తైతాకార రహస్యము త్రైతాకార బెర్ముడా cloud text 18thsep2024 Updated
తైతాకార రహస్యము త్రైతాకార బెర్ముడా.
ముందు మాట.
"త్రైతాకార రహస్యము” అను ఈ చిన్న గ్రంథములో ముఖ్యముగా "బెర్ముడా ట్రయాంగిల్" అను సముద్ర
ప్రాంతము గురించే వ్రాయడము జరిగినది. బెర్ముడా దీవి ప్రక్కన ఉండడము వలన, ఆ సముద్ర ప్రాంతమును
“బెర్ముడా ట్రయాంగిల్” అని అందరూ పిలువగా, అక్కడేదో పెద్దదయ్యమున్న దని కొందరు దానిని "డెవిల్ ట్రయాంగిల్”
అని కూడా అన్నారు. దీనిని గురించి దాదాపు 20 సంవత్సరముల క్రింద ఒక వార్తాపత్రికలో వ్రాసిన ప్రత్యేక శీర్షికలో
చూచాను. ఆ శీర్షికలో 1947లో ఆరు అమెరికా యుద్ధ విమానములు అట్లాంటిక్ సముద్రములో ఆచూకీ తెలియకుండా
పోయాయనీ, వాటి జాడ ఇంతవరకు తెలియలేదనీ వ్రాశారు. అమెరికాకు ప్రక్కన త్రికోణాకారముగల సముద్ర ప్రాంతములో
గతములో కూడా ఎన్నో మాయమై పోయాయని వ్రాశారు. అప్పటికి మాకు అది ఒక వింతగా తోచింది. ఆ తర్వాత
కొంతకాలమునకు ఇంకొక చోట బెర్ముడా ట్రయాంగిల్ను గురించి చదివాను. అందులో అక్కడ నౌకలు, విమానములు
మాయమైపోవడానికి కారణమేమి అని పరిశోధించుటకు పోయిన వారి జాడకూడా తెలియకుండా పోయినదని వ్రాశారు.
అప్పుడు దానిని గురించి కొంత యోచించాను. అప్పుడు మాకు తోచినది ఏమనగా! సముద్రము మీద పోవు నౌకలు
పోయాయి అంటే దానికి ఒక అర్థముంది. ఆ ప్రాంతములో ఆకాశములో పోవు విమానములు పోయాయనడములో
అర్థములేదు. అక్కడ పైన పోవు విమానములు కూడా పోయినది వాస్తవమే అయితే, మనిషికి తెలియని రహస్యముంటుందని
అనుకొన్నాము.
ఈ విషయములో నన్ను బాగా ఆకర్షించినదీ, యోచింపజేయుటకు కారణమైనది ఒకటి గలదు. అదియే
ట్రయాంగిల్ వారు ఇంగ్లీషు భాషలో చెప్పుపేరును తెలుగులో “మూడు కోణములని” చెప్పవచ్చును. ఆ పేరు నన్ను
ఆకర్షించడానికి కారణమేమనగా! మొత్తము ఈ విశ్వమంతయు మూడు సంఖ్యల మీద ఆధారపడి ఉన్నది. ప్రపంచములో
దైవజ్ఞానమంతా మూడు సంఖ్యలమీదే ఆధారపడి ఉన్నది. ఇదేమిటి క్రొత్తమాట! ఇంతకు ముందు ఎవరు మూడును
గురించి చెప్పలేదే! అని మీరు అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! మేము ఆధ్యాత్మిక విద్యలో
మూడును ఆధారము చేసుకొని త్రైతసిద్ధాంతమును ప్రతిపాదించాము. మాకంటే ముందు ఆదిశంకరాచార్యులు అద్వైతమును
ప్రతిపాదించినా, రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును చెప్పినా, మధ్వాచార్యులు ద్వైతమును చెప్పినా, వాటినన్నిటిని
కాదనీ మేము త్రైతమును చెప్పవలసి వచ్చినది. గతములో ద్వైతమును చెప్పినా, అద్వైతమును చెప్పినా వాటిని చెప్పిన
వారి సిద్ధాంతము లకు పునాది లేదు. అందువలన ఆధ్యాత్మికవిద్యలో అవి సరియైనవికావనీ, పునాది లేని భవనములనీ,
ఎప్పటికైనా కూలిపోక తప్పదని తెలిసి వాటిని కాదని, దేవుడే స్వయముగా చెప్పిన భగవద్గీతలోని పురుషోత్తమప్రాప్తి
యోగమున గల 16,17 శ్లోకములను పునాదిగా చేసుకొని త్రైతమును తెలియజేశాము. మేము తెలియజేసిన త్రైతమునకు,
సముద్రములోని త్రైత కోణములు దగ్గరగా ఉన్నవి. అందులోనూ ట్రయాంగిల్ యొక్క విధానము ఎవరికీ అర్థము
కాలేదు అంటే, అది ఏదో మేము చెప్పిన త్రైతముతో ముడిపడి ఉన్నదని తెలియుచున్నది. మేము చెప్పు త్రైతము
భగవద్గీతలో ఉండినా అర్థముకానట్లు, పరిశోధకులు చెప్పుచున్న ట్రయాంగిల్ సముద్రములో ఉండినా అర్థము కాలేదు.
సముద్రములో నిషేధ ప్రాంతముగా ఉండిన త్రైతాకారము యొక్క రహస్యము, త్రైతము ద్వారానే తెలియునని అనుకొన్నాము.
సముద్రము మీద ఉన్న త్రైతాకారమును తెలియుటకు ముందు త్రైతమంటే ఏమిటో కొంత తెలిసిన వారికే
అర్థమగును. కావున ఇంతవరకు ఎవరికీ తెలియని మిష్టరీగా మిగిలిపోయిన బెర్ముడా ట్రయాంగిల్ యొక్క రహస్యమును
మేము సులభముగా తెలుసుకోవచ్చుననుకొన్నాము. నేను అనుకొన్నట్లు త్రైతసిద్ధాంత మార్గములోనే మా దృష్టిని సారించడము
వలన మాకు ట్రయాంగిల్ విషయము సులభముగా అవగాహనకు వచ్చింది. అక్కడ ఏమున్నదీ, ఏమి జరుగుచున్నదీ,
ఎందుకు జరుగుచున్నదీ సులభముగా తెలియగలిగాము. మాకు తెలిసిన విషయమునంతటినీ ఇతరులు కూడా అర్థము
చేసుకొనుటకు, ఒక గ్రంథరూపములో వ్రాయదలచుకొన్నాము. ఆ ప్రయత్నమే "త్రైతాకార రహస్యము” అను ఈ
గ్రంథము. ఇందులో మేము చెప్పిన విషయములన్నియు ఆరుశాస్త్రములలో చివరిదీ, పెద్దదీ అయిన బ్రహ్మవిద్యాశాస్త్రము
ద్వారా శోధింపబడినవి. ఆధ్యాత్మిక విద్యలో ఒక సిద్దాంతమును ఆధారము చేసుకొని చెప్పిన విషయములు. కావున
ఇందులోని విషయములన్నియూ శాస్త్రబద్ధమైనవేనని తెలియాలి. ఏ ఒక్క విషయము కూడా అసత్యమైనదిగానీ, శాస్త్రీయత
లేనిదిగానీ కానేకాదు. ఈ గ్రంథము వలన బెర్ముడా ట్రయాంగిల్ విషయము తెలియడమేకాక దీనిని చదివిన ప్రతి
ఒక్కరికీ తమలోని ఆత్మను తెలుసుకోవాలను కుతూహలము పుట్టును. అందువలన వారు కూడా ఆత్మజ్ఞానులుగా
మారుటకు అవకాశము కలదు.
కొందరికి ఈ గ్రంథము మీద కొన్ని అనుమానములు రావచ్చును. అవేమనగా! అమెరికాదేశములోని శాస్త్రజ్ఞులకే
అంతుబట్టని విషయములను ఈయన చెప్పగలడా? ఈయన ఇక్కడ కూర్చొని చెప్పిన మాటలు సత్య మగునా? అని
అనుకోవచ్చును. అలా అనుమానము రావడములో తప్పు లేదు. కానీ మేము చెప్పిన మాటలను గ్రుడ్డిగా తీసివేయకుండా,
ఆలోచించి అబద్దమో నిజమో మీరే నిర్ణయించుకోవచ్చును. ఈ గ్రంథములో కేవలము ట్రయాంగిల్ను గురించేకాక,
దానితో అనుసంధానమైవున్న భూకంపములూ, సునామీలూ, అగ్నిపర్వతములూ మొదలగు ఉపద్రవములన్నిటినీ గురించి
వ్రాయడము జరిగినది. సముద్రము మీద ట్రయాంగిల్వద్ద అంతు చిక్కకుండా పోయిన నౌకలు, విమానముల వెనుక
మేఘముల యొక్క హస్తమున్నదని చెప్పాము. మేఘములశక్తి అపారమైనదనీ కూడా చెప్పాము. 1940వ సంవత్సరము,
ఒక చిన్న విమానమును మేఘములు ట్రయాంగిల్ ప్రాంతములో చిక్కించుకొని, తామే ఈ పనిని చేయుచున్నట్లు
బయటికి తెలియుటకు ఆ విమానమును వదలివేశాయి. ఆ విమానమును నడిపిన పైలెట్ స్వయముగా అక్కడ జరిగిన
తతంగమును గురించి చెప్పాడు. గంటకు 104 కిలోమీటర్ల స్పీడుతో పోవు హెలిక్యాప్టరులాంటి చిన్న విమానము
ట్రయాంగిల్ ప్రాంతములో మేఘముల మధ్య చిక్కుకొని బయటపడినపుడు 180 కిలోమీటర్ల దూరము తన విమానము,
కేవలము మూడు నిమిషములలో పోయిందనీ, ఆ వేగమును గంటకు చూస్తే 3600 కిలోమీటర్లు అగుననీ, అంతవేగముగా
తన విమానము పోయేదానికే అవకాశములేదనీ, అదేలాపోయిందో అంతుబట్టని విషయమనీ చెప్పడమేకాక,
సమయములో దిక్సూచి పని చేయలేదనీ, విమానము యొక్క ఇంజను కూడా ఆగి పోయిందనీ, ఏమాత్రము పెట్రోలు
ఖర్చుకాలేదనీ చెప్పడము జరిగినది. అతను చెప్పిన దానినిబట్టి చూస్తే తమ ఉనికినీ, శక్తినీ తెలుపుటకే మేఘములు ఆ
విమానమును వదలివేశాయని అర్థమగుటయే కాక, తమ చేతిలో చిక్కిన దేనినైనా కొన్ని క్షణాలలోనే ఎంత దూరమైనా
మేఘములు తీసుకపోగలవని నిరూపణగా తెలియుచున్నది. ఈ విధముగా త్రైతాకారములోనున్న శక్తి ఏమిటో ఎవరికీ
తెలియకున్నా, అక్కడ జరిగిన పనులకు భౌతిక ఆధారములు దొరకకున్నా, మేము అభౌతికమైన ఆధ్యాత్మిక విద్య వలన,
ఆత్మజ్ఞానము వలన ఈ గ్రంథములో కొంతకు కొంత వివరమును చెప్పగలిగాము. ఈ గ్రంథము వలన ఇప్పుడు ఎన్నో
రహస్యములు తెలియు చున్నవనీ, భావితరాల వారికి ఆత్మను గురించి తెలుసుకొనుటకు అవకాశము కల్గుననీ
అనుకొంటున్నాము. ఈ గ్రంథమును మీకు పరిచయము చేయుటకు ముందుమాటగా వ్రాస్తూ, మీరు కూడా
ఆధ్యాత్మికరంగములో ముందుకు పోవలెననీ, దానికి ఈ గ్రంథము మీకు అన్ని విధాలా ఉపయోగపడగలదనీ
అనుకొంటున్నాము.
ఇట్లు,
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
త్రైతాకార రహస్యము - త్రైతాకార బెర్ముడా.
'ఇందూ' అనగా చంద్రుడని అర్థము. చంద్రుడు జ్ఞానమునకు అధిపతి మరియు జ్ఞానమునకు చిహ్నము.
అందువలన పార్వతి భర్తయిన శివుడు కూడ తన శిరస్సునందు చంద్రవంకను ధరించి, నా తలలో జ్ఞానమున్నదనీ లేక
నేను జ్ఞానిననీ అనుటకు గుర్తుగా చంద్రవంకను చూపాడు. ఇందు అనగా జ్ఞానము అను అర్థమును మనము తీసు
కొంటున్నాము. భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగములో 25వ శ్లోకమున “చాంద్రమాసం జ్యోతి” అని దైవజ్ఞానమును
ఉద్దేశించి కృష్ణుడు అన్నాడు. అందువలన 'ఇందు' అను పదమునకు ఆధ్యాత్మికరంగములో జ్ఞానము అను అర్థమును
చెప్పుకొంటున్నాము. జ్ఞానము భూమిమీద రెండు రకములుగా ఉన్నది. ఒకటి పరమాత్మ జ్ఞానము, రెండవది ప్రపంచ
జ్ఞానము. ఏ విధమైన జ్ఞానమునకు గానీ విజ్ఞానము అనునది ఒకటి ఉంటుంది. జ్ఞానము బుద్ధికి తెలుస్తుంది,
విజ్ఞానము ఇంద్రియములకు తెలుస్తుంది. విజ్ఞానమును ఇంద్రియముల ద్వారా తెలియవచ్చును. అనగా కంటిద్వారా
చూడవచ్చును, చెవి ద్వారా వినవచ్చును. అయితే విజ్ఞానమునకు సంబంధించిన జ్ఞానమును బుద్ధిద్వారా మాత్రమే
గ్రహించవచ్చును. ఉదాహరణకు ఒక వంటను చేయు విధానమును, ఒకరి ద్వారా తెలుసు కోవడమును జ్ఞానము
అంటాము. వంటయొక్క జ్ఞానమును బుద్ధి గ్రహించుకొని, తిరిగి బుద్ధి చెప్పినట్లు వంటను చేయడము విజ్ఞానము
అంటాము. దీనినిబట్టి తెలిసిన జ్ఞానము అమలు జరిగినపుడు విజ్ఞానము అగును. విజ్ఞానమును ఎవరైనా
అనుభవించవచ్చును. ఒక వంటవాడు తన జ్ఞానముచేత చేసిన వంటను వందమంది అయినా తిని అనుభవించ
వచ్చును. తినే వారందరికీ వంటయొక్క జ్ఞానము తెలియకున్ననూ, ఒకని జ్ఞానము చేత ఎందరైనా అనుభవించవచ్చును.
ఉదాహరణకు బయట అందరికీ కనిపించు సెల్ఫోన్ తీసుకొందాము. దానిని మొదట కనిపెట్టింది ఒక్కడే! దానిని
కనిపెట్టిన తర్వాత ఆ సెల్ఫోన్ జ్ఞానము చేత సెల్ఫోన్ తయారు చేయబడింది. కనిపెట్టినవాని నుండి సెల్ఫోన్
జ్ఞానమును తెలుసుకొన్న మరికొందరు కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీపేరుతో సెల్ఫోన్లను తయారు చేశారు.
మొదట కనిపెట్టిన వాడు ఒక్కడే. తర్వాత తెలుసుకొన్నవారు పదిమంది (పది కంపెనీలు). సెల్ఫోను వాడుచూ
అనుభవించువారు కొన్ని కోట్లమంది. ఫోన్ను వాడే వారందరికీ దాని జ్ఞానము తెలియదని జ్ఞప్తికుంచుకోవాలి. మొదట
కనుగొన్నవాడు బయటికి చెప్పినపుడు అది జ్ఞానము అవుతుంది. జ్ఞానము ప్రకారము చేసినపుడు తయారైనదీ, అనుభవానికి
వచ్చునదీ విజ్ఞానమవుతుంది. ఈ కాలములో కొందరి జ్ఞానము చేత దేశమంతా విజ్ఞానమయమైపోయింది, ఎన్నో
సుఖాలను విజ్ఞానముచేత ఎందరో అనుభవిస్తున్నారనుట సత్యము.
దీనినంతటిని గమనిస్తే జ్ఞానము వేరు, విజ్ఞానము వేరని తెలియు చున్నది. విజ్ఞానమును నవీనముగా ఇంగ్లీషు
భాషలో సైన్సు అంటున్నాము. విజ్ఞానమునకు ఆధారమైన జ్ఞానమును ఇంగ్లీషు భాషలోనే సూపర్సైన్సు అనికానీ,
సూపర్నాలెడ్జి అనిగానీ అనవచ్చును. జ్ఞానము రెండు రకములనీ ఒకటి ప్రపంచ (ప్రకృతి) జ్ఞానమనీ, రెండవది
పరమాత్మ (దేవుని) జ్ఞానమనీ చెప్పుకొన్నాము. ప్రపంచ జ్ఞానమును సూపర్ నాలెడ్జి అనీ, పరమాత్మ జ్ఞానమును సూపర్
సైన్సనీ విడివిడిగా చెప్పుకోవచ్చును. దేవుని జ్ఞానమును కొందరు సూపర్ సైన్సని అన్నారు. మనము కూడ అలాగే
చెప్పుకొందాము. ఇప్పుడు ప్రపంచ జ్ఞానమును గురించి వివరముగా చెప్పుకొనుటకు ముందు ఒక విషయమును
చెప్పుకొందాము. 'కరూరు' అను ఒక ప్రాంతములో వజ్రాలు దొరుకుతుంటాయి. అందువలన ఆ ప్రాంతములో గల
కరూరు “వజ్రకరూరు” అను పేరుతో పిలువబడుచున్నది. వజ్రకరూరు ప్రాంతములో ఇప్పటికీ ఎందరికో, ఎన్నో
వజ్రములు దొరికినవి. వాటిలో కొన్ని చిన్నవీ, కొన్ని పెద్దవీ, కొన్ని మధ్య రకమువీ ఎన్నో రకములు దొరికినవి. వాటి
ఆకారమునూ, పరిమాణమునూ బట్టి వెయ్యి రూపాయలనుండి కోటి రూపాయలవరకు విలువచేయు వజ్రములు
ఉన్నవి. ఆ వజ్రములన్నీ ఒక్కమారుగ దొరకలేదు. ఇవన్నీ దొరకుటకు దాదాపు వందల సంవత్సరములు
పట్టిందనుకొందాము. ఇంతటితో అయిపోక రాబోవు కాలములో కూడ వజ్రములు దొరకవచ్చును. వందలసంవత్సరముల
కాలములో, ఎందరికో ఎన్నో వజ్రములు, అనేక పరిమాణములలో దొరికాయి అంటే, ఆ వజ్రములన్నీ ముందునుండి
ఆ ప్రాంతములో ఉన్నాయని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ముందునుండి ఉన్న వజ్రములు, అప్పుడొకటి అప్పుడొకటి
వేరు వేరు సైజులలో, వేరువేరు వ్యక్తులకు దొరికాయి. ప్రపంచ ప్రసిద్ధికాంచిన 'కోహినూర్' అను వజ్రము కూడ
కర్నూలు జిల్లా, నల్లమల అటవీ ప్రాంతములో దొరికిందని తెలిసింది. కోహినూర్ వజ్రమునకు ముందు పేరు లేదు. ఆ
వజ్రము 'కోహినూర్' అనే ముస్లీమ్ వ్యక్తికి దొరికింది. కావున దానికి గుర్తింపుగా కోహినూర్ వజ్రమని పేరు పెట్టారు.
భూమిమీద ముందే అనేకరకముల వజ్రములున్నట్లు, అనేక రకముల విజ్ఞాన పరికరములకు, యంత్రములకు
సంబంధించిన జ్ఞానము భూమిమీద ముందునుండే ఉన్నదని చెప్పవచ్చును. ముందునుండి ఉన్న వజ్రములలో ఏదో
ఒకటి, ఎవరికో ఒకరికి, ఏదో ఒక కాలములో దొరికినట్లు, ముందునుండి ఉన్న జ్ఞానములో ఏదో ఒకటి, ఎవరికో
ఒకరికి, ఏదో ఒక కాలములో తెలియుచున్నది. ఒక పరిమాణ వజ్రము, ముందు వెతికే ఒకనికే లభించినట్లు, ఒక
విషయమునకు సంబంధించిన జ్ఞానము, ముందు పరిశోధన చేయు ఒకనికే తెలియును. ముందు ఒకనికి దొరికిన
వజ్రమును తర్వాత ఎంతమందయినా చూడవచ్చును. అలాగే ముందు ఒకనికి తెలిసిన జ్ఞానము తర్వాత ఎంతమందికైనా
తెలియవచ్చును, ఎంత మందికైనా ఉపయోగపడవచ్చును. ఇక్కడ గమనించవలసిన విషయమే మంటే వెతికే వానికి
వజ్రము కనిపిస్తే, దానిని తీసుకొన్నవాడు నాకు వజ్రము దొరికింది అంటాడు. కానీ ఒక విషయమును పరిశోధించు
వానికి, ఆ విషయము యొక్క రహస్యము లేక అంతవరకు తెలియని విధానము ఊహకందినపుడు, దానిప్రకారము
చేసి చూచి, దానిని సాధించినట్లు లేదా కనుగొన్నట్లు చెప్పుకొనును. తనకు తెలిసిన విధముగా చేసి చూపించి, తాను
కనుగొన్న దానిని నిరూపించును. మొదట రేడియో లేని కాలములో క్రీస్తుశకము 1866వ సంవత్సరము మార్కోనీ
అనునతడు రేడియోను కనుగొన్నాడు. వజ్రము దొరికిందంటే ముందే భూమిమీద ఉన్నట్లే! అలాగే ఒక వ్యక్తి ఒక
పరికరమునుగానీ, ఒక యంత్రమునుగానీ, ఒక సిద్దాంతమునుగానీ కనుగొన్నాడంటే, అది ముందే అతనికి తెలియకుండ
భూమిమీద ఉన్నదని అర్థమగుచున్నది. భూమిమీద ముందు నుండీ మనకు తెలియకుండ ఉన్నదే తెలియబడుతుంది.
కానీ లేనిది ఏదీ తెలియబడదు. ఈ దినము మనము కనుగొన్న కంప్యూటర్లు, విమానములు, స్కైలాబ్లు, అణుబాంబులు,
సెల్ఫోన్లు, టెలివిజన్లు మొదలగు వస్తు సముదాయ జ్ఞానమంతయు ముందునుంచీ ఉన్నదేనని తెలియుచున్నది.
మానవుడు అనుభవించు అనేక సుఖములకు ఉపయోగపడు పరికరముల జ్ఞానమును సృష్ట్యాదిలోనే దేవుడు తయారు
చేసి (సృష్టించి) ఉన్నాడని అర్థమగుచున్నది. సృష్ట్యాదిలోనే దేవుడు ఇంకా ఇంతవరకు మనము కనుగొనని జ్ఞానము
లను ఎన్నిటినో తయారు చేసిపెట్టాడు. ఈ మా మాటలను కొందరు నాస్తికవాదులు ఒప్పుకోరు. వారు అలా
ఒప్పుకోకపోవడములో శాస్త్రబద్ధత లేదు. మేము ముందునుంచి ఉన్నాయనీ, వాటికి ఒక సృష్టికర్త ఉన్నాడనీ చెప్పుటకు
శాస్త్రబద్ధత ఉన్నది. వారికి లేని శాస్త్రబద్ధత ఏమిటో? మా మాటలకున్న శాస్త్రబద్ధత ఏమిటో తర్వాత తెలియజేస్తాము.
ముఖ్యముగ మేము తెలియజేయు సూత్రము ఏమనగా! ఒక విషయమును శాస్త్రబద్ధముగా ఉన్నదని నిరూపించగలిగినపుడు,
అలాగే ఒక విషయమును శాస్త్రబద్ధముగ లేదని కూడ నిరూపించాలి. అలా కాకుండ తనకు తెలియని విషయమును
గ్రుడ్డిగ లేదనడము శాస్త్రబద్ధత కాదు.
జ్ఞానము రెండు రకములనీ, ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండవది పరమాత్మ జ్ఞానమనీ మేము ముందే చెప్పాము.
ప్రపంచ జ్ఞానమునకు గానీ, పరమాత్మ జ్ఞానమునకు గానీ విజ్ఞానమున్నదని కూడా చెప్పాము. మనకు తెలియబడుచున్న
విజ్ఞానమునకు శాస్త్రము ఆధారము, శాస్త్రమునకు సంబంధము లేకుండ ఏ జ్ఞానముగానీ, ఏ విజ్ఞానముగానీ ఉండదు.
ప్రపంచ జ్ఞానమునకు ఆధారమైనవి ఐదు శాస్త్రములు, పరమాత్మ జ్ఞానమునకు ఆధారము ఒక శాస్త్రమని ముందునుంచి
తెలియజేస్తున్నాము. ప్రపంచము నకు సంబంధించిన ఐదు శాస్త్రములకంటే ఎంతో పవిత్రమైనదీ మరియు ఉత్తమమైనదీ,
పరమాత్మ జ్ఞాన శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము. పై పేరాలో ప్రపంచ జ్ఞానమును గురించి కొద్దిగ చెప్పుకొన్నాము.
ఇంతవరకు తెలిసిన ప్రపంచ జ్ఞానమును, ప్రాథమిక పాఠశాలనుండి విశ్వవిద్యాలయము వరకు ఉన్న బోధకులు
బోధిస్తున్నారు. ప్రపంచ జ్ఞానము బోధకుల ద్వారా తెలియ బడుచున్నది. మనకు తెలియబడిన ప్రపంచ జ్ఞానమును
విజ్ఞాన రూపముతో చూస్తున్నాము. దీనినిబట్టి ప్రపంచ జ్ఞానములోనున్న విజ్ఞానము అందరి అనుభవానికీ వస్తున్నది.
ఇక పరమాత్మ జ్ఞానమును గురించి చెప్పుకుంటే బోధకుని ద్వారా వినిన దైవజ్ఞానము, ఒకేమారు ప్రపంచ విజ్ఞానము
కనిపించి నట్లు అందరికీ విజ్ఞానముగా కనిపించదు. ఇక్కడ బాగా అర్థము చేసుకొంటే ప్రపంచ జ్ఞానము ద్వారా ఒక
కంప్యూటర్ను తయారు చేసినవాడేకాక, దానిని తయారు చేయనివారు కూడా దాని ఫలితమును పొందుచున్నారు కదా!
ఇక్కడ పరమాత్మ జ్ఞానములో అలా కాకుండ ఎవడైతే జ్ఞానము తెలిసి దాని ప్రకారము ప్రవర్తిస్తే, ఆ జ్ఞానము వలన
వచ్చు ఆనందమును వాడే అనుభవిస్తున్నాడు. వివరముగా చెప్పితే దైవజ్ఞానము వలన ఏర్పడు విజ్ఞానమును, జ్ఞానము
తెలిసినవాడు మాత్రమే అనుభవిస్తున్నాడు. ప్రపంచ జ్ఞానము మాదిరి ఒకడు కనిపెడితే, దాని విజ్ఞానమును అందరూ
అనుభవించినట్లు కాకుండా, పరమాత్మ జ్ఞానము యొక్క విజ్ఞానము, జ్ఞానము తెలిసిన వానికే పరిమితి అగును. పరమాత్మ
జ్ఞానము, ప్రపంచ జ్ఞానము మాదిరి ప్రజల చేత కనిపెట్టబడకుండ, దేవుడే తనకు సంబంధించిన జ్ఞానము నంతటిని
ముందే తెలియజేశాడు. ప్రపంచ జ్ఞానమును ముందే ఎవరూ తెలియ చెప్పలేదు. అది కాలము గడుచుకొలది
మనుషులచేతనే కనిపెట్టబడి, అప్పటినుండి మాత్రమే తెలియబడుచున్నది. ఇప్పుడు ప్రపంచ జ్ఞానమునకు, పరమాత్మ
జ్ఞానమునకు ఉన్న తేడా ఏమిటో తెలిసింది కదా! అంతేకాక పరమాత్మ జ్ఞానములో మరియొక వింత గలదు. అదేమనగా!
పరమాత్మ జ్ఞానము సరిగ తెలియకపోతే, అనగా పరమాత్మ జ్ఞానములోని అసలైన భావమును తెలియకపోతే, దాని
విజ్ఞానము తెలియబడదు. దైవజ్ఞానమును దేవుడు తెలియబరచిన భావము ప్రకారము తెలిసినపుడు మాత్రమే, అదియు
తెలిసిన వానికి మాత్రమే, దాని విజ్ఞానము అనుభవానికి వస్తున్నది. అంతేకాక ఇందులో మరియొక విధానము కూడా
కలదు. దైవజ్ఞానమునకు సంబంధించిన కొన్ని విజ్ఞానములు, దేవుడున్నాడనుటకు నిదర్శనముగా ముందే అందరికీ
తెలియబడుచున్నవి. అలా ముందే తెలియబడుచున్న దైవ విజ్ఞానముతో ప్రపంచ జ్ఞానమునకు ఏమాత్రము
సంబంధముండదు. ప్రపంచ శాస్త్రములలోని ఏ సిద్ధాంతమూ విజ్ఞానమును వివరించలేదు.
అందరికీ తెలియుచూ, అందరి అనుభవానికీ అందుచున్న విజ్ఞానమునకు, ప్రపంచ జ్ఞానము ఎప్పుడైన కారణము
కానపుడు, అది దైవ జ్ఞానమునకు సంబంధించినదని తెలియుచున్నది. పరమాత్మ జ్ఞానము యొక్క విజ్ఞానము ద్వారా
పరమాత్మ జ్ఞానమును తెలుసుకోవచ్చును. అలాగే దేవుడు ముందే తెలియజేసిన జ్ఞానము ద్వారా దేవుని విజ్ఞానమును
అనుభవించవచ్చును లేక తెలియవచ్చును. దీనినిబట్టి మనుషుల ద్వారా కాకుండ, దేవుని జ్ఞానము ద్వారా ముందే
తయారైన విజ్ఞానమును విపులముగా అర్థము చేసుకొంటే, దానిద్వారా దేవుని జ్ఞానమునూ తెలియవచ్చును. అలాగే
మనుషుల ద్వారా కాకుండ దేవుడు ముందే తెలియబరిచిన జ్ఞానము ద్వారా ఏర్పడు విజ్ఞానమునూ తెలియవచ్చును.
ప్రపంచ జ్ఞానము ముందు లేదు. కావున ముందు ప్రపంచ జ్ఞానము తెలిసిన తర్వాతనే దాని విజ్ఞానము బయటికి
వచ్చును. దీనినిబట్టి తెలియు చున్నదేమనగా! ప్రపంచ జ్ఞానము స్థూలమైనది, అందరికీ సులభముగా అర్థము
కాగలదు. అదే విధముగా ప్రపంచ విజ్ఞానము కూడ స్థూలమైనదే అది కూడా అందరికీ సులభముగా తెలియుచున్నది.
కానీ దైవముగానీ, దైవ జ్ఞానముగానీ స్థూలము కాదు. అలాగే దేవుని జ్ఞానము వలన కలుగు విజ్ఞానము కూడా
స్థూలముకాదు. అందువలన ప్రపంచ విజ్ఞానము అందరికీ సులభముగా తెలియుచున్నది. దైవజ్ఞానము వలన కలుగు
విజ్ఞానము తెలుసుకొన్న మనిషికి తప్ప ప్రక్క మనిషికి కూడా తెలియదు. కనుక ప్రపంచ జ్ఞానము విస్తరించినట్లు,
దైవజ్ఞానము విస్తరించడములేదు. ఇది మనుషులందరికీ సంబంధించిన విషయము. మనుషులు ఈ దేశములోనే
కాకుండా విదేశములలో కూడ ఉన్నారు. కావున దైవజ్ఞానము మీద ప్రస్తుత కాలములో, ఏ దేశమువారికి కూడా పూర్తి
శ్రద్దగానీ, ఆసక్తిగానీ లేకుండా పోయినది. ఇప్పటి కాలములో అన్ని దేశములలోనూ యంత్రముల పని ఎక్కువై
పోయినది. ప్రపంచ జ్ఞానము పెరిగిపోయినది. పరమాత్మ జ్ఞానము మీద పూర్తి ఆసక్తి లేకుండా పోయినది. భయంకర
మారణాయుధములను తయారు చేసుకొన్న మనిషిలో అహమూ, అజ్ఞానమూ పెరిగిపోయి అన్నిటికీ నేనే పెద్దయనీ,
దేవుడనేవాడు కల్పన మాత్రమేననీ, తెలివితక్కువ వారూ, శాస్త్రము తెలియనివారూ, మూఢనమ్మకముతో దేవుడున్నాడని
అనుచుందు రనీ చెప్పుచుందురు. ప్రతి దేశములోనూ, దేవుడున్నాడను వారు దాదాపు 80 శాతము ఉండినా, వారిలో
దేవుని జ్ఞానమంటే ఏమిటో తెలియని వారు దాదాపు 95 శాతము ఉన్నారు. దేవుడు లేడంటే ఏ నష్టమో, ఏ కష్టమో
వస్తుందను భయముతో ఉన్నాడను వారు చాలామంది కలరు.
ఇందూ దేశము.
పూర్వకాలమునకు నేటికాలమునకు పోల్చి చూచుకొంటే ఇందూ దేశములో పూర్వమే దేవుని జ్ఞానముకలవారు
ఎక్కువమంది ఉండేవారు. ప్రపంచ నాగరికత పెరిగేకొద్దీ, మనుషులు ప్రపంచ విద్యలు నేర్చేకొద్దీ, దేవుని జ్ఞానము మీద
విశ్వాసము తగ్గిపోయి, ప్రపంచ జ్ఞానము మీద విశ్వాసము పెరిగినది. చివరకు దైవజ్ఞానము మీద విశ్వాసము చాలా
శాతము తగ్గిపోయినది. నేడు మన దేశములో చదువూ, చదువు తర్వాత ఉద్యోగమూ, ఉద్యోగము తర్వాత సంపాదనా
తప్ప వేరు ధ్యాసలేని పరిస్థితి ఏర్పడినది. కొందరికి భక్తివుండినా, అది దేవుని మీద భక్తికాక, దేవతల మీద భక్తి
మాత్రమే కలదు. ఆ భక్తి కూడా తమ కోర్కెల కొరకు స్వార్థముతో కూడుకొన్న భక్తి తప్ప నిస్వార్థభక్తి కాదు. నేడు భక్తిని
కూడా స్వార్థ రాజకీయములకు ఉపయోగించుకొంటూ మాది భక్తి భావమనుచూ, మత రక్షణ ధర్మరక్షణ అను పేరుతో
గుంపులూ, సంఘాలూ ఏర్పడినవి. ఈ విధముగా దైవజ్ఞాన విషయములో ఎంతో వెనుకకు పోయిన నేటి భారతదేశము
పూర్వము ఎలా ఉండెడిదనగా! కృతయుగ చరిత్రలు మనకు అందకపోయినా, త్రేతాయుగము నాటి చరిత్రను చూడగలిగితే,
ఆధ్యాత్మిక విద్యలో, దైవశక్తిలో ప్రపంచ దేశములన్నిటికంటే ఎంతో ఉన్నత స్థాయిలో భారతదేశముండెడిది.
దైవజ్ఞానమునకుగానీ, దైవశక్తికిగానీ పేరుగాంచినది ఆనాటి భారతదేశము.
ఈ మధ్య కాలములో విడిపోయిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ భారతదేశములో అనుసంధానమై
ఉండేవి. అంతేకాక శ్రీలంక కూడ భారత భూమిలో కలిసివుండేది. త్రేతాయుగ కాలములో లంక, భారతదేశము ఏక
భూమిగా ఉండేవి. ఈనాడు లంకకు, భారతదేశమునకు మధ్యలోనున్న సముద్రము ఆనాడు ఉండెడిది కాదు.
కాలములోనే పెద్దపెద్ద తుఫానుల వలన లంకకు, భారతదేశమునకు మధ్యలో ఒక పర్లాంగు, రెండు పర్లాంగుల దూరము
నీటికుంటలవలె నిలచిన నీరు వుండేది. కొన్ని చోట్ల అరకిలో మీటరుకంటే ఎక్కువ దూరములేని నీరు ఉండేది.
నీరు తూర్పు పడమరలుగా సముద్రముతో కలిసివుండేది. లంకకు భారతదేశమునకు మధ్యలో ఈనాటివలె కొన్ని
పదుల కిలోమీటర్ల దూరము సముద్రముండెడిది కాదు. కొన్ని స్థలములలో లంకకు భారతదేశమునకు మధ్యలో ఏమాత్రము
నీరు ఉండేదికాదు. అక్కడ కొంత భూభాగము రెండు దేశములను కలిపి ఉండేది. ఆనాడు లంక భారతదేశముతో
కలిసి ఒకటే భూభాగముగా ఉండినప్పటికీ, లంక ప్రత్యేక రాజ్యముగా ఉంటూ, ప్రత్యేక రాజుల చేత పరిపాలించబడినది.
అలాగే భారతదేశము ఉత్తరాదిన ఈ దినము విడిపోయిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ అన్నీ ఒకే భూభాగముగా
ఉండినా, ఉత్తరాదిన కొందరూ దక్షిణాదిన కొందరూ ఒకే కాలములో వేరువేరు రాజులు పాలించినట్లు చరిత్ర కలదు.
త్రేతాయుగ కాలములో హస్తినాపురమైన నేటి ఢిల్లీనుండి ఉత్తర ప్రాంతమును వేరు రాజులు పాలించగా, అయోధ్యను
రాజధానిగా చేసుకొని దక్షిణ దేశమును కొంతకాలము దశరథుడూ, రాముడూ అతని వంశము వారూ పాలించినట్లు
తెలియుచున్నది. కృతయుగము మరియు త్రేతాయుగములో కొంతకాలము భారతదేశ రాజులే లంకను పాలించగా,
రాముడు, అతనికంటే ముందూ అతని తర్వాత లంక భారతదేశమునకు సంబంధము లేకుండ ప్రత్యేకముగ
పాలించబడినది.
భారతదేశము ఆసియా ఖండ భూభాగములో ఉండినా, ఉత్తరమున హిమాలయ పర్వతములు ఎత్తయిన పెద్ద
గోడవలెవుండి ఆసియాఖండము నుండి విడదీసినట్లుండుట వలనా, భారతదేశమునకు చుట్టూ సముద్రము ఉండుట
వలన, ఈ దేశమును ప్రత్యేక ఖండముగా చెప్పవచ్చును. అందువలన దీనిని భరతఖండము అని కొందరన్నారు.
