దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు part2 cloud text 24thsep24 Updated.
ఆ మాటకు ఆ పూజారి ముజావర్ బదులుగా ఇలా అన్నాడు “నీవు అనుకొన్నట్లు ఏమీ జరుగదు. ఎవరూ నటించరు.
ఆ పీరును ఎవరు ఎత్తుకొన్నా, వారి మీదికి ఆ పీరు వచ్చి మాట్లాడుతుంది. ఆ పీరును ప్రతి సంవత్సరము ఒకే మనిషి
ఎత్తుకొనే దానికి కారణము ఏమంటే? ఆ పీరును ఎత్తుకొనే దానికి ఎవరూ ముందుకు రావడము లేదు. ఏ పీరును
ఎత్తుకొన్నా అర్థగంటకంటే ఎక్కువసేపు ఎత్తుకొన్న వారికి ఆ పీరు పూనకములో ఉండదు. ఈ పీరు మాత్రము
మూడుగంటలసేపు పూనకములో ఉంటుంది. అంతసేపు పూనకములో ఉండుట వలన, ఆ పీరును ఎత్తుకొన్న మనిషికి
రెండు రోజుల వరకు శరీరములో నొప్పులు ఉంటాయి. అందువలన ఆ పీరును మొదటినుండి ధైర్యముగా ఒకేవ్యక్తి
ఎత్తుకుంటున్నాడు. అంతేతప్ప ఇందులో మోసములేదు.
అప్పుడు మాంత్రికుడు “నీమాట నిజమైతే ఈ సంవత్సరము ఆ పీరును నేను ఎత్తుకుంటాను. నీవు చెప్పినట్లు
నాకు పూనకము వస్తే నేను కూడ ఈ పీరు గొప్పదని ప్రచారము చేస్తాను. ఒకవేళ నాకు పూనకము రాకపోతే, మీరు
చెప్పునదంతా అబద్దమని, పీరులో ఏమిలేదనీ, పీరును ఎత్తుకొన్న మనిషే అలా చేస్తున్నాడని నేను ఊరిలో దండోరా
వేయిస్తాను” అన్నాడు. పీర్ల పూజారి కూడ సరేనన్నాడు. ఇదంతా మాంత్రికుడు స్వయముగా నాతో చెప్పిన విషయము.
అంతేకాక ఆ మాంత్రికుడు ఇంకా ఏమి చెప్పాడనగా! ఒకవేళ ఆ పూజారి ముజావర్ చెప్పునట్లు ఎత్తుకొన్న మనిషిలోనికి
ఆ పీరు వచ్చే మాట సత్యమే అయినా చివరకు నేనే గెలుస్తాను. ఎందుకనగా! నేను మాంత్రికున్ని కాబట్టి నాలోనికి
ఎవరూ చేరరు. ఎవరికైనా పట్టిన దయ్యాలను నేనే విడిపిస్తా ఉంటాను. నన్ను చూస్తే దయ్యాలు భయపడుతాయి.
అలాంటప్పుడు పీరుకూడ ఒక దయ్యములాంటిదే కదా! అలాంటప్పుడు అది నాలోనికి ఎలా పూనకము వస్తుంది?
ఏమాత్రము రాదు, అందువలన నేనే గెలుస్తాను అన్నాడు.
ఆ పీరును నేనే ఎత్తుకుంటానని మాంత్రికుడు చెప్పిన తర్వాత కొంతకాలానికి పీర్లపండుగ వచ్చింది. అప్పుడు
మాంత్రికుడు ముందే చెప్పిన ప్రకారము వీరును ఎత్తుకొనే దానికి పోయాడు. అందరూ పీర్లు ఎత్తుకొన్నట్లే మాంత్రికుడు
కూడ అక్కడున్న ప్రత్యేకమైన పీరును ఎత్తు కొన్నాడు. పీర్ల చావిడి ముందర త్రవ్విన గుండమువద్దకు వచ్చి గుండము
చుట్టూ తిరిగి ఊరేగింపుకోసము ఊరులోనికి పీర్లు పోవాలి. చావిడి దగ్గర పీర్లు ఎత్తుకొన్న వారందరు గుండము
ముందరికి వస్తూనే పీర్లు పూనకము వచ్చినవి. కానీ మాంత్రికునికి పూనకము రాలేదు. అప్పుడు సాయంకాలము
ఐదుగంటలైనది. మాంత్రికుడు గుండము చుట్టు పీరును ఎత్తుకొని తిరిగినాడు. అప్పటికీ పూనకము రాలేదు. గుండము
చుట్టు తిరిగి గుండము ముందర నిలుచుకొని వేచి చూచారు. అప్పటికీ రాలేదు. నాలోనికి ఏదిరాదు అనే ధైర్యముతో
మాంత్రికుడున్నాడు. అలా నిలబడినప్పుడు ముజావర్ ఉర్దూ భాషలో కల్మాలాంటి మంత్రము చదువుచున్నాడు. మాంత్రికుని
వీపుమీద ఎవరో గట్టిగ కొట్టినట్లు ఫలీమని శబ్దము వచ్చింది. ఆ ఏటుకు మాంత్రికుడు పట్టు త్రప్పిపోయి గిర్రున ఒక
చుట్టు తిరిగాడు. అంతవరకు జ్ఞప్తికి ఉన్న మాంత్రికునికి, ఒక చుట్టు తిరిగేలోపల జ్ఞప్తి పోయింది. తర్వాత ఏమి
జరిగిందో ఏమాత్రము అతనికి తెలియదు. మూడుగంటల తర్వాత పీరును దించిన సమయములో జ్ఞాపకము వచ్చింది.
అంతవరకు బాగానిద్రపోయి లేచినట్లయింది. అతను జ్ఞప్తిలోనికి వచ్చి చూచేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైనది. లెక్క
ప్రకారము నాలుగుగంటల కాలము తనకు తెలియకుండ పోయింది. ఆ నాలుగు గంటలు శరీరములోనికి పీరు
చేరినట్లు అతనికి అర్థమైనది. అప్పుడు ముజావర్ ముందర తాను ఓడిపోయినట్లు మాంత్రికునికి అర్థమైనది.
అలా మాంత్రికుడు అవమానముపాలై, కొంత మర్యాదను ప్రజలవద్ద పోగొట్టుకొని, తనకు పూనకము ఎలా
వచ్చిందో అర్థముకాక, దాని వివరమును తెలుసుకొనే దానికి నావద్దకు వచ్చి విషయమంతటిని పూస గుచ్చినట్లు
చెప్పాడు. దానినంతటిని విని నేను ఇలా చెప్పాను. “నీవు కేవలము మాంత్రికునివి మాత్రమే, నీ మంత్రబలము మీద
నీకు నమ్మకము ఎంత ఉండినా, నీ మంత్రబలముకంటే పెద్దబలము లేదనుకోవడము నీ పొరపాటు. నీవు మాంత్రికునివి
కాబట్టి నీకు దయ్యాలు భయపడుతాయి, నీ మంత్రబలముచేత పారిపోతాయి. అంతమాత్రమున నీవు పీరు నా
శరీరములోనికి రాలేదు అనుకొన్నావు. కానీ ఆ పీరు సాధారణ దయ్యమా, అసాధారణ దయ్యమా అని
ఆలోచించలేకపోయావు. మన భాషలో దయ్యమును గ్రహము అంటాము. (గ్రహము అనగా ముందే వివరము చెప్పాము.)
గ్రహముకంటే అన్ని విధముల శక్తి ఎక్కువగల దానిని విగ్రహము అంటాము. గ్రహము అనినా, విగ్రహము అనినా
రెండు దయ్యాలే అయినా శక్తిలో ఎంతో తేడా ఉండును. అలాంటి తేడాగల విగ్రహము ఆ పీరులో ఉండవచ్చును.
అందువలన అది నీలో చేరగలిగింది. నీవు నాలోనికి ఏది చేరలేదు అని జ్ఞప్తిగా ఉన్నపుడు, ఆ ఎరుకను మరిపించుటకు
ఆ పీరు విగ్రహము నిన్ను వీపు మీద గిర్రున తిరుగులాగున కొట్టింది. ఊహించని ఆ దెబ్బకు నీవు ఒక ప్రక్కకు
తిరుగుచు దయ్యము (పీరు) ఆలోచనను నీవు మరిచిపోయి నిన్ను నీవు రక్షించుకొను ధ్యాసలో ఉన్నపుడు ఆ పీరు
నీలోనికి చేరింది. నాలోనికి ఏది చేరదు అను ఉద్దేశమును ఒక్క క్షణము లేకుండ చేయుటకు నిన్ను కొట్టడము
జరిగింది. ఆ క్షణములో నీలోనికి చేరిపోయింది.
అక్కడ జరిగిన విషయమును పట్టి చూస్తే, నీవు నాలోనికి చేరవు అన్న మాటను పందెముగ తీసుకొని, పట్టువదలక
ఆ పీరు నీ లోనికి చేరింది. అంతేకానీ అది నీ మీద కక్షతోనో, కోపముతోనో చేరలేదు. అందువలన నాలుగు గంటల
కాలము నీ శరీరమును తన ఆధీనములో పెట్టుకొని, ఏ హాని చేయకుండ వదలిపోయింది. ఒకవేళ నీ మీద
కోపముతో నీ శరీరములో చేరియుంటే అది అంత సులభముగా వదిలేది కాదు. నాలుగు గంటలుండి వదలి పోయిన
తర్వాత, నీవు నాలుగు వారములు ఆసుపత్రికి పోవలసి వచ్చేది. నీకు అర్థమగుటకు గతములో జరిగిన చిన్న
ఉదాహరణను చెప్పుతాను విను. అనంతపురము జిల్లాలోనే గుత్తికి సమీపములో ఓబూలాపురము అను గ్రామము
కలదు. ఆ గ్రామములో ఉపసర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆ ఊరిలోని పీరును గురించి నీవు మాట్లాడినట్లే మాట్లాడినాడు.
అంతేకాకుండ ఆ ఊరి పేరును గురించి దుర్భాషగ మాట్లాడడము జరిగినది. నీవు నాలోనికి రాదు అని మాత్రము
అన్నావు. కానీ అతను పీరు పూనకము రావడము అబద్దము, అలా వచ్చినదని చెప్పితే వీరు ఎత్తుకున్న వానిని చెప్పుతో
పూనకమున్నపుడే కొట్టుతాను, ఎవడు ఎత్తుకోక పోతే నేనే ఎత్తుకొని పూనకము అబద్దము అని చూపిస్తాను, మనుషులు
అడే నాటకమే పూనకము. జానెడు రేకుకు కట్టెను తగిలించి ఎత్తుకొని దేవుడొచ్చాడని ఎగురుతారా? అని అన్నాడు.
పీరును జానెడు రేకు అన్నందుకు, పూనకము వచ్చిన వానిని చెప్పుతో కొట్టుతాను అన్నందుకు ఆ పీరుకు కోపము
వచ్చింది. ఇక మీదట ఎవరూ తనను గురించి మాట్లాడకుండ భయముండులాగున చేయాలను కొన్నది. పీర్లపండుగ
అతను మాట్లాడిన మూడవరోజే వచ్చింది.
పీర్ల పండుగ దినమున గొప్ప పేరున్న ఆ పీరును ఎవరూ ఎత్తు కోలేదు. ఉపసర్పంచ్ తిట్టినాడు కాబట్టి ఎవరు
ఎత్తుకొనే దానికి ముందుకు రాలేదు. ఎవరూ ఎత్తుకోక పోవడము వలన ఆ పీరును తిట్టిన ఆ సర్పంచ్ నేనే
ఎత్తుకుంటానని ఎత్తుకున్నాడు. ఊరేగింపు మొదలైంది. సమయము కొరకు వేచి చూస్తున్న ఆ పీరు యొక్క సూక్ష్మము
ఆ ఉపసర్పంచ్ శరీరము లోనికి ప్రవేశించింది. వెంటనే అతను కళ్ళు పెకలించి చూస్తూ, మోకాళ్ళ మీద నడువను
మొదలుపెట్టాడు. అది చూచిన ప్రక్కన వాళ్ళు పైకిలేపి నిలబెట్టినా, తిరిగి మోకాళ్ళ మీదనే కూర్చొని నడుస్తున్నాడు.
అది చిన్న ఊరు కావున ఒక గంటసేపుకు ఊరేగింపు అయిపోయింది. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ పీరు అతని
శరీరమునుండి తేలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞాపకము వచ్చింది. అతనికి మతికి వస్తూనే మోకాళ్ళ వద్ద నొప్పి
కనిపించింది. కాళ్ళవైపు చూచుకుంటే మోకాలి చర్మమంతా కచ్చులు, కచ్చులుగా చీలి రంధ్రాలుపడి రక్తముతో తడిసి
ఉన్నాయి. ఏమి జరిగింది అని ప్రక్క వారిని అడుగగ వారు జరిగిన విషయమంతా చెప్పారు. అప్పుడు పీరు అంటే
భయము చుట్టుకొన్నది. కాళ్ళు బాగుచేయించుకొనుటకు పది రోజులు ఆసుపత్రిలోనే ఉండిపోయాడు.
ఒక లెక్క ప్రకారము చూస్తే, ఓబులాపురములోని పీరు అతనికి వేసిన శిక్షకంటే నీకు జరిగిన అవమానము
పెద్దదికాదు. నీవు మాంత్రికునివై ఉండి, గ్రహాలకు (దయ్యాలకు), విగ్రహాలకు (దేవుళ్ళకు) తేడా తెలియని దానివలన
ఆ పీరు తన ఉనికిని తెలిపే నిమిత్తమే నీలోనికి ప్రవేశించి వదలింది. సర్పంచికి అట్లుకాదు. ఆ ఊరిలో అందరికి
భయము కల్గులాగున మోకాళ్ళ మీద నడిపించింది. ఆ సర్పంచ్కు కేవలము అజ్ఞానము తప్ప ఏ శక్తి లేదు. నీకు కొంత
మంత్రశక్తి అయినా ఉన్నది. కానీ నీ లోనికి చేరిన పీరుకు ఏదో కొంతశక్తి, నీ మంత్రశక్తికంటే ఎక్కువ ఉండుట వలన
నీలోనికి చేరి నీకంటే నేనే గొప్ప అని అర్థమగునట్లు చేసింది. నీవు ఏదో గొప్పగ అనుకొన్న మంత్రశక్తి, ఒక పీరు
ముందరే లెక్కకు పడలేదు. అందువలన ఇటువంటి మంత్రములను, దాని శక్తులను, నమ్ముకొనే దానికంటే అన్నిటిని
మించిన దైవజ్ఞానమును, దానిశక్తిని సంపాదించుకో! దైవశక్తిగల మనిషి వద్ద ఎంత పెద్ద దయ్యములైనా, దేవతలైనా
తలవంచి నడుచుకొంటారు. నీవు ఇప్పటినుండి క్షుద్రమైన మంత్రములను వదిలివేసి, పవిత్రమైన జ్ఞానమును
తెలుసుకొనుటకు ప్రయత్నించు అని అతనికి హితము చెప్పగా అతను బాగా విని స్పందించి, తనకు తెలియని జ్ఞానమును
గురించి అడిగి తెలుసుకొని, జ్ఞానమార్గములోనే నడుచుకొంటానని చెప్పి పోయాడు.
భూమిమీద కనిపించని జగతిలో దయ్యాలు, దేవుళ్ళు కలిసి యున్నారు. అందరూ జీవులే అయినప్పటకీ,
కొందరు జీవులు దయ్యాల తెగలోనివారు, కొందరు దేవుళ్ళ తెగలోనివారని తెలియుచున్నది. చాలా మంది శాస్త్రవేత్తలు
కనిపించని దానిని నమ్మరు, తెలుసుకొనే దానికి ప్రయత్నము కూడ చేయరు. కనిపించనిది లేదనుట, కనిపించేది
ఉందనుట వారి సూత్రము. ఏదో సమాజమునకు మేము మేలు చేస్తున్నామను ఉద్దేశముతో సత్యమును కూడ
అసత్యమంటే దానివలన సమాజమునకు కీడే జరుగును. సమాజములో దేవుళ్ళ పేరుతో మోసము చేయువారు
కొందరుండవచ్చును. అటువంటి వారిని అడ్డము పెట్టుకొని దేవుళ్ళు, దయ్యములు లేవు అనడము సమంజసముకాదు.
ఇపుడు చెప్పిన పీర్ల విషయములో జరిగిన దానిని అనగా పూనకమువచ్చి మోకాళ్ళుకు గాయమైన దానిని సత్యము
అందామా? అసత్యమందామా? చూచే దానికి పైకి కనిపించు సత్యము, కావున దానిని సత్యము అంటే, అది జరిగినట్లు
అతనికి జ్ఞాపకము వచ్చు వరకు తెలియదు. కాళ్ళు గాయమైనపుడు, పూనకములో ఉన్నప్పుడు ఆ విషయము ఎవరికి
తెలిసినది? అంటే ఆ సత్యమును హేతువాదులు చెప్పలేరు. ఎందుకనగా! ఆ సమయములో శరీరములో ఎవరున్నది
వారికి తెలియదు. పైకి కనిపించు మనుషుల శరీరములలోనే కనిపించని జీవున్ని తెలియనివారు, తమ శరీరములోపల
తాము ఎలా ఉన్నారో తమకే తెలియనివారు, తమకు తెలిసిన శాస్త్రములను అనుసరించి లోపలి విధానమును, లోపల
జీవున్ని గుర్తించలేరు. కనిపించు శరీరములలో జరుగు విధానము ఏదో తెలియనపుడు, అసలుకు శరీరము లేనివారిని,
శరీరములో చేరని వానిని గురించి ఏమాత్రము చెప్పలేము. ఇంతవరకు శరీరములోనికి చేరు దయ్యములను, దేవతలను,
వారిలోనే మహాత్ములను గురించి చెప్పుకొన్నాము కదా! ఇపుడు శరీరములో చేరకుండా అన్యాయమును ఖండించి,
అన్యాయమును చేసినవారికి కల్గించిన నష్టమును చూస్తే, ఇంకా ఇలాంటివి మనుషులకు తెలియకుండా ఎన్ని జరుగుచున్నవో
ఎలా తెలియగలవు? అను ప్రశ్న రాగలదు. అటువంటి ఒక యదార్థసంఘటనను గురించి చెప్పుకొందాము.
అది ఒక పల్లెటూరు. ఆ ఊరి బయట రోడ్డు ప్రక్కన ఒక పచ్చిమిరప తోట ఉండెడిది. దానికి ఒక మనిషి
కాపలాగా కూడ ఉన్నాడు. ఒకరోజు దారిలో పోవు ఒక సాధువు తోట ప్రక్కలో పోతూ, తోటలోని మిరపకాయలను
చూచి రెండు మిరపకాయలను త్రుంచుకోవాలనుకొన్నాడు. వెంటనే తోటలోనికి పోయి, రెండే రెండు మిరపకాయలు
త్రుంచుకొన్నాడు. అతనివద్ద అన్నము మాత్రమున్నది, కూర లేదు. అందువలన కూర బదులు మిరపకాయ కొరుక్కొని
అన్నము తినవచ్చుననుకొన్నాడు. అతను మిరప కాయలు త్రుంచినది తోట కాపలదారుడు చూచాడు. కాపలాదారుడు
అరుస్తూ అక్కడికి వచ్చాడు. సాధువును నానాదుర్భాషలాడి, మిరపకాయలు ఎందుకు త్రెంచావని అరుస్తూ అతను ఏమి
చెప్పినా వినకుండ, కేవలము రెండుకాయలే త్రెంచితినని చెప్పినా వినకుండ, సాధువును బాగా తన్నినాడు. రెండు
మిరపకాయలకు సాధువును అంతగ తన్నడము చూచిన వారికి ఎవరికైన అన్యాయమనిపిస్తుంది. కాని అక్కడ ఎవరూలేరు.
సాధువు బాధపడుచు తన దారిన తాను పోయాడు. అయినా ఆ విషయమును అంతటిని ఒక వ్యక్తి గమనించాడు.
ఇద్దరి స్థూలశరీరముల మధ్య జరిగిన సంఘటనను ఒక సూక్ష్మశరీరి అయిన వ్యక్తి చూచాడు. సూక్ష్మశరీరి అంటే
కనిపించని వ్యక్తి అని అర్థము. కనిపించని వ్యక్తికి ఆ సంఘటన చాలా అన్యాయమని పించింది. అయినా తాను
కనిపించని వ్యక్తి అయినందువలన అప్పుడు తానేమి అనలేక పోయాడు. అయినా ఆ తోట కాపలాదారునికి తగిన
ప్రాయశ్చిత్తము చేయాలనుకొన్నాడు. ఆ దినము రాత్రికి వచ్చి ఆ తోటలో ఒక సెంటు జాగాలోనున్న మిరపచెట్లను
పెరికి కుప్పవేసి పోయాడు. తెల్లవారిన తర్వాత ఆ తోట కాపలాదారుడు వచ్చి చూచి లబోదిబోమన్నాడు. నిన్న రెండు
మిరపకాయలకు ఒక సాధువును కొట్టినాను కదా! అతనే కక్షతో రాత్రికి వచ్చి నా చెట్లను పెరికాడనుకొన్నాడు. కాని
సాధువుకు ఏమి తెలియదు. తన దారిన తాను ఏడుస్తూ పోయాడు. ఆ సంఘటన చూచిన మూడవవ్యక్తి పెరికి
వేశాడను విషయము తోటమాలికి తెలియదు. రెండవరోజు రాత్రి కూడ ఒక సెంటు జాగాలోని మిరపచెట్లు పెరకబడి
ఉండడము తోటమాలి చూచాడు. ఈమారు సాధువు మీద చాలా కోపము వచ్చినది. మూడవ దినము కూడ ఆ
విధముగనే చేస్తాడని ఊహించిన తోటమాలి రాత్రికి వచ్చి తోట దగ్గరనే పడుకోవాలనుకొన్నాడు. అలాగే రాత్రికివచ్చి
తోటలోపడుకొన్నాడు. రాత్రి 12 గంటల వరకు మేల్కొని తర్వాత నిద్రపోయాడు. తెల్లవారి చూచాడు. ఇంకేముంది
మూడవరోజు కూడ చెట్లు పెరకబడినాయి. తాను ఇక్కడే పడుకొన్నా ఫలితము లేకుండపోయిందని అనుకొన్నాడు.
పెరకబడిన చెట్లను చూచి చాలా బాధ అయినది. ఈ మారు సాధువును ఎలాగైన పట్టుకొని బాగా తన్ని తన తోటవైపు
రాకుండ చేయాలనుకొన్నాడు. నాల్గవరోజు రాత్రి తోట దగ్గరకు వచ్చి కాపలాగ కూర్చున్నాడు. ఈ మారు నిద్రపోకుండ
జాగ్రత్తగ ఉన్నాడు. రాత్రి 12 గంటలు దాటింది, తెల్లని దుస్తులు వేసుకొన్న ఒక ఆకారము దూరముగ వస్తున్నట్లు
అగుపించింది. వెంటనే తోటమాలి జాగ్రత్తపడ్డాడు. చేతికర్ర తీసుకొని అటువైపు పోయాడు. తోటమాలి తాను
పోతూవున్నట్లే కనిపించిన వ్యక్తి తోటలోనికి రావడము చెట్లు పెరికి ఆ వ్యక్తి తిరిగిపోవడము జరిగినది. ఈ మారు తాను
చూస్తూ వస్తున్నట్లే ఇంత స్పీడుగా పని జరిగిపోవడము తోటమాలికి ఆశ్చర్యము వేసింది. నాల్గవదినము కూడ సెంటు
జాగాలో చెట్లు పెరకబడినాయి. ఎవరు వచ్చినది అంతుబట్టలేదు, సాధువైతే కాదనిపించింది. దూరము నుండి
చూస్తూన్నట్లే తోటలోనికి రావడము, పోవడము జరిగిపోయినదంటే ఆశ్చర్యముగ ఉన్నది. ఈ విషయమంతా ఊరిలో
చెప్పాడు. అందరికి వింతకథగ కనిపించింది. ఐదవరోజు ఊరిలోని ఐదుమంది కూడ వచ్చి ఒకచోట కూర్చొని
జాగ్రత్తగ చూడసాగారు. వారందరు తోటకు ఒక మూలలో కూర్చొని ఉన్నారు. అర్థరాత్రి దాటింది. వారికి ఎదురు
మోటులో ఒక మనిషి వచ్చినట్లు కనిపించింది. వెంటనే అందరు కేకలు వేయుచు అటువైపు పోయారు. అటువైపు
పోయే లోపలే వచ్చిన వ్యక్తి చెట్లను పెరికి పోవడము జరిగినది. దూరమునుండి తెల్లని ఆకారము కనిపిస్తుంది, కానీ
ఫలనా మనిషి అని ఎవరికీ తెలియదు. అటువైపు పోయేలోపలే తన పని ముగించుకొని పోవడము అంటే, అది
మనుషులతో అయ్యేపని కాదని, అది దయ్యము పనే అయి ఉండవచ్చునని కొందరికి అనుమానము వచ్చినది. మరుసటి
దినము ఈ విషయమే ఊరంతా చర్చనీయాంశమైనది. ఏదో దయ్యమంట! మిరపతోటను ప్రతి దినము పెరికి
వేస్తున్నదట! అని కొంత ప్రచారముకాగ, అలా కాదు ఏ దయ్యాలు అట్లు చేయవు, ఇదేదో మనుషుల పనియేనని
కొందరు అనుకొనుట ప్రారంభించారు. ఆరవదినము ఆ విషయమును గూర్చి తేల్చుకోవాలని ఊరిలోని వారికి కూడ
పట్టుదల కల్గినది. ఆ దినము నలభైమంది యువకులు అందరు తోడై కట్టెలు తీసుకొని రాత్రి తోటవద్దకు వచ్చారు.
నలభైమంది నాలుగు గుంపులుగా విడిపోయి, నాలుగువైపుల కాపలా ఉండునట్లు మాట్లాడుకొన్నారు. ఒక గుంపుకు
పదిమంది ప్రకారము విడిపోయి నాలుగువైపుల వేయికళ్ళతో చూస్తున్నారు. రాత్రి 12 గంటలైనది. ఒక గుంపులో
చిన్న రాయి పడినది. ఎక్కడిది ఆ రాయి అని చూచుకొను లోపల మరొక చిన్నరాయి పడినది. పడిన రాయి వక్క
(పోక) సైజుకంటే లావులేవు. నీవు ఏమైన వేశావా అని ఒకరినొకరు అడుగుకొని ఎవరు వేయలేదని నిర్ధారించుకొన్నారు.
అయినా చిన్నరాళ్ళు ఎక్కడినుండి పడినవని ఆలోచించసాగారు. అంతలో వారిముందర ఉన్న చిన్నరాయి చూస్తున్నట్లు
గానే ఎగిరిపడింది. అందరు అశ్చర్యముగ చూస్తున్నట్లుగానే ఒకరాయి తర్వాత ఒకటి క్రిందనున్న రాళ్ళు ఎగురుటకు
మొదలుపెట్టాయి. వాటంతటవి మనిషి ఎత్తు ఎగిరెగిరిపడుచున్న ఆ రాళ్ళను చూచి అందరికి భయమువేసింది. ఇది
మనుషులు చేయు పనికాదని అర్థమైనది. రాళ్ళు పడినగుంపు భయపడి మరొక గుంపువద్దకు పోయారు. వారివద్ద
కూడ ఆ విధముగానే జరిగినట్లు విని ఆశ్చర్యపోయారు. అందరు ఒకచోట చేరి అందరికి అలాగే జరిగినట్లు చెప్పుకొన్నారు.
ఇలా అందరు భయపడుచు ఒకచోట గుమికూడి చూస్తున్నట్లుగానే తోటలో ఒక ఆకారము కనిపించింది. ఈ దఫా
ఎవరూ అటువైపు పోలేదు. ఎవరికీ అటువైపు పోవుటకు ధైర్యము చాలడము లేదు. ప్రతి దినము జరిగినట్లే ఆ
దినము కూడ జరిగినది, చెట్లు పెరకబడినాయి. ఆ ఆకారము అక్కడినుండి పోయినట్లు నిర్ధారించుకొన్న తర్వాత
అందరు తోటలోనికి పోయి చూచి చెట్లు ఆ రోజు కూడ పెరకబడినట్లు తెలుసుకొన్నారు. అందరు ఇదేమి వింత అని
ఆలోచిస్తువుండ గానే నారాయణరెడ్డి అను అతని మెడమీద చేతితో ఫలీమని కొట్టి నట్లయినది. కొట్టిన శబ్దము
అందరికి వినిపించింది. దెబ్బతిన్న నారాయణరెడ్డి అబ్బా అని గట్టిగ అరిచాడు. ఎవరు కొట్టినదీ అర్థముకాలేదు.
అందరికీ భయమువేసింది. అక్కడనుండి అందరూ ఊరిలోనికి పోయారు. ఆ దినము నుండి ఎవరు ఆ తోటవైపు
పోలేదు. తోటలో చెట్లు మాత్రము ప్రతి దినము కొన్ని పెరకబడేవి. ఆ విధముగా తోటలోని చెట్లన్ని అయిపోయినవి.
రెండు మిరపకాయలు, అవి కూడ అన్నములోనికి తీసుకొంటే సాధువును అంతగ కొట్టి, చివరకు ఏమి చేయలేక
తోటమాలి తన తోట మొత్తమును పోగొట్టుకున్నాడు.
ఇటికాల గ్రామములోని వ్యక్తి టెలిఫోన్ డిపార్టుమెంట్ నందు తాడిపత్రిలో ఉద్యోగిగానున్న నారాయణరెడ్డి
ద్వార ఈ సంఘటన విషయమంతా నాకు తెలిసినది. నాకు తెలిపిన నారాయణరెడ్డి ఘటన జరిగిన ఆ పొలమువద్దకు
రెండు రోజులు కాపలాగా పోయిన వ్యక్తి! అక్కడ జరిగనదంతా కళ్ళారా చూచిన వ్యక్తి! అంతేకాక చివరిలో మెడమీద
కొట్టించుకొన్న వ్యక్తి కూడ ఈయనే! 1988వ సంవత్సరము నాకు ఈ సంఘటన సమాచారము చెప్పాడు. అప్పటికి
దాదాపు 20 సంవత్సరముల ముందు అది జరిగినట్లు చెప్పాడు. ఆ లెక్క ప్రకారము 1968వ సంవత్సరము సమయములో
జరిగి ఉండవచ్చును. దాని ప్రకారము ఇప్పటికి 42 సంవత్సరముల క్రిందట జరిగినట్లు అర్థమగుచున్నది. ఈ
సంఘటనలో స్థూలశరీరము అనుమాటగానీ, పూనకము అనుమాటగానీ ఏమాత్రము లేదు. అక్కడ జరిగిన విషయమును
అంతటిని చూస్తే ఎన్నో ప్రశ్నలు వచ్చుచున్నవి. సూక్ష్మములను గురించి బాగా తెలిసినవారు ఎంతో బాగా యోచిస్తేగానీ,
ప్రశ్నలకు జవాబులు దొరకవు. అటువంటపుడు సూక్ష్మములను గురించిగానీ, వాటి మనుగడను గురించి గానీ,
వాటిలోని తరగతులనూ, హెూదాలను గురించిగానీ తెలియనివారికి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకదు. ఇక్కడ
కొందరికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఇక్కడ కొందరికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరికినా, సూక్ష్మములను
గురించి తెలిసినవారికి కూడా జవాబు దొరకని ప్రశ్న ఒకటి గలదు. అదేమనగా! కనిపించని సూక్ష్మము కనిపించే
స్థూలమును కదిలించగలదా? ఇటు ఆస్తికవాదులకు అటు నాస్తికవాదులకు మరియు హేతువాదులకు దొరకని జవాబు
కావున, అందరూ దీనిని మొత్తానికి అబద్దము అని అంటారు. తెలియక వారు అబద్దము అనినా, అది జరిగిన వాస్తవ
సంఘటన కావున, మేము అందరిలాగ అబద్దము అనుటకు వీలులేదు. అంతేకాక ఇటువంటి రకమునకు చెందిన
సమాచారము మరొకటి కూడ కలదు. మేము నివాసమున్న తాడిపత్రిలోనే జరిగిన ఈ సంఘటనలో కూడ కనిపించని
సూక్ష్మము, కనిపించే స్థూలమును కదిలించడమూ, ప్రక్కకు లాగడము జరిగినది. కనిపించని సూక్ష్మము కనిపించే
మిరపతోటను పెరికిన విధానమునకు బలమును చేకూర్చు తాడిపత్రిలో జరిగిన దానిని వివరిస్తాము చూడండి.
ఇప్పటికి దాదాపు 50 సంవత్సరముల పూర్వము తాడిపత్రిలో ఒక బ్రాహ్మణ కుటుంబము అప్పులపాలైపోయి,
తాము నివాసమున్న ఇంటిని అమ్మివేశారు. ఆ ఇంటిని కొన్నవారు ముస్లీమ్లు. ఇల్లును అమ్మిన తర్వాత బ్రాహ్మణ
కుటుంబము, ఆ ఇల్లును ఖాళీ చేసి వెళ్ళి పోయింది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరము వరకు ఆ ఇల్లు
ఖాళీగానే ఉండేది. కిరాయికి ఇస్తామని చెప్పినా ఎవరూ ఆ ఇంటిలోనికి రాలేదు. కొన్నవారు కూడ ఆ ఇంటిలోనికి
చేరలేదు. సంవత్సర కాలము చూచినా ఆ ఇంటిలోనికి కిరాయికి ఎవరూ రాలేదు. చివరికి ఆ ఇల్లునుకొన్న ముస్లీమ్
కుటుంబము ఖాళీ ఇంటిలోనికి చేరినది. ఇదంతా బయటికి తెలిసిన విషయము. ఇక బయటికి తెలియని విషయము
కూడ కొంతగలదు. అదేమనగా! ఆ ఇంటిలో బ్రాహ్మణకుటుంబము కాపురమున్నప్పుడు, ఆ కుటుంబమునకు చెందిన
ఒక బ్రాహ్మణ స్త్రీ అర్థ ఆయుస్సు గడిచినదై అకాలమృత్యువు పొందినది. అకాలమృత్యువును పొందిన ఆమెకు,
స్థూలశరీరము పోయి సూక్ష్మశరీరము మిగిలింది. ఆ సూక్ష్మశరీరముతోనే మిగత అర్థ ఆయుస్సు గడచువరకు జీవించి
ఉండవలెను. అలా జీవిస్తున్న ఆమె కనిపించక ఆ ఇంటిలోనే నివాసమున్నది. వారు ఇల్లు అమ్మకముందే ఏడెనిమిది
సంవత్సరములనుండి, చనిపోయిన బ్రాహ్మణస్త్రీ సూక్ష్మశరీరముతో అక్కడ ఉండడము జరుగుచున్నది. బ్రాహ్మణులు
తమ ఇంటిని అమ్మి, ఇల్లును వదలిపోయినా చనిపోయిన బ్రాహ్మణ స్త్రీ మాత్రము ఇల్లు విడిచిపోలేదు. ఇల్లును
అమ్మినవారు ఆ ఇంటిని వారే కట్టించుకొన్నారు. ఆ ఇంటిలో దాదాపు నలభై సంవత్సరములు కాపురమున్నారు.
చనిపోయిన ఆమె కూడ చిన్న వయస్సు నుండి ఆ ఇంటిలోనే ఉండి, ఆ ఇంటి మీద బాగా మమకారము పెంచుకొన్న
దాని వలన తమ వారందరు ఇల్లును వదలి పోయినప్పటికీ, తాను మాత్రము ఈ ఇల్లు నాదేనను ఉద్దేశముతోనే ఆ
ఇంటిలోనే ఉండిపోయింది. తమవారు ప్రక్క వీధిలో కాపురమున్నా అక్కడికి పోయి ఉండేది కాదు. ఎప్పుడైన తమవారిని
చూడడానికి ప్రక్క వీధిలోనికి పోయినా కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఆ ఇంటిలోనే ఉండేది.
తమవారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీగా సంవత్సరమున్నది కదా! అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీకి ఎటువంటి
ఇబ్బంది లేకుండ ఒక్కతే ఆ ఇంటిలో ఉండేది. ఇల్లునుకొనిన ముస్లీమ్ కుటుంబము, ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత
ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేది. శుచి, శుభ్రతగల్గి మాంసమును చూస్తేనే సరిపడని ఆమెకు, ఆ ఇంట్లో ముస్లీమ్లు
మాంసము తినడమూ, శుచి, శుభ్రతగా లేకుండ ఉండడము చూచి అసహ్యించుకొనేది. ఆ ఇంటిలో చేరుకొన్న వారిని
తరిమివేయాలని అనుకొనేది. ఆ ఇంట్లో ఉన్న ముస్లీమ్లను చూస్తే ఆమెకు కోపము వచ్చేది. అయినా వారిని ఏమీ
చేయలేక, ఖాళీగా ఉన్న ఒక రూములో ఉంటూ కాలము గడిపేది. అమావాస్య, పౌర్ణమి దినములలో సూక్ష్మశరీరముతోనున్న
వారికి బలము ఎక్కువ, ఆ దినములు సూక్ష్మములకు అనుకూలమైన దినములు. అందువలన అమావాస్య, పౌర్ణమి
దినములలో రాత్రిపూట అందరు పడుకొన్న తర్వాత తన రూములోనుండి బయటికి వచ్చి, పడుకొన్న చిన్న పిల్లలను
మాత్రము ముట్టుకొని, పడుకొన్న చోట కాకుండ కొంత దూరముగా తీసుకుపోయి ఉంచేది. బ్రహ్మణస్త్రీకి చిన్నపిల్లల
మీద ప్రేమ ఎక్కువ. అందువలన పిల్లలను మాత్రము ముట్టుకొనేది, కానీ పెద్దలను తాకేది కాదు. ఆమె చనిపోక
ముందునుండి మృదు స్వభావముగల మనిషి, కాబట్టి ఆ ఇంటిలోని వారికి ఏ హాని తలపెట్టలేదు.
అమావాస్య దినమునగానీ, పౌర్ణమి దినమునగానీ, రాత్రిపూట చిన్న పిల్లలను పడుకొన్న చోట ఉండనివ్వక,
జాగాలు మార్చి పడుకోపెట్టేది. తెల్లవారిన తర్వాత పెద్దలు తమ పిల్లలను చూచి నా దగ్గర పడుకొన్నవాడు అక్కడికి
ఎలా పోయాడు? అని అనుకొనెడి వారు. అలా ప్రతి దినము జరుగదు, పదుహేను రోజులకొక మారు జరుగుట
వలన? పిల్లలు నిద్రలో దొర్లుతూ పోయారేమో అని అనుకొనెడివారు. వారు అలా పడుకొన్న జాగా మారడము మీద
పెద్దగా అనుమానము రాలేదు. ఆ ఇంటిలో ఇద్దరు పిల్లలు మాత్రముండేవారు. అందులో ఒకరికి మూడు సంవత్సరముల
వయస్సు, మరొకరికి ఐదు సంవత్సరముల వయస్సు ఉండేది. హాలు మధ్యలో పెద్దల ప్రక్కన పడుకొన్న పిల్లలు, హాలు
చివరిలో ఉండడము వలన పెద్దలకు అనుమానమే కలుగలేదు. అదియు నిత్యము జరుగుచుంటే పెద్దలకు కొంత
అనుమానము వచ్చేది. ఎప్పుడో పదిహేను రోజులకొక మారు కాబట్టి ఆ విషయము గుర్తింపు రాలేదు. ఇట్లు దాదాపు
ఆరు లేక ఏడు నెలలు గడిచింది. జనవరి నెల గడుస్తున్న కాలములో చలి ఎక్కువగా ఉండేది. ఆ నెలలో పౌర్ణమిదినమున
కొంత విచిత్రము జరిగినది, అదేమనగా!
హాలులో పడుకొన్న మూడు సంవత్సరముల పిల్లవానిని తీసుకొని పోయి, వంటరూములో పొయ్యి ప్రక్కన
పడుకోబెట్టడము జరిగినది. హాలులో చలి ఎక్కువగా ఉన్నది, పొయ్యి వేడిమికి వంటరూములో చలి తక్కువ ఉన్నది,
కావున పిల్లవానిని పొయ్యికి దగ్గర పడుకోపెట్టడము జరిగినది. ఆ రోజు తెల్లవారిన తర్వాత, ఆ ఇంటివారు చూచుకొని
మూడు సంవత్సరముల పిల్లవాడు ఒంటరిగా, వంటరూములోనికి ఎందుకు పోయాడు? అక్కడే ఎందుకు పడుకొన్నాడు?
అని అనుమానము వచ్చింది. అప్పటినుండి నిఘాపెట్టి గమనించసాగారు. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు అలా
జరుగుచున్నదని కొంత అర్థమైనది. ఆ విషయము వారికి అర్థముకాక ఎవరినైనా తెలిసినవారిని అడగాలనుకొన్నారు.
అలా ఆ విషయమును గురించి భూతవైద్యుల దగ్గరకు పోయి అడిగారు. ఆ భూతవైద్యులకు ఏమి అర్థముకాక, చివరకు
ఒక తావెత్తు ఇచ్చి ఇంటి గుమ్మమునకు కట్టు కొమ్మన్నారు. వారు అలాగే చేశారు. వారు అలా తావెత్తును తీసుకువచ్చి
వాకిలి వద్ద కట్టడము వలన ఆ బ్రాహ్మణస్త్రీకి కోపము వచ్చింది. నా ఇంటికి తావెత్తులు కట్టుతారా? అని కోపము
వచ్చిన ఆమె, ఆ ఇంటినుండి వారిని తొందరగా వెళ్ళకొట్టాలనుకొన్నది. అప్పటినుండి ప్రతిరాత్రి అందరూ బాగా
నిద్రపోవు సమయములో, ఇంటిలోని పాత్రలను క్రిందవేసేది. అలా పాత్రపడడము వలన వచ్చిన శబ్దానికి వారు లేచి
చూచేవారు. వంటరూము లోని పాత్ర హాలులో వారు పడుకొన్న చోటికి ఎలా వచ్చింది? అక్కడకి ఎక్కడినుండి వచ్చి
పడింది? అర్థముకాక ఇదేదో దయ్యముల పనియేనని అనుకొన్నారు. ప్రతిరోజూ రాత్రిపూట ఏదో ఒక శబ్దమువచ్చేది.
అంతేకాక అమావాస్య పౌర్ణమి దినములలో పిల్లలను జాగామార్చడము జరిగేది.
ఆ ఇంటిలోని ముస్లీమ్ కుటుంబములో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె మంచి ధైర్యముగల మనిషి, దయ్యాలను
గురించి చెప్పినా భయపడేది కాదు. ఒక అమావాస్య రోజు, అందరూ పడుకొని నిద్రపోయినా ఆ ముసలామె
పడుకోలేదు, నిద్రపోలేదు. ఆ రోజు రాత్రి ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నది. అలా మేల్కొన్న ఆమెకు, అర్థరాత్రి
తర్వాత కొద్దికొద్దిగ నిద్రవచ్చే సమయములో ఐదు సంవత్సరముల పిల్లవాడు కొంత కదిలినట్లు కనిపించింది. వెంటనే
వచ్చే నిద్రనుండి బాగా తేరుకొని, నిఘాగా ఆ పిల్లవానివైపు చూచింది. అప్పుడు పిల్లవాని కాళ్ళు పట్టుకొని ఎవరో
లాగినట్లు జరుగుతూపోవడము చూచింది. ఆ వృద్ధురాలు చూస్తున్నట్లే, ఆ పిల్లవాడు మూడు అడుగుల దూరము
లాగబడినాడు. వెంటనే వృద్దురాలు పిల్లవాడు జరిగిపోకుండ ఆ అబ్బాయి చేతులు పట్టుకొన్నది. అయినా పిల్లవాడు
అర్ధ అడుగు ఎవరో బలముగా లాగినట్లు జరిగాడు. అలా జరిగిన పిల్లవానిని వృద్ధురాలు వెనక్కిలాగింది. ఎవరో
కనిపించకుండ లాగుచున్నారని ఆ ముసలామెకు అర్థమైనది. వెంటనే గట్టిగా అరిచి ప్రక్కవారిని లేపింది. అందరూ
నిద్రనుండి లేచి, ఏమి జరిగిందని అడిగారు. అప్పుడు ఆ వృద్ధురాలు పిల్లవాడు జరిగిపోతుండగా చూచానని, పిల్లవానిని
పట్టుకున్నా నని, అయినా ఎవరో గట్టిగా లాగినట్లయినదని విషయమంతా చెప్పింది. ఆ మాటలు విన్న అందరూ
భయపడిపోయారు. ఇంతకు ముందు కూడ పిల్లలు ప్రక్కరూములో పడుకొని ఉండడము, రాత్రిపూట పాత్రలు పడడము
అన్నీ ఏదో దయ్యము చేసే పనేనని వారికి బాగా అర్థమైనది. ఆ సంఘటనతో వారు ఇల్లు వదిలిపోవాలనుకొన్నారు.
పది రోజుల లోపలే ఇల్లు వదలి పోయారు. ఆ ముస్లీమ్ కుటుంబము తన ఇల్లును వదలి పోవడము వలన అక్కడున్న
బ్రాహ్మణ స్త్రీకి సంతోషము కల్గినది.
అప్పటినుండి దాదాపు ఒక సంవత్సరము వరకు ఆ ఇంటిలో ఎవరూ చేరలేదు. సంసారముతో ఉండువారు ఆ
ఇంట్లో ఉండాలంటే భయపడి ఎవరూ రాలేదు. చివరకు ఆ ఇంటి యజమానులైన ముస్లీమ్లు పగలు మాత్రముండి,
రాత్రిపూట తలుపులు మూసిపోయేటట్లు ఒక హెూటల్ను ఆ ఇంటిలో పెట్టాలను కొన్నారు. ఆ ఇల్లు రోడ్డుకు అనుకొని
ఉన్నది కావున హెూటల్కు అనుకూలంగా ఉంటుంది. అదియు పగటి పూట మాత్రమే కదా అని ధైర్యముగా, ఆ
ముస్లీమ్ కుటుంబము హెూటల్ను ప్రారంభించింది. ఇంటి ముందర బయలులో రేకులషెడ్డు వేసి, అందులో కుర్చీలు,
బెంచీలు పెట్టి లోపలి ఇంటిని వంటకు, కాయకూరలు మొదలగు సరుకులు పెట్టుకొనే దానికి వాడుకొనునట్లు
నిర్ణయించుకొన్నారు. వారు శాఖాహర హెూటల్ కాకుండ మాంసహార మిలిటరి హెూటల్ పెట్టినారు. 'మదార్
హెూటల్' అను పేరుతో ప్రారంభించి ప్రతి దినము ఆ ఇంటిలో మాంసమును తెచ్చిపెట్టడము, మాంసాహారవంటలు
చేయడము వలన, అందులోనున్న బ్రాహ్మణస్త్రీకి దినదినము గండమైనది. అవన్ని చూడలేక ఆమె అక్కడినుండి వదలి
పోయినది. ఇప్పటికీ ఆ ఇంటివద్దనే మదార్ హెూటల్ ఉన్నట్లు కొందరు చెప్పారు. ఇప్పుడు చెప్పినదంతా రామ్ గోపాల్
వర్మ సినిమాకథ కాదు, యదార్థముగా గతములో జరిగిన విషయము.
ఇందులో గమనించతగ్గ విషయమేమంటే, సూక్ష్మముగా కనిపించ కుండ ఉన్న బ్రాహ్మణస్త్రీ, స్థూలముగా
కనిపించే పిల్లవానిని లాగుకొని పోవడము జరిగినది. ఇదే విధముగ ముందు చెప్పిన ఇటికాల తోట సమాచారములో
కూడ, కనిపించని సూక్ష్మము కనిపించే మిరపచెట్లను పెరికివేసింది. ఈ రెండు సంఘటనలనుబట్టి సూక్ష్మములు,
స్థూలములను కూడ కదిలించగలవనీ, అంతేకాక ఏమైనా చేయగలవని అర్థమైనది. ఒక రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలు
ఇంజన్లో డ్రైవర్ లేకుండ దిగిపోయినపుడు డ్రైవర్ లేకుండగనే రైలు అరవై కిలోమీటర్ల వేగముతో ముందు స్టేషన్కు
పోవడము జరిగినట్లు న్యూస్పేపర్లో చూచాను. అలా రైలు నడవడానికి కారణము సూక్ష్మము యొక్క పనియేనని
అర్థమైనది. వీటన్నిటి ఆధారముతో ఒక సూక్ష్మము మరొక స్థూలమును ఏమైనా చేయగలదు. అందువలన సూక్ష్మము
శరీరములోనికి చేరవలసిన పనిలేకుండ, బయటినుండి కూడ ఏమైన చేయగలదని అర్థమైనది. అట్లని ప్రతి సూక్ష్మము
అలా చేయుటకు వీలుకాదు. ఎందుకనగా జాతకచక్రములో బుధగ్రహము యొక్క బలము సంపూర్ణముగా ఉన్న
సూక్ష్మములకు మాత్రము అలా చేయుటకు శక్తి యుండును. అకాలమృత్యువు పొందినవారు, సూక్ష్మశరీరముతో కొంత
కాలము వారి ఆయుస్సు అయిపోవు వరకు జీవించవలసియున్నది. మరణానంతరము జన్మకు పోకుండ జీవించు
జీవితకాలము, కొందరికి సుఖముగా గడచి పోవడము, కొందరికి కష్టముగా గడచిపోవడము జరుగు చున్నది. మనిషి
శరీరముతో జీవించినప్పుడే కాకుండ, శరీరము లేకుండ జీవించునప్పుడు కూడా కష్టసుఖములుగలవనీ, పాపపుణ్యములు
అమలు జరుగడము, సంపాదించుకోవడము రెండూ ఉన్నవనీ తెలియుచున్నది. మరణానంతర జీవితమునకు కూడ
బుధగ్రహ బలము మరియు ఇతర గ్రహముల బలము కూడ అవసరము. అట్లు ద్వాదశ గ్రహముల బలా బలములనుబట్టి,
దయ్యముల భవిష్యత్తు, వర్తమానము ఉండును. అందువలన దయ్యములు లేవు అనకుండ, ఆ స్థాయి జీవితములను
గురించి తెలుసుకొని, అటువంటి జీవితము వస్తే, దానికి సంబంధించిన పాపపుణ్య ములను, సుఖదుఃఖములను
తెలిసి బ్రతుకుటకు ప్రయత్నించాలి.
భౌతికశాస్త్రము అంటే ఏమిటో నాకంటే సైన్సు చదివిన వారికి, భౌతికశాస్త్రవేత్తలకు, డాక్టరువృత్తి నేర్చినవారికి
బాగా తెలుసు. శరీరములో జరుగు ప్రతి చిన్న మార్పును భౌతికశాస్త్రము తెలియజేస్తున్నది. శరీరములోని అణువణువు
యొక్క విషయమును, సంపూర్ణముగా వివరించునది భౌతిక శాస్త్రము. దానిని చదివిన వారికి శరీరమును గురించిన
సంపూర్ణ జ్ఞానముండును. శరీరములోని కోట్ల ధాతువులలో ప్రతి ధాతువును గురించి వివరించి చెప్పు జ్ఞానము
కొందరు హేతువాదులు కల్గియున్నారు. అంతగా తెలిసిన వారు, భౌతిక శరీరములో తమకు తెలియనిది లేదని
చెప్పుచుందురు. కానీ నేనేమనుచున్నాననగా! ప్రతి ప్రశ్నకు జవాబు కల్గియున్నప్పుడే వానిని సంపూర్ణముగా తెలిసినవాడని
చెప్పవచ్చును. ఎవని వద్ద ప్రశ్నకు జవాబు లేదో వానిని తెలియనివాడేనని చెప్పవచ్చును. ఈ సూత్రములు ఏ
శాస్త్రమునకైనా వర్తించును. భౌతికశాస్త్రమును తెలిసిన ఒక శాస్త్రవేత్తకు శరీరములోని ఒక ప్రశ్నకు జవాబు తెలియనపుడు
అతనిని శాస్త్రవేత్త అనుటకు అర్హుడుకాడు. అలాగే ఒక మెడికల్ ప్రొఫెసర్కు ఒక రోగమును గురించిన ప్రశ్నకు
జవాబు తెలియనపుడు అతనిని ప్రొఫెసర్ అనకూడదు. అట్లే ఒక రోగమును గురించి తెలియనపుడు, అతనిని డాక్టర్
అని అనకూడదు. అయినా ఒక శాస్త్రవేత్త అని పేరు పెట్టుకొన్న వానికి ఆ శాస్త్రమును గూర్చి పూర్తి అవగాహన
లేదనుటకు ఎన్నో నిదర్శనములు కలవు. శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని అర్థము. ఉదాహరణకు
వంద శాసనములు ఒక శాస్త్రములో ఉన్నాయనుకొనుము. అందులో యాభైశాసనములు తెలిసినవానిని, డెభై శాసనములు
తెలిసిన వానిని సంపూర్ణ శాస్త్రవేత్త అని అనకూడదు. కానీ ఈ కాలములో ఏ శాస్త్రములోనైనా సంపూర్ణముగ తెలిసినవారు
లేరు అనుటకు నిదర్శనములు కలవు. అవి ఎలా ఉన్నాయో వివరించుకొని చూద్దాము. జరిగిన సంఘటనల లోని
తార్కాణములను తెలుసుకొందాము.
అనంతపురము శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటిలో పనిచేయు ఒక ప్రొఫెసర్కు కొంతకాలమునుండి, అతని
శరీరములో ఒక నొప్పి ఉండేది. అది కుడిప్రక్క ఊపిరితిత్తి క్రింద భాగమున ప్రక్కటెముకల వద్ద నొప్పి వచ్చేది. ఆ
నొప్పి ఎప్పటికీ ఉండక, అప్పుడప్పుడు నెలకొకమారు, నెలన్నర కొకమారు వచ్చేది. వచ్చినపుడు అర్ధగంట, గంటసేపు
ఉండి పోయేది. ఆ నొప్పి వచ్చినపుడు విపరీతముగ బాధ కలిగేది. ఆ నొప్పిని లేకుండ చేసుకొనుటకు డాక్టర్లవద్ద
చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడము కూడ జరిగినది. అయినప్పటికీ ఆ బాధ అప్పుడప్పుడు వస్తూనే ఉండేది.
ఒక దినము ఆ ప్రొఫెసర్ తన నొప్పిని గురించి చెప్పాడు. సంవత్సరము నుండి మందులు తీసుకొనినా, నయము
కాలేదని చెప్పాడు. నొప్పి వచ్చినప్పుడు మందును మ్రింగినా నొప్పి తగ్గదని చెప్పాడు. అతను చెప్పిన దంతా వినిన
నేను, అతనిని నాకు ఎదురుగా ఒక గజము దూరములో కూర్చోమని చెప్పినాను. అతను నా ముందర కూర్చున్న
తర్వాత ఇప్పుడేమైనా నొప్పి ఉందా అని అడిగినాను. ఇప్పుడు లేదు అన్నాడు. అయితే ఇప్పుడు వస్తుంది చూడు అని
నేను అతనికి చెప్పి తర్వాత ఇలా అన్నాను “నాకు ఎదురుగా కూర్చున్న మనిషిలో అప్పుడప్పుడు డొక్కలో వచ్చు నొప్పి
ఇప్పుడే రావలెను”. ఆ మాట పూర్తి అయిన వెంటనే అర్థ నిమిషములోనే అతనికి డొక్కలో నొప్పి వచ్చింది. “నొప్పి
వచ్చింది, చాలా వివరీతముగా నొప్పి ఉంది” అని ప్రొఫెసర్ అన్నాడు. అతని శరీరములో ఎప్పుడో తనకిష్టమొచ్చినప్పుడు
వచ్చు నొప్పి పిలిచిన వెంటనే వచ్చింది. వచ్చినట్లు ఆయన కూడ చెప్పాడు. ఎదురుగా ఆయన ఎంత బాధపడుచున్నది
నాకు తెలుస్తూవుంది. అది విపరీతమైన బాధగానే అర్థమైనది. అప్పుడు రెండవమారు ఇలా అన్నాను “ఈయన
శరీరములోనున్న నొప్పికి నేను చెప్పుచున్నాను, ఇతని శరీరములో నొప్పి లేకుండ బయటికి పోవాలి" అని చెప్పగానే
ఒక నిమిషములోనే అతని నొప్పి కనిపించకుండ పోయింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇట్లు చెప్పాడు. "మీరు బయటికి
పొమ్మని చెప్పగానే లోపలవుండే నొప్పిని కడ్డీ కొండికి తగిలించి, లోపలినుండి లాగినట్లయినది. బలవంతముగా లాగితే
కలిగినట్లు బాధ కలిగింది. ఎప్పుడో వచ్చు నొప్పి పిలుస్తూనే రావడమూ, పొమ్మని చెప్పగానే పోవడము చాలా
విచిత్రముగా ఉంది. ఇటువంటి అనుభవము నేను ఎక్కడా చూడలేదు. కడుపులోపల కడ్డీతో పురిత్రిప్పి లాగినట్లయినది.
నొప్పి బయటకు వచ్చిన అనుభూతి కలిగిన వెంటనే ప్రక్కకడుపులో ఏమాత్రము నొప్పిలేకుండ పోయింది. మందు
ఇవ్వకుండ, మంత్రమూ చెప్పకుండ, కేవలము నోటిమాటతో నొప్పిని లేకుండ చేయడము దానిని శాసించినట్లయినది”.
అతని మాటలువిన్న నేను అతనితో ఇలా చెప్పాను. ఒక రోగము పోగొట్టుటకు మూడురకముల పద్ధతులు
గలవు. వాటియందు ఒక పద్ధతిలో మందులు వాడడము వలన రోగమును లేకుండ చేయవచ్చును. రెండవ పద్ధతిలో
మంత్రముల వలన రోగమును లేకుండ చేయవచ్చును. మూడవ పద్ధతిలో మందులుగానీ, మంత్రములుగా ఉండవు.
ఈ పద్ధతిలో కేవలము అధికార పూర్వకముగ చెప్పడము వలన రోగమును లేకుండ చేయవచ్చును. ఈ పద్ధతిలోనే
పోతులూరి వీరబ్రహ్మముగారు, ఏసుప్రభువు, శ్రీకృష్ణుడు మొదలగువారు రోగములను శాసించినట్లు తెలియుచున్నది.
వీటిలో మొదటిదైన మందులు వాడడము అను వైద్యమును చదివి నేర్చు కుంటారు. రెండవ వైద్యమైన మంత్రములను
సాధన చేసి నేర్చుకోవచ్చును. ఇక మూడవదైన వైద్యమును జ్ఞానశ్రద్ధ చేత సాధించవచ్చును. ఈ కాలములో మొదటి
రకము వైద్యము ఎక్కడ చూచినా ఉన్నది. రెండవ రక వైద్యము చాలా అరుదుగా కొన్ని చోట్ల మాత్రము కనిపించగలదు.
ఇక మూడవ రకమైన జ్ఞానశక్తి చేత శాసించు వైద్యము, భూమిమీద అరుదుగా కూడ ఎక్కడా కనిపించ లేదు.
భూమిమీద ఎన్నో రకముల రోగములు గలవు. కొన్ని రకముల రోగములు, మొదటి వైద్యము మందుల చేత
కనిపించకుండ పోవును. కానీ కొన్ని రోగములు మొదటి వైద్యమైన మందులతో పోవు. వాటికి రెండవ రకమైన
మంత్రముల వైద్యము అవసరము. ఆ రోగములు మంత్ర వైద్యము చేతనే పోవును. ఇకపోతే మొదటి వైద్యమునకుగానీ,
రెండవ వైద్యమునకుగానీ లొంగని రోగములున్నవి. వాటిని తప్పక అనుభవించ వలసిందే. రెండు రకముల వైద్యమునకు
నయముగాని రోగములు మూడవ వైద్యమునకే పోవును. మూడవ వైద్యము చేయువారు ఎవరూ లేరు. ఒకవేళ
ఎక్కడైనా ఉండినా, వారు ఇతరులకు వైద్యము చేయు ఉద్దేశము వారికి ఉండదు. అటువంటి వారికి జ్ఞాన ప్రచారమే
ముఖ్య ఉద్దేశమై ఉండును. జ్ఞానప్రచారములో అవసరమైనపుడు మాత్రమే జ్ఞానశక్తి యొక్క సామర్థ్యమును తెలియజేయు
నిమిత్తము, ఎక్కడైన అరుదుగా వారి వైద్యము సంభవించవచ్చును. ఈ విధముగ మూడు వైద్యములు భూమి మీద
గలవు.
ఇపుడు నేను చేసినది ఏ రకము వైద్యమో నీకు అర్థమై ఉంటుంది. ఒక మనిషికి ఏ రకము వైద్యము
అవసరమో, మొదటి రెండు రకముల వైద్యులకు తెలియదు. అందువలన మంత్రములతో పోవు రోగములకు కొందరు
వైద్యులు మందులు వాడుచుందురు. అట్లు ఎంతకాలము వైద్యము చేసినా ఆ రోగము పోదు. అట్లే మందుల వలన
పోవు రోగములను తెలియక కొందరు మాంత్రికులు మంత్ర వైద్యమును చేయుచుందురు. అట్లు ఎంత కాలము
మంత్రవైద్యము చేసినా వాని రోగము పోదు. ఈ విధముగ మందుల వైద్యులు, మంత్రముల వైద్యులు ఇరువురు ఏ
రోగమునకు ఏ వైద్యము అవసరమో తెలియక పొరబడుచున్నారు. వైద్యుల పొరపాటుకు రోగులు నష్టపోవుదురు.
ఇంతవరకు నీకు ఉన్న రోగమునకు మొదటి రెండు వైద్యములు పనికిరావు. కనుక నీవు ఎన్ని మందులువాడినా,
నీకున్న నొప్పి ఏమాత్రము పోలేదు. నేటి కాలములో మంత్రవైద్యులు అరుదుగా ఉన్నారు, కావున వారివద్దకు రోగులు
పోవుట కూడ తక్కువే. అల్లోపతి మందులు వాడు వైద్యులు ఎక్కడ చూచిన ఉన్నారు. వారివద్దనే ఎక్కువ మంది
రోగులు రోగములు పోవు వైద్య విధానము తెలియక నష్టపోవు చున్నారు. మందుల వైద్యము తెలిసిన డాక్టర్ల దగ్గర
రోగులు ఎలా నష్టపోవుచున్నారో, రోగము నయముకాక ఎలా బాధపడుచున్నారో మరియు డాక్టర్లు రోగమును గుర్తించలేక
ఎలా పొరపడుచున్నారో, వివరముగా అర్థమగుటకు మరియొక సంఘటను తెలియజేస్తాము చూడు.
తాడిపత్రి మండలము చిన్నపొడమల గ్రామములో నివాసముండే మంగళ వెంకటేసుకు, అనంతపురము ప్రొఫెసర్కు
వచ్చినట్లే ప్రక్క డొక్కలో నొప్పి వచ్చింది. అతను ఆ నొప్పికి తట్టుకోలేకపోయాడు. ప్రొఫెసర్కు అరగంటసేపు నొప్పి
ఉండి పొయ్యేది. కానీ వెంకటేసుకు అలా పోకుండా ఏకధాటిగా అట్లే ఉంది. వెంకటేసు అనంతపురములోని డాక్టర్లవద్దకు
పోయి చూపించుకొన్నాడు. వారు అన్ని టెస్టులు చేసి, ఇది పలానా రోగము అని నిర్ధారణ చేయలేక పోయారు.
అతనిని ఇద్దరు, ముగ్గురు సీనియర్ డాక్టర్లు చూచి మందులు వాడినా అతని బాధ తగ్గలేదు. ఉదయము వచ్చిన నొప్పి
సాయంకాలము వరకు పోలేదు. వారు మందులు ఇచ్చి ఈపాటికి నొప్పి పోయింటుంది కదా అని అడిగారు. లేదు
పోలేదు అట్లే ఉంది అని రోగి అంటే డాక్టర్లు అతని మాట నమ్మలేదు. అంతలోనే నొప్పి ఉన్న ప్రక్క చర్మము మీద
అర్థరూపాయి, రూపాయి వెడల్పు బొబ్బలు పుట్టాయి. వాటిని చూచిన డాక్టర్లు రోగికి నొప్పి తగ్గలేదని తెలుసుకొన్నారు.
ఆ నొప్పి ఎందుకు వచ్చిందో, చర్మము మీద బొబ్బలు ఎందుకు వచ్చాయో డాక్టర్లకు అర్థము కాలేదు. వెంకటేసు
బాధను భరించలేక ఆ నొప్పితోనే చనిపోతానేమో అనుకొన్నాడు. డాక్టర్లు ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ చేస్తాము ఐదువేలు
ఖర్చువు తుందన్నారు. పేషెంట్ దగ్గరున్న ఐదువేలు అప్పటికే అయిపోయినాయి. ఇంక డబ్బులు లేవు. కావున రేపు
డబ్బులు తీసుకొని వస్తామని చెప్పి ఇంటికి వచ్చినారు. రాత్రంతా బాధపడిన వెంకటేసు కృష్ణమందిరము వద్దకు వచ్చి
అక్కడున్న నాతో విషయమును చెప్పాడు. ఇంకా డబ్బులు ఖర్చు చేయడము అతనికి శక్తికిమించిన పని. అతను
ముందునుండీ పరిచయమున్న మనిషి, నావద్ద వినయ, విధేయతలుగా నడుచుకొను మనిషి. కావున అతని రోగము
ఏమిటని తెలియుటకు నొప్పి ఉన్న చోటును చూపించమని చెప్పగా అతను చూపించాడు. చర్మము మీద బొబ్బలు కూడ
వచ్చియుండడము గమనించాను. తర్వాత ఇది మందులతోను, మంత్రములతోను పోవు రోగముకాదని తెలిసింది.
అప్పుడు చేతికర్రను తీసుకొని నొప్పివున్న చోట పెట్టి అతనికున్న నొప్పిని గురించి అడిగాను కర్రపెట్టిన వెంటనే
తగ్గిపోయినదని చెప్పాడు. అతను నాదగ్గరకు వచ్చినపుడు నడువలేని స్థితిలో కష్టముగా నడుస్తూ వచ్చాడు. అతను
నొప్పి లేదని అన్న తర్వాత కొద్దిగ నడువమన్నాను. అతను సులభముగా నడిచాడు. ప్రక్కనే ఉన్న నాలుగుమెట్లు ఎక్కి
క్రిందికి దూకమన్నాను. అలా రెండుమార్లు దూకాడు అప్పుడు కొద్దిగ నొప్పి వచ్చినట్లు చెప్పాడు. తర్వాత చేతికర్రను
నొప్పి ఉన్న జాగాలో తాకించి అడుగగా, నొప్పిలేదని చెప్పాడు. తర్వాత పైకి ఎక్కి దూకినా నొప్పి రాలేదు. అంతటితో
ఆ నొప్పి పోయింది. మూడవ రకము వైద్యము అతనికి జరిగింది. ఈ వైద్యము లేకుండ మొదటి రెండు రకముల
వైద్యములు ఆ నొప్పిని పోగొట్టలేవు.
అనంతపురములోని ఒక డాక్టరుకు, ఆ నొప్పి అర్థముకాక అతని కంటే సీనియర్ దగ్గరకు పంపాడు. అతను
మందులిచ్చినా తగ్గకపోవడముతో ఇంకొక డాక్టరును కూడ సలహా అడిగి వైద్యము చేసినా నొప్పి పోలేదు. దీనినిబట్టి
వారికి ఆ రోగము యొక్క కారణమే తెలియలేదని తెలుస్తున్నది. తర్వాత కొంత అవగాహనతో మందులు ఇచ్చినా అవి
పని చేయలేదు. అప్పుడైనా ఆ రోగమునకు తమ వైద్య విధానము సరిపోదని వారికి అర్థము కాలేదు. ఒకవేళ మన
మందులు పని చేయలేదని తెలిసినా, ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గరికి, పెద్ద హస్పిటల్కు పొమ్మని చెప్పుదురు. కానీ ఈ
వైద్య విధానము సరిపోదు, మరియొక వైద్య విధానము అయిన మంత్రవైద్యమును చేయించమని చెప్పరు. ఎవరైన
రోగి, మందులు పని చేయలేదని మంత్రములనాశ్రయించితే, వానిని తెలివితక్కువ వానిగ జమకట్టి హేళనగా
మాట్లాడుదురు. వైద్య విధానము మార్చడము మంచిదని ఏ డాక్టర్లూ అనుకోరు.
ఇక్కడ అందరికి ఒక ప్రశ్నరాగలదు. అది ఏమనగా! ఈ గ్రంథములో మీరు చెప్పవలసినది దయ్యాలను
గురించిన సంఘటనలు కదా! ఇప్పుడు చెప్పిన ప్రొఫెసర్ విషయములోగానీ, వెంకటేసు విషయములో గానీ, రోగమును,
వైద్యమును గురించి చెప్పారు తప్ప సూక్ష్మములను గురించినది ఏమి చెప్పలేదు కదా! అని అడుగవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా! ఈ విషయములలో వైద్యులు, వైద్య విధానములను గురించి చెప్పాను. కానీ రోగములను గురించి
చెప్పవలసినది ఇంకావుంది. ఇప్పుడు చెప్పబోవు సమాచారములో, మీరు అడిగిన దానికి జవాబు లభించగలదని
తెల్పుచున్నాము. రోగములు, పోయిన జన్మలో చేసుకొన్న పాపఫలితములని ముఖ్యముగ తెలియాలి. ఒక మనిషి
చేసిన కార్యములో కనిపించకుండ వచ్చు ఫలితము పాపముకావచ్చు, పుణ్యముకావచ్చును. ఇప్పుడు చేసినది చెడు
కార్యమైతే దాని ఫలితము పాపమువచ్చును. ఆ పాపము తర్వాత జన్మలో అనుభవించవలెననునది దైవధర్మము. ఒక
మనిషి ఇతర మనుషులపట్లగానీ, ఇతర జీవరాసులపట్లగానీ చేసిన పాపము ఒక రకముకాగ, ఒక మనిషి దేవతలపట్ల
చేసిన పాపము మరొక రకముగ ఉన్నది. అట్లే ఒక మనిషి దైవజ్ఞానమునకు వ్యతిరిక్తముగా చేసిన కార్యములలో వచ్చు
పాపము ఇంకొక రకముగ ఉన్నది. అదే విధముగ ఒక మనిషి దైవము పట్ల చేసిన పాపము మరియొక రకముగా ఉ
న్నది. ఈ విధముగ మనిషి సంపాదించుకొను పాపములను విభజించవచ్చును. ఈ విధముగ నాలుగు రకములుగ
విభజింపబడిన పాపము, మరుజన్మలో ఎట్లు అమలు జరుగుచున్నదో తెలుసుకొందాము.
మనుషుల ఎడలగానీ, ఇతర జీవరాసులు ఎడలగానీ చేసిన పాపములో, నాల్గవవంతు రోగముల రూపములో
అనుభవించుటకు కేటాయించబడును. అలాగే దేవతల ఎడల చేసిన పాపములో సగము రోగముల రూపములో
వచ్చును. దైవజ్ఞానము ఎడల చేసిన పాపము మూడువంతులు రోగముల రూపములో అనుభవించవలసివచ్చును.
