దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు part1 cloud text 23rdSep2024

 


దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు,


యోగీశ్వరుల ముందుమాట.


దయ్యాలను, భూతాలను ఈ కాలములో ఎవరు నమ్మినా హేతువాదులనువారు, నాస్తికవాదులను వారు నమ్మరు.

నమ్మకము అను మాట (పదము) మా డిక్షనరిలో లేదు అని అనుచుందురు. బయట కనిపించు సమాజములో

హేతువాదము, నాస్తికవాదము అని రెండు వేరువేరు పేర్లు కలిగిన వాదములుండినా, మాటలలోగానీ, కార్యములలోగానీ

రెండూ ఒకటిగానే కనిపిస్తున్నవి. ఉదాహరణకు వెండి, బంగారు రెండు వేరువేరు లోహములు కలవు. కానీ ఈ

కాలములో వెండినగలకు బంగారు పూత వేయడములో రెండూ బంగారుగానే కనిపిస్తున్నవి. అలాగే హేతువాదులు,

నాస్తికవాదులు తమను వేరువేరుగా చెప్పుకొంటున్నా, హేతువాదులు నాస్తికులవలె మాట్లాడడము వలన హేతువాదులు

కూడ నాస్తికులవలె కనిపిస్తున్నారు. అందువలన హేతువాదము అను పేరుండినా, అదికాస్త నాస్తికవాదముగా

మారిపోయినది. నేటి కాలములో ఆస్తికవాదము, నాస్తికవాదము తప్ప హేతువాదము ఎక్కడా కనిపించలేదు. హేతువాదము

పేరుతో కొన్ని సంస్థలు ఏర్పడినా, వారిది అసలైన హేతువాదముకాక, బంగారుపూత పూసుకొన్న వెండివలె నాస్తికత్వమును

నింపుకొన్న హేతువాదమైనది. ఒకరకముగా చెప్పితే వాస్తవమైన హేతువాదము భూమిమీద అరుదైపోయినదని

చెప్పవచ్చును. దేవుడున్నాడు అను ఆస్తిక వాదమునకు, దేవుడులేడు అను నాస్తికవాదము ఎప్పుడూ వ్యతిరేఖమే.

ఎక్కడైనా హేతువాదులు అని చెప్పుకొనువారుండినా వారు నాస్తికవాదుల లోనికే జమ అయిపోయారు. కావున వారు

కూడ ఆస్తికవాదమునకు వ్యతిరేఖులే!


మొదట నా జీవితము మొదలైనది హేతువాదముతోనే. నాలో ఉన్నది అసలైన హేతువాదము, కాబట్టి

అందులో నాస్తికవాద లక్షణములైన దేవుడు లేడు అను ఉద్దేశము లేనేలేదు. దేవుడు ఎలా ఉన్నాడు అన్నది ఆనాటి

నాలోని ప్రశ్న. ఆస్తికవాదములో జవాబు ఉండదు, నాస్తికవాదములో ప్రశ్న ఉండదు అని నేను చెప్పుచుంటాను. ఒకే

ఒక హేతువాదములో మాత్రము ప్రశ్న ఉంటుంది మరియు జవాబు ఉంటుంది అనికూడ ముఖ్యముగ చెప్పుచుంటాను.

అసలైన హేతువాద లక్షణములు నాలో మొదటినుండి ఉండుట వలన నాలో ప్రశ్న ఉంది, చివరకు జవాబు కూడ

ఉంది. ఒక ప్రశ్న ఉద్భవించినపుడు, శాస్త్రబద్ధమైన జవాబు దొరుకువరకు హేతువాది అన్వేషణ చేయుట వలన,

హేతువాదివద్ద ప్రశ్న ఉంటుంది మరియు దానికి సరియైన జవాబు ఉంటుందని చెప్పవచ్చును. హేతు వాదము అను

పదములో “వాదము” అన్నది సామాన్యమైనది “హేతు" అన్నది ముఖ్యమైనది. అలాగే ఆస్తికవాదము, నాస్తికవాదము

అను వాటిలో కూడ 'వాదము' అన్నది అన్నిటిలోను సమానమే. వాదముకంటే ముందున్న శబ్దమే ముఖ్యమైనది.

హేతువాదము అను శబ్దములో ఇమిడియున్న అర్థమును గమనిస్తే, సత్యము కొరకు అడుగునది లేక ప్రశ్నించునది.

సత్యమైన జవాబును పొందునదని తెలియగలదు. హేతువాదములో శాస్త్రబద్ధమైన ప్రశ్న ఉంటుంది మరియు శాస్త్రబద్ధమైన

జవాబు ఉంటుంది. అందువలన హేతువాదమును అసలైన సత్యవాదము అని అనవచ్చును. 'హేతు' అను పదము

భగవద్గీతలో మూడుచోట్ల వాడబడినది. రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయములో 10వ శ్లోకములోను,

క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అను అధ్యాయములో 5 మరియు 21వ శ్లోకములలోను చెప్పబడియున్నది. అందులో

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగములోని 21వ శ్లోకమును గమనిస్తాము.


కార్య కారణ కర్తృత్యే హేతుః ప్రకృతి రుచ్యతే,

పురుష స్సుఖ దుఃఖానాం భోక్తృత్యే హేతు రుచ్యతే.


శ్లోకములోని రెండు వాక్యములలో పై వాక్యమందు కార్య, కారణ, కర్త అను మూడు పదములూ, రెండవ

వాక్యములో సుఖ, దుఃఖా, భోక్త అను మూడు పదములు గలవు. పై వాక్యములోని కార్య, కారణ, కర్తకు చివరిలో

ప్రకృతి చెప్పబడినది. అలాగే రెండవ వాక్యములోని సుఖ, దుఃఖ, భోక్తకు చివరిలో పురుష చెప్పబడినది. పై వాక్యములోను,

క్రింది వాక్యములోను 'హేతు' అన్న పదము మాత్రమే మిగిలిపోయినది. ఈ రెండు వాక్యములలోను హేతు అన్న

పదము విశేషత కల్గియున్నది. హేతు అన్న పదము వలననే సత్యము బయటపడుచున్నది. పై వాక్యములోని కార్య,

కారణ, కర్తకు ప్రకృతిని అనుసంధానము చేయునది హేతు అను ఒకశబ్దమే, అలాగే సుఖ, దుఃఖ, భోక్తకు పురుషున్ని

అను సంధానము చేయునది హేతు అను ఒక పదమేనని తెలియుచున్నది. సుఖ, దుఃఖ అనుభవమునకు, పురుషునికి

(జీవునికి) మధ్యలోగల సత్యమేమిటో హేతు అన్న పదముతోనే తెలియుచున్నది. అలాగే కార్య, కారణ, కర్తకు ప్రకృతికి

మధ్యలోగల సంబంధముగానీ, తెలియని రహస్యముగానీ, ఉన్న సత్యముగానీ, హేతు అన్న పదముతోనే తెలియుచున్నది.

అందువలన బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతయందే, హేతు అనుపదము ముఖ్యముగా వాడబడినది. అటువంటపుడు

హేతువాదము చాలాగొప్పదనీ, సత్యమును తెలియజేయునదనీ, వాస్తవ సంబంధమును తెలుపునదనీ అర్థమగుచున్నది.

ఒక సత్యమును మనిషి తెలియాలంటే, వానికి ముందు ప్రశ్న అవసరము తర్వాత జవాబు అవసరము. అందువలన

భూమిమీద హేతువాదము ప్రశ్నలతో మొదలై జవాబులతో ముగుస్తుంది. ప్రశ్న మాత్రముండి జవాబులేని నాడు అది

హేతువాదముకాదు.


నేను హేతువాదముతో జీవితమును ప్రారంభించిన వాడిని. కావున చిన్నవయస్సుయందు ప్రతి విషయములోను

నాలో ప్రశ్నలు వచ్చేవి. వాటి జవాబుల కొరకు పెద్దవారిని అడిగేవాడిని. ఆ కాలములో కొంత జ్ఞానము కలిగిన

పెద్దలు కూడ నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక, ఈ వయస్సులో ఇవన్నీ నీకెందుకు అని నా నోరు మూయించేవారు.

నాకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఒక పెద్దస్వామీజీని యోగదండమును గురించి ప్రశ్నించాను. నా ప్రశ్న అల్లరిగా

గానీ, చిల్లరగా గానీ ఎప్పటికీ ఉండదు. నా ప్రశ్న వినయ విధేయతలతో కూడుకొని, శాస్త్రబద్ధమైనదిగా ఉంటుంది.

నేను ఎంతో వినయముగా అడిగిన ప్రశ్నకు, ఆ స్వామీజీ సమాధానము చెప్పలేక తల తోక లేని జవాబు చెప్పాడు.

అప్పటినుండి నాలో వచ్చిన ప్రశ్నలకు, నేనే జవాబును అనుభవముద్వారాగానీ, పరిశోధనద్వారాగానీ తెలుసు

కోవాలనుకున్నాను. నాలోని మొదటి పెద్ద ప్రశ్న దేవుడెవరు? నాలోని రెండవ ప్రశ్న దయ్యము ఏది? ఈ రెండు ప్రశ్నల

తర్వాత నేనెవరు అను ప్రశ్నమొదలుకొని కొన్ని వందల ప్రశ్నలున్నవి. అవన్నీ తెలియాలంటే, మొదట రెండవ ప్రశ్నవద్దనుండి

ప్రారంభించి తెలుసుకొంటే, పెద్ద ప్రశ్న అయిన దేవుడెవరు అన్నదానికి కూడ జవాబును గ్రహించవచ్చునని అనుకున్నాను.

అందువలన మొదట నా పరిశోధన దయ్యములవద్దనుండి మొదలైనది. ఆ పరిశోధనలో ఎన్నోవందల అనుభవములనుండి

సత్యమును తెలుసుకొన్నాను. ఒక్కొక్క అనుభవములో ఒక్కొక్క జవాబును సేకరించుతూ వచ్చాను. ఈ గ్రంథములో

వ్రాసిన సంఘటనలు, నూటికి ఒకటిని మాత్రము వ్రాశాము. నన్ను మొట్టమొదట స్వామీ అని పిలిచినది మనుషులు

కాదు దయ్యాలు! ఆ రోజుల్లో నేను ఏ గుర్తింపులేకుండ, సర్వసాధారణ మనిషిలాగనే ఉండేవాడిని. పైగా అం

పిలిచినప్పటికి నావయస్సు ఇరవైరెండు (22) సంవత్సరములు మాత్రమే. అలా నా రెండవ ప్రశ్న అయిన దయ్యమంటే

ఏమిటి? అన్నదానికి జవాబు ప్రారంభమై, తర్వాత క్షుద్రదేవతలు, మహా దేవతల వరకు కొనసాగింది. దాదాపు పది

లేక పండ్రెండు సంవత్సరములు సాగిన నా అన్వేషణలో ఎన్నో జవాబులు శాస్త్రబద్దముగా లభించాయి.


ఇంత సత్యమైన విషయమును, హేతుబద్దమైన విషయమును చదువుకొన్న వారందరు అసత్యమనడమేమిటి,

మేము నమ్మము అని అనడమేమిటి, అని యోచిస్తే, వారి మెదడులో సూక్ష్మమును గ్రహించు గ్రాహితశక్తి లేదని

అర్థమగుచున్నది. అందరికి తెలిసిన నవగ్రహములలో బుధగ్రహము యొక్క కిరణములు అతడు పుట్టిన సమయములో

మెదడు లోనికి ప్రాకకపోవడము వలన, సూక్ష్మములైన దయ్యములను గురించి తెలుసుకొనుశక్తి ఉండదు. అందువలన

చాలామంది దయ్యాలులేవు, భూతాలులేవు అంటుంటారు. ఎవరు ఏమనినా, దయ్యాలు అనునవి మరియు దేవతలు

అనునవి రెండు సత్యములే మరియు అనుభవ పూర్వకములే. ఈ గ్రంథములో వివిధ రకములైన సంఘటనలను

వివరించి చెప్పినా, ఇప్పటివరకు నేను దయ్యములనుగానీ, దేవతలనుగానీ ప్రత్యక్షముగా చూడలేదు. ఒక్క దయ్యమును

కూడ చూడనిదే, అన్ని విషయాలు ఎలా వ్రాయగలిగారు అంటే దానికి జవాబు, శరీరమునకున్న స్థూలకన్నులకు

స్థూల ఆకారములే కనిపించును, కానీ సూక్ష్మ ఆకారములు కనిపించవు. శరీరములోపలనున్న సూక్ష్మనేత్రమైన

జ్ఞాననేత్రమునకు సూక్ష్మములు కనిపించును. నాకు కనిపించని దయ్యాలను గురించి, మరియు భూతాలను గురించి

పెద్దగ్రహములను గురించి, నా చేతనే ఈ గ్రంథములో వ్రాయబడి వుంది. ఇంతగా చెప్పినా కొందరు చెప్పినదానిని

గ్రహించలేక, దయ్యాన్ని నాకు చూపిస్తావా? అని అడుగువారు కూడ గలరు. నేను చూచి ఉంటే నీకు చూపగలను,

కానీ నేనే చూడంది, నీకు ఎలా చూపగలను? నేను, నువ్వేకాదు, ఎవరూ చూడలేరు. మనిషి పూర్తి నిద్రలోలేకుండ,

పూర్తి మెలకువలో కూడ లేకుండ ఉండే సమయములో దయ్యాల యొక్క కొంత నమూనా ఆకారము కనపడును. అలా

కనిపించినది స్పష్టముగా కనిపించదు. పూర్తి మెలకువగా ఉన్నప్పుడు ఏ దయ్యమూ ఎవరికీ కనిపించదు.


దయ్యము అను తీగలాగితే పెద్దడొంకే కదిలింది. అందులోనే రోగములు జీవరాసులని బయల్పడినది. అంతేకాక

రోగములనుండి మేఘములవరకు తీగంతా కదిలి కనిపించినట్లయినది. ఇందులో మూడువందల పేజీల వరకు

దయ్యములు, దేవతలను గురించి చెప్పడ మైనది. అంతవరకు దయ్యములు, దేవతల సంఘటనలు ఆసక్తిని కల్గించునవై,

ఎవరికీ తెలియని విషయములెన్నో తెలియబడినవి. మూడు వందల పేజీల తర్వాత చెప్పిన సమాచారములో చాలా

గొప్పదైన జ్ఞానము ఇమిడియున్నది. ఈ గ్రంథము పేరు చూస్తే, ఏదో దయ్యాల విషయములు కాలక్షేపమునకు,

కథలను తయారు చేసి వ్రాసివుంటారు అని కొందరు అనుకోవచ్చును. అలాంటి ఉద్దేశముతో చదువను మొదలుపెట్టిన

తర్వాత, అందులో చెప్పబడినవి అల్లిన కథలుకాదు, జరిగిన సంఘటనలని తెలిసి పోగలవు. ఇంకా ముందుకు

చదివితే, జరిగిన సంఘటనలైనా, ఇవి ప్రొద్దుపోవుటకు (కాలక్షేపమునకు) చెప్పినవికావు, కర్మపోవుటకు (కర్మక్షేపమునకు)

చెప్పిన సమాచారమని తెలియగలదు. మేఘములను గురించి చెప్పిన సమాచారములో, కొంతమాత్రమే మేఘములను

గురించి పరిశోధన చేయు శాస్త్రజ్ఞులకు తెలిసినదని అర్థమైపోవుచున్నది. మేఘముల విషయము ఇంతవరకు శాస్త్రజ్ఞులకు

కూడ తెలియదని, చదివేకొద్దీ తెలిసిపోతుంది. ప్రతి విషయములోను హేతువును వెదకుచు పోవుటవలన, దొరికిన

జవాబులు చాలామంది శాస్త్రజ్ఞుల అంచనాలకు కూడ మించిపోయినవిగా ఉన్నవి. ఈ గ్రంథమును చదివేకొద్దీ,

చివరకు మనకు తెలియని క్రొత్త ప్రపంచము తెలిసినట్లగుచున్నది.


సాయిబాబా మొదలగు మహాత్ములు ప్రజలను ఉద్దరించుటకు, వారిని ఎన్నో ఆపదలనుండి కాపాడుటకు కొన్ని

వందలసంవత్సరములనుండి భూమిమీదనే ఉన్నట్లు, వారు వారి శిష్యులు ఎన్నో మహత్యములను చూపించడము కూడ

జరిగిందని ఈ గ్రంథములో తెలియబడింది. గొప్పవారైన పెనుకొండ బాబా పకురుద్దీన్, పుట్టపర్తి సాయిబాబాగారు

మానవుల శ్రేయస్సుకొరకు ఎన్నో సంవత్సరములనుండి జన్మలు తీసుకోకుండ, ఒకే జన్మలో ఉన్నట్లు కూడ వారి


ద్వారానే తెలియబడింది. మానవుడు ప్రకృతిశక్తుల ముందర బలహీనుడని, యోగులశక్తి ప్రకృతిశక్తుల కంటే బలమైనదని,

అవసరమొస్తే ప్రకృతిని కూడ శాసించగల స్థోమత యోగులకుండునని కూడ ఇందులో తెలియబడింది. అంతేకాక ఈ

గ్రంథములో యోగులను పెద్దగ చెప్పడమేకాక, యోగులకు ప్రకృతిశక్తులేకాక, దయ్యములు, దేవతలు, భూతములు,

గ్రహములు అన్నియు గౌరవమిచ్చునని, కొన్ని చోట్ల యోగులు చెప్పినట్లు నడుచుకొనునని తెలియజేయడ మైనది. ఈ

గ్రంథము వలన, ఇటు ప్రపంచ జ్ఞానము, అటు పరమాత్మ జ్ఞానము తెలియును. అంతేకాక మేము గొప్ప, అన్నీ మాకు

తెలుసు అను నేటి కాలపు హేతువాదులు ఈ గ్రంథమును చదివిన తర్వాత వారు కూడ నిజమైన హేతువును అనుసరించి,

నిజమైన హేతువాదులుగా (సత్య వాదులుగా) మారగలరని అనుకుంటున్నాను.


ప్రపంచ విషయములతో మొదలైన ఈ గ్రంథము చివరకు పరమాత్మ విషయము వరకు తీసుకుపోయినది.

అట్లని ఏదో దేవుని జ్ఞానమును అన్ని పుస్తకములలో ఉన్నట్లు, అందరు స్వాములు చెప్పినట్లు చెప్పివుంటారని అనుకోవద్దండి.

ఇంతవరకు ఎవరూ చెప్పని సత్యమైన దేవుని విధానమును అక్షరాల సత్యమైన పద్ధతిని అందరికి అర్థమగునట్లు చెప్పడము

జరిగినది. ఒక దేశములోని ప్రభుత్వము పరిపాలనా విధానమున్నట్లే, విశ్వమంతటికీ కనిపించని ప్రభుత్వము,

కనిపించనిపాలన ఉందనీ, విశ్వమంతటావున్న కనపించని ప్రభుత్వమునకు, అధిపతి లేక రాజు కనిపించని దేవుడనీ,

దేవుని ప్రభుత్వములోని పాలకులైన అధికారులు ఫలానావారని ఎవరికీ తెలియదని, వారి పాలన ఎంతో బలముతో

కూడుకొన్నదని తెలియుచున్నది. దేవుని పాలకులైన మహాభూతములు, స్వల్పభూతములు, ఉపభూతములు, గ్రహములు

మొదలగునవి నిజాయితిగలవియై పేద, ధనిక బేధము లేకుండ స్వచ్ఛమైన పాలన అందిస్తూ, భూమిమీదనే మనిషికి

స్వర్గమును మరియు నరకమును చూపుచున్నవని తెలుపడమైనది. భూమిమీద గల అన్ని మతమువారు ఎక్కడో పై

లోకములలోగలవని చెప్పుచున్న స్వర్గ, నరకములు అసత్యమనీ, భూమిమీదనే స్వర్గ, నరకములు రెండూగలవని, అవి

దేవుని పాలకులు విధించు ప్రత్యక్ష సత్యములని తెలియని గొప్ప రహస్యములు ఈ గ్రంథము చివరిలో వ్రాయబడినవి.

అందువలన ఈ గ్రంథమును చదవగలిగిన వారికి పాపముయొక్క ఫలితము ఎంత భయంకరముగ ఉంటుందో అర్థము

కాగలదు. అట్లు అర్థమగుట వలన మనిషి కర్మనుండి బయటపడుటకు ప్రయత్నించును. పాపమునుండి బయటపడుటకు

ఒకే ఒక దైవమార్గమును అనుసరించగలడని తలచుచున్నాము.

ఇట్లు,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.



దయ్యాల - భూతాల యదార్థ సంఘటనలు.


దేవుడు అను మాట పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. అయితే కొందరు దేవున్ని విశ్వసిస్తున్నారు, కొందరు

విశ్వసించడము లేదు. విశ్వసించే వారిని ఆస్తికులనీ, విశ్వసించని వారిని నాస్తికులని అనడము జరుగుచున్నది.

వాస్తవానికి ఇటు ఆస్తికులకు గానీ, అటు నాస్తికులకు గానీ దేవుడు తెలియబడలేదు. ఎందుకనగా దేవుడు నిజముగా

లేడు, అబద్దముగా ఉన్నాడు. ఈ మా మాటను బట్టి మీరు కూడా నాస్తికులేనా? అని మమ్ములను మీరు ప్రశ్నించవచ్చును.

దానికి సమాధానము మేము నాస్తికులము ఏమాత్రము కాము, అట్లని ఇప్పుడున్నటువంటి ఆస్తికులము కాము, దేవుడు

అబద్దముగా ఉన్నాడని చెప్పుచున్నాము కదా! అందువలన ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు మధ్యలోనున్నవారమని

గుర్తించుకోవలెను.


దేవునికి రూపము, పేరు పెట్టుకొని అనేక పూజలూ, యజ్ఞ యాగాదులు చేయుచున్న ఈనాటి ఆస్తికులను

మేము ఒప్పుకోము. కావున మమ్ములను నాస్తిక కోవలోనికి కొందరు ఆస్తికులు చేర్చినారు. అయితే మేము దేవున్ని

లేడని చెప్పలేదు కదా! అబద్దముగా ఉన్నాడని చెప్పుచున్నాము కదా! కావున మేము నాస్తికులమెలా అవుతాము?

అందువలన మేము నాస్తికులము కాము. అదే విధముగా దేవుడు లేడని ముందు చెప్పినా చివరిలో అబద్దముగా ఉ

న్నాడనుట వలన నాస్తికులు మమ్ములను ఆస్తికుల కోవలోనికి చేర్చినా మేము వారనుకొన్నట్లు ఆస్తికులము కాము.

దేవుడు నిజముగా లేడని చెప్పుచున్నాము కదా! కావున మమ్ములను ఆస్తికులనుటకు కూడ వీలులేదు. మేము చెప్పు

మాటలు చాలా తికమకగా ఉన్నాయి కదా! ఇంతకూ మీరు ఎవరు అని అడగవచ్చును. దానికి మా సమాధానము

ఏమనగా! మేము నాస్తికులుగా కొందరికీ, ఆస్తికులుగా కొందరికీ కనిపించినా వాస్తవానికి మేము సత్యవాదులము.

సత్యశోధన చేసి చూస్తే దేవుడున్నాడను ఆస్తికులలో దేవున్ని గురించియున్న భావముగానీ, దేవుడు లేడను నాస్తికులలో

దేవున్ని గురించియున్న అవగాహనగానీ వాస్తవానికి దూరముగా ఉన్నాయి. ఆస్తికులు అనుకొన్న భావము ప్రకారము

దేవుడు లేడు. అట్లే నాస్తికులు అనుకొన్న భావము ప్రకారమునకు కూడా దేవుడు లేడు. దీనిని బట్టి దేవుని వాస్తవికత

ఇటు ఆస్తికులకు గానీ, అటు నాస్తికులకు గానీ ఏమాత్రము తెలియదనియే చెప్పవచ్చును.


భూమి మీద ఉన్న శాస్త్రములు మొత్తము ఆరు మాత్రమే. అందులో 1) గణిత, 2) రసాయనిక, 3) భౌతిక,

4) ఖగోళశాస్త్రములు నాలుగు ప్రపంచమునకు సంబంధించినవి కాగా, ఐదవదైన జ్యోతిష్యశాస్త్రము ఇటు ప్రపంచమునకు

అటు పరమాత్మకు సంబంధించి మధ్యలో ఉన్నది. ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము దేవునికి సంబంధించినది.

దీనిని బట్టి శాస్త్రములు మూడు తెగలనీ, నాలుగుశాస్త్రములు ప్రకృతికి సంబంధించిన వనీ, ఐదవది ప్రకృతికీ, పరమాత్మకు

సంబంధించినదనీ, ఆరవది ఒకటి మాత్రము పరమాత్మకు సంబంధించినదని తెలియుచున్నది. ఇంకా కొంత యోచిస్తే

కొందరి దృష్ఠిలో గణిత,రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములు పూర్తి ప్రపంచమునకు సంబంధించినవి కాగా, కేవలము

జ్యోతిష్యశాస్త్రము, బ్రహ్మవిద్యాశాస్త్రము రెండు ఆధ్యాత్మికమునకు సంబంధించినవిగా ఉన్నవి. మరికొందరి దృష్టిలో

బ్రహ్మవిద్యాశాస్త్రము లేనే లేదు. ఇంకా కొందరి దృష్టిలో జ్యోతిష్యము శాస్త్రమే కాదు. అటువంటి వారికి కేవలము

నాల్గు శాస్త్రములే కనిపిస్తున్నవి. ఈ విధముగా కొందరి దృష్టిలో నాలుగూ, కొందరి దృష్టిలో ఐదు, కొందరి దృష్టిలో

ఆరు గలవు. ఆస్తికుల దృష్ఠిలో ఐదు మరియు ఆరుశాస్త్రములు ఉండగా, నాస్తికుల దృష్టిలో కేవలము నాల్గుశాస్త్రములే

గలవు. నాస్తికులు ఆరవశాస్త్రము మీద ఏమి మాట్లాడక మూఢ నమ్మకమనుచు దేవుడే లేడనుచుందురు. అటువంటి


నాస్తికులే జ్యోతిష్యము మీద మాట్లాడుచూ జ్యోతిష్యము శాస్త్రముకాదని, దానిని నిరూపించగలరా అని కోట్లు పందెముతో

సవాళ్ళు విసురుచుందురు.


నాస్తికులకు తెలిసిన గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములు ఈ మధ్య వంద సంవత్సరముల నుండి

అభివృద్ధియై వాటిలోని చాలా విషయములు అందరికి తెలిసినవి. ఈ నాల్గు శాస్త్రముల అనుసంధానము తోనే గత

యాభై సంవత్సరములనుండి మానవుని మనుగడ సుఖవంతము అగుటకు ఎన్నో పరికరములు కనుగొనబడినవి. ఈ

నాల్గుశాస్త్రములను చదివిన మనుషులు, ఈ నాల్గుశాస్త్రముల వలన అభివృద్ధి చెందిన మనుషులు, అంతా మేమే

కనుగొన్నాము, ఇదంతయు మానవుని మేధస్సు వలననే జరిగినది, ఇందులో దేవుని పాత్ర ఏమాత్రము లేదని చెప్పుచూ

పూర్తి నాస్తికులైపోయారు. జ్యోతిష్యము మీదా, బ్రహ్మవిద్యాశాస్త్రము మీదా నమ్మకముకల కొందరు మాత్రము

శాస్త్రములను పూర్తి తెలియకుండినా వాటిమీద నమ్మకముతో ఆస్తికులుగా ఉన్నారు. ఆస్తికులైన వారిలో కొందరు

జ్యోతిష్యము మీదా, కొందరు బ్రహ్మవిద్య మీదా ఆసక్తి కల్గియుండినా వాటిలో పూర్తి పరిశోధన లేక, తెలిసిన కొద్దిపాటి

దానితోనే అంతా తెలిసినట్లు భావించుకొనుచున్నారు. మొత్తము మీద గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళ శాస్త్రములు

పరిశోధించబడి అభివృద్ధి అయినట్లు జ్యోతిష్యముగానీ, బ్రహ్మవిద్యాశాస్త్రములుగానీ శోధించబడలేదు, అభివృద్ధియు

కాలేదు. ఈ రెండు శాస్త్రములలో ఆస్తికులైన వారు భిన్నాభిప్రాయములు కల్గియున్నారు. అందువలన ఎవరికి తెలిసిన

దానిని వారు గొప్పగ చెప్పుకొనుచున్నారు. బ్రహ్మవిద్యా శాస్త్రములో మాకు తెలిసినది సత్యమా కాదా అని యోచించడము

లేదు. చెప్పే దానిలో శాస్త్రీయత ఉందా లేదా అని కూడా అలోచించక ఎవరిది వారు గొప్పగా చెప్పుకొనుచున్నారు.

అందువలన ఈనాడు ఆధ్యాత్మికరంగము అనేక చీలికలతో, అనేక మతములతో, అనేక సాంప్రదాయములతో, అనేక

పేర్లతో, అనేక అచారములతో కనిపిస్తున్నది.


ఈ విధముగా ఆస్తికులు జ్యోతిష్య, బ్రహ్మవిద్యాశాస్త్రములను పూర్తి తెలియక, ఎవరికి తోచినది వారు చెప్పుచుండగా,

అందులోని లొసుగులను గమనించిన నాస్తికులు కొందరు అసలు ఆస్తికవాదమే తప్పు అంటున్నారు. బ్రహ్మవిద్యను

అసలు ఒప్పుకోక దేవుడే లేడంటున్నారు. అటువంటి నాస్తికులలో రెండు తెగలు కలవు. ఒక తెగ హేతువాదులనీ,

మరొక తెగ నాస్తికవాదులని అంటున్నారు. నాస్తికవాదులు వేరు హేతువాదులు వేరని కొందరనినా, వాస్తవానికి

హేతువాదమను పేరుతోనున్నది కూడా నాస్తిక వాదమే. పేరుకు హేతువాదము గొప్పదే, కానీ హేతువాదులు ఎవరూ

లేరు, అంతా నాస్తికవాదులే గలరు. హేతువాదములో పరిశోధనా, పరిశీలనా దృష్టి ఉంటుంది. గ్రుడ్డిగ ఏ దానిని

హేతువాదము కాదనదు. హేతువును (కారణమును) ప్రశ్నించునది హేతువాదము. కారణమునకు జవాబు దొరికినపుడు

దానిని పరిశీలించి సత్యమైతే ఒప్పుకోవడమూ, సత్యము కాకపోతే ఖండించడము హేతువాదములోని ముఖ్య ఉద్దేశ్యము.

అలాకాక విన్న సత్యమును పరిశీలించకనే ఖండించడమే తమ పని అయినట్లు వాదించడమును నాస్తికవాదమే అనవచ్చును.

ఇటువంటి నాస్తికవాదముంది గానీ హేతువాదములేదు, లేదనడానికి ఒక ఉదాహరణగా ఒక యదార్థ సంఘటనను

చూస్తాము.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములో గుంతకల్లు, గుత్తి అను రెండు ఊర్లమధ్యలో రైల్వేట్రాక్

ప్రక్కనే ఒక చిన్న పల్లెటూరు గలదు. ఆ ఊరిలో అందరూ కష్ట జీవులే. మగవారంతా వ్యవసాయములో నిమగ్నమవగా,

స్త్రీలు కొందరు పాలు, పెరుగును ఐదు కిలోమీటర్ల దూరములోనున్న గుత్తికి తీసుకొని పోయి అక్కడ అమ్ముకొని

జీవనము సాగించుచుందురు. అ పల్లెవాసులకు తెలుగు భాష తప్ప ఏ భాష తెలియదు. తెలుగు భాష కూడా


స్పష్టముగా కాకుండ ఆ ప్రాంతమునకు తగినట్లు కొంత యాసగా ఉండేది. ఆ ఊరి ఆడవారు కొందరు గుంపుగా

ఉదయాన్నే బయలుదేరి రైల్వేట్రాక్ వెంట నడుచుకుంటూ పోయి పాలు, పెరుగు అమ్ముకొని రావడము నిత్యము చేయు

పనిగా ఉండెడిది. ఒక దినము సాయంకాలము నిత్యము గుత్తికి పోయి వచ్చు వారిలో దాదాపు ముప్పై సంవత్సరముల

వయస్సున్న ఒక స్త్రీ ఉన్నట్లుండి తమిళ భాష మాట్లాడడము మొదలు పెట్టింది. ఆ భాష ఆ ఊరిలో ఎవరికి తెలియని

దానివలన వారికి ఏమి అర్థముకాక తికమక పడిపోయారు. ఆమె దాదాపు ఒక గంట కాలము తమిళభాష మాట్లాడిన

తర్వాత తిరిగి యథాస్థితికి వచ్చి, మామూలుగా తెలుగు భాష మాట్లాడడము జరిగినది. అంతవరకు తెలుగు మాట్లాడకుండ

తమిళమును మాట్లాడము, తమను క్రొత్తవారిని చూచినట్లు చూడడము చేశావు, అలా ఎందుకు చేశావు? తమిళమును

ఎలా మాట్లాడగలిగావు? అని ఆమెను ప్రక్కనున్నవారు ప్రశ్నించారు. దానికి ఆమె నేను అలా చేశానా! అని ఆశ్చర్యముగా

వీరినే అడిగిందట. నేను గంటసేపు నిద్రపోయినట్లయిందని, కానీ నేను ఏమి మాట్లాడినది నాకు తెలియదని చెప్పినది.

అందుకు ప్రక్కవారు ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగక ఆమె అప్పుడపుడు క్రొత్తగా ప్రవర్తించడము, అలాంటి

సమయములో తెలుగు ఏమాత్రము తెలియనట్లు ప్రవర్తించడము, తమిళములో మాట్లాడడము జరుగుచుండెడిది. ఆమె

ఎందుకు అలా చేయుచున్నదో చేయుచున్నదో ఆ ఊరి వారికి అర్థముకాక, తమిళభాష వచ్చు వ్యక్తిని పిలుచుకువచ్చి, ఆమె క్రొత్తగా

ప్రవర్తించి తమిళము మాట్లాడునపుడు, పిలుచుకు వచ్చిన తమిళ వ్యక్తితో మాట్లాడించారు. అపుడు ఆమె తమిళములో

చెప్పిన విషయమును ప్రక్కవారికి ఆ వ్యక్తి తెలుగులో చెప్పడము జరిగినది.


అప్పటికి ఐదు సంవత్సరముల పూర్వము ఉదయము 7-30 గంటల సమయములో మద్రాస్ ఎక్స్ప్రెస్లో

ప్రయాణించు తమిళనాడు నివాసి అయిన మాధవన్ అను వ్యక్తి, బ్రష్ తో పళ్ళు తోముకుంటూ డోర్ ప్రక్కన

నిలబడియున్నపుడు స్పీడ్గా పోతున్న రైల్ బోగీ కదలికకు బ్యాలెన్స్ తప్పి ట్రైన్లోనుండి క్రిందపడి చనిపోవడము

జరిగినది. ఆ వ్యక్తి క్రింద పడడము చూచిన అతని బంధువులు ట్రైన్ను ఆపి అతని శవాన్ని తీసుకు పోవడము

జరిగినది. అది జరిగిన తర్వాత ఐదు సంవత్సరములకు ఆ రోజు చనిపోయిన మాధవన్ ఆ పల్లెటూరి ఆడ

మనిషిలోనుండి మాట్లాడము జరిగినది. ఆ విషయమంతా చనిపోయిన మాధవన్ తమిళములో చెప్పితే వచ్చిన తమిళ

వ్యక్తి విని ప్రక్కవారికి తెలుగులో చెప్పడము జరిగినది. చనిపోయిన మాధవన్ రైల్వేట్రాక్ ప్రక్కనేయుండి ఆ దారి

వెంటపోవు ఆడ మనిషి శరీరములో చేరిపోయి అప్పుడప్పుడు బయటికి వచ్చి మాట్లాడము జరిగెడిది. ఈ విషయమును

విన్న వారికి చనిపోయిన వ్యక్తి మాట్లాడడ మేమిటని ప్రశ్నరావచ్చును. ఇది సంభవమేనా? అని కొందరికి ప్రశ్నవచ్చి

నది. అది జరిగేపనికాదని అనుకొనుటకు భాషరాని ఆడమనిషి తమిళ భాష మాట్లాడము ప్రత్యక్షముగా కనిపిస్తున్నది

కదాయని మరియొక ప్రశ్న వచ్చుచున్నది. ఈ విషయమును గురించి కొంత వివరముగా తెలుసు కోవాలని ఒక

హేతువాది దగ్గరకు పోయి జరుగుచున్న విషయమంతా వివరించి చెప్పితే అతను అదొక రోగము, ఆ జబ్బు ఉన్నపుడు

కొందరు తమకు తెలియకుండానే వేరే భాష మాట్లాడుదురని చెప్పడము జరిగినదట.


ఇక్కడ జరిగిన విషయము స్పష్టముగా ఉన్నప్పటికి ఆ విషయమును పరిశీలనగా చూడక, దానికి హేతువేమి

అని వెతకక, అదొక జబ్బని సరిపుచ్చుకోవడము హేతువాదమౌతుందా? ఒక విషయాన్ని డేగ కన్నులాగ చూడునది

హేతువాదము. పై సంఘటనలో రోగము వలన క్రొత్త భాష వస్తుందా? అని ప్రశ్నించుకొని చూడడము హేతువాద

మౌతుంది. గంటసేపు మనిషికి జ్ఞప్తికి ఎందుకు లేదు? అని ప్రశ్నించు కోవడము హేతువాదము అవుతుంది. ఆ

గంటసేపు క్రొత్త మనిషిగా ఎందుకు ప్రవర్తించినదని ప్రశ్నించుకొని యోచించడము, పరిశోధనా దృష్ఠితో చూడడము


హేతువాదం అవుతుంది. ఈ విధముగా ఈ సంఘటనలో ముఖ్యమైన మూడు కారణములకు (హేతువులకు) జవాబులను

వెదికి, వాటికి సరియైన జవాబు దొరికినపుడు దానిని హేతుబద్దముగా అంగీకరించ వలసివస్తుంది. అలాకాక ఏ

ప్రశ్నకు సరియైన జవాబు, సమాధానము లేనపుడు అది అసత్యమనీ, హేతుబద్దముకాదనీ, దానిని హేతువాదము

ఒప్పుకోదని చెప్పవలసి యుంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ సంఘటన ఒక జబ్బని, రోగము ముసుగులో

దానిని కప్పిపుచ్చడము నిజమైన హేతువాదముకాదు. అలా చెప్పడమును అసంబద్ధత హేతువాదము అనవచ్చును,

అసంబద్ధత హేతువాదము అంటే అది సరియైన హేతువాదము కాదని అర్థము. అది ఒక రోగమని అంటే నిజమైన

హేతువాది దానిమీద ఇలా ప్రశ్నించగలడు. రోగము అంటే ఆ లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడు గంటసేపే ఎందుకు

వస్తున్నాయి? ప్రపంచములో ఏ రోగమువలనైనా క్రొత్త భాష వస్తుందని నిరూపణ గలదా? ఆ రోగమునకు తమిళభాషకు

సంబంధమేమి? ఆ కొద్దిసేపు పాత భాష ఏమైంది? తెలియని భాష అదియు ఒకే భాష ఎలా వచ్చినది? ఆ కొద్దిసేపు

పాత మనిషి ప్రవర్తన పోయి క్రొత్త వ్యక్తి ప్రవర్తన ఎలా వచ్చినది? కనిపించేది ఆడమనిషి, చెప్పేది మగ మనిషి పేరు.

అదియు మాధవన్ అను ఒకే పేరు చెప్పడమునకు కారణము ఏమిటి? ఆ సమయములో మాట్లాడు మగ మనిషి నేను

పలానా వాడిని, పలానా విధముగా చనిపోయాను, నా అడ్రస్ తమిళనాడులో పలానా స్థలమని చెప్పితే, ఆ మాటను

ఏమాత్రము లెక్కించక ఆ మాట సత్యమా, అసత్యమా అని ఎందుకు చూడలేదు. అప్పుడు జరిగినది రోగమనుకొనుటకు

శరీరములో ఏ లోపముతో లేక ఏ క్రిములతో ఆ రోగము వస్తున్నది? ఆ రోగమునకు నిరూపణ ఏమైనా ఉన్నదా? ఇలా

ఇన్ని ప్రశ్నలను హేతు బద్దముగ అడుగవలసి వస్తుంది. ఇన్ని ప్రశ్నలకు జవాబు లేకుండా రోగమను గ్రుడ్డి సాకుతో

తప్పించుకొనువారు, మేము మేధావులము అని చెప్పుకోవడము తప్పుకాదా? ప్రశ్నలకు జవాబు చెప్పలేని నకిలీ మేధావులు

మన జనాభాలో చాలామందియున్నారు. అటువంటి వారిని వదలి అసలైన మేధస్సు ఎలా ఉంటుందో గమనిస్తాము.


ఒక మనిషి ఆరు శాస్త్రములతో సంబంధపడియుంటాడు. కానీ చాలామంది మేధావులని పేరుగాంచిన వారు

మనిషిని మొదటి నాలుగు శాస్త్రములతోనే చూస్తున్నాడు. అటువంటివారు మా దృష్ఠిలో సంపూర్ణ మేధావులు కారు.

మనిషిని ఆరు శాస్త్రములకు వర్తింపజేసుకొని చూస్తేనే మనిషికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకును.

అన్ని జవాబులు తెలిసినవాడే నిజమైన మేధావి. తెలియకున్నా తెలిసినట్లు చెప్పుకొనుచు తెలియని జవాబులను సైన్సు

పేరుతో దాటవేయుచు తాము విజ్ఞానులమని చెప్పుకొన్నంత మాత్రమున వారు విజ్ఞానులౌతారా? ప్రపంచమునకు

సంబంధించిన నాలుగు శాస్త్రములను నేర్చినంతమాత్రమున ఎవడూ మేధావి కాడు. ఆరవశాస్త్రమును తెలిసినవాడు

ఎవడైన మేధావి కాగలడు. నాలుగు శాస్త్రములను తెలిసినవాడు నేను దయ్యములను నమ్మను, దయ్యములున్నాయనుట

మూఢనమ్మకము అంటున్నాడు. తెలియకనే ఉన్నాయనడము ఎవనికైనా మూఢనమ్మకమే, కానీ తెలిసి ఉన్నాయంటే

మూఢ నమ్మకమెలా అవుతుంది? ఇపుడు ఆరవశాస్త్రము ప్రకారము దయ్యాలు ఉన్నాయా అను ప్రశ్నకువస్తే నూటికి

నూరుపాల్లు ఉన్నాయని చెప్పవచ్చును. గుత్తి దగ్గర జరిగిన యధార్థసంఘటనలోని అనేక ప్రశ్నలకు ఆరవ శాస్త్రమును

తెలిసినవానికే జవాబులు తెలియును.


ఆరవ శాస్త్రము ప్రకారము గమనిస్తే మనిషి శరీరము రెండు భాగములుగా ఉన్నది. దీని ప్రకారము మనిషి

మరణము కూడ రెండు రకములుగా ఉన్నది. ఒక మనిషి చనిపోతే మన లెక్కలో వాడు పూర్తిగా తెలియ కుండపోయినట్లే.

చనిపోయిన వాడు ఎక్కడ కనిపించడు, తిరిగి మాట్లాడడు. ఇక్కడ మరణించుట లేక చనిపోవుట అంటే శరీరము

యొక్క రెండు భాగములు పూర్తిగా మరణించడమని అర్ధము. ముఖ్యముగా గమనిస్తే ఇక్కడ చాలామందికి అనగా


సాధారణ వ్యక్తులకు గానీ, మేధావులకు గానీ శరీరము స్థూల, సూక్ష్మ అను రెండు భాగములున్నదనియు, మరణములో

కాల,అకాల అని రెండు రకముల మరణములున్నవనియు తెలియదు. స్థూల, సూక్ష్మ శరీరములను గూర్చిగానీ, కాల,

అకాల మరణములను గూర్చిగానీ తెలియక పోవడమే మనిషి మేధస్సుకు పెద్దలోటు. ఏ మనిషికైనా తన శరీరమును

గూర్చిగానీ, తన మరణమును గూర్చిగానీ తెలియనపుడు అతను దేశములో ఎంత పెద్ద హెూదాలో ఉండినా, ఎంతో

పెద్ద మేధావి అయినా ఏమి ప్రయోజనము? బయట విషయములు ఎన్ని తెలిసినా తన విషయము తనకే తెలియనపుడు

అతను మేధావి అవుతాడా? మీరే చెప్పండి.


ఇంటగెలిచి రచ్చగెలిచిన వాడే శూరుడు అని పెద్దలు ఒక సామెత (సమత)ను చెప్పేవారు. దాని వివరమేమనగా!

మొదట తన శరీరములోని రహస్యమును తెలుసుకొని తర్వాత బయటి ప్రపంచములోని రహస్యమును తెలిసినవాడు

మేధావి అని భావము. ఇల్లు అనగా శరీరమని, రచ్చ అనగా బయటి ప్రపంచమని, గెలువడమనగా రహస్యములను

తెలియడమని, శూరుడు అనగా మేధావి అని అర్థము. అలాగే ఇంకొక సామెత కూడ కలదు. అదేమనగా “మీసము

త్రిప్పినవాడు వీరుడు కాడు, శూలము పట్టినవాడు శూరుడు కాడు” దీని అర్థము ఏమనగా! పుస్తకము చదివినంత

మాత్రమున జ్ఞానికాడు, ప్రయోగము చేసినంతమాత్రమున విజ్ఞానికాడని భావము. దీనినిబట్టి చదువులు

చదివినంతమాత్రమున జ్ఞానులూ కాలేరు, సైన్సు నేర్చినంతమాత్రమున విజ్ఞానులూ కాలేరని తెలియుచున్నది. ఇక్కడ

కొన్ని ప్రశ్నలు రావచ్చును. అదేమనగా! చదువు లేక విద్య అంటేనే జ్ఞానము కదా! అలాగే సైన్సు అంటేనే విజ్ఞానము

కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! చదువు అంటే జ్ఞానము, సైన్సు అంటే విజ్ఞానము

అనుమాట వాస్తవమే. కానీ శరీరమునకు బయట ఉన్న వాటిని జ్ఞానము, విజ్ఞానము అనుకోవడము పొరపాటు.

చదువు, సైన్సు అన్నీ శరీరములోపల నుండి మొదలౌతాయి. శరీరములోపలే జ్ఞానము, విజ్ఞానము కలవు. శరీరమునుండి

కాక బయటినుండి సంపాదించుకొన్న జ్ఞానము విజ్ఞానము ఎంత అయినా దానిని జనరల్ నాలెడ్జ్ (సాధారణ జ్ఞానము)

అంటాము. జనరల్ నాలెడ్జిలో కేవలము నాలుగు శాస్త్రముల జ్ఞానము మాత్రముండును. శాస్త్రముల గురించి తెలియని

వానిని నాలెడ్జి లేని వాని క్రిందికి లెక్కగట్టుచుందురు. దీనినిబట్టి నాలుగు శాస్త్రములను తెలియని వానిని జ్ఞానము

లేనివాడనీ, నాలుగు శాస్త్రముల పరిచయమున్న వానిని సాధారణ జ్ఞానము గలవాడని తెలియుచున్నది. ఇక ఆరవ

శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలిసిన వానిని గ్రేట్ నాలెడ్జి లేక సూపర్ నాలెడ్జి గలవాడని చెప్పవచ్చును. దానినే

తెలుగులో అంతులేని జ్ఞానమనీ, అసాధారణ జ్ఞానమని, గొప్ప జ్ఞానమని చెప్పవచ్చును. మొదటి నాలుగు శాస్త్రముల

జ్ఞానము సాధారణ జ్ఞానముకాగా, ఐదవశాస్త్రమైన జ్యోతిష్యము మధ్య జ్ఞానముకాగా, ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము

అసాధారణ, అంతులేని, అమోఘమైన జ్ఞానమగుచున్నది. ఇక్కడ సాధారణ, అసాధారణమునకు మధ్య జ్ఞానమైన

జ్యోతిష్యమును వదలివేసి సాధారణ జ్ఞానమును గురించి చెప్పుకొంటే అది అంతయు కంటికి కనిపించు విధానముగా

ఉండును. సాధారణ జ్ఞానము వలన తయారు చేయబడిన ఏ పరికరముగానీ తయారు చేసినవానికే కాక ఇతరులకు

కూడ ఉపయోగపడగలదు. నాలుగు శాస్త్రముల జ్ఞానము శరీరము బయటి ఐదు ఇంద్రియములకు తెలియబడునదై

ఉండుట వలన ఎవరికైనా నిరూపణకు రాగలదు. ఉదాహరణకు ఒక రేడియోను తీసుకొందాము. ఇటలీ దేశములో

“మార్కోని” అను వ్యక్తి 1866లో మొదట రేడియోను కనుగొనడము జరిగినది. రేడియో సాధారణ జ్ఞానము కావున

అది కనిపెట్టిన వానికేకాక ప్రక్కనున్న మనుషులకు, ఇతర దేశముల వారికి, ఇతర కాలముల వారికి ఉపయోగపడుచున్నది.

రేడియో నాలుగు శాస్త్రములకు లోబడి ఉన్నది కావున దానిని సాధారణ జ్ఞానము అంటున్నాము. సాధారణ జ్ఞానము

అనునది సూత్రము ప్రకారము శరీరము యొక్క బయటి ఇంద్రియముల ద్వారా తెలియబడును. కావున కనిపెట్టిన


మార్కోనికేగాక, ఇంద్రియములున్న అందరికి తెలియుచున్నది, అనుభవానికి వస్తున్నది. "ఇంద్రియముల చేత చేయబడినది

ఇంద్రియములకే తెలియును” అన్నది సూత్రము. ఆ సూత్రము ప్రకారము ఇంద్రియ జ్ఞానము సాధారణ జ్ఞానముగా

లెక్కించబడుచున్నది. "కనిపించని ఇంద్రియముల చేత కనుగొనబడి కనిపించే ఇంద్రియములకు తెలియని దానిని

అసాధారణ జ్ఞానము అంటాము.” ఈ సూత్రము ప్రకారము కనిపించే జ్ఞానము, కనిపించని జ్ఞానమని రెండు తెగలుగా

జ్ఞానమును విభజించుచున్నాము. కనిపించే దానిని స్థూలము అంటాము. కనిపించని దానిని సూక్ష్మము అంటాము.

కనిపించే జ్ఞానమునూ మరియు కనిపించని జ్ఞానమునూ తెలిసినవాడు అసలైన మేధావి అవుతాడు. కనిపించే విధానము

యొక్క జ్ఞానమును మాత్రము తెలిసి, కనిపించని విధాన జ్ఞానమును తెలియని వానిని పూర్తి జ్ఞానమున్నవానిగ

లెక్కించకూడదు. అటువంటివానిని సగము జ్ఞానమున్న వానిగ లెక్కించవలెను. అందువలన అటువంటి వానిని ఆఫ్

నాలెడ్జి గల వానిగ చెప్పవచ్చును. పూర్తి నాలెడ్జి సూక్ష్మమును తెలియజేయు ఆరవ శాస్త్రమును తెలిసినవానికే తెలియును.


భూమి మీద శాస్త్రములు ఎన్ని ఉన్నాయనీ, అవి ఏవియని తెలియని మనిషి సైన్సు అను పేరును అడ్డము

పెట్టుకొని, తనకు సర్వము తెలుసునన్నట్లు మాట్లాడుచు, సూక్ష్మమును గురించి ఏమాత్రము జ్ఞానములేని వాడై వాస్తవానికి

దయ్యములు లేవు అనుచుండును. దయ్యములున్నట్లు కొందరు అభూతకల్పన చేయుచున్నారనీ, అవన్నియు

రాతియుగపునాటి మాటలనీ, నాగరికత పెరిగి సైన్సు అభివృద్ధి అయిన ఈ కాలములో దయ్యములున్నాయనుట

అనాగరికపు మాటయని చెప్పుచుందురు. తాము ఎంతో మేధావులమని దయ్యములున్నవనుట మూఢనమ్మకమనుచుందురు.

దయ్యములున్నాయనువారు నిరూపించగలరా? అని ప్రశ్నించుచుందురు. దానికి మా సమాధానము ఏమనగా! కంటితో

చూచే దృశ్యములు ఉంటాయి. అలాగే చెవితో వినే శబ్దములుంటాయి. కంటితో చూచే దృశ్యములను దృష్ఠియున్నవాడు

మాత్రమే చూడగలడు. చెవులతో వినే శబ్దములను వినికిడియున్నవాడు మాత్రమే వినగలడు. కళ్ళుండి చూపు లేనివాడు

దృశ్యములను చూడలేడు. అలాగే చెవులుండి వినికిడి లేనివాడు వినలేడు. శబ్దమును అలాగే దయ్యములు సూక్ష్మ

జ్ఞానదృష్ఠియున్న వానికి మాత్రమే తెలియగలవు. కళ్ళుండి గ్రుడ్డివాడు దృశ్యమును చూడలేనట్లు, చెవులుండి చెవిటివాడు

శబ్దమును వినలేనట్లు ఆరవశాస్త్రముయొక్క శాస్త్రీయత తెలియనివాడు పూర్తి మేధస్సు లేనివాడై సూక్ష్మమును గ్రహించ

లేడు. నాల్గుశాస్త్రములలో తాను ఎంత ప్రవీణుడైనా సగము జ్ఞానము కలవాడే! కనుక వాడు ప్రపంచములో హేతువాది

అయినా, సత్యవాది అయినా సూక్ష్మమును గ్రహించు స్థోమత వాని మెదడుకుండదు. అటువంటపుడు తనకు తెలియని

వాటిని లేదనడము సహజమే, కానీ వానికి తెలియనంత మాత్రమున ఉన్నది లేకుండా పోవునా?




ఇక్కడ కొందరికి మరియొక ప్రశ్న రాగలదు. అదేమనగా! “గణిత, రసాయనిక, భౌతిక, ఖగోళశాస్త్రములలో

విజ్ఞులై శాస్త్రజ్ఞులని పేరుగాంచిన ఎంతో తెలివైన వారికి కూడా తెలియని సూక్ష్మములున్నాయనీ, వారికి తెలియనంత

మాత్రమున ఉన్నవి లేకుండా పోవునా అంటున్నారు కదా! అలా దయ్యములుంటే నాలుగు శాస్త్రములలో ఆరితేరిన

వారు తెలుసు కొనుటకు అవకాశమే లేదా?” అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాలుగుశాస్త్రములు

తెలిసి దయ్యములు లేవు అనువారు కూడా తెలుసుకొనుటకు రెండే రెండు అవకాశములు గలవు. ఒకటి మాకు

అంతా తెలుసునని గోడ కట్టుకొనియుండక, తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంది అని పరిశోధన దృష్ఠితో ఆరవ

శాస్త్రమును తెలుసు కోవడము వలనా, రెండు కనిపించని దయ్యములు కనిపించెడి మనుషులలో ప్రవేశించి గానీ,

ప్రవేశించకగానీ చేసిన పనులు ప్రత్యక్షముగా కనిపించి నపుడు, జరిగిన ఆ పనుల వెనుకయున్న సత్యమును తెలుసుకొనుట

వలనా సూక్ష్మములైన దయ్యములను గురించి తెలియును.


మీ మాటను ఆలకించి ఆరవశాస్త్రమును తెలుసుకోగలము, ఆ శాస్త్రము ఏది అని ఎవరైనా అడిగితే మీకు

దగ్గరగా సులభముగా అర్థమగుటకు మాచే రచింపబడిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”యే ఆరవ శాస్త్రమని చెప్పుచున్నాము.

భగవద్గీత సంపూర్ణమైన ఆరవశాస్త్రముగా ఉన్నది. సిద్ధాంతమును ఆధారముగా చేసుకొని చెప్పబడినది "త్రైత సిద్ధాంత

భగవద్గీత”. కావున పరిశోధనా దృష్టికలవారికీ, ప్రశ్నించు వారికీ అన్ని రకముల జవాబులతో కూడినది త్రైత సిద్ధాంత

భగవద్గీత. త్రైత సిద్ధాంత భగవద్గీతను పూర్తిగా చదివిన తర్వాత సంపూర్ణ మేధస్సు అంటే ఏమిటో అప్పుడు అర్థము

కాగలదు.


రెండవ విధానము ప్రకారము దయ్యములు వాటి యదార్థసంఘట లను గూర్చి యోచించినపుడైన దయ్యములను

గురించి తెలియుటకు అవకాశము గలదు. వాటిని తెలుపుటకే భూమి మీద అక్కడక్కడ జరిగిన సంఘటనలను గూర్చి

మీకు ఈ గ్రంథము ద్వారా తెలుపుచున్నాము. ఎవరో చెప్పినవికాక నేను స్వయముగా చూచిన సంఘటనలను

మాత్రమే ఈ పుస్తకములో వివరించగలిగాము. దీనివలన మీకు మేదస్సు పెంపొందగల దాని అనుకొనుచున్నాము. ఈ

గ్రంథము వలన మాకు కలిగే ప్రయోజనము ఏమిటని కూడ కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఒక

మనిషి పరుగు పందెములో పాల్గొని పరుగిడుచున్నపుడుగానీ, లేక ప్రయాణము చేయుచున్నపుడుగానీ ఆ వ్యక్తిని ఎంత

దూరము పరుగెత్తావు అని అడిగినా లేక ఎంత దూరము ప్రయాణించావు? అని అడిగినా బయలుదేరిన స్థలమునుండి

ఎంత దూరమైనది లెక్కించుకొని చెప్పును. ఇక్కడ ముఖ్యముగా తాను ఎక్కడ బయలుదేరాడో, బయలుదేరిన వ్యక్తికి

తెలిసియుండాలి. బయలుదేరిన స్థలమును మరచిపోతే తాను ఎంత దూరము ప్రయాణించినది తనకే తెలియదు.

అలా మరిచిపోయిన వానిని తెలివితక్కువవాడని అంటాము. మధ్యదారిలో చాలా తెలివిగా ప్రయాణించినా, ఎత్తు

పల్లములను ఎంతో తెలివితో సులభముగా దాటి పోతున్నా మొదట బయలుదేరిన స్థలమును మరిచిపోయిన వానిని

మతిలేని వానిగానే లెక్కించాలి. ఒకడు బయలు దేరిన చోటును మరచి పోయినట్లు, ప్రస్తుతకాలములో మేము

మేధావులమనుకొనువారు శరీరములోపల తాను ఎక్కడ నుండి బయటి ప్రపంచములో వ్యవహరిస్తున్నానని తెలియక,

తన స్వస్థలమునే తాను మరిచి పోయి, బయట బాగా మేధస్సు కల్గినవారమని, హేతువాదులమనీ, జన వేదికవారమని,

ప్రజావేదికవారమని, విజ్ఞానులమని చెప్పుకోవడము చూస్తే బావిలో కప్ప నాకు కనిపించేదే ప్రపంచమన్నట్లున్నది.


ప్రపంచములో కొందరు ఏ విషయమైన తర్కించడమూ, దానిని కాదనడమూ తమ పనిగా పెట్టుకొన్నారు.

అటువంటి వారు కేవలము భౌతికమును మాత్రము సత్యమనీ, అభౌతికము పూర్తి అసత్యమనీ వాదించు చుందురు.

భౌతికము స్థూలముతో కూడుకొన్నది, అభౌతికము సూక్ష్మముగా ఉన్నది. అటువంటి భౌతికవాదులు, అభౌతికమైన

సూక్ష్మమును ఒప్పుకోరు. అభౌతికము అసత్యమనుటకు మొదటి నాలుగు శాస్త్రములను ఆధారము చేసుకొని

మాట్లాడుచుందురు. సూక్ష్మమైన అభౌతికము ఆ నాలుగు శాస్త్రములకు సంబంధించినది కాదని వారికి తెలియదు.

అటువంటి వారికి భూమిమీద షట్శాస్త్రములున్న విషయము కూడ తెలియదు. నిర్ధిష్టముగా ఇన్ని శాస్త్రములున్నాయని

చెప్పలేనివారు, తమకు తెలిసిన విషయములన్నిటిని శాస్త్రములనుచుందురు. భౌతికవాదులైన వారు భూమి మీదున్న

కొందరు మోసగాళ్ళునూ టక్కుటమారా విద్యలను మహత్యములుగా చెప్పుకొనువారిని చూపిస్తూ ఇదంతా మోసమని

చెప్పుచుందురు. టక్కు టమారా విద్యలు ఇతరులను మభ్యపెట్టునవే కానీ సత్యములుకావని మేము కూడ చెప్పు

చున్నాము. టక్కుటమారా విద్యలను చూచి మంత్రములను, మంత్రశక్తిని లేదనుట సరియైన తెలివికాదు. మంత్రముల

పేరు చెప్పి ఎవరో మోసము చేసినంతమాత్రమున సూక్ష్మమైన మంత్రశక్తిని లేదనడము పొరపాటు. ఈ మా మాటలు


కొందరికి అనాకగరికముగా కనిపించవచ్చును, మోస పూరితముగా కనిపించవచ్చును, అసత్యవాదనగా కూడా

కనిపించవచ్చును. ఇక్కడ గమనించవలసినది ఏమనగా! మా ఆదాయము మంత్రాల మీద ఆధారపడివుంటేనో, దయ్యాల

మీద ఆధారపడివుంటేనో మీరు అలా అనుటకు అవకాశము గలదు. కానీ నేను ఆ పనులు ఎప్పుడూ చేయలేదు.

వాటి మీద ఆధారపడి బ్రతకలేదు. వాటిని గురించి సమర్థించడములో నాకు ఎటువంటి లాభమూ లేదు. ఇది కేవలము

మేధస్సుకు సంబంధించినదీ, శాస్త్రబద్ధమైనదీ కావున చెప్పవలసి వచ్చినది. అందువలన హేతువాదులూ, ప్రజా విజ్ఞాన

వేదికలు పెట్టుకొన్నవారూ, మేము చెప్పు విషయములను కూలంకషముగా చూడవలెనని కోరుచున్నాము.


మనిషి అనగా కనిపించెడు శరీర భాగములతో కనిపించని జీవుడూ, అలాగే కనిపించని జీవునికి సంబంధించిన

కొన్ని భాగములూ అని అర్థము. శవము అనగా కనిపించెడి శరీరము మాత్రమేనని అందులో కనిపించని జీవుడుగానీ,

కనిపించని జీవునితో సంబంధపడియున్న కొన్ని భాగములు గానీ లేవని అర్థము. దయ్యము అనగా కనిపించని

జీవుడు, వానికి అనుబంధముగా ఉన్నవి మాత్రమేనని, కనిపించెడి శరీరముకాదని అర్థము. ఇంకా వివరముగా

చెప్పుకొంటే ఒక మనిషి అనగా కనిపించే పది (10) భాగముల శరీరమూ మరియు కనిపించని పదిహేను (15)

భాగముల జీవుడు వాని అనుబంధమని అర్ధము. శవము అంటే కేవలము కనిపించే పది భాగములేనని అర్ధము.

దయ్యము అంటే కేవలము కనిపించని జీవుడూ వాని అనుబంధము మొత్తము పదిహేను భాగములని అర్థము. దీనినిబట్టి

ఒక మనిషి అనగా 25 భాగములతో కూడుకొన్న కదలెడు శరీరమనీ, శవము అనగా కేవలము 10 భాగములతోనున్న

కదలని శరీరమనీ, దయ్యము అనగా కేవలము 15 భాగములతో కూడుకొన్న కనిపించని సూక్ష్మ శరీరమని అర్థము. ఈ

వివరము తెలియకపోతే దయ్యములను గూర్చి ఎవరూ తెలియలేరు.


ఈ వివరము తెలియని వారికి దయ్యములను గురించి ఏమాత్రము తెలియదు. అందువలన వారు దయ్యములు

లేవు అనుచుందురు. దయ్యములు లేవు అనువాడు తాను జీవుడననిగానీ, కనిపించకుండా వుండి తనకు సహాయపడు

14 భాగములు తన శరీరములో ఉన్నవనిగానీ తెలియదు. బయట ఎంత విజ్ఞానమును పెంచుకొన్న పెద్ద సైంటిస్టయినా

తన జ్ఞానమే తనకు తెలియకపోవడము వలన అతనిని అజ్ఞాని అని అనవచ్చును. దీనిప్రకారము ఇప్పటి కాలములో

బయటి మేధావులను, శాస్త్రవేత్తలను తమ అడ్రస్ తమకే తెలియనివారిగా, తమ స్వంత స్థలమేదో తమకే తెలియని

వారిగా లెక్కించవచ్చును. తమ శరీరములో తమ చిరునామా ఏమిటో, తమ ఆకారమేమిటో, తన సహచరులెవరో

తెలియని వీరా మేధావులు? దానికి జవాబుగా కాదనియే చెప్పవచ్చును. ఇటువంటి వారే దయ్యములున్నాయని నిరూపిస్తారా?

అని మమ్ములను అడుగవచ్చును. మీకు కనిపిస్తే నిరూపణకు రాగలవు, కానీ దయ్యములు కనిపించనివి కదా! కావున

వారికి నిరూపణకు రావు. కళ్ళున్నవాడే చూడగలడు, కళ్ళు లేనివాడు చూడలేడు అను సూత్రము ప్రకారము జ్ఞాననేత్రము

లేనివారికి దయ్యములు తెలియవు. అందువలన వాటిని మీకు ప్రత్యక్షముగా చూపకున్ననూ వాటి పనులను వివరించుచూ

ఎవరైనా తెలుసుకొనుటకు అవకాశము కల్గునట్లు ఈ గ్రంథమును వ్రాయవలసి వచ్చినది.


మొదట నేను చెప్పునదేమనగా! ఇప్పటి వరకు ఇక్కడ వ్రాసిన విధానమును బట్టి నన్ను ఒక ఆస్తికునిగా

చాలామంది హేతువాదులూ, నాస్తికవాదులూ లెక్కించియుంటారు. అట్లే మా బోధలు విన్నవారూ, మా విధానమును

చూచిన దేవతా భక్తులూ, ఆస్తికులూ, మతప్రచారకులు మొదలగువారు నన్ను నాస్తికుడు అన్నారు. ఇలా మా

సత్యవాదము అర్థముకాక కొందరు నీది ఏ మతము అని అడిగినవారు కూడ కలరు. భగవద్గీతను వివరించి చెప్పుతుంటే


అర్థముకాకనో, అసూయతోనో హిందూపరిషత్ అని పేరు పెట్టుకొన్నవారే మీరు పరమతమును బోధిస్తున్నారు

అన్నారు. ఇలా ఎందరో ఎన్నో రకములుగా అనుకొనినా నా లెక్కలో నేను ఎవరో కొంత మీకు చెప్పవలసిన

అవసరమున్నది. ఇందూమతము సనాతనమైనది. ఇది అన్ని మతములలాంటి మతము కాదు. ఇది ఎప్పుడు పుట్టినది

కూడ ఎవరికీ తెలియదు. అయినా ఈ మతము క్షీణించకుండుటకు ఇందూమతములో కలియుగములోనే కేరళ

రాష్ట్రములో ఆది శంకారచార్యుడు అను వ్యక్తి పుట్టాడు. ఇంటర్నెట్ సమాచారము ప్రకారము శంకారాచార్యులు క్రీస్తుశకము

788లో పుట్టి 820లో చనిపోయినట్లు గలదు. ఆయన బ్రతికినది కేవలము 32 సంవత్సరములు మాత్రమే. ఆయన

27వ సంవత్సరమునుండి తాను కనుగొన్న అద్వైత సిద్ధాంతమును బోధించాడు. ఆయన అద్వైత సిద్ధాంతము బోధించినది

కేవలము 5 సంవత్సరములు మాత్రమే. శంకారాచార్యుడు చనిపోయిన తర్వాత 197 సంవత్సరములకు అనగా

క్రీశ॥1017 సంవత్సరములో రామానుజాచార్యులు పుట్టాడు. ఆయన 120 సంవత్సరములు బ్రతికి క్రీశ॥ 1137వ

సంవత్సరము చనిపోయాడు. ఆయన తాను కనుగొన్న విశిష్టాద్వైత సిద్దాంతమును ప్రచారము చేశాడు. ఆయన

తర్వాత 101 సంవత్సరములకు 1238వ సంవత్సరములో మధ్వాచార్యులు పుట్టారు. ఆయన 1317 వరకు 79

సంవత్సరములు బ్రతికి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. మధ్వాచార్యుల అనంతరము 633 సంవత్సరములకు

అనగా 1951 సంవత్సరములో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టారు. 27 సంవత్సరముల వయస్సు వచ్చిన

తర్వాత అనగా 1977 నుండి జ్ఞాన ప్రచారము చేస్తు, తన త్రైతసిద్ధాంతమును ప్రచారము చేయుచున్నారు. త్రైత

సిద్ధాంత ఆదికర్తయని, ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అని పేరుగాంచిన వ్యక్తియే ఇపుడు ఈ గ్రంథము వ్రాయుచున్న

మేము. నేను స్వచ్ఛమైన ఇందూ ధర్మ సిద్ధాంతకర్తను కాబట్టి ఇక్కడ వ్రాయబడు విషయములన్నియు యదార్థములు

మరియు శాస్త్రబద్దములని తెలుపుచున్నాము. ఎక్కడైన దయ్యములను పేరుతో మోసగాళ్ళు మోసము చేసినంతమాత్రమున

దయ్యములు లేవనడము పొరపాటు. కావున దయ్యములు యదార్థములే! దయ్యముల సంఘటనలు యదార్థములే!!