భారతదేశము ఆసియాఖండములోనిదైనప్పటికీ, దీనిని భౌతికముగా చూస్తే ప్రత్యేకమైన ఖండముగా పైన వున్న
హిమాలయముల వలన కనిపించుచున్నది. అంతేకాక అభౌతికముగా క్రిందవున్న శ్రీలంక వలన ఎంతో శక్తితో కూడుకొన్న
దేశముగా కనిపించుచున్నది. ప్రపంచములో గల ఖండములలో ఆసియా ఖండము పెద్దదికాగా, ఆసియా ఖండములో
భారతదేశము భౌతికముగా ప్రత్యేకమైన ఖండముగా కనిపించడమే కాకుండ, అభౌతికముగా ఆధ్యాత్మిక శక్తిలో విశేషత
కల్గినదై, ఆధ్యాత్మిక విద్యకుగానీ, దైవశక్తికిగానీ పుట్టి నిల్లులాంటిదైనది. దేవుడు తన ధర్మములను తెలుపు నిమిత్తము
భారత దేశములోనికి ఇంతకుముందు ఐదుమార్లు వచ్చిపోయినప్పటికీ ఆరవమారు కూడ భరతఖండములో పుట్టడమువలన
భారతదేశమునకు ఒక ప్రత్యేకత కలదు. తన ఆరవ జన్మలో ప్రత్యేకముగా ధర్మములన్నిటినీ బోధించడము వలన
భారతదేశమునకు విశేషమైన ప్రత్యేకత కలదని చెప్పవచ్చును. ప్రపంచములో నేడుగల 194 దేశములలో ఒక్క
భారతదేశములోనే విశ్వమునకంతటికి దేవుడైన పరమాత్మ, ఆరుమార్లు భగవంతునిగా జన్మించుటకు కారణము కలదనియే
చెప్పవచ్చును.
ఇందూ మహాసముద్రము.
విశ్వమునంతటినీ సృష్టించిన సృష్టికర్త పరమాత్మ ఒక్కడే. పరమాత్మను దేవుడు అంటున్నాము. దేవుడు
శక్తిమయుడు, నిరాకారుడు, ధర్మయుతుడు. అటువంటి దేవుడు ఎవరో, ఎటువంటి వాడో ఎవరికీ తెలియదు. అంతగొప్ప
వాడు భూమిమీద అవతరించుటకు సూచనగా దైవశక్తి (ఆత్మశక్తి) భూమండలము మీద ముందే కొంత తిష్టవేసియుండును.
భూమండలము మీద దాదాపు 73 పాళ్ళు నీరూ, 27 పాళ్ళు భూమికలదు. భారతదేశమునకు క్రింది భాగములో
లంకా, లంకకు చుట్టూ నీరు కలదు. భారతదేశమునకు కూడా మూడువైపుల నీరు కలదు. లంక చుట్టూ దాదాపు
సముద్రమున్నట్లు, ఆ నీటికి ఆనుకొని భారతదేశమున్నట్లు, ప్రపంచ పటములో చూడవచ్చును. భారత భూభాగమునకు,
లంక భూభాగమునకు మధ్యలో నీరుండుట వలన భరతఖండములో లంక ప్రత్యేకమైన చిన్న ఖండముగా కనిపించుచున్నది.
ఆసియాఖండములో భారత భూభాగము ప్రత్యేకమైన ఖండముగా కనిపించగా, భారత ఖండములోని లంక, భారత
భూభాగము నుండి ప్రక్కన ఉన్నట్లు కనిపించుచున్నది. అలా కనిపించుటకు సముద్రమే ముఖ్యకారణము.
సముద్రము భూమండలములో అఖండముగా ఒకటే ఉండినా భూమి మాత్రము ఖండ ఖండములుగా ఉన్నది.
భూమి ఖండములుగా ఉండడమూ, ఆ ఖండములకు పేర్లు ఉండడమూ కొందరికి తెలుసు. అయితే సముద్రము
భూమివలె ఖండములుగా లేకున్ననూ సముద్రమునకు కూడా ప్రాంతాల వారిగా పేర్లు పెట్టడము జరిగినది. భారత
ఖండమునకు క్రిందా, లంకకు నాల్గువైపులగల సముద్రమునకు “ఇందూ మహా సముద్రము”గా పేరు పెట్టడము
జరిగినది. దాదాపు 70 పాళ్ళు నీరూ, 30 పాళ్ళు భూమి ఉన్ననూ, అందులో భారతదేశము క్రింద భాగములోనున్న
సముద్రమునకు, ‘ఇందూమహాసముద్రము' అని కృతయుగములోనే పేరు పెట్టారు. సృష్టి ఆదినుండీ కాలము జరుగుచూ
రాగా, మొదటి యుగమైన కృతయుగము లోనే, భారతదేశమునకు క్రిందగల సముద్రమునకు ఇందూ మహాసముద్రము
అని పేరు పెట్టడము జరిగినది. భారతదేశమునకు దక్షిణము వైపున క్రింది భాగమున ఇందూ మహాసముద్రము
ఉండుట వలన భారత దేశమునకు ఇందూదేశము అని పేరు వచ్చినది. కానీ కాలక్రమమున ఇందూదేశము అను
పేరు లేకుండా పోయి హిందూదేశము అని పిలువడము జరుగుచున్నది. కాలక్రమమున ధర్మములు అధర్మములుగా
మారిపోవునని దేవుడు చెప్పినట్లు అర్థముతో కూడుకొన్న పేరు పోయి, అర్థములేని పేరువచ్చి భారతదేశమునకు
తగులుకొన్నది. దక్షిణమువైపు గల ఇందూ మహా సముద్రము వలన కలిగిన గొప్ప పేరును వదులుకొని, ఉత్తరము
వైపున ఏ ప్రాముఖ్యత లేని సింధూనది పేరును పట్టుకొని, దానివలన మన దేశమునకు హిందూదేశము అని పేరు
వచ్చినదని కొందరు చెప్పుకోవడము తెలివితక్కువ పనికాదా! సింధూనది ప్రవహించుట వలన హిందూదేశమని
అనుచున్నామని, కొందరు హిందువులు చెప్పు కోవడము ఎంతమటుకు సమంజసమో కొంత యోచించండి. దీనివలన
ఎన్నో ప్రశ్నలు ఉత్పన్న మగుచున్నవి. సింధూనదిని బట్టి వచ్చిన పేరయితే సింధూదేశమని పిలవాలి గానీ, హిందూదేశమని
ఎందుకు పిలవాలి? ఒకవేళ కాలక్రమములో తెలియనివారు హిందూదేశమని పిలిచినా అట్లు కాదు, సింధూదేశమని
పిలవాలని చెప్పవచ్చును కదా? సింధూనది వలన వచ్చిన పేరయితే స్వయాన చరిత్ర తెలిసినవారు, హిందూ అను
పేరును తీసివేసి 'సింధూ' అను పేరును పెట్టవచ్చును కదా!
సింధూనదినిబట్టి హిందూదేశము అని అనుటకు ఏమైనా కారణము ఉన్నదా? ఏ గొప్పతనము లేని సామాన్యమైన
ఒకనది యొక్క పేరును బట్టి, ఇంత పెద్ద దేశమునకు దానిపేరును పెట్టుకొనే దానికంటే, ఈ దేశములోనే ప్రవహించుచూ,
పవిత్రమైనదిగా పేరుగాంచిన గంగానది యొక్క పేరునుబట్టి గంగాదేశమని పేరు పెట్టుకోకూడదా? భారతదేశములో
పెద్దనదిగా పేరుగాంచిన బ్రహ్మపుత్రానది యొక్క పేరును అనుసరించి బ్రహ్మపుత్ర దేశమని పిలుచుకోకూడదా?
భారతదేశములో కాకుండా పాకిస్థాన్ దేశములో ప్రవహించు సింధూనదికి గౌరవముగా పాకిస్థాన్ దేశములో ప్రత్యేకమైన
సింధూరాష్ట్రము కలదు. పాకిస్థాన్లో ఈ నది ప్రవహించుట వలన దానిపేరును వారు ఒక రాష్ట్రమునకు పెట్టుకోవడములో
ఒక అర్థముకలదు. భారతదేశము వారు సింధూనది పేరు చెప్పుకోవడములో అర్థమే లేదు. హిందూమతమును మేము
రక్షించుచున్నామని చెప్పుకొనుచు కొన్ని సంఘములను స్థాపించుకొని, మాలాంటివారిని హేళనగా మాట్లాడు హిందువులను
మేము ప్రశ్నించునదేమనగా భారతదేశము యొక్క పూర్వ చరిత్ర మీకు తెలుసా? భారతదేశము జ్ఞానశక్తిలోనూ,
ఏ
ఆధ్యాత్మిక విద్యలోనూ అన్ని దేశములకంటే ప్రథమస్థానములోనున్న చరిత్ర మీకు తెలుసా? భారత దేశములోనే దేవుడు
భగవంతుడిగావచ్చి తెలిపిన ఇందూధర్మములలో ఏ ఒక్క ధర్మమైనా మీకు తెలుసా? 'ఇందూ' అను పదము ఎంత
అర్థముతో కూడుకొన్నదో తెలుసా? అని అడుగుచున్నాము. దైవజ్ఞానము ఏమాత్రము తెలియనివారు తాము ఇందువులమని
చెప్పుకోకూడదు. అంతేకాక దైవ జ్ఞానమునకు సంబంధము లేనివారు ఇందువులే కారు అన్నట్లు, నేడు దైవ జ్ఞానమునుగానీ,
దైవ ధర్మములనుగానీ ఏమాత్రము తెలియనివారు మేము ఇందువులమని చెప్పుకోక ప్రక్కపేరుతో హిందువులమని
చెప్పు కొనుచున్నారు.
దైవ జ్ఞానమునకు మారుపేరు 'ఇందు'. భారతదేశము ప్రపంచ దేశములలో దైవజ్ఞానమునందు
అగ్రస్థానములోనున్న దేశము. కావున భారతదేశమునకు “ఇందూ దేశము” అను పేరు వచ్చినది. ఇందూదేశము అను
శబ్దమునకు జ్ఞాన దేశము అని అర్ధము గలదు. దైవజ్ఞానము కలవారు ఎక్కువగావుండడము వలన, భారతదేశమునకు
ఇందూదేశము అను పేరు వచ్చుటకు ముఖ్యకారణమైనది. కొందరు అజ్ఞానులు, సింధూ నాగరికత గలవారు హిందువులు
అనుటను చూస్తే వారి మాట ప్రకారము సింధూనది పరివాహక ప్రాంతములోని పాకిస్థాన్ దేశము వారు కూడా
హిందువులే కావాలి. కానీ అలా ఎక్కడా లేరే? అందువలన చరిత్రలేని మరియు అర్థములేని హిందూ అను మాటను
వదలి, చరిత్రగల మరియు అర్థముతో కూడుకొన్న 'ఇందువు' అను మాటనుబట్టి, మన దేశమును అనగా భారత
దేశమును ఇందూదేశముగా చెప్పుకొందాము.
జ్ఞాన సముద్రము.
భారతదేశమును ఇందూ దేశమని గర్వముగా చెప్పుకొనుటకు ముఖ్యకారణము ఇందూ మహాసముద్రము.
అంతేలేని అనంతమైన విశ్వములో అర్థమేకాని, ఆకారములేని దేవుడు అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఆయన శక్తి
అంతటా ఉండినప్పటికీ భూమండలములో ఒక్కచోట కొంత అధికశక్తి కేంద్రీకృతమైవున్నది. ఒక్క భూమండలములోనేకాక
అనేక గోళములలోనూ, అనేక గ్రహములలోనూ, అనేక నక్షత్రములలోనూ కొన్ని ప్రాంతములలో కొంత అధికశక్తి
నిలువ ఉండడము జరుగుచున్నది. అటువంటి విధానము భూగోళములో కూడ ఉన్నది. భూమండలము ఎంతో
విస్తీర్ణము కలదిగా ఉన్నది. అందులో కొన్ని లక్షల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణములో శక్తి వ్యాపించివున్నది. త్రేతాయుగ
కాలములో భారత దేశమునకు క్రిందివైపున అనగా పూర్తిగా దక్షిణ భాగమున శ్రీలంకకు దాదాపు చుట్టూ గల సముద్రములో
ఆ శక్తి ఇమిడి ఉండేది. దైవము ధర్మములతో కూడుకొన్నవాడు, ధర్మములు జ్ఞానముతో కూడుకొన్నవి. జ్ఞానము తెలిస్తే
ధర్మములు తెలియబడుతాయి. ధర్మములు తెలిస్తే చివరకు దేవుడు తెలియ బడును. అందువలన దైవశక్తిని జ్ఞానశక్తి
అనికూడా పెద్దలన్నారు. జ్ఞాన శక్తి లంక దగ్గర, భారతదేశము క్రింద సముద్రములో ఉండుట వలన ఆ సముద్రమునకు
ఇందూ మహాసముద్రము అను పేరు వచ్చినది. కృత యుగములోనే దైవజ్ఞానమును తెలిసిన యోగులు జ్ఞానసముద్రమని
ఆ సముద్రమునకు పేరు పెట్టడము జరిగినది. జ్ఞానము అను పదమునకు 'ఇందు' అను పదము సమానము, కావున
ఆ కాలములోని యోగులూ, జ్ఞానులూ అందరూ జ్ఞానసముద్రమును ఇందూసముద్రము అన్నారు. జ్ఞాన శక్తి గొప్పది
కావున ఆ విషయము అందరికీ అర్థమగునట్లు ఇందూ సముద్రమునకు మహా అను శబ్దమును చేర్చి ఇందూ
మహాసముద్రము అన్నారు. మహా అను శబ్దము కృతయుగములోనే యోగులైనవారి చేత ఇందూ సముద్రమునకు
పెట్టబడినది. అప్పటినుండి ఇందూ సముద్రము ఇందూ మహాసముద్రముగా ఉండడమేకాక, తన శక్తి వలన భారత
దేశమునూ, లంకనూ ఉత్తేజపరిచి కొద్ది శక్తిని ఆ దేశములకు కూడా అందించింది. అందువలన అప్పటినుండి ఇందూ
మహాసముద్రము వలన లంక భూభాగములోనూ, భారత భూభాగములోనూ దైవజ్ఞానము ప్రజ్వరిల్లింది. భూగోళములో
అన్ని దేశములకంటే లంక మరియు భారత దేశము దైవశక్తిలో, ఆధ్యాత్మిక రంగములో అప్పటినుండి అగ్రగామిగా
ఉన్నాయి. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అది ఏమనగా! దైవ శక్తి కొంత దక్షిణ సముద్రములో ఉండుట
వలన, ఆ సముద్రము ఇందూ మహాసముద్రమైనదనీ, ఆ సముద్రము వలననే భారతదేశమునకు ఇందూ దేశమని పేరు
వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడేమో లంక కూడా భారత దేశముతో పాటు దైవ జ్ఞాన దేశమయింది అంటున్నారు, దైవశక్తిని
పొందిన భారత దేశము ఇందూ దేశమైనప్పుడు జ్ఞానశక్తి వలన లంకకు ఏ గుర్తింపు వచ్చిందని అడుగవచ్చును.
దానికి జవాబును క్రింద చూడవచ్చును.
శ్రీలంక.
ఇందూ మహాసముద్రము వలన భారతదేశమునకు లభించిన లాభముకంటే రెండింతలు ఎక్కువ లాభము,
లంకకు లభించిందని చెప్పవచ్చును. ఇందూ మహాసముద్రమునకు దగ్గరగా ఉన్న దేశము లంకయే. భారత దేశములో
ఎందరో గుర్తింపుగల్గిన జ్ఞానులు పుట్టారు. దైవజ్ఞానమునకు పుట్టినిల్లుగ భారతదేశమునకు గుర్తింపు వచ్చినది. భారత
దేశము జ్ఞానులకు నిలయమైన దేశము, కావున ఇందూ దేశము అనడము జరిగినది. అయితే భారతదేశముకంటే
లంకయే ఎక్కువ లాభము పొందినదని చెప్పుటకు ఆధారములు గలవు. అవి ఏమనగా! విశ్వములో ఆధ్యాత్మికరీత్యా
జ్ఞానము తర్వాత గొప్పది మోక్షము. జ్ఞానము దేవుని విషయమును మాత్రమే తెలియజేస్తే, మోక్షము ఏకముగా దేవునిలోనికే
ఐక్యము చేయగలదు. అందువలన దేవుని విషయమును తెలిసిన జ్ఞానికంటే దేవునిలోనికి ఐక్యమగుటకు ప్రయత్నము
చేయు యోగియే గొప్పవాడు అని భగవద్గీతలో కూడా “ఆత్మ సంయమ యోగము” అను అధ్యాయమందు 46వ
శ్లోకమున భగవంతుడే చెప్పియున్నాడు.
་་
తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోతి మతోధికః,
కర్మిభ్యచ్ఛాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జునా!"
శ్లోకములో తపస్వికులకంటే, జ్ఞానులకంటే, కర్మములను చేయు వారికంటే యోగి గొప్పవాడు. అందువలన
నీవు యోగిగా మారమని స్వయముగా భగవంతుడే అర్జునునకు చెప్పాడు. భారతదేశమునకు జ్ఞానము లభించినది,
కావున ఇందూ దేశముగా పిలువబడగా, లంకకు జ్ఞానముకంటే గొప్పదైన మోక్షమే లభించినదని చెప్పవచ్చును.
భారతదేశములో జ్ఞానులు పుట్టినట్లు బయటికి తెలియబడగా, లంకలో పుట్టినవాడు మోక్షమును పొందినట్లు తెలియబడినది.
దైవజ్ఞానమునకు అధిపతి చంద్రుడు అని జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చెప్పవచ్చును. అందువలన జ్ఞాన చిహ్నముగా
చంద్రున్ని చూపవచ్చును. త్రిమూర్తులలో ఒకరైన శివుడు తాను జ్ఞానినను చిహ్నముగా చంద్రవంకను తన తలమీద
అలంకరించుకొని చూపాడు. అంతేకాక ఎక్కడైనా జ్ఞానమునకు గుర్తుగ చంద్రుని పేరును వాడుచున్నాము. చంద్రుని
మారుపేరు ఇందువు. అందువలన జ్ఞాన చిహ్నముగా “ఇందు” అను పేరును భారతదేశమునకు కృతయుగములోనే
పెద్దలు పెట్టడము జరిగినది. జ్ఞానమునకు “ఇందు" అను శబ్దమును గుర్తుగా చెప్పగా, మోక్షమునకు “శ్రీ” అను
శబ్దమును గుర్తుగా చెప్పడము జరిగినది. దీని ప్రకారము ఇందూ మహాసముద్రమునకు అతి దగ్గరగానున్న లంకకు
“శ్రీ” అను శబ్దమును చేర్చి శ్రీలంక అని అన్నారు. ఇందూ మహాసముద్రమునకు సమీపములో రెండవ స్థానములోనున్న
మన దేశమునకు “ఇందూ దేశము” అనిపేరు రాగా, మొదటి స్థానములోనున్న లంకకు “శ్రీలంక” అను పేరు కలగడము
మనము గుర్తించవచ్చును.
ప్రపంచము మొత్తము మీద శ్రీ అను అక్షరమును ముందు కల్గియున్న దేశము ఒక్కటే ఒక్కటి! అదియే శ్రీలంక.
అదే విధముగా ప్రపంచములో జ్ఞాన చిహ్నమైన శబ్దము కల్గియున్న ఒకే ఒక దేశము ఇందూదేశము. మన ప్రక్కలోనున్న
శ్రీలంక నేటికినీ తన పేరును అలాగే నిలుపుకొని శ్రీలంకగానే ఉండగా, భారతదేశము మాత్రము అజ్ఞానములో
చిక్కుకొని, మాయా ప్రభావము ఎక్కువైపోయి ఇందూ దేశము నేడు హిందూ దేశముగా పిలువబడుచున్నది. మతాన్ని
ఉద్ధరిస్తామను హిందూధర్మ పోషకులు, విశ్వహిందూ ధర్మరక్షకులు అనువారు కూడా పూర్తి అజ్ఞానులై పోయీ, మతము
అను మాయలో పడిపోయినవారై, చరిత్ర తెలియనివారై పోయి, ఇందూ ధర్మములంటే జ్ఞానధర్మములని తెలియక, ఒక
ప్రక్క మనము ఇందువులమనీ, హిందువులముకామనీ, మధ్యలో ఇందూ అను శబ్దము హిందూ అను శబ్దముగా
మారిపోయినదని మేము చెప్పుచుండినప్పటికీ, మమ్ములను కూడా ఏమాత్రము గౌరవించక “మీరే పొరపడి ఇందూ
అంటున్నారు. హిందూ అని సరిచేసుకొని వ్రాసుకోండని హెచ్చరించి చెప్పుచున్నారు. గుంతకళ్ళు, మహానంది
మొదలగు చోట్ల మీది పరాయి మతము అని ఇతర మతస్థుల క్రిందికి జమకట్టి మాట్లాడుచున్నారు.
ఇప్పుడు మనము మాట్లాడుకోవలసింది శ్రీలంకను గురించి. శ్రీలంకలో త్రేతాయుగమునందు రావణబ్రహ్మ
పుట్టాడు. ఆయన చరిత్ర నేటికీ మనవద్ద రామాయణ రూపములో ఉండినప్పటికీ, ఇందూ అను శబ్దమును హిందూ
శబ్దముగా మార్చివేసిన మనుషులు ఎంతో గొప్ప జ్ఞాని అనీ, త్రికాల జ్ఞాని అనీ, యోగి అనీ, బ్రహ్మ అనీ పేరుగాంచిన
రావణబ్రహ్మనే నీచముగా వర్ణించి వ్రాసుకొన్నారు. మోక్షమునకు గుర్తుగాయున్న శ్రీలంకలో, మోక్షమును పొందుటకు
తగిన గొప్ప యోగిగా పుట్టిన రావణబ్రహ్మను, కేవలము ఒక అజ్ఞానిగా చెప్పుకోవడమును చూస్తే, పూర్వము ఇందూ
దేశమని పేరుగాంచిన దేశమేనా ఇది అని అనుమానము రాక తప్పదు. నేటి భారతదేశములో ఎంతో అజ్ఞానము
పెరిగిపోయి, ఈ దేశము హిందూ దేశముగా మారిపోయినా, ఆనాడు పెద్దలు పెట్టిన ఇందూ అను పేరుకు తగినట్లు
నేటికినీ ఎక్కడో ఒకచోట అసలైన జ్ఞానము వెలువడుచూ, ఎవరికీ తెలియని జ్ఞాన రహస్యములను తెలుపుచూ, భారతదేశము
ముమ్మాటికీ ఇందూదేశమని (జ్ఞానదేశమని) నిరూపించుకొనుచున్నది. భారతదేశము నిజమైన ఇందూ దేశముగా,
ప్రపంచ దేశముల ముందు నిరూపించబడుటకే, ప్రపంచ దేశములలో ఎవరికీ అంతుబట్టని త్రైతాకార రహస్యము
(బెర్ముడా ట్రయాంగల్) అను చిన్న గ్రంథము మాచే వ్రాయబడుచున్నది.
ప్రస్తుతము అసలు విషయానికి వస్తే, శ్రీలంక అను శబ్దము పేరులో 'శ్రీ' మోక్ష చిహ్నమైన బిరుదుగా లంకకు
వచ్చి శ్రీలంక అయినది. అదే విధముగా జ్ఞాన చిహ్నమైన ఇందూ శబ్దము భారతదేశమునకు వచ్చి ఇందూ దేశమైనది.
ఇందూ దేశముకంటే ఇందూ మహాసముద్రమునకు శ్రీలంకయే దగ్గరగా ఉన్నదానివలన, శ్రీలంక అను శబ్దములో
ఇందుకంటే విశేషమైన శ్రీ ఉండడమే కాకుండా, “లం" అను ఒక బీజాక్షరము కూడా గలదు. మొదటి అక్షరము
ప్రక్కలో సున్న ఉన్న కొన్ని శబ్దములను బీజాక్షరములను చున్నాము. బీజాక్షరములను మాటయందు బీజము అను
మాటవున్నది. భీజము అను దానినిబట్టి దానియందు ఏదో పుట్టుచున్నదని అర్ధము కాలగదు. ఈ మాట ప్రకారము
“లం” అను శబ్దమునందు కూడా ఏదో ఒకటి పుట్టుచున్నది. అది ఏమనగా! “లం” అనునది శక్తి బీజముగా ఉన్నది.
ప్రపంచశక్తి, పరమాత్మశక్తి అను రెండు శక్తులు విశ్వములో గలవు. ప్రపంచశక్తికి ఒక బీజాక్షరమునూ, పరమాత్మశక్తికి
"
ఒక బీజాక్షరమునూ పెద్దలు నిర్ణయించడము జరిగినది. వారి నిర్ణయము ప్రకారము ప్రపంచశక్తికి “హ్రీం” అను
శబ్దము బీజాక్షరముండగా, పరమాత్మశక్తికి “లం” అను శబ్దము బీజాక్షరముగా ఉన్నది. “ఓం” గానీ లేక “శ్రీ” గానీ
పరమాత్మకు సూచనగానున్న అక్షరములు. ఇంతవరకు “శ్రీ” కారముతో కూడుకొన్న బీజాక్షరముగానీ, ‘ఓం' కారముతో
కూడుకొన్న బీజాక్షరముగానీ ఏ దేశము పేరులోనూ లేవు. ఒకే ఒక్క శ్రీలంకకు తప్ప అటువంటి శబ్దము ఏ
దేశమునకుగానీ లేదు. ప్రక్కనేనున్న భారతదేశమునకు కూడా అటువంటి బీజాక్షరముల శబ్దములేదు. అందువలన
పేరులోగానీ, అర్థములోగానీ, శక్తిలోగానీ, ఇందూదేశముకంటే ఎన్నో రెట్లు శ్రీలంకయే గొప్పదని చెప్పవచ్చును.
శ్రీలంక అను పదములో “శ్రీ” అక్షరమునకు “లం” అక్షరమునకు అర్థమును తెలుసుకొన్నాము. చివరిలోనున్న
“క” అను అక్షరమునకు అర్థము ఏమీలేదు. కొన్ని పదములయందు ముగింపు అక్షరములకు అర్థముండదు. ఆ
అక్షరములను పదమును ముగించుటకు మాత్రమే ఉపయోగించడము జరుగుచున్నది. ఉదాహరణకు “శాపము”
అను పదములో శాప అను రెండు అక్షరములకు అర్థముండును. చివరిలో 'ము' అను అక్షరమునకు ఏ అర్థముండదు.
అలాగే లంక అను పదములో 'క' అనునది ముగింపు అక్షరమే కానీ అర్థముతో కూడుకొన్న అక్షరము కాదు. అందువలన
శ్రీలంక అను శబ్దములో 'శ్రీ' 'లం' అనునవి మాత్రమే అర్థముగల అక్షరములని తెలియాలి.
రావణ బ్రహ్మ.
అర్థములో అన్ని విధాలా ఇందూదేశమునకంటే గొప్పదనిపించు కొన్న శ్రీలంకలో త్రేతాయుగములోనే రావణుడు
పుట్టాడు. ఆ కాలములోనే ఆయన తాను పుట్టిన దేశమునకు తగినట్లు రావణబ్రహ్మ అని జ్ఞానులైన వారి చేత
పొగడబడినాడు. రావణబ్రహ్మను గురించి కొందరు చరిత్రలో నీచముగా వ్రాసినా, జ్ఞానుల దృష్ఠిలో ఆయన ఎప్పటికీ
గొప్పవాడే. 'రావణ' ఆయన పేరుకాగా, 'బ్రహ్మ' అనునది ఆయన బిరుదు. ఆధ్యాత్మిక అర్థము ప్రకారము 'బ్రహ్మ'
అనగా పెద్ద అను ఒకేఒక అర్థము వచ్చును. దేవుడు తప్ప ఈ విశ్వములో పెద్ద ఎవరూ లేరు. కావున బ్రహ్మ అను
పదము దేవునికి మారుపేరుగా చెప్పబడుచున్నది. దైవము లేక దేవుడు లేక ఈశ్వరుడు అని అర్థమునిచ్చు బ్రహ్మ అను
గొప్ప పదము చేత పిలువబడిన వాడు, మన చరిత్ర కారులకు నీచుడుగా ఎలా కనిపించాడో?
రావణ అను పదమును విభజించి చూస్తే ర+వణా అని రెండుగా చెప్పవచ్చును. అలాగే మా రచనలలోని
“మన పండుగలు” అను గ్రంథములో రామ అను పేరును విడదీసి అర్థము చెప్పుకొన్నాము. అక్కడ కూడా రామ అను
పదమును ర+మ అని విడదీసి రెండు అక్షరములకు అర్థమును చెప్పుకొన్నాము. రామ అను శబ్దము ఎంతో పవిత్రమైనదీ,
గొప్పదని కూడా చెప్పుకొన్నాము. అలాగే ఇక్కడ రావణ శబ్దమును విడదీస్తే ర మరియు వణ అని తెలియుచున్నది.
వణ అనగా అడవి అనీ, వృక్షముల సముదాయమనీ అర్థము రాగలదు. “ర” అంటే నాశనమును సూచించునదని
ముందే చెప్పుకొన్నాము. "రం” అనునది నాశనమునకు సంబంధించిన బీజాక్షరము. రం నుండి మ కారమును
తీసివేస్తే ర మిగిలిపోతుంది. ర కూడా రం అర్థమునే ఇచ్చుచున్నది. అందువలన రం లేక ర రెండూ నాశనము అను
అర్థము నిచ్చునవే అగుట వలన, రావణ పేరులో వణమును నాశనము చేయువాడను అర్థము వచ్చుచున్నది. మాయ
అను అడవిలో గుణములు అను వృక్షములను, నాశనము చేయువాడు అను అర్థముతో రావణ పేరున్నదని తెలియుచున్నది.
ఆ కాలములో మాయ అను అడవిని సమూలముగా నాశనము చేయుటలో, అందరికంటే పెద్దవాడు అయిన దానివలన
ఆయనకు రావణబ్రహ్మ అని ఆనాడు పేరు పెట్టడము జరిగినది. రావణ బ్రహ్మ గొప్ప ఆధ్యాత్మికవేత్త. కావున
ఆయనను త్రికాల జ్ఞాని అని కూడా సంబోధించడము జరిగినది. త్రేతాయుగములో ఇందూ మహా సముద్రము
దైవశక్తితో కూడుకొన్నదని, తెలిసిన ఒకే ఒక వ్యక్తి రావణబ్రహ్మ. అందువలన తరచూ ఆయన సముద్ర స్నానము
చేసెడివాడు. ఇందూ మహాసముద్రములో స్నానము చేయుట వలన, దైవశక్తి వాని తలయందు చేరునని ఆనాడే రావణ
బ్రహ్మకు తెలుసు. ఆనాడు అంత శక్తి ఇందూ మహాసముద్రములో ఉండేది. అయితే ఈనాడు ఆ శక్తి అక్కడలేదు.
దానిని గురించి తర్వాత చెప్పుకొందాము.
త్రేతాయుగము (త్రేతాయుగము)లో రావణబ్రహ్మ పుట్టి, ఆయన మోక్షమును చేరుకొన్నాడు. శ్రీలంక అను
పేరులోని అర్థమును సార్థకము చేశాడు. ఇందూదేశము అను పేరు సార్థకమగుటకు ఇందూదేశములో ఇందువులు
(జ్ఞానులు) ఎలా ఉద్భవించారో, అలాగే శ్రీలంక అను పేరు సార్థకమగుటకు రావణబ్రహ్మ జ్ఞానికంటే మించిన యోగియై,
చివరకు మోక్షమును పొందాడు. రావణబ్రహ్మ జ్ఞానిని మించిన యోగి అని ఈనాడు ఎవరికీ తెలియదు. ఆయన ఒక
అజ్ఞానిగానే ప్రచారము చేయబడినాడు. ఎంతో గొప్పవాడైన రావణబ్రహ్మయొక్క ఔన్నత్యమును గుర్తించలేకపోవడము,
మన దురదృష్టమేగానీ వేరుకాదు. భారతదేశము ఇందూదేశమైనా (జ్ఞానదేశమైనా) మాయా ప్రభావము చేత, అర్థముగల
ఇందువులు అర్థము లేని హిందువులు అయినట్లు గొప్పవాడైన రావణబ్రహ్మను తక్కువవానిగా లెక్కించుకొన్నాము.
భగవంతుడు భగవద్గీతలో, ధర్మములు కాలక్రమమున అధర్మములుగా మారునని చెప్పినట్లు, పూర్వము ధర్మయుతులుగానున్న
ఇందువులు, నేడు అధర్మయుతులైన హిందువులుగా మారిపోయారు. ధర్మములు అధర్మములుగా మారినపుడు, తిరిగి
నేను ఉద్భవించి ధర్మములను నెలకొల్పుతానని దేవుడు చెప్పాడు. అందువలన ఏనాటికైనా దేవుడు భగవంతుడుగా
వచ్చి భారతదేశములోని మనలను, తిరిగి ఇందువులుగా తయారు చేయగలడని ఆశిస్తాము. ఇప్పుడున్న అజ్ఞానము
ప్రకారము ద్రావిడులు, ఆర్యులు అను ప్రాంతీయతత్వ బేధమును కల్గిన ఆర్యుకవులు, రావణున్ని చెడుగా చిత్రించి
వ్రాయడము వలన ఏది మంచి, ఏది చెడు అని గ్రహించలేని ప్రజలు సత్యమును తెలుసుకోలేక, రావణున్ని చెడుగా
అర్థము చేసుకోవడము జరిగినది. ఎన్నో విషయములలో ఆయనను మనము తప్పుగా అర్థము చేసుకోవడము వలన,
రావణబ్రహ్మ అందరి దృష్ఠిలో చెడ్డవాడైపోయాడు. ఆయనను మనము చెడుగా అర్థము చేసుకొన్నాము అనుటకు ఒక
విషయమును ఉదాహరణగా తీసుకొందాము.
సుర అంటే పూర్వము దేవతలు తాగే మత్తుమందు అని అందరికీ తెలియకున్నా కొందరికైనా తెలుసు. నాడు
దేవతలు త్రాగే సురనే నేడు బ్రాందీలు, విస్కీలు అంటున్నాము. ఆనాడు సుర అను దానిని త్రాగుట వలన త్రాగేవారినందరినీ
అనగా సురాపానము చేయువారందరినీ సురులు అన్నారు. సురులు అనగా దేవతలని కొందరికి తెలియకున్నా,
చాలామందికి బాగా తెలుసు. సురను త్రాగువారు సురులు అయినపుడు, సురను త్రాగని వారందరూ అసురులగుదురు.
ఆనాడు రావణబ్రహ్మను అసురుడని ప్రకటించినవారే, దేవతలను సురులని చెప్పడము జరిగింది. ఈ లెక్క ప్రకారము
అసురుడైన రావణుడు గొప్పవాడా? సురులైన దేవతలు గొప్ప వారా? మీరే చెప్పండి. ఇంకొక విషయమును చెప్పుతాను
చూడండి. ఒకడు బాగా మత్తుపానీయములను (బ్రాందీని) త్రాగువానిని చూచి 'ఒరే ఏ గాడిద ఇట్లా త్రాగదురా'
అన్నాడట. అప్పుడు త్రాగినవాడు “కరెక్టుగా చెప్పావురా నేను మనిషిని కాబట్టి త్రాగుచున్నాను. నీవు గాడిద కాబట్టి
త్రాగలేదు” అని అన్నాడట. మొదట చెప్పిన వాని ఉద్దేశములో త్రాగేవాడు గాడిదకంటే హీనము అను భావముండగా,
త్రాగినవాని ఉద్దేశములో త్రాగని వాడు గాడిదతో సమానమని అనుకొన్నాడు. అదే విధముగా రావణబ్రహ్మ అసురుడు
అంటే, ఆయన మత్తు త్రాగనివాడను అర్థమును తీసుకోక, ఆయనను రాక్షసుడని చెప్పుకొన్నాము. త్రికాల జ్ఞాని,
రావణబ్రహ్మ, ఉత్తమ యోగి అయిన వానిని రాక్షసునిగా చెప్పుకోవడమును చూస్తే ఆయనను సరిగా అర్థము చేసుకోలేదని
తెలియుచున్నది.
రావణబ్రహ్మ అడవిలోని సీతను తీసుకపోయిన మాట వాస్తవమే. ఆ ఒక్క సంఘటనను ఆధారము చేసుకొని
రచయితలందరూ రావణున్ని ఎంతో దుర్మార్గునిగా, అజ్ఞానిగా చిత్రించి చూపారు. ఆనాడు ఆయన సీతమీద దురుద్దేశముతో
సీతను తీసుకపోలేదు. దాదాపు పదినెలల కాలము సీత రావణుని సంరక్షణలోనే ఉన్నది. సీత తన వద్ద ఉన్నంత
కాలము సీతను స్వంత కూతురులాగ రావణబ్రహ్మ చూచుకోవడము జరిగినది. ఆమె సేవకు పదిమంది ఆడవారిని
ఏర్పాటు చేసిపెట్టాడు. వారమునకు ఒకమారు సీతవద్దకు భార్యా సమేతముగా పోయి, ఆమెకు ఏ లోటు లేకుండా
విచారించి వచ్చేవాడు. ఆమెను అలా తేవడానికి కారణమును కూడా సీతకు వివరించి చెప్పాడు. తన మరణము
రాముని చేతిలో ఉందని, ముందే తన భార్య మండోదరీదేవికి చెప్పిన మాటను సీతకు కూడా చెప్పాడు. తన మరణము
లంకలోనే జరుగుననీ, సీత కారణము చేతనే రాముడు లంకకు రావలసి వున్నదనీ, రావణుడు ముందే సీతకు చెప్పాడు.
రాముడు ఎటువంటి మనస్థత్వముగలవాడో జరుగబోవు కాలములో నీకే తెలుస్తుందని కూడా సీతకు చెప్పాడు. త్రికాలజ్ఞాని
అయిన రావణబ్రహ్మ, తన మరణము ఎప్పుడు జరుగునో కూడా ముందే సీతకు చెప్పాడు. సీతకు రావణబ్రహ్మ
చెడ్డవాడు అను ఉద్దేశము ఎప్పటికీ లేదు. రావణబ్రహ్మ గొప్ప జ్ఞాని, గొప్ప యోగి అని సీత గుర్తించ గలిగింది.
అందువలన ఆయనను గురించి సీత చెడుగా ఎప్పుడూ మాట్లాడలేదు.
రావణబ్రహ్మ యొక్క జన్మను గురించి లోతుగా అధ్యయనము చేస్తే ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక
రహస్యము తెలియగలదు. నేను చెప్పబోవు ఈ విషయమును కొందరు నమ్మవచ్చును, కొందరు నమ్మక పోవచ్చును.