ఇకపోతే దైవము ఎడల చేసిన పాపము పూర్తిగ రోగముల రూపములోనే అనుభవించాలి. ఇలా పాప ఫలితములను
కొన్ని రోగముల రూపములోనే అనుభవించవలసియున్నదని అర్థమైనది. రోగము ఏ రూపములోనున్నా దానిని కూడ
ఒక జీవరాసిగా చెప్పవచ్చును. ఈ మాటను గతములో చాలా సందర్భములలో ఉపన్యాసములందు “రోగము ఒక
భూతము” అని కూడ చెప్పియున్నాము. రోగము సూక్ష్మముగాను మరియు స్థూలముగాను ఉన్న జీవరాసియేనని
చెప్పవచ్చును. ఒక రోగము శరీరములో చేరింది అంటే అతనిలో ఒక సూక్ష్మము ప్రవేశించినట్లే. అందువలన రోగము
వచ్చిన మనిషిని, దయ్యము పట్టిన మనిషితో సమానముగా చెప్పవలసి వచ్చును. దీనినిబట్టి రోగము వచ్చిందంటే
దయ్యము వచ్చిందని అర్థము. రోగము పోయిందంటే దయ్యము పోయిందని అర్థము. మనుషుల ఎడల చేసిన
పాపము వలన వచ్చు రోగములు లేక జీవులను (దయ్యములను) మందులచేత వెళ్ళగొట్టవచ్చును. అట్లే దేవతల ఎడల
చేసిన పాపము వలన వచ్చు రోగములును లేక జీవులను లేక దయ్యములను మంత్రముల చేతనే తరిమి వేయవచ్చును.
దైవజ్ఞానము ఎడల సంపాదించుకొన్న పాపము వలన వచ్చు రోగములను, దైవజ్ఞానశక్తి చేతనే లేకుండ చేయవచ్చును.
కానీ ఇది అరుదైన పని అని ముందే చెప్పియున్నాము. చివరిగా చెప్పునది దైవము ఎడల ఎవడైన పాపము చేస్తే ఆ
పాపము వలన వచ్చు రోగముల నుండి ఎవడూ తప్పించుకోలేడు. అదియే క్షమించరాని, క్షమించబడని పాపము.
అందువలన దానిని జ్ఞానులు, యోగులు సహితము తప్పించలేరు. అది వీడని దయ్యమై బాధించును.
'రోగము ఒక భూతము' అను మాట మీకు అర్థమగుటకు ఒక యదార్థ సంఘటను వివరిస్తాను చూడండి.
తాడిపత్రి పట్టణములో నాకు పరిచయమున్న వ్యక్తి, నావద్దకు అప్పుడప్పుడు వచ్చు వ్యక్తి కుల్లూరు శ్రీరాములు అనునతడు
ఉండెడి వాడు. బహుశ అతనికి ముగ్గురు తమ్ముళ్ళు అనుకొంటాను. అందులో ఒకరి పేరు విశ్వమూర్తి. కుల్లూరు
శ్రీరాములు కొంత తీరిక సమయములో నావద్దకు వచ్చి, జ్ఞాన విషయము లను అడిగి తెలుసుకొని పోయేవాడు.
దైవజ్ఞానమును తెలుసుకొనుటలో ఆసక్తి ఉండుటవలన, అతనిమీద నాకు కొంత అభిమానముండెడిది. శ్రీరాములు
ఒక దినము నావద్దకు వచ్చి దిగాలుగా కూర్చున్నాడు. అతనిని చూచిన నాకు అతను మానసికముగా బాధపడుచున్నాడని
అర్థమైనది. అప్పుడతనిని ఎందుకిలా ఉన్నావని నేను అడగడము జరిగినది. అప్పుడతడు బాధపడుచు తన తమ్ముడు
లక్ష్మణమూర్తి విషయమును చెప్పసాగాడు. నాతమ్మునికి కొన్ని దినములనుండి ఆరోగ్యము సరిగలేదు. నిన్నటి దినము
అనంతపురము పోయి పెద్ద డాక్టర్లవద్ద చూపించాము. వారు అన్ని పరీక్షలు చేసి చూచిన తర్వాత అతని గుండె
వాసిపోయింది (హర్టు ఎన్లార్జ్ అయింది) దానిని బట్టి చూస్తే అతను ఐదారు గంటలు మాత్రమే బ్రతుకుతాడు. చికిత్స
చేసినా ఇతను బ్రతుకడు. ఇంటికి తీసుకుపొమ్మని చెప్పారు. ఈ విషయము నాకు, మా అమ్మ, నాన్నకు మాత్రమే
తెలుసు, నా తమ్మునికి తెలియదు. గంట క్రితమే అనంతపురమునుండి వచ్చి, అతనిని ఇంటివద్ద వదలి, అమ్మనాన్న
బాధపడుచుంటే నేను చూడలేక ఇక్కడికి వచ్చాను అన్నాడు.
అతని మాటలువిన్న తర్వాత అతనిని చూచి నాకు కూడ దయా గుణము కొంత పనిచేసిందనుకొంటాను.
అప్పుడు శ్రీరాములును చూచి ముందు నీవు పోయి నీ తమ్మున్ని నావద్దకు తీసుకొని రా అన్నాను. నా మాటవింటూనే
అతను లేచిపోయాడు. గంట తర్వాత అతని తమ్ముణ్ణి తీసుకొని వచ్చాడు. అతనిని చూస్తూనే ఇతను గంటసేపు కూడ
బ్రతుకడు అనే విధముగా ఉన్నాడు. శరీరమంతా నీరుపట్టి ఉబికి ఉన్నది. అతనిని నాముందర కూర్చోమని, ఒక్క
నిమిషము అతని గుండెవైపు చూచి ఇక చాలు ప్రక్కన కూర్చోపెట్టమని చెప్పాను. వారు అలానే చేశారు. అప్పుడు
శ్రీరాములుతో “నీ తమ్మునికి ఇప్పుడు సగము బాగైపోయింది. ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి పోయిన తర్వాత మిగత
సగము బాగైపోతుంది” అని చెప్పి పంపాను. నేను అలా చెప్పేసరికి శ్రీరాములు విన్నాడు కానీ, నామాట నిజమను
నమ్మకము అతనిలో కలుగలేదు. ఒక్క నిమిషము చూచి సగము బాగైంది అనగానే ఏ చికిత్స చేయలేదు, ఎలా
బాగవుతుంది, అను ప్రశ్న శ్రీరాములులో వచ్చింది. లోపల అతని తలలో ప్రశ్న వచ్చినా బయటికి ఏమి కనబడకుండ
అతని తమ్మున్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజంతా గడచిపోయింది. రెండవరోజు కూడ గడచిపోయింది. మూడవ
రోజు మొదలైంది. అప్పుడు శ్రీరాములుకు ఇలా అనిపించింది. అనంతపురములో డాక్టర్లు ఐదారు గంటలకంటే
ఎక్కువ బ్రతుకడని చెప్పారు కదా! ఇప్పటికి దాదాపు అరవైగంటలు గడిచింది కదా! వారు చెప్పినట్లు ఏమీ కాలేదు.
ఎందుకైనా మంచిది, ఒకమారు అనంతపురము తీసుకొని పోయి చూపించుకొని వస్తామని అనుకొన్నాడు. వెంటనే
అనంతపురమునకు కారులో బయలుదేరి పోయారు. అక్కడ డాక్టర్లకు లక్ష్మణమూర్తిని చూపించారు. డాక్టర్లు అన్ని
స్కానింగ్లు చేసి, ఇతని గుండె సాధారణ స్థితికి వచ్చింది ప్రాణాపాయము ఏమిలేదు అని చెప్పారు. అప్పుడు
శ్రీరాములు మీరు ఐదారు గంటలకంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు కదా! అని డాక్టర్లను అడిగాడు. డాక్టర్లు దానికి
సమాధానముగా నిజమే అప్పటి పరిస్థితి అలాగే ఉండేది. ఇప్పుడు చూస్తే మాకే ఆశ్చర్యముగా ఉంది. అప్పుడు చికిత్స
చేసినా బ్రతకడని మేమే చెప్పాము. కానీ చికిత్స చేయకున్నా ఎలా బాగైందో మాకు అర్థము కాలేదు అన్నారు. అప్పుడు
శ్రీరాములుకు మా మాటలు జ్ఞప్తికి వచ్చాయి. నేను ఒక్క నిమిషము చూచిన దానివలననే అతనికి బాగైందని గట్టి
విశ్వాసము అప్పుడు కలిగింది.
రెండవరోజు నావద్దకు శ్రీరాములు వచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు. తాను మొదట నా మాటను నమ్మని
విషయమును కూడా చెప్పాడు. లక్ష్మణమూర్తి ప్రాణాపాయము నుండి బయటపడుటకు మీరే కారణమని కృతజ్ఞత కూడ
చెప్పాడు. తర్వాత లక్ష్మణమూర్తికి ఉబ్బసరోగము, శరీరమంతా నీరు చేరు విషయము చాలాకాలమునుండి ఉన్నదని
చెప్పాడు. దానికి డాక్టర్లవద్ద మందులు తీసుకొమ్మని సలహా చెప్పి పంపాను. నేను చెప్పినట్లు మందులు వాడడము
వలన ఆ రెండు రోగములు కొన్ని దినములు తగ్గేవి, తర్వాత కొన్ని దినములు ఎక్కేవి. డాక్టరు ఇంటివద్దకు వచ్చి
ఒకమారు లాసిక్స్ ఇంజక్షన్ ఇస్తే ఒకరోజు మూత్రము వచ్చేది. అలాగే ఉబ్బస (ఆస్తమా) రోగమునకు మందు ఇస్తే, ఆ
రోజు మాత్రము బాగుండేది. అలా ఆరు నెలలనుండి ఉన్న రోగములు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. లాసిక్స్ ఇంజక్షన్
ఇస్తే ఒకమారు మూత్రము వస్తుంది, ఆస్తమాకు మందు ఇస్తే ఒక గంట మాత్రము బాగుంటుంది. ఆ రెండు రోగములతోనే
అతను చనిపోయేటట్లు ఉన్నాడని వైద్యులు చెప్పారు. అప్పుడు శ్రీరాములు వచ్చి ఒకమారు తన తమ్మున్ని చూడమని
ప్రాధేయపడ్డాడు. అతని బాధ చూడలేక సరే అతనిని తీసుకురమ్మని చెప్పినాను.
ఆ రోజు సాయంకాలము లక్ష్మణమూర్తిని నాదగ్గరికి తీసుకవచ్చారు. అతని శరీరమంతా నీరు నిండుకొని
ఉన్నది. ఉబ్బసము కొద్దిగ కనిపిస్తున్నది. వారు చెప్పినంత ఎక్కువగా కనిపించలేదు. అతనికి కూర్చొనే ఓపిక కూడ
లేదు. ఒక మనిషి వెనుక పట్టుకొని కూర్చోబెట్టుకొన్నారు. అతనిని అదేలాగున నాముందర కూర్చోబెట్టారు. అప్పుడు
నేను ఇలా చెప్పాను. "ఇతని శరీరములోని గాలివలన ఏర్పడు ఉబ్బసరోగము ఎంత ఉందో అంత బయటికి కనిపించమని
ఎదురుగానున్న నేను చెప్పుచున్నాను” అనగానే లోపలినుండి ఉబ్బసము తీవ్రస్థాయిలో బయటికి వచ్చింది. అప్పుడు
లక్షణమూర్తి విశేషముగా శ్వాసను పీల్చడము వదలడము చేయుచున్నాడు. శ్వాస నోటిలోను, ముక్కులోను పట్టినంత
తీవ్రముగా బయటికి వస్తావుంది. అలాగే అంతే తీవ్రతతో లోపలికి పోతావుంది. ప్రక్కన చూచేవాళ్ళకు అతను
ఊపిరితిత్తులు పగిలి చనిపోతాడేమో అనిపిస్తూవుంది. అపుడు నేను తీవ్రత తగ్గిపోయి సాధారణ స్థాయికి రమ్మని
చెప్పగానే అతనికి శ్వాస సాధారణముగా ఆడను మొదలు పెట్టింది. అక్కడ ప్రత్యక్షముగా చూచువారికి అదొక వింతగ
అగుపించింది.
రోగము ఒక భూతము (జీవుడు) అను నా సూత్రము ప్రకారము శరీరములోనున్న నీరు, గాలి, అను భూతములను
అతనిని గురించి అడగాలనుకొన్నాను. అప్పుడు ఇట్లు అడిగాను. ఇతని శరీరములోనున్న గాలి, నీరు అను మిమ్ములను
అడుగుచున్నాను. ఇతనిని ఎందుకు అంత తీవ్రస్థాయిగా బాధించుచున్నారు కారణము ఏమిటి? అని నా నుండి
మాటరాగానే మొదట ఉబ్బసం కొంతవరకు పెరిగి, నేను గాలిని మాట్లాడు చున్నాను అని చెప్పసాగింది.
గాలి :- ఇతను మహాపాపమును సంపాదించుకొన్నాడు. గతజన్మలో మనుషులను తన అధికారము చేత చాలా
ఇబ్బందులపాలు చేశాడు.
నేను :- ఈయనకు ఏ అధికారముండేది? ఏమి చేశాడు.
గాలి :- పోలీస్ ఉద్యోగము, యస్.ఐ నుండి డి. యస్.పి వరకు ఉద్యోగమును చేశాడు. తాను కూడ ఒక మనిషిని
అను మాట మరిచిపోయి తన అధికారముతో ఎంతోమందిని నేరస్థులు కానివారిని కూడ ఇబ్బందుల పాలు చేశాడు,
కొందరిని కాల్చి చంపేశాడు. తనకు తెలిసిన రేణుకా ఎల్లమ్మ తప్ప మిగత దేవతలను లెక్కచేయక, విలువ ఇవ్వకుండ
మాట్లాడడము వలన పెద్ద పాపమును సంపాదించుకొన్నాడు. పోయిన జన్మలో ఎరికల కుటుంబములో పుట్టిన ఇతను,
తనకంటే పెద్దకులస్థులను అసూయతో అదే పనిగా ఎక్కువగా బాధించెడివాడు. చెప్పేదానికి ఒకటి గాదు ఎన్నో
పాపములు చేసుకొన్నాడు. దానివలననే ఈ ఉబ్బస రోగమును అనుభవించుచున్నాడు. నా వలన చిల్లర చిల్లర
పాపములే ఐదు సంవత్సరములుగా అమలగుచున్నవి.
నేను :- నీవు అణిగిపోయి, నీరును మాట్లాడమని తెలియజేయి.
(నిమిషము తర్వాత గాలి మాట్లాడకుండ లక్ష్మణమూర్తి నుండి నీరు మాట్లాడను మొదలు పెట్టింది.)
నీరు :- మీరు ఇతనిని ఏమి చేయాలనుకొన్నారు.
నేను :- నేను ఏమీ అనుకోలేదు. ఈ బాధకు కారణమును మీ చేత తెలుసుకోవాలనుకొన్నాను. గాలి తనవంతు
చేయవలసినది తెలిపినది. ఇతను చేసిన చిల్లర పాపముల చిట్టా ఎంతో ఉందని చెప్పింది. నీవు ఇతని శరీరములో ఏ
పాపపరిహార నిమిత్తమున్నావు. మీరు చెప్పిన తర్వాత నా నిర్ణయము ఉంటుంది.
నీరు :- గాలి! మీకు చెప్పినది మనుషుల వలన వచ్చిన పాపము, దేవతల వలన వచ్చిన పాపమును అమలు చేయునట్లు
తెల్పినది. దానికంటే పెద్దదైన ఒక జ్ఞానిని నిందించిన పాపమును, దాదాపు పది సంవత్సరములనుండి అనుభవిస్తున్నాడు.
ఎదుటి మనిషి దైవజ్ఞానమును బోధించు బోధకుడని తెలిసి, అతనిని నానారకములుగా హేళనగా మాట్లాడి, చివరికి
అతని మీద చేయి చేసుకొన్నాడు. ఆ రోజు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ నని గర్వముతో ఇతను చేసుకొన్న పాపమును
ఇపుడు నేను అమలు చేయుచున్నాను. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఎన్ని మందులు తినినా, ఏమాత్రము నయముకాని
రోగముగా శరీరములో అనుభవిస్తున్నాడు. ఇప్పటికి మీవద్దకు వచ్చి కొంత రక్షణ పొంది ఆరునెలలుగా బతికాడు. ఈ
పాపము ఈ జన్మకేకాక రేపు జన్మకు కూడ ఉన్నది. వచ్చే జన్మలో కాళ్ళు, చేతులు చిన్నతనమునుండి లేకుండ పోవడమే
కాక, మానసికముగా కూడ పెరుగుదల లేకుండ పోయి దాదాపు ఇరవై సంవత్సరములు బ్రతుకవలసియున్నది.
నేను :- ఇపుడు ఈయన చరిత్ర నాకు అర్థమైనది. నా వలన ఇతని ఆయువు ఆరునెలలు సర్దుబాటు అయివుంటే, లెక్క
ప్రకారము తర్వాత జన్మలో ఈ ఆరునెలలు తగ్గిపోతుంది. వీరు నావద్దకు వచ్చారు. మీరు కూడా నా వద్దకు వచ్చారు.
కావున నేను ఇరువురకు న్యాయముగా పరిష్కారమును చెప్పెదను. దాని ప్రకారము నడుచుకోండి.
నీరు :- మీ మాటను మేము గౌరవిస్తాము చెప్పండి.
(అప్పుడు అక్కడ ఉన్నవారందరిని బయటకు పంపి మేము ఏమి చెప్పునది ఇతరులకు తెలియకుండ చేశాను.)
అందరు బయటికి పోయిన తర్వాత గాలి, నీరు అను భూతములకు (రోగములకు) నేను ఒక ఉపాయమును
చెప్పాను. మనుషులలో జ్ఞానము అభివృద్ధి అగుటకు, జ్ఞానమునకు విలువను పెంచుటకు ఉపాయమును ఆ భూతములకు
చెప్పవలసివచ్చినది. నా మాటను ఆచరిస్తామని రెండు భూతములు చెప్పిన తర్వాత, నేను వారితో లక్ష్మణమూర్తికి
పదిహేను రోజులు ఏ బాధలేకుండ ఉండునట్లు చేయమని చెప్పాను. అంతేకాక పది రోజులకు లక్ష్మణమూర్తిని తిరిగి
నావద్దకు రమ్మంటాను. అప్పటికి శరీరములో నీరు, గాలి ఏమాత్రము నాకు కనిపించకూడదనీ, తర్వాత ఐదు రోజులకు
మీరు పాపపరిపాలనను ప్రారంభము చేసుకోవచ్చనీ, ఇరవై దినములకు అతనిని మరుజన్మకు పంపించమనీ, ఆ
సమయమునకు రెండు రోజుల ముందే నేను మద్రాసుకు (చెన్నయ్) పోతానని చెప్పాను. ఆ మాటకు వారు, మీరు
చెప్పినట్లే చేస్తామని చెప్పి నావద్ద సెలవు తీసుకొన్నారు. తర్వాత బయటవున్న శ్రీరాములును పిలిచి, లక్ష్మణమూర్తిని
ఇంటికి తీసుకు పొమ్మని చెప్పాను. మరియు ఈ రోగమును పోవునట్లు చేశాను. పది రోజుల తర్వాత ఇతనిని
నావద్దకు తీసుకొని వచ్చి చూపించుకొని పొమ్మని చెప్పినాను. అలాగేనని వారు పోయారు. తర్వాత పది రోజులకు
వచ్చారు. పది రోజుల క్రిందట నేను లక్ష్మణమూర్తిని చూచినప్పుడు, మనిషి తెల్లగ లావుగ, శరీరమంత నీరు
నిండుకొనియున్నాడు. ఇప్పుడు చూస్తే మనిషి బక్క పలుచగ, గుర్తుపట్టలేని విధముగ మారిపోయాడు. అంతేకాక
తెల్లగ ఉన్న శరీరఛాయ నల్లగ మారిపోయివుంది. శరీరములో నీరు ఏమాత్రము కనిపించలేదు. అట్లే ఉబ్బసము
కూడా ఏమి లేదు. లక్ష్మణమూర్తి పూర్తి ఆరోగ్యముగా ఉన్నాడని, అతని అన్న శ్రీరాములు సంతోషమును వ్యక్తము చేస్తూ
చెప్పాడు.
అప్పుడు శ్రీరాములుతో నేను కొన్ని మాటలు చెప్పాను. ఆరు నెలల క్రితము, నీ తమ్ముడు ప్రాణాపాయస్థితిలో
ఉన్నాడని చెప్పావు. ఎవరి విషయములోను జోక్యము చేసుకోని నేను ఆ దినము నిమిషములో నయము చేసి
పంపాను. ఇది జరుగక ముందునుంచి నీవు నాదగ్గరకు వస్తున్నావు. నీవు వచ్చినా నీకు జ్ఞానము మీద శ్రద్ధకలుగలేదు.
నీ తమ్మున్ని చూచి పంపితే, జ్ఞానమునకు ఇంత శక్తి ఉంది అని తెలుసుకొని, మీరు జ్ఞాన మార్గములో ప్రయాణిస్తారని
అనుకొన్నాను. తర్వాత మీరు జ్ఞానమును పట్టించుకోలేదు. తిరిగి పదిరోజుల క్రితము మరియొక రోగముందని
వచ్చారు. అప్పుడు కూడ మీకు నయమగునట్లు చెప్పిపంపాను. ఇప్పుడు శరీరములో నీరుగానీ, ఊపిరితిత్తులలో గాలి
ఉధృతిగానీ లేదు. దీనినిబట్టి చూస్తే, నావద్దకు వచ్చినందుకు కొన్ని సంవత్సరముల నుండి ఆరోగ్యము బాగలేని వానికి
బాగైనది. ఇంతవరకు మీకు పూర్తి బాగయ్యే వరకు చూచాను. ఇప్పటినుండి ఏ రోగము వచ్చినా మీరు నావద్దకు
రావద్దండి. వైద్యము చేయడము మా ఉద్దేశముకాదు, మా పనీ కాదు. మా ధ్యాస అంతా జ్ఞాన అన్వేషణలో
ఉంచాలనుకొన్నాము. అందువలన మా దారి వేరు. ఈ వైద్యము పనివేరు. నావద్ద మంత్రములేదు, మాయలేదు.
కేవలము దైవజ్ఞానముతోనే మీకు బాగుచేయగలిగాను. ఇప్పటినుండి మీరు కూడ దైవజ్ఞానము మీద ధ్యాస పెట్టుకోండి.
దానితోనే రోగాలు వచ్చినా పోతాయి. అటువంటి ధ్యాసలేకపోతే మీకే ఇబ్బంది. ఈ రోగాలు మందులతోనే పోతాయని
అనుకోవద్దండి అని చెప్పి పంపినాను. అంతగా చెప్పినా దైవజ్ఞానము మీద శ్రద్ధలేదు. ఉన్న శ్రద్ధయంతా డబ్బు
సంపాదన మీదనే పెట్టారు.
ఇక్కడనుండి పోయిన ఐదు రోజులకు లక్ష్మణమూర్తికి తిరిగి ఉబ్బసము, శరీరములో నీరు చేరుట ప్రారంభమైనది.
తర్వాత ఐదు రోజులకు ఆ రెండు రోగములు ఎక్కువ అయిన దానివలన లక్ష్మణమూర్తి చనిపోయాడు. ఆ దినము నేను
మద్రాసులో ఉన్నాను. నేను అతను పోయిన రెండు రోజులకు వచ్చాను. అప్పుడు శ్రీరాములు వచ్చి జరిగిన విషయము
చెప్పిపోయాడు. తర్వాత లక్ష్మణమూర్తికి దినాలు చేసినప్పుడు అతనియొక్క గుర్తుగా కొలాయి బిగించిన బకెట్లాంటి
స్టీలాపాత్రను శ్రీరాములు తెచ్చి ఇచ్చాడు. ఆ పాత్రమీద లక్ష్మణమూర్తి అని వ్రాసిన అక్షరములు గలవు. ఆ పాత్ర మా
వద్ద నేటికీ ఉన్నది. ప్రాణాపాయ స్థితి నుండి తప్పించి, ఆరోగ్యమును బాగుపడునట్లు చేసినా, దైవజ్ఞానమునకు ఒక్క
రూపాయి కూడ వినియోగించలేదు. డాక్టర్ల మందులవద్ద వేలు, లక్షలు గుమ్మరించినవారు దేవుని జ్ఞానమునకు ఒక్క
రూపాయిని కూడ వినియోగించలేదు అంటే, వారివద్ద జ్ఞానమునకు ఎంత విలువ ఉన్నదో అర్థమగుచున్నది. అందువలన
చివరిలో దేవుడు, మీరు మావద్దకు రావద్దండి అని చెప్పి పంపించాడు. అతను చనిపోయిన తర్వాత వారు జ్ఞాపకార్థము
ఇచ్చిన పాత్ర ఈ రోజు కొనినా వందరూపాయల ఖరీదు కూడ చేయదు. ముప్ఫైమూడు సంవత్సరములక్రితము దాని
రేటు ఎంత ఉంటుందో, మీకే అర్థమవుతుంది. వారి గుణముల ప్రభావము వదలివేసి ఇక్కడ ముఖ్యముగ చెప్పవలసినది
ఏమగా!
ప్రొఫెసర్కు, వెంకటేసుకు వచ్చిన నొప్పి రోగమే అయినా దానిని కూడ ఒక భూతముగా లెక్కించి శాసించి
చెప్పి పంపాము. శరీరములో ప్రవేశించు సూక్ష్మశరీరముల (దయ్యముల) వలన వచ్చు అనారోగ్యములే కాక,
శరీరములోవచ్చు కొన్ని రోగములు కూడ దయ్యములుకానటువంటి, భూతముల వలన వచ్చునవని చెప్పవచ్చును.
దయ్యములు, భూతములు అనుమాటను ఇక్కడ కొంత జాగ్రత్తగ అర్థము చేసుకోవలసిన విధానమున్నది. ఒక మనిషి
అర్ధాయుస్సుతో అకాల మరణమును పొందితే దయ్యముగా (సూక్ష్మశరీరముగా) అదే జన్మలోనే ప్రారబ్ధకర్మ అయిపోవునంత
వరకు ఉండునని చెప్పాము. అటువంటి దయ్యములు మనుషులవి కావచ్చును, ఇతర జీవరాసులవి కావచ్చును.
అటువంటివన్నీ జీవరాసులలోనికే లెక్కించబడును. జీవుడు అనగా భూతము అని కూడ అర్థముగలదు. అకాలమరణము
పొందిన తర్వాత కూడ ఉన్నది జీవుడే అయినా గుర్తింపుకోసము దయ్యము అంటున్నాము. ఇటువంటి దయ్యములన్నిటినీ
ఒక రకము భూతములని చెప్పవచ్చును. అట్లే రెండవ రకము భూతములు కూడ భూమిమీద గలవు. వాటిని
వివరించుకొని చూచిన ఈ విధముగా తెలియగలదు.
ఆకాశము, గాలి, అగ్ని నీరు, భూమి అను వాటిని పంచ భూతములు అంటాము. అంతేకాక విశేషముగా
వాటిని పంచ మహా భూతములని కూడ అంటాము. మహా భూతములనగా! చాలా గొప్పవని వాటి బలమును
అంచనా వేయలేమని చెప్పవచ్చును. ఈ ఐదు మహా భూతములు బయట ప్రపంచముగా కనిపిస్తున్నవి. బయటి
ప్రపంచములో ఐదు మహాభూతములుండగా, శరీరమను దానిలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పేర్లు గల
స్వల్ప భూతములు కూడ గలవు. ప్రపంచము లోనివి పంచ మహాభూతములుకాగా, శరీరములోనివి పంచ స్వల్ప
భూతములను రెండు రకములని చెప్పవచ్చును. మొదటి రక భూతములైన దయ్యములు, ఇంకొక శరీరములో వ్యాధుల
రూపమున బాధించునట్లు, రెండవ రక భూతములైన పంచ స్వల్పభూతములు తామున్న శరీరములోనే వ్యాధుల రూపమున
బాధించును. సులభముగా అర్థమగుటకు రెండు రకముల భూతములలో ఒక రకము బయట, మరొక రకము లోపల
ఉన్నవని చెప్పవచ్చును. స్వల్పభూతములు దయ్యాలవలె రోగరూపములో ఉండినప్పటికి ఆకాశము, గాలి, అగ్ని, నీరు,
భూమి అను స్వల్ప భూతములు దయ్యలకంటే ప్రత్యేకమైనవి.
శరీరములో రోగరూపములో బాధించు మొదటి రకము దయ్యములు, మేము చెప్పితే మా మాటకు గౌరవమిచ్చి
శరీరములో బాధించకుండ పోవుచున్నవి. అలాగే శరీరములో రోగరూపములో బాధించు రెండవ రకము స్వల్పభూతములు
కూడ, మేము చెప్పితే మా మాటను గౌరవించి బాధించకుండ పోవుచున్నవి. అనంతపురములోని ప్రొఫెసర్కు, చిన్న
పొడమలలోని వెంకటేసుకు, తాడిపత్రిలోని లక్ష్మణమూర్తికి రెండవ రకము స్వల్పభూతముల వలననే రోగ బాధలు
కల్గినవనీ, మేము చెప్పితే వారిలోని భూతములు మా మాటవిని అణిగి పోవుట వలన బాధలు లేకుండ పోయినవని
తెలియుచున్నది. ఒక మనిషి చేసుకొన్న ప్రారబ్ధకర్మను రోగ రూపములో శరీరమునందు అనుభవించునపుడు, శరీరములో
ఒకటవ రకములైన దయ్యములైనా బాధించవచ్చును, లేక రెండవరకములైన స్వల్పభూతాలైనా బాధించవచ్చును. మా
జీవితములో మేము ఎంతో శ్రమించి, ఎంతో శ్రద్ధతో, జ్ఞాన సముపార్జన చేయడము వలన శరీరములోని కర్మలు,
రోగములు, దయ్యాలు, స్వల్పభూతాలు ఎట్లున్నవని తెలియ గలిగాము. కొందరికి వచ్చిన రోగములను జ్ఞానశక్తివలన
నివారించగ, నివారించినవాడు జ్ఞానియనిగాని, నివారణ గొప్పకార్యమనిగానీ గుర్తించక జ్ఞానమును మంత్రమని, జ్ఞానిని
మంత్రగాడని చెప్పువారుగలరు. తమ రోగముల నివారణకు ఎన్నో వేలు, లక్షలు ఖర్చుచేసి ఎక్కడా నయము కాకపోతే,
మా దగ్గరకు వచ్చి ప్రాధేయపడి, నివారింపజేసుకొని, మాకు మాంత్రికుడని బిరుదు ఇచ్చి పోయినవారు కూడా గలరు.
అటువంటి ఒక సంఘటను వివరిస్తాను చూడండి. ఇది 1980వ సంవత్సరములో జరిగినట్లు నాకు జ్ఞాపకమున్నది.
పులివెందుల దగ్గర పార్నపల్లి గ్రామము గలదు. ఆ ఊరివారు అనంతపురములో నివాసమున్నారు. పార్నపల్లిలో
నాకు బంధువులు గలరు. నాకు బంధువులైనవారు నన్ను గురించి చెప్పిన దానివలన అనంతపురములో నివాసముండు
వారు, వారి అనారోగ్యమును గురించి అడుగుటకు తాడిపత్రి లోని నావద్దకు వచ్చారు. వచ్చినవారు ముగ్గురు. భార్య,
భర్త, ఒక పెద్ద వయస్కురాలు. భర్తకు నలభై సంవత్సరముల వయస్సు కలదు. భార్యకు ముఫ్ఫైఐదు సంవత్సరములు
వయస్సుగలదు. తర్వాత అరవై సంవత్సరముల వయస్సు గల ఆమె ఒకరు గలరు. పెద్దవయస్సుగల ఆమె వచ్చిన
వ్యక్తికి తల్లి అవుతుంది. వచ్చినవారు "మాది పార్నపల్లె, ప్రస్తుతానికి అనంతపురము లో ఉన్నాము. పార్నపల్లెలో
పలానా వ్యక్తి చెప్పిన దానివలన వచ్చాము” అని చెప్పారు. చెప్పి పంపిన వ్యక్తి నాకు బంధువు అయిన దానివలన, మా
వాళ్ళు వచ్చినవారికి మర్యాద చేసి కూర్చోబెట్టారు. తర్వాత పై అంతస్తులో ఉన్న నాకు విషయమును తెలిపారు. నేను
వీలు చూచుకొని వారిని పైకి రమ్మని చెప్పాము. వారు ముగ్గురూ వచ్చి కూర్చున్నారు. భర్త, భార్యను గురించి చెప్పాడు.
ఆమెకు దాదాపు ఒక సంవత్సరమునుండి కుడి కాలులో విపరీతముగా నొప్పి ఉన్నదనీ, కాలికి నీళ్ళు తగిలితే తేలు
కుట్టితే ఉన్న నొప్పికంటే ఎక్కువే అవుతుందనీ, కాలు నడువడానికి చాలా కష్టముగా ఉంటుందని చెప్పగ విన్నాను.
అప్పుడు నేను అడగడము జరిగినది.
నేను :- ప్రతి దినము నొప్పి వస్తుందా? లేక అప్పుడప్పుడు వస్తుందా?
అతను :- అది పోతే కదా వచ్చేది. సంవత్సరము నుండి ఎట్లున్నది అట్లే ఉంది. ఒక్కరోజు కూడ పోయిందని
చెప్పేదానికే లేదు.
నేను :- అలా ఉన్నప్పుడు ఎక్కడా వైద్యము చేయించలేదా?
అతను :- చేయించాము. బెంగుళూరులో స్పెషలిస్టు దగ్గర చూపించాము. మూడు లక్షలకు పైన డబ్బులు అయిపోయినాయి.
అయినా ఏమి నయము కాలేదు.
నేను :- ఇప్పుడు మందులు వాడుచున్నారా?
అతను :- ప్రతి దినము వాడవలసిందే! పూటకు 40 రుపాయల మందులు వాడవలసిందే. మందులు వాడితే రెండు
మూడు గంటలు నొప్పి కనిపించదు. తర్వాత నొప్పి మొదలవుతుంది. మూడు పూటలు మందులు వాడితే పగలంతా
కొంత బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోతే పరవాలేదు. నిద్ర రాకపోతే భరించలేని బాధ ఉంటుంది. ఆ బాధ
చూడలేక ఉయ్యాల కట్టి ఊపుచూ ఉంటే కొంతమేలు, లేకపోతే ఒక రాత్రి గడిచేదానికి చాలాకష్టముగా ఉంటుంది.
నేను :- మందులు వాడితే పగలు నొప్పి అంతగా కనిపించదు అన్నావు కదా! అలాంటపుడు రాత్రిపూట కూడ మందులు
వేసుకోవచ్చు కదా!
అతను :- ఒక దినములో మూడు మార్లకంటే ఎక్కువ వాడకూడదని డాక్టరు చెప్పాడు.
నేను :- రాత్రిపూట నొప్పి ఎక్కువగా నిద్రరాకుండ ఉంటుందని డాక్టరుకు మీరు చెప్పలేదా!
అతను :- చెప్పినాము. పగలు రెండు పూటలు వేసుకొని, ఒక డోస్ రాత్రిపూట వేసుకోమన్నాడు. కానీ పగలే బాధ
తట్టుకోలేక మూడు మార్లు వేసుకొంటున్నాము.
నేను :- నొప్పి రావడానికి కారణమేమని డాక్టర్లు చెప్పారు?
అతను :- ఇక్కడ ఎవరూ చెప్పలేక, బెంగుళూరుకు వ్రాసి ఇచ్చారు. అక్కడకు పోయి అన్ని పరీక్షలు చేయించాము.
చివరకు కాలు నరములో లోపము వలన అట్లు నొప్పి వచ్చినదని నరాల స్పెషలిస్టు చెప్పాడు.
నేను :- కాలి మీద నీరు తగిలితే, తేలుకుట్టిన నొప్పికంటే ఎక్కువ అవుతుందని చెప్పారు. స్నానము చేయాలంటే
ఎలా?
అతను :- కుర్చీలో కూర్చొని మరొక కుర్చీ మీద కాలుపెట్టి దానిమీద నీళ్ళు పడకుండ గుడ్డలు కప్పి మొదట వళ్ళంత
స్నానము చేసిన తర్వాత కాలును మాత్రము తడి గుడ్డతో తుడవడము చేస్తున్నాము. మా ఇంటిలో పని మనుషులు
ఆడవారు ఇద్దరు ఉన్నారు. అందువలన అందరూ కలిసి జాగ్రత్తగా స్నానము చేయిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము
నీళ్ళు తగిలితే కష్టము కాబట్టి కాళ్ళు కడుక్కోలేదు.
నేను :- మొదట నొప్పి వచ్చినపుడు ఎలా ప్రారంభమైనదో చెప్ప గలుగుతారా?
ఆమె : - ఒకరోజు నిద్రలేస్తూనే క్రింద పాదము మీద ఐదు నిమిషాలకు ఒకసారి సూదులతో పొడిచినట్లు తెలిసేది.
లా ఆ రోజు ఉదయము 9 గంటల వరకు అట్లే ఉండేది. తర్వాత ఆ దినమంతా ఏమీలేదు. రెండవ రోజు
నిద్రలేస్తూనే మొదటి రోజు ఉన్నట్లే సూదులతో పొడిచినట్లు తెలిసేది. ఆ దినము సాయంకాలము మూడుగంటల వరకు
అట్లే ఉన్నది. మూడవ రోజుకూడ ఉదయమునుండి అట్లే ఉన్నది. ఆ దినము రాత్రి 9 గంటల వరకు పోలేదు. ఇక
నాల్గవదినము నుండి కాలులో నొప్పి ప్రారంభమైనది. అప్పటినుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నది.
నేను :- మందులతో బాధపోనప్పుడు. ఎవరైన మంత్రగాళ్ళుంటే వారి దగ్గర చూపించకూడదా?
అతను :- చాలామంది దగ్గర చూపించాము. ఆ పీడ, ఈ పీడ అని చెప్పి డబ్బులు తీసుకొని కొంతమంది దిగదీశారు,
కొంతమంది మంత్రించారు, కొంతమంది తావెత్తు కట్టారు. డబ్బులు పోయినాయి, కానీ రోగము బాగుకాలేదు.
నేను :- సంవత్సరమునుండి నొప్పి ఉన్నదంటున్నారు కదా! నొప్పి ఉన్న కుడికాలుకు, నొప్పిలేని ఎడమ కాలుకు,
సైజులో ఏమైనా తేడా వచ్చిందా?
అతను :- ఏమీ తేడా రాలేదు, మొదట ఎట్లున్నదో అట్లే ఇప్పుడూ ఉన్నది.
నేను :- సరే అది ఏ రోగమైనా కానీ తగ్గి పోయేటట్లు చూస్తాము. ఇలా రోగాలకు వైద్యము చేసేది నేను వదలుకొన్నాను.
మీరు సరి కులస్థులు తర్వాత మా బంధువులు పంపగా వచ్చినవారు కావున చూస్తున్నాను.
(అని చెప్పిన తర్వాత రోగమున్న ఆమెను నేను ముట్టుకోకుండ ఆమెకు నయము చేయాలంటే కుదరదు. ఆమెకు నొప్పి
ఎక్కడుందో అక్కడంతా వేలుతో ముట్టుకోవలసిందే. నాకు ఆమెను ముట్టుకోవడము ఇష్టములేక నా భార్య మల్లేశ్వరిని,
నేను చెప్పినట్లు తాకుతూవుండమని చెప్పినాను. తర్వాత ఆమెను నిలబడమని చెప్పి నొప్పి ఎక్కడనుంచి ఉందో చెప్పమని
అడిగాము. అప్పుడు ఆమె కుడికాలు పై భాగము నడుమువద్దనుండి ఉందని చెప్పింది. అప్పుడు చూపుడు వ్రేలును
ఆమె చెప్పిన స్థలములో నడుము దగ్గర పెట్టమని నాభార్యకు చెప్పగ, నాభార్య అలాగే తన చూపుడు వ్రేలుతో ఆమె
చెప్పిన చోట త్రాకింది. అలా ఆ వ్రేలును కొద్దికొద్దిగ నిదానముగా క్రిందికి జరుపుతూ రమ్మని చెప్పాను. నా భార్య
మల్లేశ్వరి ఆ విధముగనే కొద్దిగ జరుపుతూ వచ్చింది. వ్రేలు పెట్టినప్పటినుండి మల్లేశ్వరి జరుపుతున్నపుడు నొప్పి
ఎలాగుందో చెప్పమని ఆమెను అడిగినాను. ఆప్పుడు ఆమె నొప్పిని గమనిస్తూ వ్రేలు క్రిందికి జరిపేకొద్ది వేలు క్రిందనే
నొప్పి వస్తూ ఉన్నదని, వేలు పై భాగమున నొప్పి కనిపించలేదని చెప్పింది. మల్లేశ్వరి వేలు జరిపేకొద్ది, నొప్పి వ్రేలు
వెంట దిగుతూనే వచ్చింది. అలా కొద్దికొద్దిగా నేను చెప్పినట్లు మల్లేశ్వరి వ్రేలును క్రిందికి జరుపుతూ మోకాలి వరకు
తెచ్చింది. తన నొప్పి కాలు పై భాగము నడుము వరకు ఉన్నదని చెప్పిన ఆమె, వ్రేలు ఉన్నచోటినుండి క్రిందికి నొప్పి
ఉంది కానీ మోకాలి పైన ఎక్కడ నొప్పి లేదు అని చెప్పింది. మల్లేశ్వరిని అలాగే క్రింది పాదము వరకు జరుపుతూ
రమ్మని నేను చెప్పాను. మల్లేశ్వరి అలాగే చేసింది. ఆమె కాలిలోని నొప్పి కూడ, జరిపే వ్రేలివెంట క్రింద పాదము
వరకు వచ్చింది. పాదము పైన కాలిలో ఎక్కడ ఏమాత్రము నొప్పి లేకుండ పోయింది. అదే విషయమే ఆమె కూడ
చెప్పింది. చివరిగా మల్లేశ్వరి వ్రేలును పూర్తి క్రిందికి వచ్చునట్లు చేసి, పాదము అయిపోయిన తర్వాత భూమికి
త్రాకించమని చెప్పాను. నేను చెప్పినట్లే చేసింది. ఆమె శరీరములో కాలులోని నొప్పి కూడ భూమిలోనికి దిగిపోయింది,
కాలులో ఏమాత్రము నొప్పి లేకుండ పోయింది. తనకు కాలులో ఏమాత్రము నొప్పి లేకుండ పోయిందని ఆమె కూడ
చెప్పింది. ఇదంతా ఆమె భర్త ముందర, అత్త ముందర జరిగింది. పై నుండి క్రిందివరకు వ్రేలును జరుపుచు నొప్పిని
క్రిందికి తెచ్చు ప్రక్రియ కనీసము ఐదు లేక ఆరు నిమిషముల కాలము జరిగివుంటుంది. సంవత్సరమునుండి ఉన్న
నొప్పి ఐదారు నిమిషములలో లేకుండ పోయిందంటే ఆమె భర్త, అత్త ఇద్దరూ నమ్మలేకపోయారు. వారికి నమ్మకమును
కల్గించుటకు నీళ్ళు తెప్పించి నాముందరే కాలి మీద పోసి చూపించాను. నీళ్ళు కాలికి తగిలితే తేలు కుట్టినంత నొప్పి
కలిగేది. కానీ అప్పుడు ఏ నొప్పీ రాలేదు.
వారికి కొన్ని మాటలు చెప్పదలుచుకొని ఈ విధముగా చెప్పాను. “మీరు ఇంతవరకు ప్రతి దినము వాడుచున్న
మందులు వాడవలసిన పనిలేదు. ఇప్పటినుండి నొప్పిరాదు. నేను ఉన్నాను కాబట్టి మీకు చూచాను సరిపోయింది.
నేను లేకపోయుంటే, నీకు ఈ వైద్యము చేయువారే ఉండరు కదా! అందువలన ముఖ్యముగ మీకు నేను చెప్పునదేమంటే
నేను మీ ముందరే వైద్యము ఏమి చేశాననేది మీరు ప్రత్యక్షముగ చూచారు కదా! నేను ఏ మందుగానీ, ఏ మంత్రముగానీ
వాడలేదు. కేవలము వ్రేలు స్పర్శతోనే బాధను పోవునట్లు చేశాను. దానికి కారణము కేవలము దైవజ్ఞానము మాత్రమే.
నేను జ్ఞానమును తెలుసుకొన్నాను కావున నాకు ఆ రోగములు చెప్పినమాట వింటాయి. అదే విధముగ మీరు కూడ
జ్ఞానము తెలుసుకొంటే నాకున్నట్లే మీకు కూడ జ్ఞానశక్తియుండును. అలాంటపుడు మీ వద్దకు ఇటువంటి రోగములు
రానేరావు. ఎవరికైన రోగములుండి బాధపడుచుంటే నేను మీకు బాగుచేసినట్లే మీరు కూడ వారికి బాగుచేయ
వచ్చును. అందువలన మీరు దైవజ్ఞానమును తెలుసుకోండి. మాకెట్లు జ్ఞానము తెలుస్తుంది అని అనుకోవలసిన
పనిలేదు. మేము జ్ఞానమును తెలుపు నిమిత్తము ప్రబోధ, దేవాలయ రహస్యములు, జనన మరణ సిద్ధాంతము అను
మూడు గ్రంథములు వ్రాసియుంచాము. ఆ మూడు గ్రంథముల ఖరీదు కేవలము 40/- రూపాయలు మాత్రమే.
మీరు 40 రూపాయలు ఇచ్చి గ్రంథములు తీసుకొని పోయి ఇంటివద్దనే జ్ఞానమును తెలుసుకోండి అని జ్ఞానాన్ని
గురించి, జ్ఞానము యొక్క గొప్పతనమును గురించి చెప్పాను.
నేను చెప్పిన దానికి వారు తర్వాత వచ్చి పుస్తకాలు తీసుకొంటామని చెప్పి పోయారు. వారము రోజుల వరకు
వారు రాలేదు. గోనుగుంట్ల వెంకటనారాయణ అనంతపురములోనే కాపురమున్నాడు. (ప్రస్తుతము ఇపుడు ఆయన
సన్యాసత్వము తీసుకొని జిహ్వానంద స్వామిగా ఉన్నాడు.) వెంకట నారాయణ తన స్నేహితుని ఇంటికి పోయాడు.
స్నేహితుని ఇంటి ప్రక్కనే, నా దగ్గరకు వచ్చి నొప్పిని బాగుచేయించుకొని పోయిన వారున్నారట. ప్రక్క ఇంటి ఆమెకు
తాడిపత్రి స్వామిదగ్గరకు పోయింటే నొప్పి పోయిందని వెంకటనారాయణకు ఆయన స్నేహితుడు చెప్పాడు.
వెంకటనారాయణ నాదగ్గరకు వారమునకొకమారు వచ్చి జ్ఞానమును తెలుసుకొనేవాడు. కనుక వెంకటనారాయణ
ప్రక్క ఇంటి వారి దగ్గరకు పోయి కలిసి మాట్లాడి, నొప్పి పూర్తిగ పోయిందా అని అడిగాడు. దానికి ఆమె పూర్తిగా
పోయింది, ఎవరితోను కాని దానిని ఆయన పొగొట్టాడు అని చెప్పింది. అంతలో ఆమె అత్త నొప్పియేమో పోగొట్టినాడు,
కానీ ఆయన డబ్బులు అడుగుతాడే అని అనింది. అంతేకాక ఆయనది ఏమి ఖర్చుకాలేదు, మమ్ములను 40
రుపాయలడిగినాడు. రెండు నిమిషాలు మంత్రించి, డబ్బులు అడిగితే ఏమి బాగుంటుంది? అని కూడ అన్నది. ఆ
మాటలువిన్న వెంకట నారాయణకు ఏమీ అర్థముకాలేదు. ఇక్కడ ఏమి జరిగినది ఆయనకు తెలియదు. కావున ఆయన
వారితో ఏమి మాట్లాడకుండ, మౌనముగ వచ్చేశాడు. వెంటనే తాడిపత్రికి వచ్చి, జరిగిన విషయమంతా నాభార్య
ద్వారా తెలుసుకొన్నాడు. తర్వాత నావద్దకు వచ్చి కలిసి అనంతపురములో వాళ్ళు అనిన మాటలు నాకు చెప్పాడు. ఆ
మాటలకు నాకు కోపము వచ్చింది.
అప్పుడు వెంకటనారాయణతో ఇలా అన్నాను. “వాళ్ళు విపరీతముగా బాధపడుచు నావద్దకు వచ్చారు. వారు
ఎవరో నాకు తెలియదు. పార్నపల్లెనుండి చెప్పి పంపారని మరియు కులస్థులమని వాళ్ళు వస్తూనే కాఫీ ఇచ్చి మర్యాద
చేశాము. తర్వాత మధ్యాహ్నము భోజన సమయమునకు ముగ్గురికి అన్నము కూడ పెట్టాము. పైసా కూడ ఖర్చు
కాకుండ ఎంతో కాలమునుండి ఉన్న బాధను ఐదు నిమిషములలో లేకుండ చేశాను. నా దగ్గరకు రాకముందు
ఒకరోజుకు వందరూపాయల మందులు తినేవారిమని వారే చెప్పారు. అంతేకాక డాక్టర్ల దగ్గర లక్షల రూపాయలు
పోయాయని కూడ వారే చెప్పారు. అంత పెద్ద రోగమును నేను సులభముగా నయము చేసి, జ్ఞానమును తెలుసుకోండి,
ఇటువంటి రోగములు రావు అని చెప్పాను. జ్ఞానమును తెలుసుకొనుటకు మా వద్దనున్న 40 రూపాయల పుస్తకములు
కొనుక్కోమని చెప్పాము. 40 రూపాయలు ఇచ్చి, పుస్తకములు తీసుకొని చదువుకొమ్మని వారిమంచికే చెప్పాను గానీ,
ఉచితముగ 40 రూపాయలు ఇవ్వమని నేను అడగలేదే! ఒకవేళ నేను 40 రూపాయలు ఉచితముగ అడిగియుండినా,
నాది న్యాయమే అవుతుంది. వారు వచ్చిన రోజు ముగ్గురికి ఇచ్చిన కాఫీ, పెట్టిన భోజనము లెక్కవేస్తే 40 రూపాయలకంటే
ఎక్కువే అవుతుంది. కొంతైనా విచక్షణా జ్ఞానము లేకుండ మాట్లాడు వారిని దగ్గరకు రానివ్వడము తప్పే, వారికి
వైద్యము చేయడము తప్పే. నేను జ్ఞానమును తెలుసుకొమ్మని చెప్పితే డబ్బులు అడిగినారని చెప్పడము వారు చేసిన
పెద్ద తప్పు అని కోపంగా అన్నాను.
భూతము గ్రహించుకొను శక్తియున్న గ్రహము కావున నేను కోపగించుకొని అరిచిందీ, వారు మాట్లాడింది
పెద్దతప్పు అని చెప్పింది రోగ భూతము గ్రహించుకొన్నది. ఆ భూతమునకు కూడ కోపమొచ్చిందో ఏమో, అంతవరకు
నా రూములోనే వేలును భూమికి తగిలించిన చోటనే ఉన్న భూతము వెంటనే అనంతపురమునకు పోయి
కాలుయందు చేరుకొని ముందు మాదిరి బాధించను మొదలుపెట్టింది. అప్పుడు ఒక గుమస్తా మతికి వచ్చినట్లు నేను
మతికి వచ్చాను. అక్కడికిపోతే బాగు చేస్తాడులే అను ధైర్యముతో వచ్చారు. ఈమారు వచ్చినా, వారికి ఏ మర్యాద
చేయలేదు. కాఫీకూడ ఇవ్వలేదు. అన్నము వేళకు అన్నము కూడ పెట్టలేదు. ఉదయము 9 గంటలనుండి సాయంకాలము
4 గంటల వరకు క్రిందనే మొండిగా కూర్చున్నా నేను పైకి పిలువలేదు. నా భార్యను అడిగితే ఆయన వేరే పని మీద
ఉన్నాడు అని చెప్పింది. పైకి పోయి అడిగి వస్తామని అడిగినా, అట్లు అనుమతి లేకుండ పోకూడదు అని చెప్పారు.
వారు వస్తూనే మనమే పలకరించి, మర్యాద ఇచ్చి వారి పని చేసి పంపుతారని అనుకొన్నారో ఏమో కానీ వారి అంచనా
అంతా తారుమారైపోయింది. చివరికి చేసేది లేక వెను తిరిగిపోయారు. తర్వాత చాలామందితో అలా మాట్లాడడం
మాది పొరపాటేనని చెప్పుకొనినా, మేము వారిని పట్టించు కోలేదు. లక్ష్మణమూర్తిది, అనంతపురము రోగిది నాకు
మంచి గుణపాఠమైనది. అప్పటినుండి ఎవరికీ వైద్యము చేయకూడదనుకొన్నాను. నేను అంతవరకు చేసినది పరిశోధన
నిమిత్తము. నాకు అన్ని విషయములు తెలిసిపోయిన దానివలన, ఆ వైద్యమునకు దూరము కావాలనుకొన్నాను. పై
సంఘటనలో కాలులో నొప్పిని గురించి కొందరికి అది దయ్యమా లేక రోగమా అని అనుమానము ఉండవచ్చును.
దానికి నా జవాబు అది మొదటి రకమైన దయ్యము కాదు. రెండవ రకమైన భూతమని చెప్పవచ్చును. అనుభవించే
పాపములలో మూడవ రకమైన కర్మ అని చెప్పవచ్చును. అందువలన అది మందులకు, మంత్రములకు లొంగలేదు.
ఒక్క జ్ఞానుల మాటతోనే లొంగిపోవు జ్ఞానమునకు సంబంధించిన కర్మయని అర్థమగు చున్నది. నా మాటకు విలువనిచ్చి,
కాలునుండి దిగివచ్చి, నా సన్నిధిలోనే ఉన్న రోగ భూతము నాకు వచ్చిన కోపమును గ్రహించి, తిరిగి వారియందు చేరి
తన పనిని తాను చేసినట్లు, ఈ సంఘటనలో నిరూపణకు వచ్చినది. భూతములు గ్రహించుకొను స్వభావముగలవని,
అవి అనుకొంటే తిరిగి శిక్షను అమలు పరచగలవని తెలియుటకు, నిదర్శనముగా మరియొక ఘటనను వివరిస్తాను
చూడండి. ఇప్పుడు చెప్పబోవునది మొదటి రకము భూతమునకు సంబంధించినదని అర్థముకాగలదు.
తాడిపత్రి దగ్గర చింతలపల్లి అను చిన్న పల్లెటూరు గలదు. ఆ ఊరిలో ఒక పెద్దరైతు. అతని పేరు సరిగ
జ్ఞాపకము లేదు. బహుశ నారాయణరెడ్డి అనుకుంటాను. అతనిని ఒక సాధారణ దయ్యము పట్టి పీడిస్తుండేది. ఆ
దయ్యము చరిత్ర చూస్తే ఇలా గలదు, నాగేంద్ర అనే యువకుడు క్రొత్తగా పెళ్ళి చేసుకొన్నాడు. అతనిది కూడ
చింతలపల్లి గ్రామమే. పెళ్ళైన క్రొత్తనుండి, ఇటు భార్యకు అటు అమ్మకు ఒకరికొకరు సరిపోక పోట్లాడే వారు. అత్త
కోడళ్ళు ప్రతి చిన్న విషయానికి పోట్లాడేవారు. ఇది నాగేంద్రకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇటు భార్యకు అటు తల్లికి
చెప్పలేక మధ్యలో బాధపడేవాడు. ఆర్థిక స్థోమత లేని కుటుంబము, కావున ఎక్కడికైన పోయి బ్రతికే దానికి కూడ
వీలులేదు. అటువంటి స్థితిలో అలాగే కాలము గడుపుచుండగ అత్త కోడలు ఇద్దరు వాదించుకొని, భార్య నాగేంద్రకు
నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. భార్య చెప్పినట్లే నాగేంద్ర అమ్మకూడ చచ్చిపోతానని బెదిరించింది. ఇద్దరు
అలా చెప్పడము వలన ఏమి తోచక, వారికి ఏమి చెప్పలేక, నాగేంద్ర తానే చనిపోవాలని అనుకొన్నాడు. పైరుకు కొట్టే
క్రిమి సంహారకమందును తీసుకొని పొలము లోనికి పోయి త్రాగినాడు. ఆ సమయములో చుట్టు ప్రక్కల పొలములలో
ఎవరూ లేరు, కావున విషము త్రాగిన నాగేంద్ర క్రిందపడిపోయి పొర్లాడుచున్నా ఎవరు చూడలేదు. చివరికి అతను
చనిపోయాడు. అది నాగేంద్రకు అకాలమృత్యువు అయినది. కావున అతను సాధారణ దయ్యముగ మిగిలిపోయాడు.
నాగేంద్ర చనిపోయి దాదాపు ఆరునెలలు కాలమైనది. ఒక దినము నారాయణరెడ్డి, నాగేంద్ర చనిపోయిన
పొలముగట్టు మీద పోవుచుండుట వలన నాగేంద్ర చూచాడు. అతను ఆ ఊరిలో ధనికుడు, కావున అతనిలో చేరుకొంటే
కొంత సుఖమును అనుభవించవచ్చును అనుకొన్నాడు. అపుడు నాగేంద్ర, నారాయణరెడ్డి వెంట నడుస్తూ సమయము
చూచి నారాయణ రెడ్డిని క్రిందపడునట్లు త్రోచాడు. అతను క్రిందపడి పైకి లేచే లోపల అతని శరీరములోనికి
ప్రవేశించాడు. నాగేంద్ర, నారాయణరెడ్డి శరీరములో ఉండడము వలన, నాగేంద్ర విషము త్రాగినపుడు కడుపులో
బాధ ఎట్లుండునో అట్లే నారాయణరెడ్డికి బాధ కనిపిస్తుండెను. అప్పటినుండి నారాయణరెడ్డి చాలామంది డాక్టర్లవద్ద
చూపించుకొని అది నయము కాకపోవడము వలన, ఇతరుల సలహాతో మాంత్రికులను ఆశ్రయించి వైద్యము
చేయించుకొన్నాడు. నారాయణరెడ్డి శరీరములోనున్నది నాగేంద్ర అని తెలిసినది. కానీ దానికి సరియైన మాంత్రికుడు
ఎవరూ దొరకలేదేమో, నారాయణరెడ్డికి కడుపులో బాధ తగ్గలేదు. నారాయణరెడ్డికి పరిచయమున్న నారాయణ అను
వ్యక్తి నాకు కూడ కొంత పరిచయమే. నేను ఏదో పనిమీద బజారుకు పోయినపుడు, ఆ వ్యక్తి నాతో కలిసి నారాయణరెడ్డి
విషయము, నాగేంద్ర విషయము రెండూ చెప్పాడు. ప్రక్కనే ఉన్న లాడ్జిలో నారాయణరెడ్డికి మాంత్రికులు వైద్యము
చేస్తున్నారు. మనమూ అక్కడికి పోయి చూచి వస్తాము రమ్మని నన్ను పిలిచాడు. నేను ఎప్పుడూ మాంత్రికులు చేసే
వైద్యమును చూడలేదు, కనుక వస్తాను పోదాము అని అతనితో కలిసి లాడ్జిలోనికి పోయాము. అప్పుడు సమయము
పగలు పదకొండుగంటలైనది. నారాయణరెడ్డి చుట్టు నలుగురు మాంత్రికులు కూర్చొని మంత్రించుచున్నారు. నాగేంద్ర
దయ్యము బయటికి వచ్చి మాట్లాడలేదు. నారాయణరెడ్డి మాత్రము కడుపులో బాధగా ఉన్నదని చెప్పుచున్నాడు.
మేము ఒక గంట వరకు అక్కడే ఉండి చూచాము. దయ్యము బయటికి రావడముగానీ, నారాయణరెడ్డి కడుపులో బాధ
తగ్గడముగానీ జరుగలేదు. మధ్యాహ్న భోజనము సమయము కావడము వలన నేను ఇంటికి వచ్చేశాను.
సాయంత్రము నాలుగు గంటల సమయములో నన్ను లాడ్జిలోనికి పిలుచుకొని పోయిన నారాయణ అను వ్యక్తి
నా దగ్గరకు వచ్చాడు. ఏమి వచ్చావు? అని నేను నారాయణను అడుగగ, నారాయణ ఇలా అన్నాడు.
“నారాయణరెడ్డి ఒంటరిగా ఉన్నపుడు లాడ్జిలో ఉరివేసుకొన్నాడంట. అంతలోనే అతని అల్లుడు అక్కడికి పోవడము
వలన ఆయన బ్రతికాడు. మనము వచ్చిన తర్వాత మూడు గంటల సమయములో ఇది జరిగింది. నాకు తెలిసి నేను
పోయివచ్చాను. ఆ బాధకు తట్టుకోలేక ఉరివేసుకొన్నానని నారాయణరెడ్డి చెప్పుచున్నాడు. అతని అల్లుడు ఏమి
చేయాలో అర్థముకాక బాధపడుచున్నాడు. నన్ను పిలిచి నీకు తెలిసిన వారెవరైన ఉన్నారా అని అడిగినాడు. నేను ఏమి
చెప్పలేదు. నీవు చూస్తానంటే వారిని తీసుకొని వస్తాను” అన్నాడు. దానికి నేను ఒప్పుకోలేదు. “ఎవరికీ ఇప్పటినుండి
చూడదలుచుకోలేదు, ఎంతోమందికి బాగుచేసినా, చివరకు నన్ను కూడ మంత్రగాళ్లలోనికి కలిపివేసినారు. బయట
లక్షలు ఖర్చు పెట్టినవారు ఇక్కడ తమ రోగము పోతూనే, పది రూపాయలు కూడ ఇవ్వకుండ పోతారు. అట్లు పోయేదే
కాక, అక్కడకు పోతే బాగా మంత్రిస్తాడని ఇతరులకు కూడ చెప్పి నాకు మంత్రగాడను బిరుదు ఇస్తారు. అందువలన
ఇతరులకు చూచేదే లేకుండ వదలివేయాలనుకొన్నాను” అని చెప్పాను. దానికి నారాయణ ప్రాధేయపడి, అతను
బాధకు తట్టుకోలేక ఉరివేసుకొన్నాడు. మీరు చూడకపోతే బాధకు తట్టుకోలేక చనిపోతాడు. ఏమి అనుకోకుండ నన్ను
చూచైనా ఇది ఒక్కటి చూడమని అడిగాడు. నారాయణ మాటలు వినిన తర్వాత నాకు కూడ చూడవలెననిపించింది.
అప్పుడు నారాయణతో " నీవు అడుగుట వలన ఇది ఒక్కటి చూస్తాను. నేను ఎవరినీ డబ్బులు అడుగను కదా! నీవే
వారిని డబ్బులు అడిగి వందరూపాయలైనా ఇప్పించ వలసియుంటుంది” అని చెప్పాను. నామాటవిన్న నారాయణ
వెంటనే పోయి జట్కాబండిలో నారాయణరెడ్డిని తీసుకువచ్చాడు. నారాయణరెడ్డితో పాటు, అతని అల్లుడు మాత్రము
వచ్చాడు. అప్పుడు సమయము ఆరు గంటలవుతూ ఉన్నది.
నేను స్నానము చేసివచ్చి నారూములో కూర్చొని అతనిని నావద్దకు తెమ్మని చెప్పినాను. అలాగే అతనిని అతనికి
నాముందర కూర్చోబెట్టారు. అతనిలో సాధారణ దయ్యముందని తెలుసు కాబట్టి అతనిని నేనేమి అడుగక ప్రస్తుతము
అతని బాధ పొయేటట్లు చేయాలని యోచించి ఆ సమయానికి తగినట్లు ఇంగువను వెల్లులి (తెల్లవాయిల) రసముతో
కలిపి చేసిన గంధమును నారాయణరెడ్డి రెండు కళ్ళలో కొద్దిగా పెట్టాను. ఆ కలికమును కళ్ళలో పెట్టినపుడు ఒక్కమారు
కరెంటుషాక్ కొట్టినట్లయినది. దెబ్బతో లోపలనున్న నాగేంద్ర దయ్యము భయపడి శరీరమును వదిలిపోయింది.
నారాయణ రెడ్డికి కలికము మంట లేకుండ కళ్ళుకడుక్కొమన్నాము. అతను కన్నులు శభ్రముగా కడుగుకొన్న తర్వాత
నీకు ఇపుడు ఏమైనా బాధ ఉందా అని అడిగాము. ఏమిలేదు అని అతను హుషారుగా మాట్లాడినాడు.
ఒక్కమారు అలా బాగుకావడము అక్కడున్న అతని అల్లునికి నారాయణకు సంతోషమైనది. అప్పుడు వారితో నేను ఇలా
చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధను లేకుండ చేశాను, కానీ తర్వాత ఎప్పుడైనా రావచ్చును. అది శాశ్వితముగా
పోవాలంటే మరొకమారు ఇక్కడికి వచ్చి చూపించుకోవలసి ఉంటుంది అని చెప్పి పంపాను. నేను నా జ్ఞానశక్తిని
ఉపయోగించకుండ సాధారణముగా వైద్యము చేయాలనుకొన్నాను. అందువలన ఆ దయ్యమును బయటకు పిలిచి
అట్లు రావద్దని చెప్పి పంపకుండ క్రొత్త విధానమును అనుసరించి కళ్ళలోనికి ఇంగువ కలికము వేయడము జరిగినది.
నేను చేసిన ప్రయోగమునకు ప్రస్తుతానికి నాగేంద్ర బయటికి పోయాడు, నారాయణరెడ్డి బాధనుండి బయటపడినాడు.
నారాయణరెడ్డితో సహా నారాయణ కూడ వారి ఇంటికిపోయి వదలిపెట్టి వచ్చాడు. అలా పోయినప్పుడే ఇలా
చెప్పాడు. "స్వామి ఏమి అడుగడు, ఆయనకు అడిగే అలవాటులేదు. నీవు వందరూపాయలు తీసుకొని వచ్చి, ఆయనకు
తాంబూలములో పెట్టి ఇచ్చి, తర్వాత ఎప్పటికి ఆ దయ్యము రాకుండ, ఆ బాధ రాకుండ ఆయనతో గట్టి భద్రము
చేయించుకో” నారాయణ మాటలు విన్న అల్లుడు రేపే పంపుతానని చెప్పి నారాయణ ముందరే నారాయణరెడ్డికి
ఐదువందలు డబ్బులు ఇచ్చి, రేపుపోయి నూరు రూపాయలు ఆయనకు ఇచ్చి చూపించుకో అని చెప్పాడు. సరేనని
చెప్పిన నారాయణరెడ్డి రెండవరోజు నావద్దకు వచ్చాడు. ఆ రాత్రి కూడ నా ఇంటివద్దే పడుకొన్నాడు. మా ఇంటికి
వచ్చిన వారికి అన్నము పెట్టే అలవాటు మాకుండుట వలన, నారాయణరెడ్డి మూడు రోజులు నావద్దే తిష్టవేశాడు.
ఆయన మాత్రము నూరురుపాయల డబ్బును ఇవ్వలేదు. రెండు రోజుల తర్వాత నారాయణ వచ్చి, స్వామికి డబ్బు
ఇచ్చావా అని అడిగాడు. ఇవ్వలేదు వచ్చేటప్పుడు బజారులో ఖర్చయినాయి. తర్వాత ఇస్తానులే అన్నాడు. ఆ మాటకు
నారాయణ బాగా అతని మీద కోపగించుకొని, నేను బ్రతిమాలితే నిన్ను చూచాడు. నీకు అంత బాధను క్షణాలలో
లేకుండ చేస్తే ముందు ఇక్కడ ఇవ్వకుండ బజారులో ఖర్చయినాయి అని చెప్పడము మంచిదా అని అడిగాడు. దానికి
నారాయణరెడ్డి అన్న మాటలు విచిత్రమును విస్మయమును కల్గిస్తాయి. “బాధ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు అడిగినా
ఆ సమయములో అయితే ఇస్తాము. బాధ లేనపుడు అడిగితే ఎట్ల ఇవ్వబుద్ధి అవుతుంది. ఎప్పుడైనా బాధ ఉన్నపుడే
అడగాలని నీవు స్వామికి చెప్పు” అన్నాడు. ఆ మాటలకు నారాయణకు ఏమి అర్థముకాక బాధపడుచు నావద్దకు వచ్చి
"మీరు ఎవరికి చూడను అని ముందు చెప్పినదే సరియైనది. నారాయణరెడ్డితో నేను నూరు రూపాయలు ఇమ్మని
చెప్పితే, అతను ఇలాగ అంటున్నాడు.” దానికి నేను నవ్వి “నీవు ఒక్కన్నే చూచావు, నేను చాలామందిని చూచాను.
అందువలన కఠినముగా చూడనని చెప్పాను. నేను ఎవరిని డబ్బు అడుగలేదు, అడగలేదని నన్ను తెలివితక్కువవానిగ
లెక్కించుకొనుచున్నారు. నేను నీకు అడగమని చెప్పినది వారికి పెట్టె అన్నము ఖర్చుకేగానీ నేను చేసిన పనికి కాదు
కదా! నీవే అతనిని ఇక్కడ నుండి పంపించివేయి” అని చెప్పాను. నారాయణ, నారాయణరెడ్డిని పిలుచుకుపోయి
ఇంటికి పంపించాడు.
అతను ఇంటికి పోయిన వారము రోజులకు నాగేంద్ర నారాయణ రెడ్డిలో దూరుకొన్నాడు. విషమును త్రాగినవానికి
కలుగుబాధ తిరిగి నారాయణరెడ్డికి వచ్చింది. ఆ విషయమును తెలుసుకొన్న నారాయణ రెడ్డి అల్లుడు నారాయణతో
కలిసి మాట్లాడినాడు. నారాయణ మాట్లాడుచు “డబ్బులిచ్చి మీ మామ రెండవ మారు చూపించుకోవాలి. కానీ నాకు
బాధ పోయింది కదా డబ్బులు ఇవ్వను బుద్ధిపుట్టలేదు అంటాడు. స్వామి ఇది తాత్కాలికమే, రెండవమారు వచ్చి
చూపించుకోవాలి అని చెప్పాడు కదా! రోగమున్నపుడు వేల డబ్బులు పోగొట్టుకొని, బాగయ్యేచోట వందరూపాయలు
కూడ ఇవ్వకపోతే ఎట్లా? వందరూపాయలు కూడ ఆయన అడుగలేదు. నేను ఇస్తానని చెప్పాను. మనము పోయినపుడు
సమయానికి అన్నము పెడుతున్నారు కదా! మనము ఇచ్చే డబ్బులు మనము తిన్న అన్నమునకు కూడ సరిపోవు.
ఈయన పోయి రెండు రోజులనుండి అక్కడే కూర్చున్నాడు. అక్కడుంటే బాధ రాదులే అనుకొన్నాడు. అట్లుండడము
వారికి ఖర్చు కాదా? అని నేనే ఇంటికి పంపించాను. స్వామి మొదటనే ఇవన్నీ చూడను, నేను జ్ఞానమును చెప్పేపనే
చేస్తాను, ఇది చేయను అన్నాడు. బలవంతముగా నేనే ఒప్పించుకొని వచ్చి పిలుచుకొని పోయాను. ఇప్పుడు అక్కడ
నాకు కూడ మర్యాద లేదు” అన్నాడు.