పరిశోధించి చూచితే శాస్త్రబద్దములే!!!



ఇపుడు మొదలు పెట్టి చెప్పునదేమనగా! నాకు ఏడు, ఎనిమిది సంవత్సరముల వయస్సులోనే ప్రతి విషయములోనూ

పరిశోధనా దృష్ఠి ఉండెడిది. దానినే ఒక విధముగా హేతుశోధనా దృష్ఠి అంటాము. అందువలన ఏదైనా ప్రత్యేకమైన

సంఘటన ఉంటే, దానిని ప్రత్యేకముగా ప్రశ్నించుకొని యోచించేవాడిని. కొందరు అనుభవజ్ఞులు చెప్పారని వారు

చెప్పిన మాటలను నమ్మక, నాకు ఒక అవగాహన వచ్చేంతవరకూ నా ప్రశ్నలకు జవాబు దొరికేంత వరకూ యోచించడము

పరిపాటి. అటువంటి సమయములో నాకు ఎనిమిది సంవత్సరముల వయస్సు జరుగుచున్నపుడు అనంతపురము

జిల్లాయందు వజ్రములు దొరుకు వజ్రకరూరులో నివాసము ఉండడము జరిగినది. అక్కడికి దగ్గరగానున్న తట్రకల్లు

అను గ్రామమునకు గ్రామదేవత పెద్దమ్మ జాతర జరుగుచుండగా పోవడము జరిగినది. ఆ వయస్సులో జాతరంటే

ఏమిటో, గ్రామదేవత అంటే ఏమిటో కూడ నాకు తెలియదు. పెద్దవారు పోతూవుంటే వారివెంట పోయాము. అప్పటికే

అక్కడ కొంత భాగము జాతర జరిగిపోయినది. ఆ గ్రామములోనికి పోతూనే గ్రామమధ్యములో ఒక దృశ్యము కనిపించినది.

అక్కడ పది అడుగుల దూరములో ఒక దున్నపోతు పిల్ల తలను నరికియుండడము చూచాను. మొండెము మాత్రమున్నది.

తల దూరముగానున్న గ్రామదేవత గుడి దగ్గర పెట్టారు. అలా నాలుగు వయస్సుకు రాని చిన్నపిల్ల దూడలనే నరికి

యుండడము చూచాను. అప్పటికి అదొక వింత సంఘటనగా నాకు తోచినది. మా పెద్దలనడిగితే “పెద్దమ్మ దేవతకు

దున్నపోతులను బలి ఇచ్చారు” అన్నారు. అపుడు అనేక ప్రశ్నలు నాలో వచ్చాయి. బలి అంటే ఏమిటి? ఎందుకు బలి

ఇవ్వాలి? పెద్దమ్మ ఎవరు? ఆమెకు ఎందుకు ఈ దున్నపోతు దూడల రక్తపాతము? మనుషులచేత దూడలను కఠినముగా



చంపించిన పెద్దమ్మ దేవతవుతుందా? ఆ పెద్దమ్మతో మనకేమి పని? మనమెందుకు జాతర చేయాలి? గ్రామ మధ్యలోనే

ఎందుకు జాతర చేశారు. ఇలా ఎన్నో ప్రశ్నలు రాగా వాటికి అప్పుడు జవాబు చెప్పువారు లేరు. ఎవరినైనా అడిగితే

నీకెందుకురా ఇవన్నీ అని మందలించెడివారు. ఆ దినము సాయంత్రము నాలుగు గంటల సమయములో కొందరు

గుంపుగా మేళ తాళాలతో, తప్పెట్లు మొదలగు వాయిద్యములతో ఊరేగింపుగా ఊరుకు ఆనుకొని దిగేదానికి పది

అడుగుల వెడల్పుతో మెట్లున్న కోనేరులాంటి పెద్దబావి దగ్గరకు పోవడము జరిగినది. ఆ బావిలోనికి ముఖ్యమైన వారు

దాదాపు 30 మందిదాకా దిగారు. మిగతావారందరూ పైనుండి చూస్తున్నారు.  విశాలమైన బావి కనుక పైనుండి

నాకూ బాగా కనిపిస్తున్నది. బావిలోనికి దిగిన తర్వాత క్రొత్త మట్టికడవను నీటితో నింపి దానిని కలశమువలె అలంకరించి

గుంపులోని ఒక వ్యక్తికి ప్రత్యేకముగా పూలమాల వేసి ఆ కలశమును అతని తలమీదికి ఎత్తారు. ఆ కలశమును

మహాసందడిగా కొందరు చిందులు వేస్తు తప్పెట్లు వాయిస్తూ తీసుకువస్తున్నారు. కలశమును ఎత్తుకొన్న మనిషి పెద్ద

మీసాలు కలిగి బలమైన శరీరముతోనున్న దాదాపు 40 సంవత్సరముల వయస్సున్నవాడు. అలా చాలా గుంపుగా

సందడిగా కొంత దూరము వచ్చిన తర్వాత కలశమును ఎత్తుకొన్న మనిషి నిలబడి పోయాడు. అతనితో పాటు

అందరూ ముందుకు పోకుండ నిలబడి అందరూ అతను ఎందుకు నిలబడినాడని అతని వైపు చూడను మొదలుపెట్టారు.


అలా చూస్తుండగనే ఆ మనిషి కళ్ళవెంట కన్నీరు వస్తుండడము కనిపిస్తున్నది. అతను ఏడవను మొదలుపెట్టాడని

అర్థమైనది. అపుడు అక్కడున్న ఊరి పెద్దలు కొందరు “ఏమి తల్లీ ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధకల్గినది” అని

ప్రశ్నించారు. అపుడు అతను ఏడుస్తూనే "మీకు నేను ఐదు సంవత్సరములకు మతికి వచ్చానురా, మీరు నన్ను మరిచి

పోయినారు” అని అనగా అక్కడున్నవారు "లేదు తల్లీ నిన్ను మరిచిపోలేదు. పంటలు సరిగా పండక పోవడము వలన

ప్రతి సంవత్సరము నీకు దేవర (జాతర) చేయలేకపోయాము. ఇప్పటినుండి మాకు ఎన్ని ఇబ్బందులున్నా నీకు తప్పక

దేవర చేస్తాము” అని వినయముగా చెప్పారు. అంతలో కలశమును ఎత్తుకొన్న అతను “మీకు ఒక సంవత్సరమేరా

పంటలు సరిగా పండనిది, మిగత నాలుగు సంవత్సరములు పండినాయి కదరా? సరే ఇప్పటికైన నేను మీకు మతికి

వచ్చాను. ఇప్పడైనా నా పండుగను సరిగా చేశారా? దేవర పోతులు చిన్న దూడలు దొరికాయా? పెద్దది ఒకటైనా

ఉందా” అన్నాడు. అపుడు ఆ గ్రామ పెద్దలు “నీకు విడిచిన పెద్దపోతు కనపడకుండ ఎక్కడో పోయింది. అందువలన

చిన్న పోతులను ఇచ్చాము తల్లీ. మా తప్పులు ఏమైన ఉంటే క్షమించు అమ్మా. నీవు బాధపడితే ఊరికి మంచిది

కాదమ్మా, రేపు సంవత్సరము పెద్దపోతును బలిచ్చి పండుగ (దేవర) బాగా చేస్తాము” అని సర్దిచెప్పారు. అపుడు ఆ వ్యక్తి

“సరే రేపు సంవత్సరమైనా బాగా చెయ్యండి లేకపోతే నేను ఊరుకోను” అని చెప్పగా అందరూ అలాగే తల్లీ మమ్ముదయతో

చూడమ్మా అని నమస్కరించారు. అలా అనిన తర్వాత అతని కంటిలో నీరు రావడము, బాధగా ఏడుస్తూ మాట్లాడడము

నిలిచి పోయినది. ముందు ఎలా ఉన్నాడో అలాగే ఠీవిగా కనిపిస్తూ అక్కడనుండి నడువను మొదలుపెట్టాడు.


ఈ సంఘటనంతటిని జాగ్రత్తగా గమినించిన నాకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి. పెద్ద పెద్ద

మీసాలు పెట్టుకొన్న మగ మనిషి ఆడమనిషిలాగ మూతి సొట్టబెట్టుకొని ఏడ్చినట్లు ఏడ్చడమేమిటి? మగ మనిషిని

అందరు అమ్మా, తల్లీ అని ఎందుకంటున్నారు? చిన్న పిల్లలు అలిగినట్లు అతను అలిగి నాకు దేవర ఐదేండ్లనుండి

చేయలేదు, నన్ను మరిచి పోయారనడము ఏమిటి? మరీ విచిత్రముగా నాకు పెద్ద దున్నపోతును బలి ఇవ్వలేదు, అన్నీ

చిన్నదూడలనే ఇచ్చారు అవి నాకు చాలవు అనడమేమిటి? కొంతసేపు తర్వాత అతనిని అందరు మగ మనిషిగానే

పిలుస్తూ, అతనితో సమానముగా వ్యవరించుచున్నారు. కలశము ఎత్తుకొని మాట్లాడినపుడు మాత్రము ఆడమనిషితో


మాట్లాడినట్లు వినయముగా, భక్తిగా మాట్లాడడము ఎందుకు? ఇలా జవాబులేని ఎన్నో ప్రశ్నలు రావడము జరిగినది.

ఆ దినము మా ఇంటిలోని పెద్దలనడిగితే పెద్దమ్మ తల్లి కలశము ఎత్తుకొన్న మనిషిలోనికి వచ్చి ఆ కొద్దిసేపు మాట్లాడింది

అన్నారు. అంత తప్ప వారు ఏమి చెప్పలేదు. పెద్దమ్మ ఎవరు? ఆమె మగ మనిషిలోనికి రావడమేమిటి? గుడిలోని

దేవత పెద్దమ్మ అయితే అక్కడనుండే మాట్లాడ వచ్చుకదా! మనిషిలోనికి వచ్చి మాట్లాడడము జరుగుతుందా? కనిపించని

దేవత కనిపించే మనిషిలోనికి వస్తుందా? దేవతలు గొప్పవారైనపుడు వారికంటే తక్కువవారైన మనుషులలోనికి వస్తారా?

వచ్చిన పెద్దమ్మ చిన్న దూడలు నాకు చాలవు అనడమేమిటి? ఆమె వాటిని తింటుందా? అని అడిగితే ఎవరూ వాటికి

సరియైన సమాధానము చెప్పలేదు.


ఇంతవరకు చెప్పుకొన్న విషయము ఒక గ్రామదేవతది. ఇపుడు చెప్పుకోబోవు విషయము ఒక ప్రాంతపు

దేవునిది. అనంతపురము జిల్లా, గుంతకల్లు పట్టణమునకు నాలుగుకిలోమీటర్ల సమీపములో కసాపురము అను గ్రామము

కలదు. ఆ గ్రామములో ఆంజనేయస్వామి దేవాలయము కలదు. నెట్టికంటి ఆంజనేయస్వామిగా పేరుగాంచిన ఆ

దేవాలయము వద్దకు ఆ చుట్టుప్రక్కల ప్రాంతముల వారేకాకుండ, దూరప్రాంతముల వారు కూడ భక్తిగా రావడము

జరుగుతున్నది. దేశములో ఎన్నో జాగాలలో ఎన్నో ఆంజనేయ దేవస్థానములు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రము పేరు

గాంచినవి గలవు. అటువంటి వాటిలో కడప జిల్లాలో గండి ఆంజనేయ స్వామి పేరుగాంచియుండగా, అనంతపురము

జిల్లాలో కసాపురము ఆంజనేయస్వామి పేరుగాంచియున్నారు. ఇంతవరకు గండి ఆంజనేయ స్వామిని నేను చూడలేదు.

అటువంటి పేరుగాంచిన గుడికే పోలేదా అని మీరు అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! చిన్న వయస్సునుండి

నాలో హేతువాద భావములు ఎక్కువగా ఉండెడివి. అందరిలాగ భక్తి భావము లేకున్నను, చిన్న వయస్సులో పెద్దలవెంట

దేవాలయములకు పోవడము జరిగెడిది. అక్కడ జరిగే పనులన్నీ వింతగా, సమాధానము లేని ప్రశ్నలుగా కనిపించేవి.

అందువలన పదహారు సంవత్సరముల వయస్సు నుండి దేవాలయము లకు పోవడము మానివేశాము. వాటి మీద

ఇష్టము లేకున్ననూ, ఎవరైనా తెలిసినవారు మేము పోతున్నాము, మీరు మావెంట రాండి అని పిలిస్తే భక్తిలేని నా

భావములను బయటికి చెప్పకుండ నేను కూడ భక్తివున్న వాని మాదిరే వారివెంట పోయేవాడిని. అక్కడ ఏమి జరుగుచున్నదో

చూచేవాడిని. అదే విధముగా నాకు తెలిసిన వారు కొందరు గుంపుగా కసాపురము ఆంజనేయస్వామి దగ్గరకు

పోవుచున్నాము, మీరు కూడా మా వెంటరండి అని పిలువడము జరిగినది. అలాగే వారివెంట మేము పోవడమూ

జరిగినది.


దయ్యాల గురించి చెప్పుతానని దేవతల గురించి చెపుతున్నారేమిటి అనుకోవద్దండి. దేవతల దగ్గర మొదలు

పెడితేగానీ దయ్యాలవద్దకు రాలేము. అందువలన దేవతల వద్దనుండి మొదలుపెట్టి చెప్పడము జరుగుచున్నది. మనిషి

భావములో గుడిలోని దేవుడు గొప్పయనీ, స్మశానములోని దయ్యము తక్కువయనీ చెప్పుకోవడము జరుగుచున్నది.

కానీ వాస్తవానికి ఆ తేడా ఏమిటో తెలుసుకోవడానికి దేవున్ని, దయ్యాన్ని రెండిటిని గురించి చెప్పవలసి వచ్చినది.

కసాపురము ఆంజనేయస్వామి గుడిలోని దేవుడు కాగా! ఇక్కడి విశేషమేమంటే ఆ దేవుని ముందరే దయ్యాలు కూడ

గలవు. మిగత గుళ్ళలో దేవతలు మాత్రమే ప్రతిమ రూపములో కనిపిస్తుంటారు. అక్కడ దయ్యాలు ఉండవు.

కసాపురము గుడిలో ఆంజనేయస్వామిని చూడవచ్చును. వివరముగా చెప్పితే ఆంజనేయస్వామి గుడివద్ద మనుషుల

శరీరముల మీద దయ్యములు పూని (ఆవహించి) మాట్లాడడము జరుగుచున్నది. ఈ విషయము ఇతరుల ద్వారా విన్న

నేను అది ఎంత వాస్తవమో చూడాలని అవకాశము వచ్చింది కావున అక్కడికి పోవడము జరిగినది.


అక్కడ ఇంకొక వింత గలదు. అదేమనగా! కొందరు భక్తులు ఆంజనేయస్వామికి పాదరక్షలను (చెప్పులను)

కానుకగా తెచ్చి ఇవ్వడము గలదు. ఆ చెప్పులు బజారులో దొరికే చెప్పులలాగ కాకుండ, మామూలు చెప్పుల

కొలతకంటే రెండు లేక మూడు రెట్లు పెద్దవిగా ఉన్నవి. అంత పెద్ద చెప్పులను అదేపనిగా ప్రత్యేకముగా తయారు

చేయించి తెచ్చి పెట్టడము జరుగుచున్నది. ఆ చెప్పులను ఎందుకిస్తున్నారని అడుగగా! "ఆంజనేయ స్వామి రాత్రిపూట

చెప్పులు ధరించి బయట తిరిగి వస్తాడు” అని కొందరు చెప్పారు. అంతేకాకుండ “అలా మనమిచ్చిన చెప్పులు ధరించి

తిరిగి రావడము వలన ఆ చెప్పులు పాతబడి పోవడము, అరిగిపోవడము, తెగి పోవడము జరుగుచున్నది" అని కూడా

చెప్పారు. వారు చెప్పినట్లు గుడి ముందర కొంతదూరములో అటువంటి చెప్పులు గలవు. వాటిలో కొన్ని పాతవి, కొన్ని

క్రొత్తవి గలవు. కొందరు చెప్పినది విన్నాము, విన్నంత మాత్రమున అవి సత్యము కావచ్చు, అసత్యము కావచ్చు.

అందువలన చెప్పుల విషయము సత్యమా, అసత్యమా అని హేతువాద దృష్టితో చూడడము జరిగినది.


“సత్యముగానీ, అసత్యముగానీ మొదట నమ్మకముతోనే మొదలు అవుతుంది" అన్నది సూత్రము. తర్వాత ఆ

నమ్మకము సత్యమూ కావచ్చు లేక అసత్యమూ కావచ్చు. విచక్షణా జ్ఞానముతో కూడుకొన్న నమ్మకము సత్యమవుతుంది.

కొద్దిమాత్రము కూడా జ్ఞానము లేకుండా ఉన్న నమ్మకము మూఢనమ్మకమవుతుంది. విచక్షణ ఉన్నపుడు ఏ విషయముగానీ

సులభముగా గ్రుడ్డిగా నమ్మము. ఆంజనేయస్వామి చెప్పుల విషయమును విచక్షణా దృష్ఠితో చూడడము వలన అది

మూఢనమ్మకమని తెలిసిపోయినది. మూఢనమ్మకము ఆ విషయము అసత్యమనీ, ఆంజనేయస్వామి పాదరక్షలు

(చెప్పులు) ధరించి తిరగడము లేదని, అవి కొద్దిగా అరిగినట్లు, కొంత తెగిపోయినట్లు కనిపించినా అట్లు జరుగుటకు

కారణము వేరుగా ఉన్నదనీ, అక్కడికి పోయిన భక్తులందరూ వాటిని తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టుకోవడము వలన అవి

పాతబడి పోయాయని తెలియుచున్నది. నిత్యము వందలాది మంది భక్తులు స్వామి చెప్పులను తీసి పెట్టడము వలన

అడుగున కొంత రాపిడి ఏర్పడినది తప్ప, వాటిని ధరించి తిరగడము వలన కాదని తెలియుచున్నది. అట్లే నిత్యము

లాగడము వలన మరియు ఇద్దరు వ్యక్తులు ఒకే చెప్పును పట్టుకొని నేను ముందు నేను ముందు అని గుంజి లాగడము

వలన చిన్న చిన్న పట్టీలు తెగడము జరిగినది. ఆ విషయమును ఆలోచించకుండ గ్రుడ్డిగ నమ్మిన వారికి ఆంజనేయస్వామి

చెప్పులు ధరించి రాత్రిపూట తిరిగివచ్చినట్లే, విచక్షణతో ఆలోచించు వారికి ఆంజనేయ స్వామి చెప్పులు ధరించలేదని

తెలియుచున్నది. ఆంజనేయస్వామి చెప్పులు ధరించడము అవాస్తవము అని మేము చెప్పడమును చూచి కొందరు

ఆస్తికులు నన్ను నాస్తికునిగా లెక్కించవచ్చును. నిజము చెప్పాలంటే నేను నాస్తికున్ని కాదు. ఎందుకనగా! ఆంజనేయస్వామిని

లేడు అని నేను అనలేదుకదా! కసాపురములోని గుడి బొమ్మలో ఆంజనేయస్వామి ఉన్నాడనియే చెప్పుచున్నాము. ఈ

మా మాటనుబట్టి కొందరు నాస్తికులు నన్ను మూఢనమ్మకము గలవాడని అనవచ్చును. వారు అలా అనినా వాస్తవానికి

నేను గ్రుడ్డిగా నమ్మేవాడిని కాను. ఎందుకనగా ఎంతో విచక్షణతో ఎన్నో ప్రశ్నలకు జవాబు కలిగియున్నాను. ఒక

విషయమును విచక్షణా రహితముగా విశ్వసించువాడు మూఢ విశ్వాసి (మూఢనమ్మకము గలవాడు) ఒక విషయమును

విచక్షణా దృష్ఠితో చూచి విశ్వసించువాడు సత్యవాది లేక హేతువాది అవును. ఒక విషయమును విమర్శనా దృష్ఠితో

విశ్వసించని వాడు నాస్తికవాది లేక అసత్యవాది అని చెప్పబడును. ఇక్కడ మూఢ నమ్మకస్తునికి, నాస్తికునికి ఏమీ పెద్ద

తేడా లేదు. మూఢనమ్మకస్తుడు విచక్షణ లేని విశ్వాసముతో కూడుకొన్నాడు. నాస్తికుడు కూడా విచక్షణలేని విమర్శతో

కూడుకొన్నాడు. ఈ రెండు కోవలకు చెందని వాడిని నేను. కావున ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు మధ్యలో

ఉంటాము. మేము చెప్పు విషయము లను చూచి కొందరు తొందరపడి మమ్ములను నాస్తికులని అనుకోవచ్చును. అట్లే


కొందరు సాధారణ ఆస్తికుల క్రిందికి కూడ లెక్కకట్టవచ్చును. ఎవరేమనుకొన్నా మేము సత్యమును చెప్పుచున్నాము,

కావున మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండ జాగ్రత్తగా చదివి తెలుసుకోవలెనని కోరుచున్నాము.


చిన్న వయస్సులో పెద్దమ్మ దేవతను ఒక మనిషి మీద చూచాను. యుక్తవయస్సులో ఆంజనేయస్వామి ముందర

మనుషుల మీద దయ్యాలను చూచాను. అలాగే ఆంజనేయ ప్రతిమలో నిక్షిప్తమైయున్న ఆంజనేయుడను దేవున్ని

చూచాను. దేవతను, దేవున్ని, దయ్యములను చూచిన మేము వాటిలోని సత్యాసత్యములను తెలుపుటకు ప్రయత్నిస్తున్నాము.

గ్రుడ్డిగ విశ్వసించక, గ్రుడ్డిగా విమర్శించక సహేతుకముగా తెలుపుటయే మా ఉద్దేశ్యము. విచక్షణతో

కూడుకొన్న మా దృష్ఠి ప్రకారము భూమి మీద గల పెద్దమ్మ అను దేవతగానీ, ఆంజనేయస్వామి అను దేవుడుగానీ,

సాధారణ దయ్యముగానీ అందరూ ఒక కోవకు చెందిన వారే. ఇప్పుడు కొంత అవగాహన కొరకు దయ్యమునుండి

మొదలుపెట్టి చెప్పుకొందాము.


ప్రపంచములో ఒక జీవుడు పుట్టుచున్నాడు. కొంతకాలము బ్రతికిన తర్వాత చనిపోవుచున్నాడు. పుట్టుట,

చచ్చుట జగమెరిగిన సత్యము. మనిషిగా పుట్టిన వారిలో ఎంత పెద్ద మేధావియైనా, ఎంత ధనికుడైనా, ఎంత బలవంతుడైనా

ఎవనికీ తన పుట్టుకను గురించి తెలియదు, అలాగే తన చావును గురించి కూడా తెలియదు. వివరముగా చెప్పుకొంటే

పుట్టుకలో జీవుడు శరీరములోనికి ఎలా ప్రవేశిస్తున్నాడని తెలియదు, అలాగే మరణములో శరీరమునుండి జీవుడు ఎలా

పోవుచున్నాడని కూడా తెలియదు. శరీరములోనికి జీవుడు రావడము పోవడము ఎవరికీ తెలియని పెద్ద రహస్యము.

ఆ రహస్యము తెలియాలంటే మా రచనలలోని “జనన మరణ సిద్ధాంతము" అను గ్రంథమును చదవాలి.

గ్రంథములో జీవుడు జన్మించడమును మరియు మరణించడమును గురించి తెలియబరిచాము. అందులో జీవితములో

చివరిదైన మరణమును గురించి మాత్రము తెలిపాము. కానీ జీవితములో మధ్యలో వచ్చు మరణమును గురించి

తెలుపలేదు. ఈ మాట విన్న కొందరికి జీవితము చివరిలో మరణముండ వచ్చును. కానీ జీవితములో మరణమేమిటని

ఆశ్చర్యము కలుగవచ్చును. జీవితము చివరిలో వచ్చునది మరణము అయితే జీవితములో వచ్చునది అకాల మరణమని

చెప్పుచున్నాము. దీనినిబట్టి జన్మ ఒకటే అయినా మరణములు మాత్రము రెండు రకములున్నవని చెప్పవచ్చును.

ఇక్కడ ముఖ్య గమనిక ఏమంటే మరణము ప్రతి జీవరాసికి గలదు. కానీ అకాల మరణము కొన్ని జీవరాసులకు

మాత్రమే ఉండును. మనిషి శరీరములో జరుగు అకాలమరణమును గురించి తెలియాలంటే మొదట మనిషి శరీరమును

గురించి తెలియాలి.


ఒక వస్త్రము ఎలా తయారైనదీ సవివరముగా తెలియాలంటే పత్తి, దూది, నూలు, మగ్గమును గురించి తెలియాలి.

అదే విధముగా ఒక మనిషి శరీరమును గురించి సవివరముగా తెలియాలంటే ప్రకృతి, ప్రకృతి భాగములు, కనిపించే

బయటి శరీరము, కనిపించని లోపలి శరీరమును గురించి తెలియవలెను. మనిషి యొక్క కనిపించు శరీరమును స్థూల

శరీరమనీ, కనిపించని శరీరమును సూక్ష్మశరీరమని పిలుస్తున్నాము. మొదట ప్రకృతి యొక్క వివరమును గురించి

తెలుసుకొంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు భూమి అను ఐదు భాగములుగా కలదు. ప్రకృతిలోని ఐదు భాగములు

ఒక్కొక్కటి ఐదు భాగములుగా చీలిపోయి మొత్తము 25 భాగములుగా ఏర్పడినవి. ఆ 25 భాగములు ఒకదానితో ఒకటి

కలిసిపోయి 25 శరీర భాగములు ఏర్పడినవి. అందులో 10 భాగములు కనిపించు శరీరముగా (స్థూలశరీముగా) 15

భాగములు కనిపించని శరీర భాగములుగా (సూక్ష్మ శరీరముగా) తయారైనవి. ప్రకృతి జఢమైనది, అనగా కదలిక


లేనిది, చైతన్యములేనిది, శక్తిలేనిది. ప్రకృతిలోని భాగములచే తయారైన శరీరము కూడ జడమైనదే. ఆత్మశక్తి (ఆత్మ

చైతన్యము) శరీరముతో కూడినపుడే శరీరములో కదలికలేర్పడును. అందువలన ఆత్మలేని శరీరము కదలిక లేనిదగును.

మనిషి చనిపోయినపుడు ఆత్మ శరీరమును వదలి పోవుచున్నది. కనుక మరణించిన మనిషి శరీరము కదలిక లేనిదగును.

తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన శిశుశరీరములోనికి కొన్ని సందర్భములలో ఆత్మ కొంత ఆలస్యముగా చేరుచున్నది.

అటువంటపుడు కూడా ఆ శిశువు కదలక మెదలక చైతన్యము లేనిదిగా ఉండును. చాలా చోట్ల 5 నిమిషములు,10

నిమిషములు, అరగంట, గంట ఇంకా ఎక్కువ కాలము పుట్టిన శిశువులోనికి ఆత్మ చేరని సందర్భములు గలవు.

అటువంటపుడు శిశువు గర్భములోనే చనిపోయిందని చాలామంది పొర బడుచున్నారు. పుట్టిన శిశువులోనికి ఆత్మ

చేరినపుడు శిశువులో చైతన్యము కల్గి ఏడ్వను మొదలుపెట్టును. అప్పుడే శరీరము సజీవమగును. అంతవరకు అది

జీవములేని శరీరమే (శవమే). అలాగే మరణించిన తర్వాత ఆత్మ దానితో పాటు జీవాత్మ ఇరువురు బయటికి పోవుచున్నారు.

కావున అప్పుడు కూడ శరీరములో కదలిక లేకుండ పోవుచున్నది. అప్పుడు ఆ శరీరము జీవము లేని శరీరమే

(శవమే). విచిత్రమేమంటే చనిపోయిన తర్వాత జీవుడులేని శరీరమును శవము అంటున్నాము. పుట్టినపుడు జీవుడులేని

శరీరమును శవము అని ఎవరూ అనడము లేదు.


సజీవ శరీరము అనగా జీవుడు నివాసముంటున్న శరీరమని అర్థము. జీవుడు గల జీవితము 25 శరీర

భాగములతో గలదు. నిత్యము సజీవ శరీరమును మనము చూస్తున్నా అందులో జీవునితో 25 భాగములుగా శరీరమున్నదని

తెలియదు. జీవుడు సూక్ష్మశరీరములో నివాసముండును. ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీములో నిక్షిప్తమై ఉండును.

క్రింద సజీవ శరీరము యొక్క భాగములను గమనిస్తాము.


 శరీరము యొక్క భాగములను 20 పేజీ లో చూడండి .


పై 15 భాగములు సూక్ష్మ శరీరము (కనిపించని శరీరము).


పది స్థూల భాగముల లోపల పదిహేను సూక్ష్మ భాగములు గలవు. అందువలన పదిహేను సూక్ష్మ భాగములను

ఇంతవరకు ఎవరూ చూడలేదు. జీవుడైన వాడు శరీరములో తాను ఎట్లున్నది? తన ఆకారమెట్లున్నది తెలియ కున్నాడు.

ఈ గ్రంథము చదువుచున్న నీవు కూడ జీవునివే. కానీ నీ రూపము నీకు తెలియదు. అద్దములో చూచుకొంటే నీ

శరీరము యొక్క రూపమూ, దాని అందమూ కనిపిస్తుంది. కానీ నీవు కనిపించవు. నీవే కాదు నీ శరీరములో మనస్సు,

బుద్ధి, చిత్తము, అహములు కూడ ఎట్లున్నది తెలియదు. అలాగే ఎదుటివాని శరీరము కనిపిస్తుంది, కానీ లోపల

సూక్ష్మము లోని మనస్సు, బుద్ధి కనిపించదు. కనిపించే స్థూల శరీరము పనిచేసే ప్రింటర్లాంటిది. కనిపించని

సూక్ష్మశరీరము పనిచేయించే కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్ పనితనము ప్రింటర్లో బయటపడినట్లు, సూక్ష్మ శరీరము

యొక్క పనితనము స్థూలశరీరము మీద కనిపించును. దీనినిబట్టి ఒక సజీవ శరీరము, కనిపించు మరియు కనిపించని

రెండు భాగములుగా ఉన్నదని తెలియుచున్నది. కనిపించని సూక్ష్మశరీరములోనే బయటి విషయములను గ్రహించు


మనస్సు గలదు. వాటిని యోచించు బుద్ధియూ గలదు. ఒక విషయమును గ్రహించుశక్తి సూక్ష్మ శరీరమునకున్నదని

అర్థమగుచున్నది. స్థూల, సూక్ష్మశరీరములలో సూక్ష్మమునకే ఎక్కువ ప్రాధాన్యత గలదు. స్థూలశరీరము అందముగా

ఉండవచ్చును, కానీ సూక్ష్మ శరీరము యొక్క అందము కనిపించదు. సూక్ష్మమునకు వాస్తవముగా అందముండదు.

స్థూలశరీరము అందముగా ఉండవచ్చును లేక అంద హీనముగా ఉండవచ్చును. సూక్ష్మమునకు అందముండదు కానీ

చంద ముండును. కొందరి స్థూలము అందముగా, కొందరి స్థూలము అంద హీనముగా ఉన్నట్లు, కొందరి సూక్ష్మము

చందముగా ఉండవచ్చును లేక చందహీనముగా ఉండవచ్చును. అందము అంటే అందరికి తెలుసు. కానీ చందము

అంటే చాలామందికి తెలియదు. అందము చందము అనే మాటను చాలామార్లు మనము వినియే ఉందుము. ఒక

యువకునికి పెళ్ళి సమయములో అతని భార్యను చూచి ఈడు జోడు సరిపోయింది లేక సరిపోలేదు అంటుంటారు. ఆ

మాటలో ఈడు అంటే వయస్సు, జోడు అంటే ఎత్తు అని అర్థము. పెళ్ళి కూతురుకు వయస్సు 20 సంవత్సరములు

ఉండి పెళ్ళికొడుకు వయస్సు 40 సంవత్సరములైతే వారికి ఈడు సరిపోలేదు అనవచ్చును. అలాగే పెళ్ళి కూతురు

నాలుగు అడుగుల ఎత్తు ఉండి, పెళ్ళికొడుకు ఆరు అడుగుల ఎత్తు ఉంటే వారికి జోడు సరిపోలేదు అంటుంటాము.

అదే విధముగా పెళ్ళికొడుకు అయినా లేక పెళ్ళికూతురు అయినా అందముగా లేకుండా ఉండి జ్ఞానము కల్గియుంటే,

అందము లేక పోయినా పరవాలేదు చందముందిలే అనేవారు. ఒకవేళ అటు అందముగా లేకపోయి, ఇటు జ్ఞానము

కూడలేకపోతే అందమూలేదు చందమూలేదు అనేవారు. దీనిని బట్టి ఇక్కడ చందము అంటే దైవజ్ఞానము అని

తెలియుచున్నది. ఈ కాలములో కొందరికి అందమున్నా, చాలామందికి చందము లేదు.


ఇపుడు అసలు విషయానికి వస్తే స్థూల శరీరమునకు సంబంధించి నది అందమూ, సూక్ష్మశరీరమునకు

సంబంధించినది చందము అని తెలియు చున్నది. అందము పుట్టుకతోనే వస్తుంది, చందము (జ్ఞానము) శ్రద్ధతో

తెలుసుకొనేకొద్దీ వస్తుంది. చందము (జ్ఞానము) మనస్సు ధ్యాస వలన బుద్ధి యోచనవలన జీవితములో లభించగలదు.

ఇటు ప్రపంచ జ్ఞానము గానీ, అటు దైవజ్ఞానముగానీ కేవలము సూక్ష్మ శరీరము గ్రహించుకోవడము వలన లభిస్తున్నది.

స్థూలశరీరములోనున్న సూక్ష్మశరీరము బయటి విషయమును గ్రహించుకొనుచున్నది. కావున దానిని గ్రహము లేక

గ్రహ అంటున్నాము. ఈ లెక్క ప్రకారము మనము కూడ గ్రహాలమే. ఇపుడు మనకు స్థూల శరీరమను గృహములో

సూక్ష్మశరీరమను గ్రహము గలదు. ఖగోళములో కూడ నవగ్రహములను మాట వినుచున్నాము. ఉదాహరణకు చంద్రుడు,

కుజుడు గ్రహములే. ఆ గ్రహములకు కూడ స్థూల శరీరము గోళముల ఆకారములో గలదు. గోళముల ఆకృతియే

వాటి స్థూలశరీరము. చంద్రుడు తెల్లని చౌడు మట్టిగల గోళముగ కనిపిస్తున్నాడు. అలాగే కుజుడు ఎర్రగ ఎర్ర

మట్టిగల గోళముగ కనిపిస్తున్నాడు. రంగులూ, గోళములూ, ఆ గ్రహముల స్థూల ఆకారము కాగా, అవి మన

పాపపుణ్యములను గ్రహించు కొనుచున్నవి, కనుక వాటిని గ్రహములు అంటున్నాము. గ్రహించుకొనుట వలన మనిషి

గ్రహయే, గోళము గ్రహయే. ఇదే విధముగా ఖగోళములోని గోళము గ్రహయైనట్లు, గుడిలోని ప్రతిమ కూడ గ్రహయే

అవుతుంది. గుడిలోని ప్రతిమలో కూడ జీవుడున్నాడు. గుడిలో ఏదో ఒక దేవుడుగానో, దేవతగానోనున్న ప్రతిమలోని

జీవుడు గుడికి వచ్చు భక్తుల మనో భావము లనూ, వారి కోర్కెలనూ గ్రహించుచున్నాడు. ఖగోళములో దూరముగానున్న

గోళములను వదలివేసి ఇక్కడ భూమి మీదనే గ్రహములు ఇటు గృహములలోను అటు గుడులలోను గలవు. వాస్తవానికి

గృహములోని కదిలెడు శరీర ఆకారములైన మనుషులూ, గుడులలోని కదలని ప్రతిమ ఆకారములైన దేవతలూ గ్రహములే,

అయినా మనుషులు గుడిలోని ప్రతిమలను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. కనుక వారిని తమతో సమానముగా


గ్రహములు అంటే బాగుండదని ప్రతిమ ఆకారములోనున్న దేవతలను విగ్రహములన్నారు. ఇక్కడ బాగా అర్థము

చేసుకోవలసినది ఏమనగా! మనిషి శరీరములోని సూక్ష్మశరరీమును గ్రహము అనుచున్నాము. అలాగే ప్రతిమ శరీరములోని

సూక్ష్మశరీరమును విగ్రహము అంటున్నాము. అలా అనడము వలన సాధారణ మనిషికంటే గుడిలోని దేవత గొప్పదని

తెలియుచున్నది.


విశేషమున్న దేనినైన దానికంటే ముందు “వి” అను అక్షరమును చేర్చి చెప్పితే దానికి గొప్పతనమున్నదని

తెలియును. మనిషి గ్రహముకంటే ప్రతిమ గ్రహము గొప్పది, కావున దేవతాప్రతిమను విగ్రహము అనుచున్నాము.

ఇక్కడ విశేషము అను పదమును సూత్రబద్దముగా తెలుసుకొంటే విగ్రహము యొక్క అర్థము బాగా తెలియును. ఇపుడు

ఈ సూత్రము మీకు క్రొత్తగా కనిపించినా ఇది శాస్త్రీయత కలదని తెలియు చున్నది. భాగించే సంఖ్యచే, భాగించబడే

సంఖ్య భాగించబడి, చివరిలో మిగిలిన సంఖ్య, భాగించే సంఖ్యకంటే తక్కువ మిగిలితే దానిని శేషము అంటాము.

భాగించబడే సంఖ్య భాగించబడి చివరిలో, భాగించే సంఖ్యకంటే ఎక్కువ మిగిలితే దానిని విశేషము అంటాము. అట్లే

భాగించే సంఖ్యచే భాగింపబడే సంఖ్య భాగించబడి చివరిలో భాగించే సంఖ్యకంటే తక్కువగానీ, ఎక్కువగానీ మిగలకుండ

పోతే దానిని సశేషము అంటాము. ఇపుడు క్రింద ఉదాహరణగా శేషము, విశేషము, సశేషము సంఖ్యలతో చూచెదము.



 ఉదాహరణ  22పేజీ లో చూడండి .


ఈ విధముగా భూమిమీద గ్రహముకంటే విగ్రహము విశేషము కలదిగా ఉన్నది. గ్రహముగానీ, విగ్రహముగానీ

స్థూల శరీరములో ఉన్నపుడు వాటి యొక్క స్థూల ఆకారము మాత్రమే కనిపిస్తున్నది. కానీ సూక్ష్మమైన ఆకారము

కనిపించడము లేదు. ఇపుడు మరణాల విషయానికి వస్తాము. జీవితము యొక్క చివరిలో వచ్చునది మరణమనీ, జీవిత

కాలములోనే వచ్చునది అకాల మరణమని చెప్పాము కదా! ఈ మాట విన్న చాలామందికి ఎవరికైనా మరణము ఒక

మారే వస్తుంది, రెండు మరణాలెలా ఉంటాయని ప్రశ్నరావచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఏ జీవరాసికైనా

పైకి కనిపించు శరీరము ఒకటే అయినా కనిపించని శరీరము కూడా మరొకటి కలదని చెప్పుకొన్నాము కదా!

అందువలన ఒక జీవరాసికి జన్మతః రెండు శరీరములున్నవనీ, పైకి కనిపించునది స్థూలశరీరమనీ, కనిపించక


శరీరములోపల అణిగియున్న దానిని సూక్ష్మశరీరమని కూడ చెప్పుకొన్నాము. సూత్రము ప్రకారము జీవునికి జన్మతః

వచ్చిన స్థూల, సూక్ష్మశరీరములు రెండు ఒకమారు జీవున్ని వదలిపోతే దానిని మరణము అంటాము. జీవుని నుండి

రెండు శరీరములు విడి పోవడము జీవుని యొక్క జీవిత అంత్యములో జరుగును. మరణములో జీవుడు తన

నివాసమైన రెండు శరీరములను కోల్పోయి వెంటనే క్రొత్త నివాసమును పొందును. దానినే జన్మ అంటున్నాము. ఇక్కడ

చాలామందికి తెలియని శాసనము ఒకటికలదు. ఆ శాసనము ఏమనగా! ఏ జీవుడైనా, ఎక్కడైనా ఒక్కక్షణము కూడా

శరీరమును వదలి బయట ఉండుటకు వీలులేదు. అందువలన మరణించిన జీవుడు మరుక్షణమే క్రొత్త శిశుశరీరములో

ప్రవేశించి జన్మపొందుచున్నాడు. ఇక్కడ జీవుడు మరణము నుండి నేరుగా క్రొత్త జన్మను పొందుచున్నాడు.


శాసనములతో కూడుకొన్నదే శాస్త్రము. ఇపుడు మనము చెప్పుకొను శాస్త్రమును దేవుడు చెప్పినది. కావున

దీని పేరు బ్రహ్మవిద్యాశాస్త్రము అన్నాము. దేవుని శాసనముల ప్రకారము పైన మరణము గురించి చెప్పుకొన్నాము.

ఇపుడు అకాలమరణమును గురించి చెప్పుకొందాము. జీవునికి పూర్తి జీవితము అయిపోకనే జీవితకాలములో ఎప్పుడైనా

సంభవించు దానిని అకాలమరణము అంటాము. అకాల మరణములో జీవుడు రెండు శరీరములలో కేవలం

స్థూలశరీరమును మాత్రము వదలుచున్నాడు. స్థూలశరీరమును వదలి సూక్ష్మశరీరములో జీవుడు నివాసముంటున్నాడు.

ఒక శరీరమున్నది కావున జీవుడు మరొక జన్మకు పోనవసరము లేదు. ఒకే జీవితములో స్థూలమును వదలి

సూక్ష్మశరీరముతో కాలము గడుపుచున్నాడు. ఆ విధముగా జీవిత అంత్యము వరకు జీవించవలసియుండును.

స్థూలశరీరమును వదలినది బయట ప్రజలకు తెలియుచున్నది. కానీ సూక్ష్మముతో ఉన్నది ఎవరికీ తెలియదు. కావున

అకాలమరణము పొందిన వానిని కూడ మరణించిన వానిక్రిందకే ప్రజలు జమకట్టుచున్నారు. అకాలమరణము

పొందిన వాడు మరణము పొందకున్ననూ, జీవించియే ఉన్ననూ, శరీరము కనిపించదు కావున వాడు మరణించాడని,

ఇకలేడని అనుకుంటున్నారు. ఇక్కడ చదువు వచ్చిన వానికి గానీ, చదువురాని వానికిగానీ, మేధావి అనువానికి గానీ,

సూక్ష్మము కనిపించదు. కావున మాకు సైన్సు తెలుసు, భౌతికశాస్త్రము తెలుసు అను శాస్త్రజ్ఞులకు కూడ అకాలమరణముగానీ,

సూక్ష్మశరీరముగానీ అర్థము కాదు. కావున దయ్యములు లేవు అని చాలామంది విజ్ఞానులే అంటున్నారు. దయ్యము

అంటే సూక్ష్మముగా కంటికి కనిపించని జీవరాసి అని తెలియదు. దయ్యములు మనుష్యుల్లోనే కాదు అన్ని జీవరాసులలోను

ఉన్నాయి. అర్థము చేసుకొంటే కనిపించని ప్రపంచము ఎంతో ఉంది. దానినే కనిపించని రెండవ జగత్తు అని మేము

అంటున్నాము. కేవలము భౌతికవాదము చేయువారికి అభౌతికము తెలియదు. అభౌతికము (సూక్ష్మము)ను గురించి

తెలుసు కోవాలని ప్రయత్నము కూడ చేయకుండా, అది లేనే లేదు, ఉంటే చూపిస్తావా అను హేతువాదము ముసుగు

తగిలించుకొన్నవారు కొందరుండ వచ్చును. వారిది హేతువాదము కాదని నేనిప్పుడు కూడ చెప్పుచున్నాను. ఒక

యదార్థ సంఘటన వెనుక దాగియున్న కారణమును వెతికి దాని నిజస్థితిని తెలుసుకొని, సత్యమును ప్రకటించునది

హేతువాదము కానీ తాను పట్టుకొన్న కుందేలుకు మూడేకాళ్ళు అని మొండిగా వాదించునది హేతువాదము కాదు.


దయ్యము అను పదము మొరటుగా కనిపించినా అది దేవుడు అను పదమునకు వ్యతిరేఖముగా పుట్టినది.

దేవుడు వెతికినా తెలియడు, కనిపించడు. దయ్యము వెతికితే తెలియును, కనిపించును. దేవుడు, దయ్యము రెండు

కంటికి కనిపించనివే అయినా దేవుడు శోధించినా తెలియడు, దయ్యము శోధించితే తెలియును. గుడిలో ఉన్న ప్రతిమ

శరీరములో కూడ సూక్ష్మశరీరమున్నది, కావున దానిని కూడ దయ్యము అనవలసి వచ్చినది. అలాగే కదిలెడు జీవరాసుల

శరీరములలో కూడ సూక్ష్మశరీరము ఉన్నది, కావున దానిని కూడ దయ్యములు అని అంటున్నాము. ఇంతకు ముందు


గ్రామదేవత మనిషి శరీరములోనికి వచ్చి మాట్లాడిన విషయము చెప్పుకొన్నాము. చనిపోయిన మనిషి అనగా దయ్యము,

మనిషి శరీరములోనికి వచ్చి మాట్లాడిన విషయము చెప్పు కొన్నాము. ఇటు గుడిలోని దేవతగాక, అటు చనిపోయిన

సూక్ష్మమైన మనిషిగాక మేము చూచిన ఇతర జీవరాసి విషయమును ఇపుడు చెప్పుకొందాము.


దాదాపు ఇప్పటికి 35 సంవత్సరముల క్రితము తాడిపత్రిలో రైల్వే స్టేషన్మాస్టరు ఉద్యోగము చేయుచున్న

నాగేశ్వరావు అనే పేరుగల నాగదేవత ఉపాసకుడు, నాగదేవతను గొప్ప ఊరేగింపుగా తీసుకెళ్లుచుండగా, ఇతరులు

నాగదేవతను పూజించి, కొబ్బరికాయలను సమర్పించడానికి ఆపి పూజిస్తుండగా, దాదాపు 150 మీటర్ల దూరములో

నుండి ఆ దృశ్యమును చూస్తున్న 40 సంవత్సరముల వయస్సు గల మనిషికి పూనకము వచ్చి క్రిందపడిపోయి, పాము

ప్రాకినట్లు ప్రాకుచూ, పాము బుసకొట్టినట్లు బుస కొట్టుచున్న దృశ్యమును చూచాను. అతను చూస్తుండగానే దేవతవైపు

ప్రాకుచు పోవడము జరిగినది. దానిని చూచిన నాగదేవత ఉపాసకుడు నాగేశ్వరరావు నాగదేవతకు నమస్కరించి,

పూనకము వచ్చిన మనిషి ముఖము మీద దేవత తీర్ధమును చల్లగా అంతవరకు పాముమాదిరి ప్రాకిన మనిషి సాధారణ

మనిషిగా మారిపోయి లేచి నిలబడ్డాడు. అంతవరకు అతనికి ఏమి జరిగినది తెలియదు. కావున జరిగిన విషయమును

ఇతరుల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన చూచిన మాకు అక్కడ పాము యొక్క సూక్ష్మము

(దయ్యము) మనిషి శరీరములో ప్రవేశించినదని అర్థమైనది. ఆ విషయము నాగదేవత ఉపాసకుడైన అతనికి కూడ

తెలిసినది. కానీ అక్కడున్న ప్రజలకు ఏమి అర్థము కాలేదు.


ఇలాంటిదే మరొక సంఘటనను కూడా చూచాను. 1997వ సంవత్సరములో అనంతపురము జిల్లాలోనే

మారుమూల ఊరు, పేరు జ్ఞాపకము లేదు. ఆ ఊరి బయట ఈశ్వరాలయము గలదు.ఆ ఆలయములో దాదాపు

40మంది మనుషులతో మేము నమ్మకములు, మూఢనమ్మకములు అను విషయమును గురించి మాట్లాడుచున్నాము.

ఆ విషయములే ఇపుడు “నాస్తికులు-ఆస్తికులు” అను పేరు మీద మేము వ్రాసిన చిన్న గ్రంథము కూడ కలదు.

దినము అలా మాట్లాడుచుండగా అక్కడున్న ఆడవారిలో ఒకరు లేచి గర్భగుడిలోనికి పోవడము జరిగినది.

పోవడము చూచినా, దానిని మేము పట్టించుకోలేదు. మేము మాట్లాడు చుండగా మిగతావారంత శ్రద్ధగా వింటున్నారు.

అంతలో గర్భగుడిలో పాము బుసకొట్టినట్లు శబ్దము రావడము మొదలు పెట్టింది. అటు వైపుచూస్తే లోపలికి పోయిన

ఆమె క్రిందపడి పామువలె వంకర్లు తిరుగుచు ఈశ్వర లింగము చుట్టు ప్రాకుచున్నది. తర్వాత 20 నిమిషము లకు

ఆమె లేచివచ్చినది. అలా వచ్చిన ఆమె లోపలినుండి మల్లెపూలమాల తెచ్చి మా మెడలో వేసిపోయినది. ఆ మాలలో

పూలు అపుడే కోసిన మొగ్గలుగా ఉన్నవి. అంతేకాక ఒక ఇంచుకొక పువ్వు కట్టివున్నవి. అక్కడెక్కడా ఆ పూలు

దొరకవనీ, అంత తాజ మొగ్గలు అప్పుడే కట్టినట్లుండడము ఆశ్చర్యమని అక్కడున్నవారు చెప్పినా దానిని మేము

పట్టించుకోలేదు. కానీ అక్కడ ఆమె శరీరములోనికి పాముగ్రహము లేక పాము సూక్ష్మశరీరము ప్రవేశించినదని, అదియే

ఈశ్వరలింగము చుట్టు ప్రాకుచు తిరిగినదని మాకు అర్థమైనది.


ఈ విధముగా ఇతర జీవరాసులు కూడ మనిషి శరీరములోనికి అరుదుగా ప్రవేశించడము వలన మనుషుల

సూక్ష్మములు, దేవతల సూక్ష్మములే కాక, మిగత జీవరాసుల సూక్ష్మములు కూడ ఉన్నవని తెలియు చున్నది. ఇలా పాము

గ్రహము విషయమే కాక, ఒక చేప గ్రహము ఘటనను కూడ మేము 1975లో చూడడము జరిగినది. ఇవన్నిటిని ఒక

పరిశోధన రూపములో చూచాము. గ్రుడ్డిగా దేనిని నమ్మలేదు. ఒక్కొక్క సంఘటనలో సూక్ష్మాలకు సంబంధించిన ఎన్నో

విషయములు తెలిసినవి. మా పరిశోధనను మలుపు త్రిప్పిన ఆ సన్నివేశమును గురించి వివరిస్తాను. ఒక వ్యక్తి



మంత్రాలయము దగ్గర తుంగభద్ర నదిలో చేపలు పట్టుకొనివచ్చాడు. అందులో ఒక పెద్దచేప దొరికింది, అది ఎక్కువసేపు

ప్రాణముతోనే ఉండగా దానిని భూమికి కొట్టి అతను చంపివేశాడు. అతను ముస్లీమ్ మతస్థుడు. దేవతలను, దయ్యాలను

నమ్మేవాడు కూడా కాదు. ఆ చేపను చంపిన అర్థగంటకు అతనికి కడుపునొప్పి వచ్చినది. అతను డాక్టరు వద్దకు పోయి

చికిత్స చేయించుకొనినా ఏమాత్రము తగ్గలేదు. నొప్పితో అతను మెలికలు తిరిగిపోతూ ఇంటికి వచ్చి బాధపడుతుంటే

పక్కింటివారు నావద్దకు తీసుకువచ్చారు. ఆ సంవత్సరము నేను “రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్"గా పని చేయుచుంటిని.

అందువలన వైద్యము నిమిత్తము అతను నావద్దకు వచ్చాడు. ముందు డాక్టర్ ఇచ్చిన ప్రిస్కిప్షన్ అంతా చూపించాడు.

డాక్టరు మంచి మందులు ఇచ్చినట్లు తెలిసింది. అయినా అతను మెలికలు తిరిగి పోతుండడము ఆశ్చర్యము వేసింది.

అపుడు అతనిని కడుపులో ఏ వైపు నొప్పి ఉంది అని ప్రశ్నించాను. అతను మొదట కుడి ప్రక్క చూపించాడు. తర్వాత

నిమిషములోనే ఎడమ ప్రక్క ఉంది అన్నాడు. కరెక్టుగా చెప్పమంటే, నిమిష నిమిషము నొప్పి జాగా మారుతుంది

కడుపులో కదిపివేసినట్లుంది అన్నాడు. అపుడు ఇది శరీరములో పుట్టిన నొప్పికాదని అర్థమైనది.


అపుడు అతని నుండి వివరములు సేకరించుటకు ప్రశ్నించను మొదలు పెట్టాను.


ప్రశ్న:- నీ కడుపులో నొప్పి కడుపులో మాత్రమే ఉన్నదా? లేక పైన ఊపిరితిత్తుల వరకు ఉన్నదా?

జవాబు : కొంతసేపు కడుపులో, కొంతసేపు కడుపుకు పై భాగమున దొమ్మలలోను నొప్పి వస్తావుంది?

ప్రశ్న:- అప్పుడప్పుడు ఒక నిమిషముగానీ, రెండు నిమిషములుగానీ నొప్పి ఏమాత్రము లేకుండపోయి, బాగావుండి

తర్వాత మొదలు పెట్టి విపరీతముగా నొప్పి కలుగుచున్నదా?

జవాబు : అవును మీరు చెప్పినట్లే ఒక నిమిషము బాధ లేకుండ పోయి తర్వాత వెంటనే వస్తావుంది.

ప్రశ్న:- ఈ నొప్పి ఎపుడు ప్రారంభమైనది?

జవాబు : ఉదయము 6-30 గంటలకు ట్రైన్లోనే వచ్చింది.

ప్రశ్న:- ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నావు?

జవాబు : మంత్రాలయము నుండి

ప్రశ్న:- అక్కడికి దేనికి పోయావు?

జవాబు : తుంగభద్ర నదిలో చేపలను పట్టేదానికి పోయింటి, అక్కడ మా వారు, నేను చేపలను రాత్రి పట్టి, నా భాగము

చేపలు నేను తీసుకువచ్చాను.

ప్రశ్న:- చిన్న చేపలా? పెద్ద చేపలా?

జవాబు : పెద్దచేపలు, ఒక్కొక్కటి కేజీ పైన, రెండు కేజీల వరకు ఉంటాయి.

ప్రశ్న:- అన్ని ఒకే జాతిచేపలా?

జవాబు : వేరు వేరు జాతివి దొరికినవి. నేను మాత్రము ఒకే జాతివి తెచ్చుకొన్నాను.

ప్రశ్న:- తెచ్చుకొన్న చేపలు వాటంతటకవే చనిపోతాయి, కొన్ని బ్రతికి ఉంటాయి. చాలాసేపటికిగానీ చనిపోవు అలా

ఏమైనా నీవద్ద కనిపించాయా?

జవాబు : రెండు కేజీల చేప ఒకటి చాలాసేపు బ్రతికే ఉంది. ట్రయిన్లో కూడ సంచిలో కదులుతూవుంటే, బయటికి


తీసి క్రిందకు కొట్టి చంపి సంచిలో వేశాను.


ప్రశ్న:- అలా చేసిన తర్వాత నీకు కడుపునొప్పి వచ్చిందా?

జవాబు : అవును దానిని చంపిన తర్వాత అర్థగంటకు నొప్పి వచ్చింది.


ఇక్కడ వానికున్న కడుపునొప్పికి ఇన్ని ప్రశ్నలు అవసరమా! అని కొందరనుకోవచ్చును. ప్రతి దానిని ప్రశ్నించి

సత్యము తెలుసుకోవడమే హేతుపద్ధతి అని ముందే చెప్పానుగా! సాధారణముగా డాక్టర్లు నీకు నొప్పి ఎక్కడుంది అని

అడుగుతారు. అలాగే మొదట నేనూ అడిగాను. కొంత సేపు కడుపులో, కొంతసేపు గుండె పై భాగములో నొప్పి

వస్తావుంది అన్నపుడు నాకు ముఖ్యమైన క్లూ దొరికింది. దాని మూలంగా అన్ని ప్రశ్నలు వేయవలసి వచ్చింది. అక్కడ

నొప్పికి తగిన ఆధారమేమి దొరికిందని కొందరు ప్రశ్నించ వచ్చును. దానికి జవాబు, ఏ నొప్పి అయినా అలా అంత

తొందరగా ఒక జాగా నుండి మరియొక జాగాకు మారదు. అలా మారిందంటే అది సాధారణ నొప్పికాదని చెప్పవచ్చును.

ప్రతి జాతి జీవరాసి సూక్ష్మముగా (దయ్యముగా) ఉండుటకు అవకాశముందని తెలిసిన మాకు, అవి శరీరము మీద

పూనకము రావడము లేక ఆవహించడము జరుగుచున్నదని కూడ తెలుసు. అంతేకాక పైన వివరించిన చేప సంఘటనతో

శరీరమును ఆవహించి పైకి కనిపించడమే కాదు, శరీరములోపల వుండి బాధించడము కూడ జరుగుచున్నదని అర్థమైనది.

అతను చేపను చంపిన అర్థగంట తర్వాత చేప సూక్ష్మము (గ్రహము) అతని కడుపులో చేరి బాధించను మొదలు

పెట్టింది అని తెలిసింది. అది మందులతో బాగవునది కాదని కూడ అర్థమైనది. అయినా ఆ నొప్పిని ఐదు నిమిషములలో

నయము చేసి పంపడము జరిగినది. ఎలా నయము చేసినది తర్వాత వివరముగా చెప్పుతాము.


సాధారణ మనిషికి దయ్యాలను గురించి ఎటువంటి అవగాహన లేదు. అటువంటపుడు వాటి విషయములో

ఎన్నో ప్రశ్నలుండును, కాని సరియైన జవాబులు దొరికియుండవు. అందువలన మనిషిలో ఉద్భవించు ప్రశ్నలన్నిటికీ

జవాబులు దొరుకులాగున మా ముందర, మా అనుభవములో జరిగిన యదార్థసంఘటనలను వివరిస్తూ ఈ గ్రంథమును

వ్రాయదలచాము. మనిషిలో వచ్చు ప్రశ్నలను మేమే అడుగుచూ, వాటికి జవాబివ్వడము జరిగినది. ఇక ప్రశ్నలు

చూస్తాము.


ప్రశ్న:- దయ్యమంటే ఏమిటి? భూమిమీద దయ్యములున్నాయా?

జవాబు: దేవుడు అను పదమునకు వ్యతిరేఖపదముగా దయ్యము అను పదము పుట్టినది. దేవుడు జీవితములో

తెలియబడడు. దయ్యము తెలియ బడుతుంది. దయ్యమునే గ్రహము, సూక్ష్మశరీరము అని కూడ అంటున్నాము.

కనిపించదు కావున సూక్ష్మమనీ, గ్రహించుశక్తి గలది కావున గ్రహమని అనడము జరుగుచున్నది. జీవమున్న ప్రతిదీ

గ్రహించుకొను సామర్థ్యము కలదిగా ఉన్నది. కావున ప్రతి జీవరాసిని గ్రహము అనవచ్చును. ఆ లెక్క ప్రకారము

మనమంతా గ్రహములమే. అలాగే కనిపించెడి శరీరములో కనిపించని సూక్ష్మశరీరముగా ఉన్నాము, కావున మనమంతా

కనిపిస్తూ బ్రతుకుచున్న దయ్యాలమే. దయ్యాలు అంటే సినిమాలో మేకప్ చేసి చూపించినట్లు ఏదో వికారరూపములు

కాదు. భూమిమీద దయ్యాలు ఉన్నాయి. వాటి అనుభవాలు, ఆచరణలు ఎన్నో ఉన్నాయి. మనిషి అకాల మృత్యువు

పొందితే ఆయుస్సు అయిపోవువరకు ఉండు స్థితిని దయ్యము అంటున్నాము.

ప్రశ్న:- వెయ్యిమంది జనాభావున్న ఊరిలో ఎన్ని దయ్యములుంటాయి?


జవాబు: వెయ్యికంటే కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువగానీ ఉండవచ్చును. మనుషదయ్యాలేకాక ఊరిలో ఉండు

కోళ్ళు, కుక్కలు, పశువులు మొదలగున వన్నీ ఉండును. ఒక విధముగ చెప్పితే దాదాపు కనిపించే ఊరంత కనిపించని

ఊరుకూడ ఉందని చెప్పవచ్చును. ఒక ఊరే కాదు, ఒక దేశమేకాదు మొత్తము ప్రపంచమంతా సూక్ష్మశరీరములు

మనుగడ సాగిస్తున్నవి. కావున కంటికి కనిపించని రెండవ ప్రపంచము మరొకటి ఇక్కడే కలదని చెప్పవచ్చును. ఒక

మనిషిగానీ, జంతువుగానీ, పక్షిగానీ ప్రారబ్ధకర్మచేత నిర్ణయింపబడిన ఆయుస్సు అయిపోయి చనిపోతే మరు జన్మకు

పోవునని, ఆయుస్సు అయిపోక ముందే చనిపోతే అదే జన్మలో సూక్ష్మముగ (దయ్యముగ) ఉండునని మరొకమారు జ్ఞప్తి

చేయుచున్నాము. అట్లు ఆయుస్సు అయిపోకముందు చనిపోయిన జీవ జాతులు ఎన్నో కలవు. కావున అవన్నీ

కనిపించని జీవ సముదాయముగా అనగా కనిపించని జగత్తుగా ఉన్నవి.


ప్రశ్న:- ఒక మనిషి స్థూలశరీరముతో బ్రతికి ఉన్నపుడు వానికి ఒక కాలు లేదు, కావున వాడు కుంటుతూ నడిచేవాడు.

అటువంటివాడు అకాల మృత్యువుతో ఆయుస్సు అయిపోకముందే చనిపోతే వాని సూక్ష్మము బాగా నడుచునా? లేక

అప్పుడు కూడ కుంటుతూ నడుచునా?


జవాబు: అకాలమృత్యువు లేక అకాలమరణము పొందకముందు అంగ వైకల్యమున్న వాడు సూక్ష్మశరీరముతో గడుపు

జీవితములో కూడ అంగ వైకల్యముతోనే బ్రతుకును. దానికి నిరూపణగా ఒక సంఘటనను గూర్చి చెప్పెదను.

అనంతపురము జిల్లా, పెనుకొండ దగ్గర ఒక పల్లెటూరులో అన్ని అవయవములు బాగున్న ఒక మనిషికి దయ్యము

పట్టినది. దయ్యము పట్టిన సమయములో అతను కుంటుతూ నడుచును. దయ్యము వదలి పోతూనే కుంటకుండ

బాగానడుచును. కాలు బాగా ఉన్నప్పటికీ శరీరములో అంగవైకల్యమున్న గ్రహమున్నంతసేపు, కాలుకు బలము

లేకుండ పోవుచున్నది. కాలును ముల్లుతో గుచ్చినా కాలులో చైతన్యములేదు. దీనినిబట్టి లోపలున్న దయ్యము కర్మప్రకారమే

పై శరీరము కూడా పని చేయునని తెలియుచున్నది.


జీవుని కర్మను బట్టి పై శరీరము తయారగునని చెప్పుటకు మరొక ఆధారమును తెల్పుచున్నాను. యాడికి

అను గ్రామములో ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరముల క్రిందట జరిగిన సంఘటనను వివరించుకొందాము.

పెళ్ళికాని అందమైన 18 సంవత్సరముల యువతికి, అప్పుడప్పుడు ఆరోగ్యము బాగుండెడిది కాదు. కొంత కాలముగా

డాక్టర్లవద్ద చూపించినా అనారోగ్యముగనే ఉండేది. ఆ అమ్మాయికి దైవజ్ఞానము మీద మంచి ఆసక్తి ఉండుట వలన

నేను ఆ ఊరికి పోయినపుడు జ్ఞానమును వినేదానికి ఆమె పెద్దమ్మ ఇంటికి వచ్చి అక్కడ విని పోయేది. ఆ అమ్మాయి

యొక్క పెద్దమ్మ ఆ యువతి ఆరోగ్యమును గురించి నాకు చెప్పడము జరిగినది. నాకు మంత్రములురావు. నేను భూత

వైద్యుడనూ కాను. అయినా నన్ను చూస్తే దయ్యములు పారిపోతాయని, నావలన ఎంతో మంది ఆరోగ్యము బాగుపడిందని

ఆ యువతి పెద్దమ్మకు తెలుసు. అందువలన ఆ యువతి ఆరోగ్యమును గురించి నావద్ద ప్రస్తావించారు. నేను కూడ

ఆ అమ్మాయి జ్ఞానము తెలుసుకోవడమును చూచాను. నేను అల్లోపతి మరియు హెూమియోపతి డాక్టర్ను కనుక

తర్వాత వచ్చినపుడు చూచి చెప్పుతానని చెప్పాను. రెండు నెలల తర్వాత అక్కడికి పోవడము జరిగినది. అప్పుడు

అమ్మాయిని ఆమె పెద్దమ్మ సమక్షములోనే చూచాను. ఆమెకు శరీరములో ఏ లోపము లేదని చెప్పాము. అయినా

ఆమెకు ఆరోగ్యము బాగాలేదు, దానికి కారణము ఏముంటుందని ఆలోచించాము. నాకు వచ్చిన ఆలోచన ప్రకారము

సాయంత్రము చూస్తామని చెప్పాము. అట్లే సాయంకాలము చూడడము జరిగినది. అప్పుడు ఆమె గుండె చప్పుడులో,


రక్తప్రవాహములో బాగా తేడా కనిపించింది. అప్పుడు ఆమె శరీరములోపల మరొక గ్రహము ఉన్నదని

(సూక్ష్మశరీరమున్నదని) అర్థమైనది. ఆ విషయమును ఆమె పెద్దమ్మకు చెప్పి, దానికి తగిన చికిత్సను మంత్రాలు వచ్చిన

వారివద్ద చేయించుకొమ్మని చెప్పాము. అప్పటికే అన్ని రకములు చూపించామని భూత వైద్యులు కూడ చూచారని,

తావెత్తులు కూడ కట్టించామని చెప్పారు.


ఆ యువతి ఇంటిలో వారి తల్లిదండ్రులకు జ్ఞానము మీద ఆసక్తిలేదు. అయినా ఆ అమ్మాయికి దైవజ్ఞానము

మీద ఆసక్తి ఉండుట వలన ఆ రోగమును గురించి కొంత ఆరా తియ్యాలనుకొన్నాను. అపుడు నేను కూర్చున్న కుర్చీకి

ఎదురుగా మూడు అడుగుల దూరములో అమ్మాయిని కూర్చోమని, తలపైకి ఎత్తి ఎదురుగా నావైపు చూడమన్నాను.

అపుడు ఆమె నాపైపు చూడలేకపోయేది. నావైపు చూస్తే లోపల అణిగియున్న దయ్యము బయటికి రావడము జరుగుతుంది.

కానీ ఆమె శరీరములోని సూక్ష్మము బయటికి రాలేదు. అపుడు నేనే లోపల అణిగియున్న జీవుడు (దయ్యము) బయటికి

వచ్చి మాట్లాడమని చెప్పాము. అలా చెప్పగానే చాలా భయపడుచు ఆ యువతి మాట్లాడటము జరిగినది. పైకి యువతి

కనిపిస్తున్నప్పటికీ మాట్లాడునది దయ్యము అని నాకు, అక్కడున్న వారికి బాగా అర్థమైనది. ప్రక్కన కనీసము 20మంది

ఆడ మగ మనుషులున్నారు. వారందరికి దయ్యము మాట్లాడుచున్నదని అర్థమగుటకు కారణము ఆ అమ్మాయి మాట్లాడే

మాట స్పష్టముగా లేదు. మూతి వంకరపోయి పార్శ వాయువు వచ్చినవాడు మాట్లాడినట్లు మాట్లాడుచున్నది. అంతేకాదు

కుడి కాలు, కుడి చేయి కూడ ఏమాత్రము పని చేయలేదు. మొత్తము మీద శరీరమునకు పార్శవాయువు ఉన్నట్లు

అక్కడివారందరికి అర్థమైనది. ఆమె లోనికి చేరిన వ్యక్తికి పార్శవాయువు ఉన్నదని, అందువలన ఆమె శరీరము అలా

అయినదని నాకు తెలిసింది. అప్పుడు ఆ దయ్యమును ప్రశ్నించగా, ఎన్నో ఆసక్తికరమైన విషయములు తెలిసినవి.


