కూడా అందించాడు. అయితే దేవుని జ్ఞానమును మనిషి
అందుకోలేకపోయాడు. దేవుడు చేసినది ఒక విధముగా అన్యాయము
పనేయని చెప్పవచ్చును. మనిషికి తెలిసిన విధానములో మనిషిని
సృష్టించడము దేవుని తప్పు అని తెలియుచుండినా, దేవుని వైపునుండి
చూస్తే, దేవుని విధానము ప్రకారము దేవుడు చేసినది గొప్పపనియనీ, దేవుడు
సృష్ఠించకపోతే నీవు అనేవాడివి లేకుండెడి వానివి కదా! నేడు నేనున్నానని
నిన్ను నీవు తెలుసుకోగల్గుచున్నావు. నీ ఉనికి ఇదియని తెలియబడుచున్నది.
నీవు అనేవాడివి ఒకడున్నావు అని తెలియుచున్నది. కష్టమో సుఖమో నీవు
బ్రతికిన వాడిగా ఉన్నానని తెలియుట మంచిదా? లేవని చచ్చినవాడుగా
యుండి నీ ఉనికి నీకు తెలియక భూమిలో రాయివలె ఉండడము మంచిదా
నీవే ఆలోచించుకో. సృష్టియున్నది కావున నేడు నీవు హీరోలాగాయున్నావు.
సృష్ఠి లేకపోతే నీవు జీరోగా ఉండేవానివి. నీవు పుట్టినది మంచిదేయని
పుట్టిన రోజు పండుగ చేసుకొంటున్నావు. ఒకవేళ పుట్టక పోయివుంటే
నీకు పండుగే లేదుకదా! మంచిగా బ్రతికే దానికి దేవుడు పుణ్యమును
కూడా ఇచ్చాడు. నీవు పుణ్యమే చేయి పుణ్యము వలన సుఖమును
అనుభవించు. ఇవన్నీ చూస్తే సృష్టించిన దేవున్ని పొగడకుండా ఉండలేము.
ఏదో ఒకటి మాట్లాడవలెననుకొంటే, దేవుడు బుద్ధి లేనివాడనీ మనకు
బుద్ధిలేక చెప్పుచున్నాము. దేవునికి మనిషివలె బుద్ధియుండదని తెలియదు.
అందువలన ‘దేవునికి బుద్ధియుందా' అని అంటుంటాము.
154) ప్రశ్న :- మీరు చెప్పిన జ్ఞానము సర్వజీవరాసులకని చెప్పినప్పుడు
అమీబాలాంటి జీవులు ఎలా గ్రహించును?
జవాబు :- మేము చెప్పు జ్ఞానము సర్వజీవరాసులకు వర్తించునని చెప్పిన
మాట వాస్తవమే. వర్తించుట వాస్తవమే అయినా అందరూ గ్రహిస్తారని
మేము కూడా చెప్పలేదు. జ్ఞానము అందరికీ సమానముగా వర్తించుటకే
దేవుడు సృష్ట్యాదిలోనే జ్ఞానమును చెప్పడమైనది అయితే మనుషులు చెప్పేది
జంతువులు, వృక్షములు, అమీబాలాంటి జీవులు గ్రహించలేవు.
155) ప్రశ్న :- మీరు చెప్పిన గుణ వికార భాగములు 108, ఏకకణ
జీవుల తలలో ఉండునా? వాటికి తలే లేదు కదా! మరి వాటిలో కాల కర్మ
చక్రముల స్థానము ఎక్కడ గలదు? మొక్కలు, వృక్షములలో ఏడు చక్రముల
స్థానము ఏది?
జవాబు :- జీవరాసుల శరీర నిర్మాణములనుబట్టి, వాటి తెగలను బట్టి
పుట్టుకలు అండజ, పిండజ, ఉద్భిజములు అను మూడు రకములుగా
విభజించవచ్చును. అయితే వాటిలోనున్న అనేక విధానములనుబట్టి 84
లక్షల రకములుగా పెద్దలు విభజన చేశారు. 84 లక్షల రకములలో
అన్నిటికి శరీర నిర్మాణము ఒకే రకముగా లేదు. వాటన్నిటిలో ఆత్మశక్తి
నాలుగు విధముల ప్రవహించుచున్నది. వాటిని గురించి చెప్పుకుంటే
కొన్ని వెన్నెముక లేనివి కూడా కలవు. కొన్నిటిలో నాడీవ్యవస్థ కనిపించదు.
కొన్నిటి నిర్మాణమునుబట్టి ఎటూ చెప్పలేము. అవి ఎట్లున్నా వాటి
శరీరములో జీవుడు ఉంటే, ఆత్మ కూడా ఉండును. ఆత్మయుంటే పరమాత్మ
కూడా ఉండును. ఆత్మ ప్రవాహములు నాలుగు రకములు ఎట్లు గలవో
సూచనప్రాయముగా తెలిస్తే ఇలా క్రింద చూపిన విధముగా కలవు.
మనుషులలో ఆత్మ శక్తి ప్రవాహము చిత్రము 1, 129 పేజీ లో చూడండి..
పశువులు, జంతువులే కాక, చేపలు ఆత్మ శక్తి ప్రవాహము చిత్రము 2 ,129 పేజీ లో చూడండి. ,
వృక్షములు, చెట్లు, తీగలు ఆత్మ శక్తి ప్రవాహము చిత్రము 3,129 పేజీ లో చూడండి.
పక్షుల ఆత్మ శక్తి ప్రవాహము చిత్రము 3,130 పేజీ లో చూడండి.
ఈ విధముగా క్రిందికి ఆత్మశక్తి ప్రవాహముగా
పోవు జీవులలో మనుషులు ఒక్కరు మాత్రము
గలరు. మనుషులు పైనుండి క్రిందికి పెరుగు
చున్నారు.
చిత్రములో చూపినట్లు శక్తి ప్రవాహము
అడ్డముగా ప్రవహించుచుండును. అటువంటి
జీవులు భూమిమీద అన్నిటికంటే ఎక్కువ
సంఖ్యలో గలవు. పశువులు, జంతువులే కాక,
చేపలు మొదలగునవి కలవు. ఈ రకము
జీవులు అడ్డముగా పెరుగుచుండును.
ఈ రకముల ప్రవాహము గల ప్రాణులు
వృక్షములు, చెట్లు, తీగలు మొదలగునవి
కలవు. ఈ రకము జీవులు క్రింది నుండి
పైకి పెరుగునవి కలవు.
పక్షుల జాతులలో ఏటవాలుగా శక్తి
ప్రవహించుచుండును. ఇవన్ని పక్షి జాతులే
అయి వుండును. ఈ రకము జీవులు
పెరగడము పై నుండి క్రిందికే అయినా
మనుషులవలె కాకుండా ఏటవాలుగా
పెరుగుచుండును.
ఈ విధముగా పెరగడములో నాల్గు రకములుగాయుండు
జీవరాసులలో జ్ఞానము అన్నిటికీ సమానమే. మన శరీర విషయమే మనకు
సంపూర్ణముగా తెలియనప్పుడు వాటి విషయము తెలియదనియే
చెప్పవచ్చును. దేవుడు చెప్పిన జ్ఞానము జీవముగల అన్నిటికీ వర్తించును.
దేవుడు జీవున్ని ఆత్మను గురించి చెప్పడము వలన జీవాత్మ, ఆత్మలు అన్ని
శరీరములలో ఉండుట వలన, శరీర నిర్మాణములనుబట్టి చెప్పకపోవడము
వలన దేవుని జ్ఞానము అన్ని జీవులకు వర్తించునని తెలియుచున్నది. కాల
కర్మ చక్రములు, గుణ భాగములు ఫలానా చోట ఉన్నాయని చూపలేము.
అట్లే గుణ విభాగములు ఎక్కడున్నాయని కూడా చెప్పలేము. మనము
చెప్పినా, చెప్పకున్నా వాటిలో మనకున్నవే యుండును. మనకు చెప్పిన
జ్ఞానమే వాటికి సరిపోవును.
156) ప్రశ్న :- ఏడు గ్రంథులు, ఏడు నాడీకేంద్రముల జ్ఞానము మానవులకే
వర్తిస్తే సర్వజీవులకు భగవద్గీత ఎట్లు వర్తించును?
జవాబు :- ఇతర జీవరాసుల శరీరములలో ఏడు నాడీకేంద్రములు లేకున్నా,
ఏడు గ్రంథులు లేకున్నా వాటికి తగిన విధముగా నిర్మాణము చేయబడి
యుండును. ఆధ్యాత్మిక జ్ఞానమంతయూ జీవుడు, ఆత్మ, దేవుడు అను
ముగ్గురు పురుషుల మీద ఆధారపడియుండుట వలన భగవద్గీత జ్ఞానము
అందరికీ అర్థమగును, అందరికీ వర్తించును.
157) ప్రశ్న :- వృక్షములలో క్రెస్కోగ్రాఫ్ అనే పరికరము ద్వారా మొక్కల
భావాలను నమోదు చేయుచున్నారు. నొప్పిని జీవుడు అనుభవించునట్లు
చేయు ఆత్మ బయట గురువు చెప్పు జ్ఞానమును చెట్లలో యున్న జీవునికి
అందజేయునా? లేక చెట్లే స్వయముగా గ్రహించుచున్నవా? ఏకకణ జీవిలో
కూడా ఆత్మే జ్ఞానమును అందించునా? లేక స్వయముగా అవే తెలియగలవా?
జవాబు :- చెట్లకు సుఖములు, కష్టములు, బాధలు, సంతోషములు
ఉండుట వాస్తవమే. వాటిని ఆత్మే అందించుచున్నది. ఆత్మ లేనిది ఏదీ
ఏ జీవరాసికి అందదు. ఏ శరీరములో జీవికయినా సుఖదుఃఖముల
నయినా, జ్ఞానమునయినా ఆత్మే అందివ్వాలని, అట్లు కాకపోతే ఏ జీవికి
ఏదీ అందదని తెలియుచున్నది. ఏకకణ జీవికయినా, బహుకణ జీవికయినా
ఆత్మవలననే అన్నీ జరుగును.
158) ప్రశ్న :- జంతువులలో ఏది లోపించుట వలన మాట్లాడలేక
పోతున్నాయి?
జవాబు :- మనిషి మాట్లాడుచున్నాడు, జంతువు మాట్లాడలేదు. అయినా
మనిషికి వచ్చిన లాభము లేదు. జంతువుకు వచ్చిన నష్టము లేదు. మనిషి
జంతువులకంటే ఎక్కువ పాపము చేసుకొన్న దానివలన మనిషి మాట్లాడు
చున్నాడు. మాట్లాడుట వలన తిరిగి పాపమునే సంపాదించుకొనుచున్నాడు.
ఇంకా కొందరు గత పాపముకంటే ప్రస్తుత పాపమునే ఎక్కువ సంపాదించు
కొనుచున్నారు. ఉదాహరణకు చెప్పితే గతములోని ఒక రూపాయి
పాపమును మాటల రూపములో మాట్లాడినా కొందరు దానికి తగిన
రూపాయి పాపమునే పొందవచ్చును. లేకపోతే దానికంటే ఎక్కువ
విలువయిన పుణ్యమును కూడా పొందవచ్చును. రూపాయి పాపమును
మాటల రూపములో పది నిమిషములు మాట్లాడవలసియున్నప్పుడు ఆ
మాటలు మంచివయితే పుణ్యము రావచ్చును. అదియూ రూపాయి పుణ్యము
నుండి పదివేల రూపాయలంత పుణ్యము రావచ్చును. అట్లుకాకపోతే
పాపము కూడా రావచ్చును. పాపము ఒక రూపాయి నుండి పదివేల
రూపాయలంతా రావచ్చును. ఇక్కడ కొలతలు తెలియుటకు 'రూపాయి'
పదమును వాడాము అని తెలియవలెను. ఇంకొక విషయమేమనగా!
దేవుని విషయముగానీ, దేవుని జ్ఞాన విషయముగానీ చర్చకు వచ్చి
వ్యతిరేఖముగా మాట్లాడితే, కొన్ని లక్షల రూపాయల విలువగల పాపము
సంభవించవచ్చును. కొందరు గురువులను మాటలతోనే దూషించుచున్నారు.
కొందరు దేవున్ని కూడా మాటలతోనే హేళనగా అగౌరవముగా మాట్లాడు
చున్నారు. దానివలన కొన్ని జన్మలకు సరిపడు కర్మను సంపాదించు
కొంటున్నారు. ఇప్పుడు చెప్పండి మాటలు వచ్చు మనుషులు గొప్పా,
మాటలు రాక ఏ పాపము సంపాదించుకోని పశువులు గొప్పా?
159) ప్రశ్న :- దేవుని జ్ఞానము గ్రహించలేని జంతువులను ఉత్తమ జీవులుగా
చెప్పారు. మోక్షము పొందాలంటే మానవజన్మే సులభమని కొందరు చెప్పారు.
కర్మలు పాపము ఎక్కువగుట వలన దేవుని జ్ఞానము గ్రహించలేని జంతు,
వృక్ష, క్రిముల జన్మవస్తుందా? పుణ్యము ఎక్కువ అగుట వలన మానవ
జన్మవస్తుందా? ఈ కోణములో జంతువులు దేవునికి దగ్గరగా ఎక్కడ గలవో
వివరించగలరా?
జవాబు :- జంతువులుగానీ, వృక్షములుగానీ దేవుని జ్ఞానము గ్రహించ
లేవని నేను ఎప్పుడూ చెప్పలేదు. అట్లే మానవ జన్మలోనే మోక్షము
పొందుటకు సులభమని కూడా చెప్పలేదు. చాలామార్లు మానవులకంటే
ఉత్తమ జన్మలు జంతువులు, వాటికంటే ఉత్తములు పక్షులు, ఆ రెండింటికంటే
ఉత్తములు వృక్షములని చెప్పడము జరిగినది. ఎక్కువ పాపము చేసినవారే
మనిషిగా పుట్టునని కూడా చెప్పాము. పాపమును అనుభవించడములో
పశు, పక్షి, వృక్ష, లతాదులకంటే మనిషే ముందున్నాడని, పాపముల
అనుభవమునుబట్టి మనుషులకంటే మిగతా జంతువృక్షములే దేవునికి
దగ్గరగాయున్నాయి అని చెప్పాము. దేవునికి దగ్గర అంటే అది కనిపించు
విషయము కాదు కదా! దేవుని జ్ఞానము గ్రహించడములో జంతు,
వృక్షములకు చేతకాదని, గ్రహించుకోలేవని కూడా మేము చెప్పలేదు.
మనుషులు జ్ఞానము చెప్పితే మనుషులే గ్రహించవచ్చునుగానీ, జంతువులు
గ్రహించలేవు అనుమాట వాస్తవమే. అయితే జంతువులు గ్రహించునట్లు
దైవ జ్ఞానమును వాటి భాషలోనే చెప్పు గ్రహములు ప్రత్యేకముగా ఉన్నాయి.
మనుషుల భాషలో సూర్యుడు చెప్పినట్లు జంతువుల భాషలో కుజ గ్రహము
చెప్పగలదని మా భావము.
160) ప్రశ్న :- చేమంతి, మల్లెలాంటి మొక్కలకు అంటుకట్టేటప్పుడు కొమ్మను
భూమిలోనికి చొప్పించి పిదప తల్లిమొక్క నుండి కొద్దికొద్దిగా ఖండిస్తూ
వేరు చేసెదరు. అప్పుడు క్రొత్త అంటుకు వేర్లు వచ్చి కొమ్మ బ్రతుక
గలదు. అలా బ్రతికిన కొమ్మలోనికి ఇంకొక జీవుడు చేరినట్లా లేక మొదటి
తల్లి మొక్కలోని ఆత్మయే క్రొత్త మొక్కలో పూలు, కాయలు వచ్చేటట్లు
చేయుచున్నదా?
జవాబు :- అంటుగట్టిన క్రొత్త మొక్కలోనికి క్రొత్త జీవుడు వచ్చి చేరవలసిందే.
ఆత్మ మాత్రము అందరిలో, అన్ని చెట్లలో ఒక్కటే యుండుట వలన తల్లి
చెట్టులోని ఆత్మే క్రొత్త మొక్కలోనికి కూడా వచ్చినదని చెప్పవచ్చును. అప్పుడు
చెట్టులో జీవాత్మ, ఆత్మ రెండు ఉండినట్లగును.
161) మందారములాంటి మొక్కల కాండమునుండి వచ్చిన కొమ్మను
ఖండించి భూమిలోనికి పాతగానే వెంటనే మ్రొక్క వాడిపోదు. తర్వాత
వాడిపోయి మరల చిగురించును. కొన్ని కొమ్మలు చిగురించవు. అందులో
జీవుడు చేరక పోవడము వలన అట్లా జరిగిందా?
జవాబు :- జీవుడు చేరలేని దానివలననే అలా జరిగింది.
162) ప్రశ్న :- మహా అవతార్ బాబాజీగారు జ్ఞానియా, యోగియా?
ఆయనకు త్రైత సిద్ధాంత జ్ఞానము తెలియునా?
జవాబు :- అవతార్ బాబాజీగారు జ్ఞానియూ, యోగియూ కావచ్చును.
అయితే త్రైత సిద్ధాంత జ్ఞానము ఇక్కడినుండే మొదలగుట వలన మధ్యాత్మ
విషయము ఆయనకు తెలియదనియే చెప్పవచ్చును.
163) ప్రశ్న :- రావణబ్రహ్మ ఫోటోలో మీరే కనిపిస్తున్నారు. అయితే మీరే
రావణబ్రహ్మ అని అనుకోవాలా?
జవాబు :- అలా ఎందుకు అనుకోవాలి. రావణబ్రహ్మ చిత్రము కొరకు
నా ఫోటోకు కంప్యూటర్లో ఆభరణములు తగిలించి తయారు చేసిన
చిత్రము. వేషధారణ నా ఫోటోదే అయినంత మాత్రమున నేనే రావణ
బ్రహ్మను అని నేను చెప్పకూడదు. మీరు అలా అనుకోకూడదు. రావణ
బ్రహ్మ అన్ని విధముల గొప్ప వ్యక్తి ఆయనతో పోల్చుకొంటే మనదే తప్పగును.
164) ప్రశ్న:- అందరి స్వామీజీలవలె మీరెందుకు టీ.వీలలో కనిపించరు?
జవాబు :- గాడిద పోయి గుర్రాల గుంపులో కలియకూడదు. అలాగే
గుర్రము పోయి గాడిదల గుంపులో కలియకూడదు. రెండూ తప్పే
అందువలన నేను ఏ టీ.వీలలో కనబడను.
165) ప్రశ్న :- “దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు” అను
గ్రంథములో మీ ముఖమును చూచిన సూక్ష్మగ్రహములు తలదించుకొన్నట్లు
గలదు. దయచేసి మీ కన్నులలో ఏమి కనిపించియుండవచ్చును. హేతువాద
మైన మా ప్రశ్నకు జవాబు చెప్పగలరు?
జవాబు :- సూక్ష్మగ్రహములు నాతో దురుసుగా మాట్లాడిన వారిని నావైపు
చూడమని చెప్పినది వాస్తవమే. వారు చూడలేక తలదించుకొన్నది వాస్తవమే.
అయితే వారికి ఏమి కనిపించినది నాకు కూడా తెలియదు. నేను కూడా
వారు ఎందుకు చూడలేక తలదించుకొంటున్నారను ప్రశ్న వచ్చి వారినే
నేను అడగడము జరిగినది. అప్పుడు వారు ఐదు సెల్ల టార్చీలైట్
కళ్ళలోనికి వేస్తే ఎలా చూడలేమో అలా అయినదనీ, రెండు కళ్ళు అగ్ని
గోళములాగ చూడ శక్యము కాకుండా కనిపించాయని చెప్పారు. వారి
అనుభవమును వారు చెప్పారు. అప్పుడు ఇదంతయూ ఆత్మ వలన జరిగిన
పనేయని నేను అనుకొన్నాను.
166) ప్రశ్న :- మూడవ మారు వచ్చిన భగవంతున్ని ఎవరైనా గుర్తించ
వచ్చునా?
జవాబు :- రాకనే వచ్చాడని ఎందుకు అనుకోవాలి? అలా మూడవ మారు
భగవంతుడు వస్తే ఆయనను నేరుగా ఎవరూ గుర్తించలేరు.
167) ప్రశ్న:- నూరు తప్పులు చేసిన శిశుపాలుడిని కృష్ణుడు సంహరించెను.