నారాయణ మాటలువిన్న అల్లుడు మామను అరిచాడు “నేను ఐదువందలు ఇచ్చినాను కదా! వందరూపాయలు
ఇచ్చేదానికి ఏమి? నీ వేమైన ఊరకనే ఇస్తున్నావా? అంత పెద్ద బాధను లేకుండ చేసినాడు కదా! నీవు చేసిన పనికి
మాకు మర్యాద లేకుండ పోయింది.” అని నారాయణను బుజ్జగించి నారాయణను, మామను పిలుచుకొని నాదగ్గరకు
వచ్చాడు. నేను వారిని చూచి ఏమి వచ్చారని అడిగాను. కడుపులో బాధ నారాయణ రెడ్డికి తిరిగి వచ్చిందని చెప్పారు.
నారాయణ రెడ్డి అల్లుడు మా మామది పొరపాటు, డబ్బులు నేను ఇస్తున్నాను ఏదో ఒకటి చేయండని ఐదువందలు
ఇవ్వబోయాడు. దానికి నేను నివారించి, డబ్బులు తీసుకోకుండ ఈ విధముగా చెప్పాను. “రెండవ మారు వచ్చి
చూపించుకొమ్మని చెప్పినాను. అది ఏడు రోజుల లోపల రెండవమారు చూపించుకోవలసి ఉంటుంది. ఇపుడు ఏడు
రోజులు అయిపోయింది. మొన్న వచ్చి నావద్ద రెండు రోజులున్నాడు. నేను రెండవమారు చూపించుకోవలెనని
జ్ఞాపకము చేసినా నాకు బాగుంది కదా, పోయింది కదా అని బదులు చెప్పాడు. కాలము మించి పోయింది కావున,
నేను ఏమి చేసే దానికి కాదు” అన్నాను. నా మాటలువిన్న అల్లుడు చేసేది లేక ఏమి చేయాలో అర్థముకాక మీరే ఏదైన
ఉపాయము చెప్పండి అని అడిగాడు. దానికి నేను ఎక్కడైనా దేవతల దగ్గరకు పోయి చూపించుకోండి, మాంత్రికులవద్ద
పోదని తెలిసింది. కావున మీకు దేవతలే దిక్కు కసాపురము ఆంజనేయస్వామి దగ్గరకుగానీ, గండి ఆంజనేయస్వామి
దగ్గరకుగానీ లేక ఇంకా ఎక్కడైన ఎవరైనా దేవతలుంటే వారివద్దకు పోయి చూపించుకొమ్మని సలహా చెప్పాను. చేసేది
లేక ఎక్కడికి పోవాలని ఆలోచన చేసుకొంటూ నావద్దనుండి పోయారు.
నావద్దనుండి పోయిన నారాయణరెడ్డి, అతని అల్లుడు నేను చెప్పినట్లు మాంత్రికులవద్దకు పోకుండ పెద్దమ్మ
అను దేవత వద్దకు పోయారు. అక్కడంత మాట్లాడుకొని తిరిగి నావద్దకు వచ్చి నేను చెప్పిన తర్వాతనే పోవాలనుకొన్నారు.
నారాయణరెడ్డి అల్లుడు, నారాయణ ఇద్దరు నావద్దకు వచ్చి దగ్గర పల్లెలో పెద్దమ్మ దేవత ఉంది. ఆమె దినము మార్చి
దినము పూనకమువచ్చి మాట్లాడుతుందట. అక్కడికిపోతే ఈ బాధకూడ పోతుందట. మీరు పొమ్మంటేనే పోతాము
అని వచ్చి అడిగారు. నేను పొమ్మనే చెప్పినాను. నేను చెప్పిన తర్వాత వారు ఇంకాకొంత సమాచారమును చెప్పారు.
అదేమనగా! పెద్దమ్మ దగ్గర రెండురకముల పూజలుంటాయి. ఒకటి పెద్దపూజ, రెండవది చిన్నపూజ. పెద్ద పూజకు
రెండు వందల రూపాయలు డబ్బులు కట్టి పేరు వ్రాయించుకోవాలి. చిన్నపూజకు వంద రూపాయలు కట్టవలసియుంటుంది.
అలా డబ్బులు కట్టి పేరు వ్రాయించు కొన్నవారికి, ఒక కొబ్బరికాయ ఇచ్చి పంపుతారు. ఆ కొబ్బరికాయను రాత్రిపూట
పడుకొనే సమయములో తలప్రక్కన పెట్టుకొని పడుకొని, రెండవరోజు సాయంకాలము ఆరుగంటలకు అక్కడికిపోతే,
అప్పుడు దేవత మనలను గురించి చెప్పుతుందంట. పెద్దపూజకు రెండువందలు డబ్బులు కట్టితే పెద్దమ్మ ఉన్న రూములోనికి
పంపిస్తారట, చిన్న పూజకు డబ్బులు కట్టితే పెద్దమ్మ ఉన్న రూములోనికి పంపరట. ప్రక్కరూములోనుండి మాట్లాడిస్తారట.
అని అంతా వివరముగా చెప్పి నన్ను సలహా అడిగారు. నేను దానికి అక్కడికి పోయి చూపించుకొమ్మని సలహా
ఇస్తున్నాను. కానీ మీరు పెద్ద పూజకు పోతారో, చిన్న పూజకు పోతారో అది మీ ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది
అని చెప్పాను. దానికి వారు పెద్దపూజకు పోయేటట్లు పేరు వ్రాయించుకొంటామని చెప్పి పోయారు.
నేనున్న చోటికి నాలుగు కిలోమీటర్ల దూరములోనున్న పల్లెలో పెద్దమ్మ పూనకమువచ్చు వారి దగ్గరికి పోయి
మాట్లాడి తమ విషయమంతా చెప్పి రెండువందలు డబ్బులు ఇచ్చి పెద్దపూజకు వ్రాయించుకొన్నారు. నారాయణ రెడ్డి
దయ్యము వలన బాధ పడుచున్నాడు. దాని నివారణకు మీ దగ్గరకు పూజకు వస్తున్నాము అని చెప్పినపుడు, వారు
నారాయణరెడ్డికి ఒక మనిషి తోడుగా రమ్మని చెప్పారు. తోడుగా వచ్చే మనిషి, దయ్యము పూనకము వచ్చినా భయపడకుండ
ఉండేవారు వస్తే మంచిది అని చెప్పారు. దయ్యము అంటే అందరికి భయమే, కావున నారాయణరెడ్డి వెంట ఎవరు
పోవాలన్నది సమస్య అయినది. ఆ విషయమును చివరకు నావద్దకు తెచ్చారు. అంతేకాక నారాయణరెడ్డిని నా
ఇంటివద్దనే పెద్దమ్మ పూజ అయిపొయ్యేంత వరకు రెండు రోజులు ఉంచుతామని అడిగారు. ఆయన నావద్ద వుంటే
కడుపులో బాధ ఎక్కువ కాకుండ ఉంటుందని అడుగుట వలన సరేనని ఒప్పుకొన్నాను. నాకు చిన్నప్పటినుండి
పరిశోధనాదృష్ఠి ఎక్కువ ఉండుట వలన పెద్దమ్మ దగ్గర ఏమి జరుగుతుంది? పెద్దమ్మ నిజముగా పూనకము వస్తుందా
లేక మనుషులే పెద్దమ్మ పేరుతో నాటకమాడు చున్నారా? నిజంగా పెద్దమ్మ పూనకము వస్తే ఇతని బాధను ఎలా
బాగుచేస్తుంది? పెద్దమ్మకు చిన్నపూజ, పెద్దపూజలేమిటి? పూనకము వచ్చిన పెద్దమ్మ ఎదురుగా ఉండక, ప్రక్క రూములో
ఎందుకు ఉంటుంది? అలా ఎన్నో ప్రశ్నల జవాబుకు నారాయణరెడ్డి వెంట నేనే స్వయముగా పోతే బాగుంటుందనుకొని
నారాయణరెడ్డికి తోడుగా నేనే పోతానని వారితో చెప్పాను. దానికి వారు సంతోషపడి నారాయణరెడ్డిని నావద్దనే వదలి
అతని అల్లుడూ, నారాయణ ఇద్దరూ పోయారు.
నారాయణరెడ్డి పెద్దమ్మ దగ్గర పేరు వ్రాయించుకొన్నపుడు, వారు ఇచ్చిన కొబ్బరికాయను, తలప్రక్క పెట్టుకొని
రాత్రికిపడుకొన్నాడు. తెల్లవారిన తర్వాత కొబ్బరికాయను క్రిందపెట్టకుండ, ఒకసంచిలో ఉంచి గోడకు తగిలించి పెట్టి
సాయంకాలము ఐదుగంటలకు కొబ్బరికాయ సంచిని తీసుకొని బయలుదేరి, ఆరుగంటలకంటే ముందే అక్కడికి పోయాము.
మేము పోయి ముందే వారివద్ద వ్రాయించుకొన్న చీటిని చూపితే, అప్పుడు వారు మాదగ్గరున్న కొబ్బరికాయను
తీసుకొని, మాముందరే దాని పీచునంత పెరికి, మాదగ్గర పెట్టుకొమ్మని లోపల పూజకు పోయినపుడు కొబ్బరి కాయను
తీసుకొని పోవాలని చెప్పారు. ఆరు గంటలకు పూజ మొదలయ్యింది. అపుడు నారాయణరెడ్డిని, అతనికి తోడుగానున్న
నన్ను ఒక మనిషి వచ్చి లోపలికి పిలుచుకొని పోయాడు. అతని వెంట మేము ఇద్దరము మూడు రూములు దాటి
నాలుగవ రూములోనికి పోయాము. లోపలికి పిలుచుకొని పోయిన వ్యక్తి, మమ్ములను నాల్గవరూములోనే కూర్చోబెట్టాడు.
ఐదవరూములో పెద్దమ్మ ఆడ మనిషిలోనికి పూనకము వచ్చివుంది. ఐదవరూముకు మధ్యలో తలుపువున్నది. తలుపుకు
కుడిప్రక్క పెద్దమ్మ ఉన్నట్లు మాకు అర్థమైనది. మమ్ములను లోపలికి తీసుకొని పోయిన వ్యక్తి ఐదవ రూములోనికి
పోయి, మాకు కనిపిస్తున్నట్లు కుడిప్రక్క తిరిగి నిలబడి "అమ్మవారితో తల్లీ! నారాయణరెడ్డి అనునతడు పూజకు
వచ్చాడు, అతనికి దయ్యము బాధ ఉన్నదట" అని అన్నాడు. ఆ మాట అన్న వెంటనే తిరిగి బయటికి వచ్చాడు. అతను
వచ్చిన తర్వాత నారాయణరెడ్డితో కొబ్బరి కాయను తీసుకొని లోపలికి పోయి అమ్మవారికి ఇచ్చి వచ్చేయి అని చెప్పాడు.
నారాయణరెడ్డి అలాగే కొబ్బరికాయను తీసుకొని లోపలికి పోయి కుడి ప్రక్కన ఉన్న అమ్మవారికి ఇచ్చాడు బయటినుండి
చూస్తే నారాయణరెడ్డి అమ్మవారికి కొబ్బరికాయను ఇచ్చినది కనిపించదు. అతను కొద్దిగ కుడి ప్రక్కకు పోయి ఇచ్చుట
వలన, ఇచ్చిన అతను కనిపించడు, తీసుకొన్న అమ్మవారు కనిపించదు.
లోపలికి పోయిన నారాయణరెడ్డి కొబ్బరికాయను పెద్దమ్మకు ఇచ్చిన వెంటనే, పెద్దమ్మ బయటికిపో అని గద్దించి
చెప్పింది. అలా గట్టిగ అరచి చెప్పడము, నాల్గవరూములోనున్న నాకు వినిపించింది. నారాయణ రెడ్డి బయటికి వచ్చి
మేమున్న చోట కూర్చున్నాడు. అతను కూర్చున్న వెంటనే లోపల అమ్మవారి రూములో కొబ్బకాయను కొట్టిన శబ్దము
వినిపించినది. అప్పుడు మాతో పాటు నాల్గవరూములోనే ఉన్న వ్యక్తి నారాయణరెడ్డితో “లోపలికి పోయి అమ్మవారు
కొట్టిన కొబ్బరికాయను గిన్నెలో వేసివుంటుంది. ఆ గిన్నెను తెచ్చుకో పో" అని చెప్పాడు. నారాయణ రెడ్డి ముక్కుతూ
మూల్గుతూ చిన్నగ పోయి అక్కడ కొబ్బరికాయ చిప్పలున్న గిన్నెను తెచ్చాడు. ఆ గిన్నెలోనికి చూస్తూనే నాకు ఆశ్చర్యము
అయినది. ఆ గిన్నెలో కొబ్బరి చిప్పలతోపాటు ఒక ఊపిరితిత్తి, దానితోపాటు రక్తము కలిసి ఎరుపు రంగునున్న నీచు
నీళ్ళు, ఆ నీళ్ళలో అరంగుళం పొడవుతో కదులుతూవున్న రెండు తోకకల్గిన తెల్లని పురుగులు గలవు. మాంసపు
మార్కెట్లో చూచిన గొర్రెల ఊపిరితిత్తిలాగ, ఆ గిన్నెలోనున్న ఊపిరితిత్తి కనిపిస్తున్నది. డ్రైనేజికాలువలో కనపడే తోక
పురుగులు ఆ గిన్నెలోనున్నవని నాకు అర్థమైనది. అప్పుడు లోపలనున్న అమ్మవారు, నాల్గవరూములోనున్న మాకు
వినిపించేటట్లు బిగ్గరగా అరుస్తు, ఏమిరా బాలా? గిన్నెలో నీకు కనిపించేది నీ ఊపిరితిత్తి అది రంధ్రాలుపడింది
కనిపిస్తావుందా లేదా? అని అడిగింది. ఇక్కడ ప్రక్కనేవున్న వ్యక్తి ఒక అడుగు పొడవున్న కడ్డీని తీసుకొని ఆ కడ్డీతో
గిన్నెలోనున్న ఊపిరితిత్తిని కదిలించి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ రంధ్రాలు పడింది చూడు అని నారాయణరెడ్డికి చూపిస్తున్నాడు.
అంతలో "గిన్నెలో పురుగులు కూడా ఉన్నాయి కనిపించాయా బాలా” అని అమ్మవారు అడిగింది. ప్రక్కన వున్న వ్యక్తి,
ఇదిగో ఇవి పురుగులు చూడు అంటున్నాడు. అక్కడ లోపలనుండి అమ్మవారు “నీకు ఊపిరితిత్తులు చెడిపోయినాయి
అవి పురుగులు పట్టినాయి. చెడిపోయిన ఊపిరితిత్తిని, పురుగులను ఇప్పుడు తీసివేసినాను. నీకు ఇంకా లోపముంది,
నీవు మళ్ళీ నాదగ్గరకు వస్తే అప్పుడు చెప్పుతాను” అన్నది.
అప్పుడు మా దగ్గరున్న వ్యక్తి మావైపు చూచి “మీరు ఇంకొక టెంకాయ (కొబ్బరికాయ)ను తీసుకొని పోండి.
ఈ రోజు రాత్రికి తల క్రింద పెట్టుకొని నిద్రపోయి, ఎల్లుండి సాయంకాలము రండి. అప్పుడు మీకున్న లోపము
ఏముందో కొబ్బరికాయలో వస్తుంది. ఇప్పుడు కూడ మీరు తెచ్చుకొన్న కొబ్బరికాయను, అమ్మవారు పగులగొట్టినపుడు
కాయలో నుంచి పడిన వస్తువులను చూచాము కదా! ఈ రోజు కొబ్బరికాయలో చెడిపోయిన ఊపిరితిత్తి వచ్చింది కదా!
రేపు నీ శరీరములో ఏదైనా అనా రోగ్యముగానీ, అనారోగ్యమునకు కారణమైనది కానీ ఉంటే అది వస్తుంది” అని చెప్పి
ఐదురుపాయలు తీసుకొని కొబ్బరికాయను ఇచ్చి పంపాడు. ఆ తతంగమంతటిని చూచిన నేను, తొందరగా ఏ
నిర్ణయానికి రాకుండ హేతుబద్దముగా యోచించను మొదలుపెట్టాను. ఇంతకుముందు నాలో ఉన్న ప్రశ్నలకు మరికొన్ని
ప్రశ్నలు తోడైనాయి. అవి, కొబ్బరికాయలో వస్తువులు రావడము సాధ్యమా? చూచిన ఊపిరితిత్తి మనిషిదా, జంతువుదా?
అంతలావు డ్రైనేజి పురుగులు ఊపిరితిత్తులలో ఉంటాయా? ఇట్లు అనేక ప్రశ్నలు మెదిలాయి.
మొదటిరోజు పెద్దమ్మ దగ్గర జరిగిన సంఘటనలను బాగా విశ్లేషించుకొని, వాటికి అనుబంధముగా రెండవరోజు
ఏమైనా ఆధారము దొరుకుతుందేమో చూడాలనుకొన్నాను. మూడవదినము సాయంకాలము పెద్దమ్మవద్దకు పోయాము.
ఆ దినము కూడ పెద్ద పూజ వ్రాయించుకొన్న దానివలన, మేము అందరికంటే ముందు లోపలికి పోయాము. మొదటి
రోజువలె కొబ్బరికాయను పట్టుకొని కూర్చోవడము, లోపలికి పోయి అమ్మ వారికి ఇవ్వడము, ఇచ్చిన తర్వాత తిరిగి
వచ్చి కూర్చోవడము జరిగింది. లోపల పెద్దమ్మ కొబ్బరికాయను కొట్టిన శబ్దము వినిపించింది. నారాయణ రెడ్డి పోయి
గిన్నెను తెచ్చుకోవడము జరిగినది. గిన్నెలో చూస్తే కొబ్బరి చిప్పలతోపాటు మూరడు పొడవు గొర్రెల కడుపులో వున్న
ప్రేగు కనిపించింది. అది నాలుగు ఇంచులకొక చోట ముడిపడి వుంది. లోపలి నుండి అమ్మవారు “ఏమిరా బాలా
గిన్నెలో ప్రేగు కనిపిస్తా వుందా?” అని అడిగింది. ప్రక్కనున్న వ్యక్తి కడ్డీతో గిన్నెలోని ప్రేగును ఎత్తి చూపుచు “కనిపించిందని
చెప్పు” అన్నాడు. అప్పుడు నారాయణరెడ్డి "కనిపిస్తావుంది తల్లీ" అన్నాడు. మళ్ళీ అమ్మవారు లోపలినుండి “నీ ప్రేగు
ముడులు పడివుంది కనిపిస్తావుందా” అన్నది. ఇక్కడ చూపించువాడు "ప్రేగు ఎన్ని ముడులు పడిందో చూడు” అని
ఎత్తి చూపించాడు. నారాయణ రెడ్డి "కనిపిస్తావుంది తల్లీ" అన్నాడు. అప్పుడు పెద్దమ్మ “నీ కడుపులో ముడిపడిన
ప్రేగును కత్తిరించి తీసివేసినాను. ఇప్పటినుండి కడుపులో బాధ కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. ఇంతటితో అయిపోలేదు,
నీకు ఇంకా ఎందుకు బాగలేదో తెలుస్తుంది. నీవు మళ్ళీ ఒకమారు వచ్చిపో" అని చెప్పింది. ప్రక్కనున్న వ్యక్తి “మీరు
అమ్మవారు చెప్పినట్లు ఎల్లుండి రండి ఇంకా ఏమైనా ఉంటే కొబ్బరికాయలో తీసివేస్తుంది" అన్నాడు. దానికి నారాయణరెడ్డి
సరేనని తలూపాడు. అప్పుడు కూడా రెండు వందల డబ్బులు కట్టి పెద్ద పూజకు చీటి తీసుకొని, కొబ్బరికాయను కూడ
తీసుకొని వచ్చాడు.
రెండవమారు మూరెడు ప్రేగు కనిపించడము, ప్రేగు ముడిపడి ఉండడము చూచిన తర్వాత, నాకు మరికొన్ని
ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మొదటి రోజు, రెండవ రోజు కనిపించిన దృశ్యములను గురించి యోచించి తొందరగా
నిర్ణయమును తీసుకోకుండ, మూడవరోజు కూడ చూడాలను కొన్నాను. మూడవరోజు కూడ రానేవచ్చింది. ఆ దినము
కొబ్బరికాయను తీసికొని పోయాము. సాయంకాలము ఆరుగంటలకు పూజ మొదలైంది. మేము నాల్గవరూములో
కూర్చున్నాము. నారాయణరెడ్డి కొబ్బరికాయను లోపల ఇచ్చివచ్చాడు. నారాయణరెడ్డి కూర్చోకముందే కొబ్బరికాయను
కొట్టిన శబ్దము వినిపించింది. నారాయణరెడ్డికి ఓపిక లేకున్నా పోయి గిన్నెను తెచ్చుకొన్నాడు. ఈ తూరి గిన్నెలో
కొబ్బరి చిప్పలతో సహా వెంట్రుకలతో పేడిన చిన్నత్రాడు, ఆ త్రాడుకు మూడు ఎండిపోయిన నిమ్మకాయలు కట్టబడి
ఉన్నాయి. ఆ నిమ్మకాయలకు చిన్న ములుకులు (సీలలు) లేక మేకులు కొట్టబడివున్నాయి. ఆ త్రాడుకు చివరిలో
మూడు ఇంచులు పొడువుగల బొమ్మకట్టబడి వున్నది. ఆ బొమ్మ నల్లనిగుడ్డతో చేయబడి ఉండడమేకాక, దాని
కడుపులో ఒక ములికి కొట్టబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని కనిపిస్తున్నాయా అని లోపలినుండి అమ్మవారు
అడుగుచుండగా, మావద్దవున్న వ్యక్తి కడ్డీతో అన్నిటిని చూపిస్తున్నాడు. చూపించడము అయిపోయిన తర్వాత లోపలినుండి
పెద్దమ్మ “బాలా నీకు సరిపోని వాళ్ళు నీవు చనిపోవాలని, మంత్రములతో చేతబడి చేశారు. చూశావుగా! నీ పేరు మీద
నిమ్మకాయలకు ములుకులు కొట్టినారు, నీ బొమ్మను చేసి కడుపులో ములుకులు కొట్టినారు. అందువలన నీకు
ఆరోగ్యము బాగలేకుండ పోయింది. నీవనుకొన్నట్లు నీకు దయ్యములేదు భూతమూ లేదు. ఇప్పుడు ఇవన్నీ తీసివేసినాను
కదా! ఇంక ఏమీలేవు. ఇప్పటినుండి నీ ఆరోగ్యము కొద్దికొద్దిగా బాగైపోతుంది. పూర్తి బాగయ్యే దానికి నలభైరోజులు
పడుతుంది. నీవు నలభై రోజులు ఊరక ఉండకుండ నేను చెప్పినట్లు చేసుకో. అట్లు చేసుకోకపోతే ఇంకా ఏదైనా
క్రొత్తగా అనారోగ్యము రావచ్చు. అందువలన నేను చెప్పినదంతా వ్రాసుకొనిపోయి, అట్లే నడుచుకో” అని చెప్పింది.
అప్పుడు ప్రక్కన ఉన్న వ్యక్తి పెన్ను, పేపరు ఇచ్చాడు. నేను వ్రాసుకొనేదానికి వారు ఇచ్చిన పేపరు పెన్ను తీసుకొన్నాను.
పెద్దమ్మవారు లోపలినుండి చెప్పుతూవుంటే నేను వ్రాయుచున్నాను. ఆమె చెప్పునదేమనగా! నలభైరోజులు
శివాలయమునకు పోయి లింగమునకు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి. శివాలయమునకు పోకముందే రాత్రి
రాగిబిందెలో నీళ్ళు పెట్టుకొని, ఉదయము స్నానము చేసిన తర్వాత శివాలయమునకు పోవాలి. అట్లే నలభైరోజులు
సాయంకాలము వేపాకు వేసిన నీళ్ళతో స్నానము చేసి, ఆంజనేయుని గుడికి పోయి ప్రదక్షణ చేసి రావాలి. నలభైరోజులు
మాంసము తినకూడదు. ఆ నలభైరోజులలో వారమునకొకమారు శెనగలు నానబెట్టిన నీళ్ళు తాగి ఆ శెనగలను ఉడక
బెట్టుకొని గుగ్గిళ్ళు తినాలి. ఉదయము, సాయంకాలము కాఫీగానీ, టీ గానీ త్రాగకుండ గ్లాసు పాలుత్రాగాలి. రాత్రిపూట
ఆంజనేయస్వామి ఫోటోను తలక్రింద పెట్టుకొని పడుకోవాలి. ఇవన్నీ క్రమము తప్పకుండ చేయాలి అని చెప్పింది.
అమ్మవారు చెప్పినవన్ని వ్రాసుకొన్న నేను “ఇంక పూజకు రావలసిన పనిలేదు కదా” అని మా ప్రక్కనున్న వ్యక్తిని
అడిగాను. అతను “అమ్మవారు చెప్పింది. అన్నీ తీసివేసినానని ఇంక అవసరములేదు" అన్నాడు. అప్పుడు నేను
“మూడు రోజులుగా నేనూ వచ్చాను. నాకు అమ్మవారి దర్శనము దొరకలేదు. పైగా నేను ఎవరికైనా చెప్పేదానికి
అమ్మవారి మహత్యము కూడ ఏమి తెలియదు. నీవు ఇక్కడ ముఖ్యమైన మనిషిగా ఉన్నావు కదా! నీవు నాకు పెద్దమ్మ
వారి దర్శనమును చేయించ వచ్చును కదా!" అని అడిగాను. దానికి ఆ వ్యక్తి “తప్పకుండ దర్శనము చేయిస్తాను” అని
నా చేయి పట్టుకొని రూములోనికి పోకముందే "అమ్మా! ఒక బాలుడు నీ దర్శనమును అడుగుచున్నాడు” అని చెప్పి,
నన్ను లోపలికి తీసుకొని పోయాడు.
లోపలికి పోయి కుడిప్రక్కను తిరిగి చూచాను. నాల్గవరూముకంటే అమ్మవారున్న రూము రెండింతలు వెడల్పు
ఎక్కువగా ఉన్నది. అమ్మవారు ఒక ఆడమనిషిలో చేరివున్నది. ఆ ఆడమనిషి వెల్లకిలా పడుకొని, కాళ్ళు వెడల్పుగా
చాపివుంది. ఆమె శరీరములో నుండి చిన్నగా మూల్గినట్లు వినిపిస్తావుంది. ఆమె నడుముల వద్దనుండి క్రిందికాళ్ళ
వరకు కుడిప్రక్క ఎడమప్రక్క స్వీటాల్లో ఉన్నట్లు అన్ని స్వీట్లు, కారాలు, బూందీలు అన్ని రెండు వైపులా పెట్టబడి
ఉన్నాయి. నడుము పై భాగమున రెండు ప్రక్కల ఖాళీ స్థలముండి, ఆ స్థలములో రెండు ప్రక్కలా రెండు అడుగుల
ఎత్తుగల దీపస్తంభములు గలవు. మా వైపు కాళ్ళు ఉండగా తలవైపున పెద్ద దిండుమీద తలపెట్టుకొని పడుకొని ఉంది.
ఆమె పడుకొని చూచినా, దిండుమీద తల ఉండుటవలన ఎదురుగా ఉన్న మేము బాగా కనిపిస్తాము, అలా పడుకొన్న
ఆమెకు ఎడమ ప్రక్కన రెండున్నర అడుగుల దూరములోనే, మేము వచ్చిన తలుపు దగ్గరనుంచి ఆ గది పొడువునా
కేవలము మూడు అడుగుల ఎత్తు, అర్థ అడుగు మందము గల గోడ కలదు. గోడ ప్రక్కన ఎనిమిది అడుగుల పొడవు,
ఎనిమిది అడుగుల విస్తీర్ణము గల గది ఉన్నది. అమ్మవారు పడుకొన్న రూముకు, ప్రక్క రూముకు గజము ఎత్తుగల
గోడమాత్రము కలదు. గోడ ప్రక్కన గల గదిలో, పది లేక పండ్రెడు పెద్ద కుండలు (బానలు) కలవు. వాటిమీద
మూతలు కూడా ఉన్నాయి. ఆ గదిలోనుండి తెలిసి తెలియనట్లు కొద్దిగ కుళ్ళిన మాంసము వాసన వస్తూవుంది. ఆ
చిన్న గోడకు, బానలకు పెద్దకుండలకు మధ్యలో రెండు అడుగుల స్థలమున్నది. గోడకు, బానలకు మధ్యలో ఒక
మనిషి పడుకొంటే మేము నిలుచున్న చోటినుండి ఏమాత్రము కనిపించడు. ఇదంతా ఎవరు గ్రహించుకొనే దానికి
ఏమాత్రము వీలులేదు. ఎందుకనగా!
నాలాగ ఎవరైన లోపలికి పోయి అమ్మవారు ప్రక్క తిరిగి చూస్తూనే అంతవరకు పడుకొని ఉన్న ఆమె అమాంతం
ఒక్కసారి లేచి కూర్చుంటుంది. ఆ దృశ్యమును చూస్తూనే, ఎవరిలోనైన కొంత భయము ఏర్పడుతుంది. అంతేకాక
లోపలికి వచ్చిన మనిషి ఎంత తెలివైనవాడైన వాని తెలివి పని చేయకుండునట్లు, ఎలాగ చేయాలో వారు ముందే
తయారు చేసుకొన్న పథకము ప్రకారము అలాగే చేయుదురు. అట్లు చేయుటలో వారి తెలివి గొప్పదే అని చెప్పవచ్చును.
నేను లోపలికి పోయిన వెంటనే నా ధ్యాసను ప్రక్కకు మళ్ళించుటకు, పడుకొన్న మనిషి ఒక్కసారిగ లేచి కూర్చుంది. రా
ముందుకు రా అని గద్దించి పలికింది. అలా గద్దించి చెప్పడములో మనలో యున్న యోచనలన్ని గాలికి పోతాయి.
ఆమె చెప్పినట్లు ముందుకు పోతూనే వెనక్కి పో అని అరుస్తుంది. నేను ముందుకు పోతూనే నేనేమో తప్పు చేసినట్లు
వెనక్కి పో అని అరిచి చెప్పింది. ఆ అరుపుకు రెండు అడుగుల వెనక్కి వచ్చాను. నేను వెనక్కి వచ్చేటప్పుడు నాతో
పాటు లోపలికి వచ్చిన మనిషి, నా వెనుకనుండి నా చేయి పట్టుకొని వెనక్కి రమ్మనట్లు లాగినాడు. ఆ స్థితిలో ఎవడైనా
ఏమి తప్పు చేశామోనని వానిలో వాడు యోచించు కుంటాడు తప్ప బయట ఏమి జరుగుతూ ఉన్నదని యోచన
చేయలేడు. వచ్చిన వానిని అలా తికమక చేయడమే వారికి ముఖ్యమైనపని. వెనక్కి వచ్చిన నన్ను, ప్రక్క గూడువుంది
చూడు అని అమ్మవారు గద్దించి చెప్పింది నా ప్రక్కనున్న మనిషి ఇదిగో గూడు అని నాకు చూపించాడు. ఆ గూడు
మేము వచ్చిన వాకిలికి ఎదురుగా ఉన్నది. నేను ఆ గూడువైపు చూచి చూడకనే గూటిలో చెంబు ఉంది కనిపిస్తావుందా
అని అమ్మవారు గద్దించి అడిగింది. ఆ మాటకు కనిపించింది తల్లీ అని నేను చెప్పాలి. మాట్లాడకుండ (పలుకకుండ)
మౌనముగా ఉండకూడదు. నేను కనిపించింది అని చెప్పాను. వెంటనే ప్రక్కనే దూది ఉంది చూడు, దూదిని తీసుకో
అని వెంటనే చెప్పింది. నేను అదే గూటిలో చెంబు ప్రక్కనే ఉన్న దూదిని తీసుకొన్నాను. చెంబులోని నీళ్ళలో దూదిని
ముంచి నాకివ్వు అని అరిచింది. నేను అలాగే చెంబులోని నీటిలో దూదిని తడిపి కూర్చొనియున్న అమ్మవారికి ఇవ్వడానికి
పోయాను. చేయి చాచి నా చేతిలోని దూదిని తీసుకుంటూనే దూరంగా నిలబడు అని గద్దించగా, నేను రెండు మూడు
అడుగులు వెనక్కి వేసి నిలబడినాను. నా ప్రక్కనున్న మనిషి చేతులు కట్టుకొని చాలా భయముగా ఉన్నట్లు కనిపించాడు.
అంతలో నా చేతినుండి తడిసిన దూదిని తీసుకొన్న అమ్మవారు, దూది పై భాగమును దీపమునకు అంటించింది.
దీపమునకు అంటుకున్న దూది పై భాగము నూనెతో మండినట్లు మండుచున్నది. పై భాగమున దూది మండుచుండగ,
అమ్మవారు చేతితో పట్టుకొని ఉన్నది. నా ప్రక్కనేనున్న మనిషి, చూచావా? అమ్మవారి మహత్యము అంటున్నాడు.
అంతలో ఆ దూదిని ప్రక్కన క్రింద పెట్టిన అమ్మవారు, నీ వెనుక గూడువుంది చూడు అన్నది. వెను తిరిగి చూచాను.
గూడు ఉన్నది. అక్కడ చేటలో మన్నువుంది చూడు అని చెప్పింది. అక్కడికి పోయి చూస్తే గూటిలో చేటవుంది, ఆ
చేటలో మన్ను కూడ ఉన్నది. ఆ మన్నును తీసుకొని రా అని చెప్పింది. నా ప్రక్కనున్న మనిషి దోసెడు నిండా తీసుకో
అని చిన్నగ చెప్పాడు. అతను చెప్పినట్లు నేను రెండు చేతుల నిండా మన్ను తీసుకొన్నాను.
వెంటనే నా ప్రక్కనున్న వ్యక్తి అమ్మవారికి ఇవ్వు అని చెప్పాడు. నేను ముందుకు పోయాను. అప్పుడు
అమ్మవారు ముందుకు చేతులు చాచి తన చేతులలోనికి మన్నును పోయించుకొని వెనక్కి పో అని అరిచింది. నేను
కొద్దిగ వెనక్కి వచ్చి నిలబడ్డాను. అమ్మవారు కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని ఉంది అన్నాను కదా! తన చేతులలోని
మన్నును రెండు హస్తములతో గట్టిగా రుద్దుచూ, క్రింద తన చీరలో పడునట్లు చేసినది. ఆ మన్ను రాపిడిగా రుద్ది
క్రిందికి వదిలేకొద్దీ, అ మన్ను ఎర్రగ రంగు మారి పడుచున్నది. నేను ఇచ్చినది నల్లమట్టి, ఆమె రాలిపింది ఎర్రని
కుంకుమ. ప్రక్కన మనిషి చూచినా అమ్మవారి మహత్యము అంటున్నాడు. రెండు హస్తముల మధ్యన మట్టిని రుద్దిన
చేతులు ఎర్రగ కనిపిస్తున్నాయి. ఆమె చీరమీద, కాళ్ళ మద్యలో పడినదంతా ఎర్రగా కనిపిస్తావున్నది. అప్పుడు
అమ్మవారు చూచావా బాలా? నా మహత్యమును అన్నది. చూచాను అమ్మా అని నేను చెప్పాను. అయితే నా దీవెన నీకు
ఎప్పుడూ ఉంటుంది. ఇంక పోండి అన్నది. అక్కడినుండి వచ్చేశాము. ఆమె చెప్పిన విషయములను వ్రాసుకొన్న
పేపరు నారాయణరెడ్డికి ఇచ్చి, అతని ఊరికి పంపించివేశాను.
నేను ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజులు జరిగిన విషయ ములన్నిటిని గుర్తుచేసుకొని చూచాను. అలాగే
చివరిలో వారు నాకు చూపిన మహత్యములను కూడ వివరించుకొని యోచించాను. అసలైన విషయమంతా అర్థమైనది.
అక్కడ జరుగుచున్న వాటిలోనున్న సత్యమేమిటి అన్నది తెలిసిపోయింది. నాకు తెలిసింది మీకు వివరించి చెప్పుచున్నాను
చూడండి. వారు ఇచ్చే కొబ్బరికాయగానీ, బజారులో కొనే కొబ్బరికాయగానీ రెండు ఒక్కటే. అలా ఇవ్వడములో అది
ఒక వ్యాపారమే గానీ, అందులో ఏ మోసములేదు. తలక్రింద పెట్టుకొని తీసుకుపోవడము వలన దానిలో తలక్రింద
పెట్టుకొన్న వాని సమాచారము ఏమి ఉండదు. అట్లు పెట్టుకొని పోవడము వలన ఏమైన అందులో తెలుస్తుందేమో
అనుకొంటే అది వారి భ్రమే అగును. అలా చేయించడము మనకు నమ్మకము కల్గుటకు మాత్రమేనని అర్థమగుచున్నది.
ఇక ముఖ్యముగ గమనించ వలసినదేమంటే కొబ్బరికాయను కొట్టిన శబ్దము మాత్రము వినిపిస్తున్నది. కొబ్బరికాయను
తీసుకుపోయిన వాడు, అక్కడ ఇచ్చి వచ్చిన తర్వాత కొట్టుచున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే? మన ముందర కొట్టకుండ
ఎవరు చూడకుండ కొట్టడము ఎందుకు? దానికి జవాబును వెదికితే. మనము తీసుకు పోయిన కొబ్బరి కాయను
కొట్టడము వాస్తవము. కానీ అమ్మవారు కొబ్బరికాయను కొట్టలేదు. కాయను లోపలికి తీసుకొని పోయినప్పుడు
కూర్చొనే ఉంటుంది. టెంకాయను ఇవ్వు అని, ఇచ్చిన వెంటనే పో అని గద్దించి చెప్పి పోయిన వానిని గందరగోళము
చేసి పంపడము వలన వాడు అక్కడ పరిస్థితులను గురించి యోచించు అవకాశమే ఉండదు. కాయను ఇచ్చిన వాడు
బయటికి వస్తూనే, ఆ కొబ్బరికాయను అమ్మవారు ఎడమ చేతితో చిన్న గోడవైపు అందించును. అంతకు ముందు
నుండి గోడ ప్రక్క ఎవరికి తెలియకుండ దాగియున్న మనిషి, కొబ్బరికాయను తీసుకొని పగులగొట్టి కొబ్బరిచిప్పలను
ముందే తనవద్దనున్న పాత్రలోనికి వేయును. ఆ గిన్నెలో ఏమివేసియుంచాలో ముందే నిర్ణయించుకొని చిప్పలలో వేసి,
గోడప్రక్కన నుండి అమ్మవారుకు ఇవ్వగా దానిని తీసుకొని అమ్మవారు, వచ్చి తీసుకుపో అనిచెప్పగానే బయటినుండి
పోయి రోగి తెచ్చుకుంటున్నాడు. లోపల జరిగే తంతు, పోయిన రోగికి తెలియదు. కానీ రోగిని నాల్గవ రూము వరకు
తీసుకొని పోయి అన్ని అర్థమగులాగున చెప్పు వ్యక్తి ఉన్నాడు కదా! అతనికీ, అమ్మవారుకూ, గోడప్రక్కన కనిపించకుండ
ఉన్న వ్యక్తికీ అన్నీ తెలుసు. వచ్చిన రోగి ఆరోగ్యము బాగలేక పోతేనో లేక నడువ లేక పోతేనో అతని వెంట ఒక మనిషి
వచ్చుటకు అవకాశమిస్తారు. రోగి బాగుంటే రెండవ మనిషిని నాల్గవరూము వరకు రానివ్వరు. వచ్చినవాడు చిన్న
పూజకో, పెద్ద పూజకో డబ్బులుకట్టి వచ్చినపుడు వానికి ఉన్న సమస్య అక్కడ డబ్బులు కట్టించుకొనే వానికి చెప్పును.
డబ్బులు కట్టించుకొను వాడు నాల్గవరూములో మన ప్రక్కనే ఉండి గిన్నెలోవున్న వాటిని వివరముగా చూపువాడే! అతని
ద్వారా అమ్మవారుకు, లోపల తెలియకుండ ఉండి కొబ్బరికాయ కొట్టువానికి, వచ్చినవాని విషయమంతా తెలిసియుండును.
అందువలన వచ్చినవానికి తగినట్లు వారు అక్కడ చేయడము జరుగుచున్నది.
వచ్చిన రోగి విషయమంతా అవగాహన చేసుకొని, నాల్గవ రూములోవున్న వ్యక్తి, అమ్మవారు, తెలియకుండ
చాటున ఉన్న మనిషి ముగ్గురు కలిసి ఆడుచున్న నాటకము నాకు బాగా అర్థమైనది. నాల్గవ రూములో ఉన్న వ్యక్తి చాలా
తెలివిగా నడుచుకొనుచుండును. కొబ్బరి కాయను ఇస్తూనే పొమ్మని అమ్మవారు చెప్పగా, తిరిగి వచ్చిన రోగిని అమ్మవారు
పిలిచేంత వరకు లోపలికి పోకుండ చూచుకొనును. కాయను ఇచ్చి వస్తూనే కూర్చోమని చెప్పును. కూర్చుని అరనిమిషము
కాకముండే లోపలికి పిలువడము జరుగుచున్నది. పోయిన రోగి గిన్నెను తీసుకొని పోయేటట్లు లోపల గద్దించి
పంపగా, వచ్చినవానికి గిన్నెలోని వస్తువులను అమ్మవారు చెప్పినట్లు చూపుచుండును. రోగి కొబ్బరికాయను ఇవ్వడానికి
తీసుకొని వచ్చే దానికి రెండుమార్లే లోపలికి పోవును. ఆ సమయములో కూడ అమ్మవారు వెంట్రుకలు విరబోసుకొని,
కాళ్ళు చాపుకొని కూర్చొని ఉండడమూ, పోయిన వానిని గద్దించి మాట్లాడడము వలన అక్కడ ఏమి జరుగుచున్నదో
ఎవడూ ఊహించలేడు. బయటికి వస్తూనే బయటివాడు ఇది చూడు, అది చూడు అని మభ్యపెట్టును. అందువలన ఏ
రోగీ అది వారు ముగ్గురు ఆడుచున్న నాటకమని గుర్తించలేడు. మట్టిబానలలో నిల్వయుంచడము వలన లోపల కొద్దిగ
వాసన రావడమును నేను గ్రహించాను.
ప్రక్కనే చిన్నగోడ, దానిలోపల మట్టిబానలు, వాటిలో వచ్చిన వారికి గిన్నెలలో చూపవలసిన సామాగ్రి. ఆ
సామాగ్రిలోనుండియే మాకు మూడు రోజులు మూడు రకములవి చూపించారు. చివరిలో చూపిన నిమ్మకాయలు,
త్రాడుబొమ్మ, దానికున్న ములుకులు చాలా రోజులనుండి ఉన్నవేనని అవి పాతబడివున్న స్థితినిబట్టి చూస్తూనే
అర్థమగుచున్నది. ఇలాంటివి వారివద్ద ఎన్ని వస్తువులను మట్టి బానలలో పెట్టుకొన్నారో? ఇంకా అమ్మవారు విషయానికి
వస్తే, ఆమెలో పెద్దమ్మలేదు, చిన్నమ్మలేదు. ఆమె పూనకము వచ్చినట్లు నటిస్తున్నది. నేను అమ్మవారున్న రూములోనికి
పోయినపుడు ఆమె వెల్లకిల పడుకొనివుండి, కొద్దిగ మూల్గినట్లు నటించినది. అట్లు మూల్గుట వలన ఆమె శరీరములో
పెద్దదేవత ఉన్నదనీ, దేవత ఉండుట వలన సాధారణ మనిషి అయిన ఆమె శరీరము తట్టుకోలేక పోవుచున్నదని
తెలియునట్లు నటించినదని అర్థమైనది. దేవత శరీరములో ఉన్నట్లు నటించడమేకాక, లోపలికి పోయిన రోగిని
మాటలతోనే భయపెట్టడములో మంచి అనుభవమును పొందినది. నేను లోపలికి పోతే మన యోచనలు పారకుండ,
అరిచి భయపెట్టి మభ్యపెట్టుదురని నేను ముందే ఊహించు కొన్నట్లే, నన్ను ముందుకు వెనక్కు, దూరము, అక్కడ చూడు
అని గద్దించి మన దృష్టిని వారి చేతుల్లో పెట్టుకోవాలనుకొన్నారు. కానీ అమ్మవారి దర్శనము కావాలని లోపలికి
పోయిన నన్ను మభ్యపెట్టినా, వారు ఆడించినట్లు నేను ఆడినా, వారి దృష్ఠిలో నేను మభ్యపడిపోయినట్లు కనిపించినా,
ఇతను మనకంటే బాగా నటిస్తున్నాడని వారికి తెలియదు. నేను లోపల గడిపిన కొద్ది నిమిషములకే వారు ఆడించినట్లు
ఆడుచు అన్నీ అర్థము చేసుకొన్నాను.
ఇక్కడ కొందరికి ఒక అనుమానము వచ్చి “నీటితో దీపమును వెలిగించింది కదా! అనియు, మట్టిని కుంకుమ
చేసింది కదా! అనియు, ఇవన్నీ మహత్యములు కావా? సాధారణ ఆడమనిషి చేయగలదా? అని అడుగ వచ్చును.
దానికి నా సమాధానము ఇలా ఉన్నది. నాలాగ ఎవరికైన వారి మీద అనుమానము వస్తే, వారికి ఆ అనుమానము
లేకుండ చేయుటకు పెట్టుకొన్న రెండు మహత్యములు నాకు చూపినవి. అవి మహత్యములే అయితే ఆ మహత్యములను
మీరూ చేయవచ్చును. చదువు రాని వారు కూడ చేయవచ్చును. అది అందరికి ఎలా సాధ్యమో వివరిస్తాను గమనించండి.
అక్కడ చెంబులో నీళ్ళను ఎందుకు పెట్టారు? ప్రక్కనే దూదిని ఎందుకు పెట్టారు? ఈ రెండు ప్రశ్నలకు జవాబును
వెదికితే దానికి ఒకటే సమాధానము దొరుకుతుంది. ముందే సంసిద్ధముగా చేసి పెట్టుకొన్న వని అర్థమగుచున్నది.
అక్కడున్న దూదిలో ఏమి లేదు. అది సాధారణ దూదియే. కానీ చెంబులో నీళ్ళు మాత్రము మామూలు నీళ్ళుకాదు. ఆ
నీళ్ళలో భాస్వర కణములు కలిసివున్నాయి. భాస్వరము అనునది ఒక ఘనపదార్థము. భాస్వరము అను పదార్థము
నీటిలో ఉన్నపుడే ఏ మార్పు చెందకుండ ఉంటుంది. కానీ దానిని నీటినుండి బయటికి తీస్తే మండి పోతుంది. ఈ
విషయము చదువుకొన్న వారందరికి బహుశ తెలిసే ఉంటుంది. అక్కడ నీటిలో కొద్దిపాటి భాస్వరమును కలిపి
పెట్టారు. చిన్న ముక్క భాస్వరము నీటిలో నలిపివేస్తే, చిన్న చిన్న ముక్కలై నీటిలోనే ఉండును. దూదిలో నీరు ఉండుట
వలన, దూదిలో అంటుకొని వచ్చిన భాస్వరకణములు మండిపోవు. ఆ దూదిని దీపముతో అంటించితే భాస్వర
కణములు అంటుకొని నీరు ఉండినా, భాస్వరకణములు ఒక్కొక్కటిగా మండుట మొదలు పెట్టును. నీటిలోని భాస్వరకణముల
విషయము మనకు తెలియనప్పుడు నీటిలో తడిసిన దూది మండుతున్నదని, అది ఎక్కడా జరగని పని కావున, దానిని
మహత్యమని మనము అనుకుంటాము. అక్కడ ఏ మహత్యము లేకున్నా ప్రజలను నమ్మించుటకు చేసిన మోసము పని
తప్ప ఏ మహత్యముకాదని తెలియుచున్నది.
ఇక వారు చేసిన రెండవ మహత్యము, మట్టిని ఎర్రని బండారుగా మార్చడము. చేటలో ముందే మట్టిని
అక్కడెందుకు పెట్టుకొన్నారు? అని ప్రశ్నించుకొంటే, ఆ మట్టి అప్పుడప్పుడు బయట దొరుకు మట్టికాదు. అది ముందే
తయారు చేసుకొన్న మట్టి అని జవాబు తెలియుచున్నది. ఆ మట్టిని తయారు చేసి పెట్టుకొంటే, మీరైన సులభముగా
మహత్యమును చేయవచ్చును. కొంత కుంకుమను తీసుకొని దానిని మజ్జిగలో కలిపి ఆరబెట్టితే చిన్న చిన్న తెల్ల
ముక్కలుగా తయారుకాగలదు. ఎర్రని కుంకుమను తెల్లని మజ్జిగలో కొంత కలుపడము వలన ఎండలో ఆరపెట్టినపుడు
కుంకుమ చిన్న ఉంటలుగా తయారై ఉంటపై భాగము ఎర్రగ కనిపించకుండ కొద్దిగ తెల్లగ కనిపించును. ఆరిన
తర్వాత ఆ ఉంటను నలిపితే లోపల ఎర్రని కుంకుమ బయటపడును. ఎర్రని కుంకుమను కొద్దిగా మజ్జిగలో కలిపినపుడు
తేమకు, కుంకుమ గడ్డలుగా మారును. ఆరబెట్టినపుడు మజ్జిగలోని తెల్లతనము, కుంకుమ ఉంటపై భాగమును
చేరును. లోపల భాగమున కుంకుమ అట్లే ఉండును. కుంకుమ ఉంటలకు ఎర్రని రంగు కనిపించ కుండ కొద్దిగ
తెలుపు కనిపించుటకు, కుంకుమకు మజ్జిగను కలుపుచున్నారు. అట్లు కలుపుకొని కుంకుమ ఉంటలను కొద్దిపాటి
మన్నులో కలిపిపెట్టుకొంటే అది మన్నులో కలిసిపోయి మన్ను మాదిరే కనిపించును. ఆ మన్నును అవసరమొచ్చినపుడు
వ్రేళ్ళతో నలిపితే, కుంకుమ ఉంటలు పగిలిపోయి మట్టికి కూడ ఎర్రతనము అంటుకొని పొడిగా రాలును. అప్పుడు
కొంత రంగు తక్కువ కుంకుమ (బండారు) కనిపించును. అలా కనిపించుట వలన, తెలియనివారికి అది మహత్యము
అవుతున్నది. పెద్దమ్మ బొమ్మను గాని, సుంకులమ్మ బొమ్మను ఎత్తుకొన్నవారుగానీ, కొరడాలు భుజముమీద వేసుకొని
బజారులో డబ్బులు అడుక్కొనేవారు కూడ, క్రింద మట్టిని తీసుకొని తమ చేతిలో పెట్టుకొన్న కుంకుమ ఉంటలను నలిపి
మన చేతిలోనికి పెట్టుచుందురు. దానిని చూచి మట్టిని తీసుకొని బండారు పెట్టాడని భ్రమించినవారు వారికి డబ్బులు
ఇచ్చి పంపుట అక్కడక్కడ జరుగుచుండును. అదే పద్ధతి ప్రకారము ముందే కుంకుమను మజ్జిగలో తడిపి ఆర
పెట్టుకొన్న జొన్నగింజలలాంటి ఉంటలలోనికి కొంత జల్లెడపట్టిన మెత్తని రేగడిమన్నును కలిపి పెట్టుకొన్నారు. రేగడిమట్టితో
కలిసియుండుట వలన కుంకుమ ఉంటలు కూడ మన్ను మాదిరే ఉన్నాయి. ఆ మట్టినే నేను అమ్మవారి చేతుల్లోనికి
పోసాను. చేతిలోనికి పోసిన వెంటనే నన్ను వెనక్కి పో అని గద్దించి, నేను వెనక్కి పోతూనే రెండు చేతుల మధ్యన గట్టిగా
మట్టిని త్రికుటవలన క్రింద ఎర్రనిరంగు పొడి మట్టితో కలిసి రాలింది. మట్టికూడ ఎర్రని రంగుతో కలిసిపోవుట వలన
క్రింద రాలినదంతా బండారుగా అనుకొన్నాము. అది కొంత కలరు తక్కువగ ఉండుట వలన, ముందే చేటలో మట్టిని
రడీగా ఉంచిన దానివలన, ఇచ్చిన మట్టిని అమ్మవారు నలిపి రాల్పడము వలన, అది మహత్యముకాదని, అది ఎదుటివారిని
నమ్మించుటకు చేయు క్రియ అని అర్థమైనది. ఇలా వారు చేసి చూపించినవి మహత్యములుకాదు. ప్రజలకు తెలియని
పనులని తెలియుచున్నది.
రోగి కొబ్బరికాయను తీసుకొని లోపలికి పోయి ఇచ్చినపుడు, అతని ముందరనే కొబ్బరికాయను కొట్టితే,
కొబ్బరికాయలో నుండి పడిన వస్తువులు రోగికి కనిపించును కదా! అప్పుడు వాటిని బయటికి తెచ్చుకొని బయటనున్న
వ్యక్తితో వివరముగా చెప్పించుకోవచ్చును. అలా కాకుండ లోపలకి పోయిన రోగిని బయటకు పంపి, అతనికి తెలియకుండ,
అతను చూడకుండ కొబ్బరి కాయను కొట్టి, నీకున్న రోగము కొబ్బరికాయలోనుండి పడినదని చూపించడము, రోగిని
మోసము చేసి నమ్మించినట్లు కాదా! మొదటి దినము నారాయణరెడ్డి కొబ్బరికాయను లోపలికి తీసుకుపోయి అమ్మవారికి
ఇచ్చివచ్చాడు. నారాయణరెడ్డి బయటికి వస్తూనే, అమ్మవారుగా పూనకము వచ్చినట్లు నటిస్తున్న ఆమె, ఆ కొబ్బరికాయను
గోడప్రక్కనున్న వ్యక్తికి ఇస్తే అతను కాయను సులభముగా పగులగొట్టుటకు తయారు చేసుకొన్న ఇనుపరాడ్తో కొట్టి,
నీళ్ళను వేరేపాత్రలోనికి పట్టిపెట్టి, నీళ్ళు లేని చిప్పలను గిన్నెలోనికి వేసి, ఆ గిన్నెలోనికి ముందే అనుకొన్నట్లు ఏమి
వేయాలో అవియే వేసి, ఆమెకు అందిస్తే అప్పుడు అమ్మవారు పిలిచింది. (నేను లోపలికి పోయినపుడు అక్కడ కొబ్బరికాయ
కొట్టినట్లు గుర్తు ఏమి కనిపించలేదు. కాయ పగులకొట్టినపుడు పడిన నీళ్ళ గుర్తులు కూడ లేవు. దానినిబట్టి అక్కడ
కొబ్బరికాయను కొట్టలేదని సులభముగా అర్థమగుచున్నది.) అమ్మవారు పిలువగానే, నారాయణరెడ్డి పోయి తెచ్చుకొన్న
గిన్నెలో కనిపించిన ఊపిరితిత్తి, కొద్దిగ ఎరుపు వర్ణముగల నీచునీళ్ళు, రెండు పురుగులు అన్ని గిన్నెలో వేసి పంపినవే.
అయితే బయటవున్న వ్యక్తి, అమ్మవారు కాయను పగులగొట్టినప్పుడు కాయలోనుండి బయటపడినవని చెప్పి నమ్మించారు.
లోపలినుండి అమ్మవారు నీకు ఊపిరితిత్తి రంధ్రాలు పడింది, పురుగులు పట్టింది అని, రెండు పురుగులు చూపడము
పచ్చి మోసమని తెలిసింది. ఊపిరితిత్తి రంధ్రాలుపడడమేమిటి? లోపల అంతలావు డ్రైనేజి పురుగులు ఉంటాయా?
అవన్నిటిని ఈమె కొబ్బరికాయలోనికి వచ్చేటట్లు చేయడ మేమిటి? ఇవన్నీ నమ్మశక్యముకాని పచ్చి అబద్దపు మాటలు.
బాధలతో నివారణకు ఒక దేవత దగ్గరకు పోవుచున్నామని నమ్మిపోవుచున్న వారినుండి పెద్దపూజకు రెండువందలు,
చిన్న పూజకు వంద డబ్బులు లాగడము, ముందే బాధలతో బాధపడుచున్న వారిని ఇంకా దోచుకొని బాధపెట్టడము
కాదా? కడుపులోని ప్రేగు ముడిపడిందని చెప్పడము, దానిని కత్తిరించి తీసివేసినానని చెప్పడము మోసము కాదా?
ఉండే సమస్యలన్నిటిని ఒకేరోజు చెప్పక మూడురోజులు త్రిప్పుకొని, ఆరువందల డబ్బులు కాజేయడము మోసము
కాదా? చివరిరోజు కంబడిదారమును ఎండిపోయిన నిమ్మకాయ లను, గుడ్డబొమ్మను చూపించి నారాయణరెడ్డికి చేతబడి
చేశారని చెప్పడము విడ్డూరమైన మోసము కాదా? ఆయనకున్నది సాధారణ దయ్యము యొక్క సమస్యకాగా, దానిని
ఏమాత్రము చెప్పకుండ, లేనివన్ని చెప్పి వాటినన్నిటిని కొబ్బరికాయలోనుండి తీసి వేశామనడము పాపభీతి లేకుండ
మోసము చేయడము కాదా? ఇప్పటికి ముప్పైఐదు సంవత్సరముల క్రితము రోజుకు రెండువందలు డబ్బులు తీసుకొన్నారు.
ఇప్పటికాలములో ఆ రెండు వందల విలువ రెండువేలు అవుతుంది. మేము పోయినపుడు ఒక్క రోజుకు ఇరవైమంది
దాక అక్కడికి పోయేవారిని చూచాను. ఆ లెక్క ప్రకారము ఒక రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో?
నేను ఇంతవరకు ఎన్నో దయ్యముల విషయములను చెప్పాను. అన్నీ వాస్తవముగా దయ్యాలే. అలాగే
దేవతలను కూడ చూశాను. అవి కూడ వాస్తవమే. కానీ పెద్దమ్మను చూచిన వెంటనే ఆమె శరీరములో ఏ దేవతాలేదని
తెలుసుకోగలిగాను. నిజముగ ఆమె దేవతే అయ్యుంటే నన్ను చూస్తూనే భయపడి తేలిపోయేది. అక్కడ ఒక ఆడమనిషి,
దేవత పూనినట్లు నటిస్తున్నది. అక్కడున్న ముగ్గురు కలిసి చేసే మోసము చాలా పెద్దమోసము. అయినా ఆ రోజు
నుండి ఇంతవరకు ఎక్కడా వారు చేయుచున్నది మోసమని నేను చెప్పలేదు. వారి బ్రతుకుతెరువులో అది ఒక మార్గము
అని అనుకొన్నాను. కానీ వారు చేయుచున్నది, ఒక దేవత పేరు చెప్పి పాపమునే సంపాదించుకొనుచున్నారు. వారికర్మ
వారిదనుకొన్నాను. ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చినది. నేను దయ్యాలు ఉన్నాయనినా,
శాస్త్రబద్దముగానే చెప్పుచున్నాను. అన్నిటిని గ్రుడ్డిగా దయ్యాలనీ, దేవతలనీ చెప్పడము లేదనుటకు ఇది ఒక నిదర్శనము.
నేను ఇప్పుడు పెద్దమ్మవారు పూనకము వచ్చింది అని చెప్పిన వారిలో దేవతలేదు అని చెప్పడము కూడ శాస్త్రబద్దము
గానే చెప్పి దానిని మహత్యమనుట తగదన్నాను. ఒక విషయమును ఒప్పుకొనినా, ఖండించినా రెండిటికీ శాస్త్రబద్దత
ఉండవలెను. కొందరు హేతువాదులు శాస్త్రబద్దత లేకుండ అన్నిటిని కాదు, లేదు, అసత్యము అని అంటున్నారు.
కాదన్నది ఎట్లు కాదో, అసత్యమన్నది ఎట్లు అసత్యమో శాస్త్రీయముగా వివరించకుండ గ్రుడ్డిగ అసత్యమని, కాదని
వాదించు చున్నారు. అందువలన హేతువాదులకు, నాస్తికవాదులకు మేమిచ్చు సలహా ఏమంటే, ఒక విషయమును
ఖండించినా, లేక సమర్థించినా దానికి శాస్త్రీయతను చూపించి ఆ పనిని చేయాలి. నేను దయ్యాలున్నాయి అంటున్నాను.
అన్నీ యదార్థముగా జరిగిన సంఘటనలే. నేను చెప్పిన వాటిని ఎవరైనా ఖండించవచ్చును. “ఖండించకూడదు, నేను
చెప్పినవన్ని అందరు ఒప్పుకోవాలని” చెప్పను. కానీ మీరు ఒప్పుకోవడానికీ, ఖండించ డానికి శాస్త్రబద్ధత ఉందా? అని
అడుగుచున్నాను. శాస్త్రబద్దతలేకుండ మాట్లాడితే ఎవరైనా కూడ మూఢ నమ్మకస్తులే అవుతారు.
మన శరీరములో ముఖ్యమైనవి ఏడు గ్రంథులున్నవి. ఏడు గ్రంథులలోను చిన్నది ఒకటి గలదు. దానిపేరు
గ్రంథిరాజము అంటాము. గ్రంథిరాజము అనగా గ్రంథులన్నిటికి రాజు అని అర్ధము. అన్నిటికంటే చిన్న గ్రంథి
తనకంటే పెద్ద గ్రంథులను కూడ తన ఆజ్ఞకు లోబడి పని చేయునట్లు చేసుకొన్నది కావున దానిని గ్రంథిరాజము అని
అంటున్నాము. అలాగే భూమండలములో శాస్త్రములు ఆరున్నవి. వాటిని “షట్శాస్త్రములు” అని అంటాము.
ప్రపంచములో ఏదైన ఈ షట్శాస్త్రములను అనుసరించి ఉండును. షట్శాస్త్రములలో అన్నిటికంటే చిన్నది ఆరవశాస్త్రము.
దానికంటే మిగత ఐదుశాస్త్రములు పెద్దవే. అయినప్పటికీ ఆరవశాస్త్రమునకు లోబడియే మిగతా శాస్త్రములన్ని
ఉండును. అందువలన ఆరవశాస్త్రమును రాజవిద్యా శాస్త్రము లేక బ్రహ్మవిద్యా శాస్త్రము అంటాము. బ్రహ్మ అనగా
అన్నిటికంటే గొప్ప అని అర్థము. అలాగే రాజ అనినా అన్నిటికంటే గొప్ప అని అర్థము. జగతిలో మొట్టమొదట
తెలిసిన శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము. తర్వాత మిగత శాస్త్రములు తెలిసినవి. ఇప్పటికాలములో తెలియకుండ పోయిన
శాస్త్రము కూడ మనిషికి మొదట తెలిసిన ఆరవశాస్త్రమే. ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము, సృష్టి ఆదిలోనే మనిషికి
పూర్తిగా తెలిసిపోయినది. మిగత ఐదు శాస్త్రములు సంపూర్ణముగా ఇంకా తెలియబడలేదు. కాలక్రమేపి మిగత ఐదు
శాస్త్రములు అభివృద్ధి చెందుచున్నవి. అభివృద్ధిలో అన్నిటికంటే ఎక్కువ వెనుకబడినది ఐదవశాస్త్రమైన జ్యోతిష్యశాస్త్రము.
ముందే సంపూర్ణముగా తెలిసిన బ్రహ్మవిద్యా శాస్త్రము తెలియకుండా పోయినది. ఐదవశాస్త్రమైన జ్యోతిష్యశాస్త్రము
అభివృద్ధి చెందలేదు. కొంతవరకు అభివృద్ధి చెందిన గణిత, ఖగోళ, రసాయనిక, భౌతికములు నాలుగు ప్రజలలోనికి
చొచ్చుకొని పోయినవి. కొంతవరకే అభివృద్ధి చెందియున్న నాలుగు శాస్త్రము లను కొంత తెలిసిన మనిషి, అభివృద్ధి
చెందని జ్యోతిష్యశాస్త్రము తనకు తెలియదు కనుక అది ఉన్నదని కొందరు, లేదని కొందరూ అంటున్నారు. మొదటనే
ఉండి, ప్రస్తుతకాలములో లేకుండా పోయిన బ్రహ్మవిద్యా శాస్త్రమును మనిషి లేనేలేదు అంటున్నాడు.
జననము, మరణములు రెండు ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవి. ఆరవశాస్త్రము
తెలియకుండా పోయినది, కావున భూమిమీద కొందరు మరణించిన తర్వాత, మళ్ళీ జన్మేలేదు అంటున్నారు.
ఇస్లామ్మతములోను, క్రైస్తవమతములోను పునర్జన్మలేదు అను వాదన వినిపిస్తూ ఉన్నది. ఇకపోతే ఒక ఇందూమతములోనే
పునర్జన్మ ఉన్నదని కొందరికి మాత్రము కొంత నమ్మకము గలదు. ఇందూమతములోనే ఎక్కువ శాతము మంది
జ్ఞానమును తెలియని విద్యాధికులుగా, హేతువాదులుగా, నాస్తికవాదులుగా తయారై దైవమునే నమ్మనివారై చచ్చిన
తర్వాత పుట్టడమేమిటి? తెలివి ఉన్నవాడు, చదువు ఉన్నవాడు ఈ మాటను చెప్పరు. చదువులేనివారు, తెలివితక్కువవారే
ఈ మాటలంటుంటారు. అని చెప్పుచున్నారు. దీనినంతటిని బట్టి చూస్తే భూమిమీద చావడము వరకే గానీ, చచ్చిన
తర్వాత పుట్టడములేదు అనువారు ప్రపంచ జనాభాలో 98 శాతము గలరు. కేవలము 2 శాతము మాత్రము జన్మలున్నాయి
అని చెప్పువారు గలరు. అలా చెప్పువారిలోను పూర్తి నమ్మకము లేనివారు ఒక శాతముండగా, పూర్తి నమ్మకముతో
చెప్పువారు ఒక్క శాతము గలరు. దీని ప్రకారము ప్రపంచ జనాభా 700 కోట్లు కాగా అందులో 7 కోట్ల మంది
మాత్రము జన్మలను పూర్తిగా విశ్వసించువారు గలరని తెలియుచున్నది.
ఏడుకోట్ల మందిలో ఏడు లక్షలమంది మాత్రమే వేదములను, పురాణములను వదలి అసలైన బ్రహ్మవిద్య మీద
ఆసక్తి గలవారున్నారు. ఏడు లక్షలమందిలో ఏడు వేలమంది అసంపూర్ణ దైవజ్ఞానముగలవారు ఉన్నారు. ఏడు
వేలమందిలో 70 (డెభ్బై)మంది మాత్రము అసలైన బ్రహ్మవిద్యను తెలిసి అసలైన దైవజ్ఞానము పొందియున్నారు.
బ్రహ్మవిద్యను (దైవజ్ఞానమును) పొల్లుపోకుండ ఆచరించువారు సంపూర్ణ జ్ఞానాగ్నికలవారు భూమండలమునందు 70
(డెభై) మందిలో కేవలము ఏడు (7) మంది మాత్రము గలరు. 700 కోట్ల ప్రపంచ జనాభాలో మాయ బారినుండి
తప్పించుకొని, దైవమార్గములో ప్రయాణించువారు కేవలము ఏడుమంది మాత్రమేనని తెలియుచున్నది. వందకోట్ల
మనుషులలో అసలైన దైవ మార్గము తెలిసి, అసలైన దైవమార్గములో శాస్త్రబద్దముగా నడుచువాడు ఒక్కడేనని
తెలియుచున్నది. ప్రస్తుతము మన దేశ జనాభా వందకోట్లకు కొద్దిగ మించియున్నది. కావున మన భారతదేశము
(ఇందూదేశము) అంతటికి, ఎవడో ఒకడు ఆరవ శాస్త్రమును తెలిసి దాని ప్రకారము నడుచువాడు గలడని అర్థమగుచున్నది.
సరిగా ఆచరించువాడు ఒక్కడున్నా, మిగత 69 మంది సంపూర్ణజ్ఞానులు ఆరవశాస్త్రమును క్షణ్ణముగా తెలిసినవారు
గలరు. అటువంటివారి వద్ద నేను తెలుసుకొన్న జ్ఞానము ప్రకారము పునర్జన్మలు ఉన్నాయని చెప్పుచున్నాను.
ఇంకా వివరముగా చెప్పితే పునర్జన్మలే కాదు, పునర్మరణము కూడ కలదు. ఒకసారి పుట్టినవాడు చనిపోయి,
రెండవమారు పుట్టితే దానిని పునర్జన్మ అంటున్నాము. అలాగే ఒకసారి మరణించిన వాడు పుట్టి తర్వాత చనిపోతే
దానిని పునర్మరణము అంటున్నాము. ఇది బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము చెప్పుమాట. ఇక్కడ కొంత వివరమును
జాగ్రత్తగా విందాము. శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని, చెప్పినది చెప్పినట్లు జరిగి తీరునని చెప్పవచ్చును.
శాస్త్రము భూమిమీద ఎక్కడైన, ఏ దేశములోనైన ఒకే విలువ, ఒకే ఆచరణ కల్గియుండును. శాస్త్రమును చెప్పినది
మనుషులకే కావున ఏ దేశములోని, ఏ మతస్థులకైన ఒకే విధముగా వర్తించును. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్కరకముగా,
ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క విధముగా వర్తించదు. ఉదాహరణకు గణితశాస్త్రమును తీసుకొందాము. 3x3=9 అను
సూత్రము ఏ దేశములోనైనా, ఏ మతస్థునికైనా వర్తిస్తుంది. అలాగే ఆరు శాస్త్రములలో పెద్ద శాస్త్రమైన బ్రహ్మవిద్యా
శాస్త్రము ప్రకారము “జాతస్యహి ధృవో మృత్యుః, ధృవం జన్మ మృతస్యచ" అను సూత్రము అన్ని దేశములలోను అన్ని
మతములలోను వర్తించును. శాస్త్రము శాపములాగ జరిగి తీరుతుంది. కావున అన్ని మతములలోను గల ధర్మము,
జనన మరణములను సూచిస్తున్నది. దేవుడు చెప్పిన ధర్మమును ఆయా మతస్థులు గ్రహించుకోలేక మాయబారిలో
(సాతానాబారిలో) పడిపోయి దైవవాక్యమును మరచిపోయి జన్మలు లేవు అంటున్నారు. ఉదాహరణకు పరిశుద్ధ
బైబిలులో మత్తయి సువార్త 12వ అధ్యాయములో 31,32 వచనములను చూస్తే “మనుష్యులు చేయు ప్రతి పాపమును,
దూషణయు వారికి క్షమించబడును గాని, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి
విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ
యుగమందైననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.” మా మతములో జన్మలు లేవు అని చెప్పుచున్న
వారి గ్రంథములోనే దైవధర్మము ప్రకారము జన్మలున్నాయనుటకు సాక్ష్యముగా ఈ మాట నిలిచినది. శాస్త్రము ఎవరికైనా
శాసనమే అనుటకు బైబిల్లోని వాక్యము నిదర్శనముగా ఉన్నది. సాతాను (మాయ) ప్రభావము వలన పై వాక్యమును
క్రైస్తవులు ఇంకొక విధముగా అర్థము చేసుకొని, అందులోని సత్యమును గ్రహించలేక పోయినా, దైవధర్మశాస్త్రము
ప్రకారము మనిషికి జన్మలున్నాయనే ఆ వాక్యము చెప్పుచున్నది.