ఒక వ్యక్తికి 20 సంవత్సరముల యుక్తవయస్సులోనే పార్శవాయువు (పెరాలసిస్) వచ్చి శరీరములో ఒక ప్రక్క

కాలు, చేయి, నోరు పడిపోయినవి. అతనికి మాట్లాడేదానికి కూడ నోరు అనుకూలించడము లేదు. అలాగే కష్టముగా

కుంటుతూ నడిచేవాడు. అతను అడుక్కు తిని బ్రతికేవాడు. అతనిది తెలంగాణా ప్రాంతము. బిక్షాటన చేస్తు

అనంతపురము జిల్లాకు పోయాడు. యాడికిలో, ఊరిలోనే పెద్ద గుడి ఉందనీ, అక్కడికి భక్తులు వస్తుంటారని తెలుసుకొని

గుడి ముందర కూర్చుంటే కొందరైన దయదలచి డబ్బులిస్తారనుకొన్నాడు. సరిగా నడువలేని అతను ఆ గుడిముందర

ఉండేవాడు. అక్కడ ఎవరూ డబ్బులివ్వక పోవడము వలన ఆ ఊరిలోనే కొంత తిరిగి ఎవరైనా ఏదైన పెట్టితే తిని

బ్రతికేవాడు. ఆ కుంటివాడు ఆ ఊరికి వచ్చిన ఆరునెలలకే చనిపోవడము జరిగినది. అదియు అకాల మరణము

పొందాడు. కావున దయ్యముగా ఉండిపోయాడు. ఇక్కడ అతను చనిపోయాడన్న పేరేగానీ, అతని జీవితము

మాత్రము యధాతథమే. చనిపోకముందు కనిపించేవాడు, చనిపోయాక కనిపించడము లేదు. మనుషులకు కనిపించకున్నా,

వాడూ ఉన్నాడు, వాని జీవితమూ ఉన్నది. అలా కాలమరణము వచ్చువరకు అనగా పూర్తి ఆయుస్సు అయిపోవు

వరకు అతను ఉండవలసిందే. అతను బ్రతికినపుడు కాలు, చేయి సహకరించక ఎంత దుర్భర జీవితమును అనుభవించాడో,

అకాల మరణము పొందిన తర్వాత కూడ, అలాగే దుర్భర జీవితమును అనుభవిస్తున్నాడు.


అలా జీవితము గడుపుచున్న అతనికి ఒక దినము ఒక క్రొత్త ఆలోచన వచ్చినది. అప్పటికి అతని వయస్సు

25 సంవత్సరములు. అతనిది యుక్తవయస్సే కావున, తనకు ఒక అమ్మాయి తోడు కావాలను కొన్నాడు. బ్రతికి ఉ

న్నపుడు అడుక్కుని తినే అతనిని చూచీ, అతని కాలు చేయి చూచీ ఎవరు కూడా అతనికి తోడు కారు. కానీ ఇప్పుడు

తన ఇష్టప్రకారము తోడు చేసుకోవచ్చు అనుకొన్నాడు (ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటున్నది. మగ దయ్యము


బ్రతికియున్న స్త్రీ శరీరములో చేరి ఆమెను అనుభవించవచ్చును. అలాగే స్త్రీ దయ్యము బ్రతికియున్న మగ శరీరములో

చేరి అతనితో సంయోగము చేయవచ్చును) వెంటనే యుక్తవయస్సులోనున్న ఆడపిల్లల కొరకు వెదకను మొదలు పెట్టాడు.

అదియు అందమైన అమ్మాయే కావాలనుకొన్నాడు. ఒక రోజు 10వ తరగతి చదువుచున్న అమ్మాయి కనిపించింది.

అందరికంటే ఆ అమ్మాయి బాగా అందముగా ఉన్నదనుకొన్న అతను, ఆమెలో చేరడానికి ప్రయత్నము చేయను

మొదలు పెట్టాడు. దాదాపు నెల తర్వాత ఒక దినము ఆమె స్కూల్నుండి వచ్చే సమయములో మధ్యాహ్నము ఒంటిగంటపుడు

ఆమె లోనికి ప్రవేశించాడు. స్కూల్నుండి ఆమె ఇంటికి వచ్చుదారి పొలాల్లో ఉంది. ఆ దారిలో ఆమె ఒక్కతే

ఒంటరిగా వస్తుంది. అదే మంచి అదనుగా అతడు తలచాడు. అతను కుంటివాడు కనుక దారిలో అదియు పొలము

గట్టులో కాచుకొని కూర్చున్నాడు. ఆమె వచ్చుచున్నపుడు కనిపించక అదృశ్యముగా నున్న అతను, ఆ అమ్మాయి

కాలుపట్టుకొన్నాడు. అపుడు ఆమె పొలము గట్టులో క్రిందపడింది. ఆ అమ్మాయి పడి తేరుకొని లేచే లోపల ఆమెలోనికి

చేరుకొన్నాడు. చదువుతూవుంటే ఇదొక వింతగా ఉంది కదా! ప్రక్కన ఉండి చూచినట్లు చెప్పుచున్నావు, ఇదంతా

నీకెలా తెలుసునని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి నా జవాబు ఇలా ఉంది.


ఆ అమ్మాయి పెద్దమ్మ ఇంటిలో నా ముందర కూర్చున్నపుడు ఆమెలో మార్పువచ్చింది కాలు, చేయి పని

చేయలేదు, నోరు కూడ సరిగ పని చేయలేదు అని చెప్పాము కదా! అప్పుడు ఆమె శరీరములోనున్న కుంటి వాడు

ఆమె శరీరము మీదికి వచ్చి మాట్లాడుచు, నేను ప్రశ్నించే కొద్దీ గతములో జరిగిన విషయమంతా పూసగ్రుచ్చినట్లు

చెప్పాడు. అతడు చెప్పినదంతా వాస్తవమేనని తెలిసినది. కావున దానిని మీకు చెప్పాము. ఇదంతా విన్న తర్వాత నేను

అడిగిన విధానము, అతను మాట్లాడిన విషయము ఇలా ఉంది.


నేను :- చిన్న వయస్సులోనున్న అందమైన అమ్మాయిని పీడించే దానికంటే నీమాదిరి చనిపోయి దయ్యాలైన

ఆడవారుంటారు కదా! వారిలో ఎవరినైన తోడు చేసుకోకూడదా?


కుంటివాడు:- నేను దయ్యాన్నే, వాళ్ళు దయ్యాలే, వారికి నేను కనిపిస్తా వుంటాను. నన్ను చూచి ఎవరు నా దగ్గరకు

వస్తారు? నేనేమైనా మాట్లాడితే వాళ్ళే నన్ను తంతారు. అందువలన చనిపోయిన వారి జోలికి నేను పోలేదు.

బ్రతికియున్నవారికి నేను ఎటూ కనిపించను. అందువలన వారిలోనికి దొంగగా చేరవచ్చును. చేరిన తర్వాత నా

కోర్కెను తీర్చుకోవచ్చును. అందుకే ఈ అమ్మాయిలోనికి వచ్చాను.


నేను :- జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ అమ్మాయిని వదిలిపో, నీ జీవితము ఎటూ పాడైపోయింది. ఆమె

జీవితమును ఎందుకు నాశనము చేస్తావు?


కుంటివాడు :- నాకు తోడు కావాలనే వచ్చాను. కొంత కాలము ఇలాగే ఈమెలో ఉండి, ఈమె బాగా బలహీనపడిన

తర్వాత ఈమెను చంపేస్తాను. అపుడు ఈమె కూడ నా మాదిరి దయ్యమే అవుతుంది. అపుడు ఈమెకు నేనే

పరిచయము కాబట్టి నాదగ్గరే ఉంటుంది. నాకు కాలు, చేయి సరిగ లేదు కదా! ఈమె తోడుంటే నన్ను పట్టుకొని

నడిపించగలదు, ఏమైన పని చేసి పెట్టగలదు.


నేను :- ఎంతో మంచి భవిష్యత్తున్న అమ్మాయిని ఇలా చేయడము చాలా అన్యాయము. నీకు చాలా పాపము వస్తుంది,

నేను చెప్పినట్లు విని ఈ అమ్మాయిని వదలిపో. లేకపోతే ఈ విషయములో నీమీద నాకు కోపము వస్తుంది.


కుంటివాడు :- పెద్దవాళ్ళు మీరే అలా అంటే ఎలా స్వామి! అవిటివాన్ని నేను బ్రతికేది ఎలా? నాకు ఆసరాగా ఎవరో

ఒకరు ఉండాలి కదా! నేను ఏ మంత్రగాళ్ళవద్ద బయటికి వచ్చి మాట్లాడలేదు. కానీ మీ వద్ద మాత్రము అలా ఉండలేక

పోయాను. మీ ముందర ఉండలేక పోతున్నాను. మీరు అనుకొంటే నాకు న్యాయమైనా చేయగలరు, అన్యాయమైనా

చేయగలరు.


నేను :- నీకు న్యాయము చేస్తే, ఈ అమ్మాయికి అన్యాయము చేసినట్లు కాదా! ఇది నీకైనా పాపము పని కదా! నీవే

ఆలోచించుకొని చెప్పు.


కుంటివాడు :- నేను ఆలోచించుకొని మీకు చెప్పేంతటివాడను కాను, మీరెలా చెప్పితే అలా చేస్తాను. ఈ అమ్మాయికి

దైవజ్ఞానము మీద ఆసక్తి కలదు. అయినా స్వతంత్రముగావచ్చి తెలుసుకొనే అవకాశము లేదు. వాళ్ళ అమ్మ, నాన్నకు

జ్ఞానమంటే సరిపోదు. ఇప్పుడు కూడ వాళ్ళకు తెలియకుండ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి జ్ఞానము తెలుసుకొనే దానికి

వచ్చినది. నాకు కూడ జ్ఞానమును తెలుసుకోవాలనే ఉంది. ఈ అమ్మాయి నా దగ్గరుంటే ఇద్దరము వచ్చి జ్ఞానమును

తెలుసుకోవచ్చును. ఈ అమ్మాయికి ఏ ఆటంకముండదు. నేను ఈమెను ఏ ఇబ్బంది పెట్టను. మీరు దయ తలచి

నన్ను ఏమి అనవద్దండి, నాకు జ్ఞానము తెలుసుకొను అవకాశము ఇవ్వండి.


నేను :- ఒరే! నీవు నన్నే ఇరుకున పెడుతున్నావు. నీతి, న్యాయములు ప్రపంచ సంబంధమైనది. జ్ఞానము, ధర్మము

దైవసంబంధమైనవని నేనే ఎందరికో చెప్పుచుంటాను. అలాంటపుడు ప్రకృతి సంబంధమైన నీతి, న్యాయముకంటే

ఎక్కువ జ్ఞాన, ధర్మములకే విలువ ఇస్తాను. అందువలన నీవు అడిగిన దానికి సరియైన పరిష్కార మార్గము చెప్పుతాను

నీవు అలాగే నడుచుకో. చెప్పమంటావా? నా మాటవింటావా?


కుంటివాడు :- జ్ఞానము ప్రకారము చెప్పే మీ మాటను తప్పనిసరిగ వింటాను. మీరు ఎలా చెప్పితే అలా చేస్తాను.

నేను :- సరే, నీవు ఈ అమ్మాయిలో ఉండినా పరవాలేదు. కానీ ఈ అమ్మాయికి పెళ్ళి అయి సంతతికల్గిన తర్వాత నీ

వెంట పిలుచుకొనిపో, అంతవరకు ఈమెను ఏ బాధ పెట్టకూడదు, నీవు చంపకూడదు. ఒకవేళ నామాట వినకపోతే

నీకే మంచిదికాదు.


కుంటివాడు :- లేదు స్వామి మీ మాట జవదాటను. మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. ఇప్పటికే చేసుకొన్న పాపమును

అనుభవించుచూ చస్తున్నా. మీ మాటను కాదంటే నాకు తిరుగులేని పాపము వస్తుంది.


సరే లోపలికి అణిగిపో. అని నేను చెప్పగానే అతను అణిగిపోవడము ఆ అమ్మాయికి జ్ఞప్తిరావడము జరిగినది.

అప్పుడు నీవు జ్ఞానము తెలుసు కొంటూవుంటే నీకు మంచి జరుగుతుందని ఆమెకు చెప్పి వచ్చేశాము. తర్వాత కొంత

కాలమునకు ఆమెకు పెళ్ళి కావడమూ, ఆ తర్వాత కొంత కాలమునకు గర్భము రావడము జరిగినది. అబ్బాయిని

ప్రసవించిన తర్వాత ఆమె చనిపోవడము కూడ జరిగినది. తర్వాత కొంత కాలమునకు ఆమె చనిపోయినట్లు నాకు

తెలిసింది. బ్రతికినవారే మర్యాద ఇవ్వని ఈ కాలములో చచ్చినవాడైనా, కుంటివాడైనా నామాట మీద గౌరవముతో

అతను నడుచుకొన్నందుకు సంతోషించాను.


ఈ సంఘటనను చదివిన తర్వాత, మీకు ఎన్నో అనుమానములు, ఎన్నో ప్రశ్నలు వచ్చియుండవచ్చును. కొన్ని

సంశయములు తీరుటకు నా గురించి కొంత వివరము చెప్పదలుచుకొన్నాను చూడండి. నేను మంత్రగాడిని కాదు,


నాకు ఏ మంత్రములు రావు. నా వద్ద శక్తివంతమైన మూలికలు (బదనికలు) గానీ, తావెత్తులు గానీ ఉండవు. నావద్ద

ఉన్నదంతా ఒకే ఒక దైవజ్ఞానము. నాలోయున్న జ్ఞానమునుబట్టి దయ్యములు బయటపడడము, వాటంతటకవే బయటికి

వచ్చి మాట్లాడడము జరిగింది. కొన్ని చోట్ల దయ్యములు వెంట్రుకలు విరబోసుకొని ఊగడమూ, కళ్ళుపెకిలించి

చూడడము ఉంటుంది. కానీ నావద్ద ఎవరూ అలా ప్రవర్తించ లేదు. మామూలుగా మనుషులు మాట్లాడినట్లే మాట్లాడడమూ,

అదియు భయ భక్తులతో ఉండడము జరిగినది. మేము దయ్యములకు కూడ జ్ఞానమే చెప్పినాము. వారు కూడ విని,

జీవితమును మంచి మార్గములో గడుపుతా మని చెప్పిపోయారు. నా జీవితకాలములో దయ్యములతోనే కాక కొంతమంది

దేవతలతోను, గొప్ప శక్తులతోను మాట్లాడడము జరిగినది. తర్వాత వాటన్నిటిని వివరిస్తాను. ఇపుడు అందరికి వచ్చు

ప్రశ్నలను వ్యక్తపరచి దానికి జవాబు వ్రాస్తాను చూడండి.


ప్రశ్న :- ఒక మనిషి శరీరములోనికి మరొక మనిషి దయ్యము ప్రవేశించి మాట్లాడుచున్నపుడు మొదటి మనిషి

ఏమై ఉంటాడు? వాని పరిస్థితి ఏమిటి?


జవాబు :- ఈ విషయము తెలియాలంటే సజీవ శరీరమును గురించి పూర్తిగా తెలిసియుండాలి. బయటికి కనిపించే

శరీరము యొక్క పది భాగములు అందరికి తెలుసు. కనిపించని శరీరము (దయ్యము) యొక్క పదిహేను భాగములను

గురించి తెలుసుకొంటే ఈ విషయము సులభముగా అర్థమగును. కనిపించని భాగములలో ముఖ్యముగ మనస్సు,

జీవుడు శరీరములో ఎక్కడున్నది, ఏమి చేయుచున్నది తెలుసుకోవాలి. జీవుడు తల మధ్యభాగములోనున్న

బ్రహ్మ,కాల,కర్మ,గుణచక్రములలో క్రిందగల గుణచక్రములో ఉన్నాడు. జీవుడు అక్కడ ఉండి అక్కడికే వచ్చిన విషయములను

తెలుసుకోవడము, అనుభవించడము జరుగుతున్నది. జీవునికి తానున్న గుణచక్రము వరకు రాని విషయములు ఏవీ

తెలియవు. ఇక మనస్సు విషయానికి వస్తే, మనస్సు శరీరములో రెండు విధములుగా వ్యాపించియుంటుంది. ఒక

విధము మెలకువలో శరీరమంతా మనస్సు వ్యాపించియుంటుంది. రెండవ విధము శరీరమంతా వ్యాపించిన మనస్సు

నిద్రలో ముకుళించుకొని ఒక చిన్న ఉంటగా ఏర్పడి బ్రహ్మనాడిలో చేరిపోవును. మెలకువలో శరీరమంతా వ్యాపించి,

శరీర ఆకారమును పోలియున్న మనస్సు నిద్రలో ఒక్కచోట చేరిపోయి గుండ్రని ఉంటగా తయారగుచున్నది. మనస్సు

సంకోచము చెందుటకు మొదలు పెట్టినపుడు కొందరికి ఆవులింపులు రావడము జరుగుచుండును. మనస్సు శరీరమునుండి

ముడుచుకొని బ్రహ్మనాడిలో చేరిపోయినపుడు శరీరము నుండి జీవునికి ఏ విషయములు తెలియవు. ఎందుకనగా

శరీరమునుండి వచ్చు సమాచారమును దేనినైనా శరీరమంతా వ్యాపించియున్న మనస్సే జీవునికి తెలుపవలసియున్నది.

మనస్సు శరీరమంతాలేనపుడు జీవునికి సమాచారముండదు.


ఇటు మెలకువలోగానీ, అటు నిద్రలోగానీ శరీరమంతా ఆత్మ వ్యాపించియుండి శరీరమును నడుపుచున్నది.

నిద్రలో జీవునికి శరీరముతో సంబంధము తెగిపోవుచున్నది. అలాగే మనస్సుకు కూడ శరీర సంబంధము లేదు.

నిద్రలో మనస్సు, జీవుడు ఇద్దరు విశ్రాంతి తీసుకొంటున్నారు. ఒక్క ఆత్మ మాత్రము నిద్రలోను, మెలకువలోను ఒకే

స్థితిలో ఉన్నది. మనస్సు శరీరమంతా వ్యాపించి, మెలకువగా ఉన్నపుడు బయటి విషయములను జీవుని వద్దకు

చేర్చడమూ మరియు వాటిని జ్ఞప్తికి పెట్టుకోవడము జరుగు చున్నది. మనస్సు శరీరము మీద లేనపుడు శరీరములోని

విషయములు ఏవీ మనస్సుకు తెలియవు. అందువలన నిద్ర పోయిన తర్వాత శరీరము ఎటు తిరిగి పడుకొనినది, ఏ

ప్రక్కకు కదిలినది ఏమాత్రము మనస్సు జ్ఞాపకములో ఉండవు. అట్లే జీవునికి కూడ ఏమి తెలియదు. ఈ విధముగా

ఒక శరీరములోని నిద్ర, మెలకువల విధానమున్నది.


ఒక మనిషి నిద్రపోవుచున్నపుడు అందులోని జీవునికి, మనస్సుకూ ఆ శరీరముతో సంబంధము లేదు.

కావున ఆ సమయములో ఆ శరీరము ఏ జీవునికైనా, ఏ మనస్సుకైనా ఉపయోగపడవచ్చును. ఈ సూత్రము ప్రకారము

ఒక శరీరములోని మనస్సును నిద్రలోనికి త్రోసి, మరొక జీవుని మనస్సు శరీరమును ఆక్రమించుకోవడమును 'పూనకము’

లేక 'ఆవహించడము' అంటాము. ఇపుడు పైన అడిగిన ప్రశ్నకు దాదాపు జవాబు వచ్చినట్లే. ఒక శరీరములోనికి

దయ్యము చేరితే, ఆ మనిషిలో నున్న మనస్సు నిద్రలోనికి, జీవుడు విశ్రాంతిలోనికి పోవుచున్నాడు. శరీరము మీద

దయ్యము ఉన్నంతవరకు, ఆ జీవునికి ఏమి తెలియదు. దయ్యము ఉన్నపుడు ఏమి మాట్లాడినది, ఏమి చేసినది

తెలియదు. అందువలన దయ్యము వదలి పోయిన తర్వాత అక్కడ గుంపుగా చేరిన మనుషులను చూచి ఏమి జరిగినదని,

దయ్యము వదిలిన మనిషి అడుగుచున్నాడు.


ప్రశ్న :- ఒక మనషి శరీరములోనికి దయ్యము చేరి లోపలేవుండి ఎప్పుడైనా శరీరము పైకి వచ్చి మాట్లాడుచున్నదని

తెలిపారు. యాడికిలో కుంటి దయ్యము అమ్మాయి శరీరములోనికి చేరి శరీరములోనే ఉంటూ యువతిని అనారోగ్యము

పాలు చేసిందని, ఎక్కడ బయటికి రాలేదని మీ ముందు బయటికి వచ్చిందని చెప్పారు. అలా శరీరము లోపల ఎలా

ఉండగలిగింది? ఎక్కడ ఉండగలిగింది? వివరముగా చెప్పండి.


జవాబు :- దయ్యములు (సూక్ష్మ శరీరములు) ఒకమారు శరీరములో చేరి లోపలే ఉండి, అప్పుడప్పుడు లేక ఎప్పుడైనా

పైకి వచ్చి మాట్లాడునవి ఒక రకము ఉండగా, కొన్ని అవసరము వచ్చినపుడు మాత్రము శరీరములోనికి చేరి, బయటికి

వచ్చి మాట్లాడునవి ఉన్నవి. ఇక మూడవ రకము ఎలా ఉండుననగా! శరీరములోనికి చేరిన దయ్యము అప్పుడప్పుడు

శరీరము పైకి వస్తూ పోతూ, ఏదో ఒకమారు పైకి వచ్చినది తిరిగి శరీరములో అణిగి పోదు. ఆ శరీరములో

మొదటినుండి ఉన్న జీవున్ని శాశ్వితముగా నిద్రలోనే ముంచివేసి, తానే శరీరమును వాడుకొనుచు, ఎవరికి అనుమానము

రాకుండ శాశ్వితముగా శరీరము పైనే ఉండి, మొదటివానివలె నటిస్తూ, అందరిలో కలిసిపోవును. ఇక నాల్గవరకము,

ఒకమారు శరీరములోనికి చేరిన తర్వాత ఒకసారి కూడ పైకి రాకుండ, శాశ్వితముగా శరీరములోనే ఉండి పోవునవి

కలవు. కొన్ని నేరుగా శరీరము మీదకే వచ్చి తిరిగి బయటికి పోవునని చెప్పాము కదా! అవి శరీరములో ఉండు

అవసరములేదు. ఇలాంటి ఒక రకము దయ్యములు తప్ప మిగతావి మొదట శరీరములోనికి చేరునని చెప్పాముగ!

అలా చేరినవి శరీరములో ఏదో ఒక భాగములో నిలిచి యుండును. అలా శరీరములో దయ్యము ఎక్కడ నిలిచియుండునో

అక్కడ శరీరమునకు బాధకల్గుచుండును, లేదా అక్కడి భాగము అనారోగ్యమునకు గురియగును. ఒక వ్యక్తిలో ప్రవేశించిన

దయ్యము శరీరములోపలగానీ, లేక శరీరము పైనగానీ ఉండవలసిందే. శరీరము పైన ఉంటే అనారోగ్యము ఉండదు.

కానీ శరీరములోపల ఉన్నపుడే అనారోగ్యము ఆ వ్యక్తికి కనిపించును.


ప్రశ్న :- దయ్యములు శరీరములో నివసిస్తే అనారోగ్యము కల్గునని చెప్పారు కదా! ఎటువంటి అనారోగ్యము వస్తుంది?

అది ఏ రోగముగా అయినా కనిపిస్తుందా?


జవాబు :- దయ్యము శరీరములో ఉండగా వచ్చు అనారోగ్యములు అనేక రకములుగా ఉండును. ఒక రకము

అనారోగ్యము అంటేనే ఒక రక రోగమని అర్థము. కావున దయ్యము వలన వచ్చు అనారోగ్యములు అనేక రోగముల

రూపములో ఉండును. మనిషికి ఒక రోగము ఉంది అంటే అది దయ్యము వలన కావచ్చును లేక శరీరము యొక్క

లోపము వలన అయినా కావచ్చును. పార్శవాయువులు లేక పక్షవాత వాయువులు నూటికి డెబ్భై శాతము దయ్యముల


వలన వచ్చుచున్నవి. కడుపు నొప్పి నూటికి యాభై శాతము సూక్ష్మశరీరముల వల్లనే వచ్చుచున్నవి. ఇలా అనేక రకాల

రోగాలు అనేక శాతములుగా దయ్యముల వలననే కల్గుచున్నవి.


ప్రశ్న:- దయ్యాల వలన కలిగే రోగాలు నయము అవుతాయా?


జవాబు :- దయ్యము వలన కల్గు ఏ జబ్బు అయినా, ఏ బాధ అయినా మందుల వలన పోదు. వాటి వలన వచ్చు

రోగాలు ఏవో కొన్ని మాత్రము మంత్రములకు, అంత్రములకు పోవును. చాలా రోగాలు అంత్ర, మంత్రములకు కూడా

పోవు. అటువంటి రోగాలు దైవజ్ఞానము వలననే పోవును. దైవజ్ఞానము లేనివారికి మరణము తప్పదు.

ప్రశ్న:- దయ్యములు ఎవరిలోనైనా చేరునా? లేక కొందరిలో మాత్రము చేరునా?

జవాబు :- దయ్యములు అందరిలో చేరలేవు. దైవజ్ఞానమున్న వారిలో ఏమాత్రము చేరలేవు. దైవజ్ఞానము లేనివారిలో

కూడ కొందరిలో మాత్రము చేరగలవు. ఎవని జాతకములో బుధగ్రహము వ్యతిరేఖమై, వాని ఆరవ స్థానములో

ఉండినా లేక ఆరవస్థానమును చూచినా వానికి దయ్యముల బాధలు జీవితములో తప్పవని చెప్పవచ్చును. ఇక

దైవజ్ఞానము లేకున్నా వానికి బుధగ్రహము అనుకూలమై ఉన్నపుడు వానికి దయ్యముల పీడ ఉండదు.

ప్రశ్న:- దయ్యము వలన వచ్చు రోగము ముదిరిపోయి మరణము కూడ రావచ్చునా?

జవాబు :- చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని దయ్యములు ఫలానా దినానికి చంపివేస్తానని చెప్పి,

చంపినవి కూడా కలవు.

ప్రశ్న :- దయ్యము వలన వచ్చిన రోగమును డాక్టర్లు ఇది ఫలానా అని చెప్పలేరా?

జవాబు :- డాక్టర్లు రోగము పేరు చెప్పగలరు. కానీ ఎలా వచ్చింది చెప్పలేరు. తమ మందులు ఎందుకు పనిచేయనిది

కూడ చెప్పలేరు. డాక్టర్లకు అర్థముగాని క్రొత్త రోగాలను కూడ మరొక జాతి దయ్యములు మనుషులకు వచ్చేటట్లు

చేయగలవు. అటువంటపుడు ఒక్క దైవజ్ఞానము తప్ప ఆ రోగాలకు మందేలేదు. అన్నీ బాగున్నపుడు జ్ఞానముతో

నాకేమి అవసరమని అనుకొన్న వాళ్ళను దయ్యములు భయంకరముగా తమ రోగాలతో చంపివేస్తాయి.

ప్రశ్న:- దయ్యాలలో జాతులున్నాయా?


జవాబు :- మనుషులు మరియు ఇతర జీవరాసులనుండి అకాలమరణము వలన తయారైన దయ్యములన్నీ ఒక

జాతిక్రిందకి వస్తాయి. మనుషులు ఆరాధించు దేవతలందరు మరొక జాతి దయ్యములుగా ఉన్నవి. ఇటు జీవరాసులు,

దేవతలు కాక, మహాభూతములనబడునవి కూడ ఒకజాతిగా చెప్పవచ్చును. జీవరాసుల దయ్యముల శక్తి పరిమితముకాగ,

దేవతలనబడు దయ్యముల శక్తి చాలా గొప్పది. ఇక మహాభూతములనబడు వాటి శక్తి అపరిమితమైనది.


ఇంతవరకు చెప్పిన జవాబులకు తగిన విధముగా మూడు రకాల జాతుల వలన జరిగిన యదార్థ సంఘటనలను

వివరిస్తాము చూడండి. ఇక్కడ చెప్పు సంఘటలన్ని నాకు ప్రత్యక్షముగా తెలిసినవే. ఎవరో చెప్పితే వ్రాసినవికావు.

జరిగిన సంఘటన పూర్తి వివరము నాకు తెలిసినా, కొన్ని చోట్ల ప్రాంతము పేర్లు, ఊరిపేర్లు వ్రాసి, వ్యక్తుల పేర్లు

వ్రాయలేదు. పేర్లు వ్రాయడము వలన ఆ వ్యక్తులకు గౌరవలోపము ఏర్పడునని మేము వ్రాయలేదని ముందే తెల్పుచున్నాము.


ఇపుడు తెలుపు సంఘటన ఒక దయ్యము కక్షసాధింపుకు మాసిపోని గుర్తుగా ఉన్నది. ఇది ఒక ఆసక్తిగల కథలాగ

ఉంటుంది చూడండి.


1978వ సంవత్సరములో నేనొక ప్రవేటు డాక్టరుగా కాలము గడుపుచున్నాను. అపుడు ఆ పని చేయడము

బ్రతుకుతెరువుకు కాదు. వచ్చే రోగులలో ఎంతమందికి శరీరములో సహజముగా వచ్చిన రోగాలున్నాయి, ఎంతమందికి

దయ్యముల వలన వచ్చిన రోగాలున్నాయి? అని తెలుసుకొను నిమిత్తము పని చేయుచుంటిని. సహజముగా వచ్చిన

రోగాలనైనా రోగికి ఖర్చు లేకుండా సులభముగా రోగము పోవు విధానమును శోధించుచుంటిని. అటువంటి సమయములో

మా ఇంటివెనుక చెట్టుక్రింద 70 సంవత్సరముల ఒక ముసలి వ్యక్తి చిన్న పిల్లలకు ప్రవేటుగా చదువు చెప్పుచు, నెలకు

వారిచ్చు కొద్దిపాటి డబ్బుతోనే కాలము గడుపుకొనేవాడు. వాస్తవానికి అతనిది దయనీయస్థితి. 30 మంది పిల్లలు

ఒక్కొక్కరు ఐదు రూపాయలిచ్చినా నెలకు 150 రూపాయలే అతని ఆదాయము. ఇప్పటి కాలముతో లెక్కించినా 450

రూపాయల విలువే అవుతుంది. రెండు లేక మూడు రోజులకొకమారు అతని కొడుకు వచ్చి పదిపైసలో, పావలానో

ఇప్పించుకొని పోయేవాడు. కొడుకు అంటే చిన్నపిల్లవాడు కాదు. దాదాపు 30 సంవత్సరముల వయస్సున్నవాడు. ఆ

వయస్సువాడు ముసలి తండ్రికి డబ్బులివ్వాలి, కానీ తండ్రి దగ్గరే డబ్బులు తీసుకుపోవడమేమిటని అనుకోవచ్చును.

కానీ అతని పరిస్థితి అటువంటిది. అతనికి కుడికాలు, కుడిచేయి పార్శవాయువువలన పడిపోయాయి, నోరు కూడ

అలాగే సొట్టగ ఉండి మాట సరిగా రాదు. అతి కష్టముగా నడుస్తూ బజారులో డబ్బులు అడుక్కొనే వాడు.

అడుక్కొన్న డబ్బులతో కాలము గడుపుకొంటూ అప్పుడప్పుడు తండ్రి వద్దకు కుంటుతూ వచ్చేవాడు.


అతని పరిస్థితిని చూచిన నేను, మూలికా ఔషధమును ఉపయోగించి అతని కాలు, చేయిని కొంతవరకైనా

బాగుచేయాలనుకొన్నాను. అతనిని పిలిచి నీకు మేము అన్నము పెట్టుతాము, వైద్యము కూడ చేస్తాను ఇక్కడే ఉ

ండమని చెప్పి, మాసిన గుడ్డలు తీయించి క్రొత్త గుడ్డలు ఇచ్చాము. పెరిగిన తలను గుండుగీయించి శుభ్రముగా ఉ

ండునట్లు చేసి, మందు ఇచ్చి తినమన్నాము. ఇచ్చిన మందుకు పది రోజులకు దాదాపు సగము మార్పు కనిపించాలి.

కానీ ఏ కొద్దిమార్పు కూడ కనిపించలేదు. కావున అతనిని ప్రత్యేకముగా చూడాలనుకొన్నాను. ఒక రోజు ఉదయము

9 గంటలకు నా ముందర కూర్చోమన్నాను. అతని వైపు నిఘాగా చూచాను. అలా చూస్తున్నపుడు చలనములేని అతని

కుడిచేయి దానంతట అదే పైకి లేవను మొదలు పెట్టింది. కుడి చేయిని అతను భుజము వరకు ఎత్తాడు. అపుడు నీవు

స్వయముగా ఎత్తుచున్నావా అని అడిగాను. లేదు అదే లేస్తున్నదని అతను చెప్పాడు. అప్పుడు అతని శరీరములో

వేరెవరో ఉన్నట్లు నాకు అర్థమైనది. అపుడు లోపలున్న వ్యక్తి బయటికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పాను. వెంటనే

లోపలనున్న వాడు శరీరము మీదికి వచ్చి మాట్లాడడము జరిగినది. అప్పుడు శరీరము పైకి వచ్చిన అతను చెప్పిన

మాటలను బట్టి నాకు తెలిసిన సమాచారము ఈ విధముగా ఉన్నది.


కడప జిల్లా మడూరు అను ఊరిలో విశ్వబ్రాహ్మణ (వడ్రంగి) కులమునకు చెందిన ఒక కుటుంబము ఉండెడిది.

అప్పటి కాలములో ఆ ఊరు ఎద్దులబండ్లు చేయడములో ప్రసిద్ధి. వారు వడ్రంగి వారే కావున కొయ్యపని చేయడములో

ప్రావీణ్యత పొంది బాగానే బ్రతికెడివారు. ఆ కుటుంబములో తల్లి, తండ్రి, 16 సంవత్సరముల కొడుకు ఉండెడివారు.

కొడుకు పేరు రామాచారి, తండ్రి పేరు నారాయణాచారి. కొడుకు రామాచారి బండ్ల పనులు చేయుచు బాగా

సంపాదించెడివాడు. రామాచారికి బాల్యము నుండి ఒక స్నేహితుడు ఉండెడివాడు. అతని పేరు ప్రభుదాస్, అతను

హరిజనుడు. అతను క్రైస్తవ మతములోనికి చేరి ప్రభుదాస్ గా పేరు మార్చుకొన్నాడు. రామాచారి కూడ స్నేహితుని


మాటలు విని క్రైస్తవ మతమును స్వీకరించాడు. వీరిరువురు బాల్య స్నేహితులు కావున యుక్తవయస్సులో కూడ వారి

స్నేహము బాగా కొనసాగేది. అప్పటికి ఇటు రామాచారికి, అటు ప్రభుదాసుకు ఇద్దరికి పెళ్ళి కాలేదు. ఇరువురిలో

మొదట ప్రభుదాసుకు పెళ్ళికుదిరింది. ప్రభుదాసుకు పెళ్లై ఒక సంవత్సరము గడచిపోయినది. రామాచారి అప్పుడప్పుడు

ప్రభుదాసు ఇంటికి వెళ్ళి స్నేహితునితో కలిసి వచ్చెడివాడు. అట్లున్న సమయములో రామాచారికి ప్రభుదాస్ భార్యతో

అక్రమసంబంధము ఏర్పడినది. ఒక దినము ప్రభుదాస్ ఇంటిలో లేని సమయములో రామాచారి ప్రభుదాస్ భార్యతో

కలిసి పడకలో ఉండడమును అప్పుడే బయటినుండి వచ్చిన ప్రభుదాస్ చూచాడు. ప్రభుదాస్ చూచిన విషయము

ప్రభుదాస్ భార్యకుగానీ, రామాచారికిగానీ తెలియదు. తనకు ముఖ్యమైన బాల్య స్నేహితుడు, తన భార్యతో అక్రమ

సంబంధము ఏర్పరుచుకోవడము ప్రభుదాస్కు ఒక షాక్ తగిలినట్లయింది. దానికి తట్టుకోలేక అదే రోజు ప్రభుదాస్

బావిలో దూకి చనిపోయాడు. ప్రభుదాస్ ఎందుకు చనిపోయినది కూడ రామాచారికి తెలియదు.


ప్రభుదాస్ చనిపోయిన తర్వాత ఆరు నెలలకే రామాచారికి పెళ్ళి అయినది. పెళ్ళి అయిన ఆరు నెలలకే

రామాచారి ఆ ఊరు వదిలి కుటుంబముతో సహా అనంతపురము జిల్లా తాడిపత్రికి చేరాడు. తాడిపత్రిలో వడ్రంగి పని

చేస్తు డబ్బును బాగా సంపాదించను మొదలుపెట్టాడు. రామాచారి అన్ని విధముల సుఖముగా కాలము గడుపుచున్నాడు.

తాడిపత్రి చేరిన తర్వాత ఒక సంవత్సరమునకు రామాచారి ఒక దినము తన సొంత ఊరుకు కుటుంబముతో కలిసి

పోయాడు. అప్పటికి ప్రభుదాస్ చనిపోయి రెండు సంవత్సరములైనది. ప్రభుదాస్ కాలమరణము కాకుండ అకాల

మరణము పొందాడు, కావున అతను సూక్ష్మశరీరముతో జీవించియే ఉన్నాడు. ఇటు స్థూలశరీరమును, అటు భార్యను

పోగొట్టుకొన్న ప్రభుదాస్ భార్యా సమేతముగా వచ్చిన రామాచారిని చూచాడు. స్నేహితుడు చేసిన ద్రోహము వల్లనే

నేను ఇలా అన్ని రకముల చెడిపోయానని రామాచారి మీద కోపము వచ్చింది. రామాచారి బంగారు ఉంగరాలు,

మెడలో గొలుసు కల్గి భార్యతో సంతోషముగా ఉన్నాడు, నేను ఎటు కాకుండ పోయాను. దీనికంతటికి కారణమైన

రామాచారిని వదలకూడదు. అతనిని సుఖముగా బ్రతకనివ్వకూడదని, ప్రభుదాస్ ఒక రోజంతా ఆలోచించి నిర్ణయము

తీసుకొన్నాడు. మరుసటి దినము రామాచారి తిరిగి తాడిపత్రికి వచ్చాడు. అందువలన ప్రభుదాస్కు రామాచారి

మడూరులో కనిపించలేదు. ప్రభుదాస్ రామాచారియున్న తాడిపత్రికే పోయి కక్షను సాధించాలనుకొన్నాడు. అలా

అనుకొన్న రెండవరోజే బయలుదేరి తాడిపత్రికి వచ్చాడు. తాడిపత్రిలో రామాచారి ఎక్కడున్నది ప్రభుదాస్కు తెలియదు.

అందువలన పది రోజులు ఊరంతా వెదికాడు, కానీ రామాచారి ఎక్కడా కనిపించలేదు. చివరికి పదకొండవ దినము

రామాచారి, ప్రభుదాస్ కంటబడ్డాడు.


పదిరోజులుగా రామాచారిని వెదికిన ప్రభుదాస్, పదకొండవ దినమున రాత్రి 7-30 గంటలకు రైల్వేస్టేషన్

వద్ద బయలుదేరి తాడిపత్రి వైపు రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుండగా, సరిగా 8 గంటలకు రామాచారి ప్రభుదాసు

కరెంటుసబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తూ కనిపించాడు. చేతిలో మిక్చర్ పొట్లము పట్టుకొని రామాచారి నడుస్తూ

రావడము ప్రభుదాస్ చూచి, రామాచారి వెంట అతని వెనకే వచ్చాడు. రామాచారికి, ప్రభుదాస్ విషయము ఏమీ

తెలియదు. ప్రభుదాస్ సూక్ష్మశరీరముతో ఉన్నాడు, కావున ప్రభుదాసు రామాచారి ఎదురైన విషయముగానీ, ప్రభుదాస్

తన వెంట వస్తున్నట్లుగానీ రామాచారికి ఏమాత్రము తెలియదు. ఎలక్ట్రికల్ సబ్స్టేషను నుండి అర్థకిలోమీటరు

దూరములో, శ్రీనివాసపురములోనున్న తన ఇంటికి రామాచారి వచ్చి, భార్యకు మిక్చరొట్లమిచ్చి స్నానానికి వేడి

నీళ్ళు పెట్టమన్నాడు. పదిహేను నిమిషములలో నీళ్ళు రెడీకాగా, బాత్రూమ్లోనికి రామాచారి పోయాడు. అప్పుడు


ప్రభుదాస్ కూడ రామాచారి వెంట బాత్రూమ్లోనికి పోవడము జరిగినది. రామాచారి చెంబుతో నీళ్ళు తీసుకొని మీద

పోసుకొన్నపుడు, ప్రభుదాస్ రామాచారి శరీరములోనికి ప్రవేశించాడు. అపుడు వెంటనే రామాచారి బాత్రూమ్లో

క్రిందపడిపోయి అపస్మారక స్థితి (కోమా) లోనికి వెళ్ళిపోయాడు. రామాచారి జ్ఞప్తిలేకుండ పలుకనిస్థితిలో ఉండడము

అతని భార్యచూచి, వెంటనే హస్పిటల్కు తీసుకుపోయారు. అక్కడ రెండు రోజులు కోమాలోనే రామాచారి ఉండిపోయాడు.

మూడవ రోజు కొద్దిగ జ్ఞాపకము వచ్చింది. మూడవ రోజుకు తేరుకొన్న అతనికి కాలు, చేయి, నోరు మొత్తము

కుడిప్రక్క శరీర భాగమంతా శక్తి లేకుండ పోయినట్లు అతని భార్యకు, తండ్రికి తెలిసింది. డాక్టర్లు పెరాలసిస్

(పార్శవాయువు) వచ్చిందని చెప్పారు. అప్పటినుండి రామాచారి మంచములోనే పేషెంట్గా ఉండిపోయాడు. అతని

వైద్యము కొరకు సంపాదించుకొన్నదంతా పోయింది. రామాచారి కొంతకాలానికి కొద్దిగా నడువగలిగాడు. కానీ

కుడిచేయి కొద్దిగా కూడ కదిలేది కాదు. ఏదైనా తినాలంటే ఎడమచేతితో తినేవాడు. ఏమి చేతగాని వానిగా మారిపోయిన

రామాచారిని చూచి, అతని భార్య అతనిని వదలి వెళ్ళి పోయింది. చివరికి ఇటు సంపాదించుకొన్న డబ్బును, అటు

చేసుకొన్న భార్యను పోగొట్టుకొని కుంటివానిగా మిగిలి పోయాడు. తనను ఆదరించువారు ఎవరూ లేక పోవడము

వలన చివరికి రామాచారి సమాజములో అడుక్కొని బ్రతకవలసి వచ్చినది.


తలమాసి, గుడ్డలు మాసి, తిండిలేని సమయములో నాకు కనిపించాడు. అతనికి పార్శవాయువు వలన ఆ

విధముగా ఉన్నాడని తలచిన నేను, అతని కాలుకు, చేతికి చికిత్స చేయాలని నా వద్ద పెట్టు కోవడము జరిగినది. ఆ

రోగము మీద అనుమానము వచ్చి చూడగా అతనిలో ప్రభుదాస్ బయటపడ్డాడు. అలా శరీరము మీదకి వచ్చిన

ప్రభుదాస్ స్వయాన చెప్పినపుడు రామాచారి యొక్క ఇంత చరిత్ర తెలిసింది. ఇదేదో కథ అని అనుకోవద్దండి. నా

ముందర నాకు తెలిసిన యదార్థ సంఘటన ఇది.


ఇదంత విన్న తర్వాత ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో చెప్పలేక పోయాము. రామాచారికి ప్రభుదాస్

వలన తనకు ఇలా జరిగిందను విషయము తెలియదు. ఆ విషయము ప్రభుదాస్ మొదట బయటికి వచ్చి నాకు

చెప్పాడు. ఆ సమయములో మా ప్రక్కన ఎవరూ లేరు, కావున ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అపుడు నేను

ప్రభుదాస్తో ఇలా చెప్పాను.







నేను :- ప్రభుదాస్! నీవు తొందరపడి చనిపోవడము నీవు చేసిన పెద్దతప్పు. దేవుడిచ్చిన జీవితమును, కొద్దిరోజుల

క్రిందట వచ్చిన భార్యకోసము వదలు కోవడము పొరపాటు. సమస్యకు పరిష్కారము చావుకాదు. కొంత ఆలోచించి

ఉండవలసింది. నీవు చనిపోయిన దానివలన అప్పుడు రామాచారికి  ఏ నష్టము కలుగలేదు. నీ జీవితమే

నాశనమైపోయింది. దానికి నీకు కక్ష ఏర్పడి, అది అతనికి శిక్ష అయినది. ఇదంతటిని చూస్తే రామాచారిది మొదటి

తప్పు, తర్వాత నీది రెండవ తప్పు. నీ భార్య పోయింది వేరే వారివద్ద వుంది. అలాగే రామాచారి భార్య పోయింది వేరే

వారివద్దవుంది. నీ బాహ్య జీవితము పోయింది, సూక్ష్మజీవితము మిగిలింది. అలాగే అతని జీవితము నాశనమైంది,

కుంటి జీవితము మిగిలింది. నీవు చచ్చి బ్రతుకు చున్నావు. ఇతను బ్రతికి నిత్యము చస్తున్నాడు. మీరు ఇద్దరు పోయిన

జన్మలలో చేసుకొన్న పాపమును ఈ రూపములో అనుభవిస్తున్నారు. కొన్ని సంవత్సములకు రామాచారి నావద్దకు

వచ్చాడు, కావున నేను నీకు చెప్పునది ఏమంటే ఇక ఇతనిని నీవు వదలిపెట్టిపో. వదలి పోయిన తర్వాత దైవజ్ఞానము

తెలుసుకో, నీ జీవితమునకు ఒక అర్ధము, పరమార్ధము ఏర్పడుతుంది.


ప్రభుదాస్ :- మీరు గొప్పవారు, ఇతని మీద నాకు ఎంత కోపమున్నా మీరు చెప్పినట్లు ఇతనిని వదలిపోతాను. నేను


ఇంతవరకు మెడ ప్రక్క నరమువద్ద చేరి అక్కడి నరమును అదిమి పట్టాను. ఆ నరము దాదాపు పూర్తిగా చెడిపోయినది.

అందువలన నేను వదలిపోయినా ఇతను పూర్తిగా నడువలేడు. ఇప్పటికంటే కొంచెము బాగ నడవగలడు. అలాగే

చేయి కొద్దిగ పైకి లేవగలదు. అదియు మీ ముందర ఎంత లేచిందో అంతే లేవగలదు. చేయి పూర్తిగా నోటివద్దకు

పోలేదు. చేతితో అన్నము తినలేడు. ఇప్పటికి 75 శాతము ఇతని నరము దెబ్బతిని పోయింది. కావున మిగిలిన 25

శాతము మాత్రము నయము కాగలదు. మీరు చెప్పినట్లు నేను దేవుని జ్ఞానమును తెలుసుకొనే దానికి ప్రయత్నిస్తాను.

ఇపుడు మా ఊరికి పోయి, అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి జ్ఞానము తెలుసుకొంటాను. నమస్కారము, అని చెప్పి ప్రభుదాస్

రామాచారి శరీరమునుండి బయటికి పోయాడు. అపుడు రామాచారికి జ్ఞాపకము వచ్చినది. అంతసేపు తాను

నిద్రపోయానని అనుకున్నాడు. అప్పుడు రామాచారిని చూచి ఇలా అన్నాను. “నీకు పూర్తి బాగుకాదు, కొంతవరకు

నడువగలవు, అలాగే చెయ్యి కొంత ఎత్తగలవు, మాట కొద్దిగ బాగరాగలదు. ఇక నీవు ఇక్కడినుండి వెళ్ళి పోవచ్చును.”

అని చెప్పి పంపివేశాను. ఈ సంఘటను అంతా గమనిస్తే రెండు కుటుంబాలు, రెండు నిండు జీవితాలు నిలువునా

నాశనమైనట్లు అర్థమగుచున్నది. ఇక్కడ భూమి మీద దయ్యములు లేవు అనే వారంతా ఏమి చెప్పగలరు? జరిగిన పై

సంఘటనలో ఏదీ అసత్యము లేదు. ప్రభుదాస్ చెప్పినది బయటికి చెప్పకుండ, రామాచారి తండ్రిని అడిగితే అతను

చెప్పిన దానికి ప్రభుదాస్ చెప్పిన దానికి పూర్తిగా సరిపోయింది. అటువంటపుడు ప్రభుదాస్ కనిపించని సత్యము,

రామాచారి కనపడే సత్యము, రామాచారి తండ్రి జరిగిన సత్యమునకు సాక్ష్యము. కావున దీనిని ఎవరూ అసత్యమన

లేరు, అలాగే దయ్యములు అసత్యమనుటకు వీలులేదు. మేధస్సుయున్న వారు హేతువాద దృష్ఠితో సత్యమును గ్రహించమని

కోరుచున్నాము.


అనుభవానికి వచ్చేది ఏదైనా విజ్ఞానమే అవుతుంది. ఒక విధానమును వివరముగా తెలుసుకోవడమును

జ్ఞానము అంటాము. జ్ఞానము ప్రకారము ఆచరించి నిరూపణకు వస్తే, అపుడు దానిని విజ్ఞానము అంటాము.

ఆచరణకుగానీ, అనుభవానికిగానీ రాని విషయ వివరము జ్ఞానమే కాదు. దీనినిబట్టి జ్ఞానము తెలిసేదైతే విజ్ఞానము

అనుభవించేది అని చెప్పవచ్చును. అందువలన జ్ఞానమునకు, విజ్ఞానమునకు అవినాభావ సంబంధము కలదని

చెప్పవచ్చును. మేము చెప్పునవి సత్యమైనవి, అనుభవరీత్య జరిగినవి. కావున మా రచనలలో జ్ఞానము, విజ్ఞానము

రెండూ ఉన్నాయి. అందువలన మేము 2004వ సంవత్సరములో స్థాపించిన “ఇందూ జ్ఞానవేదిక” అను సంస్థ ప్రచురణలలో

ఈ గ్రంథము బయటికి వస్తున్నది.


ఏదో ఒక విజ్ఞానమని పేరు పెట్టుకొన్న కొన్ని సంస్థల వ్యక్తులు, ఇటు దయ్యాలను ఒప్పుకోవడము లేదు, అటు

మంత్రాలనూ ఒప్పుకోవడము లేదు. అటువంటి వారికి జ్ఞానమంటే ఎట్లుంటుందో మరియు విజ్ఞానమంటే ఎట్లుంటుందో

అర్థమగుటకు ఒక చిన్న ఉదాహరణను చెప్పుచున్నాను చూడండి. నాలో ప్రశ్నించే విధానము అనగా హేతువాద పద్ధతి

ఎక్కువగా ఉంటుందని, నేను ఈ గ్రంథములో ముందే చెప్పాను. ప్రశ్నించుచున్నా మంటే జవాబు కొరకు వెదుకుచున్నామని

అర్థము. ఈ కాలములో కొందరు హేతువాదము అని పేరు పెట్టుకొన్నవారు, ప్రశ్నించడము తప్ప జవాబును

చూడడము లేదు. ప్రశ్నించడము, సరియైన జవాబును ఒప్పుకోవడము సంపూర్ణ హేతువాదమౌతుంది. దాని ప్రకారము

ఒక పుస్తకములో తేలు కుడితే, ఆ విషమును నివారించుటకు ఒక మూలికను మందుగా ఉపయోగించు విధానమును

చదివాను. మూలిక, తేలు విషమును లేకుండ చేసి, బాధను నివారిస్తుంది అని చెప్పిన విధానమంతా నాకు తెలిసింది

కాబట్టి అది అప్పుడు నాకు జ్ఞానమైంది. తెలియబడింది కాబట్టి జ్ఞానమైంది. కానీ అనుభవానికి రాలేదు కాబట్టి అది

నా లెక్కలో విజ్ఞానము కాలేదు. అక్కడ చెప్పిన మూలికను కొన్ని దినముల తర్వాత తేలు కుట్టిన మనిషికి వాడి


చూచాను. అక్కడ తెలిపినట్లు విషము వెంటనే తగ్గిపోయి బాధలేకుండ పోయినది. అది అనుభవానికి వచ్చింది

కాబట్టి నాకుగానీ, నా ప్రక్కన ఉండి చూచిన వారికిగానీ అది విజ్ఞానమే అవుతుంది.


అంతేకాక అదే పుస్తకములో తేలుకుట్టినపుడు బాధ నివారణకు మరియొక విధానము కూడ కలదు. పైన

చెప్పిన మొదటి విధానములో ఉన్నది చెట్టు యొక్క మూలిక, మరియొక విధానములో ఉన్నది అక్షరముల యొక్క

మంత్రము. మూలిక ఒక పదార్ధము. మంత్రము ఒక శబ్దము. మూలికయొక్క పదార్థము కనిపించునది, మంత్రముయొక్క

శబ్దము వినిపించునది. ఎదుటి మనిషికి కనిపించు శరీరము మీద, కనిపించు మూలికను ఉపయోగించగా ఎదుట

మనిషికి కనిపించని బాధ పోయినది. ఇపుడు ఎదుట మనిషికి కనిపించు శరీరము మీద, కనిపించని మంత్రమును

ఉపయోగిస్తే, ఎదుట మనిషికి కనిపించని బాధ పోతుంది అని వుంది. మొదట ఔషధము అనుభవ నిరూపణకు వచ్చి

విజ్ఞానమైనది, ఇపుడు మంత్ర విధాన జ్ఞానము విజ్ఞానమౌతుందా లేదా అని చూడవలసివుంది. మంత్ర విధాన

జ్ఞానము ఏమని కలదనగా! ఈ మంత్రమును ధ్యాసతో పదివేల మార్లు జపిస్తే మంత్రశక్తి లభించును. తర్వాత

ఎప్పుడైన తేలు విష నివారణకు మంత్రమును పదకొండు మార్లు జపించి, నీటిని ఊది ఆ నీరును త్రాగిస్తే, త్రాగిన

వానికి విషనివారణ అగునని గలదు. దానిని తెలుసుకొన్న నేనే అది విజ్ఞానమో కాదో చూడవలసియున్నది. ఆ

మంత్రము ఒక్కొక్క పదములు రెండు అక్షరాలుగావుంటూ మొత్తము నాలుగు పదములుగా కలదు. దానిని చెప్పినట్లు

జపించినాము. తర్వాత కొద్ది రోజులకు, నాకు పరిచయమున్న విజయ్కుమార్ యాదవ్ ఇంటిలోని కుక్కకు తేలు

కుట్టింది. ఆ కుక్క బాధకు అరుస్తూ ఉన్నపుడు దానిని తీసుకొని వచ్చారు. అప్పుడు మంత్ర విధానములో ఉన్నట్లు,

కొద్ది నీరును గ్లాసులోనికి తీసుకొని మంత్రించి వెడల్పు ప్లేటులో పోసి కుక్కను త్రాగునట్లు చేశాము. కొద్ది నీరును కుక్క

గతికింది. తర్వాత రెండు నిమిషములుకాకనే కుక్క అరుపు మానేసింది. ఆ మరుసటి దినమే 30 సంవత్సరముల

వయస్సున్న వ్యక్తి తేలు కుట్టిందని బాధపడుచు వచ్చాడు. అతనికి గ్లాసుతో నీళ్ళను మంత్రము చెప్పి ఇవ్వగా వెంటనే

నొప్పి లేకుండ పోయింది. అప్పుడు పూర్తిగా మంత్రము పని చేసినట్లు తెలిసింది. అందువలన తెలుసుకొన్న మంత్ర

జ్ఞానము విజ్ఞానరూపమైనది. దీనినిబట్టి మందేకాక, మంత్రము కూడ విజ్ఞానముతో కూడుకొన్నదని అర్థమైనది. ఈ

సంఘటన వలన జ్ఞానము, విజ్ఞానము రెండు అవినాభావ సంబంధము కలవని తెలియుచున్నది.


నేను చేసి చూచిన బాహ్యాచరణలో తేలు విషము మీద మందు పని చేసినట్లే, మంత్రము కూడ పని చేసినదని

తెలిసినది. తర్వాత నా జీవితములో ఎవరికీ మందు ఇవ్వలేదు, మంత్రము చదవలేదు. నా పరిశోధనలో కేవలము

నిరూపణ నిమిత్తము చేసి చూచి ఇవి సత్యము అని తెలుసుకొన్నాను. కొందరు మేము విజ్ఞానులము, మా విజ్ఞానము

ప్రకారము దయ్యములు లేవు, మంత్రములు లేవు అనుచుందురు. అటువంటి వారిది అసత్యవాదన అని, వారు

విజ్ఞానులే కాదని చెప్పుచున్నాము. సత్యమును గ్రహించలేని విజ్ఞానులకు కనువిప్పుగా మంత్రములు, దయ్యములు

కలయికగానున్న, నేను చూచిన ఒక యదార్థ సంఘటను పొందుపరుచుచున్నాను చూడండి.


నేను తాడిపత్రిలో నివాసమున్నపుడు నేను వైద్యము చేసింది సంవత్సరమే అయినా చాలా రకముల రోగములను

చూచాను. నేను వైద్యము చేసింది పరిశోధన నిమిత్తమేగాని జీవనమునకు కాదని ముందే చెప్పాను. ఆ నేపద్యములో

నావద్దకు వచ్చిన రోగములలో శరీరములో వాస్తవ రోగాలు 30 శాతము మాత్రమే ఉన్నట్లు తెలిసినది. మిగత 70

శాతము స్థూల శరీర రోగములు కాదని, సూక్ష్మశరీర రోగములున్నాయని తెలిసింది. అలా వచ్చిన వారిలో దాదాపు 45

సంవత్సరముల వయస్సుగల ఒక ఆడమనిషిని నావద్దకు తీసుకరావడము జరిగినది. ఆమెకు వారమునకు ఒకమారు


కడుపునొప్పి వస్తుందని తెలిపారు. శరీరములో వచ్చు నొప్పి ఏదైనా శరీరములో లోపము ఏర్పడినపుడు రావచ్చును.

కానీ వారానికి ఒకమారు అను నియమము ఉండదు. అలా ఉందంటే అది తప్పనిసరిగా సూక్ష్మశరీరముల వేధింపేనని

నాకు అర్థమైనది. ఇది రోగము వలన వచ్చు కడుపునొప్పి కాదు. మందులతో పోదు, మంత్రములు వచ్చిన మాంత్రికుల

వద్దకు తీసుకపొమ్మని ఆమెను తెచ్చినవారికి చెప్పాము. దానికి వారు "మేము మాంత్రికులందరి దగ్గరకు పోయాము

ఎక్కడా ఏమీ కాలేదు. తర్వాత కసాపురము ఆంజనేయస్వామి వద్దకు, పప్పూరు శివాలయము వద్దకు, మిగత చాలా

దేవతల దగ్గరికి కూడ పోయాము. అయినా అక్కడ కూడ ఏమి కాకపోయింది. చివరకు ఇది నివారణ కాదు అని

నిర్ణయము చేసుకొని ఉన్నాము. ఇపుడు మీ దగ్గరికి పోతే, ఏదైనా తప్పనిసరిగా బాగవుతుంది అని మాకు తెలిసిన

వారు చెప్పగా ఆశతో మీ వద్దకు వచ్చాము” అన్నారు.


వారు చెప్పినది విన్న తర్వాత వారిమీద కొంత జాలి కలిగి, సరే సాయంకాలము వరకు ఉండండి అని చెప్పి,

తర్వాత ఆ దినము కుదరదని వచ్చే బుధవారము రమ్మని చెప్పి పంపాము. బుధవారము ఉదయమే వారు వచ్చారు.

అపుడు 8 గంటలకే తయారై కడుపునొప్పి వచ్చు మనిషిని నాకు ఎదురుగా కూర్చోమని చెప్పి ఆమెవైపు చూచి, ఈమె

శరీరములో వారమునకు ఒకమారు వచ్చు కడుపునొప్పి ఏదైతే ఉందో అది ఇప్పుడు నాముందర రమ్మని చెప్పాము.

కూర్చున్నపుడు ఆమెకు కడుపునొప్పిలేదు. ఆమెకు ప్రతి ఆదివారము కడుపునొప్పి వచ్చేది. ఆ దినము బుధవారము,

అయినా నామాట విన్న నిమిషమునకే ఆమెకు కడుపునొప్పి వచ్చింది. అప్పుడు అక్కడ పదిహేను మందిదాకా

ఉన్నారు. పిలుస్తూనే ఆ నొప్పి రావడము అందరికి ఆశ్చర్యము వేసింది. ఎదురుగా కూర్చున్న ఆమె కడుపునొప్పి

ఎక్కువగా ఉంది, అని చెప్పి బాధపడుచూ ఉన్నది. అపుడు "శరీరము లోపల కడుపునొప్పికి కారణమైన వారు

ఎవరున్నా బయటికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పుచున్నాను” అని నేను అనగానే లోపలనున్న గ్రహము (సూక్ష్మశరీరము)

బయటికి వచ్చింది. అంతవరకు కొద్దిగ ముడుచుకొని కూర్చొనియున్న ఆమె వెంటనే చక్కగ కూర్చొని ఒకమారు గట్టిగ

నవ్వింది. ఆ నవ్వును చూచి ప్రక్కనున్న వారికి కూడ ఆమె శరీరములోని దయ్యము బయటికి వచ్చిందని అర్థమైనది.


నేను :- నీవు ఎందుకు నవ్వినావు చెప్పు?

ఆమె : - ఎందరో వయస్సయిన ముసలి మంత్రగాళ్ళు కూడ నన్ను చూచి చివరికి పారిపోయారు. నీవు చిన్న పిల్లవాడివి,

నన్ను పిలిచిన నిన్ను చూచి నవ్వువచ్చింది.

నేను :- మంత్రగాళ్ళు మంత్రించి, ధూపముపొగ పెట్టి, వేపమండలు అల్లాడించి నిన్ను బయటికి పిలిచివుంటారు.

కానీ నేను నిన్ను మంత్రించానా? దూపము వేశానా? వేపమండలతో దిగదీచానా? ఒక్క అగరుబత్తి అయినా ముట్టించానా?

మాంత్రికులు చేసినట్లు నేనేమి చేయలేదు కదా! నొప్పిని పిలిచాను వచ్చింది, నొప్పికి కారణమైన నిన్ను పిలిచాను

నీవూ వచ్చావు. నావద్ద నిమ్మకాయలు లేవు, కోళ్ళులేవు, నేను మాంత్రికుడను కాను, పైగా చిన్న పిల్లవాడిని, అటువంటపుడు

నామాట వింటూనే నీవు బయటికెందుకు వచ్చావో చెప్పు?

ఆమె : - ఏమో! దయతలచి వచ్చాను. నన్ను పిలిచేదానికి అసలుకు నీవు ఎవరు?

నేను :- ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలుకు నీవు ఎవరు?

ఆమె :- నేను ఎవరో చెప్పితే భయపడిపోతావు, నీకు నిద్రరాదు.


నేను :- నాకు నిద్రవస్తుందో, పోతుందో అటుంచి, నీవు ఒకమారు నావైపు చూడు నేనెవరో నీకు తెలుస్తుంది.

(అపుడు ఆమె తల ఎత్తి నావైపు చూచి వెంటనే తలదించుకుంది. ఏమి మాట్లాడలేదు.)


నేను :- ఇప్పుడు జాగ్రత్తగ మాట్లాడు. నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పు. నీవు అసత్యము చెప్పిన నేను

గ్రహించగలను. ఇంతవరకు అందరివద్ద మాట్లాడినట్లు మాట్లాడినావు. ఇపుడు నీకు అర్థమైంది. మంత్రగాడిని

కాదని. అందువలన నేను ఏమి అడగను అన్నీ నీవే చెప్పు.


(అపుడు ఆమె శరీరములోని దయ్యము ఇలా చెప్పను మొదలు పెట్టింది)


మా ఊరిలో నన్ను అందరు వీరప్ప అనెడివారు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరములో రైలురోడ్డు ప్రక్కనే మా

ఊరు ఉంది. ఆ ఊరిలో వడ్రంగి పని (చెక్కపని) చేస్తుండెడి వాడిని. ఆ ఊరిలోని వారందరు నన్ను మామ అని

పిలిచెడివారు. మా ఊరిలో రెడ్డి కుటుంబాలున్నాయి. వాటిలో రెండు ఇండ్లు పెద్ద పేరున్న కుటుంబములు. వారు

మంచి ధనికులు. ఊరిలో అందరికి నాతో పని వుంటుంది. కావున అందరి ఇళ్ళదగ్గరికి పోయి వచ్చేవాడిని. అది ఆ

ఊరిలో నాకున్న సంబంధము. ఇక నా స్వంత విషయానికి వస్తే, నేను విశ్వబ్రాహ్మణ కులములో పుట్టినవాడను. నా

అసలు పేరు వీరప్పాచారి, నేను పెద్ద మాంత్రికుడను. కాళికాదేవి ఉపాసకుడను. మంత్రసిద్ధితో కాళికాదేవిని నా

వశము చేసుకొన్నవాడిని. నేను చనిపోయినా ఇప్పటికి నేను మంత్రసిద్ధుడనే, కాళికాదేవి నా వశములోనే ఉన్నది.

నేను చెప్పిన పని చేస్తుంది. ఇంతవరకు ఆంధ్రదేశములో నన్ను మించిన మాంత్రికులు ఎవరూ లేరు. ఎవరైనా

మాంత్రికుడు నన్ను విడిపించాలని వస్తే ఏడిపించి పంపేవాణ్ణి. నా వద్దకు వచ్చిన వారంతా భయపడి పారిపోయారు.

మొదట నీవు కూడ మంత్రగాడివేనని అనుకొని నిన్ను చూచి నవ్వాను. మీరు మాంత్రికుడు కాదని ఇప్పుడు తెలిసింది.

మీరు ఏమి అడిగినా దాచకుండ చెప్పుతాను.


నేను :- అంతపెద్ద మాంత్రికునివి. కాళికాదేవే నీ వశములో ఉండగా నీహెూదా పెద్దగ ఉండాలి కదా! చిల్లర

మనిషిలాగ ఈమెలోనికి ఎందుకు చేరావు?

వీరప్ప :- మీరు చెప్పినట్లు నాకు చిల్లర బుద్ధులున్నాయి. అందమైన ఆడమనిషిని చూస్తే ఆమెను ఎలాగైనా పొందాలి

అనేది నా బలహీనత. నేను బ్రతికి ఉన్నపుడు మా ఊరిలో పెద్ద కుటుంబములో ఈమె పెద్దరెడ్డి భార్య. ఈమె మీద

నాకన్ను పడింది, ఈమెను ఎలాగైనా అనుభవించాలి అని అనుకొనేవాడిని. కానీ బ్రతికియున్నపుడు ఎప్పుడూ కుదరలేదు.

నేను చనిపోయిన తర్వాత ఏ ఆటంకములులేవు, కాబట్టి నేను ఈమెలో చేరినాను.

నేను :- నీవు నీ ఇష్టప్రకారము ఈమెలోనికి వచ్చావు సరే, వారమునకు ఒకమారు కడుపునొప్పి రావడమేమిటి? అలా

ఎందుకు చేస్తున్నావు?

వీరప్ప :- నేను మంత్రగాడిని, ఇప్పటికీ నియమ నిష్టలతో మంత్ర జపము చేయుచున్నాను. నామంత్రశక్తిని పోగొట్టుకోలేదు.

నాకు ఒక నియమమున్నది. దాని ప్రకారము వారమునకు ఒకమారు ఈమెను పొందుచున్నాను. దానివలన ఆమె

కడుపులో నొప్పి కల్గుచున్నది. నేను పెద్దమంత్రగాడిని అయినా నాకు ఒక ఒక బలహీనతవుంది.

నేను :- ఆ బలహీనత ఏమిటి?