రహస్యము అంటే తెలియనిది అని అర్థము కదా! రావణుని జన్మ రహస్యమైనదైనపుడు, దానిని గురించి కొందరికైనా
తెలియకుండానే ఉండాలి. అప్పుడే రహస్యమను మాటకు అర్థమూ, సార్థకమూ ఉంటుంది. అందువలన నేను
వివరించి చెప్పినా అది కొందరికి మాత్రమే తెలియును. అందరికీ తెలియదు. శ్రీలంకకు చుట్టూవున్న సముద్రములో
కొంత దైవశక్తి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము కదా! ఆ దైవశక్తి భూమిమీద దైవ జ్ఞానమంటే ఏమిటో? యోగమంటే
ఏమిటో? చివరకు మోక్షమంటే ఏమిటో? ఒక నమూనాను చూపవలెనని అనుకొన్నది. భూమిమీద ప్రజలకు జ్ఞాన,
యోగ, మోక్షములకు తార్కాణముగ ఒక వ్యక్తిని పుట్టించి, అతనిని చూచుట ద్వారా అందరికి ప్రత్యక్ష ప్రమాణమును
చూపినట్లగునని తలచిన శక్తి, తానే స్వయముగా రావణబ్రహ్మగా పుట్టింది. అలా ఒక వ్యక్తిగా దగ్గరలోనున్న లంకలోనే
పుట్టడము జరిగింది. శక్తి వ్యక్తిగా పుట్టి రావణ, రావణబ్రహ్మ అని పేరుగాంచినది. అలా బ్రహ్మగా పిలువబడిన శక్తి
నిజజీవితములో జ్ఞానమును, యోగమును రావణుని నుండి చూపినది. చివరిలో బ్రహ్మ విద్య చెప్పిన నియమముల
ప్రకారము మరణించి మోక్షమును పొంది, ఈ విధముగానే ఏ మానవుడైనా మోక్షము పొందాలి అని చూపించినది.
దీనిని బట్టి రావణబ్రహ్మ అంటే సాధారణ వ్యక్తి కాదనీ, ఆయన ఒక శక్తి అనీ, జ్ఞాన, యోగ, మోక్షములను జీవితములో
తార్కాణముగా చూపిన వ్యక్తిగా కనిపించిన శక్తియని అర్థమగుచున్నది. రావణబ్రహ్మగా పుట్టిన వ్యక్తి ఎంత గొప్పవాడో
దీనినిబట్టి తెలిసిపోవుచున్నది. అంతగొప్ప వ్యక్తిని నీచునిగా, దుర్మార్గునిగా ప్రచారము చేసినవారు పూర్తి అజ్ఞానులేనని
చెప్పవచ్చును.
రావణబ్రహ్మను పది తలలున్నవాడనీ, దశకంఠుడని చాలామంది అనగా విన్నాము. ఇందులో దశకంఠుడు
అన్నమాట వాస్తవము కాదు. పది తలలు అన్నమాట వాస్తవమని చెప్పవచ్చును. ఈ మాట కూడ ఒక భావము
ప్రకారమే వాస్తవము. స్థూలముగా పది తలలున్నాయనుట అవాస్తవము. రావణబ్రహ్మ మహామేధావి. అటువంటి
మేధావులను పది మందిని కలిపితే ఎంత మేధాశక్తి ఉండునో అంత మేధస్సు కలవాడు రావణబ్రహ్మ. అందువలన
ఆయనకు పది తలలున్నాయన్నారు. దీనినిబట్టి స్థూలముగా కనిపించునట్లు ఆయనకు పదితలలు లేవనీ, సూక్ష్మముగా
పది తలల తెలివి ఆయనకున్నదని అర్థము చేసుకోవాలి. దీనినిబట్టి పది తలలున్నాయనుటలో సూక్ష్మ భావము ప్రకారము
సరిపోవును. ఇకపోతే దశకంఠుడు అన్నమాట పూర్తి అసత్యమగును. ఎందుకనగా తలలే లేనపుడు కంఠములెలావుండును?
అందువలన పది కంఠములు అనుమాట పూర్తి అవాస్తవమే అగును. సూక్ష్మముగ రావణుడు పది తలలున్నవాడు
కావచ్చును. అయితే స్థూలముగానీ, సూక్ష్మముగాగానీ పది కంఠములున్నాయనుట అసత్యము.
సముద్రము మీద శక్తి.
ఇందూ మహాసముద్రములో దైవశక్తి కొంత అధికముగా ఉందనీ, ఆ దైవశక్తి వలననే భారతదేశమునకు
ఇందూదేశమనీ, దాని క్రిందవున్న దేశమునకు శ్రీలంక అను పేర్లు వచ్చినవని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు
ఎవరైనా కొన్ని ప్రశ్నలు అడుగవచ్చును. అదేమనగా! ఇంతవరకు సముద్రమును పరిశోధించు శాస్త్రజ్ఞులుగానీ, ఖగోళ
శాస్త్రజ్ఞులుగానీ, ఇంకా ఇతర పరిశోధకులు గానీ ఎవరూ ఇందూ మహాసముద్రములో ఏదో ఒక శక్తి ఉన్నదని
చెప్పలేదే! ఎవరూ చెప్పని దానిని మీరు ఎలా చెప్పగలుగు చున్నారు? మీరు చెప్పుటకు ఏదైనా ఆధారమున్నదా? అని
అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! నేను దైవశక్తి అక్కడున్నదని చెప్పాను. దైవశక్తిని చూపించుటకుగానీ,
నిరూపించుటకుగానీ ఆధారముండదు. ఎందుకనగా దైవశక్తి భౌతికమైనదికాదు. అందువలన భౌతికముగా చూపించుటకు
వీలుండదు. అభౌతికమైన దైవశక్తిని అభౌతికమైన బుద్ధి చేత మాత్రమే గ్రహించవచ్చును. అలా గ్రహించుట కూడా
వాని వాని బుద్ధి గ్రాహితశక్తినిబట్టి ఉండును. పూర్వకాలములో ఇందూ మహా సముద్రములో దైవశక్తి ఉండేదనీ,
ఇప్పుడు అక్కడ ఆ శక్తి లేదని కూడా చెప్పుచున్నాము. ఇప్పుడు మరియొక ప్రశ్నను కొందరు అడుగుటకు అవకాశము
గలదు. "మేము శక్తిని గురించి అది ఉన్నట్లు మీరు ఎలా చెప్పగలుగుచున్నారు? అని అడిగిన వెంటనే, ఉంది అంటే
ఇరుక్కుంటా మనుకొని, పూర్వము ఉండేది ఇప్పుడు లేదంటున్నారా?” అని అడుగ వచ్చును. దానికి మా సమాధానము
ఏమనగా! ఇప్పుడు ఆ శక్తి అక్కడలేదని చెప్పాను. కానీ ఎక్కడాలేదని చెప్పలేదు కదా! గత కాలములో ఇందూ
మహాసముద్ర ములో ఉండే శక్తి, తన జాగాను మార్చుకొని వేరొకచోట ఉన్నదని చెప్పుచున్నాను. మీకు విపులముగా
అర్థమగుటకు సముద్రములో నున్న శక్తిని గురించి కొంత వివరముగా చెప్పుచున్నాము వినండి.
మనిషి శరీరము అంతా ప్రకృతికి సంబంధించినదేనని చెప్ప వచ్చును. ప్రకృతిలోని ఆకాశము, గాలి, అగ్ని,
నీరు, భూమి అను పంచభూతముల చేత శరీరము తయారైనది. పంచభూత నిర్మితమైన శరీరమందు, పంచభూతములైన
ప్రకృతిని శాసించి నడుపుటకు ఒక శక్తి మనిషి మెదడునందు స్థానము చేసుకొని ఉన్నది. అలా మనిషిలోనున్న శక్తిని
దైవశక్తి లేక ఆత్మశక్తి అంటున్నాము. శరీరములోని ఆత్మగానీ, ఆత్మశక్తిగానీ ఎవరికీ కనిపించదు. ఆత్మశక్తియే శరీరమంతా
వ్యాపించి అనేక పనులు జరుగునట్లు చేయుచున్నది. శరీరములో ఆత్మవుంటేనే శరీరము బ్రతుకగలదు. ఆత్మ లేకుండ
పోతే శరీరము పని చేయదు. ఒక శరీరములో ఆత్మశక్తివుండి పంచభూతముల శరీరమును నడిపించునట్లు ఒక
గ్రహములోగానీ, ఒక గోళములోగానీ దైవశక్తి (ఆత్మశక్తి) ఉండి ఆ గోళమును నడుపుచున్నది. ఆత్మశక్తి లేని చిన్న
గ్రహముగానీ, పెద్ద గోళముగానీ, నక్షత్రముగానీ విశ్వములో ఏదీలేదు. విశ్వవ్యాప్తముగా అన్ని గ్రహములలోనూ,
గోళములలోనూ ఆత్మ తప్పక ఉండి తీరవలసిందే. ఆత్మశక్తి లేకపోతే అది మరణించిన మనిషితో సమానము. విశ్వములో
ఆత్మశక్తిని కోల్పోయిన గ్రహములుగానీ, ఆత్మశక్తి వదలిపోయిన గోళముగానీ, నక్షత్రముగానీ మృతదేహములతో సమానమే
అగును. మరణించిన దేహము ఎలా నశించి కనిపించకుండ పోతుందో, అలాగే విశ్వములో కూడా ఆత్మలేని గోళమూ,
నక్షత్రమూ ఏదైనా చీకటి గుహలోనికి పోయి దానిలో నశించి కనిపించకుండ పోవుచున్నది. మనుషులకు స్మశానములోని
గుంత ఉన్నట్లు, గోళములకు, నక్షత్రములకు బ్లాకెూల్స్ అనునవి కలవు. బ్లాక్వెల్ అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పు
వాటినే మనము చీకటి గుహలు అని అంటున్నాము.
దీనిని బట్టి చనిపోయిన మనిషికి స్మశానములో గుంతా, నక్షత్రము నకు ఆకాశములో బ్లాక్ హెూల్ రెండూ
సమానమేననీ తెలియుచున్నది. గుంతలోనికి పోయిన మనిషి ఎలా కనిపించకుండా మట్టిలో కలిసి పోతాడో, అలాగే
బ్లాక్ హెూల్ లోనికి పోయిన గోళము కూడా కనిపించకుండా చీకటిలో కలిసి పోతుంది. మనిషికి స్మశానమున్నట్లు,
గోళములకు బ్లాక్ హెూల్స్ కలవని తెలియుచున్నది. ఒక మనిషిలో ఆత్మశక్తి వాని తలలోవుండి జీవితాంతము వాని
శరీరమును నడుపుచున్నది. అలాగే భూగోళములోని సముద్రమునకు శక్తినిచ్చి దానిని నడుపుటకు సముద్రములో
ఏదో ఒక చోట ఆత్మశక్తి (దైవశక్తి) ఉండవలసిందే. భూగోళమున ఇందూ మహాసముద్రములో ఆ శక్తి ఉన్నదని మేము
చెప్పుచూ వస్తున్నాము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగముల కాలములో ఇందూ మహాసముద్రములో
తిష్టవేసిన శక్తి, ఇప్పుడు కలియుగములో 3112 సంవత్సరములనుండి అక్కడ లేకుండా పోయినది. కలియుగములో
కూడా రెండువేల సంవత్సరముల వరకు ఇందూ మహా సముద్రములోనున్న శక్తి ఇప్పుడు 3112 సంవత్సరములనుండి
ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రము ప్రక్కన సముద్రములో 20 లక్షల నుండి 24 లక్షల చదరపు కిలోమీటర్ల
వైశాల్యములో తిష్టవేసివున్నదని తెలియుచున్నది. ఇప్పుడు అక్కడినుండే భూమండలములోని అన్ని ప్రాంతములకూ శక్తి
ప్రసారమగుచున్నది. శరీరములోని ఆత్మ చైతన్యము వలన శరీరములోని అన్ని పనులూ జరిగినట్లు, సముద్రములోని
ఆత్మచైతన్యము వలన భూ గోళములో అన్ని పనులూ జరుగుచున్నవి. ఇప్పుడు మాచే చెప్పబడిన సముద్రము యొక్క
శక్తి రహస్యము, ఇంతవరకు ఏ ఖగోళశాస్త్రజ్ఞునికీ తెలియదనియే చెప్పవచ్చును. త్రేతాయుగములో రావణునికి
తెలిసిన సముద్రములోని శక్తిని గురించే మేము ఇప్పుడు కలియుగములో చెప్పుచున్నాము. అప్పటి రావణబ్రహ్మ
కాలమునుండి, ఇప్పటి ప్రబోధానంద యోగీశ్వరుల వరకు సముద్ర శక్తి యొక్క ప్రస్థావన రాలేదని తెలియుచున్నది.
తైతాకార శక్తి - బెర్ముడా ట్రయాంగిల్.
ఎక్కడో ఆకాశములోనున్న సూర్యుడు తన కిరణములను భూభాగము మీద ప్రసరింప చేసి, ఈ లోకమునంతటిని
ప్రకాశింపజేసినట్లు, శరీరములో తలయందున్న ఆత్మ, తనశక్తిని శరీరమంతా వ్యాపింపజేసి, శరీరమంతటిని చైతన్యము
చేయగల్గినట్లు, భూమండలమున ఎక్కడో సముద్రమందు ఒక్క చోటున్న శక్తి, భూమండలమంతా వ్యాపించి ప్రకృతి
భాగములైన పంచ భూతములకు చైతన్యమునిచ్చి ఎప్పుడు, ఎక్కడ ఏ విధముగా పని చేయించ వలెనో, ఆ విధముగనే
పని జరుగునట్లు చేయుచున్నది. శరీరములో పంచభూతములతో తయారైన అన్ని భాగములకు, తలయందు బ్రహ్మనాడిలో
నున్న ఆత్మ, శక్తి నిచ్చుచూ ఆ శరీరములోని జీవుని కర్మ ప్రకారము కష్ట సుఃఖములను కలుగచేయుచున్నదని ఆత్మజ్ఞానములో
తెలుసుకొన్నాము. అలాగే భూమండలమును ఒక శరీరముగా తీసుకొంటే అందులోని ఆత్మశక్తి శరీరములోని
పంచభూతములకు వ్యాపించినట్లు, సముద్రములోని శక్తి భూమండలములోని అన్ని భాగములకు వ్యాపించుచున్నదనుట
కూడా ఆత్మజ్ఞానమే. దీనినిబట్టి శరీరములోని ఆధ్యాత్మికమూ, శరీరము బయట ప్రపంచములోని ఆధ్యాత్మికము అని
రెండు రకముల ఆధ్యాత్మికములు కలవు. భూతములు, మహా భూతములని రెండు రకములున్నవని చాలామార్లు
చెప్పుకొన్నాము. భూతము అనగా జీవుడనీ కూడా చెప్పుకొన్నాము. మహా భూతములనగా ఆకాశము, గాలి, అగ్ని,
నీరు, భూమి యొక్క జీవాత్మలని కూడా “దయ్యాల భూతాల యదార్థసంఘటనలు" అను గ్రంథములో కూడా చెప్పుకొన్నాము.
ఈ గ్రంథములో ఇంతవరకు చెప్పుకొన్న సముద్రము మీది శక్తి నీరు అను భూతముయొక్క ఆత్మదని తెలియవలెను.
గాలి, అగ్ని, ఆకాశము, భూమి అను భూతములకు కూడా ఆత్మలు గలవు. మనము ఇప్పుడు చెప్పుకొనుచున్నది ఒక్క
నీటి యొక్క శక్తిని గురించేనని జ్ఞప్తికుంచు కోవలెను.
-
ఒకచోట జీవుడున్నాడు అంటే, అక్కడ ఆ జీవునితో పాటు ఆత్మ కూడా ఉంటుందనడము బ్రహ్మవిద్యా శాస్త్రబద్ధత.
మనము ఏది చెప్పుకొన్నా శాస్త్రబద్దముగా ఉండాలి. శాస్త్రమును అతిక్రమించి ఏదీ చెప్పడము లేదు. జీవుడు, ఆత్మ
రెండు జోడు ఆత్మలు. ఒకటి ఉంది అంటే మరియొకటి ఉండి తీరవలసిందే. ఈ రెండు ఆత్మలున్న చోట మూడవదీ,
రెండిటికంటే పెద్దదీ, రెండిటికంటే ఉత్తమమైనదీ మరియొకటి గలదు, అదియే పరమాత్మ. ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ,
మూడు పరమాత్మ అని గతములో కూడా చెప్పుకొన్నాము. ఈ మూడు ఆత్మల విధానము వలననే "త్రైత సిద్ధాంతము”
ఏర్పడినదని కూడా చెప్పుకొన్నాము. ఈ మూడు ఆత్మల విధానమును తెలుసుకోవడమే అసలైన దైవజ్ఞానము. దైవజ్ఞానము
ప్రకారము వివరించు కొంటే, జీవాత్మ శరీరములో ఒక స్థలములో ఉండునదికాగా, ఆత్మ శరీర మంతా వ్యాపించునదిగా
ఉన్నది. జీవాత్మ శరీరమంతా ఉండునది కాదనీ, ఆత్మ ఒక్కచోటనే పరిమితముకాదనీ దీనినిబట్టి తెలియుచున్నది. ఇక
పరమాత్మ విషయానికి వస్తే, అది అణువణువునా శరీరములోనూ, శరీరము బయటా వ్యాపించి ఉన్నది. జీవాత్మ
ఆత్మలు రెండూ శరీరము లోపలే ఉండగా, పరమాత్మ మాత్రము శరీరము లోపలా, శరీరము బయటా అంతటా
వ్యాపించి ఉన్నది. జీవాత్మ ఆత్మలు ఒకదానితో ఒకటి సంబంధము కల్గి వుండగా, పరమాత్మ శరీరములోని రెండు
ఆత్మలతో ఏమాత్రము సంబంధము లేకుండా ఉన్నది. జీవాత్మ, ఆత్మలు రెండూ జననములోనూ, మరణములోను కలిసి
ప్రయాణము చేస్తున్నవి. పరమాత్మ, జీవాత్మ ఆత్మలతో ఎప్పుడూ కలువదు. పరమాత్మ అంతట వ్యాపించినది, అది ఒక
చోటనుండి మరియొక చోటికి ప్రయాణము చేయదు. ఎందుకనగా అది అక్కడా, ఇక్కడా అన్ని చోట్లా కలదు. ఒక
శరీరములో మూడు ఆత్మలున్నప్పటికీ జీవాత్మ, ఆత్మ రెండు ఆత్మలు జోడు ఆత్మలుకాగా, ఒక్క పరమాత్మ మాత్రము
ప్రత్యేకముగా ఉన్నది. ఈ విధానము అందరిలోను ఉన్నదనీ, ఈ విషయము అందరికీ తెలియాలనీ, మన శరీర నిర్మాణ
సమయములోనే మన హస్తములో ముఖ్యముగ మూడు రేఖలు తయారైనవి. అందులో జీవాత్మ, ఆత్మలు రెండూ జోడు
ఆత్మలని తెలియునట్లు, రెండు రేఖలు మొదట విడివిడిగా పుట్టి, చివరిలో రెండు కొనలు కలిసివున్నవి. పరమాత్మ
ప్రత్యేకమైనది అని తెలియునట్లు, రెండు రేఖలకు పైన ఒక రేఖ ప్రత్యేకముగా పుట్టి ఉన్నది. మన శరీరములోని
త్రేతాత్మల విషయము ప్రతి ఒక్కరి హస్తములోను ఉన్నది.
ఒక మనిషి శరీరములోని ఆత్మ వివరమున్నట్లే ఒక గ్రహము శరీరములోగానీ, ఒక గోళము యొక్క
శరీరములోగానీ, అట్లే నక్షత్రము యొక్క శరీరములోగానీ ఆత్మలుండడము సహజము. ఒకప్పుడు 3112 సంవత్సరముల
పూర్వము ఇందూ మహాసముద్రములోనున్న మూడు ఆత్మలు కూడా మానవుని హస్తములో మూడు రేఖలుగా కనిపించునట్లు,
( చిత్రము: హస్తము 19 పేజీ లో చూడండి )
మూడు మూలలుకల్గిన త్రిభుజాకారముగా తెలియునట్లు ఉండెడివి. ఇందూ మహా సముద్రములో ముక్కోణాకారముగా
మూడు ఆత్మల చిహ్నముండెడిదని అప్పుడు ఎవరికీ తెలియదు. కలియుగములో 2000 సంవత్సరము వరకు ఇందూ
మహాసముద్రములోనున్న త్రిభుజాకారశక్తి, ఇప్పుడు 3112 సంవత్సరములనుండి ఉత్తర అమెరికాకు ఎడమ ప్రక్కన
గల సముద్రములో త్రికోణాకారము కల్గి ఉన్నదని చెప్పుచున్నాము. సముద్రము మీద దాదాపు 24 లక్షల చదరపు
కిలోమీటర్ల త్రిభుజాకార విస్తీర్ణములో, ఆత్మశక్తి ఆవహించి ఉన్నది. నేను మొదటినుండి చెప్పునది ఒక వింత కథలాగా
నమ్మశక్యము కాకుండా ఉన్నదానివలన, నా మాట నిజమని తెలియుటకు 1950 సెప్టెంబరు 16వ తేదీన త్రిభుజాకారము
గల సముద్ర విస్తీర్ణములో పెద్ద ఓడ జాడ తెలియకుండా పోయినది. సరిగా ఫలానా ప్రాంతములోనే పోయింది అని
ఆనాడు గుర్తించగలిగారు.
అంతకు ముందునుండి ఆ ప్రాంతములో, సముద్రము మీద శక్తి ఉన్నదని మా మాటకు ఆధారముగా 1947వ
సంవత్సరము డిశంబరు 5వ తేదీన అమెరికా యుద్ధ విమానాలు ఒకేమారు, ఆరు జాడ తెలియకుండా పోయాయి. ఆ
రోజు ఆరు విమానాలు పోయినప్పటికీ, సముద్రము మీద త్రిభుజాకార ప్రాంతములో ఏదో శక్తి ఉందని తెలియలేకపోయారు.
1950 లో స్టీమర్ పోయినప్పుడు అక్కడ ఏదో తెలియని శక్తి ఉందని ప్రజలకు తెలిసింది. ఫలానా ప్రాంతములో,
ఫలానా నౌక పోయిందని తెలిసినా, అది ఫలానా విధముగా పోయిందని తెలియదు. తర్వాత కాలములో కూడా
త్రిభుజాకార సముద్రము మీదకు, తెలియక పోయిన కొన్ని నౌకలు, కొన్ని విమానములు మాయమై పోవడముతో అక్కడ
ఏమి జరుగుచున్నదో, ఎవరికీ అర్థముకాని స్థితి ఏర్పడినది. తర్వాత ఆ రహస్యమును తెలుసుకొనుటకు చాలామంది
పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రయత్నము చేశారు. అక్కడికి పరిశోధన నిమిత్తము పోయినవారు కూడా అంతు బట్టకుండా
పోవడము జరిగినది. దానితో మిగతావారందరు భయపడి అక్కడ పరిశోధన చేయాలనుకొను ప్రయత్నమును వదలివేశారు.
అప్పటి నుండి సముద్రము మీద త్రికోణాకారముగానున్న ఏరియాను ఇంచుమించుగా గుర్తించి, ఆ ప్రాంతములోనికి
ఎవరూ పోకూడదని నిషేధించారు. ఆ త్రిభుజాకార ప్రాంతమును నిషిద్ద ప్రాంతముగా ప్రకటించారు. ఆ ప్రాంతమునకు
“బెర్ముడా ట్రయాంగిల్” అను పేరును కూడా పెట్టారు. సముద్రము మీద బెర్ముడా ట్రయాంగిల్ ఒక అపాయకరమైన
ఆ
ప్రాంతముగా చాలామందికి తెలిసిపోయింది. కానీ ఆ ప్రాంతములో ఎందుకలా జరుగుచున్నదో? ఎవరు అపాయమునకు
గురి చేయుచున్నారో, ఎవరికీ తెలియని రహస్యముగా మిగిలిపోయింది.
1938 సం|| 5500 టన్నుల బరువును మోసుకొని పోవు నౌక ఒకటి నుండి రెండు నిమిషములలో తెలియకుండా
పోయినది. అది మునిగిపోయినట్లుగానీ, పగిలిపోయినట్లుగానీ ఏ ఆధారములు లేవు. అంత పెద్ద నౌక పోవడమును
గురించి పరిశోధన సాగించిన వారు “చివరకు ఆ నౌక ఏమయిందో ఆ సముద్రమునకు తెలుసు, దేవునికి తెలుసు,
మిగతా వారికి ఎవరికీ తెలియదు” అన్నారు. ఒక యుద్ధవిమానము ఆకాశములో పోతూ కొద్దిగ ఆ ప్రాంతము మీదుగా
పోయింది. బయలుదేరిన స్టేషన్ నుండి ఆ విమానమునకు వైర్లెస్ కనెక్షన్ ఉండడము వలన, విమానమును
నడుపుతున్న పైలెట్ తన క్యాబిన్లో జరుగు విషయమునంతటిని ఎప్పటి కప్పుడు క్రింద స్టేషన్కు తెలియబరచుచుండెను.
బెర్ముడా ట్రయాంగిల్ లోనికి ప్రవేశించిన వెంటనే విమానము యొక్క డ్యాష్ బోర్డులోని మీటర్లన్నీ తమ ఇష్టమొచ్చినట్లు
ముల్లులను చూపడము మొదలు పెట్టాయి. ఆ మీటర్లతో విమానము ఎంత వేగముగా పోయేది తెలియలేదు. అట్లే ఏ
దిశకు పోయేదీ తెలియలేదు. ఎంత ఎత్తులో పోతున్నది కూడా మీటర్లు చూపడము లేదు. అప్పుడు విమానమును
నడుపుచున్న పైలెట్ ఆ విషయమును క్రింది స్టేషన్కు చెప్పుచూనే ఉన్నాడు. పైలెట్ నడిపినట్లు విమానము పోవడములేదు.
పైలెట్ అయోమయస్థితిలో ఉండిపోయాడు. అంతలో విమానము చుట్టూ మేఘములు ఉండగా మధ్యలో ఒక గుహలాగ
కనిపిస్తూ ఉన్నది. విమానము మేఘముల మధ్యలోనికి సొరంగములోనికి పోయినట్లు కనిపిస్తున్నది. అంతవరకు ఏమి
జరుగుచున్నదీ చెప్పుచుండిన పైలెట్, తర్వాత ఏమి జరిగినదీ చెప్పలేదు. అంతటితో ఆ విమానము నుండి రేడియో
కనెక్షన్ తెగిపోయింది. తర్వాత ఏమి జరిగిందో ఏమో గానీ ఆ విమానము మాత్రము ఆనవాళ్ళు లేకుండా
మాయమైపోయినది. ఈ విధముగా ఒక విమాన విషయములో కొంత సమాచారము దొరికినది. అమెరికా వారు
గుర్తించిన ట్రయాంగిల్ ఏరియాలోనే అట్లు జరుగుచున్నదని తెలిసినప్పటికీ, చివరిలో విమానములుగానీ, నౌకలుగానీ
ఏమైనాయో ఎవరికీ అర్థము కాలేదు. సైన్సుకే అర్థముకాని మిస్టరీగా బెర్ముడా ట్రయాంగిల్ నిలిచిపోయినది. ట్రయాంగిల్
అనగా మూడు కోణములని అర్థము. బెర్ముడా అనునది ఆ ప్రాంతములోని చిన్నదీవి. దాని గుర్తింపుగా పెట్టిన పేరని
తెలియుచున్నది.
పూర్వము మూడు యుగములనుండి ఇందూ మహాసముద్రములో దైవశక్తి లేక ఆత్మశక్తి అనునది మూడు
కోణముల ఆకారముతోనే ఉన్నది. అక్కడున్నప్పుడు దానిశక్తి విషయముగానీ, దాని ఆకార విషయముగానీ ఎవరికీ
తెలియదు. ఈ మధ్య కాలములో 60 సంవత్సరములనుండి మూడు కోణములుగల ప్రాంతము అట్లాంటిక్ సముద్రములో
ఒకటున్నదని కొందరికి తెలిసింది. ఇందూ మహాసముద్రములో మూడు కోణములతో త్రైతాకారముగా సముద్రము
మీదవున్న శక్తి, ప్రస్తుతము ఉత్తర అమెరికా ప్రక్కన అట్లాంటిక్ సముద్రము మీద కూడా ఇందూ మహాసముద్రములో
ఉన్న ఆకారముతోనే ఉండడము విశేషము. దాదాపు 39 లక్షల సంవత్సరము లనుండి భారతదేశమునకు దక్షిణ
భాగములోనున్న శక్తి, కలియుగములో రెండువేల సంవత్సరములు గడచిన తర్వాత, ఒక్కమారుగా ఇందూ మహా
సముద్రమునుండి అట్లాంటిక్ సముద్రము మీదికి రావడమునకు కారణము తప్పక ఉంటుంది. ఇంతకు ముందు
కలియుగములో 3112 సంవత్సరము క్రితము వరకు ఇందూ మహాసముద్రములో మూడు కోణముల ఆకారముతో
నున్న శక్తి, ఇప్పుడు కూడ అదే ఆకారముతో ఉండడమునకు కారణమేమిటని చూస్తే ఈ విధముగా ఉన్నది.
పంచభూతములకు కూడా ఆత్మవున్నదనీ ఆధ్యాత్మికరీత్యా తెలియు చున్నది. అందువలన భూమండలములోని
నీటికి ఆత్మ సముద్రము లోనున్నదని అర్థమగుచున్నది. ఏ భూతమునకైనా (ఏ జీవరాశికైనా) దానికున్న శరీరములోనే
ఆత్మ తోడుగా ఉంటుంది. జీవాత్మ, ఆత్మలు రెండుగాక మూడవది పరమాత్మ కూడా ఉంటుందని చెప్పుకొన్నాము. ఈ
మూడు ఆత్మల విషయము బయటికి తెలియుటకే నీటిలో గల ఆత్మశక్తి త్రికోణ ఆకారముతోనే ఉన్నది. జీవాత్మ, ఆత్మలు
రెండూ ఒకే జోడీగా ఉన్న ఆత్మలు, తర్వాత మూడవదైన పరమాత్మ ప్రత్యేకముగా ఉన్నది. ఆ విషయము బాగా
అర్థమగుటకు మూడు కోణముల ఆకారములో కూడా పరమాత్మ ప్రత్యేక కోణముగా, రెండు ఆత్మలను సమానమైన
కోణముగా కనిపించడము జరిగినది. ఇందూ మహాసముద్రములోగానీ, అట్లాంటిక్ సముద్రములోగానీ దైవశక్తి (ఆత్మశక్తి)
ఒకే ఆకారముగా ఎలా వ్యాపించి వుందో క్రింది పటములో చూచెదము.
త్రిభుజము చిత్రము 20 పేజీ లో చూడండి .
ముందు పేజీలోని చిత్రపటములో ఉన్నట్లు నీటిమీద శక్తి మూడు కోణములుగా వ్యాపించి ఉన్నది. చిత్రపటములో
1,2 మూలలను జీవాత్మ, ఆత్మగా గుర్తించాము. 1వ నంబరులో జీవాత్మ కోణమునకు, 2వ నంబరులో నున్న ఆత్మ
కోణమునకు కొంత తేడా కలదు. రెండవ కోణము నుండి మూడవ కోణమైన పరమాత్మ గుర్తువైపు వెళ్ళిన రేఖ
సమాంతరముగా పోయింది. అట్లే రెండవ కొనయైన ఆత్మవైపునుండి ఒకటవ కోణము వైపు వెళ్ళిన రేఖకూడా 90
డిగ్రీల కోణముతో నిటారుగా పైకి పోయినది. ఇక పోతే ఒకటవ కొనయైన జీవాత్మ నుండి మూడవ కోణము వైపు
వెళ్ళు రేఖ 45 డిగ్రీలు వంగిపోవుట వలన జీవాత్మగా గుర్తించిన ఒకటవ కోణము చిన్నదిగానూ, ఆత్మగా గుర్తించిన
రెండవ కోణము ఒకటవ దాని మాదిరే ఉంటూ దానికంటే కొద్దిగ పెద్దదిగా కనిపిస్తున్నది. ఇక పరమాత్మగా గుర్తించిన
మూడవ కోణము మొదటి రెండు కోణములకంటే విభిన్నముగా పొడవైన మూలగా కనిపిస్తున్నది. శరీరములో జోడు
ఆత్మలుగా పేరుగాంచిన జీవాత్మ, ఆత్మలు ఒకవైపు పైనా క్రింద ఉండగా ప్రత్యేకమైన పరమాత్మ ప్రత్యేకముగానే
ఒకవైపు ఉన్నది. మన హస్తములో కనిపించినట్లే జీవాత్మ, ఆత్మలు ఒక ప్రక్క, పరమాత్మ ఒక ప్రక్కనున్నట్లు త్రైతాకారము
అనగా త్రిభుజాకారము ఎంతో అర్థసహితముగా కనిపించుచున్నది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ధర్మములకు తగినట్లు
సముద్రము మీద విస్తీర్ణము యొక్క ఆకారము కూడా ఉండడము విశేషము. అట్లాంటిక్ సముద్రములో పై చిత్రపటములో
ఉన్నట్లే నిషేధ సముద్ర ప్రాంతమున్నది. సముద్రము మీద అది బ్యాన్ చేసిన ఏరియాగా ఉన్నది. ఆ ప్రాంతములోనికి
నీటి మీద నౌకలు పోయినా, ఆకాశములో విమానములు పోయినా అవి అంతు బట్టకుండా ఎక్కడికి పోయినదీ,
ఏమైనదీ తెలియకుండా మిస్టరీగా మారి పోవుచున్నవి.
ప్రపంచములోని పెద్ద మేధావులకు కూడా అంతుబట్టని రహస్యమైన దానిని తెలుసుకోవాలని ప్రయత్నించిన
వారు కూడా అంతుచిక్కకుండా పోయారు. చివరికి ఎవరికీ అర్థముకాక దానివిషయమును వదలివేసి, ఆ ప్రాంతములోనికి
ఎవరూ పోకుండా నిషేధ ప్రాంతముగా ప్రకటించారు. దాని విషయములో నేను చెప్పునదేమనగా! సముద్రము మీద
త్రికోణా కారముగనున్న ప్రాంతములో ఆత్మశక్తి ఉన్నది. ఆత్మ, నేను ఒక్కదానినే ఉండను, నేను ఎక్కడుండినా నాతోపాటు
ఇటు జీవాత్మ, అటు పరమాత్మ ఉందురని తెల్పుటకు మూడు కోణములను ఏర్పాటు చేసుకొన్నది. జీవాత్మ, పరమాత్మల
మధ్యలోని ఆత్మ విషయమునూ, దాని జ్ఞానమునూ తెలిసిన వాడు ఆత్మజ్ఞాని అగును. ఆత్మ జ్ఞాని కానివాడు భూమిమీద
ఏ దానియందు పెద్దగా ఉండినా, వాడు తనను గౌరవించని వాని క్రిందకే ఆత్మ జమకట్టును. ఆత్మ ఒక్క ఆత్మజ్ఞానిని
మాత్రమే గౌరవించును. ఈ సూత్రము ప్రకారము చూస్తే ఆత్మశక్తిగల బెర్ముడా ట్రయాంగిల్ మీదికి పోయిన విమానములను
నడుపు పైలెట్లు, నౌకలను నడుపు కెప్టెన్లు ఆత్మజ్ఞానము లేనివారే, కనుక వారు ఆ శక్తిలో తెలియకుండా పోయారు.
వారు నడుపుచున్న వాహనములు అదృశ్యమైపోయాయి. ఎంతోమంది పరిశోధకులైన శాస్త్రవేత్తలు కూడా జ్ఞానము
లేనిదానివలన ఆత్మశక్తి గల ప్రాంతములోనికి పోయి మాయమై పోయారు. ఎవడైతే ఆత్మజ్ఞానమును తెలియునో, వాడు
అపాయమని నిషేధింపబడిన ఆ ప్రాంతములోనికి పోయినప్పటికీ వారికి ఏమీకాదు. వారికి ఆత్మశక్తి తోడుగా
నిలుచును. ఆధ్యాత్మికవేత్తలూ, బ్రహ్మవిద్యా శాస్త్రజ్ఞులూ, ఎన్నిమార్లు సముద్రము మీదవున్న త్రికోణాకార ప్రాంతము
లోనికి పోయివచ్చినా ఏ అపాయమూ జరుగదు. ఇంతవరకూ అటువంటి ఆత్మజ్ఞానులు ఆ ప్రాంతములోనికి పోలేదు.
అమెరికా ప్రక్కనున్న అట్లాంటిక్ సముద్రములోగల బెర్ముడా ట్రయాంగిల్లో, గడిచిపోయిన రెండు మూడు
వందల సంవత్సరముల నుండి అప్పుడొకటి అప్పుడొకటి లెక్కలేనన్ని నౌకలు, విమానములు కనిపించకుండ పోయాయి.
అక్కడికి పోయినవి తిరిగిరాలేదని కొందరికి తెలుసు, కానీ అవి ఏమైనాయని మాత్రము ఎవరికీ తెలియదు. అవి
సముద్రములో మునిగిపోయాయా? పేలిపోయాయా? అను ప్రశ్నలకు ఏ జవాబునూ ఎవరూ చెప్పలేదు. జవాబు
చెప్పుటకు ఏ ఆధారమూలేదు. అయితే అక్కడ ఏమి జరిగిందని నన్ను ప్రశ్నిస్తే, పెద్ద చదువులు చదివిన మేధావులకు,
సైన్సును క్షుణ్ణముగా పరిశీలించిన శాస్త్రవేత్తలకు తెలియని విషయమును నేనెలా చెప్పగలను? అని సులభముగా
తప్పించుకోవచ్చును. అయితే నేనలా తప్పుకోను. ఇంతవరకు ఈ గ్రంథములో చెప్పిన విషయములు కూడా ఎవరికీ
తెలియని రహస్యములే! అన్నీ తెలియని విషయములను చెప్పి, ఆసక్తికరమైన విషయములను చెప్పకపోవడము
బాగుండదు. ప్రపంచములో ఐదు శాస్త్రములకు సంబంధించిన విషయము లైతే నేను వాటి జోలికి పోను. అవి నాకు
సంబంధించినవి కావు. కానీ ఇక్కడి ప్రశ్నలు ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించినవి. అందువలన
ఈ శాస్త్రమునకు సంబంధించిన విషయములను చెప్పడము నా కర్తవ్యము.