జ్యోతిష్యశాస్త్రము ప్రకారము స్థూలశరీరముతో మనిషి 120 సంవత్సరములు బ్రతుకవచ్చును. సూక్ష్మశరీరముతో
ఎంతకాలమైన బ్రతుకవచ్చును. మనకు కనిపించేది స్థూలశరీరమే కావున దానిని గురించే మాట్లాడుకొందాము.
ప్రస్తుత కాలములో మనిషి 80 లేక 90 సంవత్సరములకంటే ఎక్కువ బ్రతుకలేకున్నాడు. కొందరైతే మరీ తొందరగానే
చనిపోవుచుందురు. ఆయుష్షు తీరి చనిపోయినవాడు, ఆ క్షణమే జన్మకు పోవునని ధర్మశాస్త్రమైన ఆరవశాస్త్రము
చెప్పుచున్నది. 1200 సంవత్సరము లకు 10 జన్మలు తీసుకోవలసిన మనిషి 15 లేక 20 లేక 30 జన్మలు పొందుచున్నాడు.
ఒకవేళ 90 సంవత్సరములు బ్రతుకునట్లు లెక్కించిన 1200 సంవత్సరములకు 13 లేక 14 జన్మలు పొందుచున్నాడు.
మనిషికి ఆయుష్షు పరిమాణమున్నట్లు, నాలుగు యుగములకు కూడ పరిమాణము గలదు. కలియుగము యొక్క
ఆయుష్షు 4,32,000 సం||లు అని దేవుని చేత నిర్ణయించబడినది. అలాగే ద్వాపరయుగము 8,64,000 సం||లు
అనియు, త్రేతాయుగము 12,96,000 సం||లు అనియు, కృతయుగము 17,28,000 సం||లు అనియు నిర్ణయింపబడినది.
బైబిలులో చెప్పిన వాక్యము రెండువేల సంవత్సరముల పూర్వముదే, కావున కలియుగములో చెప్పబడినదేనని సులభముగా
తెలియుచున్నది. బైబిలు వాక్యము ప్రకారము ఎవడైనా దేవున్ని దూషించితే, వాడు రెండు యుగములలో పాపమును
అనుభవించును. ఉదాహరణకు ప్రస్తుత కాలములో ఈ దినమే దేవున్ని దూషణగా మాట్లాడినవాడు పది సంవత్సరముల
తర్వాత చనిపోయాడను కొనుము. అప్పటినుండి ఈ యుగములోనూ, రాబోవు యుగములోను పాపభారమును
మోయవలసియుండును. ఆ లెక్క ప్రకారము కలియుగము ఇప్పటివరకు జరిగినదికాక, మిగిలియున్న సంవత్సరములు
మరియు రాబోవు కృతయుగ సంవత్సరములు మొత్తము అనుభవించవలసియుండును. కలియుగము ఇప్పటి వరకు
5110 సంవత్సరములు గడిచిపోయినది. వాడు ఈ జన్మలో చనిపోవుటకు 10 సంవత్సరములున్నది. కావున వాడు
చనిపోవు సమయమునకు కలియుగము 5,120 సంవత్సరములు గడిచిపోవును. ఇంకా మిగిలియున్నది 4,26,880
సంవత్సరములు. రాబోవు కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇపుడు ఈ యుగములోని 4,26,880
సం||లు, రాబోవు యుగములోని 17,28,000 సంవత్సరము లను కలిపితే మొత్తము 21,54,880 సంవత్సరములు
పాపమును అనుభవించవలసియున్నది.
ఈ జన్మలో దేవుని ఎడల పాపమును సంపాదించుకొన్నవాడు ప్రతి జన్మలోను 100 సంవత్సరములు జీవించినా,
బైబిలు వాక్యమును అనుసరించి 21,549 మార్లు భూమిమీద పుట్టవలసి వస్తున్నది. 21 వేయి 5 వందల 49 మార్లు
జన్మనెత్తవలసియున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31,32 వాక్యములలో స్పష్టముగా ఈ యుగమందైనను,
రాబోవు యుగమందైనను అని ప్రభువే చెప్పియుండగా క్రైస్తవులు ప్రభువు మాటకు వ్యతిరేఖముగా సాతాను మాట
ప్రకారము, మనిషికి జన్మలు లేవు అనడము అధర్మము కాదా! ధర్మశాస్త్రమునకు విరుద్ధము కాదా?
ఆరవశాస్త్రమైన దైవశాస్త్రము లేక ధర్మశాస్త్రము ప్రతి మతములోను ప్రతి దేశములోను శాసనమై
నిలిచియున్నదనుటకు బైబిలులోని వాక్యమే తార్కాణము. ఇదే విధముగ కొన్ని మతముల వారు తమ తమ ధర్మగ్రంథము
లలోవున్న దైవవాక్యమును, మాయా ప్రభావముచేత తప్పుగా అర్థము చేసుకొని జన్మలులేవు అంటున్నారు. అట్లే కొన్ని
మతములవారు దయ్యములున్నాయని అంటున్నారు. కొన్ని మతములవారు దయ్యములు లేవు అంటున్నారు. బైబిలులో
ప్రభువు అనేక పర్యాయములు దయ్యాల ప్రస్తావన తెచ్చాడు. మనము కూడ ఈ గ్రంథములో ఇంతవరకు దయ్యాలను,
దేవతలను, క్షుద్రదేవతలను, దేవతలవలె నటించు వారి విషయములు ఎన్నో తెలుసు కొన్నాము. ఎవరు ఉన్నాయనినా,
ఎవరు లేవనినా దయ్యాలు ఉన్నది నూటికి నూరుపాళ్ళు నిజమని, ఎన్నో అనుభవ సంఘటనల ద్వారా తెలిసింది.
దయ్యాలున్నాయి అను వారికి దయ్యముల భయము కూడ ఉంటుంది. అందువలన వాటికి వ్యతిరేఖముగా మాట్లాడరు,
వ్యతిరేఖమైన పనులు చేయరు. దయ్యాలులేవు అను వారికి మాత్రము వాటి భయముండదు. ఉంటే కదా భయపడవలసినది
అనే ధైర్యముతో ఉంటారు. అటువంటివారు అవి లేవు అను ధైర్యముతో దయ్యాలకు వ్యతిరేఖమైన మాటలు మాట్లాడడము,
వ్యతిరేఖమైన పనులు చేయడము జరుగుతుంది. కొన్ని దయ్యాల మనస్తత్వము గొప్ప నీతి నిజాయితీగా ఉండును.
అటువంటి దయ్యాలు ఎవరి జోలికిరావు, ఎవరికి హాని చేయవు. కానీ వారిని ఎవరైనా రెచ్చగొట్టినా, దూషించినా,
హేళనగా మాట్లాడినా, తమ విషయములను బయటికి తెలియునట్లు చేసినా వారిమీద కక్షసాధింపునకు దిగుదురు.
అటువంటపుడు కొన్ని దయ్యములు కక్షసాధింపేకాక, ఏకంగా ప్రాణము తీయునవి కూడ కలవు. భూమిమీద అటువంటి
సంఘటనలు ఎన్నో జరిగాయి. పాము పగపట్టితే కక్షసాధింపునకు 12 సంవత్సరములైనా జ్ఞప్తి పెట్టుకొని అవకాశము
కొరకు కాచుకొని ఉండును. అనుకొన్న మనిషిని చంపేంతవరకు ఆహారమును కూడ ముట్టదు.
పాము పగలాగ కొంతమంది దయ్యముల పగ ఉండుననుటకు కొన్ని సంఘటనలు గలవు. ఉదాహరణకు
చంద్రముఖి సినిమాను తీసుకొందాము. చంద్రముఖి సినిమాలో ఉన్న కథ తమిళనాడులో యదార్థముగా జరిగిన
విషయమేనని వార్తలలో చూచాను. తమిళనాడులో ఊరుపేరును చూచాను గానీ జ్ఞాపకము లేదు. ఆ ఊరిలో
పాతబంగ్లా ఉండడము, దానిలో ఎవరూ నివసించక పోవడము, ఆ ఇంటిలో ఎవరైన ఉంటే సంగీత శబ్దము వినిపించడము,
వింత సంఘటనలు జరగడము అన్నియు వాస్తవముగానున్న విషయములే. ఆ వాస్తవ విషయమును ఆధారము
చేసుకొని ఒక సినిమాను తీయాలని అనుకున్నారు. తమిళనాడు లో ఉన్న ఇల్లూ వాస్తవమే, చంద్రముఖీ వాస్తవమే.
దాని తర్వాత చంద్రముఖిని ఇంటినుండి తరిమివేసిన కథ వాస్తవము కాదు. సినిమాకొరకు వాస్తవ చరిత్రను మధ్యనుండి
జరుగని చరిత్రను జరిగినట్లు సినిమా తీసారు. మొదట తమిళములో తీసిన సినిమాను తెలుగులోనికి డబ్బింగ్ చేశారు.
చంద్రముఖి పేరుతో తీసిన ఒకే యాక్టర్లున్న సినిమా అటు తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఆడడము
జరిగినది. మొదట చంద్రముఖి సినిమా తీయకముందు చంద్రముఖి దయ్యానికి ఆ విషయము తెలియదు. సినిమా
తీసిన తర్వాత ఆ సినిమా బయట ప్రదర్శించుచున్నప్పుడు తన సినిమాను గురించి ఆమెకు తెలిసింది. ఆమె కూడ ఆ
సినిమాను చూచింది. ఆ సినిమాలో మాంత్రికుడు (భూతవైద్యుడు) మరియు మానసిక వైద్యుడు ఇద్దరు కలిసి తెలివిగా
మోసము చేసి తనను ఇంటినుండి తరిమివేసినట్లు చిత్రించడము చంద్రముఖికి కోపము వచ్చింది. రెండు మూడు
వందల సంవత్సరములనుండి స్తబ్దతగా ఎవరిజోలికి పోకుండ ఉన్న నన్ను ఇలా చిత్రించుతారా? అని ఆమెకు కోపము
రావడము జరిగినది. సినిమాలో నటించి చూపించిన వారిమీద తన కోపమును తీర్చుకోవాలనుకొన్నది.
ఆధ్యాత్మిక శ్రద్ధ కల్గి, జ్ఞానసముపార్జనలోనున్న రజనీకాంత్ ఆ సినిమాలో ముఖ్యపాత్రను పోషించడము వలన
చంద్రముఖి రజనీకాంత్ను చూస్తూనే వెనకడుగు వేసింది. అంతేకాక ఆయనతో కలిసి నటించిన ఎవరి మీదకు
వచ్చుటకు చంద్రముఖికి ధైర్యము లేకపోయింది. దానికి కారణము దైవజ్ఞానము మీద ఆమెకున్న గౌరవము అలాంటిది.
చంద్రముఖి దయ్యముగా మారి, కాలము గడుపుచున్న ఆమె దేవునిపట్ల విధేయురాలై జ్ఞానజిజ్ఞాసకల్గియున్నది. అందువలన
రజనీకాంత్ను గానీ, ఆయన సహ నటులనుగానీ ఏమి అనకుండ ఊరకుండిపోయింది. తమిళములో తీసిన సినిమాను
తెలుగులోనికి డబ్బింగ్ చేసినట్లు, కన్నడములోనికి డబ్బింగ్ చేసుకొని ఉంటే బాగుండేది. కన్నడవారు అలా కాకుండ
అదే కథను 'ఆప్తమిత్ర' అను పేరు పెట్టి సినిమాను తీశారు. దానిలో నటీనటులందరు కన్నడవారే. కన్నడభాషలో
విష్ణువర్ధన్, సౌందర్య ముఖ్యపాత్రలు పోషించారు. ఆ విషయము తెలుసుకొన్న చంద్రముఖి, కోపముతో కర్నాటక
రాష్ట్రానికి పోయింది. అక్కడ సమయము చూచి ముఖ్యపాత్రలు చేసిన విష్ణువర్ధన్ను, సౌందర్యను చంపివేసింది.
సౌందర్యను హెలిక్యాప్టర్ ప్రమాదములో చంపివేసింది. అలాగే విష్ణువర్ధన్ను చంపింది. తనను హింసించి, మోసము
చేసి పారద్రోలినట్లు సినిమాలో చూపడము, చంద్రముఖిని అవమానపరచి నట్లయినది. అందువలన ఆమెకు కోపము
వచ్చి వారిమీద కసి తీర్చుకొన్నది. 'ఆప్తమిత్ర' సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన విష్ణువర్ధన్కు, సౌందర్యకు
రజనీకాంత్వలె దైవజ్ఞానము మీద శ్రద్దగానీ, జిజ్ఞాసగానీ లేవు. చంద్రముఖిని ఆపగలిగిన దైవజ్ఞానము వారివద్దలేని
దానివలన, ఆమె కోపమునకు సౌందర్య, విష్ణువర్ధన్ ఇద్దరు బలియైపోయారు.
వారిరువురు అర్ధాంతరంగా చనిపోవడము వలన తమిళములో ఆ సినిమాలో నటించిన రజనీకాంత్ కొందరి
జ్యోతిష్యుల వలన చంద్రముఖి చేతనే వారిరువురు చనిపోయినట్లు తెలుసుకొన్నాడు. ఆ విషయమును తెలుసుకొన్న
తర్వాత రజనీకాంత్ కూడ, చంద్రముఖి వలన ముప్పు పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్పడము వలన, ఆయన ఆలోచనలో
పడ్డాడు. కొంతమంది పండితులతో కలిసి చర్చించిన తర్వాత చంద్రముఖి నుండి వచ్చు ప్రమాదమును తప్పించుకొనుటకు
రజనీకాంత్ “మృత్యుంజయ యజ్ఞము” చేయవలసి ఉంటుందని పండితులు అభిప్రాయమును వ్యక్తము చేశారు. వారి
మాటలు విన్న తర్వాత రజనీకాంత్ గారు డబ్బును ఖర్చుపెట్టి మృత్యుంజయ యజ్ఞమును చేయించారు. చంద్రముఖి,
రజనీకాంత్ జోలికి రాకున్నా పండితులు అనవసరమైన భయమును ఆయనకు కల్పించి యజ్ఞమును చేయించారు.
కర్నాటకలో ముఖ్యపాత్రలు చేసి తనను కించపరిచారని, దైవజ్ఞానము లేని ఇద్దరిని చంపిన తర్వాత అదే కథను మరొక
భాషలో క్రొత్తగా తీయాలని ప్రయత్నించి నాయిక పాత్రను పోషించుటకు ఒక యువతిని ఎంచుకొని ఆమె చేత చంద్రముఖి
పాత్రను రిహార్సల్ చేయిస్తున్న సమయములో ఆ యువతికి చంద్రముఖి పూనకము వచ్చి నానా హంగామ చేసిందట.
ఆ యువతి అలా ప్రవర్తించడములో సినిమాను తీయాలనుకొన్న వారికి కొంత అనుమానము వచ్చి ఆ సినిమాను
తయారు చేయకుండ విరమించుకొన్నారట. యువతికి పూనకము వచ్చినది, విష్ణువర్థన్ చనిపోయింది, రజనీకాంత్
మృత్యుంజయ యజ్ఞము చేయించినది తమిళనాడులో చంద్రముఖి స్వంత ఇంటి ఫోటో విషయములన్నియు ఒక
దినము 'సాక్షి' దినపత్రికలో చూచినట్లు నాకు జ్ఞప్తికి ఉన్నది.
చంద్రముఖి సినిమా విషయమునంతటిని వివరించుకొని చూస్తే తెలియునదేమనగా! తమను కించపరిస్తే,
కొన్ని సూక్ష్మములు పామువలె పగపట్టి సాధిస్తాయని అర్థమగుచున్నది. దయ్యాల వలన ఎన్నో చావు బ్రతుకు సమస్యలు
ఏర్పడుచున్ననూ వాటి ఉనికిని గ్రహించలేని వారు ఎంత చదువు చదివినా గ్రుడ్డివారితో సమానము కాదా! ఎవడైనా
దయ్యాలున్నాయి అంటూనే వానిని అమాయకుని క్రిందకు జమకట్టి మాట్లాడు వారిని మేము ఎవరి క్రింద జమకట్టాలి?
పెద్ద చదువు చదువుకొన్నంత మాత్రమున, మేము విజ్ఞానులము అని పేరుపెట్టుకొన్నంత మాత్రమున తమ చదువు
కొంతేనని, తమ విజ్ఞానము విజ్ఞానముకాదని తెలియని వారిని అమాయకులలోకెల్ల అమాయకులని చెప్పవచ్చును.
భూమిమీద ఉన్న చదువులన్ని నాలుగుశాస్త్రములకు సంబంధించినవే. ప్రాధమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయముల
వరకు వాటిలో బోధింపబడు విద్యలన్నిటిని కలిపి చూస్తే, చివరకు కనిపించేవి నాలుగు శాస్త్రములే. గణితశాస్త్రము,
ఖగోళశాస్త్రము, రసాయనికశాస్త్రము, భౌతికశాస్త్రమును మినహా మిగత ఏ శాస్త్రములు ఏ బోధనాలయములలోను
కనిపించవు. ఈ నాలుగు శాస్త్రములు మనిషికి స్థూలముగా కనిపిస్తున్నవి. కావున ఈ నాలుగు శాస్త్రములు మనిషికి
స్థూలదృష్టిని ఇచ్చి, స్థూల భావములను గ్రహించుశక్తి నిచ్చుచున్నవి. అందువలన సూక్ష్మముగానున్న దయ్యములను,
దేవతలను, చదువులో ఏ డిగ్రీ పొందినవాడుగానీ తెలియ లేకున్నాడు. సూక్ష్మముగానున్న దయ్యాలను, దేవతలను వారి
జీవిత విధానాలను గ్రహించాలంటే మనిషికి, సూక్ష్మదృష్టి అనబడు జ్ఞానదృష్టి అవసరము. జ్ఞానదృష్టి అను పదము ఒకే
ఒక బ్రహ్మవిద్యాశాస్త్రములో మాత్రము కనిపిస్తున్నది. కొద్దిగ అయినా ఆరవశాస్త్రమైన రాజవిద్యా శాస్త్రము, లేక
ధర్మశాస్త్రము అనుబడు బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలియనిదే సూక్ష్మములను గురించి ఎవనికి ఏమాత్రము తెలియదు.
అందువలన నేటికాలములో ఎంత చదువు చదివినా, ఎంత విజ్ఞానమును సంపాదించు కొనినా, ఎన్ని డిగ్రీలు పేరు
చివర తగిలించుకొనినా, వారికి దయ్యములను గురించికానీ, దయ్యముల కోవకు చెందిన దేవతలు, దేవుళ్ళను గురించిగానీ
ఏమాత్రము తెలియదు. అటువంటపుడు దేవతలకు, దయ్యములకు కూడ అతీతమైన, అగమ్యగోచరుడైన దేవుడు
తెలియునా?
విశ్వవిద్యాలయాలలో బోధించు నాలుగుశాస్త్రములను చదివి బాహ్యజ్ఞానమును సంపాదించుకొనిన శాస్త్రజ్ఞులకే
దయ్యముల, దేవతల, దేవుళ్ళ విషయము తెలియనిది, ఏ శాస్త్రముకానటువంటి పురాణములను, వేదములను చదివిన
వారికి ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును. వేద, పురాణములను చదివినవారు, దయ్యములున్నాయను గ్రుడ్డినమ్మకముతో
వాటిని గుర్తించి శాస్త్రబద్దముగాని, అబద్ద విషయములు చెప్పుట వలన బాహ్యశాస్త్రములను చదివినవారు ఆ విషయములను
ఖండించుచుందురు. అంతమాత్రమున వాస్తవముగా దయ్యాలులేవు, దేవుళ్ళు లేరు అనడము పొరపాటు. ఇంతవరకు
కొన్ని రకముల సంఘటనలకు సంబంధించిన విషయములను చెప్పుకొన్నాము. చివరిలో చంద్రముఖిని గురించి
చెప్పుకొన్నాము. చంద్రముఖి దైవజ్ఞానము యొక్క జిజ్ఞాసకల్గిన మరియు కొంత దైవజ్ఞానముగల రజనీకాంత్ను
గౌరవించడము. జ్ఞానము లేనివారిని ఏదో ఒక రూపములో చంపివేసినట్లు తెలుసుకొన్నాము. దీనితో దయ్యములు
అంటే అన్నీ చెడు చేయునవే అని అనుకోకుండ మంచి చేయునవి, జ్ఞానమునకు విలువనిచ్చునవి, దైవజ్ఞానమును
గౌరవించునవి మరియు పూజ్యముగ చూచునవి, దేవుని సేవ చేయునవి, దేవుని సేవ చేయువారికి రక్షణనిచ్చునవి
కలవని తెలియుచున్నది.
చంద్రముఖి, జ్ఞానమునకు విలువనిచ్చి, జ్ఞానములేని వారిని చంపినది కదా! అట్లే జ్ఞాన జిజ్ఞాసకల్గి, జ్ఞాన
సేవను దైవసేవగా భావించి చేయు సాధారణ వ్యక్తిని చంద్రముఖిలాగ జ్ఞానమునకు విలువనిచ్చు ఒక సూక్ష్మము ఎలా
చావునుండి రక్షించిందో జరిగిన ఒక సంఘటననుబట్టి చూస్తే తెలుస్తుంది. మావద్దకు వచ్చిన ఒక వ్యక్తి దగ్గర
ప్రత్యేకత లేదు. దైవజ్ఞానము తెలియని సాధారణ వ్యక్తి మరియు అన్ని దుర్వ్యసనములున్న వ్యక్తి. తన సహచరులు
నన్ను గురించి గొప్పగా చెప్పి, వారి వెంట అతనిని తీసుకొనివచ్చారు. అలా వచ్చిన వ్యక్తికి “ఇక్కడ ఏ ప్రపంచ కోర్కెలు
నెరవేర్చబడవు. కేవలము దైవజ్ఞానము మాత్రము చెప్పబడుతుంది. నీకు దైవజ్ఞానము మీద ఆసక్తియుంటే అప్పుడప్పుడు
ఇక్కడికి వచ్చి జ్ఞానము తెలుసుకోవచ్చును. అలాకాకుండ నావద్దకు వస్తే మీకు ఏదో మంచి జరుగుతుందని అనుకోవద్దండి.
నావద్దకు వస్తే ప్రపంచపరముగా ఏ మంచి జరుగదు" అని చెప్పాను. నేను చెప్పిన మాటలు అతనికి నచ్చి రెండు
మూడుమార్లు నావద్దకు తన సహచరులతోపాటు వచ్చాడు. ఆయన సహచరులు, ముందునుంచే నావద్ద దైవజ్ఞానమును
తెలుసుకొనుచు నాలోని జ్ఞానమును బాగా విశ్వసించినవారు. అటువంటి అనుచరుల వలన నా జ్ఞానము యొక్క
విలువ గొప్పదని తెలిసి, నావద్దకు రావడము వలన అతనికి ప్రపంచ జ్ఞానముకంటే, దైవజ్ఞానము గొప్పదని తెలిసినది.
అప్పటినుండి దైవజ్ఞానము మీద ఆసక్తిని పెంచుకొని, ప్రపంచ జ్ఞానముమీద ఆసక్తిని తగ్గించుకొన్నాడు. అట్లు
చేయుట వలన తనలోని త్రాగుడు మొదలగు దుర్వ్యసనములన్ని అతనికి దూరమైపోయాయి.
కర్నూల్ జిల్లా డోన్ సమీపములోనున్న జలదుర్గము గ్రామములో విశ్వనాథ్ అను వైశ్యకుటుంబము, నావద్దకు
వచ్చి జ్ఞానమును తెలుసుకొనే వారు. విశ్వనాథుప్తకు అదే గ్రామమునకు చెందిన శేఖర్ అను పెళ్ళికాని యువకుడు
పరిచయము. ఆ పరిచముతోనే విశ్వనాథుప్త అతనికి తాను తెలుసుకొన్న జ్ఞానమును చెప్పి, నావద్దకు తీసుకురావడము
జరిగినది. అలా వచ్చిన వ్యక్తియే పైన నేను చెప్పిన దుర్వ్యసనములు మానుకొన్న వ్యక్తి. తర్వాత కొంతకాలానికి నా
సమక్షములోనే పెళ్ళి కూడ చేసుకొన్నాడు. అతని వృత్తి లారీని నడుపు డ్రైవర్. అతను డ్రైవర్ పని చేస్తూనే వీలు
దొరికినపుడు జ్ఞానమును తెలుసుకొనేవాడు. తాను జ్ఞానమును తెలుసుకొని దానిని ఇతరులకు తెలుపుట దేవునిపని
చేసినట్లని నేను చెప్పిన దానివలన అతను డ్రైవర్గా పోయినపుడు కూడ తన లారీలో నా రచనలలోని కొన్ని గ్రంథములును
ఉంచుకొని పోయేవాడు. వీలు దొరికినపుడు ఇతరులకు జ్ఞానమును చెప్పేవాడు. వినేవారు ఆసక్తిగ కనిపిస్తే వారికి
తనవద్దనున్న గ్రంథములను ఉచితముగా ఇచ్చేవాడు. అలా అతని వృత్తి డ్రైవర్కాగా, అతని ప్రవృత్తి జ్ఞానమును
ఇతరులకు అందించడము అని చెప్పవచ్చును. నావద్ద జ్ఞానమును తెలుసుకొన్నవారంత ముఖము మీద ధరించు
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను అతను నిత్యము ధరించెడివాడు. ఆ విధముగ 24 గంటలు అతని ముఖము మీద
కాల, కర్మచక్రములు కనబడేవి.
ఈ విధముగ కొంతకాలము తాను జ్ఞానమును తెలుసుకొంటూ ఇతరులకు తెలుపుచు, జ్ఞానసేవ చేయుచున్న
శేఖర్ చివరకు మనము పూజించే దేవతలు, దేవుళ్ళు కూడ దేవుని చేత సృష్ఠింపబడినవారేనని, మనుషులను, దేవతలను,
దేవుళ్ళను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడని, దేవునికి రూప,నామ,క్రియలు లేవని, ఆకారముగానీ,
పేరుగానీ, పనిగానీ ఉన్నవాడు ఎవడూ దేవుడుకాదని తెలుసుకొన్నాడు. భగవద్గీతలో భక్తియోగమందు 10వ శ్లోకమున
“మదర్థమపి కర్మాణి” నా కొరకు పనిచేయు అను సూత్రము ప్రకారము దైవజ్ఞానమే తన ధ్యేయముగా, ప్రవృత్తిగా
చేయుచుండెను. అలా మనోభావములో జ్ఞానమునకు గొప్ప స్థానమిచ్చిన శేఖర్ను చంద్రముఖిలాంటి ఒక సూక్ష్మము
చూచినది. దైవ జ్ఞానమును శాస్త్రబద్దముగా తెలుసుకొని అలాగే ఆచరించుచు దైవ భావమున్న వ్యక్తులను గౌరవించు
స్వభావమున్న చంద్రముఖిలాంటి సూక్ష్మము, అతను చేయు వృత్తి లారీని నడపడము కావున అతనికి రక్షణగా అతని
వెంట ఉండాలనుకొన్నది. అప్పటినుండి అతను లారీకిపోతే ఆ సూక్ష్మము కూడ అతని వెంటపోయేది. అతను
ఇంటిదగ్గర ఉంటే ఇంటి దగ్గరే ఉండేది.
దేవతలను పుట్టించినది, మనుషులను పుట్టించినది ఒక్క దేవుడేనని తెలిసిన తర్వాత, శేఖర్కు మనుషులు
దేవతలను పూజించడము, దేవున్ని గుర్తించలేకపోవడము సరిపోయేది కాదు. ఆ విధముగ ఉన్నపుడు ఒకరోజు
బెంగుళూరుకు వెళ్ళే మార్గమైన పామిడి ప్రాంతములో రోడ్డుప్రక్కనే వేపచెట్టుకు తాయమ్మ పేరుతో పూజచేసి చెట్టుకు
పసుపు చీరకట్టియుండడము చూచాడు. రాత్రిపూట రేడియేటరు నీళ్ళు పోసేదానికి రోడ్డుప్రక్కన లారీని నిలబెట్టినపుడు,
ప్రక్కనే చీరకట్టియున్న చెట్టును చూచాడు. జ్ఞానమును తెలుసుకొన్న తర్వాత దేవతలంటే చాలా చులకన భావము
అతనిలో ఏర్పడింది. కావున చెట్టుకు చీర ఎందుకు? బండి తుడిచే దానికి పనికి వస్తుందని అనుకొని చెట్టుకున్న
చీరను తెచ్చుకొన్నాడు. ఆ సమయములో అతని నుదుటిమీద కాల, కర్మచక్రములను పెట్టుకొనియున్నాడు. రాత్రి
ఒంటిగంట సమయములో అందరు నిద్రించుచుండుట వలన చెట్టుకున్న చీరను తీయడము మనుషులు ఎవరూ
చూడలేదు. కానీ ఆ చెట్టుమీదనే ఉన్న తాయమ్మ చూచింది. అతని నుదటిమీద కాల, కర్మచక్రముల గుర్తుండడము
వలన, అది ప్రకాశిస్తున్నట్లు కనిపించడము వలన, తాయమ్మ అతనిని ఏమి చేయలేక పోయింది. అప్పటినుండి ఏదో
ఒకరకముగా సమయము దొరికినప్పుడు శేఖర్ను ఇబ్బంది పెట్టాలనుకొన్నది. అతను బెంగుళూరు ఏరియాకు
పోయినప్పుడల్లా అతని మీద తాయమ్మ కోపముగా ఉండేది. తాయమ్మ చెట్టుకుచుట్టిన చీరను శేఖర్ తెచ్చుకొన్న
తర్వాత, బహుశ నెలరోజులకు తిరిగి బెంగుళూరికి పోయాడు. బెంగుళూరులో అన్లోడ్ చేసి, ఖాళీలారీని తీసుకొని
వచ్చేటప్పుడు బెంగుళూర్ చివర యలహంక ప్రాంతము దగ్గర రోడ్డు సైడుకు లారీని ఆపాడు. అప్పుడు మధ్యాహ్నము
ఒంటిగంట సమయము అయిన దానివలన భోజనమునకు ఆపాడు. అక్కడే రోడ్డుప్రక్కన మొబైలెూటల్ ఉంటే
అక్కడికిపోయి క్లీనర్ రమేష్, డ్రైవర్ శేఖర్ ఇద్దరు భోంచేశారు. వారితో పాటు చంద్రముఖిలాంటి సూక్ష్మము కూడ
ఉండేది. రోడ్డుమీద అక్కడే స్పీడ్ బ్రేకర్ ఉన్నది. అంతేకాక రోడ్డు బెంగుళూరు వైపు పూర్తి తగ్గుగా ఉండేది. డౌన్లో
స్పీడ్గా వచ్చిన వాహనములన్ని స్పీడ్ బ్రేకర్ ఉన్నదానివలన బ్రేక్వేసి, స్లో చేసుకొని బ్రేకర్ దాటుకొనిపోతున్నారు. అంతలో
బెంగుళూరు వైపు పోయే లారీ డౌన్లో స్పీడ్గా వచ్చి ముందర బ్రేకర్ ఉన్నదానివలన బ్రేక్ వేయడము జరిగినది.
అప్పుడు లారీబ్రేక్ పనిచేయలేదు. ముందర స్పీడ్ బ్రేకర్ దగ్గర కొన్ని మోటర్ సైకిళ్ళు, రెండు కార్లు స్లో
అవుతున్నవి. లారీ బ్రేకపడక పోవడము వలన స్పీడ్గా వస్తున్నది. లారీ కొద్దిగ ముందుకు వస్తే రెండు కార్లు, కొన్ని
మోటర్ సైకిళ్ళు లారీక్రింద నలిగి పోతాయి. అటువంటి సమయములో లారీడ్రైవర్ సమయస్పూర్తితో, లారీని ఎడమ
చేతివైపు రోడ్డుకు అడ్డముగా ప్రక్కకు త్రిప్పడము వలన, ముందర ఉన్న కార్లను మోటర్సైకిళ్ళను లారీ గుద్దలేదు.
స్పీడ్లో ఉన్న లారీని అడ్డముగా ప్రక్కకు త్రిప్పడము వలన లారీ స్పీడ్గావెళ్ళి, రోడ్డు ప్రక్కన ఉన్న తొమ్మిది అడుగుల
ప్రహరిగోడను గుద్దింది. టాటాకంపెనీ లారీ ప్రహారి గోడను గ్రుద్దడము వలన లారీక్యాబిన్ వెడల్పు గోడపడిపోయింది.
గోడ పడిపోగా, క్రింది భాగములో పడిపోకుండ మిగిలిన అడుగుఎత్తు గోడకు లారీ ముందర చక్రాలు ఆనుకొని, లారీ
నిలిచిపోయినది. పైగోడ అంతా, లారీ వెడల్పు ప్రక్కనున్న తోటలోపలి పొలములోనికి పడిపోయింది. ఆ గోడ
సిమెంట్ పెళ్ళలతో కట్టినది కావున లారీ గుద్దేటప్పటికి ఒక్కసారి ప్రక్కకు వాలి పోయినది. దాదాపు 9 ఇంచులు
వెడల్పు, 18 ఇంచుల పొడవున్న, పెద్ద ఇటుకతో కట్టిన గోడ ప్రక్క పొలములోనికి దాదాపు 10 అడుగుల దూరము
వరకు పడియున్నది. ఈ విషయమును అంత ప్రాముఖ్యముగా చెప్పవలసిన పనేముంది అని మీరు అనుకోవచ్చును.
ఎందుకు చెప్పాను అనగా! ఇక్కడే ఒక ప్రమాద సంఘటన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది. అంత
ఆశ్చర్యపడునది ప్రమాదమైనది ఏమనగా!
శేఖర్, రమేష్ ఇద్దరూ గోడను అనుకొనియున్న మొబైల్ హాటల్ దగ్గర నిలబడి భోంచేసి ఇద్దరూ తమ లారీవైపు
రావాలని బయలుదేరారు. రమేష్ రోడ్డు దగ్గరకొచ్చాడు, శేఖర్, రమేష్ వెంట రెండడుగులు వచ్చి ఇంకా కొన్ని నీళ్ళు
తాగివస్తామని గోడవైపువున్న డబ్బాలాంటి నీళ్ళ పాత్రవైపు పోయాడు. నీళ్ళు త్రాగి తిరుగుతున్న సమయములో, లారీ
రోడ్డుకు అడ్డము తిరిగి గోడవైపు రావడమును చూచాడు. లారీ ఈ ప్రక్కకు ఎందుకు వస్తావుంది? అని అనుకొని
తేరుకొనేలోపల, లారీ స్పీడ్గా వచ్చి గోడను గుద్దింది. శేఖరు ప్రక్కకు రావాలని ప్రయత్నము చేయకముందే లారీ
గుద్దడము జరిగినది. ఆ విధముగా శేఖర్కు ఊహించని ప్రమాదము జరిగింది. ఆ ప్రమాదములో ఇటు లారీకి అటు
గోడకు మధ్యలో శేఖర్ ఉండిపోయాడు. ఆ విధముగా జరిగిన ప్రమాదములో శేఖర్ గోడకు లారీకి మధ్యలో
నలిగిపోయి, అతని ఆకారము కూడ మిగలకుండ పోవాలి. కానీ అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన వింత ఏమిటంటే,
శేఖర్ గోడతోపాటు పొలములో పడినాడు. అదియు గోడమీద కూర్చున్నవాడు గోడ చివరిలో పడినట్లు పొలములో
గోడంతా పది అడుగుల దూరము వరకు పడియుంది. పది అడుగుల తర్వాత శేఖర్ పడివున్నాడు. శేఖర్ శరీరమునకు
ఎటువంటి దెబ్బతగలలేదు, కానీ కుడికాలు మీద సిమెంట్ ఇటుకలు పడివున్నాయి. ఎడమ కాలుమీద ఒక్క ఇటుక
కూడ పడలేదు. శరీరమంతా ఎక్కడగానీ, ఎడమ కాలుకుగానీ దెబ్బ తగలకుండ పోయి. కుడికాలు క్రింద పాదము పై
భాగమున కాలిమీద సిమెంట్ ఇటుకలు పడిన దానివలన కాలుకు పిక్క కండలు తెగి ఎముక విరిగింది. ఈ విధముగ
ఒక్క కుడికాలుకు మాత్రము దెబ్బ తగిలి ఎముక విరిగింది.
తొమ్మిది (9) అడుగుల ఎత్తు గోడకు అనుకొని మనిషి ఉండగా, ఆ మనిషి ఐదున్నర అడుగుల ఎత్తు మాత్రమే
ఉండగా, మనిషి ఎత్తుకంటే పైన దాదాపు మూడున్నర అడుగుల గోడ ఉండగా, లారీ తగిలితే మనిషి ఆకారము కూడ
మిగలకుండ పోవాలి. కానీ ఒక కాలికి మాత్రము దెబ్బ తగిలి, మిగత శరీరములో ఎక్కడా తగలకుండుటకు కారణము
ఏమిటని కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలావుంది చూడండి. లారీ బ్రేక్ ఫెయిల్ అయి గోడవైపు
దూసుకొచ్చినపుడు, శేఖర్తో పాటు అతని ప్రక్కనే అతనికి రక్షణనివ్వాలనుకొన్న సూక్ష్మము కూడ నిలచి ఉండెను.
శేఖర్ అడుగు ప్రక్కకు వేయకముందే, లారీ అతనిని గుద్దివేయునని సూక్ష్మము గ్రహించింది. అతనిని ఆ ప్రమాదమునుండి
రక్షించాలనుకొన్నది. అంతలో లారీ శేఖర్కు అర్థఅడుగు దూరము వరకు సమీపించింది. అప్పుడు సూక్ష్మము శేఖర్ను
గాలిలోనికి పైకి గోడ అంచువరకు ఎత్తింది. అంతలోపల అరక్షణములో లారీ గోడను గుద్దింది. అప్పుడు శేఖర్ గోడ
అంచువరకు పైకి పోయిన దానివలన గోడకు, లారీకి మధ్యలో అతను నలిగిపోలేదు. రెండు సెకండ్లు ఆలస్యముగా
లారీ తగిలివుంటే, శేఖర్ను సూక్ష్మము ఇంకా పైకి లేపి ఉండెడిది. అలా ఇంకా కొద్దిగ పైకిపోవు అవకాశముంటే
గోడకు కొంత దూరముగా పడేవాడు. కుడికాలు కూడ గాయపడేది కాదు. అక్కడికే సూక్ష్మము, శేఖర్ను చాలావరకు
రక్షించగలిగింది. లారీ ప్రక్కకు రావడము రమేష్ కూడ గమనించి, శేఖర్వైపు చూచేలోపల శేఖర్ కనిపించకుండ లారీ
అడ్డమైపోయింది. అంతలోనే గోడను గ్రుద్దడము జరిగినది. ఇక శేఖర్రోడు అని రమేష్ అనుకొని ఆతృతగా అటువైపు
పోయి చూచాడు. గోడ చివరిలో పొలములో పడియున్న శేఖర్ దగ్గరకు పోయి కుడికాలు మీద పడిన ఇటుకలను
తీసివేసి, శేఖర్ను రోడ్డు ప్రక్కకు ఇతరుల సహాయముతో తీసుకువచ్చారు. ఆ సమయములో శేఖర్ లారీక్రింద పడక
పొలములో ఎట్లు పడినాడను యోచనకూడ రమేష్కు రాలేదు. వెంటనే అంబులెన్స్ వ్యాన్ వస్తే, ఆసుపత్రికి తీసుకుపోవడము
జరిగినది.
శేఖర్ను అతని వెంటనున్న సూక్ష్మము రక్షించగలిగింది అని చెప్పాముగా! ఇక శేఖర్మీద కోపముగానున్న
తాయమ్మ ఏమి చేసిందో చూద్దాము. స్పీడ్ బ్రేకర్ వరకు లారీ రాకముందు, తాయమ్మ బ్రేక్ పైపును విరిగిపోవునట్లు
చేసింది. తర్వాత క్యాబిన్లోనికి వచ్చి డ్రైవర్ దగ్గర కూర్చుంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేస్తే, బ్రేక్ ఆయిల్ కారిపోవడము
వలన లారీకి బ్రేక్ పడలేదు. లారిడ్రైవర్ బ్రేక్ ఫెయిలైందను తత్తరపాటులో ఉన్నపుడు అతనికి తెలియకుండానే అతని
చేతులు ఎడమ ప్రక్కకు స్టీరింగ్ను లాగాయి. వెంటనే లారీ దిశ మారిపోయి, శేఖర్వైపు పోసాగింది. శేఖర్ మీద
కోపముతో తాయమ్మ, శేఖర్ను అతని శరీరమును కూడ మిగలకుండ చేయాలనుకొన్నది. కానీ ఆ సమయములో
శేఖర్ ముఖము మీద చక్రాలుండడము వలననూ, ప్రక్కనేవున్న సూక్ష్మము అతనిని ఒక్కసారిగ పైకి ఎత్తడము వలననూ
శేఖర్ బ్రతికి బట్టకట్టగలిగాడు. ఇక్కడ ఒక సూక్ష్మము చంపాలని చూస్తే, ఒక సూక్ష్మము బ్రతికించాలని చూచింది.
చివరకు శేఖరైవైపున్న సూక్ష్మమే ఆ పోరాటములో కొంత నెగ్గగలిగింది.
కొంతకాలము తర్వాత నావద్దకు వచ్చిన సూక్ష్మము ద్వార జరిగిన విషయమంతా నాకు తెలిసింది. కావున
ఇప్పుడు మీకు నేను చెప్పగలుగు చున్నాను. ఇక్కడ జరిగినదంతా గమనించితే, భూమిమీద అన్ని చెడు చేయు దయ్యాలేకాక,
మంచిని చేయునవి, జ్ఞానమును తెలుసుకొనునవి ఎన్నో గలవు. ఇంతవరకు దయ్యముల గురించి నాకు తెలిసిన కొన్ని
విషయము లను మాత్రము తెలియజేశాను. నేను దయ్యాలున్నాయా? అను పరిశోధన నిమిత్తము గడిచిన దాదాపు
ఒకటిన్నర లేక రెండు సంవత్సరముల కాలములో నేను చూచిన పదవవంతు విషయములను మాత్రమే ఇంతవరకు
తెలిపాను. ఇంతవరకు తెలిపిన విషయములన్నియు కేవలము దయ్యములకు సంబంధించిన సమాచారములే. మనకు
కనిపించని దయ్యములు ఒక్కటే కాదు. భూతములు కూడ ఉన్నవి. భూతములు అనుమాట దయ్యాలకు వర్తించదా?
అని ఎవరైనా అడిగితే దయ్యములు వేరు, భూతములు వేరు అని చెప్పవచ్చును. దయ్యములలాంటివే భూతములు,
భూతములలాంటివే దయ్యములు. అయినా వాటిని విడదీసి దయ్యములు, భూతములని వేరువేరుగా చెప్పవలసిన
అవసరమున్నది.
'భూతము' అంటే జీవుడు అని అర్థము. దయ్యము అంటే దేవుడు కానివాడు జీవుడు అని అర్థము. దయ్యము
అనినా భూతము అనినా జీవుడనియేగా అర్థము. అలాంటపుడు దయ్యాలు, భూతాలు వేరు వేరు అనడమేమిటి అని
ఎవరైనా అనవచ్చును. దానికి జవాబు ఏమనగా! మనుషులు అందరు ఒకే జాతి అయినా కొందరు పండితులుగా,
కొందరు పామరులు (చదువురానివారు) గా ఉండవచ్చును. ఒకే మనిషి జాతి అయిన మనుషులను, వారికున్న
పరిజ్ఞానమును బట్టి, విద్యా జ్ఞానమునుబట్టి ఏ విధముగ కొందరిని పండితులని, కొందరిని పామరులని విభజించి
పిలుస్తున్నామో, అదే విధముగా అందరూ జీవులే అయినా వారు చేయు కార్యములనుబట్టి, వారికున్న శక్తినిబట్టి దయ్యాలు,
భూతాలు అని రెండు విధముల విభజించవలసివచ్చినది. కొందరు తమకు తెలియకున్నా కొన్ని సందర్భములలో
మాట్లాడుచు దయ్యాలులేవు, భూతాలులేవు అనుచుందురు. ఇంకా దయ్యాలుగానీ, భూతాలుగానీ నన్ను ఏమి చేయలేవు
అనుచుందురు. కొన్ని చోట్ల నాకు దయ్యాలన్నా, భూతాలన్నా భయములేదు, నేను దయ్యాలకు భూతాలకు భయపడను
అని అంటుంటారు. ఈ విధముగా చాలామంది తమకు తెలియకుండినా దయ్యములు, భూతములు అను పదములను
అనడము వినుచుందుము. మనకు తెలియకున్నా వాటిని గురించి దేవుడే అవి వేరువేరు అని తెలియునట్లు మనచేత
అట్లు పలికించుచున్నాడు. ఈ విధముగా దయ్యాలు, భూతాలు అను రెండు రకములు జగతిలో కలవని తెలియుచున్నది.
ఇంతవరకు దయ్యముల విషయములను కొన్నిటిని చెప్పుకొన్నాము. భూతముల విషయములు చెప్పుకోవలసియున్నది.
భూతములను రెండు రకములుగా చెప్పుకోవచ్చును. ఒకటి మహా భూతములు, రెండు స్వల్ప భూతములని
వాటిని చెప్పవచ్చును. మహా భూతములనునవి ప్రకృతిలోని భాగములు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను
ప్రకృతిలోని ఐదు భాగములను ఐదు మహాభూతములుగా చెప్పవచ్చును. ఈ ఐదు అన్ని జీవరాసులకంటే గొప్పవి,
కావున వీటిని మహా భూతములని పిలుస్తున్నాము. స్వల్ప భూతములనునవి కూడ ఆకాశము, గాలి, అగ్ని, నీరు,
భూమి అను పేరుతోనే ఉన్నవి. బాగా అర్థము చేసుకొంటే, మహాభూతములనే స్వల్పభూతములను పేరుతో పిలుస్తున్నాము.
మహాభూతములలోని ఆకాశమునకు, స్వల్ప భూతములలోని ఆకాశమునకు ఏమీ తేడా ఉండదు. అలాగే
మహాభూతములనబడు గాలికి, స్వల్ప భూతములనబడు గాలికి ఏమీ వ్యత్యాసములేదు. మహా భూతమేదో స్వల్ప
భూతము కూడ అదియేనని చెప్పవచ్చును. స్వల్పభూతము మహా భూతము రెండు ఒకటే అయినపుడు స్వల్ప, మహా
అను వ్యత్యాసమును చూపుతూ స్వల్పభూతములని, మహాభూతములని పేర్లు ఎందుకు పెట్టారు? భూతములు రెండు
రకములని ఎందుకు చెప్పారని ఎవరైన అడుగవచ్చును. దానికి మా సమధానము ఏమనగా!
విశ్వము రెండు భాగములుగా ఉన్నది. ఒకటి ప్రపంచము, రెండు జగతి. ప్రపంచము, జగతి అను రెండిటిని
కలిపి చెప్పితే 'విశ్వము' అని చెప్పవచ్చును. విశ్వమును ఇంకా వివరముగా చెప్పుకొంటే, విశ్వములోని మొదటి
భాగము ప్రపంచము, రెండవ భాగము జగతి. “ప్ర" అనగా గొప్ప లేక ముఖ్యమైన అనియు “పంచము” అనగా ఐదు
అనియు చెప్పవచ్చును. గొప్పవైన ఐదింటిని ప్రపంచము అంటున్నాము. ఆ ఐదు ఏవి అనగా ఆకాశము, గాలి, అగ్ని,
నీరు, భూమి అని తెలియుచున్నది. ఈ ఐదు స్వయముగా పరమాత్మ సంకల్ప బలము చేత నిర్మింపబడినవి. అందువలన
ఈ ఐదుకు పరిమితిలేని అమితబలముండును. ఈ ఐదు, అన్ని జీవరాసులకంటే బలమైనవి, గొప్పవి కావున వీటిని
మహాభూతములు అని అంటున్నాము. ఈ ఐదు (పంచము) కలిసి కనిపించునదే ప్రపంచము. శరీరమున్న జీవరాసులు,
ప్రపంచము పుట్టిన తర్వాత పుట్టినవి. జీవరాసులు శరీరములను ధరించి పుట్టుచున్నవి మరియు మరణించుచున్నవి.
పుట్టుకను “జననము” అనియు, మరణించుటను “గతించుట” అనియు చెప్పవచ్చును. పుట్టుట, చచ్చుట కలిగిన
జీవసముదాయమునకు జనించుట, గతించుట ఉన్నదానివలన “జగతి” పేరుపెట్టి చెప్పుచున్నాము. జీవ సముదాయ
శరీరములున్న దానిని జగతి అనియు, పంచభూత సముదాయమును ప్రపంచము అనియు ప్రపంచమును, జగతిని
రెండిటిని కలిపి విశ్వము అనియు చెప్పవచ్చును. పంచభూతములను ప్రపంచము అనినా, ప్రపంచమును పంచభూతములు
అనినా రెండూ ఒకటే. ఇంతవరకు భూతములలో ఒక రకమైన మహాభూతములను గురించి తెలుసుకొన్నాము. ఇక
స్వల్పభూతములను గురించి తెలుసుకొందాము.
స్వల్ప, మహా అను పేరు తప్ప భూతములు అన్నీ ఒకటేనని చెప్పుకొన్నాము. అలాంటపుడు స్వల్ప అని పేరు
ఎందుకు పెట్టామనగా! మహాభూతములలో అన్నీ అఖండముగా ఉన్నవి. కానీ సకల జీవరాసులు శరీరములలో
స్వల్పభూతములు ఖండ ఖండములుగా ఉన్నవి. ఒక జీవుని శరీరములో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అన్ని
కొద్దికొద్దిగా ఉన్నవి. అనేక జీవరాసులు శరీరములలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనేక భాగములుగా
విభజింపబడి ఉన్నాయి. ఒక శరీరములో పంచ భూతములు ఏ నిష్పత్తిలో ఉన్నాయో వివరించుకొని చూస్తే, ఆకాశము
ఒక్కశాతము, గాలి రెండు శాతము, అగ్ని మూడు శాతము, నీరు అరవై తొమ్మిది శాతము, భూమి ఇరవైఐదుశాతము
గలవు. ఆకాశము 1, గాలి 2, అగ్ని 3, నీరు 69, భూమి 25 పాళ్ళు శరీరములో గలవని తెలియుచున్నది. ఈ
విధముగా శరీరములో పరిమిత భాగములుగా, పరిమిత శక్తికల్గియున్న ఐదు భూతములను పంచ స్వల్పభూతములని
అనుచున్నాము. జగతి మొత్తము జీవుళ్ళ శరీరములలోని పంచభూతములను కలిపితే కొద్దిమాత్రము తేడాతో అనగా
ఇంచుమించుగా బయటి మహా భూతములతో సమానముగా ఉన్నవి. వివరముగా చెప్పితే మహా భూతములు బయట
50.1%గా ఉండగా, శరీరములోని స్వల్ప భూతములు 49.9% గా ఉన్నవి. అందువలన ఇంచుమించుగా అని
చెప్పుకొన్నాము. ఇంతటితో శరీరములోపల స్వల్ప పంచభూతములు గలవని అందరికీ అర్థమై ఉంటుంది.
ఒక శరీరములోని జీవున్ని కూడ భూతమనియే అనవచ్చును. జీవుడు అనబడు భూతము పంచభూతములను
ఆశ్రయించుకొని శరీరములో మనగలుగుచున్నాడు. దీనినిబట్టి ఒక సజీవ శరీరములో మొత్తము ఆరు భూతములున్నవని
చెప్పవచ్చును. ఒకటి శరీరములో జీవించు జీవుడు కాగా, మిగత ఐదు భూతములు శరీరముగా నిర్మాణమై ఉన్నవి.
శరీరములో జీవునితోపాటు ఆత్మకూడ నివాసము చేయుచున్నది. జీవుని అంటిపెట్టుకొని ఉండునది ఆత్మ. ఆత్మ
లేకుండ జీవాత్మ ఎక్కడగానీ, ఎప్పుడుగానీ ఉండుట అసంభవము. ఆత్మ జీవునికి అధిపతిగా శరీరములో ఉన్నది. ఆత్మ
ఒక్క జీవునికే అధిపతికాక శరీరములోనున్న ఐదు స్వల్ప భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి కూడ
అధిపతిగా ఉన్నది. అనగా శరీరమంతటికి కూడ అధిపతిగా ఉన్నదని చెప్పవచ్చును. శరీరరూపములోనున్న ఐదు
స్వల్పభూతములు ఆత్మ ఆధీనములో ఉంటూ ఆత్మ ఆదేశించినట్లు నడుచుకొనును. అంతేకాక గొప్ప యోగీశ్వరులైన
వారు తమను ఆదేశించితే, వారు ఆత్మతో సమానమైన వారుగ గుర్తించి వారిమాటను శిరసా ఆచరిస్తాయి. యోగీశ్వరుల
మాటలను శరీరములోపలి స్వల్ప భూతములు మాత్రమే ఆలకించి ఆచరించును. కానీ బయటి మహాభూతములు
మాత్రము ఏ యోగీశ్వరుని మాటను లెక్కించవు. శరీరము బయటనున్న ఐదు మహాభూతములు, ఒక్క పరమాత్మ
ఆధీనములో మాత్రముండును. అందువలన పరమాత్మ మాటను తప్ప ఇతరుల మాటలను ఏమాత్రము ఆలకించవు.
స్వల్పభూతములు, మహాభూతములు రెండు ఒకటే అయినా స్వల్పభూతములు శరీరములోపల, మహాభూతములు
శరీరము బయట గలవు. స్వల్పభూతములు ఆత్మ ఆధీనములో ఉండగా, మహాభూతములు పరమాత్మ ఆధీనములో
గలవు. స్వల్పభూతములు ఆత్మమాట వినును, మహాభూతములు ఆత్మమాట వినవు. స్వల్పభూతములు యోగీశ్వరుల
మాటలకు గౌరవమిచ్చును, మహాభూతములు పరమాత్మను తప్ప ఎవరినీ గౌరవించవు. శరీరములోపలనున్న జీవున్ని
దయ్యము అనినట్లు, స్వల్ప భూతములను అట్లు దయ్యములతో జమకట్టకూడదు. స్వల్ప భూతముల శక్తి పరిమితము,
మహాభూతముల శక్తి అపరిమితము. ఈ విధముగా చెప్పుతూ పోతే స్వల్ప, మహాభూతములకు ఎన్నో తేడాలు గలవు.
శరీరములో నివశించుట వలన జీవున్ని కూడ భూతము అని చెప్పవచ్చును. బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో
జీవున్ని భూతము అని ఉచ్చరించారు. జీవున్ని మినహా భూతములను రెండు రకములుగా చెప్పవచ్చును. ఒకటి
మహాభూతములు, రెండు స్వల్పభూతములని చెప్పవచ్చును. దయ్యములను గురించి చెప్పిన వెనుక పేజీలలో లక్ష్మణ
మూర్తిని గురించి చెప్పినపుడు రోగరూపములోనున్న గాలి, నీరు శరీరములో నుండి మాట్లాడినట్లు చెప్పాము. అప్పుడు
మాట్లాడినది ఆ శరీరములోని స్వల్పభూతములని గుర్తించుకోవాలి. యోగుల మాటలకు గౌరవమిచ్చును అనినట్లు, ఆ
దినము స్వల్పభూతములైన గాలి, నీరు మా మాట వినడము జరిగినది. స్వల్పభూతములకు సంబంధించిన మరొక
యదార్థసంఘటను వివరించి, తర్వాత మహాభూతములను గురించి వివరిస్తాము. మనుషులు చేసుకొన్న పాపములను
అమలు చేయుటకు ప్రకృతి మహాభూతములుగా, స్వల్పభూతములుగా ఏర్పడినది. సామూహికముగా మనుషులనుగానీ,
ఇతర జీవరాసులనుగానీ బాధించుటకుగానీ, చంపుటకుగానీ మహా భూతములు విజృంభించుచున్నవి. ఒక మనిషి
పాపమును అనుభవింప జేయుటకుగానీ, అతనిని శరీరములోనే కృంగదీయుటకు గానీ, చంపుటకు గానీ స్వల్పభూతములు
శరీరములోనే చెలరేగుచున్నవి. సాముహికముగా మనుషుల పాపములను అమలు చేయుటకు మహాభూతములైన
భూమి చెలరేగి, భూకంపములను సృష్టించి ఎందరినో చంపడము, గాయపరచడము, అంగహీనులను చేయడము
జరుగుచున్నది. నీరు చెలరేగితే తుఫానులు, సునామీలను తెచ్చిపెట్టి భయంకరముగా బాధపెట్టడము, చంపడము
చేయుచున్నది, అగ్ని అనుకుంటే అగ్ని పర్వతాలను ప్రేలిపోవునట్లు చేసి, సూర్యరశ్మిలో వేడిని పెంచి మనుషులు తట్టుకోలేనంత
చేసి, మనుషులను సామూహికముగా చంపడము, బాధపెట్టడము చేయుచున్నది. గాలి అనుకుంటే తన బలమైన
గాలిని వేగముగా వీచునట్లు చేసి, దేనినైన కూల్చగలదు, గాలిలో ఎగిరి పోవునట్లు చేయగలదు. ఆకాశము కోపగిస్తే
వాతావరణములో ఎన్నో మార్పులు రాగలవు, వాతవరణము స్థంభించి పోగలదు. పైనున్న శాటిలైట్స్, ఖగోళలములోనున్న
గోళములన్నియు నిలిచిపోగలవు. ఒక్కొక్క మహా భూతము, తన అపారమైన శక్తితో, ఒక్క సమయములోనే వందలు,
వేలు,లక్షలు, కోట్లమందిని చంపగలదు.
ఇపుడు ప్రస్తుతము స్వల్పభూతముల విషయానికి వస్తాము. ఒక మనిషిలోని పాపమును వాడు మాత్రము
అనుభవించునట్లు చేయునవి స్వల్పభూతములు. మనిషిలో వచ్చు రోగములు, రుగ్మతలు మొదలగునవి అన్నియు
స్వల్పభూతముల వలన కలుగునవేనని చెప్పవచ్చును. స్వల్ప భూతముల అవగాహనకొరకు, అవి యోగుల మాటకు
ఎట్లు గౌరవమును ఇచ్చుచున్నవో తెలియుట కొరకు, ఒక యదార్థవిషయమును చెప్పుకొందాము. నావద్దకు వచ్చి,
దేవుని జ్ఞానమును తెలుసుకొను వారిలో ఒక ముస్లీమ్ కుటుంబము కూడ కలదు. నేను తెలుపు మతాలకు అతీతమైన
జ్ఞానమును తెలుసుకొని, జ్ఞానము మీద కుటుంబములోని వారు మొత్తము ఆసక్తి కలిగియున్నారు. భర్త డ్యూటీలో
బెంగుళూరులో ఉండగ, భార్య రంజాన్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉండేది. సైదా భార్య రంజానీకి
ఉన్నట్టుండి జబ్బు చేసింది. ఆమె ప్రవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకొంది. కొద్దిగ కూడ నయముకాకపోగా
ఆ రోగము ఇంకాకొంత తీవ్రమైంది. ఇక్కడ మిర్యాలగూడలో రంజానీ తన స్థితి ప్రమాదస్థితికి వచ్చినదని భర్తకు
చెప్పగా, భర్త సైదా బెంగుళూరునుండి ఆందోళనగా నాకు దగ్గరగానున్న వారికి ఫోన్చేసి తన భార్య పరిస్థితి బాగాలేదు,
నేను దూరముగా ఉన్నాను. స్వామివారికి నాభార్యస్థితి బాగలేదని ఒకమారు చెప్పండని చెప్పాడు. అతను సాయంకాలము
నాలుగుగంటలకు శ్రీనివాసులు అనే వ్యక్తికి చెప్పగా, అతను ఆరుగంటలకు సైదా భార్య విషయము చెప్పాడు. అప్పుడు
నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ విషయము నాకు తెలిసిన తర్వాత కొంత యోచించాను. సైదా కుటుంబము
జ్ఞానము తెలుసుకుంటున్నది మరియు వారు బీదవారు రోగమునకు ఎంతడబ్బైనా ఖర్చు పెట్టు స్థోమతలేనివారు, పైగా
రోగము తీవ్రస్థాయిగా ఉందనడము, ఇవన్నిటిని చూచి వారికి కొంతమంచి చేయాలనుకొని, నాకు విషయమును
చెప్పిన శ్రీనివాసులుకు "నేను మిర్యాలగూడకు ఇప్పుడే పోయి రంజాన్ ని చూచివస్తాను" అని చెప్పి ఆరున్నరకు
బయలుదేరాను. శ్రీనివాసులు రంజానీకి నేను బయలుదేరిన విషయమును చెప్పాడు. శ్రీనివాసులు ద్వారా నేను
వస్తున్నానను విషయమును రంజానీకి తెలిసిన వెంటనే ఒక్క నిమిషములోనే ఆమె శరీరములోని జబ్బు ఏమాత్రము
లేకుండ పోయింది. అంతవరకు బెడ్మీద లేవలేకున్న ఆమె వెంటనే లేచికూర్చొని కాళ్ళు, ముఖము శుభ్రము చేసుకొని
ఫ్రెష్గా తయారైపోయి, ప్రక్క బెడ్లలో నున్న వారందరికి మా గురువుగారు వస్తున్నారని చెప్పింది. అంతవరకు
అనారోగ్యముతోనున్న ఆమె ఒక్కసారిగా లేచి ఆరోగ్యముగా తిరగడము అక్కడున్న వారందరికి ఆశ్చర్యమైనది.
నేను, నావెంట ఇంకా ముగ్గురు మనుషులు బయలుదేరి రాత్రి తొమ్మిదిగంటలకు మిర్యాలగూడ చేరుకొన్నాము.
మేము అసుపత్రికి పోయి రంజాన్ఫీని చూస్తే ఆమెకు ఏ రోగములేనట్లు కనిపించింది. ఆమెకు రోగము బాగైనట్లు
మాకు తెలియదు. అందువలన “నీ రోగము ఏమైంది” అని అడిగాము. దానికి ఆమె “మీరు ఇక్కడికి బయలుదేరారని
శీనా అన్న చెప్పిన వెంటనే, నాలో అంతవరకు ఉన్న రోగము లేకుండపోయింది. ఒక్కసారిగా బాగైపోయింది”. అని
చెప్పింది. ఆమె మాటలు విని మాకు ఆశ్చర్యమైనది. ప్రక్కన మంచముల మీదవున్న పేషెంట్లు కూడ “ఆమె ఒక్కమారుగ
లేచి కూర్చొని రోగము బాధలేకుండ పోయిందని, మీరు వస్తున్నారని కూడ చెప్పింది” అని చెప్పడము జరిగినది.
తర్వాత మేము ఆమెను పరామర్శించి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వచ్చాము. ఆమెకు రోగము ఎందుకు
ఉన్నట్లుండి బాగైనది, అని యోచించాము. అప్పుడు మా యోచనకు అందిన వివరము ఏమనగా! ఆమెకు
శ్వాససంబంధమైన రోగము మరియు ఇతర రోగము రెండూ గాలివలన ఏర్పడిన రోగములు. గాలి ఆమె శరీరములో
స్వల్పభూతములలో ఒకటి. ఆ స్వల్పభూతము నేను వస్తున్నానని వింటూనే నాకు గౌరవము నిచ్చునదై వెంటనే తన
వలన కలిగిన రోగమును ఉపసంహరించుకొన్నది. వారు బీదవారు కావున వారికి రోగము నయము చేయాలను
ఉద్దేశముతో నేను బయలుదేరగానే, ఆ ఉద్దేశమును గ్రహించిన గాలి దైవజ్ఞానమునకు యోగమునకు మర్యాద నిచ్చునదై,
నేను బయలుదేరిన ఐదునిమిషములకే ఆమెకు రోగము లేకుండ పోవడము జరిగినది. ఈ విధముగ స్వల్పభూతములు
శరీరములో పాపమును పాలించునవై ఉంటూ అవసరమైనపుడు యోగుల మాటలను గౌరవించినట్లు ఎన్నో చోట్ల
చరిత్రలో కూడ గలదు. జరిగిన చరిత్రను తిరగవేసి చూస్తే ఎన్నో సందర్భములలో యోగులైన వారు చెప్పిన మాటకు,
తాకిన స్పర్శకు, చూచిన చూపుకు రోగములు పోయినట్లు తెలియుచున్నది. స్వల్పభూతములు జీవుని పాపమునే
కాకుండ, పుణ్యమును కూడ శరీరములో పాలించుచున్నవి. అందువలన పుణ్యము చేసుకొన్న శరీరములో కొందరికి
ఎనభైసంవత్సరముల వయస్సులో కూడ 'ప్యాంక్రియాస్' గ్రంథి బాగ పనిచేస్తూ సుగర్ జాడ్యము అతనికి రాకుండ
చేస్తుంది. అలాగే పాపము చేసుకొన్న వారికి ముప్ఫైసంవత్సరముల వయస్సులో గ్రంథి పని చేయకుండపోయి సుగర్
జాడ్యము వస్తుంది. శరీరములో భాగములన్ని బాగా పని చేయుటకుగానీ, చేయకుండ పోవుటకుగానీ స్వల్పభూతములే
కారణము. స్వల్పభూతములు పనిచేయునపై ఉండగా వాటికి ఉత్తర్వు ఇచ్చి పని చేయునట్లు చెప్పువాడు శరీరములోని
ఆత్మ. శరీరములోని ఆత్మ శరీరములోని స్వల్పభూతములకు అధిపతియై ఉన్నప్పటికి, తన ఇష్టాను సారము ఉ
త్తరువులు జారీచేయదు. ఆ శరీరములో నివశించుచున్న జీవుడు గతములో చేసుకొన్న పాపమునుబట్టి, ఎట్లు
నడుచుకోవలసినది ఆత్మ ఆజ్ఞాపిస్తే దానికి అనుగుణముగా స్వల్పభూతములు నడుచుకొనును. ఒక శరీరములోని
స్వల్పభూతములకు శరీరమంతావున్న ఆత్మ అధిపతికాగా, ఆత్మకు విశ్వమంతావున్న పరమాత్మ అధిపతిగా ఉన్నాడని
తెలియాలి. ఈ విధముగా స్వల్పభూతములు ఆత్మను అనుసరించి, ఆత్మ కర్మననుసరించి శరీరములో పని చేయుచుండును.
విశ్వము అంతా నిండియున్న పరమాత్మ ఆధీనములోని మహాభూతములు, శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ ఆధీనములోని
స్వల్పభూతములు, దైవనిర్మితమైన కర్మ అను చట్టమును అమలు చేయుచున్నవి.
దేశముంటే దానికి ఒక ప్రభువు, ప్రభుత్వము ఉండును. ప్రభుత్వము నకు ఒక చట్టముండును, చట్టమును
అమలు చేయువారుందురు. దానినే “లా అండ్ ఆర్డర్" అని కూడ అనుచుందురు. చట్టము ఏదైనా అది దేశమునకు
అధిపతియైన ప్రభువుచేతిలో ఉండును. అతను పనిచేయడు, అతని క్రింద పరిపాలన కొన్ని శాఖలరూపములో
ఉండును. ఎంత తప్పు చేసినవానికైన చివరికి చట్టము ప్రకారము ఉరిశిక్ష పడిన వానికైన క్షమించి వేయు అధికారము
ప్రభువుకు (రాష్ట్రపతికి) ఉన్నది. అలాగే దేహము అను ఒక దేశమునకు అధిపతి పరమాత్మ, అతని ఆధీనములోనే
శరీర పరిపాలనంతా జరుగుచుండును. కర్మ అను చట్టము ప్రకారము ఆత్మ అను జడ్జి నిర్ణయించిన శిక్షలను
స్వల్పభూతములను భటులు అమలు చేయుదురు. చట్టప్రకారము నేరముచేసి ఉరిశిక్షపడిన వానినైన తన ఇష్ట ప్రకారము
శిక్షను రద్దుచేసి విడుదల చేయగల అధికారము పరిపాలనాధి పతియైన ప్రభువుకు ఉన్నట్లు, ఎంతపాపాత్ముడైన
బాధ అనుభవించ కుండ, ఏ శిక్ష అమలుకాకుండ, తనకు ఇష్టమైతే శిక్షను రద్దుచేసి విడుదల చేయువాడు (ముక్తికి
పంపువాడు) దేవుడు అని తెలియవలెను. ఎంతటి పాపాత్ముడైన దైవమును గుర్తించి, ఆరాధించుట వలన ఒకే జన్మలో
ముక్తి పొందవచ్చును. ఇదేమాటను భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగమున, శ్లో॥ 30,31 "అపిచేత్సు దురాచారో
భజతే మా మనన్యభాక్, సాధురేవస మన్తవ్య స్సమ్యగ్యవసితోహిసః, క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి.”
ఎంతటి దుర్మార్గుడైనా వాడు నన్ను ఆరాధించుట వలన మరియు నేను దైవమునని నిశ్చయము కలిగియుండుట వలన
వానిని సాధువని (మంచి వాడని నేను లెక్కింతును. అటువంటివాడు ధర్మాత్ముడు కావున వానికి తొందరగా,
శాశ్వితశాంతియైన మోక్షము లభించును” అని కలదు. వేమనయోగి వ్రాసిన ఒక పద్యములో “పతిమెచ్చిన సతిమెచ్చును”
అను పద్యములో కూడ దేవుడు మెచ్చితే వానికి కర్మచట్టము వర్తింపకుండ ముక్తి పొందునని చెప్పాడు. ఈ విధముగా
పరిశీలించి చూచితే రాష్ట్రపతి ఉరిశిక్షను రద్దుచేసినట్లు, దైవము జన్మనే రద్దుచేసి ముక్తికి పంపగలదు.
అపరిమితమైన, ఎవరూ అంచన వేయలేని శక్తికల్గియున్న మహా భూతములకు అధినాయకుడైన దైవము
అనుకుంటే ఎంతటి పాపమునైన క్షమించి ముక్తి నివ్వగలడు. ఒకవేళ పెద్దభూతములకే పెద్దవాడైన దైవమును చిన్న
భూతములకంటే చిన్నవాడైన మనిషి, దైవమును లెక్కచేయకుండ దూషించినా లేక దూషణ భావముకల్గియున్నా అటువంటి
వానికి గొప్ప పాపము అంటుకొని రెండుయుగముల కాలము అనుభవించవలసి యుండును. దైవమును ఇష్టపడి
ఆరాధిస్తే దుర్మార్గుడైనా ముక్తి పొందవచ్చును, అయిష్టపడి దూషిస్తే, సన్మార్గుడైనా రెండుయుగములు నరకము అనుభ
వించును. ఒకయుగము కొన్ని లక్షల సంవత్సరములుండగా అటువంటివి రెండు యుగముల నరకము అనుభవించాలంటే,
ఎంతటి దుస్థితో యోచిస్తే భయంకరముగా ఉండును. అటువంటి నరకమును పొందవలెనని, మానవుడు తెలియక
దైవమును దూషిస్తున్నాడు. మతముల భ్రమలోపడి చాలామంది దైవమును దూషిస్తున్నారు. మనిషి మతాల మత్తులో
పడిపోయి, తనకు తెలిసినవాడే దేవుడనీ, ఇంకెవరు దేవుడుకానేకాదని, పంచమహా భూతములకు అధిపతియైన దేవున్ని
తెలియలేక, ఆయన పరిపాలనను గుర్తించలేక, మహాభూతములు బయట దేశములో, స్వల్ప భూతములు లోపల
దేహములో స్వర్గ, నరకములను కలుగజేస్తున్నవని అర్థము చేసుకోలేక, మనము ప్రతిదినము అనుభవించేవి పాపపుణ్య
ఫలితములైన సుఖదుఃఖము లని గ్రహించలేక, ఎక్కడో స్వర్గ, నరకములు ఉన్నాయను భ్రమలో మునిగి పోయాడు.