అలా చంపడము దుష్ట శిక్షణ అని కొందరు అంటున్నారు. మరి ఏ
గుణములో యున్నవారు చనిపోయిన తర్వాత ఆ గుణములోనే జన్మిస్తారు
అని తెలిపిన కృష్ణుడు దుష్టశిక్షణగా వారిని ఎందుకు చంపెను?
జవాబు :- ఏ గుణములో చనిపోయిన వాడు అదే గుణములో పుట్టగలడు.
అందువలన దుర్మార్గున్ని చంపితే దుష్ట శిక్షణ జరుగదు. దుర్మార్గులను
సన్మార్గులుగా మార్చుటకు వారికి జ్ఞానమును బోధించి మంచి మార్గములోనికి
మార్చవలెను. దుష్టులకు జ్ఞానమును బోధించు శిక్షణను ఇచ్చుటను దుష్ట
శిక్షణ అందురు. శిక్షణ అనగా నేర్పించడము (ట్రయినింగ్) అని
చెప్పవచ్చును. పోలీస్ శిక్షణ అనగా సాధారణ మనుషులను పోలీసులుగా
తర్ఫీదు చేయడము. శిక్షణ అనగా నేర్పించడము. దుష్టులకు సన్మార్గులుగా
మార్చు శిక్షణను దుష్ట శిక్షణ అని అంటున్నారు. వాస్తవముగా “సన్మార్గ
శిక్షణ”యని చెప్పవలసి వలసియుంది. అయినా అలవాటు ప్రకారము
దుష్టశిక్షణ అని అంటున్నారు. అట్లు చెప్పడమును దుష్టులను శిక్షించుట
అని అనుకొంటున్నారు. ఇంకా దుష్టులను చంపి లేకుండా చేయుట అని
కూడా అంటున్నారు. అది అసత్యము. అట్లు చేయుట వలన భగవద్గీతలో
చెప్పినట్లు చనిపోయిన వాడు తిరిగి అదే గుణములలో పుట్టగలడు.
అందువలన దుష్టులను చంపినా ఏమీ ప్రయోజనము లేదు. వారి వలన
సమాజము ఇబ్బంది పడుచుండును. అందువలన దుర్మార్గులను చంపుట
కంటే వారిని సంస్కరించడము మంచిది. అయితే శిశుపాలున్ని కృష్ణుడు
చంపడము వాస్తవమే. అయితే అదియంతయూ ప్రపంచ సంబంధముగా
జరిగిన వ్యవహారము. శిశుపాలుడు మొదలగువారు జ్ఞానమును చెప్పినా
వినరను ఉద్దేశ్యముతోనే చంపవలసి వచ్చిందని అనుకొంటాను.
168) ప్రశ్న :- దయ్యముగా మారిన మనిషి వారి పుత్రులు చేయు శ్రాద్ధాది
కర్మలను స్వీకరించునా? శ్రాద్ధాది కర్మలు చేయని వారిమీద దయ్యాలుగా
యున్న వారి పెద్దలు కోపగించుకొందురా? లేక వారి దారిన వారు
పోవుదురా?
జవాబు :- పితృలు దయ్యములుగా మారినవారు వారి కొడుకులు చేయు
శ్రాద్ధాది కర్మలను స్వీకరించుచుందురు. అయితే కొందరు పుత్రులు శ్రాద్ధ
కర్మలు చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగు వారు కూడా కలరు?
మేము సంపాదించిన ఆస్తిని మీరు తినుచూ మాకు గుడ్డలు, ఆహారము
ఎందుకు పెట్టరని వాదించు పితృలు కూడా కలరు. కొందరు తమ పుత్రులను
ఏమీ అనలేక మౌనముగా ఉన్నారు.
169) ప్రశ్న :- “మత్తః స్మృతి, జ్ఞాన, మపోహనంచ” అనే పురుషోత్తమ
ప్రాప్తి యోగములోని శ్లోకములో జ్ఞానము కూడా తనవలెనే కల్గుచున్నది
అని అన్నప్పుడు, జ్ఞానమును కొందరికే ఇస్తాను అన్నట్లున్నది. మరీ మీరేమో
"శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్" శ్రద్ధ వలననే జ్ఞానము లభించును అని
చెప్పుచున్నారు. రెండిటిలో ఏది వాస్తవము?
జవాబు :- రెండు వాస్తవమే. నా వలన జ్ఞానము కల్గును అనుమాట
నిజమే. ఆత్మ వలననే బుద్ధికి జ్ఞానము గ్రహించు శక్తి రాగలదు. అయితే
శ్రద్ధయున్న వానికే ఆత్మ జ్ఞానమును గ్రహించుశక్తిని ఇచ్చును. శ్రద్ధ లేనివానికి
ఆత్మ బుద్ధికి జ్ఞానమును ఇవ్వదు. జ్ఞానమును గ్రహించుశక్తి ఇవ్వదు.
170) ప్రశ్న :- 250 మార్లు 4 యుగములు గడచితే 1000 యుగములు
అయిపోయి ప్రపంచ అంత్యమగును కదా! మరి ఇప్పటి కలియుగము
ఒకటవదా లేదా 230వ దా లేక 1వ సారి మాత్రమే గడచుచున్నదా?
చాలా కలియుగములు గడిస్తే ఇప్పటికి భగవంతుడు ఎన్నోమార్లు వచ్చి
యుండాలి కదా! అలా అయితే ఇప్పటికి జరిగిన 250 ద్వాపరయుగములలో
250 మంది కృష్ణులు జన్మించినట్లా? ఈ సందిగ్ధతను వివరించగలరా?
జవాబు :- నాలుగు యుగములు 250 మార్లు గడిస్తే ఒక బ్రహ్మ పగలు
అని అర్ధము. అలాగే వేయి యుగములు గడిస్తే దేవునికి ఒక రాత్రి
గడచినట్లగును. అయితే కలియుగము ఇప్పటికి ఎన్నిమార్లు గడచినది
యని ఎవరూ ఆధారపూర్వకముగా చెప్పడము లేదు. కొందరు 17 మార్లు
గడచినదని 17వ కలియుగమని చెప్పుచున్నారు. అట్లు చెప్పుటకు పూర్తి
సాక్ష్యము ఏమీ లేదు. ఒక కలియుగములో కృష్ణుడు వచ్చి భగవద్గీత చెప్పితే
మిగతా కలియుగములలో కృష్ణుడు వస్తాడు అనుకోవడము పొరపాటు.
కాలగమనమునుబట్టి ఒక శుక్రవారము గడియారము కొన్నామనుకోండి.
తర్వాత శుక్రవారం గడియారము కొనము కదా! అలాగే ఒక కలియుగములో
దేవుడు భగవంతునిగా పుట్టి భగవద్గీతను చెప్పితే తర్వాత కలియుగములో
భగవంతుడు పుట్టవలెననిగానీ, భగవద్గీతను చెప్పవలెననిగానీ ఏమీ
ఉండదు. నా ఉద్దేశ్యము ప్రకారము ఇదే మొదటి మారని చెప్పుచున్నాము.
అందువలన జ్ఞానము కూడా ఇప్పుడే తెలిసినది. తర్వాత రాబోయే యుగము
రెండవమారు వచ్చు కృతయుగమని చెప్పవచ్చును.
171) ప్రశ్న :- పరకాయ ప్రవేశ విద్యలో జీవుడు, ఆత్మ రెండు శరీరమును
విడిచి పెట్టునట్లుగా యున్నది. ఏ మానవుడు తన శరీరమును వదలి
పెట్టి బయటికి పోయి తర్వాత తిరిగి వచ్చి అదే శరీరములోనికి చేరుటకు
అవకాశమే లేదు కదా! ఆ అవకాశము విగ్రహాలలో ఉండేవారికే మాత్రమే
కలదని చెప్పారు. మరి పరకాయ విద్యలో జీవుడు, ఆత్మ ఇద్దరూ వదలి
పోయిన శరీరములోనికి ఎట్లు చేరగలుగుచున్నారు? అది సాధ్యమయ్యే
పనియేనా?
జవాబు :- పరకాయ ప్రవేశ విద్యను నేర్చుటకు పన్నెండు (12)
సంవత్సరముల కాలము పట్టును. అలా నేర్వగలిగినవాడు తన శరీరమును
వదలి ఆత్మ జీవాత్మ బయటికి వచ్చి వేరే శరీరములో చేరడమును అభ్యాసము
చేసియుందురు.అయితే ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటి
గలదు. ఒకమారు జీవుడు శరీరమును వదలి బయటికి వచ్చిన తర్వాత
వదలిన శరీరములోనికి తిరిగి ప్రవేశించుటకు వీలుకాదు. అటువంటప్పుడు
ఈ అభ్యాసము ఎందుకు? అను ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఇట్లు
చెప్పవచ్చును. శరీరములో ఐదు ఉపవాయువులను వదలి శరీరమును
విడిచిపోతే పూర్తిగా వదలినట్లు కాదు. అందువలన పరకాయ ప్రవేశ
విద్యలో ఉప వాయువులను శరీరములో వదలి బయటికి రావడము, తిరిగి
అదే శరీరములోనికే చేరడము జరుగుచున్నది. ఈ సాధన పన్నెండు
(12) సంవత్సరములు చేసిన తర్వాత ధైర్యముగా పరకాయ ప్రవేశ విద్య
నేర్చినామని చెప్పవచ్చును. ఉపవాయువులను వదలకుండా జీవుడు
బయటికి వస్తే తిరిగి ఆ శరీరములోనికి ప్రవేశించుటకు వీలుపడదు.
172) ప్రశ్న :- సూర్య చంద్ర గ్రహణ సమయములో దర్భగడ్డిని ఆహార
పదార్థములలో వేస్తారు. బహుశా గ్రహణ సమయములో వచ్చే సూర్య,
చంద్ర కిరణాలలో ఉండే దోష కిరణాలను నిర్వీర్యము చేసే గుణము
మూలికకు (దర్భగడ్డికి) కలదా?
జవాబు :- దర్భలకు కొంత ప్రత్యేక నిరోధక శక్తి కలదు. అందువలన
గ్రహణ సమయములో దర్భను వాడవచ్చును.
173) ప్రశ్న :- పెళ్ళి బృందాల వాహనాలు, తీర్థయాత్రలకు బయలుదేరిన
బస్సుల ప్రమాదముల వెనుక దేవుని సైనికులవలె పని చేయుచున్న
భూతముల, గ్రహముల ప్రభావము కలదని మీరన్నారు. మేము అజ్ఞానులని
వారికే తెలియని వారిని జ్ఞానము తెలియక మునుపే చంపివేసిన గ్రహముల
చర్య తొందరపాటు అగును కదా! 'అజ్ఞానులుగా చనిపోయినవాడు, మరల
అజ్ఞానులుగా పుట్టుదురను' సూత్రమును చెప్పి దేవుడు వారిని ఎందుకు
వారించలేదు. వారి మరణానికి కారణము జ్ఞానులకు తెలుసు, కానీ వారిని
అలా చంపడమునకు కారణమును వారికి తెలియచేయక చంపివేయడము
ఎంత వరకు సమంజసము?
జవాబు :- సమంజసమో, అసమంజసమో గ్రహములు, భూతములు
ఆలోచించరు. తప్పుకు తగిన శిక్ష వెంటనే చూపాలనునది వారి భావము.
అత్యాచారము చేయువానిని దొరికిన వెంటనే కొట్టుదురు. అప్పుడు వానిని
ఎందుకు కొట్టాలి, వానికి తెలియక అత్యాచారము చేశాడని అనుకోము.
అలాగే సాంప్రదాయరహితముగా, జ్ఞానము లేకుండా పెళ్ళి చేయువారిని
దేవున్ని ఏమాత్రము అనుకోక దేవతలను ఆరాధించుటకు తీర్థయాత్రలకు
పోవువారు భూతముల గ్రహముల లెక్కలో బయట అత్యాచారము చేయు
వారికంటే పెళ్ళి, దేవతల దర్శనార్థము పోవువారు ఇంకా దుర్మార్గులుగా
కనిపించియుందురు. అందువలన వెంటనే వారిమీద చర్యగా రోడ్డు
ప్రమాదములను కలుగజేయుచున్నారు.
174) ప్రశ్న :- ఆహారమును తీసుకోకపోయినా ప్రహ్లాద్ జానీ శరీరములో
శక్తిని ఇచ్చిన ఆత్మ మత్తు పదార్థములు తీసుకొన్న వ్యక్తిలో ప్రభావితుడు
కావటము, తద్వారా బలహీనుడై పోవడము విచిత్రముగా వుంది.
జవాబు :- ఆత్మ శక్తితో కూడుకొన్నవాడు. ఆత్మే చైతన్యముగా యున్నది.
అటువంటి ఆత్మ బలహీనము కావడము లేదుగానీ, మత్తు పాణీయములను
స్వీకరించిన వారికి తనశక్తిని ఇవ్వను అని చెప్పుచున్నది. తానే బలమై
యున్ననూ, నా ఆత్మ తన బలమును త్రాగిన వానికి ఇవ్వను అని
చెప్పడమునకు కారణము మత్తు పాణీయములంటే ఆత్మకు సరిపోదని
తెలియుచున్నది. త్రాగిన వానికి మత్తు మెదడునందు చేరుట వలన మెదడు
నుండి ప్రారంభమగు ఆత్మకు మత్తు మెదడును చేరియుండుట వలన తన
గౌరవమునకు భంగము ఏర్పడుచున్నది. తాను అనుభవింపచేయు కర్మలను
జీవుడు పూర్తిగా అనుభవించకుండా మత్తులోనికి చేరిపోవుట వలన జీవుడు
అనుభవించు స్థితిలో యుండడు. అందువలన కర్మ అమలు చేయు ఆత్మకు
ఆటంకముగా యుండుట వలన త్రాగిన వానికి తన చైతన్యమును ఇవ్వను
అని అన్నాడు. అందువలన త్రాగిన వానికి బలము లేకుండా ఉండును.
త్రాగిన మనిషికి బలము లేకుండుట వలన వానిని చిన్నపిల్లవాడు కూడా
కొట్టగలడు. మత్తు త్రాగినవానికి ఆత్మ చైతన్యమును (బలమును)
ఇవ్వకపోవడము వలన త్రాగినవాడు నడువ లేక క్రింద పడి పోవును. ఈ
విషయము అందరికీ తెలిసినదే.
175) ప్రశ్న :- పశు, పక్షి, వృక్ష, లతాదులలో బుద్ధి, చిత్తము, అహము,
మనస్సు మనుషులలోవలె విధులను నిర్వహించునా?
జవాబు :- వేరు వేరు జాతుల జీవరాసులలో వాటి నిర్మాణము వేరుగా
యుండును కానీ పనులు మాత్రము అన్ని మనుషులలోవలె చేయును.
176) ప్రశ్న :- మూలికా వైద్యములో గుణ ప్రేరణ చేయు ఆహారమును
గురించి వ్రాయబడినది. కానీ ఆహారము వలన కామప్రకోపము జరుగదు
అని మీరు అంటున్నారు. ఆహారము మానసిక స్థితిపైన ప్రభావము
చూపదా?
జవాబు :- మూలికా వైద్యములో ఆహారము వలన గుణ ప్రేరణ జరుగును
అని వ్రాసియుండుట నేను కూడా చూచాను. "వస్తు గుణదీపిక" అను
గ్రంథములో వంకాయను తింటే ఈ ఫలితముండును, తొండకాయను
తింటే ఈ ఫలితము, చింతకాయను తింటే ఈ ఫలితము అని సాధారణముగా
వ్రాశారు. వంకాయను తింటే నొప్పులు వచ్చును అని ఉందనుకో అది
అందరిలో నొప్పులు రావడము లేదు. వ్రాసినట్లు కొందరిలో మాత్రము
వాయు నొప్పులు వస్తున్నవి. అలాగే అని ఔషధములు చెప్పినవి చెప్పినట్లు
పని చేయడము లేదు. అయితే ఔషధములు కొందరిలో పని చేయడము
కొందరిలో పని చేయకపోవడము ఏమిటి? అని ఆలోచిస్తే మూలికలు,
ఔషధములు, ఆహారములు వాటివాటి పనిని అవి చేస్తున్నవి. అయినా
శరీరములో యుండే ఆత్మ వాటిని ఎంతవరకు అనుమతించాలో అంతవరకే
అనుమతించుట వలన, అంతవరకే అవి శరీరములో ఉపయోగపడుచున్నవి.
జీవుళ్ళ కర్మనుబట్టి ఆత్మ అనుమతియుండుట వలన అనుమతి ప్రకారమే
శరీరములో కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉపయోగ
పడుచున్నవి. మనిషిలో ఆత్మ అందించు నిరోధకశక్తి వలన ఆహారములు
గానీ ఔషధములుగానీ పనిచేయడము జరుగుచున్నది. ఉదాహరణకు
సారాయి మత్తును కల్గించి మనిషిని మానసికముగా మార్చగలదు.
మాట్లాడని వానిని కూడా ఎక్కువగా మాట్లాడునట్లు చేయగలదు. అయితే
ఒక మనిషి చిన్న గ్లాసు సారాత్రాగినా వానిలో అది బాగా పనిచేసి
మనిషిని ఎక్కువగా మాట్లాడునట్లు చేయును. అదే సారాను మరొక మనిషి
త్రాగినా త్రాగనట్లేయుండును. అతనిలో ఏ మార్పు రాదు. అతను ఒక
పెద్ద సారాయి త్రాగినా అతనిలో మార్పు రాదు, వాడు మాట్లాడడు. అట్లే
కొందరిలో ఆహారములు, ఔషధములు ఆత్మ ఆజ్ఞను అనుసరించి పని
చేయును. అంతేగానీ ఏ పదార్థముగానీ స్వయముగా పని చేయలేదు.
అన్ని విషయములలో హెచ్చుతగ్గులుగా ఆత్మ ఆడించు ఆటదేగానీ ఆహారము
వలన ఏమీ జరుగడము లేదని గ్రహించవలెను.
177) ప్రశ్న :- గర్భిణీ స్త్రీ ఉండే వాతావరణము హింసాపూరిత చర్యలో
ఉండి మానసిక క్షోభ అనుభవిస్తుయుంటే, గర్భములో పెరిగే బిడ్డ పైన
చెడు మార్పులు జరుగునా?
జవాబు :- బయట వాతావరణమునకు గర్భములోపల పెరిగే బిడ్డకు
ఏమాత్రము సంబంధము ఉండదు.
178) ప్రశ్న :- భగవద్గీతలో కల్పిత శ్లోకములను చొప్పించిన వారు వేద
నింద కల్గిన “త్రై గుణ్య విషయా వేదా” వంటి శ్లోకాలను ఎందుకు తీసి
వేయలేకపోయారు?
జవాబు :- వాటిని ముట్టుకుంటే ఏమి జరుగుతుందోనను భయము చేత
ఆ శ్లోకములను ముట్టుకొనే సాహసము చేయలేకపోయారు.
179) భగవద్గీత రచన జరిగినప్పుడు శ్రీకృష్ణుడు బ్రతికియున్నాడు కదా!
ఆయన జ్ఞానము గ్రంథము అయినందుకు సంతోషించెనా?
జవాబు :- వ్యాసుని చేత వ్రాయబడవలెనను ఫతకముతోనే భగవద్గీతను
అర్జునునకు చెప్పాడు. ఆయన అనుకొన్నట్లే వ్యాసుని చేత 'భగవద్గీత'
అను పేరుతో తన బోధ గ్రంథరూపమైనది. తన గ్రంథమును భగవద్గీతయను
పేరు పెట్టడము కృష్ణునికి సరిపోలేదని, అసంతృప్తిగా యుండేదని తెలిసినది.
గ్రంథము తయారయిన తర్వాత ఇజ్రాయెల్ దేశములో మోషే ప్రవక్తకు
భగవద్గీతను కృష్ణుడు స్వయముగా ఇచ్చి గ్రంథము పేరు “తౌరాత్” అని
చెప్పాడు. తౌరాత్ గ్రంథమని పేరు పెట్టిన తర్వాత కొంత సంతోషము
కల్గినది. ఆకాశ శబ్దము ద్వారా వచ్చిన జ్ఞానమే భగవద్గీత అయినా అది
భగవంతుడు చెప్పినట్లు ఉండకూడదని, ఆకాశము నుండి వచ్చినట్లు
తెలియవలెనను భావము ఆయనలో ఉండేది.
180) ప్రశ్న :- నిన్నటి (03-09-2016) వార్తాపత్రికలో 147
సంవత్సరములు ఒక వ్యక్తి బ్రతికినట్లు చూపించారు. మానవుని ఆయుష్షు
120 సంవత్సరములే కదా! మరి 147 సంవత్సరములు ఆ మనిషి ఎట్లు
బ్రతికెను?
