పొడుపు కథల జ్ఞానము. cloud text updated 19thsep24

 


పొడుపు కథల జ్ఞానము.


కథలు వేరు, పొడుపు కథలను వేరు. కథలు, చెప్పే వారిద్వారా వినవచ్చును. కథలో ప్రశ్నలుండవు పొడుపు

కథలు చెప్పేవారికి, వినేవారు తిరిగి జవాబు చెప్పవలసి ఉండును. పొడుపు కథలలో ప్రశ్నలు ఉండును. పాఠశాలలో

నున్న తెలివితక్కువ పిల్లల కొరకు, పొడుపు కథలను సృష్టించారు. పొడుపు కథలోని ప్రశ్నకు జవాబును కథవిన్నవారు

చెప్పవలసి ఉంటుంది. దానివలన విన్న కథకు, జవాబు ఏమి అని ఆలోచించుట వలన, పిల్లలకు బుద్ధి బలము

పెరుగునని, ఆనాటి ఉపాధ్యాయుల ఉద్దేశ్యము. పొడుపు కథలు ద్వంద్వ అర్థములు కలిగివుండును. ఒకటి ప్రపంచ

అర్థము ఇమిడి ఉండగా, మరొకటి పరమాత్మ అర్థము ఇమిడి ఉండును. పొడుపు కథలోని ప్రశ్నకు ప్రపంచ అర్థముతో

జవాబు చెప్పితే, అది కాదని పరమాత్మ అర్థమును చూపవచ్చును. ఒకవేళ జవాబు చెప్పువాడు పరమార్థ అర్థమును

చెప్పితే, అది కాదని ప్రపంచ అర్ధమునూ చూపవచ్చును. ఈ విధముగా ఎదుటి వ్యక్తిని అధిగమించుచూ, వాని బుద్ధికి

పదును పెట్టవచ్చును. ఉదాహరణకు “పండుగాని పండు ఏది” అని ఒక పొడుపు కథను అడిగినప్పుడు, దానికి

జవాబు ప్రపంచ సంబంధముగా విభూదిపండు అని చెప్పితే, అది కాదని దైవసంబంధమైన జవాబుగా తలపండు అని

చెప్పవచ్చును. ఈ విధముగా ప్రతి పొడుపుకథకు రెండు జవాబులు ఉండును. అయితే అందరికీ రెండు జవాబులు

తెలిసివుండవు. కొందరికి ఒక జవాబు కూడా తెలియకపోగా, కొందరికి ప్రపంచ సంబంధమైన జవాబు మాత్రము

తెలిసివుండును. చాలామందికి దైవసంబంధ జవాబు తెలియదు. అందువలన రెండు రకముల జవాబులు తెలిసినవారు

చాలా అరుదుగా ఉందురు. ఇప్పటి కాలములో పొడుపు కథలంటే ఏమిటివో కూడా చాలామందికి తెలియవు. అటువంటి

వారికి, పొడుపు కథలోనున్న ప్రపంచ సంబంధమైన ఒక జవాబు కూడా తెలియదు. ప్రపంచ జవాబే తెలియనప్పుడు

పొడుపు కథలో దాగియున్న దైవజ్ఞానమును ఎలా గుర్తించగలరు? మొత్తము మీద పొడుపు కథలు అంతరించిపోవు

స్థితికి వచ్చినవి. చివరి అవసానదశలోనున్న పొడుపు కథలను గురించి మనము ఇప్పుడు చెప్పుకోవడము వలన,

వాటికి కొంత ఊపిరి వచ్చినట్లగునని తలచుచున్నాను. పొడుపు కథలకు బలము చేకూరుటకు మేము వాటిని సేకరించి,

వాటిలో దాగియున్న జ్ఞాన సంబంధమైన విషయములను చెప్పదలచుకొన్నాము.


శరీర జ్ఞానము ఎంతవున్నా, ఆత్మజ్ఞానములేని జీవితము వ్యర్థము.

***

1. ఇంటికి కాపలా కాస్తుంది, కానీ కుక్క కాదు?