కొన్ని మతములవారు, దేవుని విషయములో పొరపడిపోయారు. కళ్ళ ఎదుట కనిపించు స్వర్గ, నరకములనే గుర్తించలేని
గ్రుడ్డివారు, కళ్ళకు కనిపించని దైవమును గుర్తించగలరా? గుర్తించలేక, తమకు తెలిసిందే జ్ఞానమని, తాము
విశ్వసించినవాడే దేవుడని, తామున్నదే నిజమైన మతమని అనుకొను మత విశ్వాసులు దేవున్ని ఎప్పటికీ తెలియలేరు.
దేవుడు మతాతీతుడు అని తెలియనిదే, ఆయనే ప్రజలకు ప్రభువని (రాజని), ప్రభువు ఆధీనములోనున్నదే పంచభూతముల
పరిపాలనా ప్రభుత్వమని తెలియనిదే, అసలైన పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మను గుర్తించలేరు. అందువలన అసలైన
దేవున్ని తెలియాలంటే ముందు ఆయన ప్రభుత్వమును గురించి తెలుసుకోవాలి. ప్రత్యక్షముగా అందరికి తెలియునట్లు
జరుగుచున్న విధానమును యోచించి చూస్తే దేవుడు సృష్టించిన సృష్టి మన ముందరే ఉండగా, దానినే ఆధారము
చేసుకొని చూస్తే, దానిని సృష్టించిన సృష్టికర్త తెలియునని ఆలోచించక, మతములు చెప్పిన మార్గములో పోతే మాయే
కనిపిస్తుంది, కానీ దేవుడు తెలియడు.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చూస్తాము. ఒక ఇంటిలో దొంగతనము జరిగింది. ఆ ఇంటిలోనికి ప్రవేశించిన
దొంగ, తనెవరో ఇతరులకు తెలియకుండ దొంగతనము చేసిపోయాడు. ఆ ఇంటిలో పోయింది ఎంతైన, ఏమైనా
దొంగను కనిపెట్టవలసిన బాధ్యత పోలీస్ వారిది. దొంగతనము చేసిన దొంగ, ఏ పోలీస్ లు తనను గుర్తించలేరను
ధైర్యముతో పోలీస్లకు సవాల్ ఒక లేఖను వదలిపోయాడు. మీరు నన్ను గుర్తించ గలిగితే, మీరు ఉద్యోగము
చేయకుండినా ప్రతినెల జీతము నేనే ఇస్తాను. ఏ పనిపాట లేకుండ నేను ఉచితముగా ఇచ్చు జీతముతో మీరు హాయిగా
ఉండవచ్చునని, తనను గుర్తించితే కలిగే లాభమును కూడా చెప్పాడు. ఆ దొంగ అలా చెప్పడమేకాక, తనను
గుర్తించుటకు అవసరమైన తన చేతి వ్రాతను వదలిపోయాడు. ఆ దొంగతనమును ఎలాగైనా ఛేదించాలనుకొన్న పోలీస్లు
ఆ దొంగతనమును పరిశోధించుటకు కొన్ని గుంపులుగా చీలిపోయి ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క కోణమునుండి ఇన్వెస్టిగేషన్
(పరిశోధన) ప్రారంభించారు. ఒక గ్రూపు అంతకంటే ముందు జరిగిన దొంగతనము చేసిన వారిని విచారింపసాగారు.
ఒక గ్రూపు వేలిముద్రలు తీసుకొని పరిశోధన ప్రారంభించింది. ఒక గుంపువారు దొంగకు సంబంధించిన 'క్లూ’
దొరుకుతుందేమోనని దొంగతనము జరిగిన ఇంటిలో వెదికారు. ఈ విధముగ ఒక్కొక్క కోణములో ఒక్కొక్కరు వెదకను
మొదలుపెట్టారు. చాలా కష్టపడి చాలా తొందరగా దొంగను పట్టుకోవాలనుకొన్నారు. అంతగా వారు శ్రమించుటకు
ముఖ్యకారణము, దొంగతనము జరిగిన ఇల్లు హెూమ్ మినిస్టర్గారిది. పోలీస్ వారు ఎంత వెదికినా దొంగ దొరికేటట్లు
లేడని ఒక గుంపు పోలీస్లు నిర్దారించుకొన్నారు. ఇంకా మూడు గుంపులు పోలీసులు వెదికి ఒక్కొక్క గుంపువారు
ఒక్కొక్కని పట్టుకొని వచ్చి ఇతనే దొంగ అన్నారు. మూడు గ్రూపులవారు ముగ్గురు పాతనేరస్థులైన పాత దొంగలనే
పట్టుకొనివచ్చారు. మూడు గ్రూపులలో ఒక గ్రూప్ పోలీస్లు నేనే అసలైన దొంగను తీసుకువచ్చానని అనగా, మిగత
పోలీసా పార్టి లేదు మేము తెచ్చినవాడే నిజముగా దొంగతనమును చేశాడు అని చెప్పారు. అలా అందరూ మేము
తెచ్చినవాడే నిజమైనదొంగ అనగా, ఒక గ్రూపువారు మాత్రము మాకు దొరకని దొంగ మీకెట్లు దొరుకుతాడు. వీరంతా
పాత దొంగలు కానీ వీరిలో అసలైన దొంగలేడు అన్నారట.
చివరకు పోలీస్ ఉన్నతాధికారులు విచారణలో మూడు గ్రూప్ వారు తెచ్చిన దొంగలలో నిజమైన దొంగలేడని
తేలిపోయినది. పోలీస్ లు వీరే దొంగలు అని తెచ్చినా, అలా దొంగలుగా చూపబడిన ఏ ఒక్కరూ ఆ ఇంటిలో
దొంగతనము చేయలేదని తెలిసినది. చివరికి ఎవరినీ పట్టుకొని రాని వారిని పిలిచి మీకు దొంగ ఎందుకు దొరకలేదని
అడిగారు. అప్పుడు ఆ గ్రూప్ ఇన్చార్జి అయిన ఇన్స్పెక్టర్ ఇలా “మేము దొంగను పట్టుకోవాలి అంటే అతను (దొంగ)
వ్రాసిన లేఖనే ఆధారముగా తీసుకోవాలి. మేము ఆ లేఖను బాగా గమనిస్తే, అందులో “మీరు నన్ను గుర్తించితే మీరు
ఉద్యోగము చేయకున్నా ప్రతినెల జీతము నేనే ఇస్తాను" అని ఉన్నది. అంతేకాక దొంగతనము జరిగిన ఇల్లు స్వయాన
హెూమినిస్టర్ గారిది. మేము అన్ని విధాల ఆలోచిస్తే, మేము దొంగను గుర్తించితే, మేము డ్యూటీ చేయకున్నా
ప్రతినెల జీతము ఇచ్చు స్థోమత అధికారము ఒక్క హెూమ్ మినిస్టర్ గారికే కలదు. ఒకవేళ వేరే ఎవరైనా ఘరానా
దొంగైనా చాలా డబ్బున్నవాడైన మేము ఉద్యోగము చేయకున్నా డబ్బు ఎప్పుడవసర మొస్తే అప్పుడిస్తాడుగానీ, కరెక్టుగ
ప్రతినెల ఇవ్వడు కదా! ఎప్పుడు అవసరమొస్తే అప్పుడిస్తానని వ్రాసివుంటే మేము దొంగను వెదికేవారమే, కానీ
ప్రతినెల జీతము ఇస్తానని చెప్పడము వలన, పైగా బాగా చదువుకున్న వారు వ్రాసిన లేఖ అయినందువలన, దొంగ
ఇచ్చే డబ్బును జీతము అని చెప్పడము వలన, మరియు ప్రతినెల అని నిర్ధిష్టముగా కూడ చెప్పుటవలన, అంతేకాక
నన్ను మీరు గుర్తించగలిగితే అని వ్రాశాడంటే, నేను మీకు బాగా తెలుసు అని అర్థమగుచున్నది. ఈ విధముగా అన్ని
రకములుగా యోచించి చూచితే మామీద పూర్తి అధికారమున్న హెూమ్మినిస్టర్గారే దొంగ అని చెప్పవచ్చును. వ్రాసిన
లేఖ ఆధారముగా లేఖను వ్రాసినవాడు పలానా అని గుర్తించి చెప్పగలుగుచున్నాము కానీ ఆయనను పట్టుకొనే స్థోమత
మాకులేదు” అని చెప్పాడు. ఆ విషయమును విన్న పోలీస్ అధికారులు ఆ విషయమును హెూమ్మినిస్టర్గారికి
తెలుపగా మినిస్టర్, తనమీద నేరారోపణ చేసినవారిని అభినందించి తానే ఆ దొంగతనమును సృష్టించినదని (చేసినదని)
ఒప్పుకొన్నాడట. ఆ లేఖలో వ్రాసిన ప్రకారము తనను గుర్తించినవారికి ప్రమోషన్ ఇచ్చి పనిలేని పోస్టులో వారిని
నియమించి వారికి శ్రమలేకుండా చేశాడట. పోలీస్ వారి సామర్థ్యమును తెలుసుకొనుటకు, వారిలో సామర్థ్యమును
పెంచుటకు మినిస్టర్గారే తన ఇంటిలోని దొంగతనము తానే చేసి, దానిని చేసిన దొంగ ఎవరో కనిపెట్టమని చెప్పాడు.
దొంగతనము తన ఇంటిలో జరిగినట్లు తెలిసిన మంత్రి, తానే లేఖ వ్రాసి, పోలీస్లకు సవాల్ విసిరినట్లు చేసిన
దానివలన కొందరు పోలీస్లు, మొదటినుండి దొంగలుగా పేరుగాంచిన వారిని పట్టుకొని వచ్చారుగానీ, అసలైన
దొంగను, ఇటువంటివాడు అని అంచనా కూడ వేయలేకపోయారు. ఒక గుంపువారు మాత్రము దొంగ వ్రాసిన లేఖను
పట్టుకొని దొంగను గుర్తించగలిగారు.
పై దొంగతనమును చూస్తే, మనకు కొంత సమాచారము అర్థమగు చున్నది. తెలియవలసిన దొంగ పోలీస్లందరికి
పెద్ద అయిన హెూమ్ మినిస్టర్గారు. అట్లే తెలియదగినవాడు మనుషులందరికి పెద్ద అయిన దేవుడు! పోలీస్ లు
నాలుగు గ్రూపులుగా దొంగకోసము అన్వేషణ చేశాయి. అలాగే నాలుగు మతములవారు దేవునికోసము అన్వేషణ
చేశారు. మూడు గ్రూపుల పోలీస్ లు ముగ్గురు దొంగలను తెచ్చారు. అట్లే మూడు మతముల వారు ముగ్గురు దేవుళ్ళను
చూపుతున్నారు. ముందునుండి పేరు పొందిన దొంగలనే మూడు పోలీస్ గ్రూపులు దొంగగా చూపుతున్నాయి. అలాగే
ముందునుండి వీరు దేవుళ్ళు అని పేరుపొందిన వారినే మూడు మతముల వారు దేవునిగా చూపుతున్నారు. ఒక పోలీస్
గ్రూపు మాత్రము పలానావాడు దొంగ అని చూపలేదు. అలాగే కొందరు జ్ఞానులు మాత్రము, పలానావాడు దేవుడని
చూపలేదు. అధికారుల విచారణలో పోలీస్వరు తెచ్చిన దొంగలలో అసలు దొంగ లేడని తెలిసింది. అలాగే యోగీశ్వరుల
విచారణలో కొన్ని మతములవారు చెప్పుచున్న దేవుళ్ళలో అసలైన దేవుడులేడని తెలిసింది. ఒక గ్రూప్ పరిశోధనాధికారులు,
దొంగ చేతితో వ్రాసిన కనిపించే లెటర్ ఆధారముగా కనిపించని దొంగను గుర్తించవచ్చును అన్నారు. అలాగే కొందరు
జ్ఞానాన్వేషులు, దేవుడు సృష్టించిన కనిపించే పంచభూతముల ఆధారముతో కనిపించని దేవున్ని గుర్తించవచ్చును అన్నారు.
పోలీస్లకు ప్రతినెల జీతము ఇచ్చే అధికారి, పనిచేయకున్నా జీతమివ్వగల స్థోమత ఉన్నవాడు హెూమినిష్టర్.
అలాగే ప్రతి జన్మకు జీవితమును ఇచ్చువాడు, పనివున్నా, పనిలేకున్నా జీవితము మాత్రము ఇవ్వగల స్థోమతయున్నవాడు
దేవుడు. పోలీస్వరు దొంగను గుర్తించితే, ఉచితముగ జీతము ఇచ్చువాడు దొంగ అయిన హెూమ్మినిష్టరే. అలాగే
జ్ఞానులు తెలియదగిన దేవుడు పలానావాడని గుర్తించి చెప్పగలిగితే మోక్షమునిచ్చువాడు దేవుడే. మూడు గ్రూపుల
పోలీస్వరు కూడా దొంగ వదలిపోయిన లేఖను పట్టించుకోలేదు. మూడు మతముల వారు ఆధారముగానున్న ప్రకృతిని
(పంచభూతములను) చూడలేదు. లేఖ ఆధారముతో ఒక గ్రూప్ పోలీస్లు అసలైన దొంగను గుర్తించగలిగారు.
అలాగే శాస్త్రబద్ద జ్ఞానమును అనుసరించువారు ప్రత్యక్షమైన ప్రకృతిని ఆధారము చేసుకొని అసలైన దేవున్ని గుర్తించగలిగారు.
చివరికి దొంగ పోలీస్లకు అధిపతియైన హెూమ్మినిష్టర్ అని తెలిసింది. అలాగే చివరికి దేవుడు అందరికి అధిపతియైన
పరమాత్మ అని తెలిసింది.
పై సారాంశమునంతటిని చూస్తే, దొంగ వదలిన లేఖ ఆధారము తోనే దొంగను గుర్తించగలిగినట్లు, దేవుడు
మన ముందర ఉంచిన ప్రకృతి ఆధారముతోనే అసలైన దేవున్ని గుర్తించవచ్చును అను విధానము తెలియు చున్నది.
కావున దేవునిచే తయారు చేయబడి, మన ముందర కనిపిస్తున్న పంచభూతములను (ప్రకృతిని) ఆధారము చేసుకొని
దేవున్ని తెలియవచ్చును అని ధైర్యముగా చెప్పవచ్చును. అలా కాకుండ ప్రకృతిని తెలియకుండ పరమాత్మను గుర్తించలేము.
అందువలన బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో ప్రకృతిని పంచభూతములుగా విభజించిన జ్ఞానము, ప్రకృతి వలననే
సకల శరీరములు తయారైన విషయము, ప్రకృతివలననే అజ్ఞానమునకు మూలమైన గుణములు తయారైన వివరము,
ప్రకృతివలననే జీవుల చావుపుట్టుకలు జరుగుచున్నవని తెలుపు సమాచారము కలదు. ప్రకృతియే తన గర్భమును
మోయుచున్న భార్య అనియు, సర్వజీవరాసులకు ప్రకృతియే తల్లి అనియు, తండ్రియైన నేను ఏమి చేయలేదనియు,
చేయునది అంతయు ప్రకృతియే ననియు ప్రకృతిని గురించి విస్తారముగా చెప్పియున్నారు. దేవున్ని తెలుసు కోవడములో
ప్రకృతి (పంచభూతముల) పాత్ర ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నట్లు తెలియుచుండగా, మతానికొక దేవున్ని పెట్టుకొని
ప్రకృతిని విస్మరించిన వారు ఎవరైన దేవున్ని తెలియగలరా? అని ప్రశ్నించుచున్నాను. ఏ మతమువాడైనా దేవున్ని పూర్తి
విశ్వసించినా, దేవున్ని ప్రార్థనల ద్వారా, పూజల ద్వారా, యజ్ఞముల ద్వార, వేదపఠనముల ద్వారా, దానముల ద్వారా,
తపస్సుల ద్వారా తెలియలేరని గీతయందు చెప్పారు. అన్నిటిని మించిన యోగము ద్వారానే దేవున్ని తెలియవచ్చునని
అదే గీతయందు చెప్పారు. యోగమును ఆచరించవలెనంటే ప్రకృతి వలన ప్రపంచమెలా ఉన్నది? ప్రకృతి వలన
శరీరమెలా తయారైవున్నది? ప్రకృతి వలన తయారైన గుణములు ఎలా పనిచేయుచున్నది? ప్రకృతి దైవమార్గమునకు
ఆటంకమైన మాయగా ఎలా పని చేయుచున్నది? తెలిసిన తర్వాతే యోగము ఎవరికైన సాధ్యమగును.
అందువలన ప్రకృతిని గురించి తెలుసుకోవలసిన అవసరమున్నది. ప్రకృతియే పంచమహాభూతములుగా
బయట, పంచ స్వల్పభూతములుగా శరీరములోపల గలవు. శరీరములోని స్వల్పభూతములను గురించి కొద్దిగ అవగాహన
కొరకు రెండు సంఘటనలు చెప్పుకొన్నాము. వాటిని గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉన్నది. శరీరములో
మాయగా పనిచేయు 36 గుణములు కూడ పంచస్వల్ప భూతముల వలననే తయారైనవి. స్వల్ప భూతములను
గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉండినా, ప్రస్తుతానికి వాటిని వదలి పంచ మహాభూతములను గురించిన
సమాచారమును కొంత తెలుసుకొందాము. దేవుడు సృష్ఠి ఆదిలో తన సంకల్పముచేత ప్రకృతిని మొదట సృష్ఠించాడు.
తర్వాత వెంటనే ఆత్మ, జీవాత్మలను సృష్టించాడు. ఇపుడు మీరు అర్జంటుగా ఒక ప్రశ్న అడుగవచ్చును. రూప, నామ,
క్రియలు లేనివాడు దేవుడు అన్నారు కదా! ఇపుడు ఆయనకు ఒక పనిని పెట్టి చూపిస్తున్నారు. ప్రకృతిని సృష్టించెను,
తర్వాత ఆత్మ, జీవాత్మలను సృష్టించెను అన్నారు. అలాంటపుడు దేవుడు కూడ సృష్టించే పనిని చేసినట్లే అవుతుంది.
దీనినిబట్టి పనిలేనివాడు (క్రియలేనివాడు) దేవుడు అను సూత్రము చెడిపోతుంది కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి
మా జవాబు ఏమనగా! రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు అన్నది సూత్రము. సూత్రము అనగా శాస్త్రబద్ధమైనదని
అర్థము. ఆ మాట శాసనమై ఎల్లప్పుడు చెక్కుచెదరనిదై ఉంటుంది. అలాంటపుడు సూత్రము చెడిపోవడము జరగదు.
ఇక్కడ ముఖ్యముగ గమనించవలసినది ఏమనగా! రూప, నామ, క్రియలు లేనివాడు అను సూత్రము ఎప్పుడు చెప్పబడినదని
యోచించితే రూపము, పేరు, పని ఉన్న మానవుడు తయారైనప్పటినుండి రూప, నామ, క్రియలు లేనివాడున్నాడని,
అప్పటినుంచి ఆ సూత్రము వర్తిస్తుందని తెలియాలి. ఒకనికి రూపమున్నపుడే ఇంకొకనికి రూపములేదని చెప్పవచ్చును.
అలాగ ఒకనికి పేరు, పని ఉన్నపుడే ఇంకొకనికి పేరు పని లేదని చెప్పవచ్చును. ఒక రూపమున్నపుడే, రూపము అంటే
ఏమిటో మనకు తెలిసినపుడే, రూపమును పోల్చి, రూపము లేనటువంటిది అని చెప్పవచ్చును. అలాగే రూపము,
పేరు, పని ఉన్న మనిషి వచ్చిన తర్వాత అతను చేయుచున్న పనినిగానీ, అతనికున్న పేరునుగానీ, రూపమునుగానీ
పోల్చి నీకున్న ఇటువంటివి ఏవి లేవు అని తెల్పుచు రూప, నామ, క్రియ రహితుడు అన్నారు. సృష్టికి పూర్వము దేవునికి
ఈ మాట వర్తించదు. సృష్టి జరిగిన తర్వాత దేవుని సూత్రానుసారము మనవలె ఆకారముగానీ, మనవలె పేరుగానీ,
మనవలె (జీవరాసులమాదిరి) పనికాని ఏదిలేదు. సృష్టి జరిగిన తర్వాత అన్ని కార్యములను ప్రకృతియే చేయునట్లు,
ఒక చట్టము నిర్ణయించి పెట్టాడు. ఆ చట్టము ప్రకారము రూప, నామ, క్రియలున్న ప్రకృతి అన్ని పనులను తానే
చేయుచున్నది. మనుషులను పుట్టించడము, బ్రతుకు సాగించడము, మరణించడము అన్నిటినీ ప్రకృతియే చేయుచున్నది.
ఈ విశ్వములో ఏది జరిగినా ప్రకృతివలననే జరుగుచున్నది. విశ్వమంతా నిండియున్న పరమాత్మ సాక్షిభూతుడై
ఉన్నాడు తప్ప కార్యభూతుడై లేడు. ఇది బ్రహ్మవిద్యాశాస్త్రములోని ముఖ్యమైన మాట.
రూప, నామ, క్రియలున్న విశ్వము సృష్టించబడకముందు, క్రియలేని వాడు అను వాక్యము దేవునికి వర్తించదు.
సృష్ఠిలేనపుడు కూడ దైవము యొక్క సంకల్పముతోనే సృష్టి మొదలైనది. అప్పుడు కూడ దైవము కార్యరూపములో
దేనిని తయారు చేయలేదు. సంకల్పము కూడ పనితో సమానమే అయినా, సృష్ఠిలేకముందు రూప, నామ, క్రియలు
లేనివాడు దేవుడు అనుటకు అప్పుడు ఈ సూత్రము వర్తించదు. సృష్ఠిలేనపుడు నీవు లేవు కావున నీవున్నపుడే సూత్రముగానీ
నీవు లేనపుడు (జీవరాసి పుట్టక ముందు) ఈ సూత్రమే ఉండదు. అంతేకాదు, సృష్ఠి లేకముందు దైవమును పరమాత్మ
అని అనుటకుగానీ, పురుషోత్తమ అని అనుటకు గానీ, దేవుడు అని అనుటకుగానీ వీలులేదు. ఎందుకనగా ఆత్మేలేనపుడు
ఆత్మకంటే పరముగానున్నవాడని అర్థమొచ్చునట్లు, పరమాత్మ అను మాటను చెప్పుటకు వీలులేదు. వేరే పురుషులే
లేనపుడు, పురుషులలో ఉత్తమమైనవాడు అని అర్థమొచ్చునట్లు పురుషోత్తమా అనుటకు కూడ వీలులేదు. అలాగే వెదికే
జీవుడే లేనపుడు వెదకబడేవాడు ఉండడు. దేవులాడేవాడు లేనపుడు దేవులాడబడేవాడు ఉండడు. అందువలన
దేవులాడబడేవాడు అను అర్థమొచ్చు దేవుడు అను ఉచ్చారణే ఉండదు. సృష్ఠి జరిగిన తర్వాత దైవమును గుర్తించుకొనుటకు
దేవుడు, పరమాత్మ, పురుషోత్తమ అని చెప్పుచున్నాము గానీ సృష్టిలేనపుడు దైవమునకు ఏ గుర్తింపులేదు. కావున
అప్పుడు దైవమును దేవుడనిగానీ, పురుషోత్తముడనిగానీ పరమాత్మ అనిగానీ చెప్పుటకు వీలులేదు.
దేవుని సృష్ఠిలో మొదటిది ప్రకృతి, రెండవ సృష్ఠి ఆత్మ, జీవాత్మలు. ప్రకృతి, ఆత్మ, జీవాత్మలను ఒక్క సమయములోనే,
సృష్ఠి ఆదియందే తయారు చేసినా, ముందు సృష్టించినది ప్రకృతిని, తర్వాత సృష్టించినది ఆత్మ, జీవాత్మలను. అన్నీ
ఒక్కమారుగా తయారైనా వరుసక్రమములో ప్రకృతియే ముందున్నదని తెలియుచున్నది. ప్రకృతి తర్వాత ఆత్మ,
జీవాత్మలున్నాయని అందరికి తెలియునట్లు, ప్రస్తుత ప్రపంచములో ఒక విధానము అమలులో గలదు. ఆ విధానము
అమలులో ఉండినా, ఇది పలానా గుర్తింపు అని ఎవరూ గుర్తించలేక పోవుచున్నారు. ఏ దానికైనా ప్రశ్నవుంటే జవాబు
కొరకు వెదకుతాము. ప్రశ్నలేనపుడు జవాబు ఏదో తెలియదు. నేటి మానవుడు డబ్బు సంపాదన మీదనే తన
బుద్ధినంతా ఉపయోగిస్తున్నాడు. అందువలన అతనికి మిగత దేనిమీద ప్రశ్నరావడములేదు. మనిషి తనను గురించిగానీ,
తనకంటే ముందున్న ప్రపంచమును గురించిగానీ యోచించడము లేదు. ఎవరూ యోచించకుండినా, ప్రశ్నించకుండినా,
వారి తరపున మనమే ప్రశ్నవేసుకొని మనమే జవాబు చెప్పుకొందాము. ఇక్కడ ప్రశ్న మనదే, జవాబు మనదేనని
ఇష్టమొచ్చినట్లు చెప్పకూడదు. జవాబు శాస్త్రబద్దముగా ఉండాలి. ఇది దైవజ్ఞానము కావున ప్రతిమాట సూత్రబద్దముగా
ఉండాలి, అట్లుకాకపోతే అంతా అబద్దమైపోతుంది.
ఇప్పుడు ఒక ప్రశ్నను ప్రశ్నించుకొందాము. అదేమనగా! దైవము సృష్టి ఆదిలో మొదట ప్రకృతినే ఎందుకు
సృష్ఠించాలి? ఆత్మ, జీవాత్మలను ఎందుకు ముందు సృష్టించలేదు? వరుస క్రమములో ప్రకృతియే ముందు ఉండవలసిన
అవసరమేమిటి? దానికి జవాబు ఏమనగా! ఒక వస్తువు బయటికి తెలియకుండుటకు దానిమీద ఏదైనా కప్పియుంచుతాము.
ఉదాహరణకు ఒక ధాన్యము కుప్పను (రాశిని) పెద్దగుడ్డను ఉపయోగించి కప్పి పెట్టాము అనుకొనుము. అప్పుడు
చూచేదానికి మొదట బయటవున్న గుడ్డయే కనిపించును. గుడ్డక్రింద ఏమున్నది కప్పిపెట్టినవారికి తప్ప ఎవరికీ
తెలియదు. గుడ్డ ఎత్తుగా ఉన్నది కదా? అది అలా ఎత్తుగా ఉండుటకు క్రింద ఆధారముగా ఏదైనా ఉన్నదా? అని
యోచించువారు గుడ్డను తొలగించి చూడగలరు. అలా గుడ్డను తొలగించి చూచినవారికి మాత్రమే లోపలనున్న
ధాన్యము కనిపించును. గుడ్డఎత్తుగా ఎలా నిలబడగలిగింది? అని ప్రశ్న రానివారికి, దానిని గురించి యోచించని
వారికి, పైనున్న గుడ్డమాత్రము తెలియును. లోపల ఒకటున్నదనిగానీ, లోపలనున్నది ఏమిటనిగానీ తెలియదు. అదే
విధముగా దైవము, ప్రకృతి అనే గ్రుడ్డక్రింద ఆత్మ, జీవాత్మలను ఉంచాడు. ఆత్మ, జీవాత్మలను ప్రకృతి (మాయ) అను
గుడ్డ కప్పియుండుట వలన, బయట అందరికి ప్రకృతియే కనిపించునుగానీ ఆత్మ, జీవాత్మలు ఎవరికీ కనిపించవు.
ఎవరైనా నూటికో, కోటికో ఒకడు ప్రకృతి క్రింద ఏముంది? ప్రకృతి దేనిని కప్పియుంది? అని ప్రశ్నించుకొని మొదట
ప్రకృతిని గురించి తెలుసుకొని, ఎక్కడ పట్టిలాగితే ప్రకృతి ముసుగు పోతుందో తెలుసుకొని, తర్వాత జ్ఞానమను విధానముతో,
మాయ అనబడు ప్రకృతిని తొలగించి చూచితే ఆత్మ, జీవాత్మలు ఎవరో తెలియుదురు. అప్పుడు ఆత్మ జీవాత్మల ద్వారా
వారిని దాచియుంచిన పరమాత్మను తెలియవచ్చును. అలా తెలిసినపుడు తెలియబడిన దానికి విలువవుండును. మనిషి
వెదకి తెలుసుకొనేదానికి దేవుడు, ప్రకృతిని పైన అడ్డము పెట్టాడు. మొదట జీవాత్మ, ఆత్మల విషయములు తెలియకుండా
ఉండుటకు ప్రకృతిని అడ్డముగా మాయరూపములో మనతలయందే ఉంచాడు. అందువలన మనిషియొక్క
విధానములన్నిటిలోను మొదటిస్థానము మాయకు లేక ప్రకృతికి దక్కింది.
ఆత్మ, జీవాత్మల విధానమును ప్రకృతిచేత కప్పియుంచి, మొదట ప్రకృతియే తెలియునట్లు చేసిన పరమాత్మ,
తనచేత తయారు చేయబడిన ప్రకృతిని (మాయను) మనిషి విధానములన్నిటిలోను మొదటి స్థానములో ఉంచిన పరమాత్మ,
కనిపించని కారణమైన తనకు (పరమాత్మకు) కనిపించే కార్యమైన ప్రకృతిని కవచముగా పెట్టుకొన్న పరమాత్మ, తనచేత
సృష్ఠింపబడిన ఆత్మ, జీవాత్మలకంటే ముందు సృష్ఠింపబడినది ప్రకృతియని అందరికి తెలియునట్లు, మనుషుల మధ్యలో
ప్రకృతికి సంబంధించిన పదమునే మొదట ఉచ్చరించునట్లు అమర్చాడు. పరమాత్మ పుంలింగము, ప్రకృతి స్త్రీలింగము
అని ఆధ్యాత్మిక విద్యలో చెప్పబడియున్నది. అందువలన ఎక్కడైన పరమాత్మకు సంబంధించిన పుంలింగముకంటే,
ప్రకృతికి సంబంధించిన స్త్రీలింగమునే మొదట చెప్పునట్లు లేక పలుకునట్లు దేవుడు అమర్చాడు. అది ఎలా అనగా!
మనము మాట్లాడు భాష ఏదైనా కావచ్చును, అందులో మొదట స్త్రీతత్త్వమైన శబ్దమునే ఉచ్చరించుచున్నాము.
ఉదాహరణకు ఆడమగ, స్త్రీపురుషులు, భార్యభర్తలు, ఆలుమగలు, పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణుడు,
సీతారాములు, ప్రకృతిపురుషులు అని మాట్లాడుట అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అన్నిచోట్ల ప్రకృతి (ఆడ)
విధానమే మొదటగలదు. కానీ ఏ మనిషి కూడా ఇలా ఎందుకున్నది అని యోచించడము లేదు. అలా యోచించగలిగితే
దానికి సమాధానము ఆరవశాస్త్రమైన రాజవిద్యాశాస్త్రములోనే దొరుకును. ఎవడైనా ప్రశ్నించుకొని సమాధానముకొరకు
అన్వేషణ చేస్తే, దేవుడు సృష్టి ఆదిలో ప్రకృతిని తయారు చేసినట్లు తెలియగలదు. అలా ఎందుకు చేశాడో కూడ
స్తమైన రాః **
తెలియగలదు, అంతేకాక తయారు చేసినవాడు ఎవరో కూడ తెలియగలదు. మొదట కనిపించే ప్రకృతిని ఆధారము
చేసుకొని, దానిని తయారుచేసిన, కనబడని వానిని కనుగొనుటయే ముఖ్యమైన పరిశోధన. అలా పరిశోధనలో ముందుకు
పోతే తెలియునది ఏమనగా!
రాజు రాజధానిలో ఉండును, రాజుయొక్క పరిపాలన రాజ్యములో ఉండును. రాజధానిలోనున్న రాజును
ప్రభువు అంటారు. అతని రాజ్యములోనున్న పరిపాలనను ప్రభుత్వము అంటారు. ప్రభుత్వము ఎంతవరకు విస్తరించివుందో,
అంతవరకు ప్రభువు కనిపించకుండ ఉండును. కనిపించని ప్రభువుయొక్క యోచనలు (ఉత్తర్వులు) కనిపించే పరిపాలకుల
చేత అమలు చేయించబడును. కనిపించని ప్రభువు లేక రాజు దేవుడైతే రాజ్యములో పనిచేయువారు మరియు
చేయుంచు వారు ముఖ్యమైన కనిపించు ఐదుగురు అధికారులు గలరు. రాజ్యములో కనిపిస్తూ తాము పనిచేయుచు,
తమ అనుచరులచేత పని చేయిస్తూ, రాజ్యములో పరిపాలన సక్రమముగా సాగులాగున చేయు ఐదుగురిని ఆకాశము,
గాలి, అగ్ని, నీరు, భూమి అని చెప్పవచ్చును. ఇక్కడొకవింత సమాచారము మేము చెప్పకతప్పదు. అదేమనగా!
పరిపాలనకర్త అయిన ప్రభువు పురుషుడే! పరిపాలించబడు ప్రజలు పురుషులే! ఇక మధ్యలో పరిపాలన చేయువారు
మాత్రము అందరు స్త్రీలే. వివరముగా చెప్పితే ప్రభువు లేక రాజు దేవుడుకాగ, ప్రజలు జీవులుకాగ, పరిపాలించు
ముఖ్య అధికారులు ఐదుగురు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ ఐదుమంది స్త్రీలను కలిపితే ఒకే ప్రకృతి అని
చెప్పవచ్చును. ఒకే పురుషుడైన పరమాత్మ, ఆత్మ, జీవాత్మలుగా విభజింప బడినట్లు, ఒకే స్త్రీ అయిన ప్రకృతి ఆకాశము,
గాలి, అగ్ని, నీరు, భూమిగా విభజింపబడియున్నది. రాజు పురుషుడు, రాజ్యాంగము స్త్రీ. పరమాత్మ రాజ్యములో
ప్రకృతి పరిపాలన జరుగుచున్నది. వివరముగా చెప్పితే మగ రాజు క్రింద ఆడపరిపాలన జరుగుచున్నదని అర్ధముచేసుకోవాలి.
ఇప్పుడు పరిపాలనా విభాగమునకు వచ్చి చూచి, అక్కడున్న వివరమంతా తెలుసుకొందాము. పరిపాలనలో
ప్రధానపాత్ర పోషిస్తున్నది ప్రకృతి. ప్రకృతి ఐదు భాగములుగా విడిపోయి విశ్వమంతా నిండియున్న జగతిలో పాలన
సాగిస్తున్నది. భూమిమీదున్న జీవరాసులన్నిటిని కలిపి జగతి అంటున్నాము. జగతిని విడివిడిగా చూస్తే ఒక్కొక్క
జీవునికి ఒక్కొక్క శరీరముండును. జీవుని శరీరములో కూడ ఐదు భాగములుగా ప్రకృతి యున్నది. బయట
పంచమహాభూతములుగానున్న ప్రకృతి, శరీరములో పంచ స్వల్ప భూతములుగా ఉన్నది. శరీరము బయట ఆకాశము,
గాలి, అగ్ని, నీరు, భూమిగానున్న ప్రకృతి, శరీరములోపల కూడా ఆ పేర్లతోనే ఉన్నది. శరీరము బయట ఐదు
మహాభూతములుగానున్న ప్రకృతి ఐదు భూతముల చేత భూకంపములు, వరదలు, సునామీలు, అగ్ని పర్వత
ప్రేళ్ళులు, సుడిగాలుల విజృంభణ మొదలగు భీభత్సములను సృష్ఠించు చున్నది. శరీరములోపలనున్న ఐదు
స్వల్పభూతములుగానున్న ప్రకృతి ఎన్నో రోగములను, తన భాగముల చేత సృష్ఠించుచున్నది. శరీరములో నివశించు
జీవుడు, దుఃఖమును పొందాలన్నా లేక సుఖమును పొందాలన్నా పంచభూతములు పనిచేయవలసిందే! శరీరములో
శ్వాస గాలి, చంకలో వేడి, నాలుక తేమ, చెవి ఆకాశము, చర్మము మీద మట్టి కనిపిస్తూ పంచ భూతములు తెలియుచున్నా,
శరీరములోని ముఖ్య భాగములు ఇరువది నాలుగు (24) పంచభూతముల వలననే తయారైనవి. 24 భాగములు పని
చేయుటకు అనుబంధముగ శరీరములోపల మరికొన్ని అవయవములు కూడ తయారైనవి. ఈ విధముగ 24 భాగములు,
వాటి అనుబంధ భాగములు అన్నిటినీ కలిపి శరీరము అంటున్నాము.
శరీరము మొత్తము ప్రకృతి భాగముల చేత తయారు చేయబడినది, కావున శరీరమును స్త్రీ లింగమునకు
చెందినదిగా చెప్పుకొంటున్నాము. ఆత్మ, జీవాత్మ రెండు పుంలింగమునకు సంబంధించినవి కావున రెండు ఆత్మలను
పురుషులుగా చెప్పుకొనుచున్నాము. ప్రకృతియైన పంచ భూతములు భార్యస్థానములో ఉండగా, పరమాత్మ భర్త స్థానములో
ఉన్నాడు. జీవుడు అనువాడు ప్రకృతి, పరమాత్మలచేత పుట్టబడినవాడు, కావున జీవునికి ప్రకృతి తల్లి, పురుషోత్తముడైన
పరమాత్మ తండ్రి అని భగవద్గీతలో చెప్పబడినది. ఇక ఆత్మ విషయానికి వస్తే ఆత్మ ప్రత్యేకమైనది. ప్రకృతి ఏమాత్రము
ఆత్మ తయారగుటకు ఉపయోగపడలేదు. దేవుడు ప్రకృతిని తయారు చేసిన వెంటనే ఆత్మను తయారుచేశాడు. ఆత్మను
చేసిన తర్వాత ప్రకృతిని భార్యగా ఉపయోగించుకొని జీవుణ్ణి పుట్టించాడు లేక తయారుచేశాడు. అందువలన ప్రకృతి
పరమాత్మలు జీవుళ్ళకు శాశ్వితమైన తల్లి, తండ్రికాగా, ఆత్మ, ప్రకృతికి సోదరుడు అవుతుంది. దైవసృష్ఠిలో మొదట
ప్రకృతి పుట్టగా, దానిని అనుసరించి రెండవదిగా పుట్టినది ఆత్మ కావున, ప్రకృతికి ఆత్మ అనుజుడు (తమ్ముడు) అవును.
ప్రకృతికి ఆత్మ తమ్ముడుకాగ, జీవుడు కుమారుడౌవును. స్వచ్ఛముగ పరమాత్మచేత ఉద్భవించినవాడు ఆత్మ. ఆత్మ,
జీవాత్మకు తోడుగా శరీరము లోని పురుషుడుగా ఉన్నాడు. చైతన్యశక్తిగ శరీరములో ఉండి, శరీరములోని దేవునిగా
గుర్తింపుపొందియున్నాడు. పరమాత్మ శక్తికి నమూనాగా దేహములోని ఆత్మ కలదు. బయట ప్రపంచములో
పంచమహాభూతములకు పరమాత్మ అధిపతియై ఉన్నట్లు, దేహము లోపల ఆత్మ, పంచ స్వల్ప భూతములకు అధిపతిగా
ఉన్నాడు. పంచమహాభూతములు ఒక్క పరమాత్మ మాట మాత్రము వినును. అలాగే శరీరములోని పంచస్వల్పభూతములు
ఆత్మమాటను వినును. ఇట్లు ఎన్నో విధముల ఆత్మ ప్రత్యేకతను కల్గియున్నది. అంతేకాక ఎంతటి జ్ఞానిగాని, మొదట
ఆత్మను తెలుసుకోవలసిందే. ఆత్మను అధ్యయనము చేయుటనే ఆధ్యాత్మికము అంటాము. ఆత్మను తెలియనివాడు
పరమాత్మ జ్ఞానమును తెలియలేడు.
నేటి ప్రపంచములో పెద్దపేరు పొందిన స్వామీజీలకు కూడ ఆత్మ విషయము అణుమాత్రము కూడ తెలియదు.
జీవాత్మనే ఆత్మ అనువారు కొందరుండగా, పరమాత్మనే ఆత్మ అనువారు ఎందరో కలరు. ఇంకా కొందరు, మనస్సును,
బుద్ధిని, చిత్తమును, అహమును మొదలగు వాటినన్ని టిని ఆత్మే అంటున్నారు. ఆత్మనే మనస్సు అని అనవచ్చును,
అలాగే బుద్ధి అని అనవచ్చును అని చెప్పుచున్నారు. మొత్తము మీద ఆత్మ అనగా ఇది అని, ఆత్మయొక్క పాత్ర ఇది అని
శాస్త్రీయముగా ఎవరూ చెప్పలేకపోవు చున్నారు. భగవద్గీత శాస్త్రములో ఆత్మను ఉద్దేశించి అక్షరుడు అని భగవంతుడు
చెప్పగా, గీతను వ్యాఖ్యానించిన వారందరు అక్షరుణ్ణి జీవునిగా వ్రాసుకొన్నారు. పెద్దస్వామీజీలకు, పీఠాధిపతులకు
అక్షరుడంటే ఎవరో తెలియకపోతే, సామాన్య ప్రజానీకానికి ఆత్మ విషయము ఎలా తెలుస్తుంది? ఇంతవరకు
ప్రపంచములోని మనుషులలో అగమ్యగోచరముగ ఉన్నది ఆత్మ. ఒక్క హిందూమతములోనే కాదు, ప్రపంచములోని ఏ
మతములో కూడ ఆత్మంటే ఎవరో తెలియదు. ఆత్మ అను మాటను అందరు చెప్పు కొంటున్నారు. ఆత్మ అను
పదమును అక్కడక్కడ స్వామీజీలు అందరు ఉపయోగించుకొంటున్నారు. అయినా అది ఏదో? ఎలా ఉందో? దాని
పనేమిటో? అది ఎలా తయారు చేయబడిందో? ఎప్పుడు తయారు చేయబడిందో? జీవుని ఎడల దానిపాత్ర ఏమిటో?
అది శరీరములో ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? గుండెల మీద చేయి పెట్టుకొని ఎవరైనా ధైర్యముగా ఆత్మంటే ఏమిటో
చెప్పగలరా? చెప్పలేరు, అందువలననే భగవద్గీతలో ఆత్మను గురించి కొమ్ములు తిరిగిన స్వామీజీలు కూడ తప్పుగా
వ్రాశారు. ఆత్మ ఎవరికి తెలియదనుటకు, మేము జ్ఞానులము అని గీతను వ్రాసిన వారందరు ఆత్మను గురించి తప్పుగా
వ్రాయడమే నిదర్శనము.
ఇంతమందికి తెలియనిది ఈయనకొక్కనికే తెలుసా? అనియు ఎంత గర్వముతో మాట్లాడుచున్నాడు? అని
కొందరు నన్ను గురించి అనుకోవచ్చును. నాకు తెలుసు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలిసింది ఇక్కడ
వ్రాశాను, నాలోని ఆత్మ నాచేత వ్రాయిస్తే వ్రాస్తున్నాను. ఈ మాటలన్నీ నేను స్వయముగా అడుగునవికావు. ఆత్మే
మిమ్ములను ప్రశ్నించుతావుందని మీరెందుకు అనుకోకూడదు? నాకు తెలుసు, ఎలా చెప్పినా మీరు నన్నే అనుకుంటారు.
ఎందుకనగా ఆత్మంటే ఎవరో మీకు తెలియదు కదా! ఎవరికి తెలిసినా, తెలియకున్నా అందరి శరీరములలో జీవాత్మతో
పాటు ఆత్మవున్నాడు. ఆత్మ పురుషుడే! పరమాత్మ పురుషుడే!! ఆత్మ ఒక విధముగా పరమాత్మ చేత పుట్టినందుకు,
దేవునికి కుమారుడు అగును. మరొక విధముగా ప్రకృతికి తమ్ముడు అయినందుకు దేవునికి బావమరిది అగును.
జీవునికి మామ అగును. ఇక ప్రకృతి పరమాత్మ చేత పుట్టినందుకు దేవునికి ఒక విధముగా బిడ్డ అగును. మరొక
విధముగ దేవుని బీజము వలన జీవుని శరీరమును తయారు చేసినది మరియు జీవుడు పుట్టుటకు తను సహకరించిన
దానివలన దేవునికి భార్యగనున్నది. జీవున్ని దేవునివైపు పోకుండ ప్రకృతి చేయుచున్నది, కావున జీవునికి ప్రకృతి ఒక
విధముగా చెడు చేయు మాయగా ఉన్నది. ఆత్మ ఎల్లప్పుడు జీవున్ని వదలకుండ ఉండి దేవునివైపు పోవుటకు అవకాశము
కల్పించి మంచి చేయుచున్నది. కావున పొరుగువానిగా, స్నేహితునిగా ఆత్మను చెప్పవచ్చును.
ఇప్పుడు చెప్పుకొన్న దానిని బట్టి ప్రకృతి ఆత్మకేమౌతుందో, పరమాత్మకేమౌతుందో, జీవాత్మకేమౌతుందో
అర్థమైంది. అలాగే ఆత్మ ప్రకృతికేమౌతుందో, పరమాత్మకేమౌతుందో, జీవాత్మకేమౌతుందో అర్థమైంది. జీవాత్మ ప్రకృతికి
ఏమౌతుందో, ఆత్మకు ఏమౌతుందో, పరమాత్మకు ఏమౌతుందో అర్థమైంది. అట్లే పరమాత్మవైపు నుంచి చూస్తే, పరమాత్మ
ప్రకృతికి ఏమౌతుందో, ఆత్మకు ఏమౌతుందో, జీవాత్మకు ఏమౌతుందో అర్థమైంది. ముందే కొంత జ్ఞానము తెలిసిన
వారికైనా ఈ వావి వరుసలు తొందరగా అర్థముకావు. అందువలన కొంత శ్రద్ధగా యోచనచేసి, చూచిన చెప్పినదంతా
సత్యమేనని తెలియును. అర్థము చేసుకొంటే ఇందులో జ్ఞానమే కనిపించును. అర్థముకాకపోతే అజ్ఞానము కనిపించును.
దేవునికి వావి వరుసలు లేవు అన్నట్లు అర్థమగును. వావివరుసలు లేనివాడు దేవుడెట్లగునని మాయ ప్రేరేపించగలదు.
అందువలన యోచించి నిజము తెలుసు కొమ్మంటున్నాము.
మీకు బాగా అర్థమగుటకు క్రింద పట్టికరూపములో వ్రాయుచున్నాము చూడండి.
ప్రకృతి: ఆత్మకు అక్క,జీవాత్మకు తల్లి,జీవాత్మకు మాయ;పరమాత్మకు భార్య,పరమాత్మకు బిడ్డ
ఆత్మ:ప్రకృతికి తమ్ముడు,జీవాత్మకు మామ,జీవాత్మకు స్నేహితుడు;పరమాత్మకు కొడుకు,పరమాత్మకు బావమరిది.
జీవాత్మ: ప్రకృతికి పుత్రుడు,ప్రకృతికి కీలుబొమ్మ;ఆత్మకు అల్లుడు,ఆత్మకు అనుచరుడు,పరమాత్మకు కొడుకు.
పరమాత్మ:ప్రకృతికి భర్త,ప్రకృతికి తండ్రి,ఆత్మకు తండ్రి,ఆత్మకు బావ,జీవాత్మకు తండ్రి.
ఇంతవరకు తెలుసుకొన్న విషయములలో ఆత్మ,జీవాత్మ, పరమాత్మల వివరమును, ముగ్గురు పురుషుల విషయమును
తెలుసుకోగల్గినాము. ముఖ్యముగా, ముందుగ తెలుసుకో తగిన ప్రకృతియొక్క విషయములనే ఇంకా తెలుసుకోవలసిన
అవసరమున్నది. ప్రకృతియొక్క విభజనలో కూడ మహాభూతములు, స్వల్పభూతముల వరకు తెలుసుకోగలిగాము.
అయినా ఇంకా తెలుసుకోవలసినది, ముఖ్యముగా మనకు తెలియనిది చాలా ఉన్నది. దానిని గురించి తెలుసుకొనే
దానికి ప్రయత్నిస్తే, అంతకు అంతాకాకున్నా, కొంతకు కొంతైనా అర్థముకాగలదు. రాజు పరిపాలనలో మంత్రి వద్దనుండి
సిపాయి వరకు ఎందరో భాగస్థులుగా ఉన్నట్లు, దేవుని పరిపాలనలో కూడ ప్రకృతి మొదలుకొని గ్రహముల వరకు
ఎందరో భాగస్థులుగా ఉన్నారని తెలియుచున్నది. దేవుని పరిపాలన సృష్టి అంతటా వ్యాపించియున్నది. ప్రతి జీవరాసి
శరీరములోని ప్రతి అణువు వరకు వ్యాపించి ఉండుట వలన, దేవుని పాలననుండి ఎవరుగానీ తప్పించుకొను
అవకాశముండదు. 'శరీరములో స్వల్పభూతములు వ్యాపించి పాలన సాగించుచున్నవి. అట్లే బయట
ప్రపంచములో ఆకాశము, గాలిలేని స్థలమంటులేదు. బయట కూడ పంచభూతములకు తెలియకుండ ఎవరూ ఏమి
చేయుటకు వీలులేదు. ఇటు శరీరము లోపలగానీ, అటు శరీరము బయటగానీ పంచభూతములకు తెలియకుండ
ఎవరూ ఏమీ చేయలేరు.
దేవుని పాలన మహాభూతములు, స్వల్పభూతములు అను రెండు భాగముల చేతనే కాకుండ మరియొక
విభాగముచేత కూడ చేయబడు చున్నది. దీనినిబట్టి పాలనా విధానము మొత్తము మూడు భాగములుగా ఉన్నదని
చెప్పవచ్చును. మూడు భాగములలో రెండు భాగములు మనకు తెలిసిన మహాభూతములు, స్వల్పభూతములుగా
ఉన్నవి. మనకు ఇంతవరకు తెలియని విభాగము యొక్క పేరు ఉప భూతములు.
1) మహా భూతములు:సృష్ఠి అంతా ఇవే కలవు. అవి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
2) స్వల్ప భూతములు:పుట్టిన జీవుల శరీరములలో గలవు. అవి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
3) ఉప భూతములు :ఖగోళములో ద్వాదశ (పండ్రెడు) గ్రహములు మొదలుకొని భూగోళము వరకు లెక్కలేనన్ని కలవు.
ཚལ་བས
ఉపభూతములు అనునవి మహాభూతములు, స్వల్పభూతములవలె ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమివలె
విడివిడిగా కాకుండ, ఐదు భూతములు కలిసి ఏర్పడిన శరీరములతో ఉండును. పంచభూతములతో ఏర్పడిన జీవరాసుల
శరీరమువలె కాకుండ వివిధరకముల ఆకారములతో కొన్ని కనిపించునవిగా, కొన్ని కనిపించనవిగా ఉన్నవి.
కనిపించువాటిలో ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలగునవి.
కనిపించని వాటిని ఫలానా అని చెప్పుటకు వీలులేదు. కనిపించిన వాటిలో కూడ కొన్ని తమకు ఇష్టమొచ్చిన సమయములలో
మాత్రము కనిపించి, మిగత సమయములలో కనిపించ కుండ పోవునవి గలవు. అటువంటివాటిలో ఉదాహరణకు
మేఘములను చెప్పుకోవచ్చును. మనకు తెలిసిన సప్తగ్రహములు కూడ జీవులే! అందువలన వాటిని గ్రహములు
అంటున్నాము. సూర్యచంద్రాది గ్రహములు జీవము గలవి మరియు ప్రాణము కూడగలవని చెప్పవచ్చును. అలాగే
మేఘములు, అట్లే ఎన్నో అసంఖ్యాకముగానున్న ఉపభూతములు కూడ జీవముగలవి మరియు ప్రాణముకలవిగా
ఉన్నాయి. ఉపభూతములలో మేఘము ఒక భూతముకాగ, రోగము కూడ ఒక భూతముగా ఉన్నది. భూమిమీద ఉప
భూతములుగా ఎన్నో మేఘములు, ఎన్నో రోగములు అసంఖ్యాకములుగా ఉండగా, మనము చెప్పలేనివి, పేర్లు తెలియనివి
ఎన్నో లేక్కలేనన్ని గలవు. అటువంటి ఉపభూతములు, భూగోళమునుండి ఖగోళము వరకు వ్యాపించి ఉన్నవి.
ఉపభూతములు మేఘములు, రోగములు మొదలుకొని, సూర్య చంద్రాది గోళముల వరకు, దేవుని పరిపాలనా విభాగములో
పాత్రధారులై ఉన్నవి. ప్రజలు వేరు, ప్రభుత్వము వేరుగా ఉన్నట్లు, జీవరాసులు వేరు పాలనా భూతములు వేరని
తెలియుచున్నది.
పాలనా విభాగములోనున్న ప్రతి భూతము కర్మను పాలించునవిగా ఉన్నవి. ఉపభూతములన్నియు నియమిత
పనిని మాత్రము చేయుచున్నవి. ఒక ఉద్యోగి తనకు ఏ పని నియమితమై ఉంటే ఆ పనినే చేసినట్లు, ఉప భూతములు
చేయుచున్నవి. ఉదాహరణకు బిల్ కలెక్టర్ బిల్లులు మాత్రమే వసూలు చేయును, బస్కండక్టర్ బస్సులో ఎక్కిన ప్రయాణికులకు
టికెట్లు ఇచ్చును. అదే విధముగా నవగ్రహములు ఒక విధముగా వారివారి నియమిత పనిని చేయగా, రోగములు,
మేఘములు కూడ నియమిత పనినే చేయుచున్నవి. అందువలననే రోగములకు, వాటి వాటి పనిని బట్టి ఒకదానిని
మలేరియా రోగము అంటాము, మరొక దానిని మశూచి రోగము అంటాము. బయట మనకు కనిపించే ప్రభుత్వములో
బిల్ కలెక్టర్కు, జిల్లాకలెక్టర్కు ఎంత తేడా ఉంటుందో అట్లే కనిపించని దేవుని పాలనలో కూడ మలేరియాకు, మశూచికి
ఎంతో కొంత తేడా ఉండును. ఈ విధముగా దేవుని పాలనను విశ్లేషిస్తూ పోతే, ఒక రోగమునకు మరొక రోగమునకు,
ఒక మేఘమునకు మరొక మేఘమునకు, ఒక గ్రహమునకు మరొక గ్రహమునకు వాటి నియమిత పనులలో ఎన్నో
తేడాలుండును.
మహాభూతములు, స్వల్పభూతములు, ఉపభూతములు అన్నియు జీవరాసుల కర్మలను పాలించునవియే కానీ,
జీవులవలె కర్మను అంటించు కొనవు. మూడు రకముల భూతములకు కర్మలు అంటుకొను విధానము లేదు. అన్ని
జీవరాసులకు ఉన్నట్లు, మూడు రకముల భూతములకు మనో, బుద్ధి, చిత్త, అహములు లేవు. అందువలన ఒక
మేఘము వర్షించి వరదను కల్పించి ఎందరినో దయా, దాక్షిణ్యము లేకుండ చిన్నపిల్లలను సహితము చంపివేసినా, ఆ
మేఘమునకు అంతమందిని చంపిన పాపము అంటదు. మహాభూతములకుగానీ, స్వల్పభూతములకుగానీ,
ఉపభూతములకుగానీ గుణములుండవు. అందువలన పాపము చేసిన వానిని నిర్దాక్షిణ్యముగా చంపివేయుచున్నవి.
ఏమాత్రము ప్రేమగానీ, ఏమాత్రము దయగానిలేని రోగము, పాపము అమలుకొచ్చినపుడు మనిషి పాలుత్రాగే ప్రాయములో
ఉన్నా, మధ్యవయస్సులో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా హింసించుట మానుకోదు. పాలుత్రాగే ప్రాయములో మశూచి
(పెద్దఅమ్మవారు) లేక బొబ్బల రోగమువస్తే, ఒకటిన్నర సంవత్సరము పిల్లవాడు బాధ అనుభవించ లేక ఏడుస్తుంటే,
పిల్లవానిని చూచే తల్లిదండ్రులు దేవునికి దయలేదనినా, దేవునికి న్యాయములేదనినా, పిల్లవాడు ఇంతగా బాధపడుచుంటే
దేవునికి మ్రొక్కినా, కొంతైనా కరుణ కలుగలేదనినా, పాపమును రోగము అమలు చేసి తీరును. ఒకవేళ పిల్లవాని
పాపము ఎక్కువవుంటే రోగము చంపి వేయవలసివచ్చును. మనస్సుగాని, దయగాని లేని రోగము పిల్లవానిని చంపివేస్తే
తల్లిదండ్రులకు కోపమువచ్చి దేవున్నే నిందించడము, దేవుడు గ్రుడ్డివాడనడము జరుగుతుంది.
దేవుని ప్రభుత్వ విధానమును, పరిపాలనా విభాగములను తెలియని ప్రజలు తమ కర్మలను గుర్తుచేసుకోకుండ
దేవునికి న్యాయము లేదని, దేవునికి దయలేదని నిందించుట జరుగుచున్నది. ఏదైనా చాలా బాధాకరమైన సంఘటన
జరిగినా, అల్లారుముద్దుగా ప్రేమగా పెంచుకొన్న పిల్లవాడు చనిపోయినా, అంతవరకు దేవుడున్నాడని కొంత నమ్మకమున్న
వారు కూడ ఆ సంఘటనతో దేవుడేలేడను నిర్ధారణకు వస్తారు. కొందరైతే దేవుడు కనపడలేదు కావున సరిపోయింది.
ఒకవేళ దేవుడు కనిపిస్తే చెప్పుతో కొట్టేవాడిని అని తిట్టడము స్వయముగా నేనే విన్నాను. ఆరు సంవత్సరముల
వయస్సున్న ఆడపాప రోడ్డు ప్రమాదములో చనిపోతే, ఆ ప్రమాదములో బ్రతికిన వారు “మేమంటే పాపము చేసివుంటాము,
మేము చనిపోయినా సరిపోతుంది. కానీ చిన్నపిల్ల ఏమి చేసింది? ఎన్నో పాపములు చేసిన వారము మేముంటే, మాకు
ఏమి జరుగకుండ చిన్నపిల్ల చనిపోవడము చూస్తే దేవునికి కళ్ళు ఉన్నాయా? దేవుడు గ్రుడ్డివాడు కాదా, కనిపిస్తే
దేవుడని కూడ లెక్కచేయకుండా తన్నేవాడిని, అని ఒక పెద్దమనిషి ఏడుస్తూ అనడము జరిగింది. అతను బాధతో అలా
అనడమును చూస్తే దేవుడు చంపలేదు, చంపినవారు వేరేవాళ్ళు అని అతనికి తెలియక పోవడము వలన అలా
మాట్లాడడము జరిగినది. ఈ విధముగా దేవుని పరిపాలన తెలియని వారందరూ మాట్లాడడము జరుగుచున్నది.
దేవుని పరిపాలనా విధానము ఏ విధముగా ఉన్నదీ, సామాన్య ప్రజలకేకాక, మేము జ్ఞానులము అని అనుకొను
వారికి కూడ ఏమాత్రము తెలియదు. దేవుని పరిపాలన, అందులోని విభాగములు ప్రత్యక్షముగా మనముందున్నా
వాటిని గ్రహించలేక పోయాము. రోగాలు, మేఘాలను మనము నిత్యము చూస్తున్నా, ఇవి ఎందుకిలా ఉన్నాయి అని
ఆలోచించ లేకపోయాము. ప్రత్యక్షముగా దేవునిపాలన మనముందరే సాగుతున్నా ఇది ప్రత్యక్షనరకమని తెలియక,
నరకము ఎక్కడో ఉన్నదని వ్రాసుకొన్నాము. పాపము అంటే ఏమిటో తెలియక దాని ధ్యాస కొంచెమైనా లేక ధన
మదాంధులై కొందరు, అధికారమదముతో గ్రుడ్డివారై కొందరు, దైవజ్ఞానము అను వాసనలేని అజ్ఞాన అంధకారులై
సులభముగా పాపమును మూటకట్టు కొంటున్నారు. ప్రస్తుతము సుఖములను అనుభవిస్తూ డబ్బూ, అధికారము
ఉంటే, అతను దేవున్నిగాని, దేవుని జ్ఞానముతో కూడుకొన్న జ్ఞానులను, యోగులను గానీ లెక్కచేయకుండ మాట్లాడుతున్నాడు.
పాపము అంటే భయము లేని పనులను చేయుచున్నాడు. దానివలన సంభవించు భయంకర పాపమును అనుభవించలేక,
దేవునివద్ద న్యాయము లేదు, దయలేదు అంటున్నాడు. జరిగిన రోజులలో తన ఇష్టప్రకారము నడుచుకొని పాపభీతి
లేకుండ ప్రవర్తించి, పాపమును సంపాదించుకొని, లెక్కప్రకారము అనుభవించవలసి వచ్చినపుడు మాత్రము దేవుడు
జ్ఞప్తికి వస్తాడు. దేవుని దగ్గర న్యాయము లేదంటారు.
దేవుడు సృష్ఠిఆదిలో పాపపుణ్యముల సంపాదన, దాని అనుభవము లైన నరక స్వర్గములు అన్నియు భూమిమీదనే
ఉండునట్లు, తన పరిపాలన ద్వారా లెక్కప్రకారము పాపములను అనుభవించునట్లు నిర్మించిపెట్టాడు. దానిప్రకారమే
అన్నీ జరుగుచున్నవి. స్వర్గము, నరకములు రెండు మనిషి భూమిమీదనే పాలనాభూతముల ద్వారా అనుభవించునట్లు
దేవుడు ఏర్పాటు చేసిపెట్టాడు. తన పరిపాలనలో శిక్షలు, వాటిని అమలు చేయు భూతములు అన్నీ ఉండగా, ప్రతి
మతములోని వారు ఎక్కడో స్వర్గము, నరకములు ఉన్నాయనుట ద్వారా ఏ మతములోను దేవుని పరిపాలన తెలియలేదని
అర్థమగుచున్నది. ఒక్క హిందూమతమేకాక, ఇతర మతముల వారు కూడ దేవుని జ్ఞానమును తెలిసినవారమని
చెప్పుకొనుచూ, స్వర్గనరకముల నిజ స్థితినీ, దేవుడు అమర్చిన ప్రత్యక్షనరకమును, ప్రతక్షస్వర్గమును తెలియలేక పై
లోకములో స్వర్గముందని, క్రింది లోకములో నరకముందని చెప్పు చున్నారు. అలా అసత్యమును చెప్పడము వలన
దైవజ్ఞానము పట్ల ఇంకా పాపము చేసినవారగుచున్నారు.
దేవుని పాలనా విషయము తెలియనివారు, దేవుడు మనిషిని సృష్టించి భూమిమీద వదలి తాను ఎక్కడో పైన ఉ
న్నాడనీ, పై లోకములోనున్న దేవుడు అక్కడ మానవుని కొరకు స్వర్గము, నరకము ఏర్పాటు చేశాడనీ, భూమిమీద
పాపపుణ్యము సంపాదించుకొన్నవారు, అక్కడకు పోయి ముందు నరకమును అనుభవించి, తర్వాత స్వర్గమునకు పోవుదురనీ,
పుణ్యమును స్వర్గములో అనుభవించిన తర్వాత, తిరిగి భూమిమీద పుట్టుచుందురని హిందువులు చెప్పుచుండగా!
ఇతర మతములవారు నరకము అయిపోయిన వెంటనే స్వర్గములో హాయిగా ఉందురని తిరిగి ఎవరు పుట్టరని, పునర్జన్మలే
లేవని చెప్పుచున్నారు. ఈ విధముగా అన్ని మతములవారు మాయ ప్రభావముచేత అజ్ఞానదశలో ఉండి, దేవుని
పరిపాలన ప్రత్యక్షముగా భూమి మీద ఉందనీ, స్వర్గ నరకములు భూమిమీద ఉన్నాయనీ, మనము నిత్యము అనుభవించు
సుఖములే స్వర్గసుఖములని, నిత్యము అనుభవించు కష్టములు బాధలు దుఃఖములు అన్నియు నరకములనీ తెలియక
భ్రమలో మునిగి యున్నారు. భూమిమీద ఏమాత్రము రాయితీలేని దుఃఖములను తాను అనుభవిస్తున్నా, భయంకరమైన
బాధలను ఎదుటివారు అనుభవిస్తున్నా మనముందరే జరుగు హింసలు ఎక్కడివనీ, దేని కారణముతో వస్తున్నవని
యోచించక గ్రుడ్డిగ అనుభవిస్తూ, ఎప్పుడో చచ్చిన తర్వాత యమలోకము వస్తుందనుకోవడము పొరపాటు కాదా?
యమలోకము ఒకటున్నదని దానిలో యమధర్మరాజు ఉన్నాడని అట్లే మన పాపములను లెక్కించు
చిత్రగుప్తుడున్నాడని కూడ చెప్పుచున్నారు. అటువంటివారు, శరీరములో చైతన్యశక్తియై, శరీరమును కదిలించి నడిపించు
ఆత్మ చిత్రగుప్తుడు అని తెలియలేకపోయారు. దండనాధికారులలో రాజు అయిన యమధర్మరాజు విశ్వమంతా వ్యాపించిన
పరమాత్మ అని తెలియలేక పోయారు. శరీరములో చిత్రగుప్తుడు లెక్కించిన పాపముల ప్రకారము చిత్రహింసలు
భూమిమీదనే అనుభవిస్తున్నామని తెలియలేక పోయారు. ఏ విధముగ చూచినా, దైవజ్ఞానము ప్రకారము, బ్రహ్మవిద్యా
శాస్త్రము ప్రకారము, ఈ భూమండలమే పాపము చేసినవారికి యమలోకము, పుణ్యము చేసినవారికి స్వర్గలోకముగా
ఉన్నది. శరీరములో ఎవరికి తెలియకుండ గుప్తముగావున్న ఆత్మయే చిత్రగుప్తుడు. తానే అన్నీ చేస్తూ, ఏమి చేయనివానివలె
ఉంటూ, దేనిని చేసినా దానిని ఏమాత్రము అనుభవించనివాడై, దేనిని చేసినా దాని పాపమునుగానీ, పుణ్యముగానీ
అంటనివాడై, తన పనులు కనిపిస్తున్నా, తాను కనిపించక దేహములో అంతటా నిండియుండినా, శరీరములో తనను
ఎవరూ గుర్తించనట్లు విచిత్రముగా శరీరములో దాగియున్న ఆత్మను తెలిసిన జ్ఞానులు, ఆత్మ ఇటువంటిది అని
అర్థమగులాగున ఆత్మను చిత్రగుప్తుడు అన్నారు. ఈ విధముగా మన శరీరములోనే చిత్రగుప్తుడు అనుపేరుకల్గి, మనము
చేసుకొన్న పాపములను లెక్కించి అనుభవింపచేయుచున్న ఆత్మను తెలియకున్నాము. మనిషి అనేక పాపములను
సంపాదించుకొనుచు, దానికంటే ముందు జన్మలలో సంపాదించుకొన్న పాపములను అనుభవిస్తూవున్నాడు. ఇతరులు
అనుభవిస్తున్న నరక బాధలన్నిటిని ప్రత్యక్షముగా చూస్తున్నా, వాటిని ఏమాత్రము లెక్కించక యమధర్మరాజు, యమలోకము,
చిత్రగుప్తుడు, నరకము ఎక్కడో ఉన్నాయనుకోవడము మనలో ఉన్న అజ్ఞానము కాదా? మనిషి తన అజ్ఞానమును
లేకుండ చేసుకొని జ్ఞాననేత్రముతో చూడగలిగితే, స్వర్గనరకములు భూమి మీదనే ఉన్నాయని తెలియగలవు. వాటిని
అనుభవింపజేయుటకు ముఖ్యపాత్రవహించునవి పంచ మహాభూతములు, పంచ స్వల్పభూతములు కాగ అనేక పాత్రలుగా
అమలు చేయునవి ఉప భూతములని తెలియుచున్నది.
పంచ మహాభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని గురించి కొంతమందికి కొద్దిగా అయినా
తెలిసియుండును. పంచ స్వల్ప భూతములను గురించి, అవి చేయుచున్న కార్యములను గురించి బహుశ చాలామందికి
తెలియదు. అలాగే ఉపభూతములను గురించిగానీ, వాటి పనిని గురించిగానీ, అవి ఉన్నాయనిగానీ ఎవరికీ తెలియదనే
చెప్పవచ్చును. ఇన్ని విభాగములుగ దేవుని పరిపాలన నిర్ణయించబడి ఉన్నదనీ, ఆ పరి పాలనలో ఎవరు, ఏ పనిని
చేసినా వాని శరీరములోని ఆత్మయే దానిని వదలక కర్మరూపములో, కర్మచక్రములోని పాపపుణ్యముల స్థానములలో
దానిని నిలువచేయునని, తర్వాత జన్మలలో దానిని అమలుచేసి జీవుని చేతనే అనుభవింపచేయునని, గొప్ప
ఆధ్యాత్మికవేత్తలమనుకొను వారికి కూడ తెలియదు. ఇక్కడ కొందరు మమ్ములను ఈ విధముగ ప్రశ్నించ వచ్చును.
“మీకే అన్ని తెలిసినట్లు, మీకు తప్ప పెద్దస్వామీజీలకు, పీఠాధిపతులకు, గురువులుగానున్న వారికి తెలియదని చెప్పడము
వలన అందరిని కించపరిచినట్లు కాదా? మీకిది మంచి పద్ధతా?” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఏమనగా! మీరన్నట్లు అలా చెప్పడము మంచిపద్దతా? కాదా? అని లెక్కించి చూస్తే, ప్రపంచ విధానము ప్రకారము
ప్రపంచ విషయమేదైనా ఎదుటి వానికి తెలియకున్నా నీకు తెలియదని బహిరంగముగా చెప్పడము అతనిని
అవమానపరిచినట్లే అగును. ఎవరైనా అలా చెప్పడములో వానిలోని గర్వము అను గుణము వలన జరిగినదనియే
చెప్పవచ్చును. కానీ ఇక్కడ చెప్పువిషయము దైవసంబంధ జ్ఞానవిషయము. ఇది ప్రపంచ విధానము కాదు, పరమాత్మ
విధానములో చెప్పునది. దేవుని విషయములో మాన, అవమానముల ప్రసక్తి ఉండదు. కేవలము సత్య అసత్యముల
ప్రసక్తే ఉండును. దేవుని విషయములో తెలిసి సత్యమును చెప్పకపోతే దైవద్రోహమగును. ఇతరులు బాధపడుదురని
సాటి మనుషులను గురించి, దేవుని విషయము దాచడము వలన దేవునికంటే మనుషులకే ఎక్కువ విలువనిచ్చినట్లవుతుంది.