జవాబు :- పన్నెండు నవగ్రహముల దశా సంవత్సరములు పూర్తిగా
గడచుటకు 120 సంవత్సరములు పట్టును. అంతేగానీ అది మనిషి
ఆయుష్షు కాదు. మనిషి ఆయుష్షు వేల సంవత్సరముల వరకైనా యుండ
వచ్చును. 120 సంవత్సరములు గ్రహముల దశాచార సంవత్సరములు
మాత్రమే.
181) ప్రశ్న :- వృక్షములలో వృక్షమంతా ఆవహించియున్న ఆత్మ వాటి
పండ్లలో కూడా వ్యాపించి యుండును కదా? పండు ఊడినా మనము
తెంపినా ఆత్మను ఖండించినట్లగునా? పండును తింటే ఆత్మను తినినట్లగునా?
జవాబు :- వృక్షమంతా ఆత్మ వ్యాపించి యుండుట నిజమే. వాటి కాయలో
కూడా వ్యాపించియుండును. కాయ పండుగా మారినప్పుడు అందులో
ఆత్మ ప్రవేశించదు. అప్పుడు దానంతట అదే కాడనుండి ఊడిపడును.
పండులో ఆత్మశక్తి యుండదు. కాయలో ఆత్మశక్తి ఉండును. పచ్చికాయను
పెరికితే ఆత్మను త్రెంపినట్లగును. అప్పుడు కాయలో ఆత్మయున్నా అది
రెండు నిమిషములలో లేకుండా పోవుచున్నది. తర్వాత కాయను తిన్నా
ఆత్మతో ఏమీ సంబంధము లేదు. తెగిన బల్లితోకలో శక్తి రెండు
నిమిషములలో అణిగిపోవునట్లు కాయలో కూడా లేకుండా పోవును.
182) ప్రశ్న :- తల్లిగర్భములో జీవుడు లేనప్పుడు ఆ దేహానికి కర్మలేనట్లే
కదా! అయితే కొందరి గర్భములలో అంగవైకల్య శరీరములు పెరుగు
చున్నవి. లేదు తల్లిదండ్రుల కర్మవలన అట్లా పెరుగుచున్నదంటే, ఎవరి
కర్మను వారే అనుభవించాలి కదా? దీనికి మీరేమంటారు?
జవాబు :- మనిషికేగాక ప్రతి జీవికి కర్మపత్రము వ్రాయబడియున్నది.
ఒక మనిషిని తీసుకొని చూస్తే అతని ఆయుష్షు మొదట పుట్టినప్పటినుండి
ప్రతి 69 సంవత్సరముల, ఐదు (5) నెలల, పది (10) రోజులకు ఒకమారు
జరిగిన కర్మమంతయూ కలిపి రాబోవు జన్మ ఎలా ఉండాలో నిర్ణయము
చేసి వ్రాయబడియుండును. మనిషి ఎంతకాలము బ్రతికినా 69 సం॥ 5
నెలల, 10 రోజులకు ఒకమారు కర్మపత్రము లేక కర్మగ్రంథము వ్రాయబడు
చున్నది. ఒక వ్యక్తి 80 సంవత్సరములకు చనిపోయాడనుకొనుము.
అప్పుడు వారు ఎక్కడ పుట్టవలెనని ఎట్లు పుట్టవలెనని అన్ని వివరముల
కర్మ 69 సం॥ 5 నెలల, 10 రోజులప్పుడే నిర్ణయించబడియుండును.
అందువలన ఆ మనిషి తర్వాత కుంటి జన్మ ఎత్తవలసి యుండునట్లయితే
అతనికి సంబంధించిన గర్భములోని శిశువు కుంటిదిగా తయారవును.
ఆ శిశువు జన్మించిన తర్వాత అందులో చేరవలసినవాడు పోయి చేరును.
అయితే ముందే కర్మ నిర్ణయము జరిగియుండునను విషయము
చాలామందికి తెలియదు. ఈ విషయము "కలియుగము ఎప్పటికీ
యుగాంతము కాదు" అను గ్రంథములో వ్రాసియున్నాము. మనిషి
చనిపోయినప్పుడు కర్మ నిర్ణయము జరుగును అనికూడా కొన్నిచోట్ల
చెప్పాము. చనిపోయినప్పుడు ఆత్మ ముద్ర (ఆత్మ అనుమతి) పొంది
రెండవ జన్మకు రావలసియున్నది. కర్మ ముందే నిర్ణయము జరిగియుండును.
183) ప్రశ్న :- సృష్ఠి ఆదిలో కర్మలేనప్పుడు మానవులే కాకుండా అన్ని
జీవరాసులను సృష్టించియుంటే అండజ, పిండజ, ఉద్భిజములు ఎన్ని
ఉండెను?
జవాబు :- త్రైత సిద్ధాంత భగవద్గీతలో విభూతి యోగమున జీవరాసుల
సృష్ఠిని గురించి సంపూర్ణముగా చెప్పియున్నాము. అందులో మనుషులు
108 పుట్టగా అందులో పురుషులు 54 మంది, స్త్రీలు 54 మంది. వారిలో
పురుషులయందు 27 మంది మంచివారు, 27 మంది చెడు వారిగా (మంచి
చెడు) గుణములలో పుట్టునట్లు చేశాడు. అట్లే అండజములు, పిండజ,
ఉద్భిజములు 108, 108, 108 పుట్టునట్లు చేయబడినవి. మొదట
జంతువులు లేవు. తర్వాత జరుగు కాలములో మనుషుల సంఖ్య తగ్గి
జంతువుల సంఖ్య పెరిగినది. భూమిమీద కొంత కాలమునకు అన్ని
సంఖ్యలు సమానమైనవి. తర్వాత కాలక్రమేపీ జీవరాసుల సంఖ్య పెరుగుచూ
వచ్చినది.
184) ప్రశ్న :- పిండము దశనుండి అన్ని అవయవములు పెరిగినా
మూత్రమును తయారు చేయు కిడ్నీలను మూత్రపిండములని అంటానే
యున్నారు? దేనికి?
జవాబు :- గర్భములోని శిశువు ఆకృతిలో మూత్రమును తయారు చేయునవి
ఉండుట వలన వాటిని మూత్రపిండములని అంటున్నారు. వాని ఆకృతిని
బట్టి వాటికి ఆ పేరు రావడము జరిగినది.
185) ప్రశ్న :- జీవునికి జ్ఞానము మీద శ్రద్ధ పూర్వ జన్మ సుకృతము వలన
లభ్యమగును అన్నారు కదా! అయితే పూర్వజన్మ లేకుండా అదే మొదటి
జన్మ అయితే ఆ జీవునికి శ్రద్ధ ఎట్లు కల్గును. సృష్ఠి మొదట జన్మ కల్గిన
ఎందరో జీవులలో అందరికీ ఆ శ్రద్ధ ఎందుకు కల్గటము లేదు? మొదటి
శ్రద్ధ మొదటి జీవునికి ఎట్లు కల్గెను?
జవాబు :- అర్జునునకు జ్ఞానము మీద ఏమాత్రము శ్రద్ధ లేకున్నా తన
జ్ఞానము బయటికి వచ్చుటకు శ్రద్ధలేని అర్జునునకు జ్ఞానమును చెప్పినట్లు
మొదట ఏమాత్రము శ్రద్ధలేని మనిషికి దేవుని జ్ఞానము బయటికి వచ్చుటకు
మానవునకు శ్రద్ధలేకున్నా దేవుడే వానికి జ్ఞానమును చెప్పాడు. జ్ఞానమును
విన్న తర్వాత కొందరికి జ్ఞానము మీద శ్రద్ధ కల్గినది. కొందరికి ప్రపంచ
శ్రద్ధల వలన జ్ఞానము మీద శ్రద్ధ లేకుండా పోయినది. మొదట మనిషికి
శ్రద్ధలేకున్నా దేవుడే జ్ఞానము చెప్పాడని తెలియుచున్నది. అయినా
మనుషులలో కొందరు జ్ఞానము యొక్క రుచిని చూచిన తర్వాత దానిమీద
శ్రద్ధకల్గి యున్నారు. కొందరికి జ్ఞానము యొక్క రుచే తెలియలేదు. జ్ఞానము
రుచి తెలిసిన వారిని జ్ఞానులని, రుచి తెలియని వారిని అజ్ఞానులని
అంటున్నాము.
186) ప్రశ్న :- శ్రీకృష్ణుని ఎడమ కాలిపైన పాముకాటు నమూనా ప్రభువు
కాలుకు సేవ చేస్తున్నప్పుడు భక్తురాలు గుర్తించి ఇదేమి అని అడుగగా,
అది గత జన్మలో ఏర్పడిన గుర్తుయని ప్రభువు చెప్పే సన్నివేశము బైబిలు
గ్రంథములో ఏ సువార్తలో కలదో చెప్ప మనవి?
జవాబు :- ఈ విషయము నేను బైబిలులో ఉన్నట్లు చెప్పలేదు. అంతేకాక
ప్రభువు ఆ మాట చెప్పిన విషయము నేను చెప్పానా లేక ఎవరైనా మీకు
చెప్పారా? ఈ విషయము నా జ్ఞాపకములో పూర్తిగా లేదు. అయితే అడిగావు
కావున నీకు సత్యము చెప్పాలంటే ఆ పాము కాటును పోలిన గుర్తులు నా
ఎడమ మోకాలు క్రింద పిక్క కండకు ఉన్నమాట వాస్తవమే. అంతతప్ప
ఈ విషయములో నాకు ఏమీ గుర్తులేదు.
187) ప్రశ్న :- “ఈ జన్మలో చేసిన తప్పులకు శిక్షలు మరుజన్మలో” అనే
సూత్రము వలన హేతువాదులు, నాస్తికవాదులు ఎక్కువై ఆస్తికవాదులంటే
భయము లేకుండా పోయినది. మరి ఈ జన్మలో అన్ని తప్పులకు కాకుండా
కొన్ని తప్పులకయినా శిక్షలు ఉంటే, జ్ఞానదూషణ, జ్ఞానులపైన దాడి జరిగిన
దానికయినా శిక్షలు పడితే జ్ఞానప్రభావము తెలిసినట్లగును. మిగతావారు
దేవుని జ్ఞానము ఎడల భయభక్తులు కల్గియుందురు కదా! మరి అట్లా
ఎందుకు జరుగదు?
జవాబు :- పాపము చేస్తే ఆ పాపమునకు శిక్ష మరుజన్మ జీవితములో
జరుగునని దానినే కర్మఫలమును మరుజన్మలో అనుభవించడమని చెప్పు
చుందురు. అది వాస్తవమే అయినా కొన్ని తప్పులకు శిక్షలు అప్పుడేగానీ
లేక కొంత ఆలస్యముగాగానీ అమలు జరుగడము కూడా కలదు. ఈ
జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే శిక్షలు అమలయిన సంఘటనలను
చూస్తే ఇది వాస్తవమేనాయను అనుమానము రాక తప్పదు. దేవుడు,
జ్ఞానము అను ఈ రెండు విషయములలోనే చాలామందికి వెంటనేగానీ,
కొంత ఆలస్యముగాగానీ శిక్షలు అమలు కావడము మేము చాలా చూచాము.
చాలామంది మరణించిన వారు గలరు. కొంతమంది అంగహీనులై జీవిత
మంతా కష్టముగా గడుపువారు కూడా కలరు. జ్ఞానము విషయములో
అనవసరముగా మాట్లాడి తప్పు చేసిన వారు హీనముగా కొందరు బ్రతుకు
చుండగా కొందరు కారణము తెలియకుండా చనిపోయారు. వారు
మనుషుల వలన బాధింపబడలేదు, మనుషుల చేత చంపబడలేదు. దీని
కంతటికి కారణము ఆకాశములో నుండి భూమిమీదికి వచ్చి పోవు గ్రహముల
వలన, భూతముల వలన జరిగిందని అనుకొంటాను. జ్ఞానమునుగానీ,
జ్ఞానినిగానీ, దేవున్నిగానీ అజ్ఞానులు అగౌరవముగా మాట్లాడినా, నిందించినా
ఆ సమయములో అక్కడ ఆకాశ భూతములుగానీ, గ్రహములుగానీ
సూక్ష్మముగా అక్కడికి వచ్చియుంటే, ఒకవేళ వారు దేవున్ని, దేవుని
జ్ఞానమును, జ్ఞానిని నిందించడము చూస్తే వానిని కొన్ని రోజులలోగానీ,
కొన్ని నెలలలోగానీ చంపడమో, అంగవైకల్యము చేయడమో చేయును.
అంత జరిగినా ఎందుకో జరుగకూడనిది జరిగినదని ఎవరూ
ఆలోచించడము లేదు. దేవుని సైన్యములో భూతములు, గ్రహములు పని
చేయుచున్నవి. వాటికి దేవుడంటే ఎంతో ఇష్టము. తమకు ఇష్టమైన
దేవున్ని, దేవుని జ్ఞానమును నిందించువానిని ఆ సమయానికి అక్కడేయుండి
చూస్తే వానిని సులభముగా వదలవు. గ్రహములు భూతములు
ఎంతోమందిని శిక్షించినా ఫలానా తప్పు వలన ఇది జరిగింది అని మనిషి
అనుకోవడము లేదు. ఒకవేళ మేము “ఇది మంచిది కాదు దేవుని శిక్షకు
మీరు గురికావచ్చు” అని చెప్పి హెచ్చరించినా జరిగినప్పుడు చూస్తాము
అని కొందరనుకోగా, మాది తప్పే లేదు మమ్ములను ఎవరూ ఏమీ చేయరను
ధీమాను కొందరు వ్యక్త పరచుచున్నారు.
188) ప్రశ్న :- భీష్ముడు భగవద్గీతను వినకముందే జ్ఞాని ఎట్లు అయ్యెను?
ఆయన కృష్ణున్ని భగవంతుడని ఎలా తెలియగలిగాడు?
జవాబు :- ఇప్పుడు నేను చెప్పు విషయమునకు ఏమాత్రము
ఆధారముండదు. అయినా నేను చెప్పునది సత్యము. ఇతరులు నమ్మవచ్చు
లేకపోతే లేదు. సృష్ట్యాదిలో చెప్పబడిన జ్ఞానమును మనుషులు అర్థము
చేసుకొనుటకు సూర్యుడు భూమిమీదగల 'మనువు' అను వ్యక్తికి తెలుపగా,
మనువు ద్వారా ఇతరులకు రాజునుండి పేదవరకు తెలియబడినది. మనువు
జ్ఞానమును సూర్యుడు చెప్పగా వినిన దానివలన జ్ఞానిగా మారిన మనువు
ఎన్నో జన్మలు ఎత్తుచూ సూర్యుడు చెప్పిన జ్ఞానమును నెమరు వేసుకొంటూ
చస్తూ పుట్టుచూ చివరికి కొంత కర్మ శేషము వలన భారతదేశములో
ఉత్తరమున 'భీష్ముడు' అను పేరుతో పుట్టడమైనది. ముందు జన్మలలోనే
జ్ఞానము సంపూర్ణముగా తెలిసిన మనువు కురువంశములో భీష్ముడుగా
పుట్టినా ఆయన జ్ఞానము గల వ్యక్తి అని కూడా ఎవరికీ తెలియదు. భీష్ముడు
భగవద్గీతను చెప్పక ముందు నుండి కర్మయోగమును ఆచరించుచున్నాడు.
సంపూర్ణ జ్ఞాని, సంపూర్ణ యోగి అయినందున కృష్ణుని జన్మను సులభముగా
గుర్తించగలిగాడు. కృష్ణుని విషయములో అనేకమార్లు కౌరవులను
హెచ్చరించాడు. అయినా ఆయన మాటను ఎవరూ వినలేదు. ఆ
కాలములో కృష్ణుడు సాధారణ మనిషికాదు సాక్ష్యాత్తూ దేవుడైన భగవంతుడని
తెలిసినవాడు ఒకే ఒక్క భీష్ముడు తప్ప ఎవరూ లేరు. యుద్ధరంగములో
కృష్ణుడు తనమీదికి కోపముగా వచ్చినప్పుడు చేతులు జోడించుకొని
వినమ్రుడై రథము దిగి నిలబడ్డాడు. కృష్ణుని చేతిలో చనిపోతే ఎంతో
భాగ్యముగా తలచాడు. యుద్ధరంగములో క్రింద పడిపోయినప్పుడు కూడా
కృష్ణున్నే పిలిచి కృష్ణునితోనే మాట్లాడినాడు. నేరుగా కృష్ణున్ని తనను
నీలో కలుపుకొమ్మని అడిగినవాడు భీష్ముడు ఒక్కడే. చివరికి కృష్ణుడు
చెప్పిన మాటప్రకారము ఉత్తరాయణ కాలము రాగానే భీష్ముడు చనిపోవడము
జరిగినది. అదే ఆయనకు ఆఖరీ మరణము. ఆయన తిరిగి పుట్టలేదు.
దేవునిలో ఐక్యమై దేవునిలోనే నిలిచిపోయాడు.
189) ప్రశ్న :- బుద్ధుడు చెప్పిన సూత్రాలను, ఉపనిషత్తులలో కొన్ని
వాక్యములను జతచేసి వ్రాసినదే భగవద్గీతయని హేతువాదులుగా మేము
అంటున్నాము. అంతేగానీ భగవద్గీత ద్వాపరయుగము కాలము నాటిది
కాదు.
జవాబు :- అట్లని అనుకొనే వానికి బుద్ధుని సూత్రాలతో భగవద్గీత
ఏకీభవించదు. బుద్ధుని సూత్రాలు వేరు, భగవద్గీత వేరు. అందువలన మీ
మాటలో సత్యము ఏ కొద్దిగ కూడా లేదని చెప్పవచ్చును.
190) ప్రశ్న :- పుష్కర సమయంలో ఉన్న నీటిలో వాస్తవముగా ఏ శక్తి
కిరణాలైనా ప్రసరించునా?
జవాబు :- ఏ శక్తి కిరణములు పుష్కర సమయములో నదులయందు
ప్రసరించవు. ఆధ్యాత్మికరీత్యా ఇది కూడా కొంత అజ్ఞానమే అగును.
191) ప్రశ్న :- మనకు చేదుగాయున్న వేప ఆకులు మేకలకు చేదు
అనిపించవా? మనకు తెలిసే రుచులు వేరే జీవులకు మరొక రుచిలా
ఉండునా?
జవాబు :- 'జిహ్వకు ఒక రుచి'యని మన పెద్దలు చెప్పినట్లు మనుషుల
రుచి జంతువులకు వేరుగాయుండును. మనకు చేదుగా యున్న వేప ఆకు
మేకలకు రుచిగా యుండును. మనకు చేదులేని మేక మేయని ఆకు
మేకకు చేదుగాయుండును. అందువలన అన్ని ఆకులను తిను మేక ఒక
ఆకును మాత్రము తినదు. అదే మేక మేయని ఆకు అని చెప్పబడుచున్నది.
మేక నాలుక మీద గల రుచి కణముల సంఖ్యనుబట్టి, పరిమాణమునుబట్టి
వాటికి రుచి తెలియుచుండును. ఒకే పదార్థమే వేరువేరు జీవరాసులకు
వేరువేరు రుచులుగా తెలియును.
192) ప్రశ్న :- ఒక్క రోజు పుట్టి ఒక్కరోజే బ్రతికి చనిపోవు జీవులు ఎన్నో
గలవు. ఒక్కరోజే పుట్టుటకు తగిన కర్మయుండునా?
జవాబు :- పుట్టిన రోజే ఒక గంట బ్రతికి చనిపోవువారు, రెండవ రోజు
చనిపోయినవారు ఎందరో గలరు. వారు బ్రతికిన కాలము తక్కువే
అయినందున ఆ జన్మకు అంతే కర్మ కేటాయించబడినదని తెలియుచున్నది.
ఒక గంటసేపు మాత్రమే బ్రతికి చనిపోవు జీవులు చాలా కలవు. కర్మను
బట్టి జన్మలుండునని తెలియవలెను.
193) ప్రశ్న :- గొడ్డలి పట్టుకొని వస్తున్న వ్యక్తిని చూచి తనను
నరికివేయునని తెలిసిన వృక్షములో జీవుడు మరియు ఆత్మ ఇద్దరూ
సూక్ష్మముగా బయటికి పోవుదురా?