వీరప్ప :- నాకు ఒక బలహీనత ఉందియని నేను ముందే చెప్పాను. మీ ముందర దాచకూడని వాస్తవమొకటి ఉన్నది.

అదేమంటే ఈమె బిడ్డ మంచి అందగత్తె, యుక్తవయస్సులోనున్న ఆమెను చూచి నాలో కోర్కె కలిగింది. నేను ఇంత

పెద్దమాంత్రికున్ని కదా! నాచేత కానిదేముంది ఏదో ఒకటి చేయాలి అనుకునే వాడిని. ఏదైనా బయటికి తెలిస్తే రెడ్డి

వాళ్ళు చంపివేస్తారను భయము మరొక ప్రక్క ఉంది. ఆ కోర్కె కూడ నేను చనిపోయేంతవరకు కుదరలేదు.

ఉండెడిది.

నేను :- నీ వయస్సెంత? నీవు ఎలా చనిపోయావు?

వీరప్ప :-:- నా వయస్సు 45 సంవత్సరములకు మించి ఉండదు. నేను ఏ రోగముతోనూ చనిపోలేదు. మంచి ఆరోగ్యముగా

ఉండేవాడిని. ఇంత తొందరగా నేను చనిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికి మూడు సంవత్సరముల క్రిందట

ఒక దినము వర్షము బాగా వచ్చినది. ఆ దినము రెడ్డిగారి ఇంటిలో పశువుల గాడికి పైనఉన్న దూలము తడిమన్ను

బరువుకు కొద్దిగ విరిగినట్లు చిన్న గీటు కనిపించింది. దూలము విరిగిపోతే పశువుల పై కప్పు అంతా కూలిపోతుందని

అక్కడున్నవారు బారు కాడిమాను (ఎద్దుల మెడమీద పెట్టు పొడవు మొద్దు) ను దూలముకు ఆనించి పోటు పెట్టారు.

ఆ కాడిమాను దూలము ఇరిగిపోకుండ సపోర్టుగ ఉండేది. కొయ్యపని చేసేవాడిని కనుక దానిని ఎలా రిపేరు చేయాలో

అడిగే నిమిత్తము నన్ను రెడ్డి రమ్మంటున్నాడని పనిమనిషి వచ్చి చెప్పాడు. వెంటనే నేను పోయాను.

ఇంటికి పోతూనే రెడ్డి కాఫీ ఇప్పించాడు. కాఫీ త్రాగిన తర్వాత దూలమును ఏమి చేయాలో చూడమన్నాడు.

కాఫీ త్రాగిన తర్వాత దూలము క్రిందకి పోయి చూస్తుండగా అంతవరకు దూలముకు పోటు పెట్టిన కాడిమాను

విరిగిపోవడము పెద్దశబ్దముతో దూలము విరిగి నాతల మీద పడడము క్షణాలలో జరిగిపోయింది. దూలము నామీద

పడడమే కాక పై కప్పు అంతా నామీద కూలిపోయింది. నా తల చీలి పోయింది నాకు క్షణాలలో ప్రాణము పోయింది.

ఇలా అనుకోని సంఘటన ద్వారా నేను చనిపోయాను. నా శరీరము శిథిలమైపోయింది. సూక్ష్మశరీరము మిగిలిపోయింది.

అప్పుడు అక్కడున్న వారంత మన్నును, కట్టెలను, దూలమును తొలగించారు. నేను లేచి బయటికి వచ్చాను. కానీ

అక్కడ నాశరీరము తల పగిలి పడివున్నట్లు నాకు కనిపిస్తున్నది. నేను ఎవరిని మాట్లాడించిన ఎవరూ నన్ను పట్టించుకోలేదు.

అప్పుడు నేను చనిపోయానని, చనిపోయి దయ్యముగా ఉన్నానని నాకు అర్థమైంది. నా చావును గురించి రెండు

రోజులు చింతించిన నేనే మనిషికంటే దయ్యముగా ఉండడమే బాగుందనుకొన్నాను. అంతవరకు నాలో ఉన్న కోర్కె

ప్రకారము మొదట ఈమె బిడ్డను పొందాను. ఆమె మనిషిగా కాకుండ, నేను ఆమెకు కనిపించునట్లు ఆమెను దయ్యముగా

మార్చితే ఇద్దరము కలిసి ఉండవచ్చనుకొన్నాను. అలా అనుకొన్న కొంతకాలానికే ఆమెను చంపి నావలె దయ్యముగా

మార్చుకొన్నాను. ఆమె ఆమెతల్లి ఒక చోట లేకుండ బిడ్డను కొన్ని మైళ్ళ దూరములోనున్న కొండలో పెట్టాను. వారములో

కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను.


నేను :- ఈమె బిడ్డను ఎలా చంపావు?


వీరప్ప :- మొదట శరీరములో చేరి జీర్ణాశయమును అదిమిపట్టి కడుపు నొప్పిని కల్గించాను. డాక్టరువద్ద చూపించారు,

మందు వాడారు. కానీ ఏమీ నయము కాలేదు. నేను అదిమే కొద్ది నొప్పి కల్గది. చివరికి డాక్టర్లకు ఏమీ అర్థము

కాలేదు. జీర్ణాశయమును అదిమితే నొప్పి కల్గుచున్నది కానీ ఆమె చనిపోలేదు. అందరి దృష్టిని కడుపునొప్పి మీద

పెట్టి, లోపల ఊపిరి తిత్తులను అదిమి ఊపిరాడకుండ చేసి చంపేశాను. నేను చంపినట్లు చనిపోయిన ఈమె బిడ్డకు

తెలియదు. ఆమె సూక్ష్మశరీరముగా మారిన తర్వాత నేను కనిపించాను. పరిచయమున్న వ్యక్తిని నేనొక్కనినే. మిగత


సూక్ష్మాలు కనిపించినా వారు పరిచయము లేరు, కావున ఆమె నాతోనే మాట్లాడవలసి వచ్చింది. అప్పటినుండి ఆమెను

నాదగ్గరే పెట్టుకొన్నాను.


నేను :- ఇదంతా పాపము పనికాదా? నీవు ఇంకా ఎవరినైనా చంపినావా?

వీరప్ప:- లోపల ఒక ప్రక్క పాపమొస్తుందనిపించినా, నేను చచ్చిపోయిన తర్వాత కదా యమలోకానికి పోయేది.

అప్పుడు ఏమి జరిగేది ఎవడు చూచాడు అనిపించింది. అప్పటికి అనుకూలమైన పనిని వదులుకో కూడదనిపించింది.

ఒక్కప్పుడు కాళీమాతను వశము చేసుకోడానికి తొమ్మిది సంవత్సరముల అమ్మాయిని స్మశానములో నరికి చంపాను.

అది పాపమే అనిపించినా దేవత కోరుకున్నపుడు నాదేమి తప్పు అనుకొన్నాను. అటువంటి బలి ఇచ్చిన తర్వాతే

కాళికాదేవత నాకు వశమైనది.


నేను :- ఇంత భయంకరమైన పనిని ఏమాత్రము పశ్చాత్తాపము లేకుండ చెప్పుచున్నావు. నీవు చాలా కఠినాత్మునివి.

నీకు సమాజమనినా, చట్టమనినా, పోలీసులనినా భయము లేదా?


వీరప్ప :- బయటికి తెలిస్తే భయమే, తెలియకుండ చేస్తే భయమెందుకు? ఇపుడైతే భయపడవలసిన పనేలేదు. నేను

చనిపోయాను కదా! నన్ను పోలీసులు ఏమి చేస్తారు? తొమ్మిది సంవత్సరముల అమ్మాయి కనిపించకుండ పోయిందో

లేదో విచారించుకొమ్మనండి. ఆ ఊరిలో కనిపించని అమ్మాయిని నేనే చంపానని ఇప్పుడు చెప్పుచున్నాను కదా!

బ్రతికియున్నపుడైతే చట్టము పోలీసులు. ఇపుడు వాళ్ళు నన్నేమి చేస్తారు? మీరు అన్నీ చెప్పమన్నారు, కాబట్టి ఇంకొక

రహస్యము కూడ చెప్పుచున్నాను. ఒకరోజు రాత్రి నడుచుకొంటూ మా ఊరికి రావాలని వస్తున్నాను. అపుడు అంత

రాత్రివేళలో ఒక అమ్మాయి ఎదురైనది. బంగారునగలు ధరించుకొనివుంది. ఆ అమ్మాయిని ఆపి ఎవరు నువ్వు అని

అడిగాను. ఆ అమ్మాయి ఏడుస్తు నాకు బలవంతపు పెళ్ళి చేస్తున్నారు. అందుకై పారిపోయివచ్చానని చెప్పింది. ఆమె

పెళ్ళి కూతురని, పారిపోయి వచ్చిందని అర్థమైంది. ఎక్కడికి పోవాలని అడిగాను. ఎక్కడికి పోవాలో తెలియదు.

ముందు అక్కడినుండి పారిపోవాలనిపించింది. వచ్చేశాను అన్నది. అపుడు నేను నాయింటికిరా! రెండు రోజుల

తర్వాత పెళ్ళి ఆగిపోతుంది కదా! అప్పుడు నీవు ఇంటికి పోవచ్చు నేను కూడ వచ్చి ఆ పెళ్ళి వద్దని చెప్తాను అని అనగా

ఆమె నావెంట వచ్చింది. అర్థరాత్రి తర్వాత ఊరిలోనికి పోయాము కాబట్టి ఎవరు చూడలేదు. ఆమె పడుకొన్న తర్వాత

గొడ్డలితో తలమీద కొట్టి చంపివేసి, ఆమె వంటిమీద ఉన్న నగలన్ని తీసుకొన్నాను. నాయింటిలోనే గుంతతీసి

అందులో పూడ్చివేశాను. ఈ విషయము కూడ ఎవరికీ తెలియదు. ఇపుడు చెప్పినా నన్నెవరూ ఏమి చేయలేరు.

అందువలన చెప్పుచున్నాను. నామాట అబద్దమేమో అని అనుకొనుటకు కూడ వీలులేదు. ఎందుకనగా ఇప్పుడు పోయి

త్రవ్వి చూచినా, నేను పూడ్చిన చోట ఆ అమ్మాయి శవము యొక్క ఎముకలు దొరుకుతాయి. నేను బ్రతికినపుడు ఈ

రెండు హత్యలే చేశాను. అవి ఇద్దరి ఆడవారివే. నేను చనిపోయిన తర్వాత ఈమె బిడ్డను మాత్రమే చంపాను.

ఇంకెవరిని చంపలేదు. మొత్తము ముగ్గరినీ పెళ్ళికాని వారినే చంపేశాను.

నేను :- నీ చరిత్రవద్దు కానీ ఈమె సమస్య చెప్పు. వీరు దేవతల వద్దకు, మాంత్రికుల వద్దకు పోయి చూపించుకొన్నారు

కదా! అప్పుడు నీవు ఎందుకు వదలిపోలేదు?


వీరప్ప :- వీరు నాకు వ్యతిరేఖముగా మాంత్రికుల వద్దకు, దేవతల దగ్గరకు పోయారు. అలాంటపుడు మాంత్రికులుగానీ,

దేవతలుగానీ నన్ను ఏమి చేయలేక పోయారు. వారిని నేనే బెదిరించాను. నాకు కాళికాదేవత వశములో ఉన్నది


కావున, మిగత దేవతలు నన్ను చూచి ఏమి చేయలేక పోయారు. గండి ఆంజనేయస్వామి వద్దకు పోయారు. అక్కడ

ఆంజనేయుడు పేరుపొందినవాడే, శక్తివంతుడే. నావద్దకు ఆయన వచ్చి దండించాలని చూచాడు. కానీ నేనే ఆయనను

జాగ్రత్త అని హెచ్చరించాను. నేను అందరి మాదిరి మనిషినికాదు, నాజోలికి వస్తే నీతోక తెగిపోతుందని చెప్పినాను.

ఆ దినమునుండి గండి ఆంజనేయుడు నా ప్రక్కకు కూడ చూడలేదు. గండిలో ఒక నెల రోజులుండి వచ్చి, తిరిగి

కొన్నాళ్ళకు కసాపురము ఆంజనేయస్వామి వద్దకు పోయారు. అక్కడ ఆయన అన్ని దయ్యములను కొట్టినట్లు నన్ను

కూడ కొట్టాలని చూచాడు. నా జోలికి వస్తే నీకే మర్యాద పోతుందని చెప్పాను. నేను మంత్రగాడిని మరియు

కాళికాదేవిని వశపరుచుకొన్న వాడినని కూడ చెప్పాను. అంతే అప్పటి నుండి నా ప్రక్కవాడి వరకు వచ్చి, నన్ను

వదలివేసి నా తర్వాత వాడిని కొట్టేవాడు.


ప్రతి రోజు అక్కడ ఉదయము, సాయంత్రము ఆంజనేయస్వామి దయ్యాలను దండించడము చూస్తు కూర్చొనే

వాడిని. ఒక దినము ఉదయము 8 గంటలపుడు ఒక బాలింత దయ్యమును కొట్టుచుండగా చూచాను. ఆమె కూడ

మంచి అందముగా ఉంది. ఆంజనేయస్వామి ఆమెను కొట్టడము, ఆమె నేను పోతాను స్వామీ అని చెప్పడము, రెండు

రోజులనుండి అబద్ధము చెప్పుచున్నావని దండించడము, లేదు ఈ రోజు సాయంత్రానికి పోతానని ఆమె చెప్పడము

జరిగింది. అదంతా చూచిన నేను, తర్వాత ఆ బాలింత దయ్యము వద్దకు పోయి ఆమెతో మాట్లాడినాను. ఆ బాలింత

దయ్యముది ఉరవకొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఆమె ఆ ఊరిలోని ఒక ఆడమనిషిని ఆవహించింది. బాలింత

పట్టుకొన్న వాళ్ళు పూర్తి బీదవాళ్ళు. వాళ్ళు మంత్రగాళ్ళ వద్దకు పోకుండ కసాపురమునకు వచ్చారు. అక్కడ ఆంజనేయుడు

కొట్టే దెబ్బలకు తట్టుకోలేక ఆ ఆడమనిషిని బాలింత వదలి పోవాలనుకొన్నట్లు నాకు తెలిసింది.


అప్పుడు నేను ఆమెతో నీవు తగులుకొన్నది కూటికి, గుడ్డకు లేనివాళ్ళను, నేను తగులుకొన్నది మా ఊరిలోనే

పెద్దధనికులు. నేను ఉన్న ఇంటిలో ఏమి తినాలన్నా తినవచ్చును అన్నీ ఉన్నాయి. మావారికి మామిడి తోటలున్నాయి,

ఎన్ని మామిడిపండ్లనైనా తినవచ్చును. పలానిది లేదు అనకుండ, ప్రతీది నేనున్న ఇంటిలో ఉన్నాయి. నా వెంట వస్తే

బాగ సుఖపడవచ్చు అని చెప్పాను. అందుకు ఆమె నావెంట వచ్చుటకు ఒప్పుకుంది. అపుడు ఆమె మీవాళ్లు పొయ్యేంత

వరకు నీవూ ఇక్కడే ఉంటావు కదా! అంతవరకు నేను ఉంటే ఆంజనేయస్వామి కొడతాడు, నేను తట్టుకోలేను అని

చెప్పింది. ఆ మాటకు నేను ఆమెకు ధైర్యము చెప్పి నీవు భయపడవలసిన పనిలేదు. ఆంజనేయస్వామి నిన్ను ఏమీ

అనకుండ ఉండాలంటే, నీవు కూడ నేనున్న ఈమె శరీరములోనికి వచ్చేయి. ఇద్దరము కలిసియుండవచ్చును, నీవు

వారిని వదలి పోయినట్లూ ఉంటుంది. నాదగ్గరున్న దానివలన నిన్ను ఆంజనేయుడు ఏమి అనలేడు అని చెప్పాను.

అప్పుడు ఆ బాలింత నేనున్న ఈమె శరీరములోనికి వచ్చింది. వీళ్ళు నన్ను ఒక్కన్ని వదిలించుకోవాలని కసాపురానికి

పోయారు, నేను అక్కడ ఇంకొకరిని తగిలించుకొని వచ్చాను.


నేను :- అయితే ఇప్పుడు ఈమె శరీరములో నీవుకాక మరొకరు కూడ ఉన్నారు.

వీరప్ప :- అవును. మీరు అన్నీ నిజము చెప్పమన్నారు కదా! అందువలన ఉన్నది ఉన్నట్లు చెప్పాను.

నేను :- నీవు ఇప్పుడు లోపలికి అణిగిపో, ఆమెను బయటికి పంపు. నీవు చెప్పినది నిజమో కాదో ఇప్పుడే తెలుస్తుంది.

(అప్పుడు అంతవరకు మాట్లాడుచున్న వీరప్ప లోపలికి పోయాడు. వెంటనే లోపలున్న మరొక దయ్యము బయటికి


వచ్చింది. ఆ దయ్యము బయటకు వస్తూనే బాలింతలు చెవులకు గాలి తగలకుండ తలకొంగు కట్టుకొన్నట్లు చీర

చెరుగుతో తలకు కట్టుకొని భయముగా కూర్చుంది. వీరప్ప లోపలికి పోతూనే అంతవరకు కనిపిస్తున్న ముఖము

యొక్క విధానము కనిపించకుండ పోయింది. అంతవరకు కూర్చున్నట్లుకాక, భయముగా ఒదిగి కూర్చోవడము

జరిగింది. ఆ మార్పును చూచి అక్కడ చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు.)



నేను :- నీవు ఏమి భయపడవద్దు. వీరప్ప చెప్పినది నిజమేనా? ఉన్నదున్నట్లు చెప్పు.

బాలింత :- నిజమే స్వామీ! నన్ను పొమ్మంటే పోతాను, నా తప్పు ఏమిలేదు స్వామీ.

నేను :- వీరప్ప నీతో సంబంధము పెట్టుకొన్నది నిజమేనా?

బాలింత :- నాతో సంబంధము పెట్టుకొన్నది నిజమే స్వామీ! నేను వద్దన్నా వినలేదు.

నేను :- నాతో చెప్పకుండా ఇంకా ఏమైనా దాచిపెట్టాడా?

బాలింత :- వీరప్పకు కోపము ఎక్కువ. అప్పుడప్పుడు నన్ను కొట్టుతుంటాడు. ఈ మధ్య నెల క్రిందట వీరప్పను

విడిపించడానికి ఒక మాంత్రికున్ని వీళ్ళు పిలుచుకవచ్చారు. అయితే వీరప్ప ఆ మాంత్రికున్ని ముప్పతిప్పలు పెట్టి

పంపించాడు. ఆ విషయమొక్కటి చెప్పలేదు.

నేను :- నీవు లోపలికి పో, నేను వీరప్పతో మాట్లాడుతాను.

(వెంటనే ఆమెలోపలికి అణిగి పోయింది. ఆమె పోయిన వెంటనే వీరప్ప బయటికి వచ్చాడు. వచ్చిన వెంటనే

అంతవరకు ఆమె కట్టుకొన్న తలకొంగును తీసివేసి ఠీవిగా కుర్చున్నాడు. బాలింత ఉన్నపుడు కనిపించినంత అణుకువ

కనిపించలేదు. అక్కడ చూస్తున్న వారికి ఆ మార్పు సులభముగా కనిపించింది)

నేను :- ఆమె చెప్పినది విన్నావా? ఆ మాంత్రికున్ని ఏమి చేశావు?

వీరప్ప :- వీరు పెద్దమాంత్రికుడు కావాలని వెదికి హైదరాబాద్నుండి వాణ్ణి పిలుచుకువచ్చారు. వాడు ఒకేమారు

ఐదువేలు డబ్బులు తీసుకొన్నాడు. అది వాని బ్రతుకుతెరువులే అనుకొన్నాను. అయితే వాడు నేను ఇంత పెద్దవాడిని,

అంత పెద్దవాడిని అని ప్రగల్భాలు చెప్పుకోవడమే కాక నన్ను సీసాలో బంధించి, స్మశానములో పూడ్చిపెట్టుతా అన్నాడు.

దానికి వాని మీద నాకు కోపము వచ్చింది. అయినా వాణ్ణి నేను కొట్టలేదు.

నేను :- ఏమి చేశావు వివరంగా చెప్పు?


వీరప్ప :- వాడు నన్ను విడిపించుటకు పూజపెట్టి, నడి ఇంటిలో ముగ్గువేసి, ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి, నన్ను

బయటికి పిలిచాడు. నేను బయటికి వచ్చాను. నా పేరు అడిగితే చెప్పాను. తర్వాత ఎందుకొచ్చావు? ఎంత

కాలమునుండి ఉన్నావు అని అడిగాడు. అప్పుడు అవన్ని నీకు అనవసరము. నీవు చేసే పని చేసి, నీ డబ్బులు నీవు

తీసుకొనిపో అని చెప్పాను. అయినా వాడు నన్ను చులకనగా మాట్లాడి, సీసా (బాటిల్)లో బంధిస్తానని మంత్రాలు

చదవను మొదలు పెట్టాడు. అప్పుడు నాకు కోపము వచ్చి, నీ మంత్రములు పెద్దవో, నా మంత్రములు పెద్దవో చూడు

అని ఆ గదిలోనే ఒక ప్రక్కన ఇసురురాయిని తిరుగు అని అన్నాను. నేను చెప్పుతానే రాయి ఐదారు చుట్లు తిరిగింది.

దానిని చూచిన ఆ మాంత్రికుడు నన్ను చూచి భయపడి నాడు. తర్వాత వారమునకు వస్తానని ఇంటివాళ్ళకు చెప్పి,

అక్కడినుండి పోయాడు. అంతే నేను ఏమి చేయలేదు.


నేను :- నేను చెప్పినట్లు వింటావా లేక నేను మాంత్రికున్ని, నాకు కాళికాదేవి ఆసరాగా ఉంది అంటావా?

వీరప్ప :- నిన్ను చూచి కాళికాదేవి రూము బయటనే ఉంది. లోపలికి రావడానికి కూడ భయపడి రాలేదు. ఆయమ్మే

భయపడినపుడు నేనెంత. మీరు ఎట్లు చెప్పితే అట్లానే నడుచుకొంటాను.

(అక్కడ అంతవరకు ఆ వింత చూస్తున్న వారందరినీ బయటికి పంపివేసి, తలుపులు మూసి వీరప్పకు మాత్రము

చెప్పడము జరిగినది.)

నేను :- నీకు వ్యతిరేఖముగా నేను ఏమీ చెప్పను. నిన్ను నీకర్మకే వదలి వేస్తున్నాను. కానీ ప్రతి వారము ఈమెకు వచ్చు

కడుపునొప్పి రాకూడదు. అలా వస్తే తిరిగి వీరు నాదగ్గరకు వస్తారు. కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అలా కాకుండ

నీవు ఎట్లున్నావో అట్లే ఉండు. కడుపునొప్పి రాకుండ పోతే వీరిలెక్కలో నీవు పోయినట్లే. అందువలన నేను చెప్పినట్లు

నడుచుకో. ఏమంటావు.

వీరప్ప :- నేను అనునది ఏమి లేదు. మీరు చెప్పినట్లే చేస్తాను. ఇక లోపలికి పోతాను.


(చివరిగా వీరప్ప నమస్కారము చేసి అణిగి పోయాడు.) ఇదంతా ఒక వింత కథగా కనిపించినా, ఇది

నాముందర జరిగిన యదార్థగాథ. ఇందులో దయ్యము అబద్దము అనేదానికి వీలులేదు, అలాగే మంత్రములు లేవు

అనేదానికి కూడ అవకాశము లేదు. నేర్చుకున్న విద్య పూర్తి మరణము వచ్చు వరకు పోదు అనేదానికి ఇందులో

ఆధారము లభించింది.


ఇపుడు చెప్పబోవు సంఘటనలో మనిషి శరీరము ఒక వాహనము లాంటిదని, దానిని ఎక్కినవాడు నడిపినట్లు

నడుచునని తెలియుచున్నది. అకాలమృత్యువు చెందిన వారికి స్థూలశరీరముండదు. కనిపించని సూక్ష్మ శరీరము

మాత్రముండును. మనకు సూక్ష్మశరీరముల (దయ్యముల) విషయము తెలియాలంటే దయ్యముల ద్వారానే తెలుసుకోవలెను.

ఒక శరీరము మీదకు వేరొక సూక్ష్మశరీరము వచ్చినపుడు వారిని ప్రశ్నించడము ద్వారా ఎన్నో మనకు తెలియని

విషయములను తెలుసుకోవచ్చును. అలాగే కనిపించు పనుల వలన కూడా తెలియని విషయములను తెలుసు కోవచ్చును.

ఒక రైల్వే ఉద్యోగస్థుని భార్య శరీరము మీదికి ఒక దయ్యము వచ్చింది. దానిని విచారిస్తే ఆ దయ్యము పేరు శివరామయ్య

అనీ, పేరును బట్టి అది మగ దయ్యమని తెలిసిపోయింది. ఇంకా తెలిసింది ఏమంటే శివరామయ్య గతములో

బ్రతికియున్నపుడు, ఇపుడు పట్టుకున్న ఈమెను ప్రేమించెడివాడు. అతను ప్రేమిస్తున్నట్లు ఈమెకు కూడ తెలుసు. శివ

రామయ్య తమ పెద్దలను అమ్మాయి ఇంటికి పెత్తనానికి పంపి, పెద్దలు ఒప్పుదలతో ఒక ముహూర్తములో పెళ్ళి

చేసుకోవాలనుకొన్నాడు. కానీ అంతలో బస్సు ప్రమాదములో శివరామయ్య చనిపోయాడు. చనిపోయిన శివరామయ్య

అకాలమృత్యువు పొందాడు, కావున కనిపించని మనిషిగా ఉండిపోయాడు. చనిపోకముందు ఒక నాటకములో

రావణబ్రహ్మ పాత్రను బాగా ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆ నాటకము వేయకముందే అకాలముగా మరణించాడు.

శివరామయ్య చనిపోయిన తర్వాత కొంత కాలమునకు ఆమెకు పెళ్ళి అయినది. ఆ పెళ్ళిని చూచిన శివరామయ్య

చాలా బాధపడినాడు. పెళ్ళైయిన తర్వాత శోభనము దినము ఆమె భర్త, భార్యవద్దకు వస్తూనే, శివరామయ్య ఆమె

శరీరము మీదికి వచ్చి ఈమె నాది, నీదికాదు అనెడివాడు. ఇదంతా అర్థముకాని ఆమె భర్త, అంతటా చూచి చివరకు

నావద్దకు తెచ్చాడు. అప్పుడు శివరామయ్య బయటికి వచ్చి మాట్లాడు చున్నాడు. అలా మాట్లాడే సమయములో

అప్పుడప్పుడు మీసము మెలి వేసినట్లు చేయిని మూతిమీద పెట్టేవాడు.


కనిపిస్తున్నది ఆడమనిషి, మాట్లాడుచున్నది మగమనిషి అలవాట్లు మగమనిషివే! అప్పుడు మేము, నీవు మీసము

త్రిప్పుచున్నావా అని అడిగాము. అవునని అతను సమాధానమిచ్చాడు. అంతేకాకుండ తాను రావణబ్రహ్మ పాత్రను

నేర్చుకొన్నాననీ, ఆ పాత్రలో ఎక్కువగా మీసము తిప్పేపని గలదనీ, అది అట్లే అలవాటుగా మారిందని చెప్పాడు. రావణ

పాత్రలో పద్యాలు నేర్చివుంటే చెప్పమని అడిగాము. అపుడు పైకి కనిపించు ఆమె రావణునిగా నటించను మొదలుపెట్టింది.

అపుడు గదను భుజముమీద పెట్టుకొన్నట్లు చేసి, ఎడమచేతితో మీసమును మెలివేసి పద్యమును చెప్పను మొదలు

పెట్టింది. గంభీర స్వరముతో పద్యమును చెప్పగా అందరికి ఆశ్చర్యమైనది. తర్వాత శివరామయ్యను లోపలికి పొమ్మని,

ఆమెను పద్యము గురించి అడిగాము. పద్యమేమిటో నాకు తెలియదని ఆమె చెప్పింది. శివరామయ్యను గురించి

అడుగగా అంతా నిజమేనని ఆమె చెప్పింది. శివరామయ్యను పైకి పిలిచి అడిగితే మొదట ఆమెను ప్రేమించింది

తానేనని, అందువలన ఆమెను ఇతరుని భార్యగా ఒప్పుకోలేక పోతున్నానని చెప్పాడు. అమెనడిగితే అతను పెళ్ళికాకముందే

చనిపోయాడు. కావున నాఇష్టముతోనే నేను పెళ్ళి చేసుకొన్నాను. అయినా అతను మా కాపురానికి ఆటంకమైనాడు

అంటున్నది.


ఇదంతా చూస్తే, ఆడమనిషి శరీరము మీద మగమనిషి నటన వచ్చిందంటే, శరీరము మీద ఎవరుంటే వారు

ఆడించినట్లే శరీరము ఆడుతుందని, వారి లక్షణములు, అలవాట్లు శరీరము మీద కనిపిస్తాయని తెలియుచున్నది.

స్థూలశరీరము కేవలం ఆట బొమ్మలాంటిదని, ఆడించే వానిని బట్టి అడునని చెప్పడమేకాక, శరీరము ఆడించేవాని

లక్షణములు పొందునని కూడ తెలియుచున్నది. ఈ మాటను బలపరుచుచు మరొక సంఘటనను ఇపుడు చెప్పుకొందాము.

ఒక ఆడమనిషిని అనారోగ్య కారణము వలన నావద్దకు వారిబంధువులు తెచ్చారు. రోగాలు అన్నీ శరీరము లోపముతో

ఏర్పడవనీ, శరీరములో దయ్యాలు కల్గించడము వలన ఏర్పడునవి చాలా ఉన్నాయనీ ముందే చెప్పాము. ఈ సూత్రము

ప్రకారము 22 సంవత్సరముల ఆమెకు ఏ రోగములేదని తెలిసింది. ఇక వెదకవలసింది దయ్యము ఏదైనా శరీరములో

ఉన్నదా అని చూడాలి. అలా చూస్తే ఆమెకు దయ్యమున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎలా నిర్ధారణ చేశారని, దానికేదైన

లాబెస్టు ఉందా అని కొందరడుగవచ్చును. దయ్యాలు లాబ్లో ఏ టెస్టుకూ దొరకవు. దానిని కనిపెట్టడానికి చిన్న

సూత్రము గలదు. అదేమనగా! వేరొక సూక్ష్మశరీరము, ఒక శరీరములో ఉన్నపుడు ఆ శరీరములో ఉన్నవి రెండు

సూక్ష్మశరీరములగును. రెండు సూక్ష్మశరీరములు ఒక స్థూలశరీరములో ఉన్నపుడు గుండె వేగము ఎక్కువగా ఉండును.

ఒకే పద్ధతిగా గుండె కొట్టుకోదు. అందువలన గుండె స్పీడు ఎక్కువ తక్కువలుగా ఉండును. నూటికి డెభ్భైమందిలో

మణికట్టు దగ్గర నాడి ఎక్కువ తక్కువలుగా స్పీడుగా కనిపించును. ఇక 30 శాతము మందికి దయ్యము లోపల

ఉండినప్పటికి నాడిలో తేడా కనిపించదు. దానికి కారణము, శరీరములో చేరిన దయ్యము బ్రహ్మనాడికి (వెన్నుపాముకు)

దూరముగా ఉంటే తెలిసేదానికి అవకాశము లేదు. ఉదాహరణకు భుజములోగానీ, చేతిలోగానీ, కాలిలోగానీ ఉన్న

ఎడల వాటి స్పందన నాడిలో కనిపించదు. గొంతు నుండి క్రింది కడుపు వరకు దయ్యము ఎక్కడున్నా నాడిలో

తెలియును. ఎక్కువ శాతము కడుపులో గానీ, దొమ్మల భాగములోగానీ, మనుషులలో సూక్ష్మశరీరములు నివాసము

ఏర్పరుచు కొనును. అందువలన దయ్యముల వలనవచ్చు అనారోగ్య సమస్యలన్నీ ఎక్కువ కడుపులోను, దొమ్మలలోను

ఉండును.


నావద్దకు తెచ్చిన ఆడమనిషికి కడుపునొప్పి సమస్య. ఆ నొప్పి కారణము ఏ టెస్టులకు, ఏ స్కానింగ్లకు

అంతుబట్టలేదు. నేను చూచినపుడు నాడి స్పీడు, స్లో రెండు రకములుగా ఆడుచుండుట వలన ఆ నొప్పి దయ్యము


వలన వచ్చినదని తెలిసిపోయింది. అపుడు ఆ దయ్యమును బయటికి పిలిచాము. మేము పిలిస్తే నూటికి తొంభైమందికి

దయ్యాలు బయటికి వస్తాయి. దానిప్రకారము ఆ దయ్యము బయటికి వచ్చింది. అలా దయ్యము బయటికి రాగానే,

ఆమెలో ఒక వింత కనిపించింది. ఆ వింత ఏమనగా! దయ్యము పైకి రానంతవరకు నా ఎదురుగా కూర్చున్న ఆమె

కన్నులు బాగానే ఉండేవి. దయ్యము బయటికి వచ్చిన తర్వాత ఆమె కన్నులలో తేడా వచ్చింది. ఒక కన్ను బాగుంది,

ఒక కన్ను మాత్రము మెల్ల కన్ను మాదిరి ఒక ప్రక్కకు తిరిగి ఉంది. చూస్తూనే కళ్ళలో తేడా బాగా కనిపించినది.

దయ్యము లోపలికి అణిగి పోతానే, అంతవరకు ప్రక్కకున్న కన్ను తిరిగి యథాస్థానములోనికి వచ్చి, కన్నులు బాగా

ఉన్నట్లే కనిపిస్తున్నవి. అర్థగంట తర్వాత రెండవమారు దయ్యమును బయటికి పిలిస్తే అప్పుడు కూడ కన్ను మెల్ల

కన్నుగా మారిపోయింది. దీనినిబట్టి చనిపోయి దయ్యముగా మారిన వ్యక్తికి ముందే మెల్లకన్ను ఉండెడిదనీ, ఆ వ్యక్తి

చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మశరీరమునకు మెల్లకన్ను కలదనీ, సూక్ష్మశరీరము ఏ శరీరములో చేరితే, ఆ శరీరమునకున్న

కన్ను కూడ మెల్లకన్నుగా మారిపోవుచున్నదని తెలియుచున్నది. ఈ విధముగా ఎన్నో వాటిని చూచిన అనుభవములూ,

ఎన్నో దయ్యములతో మాట్లాడిన అనుభవములూ మనకు తెలియని దయ్యముల రహస్యములను అర్థమగునట్లు

చేయుచున్నవి.


ముందు చెప్పిన రైల్వే ఎంప్లాయి భార్యకు పట్టిన శివరామయ్య అలవాట్లను బట్టి, ఒక సూక్ష్మశరీరమునకున్న

అలవాట్లు ఆ సూక్ష్మశరీరము ప్రవేశించిన శరీరమునకు కూడ వచ్చునని తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు చెప్పుకొన్న

మెల్లకన్ను విషయమును బట్టి ఒక సూక్ష్మశరీరమునకు ఏ లోపముండునో ఆ లోపము ఆ సూక్ష్మశరీరము ప్రవేశించిన

శరీరమునకు కూడా కనిపించునని తెలిసిపోయినది. ఇప్పుడు ఒక సూక్ష్మశరీరమునకు (దయ్యమునకు) ఒక పదార్థము

మీద ఉన్న ఎలర్జీగానీ, రియాక్షన్ గాని ఉన్నట్లయితే ఆ సూక్ష్మశరీరము ఇతరుల శరీరములను చేరినపుడు ఉంటాయో,

ఉండవో చూస్తాము.


మాకు దగ్గరగానున్న ఒక గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబము ఉండెడిది. ఆ ఇంటి యజమాని ఆ ఊరికి

కరణము పనిచేసేడివాడు. అతని వయస్సు అరవై సంవత్సరముల పైనే కలదు. అతని భార్యకు వయస్సు 60

సంవత్సరములు గలవు. ఆ కుటుంబములోని ఆమె కొడుకులు నాకు బాగా పరిచయమున్న వ్యక్తులు. ఒక దినము

ఆమె కొడుకు నావద్దకు వచ్చి, మా అమ్మకు దయ్యము అప్పుడప్పుడు వచ్చిపట్టి పోతూవుంటుంది. ఆ దయ్యము ఎవరో

కాదు స్వయాన మాకు పెద్దమ్మ, మా అమ్మకు స్వంత అక్క అవుతుంది. మా అమ్మమీద ఆమెకు ఎక్కువ ప్రేమవుంది.

ఆమె చనిపోయి పది సంవత్సరములైనది. చనిపోయిన ఆమె అట్లు మా దగ్గరకు రావడము మంచిది కాదనుకొన్నాము.

మేము నిష్టగ పూజలు చేసు కొంటాము. అటువంటి ఇంటిలోనికి దయ్యము రావడము అరిష్టం అనుకొన్నాము. ఆమెను

రావద్దని చెప్పినా మామాట వినడము లేదు. మీ వద్దకు తీసుకువస్తాము, ఏదో ఒక రకముగా చెప్పి పంపండి మీ

మాటైనా వింటుందేమో అని అడిగారు. ముందునుండి పరిచయమున్న వ్యక్తులైన దానివలన సరే తీసుకురాండి చెప్పి

చూస్తాము అన్నాము.


ఒక దినము సాయంకాలము, ఆమెను తీసుకురావడము జరిగింది. ఆమె ముందే నన్ను చూచిన వ్యక్తి

అయినందున, బాగున్నారా అని నన్ను పలకరించింది. నీ ఆరోగ్యము ఎట్లుందమ్మా అని నేను అడిగాను. దానికామె

దయ్యము పీడ తప్ప ఆరోగ్యమంతా బాగానే ఉంది నాయనా అన్నది. నాముందర ఆమెను కూర్చొపెట్టుకొని ఆమెకు

దయ్యముందని ముందే తెలుసు కాబట్టి నేరుగా ఆ దయ్యాన్నే పేరు పెట్టి పిలిచాను. పిలిచిన తర్వాత కూర్చున్న ఆమె


ఆవులిస్తూ ఆవులిస్తూ చిన్నగా నిద్రమత్తులోనికి జారుకుంది. అలా రెండు నిమిషములకు ఆమె నిద్రలోనికి పోగా,

లోపలయున్న దయ్యము శరీరము మీదికి వచ్చి మాట్లాడడము మొదలు పెట్టింది. వచ్చిన దయ్యానికి తాంబూలము

వేసుకొనే అలవాటుందంట. బ్రతికియున్నపుడు గంట గంటకు ఆకు, వక్కను దంచి వేసుకొనేదంట. ఇప్పుడు శరీరము

పైకి వస్తూనే నాకు ఆకు, వక్క, సున్నము ఇవ్వండి అని అడగడము మొదలు పెట్టింది. ఎప్పుడు పైకి వచ్చినా అలాగే

అడుగుతుందట. అప్పుడు అక్కడే పక్కనే గల ఆకు, వక్క, సున్నము ఇచ్చాము. ఆకు, వక్కను దంచి ఇమ్మని అడిగితే

అలాగే ఇచ్చాము. తాంబూలమును నోటిలో పెట్టుకొన్న తర్వాత ఆమె మాట్లాడేదానికి మొదలు పెట్టి నాతో ఇలా

అన్నది.



దయ్యము :- నీకు వీళ్లు బాగా తెలుసు కదా! నీవైనా చెప్పకూడదా! నేను అప్పుడప్పుడు నా చెల్లెలు దగ్గరకు వస్తే

వీరికేమి నష్టము? ఇపుడు నీ వద్దకు తెచ్చారు, సరే! నాకు ఇక్కడికి వచ్చినందుకు ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకుముందు

ఊరిలో ఇంటి దగ్గరకు ఒక మంత్రాల సాయబ్ను పిలుచుకు వచ్చారు. వాడు నన్ను నానారకాలుగా మాట్లాడి, నీవు

పోకపోతే మాంసము ముక్క నీ నోటిలో పెట్టుతానన్నాడు. ఇదేమైనా మంచిపనేనా నువ్వే వీరినడుగు.


(అపుడు ఆమె చెల్లెలు కొడుకులతో అలా ఎందుకు చేశారు? పెద్ద వాళ్ళతో అలా మాట్లాడడము మంచిది

కాదు కదా! అన్నాను. దానికి వారు దయ్యము విడిపించే వాడంటే అతనిని పిలుచుకు వచ్చాము. అతను చెప్పి

చూచాడు. ఈయమ్మ నేను పోనే పోను అన్నది. దానికి వాడు మాంసము ముక్కను చూపించి నీ నోటిలో పెట్టుతానని

అన్నాడు. ఆ మాట అంటూనే వానిని ఈయమ్మ ఊరకే వదిలిందా? ప్రక్కనేయున్న 20 కేజీల రుబ్బుడు గుండును

వానిమీద వేస్తానని పైకి ఎత్తింది. ఆ గుండును ఎత్తుతానే వాడు లేచి పరిగెత్తాడు. వాడు బయటికి పరిగెత్తినా

వదలకుండ ఈమె గుండును ఎత్తుకొనే బయటికి పోయింది. వాడు పరిగెత్తేకొద్దీ అంత బరువు గుండు ఎత్తుకొని

వెంటపడింది. మేమంతా పరిగెత్తి పోయి గట్టిగ పట్టుకొని రాయిని క్రిందవేయించాము. ఇక ఎవరితోను కాదని

నీవద్దకు తెచ్చాము.)


నేను :- వీరు చెప్పేదంతా నిజమేనా? 20 కేజీల గుండును ఎత్తుకొని పరిగెత్తావా?

దయ్యము : వాడు దొరికింటే వానిని గుండుతోనే చంపేసే దానిని. వాడు ప్రత్తి చేనులోపడి పారిపోయాడు. అంతలో

వీరు వచ్చి వెనుక నుండి నన్ను పట్టుకొన్నారు.

నేను :- చూడమ్మా, నీవు పెద్దదానివి నీకు చెప్పేంతటివారము కాము. కానీ నీకు గుర్తు చేయునది ఏమంటే? ప్రతి

మనిషి భూమిమీద కొంత కాలమే బ్రతికి చనిపోవడము జరుగుచున్నది. కొందరికి చనిపోయిన తర్వాత కొంతకాలము

సూక్ష్మరూపములో బ్రతుకుటకు అవకాశము గలదు. కొందరు చనిపోతూనే మరుజన్మకు పోవడము జరుగుచున్నది.

చనిపోతూనే రెండవ జన్మకు పోవువారికంటే, కొంతకాలము సూక్ష్మశరీరముతో అదే జన్మలో ఉండడము మంచిదే.

ఎందుకనగా ఆ జన్మలో బ్రతికియున్నపుడు తన జీవితము ఎలా గడిచింది అని జ్ఞాపకము తెచ్చుకొని చూచుకొనుటకు

అవకాశము గలదు. బ్రతికియున్నపుడు దైవజ్ఞానము తెలుసుకొను తీరిక లేకుండ బ్రతికియుండినా, సూక్ష్మముగా

ఉన్నపుడు తీరిక ఉంటుంది. కావున తన తప్పును తెలుసుకొని దైవజ్ఞానమును తెలుసుకోవచ్చును. చనిపోయి

దయ్యముగా ఉన్నపుడు కూడ నీవు నా చెల్లెలు అంటున్నావు. వారేమో నిన్ను పీడ అంటున్నారు. వారు అంతగ

ఏవగించుకొన్నపుడు నీవెందుకు వీరిని అనుకోవాలి. మంచి అవకాశమున్న కాలములో కూడ దేవున్ని తెలుసుకోకపోతే,


దయ్యముగా మారి తన తప్పును తాను తెలుసుకోలేనట్లే. జన్మకు పోతే తన తప్పును గుర్తు చేసుకొను జ్ఞాపకమే ఉ

౦డదు. అటువంటి వారికంటే తాను గడిపిన జీవితమును గుర్తు చేసుకొని, మంచి జీవితమును గడుపుటకు అవకాశమున్న

సూక్ష్మశరీరములో ఉండి, ఒక క్షణము వృథా చేసినా, అది ఆ జన్మకు తీరని నష్టమే అగును.


ఇపుడు నీవు సూక్ష్మముగా కాలము గడుపుచున్నావు. ఏ ఆటంకము లేదు. గడచిన కాలమును గురించి

యోచించుకో, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తముగ దైవజ్ఞానము తెలుసుకో. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. నీకు

నేను చెప్పినది మంచిదనిపిస్తే ఇట్లు వచ్చేది మానివేసి జ్ఞానము తెలుసుకొనేదానికి కాలమును వినియోగించుకో లేకపోతే

నీఇష్టము.


దయ్యము :- నీవు చెప్పినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఎక్కడికి పోయినా దయ్యము అంటేనే చాలా చిన్నచూపు

చూస్తున్నారు. మనిషి యోగ్యతనుగానీ, బంధుత్వమునుగానీ, వయస్సునుగానీ, సాటి మనిషియని గానీ చూడకుండ

పరక (చీపురు)తో కొట్టు, చెప్పుతో కొట్టు, పొగపెట్టు అనెడివారేగానీ మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళేలేరు. మావారు

కూడ నాకు ఏమీ మర్యాద ఇవ్వలేదు. అలాంటపుడు నేను రావడము కూడ నాబుద్ధి తక్కువే అగును. ఇప్పటినుండి

దైవజ్ఞానమును తెలుసుకొనుటకే ప్రయత్నిస్తాను.


(అని చెప్పి అక్క తేలిపోయి చెల్లెలు నిద్రనుండి బయటికి వచ్చింది. ఇదంతా ఒక గంటకాలము

జరిగిందనుకుంటాను. దయ్యము పోయి మనిషికి జ్ఞాపకము వచ్చిన రెండు నిమిషములకే చెల్లెలు కక్కుకున్నది (వాంతి

చేసుకొన్నది). ఎందుకు అలా వెంటనే కక్కుకున్నదని అడుగగా ఆమె కొడుకులు ఇలా చెప్పారు. మా అమ్మకు

తాంబూలము సరిపోదు. మా పెద్దమ్మకు సరిపోతుంది. మా పెద్దమ్మ తాంబూలము లేనిది ఉండలేదు. ఇట్లా మా

పెద్దమ్మ వచ్చినపుడు తాంబూలము ఇచ్చినా, ఆమె పోయిన తర్వాత మా అమ్మ శరీరములో అది సరిపోదు. వెంటనే

కడుపులో త్రిప్పి వాంతికి వస్తుంది అని చెప్పారు. ఇదంతా గమనించి చూస్తే, అక్క సూక్ష్మము చెల్లెలు శరీరమును

ఆక్రమించి ఉన్నపుడు ఆ సూక్ష్మమునకు తాంబూలము సరిపోతుంది. కావున చెల్లెలు శరీరములో తాంబూలమున్నపుడు

ఏ అలర్జీలేదు, రియాక్షన్ లేదు. అక్క సూక్ష్మము, చెల్లెలు శరీరమును వదలి పోయిన తర్వాత చెల్లెలు సూక్ష్మమును బట్టి,

చెల్లెలు శరీరములో తాంబూలము ఎలర్జీ వలన రియాక్షన్ అయి వాంతికి వచ్చింది. దీనినిబట్టి ఏ శరీరములోనైనా

ఆహార ప్రత్యేకతలు, ఆహార ఎలర్జీలు ఉండవనీ, కేవలము శరీరములో జీవించు జీవున్ని బట్టి, జీవుని కర్మను బట్టి,

శరీరమునకు ఎలర్జీలు, రియాక్షన్లు ఉండునని తెలియుచున్నది.


ఇంతవరకు తెలుసుకొనిన శివరామయ్య మీసమును త్రిప్పు అలవాటుగానీ, దయ్యము పట్టినపుడు వచ్చిన

మెల్లకన్నుగానీ, ఇపుడు చెప్పిన తాంబూలము రియాక్షన్ గానీ శరీరమునకు ఉండునవి కావనీ, శరీరములో ఉండు

జీవున్ని బట్టి ఉండునవనీ, అనుభవపూర్వకముగా, ప్రత్యక్షముగా తెలిసిపోయింది. ఇంత ప్రత్యక్ష సాక్ష్యములున్నప్పటికి

దయ్యాలను ఒప్పుకోని కొందరు నాస్తికులున్నారు. వారి అంతరంగమందు దయ్యాలు నిజమేనని వారికి అర్థమైనా,

తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్లు వాదిస్తుందురు. తెలియనివారికైనా చెప్పవచ్చును, తెలిసినవారికైనా

చెప్పవచ్చును, తెలిసినా, తెలియదను వారికి ఏమీ చెప్పలేము. ఎందుకనగా వానికి తెలిసినా తెలియదనడమూ,

అర్థమైనా అర్థమే లేదనడము అతని పని. అటువంటివారికి చెప్పేదానికంటే చెప్పకపోవడమే మంచిది.


శరీరములో రోగాలు రావడము సహజము. కానీ అన్ని రోగాలు ఆసుపత్రిలో డాక్టరువద్దనే నయము కావు.

దానికి కారణము, రోగాల రూపములో ఉండేవన్నీ రోగాలు కావు. ఇప్పుడు అటువంటి రోగాన్ని గురించి ఒక సంఘటన

ద్వారా తెలుసుకొందాము. అనంతపురము జిల్లాలో గంగవరము అను ఊరిలో రామన్నచౌదరి అను వ్యక్తికి ప్రతి

బుధవారము సాయంత్రము ఏడుగంటలకు వాయి (మూర్చ) లేచేది. అది ఐదునుండి పది నిమిషముల వరకు ఉండి

పొయ్యేది. అట్లు దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలమునుండి జరిగేది. డాక్టర్ల వద్దకు పోయి చూపించుకొంటే ఆ

రోగమునకు ఏదో ఒక పేరుపెట్టి, అది అట్లే వస్తుంది దానికి ఈ మందులు వాడితే రాకుండ పోతుందని చెప్పి, నెలల

పర్యంతము మందులు ఇచ్చినా అది మాత్రము రాకుండ పోలేదు. చివరకు వారు నావద్దకు వచ్చి ఇలా చెప్పారు. “ప్రతి

బుధవారము సాయంత్రము ఏడుగంటలకు వాయి లేవడము (ఫిట్స్ రావడము) వలన ఆ రోజు, ఆ సమయానికి

పనులన్నీ మానుకొని ఇంటి వద్దనే ఉండవలసివస్తున్నది. ఇంతవరకు ఏ మందులు వాడినా నయము కాలేదు” వారి

మాటలువిన్న నేను కొంత ఆలోచించగా రోగానికి బుధవారమనిగానీ, ఏడుగంటలే అనిగానీ నియమముండదు.

ఉంది అంటే అది శరీరరోగముకాదని, సూక్ష్మశరీరరోగమని అర్థమైనది. అప్పుడు అతనిని కొన్ని ప్రశ్నలడిగాను.


నేను :- ఈ రోగము ఎంతకాలమునుండి వస్తున్నది?

రామన్న :- దాదాపు ఒకటిన్నర సంవత్సరమునుండి వస్తున్నది.

నేను :- మొట్టమొదట వచ్చినపుడు ఇంకా ఏదైనా జరిగిందా లేక ఏదైనా జరిగిన తర్వాత ఈ రోగము వచ్చిందా?

రామన్న :- మొదట వచ్చినపుడు ఏమి జరిగినట్లు గుర్తులేదు.

నేను :- ఈ రోగము రాకముందు అమాస్యదినముగానీ, పౌర్ణమి దినముగానీ, ఆదివారము దినముగానీ నీకేమైనా

ప్రత్యేకముగా జరిగిందా?

రామన్న :- నాకు ఏమీ జరగలేదు, కానీ అమావాస్యదినము అనేది నాకు బాగా జ్ఞప్తికియున్నది.

రామన్న :- మా ప్రక్క ఊరిలో వడ్లమిషన్ ఉంది. ఆ రోజు వడ్లను ఆ మిషన్కు తీసుకపోయాను. దారి మధ్యలో కొంత

ఆలస్యమై అక్కడికి పోయేటప్పటికి సాయంత్రము చీకటిపడే సమయమైంది. మిషన్వాళ్ళు లైట్లు వేశారు. ఈ రోజు

అమావాస్య మిషన్కు పూజ చేయాలి. రేపువస్తే వడ్లు వేస్తాము, ఇపుడు వేయము అన్నారు. ఎంత అడిగినా వాళ్ళు

వినలేదు. ఆ రోజు ఇంటికి వచ్చాను, మరుసటి దినము నేను పోలేదు, మావాళ్ళు పోయారు.

నేను :- దారిలో ఎందుకు ఆలస్యమైనది?

రామన్న :- బండి వాటు పడింది. నేను ఒక్కడినే కాబట్టి చాలసేపువుండి. దారిలో ఐదారు మంది మనుషులు వచ్చిన

తర్వాత, బండిని తిరిగి లేపి వడ్ల మూటలన్నిటిని తిరిగి బండిలోనికి వేసుకొని, వచ్చేటప్పటికి సాయంకాలమై పోయింది.

నేను :- ఈ రోగము అమావాస్య తరువాత వచ్చినట్లు గుర్తుందా?

రామన్న :- అమావాస్య పోయిన తర్వాతనే, అదే నెలలో వచ్చింది, కానీ ఎన్ని దినములకు వచ్చినదో జ్ఞాపకములేదు.

(ఇదంత విన్న తర్వాత ఏమీ అర్థము కాలేదు. అయినా అతని కుడి చేయి నాడిని చూచాను. నాడికొట్టుకోవడమునుబట్టి

అతని శరీరములో మరొక సూక్ష్మశరీరమున్నట్లు అర్థమైనది. అప్పుడు అతనిని నాముందు కూర్చోమని అతని వైపు


చూచాను. అలా చూస్తూవుండగా ఒక నిమిషములోనే, రామన్న శరీరములోని సూక్ష్మశరీరము, శరీరము పైకి వచ్చినట్లు

అర్థమైనది. అపుడు మా సంభాషణ ఇలావుంది చూడండి)

నేను:- నీవు ఎవరో తెలుసుకోవచ్చా?

సూక్ష్మము :- నన్ను ఎందుకు బయటికి లాగారు?

నేను :- ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. తర్వాత నీ ప్రశ్నకు జవాబు చెప్పుతాము.

సూక్ష్మము :- నేను సుబ్బలక్ష్మిని. నేను చనిపోయి ఏడు సంవత్సరములైనది.

నేను :- సుబ్బలక్ష్మీ నీవు ఎందుకు చనిపోయావు? నీ వయస్సెంత?

సుబ్బలక్ష్మి :- నాకు ఇప్పటికి 24 లేక 25 సంవత్సరముల వయస్సుంటుంది. నేను రోగమొచ్చి చచ్చిపోలేదు. వేరే

వాళ్ళు నన్ను చంపేశారు.

నేను :- నీకు ఇప్పటికి 25 సంవత్సరముల వయస్సయితే, నీవు చచ్చిపోయి ఏడు ఏండ్లయితే, 18 సంవత్సరము

వయస్సులోనే నీవు చనిపోయి ఉండాలి అంతేనా?

సుబ్బలక్ష్మి :- అంతే. నేను చచ్చిపోలేదు, నన్ను చంపారు. అయినా నేను బ్రతికే ఉన్నాను. ఇపుడు నన్ను ఎవరూ

చంపలేరు. నేనే వాళ్లను చంపుతా.

నేను :- నీ వెనుక మాకు తెలియనిది చాలా ఉన్నట్లున్నది. అవసరమైతే నీకు నేను కూడ సహాయము చేస్తాను. నిన్ను

ఎవరు చంపారు?

సుబ్బలక్ష్మి :- మీరు గొప్పవారు. మీరు నాకు సహాయము చేస్తానన్నారు. చాలా సంతోషము. నాది బీదకుటుంబము.

నా తల్లి తండ్రులు నన్ను బాగా చదివించాలనుకొన్నారు. మా అమ్మకు నామీద ఎక్కువ ప్రేమ. మా ఊరికి ప్రక్కన

ఉన్న ఊరిలో హైస్కూలు ఉన్నది. అక్కడ నేను పదవతరగతి చదివేదానిని. ప్రతి రోజు కాలినడకన స్కూల్కు పోయి

వచ్చేదానిని. మా ఊరినుండి నాతోపాటు స్కూల్కు వచ్చేవాళ్ళుండిరి. కానీ ఒకరోజు నాకు ఇంటివద్దే ఆలస్యమైనది.

తోటిపిల్లలు నేను రానని చెప్పడము వలన వారు వెళ్ళిపోయారు. తర్వాత కొంత ఆలస్యమైనా పరవాలేదు చెప్పుకోవచ్చునని

బయలుదేరి వచ్చాను. స్కూలున్న ఊరు దగ్గర దగ్గరకు వచ్చాను. అంతలో ఇద్దరు యువకులు మోటరైసైకిల్లో

ఎదురయ్యారు. వాళ్ళు ఇద్దరు నేను పొయ్యే ఊరివారే. కమ్మకులానికి చెందిన వారు. వారు నా ప్రక్కనే ఆగారు.

ఏమి ఆలస్యము అని అడిగారు, నేను పలకలేదు. నాదారిన నేను వస్తున్నాను. అంతలో ఒకడు వెనుకనుండి వచ్చి

నానోరు మూశాడు, రెండవాడు కాళ్ళు పట్టుకొని ఎత్తి ప్రక్కనేవున్న కందిచేనులోనికి తీసుకెళ్ళారు. నోటిలో కర్చీఫ్ పెట్టి,

మొలత్రాడుతో చేతులు పైకిపెట్టి కట్టారు. అక్కడ కంపచెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోడ్డులోనికి ఏమి కనిపించదు.

తర్వాత ఒకడు మోటర్ సైకిల్వద్దయుండి, ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారము చేశారు. తర్వాత విషయము

తెలిస్తే ప్రమాదమని నన్ను నిర్ధాక్షిణ్యముగా గొంతు నులిమి చంపారు. శవాన్ని దారి ప్రక్కనే గల బావిలో వేశారు.


అలా వాళ్ళు నన్ను బలవంతముగా చంపారు. అయినా ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. మా

అమ్మ నేనే బావిలోపడ్డానని అనుకుంది. వాళ్ళు ఎలా చంపినా దేవుడు నన్ను సజీవముగానే ఉంచాడు. దేవుడు నన్ను

సజీవముగా, వారిమీద పగతీర్చుకొమ్మనే ఉంచాడనుకొన్నాను. తర్వాత కొన్నాళ్ళకే వారిద్దరినీ చంపేశాను. నన్ను


చంపింది కమ్మవాళ్ళే కనుక ఆ కులస్తులంటే నాకు కోపము. ఒక అమావాస్య దినమున ఈ రామన్న ఎద్దులబండిని

తోలుకుంటూ ఆ దారిలో వస్తుండము చూచాను. దారి ప్రక్కనే బావివుందని చెప్పానుగా! నేను అప్పుడప్పుడు అక్కడే

ఉంటాను. ఆ రోజు అక్కడే ఉండి రామన్నను చూచి చంపాలనుకొన్నాను. తర్వాత అతనేమి చేశాడు అని అనుకున్నాను.

రామన్న కమ్మవాడు కదా అందుకు వదలకూడదనుకున్నాను. అక్కడికి వస్తూనే బండిని వాటు పడేటట్లు చేశాను.

అక్కడ వాటుపడే అవకాశమే లేదు. అయినా పడిందే అనుకొన్నాడు. ఇతను ఒంటరిగా చాలాసేపు అక్కడే ఉన్నాడు.

మనుషులు వచ్చిన తర్వాత బండిని లేపుకొని పోయారు. బండివాటు పడినపుడు రామన్న కూడ క్రింద పడినాడు.

అప్పుడు కొద్దిగ మబ్బు వచ్చినట్లయినది (జ్ఞాపకము లేనట్లయినది) అప్పుడే నేను అతనిలో చేరుకొన్నాను. అప్పటి

నుండి ఇతనిలోనే ఉన్నాను. రామన్న క్రిందపడింది బావిదగ్గరే. నామాట నిజమా? కాదా? అనుటకు అతనికి

జ్ఞాపకము వచ్చిన తర్వాత అడగండి. ఇంకొక విషయము అతను మీకు చెప్పలేదు. అతను భార్యతో కాపురము

చేయడము లేదు. భార్యతో శరీరసంబంధము ఏమాత్రము లేదు. దానికి కారణము నేనే. అతని మగతనాన్ని నేనే

అనుభవిస్తున్నాను. అందువలన అతని భార్యతో రామన్నకు సంబంధము లేకుండ పోయింది. ఇతనికి ప్రతి బుధవారము

వాయువు వచ్చునట్లు చేయుచున్నది నేనేనని ఎవరికీ తెలియదు. అట్లు వచ్చుట వలన అది పైకి కనిపించు కారణమైనది.

దానివలననే ఇతని మగతనము పోయిందని అనుకున్నారు. ఇతను డాక్టర్లను అడిగితే వారు వాయువు వచ్చుటవలన

అలా అయినదని చెప్పారు. మీరు గొప్పవారు ఇప్పుడు మీరే చెప్పండి, నేను చేసింది తప్పా?


నేను :- తప్పని నేను చెప్పలేను. ఇపుడు ఏమి చేయదలచుకున్నావు.


సుబ్బలక్ష్మి :- నేను చేయవలసినది చేశాను. నన్ను చంపిన వాళ్ళను చంపాను. ఇతని విషయానికి వస్తే, భార్యకు

పసుపుకుంకుమ ఉంచాలను కున్నాను. నేను మనిషినే కదా! నాకూ కోర్కెలుంటాయి కదా! అందువలన నేను ఇతనిని

వదలను, అట్లని చంపను. మీరు ముందే నాకు సహాయము చేస్తానన్నారు. అందువలన నన్ను నా దారినుండి

తప్పుకొమ్మని చెప్పవద్దండి. దయచేసి నన్ను చెడ్డదానిని అనకుండ వదిలేస్తే, మీరు నాకు సహాయము చేసినట్లే.

నేను :- సుబ్బలక్ష్మీ నీవు చాలా తెలివైన దానివి. నేను నీకు మంచి చేసినా కొంత చెప్పేది ఉంది. నీకు ఒంటరిగా

తర్వాత చెప్పుతాను. ముందు నీవు లోపలికి అణిగిపోయి రామన్నను బయటికి పంపు అతనితో మాట్లాడాలి.

(సుబ్బలక్ష్మి అణిగిపోయి రామన్న బయటికి వచ్చాడు. అంతవరకు అక్కడేమి జరిగినది అతనికి తెలియదు. అంతవరకు

అతను నిద్రలోవుండి లేచాడు. అప్పుడు రామన్నను కొన్ని మాటలు అడిగాను)

నేను :- నీవు వడ్లు తీసుకొని పోయిన ఆ దారి ప్రక్కనే బావి ఉంది కదా! ఆ బావి దగ్గరే నీబండి పడినదా?

రామన్న :- దారి ప్రక్కన బావి ఉన్నమాట నిజమే, నేను అక్కడ పడినది కూడ నిజమే.

నేను :- నీకు మగతనము తగ్గిపోయిన మాట వాస్తవమేనా?

రామన్న :- నిజమే అయినా ఆమాట నేను చెప్పలేదు కదా! మీకెలా తెలుసు? డాక్టర్లకు చెప్పుకొనినా ప్రయోజనము

లేదు.

నేను :- రాత్రిపూట శృంగారమునకు సంబంధించిన స్వప్నాలు వస్తాయా?

రామన్న :- అవును వస్తుంటాయి.


నేను :- నీకు వాయి లేచినపుడు ఆ కొద్దిసేపు ఎలా ఉంటుంది.

రామన్న :- అది వచ్చేటపుడు, అలాగే వదలి పోయేటపుడు శరీరమంతా అదోరకము తిమ్మిరి ఉన్నట్లు తెలుస్తుంది.

మధ్య మధ్యలో ఏమీ తెలియదు.

(అక్కడ రామన్నను తీసుకువచ్చిన అతని బంధువులను బయటికి పొమ్మని చెప్పాను. అప్పటికే రామన్న బంధువులందరికి

రామన్న రోగము గురించి తెలిసిపోయింది. వారు సుబ్బలక్ష్మి చెప్పిన మాటలన్నీ వినుటవలన ప్రతి విషయము మనము

చెప్పకున్నా వారికి తెలిసిపోయింది. అందరు బయటికి పోయిన తర్వాత సుబ్బలక్ష్మిని తిరిగి పైకి రమ్మని చెప్పగా ఆమె

మళ్ళీ వచ్చింది.)


నేను :- సుబ్బలక్ష్మీ! నీకు చాలా అన్యాయము జరిగింది. అదియు చిన్న వయస్సులోనే జరగడము చాలా చింతించతగ్గ

విషయము. ఇంతవరకు జరిగిన దానిలో ఎక్కడా నీ తప్పులేదు. నీవు అడిగినట్లు నేను ఏమీ దండించడము లేదు.

అయినా దైవజ్ఞానము తెలిసిన మనిషిగా నీకు నేను కొంత చెప్పవలసియున్నది. జీవితము అంటే కష్టసుఖాల కలయిక.

అందులో ప్రతి మనిషి తన కష్టమును గురించో, సుఖమును గురించో చింతించుతూ కాలము గడుపుచున్నాడు. ప్రస్తుతము

నీవు కూడ నీకు కల్గిన కష్టమును గురించి చింతించుచు, దానికి ఒక ప్రతికారమనీ దానిలోనే నీ జీవితమును

గడిపేస్తున్నావు. ఇది సహజముగ, సర్వసాధారణముగ అందరికి ఉండునవే. అలా జీవిత కాలమును వృథా చేసుకోకుండ

మనిషి జీవితానికి ఒక అర్ధము, పరమార్ధము ఏర్పడాలంటే ఏ మనిషి అయినా దైవజ్ఞానమును తెలుసుకోవాలి. ఇపుడు

నీవు ప్రతీకారము మీద పెట్టుకొన్న శ్రద్ధను త్రిప్పి దైవజ్ఞానము మీద పెట్టుకో, చనిపోయిన తర్వాత జీవితము

కొంతమందికే ఉంటుంది. అలాంటి జీవితమును దైవమువైపు త్రిప్పుకొంటే, ప్రపంచములో బ్రతికేవారి కంటే,

సూక్ష్మప్రపంచములో బ్రతికే మీలాంటి వారు జ్ఞానమును, జ్ఞానశక్తిని ఎంతైన సంపాదించుకోవచ్చును. ప్రపంచము లో

బ్రతికే వారికున్న ఆటంకములు మీకుండవు. అందువలన నీవు దేవుని జ్ఞానమును సంపాదించుకో! జీవితమునకు

పవిత్రతను చేకూర్చుకో. అలాకాకుండ ఇప్పటివలె బ్రతుకుతూవుంటే, జీవితములో పాపాలు, పుణ్యాలు తప్ప ఏమీ

రావు. ఈ జన్మలో నీకు జరిగిన అన్యాయము, పోయిన జన్మలో నీవు చేసుకొన్న పాపమే. పాపపుణ్య పరంపరల వలన

సుఖదుఃఖాల గొలుసు జీవితము తప్ప ఏమీ ఉండదు. పాపపుణ్యాలను, కర్మను నిర్మూలించడానికి జ్ఞానము ఒక్కటే

ఆయుధమని తెలుసుకో. ఇప్పుడు నేను చెప్పిన మాటలను జీవితాంతము గుర్తుపెట్టుకో. అలా గుర్తుండుటకు నీవు

నేను చెప్పినట్లు మార్పుతో ఇప్పటినుండి ప్రవర్తించు. ఇంతవరకు లేనిది, నావద్దనుండి పోయిన తర్వాత ఉండవలసినది

ఏమంటే, నీవు ప్రతి బుధవారము రామన్నకు కల్గించు వాయువును నేటినుండి రానీయవద్దు. అది నీ చేతిలోని పనే.

నేను చెప్పిన విధానము నీకు సమ్మతమేనా?


సుబ్బలక్ష్మి :- స్వామీ! మీరు నా జీవితానికి కనువిప్పు కల్గించారు. నా జీవితములో మీ మాటను ఎప్పటికీ మరువను.

మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. అని చెప్పి ఆమె ఆ దినము వెళ్ళిపోయింది. తర్వాత సమాచారము తెలియదు.


ఒక మనిషి కాలమృత్యువును పొందితే మరుజన్మకూ, అకాల మృత్యువును పొందితే జీవితానికే పోవలసి వస్తుంది.

ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే, జీవుడు కర్మను అనుభవించేదానికే పుట్టుచున్నాడు. జీవుని చేత అనుభవింపబడే

కర్మ రెండు రకములుగా ఉన్నది. ఒకటి మానసిక కర్మ, రెండు శారీరక కర్మ. వాటినే ఇంకొక విధముగా చెప్పుకొంటే

సూక్ష్మకర్మ, స్థూలకర్మ అని కూడ అనవచ్చును. మానసిక కర్మ లేక సూక్ష్మకర్మ అనబడునది లోపలి సూక్ష్మశరీరముతో


అనుభవించునది. అట్లే శారీరక కర్మ లేక స్థూలకర్మ అనునది స్థూలశరీరము చేత అనుభవించబడునది. రెండు

రకముల కర్మలు మిశ్రమముగ ఉండువాడు, ఆయుస్సు అయిపోయి మరణము పొందును, దానినే కాలమరణము

అంటాము. ఒకవేళ శారీరక కర్మ (స్థూలకర్మ) ముందే అయిపోయి, కేవలము సూక్ష్మకర్మ మిగిలితే వానికి స్థూలశరీరము

అవసరము లేదు. మిగిలిన మానసిక కర్మను (సూక్ష్మకర్మను) సూక్ష్మశరీరముతో అనుభవించవలసి ఉండును. కావున

వానికి ఆయుస్సు అయిపోకముందే అకాల మరణము వస్తుంది. అకాల మరణములో స్థూల శరీరము పోయి సూక్ష్మశరీరము

మాత్రము మిగులును. ముఖ్యముగ చెప్పుకొంటే అకాలమరణము పొందిన వారిలో మరొక రకము వారు కూడ కలరు.

ఉదాహరణకు ఒకడు జన్మించిన తర్వాత 80 సంవత్సరములు బ్రతకవలసియున్నది. కానీ వానికి 20 సంవత్సరములకు

శారీరక కర్మ అయిపోయి,10 సంవత్సరములు మానసిక కర్మ అనుభవించి, తర్వాత 50 సంవత్సరములు శారీరక కర్మ

అనుభవించవలసి ఉన్నది. అటువంటి వాడు 20 సంవత్సరములకు అకాలమృత్యువు పొంది, అందరి దృష్ఠిలో చనిపోవును.

తర్వాత 10 సంవత్సరములు సూక్ష్మశరీరముతో (దయ్యముగ) ఉండును. 30 సంవత్సరముల వయస్సు తర్వాత, 50

సంవత్సరముల కాలము తిరిగి స్థూలశరీరముతో బ్రతకవలసియున్నది.


ఇక్కడొక ప్రశ్న ఎవరికైనా రాగలదు. అదేమనగా! 20 సంవత్సరముల తర్వాత స్థూలశరీరము ఎలా

వస్తుంది? అని అడగవచ్చును. దీనికి సమాధానము దొరకాలనినా, మరియు దొరికిన సమాధానము అర్థము కావాలనినా,

భూమిమీద జరిగిన కొన్ని యదార్థసంఘటనలను చూడ వలసిందే. అవి ఎలా జరిగాయనగా! క్రొత్తగా పెళ్ళైన జంట

ధర్మవరము శివానగర్ లోని తమ బంధువుల ఇంటికి పోయినారు. నాలుగురోజుల తర్వాత క్రొత్తజంటైన భార్య శేషమ్మ,

భర్త పోలయ్య అనంతపురము రావాలని ధర్మవరము శివానగర్నుండి బయలుదేరారు. కదిరి గేట్ దగ్గరనుండి రైల్వే

రోడ్ వెంట కాలినడకన నడుచుకొంటూ రైల్వేస్టేషన్ వైపు వస్తున్నారు. గేట్కు, స్టేషన్కు మధ్యలోనికి వచ్చిన తర్వాత

భార్యకు రాయితట్టుకొన్నట్లయి క్రిందపడింది. ముందుపోవుచున్న భర్త వెంటనే వచ్చి భార్యను లేపాడు. తర్వాత స్టేషన్కు

పోయి రైలెక్కి పోయారు. అప్పటికి దాదాపు పదిరోజుల తర్వాత భార్యకు కొద్దిగ ఆరోగ్యము సరిగ లేకుండపోయినది.

దానివలన ఆమె నాకు బాగలేదని ఎక్కువగ పడుకొనేది. అప్పుడప్పుడు డాక్టర్వద్దకు పోయి చూపించుకొని వచ్చేవారు.

ఇట్లు ఒక సంవత్సకాలము గడిచింది, భార్య శేషమ్మకు ఆరోగ్యము సరిగలేదని గ్రహించిన భర్త పోలయ్య పెద్ద డాక్టర్ల

వద్దకు తీసుకపోయాడు. అక్కడ కూడ ఆరోగ్యము కుదుటపడలేదని ఇతరుల సలహా ప్రకారము ఆమెకు మంత్రగాళ్ళవద్ద

తావెత్తులు కూడ కట్టించాడు. అయినా అప్పుడప్పుడు ఆరోగ్యము బాగాలేనట్లనిపించేది. చివరకు నావద్దకు రావడము

జరిగినది. నావద్దకు వచ్చిన తర్వాత శేషమ్మ శరీరములో మరొక సూక్ష్మశరీరమున్నట్లు నాకర్ధమైనది. ఒక శరీరములో

దాని సూక్ష్మశరీరము ఒకటి ఎప్పటికి ఉండుట సహజము. వేరొక సూక్ష్మ శరీరము చేరితే మొత్తము రెండు సూక్ష్మశరీరములు

శరీరములో ఉన్నట్లుగును. అలాంటపుడు నాడి కొట్టుకోవడములో తేడావుండును. దానినిబట్టి శరీరములో మరొక

సూక్ష్మశరీరమున్నదని అర్థమగును. అట్లున్న వారిలో శరీరము ఒకరి స్వంత ఇల్లుకాగ, మరొకరిది పరాయి ఇల్లగుచున్నది.

జన్మలో శరీరములో చేరిన జీవునికి ఆ శరీరము స్వంత ఇల్లుగ లెక్కించబడును. అలాగే ఒక జీవుడున్న శరీరములోనికి,

ఎవరైన వేరొక జీవుడు ఎప్పుడైన ప్రవేశిస్తే, వాడు పరాయి ఇంటిలోనికి వచ్చినట్లగును. అందువలన అకాల మృత్యువు

పొందిన వారికి శరీరము లేకుండ పోయింది కావున వారికి స్వంత ఇల్లు లేనట్లే.


శరీరముల విషయము వదలివేసి, బయటి ప్రపంచములోని మనుషులు నివాసము చేయు ఇళ్ళను గురించి

మాట్లాడుకొందాము. ఒకడు కష్టపడి స్వంత ఇల్లును సంపాదించుకొని దానిలో కాపురమున్నాడు. ఉన్న ఇల్లును బాకీల


బాధలకు అమ్మివేసి, ఇల్లును పోగొట్టుకున్నవాడు మరొకడున్నాడు. స్వంత ఇల్లున్న వానిపేరు వెంకటరాముడు. ఇల్లును

పోగొట్టుకొన్న వానిపేరు బికారి అంజయ్య. స్వంత ఇల్లున్న వెంకటరాముని ఇంటికి, ఇల్లులేని బికారి అంజయ్య

అప్పుడప్పుడు పోయివచ్చెడువాడు. ఒక దినము వెంకటరాముని ఇంటికి బికారి అంజయ్య వచ్చాడు. ఇంటిలో

వెంకటరాముని ప్రక్కనే అంజయ్య కూర్చొని ఉండగా, కాయకూరలమ్ముకొనే పుల్లయ్య వచ్చాడు. ఇద్దరినీ ఇంటిలో

చూచిన పుల్లయ్యకు ఎవరు ఇంటి మనిషో, ఎవరు బయటి మనిషో అర్థము కాలేదు. తర్వాత నెలరోజులకు కాయకూరల

పుల్లయ్య మళ్ళీ వచ్చాడు. ఆ దినము బయటిరూములో వెంకట రాముడు ఉండగా, లోపలి రూములో బికారి అంజయ్య

ఉన్నాడు. బికారి అంజయ్య కాయకూరల పుల్లయ్యతో మాట్లాడి కాయకూరలు తీసుకొన్నాడు. తర్వాత నెలకు మళ్ళీ

పుల్లయ్య కాయకూరలు తీసుకురాగ, ఆ దినము వెంకట రాముడు అసలుకు కనిపించలేదు. అంజయ్య మాత్రమే

ఇంటిలో ఉన్నాడు. ఆ దినము కూడ పుల్లయ్యతో అంజయ్యే మాట్లాడినాడు. ఈ విధముగ మూడుమార్లు చూచిన

పుల్లయ్యకు, బికారి అంజయ్యే ఇంటి యజమాని అని అర్థమైనది.


శరీర విషయములోను పరిశీలించితే అకాలమృత్యువు పొందిన వాడిని శరీరమను ఇల్లును పోగొట్టుకున్న

బికారి అంజయ్యగ చెప్పవచ్చును. అటువంటివాడు వెంకటరాముని ఇల్లును చేరి, కొంతకాలమునకు వెంకట రామున్ని

బయటికి గెంటివేసి, పుల్లయ్యకు తానే ఇంటి యజమానిగ కనిపించినట్లు, జన్మతో శరీరము పొందిన 'X' అను జీవున్ని,

మధ్యలో శరీరమును పోగొట్టుకొన్న 'Y' అను జీవుడు, శరీరమునుండి బయటికి పంపి 'Z' అను వానికి శరీరముగల

వానిగ కనిపించవచ్చును. సరిగా అదే విధానము భూమిమీద అక్కడక్కడ జరిగినట్లు కనిపిస్తున్నది. ఇక్కడ శేషమ్మ

శరీరములోనికి, భారతి అను మరొక సూక్ష్మశరీరము ప్రవేశించి, కొంత కాలమునకు శేషమ్మను బయటికి గెంటివేసి,

శేషమ్మ శరీరమును స్వంతము చేసుకొన్న విచిత్రమును ఈ సమాచారములో చూడగలరు.


శేషమ్మ శరీరములోనికి ప్రవేశించిన సూక్ష్మశరీరమును (దయ్యమును) బయటకు పిలిచి, అడిగినపుడు కొన్ని

తెలియని విషయములు బయటపడినవి. అవి ఏమనగా! ధర్మవరములో బంధువుల ఇంటినుండి బయలుదేరిన

శేషమ్మ, పోలయ్య రైల్వేలైను ప్రక్కన వస్తున్నపుడు ఆ దారిలోనున్న భారతి అను 20 సంవత్సరముల వయస్సున్న

యువతి, శేషమ్మను చూచింది. శేషమ్మకు ముందు నడుస్తున్న పోలయ్యను కూడ చూచింది. శేషమ్మ అలంకారమును

బట్టి క్రొత్తగా పెళ్ళైనదని గ్రహించింది. శేషమ్మను చూస్తూనే ఆమెలోనికి ప్రవేశించాలని అనుకొన్నది. శేషమ్మ వెంట

కొంత దూరము నడిచిన భారతి, శేషమ్మను క్రిందపడునట్లు త్రోచింది. ఆమె క్రిందపడి లేచేలోపల భారతి ఆమెలోనికి

చేరింది. అట్లు శేషమ్మ శరీరము లోనికి చేరిన భారతి, కొంతకాలము ప్రయత్నము చేసి చివరకు శేషమ్మ నిద్రలోనికి

పోయినపుడు బ్రహ్మనాడిలో చేరి శరీరమంతా వ్యాపించు కొన్నది. బ్రహ్మనాడిలో చేరిన భారతి సూక్ష్మశరీరము,

స్థూలశరీరమును ఆక్రమించుకొని చిన్నగ పోలయ్యతో శేషమ్మవలె నటిస్తూ మాట్లాడను మొదలు పెట్టింది. పైన

కనిపించు శరీరమును బట్టి పోలయ్య, భారతిని శేషమ్మే మాట్లాడుచున్నదని అనుకొన్నాడు.


శేషమ్మ శరీరములోనున్న భారతి కొంతసేపు మాట్లాడిన తర్వాత పోలయ్య తన భార్య శేషమ్మ దగ్గర ప్రవర్తించినట్లు

ప్రవర్తించాడు. భారతి పెళ్ళికాకముందే 17 సంవత్సరములకే చనిపోయింది. అంతవరకు పురుషుల స్పర్శ తగలని

భారతికి, పోలయ్య ముట్టుకోవడము క్రొత్త అనుభూతి అయినా అది ఆమెకు సుఖముగా తోచింది. భారతి ఆ విధముగ

మొట్టమొదట పురుషసంపర్క సుఖమును పొందినది. అప్పటినుండి శేషమ్మ శరీరములో శేషమ్మ కొంతకాలముండగా,

కొంతకాలము భారతి ఉండేది. మొదట శేషమ్మ నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆమె శరీరములోనికి దూరగలుగు


చుండెడిది. కాలము గడువగా, గడువగా భారతి ప్రయత్నము చేసి శేషమ్మను బలవంతముగా నిద్రలోనికి పంపేది.

అట్లు కొంతకాలము జరిగిన తర్వాత శేషమ్మను మెలుకువలోనికి రాకుండ చేసింది. ఆ విధముగా శరీరములో ఇద్దరూ

ఉన్నపుడు పోలయ్య నావద్దకు వచ్చారు. శరీరములో ఇద్దరున్నది తెలుసుకొన్న నేను, లోపల అణిగియున్న సూక్ష్మమును

మాట్లాడమని చెప్పగా శేషమ్మ శరీరమునుండి భారతియే మాట్లాడుచు నేను భారతిని మాట్లాడుచున్నానని, అప్పుడే

శరీరముపైకి వచ్చినట్లు మమ్ములను నమ్మించి మాట్లాడింది. పోలయ్య భార్య శేషమ్మ అని తెలిసిన నేను అప్పుడు చేరిన

భారతి మాట్లాడుచున్నదని, తర్వాత శేషమ్మ శరీరము మీదికి వస్తుంది అనుకొన్నాను. కానీ భారతియే ఎల్లప్పుడు

శరీరము మీద ఉన్నదని గ్రహించలేకపోయాను.


శేషమ్మ శరీరములో భారతి, శేషమ్మను బ్రహ్మనాడిలోనికి పోవునట్లు చేయుచుండుట వలన, శేషమ్మకు మొదట

ఆరోగ్యము బాగుండెడిది కాదు. చివరకు శేషమ్మ లోపలికి, భారతి బయటికి ఉండిపోవడము వలన కొంత ఆరోగ్య

సమస్య తగ్గింది. ఎవరైనా పైకి కనిపించు శరీరమునుబట్టి పలానా మనిషి అని గుర్తించగలము. అలాగే నేను కూడ

పైకి కనిపించు శేషమ్మ శరీరమునుబట్టి ఆమె శేషమ్మే అనుకొన్నాను. కానీ ఉన్నది భారతి అని గుర్తించలేకపోయాను.

నావద్దకు వచ్చిన పోలయ్య దంపతులను 9 దినములు అక్కడే నిద్రచేసి పొమ్మన్నాను. శేషమ్మగా కనిపించు భారతి

నన్ను చూస్తే వణికిపోతూ ఉంది. ఆమె కన్నులలో భయముతో కూడిన చూపు కనిపించేది. అమె ప్రవర్తనలో కూడ

కొంతమార్పు కనిపించేది. ఇవన్నీ గమనిస్తున్న నాకు, శేషమ్మ మీద కొంత అనుమానము వచ్చినది. ఒక దినము నీవు

ఎవరో చెప్పు అని అడిగాను. అప్పుడు నేను శేషమ్మను అని అబద్ధము చెప్పినది. నీవు శేషమ్మవు కాదు శేషమ్మ

శరీరములో తిష్టవేసి నన్ను కూడ మోసము చేశావు. ఉన్నదున్నట్లు చెప్పు లేకపోతే నీవెవరైనది నేనే చెప్పగలను అని

అనగా! అప్పుడు తాను భారతినని ఒప్పుకొన్నది. అంతేకాక శేషమ్మను శరీరములో అణచివేసి, శరీరమంతటిని తానే

ఆక్రమించుకొన్నాననీ, నేను భారతినని తెలియకుండ శేషమ్మనేనని పోలయ్యను కూడ నమ్మించి, అతనికి తానే భార్యగా

ఉన్నానని చెప్పింది. భారతి నన్ను కూడ మోసము చేసినందుకు నాకు చాలాకోపము వచ్చింది. ఆమె చెప్పిన మాటలనుబట్టి,

మొదట శరీరమును కబ్జా చేయక (ఆక్రమించుకోక) ముందే ఇంటిలోని వారిని, బయటివారిని, బంధువులను అందరినీ

బాగా గ్రహించగలిగింది. శేషమ్మ ఎవరితో ఎలా మాట్లాడేదో బాగా గమనించింది. అలాగే శేషమ్మ చేసే పనిని కూడా

కొంత నేర్చుకోగలిగింది. ఇలా అన్నిటిలోను తర్పీదు పొందిన తర్వాత శేషమ్మను శరీరము మీదికి రాకుండ నిద్రలోనే

అణిచివేసింది. శేషమ్మను అపస్మారక స్థితిలో లోపలే ఉండునట్లు చేసిన భారతి, ఎవరికి అనుమానము రాకుండ అన్ని

విధముల శేషమ్మవలె నటించను మొదలుపెట్టింది. కొన్నాళ్ళకు అంతా సులభమై పోయింది. నావద్దకు వచ్చినపుడు

పైకి వచ్చినట్లు నటించి తాను భారతినని చెప్పింది. అప్పుడు శేషమ్మ ప్రక్కకు పోయి భారతి వచ్చిందనుకొని పొరపాటు

పడినాను. తర్వాత నాకు అనుమానము వచ్చిన దానివలన చివరికి భారతి రహస్యము బయటపడింది.


ఈ విషయమునంతటిని విన్న భర్త పోలయ్య ఆశ్చర్యపోయాడు. కొన్నాళ్ళుగా దయ్యముతోనే కాపురము చేస్తున్నానని

తెలుసుకొన్నాడు. ఆమె మోసము చేసినందుకు ఇటు భర్తకు, అటు నాకూ ఇద్దరికీ భారతి మీద కోపము వచ్చింది.

శేషమ్మ శరీరమును వదలిపొమ్మని భారతికి గట్టిగా చెప్పాను. అంతేకాక నన్ను మోసము చేసినందుకు శిక్షగా ఒక 20

కేజీల బరువున్న రాయిని భారతి తలమీద పెట్టి, నేను ఇకచాలు అనేంత వరకు కూర్చొని లేవమన్నాను. ఆమె 20 లేక

30 మార్లకంటే ఎక్కువ కూర్చొని లేవలేదు, తర్వాత చేతకాదు, కావున భయపడి శిక్షను అనుభవించలేక శరీరమును

వదలి పోతుందని అనుకొని ఆ విధముగ చెప్పాను. ప్రక్కన రంగారెడ్డి అనే వ్యక్తిని పెట్టి, ఎన్నిమార్లు కూర్చొని లేచేది


లెక్కించమని చెప్పాను. ఆమె కూర్చొని లేస్తూనేవుంది రంగారెడ్డి లెక్కించుచునే ఉన్నాడు. లెక్కించే సంఖ్య 200 కు

చేరింది. ఒక ఆడమనిషి తలపైన బరువును మోస్తూ, రెండువందలమార్లు కూర్చొని లేవడమేకాక ఇంకొక వందమార్లయిన

లెక్కలేకుండ చేసేటట్లున్నది. అది చూచిన నేను ఇన్ని మార్లు ఎలా కూర్చొని లేవగలిగావు? అని అడిగినాను. అందుకు

ఆమె తాను చనిపోకముందు, బావులు త్రవ్వేపనికి పోతూవుంటిననీ, మెట్లమీద క్రిందినుండి పైవరకు 30 కేజీల

బరువుగల మట్టిగంపలను మోసేదానినని, అందువలన ఈ పని సులభమైనదని చెప్పింది. అది విన్న నేను శిక్షలు

ఈమెకు పనికి రావని అనుకొన్నాను. తర్వాత భారతికి ఒకమాట చెప్పాను. అదేమనగా! నీకు ఒక నెల దినములు

గడువు ఇస్తున్నాను. అంతలో నీవు శేషమ్మ శరీరమును వదలి ధర్మవరమునకే పో అని చెప్పి పంపాను.


నెల తర్వాత మళ్ళీ నాదగ్గరకు వచ్చినప్పుడు భారతియే శరీరము మీద ఉన్నదని గ్రహించిన నేను, శేషమ్మను

గురించి అడిగాను. శేషమ్మ చనిపోయిందని భారతి చెప్పింది. అప్పుడు ఆమె చేతి నాడిని పరీక్షించి చూచాను.

శరీరములో ఇద్దరున్నప్పుడు కొట్టుకొను నాడివలె కనిపించలేదు. దానిని బట్టి శరీరములో భారతి ఒక్కతే ఉందని,

శేషమ్మ చనిపోయినది వాస్తవమేనని అర్థమైనది. ఆ విషయము నాకు ఒక్కనికే తెలుసు, ఆమె భర్తకు తెలియదు. నేను

ఆ విషయమును గురించి మాట్లాడక భారతి పోయింది, శేషమ్మ ఉంది అని పోలయ్యకు చెప్పాను. ఇంతవరకు జరిగిన

భారతి విషయము శేషమ్మకు తెలియకూడదనీ, ఆమెకు జరిగిన విషయము ఏమీ తెలియదనీ, నీవు కూడ ఎప్పటికీ

చెప్పవద్దని చెప్పి పంపాను. అప్పటినుండి వారి సంసారము యధావిధిగా జరిగిపోయింది. వారికి నలుగురు పిల్లలు

కూడ పుట్టినట్లు తెలిసినది. కానీ ఇంతవరకు భారతితోనే కాపురము చేస్తున్నానని పోలయ్యకు తెలియదు.


ఇదంతా ఒక సినిమా కథలాగ ఉందికదా! అవును అలాగే అనిపిస్తుంది. ఎవరికి ఎలాగ అనిపించినా ఇది

30 సంవత్సరముల క్రితము యదార్థముగా జరిగిన సంఘటన. ఇది నమ్మశక్యము కాదు దయ్యాలు మనుషులలో చేరి

కాపురము కూడ చేస్తాయా! అని ఆశ్చర్యముగ మీరు అడుగవచ్చును. కాపురము చేయడమే కాదు పిల్లల్ని కూడ

కన్నారు. ఇదేదో అరుదైనది ఇలా ఎక్కడా జరుగదు అనుకోవద్దండి. ఇలా జరుగునవి భూమిమీద నూటికి ఒకటి నుండి

ఐదు కాపురాలున్నాయని చెప్పవచ్చును. కాపురాలేకాక వ్యక్తులు కూడ కొందరు అలాగే గలరు. ఉదాహరణకు

సత్యనారాయణరాజు అనే అబ్బాయి శరీరములోనికి, ఒక గొప్పవ్యక్తి యొక్క సూక్ష్మశరీరము వారమునకు ఒకమారు,

అదియు గురువారము దినమున ప్రవేశించి, ఒకగంటసేపు మాత్రముండి పైకివచ్చి మాట్లాడిపొయ్యేది. కొంతకాలానికి

సూక్ష్మముగానున్న గొప్పవ్యక్తి ఆ అబ్బాయి శరీరములో శాశ్వితముగా నిలిచిపోయాడు. పై శరీరమును బట్టి లోపల

నున్న వ్యక్తిని ఎవరూ గమనించలేదు. పిల్లవాడేనని హేళనగా మాట్లాడేవారు. చివరకు లోపలయున్న వ్యక్తే నేను

పలానావాడినని చెప్పినా కొందరు నమ్మలేదు. తర్వాత తాను బ్రతికియున్నపుడు మాట్లాడినవి, చేసినవి, ఇచ్చినవి

గుర్తుచేయగా కొందరు విశ్వసించారు. అలా ఒక బాలుని శరీరములో తనకు తానుగ చెప్పుకొన్న వ్యక్తి ఈ దినము

ప్రత్యక్షసాక్ష్యముగా పుట్టపర్తిలో సత్యసాయిగా ఉన్నాడు. ఆయనే షిరిడి సాయిబాబాగారు. షిరిడి సాయిబాబా ప్రత్యక్షముగా

సజీవముగా సత్యసాయిరూపముతో పుట్టపర్తిలో ఉండినా, అక్కడికి పోయి ప్రత్యక్షముగ ఆయనకు నమస్కరించక,

ప్రక్కన షిరిడి బాబాగుడి కట్టుకొని మ్రొక్కేవారున్నారు. దీనినిబట్టి చూస్తే చనిపోయిన బాబా ప్రత్యక్షముగ శరీరముతో

ఉన్నాడని చాలామందికి తెలియదని అర్థమగుచున్నది.


అనంతపురము జిల్లాలో ధర్మవరములో భారతి అను దయ్యము సాటి ఆడమనిషిలో ప్రవేశించి శాశ్వితముగా

ఉండి కాపురము చేసి పిల్లలను కన్నది. అలాగే అదే ధర్మవరములోనే ఒక మగమనిషి సూక్ష్మము మరియొక మగమనిషిలోనికి


చేరి, పెళ్ళి చేసుకొని ఒక కొడుకును కూడ కలిగియుండి, ఎవరికీ తెలియకుండ బాబు అని మొదటివానిపేరు మీదనే

జీవిస్తున్నాడంటే ఎంత విచిత్రమో చూడండి! వాస్తవముగా ఎవరైనా చెప్పినా ఇవి నమ్మశక్యము గాని విషయములే!

అయినా ప్రత్యక్ష సత్యములని చెప్పక తప్పదు. ఒక్క అనంతపురము జిల్లాలోనే, అదియు ఒక్క ధర్మవరము ప్రాంతములోనే

భారతి, బాబు, బాబా ముగ్గురి విషయము కనిపిస్తూవుంటే మనకు తెలియని విషయములు దేశములో ఎన్ని ఉ

న్నాయో? ఇదంతా విన్న తర్వాత నన్ను కొందరిలా ప్రశ్నించవచ్చును. మీకంటికి సూక్ష్మశరీరములు కనిపిస్తాయా?

కనిపించుట వలననే వీరు చచ్చినవారు, వీరు బ్రతికినవారని చెప్పగలుగు చున్నారా అని అడుగవచ్చును. నా జవాబు

ఏమనగా! మీకంటికి సూక్ష్మశరీరములు ఎలా కనిపించవో, అలాగే నాకు కూడ కనిపించవు. అలా కనిపించివుంటే

భారతి విషయములో మోసపోయేవాడిని కాదు కదా! అనుభవముతో పరిస్థితులను బట్టి, దైవజ్ఞానము మనవద్ద ఉ

న్నపుడు వారి ప్రవర్తనను బట్టి తెలుసుకొనుటకు వీలున్నదని చెప్పుచున్నాను.


ఇంతవరకు మనుషుల శరీరములనుండి వచ్చిన సూక్ష్మశరీరములకు సంబంధించిన కొన్ని వివరములు మాత్రమే

తెలుసుకొన్నాము. ఇపుడు దేవతా ప్రతిమల నుండి వచ్చిన సూక్ష్మశరీరముల యొక్క కొన్ని విషయములను

తెలుసుకొందాము. మనుషులకు సూక్ష్మశరీరములుండుననీ, వాటినే దయ్యములనీ, గ్రహాలనీ అంటామని తెలుసుకొన్నాము.

అట్లే ప్రతిమలకు కూడ సూక్ష్మశరీరములున్నాయనీ వాటిని దేవతలనీ, విగ్రహాలనీ అనవచ్చుననీ చెప్పుచున్నాము.

భూమిమీద రకరకాల మనోభావములు గల మనుషులు ఉన్నట్లు, ప్రతిమలలో కూడ అనేక రకముల మనో భావములున్న

విగ్రహములనబడు సూక్ష్మములు గలవు. మనుషులలో అందరూ మంచివారే లేనట్లు, దేవతలలో కూడ అందరూ

మంచివారే లేరు. దీనినిబట్టి దేవతలలో కూడ మనుషులలో ఉన్నట్లు, దుర్మార్గులు కూడ ఉన్నారని తెలియుచున్నది.

దేవతలను దుర్మార్గులని అంటారేమిటి? దుర్మార్గులు దేవతలెట్లవుతారని మీరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు

కావాలంటే ముందు ఒక విషయము తెలుసుకోవాలి. అదేమనగా విశ్వమును సృష్ఠించిన సృష్టికర్త ఒకడున్నాడు.

అతడే దేవుడు. దేవుడు రూప, నామ, క్రియ లేనివాడు. అంతేకాక సృష్టి, స్థితి, లయ కారకుడు కూడ దేవుడే. దీనినిబట్టి

జగతిలో సృష్టించబడిన ఇటు మనుషులుగానీ, అటు దేవతలుగానీ జీవరాసులు క్రిందకి వస్తారు. దేవతలకు కూడ

గుణములూ వాటి నడవడిక గలదు. వాస్తవమును విప్పి చెప్పితే మనుషులకంటే తెలివితక్కువవారు, మనుషులకంటే

దుర్మార్గులు, మనుషులకంటే కఠినమైనవారు దేవతలలో కూడ కొందరు గలరు. ఇక్కడ గమనించవలసినది ఏమనగా!

నేను దేవతలందరిని దుర్మార్గులనలేదు, కొందరిని మాత్రమే చెప్పుచున్నాను. దేవతలలో కూడ ఎంతో గొప్పవారు

కలరు. ఒక మనిషి చాలా విషయములలో మంచివాడని అనిపించుకొన్నప్పటికీ, కొన్ని విషయములలో మాత్రము

చెడ్డవాడని అనిపించుకొనుట చూస్తున్నాము. అలాగే కొందరు దేవతలు, కొన్ని విషయములలో సక్రమముగా

ఉన్నప్పటికీ, కొన్ని విషయములలో చెడుగా ప్రవర్తించుచుందురు. ఇప్పుడు ఒక మగ దేవత ప్రవర్తనను గురించి వివరిస్తాను.

దానిని చూచి ఆ దేవతామూర్తి దుర్మార్గుడో, సన్మార్గుడో మీరే యోచించి చెప్పవచ్చును.


ఒక దినము ఉదయము 9 గంటల సమయములో మా ప్రక్క ఇంటిలో కిరాయికి కాపురమున్న భీమక్క అనే

ఆమె ఏడుస్తూ వచ్చి, ఆమె భర్త బోయలింగన్నకు మంచములోనే కాలు, చేయి పడిపోయిందని, మూతి వంకరపోయి

మాట్లాడలేకున్నాడని, పైకి లేవలేకున్నాడని చెప్పింది. ఇంటి ప్రక్కనే ఉండుట వలన నిత్యము వారు నాకు కనిపించేవారు.

నా ఇంటి ప్రక్కన చిన్నపాకలో (కొట్టములో) కిరాయికి నివశిస్తున్నారు. ఆమె భర్త పేరు బోయలింగన్న. ముగ్గురు చిన్న

పిల్లలున్నారు. లింగన్న రోడ్డురోలర్ డ్రైవర్గా పనిచేయుచున్నాడు. అతను పెద్దత్రాగుబోతు, ఎక్కువ డబ్బులు సారాకు


ఖర్చు చేసెడివాడు. ఇంటిలో భార్య పిల్లలు చాలీ చాలని తిండితో కాలము గడిపేవారు. ఒకరోజు తిండిలేక పస్తున్నారు,

నేనే తిండిగింజలు ఇచ్చిన సందర్భము కూడ కలదు. వారిది స్వంత ఊరు గుంతకల్లు దగ్గర చిప్పగిరి అనుకుంటాను.

వారి బీదరికాన్ని ప్రత్యక్షముగ చూచిన వాడిని కనుక భీమక్క ఏడుస్తూ చెప్పినపుడు నాకు కూడ కొంత బాధగా అనిపించింది.

డాక్టర్ల దగ్గరికి పోయి చూపించుకొను స్థోమతవారికి లేదు. కావున లింగన్నను నావద్దకు తీసుకురమ్మని చెప్పాను.

అప్పుడు ఆమె ఇతరుల సహాయముతో లింగన్నను నావద్దకు తెచ్చారు.


లింగన్నను ఇతరుల సహాయముతో లేపి నాముందర కూర్చోబెట్టి పట్టుకున్నారు. అప్పుడు అతని నాడిని

చూడాలని లింగన్న కుడి చేయిని పట్టుకొన్నాను. అలా పట్టుకొని నాడిని గమనిస్తుండగా ఒక్కసారి వేగంగా చేయిని

లాగేసుకున్నాడు. ఎందుకలా చేశాడని లింగన్న వైపు చూచాను. అప్పుడు లింగన్న కనుగుడ్లు పెకలించి కోపంగా

నావైపు చూస్తున్నాడు. ఆ దృశ్యమును బట్టి లింగన్న శరీరము మీదికి ఎవరో వచ్చినట్లు తెలిసినది. అప్పుడు అతనికి

నాకు ఇలా సంభాషణ జరిగింది.

నేను :- ఏయ్! ఎవరు నువ్వు. ఎందుకలా చూస్తున్నావు. నీ చూపుకు భయపడను.

అతను :- ఏమిరా! నీవు ఎవరు అని నన్నే ప్రశ్నిస్తావా? కొద్దిగైనా భయము లేకుండ మాట్లాడుతావా? నేనెవరనుకున్నావు.

నేను :- నీ వెవరైతే నాకేమి. ఇక్కడికి వచ్చినవారు నాముందర భయభక్తులతో మాట్లాడుతారు. నీవు నన్నే భయము

లేదంటున్నావు. పైగా నేనెవరను కున్నావు అంటావా? నీవు చెప్పకనే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు కూడా నీకు మర్యాద

ఇచ్చి అడుగుచున్నాను, నీవు ఎవరో చెప్పు. లింగన్నను ఇలా ఎందుకు చేశావో చెప్పు?


(అప్పుడు అతను మాట్లాడిన మాటలను బట్టి, అతను భైరవుడు అని తెలిసింది. అతనిని మబ్బు భైరవుడు అని

కూడ అంటుంటారు. అతనికి నడిరాత్రి ప్రజలు పూజలు చేస్తారు. నల్లకోళ్ళు, నల్లమేకలను భైరవునికి బలి ఇస్తుంటారు.

అతనంటే ప్రజలకు చాలా భయము. మ్రొక్కుకున్నవారు తప్పక అతని మ్రొక్కుబడిని చెల్లిస్తుంటారు.) ఇక లింగన్న

విషయానికి వస్తే, ముందురోజు తాడిపత్రికి సమీపములోనున్న పుట్లూరులో డ్యూటీ చేశాడు. సాయం కాలము 7

గంటలకు కొంతత్రాగి, తాడిపత్రికి వచ్చేదానికి పుట్లూరులో బస్ స్టాండుకు వచ్చాడు. బస్సు ఆలస్యమైనది. 8 గంటలవరకు

చూచి తిరిగి ఊరులోనికి పోయి ఫుల్గా త్రాగి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి 10 గంటలైనది. బస్మిస్సయి పోయింది.

తాగిన మైకములో అతను తాడిపత్రి రోడ్డువెంట నడుచుకుంటూ వచ్చాడు. కొంత దూరము వచ్చిన తర్వాత, పుట్లూరుకు

దగ్గరగానే రోడ్డుప్రక్కనే వేపచెట్టు ఉంది. దానిచుట్టు అరుగు కట్టబడివుంది. అక్కడ వరకు వచ్చిన లింగన్న రోడ్డుప్రక్కనే

ఉన్న అరుగుమీద పడుకొన్నాడు. అలా అక్కడ నిద్రపోయిన లింగన్నను నడిరాత్రి గడచిన తర్వాత ఒక ఆడమనిషి వచ్చి

లేపింది. నిద్రమత్తు మరియు సారామత్తులో లేచిన అతనిని అక్కడకు వచ్చిన ఆడమనిషి తనకు ఇష్టమొచ్చినట్లు

క్రిందపడేసి కొట్టింది. ఆ దెబ్బలకు లింగన్నకు మత్తు అంతా వదలి పోయింది. ఆమె ఎవరో, ఎందుకు కొడుతావుందో

తెలియలేదు. చివరకు అతని జుట్టుపట్టుకొని, కట్టచుట్టు త్రిప్పి అతని మోకాళ్ళను ఆ కట్టకు కొట్టమని చెప్పి కొట్టించింది.

అట్లు కొట్టించడము వలన అతని మోకాళ్ళకు కొద్దిగ గాయములు కూడ అయినవి. అలా కొట్టి వదిలివేసింది. ఆమె

వదలిన వెంటనే లింగన్న పుట్లూరువైపు వచ్చాడు. అక్కడ కెనాల్ ఆఫీస్ దగ్గర తన తోటి డ్రైవర్ ఇంటికి పోయాడు.

లింగన్న వెంట కొట్టిన మనిషి కూడ వచ్చింది. లింగన్న వెనకే డ్రైవర్ ఇంటివరకు పోయింది. ఆమెను చూస్తునే డ్రైవర్

ఇంటికి పోయిన లింగన్న భయపడుచు తలుపు తట్టాడు. ఆ ఇంటి డ్రైవర్ తలుపుతీసి ఏమి లింగన్నా ఈ వేళప్పుడు


వచ్చావు అని అడిగాడు. అపుడు లింగన్న అక్కడే నిలబడుకొన్న ఆమె వైపు చేయి చూపి, ఈయమ్మ ఎవరు? నన్ను

కొట్టింది అన్నాడు. ఆ డ్రైవర్కు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరు, నిన్ను ఎవరు కొట్టారని అని అడిగి

ఇతని వాలకము చూచి, అతనికి భయము కలిగి పడుకొనేదానికి చాప, రగ్గు ఇచ్చి బయటే పడుకోమని తలుపులు

వేసుకొన్నాడు. లింగన్న తలుపులు తెరువమన్నా అతను తెరువలేదు. ఇంకొకమారు అక్కడకు వస్తే చంపేస్తానని చెప్పి

ఆమె వెళ్ళిపోయింది.


లింగన్నకు తెల్లవారేవరకు నిద్రరాలేదు. ఉదయము మొదటి బస్సుకు తాడిపత్రికి వచ్చి ఇల్లు చేరుకొన్నాడు.

రాత్రి క్రిందపడినపుడు మన్నుపట్టిన గుడ్డలు తీయించి, అతని భార్య స్నానము చేయించి, అన్నము పెట్టగా తిని

మంచము మీద పడుకొన్నాడు. రాత్రి జరిగిన విషయము భార్యకు కూడ లింగన్న చెప్పలేదు. మన్నుపట్టిన గుడ్డలు

చూచి, మోకాలి దెబ్బలు చూచి, త్రాగినమత్తులో ఎక్కడైన క్రింద పడివుంటాడని అతని భార్య అనుకున్నది. మంచము

మీద పడుకొన్న లింగన్న నిద్రపోయాడు. దాదాపు ఉదయము 9 గంటలకాలములో అతను ఉలిక్కి పడి మెలకువలోనికి

వచ్చాడు. మెలకువలోనికి వచ్చిన తర్వాత మంచము నుండి లేవాలని ప్రయత్నము చేశాడు. కానీ లేవలేక పోయాడు.

అప్పటికే అతని కాలు, చేయి పనిచేయడము లేదు. భార్యను పిలువాలన్నా నోరు పనిచేయలేదు. దానిని గమనించిన

అతని భార్య భీమక్క, నావద్దకు వచ్చి చెప్పడము, అతనిని నావద్దకు తేవడము, భైరవుడు మాట్లాడడము జరిగినది.

రాత్రి లింగన్న నావద్దకు వచ్చిన భైరవుని కట్టవద్దకు పోయాడు. లింగన్నకు అది భైరవుని కట్టయనిగానీ, త్రాగినవారు

అక్కడకు పోకూడదనిగానీ తెలియదు. చాలా కాలమునుండి త్రాగినవారు ఎవరు అక్కడికి పోయేవారు కాదు. అంతేకాక

రాత్రిపూట పూజ చేయువారు మాత్రము గుంపుగా అక్కడికి పోతారు. మిగతా దినములలో రాత్రిపూట ఒంటరిగా

ఎవరు పోరని ఇతరులు చెప్పగా విన్నాను. అటువంటి జాగాలోనికి రాత్రిపూట ఒంటరిగా, అదియు త్రాగిపోవడము

ఒక విధముగా తప్పే.


ఆ రాత్రి లింగన్న కట్టవద్దకు పోయిన సమయములో, భైరవుడు పుట్లూరులోనికి వచ్చాడు. లింగన్న పోయి

పడుకొన్న కొంతసేపటికి, భైరవుని భార్య అక్కడికి వచ్చి చూచి, లింగన్నను కొట్టడము జరిగినది. తర్వాత ఆమె డ్రైవర్

ఇంటి వరకు వచ్చిపోయింది. తెల్లవారిన తర్వాత భైరవుడు తన జాగా అయిన కట్టవద్దకు వస్తూనే, అతని భార్య రాత్రి

జరిగిన విషయమంతా చెప్పింది. అది విన్న భైరవుడు కోపముతో ఊగిపోయాడు. భయము లేకుండ నాకట్ట దగ్గరకు

త్రాగి వచ్చినవానిని వదలిపెట్టను. వానికి జరిగినది ఇతరులకు గుణపాఠము కావాలి అని భార్యకు చెప్పి బయలుదేరి

వచ్చాడు. అలా కోపముతో వచ్చిన భైరవుడు లింగన్నలోనికి దూరి, మెడలో నరమును అదిమి లింగన్నకు కాళ్ళు,

చేతులు, నోరు పడిపోయేటట్లు చేశాడు. అంతేకాక భైరవుడు నన్ను కూడ లెక్కచేయక, నేనంటే భయములేదా అని

అడిగాడు. తర్వాత అతను భైరవుడని, అతనికి చాలాకోపమని తెలిసింది. అయినప్పటికి లింగన్న తెలిసి చేసియుంటే,

లింగన్నది తప్పేనని మనము కూడ అనవచ్చును. కానీ లింగన్నకు అది భైరవుని స్థలమని, ఆ అరుగుమీద పడుకోకూడదని

తెలియదు. అలాంటపుడు లింగన్నది తప్పెలా అగును? అందువలన లింగన్న తరుపున భైరవునితో నేను వాదించడము

జరిగినది. ఆ వాదనను క్రింద చూడండి.

నేను :- లింగన్న తెలియక అక్కడ పడుకొన్నాడు. ఇది లింగన్న తెలిసి చేసిన తప్పుకాదు. తప్పుకాకున్నా అతనిని

కొట్టినారు. ఇదే పనిని మనుషులు చేసియుంటే వారి మీద క్రిమినల్ కేసు అయ్యేది.


భైరవుడు :- మేము చేసింది తప్పు అంటావా.

నేను :- ఎవరు చేసినా తప్పు తప్పే. న్యాయము, అన్యాయము అందరికీ ఒకటే ఉంటుంది.

భైరవుడు :- నన్ను పూజించే వాళ్ళను బాగా చూచుకొంటాను, నన్ను దూషించినా లేక నన్ను లెక్కచేయకుండినా వారిని

వదలకుండా శిక్షిస్తాను.

నేను :- ఆ పనిని మనుషులు కూడ చేస్తున్నారు. నీవు దేవునివని చెప్పు కొంటున్నావే, నీకు మనుషులకు ఏమి

తేడావుంది?

భైరవుడు :- నన్ను మనుషులతో పోల్చుతావా? నన్ను ఏమనుకుంటున్నావు?


నేను :- నిన్ను మనుషులతో కూడ పోల్చకూడదు. ఎందుకంటే మనుషులు తెలియక తప్పుచేసిన వానిని శిక్షించరు.

ఇట్లు చేస్తే తప్పు అని చెప్పుతారు, మీరు కొట్టినట్లు కొట్టడముగానీ, కాళ్ళు, చేతులు లేకుండ చేయడముగానీ చేయరు.

భైరవుడు :- నేను మనుషులు పూజించే దేవుడనని, నాకు శక్తులున్నాయని, భయము లేకుండ మాట్లాడుచున్నావు.

నేను :- నేను పద్ధతిగా మాట్లాడువాడిని కాబట్టి ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడినాను. అయినా నీవు నీ

మర్యాదను నిలబెట్టుకోకుండ నేను దేవున్ని, నన్ను అందరు పూజిస్తారు, నాకు శక్తులున్నాయి అంటున్నావు. ఎవడురా

నిన్ను దేవుడన్నది? ఏ జ్ఞానము తెలియని ప్రజలు అమాయకులై పూజిస్తే, నీవు నేనొక దేవున్ని అనుకొన్నావు. నాకు

శక్తులున్నాయి అంటున్నావు. ఆ మాటలు ఎవరి దగ్గర చెప్పాలో తెలియని మూర్ఖునివి. నేను ఎవరో నీకు తెలియక

మాట్లాడుచున్నావు. నీకు శక్తులుంటే ప్రజలకు మేలు చేయి. కీడు చేయడమా నీ పని? పూటకు కూడు సరిగలేని వ్యక్తి

మీద నీ ప్రతాపము చూపుతావా? నిన్ను దేవుడని అన్నవాణ్ణి ముందు కొట్టాలి. తర్వాత నిన్ను కొట్టాలి. అట్లయితే కానీ

మీలాంటి వారికి సిగ్గురాదు. కోళ్లు, మేకల కొరకు ప్రజలకు పని చేసి పెట్టేవానివి నీవు దేవునివా? ఎదుట మనిషి

ఎంతటివాడోనని తెలియక గర్వము, అహము రెండు మేళవించి మాట్లాడే వానివి నువ్వు దేవునివా? తెలియక చేసిన

పనిని తప్పుగా పట్టుకొని, ఇంతదూరము వచ్చి ఒక మనిషి కాళ్ళు, చేతులు పోగొట్టిన నువ్వు దేవునివా? రాత్రిపూట

రాక్షసత్వముతో నల్లకోళ్ళు, నల్ల మేకల మాంసము తినే నువ్వు దేవునివా? ఏమాత్రము దైవజ్ఞానము లేకుండ అజ్ఞానముతో

మాట్లాడు నువ్వు దేవునివా? ప్రజలను భయపెట్టి వారితో పూజలు చేయించుకొనే నువ్వు దేవునివా?

దేవుడెవరో తెలుసా? నిన్ను పుట్టించినవాడు దేవుడు. అసలైన దేవున్ని మరచిపోయి, నేను ఒక దేవున్ని అని

అంటున్నావంటే నీవు అజ్ఞానులలో పెద్ద అజ్ఞానివని తెలియుచున్నది. ఇప్పటికే నీవు పెద్ద పాపము చేసుకొన్నావు.

కనుక ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని, చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది, ఇతనిని (లింగన్నను) వదలిపో. ఇంతకంటే

ఎక్కువ చెప్పను.


భైరవుడు :- నన్ను ఇంతవరకు ఇట్లు ఎవరూ మాట్లాడలేదు. 80 సంవత్సరముల వయస్సు ముసలివారు కూడ నాకు

నమస్కరిస్తారు. నీవు చూస్తే 25 సంవత్సరముల పిల్లవానివి నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా? నేను అనుకొంటే.....

నేను :- ఏయ్! నోరు మూసుకో! ఇంతవరకు చెప్పిందంతా చెవిటి వాని ముందర శంకు ఊదినట్లున్నది. ముసలి

వాళ్లు నిన్ను మ్రొక్కితే నేను కూడ నీకు మ్రొక్కాలా? నీ యోగ్యత ఏమిటో నీకు తెలుసా? సరే నీవు అనుకొంటే ఏమి

చేయగలవు చెప్పు?


భైరవుడు :- ఇప్పుడు చెప్పను, రాత్రికి చూచుకో నీకేమౌతుందో? తెల్లవారే సరికి నీవేమౌవుతావో చూచుకో! (ఆ

మాటకు నాకు నవ్వువచ్చి నవ్వినాను). నవ్విన తర్వాత భైరవునితో ఇలా అన్నాను. "రాత్రికి నాకు ఏమౌతుందో, నీవు

ఏమి చేస్తావో అది తర్వాత జరుగబోవు విషయము. కానీ ఇప్పుడు ఇంతమంది ముందర చెప్పుచున్నాను. నీవు

పెద్దదేవునివే అయితే, నీవు భైరవునివే అయితే, నీకు మగతనముంటే, నీకు చేతనైతే, నీకు శక్తివుంటే నాకళ్ళలోనికి

చూడు” అన్నాను. అక్కడున్న అంతమంది ముందర ఆ మాట అనేసరికి పట్టలేని కోపముతో ఊగిపోతూ నావైపు

తీక్షణముగా చూచాడు. వెంటనే తల దించుకొన్నాడు. చేతగాని వానిమాదిరి ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను ఈ

విధముగా చెప్పాను. “ఇప్పుడు నేను చెప్పుచున్నాను విను. నీవు రాత్రికి నన్ను ఏమో చేస్తానన్నావు. కానీ నీకు పది

నిమిషములు మాత్రమే వ్యవధిస్తున్నా. పది నిమిషములలోపల నీవు ఇతనిని వదలి పోకపోతే, నీకు కాళ్ళు, చేతులు పని

చేయవు. ఇప్పుడు లింగన్నకు అయినట్లు నీకు అవుతుంది. పది నిమిషముల లోపల ఇక్కడి నుండి క్షేమంగా పోతావో,

లేక కుంటివానివై ఇక్కడే పడిపోతావో నీవే నిర్ణయించుకో” అని భైరవునికి చెప్పి, అక్కడున్న వారితో "లింగన్నను ఇంటికి

తీసుకొనిపోండి. పది నిమిషముల తర్వాత బాగా కాలేదంటే వచ్చి నాకు చెప్పండి” అని చెప్పి పంపించాము. పది

నిమిషముల తర్వాత లింగన్న భార్యవచ్చి ఇక్కడనుండి పోయిన తర్వాత రెండు నిమిషాలకే లింగన్న కాళ్ళు, చేతులు

బాగైనట్లు చెప్పింది.


ఇదంతా చదివిన తర్వాత ఇది నమ్మేవిషయమేనా అని కొందరికి అనుమానము రావచ్చును. మీరు నమ్మినా,

నమ్మకపోయినా యదార్థముగా జరిగిన విషయమునే చెప్పాము. చాలాచోట్ల ప్రజలను ఇబ్బంది పెట్టు ఇలాంటి

దేవతలున్నారని. కొందరు చెప్పుచుంటే విన్నాము. నొస్సనకోట సుంకలమ్మ అను దేవత గుడివద్ద రాత్రిపూట ఎవరు

ఉండకూడదట. అనంతపురము జిల్లాలో రామగిరికి దగ్గరగానున్న నొస్సనకోట అను ఊరి బయట సుంకలమ్మ

దేవాలయము కలదు. అక్కడ తెలియక పడుకొన్నవారు చనిపోయారు. ఏమి జరుగుతుందో చూస్తాము అని తెలిసిపోయిన

వారు తెల్లవారేసరికి చనిపోయారు. రాత్రిపూట ఆ దేవతదగ్గరకు ఎవ్వరు పోయేవారుకాదట. ఇలాంటివే మరికొన్ని

కూడ గలవు. మేము ఈ విషయములను నమ్మము అనేవారున్నప్పటికి, లింగన్నను వేధించిన భైరవులులాంటి వారు

ఎందరో ఉన్నారు. మేము నమ్మము అనేవాళ్లు దయ్యాలు లేవు, మనిషి కల్పనే దయ్యాలు అని మాట్లాడేవారు, ప్రత్యక్షముగా

జరిగిన సంఘటనలను పరిశీలించి సత్యమును చెప్పవచ్చును కదా! లింగన్న ఆ రాత్రి తన్నులు తిన్నది అబద్దమా?

ఉదయము కాళ్లు, చేతులు పడిపోయినది అబద్దమా? చెప్పిన తర్వాత పది నిమిషాలకు రోగమంతా నయమైపోయినది

అబద్దమా? మా అనుభవములో అన్నీ నిజమే. నేను భూతవైద్యము చేసేవాడినైతే, నా ప్రచారము కొరకు లేనిపోనివి

అన్ని చెప్పవచ్చును. కానీ నేను అటువంటి వైద్యుడను కాను. ఇప్పటికి 35 సంవత్సరముల క్రిందట, నేను దయ్యాలమీద,

దేవతలమీద చేసిన పరిశోధనలో, నాకు ఎదురైన వాటిని గురించి నేడు చెప్పుచున్నాను. నాకు ఇపుడు 60 సంవత్సరముల

వయస్సు దాటి 61 నడుస్తున్నది. నావృత్తి, ఉద్దేశ్యము అన్ని దైవజ్ఞానమును గురించే ఉంటాయి. అయినా నాకు తెలిసిన

సత్యమును చెప్పకపోతే, నా పరిశోధనలో నేను కనుగొన్న రహస్యములన్ని నాతోనే అంతరించి పోవును. అలాకాకుండ

గ్రంథరూపములో నా అనుభవములను ఉంచితే, ఏనాటికైనా సత్యము బ్రతికి ఉండునను ఉద్దేశముతో ఈ విషయములను

చెప్పుచున్నాము. అంతేగానీ నా ఉద్దేశములను బలవంతముగా ఇతరుల మీద రుద్దడముగానీ, నమ్మమని చెప్పడముగానీ

లేదు. ఇక్కడ కొందరు ప్రశ్న అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! భైరవున్ని మీరు చూడమన్నపుడు అతను

మీవైపు చూస్తూనే వెంటనే తలదించుకొన్నాడు, ఏమి మాట్లాడలేదు అన్నారు కదా! అప్పుడు భైరవునికి ఏమైంది? మీ

గొప్పతనము చాటుకొనేదానికి అలా వ్రాశారా? అని అడుగవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! అక్కడ


సందర్భానుసారము జరిగిన విషయము చెప్పకతప్పదు. భైరవుడు తలదించుకున్నాడు, అని అక్కడ అందరికి కనిపించినది

చెప్పాను తప్ప, భైరవునికి ఏమి కనిపించినదో, దానిని గురించి చెప్పలేదు కదా! అలాంటప్పుడు నాగొప్పతనమును

గురించి నేను చెప్పనట్లేగా? భైరవునికి ఏమి కనిపించినదో, ఇప్పటికి కూడ చెప్పలేదు. కావున నన్ను గురించి మీరు

ఆలోచించక, జరిగిన సంఘటనలోని సత్యమును తెలుసు కొమ్మంటున్నాను.


ఇంతవరకు ఒక మగదేవతను గురించిన విషయము తెలుసు కొన్నాము. ఇపుడు వివరించబోవు విషయము

ఒక ఆడ దేవతది. మాంత్రికులు ఆరాధించు ఆడ దేవతలలో గొప్పశక్తిగల దేవతలు కాళి, భగళాముఖి, కాటేరి మొదలగువారు

కలరు. అటువంటి వారిలో భగళాముఖిని ఒకవ్యక్తి గొప్పగ పూజించి, ఆమెను వశీకరణ చేసుకొని, ఆమె ద్వారా గొప్ప

మాంత్రికునిగ చలామణి అయ్యేవాడు. పుట్టపర్తికి చెందిన గౌతమరాజు అను వ్యక్తి, మంత్రవిద్యలో కొంత ఆరితేరినవాడై,

చివరకు భగళాముఖి అను క్షుద్రదేవతను ఉపాసించి తన వశము చేసుకొన్నాడు. మొండి దయ్యములను సహితము

విడిపిస్తానని, అయితే తన ఫీజు మాత్రము ఎక్కువగా ఉండునని ప్రచారము చేసుకొన్నాడు. ఎవరైనా దయ్యమును

విడిపించమని తనవద్దకు వస్తే, 35 సంవత్సరముల క్రితమే 1,108 రూపాయలను తన పారితోషికముగా తీసుకొనెడివాడు.

ఇప్పటి కాలములో దానివిలువ 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంత డబ్బులు ఎక్కువ తీసుకొంటే, అంత

గొప్ప వైద్యుడు అని మనుషులు అనుకొంటారు. అందువలన ప్రతిరోజు అతని వద్దకు ఒకటి రెండు దయ్యముల

కేసులు వచ్చేవి. డబ్బులు బాగా సంపాదించుకొన్నాడు. అతని వయస్సు 80 సంవత్సరములు దాటినది. తనవిద్య

తనతో పోకూడదని తన మనుమరాలుకు నేర్పించాడు. ఆమె పేరు ముత్యాలమ్మ. గౌతమరాజు తన మనుమరాలు

ముత్యాలమ్మకు, భగళాముఖిని వశము చేసుకొను విధానమును కూడ నేర్పించి, తనవలె పెద్దమాంత్రికురాలుగ

ముత్యాలమ్మను తయారు చేశాడు.


గౌతమరాజు వద్దకు, ఎవరైనా ఎక్కడాపోని మొండి దయ్యాన్ని తీసుకు వచ్చినా దానిని విడిపించి పంపేవాడు.

దయ్యమును విడిపించే సమయములో ముందు భగళాముఖి పూజపెట్టి, ఆ దేవతను అక్కడకు రప్పించి దయ్యమును

వదలించమని ఆదేశించును. అపుడు గౌతమరాజు ఆదేశము ప్రకారము భగళాముఖి ఆ దయ్యమును తరిమివేయును.

ఎటువంటి దయ్యమైనా భగళాముఖిని చూస్తూనే భయపడి వణికిపోయి, పట్టిన మనిషిని వదలి పొయ్యేది. భగళాముఖి

గొప్పశక్తిగల దేవత కావున ఏ దయ్యమైన ఆమెను చూస్తూనే చెప్పినట్లు విని పారిపోయేవి, తిరిగి వచ్చేవికావు. ఆ పని

చేసినందుకు గౌతమరాజు 1108 రూపాయలు డబ్బు తీసుకోవడమేకాక ఆదినము భగళాముఖి పూజకోసము 11

టెంకాయలు, 11 కర్జూరాలు,11 ఎండు కొబ్బెర చిప్పలు, 11 నిమ్మకాయలు, 11 తాంబూలములు అన్ని వచ్చిన

వారితోనే తెప్పిస్తాడు. దాని ఖర్చుకూడ వచ్చిన వారిమీద పడేది. ఇదంతా మంచి ఆదాయమున్న పనియే. డబ్బులు

పోయినా, గ్యారంటీగా పని జరుగుతుందని, దయ్యాల బాధలున్న ప్రజలు చాలామంది గౌతమరాజు వద్దకు వచ్చేవారు.

గౌతమరాజు మనుమరాలు ముత్యాలమ్మ భర్త, రైల్వేశాఖలో చిన్న ఉద్యోగి. చాలీచాలని జీతముతో ఇబ్బంది

పడేవారు. గౌతమరాజు పుట్టపర్తి నుండి వచ్చి, తాడిపత్రిలో మనువరాలు ఇంటిలో మూడు నెలలుండి డబ్బు సంపాదించడము

చూచి, ఆ విద్యను ముత్యాలమ్మ కూడ నేర్చుకొని దయ్యాలు విడిపించడములో తర్పీదు పొందినది. తర్వాత గౌతమరాజు

ఆరోగ్యము సరిగలేక పుట్టపర్తికి పోయి చనిపోవడము జరిగినది. క్షుద్ర దేవతలను వశము చేసుకొంటే, అవి తమ ఆజ్ఞ

ప్రకారము పని చేయాలంటే, వాటిని అప్పుడప్పుడు ఆరాధిస్తుండాలి. అంతేకాక కొన్ని నియములు పాటించాలి.

ఉదాహరణకు నీరు పారుచున్న కాలువను ఒక్క అడుగుతో దాటకూడదు. కాలువలో అడుగుపెట్టి పోయిన పరవాలేదు


కాని దాట కూడదు. అలాగే అమావాస్య, పున్నమి రోజులలో అద్దములో ముఖమును చూచుకోకూడదు. ఎప్పుడైనా

అన్నము తినే సమయములో ఉప్పు అని అనకూడదు. ప్రక్కన ఎవరైనా ఉప్పు అని అనినా అప్పుడు అన్నమును

తినకుండ వదలివేసి ఆ దినమంతా తినకూడదు. మూగవాని చేత ఇవ్వబడిన నీరు త్రాగకూడదు. సూర్య, చంద్ర

గ్రహణ సమయములలో మంత్ర జపము చేస్తూనే ఉండాలి. ఇలా కొన్ని నియమములుండును. ఈ విధముగా, ఒక్కొక్క

దేవతకు ఒక్కొక్క నియమముండును. ఆ నియమము లను పాటించకపోతే ఆ దేవత మాంత్రికుని వశమునుండి

తప్పించుకొని పోవును. అట్లు తప్పించుకొని పోవు దేవతలు తిరిగి తమని ఆ మాంత్రికుడు వశము చేసుకోకుండ,

అతనిని చంపివేయడమో లేక అంగలోపము చేసి పోవడమో జరుగును. మంత్రబలముతో తమను వశపరుచుకొని

తమ చేత పని చేయించాడని ఆ దేవతలకు కోపముండును. కావున అవి మంత్రగాళ్ళ వశమునుండి తప్పించుకొన్న

తర్వాత కొందరిని చంపివేశాయి, కొందరికి కాళ్ళు, చేతులు పని చేయనట్లు చేశాయి. కొందరికి నోటిలో శబ్దము

రాకుండచేసి, ఏమి మాట్లాడని స్థితికల్గించాయి. అందువలన మంత్రగాళ్ళు వారు తీసిన గొయ్యిలో వారే పడుదురని

నేను చాలామార్లు చెప్పాను.


అటువంటి పరిస్థితి ముత్యాలమ్మకు ఎదురైనది. భగళాముఖి ఎదురు తిరిగింది. సమయము దొరికితే

చంపేయాలని చూసింది. ఒకదినము మధ్యాహ్నము ఒంటిగంట సమయములో, ముత్యాలమ్మను భగళాముఖి గొంతు

పట్టుకొన్నది. అప్పుడు ముత్యాలమ్మ గట్టిగ అరిచి విడిపించుకోవాలని చూచింది. ఆమె పరిస్థితి చూచిన భర్త మరియు

చుట్టుప్రక్కల ఇళ్ళవారు గుంపుగా చేరారు. సరిగ ఆ సమయములోనే వారి ఇంటిముందు దారిలో నేను వచ్చాను.

అక్కడ గుంపు చేరుచుండడము చూచి, నేను ఆగి ఆ ఇంటిలోనికి చూచాను. ఆమె క్రిందపడి ఉండగా భర్త వీపుభాగమును

ఎత్తి పట్టుకున్నాడు. ప్రక్కవారు విసనకర్రతో విసురుచున్నారు. ఆమెకు శ్వాస సరిగ ఆడక ఇబ్బంది పడుతూవున్నది.

అప్పుడు ఒక్కనిమిషము గడచినా ఆమెకు శ్వాస ఆగిపోతుందని బయటకు అర్థమగుచున్నది. ముత్యాలమ్మకు నీరు

త్రాగించాలని, ప్రక్కన ఎవరో గ్లాసుతో నీళ్ళు పట్టుకొని ఉండడము చూచి, వెంటనే ఆ గ్లాసును నేను తీసుకొని అందులోని

నీరును చేతిలో పోసుకొని, ముత్యాలమ్మ ముఖము మీద చల్లడము జరిగినది. వెంటనే ఆమె శ్వాసను సులభముగా

తీసుకోవడము జరిగినది. అపస్మారక స్థితినుండి తేరుకుంది. నీరు ముఖము మీద చల్లుతూనే, పులిపంజాలో చిక్కిన

జింక ఒక్కమారు విడిపించుకొన్నట్లు భగళాముఖి పట్టునుండి ముత్యాలమ్మ బయటపడింది.


అంతవరకు ఆమె మాంత్రికురాలని నాకు తెలియదు. నేను నివాసమున్న ఇంటికి దగ్గరగానే ముత్యాలమ్మ

ఇల్లుకలదు. వారి ఇంటికి నాయింటికి కేవలము 40 మీటర్ల దూరమే కలదు. నా ఇంటినుండి 30 మీటర్ల దూరములో

కుడిప్రక్కకు మలుపుతిరిగితే ప్రక్కనే పది మీటర్ల దూరములో వారి ఇల్లుగలదు. ముత్యాలమ్మ తాతగారు మంత్రగాడనీ,

అతను దయ్యములను విడిపించు పనిచేసేవాడని తెలుసుగానీ, ముత్యాలమ్మ కూడ మాంత్రికురాలను విషయము నాకు

తెలియదు. ముత్యాలమ్మ ప్రమాద స్థితిలో ఉన్నపుడు, అనుకోకుండ కాకతాళీయముగా అక్కడికిపోయి నీళ్ళు చల్లినపుడు

ఆమె తేరుకున్న తీరును చూస్తే, అది ఏ రోగముకాదని అర్థమైనది. వెంటనే ఆ విషయమును ఆమె భర్తకు చెప్పగా!

మొత్తము విషయమంతా సవివరముగా చెప్పాడు. కొద్దిరోజులుగా ముత్యాలమ్మకు ఏదో వికృతా కారము కనిపిస్తున్నదని,

ఆమె చెప్పినట్లు కూడ చెప్పాడు. అప్పుడు అదంతా వారు పూజిస్తున్న భగళాముఖి పనియేనని నాకు అర్థమైనది.

అంతేకాక భగళాముఖినుండి ఆమెకు ప్రమాదము తప్పదని కూడ అర్థమైనది. వెంటనే ముత్యాలమ్మకు ప్రమాదము

తప్పదని ఆమె భర్తకు చెప్పాను. దానిని నివారించుకొనుటకు నీవు వెంటనే ఎవరైనా మంత్రగాళ్ళ వద్దకు పోయి ఏదైనా

శాంతి చేయించుకొమ్మని చెప్పాను.


మంత్రగాళ్ళను వెదుక్కొనే దానికి, అక్కడికి పోయేదానికి కనీసము రెండు రోజులైన పడుతుంది. అంతలో

ఏమైనా ప్రమాదము జరిగితే ఎలా అనీ, అతను నన్నే ఏదో ఒక నివారణ చేయమని అడిగాడు. దానికి నేను

ఒప్పుకోలేదు. “ మంత్రములు నేర్చిన మాంత్రికులకు క్షుద్రదేవతల శాంతి విధానము కూడ తెలిసియుంటుంది. మీరు

ఆ దేవతను శాంతపరుచు కొంటేనే అది మిమ్ములను వదలుతుంది” అని చెప్పాను. దానికి ముత్యాలమ్మ భర్త బాధపడుచు,

“మేము మాంత్రికుల వద్దకు పోవువరకు ఏమి జరగకుండ ఏదో ఒక ఉపాయము చెప్పండి” అని అడిగాడు. అప్పుడు

అతని బాధను చూచి, ఆమెకు ప్రమాదమున్నదని నేనే చెప్పాను కావున, సరే! మీరు పోవు వరకు ఏమి జరుగకుండ ఒక

రక్షణను మీకిస్తాను. దానిని దగ్గరుంచుకొన్నంత వరకు భగళాముఖి ముత్యాలమ్మ దగ్గరకు రాలేదని చెప్పి, ఒక

నిమ్మకాయను తీసుకొని దానిమీద సూదితో 'ఓం' అని వ్రాసి ఇచ్చాను. “ఇది నా చేతినుండి ఇచ్చాను. దీనిని ఆమె

నడుమువద్ద చీరలో చెక్కి పెట్టుకొమ్మను. ఆమె స్నానము చేయాలనుకొన్నప్పుడు దీనిని క్రింద పెట్టకూడదు. నీవు

చేతిలో పట్టుకొని ఆమె ప్రక్కనే నిలబడియుండు” అని చెప్పి పంపాము.


రెండవ దినము 'దక్షయజ్ఞము' సినిమా మొదటి ఆటకు పోయి ఇంటికి వచ్చాను. అప్పటికి రాత్రి పదిగంటల

టైమ్ అయివుంటుంది. అప్పటికి నేను ఒక్కడినే ఇంటిలో ఉండేవాడిని. నేను సినిమానుండి వచ్చినది చూచి, ప్రతిదినము

నావద్దకు జ్ఞానము వినే దానికి వచ్చే యువకుడు నా ఇంటిలోనికి వచ్చి ఏమైనా కడిగే పాత్రలున్నాయా అని అడిగాడు.

నేను అన్నము తిన్న తర్వాత కడిగిపెట్టుదువు అని చెప్పి, అన్నము తినేదానికి ప్లేట్ తీసుకొను సమయములో ముత్యాలమ్మ

భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ముత్యాలమ్మకు బాగాలేదని చెప్పాడు. నేను అన్నము తినే ప్రయత్నము ఆపివేసి ఆమెను

వెంటనే తీసుకురమ్మని చెప్పాను. నా ఇంటిలోని యువకుడు ఆమె భర్త పోయి ఆమెను తీసుకొని వచ్చారు. అప్పుడు

ఆమె కడుపునొప్పితో బాధపడుచున్నది. నేను ఇచ్చిన నిమ్మకాయ ఏమైనదని ఆమెను అడిగాను. ఐదునిమిషముల

ముందు నిమ్మకాయ పెద్ద శబ్దముతో పేలిపోయినట్లయింది. తర్వాత చూచుకొంటే నిమ్మకాయలేదు. వెంటనే నా

భర్తకు చెప్పాను. ఆ శబ్దమును నాభర్త కూడ విన్నాడు. తర్వాత నిమిషములోనే కడుపునొప్పి వచ్చిందని చెప్పినది.