అట్లు చేయడము మంచిదికాదు. ఎవరు ఏమనుకొన్నా దైవవిషయములో సత్యమును చెప్పడము వలన అప్పటికది
అవమానముగా కొందరికున్నా, తర్వాత వారికి కూడ మార్గదర్శకమగును. ఒక మందు మ్రింగేటప్పుడు చేదుగావున్నా,
మ్రింగేవానికి ఇబ్బందిగా ఉన్నా కొంతకాలము తర్వాత ఆ మందే వానిలోని రోగమును పోగొట్టి మంచి ఆరోగ్యమును
చేకూర్చినట్లు, మేము చెప్పిన సత్యమైన జ్ఞానమను మందు, ప్రస్తుతానికి కొందరికి చేదుగా అనిపించినా తర్వాత కాలములో
ఇదే జ్ఞానము వలన వారిలోని అజ్ఞాన రోగమంతా పోయి సంపూర్ణ జ్ఞానులు కాగలరు. అందువలన మేము చెప్పుమాటలు
కొందరికి ఇబ్బందిగా ఉండినా పరవాలేదు. తర్వాత, వారికి మా మాటలు మంచి జ్ఞానమార్గమును చూపునను
ఉద్దేశముతోనే ఉన్నదున్నట్లు చెప్పవలసివచ్చినది.
ఎవరికీ తెలియకుండ తమ పనిని తాము చేయుచు, ఎక్కడా దైవ నిర్ణితమగు పాలనా చట్టమైన ధర్మములను
అతిక్రమించకుండా, ప్రకృతి జనితములైన దయా గుణమునుగానీ, కోప గుణమునుగానీ, ప్రేమనుగానీ, అసూయనుగానీ
లేకుండ, జీవుని కర్మప్రకారము ప్రవర్తించు ఉపభూతము లను గురించి ఇప్పుడు తెలుసుకొందాము. మనకు బాగా
అర్థమగుటకు అసంఖ్యాకములైన ఉపభూతములలో ముందుగా “రోగము ఒక భూతము" అను విషయమును గురించి
చెప్పుకొందాము. శరీరములో రెండు రకముల శరీర బాధలు ఏర్పడును. వాటిని ఒకటి రోగము, రెండు జాడ్యము
అని చెప్పవచ్చును. శరీరములో ఏర్పడు బాధలన్నిటిని రోగములని చాలామంది అనుచుందురు. అలా ఉన్న బాధలన్ని
రోగములుకావు. కొన్ని రోగములు కావచ్చును, కొన్ని జాడ్యములు కావచ్చును. రోగము అనగా శరీరములో ఏర్పడు
జబ్బు అని చెప్పవచ్చును. ఉదాహరణకు మలేరియా, టైఫాయిడ్, కలరా, శబ్ది (గనేరియా), శవాయి (సిల్లిస్), క్షయ
(టి.బి) కుష్టు, గజ్జి, తామర, అతిసారము (బేదులు), రాచపుండు (క్యాన్సర్) మొదలగు అనేక రోగములున్నవి. శరీరము
బయటినుండి వచ్చి, శరీరములో ప్రవేశించునవి రోగములు లేక జబ్బులు అని చెప్పవచ్చును. జబ్బు శరీరములో
కొంత కాలముండి పోవచ్చును. జబ్బు శరీరము బయటినుండి వచ్చినది, కావున అది తిరిగి శరీరమును వదలి
బయటికే పోవచ్చును. కానీ జాడ్యము అలా కాదు. జాడ్యము శరీరము బయటినుండి రాదు తిరిగి శరీరమువదలి
బయటికి పోదు. శరీరములోనే ఉత్పన్నమగు బాధను జాడ్యము అంటాము. ఉదాహరణకు మోకాళ్ళ కీళ్ళ నొప్పులు,
ఉబ్బసము, మధుమేహము (సుగర్వ్యాధి), చత్వారము (గ్రుడ్డితనము లేక చూపు తగ్గుట), ముసలితనము, చర్మము
ముడుతలు పడడము, గ్రంథుల పని తగ్గిపోవడము, నరములు బలహీనపడిపోవడము, శరీరము సహజత్వమును
కోల్పోవడము మొదలగున వన్నియు జబ్బులుకాదు జాడ్యములు అని చెప్పవచ్చును.
జాడ్యము అనగా! శరీరము తన సహజత్వము కోల్పోయి అవయవములలో కార్యలోపములు పెరిగి పోవడము
లేక శరీరములోని అవయవములకు వయస్సు అయిపోవడము వలన ఏర్పడు రుగ్మతలను జాడ్యము అంటాము. వయస్సు
అయిపోయి వృద్ధాప్య సూచనలు కనిపించి నపుడు దానిని రోగము అనము కదా. అలాగే శరీరములోని అవయవముల
పని సామర్ధ్యమును సహజముగ కోల్పోతే దానిని రోగమనుటగాని, జబ్బు అనుటగానీ జరుగదు, దానిని జాడ్యము
అనాలి. శరీరములో క్లోమరస గ్రంథి (ప్యాంక్రియాస్ గ్లాండ్) తన సామర్థ్యమును కోల్పోతే, దానివలన డయాబెటిస్
(సుగర్) వ్యాధి వస్తే, ఆ వ్యాధిని జాడ్యము అంటాము. సామర్థ్యమును కోల్పోయిన దానిని ఎవరూ బాగుచేయలేరు.
అందువలన మందుల వలన సుగర్వ్యాధి నయముకాదు. మందుల వలన క్లోమరస గ్రంథి తిరిగి పని చేయునట్లు ఏ
డాక్టరు వైద్యమును చేయలేడు. ఆ గ్రంథి ఉత్పత్తి చేయలేని ఇన్సులిన్ హార్మోనును బయటినుండి పంపి శరీరములో
ఇన్సులిన్ అవసరమును తీర్చవచ్చును. కానీ ఇన్సులిన్ మందుకాదు, సుగర్ వ్యాధి రోగముకాదు. దీనినిబట్టి శరీరములో
ఏర్పడు రుగ్మతలలో కొన్ని సహజసిద్ధమైన జాడ్యములుకాగా, కొన్ని మాత్రము రోగములుగా ఉన్నవి. అటువంటి
రోగములు కొన్ని మందులతోను, కొన్ని మంత్రముల తోను పోవునవి ఉండగా, మరికొన్ని అరుదుగా మందులకు గానీ,
మంత్రములకుగానీ, పోని రోగములు కూడ కలవని ముందే చెప్పుకొన్నాము. అలా ఎందుకు జరుగుచున్నదని వివరముగా
తెలుసుకోవాలంటే రోగము అంటే ఏమిటో దానిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
మన శరీరములో వచ్చు ఏ రోగమైనా అది కూడా ఒక భూతమే అనగా జీవముకలది అని అర్ధము. ఒక
జీవున్ని భూతము అనికూడ అనవచ్చునని ముందే చెప్పుకొన్నాము. కొన్ని కోట్ల జీవధాతుకణ సముదాయమును ఒక
సజీవ శరీరము అని అంటున్నాము. సజీవ శరీరమును ఒకవ్యక్తి అంటున్నాము. వ్యక్తి కనిపిస్తాడు, వ్యాధి కనిపించదు.
వ్యక్తికి ఉద్దేశము, కార్యము ఉన్నట్లు, వ్యాధికి కూడ ఉద్దేశము, పని రెండూ ఉన్నాయి. వ్యాధి అను పేరు మొదట ‘వ్యక్తి’
అనుపేరుకు దగ్గరగా ఉన్నట్లు “వ్యధి” అని పిలువబడేది. కాలక్రమమున వ్యధి అను పేరు చివరకు 'వ్యాధి'గా మారినది.
వ్యాధినే అందరు రోగము అని పిలుస్తున్నారు. కొన్ని కోట్ల జీవక్రిముల సముదాయము ఒక రోగముగా ఉన్నది.
ఉదాహరణకు ‘కలరా’ రోగమును తీసుకొందాము. కలరా అనునది అందరికి తెలిసినట్లు ఒక రోగమే. కానీ అందరికి
తెలియనట్లు అది కూడ ఒక ఉపభూతముగా ఉన్నది. ఉపభూతమైన కలరా తన క్రిమిసముదాయము చేత మనుషుల
లోనికి వ్యాపించగలదు. మనిషిలోనికి చేరిన కలరా, ఆ మనిషిని 48 గంటలలోనే చంపగలదు. దీనినిబట్టి చూస్తే
కలరా రోగమునకు మనుషులను చంపాలను ఉద్దేశముకలదని తెలియుచున్నది. ఒక మనిషిని చంపాలను ఉద్దేశముతో
అతనియందు చేరి అతని శరీరములో బలపడి చివరకు అతనిని చంపివేయుచున్నది. అలా ఎందుకు చేయాల్సివచ్చిందంటే,
ఆ మనిషి చేసుకొన్న పాపము అలా ఉంటుంది. ఒక మనిషి చేసుకొన్న పాపమునుబట్టి అతనిని ఎంతవరకు, ఏ స్థాయి
బాధతో, ఎట్లు హింసించాలో అట్లే హింసించి అతనిని చంపడము జరుగుచున్నది. అందువలన ఒక కలరా రోగికి,
మరొక కలరా రోగికి వారివారి కర్మల ప్రకారము, వారివారి అనుభవములు కూడ తేడాగా ఉండును.
ఒక వ్యక్తి కర్మప్రకారము కలరా రోగము అతని శరరీములోనికి చేరి, రెండు లేక మూడు రోజులు అతనిని
బాధించి, చంపకుండ వదలి వేయవలసివుంటే, అలాగే మనిషిలోనికి చేరిన కలరా, రెండు మూడు రోజులు బాధించి,
అతను వాడిన మందుల వలన అతనిని వదిలిపోయినట్లు మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి అలా వదలి పోవలసిన
కర్మ ఉంటేనే మందుల సాకుతో వదలిపోవును. దీనినిబట్టి కలరా రోగము మందుల వలన పోవునని తెలియుచున్నది.
ఒక్కొక్కప్పుడు కలరా చేరిన వ్యక్తికి కర్మ బలీయముగా ఉండి చనిపోవలసిన నిర్ణయము జాఫథకము (జాతకము)లో
ఉంటే, అతనికి ఎన్ని ఖరీదైన మందులు వాడినా, ఎంత గొప్ప డాక్టర్లు వైద్యము చేసినా, వాటన్నిటిని కలరా అతిక్రమించి
అతనిని చంపివేయును. ఒకవేళ ఒక వ్యక్తికి కర్మబాధ, అనుభవించు వరకు మాత్రమేవుండి, చనిపోవలసినది
లేదనుకొనుము, ఆ వ్యక్తికి వైద్యము కూడ అందలేదనుకొనుము, వైద్యము అందకున్నా అతని కర్మానుసారము కలరా
ప్రవర్తించి అతనిని వదలి పోవుచున్నది. కలరా రోగము వచ్చిన తర్వాత మందులు వాడకున్నా బ్రతికిన వారిని నేను
చూచాను. కొందరు మందులు వాడినా చనిపోయిన వారిని చూచాను. అలాగే మందులు వాడిన తర్వాత కలరా
రోగము వదలి పోయిన వారిని కూడ చూచాను. మనకు కనిపించని కర్మను అనుసరించి కలరా రోగము యొక్క ఆత్మ
ఆదేశానుసారము లేక ఆత్మ ఆడించునట్లు కలరా అడుచున్నది. భూమిమీద ప్రతి జీవుడు ఆత్మ ఆడించినట్లు ఆడవలసిందే.
ఆ సూత్రము ప్రకారము కలరా కూడ జీవత్వము కలదే, కావున ఆత్మ ఆదేశానుసారము పనిచేయుచున్నది. ఆత్మ
జీవునకున్న కర్మానుసారము కలరాను ఆదేశించగా, ఆత్మ ఆదేశమునే తన ఉద్దేశముగా ఉంచుకొని కలరా పనిచేయుచున్నది.
ఇక్కడ ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమనగా! ఆత్మ ఆదేశము మనకు ఏమాత్రము తెలియదు. ఆత్మ
ఆడించుచున్నా, ఆ విషయము మనకు తెలియక చేయునదంతా నేనే అని మనిషి అనుకొనుచున్నాడు. కానీ ఆత్మ
ఆదేశము రోగమునకు తెలియును. రోగము తాను చేయుచున్న పని, ఆత్మ ఆదేశముతో చేయుచున్నానని తెలిసి
చేయుచున్నది. ఆత్మ ఆదేశమునే తన ఉద్దేశముగా పెట్టుకొని పనిని చేయుచున్నది. తన ప్రత్యేకత ఏమిలేని రోగము,
ఎవరిని బాధించినా, ఎంత బాధించినా, ఆ రోగమునకు కర్మ అంటదు. ఒక జీవుని కర్మానుసారము ఆత్మ పనిచేయగా,
ఆత్మానుసారము రోగము పనిచేయుచు, ఆ జీవున్ని అనుభవింపచేయుచున్నది. అందువలన జీవుని కర్మానుసారము
పనిచేయు ఆత్మకుగానీ, ఆత్మానుసారము పనిచేయు రోగమునకుగానీ ఏ కర్మలు అంటవు.
రోగము సజీవమైనదే అయినప్పటికీ, దేవుని పరిపాలనా వ్యవస్థలో పనిచేయు సైనికునిలాంటిది. ఒక సైనికుడు
ప్రభుత్వ ఆదేశానుసారము శత్రువులను ఎంతమందిని చంపినా, ఎంతమందిని హింసించినా ఆ సైనికుణ్ణి హంతకుడు
అనము, అతనికి ఏ కేసులుండవు. అలాగే ఒక రోగము ఆత్మ యొక్క ఆదేశానుసారము మనుషులను ఎంతమందిని
చంపినా, ఎంత మందిని హింసించినా, ఆ రోగమునకు పాపము అంటదు, దానికి అనుభవము ఉండదు. “నానా
రూపేణా కాల కింకరః” అను వాక్యమును పెద్దలు చెప్పియున్నారు. కింకరుడు అనగా సైనికుడని అర్థము. కాలము
అనగా దేవుడు అని అర్థము. కాలకింకరులు అనగా దేవుని సైనికులని అర్థము. నానా రూపేణ అనగా అనేక
రోగముల రూపముతో అని ఈ సందర్భములో అర్థము చేసుకొందాము. దీనిప్రకారము కలరా దేవుని ప్రభుత్వములో
ఒక సైనికునిగా పని చేయుచున్నదని తెలియుచున్నది. మనుషులు చేసుకొన్న పాపమునుబట్టి, కలరా కొందరిని
బాధించి వదిలి వేయుచున్నది. కొందరిని బాధించి చంపివేయుచున్నది. ఒక మనిషిని మరొక మనిషి బాధించితే
పాపము వస్తుంది. కానీ కలరా అను జీవుడు మనిషి అను జీవుణ్ణి బాధించితే పాపమురాదు. అట్లు రాకుండుటకు
కలరా సాధారణ జీవుడుకాదు, దేవుని పరిపాలనలో పనిచేయుచున్న జీవుడు (సైనికుడు). అందువలన కలరా అను
వ్యాధి పాపపుణ్యములకు, ప్రేమ, ద్వేషములకు అతీతముగా ఉండి ఆత్మను గౌరవిస్తున్నది. ఆత్మను గౌరవించడమే
కాక, ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న యోగులను కూడ గౌరవిస్తున్నది. అట్లని కర్మ విషయములో యోగులకు రాయితీ
ఏమీ ఉండదు. కర్మయున్నపుడు యోగినైన రోగము బాధించవలసివస్తుంది. ఆత్మ ఆదేశానుసారము పనిచేయు కలరా,
ఆత్మజ్ఞానముగల యోగియొక్క ఆజ్ఞను కూడ పాటించును. అందువలన యోగీశ్వరులు చెప్పితే ఒక శరీరములోనున్న
కలరా కూడ, ఆ శరీరమును వదిలి బయటికిపోవును. ఇక్కడ మందుగానీ, మంత్రముగానీ లేకుండనే కేవలము
నోటిమాటతో కలరా రోగము బయటికి పోవడము జరుగుచున్న దంటే, ఆత్మ ఆదేశమును పాటించిన కలరా, యోగీశ్వరుల
ఆదేశమును కూడ పాటించుచున్నది. యోగులమాట రోగము వినునని తెలిసినా ప్రకృతిసిద్ధమైన రోగమును, ధర్మబద్ధమైన
యోగి ఎప్పుడూ ఆదేశించడు. ఎప్పుడైనా దైవజ్ఞానము ప్రచారమగుటకు, జ్ఞానశక్తి ఇంతటి గొప్పదని తెలుపుటకు,
నిరూపణ నిమిత్తము అరుదుగా యోగి ఉపభూతమైన రోగమును ఆదేశించును. అప్పుడు అది ఎంత పెద్ద రోగమైనా
యోగి మాటను గౌరవించి, యోగీశ్వరుల ఆదేశానుసారము నడుచుకొనును.
ఒక శరీరములోని జీవుడు చేసుకొన్న పాపమును అనుభవింప చేయుటకు, కాలకింకరులు అను తన సేనను
దేవుడు తయారుచేశాడు అనుకొన్నాము కదా! సేన లేక సైన్యము అనగా ఎంతో సంఖ్య ఉంటుంది. అందులోను ఎన్నో
విభాగములు ఉంటాయి. సైన్యములో 1. సిపాయి 2. నాయక్ 3. హవల్దార్ 4. సుబేదార్ 5. కాప్టన్ 6. మేజర్ 7.
లెఫ్టినెంట్ కల్నల్ 8. కల్నల్ 9. బ్రిగేడియర్ 10. జనరల్ హెూదాలు ఉన్నట్లు, హెూదాలకు తగినట్లు వారి
అధికారబలమున్నట్లు, కాలకింకరులు అను సైనికులు కూడ హెూదాలు కలిగియున్నారు. హెూదాలు బయటికి
కనిపించునవి కావు. బయటి హెూదాలవలె అధికారబలములో తేడాలు ఉండక, వారిశక్తి సామర్థ్యములలో తేడాలుండును.
బాగా అర్థమగుటకు ఉదహరించి చెప్పుకొందాము. ఒక పల్లెటూరు ఉందనుకొందాము. ఆ చిన్న గ్రామములో ఒక
వెయ్యి ఇళ్ళు ఉన్నాయనుకొందాము. ఒక ఇంటికి సగటుకు పదిమంది ఉన్నారనుకొందాము. వెయ్యి ఇళ్ళకు ఇంటికి
పదిమంది ప్రకారము పదివేల మంది జనసంఖ్య ఉన్నారనుకొనుము. పదివేలమందికి కర్మప్రకారము ఒక కాలములో
ఆ
కలరా వ్యాధి ఊరంతా వ్యాపించి, పదివేలమందిని బాధించును. అందులో కొందరిని చంపివేయును, కొందరిని
బాధపెట్టి వదలివేయును. ఊరిలోనికి కలరారోగము ప్రవేశించిన వెంటనే డాక్టర్లు స్పందించి ఊరందరికి వైద్యము
చేసినా, కొందరు చనిపోవడము, కొందరు మిగలడము జరిగినది. చనిపోయిన వారు 2% శాతము, బ్రతికి మిగిలిన
వారు 98% శాతము. చనిపోయినవారు రెండువందల మందికాగ, బ్రతికి బట్టకట్టినవారు తొమ్మిదివేల ఎనిమిది
వందల మంది అని అర్థమగుచున్నది.
పదివేలమంది గల చిన్న ఊరిలో, ఒక్కమారుగా కొన్ని దినముల తేడాతో కలరావ్యాధి అందరికి తగలడము
జరిగినది. నాలుగు లేక ఐదు రోజుల తేడాతో ఊరంతా వ్యాపించిన కలరా అను భూతము (జీవాత్మ) ఒక్కటేనా, లేక
ఒక్కొక్కరికి ఒక్కొక్క కలరా భూతము చేరినదా అని కొందరికి ప్రశ్నరావచ్చును. దానికి మా జవాబు ఏమనగా! కొన్ని
కోట్ల జీవక్రిమి సముదాయముకల్గిన కలరా భూతము ఒక్కటియే, ఒక ఊరంతా వ్యాపించ గలదు. ఒక ఊరేకాదు, ఆ
ఊరి చుట్టుప్రక్కల గ్రామాలకు కూడ ప్రాకగలదు. అలా ఒకే కలరా భూతము ఒక జిల్లా మొత్తము వ్యాపించగల
స్థోమత కల్గియుండును. ఒక గ్రామములోని ఒకరిలో మొదట కలరావ్యాధి కనిపించి, అక్కడినుండి తన జీవక్రిముల
ద్వారా ఇతరులలో వ్యాపించుచుపోవును. అలా ఒక ఊరిలోని పదివేలమందికి కూడ నాలుగైదు రోజులలో వ్యాపించును.
దీనినిబట్టి చూస్తే అనేక హెూదాలు కల్గిన భూతములలో కలరారోగము బయటి సైన్యములో మూడవస్థానములోనున్న
హవల్దార్ హెూదాకు సమానమైన హెూదా కల్గినదని అర్థమగుచున్నది. మూడవస్థాన హెూదా కల్గిన కలరా భూతము
ఒక్కటే ఒక జిల్లానుగానీ, ఒక రాష్ట్రమును గానీ కొన్ని రోజులలోనే అతలాకుతలము చేసి, పీడించి కొందరినైన చంపగలదు
లేక అందరినైన చంపగలదు. మూడవస్థానములోనున్న కలరా భూతము ఒక్కదానికే అంతబలము ఉంటే, అంతకంటే
పెద్ద హెూదాలు కల్గిన ఉపభూతములకు ఎంత బలముండునో సులభముగా అర్థము చేసుకోవచ్చును.
ఇక్కడ మరొక ప్రశ్న అడగవచ్చును. అదేమనగా! భూమండలము అంతటికి కలరాభూతము ఒకటే ఉన్నదా
లేక కలరాభూతములు ఇంకా ఉన్నాయా? ఈ ప్రశ్నకు మా జవాబు ఈ విధముగా ఉన్నది. కలరా ఒక ఉపభూతము,
కొన్ని సమయములలో భూమిమీద మొత్తము వెదికినా కలరా భూతము (రోగము) ఎక్కడా కనిపించదు. కానీ కొన్ని
సమయములలో భూమిమీద అనేకచోట్ల, అనేక రాష్ట్రములలో, అనేక దేశములలో, అనేక ఖండములలో ఒకేమారు
కనిపిస్తున్నది. ఒక్క చోట విస్తరించియున్న కలరాను ఒక్క కలరా భూతముగా లెక్కించితే, వివిధ చోట్ల విస్తరించియున్న
కలరాను వివిధ భూతములుగా లెక్కించవలసియున్నది. అఖండముగ ఒకచోట ఉన్న రోగమును ఒక భూతముగా
లెక్కించవచ్చును. ఖండ ఖండములుగా కొన్ని ప్రదేశములలో వ్యాపించిన కలరాను, వేరువేరు కలరా భూతములుగా
పరిగణించాలి. ఒకే దేశములో యాభైమైళ్ళ దూరము సందుగలిగి, నాలుగు చోట్ల కలరా ఉందనుకొనుము. అప్పుడు
ఒకదాని కొకటి సంబంధము లేకుండ యాభైమైళ్ళ దూరములో ఉండుట వలన, ఆ దేశములో నాలుగు కలరా భూతములు,
ఆ సమయములో ఉన్నవని చెప్పవచ్చును. ఈ విధముగా లెక్కించి చూచితే కలరా భూతము లేక కలరా రోగము
ఒకటికాదు ఎన్నో ఉన్నవని తెలియుచున్నది. మేడిపండు మేలిమైయుండు పొట్టవిప్పిచూడు పురుగులుండు అన్నట్లు,
కలరా రోగమే మనిషి శరీరము మీద కనిపించదు, శరీరములోపల పొట్టయందు, క్రిమిరూపములో (పురుగురూపములో)
వ్యాపించి, ప్రేగుల మీద ఎక్కువ ప్రభావము చూపి, మనిషిని చంపి వేయుచున్నది. అది మనిషిమీద కలరాయొక్క
ముఖ్యమైనదాడి. ఒక మేడిపండు ఎట్లుంటుందో, సరిగా అటువంటి దానినే మేడిపండు అంటాము. అనగా ఒక
మేడిపండుకు మరొక మేడిపండుకు ఎటువంటి తేడా ఉండదు. అలాగే ఒక కలరా రోగము మనిషిమీద ఎలా దాడి
చేయుచున్నదో, అలాగే మరొక కలరా రోగము కూడ అదే విధముగా దాడిచేయును. కలరా రోగములు వేరువేరుగా
ఉండినా, అన్నియు ఒకే లక్షణములు కల్గియుండును. అయితే కలరా రోగములు భూమిమీద ఎన్ని ఉన్నవో సరిగా
చెప్పలేము.
ఇక్కడ కూడ మరొక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! భూమిమీద కొన్ని సమయములలో అక్కడక్కడా
అనేకచోట్ల, అనేక దేశములలో కనిపించు కలరారోగము, కొన్ని సమయములలో భూమిమీద ఎక్కడ తన ఆనవాళ్ళు
కనిపించకుండ పోతుంది. ఆరునెలలుగానీ, సంవత్సరముగానీ, కొన్ని సంవత్సరములుగానీ ఎక్కడ లేకుండా కనిపించ
కుండపోయిన కలరా, తిరిగి అక్కడక్కడ కనిపించి మనుషులను చంపు చున్నది. కొంతకాలము భూమిమీద ఏ ప్రాంతములో
లేని కలరా భూతము (కలరా రోగము) భూమిమీద కనిపించని సమయములలో ఏమైపోయింది? తిరిగి ఎక్కడినుండి
వస్తున్నది? అని మీరు అడిగిన ఈ ప్రశ్నకు మా సమాధానము ఏమనగా! ప్రభుత్వమునకు అధిపతియైన రాజు
(రాష్ట్రపతి) యొక్క ఆజ్ఞతో పనిచేయు సైన్యము బయటి ప్రజలు ప్రవేశించని మిలిటరీ ఏరియా అను ఒక ప్రదేశములో
ఉండును. అవసరము వచ్చినపుడు వారు బయటికి వచ్చి వారు చేయవలసిన విధులు నిర్వహించి తిరిగి వారి
స్థలములోనికే పోవుదురు. అదే విధముగ కలరా అను రోగము కూడ ఒక సైనికుడే కావున కలరాగానీ, మిగత
రోగములను సైన్యముగానీ ప్రజలులేని, ప్రజలురాని నిషిద్ధ స్థలములో నివాసముండును. రాజు లేక రాష్ట్రపతి ఆర్డరును
బట్టి సైన్యము బయటికి వచ్చి పని చేయునట్లు, దైవ నిర్ణయము ప్రకారము కలరా బయటికి ప్రజలలోనికి వచ్చి, తన
కర్తవ్యమును తాను చేయుచున్నది. పని అయిపోయిన వెంటనే తనలాంటి సైన్యమున్న మిలటరీ రెజిమెంట్ ఏరియాలోనికి
పోయి ఉంటున్నది. మిలటరీ రెజిమెంట్ ఉన్న ఏరియాలోనికి ప్రజలు ఎవరు పోకూడదు. అక్కడున్న సైనికులు
ఎప్పుడైనా బయటికిరావచ్చును. కానీ ప్రజలు మాత్రము ఎప్పుడు సైన్యమున్న ప్రదేశము లోనికి పోకూడదు. అటువంటపుడు
సైనికుడు బయటికి వచ్చినపుడే కనిపిస్తాడు. తన ఏరియానుండి బయటికి రానపుడు కనిపించడు కదా! అలాగే ప్రజలు
భూగోళములో ఉన్నట్లు, దేవుని సైన్యము అయిన రోగములు ఖగోళములో ఉన్నవి. ఖగోళములోనున్న రోగములు
ఎవరికీ కనిపించకుండ పోవును. ఖగోళములోని కనిపించని రోగములు, భూగోళము మీదికి వచ్చినపుడు మాత్రమే
కనిపించును. భూమిమీద రోగము, దాని పనిని చూచిన ప్రజలకు, రోగము తిరిగి కనిపించకుండ ఎక్కడికి పోవుచున్నదో
తెలియదు. మేఘము కరిగిపోవునట్లు కనిపించకుండపోవును. తిరిగి మేఘము చిన్నగ పుట్టి పెద్ద ఆకారమును పొందునట్లు,
రోగము కూడ పుట్టి కనిపించును.
ప్రభువు ఆధీనములోని ప్రభుత్వములో పనిచేయు సైన్యమునుగానీ, ఒక సైనికుణ్ణి గానీ, బయటి ప్రజలు
బంధించలేరు. బయటి ప్రజలను బంధించుటకుగానీ, చంపుటకుగానీ సైన్యమునకే అధికారముండును. అందువలన
కలరా రోగమును ఎవరూ బంధించలేరు. అంతేకాక కలరా రోగము ప్రజలలో ఉన్నపుడు మాత్రమే కనిపించి, తిరిగి
కనిపించకుండ ఎక్కడికి పోవునది ఎవరికీ తెలియదు, అట్లే అది ఎక్కడినుండి వచ్చేది కూడ తెలియదు. ఒక్క కలరానే
కాదు, ఏ రోగమైనా ఎక్కడినుండి ఊడిపడుతుందో ఎవరికీ తెలియదు. నేను విజ్ఞానిని అని చెప్పుకొను మనిషి,
ఖండాంతర క్షిపణులను తయారుచేసిన మనిషి, జీవకణాన్ని సృష్టించానని గొప్పలు చెప్పుకొను మనిషి, వివిధ రంగములలో
పనిని చేయు కంపూటర్లను కనిపెట్టిన మనిషి, ఖగోళములో కలియతిరిగి పైనున్న వాటిని గురించి తెలుసుకొన్నానని
చెప్పుకొను మనిషి, దేవుడెవరు, వాని అడ్రస్ ఏమిటి? అని ప్రశ్నించు మనిషికి, చివరకు తన శరీరములోనికి వచ్చు
రోగము ఎక్కడినుండి వచ్చినదో తెలియదు. తన శరీరములోనికి వచ్చిన క్రొత్త రోగము ఎక్కడిదో తెలియనిది, ఇంతకు
ముందు ఎక్కడాలేని రోగము, ఎలా పుట్టుకొచ్చిందో తెలియని మనిషి, నేను విజ్ఞానిని అని చెప్పుకోవడము ఎట్లుందనగా!
ముఖానికి మసిపూసుకొన్న మనిషి, తాను వికారముగా కనిపిస్తున్నా, నేను అందగాడినని చెప్పుకొన్నట్లున్నది.
ముఖానికి మసి ఉందని మరిచిపోయి నేను అందగాడినని చెప్పుకొన్నట్లు, మన శరీరములో రోగమును గురించి
తెలియకున్నా దానిని మరచిపోయి, నేను విజ్ఞానిని అని అనుకోవడము జ్ఞానమవుతుందా? విజ్ఞానమవుతుందా?
జీవక్రిమి సముదాయమైన కలరా, రోగముగా మనుషులకు తెలిసినా మేము దానిని ఒక ఉపభూతముగా
లెక్కించుచున్నాము. ఉపభూతమైన కలరా రోగము దైవజ్ఞానమును తెలిసిన యోగులను మాత్రమే అభిమానించు నని
ముందుకూడ చెప్పుకొన్నాము. యోగులు, ఆత్మను అధ్యయనము చేసిన ఆధ్యాత్మికులు, కావున రోగము వారిమాటను
వినగలుగుచున్నది. అందువలన పూర్వము ఒక యోగి, కలరా రోగమును ఈ ఊరి లోపలికి రావద్దని, ఊరికి
నాలుగువైపులవున్న త్రోవలవద్ద దారికి అడ్డముగా గీతను గీచాడు. రెండు రోజుల తర్వాత కలరా రోగము ఆ
ఊరిలోనికి పోవాలను ఉద్దేశముతో ఒక దారిలో పోయింది. అలా పోయిన ఆ భూతమునకు ఆ దారిలో యోగిచేత
గీయబడిన గీత మెరిసినట్లు కనిపించింది. కలరా ఆ దారిలో పోయిన సమయానికి, యోగి గీచిన గీత కనిపించకుండ
చెదిరి పోయినప్పటికీ, ఆయన ఉద్దేశము గీతరూపములో ప్రకాశించి కలరా భూతమునకు కనిపించింది. అప్పుడు
బాహ్యకంటికి కనిపించని కలరా భూతము, యోగియొక్క ఉద్దేశమును సూక్ష్మముగానే గ్రహించి అక్కడినుండి వెనుతిరిగి
వచ్చింది. దీనినిబట్టి కలరా భూతము యోగిమాటను జవదాట లేదని (గీత దాటలేదని) తెలియుచున్నది. ఇక్కడ మీరు
మమ్ములను ఒక ప్రశ్న అడుగవచ్చును. “ఎవరో గీత గీచితే కలరా దాటలేదని చెప్పుచున్నారు కదా! ఆ విషయమును
మీరు ప్రత్యక్షముగా చూచినది కాదుకదా! ఎవరో చెప్పగా విని మీరు మాకు చెప్పారనుకుంటాము. అలాంటపుడు మీరు
ప్రత్యక్షముగా చూడనపుడు దానిని సత్యమని మేము ఎలా అనుకోవాలి? మీరు చెప్పిన మాట సత్యము అని మీరు
అనుకొన్నా, మేము అనుకొనుటకు ఆధారము లేదుకదా" అని సంశయమును వెలిబుచ్చవచ్చును.
మీ సంశయమునకు మా సమాధానము ఇలాగ ఉన్నది చూడండి. నేను ముందే నా జీవితము హేతువాద
పద్ధతిలో మొదలైనదని చెప్పాను. ఏ విషయమునూ మూఢనమ్మకముతో ముడిపెట్టి చెప్పను. దయ్యముల విషయములలో
చెప్పినవన్నీ యదార్థసంఘటనలే! ఇక్కడ భూతముల విషయములలో చెప్పినవన్నీ కూడ నా స్వంత అనుభవముతో
చెప్పినవే! దయ్యముల విషయములలో జరిగిన యదార్థసంఘటనలలో వాస్తవమును చెప్పకతప్పలేదు. కావున వాస్తవ
విషయములను అన్నిటిని ఇష్టములేకున్నా చెప్పవలసివచ్చినది. అక్కడ నాకు ఇష్టములేని విషయము దయ్యములకంటే,
దేవతలకంటే, క్షుద్రశక్తులకంటే నేను గొప్ప అని తెలియబడడము. ఆ విషయములను చెప్పడము వలన అవి సత్యమే
అయినప్పటికీ, ఆ సంఘటన లలో ఎక్కువగా నా ఆధిపత్యమే కనిపిస్తుంది. నేను గొప్ప అని ప్రకటించుకోవడము
నాకు ఏమాత్రము నచ్చదు. ఎవరూ ప్రశ్నించకుండ యదార్థ సత్యములను చెప్పాము. భూతముల విషయములలో మీ
అవగాహన కొరకు ఇతరులవద్ద జరిగిన సంఘటనను చెప్పాను. దానిని మూఢ నమ్మకమని ఇతరులు అనుటకు
అవకాశము కలదు. కావున దయ్యముల విషయములను చెప్పినట్లే, భూతముల విషయములలో కూడ నావద్ద యదార్థముగా
జరిగిన సంఘటనలనే వివరించి చెప్పుతాను. అందువలన ఎవరూ మూఢ నమ్మకము అనుటకు వీలుండదు. ఇపుడు
చెప్పబోవు విషయము 1973వ సంవత్సరములో జరిగినది.
అనంతపురము జిల్లాలోని గుత్తికి సమీపములో ఒక పల్లెటూరిలో నాకు దూరసంబంధ బంధువులుండెడివారు.
37 సంవత్సరముల క్రితము ఒకరోజు బంధువులున్న పల్లెకు పోవడము జరిగినది. ఆ ఊరిలో పశువులకు గాలికుంటు
రోగము మొదలైంది. గాలికుంటు రోగము పశువుల కాలిగిట్టలకు వచ్చి, పశువులను పది పదిహేనురోజులపాటు
బాధిస్తుంది. ఆ రోగమున్న పది పదిహేను రోజులు పశువులు నడువడానికి చాలా ఇబ్బంది పడి నడవలేక బాధపడును.
గాలికుంటు రోగము కూడ భూతమే అగును. గాలికుంటు భూతము, పశువుల పాపమును బట్టి ఆత్మ ఆదేశానుసారము
పశువులను బాధపెట్టును. నేను అక్కడికి పోకనే ఒకటి రెండు రోజులముందు ఆ పల్లెలో, ఆ రోగము ప్రవేశించి కొన్ని
పశువులలో చేరిపోయింది. గాలికుంటు రోగము కొన్ని పశువులకు వచ్చినదని ఆ ఊరిలోని అందరికి తెలుసు.
మొదట ఒకటి రెండు పశువులతో ప్రారంభమైన రోగము, ఊరిలోని పశువులన్నిటికి కొన్ని రోజులలోనే వ్యాపించును.
అది అంటురోగము కావున అన్ని పశువులకు ప్రాకును. రోగమున్న పశువు కాలిమీద వాలిన ఈగ, రోగములేని పశు
వుమీద వాలితే ఆ రోగము ఈగ ద్వార, బాగున్న పశువును చేరి ఆ పశువుకూడ రోగగ్రస్త మగును. ఆ విధముగా
గాలికుంటు అను భూతము లేక రోగమను అంటువ్యాది అన్ని పశువులకు చేరిపోవును. నేను వెళ్ళిన బంధువుల
ఇంటిలో దాదాపు చిన్నవి, పెద్దవి అన్నీ పదహారు పశువులున్నవి. నేను వెళ్ళిన దినము అన్ని ఆరోగ్యముగానే ఉన్నవి.
నేను వెళ్ళిన ఇంటిలోనివారు నన్ను చూచి “మా ఇంటిలో ఇన్ని పశువులున్నాయి, గాలికుంటు రోగము ఊరిలోనికి
వచ్చింది. అది మా పశువులకు కూడ వస్తుంది. అది అంటురోగము కావున మా పశువులకు కూడ రెండు మూడు
రోజులలో అంటుకొంటుంది. ఆ రోగము రాకుండ ముందే మందులను వాడవచ్చునా? ఆ రోగము రాకుండుటకు
ఏమైనా మందులుంటే చెప్పండి” అని అడిగారు.
నేను అల్లోపతి మరియు హెూమియోపతి డాక్టర్ కోర్సులు చదివానని వారికి తెలుసు. కావున వారు వైద్యమును
గురించి నన్ను అడిగారు. నాకు అల్లోపతి, హెూమియోపతి మాత్రమే తెలుసునని వారికి తెలుసు, కానీ అందరిపతి
కూడ నాకు తెలుసునని వారికి తెలియదు. ఇక్కడ కొంతమంది డాక్టర్లకు అల్లోపతి తెలుసు, హెూమియోపతి అంటే
తెలుసు కానీ అందరిపతి ఎక్కడుంది అని అనుమానము రావచ్చును. దానికి జవాబు ఏమంటే, అందరిపతి అంటే
అందరికి భర్త అని అర్ధము. అందరి భర్త లేక అందరిపతిని గురించి తెలియాలంటే ఆరవశాస్త్రమైన భగవద్గీతను
చదివితే క్షుణ్ణంగా అందరిపతిని గురించి అర్థమౌతుంది. అల్లోపతి చదివి దానిని బాగా తెలుసుకొంటే ఒకరకమైన
వైద్యమును చేయవచ్చును. హెూమియోపతి చదివి దానిలో ప్రావీణ్యతను సంపాదించు కొంటే, మరొక రకమైన
వైద్యమును చేయవచ్చును. అందరిపతి ఏమిటో చదివి బాగా అర్థము చేసుకొని గ్రహించగలిగితే, అన్ని రకముల
వైద్యములను చేయవచ్చును. అందరిపతిని గూర్చి వివరంగావున్న భగవద్గీతను చదివి అర్థము చేసుకొని దానిలోవున్న
దానిని బాగా గ్రహించుకొన్నాను. కావున అల్లోపతి, హెూమియోపతియేకాక, అందరిపతి కూడ తెలిసినవాడిని కనుక
అందరిపతి వైద్యము అప్పుడు ఆ ఇంటిలోని పశువులకు అవసరము అనిపించింది. వారు అడిగిన దానికి సమాధానముగా
"ప్రస్తుతము అందరికి తెలిసిన వైద్యము ప్రకారము గాలికుంటు వ్యాధి రాకుండ చేయుటకు మందులు లేవు. రోగము
వచ్చిన తర్వాత అది తగ్గిపోవుటకు అల్లోపతిలో మందులున్నాయి. ముందే రాకుండ చేయుటకు అల్లోపతిలో మందులు
లేవు. ఎందుకనగా! నవ్వ వచ్చినపుడే బరకాలి లేక దురదవచ్చినపుడే గోకాలి అన్నది అల్లోపతి సూత్రము. అందువలన
ముందే దురదను రాకుండ చేసుకొను విధానము అల్లోపతిలో లేదు.
ప్రస్తుతకాలములో భూమిమీద అల్లోపతి విధానము యొక్క డాక్టర్లు ఉన్నారు. కానీ అందరిపతి విధానముయొక్క
డాక్టర్లు లేరు. నేను వెళ్ళిన పల్లెటూరిలో పశువుల సమస్యను అడ్డము పెట్టుకొని, ఆ ఇంటివారికి జ్ఞానముయొక్క విలువ
తెలుపుటకు, అందరిపతి విధానముతో గాలికుంటు రోగము ఆ ఇంటి పశువులకు రాకుండ వైద్యము చేయాలనుకొన్నాము.
ఉదయము ఏడుగంటల తర్వాత పశువులన్నిటిని బయటికి తోలకముందే పశువులు త్రాగే తొట్టిలో, అన్ని పశువులు
త్రాగేదానికి సరిపోవు నీరును పోయించాను. తర్వాత ఒక గ్లాసులో త్రాగేనీరు తీసుకొని, నా కుడిచేతి చూపుడు వ్రేలును
ఆ నీటిలో సగము వరకు ముంచి “ఈ నీరు త్రాగిన పశువులకు గాలికుంటు వ్యాధి రాకూడదు." అని మనస్సులో
అనుకొని, ఆ గ్లాసు నీటిని పశువులు త్రాగునీటి తొట్టిలో కలిపి అన్ని పశువుల చేత ఆ తొట్టిలోని నీటిని త్రాపాము. అన్ని
పశువులు నీరు త్రాగిన తర్వాత పశువులన్నిటిని బయటకు వదలడము జరిగినది. అప్పటినుండి ఒక నెల రోజులు,
గాలికుంటు వ్యాధి ఆ ఊరిలో అన్ని పశువులను బాధించినా, ఆ ఇంటిలోని పశువులకు మాత్రము రాలేదు. ఊరిలో
అన్ని పశువులకు రోగము సోకడము, ఆ ఇంటి పశువులకు మాత్రము ఆ రోగము రాకుండపోవడము, ఊరిలోని
వారికి ఆశ్చర్యమును కలిగించింది. అయినా నేను చేసిన విధానము ఎవరికీ చెప్పకూడదని ఆ ఇంటివారికి ముందే
చెప్పాను. కాబట్టి ఆ ఇంటివారు కూడ ఆ విషయము ఎవరికీ చెప్పలేదు. జ్ఞానము బయటికి తెలియాలని అర్జునుడు
అడగకున్నా కృష్ణుడు సందర్భము వచ్చింది కాబట్టి జ్ఞానమును చెప్పాడు. అలాగే ఆ ఇంటివారికి జ్ఞానము తెలియాలని
వారు జ్ఞానమును అడుగకున్నా సందర్భము వచ్చింది కాబట్టి జ్ఞానసంబంధ వైద్యమును చేశాను. ద్వాపరయుగములో
ఆ రోజు యుద్ధము అయిపోతూనే కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అర్జునుడు మరచి పోయినట్లు, ఈ కాలములో వారి
అక్కర తీరిపోతానే నేను చేసిన వైద్యమును వారు మరచిపోయారు. పైగా నేను చేసింది మంత్రవైద్యము అనుకొన్నారు,
నన్ను మంత్రగాడు అనుకొన్నారు.
ఎవరు ఏమనుకొన్నా నేను ఒక యోగిగా గాలికుంటు రోగమును పశువులు త్రాగిన నీటిద్వారా ఆదేశించాను,
నేను గ్లాసులో నీటిని తెప్పించు కొన్నపుడు ఆ నీటిలోగానీ, తొట్టిలోని నీటిలోగానీ ఏమీలేదు. అన్నీ సర్వ సాధారణముగా
ఉన్నవే. గ్లాసులోని నీటిలో, నా చూపుడు వ్రేలుని ముంచినపుడు నేను రోగమునకు ఇచ్చిన సంకల్పము నీటిలో
చేరిపోయింది. నాతలలోని సంకల్పము వెన్నుపాము ద్వార (బ్రహ్మనాడి ద్వార) ప్రయాణించి కుడిచేయి చివరివరకు,
నరముల ద్వారా చేరి హస్తములోని చూపుడు వ్రేలు గుండా గ్లాసులోని నీటిలోనికి చేరింది. ఆ నీటిని తొట్టిలోని నీటిలో
కలిపిన దాని ద్వారా తొట్టిలోని నీరంతా నా సంకల్ప ఆదేశము ప్రాకిపోయినది. ఆ నీరును త్రాగిన పశువుల
శరీరములలోనికి, నేను గాలికుంటు రోగమునకు చెప్పిన మాట చేరిపోయినది. గాలికుంటు క్రిమి ఆ పశువుల వద్దకు
వచ్చినపుడు, అప్పటికే పశువు శరీరములోనున్న సందేశము ఆ క్రిమికి చేరగా, ఆ క్రిమి ద్వారా గాలికుంటు భూతముకు
చేరినది. అప్పుడు రోగమనుబడు ఆ భూతము నా మాటను గౌరవించి, నా సంకల్పమున్న ఏ పశువులోనికి
చేరకూడదనుకొన్నది. అలా ఆ భూతము అనుకోవడము వలన, ఆ రోగక్రిములు ఆ పశువులను వదలి ప్రక్కకు
పోయేవి. మనకు కంటికి కనిపించని ఇంత తతంగము జరిగింది. కావున గాలికుంటు రోగము ఆ ఇంటి పశువులకు
మాత్రము రాలేదు. ఒక నెల రోజులు గాలికుంటురోగము, ఆ ఊరిలో ఉండి తర్వాత అన్ని పశువులను వదలి
పోయినది. నేను చేసిన విధానము అప్పుడు ప్రత్యక్షముగ అక్కడున్న వారికి చెప్పినా వారి బుర్రకెక్కలేదు. కానీ నేను
మంత్రములను గురించి చెప్పకున్నా, నా మంత్రమువలన వారి పశువులకు రోగము రాలేదనుకొన్నారు.
ఇక్కడ ఒక విచిత్రము జరిగినది. అదేమనగా! ఆ ఊరిలోనికి వచ్చిన గాలికుంటు రోగము నెలరోజుల తర్వాత
పూర్తిగా పోయినదని చెప్పాము కదా! ఆ రోగము పోయిన తర్వాత దాదాపు ఒక నెల రోజులు ఆ ఊరిలోని పశువులన్ని
ఆరోగ్యముగా ఉండేవి. అలా ఆరోగ్యముగా ఉన్న నెలరోజులు తర్వాత, తిరిగి గాలికుంటు వ్యాది ఆ ఊరిలోనికి వచ్చి
ఒక్కొక్క పశువు అనారోగ్యము చెందినది. రెండవమారు దాదాపు ఊరిలోని పశువులన్నిటికి ఆ రోగము వచ్చినది.
నా
అప్పుడు మొదట రోగము రాని ఆ ఇంటి పశువులకు కూడ గాలికుంటు వచ్చింది. అలా వచ్చిన రోగము కొన్ని
రోజులుండి పోయింది. అప్పుడు నాకు బంధువులుగా ఉన్నవారు వచ్చి, అప్పుడు రాని రోగము ఇప్పుడెందుకు వచ్చింది
అని అడిగారు. ఈ ప్రశ్న వారికేకాదు, ఎవరికైనా వస్తుంది. దానికి మా జవాబు ఏమనగా! చిన్న ఉదాహరణతో
అర్థమగులాగున వివరిస్తాను. నేను మల్లయ్య అనే బిల్ కలెక్టర్కు డబ్బులిచ్చి ఒక పనిని చెప్పాను. నేను డబ్బులిచ్చానను
గౌరవముతో ఆ వ్యక్తి నా పనిని చేసిపెట్టాడు. తర్వాత అతను పోయి అతని స్థానములోనికి ఎల్లయ్య అనే బిల్ కలెక్టర్
వచ్చాడు. ఇద్దరు బిల్ కలెక్టర్ అయినా, ఇద్దరూ ఒకే పనిని చేసినా, ఎల్లయ్య నా పనిని చేయడు. మొదట మన పని
అయింది కదా, ఇప్పుడెందుకు కాలేదు అంటే, మొదట ఉన్నవాడు మల్లయ్య, మల్లయ్యతో నేను మాట్లాడి డబ్బులిచ్చాను,
కాబట్టి నా పనిని చేసి పెట్టాడు. తర్వాత వచ్చిన ఎల్లయ్యతో ఏమాత్రము నాకు సంబంధము లేదు, నేను అతనికి
తెలియదు. అతనికి నేను ఏ పనిని చెప్పలేదు. అటువంటపుడు ఎల్లయ్య నా పనిని ఎందుకు చేయును? ఏమాత్రము
చేయడు. అదే విధముగ నేను రోగమును రావద్దని ఆదేశించినది మొదట వచ్చిన గాలికుంటు రోగమును. నేనిచ్చిన
'జ్ఞానశక్తి' అను ఆదేశానుసారము అప్పుడు ఆ రోగము ప్రవర్తించినది. నేను చెప్పిన పనిని నెరవేర్చినది. దానివలన
అప్పుడు పశువులకు రోగము రాలేదు. తర్వాత రెండవమారు వచ్చినది గాలికుంటు రోగమే అయినా, రెండవమారు
వచ్చిన రోగమునకు నేను ఎవరో తెలియదు. నా ఆదేశము ఏమీ, ఆ రోగమునకు నేను చెప్పలేదు. రెండవమారు
వచ్చిన రోగము, మొదట వచ్చిన రోగము రెండు ఒకే పనిని చేయుచు, ఒకే పేరుకల్గియున్నా, నేను చెప్పినది మొదటి
రోగమునకేగానీ, రెండవమారు వచ్చిన రోగమునకు కాదు. అందువలన రెండవమారు వచ్చిన గాలికుంటు రోగము,
తన పనిని తాను నిర్వర్తించి అన్ని పశువులకు రోగము ప్రాకునట్లు చేసినది. దీనినిబట్టి ఉపభూతములు అనేకము అని
చెప్పినట్లు, ఒకే పని విధానమున్న, ఒకే పేరుకల్గిన ఉప భూతములు వేరుగా ఉన్నవని పై సంఘటన ద్వారా తెలియుచున్నది.
ఇదంతా విన్న తర్వాత కొందరు హేతువాదులు కానీ లేక కొందరు నాస్తికవాదులుకానీ ఈ విధముగా
ప్రశ్నించవచ్చును. అదేమనగా! "మీ ఆజ్ఞవలన లేక మీ సంకల్పము వలన మీరు చెప్పినట్లు రోగము మీమాట
వినినదని చెప్పారు. ఆ విధముగ ప్రత్యక్షముగ జరిగినదని చెప్పారు. అటువంటి విధానము ఎక్కడైనా, ఎవరివద్దనైనా
భూమిమీద ఉంటే లేక మీ వద్దయినా ఉంటే, రోగమును మీరు శాసించవచ్చును కదా! ఇంతమంది డాక్టర్లు, ఆస్పత్రులు
అవసరము లేదుకదా! కట్టుకథలు చెప్పి ప్రజలను మోసము చేయడము తప్ప, ఇందులో సత్యములేదని మేమంటున్నాము.
రోగమును, మందులు లేకుండ మంత్రములతో నయము చేయలేరు, మాటలతోను బాగుచేయలేరు. మీరు చెప్పిన
మాటలతో రోగములు నయమైపోతే, మీకు నెలకు పదిలక్షల రూపాయలు ఇస్తాము. మీరు ఏ పనిచేసిన అంత
డబ్బులు ఎవ్వరూ ఇవ్వరు. మేము పెద్ద మొత్తము పది లక్షలు ఇస్తాము, ఊరకనే కూర్చొని వచ్చిన ప్రజలకు రోగములు
పోయేటట్లు చెప్పండి. ఈ నియమానికి ఒప్పుకుంటారా? లేక మీరు చెప్పినవన్నీ భూటకము, అబద్దము అని ఒప్పుకుంటారా”
అని మాకు సవాల్ విసర వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాకు అల్లోపతి వైద్యము తెలుసు, హెూమియోపతి
వైద్యము తెలుసు. అందరు చేసినట్లు నేను డాక్టరువృత్తి చేసి డబ్బు సంపాదించుకోవచ్చును. అంతేకాక నేను జ్యోతిష్య
శాస్త్రమును ఉత్తమపద్ధతిలో వ్రాసినవాడిని, అనగా ఇప్పుడున్న జ్యోతిష్యులకంటే జ్యోతిష్యము బాగా తెలిసినవాడిని.
జ్యోతిష్యమును అందరికంటే బాగా చెప్పితే ఎంతైనా డబ్బులు సంపాదించవచ్చును. ఇవియేకాక ఎన్నో పనులలో
నైపుణ్యత కలిగినవాడిని. అయినా నేను ఏ పనీ చేయలేదు. జ్యోతిష్యము తెలిసినా జ్యోతిష్యమును చెప్పలేదు. అల్లోపతి
వైద్యము తెలిసినా డాక్టర్ వృత్తి చేయలేదు. మా నాన్న రైల్వేసర్వీస్లో చనిపోయిన దానివలన నాకు రైల్వేలో ఉద్యోగము
వచ్చినా, నేను ఆ ఉద్యోగానికి పోలేదు. డబ్బుల కొరకు ఆశించేవాడినైతే, డబ్బు సంపాదన పని, నేను ఏదీ ఇంతవరకు
చేయలేదు. ఒకప్పుడు యుక్తవయస్సులో మిలిటరీలో మంచి ఉద్యోగమును చేసేవాడిని. అప్పుడు నా మనస్సు
ఆధ్యాత్మికమువైపు మరలిన వెంటనే ఆ ఉద్యోగమును కూడ వదలుకొన్నాను. నేను ఇప్పటికి నలభైసంవత్సరము లుగా
ఆధ్యాత్మికములో, ఎంతో పరిశోధన చేసి కొంతైనా నేర్చుకోగలిగాను. డబ్బు విషయానికి వస్తే అది కర్మనుబట్టి
వస్తుందని నాకు బాగా తెలుసు. ఎప్పటికీ నేను దానిని గురించి చింతించలేదు. నా చింతనంతా దైవము మీదనే
కలదు.
ఇక మీరడిగిన ప్రశ్నకు జవాబును వివరముగా చెప్పాలంటే, ఒక ఉదాహరణను చూస్తాము. గరీబ్ అనే ఒకడు
మగ్గము మీద చీరలు నేయుచున్నాడు. నెలకు పది చీరలు తయారుచేసి 'నవాబ్' అను ఒక ధనికుడైన వ్యాపారస్తునికి
ఇస్తాడు. అలా ఇచ్చిన చీరలకు బదులుగా కొంత డబ్బును ఆ ధనికుడు చీరలు తయారుచేసిన వానికి ఇస్తాడు. నవాబ్
ఇచ్చిన డబ్బుతో గరీబ్ బ్రతుకగల్గుచున్నాడు. గరీబ్ జీవితము సాఫీగా సాగాలంటే నవాబ్కు చీరలు నేసి ఇవ్వవలసిందే.
ఆ విధముగ గరీబ్ నిత్యము చీరలు నేయడము చేస్తున్నాడు. ఒక దినము గుడ్డలు లేకుండ చలికి బాధపడు నసీబ్ అనే
వానిని చూసి, తనకు వచ్చు ఆదాయము కొంత పోయినా పరవాలేదు, చలికి బాధపడువాని బాధను ఒక చీరనిచ్చి
తీర్చాలనుకున్నాడు. తన ఆదాయము పోతుంది అని తెలిసినా, ఎదుటి వాని బాధను పోగొట్టుటకు తన ఆదాయమును
లెక్కచేయక వదలివేసి, ఒక చీరను గుడ్డలు లేకుండ చలికి వణుకుచున్న నసీబ్క ఇచ్చాడు. అంతవరకు చలికి
బాధపడుచున్న వానికి, చీర లభించగానే చలి బాధపోయింది. చీరను కప్పుకొని హాయిగా ఉన్నాడు. నసీబ్ అను వాని
బాధనివారణ కొరకు గరీబ్ ఒక చీర ఆదాయమును పోగొట్టుకున్నాడు. గరీబ్ అనే వ్యక్తి, నసీబ్ అనే వ్యక్తికి చీరనివ్వడము
వలన నసీబు చలి బాధ పోయింది, అని చూచిన వ్యక్తులు చెప్పితే, దానిని వినిన కొందరు మోటువాదులు చీరవలన
చలి బాధపోదు, దుప్పటి వల్లనే పోతుంది, చీరవలన పోతుంది అనడము అబద్దము అన్నారు. ప్రత్యక్షముగ చూచిన
వ్యక్తులు “చీరవలనే అతని చలిబాధ పోయింది, మేము ప్రత్యక్షముగా చూచాము” అని చెప్పారు. అప్పుడు మోటువాదులు
ఇలా అన్నారు. "గుడ్డలు లేకుండ చలితో బాధపడేవారు దేశములో చాలామంది ఉన్నారు. వారందరికి ప్రతి దినమూ
చీరలిచ్చి చలిబాధనుండి విముక్తి చేస్తే, మేము నెలకు పది మూటలు వజ్రాలరాళ్ళు ఇస్తాము” అన్నారట.
మొరటుగా మాట్లాడే మోటువాదులు చెప్పిన విషయమును కొందరు గరీబు చెప్పారట. ఆ మాటకు గరీబ్
నవ్వి నేను నవాబ్కు చీరలు నేసి ఇచ్చి నేను పడిన శ్రమకు కూలిగా నవాబ్నుండి చీరకు వందరూపాయలు డబ్బులు
తీసుకొంటున్నాను. ఆ డబ్బులతో నేను సుఖ జీవనము సాగించు చున్నాను. నేను చీరలను తయారుచేసి నవాబ్కు
ఇవ్వకపోతే, నాకు నవాబ్ డబ్బులివ్వడు దానివలన నా జీవనము సుఖముగా కాకుండ దుఃఖముగా సాగును. గరీబ్
నేసిన నవాబ్ చీర చలిబాధను పోగొట్టునని అందరికి తెలుపుటకు, తర్వాత ఎదుటి వాని బాధను పోగొట్టుటకు ఒక
చీరపోయినా పరవాలేదు, ఆ ఒక చీరవలన నాకు వంద రూపాయలే కదా నష్టము అనుకొని ఇచ్చాను. దేశములో
ఎందరో గుడ్డలులేని వారుంటారు. వారందరికి గుడ్డలు ఇవ్వాలి అంటే నేను పస్తుండాలి. ఆకలితో గుడ్డలు లేనివారికంటే
నేనే ఎక్కువ బాధపడవలసి వస్తుంది. “తనకు మాలిన ధర్మము మొదటికి చేటు” అని పెద్దలన్నట్లవుతుంది. పైగా నేను
చీరలను నిత్యము నేసి, నిత్యము గుడ్డలులేని వారికి ఇస్తే మోటువాదులు నాకు ఇచ్చేది పది మూటల వజ్రాల రాళ్ళు.
వాటిని తీసుకొని నేనేమి చేయాలి. ఆ వజ్రాలు నాకు ఉపయోగపడవు. వజ్రాలను తీసుకొని పోయి అమ్మినా ఎవరూ
తీసుకోరు. ఒకవేళ ఎవరైనా తీసుకొన్నా, వారి డబ్బులు మా అంగడిలో తీసుకోరు, సరుకులు ఇవ్వరు. కావున నేను
నేసిన చీరలను ఇతరులకు దానముగా ఇవ్వడమెందుకు? నేను దానమిస్తే ఎవరో నాకు అక్కరకు రాని వజ్రాలివ్వడమెందుకు?
నేను నేసిన చీరను మా నవాబు ఇస్తే, మా నవాబ్ ఇచ్చు డబ్బులు నాకు సుఖమునిస్తాయి. అందువలన నవాబ్కు
నాకు ఉన్న సంబంధము తెగిపోకుండా ఉండాలంటే, నాకు వజ్రాలిస్తామన్నా వాటికి నేను ఆశపడకూడదు. నాకు
నవాబ్ నెలకు ఇచ్చే వెయ్యిరూపాయలే సుఖాన్నిస్తాయి, ఇతరులిచ్చే వజ్రాలు దుఃఖానిస్తాయి అన్నాడు.
ఇది ఉదాహరణకు చెప్పిన విషయము కావున, దీనిలోని విషయము లను అర్థము చేసుకోవలసిన పని ఉన్నది.
ఈ కథను వివరించుకొని చూస్తే, గరీబ్ అను నేతగాడు ఒక యోగి అని అనుకుందాము. యోగి చేయు యోగమును
గరీబ్ నేయు చీరలుగా పోల్చుకుందాము. చీరల వలన వచ్చే డబ్బును, యోగము వలన లభించే జ్ఞానశక్తిగ
లెక్కించుకొందాము. గరీబ్ నేసిన చీరలకు డబ్బులిచ్చు నవాబ్ను దేవునిగా లెక్కించు కుందాము. ఇప్పుడు దీనినంతటిని
కలిపి చూస్తే, ఒక యోగి తాను నిత్యము యోగమును చేయడము వలన, ఆ యోగమునకు ఫలితముగా దైవమునుండి
యోగికి జ్ఞానశక్తి లేక జ్ఞానధనము అనునది లభించును. నవాబ్ చీరలకు ఇచ్చు డబ్బుతో గరీబ్ సుఖజీవనము
సాగించుచున్నాడు. అనగా యోగమునకు వచ్చు జ్ఞానశక్తి చేత యోగి కర్మలు కాలిపోవును, కర్మలను యోగి అనుభవించడు,
కావున నవాబ్ ఇచ్చు డబ్బుతో గరీబ్ సుఖజీవనము సాగించుచున్నాడు అని చెప్పారు. గరీబ్ గుడ్డలు లేక చలికి
బాధపడువానికి తను నేసిన చీరను ఇచ్చాడు, దానివలన వానికి చలి బాధ పోయింది, అనగా యోగి, రోగమును
అనుభవించు వాని కర్మను తన యొక్క యోగము చేత లేకుండ చేశాడని అర్థము. కర్మలచేత బాధపడు కర్మ జీవులు
దేశములో ఎందరో ఉన్నారు. కావున వారిని గుడ్డలులేక బాధ పడువారు చాలామంది ఉన్నారని పోల్చి చెప్పారు.
గుడ్డలు లేని వారందరికి గుడ్డలు ఇవ్వమని చెప్పిన మోటువాదులను రోగమున్న వారందరిని తమ శక్తి చేత బాగు
చేయమని అడిగిన హేతువాదులుగా చెప్పవచ్చును. మందులు లేకుండ, మాటలచేత రోగములను లేకుండా చేస్తే
వజ్రాలమూటలు ఇస్తామన్నారు కదా! ఆ వజ్రాల మూటలను ప్రపంచ డబ్బుగ పోల్చి చెప్పవచ్చును. ప్రపంచ డబ్బు
యోగికి మోక్షము నివ్వదు. కావున గరీబ్ వారి వజ్రాల వలన నాకు సుఖములేదు, నా ఆకలి తీరదు అన్నాడు.
ఈ కథ యొక్క వివరమును చెప్పుకొంటే ఒక (గరీబ్ అను) యోగి నిత్యము యోగము చేయుచుండుట వలన
యోగము యొక్క ఫలితము యోగశక్తి లేక జ్ఞానాగ్ని దైవము నుండి లభించును. ఆ విధముగా లభించిన జ్ఞానాగ్ని
వలన. తన కర్మలను కాల్చుకొని, యోగి ఏ కర్మ అనుభవించ కుండునట్లు చేసుకొనును. ఎవడైన బాధపడుచున్నపుడు
జ్ఞానాగ్నికి కర్మలను కాల్చుశక్తి ఉన్నదని నిరూపణగా చూపించుటకు తన జ్ఞానాగ్ని చేత ఎదుటి వాని కర్మను కాల్చివేయును.
అట్లు ఒకమారు ఇతరుల కర్మను కాల్చివేసిన, తన అగ్ని తనకు ఉపయోగపడక ఇతరులకు ఉపయోగపడడము వలన
అక్కడ కొంత జ్ఞానశక్తిని యోగి కోల్పోయినట్లే అగుచున్నది. ఒక రోగి యొక్క రోగమును, తన మాటచేత శాసించినప్పుడు
అక్కడ మనకు తెలియకుండానే యోగియొక్క యోగశక్తి లేక జ్ఞానాగ్ని కొంత నష్టమై పోవుచున్నది. ఒక్క రోగిని
రోగమునుండి విముక్తి చేయుటకు వాని కర్మను కాలిపోవునట్లు చేయాలి. అలా చేయుటకు కొంత అగ్ని వృథా
అయిపోవు చుండగా, అనేకమంది రోగులను బాగుచేయాలంటే యోగి తనకున్న శక్తినంతటిని కోల్పోవును. అలా
చేయడము బూడిదలో పన్నీరును పోసినట్లవుతుంది. అనేకమంది రోగులను యోగి తన మాటచేత బాగుచేస్తే హేతువాదులు
ఇచ్చేది కొన్ని కోట్లరూపాయలైన అది ప్రపంచధనమే అగును. వారు ఇచ్చిన అర్థగంట తర్వాత చనిపోయిన, అది ఒక్క
రూపాయి కూడ వెంటరాదు. యోగికి కావలసినది జ్ఞానధనము, ప్రపంచ ధనముకాదు. అందువలన హేతువాదులు,
నాస్తికవాదులు ప్రపంచ ధనమును ఆశ చూపితే దానికి ఆశపడి యోగులు పని చేయరు. యోగుల ఉద్దేశము, వారి
పని మోక్షము కొరకు, జ్ఞానశక్తి కొరకు ఉంటుంది. ప్రపంచ పేరు ప్రఖ్యాతుల మీద కానీ, ప్రపంచ ధనముమీద కానీ
ఏమాత్రముండదు. యోగులు ఎప్పటికీ రోగములను బాగుచేయు వైద్యులుకారు. యోగులకు, వైద్యులకు ఎంతో వ్యత్యాసము
కలదు. యోగులు వైద్యుల స్థాయికి దిగజారి పోరు. ఎక్కడైనా, ఎవరి రోగమునైనా వారు నోటి మాటతోగానీ, చేతి
స్పర్శతోగానీ, కంటి చూపుతోగానీ బాగుచేస్తే అది జ్ఞానాగ్నికి ఎటువంటి శక్తి ఉందో తెలుపుటకే గానీ, వైద్యముకాదని
తెలియాలి.
పూర్వము కొందరు పెద్దలు, ఎవరి రోగమును లేకుండ చేసినా, అది వైద్య విధానము కాకుండ జ్ఞాన ప్రచార
విధానముతోనే చేశారు. ఒక యోగి ఎక్కడైనా ఒక రోగమును పోగొట్టితే, రెండవమారు అటువంటి పనిని చేయడు.
ఒకనికి రోగము పోయినదని తెలిసి, అటువంటి రోగులు కొందరు అతి వినయమును ప్రదర్శిస్తూ, మాకూ నయము
చేయండని ప్రాధేయపడినా, యోగి వారి అభ్యర్థనలను అంగీకరించడు. యోగి అయిన వాడు జ్ఞానమార్గమునుండి
తప్పిపోకుండ జాగ్రత్తపడుచు నడుచుకొనును. అందువలన యోగి, రోగి విషయములను పట్టించుకోడు. హేతువాదులు
లక్షల డబ్బులు ఇస్తాము మాకు చేసి చూపించండి అంటే, అలా చూపించే దానికి అది గారడి విద్యకాదు. దేవుడు
నిర్మించిన చట్టము ప్రకారము ప్రకృతి ఆధ్వర్యములో జరిగే, జనన మరణములయందుగానీ, ఆరోగ్య అనా
రోగ్యములయందుగానీ, సుఖ దుఃఖములయందుగానీ యోగి ఎప్పటికి తల దూర్చడు. దేవుని చట్టము ప్రకారము
జ్ఞానశక్తికి లేక జ్ఞానాగ్నికి కర్మల మీద ఇటువంటి శక్తి ఉందని తెలుపు నిమిత్తము సమయమును, సందర్భమును చూచి
అరుదుగా రోగముల విషయములోగానీ, మరణము విషయములోగానీ, దుఃఖముల విషయములోగానీ, యోగి జోక్యము
చేసుకొని, జ్ఞానశక్తి యొక్క విలువ తెలియునట్లు చేయును.
రోగములను గురించి ఇంతవరకు కొన్ని విషయములనే తెలుసు కొన్నాము, మనకు తెలియని విషయములు
ఇంకా ఉన్నవి. రోగములు భూమిమీదనే మనుషులలోను, జంతువులలోను, పక్షులలోను, భూమి నుండి పుట్టు
వృక్షములలోను చేరుటయేకాక, సముద్రగర్భములోనున్న అనేక జీవ రాసులను బాధించుచున్నవి, చంపుచున్నవి. రోగము
జీవుడే అయినా రోగమును, భూతము అను పేరుతోనే పిలుస్తున్నాము. భూతము ఒక జీవుడు, మరొక జీవున్ని
బాధించడము, చంపడమును దేవుడు రచించిన చట్టమని చెప్పవచ్చును. అది ఎక్కడ జరుగుచున్నదో దానినే యమలోకము
అంటున్నాము. దీని ప్రకారము మనము నివసించు భూమండలమే యమ లోకము! రోగములే ఒకరకమైన యమకింకరులు!
రోగములే కాక మిగత రకములైన యమకింకరులు కూడ కలరు. రెండవ రకమైన యమకింకరులను గురించి చెప్పుకుంటే
రోగము మాదిరి మేఘము కూడ ఒక భూతమే! ఒక రోగము భూమిమీద కొంతకాలము కనిపించి, కొంతకాలము
ఏమాత్రము కనిపించకుండ పోతుంది. అలాగే ఒక మేఘము కూడ కొంతకాలము కనిపించి, కొంతకాలము కనిపించకుండ
పోవును. రోగమునకు, మేఘమునకు కొన్ని విషయములలో దగ్గర పోలికలున్నా రోగముకంటే మేఘము కొంత
గొప్పదనియే చెప్పవచ్చును. ఎందుకనగా రోగమునకు వైద్యమున్నది. వైద్యము ద్వారా రోగమును మనిషి అణిచి
వేయవచ్చును. కానీ మేఘము వైద్యమునకు గానీ, మరి ఏ ప్రపంచ విధానమునకుగానీ లొంగునదికాదు. రోగము తన
ఉనికి తెలియకుండ వంద లేక రెండువందల సంవత్సరములైన అణిగి ఖగోళములో నివశించును. మేఘములు
రోగములవలె అంత దీర్ఘకాలము కనిపించకుండాపోవు. రోగము కొంత ప్రదేశములో వ్యాపించుటకు కొన్ని దినముల
కాలము పట్టును. కానీ మేఘము కొన్ని నిమిషములలోనే కొంత ప్రదేశమంతటా వ్యాపించును. ఒక రోగము కొన్ని
కోట్ల క్రిముల సముదాయమనిచెప్పుకొన్నాము. ఆ క్రిములను మైక్రోస్కోపుల ద్వారా ప్రత్యక్షముగా, స్థూలముగా
చూడవచ్చును. ఆ క్రిముల ఆకారమును గుర్తించవచ్చును. అయితే మేఘములకు అటువంటి క్రిమిసముదాయముండదు.