జవాబు :- ఆ విధముగా పోవు అవకాశము విగ్రహాలలో జీవులకు మాత్రము
గలదు. వృక్షములోని జీవుడు, ఆత్మ బయటికి పోరు. పోయే అవకాశము
లేదు. చెట్ల కొమ్మలు నరికినా, మొదలు నరికినా జీవుడు వేర్లలో యుండుట
వలన వృక్షమునకు ప్రాణము పోదు. కొమ్మలు నరికినప్పుడు మనిషి
శరీరములో అవయవములను నరికివేయునప్పుడు మనిషికి కల్గు నొప్పివలె
చెట్టుకు నొప్పియుండదు. నొప్పి పూర్తి లేదు అని చెప్పలేము కానీ, మనిషి
శరీరములో పొందు బాధలో కేవలము ఐదు నుండి పది శాతము వరకు
బాధ యుండవచ్చును. మనిషికి యున్న నొప్పిలో చాలా తక్కువ శాతము
అనుభవించు జీవులలో చెట్లు మొదటి స్థానములో యున్నవి. పక్షులు,
పది నుండి పదిహేను శాతము అనుభవిస్తూ రెండవ స్థానములో యున్నవి.
జలచరములయిన కప్పలు, తాబేళ్ళు, చేపలు 15 నుండి 20 శాతము
నొప్పిని అనుభవిస్తూ మూడవ స్థానములోయున్నవి. జంతువులు ఇరవై
నుండి ముప్పై (20 నుండి 30) శాతము వరకు అనుభవిస్తూ నాల్గవ
స్థానములో యున్నవి.
194) ప్రశ్న :- శారీరక వ్యాయామము వలన ఆత్మశక్తి పెరుగునా?
జవాబు :- మనిషి తన శక్తిని పెంచుకోవాలని శరీర వ్యాయామము
చేయుచున్నాడు. శరీరమునకు శక్తి ఇచ్చునది ఆత్మేనని చాలామందికి
తెలియదు. శరీర వ్యాయామము వలన శక్తి పెరుగుతుందని చాలామంది
కఠోర వ్యాయామము చేయుచున్నారు. శరీర వ్యాయామము చేయుట
వలన శరీర శక్తి పెరిగినట్లు మనిషికి తెలియుచుండినా, అది వ్యాయామము
వలన వచ్చినదేయని నమ్మకమున్నా ఆత్మ తన చైతన్యమును ఇచ్చినప్పుడే
శరీర బలము పని చేయును. శరీరమునకు బలమును నిర్ణయించి
ఇచ్చువాడు ఆత్మయే. మనిషి శరీరమును నమ్ముకొని వ్యాయామము చేయుట
కంటే ఆత్మను గురించి తెలియగలిగితే ఎంతటి శక్తినయినా పొందవచ్చును.
రావణబ్రహ్మ శరీర వ్యాయామము చేయలేదు. ఆత్మను విశ్వసించి ఆత్మను
తెలియుట వలన ఆత్మను అర్థించి శక్తిని పొంది కైలాసగిరిని పైకి
ఎత్తగలిగాడు. వాలి మహా బలాఢ్యుడయినాడు. ఆంజనేయుడు మూలికా
శక్తి చేతనే (ఆత్మశక్తి చేతనే) మహా బలశాలి అని పేరుగాంచాడు.
అందువలన వ్యాయామము వలన ఆత్మకు శక్తి రాదుగానీ, ఆత్మ వలననే
శరీరమునకు శక్తి వచ్చుచున్నది.
195) ప్రశ్న :- దయ్యాలను చూపే యంత్రములను భవిష్యత్తులో మేము
కనిపెడితే మీ స్పందన ఎట్లుండును?
జవాబు :- దయ్యాలు లేవు అనే మీరు హేతువాదులు) దయ్యాలున్నాయని
నమ్మగలిగి, వాటిని చూపే యంత్రములను కనుగొనగలిగితే మీరు మా
దారిలోనికి వచ్చినందుకు సంతోషిస్తాము. దయ్యము ఉంది అని విశ్వసిస్తే
తర్వాత దేవుడున్నాడని పరోక్షముగా విశ్వసించినట్లేయును. దయ్యము
వికృతి పదము, దేవుడు ప్రకృతి పదము అని చెప్పుచుందురు. అనగా
ప్రకృతి నుండి తయారయినది వికృతియని చెప్పవచ్చును. దేవుడు అను
శబ్దమునుండి పుట్టినది దయ్యము. అందువలన దయ్యమును నమ్మితే
దేవున్ని కూడా నమ్మినట్లేయగును. బ్రాహ్మణుడు ప్రకృతి పదముకాగా
దానినుండి పుట్టినది వికృతి పదము బాపడు. బాపడు అనువానిని నమ్మితే
బ్రాహ్మణుడు అను వానిని నమ్మినట్లే కదా! పంచభూతములు ప్రకృతి కాగా
సర్వభూతములు వికృతిగా యున్నవి. కనిపించని దేవుడునుండి కనిపించే
దయ్యములు వచ్చినవని, దయ్యములను చూడగలిగితే ఎప్పటికయినా
మోక్షము పొంది దేవున్ని చూడవచ్చని చెప్పుచున్నాము.
196) ప్రశ్న :- ఆత్మను నీటితో పోల్చెదము కదా! అయితే 'నీరు' అనే
పేరులోగానీ ‘జలము' అనే పేరులోగానీ జ్ఞానార్థము ఏమైనా ఉన్నదా?
జవాబు :- ఆత్మను నీటితో పోల్చకూడదు. ఆత్మశక్తిని నీరుతో పోల్చవలెను.
ఆత్మను అగ్నితో పోల్చవలెను. భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ ఆత్మను
అగ్నితో పోల్చారు. ఆత్మశక్తి సర్వ అవయవములకు ప్రవహించుట వలన
అర్థమగుటకు నీటి ప్రవాహముతో పోల్చి చెప్పడమైనది. అర్థమగు నిమిత్తము
శక్తి ప్రవాహములాంటిదని నీరుగా పోల్చి చెప్పారు. కర్మను దహించు శక్తి
ఆత్మకుండుట వలన ఆత్మను అగ్నితో సమానముగా పోల్చారు. ఆత్మ
ఎల్లప్పుడు శరీరము లోపలే యుండును కనుక ఆత్మను అగ్నిగా కూడా
చెప్పారు.
197) ప్రశ్న :- కర్మానుసారము శరీరము వస్తుంది అంటే శారీరకముగా,
మానసికముగా, తల్లితండ్రుల బాహ్య శరీర పోలికలతో పాటు మానసిక
పోలికలు కూడా బిడ్డలకు వస్తున్నవి. అదెలా అంటే ఆత్మహత్యలు (హత్యలు)
చేసే గుణము గల తల్లితండ్రులకు పుట్టిన బిడ్డలకు కూడా అదే గుణములతో
పని చేయు కౄరత్వము కల్గి వారు కూడా హత్యలు చేయాలను చింత
కల్గియుందురు. మరి ఇవి వీటికి జన్యువులే కారణమనే నవీన సిద్ధాంతములో
మీ కర్మ సిద్ధాంతము పని చేయనట్లే కదా?
జవాబు :- మనుషులు తమ సంతతికి తామే కారణమని అనుకోవడము
జరుగుచున్నది. వాస్తవముగా వారి బిడ్డలకు వారు కారణము కాదు.
తండ్రి వీర్యకణముతో సంబంధము లేకుండా అందరూ పుట్టుచున్నారు.
మొదటి నుండి ఇదే జరుగుచున్నది అయినా ఎవరికీ తెలియదు. అయితే
పుట్టిన బిడ్డకు తల్లిదండ్రుల పోలికలు వచ్చుట వలన తమ బిడ్డలు తమకు
పుట్టారని మురిసిపోవుచుందురు. కొన్ని పోలికలు తల్లితండ్రులవి ఉండడమే
కాకుండా వారికున్న బుద్ధి స్వభావములు, గుణ స్వభావములు వచ్చుట
వలన తల్లితండ్రులు వారు కాదని ఎవరూ చెప్పలేరు. ఆత్మయే అందరికీ
బీజదాతయనీ, ఆత్మే అందరికీ బాహ్య తల్లితండ్రులను నమ్మించుటకు
పోలికలను ఇవ్వడమేకాక తల్లితండ్రులు ఏవి ఇష్టముగా చేయుచుందురో
అవే పనులు ఇష్టముగా చేయుట వలన వారికి తల్లితండ్రి గుణములు
వచ్చినట్లు కనపడుటకు ఆత్మే అలా తయారు చేయుచున్నది. దానివలన
కనపడు తల్లితండ్రులే నిజమైన తల్లితండ్రులుగా చెప్పుచున్నారు. శిశువు
ఏ శరీరమునుండి పుట్టుచున్నాడో ఆ శరీరములోని ఆత్మే ఆ శరీరము
యొక్క జన్యుకణములను శిశు శరీరములో ఉండునట్లు చేయుట వలన
శిశువు పెరిగి పెద్దదైనప్పుడు తల్లితండ్రుల జీన్స్ బిడ్డల శరీరములో
కనిపించుట వలన తమ జన్మకు ఆత్మ కారణమని, ఆత్మే తండ్రియని
ఎవరికీ తెలియకుండా పోయినది.
198) “శుచీనాం శ్రీమతాం గేహే” అనే శ్లోకానుసారము యోగీశ్వరునిగా
వచ్చిన శ్రీకృష్ణుని పుత్రులు జ్ఞానులయ్యారా? లేదా?
జవాబు :-భగవద్గీత ఆత్మసంయమ యోగములో 41వ శ్లోకమందు
“శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే" అని కలదు. అక్కడ
చెప్పినట్లు “యోగభ్రష్టులయిన వారు మంచి జ్ఞానుల ఇల్లలోగానీ, యోగుల
ఇల్లలోగానీ జన్మించుదురు” అని కలదు. అయితే కృష్ణుడు యున్న
సమయములలో యోగభ్రష్టులు ఎవరూ లేరనుకో అప్పుడు వారు వచ్చి
యోగుల ఇల్లలో పుట్టే అవకాశమే లేదు కదా! అప్పుడు భూమిమీద
యోగ విధానము లేదని కృష్ణుడు తన బోధలో మూడు యోగ విధానములను
తెలిపాడు. కృష్ణుడు చెప్పినప్పుడు యోగుల విషయము బయటికి తెలిసినది.
అంతవరకు యోగము అంటే ఏమిటి, యోగములు ఎన్ని అను విషయము
ఎవరికీ తెలియదు. అందువలన అప్పుడు యోగభ్రష్టులు లేరు. కృష్ణుని
ఇంట్లో పుట్టిన వారు సాధారణ మనుషులే అయి ఉంటారు తప్ప యోగ
భ్రష్టులు ఎవరూ ఉండరు.
199) ప్రశ్న :- భూమి పుట్టుక 450 కోట్ల సంవత్సరముల క్రితము అని
మేము చెప్పుచున్నాము. ఇప్పటికి 200 కోట్ల సంవత్సరముల వరకు
భూమిమీద ఏ ప్రాణీ లేదనేది వాస్తవము. మీ సిద్ధాంతము ప్రకారము
భూమి పుట్టుక వెంటనే జీవులు ఏర్పడెనా? లేక కొంత వ్యవధి పట్టిందా?
మానవ పరిణామము ఇప్పటికి 70 లక్షల సంవత్సరముల క్రితము ఆఫ్రికాలో
ఏర్పడినదని మా వాదన. దీనికి మీరేమంటారు?
జవాబు :- మాకు తెలిసిన దానిప్రకారము ప్రకృతి ముందు పుట్టినది.
ప్రకృతిలో భూమి కూడా ఒక భాగమే. తర్వాత కొంత వ్యవధిలో జీవుల
సృష్ఠి జరిగినది. జీవులకంటే ముందు భూమి ప్రకృతి పుట్టడము వాస్తవమే.
అయితే భూమి పుట్టుకకు జీవుల పుట్టుకకు కొంత వ్యవధి ఉండుట వాస్తవమే
అయినా అది ఎంత అనునది మాకు కూడా తెలియదు. ప్రకృతి పూర్తి
రూపురేఖలు దిద్దుకొనుటకు కొంతకాలము జరిగినది వాస్తవమేయని మేము
కూడా అంటున్నాము. అయితే జీవుల పరిణామములో ముందు మనుషులే
పుట్టారనీ తర్వాత జీవరాసులు సృష్ఠి జరిగినదని మేము చెప్పుచున్నాము.
లేదు ముందు జీవరాసులు పుట్టాయని మీరు అంటున్నారు. పరిణామ
సిద్ధాంతము వాస్తవము కాదు. భగవద్గీత బ్రహ్మవిద్యా శాస్త్రమగును.
దానిప్రకారము చూస్తే మనుషులు ముందు జీవరాసులు వెనుక
తయారయినవని చెప్పవచ్చును. మనుషులు ఎప్పుడు సృష్టింప బడినారని
మేము ఖచ్చితముగా చెప్పలేము. ఎప్పుడు తయారయివున్నా 'మనుషులు
ముందు జీవరాసులు వెనుక' పుట్టారని చెప్పుచున్నాము.
200) ప్రశ్న :- స్త్రీ, పురుషుల కలయిక వలననే సంతతి అభివృద్ధి
చెందుతున్నదని అది ప్రకృతి పరమాత్మకు నమూనాయని మీరు చెప్పారు.
పురుషుని శుక్రకణము అక్కడ లేకుండానే 'డాలి' అనే గొర్రెపిల్లను సృష్టించి
(క్లోనింగ్ ద్వారా) పురుషుని నమూనాయే లేకుండా చేశారు. తర్వాత
మానవులలోనికి ప్రవేశించి, మగవారు అక్కడ లేకుండా ఆడవారు బిడ్డలు
కనే రోజులు వస్తాయి. మరి మీ ప్రకృతి పరమాత్మల సిద్ధాంతము భవిష్యత్తులో
అడ్రస్ లేనిదవుతుందేమో?
జవాబు :- పురుష శుక్రకణము లేకుండా పిల్లలుకంటున్నారని ఇంతకు
ముందు చెప్పాము. దేవుని సృష్టిలోనే పురుషకణము లేకుండా దేవుడే
జీవులను సృష్ఠించుచున్నాడు. మనుషులు ఆ ప్రయత్నములో క్లోనింగ్
ద్వారా గొర్రెపిల్లను పుట్టించగలిగినా అది ఎక్కువ కాలము బ్రతుకలేదు.
అంతేకాక మిగతా గొర్రెలలాగా దానిలో రోగ నిరోధక శక్తి లేదు. దానికి
కీళ్ళ నొప్పులు వగైరా రావడము జరిగినది. దానివలన గొర్రె పిల్లవరకే
చేసి చూచినా శాస్త్రవేత్తలు అంతటితో వారి పరిశోధన ఆపివేసి, మనుషుల
వరకు రాలేదు. మగవారు లేకుండా పిల్లలు పుట్టుచున్నారని ఇంతకు
ముందే తెలిసిపోయినది. దానికి కారణము కూడా తెలిసింది. ప్రకృతి,
పరమాత్మల సృష్ఠి సిద్ధాంతము మగవారు లేకున్నా ఉంటుందని తెలిసి
పోయింది. అందువలన ఆ సిద్ధాంతము ఎక్కడా పోదు.
201) ప్రశ్న :- వినాయకుని ఊరేగింపులు స్వాతంత్ర్యము కోసం పోరాటము
చేస్తున్న సమయములో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్ర
లో ప్రారంభించారు. తర్వాత వినాయక ఊరేగింపులు వ్యాపించాయని
నిన్నటి (03-09-2016) వార్తాపత్రికలో వచ్చింది. మీరేమో కలియుగము
మొదటి కాలములోనే బలవంతునిచే బలహీనులు అణగద్రొక్కబడు
చున్నారనీ, దాని నమూనాను ఎలుక ఏనుగు గుర్తుగా చూపుచూ వినాయక
ఊరేగింపులు ప్రారంభమయినాయని చెప్పారు. అది మంచి పద్ధతి కాదన్నట్లు
ఏనుగు బొమ్మను విరగగొట్టి నామరూపములు లేకుండా పోవునట్లు నీటిలో
కలిపేవారన్నారు. అయితే చరిత్రలో 1750 సంవత్సరముల నుండి
వినాయకున్ని దేవునిగా ఊరేగించడము ఉంది. దీనికి మీరేమంటారు?
జవాబు :- నేను చెప్పినది కృతయుగము మాట. అప్పుడది జరిగేది.
తర్వాత లేకుండాపోయినది. తర్వాత 1750 సం|| అప్పుడు మొదలయినది.
అయితే అప్పటి ఆచరణలు అన్ని ఉన్నాయి. కానీ అది భక్తిగా
మారిపోయినది. ఆనాడు సామాజిక న్యాయమని చేసిన పనిలో ఏనుగును
ధనుకునిగా ఎలుకను పేదవానిగా భావించి 'ఎలుక మీద ఏనుగు స్వారీ
చేయుట” అనగా “ధనికుడి పెత్తనము పేదవాని మీద ఉండుట మంచిది
కాదని” ఊరు ఎరిగింపు చేసి దానిని లేకుండా చేయుటకు నీటిలో కలిపే
వారు. నేడు అదే వుంది అయితే భావములో భక్తి ఏర్పడినది. మొదటిది
మాసిపోయినది.
ఇంతవరకు రెండు వందల ఒకటి (201) ప్రశ్నలను ఒకే వ్యక్తి
అడగడము జరిగినది. ఆ ప్రశ్నలకన్నింటికి జవాబులు ఇచ్చాము. అయితే
అవి వారికి ఎంతవరకు సంతృప్తిని ఇస్తాయో లేదోగానీ ప్రజలకు అనేక
రుచుల ఆహారమును ఇచ్చినట్లయినది. మా వైపు నుండి మేము చెప్పేదే
కాకుండా ఇతరుల వైపునుండి వచ్చే ప్రశ్నలకు జవాబులివ్వడము వలన
చదివే వారికి అనేక రుచులను అందించినట్లవును అను ఉద్దేశ్యముతో
హేతువాద ప్రశ్నలను తీసుకొన్నాము. అడిగినవారు హేతువాదులు కాకున్నా
హేతువాదము నుండి వారికి వచ్చిన ప్రశ్నలను మాకు పంపడము జరిగినది.
చివరికి ప్రశ్నలన్నీ హేతువాదుల వైపునుండి వచ్చినవేయని తెల్పుచున్నాము.
ఇంతవరకు చెప్పిన రెండు వందల ఒకటి (201) ప్రశ్నలు హేతువాదులవే.
ఇప్పుడు ఇక్కడినుండి వచ్చు ప్రశ్నలు పూర్తి హేతువాదమునకు
సంబంధించినవి కాకపోవచ్చును. ఈ ప్రశ్నలలో ఏసును గురించి బైబిలును
గురించిన ప్రశ్నలు ఎక్కువ గలవు. ఇందులో హేతువాద శాతము ఎక్కువ
లేనందున సర్వసాధారణ ప్రశ్నలుగానే మేము తలచుచున్నాము. అడిగిన
వారు క్రైస్థవములో ఎన్నో సంవత్సరములుగా బోధకులుగా పని చేయుచున్న
వారు. ఇక్కడ మూడు మతముల వారికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు
ఇవ్వడము జరుగును. అందువలన క్రైస్తవులు అడిగిన ప్రశ్నలకు, అలాగే
ముస్లీమ్లు అడిగిన ప్రశ్నలకు మేము జవాబులు ఇవ్వదలచాము. “సర్వ
మతములకు ఒకే దేవుడు, ఒకే జ్ఞానము” అన్నది మా సూత్రము.
అందువలన ఏ మత ప్రశ్నకయినా జవాబు ఇవ్వడము మా బాధ్యత.
1) ప్రశ్న :- దేవుడు ఇచ్చిన మూడు గ్రంథములలో మనుషుల జ్ఞానము
చేర్చబడుతూ ప్రజలు జ్ఞానహీనులుగా మారుతుంటే దేవునికి ఇష్టమా?
జవాబు :- ప్రజలు జ్ఞానవంతులు కావాలని దేవుడు భగవంతునిగా
అప్పుడప్పుడు వచ్చి తన జ్ఞానమును తెలియజెప్పి పోతున్నాడు. దేవుడు
తెచ్చిన మూడు విధానములలో స్వచ్ఛమయిన జ్ఞానమున్నా మనుషులలో
కొందరు స్వార్థులు తమ పెత్తనమును చెలాయించుటకు తమ జ్ఞానమును
దేవుని జ్ఞానముతో జోడించుచున్నారు. అలా మూడు గ్రంథములలో కొంత
కలుషితము ఏర్పడినది. దేవుడు చెప్పని విషయములు, జ్ఞానమునకు
సంబంధములేని విషయములను కూడా కొన్ని గ్రంథములో ఇరికించి ఇది
దేవుడు చెప్పాడని ప్రజలను మభ్యపెట్టి వారి మత విధానములో నడుపు
చున్నారు. దేవుడు చెప్పిన జ్ఞానములో మత విధానము ఏమాత్రముండదు.