అమెరికాలోని ఫ్లోరిడా నుండి పోవునవి, వచ్చునవి కొన్ని నౌకలు సాంకేతిక లోపము వలనగానీ, ఇంకా ఏదైనా
లోపము వలనగానీ సముద్రములో మునిగిపోవడము జరిగింది. అయినా అవి ఖచ్చితముగా బెర్ముడా ట్రయాంగిల్లోనే
మునిగిపోయాయని చెప్పలేము. 1938 సంవత్సరము, మార్చి నెలలో 426 అడుగుల పొడవున్న భారీ నౌక 39 మంది
సిబ్బందితో 5500 టన్నుల బరువుగల సరుకుతో బ్రిటన్ నుండి అమెరికాకు వస్తూ, కేవలము రెండు నిమిషములలో
తెలియకుండా పోయినది. ఆ భారీనౌక వాస్తవముగా బెర్ముడా ట్రయాంగిల్లోనే పోయింది. 1950 నుండి ఆ ప్రాంతములోనే
పోతున్నట్లు నిర్ధారించబడినా, 1938లో పోయిన బ్రిటన్ నౌక కూడా అక్కడే పోయిందని చెప్పుచున్నాము. అక్కడ
నౌకలు, విమానాలు ఎలా పోవుచున్నవో అర్థమగుటకు, 5500 టన్నుల సరుకుతో పోవు 1988వ సంవత్సరములోని
సంఘటనలను తీసుకొని చూస్తాము. ఆ ఒక్క నౌక విషయము తెలిస్తే, మిగతా వాటి విషయమును కూడా అర్థము
చేసుకోవచ్చును.
బ్రిటన్ నుండి అమెరికాలోని ఫ్లోరిడాకు బయలుదేరిన భారీ నౌక బెర్ముడా ట్రయాంగిల్లోనికి పొరపాటుగా
రావడము జరిగినది. అక్కడ ప్రమాదము ఉంటుందని వారికి ఏమాత్రము తెలియదు. 39 మంది నావికా సిబ్బందితో
ఆ
ప్రయాణిస్తున్న 426 అడుగుల పొడవున్న నౌకకు ఆ దినము సముద్రము మీద ఒక మేఘము అడ్డము వచ్చింది. ఆ
నౌక మేఘములో దూరి వస్తున్నది. ఆ నౌక మొత్తము మేఘములోనికి ప్రవేశించే దానికి దాదాపు ఒక నిమిషము లేక
ఒకటిన్నర నిమిషము పట్టివుంటుంది. నౌకలోని సిబ్బందికి గానీ, నౌకకుగానీ ఏమీ జరుగలేదు. ఏ ప్రమాదమునకు
నౌక గురి కాలేదు. దారికి అడ్డము వచ్చిన చిన్నపాటి మేఘములోనికి ఆ నౌక ప్రవేశించింది. పొగలాగవున్న మేఘములోనికి
ప్రవేశించింది. అంతే! అప్పటినుండి ఆ నౌక ఇక్కడి ప్రజలకు తెలియకుండా పోయింది. మేఘములో దూరిన నౌక,
మేఘము నుండి బయటికి రాలేదు. కొద్దిసేపటికి మేఘము తెలియకుండా కరిగిపోయి అదృశ్యమైంది. కానీ నౌక జాడ
మాత్రము లేదు. ఒక్క నిమిషములో మేఘములోనికి దూరిన నౌక ఏమయింది? పగిలి పోయిందా? ప్రమాదమునకు
గురి అయిందా? అందులోని మనుషులు చనిపోయారా? ఆ నౌకలోని 5500 టన్నుల సరుకు ఎక్కడికి పోయింది?
మొత్తానికి నౌక మునిగి పోయిందా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నవి. అన్ని ప్రశ్నలకు జవాబులు ఈ విధముగా ఉన్నవి.
1) ప్రశ్న:- నౌకకు ఏమైంది? జ॥ నౌకకు ఏమీ కాలేదు. 2) పగిలిపోయిందా? జ॥ లేదు. 3) ప్రమాదమునకు
గురి అయిందా? జ॥ ఏ ప్రమాదమూ జరుగలేదు. 4) అందులోని మనుషులు చనిపోయారా? జ॥ ఒక్కడు కూడా
చనిపోలేదు, ఒక్కరికి కూడా ఏ గాయమూ కాలేదు. 5) ఆ నౌకలోని సరుకు ఏమయింది? జ॥ ఏమీ కాలేదు,
ఎట్లుండేది అట్లే ఉంది. 6) మొత్తానికి నౌక మునిగిపోయిందా? జ॥ ఏమాత్రము మునిగి పోలేదు. అన్ని ప్రశ్నలకు
అన్ని జవాబులను చూచిన తర్వాత ఆశ్చర్యముగా చివరిలో, ఏమి కాకపోతే ఆ నౌక ఎందుకు జాడ తెలియకుండ
పోయింది అని ప్రశ్నించవచ్చును. దానికి నా సమాధానము ఇలావుంది. నౌక సర్వ సాధారణముగా మేఘములోనికి
ఒక నిమిషమునుండి రెండు నిమిషముల లోపల పోయింది. అలా పోయిన నౌక కొన్ని నిమిషముల తర్వాత మేఘము
నుండి బయటికి రావడమూ జరిగినది. అయితే ఆ నౌక మేఘములోనికి దూరేంతవరకే మనకు తెలిసింది. మేఘములోనికి
దూరిన తర్వాత ఏ రాడార్కు తెలియకుండ పోయినది. నాకు తెలిసినది నౌక కనిపించునట్లు మేఘము నుండి
బయటికి రాలేదు. మేఘము కరిగి కనిపించకుండ పోయింది. "ఇపుడు కొందరు నన్ను ఇలా మనకుగానీ, మన
రాడార్ వ్యవస్థకుగానీ తెలియకుండా పోయిన నౌకను మీరు, సర్వ సాధారణముగా కొద్దిసేపటికే మేఘమునుండి
బయటకు వచ్చిందని అంటున్నారే. అందరికీ కనిపించని నౌక మీకెలా తెలిసింది? మీరు తెలిసే చెప్పుచున్నారా?” అని
ప్రశ్నించుటకు అవకాశము కలదు. దానికి నా జవాబు ఏమనగా! నేను చెప్పిన మాట అందరికీ ప్రశ్నార్థకమగునని
నాకు బాగా తెలుసు. అంతేకాక ఈయన మతి ఉండే మాట్లాడుచున్నాడా? అనికూడా అనుకోవచ్చును. అందరూ
ఇక్కడ సందిగ్ధములో పడుతారని నాకు తెలుసు. అయినా జరిగిన విషయము నాకు బాగా తెలిసి చెప్పుచున్నాను.
జరిగిన విషయము మీకు తెలియదు, కావున మీరలా అనుకొనుచున్నారు. వాస్తవానికి మీకు తెలియకుండా అక్కడ ఏమి
జరిగిందో క్షణక్షణమును గమనిస్తే ఈ విధముగా ఉన్నది.
ఆ భారీ నౌకను నడుపుచున్న కెప్టెన్ పార్లె మరియు అతని సహాయకులు పొగమంచువలెవున్న మేఘములోనికి
నౌకను యథాతధముగా నడిపారు. మేఘములోనికి దూరిన నౌక కొద్దిసేపటికే అనగా దాదాపు పది పదిహేను
నిమిషములకు బయటికి వచ్చింది. బయటికి వచ్చిన నౌకలోని కెప్టెన్ పార్లో, నౌకను సాధారణముగా నడుపుచూ
దిక్సూచివైపు చూచాడు. అప్పుడు దిక్సూచి తాము ప్రయాణిస్తున్నది ఫలానా దిక్కని చూపకుండా, అది ఇష్టమొచ్చినట్లు
కదులుచూ అన్ని దిక్కులను చూపడము మొదలుపెట్టింది. అది పని చేయలేదని గ్రహించిన కెప్టెన్ పార్లె వెంటనే
వేరొక దిక్సూచిని చూచాడు. అది కూడ పని చేయడము లేదని తెలిసి పోయింది. దాని తర్వాత తాము పోవు వేగమును
తెల్పు మీటరు కూడా పనిచేయడము లేదని తెలిసింది. తర్వాత నౌకలోని ఏదీ సరిగా పని చేయలేదని అర్థమైనది.
అప్పుడు తాము ప్రయాణించునది అట్లాంటిక్ సముద్రమేనా అని అనుమానము వచ్చింది. వెంటనే అప్పటి కమ్యూనికేషన్
అయిన టెలిగ్రాఫ్ ద్వారా మెసేజ్ భూమిమీదున్న పోర్టుకు పంపగా, ఆ మెసేజ్కు ఎవరూ స్పందించలేదు. అప్పుడు
వారు కొంత అయోమయస్థితికి చేరుకొన్నా, నౌక ప్రయాణము సాగుచున్నది కదా! అని ధైర్యముగా ఉన్నారు. పైన
ఆకాశమూ, క్రింద సముద్రమూ, నౌక ప్రయాణమూ యధాతధముగా ఉండుట వలన వారికి పెద్ద అనుమానము ఏమీ
రాలేదు. వారికి సూర్మరశ్మి లేకుండా ఆకాశము తుఫాను సమయములో ఉన్నట్లు మేఘములుండెను. అప్పటికే
భూమిమీద రాడార్కు తమ నౌక తెలియకుండా పోయిందని నౌకలోని వారికి తెలియదు. అలావారు ప్రయాణిస్తున్న
కొన్ని గంటలకే అనుకోకుండా సముద్ర తీరము కనిపించింది. ఆ నౌక కెప్టెన్ పార్స్లోకు అది ఏ ప్రాంతమో, ఏ తీరమో
అర్థము కాలేదు. ఆ తీరములో షిప్ పోర్టు కూడా లేదని తెలిసింది. తాము ఎక్కడికి వచ్చామో కూడా వారికి తెలియలేదు.
తీరమునకు అర కిలోమీటరు దూరములో నౌకను ఆపిన కెప్టెన్, తమవద్దనున్న చిన్న బోట్లను సముద్రములోనికి దింపి
ఒడ్డుకు చేరుకొన్నారు. చిన్న బోట్లలో పోయేటప్పుడు ఆ సముద్రము నీరు చాలా బరువుగా ఉన్నవని వారికి అర్థమయింది.
ఒడ్డుకు చేరుకొన్న తర్వాత అది అమెరికా భూభాగమే కాదని అర్థము చేసుకోగలిగారు. అక్కడ కనుచూపుమేర ఎవరూ
కనిపించలేదు. అంతేకాక ఆ ప్రాంతములో ఎక్కడా చిన్న చెట్టు కూడా కనిపించలేదు. వారున్న ప్రాంతమంతా
ఒకరకమైన రాతి ప్రాంతముగా కనిపించింది. అంతలో ఆ వాతావరణము వారికి సరిపోనట్లు తోచింది. అక్కడ దిగిన
పది, పదిహేను నిమిషముల లోపల వారికి నిద్రమత్తు రావడమూ, ఆవులింతలు రావడమూ, కడుపునిండా ఆహారము
తిన్నట్లుండడము, ఒక్కొక్కరు తాము కూర్చొన్న చోటనే పడుకొని నిద్రలోనికి పోవడము జరిగింది. అక్కడ వారి విషయము
వారి మనస్సు పని చేసినంతసేపూ మాకు తెలిసింది. వారి మనస్సు నిద్రలోనికి పోయిన వెంటనే అక్కడి విషయము
మాకు కూడ తెలియకుండా పోయినది. వారు మెలకువగా ఉన్నంతసేపూ, వారి మనస్సు ఎరుకగా ఉన్నంతసేపూ, వారి
మనస్సు ఒక అద్దములాగా మాకు ఉపయోగపడింది. కావున జరిగిన విషయమంతా అద్దములో చూచినట్లు తెలిసింది.
తర్వాత ఏమి జరిగిందో ఊహతో చెప్పవలసిందేగానీ, ప్రత్యక్షముగా తెలిసి చెప్పుటకు వీలులేదు. తర్వాత నిద్రనుండి
వారి మనస్సు, జ్ఞాపకము (మెలకువ) లోనికి రాలేదు. కావున అక్కడి ప్రత్యక్ష విషయము ఏమీ చెప్పలేము.
ఇప్పుడు తిరిగి ఆ నౌక విషయములో పుట్టిన ప్రశ్నలవద్దకు వచ్చి మేము చెప్పిన జవాబులను చూడండి. నౌక
ఏ ప్రమాదానికీ గురికాలేదు, నౌక పగిలిపోలేదు, నౌకలో సిబ్బంది చనిపోలేదు, వారిలో ఎవరికీ చిన్న గాయముకూడా
కాలేదు. నౌకలోని సరుకు అలాగే ఉంది. మేము చెప్పిన జవాబులు అన్ని వాస్తవమే. నౌక తీరమునకు చేరడమూ,
నౌకలోని వారు నౌకను ఆపి, చిన్న పడవలలో ఒడ్డుకు పోవడము, వారు అక్కడ నిద్రలోనికి జారి పోవడమూ అన్ని
వాస్తవమే. తర్వాత ఊహతో చెప్పవలసిందేనన్నాము కదా! తర్వాత వారి విషయములో ఒక ఊహకు వస్తాము.
1938 తర్వాత 1947 డిశంబరు 5వ తారీఖున (తేదీన), ఆరు అమెరికా యుద్ధ విమానాలు మాయమైన విషయమును
తీసుకొని, ఆ రోజు ప్రత్యక్షముగా జరిగిన విషయమును చెప్పుకొందాము.
అమెరికా మిలటరీలోని ఒక భాగమైన ఎయిర్ఫోర్సు (వాయుసేన) నకు సంబంధించిన ట్రైనింగ్ ఐదు విమానాలకు
ట్రైనింగ్లో భాగముగా సముద్రములో ఒక టార్గెట్ పెట్టి దానిమీద బాంబులు కురిపించి వచ్చునట్లు ఆఫీసర్లు చెప్పడము
జరిగినది. ఐదు విమానాలు ఒక్కమారుగా లేచి సముద్రములో 500ల కిలోమీటర్ల దూరములోనున్న గుర్తును ఛేదించాలన్నది
వారి ఉద్దేశము. ఐదు యుద్ధ విమానములకంటే ముందు ఒక పైలెట్ విమానము ముందు పోయి, అక్కడ పరిస్థితిని
ముందే వెనుకవచ్చు విమానాలకు తెలియజేయాలి. ముందుపోయిన పైలెట్ విమానము యొక్క సూచనలను బట్టి,
వెనుకవచ్చు విమానములు అక్కడ బాంబులు వేయవలసి వున్నది. అదే విధముగా ముందు పైలెట్ విమానము
బయలుదేరిపోగా, కొన్ని నిమిషముల తేడాతో వెనుక, బాంబులు వేయవలసిన యుద్ధ విమానములు బయలుదేరినవి.
వారి ఆఫీసర్లు ముందే నిర్ణయించిన రూట్లోనే ఆ విమానములు పోవలసివున్నది. 1938వ సంవత్సరములో భారీనౌక
కనిపించకుండా పోయిన తొమ్మిది సంవత్సరములకు 1947లో అమెరికా యుద్ధ విమానములు కూడా పోవడము
జరిగినది. అప్పటికి కూడా సముద్రము మీద ప్రత్యేకముగా ఉన్న ట్రయాంగిల్ గురించి ఎవరికీ అర్థము కాలేదు.
చివరకు 1950 సంవత్సరము సెప్టంబరు 16వ తేదిన ఒక నౌక మాయమై పోయినపుడు సముద్రము మీద కొంత
ప్రాంతములోనే అలా జరుగుచున్నదని గుర్తించగలిగారు. అప్పటినుండి ఆ ప్రాంతము ముక్కోణాకారముతో ఉన్నదని
తెలిసి దానిని బెర్ముడా ట్రయాంగిల్ అన్నారు. 1950 వరకు ఆధారపూరితముగా ట్రయాంగిల్ విషయము ఎవరికీ
తెలియదు. కావున 1947 లో అమెరికా యుద్ద విమానములు ఆ ట్రయాంగిల్ మీద పోవడము జరిగినది. మొదట
పోయిన పైలెట్ విమానము ట్రయాంగిల్, (ముక్కోణపు) ఆకారమున్న సముద్రము మీదికి పోయినపుడు దానిని నడుపుచున్న
వ్యక్తికి తాను ఎంత స్పీడ్తో పోతున్నానని గానీ, భూమికి ఎంత దూరములో ఉన్నాననిగానీ, ఎంత పైన ఎగురు
చున్నాననిగానీ, ఏ దిశలో పోతున్నానని గానీ తెలియకుండా పోయింది. విమానములోని అన్ని విషయాలను తెలుపు
అన్ని పరికములు పని చేయకుండా పోయాయి. కరెంటు లైట్లను ఆన్ చేయకున్నా వాటంతటవే వెలుగను మొదలుపెట్టాయి.
భూమిమీద ఎయిర్ఫోర్సు కేంద్రముతో రేడియో కమ్యూనికేషన్ లేకుండ పోయింది. అప్పటికీ విమానము పోతూనేవుంది.
తన దారికి చుట్టూ తెల్లని మేఘాలు కనిపిస్తూ చివరికవి ఒక గుహలాగ తయారై మధ్యలో దారి ఉన్నట్లు, విమానము
మేఘాల మధ్య గుహలోనికి పోయినట్లు కనిపిస్తూవున్నది. అంతలో ఒక మేఘము అడ్డము రావడమూ, ఆ మేఘములోనికి
విమానము పోవడమూ జరిగింది. అప్పటికీ ఆ విమానమును నడుపుచున్న పైలెట్ పూర్తి ఎరుకలోనే ఉన్నాడు.
విమానమును కప్పిన మేఘము కొంతసేపటికే తన విమానమును వదలిపోయింది. అయితే తన విమానము
అప్పటికే భూభాగము మీద ల్యాండ్ అయివున్నట్లు పైలెట్కు తెలిసింది. ఆకాశములో ఎగురుచున్న విమానము, మేఘము
తొలగిపోతూనే భూమిమీద నిలబడి ఉండడమును చూచిన పైలెట్ ఆశ్చర్యపోయాడు. అది ఎలా జరిగిందో అతనికి
ఏమాత్రము అర్థముకాలేదు. తన విమానము నిలబడింది రన్వే మీదకాదు. సాధారణ మైదానములో నిలబడివుంది.
అంతేకాక అతనికి మరియొక ఆశ్చర్యకర దృశ్యము కనిపించింది. అదేమనగా! తన వెనుక బయలు దేరవలసిన
విమానములు ఐదు కూడా తనకు కొంత దూరములో నిలబడి ఉన్నాయి. అసలుకు ఏమి జరిగిందో అర్థముకాక
అదేమైనా స్వప్నమా అనుకొన్నాడు. అంతలో తాను ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేకుండా నిద్రలోనికి పోయాడు.
ఇదంతా ఎవరూ నమ్మలేని కథలాగా వుంది. అంతేకాక దీనినంతటిని కల్పిత కథ అనే అవకాశము కూడా ఉన్నది.
పరిశోధనా బుద్ధితో చూస్తే కొంతకు కొంత అర్థముకాగలదు.
అనుకొన్నాడు. *
ప్రపంచ ప్రజల దృష్ఠిలో 1938వ సంవత్సరము సముద్రములో కనిపించకుండా పోయిన నౌక విషయముగానీ,
1947వ సంవత్సరము పోయిన ఆరు విమానముల విషయముగానీ, అవి మరుగైపోయిన వెంటనే అవి పూర్తిగా
లేకుండా పోయినట్లు భావించారు. కానీ మేము మాత్రము ఆ దినము, ఆ సమయములో ఏమి జరిగిందో, వారి
మనస్సులో ఏమి రికార్డయిందో, దానిని వారి మనస్సు ద్వారానే తెలుసుకోగలిగాము. వారి మనస్సు నిద్రలోనికి
పోయిన దానివలన అంతటితో ఆ సమాచారము ఆగిపోయినది. అలా ఎప్పుడో జరిగిపోయిన దానిని ఆ కాలములో
వారి మనస్సునందు ఉన్నదానిని, మా మనస్సు ద్వారా తెలుసుకోవడము చాలా కష్టము. ఒక మనిషి తన మనస్సును
ఏకాగ్రత పరిచి, మనస్సులో ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నపుడు, ఏ విషయమునైతే తెలుసుకోవాలో ఆ విషయమును
సంకల్పించి దానిని తెలియాలి అను దృఢమైన భావముతో ఉన్నపుడు, ముందు జరిగిపోయిన విషయమును వారి
మనస్సులోనున్న రికార్డు ద్వారా గ్రహించవచ్చును. దానికి దృఢసంకల్పము కావాలి, మనస్సు ఏకాగ్రతపడాలి. ఫలానా
విషయము నా మనస్సుకు తెలియాలి అని గట్టి సంకల్పమును ముందే పెట్టుకొని, ముందు మనస్సును ఏ విషయము
మీదికి పోకుండా చూచుకోవాలి. మనస్సును ఏకాగ్ర పరుచు సమయము లో నాకు ఫలానా విషయము తెలియాలి
అను జ్ఞాపకమును కూడా వదలి పెట్టాలి. అలా మనస్సు ఖాళీ అయినపుడు యోగమగును. మనస్సు ఎప్పుడు ఏకాగ్రత
చెందుతుందో అప్పుడు బ్రహ్మయోగమగుట జరుగు చుండును. బ్రహ్మయోగములో కొంతసేపు ఉండిన తర్వాత ముందే
సంకల్పించుకొన్నట్లు, జరిగిపోయిన సంఘటనలో ఉన్న వారి మనస్సు నందున్న సమాచారము ప్రత్యక్ష ప్రసారమును
తెలియవచ్చును. మొదట దృఢసంకల్పమున్నవానికే, యోగమును వీడి నేరుగా భూతకాలములో జరిగినప్పుడు గల
మనస్సు యొక్క ఎరుకలో ఏమున్నదో తెలియగలదు. మనస్సు నిలిచి బ్రహ్మయోగమును పొందడమే కష్టము. అలా
బ్రహ్మ యోగమును సాధించిన వారు మాత్రమే దృఢమైన సంకల్ప బలముతో వెనుకటి విషయములు తెలియవచ్చును.
ఈ విషయము చెప్పుకొన్నంత సులభము కాదు. ఎవడైనా మనస్సును జయించి, మనస్సును కదలకుండా
కట్టివేసి, చివరికి బ్రహ్మ యోగమును సాధించినా, ఆ యోగము తర్వాత తెలియాలనుకొన్న విషయము తెలియకుండా
పోవుటకు అవకాశము కలదు. బ్రహ్మయోగము నుండి నూటికి తొంభైమంది నేరుగా నిద్రలోనికి పోవువారుందురు.
అట్లు నిద్రలోనికి పోకుండా పూర్తి ఎరుకగా ఉన్నవానికి మాత్రమే మొదటవున్న సంకల్ప బలముచేత మనస్సు,
భూతకాలములోని సంఘటనకు సంబంధించిన వ్యక్తి యొక్క మనస్సు వద్దకు పోయి, అక్కడి సమాచారమును ప్రత్యక్షముగా
చూడగలదు. అలా జరిగిన కాలములో, జరిగిన విషయమును తెలియుట బ్రహ్మయోగముకంటే కష్టమైనది. పట్టుదలగా
సాధించి ఎవడైనా గత కాలములోని రహస్యమును అప్పటి వారి మనస్సులోని ఎరుకను బట్టి తెలియ వచ్చును. అలా
తెలియాలనుకొన్నవాడు ముందు తన ఎరుకను తానే అదుపు చేయగలిగి నిద్రను జయించి ఉండవలెను. మేము
గతములో జరిగిన విషయమును తెలియాలని ప్రయత్నము చేసీ చేసీ చివరకు తెలుసుకోగలిగాము. అదియు అప్పుడున్నవాని
మనస్సును ఆధారము చేసుకొని చూచిన దానినే చెప్పగలిగాము. అప్పటి మనిషియొక్క మనస్సు నిద్రలోనికి పోయి
మరుపు చెందినపుడు ఆ సమాచారము తెలియదు. 1938లో జరిగిన సమాచారముగానీ, 1947లో జరిగిన
సమాచారముగానీ అప్పుడు వారు మెలకువలో ఉన్నంత వరకు తెలిసింది. వారు నిద్రపోవడము వలనా, మనస్సుకు
జ్ఞప్తి లేని దానివలనా, తర్వాత విషయము ఏమి జరిగినదీ తెలియలేదు.
తర్వాత జరిగిన విషయమును ఊహించి చెప్పవలసిందే కానీ ప్రత్యక్షముగా చూచి చెప్పినది కాదు. మేము
కూడా అంతవరకు జరిగిన విషయములను బట్టి తర్వాత ఇలా జరిగివుండవచ్చునని ఒక అంచనాకు రాగలిగాము.
మేము అంచనా వేసిన సమాచారము సత్యము కావచ్చును, లేక అసత్యమూ కావచ్చును. అందువలన తర్వాత విషయమును
పూర్తి సత్యమని చెప్పలేము. ముందు జరిగినది జరిగినట్లు చెప్పగలిగాము. కావున నౌక విషయములోగానీ, విమాన
విషయములలోగానీ మేము చెప్పినదంతా సత్యమే. ఒక నౌకా, ఆరు విమానములూ కనిపించకుండా పోయిన రెండు
సంఘటనలను తీసుకొని చూస్తే, రెండు సంఘటనలు వేరువేరు కాలములలో జరిగినప్పటికీ, అవి రెండూ కొంత
తేడాతో దాదాపు ఒకే విధముగా జరిగాయి. నౌక మేఘమునుండి బయటికి వచ్చిన తర్వాత కూడా సముద్రములో
పోయినట్లే కనిపించింది. తర్వాత నౌకలోనివారు చిన్న బోట్లలో ఒడ్డుకు రావడము జరిగింది. విమానమేమో, మేఘము
పోతూనే పైలెట్కు మైదానములో నిలబడివున్నట్లు కనిపించింది. అలాగే తన వెనుక బయలుదేరిన ఐదు యుద్ధ
విమానములు కూడ ల్యాండయి వున్నట్లు కనిపించినవి. బయట ప్రపంచమునకు ఇటు నౌకగానీ, అటు విమానములుగానీ
మేఘములోనికి దూరినప్పుడే కనిపించకుండా మాయమై పోయాయి. బయట ప్రజలకు విమానములు, నౌక కనిపించకుండా
పోయిన తర్వాత కూడా కొంతసేపు నౌకలోని వారూ, విమానములోని వారూ క్షేమముగానే ఉన్నారు. ప్రపంచ దృష్టికి
నౌకా, విమానమూ తెలియకుండా పోయినా ఆధ్యాత్మిక దృష్ఠికి ప్రత్యక్షముగా గోచరించాయి. ఇక్కడ మనకు కావలసిన
జవాబులు ఏమనగా! ఆ భారీనౌకను, నావికులను తెలియని తీరానికి ఎవరు తీసుకపోయారు? మేఘము అడ్డము
రావడము ఏమిటి? దానినుండి బయటికి రాగానే ఎక్కడో తెలియని ప్రాంతములో ఉండడ మేమిటి? అలాగే విమానమునకు
కూడా మేఘము అడ్డము రావడమూ, అది పోయిన వెంటనే విమానము భూమిమీద నిలబడివుండడము ఏమిటి? అలా
నిలబెట్టిన వారెవరు? తనకంటే వెనుక వచ్చు ఐదు విమానములు కూడా అక్కడికి ఎలా వచ్చాయి? నౌకకుగానీ,
విమానమునకుగానీ మేఘమే అడ్డము రావడము ఏమిటి? నౌకలోని నావికులు పోయిన సముద్ర తీరముగానీ, విమానములు
నిలబడియున్న మైదానముగానీ ఎక్కడివి? ఇంతకూ నౌక, నావికులు పోయిన ప్రాంతమూ, విమానములు దిగియున్న
ప్రాంతమూ ఎవరికీ తెలియని ప్రాంతమా? ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చుచున్నవి. ఇన్ని ప్రశ్నలకు జవాబులను విమానమును
నడిపిన పైలెట్ ద్వారాగానీ, నౌకను నడిపి ఒడ్డుకు పోయిన పార్లో కెప్టెన్ ద్వారాగానీ తెలుసుకొనుటకు వీలులేదు.
వారు నిద్రలోనికి పోయారు కావున వారినుండి ఏ జవాబూ దొరకదు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికి జవాబు మనకు
త్రోచిన విధముగా చెప్పుకోవలసిందేగానీ వేరు మార్గము లేదు. మన అంచనా ప్రకారము చెప్పుకొను విషయములు
కొన్ని సత్యముకావచ్చును, కొన్ని అసత్యమూ కావచ్చును. అందువలన ఇప్పుడు నేను చెప్పబోవు విషయము అంతా
నిజమేనని నేను చెప్పడము లేదు.
1938వ సంవత్సరము మాయమైపోయిన నౌక విషయమును గురించి నా ఉద్దేశము ఇలా వుంది. ఆ దినము
సముద్రము మీద ప్రయాణము చేయుచున్న బ్రిటీష్ నౌక, శక్తిగల త్రిభుజాకార ప్రాంతములోనికి పోవడము జరిగినది.
నౌకలోనున్న పార్లో కెప్టెన్కగానీ, మిగతా సిబ్బందికిగానీ ఏమాత్రము దైవజ్ఞానము లేదు. ఆ ప్రాంతములోనికి
పోయిన వారు ఎవరైనా దైవజ్ఞానముగలవాడుగా ఉండాలి. దేవుని మీద విశ్వాసము లేని అజ్ఞానులు శక్తిగల ఆ
ప్రాంతములోనికి ప్రవేశిస్తే, ఆ శక్తి ఆగ్రహమునకు గురికాక తప్పదు. అలా అజ్ఞానుల మీద, సముద్రములోనున్న ఆ
శక్తికి కోపము రావడమునకు కారణమున్నది. త్రేతాయుగములోనే ఇందూ మహాసముద్రములోనున్న ఆత్మశక్తి దగ్గరేనున్న
శ్రీలంకలో రావణ బ్రహ్మగా జన్మించి దైవజ్ఞానమునకూ, యోగమునకూ, మోక్షమునకూ నమూనాగా జీవించింది.
జ్ఞానమంటే ఎటువంటిదో, యోగము అంటే ఎలాంటిదో, మోక్షమును జీవుడు ఎలా పొందవలెనో మానవులకు తెలియునట్లు
ఆచరించి చూపించింది. ఆత్మశక్తియే తనలోని అంశను రావణబ్రహ్మగా పంపి, మానవులు జ్ఞానమును, యోగమును,
మోక్షమును తెలియునట్లు శ్రమించగా, నాటికి నేటికి ప్రజలు అజ్ఞానమువైపు ఉండి, ఆనాటి రావణబ్రహ్మ యొక్క
గొప్పతనమును ఏమాత్రము గుర్తించక, చివరికి ఆయనను అజ్ఞానిగా, దుర్మార్గునిగా, కామాంధకారునిగా చెప్పుకోవడము
వలన సముద్రము మీద శక్తికి కోపము వచ్చింది. నాడు ఇందూ మహాసముద్రములో గల త్రైతాకార శక్తి, నేడు
అట్లాంటిక్ సముద్రములోనున్న త్రైతాకార శక్తి రెండూ ఒక్కటేననీ, ఆ శక్తియొక్క భాగమే రావణబ్రహ్మ అని ముందే
చెప్పుకొన్నాము. ఆనాటి రావణబ్రహ్మకు నేటి సముద్రము మీద శక్తికీ ఏ వ్యత్యాసములేదు, రెండూ ఒక్కటేనని
చెప్పుచున్నాము. నేడు మనుషులు తనను గురించి చెడ్డగా చెప్పుకోవడమును చూచిన రావణబ్రహ్మకు మనుషుల మీద
కోపము రాదా? అందువలన ఆ శక్తియున్న సముద్రప్రాంతములోనికి అజ్ఞానులు పోతే ఆ శక్తికి కోపము వస్తున్నది.
జ్ఞానులను గౌరవించి ఏ ఇబ్బంది లేకుండా పంపగల ఆ శక్తి, అజ్ఞానులను చూస్తే కోపముతో మండిపడుచున్నది.
అందువలన అక్కడికి పోయిన నౌకలోని వారి మీద, సముద్రములోని శక్తికి కోపము వచ్చిందని చెప్పవచ్చును.
శక్తికి కోపము వచ్చినా వారిని ఏమాత్రము హింసించలేదు. అప్పుడు కూడా వారు జ్ఞానులుగా మారుటకే అవకాశము
ఇచ్చినది. అలా వారిని దైవము మీద విశ్వాసముగల జ్ఞానులుగా మార్చుటకు, ఆ శక్తి చేసిన పని మంచిదే, అయినా
ఇన్నాళ్ళు కలిసిమెలసి యున్న వారి కుటుంబ సభ్యులనుండి శాశ్వితముగా దూరమై పోవడము వారికి ఒక విధమైన
శిక్షయేనని చెప్పవచ్చును. నా లెక్కలో కొంత శిక్ష అనిపించినా, వారి లెక్కలో వారికి పూర్తి కఠినమైన శిక్ష అనియే
చెప్పవచ్చును. జ్ఞానము తెలియనివారు ఎవరైనా అది పూర్తి కఠినమైన శిక్ష అనియే చెప్పుదురు.
గతములో మేము వ్రాసిన “దయ్యాల - భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథములో దేవుని రాజ్యములోని,
దేవుని పరి పాలనలో మేఘములు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవని వ్రాస్తూ, మేఘములు చేయుచున్న పనులను
కూడా వివరించాము. త్రిభుజాకారముగా సముద్రము మీద ఉన్న శక్తియొక్క ఉద్దేశమును గ్రహించిన మేఘము, నౌకకు
ఒక కిలోమీటరు దూరములో కొద్దిగా పుట్టి, వెంటనే తన ఆకారమును పెంచుకొన్నది. నౌక దగ్గరవుతున్నకొద్దీ ఆకారమును
విస్తరించుకొన్న మేఘము, నౌక తనయందు ప్రవేశిస్తానే, చుట్టూ మేఘముండి ఏమీ కనిపించకుండా చేసినది. దాదాపు
పది, పదిహేను నిమిషములకు మేఘమునుండి బయటకు వచ్చినట్లు అందులోని సిబ్బందికి కనిపించినా, ఆ పది,
పదిహేను నిమిషములలో వారికి ఏమాత్రము తెలియని విషయమూ, ఎవరికీ కూడ అంతుబట్టని విషయమూ జరిగినది.
ఆ కొద్ది సమయములోనే ఆ మేఘము అంతపెద్ద నౌకను, ఎన్నో కోట్ల మైళ్ళ దూరములోనున్న ఒక గ్రహము మీదికి
తీసుకొని పోయింది. ఆ గ్రహము ఈ సూర్య కుటుంబము లోనిదే కాదు. ఆ గ్రహము మీద కూడా సముద్రమున్నది.
అందువలన ఆ నౌకను ఆ గ్రహము యొక్క సముద్రము మీద వదిలింది. అదియూ తీరమునకు దగ్గరగా వదిలింది.
మేఘము వదిలిపోయేటప్పటికీ తమ ఓడ సముద్రము మీదే ప్రయాణిస్తున్నది, కావున ఆ ఓడలోనికి మనుషులకు
ఎటువంటి అనుమానమూ రాలేదు. తర్వాత కొద్దిసేపటికే తీరము దగ్గరిలో కనిపించేటప్పటికి, తాము దారి
తప్పినామనుకొన్నారు. కానీ తామూ తమ ఓడా, భూగోళమునే వదలి వచ్చామని వారికి ఏమాత్రము తెలియదు.
తమ ఓడను సముద్రములో ఆపి, చిన్న పడవల ద్వారా వారు తీరములోనికి వచ్చి చూచారు. అది ఏ దేశమో,
ఏ ప్రదేశమో ఏమాత్రము అర్థము కాలేదు. అంతలో అక్కడికి తీసుకొని పోయిన మేఘమే వారికి నిద్రమత్తు కల్గించి,
నిద్రలోనికి పోవునట్లు చేసినది. వారు ఒక గంటసేపు నిద్రపోయి లేచారు. ఆ గంట నిద్రకాలములో వారి మనస్సుకున్న
జ్ఞాపకములన్నీ, వారి మనస్సునుండి కంప్యూటర్లో డిలేట్ అయిపోయినట్లు తొలగిపోయాయి. అంతటితో వారికి వారి
గతము పూర్తిగా తెలియకుండా పోయినది. వారు భూలోకవాసులైన విషయము కూడా వారికి తెలియదు. తాము
నౌకలో వచ్చామను జ్ఞాపకము ఏమాత్రము లేదు. అలా వారి పూర్వ మనోజ్ఞాపకములను కోల్పోవుట వలన, తర్వాత
వారికి ఏమి జరిగినది ప్రత్యక్షముగా తెలియదు. తర్వాత విషయమును పరోక్షముగా ఊహించి చెప్పుచున్నాము తప్ప
పూర్తిగా తెలిసి చెప్పునది కాదు. అలా నిద్రలోనికి పోయి లేచిన వారికి, క్రొత్త జన్మవచ్చినట్లయినది. పాత విషయములన్నీ
తెలియకుండా పోయినపుడు, పాతజన్మ పోయినట్లే అగును. జన్మ మారకుండి నప్పటికీ, శరీరము మారనప్పటికీ అది
క్రొత్త జన్మతో సమానమైనది. ఆ గ్రహము మీద కూడా భూమిమీదవున్నట్లే మనుషులే ఉన్నారు. ఆ మనుషులందరూ
మంచి దైవజ్ఞానముకలవారు. అటువంటి జ్ఞానులలో భూగోళమునుండి పోయిన వారు కలిసిపోయారు. గోళము
మీదగల మనుషులలో కలిసి ఉండుట వలన, ఇక్కడినుండి పోయిన మనుషులు కూడా జ్ఞానులుగా మారిపోయారు.
భూగోళమునుండి తప్పి పోవడము నౌకలోని వారందరికీ ఒక విధముగా శిక్షయే అయినా, చివరకు వారు జ్ఞానులుగా
మారిపోవడము మంచిదేకదా! ఈ విధముగా ఒక నౌక వెనుక కథ ఇంతవుంది. ఇంత జరుగుటకు కారణము
అట్లాంటిక్ సముద్రములోని త్రైతాకార ప్రాంతమేనని చెప్పవచ్చును.
1947వ సంవత్సరము అమెరికా యుద్ధవిమానములు పోయినపుడు జరిగిన విషయమును వివరించుకొందాము.