ఏ స్కోపుల ద్వారా మేఘములలోని స్థూలత్వమును చూడలేము. రోగము చేతిలో పడిన మనిషినిగానీ, జంతువునుగానీ,
నీటిలోని చేపనుగానీ చూడవచ్చును. కానీ మేఘము చేతిలో పడిన మనిషినిగానీ, జంతువునుగానీ, చేపగానీ ఏదీ
కనిపించకుండ పోవును. మేఘము వదలినప్పుడు తిరిగి కనిపించును. రోగమునకు కొన్ని కోట్ల క్రిములుంటే,
మేఘమునకు కొన్ని కోట్ల చేతులున్నవి. ఇలా రోగమునకు, మేఘమునకు ఎన్నో తేడాలున్నవి. ఇప్పుడు ఏమి రోగముకంటే
అన్ని విధముల గొప్పదైన మేఘమును గురించి తెలుసుకొందాము.
మేఘము ఒక భూతము అనుమాట కొందరికి విచిత్రముగా, విడ్డూరముగా కనిపించినా, మామాట నూటికి
నూరుపాళ్ళు సత్యము. మేఘము అను భూతము లేక జీవుడు, దేవుని పరిపాలన విభాగములోని వాడే కావున,
మేఘమునకు ప్రకృతినుండి వచ్చు ఆజ్ఞను ఆచరించడము మేఘము యొక్క కర్తవ్యము. ప్రకృతినుండి వచ్చు ఆజ్ఞను
బట్టి చేయవలసిన పని ఎంత భయంకరమైనదైనా, ఎంత కూరత్వముతో కూడుకొన్నదైనా మేఘము చేసి తీరును.
దేవుని చట్టమును అనుసరించి ప్రకృతినుండి వచ్చు ప్రతి ఆజ్ఞను నెరవేర్చడము మేఘము యొక్క విధి విధానము.
భూమిమీద రోగములు ఎన్నో రకములున్నట్లు, ఖగోళములో కూడ మేఘములు ఎన్నో రకములున్నవి. చాలామందికి
మేఘము అంటే వర్షము కురుయునదని మాత్రము తెలుసు. మేఘము వర్షించడమేకాక, మిగత ఎన్నో పనులను కూడ
చేయుచున్నదని తెలియదు.
ఆకాశములోని మేఘమునకు ఒక రూపము ఉండదు. ఒక మేఘము అనేక రూపములను మార్చుకొనును.
అంతేకాక మేఘము తెలుపు, నలుపు, ఎరుపు రంగులను మార్చుకొనును. మేఘము యొక్క ఆకారము ఏమాత్రము
కనిపించకుండ అదృశ్యమైపోవును. అలా అదృశ్యమైన మేఘము తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపించగలదు.
అదృశ్యములోనున్న మేఘము, మొదట చిన్న ఆకారముతో అర్ధ అంగుళము పరిమాణమునుండి మొదలై దాదాపు 20
లేక 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము వరకు తన ఆకారమును పెంచుకొనును. ఈ విధముగ ఆకారము పెరిగిన
మేఘము, ఎంతో బలము కలిగినదై, ఎన్నో చేతులు కలిగినదై ఉండును. కొన్ని కోట్ల చేతులు కలిగియున్న మేఘము,
పరిమితము లేని బలము కలిగి, ఎంతటి బరువునైన మోయగల స్థోమత కల్గియున్నది. ఆకాశములో మేఘములు ఎన్నో
గలవు. ఒక్కొక్క మేఘము కొన్ని లక్షల, కొన్ని కోట్ల టన్నుల బరువును మోయగల శక్తి కల్గియున్నది. మేఘము
భూమిమీద నీటిని సూక్ష్మముగా కంటికి కనిపించకుండా తీసుకోగలదు. ఎక్కడైనా అరుదుగా మనిషి కంటికి కనిపించే
విధముగా కూడ నీటిని మేఘము తీసుకొనును. మేఘము ఒక్క నీటినేకాక నీటిలోని చేపలను, తాబేళ్ళను కూడా పైకి
తీసుకొని పోగలదు. కొన్ని చోట్ల మనుషులను, జంతువులను పైకి తీసుకొని పోయినట్లు చరిత్రగలదు. ఈ మధ్య
కాలములో 118 మంది మనుషులను, కొన్ని జంతువులను ప్రత్యక్షముగా పైకి తీసుకొని పోయి వారిని క్రింద పడవేయడము,
వారు చనిపోవడము జరిగినట్లు ఆంధ్రయూనివర్శిటిలో మేఘములను గురించి పరిశోధన చేయు ఒక ప్రొఫెసర్
చెప్పగా విన్నాము. మేఘములకు కనిపించని ఎన్నో చేతులున్న దానివలన ఎవరినైన, దేనినైనా పైకి తీసుకొని పోగలవు.
పైకి తీసుకొని పోయిన వారిని క్షేమముగా భూమిమీదకు తీసుకవచ్చి వదలగలవు. లేకపోతే పై నుండి క్రిందపడవేసి
చంపగలవు. మేఘము నీటితో సహా చేపలను తీసుకొని పోతే వాటిని క్షేమముగా, ఒక్క చేపకు కూడ దెబ్బతగలకుండ
భూమికి దగ్గరగా తీసుకువచ్చి వదలుచున్నవి. పై నుండి క్రిందపడినట్లు మనకు ప్రత్యక్షముగా కనిపించినా చేపలు
చనిపోకుండ క్రిందపడును.
మేఘము కొన్ని సమయములలో అరుదుగా మనకు కనిపించే విధముగా భూమిమీద నుండి దేనినైనా
తీసుకుపోగలదు. ఉదాహరణకు స్థూలముగా కనిపించు చేపలను నీటితో సహా మేఘము పైకి తీసుకొని పోయినపుడు
మేఘము యొక్క చేతులలో నీరు, చేపలు అన్ని ఉండును. మేఘము యొక్క చేతులు ఎవరికి కనిపించునవి కావు.
అందువలన మేఘము చేతులలోనికి పోయిన నీరుగానీ, చేపలుగానీ కనిపించకుండ పోవును. మేఘము తీసుకొని
పోయిన నీరుగానీ, చేపలుగానీ, తాబేళ్ళు కానీ పైన మేఘములలో అదృశ్యముగా ఎవరికి కనిపించకుండ ఉండి పోవును.
అందువలన ఒక మేఘములో ఎన్ని నీళ్ళున్నది ఎవరు చెప్పలేరు. అలాగే ఇంకా ఏదైనా మేఘములో ఉండినా అది
కూడ తెలియ బడక అదృశ్యరూపములో ఉండును. అదృశ్యరూపములోనున్న చేపలను ఒక దినముగానీ, అంతకంటే
ఎక్కువ కాలముగానీ మేఘము తన చేతులలో ఉంచుకోగలదు. అయినా అంతకాలము ఉంచుకొను అవసరము
మేఘమునకు లేదు. మేఘము తన చేతిలో ఉంచుకొన్న వాటిని కొన్ని కిలోమీటర్ల దూరము వరకు తీసుకొని పోయి,
ఎక్కడ వదలాలని నిర్ణయముంటుందో అక్కడే వదులును. కొన్ని చేపలనుగానీ, కొన్ని జంతువులనుగానీ
ఆఫ్రికాఖండమునుండి ఆసియాఖండమునకు, ఆసియా ఖండమునుండి ఐరోపాఖండమునకు తీసుకొని పోగలదు. కొన్ని
వేల కిలోమీటర్ల దూరము పైన ఆకాశములో ప్రయాణించు మేఘము, ఒక ఖండమునుండి మరొక ఖండమునకు
చేరుచున్నది. జంతువులను ఒక ఖండమునుండి మరొక ఖండమువరకు, ఒక ప్రాంతమునుండి మరొక ప్రాంతము
వరకు తీసుకుపోగలదు. ఆకాశములో మేఘమునందు కనిపించకుండవున్న చేపలుగానీ, తాబేళ్ళుగానీ, పాములుగానీ
మేఘము వర్షించునపుడు వాటిని క్రిందికి వదలును. కనిపించని మేఘము చేతులు చేపలు మొదలగువాటిని క్రిందికి
తీసుకొని వచ్చినపుడు, దాదాపు వంద అడుగుల పైనుండి చేపలు మొదలగునవి దృశ్యరూపమై కనిపించను మొదలుపెట్టును.
మేఘము ఒక నీటినేకాక, నీటితో సహా చేపలను తాబేళ్ళను, పాములను తీసుకొని పోయి మరొక ప్రాంతములో,
మరొక దేశములో వదలుట వలన అక్కడకి అవి మేఘము వలన రవాణా చేయబడినవని చెప్పవచ్చును. అలా రవాణా
చేయబడుట వలన అక్కడలేని చేపల జాతిగానీ, తాబేళ్ళ జాతిగానీ, పాముల జాతిగానీ క్రొత్తగా అక్కడ కూడ కనిపించును.
ఉదాహరణకు ఒక రోజు వార్తాపత్రికలో అరుదైన నక్షత్ర తాబేలు కర్నూలు జిల్లా 'అవుకు'లో కనిపించిందని వ్రాశారు.
నక్షత్ర తాబేలుజాతి మన భారత దేశములో ఎక్కడాలేదనీ, ఆ జాతి తాబేలు ఆప్రికాఖండములో కలదని, ఈ దేశములో
లేని తాబేలుజాతి, కర్నూలు జిల్లా అవుకుప్రాంతములో కనిపించడము ఆశ్చర్యమని వ్రాశారు. నాలుగైదు చిన్న నక్షత్రతాబేళు
్ళ కనిపించినట్లు వ్రాశారు. నక్షత్ర తాబేళ్ళ ఫోటో కూడ అందులో ముద్రించారు. ఆ దినము అందరికి అది ఆశ్చర్యకరమైన
వార్త అయినపుడు, దానిని అంతటితోనే వదలివేశారు. ప్రతి దానికి కనిపించే నిరూపణకావాలని వాదించే హేతువాదులు,
ప్రత్యక్షముగా వ్రాసినవార్తను, ముద్రించిన తాబేలు బొమ్మను చూచి, ఇది అసత్యము. ఇక్కడలేని జాతి ఎలా వచ్చింది
అని ఎందుకు ప్రశ్నించలేక పోయారో? మేధావులుగానీ, సామాన్యులుగానీ హేతువాదులుగానీ ఆ వార్తను చూచిన
తర్వాత దేశములో ఎక్కడలేని జాతి ఉన్నట్లుండి ఇక్కడ ఎలా కనిపించింది? అని ప్రశ్నించుకోలేక పోయారు, దానిని
గురించి ఆలోచించలేక పోయారు. మేధావుల ఆలోచనకు కూడ అవి లేని ప్రాంతములోనికి ఎలా వచ్చాయో, ఏ
విధానము ద్వారా వచ్చాయో కూడ తెలియదు. దాని వెనుకనున్న సత్యమును తెలిస్తే మేఘముల ద్వారా వచ్చాయని
ఎవరైనా ఒప్పుకోక తప్పదు.
ఒక్క తాబేళ్ళనేకాక, కొన్ని జాతుల పాములను, కొన్ని జాతుల చేపలను కూడ తెచ్చి, మరొక దేశములో, మరొక
ప్రాంతములో వదలు చున్నవి. అందువలన వర్షము కురియునపుడు వర్షముతో సహా పాములు పడడము, చేపలుపడడము,
తాబేళ్ళుపడడము కొందరు ప్రత్యక్షముగా చూచిన వారున్నారు. అలాగే మేఘములు ప్రత్యక్షముగ నీటిని, నీటితో సహా
చేపలను, కప్పలను ఒక చెరువునుండి తీసుకోవడము కొందరు ప్రత్యక్షముగ చూచారు. ఒక చెరువునుండి నీటినంతటిని
మేఘము పీల్చుకోవడము ఫోటోతో సహా వార్తను ప్రచురించడము కూడ జరిగింది. ఈ మధ్యకాలములో మేఘము
నీటిని తీసుకొంటున్న ప్రత్యక్షదృశ్యమని టి.విలలో కూడ ప్రసారము చేసి చూపించారు. మేఘము అరుదుగా దృశ్యరూపములో
కనిపించే విధముగా ఎక్కడో ఒక చోట నీటిని ప్రజలకు దగ్గరగానున్న చెరువునుండి తీసుకొనుచున్నది. అలా చేయడము
వలన మేఘములు నీటిని ఈ విధముగా తీసుకొంటున్నవని ప్రజలకు తెలియవలెనని దేవుడే ఆ విధముగా చేయించాడని
అర్థమగుచున్నది. మనము తెలుసుకొనుటకు ఆధారముగా ఎక్కడో ఒకచోట ఉన్న సత్యమును, మనకు కనిపించే
విధముగా చూపించినా మనిషి దానిని అర్థము చేసుకొను స్థితిలో లేడు. ఇప్పుడు ఉన్న సత్యమును విప్పి చెప్పినా,
విజ్ఞానులమనుకొను కొందరు మా మాటలను హాస్యాస్పదము గా తీసుకొంటున్నారు. మా మాటను అసత్యము అంటున్నారు.
మనుషులకు ఏ విధముగా తెలియని కొన్ని విషయములను, కొందరు ఏ విధముగానూ నమ్మని విషయములను,
దేవుడు ప్రత్యక్షముగా ఎక్కడో ఒకచోట చూపించును. అప్పటికి సత్యమును గ్రహించలేని మనుషులు విజ్ఞానులవు
తారా? మేధావులవుతారా?
మేఘములు నీటినిగానీ, నీటితో సహా కొన్ని జీవరాశులనుగానీ తీసుకొని పోవునను సత్యము ఎవరికీ తెలియదు
కనుక, కొన్ని సంవత్సరము లకు ఒకమారు, ఎక్కడో ఒకచోట ప్రత్యక్షముగ కనిపించునట్లు దేవుడు చేయించాడు. దీని
మాదిరే పునర్జన్మ విషయము కూడ! ఇది సత్యము అని చెప్పుటకు ఎటువంటి ఆధారము లేనిదానివలన దానిని కూడ
కొన్ని సంవత్సరములకు ఒకమారు ఎక్కడో ఒకచోట అందరికి తెలియునట్లు, కొంత కాలము మాత్రము వెనుకటి జన్మ
జ్ఞాపకము వచ్చిన వారిని దేవుడు కనిపింపజేయుచున్నాడు. ప్రత్యక్షముగా వెనుక జన్మ విషయములను చెప్పడమేకాక,
చూపించడము జరిగినపుడు కూడ విజ్ఞానులము, మేధావులము అనువారు కొందరు, కనిపించే సత్యమును గ్రహించుకోలేని
స్థితిలోవుండి, సత్యమును మూఢనమ్మకము అంటున్నారు. అటువంటివారు ప్రపంచ విధానములో ఎంత పెద్ద మేధావులు,
విజ్ఞానులు అయినా, పరమాత్మ విధానములో వారి బుద్ధి, కనిపించే దానిని కూడ గ్రహించకోలేని బలహీనముగా
ఉన్నదని తెలియుచున్నది. ఒక విధముగా ప్రపంచ విధానములో మేధావులుకానటువంటి సామాన్య ప్రజలే, దేవుని
విధానమును అర్థము చేసుకొను బుద్ధి బలము కల్గియున్నారని చెప్పవచ్చును. ఇటువంటి రెండు రకముల మనుషులేకాక,
మూడవరకము మనుషులు కూడ చాలా అరుదుగా ఉన్నారు. వారు ఇటు ప్రపంచ విధానములోను మేధావులే, అటు
పరమాత్మ విధానములోను మేధావులే అయివున్నారు. ప్రపంచ విషయములో మేధావులైన ఒక రకమువారు భూమిమీద
కొందరే ఉండగా ప్రపంచ విషయములో మేధస్సులేని రెండవరకము వారు, భూమిమీద ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే
ప్రపంచ విషయములోను, పరమాత్మ విషయములోను రెండు విధముల మేధావులైన మూడవరకము వారు భూమిమీద
బహు అరుదుగా ఉన్నారు. ఈ మూడు రకములు మనుషులలో దైవజ్ఞానము ప్రకారము చూస్తే, అరుదుగానున్న
మూడవరకము వారు ఉత్తములు, ఎక్కువగానున్న రెండవ రకమువారు మధ్యములు, తక్కువగానున్న ఒకటవ రకమువారు
అధములని చెప్పవచ్చును.
దేవుని జ్ఞానములో అధములై, ప్రపంచ జ్ఞానములో మేధావులైన వారు, సముద్రము నీరు ఆవిరై పైకిపోయి
మేఘముగా ఏర్పడుచున్నదని చెప్పుచున్నారు. ఎండాకాలము సూర్యుని వేడికి సముద్రము మీద నీరు ఆవిరై పోతున్నదని
ప్రపంచ విజ్ఞానులు చెప్పుచున్నారు. అయినా మేము ఆ మాటను విశ్వసించడము లేదు. ఎందుకనగా! ఒక లోహమును
కరిగించుటకు ఎంత వేడి, అవసరమవుతుందో, దానిని మెల్టింగ్ పాయింట్ డిగ్రీలు అని అంటారు. సీసమును
(లెడ్్ను) కరిగించుటకు ఎంత వేడి అవసరమో, దానికంటే ఎక్కువ వేడి రాగి లోహమును (కాపర్) కరిగించుటకు
అవసరమగును. దీనినిబట్టి సీసము ఒక ఉష్ణోగ్రతవద్ద, రాగి మరొక ఉష్ణోగ్రతవద్ద కరుగుచుండుట వలన సీసముకు,
రాగికి మెల్టింగ్ పాయింట్స్ డిగ్రీలు వేరువేరుగా ఉన్నాయని తెలిసింది. అలాగే నీరు ఆవిరి అగుటకు ఎంతవేడి
అవసరమో, ఆ వేడిని బాయిలింగ్ పాయింట్ డిగ్రీలు అంటారు. ఇపుడు మనకు అవసరమైనది నీరు విషయము.
కావున నీటి విషయమును చూస్తే నీరు నూరు (100) సెంటిగ్రేడ్ డిగ్రీలవద్ద మరిగి ఆవిరి అగును. అందువలన నీరు
యొక్క బాయిలింగ్ పాయింట్ డిగ్రీలు వంద సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అని చెప్పవచ్చును. మన ఇంటిలో ఒక పాత్రలో
నీరును నింపి, పోయ్యి మీదపెట్టి వందడిగ్రీల వరకు వేడిచేస్తే అప్పుడు నీరు ఉడికి (మరిగి) ఆవిరి అగుచున్నదని
అందరికి తెలుసు. ఆకాశములో సూర్యుని వేడివలన సముద్రము నీరు ఆవిరై, పైకి పోయి మేఘములు ఏర్పడుచున్నవని
చాలామంది చెప్పుమాటలో సత్యము లేదని తెలియుచున్నది. సముద్రము నీరు ఆవిరి అగుటకు వంద డిగ్రీల వేడి
అవసరము కదా! అంతవేడి సూర్యుని నుండి రాలేదు. సూర్యుని నుండి వచ్చు వేడి ఎండాకాలము 40 నుండి 45
డిగ్రీల వరకు ఉండును. ఎప్పుడైన అరుదుగా 50 డిగ్రీల వరకు ఉండవచ్చును. నీరు ఆవిరి అగుటకు వంద
సెంటిగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమైనపుడు, సూర్యుని నుండి వచ్చు 40 లేక 45 డిగ్రీల ఉష్ణోగ్రతకు నీరు ఆవిరైపోవు
ప్రసక్తే లేదు. అందులన సూర్యుని వలన నీరు ఆవిరైపోతుందని, ఇంతవరకు మనము వినిన లేక చదువుకొన్న విషయము
పూర్తి అసత్యమని తెలియుచున్నది.
ఇంత చెప్పినా “లేదు! సముద్రము నీరే ఆవిరై మేఘముగా తయారగు చున్నది. ఆ మేఘమునకు చల్లని గాలి
తగిలినపుడు మేఘములలో ఆవిరి రూపములోనున్న నీరు చల్లనిగాలికి, నీరుగా మారి వర్షము పడుచున్నదని” మొండిగా
వాదించు వారుండవచ్చును. అటువంటి వారిని మేము అనేక ప్రశ్నలు అడుగవలసి వచ్చును. ఆ ప్రశ్నలకు వారు
మొండిగా, జవాబు కాని దానిని చెప్పడము తప్ప వేరు మార్గములేదు. సముద్రములో నీరుగానీ, ఒక డ్యామ్
నీరుగానీ, చిన్న చెరువులో నీరుగానీ అన్నీ నీరే అగును. అన్నిటికి నూరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత బాయిలింగ్
పాయింట్ అగును. అటువంటపుడు చిన్న చెరువులోగానీ, పెద్ద డ్యామ్లోగానీ, అపారమైన సముద్రములోగానీ నీరు ఉ
డికి (మరిగి) ఆవిరి అవడము ఎవరైనా చూచారా? ఎవరూ చూడలేదు, అది ఎక్కడ జరుగలేదు. సూర్యుని నుండి
నూరు సెంటిగ్రేడ్ డిగ్రీల వేడి రానపుడు, నీరు ఆవిరి అగుటకు వీలులేదని ఎవరైనా చెప్పవచ్చును. నీరు భూమిలోనికి
ఇంకిపోవచ్చును. కానీ ఆకాశములోనికి ఆవిరైపోదు. అలాగే గాలిలోనికి నీరు కలిసి గాలిలో తేమ ఏర్పడును. కానీ
నీరు ఆవిరై గాలిలో కలిసిపోలేదు. బండలమీద నీరుగానీ, తేమగానీ గాలికి అరిపోతుంది, కానీ ఆవిరై పోదు. తడిగుడ్డలలోని
తేమ గాలిలోనికి అరిపోతుంది, కానీ ఆవిరై పోదు. ఏర్ కూలర్ లోని నీరు ఫ్యాన్గాలికి ఆరిపోతుంది, కానీ ఆవిరైపోదు.
ఇట్లు నీరు అరిపోయే దానికి, ఆవిరై పోయే దానికి తేడా తెలియని కొందరు నీరు ఆవిరై మేఘాలుగా మారి పోతున్నదని
అనుకోవడము జరుగుతున్నది. ఎవరు ఏమనుకొనిన మేఘములు నీరును, నీటితోపాటు కొన్నిటిని తీసుకుంటున్నదని
చెప్పుటకు ఆధారముగా వార్తాపత్రికలో వచ్చిన సమాచారమును క్రింద ఇస్తున్నాము చూడండి.
చేపల జల్లులు... కురిసిన కప్పలు!
(ఈనాడు హైదరాబాద్ ఆదివారం 25 జులై 2010, 28వ పేజీలో)
(వర్షంతో పాటు వడగళ్ళు పడితే సంబరపడతారు... మరి చేపలు, కప్పలు కూడా పడితే? అవే కాదు నాణాలు, పిజ్జాలు కూడా
పడ్డ సంగతి తెలుసా? అవే వింత వానలు!)
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ కుటుంబమంతా కలిసి కారులో వెళ్తుంది. అకస్మాత్తుగా ఆకాశంలో ఓ
చోట నల్లని మబ్బులు కమ్ముకుని వానపడింది. దాంతోపాటు దబదబమంటూ చేపలు కురిశాయి! పైగా అవి
బతికున్నవే!!
సెర్బియా దేశంలో 2005లో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు హఠాత్తుగా ఇళ్ళలోకి పరుగులు తీశారు. ఎందుకో
తెలుసా? వడగళ్ళలాగా చిన్న కప్పలు కురవడం ప్రారంభించాయి!
ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల వింతవానలు కురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటినే 'ఆడ్ రెయిన్స్'
'స్ట్రేంజ్ రెయిన్స్' అంటారు. యాసిడ్ వర్షాలు, ఎర్రరంగులో కురిసే వానలు కూడా ఈ కోవలోకే వస్తాయి. అయితే
మొసళ్ళు, పిజ్జాలు, కాసులు కూడా కురిసిన సందర్భాలు ఉన్నాయి. బలమైన సుడిగాలులు ఏర్పడినప్పుడు అవి ఏ
చెరువులోని నీటినో పీల్చుకుంటాయని, ఆ గాలులు చెల్లాచెదరైనప్పుడు అందులోని చేపలన్నీ వర్షంలా కురిసే అవకాశం
ఉందని చెబుతారు. ఏమైనా ఇలాంటి వింత వానల గురించి వానాకాలంలో తెలుసుకోవడం ఆసక్తికరం.
అర్జెంటైనాలోని ఓ ప్రాంతంలో 2007 ఏప్రిల్ 6న సాలీళ్ళ వర్షం కురిసింది. ఆ వానని ఒకతను ఫోటో తీశాడు
కూడా!
మన దేశంలో కేరళలో 2001లో ఎర్రరంగు వర్షం కురిసింది. దాన్ని 'బ్లడ్ రెయిన్' అని పిలిచారు.
గుజరాత్లోని బాన్వాడ్, 2009 అక్టోబరు 24న చేపల వర్షం కురిసింది.
కాలిఫోర్నియాలో 1869 ఆగష్టు 1న ఏదో జంతువుకు చెందిన శరీర భాగాలు కురిశాయి.
ఇంగ్లాండులో 1894లో జెల్లీఫిష్లు రాలాయి.
ఇంగ్లండ్లో 1881లో హెర్మిట్ పీతలు వందల కొద్దీ పడ్డాయి.
కొలరాడో ప్రాంతంలో 1982 నుంచి 86 వరకూ ఏటా మొక్కజొన్న కంకులు కురిశాయి.
ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో 1982 మే 28న నాణాల వాన కురిసింది. రష్యాలో మెర్చెరీ గ్రామంలో కూడా
కాసులు రాలాయి.
అమెరికాలోని సిల్వర్టైన్లో 1877లో ఓసారి మొసళ్ళ వాన కురిసింది. ఒక్కో మొసలి 12 అంగుళాల
పొడవుంది.
మాంట్రియల్ అనే ఊరిలో 1857లో బల్లుల వర్షం పడింది.
ఆఫ్రికాలో ఒకాయన కారుపై దబ్బుమని పెద్ద పిజ్జా పడింది.
హెూండురస్ దేశంలో ప్రతి ఏడాది మే-జులై నెలల మధ్య చేపల వాన కురుస్తుంది. వాటిని వండుకుని
తింటారు కూడా.
ప్రత్యక్షముగ క్రిందపడిన ఇన్ని వస్తువులు ఆవిరియై పోలేదు కదా! నీటిని వేడి ద్వారా ఆవిరి చేసి, ఆ ఆవిరిని
చల్లబరచి తిరిగి నీరగునట్లు ప్రయోగశాలలో చేసి చూపించవచ్చును. అదే మాదిరి సముద్రము నీరు ఆవిరై మేఘరూపములో
ఉండగా, చల్లని గాలి తగలడము వలన ఆవిరి తిరిగి నీరై, వర్షము కురవడము జరుగుచున్నదని కొందరు చెప్పినా,
నీరు ఆవిరై, ఆవిరి చల్లబడి నీరవుతుందను సూత్రము చెప్పినా, ఆ విధానమును ప్రయోగము చేసి, చూపించినా, ఆ
సూత్రము సారాయిని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ వర్షము కురిసే దానికి ఉపయోగపడడము
లేదు. కొందరు వారికి తెలిసిన సూత్రము ప్రకారము, మేఘమధనము చేసి వర్షాలను కురిపిస్తామని ప్రయత్నము
చేసినా, మేఘ మధనము ద్వారా కూడ వర్షాలు కురుస్తాయని నిరూపణకు రాలేదు. మేఘ మధనము చేసినా, వర్షము
కురవని సందర్భములున్నవని దీనినంతటిని గమనిస్తే, మేఘములు మన ఇష్టప్రకారము పని చేయవనీ, దేవుని ఇష్టము
ప్రకారము పని చేయునని తెలియుచున్నది.
మేఘము వర్షించినపుడు వచ్చు నీరు, కొన్ని లక్షల చెరువులు నిండేంత ఉండును. వర్షించిన నీరు వరదలై
పారుచున్నది. భూమిలోనికి కొంతనీరు ఇంకిపోయినా, కొంత నీరు పల్లముగానున్న గుంతలలో నిలిచి పోయినా,
చివరకు సముద్రము వరకు వర్షము నీరు ప్రవహించుచున్నదంటే ఎన్ని నీళ్ళు పైకి పోయి ఉండాలో మీరే లెక్కించుకోండి.
అంత నీరు ఆవిరి రూపములో పైకి చేరినదని చెప్పుటకు వీలులేదు. చివరకు ఒక లీటరు నీరు కూడ సూర్యరశ్మి ద్వారా
ఆవిరై పైకి పోయిందనుటకు అవకాశము లేదు. అందువలన మేము చెప్పునది ఏమనగా! మేఘము జీవము గల
భూతము. అది ఇంకొకరి ఆజ్ఞకు లోబడి పని చేయుచున్నది. తనకు వచ్చు ఆజ్ఞ ప్రకారము, భూమిమీద నీరును
కంటికి కనిపించకుండ సూక్ష్మముగా పైకి తీసుకోగలుగుచున్నది. మేఘములోని నీరు ఆవిరి రూపములో వచ్చినది
కాదు, మేఘము స్వయముగ తీసుకొన్నదేనని తెలియాలి. ఇటు ప్రపంచ జ్ఞానము, అటు దైవజ్ఞానము తెలిసిన మేధావులైన
మూడవరకము వారు చెప్పు ప్రకారము, దేవుని పాలనలో మేఘములు ముఖ్యపాత్ర పోషిస్తున్నవి. మనుషులు బ్రతుకుటకు
త్రాగునీరును, ఆహార ధాన్యములు పండుటకు అవసరమైన నీరును, మనిషికి జీవనాధారమై ప్రతిచోట ఉపయోగపడు
నీరును అందించడము మేఘముల యొక్క ముఖ్య కర్తవ్యము. మనుషులు చేసుకొన్న పాపపుణ్యము ప్రకారము, వారికి
పంటలు పండాలన్నా, భూమి సారవంతముగా ఉండాలన్నా, మేఘముల వర్షము మీద ఆధారపడి ఉండును. అంతేకాక
మనుషులను వరదల ద్వారా హింసించుటకుగానీ, చంపుటకుగానీ మేఘములదే ముఖ్యపాత్ర!
దేవుని పాలనలో సేవకులై, దైవత్వము యొక్క గొప్పతనమును తెలిసిన మేఘములు, నేటికాలములో అజ్ఞానములో
మునిగిపోయి, దైవత్వమును పూర్తి మరచిపోయిన మనుషులనూ, జ్ఞానులను దైవ జ్ఞానమున్న గ్రంథములను గౌరవించని
వ్యక్తులనూ, ప్రపంచ ధనము అయిన డబ్బు ముందర దేవున్ని కూడ లెక్కచేయని మానవులనూ, కానుకలు, ముడుపులు
ఇస్తే దేవుడు కూడ తమ పనిని చేస్తాడు అనుకొను వ్యాపార దృష్టికల్గిన మనుషులనూ, చూచిన మేఘములు తమ దేవుని
రాజ్యములో ఉండి దేవున్ని గౌరవించని వారి మీద విసుగుకల్గియున్నవి. అందువలన మనుషుల పాపము వంతుకు
వచ్చినపుడు, మనుషులను బాధించుచున్నవి. చిన్న ఉదాహరణ ప్రకారము చూస్తే, ఒక వరదవచ్చి ఊరంతా జలమయమై
పోయి తిండిగింజలుగానీ, కట్టుబట్టలుగానీ చేతికి దొరకకుండ పోయినపుడు, తమకు పిడికెడు అన్నము కూడ దొరకనపుడు,
తమ పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే, తమకు ఆహారము లేని కారణమున శరీరములోని శక్తి లేకుండ పోవుచున్నపుడు,
ఈ వరద ఎంత పని చేసినదని బాధపడుచున్నపుడు మేఘము అదే ప్రాంతములో వర్షించను మొదలుపెట్టితే, ఇక
వర్షము వద్దు, వర్షము వస్తే మా ప్రాణాలు పోతాయి, మమ్ములను కాపాడమని దేవున్ని ప్రార్థించినా, ఇంతకాలము
డబ్బు తప్ప దేవుడే గుర్తుకు రాని మీకు ఆపద సమయములో మాత్రము దేవుడు గుర్తుకు వస్తాడా? అని మేఘములు
వర్షించి, నీటిలో మునిగిపోవు పరిస్థితిని తెచ్చుచున్నవి. కొన్ని ప్రాంతములలో నీటినుండి బయటపడకుండ చనిపోవునట్లు
చేయుచున్నవి. కొందరి ఇళ్ళను వర్షము వలన కూలిపోవునట్లు చేసి, ఇంటిలోని వారందరిని దయదాక్షిణ్యము లేకుండ
చంపివేయుచున్నవి. ఇవన్నియు దేవునికి తెలియకుండ జరగడము లేదు. దేవునికి తెలిసినా, నా పాలన బాగా
సాగుచున్నదనుకొంటాడు, నా సైన్యము బాగా పని చేస్తున్నదని అనుకుంటాడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును.
“ప్రాణాపాయ స్థితిలో తమ ప్రాణములు పోతాయను భయముతో దేవున్ని వేడుకుంటే దీన స్థితిలోనున్న వారిని చూచి
దేవునికి కొద్దిగ అయినా దయరాదా? తమ సైనికుడు చేయు భీభత్సమును చేయవద్దని, తమ సైనికుడైన మేఘమునకు
చెప్పలేడా?” అని అడుగవచ్చును. దానికి దేవుడు ఈ విధముగ సమాధానము చెప్పవచ్చునని అనుకుంటాను. “నన్ను
భక్తితో వేడుకొమ్మని భగవద్గీతలో చెప్పానుగానీ, భయముతో వేడుకొమ్మని నేను ఎక్కడ చెప్పలేదు. భయము పరధర్మమని
అది నా ధర్మమేకాదని, అది మీకు అజ్ఞానాన్నే ఇస్తుందని, పర ధర్మమైన భయముకంటే, స్వధర్మములో మరణమైన
మంచిదేనని భగవద్గీతలో కర్మయోగమున 35వ శ్లోకములో చెప్పియున్నానని మరువవద్దు. నీకు అభిషేకములు చేయించానే?
ఆకు పూజలు కట్టించానే? వేలు ఖర్చుపెట్టి కుంకుమార్చనలు, లక్షలు ఖర్చుపెట్టి తులసి అర్చనలు, కోట్లు ఖర్చుపెట్టి
నగలు, కిరీటాలు చేయించానే? మామీద కొంచెమైన దయరాదా? మమ్ములను కాపాడవా? అని కొందరు అంటున్నారు.
దానికి నా సమాధానము ఏమనగా! నేను గుణరహితుడనని గీతయందు చెప్పాను. నాకు గుణములే లేనపుడు,
దయా గుణము ఎలా వస్తుంది? కావున నాకు దయలేదు. నా మాదిరి నా సేవకుడైన మేఘమునకూ దయలేదు. ఆకు
పూజలు, అర్చనలు, అభిషేకములు చేయించానే అని అడుగువారున్నారు. ఆ మాటను నేను ఒప్పుకుంటాను. మీరు
వేలు, లక్షలు ఖర్చుపెట్టి నాకు అర్చనలు చేయించేటపుడు, దేవుడు సర్వవ్యాప్తి సర్వాంతర్యామి అని అనుకోకుండ, నేను
గుడిలో మాత్రమున్నవాడిగ, నా ఎదురుగా నిలుచున్నవాడు, ఎవడో కూడ తెలియని గ్రుడ్డివానిగ నన్ను లెక్కించి, నేను
పలానావాడిని, నీకు పూజచేయిస్తున్నాని నాకు తెలియు నట్లు, నాది పలానా వంశము, పలానా గోత్రము, పలానా
నామధేయము అని మీ అడ్రస్ పూజారి చేత చెప్పిస్తారా? అలాంటపుడు నీవు ఎవరో తెలియని నేను, నిన్ను రక్షించే
దానికి నీవు పిలిచినపుడే రావాలంటే కుదరదు. ఎందుకు కుదరదనగా, నీలాగా చాలామంది అడ్రస్లు చెప్పిపోయారు
కదా! నీకు వరదలు వచ్చినపుడు, నీకంటే వందరూపాయలు ఎక్కువ ఖర్చుపెట్టి పూజ చేసినవాని కొంప అంటుకొని
వాడు పిలుస్తున్నాడు. అదే సమయము లోనే కోట్లు ఖర్చుపెట్టి కిరీటము చేయించినవాడు కడుపునొప్పితో బాధపడుచు
నన్ను కాపాడు అంటున్నాడు. అలాంటపుడు ఎవడు ఎక్కువ ఖర్చుపెట్టాడని నేను కూడ లెక్క చూచుకొని తక్కువ
ఖర్చుపెట్టిన వారిని వదలి, ఎక్కువ ఖర్చుపెట్టిన వానివద్దకు పోవాలంటే వాని అడ్రస్ వెదకుచు పోవాలి. ఎక్కువ
తక్కువల లెక్క చూచుకొని పోయే దానికి కొంత సమయము, వాడు చెప్పిన అడ్రస్ వెదకుచు పోయే దానికి కొంత
సమయము వృథా అవుతుంది కదా! అలా వెదకుచూ పోయినా వాడు చెప్పిన అడ్రస్, గోత్రము, పేరుమాత్రము ఉన్నది,
ఇంటినెంబరు పూజారికి చెప్పలేదు. నేను గోత్రము, పేరును పట్టుకొని పోతే అదే పేరు, అదే గోత్రమున్న వాళ్ళు
పదిమంది ఉన్నట్లు తెలిసింది. ఇంటినెంబర్ లేని దానివలన అదే పేరు, అదే గోత్రమున్న పదిమందిలో ఎవనికి
కడుపునొప్పి ఉందో ఎలా తెలుస్తుంది? పదిమందిలో ఎవడు పిలిచాడో తెలియక వెనక్కివచ్చాను. అప్పుడు మీరు
అడ్రస్ చెప్పినా, పూర్తి ఇంటినెంబర్తో సహా చెప్పకపోయిన దానివలన, నేను చివరకు కడుపునొప్పి వచ్చినవాని దగ్గరకు
పోలేకపోయాను.
మీరు నన్ను గ్రుడ్డివానిగ అనుకోకుండ, సర్వవ్యాపి లెక్కించి, ఆ రోజు గోత్రము, పేరు చెప్పకుండ పూజ
చేసియుంటే ఈ రోజు నేను కూడ సులభముగ నీవద్దనే ఉండేవాడిని, అలా కాకుండ నాకు మీ అడ్రస్ చెప్పి నన్ను
అవమానపరుస్తున్నారు. అటువంటి మిమ్ములను నేనెందుకు కాపాడాలి? మీరు పూజచేస్తే కాపాడుతానని నేను ఎక్కడా
చెప్పలేదు. నన్ను అర్థముతో ఆరాధిస్తే దానివలన జ్ఞానము కల్గునని, జ్ఞానము వలన మీ కర్మలు పోవునని, దానివలన
మీరు రక్షింపబడుదురని గీతయందు చెప్పాను గానీ, అర్థములేని పూజలు చేస్తే మిమ్ములను కాపాడుతానని చెప్పలేదు.
అందువలన మీరు అర్థము తెలిసి ఆరాధనలు చేయండి అర్థము తెలిసి చేస్తే జ్ఞానశక్తికల్గి దానివలన మీరు కాపాడబడుతారు.
కానీ నా వలన ఎవరూ కాపాడబడరు. నేను పెట్టిన చట్టము ప్రకారము నా మేఘములు పనిని చేయుచున్నవి.
మేఘములు ఎవరిని హింసించినా, చంపినా అది నా పాలనలోని చట్టరీత్య జరిగినదేగానీ వేరుకాదు.
మేఘములు ద్రవపదార్థమైన నీటివర్షమునేకాక, ఘన పదార్థమైన మంచు లేక ఐసుక్కలనుగానీ, పెద్ద
మంచుగడ్డలనుగానీ, మంచుపొడిని గానీ తెచ్చి క్రిందవేయడము జరుగుచున్నది. ఎక్కువ శీతల ప్రాంతములలో మంచుపొడి
మేఘములనుండి రాలుతుంది. ఉష్ణప్రాంతములో వర్షా కాలమున చిన్న చిన్న మంచుముక్కలు రాలడము జరుగుతుంది.
ఎప్పుడైన అరుదుగా పెద్దపెద్ద మంచుబండలు క్రిందికి పడడము కూడ జరుగుతుంది. ఈ మధ్యకాలములో మంచుముక్కల
వర్షము లేక వడగండ్ల వాన ఎక్కువగా కురిసింది. వర్షముతోపాటు వడగండ్లు (మంచుముక్కులు) పడడమును వడగండ్లవాన
అంటాము. వడగండ్ల వానపడడము వలన అరటితోటలు, బొప్పాయితోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దానివలన
రైతులు నష్ట పోయారు. మేఘమునుండి విసరివేయబడిన మంచుముక్క బుల్లెట్గ (తుపాకిగుండులాగ) అరటిగెలను
తాకడమువలన అరటికాయలు రంధ్రాలుపడి చీలిపోయాయి. అలాగే బొప్పాయి కాయలురంధ్రాలు పడిపోయాయి.
పచ్చి అరటికాయలు, పచ్చిబొప్పాయి కాయలు గట్టిగా ఉండినప్పటికి, వేగముగా వచ్చి తగిలిన వడగండ్లవలన రాళ్ళలాగ
గట్టిగ ఉన్న కాయలు కూడ రంధ్రాలు పడిపోయాయి. ఈ విధముగా మంచు ముక్కల వర్షమువలన ఎన్నో పంటలు
పూర్తిగా నాశనమై రైతులు నష్టపోయి, నానా బాధలు పడడమేకాక అప్పులు తీర్చలేక, ఆత్మహత్యలు చేసుకొనునట్లు
మేఘములు చేయుచున్నవి. ఈ సంవత్సరము కర్నూలు జిల్లాలో స్పీడ్గా పోయే బస్సుమీద వడగండ్ల వాన కురియుట
వలన బస్సు అద్దములు పగిలి లోపలి ప్రయాణికులకు గాయములై, ఆసుపత్రికి పోయినట్లు టి.విలో వార్తను చూచాను.
ఈ విధముగా మేఘములు వర్షములు, వరదల రూపములోనే కాకుండా, మంచు తుఫాన్రూపములో కూడ మనుషులను
కష్టాలపాలు చేయుచున్నవి. మంచు కురియడము వలన చిన్నదారులు, పెద్ద రహదారులు పూడిపోయి కనిపించకుండ
పోవడము వలన, రోడ్లమీద పోవు రవాణా వ్యవస్థ అంతా స్థంభించి పోవుచున్నది. ఇళ్ళపైకప్పుల మీద మంచు
పేరుకోవడము వలన పైకప్పులు బరువెక్కి కూలిపోవుచున్నవి. మంచుపొడి ఎడతెరపి లేకుండ రాలడము వలన ఇళ్ళు,
వాహనములు, రోడ్లు, చిన్న చిన్న చెట్లు అన్నీ మునిగిపోవుచున్నవి. దానివలన ఆ ప్రాంత ప్రజలు పడే అవస్థలు
వర్ణనాతీతము!
తన ఆకారమును, పరిమాణమును మార్చుకొను మేఘములు, కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధి వరకు ఆకాశములో
విస్తరించుకొని ఉండును. అలా విస్తరించుకొన్న మేఘముల పరిధిలోనికి విమానములుగానీ, హెలిక్యాప్టర్లుగానీ వస్తే,
కొన్నిటిని ఏమి చేయక వదలి వేయును. కొన్నిటిని మాత్రము, తన చేతులతో విమానములను కూడ క్రిందికి నెట్టివేయును.
మేఘములు విమానములను బలముగా మరియు వేగముగా క్రిందికి త్రోయడము వలన విమానములను నడుపువారికి
విమానము కంట్రోల్ కాకపోవడమేకాక ఏమి జరుగుచున్నదని పైలెట్లకు అర్థము కాకుండ పోవును. వారు తేరుకొనే
లోపలే విమానము క్రిందపడి ప్రమాదము జరిగిపోవును. ఈ మధ్యకాలములో మేఘములు విమానములను క్రిందికి
త్రోయడము అక్కడక్కడ జరిగింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డిగారు ప్రయాణించు హెలిక్యాప్టర్
కూడ మేఘముల వలననే ప్రమాదానికి గురియైనదని, మేఘములు క్రిందికి తోయడము వలన హెలి క్యాప్టర్ వేగముగా
క్రిందకివచ్చి భూమికి కొట్టుకొన్నదని పరిశోధనలోనే తేలింది. అంతేకాక ఆంధ్రయూనివర్శిటిలో మేఘములను గురించి
రీసర్చ్ చేయు ప్రొఫెసర్ “క్యూములోనింబస్” మేఘములు ప్రమాదరకమైనవని, అవి విమానములను సహితము క్రిందికి
త్రోయగలవని, వాటినే రాక్షస మేఘములంటామని న్యూస్పేపర్లో ప్రకటించారు.
మేఘములు వర్షాలు, వరదల రూపములోనే కాకుండ, వడగండ్ల వానరూపములో, మంచుపొడి తుఫాన్రూపములో,
ఆకాశమబ్బులైన క్యుములోనింబస్ మేఘాలరూపములో మనుషులను ఎన్నో కష్టాలపాలు చేయుచున్నవి. అంతేకాక
కొన్ని విదేశాలలో సుడిమేఘాలరూపములో కూడ విజృంభించుచున్నది. విదేశాలలోని సుడిమేఘములను బహశ నేషనల్
జియోగ్రఫి టి.వి ఛానల్లోగానీ, డిస్కవరిఛానల్లోగాని చూడవచ్చును. చాలామంది సుడిమేఘాలను, సుడిగాలిగా
అనుకోవడము జరుగుచున్నది. కానీ అది సుడిగాలి కాదు. గాలివలె పనిచేయుట వలన సుడిమేఘాలను సుడిగాలిగా
చాలామంది పొరబడి అనుకోవడము జరుగుచున్నది. సుడి మేఘమును గురించి చెప్పుకొంటే ఆకాశములో
అదృశ్యముగానున్న సుడి మేఘము దృశ్యరూపములోనికి మారి, పది నుండి ఇరవై ఎకరాల విస్తీర్ణముగా విస్తరించి
అక్కడినుండి క్రిందికి వ్యాపించును. పైన పది ఎకరముల విస్తీర్ణముగల మేఘము క్రిందికి వచ్చేటప్పటికి దాదాపు
నాలుగవవంతు విస్తీర్ణముగా తయారగును. పైన పది ఎకరముల విస్తీర్ణముగా కనిపిస్తూ, క్రిందికి విస్తీర్ణవ్యాసము
తగ్గుతూ భూమిమీదకు వచ్చేటప్పటికి రెండు లేక రెండున్నర ఎకరముల విస్తీర్ణముగా ఉండును. పైన వెడల్పుగా
కనిపిస్తున్న మేఘము క్రింద భూమిమీద ఆకారము తక్కువ వెడల్పుగ కనిపించును. అలా కనిపించిన ఆకారము
ముందుకు కదలుచువచ్చుచుండును. గంటకు పది నుండి ఇరవై కిలోమీటర్ల వేగముతో సుడి మేఘము ముందుకు
కదలుచు పోవుచుండును. అలా కదలుచున్న మేఘము, కొన్ని ఊర్లమీద ప్రయాణించడము జరుగుచున్నది.
సుడి మేఘము పై నుండి క్రింద భూమివరకు ఉండును కదా! క్రింద భూమిని తాకినకొన, రెండు మూడు
ఎకరముల విస్తీర్ణముగా ఉంటూ వేగముగా సుడి తిరుగుచుండును. మేఘము క్రిందికొన, సుడి తిరుగడము వలన
భూమిమీద ఏమున్నా, అది మేఘము యొక్క బలమునకు తట్టుకోలేక మేఘము వెంట తిరుగుచు పైకెగురును. అలా
సుడిమేఘములో చిక్కుకొన్న, చిన్నచిన్న కార్లు కూడ గిర్రున తిరుగుచు పైకి లేచి, సుడి వ్యాసము యొక్క అంచు దగ్గర
నుండి విసరివేయబడును. ఉదాహరణకు కోళ్ళఫారమ్ను నిర్వహించు ఇనుపరేకుల షెడ్గానీ, సిమెంటేకుల షెడ్
గానీ సుడిమేఘము ప్రయాణించు దారిలో ఉందనుకొనుము. సుడిమేఘము ఆ షెడ్ల మీదకు వస్తూనే, మేఘము సుడి
తిరుగు వేగమునకు మరియు బలమునకు, షెడ్మీద ఉన్న రేకులు పైకి లేచి మేఘములో తేలిపోతూ, సుడి తిరుగుచు
విసిరివేయబడినట్లు దూరముగా పడిపోవుచుండును. మేఘము కదలి పోయేకొలది దారిలోనున్న ఏవైనా తేలిక
వస్తువులనుండి, బరువు వస్తువుల వరకు పెరికి త్రిప్పి విసిరివేయడము జరుగుచుండును. సుడి మేఘము ఎక్కడికి
వచ్చినా విధ్వంసము జరిగినట్లే అవుతుంది. ఆ మేఘమును దూరమునుండి గమనించిన మనుషులు, దానిలో చిక్కుకోకుండ
ఇళ్ళు వదలి పారిపోవుదురు. ఆ మేఘములో చిక్కుకొన్న పశువులు కూడ వంద అడుగుల పైకిలేచి, మేఘములో
గిర్రున తిరగడము టి.వి. ఛానళ్ళలో చూడడము జరిగింది. ఒక ఊరుమీద ఆ మేఘము ప్రయాణించి పోయిన తర్వాత,
ఆ ఊరును చూస్తే చీపురుతో ఊడ్చినట్లు పై కప్పులు ఊడిపోయిన ఇండ్లు, చెల్లాచెదురుగా పడిన వాహనములు
మొదలగునవి భయంకరముగా కనిపించును. నిన్నటి దినము ఒక దేశములో సుడిమేఘము ప్రయాణించ డమును
టి.వి. ఛానల్ చూచాను. అది ప్రయాణించకముందు విమానా లను రిపేరు చేయు పెద్దషెడ్లను దూరమునుండి
చూపించారు. ఆ మేఘము ఆ షెడ్మీదకు వచ్చినపుడు, పై కప్పులు సుడితిరుగుచు, మేఘములో లేచి పోవడము,
గిర్రున తిరుగుచూ దూరముగా పై నుండి విసిరివేసినట్లు పడి పోవడము ప్రత్యక్షముగా కనిపిస్తూవుంది. సుడిమేఘము
ఆ ప్రాంతమును దాటిపోయిన తర్వాత అక్కడికి పోయి ఆ దృశ్యములను చూపించగా షెడ్లలో నిలబడివున్న విమానాల
రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విమానాలు ప్రక్కకు తిరిగి పడివున్నాయి. చూచేదానికి ఎవరైనా పెద్ద రౌడిమూక
(కొన్ని వందలమంది రౌడీలగుంపు) వచ్చి విధ్వంసము చేసినట్లు, అన్నిటిని పగులకొట్టినట్లు కనిపిస్తున్నది. సుడిమేఘము,
గాలి సుడితిరిగినట్లు, గాలిలో వస్తువులు లేచిపోయినట్లు, కొట్టుకుపోయినట్లు చేయుచున్నది. కావున వాస్తవానికి అది
మేఘమే అయినా, చాలామంది దానిని సుడిగాలి అనుకోవడము జరుగుచున్నది.
మేఘము అనునది ఒకటే అయినా మానవుడు చేసుకొన్న పాపమును బట్టి అది ఐదు రకములుగా పనిని
చేయుచు ఐదు రకముల పేర్లను కలిగియున్నది. 1. వర్షమును కురియునపుడు వర్షమేఘము అంటాము. 2. మంచుముక్కలు
పడునపుడు వడగండ్ల మేఘము అంటాము. 3. పొడిమంచు పడునపుడు మంచుమేఘము అంటాము. 4. విమానాలను
కూలద్రోయునపుడు మబ్బుమేఘము అని మనము అంటాము. శాస్త్రవేత్తలు రాక్షసమేఘము లేక క్యుములోనింబస్
మేఘము అని అంటారు. 5) సుడిగాలిలాగ ప్రయాణిస్తు దొరికిన వస్తువులన్నిటిని పైకిలేపి విసరివేయు మేఘమును
సుడిమేఘము అంటాము. ఐదు రకాల పేర్లు కల్గి ఐదు విధములుగా మేఘము, మనుషులను చిత్రహింసలపాలు
చేయడమేకాక ఘోరముగా మనుషులను చంపివేయుచున్నది. ఎక్కడో యమలోకముందని చెప్పుకోవడము తప్ప దానిని
ఎవరూ చూడలేదు. కానీ మేము ఇక్కడే యమలోకముందని చెప్పినా, వాస్తవమును ఎవరూ గ్రహించలేకున్నారు.
యమలోకములో మనిషియొక్క పాపము చిత్రగుప్తుని చేత లెక్కించబడి చిత్రగుప్తుడు చెప్పిన లిస్టు ప్రకారము
అనుభవించవలసియున్నది. దానిని అనుభవింప చేయువారు యమకింకరులు. యమధర్మరాజు రాజ్యములో, యమకింకరుల
ద్వారా, పాపులైన ప్రజలను పాలించడము జరుగుచున్నది.
పూర్వము వ్యాసుడు యమలోకము అను దానిని గరుడపురాణము లలో చెప్పినా, ఇప్పుడు
ప్రబోధానందయోగీశ్వరులు యమలోకము అనునది బ్రహ్మవిద్యాశాస్త్రములో కలదని చెప్పినా, యమలోకమును
పరిశీలించితే మూడు ముఖ్యమైన భాగములు తెలియుచున్నవి. ఒకటి యమధర్మరాజు, రెండు యమకింకరులు,
మూడు ప్రజలు లేక జీవులు. దానినే ఒకటి ప్రభువు, రెండు పాలకులు, మూడు పాలించబడువారు అనవచ్చును.
ఇక్కడ ప్రభువు ఎవరు? పాలకులు ఎవరు? పాలించబడువారు ఎవరు అని ప్రశ్నించు కొనినట్లయితే, ప్రభువు
యమధర్మరాజు, పాలకులు యమ కింకరులు, పాలించబడువారు జీవులు అని చెప్పవచ్చును. యమధర్మరాజు,
యమకింకరులు అను పేర్లలో రెండిటియందు 'యమ' అను పదమును తీసివేస్తే, మిగిలేది మొదట ధర్మరాజు, తర్వాత
కింకరులు. కింకరులు అనగా సైనికులు అని చెప్పవచ్చును మరియు సేవకులు అని చెప్పవచ్చును. సేవకులుగానీ,
సైనికులుగానీ, రాజు క్రింద రాజు ఆధీనములో పని చేయువారు అయినపుడు రాజు, కింకరులు అంటే సరిపోతుంది.
కానీ రాజు ముందర “ధర్మ" అనే పదము ఒకటి ప్రత్యేకముగా ఉన్నది. ఏ దేశములో అయినా, ఏ రాజ్యములో అయినా
రాజు ఉంటాడు. రాజు అను పదము ముందర ఏమీ ఉండదు. కానీ ఇక్కడ రాజు ముందర “ధర్మ” అనే ప్రత్యేకమైన
పదము ఎందుకున్నది అని యోచించవలసిన అవసరమున్నది. “ధర్మ” అనే పదమునకు దగ్గరగా సరిపోవు పదము
“నిబంధన”. నిబంధన అనగా బంధములేనిది (బంధింపబడనిది) అని అర్థము. ప్రపంచములోని బంధనములలోకెల్ల
పెద్దబంధము "కర్మబంధము” కర్మచేత బంధింపబడనివాడు లేక కర్మబంధనము లేనివాడు దేవుడు తప్ప ఎవరూ లేరు.
అందువలన దేవున్ని రాజు అని చెప్పినపుడు ఆయన అందరి రాజులాంటివాడు కాడు, ఈ రాజు ప్రత్యేకమైనవాడు అని
చెప్పుచు, ఆ ప్రత్యేకత ఏమిటో అందరికి తెలియునట్లు “ధర్మరాజు” అన్నారు. గరుడ పురాణములో వ్యాసుడు చెప్పిన
యమధర్మరాజు, ఎక్కడో ఎవడూ చూడని యమలోకములో ఉంటాడు. బ్రహ్మవిద్యలో మేము చెప్పు యమధర్మరాజు
మనకు కనిపించు విశ్వము లోనే ఉన్నాడు. వ్యాసుడు చెప్పిన గరుడ పురాణములోని యమధర్మరాజును గురించి
తెలుసుకొంటే కాలక్షేపమౌతుంది. మేము చెప్పు యమధర్మరాజును గురించి తెలుసుకొంటే కర్మక్షేపమౌతుంది.
ఇపుడు మనకు కర్మక్షేపము (కర్మనాశనము)ను గురించిన యమ ధర్మరాజును గురించి తెలుసుకొనుటయే
ముఖ్యము. ఒక రాజ్యములో రాజు, రాజు క్రింద పనిచేయు సైనికులైన సేవకులుంటారు. ఇక్కడ మనము చెప్పుకొను
రాజు ప్రత్యేకత కల్గియున్నాడు. కావున రాజును ధర్మరాజు అనడము జరిగినది. ఇంకా గమనిస్తే ధర్మరాజుకు ముందర
మరియు కింకరులకు ముందర “యమ” అను పదముకలదు. ఇటు ధర్మరాజు ముందర అటు కింకరుల ముందర ఉ
౦డుటలో ఏమి విశేషముకలదని యోచించి చూస్తే కొంతవరకు అర్థమగుచున్నది. అదేమనగా! యమ అనగా పెద్ద
అనియు, గొప్ప అనియు చెప్పవచ్చును. దీనిప్రకారము యమధర్మరాజు అనగా పెద్ద ధర్మరాజు అని అర్థము. అలాగే
యమ కింకరులు అనగా పెద్ద కింకరులు అని అర్థము. అన్నిటికంటే మించిన పెద్దది ఏదైతే ఉందో దాని ముందర
“యమ” అను పదమును వాడవచ్చును. విశ్వములో దేవునికంటే మించిన రాజుగానీ, భూతములకంటే మించిన
కింకరులుగానీ లేరు. కావున దేవున్ని యమధర్మరాజు అని, భూతములను యమకింకరులని చెప్పడము జరిగినది.
యమ అనగా పెద్ద అయితే, నియమ అనగా చిన్నదని అర్థము. అందువలన దేవున్ని యమము కలవాడనీ, నియమము
లేనివాడని చెప్పవచ్చును. కావున కొన్ని చోట్ల దేవున్ని నియమ నిష్టలు లేనివాడు అని అన్నారు. అట్లే భూతములను
నియమము లేనివని చెప్పవచ్చును.
విశ్వమునందు బలములోగానీ, పనులు చేయుటలోగానీ భూతముల కంటే మించినవి లేవు. కనుక
మహాభూతములనుగానీ, స్వల్పభూతములను గానీ, ఉపభూతములనుగానీ యమకింకరులు అని అనవచ్చును. అనేక
ఉపభూతములలో, ఒకానొకటి అయిన మేఘము అను భూతము ఎంత పెద్దదో, ఎంత పెద్ద బలముకలదో చెప్పుకొన్నాము.
మేఘము అను భూతమునకు కొన్ని కోట్ల చేతులున్నాయి అనియు, ఆ చేతులకు బలము లెక్కలేనంతకలదని కూడ
చెప్పాము. యమకింకరులు అన్నపుడు మేఘమునకు కూడ 'యమ' అను పదము వర్తిస్తుంది. కావున మేఘమును
మించిన బలము, భూమిమీద ఏ జీవరాసికి లేదని చెప్పవచ్చును. మేఘమునకున్న బలము ఏ జీవరాసికి లేదన్నపుడు,
ఏ జీవరాసికి ఉపయోగపడని బలము మేఘమునకు ఉపయోగపడినదని చెప్పవచ్చును. ఉదాహరణకు పోయిన సంవత్సరము
చైనాలో, ఒక ప్రాంతములో అరవై (60) లక్షల టన్నుల పొడిమంచు కురిసిందనీ, మరియొక చోట ఎనభై (80) లక్షల
టన్నుల పొడిమంచు కురిసిందని వార్తలలో చెప్పడము, చూపించడము జరిగింది. రెండు ప్రాంతములలో కురిసిన
మంచుయొక్క బరువును చూస్తే, 140 లక్షల టన్నులు! దీనినిబట్టి మేఘముల చేతులకు ఎంత బలమున్నదో చెప్పలేము.
ఒక లారీకి పది టన్నుల బరువును వేస్తాము. ఆ లెక్క ప్రకారము మేఘము కురిసిన పొడిమంచు 14 లక్షల లారీలలోనికి
నింపవచ్చును. దీనినిబట్టి చూస్తే ఉపభూతమైన మేఘమును యమ కింకరుడని అనవచ్చును.
యమలోకములో యమకింకరుల బాధ ఉంటుందని, అది చనిపోయిన తర్వాత యమలోకములో ఏర్పడునని
కొందరు హిందువులు చెప్పుచున్నారు. ఇతర మతముల వారు కొందరు, ప్రళయాంతము వరకు చనిపోయిన వారు
సమాధులలోనే ఉంటారని, అంతవరకు పునర్జన్మలు లేవని, మనిషి ఒకమారు పుట్టి ఒకమారే చనిపోతాడని,
ప్రళయాంతములో దేవుడు అంతవరకు చనిపోయి సమాధులలో ఉండిన వారందరిని లేపి, వారు చేసిన పాపములను
విచారించి, వారి పాపములకు తగినట్లు నరకమునకు పంపునని చెప్పుచున్నారు. ఎవరికి తెలిసినది వారు చెప్పుకొనినా,
జరుగుచున్న సత్యము ఏమిటి అని చూస్తే, అందరికి తెలిసిన దానికంటే, వారు చెప్పుకొను దానికంటే, నరకము
విభిన్నముగా ఉన్నదని చెప్పవచ్చును. అన్ని మతాల మనుషులకు దేవుడు లేక యమధర్మరాజు ఒక్కడేకాగ, మనుషులందరికి
యమకింకరులు మహా, స్వల్ప, ఉపభూతము లనియే చెప్పవచ్చును. చనిపోయిన తర్వాత అని చెప్పు హిందూమతములోని
కొందరి మాటలు, యుగాంతము లేక ప్రళయములో అని చెప్పు ఇతర మతస్థుల మాటలు, నరకము, స్వర్గము ప్రత్యేక
లోకములని అవి ఎక్కడో పైన ఉన్నాయని చెప్పు అన్ని మతముల వాదనలను చూస్తే, మాయ లేక సాతాన్ (సైతాన్)
అనునది మనుషులకు సత్యము తెలియకుండ ఎలా చేసిందో, ఎంత బలముగా వారి ప్రజ్ఞను ముంచేసిందో అర్థమగుచున్నది.
మాయ తన ఫథకమును మనుషులయందు, మనుషుల చేత ఎలా నమ్మించ గలిగిందో అర్థమగుచున్నది. మాయ
ఎవరి ద్వారా తనవైపు మనుషులను మరల్చుకోవాలో, అలాగే వారి ద్వారానే మరల్చుకొంది. అట్లే భవిష్యత్తులో తన
మాయ నుండి ఏ మతస్థుడు కూడ బయటపడకుండ, తనకు తెలిసిందే సత్యమని నమ్మి, చివరకు దేవుడు చెప్పినా,
దేవుని మాటను కూడ నమ్మనట్లు వారి తలలో మార్పురానట్లు, మనుషులచేతనే తన బోధను మనుషులలోనికి ఎక్కించింది.
అందువలన యమలోకము, స్వర్గలోకము ఇక్కడే ఉన్నాయని మేము చెప్పినా, ఎవరూ విననిస్థితిలో ఉన్నారు. దేవునిమాటే
విననివారు మాలాంటివారు చెప్పేమాటను వింటారను నమ్మకములేదు. కావున మేము ఎంత చెప్పినా వినకుండ
స్వర్గము, నరకము పైన ఉన్నాయని మాకే తిరిగి చెప్పుచున్నారు. ఎవరు ఏ నమ్మకము మీదైన ఉండవచ్చును. కానీ
వారు నమ్మిన నమ్మకము, మూఢనమ్మకమా లేక సరియైన నమ్మకమా అని చూచు కోవలసియుండగా, అలా ఎవరూ
చేయడము లేదు. వారు నమ్ముచున్న స్వర్గమును గానీ, నరకమును గానీ ఎవరైనా చూచారా అని వెదికినా, అట్లు
చూచినవారు ఎవరూ లేరు. అట్లు చూడకపోయినప్పటికీ ఒకవేళ వారు చెప్పునది శాస్త్రబద్దమా అంటే, అట్లు శాస్త్రమునకు
సంబంధించిన విషయమనుటకు కూడ వీలులేదు. ఇటు శాస్త్రబద్దముకాక, అటు ఎవరూ చూడక, ఎవరూ కూడ
ఏమాత్రము అనుభవించక, స్వర్గమునకు నరకమునకు మధ్యలో దూరమెంతవుందో తెలియక, నీవు ప్రస్తుతము వాటికి
ఎంత దూరములో ఉన్నావో తెలియక, అన్ని తెలిసినవానివలె స్వర్గముంది, నరకముంది. రెండు పైన ఉన్నాయంటే
మేము గ్రుడ్డిగా నమ్మాలా? హేతువాద ప్రశ్నలకు నిలబడి జవాబిచ్చినపుడు, చెప్పబడు విషయము శాస్త్రబద్ధ మైనపుడు
దానిని విశ్వసించవచ్చును. కానీ అబద్దమైన దానిని జ్ఞానులైన వారు ఎవరూ విశ్వసించరు.
భూమిమీదనే ప్రత్యక్ష స్వర్గము, ప్రత్యక్ష నరకము రెండు ఉన్నాయి. స్వర్గనరకములు రెండూ ప్రక్క ప్రక్కనే ఉ
న్నాయి. ఉదాహరణకు ఒకడు రంభకంటే అందమైన అమ్మాయిని చూచాడు. వాడు ఆ అమ్మాయిని చూచినప్పటి
నుండి ఆ అమ్మాయితో స్నేహము చేయాలని, ఆమెతో శరీర సుఖమును అనుభవించాలని తహతహలాడిపోయేవాడు.
అయితే కొద్ది రోజులకే ఆమెతో స్నేహము ఏర్పడింది. తర్వాత కొద్దిరోజులకే అన్ని విధముల అతని మాట వినేస్థితిలోనికి
ఆమె వచ్చింది. అటువంటి అనుకూల వాతావరణమును గ్రహించిన అతను, ఆ అమ్మాయికి తన కోర్కెను తెలిపాడు.
అతని కోర్కెను విన్న అమ్మాయి, ఏ ఆటంకము చెప్పక నవ్వి ఊరకుంది. అప్పుడతనికి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లయినది.
ఇదంతా అతనికి సంతోషమును కల్గిస్తున్నది. చివరకు ఒకదినము ఆ అమ్మాయితో శరీరసుఖమును అనుభవిస్తూ,
సంతోషమును పొందుచూ, నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడనుకొన్నాడట. ఇదంతటిని బాగా ఆలోచిస్తే,
స్వర్గసుఖమును అతడు అనుభవిస్తున్నాడని చెప్పవచ్చును. అది ప్రత్యక్షముగ కనిపిస్తున్న మరియు ప్రత్యక్షముగ అనుభవిస్తున్న
స్వర్గము. (స్వర్గము, నరకము మనిషికి చాలా దగ్గరగా ఉన్నాయనుటకు కూడ నిదర్శనము కలదు) ఆ విధముగ
అతను సంతోషమును పొందుతూ నాలుగురోజులు సుఖములలో తేలియాడాడు. నాల్గవదినము అమ్మాయితో అతను
శారీరక సుఖములో కలిసియుండగా, అమ్మాయి మేనమామ చూచాడు. అక్క బిడ్డ అందంగా ఉందికదా, అనుకొని
పెళ్ళి చేసుకోవాలనుకొన్న మేనమామకు అపరిమితమైన కోపమువచ్చి వెంటనే ఒకచోట కలిసియున్న వారి ఇద్దరిని
పట్టుకొన్నాడు. ఆ అమ్మాయి, అమ్మ తమ్ముణ్ణి చూచేసరికే ప్లేటు ఫిరాయించి, ఇతనెవడో నాకు తెలియదు, నన్ను
బలవంతముగా అత్యాచారము చేయుచున్నాడని ప్రియుని మీద అబద్ధము చెప్పింది. అంతవరకు అందమైన ప్రియురాలితో
స్వర్గసుఖములు అనుభవించిన ప్రియునికి ఒక్కమారుగా స్వర్గము సీను పోయి, నరకము సీన్ మొదలైంది. ఆ సమయానికి
అతనికి పాపము వంతుకొచ్చింది. ఆ అమ్మాయి మేనమామ అతనిని తన ఇష్టమొచ్చినట్లు కొట్టి, పోలీస్ స్టేషన్కు
తీసుకుపోయాడు. పోలీస్ స్టేషన్ బయట ఉన్నంతవరకు, ఆమె మేనమామ అతనికి యమభటుడై కొట్టాడు. పోలీస్ స్టేషన్కు
పోయిన తర్వాత పోలీస్ వారు యమభటులై చితకబాదారు. తర్వాత రేపేసు నమోదుచేసి సబ్సల్కు పంపినారు. నెల
రోజులకు బెయిల్వచ్చి అతను బయటికి వచ్చాడు. అంతకు ముందు నెలలో సంతోషముతో, సుఖముతో, కాలము
గడిపాడు. కావున దానిని స్వర్గసుఖము అనవచ్చును. నెల తర్వాత వెంటనే నరకము మొదలై, నెలరోజుల వరకు
శరీరబాధలు, మానసిక కష్టాలు అనుభవించాడు. కావున దానిని నరకము అనవచ్చును. ఈ సంఘటన స్వర్గము,
నరకము భూమిమీదనే ఉందనుటకు మరియు స్వర్గము నరకమునకు చాలా దూరములేదు, రెండు దగ్గర దగ్గరగానే
ఉన్నాయనుటకు నిదర్శనముగా ఉన్నది.