ముత్యాలమ్మ చెప్పినది చూస్తే ఎందుకు శబ్దము వచ్చిందో, నిమ్మకాయ లేకుండ ఎక్కడికి పోయిందో నాకు ఏమీ అర్థము

కాలేదు.


అప్పుడు ముత్యాలమ్మకు వచ్చిన కడుపునొప్పి భగళాముఖి పనేనని అర్థమైనది. వెంటనే గ్లాసుతో నీళ్ళను

తీసుకొని, ఆ నీటిలోనికి నా కుడి చేతి చూపుడు వ్రేలిని అద్ది ఆమెకు త్రాగించాము. నీటిని త్రాగించిన వెంటనే

అదిగదిగో పోతున్నదని ఆమె గట్టిగ అరిచింది. ఆమెను కొంతనెమ్మది పరచి ఏమి పోయింది? ఏమి చూచావు? అని

అడిగితే, ఆమెకు కనిపించిన వికృతాకారమును గురించి చెప్పింది. ఆ సమయములో మేము కూర్చున్న రూము వాకిలి

తెరిచియుంచాము. ఆ వాకిలికి ఎదురుగా చూస్తే దారి మలుపు వరకు కనిపిస్తుంది. దారిమలుపు, మా ఇంటినుండి

దాదాపు 30 మీటర్ల దూరముంటుంది. ముత్యాలమ్మకు కనిపించిన ఆకారము 30 మీటర్ల దూరమును రెండు సెకండ్లలో

పోయినట్లు చెప్పింది. మలుపు తిరిగి పోయిన తర్వాత కనిపించలేదని చెప్పడము వలన వారిని ఇంటికి పోయి పది

నిమిషముల తర్వాత రండి! అంతలో అన్నము తింటాను. మీరు వచ్చిన తర్వాత రక్షణగా ఏదైనా ఇస్తానని చెప్పాను.

అక్కడున్న వారంతా వెళ్లిపోయారు. నేను తిరిగి ప్లేట్ తీసుకొని అన్నము పాత్రవద్దకు పోకనే పోయిన వారంతా తిరిగి

వచ్చారు. ఏమి వెంటనే వచ్చారని అడుగగ ముత్యాలమ్మ ఇంటివద్దకు పోయి తలుపు తెరుస్తూనే దేవుని మూల (వారు

పూజ చేసే గదిలో) బండలసందులో కొద్దిగ ఆ వికృతాకారము కనిపించిందని, వెంటనే తలుపులు మూసివచ్చామని


చెప్పింది. నాకేమో ఒకప్రక్క ఆకలిగా ఉంది, ఒక్క ప్రక్కనేమో ముత్యాలమ్మ సమస్య. ముత్యాలమ్మ మాటలు వింటూనే

భగళాముఖి మీద నాకు కొద్దిగ కోపము వచ్చింది.


ముత్యాలమ్మకు, ఆమెభర్తకు, నా ఇంటికి వచ్చిన యువకునికి ఈ విధముగ చెప్పాను. "ముత్యాలమ్మ కుడి,

ఎడమ ప్రక్కల మీరు ఇద్దరు నిలబడి ఇంటివద్దకు పోయి తలుపు తెరవండి. ఒక్కమారుగ ముగ్గురు ఇంటిలోనికి పోండి.

మీ వెనుక బారెడు దూరములోనే నేను వస్తుంటాను. మీరు లోపలికి బారెడు పోయేలోపల నేను వాకిలిలో నిలబడుతాను.

అప్పుడు భగళాముఖి ఎక్కడికి పోలేదు ఇంటిలోనే చిక్కుకుంటుంది. అది నాకు కనిపించదు నీకు కనిపిస్తుంది కదా?

అది ఎక్కడున్నది చెప్పుతూవుండు” అని ముత్యాలమ్మకు మిగతావారికి చెప్పి పంపి, నేను కూడ వారి వెనుక ఆరు

అడుగుల దూరములో ఉంటూ పోయాను. వారు ఇంటితలుపు వరకు పోయి, శబ్దము లేకుండ తలుపు తెరిచి,

ముగ్గురు ఒక్కమారు లోపలికి పోయారు. వారు లోపలికి పోయిన వెంటనే వాకిటిలో అడ్డముగ నిలబడా లనుకొని నేను

ముందుకు ఒకడుగు వేశాను. లోపలికి పోయిన ముగ్గురు కనిపిస్తున్నారు. అంతలో ముత్యాలమ్మ పెద్దగా వచ్చె అని

అరుస్తూ కుడి ప్రక్కనున్న యువకున్ని ప్రక్కకు త్రోసింది. ఆమె తన భర్తను ఎడమ ప్రక్కకు త్రోసి ఆమె కూడ భర్త

ప్రక్కకు ఒరిగిపోయింది. ఇదంతా ఒక్క క్షణములోనే జరిగింది. అప్పుడు నేను వాకిలికి నాలుగు అడుగుల దూరములో

ఉన్నాను. అలా పడిన వారు వెంటనేలేచారు. అంతలో నేను వాకిలిలో ఉన్నాను.


ఆమె లేచిన తర్వాత నన్నుచూచి, ఆమెకు కనిపించిన ఆకారము వేగంగా తమవైపు రావడముతో భయపడి,

అతన్ని త్రోసి మేము పడినాము అది బయటికి పోవడము కనిపించిందని ముత్యాలమ్మ చెప్పింది. నేనెంత ప్రయత్నము

చేసినా, భగళాముఖి దొరకకుండ తప్పించుకొని పోవడముతో భగళాముఖి మీద నాకు మరీ కోపము వచ్చింది. వారి

సమస్యను పట్టించుకోనని మొదట చెప్పిన నేనే, ఈ విధముగ జోక్యము చేసుకోవలసి వచ్చింది. ఆ సందర్భానుసారము

భగళాముఖిని తరిమివేయాలని నిర్ణయించు కొన్నాను. నేను లోపలికి పోయి వారి దేవుని మూలస్థలమును చూచాను.

అక్కడ మంత్రములను వ్రాసిన అడుగు విస్తీర్ణమున్న రాగిరేకులు కనిపించాయి. అవి భగళాముఖి మంత్రములని

వారిచేత తెలుసుకొన్నాను. తర్వాత వాటిని తీసుకొని పోయి నీరున్న బావిలో వేయమని చెప్పినాను. అంతలో ముత్యాలమ్మ

బయటికి చూడడము జరిగింది. అప్పుడు ఇంటి బయట వికృతాకారము నిలబడి ఉంది, అది ముత్యాలమ్మను చూచి

పైకి క్రిందికి తల అల్లాడించడము ఆమెకు కనిపించిది. ఆ వికృతాకారము ముత్యాలమ్మకు స్పష్టముగా కనిపిస్తున్నది,

కానీ అక్కడ ఎవరికీ కనిపించడము లేదు. ఆమె చూస్తున్న వికృతాకారము ఎలా ఉన్నది అని అడుగగా! ముత్యాలమ్మ

వివరముగా దాని ఆకారమును గురించి చెప్పింది. విశేషమే మంటే ఆ ఆకారమే భగళాముఖియనీ, ఆ ఆకారమునే

తాము ఇంతకాలము పూజించామని ఆమెకు తెలియదు. భగళాముఖి, ఇంటిలో నాప్రక్కన నిలుచున్న ముత్యాలమ్మను

చూస్తూ, తలను పైకి క్రిందికి నాలుగైదు మార్లు అల్లాడించినట్లు ముత్యాలమ్మ చెప్పింది. కనిపించే ఆకారము నోరు

తెరుచుకొని నాలుకను బయట పెట్టివుందనీ, అలా బయటకున్న నాలుక దాదాపు జానెడు పొడవు ఉందనీ, తల పైకి

క్రిందికి అల్లాడించినపుడు నాలుక దొమ్మలమీద తగిలినట్లు కనిపిస్తున్నదని చెప్పింది. అంతేకాక కన్నులు లైట్లు మెరిసినట్లు

మెరుస్తూ కనిపిస్తున్నవని చెప్పడము జరిగినది.


అప్పుడు ఆ ఆకారమును నీ ఇష్టమొచ్చినట్లు తిట్టమని ముత్యాలమ్మ కు చెప్పాను. నేను నీ ప్రక్కనే ఉన్నాను నీకు

ఏమీ భయము లేదు. చేతనైతే ఇప్పుడే రమ్మని, దానిని రెచ్చకొట్టినట్లు తిట్టు, అదివస్తే నా చేతిలో ఇరుక్కుంటుందని

చెప్పాను. నామాటలను విన్న ముత్యాలమ్మ ఇష్ట మొచ్చినట్లు తిట్టను మొదలు పెట్టింది. దాదాపు ఐదు నిమిషములసేపు


తిట్టినా, అది ఒక్క అడుగు కూడ ముందుకు రాలేదని చెప్పింది. ఇక తిట్టడము వలన లాభము లేదనుకొన్న నేను

ముత్యాలమ్మకు మరొక ఉపాయము చెప్పాను. ఈ మారు నేను నీ చేయి పట్టుకొని నీ వెంటనే వస్తాను. నేను రెడీ

అంటూనే, నీవు స్పీడ్గా పరిగెత్తి దాని దగ్గరకు పోయి దానిని ముట్టుకో! అది నాచేతికి దొరుకుతుందని చెప్పాను.

అట్లు మాట్లాడు కొన్న మేము ఒక్కమారు బయటికి పరుగెత్తడము జరిగినది. మేము వాకిలి దాటి బయటకు వస్తూనే,

అది దాదాపు అర్థకిలోమీటరు దూరము పోయినట్లు ఆమెకు కనిపించింది. మేము ఒక్కనిమిషము అటువైపు చూస్తు

నిలబడుకొన్నాము. నాకు అది కనిపించదు కావున ఆమె చెప్పడము వలననే అర్థమయ్యేది. ఆమె నా ప్రక్కనే చేయి

పట్టుకొని నిల్చున్నది. మమ్ములను చూచిన ఆ ఆకారము చూస్తున్నట్లే దూరము పోతూ, పోతూ చివరకు ముత్యాలమ్మకు

కనిపించకుండ పోయింది. ఆ విషయమును తెలుసుకొన్న నేను ముత్యాలమ్మకు ఆమె భర్తకు అది ఈ జన్మలో

మీజోలికిరాదు నిశ్చింతగా ఉండండని చెప్పి ఇంటికి పోయాను. ఈ తతంగమును చూచుటకు దాదాపు అక్కడ 30

మందిపైగా జనము చేరి ఉండిరి. తర్వాత కొన్ని దినముల వరకు వారంతా దానిని ఒక వింతగా చెప్పుకొనిచుండిరి.

అప్పటి నుండి ముత్యాలమ్మకు, భగళాముఖి పీడ లేకుండ పోయింది. వీటిని చూడనని ముందు రోజు చెప్పిన నేనే,

రెండవ రోజు చూడవలసివచ్చింది. దీనినిబట్టి అన్నీ కర్మ నిర్ణయము ప్రకారమే జరుగునని నిరూపణ అయ్యింది.


దేవతలను ఉన్నత స్థానములో కూర్చోబెట్టి మనిషి పూజలు చేస్తుంటే, ఆ మనిషినే దేవతలు ఎలా వేధిస్తున్నారో

భైరవ చరిత్రలోను, భగళాముఖి చరిత్రలోను కొంత అర్థమయ్యేవుంటుంది. దైవజ్ఞానము తెలియని ప్రజలకు దేవునికి,

దయ్యాలకు తేడా తెలియదు. అందువలన దయ్యాలను దేవుళ్ళనుకోవడము జరుగుచున్నది. మా లెక్కలో మనిషి

సూక్ష్మశరీరముగానీ, ప్రతిమ సూక్ష్మశరీరముగానీ రెండు దయ్యముల క్రిందకే జమకట్టబడును. నేడు దేవుళ్ళని పేరు

పెట్టుకొన్నవన్నీ దేవుడుకాదు. మనము పూజించే ఈ దేవతలకు గుణములున్నాయి, ఆకారములున్నాయి, పేర్లు

ఉన్నాయి. మనుషుల మాదిరి పేర్లు, ఆకారములున్న దేవతలు, మనుషుల గుణములకంటే హీనగుణము కల్గియున్నారని

చెప్పుటకు ఎన్నో తార్కాణములు గలవు. అందులో ఒక దానిని ఇప్పుడు మీ ముందు పెట్టుచున్నాను చూడండి.


కళ్యాణదుర్గములో హెూటల్ నడుపుకొను ఒక వ్యక్తి, ప్రక్కనే 15 కిలోమీటర్ల దూరములోనున్న స్వంత ఊరిలో,

కొన్ని సంవత్సరముల క్రింద "నేను కళ్యాణదుర్గములో హెూటల్ పెట్టుచున్నాను, నా వ్యాపారము బాగా జరిగితే నీకు

పొట్టేలును బలి ఇస్తానని” పెద్దమ్మ అను దేవతకు మ్రొక్కు కున్నాడు. అతను కళ్యాణదుర్గములో హెూటల్ పెట్టిన

తర్వాత రెండు సంత్సరములు వ్యాపారము సరిగా జరుగలేదు. కావున ఆ వ్యక్తి ఆ మ్రొక్కు బడిని మరచిపోయాడు.

హెూటల్ పనిలో నిమగ్నమైన దానివలన స్వంత ఊరికి కూడ పోలేదు. రెండు సంవత్సరముల తర్వాత హెూటల్ బాగా

పుంజుకున్నది. అలా నాలుగు సంవత్సరములు గడచిపోయాయి. ఆ వ్యక్తి పెద్దమ్మను మరచిపోయినా, పెద్దమ్మ

మాత్రము అతనిని మరచిపోలేదు.


ఒక దినము అతనికి గుండెలో నొప్పి వచ్చింది. డాక్టరును సంప్రదించితే, గుండెజబ్బు అని చెప్పి పెద్ద

హాస్పిటల్ కు పోయి చూపించు కొమ్మని చెప్పాడు. వెంటనే బంధువుల సమేతముగా అనంతపురమునకు వచ్చి పెద్ద

ఆసుపత్రిలో చేరిపోయారు. అక్కడ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించారు. కానీ ఆ పరీక్షలలో ఏ

లోపము కనిపించలేదు. ఆ వ్యక్తికేమో గుండెలో నొప్పి ఉన్నది. అతని బాధను చూచిన డాక్టర్లు కనిపించని లోపము

ఏదైనా ఉండవచ్చును. పదిహేను రోజులు మా ఆధ్వర్యములోనే ఉండాలి అని చెప్పారు. గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి

యాభై సంవత్సరముల పైనే వయస్సుంటుంది. అతని బంధువులందరు ఆస్పత్రికి వచ్చి చూచిపోతున్నారు. నాకు


దూరపు బంధువు ఒకరు అక్కడికి పోయి మనకు బంధువుగావున్న ఒకరు తాడిపత్రిలో ఉన్నాడు, అతనికి కూడ వైద్యము

తెలుసు, ఆయనతో ఒకమారు చూపిస్తే బాగుంటుందని అన్నాడు. అతను ఆ మాట చెప్పిన వెంటనే అతనితో సహా

ఆరుమంది వచ్చి నన్ను పిలువడము జరిగినది. సరేనని నేను అక్కడికి పోయి అతనిని చూడడము జరిగింది. గుండెకు

సంబంధించిన అన్ని రిపోర్టు సరిగ ఉన్నపుడు, ఆ వ్యక్తికి గుండె నొప్పి ఎందుకుంటుందని యోచించిన నేను, నాకున్న

అనుభవముతో ఆ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడిగాను.


నేను :- నీకు నొప్పి ఉంది అంటున్నావు. ఆ నొప్పి ఎక్కడ వచ్చిందో, మొదటి నుండి అక్కడే ఉందా? లేక కొద్దిగ

ఏమైనా ప్రక్కకు జరిగినట్లున్నదా?


ఆ వ్యక్తి :- మొదట వచ్చినట్లు ఒక్కచోటే లేదు. కొద్దిగ అటు ఇటు మారుచున్నది.

నేను :- నీకు కనిపించే నొప్పి ఒకే స్థాయిలో ఉంటుందా లేక ఎక్కువ, తక్కువ అగుచు పిండినట్లు, అదిమినట్లు ఏమైనా

కనిపిస్తుంటుందా?


ఆ వ్యక్తి :- ఎక్కువ తక్కువగా కూడ ఉంటుంది. మరియు అదిమినట్లు కూడ ఉంటుంది.

నేను :- నీవు దేవతలకు మొక్కుతుంటావా? ఎవరికైనా ఎదైనా ఇస్తానని మ్రొక్కుకున్నావా?

ఆ వ్యక్తి :- మేము పెద్దమ్మను ఎక్కువగా మ్రొక్కుచుంటాము. మా ఊరివద్ద నున్న పెద్దమ్మకు, హెూటల్ వ్యాపారము

గురించి పొట్టేల్ని ఇస్తానని మ్రొక్కుకొని ఉంటిని. రెండేళ్ళు వ్యాపారము ఏమీ జరగలేదు. తర్వాత బాగానేవుంది.

మూడవ సంవత్సరము పెద్దమ్మకు కోడిని బలి ఇచ్చివచ్చాను.

నేను:- నీవు ఇస్తానన్నది పొట్టేలు! ఇచ్చింది కోడి!! పెద్దమ్మ ఒప్పుకుంటుందా?

ఆ వ్యక్తి :- రెండేళ్ళు హెూటల్ జరుగలేదు కదా! అందుకని పొట్టేల్ని ఇవ్వలేదు. ఆయమ్మ మా కోరిక నెరవేర్చకుండినా,

నేను కోడిని కోసి వచ్చాను కదా!

నేను :- చెప్పింది ఒకటి, చేసినది ఒకటి. అందువలన పెద్దమ్మకు కోపము వచ్చియుంటుంది. ఆయమ్మ కోపము వలన

నీకు గుండెజబ్బు వచ్చిందేమో. ఇలా ఆస్పత్రికి డబ్బులు ఖర్చుపెట్టడముకంటే ఒక పొట్టేలుని పెద్దమ్మకు ఇచ్చేది

మంచిదని అనుకుంటున్నాను.

ఆ వ్యక్తి :- నాకు బాగవుతుంది అంటే, ఒకటేమిటి? రెండు పొట్టేళ్ళను ఇస్తాను.

నేను :- నీకు బాగవుతుంది అనే పూచినాది. ముందునువ్వు ఊరికి పోయి పెద్దమ్మకు ఇచ్చేది ఇచ్చిరా పో!

ఆ వ్యక్తి :- అయితే ఆ పని రేపుకాక ఎల్లుండి చేస్తాను. నువ్వుకూడ వస్తే మంచిదని పిలుస్తున్నాను.

నేను :- నీకు మంచిదే, నాకు మంచిదే. కానీ నేను వస్తే పెద్దమ్మకు మంచిది కాదు. అందువలన నేను రాకుంటేనే

పెద్దమ్మకు మంచిదవుతుంది. ఎల్లుండి ఆ కార్యము అయిపోయిన తర్వాత నీకు గుండెలో నొప్పివుంటే నన్ను అడుగు.

ఆ వ్యక్తి :- అయితే పెద్దమ్మే ఇట్లు చేసిందంటావా?

నేను :- నేను అట్లంటే నీకు బాగుండదు, పెద్దమ్మకు బాగుండదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి. నీ రోగము

గంటలోనే పోతుంది.


వ్యక్తి :- బంధువులను అందరినీ పిలుచుకొని ఎల్లుండి తప్పక ఆ కార్యమును చేస్తాను.


(అతను వెంటనే ఇంటికి పోయి ఆ కార్యమునకు తగిన ఏర్పాట్లు చేసుకొని, అతని మ్రొక్కుబడిని చెల్లించుకొని,

ఏమైన తప్పులుంటే క్షమించమని పెద్దమ్మకు మ్రొక్కుకొన్నాడు. అతనికి నేను చెప్పినట్లు గంటకే నొప్పి లేకుండ పోయింది.)


మనుషులకు ఏదైనా ఇస్తామని చెప్పి ఇవ్వకుండినా పరవాలేదు. ఒకవేళ ఒక మనిషి దగ్గర బాకీ చేసి ఇవ్వకుండినా

పరవాలేదు. కానీ ఒక దేవతకు ఏదైనా ఇస్తానని మ్రొక్కుకొని ఇవ్వకపోతే, వారు ముక్కుపిండియే కాదు కడుపుపిండి

అయినా, గుండెలు పిండిఅయినా వసూలు చేస్తారు. పైన చెప్పిన సంఘటనలో పెద్దమ్మ, ఒక వ్యక్తికి గుండెలు పిండి

తన పొట్టేలు బాకీని వసూలు చేసింది. ఇటువంటిదే మరొక సంఘటనను వివరిస్తాను చూడండి. ఈ సంఘటనలో

తన బాకీకోసము ఒక మనిషి కడుపును పిండిన సమాచారము గలదు చూడండి.


రైల్వే డిపార్టుమెంటులో గార్డుగా పనిచేయు గంగయ్యయాదవ్ అను వ్యక్తి, ఒక దేవతకు ఏదో మ్రొక్కుబడి

ఇస్తానని మ్రొక్కి, ఆ దేవతను మరచి పోయాడు. కొంతకాలము వేచిచూచిన ఆ దేవత ఇక లాభము లేదని ఏదో ఒకటి

పిండి వసూలు చేసుకోవాలనుకొన్నది. చివరికి కడుపుపిండి వసూలు చేయాలనుకొన్నది. ఆ విధముగా అనుకొన్న ఆ

దేవత, తన పనిని తాను చేసింది. కానీ కర్మబెడిసికొట్టి తానే చనిపోయింది. ఆ దేవత ఎలా చనిపోయిందో జాగ్రత్తగా

చూస్తాము. రైల్వేగార్డు గంగయ్యయాదవ్కు కొంత కాలమునుండి అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేది. ఆ కడుపు

నొప్పికి ఒక నియమము ఉండేది. అదేమనగా గంగయ్య డ్యూటిలో ఉన్నపుడు ఏమాత్రము నొప్పిరాదు. డ్యూటి అయిన

తర్వాత ఇంటిదగ్గర ఉన్నపుడే నొప్పి వచ్చేది. అదియు 20 దినములకో, 30 దినములకో ఒకమారు వచ్చేది.

ఒకమారు నొప్పి వచ్చిందంటే అర్థగంటనుండి ఒక గంటవరకు ఉండెడిది. కడుపునొప్పి ఉన్నంతసేపు భయంకరముగా

బాధ ఉండేది. గంగయ్య ఆ బాధను తట్టుకోలేక క్రిందపడి పొర్లేవాడు. అతనికి అంతనొప్పి వస్తున్నా, ఏ

కారణము వలన ఆ నొప్పి వస్తున్నదని తనకు ఏమాత్రము తెలియదు. ఆ కడుపునొప్పిని బాగుచేయించుకొనే దానికి

రైల్వే హాస్పిటల్లో కొన్ని నెలలుండినా డాక్టర్లకు ఆ నొప్పి అంతుబట్టలేదు. హాస్పిటల్లోనే కడుపునొప్పి వచ్చినా

డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆ నొప్పితో ఆయన బంధువుల ద్వారా నావద్దకు వచ్చాడు. వారు

కడుపునొప్పిని గురించి చెప్పినదంతా వినిన తర్వాత, నాకు తీరిక ఉన్న దినమును చూచుకొని ఆ దినము రమ్మని చెప్పి

పంపాము.


నేను చెప్పిన దినమున గంగయ్య, అతని బంధువులు పదిమంది వచ్చారు. గంగయ్యను నాముందర కూర్చోమని

చెప్పాము. అతను నాముందర కూర్చున్న తరువాత, ఇపుడు నీకు కడుపునొప్పి ఉందా అని అడిగాను. ఇప్పుడు లేదు,

ఎప్పుడు వస్తుందో చెప్పలేను అని గంగయ్య చెప్పాడు. సరే! ఎప్పుడో వచ్చే నొప్పిని ఇపుడు రమ్మని పిలుస్తాను. నొప్పి

వస్తే చెప్పు అని గంగయ్యకు చెప్పి తర్వాత గంగయ్య శరీరములోవచ్చు కడుపునొప్పి ఏదైనా ఇప్పుడు నాముందర

రమ్మని చెప్పుచున్నాను అని నేను తీక్షణముగా చెప్పడము జరిగినది. అలా చెప్పిన వెంటనే ఎదురుగా ఉన్న గంగయ్య

కడుపులో కదలికలు మొదలయ్యాయి. ఒక నిమిషము తర్వాత గంగయ్య కడుపునొప్పితో బాధపడుట మొదలుపెట్టాడు.

నీ కడుపులో నొప్పి ఎక్కడుందో అక్కడనే కరెక్టుగా చూపించు అన్నాను. నేను చెప్పిన మాటప్రకారము గంగయ్య

కడుపు మధ్యభాగములో బొడ్డుకుపైన చూపించాడు. అప్పుడు నేను అతను చూపించిన కడుపు భాగమును చూడడము

జరిగింది. నేను పది సెకండ్లు చూస్తూనే కడుపులోని నొప్పి అతని కుడి భుజములోనికి పోయింది. అలా నొప్పి


భుజములోనికి వచ్చిన సంగతి గంగయ్య చెప్పాడు. తిరిగి నేను భుజము మీదికి చూచాను. అక్కడ కూడ కొన్ని సెకండ్లలోనే

నొప్పి కనిపించకుండ పోయి, వెనక వీపు భాగములోనికి చేరినది. భుజములో నొప్పి లేదని వెనుక వీపులోనికి నొప్పి

చేరిందని గంగయ్య చెప్పాడు. వెంటనే అతనిని త్రిప్పి వీపు భాగములో చూడగా, అక్కడ కూడ మాయమైన నొప్పి అతని

ఎడమ మోకాలిలోనికి చేరినది. ఈ మారు అతను తన మోకాలిని చేతితో చూపాడు.


గంగయ్య నిజము చెప్పుచున్నాడా, అబద్ధము చెప్పుచున్నాడా అని నాకు అనుమానము వచ్చింది. నీకు నొప్పి

ఎక్కడున్నది తెలిసి చెప్పుచున్నావా, లేక అందాసుగా ఏమైనా చెప్పుచున్నావా, నీవు చెప్పేది అంతా నిజమేనా అని

అడిగాను. దానికి గంగయ్య "ఉన్నదున్నట్లు చెప్పుచున్నాను. లేనిది చెప్పవలసిన అవసరము నాకేమి వచ్చినది. నాకు

ఎప్పుడు వచ్చినా కడుపులోనే నొప్పి వచ్చేది. ఇంతవరకు ఎప్పుడూ ఇట్లు జాగ మారలేదు. పైగా ఇంత స్పీడుగా నొప్పి

మారడము ఎవరికీ జరిగి ఉండదు.” అని అన్నాడు. ప్రక్కనున్న అతని బంధువులు కూడ జరుగుచున్న సంఘటనను

చూచి ఆశ్చర్యపోతూ “కడుపునొప్పి వస్తే ఎప్పుడుగానీ ఇతను కూర్చోని మాట్లాడినది చూడలేదు. నొప్పి ఉన్నంతసేపు

క్రిందపడి పొర్లడడము, కడుపు పట్టుకొని ముడుచుకోవడము చూచాము. ఇంత నెమ్మదిగా మాట్లాడుచున్నది ఇప్పుడే

చూస్తున్నాము.” అన్నారు.


శరీరములోని నొప్పి ఒక్కచోట కూడ నిలబడకుండ, నాతో దోబూచులాట ఆడడము అది నీవు నన్నేమి చేస్తావు

అని వెక్కిరించినట్లున్నది. నాచూపుకు చిక్కకుండ మనిషి సూక్ష్మములు (దయ్యాలు) ఏవి అట్లు శరీరములో జాగాలు

మారలేవు. కొంతమంది దేవతలకే అది సాధ్యమగును. ఇదేదయినా మ్రొక్కుబడి దేవత అయి ఉంటుందని నాకు

ముందునుండి అనుమానమే. అది ఒకచోట నిలబడితే, దానిని బయటికి లాగి మొత్తము సమాచారమును

తెలుసుకోవచ్చును. అయినా అటువంటి అవకాశము ఇవ్వకుండ జాగాలు మారడము నాకు కొంత విసుగైనది. అయినా

విసుగుపడకుండ, ఓపికతో అతని మోకాలి వైపుచూచి "నీవు అక్కడే ఆగు! ఉన్న జాగాను మారవద్దు. ఈతూరి జాగా

మారితే, నీమీద నాకు కోపమొస్తుంది.” అని చెప్పాను. అయినా ఆ నొప్పి అక్కడ కూడ నిలువలేదు ఈమారు ఏకంగా

తలలో చేరింది. శరీరములో నొప్పి ఎక్కడికి పొయ్యేది గంగయ్యకు బాగా అర్థమౌవుచున్నది. కావున వెంటనే ఇప్పుడు

తలలోనికి వచ్చింది అన్నాడు. నేను వెంటనే తలవైపు చూచాను. అయినా ప్రయోజనము లేదు. ఈతూరి కొంత తేడా

కనిపించింది. పది లేక పదిహేను సెకండ్లకే ఉన్న చోటు నుండి తప్పించుకొనునది, దాదాపు ఒక నిమిషము వరకు

అక్కడే తలలోనే ఉండి, తర్వాత కడుపులోనికి చేరింది. గంగయ్య తిరిగి కడుపులోనికి నొప్పి వచ్చిందని చెప్పాడు.


ఆ మాట వింటూనే లోపల జాగా మారుచున్న విగ్రహము (దేవత) మీద తీవ్రమైన కోపము వచ్చింది. వెంటనే

నాకు తెలియకుండానే నా నోటివెంట ఒకమాట వచ్చింది. అటువంటి మాట నా జీవితములో ఆ దినముకంటే ముందుగానీ,

ఆ దినము తర్వాత ఇంతవరకుగానీ ఎప్పుడు వినలేదు. నా జీవితములో ఒక్కమారే వచ్చిన ఆ మాట ఏదనగా! “నాలోని

జ్ఞానాగ్ని నిన్ను భస్మీపటలము చేయుగాక” ఆ మాట బయటికి వస్తూనే దానిని విన్న నాకే కొంత ఆశ్చర్యమైంది. నానోట

ఆ మాట పలుకబడగానే ఎదురుగానున్న గంగయ్య శరీరములో అంతవరకు దొరకకుండ తిరిగినది ఏదైతేవుందో అది

ఒక్కమారు భగ్గున అంటుకొన్నది. శరీరములోపల అది అలా అంటుకొంటూనే, బయట గంగయ్య మంట,మంట అని

అరవను మొదలు పెట్టాడు. అగ్ని అంటుకొన్న మనిషి అరిచినట్లు అతను అరుస్తూ ఉంటే ఒక్కనిమిషము మాకు ఏమి

చేయాలో అర్థము కాలేదు. తర్వాత బకెట్లో నీళ్ళు తెచ్చి, గుడ్డలు తడిపి, అతని శరీరము మీద వేయను మొదలు

పెట్టాము. లోపల అంటుకొన్నది. శరీరమంతా పరుగెత్తుచుండుట వలన పైన గంగయ్యకు శరీరమంతా మంటలు


రేగిన అనుభూతి కల్గినది. నీటి గుడ్డలతో శరీరమును ఎంత తడిపినా అతను అరిచేది ఆపలేదు. అప్పుడు పైన

చేయుచున్న మా ప్రయత్నము వృథా అనిపించింది. అక్కడున్న అతని బంధువులకు ఏమి జరుగుచున్నదో ఏమాత్రము

అర్థము కాలేదు. ఏమైంది అని గాబరాగా నన్ను అడుగను మొదలుపెట్టారు. నేను వారికేమి జవాబు చెప్పలేదు. ఆ

విధముగా దాదాపు పది నిమిషములు గడచింది. అప్పుడు గంగయ్య శరీరములోని మంటలు అణిగిపోయాయి.

తర్వాత అతని శరీరములో ఏ బాధ కనిపించలేదు. అదంతా అక్కడున్నవారికి ఒక వింతగ కనిపించింది.


జరిగిన సంఘటన మాకు కూడ ఒక క్రొత్త అనుభవమును చేకూర్చినది. గంగయ్య శరీరములో కొంతకాలముగా

వేధిస్తున్న ఆ దేవత ఎవరోగానీ, ఎదురుగావున్న నన్ను నా జ్ఞానమును లెక్కచేయకపోవడము వలన అలా కాలిపోవలసి

వచ్చినది. మా జీవితములో ఒకే ఒక్కమారు జరిగిన ఆ అనుభవము నేను మరచిపోలేని గుర్తుగా మిగిలిపోయింది.

దైవజ్ఞానమంటే ఏమిటో, దానిశక్తి అంటే ఏమిటో తెలియనివారికి ఇదేదో కల్పనగా, కథగా అనిపిస్తుంది. ఎవరికేమనిపించినా

ఇది 35 సంవత్సరముల క్రిందటే జరిగిన యదార్థసంఘటన.


భూమిమీద జన్మను పొంది, ఒక పేరును కల్గియుండి, కొన్ని పనులు చేయుచున్న మనుషులుగానీ, దేవతలుగానీ,

ఇంకా ఎవరైనాగానీ వారికి చివరిలో మరణము కూడ కలదు. పుట్టుక నుండి మరణము వరకు ఎవరికైనా జీవితము

అనునది కలదు. పుట్టిన తర్వాత కొందరు తమ జీవితమును సార్థకము చేసుకొంటారు. కొందరు వ్యర్థము చేసుకొంటారు.

ఎవరు స్థారకము చేసుకొన్నారో, ఎవరు వ్యర్థము చేసుకొన్నారో వారివారి జీవిత చరిత్రలను బట్టి తెలుస్తుంది. జగతిలో

జీవితమును వ్యర్థము చేసుకొన్నవారు కోకొల్లలున్నారు. కానీ జీవితమును సార్థకము చేసుకొన్న వారు బహు అరుదుగా

ఉన్నారు. ఇప్పుడు గడుస్తున్న మన జీవితమును సార్థకము చేసుకోవాలంటే, గతములోని సార్థక జీవితమును పొందిన

కొంత మంది చరిత్రలను తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకోవాలనినా కొంతమంది మహానుభావులు గడిపిన

బాహ్యచరిత్రే అగుపించును. ఇక్కడ బాహ్య చరిత్ర అనగా వారు కనిపించు స్థూలశరీరముతో గడిపినదని అర్థము.

కానీ మనకు కనిపించని సూక్ష్మశరీరములతో గడిపిన ఎందరో మహాత్ముల చరిత్రలు కూడ కలవు.


దయ్యము అను పేరు వింటూనే ఏదో అసహ్యమైనదిగా కొందరు భావించుకొంటుంటారు. దయ్యము అను

పేరు మన జీవితములోని కొంత భాగమును తెలియజేయు పదము మాత్రమే. ఈ రోజు దయ్యమంటే ఏమిటో అని

భయపడువారు ఎందరో, రేపు దయ్యముగా జీవితకాలమును గడపవలసివస్తుంది. కావున దయ్యము అంటే ఏమిటో

తెలుసుకొని అది అంటరానిదో, వేరేజాతిదో కాదని, మనమే రాబోవు కాలములో దయ్యముగా మారగలమనీ, అలా

మారిన వారిలో ఎందరో గొప్పవారున్నారని తెలుసు కొందాము. దయ్యముగా మారిన జీవితములు కూడా ఎంతో

గొప్పవిగా, సార్థక జీవితముగా ఉన్నవని తెలుసుకొందాము. అటువంటి వాటిలో ఇప్పుడు కూడ జీవించియున్న ఒక

సార్థక జీవితము తీసుకొని వివరించుకొందాము.


అనంతపురము జిల్లాలో పెనుకొండను తెలియనివారుండరు. ఎందుకనగా ఆ గ్రామము కృష్ణదేవరాయల

కాలమునుండి చరిత్రగలిగినది. కావున చాలామందికి తెలిసే ఉంటుంది. పెనుకొండకు కేవలము ఏడు కిలోమీటర్ల

దూరములో ‘మావుటూరు' అను ఒక చిన్న గ్రామము గలదు. ఆ ఊరిలో నేను ఒక వారము దినములు ఉన్నాను. నేను

ఆ ఊరిలో ఉన్న సమయములో, అక్కడ చిన్నపిల్లలకు మెదడువాపు జ్వరములు ఎక్కువగా ఉండేవి. ఆ ఊరినుండి

మెదడువాపు జ్వరము వచ్చిన ఆరు సంవత్సరముల వయస్సున్న పాపను పెనుకొండ హస్పిటల్కు తీసుకుపోయారు.



అక్కడ మూడురోజులు చికిత్స చేశారు. అల్లోపతి చికిత్సకు ఆ రోగము నయము కాలేదు. ఇంకొక అర్థగంట కూడ

బ్రతకదు అని డాక్టర్లకు అర్థమైనది. అటువంటిస్థితిలో పాప బ్రతకదు, ఇంటికి తీసుకుపోండి అని చెప్పగ తల్లి తండ్రులు

ఇంటికి తెచ్చుకొన్నారు. ఇంటిలో బంధువులందరు పాపచుట్టు చేరి ఏడ్చుచున్నారు. ఆ ఊరిలో అందరికంటే

స్థోమతగానున్న కుటుంబము ఆ పాప ఇంటివారిదే. ఆ పాప మామ ఆ ఊరి ప్రెసిడెంట్గా పని చేయుచున్నారు.

ప్రెసిడెంట్ నాన్న అనగా పాప తాతగారు నావద్దకు వచ్చి పాపను కొద్దిగా చూడమన్నాడు. నేను డాక్టరునని ఆ ఊరిలో

కొందరికి తెలుసును. అందువలన ఆయనవచ్చి నన్ను పిలువడము జరిగినది. నేను బంధువుల ఇంటికి పోయినవాణ్ణి,

నాదగ్గర చికిత్స చేయుటకు ఏ మందులు లేవు. ఆ పెద్దమనిషి పిలిచినపుడు నేను రాను అంటే బాగుండదని పోయాను.

అక్కడ ఆ పాప అపస్మారక స్థితిలో (కోమాలో) ఉన్నది. కాళ్ళు చేతులు చల్లగై పోయాయి. శరీరములో వేడి తగ్గిపోయింది.

శ్వాస ఆడి ఆడక ఉంది. మొత్తము మీద ఆ పాప ప్రాణముతో ఉండినా, ఒక ఐదు లేక పది నిమిషములకంటే

ఎక్కువసేపు బ్రతకదనిపిస్తావుంది.


ఆ పాపను చూచి ఏదో ఒకటి చేయాలనిపించింది. వెంటనే ఆవాలను తెప్పించి, వాటిని పిండి చేయించి, ఆ

పిండిని నీటిలో కలిపి పెద్ద ప్లేటులో పోయించి, ఆ పాపను ఆ నీటిలో పడుకోపెట్టినాము. ఆ నీటితోనే తడువని

చోటంత తడిపాము. అలా చేసిన ఐదు నిమిషాలకే, ఆ పాప కళ్ళు తెరిచి చూచింది. శరీరమంతా వేడివచ్చింది.

శ్వాసకూడ బాగా ఆడను మొదలుపెట్టింది. చనిపోతుందనుకొన్న పాప బ్రతకడము, ఆ ఊరి వారందరికీ తెలిసిపోయింది.

దానితో అక్కడివారంత నన్ను పెద్ద వైద్యునిగా లెక్కించుకొన్నారు. పాప విషయము జరిగిన మూడురోజులకు నేనున్న

ఇంటికి కొద్దిదూరములోనే నిండుగర్భిణి మనిషికి ఆరోగ్యము బాగాలేదని, పలుకకుండ పడిపోయినదని, మీరు వచ్చి

చూడండి అని పిలిచారు. సరేనని పోయి చూస్తే, గర్భిణి మనిషి అయిన ఆమె పలకని స్థితిలో అపస్మారకములో

ఉన్నది. అప్పుడు నేను నీటిని ఆమె ముఖము మీద చల్లినాను. నీళ్ళు ముఖము మీద పడుతూనే వెంటనే జ్ఞప్తిలోనికి

వచ్చింది. తర్వాత లేచి కూర్చుంది. ఆమెకు కొన్ని నీళ్ళు త్రాపి ఏమి కాదులే అని చెప్పి వచ్చేశాను. ఆమె పరిస్థితిని

గమనించిన నాకు, అది అనారోగ్యము వలన జరిగినది కాదని, సూక్ష్మశరీరము యొక్క ప్రభావము వల్లనే జరిగిందని

అర్థమైనది. అయినా ఆ విషయము వారికి చెప్పకుండ వచ్చేశాను.


నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇరవైనిమిషములకు గర్భిణీ అయిన ఆమె వచ్చింది. ఆమెను కూర్చోమని చెప్పగా

ఆమె కుర్చీలో కూర్చొనక క్రింద కూర్చున్నది. సమయానికి మీరు వచ్చి చూచినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను

అని నాకు నమస్కరించింది. అలా నాకు నమస్కరించ కూడదు. నేను నీలాంటి మనిషినే, నమస్కారమునకు అర్హుడు

దేవుడు ఒక్కడేనని చెప్పాను. ఆ మాటవిన్న తర్వాత ఒక నిమిషమునకే మామూలుగా కూర్చున్న ఆమె ఒక ప్రక్కకు

కాళ్ళు వెనక్కు మడిచి కూర్చొని, తర్వాత తలమీద ముసుగువేసుకొని, తలక్రిందికి వంచుకొని కూర్చోవడము జరిగినది.

అలా కూర్చున్న తర్వాత “మీకు ధన్యవాదములు చెప్పుచున్నాను స్వామి!" అన్నది. అంతవరకు నన్ను స్వామి అని ఆ

ఊరిలో ఎవరూ అనలేదు. డాక్టరునని, సార్ అని అనే వాళ్ళు. ఆమె కూర్చున్న వాలకమును బట్టి, మాట్లాడే మాటనుబట్టి

మొదట వచ్చిన ఆమె కాదని నాకు అర్థమైనది. అప్పుడు నేను ఆమెను నీవు ఎవరు అని అడిగాను.


ఆమె :- స్వామి! నాపేరు అంబోజమ్మ. నేను మీ దగ్గరకు వచ్చిన గర్భిణీ మనిషిని కాదు.

నేను :- నీవు అలా కూర్చున్నపుడే నాకు అర్థమైనది. నీవు ఎవరివి, ఎందుకు వచ్చావు?


ఆమె :- నాది ఈ ఊరుకాదు పెనుకొండ. ఈమె పెనుకొండ బాబాగారి భక్తురాలు.

నేను :- బాబాగారు పుట్టపర్తిలో ఉన్నారు. నీవు పెనుకొండ బాబా అంటున్నావు. నీవు చెప్పే బాబా ఎవరు? పుట్టపర్తి

బాబా కాదా?

ఆమె : - పుట్టపర్తి బాబాగారు కాదు. పెనుకొండలోనే బాబా పకురుద్దీన్ గారిని, పెనుకొండ బాబయ్య అని ప్రజలు

అంటారు. ఈమె బాబా పకురుద్దీన్ గారి భక్తురాలు. ఈమె మీ దగ్గరకు వచ్చింది కదా, నేను కూడ మీతో మాట్లాడవలెనని

వచ్చాను.

నేను :- ఈమెది మావుటూరు, నీది పెనుకొండ. ఈమె నీకేమైన బంధువు అవుతుందా?

ఆమె :- ఈమె నాకు బంధువుకాదు. బంధువు కాకపోయినా మాకు బంధువు కంటే ఎక్కువ సంబంధము ఉంది. ఈమె

హిందువు, హిందువులు చాలామంది బాబయ్యగారి దగ్గరికి వస్తుంటారు. కానీ వారిలో ఈమె బాబయ్యగారికి పెద్దభక్తురాలు.

ప్రతి వారము పెనుకొండకు వచ్చి బాబాగారి దర్గాను దర్శించుకొని, ప్రదక్షిణలు చేసివస్తుంది. ఈమెకు బాబయ్యగారి

మీద ఎక్కువభక్తి ఉండుట వలన, ఈమె కూడ ఇంటిలోనే నమాజ్ చేస్తుంది. ఈమెకున్న ఇద్దరి పిల్లలకు ముస్లీమ్ల పేర్లే

పెట్టింది. తన పేరును కూడా మార్చుకున్నది.

నేను :- ఉన్న పేరును తీసి లేని పేరును ఎందుకు పెట్టుకున్నది?

ఆమె :- ఈమెకు పెళ్ళైయినప్పటినుండి ఈమెను ఒక దయ్యము పట్టి పీడించేది. దానివలన ఈమె కొంత అనారోగ్యముగ

ఉండేది. ఏ దేవతను మ్రొక్కినా ఈమెను ఆ దయ్యము వదలలేదు, ఆరోగ్యము బాగుపడలేదు. చివరకు బాబాగారి

దగ్గరకు వచ్చి కొన్ని రోజులు సేవ చేసింది. తర్వాత దయ్యము పోయింది. ఆరోగ్యము బాగుపడింది. అప్పటినుండి

దేవతలను వదిలివేసి బాబాగారినే ఆరాధిస్తున్నది. బాబాగారు పేరు మార్చుకున్నట్లు ఈమెకూడ మార్చుకొన్నది.

నేను :- బాబాగారు పేరు మార్చుకున్నారా?


ఆమె :- అవును, బాబాగారు కూడ మార్చుకొన్నారు. బాబాగారినే ఆదర్శముగా తీసుకొని, ఆమె కూడ అలాగే

మారింది. బాబాగారికి కూడ ఈమె మీద ఎక్కువ ప్రేమ. తండ్రిప్రేమకంటే ఎక్కువ ప్రేమను చూపుతుంటాడు.

అందువలననే ఈమెకున్న దయ్యమును వదిలించి ఏ దయ్యము ఈమె దగ్గరకు రాకుండ నన్ను కాపలా పెట్టాడు.

నేను :- నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థము కాలేదు. బాబయ్యను మ్రొక్కింది, ఆరోగ్యము బాగుపడింది సరే, ఈమె

పేరు మార్చుకొన్నది సరే అదీ ఈమె ఇష్టము, కానీ ఇక్కడ అర్థముకానిది, బాబయ్య ఈమెను బిడ్డకంటే ఎక్కువగా

ప్రేమిస్తున్నాడంటున్నావు కదా! అలా అయితే బాబయ్య ఇప్పుడు ఉన్నాడా? ప్రతి సంవత్సరము పెద్దగ ఉరుసు జరుగుతుందనీ,

ఆరోజు అక్కడే ఉన్న చెట్టునుండి చక్కెర రాలుతుందని విన్నాను. నేను ఎప్పుడూ అక్కడికి పోలేదు, చూడలేదు. ఆ

దర్గాను గురించేనా నీవు చెప్పునది?

ఆమె : - అవును, ఆ దర్గాను గురించే చెప్పుచున్నాను. బాబయ్యగారు దాదాపు ఐదు (500) వందల సంవత్సరముల

క్రిందట నుండి నేటికినీ ఉన్నాడు. పెనుకొండ దర్గాదగ్గరే ఉన్నాడు. మీకు అర్థము కాకపోతే వివరముగా చెప్పుతాను.

నేను :- బాబా ఎవరు? ముస్లీమ్ మతానికి చెందినవారిపేరు బాబా అని ఉండదు కదా! ఆయన ఇప్పుడు కూడ ఎట్లున్నాడు?

ఆయన వయస్సు ఎంత? ఆయన ఏమి చేస్తుంటాడు? ఆయన మనిషా? కాదా! అన్నీ వివరముగా చెప్పితే బాగుంటుంది.



ఆమె :- అన్నీ వివరముగా చెప్పుతాను. అన్ని విషయములు మీకు తెలిస్తే బాగుంటుంది. దాదాపు ఐదు (500)

వందల సంవత్సరముల క్రిందటి కాలములో తూర్పుగోదావరి జిల్లాలో క్షత్రియుల (రాజుల) కుటుంబములో సత్యంరాజు

అను వ్యక్తి పుట్టాడు. అతను దాదాపు నలభైసంవత్సరముల వయస్సులో ఇల్లు వదలి దైవజ్ఞానమును తెలుసుకోవాలని,

దానిని తెలుపు గురువు కొరకు అన్వేషణ చేస్తు ఊరు వదలి వచ్చాడు. ఆయనకు గురువు ఎక్కడ కనిపించలేదు.

తూర్పుగోదావరి జిల్లానుండి కాలినడకతోనే తిరుగుచు పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు,

చిత్తూరు జిల్లాలు అన్నిటిని దాటి, మూడు సంవత్సరములకు అనంతపురము జిల్లా పెనుకొండ ప్రాంతములోనికి వచ్చాడు.

ఆ విధముగా ఏడు జిల్లాలు దాటి వచ్చిన సత్యంరాజు చివరికి బికారిలాగ మారిపోయాడు. ఏది దొరికితే అది తిని,

ఎక్కడంటే అక్కడ పడుకొనేవాడు. ఒకరోజు పెనుకొండ కోటలోనికి పోయి అక్కడ దొరికింది తిని, కోటప్రక్కన కొండమీదనే

నీడ ఉన్నచోట కూర్చొన్నాడు. అప్పటి కాలములో పెనుకొండ కోటను ఒక సామంత రాజు పాలించుచుండెను. ఐదు

(500) వందల సంవత్సరముల కాలములో పెనుకొండ కోట, కృష్ణదేవరాయల వంశము వారిపాలనలో ఉండెడిది.

కోటలో ఉన్నవారు పెట్టింది సత్యంరాజు తిని కొండమీదనే ఒక చెట్టుక్రింద కూర్చొని నాకు గురువు దొరకడా? జ్ఞానము

తెలియదా? అని ఆలోచిస్తూ మనస్సులోనే బాధపడుచుండెను.


అంతలో ఒకమాట అతనికి వినిపించింది. “నీవు నావద్దకు రా” అని వినిపించగా, అతనికి ఏమి అర్థముకాక

చుట్టుప్రక్కల కలియచూచాడు. అతనికి ఎవ్వరు కనిపించలేదు. నన్ను ఎవరు పిలిచారు, ఎక్కడనుండి పిలిచారు అని

ఆలోచిస్తూ ఉండగా మరొక్కమారు అదేమాట వినిపించింది. ఆ శబ్దము వచ్చిన వైపు చూస్తే రెండు పెద్దరాతి గుండ్లు

కనిపించాయి. ఆ రెండు గుండ్ల మధ్యలో, మనిషి పోవుటకు కూడ ఇరుకుగా ఉన్న కొద్దిపాటి సందు కనిపించింది. ఆ

సందులోనుండి శబ్దము వచ్చినట్లు సత్యంరాజుకు అర్థమైనది. రెండు రాళ్ళ సందులోనికి బలవంతముగా దూరి

చూడగా కుడి ప్రక్కకు కొద్దిగ మలుపు తిరిగి ఉండెను. పైన మన్ను కప్పబడి ఉండగా, మలుపుతిరిగిన దారి ముందుకున్నట్లు

సత్యంరాజుకు అర్థమైనది. సత్యంరాజు ధైర్యముగ లోపలికి పోయాడు. దాదాపు నలభై అడుగుల దూరము పోయిన

తర్వాత దారి కుడి ప్రక్కకు తిరిగింది. అక్కడ పది అడుగుల పొడవు, అంతే వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుగల

బయలు కనిపించింది. ప్రక్కన నుండి చిన్న రంధ్రము ద్వారా వెలుతురు కూడ ఉన్నది. ఆ బయలులో మధ్యన ఒక

వ్యక్తి కూర్చొని ఉండడము కూడ కనిపించింది. ఆ వ్యక్తిని చూస్తూనే సత్యంరాజుకు కొద్దిగ భయమైంది సత్యంరాజు

భయమును చూచిన లోపలున్న ఆ వ్యక్తి, నీవు భయపడవద్దు నీవు వెతుకుతున్నది నన్నే అన్నాడు. అప్పుడు సత్యంరాజుకు

భయము ఏమాత్రము లేకుండ పోయి, ఏదో నిధి దొరకినంత సంతోషమైనది. వెంటనే సత్యం అతని కాళ్ళమీద పడి

నీవు ఎవరో మహానుభావునివి, నీకు కనిపించకుండినా బయటవున్న నన్ను పిలిచారంటే మీరే నా గురువు అని

అన్నాడు. అక్కడున్న వ్యక్తి చూచేదానికి పొడవుజుట్టు, గడ్డము కలిగి ఒక మహర్షిలాగ కనిపించుచుండినా తాను

ముస్లీమ్ మతములో పుట్టినవాడిననీ, అయినా హిందుమతములోని జ్ఞానమును తెలుసుకొని దానినే ఆచరించిన వాడిననీ,

అందువలన నాపేరు రెండు మతములకు సంబంధించి నదిగా ఉన్నదనీ, ముస్లీమ్ మతానికి గుర్తుగా సాయబ్ అనీ,

హిందూమతము నకు సంబంధించిన గుర్తుగా బాబాయని, రెండు కలిపితే “సాయబ్బాబా” అను పేరుతోయున్నానని

సత్యంకు చెప్పాడు. అంతేకాక సాయబాబా గారు, ఇలా మరికొన్ని విషయములు కూడ చెప్పాడు. నేను ఇక్కడే కొన్ని

సంవత్సరములు ధ్యానము చేశాను. నాలో ఎంతో శక్తి ఏర్పడినది. అయితే ఇస్లామ్ ఖురాన్లో చెప్పినట్లు, తోటి

మనుషులకు సహాయము చేయాలను కొన్నాను. అందువలన నేను ఇక్కడినుండి పోవాలనుకొన్నాను. ఇన్ని రోజులు

నీకోసమే వేచి చూచాను. ఇప్పుడు నీవు వచ్చావు. నాలో కల్గిన శక్తితో నేను మోక్షముకు పోవచ్చును. కానీ నేను


మోక్షమునకు పోకున్నా పరవాలేదు. ఆ శక్తిని ప్రజలకు ఉపయోగపడునట్లు దేవున్ని వేడుకున్నాను. దేవుడు నా నిస్వార్థ

కోరికను మన్నించి నాకోర్కె నెరవేరునట్లు ఆశీర్వదించాడు. నీవు కూడా భవిష్యత్తు కాలములో ప్రజలకు ఉపయోగ

పడుటకు నానుండి నీకు కొంతశక్తిని ఇస్తున్నాను. నీవు నా శక్తిని పొంది ఈ ఊరిలోనే ఉండిపో. నేను ఎంతో

కాలముగా ఉండిన ఊరు పెనుకొండ. కావున నీవు పెనుకొండ లోనే ఉండు అన్నాడు. అప్పుడు సత్యం, సంతోషపడుచు

ఇపుడు నా జీవితానికి ఒక గట్టు దొరికింది, మీరు ఎట్లు చెప్పితే అట్లే వింటానని అన్నాడు.


సాయబ్ బాబాగారు సత్యంరాజుతో ఇంకా కొంత విషయము చెప్పాడు. నీవు హిందూమతస్థునివి. నీవు నా

శిష్యునివి అయిన తర్వాత నీకు ఈ మతము పేరు ఉండకూడదు. అందువలన నేను రెండు మతాలకు సంబంధించిన

పేరు పెట్టుకొన్నట్లు, నీవు కూడ రెండు మతాలకు సంబంధించిన పేరుతో చలామణి కావలెను. నేను మొదట ఇస్లామ్

మతములోనివాడిని. తర్వాత హిందూ జ్ఞానమును తెలుసుకొని అనుసరించాను కావున ముందు ముస్లీమ్ పదము

“సాయబ్” తర్వాత, హిందూపదము "బాబా” అని పూర్తిగా సాయబ్బ్బా అని పేరు పెట్టుకొన్నట్లు, నీవు హిందూమతములో

పుట్టిన దానివలన ముందు హిందూ మతానికి సంబంధించిన పేరు 'బాబా' అనీ, తర్వాత ఇస్లామ్ జ్ఞానము ప్రకారము

నడుచుకొందువు కాబట్టి వెనుక ముస్లీమ్ పేరు 'పకురుద్దీన్' అని రెండూ కలిపి 'బాబా పకురుద్దీన్' అను పేరుతో

చలామణి కావలెను. నేను ముస్లీమ్ హిందువును కావున “సాయబ్బ్బా”ను, నీవు హిందూ ముస్లీమ్ కావున “బాబా

పకురుద్దీన్”వు! తర్వాత, ఇప్పటి నుండి నీవు ముస్లీమ్ మతస్థునిగానే కనిపించాలి. నేను ముస్లీమ్ మతములో పుట్టినా,

హిందూ మహర్షిగా కనిపిస్తున్నాను. అట్లే నీవు హిందూమతములో పుట్టినా ఇస్లామ్ పండితునిగా కనిపించాలి. అలా

ఉంటేనే నీకు నాశక్తి ఉపయోగపడుతుంది. అంతేకాక నీవు ఈ ఊరిలో ఎక్కడ ఉండవలసినది దేవుడే నిర్ణయిస్తాడు.

దానికి నీవు ఒక పని చేయాలి. అదేమనగా! నేను ఒక పుల్లను ఇస్తాను. ఆ పుల్లను తీసుకొని నీవు రాత్రిపూట

పడుకొనేటప్పుడు, తల ప్రక్క భూమిలో ఒక కొనను పాతిపెట్టి పడుకో. తెల్లవారి అది పైకొన చిగురించి ఉంటే అదే

నీ నివాసస్థలమని తెలుసుకో! నేనిచ్చిన పుల్ల చిగురించేంత వరకు ఈ ఊరిలో వేరువేరు జాగాలలో పడుకొనిచూడు.

తప్పక ఏదో ఒక స్థలము నీకు దొరుకుతుంది అని చెప్పి, సాయబ్బ్బా తాను పళ్ళు తోముకొన్న మిస్వక్ చెట్టు పుల్లను

ఇచ్చాడు. మిస్వక్ చెట్టును కొన్ని ప్రాంతములలో చక్కెర చెట్టు అని పిలుస్తారు.


అలా పుల్లను ఇచ్చిన సాయబ్బాబాగారు, సత్యంరాజుకు ముస్లీమ్ లలో సన్యాసిగా చలామణి కావలెనని,

క్రమము తప్పకుండ నమాజ్ చేసుకోమని, దేవుని మీద విశ్వాసము పెంచుకొమ్మని, ఇస్లామ్కు చెందిన జ్ఞానమును చెప్పి

ఇక పొమ్మని పంపాడు. అంతేకాక “నీవు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు. ఇక్కడ నేనుండను. ఇక్కడినుండి వెళ్ళిపోతాను”

అనికూడ చెప్పాడు. సాయబాబా దగ్గర ఆశీర్వాదము పొందిన సత్యమ్రాజు బయటికి వచ్చి పెనుకొండలో తిరుగుచు,

ప్రతి రాత్రి ఎక్కడ పడుకొంటే అక్కడ బాబాగారు ఇచ్చిన పుల్లను కొంత పాతిపెట్టి పడుకొనేవాడు. ఆ విధముగ కొన్ని

దినములు గడిచినవి. ఒక దినము పెనుకొండలోయున్న ఈశ్వర ఆలయములో సత్యంరాజు పడుకొన్నాడు. తెల్లవారి

చూచేటప్పటికి తల భాగములో పాతిపెట్టిన మిస్వక్ పుల్ల చిగురించి కనపడగా, ఆ దినమునుండి సత్యంరాజు అక్కడే

పడుకొనుటకు మొదలు పెట్టాడు. ఇతనితో పాటు కొందరు సాధువులు ఊరిలో బిక్షాటన చేసుకొని వచ్చి, రాత్రిపూట

ఆలయములో పడుకొనేవారు. అలా పడుకొను సాధువులు ఐదారు దినముల కంటే ఎక్కువ ఉండేవారు కాదు. సత్యంరాజు

మాత్రము ఎక్కడకూ పోకుండ ఆ శివాలయములోనే నిలిచిపోయాడు.


నేను :- నీవు చెప్పుచున్న విషయమంతా బాగానేవుంది. కానీ చిన్న సంశయము కల్గుచున్నది అడగమంటావా?


ఆమె : - అడగండి స్వామీ! మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి. ఏమిటా సంశయము?

నేను :- సత్యం రాజు గుహలోనికి పోయినపుడు, అక్కడ ఒక్క సాయబ్ బాబాగారు మాత్రము ఉన్నారు. మీరు

చెప్పినట్లు సత్యం మరియు బాబాగారు తప్ప ఎవరూ లేరు. అక్కడ వారిమధ్యలో జరిగిన విషయము ఏదైతే ఉందో

దానిని ఇటు సత్యంగాని అటు బాబాగాని చెప్పితేనే బయటివారికి తెలియును. వారు ఎవరికీ చెప్పకుండ ఉంటే ఎవరికీ

తెలియదు. అలాంటపుడు అక్కడ జరిగిన విషయమంతా పూసగ్రుచ్చినట్లు మీరు ఎలా చెప్పగల్గుచున్నారు?

ఆమె :- క్షమించండి, నేను ముందే చెప్పవలసిన విషయముంది కానీ చెప్పలేదు. నేను సత్యంరాజుకు స్వంత చెల్లెలవుతాను.

నాపేరు అంబోజమ్మ. మా అన్న సత్యం ఇల్లు వదలిరాకముందే నేను చనిపోయాను. అయినా జన్మకు పోలేదు. నేను

అప్పటినుండి ఉన్నాను, కానీ ఎవరికీ కనిపించను. మా అన్న ఇల్లువదలి వచ్చేటప్పుడు నేను కూడ అన్నవెంట వచ్చేశాను.

నేను కనిపించక ఉండినా, అన్న సత్యంకు ఎటువంటి హాని కలుగకుండ చూచుకొనే దానిని. ఆ విధముగ సత్యం

అన్నను వెంబడించి నేను కూడ గుహలోనికి పోయి, ఒక ప్రక్కనయుండి అన్నీ వినడమూ, అన్నిటినీ చూడడమూ

జరిగినది. అందువలన మీకు పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్నాను.

నేను :- సరే! ఇప్పుడు సంశయము తీరిపోయినది. మరొక సంశయము పుట్టింది. దానిని అడుగుచున్నాను. మీరు

చెప్పినది దాదాపు ఐదు (500) వందల సంవత్సరముల క్రిందటి విషయము. అప్పటినుండి మీరు సజీముగానే

ఉన్నారా?

ఆమె : - అవును. నేను సూక్ష్మముగ అప్పుడున్నట్లే ఇప్పుడూ ఉన్నాను. అలాగే సత్యం కొంతకాలమునకు చనిపోయి,

ఆయనకూడా నావలె సూక్ష్మముగా మారి సజీవముగానే ఉన్నాడు. ఇద్దరము కలసి దర్గాదగ్గరే ఉన్నాము. మాకు చావు

ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా ఇంకా ఎంత కాలము ఉండాలో తెలియదు.

నేను :- అయితే మీరు ఇద్దరూ స్థూలశరీరమును వదలి సూక్ష్మశరీరముతో ఉన్నారన్నమాట.

ఆమె:- అవును అలాగే ఉన్నాము.

నేను :- సత్యం రాజుగారు, శివాలయములో నిలిచిపోయాడు కదా! అక్కడ ఎంత కాలమున్నాడు? తర్వాత జరిగిన

విషయమును నీవే చెప్పాలి.


ఆమె : సత్యంరాజు గురువుగారైన సాయబ్బ్బాగారు చెప్పినట్లు పుల్ల చిగురించింది, కాబట్టి సత్యం శాశ్వతముగ

అక్కడే ఉండాలి. అదే విధముగ మూడు నాలుగు నెలలు గడిచినవి. ప్రతిదినము ఉదయము, సాయంత్రము సత్యమును

గమనించిన పూజారి, శాశ్వతముగ అక్కడే ఉండకూడదు, అప్పుడప్పుడు వచ్చి ఉండవచ్చునన్నాడు. ఆ పూజారిమాటను

సత్యం వినలేదు. ఒక దినము పూజారి వచ్చి, నీ పేరు ఏమి అని అడిగాడు. అప్పుడు సత్యం నాపేరు సత్యంరాజు అని

చెప్పకుండ, బాబాఫకురుద్దీన్ అన్నాడు. ఆ మాటవింటూనే పూజారికి మరింత కోపము వచ్చింది. ఈ గుడిలోనికి

సాధువులు, సన్యాసులు రావచ్చు, పోవచ్చు కానీ నీవు ఒక ముస్లీమ్ ఫకీర్పు! లోనికి రాకూడదు అని పూజారి అనగా

అందుకు బాబా ఫకురుద్దీన్ (సత్యమ్) ఇది మా గురువుగారు ఆజ్ఞప్రకారము ఇది నా స్వంత స్థానము. ఇక్కడినుండి నేను

బయటికి పోను అన్నాడు. ఈ విధముగ పూజారి గుడి నాది నీవు బయటికి పో! అని అంటాడు, బాబయ్య ఈ స్థానము

నాది నేను పోను అంటాడు. అట్లు కొంతకాలము జరిగినది. గుడికి వచ్చినవారు అనారోగ్యములను బాబయ్యకు


చెప్పితే, ఆయన తన గురువు ఇచ్చిన శక్తితో నయము చేసి పంపేవాడు. ఆ విధముగా గుడిలో బాబాగారికి కొంత

పరపతి పెరిగినది.


ఈశ్వరాలయములోని పూజారికి, బాబా పకురుద్దీన్ (సత్యమ్రాజు) ప్రక్కలో బల్లెమువలె తయారైనాడు. ఒకనాడు

పూజారికి, బాబాను మోసము తోనైన చంపాలని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత ఒకదినము విషమును కలిపి

గారెలును తయారుచేసి, ఇతరుల చేత బాబాగారికి చేరునట్లు చేశాడు. రాత్రికి తిని, ఉదయానికి చనిపోవాలని

ఉద్దేశముతో సాయం కాలము గారెలు బాబాగారికి ఇచ్చునట్లు చేశాడు. ఎవరు ఏమి ఇచ్చిన బాబాగారు తినేవాడే.

అందువలన సులభముగ ఫథకము నెరవేరు తుందని పూజారి అనుకొన్నాడు. కానీ ఆ దినము బాబా పకురుద్దీన్

తాను తీసుకొన్న గారెలును ప్రక్కనపెట్టి పడుకొన్నాడు. ఆ దినము నడిరాత్రి సమయములో పూజారికి కడుపునొప్పి

వచ్చింది. ఆ రాత్రంతా పూజారి విపరీతముగ బాధపడిపోయాడు. ఉదయాన్నే వచ్చిచూస్తే, బాబాగారికి ఏమీకాలేదు.

పూజారికి ఆశ్చర్యమైంది. రోగగ్రస్తులకు బాబా మంత్రము చదివో, ఏదైనా మందు ఇచ్చో బాగు చేసేవాడు. కావున

పూజారి కూడ బాబయ్య దగ్గరికి పోయి కడుపునొప్పి పోయేదానికి మందు ఇమ్మన్నాడు. అప్పుడు బాబా తనవద్ద ప్రక్కన

పెట్టుకొన్న గారెలు ఇచ్చాడు. ఇవి తింటే కడుపునొప్పి పోతుందని చెప్పాడు. వాటిని చూస్తూనే పూజారికి విషము

మతికి వచ్చింది. గారెలను చేతిలోనికి తీసుకొని, తినకుండ పెట్టుకోవడము చూచిన బాబా వాటిని తిను, నీవు ఏమి

భయపడవద్దు వాటిలోని విషమే నీ కడుపునొప్పిని లేకుండ చేస్తుందని చెప్పాడు. పూజారికి ఏమి అర్థము కాలేదు.

వీటిలో విషమున్నదని ఆయనకెలా తెలుసు? ఇప్పుడు ఇవి తింటే నేను చస్తాను, తినకపోయినా బాధకు తట్టుకోలేక

చస్తాను. బాధను అనుభవించి చచ్చే దానికంటే వీటిని తిని తొందరగ చచ్చేది మేలనుకొని గారెలను తిన్నాడు. తిన్న

వెంటనే బాబాగారు చెప్పినట్లు కడుపునొప్పి మాయమైపోయింది. అక్కడనుండి పూజారి తలవంచుకొని పోయాడు.


మరి కొంతకాలమునకు పూజారికి బాబామీద ద్వేషము పెరిగి పోయింది. ఈమారు నేరుగా కోటలోనికి

పోయి, రాజుగారికి బాబా పకురుద్దీన్ విషయము చెప్పి, గుడినుండి రాజుగారి చేత తరిమేయించాలను కొన్నాడు.