ఆ దినము మొదట పైలెట్ విమానము బయలుదేరింది. దానివెనుక కొన్ని నిమిషములకు ఐదు యుద్ధ విమానములు
బయలుదేరాయి. ఫ్లోరిడా నుండి బయలుదేరిన మొదటి పైలెట్ విమానము సముద్రము మీద గల ట్రయాంగిల్ మీద
ప్రయాణిస్తూ ఉన్నది. అప్పుడు అమెరికాలోని ఫ్లోరిడానుండి బయలుదేరి దాదాపు 500 కిలోమీటర్లు సముద్రము మీద
ప్రయాణించింది. అప్పుడు విమానములోని కమ్యునికేషన్ సిస్టమ్ అంతా ఏమాత్రము పని చేయలేదు. దానివెనుక
పైలెట్కు భూమినుండి కనెక్షన్ తెగిపోయింది. తమ వెనకనే వంద కిలోమీటర్ల దూరములో వస్తున్న ఐదు యుద్ధ
విమానములతో కూడా సంబంధము లేకుండా పోయింది. కాకి ్పట్లో ని మీటర్లన్నియు పని చేయకుండా పోయినవి.
దానివలన విమానము భూమినుండి ఎంత ఎత్తున ఎగురుచున్నదనిగానీ, ఎంత వేగముగా పోవుచున్నదనిగానీ, తమకు
గమ్యము ఎంత దూరములో ఉన్నదనిగానీ తెలియకుండా పోయినది. దానితో పైలెట్ కొంత అయోమయస్థితిలో
పడిపోయి, ఎందుకిలా అవుతున్నదో అర్థముకాక, అతని ప్రయత్నము అతను చేయుచుండెను. అప్పటికీ విమానము
ప్రయాణిస్తూనే ఉన్నది. అంతలో బయట విమానము చుట్టూ మేఘమున్నట్లు, మేఘముల మధ్యలో కొంత ఖాళీస్థలములో
తమ విమానము పోవుచున్నట్లు పైలెట్కు అర్థమైంది. అట్లు కొంతదూరము పోయీ పోకనే, ఒక తెల్లని మేఘము
విమానమునకు అడ్డము వచ్చినది. అప్పుడు విమానము మేఘములోనికి దూరిపోయినది. తర్వాత మేఘము విమానమును
వదలి పోయినట్లు, అప్పటికే విమానము భూమిమీద దిగివున్నట్లు పైలెట్ గ్రహించాడు. తనకు కొంత దూరములో తన
వెనుక వచ్చు ఐదు విమానములు కూడా ల్యాండ్ అయినట్లు కనిపించినవి. తర్వాత అతనికి నిద్రమత్తు రావడమూ,
అతను నిద్రలోనికి పోవడమూ జరిగినది.
అతని వెనుక వచ్చు విమానములకు కూడా ముందు విమానము పైలెటు జరిగినట్లే జరిగింది. వాటికి కూడా
మేఘములు అడ్డము రావడమూ, అవి కూడా మేఘములోనికి పోవడమూ, తర్వాత మేఘమునుండి బయటకు వచ్చేటప్పటికే
ఐదు విమానములు మైదానములో నిలబడి వుండడమూ జరిగినది. తర్వాత ఆ ఐదు విమానములను నడుపు వారు
కూడా నిద్రలోనికి పోవడము జరిగినది. తర్వాత ఏమి జరిగిందో వారికి తెలియదు, వారిని అనుసరించు మనకు
కూడా తెలియదు. అయితే అక్కడ జరిగిన దానిని ఊహించి చెప్పుచున్నాము. మేము ఊహించినది పూర్తి సత్యమని
మేము కూడా చెప్పడము లేదు. విమానములు మైదానములో దిగివున్నంత వరకు పూర్తి సత్యమని కూడా చెప్పాము.
అలా విమానములలో వచ్చిన వారు నిద్రించి ఒక గంట తర్వాత లేచారు. లేచిన తర్వాత వారికి కూడా అంతకు
ముందున్న జ్ఞాపకము లేకుండా పోయినది. నౌకలో వచ్చిన వారికి జరిగినట్లే విమానములో వచ్చిన వారికి కూడా గత
జ్ఞాపకములన్ని లేకుండా పోయినవి. దానితో వారెవరో వారికే తెలియకుండా పోయినది. విశేషమేమంటే నౌక
చేర్చబడిన గ్రహము మీదికే విమానములు కూడా చేర్చబడినవి. బ్రిటీష్ నౌక వారూ, అమెరికా విమానము వారు ఒకే
గ్రహము మీద దించబడినారని, భూమండలములోని అమెరికా వారికిగానీ, బ్రిటీష్ వారికిగానీ తెలియదు.
ఒకే గ్రహము మీద దిగిన ఇరు దేశముల వారికి మేము ఫలానా వారిమని చెప్పుటకు వీలులేకుండా జ్ఞాపకశక్తి
పోయినది. వారు దిగిన గ్రహము మీద కూడా మనుషులు ఉండడమూ, చివరికి వారితో వీరు కలిసిపోవడమూ
జరిగినది. ఆ గ్రహవాసులు ఏడు నుండి ఎనిమిది, తొమ్మిది అడుగుల పొడవు శరీరము గలవారు. ఇక్కడినుండి
పోయిన వారు, ఐదు నుండి ఆరు అడుగుల పొడవువారు. ఆ గ్రహములోని ప్రజలముందు, ఇక్కడి నుండి పోయిన
వారు పొట్టివారుగా కనిపిస్తుండడమే కాక, వారిముందు భూలోకమునుండి పోయిన వారు చాలా తెలివితక్కువగా
కనిపించారు. ఇక్కడివారు విమానమునూ, ఓడను నడుపగలిగిన తెలివిగలవారైనా, అక్కడి వారిముందు వీరి తెలివి
చాలా తక్కువేనని చెప్పవచ్చును. అక్కడి వారు అన్ని రంగములలోనూ ముందంజలో ఉండడమేకాక, ఆధ్యాత్మికరంగములో
కూడా ఆరి తేరినవారై ఉన్నారు. ఒక ఊరిలో ఎవడైనా దైవజ్ఞానము లేనివాడై అజ్ఞానిగా ఉంటే, వానిని ఆ ఊరినుండి
వెలివేసి ఊరిలోనికి రానిచ్చేవారు కాదు. దైవజ్ఞానము లేనివాడు పుట్టడమే తప్పు అని చెప్పెడివారు. ఆ గోళములోని
ప్రజలందరూ జ్ఞానము కలిగి బ్రతుకు సాగిస్తుండడమేకాక, ఎంతో ప్రశాంతముగా జీవిస్తున్నారు. వారికి మనవలె
రాజకీయము లేదు. ఆ గోళములో ఎవడు గొప్పజ్ఞాని, యోగియై ఉంటాడో అతనే వారికి రాజు. స్వార్ధము లేకుండా
రాజపాలన ఉండేది. రాజు క్రింది పాలకులందరూ దైవజ్ఞానము కలవారే. అటువంటి ప్రజల మధ్యలోనికి పోయిన
భూగోళ వాసులు కూడా వారి మాదిరే మారిపోయి మంచి జ్ఞానులుగా తయారైనారు.
అక్కడి వారు భూమండలమునుండి వచ్చినవారిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. వీరు ఎవరు? ఎక్కడినుండి
వచ్చారని కూడా అనుకోలేదు. వారికి ముందే ఇటువంటి మనుషులు గానీ, జంతువులుగానీ కొత్తగా అప్పుడప్పుడు
అక్కడికి వచ్చుచుండునని తెలియును. అంతకు ముందు కూడా అక్కడలేని మనుషులు, అక్కడలేని జంతువులు వచ్చాయని
వారికి తెలుసు. వారిని కనిపించని శక్తి తీసుకొని వచ్చి అక్కడ వదులుతుందని కూడా తెలుసు. వారు ఎక్కడి వారైనదీ
వారికి జ్ఞప్తిలేకుండా పోవునని కూడా అక్కడివారికి తెలుసు. క్రొత్తగా వచ్చినవారు ఎవరైనా వారు చేసుకొన్న పాపమునకు
శిక్ష నిమిత్తమే వారి స్థానమునుండి, వారి బంధువులనుండి కనిపించనిశక్తి విడదీసి ఇక్కడికి తెస్తున్నదని, తమలో
తెలియనివారికి చెప్పెడి వారు. ఈ విధముగా ఆ గ్రహవాసులు ఎంతో జ్ఞానము కల్గినవారై కనిపించని శక్తి ఒకటున్నదనీ,
దానివెనుక దేవుడున్నాడని చెప్పెడివారు.
పాపము చేసుకొన్న వారిని వారి పాపమునుబట్టి, కనిపించని శక్తి శిక్ష నిమిత్తమే ఎక్కడనుంచో ఇక్కడకు
కొందరిని తీసుక వచ్చిందని వారు చెప్పడము, పూర్తి సత్యమేనని మనము కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకనగా!
వారు చెప్పినట్లు భూమండలములో కూడా జరుగుచున్నది. కానీ మన అజ్ఞానము వలన ఆ విషయము మనకు
తెలియకుండా పోయినది. ఆ గ్రహవాసులు చెప్పిన మాట వాస్తవమేననుటకు, మన భూమిమీదనే జరిగిన సంఘటనలను
తీసుకొని చూస్తాము. ప్రభుత్వము యొక్క చట్టము ప్రకారము తప్పుచేసిన వానికి శిక్ష ఉందని మనకు తెలుసు.
చట్టము ప్రకారము న్యాయస్థానము ఒక వ్యక్తికి జైలు శిక్షను విధిస్తే, అది అమలైతే, శిక్ష పడిన వ్యక్తిని వాని బంధువులకుగానీ,
భార్యాబిడ్డలకుగానీ, స్నేహితులకు గానీ సంబంధము లేకుండా జైలులో పెట్టడము జరుగుచున్నది. జైలులో అన్నము
నీళ్ళు దొరుకుట వలన కేవలము తన వారికి దూరముగా ఉండడమే అతనికి శిక్ష అగుచున్నది. చట్టవిరుద్ధమైన,
సంఘ వ్యతిరేఖమైన పనులను చేసినవానికి విధించు శిక్ష, తన వారికి దూరముగా పెట్టడమేనని తెలియుచున్నది.
అలాగే దైవ విరుద్ధమైన సంఘ వ్యతిరిక్త పాపములను చేసిన వానికి, కనిపించని శక్తి విధించు శిక్షలలో ఒక శిక్ష,
తనవారినుండి దూరముగా పెట్టడమని తెలియుచున్నది.
ఇక్కడ ఇంకొక ప్రశ్న పుట్టుచున్నది. అదేమనగా! తనవారికి దూరముగా ఉంచడము బయటి ప్రపంచములోని
శిక్ష అయినపుడు, అందులో జ్ఞాపకశక్తి ఉండుట వలన తనవారిని గురించిన జ్ఞాపకాల బాధ మనిషిని మానసికముగా
బాధించగలదనుకోవచ్చును. అయితే ఇక్కడ వేరే గ్రహము మీదికి పోయిన వారికి జ్ఞాపకశక్తి ఏమాత్రము లేకుండా
పోవుట వలన, వానికి తనవారిని గురించి మానసిక బాధే ఉండదు కదా! అలాంటపుడు అది శిక్ష ఎలా అగునని
అడుగవచ్చును. ఈ ప్రశ్న ఇక్కడ చాలా సమంజసమైనదే. దానికి మేము చెప్పు జవాబు ఏమనగా! మేఘము బెర్ముడా
ట్రయాంగిల్ (త్రైతాకార ప్రాంతము) నుండి తీసుక పోవడములో రెండు రకముల ఉద్దేశములు కలవు. ఒకటి
మానవుడు శిక్షను అనుభవించాలి, రెండు జ్ఞానమునూ తెలుసుకోవాలి. శిక్ష వాని కర్మాను సారమైనదే, కానీ జ్ఞానము
కర్మానుసారము వచ్చునది కాదు. అది శ్రద్ధానుసారము వచ్చునది. అయితే భూమినుండి తీసుకపోబడిన మనిషికి
జ్ఞానము మీద శ్రద్ధలేదు. అటువంటపుడు వానికి శ్రద్ధలేని కారణమున జ్ఞానము తెలియబడదు, వాడు జ్ఞాని కాలేడు.
అలాగే వానికి జ్ఞాపకశక్తి లేని దానివలన, వాడు వెనుకటి జీవితమునకు సంబంధించిన బాధను పొందుటకు కూడా
వీలులేదు. అటువంటపుడు వానికి బాధపడు శిక్షా లేదు, సుఖపడు జ్ఞానమూ లేదు. అలాంటపుడు కనిపించని శక్తి
భూ మండలమునుండి రెండు ఉద్దేశములతో తీసుకపోయిందని చెప్పడములో అర్థమేలేదు కదా! అని ఎవరైనా
ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! కంటికి కనిపించని శక్తి ఒకటి ఒక పనిని చేసింది అంటే అందులో
నెరవేరనిది ఉండదు. అంతలేనిది ఆ శక్తి ఆ పనిని చేయదు. ఆ పని నెరవేరేదానికి కావలసిన జ్ఞాపకశక్తిగానీ,
అవసరమైన శ్రద్ధగానీ లేకుండా పోయినా, ఇటు శిక్షాపడుచున్నది. అటు జ్ఞానమూ కల్గుచున్నది. ఎలా అనగా!
అసాధ్యమైన అనుభవములు సుసాధ్యమగుటకు ముందే మనిషికి ఒక అవస్థను దేవుడు తయారు చేసి
ఉంచాడు. ఆ అవస్థయే స్వప్నావస్థ. స్వప్నావస్థలో బయటి ప్రపంచములో లేని అనుభములన్నియు జరుగు చుండును.
బయటి ప్రపంచములో మనిషి ఆకాశములో ఎగిరిపోలేడు. కానీ స్వప్నములో మనిషికి పక్షివలె ఆకాశములో ఎగిరిపోవడము
అనుభ వానికి వస్తున్నది. ఎటువంటి అనుభవమైనా స్వప్నావస్థలో అనుభవానికి రాగలదు. వేరే గ్రహము మీదికి
తీసుకపోబడిన మనిషికి, వెనుకటి జ్ఞాపక శక్తి లేకపోవుట వలన, జాగ్రతావస్థలో వెనుకటి జీవితమునకు సంబంధించిన
ఎటువంటి మానసిక బాధలు లేకుండా ఉండును. అయితే జాగ్రతావస్థ కంటే భిన్నముగా ఉండిన స్వప్నావస్థలో,
వెనుకటి జ్ఞాపకాలు కూడా కల్గుట వలన, ఆ మానసిక బాధను అనుభవిస్తున్నాడు. స్వప్నావస్థలో కాల పరిమితీ,
కాలక్రమమూ ఉండదు. అందువలన బయట ఒక సంవత్సరములో అనుభవించే బాధను, కలలో ఒక పది నిమిషములలోనే
అనుభవించును. స్వప్నములలో కాలమూ మారుచుండును, అలాగే రూపమూ మారు చుండును. అలా స్పీడుగా
మారుచుండినా, మన అనుభవము స్పీడుగా ఉండినా, దానిని మనము గుర్తించలేము. స్వప్నావస్థ బయటి మెలుకువతో
పోల్చి చూచితే అది మాయలాగ ఉండును. జరుగుటకు అవకాశము లేనివి కూడా జరుగుచుండును. మొదట కుక్కగా
కనిపించినది కొద్దిసేపటికే సింహముగా మారివుండినా, దానిని ఏమాత్రము గుర్తించలేము, ఎందుకిలా అయిందని
యోచించనూలేము. అందువలన స్వప్నావస్థ జీవునికి ఒక ప్రత్యేకమైన అనుభవమనీ చెప్పవచ్చును. వేరు గ్రహములోనికి
పోయినవారు వారి జ్ఞాపకశక్తిని కోల్పోయివుండినా, కర్మ వానిని వెనుకటి జ్ఞాపకములను స్వప్నములో కల్గించి, వాటి
బాధను అనుభవించునట్లు చేయుచున్నది. ఎన్నో ప్రత్యేకతలు కల్గియున్న స్వప్నములో ప్రస్తుత జీవితమునకు సంబంధములేని
ఏ బాధనైనా, ఏ సుఖమునైనా అనుభవించవచ్చునని తెలియుచున్నది. అందువలన జాగ్రతావస్థలో జ్ఞాపకములేని
విషయములు కూడా స్వప్నములో జ్ఞాపకము వచ్చి అనుభవించుట జరుగుచున్నది.
స్వప్నావస్థలో ప్రస్తుత జీవితమునకు సంబంధములేనివి కూడా అనుభవానికి రావచ్చును. అందువలన గత
జన్మలో జ్ఞాపకములేని విషయములను కూడా ఈ జన్మలో స్వప్నమునందు అనుభవించవచ్చును. దీనినిబట్టి
భూగ్రహమునుండి వేరే గ్రహము మీదికి పోయినవారికి జ్ఞాపకము పోయినప్పటికీ, కర్మ అనుభవము మాత్రము
పోలేదని తెలియుచున్నది. ఇక జ్ఞానవిషయానికి వస్తే భగవద్గీతలో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" అన్నట్లు మనిషికి
శ్రద్ధవుంటేనే జ్ఞానము లభించుతుంది. శ్రద్ధ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ జ్ఞానము లభిస్తుందని పెద్దలు కూడా
చెప్పారు. ఈ భూగోళము నుండి త్రైతాకారశక్తి వేరే గ్రహముమీదికి తీసుకపోయిన 45 మందికి దేవుని మీదగానీ,
దేవుని జ్ఞానము మీదగానీ ఏమాత్రము ఇష్టములేదు. ఇష్టము లేనపుడు దానిమీద ఆసక్తిని కనబరచరు. శ్రద్ధలేనపుడు
జ్ఞానము కూడా లభించదు. దీనినిబట్టి ఎవరికి జ్ఞానము మీద శ్రద్ధ ఉంటుందో వానికి మాత్రమే జ్ఞానము లభించునని
తెలియుచున్నది. ఇక్కడ బాగా గమనిస్తే ఒక శాస్త్రబద్ధమైన సూత్రము కలదు. ఒక వ్యక్తి రంగులో పడినపుడు ఆ
రంగు అతనిని అంటుకొంటుంది. అలా కాకుండ రంగే అతని మీద పడినపుడు కూడా రంగు అతనిని అంటుకొంటుంది.
అదే విధముగా జ్ఞానము మీద శ్రద్ధలేని వానికి జ్ఞానము కలుగదు. జ్ఞానమును తెలుసుకోవాలను ప్రయత్నమును కూడా
వాడు చేయడు. అటువంటి వాడు జ్ఞాని కాలేడా? అను ప్రశ్నకు జవాబును చూస్తే, దేవుడే భగవంతుని రూపములో
శ్రద్ధవుంటేనే జ్ఞానము లభిస్తుందని అన్నాడుకదా! అంతకంటే వేరే జవాబు ఏముంది అని చెప్పవచ్చును. ఈ జవాబు
మానవుల వైపునుండి చెప్పవచ్చును. దేవుని వైపునుండి మరియొక జవాబు కూడా కలదు. అదే మనగా! అర్థమగుటకు
చిన్న ఉదాహరణతో చెప్పుకొందాము.
నేను 1981వ సంవత్సరములో మద్రాస్ (చెన్నై) దగ్గర మెరీనా బీచ్లో కూర్చొని ఉన్నాను. సాయంకాల
సమయమైన దానివలన ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. చిన్నచిన్న వ్యాపారస్తులు తినుబండారములను తిరిగితిరిగి
అమ్ముకుంటున్నారు. ఉడకపెట్టిన వేరుశెనగ విత్తనములను ఒక బుట్టలో పోసుకొని ఒక వ్యక్తి అమ్ముకొంటూ నావద్దకు
వచ్చి ఉడక పెట్టిన వేరుశెనగ విత్తనములని నాకు వినిపించేటట్లు అరిచాడు. నేను కొనాలనే అతను అలా అరవడము
జరిగినది. అయినా నేను వేరుశెనగ విత్తనములనుకొనలేదు. నాకు చిరుతిండి తినే అలవాటు లేనేలేదు. అందులోనూ
వేరుశెనగ విత్తనముల మీద ఏమాత్రము ఆసక్తిలేదు. ఆ వ్యాపారి మూడులేక నాలుగు మార్లు ఐదు నిమిషములకొకమారు
నా ప్రక్కగా వేరుశనగవిత్తనములు రుచిగా ఉన్నాయి అంటూ పోయాడు. నాకు వాటి మీద శ్రద్ధలేదు, కావున నేను
ఏమాత్రముకొనలేదు. తర్వాత అతను నేరుగా నావద్దకు వచ్చి "మీరు కొనకపోయినా ఫరవాలేదు, కాలక్షేపమునకు
రుచి చూడండి సార్” అని నా చేతిలో నాలుగు విత్తనములను పెట్టాడు. నేను అడుగకున్నా వానంతకు వాడు ఉ
చితముగా ఇచ్చినపుడు ఎందుకు వద్దనాలి అని అనుకొని, ఆ నాలుగు విత్తనములను తినడము జరిగినది. ఆ నాలుగు
విత్తనములను తిన్నపుడు అవి రుచిగా కనిపించాయి. తర్వాత తినాలని పించింది. ఒకవైపు తినాలనిపించినా, ఇంతవరకు
ఊరకనేవుండి, ఇపుడు కొనడమేమిటి? అని అనిపించినా, వాడు ఉచితముగా ఇచ్చాడు కదా! దానికైనా కొనాలి అనిపించింది.
చివరకు కొనడము, తినడము రెండూ జరిగినవి. అక్కడ ప్రత్యక్షముగా జరిగిన విషయమును చూచుకుంటే, నాకు
వేరుశనగ విత్తనములను తినాలని ఇష్టము లేకున్నా, అమ్మేవాడు పెట్టడము వలన చివరకు తినడము జరిగినది.
అలాగే ఒకనికి దైవజ్ఞానము మీద ఏమాత్రము శ్రద్ధలేదు. వాడు జ్ఞానమును తెలుసుకోవాలని ఎప్పుడూ
అనుకోలేదు. జ్ఞానమును చెప్పుచున్న బోధకులను చాలామార్లు చూచాడు. అయినా జ్ఞానము జోలికిగానీ, చెప్పే
వారివద్దకు గానీ పోలేదు. వేరు శనగ విత్తనములను అమ్మేవాడు అమ్ముచున్నా, కొనేవారు కొనుచున్నా, శ్రద్ధలేని నేను
మాత్రము వాటిని కొననట్లు, వేరు శనగ విత్తనములవలెనున్న జ్ఞానమును చిరు వ్యాపారివలె నున్న బోధకుడు తెల్పుచున్నా,
తెలుసుకొనేవారు తెలుసుకొనుచున్నా ఆసక్తి (శ్రద్ధ లేని వారు ఏమాత్రము తెలుసుకోక పోవడము సహజమే. అయితే
శ్రద్ధలేని మనుషులను గ్రహించిన గురువు, తన బోధను మొదట తానే వారికి ఉచితముగా అందించును. జ్ఞానము
తెలుసుకోవాలని కర్మలో ఎటూ ఉండదు. జ్ఞానము శ్రద్ధనుబట్టి మాత్రమే ఉండును. శ్రద్ధలేనివానికి జ్ఞానము దొరకదు.
అయితే మొదట, వాడు కోరకున్నా లభించిన కొద్దిపాటి జ్ఞానము వలన జ్ఞానమును తెలుసుకోవాలను శ్రద్ధ ఏర్పడును.
అలా వచ్చిన శ్రద్ధవలన జ్ఞానము లభించుటకు మొదలిడును. మొదట నాకు వేరుశనగ విత్తనముల మీద ఆసక్తి
లేకున్ననూ, మొదట ఉచితముగా లభించిన నాలుగు విత్తనములచేత, తర్వాత ఇంకాకొన్ని విత్తనములను కావాలనుకొన్నట్లు,
జ్ఞానము మీద శ్రద్ధలేని వారికి దైవశక్తే మొదట కొద్ది జ్ఞానమును అందించి, తర్వాత పూర్తిగా జ్ఞానము మీద శ్రద్ధకల్గునట్లు
చేయుచున్నది.
భూమిమీద అజ్ఞాన సాంధ్రత పెరిగి పోకుండా దైవశక్తి అటుల చేయుచున్నది. ఒకమారు ఆ విధముగా
జ్ఞానము మీద శ్రద్ధను దైవమే కల్గించగా, తర్వాత తనకున్న శ్రద్ధచేత మనిషి జ్ఞానమును తెలుసుకోవలసి ఉన్నది.
1938 మరియు 1947వ సంవత్సరములలో భూమినుండి తీసుక పోబడిన వ్యక్తులు ఒక విధముగా వారికి కల్గించిన
శ్రద్ధవలన జ్ఞానమును తెలుసుకోగలిగారు. అట్లే వారికి కల్గిన స్వప్నములలో పాపకర్మనూ అనుభవించారు. సముద్రము
మీదున్న త్రైతాకారముగల శక్తిలోనికి పోయిన వారిని, మేఘములే ఎక్కడో మానవునికి తెలియకుండావున్న గోళము
మీదికి తీసుకపోయి, ఒక విధముగ కర్మానుభవమునూ, ఒక విధముగ జ్ఞాన సముపార్జననూ కలుగజేసినవి.
శిక్షరూపములోనున్న కర్మ అనుభవముతో పాటు జ్ఞానమును కలుగజేయాలనుకొన్న వారిని ఆ విధముగ మేఘములు
చేశాయి. జ్ఞానము సంబంధము లేకుండా, కేవలము కర్మను మాత్రము అనుభవింపజేయుటకు మేఘములు మరియొక
పనిని కూడా చేయుచున్నవి. మనుషులను కాకుండా వేరే జాతుల జీవరాసులను కర్మ అనుభవమునకు, ఒక చోటినుండి
మరియొక చోటికి మేఘములు మార్చడము జరుగుచున్నది. అలా మార్చుటను బట్టి చూస్తే అట్లాంటిక్ సముద్రము
మీద మనుషులు మాయమై పోవడము మేఘముల పనియేనని అర్థముకాగలదు. తామే ఆ పనిని చేశామన్నట్లు,
మేఘములు జీవరాసులను కూడా భూమిమీదనే ఒకచోట అదృశ్యము చేసి మరొక చోట కనిపించునట్లు చేయుచున్నవి.
ఈ పని భూమిమీద జరుగుచున్నప్పటికీ, మనుషుల బుర్రలకు తొందరగా అర్థము కాలేదు. కర్మనుబట్టి జీవరాసులను
గుంపుగాగానీ, ఒక్కదానినిగానీ, మేఘములు స్థలమార్పిడి చేయిస్తున్నవని గతములోనే “దయ్యాల-భూతాల యదార్థ
సంఘటనలు” అను గ్రంథములో పూర్తిగా వివరించాము. అటువంటి సంఘటనను ఒక్కదానిని ఇప్పుడు వివరిస్తాము
చూడండి.
2010వ సంవత్సరము సెప్టెంబరు నెల మంచి వర్షాకాలము అగుట వలన హైదరాబాద్ నగరములో విపరీతముగా
వర్షము కురిసినది. హైదరా బాద్ నగరములో పల్లపు ప్రాంతములన్నీ నీటితో మునిగిపోయాయి. అటువంటి సందర్భములో
ఒకచోట పెద్ద భవనము కట్టుటకు లోతుగా తీయబడిన పునాదుల గుంతలోనికి (సెల్లార్ గుంతలోనికి) నీరు చేరింది.
రెండవరోజు తెల్లవారిన తర్వాత పునాది గుంతలో 12 అడుగుల పొడవు గల మొసలివుండడము స్థానికులు గమనించారు.
తర్వాత ఆ విషయము అందరికీ తెలియడమూ, ఆ తర్వాత అటవీశాఖ అధికారులు వచ్చి దానిని బంధించి తీసుకొని
పోవడమూ జరిగినది. ఆ దినము 12 అడుగుల పొడవుగల మొసలి అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ అర్థముకాలేదు.
ఆ విషయమును అంతటితో వదిలివేశారు. ఇప్పుడు మనము దానిని గురించి ఆలోచిస్తే, హైదరాబాద్కు సమీపములో
మొసళ్ళ నివాసములు ఎక్కడా లేవు. ఆ చుట్టు ప్రక్కల అటవీప్రాంతముగానీ, మొసళ్ళు పెరుగుటకు అనుకూలమైన
మడుగులు గానీ, నదులుగానీ, చెరువులుగానీ లేవు. అక్కడికి చుట్టూ రెండు మూడువందల కిలోమీటర్ల దూరంలో
గానీ ఎక్కడా మొసళ్ళు కనిపించవు. అవి ఉన్నట్లు ఆధారములే లేవు. అటువంటపుడు జన సమూహముతో కూడుకొన్న
హైదరాబాద్ పట్టణములోనికి ఆ మొసలి ఎలా రాగలిగింది? మొసళ్ళు మిగత జంతువుల మాదిరి ఎక్కువ దూరము
ప్రయాణము చేయలేవు. మనకు తెలిసినంతలో అవి చిన్న నీటిమడుగులో పూర్తి ఎండి పోయేంతవరకు కూడా అక్కడే
ఉంటాయి. అటువంటి మొసలి పూర్తి వర్షాకాలము ఎక్కడ చూచినా చెరువులు, కుంటలు, నదులు నిండివున్న
కాలములో అన్నిటినీ వదలి జనసంచారమున్న పట్టణములోనికి రావలసిన అవసరమే లేదు. అదియూ శాశ్వితముగా
నీరున్న జాగా కాకుండ ఒక పునాది గుంతలోనికి ఎందుకు వచ్చింది? రాత్రిపూట కూడా లైట్లు వెలుగుతున్న పట్టణములోనికి
ఎవరికంటా పడకుండా రావడము చాలా కష్టము. జనవాసముల మధ్యలోనికి ఎక్కడినుండి వచ్చింది అను ప్రశ్నకు
ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. దానిని గురించి మేమేమను చున్నామంటే, అది ఎక్కడినుండీ ప్రయాణము చేసి
అక్కడికి రాలేదు. దానిని ఎవరైనా తెచ్చి అక్కడ వదిలారా అంటే, అట్లు కూడా ఎవరూ చేయలేదు. అటువంటపుడు
అది అక్కడికి ఎలా వచ్చింది? అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికంతటికి జవాబు ఒక్కటే కలదు. బెర్ముడా
ట్రయాంగిల్ నుండి మనుషులూ, పెద్దనౌకా, ఆరు విమానములూ ఎట్లు మాయమై ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల
దూరములో ఎవరికీ తెలియని గ్రహము మీదికి ఎలా పోయాయో, ఎందుకు పోయాయో, అలానే ఈ మొసలి కూడా
హైదరాబాద్లోని ఒక పునాది గుంతలోనికి వచ్చింది. వర్షించే మేఘమే ఆ మొసలిని కూడా తెచ్చి అక్కడ వదిలింది అని
చెప్పుచున్నాము. మేఘము అంతపని చేస్తుందా అని ఆశ్చర్యపడవలసిన అవసరములేదు. బెర్ముడా ట్రయాంగిల్ నుండి
కొన్ని నిమిషములలోనే ఆరు విమానములను ఎక్కడికో చేరవేసిన మేఘము, మొసలి విషయములో అట్లు చేయలేదు.
క్షణాలలో అక్కడికి తీసుకరాలేదు. కొన్ని రోజులు ఆకాశములోనే కనిపించకుండా అదృశ్యముగా తనవద్ద వుంచుకొని,
తర్వాత హైదరాబాద్లో వదిలింది. ఇది మరీ క్రొత్తగా ఉండినా, ఈ విషయము లన్నియు వివరముగా “దయ్యాల
భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథములో ముందే చెప్పడము జరిగినది. తన రూపమును మార్చుకొని
కనిపించకుండా పోవు మేఘము ఎవరినైనా తనయందు దాచుకోగలదు, ఎవరికీ కనిపించకుండా చేయగలదు.
బెర్ముడా ట్రయాంగిల్ నుండి ఒక భారీ నౌకనూ, ఆరు విమానము లనూ మాయము చేసినది మేఘమంటే
ఎవరూ నమ్మలేక పోయినా, అవి అక్కడ మాయమై పోయాయనుటను మాత్రము ఎవరూ కాదనలేరు. బెర్ముడా ట్రయాంగిల్లో
దైవశక్తి త్రైతాకారముగా ఆవహించి ఉన్నది. దేవుని పాలనలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మేఘములు, అట్లాంటిక్ సముద్రము
మీదున్న త్రైతాకారశక్తిని తాకి శక్తిని పొంది వస్తున్నవి. త్రైతాకార శక్తిని తాకి పూర్తిగా ఉత్తేజమైన మేఘములు,
భూమిమీదగల జీవరాసుల మీద తమ ప్రభావమును చూపుచున్నవి. అయినా విజ్ఞానము అంటూ అజ్ఞానములో
చిక్కుకొని, కనిపించే వాటినే నమ్ముతాము, కనిపించని వాటిని నమ్మము అనేవారు చాలామంది గలరు. అటువంటివారు
కూడా ఆలోచించే విధముగా, తామున్నామనీ, తమశక్తి ఇలాంటిదనీ తెలిసే విధముగా మేఘములు సముద్రము మీదనేకాక,
భూమిమీద కూడా కొన్ని పనులు చేయుచున్నవి. అటువంటి పనులను చూచికూడా ఏమీ అర్థముకాక, వాటిని గురించి
తెలుసుకోకుండా వదలివేయువారున్నారు. ఒక పనిని గురించి వివరణ ఇవ్వలేనిది విజ్ఞానముకాదు. మేఘములు
చేయు అన్ని పనులను అర్థము చేసుకోకున్నా, కనీసము కొన్నిటికైనా వివరమును తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే
మనకు సైన్సూ తెలియదు, మనము విజ్ఞానులమూ కాము అని చెప్పుటకు అవకాశమున్నది.
మా విషయము మీకు తెలియదు. దీనిని చూచిన తర్వాత అయినా మా విషయమును తెలుసుకొనుటకు
ప్రయత్నించండి అని మనుషులకు సవాలు విసరుచు మేఘములు భూమిమీద ఒక రకమైన పనిని చేయుచున్నవి.
భూమిమీద మేఘములు చేయుచున్ననూ మనుషులకు అర్థముకాని పనిని వివరించుకొందాము. బెర్ముడా ట్రయాంగిల్
అను త్రైతాకారము అమెరికాకు దగ్గరగా అట్లాంటిక్ సముద్రములో ఉన్నదని చెప్పుకొన్నాము కదా! త్రైతాకారమునకు
దగ్గరగానున్న అమెరికాలోనే ఎక్కువగా మేఘములు ఒక వింత పనిని చేయుచున్నవి అదేమనగా! ఒకరోజు అమెరికాలో
ఒక చిన్న విమానములో కేవలము ముగ్గురు మనుషులు మాత్రము ప్రత్యేకమైన పని మీద పోవుచున్నారు. అందులో
ఒక మనిషి క్రింది భూభాగమును చూస్తూ పోవుచుండెను. వారు పోవు దారిలో ఒక ప్రత్యేకమైన రాళ్ళు కలవు. ఆ
రాళ్ళను పైనుండి చూడాలను ఉద్దేశముతో, ఆ మనిషి క్రింది భూభాగమును చూస్తూ పోయాడు. ఆ శిలలు కనిపించాయి.
ఆ చుట్టు ప్రక్కల ప్రాంత మంతా కనిపించింది. ఆ రాతి శిలలు నిటారుగా ఎత్తుగా ఉన్నవి. ఆ ప్రాంతమంతా గోధుమ
పంటపొలాలతో నిండివున్నది. గోధుమ పంట పొలాలతో నిండి ఉన్న ఆ ప్రాంతములో రాతిశిలలు ప్రసిద్ధిగాంచినవట.
అందువలన పైన విమానములో పోవు వ్యక్తి క్రిందికి చూస్తూ పోయాడు. వారు పోవు గమ్యము దగ్గరలోనే ఉండుట
వలన, పోయినవారు ఒక గంట వ్యవధిలోనే తిరిగి అదే దారిలో వచ్చారు. గంటకే తిరిగి వచ్చిన విమానము రాతిశిలలువున్న
ప్రాంతము మీద పోవునపుడు, మొదట క్రిందికి చూస్తూ పోయిన వ్యక్తి, అప్పుడు కూడా క్రిందికి చూచాడు. అయితే
అప్పుడు అతనికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము కనిపించింది. రాతి శిలలకు దగ్గరగానే ఉన్న పొలాల మైదానములో
గీచిన బొమ్మలాగా అన్ని కొలతలు సక్రమముగా వున్న చిత్రములాగా, చూస్తూనే ఆహ్లాదముగా ఉండు ఒక చిత్రము
కనిపించింది.
అది ఎదిగిన గోధుమపంటతో కూడుకొన్న మైదానము. ఆ మైదానములో కొన్ని వందల మంది మనుషులు
పనిచేస్తేగానీ ఏర్పడని బొమ్మ ఒక గంటలోపే ఏర్పడింది. నిలబడివున్న గోధుమపంట కొంత పడిపోయి భూమికి
ఆనుకొనివుంది, కొంత నిటారుగా నిలబడివుంది. గోధుమగడ్డి నిటారుగా కొంతా, పడిపోయి కొంతా ఉండుట వలన
అది ఒక గీచిన బొమ్మలాగ పైకి కనిపిస్తుంది. ఆ ఆకారము పైన ఆకాశము నుండి చూచువారికి మాత్రమే అందముగా
కనిపించును. దాదాపు కిలో మీటరు పొడవున్న బొమ్మ ఆకారము భూమిమీదనుండి చూస్తే పూర్తిగా కనిపించదు.
పైన విమానము పోవు ఎత్తునుండి చూచినా, హెలిక్యాప్టరు పోవు ఎత్తునుండి చూచినా పూర్తి బొమ్మ కనిపించగలదు.
పైరు కొంత పడిపోయి ఏర్పడినపుడు కనిపించు బొమ్మ ఆకారములను కొన్నిటిని, పైనుండి తీసిన ఫోటోలను, తర్వాత
పేజీలలో చూపిస్తాము చూడండి.
మీరు చూచిన ఆకారములన్నీ అమెరికా ఖండములో అక్కడక్కడ, ఏ మనుషులు తయారు చేయకుండా, రాత్రికిరాత్రే
ఏర్పడిన దృశ్యములు. “క్రాప్సర్కిల్స్” అని పిలువబడు ఈ దృశ్యములను చూచిన చాలామంది చాలా రకములుగా
అనుకొన్నారు. ఇదంతా మనుషులు చేసినదే అని కొందరు నాస్తికవాదులు అనగా, ఇది మనుషులచేత అయ్యేపనికాదు,
ఏదో కనిపించని శక్తి చేసివుంటుందని కొందరు ఆస్తికవాదులు అన్నారు. కొందరైతే మేము చేసి చూపిస్తామని కష్టపడి
ఆకారములను చేసిన వారు కూడా కలరు. అయితే మనుషులు చేసిన బొమ్మలను సులభముగా గుర్తు పట్టవచ్చును.