ఉదాహరణగ చెప్పిన పై సంఘటనలో, యమకింకరుల పాత్ర భూతములకు లేదే? మనుషులనే ఆ సమయానికి
యమకింకరులుగా పోల్చి చెప్పారే? అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! మీకు అర్థమగుటకు
కనిపించే మనుషులనే యమభటులుగా చెప్పినాము. పైకి కనిపించే మనుషులను, ఆడించే స్వల్పభూతములు శరీరములోపల
ఉన్నాయి. వాటిపాత్ర కనిపించదు. స్వల్పభూతములు మనుషులను బాధించుటకు గానీ, సుఖపెట్టుటకుగానీ అధికారము
కల్గియున్నవని ముందు కూడ చెప్పియున్నాము. "నానా రూపేణా కాలకింకరః” అను వాక్యములో అనేక రూపములలో
దేవుని సైన్యముంటుంది. మొదట యువతి, యువకుని శరీరములోని స్వల్పభూతముల పాత్రవలన యువతి, యువకుడు
స్వర్గ సుఖమును అనుభవించారు. తర్వాత అవే స్వల్పభూతములే, యువతిని మాట మార్చునట్లు చేసి, యువకున్ని
దోషిగా నిలబెట్టాయి. అమ్మాయి మామ శరరీములోనుండి అతనిని, ఆ సమయానికే అక్కడికి తీసుకొనివచ్చి, అతనికి
చూపించవలసిన దృశ్యమును చూపించి, ఆ సమయానికి అమ్మాయి మామను, కనిపించే యమకింకరునిగా మార్చాయి.
తర్వాత పోలీస్ స్టేషన్ పోలీస్లను యమకింకరులుగా మార్చాయి. కనిపించినా, కనిపించక పోయినా ఈ సంఘటనలో
స్వల్పభూతములపాత్ర ఉంది అవియే ఒకనికి కొంతకాలము స్వర్గమును చూపించాయి, వెంటనే కొంతకాలము నరకమును
కూడ చూపించాయి.
స్వర్గ, నరక విషయములో కొన్ని సమయములందు స్వయముగ మహాభూతములు పనిచేయును, అట్లే కొన్ని
సమయములలో స్వల్ప భూతములు పనిచేయును. ఇంకా కొన్ని సమయములలో ఉపభూతములు పనిచేయును.
అంతేకాక దైవజ్ఞానమును తెలిసిన పెద్ద పెద్ద గ్రహములు కూడ కొన్ని జ్ఞానుల ఎడల, అజ్ఞానుల ఎడల మంచిగా,
చెడుగా, మిత్రులుగా శత్రువులుగా పని చేయుచున్నవి. ప్రపంచసంబంధ పాపపుణ్యములను భూతములు మూడు
విధములుగా ఉండి పాలించగా, దైవసంబంధ పాపపుణ్యములను మూడు విధములు భూతములే కాకుండ కొన్ని
రకముల జీవులైన గ్రహములు కూడ దేవుని పక్షమున నిలిచి, దేవుని సైనికులుగానే పని చేయుచున్నవి. దైవసంబంధ
పాపపుణ్యములను కూడ మనిషి సంపాదించుకొంటున్నాడు. దేవున్ని దూషిస్తే భయంకరమైన పాపము వస్తుంది.
దేవున్ని పూజిస్తే మోక్షము వస్తుంది. దేవతలను ఆరాధిస్తే పుణ్యము వస్తుంది. దేవుని ఎడల వచ్చిన పాపమును గానీ,
దేవతల వలన వచ్చిన పుణ్యమునుగానీ అమలు చేయుటలో జ్ఞానముకల్గిన జీవ గ్రహములు కొన్ని భూతములవలె పని
చేయుచు, తాము కూడ దేవుని సేవ చేయువారిగ ప్రవర్తించుచున్నవి. జీవగ్రహములు కొన్ని ఖగోళములో సూక్ష్మముగా
తిరుగుచూ, అవకాశమొచ్చినపుడు దేవుని సేవ చేయుచున్నవి. అటువంటి గ్రహములు తమ జీవితములో ఇంకా
ఉన్నతస్థాయి జ్ఞానమును తెలుసు కొనుటకు ప్రయత్నించుచున్నవి. అందువలన దైవజ్ఞానమును తెలిసిన వారికి
ఎక్కువ గౌరవమునిచ్చుచున్నవి. అజ్ఞానులను ఇబ్బందుల పాలు చేయుచున్నవి. ఇటువంటి జీవగ్రహములు
స్థూలశరీరములేనివై, సూక్ష్మ శరీరముతో ఖగోళములో ఉన్నాయను విషయము ఎవరి ఊహకు అందదు. ఇప్పుడు
ఎవరి ఊహకూ అందనప్పుడు, నీకెలా తెలిసింది అని వెంటనే ఎవరైన నన్ను ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము
ఏమనగా! ఇప్పుడు ఈ సమాచారమును వ్రాయునది నేను కాదు, 'మేము' వ్రాయుచున్నా మని చెప్పుచున్నాము. ఈ
పుస్తకము వ్రాయడములో ముఖ్యమైనపాత్ర నా శరీరములోని ఆత్మది. ఆత్మ ఆడిస్తే శరీరము ఆడుచున్నది. కనుక పైకి
నేను వ్రాసినట్లు మీకు కనిపించుచున్నది. కానీ మీరు చదువుచున్నపుడు విషయము మీకు అర్థమైనట్లు, ఈ సమాచారము
శరీరము యొక్క చేయిచేత ఆత్మ వ్రాయించునపుడు మొదట ఆ విషయము నాకు తెలియుచున్నది. అంతే తప్ప వ్రాత
పడకముందు నాకు కూడ తెలియదు. నాకు తెలియని విషయము నేను వ్రాసినట్లు పైకి మీకు కనిపించినా, వాస్తవముగా
వ్రాయించునది ఆత్మ అని తెలియవలెను. ఇది నా ఊహకు కూడ అందని విషయమే, కావున ఆత్మ స్వయముగ ఎవరికి
తెలియదని ధైర్యముగా చెప్పుచున్నది. మనకు తెలియని విషయమును తెలియదని మనము ఒప్పుకోవడములో తప్పులేదు
కదా! అందుకే నాకు తెలియదని ధైర్యముగా నేను ఒప్పుకుంటున్నాను.
జీవగ్రహములు భూతముల కోవకు చెందకున్నను దైవధర్మముల ఎడల ఆసక్తి కల్గియుంటూ, జ్ఞానులకు
అనుకూలముగా, అజ్ఞానులకు వ్యతిరేఖముగా పనిచేయుచున్నవి. ఉదాహరణకు ఒక కుటుంబము అజ్ఞానము కల్గియుండి,
జ్ఞానము మీద ఏమాత్రము ఆసక్తి లేనివారై దేవదేవుడైన పరమాత్మను వదలి, దేవతలను కూడ సృష్టించిన దేవున్ని
మరచి అన్యదేవత ఆరాధన చేయుటయందు ఆసక్తి కల్గినవారై, 300 కిలోమీటర్ల దూరముగానున్న ఒక దేవతను
పూజచేయుటకు, ముడుపులు చెల్లించుటకు, కోర్కెలు కోరుటకు జీపులో బయలుదేరి పోయారు. ఖగోళములో దేవుని
జ్ఞానముకల్గి, దేవుని కొరకే పని చేయాలను ఉద్దేశము కల్గియున్న జీవ గ్రహములలో ఒక గ్రహము ఆ కుటుంబమును,
వారి ఉద్దేశమును, వారి ప్రయాణమును గ్రహించింది. వారు తమను పుట్టించిన దేవున్ని వదలి కోర్కెల కొరకు అన్యదేవతను
పూజించడము, దూరముగా ఉండినా, శ్రమ అయినా, డబ్బు ఖర్చు అయినా అన్నిటిని భరించుకొనిపోవడము, ఆ
గ్రహమునకు నచ్చలేదు. వారు దేవతవద్దకు బయలుదేరకముందు ఒక నెల క్రిందట దైవజ్ఞానమును ప్రచారము
చేయువారు భగవద్గీత గ్రంథమును ప్రచారము చేయుచు, వారి ఇంటివద్దకు వచ్చి భగవద్గీతను తీసుకొని చదవండి అని
చెప్పితే, వారు మనము జ్ఞానమును తెలుసుకొను నిమిత్తము శ్రమపడి, దేవుని సేవ చేయుచు, మన ఇంటివరకు
భగవద్గీతను తెచ్చారు కదా! అని వారిని గౌరవించి మాట్లాడక, మా దగ్గర ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఉచితముగా
అయితే ఇవ్వండి, డబ్బులకైతే వద్దు అన్నారు. ఆ మాటకు గీతను ప్రచారము చేయువారు ఇలా "మేము మా ఇంటివద్ద
పనులు వదలుకొని కొన్ని రోజులు దేవుని సేవ చేయాలని వచ్చాము. ఈ గ్రంథము కేవలము రెండువందలు మాత్రమే,
రెండు వందలు ఈ గీతకు పెట్టితే మీకు ఎన్నో జ్ఞానవిషయములు తెలియబడుతాయి” అని చెప్పితే మాకు గీతతో
పనేలేదు, మాకు చదువుకొనే తీరికలేదు అని చెప్పడమే కాక గీతను, గీతను ప్రచారము చేయువారిని హేళనగ
మాట్లాడడమును, ఆ సమయములో అక్కడేవున్న గ్రహము విని వారిమీద కోపము తెచ్చుకుంది. అప్పటినుండి వారిమీద
నిఘా పెట్టిన గ్రహము, వారు దేవతాపూజ కొరకు ప్రయాణము చేయడమును గ్రహించినది.
జ్ఞానము తెలిసిన మనిషికి మరియొక అజ్ఞాని మాటలు చేష్టలు ఎలా నచ్చవో, అలాగే దైవజ్ఞానము మీద
ఆసక్తికల్గి, జ్ఞానము తెలిసియున్న గ్రహమునకు, అజ్ఞానులైన ఆ కుటుంబము మాటలు, పనులు నచ్చక పోవడమేకాక,
వారు భగవద్గీత పట్ల మాట్లాడిన మాటలకు జ్ఞానులపట్ల అగౌరవ ప్రవర్తనకు పూర్తి కోపము వచ్చింది. గ్రహము
జీవజాతికి చెందినది, కావున గుణములున్నవని మరువకూడదు. జ్ఞానము అంటే గౌరవములేని ఆ కుటుంబము మీద
తన కోపమును తీర్చుకొనుటకు అవకాశము కొరకు చూచుచున్న సమయములో, వారి దేవతా ప్రయాణము కనిపించింది.
వారు వారనుకున్న దేవతవద్దకు పోయి, తమ మొక్కుబడిని తీర్చుకొని, క్రొత్త కోర్కెలు కోరుకొని, తిరుగు ప్రయాణము
చేయుచున్న సమయములో వారినే వెంబడించుచున్న గ్రహము, వారి వాహనమును ప్రమాదానికి గురి అగునట్లు
చేసింది. వాహనములో పదిమంది ప్రయాణము చేయుచుండగ అందులో ఎనిమిది మంది అక్కడికక్కడనే చనిపోగా,
ఇద్దరికి తీవ్రమైన గాయములైనవి. దేవతల కొరకు పోవడమే గ్రహములకు సరిపోదు. అదియేకాక వారు గీతను, గీతా
ప్రచారకులను గౌరవించకపోవడము మరీ కోపమునకు కారణమైనది. అందువలన ఎనిమిదిమంది చనిపోయారు
ఇద్దరికి తీవ్రమైన గాయములైనవి. అందరికి పెద్ద అయిన దేవున్ని వదలిపెట్టి, చిల్లర దేవతలను మ్రొక్కడము గ్రహములకు
సరిపోదని ఈ సంఘటనతో తెలియుచున్నది.
ఇందూసాంప్రదాయములు చాలాగొప్పవి. వాటిలో పెళ్ళి సాంప్రదాయము చాలా ముఖ్యమైనది. పెళ్ళికార్యములో
చేయు పనులన్నిటికి దైవజ్ఞానము ముడిపెట్టబడియున్నది. కానీ నేటి సమాజములో పెళ్ళి జ్ఞానసంబంధమైనదని
ఎవరికి తెలియదు. అందువలన ఎవరి ఇష్టాను సారము వారు చేయుచున్నారు. జీవితములో జ్ఞానానికి ముఖ
ద్వారమైన పెళ్ళిని, జ్ఞానసంబంధముగ కాకుండ తమ తమ ఆర్భాటములను ప్రదర్శించుకొనునట్లు చేయుచున్నారు.
ఎవరి పెళ్ళిలోగానీ జ్ఞానము మచ్చుకైన లేదు. అందువలన పెళ్ళి విషయములో దేవతల విషయముకంటే ఎక్కువ
కోపముతో ఖగోళములోని గ్రహములున్నారు. ఎక్కడైన పెళ్ళి విషయముగానీ, పెళ్ళిదృశ్యముగానీ గ్రహముల కంటబడితే
పెళ్ళివారిని వెంబడించి, వారికి ఏదో ఒక విధముగ ప్రమాదము జరుగునట్లు చేయు చున్నవి. గ్రహములకు తెలియని
పెళ్ళి ఉంటే పరవాలేదు, ఆ పెళ్ళి వారు ప్రమాదమునుండి తప్పించుకొన్నట్లే. పెళ్ళిపెత్తనము మొదలు నిశ్చితార్థము,
పెళ్ళి, తిరిగింపులు మరిగింపుల వరకు ఎప్పుడు గ్రహములకు తెలిసినా ప్రమాదము తప్పదు. అందువలననే
ప్రస్తుతకాలములో పెళ్ళి వాహనములు ఎక్కువగా ప్రమాదానికి గురియగుచున్నవి. పెళ్ళివాహనముల ప్రమాదము,
పెళ్ళి ఇంటిలో ప్రమాదము, దేవతలవద్దకు పోవు వాహనములు, దేవతక్షేత్రములలో ప్రమాదములు, గత ముప్పయి
సంవత్సరములనుండి ఎక్కువై, ఇప్పటి కాలమునకు తీవ్రస్థాయికి చేరుకొన్నవి. అలా ఎందుకు జరుగుచున్నదనగా!
దేవతలువేరు దేవుడువేరనీ, పెళ్ళి పూర్తిస్థాయి దైవజ్ఞానమనీ గత ముప్పయి సంవత్సరములనుండి ఉన్నత జ్ఞానము
చెప్పబడుచున్నది. గ్రహములు కొన్ని సంవత్సరములనుండి ఉన్నత జ్ఞానమును తెలుసుకొంటున్నవి కనుక, అప్పటినుండి
ప్రమాదములు జరుగుట ప్రారంభమైనవి. ప్రస్తుతకాలమునకు, ఉన్నత జ్ఞానమును తెలుసుకొను గ్రహముల సంఖ్య
ఎక్కువైనది. కావున ప్రమాదముల సంఖ్య ఎక్కువైనది. నేను చెప్పునది సత్యమా, అసత్యమా అనుటకు మీరు ఇప్పటినుండి
ధ్యాస పెట్టి చూడండి. ఎక్కడైన ప్రమాదము జరిగింది అంటే, అది పెళ్ళిదైనా ఉంటుంది లేక దేవతలయాత్రదైన ఉ
ంటుంది. ఈ ప్రమాదముల వెనుక గ్రహముల హస్తముందని ఎవరికీ తెలియదు.
దైవజ్ఞానమును తెలిసిన గ్రహములు, భూతముల స్థాయిలో కర్మల పాలన చేయకున్ననూ, దైవవిషయములో
మాత్రము అజ్ఞానముగా ప్రవర్తించు వారిని శిక్షించుచున్నవి. ఇక్కడొక ప్రశ్న ఎవరైన అడుగవచ్చును. "గ్రహములు
జీవజాతికి చెందినవి కదా! గ్రహములకు గుణములైన కోపమున్నపుడు, కోపము ప్రకారము ఇతరులను ప్రమాదములకు
గురి చేసి చంపడము, గాయాలపాలు చేసి బాధపెట్టడము వలన గ్రహములకు కూడ పాపము వచ్చును కదా!” అలా
అడిగితే, దానికి జవాబుగా ఇట్లు చెప్పవచ్చును. గ్రహములు జ్ఞానము తెలిసినవి. అవి కర్మయోగ పద్ధతిలో కార్యములను
చేయుచుండుట వలన గ్రహములకు పాపము అంటదు. గ్రహములన్ని భగవద్గీత ప్రకారము జ్ఞానము తెలిసి, దైవ
విషయములోనే మనుషుల మీద కోపముతో ప్రవర్తించుచున్నవి. అజ్ఞానులను హింసించు గ్రహములు, జ్ఞానులను
గౌరవించుచున్నవి. గ్రహములు తమను ఎట్లు గౌరవించుచున్నది జ్ఞానులకు కనిపించదు. కావున జ్ఞానులకు కూడ
గ్రహముల పనులు తెలియవు. జ్ఞానులకు తెలియనిది నీకెలా తెలుసునని మీరు ప్రశ్నించగలరు. దానికి నా సమాదానము
నేను జ్ఞానిని కాదు కదా! నేను కేవలము యోగిని, యోగీశ్వరుణ్ణి. అందువలన గ్రహముల విషయము మాకు తెలుసు.
అందువలన ప్రబోధాశ్రమ నియమావళిలో పెద్ద బోర్డుమీద “మావద్దకు ఖగోళములోని గొప్పశక్తిగల గ్రహములు జ్ఞానమును
తెలుసు కొనుటకు వస్తుంటారు. కావున ఇక్కడికి వచ్చువారు చెడు ఉద్దేశముతో రావద్దండి. ఒకవేళ చెడు ఉద్దేశముతో
వస్తే గ్రహముల వలన మీకు కష్టము నష్టము జరుగవచ్చును” అని వ్రాసియుంచాము. ముప్పయి సంవత్సరములుగా
మాకు కనిపించకుండ, మావద్దకు వచ్చి కనిపించని గ్రహములు, పెద్దపెద్ద మహర్షులు జ్ఞానమును విని పోతున్నారు.
అందువలన ప్రస్తుతకాలములో అజ్ఞానులకు తెలియకుండానే ప్రమాదములు జరుగుచున్నవి. నన్ను ఒక యోగిగ
గ్రహములు గౌరవిస్తున్నవి, కావున నన్ను ఎవరైన నిందించినపుడు, ఏ గ్రహమూ అక్కడ లేకపోతే పరవాలేదు, ఒకవేళ
ఏ గ్రహమైన నన్ను నిందించినది చూస్తే, అతనిని సామాన్యముగ వదలదు. ఇది సత్యమనుటకు చిన్న ఉదాహరణగా
ఒక సంఘటనను వివరిస్తాము.
ధర్మవరము (అనంతపురము జిల్లా)లో ఆచారి కులమునకు చెందిన 35 సంవత్సరముల వయస్సున్న వ్యక్తి,
ఇస్లామ్ మతమునకు చెందిన వ్యక్తితో మాట్లాడుచు “మీరు గొప్ప జ్ఞానిగ చెప్పుకొను ప్రబోధానంద యోగీశ్వరులను
తిట్టితే మంచిది కాదు అంటుంటారు కదా! అయితే నేను ఇప్పుడు నీ ముందరే తిట్టుతాను నాకు ఏమౌతుందో
చూస్తాను” అని అనవసరముగా దూషించి బెంగుళూరుకు పోయాడు. అతని బావమరిది పెళ్ళిలో మేము చెప్పిన
“జ్ఞానసాంప్రదాయము” ప్రకారము పెళ్ళి చేసుకోవాలని బావమరది అన్న చెప్పగా, అదంతావద్దు అందరూ ఎలా చేస్తే
అలా చేస్తాము అని గొడవపెట్టుకొన్న అతను, పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు ఇంటికి పోవునపుడు,
అజ్ఞాని అయిన అతను మమ్ములను దూషించిన తర్వాత పదిహేను నిమిషములకే పెళ్ళివారి వెంట బెంగుళూరికి
పోవడము జరిగినది. అలా అతను దూషించినపుడు అక్కడ ఏ గ్రహములేకుంటే అతనికి ఏమి జరిగేది కాదు. కానీ
అతను దూషించిన సమయములో మమ్ములను అభిమానించు గ్రహము, అక్కడుండడము వలన అతని మాటలన్నిటిని
ఆ గ్రహము వినగలిగింది. అప్పుడు ఆ గ్రహమునకు కోపము వచ్చింది. అతనిని వదలకూడదనుకొని అతనిని
వెంబడించింది. మరుసటి దినము తిరుగు ప్రయాణమున బెంగుళూరు బస్ స్టాండులో బస్సు ఎక్కి కూర్చొన్న అతనిని,
బస్సు పూర్తిగ సిటి దాటకముందే, ఎవరికి తెలియకుండ అతనిని వెంబడించిన గ్రహము చంపేసింది. అతను కూర్చొన్నవాడు
కూర్చొన్నట్లే చనిపోయాడు. అతడు చనిపోయినట్లు గ్రహించిన ప్రక్క ప్యాసింజర్లు బస్సును ఆపి, దగ్గరగానున్న ఆసుపత్రికి
తీసుకెళ్ళారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. గుండె ఆగిపోయి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.
హార్టు ఫెయిల్ అయితే, ఉన్నట్లుండి చనిపోవడము వాస్తవమే కానీ, అలా ఒంటికి, దొడ్డికి గుడ్డలలో పోవడము జరుగదు.
బజారులో బస్సు ఎక్కేముందు నేను ఇప్పుడు తిట్టుచున్నాను నాకు ఏమౌతుందో చూస్తాము, అన్న అతను మరుసటి
దినము అదే సమయమునకు చనిపోవడము వలన గ్రహములే అతనిని చంపాయని అర్థమగుచున్నది. ఇలాంటి
సంఘటనలు చాలా జరిగాయి. కావున గ్రహములు ఒక్క జ్ఞానవిషయములోనే ఎక్కువ పని చేయుచున్నవని తెలియుచున్నది.
ఈ విధముగ అన్నిటిని లెక్కించి చూచితే, మానవుని పాప పుణ్యములను మూడు రకముల భూతములు, ఒక
రకము గ్రహములు అమలు చేయుచున్నవని తెలియుచున్నది. ఈ గ్రంథములో చెప్పిన దయ్యములుగానీ, భూతములుగానీ,
గ్రహములుగానీ అన్ని జీవుళ్ళే అయినా దయ్యములు వేరు, భూతములు వేరు, గ్రహములు వేరని అర్థమైనది. దయ్యముల
వలన జరిగే పనులకంటే, గ్రహముల వలన జరుగు పనులు ఉత్తమమైనవి. దయ్యములు అజ్ఞానముతో పని చేయుచున్నవి.
అందువలన వాటికి కర్మ అంటుచున్నది. గ్రహములు జ్ఞానముతో పని చేయుచున్నవి. కావున గ్రహములకు కర్మ
అంటడములేదు. ఇకపోతే మూడు విధముల భూతములు పని చేసినా, వాటికి గుణములుగానీ, ఉద్దేశములుగానీ లేవు
కావున భూతములు కర్మకు అతీతమైనవని చెప్పవచ్చును. మానవుడు అజ్ఞానిగా ఉన్నంతవరకు కర్మలు వచ్చుచుండును.
కర్మలు పెరుగుకొలది భూతముల పని ఎక్కువగుచున్నది. మనిషి దైవత్వమును లెక్కచేయనంత వరకు, జ్ఞానమార్గములో
ప్రయాణించనంతవరకు, ముక్తిస్థానమును అన్వేషించనంత వరకు, మనిషి అనేక ఉపద్రవములను, అనేక కష్టములను
ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇప్పటి కాలములో చిన్న తనమునుండి చదువుకొని ప్రపంచ జ్ఞానముమీద ప్రవీణులవుతున్నారు,
కానీ పరమాత్మ జ్ఞానము అంటే ఏమిటో తెలియనిస్థితిలో ఉంటూ, దైవత్వమును లేదు అంటున్నారు. దైవజ్ఞానము
కల్గినవారిని ఏమాత్రము గౌరవించకపోగా కించపరుచుచున్నారు. పూర్వకాలముకంటే ప్రస్తుతకాలములో అజ్ఞానము
ఎక్కువై, పాపసంపాదన ఎక్కువైనది. పాపము పరిహారము కావాలంటే, భూతములు, గ్రహములు విజృంభించి పని
చేయుచున్నవి. అందువలన పూర్వకాలములో లేని రోగములు క్రొత్తక్రొత్తవి పుట్టుకొస్తున్నవి. పూర్వములేని సునామి
మొదలగు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి.
మనుషులు విజ్ఞానము అను పేరుతో అజ్ఞానములోనికి పోవు చున్నారు. దైవత్వమును పూర్తి మరచిపోయారు.
డబ్బు ఉంటే చాలు హాయిగా బ్రతుకవచ్చు అనుకుంటున్నారు. డబ్బుకోసము చదువుకొంటున్నారు. డబ్బుకొరకే ఉ
ద్యోగాలు చేస్తున్నారు. కానీ విజృంభించే రోగాలను గానీ, చెలరేగే ప్రకృతి వైపరీత్యాలనుగానీ, డబ్బు ఆపలేదని మనిషికి
తెలియడము లేదు. మనము చేసుకొన్న పాపములను భూమిమీదనే అనుభవిస్తున్నాము అని అర్థము కావడములేదు.
ముఖ్యముగ ఏ పాపమునకు ఏమి శిక్ష పడుతుందో, ఏ మనిషికీ తెలియదు. అట్లే ఏ పాపము ఎప్పుడు అనుభవిస్తామో
తెలియదు. అంతేకాక చేసుకొన్నదంతా ఇక్కడే అనుభవిస్తున్నామని కూడ తెలియదు. ఒక పాపమునకుగానీ,
పుణ్యమునకుగానీ ఏమి అనుభవమును పొందుతామో, ఎప్పుడు పొందుతామో, ఎక్కడ పొందుతామో తెలియనిస్థితిలో
మానవుడు ఉండి పోవడము వలన, జరుగుచున్నదే సత్యము, జరుగబోవునది అసత్యము అను వాదనలో మనిషి
ఉండిపోయాడు. వర్తమానములో ఒక మానసిక రోగి ఉన్నాడనుకొనుము అది సత్యము. కానీ అతను అలా
ఉండడానికి కారణమేమి అని దాని వెనుక ఉన్న సత్యమునుగానీ, ముందు జరుగబోవు సత్యమునుగానీ మనిషి వెదకడము
లేదు. ప్రపంచములో వెదికితే ఒక్క దేవుడు తప్ప అన్ని దొరుకును. శ్రద్ధతో దేవుని జ్ఞానమునే తెలుసుకోవచ్చును.
అలాంటపుడు ఒక మానసిక రోగి విషయముగానీ, అంగవైకల్యముగల వాని పాపమును గురించిగానీ, మందులకు,
మంత్రములకు, మాటలకు లొంగని రోగమును గురించిగానీ మనకు శ్రద్ధవుంటే తెలుసుకోవచ్చును.
నేడు మానవులలో కొందరు స్వర్గసుఖములను, కొందరు నరక బాధలను భూమిమీదనే అనుభవిస్తున్నారు.
భూమినివదలి ఎవరు ఎక్కడికీ పోలేరు. భూమిమీద ఒక జాగాలో ఒకడు చనిపోతే, వాడు అదే క్షణమే భూమిమీదనే
పుట్టుచున్నాడు. అలాంటపుడు బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి చెప్పుకొంటే, నీవు ఇప్పటికాలము మనిషివికాదు,
కృత యుగమునుండి ఇదే భూమిమీద ఉంటున్నావు! కాని ఈ జన్మ విషయము మాత్రము జ్ఞప్తికి ఉన్నందున, వెనుకగల
నీ సమాచారము నీకే తెలియదు. వెనుక జన్మలలో అనేక సుఖములను, అనేక దుఃఖములను అనుభవించిన మనిషి,
ప్రస్తుత జన్మలో వాటిని అన్నిటిని మరచిపోయి నేడు జరుగుచున్నది మాత్రము సత్యమనుకొంటున్నాడు. నేడు బ్రతుకుతున్న
జీవితములోని కష్టసుఖములకు, వెనుకటి జన్మల పాపపుణ్యములే కారణమను జ్ఞప్తిని, జ్ఞానమును కోల్పోయాడు. నేడు
మనిషి బ్రతుకుతున్న జీవితములోని కష్టసుఖములకు కారణము ప్రస్తుతమున్న డబ్బే అనుకుంటున్నాడు. మనిషికి అన్ని
విధముల పెద్దగా కనిపిస్తున్నది డబ్బే! మనిషి మనసులో దేవునిస్థానము కంటే మించిన స్థానము డబ్బుకు కలదు.
కావున మొదట దానిని సంపాదించుటకే ఎక్కువ అవకాశమిస్తున్నాడు. అలా తన మెదడునంతటిని డబ్బు సంపాదనకే
వినియోగించినా, తృప్తి కలిగినంత సంపాదించలేక పోవుచున్నాడు. కొందరైతే తృప్తినటుంచి కొంతైనా సంపాదించుకోలేక
పోవుచున్నారు. డబ్బు సంపాదనకు కూడ కర్మే కారణమని వారికి తెలియదు. ఇటువంటి తెలియని స్థితిలో తెలివైనవారు
కూడ జీవిస్తున్నారు. వీరి జీవితములలోని కర్మలను పాలించుటకు భూతములు, గ్రహములు పని చేయుచున్నవి.
భూతములు, గ్రహములు నేడు భూమిమీద మనిషి బాధపడు బాధలన్నిటికి కారణముగానున్నవి. భూకంపములుగానీ,
సునామీలుగానీ, వరదలుగానీ, అగ్నిపర్వతములుగానీ, వేడిగాలులుగానీ, మంచుతుఫానులు గానీ, వడగండ్లవానగానీ,
అనేక రోగములుగానీ క్రొత్తగా పుట్టుకొచ్చు క్రొత్తరోగముగానీ, ఇటు శరీరములో గానీ, అటు బయటగానీ కలుగు
ఉపద్రవములన్నిటికి కారణము, మనిషి తనెవరో, తననెవరు నడిపిస్తున్నారో తెలియకపోవడము మరియు విశ్వమునంతటిని
నడిపించు దేవున్ని గురించివున్న జ్ఞానము తెలియక పోవడము. ఏనాడైతే మనిషి తనస్థితిని తాను తెలుసుకొని తాను
ఏమి చేయని జీవాత్మనేనని, తనను నడిపించు ఆత్మ మరొకటిగలదని, తనను నడిపించు ఆత్మను కూడ నడిపించునది
పరమాత్మయని తెలిసి, మోక్షమును పొందునంతవరకు, ఈ ప్రపంచములో యుగముల తరబడి మనిషి కష్ట సుఖములను
అనుభవిస్తు ఉండవలసిందే. పరమాత్మను తెలియనంతవరకు జీవాత్మకు జన్మలనుండి విడుదల లేదు. పరమాత్మను
తెలియాలంటే ఆయన ప్రభుత్వమును, ఆ ప్రభుత్వములోని పాలకులను, పాలకుల ద్వారా పాలించబడువారిని మొదట
తెలియాలి. పాలకులను తెలిసి వారి అనుమతి పొందితే రాజును చూడవచ్చును. అలాగే మహాభూతములను, స్వల్ప
భూతములను, ఉపభూతములను, గ్రహములను తెలుసుకొని వారి ద్వారా దేవునివద్దకు పోవచ్చును. అందువలన ఈ
గ్రంథములో మొదట దయ్యములను గురించి చెప్పి చివరకు భూతముల వరకు తెచ్చి గ్రహములతో ముగిస్తున్నాము.
సమాప్తం.
చివరి మాట
దయ్యాల, భూతాల యదార్థసంఘటనలు అను ఈ గ్రంథములో వ్రాయబడినవన్నియు సత్యములే. కావున ఈ
గ్రంథము పేరులో యదార్థ అను పదమును పెట్టవలసివచ్చినది. సత్యముతో కూడుకొన్న జరిగిన సంఘటనలు ఉ
ండుట వలన, యదార్థసంఘటనలు అని చెప్పవలసి వచ్చినది. ఇంతవరకు మేము వ్రాసిన గ్రంథములలో, నా
గొప్పతనమును గురించి ఎక్కడా చెప్పలేదు. మా వ్రాతలో కేవలము శాస్త్రబద్దమైన జ్ఞానము మాత్రము ఉండెడిది. కానీ
ఇక్కడ తప్పనిసరిగ చెప్పవలసిన విషయములలో కొంత మా గొప్పతనము బయటపడినది. మమ్ములను గురించి
మేము చెప్పుకోవడము నాకు ఇష్టములేకున్నను తప్పనిసరిగ చెప్పవలసివచ్చినది. ఈ గ్రంథములోని విషయములను
చదివిన తర్వాత, దయ్యాల బాధలున్న వారు మావద్దకు వచ్చి చూపించుకోవలెనని, మావద్దకు వస్తే సులభముగా వాటి
బాధపోతుందని అనుకోవచ్చును. కానీ ముఖ్యముగ అలాంటివారు ముందుగా తెలుసుకోవలసినది ఏమంటే! నేను
దయ్యాలను గురించి పరిశోధన చేయునపుడు జరిగిన సంఘటలను గురించి వ్రాశాను. ఆ కాలము జరిగిపోయి
దాదాపు ముప్పయిఐదు (35) సంవత్సరములు అవుతుంది. ఆనాడు నావయస్సు కేవలము ఇరువది ఐదు (25)
సంవత్సరములే. అప్పటికి, ఇప్పటికి నా శరీరములో ఎన్నో మార్పులు జరిగాయి. నేడు శారీరకముగా మరియు
మానసికముగా అన్ని విధముల వెనుకబడిపోయాను. ఆనాడున్న జ్ఞానశక్తిగానీ, శరీరశక్తిగానీ ఇప్పుడు లేవు. అందువలన
ఎవరైన నావద్దకు వచ్చినా, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని ముందే చెప్పుకొంటున్నాను. నేను దయ్యాలను
గురించి పరిశోధన చేయు సమయములో కూడ, ఇతరుల బాధలను నివారించుటకు చేయలేదు. అందువలన ఆరోజుగానీ,
ఈరోజుగానీ నేను దయ్యాల బాధలను నివారించు వృత్తి చేయలేదు. పరిశోధనలో భాగముగా ఆ దినము కొందరి
బాధలను నివారించడము, దేవతలను దండించడము జరిగింది. అంతేకానీ మనిషి బాధలను పోగొట్టాలను ఉద్దేశముతో
చేయలేదు. ఆనాడు, ఈనాడు దైవజ్ఞానమును ప్రజలకు అందించడమే నాముఖ్య ఉద్దేశముగానీ, వేరుగా నేను ఏ
విధముగా ఎవరికీ ఉపయోగపడువాడినికాదు. నాకు అటువంటి శక్తిలేదని ముందే తెలియజేయుచున్నాను.
ఈ గ్రంథములో హేతువాదులను, నాస్తికవాదులను ఎక్కువగా విమర్శించి వ్రాసినట్లు కనిపిస్తుంది. నేను
ముఖ్యముగ విమర్శించినది నాస్తికవాదులనే అని చెప్పుచున్నాను. హేతువాదులమనుకొనుచు హేతువాదమంటే ఏమిటో
తెలియక, నాస్తికవాదమునే పునాదిగా చేసుకొని మాట్లాడు హేతువాదులమనుకొను వారిని విమర్శించాను. నిజమైన
హేతువాదమును నేను ఏనాడూ విమర్శించలేదు. ఎందుకనగా నేను కూడ స్వచ్ఛమైన హేతువాదినే. హేతువాదము
వలన ప్రశ్నలు వచ్చినపుడే దానికి జ్ఞానము జవాబివ్వగలదు. అప్పుడే దైవజ్ఞానము బయటపడగలదు. మావ్రాతలో
మధ్యమధ్యలో ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్నలను నేనే ప్రశ్నించి జవాబు చెప్పడము జరిగింది. జ్ఞానము చెప్పుచున్నపుడు
ఎక్కడైనా ప్రశ్నకు అవకాశముంటే, ఎవరికీ ఆ ప్రశ్న యోచనకు రాకున్ననూ, నేనే ఆ ప్రశ్నను అడిగి, దానికి జవాబును
కూడ చెప్పిన తర్వాతనే, మిగత విషయములను వ్రాయడము జరిగినది. ఈ ఒక్క గ్రంథములోనేకాక మా రచనలన్నిటి
లోను ఇదే విధానముండును.
నిజమైన హేతువాదము సత్యమునకు కారణమైనది. కావున అసలైన హేతువాదమును సత్యవాదము అని
అనవచ్చును. నాది కూడ సత్యవాదమే. కనుక కొన్నిచోట్ల నాస్తికవాదులనూ, కొన్నిచోట్ల మేధావులనూ, కొన్నిచోట్ల
శాస్త్రజ్ఞులనూ, కొన్నిచోట్ల భక్తులనూ, కొన్నిచోట్ల స్వాములనూ విమర్శించవలసి వచ్చినది. సత్యవాదము ప్రకారము
మాట్లాడునపుడు అసత్యవాదులు ఎవరుండినా, వారిని విమర్శించక తప్పదు, వారి మాటలను అసత్యములని చెప్పక
తప్పదు. అందువలన ఈ గ్రంథములోని మాటలు ఎవరికైన బాధను కలిగించియుంటే, వివేకముతో వారు అర్థము
చేసుకుంటారని కోరుచున్నాను. అందరిని విమర్శించడము నాపని కాదు, అంతా నిజమును చెప్పడమే నాపని. ఈ
గ్రంథములో నామాటలు ఎవరినైన విమర్శించియుంటే వారు సత్యమును తెలుసుకొని, జ్ఞానమార్గములో ముందుకు
పోవుటకు నా విమర్శలను తీసుకోవాలనీ, అంతేతప్ప నామాటలను అపార్థముగ అర్థము చేసుకోకూడదని కోరుచున్నాను.
నేడు మనుషులలో దైవభక్తిగానీ, దైవజ్ఞానముగానీ పూర్తిగ లేకుండ పోయినది. హిందూమతములో పూర్వముకంటే
ఎక్కువ దేవాలయములు ఈకాలములో తయారై ఉండినా, పూర్వముకంటే ఆరాధనలు, అర్చనలు ఎక్కువైనా, అవన్నియు
మనిషిని దైవత్వమువైపు పంపకుండ ప్రక్కదారిలోనికి మళ్ళించుచున్నవి. ఇక ఇతర మతములలోనికి వస్తే అక్కడ వారు
దేవుని మీద దృష్ఠికంటే, మతమును విస్తరింపజేయుటయందు ఎక్కువ దృష్టిని సారించారు. తమ మతమును విస్తరింపచేయు
నిమిత్తము, ఇతర మతము లను తక్కువగ లెక్కించడము, అందులో చెప్పబడిన దైవత్వమును కూడ తక్కువగా చెప్పడము
జరుగుచున్నది. అలా చేయడము వలన తమకు తెలియకుండానే, దైవదూషణకు పాల్పడినవారగుచున్నారు. సర్వ
ప్రపంచము నకు సృష్టికర్త అయిన దేవుడు అందరికీ అధిపతియై ఉండగా, మా మతము లోని దేవుడే నిజమైన దేవుడు,
మిగత మతములలో చెప్పబడిన దేవుడు, దేవుడేకాదు అనడము వలన, ఆ మాట ఎంత తప్పవుతుందో వారికి అర్థము
కాలేదు. అన్ని మతములలోను దేవుని విషయములో మీ దేవుడు, మా దేవుడు అను భావముండుట వలన మనుషులు
దేవున్ని తక్కువగా లెక్కించినట్లయినది. విశ్వమునకంతటికి దేవుడు గొప్పవాడైనపుడు, ప్రతి మనిషితోను దేవునికి
సంబంధమున్నపుడు, ప్రతిమనిషి దేవునివైపు పోవుటకు ప్రయత్నించాలి. కానీ ప్రతి మనిషి మతమువైపు పోవడానికి
ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మతములకు అతీతుడు. ఒక్క మతమునకు సంబంధించినవాడు కాడు. అన్ని మతముల
మనుషులకు అధిపతి అయిన వాడు దేవుడు. మనిషిలో మత భావముంటే, దైవత్వము మనిషికి దూరమగును.
ఎందుకనగా మతములకు దేవుడు అతీతుడు అయినందున, మతాతీత భావమున్న వానిప్రక్కే దేవుడుండును. మతము
అనగా మౌఢ్యముతో కూడుకొన్నదని అర్థము. అందువలన మనిషి మతము, దేవుని పథమునకు ఆటంకమైనదని
అర్థమగుచున్నది. జ్ఞానదృష్టితో చూస్తే ప్రతి మతము దేవుని విధానములో మనిషిని ప్రక్కదారి పట్టిస్తున్నది. కావున
మతము మౌఢ్యముతో కూడుకొన్నదని చెప్పుచున్నాము.
మతము దేవుని జ్ఞానమును తెలియజేస్తుంది అని అందరూ అనుకోవచ్చును. అలా తెలియజేస్తే, ఏ మతములోనూ
మౌఢ్యముండదు. కానీ అలా ఏ మతము చెప్పడము లేదు. మతము అన్నది ఏదైనా కానీ దేవుని స్పష్టమైన విధానమును
తెలియజేయకుండ, మతము తన యొక్క విధానమును మనుషుల మీద దిద్దుచున్నది. అందువలన ఏ మనిషిని
చూచినా, వీడు పలానా మతమువాడు అని గుర్తించుటకు వీలుండునట్లు వాని మతము, వానిని కనిపింపజేయుచున్నది.
కానీ ఏ మనిషిని చూచినా వీడు దైవజ్ఞాని అని తెలియుటకు వీలులేకుండ, మతము వానిని కప్పివేసి పలానామతమువాడని
తెలియునట్లు చేసినది. ప్రతి మతము మనిషిమీద తనదైన ముద్రను వేసి, దేవుని విధానమును గురించి తెలుసుకొను
అవకాశమే లేకుండ చేయుచున్నది. ఉదాహరణకు స్వర్గ, నరకముల విషయమును తీసుకొందాము. ప్రతి మతము
స్వర్గ, నరకములను గురించి చెప్పి మా మాటయే మీకు శిరోధార్యము అన్నట్లు చేసినవి. అందువలన మనిషి వాని
మతములో చెప్పినట్లే స్వర్గ,నరకములున్నాయి అనుకుంటున్నాడు. ఆ విధానమునే మిగతావారికి కూడ చెప్పుచున్నాడు.
నేను చెప్పునది వాస్తవమా? అని ఏ మనిషి తనను తాను ప్రశ్నించుకోవడము లేదు. అలా ప్రశ్నించుకోగలిగితే,
ప్రశ్నలు ఇలా ఉంటాయి. హిందూమతములో చెప్పిన స్వర్గము, నరకము ఎక్కడున్నాయి? ఎక్కడో పైన ఉన్నాయనువారు
వాటిని చూచారా? నరకములో మనిషిని బాధపెట్టువారు ఎవరు? వారు ఎలా ఉంటారు? ఒక మనిషికి శిక్షవేయడానికి
ఒకనికి ఇద్దరైనా కావాలి. అలా చూస్తే మనుషులకంటే శిక్షించు వారిసంఖ్యే ఎక్కువగా ఉండాలి. అటువంటి వారికి
కూడు, గుడ్డ ఎక్కడి నుండి వస్తాయి? వారికి జీతాలు ఎవరిస్తారు? స్వర్గములోనికి పోయిన వానికి రంభ, ఊర్వశి
మొదలగు వారి సాన్నిహిత్యము సంపర్కము లభిస్తుందని అంటారు. అది నిజమా? నిజము అయితే స్వర్గములో ఉ
ండే రంభ, ఊర్వశిలు ఒక్కొక్కరే కదా! మనుషులతో వారు సన్నిహితముగా మెలగాలంటే స్వర్గమునకు పోయిన
మనుషులు నెలలు, సంవత్సరములు తరబడి క్యూలో నిలుచుకోవాలి కదా! అందరికి రంభ కావాలంటే, కాచుకొనేదానికి
ఎంతకాలము పట్టుతుంది? ఇట్లు చెప్పుకుంటూ పోతే, వంద ప్రశ్నలకు పైగానే వస్తాయి. ఇతర మతములలో వారు
చెప్పునది చూస్తే, స్వర్గమునకు పోయినవానికి, సెలయేర్లుకల ఉద్యానవనములలో చల్లనిగాలియందు, అందమైన
ఆడవారితో సుఖముగా ఉండునట్లు దేవుడు చేస్తాడని అంటుంటారు. అలా స్వర్గమునకు పోయిన ప్రతి ఒక్కనికి
అందమైన నలుగురు ఆడవాళ్ళను అతనికి ఇచ్చినా, అక్కడికి పోయిన వారందరికి ఎంతమంది ఆడవారు అవసరమౌవుతారు?
మగవాడు స్వర్గానికిపోతే అక్కడ అతనిని సుఖపరిచేదానికి అందమైన ప్రదేశము, అందమైన స్త్రీలు ఉంటారు. ఒకవేళ
ఆడవారు స్వర్గానికి పోతే వారు సుఖపడేదానికి అందమైన ప్రదేశముంటుంది, కానీ అందమైన మగవారు ఉంటారా?
స్వర్గము ఆడవారికి ఉండదా? మగవారికి మాత్రమే ఉంటుందా? మగవారికి మాత్రమే స్వర్గమంటే, దేవుడు ఆడవారికి
అన్యాయము చేసినట్లు కాదా? దానివలన దేవుడు అందరికి సమానుడు కాదు కదా? ఇట్లు అనేక ప్రశ్నలురాగలవు.
ఇలా ప్రశ్నలు వేసుకొని చూస్తే, దేవునిపాత్ర విలువలేనిదై పోతుంది. ప్రశ్నించుకోకపోతే మూఢనమ్మకమై దేవుని
విధానమును తెలుసుకోలేనివారమై పోతాము. అందువలన మనిషి స్వర్గ, నరకముల విషయములో దేవుని వాస్తవ
విధానమును తెలుసుకొనునట్లు, ప్రతి ప్రశ్నకు జవాబు దొరకునట్లు ఈ గ్రంథములో వ్రాయబడింది. దేవుని విధానమును
మనిషి తెలుసుకోగలిగితే తప్ప, దేవున్ని మనిషి గుర్తించలేడు. అందువలన సర్వసృష్ఠికి అధిపతియైన దేవుని ప్రభుత్వమును
గురించి ఇందులో సంపూర్ణముగా వ్రాయబడింది. దేవుని ప్రభుత్వము మరియు పరిపాలనా విధానమును తెలుసుకుంటే,
అన్ని మతముల వారి సంశయములు పటాపంచలైపోవును. అట్లుగాక వ్రాసిన మమ్ములను అసూయతో చూచిన, వారు
దైవదూషణ పాపమును పొందవలసివచ్చును. ఇందులో చెప్పిన సమాచారము నావెనుక ఉన్నవాడు చెప్పాడు. కనుక
మీరు నన్ను దూషించినా, ఆ దూషణ నేరుగా నావెనుక ఉన్నవానికే చేరును. కావున మీరు మా మాటను నమ్మకపోయినా
పరవాలేదు. దైవదూషణా పాత్రులు కావద్దండి. దైవదూషణ పాపము క్షమించబడక, రెండుయుగములు
అనుభవించవలసివచ్చును. మీరు దైవము ఎడల సత్యమును తెలుసుకోండి, సత్యమునే ఇతరులకు చెప్పండి. అలా
చేస్తే అది దేవుని సేవ అవుతుంది. మీరు కూడ దేవుని సేవకులు కావాలని కోరుచున్నాము.
ఇట్లు,
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
ముఖ్య విషయము.
ఈ గ్రంథమంతా చివరివరకు చదివినవారికి దేవుడు, దేవునియొక్క చట్టము, పరిపాలన అర్థమైయుంటుంది.
అటువంటి వారు ఇప్పటినుండి అయినా మాయవైపు పోకుండ, దేవునివైపు పోవుటకు, గతములో మనము చేసుకున్న
పాపముల (కర్మల) నుండి బయటపడుటకు, సులభమైన ఉపాయమును చెప్పదలచుకొన్నాము. ఆ ఉపాయమును
కూడ ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రములో గల ఆధారముతోనే చెప్పుచున్నాను. ఒక మనిషి మృత్యుకూపము,
నరకకూపము అయిన ప్రపంచమును వదిలి పరమాత్మ అయిన దేవునివద్దకు చేరాలంటే, ప్రస్తుతము భక్తికోవకు
చెందినవి మరియు అందరూ ఆచరించునవి అయిన వ్రతక్రతువులూ, యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనములు,
వేదమంత్రములను చదువుట ద్వారా చేయు ఆరాధనలు, ప్రపంచములోనున్న దానములైన గోదాన భూదాన, అన్నదాన,
ధనదాన మొదలగు దానములు, చిన్న ధ్యానము నుండి పెద్ద తపస్సులు మొదలగునవన్నియు దేవుణ్ణి చేరుటకు పనికిరావు.
ఈ విధానములు దేవుణ్ణి తెలియుటకు పనికిరావు. ఈ విధానముల వలన దేవున్ని తెలియుటకు శక్యముకాదు అని
భగవద్గీతయందు విశ్వరూప సందర్శన యోగము అను ఆధ్యాయములో 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున
భగవంతుడే స్వయముగా చెప్పాడు. ప్రస్తుత కాలములో భక్తి అనునది ఎవరికైనా ఉంటే, అది పైన చెప్పిన విధానములోనే
ఉంటుంది. అటువంటపుడు వారు భక్తి విధానములో పడిన శ్రమ, ఖర్చు అన్ని వృథాయేనని చెప్పవచ్చును. ఇది
నామాట కాదు గీతలో భగవంతుని మాటని గుర్తుంచుకోవాలి.
మనము చేయు పూజలు, అర్చనలు, యజ్ఞములు, మ్రొక్కుబడులు, ముడుపులు అన్నీ వృథా అయితే ఇక
సరియైన మార్గమేది అని ఎవరైనా అడుగవచ్చును. దానికి సమాధానము భగవద్గీతలోనే కలదు. దేవుణ్ణి తెలియాలంటే,
దేవునివద్దకు చేరాలంటే 'యోగము' అను మార్గము తప్ప వేరు మార్గములేదు. యోగము అనునది ధ్యానములు,
తపస్సులకంటే, యజ్ఞములకంటే, దానములకంటే ప్రత్యేకమైనది. భగవద్గీతలో భగవంతుడు యోగము రెండు రకములుగా
ఉన్నదనీ ఒకటి కర్మయోగము, రెండు బ్రహ్మయోగము అని చెప్పి వాటి ఆచరణ కూడ చెప్పియున్నాడు. ఈ రెండు
యోగ విధానములు మనిషిని దేవునివద్దకు చేర్చునవే. కర్మ, బ్రహ్మ అను రెండు యోగములను తెలుసుకొంటే అవి
ప్రస్తుతమున్న భక్తి విధానములకంటే సులభమైనవే. అర్చనలు, యజ్ఞములు, తపస్సులకంటే సులభమైనవేకాక, ఏమాత్రము
ఖర్చు, శ్రమలేనివని చెప్పవచ్చును. యోగములలో కర్మయోగమునందు మనలోని అహమును అణచివేయడమే మనము
చేయవలసిన పని. ఇందులో పైసా ఖర్చూ ఉండదు. ఇకపోతే బ్రహ్మయోగములో మనలోని మనస్సును అణచివేయడమే
పనిగా ఉన్నది. ఇందులో కూడ ఏ ఖర్చూలేదు. శరీరములో అహమును, మనస్సును అణచివేయడము అలవాటు మీద
ఆధారపడివుంటుంది. అలవాటు శ్రద్ధవలన లభిస్తుంది. చివరకు శ్రద్ధకూడ కష్టమూ, ఖర్చూ లేనిదే! ఏ కష్టము,
ఖర్చులేని సులభమైన విధానమును భగవంతుడు చెప్పితే, అటువంటి వాటిని వదిలి, వ్యయ ప్రయాసలతో కూడుకొన్న
భక్తినే మనిషి ఆచరించు చున్నాడు. కష్టము, ఖర్చుతో కూడుకొన్న పని అయిన భక్తివిధానములో ఒక దానిని ఉ
దాహరణకు చెప్పుకొందాము.
ఒక వ్యక్తి తిరుపతి వెంకటేశ్వరస్వామికి నాకు వ్యాపారములో లాభమువస్తే అందులో పదవవంతు నీ హుండీలో
వేస్తానని మ్రొక్కుకొన్నాడు. సంవత్సరము తర్వాత తన వ్యాపారములో కొంత లాభము కనిపించగా, వెంకటేశ్వరస్వామికి
మ్రొక్కుకున్నట్లు వచ్చిన లాభములో పదవవంతు, తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరస్వామి హుండీలో వేసివచ్చాడు. అక్కడికి
పోయి, ఒక లక్షరూపాయలను హుండీలో వేసివచ్చుటకు, మొత్తము ఆరు రోజుల కాలము పట్టినది. వెంకటేశ్వరస్వామి
దర్శనమునకు వరుసలో రెండు రోజులు నిలబడవలసివచ్చినది. తన ఊరిలో బయలుదేరినప్పటి నుండి ఒకప్రక్క
కష్టము, ఒకప్రక్క ఖర్చు రెండూ తగులుకొన్నాయి. అలా మొదట వ్యాపారము మొదలు పెట్టినప్పుడు ప్రారంభించిన
భక్తి, వ్యాపారము పెరుగుకొద్దీ, లాభము వచ్చుచుండుట వలన వెంకటేశ్వరస్వామియే నాకు డబ్బులు ఇస్తున్నాడనీ,
ఆయన వల్లనే నా వ్యాపారము అభివృద్ధి అగుచున్నదని తలచిన ఆ భక్తుడు, ప్రతి సంవత్సరము కొండకుపోయి
గుండుకొరించుకొని ముడుపులు చెల్లించి వచ్చుచుండెను. అతను చేయు వ్యాపారములో విపరీతమైన లాభము వచ్చినది.
కావున కొన్ని సంవత్సరములలోనే అతను కోటీశ్వరుడైపోయాడు. అదంతయు వెంకటేశ్వరస్వామి తనమీద దయ చూపడము
వల్లనే జరిగినదని అనుకొన్నాడు. ఆ విధముగా అతనికి వెంకటేశ్వరస్వామి మీద ప్రగాఢమైన విశ్వాసము ఏర్పడినది.
తాను చేయు వ్యాపారములోవచ్చు విపరీతమైన లాభములో కోట్ల రూపాయలను హుండీలో వేయడము మానివేసి,
వెంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణమును శాశ్వితముగా ఉండునట్లు చేయించాలనుకొన్నాడు. అనుకొన్న తక్షణమే
స్వామి ప్రతిమకు తగినట్లు కిరీటమును చేయించాలను కొన్నాడు. 42 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బంగారు కిరీటమును
చేయించాడు. ఒక శుభ దినము ఆ కిరీటమును వెంకటేశ్వర స్వామికి తిరుమలకు పోయి సమర్పించి వచ్చాడు.
తర్వాత రెండవ సంవత్సరము నుండి ఆ వ్యక్తికి నష్టాలు రావడము మొదలైనవి. నష్టములో అపారనష్టము ఏర్పడినది.
తాను చేయు వ్యాపారము అక్రమమని ప్రభుత్వమే ఆటంక పరచినది. తన వ్యాపారమే నిలిచిపోయినది.
నిలిచిపోవడమేకాక, కోర్టువ్యవహారములో కూడ చిక్కుకోవలసి వచ్చినది. ఈ విధముగా ఒకదానికొకటి అన్ని వ్యతిరేఖములే
ఎదురైనాయి. దీనిని బట్టి చూస్తే ఇంతవరకు వెంకటేశ్వరుడు ఆదాయమును చేకూర్చినాడు, ఇప్పుడెందుకు ఆదాయమును
చేకూర్చలేదు అన్న ప్రశ్నవస్తుంది. ఆ ప్రశ్నకు జవాబును చూస్తే ఈ విధముగా కలదు.
మానవజీవితములో ప్రతిదీ జరుగుటకు ఒక కారణముంటుంది. ప్రతి పనికీ గల హేతువును చూస్తే, ఆ
హేతువు గత జన్మలలో మనము చేసుకొన్న పాపపుణ్యములని తెలియుచున్నది. వెంకటేశ్వరస్వామి భక్తునికి జీవితములో
పుణ్యము అమలుకొచ్చిన దానివలన, అతను చేయుచున్న వ్యాపారములో లాభము రావడము మొదలయింది.
జ్యోతిష్యశాస్త్రము ప్రకారము అతనికి పుణ్య ఫలితమునిచ్చు మంచి దశ ఉండుటవలన, ఆ లాభము వచ్చింది. లాభమునకు
హేతువు తన పుణ్యమని తెలియని ఆ వ్యక్తి, అదంతయు వెంకటేశ్వరుని ద్వారానే వచ్చిందనుకొని స్వామికి ముడుపులు
చెల్లిస్తూ, చివరకు గొప్ప కిరీటమునే చేయించాడు. పుణ్యము అయిపోయిన వెంటనే, లాభము రాకుండ పోవడమేకాక
పాపఫలితముగ కష్టాలు కూడ మొదలైనవి. దీనినిబట్టి చూస్తే మొదట లాభమునకుగానీ చివరి నష్టమునకుగానీ
వెంకటేశ్వరస్వామి ఏమాత్రము కారకుడు (హేతువు) కాడు. మీరు ఆరాధించు దేవుడు, మీకు ఏమీ ఇవ్వడు అను
విషయమును మనము తెలుసుకొనుటకు భగవంతుడు భగవద్గీతలో ఈ విధముగా చెప్పాడు. ( విజ్ఞాన యోగము
20,21,22,23,24 శ్లోకముల సారాంశము) 1) ఆశ అను గుణము చేత కట్టబడినవారై, నియమ నిష్టల ప్రకారము
దేవుడుకాని ఇతర దేవతలను కొందరు మనుషులు ఆరాధిస్తున్నారు. 2) ఎవరు ఏ దేవతను పూజించదలచుకొన్నారో, ఆ
దేవతాభక్తి మీదనే వారికి శ్రద్ధ ఉండునట్లు నేను చేయుచున్నాను. 3) అతను శ్రద్ధతో దేవతను ఆరాధించగా దానివలన
అతను కోరుకొన్న కోర్కెలు నెరవేరునట్లు నేనే చేయుచున్నాను. 4) తెలివితక్కువవారు పొందు ఫలితము కూడ అంత
మాత్రమే ఉంటుంది. దేవతాభక్తులెల్ల దేవతలనే పొందగా, నా భక్తులందరు నన్ను పొందగలరు. 5) బుద్ధిలేనివారు
కొందరు నాశనములేని, ఉత్తమమైన నా గొప్పతనమును తెలియక, కనిపించని నన్ను కనిపించే దేవతగా లెక్కించుచున్నారు.
దేవుడు చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తే, దేవతలను పూజించువారు బుద్ధిలేనివారు, తెలివితక్కువవారని తెలియుచున్నది.
అంతేకాక దేవతలను పూజించువారు, నావైపు రాకూడదను భావముతో, వారి కోర్కెలను దేవుడే నెరవేర్చుచున్నాడు. అది
తెలియక వారు పూజించు దేవతే మా కోర్కె నెరవేర్చినదని, దేవతాభక్తులు అనుకోవడము జరుగుచున్నది. వెంకటేశ్వరస్వామి
భక్తుడు కూడ అలాగే అనుకున్నాడు. నా కోర్కెలు నెరవేర్చి, నాకు లాభమొచ్చునట్లు చేశాడని కొన్ని కోట్లు హుండీలో
వేయడమేకాక, గొప్ప కిరీటమును కూడ చేయించాడు. తన కోర్కెలను వెంకటేశ్వరుడు నెరవేర్చలేదను అసలు విషయము
ఆ భక్తునికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పినా వినేస్థితిలో ఉండడు.
ప్రతి పనికి కనిపించని ఫలితముండును కదా! వెంకటేశ్వరస్వామి భక్తుడు చేసిన ఆరాధనలకు ఫలితముండదా
అని కొందరడుగవచ్చును. దానికి జవాబు కనిపించే ఫలితమును దేవుడే ఇచ్చి, తనవైపు రాకుండ చేసుకొంటాడు.
ఇక కనిపించని ఫలితము పుణ్యము వస్తుంది. పుణ్యము వలన జన్మవస్తుంది, కానీ ముక్తిరాదు. గొప్పదైన ముక్తిని
వదలి, బంధమైన జన్మకు పోవడము తెలివితక్కువ పనికాదా! అందువలన పవిత్రమైన దైవము వైపు పోవడమే మేధావుల
పని అగును. అలా పోవాలి అంటే కర్మయోగము, బ్రహ్మయోగము అను శాస్త్రబద్దమైన మార్గములు గలవు.
మార్గములు భగవద్గీతలో ధర్మయుక్తముగా చెప్పబడివున్నవి. ఒకవేళ ఎవరైన యోగముల మీద పూర్తి ఆసక్తి కల్గియుండి,
ఆ రెండు యోగములను ఆచరించడములో గానీ, అభ్యాసము చేయడములోగానీ సమర్థతలేనివారైతే, అటువంటివారికి
ప్రత్యేకమైన మార్గముకలదు. అదియే భక్తిమార్గము. భక్తిమార్గములో కేవలము దేవుని ఎడల మాత్రము సేవ
చేయడముండును. సృష్టికర్త అయిన పరమాత్మ సేవ తప్ప, ఏ దేవత సేవకు సంబంధముండదని జ్ఞప్తికి ఉంచుకోవలెను.
దేవుడు కనిపించని వాడు, ఆకారములేనివాడు అయినపుడు ఆయనకు సేవ ఎలా చేయాలని కొందరికి ప్రశ్నరావచ్చును.
దానికి జవాబు ఏమనగా! ప్రపంచములో దేవుని సేవ అనునది ఒకే ఒక్కటి మాత్రము గలదు.ఆ ఒక్కటి ఏదనగా!
దేవుని జ్ఞానమును ప్రచారము చేయడము. అంతగొప్ప దేవునికి ఇంత చిన్న సేవ ఒక్కటిమాత్రమే గలదా? అని
కొందరు అనుకోవచ్చును. దీనిని గురించి భగవద్గీత భక్తియోగములో 10వ శ్లోకమున...
అభ్యాసే ప్యసమర్థో సి మత్కర్మపరమో భవ,
మదర్థమపి కర్మాణికుర్వన్ సిద్ధిమవాస్యసి।।
ఇలా గలదు. “నీవు యోగము చేయుటయందు అసమర్థుని వైతే, నాకొరకు పనిని చేయుము. నా కొరకు
పనిని చేసినట్లయితే, నీవు ముక్తి పొంది నావద్దకు రాగలవు.” అన్నాడు. దీనినిబట్టి చూస్తే దేవుని పని ప్రపంచములో
ఒక్కటి మాత్రమే గలదు. దానికొరకు దేవుడే భూమిమీదకు భగవంతునిగా వచ్చి ఆ పనిని చేసిపోయాడు. ఆయనే
స్వయముగా ధర్మముల యొక్క ప్రచారము అను పని చేశాడు. అందువలన ఆయన (దేవుని) యొక్క ధర్మములను
ప్రచారము చేయడమే నిజమైన దేవుని పనియగును. దేవుని పనిని ప్రత్యక్షముగాగానీ, పరోక్షముగాగానీ చేయడము
వలన దేవుని సేవ చేసినట్లుగును. ఎవరికైనా దేవుని ధర్మములు శాస్త్రబద్ధము గా, హేతు బద్దముగా తెలిసియుంటే,
వాటిని ఇతరులకు తెలియజేయడము దేవుని సేవ అగును. ఒకవేళ దేవుని జ్ఞానముగానీ, ధర్మములుగానీ తెలియనపుడు
అవి తెలియబడుటకు సహాయపడినా, ప్రత్యక్షముగా కాకుండ పరోక్షముగా సేవ చేసినట్లగును.
ఇప్పుడు కొందరికి కొన్ని ప్రశ్నలు వచ్చి ఇలా అడుగవచ్చును. “నేను పదిలక్షలు ఖర్చుచేసి ఆంజనేయస్వామి
గుడిని కట్టించాను. ఆ గుడి ఉండుట వలన మా ఊరిలోని చాలామంది ప్రజలలో భక్తి భావము పెరిగి, ప్రతి దినము
గుడికి పోయి వస్తుంటారు. దానివలన నేను దేవుని సేవ చేసినట్లే కదా! అని అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!
దేవుడు వేరు, దేవతలు వేరు అని ముందే చెప్పియున్నాము. ఆంజనేయస్వామి గానీ, మరెవరుగానీ ఆకారముండి
కనిపించే దేవతలు మరియు పేరుండి వినిపించే దేవతలు అయినందువలన వారు ఎవరూ దేవుడుకాదు, వారికి చేసినది
దేవుని సేవాకాదు. అలా చేయడము దేవుడుకాని అన్యదేవున్ని ఆరాధించినట్లు, సేవించినట్లు అగును. నేడు భూమిమీద
దేవుని ధర్మములు తెలియక అధర్మయుక్తములైన పనినే చేయుచున్నారు. కొందరు ఆంజనేయ దండకము అను పుస్తకమును
అచ్చువేయించి, ఉచితముగా లక్షకాపీలను పంచినవారు, కొందరు రామ్ దేవ్ బాబా మహత్యమును గురించి ప్రచురించి
ఐదు లక్షల పుస్తకములను పంచిన వారు, మేము ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా దేవునిసేవ చేసినట్లే కదా! అని
అనుకొనుచున్నారు. పైన చెప్పిన సూత్రము ప్రకారము ఇటువంటివన్ని దేవతల సేవలగును. కానీ దేవుని సేవకాదు.
బ్రహ్మవిద్యాశాస్త్రమును గురించి స్వయముగా ఇతరులకు బోధించినా, లేక దానిని గురించి తెలియనపుడు, ఆ
శాస్త్రమును బోధించు వారికి సహాయపడి బ్రహ్మవిద్య ప్రచారమగునట్లు చేసినా, అది దేవుని సేవ చేసినట్లు అగును.
స్వయముగా బోధిస్తే ప్రత్యక్షముగా సేవ చేసినట్లుగును. బోధించువారికి సహాయపడినగానీ, ఆ కార్యములలో పాల్గొనినాగానీ,
అతను పరోక్షముగా సేవ చేసినట్లగును. నేడు బ్రహ్మవిద్యాశాస్త్రము ఇందూమతములో ఒకే ఒక భగవద్గీతలో కనిపిస్తూవున్నది.
అందువలన నేను స్వయముగా త్రైతసిద్ధాంత భగవద్గీతను రచించి, ప్రచురించి ప్రచారము చేయుచున్నాను. అంతేకాక
బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిన అనేక అంశములను కూడ వ్రాసి ప్రచురించి, ప్రచారము చేయడము వలన
నాది నిజమైన దేవునిసేవ అని ధైర్యముగా చెప్పుకొంటున్నాను. నేను ఇంతవరకు ఇతరులనుండి ధన సహాయమును
తీసుకోకుండ, చందాల పేరుతో డబ్బును వసూలు చేయకుండ, స్వచ్చందముగా గత 40 సంవత్సరములనుండి దేవుని
సేవ చేయుచువచ్చాను.
నేడు దేశములో దేవుని సేవ అంటే ఏమిటో తెలియకుండ పోయినది. యోగములంటే వారి ఇష్టమొచ్చినట్లు
ఊహించుకొంటున్నారు. బ్రహ్మవిద్య అసలుకు అడుగంటిపోయి తెలియకుండ పోయినది. ఆరవశాస్త్రము ఒకటున్నదను
మాటకూడ ఎవరికి తెలియకుండ పోయినది. ఇటువంటి సందర్భములో మేము దైవజ్ఞానమును, ధర్మములను ఎంతగా
ప్రచారము చేసినా, పూర్తి ప్రయోజనము లేకుండ పోవుచున్నది. వేయింటికి ఒక్కనికి కూడ మా జ్ఞానము అందడము
లేదు. నేను ఒక్కనినేకాక చాలామంది నాలాగ దైవజ్ఞానమును ప్రచారము చేస్తే, కొందరికైనా అసలైన జ్ఞానము తెలియగలదు.
నాలాగ అందరు జ్ఞానమును బోధించలేక పోవచ్చును. అయినా నాలాగ జ్ఞానమును ప్రచారము చేయవచ్చును.
జ్ఞానప్రచారములో ప్రత్యక్షముగా పాల్గొనకపోయినా, పరోక్షముగా సహాయపడినా అది దేవుని సేవయే
అవుతుందనుకొన్నాము. అందువలన మా అనుమతితో మా గ్రంథములను ప్రచురించి, ఉచితముగా ఇతరుల కివ్వడము
దేవునిసేవ అగును. మేము తెల్పిన జ్ఞానము దేవతలకు సంబంధము కాకుండ, కేవలము దేవునికి మాత్రమే సంబంధించినది.
కావున మా గ్రంథములను ప్రచారము చేయుటవలన మాత్రమే దేవునిసేవ చేసినట్లగును.
దేవుని జ్ఞానమును బోధించడము అను సేవ నిమిత్తము మేము ఒక సంఘమును స్థాపించాము. దానిపేరు
“ప్రబోధ సేవాసమితి” ఈ సమితి, దేవునిసేవ నిమిత్తము ఏర్పరచబడినది. ఈ సంఘము దాదాపు 20 సంవత్సరములనుండి
పని చేయుచుండినప్పటికి, ఈ ప్రబోధ సేవాసమితి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. మాయా ప్రభావము చేత, మాచే
స్థాపించబడిన ప్రబోధ సేవాసమితి ప్రచారము కాలేకపోయినది. అందువలన ఇంతవరకు చాలామందికి ప్రబోధ
సేవాసమితి అసలైన దేవునిసేవ చేస్తున్నదని, ఎవరికీ తెలియకుండపోయినది. ఇప్పుడు మేము అందరికీ తెలియజేయునది
ఏమనగా! ప్రపంచములో నిజమైన దేవునిసేవ చేయాలనుకొన్నవారు ఎవరైనా ఈ సంఘములో సభ్యులుగా చేరవచ్చును.
కొందరికి అలా చేరుటకు కొన్ని ఇబ్బందులుండుట వలన, వారు ప్రబోధ సేవాసమితిలో సభ్యులుగా చేరలేకపోవచ్చును.
అలాంటివారు కూడ ఈ సంఘమునకు ఆర్థిక సహాయము చేసి పరోక్షముగా దేవుని సేవలో పాల్గొనవచ్చును. అటువంటి
సహాయము చేయువారికి వారి ఆధాయపు పన్నునుండి మినహాయించబడుటకు తగిన అవకాశము కూడ గలదు.
దానికి తగిన ప్రభుత్వ అనుమతి కూడ గలదు.
ప్రభుత్వ పత్రం 199 పేజీ లో చూడగలరు.
ఈ సంస్థ ద్వారా దేవుని సేవ చేయవచ్చును. అట్లుకాకుండ ఎంతమంది దేవతలకైనా, ఎంత పెద్ద పేరున్న
దేవతలకైనా, వారి హుండీలలో లక్షలు గుమ్మరించినా, అది దేవుని సేవకాదని తెలియవలెను. చాలామంది అసలైన
దైవత్వము తెలియక, కనిపించే దేవతలే దేవుడనుకొని పొరపడి పోయారు. ఆ విషయము గీతయందు స్పష్టముగా
చెప్పబడినది. ఇప్పటి నుండైన దేవతలను కూడ సృష్టించినవాడు దేవుడనీ, ఆ దేవున్ని యోగము ద్వారాగానీ, సేవ
ద్వారాగానీ చేరవచ్చునని తెలిసి, ఇటు యోగమైనా చేయండి, అటు సేవ అయినా చేయండి. యోగము చేయుటకు
ఎట్లు దారిని చూపామో, అట్లే సేవ చేయుటకు కూడ దారిని చూపాము. చెప్పవలసినది మా తప్పులేకుండ చెప్పాము.
ఇక మీ ఇష్టము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.