అయినా దైవగ్రంథములో అది కనిపించుచున్నదంటే దైవగ్రంథములోనికి
కూడా మనుషుల మత సంబంధ అజ్ఞాన బోధలు చేరాయని అర్థమగు
చున్నది. దానివలన ప్రజలు అజ్ఞానులుగా మారుటకు అవకాశమున్నది.
దేవుని జ్ఞానమును ప్రక్కనబెట్టి మనుషుల జ్ఞానమునే ఆచరించుచున్నారు.
దేవుడు జ్ఞానము తెలిపితే దేవుని శ్రమను కాదని తమ జ్ఞానమును
అడ్డము పెట్టడము దేవునికి ఇష్టము లేదు. అందువలన ఇది తప్పు, ఇది
ఒప్పు అని సత్యాసత్యమును తేల్చి చెప్పు గీటురాయిలాంటి వారిని తిరిగి
భూమిమీదికి పంపునని అనుకొంటున్నాము. అలా వచ్చినవాడు ఏ
మతములో అజ్ఞానమున్నా దానిని బయటికి తీసి చూపడమే తమ పనిగా
పెట్టుకొని స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమును మనుషులకు అందేలా
చూడగలడు. దేవుని జ్ఞానమును ప్రజ్వరిల్ల చేయు పనిలో మనిషి జ్ఞానము
కొట్టివేయబడును. అలా జరుగుట మతఛాందసవాదులకు ఆటంకముగా
కనిపించినా దేవుడు పంపిన వానిమీద కుట్రలు, కుతంత్రములు చేసినా
దైవము వైపునుండి వచ్చినవాడు ఏమాత్రము భయపడడు. తాను ఏమి
చెప్పవలెనో దానినే చెప్పుచూపోవును.
2) ప్రశ్న :- ఏసు చనిపోయిన 50 రోజులకు ఆదరణకర్త అనగా
పరిశుద్ధాత్మ భూమిమీదికి వచ్చెనని యావత్ క్రైస్థవ లోకము నమ్ముతుంది.
దీనికి మీరేమంటారు?
జవాబు :- ఏసు చనిపోకముందే ఆదరణకర్త వస్తాడని ఏసే చెప్పాడు.
ఆదరణకర్త పరిశుద్ధాత్మయేనని కూడా చెప్పాడు. యోహాన్ సువార్త 16వ
అధ్యాయములో ఏడవ వచనములో “నేను పోతేనే ఆదరణకర్త మీ వద్దకు
వస్తాడు. నేను పోనిదే ఆయన మీవద్దకు రాడని కలదు" చూడండి.
(యోహాన్ 16-7) “నేను వెళ్ళిపోవుట వలన మీకు
ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీవద్దకు
రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీవద్దకు పంపుదును".
దీనినిబట్టి ఏసు వెళ్లిపోని యెడల ఆదరణకర్త మనవద్దకు రాడన్నమాట.
అంతేకాక నేను వెళ్లిన యెడల ఆయనను మీవద్దకు పంపుదును. దీనినిబట్టి
ఏసు పోయి ఏసే ఆదరణకర్తను పంపవలసియున్నది. ఈ మాటల వలన
ఏసు పోనిది ఆదరణకర్త రాడని తెలిసిపోవుచున్నది. ముఖ్యముగా ఏసు
పోకడ ఆదరణకర్త రాకడకు మూలమైయున్నది. అయితే ఏసు ఎప్పుడు
పోతానని ఎవరితోనయినా చెప్పాడా? పోతానన్న మాట వాస్తవమే!
‘ఎప్పుడు?' అన్నమాట సందిగ్ధము. ఎప్పుడైనా గానీ ఏసు పోయినప్పుడు
ఆదరణకర్త రాగలడు. ఏసు ఎప్పుడు పోయాడను విషయములో ఆయన
తేల్చి చెప్పలేదు. మనము చూడలేదు.
ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు ఏసు పోయాడనుకొందాము. ఏసు
పోయిన దానివలన ఆదరణకర్త యుండును. అయితే ఎవరు ఆదరణ
కర్త? ఎవరయినా ఇంతవరకు నేను ఆదరణకర్తను అని చెప్పియున్నారా?
ఎవరూ చెప్పలేదు. మనుషులు తమంతకు తాము ఊహించుకొని ఏ
ఆధారము లేకుండా మాట్లాడుకొనుచున్నారు. ఏసు చనిపోయిన 50
రోజులకు ఆదరణకర్త వచ్చాడని కొందరు అంటున్నారు. ఏసు ఎప్పుడు
చనిపోయాడో ఖచ్చితముగా ఎవరయినా చెప్పగలరా? ఒకవేళ మరణము
నుండి లేచి వచ్చిన తర్వాత, సమాధినుండి బయటికి మరణమును జయించి
వచ్చిన తర్వాత మరణము లేదు కదా! అటువంటి వాడు 50 రోజులకే
చనిపోయాడా? ఇట్లు అనేక సంశయములు వచ్చును. అన్నిటికీ ఏదో
ఒకటి సమాధానము చెప్పి ఆదరణకర్త వచ్చాడు అనుకొందాము. వచ్చిన
ఆదరణకర్త ఎవరని తెలియగలదు. వచ్చినవాడు నేను ఆదరణకర్తను అని
చెప్పడు. అందువలన వచ్చిన వానిని తెలియుటకు వీలు లేదు. ఈ
విషయమై యోహాన్ సువార్త 14వ అధ్యాయము, 17వ వచనమును చూస్తే
ఇలా కలదు. (యోహన్ 14-17) “లోకము ఆయనను చూడదు,
ఆయనను ఎరుగదు. గనుక ఆయనను పొందనేరదు. మీరు
ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివశించును
మీలో ఉండును" అని కలదు. దీనిప్రకారము ప్రపంచపు ప్రజలకు
ఆదరణకర్త వచ్చాడను విషయము ఏమాత్రము తెలియదు. ఏసు తన
జన్మను చాలించి పోయిన తర్వాత ఎంతో కొంత కాలమునకు ఆదరణకర్తగా
ఏసే రావలసియున్నది. వచ్చే ఆదరణకర్త ఎవరో కాదు ఏసే. అందువలన
తన శిష్యులను 'మీరు ఎరుగుదురు' అని చెప్పడమేకాక ప్రక్కనే 18,
19వ వచనములలో ఇలా కలదు చూడండి. (యోహాన్ 14-18,19)
'మిమ్ములను అనాథలనుగా విడువను. మీ వద్దకు వత్తును. కొంత
కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు.
అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక
మీరును జీవింతురు." ఏసు శరీరముతోయున్నప్పుడు చెప్పిన మాటలివి.
కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. ఈ మాట ప్రకారము
శరీరముతోయున్న ఏసును కొంతకాలము వరకు ఈ లోక ప్రజలు
చూడగలరని తర్వాత మరి ఎప్పటికీ తనను చూడరని చెప్పాడు. అంటే
అప్పుడు శరీరమును వదలిపోయిన తర్వాత ఏసు భౌతికముగా కనిపించడు
కావున ఎప్పటికీ లోకము ఆయనను చూడలేదు. అలాంటప్పుడు వేరే
శరీరము ధరించి ఆదరణకర్తగా వచ్చిన ఆయనను తెలియరని అర్థము.
అందువలన “లోకము ఆయనను చూడదు, ఎరుగదు" అని వాక్యములో
చెప్పారు.
ఇన్ని విషయములు అర్థముకాకపోయినా వెనుక జరిగిన
సంఘటనలో మరియొక విషయమును జ్ఞాపకము చేసుకొని చూస్తే ఇలా
కలదు. లూకా, 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు చూడండి.
(లూకా-23-39, 40, 41, 42, 43) "వ్రేలాడదీయబడిన ఆ
నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచూ నీవు క్రీస్తువు కదా!
నిన్ను నీవు రక్షించుకొనుము. మమ్ములను కూడా రక్షించుమనెను.
అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో
ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే.
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గానీ
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసూ,
నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను
మనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడా పరదైసులో
ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను." అప్పుడు ఏసు
నేరస్థునికి ఇచ్చిన మాట ప్రకారము పరదేశములో కొంత కాలముండ
వలసి వచ్చినది. ఎంత కాలమున్నాడు, ఏ దేశములో ఉన్నాడు అనుటకు
వివరము “ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?" అను మేము వ్రాసిన
గ్రంథమును చూడండి. దీనిప్రకారము ఏసు చనిపోయిన తర్వాత 50
రోజులకే ఆదరణకర్త వచ్చాడు అనుట అవాస్తవము. ఆదరణకర్తగా
వచ్చువాడు ఎవరో కాదు ఏసే కనుక ఆయన రెండవరాక కొరకు కొన్ని
సంవత్సరముల ముందే ప్రణాళికను ఏర్పరచుకోవలసిన అవసరమున్నది.
అందువలన కొన్ని సంవత్సరములు తన ప్రణాళికను రచించుకొన్న తర్వాత
ఏసు ఆదరణకర్తగా రావలసియున్నది. ఈ విషయములన్నియూ
ఆలోచించకనే ఏసు శిలువ వేయబడిన తర్వాత 50 రోజులకే ఆదరణకర్త
వచ్చాడనిగానీ, ఏసు చనిపోయాక 50 రోజులకు ఆదరణకర్త వచ్చాడనిగానీ
చెప్పుట అసత్యమగును.
3) ప్రశ్న :- మోషేకు కనపడిన 'తౌరాతు' గ్రంథమును ఎంతవరకు
తెలియజేశాడు. కొందరు ఆదికాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశ
కాండము, సంఖ్యా కాండము, ధర్మశాస్త్రము అని అంటున్నారు నిజమా?
జవాబు :- మోషేకు కనబడిన తౌరాతు గ్రంథములోని జ్ఞానమునంతటినీ
మోషే ధర్మశాస్త్రము అను పేరుతో చెప్పాడు. మోషే చెప్పిన ధర్మశాస్త్రము
వలన అప్పటి ప్రజలు సంపూర్ణ జ్ఞానులుగా తయారయినారు. ఆ కాలములో
మోషే చెప్పిన ధర్మశాస్త్రము మంచి పేరుగాంచినది. మోషే చెప్పితే వినిన
జ్ఞానమేగానీ, మోషే చెప్పు ధర్మశాస్త్రము ఏ గ్రంథములోనిదో ఎవరికీ
తెలియదు. మోషే చూచి చెప్పుచున్న తౌరాతు గ్రంథము మోషేకు ఒక్కనికే
ప్రతి దినము కనిపించేది. అందులో చూచిన జ్ఞాన విషయములనే మోషే
ప్రజలకు చెప్పేవాడు. మోషే చెప్పినది ధర్మశాస్త్రమనుట నిజము.
4) ప్రశ్న :- తండ్రి (దేవుడు) తనకిష్టమైన వారిని తనవైపు ఆకర్షించు
కొనుటకు దేవుడు పక్షపాతియా?
జవాబు :- మనుషులకు దేవుడు ఇష్టమైతే దేవునికి మనుషులు కూడా
ఇష్టులౌతారు. మనుషులు దేవున్ని శత్రువుగా చూస్తే దేవుడు కూడా
మనుషులను శత్రువులుగా చూస్తాడు. మనుషుల విధానమునుబట్టి
దేవుడుంటాడు. దేవునికి ఇష్టమైన వారున్నారు అంటే ముందు మనుషులకు
దేవుడు ఇష్టుడై ఉంటాడు అని అర్థము. మనుషులనుబట్టి దేవుడుండును
కనుక దేవుడు తనకిష్టమైన వారిని తనవైపు వచ్చుటకు ఏ ఆటంకము
లేకుండా చేయును. దేవునివైపు పోవుటకు మాయ ఒప్పుకోదు. దేవుడు
మనిషిని ఒప్పుకొంటే మాయ కూడా ఒప్పుకుంటుంది. దేవునికి ఇష్టుడు
కానివానిని దేవుని మార్గములో ముందుకుపోనివ్వక ఆటంకపరచును.
దేవుడంటే పూర్తి భక్తి విశ్వాసములు కల్గి, దేవుని మీదనే తన ధ్యాసను
పెట్టుకొన్న వానికి దేవుడు కూడా అతనిని ఇష్టపడుట చేత మాయ అతనికి
ఏ ఆటంకము కలుగకుండా చేయగలదు. అప్పుడు వాడు దేవునివైపు
పోవుటకు మంచి అవకాశము లభించును.
5) ప్రశ్న :- ఏసు గుజరాత్లో 30 సంవత్సరములు ఏమి చేసెను?
జవాబు :- రాబోవు తన రెండవ జన్మను గురించి ప్రణాళికను సిద్ధము
చేసుకొన్నాడు. 30 సంవత్సరముల ఫతకములో పుట్టుకనుండి మరణము
వరకు ప్రతి విషయము వ్రాసిపెట్టాడు.
6) ప్రశ్న :- రక్తము అనగా ప్రాణమా? రక్తము దేవుని మొర పెట్టునా?
జవాబు :- రక్తము అనగా జ్ఞానము అని భావించవలెను. సువార్తలలో
జ్ఞానమును “నిబంధన రక్తము” అని చెప్పియున్నారు. జ్ఞానము ద్వారా
దేవున్ని వేడుకోవచ్చును. అలా చేయడమే సరియైన దారి, లేక సరియైన
పద్ధతి.
7) ప్రశ్న :- శరీరములో ఉన్న ఆత్మకు మనిషి ఎన్ని జన్మలు ఎత్తినది
తెలుసునన్నారు. అయితే కొందరికే ఎందుకు ఆత్మ పునర్జన్మలను గురించి
తెలుపుచున్నది. అందరికీ ఎందుకు తెలుపదు?
జవాబు :- పునర్జన్మలు ఉండడము సత్యమే అయినా ఏ ఆధారము లేకపోతే
ఎవరూ నమ్మరను ఉద్దేశ్యముతో అక్కడక్కడ ఎవరికో ఒకరికి వెనుకటి
జన్మ జ్ఞాపకము వచ్చునట్లు ఆత్మ చేయుచున్నది. ఆధారము కొరకు
చూపవలసినదే కావున 20 లేక 30 సంవత్సరములకు ఒకమారు వివిధ
ప్రాంతములలో వెనుక జన్మ జ్ఞాపకము వచ్చి చెప్పుట వలన, ఆ జ్ఞాపకము
లన్నీ సత్యమైనవిగా నిరూపణకు వచ్చుట వలన ఎవరయినా పునర్జన్మలను
నమ్మవలసి వచ్చును. ఒక ఆధారము ఆ ప్రాంతములో వ్యాపించుట వలన
అందరికీ తెలియును. అందువలన అందరికీ పునర్జన్మ జ్ఞాపకములు
అవసరము లేదు.
8) ప్రశ్న :- కర్మానుసారమే ప్రతి మనిషి దినచర్య జరుగును అన్నారు.
దీనిని ప్రజలు ఎందుకు గుర్తించరు. జరిగిన పనులనన్నిటినీ నా గొప్ప
తనము, నేనే చేశాను అని ఎందుకు అంటున్నాడు?
జవాబు :- ప్రతి చిన్న పని, పెద్దపని అన్నీ కర్మానుసారము ఆత్మ చేయు
చుండగా, మనిషి తన అజ్ఞానము చేత తన శరీరములో జరుగు విధానము
తెలియక 'నేను' అను అహము చేత జరిగెడి పనినంతా నేనే చేయుచున్నానని
భ్రమించుచున్నాడు. చేయని దానిని చేశానని, చూడని దానిని చూచానని
చెప్పుచుండుట వలన కర్మ వలన ఆత్మ చేసిన పాపపుణ్యములు జీవునికే
తగుల్కొనుచున్నవి. మనిషి అనవసరముగా చేయని పాపమును తన నెత్తిన
వేసుకొంటున్నాడు. ఈ విషయమై యోహాన్ సువార్త 9వ అధ్యాయము,
41వ వాక్యములో ఏసువారు ఈ విధముగా చెప్పుచున్నారు చూడండి.
(యోహాన్ 9-41) "అందుకు ఏసు మీరు గ్రుడ్డివారయితే మీకు
పాపము లేకపోవునుగానీ, చూచుచున్నామని మీరిప్పుడు
చెప్పుకొను చున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను"
ఈ మాట ప్రకారము వాస్తవముగా జీవుడు గ్రుడ్డివాడు, ఏమీ చేత కానివాడు,
చెవిటివాడు మరియు అవిటివాడు. వాస్తవముగా ఏ కార్యమును జీవుడు
చేయడము లేదు. శరీరములోని ఏ అవయవము జీవుని ఆధీనములో
లేదు. అవయవములన్నియూ ఆత్మ ఆధీనములోయుండి పని చేయుచున్నవి.
కర్మప్రకారము ఆత్మ శరీర అవయవములకు శక్తినిచ్చి పని చేయించుచుండగా
జరిగే పనిలో ఏ సంబంధము లేని జీవుడు పనులను నేనే చేశానని
అహము చేత అనుకొంటున్నాడు. అలా అనుకోవడము మనిషిలోని
అజ్ఞానమేయని చెప్పవచ్చును.
9) ప్రశ్న :- ఇండియాలో ఎన్నో పేరుగాంచిన గొప్ప ప్రదేశములుండగా,
మీరు తాడిపత్రిలో చిన్నపొడమలను దైవజ్ఞానము అందించు కేంద్రముగా
ఎంచుకొన్నారు ఎందుకు?
జవాబు :- మనిషి స్వయముగా ఏదీ ఎంచుకోలేడు. అంతా దైవ నిర్ణయము
ప్రకారము జరుగుచుండును. అందులో భాగమే మేము ఒక ప్రాంతములో
యుండి జ్ఞానమును తెల్పుచున్నాము.
10) ప్రశ్న :- బైబిలులో ప్రతి రచయిత పరిశుద్ధాత్మ పేరుతో వ్రాశారు.
అందులో ఒక్క అక్షరమును కలిపినా, ఒక్క అక్షరమును తీసివేసినా
గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు మీకు వస్తాయి అని హెచ్చరిక
చేయబడినది. దీనిని మీరు సమర్థిస్తారా? 66 పుస్తకాలను నమ్ముచున్న
క్రైస్థవులు మీరు చెప్పుచున్న ఏసుక్రీస్తు వారు 63 సంవత్సరములు బ్రతికారు
అను మాటను జీర్ణించుకోలేకున్నారు. దీనికి మీరేమంటారు?
జవాబు :- నేను “ఏసు 63 సంవత్సరములు బ్రతికారు” అని చెప్పినది
నాలుగు సువార్తలకు సంబంధించిన పాఠములలో ఎక్కడా కలుపలేదు.
నాలుగు సువార్తలకు అతీతముగాయున్న మాటను చెప్పాను. నా మాట
బైబిలులో భాగము కాదు. నేను చెప్పిన మాట అందరూ వినవలెననిగానీ
విశ్వసించవలెననిగానీ చెప్పడము లేదు. నాకు తెలిసిన సత్యమును, చరిత్రలో
జరిగిన సత్యమును చెప్పాను. అంతేగానీ వినవలెనని ఎవరినీ బలవంతము
చేయలేదు. అది వారి ఇష్టాయిష్టముల మీద ఆధారపడియుండును. బైబిలు
గ్రంథము అంటే మొత్తము 66 పుస్తకముల కలయిక. అందులో సాక్ష్యాత్తూ
దేవుడు మారు వేషములో యుండి మాట్లాడిన మాటలను వ్రాసిన పుస్తకములు
నాలుగు రకములుగాయున్నవి. అవియే నాలుగు సువార్తలు. నాలుగు
సువార్తలలో ఒక్క అక్షరమును కూడా కదలించుటకు వీలులేదు. నాలుగు
సువార్తలు సత్యసమేతముగాయున్నవి. మిగతా పుస్తకముల గురించి మేము
పట్టించుకోవడము లేదు. అందులో కూడా జ్ఞానమే యున్నా 62
పుస్తకములకంటే దగ్గరైనవి నాలుగు సువార్తలనునవే. దైవగ్రంథములు
ప్రపంచములో మూడే గలవు. అవి భగవద్గీత (తౌరాత్), ఇంజీలు (బైబిలు),
ఖురాన్ అనునవి. ఈ మూడు గ్రంథములలో మానవ కలుషిత వాక్యములు
చేరకూడదు. ఒక వాక్యమునకు భావమును తప్పు చెప్పినా శిక్ష తప్పదని
ఖురాన్ గ్రంథములో దేవుడు హెచ్చరించినా దైవగ్రంథములలో కలుషిత
వాక్యములు అక్కడక్కడ కనిపిస్తూనే యున్నవి. దేవుడంటే భయము లేనివారు
చేసిన పనియని మనకు అర్థమగుచున్నది. అందువలన మూడు గ్రంథము
లను వడగట్టి చదువుకోవలెను.