అలా అనుకొన్న తర్వాత ఒక దినము కోటలోని రాజుగారి వద్దకు పోయి ఒక ఫకీరు గుడిని ఆక్రమించుకొని,

అపవిత్రము చేయు చున్నాడని చెప్పాడు. రాజుగారు భటులతో బాబా పకురుద్దీన్ను పిలువనంపాడు. ఇద్దరి వాదనలు

విన్నాడు. దేవాలయము భక్తులది కానీ పూజారిది కాదు అని బాబా అంటాడు, ఆలయము పూజారిదే కానీ భక్తులది

కాదు అని పూజారి అంటాడు. చివరికి రాజు ఎటూ తేల్చి చెప్పలేనివాడై ఇద్దరికి కలిపి ఒక పరీక్ష పెట్టాడు.

పరీక్షలో ఎవరు నెగ్గితే వారికే గుడి స్వంతమవుతుందని చెప్పాడు. ఆ పరీక్షకు ఇద్దరూ ఒప్పుకొన్నారు. ఆ పరీక్ష

ఏమనగా! ఒక్కొక్క సున్నపు మూటలో ఒక్కొక్కరిని సున్నముతో సహ ఉంచి, మూటకట్టి, పెనుకొండ చెరువులో వేస్తే,

ఎవరు ముందు మూటను విప్పుకొని బయటపడితే వారికే గుడి ఇవ్వడము జరుగుతుంది. రాజుగారు చెప్పిన ప్రకారము

సున్నముతో సహా ఇద్దరిని మూటలుగా కట్టి నడి చెరువులో వేశారు. ఇదంత రాజుగారి సమక్షములోనే జరిగినది.

మధ్యాహ్నము ఒంటిగంట సమయములో నీటిలో వేయగా, ఐదు నిమిషము లలో బాబాగారు ఒడ్డుకు చేరుకొన్నాడు.

పూజారి సున్నములో ఉడికిపోయి చనిపోయాడు. బాబాగారు ఒడ్డుకు చేరిన వెంటనే చెరువు కట్టమీదనే నమాజ్ చేసి,

రాజుగారివద్ద అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విధముగా శివాలయము బాబా పకురుద్దీన్ స్వంతమైనది.

అప్పటినుండి శివభక్తులు వచ్చి, పూజచేసుకొని బాబా దగ్గర తమ కష్టాలను చెప్పుకొని పోవుచుండిరి. బాబా దగ్గర

కష్టాలను చెప్పుకొంటే తీరిపోతాయని నమ్మేవారు. చాలామందికి అలా జరగడము వలన, అక్కడికి వచ్చేవారి సంఖ్య


పెరిగి పోయింది. ఆ విధముగ బాబాకు, ప్రజలకు సంబంధము పెరిగిపోయింది. కొంతకాలము గడువగా బాబాకు

వృద్దాప్యము వచ్చి చివరకు చనిపోవడము జరిగింది. చనిపోయిన తర్వాత సూక్ష్మశరీరముతో అక్కడే ఉండడము జరిగినది.


బాబాగారు చనిపోయిన తర్వాత అంతవరకు ఆయనతో పరిచయ మేర్పడిన ముస్లీమ్ భక్తులు,

చనిపోకముందే తమతో చెప్పిన ప్రకారము ఆయన శరీరము గుడిలోపలే పూడ్చిపెట్టి దర్గాకట్టినారు. (నేటికీ దర్గా

ఉంది శివాలయము ఉంది. ప్రస్తుత కాలములో పాతవారికి, ఆ ఊరి వారికి అది "శివాలయము” అని తెలుసుగానీ

క్రొత్తవారికి బాబా పకురిద్దీన్ “దర్గా” అనియే తెలుసు. అక్కడ ప్రతి సంవత్సరము బాబాగారి ఉరుసు జరుగుతుంది. ఆ

ఉరుసు ప్రత్యేకత ఏమిటంటే బాబాగారు మొదట పుల్ల నాటగా చిగురించిన మిస్వక్ చెట్టు (చక్కెరమాను) నుండి

ఉరుసు దినమున చక్కెర రాలుతుందట. ఆ చక్కెరను బాబాగారికి చదివింపులు చేస్తారట. పూర్వము ఆ చెట్టునుండి

ఆ దినము ఒక కేజీ చక్కెర రాలేదట. ప్రస్తుత కాలములో ఒక పిడికెడు మాత్రమే రాలుతుందని చెప్పుచున్నారు. (ఇది

చెప్పితే వినడమే కానీ నేను చూడలేదు.)


నేను :- ఇదంతా బాబా పకురుద్దీన్ (సత్యంరాజు) చరిత్ర. కానీ సాయబ్ బాబా ఏమైనట్లు? ఒక్కమారైన ఆయన

మీవద్దకు వచ్చాడా? లేక మీరు ఆయనవద్దకైనా పోయారా? ఆయన ఎక్కడున్నట్లు?


ఆమె :- పెనుకొండ కోటదగ్గర గుహలో మాట్లాడిన తర్వాత సాయబ్బాబా గారు వందలసంవత్సరముల కాలము,

మహరాష్ట్రలోని షిరిడి దగ్గర భూమిలో ఏర్పరుచుకొన్న గుహలో ధ్యానములో ఉండిపోయాడు. తర్వాత బయటకు వచ్చి

షిరిడిలోనే తిరుగుచుండెడి వాడు. అప్పడు కూడ ఆయన పేరు సాయబ్బ్బానే! కానీ కాలక్రమేపి ఆయన పేరులో

కొంత మార్పు వచ్చినది. చిన్నపిల్లలు నోరు తిరుగక సాయబ్ అనకుండ సాయబాబా అనెడివారు. అలా ఒక అక్షరము

ఆయన పేరులో మాయమైపోయినది. సాయబాబాగా ఆయన జీవితకాలము అంతా గడిచిపోయింది. అక్కడ ఆయన

చనిపోయినా సూక్ష్మముగానే మిగిలిపోయాడు. సూక్ష్మశరీరముతో తిరిగి పెనుకొండ ప్రాంతమునకే వచ్చి, ఇక్కడ మమ్ములను

చూచి దీవించి ఇక్కడికి దగ్గరగానే ఉంటానని చెప్పి, సత్యనారాయణ రాజు అను బాలునిలో చేరి ఆ శరీరములోనే

నేటికినీ పుట్టపర్తిలో ఉన్నాడు. ఇప్పుడు వంద సంవత్సరముల నుండి సాయిబాబాగా పిలువబడుచున్నాడు. మొదట

పెనుకొండలో సాయబ్బ్బాగా తర్వాత షిరిడిలో సాయబాబాగా, ప్రస్తుత కాలములో పుట్టపర్తిలో సాయిబాబాగా

పిలువబడుచున్నాడు.

నేను :- సాయిబాబాగా ఎంతకాలము బ్రతుకుతాడో చెప్పగలవా?


ఆమె :- ఇప్పుడు నేను చెప్పేది ఏముంది? మూడు సంవత్సరముల క్రితము మీరే చెప్పారు. ఆయన ఆయుస్సు 90

నుండి 96 వరకు గలదని, బహుశ 92వ సంవత్సరము చనిపోవచ్చని ఒక సందర్భములో చెప్పారు. చంద్రునిలో

నీళ్ళున్నాయి అని కూడ అప్పుడే చెప్పారు.

నేను :- నేను ఎప్పుడో చెప్పినది నీకెలా తెలుసు?

ఆమె : - మీరు ఇదే పెనుకొండ ప్రాంతములో మీ శిష్యులతో సహ జీపులో వచ్చి రాత్రిపూట రైల్వేగేట్ దగ్గరున్న

ఆంజనేయస్వామి గుడివద్ద ఆగారు. అక్కడ మీ శిష్యులకు చెప్పుచుండగా నేను విన్నాను. నేనే కాదు మా అన్న బాబా

పకురుద్దీన్ కూడ విన్నాడు.


నేను :- ఆ సమయములో మీరు అక్కడెందుకున్నారు. ఒక విధముగా ఈ ప్రశ్న నేను అడుగకూడదు. కావున దానికి

జవాబు వద్దు కానీ ఇక్కడికి ఎందుకొచ్చావు? ఈ గర్భిణి మనిషిలోకే ఎందుకొచ్చావు?.

ఆమె :- నేను ముందే చెప్పాను కదా! ఈమె మా భక్తురాలని, అన్న ఆజ్ఞ ప్రకారము నేను అప్పుడప్పుడు వచ్చి ఏ

దయ్యాలు ఈమె జోలికి రాకుండ చూసి పోతుంటాను. ప్రస్తుతము రెండు రోజులనుండి నేను పెనుకొండలోనే

ఉంటిని, ఇక్కడికి రాలేదు. అదునుచూచి ఒక దయ్యము ఈమెలో దూరడము, మీరు పోయి బయటికి పంపిరావడము

జరిగినది.


బాబాగారు మక్కాకు పోయాడు కాబట్టి రెండు దినములనుండి ఇక్కడికి రాలేకపోయాను. ఇప్పుడు ఇక్కడికి

వచ్చిన తర్వాత మీరు వచ్చి ఈమెను చూచివచ్చినట్లు నాకు తెలిసింది. ముందు ఒక మారు మిమ్ములను చూచాను

కాబట్టి ఇప్పుడు చూడాలని, మీతో మాట్లాడాలని వచ్చాను. నా కోరిక నెరవేరింది.

నేను :- మీ అన్న సత్యంరాజు బాబాపకురుద్దీన్ అని పేరు మార్చుకొన్నపుడు, నీవు నీ పేరు మార్చుకోకుండ అంబోజమ్మ

అని పాతపేరుతోనే ఉన్నావెందుకు.

ఆమె :- అన్న స్వయముగా పేరు మార్చుకోలేదు. అన్నకు సాయబ్బాబాగారు పేరు మార్చారు. నాకు ఎవరూ మార్చలేదు,

అందువలన ఆ పేరుతోనే ఉన్నాను.

నేను :- పెనుకొండ దర్గాదగ్గర మీరు ఇద్దరే ఉన్నారా?

ఆమె :- దాదాపు రెండు వందలమంది ఉన్నారు. కానీ మా అంత వయస్సున్న వారు ఎవరూ లేరు.

నేను :- రెండువందల మంది కనిపించే వారా? కనిపించని వారా?

ఆమె : - కనిపించేవారు వచ్చి వారి కోర్కెలు చెప్పుకొని పోతూవుంటారు. కనిపించని వారే రెండు వందలమంది అక్కడే

ఉంటారు. అన్నతో జ్ఞానమును చెప్పించుకొంటుంటారు.

చెప్పించు.

నేను :- ఇప్పుడు మీ అన్న దర్గాదగ్గర లేడు కదా! ఇప్పుడు ఎవరు అక్కడ పెద్దగా ఉంటారు.

ఆమె : – ఎవరూ ఉండరు. నేనే వెళ్ళాలి. స్వామిగారు నాకు సెలవు ఇవ్వండి నేను పోయివస్తాను.

(చివరిలో ఆమె నమస్కారము చేసి, గర్భిణి మనిషి శరీరము నుండి వెళ్ళి పోయింది. )


ఇదంతా ఒక సినిమా కథలాగ ఉంది కదా! అట్లని కథ అనుకునేరు. అంతయు వాస్తవమే! అంబోజమ్మ

మాట్లాడము ద్వారా ఎన్నో క్రొత్త విషయములు, ఎవరికి తెలియని రహస్యములు తెలిసినవి. ఈ సంభాషణ జరిగి

ఇప్పటికి ముఫ్పై సంవత్సరములైనది. మేము మాట్లాడినప్పటి నుండి ముఫై సంవత్సరములు గడిచినా, శిష్యుడైన

బాబా పకురుద్దీన్, గురువు అయిన సాయబ్బాబాగారు నేటికిని ఒకరు కనిపిస్తూ, ఒకరు కనిపించక యున్నారు.

సాయబాబా కారణము వలననే పెనుకొండ ప్రాంతము చరిత్ర సంతరించుకొన్నది. విదేశాలకు సహితము బాబాగారి

వలన పెనుకొండ పేరు తెలిసినది. సూక్ష్మశరీరములను గురించి చెప్పుచున్నాము కావున వీరు కూడ సూక్ష్మశరీముతోనే

ఉన్నారని తెల్పుటకు ఈ సంఘటన చెప్పవలసి వచ్చినది. బాబాల భక్తులు ఎందరో దయ్యాలు లేవు అంటున్నారు.

వారికి కూడ సూక్ష్మశరీరములంటే ఏమిటో, ఎలా ఉండగలుగుచున్నయో దీనిమూలముగ సులభముగా తెలియగలదు.


అంతేకాక ఒక మనిషి 70,80,90,100 సంవత్సరములే కాక సూక్ష్మశరీరముతో వందల సంవత్సరములు బ్రతుకుచున్నాడని

ఇందుమూలముగా తెలియుచున్నది. మరియు కనిపించని జీవితమును కూడ మంచి మార్గములో నడుపుకొను వారు

భూమి మీద ఎందరో ఉన్నారని కూడా ఇందు మూలముగా తెలియుచున్నది. ఇంకొక ముఖ్యమైన విషయము.

కొందరు క్రొత్త జన్మకు పోకుండానే శరీరములను మార్చి బ్రతుకగలుగుచున్నారని కూడ దీని మూలముగా తెలియుచున్నది.


ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని ఒకరు అంటే, కొందరే మహానుభావులు వారికి

వందనములు అన్నాడట మరొకరు. ఇక్కడ రెండు వాక్యములు, ఇద్దరు వ్యక్తులు గలరు. ఇందులో ఏది సరియైన మాట

అని యోచిస్తే వాస్తవానికి రెండవ మాటయే సరియైనదని చెప్పవచ్చును. ఎందుకనగా మహానుభావులు ఎందరో

ఉండరు, కొందరే ఉంటారు. గొప్ప భావమున్న వారిని మహానుభావులు అంటాము. అలాగే గొప్ప ఆత్మవున్న వారిని

మహాత్ములు అని అంటాము. మహానుభావులు వేరు, మహాత్ములు వేరు. మహానుభావులలో గొప్ప భావములుండినా

వారిలో జ్ఞానశక్తితో కూడుకొన్న ఆత్మ ఉండదు. మహాత్ములలో జ్ఞానశక్తితో కూడుకొన్న ఆత్మ ఉండును. అన్ని విధముల

మహానుభావులకంటే మహాత్ములే గొప్పవారని చెప్పవచ్చును. ప్రస్తుత కాలములో మహానుభావులే కొందరున్నారని

చెప్పినపుడు, వారికంటే గొప్పవారైన మహాత్ములు మరీ తక్కువగా ఉందురు. భూమిమీద తక్కువగానున్న మహాత్ములు

స్థూలముగానైన ఉండవచ్చును, సూక్ష్మముగానైన ఉండవచ్చును. ఇపుడు సూక్ష్మముగానున్న ఒక మహాత్ముని కథనము

విందాము.


చిత్తూరు జిల్లా రామాపురము ప్రక్కన, పాపసముద్రము దాని ప్రక్కనే గుడిపాల అను ఒక చిన్న గ్రామముకలదు.

గుడిపాల గ్రామమునకు నేను ఒక మారు 1981 వ సంవత్సరము పోవడము జరిగినది. గుడిపాల గ్రామములో

గురుమూర్తి అను పేరుగల వ్యక్తి గలడు. అతను, అతని భార్య ఇద్దరే ఇంటిలో ఉంటున్నారు. అతనికి పిల్లలు లేరు,

వారి వయస్సు యాభై సంవత్సరములు ఉండవచ్చును. నేను ఆ ఊరిలో గురుమూర్తి ఇంటికే పోయాను. ఆ దినము

సాయంకాలము ఐదుగంటల సమయములో ఇంటి బయట మైదానములో కుర్చీమీద కూర్చోని ఉండగా, అక్కడికి

వచ్చినవారు పాదనమస్కారము చేసుకొనుచున్నారు. నాకు మ్రొక్కించుకొనే దానికి ఇష్టముండదు. పల్లెటూరి ప్రజలు

చెప్పినా వినరు. నేను మౌనముగా కూర్చున్నాను. అలా అందరు ఒక్కొక్కరుగా పాదములకు నమస్కారము చేయుచున్నప్పుడు,

మధ్యలో గురుమూర్తి భార్యకూడ వచ్చి నమస్కారము చేసి పోయి ప్రక్కన నిలబడివున్నది. ఆమె నమస్కారము చేయునపుడే

పాదముల స్పర్శలోనే కొంత నాకు తేడా కనిపించింది. తర్వాత ఆమె ప్రక్కన నిలుచుకొని అప్పుడప్పుడు నావైపే చూస్తూ,

కళ్ళలో నీరు కార్చుచుండడము గమనించాను. తర్వాత రాత్రి ఎనిమిది గంటలపుడు తీరిక ఉండడము వలన గురుమూర్తి

వద్ద అతని భార్య ప్రస్తావనను తీసుకువచ్చి ఈమె శరీరములో ఇంకా ఎవరో ఉన్నారు, నేను సాయంకాలము గమనించాను

అన్నాను. దానికి గురుమూర్తి అలాంటిదేమి లేదు, అట్లున్నట్లు ఎప్పుడూ ఏమీ కనిపించలేదు అన్నాడు. దానిని విన్న

నేను, “లేదు ఆమె శరీరములో ఎవరో గొప్పవ్యక్తి ఉన్నట్లు మరియు నన్ను చూచి ఆ వ్యక్తి కొంత సంతోషమును

పొందినట్లు నాకు అనిపించింది. ఆ విషయమును గురించి ఆందోళన చెందవలసిన పని లేదు. లోపలున్న ఆ వ్యక్తి

ద్వార మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటాను” అన్నాను. ఆ మాటను విన్న గురుమూర్తి కొంత ఆలోచించి

ఏదో జ్ఞప్తికిరాగా ఇలా చెప్పసాగాడు.


నాకు పెళ్ళి అయిన క్రొత్తలో నా భార్యకు దయ్యమున్నదని ఒక మాంత్రికుడు చెప్పాడు. అప్పుడు దానిని

విడిపించమని అతనినే అడిగాను. అతను ప్రయత్నము చేసి చూచాడు. ఆ దయ్యము బయటకు కూడ వచ్చి మాట్లాడలేదు.


చివరకు అతను తనకొక పెద్ద మాంత్రికుడు తెలుసునని అతని చేత చూపించితే సరిపోతుందని తెలిపాడు. ఎలాగైనా

ఉన్న దయ్యమును వదిలించుకోవాలని పట్టుదలగానున్న నేను, ఆ పెద్ద మాంత్రికుని వద్దకు పోయి విషయమును చెప్పి

పిలిచాను. అతను వస్తానని వచ్చాడు. వచ్చిన అతను ఏదో పూజ పెట్టించి ఆ పూజలో నా భార్యను కూర్చోబెట్టి

మంత్రాలు చదువుతూవుంటే అప్పుడు నా భార్య శరీరము మీదికి దయ్యము వచ్చింది. వచ్చిన వెంటనే నీ మంత్రాలు

ఆపు అని గద్దించి చెప్పింది. మాంత్రికుడు మంత్రాలు ఆపివేశాడు. అప్పుడు ఆ దయ్యము నావైపు చూచి ఎందుకు

వీరినందరిని పిలిచి డబ్బులు పోగొట్టుకుంటున్నావు. వీరు ఎవరు ఏమి చేసినా నేను పోను. వీరు ఎవరూ నన్ను

పంపలేరు. ఇప్పటినుంచైనా ఇటువంటి ప్రయత్నములు మానుకో! నేను ఉన్నదానివలన నీకు ఏమి నష్టముగానీ,

కష్టముగానీ లేదు కదా! ఇటువంటి పని మానుకో, అని నాకు చెప్పి లోపలికి అణిగిపోయింది.


ఆ దయ్యము అలా బుద్ధి చెప్పడము నాకు చాలా అవమానమైనట్లు అనిపించింది. వచ్చిన మాంత్రికుడు కూడ

తన చేతకాదు అని చెప్పాడు. ఇది పొయ్యే మార్గమే లేదా? దీనిని పంపించే వారే లేరా అని మాంత్రికులని అడిగినాను.

అప్పుడు ఇద్దరు మాంత్రికులు కలిసి మాట్లాడుకొని, నన్ను కూడ పిలుచుకొని పోస్టాఫీసు దగ్గరకు పోయి, అక్కడినుండి

ఎవరికో ఫోన్ చేసి నాముందరే మాట్లాడినారు. తర్వాత వారు మాట్లాడిన విషయము నాకు చెప్పారు. మాకు తెలిసిన

ఒక దేవతా ఉపాసకుడు ఉన్నాడు. ఆయన దేవతలను పిలిచి, వారి చేత ఎంత పెద్ద దయ్యమునైనా వదిలించగలడు.

ఆయన ఫీజు ఐదువేల రూపాయలు తీసుకొంటాడు. దయ్యము పోతేనే ఫీజు ఇస్తాము పోకపోతే ఇవ్వము అని

చెప్పాము. సరే! అలాగేనని ఆయన ఒప్పుకొన్నాడు. ఐదువేలు ఇవ్వాలంటే నీకు కష్టమే! అందువలన మాకు ఇద్దరికి

ఇవ్వవలసిన డబ్బుకూడ మాకు వద్దు అది కూడ ఆయనకే ఇచ్చుకో! నీవు చెప్పితే ఆయనను అడిగి చూస్తాము అని నాతో

చెప్పగా, సరే ఎలాగైనా రమ్మని చెప్పండి అన్నాను. తర్వాత వారు ఫోన్ చేసి మాట్లాడి, పది రోజుల తర్వాత వస్తాడని

నాతో చెప్పారు. ఈమారు దయ్యాన్ని, దేవతలే తరిమి వేస్తారని ధైర్యముగా ఉంటిని. పదిరోజులకు ముందు వచ్చిన

మాంత్రికులు ఇద్దరు పోయి ఆయనను పిలుచుకొనివచ్చారు. వచ్చిన వ్యక్తి దాదాపు అరవై సంవత్సరముల వయస్సువాడు,

మంచి అనుభవము కలవాడని అతనిని చూస్తానే అర్థమైనది. ఆయన కూడ పూజా ద్రవ్యములన్నిటినీ పెట్టి, పూజ

ప్రారంభించే ముందు నా భార్యను పిలిచి పూజ ముందర మాంత్రికునికి ఎదురుగా కూర్చోబెట్టి, పూజ మొదలుపెట్టాడు.

ఇద్దరు మాంత్రికులు కూడ ఆయనకు సహాయముగా అతని ప్రక్కనే కూర్చున్నారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఒక్కొక్క

దేవతకు, ఒక్కొక్క మంత్రమును చదువుచు ముగ్గురు దేవతలను అక్కడికి రమ్మని చెప్పసాగాడు.


అంతవరకు మౌనముగా కూర్చొని చూస్తున్న నాభార్య ఒక్కసారిగ లేచి, ప్రక్కనే ఉన్న ముగ్గుపొడి డబ్బాతీసుకొని

వాకిలి దగ్గరకు పోయి గడప మాను ముందర బయట ముగ్గుతో మూడు గీతలు వాకిలికి అడ్డముగా వేసింది. ముగ్గుపొడితో

గీతలు వేసిన తర్వాత వచ్చి ముందు కూర్చున్న స్థానములోనే మాంత్రికులకు ఎదురుగా కూర్చున్నది. నాభార్య

విధముగా లేచి పోయినపుడు మాంత్రికులూ నేను చూస్తువుండిపోయాము. మేము ఎందుకు పోతావుంది అని తేరుకొనే

లోపల, మూడు గీతలేసి వచ్చి కూర్చున్నది. కూర్చున్నది కదా అని ఆయన తిరిగి మంత్రాలు మొదలు పెట్టి దేవతలను

తొందరగా రమ్మని చెప్పసాగాడు. అంతలో నాభార్య పెద్దగా నవ్వుచు, “ఒరేయ్ మూర్ఖుడా! నీవు ఏ దేవతను ఎంతగా

పిలిచినా వాళ్ళువచ్చేది ఆ వాకిలివరకే, నేను గీచిన గీతదాటి నీవు పిలిచే ఏ దేవతలు రాలేరు. నామాట అర్థముకాకపోతే

పిలిచి చూడు నీకే తెలుస్తుంది” అని చెప్పింది. ఆ మాంత్రికుడు కూడ కొంతవరకు ప్రయత్నము చేసి, ఇంతవరకు నాకు

ఈ విధముగా ఎక్కడా జరుగలేదని, తన ప్రయత్నమును విరమించుకొన్నాడు. అయినా మేము పట్టువదలలేదు.


చివరకు కేరళలో చాలా పెద్ద మాంత్రికుడున్నాడని, అతను అడుగు పెట్టితే చాలు దయ్యములే కాదు, దేవతలు కూడ

పారిపోతాయని తెలిసింది. తెలిసిన వెంటనే కేరళకు పోయి జరిగిన విషయమంతా చెప్పాము. మా మాటలు విన్న

మళయాల మాంత్రికుడు, మీరు చెప్పే విషయము చాలా ఆసక్తిగా ఉందే! అయితే దానిని నేను చూడాలసిందే! అన్నాడు.

ఆయన వచ్చి చూస్తానని చెప్పడము మాకు సంతోషమైనది.


మేము అక్కడ ఆయనకు డబ్బులిచ్చి వచ్చాము. ఆయన మూడు నెలలకు వస్తానని చెప్పి అలాగే వచ్చాడు.

కేరళనుండి మొత్తము పండ్రెండు మంది శిష్యులతో ఆ మళయాల మాంత్రికుడు వచ్చాడు. ఆయన చేత తప్పక పని

జరుగుతుందని నాకు పూర్తి నమ్మకము. ఆయన నా భార్యను చూచి ప్రక్కన కూర్చో! నేను పిలిచినప్పుడు రమ్మని

చెప్పాడు. ఆయన పూజలకే గంటకాలము పట్టింది. తర్వాత నా భార్యను వచ్చి, వారు గీచిన గుర్తులో కూర్చోమన్నారు.

తర్వాత మళయాళ భాషలో మంత్రములు మొదలు పెట్టి, కొంత మంత్రించిన విభూతిని నా భార్యమీద చల్లినాడు.

అంతవరకు ఊరక కూర్చున్న నా భార్య శరీరము మీదికి వచ్చిన దయ్యమునకు కోపము వచ్చింది. అప్పుడు ఆ

మాంత్రికున్ని హెచ్చరించినట్లు, ఇంకొకమారు నీ విభూతిని నామీద చల్లితే నేను నిన్ను ఏమిచేస్తానో చెప్పలేను జాగ్రత్త

అన్నది. అప్పుడు ఆ మాంత్రికుడు చిన్నగ నవ్వి, నేను ఎవరో నీకు తెలియదు. నీవు నన్ను బ్రతిమలాడినా నిన్ను

వదలను. నిన్ను బంధించి భూసమాధి చేస్తాను. ఎందరో మాంత్రికులను లెక్క చేయకుండ అవమానపరిచావు. చివరకు

నీ కర్మకొద్దీ నాచేతిలో పడినావు. ఇక నీగతి చూచుకో! నేను ఒక్కొక్క మంత్రము చెప్పేకొద్దీ, నీ శరీరములో మంటలు

రేగును, నా మంత్రములతో నీ శరీరమంత సూదులు గ్రుచ్చినట్లగును, అని చెప్పి మంత్రములు చదివి కొంత విభూతిని

తిరిగి ఆమె మీద చల్లాడు. అప్పుడు ఆమె గట్టిగా తల విదిలించుకొని నేను ముందే చెప్పాను. మరొకమారు నా మీద

విభూతి చల్లవద్దని. అయినా నీవు నామాటను లెక్కచేయకుండా నన్నే బంధిస్తానని భూమిలో పాతి పెట్టుతానన్నావు.

నీ కర్మకొద్దీ నాకు దొరికావు అన్నావు. అదే మాట నేను అంటున్నాను, ఇప్పుడు నీవు నీకర్మకొద్ది నాకు దొరికావు. ఇదే

నీకు నేను పెట్టుచున్న శాపము “నీకు మంత్రములు పలుకు గొంతే లేకుండ పోవుగాక" అన్నది. ఆ మాట అంటూనే,

అంతవరకు మంత్రములు చెప్పుచున్న ఆయన గొంతులో శబ్దమురాలేదు. ఆయన శిష్యులు వెంటనే మంత్రించి ఆయన

మీద నీళ్ళు చల్లడము, విభూతి చల్లడము చేసారు అయినా ఫలితము లేదు. ఆయన మాట పడిపోయింది. ఆ

మాంత్రికుడు అవమానముపాలై ఏడ్వను మొదలుపెట్టాడు. ఆయన శిష్యులు ఆయనను బాగుచేయించుకొనుటకు

కేరళకే తీసుకెళ్ళి పోయారు. ఆ సన్నివేశము చూచిన మాకు భయము చుట్టుకొన్నది.



ఒక్కమాటతో అంత పెద్ద మాంత్రికుని గొంతు పనిచేయకుండ పోయిందంటే, ఆ దయ్యము అనుకుంటే

మేమెంత అనుకొన్నాము. అప్పటి నుండి మేము ఏ ప్రయత్నము చేయలేదు. ఆ దయ్యము జాడలు కూడ కనిపించకుండ

పోయాయి. ముప్పయి (30) సంవత్సరములుగా దయ్యము కనిపించలేదు. ఇదంతయు నాకు పెళ్ళైయిన క్రొత్తలో

జరిగింది అప్పటి నుండి ఏ పీడ లేకుండ హాయిగా ఉన్నాము. మళ్ళీ ఇదేదో క్రొత్తది, దీనిని గురించి మాకు ఏమీ

తెలియదు అని గురుమూర్తి నాతో అన్నాడు! నేను గతములో వారికి జరిగిన కథనంత గురుమూర్తి చెప్పగా విన్నాము

కదా! అప్పుడు పూర్తి విషయమంతా అర్థమైపోయినది. నాకు అర్థమైన విషయమంతటిని గురుమూర్తికి వివరముగా

చెప్పాను. అదేమనగా! మొదట, సాయంకాలము గురుమూర్తి భార్య నావద్దకు వచ్చి పాదములు పట్టుకొన్నపుడే

స్పర్శ కొంత తేడాగా కనిపించింది. తర్వాత ఆమె ప్రక్కన నిలుచుకొని నావైపు చూచి కళ్ళనుండి నీరు కార్చినది

చూచాను. నావద్ద కల్గిన ఈ రెండుకార్యముల ఆధారముగా మరియు మాంత్రికుల వద్ద జరిగిన కార్యముల ఆధారముగా


వివరించుకొని చూస్తే, గురుమూర్తి భార్య శరీరములో ఉన్న వ్యక్తి గొప్ప మహాత్ముడని తెలియుచున్నది. జ్ఞానశక్తి

కల్గినవాడు మహాత్ముడని ముందే చెప్పుకొన్నాము. జ్ఞానశక్తి ముందర ఏ విధమైన మంత్రములు, ఎంతో ప్రభావమున్న

మంత్రములు పనిచేయవు. వచ్చిన మాంత్రికులు గొప్ప మంత్రశక్తిగలవారైనా, అంతపెద్ద మంత్రశక్తులు కూడ ఆ

మహాత్ముని ముందు ఏ మాత్రము పనిచేయలేదు.


జ్ఞానశక్తిగల మహాత్ములు గీత గీచితే, ఆ గీతను ఎంతటి రోగము లైనా, ఎంతటి దేవతాశక్తులైనా దాటవని మా

బోధలలో అనేకమార్లు నేనే చెప్పాను. ఆ విధముగనే గురుమూర్తి భార్య శరీరములోనున్న మహాత్ముడు, ముగ్గు పిండితో

గీతవేస్తే ఆ గీతను మాంత్రికుడు పిలువగా వచ్చిన దేవతలు దాటి లోపలికి రాలేకపోయారు. అంతేకాక ఇటు

గురుమూర్తిని ఆ మహాత్ముడు నన్ను మీరు ఏమీ చేయలేరు, నా వలన మీకు ఏ నష్టము ఉండదని చెప్పడము జరిగినది.

అటు మాంత్రికులకు, నన్ను రెచ్చగొట్టితే మీకే ఇబ్బందని కూడ చెప్పడము జరిగినది. అయినా ఇటు గురుమూర్తి

ఆయన మాట వినకపోవడము వలన డబ్బు నష్టము, శ్రమ రెండు కలిగినవి. చివరికి మాంత్రికుడు భూమిలో

పాతిపెట్టుతానని పరాక్రమము చేసి చివరికి గొంతులో మాటనే లేకుండ పొగొట్టుకొన్నాడు. నేను నిన్ను శపిస్తున్నానని

మహాత్ములే అంటారు. వారు దృఢసంకల్పముతో పలికిన మాట ఏదైనా శాపమగును. ఈ సూత్రము ప్రకారము ఆ

శరీరములో ఎంతో జ్ఞానశక్తిగల మహాత్ముడున్నాడని తెలియుచున్నది. మంత్రశక్తి జ్ఞానశక్తికి ఏ విషయములోను

సాటిరాదు. అంతేకాక మంత్రశక్తిగలవారు, జ్ఞానశక్తిగల వారిని గుర్తించలేరు. జ్ఞానశక్తియున్నవారు జ్ఞానశక్తియున్నవారిని

గుర్తించగలరు. జ్ఞానశక్తియున్న వారిని, జ్ఞానశక్తియున్నవారు చూస్తే వారికి తెలియకుండానే సంతోషము కలుగును.

ఆ ప్రకారమే నన్ను చూచినపుడు గురుమూర్తి భార్య శరీరములోని వ్యక్తికి, కళ్ళలో ఆనంద బాష్పములు రాలడము

జరిగినది.


భూమిమీద కొందరి శరీరములు మాత్రమే సూక్ష్మశరీరములు నివాసము చేయుటకు యోగ్యముగా ఉండును.

జాతకములో (జాఫతకములో) బుధగ్రహము వ్యతిరేఖమైయుండి, ఆ బుధగ్రహము జాతకలగ్నమునకు ఆరవస్థానములో

ఉంటే, అటువంటి వాని శరీరములో తప్పక వేరొక సూక్ష్మశరీరము (దయ్యము) నివాసముండునని చెప్పవచ్చును.

బుధగ్రహము అనుకూలము లేనివారి జీవితములలో, దయ్యాల సంబంధము ఉండును. కాబట్టి గురుమూర్తి భార్యకు

జాతకచక్రములో బుధగ్రహము వ్యతిరేఖత ఉండుట వలన, ఆమె శరీరము ఆ మహాత్మునికి నివాసయోగ్య మైనది.

కావున ఆమెలో చేరియుండడమైనది. మరొక విషయమేమనగా! జాతకచక్రములో ఐదవస్థానము స్త్రీలకు సంతాన

స్థానమగును. ఐదవ స్థానము శత్రుగ్రహముల చేత చూడబడినా లేక శత్రుగ్రహము ఆ స్థానములో ఉండినా, ఆ స్త్రీకి

సంతానము కలుగదు, ఆమె గొడ్రాలుగా ఉండును. ఇవి జ్యోతిష్యశాస్త్రములోని సూత్రములు. ఇటువంటి సూత్రము

ప్రకారము కూడా ఆమెకు సంతానము కలుగుటకు వీలులేదు. అందువలన అన్ని విధముల, ఆ మహాత్ముడు

ఉండుటకు అనుకూలమైన దానివలన ఆమె శరీరములో ఉండడము జరిగినది. జ్ఞానశక్తిగల మహాత్ములు పిల్లలుకనే

శరీరములో ఉండరు. ఇన్ని విధముల ఆమె శరీరము ఆ మహాత్మునికి అనుకూలమైనది. కాబట్టే అందరు మంత్ర

గాళ్ళు విడిపించాలని చూచినా శరీరమును విడిచిపోలేదు. పైగా మీరు ఏమిచేయలేరు, ఊరకనే ఉండండి, నన్ను

రెచ్చకొట్టకండి నాకు కోపము వస్తుంది అని చెప్పినా వినకపోవడము వలన మాంత్రికుడు మహాత్మునిచేత శాపము

పొందవలసి వచ్చినది. శాపము వలన నోటి మాట పోయినపుడు వారు ఆమె శరీరములోని వ్యక్తినే ప్రాధేయపడి


ఉండివుంటే అప్పుడే మాటవచ్చేదేమో! అలాకాకుండ ఆమె శరీరములోని మహాత్ముని సాధారణ దయ్యముగా లెక్కించిన

మాంత్రికులు, మాట వచ్చేదానికి మంత్రాలు వైద్యముల మీద ఆధారపడినారు.


ఇలా పాపసముద్రము దగ్గర గుడిపాలలో గురుమూర్తి ఇంటిలో జరిగిన విషయములన్నిటిని బట్టి చూస్తే,

భూమిమీద అరుదుగానున్న మహాత్ములు కూడా సూక్ష్మశరీరములలో ఉన్నారని తెలియుచున్నది. ఈ సంఘటన జరిగి

ఇప్పటికి దాదాపు అరవై (60) సంవత్సరముల కాలము గడచిపోయినది. ఇలా ఎన్నో ముఖ్యమైన సంఘటనలు

కాలగర్భములో కలిసిపోయాయి. ఎక్కడైనా ఒక విషయము మనిషి ఎదురుగా జరిగినా దానిని గుర్తించడము కానీ,

అర్థము చేసుకోవడముకానీ మనిషికి చేతకాలేదు. ఎవరైనా ఒక్కడు ఇది దయ్యము లేక సూక్ష్మశరీరము పనేనని చెప్పితే

వానిని రాతియుగము కాలమునాటి మనిషివని, ఇప్పుడు సైన్సు అభివృద్ధియైన ఈ కాలములో రాతియుగకాలమునాటి

మాట మాట్లాడుచున్నారని హేళనగా, తెలివి తక్కువవానిగా లెక్కించి మాట్లాడువారు వాని ప్రక్కనే పదిమంది ఉందురు.

ఇది దయ్యము పనేనని చెప్పు ఆ ఒక్కనికి కూడ దయ్యములను గూర్చి పూర్తి అవగాహనా జ్ఞానము లేనిదానివలన

విజ్ఞానులమను పదిమంది చెప్పుమాటలను ఖండించి వివరము చెప్పలేడు. అందువలన దేశములో విజ్ఞానమను

పేరుతో అజ్ఞానమును తలకెక్కించుకొని కనిపించు దానినే పరిశోధిస్తూ, కనిపించని దానిని మరచిపోతున్నారు.

మరచిపోవడమే కాక ఎవరైనా గుర్తుచేస్తే కూడ దానిని కూడ పరిశోధన దృష్టితో చూడకుండ గ్రుడ్డిగ అది లేనే లేదు,

ఇది జరుగనే జరుగదు అంతా అబద్దము, శాస్త్రబద్దము కాదు అంటున్నారు. దయ్యమనునది కూడ శాస్త్రీయ విషయమేనని

వారికి తెలియకుండ పోయినది. తాము చదువుకొన్నదే శాస్త్రము, తమకు తెలిసినదే విజ్ఞానము అనువారు చాలామంది

ఉన్నారు. తమకు తెలిసిన శాస్త్రములు నాలుగేనని, తమకు తెలియని శాస్త్రములు ఇంకా రెండు మిగిలియున్నాయని,

ఆరు శాస్త్రములు తెలిసిననాడే ఒక మనిషి పూర్తి విజ్ఞాని అగునని, అంతవరకు ఏ మనిషి అయినా పూర్తి విజ్ఞాని

కాలేడని, వాడు అసంపూర్ణ మేధస్సు కలవాడని చెప్పవచ్చును. చివరకు ఏ మనిషి అయినా వాని జీవితములో

ఆరవశాస్త్రము అయిన బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలియనిదే వానికి ఏ శక్తి ఉండదు. అటువంటి వాడు మనిషి

జీవితములో సంపాదించు కొను బాహ్య ప్రపంచ చదువుల డిగ్రీలు ఎన్ని పొందినా, తాను శక్తిని పొందు డిగ్రీలను

ఒక్కదానిని కూడ పొందనట్లే. బాహ్యవిద్యలలో బి.ఎ., యం.ఎ., సి.ఎ అను డిగ్రీలు అనేకమున్నట్లు, బ్రహ్మవిద్యలో

మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అను నాలుగు డిగ్రీలు కలవు. బాహ్య ప్రపంచములో ముప్పైసంవత్సరములు చదివి

ఏదో ఒక డిగ్రీ తీసుకొన్న వానికి, ఆ డిగ్రీ గురించే తెలుసు. మిగత డిగ్రీల గురించి తెలియదు. ఉదాహరణకు యం. ఎ

చదివినవానికి సి.ఎ డిగ్రీ చదువును గురించి తెలియదు. వాడు చదివిన యం.ఎ లో కూడ ఒక విభాగమును గురించే

తెలుసు. మిగతా రెండవ విభాగము తెలియదు. ఆర్థిక విభాగమును చదివిన వానికి రాజకీయ విభాగము తెలియదు.

ఈ విధముగ బయటి అన్ని డిగ్రీల గురించి తెలియక ఏదో ఒక డిగ్రీని తెలిసినవారికి, బ్రహ్మవిద్యా శాస్త్రమును గురించిగాని,

ఆ శాస్త్రములోని డిగ్రీలు గురించిగాని తెలియదు. బ్రహ్మవిద్యాశాస్త్రములో చిన్న సబ్జక్టు దయ్యములు! బయటి డిగ్రీలు

పొందిన వారు తమ సబ్జక్టు కాని దానిని గురించి ఎలా మాట్లాడగలరు? తెలియనపుడు అన్నీ అబద్దము అనేదే వారి

వంతగును. అదే ఇప్పటి హేతువాదులమనుకొను నాస్తికవాదులు చేయుచున్న పసలేనివాదన.



పునర్జన్మ జ్ఞాపకము వచ్చి చెప్పితే, అది ఒక రోగమంటారు. దయ్యము పట్టి ఇతర భాష మాట్లాడితే ఇది

భూటకము, ఆ భాష వానికి ముందే వచ్చునంటారు. దయ్యము పట్టి మాట్లాడక మౌనముగ ఉన్నవానికి హిస్టీరియా

ఈ విధముగ తమకు తెలియకున్నా, తెలిసినవారమను భావముతో, ఏదో ఒకటి ఆపాదిస్తు అన్నీ

రోగమంటారు.


అబద్దము అంటున్నారు. ఏ ఒక్కదానిని పరిశీలించి, పరిశోధనరీత్య తేల్చి చెప్పడము లేదు. తమకు తెలియని

విషయము హేతువాద దృష్ఠిలో పరిశీలించక ముందే, అదికాదు అను నిర్ణయముతో మాట్లాడువారు హేతువాదులు

కారు. సత్యమును సత్యమనీ, అసత్యమును అసత్యమని తేల్చి చెప్పునది నిజమైన హేతువాదము. అట్లుకాక శాస్త్రబద్ధత

ప్రకారము తేల్చి చూడకముందే ఇదంతా భూటకము, నాటకము, మోసము, అబద్దము అనుట బద్దమా? హేతువాదమా?

శాస్త్రబద్దమా? అట్లని, చూచిన దానిని, విన్నదానిని నమ్మమని మేము చెప్పలేదు. మేము చెప్పునది ప్రతి దానికి

కారణమును వెదకకుండ, కారణమును చూపకుండ కాదనడము హేతుబద్దతి కాదు. నేను కూడ ఏ విషయమును

గ్రుడ్డిగ నమ్మడము లేదు. ప్రజలందరు తెలియక నమ్మిన దానిని నేను పద్దతి చూపి ఖండిస్తూ, వారి నమ్మకమును

మూఢనమ్మకము అంటున్నాను. అట్లు నేను పరిశీలించి అందరూ సత్యమనుకొన్నా, నేను మాత్రము అసత్యమని

చెప్పడమేకాక, దానికి పద్ధతిగా వివరమును కూడ చెప్పుచున్నాను. అటువంటి ఒక సంఘటనను క్రింద చూసెదము.


అనంతపురము జిల్లాలో గుంతకల్లు ఉరవకొండ మార్గమున మధ్యలో రోడ్డుకు ప్రక్కనే 'తట్రుకల్లు' అనే గ్రామము

గలదు. నాకు ఎనిమిది సంవత్సరముల వయస్సులో, నేను జాతరకు పోయి మొదట దేవతా పూనకమును చూచినది

కూడా అదే ఊరు! ఆ తట్రుకల్లులో సుంకులమ్మ అను గ్రామదేవత పేరు చాలామందికి తెలుసు. ఎందుకనగా

వారములో ఒక దినము, సుంకులమ్మ ఒక వ్యక్తిమీదికి పూనకము వచ్చి మాట్లాడు చుండును. అప్పుడు ప్రజలు

అక్కడకు పోయి వారివారి సమస్యలు ఆ దేవతకు చెప్పుకొనుచుందురు. ఆ దేవత వారికి పరిష్కారమార్గములు

చెప్పుచుండును. అందువలన 'తట్రకల్లు సుంకులమ్మ' అను పేరు దూర ప్రాంతములవారికి కూడ తెలుసు. ప్రజలు ఒక

మారుమూల గ్రామములో ఉండే సుంకులమ్మ దగ్గరికి అంతగా పోవడానికి కారణమేమి అని చూస్తే, అక్కడికి పోయిన

ప్రతివారికి, సుంకులమ్మ చెప్పునది ఏదైనా నిజమేనను నమ్మకము మొదటనే కల్గుచున్నది. ఆ ఒక్క నమ్మకము ప్రజలను

ఐదారు సంవత్సరములు విశేషంగా ఆమె చుట్టు త్రిప్పింది. ఆరోజు కూడ కొందరు హేతువాదులు సుంకులమ్మను

అడ్డము పెట్టుకొని పూనకము వచ్చినట్లు డ్రామా ఆడి డబ్బు సంపాదించుకొంటున్నారని అన్నారు. వారు నాటకము

ఆడుచుంటే ప్రజలు మరీ అంత గ్రుడ్డిగా ఏమీ పోరు. ఎంతో కొంత సత్యము కనిపించియుంటేనే అలా పోవుదురని

అనుకుంటాను.


అందరూ మాట్లాడినట్లు మాట్లాడక, ఒక సమస్యలోని నిజానిజాలు తెలుసుకోవడమే నిజమైన హేతువాదమనే

నేను, తట్రకల్లు సుంకులమ్మ విషయమును పరిశీలించి చూచాను. ఉదాహరణకు ఒక విషయమును తీసుకొని చూస్తాము.

రామయ్య అనే వ్యక్తి తన కూతురు పెళ్ళి విషయమును అడగాలను ఉద్దేశముతో అక్కడికి పోయాడు. శుక్రవారము

(గమనిక: పలానా వారమని గుర్తులేదు, దానిని శుక్రవారము అని వ్రాస్తున్నాము) పూజకు హాజరై కూర్చున్నాడు.

రామయ్యలాగ వచ్చినవారు ఇంకా వందమంది దాకా అక్కడ రామయ్యతో పాటు కూర్చున్నారు. రామయ్య ‘మల్లేపల్లి’

అను ఊరునుండి వచ్చాడు. అలాగే వివిధ ప్రాంతములనుండి వివిధ పేర్లుగల వ్యక్తులు, వివిధ సమస్యలతో అక్కడికి

వచ్చియున్నారు. కొంతసేపుకు ఒక ఆడ మనిషి వచ్చి పూజముందర కూర్చోని సుంకులమ్మకు పూజచేసింది. పూజ

అయిపోయిన తర్వాత నిమిషానికే సుంకులమ్మ దేవత ఆమె శరీరములోనికి చేరి మాట్లాడడము మొదలు పెట్టింది. ఆడ

మనిషి శరీరములోనికి వచ్చిన సుంకులమ్మ, మొదట అక్కడ ఎదురుగా కూర్చున్న వారందరిని చూచింది. తర్వాత ఒక

వ్యక్తినే ఒక నిమిషముసేపు చూడడము జరుగుచున్నది. ఒకే వ్యక్తిని చూచిన తర్వాత ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలువడము

జరుగుచున్నది. అలా పిలిచిన వ్యక్తి వచ్చి ముందర కూర్చోవాలి. ఆమె ముందర కూర్చున్న తరువాత, అతను ఏ


ఊరునుండి వచ్చినది, ఏ పనికోసము వచ్చినది అక్కడ కూర్చున్న వ్యక్తి చెప్పకముందే సుంకులమ్మే చెప్పుచున్నది.

హేతువాదులు చెప్పినట్లు అక్కడ ఎవరు నాటకము ఆడలేదు. వాస్తవముగ సుంకులమ్మ దేవతను పూజించు తన

భక్తురాలి శరీరములోనికి సుంకులమ్మ రావడము జరుగుచున్నది. సుంకులమ్మ శరీరము మీదికి వచ్చి చేరిన తర్వాత,

ఆ దేవత ఏమి మాట్లాడినది ఆ భక్తురాలికి తెలియదు. అలాంటపుడు ఎవరూ నాటకమాడలేదు కదా! తప్పు చెప్పినా

ఒప్పు చెప్పినా, అది అంతయు సుంకులమ్మకు సంబంధమేకాని, ఆమె భక్తురాలికి గానీ, ఆ ఇంటివారికి గానీ ఏమి

సంబంధముండదు.


సుంకులమ్మ శరీరము మీదికి చేరిన తర్వాత సుంకులమ్మను పూజించిన ఆ ఆడ మనిషి నిద్రలోనికి వెళ్ళిపోవును.

బయట ఏమి జరిగినది శరీరము లోపల నిద్రలోనున్న ఆ భక్తురాలికి ఏమీ తెలియదు. సుంకులమ్మ తనకు ఎదురుగా

కూర్చున్న వ్యక్తులలో ఒక్కొక్కరిని పిలుస్తున్నది. మాట్లాడి పంపుచున్నది. అలా జరుగుచుండగా సుంకులమ్మ రామయ్య

ముఖము వైపు చూచి రామయ్యా! నాదగ్గరకిరమ్మని చెప్పింది. రామయ్య ఆశ్చర్యపడుచు పోయి అక్కడ కూర్చున్నాడు.

రామయ్యకు ఆశ్చర్యమైన విషయమేమంటే తన పేరును అక్కడికి పోయినప్పటి నుండిగానీ, ఆ ఊరిలో ప్రవేశించినప్పటి

నుండిగానీ, బస్సులో ప్రయాణించునపుడు గానీ ఎవరికీ చెప్పలేదు. అలాంటప్పుడు తన పేరు తాను చెప్పకున్నను

చెప్పుచున్నదంటే ఈ దేవతకు అన్ని విషయములు తెలిసే ఉంటాయని అనుకున్నాడు. ముందర పోయి కూర్చున్న

తర్వాత ఆమె రామయ్యవైపు చూచి రామయ్యా నీవు మల్లేపల్లి నుండి వచ్చావు కదా! అన్నది, అందుకు రామయ్య అవును

అన్నట్లు తలూపాడు. సుంకులమ్మ అనిన ఆ మాటను రామయ్య విని నేను చెప్పకనే నా ఊరును కూడ చెప్పింది

అనుకొన్నాడు. తర్వాత సుంకులమ్మ రామయ్యా నీకు ఒక్కతే కూతురు కలదు. ఆ అమ్మాయి పెళ్ళి విషయమును అడిగే

దానికి వచ్చావు అన్నది. ఆ మాటతో రామయ్య ఆశ్చర్యచకితుడై పోయాడు. ఈ దేవతకు సమస్తము తెలుసునని

నూటికి నూరుపాళ్ళు ఆ దేవతను నమ్మినాడు.


రామయ్యది ఏ ఊరైనది అతని పేరు ఏమైనది, అతను వచ్చినది దేని కోసము అను విషయము వాస్తవముగ

రామయ్య ఎవరికి చెప్పకుండినా సుంకులమ్మ నిజంగానే చెప్పింది. ఈ విషయమునే హేతువాదులు ఖండిస్తున్నారు.

అలా చెప్పుటకు వీలుకాదు అంటున్నారు. వారు ఖండించినా, వీలుకాదనినా, వాస్తవముగా రామయ్య పేరు, ఊరు,

వచ్చిన పనిని చెప్పింది. ఈ విషయము హేతువాదులు పరిశీలనగా పరిశోధించి చెప్పకుండా గ్రుడ్డిగా కాదంటున్నారు.

అందువలన అటువంటి వారిది నిజమైన హేతువాదము కాదంటున్నాను. నిజము చెప్పాలంటే హేతువాదము

శాస్త్రబద్ధమైనపుడు హేతువాదము హేతుబద్దత వుతుంది. హేతుబద్దత ప్రకారము ఒక గ్రామదేవత ఒక వ్యక్తి యొక్క

పేరును, ఊరును, పనిని ఎలా చెప్పింది? అలా చెప్పుటకు హేతువేమి కారణమేమి) అని యోచించి చూస్తే, ఆ ప్రశ్నను

శోధించి చూస్తే, జవాబు దొరుకుటకు కొంత ఆధారమున్నది. దొరికిన ఆధారము ప్రకారము అతని పేరును, ఊరును

పనిని తెలుసుకోవచ్చును. ఒకవేళ అలా చెప్పుటకు వీలుకాదనిపిస్తే, ఎలా వీలుకాదో దానికి కూడ ఆధారము

చూపాలి. తెలియని విషయమును ఎలా చెప్పుచున్నారో హేతువాదికి తెలియకపోతే, ఖండించుటకు కూడా శాస్త్రబద్ధత

కావాలి. ఎదుటి మనిషిని మీ మాటలలో శాస్త్రబద్ధత లేదు అవి అసత్యము అని హేతువాది అంటే, అవి ఎలా

అసత్యమో చెప్పుటకు కూడ శాస్త్రబద్దత కావాలి.


ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుతాను చూడండి. ఈ మధ్య రెండు రోజుల క్రితము 'టివి9' చానల్లో "బ్రహ్మముగారి

కాలజ్ఞానము నిజమా? అబద్దమా?" అని చర్చావేదికను నిర్వహించారు. అందులో ఇద్దరు సైన్సు చదివినవారు పాల్గొన్నారు.



కాలజ్ఞానము నిజము అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుచున్నపుడు. ఫోన్లో మాట్లాడు వ్యక్తి కాలజ్ఞానము నిజమండీ,

బ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞాన వాక్యములలో ఇప్పటికి పదిహేను, ఇరవై శాతము ప్రత్యక్షముగా జరిగి ఉన్నాయి.

కావున జరుగబోవు కాలములో మిగత వాక్యములు జరుగునని నమ్ముచున్నాము అన్నాడు. అప్పుడు ఆ వేదికలో

పాల్గొన్న గోగినేని బాబు అనునతడు ఇలా “అతను పదిహేను ఇరవైశాతము జరిగాయి అంటున్నాడు. ఇవన్ని

కాకిలెక్కలు, ఎన్ని జరిగినది కరెక్టుగా అతనికే తెలియదు. ఇన్ని జరిగాయి అనేదానికి శాస్త్రబద్దత లేదు”. అన్నాడు.

పైగా అతను నేను హేతువాదిని అంటున్నాడు. అతను ఇతరులు మాట్లాడిన మాటలలో లేదు అన్నపుడు,

ఎన్నో కొన్ని జరిగాయి కదా! అవి జరుగలేదు అనే దానికి అతని వద్ద శాస్త్రబద్దత ఉందా? ఏ శాస్త్రము ప్రకారము అని

జరుగ లేదని చెప్పగలడు? బ్రహ్మముగారు చెప్పిన మాటలు భవిష్యత్తులో జరుగవు అని చెప్పుటకు శాస్త్రబద్దత వుందా?

ఎర్రగుడ్డలు వాళ్ళు అని చెప్పే బదులు కమ్యూనిష్టులు అని పేరు చెప్పవచ్చును కదా! బ్రహ్మముగారు పేరు ఎందుకు

చెప్పలేదు అని ఆయన (గోగినేని బాబు) అన్నాడు. బ్రహ్మముగారున్నది నాలుగువందల సంవత్సరముల క్రితము,

అప్పుడు ఇంగ్లీషు భాషకు ప్రాచుర్యము లేదు. ఆ భాష బ్రహ్మము గారికి తెలియదు. అలాంటపుడు కమ్యునిష్టులు అని

ఎలా ఇంగ్లీషు పదమును చెప్పగలడు? ఒకవేళ ఆ దినము కమ్యూనిష్టులు అని ఆయన వ్రాసివుంటే, ఆ దినము

బ్రహ్మముగారికి ఇంగ్లీషు భాషరాదు. ఈ మాట ఆయన వ్రాసినది కాదు. మధ్యలో వేరేవాళ్ళు బ్రహ్మముగారి పేరుమీద

వ్రాసి, కాలజ్ఞానమని ప్రచారము చేయుచున్నారని ఇదే బాబుగారు అని ఉండేవారు. నక్సలైట్లు మావోయిస్టులుగా పేరు

మార్చుకున్నపుడు, జరుగబోవు కాలములో కమ్యూనిష్టులు, హ్యూమనిష్టులుగా పేరు మార్చుకోకూడదా! ఏ పేరు మార్చుకున్నా,

వారికి ఎర్రగుడ్డలే గుర్తు కావున ఎర్రగుడ్డలు వాళ్ళు అనడములో బ్రహ్మముగారికి దూరదృష్టి ఉన్నట్లే కదా!


గోగినేని బాబుగారు అదే వేదికలో బ్రహ్మముగారు చెప్పిన మాటలకు శాస్త్రబద్దత లేదు, సైన్సు ఒప్పుకోదు

అన్నారు. దానికి నేను ఏమనుచున్నానంటే బ్రహ్మముగారు కొంత జ్ఞానమును ఉపయోగించి ఒక తత్త్వమును పాట

రూపములో చెప్పాడు. ఆ తత్త్వము నూటికి నూరు పాళ్ళు భౌతికశాస్త్రమునకు సంబంధించినది. భౌతికశాస్త్రములో

ధాతు కణమును గురించి వివరముగా చెప్పగలిగిన మీరు, ఆయన చెప్పిన తత్త్వము భౌతికశాస్త్రమునకు సంబంధించినది

కాదని చెప్పగలరా? మాకు తెలుసు, మీరు కాదనే చెప్పగలరు. ఎందుకనగా మీరు భౌతికశాస్త్రవేత్తలైనా, మీకు

తెలియనిది ఎంతో ఉంది అనుటకు ఆ తత్త్వము ఒక తార్కాణము. సైన్సు చదివి మేము హేతువాదులమని చెప్పుకొను

వారు ఎవరూ దానిని భౌతిక శాస్త్రమునకు సంబంధించినదని చెప్పలేరు. కానీ మేము ప్రతి పదమును, ప్రతి వాక్యమును

భౌతికమునకు సంధానము చేసి చెప్పగలము. మేము చెప్పిన దానిని శాస్త్రీయముగా ఎవరు ఖండించటకు వీలులేదు.

బ్రహ్మంగారు అంత పెద్ద భౌతికశాస్త్రవేత్తయినపుడు, ఆయన శరీర రహస్యమును శాస్త్రబద్ధముగ కక్కయ్యకు చెప్పినపుడు,

ఆయన మాటలలో శాస్త్రీయత లేదు అంటే, మేము ఒప్పుకుంటామా! హేతువాదులమని, సైన్సు చదివామని,

చెప్పుకొనువారు బ్రహ్మము గారి తత్త్వములోని శాస్త్రమును గుర్తించలేనివారు గ్రుడ్డివారు కాదా? భగవద్గీతలో

ఐదువేలసంవత్సరముల పూర్వము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగమును గురించి చెప్పినది భౌతికశాస్త్రము కాదని ఎవరైనా చెప్పగలరా?

భౌతిక శాస్త్రము తెలిసిన వారు ఎవరూ కాదనరు. ఇలా వ్రాస్తూపోతే నడిచే దారిని వదలి ప్రక్కకు పోయినట్లవుతుంది.

ఇది కేవలము ఉదాహరణకు మాత్రము చెప్పుకొన్న విషయము. ఇపుడు అసలు విషయానికి వస్తాము.


ధర్మవరములో మా జ్ఞానము తెలిసిన ఒక ఇంటిలో, ఒక సమస్య వచ్చినది. ఆ సమస్య ఎప్పుడు తీరుతుందో

తెలుసుకొనుటకు ఆ ఇంటి వారు ఒక దేవత దగ్గరకు పోవాలనుకొన్నారు. యల్లపు శ్రీరాములు అను ఆ ఇంటి యజమాని


వద్దు అన్నాడు. ఇంటిలోని వారు పోవాలని పట్టుబట్టారు. అపుడు ఇంటి యజమాని ఆ దేవతకేమి తెలుసు, అది ఒక

దయ్యము అని అన్నారు. అపుడు అలా అనవద్దని అతనికి నచ్చచెప్పి, బలవంతముగ అతనిని ఆ దేవత దగ్గరకు

తీసుకొని వచ్చారు. అక్కడకు వచ్చిన ఇంటి యజమానిని, పూనకము వచ్చిన ఆ దేవత చూచి, ఏమిరా? మీ

ఇంటిదగ్గర నన్ను నీవు తిట్టలేదా? చెప్పు? నన్ను దేవతకాదు దయ్యము అనలేదా చెప్పు అని అడిగిందట. ఆ దేవత అలా

అడుగుతూనే, ఆ వ్యక్తి బిత్తరపోయి నేను ఇంటిదగ్గరన్న విషయము ఈమెకెలా తెలిసింది? అనుకొని నాది తప్పు,

క్షమించమని ప్రాదేయపడ్డాడు. ఈ సంఘటనను చూచినా, తట్రకల్లు సుంకులమ్మ చెప్పినట్లే ధర్మవరము పెద్దమ్మ కూడ

చెప్పినది. ఈ సంఘటనను యోచించి, అందులోని రహస్యమును అనగా మనకు తెలియని విధానము ఏముందో

తెలుసుకోవడము శాస్త్ర పరిశోధకుని కర్తవ్యము. అలా కాకుండ తనకు తెలియనిదంతా లేదు, కాదు అనుకొంటే అది

శాస్త్రశోధన కాదు. శాస్త్రశోధన లేని దానివలన కొందరు దేవతలు కొన్ని విషయములను ముందే చెప్పుచూ

పూజ్యనీయమైపోయారు. కొందరు జ్యోతిష్యులున్నారు వారు జ్యోతిష్యము అడిగేదానికి వచ్చినవారిని ముందు

మూడుపువ్వుల పేర్లు చెప్పమంటారు. అందులో ఏదో ఒక దానిని గుర్తు పెట్టుకొమ్మని చెప్పుతారు. తర్వాత మూడు

అంకెలను చెప్పమంటాడు, వాటితో ఏదో లెక్కలు చేసి మనము గుర్తుపెట్టుకొన్న పువ్వు పేరునే చెప్పుతారు.

చెప్పడముతో మనకు అతని మీద ఒక నమ్మకము ఏర్పడుతుంది. మన మనస్సులో అనుకున్నది చెప్పాడు కదా! అట్లే

మన జ్యోతిష్యమునంత కరెక్టుగా చెప్పునని నమ్మి, అతను ఎంత అడిగితే అంత ఇచ్చి భవిష్యత్తు చెప్పించుకొంటాము.

తర్వాత అతను చెప్పింది సత్యమో కాదో అది దేవుడెరుగును. కానీ ప్రస్తుతానికి అతను సత్యమే చెప్పునని మూఢంగా

నమ్ముచున్నాము.


ఈ దేవతల వద్ద కూడ ఇటువంటి తంతు ఏదో జరుగుచున్నదని జ్యోతిష్యుని విషయమును ఆధారము చేసుకొని

చూస్తే అర్థమవుతుంది. జ్యోతిష్యునివద్ద ముందు మన మనసులోని మాట చెప్పాడు కదా! ఇక ఆయన చెప్పునవన్ని

సత్యమే అగునని ఎట్లు ఒక నిర్ణయానికి వస్తున్నామో, అలాగే దేవత ముందు మన ఊరు పేరు, వచ్చిన పనిని చెప్పిన

వెంటనే మన మనసులోని మాటను చెప్పింది. ఇక ఆమె చెప్పునవన్ని సత్యమేనని నిర్ణయానికి వస్తాము. జ్యోతిష్యుడు

ముందే చెప్పినది మనమనుకొన్న పువ్వును, దేవత ముందే చెప్పినది మనము అనుకొన్న పనిని ఎలా చూచినా రెండు

ఒకే కోవకు చెందినవే! ఇందులో ఏదో మనకు తెలియని విధానముంది అని నేను బాగా యోచించి, జ్యోతిష్యునివద్ద

చెప్పవలసిన మూడు అంకెలలో రెండు వేరువేరు అంకెలు చెప్పి, మూడవది ముందు చెప్పిన రెండు అంకెలలోనిదే

మరొకటి చెప్పగా, ఆ జ్యోతిష్యుడు ఈ అంకెను ముందే చెప్పావు, చెప్పింది వద్దు మరియొక అంకెను చెప్పమన్నాడు.

ఇక్కడ చెప్పిన అంకెను చెప్పినా లేక రెండు అంకెలు చెప్పినా మనము నిర్ణయించుకొన్న పువ్వును అతను గుర్తించలేడు.

అలాగే దేవతలవద్ద కూడ మనకు తెలియని విధానము ఒకటి కలదు. దాని మూలంగానే మన మనసులోని మాటను

వారు మనము చెప్పకనే చెప్పుచున్నారు. ఆ విధానమును బయటపెట్టుటకు ఒక చిన్న ప్రయోగము చేశాము. అదేమనగా

ధర్మవరములో ఇంటివద్ద దూషించి దేవతవద్దకు పోయినది నా అనుచరుడే! అతని ద్వారా ఆ దేవత తను దూషించిన

విషయము పసికట్టి చెప్పిందని అతను నాకు చెప్పగా, నేను అతనికి ఆమె ఎలా చెప్పిందో అర్థమగుటకు ఒక

ఉపాయము చెప్పాను. ఈ తూరి రెండవమారు ఏదో ఒక సమస్యను పెట్టి దానిని అడిగే దానికి మీ ఇంటిలోని వారిని

పంపించు. నీవు మాత్రము పోవద్దు. కానీ నీవు ఈ తూరి కూడ అది దేవుడేకాదు దానిమీద నాకు నమ్మకము లేదు

మీరే పోండి అని చెప్పి పంపు. అపుడు నీవు పోకున్నా మీ ఇంటిలోని వారితో ఆ దేవత మీ ఇంటియజమాని ఇలా

మళ్ళీ నన్ను దూషించాడు అని చెప్పుతుందో లేదో చూడమని చెప్పిపంపాను. అతను నేను చెప్పినట్లు చేశాడు. ఆ



దేవతను నేను చెప్పిన దానికంటే ఎక్కువ దూషించి నాకు నమ్మకము లేదు, నేను రాను మీరే పోండని చెప్పి పంపాడు.

ఆ ఇంటి వారు ఆ దేవతవద్దకు పోయి తమ సమస్యను చెప్పగ దానికి ఆమె ఏదో సమాధానము చెప్పి పంపినది. కానీ

మీ యజమాని నన్ను రెండవమారు కూడ దూషించాడని వారితో చెప్పలేదు. ఇతను అక్కడికి పోయివుంటే అతనిని

చూచి నీవు మళ్ళీ నన్ను దూషించావే అని అడిగేది. అతను పోలేదు కావున, ఆయన తనను దూషించినట్లు ఆ దేవతకు

తెలియదు.


దీనికి ఆధారమేమి? మీరు ఎలా చెప్పగలుగుచున్నారని కొందరు అడుగవచ్చును. దానికి నా సమాధానమును

చూడండి. మనిషి కనిపిస్తేనే అతని మనసులో అతనికి తెలిసియున్న దానిని దేవత గ్రహించగలదు. మనిషి కనిపించకపోతే

అతనిలోని ఉద్దేశమును ఏ దేవతా చెప్పలేదు. ధర్మవరము పెద్దమ్మ దగ్గర జరిగినది, తట్రకల్లు సుంకులమ్మ దగ్గర

జరిగినది ఒకే విధానమే! ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. తట్రకల్లు సుంకులమ్మ దగ్గరికి పోయిన రామయ్య

తన కూతురు పెళ్ళి విషయమును అడగాలను ఉద్దేశముతోనే పోయాడు. కావున ఆ విషయమును ఆ దేవత చెప్పగలిగింది.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్నరాగలదు. అదేమనగా! ఎదుటి వ్యక్తి తలలో ఆ సమయములోనున్న విషయమును

దేవత గ్రహించి చెప్పగలదు అన్నారు కదా! మనిషియొక్క తలలోనున్న విషయమును దేవత ఎలా గుర్తించగలదు? అని

అడుగవచ్చును. దానికి కూడ జవాబు చెప్పుచున్నాను. ఇప్పుడు నేను చెప్పు జవాబు శాస్త్రబద్దమైనదని కూడ చెప్పుచున్నాను.