ఈ పొడుపు కథకు ప్రపంచ సంబంధముగా జవాబును చెప్పు కొంటే, “తాళం” అని చెప్పవచ్చును. కుక్క

కాకున్నా ఇంటిలోనికి ఎవరు ప్రవేశించకుండా, కాపలాగా అందరికీ కనిపించునది "తాళం” కావున, దానిని జవాబుగా

చెప్పవలసివచ్చినది. ఇకపోతే ప్రపంచ సంబంధముగా కాకుండా ఆధ్యాత్మికముగా దీనికి జవాబును చెప్పితే ఈ

విధముగా కలదు. మనిషి నివసించునది ఇల్లు కాగా, జీవుడు నివసించు ఇల్లు శరీరమగును. బయట ప్రపంచములో

మనుషులు నివసించు ఇంటిని రాళ్ళతోగానీ, మట్టితో గానీ, కట్టెలతోగానీ, కట్టుకొనియుండవచ్చును. కట్టెలతో కట్టిన

చిన్న పాకగానీ, మట్టితో కట్టిన చిన్న ఇల్లుగానీ, రాయితో కట్టిన మేడగానీ మనుషుల చేత కట్టబడినదే. అయితే జీవుడు

నివసించు శరీరమును మనుషులు తయారు చేయలేదు. శరీర గృహము ప్రకృతి చేత తయారు చేయబడినది. శరీరమను

ఇల్లు, దేవుని అధ్యక్షతన, ప్రకృతి కార్యము చేత, రక్తమాంసముల చేత తయారు చేయబడినది. మనిషి తయారు చేసిన

ఇంటికి ప్రవేశ ద్వారములు ఒకటిగానీ, అంతకంటే ఎక్కువగానీ అవసరమును బట్టి యుండును. ప్రకృతి చేత


తయారు చేయబడిన శరీర గృహమునకు ద్వారములు మొత్తము తొమ్మిది గలవు. అందులో ఏడు ప్రవేశ ద్వారములుగా,

రెండు బహిర్గత ద్వారములుగా ఉన్నవి.


ఆధ్యాత్మికము ప్రకారము శరీరము ఇల్లుకాగా, ప్రపంచరీత్యా మిద్దెలు, మేడలు ఇళ్ళుగా ఎన్నో గలవు. అయితే

మనము జ్ఞానపథము ప్రకారము శరీర గృహమును చెప్పుకొంటున్నాము. బయటి ఇంటికి కాపలా, కుక్కయినా కావచ్చు

లేక తాళమైనా కావచ్చును. అయితే తొమ్మిది రంధ్రములు గల శరీరమునకు కాపలా ఎవరున్నారని ఆలోచిస్తే, ఒక

విధముగా కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఆలోచించి ఇట్లంటున్నారు.


వేత్తలు :- శరీరములో ఎరుకగా ఉన్నది మనస్సుయే కదా! మనస్సు జాగ్రత్తగా ఉండునది, శరీరమునకంతటికి

ఎరుకగా ఉన్నది. శరీరములోని అన్ని ద్వారముల వద్ద ఏమి జరిగినా ముందు మనస్సుకు తెలియును. మనస్సుకు

తెలిసిన తర్వాత ఆ విషయము మనస్సు, లోపల బుద్ధికి తెలియజేయును. బుద్ధి తనకు తెలిసిన దానిని ప్రక్కనేయున్న

జీవునికి తెలియజేయును. శరీరములో ఎక్కడ ఏమి జరిగినా, ఆ విషయమును బయటినుండి లోపలి బుద్ధికి

తెలియజేయునది మనస్సే. కావున శరీర గృహమునకు కాపలాగా ఎప్పుడూ ఎరుకగా ఉన్నది మనస్సు. కావున

మనస్సు శరీరమునకు కాపలాదారుడిగా ఉన్నదని చెప్పవచ్చును. బయట ఇంటికి కుక్క కాపలా కాయవచ్చునుగానీ,

శరీరమను ఇంటికి మనస్సు కాపలా కాస్తుందని చెప్పవచ్చును.


నేను :- మీరు చెప్పినదంతా వాస్తవ విషయమే. మనస్సు నిద్రలోనికి పోకుండా మెలుకువలో ఉన్నంతవరకు, అది

శరీరమంతా వ్యాపించి ఉండుట వలన, తొమ్మిది ద్వారముల వద్ద ఏమి జరిగినా, మనస్సుకు తెలియకుండా జరుగడము

లేదు. కావున మెలకువలో ఉన్నంతవరకు మనస్సు ఎరుకగా ఉండి, ఎక్కడ ఏమి జరిగినా ఆ విషయమును మనస్సే

లోపలికి తెలుప వలసియున్నది. కావున మనస్సును శరీర గృహమునకు కాపలా కాయునదిగా చెప్పవచ్చును. జాగ్రత్తావస్థలో

మనస్సు శరీరమంతా కాపలా కాస్తుంది. అదే నిద్రావస్థలోనికి పోయినప్పుడు మనస్సు యొక్క స్థితి ఎలాగుండునో

తెలియునా? మెలకువలో శరీరమంతా వ్యాపించిన మనస్సు పూర్తిగా ముకుళించుకొని, చిన్న ఉంటగా మారిపోవును.