11) ప్రశ్న :- మీరు ఒక సందర్భములో బాప్తిస్మమిచ్చు యోహాన్ను క్రీస్తువుకు
గురువు అన్నారు. క్రీస్తుకు గురువులుంటారా? జగత్ గురువు ఒక్కడే
కదా!
జవాబు :- ప్రపంచములో గురువులు రెండు రకములు. కనిపించే గురువు
కనిపించని గురువు అని రెండు విధములు గలరు. వారిలో యోహాన్
కనిపించే గురువు మాత్రమే. బయట గురు సాంప్రదాయము ప్రకారము
గురుబోధ లేక గురు ఉపదేశము, లేదా బాప్తిస్మము తీసుకోవలసియుండును.
లోక సాంప్రదాయము ప్రకారము ఏసు యోహాన్ దగ్గర బాప్తిస్మము
తీసుకొన్నాడు. అయితే కనిపించని గురువు జగత్ గురువు ప్రపంచమున
కంతటికీ గురువుగా ఉంటాడు. ఎవరయితే జగత్ గురువో ఆయన ఏసు.
ఏసు జగత్ గురువు అయినా బాహ్య సాంప్రదాయము ప్రకారము యోహాను
దగ్గర ఉపదేశమును పొందాడు. ఏసుకు బాప్తిస్మమిచ్చిన యోహాన్ ఏసు
బాప్తిస్మము పొందుటకు తన దగ్గరకు రాకముందే ఈ వాక్యమును చెప్పి
యున్నాడు చూడండి. (మత్తయి 3-11) "మారు మనస్సు నిమిత్తము
నేను నీళ్ళతో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక
వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు
మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మ
తోనూ, అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును." లోక సాంప్రదాయము
కొరకు ఏసుకు యోహాను బాప్తిస్మము ఇచ్చాడని ఈ వాక్యమును బట్టి
తెలియుచున్నది.
12) ప్రశ్న :- క్రిస్టమస్ డిశంబరు 25న అని యావత్ క్రైస్తవము చేస్తుంది.
క్రీస్తు పుట్టుక డిశంబర్ 25 కాదు కదా?
జవాబు :- డిశంబర్ 25వ తేదీన ఏసు పుట్టకపోయినా, పుట్టినా రెండింటి
వలన ఎవరికీ ఏమీ ప్రయోజనము లేదు. ఆయన పుట్టిన దినమును
గౌరవించు నిమిత్తము డిశంబర్ 25వ తేదీన ఏసు పుట్టినదిన పండుగ
చేయుచున్నాము. చేయుచున్న పనిలోని భావమే ముఖ్యమగుట వలన
పండుగ ఎప్పుడు చేసినా ఒక్కటే.
13) ప్రశ్న :- ప్రతిమ ఆరాధన చేయు మీరు క్రీస్తు వారి ప్రతిమను పెట్టు
ధైర్యము ఎందుకు చేయలేకపోయారు?
జవాబు :- నేను ఇంతవరకు ప్రతిమను ఆరాధించలేదు. చిన్నవయస్సులో
మా పెద్దలు గ్రామదేవతలయిన సుంకులమ్మ, పెద్దమ్మ దేవతలకు బలులు
ఇచ్చి ఆరాధించెడివారు. వారివెంట పోయి వారు చేయు పూజలను
చూచాను తప్ప స్వయముగా ఏనాడూ ఎవరినీ ఆరాధించలేదు. మా
ఆశ్రమములో కృష్ణ ప్రతిమయున్నది. ఇక్కడికి వచ్చు భక్తులు కృష్ణ ప్రతిమకు
పూజలు చేయుచుందురు గానీ నేను ఎప్పుడూ చేయి ఎత్తి కూడా
నమస్కారము చేయలేదు. నా చిన్నతనములోనే మా పెద్దలు సత్యనారాయణ
వ్రతము చేయాలని చెప్పితే పూర్తి వ్యతిరేఖించి ఆ వ్రతమును ఆపివేశాను.
తర్వాత ఇంటిలో మా నాన్నగారు చనిపోతే ఆ కార్యక్రమములలో పాల్గొన
లేదు. దినములు వగైరా ఏదీ చేయలేదు. మొదట నన్ను నాస్తికుడు అని
అందరూ అన్నారు. ఇప్పుడు కూడా కొందరు నా బోధలు అర్థము కానివారు
నేను నాస్తికత్వమును బోధిస్తున్నానని అనువారు కూడా కలరు. ప్రతిమను
నేను ఆరాధించనంతమాత్రమున అందరినీ అలాగే ఉండమని చెప్పలేదు.
కృష్ణ ప్రతిమను గౌరవార్ధము ఆరాధించమని చెప్పుచున్నాము. అలాగే
ఏసుప్రభువు చిత్రమును పెట్టి నమస్కరించమని చెప్పాము. మా సలహా
మీద వైజాగ్ దగ్గర మజ్జివలస ఆశ్రమములో ఏసు ప్రతిమను పెట్టడమైనది.
కృష్ణుడే ఏసు అని చెప్పు నేను ఇద్దరినీ ఒకే గౌరవముగా నమస్కరించ
మన్నాను.
14) ప్రశ్న :- ఇంజీలు అనబడిన నాలుగు సువార్తలలో మానవుల జ్ఞానము
చేరియున్నదా? అందులోనుంచి తీసివేయవలసినదేమయినా ఉన్నదా?
జవాబు :- నాలుగు సువార్తలలో మానవ కల్పితములు ఏమీ లేవు. అంతా
దేవుని జ్ఞానమే కలదు.
15) ప్రశ్న :- మీరు కొన్ని విషయములను చెప్పిన వాటినే మరల మరల
జ్ఞాపకము చేస్తారు ఎందుకు?
జవాబు :- మరచిపోవుటకు అవకాశమున్న విషయములను, ముఖ్యమైన
విషయములను మరల మరల జ్ఞాపకము చేస్తుంటాము.
16) ప్రశ్న :- శ్రీకృష్ణుడు ఎదురు కాళ్ళతో జన్మించాడు అన్నారు. మరి
ఏసువారు ఎలా జన్మించారు. సామాన్యమైన మనుషులు కూడా
అప్పుడప్పుడు అలాగే ఎదురు కాళ్ళతో పుట్టుచుందురు. వారేమయినా
ప్రత్యేకులా?
జవాబు :- కృష్ణుడు ఎదురు కాళ్ళతో జన్మించినది వాస్తవమే. కృష్ణుని
శరీరమునకు తల్లిగర్భములోనే ప్రాణమున్నదని నిరూపించుటకు అలా
పుట్టవలసి వచ్చినది. కాళ్ళు గర్భమునుండి బయట పడిన వెంటనే ఒక
కాలును కదలించుట వలన శిశువుకు గర్భము లోపలే ప్రాణమున్నదని
అర్థమగుటకు సాక్ష్యముగా కాళ్ళతో పుట్టడము, కాళ్ళు కదలించడము
జరిగినది. ఒక విషయము యొక్క నిరూపణ కొరకు ఒకమారు జరిగిన
సరిపోవును. రెండవమారు జరుగవలసిన అవసరము లేదు. అందువలన
ఏసు విషయములో అలా జరుగలేదు. కృష్ణుడు ఏసు ఇద్దరూ ఒక్కరే
అగుట వలన ఏసు పుట్టుకలో ఎదురు కాళ్ళతో పుట్టడము జరుగలేదు.
తర్వాత కాలములో చాలామంది ఎదురు కాళ్ళతో పుట్టడము జరిగినది.
వారిలో ఏ ప్రత్యేకత లేకున్నా వారిని దేవుడు అలాగే పుట్టించాడు. దానివలన
కృష్ణుని జన్మను అందరూ గుర్తించుటకు వీలు లేకుండా పోగలదని, కృష్ణున్ని
సామాన్య మనిషిగానే లెక్కించుకోవాలని అలా మిగతా వారిని పుట్టించడము
జరిగినది. మిగతా వారు అలా పుట్టడము వలన కృష్ణుని విషయము
కూడా సర్వసాధారణమై పోగలదు. మనుషులందరికీ కృష్ణుని విషయము,
కృష్ణుని ప్రత్యేకత తెలియకూడదనే ఉద్దేశ్యముతోనే దేవుడు కొందరిని అలా
పుట్టించాడు. భగవంతుడైన కృష్ణున్ని భక్తి, శ్రద్ధ యున్నవారు మాత్రము
గుర్తించునట్లు, భక్తి శ్రద్ధ లేనివారు గుర్తించనట్లు దేవుడు మిగతావారిని
కూడా కృష్ణుడు పుట్టినట్లు ఎదురు కాళ్ళతో పుట్టించడము జరిగినది.
17) ప్రశ్న :- సృష్ట్యాదినుండి మూడు యుగములలో ఒకే జ్ఞానమున్నా
ఒక్క కలియుగములో మాత్రము జ్ఞానము మనుషుల మధ్యలో అనేక
మతములుగా కన్పించుచున్నది. అన్ని మతములకు మీ జ్ఞానము ఒకే
జవాబుగా నిలబడినా కొందరు వారి అజ్ఞానమును వీడి మీ జ్ఞానమును
తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో పోవుచూ అజ్ఞానములో జీర్ణించుకొని
పోయారు. అది వారి కర్మనా? లేక అజ్ఞానమా?
జవాబు :- సృష్ట్యాదినుండి ఏ మతములు లేకున్నా ఒకే హిందూ (ఇందూ)
సమాజమేయున్నా మనుషులలో అప్పుడు కూడా జ్ఞానము అజ్ఞానము
రెండూ ఉండేవి. జ్ఞానముతో కూడుకొన్నవి ధర్మములు. అజ్ఞానముతో
కూడుకొన్నవి అధర్మములు. మూడు యుగములలో ధర్మములు అధర్మములు
రెండూ యుండేవని తెలియుచున్నది. ప్రస్తుత కలియుగములో గత
యుగములకంటే అధర్మముల సంఖ్య కొంత పెరిగినది. ధర్మముల సంఖ్య
ఎట్లుండేది అట్లే యుంటుంది. సృష్ట్యాదినుండి మూడు ధర్మములు, నాలుగు
అధర్మములు ఉండగా, కలియుగములో మతము అను అధర్మము క్రొత్తగా
పుట్టుకొచ్చినది. మతము అను అధర్మము గతములోగల నాలుగు
అధర్మములకంటే ఎక్కువ బలముగా యున్నది. మూడు యుగముల వరకు
గల అధర్మములను దృష్టిలో పెట్టుకొని భగవద్గీత వానిని అణచివేయు
జ్ఞానముతో బయటకు వచ్చినది. తర్వాత వచ్చిన ఇంజీలు గ్రంథము
వచ్చినప్పుడు కూడా 'మతము' అను అధర్మము లేకుండెడిది. తర్వాత
తయారయిన ఖురాన్ గ్రంథములో మతమను అధర్మమును గురించి పెద్దగా
వ్రాయకున్నా అక్కడక్కడ కొన్ని మత వ్యతిరేఖ వాక్యములు చెప్పియున్నా
వాటికంటే ఎక్కువ మత ప్రభావము దానిలో కలిసిపోయినది. అందువలన
ఆ గ్రంథమును అడ్డము పెట్టుకొని మతమును అభివృద్ధి చేయువారు
కూడా తయారయినారు. అందులోని జ్ఞానమంతా మతమునకు అతీతమని
చెప్పకుండా మతమునకు సంబంధించినదేయని ముస్లీమ్లు ప్రచారము
చేయుచున్నారు. అందువలన మత వ్యతిరేఖ భావములున్నా అవి ఎక్కడా
కనిపించని స్థితిలో ఉండిపోయినవి. ముస్లీమ్ మతము కొరకే ఖురాన్
గ్రంథమని ప్రచారమయినది. మిగతా అందరూ అలాగే ఖురాన్
ముస్లీమ్లదేయని అనుకోవడము జరుగుచున్నది. అలా అనుకోవడము
వలన దానిని మతగ్రంథముగా తలచి మిగతా మతస్థులు ఖురాన్
గ్రంథమును చదవడము లేదు. అయితే ఖురాన్ గ్రంథము సర్వమానవుల
జ్ఞానమని తెలియకుండా పోవడము వలన, ముస్లీమ్లదే అనుకోవడము
వలన మతమను అధర్మమునకు కొమ్ములు పెరిగిపోయాయి. ఎప్పటికయినా
మతమను అధర్మము దేవుని జ్ఞానము ద్వారానే అణిగిపోవలసియున్నది.
అయినా మా జ్ఞానములో ఎక్కువగా మూడు దైవగ్రంథములను సమాన
గౌరవముతో చెప్పినా కొందరు అజ్ఞానులు మా జ్ఞానమును కూడా
మతములలోనికి కలుపుచున్నారు. మతము కర్మకు సంబంధించినది కాదు.
అజ్ఞానమునకు సంబంధించినదని తెలియవలెను.
18) ప్రశ్న: - మోషే ద్వారా కర్మ సిద్దాంతము యూదులలోనికి ప్రవేశించినది.
క్రీస్తువారు కర్మ సిద్ధాంతమును కోపముగా చెప్పలేదు. కృపను గూర్చి
రక్షణ గూర్చి తెలిపిరి. అయితే పౌలు కర్మ సిద్ధాంతమును పూర్తిగా
నిర్మూలించు బోధను చేసి, ధర్మశాస్త్రము నిష్ప్రయోజనమని బోధించి గత
2000 సంవత్సరములనుండి విస్తరించులాగున బోధించినారు. ఈ నిప్పును
ఆర్పలేకపోవును కదా?
జవాబు :- మోషే ద్వారా కర్మసిద్ధాంతము వచ్చినదన్నారు. అదే కర్మ
సిద్ధాంతమునే ఏసు కృప, రక్షణను కూర్చి చెప్పాడు. కర్మ సిద్ధాంతము
కర్మను దహించివేయునదిగా యున్నది. కావున దానిని అగ్నితో
సమానముగా పోల్చి పౌలు చేసిన ప్రచారము అగ్నిని ఆర్పగలదాయని
అడిగినట్లున్నది. పౌలు ఏమి చెప్పాడో నాకు తెలియదు. నాకు తెలిసినది
ఏసు చెప్పినది అగ్నియని మాత్రమే తెలుసు. అగ్ని అన్నిటినీ కాల్చునుగానీ
అది ఎప్పటికీ ఆరిపోదు. కట్టెతో మండిన అగ్ని నీటితో ఆరిపోవచ్చునుగానీ,
మనిషలో మండే జ్ఞానాగ్నిని ఏదీ ఆర్పలేదు. అందువలన ఏసు ఇచ్చినది
“ఆరని అగ్ని”యని తెలియవలెను.
19) కొందరు పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా దైవ
కణాన్ని సంపాదించి దేవున్ని సాధించి మృత్యువును జయించ ప్రయత్ని
స్తున్నారు. సాధించు రోజులు దగ్గరే ఉన్నాయి అంటున్నారు. వారి మాట
నిజమవుతుందా? మానవుడు మృత్యువును జయించగలడా?
జవాబు :- ఎందరో పరిశోధకులు ఏవేవో సాధించాలని ప్రయత్నము
చేయుచున్నారు. అంతమాత్రమున అందరూ అన్నీ సాధించలేకపోయారు.
ఎందరో పరిశోధనలు ఎన్నో విషయముల మీద జరుపగా, అందులో కొన్ని
మాత్రము సిద్ధాంతపరముగా సాధించగలిగారు. మీరు చెప్పిన పరిశోధకులు
ఏకంగా దైవ కణాన్ని కనుగొనాలనుకొన్నారు. దేవుడుగానీ, దైవకణముగానీ
కనిపించునది కాదు. అట్లే ఎవరికీ సాధ్యపడునది కాదు, దొరుకునది
కాదు. అది అగమ్యగోచరమైనది. దానిని తెలియుటకు బ్రతికియున్న
వారికి ఏ ఒక్క ఆధారము లేదు. అందువలన ఏ పరిశోధకుడు దేవున్ని
గానీ, దైవకణమునుగానీ తెలియలేడు. అట్లే మృత్యువును జయించలేరు.
మనిషి ఎప్పుడు పుట్టాడో అప్పుడే మృత్యువు వాని జన్మహక్కుగా యున్నది.
జన్మహక్కు జన్మ కల్గిన వానికి తప్పక లభించును. హక్కుద్వారా నీకు
తెలిసినా, తెలియకున్నా సంక్రమించు ఆస్తిలాంటిది మృత్యువు. దానిని
నీవు వద్దన్నా రాకుండా మానునది కాదు. నీ మీద నీ భార్యాపిల్లలకు లేని
హక్కు నీ మృత్యువుకున్నది. అందువలన నీ భార్యాపిల్లలు నీ దగ్గరకు
రాలేకపోయినా నీ మృత్యువు మాత్రము నీవద్దకు వచ్చి తీరును. దానిని
జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు.
20) ప్రశ్న :- భూమిమీద జన్మించిన ప్రతివాడు సమాజానికి తెలియని
క్రొత్త సంగతులు బోధించినంతమాత్రమున భగవంతులౌతారా? గురువులు
అవుతారా? ఏ కోణములో ఆలోచిస్తే ఆ కోణములో అనేకమైన జ్ఞానము
తెల్పవచ్చును కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- భూమిమీద ఎందరో ఎన్నో పరిశోధనల ద్వారా ఎన్నో క్రొత్త
విషయములను కనిపెట్టగలిగారు. వాటివలన ఎందరో సుఖములు
అనుభవించుచున్నారు. అంతమాత్రమున ఎవరూ గురువులు కారు. దేవుడు
ఒక్కడే భూమిమీద భగవంతునిగా పుట్టును. ఆయన ఒక్కడే ఎప్పటికయినా
గురువుగా రాగలడు. ఆయన తప్ప ఎవరిని గురువులుగా చెప్పుకున్నా
వారు గురువులు కాలేరు. మనుషులలో మాలాంటి కొందరు బోధకులున్నా
బోధకుడు గురువు కానేరడు. మొత్తానికి మనుషులు ఎవరూ గురువు
కాదు. భగవంతుడు ఒక్కడే గురువగును. బయటి ప్రపంచములో
ఎవరయినా గురువు అని పేరు పెట్టుకొంటే అతను గురువు యొక్క
నమూనాను గుర్తు చేయువాడేగానీ నిజమైన గురువు కాడు.
ఇంతటితో క్రైస్తవ బోధకులయిన పాస్టరుగారి ప్రశ్నలు అయి
పోయాయి. ఇప్పుడు శంకరరావు అని ఒక మాస్టరుగారు అడిగిన మూడు
ప్రశ్నలకు జవాబు చెప్పుకొందాము. తర్వాత నెల్లూరు జిల్లా నుంచి
వీరనారాయణ రెడ్డిగారు అడిగిన ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పుకుందాము.
తర్వాత మురళీకృష్ణ గారి మూడు ప్రశ్నలకు జవాబును చెప్పుకొందాము.
1) ప్రశ్న : మనిషి శరీరములో ఆత్మ, భగవంతుని శరీరములోని ఆత్మ
ఒక్కటే అన్నారు. కానీ “గుత్తా” గ్రంథములో పరమాత్మ జ్ఞానము పరమాత్మకు
తప్ప ఆత్మకు కూడా తెలియదు. అందువలన అన్ని శరీరములలోనున్న
ఆత్మ దేవుని జ్ఞానమును బోధించదు. ఒక్క పరమాత్మ అంశ కల్గిన ఆత్మ
మాత్రము దేవుని జ్ఞానమును తెల్పును అన్నారు. కావున భగవంతుని
ఆత్మ మనిషిలో గల ఆత్మ ఒక్కటేనా?