భౌతికశాస్త్రము ప్రకారము చెప్పబడు ఈ వివరమును బాగా అర్థము చేసుకోవాలని చెప్పుచున్నాను. భౌతిక శరీరము

రెండు భాగములుగా ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. ఒకటి స్థూలశరీరము, రెండు సూక్ష్మశరీరమని వాటి పేర్లు

గలవు. స్థూలశరీరములోపల సూక్ష్మశరీరము ఉన్నది. కనిపించు స్థూలశరీరము కనిపించని సూక్ష్మశరీరమునకు పై

తొడుగు (పై కవర్) లాంటిది. మీకు సులభముగా అర్థమగుటకు స్థూల, సూక్ష్మ శరీరములకు ఉదాహరణగా ఒక

ట్యూబ్లైటును తీసుకొని చూద్దాము. ట్యూబ్ లైట్ను విభజించి చూస్తే లోపల వెలుగు వేరు, పైన కనిపించు ట్యూబ్

వేరు. పైన కనిపించు గాజు ట్యూబ్కు స్వయంగా వెలిగే శక్తిలేదు.


వెలుగు శక్తి ట్యూబ్ లోపల ఉండును. లోపల వెలిగిన ప్రకాశము బయటికి ట్యూబ్ ద్వారానే కనిపించును.

లోపలనుండి వచ్చు ప్రకాశము ట్యూబ్ గాజుపొరలో దూరి బయటికి రావలసియుండును. మనిషి లోపలి సూక్ష్మశరీరమునకు

పైన స్థూలశరీరము పై తొడుగులాగ ఉన్నదని చెప్పుకొన్నాము కదా! అలాగే లోపలి వెలుగుకు బయటి ట్యూబ్ పై

కవర్గ ఉన్నది. పైన ట్యూబ్ దుమ్ముపట్టి ఉంటే లోపలి వెలుతురుకు దుమ్ము కొంత ఆటంకముగావుండి పూర్తి

వెలుతురు బయటికిరాదు. అలాగే పై ట్యూబ్కు కొంత నూనె జిడ్డు తగులుకొని, ఆ పైన కొంత దుమ్ము, ధూళి పేర్కొన్న

దనుకొనుము. అప్పుడు లోపలి నుండి వచ్చు వెలుగు ఇంకా కొంత తగ్గి వెలుతురు తక్కువగా కనిపించును. లోపలినుండి

వచ్చు వెలుగు ఆకుపచ్చ రంగుగా కనిపించాలని ట్యూబ్పైన ఆకుపచ్చ పేపర్ను చుట్టి పెట్టామను కొండి. అప్పుడు

ట్యూబ్ ఆకుపచ్చరంగులో వెలిగినట్లు కనిపించు చుండును. కానీ వెలుగు తొంభైపాళ్ళు పేపర్ వలన నిరోధింపబడి

కేవలము పది పాళ్ళు వెలుగుమాత్రము బయటికివచ్చును. ట్యూబ్ శుభ్రముగా ఉన్నది ఒకటి, ట్యూబ్ కొంత దుమ్ముపట్టినది

ఒకటి, నూనె జిడ్డు దుమ్ము తగులుకొన్న ట్యూబ్ ఒకటి, కలర్పేపర్ చుట్టిన ట్యూబ్ ఒకటి మొత్తము నాలుగింటిని

తీసుకొని చూస్తే లోపల వెలిగే వెలుగు అన్నిటికి సమానము గానే ఉన్నది. ఆ వెలుగు బయటికి రావడములో నాలుగు

రకముల తేడాలున్నాయి. శభ్రముగానున్న ట్యూబ్లో నుండి పూర్తి వెలుగు బయటికి వస్తూ బాగా ప్రకాశిస్తున్నది.

మిగతా మూడు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకముగా కనిపిస్తున్నవి. వెలుగు ఒకటే అయినా, బయటి ట్యూబ్లను బట్టి వెలుగు


బయటికి వస్తున్నదని అందరికి అర్థమైనదనుకొంటాము. వివరంగా చెప్పాలంటే లైట్కు స్థూలంగా కనిపించు గాజుట్యూబ్

లోపల సూక్ష్మంగా కనిపించని రెండు ఫిలమెంట్లు ఉన్నవి. మనకు బయటికి కనిపించని ట్యూబ్లోట్లోని ఫిలమెంట్లు

నుండి వచ్చే వెలుగు, బయట స్థూలంగా కనిపించు ట్యూబ్నుండి బయటికి వస్తున్నది. అలా వచ్చు వెలుగు, పైన

స్థూలంగానున్న ట్యూబ్ సామర్థ్యమును బట్టి ఉంటుంది. అలాగే మనిషి స్థూలశరీరము లోపలగల సూక్ష్మశరరీమునకు

కూడ చూపు అనబడే ఫిలమెంటు గలదు. ఆ ఫిలమెంట్ వెలుగు స్థూలశరరీమునకున్న రెండు కళ్ళు అను అద్దముల

ద్వారా బయటికి వస్తున్నది. కళ్ళు అనబడు రెండు అద్దములు శుభ్రముగ ఏ లోపము లేకుండ ఉంటే లోపలి చూపు

బయటికి బాగా కనిపించును. అద్దములలో లోపముంటే చూపు బయటికి వచ్చేది కూడ అంతంతమాత్రమే ఉండును.


స్థూలశరీరమునకు రెండు కళ్ళు దేవుడిచ్చిన రెండు అద్దముల లాంటివి. మనిషికి వయస్సు పెరుగుకొద్దీ రెండు

కన్నులలో కొంత సామర్థ్యము తగ్గి, లోపలినుండి చూపు ఉండినా, బయటి కన్నులు సరిగ చూడలేక పోవుచుండును.

అలాంటపుడు కళ్ళ డాక్టర్ల దగ్గరకు పోయి దేవుడిచ్చిన కన్నులు అను అద్దములకు తోడు, బయటనే మరియొక జోడి

బూస్టర్ అద్దములు తగిలించుకొని కన్నుల సామర్థ్యములను పెంచుకొని చూపును పెంచుకొంటున్నాము. నాలుగురకముల

ట్యూబ్లో లోపలి వెలుగు నాలుగురకముల బయటికి వచ్చినట్లు, మనుషుల శరీర కన్నుల ఆరోగ్యమును బట్టి చూపు

అనేక రకముల కనిపిస్తున్నది. ట్యూబ్లైట్లో లోపలి ఫిలమెంటు వెలుగు బయటికి వచ్చునపుడు శుభ్రముగా ఉన్న

ట్యూబ్లో కూడ కొంత వెలుగు నిరోధించబడుచున్నది. ట్యూబ్కు ఉన్న తెల్ల అద్దములో దూరి వచ్చునపుడు వెలుగు

కొంత తగ్గిపోయి వస్తున్నది. అలాగే మనిషి స్థూల కన్నులనుండి బయటికి వచ్చు చూపు, ఏ రోగము లేని ఆరోగ్యమైన

కన్నులలో కూడ పది శాతమే బయటికి వస్తున్నదని చెప్పవచ్చును. ఒకనికి చూపు బాగుంది అని చెప్పినా, అది వాని

సూక్ష్మశరీరమునకున్న చూపులో కేవలము ఐదునుండి పది శాతము వరకే ఉన్నదని చెప్పుటకు ఆధారముగలదు. ఈ

మా మాట నమ్మశక్యముగా లేకున్నా శాస్త్రబద్ధమైనది, సత్యమైనది. స్థూల కన్నులను అద్దములో నుండి వచ్చు చూపు

అను వెలుగు పది శాతము వరకే ఉన్నపుడు. కన్ను అను అద్దమును లేకుండ చూచువానికి నూటికి నూరుపాళ్ళు చూపు

అను వెలుగు బయటికి వచ్చి దూరముగా ప్రసరించుచున్నది.


స్థూలశరీరమున్న వాని చూపుకంటే, స్థూలశరీరములేని వానికి చూపు నూరింతలు ఎక్కువ ఉండును అనునది

సూత్రము!. ఈ సూత్రము ప్రకారము స్థూలకన్నులతో ఒక కిలోమీటరు దూరము వరకు చూచు శక్తియున్నవాడు,

స్థూలశరీరము లేనపుడు సూక్ష్మశరీరముతో వంద కిలోమీటర్ల దూరము వరకు చూడగలడు. అంతేకాక మరొక విషయము

ఏమనగా! సూక్ష్మశరీరముతోనున్నపుడు ఎదుటి వ్యక్తి స్థూలశరీరములోనున్న సూక్ష్మములోని మనో బుద్ధి యొక్క ప్రస్తుత

సంకల్పములు సులభముగా తెలియగలడు. అందువలన ఒక దేవతా సూక్ష్మము, ఎదుటి మనిషి యొక్క శరరీములోని

ప్రస్తుతమున్న యోచనలను నిర్ణయములను తెలుసుకోగలుగుచున్నది. అట్లు తెలియుట వలననే రామయ్య మనస్సులోని

మాటను రామయ్య చెప్పకనే సుంకులమ్మ చెప్పగలిగింది. కానీ ప్రస్తుత సమయములో రామయ్య తలలోనున్నది చెప్పగలిగిన

సుంకులమ్మకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ దేవతకు భవిష్యత్తు తెలియదని, మనుషులకు తెలియదు.

వర్తమానములో మన తలలోని విషయమును మనము చెప్పకనే దేవత చెప్పడము వలన, ఆ దేవతకు అన్నీ తెలుసునని,

మనిషి ఒక నిర్ణయానికి వచ్చి ఆమె చెప్పే మాటలన్నీ సత్యమేనని నమ్మడము జరుగుచున్నది. ధర్మవరము పెద్దమ్మ ఈ

సూత్రము ప్రకారమే యల్లపు శ్రీరాములుతో నీవు ఇంటివద్ద నన్ను దూషించావు అని చెప్పి, తనకు అన్ని తెలుసునని

నమ్మించింది. అలాగే తట్రకల్లు సుంకులమ్మ కూడ రామయ్యను నమ్మించ గలిగింది. కొంతకాలము ప్రజలు ఆమె


చెప్పునవి జరుగునని పోయినవారు కాలక్రమములో అలా జరుగక పోవడము వలన, కొంత అక్కడికి పోవడము

తగ్గిపోయినది. కొన్ని సంవత్సరముల వరకు అక్కడికి పోవడము, పెరిగిన సంఖ్య తగ్గిపోవడానికి మరికొన్ని సంవత్సరములు

పట్టినది.


ఒక్క తట్రకల్లులోనే కాదు దేశములో అనేక చోట్ల ఇటువంటి తంతులే జరుగుచున్నవి. వాటిని హేతువాదులు

హేతుబద్దముగ ఖండించడము లేదు, గ్రుడ్డిగ ఖండించుచున్నారు. మన తలలోని ప్రస్తుత మాటను వారు చెప్పుటను

సత్యముకాదు అని మొండిగ వాదిస్తున్నారు. ఒక వ్యక్తి చెప్పకనే వాని మనస్సులోని మాటను ఎదుటి దేవత చెప్పినపుడు

ఆ వ్యక్తికి సత్యమని తెలిసినపుడు, హేతువాదులు దేవతలు చెప్పునది అబద్దము, బూటకము, నాటకము అని అరిచినా,

ఆ వ్యక్తియే కాదు ఎవరూ వినరు. వాస్తవానికి హేతువాది చెప్పినది అసత్యమగును. అందువలన దేశములో ప్రజలయందు

హేతువాదమునకు ఉన్నత స్థానము లేకుండ పోయినది. హేతువాద పద్ధతి సరియైనది, గొప్పది అయినా దాని పేరు

చెప్పుకొని మేము హేతువాదులమను వారు గ్రుడ్డిగ వాదిస్తున్నారు. కావున హేతువాదమునకు మర్యాద లేకుండ

చేసినవారగుచున్నారు. నాకు తెలిసిన హేతువాదము ప్రకారము, వర్తమానములో మనిషిలోని విషయము గ్రహించి

దేవతలు చెప్పుట సత్యమేనని, కానీ వారు భవిష్యత్తు చెప్పలేరని చెప్పడమే కాక అందరికీ అర్థమగునట్లు వివరించాము.

సత్యమును అంగీకరించి, అసత్యమును అంగీకరించకపోవడమే నిజమైన హేతువాదము అని మేము చెప్పుచున్నాము.


దేవతలు గుడులలో, రాతిప్రతిమలలోనే కాకుండ మనుషుల శరీరములలోనికి కూడ వచ్చి మాట్లాడుదురని

తెలుపుటకు ఒక సంఘటనను వివరిస్తాను చూడండి. మేము చెప్పు విషయములు సత్యమును తెలుపుటకే గానీ, ఏ

దేవతలను కించపరుచుటకు కాదని ముఖ్యముగ తెలియజేసు కొంటున్నాను. 1975వ సంవత్సరములో అనగా ఇప్పటికి

ముప్పైఐదు (35) సంవత్సరముల క్రిందట ఒక దినము తొండపాడు అను గ్రామములో ఉండే రంగనాయకులు స్వామి

గుడిలోనికి పోయాను. నేను గుడికి పోయాను అంటే పూజ చేయటానికికాదు, కొబ్బరికాయలు కొట్టడానికి కాదు.

చల్లగా ఉంటుందని లోపలికి పోయి కూర్చున్నాను. కొద్దిసేపటికి తెల్ల జుబ్బా పైజామా వేసుకొన్న దాదాపు

యాభైసంవత్సరముల వయస్సు గల వ్యక్తి దేవాలయములోనికి వచ్చాడు. ఆ సమయములో మిగత భక్తులు కూడ

పూజ చేయించుకుంటున్నారు. అంతలో ఉన్నట్టుండి అక్కడే ఉన్న ఒక స్త్రీకి పూనకము వచ్చింది. కన్నులు పెద్దవి చేసి

తీక్షణముగా అప్పుడే వచ్చిన పెద్దమనిషి వైపు చూస్తు, ఊగిపోతూవుండగా ప్రక్కనే ఉన్న ఆమె బంధువులు ఆమెను

పట్టుకొన్నారు. అక్కడే ఉన్న పూజారి “ఎవరునువ్వు? రంగనాయకుల స్వామి గుడిలోనికే ఏకంగా వచ్చావు? ఇక్కడికి

రాకూడదు బయటికి పో!" అన్నాడు. అప్పుడు ఆమె పూజారివైపు చూస్తూ "ఏమిరా! నా గుడిలోనికి నేను కాక

ఎవరొస్తారు. నన్ను మీరు గుర్తుపట్టలేదు. నేనే రంగనాయకుణ్ణి" అనగానే అందరు మ్రొక్కను మొదలుపెట్టారు. రంగ

నాయకుల స్వామి ఆమెలోనికి వచ్చాడని అందరికి అర్థమైనది. నేను ప్రక్కన కూర్చోని ఆ వింత చూస్తున్నాను. ఆమె

తిరిగి తెల్ల జుబ్బావేసుకొన్న పెద్ద మనిషివైపు చూచి ఇలా అన్నది.


రంగనాయకులు :- ఏమిరా నీకు నేను ఐదు సంవత్సరములకు జ్ఞాపకము వచ్చానా? ఈ రోజు వచ్చావు.

పెద్దమనిషి :- (ఏమి చెప్పాలో తెలియక నోరు తడబడుచుండగా) లేదు స్వామీ! నిన్ను నేను ఎప్పటికీ మరచిపోలేదు. నీ

పూజే చేస్తున్నాను. చాలా రోజుల నుండి ఇక్కడికి రావాలనుకొంటున్నాను. రాలేక పోయాను. అదే నాతప్పు.

రంగనాయకులు:- రాలేక పోయావు. ఐదేండ్ల క్రిందట ఏమి లేదు. ఆ రోజు నేను అవసరమై నాదగ్గరకు వచ్చావు. ఆ

రోజు బస్సులో వచ్చావు. ఈరోజు కారు, ధనము, ఇల్లు అన్ని వచ్చాయి. ఇంక నాతో అవసరము ఏముంది.


పెద్దమనిషి :- నాకు ఎన్ని ఉండినా అన్నీ నీవు ఇచ్చినవే. నీవు ఎప్పటికీ కావాలి, నేను నిన్ను మరచిపోను. ఇప్పటినుండి

ప్రతి సంవత్సరము వస్తాను.


రంగనాయకులు:- ఐదు సంవత్సరముల క్రిందట కూడ ఇలాగే మ్రొక్కావు. నీవు మొక్కిన దానికి నేనే మోసపోయాను.

ఆ రోజునుండి ఈ రోజు వరకు నీ జాడేలేదు. ఈ రోజు కూడ నా దగ్గరకు రావాలని రాలేదు, వేరే పని మీద పోతూ

దారిలో గుడివుంది కాబట్టి మ్రొక్కిపోదామని వచ్చావు. మొదట వచ్చినపుడు నన్ను కష్టాలనుండి కాపాడు, నీకు

అభిషేకములు చేయిస్తా, పూజలు చేయిస్తా అని చెప్పి తర్వాత కనపడకుండ పోతావా?

పెద్దమనిషి :- లేదు స్వామి నేను మొక్కుకున్నట్లు నీ వలన బాగుపడినాను. నేను నిన్ను మరచిపోకుండ పూజలు

చేయిస్తున్నాను. నెలకొక్కమారు అభిషేకము చేయిస్తున్నాను.

రంగనాయకులు:- అబద్దాలు చెప్పవద్దు ఎప్పుడు చేయించావు?

పెద్దమనిషి :- ఆలూరులో పూజారికి ముందే డబ్బు ఇచ్చి, ఒకవేళ నేను పనిపడి రాకపోయినా, నెలలో ఏకాదశి రోజున

అభిషేకము చేయునట్లు ఏర్పాటు చేసినాను. నేను కూడ హాజరై పూజ చేసి వస్తున్నాను.

రంగనాయకులు :- నీవు మ్రొక్కినది నాదగ్గర! నాకు చేయకుండ ఆలూరు రంగనాయకులుకు పూజచేస్తే సరిపోతుందా?

అక్కడ చేస్తే ఆయనకు చేసినట్లు, ఇక్కడ చేస్తే నాకు చేసినట్లు. ఎక్కడ మ్రొక్కితే అక్కడే చేయాలి.

పెద్దమనిషి :- నాకు ఏమి అర్థముకాలేదు. అక్కడ చేస్తే నీకు చేసినట్లు కాదా! అక్కడుండేది కూడా నువ్వే కదా!

రంగనాయకులు:- బాగా అర్థమయ్యేటట్లు చెప్పుతాను విను. ఇక్కడుండేది నేను బొల్లికొండ రంగనాయకులును.

అక్కడుండేది ఆలూరు రంగ నాయకులు. నేను వేరు, ఆయన వేరు. నాకు మొక్కి, ఆయనకు మొక్కు తీర్చితే ఎలా

సరిపోతుంది? నాకు మ్రొక్కినావు నాకు తీర్చలేదు. నీవు నాకు బాకీ ఉన్నట్లే. తెలియక పొరపాటుపడినావు. ఇప్పటినుండి

నీ మ్రొక్కుబడి ఇక్కడే తీర్చుకో! లేకపోతే నీవు చెడిపోతావు.

పెద్దమనిషి :- పొరపాటు స్వామీ! తెలియక నీ దగ్గరకు రాలేదు. ఇప్పటి నుండి నెల నెల ఇక్కడికే వచ్చి, పూజ చేసుకొని

పోతాను.


ఆ పెద్దమనిషి చెప్పిన తర్వాత రంగనాయకుల స్వామి ఆమె శరీరమునుండి పోయాడు. ప్రక్కనున్న వారికి

ఏమి అర్థము కాలేదు. ఆ పెద్ద మనిషికి కూడ ఏమి అర్థము కాలేదు. కానీ అక్కడికి పోయి మ్రొక్కినా నాకు మాత్రము

ఇక్కడికే వచ్చి మ్రొక్కాలి అనునది ఒక్కటి మాత్రము అర్థమైనది.


రంగనాయకులు ఏ గుడిలో ఉండినా, ఏ ఊరిలో ఉండినా అంతటా ఒక్కడే రంగనాయకుడు కదా! అని

అందరూ అనుకొనుట సహజము. కానీ ఒకే రంగనాయకులు, అన్ని గుడులలోను ఉండడు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క

రంగనాయకుడు ఉన్నాడనడము సత్యము. అలాగే ఆంజనేయ స్వామి గుడులు ఎన్నో ఉన్నాయి కదా! అక్కడ కూడా

ప్రజలందరు పడు పొరపాటు ఏమంటే రాముని బంటు ఆంజనేయుడని, ఆంజనేయుని గుడి ఎక్కడున్నా శ్రీరాముని

భక్తుడైన ఆంజనేయుడే ఉంటాడని అనుకుంటారు. కానీ అది సత్యముకాదు. తొండపాడులో బొల్లికొండ రంగనాయకుల

స్వామి చెప్పినట్లు, వేరు వేరు గుడులలో, వేరువేరు దేవుళ్ళున్నారనడము సత్యము. కసాపురము ఆంజనేయస్వామి


వేరు, గండి ఆంజనేయస్వామి వేరు. ఆంజనేయుడని ఒకే పేరుండినా, నిజముగా వారు వేరు వేరు దేవతలు. స్వభావము

కూడ వేరువేరుగా ఉండును. భక్తులు ముడుపులు ఇస్తామని మ్రొక్కి ఇవ్వక పోయినా ఒక ఆంజనేయస్వామి పట్టించుకోడు,

ఒక ఆంజనేయ స్వామి ముక్కుపిండి బాకీని వసూలు చేసినట్లు ముడుపులు వసూలు చేస్తారు. తొండపాడు

రంగనాయకులస్వామి ఆ పెద్దమనిషిని నిలదీసి అడగడము న్యాయమే. అప్పుచేసిన తొండపాడులో బాకీ తీర్చక,

ఆలూరులో ఇచ్చినానంటే ఆ పెద్దమనిషి పొరపాటు పడినట్లే.


నీవు షావుకారు మల్లారెడ్డి దగ్గర అప్పు తీసుకొని, నీకు దగ్గరగా ఉన్నాడని చింతమాను మల్లారెడ్డికి డబ్బులిచ్చి

నా బాకీ తీరిపోయింది కదా, నేను ఇచ్చింది మల్లారెడ్డికే కదా! అంటే అప్పు ఇచ్చిన షావుకారి మల్లారెడ్డి ఊరక

ఉంటాడా? కోర్టుకు లాగి మరీ రాబట్టుతాడు. అలాగే ఒక ఆంజనేయు నికి మ్రొక్కి, ఇంకొక ఆంజనేయునికి ఇచ్చినా,

ఒక రంగనాయకుల స్వామికి మ్రొక్కి ఇంకొక రంగనాయకుల స్వామికి మ్రొక్కు తీర్చినా ఒప్పుకోరు. అదే ఆ పెద్దమనిషి

విషయములో జరిగినది. ఇదంతా మీకెలా తెలుసు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి నా జవాబు ఏమనగా! నేను పదేళ్ళ

వయస్సులో వజ్ర కరూరులో ఉంటిని. ఆ ఊరిలో పీర్ల చావిడులు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఊరికి క్రొత్తగావచ్చిన

కరెంటు ఆఫీస్ పనిచేసే హెల్పర్ ఒక వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉండేవాడు. అంతలో అక్కడ పీర్లపండుగ

వచ్చింది. ఆ పండుగలో పీర్లను నిలబెట్టినారు. హెల్పర్ ప్రసాద్ ఉన్న వీధిలో కూడ పీర్లచావిడి ఉండేది. హెల్పర్

ప్రసాద్ పీర్లచావిడి దగ్గరికి సాయంకాలము పోయి, నాకు పెళ్ళి ఈ సంవత్సరము అయితే వచ్చే పీర్లపండుగకు గుడ్డలు

ఇస్తాను, ఐదు శేర్ల చక్కెర చదివిస్తానని ఉస్సేన్ అను పేరుగల పీరుకు మ్రొక్కుకొన్నాడు. ఆ వీధిలో ఉస్సేన్ పీరు

శక్తివంతమైనదని, మ్రొక్కితే తప్పక నెరవేరునని ఆ వీధిలో అనెడివారు. అందువలన ప్రసాద్ తన పెళ్ళి విషయము

గురించి మ్రొక్కినాడు. ఆ పండుగ పోయిన తర్వాత నాలుగు నెలలకే ప్రసాద్కు పెళ్ళి అయినది. తర్వాత నెలకు భార్య

కాపురానికి వచ్చినది. అప్పుడు ప్రసాదున్న ఇల్లు చాలా చిన్నది, కావున అతను అదే ఊరులోనే, వేరే ప్రాంతము

వీధిలోని పెద్ద ఇంటిలోనికి వచ్చాడు. తర్వాత ఆరు నెలలకు పీర్ల పండుగ వచ్చింది. అప్పుడు హెల్పర్ ప్రసాద్ ఉస్సేన్

పీరుకు ముడుపు లేక మ్రొక్కుబడి తీర్చాలి కదా! ఆ రోజు చెప్పిన ముడుపు కోసము, ప్రసాద్ ఐదుశేర్లు చక్కెర మరియు

క్రొత్త గుడ్డలు తెచ్చి ప్రస్తుతము ప్రసాదున్న వీధిలోని పీర్లచావిడిలో ఉన్న ఉస్సేన్ అనే పీరుకు చక్కెర చదివించి, గుడ్డలు

ఇచ్చాడు. అంతటితో తాను మ్రొక్కుకున్నట్లు ఉస్సేన్కు ముడుపు చెల్లించానని తృప్తి చెందాడు. అలా చేసిన రెండవరోజే,

మొదట ప్రసాద్ కాపురమున్న వీధిలోని ఉస్సేన్ అను పీరు ప్రసాద్ ఇంటిముందుకు వచ్చింది. పీరును ఎత్తుకొన్న

మనిషికి పూనకము వచ్చి మాట్లాడుచు "ప్రసాద్! చక్కెర గుడ్డలు ఇస్తానని చెప్పి, నీవు ఆ ప్రక్కకు రాలేదు. నా ముడుపు

ఇవ్వవలసిందే” అని చెప్పాడు. అది చూచిన ప్రసాద్ నివ్వెరపోయి "నిన్ననే ఐదుశేర్లు చక్కెర, క్రొత్త గుడ్డలు ఇచ్చాను

కదా” అన్నాడు. “నీవు నాకు మ్రొక్కినావు నాకు ఇవ్వాలి. అట్లు కాకుండ ఈ వీధిలోని ఉస్సేన్కు ఇస్తే నాకు ఇచ్చినట్లు

ఎట్లగును? ఈ వీధిలో ఉస్సేన్కు నాకు సంబంధము లేదు. నీవు మాత్రము నాకు ఇవ్వవలసిందే”. అని వీరు చెప్పింది.

ఆ మాటతో ఆ పీరు ఉస్సేన్ వేరు, ఈ పీరు ఉస్సేన్ వేరని ప్రసాద్కు అర్థమైనది. రేపు తప్పకుండ మ్రొక్కుకున్నది

ఇస్తానని ప్రసాద్ చెప్పగా వచ్చిన వీరు పోయింది. అతను మరుసటి దినము చక్కెర, గుడ్డలు తీసుకొని, ముందు

కాపురమున్న వీధిలోనికి పోయి, అక్కడ పీర్ల చావిడిలోనున్న ఉస్సేన్ పీరుకు సమర్పించి వచ్చాడు.


ఈ విషయమునంతటిని పదేళ్ళ వయస్సులో వజ్రకరూరులోనున్న నేను ప్రత్యక్షముగా చూచాను. ఆ దినమే

పీర్ల విషయము అర్థమైనది, తర్వాత, కాలము జరుగుకొలది పీర్లచావిడిలోని పీర్లేకాక, దేవతల గుడిలోని దేవుళ్ళు


కూడా ఒకే పేరుకల్గిన వారైనప్పటికీ, గుడి గుడికి వేరు వేరుగా ఉన్నారని అర్థమైనది. అందువలన తొండపాడు గుడిలో

నాముందరే జరిగినది నాకు తెలిసిన పాత విషయమే, కావున నాకు ఏమీ ఆశ్చర్యము కాలేదు. కానీ అప్పుడు అక్కడున్న

వారందరికి అది క్రొత్త విషయమైన దానివలన వారికి ఒక్కమారుగ అర్థముకాక, రంగనాయకుల స్వామి మాటలకు

తికమక పడినారు. చివరికి తొండపాడు రంగనాయకులు వేరు, ఆలూరు రంగనాయకులు వేరు అనే విషయము

అర్థముకాలేదు. వారికి అర్థమైనదంతా ఏ గుడిలో మ్రొక్కితే, ఆ గుడిలోనే మ్రొక్కుబడి చెల్లించాలను విషయము

మాత్రము అర్థమైనది.


ఈ విధముగ చెప్పుకొంటూ పోతే, మనిషికి తెలియని రహస్యములు ఎన్నో ఉన్నాయి. ఒకే పేరున్న వ్యక్తులు

నలుగురుంటే, వారికున్న పేర్లు ఒకటే అయినప్పటికి వారు మాత్రము వేరు, వారి ఉద్దేశములు వేరు, వారి ప్రవర్తన

వేరుగా ఎట్లున్నవో, అలాగే ఒక ఊరిలో ఒకే పేరున్న ఆంజనేయుని గుడులు నాలుగున్నాయనుకొనుము. ఆ నాలుగు

గుడులలో ఉన్న నలుగురు ఆంజనేయుళ్ళు వేరువేరుగా ఉన్నారు. అలాగే వారి గుణములు వేరు, వారి ప్రవర్తన వేరుగా

ఉండునని, పైన చెప్పిన రంగనాయకులస్వామి, ఉస్సేన్ పీరు ఉదంతము చూచిన తర్వాత ఎవరికైనా అర్థముకాగలదు.

నాకు చిన్న వయస్సులోనే అర్థమైనది, కావున నేను మీకు చెప్పుచున్నాను. నా మాటను వివరంగా అర్థము చేసుకొన్నవారికి,

ఒకే పేరున్న వారంతా ఒకే దేవుడుకాదని కొంతవరకు తెలుస్తుంది. కానీ ఈ గ్రంథమే చదవని వారికి దేవతల గురించి

ఏమీ తెలియదు. అటువంటివారు ఒకరి దగ్గర బాకీ చేసి అదే పేరున్న ఇంకొకరి దగ్గర అప్పు తీర్చినట్లు, పళని

సుబ్రమణ్యముస్వామికి కానుక ఇస్తానని చెప్పి తిరుత్తణి సుబ్రమణ్యస్వామికి ఇవ్వడముగానీ, గండి ఆంజనేయస్వామికి

ముడుపు ఇస్తానని, కసాపురము ఆంజనేయస్వామికి ఇవ్వడముగానీ జరుగుతావున్నది. అట్లు చేయుట వలన మ్రొక్కిన

వారికే కష్టము నష్టము కలుగునని తెలియవలెను. ఇటువంటి దేవతలను గురించి హేతువాదులు ఏమనగలరో?


మనిషి శరీరమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అను నాలుగు దశలు కలవు. నాలుగు

దశలు అయిపోయిన తర్వాత శరీరము చనిపోవడము కూడ జరుగుచున్నది. శరీరము నాలుగు దశలలో, శరీరమునందు

నివసించిన జీవుడు మరణములో శరీరమును వదలి పోవుచున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరికీ

తెలియని విషయము కూడ ఒకటున్నది. అది ఏమనగా! మనిషికి మాంసముతో కూడుకొన్న శరీరమున్నట్లు, ఒక

దేవతకుగానీ, ఒక దేవునికి గానీ, రాతితో తయారుచేయబడిన ప్రతిమయే శరీరముగా ఉన్నది. ఒక దేవతకు

దేవతయొక్క ప్రతిమ స్థూలశరీరముగా ఉండగా, సూక్ష్మశరీరము మాత్రము మనుషులకున్నట్లే ఉన్నది. దేవతా ప్రతిమలో

మనిషి స్థూల శరీరమునకు కనిపించునట్లు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము మరియు మరణములు

కనిపించవు. ప్రతిమలో శరీర దశలు కనిపించకపోయినా, ప్రతిమ యొక్క సూక్ష్మశరీరమునకు అన్ని దశలు మనుషులకు

ఉన్నట్లే తప్పక ఉండును. మనిషి శరీరము మరణాంతరము కుళ్ళిపోయి నాశనమైపోవును. కానీ ఒక దేవతా శరీరమైన

ప్రతిమ ఆ దేవత మరణించినా కూడ ప్రతిమ నాశనము కాదు, ఎట్లున్నది అట్లే ఉండును. మనిషి శరీరము

మరణములో కదలకుండ పడిపోవును, కావున ఆ మనిషి చనిపోయాడని శరీరమును చూచి చెప్పవచ్చును. కానీ దేవత

చనిపోయినట్లు ప్రతిమను చూచి చెప్పలేము. ఇక్కడ కొందరికే కాక అందరికి కూడ వచ్చు ప్రశ్న ఒకటి గలదు. ఒక

మనిషి తన శరీరములో చనిపోయినట్లు, ఒక దేవత తన శరీరమైన ప్రతిమలో చనిపోతుందా? అని అడుగవచ్చును.

దానికి మా జవాబు ఏమనగా!


ఒక మనిషి అయినా, లేక దేవత అయినా ఏదో ఒకరోజు చనిపోవలసిందే. గుడిలోని దేవతలకు కూడ

చావుగలదు, మరియు వెంటనే పుట్టుక కూడ గలదు. దీనినిబట్టి చావుపుట్టుకలకు, దేవతలు కూడ అతీతులు కారని

తెలియుచున్నది. మనిషికి ఉన్నట్లే గుడిలోని దేవతలకు కూడ ఆయుస్సు ఉన్నది. మనిషికి ఆయువు పరిమితి 120

సంవత్సరములు. అట్లే దేవతల ఆయుస్సు, ప్రతిమలను శరీరములలో 120 సంవత్సరములు మనుషులకు ఉన్నట్లే ఉ

న్నది. అందువలన మనిషికి, దేవతలకు ఆయుస్సు పరిమితిలో ఎటువంటి తేడాలేదు. కానీ మనుషులైనా, దేవతలైన

ఆ జన్మకున్న ప్రారబ్ధ కర్మప్రకారము కొన్ని సంవత్సరములు బ్రతికి చనిపోవు చున్నారు. ఒక ప్రతిమలో ఒక

దేవుడున్నాడనుకొనుము. ఆ దేవుడు 80 సంవత్సరములకు చనిపోతే, ఆ ప్రతిమ ఖాళీ అయిపోతున్నది. అట్లు ఖాళీ

అయిన ప్రతిమలోనికి, క్రొత్త జీవుడు జన్మ తీసుకొని పుట్టుచున్నాడు. అలా పుట్టిన జీవుడు ఆ ప్రతిమలలోని దేవునిగా

చలామణి అగుచున్నాడు. అలా కాలగమనములో ఒక ప్రతిమలో ఎందరో జీవుళ్ళు, దేవుళ్ళుగా చలామణి అయినట్లు

తెలియుచున్నది. ఒక ప్రతిమలో కొంత కాలము ఒక జీవుడు, ఆ ప్రతిమ పేరునుబట్టి, ఆ దేవునిగా ప్రవర్తించినా

అతనికి కూడ గుణములు కర్మనుబట్టి పనిచేయును. అందువలన ఒక దేవుని గుణము, పనులు, ఉద్దేశములు, స్వభావములు

అదే ప్రతిమలో చేరిన వేరొక దేవునికి (జీవునికి) ఉండవు. ఇదంతా కొంతమందికి ఆషామాషీగా కనిపించినా, నేను

చెప్పునది సత్యము అనుటకు ఎన్నో ఆధారములు గలవు. అటువంటి ఆధారమును క్రింద వివరిస్తాము చూడండి.


ఈ విషయమును చెప్పబోవు ముందు ముఖ్యముగ ఒకమాట చెప్పదలచుకొన్నాము. ఇంతకు ముందు చెప్పినది

దయ్యాల విషయములే. కానీ ఇప్పుడు చెప్పునది గుడిలోని దేవుని విషయములు. సత్యమును భావితరాల వారికి

అందించుటకు యదార్థమైన విషయములను చెప్పవలసి వచ్చినది. కానీ ఇందులో ఏ దేవుణ్ణి కించపరిచే ఉద్దేశము

ఏమాత్రము లేదు. దైవజ్ఞానమును తెలిసిన వ్యక్తిగా వ్రాస్తున్నానే తప్ప, అజ్ఞానముతో ఏమీ వ్రాయలేదు. భగవద్గీతలో

భగవంతుడు చెప్పిన జ్ఞానము, ఇందూ సమాజములో గుర్తింపురావాలని, ప్రచారము కావాలని, ప్రతి ఒక్కరికి తెలియాలని

గీతలోని శ్లోకముల ఆధారముతోనే ఇక్కడ చెప్పు విషయములు ఉండునని తెలియజేయుచున్నాము. భగవద్గీత ప్రకారము

దైవత్వమును రెండు విధములుగా మనుషులు అర్థము చేసుకొన్నారు. ఎందరో దైవత్వమును అనేక దేవుళ్ళ రూపములో

చూస్తున్నారు. కొందరేమో దైవత్వమును ఒక్కదేవునిగానే చూస్తున్నారు. ఆ ఒక్క దేవుణ్ణి రూప, నామ, క్రియలు అను

మూడు లేనివానిగా లెక్కించుచున్నారు. చాలామంది ఆకారము, పేరు, పని మూడు ఉన్న వానిని దేవుడుగా

లెక్కించుచున్నారు. దేవునికి రూప, నామ,క్రియలు ఉన్నాయని అనుకొనువారు రూపమున్న ప్రతిమలను దేవునిగా

లెక్కించుకోవడము, ఆరాధించడము జరుగుచున్నది. ఆ నేపధ్యములో అనేకమంది, అనేక దేవుళ్ళను తయారుచేసుకొన్నారు.

భూమిమీద ఉన్న అనేక దేవుళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఇష్ట దైవముగానో, ఇంటిదేవునిగానో పెట్టుకొన్నారు. ఆ

విధముగా ఒక దేవుణ్ణి ఇష్టముగా జీవితాంతము ఆరాధించువాడు, చనిపోయిన తర్వాత ఆ దేవునిగా మారిపోవును.

ఒక వ్యక్తి జీవితాంతము ఒక దేవున్ని ఇష్టముగా ఆరాధిస్తే ఆ వ్యక్తి చనిపోతే, అతను తల్లిగర్భములో తయారైన శిశువు

శరీరములోనికి ప్రవేశించక, తన జీవితములో ఏ దేవున్ని గొప్పగా పూజించాడో అదే పేరున్న ప్రతిమ శరీరము ఎక్కడుండినా

అక్కడ చేరును. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రొద్దుటూరులో రాముని గుడిలోని రాముణ్ణి ఎక్కువ శ్రద్ధతో జీవితాంతము

పూజించాడు. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయి టంగుటూరులోని రాముని గుడిలోనున్న రాముని ప్రతిమలో పుట్టాడు.

దీనినిబట్టి తెలియునదేమనగా పూజించినది రాముణ్ణి కాబట్టి పూజించిన గుడిలోనే కాక, ఏ గుడిలోనైనా రాముని

పేరున్న ఏ ప్రతిమలోనైనా చేరి పుట్టవచ్చును.


దేవతా భక్తులు దేవతలుగా మారుదురని భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు జరుగుచున్నది. ఈ విషయమును

గురించి భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్యయోగము అను అధ్యాయమునందు 25వ శ్లోకమున ఇలా గలదు.


“యాన్తిదేవ వ్రతాన్ దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః,

భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మధ్యాజినోకపి మామ్.”


భగవంతుడు ఈ శ్లోకములో చెప్పినట్లు, పూర్తి శ్రద్ధతో జీవితాంతము ఆకారమున్న దేవున్నిగానీ, పితృదేవతలనుగానీ,

జీవరాసులైన పక్షులు, జంతువులు, వృక్షములనుగానీ పూజించినవాడు వాటియందే చేరును. అట్లుకాక ఆకారము,

పేరు, పని లేనివాడైన దేవుణ్ణి పూజించిన లేక ఆరాధించినట్లయితే ఆ దేవునియందే చేరిపోవును. ఇక్కడ దేవునియందనగా

తిరిగి పుట్టకుండ, పరమాత్మయిన దేవునిలోనికి ఐక్యమైపోవునని అర్థము. దేవుడు దేవుళ్ళు అనే విషయము అర్థమగుటకు

చెప్పునదేమనగా! పుట్టించినవాడు దేవుడు, పుట్టినవారు దేవుళ్ళు. రూప, నామ, క్రియ లేనివాడు దేవుడు, రూప,

నామ, క్రియలున్నవారు దేవుళ్ళు. విశ్వమంతా అణువణువున నిండియున్నవాడు దేవుడు, విశ్వములో ఎక్కడో ఒక

చోటవున్నవారు దేవుళ్ళు. ఏ గుణములేనివాడు దేవుడు, అన్ని గుణములున్న వాళ్ళు దేవుళ్ళు. పుట్టనివాడు, చావనివాడు,

దేవుడు! చావు, పుట్టుక రెండు ఉన్న వాళ్ళు దేవుళ్ళు. యోగశాస్త్రము లేక బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసినవారు దేవుని

ఆరాధిస్తారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తెలియనివారు దేవుళ్ళను ఆరాధిస్తారు. అసలైన దైవత్వమును గురించి తెలియనివారు

వారికి తెలిసినదే జ్ఞానమనుకొని, దేవతలను ఆరాధించి, చనిపోయిన తర్వాత దేవతా ప్రతిమలోనే పుట్టుచున్నారు.


ఒక దేవతా ప్రతిమలో దేవుడను జీవుడు పుట్టాలంటే, ఆ ప్రతిమలో అంతవరకు ఉన్న దేవుడనబడు జీవుడు

మరణించి, ఆ ప్రతిమలోనుండి బయటకు పోయి ఉండాలి. ఒక ప్రతిమలోనున్న దేవుడు చనిపోతే, ఆ ప్రతిమలోనే

క్రొత్త దేవుడు పుట్టునని తెలియుచున్నది. అలా పుట్టిన క్రొత్త దేవునికి అదే ప్రతిమలోనున్న పాతదేవునికి స్వభావములోగానీ,

ప్రవర్తనలో గానీ ఎంతో తేడా ఉండును. భూమిమీద ఏ దేవాలయములోనున్న ఎంత పెద్ద దేవుడుగానీ, ఏదో ఒకనాడు

ప్రతిమను వదలి చనిపోవలసిందే! అలా చనిపోయిన దినమున క్రొత్త జీవుడు దేవుడుగా ఆ ప్రతిమలోనే చేరవలసిందే!

ఈ విధానము ప్రకారము చూస్తే దక్షిణ భారతదేశములోనే అతి పెద్దదైన పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానము.

దేవస్థానములో ఉన్నది సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరస్వామి. ఈ దినమున్న వెంకటేశ్వర స్వామి

శాంత స్వభావుడు, క్షమా గుణము కల్గినవాడు. తనను దూషించిన వానిని కూడా దీవించువాడు. తన సొమ్మును

అపహరించిన వానిని కూడ చూచి చూడనట్లు వదలివేయువాడు. తన భక్తులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో

ఉండాలనుకొనువాడు. ఇలా నేడు అన్ని విధముల గొప్ప దేవుడు తిరుమల వెంకటేశ్వరుడు!


ఇప్పటికి సరిగా అరవై సంవత్సరముల క్రిందట ఇదే తిరుమలలో ఉండే వెంకటేశ్వరస్వామి, తన సొమ్ము

ఒక్కరూపాయి పోయినా సహించుకొనే వాడు కాడు. ఎవరైన తనకు తీసిపెట్టిన డబ్బును మ్రొక్కి వాడుకొనినా, తర్వాత

దానికి వడ్డివేసి ఇవ్వాలి. తన సొమ్ము వాడుకొని వడ్డీతో సహా ఇవ్వకపోతే వారిని వదలకుండ తనసొమ్ము ఎంత

విలువైనదో తెలియునట్లు కష్టాలపాలుచేసెడివాడు. ఎవడైన తన సొమ్మును దొంగిలించితే వానికి కాలో, చెయ్యో పని

చేయకుండునట్లు చేసి శిక్షించేవాడు. అందువలన ఆ కాలములో తిరుపతి వెంకటేశ్వరస్వామి అంటే, భక్తికంటే భయమే

ఎక్కువ ఉండేది. అందువలన ఆయన సొమ్మును వాడుకొనేదానికి ఎవరు సాహసించే వారుకాదు. దొంగలు సహితము

తాము దొంగతనము చేసిన సొమ్ములో ముందుగా మ్రొక్కుకొన్నట్లు, దేవుని వాటా ఎంతో అంత హుండీలో వేసి పోయెడివారు.

ఆనాడు వెంకటేశ్వరస్వామిని వడ్డికాసులవాడని, దొంగలను సహితము దోచుకొనువాడని చెప్పేవారు. అలా ఆనాడు


చాలామందిలో భయము, భక్తి రెండూ ఉండేవి. ఆనాటికి, ఈనాటికి తేడా చూస్తే నేడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి

ఉంది, కానీ భయము ఏమాత్రము లేదు. ఎందరో భక్తులు భక్తితో కానుకలు తెచ్చి వెంకటేశ్వరస్వామి హుండీలో

వేయుచు, తమ భక్తిని ప్రదర్శించుకొంటూ ఉంటే, భయములేని ఎందరో దేవుని సొమ్మును ఇష్టమొచ్చిన పద్ధతిలో

కాజేయడము కూడా జరుగుచున్నది. ఆనాడు ఎవరైనా మాంసము తిని కొండమీదికి పోవాలన్నా భయపడేవారు.

ఈనాడు కొండమీదనే మాంసము, మద్యము ఉన్నట్లు వార్తలలో చెప్పు చున్నారు. ఈ విధముగ చెప్పుకొంటూపోతే

ఆనాటికి, ఈనాటికి ఎంతో తేడాగలదని తెలియుచున్నది.


వీటన్నిటినీ ఆధారము చేసుకొని చూస్తే ఆనాడు ప్రతిమలోనున్న వెంకటేశ్వరుడు వేరు, ఈనాడు అదే ప్రతిమలోనున్న

వెంకటేశ్వరుడు వేరు అని తెలియుచున్నది. ఆనాడు ఒక్క రూపాయి పోయినా ఆ వెంకటేశ్వర స్వామి వదలేవాడు కాదు.

ఈనాడు కోట్లు పోయినా, ఈ వెంకటేశ్వరస్వామి పట్టించుకోవడములేదు, చూచినా చూడనట్లు వదలివేస్తున్నాడు. (ఇదంత

మీకు క్రొత్త కథమాదిరి కనిపించవచ్చును. కానీ దీనిని కథ మాదిరి చూడకుండ సత్యమును తెలుసుకొనుటకు

ప్రయత్నించండి.) ఈనాడు తిరుమలలో దేవస్థాన పరిపాలనలోనే ఎన్నో అవకతవకలున్నట్లు, ఎంతో డబ్బును అభివృద్ధి

పేరుతో దోచుకుంటున్నారని అంటున్నారు. దీనినిబట్టి పరిశీలించి చూస్తే అరవై సంవత్సరముల క్రిందున్న

వెంకటేశ్వరస్వామి, ఇప్పుడున్న స్వామికాదు అని నిరాటంకముగా చెప్పవచ్చును. మీరు అంత ఖచ్చితముగా ఎలా

చెప్పగలుగుచున్నారని ఎవరైనా ప్రశ్నించినా, దానికి జవాబుగ పూర్వము అరవై సంవత్సరముల సమయములో జరిగిన

సంఘటను వివరించగలను చూడండి.


అనంతపురము జిల్లాలో పుట్టపర్తికి సమీపములో గోరంట్ల అను గ్రామము గలదు. అరవై సంవత్సరముల

క్రితము చాలా చిన్న గ్రామముగా ఉంటుందనుకుంటాను. ఆ ఊరిలో పురాతన దేవాలయములు, మంచి శిల్పకళతో

కూడుకొన్నవి ఉండుట వలన, ఆ గ్రామము కొంత చరిత్ర కలిగినదేనని అనిపిస్తుంది. గోరంట్లలో చిత్రావతినది ఒడ్డున

వున్న మాధవరాయుని గుడి ప్రసిద్ధి చెందినది. గోరంట్లలో అద్వైత పీఠమునకు చెందిన ఆశ్రమము కూడ కలదు. ఆ

ఆశ్రమములో రమణానంద భారతి అను స్వామి ఉండి, ఆ ప్రాంతము వారికి ఆధ్యాత్మికబోధలు చేసెడివారు. అందువలన

ఆ ఊరి వారందరికి సుపరిచిత వ్యక్తి ఆ స్వామీజీ. అరవై సంవత్సరముల క్రితము ఆ ఊరిలోని కొందరు తిరుపతికి

పోవాలనుకొన్నారు. దాదాపు పది కుటుంబములనుండి కుటుంబమునకు ఒక్కరు ప్రకారము పదిమంది

బయలుదేరాలనుకొన్నారు. ఆ ప్రయత్నములో అందరూ కలసి రమణానందభారతి స్వామిని తమవెంట, తమ ఖర్చులతోనే

తీసుకుపోవాలనుకొన్నారు. వారు అడిగితే స్వామి కూడ వస్తానని ఒప్పుకొన్నాడు. అప్పటికి స్వామితో సహా మొత్తము

పదకొండుమంది కాగ, అందులో ఒక కుటుంబము నుండి దాదాపు పది సంవత్సరముల వయస్సుగల అబ్బాయిని

పంపారు. వారందరు వెంకటేశ్వరస్వామికి తీసిన ముడుపుల డబ్బులు తీసుకొని బయలుదేరారు. ఆ కాలములో

ఇప్పటివలె హెూటళ్ళ సౌకర్యములేదు, కనుక ఇంటినుండి అన్నము, రొట్టెలు మొదలగు తిండిపదార్థములను మూటగట్టుకొని

బయలుదేరారు. గోరంట్లనుండి కదిరి, రాయచోటి, పీలేరు మీదుగ తిరుపతికి బస్సులో ప్రయాణించి చేరుకొన్నారు.

కాలములో ఇప్పటివలె క్యూలైన్ లేదు. దర్శనముకు ఆలస్యమయ్యేది కాదు. పోయిన వెంటనే దర్శనము లభించేది.

తిరుపతి చేరుకొన్న గోరంట్ల బృందము, ఉదయము తొమ్మిది గంటలకు వెంకటేశ్వరస్వామి దర్శనము చేసుకొని, ముడుపులన్ని

హుండీలో వేసి త్రాగు నీటి సౌకర్యమున్న చోటికి పోయి కూర్చున్నారు. వారితో పాటు తెచ్చుకొన్న రొట్టెలు తిని,

అక్కడినుండి పాపనాశన తీర్థమువరకు పోయి రావాలనుకొని, రొట్టెల మూటలు విప్పుకొని తినేదానికి మొదలు పెట్టు


సమయములో, ఆ గుంపులో వచ్చిన పది సంవత్సరముల బాలునికి పూనకము వచ్చింది. అప్పుడు ఆ పిల్లవాని

శరీరమంతా గట్టిగ వణికినట్లు కదలుచూ, నోటివెంట నా మూడుబొట్లు నాకు ఇవ్వు అను మాట మాటి మాటికి

వస్తున్నది. ఉన్నట్లుండి ఆ బాలునికి అలా జరగడము అక్కడి వారికి ఏమీ అర్థముకాలేదు. ఆ పిల్లవాడు అల

శరీరమంతా వణుకుచూ 'నా మూడు బొట్లు నాకివ్వు' అని అనడమేమిటి అని అక్కడేనున్న రమణానందస్వామి ఆలోచించి,

అది పూనకమేనని నిర్ధారించుకొని నీవు ఎవ్వరు? నీ మూడు బొట్ల విషయమేమిటి? అని అడిగాడు. ఆ పిల్లవాడు ఎవరి

మాటలను పట్టించుకోలేదు. అలాగే వణుకుచూ నామూడుబొట్లు నాకివ్వు అనుమాట మాటిమాటికి అను చున్నాడు.

అప్పుడు రమణానంద స్వామికి ఒక ఆలోచన వచ్చింది. పిల్లవాని కుటుంబమువారు వెంకటేశ్వరస్వామి ముడుపుడబ్బులను

హుండీలో వేయమని పిల్లవానిచేత పంపారు. ఈ పిల్లవాడు ఆ డబ్బులను అంతా హుండీలో వేయకుండ మూడుబొట్లు

దాచిపెట్టుకున్నాడేమోనని అను మానముతో పిల్లవాని జేబులన్నీ వెదికాడు. కానీ డబ్బులు కనిపించ లేదు. అంగీని

అల్లాడించగా అంగీ మెడపట్టిలో డబ్బుల శబ్దము వచ్చింది. ఆ శబ్దమునుబట్టి చూడగా మెడపట్టీలో మూడు బొట్లను

చొప్పించి దాచుకొన్నట్లు అర్థమైనది.


అప్పుడు రమణానందస్వామి, వెంకటేశ్వరస్వామికి మ్రొక్కు కొనడము జరిగినది. పిల్లవాడు తెలియక తప్పు

చేశాడు. నీ మూడు బొట్లకు మరియొక మూడుబొట్లు వడ్డీగా వేసి, నీ హుండీలో ఇప్పుడే వేస్తామని వెంకటేశ్వరస్వామికి

మ్రొక్కగా అప్పుడు పూనకము నిలిచిపోయి ఆ పిల్లవానికి జ్ఞాపకము వచ్చింది. వెంటనే ఆరుబొట్లు హుండీలో

వేసివచ్చారు. (ఆ కాలములో నయాపైసాలు లేవు రూపాయకు పదహారు ఆణాలు ఉండేవి. ఒక్క ఆణాకు నాలుగు బొట్లు

ఉండేవి. రెండు బొట్లు కలిపితే అర్థ ఆణా అనెడివారు. బొట్లు, అర్థ ఆణాలు, పావల, అర్థరూపాయి అని చెప్పెడివారు. అప్పటి

ఒక బొట్టు రూపాయిలో 64వ భాగము కాగ, ఆ బొట్టు విలువ ఇప్పటికాలములో పది రూపాయలకంటే ఎక్కువ విలువ

చేస్తుంది.) అలా ఆరుబొట్లు హుండీలో వేసివచ్చినప్పటికీ, ఆ రోజు పూనక సమయములో వచ్చిన వణుకు అదే

విధముగ అలాగే నిలిచిపోయింది. ఆ వణుకు జీవితకాలమంతా ఉండుట వలన అతని జీవితమే దుర్భరమైనది.

నడిచేటప్పుడు కాలు వణుకుచుండుట వలన అడుగు అనుకున్న చోటనే పెట్టలేడు. అందువలన క్రింద పడిపోయేదానికి

అవకాశమున్నది. శరీరమంతా కదలుచుండుట వలన అందరివలె అతను తన పనులు చేయుటకు కూడ వీలులేదు.

మొదట పూనకము వచ్చినపుడు నరముల మీద వచ్చిన వణుకు, పూనకము పోయిన తర్వాత కూడ నిలిచిపోవడము

వలన అతని జీవితమే దుర్భరమైనది.


నాకు పదమూడు లేక పదునాలుగు సంవత్సరముల వయస్సులో, నేను గోరంట్లలో ఎనిమిదవ తరగతి

చదువుచున్నపుడు చేతి కట్టె ఆధారముతో అతి కష్టముగా వణుకుచు నడుచు వ్యక్తిని చూచి, రమణానందస్వామిని

ఇతనెందుకు అలా నడుస్తున్నాడని అడుగగా, రమణానంద స్వామి మొత్తము సమాచారమునంతటిని చెప్పాడు.

రమణానందస్వామి ఆశ్రమములోనే మేము నివాసముండుట వలన, అనుమానము వచ్చిన ప్రతి విషయమును మరియు

తెలియని విషయములను అడిగి తెలుసుకొనుచుంటిని. వణుకుచు నడుచు వ్యక్తికి పూనకము వచ్చిన రోజున, ప్రత్యక్ష

సాక్షిగా రమణానంద స్వామి ఉండుట వలన, విషయమునంతటిని వివరముగా తెలిపాడు. నా చిన్న వయస్సులో ఆ

రోజు ఆయన చెప్పినది వింతకథలాగ కనిపించినా నాకు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు వచ్చే సమయానికి,

సూక్ష్మ శరీరముల విషయములన్నియు దాదాపుగా అర్థమైనవి. అరవైసంవత్సరముల క్రితము చిన్న పిల్లవాడు తప్పుచేసినా

వదలక పెద్దశిక్ష వేసిన ఆనాటి వెంకటేశ్వరస్వామికి, నేడు తన సొమ్మును ఎవడు ఎంత తినినా పట్టించుకోని వెంకటేశ్వర


స్వామికి అన్ని విధముల తేడా కనిపిస్తున్నది. అందువలన పూర్వమున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమలో చనిపోయాడని,

క్రొత్త వెంకటేశ్వరస్వామి ఆ ప్రతిమలో పుట్టాడని చెప్పవచ్చును. దీనినిబట్టి ఒక ప్రతిమలోనున్న వాడు చనిపోతే, ఆ

ప్రతిమలోనికి దేవుడుగా రావలసిన జీవుడు ఎవరని వెతుకకుండ భగవద్గీతలో భగవంతుడు ఫలానావాడే ప్రతిమలో

పుట్టగలడని చెప్పుచు “యాన్తి దేవవ్రతాన్ దేవాన్” అన్నాడు. ఆ మాట చాలాచోట్ల నెరవేరుచున్నదని తెలియుటకు

తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయమే మనకు నిదర్శనము. ఈ విధానము కొన్ని పదుల సంవత్సరములకు ఒకమారు

ప్రతి దేవాలయములోని ప్రతిమలయందు జరుగుచున్నా, ఆ విషయము కంటికి కనిపించునది కాదు, కాబట్టి ఎవరికీ

దేవతల, దేవుళ్ళ జనన మరణముల విషయము తెలియదని చెప్పవచ్చును. దేవుడున్నాడనీ, అలాగే దయ్యములు కూడ

ఉన్నాయను వారికే దేవుళ్ల జనన మరణ విషయము తెలియకపోతే, ఇక దేవుడుగానీ, దయ్యముగానీ లేనేలేదు అనేవారికి

ఈ విషయము అగమ్యగోచరముగా ఉండును. ఎన్నో విషయములు తెలియ కుండినా, అన్నీ తెలుసుననుకొను

హేతువాదులు, నాస్తికవాదులు తిరుపతిలో వచ్చిన ఆ బాలుని వణుకు రోగమును గురించిన కారణము చెప్పగలరా?

పూనకము వచ్చిన సమయమునుండియే, అలా అగుటకు కారణము చెప్పగలరా?? ఎవరికి తెలియకుండ దాచుకొన్న

మూడు బొట్ల విషయము గుడిలోనున్న వెంకటేశ్వరునికి ఎలా తెలిసిందో చెప్పగలరా??? మూడుకు మూడు వడ్డిగా

ఆరు బొట్లు ఇస్తామని చెప్పువరకు, నా మూడు బొట్లు నాకు ఇవ్వు అనుమాట ఆగకుండ, ఆ బాలుని నోట పలుకబడుటకు

కారణమును చెప్పగలరా? ఇట్లు తిరుపతి సంఘటనలో ఎన్నో హేతువులను అడగవచ్చును. ఇందులో ఒక హేతువును

కూడ తీసుకొని సమాధానము వెదకకుండ మొత్తముగా ఇదంతయు అబద్దము అనువారు హేతువాదులు అవుతారా?


ప్రతి మనిషిలో ఏ విషయమునైనా గ్రహించుకొను గ్రాహితశక్తి ఉంటుంది. ఆ గ్రాహితశక్తి ఒక్కొక్క మనిషిలో

ఒక్కొక్క రకముగా ఉండును. గ్రహించుకొను శక్తి ఉన్నది, కావున మనిషిని కూడ గ్రహము అనవచ్చును. కొందరిలో

గ్రహించుకొను శక్తి ఎంతయున్నా కొన్ని విషయములను గ్రహించుకోలేరు. అటువంటి విషయములను ఎదుటి వారు

తమ అనుభవములని ఎంత చెప్పినా, గ్రహించుకోలేక స్వయముగా అనుభవిస్తేగానీ మేము మీ మాటను విశ్వసించము

అనువారు గలరు. ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా! కంటితో చూస్తేగానీ, చెవితో వింటేగానీ అందులోని

వాస్తవమును తెలుసుకొనుటను గ్రాహితజ్ఞానము అంటాము. అట్లుకాక స్వయముగా అనుభవించి తెలుసుకోవడము

అనుభవ జ్ఞానము అంటాము. ఒక మనిషి క్రొత్త విషయములను తెలుసుకొనుటకు గ్రాహితజ్ఞానము అవసరము.

స్వయముగా తాను ఒక పనిని చేయవలసి వచ్చినపుడు అనుభవజ్ఞానము అవసరము.ఉదాహరణకు విద్యార్థులు

టీచర్లు చెప్పు విషయములను తమకున్న గ్రాహితశక్తి వలన గ్రహించు కొంటూపోతే వానికి 'గ్రాహిత జ్ఞానము' ఏర్పడును.

అలాగే ఒకడు డ్రైవర్గా మారాలంటే అప్పుడు అనుభవజ్ఞానము తనకి అవసరము. అతను స్వయముగా వాహనమును

నడిపి అనుభవము ద్వారా తెలుసుకొన్న దానిని 'అనుభవ జ్ఞానము' అంటాము. ఈ విధముగ చూస్తే మనిషికి అనేక

విషయములలో గ్రాహిత జ్ఞానము అవసరము. కొన్ని చోట్ల కొన్ని విషయములలో మాత్రమే అనుభవ జ్ఞానము

అవసరము. గ్రాహిత జ్ఞానము అవసరమున్న చోట అనుభవజ్ఞానము కావాలనుకొనువారు, ఎంత మేధావులనిపించుకొనినా

తెలివితక్కువారే. ఎప్పుడు ఏది అవసరమో తెలియకుండ అడుగువానిని తెలివితక్కువ వాడేనని చెప్పవచ్చును.

ఉదాహరణకు అన్నము తినేటప్పుడు కంచము (ప్లేటు) అవసరము. పడుకొనేటప్పుడు మంచము అవసరము. అట్లుకాక

తినేటప్పుడు మంచమును, పడుకొనేటప్పుడు కంచమును అడుగువాడు తెలివితక్కువ వాడు కాక ఏమగును? అందువలన

మనిషి కొన్ని వినడము, చూడడము వలన తెలుసుకోవచ్చును. కానీ వాటిని అనుభవిస్తేగాని నమ్మను అనేవాడు

తెలివితక్కువవాడగును.


కొందరు హేతువాదులు, నాస్తికవాదులు వినవలసిన వాటిని చూడాలనీ, చూడవలసిన వాటిని అనుభవించి

చూడాలనీ అడుగుచుందురు. వారే కాకుండ మరికొందరు కూడ అదే విధముగ మాట్లాడుచుందురు. ఎక్కడ ఏ

విధమైన గ్రహింపు కావాలో, తెలియకుండ మాట్లాడిన వారి విషయమును ఇప్పుడు వివరించుకొని చూస్తాము. ఇప్పటికి

ముప్పయి అయిదు సంవత్సరముల క్రిందట నేను వైద్యము చేయు సమయములో ఒక మాంత్రికుడు వచ్చి నాతో కలిసి

మాట్లాడినాడు. అతని ఊరు కనగానిపల్లి గానీ, కుంటిమద్దిగానీ అయివుంటుందని అనుకుంటాను. అతని వృత్తి

భూతవైద్యము చేయడము, గృహవాస్తు చెప్పడము వగైర వగైరా చేసెడివాడు. ఆ నేపద్యములో చుట్టు ప్రక్కల ప్రాంతములో

తిరిగేవాడు, అంతేకాక దూర ప్రాంతములకు కూడ పోయేవాడు. ఆ విధముగా కనగానిపల్లికి చుట్టుప్రక్కల ప్రాంతములు

అన్నియు అతనికి సుపరిచితమైనవే. కనగానిపల్లికి పదిహేను లేక ఇరవై కిలోమీటర్ల దూరములో కుంటిమద్ది అను

గ్రామము కలదు. ఆ గ్రామములో పీర్లపండుగ చేయుట గలదు. పీర్ల పండుగ సమయములో అక్కడ పీర్లు ఎత్తుకున్న

మనుషులలోనికి, పీర్లు అనబడు దేవుళ్ళు వచ్చి మాట్లాడడము కూడ జరిగేది. ఆ విధముగ మాట్లాడడము అన్ని ఊర్లలో

జరిగే విషయమే. అయితే మనుషులలో కొందరు ప్రత్యేకతను సంపాదించుకొన్నట్లు, కొన్ని గ్రామములలో కొన్ని పీర్ల

దేవుళ్ళు కూడ కొంత ప్రత్యేకతను కల్గియున్నారు. గ్రామములోనున్న పీర్లకు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పేరు ఉండును.

ప్రత్యేకత సంపాదించుకొన్న పీర్లయొక్క పేర్లను, ఆ ఊరి ప్రజలు గొప్పగ చెప్పుకొనుచుందురు. ఊరిలో ఎన్ని పీర్లు

ఉంటే అందులో అన్ని పీర్లు చురుకుతనముగా ఉండవు.


సంవత్సరమునకు ఒకమారు వచ్చు పీర్ల పండుగ సమయములో పీర్లచావిడిలో పీర్లను అలంకరించి నిలబెట్టడము

జరుగుతుంది. ఆ పీర్లను ఒక్కొక్క దానిని ఒక్కొక్కరు ఎత్తుకొని, ఊరిలో త్రిప్పడము కూడ జరుగుతుంది.

ఎత్తుకొని ఊరిలో తిరుగునపుడు పీరును ఎత్తుకొన్న మనిషిలోనికి ఆ పేరుగల సూక్ష్మము చేరి, ఎత్తుకొన్న వానికి జ్ఞప్తి

లేకుండ పోతుంది. అప్పుడు ఎత్తుకున్న వ్యక్తిలోనికి చేరిన పీరు, ఆ వ్యక్తి శరీరము ద్వారా మాట్లాడడము, ఊగడము,

తూగడము, ఎగరడము చేయుచుండును. అలా పూనకము వచ్చిన పీర్లు కొన్ని శాంత స్వభావముతో ఉండును. కొన్ని

చురుకుతనము కల్గి ప్రజలను అడిగి లేక బెదిరించి, తమ కోర్కెలను, మ్రొక్కుబడులను నెరవేరు నట్లు చేసుకొనుచుందురు.

అలాంటి పీర్లు పేరు పొందియుండును. (ఊరి పేరు సరిగా జ్ఞాపకములేదు, బహుశ ఆ మాంత్రికుడు చెప్పినది కుంటిమద్ది

అను గ్రామమే అనుకుంటాను) కుంటిమద్ది గ్రామములో ఒక పీరు ఎవరు ఎత్తుకొనినా, పూనకమువచ్చి ఊరంత తిరిగి

తనకు ఇష్టము వచ్చినవారి ఇంటికిపోయి అక్కడ వారిని పరామర్శించడమో, విమర్శించడమో, దండించడమో

చేసివచ్చుచుండును. అలా చేయడము వలన కొందరు మనుషులు, అన్ని పీర్లలో ఆ పీరు గొప్పదని చెప్పు కొనుచుండగ,

కొందరు ఆ పీరు గొప్పతనము ఏమీలేదు, కానీ ఆ పీరును ఎత్తుకున్న మనుషులు పూనకము వచ్చినట్లు నటించి, వారే

కొన్ని ఇళ్ళకు పోయి రాద్దాంతము చేసి వస్తున్నారు. అందువలన ఆ పీరుకు పేరువచ్చింది, అని అనువారు కూడ

కలరు. పేరుగాంచిన పీరును ఎత్తుకొన్న మనిషికి, ఆ పీరు పూనకమే రాలేదు అనువారిలో, నావద్దకు వచ్చి మాట్లాడిన

మాంత్రికుడు కూడ ఒకడు. పీర్లు ఊరేగించునపుడు గానీ, పీర్లు చావిడిలో నిలబెట్టి ఉన్నపుడుగానీ, పీర్లకు చక్కరను

చదివించుటకు, అలంకరించుటకు ప్రత్యేకమైన వ్యక్తి పీర్ల పూజారి మాదిరి ఒక వ్యక్తి ఉండును. పీర్ల పూజారిని

ముజావర్ పేరుతో పిలుస్తారు. పీర్లవద్ద నుండు ఆ వ్యక్తితో ఒక రోజు మాంత్రికుడు పూర్తిగా వాదిస్తూ ఇలా అన్నాడు.

“నేను మాంత్రికుణ్ణి ఎన్నో మొండి దయ్యాలను కూడ విడిపించాను. నాకు అన్నీ తెలుసు, ప్రతి సంవత్సరము ఒకే

మనిషి ఆ పీరును ఎత్తుకొనుచున్నాడు. ప్రతిమారు ఆ మనిషే ఎందుకు ఎత్తుకోవాలి? మీరు చెప్పునట్లు ఆ పీరు

పూనకము రాకున్నా, దానిని ఎత్తుకొన్న మనిషి పూనకము వచ్చినట్లు నటించి పీరుకు పెద్దపేరు వచ్చునట్లు చేశాడు”.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024