బొమ్మలను మనుషులు చేయగలరని నిరూపించుటకు పట్టు దలగా కొయ్యపలకలతో ఎంతోమంది పైరును పడగొట్టుచూ
పోయి ఆకారమును సృష్టించినా, పైరు పూర్తిగా వంగి భూమికి కరుచుకొని పోకుండా, ఎంత అణగ త్రొక్కినా, కొద్దిగా
అయినా పైకి లేచుట వలన ఆకారములో స్పష్టత లేకుండా పోయినది. అందువలన మనుషులు చేసిన ఆకారము
క్రాప్సర్కిల్స్ చిత్రము 36,37,38,39 పేజీ లో చూడండి .
ప్రత్యేకముగా గుర్తించునట్లు కనిపించుట వలన, రాత్రికి రాత్రే ఏర్పడిన ఆకారములు మనుషుల చేత చేయబడినవి
కావని తెలిసిపోయినది. మనుషులు తయారు చేయు ఆకారములకు స్పష్టత లేకపోవడమేకాక, కొంత కాలమూ,
కొంతమంది మనుషులూ అవసరమగుచున్నది. ఈ ఆకారములు మనుషులు చేసినవేనని నిరూపించుటకు కొందరు
శ్రమించి చేసినా, వాటిని సులభముగా గుర్తుపట్టవచ్చును. అందువలన కొన్ని నిమిషములలో ఎవరికీ తెలియకుండా
ఏర్పడిన ఆకారములు మానవసృష్ఠికాదని తేలిపోయింది. అయినా అవి ఎలా ఏర్పడుచున్నవి? వాటిని ఏ శక్తి తయారు
చేయుచున్నదను ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.
క్రాప్సర్కిల్ అను పేరుతో పిలుబడు ఆకారములను గురించి, నేషనల్ జియోగ్రఫి టీవీ ఛానల్లో చూపించడము
జరిగినది. యదార్థ కథలు (TRUE STORIES) అను పేరుతో చూపించిన ప్రోగ్రామ్లో క్రాప్సర్కిల్స్ ఒక మిస్టరీ గానే
ఉన్నవని చెప్పడము జరిగినది. ఎవరికీ వాటి విషయము తెలియకున్నా మనము ముందే, ఈ పనిని మేఘములే
చేయుచున్నవని చెప్పుకొన్నాము. తన శక్తి యొక్క ఉనికిని చాటుకొనుటకు మేఘములు ఈ రకమైన క్రాప్ సర్కిల్స్ను
సృష్ఠిస్తున్నవి. మేఘము పైనుండి క్రిందికి తనశక్తి చేత కొన్ని నిమిషములలోనే క్రాప్సర్కిల్ బొమ్మను సృష్టిస్తున్నది. ఆ
బొమ్మ ఒక కళాకారుని చేతిలో తయారైనట్లు కనిపించుచున్నది. మేఘము తయారు చేసిన బొమ్మలో గోధుమగడ్డి
భూమిని అంటుకొని పడిపోవుట వలన పైనుండి ఆకారము స్పష్టముగా కనిపించు చున్నది. మేఘములు సృష్టించిన
క్రాప్సర్కిల్ ఆకారములను పై చిత్రములలో చూచారు కదా! ఆ బొమ్మలు మనిషి ఊహకు కూడా రావు. అలా ఏర్పడిన
ఆకారమును ముగ్గులనిగానీ, ఫలానా బొమ్మలనిగానీ చెప్పుటకు వీలులేదు. అటువంటి ఆకారములు భూమిమీద
ఎక్కడా ఉండవు.
క్రాప్ సర్కిల్ ఆకారమునకు అర్థము గలదా!
క్రాప్సర్కిల్స్ ఆకారములను చూస్తూనే ఆ ఆకారములు భూమిమీద ఎక్కడా లేనట్లూ, అవి మానవుని సృష్ఠికానట్లూ,
పంట మైదానములలో అంత పెద్ద ఆకారములు ఏర్పడడములో ఏదో ఒక అర్థమున్నట్లూ తెలియుచున్నది. అంత
ఖచ్చితమైన కొలతలతో సృష్ఠింపబడిన ఆకారము వెనుక ఏ భావమున్నదో తెలియాలంటే, ముందు వాటిని తయారు
చేసిన వారిని గురించి తెలియాలి. మనకు తెలిసిన ప్రకారము మేఘములే వీటి సృష్టికర్తలని చెప్పుకొనినా, ప్రజల
దృష్ఠిలోకూడా ఏదో గొప్పశక్తి వాటిని సృష్టిస్తున్నదని చెప్పుచున్నారు. వారు ప్రత్యక్షముగా చూచిన విషయములను
కూడా ఇలా చెప్పుచున్నారు. ఒక రైతు రాత్రిపూట పొలములో ట్రాక్టరుతో పనిచేసి కొంత ప్రొద్దుపోయిన తర్వాత
ట్రాక్టర్ను నడుపుకొంటూ ఇంటికి వస్తుండెనట. రాత్రిపూట అయిన దానివలన, ఎటు చూచినా చీకటిగా ఉన్న సమయములో
దూరముగా రెండు పెద్దలైట్లు వెలుగుచున్నట్లు అతనికి కనిపించాయి. అవి భూమిమీద కాకుండా ఆకాశములో 60 లేక
70 అడుగుల ఎత్తులో వెలుగుచున్నట్లు కనిపించాయి. అట్లు కనిపించిన లైట్లు స్పీడుగా తనవైపు వచ్చుచున్నట్లు ఆ
రైతుకు కనిపించాయి. రైతు ట్రాక్టరు పోతూవుండగానే అదే దారిలోనే వెనుకవైపు నుండి, దాదాపు 100 కిలోమీటర్ల
వేగముతో వచ్చి ట్రాక్టరు మీదుగా ట్రాక్టరును దాటి ముందుకు పోవడము జరిగింది. ఆ దినము రైతు చూచినట్లే
అప్పుడప్పుడు ఇతరులు కూడా చూచారు. ఆ వెలుగులు ప్రత్యేకమైనవనీ, అలాంటి వెలుగులను తాము ఎప్పుడూ
చూడలేదనీ వారు చెప్పడము జరిగినది. ఎవరికీ అంతుబట్టని అలాంటి వెలుగులు కనిపించడమూ, తర్వాత కొద్ది
రోజులకు ఆ ప్రాంతములో ఎక్కడో ఒకచోట క్రాప్సర్కిల్ ఏర్పడమూ జరిగెడిది. అది ఎక్కడ లేనిదిగా, క్రొత్తదిగా
ఉండడము వలన, దానిని ఏదో ఒక మహత్తరశక్తి చేయుచున్నదని ప్రజలు కూడా భావించెడి వారు.
నాకు తెలిసిన జ్ఞానము ప్రకారము ప్రజలకు ఏ విధముగా కనిపించినా, అలా క్రాప్సర్కిల్స్ను తయారు
చేసినవి మేఘములను నిర్ధారణకు వచ్చాము. వెలుగుల విషయానికి వస్తే, మేఘములు దేవుని పాలనలో భాగమై దేవుని
సేవ చేస్తున్నవని చెప్పుకొన్నాము కదా! అలాగే దేవుని సేవ చేయు చిన్నచిన్న గ్రహములు ఆకాశములో కొన్ని కోట్ల
సంఖ్యలో గలవు. అటువంటి గ్రహములు అప్పుడప్పుడు భూమిమీద సంచరించు చుండును. అటువంటి వాటిలో ఏ
గ్రహములైనా అలా వెలుగురూపములో కనిపించి ఉండవచ్చును. అంతేకానీ మేఘములు వెలుగు రూపములో కనిపించవు.
ఆకాశములో పెద్దపాత్రను పోషించునవి మేఘములుకాగా, చిన్నచిన్న పాత్రలను చిన్న గ్రహములు పోషించుచుండును.
ఈ విశ్వములో ఏవి చేయు పనులను అవి చేయుచున్నవి. రాజ్యాంగములో ప్రజలూ, పాలనా అని రెండూ ఉన్నట్లు,
దేవుని రాజ్యాంగములో కూడ జీవరాసులూ, వాటిని పాలించు పాలకులు రెండూ గలవు. ప్రతి మనిషి పాపమును,
పుణ్యమునూ ప్రతి క్షణమూ లెక్కించుచూ వాటిని అమలుచేసి అనుభవింపజేయు పాలనలో ఎన్నో గ్రహములు, మేఘములు,
భూతములు, ఉప భూతములు తమతమ పాత్రను నిర్వర్తిస్తున్నవని మానవునికి తెలియదు. మనిషి తన ఇష్టమొచ్చినట్లు
చేయుచున్నాడు తప్ప నేను చేయు పని మంచిదా, చెడ్డదా అని ఏమాత్రము యోచించడము లేదు. ఎవరికి కష్టమైనా,
ఎవరికి నష్టమైనా ఫరవాలేదు తనకు మాత్రము అనుకూలముగా, సుఖముగా, లాభముగా ఉండాలను ఉద్దేశములో
మనిషి పనులు చేయుచున్నాడు. ఈ పని వలన పాపము వస్తుందను ధ్యాస ఏమాత్రము లేకుండా చేయుచున్నాడు.
ప్రతి పనిని గమనిస్తున్నవారు కలరనీ, ప్రతి పని వెనుక తన పాప పుణ్యములను లెక్కించి శిక్షించువారున్నారనీ, ఏ
మనిషి అనుకోవడము లేదు. ధనికుడైతే తాను ఏమి చేసినా చెల్లుననుకొంటున్నాడు, రాజకీయ నాయకుడైతే నా పనికి
అడ్డుపడువాడెవడు అను గర్వముతో ఉండును. తాను ఎంత ధనికుడైనా, రాజకీయనాయకుడైనా, పెద్ద అధికారియైనా
తనకంటే పెద్దవారూ, తనను శిక్షించువారూ, తన కాళ్ళలోనూ, తన కీళ్ళలోనూ, తన ఒంటిలోనూ, తన కంటిలోనూ
ఉన్నారని తెలుసుకోలేక పోవుచున్నాడు. ఒక మనిషి జీవితమును సాగిస్తున్నాడంటే, వానిని ప్రతి క్షణము కాచుకొని
చూస్తున్నవాడు ఒకడు, వానిని నిత్యము శిక్షించువాడు మరొకడు ఉన్నాడని మరువకూడదు. దీనినిబట్టి చూస్తే
మనుషులకంటే, కనిపించకుండా మనుషులను పాలించు వారిసంఖ్యే ఎక్కువగావున్నదని తెలియుచున్నది.
ట్రాక్టర్లో పోవు రైతుకు కనిపించిన వెలుగులు బహుశ ఏవో చిన్న గ్రహములపై ఉండవచ్చును. మేఘములు,
గ్రహములకంటే శక్తివంత మైనవి. క్రాప్సర్కిల్స్ను ఏర్పరచడములో మేఘములు ఏ గ్రహముల సహాయము లేకుండానే
చేయగలవు. మేఘములు ఏర్పరచిన క్రాప్సర్కిల్స్ ఎన్నో ఆకృతులుగా ఉన్నట్లు పై బొమ్మలలో మీరు చూచారు.
ఆకృతులలో ఎక్కువగా సర్కిల్స్ ఉంటాయి, కానీ యాంగిల్స్ ఎక్కువగా ఉండవు. అందువలన సర్కిల్స్ అని వాటికి పేరు
వచ్చిదనుకొంటాము. పైన మీరు చూచినవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకముల సర్కిల్స్ ఏర్పడినాయి. అందులో
కొన్నిటిని మాత్రము ఇక్కడ చూపాము. మీకు చూపిన బొమ్మలలో కొన్ని మూడు చంద్రవంకల ఆకారమూ, మూడు
గుండ్రని ఆకారములు కనపిస్తున్నవి. ఆ బొమ్మలలో మూడు సంఖ్య ఎక్కువ కనిపించడము వలన, మూడు ఆత్మలకు
సంబంధించిన వివరమని అర్థముకాగలదు. తర్వాత చంద్రవంక గుర్తులు కనిపించడము వలన జ్ఞాన సంబంధమైన
గుర్తులని తెలియుచున్నవి. అవి ఎట్లున్నా అందులో మూడు ఆత్మల జ్ఞానమునకు సంబంధించిన గుర్తులున్నవనియే
చెప్పవచ్చును. క్రాప్సర్కిల్స్ మేఘములు సృష్టించిన ఆకారములైనందున అవి ఏదో గొప్ప భావముతోనే ఉండునని
చెగ్పగలము. కానీ ఖచ్చితముగా ఫలానా భావము అని చెప్పలేము. పెన్ను తీసుకొని, పేపరు మీద మనం వేయలేని
ఆకారములను కూడా మైదానములో గోధుమగడ్డి మీద వేయడము ఆశ్చర్యకర విషయమే, అయినా మన విజ్ఞానులు
వాటి వివరమును చెప్పలేకపోవడము చోద్యమే.
బెర్ముడా ట్రయాంగిల్ విషయముగానీ, క్రాప్సర్కిల్ విషయముగానీ చెప్పలేక పోవుచున్నామంటే, ఇంతవరకు
మనము తెలుసుకొన్న సైన్సుకు చేతకాదనియే అర్థము. మనము సైన్సు రెండు రకములుగా చెప్పుకొన్నాము. ప్రపంచ
జ్ఞానమునకు సంబంధించిన సైన్సు, పరమాత్మ జ్ఞానమునకు సంబంధించిన సైన్సు అని రెండు రకములు ఉన్నాయి.
పరమాత్మ జ్ఞానమునకు సంబంధించిన సైన్సును సూపర్ సైన్సు అంటాము. ప్రజలకు ఇంతవరకు తెలిసినది సాధారణ
సైన్సు మాత్రమే, దానినే సామాన్యశాస్త్రము అంటున్నాము. ప్రజలకు ఇంతవరకు తెలిసిన సైన్సు ఆధారముతో, దైవశక్తికి
సంబంధించిన దానిని వివరముగా తెలుసుకొనుటకు వీలుపడదు. అందువలన దైవశక్తితో కూడుకొన్న ట్రయాంగిల్ను
గురించిగానీ, క్రాప్ సర్కిల్స్ను గురించిగానీ తెలుసుకోలేక పోయాము. సముద్రము మీదగల ట్రయాంగిల్ను గురించిగానీ,
భూమిమీద ఏర్పడిన క్రాప్సర్కిల్స్ను గురించి గానీ, తెలుసుకోవాలంటే సూపర్సైన్సును ఆధారము చేసుకోవాలి.
సూపర్ సైన్సు ఎక్కడుంది, మీరు క్రొత్తమాటను చెప్పుచున్నారే అని ఎవరైనా మమ్ములను అడిగితే, దానికి జవాబుగా
ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రములో పూర్తిగా సూపర్సైన్సు ఉన్నదని చెప్పుచున్నాము. సూపర్సైన్సు లోని సూత్రములను
తెలుసుకొంటే, దానికి తెలియని దైవ రహస్యమంటూ ఏదీ ఉండదు. మనుషులు సాధారణసైన్సును తెలుసుకొని
మేము మేధావుల మని అనుకొంటున్నారు. ప్రపంచ విషయములలో మేధావులైనా పరమాత్మ విషయములలో వారి
మేధస్సు పని చేయడములేదు. అందువలన బెర్ముడా ట్రయాంగిల్ను గురించిగానీ, క్రాప్సర్కిల్స్ను గురించి గానీ,
ప్లయింగ్ సాసర్స్ (ఎగిరే పల్లాలు)ను గురించిగానీ, ఏలియన్స్ (గ్రహాంతర వాసులు)ను గురించిగానీ తెలియలేకపోయారు.
సూపర్ సైన్సును తెలుసుకోగలిగితే, దైవమునకు సంబంధించిన వాటిని గురించీ, అభౌతిక శక్తులను గురించీ
తెలియవచ్చును. ఇపుడు మనము సైన్సును వదలి సూపర్ సైన్సును ఆధారము చేసుకొని ప్లయింగ్ సాసర్స్ను గురించీ,
అట్లే ఏలియన్స్ గురించి తెలుసుకొందాము.
ఎగిరే పళ్ళెములు అంటే ఏమిటి?
కొన్ని దేశాలలో ప్లయింగ్ సాసర్స్ను చూచామనీ, అవి తమ ప్రాంతములో ఆకాశమందు కనిపించాయనీ
చాలామంది చెప్పగా విన్నాము. ఇంకా కొంతమంది ఫ్లయింగ్ సాసర్స్ దిగడము చూచామనీ, అందులో నుండి
ఏలియన్స్ దిగినారని చెప్పుచుందురు. అలా వారు చెప్పుమాటలు నిజమేనా అని చూస్తే ప్లయింగ్ సాసర్స్కు,
ఏలియన్స్కు ఏమాత్రము సంబంధము లేదు. ఫ్లయింగ్ సాసర్స్వేరు, ఏలియన్స్ వేరని తెలియుచున్నది. ఫ్లయింగ్
సాసర్స్ ఉన్నమాట నిజమే, అలాగే ఏలియన్స్ మాట నిజమే. అయితే ఫ్లయింగ్ సాసర్స్లో ఏలియన్స్ వచ్చారన్నమాట
పూర్తి అసత్యము. ప్లయింగ్ సాసర్స్ అనేక దేశాలలో చూచి అవి గ్రహాంతరవాసుల (ఏలియన్స్) యొక్క వాహనాలు
అనుకోవడము జరిగినది. వాస్తవానికి అవి వాహనములు కావు. ఖగోళములో కొన్ని కోట్ల సంఖ్యలో చిన్నచిన్న
గ్రహములు కలవు. చిన్న గ్రహములు కూడా స్థూలముగా ఎట్లుండినా, ఏ ఆకారముతో ఉండినా సూక్ష్మముగా సజీవమైనవేనని
ముందే చెప్పుకొన్నాము. సజీవమైన చిన్న గ్రహములు కూడా దేవుని పాలనలో భాగస్వాములై ఉన్నాయని కూడా
చెప్పుకొన్నాము. అటువంటి స్వల్ప గ్రహములలో ఒకరకమైనవి ప్లయింగ్ సాసర్స్ అనునవి. ప్లయింగ్ సాసర్స్ (ఎగిరే
పళ్ళెములు) నిత్యమూ భూమి మీదకు వచ్చిపోతూవున్నవి. నిత్యమూ వచ్చి పోతున్నప్పటికీ బహు అరుదుగా మనుషులకు
కనిపించి ఉండవచ్చును. వాటి ఉనికి మానవులకు తెలియుట కొరకు అలా ఎప్పుడైనా కనిపించి ఉండవచ్చును.
మనుషులకు పునర్జన్మలు ఉన్నాయి, అయినా అవి ఎవరికీ తెలియవు. అవి ఉన్నాయని తెలియుటకు ఎక్కడో ఒకచోట,
ఎవరికో ఒకరికి పునర్జన్మ జ్ఞప్తి వచ్చుచున్నది. అలా పునర్జన్మ జ్ఞప్తి వచ్చినవాడు తన పూర్వ వృత్తాంతమును చెప్పుటయూ,
దానిని విచారించితే అంతా నిజమని తెలియుటయూ జరుగుచున్నది. అలా జరుగుట వలన మనకు పునర్జన్మలున్నాయను
టకు ఆధారము దొరుకుచున్నది. అదే విధముగా ఎన్నో సూక్ష్మ, స్థూల గ్రహములు ఖగోళములో ఉండినప్పటికీ, అవి
మనకు తెలియనివి ఎన్నో రకములున్నవి. తెలియనివి కూడా ఉన్నాయనుటకు ఆధారముగా ఎవనికో ఒకనికి పునర్జన్మ
జ్ఞాపకము వచ్చినట్లు, ఎప్పుడో ఒకప్పుడు ఫ్లయింగ్ సాసర్స్ కనిపించడమూ, ఏలియన్స్ కనిపించడమూ జరుగుచున్నది.
ప్లయింగ్ సాసర్స్ ఎంతో కాలమునుండి కనిపించుచున్నవని తెలియుచున్నది. ప్లయింగ్ సాసర్స్ గానీ, ఏలియన్స్ గానీ
ఎక్కువగా అమెరికా ఖండములోనే కనిపించడము విశేషము. బహుశా 1940వ సంవత్సరములో అనుకుంటాను,
అమెరికాలో ప్లయింగ్ సాసర్స్ను గురించిన ఒక సంఘటన జరిగింది. అదేమనగా! అంతకుముందు ఎన్నో మార్లు
ఎగిరేపళ్ళెములను చూచిన అమెరికావారు, అవి ఏమిటి? ఎక్కడినుండి వస్తున్నవి, వాటిలో ఎవరున్నారు? అను విషయములు
తెలుసుకోవాలనుకొన్నారు. అటువంటి సందర్భములో ఒకరోజు ఎగిరే పళ్ళెములు వారికి కనిపించాయి. వెంటనే
అమెరికా ఎయిర్పోర్సుకు సంబంధించిన నాలుగు యుద్ధవిమానాలు బయలుదేరి వాటిని వెంబడించాయి. ఎటు
తిరిగి వాటిని బలవంతముగా క్రిందికి దించడముగానీ, అట్లు వీలుగాని సమయములో కూల్చివేయడము గానీ
చేయవలెననునది యుద్ధవిమానాల ఉద్దేశము. ఆ ఉద్దేశముతో విమానములు ప్లయింగ్ సాసర్స్కు దగ్గరగా పోయాయి.
విమానములు పూర్తిగా వాటిని సమీపించినపుడు, ఆ ఫ్లయింగ్ సాసర్స్ నుండి నీలిరంగు గల పొగ బయటికి వచ్చింది.
ఆ పొగ తర్వాత అవి కనిపించకుండా పోయాయి. నీలిరంగు పొగవచ్చినపుడు, పొగ వాటిని కనిపించకుండా చేసింది.
పొగ తర్వాత అవి పూర్తిగా కనిపించకుండా పోయాయి. ఎంత ప్రయత్నము చేసినా ఫలితము లేకుండా పోయింది,
వాటి వివరము తెలియకుండా పోయింది. తర్వాత వాటిని గురించిన పూర్తి సమాచారము ఇంతవరకు దొరకలేదు.
కొందరు ప్లయింగ్ సాసర్ కూలిపోయిందని చెప్పినా అది అబద్దము. అట్లు కూలిపోవడము ఇంతవరకు ఎక్కడా
జరుగలేదు. ప్లయింగ్ సాసర్ ఒకయంత్రముగానీ, వాహనముగానీ కాదు. అది సజీవమైన చిన్నపాటి గ్రహము.
అందువలన అది కూలిపోవుటకు వీలులేదు. ఫ్లయింగ్ సాసర్ అనునది ఒక ఎగిరే పళ్ళెములాగ కనిపిస్తే దానిని ఒక
యంత్రము లాగా పోల్చుకోవడము పొరపాటు. ఆ గ్రహము యొక్క ఆకారము పళ్ళెములాగ ఉండడము వలన, దానిని
మనుషులు పొరపాటుగా ఒక వాహన యంత్రమనుకొన్నారు. ప్లయింగ్ సాసర్స్ అనబడు ఆ గ్రహములు, మానవుని
పాపములను అమలు జరుపడములో తనవంతు కార్యమును చేయుటకు, నిత్యము ఎన్నో భూమిమీదికి రావడము
జరుగుచున్నది. మానవుని ఒక రకమైన పాపమునకు తగినట్లు శిక్షను అమలు చేయుటకు ప్రత్యేకముగానున్న ఫ్లయింగ్
సాసర్స్ భూమిమీదికి నిత్యమూ అనేక చోట్లకు వస్తున్నవని ఎవరికీ తెలియదు. మనిషికి ఎంత మేధస్సు ఉండినా,
ఎంత హెూదా ఉండినా, ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా తన పాపపుణ్యములు తన మీద ఎట్లు అమలగుచున్నవో
ఎవరికీ తెలియదు. పాపము అమలగు విధానము కొంతకు కొంత తెలియాలంటే, అతను ఆధ్యాత్మిక విద్యలో ఆరి తేరి
ఉండాలి. ఆధ్యాత్మికము తెలియనివానికి, వానికే వాడు తెలియడు. వానికి వాడే ఏమిటో తెలియనపుడు, వాని కర్మను
గురించి వానికి అసలుకే తెలియదు. అటువంటపుడు కర్మ ఎలా వస్తున్నదో, పాపము ఎట్లు తనను చేరుచున్నదో,
చివరికది ఏ రూపములో, ఎవరి ద్వారా అమలుకు వస్తుందో తెలియదు. ఆ విధానములో ప్లయింగ్ సాసర్స్ మన పాప
పరిపాలకులలో భాగస్తులని కూడా తెలియదు.
గ్రహాంతర వాసులు ఉన్నారా?
గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉన్నారా? అను ప్రశ్నకు ఉన్నారనియే సమాధానము చెప్పుచున్నాము.
ఎగిరేపళ్ళెములు ఏ విధముగా భూమిమీద కనిపించినవో, గ్రహాంతర వాసులనబడు వారు కూడా ఆ విధముగనే
అక్కడక్కడ కనిపించినట్లు కొందరు చెప్పుచుండగా విన్నాము. ఇటువంటి విషయములన్నియూ ఎక్కువగా న్యూస్ పేపర్లలో
వస్తుంటాయి. న్యూస్ పేపర్లలో వచ్చిన సమాచారమును సేకరించి ఎగిరే పళ్ళెముల విషయమును వ్రాశాము. ఎగిరే
పళ్ళెముల విషయములో న్యూస్ పేపర్ల సమాచారము కొంతవరకే ఉండినా, మిగత సమాచారమును మేము చెప్పాము.
మీరు ఏ పరిశోధన చేసి చెప్పుచున్నారని మమ్ములను ఎవరైనా అడిగినా, మేము దానికి సమాధానముగా సూపర్
సైన్సును తెలుసుకొంటే ప్రపంచములో మేధావులు, శాస్త్రజ్ఞులు చెప్పలేని విషయములను చెప్పవచ్చు నని కూడా
తెలిపాము. ఇప్పుడు కూడా ఏలియన్స్ విషయములో ఫ్లయింగ్ సాసర్స్ను గురించి చెప్పిన విధానమునే అనుసరిస్తూ
చెప్పుచున్నాము. ఏలియన్స్ అనీ లేక గ్రహాంతరవాసులనీ చెప్పబడు వారు నిజముగా ఉన్నారని మేము కూడా అంటున్నాము.
ఇప్పుడు గ్రహాంతర వాసులు ఎవరు? అను విషయమును వివరించుకొని చూద్దాము. గ్రహాంతర వాసులని పేరుపెట్టి
ఎవరినైతే అంటున్నామో వారు నిజముగా గ్రహాంతర వాసులు కాదు. భూగోళము మీద కాకుండా వేరే గ్రహము మీద
నుండి వచ్చినవారనుకొని, ఏలియన్స్ను గ్రహాంతరవాసులని అంటున్నాము. వాస్తవానికి ఏలియన్స్ అనబడువారు
ఇతర గ్రహవాసులు కాదు. వారికంటూ ఏ గ్రహమూ ప్రత్యేకముగా లేదు. వారు భూమండలమును ఆశ్రయించుకొనే
ఉన్నారు. మనుషుల నివాసముగల భూమి మీదనే ఉన్నారు. కావున గ్రహాంతరవాసులు కాదు. ఒక విధముగా వారిని
గృహాంతర వాసులనియే చెప్పాలి.
ఏలియన్స్ అనబడువారు కూడా దేవుని పాలనలో పాత్రకల్గిన వారే. వారు అదృశ్యరూపములో అన్ని చోట్ల ఉ
న్నారు. ఇప్పుడు మేము చెప్పు విషయము సత్యమని నిరూపణకు వచ్చుటకే అన్నట్లు, వారు అదృశ్యులైనా కొందరికి
అక్కడక్కడ కనిపించి మేమున్నాము అని నిరూపించుకొన్నారు. ఇప్పటికి పదిరోజుల క్రితము నల్గొండ జిల్లాలో ఒక
యువకుడు రాత్రిపూట బహిర్భూమికి పోయినపుడు అతనికి వీధిలైట్ల వెలుగులో ఒక చెట్టు చాటునుండి తల ఆకారము
కనిపించింది. దాదాపు 15 అడుగుల ఎత్తున్న చెట్టుకొమ్మల చాటునుండి ప్రక్కకు తొంగి చూచినట్లు కనిపించిన
ఆకారమును గమనించిన ఆ యువకుడు, ధైర్యముగా తన సెల్ఫోన్లో ఆ దృశ్యమును వీడియో రికార్డింగ్ చేశాడు. ఆ
దృశ్యమును టీవీ ఛానల్స్లో కూడా ప్రసారము చేశారు. న్యూస్ పేపర్లలో కూడా ఆ విషయము వచ్చింది. సెల్ఫోన్లో
తీసిన దృశ్యములను చూస్తే దాదాపు చెట్టంత ఎత్తువుండిన ఆకారము, తన చేతులు నడుము వరకు చెట్టు చాటునుండి
బయటికి వచ్చి కనిపించినట్లు తెలియుచున్నది. అదొక నీడ దృశ్యమువలె ఉంటూ కనిపిస్తున్నా పూర్తి స్పష్టతలేదు. అది
పూర్తి స్థూల శరీరమువలె కాకుండా అదృశ్యరూపములోవుండి, నీటిమీద ఛాయలాగ ఉన్నట్లు కనిపించింది. ఎలా
కనిపించినా, ఎవరు చూచినా చూడకపోయినా ఏలియన్స్ అనువారు ఉన్నారు.
ఏలియన్స్ భూలోకవాసులే అయినా ఆ విషయము ప్రజలకు తెలియకపోవడము వలన వారిని
గ్రహాంతరవాసులన్నారు. ఏలియన్స్ గ్రహాంతరవాసులు కాదు భూలోక నివాసులే అని చెప్పుచున్నాము. భూలోకములో
వారు దేవుని పాలనయందు పాత్రధారులుగా ఉన్నారు. దీనినిబట్టి జీవరాసులను పాలించు వారిలో ఏలియన్స్ కూడ
ఒక కార్యమును నిర్వర్తించుచున్నారని తెలియుచున్నది. మా శోధనలో మాకు ఏలియన్స్ గురించి తెలిసిన విషయము
ఏమనగా! ఏలియన్స్ క్యాన్సర్ కణాలను మోసుకొని పోవు వాహనకారులుగా ఉన్నారు. వారు ప్రత్యేకముగా క్యాన్సర్
కణాలను వారియందు స్టోర్ చేసుకొని ఉన్నారు. ఏలియన్స్ కనిపించని అదృశ్యరూపులే అయినప్పటికీ వారు ఎక్కడో
ఒకచోట, ఎవరికో ఒకరికి కనిపించారు. ప్రత్యేకముగా క్యాన్సర్ కణాలను వారి శరీరములో నింపుకొని ఎక్కడికి
అవసరమైతే అక్కడికి పోవుచుందురు. పోయిన జన్మలో ప్రత్యేకమైన పాపము చేసుకొన్న వారి శరీరములోనికి క్యాన్సర్
కణాలను చేర్చడమే ఏలియన్స్కు ముఖ్యమైన పనిగా ఉంది. మానవుని ప్రతి కర్మ, సూర్యచంద్రాది ద్వాదశ గ్రహముల
చేతిలో ఉండును. గ్రహములు ఆ
గ్రహములు ఆ కర్మను తమ ఆధీనములో పనిచేయు అనేక గ్రహములకు, ఉపగ్రహములకు,
భూతము లకు, ఉపభూతములకు ఇచ్చి వారిచేత ప్రజలు పాపపుణ్యములను అనుభ వించునట్లు చేయుచుందురు. దైవ
పాలనలోని సూర్యచంద్రాది గ్రహముల క్రింద పని చేయు వారిలో ఏలియన్స్ కూడా ఉన్నారు. ఏలియన్స్ అనువారు
మనుషులు చేసుకొన్న పాపమునుబట్టి క్యాన్సర్ రోగమును అనుభవించ వలసిన వారికి, తమవద్దనున్న క్యాన్సర్ కణాలను
అంటించుచుందురు. ఒక మనిషికి క్యాన్సర్ వచ్చిందంటే అది ఏలియన్స్నుండే వచ్చిందని ఖచ్చితముగా చెప్పవచ్చును.
అంత ఖచ్చితముగా చెప్పుటకు కారణము ప్రపంచములో క్యాన్సర్ కణములు ఏలియన్స్ వద్ద తప్ప ఎవరివద్దా లేవు.
మనిషిగా పుట్టినవాడు ఒక రకము కాకుండా అనేక రకముల పాపమును చేసివుంటాడు కదా! అటువంటపుడు
ఏ రకమైన పాపము చేసినవారికి క్యాన్సర్ రోగము వచ్చుననీ, ఏ పాపమున్న వానికి ఏలియన్స్ క్యాన్సర్ కణాలను
ఇస్తారనీ ఇక్కడ కొందరు అడుగవచ్చును. ఆ ప్రశ్నకు జవాబును ఏలియన్స్నే అడిగితే వారిలా చెప్పగలరు. వారి
మనో భావమును తెలుసుకోగల్గితే తెలియబడు విషయము మేము చెప్పుచున్నాము. భూమిమీద ఎవరైనా కానీ కొంత
అధికారము కల్గినవాడు, ఎదుటి మనిషి తప్పు చేయలేదని తెలిసీ, తన అధికారముచేత పాపము వస్తుందనే ధ్యాసగానీ,
పాపము యొక్క భయముగానీ లేనివాడై, ఒక నిర్దోషిని దోషిగా చూపించినా, లేక నిర్దోషిని దోషిగా వర్ణించినా,
అటువంటి వానికి వచ్చు ప్రత్యేకమైన పాపమును అనుభవింపజేయుటకు, కుజగ్రహము యొక్క అనుమతితో ఏలియన్స్
క్యాన్సర్ కణములను వానికి చేర్చుచున్నారు. తనకున్న అధికారము చేత తనకు చేతనగునని, ఒక నిర్దోషిని దోషిగా
ఆరోపిస్తే, ఆ ఆరోపణ ఫలితముగా వచ్చు పాపము ఆ అధికారిలో తెలియకుండానే చేరిపోవుచున్నది. ఆ పాపము
ద్వాదశ గ్రహములైన సూర్యచంద్రాది గ్రహములలో కుజగ్రహము యొక్క విభాగములో చేరిపోవును. తర్వాత జన్మలో
కుజగ్రహము ఆ పాపమును అనుభవింపజేయుటకు, దేవుని పాలనలోని ఏలియన్స్కు అనుమతిచ్చును. కుజగ్రహము
తన ఆధీనములోని పాపమును గురించి, ఆ పాపఫలితము క్యాన్సర్ రోగమేనని తెలుపగా, కుజగ్రహ ఆదేశమును
తీసుకొన్న ఏలియన్స్ తమ శరీరములో నిలువయున్న క్యాన్సర్ కణాలను, గత జన్మలో అధికారిగా వుండి తప్పుడు
ఆరోపణ చేసిన వానికి చేర్చడము వలన, వానికి అప్పటి నుండి క్యాన్సర్ ప్రారంభమగును. ఈ విధముగా ఒక్క
క్యాన్సర్ రోగమును వ్యాపింపజేయు నిమిత్తమే ఏలియన్స్ ఉన్నాయని తెల్పుచున్నాము. ప్లయింగ్ సాసర్స్ కూడా
జీవచైతన్యమున్న గ్రహములేగానీ వేరుకాదనీ, అవి కూడా మానవుడు సంపాదించుకొన్న ఒకరకమైన పాపమును
అనుభవింపజేయుటకే ఉన్నవని కూడా తెలుసుకొన్నాము.
అధికారముండినపుడు తప్పు చేయకున్ననూ, మంచివానిని కూడా నేరస్థునిగా, ముద్దాయిగా చిత్రించి చూపడము
మిగత శాఖలలోని అధికారులకంటే ఎక్కువగ పోలీస్ శాఖలోని ఇన్స్పెక్టర్లకు, సబన్ఇన్స్పెక్టర్లకు మరి కొంతమందికి
మాత్రమే ఉంటుంది. అందువలన వారు ఏమాత్రము పాపభీతి లేకుండా చేసుకొన్న పాపము, తర్వాత జన్మలో క్యాన్సర్
రోగమై పీడించునని తెలియుచున్నది. ఇప్పుడు ప్రస్తుత కాలములో క్యాన్సర్ రోగము గలవారందరు పోయిన జన్మలో
అధికారమదము తలకెక్కి, ఎదుటివాడు తప్పుచేయలేదని తెలిసినప్పటికీ మంచి వానిని కూడా నేరస్థునిగా, ముద్దాయిగా,
చెడ్డవానిగా చిత్రించినవారైవుందురని అర్థమగుచున్నది. క్యాన్సర్ రోగము ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలిసింది కదా!
ఇప్పుడైనా పాపము రాబోవు జన్మలో భయంకరమైన శిక్షవేస్తుందని తెలిసి, తమ అధికారమును దుర్వినియోగము
చేసుకోకుండా, పాపమును మూట కట్టుకోకుండా ఉండవలెనని, ఇప్పుడు అధికారులుగానున్న వారికి తెల్పుచున్నాము.
ఇప్పటికీ పాపమంటే భయము లేని వారిని కనిపించని ఎన్నో గ్రహములు, అనేక విధముల బాధించుటకు పీడించుటకు
సన్నద్ధమై ఉన్నాయి. అవి పంచ మహాభూతముల నుండి, ద్వాదశ గ్రహములనుండి ఆజ్ఞ పొందినవై భూకంపములనూ,
సునామీలను సృష్టించి బాధించగలవు. అందువలన ఇప్పటికైనా దైవజ్ఞానము కల్గి, పాపమునుండి బయటపడు మార్గమును
తెలుసుకొందాము.
భూకంపాలు - సునామీలు ఎందుకొస్తున్నాయి?