జవాబు :- దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులెవరికీ తెలియదు అని
ఖురాన్ గ్రంథములో సూరా 3, ఆయత్ 7 లో చెప్పియున్నారు. ఆ మాట
పైన నేను చెప్పినమాట రెండు ఒకటేయని చెప్పవచ్చును. భగవంతుడైన
వాడు పాపమును క్షమించగలిగితే భగవంతుని శరీరములోయుండే ఆత్మే
మనిషి శరీరములో యున్నప్పుడు మనిషి ఇతరుల పాపమును ఎందుకు
క్షమించలేడు? అని ఎవరయినా అడిగినప్పుడు పైన నేను చెప్పినట్లు చెప్పడమే
తగిన జవాబగును. ఒక్క భగవంతుడే జ్ఞానమును చెప్పగలిగినప్పుడు
అందరిలో ఒకే ఆత్మయుంటే సాధారణ మనిషి కూడా జ్ఞానమును
చెప్పవచ్చును కదా!యని అడిగినప్పుడు నేను “గుత్తా” గ్రంథములో చెప్పిన
మాటనే చెప్పాలి. మనిషి శరీరములో భగవంతుని శరీరములో వేరువేరు
ఆత్మలు లేవు. ఒకే ఆత్మ అందరిలో నివసించుచూ తన పనిని తాను
చేయుచున్నది. అయితే అందరిలో ఒకే ఆత్మవుంటే భగవంతుని శరీరములో
చేసిన కర్మ క్షమాపణ మనిషి శరీరములోయున్న ఆత్మ ఎందుకు చేయలేదు?
అని అడిగితే ఆత్మ కర్మనుబట్టి పని చేయును. అట్లే దేవుని ఆజ్ఞను బట్టి
కూడా పని చేయును. ఆత్మ తనకంటే దేవుడు పెద్దయను జ్ఞప్తిలోనే యున్నది.
సామాన్య మానవుని శరీరములో ఆత్మ భగవంతుడు చెప్పినట్లు జ్ఞానము
చెప్పగలదు, కర్మ క్షమాపణ చేయగలదు. అయితే దానికి ఒక పద్ధతి
కలదు. కర్మను అనుభవింపజేయు ఆత్మ తన ఇష్టప్రకారము కర్మను
అనుభవించునట్లు చేయదు. ఒక లెక్కప్రకారము కాలచక్రము యొక్క
గమనమునుబట్టి ఏ సమయములో ఏ కర్మ అనుభవింపజేయవలెనో ఆ
సమయములో అదే కర్మను అనుభవింపచేయును. కర్మను అనుభవింప
జేయుటే పనిగా యున్నా ఆ పనిని శాస్త్రబద్ధముగా కర్మను, కాలమును
అనుసరించి చేయడము జరుగుచున్నది. అదే విధముగా ఆత్మకు తెలియని
జ్ఞానముగానీ, ఆత్మ చేయలేని పనిగానీ, ఆత్మకు లేని అధికారముగానీ ఏదీ
లేదు. అన్నీ ఆత్మ చేతిలో యున్నా కర్మాచరణ కాలమును అనుసరించే
చేసినట్లు, మిగతా అధికారములను గానీ, దేవుని జ్ఞానమును
బోధించడములో గానీ దేవుని సంకల్పమును అనుసరించి చేయుచున్నది.
అన్నీ తన చేతిలో యున్నా ఏదీ స్వయముగా చేయదు. దేవుని ఆజ్ఞను
అనుసరించి ఆత్మ పని చేయునుగానీ స్వయముగా ఎప్పుడుగానీ, ఏ
సందర్భములోగానీ చేయలేదు, చేయదు. అక్కడే దేవుని గొప్పతనమును
ఆత్మ కనబరచుచున్నది. ఒక మనిషి చనిపోతే వాని కర్మను అనుసరించి
ఏ జన్మకు పంపవలెనో ఆ జన్మకే పంపుచున్నది. అయితే ఆ ఆధికారమును
దేవుడే ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ మేరకే మనుషులను జన్మలకు పంపుచున్నాను
అని చెప్పుచున్నది. ఈ అధికారములన్నియూ ముందే దేవునివద్దనుండి
ఆత్మ పొందియున్నాడు. ఆ విషయమును ఇంజీలు గ్రంథమందు యోహాను
సువార్త 5వ అధ్యాయములో 26వ వచనమును చూస్తే తెలియగలదు.
(యోహాను 5-26) “తండ్రి (దేవుడు) ఎలాగు తనంతట తానే
జీవముగల వాడై యున్నాడో అలాగే కుమారుడు (ఆత్మయు) ను
తనంతట తానే జీవము గలవాడైయుండుటకు కుమారునికి
అధికారము అనుగ్రహించెను" ఈ వాక్యము దేవుడు ఆత్మకు కలుగజేసిన
అధికారమును గురించి చెప్పినది. సృష్ట్యాదిలోనే సర్వ అధికారములు
దేవునివద్దయుండి పొందిన ఆత్మను ఎవరి శరీరమునుండి ఏమి చేయవలెనో
అదే చేయుచున్నది. శరీరములో ఆత్మే దేవుడై దేవుని అధికారముతో అన్ని
కార్యములను శాస్త్రపద్ధతిగా చేయుచున్నది. అధికారమున్నదని విధి
విధానమును అనుసరించక ఏమీ చేయడము లేదు. సర్వప్రపంచమంతా
అన్ని జీవరాసులలో యున్న ఆత్మ ఒక్కటే. అయినా భగవంతుని శరీరము
నుండే జ్ఞానము చెప్పుచున్నది. మనిషి శరీరమునుండి వినుచున్నది. ఆత్మను
గురించి తెలియడము చాలా కష్టము. కష్టమైన ఆత్మను గురించి
తెలియడమునే “ఆధ్యాత్మికము” అని అంటున్నారు. సంపూర్ణ ఆధ్యాత్మికము
తెలిసినవాడు ఆత్మేయని తెలియవలెను. ఎంతో ఓపిక, పట్టుదల,
శ్రద్ధయుంటేనే ఆత్మను తెలియుటకు అవకాశముండును.
2) ప్రశ్న :- మొదట ఏమీకాని దేవుడు ప్రకృతిని ఆత్మను తయారు చేయగా
తర్వాత వాటినుండి సృష్ఠి తయారయినదా? లేక మొదట దేవుడే మొత్తము
అంతా ఒకేసారి సృష్టించాడా? అటువంటప్పుడు సృష్ఠికర్తయని ఆత్మను
అనాలా? పరమాత్మను అనాలా?
జవాబు :- మొదట సృష్ఠి పూర్వము పనిచేయగల దేవుడు మొదట తననుండి
ప్రకృతిని తయారు చేశాడు. తర్వాత కొంత వ్యవధిలో జీవాత్మ, ఆత్మను
ఒకేమారు సృష్టించాడు. ఒక లెక్కాచారము ప్రకారము జీవులను తయారు
చేసినవాడు దేవుడే అయినందున సృష్టికర్తయని దేవున్ని అనుచున్నాము.
సృష్ఠిని తయారు చేసిన వాడు దేవుడుకాగా, అప్పటి నుండి సృష్టిని అంతటినీ
ఆత్మే నడుపుచున్నది. సృష్టికర్తయిన దేవుడు సృష్ఠి తర్వాత ఆయన ఏమీ
చేయడము లేదు. చేసేవాడంతా ఆత్మేయని తెలియవలెను.
3) ప్రశ్న :- గీతలో అక్షర పరబ్రహ్మయోగమందు మోక్షము పొందు వ్యక్తి
మరణించే కాలమును గురించి చెప్పుచూ, దానికి శరీరము లోపలగల
కాలచక్రములోని సూర్యచంద్ర గమనాల వలన ఉత్తరాయణము దక్షిణా
యనము ఏర్పడునని చెప్పారు కదా? కానీ బయట సూర్యరశ్మి,
ఆకాశము మేఘావృతము ఉత్తరాయణములో మోక్షము పొందటానికి ఏమి
సంబంధము?
జవాబు :- బయట కాలమునకు లోపల కాలచక్రమునకు సంబంధము
గలదు. అందువలన బయట ఉన్న దానినిబట్టి లోపల గలదని తెలియవలెను.
సూర్యరశ్మి విషయమునకు వస్తే నీ మెదడు ఎప్పుడు మజ్జుగా యుంటుందో
అప్పుడు లోపల నీ మీద సూర్యరశ్మి లేదనీ, ఎప్పుడయితే నీవు చురుకుగా
ఉన్నావో అప్పుడు లోపల నీ మీద సూర్యరశ్మి బాగా యున్నదని
తెలియవలెను.
వీరనారాయణ రెడ్డి గారి ప్రశ్నలు :-
1) ప్రశ్న :- విశ్వములో బ్లాక్హోల్నందు ప్రకృతి లేదు అని విన్నాము.
రమణమహర్షి ఒక సందర్భములో మాట్లాడుచూ ఎచ్చట లయము ఉండునో
అదే ఉత్పత్తి స్థానము అని అన్నాడు. బ్లాక్హోల్ గ్రహములను లయము
చేయుచున్నది. కావున దానిని ఉత్పత్తి స్థానము (ఆరిజన్) అని చెప్పుటకు
వీలుపడుతుందా?
జవాబు :- రమణ మహర్షి గారు మాట్లాడేది చాలా అరుదు. ఒకవేళ
మాట్లాడినాడనుకొందాము. అది సరైన భావమును ఇచ్చునదిగా ఉండదు.
అటువంటప్పుడు ఆయన మాటలో సత్యము లేదని తెలియుచున్నది.
లయములో ఉత్పత్తి ఉండదు. జీర్ణాశయములో ఆహారము నాశనమై
పోవుచున్నది. అక్కడే ఆహారము తయారగునని చెప్పడము తిక్క అంటారు.
2) ప్రశ్న :- జీవులమయిన మనము భౌతిక శరీరమునుండి సూక్ష్మ
శరీరమును వేరుబరచలేకున్నాము. మరణములో మాత్రము సూక్ష్మ శరీరము
స్థూలశరీరమునుండి విడువడుతుంది. సూక్ష్మ శరీరముతో యున్న జీవులు
స్థూల శరీరములోనికి ప్రవేశించి మరలా బయటికి రాగలవు. పరకాయ
ప్రవేశము నేర్చిన యోగులు తమ ఇచ్ఛానుసారము స్థూల శరీరమునుండి
బయటికి రాగలరు, లోపలికి పోగలరు. భౌతిక శరీరదారులయందు
సూక్ష్మశరీరము విడివడక బంధింపబడియుండునా?
జవాబు :- మనిషియందుగానీ, విగ్రహయందుగానీ స్థూల శరీరమందు
సూక్ష్మ శరీరము ఇమిడియుండును. అయితే అది ఒకమారు బయటకు
వస్తే తిరిగి రెండవమారు బయటికి వచ్చుటకు సులభమగును. ప్రతిమలో
నుండి బయటికి వచ్చిన సూక్ష్మము తిరిగి అదే ప్రతిమను చేరవచ్చును.
తర్వాత సులభముగా బయటికి రావచ్చును. అలా ఎన్ని మార్లయినా లోపలికి
బయటికి పోవచ్చును, రావచ్చును. అయితే మనిషియందు ఒకమారు
బయటికి వస్తే తిరిగి చేరుటకు అవకాశము లేదు. ఎందుకనగా! సూక్ష్మ
శరీరము తిరిగి స్థూల శరీరమును చేరాలంటే వదలబడిన శరీరములో
వాయువులుండవలెను. ఏమీలేని శరీరము మృత శరీరము క్రిందికి జమ
కట్టబడును. మృత దేహమును సూక్ష్మశరీరము చేరలేదు. అదే పరకాయ
ప్రవేశము నేర్చిన వారికి ఎలా సాధ్యమయితావుంది? అని మీరు అడుగ
వచ్చును. ఆ విద్య దాదాపు పన్నెండు సంవత్సరములు నేర్వవలసియున్నది.
అందులో నేర్చేది తాను వదలుతున్న శరీరములో ఉప వాయువులను వదలి
బయటికి రావడమే. నేను ఉపవాయువులను వదలి వెళ్ళుచున్నానని
సంకల్పము చేయుటే అందులోని అభ్యాసము. ఆ విధముగా ఉప
వాయువులను వదలి బయటికి ఒకమారు పోయి తిరిగి తన శరీరములో
వచ్చి చేరవచ్చును. ఉపవాయువులు ఉండుట వలన ఆ శరీరము చెడి
పోకుండా ఉండును. ఉపవాయువులు లేని శరీరములో పరకాయ ప్రవేశము
చేయువారు కూడా చేరలేరు. కొన్ని కథలలో చనిపోయిన పులిలో దూరినట్లు,
లేక చనిపోయిన ఇతర జంతువులలో దూరినట్లు, ఇంకా చనిపోయిన
మనిషిలో దూరినట్లు వ్రాసుకొన్నారు. అదంతా అసత్యము. బ్రతికిన
మనిషిలో దయ్యము చేరినట్లు చేరవచ్చునుగానీ, పూర్తి చనిపోయిన
శరీరములో చేరుటకు సాధ్యము కాదు. అలా సాధ్యమయితే చనిపోయిన
వాడు తన దేహమును తిరిగి చేరవచ్చును. పరకాయ ప్రవేశము ఒక
విద్య. ఉపవాయువులను వదలి బయటికిపోయి తిరిగి లోపలికి చేరడమనే
అభ్యాసము చేయుదురు. అది ఒక రోజు లేక ఒక సంవత్సరముతో
సాధ్యపడేది కాదు. ఏకంగా 12 సంవత్సరములు అభ్యాసము చేయగా
సాధ్యమగును. అంత శ్రమపడి ఆ విద్యను నేర్చినా ఒక దయ్యము వేరే
మనిషిలో దూరినట్లు దూరడము తప్ప అందులో ఏమీ లాభము లేదు.
3) ప్రశ్న:- జీవుడు ఏకకాలములో ఒకే శరీరములో ఉండునని బ్రహ్మవిద్యా
శాస్త్రము ద్వారా తెలియపరచబడినది. “శ్రీవల్లభ చరితామృతము”లో ఏక
కాలములో జీవుడు విభిన్న దేహములను ధరించి తన కర్మను త్వరగా
అనుభవించుటకు అవకాశము ఉన్నదని తెలియజేసినది. ఇది సాధ్య
పడుతుందా?
జవాబు : - ఒక కాలములో ఒక జీవుడు ఒక శరీరములో ఉండుట సత్యము
గానీ అనేక శరీరములలో ఉండుట అసంభవము. ఇటువంటి మాటలు
బ్రహ్మవిద్యా శాస్త్రమునకు పూర్తి వ్యతిరేఖము. దీనిని నమ్మకూడదు.
4) ప్రశ్న :- కబీరు గొప్ప జ్ఞాని, వీరు మూడు ఆత్మల జ్ఞానమును
బోధించినట్లు తెలియుచున్నది. గత శతాబ్దిలో సఫాల్ దేవ్ మహరాజ్
అను వ్యక్తి ద్వారా కబీరు జ్ఞాన ప్రచారము చేయించుచూ పరబ్రహ్మ సాక్షిగా
యుండగా, అక్షరబ్రహ్మ సృష్టి స్థితి లయము చేయుచున్నాడని తెలిపాడు.
పరబ్రహ్మ వ్యాపించిన ఈ విశ్వములో ప్రకృతి మరియు అక్షర బ్రహ్మ 1/4
భాగము వ్యాపించియున్నట్లు తెలియజేశాడు. అంటే పరబ్రహ్మ ఉన్న 3/4
భాగములలో ప్రకృతి మరియు అక్షర బ్రహ్మ లేనట్లు తెలిపినాడు. ఈ
విధమైన కొలతలు సత్యమైనవా?
జవాబు :- పరబ్రహ్మ, అక్షర బ్రహ్మ అనుమాటలు వాస్తవమే. అయితే
నాలుగవ వంతు ప్రకృతి, అక్షర బ్రహ్మయున్నాయనడము చూస్తే ప్రకృతి
గానీ, అక్షర బ్రహ్మగానీ పూర్తి తెలియనట్లేయనిపిస్తున్నది. ఆయన చెప్పిన
లెక్కలు పూర్తి తప్పు.
5) ప్రశ్న :- “చెట్టుముందా? విత్తుముందా?” అను గ్రంథమునుండి జన్మకు
కారణము కర్మయని తెలియుచున్నది. “యోగ వాసిష్టము” అనే గ్రంథములో
కర్మకు కారణము అజ్ఞానము అని తెలియజేయబడినది. జ్ఞానము వికసించిన
కర్మ నాశనమగును. అందువలన కర్మకు మూలము అజ్ఞానమా?
జవాబు :- జన్మకు కారణము కర్మయని చెప్పడము శాస్త్రబద్దము. దానిని
ఎవరూ ఖండించలేరు. అయితే కర్మకు కారణము అజ్ఞానము అనడము
సరియైన నిర్వచనము కాదు. కర్మకు కారణము 'అహము' అని బ్రహ్మ
విద్యా శాస్త్రములో చెప్పుచున్నారు. అహమును అణచితే కర్మయోగము
అగునని కూడా చెప్పుచున్నారు. కర్మకు కారణము అహము అని చెప్పక
అజ్ఞానము అని చెప్పడము పూర్తి తప్పు. అజ్ఞానము వలన నేరుగా కర్మ
రాదు. అజ్ఞానము వలన అహము పనిచేయగా, అహము వలన కర్మ
వచ్చుచున్నది. ఏ విషయమైనా శాస్త్రబద్ధము కానిది వదలి వేయవలెను.
ఇక్కడ నుండి ఒక ముస్లీమ్ వ్యక్తి అడిగిన ప్రశ్నలు గలవు. మొదట
200 ప్రశ్నలను ఒకే వ్యక్తి హిందూ సమాజములోని వ్యక్తి, ప్రత్యేకించి
బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నలు, తర్వాత క్రైస్తవ సమాజమునుండి ప్రత్యేకించి
బోధకుడయిన పాస్టరు గారు అడిగిన ప్రశ్నలు వ్రాయడము వలన రెండు
సమాజముల వారినుండి వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్లయినది.
ఇప్పుడు ముస్లీమ్ సమాజమునుండి వచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయడము
వలన మూడు మతముల నుండి వచ్చు సంశయములకు జవాబు
చెప్పినట్లగును. చెన్నై నుండి షఫీగారు అడిగిన ప్రశ్నలను చూస్తాము.
1) ప్రశ్న :- దైవగ్రంథములయిన భగవద్గీత, ఇంజీలు, ఖురాన్లలోని
విషయములు కర్మాతీతమా? కాదా?
జవాబు :- వాస్తవముగా దేవుడు చెప్పిన విషయములు కర్మాతీతమైనవే.
అయితే కర్మాధీనములోని విషయములు కొన్ని మూడు గ్రంథములలోను
కలిసియున్నవి. ఉన్న కర్మను లేకుండా చేయు జ్ఞాన విషయములు
కర్మాతీతమైనవి. లేని కర్మను తెచ్చి మనిషికి అంటగట్టు ప్రపంచ
విషయములు కర్మాధీనమైనవి. దైవగ్రంథములలో దేవుడు జ్ఞాన
విషయములను చెప్పియుంటే మనిషి తన పెత్తనమును చూపుటకు ప్రపంచ
విషయములను దైవ గ్రంథములందు చేర్చడమేకాక అందులో చెప్పిన
దైవికమయిన జ్ఞాన విషయములకు కూడా ప్రపంచ సంబంధ అర్థములను
అంటగట్టుచూ ప్రజలకు దైవ గ్రంథములలోయున్న జ్ఞానమును
తెలియకుండానే చేయుచున్నారు. ఆ విషయములను మేము ఖండించి
దైవ గ్రంథములో దేవుడు దైవజ్ఞానమునే చెప్పాడని ప్రపంచ విషయములను
చెప్పలేదని చెప్పుచున్నాము.
2) ప్రశ్న :- స్వప్నము సత్యాసత్య మిళితమా?
జవాబు :- అవును. స్వప్నములో కొన్ని సత్యములు, కొన్ని అసత్యములని
తెలియుచున్నవి. అయినా ఇది సత్యమనిగానీ, ఇది అసత్యమనిగానీ ఎవరూ
నిరూపించలేరు. స్వప్నములన్నియూ జ్ఞాన సంబంధమైనవి గానే అర్థము
చేసుకొన్నప్పుడు వాటి వలన జ్ఞానము తెలియును.
3) ప్రశ్న :-ఆత్మ స్త్రీ సంబంధమైనదా, పురుష సంబంధమైనదా?