ఒక రాజ్యముంటే దానికి రాజధాని ఉంటుంది. అలాగే భూ గోళములో మాత్రము దేవుని పాలనకు రాజధాని,
దైవశక్తితో కూడుకొని వున్న “బెర్ముడా ట్రయాంగిల్” అనియే చెప్పవచ్చును. దేవుని పాలన అని మనము
చెప్పుకొనుచున్నప్పటికీ, స్వయముగా దేవుడు పాలించునది కాదు. దేవుని చేత అప్పగించబడిన అధికారముతో,
ప్రకృతియే పాలించు దానిని దేవుని పాలన అని అంటున్నాము తప్ప నిజముగా దేవుని పాలన కాదు, ప్రకృతి పాలనయేనని
చెప్పవచ్చును. ప్రకృతిలోనున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచ మహాభూతములు దేవుని ఆజ్ఞకు
లోబడి, సృష్ఠి ఆదినుండి జీవరాసులు పాపపుణ్యములను పాలించుచున్నవి. ప్రకృతి అనబడు పంచ మహాభూతముల
క్రింద భూతములు, ఉపభూతములు, గ్రహాములు, ఉపగ్రహములు మరియు ప్రకృతికి సంబంధించినవి ఎన్నో పని
చేయుచున్నవి. అటువంటి ఉపగ్రహములలో ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ అనునవి కూడా ఉన్నవి. సృష్టి ఆదిలో
దేవుడు నిర్మించిన పాలనను ప్రకృతి శ్రద్ధగా పాలించుచున్ననూ, దానిని మనము దేవుని పాలన అని చెప్పుకొను
చుండిననూ, ప్రత్యక్షముగా దేవుడు ఏమీ చేయడము లేదు. అంతా ప్రకృతియే చేయుచున్నది. జీవరాసులూ, మానవులూ
చేసుకొన్న పాపమును అమలు చేయుటకు తగిన ఏర్పాట్లతో నిర్మింపబడిన విధానమును, దేవుని పాలన అంటున్నాము.
అన్నిటికీ పెద్ద దేవుడైనా పాలనను సాగించునది ప్రకృతి అనియే తెలుసుకొన్నాము. దేవుని పాలనను గురించి ఇంతవరకు
ఎవరికీ తెలియదు. దేవుని పాలనలో ఎవరెవరు పాత్ర వహిస్తున్నారనిగానీ, ఎవరిది ముఖ్యపాత్ర అనిగానీ, అందులో
చిన్నవారు ఎవరు, పెద్దవారు ఎవరు అనిగానీ మనుషులకు ఇంతవరకు తెలియదు. పాలించువారు ఎవరో తెలియనపుడు,
వారి పాలన ఎట్లుంటుందో కూడా తెలియదు. ఈ విషయములను కొన్నింటిని మా రచనలలోని “దయ్యాల-భూతాల
యదార్థ సంఘటనలు" అను గ్రంథములో వివరించి చెప్పాము. అందులో దేవుని పాలన చాలా నిష్పక్షపాతముగా
ఉంటుందని చెప్పడమే కాక, చాలా కఠినముగా ఉంటుందని కూడా చెప్పాము.
కర్మ పాలన ఏ విధముగా ప్రకృతిలోని అనేక భాగములచేత చేయబడుచున్నదో అర్థమగుటకు, ఏలియన్స్
అను చిన్న గ్రహములు ఒక విధమైన పాపమును మాత్రమే అమలు చేయుటకు ఉన్నాయని చెప్పుకొన్నాము. ఒక
రకమైన పాపమును అమలు చేయుటకు ఒకరు ఉండగా, అనేక రకమైన పాపములను అమలు పరచుటకు అనేకమైన
తెగలుగానున్న గ్రహములు, ఉపగ్రహములు, భూతములు, ఉపభూతములు బాధ్యతగా పని చేయుచుండును. మనుషులు
ఏమాత్రము పాపము అను దానిమీద ధ్యాస లేకుండా, ఎవరైనా పెద్దలు గుర్తుచేసినా దానిని గురించి ఏమాత్రము
యోచించకుండా, తమది తప్పని తెలిసినప్పటికీ, తమను తాము సమర్థించు కొని పాపములను సులభముగా
చేయుచున్నారు. అలా చేసిన చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా శరీరములోనే లెక్కించి వ్రాయబడుచున్నదనీ, దానిని
అనుభవింప చేయుటకు ఒక పెద్ద యంత్రాంగమే ఉన్నదనీ మనిషికి తెలియదు. కొన్ని పాపములను ఉపగ్రహములూ,
కొన్ని పాపములను గ్రహములూ, కొన్ని పాపములను భూతములూ, కొన్ని పాపములను ఉప భూతములూ, మరికొన్ని
పాపములను మహాభూతములు లెక్కప్రకారము విభజించుకొని అమలుచేసి మనిషి చేత అనుభవింపజేయుచున్నవి.
మహా భూతములు ఐదుకాగా, భూతములు లెక్కలేనన్ని ఉన్నవి. అలాగే ఉప భూతములు కొన్ని కోట్లలో ఉన్నవి. మన
భూగోళమునకు మహా గ్రహములు పండ్రెండు ఉండగా గ్రహములూ, ఉపగ్రహములు ఎన్నో కోట్లలో ఉన్నాయి. ఒక్క
మనిషి వెనుక కనిపించని ఎన్నో కన్నులు పొంచి చూస్తున్నవి. ఎన్నో శక్తులు అతని పాపమును అమలు చేయుటకు
సిద్ధముగా ఉన్నవి. ఉపగ్రహములను వాటిలోనే ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ మరియు ఎన్నో రకములు ఉండగా,
ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పాపమును అమలు చేయుటకు నియమింపబడి ఉన్నవి.
మనిషి చేసుకొన్న ఎన్నో రకముల పాపములు, ఎన్నో రోగముల రూపములలో మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు.
ఒక రోగము వచ్చింది అంటే దానివెనుక ఒక గ్రహమో, ఒక భూతమో పని చేసివుంటుంది. పైకి కనిపించునది
మాత్రమే మనిషికి తెలియుచున్నది, కానీ దానివెనుక కనిపించనిది మనిషికి తెలియదు. మనిషి మనిషికీ వేరువేరుగా
అమలు చేయబడు పాపములను, వేరువేరు శక్తులు అమలు చేయుచున్నవి. ఒక సమయములో ఒక్కరే కర్మను
అనుభవిస్తుంటారు. ప్రక్కవారు ఏమాత్రము అనుభవించరు. ఉదాహరణకు పదిమంది ఉన్నచోట ఒక్కనికి కడుపు
నొప్పి వచ్చినపుడు వాడు మాత్రమే అనుభవించుచున్నాడు. ప్రక్కవాడు ఏమాత్రము అనుభవించడములేదు. ఒక్కొక్క
సమయములో పదిమంది ఒకేమారు, ఒకే కర్మను అనుభవించడము కూడా జరుగుచుండును. ఉదాహరణకు ఒక
వాహనములో పదిమంది ప్రయాణము చేయుచున్నపుడు ఆ వాహనము ప్రమాదమునకు గురియైతే, ఆ వాహనములోని
పదిమందికి దెబ్బలు తగలడము జరుగుచున్నది. అప్పుడు అక్కడున్న పదిమంది సామూహికముగా కర్మను అనుభవిస్తున్నారు.
అదేవిధముగా ఒక్కొక్కప్పుడు ఒక ఊరంతయూ, ఒక్కొక్కప్పుడు ఒక ప్రాంతమంతయూ, ఒక్కొక్కప్పుడు ఒక
రాష్ట్రమంతయూ, ఒక్కొక్కప్పుడు ఒక దేశమంతయూ కర్మను అనుభవించ వలసివస్తున్నది. అలాంటి వేరువేరు
సందర్భములలో వేరువేరు గ్రహములూ, వేరువేరు భూతములూ పని చేయుచున్నవి.
నేను ఈ సమాచారమును వ్రాయుటకు పైన "భూకంపములు, సునామీలు ఎలా వస్తున్నవి” అని హెడ్డింగ్ పెట్టి
వ్రాయుటకు పూను కొన్నాము. శుక్రవారము 11-03-2011 తేదీన సరిగా మధ్యాహ్నము 12 గంటల సమయములో
మా అబ్బాయి ఫోన్ చేసి టీవీ చూడండి, అందులో జపాన్ దేశము భూకంపమునకు, సునామీకి గురి అయిందని
చూపుచున్నారని చెప్పాడు. అప్పుడు టీవీ ఆన్చేసి చూస్తే నేను వ్రాయదలచుకొన్నది కంటికి ప్రత్యక్షముగా కనిపిస్తున్నది.
అంతకు ముందురోజు బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాను గ్లోబ్ మీద ప్రక్కవారికి చూపించి, దీనికి ఎదురుగానున్న క్రింది
ఇండోనేషియా నుండి పైన జపాన్ వరకుగల ప్రాంతములో ఉపద్రవము జరిగే అవకాశమున్నదని చెప్పుకొన్నాము.
బెర్ముడాట్రయాంగిల్లోని శక్తి మనుషుల మీద కోపముగా ఉన్నది. దాని చూపు భూగర్భము లోపలినుండి వచ్చి
దానికి ఎదురుగానున్న ప్రాంతము మీద పడుతుంది. అందువలన ఎప్పుడో ఒకప్పుడు, దానికి ఎదురుగానున్న ప్రాంతములో
మహాభూతములు చెలరేగి మనుషులను హింసిస్తాయని చెప్పడము జరిగినది. మేము ఆ విధముగా చెప్పిన రెండవరోజే
జపాన్ ప్రాంతము మీద ఆ శక్తి కోపము పని చేస్తుందని ఏమాత్రము ఊహించలేదు. మేము టీవీ చూస్తున్నట్లే
ముందురోజు బెర్ముడాట్రయాంగిల్ను గురించి చెప్పినపుడు వినిన మనిషి వచ్చి, మీరు చెప్పినది ఈ రోజే జరిగింది అని
మాతో చెప్పడము జరిగింది. వాస్తవానికి ఈ విధముగా జరుగబోతుంది అనుకొన్నాము. కానీ అనుకొన్న మరుసటి
దినమే జరుగడము మాకు పెద్ద విచిత్రముగా తోచింది.
“త్రైతాకార రహస్యము” అను పేరుతో వ్రాయబడు గ్రంథము గురించి నావద్ద జ్ఞానమును తెలుసుకొను మనుషులు
అడిగినపుడు, దానిని గురించి చెప్పుచూ అందులో ఎక్కువగా బెర్ముడాట్రయాంగిల్ గురించి వ్రాయడము ఉంటుందని
చెప్పాము. బెర్ముడాట్రయాంగిల్ ఎక్కుడున్నదో అర్ధమగుటకు, భూగోళ చిత్రమున్న గ్లోబ్ను తీసుకొని, అట్లాంటిక్
సముద్రములో అమెరికాకు ప్రక్కనవున్న ట్రయాంగిల్ను గురించి చూపుతూ బెర్ముడా అను చిన్న దీవికి మిక్కిలి సమీపముగా
ఉండుట వలన, ఆ ప్రాంతమును గుర్తింపు కొరకు బెర్ముడా ట్రయాంగిల్ అనడము జరిగినదనీ, అక్కడ జరుగు ప్రమాదములు
అర్థము కానివారు అక్కడేదో దయ్యమున్నదని దానిని “డెవిల్ యాంగిల్” అనికూడా అన్నారనీ చెప్పాము. తెలియనివారు
అలా అనినా, అక్కడ దయ్యము లేదనీ, దైవశక్తి ఉందనీ, ఆ శక్తియే అక్కడ జరిగే పనులకు కారణమని చెప్పాము.
అంతేకాక మనుషులలో అజ్ఞానము ఎక్కువయ్యేకొద్దీ, ఆ దైవశక్తికి మనుషుల మీద విసుగువస్తున్నదనీ, దానివలన ఆ
యాంగిల్కు ఎదురుగా గల భూభాగములోవున్న ఇండోనేషియాలో ఒకమారు సునామీ వచ్చిందనీ, అయినా మనుషులలో
మార్పురాలేదనీ, అజ్ఞానము పెరిగిపోతూ జ్ఞానమునకు విలువనివ్వకుండా పోతున్నారని, అందువలన ట్రయాంగిల్
వలన మరొకమారు ప్రమాదము ఏర్పడవచ్చునని వివరించాము. అయితే అది మరుసటి రోజే జరిగింది.
ఇప్పుడు తాజాగా జరిగిన జపాన్ విధ్వంసము తర్వాత కొన్ని గంటలకే భూకంపముల గురించి, సునామీలను
గురించి వ్రాయుచున్నాము. ఈ విధముగ సామూహికముగా ఒక దేశ ప్రజలు హింసింపబడవలసి వచ్చినపుడు,
అందరి పాపములను ఒకే కట్టకట్టి, ఒకేమారు అమలు చేసి అనుభవింపజేయవలసి వచ్చినపుడు చిన్న గ్రహములుకాక,
చిన్న భూతములుకాక, పెద్ద భూతలములశక్తియే పని చేయునని తెలియుచున్నది. ప్రకృతిలో మహాభూతములు ఐదు
గలవు. అందులో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవి మహా భూతములుగా ఉన్నవి. గాలి, అగ్ని అను
రెండు ఏకమై ఒక్కొక్కప్పుడు చెలరేగి ప్రజలను భయంకరముగా బాధించి చంపగలవు. ఒక్కొక్కప్పుడు గాలి, నీరు
చెలరేగడము వలన కూడా కొన్ని ప్రాంతములు సామూహికముగా నరకమును అనుభవించును. అలాగే ఒక్కొక్కప్పుడు
నీరు, భూమి చెలరేగుట వలన కూడా ఇప్పుడు జపాన్లో ఏర్పడినట్లు భూకంపములు, సునామీలు వచ్చి ప్రజల
పాపములను అందరూ ఒకేమారు అనుభవించునట్లు చేయును. ఒక్కొక్కప్పుడు భూమి ఒక్కటే విజృంభించుట వలన
భూమి కంపించి ఇళ్ళు కూలిపోయి ఎంతో మందికి ప్రాణనష్టము జరుగును. ప్రకృతిలోని ఏ ఒక్క భాగము చెలరేగినా
దానిధాటికి మానవుడు నిలువలేడు. ప్రతి నలుగురిలో ఒకరు మేధావులుగా నున్న జపాన్ దేశము వారి మేధాశక్తి,
ప్రకృతి శక్తి ముందర ఏమాత్రము పని చేయలేదు. ప్రకృతిలోని ఏ ఒక్క భాగము విజృంభించినా ప్రజలలో విధ్వంసము
జరిగిపోవును. తల్లి ముందర కూతురు "అమ్మా! నన్ను కాపాడు" అని అరుస్తూవుండినా, తల్లి పిల్లను కాపాడలేదు, పిల్ల
తల్లినీ కాపాడలేదు. ఒక ఇంటిలోని వారు, ఒక కుటుంబములోని వారు జరుగుచున్న ప్రకృతి భీభత్సములో ఒకరినొకరు
కాపాడుకోలేక, ఒకరి ఆర్తనాదములు మరియొకరు వింటూ నిస్సాహాయులై చనిపోవలసిందే. దీనికంతటికీ కారణము
మనుషులు చేసుకొన్న పాపమే!
భూమిమీద అట్లాంటిక్ సముద్రములోనున్న బెర్ముడా ట్రయాంగిల్ శక్తి ముందు ఇందూ మహాసముద్రములో
ఉండేది. అదియే రావణబ్రహ్మగా జన్మ తీసుకొన్నదని కూడా చెప్పాము. ఆ దినము మానవునికి మంచి మార్గమును
చూపుటకూ, ఆధ్యాత్మికవిద్యలో ఆసక్తిని కల్పించుటకూ, జ్ఞాన యోగముల నమూనా చూపుటకూ రావణబ్రహ్మ పుట్టాడు.
ఆయన బ్రహ్మవిద్యకే తార్కాణముగా నిలిచిచూపినా, చివరకు మనిషి రావణబ్రహ్మను కూడా చెడుగా చిత్రించి
చెప్పుకోవడమూ, పాపములను చేయుటయందే మునిగి పోవడమూ జరిగినది. మనిషి త్రేతాయుగము నుండి కలియుగము
వరకు రానురాను అజ్ఞానిగా మారిపోయి, ఆధ్యాత్మిక విద్యను ఏమాత్రము గుర్తించక, ఆ విద్య నేర్చుకొన్న యోగులను
కూడా హేళనగా మాట్లాడు చున్నాడు. అన్నిటికీ శక్తినిచ్చు దైవశక్తికంటే తన మేధాశక్తే గొప్పదనుకొని, ఏ కోణములో
గానీ దైవము మీద విధేయత లేని మనుషులుగా మారడమును త్రైతాకారశక్తి, ఓర్చుకోలేక పోవుచున్నది. అందువలన
ప్రకృతిలోని భూతములకు, గ్రహములకు, ఉపగ్రహములకు, ఉపభూతములకు కేంద్రమై యున్న త్రైతాకారశక్తి మానవులకు
దైవశక్తి యొక్క బలమేమిటో చూపించాలనుకొన్నది. అందువలన వికృతినామ సంవత్సరము నుండి గ్రహముల చేత,
భూతముల చేత మనుషులలో విధ్వంసము సృష్టించాలను కొన్నది. క్రీ॥శ॥ 2010వ సంవత్సరము నుండి (వికృతినామ
సంవత్సరము నుండి) ఎండా, వానా, చలీ, గాలీ అన్నీ ఎక్కువగుటయేకాక, భూకంప ములూ, తుఫానులూ, సునామీలూ,
అగ్నిపర్వత ప్రేలుళ్ళు అన్నీ ఎక్కువ గుటకు అవకాశమున్నదని గత సంవత్సరమే చెప్పుకొన్నాము. భూమిమీద అన్ని
ఉపద్రవములు ఎక్కువై మనుషులు నాశనమగుటకు అవకాశము కలదని, రాబోవు విపత్తును గమనించి, లోకానికి
భవిష్యత్తు చెప్పి కాలజ్ఞానమును వ్రాసిన బ్రహ్మముగారి రాతిప్రతిమ నుండి కన్నీరు కారింది. అనంతపురము జిల్లా,
ధర్మవరములో బ్రహ్మంగారి ప్రతిమకు ఒకరోజంతా నీరు కారడము చాలామంది చూచారు. కానీ ఎందుకు అలా
జరుగుచున్నదో చూచిన వారికి ఎవరికీ తెలియదు.
ఇందూ మహాసముద్రములోనున్నశక్తి ఇప్పుడు కొన్ని సంవత్సరముల నుండి బెర్ముడా దీవివద్దకు పోయింది.
ఇందూ మహాసముద్రములోనున్న శక్తి దక్షిణ భారతదేశములో దైవజ్ఞానమును స్థాపించి ఇందూ ధర్మములను
తెలియజేయునట్లు దేవాలయములను కూడా సృష్టించింది. అందువలన ప్రపంచములోనే ఎక్కడాలేని దైవధర్మములను
తెలియజేయు దేవాలయములు దక్షిణ భారతదేశమున కలవు. అంతేకాక మొత్తము ప్రపంచములోనే దైవ జ్ఞానము
తెలియక అధర్మములను ఆచరించువారు తయారైనా, ఒకే ఒక భారతదేశములో అదియు దక్షిణ భారతదేశములోనే
ధర్మములు సజీవముగా వుండి తిరిగి పునరుద్ధరింపబడుటకు అవకాశము గలదు. అలా జరుగుటకు, దక్షిణ భారతదేశములో
ధర్మములు మిగిలి ఉండుటకు కారణము బెర్ముడా ట్రయాంగిల్లోనున్న దైవశక్తి యొక్క చూపు, దక్షిణ భారతదేశము
మీద ఉండడమేనని చెప్పవచ్చును. దైవమునకు వ్యతిరేఖులైన వారిని తన భూతముల చేత, గ్రహముల చేత తర్వాత
జన్మలలో నరకములను అనుభవింపజేయుచున్నది. ఈ దినము సునామీలూ, భూకంపములు ఒక ప్రణాళిక ప్రకారమే
జరుగుచున్నవి. ప్రమాదము వచ్చినపుడు దేవున్ని వేడుకొనినా, ఆయన పాలనలోనివారు ఏమాత్రము వదలరు.
దేవుడు ఆపద మ్రొక్కులవాడు కాదు. ఒకవేళ సునామీ వచ్చినపుడో, భూకంపము వచ్చినపుడో దేవున్ని వేడుకొనినా,
దేవుడు తన పరివారమైన మహాభూతములనే సమర్థించును కానీ ఆపదలో మ్రొక్కే అజ్ఞానులను సమర్థించడు. మనుషులు
చేసిన ప్రతి పాపము, ప్రతి తప్పును మరచిపోని గ్రహములు గానీ, భూతములుగానీ వాని తప్పును గుర్తుచేసుకొని
వానిని బాధింతురు.
1950 నుండి మనుషులు విజ్ఞానములో అభివృద్ధి అగుచూ అజ్ఞానములోనికి దిగజారిపోయారు. దైవజ్ఞానము
మీద ఏమాత్రము ధ్యాస లేకుండాపోయినది. అంతేకాక కొందరు దేవాలయములను ఆధాయ కేంద్రములుగా
మార్చుకొన్నారు. కొందరు మత ఛాందసవాదులై జ్ఞానులనే అవమానిస్తున్నారు. అటువంటి వానికి మేము చెప్పు
దైవజ్ఞానము కూడా అర్థముకాక, మమ్ములను కూడా నిందించు స్థితికి వచ్చారు. మేము జ్ఞానము అను అర్థముతో
“ఇందూ” అను పదమును చెప్పితే, చెప్పినది అర్థము చేసుకోలేక, ఆ పదమును మార్చమని మమ్ములనే బెదిరించు
స్థాయికి మత ఛాందసవాదులు తయారైనారు. ఒకరకముగా కాకుండా అన్ని రకములా మానవుడు అజ్ఞానములో
కూరుకుపోయి, దైవమునే ధిక్కరించు స్థాయికి వచ్చాడు. అందువలన దైవము తన పరిపాలనలోని సైనికులైన
మహాభూతముల ద్వారా భూకంపములు, సునామీలను సృష్టించి మనిషిని శిక్షించుచున్నాడు. ఇంత జరుగుచుండినా
తన తెలివిని దైవజ్ఞానమును పరిశోధించుటకు ఉపయోగించి అసలు కారణమును తెలుసుకోలేక, ప్రపంచ జ్ఞానములోనే
ఉంచి, ప్రపంచ జ్ఞానపు పరిశోధనలే చేసి సునామీలు, భూకంపములు ఇలా వస్తున్నవని వివరమును చెప్పుచున్నాడు,
కానీ ఎందుకు వస్తున్నవో తెలుసుకోలేక పోవుచున్నాడు. వచ్చినదానికి వివరమును చెప్పు వాడు దానికి కారణమును
చెప్పలేక పోవుచున్నప్పటికీ, చెప్పిన వివరము కూడా సరిగాలేదని గమనించలేకపోవుచున్నాడు. వచ్చిన దానికి వివరమును
చెప్పాలనినా, అలాగే వచ్చిన దానికి కారణమును చెప్పాలనినా, అతడు ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమును
తెలిసివుండాలి. బ్రహ్మవిద్యా శాస్త్రము తెలియనివానికి స్థూలమే కనిపిస్తుంది, కానీ దానివెనుక ఉండే సూక్ష్మమైన శక్తి
కనిపించదు. అందువలన ఆరవశాస్త్రమును తెలియని వారు సునామీకిగానీ, భూకంపమునకుగానీ, ప్రకృతి వైపరీత్యమునకు
గానీ, ఏ దానికిగానీ వివరమును చెప్పలేరు, కారణమునూ చెప్పలేరు.
భూకంపము వచ్చినపుడు ఆ సమయములో వీడియో తీసిన వారున్నారు. ఆ వీడియో చిత్రములను చూస్తే
కనిపించే దృశ్యములు మనలను కొంత ఆలోచింపజేసే విషయములుగా ఉంటాయి. మార్చి 11,2011వ తేదీన
జపాన్లో భూకంపము వచ్చినపుడు, ఒక ఆఫీస్లో ఆ సమయానికి వీడియో కెమెరా ఆన్లో ఉండడము వలన అక్కడి
దృశ్యము లను చూడగలిగాము. అక్కడ టేబుల్స్ మీద కంప్యూటర్లు కదలడమూ, మిగతా సామాన్లు కదలడము
కనిపిస్తున్నది. టేబుల్ మీద కంప్యూటర్ ముందుకు వెనకకు కదలుచు చివరికి క్రింద పడిపోయింది. అది కదలిన
దానినిబట్టి ఆ భవనము కూడా ముందుకు, వెనకకు ఊగుచున్నదని అర్థమగుచున్నది. మార్చి 11,2011వ తేదీ
జరిగిన జపాన్ సంఘటనలోనే కాక, చాలాచోట్ల జరిగిన భూకంపములలో ఇళ్ళలో కదలిన వస్తువులను చూస్తే అవి
ముందుకు, వెనకకు ఊగినట్లు తెలియుచున్నది. అట్లు ఆ వస్తువులు ఊగడమును చూస్తే భూమి రెండు ప్రక్కలకు
అల్లాడినపుడే అలా జరుగవచ్చును. అయితే భూకంప పరిశోధకులు వెల్లడించు సమాచారము ప్రకారము, భూమిలో
కదలికలు వచ్చినపుడు ఆ కదలికయే పై వరకు వచ్చి భూమి కదలుచున్నది. అట్లు భూమి కదలడమునే భూకంపములు
అంటున్నాము అని తెల్పుచున్నారు. భూమిలో కదలికలు ఎందుకు వస్తున్నవి అని అడిగితే దానికి జవాబుగా, భూమిలో
ఎక్కడైనా ఖాళీ ఆ ప్రదేశముండి అది కూలిపోయినపుడు గానీ, అట్లు లేకపోతే భూమిలో రాతిగుండ్ల మధ్యలో ఖాళీ
ఉన్నపుడు ఆ రాతిగుండ్లు ఖాళీ ప్రదేశములోనికి తొసగి పోయినపుడు (కదలిపోయినపుడు) గానీ ఏర్పడు కదలిక
చివరికి భూమి మీదికి రావడమును భూకంపము అంటున్నామని చెప్పుచున్నారు. అంతేకాక కొందరు మిగతా
కారణములను కూడా చెప్పుచున్నారు. వారు చెప్పునది సత్యమే అయినప్పటికీ, వారు చెప్పు కదలికలు భూమిమీద
వేరు విధముగా ఉండాలి. ముందుకు వెనుకకు అల్లాడించినట్లు ఉండకూడదు. భూమి యందు ఎంతో లోతులో
జరిగిన కదలిక భూమిపైకి వచ్చేటప్పటికి ఆ కదలిక వేగము తగ్గిపోవాలి. భూమిలోతుల్లో జరిగిన కదలిక బయటికి
వచ్చేటప్పటికి ప్రక్క భూమి వత్తిడి వలన కదలిక శక్తి, కదలిక వేగము తగ్గిపోతూరావాలి. ఒకవేళ ఆ కదలిక పై
వరకూ వచ్చినా అది ఏదో ఒక ప్రక్కకు మాత్రమే ఉండాలి, కానీ రెండు ప్రక్కల ఉండడము వలన కొంత ఆలోచించవలసి
వస్తున్నది. పరిశోధకులు చెప్పుమాట నిజమేనా అని ప్రశ్నార్థకమగుచున్నది.
భూకంపము వస్తున్నది వాస్తవమే, భవనములు ముందుకు వెనుకకు కదలుచున్నదీ నిజమే. అయితే పరిశోధకులు
చెప్పుమాట ప్రకారము జరుగుచున్నదా? లేక వేరు విధముగా జరుగుచున్నదా? అను ప్రశ్నలు మిగిలిపోవుచున్నవి.
అంతేకాక మరియొక ప్రశ్న కూడా ఈ విధముగా ఉన్నది. భూమిపుట్టి ఎన్నో కోట్ల సంవత్సరములైనది కదా! అప్పటినుండి
ఇప్పటివరకు భూకంపములు వస్తూనే ఉన్నవికదా! భవిష్యత్తులో కూడా భూకంపములు రావని చెప్పలేము కదా!
అలాంటపుడు భూమిలోపల ఇంకా ఎన్ని ఖాళీ స్థలములున్నాయి? ముందు ఎన్ని ఖాళీ స్థలములు ఉండేవి? ఆ లెక్కకు
పోతే భూమి అంతా తొర్రల మయముగా ఉన్నదా? అను మొదలగు ప్రశ్నలు రాగలవు. నేను అడుగు ప్రశ్నలన్నీ
సమంజసమైనవే అనుకొంటాను. ఇక సునామీల విషయానికి వస్తే వాటిలో కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమగుచున్నవి.
మేము పరిశోధకులము వాటిమీద పూర్తి పరిశోధన చేసి చెప్పుచున్నామనినా, వారు చెప్పినట్లు గ్రుడ్డిగా నమ్మితే అవి
మూఢనమ్మకములగును. అందువలన వాటిని కూడా ప్రశ్నించి తెలుసు కోవలసిన అవసరమున్నది. సముద్రములో
భూకంపములు వచ్చినపుడు సునామీలు వచ్చుచున్నవని చెప్పుచున్నారు. అలాగే భూమిమీద వస్తే భవనాలు పడిపోతున్నవి.
భూమిమీద వచ్చే భూకంపములు భవనాలను పడగొట్టడము చేయుట చూచిన విషయమే, అదే సముద్రములోని భూమిలో
భూకంపము వస్తే నీటిలో సునామీ వస్తున్నది. మార్చి 11,2011వ తేదీన జపాన్ దగ్గర వచ్చిన సునామీ గంటకు 800
కిలోమీటర్ల వేగముతో, నీరు 30 అడుగుల ఎత్తుగా భూమిమీదకు వచ్చిందనీ, ఆ తాకిడికి టోక్యో నగరము శిథిలావస్థకు
చేరుకొన్నదని చెప్పారు. సునామీ అంత బలముగా, అంత వేగముగా వచ్చుటకు సముద్రములోని భూకంపమే కారణమైతే,
సముద్రాన్ని అంతగా కదిలించుటకు, నీటిని అన్ని అడుగుల ఎత్తు చేయుటకు కావలసిన శక్తి బయట వచ్చు భూకంపములో
కనపడడము లేదు. బయటవచ్చు భూకంపములో బయట భూమి కృంగి పోవుచున్నదిగానీ, భూమి పైకి రావడములేదు.
సముద్రములో భూమి కృంగిపోతే నీరు లోపలికి పోవాలి గానీ, పైకి ఎత్తుగా ఎందుకు లేస్తున్నదో? భూమి కంపనములు
బరువైన భవనములను కదిలించుచున్నవి. కొన్నిచోట్ల కొన్ని భవనములు కూలి పోవుచున్నవి. కొన్ని ప్రాంతములలో
భవనములు కూలిపోకుండా నిలిచినవి. భవనములను కదిలించు బలమును చూచిన తర్వాత, ఆ బలము కొంత నీటిని
కదిలించవచ్చునుగానీ, నీటిని ఎత్తు లేపలేదు. భవనములను కదిలించు బలము నీటిని త్రోయవచ్చును, అయితే ఆ
బలము కొన్ని వందల కిలోమీటర్ల వేగముతో నీటిని త్రోయలేదు. అలాంటపుడు సముద్రములోని నీటికి అంత వేగము
ఎలా వచ్చింది? అను విషయము కూడా ప్రశ్నగానే మిగిలిపోగలదు.
మార్చి 11,2011వ తేదీ జపాన్లో సముద్రము 30 అడుగుల ఎత్తుగా వచ్చిన మాట వాస్తవమే. అట్లే 800
వందల కిలోమీటర్ల వేగముతో వచ్చిన మాట కూడా వాస్తవమే. అయితే శాస్త్రవేత్తలమూ, పరిశోధకులమూ అని
చెప్పుకొను వారు చెప్పే వివరమును మాత్రము నమ్మలేము. మేము ఏమి చెప్పినా నమ్ముతారని చెప్పుచున్నారు తప్ప
పూర్తిగా వారికి తెలిసి చెప్పడము లేదనీ, జరిగిన దానికి సరిపోవునట్లు అల్లి చెప్పుచున్నారు తప్ప ప్రత్యేకముగా
పరిశోధన చేసి ఉన్న సత్యమును చెప్పడము లేదనీ, ఉన్న సత్యమేదో వారికి తెలియదనీ అర్థమగుచున్నది. ఒక్క సునామీ
విషయములో గానీ, భూకంప విషయములోగానీ, అట్లే మరికొన్ని విషయములలోగానీ మేము శాస్త్రజ్ఞులము, మేము
పరిశోధకులము అను మాటను అడ్డము పెట్టుకొని, మాకు తెలిసినంత ఎవరికీ తెలియదని, మేము చెప్పినదే అందరూ
నమ్ముతారను ధైర్యముతో వాస్తవముగాని విషయములను కూడా చెప్పుచున్నా రనీ, వాటిని మనము గ్రుడ్డిగా నమ్ముచున్నామని
ఎవరూ అనుకోవడములేదు. మన కంటికి కనపడు దృశ్యములోని సత్యమును తెలుసుకొనుటకు ఎవరూ సరిగా
ప్రయత్నము చేయలేదని తెల్పుటకు ఒక విషయమును ఉదాహరణగా వివరించుకొందాము. అమెరికాలో ఆల్భైదా
తీవ్రవాదులు W.T.C. టవర్స్ మీద విమానముతో దాడి చేసిన విషయము అందరికీ తెలుసు. నూరు అంతస్థులున్న
టవర్ను దాదాపు 75 అంతస్థుల దగ్గర విమానము టవర్లోనికి దూరిపోయి నిప్పు అంటుకొన్నది. విమానములో
పెట్రోలు ఉన్నదాని వలన విమానము దూరిన అంతస్థుతో సహా దానిపై అంతస్థులు రెండూ, క్రింది అంతస్థులు రెండూ
అగ్నిప్రమాదానికి గురికావచ్చును. అక్కడ జరిగినది ప్రత్యక్షముగ టీవీలో కనిపిస్తున్నది. మనము చెప్పుకొన్నట్లు ఐదారు
అంతస్థులు మాత్రమే అగ్నిప్రమాదానికి గురియైనవి. ఆ రోజు ఆల్ ఖైదా తీవ్రవాదులు కూడా విమానముతో టవర్సును
గుద్దించి విమానములోని వారినీ, అక్కడ ప్రమాదానికి గురియగు అంతస్థులలో ఉన్న వారినీ చంపాలనుకున్నారే తప్ప,
ఆ ప్రమాదములో టవర్స్ కూలిపోతాయనీ, పెద్ద ప్రమాదము ఏర్పడుతుందనీ వారు కూడా అనుకొనివుండరు. తీవ్రవాదులు
అనుకొన్న దానికంటే ఎక్కువ ప్రమాదము జరిగిందని చెప్పవచ్చును. వాస్తవానికి వారు టవర్స్ను కూల్చాలని రాలేదు.
అక్కడ జరిగిన సంఘటనను చూచిన తర్వాత తీవ్రవాద నాయకులు తాము ఊహించని పని జరిగిందని ఆశ్చర్య
పోయివుంటారు. అమెరికాకు తాము అనుకొన్న దానికంటే, తాము చేసిన దానికంటే ఎక్కువ నష్టము జరుగడము
వలన సంతోషించి ఉంటారు.
W.T.C. టవర్లు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడమును ప్రత్యక్షముగా టీవీలో చూచాము. మేమేకాదు
బహుశా అందరూ చూచి ఉంటారు. ఒక టవర్ ముందు కూలిపోయింది. కూలిపోయిన మొదటి టవర్, భాగవతములో
బలిచక్రవర్తిని వామనుడు తలమీద త్రొక్కితే చక్కగా భూమిలోనికి పోయినట్లు, ఏమాత్రము ప్రక్కకు పడకుండా నిటారుగా
భూమిలోనికి పోయినట్లు కనిపించింది. ప్రమాదము జరిగినది పైనకాగా పై అంతస్థులుగానీ, ప్రమాదము జరిగిన
అంతస్థులుగానీ కూలిపోకుండా అవి అట్లే ఉండగానే, క్రింద భూమిదగ్గరున్న అంతస్థులు భూమిలోనికి పోయినట్లు,
నిటారుగా పైనుండి క్రిందివరకు పోవడమును చూస్తే, అక్కడ కూడా మానవునికి తెలియనిది ఏదో జరిగినదని
అనుమానము రాక తప్పదు. రెండవ టవర్ కూడా మొదటి టవర్ పోయినట్లే కనిపిస్తూ పోయింది. తీవ్రవాదులు
దాడిచేసినపుడు రెండు టవర్లు కూలిపోయిన మాట వాస్తవమే. అవి మన కళ్ళముందే కూలిపోయాయి. అంతవరకు
నిజమే, అయితే ఆ టవర్లు ఆ విధముగా కూలిపోవుటకు సరిపడు సంఘటన, అక్కడ తీవ్ర వాదులు చేసిన ప్రమాదముతో
సరిపోతుందా? అనునది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబును చూస్తే తీవ్రవాదులు చేసిన ఆక్సిడెంట్కు టవర్లు కూలిపోయిన
దానికి ఏమాత్రము సరిపోదు. అక్కడ జరిగిన దానికి ఏదో ఒకటి అల్లి కాంక్రీటులో వాడిన ఇనుము కరిగిపోవడము
వలన అలా జరిగింది అని సరిచేసి చెప్పారు. అయితే వారు చెప్పినట్లు అన్ని అంతస్థుల ఇనుము కరిగే దానికి
అవకాశమున్నదా అంటే, అంత ఇనుము కరిగే అవకాశమే లేదని చెప్పవచ్చును.
అమెరికాలోని ఆ టవర్సు కూలిపోవడానికి పూర్తి కారణము విమాన ప్రమాదము కానేకాదు. ఉగ్రవాదులు
అనుకొన్నది, చేసినది కొంతే. అయితే అక్కడ వారికి కూడా తెలియకుండా ఎక్కువ జరిగినది. దాడిచేసిన ఉగ్ర
వాదులకే కాకుండా మనుషులకు ఎవరికీ తెలియని శక్తి ఏదో అక్కడ పని చేసింది అని సులభముగా చెప్పవచ్చును.
టవర్సు కూలిపోయిన విధానమును చూస్తూనే ఆ విషయము మా అంచనాకు వచ్చింది. ఏదో ఒక శక్తి అదృశ్యరూపములో
అక్కడికి వచ్చి ఆ టవర్సు మీద తన కాలును పెట్టి లోపలికి తొక్కివేసిందని చెప్పవచ్చును. సైన్సులో అదృశ్యశక్తులు
అనునవి లేవు, ఎవరూ నిరూపణ చేయలేరని కొందరనినా, మీకు తెలిసిన సైన్సులో లేవు. మాకు తెలిసిన సైన్సులో
ఉన్నాయని మేము చెప్పుచున్నాము. “మాకు తెలిసిన సైన్సు సూపర్సైన్సు, అదియే బ్రహ్మవిద్యాశాస్త్రము”. దానిని తెలిస్తే
అమెరికాలోని టవర్సు విషయమేకాదు, జపాన్లో భూకంప విషయమూ, ఇండోనేషియా సునామీ విషయమూ
అర్థముకాగలవు. వాటి విషయములో ఉత్పన్నమైన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరకగలవు. మాకు తెలిసిన శాస్త్రము
ప్రకారము అమెరికాలో ప్రమాదమునకు గురి అయిన రెండు టవర్లనూ ఒక గ్రహము తొక్కింది. అలాగే ఇండోనేషియాలోని
సునామీని ఒక భూతము లేపింది. మార్చి 11,2011వ తేదీ జపాన్లోని భూకంపమును కూడా ఒక భూతము చేసినదే.