జవాబు :- ఆత్మను గురించి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున
చెప్పినప్పుడు ఆత్మను, జీవాత్మను ఇద్దరినీ పురుషులని చెప్పారు. ఒకమారు
ఆత్మను పురుషుడని చెప్పడము వలన ఆత్మ ఎప్పటికీ పురుషుడేయని
చెప్పవచ్చును. అయితే మాటలలో ఒక్కొక్కమారు స్త్రీలింగముగా అది,
ఇది అని చెప్పబడుచుండును. తర్వాత కొన్ని సందర్భములలో అతను,
వాడు అని పురుష లింగముగానే చెప్పుచున్నాము. జీవాత్మ, ఆత్మ, ఇద్దరూ
పురుషులుకాగా, పరమాత్మ (దేవుడు) పురుషోత్తముడుగా యున్నాడు.
4) ప్రశ్న :- మా గ్రంథమయిన ఖురాన్లో జీవాత్మ, ఆత్మయని ఎక్కడా
చెప్పలేదు. మీరు భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో ఒకటే
జ్ఞానమున్నదని చెప్పారు కదా! మా గ్రంథములో ఆ విధముగా ఎక్కడా
కనిపించలేదు కదా! ముస్లీమ్ పెద్దలు ఖురాన్ గ్రంథము ప్రత్యేకమయినది
దానిలోని జ్ఞానము మిగతా గ్రంథములలోని జ్ఞానముకంటే గొప్పదని
చెప్పుచున్నారు. దానిని గురించి మీరు ఏమి చెప్పెదరు?
జవాబు :- మూడు దైవ గ్రంథములు ఏదీ ఒక మతమునకు సంబంధించినది
కాదు. మూడు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటిగానే ఒకే సిద్ధాంతమునే
బోధించుచున్నది. సమస్త మానవాళికి ఇది హితోపదేశము అని ఖురాన్లో
81వ సూరాలో 27వ ఆయత్నందు చెప్పియున్నారు చూడు. (81-27)
“ఇది సమస్త లోకవాసులకు హితోపదేశము”. ఈ మాటను
చెప్పియుండుట వలన మీరు ఖురాన్ ను 'మా గ్రంథము' అని అనకూడదు.
ఖురాన్ అందరి గ్రంథము. అందులో వ్రాయబడిన భాష వలన, అనువాద
భాష వలన కొన్ని పదములు వేరుగా కనిపించినా మూడు గ్రంథములలో
చెప్పబడిన జ్ఞానము ఒక్కటేయని తెలియుచున్నది. మీ పెద్దలు మిగతా
గ్రంథములకంటే ఖురాన్లో ఎక్కువ జ్ఞానమున్నదని ఎలా చెప్పారో మాకు
తెలియదు. స్వయముగా ఖురాన్ గ్రంథమే ముందు వచ్చిన గ్రంథముల
జ్ఞానమే తనయందున్నదని చెప్పుచూ ముందు వచ్చిన తౌరాతు, ఇంజీలు
గ్రంథములను ధృవీకరించుచున్నానని చెప్పినది. ఈ విషయమును ఖురాన్
గ్రంథములో (5-48) “మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని (ఖురానను)
సత్యసమేతముగా అవతరింపజేశాము. ఇది తమకన్నా ముందు
వచ్చిన గంథాములను సత్యమని ధృవీకరిస్తుంది. నీ వద్దకు వచ్చిన
సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరించకు." ఈ
ఆయత్ను చూచిన తర్వాత మాది గొప్ప గ్రంథము, ఇతరులది కాదు అని
అంటే అతడు ఖురాన్ గ్రంథములోని ఈ వాక్యమునకు వ్యతిరేఖముగా
మాట్లాడినట్లగును.
5) ప్రశ్న :- తౌరాతు మూసా ప్రవక్తకు ఇవ్వలేదని, మూసాకు గ్రంథమును
ఇచ్చాము అని చెప్పుచున్నారు గానీ ఫలానా గ్రంథమని చెప్పలేదు అని
తౌరాతు గ్రంథమునే మూసాకు ఇచ్చాడని మీకు ఎలా తెలుసు అని కొందరు
అడుగుచున్నారు. దానికి మేము ఏమి చెప్పాలి?
జవాబు :- మూసాకు దేవుడు తౌరాతు గ్రంథమును ఇవ్వకపోతే వారికి
తెలిసి ఏ గ్రంథము ఇవ్వబడినదో చెప్పమని మీరు అడగండి. విశ్వములో
నాలుగు గ్రంథముల పేర్లు అందరికీ తెలుసు. అవియే జబుర, తౌరాతు,
ఇంజీలు, ఖురాన్ అని చాలామంది చెప్పగా విన్నాము. ఈ నాలుగు పేర్లు
మిగతా మతముల వారికంటే ముస్లీమ్లకు బాగా తెలుసు. ఎందుకనగా!
ఈ నాలుగు పేర్లు ఖురాన్ గ్రంథములోనే ఉన్నాయి. అయితే అందరికీ
తెలియని విషయమేమనగా! ఈ నాలుగు పేర్లలో మొదటి పేరయిన జబుర
అనునది గ్రంథము కాదు. మిగతా తౌరాతు, ఇంజీలు, ఖురాన్ మూడు
గ్రంథములేయని చెప్పవచ్చును. మూడు గ్రంథములలో మొదటిదయిన
తౌరాతు గ్రంథము ఖురాన్లో చాలామార్లు చెప్పబడినది. తౌరాతు అను
పేరు ముస్లీమ్లకు ఖురాన్ చదివిన వారందరికీ తెలుసు. అయితే ఆ
గ్రంథము పేరు తెలుసుగానీ దానిని ప్రపంచములో చూచిన వాడు ఒకే
ఒక వ్యక్తి మోషే. ఆయననే మూసాయని ఖురానియందు చెప్పుచున్నాము.
ఇంజీలు గ్రంథములో చెప్పబడిన మోషే ప్రవక్తయే ఖురాన్ గ్రంథములో
మూసాగా చెప్పబడుచున్నాడని కూడా చాలామందికి తెలియదు. బైబిలు
(ఇంజీలు) గ్రంథములో చెప్పబడిన మోషేకు తౌరాతు గ్రంథము ఇవ్వబడినది.
తౌరాతు గ్రంథమును ముట్టుకొన్నవాడు, చూచినవాడు ఒక్కమోషే మాత్రమే.
మోషే తప్ప ఇతర ఏ మానవుడు తౌరాత్ అను పేరుగల గ్రంథమును
చూడలేదు. నాలుగు గ్రంథములలో జబూర అనునది గ్రంథమే కాదు అది
పేరు మాత్రమే. తర్వాత తౌరాతు అనునది గ్రంథమే అయినా దానిని
మోషే ప్రవక్త ఒక్కడు చూచాడు. మోషే, మూసా ఇద్దరూ ఒక్కరే అయినందున
మూసా తప్ప ఎవడూ తౌరాతు గ్రంథమును చూడలేదు. ఇక మిగిలినది
ఇంజీలు, ఖురాన్ గ్రంథములు ఈ రెండును అందరూ చూచారు.
6) సూరా 2, ఆయత్ 187లో ఏ విషయమును గురించి చెప్పారు? ప్రపంచ
విషయమునా, పరమాత్మ విషయమా?
జవాబు :- సూరా 2, 187వ ఆయత్లో మొదటినుండి చివరి వరకు ఒకే
విషయమును చెప్పారు. అది దేవునికి సంబంధించిన విషయము కాదు.
అది కేవలము మనుషులకు సంబంధించిన విషయముగానే యున్నది.
భార్యాభర్తలు ఒకరినొకరు శారీరకముగా కలుసుకొను విషయమై
చెప్పియున్నారు.
7) ప్రశ్న :- సూరా 2, 187వ వాక్యములో చెప్పినది ప్రపంచ విషయమేనని
అదియూ భార్యాభర్తల కలయిక విషయమని చెప్పుచున్నారు కదా! ఇది
ప్రపంచ సంబంధ విషయమే కదా! ఈ విషయముతో దేవునికి ఏమి
అవసరము అని నేను ఇతరులను అడిగాను. దేవుడు కర్మపత్రములో
వ్రాసిన ప్రకారమే ప్రతీదీ జరుగునని అదే ఖురాన్ గ్రంథములో వ్రాశారు
కదా! అలాంటప్పుడు కర్మ ప్రకారమే భార్యాభర్తల కాపురము, కలయిక
ఉండును కదా!యని అడిగాను. దానికి వారు భార్యాభర్తల విషయమును
ధర్మసమ్మతము చేయుటకు అక్రమముగా నడువకుండా యుండుటకు
అని చెప్పారు. అంతేకాక రాత్రిపూట మాత్రమే ఆ పనికి ధర్మసమ్మతమైనదనీ,
పగలు పూట రంజాన్ నెలలో ఉపవాసముండుటకు రాత్రిపూట తొలిజాము
4 గంటలనుండి తిని, త్రాగి పగలంతా ఉపవాసముండమని చెప్పాడు అని
అన్నారు. వారు ఇలా చెప్పగా ఉపవాసము కూడా దేవునికి సంబంధించిన
దైవజ్ఞానమునకు సంబంధించిన విషయము కాదు కదా!యని అనుమానము
వచ్చినది. ఈ ఆయత్లో ఉపవాసమునకు సంబంధించిన విషయమున్నదా?
అని అడుగుచున్నాను. మీరు ఏమి చెప్పగలరు?
జవాబు :- రెండవ సూరా 187వ ఆయత్లో మొదటినుండి చివరి వరకు
చదివి చూచాము. అల్లాహ్ తన ఆయత్లో ఏమి చెప్పాడో దానిని దాచిపెట్టి
తమకు ఇష్టమైన విషయములను అందులో చేర్చి చెప్పువారికి శాపము
తప్పదని ఖురాన్ గ్రంథమందు దేవుడు రెండవ సూరా 159వ ఆయత్లో
చెప్పియున్నాడు. (2-159) “మేము అవతరింపజేసిన స్పష్టమైన
బోధలను, మార్గదర్శకత్వాలను ప్రజల కొరకు దివ్యగ్రంథములో
స్పష్టపరచిన పిదప కూడా దాచుతారో వానిని అల్లాహ్ తప్పక
శపిస్తాడు. మరియు శపించగల వారు కూడా వారిని శపిస్తారు"
అని వ్రాసియున్నది. ఈ విషయము తెలియక కొందరు దేవుని వాక్యమును
తమ ఇష్టమొచ్చిన విధముగా మార్చి దేవుడు చెప్పని విషయమును చేర్చి
చెప్పుచున్నారు. అంత అవసరము ఏమి వచ్చిందో? ఒకవేళ ఎవరయిన
తెలిసినవారు మీరు చెప్పు వివరమును దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పిన
భావము వేరుగాయున్నది కదా! ప్రత్యక్షముగా కనిపించునట్లున్న భావమును
తీసివేసి వేరే భావమును చెప్పుట వలన దేవునికి మీ మీద కోపము
రాగలదు. దేవునివైపునుండి మీకు శాపము రాగలదు. దేవునివైపునుండే
కాక దేవుని పాలనలో గల గ్రహముల, భూతముల నుండి కూడా శాపము
రాగలదు. వారినుండి చెడు జరుగగలదు అని చెప్పితే అట్లే కానీలే అని
భయము లేకుండా చెప్పుచున్నారు. అటువంటి వారికి దేవుని శిక్ష తప్పదు.
8) ఖురాన్లోని జ్ఞానమును ఎవరు బోధించారు? ఎలా బోధించారు? ఎవరికి
బోధించారు? ఎంత కాలము బోధించారు?
జవాబు :- జిబ్రయేల్ అను ఆకాశ గ్రహము తెరచాటునుండి బోధించాడు.
ముహమ్మద్ ప్రవక్తగారికి బోధించాడు. 23 సంవత్సరములు ఖురాన్
జ్ఞానమును బోధించడము జరిగినది.
9) ప్రశ్న :- ద్వాపరయుగము చివరిలో కృష్ణుడు భగవద్గీతను అర్జునునకు
పది నిమిషములలోపే బోధించాడు. ఏసు ఇంజీలు జ్ఞానమును (నాలుగు
సువార్తల జ్ఞానమును) మూడు సంవత్సరములలో బోధించాడు. ఖురాన్
జ్ఞాన విషయమును జిబ్రయేల్ 23 సంవత్సరములు ఎందుకు బోధించాడు?
ముందు వచ్చిన గ్రంథములు భగవద్గీత కొన్ని నిమిషములలోనూ, బైబిలు
మూడు సంవత్సరములలోనూ చెప్పగా, ఖురాన్ జ్ఞానము చెప్పుటకు 23
సంవత్సరములు ఎందుకు పట్టినది?
జవాబు :- ఆకాశమునుండి దిగివచ్చిన జిబ్రయేల్ ఖురాన్ జ్ఞానమును
చెప్పాడు అన్నది వాస్తవమే. క్రిందనే ప్రక్కనే యుంటున్న కృష్ణుడు అర్జునునకు
ఎంతకాలమయినా భగవద్గీతను చెప్పవచ్చును. అయినా పది నిమిషముల
లోపే పూర్తి చెప్పేశాడు. ఒకచోట నిలకడలేని ఏసు పర్యటించుచూ
సమయము దొరికినప్పుడంతా సువార్తల జ్ఞానమును చెప్పాడు. అలా
మూడు సంవత్సరములు చెప్పాడు. చివరిలో తన శిష్యులతో గడిపి
భోజనము చేసినప్పుడు చివరిగా చెప్పవలసిన విషయములన్నియూ చెప్పాడు.
ఇక ఖురాన్ విషయమునకు వస్తే ఎంతో దూరమునుండి వచ్చు జిబ్రయేల్
ఒక్కమారుగా జ్ఞానము చెప్పుటకు వీలుపడలేదు. ముహమ్మద్ ప్రవక్తగారు
చదువురానివాడైనందున జ్ఞానమంతయూ ఒకేమారు చెప్పుటకు వీలులేదు.
అందువలన రెండు లేక మూడు వాక్యములకంటే ఎక్కువ చెప్పేవాడు కాదు.
జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును ప్రవక్తగారు విని తర్వాత తన ఇంటికి వచ్చి
తన అనుచరులకు చెప్పగా వారిలో ఒకరు లేక ఇద్దరు చదువు వచ్చిన
వారుంటే దానిని వ్రాసిపెట్టే వారు. ఆ కాలములో ఆ దేశములో అంతా
చదువురానివారు ఎక్కువగాయుండేవారు. ఎప్పుడయినా ఒకమారు ప్రవక్త
గారు తెచ్చిన సందేశమును వ్రాసుకొనుటకు ఎవరూ లేకుండెడివారు.
అప్పుడు అక్కడున్న వారు విని జ్ఞాపకము పెట్టుకొనెడివారు. ఈ విధముగా
రెండు, మూడు వాక్యములకంటే ఎక్కువ చెప్పుటకు వీలు లేనందువలన,
ఆకాశమునుండి వచ్చు జిబ్రయేల్ నెలకొకమారుగానీ రెండు మూడు నెలల
కొకమారు గానీ రావడము వలన 23 సంవత్సరముల ఖురాన్ బోధ సాగింది.
10) ప్రశ్న :- ఏసుప్రభువు వారు తన జ్ఞానపు చివరిమాటను చివరి భోజన
రాత్రి పూర్తిగా చెప్పుకోవడము దానికంటే కొన్ని రోజులముందు నుండి
చెప్పుకోవడము జరిగినది. అలా ఖురాన్ జ్ఞానము అయిపోయింది అని
జిబ్రయేల్ ప్రవక్తగారికి చెప్పాడా?
జవాబు :- లేదు ఖురాన్ జ్ఞానము అయిపోయింది అని ఎక్కడా, ఎప్పుడూ
చెప్పలేదు. సంపూర్ణముగా చెప్పానని జిబ్రయేల్ చెప్పాడని కొందరు
ముస్లీమ్లు చెప్పుచున్నా అందులో వాస్తవము లేదు. ముహమ్మద్ ప్రవక్త
చనిపోతాడు అని జిబ్రయేల్కు తెలిసియున్నా ఆ విషయమును ప్రవక్తగారికి
జిబ్రయేల్ చెప్పియుండేవాడు. ప్రవక్తకు కూడా తాను చనిపోతానని
ఏమాత్రము తెలియదు. భవిష్యత్ అంధకారము ప్రవక్తకు జ్ఞానము చెప్పు
జిబ్రయేల్ ఆకాశమునుండి వచ్చుటకు దాదాపు మూడు నెలలకు పైన
పట్టినది. భూమిమీదికి వచ్చిన తర్వాత జిబ్రయేలు ప్రవక్తగారు చనిపోయిన
విషయము తెలిసినది. ప్రవక్తగారు చనిపోకపోతే ఇంకా కొంత జ్ఞానము
జిబ్రయేల్ ద్వారా తెలిసేది. ప్రవక్త చనిపోయిన విషయము జిబ్రయేల్కు
తెలియడమేకాక తాను భూమిమీదికి వచ్చి జ్ఞాన వాక్యములు చెప్పిపోయిన
తర్వాత 82 రోజులకు చనిపోయాడని తెలిసినది. అట్లే ప్రవక్త మరణమునకు
కారణమయిన రోగము ఏమి? అని జిబ్రయేల్ తన జ్ఞానము చేత తెలియ
గలిగాడు. తర్వాత జిబ్రయేల్ క్రిందికి రాలేదు.
11) ప్రశ్న :- ప్రవక్తగారు మరణించిన తర్వాత ఎన్ని దినములకు జిబ్రయేల్
భూమిమీదికి రావడము జరిగినది.
జవాబు :- ప్రవక్తగారు చనిపోయిన తర్వాత జిబ్రయేల్ ఎప్పుడు వచ్చాడని
ఖచ్చితముగా చెప్పలేము గానీ మూడు నాలుగు రోజులకే వచ్చియుంటాడని
ఒక అంచనాగా చెప్పవచ్చును. మా అంచనా తప్పు కూడా కావచ్చును.
ప్రవక్తగారు చనిపోకనే 82 రోజుల ముందు జిబ్రయేల్ జ్ఞానమును విన్నాడని
చరిత్ర గలదు. జిబ్రయేల్ మూడు నెలలు మించి ఐదారు రోజుల కంటే
ఎక్కువ ఎప్పుడు ఆలస్యము చేయలేదు. అందువలన ప్రవక్త చనిపోయిన
మూడు రోజుల తర్వాత ఒకటి లేక రెండు రోజలు అటు ఇటు
వచ్చియుండును అని అనుకుంటాము. ఇంకా రెండు సంవత్సరములు
ప్రవక్త బ్రతికియుంటే బాగుండేదని జిబ్రయేల్ ఇతరులతో చెప్పినట్లు కలదు.
జిబ్రయేల్ ఇతర గ్రహములతో చెప్పియుండుట వలన ఆ గ్రహములు వచ్చి
ప్రవక్తగారి చావుకు కారణమయిన రోగమును దండించడము జరిగినది.
మీరు చేసిన పనికి ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోవడము జరిగినది. ఆయన
ఇంకా రెండు సంవత్సరములు బ్రతికియుంటే బాగుండేది. ఆయన ద్వారా
ప్రజలకు దైవజ్ఞానము అందేదని దండించడము జరిగినది. ఆ విషయము
మాకు తెలియదనీ దేవుని పాలనలో విధులు నిర్వహించువారమైనందున
ఆయుష్షు తీరిన వారిని చంపవలసి వచ్చినదని వారు చెప్పడము జరిగినది.
చివరకు అది అల్లాహ్ నిర్ణయమని అందరూ అనుకోవడము జరిగినది.
దీనినిబట్టి ఇంకా కొన్ని ఆయత్లు ప్రవక్తగారు ఉండివుంటే వచ్చేవి. ఆయన
పోయిన దానివలన మనుషులు రెండు సంవత్సరముల జ్ఞానమును
కోల్పోయారు. రెండు సంవత్సరములలో కనీసము ఎనిమిది నుండి పది
మార్లయినా జిబ్రయేల్ వచ్చి జ్ఞానమును చెప్పేవాడు. ఆ లెక్కప్రకారము
దాదాపు 20 నుండి 25 ఆయత్ల వరకు మనకు ఇంకా తెలిసియుండేవి.
అల్లా అంతటితో ఆపివేశాడు కనుక జిబ్రయేల్ చెప్పినంత వరకు మానవుడు
మోక్షము పొందు జ్ఞానము వచ్చియున్నదని తలచవచ్చును. మనిషి దేవుని
వద్దకు చేరుటకు అల్ ఇఖ్రాస్ అను 112వ సూరాలోని నాలుగు ఆయత్లు
అర్థము చేసుకోగలిగితే చాలు. మిగతా వాటి అవసరము లేకపోవచ్చును.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా,అసత్యము కాదు.