అమెరికాలోనేమో గ్రహము కాగా, జపాన్, ఇండోనేషియాలలో చేసినవి భూతములని చెప్పుచున్నాము. గ్రహముల
శక్తిగానీ, భూతముల శక్తిగానీ ఎవరి అంచనాకు రావు. గ్రహములుగానీ, భూతములుగానీ అట్లాంటిక్ సముద్రములోనున్న
ట్రయాంగిల్ శక్తికి తెలియకుండా ఇటువంటి విధ్వంసములను చేయవు. దేవుని పాలనకు రాజధానివలెనున్న బెర్ముడా
ట్రయాంగిల్ శక్తి ఆధారము తోనే, అనుమతితోనే సునామీలూ, భూకంపములు జరుగుచున్నవి. మార్చి 11,2011వ
తేదీ జరిగిన జపాన్ భూకంపముగానీ, సునామీగానీ బెర్ముడా ట్రయాంగిల్ శక్తికి తెలియకుండా జరుగలేదని చెప్పవచ్చును.
ఇటువంటివి ఎన్నో భూమిమీద జరుగుచున్నప్పటికీ, వాటి వెనుకవున్న నిజస్థితిని మనుషులు తెలుసుకోలేకున్నారు.
క్షణాలలో ఎంత దూరమైనా పోగల మేఘములు సముద్రము మీదున్న ట్రయాంగిల్కు, గ్రహములకు, భూతము లకు
మధ్యవర్తిలాగ ఉన్నవి. మనిషికి కనిపించని తతంగములు, యోచించినా తెలియని రహస్యములు ఎన్నో గలవు. ప్రపంచ
విజ్ఞానమును సంపాదించు కొన్న వారందరి బుద్ధికి ప్రత్యక్షముగా జరిగే పనులలో తెలియని రహస్యములు ఎన్నో
గలవని చెప్పుచున్నాము.
సూపర్ సైన్సు అనబడు ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసినవానికి గ్రహములూ, భూతములూ అంటే
ఏమిటో తెలుసు. అందువలన పూర్వము ఆధ్యాత్మిక విద్యను తెలిసినవారు భూతములనూ, గ్రహములనూ తెలిసినవారై
ఉండెడివారు. పూర్వము రావణబ్రహ్మ ఈ విషయమును నిరూపించి చూపించుటకు తన జీవితములో సూర్యచంద్రాది
గ్రహములను తన మాటవినునట్లు, తనమాటను గౌరవించునట్లు చేసి చూపించాడు. చిన్నచిన్న గ్రహములు నేటికినీ
యోగులను గౌరవించుచున్నవి. యోగుల మాట ప్రకారము నడుచుకొనుచున్నవి. నేటికాలములో మనుషులయందు
అజ్ఞానము పెరిగిపోవుట వలన బ్రహ్మవిద్యాశాస్త్రము ఒకటున్నదని తెలియకుండా పోయినది. అది తెలియకపోవడము
వలన కనిపించని గ్రహముల, భూతముల యొక్క ఆచూకి తెలియకుండా పోయినది. వాటి ఆచూకి తెలియక
పోవడము వలన ప్రళయ సమానమైన సునామీలు, భూకంపములు ఎలా వస్తున్నవో, ఎందుకు వస్తున్నవో ఎవరికీ
తెలియడము లేదు. అటువంటివారికి ఇప్పుడు మేము చెప్పు విషయము లన్నియు నమ్మశక్యము కాకుండా ఉండును.
మేము చెప్పినంత మాత్రమున దైవజ్ఞానము లేనివారికి ఏమాత్రము అర్థముకావు. మేము చెప్పిన విషయములు నూటికి
నూరుపాళ్ళు సత్యమని తెలియుటకు కొంతకు కొంతైనా జ్ఞానము ఉండితీరాలి.
నాస్తిక వాదులను దైవజ్ఞానులుగా మార్చవచ్చునా?
ఏమి చెప్పినా, ఎంత చెప్పినా కొందరు అజ్ఞానులు మేము విజ్ఞానులము, మాకు అన్నీ తెలుసు, మీరు చెప్పునవి
శాస్త్రబద్ధమైన విషయములు కావు, సైన్సు పరిశోధనకు ఏమాత్రము నిలువవు, అని వారి వాదనను వారు చెప్పుటకే
ప్రయత్నించుచుందురు. కానీ మేము చెప్పు మాటలు వినరని మాకు బాగా తెలుసు. అటువంటి మొండివాదులు
విజ్ఞానము పేరు చెప్పుకొని అజ్ఞానములోనే ఉండకుండా, నేడు అట్లాంటిక్ సముద్రములో ట్రయాంగిల్ రూపములోనున్న
ఆత్మశక్తి ఇదే భారతదేశము లోనికి తనశక్తిని కొంతపంపి ఒక వ్యక్తిగా పుట్టించింది. నేడు ఆ వ్యక్తిలో ట్రయాంగిల్
శక్తియుండడము వలన, ఆ వ్యక్తి నాస్తిక వాదులకు, హేతు వాదులకు కనువిప్పు కల్గునట్లు ఒక ప్రశ్నగా మిగిలియున్నాడు.
నాస్తిక వాదులకు ప్రశ్నగా నిలిచిన ఆ వ్యక్తి విషయములో సమాధానము తెలిసిన ఏ హేతువాదిగానీ, నాస్తికవాదిగానీ
జ్ఞానిగా మారవలసిందే! జవాబు చెప్పలేని వాడు విజ్ఞానికాదు అజ్ఞానియే అగును. విజ్ఞాని అయితే సైన్సు ప్రకారము
జవాబు చెప్పితీరాలి. ఒకవేళ జవాబును చెప్పగలిగితే ఎంత నాస్తికుడైనా జ్ఞానియే అగును. శాస్త్రబద్ధ జ్ఞానము లేనిదే
ఎవడూ జవాబు చెప్పలేడు. జవాబును చెప్పకుండా పోతే తాను విజ్ఞానిని కాదని చెప్పవలసి వుంటుంది. ఒకవేళ
జవాబును చెప్పితే, నేను అజ్ఞానిని కాదు జ్ఞానినని చెప్పవలసి ఉంటుంది. ట్రయాంగిల్ ఆత్మశక్తి పెట్టిన ఆ తిరకాసు
ఏమిటో క్రింద చూస్తాము.
29-04-2010వ తేదీన ఒక న్యూస్ పేపర్లో వచ్చిన వార్త ఇలాగ వుంది. 83 సంవత్సరముల వయస్సుగల
వ్యక్తి ఇప్పటికి 74 సంవత్సరము లుగా ఆహారముగానీ, నీళ్ళుగానీ ఏమాత్రము తీసుకోకుండా ఉంటున్నాడు.
నీళ్ళుగానీ, అన్నముగానీ తినకుండినా ఆయన ఆరోగ్యముగా ఉన్నాడు. అతని మెదడు కూడా 25 సంవత్సరముల
యువకునికున్నట్లు చురుకుగా పని చేస్తున్నదట. ఈ విషయము నిజమా కాదా అని 30 మంది డాక్టర్ల బృందము కొన్ని
నెలలు అతనిని పరీక్ష చేస్తు వచ్చి చివరకు అన్నీ సత్యమే అని తేల్చి చెప్పారు. ఆయనను చూచినప్పటికీ నమ్మనివారు
ఎందరో పరీక్షించారు. తర్వాత ఎందరో పరీక్షించుటకు పూనుకొన్నారు. ఆ రోజు వచ్చిన వార్తను ఉన్నదున్నట్లు
తర్వాత పేజీలో పొందుపరుచుచున్నాము.
ఒక వ్యక్తి పని చేయుటకుగానీ, వాని శరీరము ఆరోగ్యముగా ఉండుటకుగానీ, మనిషికి ఆహారము అవసరమని
అందరికీ తెలుసు. భౌతికశాస్త్రము ప్రకారము శరీరములకు క్యాలరీస్ రూపములో శక్తి కావాలి. క్యాలరీస్ ఆహారము
ద్వారా లభించును. అలాగే శరీరము వేడిగా ఉండాలి అంటే ఊరిపితిత్తులనుండి ఆక్సిజన్ (ప్రాణవాయువు) శరీరములోని
ప్రతి ధాతుకణమునకు చేరాలి. అలాగే జీర్ణవ్యవస్థ నుండి కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థములు) అనునవి పోయి ప్రతి
ధాతుకణమునకు చేరాలి. ముక్కురంధ్రములనుండి వచ్చు గాలి ద్వారా లభించిన ప్రాణవాయువూ, నోటినుండి వచ్చిన
ఆహారము ద్వారా లభించిన గ్లూకోజ్ (పిండి పదార్థములు) శరీరములో అణువణువున గల ధాతువుల వరకు పోవును.
అక్కడ ప్రతి ధాతుకణము ఒక ఫ్యాక్టరీలాగ ఉండును. ఆ ఫ్యాక్టరీలోనికి ఆహారపదార్థమైన గ్లూకోజ్ పోవాలంటే,
ఇన్సులిన్ అనే గేట్పాస్ ఉండాలి. రక్తములో గల ఇన్సులిన్ అను గేట్పాస్ ను తీసుకొని గ్లూకోజ్ ధాతుకణములోనికి
ప్రవేశించగా, రక్తములోనున్న ఎర్రకణముల మీద అంటుకొని వచ్చిన అక్సిజన్ కూడా ధాతుకణములోనికి చేరును.
ఆక్సిజన్ ధాతుకణము లోనికి పోయేదానికి గేట్పాస్ అవసరములేదు. ధాతుకణము లోపల ఒక చిన్నపాటి ఫ్యాక్టరీలాగ
ఉండును. బయటినుండి పోయిన పిండి పదార్థము లేక గ్లూకోజ్ అనబడునది ఆ ఫ్యాక్టరీలో కాలిపోయే కట్టెలుగా
ఉపయోగపడగా, మండే గుణమున్న ఆక్సిజన్ను, కాలిపోయే గుణమున్న కార్బోహైడ్రేస్ అను గ్లూకోజ్ కణములనూ
ధాతుకణమనుబడు ప్యాక్టరీలో బాయిలర్ (మండించే యంత్రముగా) ఉండు ఆత్మశక్తియందు కలుపబడును. ఆత్మశక్తి
చేత ఇటు గ్లూకోజ్, అటు ఆక్సిజన్ కలుపబడుట చేత గ్లూకోజ్ ఆక్సిజన్లో మండిపోవుచున్నది. ఈ ప్రక్రియ
శరీరమంతా అణవణువునా క్షణక్షణమూ జరుగుచున్నది. అలా జరుగుటచే ఏర్పడిన మంటవలన ధాతుకణము వేడిగా
ఉండును. ప్రతి ధాతుకణము వేడిగా ఉండుట వలన శరీరమంతా వేడిగా ఉండును. బ్రతికివున్న శరీరము వేడిగా
ఉంది అంటే ఆ శరీరములో అణువణువునవున్న ధాతుకణములలో ఆక్సిజన్ గ్లూకోజ్ను మండించుచున్న దని
తెలియుచున్నది. ధాతుకణములో మంట మండుచూ ఉండాలంటే వాటికి గ్లూకోజ్ మరియు ప్రాణవాయువు రెండూ
అవసరమే. ఆ రెండూ కావాలంటే నోటి ద్వారా ఆహారము, ముక్కు ద్వారా గాలి అవసరము. దీనినిబట్టి ఒక మనిషి
బ్రతికి ఉన్నాడంటే, భౌతికశాస్త్రము ప్రకారము ఇటు గాలి, అటు ఆహారము రెండూ అవసరమే. ఒకటి వుండి ఒకటి
లేకపోతే లోపల మంట మండదు. శరీరములో మంట మండకపోతే శరీరము చల్లబడిపోయి మనిషి చనిపోవును. ఒక
మనిషి బ్రతికి ఉన్నాడంటే నిత్యమూ, క్షణక్షణమూ మంట కార్యక్రమము జరుగు చుండవలసిందే. ఆ మండే కార్యక్రమము
కొరకు మనిషి ఒకవైపు నోటి ద్వారా ఆహారమును తినవలసిందే, ఒకవైపు ముక్కు ద్వారా గాలిని పీల్చవలసిందే.
ఇంతవరకు చెప్పినది మనకున్న ఆరుశాస్త్రములలో నాల్గవదైన భౌతికశాస్త్రమునకు సంబంధించిన సైన్సు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము, గుజరాత్లోని ప్రహ్లాద్ జానీ అనబడు 83 సంవత్సరముల వయస్సున్న
వ్యక్తి ఇప్పటికి 74 సంవత్సరములుగా ఆహారముగానీ, నీరుగానీ తీసుకోలేదని తెలిసింది. అలా ఉండడము భౌతికశాస్త్ర
సైన్సుకు పెద్దసవాలులాంటి విషయము. భౌతిక శాస్త్రము ప్రకారము ఆహారము లేకపోతే, మనిషి బ్రతకడు అనుమాట
వాస్తవము. ఒకవేళ నాలుగైదు రోజులు ఆహారము లేనివారు కూడా చనిపోలేదు కదా అని ఎవరైనా అడిగితే, అలా
కొన్ని రోజులు మాత్రము ఆహారము తీసుకోకపోయినా శరీరములో నిలువయున్న గ్లైకోజ్ అనునది గ్లూకోజ్ మార్చబడి,
ఆహారముగా అందించు ఏర్పాటు శరీరములో ఉన్నది. అందువలన గ్లైకోజ్ నిలువ ఉన్నంత వరకు మనిషి బ్రతుకగలడు.
తర్వాత ఆహారము అందదు కావున చనిపోవుట సంభవించును. ఆ విధానము కొన్ని రోజులకే పరిమితముగానీ ఒక
నెలకు కూడా సరిపోదు. ఇంతకుముందు మనము చెప్పుకొన్నది భౌతికశాస్త్రము కావున అది వాస్తవమే. అయితే
భౌతికశాస్త్రమునకు విరుద్ధముగా 83 ఏళ్ళ ప్రహ్లాద్ జానీ బ్రతికి ఉన్నదీ వాస్తవమే. ఈ రెండూ పరస్పర విరుద్ధములు.
శాస్త్రము ఎప్పటికీ అబద్దము కాదు. శాస్త్రమునకు విరుద్ధముగా ఎవరూ బ్రతుకుటకు వీలులేదు. ఏదో ఒకటి సత్యము
కావలెను. ఒకటి అసత్యముకావలెను. అయితే శాస్త్రము ఎప్పటికీ సత్యమే. కానీ ఇక్కడ అనుభవరీత్యా మనిషి
బ్రతికివున్నది కూడా సత్యమే. ఇక్కడ శాస్త్రవేత్తలందరూ జుట్టును పెరుక్కున్నా వారికి ఏమీ అర్థము కాలేదు.
ఇక్కడ మనిషి ఎంత మేధావియైనా, ఎంత విజ్ఞానవంతుడైనా అతను పూర్తి విజ్ఞానికాడు, అలాగే అతను పూర్తి
మేధావి కూడా కాడు. పూర్తి మేధావి కావాలన్నా, పూర్తి విజ్ఞాని కావాలన్నా ఆరవ శాస్త్రమును మనిషి తెలిసి తీరాలి
అనునది ముఖ్యసూత్రముగా ఉన్నది. ఆరవ శాస్త్రమును తెలిసినపుడే అతడు ఇలాంటి ఏ ప్రశ్నకైనా జవాబును
చెప్పగలడని తెలియుటకు, ట్రయాంగిల్ శక్తి ఆ వ్యక్తిని పుట్టించి మనిషి యొక్క మేధస్సుకు, మనిషియొక్క విజ్ఞానమునకు
ప్రశ్నగా నిలిపింది. ఇలా జరుగడము వలన మనిషి ఆరవశాస్త్రమును గుర్తించునని, దానివలన మానవుడు జ్ఞానికాగలడనీ
ట్రయాంగిల్ (మూడు కోణముల) శక్తి యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఎన్నో అర్థముగాని సంఘటనలు సముద్రములో
ఏర్పడినా, ప్రహ్లాద్ జానీలాంటి ప్రశ్నార్థకమైన అర్థముకానివి విషయములు భూమిమీద ఎన్నో ఉండినా, మనిషి వాటిని
గ్రుడ్డిగా వదలివేయుచున్నాడు. వాటికి ఏమాత్రము సమాధానము చెప్పలేని స్థితిలో ఉండి కూడా తన్నుతాను మేధావిగా
చెప్పుకొంటున్నాడు. ఆరవశాస్త్రమును తెలిసిన వారిని హేళనగా మాట్లాడుచున్నాడు. బెర్ముడా ట్రయాంగిల్ విషయములో
ఏమీ చెప్పలేక పోయినా, పూర్వమునుండి భూకంపములు ఎందుకు వస్తున్నవో, వాటి వెనుక చరిత్ర తెలియకపోయినా,
ప్రహ్లాదానీలాంటి వారు ఎలా బ్రతికి వున్నారో చెప్పలేక పోయినా, మనిషి జీవితమునకు ముఖ్యమైన దైవజ్ఞానము
లేకున్నా, తాను విద్యావేత్తననీ, శాస్త్రవేత్తననీ, మేధావిననీ చెప్పుకోవడము సిగ్గుచేటు కాదా! దైవజ్ఞానము లేకపోతే
భూమిమీద పుట్టిన జంతువుకు అవసరమైనవే మనకున్నవని, వాటివలె నిద్రా, అహారమూ, పనీ ఉన్నాయనీ, వాటికి
మనకు ఏమీ తేడా లేదని తెలియుచున్నది. అలా కాకుండా నిజమైన విజ్ఞానిగా, నిజమైన మేధావిగా ఉండాలంటే
ఆరవ శాస్త్రమును తెలిసి శాస్త్రవేత్తవు కావలెనని తెల్పుచున్నాము.
బెర్ముడా ట్రయాంగిల్ లో ఉన్న శక్తిని దైవశక్తి అన్నాము. మనిషి లెక్కలో ఆత్మశక్తిని దైవశక్తి అని
మర్యాదపూర్వకముగా ఉచ్ఛరించవచ్చును. సృష్ఠి తర్వాత అంతటా పని చేయునది ఆత్మశక్తియే. ఆత్మశక్తిని దైవశక్తి అని
పిలుచుచున్నామని జ్ఞప్తికుంచుకోవాలి. కొందరు శాస్త్రవేత్తలూ బెర్ముడా ట్రయాంగిల్ మీద పరిశోధనలు జరుపువారూ
"అక్కడ అయస్కాంతశక్తి ఉండవచ్చును. సూర్యుని నుండి వ్యాపించే వేడివలన అక్కడ ఎక్కువ బలమైన అయస్కాంతశక్తి
ఉంటుంది. అందువలన లెక్కలేనన్ని విమానములు, నౌకలు ప్రమాదానికి గురియైనాయి”. అని వారి అంచనా
ప్రకారము వారు చెప్పారు. దానికి ఏవిధమైన వాళ్ళు ఆధారమును చూపలేదు. చివరికి ఏదో ఒక శక్తి అక్కడ ఉన్నదని
అంటున్నారు. ఎక్కువమంది అయస్కాంతశక్తి అన్నారు. అయస్కాంత శక్తిని గురించి మేము ఏమి అనుచున్నామంటే!
అయస్కాంత శక్తి వేరు, ఆత్మశక్తివేరు. అయస్కాంతశక్తిని మనిషి తయారు చేయవచ్చును. కానీ ఆత్మశక్తిని ఎవరూ
తయారు చేయలేరు. విద్యుత్ శక్తిని అయస్కాంత శక్తిగా, అయస్కాంతశక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చును. కానీ
ఆత్మశక్తిని ఏ శక్తి చేత తయారు చేయలేము. మానవుని శరీరములో ఆత్మశక్తి ఉన్నది. అలాగే బెర్ముడా ట్రయాంగిల్
ప్రాంతములో కూడా ఆత్మశక్తియే ఉన్నది. ఆత్మశక్తి విశ్వమంతట అందరిలో భిన్నభిన్నముగా ఉండినప్పటికీ శక్తి మాత్రము
ఒక్కటే. ఆత్మశక్తి ఉన్న స్థలమును బట్టి తన పాత్రను పోషించుచుండును. సముద్రము మీద ట్రయాంగిల్లో ఉండే
ఆత్మశక్తి ఒక పాత్రను పోషిస్తే, మనిషి శరీరములోనున్న శక్తి ఒక పాత్రను పోషించును. ఆత్మశక్తి విశ్వమంతా ఒకటే
అయినా అది ఉండే స్థలములను బట్టి వేరువేరుగా ఉంటూ వేరువేరు పనులను చేయుచున్నది. ప్రపంచములో ఏ
జీవరాసి యందైనాగానీ పనులను చేయునది ఆత్మయే. ఎక్కడైనా, ఏ పనియైనా జరిగింది అంటే, అక్కడ ఆత్మవలననే
జరిగివుంటుంది. ఆ లెక్క ప్రకారము మనుషులు చేయు పనులన్నీ వారి శరీరములోని ఆత్మయే చేయించుచున్నది.
విశ్వములో ఎన్నో పాత్రలను ఆత్మ పోషించుచున్నా, ఆత్మ అను శబ్దము అందరికి సుపరిచితమైనా, ఆత్మ అంటే ఏమిటో,
దానిని గురించిన జ్ఞానము ఎవరికీ తెలియదు. కొందరు జీవాత్మను ఆత్మ అంటున్నారు. కొందరు పరమాత్మను ఆత్మ
అంటున్నారు. కానీ ఈ రెండు కానిది ఆత్మ అని ఎవరికీ తెలియదు. మనిషికి ఆత్మజ్ఞానము ముఖ్యమైనప్పటికి
ఆత్మపేరు చెప్పుకొని ఆత్మకాని దానిని మనిషి తెలుసుకొంటున్నాడు.
పూర్వము రావణబ్రహ్మ ఈశ్వరలింగము మీద మూడు విభూతి రేఖలను దిద్ది, ఆ రేఖలలో క్రిందిది జీవాత్మకూ,
మధ్యలోనిది ఆత్మకూ, పైది పరమాత్మకు చిహ్నములని తెలిపి మధ్యలోనున్న ఆత్మజ్ఞానమే మనిషికి ముఖ్యమనీ, దానిని
తెలియునట్లు లింగము మీద మధ్యరేఖకు కుంకుమ బొట్టు పెట్టి చూపాడు. అదే పద్ధతిలో తానూ ధరించాడు,
అందరినీ ధరింపజేశాడు. అయినప్పటికీ ఈ కాలములో ఆధ్యాత్మిక వాదులకు కూడా ఆత్మయొక్క వివరము తెలియకుండా
పోయినది. ఫలానిది ఆత్మ అనిగానీ, ఫలానా పనిని మాత్రము ఆత్మ చేయుచున్నదనిగానీ, నిర్దిష్టముగా ఎవరూ చెప్పలేక
పోవుచున్నారు. అటువంటి ఆత్మను గురించి తెలుసుకొంటే ఎన్నో రహస్యములు తెలియగలవు. ఇప్పుడు అసలు
విషయానికి వస్తాము. 83 సంవత్సరముల ప్రహ్లాదానీ అనువ్యక్తి శరీరమందు నిర్దిష్టమైన పనులు చేయు, నిర్దిష్ట
భాగములు మొత్తము 26 గలవు. అందులో ఆత్మ కూడా ఒకటి. ఆత్మను ప్రక్కన పెట్టిచూస్తే మొత్తము 25 భాగములు
జీవునితో సహా గలవు. శరీరములో 25 భాగములు పని చేయుచుండగా శరీరము బ్రతుకగలుగుచున్నది. శరీరములోని
25 భాగములు ఏ దాని పని అది చేయుటకు కావలసిన శక్తిని ఆత్మయే అందించుచున్నది. దీనినిబట్టి ప్రతి శరీరములోనూ,
జరిగెడు ప్రతి పనీ ఆత్మశక్తి చేత జరుగుచున్నదని తెలియుచున్నది. శరీరములో ఆత్మ లేకపోతే ఆ శరీరమునకు
కదలికయే లేదని చెప్పవచ్చును. శరీరమునకు మొత్తము అధిపతి ఆత్మయే. అట్లాంటిక్ సముద్రములో ఆత్మ, త్రైతాకార
కోణమును స్థానము చేసుకొన్నట్లు, శరీరములో ఆత్మ తలయందు స్థానముగల్గియున్నది. అక్కడినుండి తనశక్తిని శరీరమంతా
ప్రసరింపజేయుచున్నది.
74 సంవత్సరముల నుండి ఆహారమునుగానీ, నీరునుగానీ స్వీకరించని ప్రహ్లాదానీ అను వ్యక్తిని భూమిమీద
హేతువాదులూ, నాస్తిక వాదులూ, అజ్ఞానులూ, విజ్ఞానులూ అందరికీ కనువిప్పు కల్గునట్లు త్రైతాకారముగానున్న
శక్తియే పుట్టించినది. అతను పుట్టిన తొమ్మిది సంవత్సరముల నుండి ఆహారమును మానుకొన్నాడు. ద్రవాహారమునుగానీ,
ఘనాహారమునుగానీ, చివరికి నీరునుగానీ తీసుకోకుండా వదలివేశాడు. నాటినుండి నేటి వరకు ఆరోగ్యముగా
బ్రతుకగల్గుచున్నాడు. అతని వలన భౌతిక శాస్త్రవేత్తలకు కూడా ఏమి అర్థముకాని పరిస్థితి ఏర్పడినది. అతను ఆహారము
లేకుండా ఎలా ఆరోగ్యముగా బ్రతుకగల్గుచున్నాడో భౌతిక శాస్త్రమునకు సంబంధించిన విషయమే అయినా భౌతిక
శాస్త్రవేత్తల నుండి దానికి వివరము లేదు. వారు ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకనగా! ఇది ఆత్మకు సంబంధించిన
విషయము. ఆత్మ ఏమిటో భౌతికశాస్త్రమునకు తెలియదు. ఆత్మను గురించి చెప్పునది ఒకే ఒక బ్రహ్మవిద్యాశాస్త్రము.
ఆ ఆరవ శాస్త్రమును తెలిసినవారివద్ద మాత్రమే ఆహారము లేకుండా అతను ఎలా బ్రతుకుచున్నాడనుటకు జవాబు
గలదు. ప్రపంచములో కేవలము నాల్గుశాస్త్రములను తెలిసిన వారిని వదిలి, ఆరవ శాస్త్రమును తెలిసిన ఆత్మజ్ఞానులను
అడిగితే వారిలా చెప్పుచున్నారు. శరీరములో అన్ని పనులను చేయించువాడు ఆత్మ. శరీరములో అధిపతిగా
ఉన్నవాడు ఆత్మ. ఆత్మశక్తి శరీరమంతా ప్రాకి అణువణువునా వ్యాపించి ఉన్నది. శరీరములో కొన్ని కోట్ల ధాతుకణములు
గలవు. అన్నిటియందూ ఆత్మశక్తి వ్యాపించి ఉన్నది. ధాతుకణములలో వ్యాపించియున్న ఆత్మ అక్కడికి వచ్చు గ్లూకోజ్ను
ఆక్సిజన్ను కలిపి మండించుచున్నదని ముందే చెప్పుకొన్నాము. అందరి శరీరములో జరుగుపని అదికాగా, ఇక్కడ
ప్రత్యేకముగా త్రైతాకార ఆత్మశక్తిచేత పుట్టిన ప్రహ్లాదానీ శరీరములో ఏమి జరుగుచున్నదనగా!
ప్రహ్లాదానీ ముక్కు ద్వారా గాలిని పీల్చుచున్నాడుగానీ, నోటిద్వారా ఆహారమును తీసుకోలేదు. అందువలన
అతని శరీరములో ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువు రక్తకణములలోనికి చేరి, రక్తప్రసరణ ద్వారా ప్రతి ధాతుకణమునకు
పోవుచున్నది. అలా పోయిన ప్రాణవాయువు మండించే గుణముకలదిగా ఉన్నది. కానీ అక్కడ కాల్చుటకు ఆక్సిజన్
ఉండినా, కాలి పోవుటకు గ్లూకోజ్ లేదు. అతను ఆహారమును తీసుకోని దానివలన అక్కడికి గ్లూకోజ్ పోలేదు. ప్రతి
ధాతుకణములోను ఆత్మశక్తి వ్యాపించి వుండి, గ్లూకోజ్ను ప్రాణవాయువును కలిపి మండునట్లు చేయుచుండును.
శరీరమంతటికి అధిపతి ఆత్మని ముందే చెప్పుకొన్నాము. అందువలన ఆత్మ మనిషి కర్మనుబట్టి తను స్వయముగా
నడుచుకోగలదు. ఆత్మను నడిపించుశక్తి శరీరములో ఏదీలేదు. ఆత్మే అన్నిటినీ నడిపించును. ఆత్మ శరీరములో వేడి
లేకుండా చేయాలనుకుంటే ధాతుకణములోనికి వచ్చిన గ్లూకోజ్ను, ఆక్సిజన్ను మండకుండా చేయును. అందువలన
ఆసుపత్రిలో ముక్కులకు ఆక్సిజన్ను అందించినా, రక్తములోనికి గ్లూకోజ్ను ఎక్కించినా ధాతుకణముల వరకు రెండూ
పోయినా, ఆత్మ వద్దనుకుంటే రెండూ మండవు. అప్పుడు శరీరములో వేడితగ్గి చల్లబడిపోయి మనిషి చనిపోగలడు.
ఆత్మ అనుకొంటే ఆక్సిజన్ తక్కువ వచ్చినా, గ్లూకోజ్ తక్కువ వచ్చినా ధాతు కణములో మంటను సక్రమముగా
ఉండునట్లు చేసి, వాని ఆరోగ్యమును కాపాడగలదు. అందువలన మనిషిని చంపుటకు గానీ, బ్రతికించుటకుగానీ ఆత్మ
అధిపతిగా ఉన్నది. ఇక్కడ ప్రహ్లాదానీ శరీరములో ఆక్సిజన్ మాత్రము ధాతుకణమునకు వచ్చింది, గ్లూకోజ్ రాలేదు.
అయినా శరీరమునకు అధిపతిగా ఉన్న ఆత్మ ఆక్సిజన్ ను మాత్రము మండునట్లు చేసింది. అతని శరీరము చల్లారకుండా
బ్రతుకునట్లు చేసింది. గ్లూకోజ్ మండే ధాతు కణములలో బూడిదలాంటి కాలుష్యము ఏర్పడుట వలన అది సరిగా
బయటికి పోకపోతే మనిషికి అనారోగ్యము కలుగవచ్చును. కానీ ప్రహ్లాద్ జానీ శరీరములో గ్లూకోజ్ మండడములేదు.
గ్లూకోజ్ లేకున్నా ఆత్మ కేవలము ప్రాణవాయువును మాత్రమే మండింపజేయుట వలన అతని శరీరములో కాలుష్యము
ఏమాత్రముండదు. అందువలన అందరికంటే అతను ఆరోగ్యముగా ఉన్నాడు. దీనినిబట్టి ఆత్మ అనుకూలిస్తే
ఆహారము లేకున్నా బ్రతుకవచ్చుననీ, అది 83 ఏళ్ళ ప్రహ్లాద్బానీ వద్ద ఆత్మ రుజువు చేసి చూపించిందని తెలియుచున్నది.
శరీరములో సర్వ అధికారములుగల ఆత్మ నీ శరీరములో కూడా ఉంది. శరీరములో ఆత్మ ప్రత్యేకముగా పనిచేసి
గ్లూకోజ్ లేకున్నా ఆక్సిజన్ ఒక్కదానితోనే మండిచుచున్నది. ఆ విషయము బయట ప్రహ్లాదానీకి కూడా తెలియదు.
అతను ఏదైనా సాధించి ఆహారమును తీసుకోలేదా అంటే అతను ఏమి సాధించలేదు. వాస్తవానికి అతనికి ఏమి
తెలియదు. అతను యోగీకాడు, జ్ఞానీకాడు అతని ప్రత్యేకత ఏమి లేకున్నా, అతని శరీరములోని ఆత్మ ప్రత్యేకతే
అతనిని గుర్తింపునకు తెచ్చినది.
ఎవరి శరీరములోనైనా ఆత్మే అధిపతి. ఆత్మ కుంటివానిని నడిపించగలదు. మూగవానిని మాట్లాడించగలదు.
చనిపోయాడనుకొన్న వానిని బ్రతికించగలదు. ప్రాణముతోనే ఉన్నా, అందరూ చూచుటకు చనిపోవునట్లు చేయగలదు.
అందరూ చనిపోయాడను వానిని ఆశ్చర్యముగా బ్రతికివచ్చునట్లు చేయగలదు. ఆత్మ శరీరములో అన్ని అధికారములతో
ఏమైనా చేయగల్గు స్థోమతకల్గి ఉన్నది. అటువంటి ఆత్మను ఎవరూ గుర్తించలేదు. కనీసము శరీరములో ఆత్మనునది
ఒకటున్నదని కూడా ఎవరికీ తెలియకుండా పోయినది. ఆత్మను గురించి భగవద్గీతలో విపులముగా భగవంతుడే
చెప్పాడు. పురుషోత్తమ ప్రాప్తియోగములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని మూడు ఆత్మలున్నాయనీ, అవి క్షరుడు,
అక్షరుడు, పురుషోత్తముడు అను ముగ్గురు పురుషులుగా మన శరీరములో ఉన్నారనీ, వాటినే మేము త్రైతసిద్ధాంతముగా
చెప్పుచున్నా మనీ చెప్పాము. ఇందువులకు ముఖ్య గ్రంథమైన భగవద్గీతను ఆధారము చేసుకొని, గీతలో చెప్పిన మూడు
ఆత్మలను త్రైతసిద్ధాంతము అను పేరుతో మేము చెప్పితే, ఇందూమతములోని మతఛాందసవాదులు ఏమాత్రము ఆత్మ
జ్ఞానము లేనివారై, మమ్ములను క్రైస్తవులనీ, మేము క్రైస్తవుల బోధలు చెప్పుచున్నామనీ అన్నారు. దీనిని బట్టి ఒకప్పుడు
దైవజ్ఞానములో ప్రసిద్ధిగాంచిన ఇందూమతము నేడు తమ మతమేదో, పరాయి మతమేదో తెలియనిస్థితిలోనికి వచ్చినదని
అర్థమగుచున్నది.
నేడు ఆత్మంటే, ఏమిటో ఎవరికీ తెలియని స్థితిలో మనుషులున్నారు. నాలుగు మహత్యములు చూపితే బాబాలుగా,
మూడు పాటలు పాడి, రెండు మాటలు చెప్పితే స్వామీజీలుగా, ఒక శ్లోకము చెప్పితే పండితునిగా తయారై పోవుచున్నారు.
కానీ ఆత్మ విషయము స్వాములకూ, బాబాలకూ, పండితు లకూ తెలియకుండా పోయింది. ఇంతటి అజ్ఞాన పరిస్థితిని
చూచిన ఆత్మకు విసుగు వచ్చింది. ఆత్మకు విసుగు వచ్చినందుకే మనుషులను శిక్షించి అయినా జ్ఞానమును
కలుగజేయాలనుకొన్నది. అందువలననే బెర్ముడా ట్రయాంగిల్లో నివాసమేర్పరుచుకొన్న ఆత్మ, అక్కడికి పోయిన ఎన్నో
విమానములను, ఎన్నో నౌకలను మాయము చేసింది. తన మేఘముల చేత ఇతర గ్రహములకు తరలించింది.
అక్కడకు పోయిన మనుషులు ఈ లోకమును మరిచిపోయి, ఆ లోకములో పడిపోయి, అక్కడ జ్ఞానమును తెలుసుకొనేలా
చేసింది. అట్లు జ్ఞానమును తెలుసుకొన్నవారు తిరిగి భూమిమీద పుట్టి జ్ఞానము మీదనే ఆసక్తికల్గి, జ్ఞానులుగానే
జీవించుదురు. అట్లు జరుగుట వలన భూమిమీద పూర్తి అజ్ఞానము పెరగకుండా కొంతకు కొంతైనా జ్ఞానముంటుందని
ఆత్మ ఆ విధముగా చేసింది. శ్రద్ధలేని వానికి కూడా జ్ఞానమును తెలియజేయు నిమిత్తము, బెర్ముడా ట్రయాంగిల్లో
ఎందరినో మాయము చేసిన ఆత్మ, ఆత్మశక్తిని లెక్కించని మనుషులనూ మరియు ఆత్మశక్తియున్న యోగులను, జ్ఞానులను
దూషించిన మనుషులనూ శిక్షింప దలచుకొని, భూమిమీద తన భూతములచేత ఎన్నో ప్రకృతి వైపరీత్యములను
కల్గించుచున్నది. అయినా మనిషి మొండిగా అనుభ విస్తున్నాడు తప్ప, ప్రకృతి వైపరీత్యముల వెనుక ఎవరి హస్తమున్నదని
ఆలోచించకపోవుచున్నాడు. ఎన్నో విధముల మనిషికి కనువిప్పు కల్గించి మనిషిని జ్ఞానమార్గములోనికి తేవాలనుకొన్న
ఆత్మ, ప్రహ్లాదానీలాంటి వారిని పుట్టించి, వింతగా కనిపింపజేసి మేధావులైన వారికి కూడా ఆత్మంటే ఏమిటో
తెలియజేయాలనుకొన్నది. అయినప్పటికీ ఆత్మ చేయు పనులకు వివరము తెలియకుండాపోతే, తాను ఆ పనిని చేసి
ప్రయోజనములేదని తలచిన ఆత్మ, మాలాంటి వారిచేత ఆత్మకూ, ఆత్మ పనులకూ వివరమును చెప్పించుచున్నది.
మాచేత, మాలోని ఆత్మ ఎంతో వివరముగా జ్ఞానమును చెప్పించినా, వినని వారిని తప్పక తన ఇష్టమొచ్చిన పద్ధతిలో
శిక్షించును. అలా ఆత్మ శిక్షకు గురియై, ఎన్నో బాధలను అనుభవించే దానికంటే, ఆత్మజ్ఞానమును తెలుసుకోవడము
మంచిది. అందువలన నేను చెప్పునది ఏమనగా! నీవు ఎంతటి హెూదాలో ఉండినా, అధికారములో ఉండినా,
ధనికునివైనా, పండితునివైనా, పామరునివైనా నీవు మాత్రము ఆత్మ చేతిలో కీలుబొమ్మవే. అందువలన ఇప్పటి నుంచయినా
ఆత్మజ్ఞానమును తెలుసు కొనుటకు ప్రారంభించమని తెల్పుచున్నాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.