మనము పెన్నుతో వ్రాయునపుడు వాక్యము చివరిలో ఒక చుక్కను ఉంచుతాము కదా! పెన్నుతో పెట్టిన చుక్క ఎంత సైజు

ఉంటుందో, దానిలో పదవ వంతు చిన్నసైజు చుక్క ఎంత ఉండునో అంతసైజు ఉంటగా మారిపోవును. కంటికి

కనిపించీ కనిపించని పరిమాణముగా మారిపోవును. అలా మారిపోయిన మనస్సు, శరీర మధ్యలోనున్న బ్రహ్మనాడి

ద్వారా మెదడును చేరి, అక్కడ ఏడవ నాడీకేంద్రమున ఆత్మయందు అణిగిపోవుచున్నది. అప్పుడు మనస్సు పూర్తిగా

విశ్రాంతి తీసుకొంటున్నది. మనస్సు బ్రహ్మనాడి ఏడవ కేంద్రములో అణిగిపోవడమునే నిద్ర అంటున్నాము. అప్పుడు

శరరీములో ద్వారముల వద్ద ఏమి జరుగునదీ మనస్సుకూ తెలియదు, బుద్ధికీ తెలియదు, జీవునకూ తెలియదు. అప్పుడు

శరీరము లోపల ఎక్కడో విశ్రాంతి తీసుకొను మనస్సు శరీరమునకు కాపలాగా ఉండలేదు కదా! అందువలన మనస్సు

శరీరమునకు కాపలాదారుడు కాదని తెలియుచున్నది.



మెలకువలో ఉన్నంతసేపు శరీరము యొక్క బయటి అంచులలో జరుగు విషయమును మనస్సు తెలిపినా,

తర్వాత నిద్రలో మనస్సు చిన్న ఉంటగా మారి లోపలికి పోయి నిలచిపోవుచున్నది. అప్పుడు లోపలనున్న బుద్ధికి

బయటి విషయమును తెలుపువాడు ఒక్కడే ఒకడు కలడు. వాడే అక్షర పురుషుడైన ఆత్మ. ఆత్మ, మనిషి పుట్టింది

మొదలుకొని శరీరమంతా వ్యాపించియున్నది. నిద్రలోను, మెలుకువలోను ఆత్మ ఒకే విధముగా శరీర మంతా


వ్యాపించియుండుట వలన, ఎల్లకాలము ఆత్మయే అన్ని ద్వారముల వద్దయున్నట్లు తెలియుచున్నది. మెలుకువలో

మనస్సు పని చేయుచుండుట వాస్తవమే. మనస్సు పని చేయునప్పుడు కూడా ఆత్మ అక్కడవుండి, మనస్సును చూస్తున్నది.

మనస్సు ఎరుకగా ఉన్నప్పుడు, బయటి శరీరమునకు కాపలా కాస్తూవుండి, బయటి విషయమును లోపలి బుద్ధికి

పంపునపుడు, ఆత్మ తాను ఆ పనిని చేయక, మనస్సుకే వదలివేయుచున్నది. శరీరము లోపల మరియు శరీరము

అంచుల వరకు శరీరమంతటా వ్యాపించిన మనస్సుకు మాత్రము, తనతోపాటు ఆత్మకూడా శరీరమంతా

వ్యాపించియున్నదని తెలియదు. ఎల్లకాలము ఆత్మ శరీరమంతా నిండుకొని ఉండగా, మనస్సు మాత్రము మెలుకువలో

శరీరమంతా వుంటూ, నిద్రయందు శరీరములో ఒక్కచోట అణిగిపోవుచున్నది. మనస్సు లోపలికి పోయి, నిద్రించునపుడు

మనస్సు చేయు పనిని కూడా ఆత్మే చేయును. ఇక్కడ విశేషమేమంటే, మెలుకువలో మనస్సు ప్రతి క్షణము ఏదో ఒక

విషయమును బుద్ధికి తెలుపుచుండును. అలా చేయడము మనస్సు యొక్క పనికాగా, నిద్రలో ఆత్మ, మనస్సు యొక్క

పనిని చేసినా, మనస్సు తెల్పినట్లు ప్రతి క్షణము ఏదో ఒక విషయమును తెలుపక, అవసరమొచ్చినపుడు మాత్రమే,

అవసరమైన విషయమునే తెలుపును. శరీరములో ఆత్మ చేయు పనులు, మనస్సు చేయు పనులు వేరువేరుగా ఉన్నా,

మనస్సు విశ్రాంతి తీసుకొను సమయములో మనస్సు యొక్క పనిని కూడా అవసరమైనప్పుడు ఆత్మ చేయును. ఆత్మ

తన పనిని ఏమాత్రము విశ్రాంతి తీసుకోకుండా చేయుచుండును. శరీరములో 25 భాగములకు విశ్రాంతియున్నా,

ఆత్మకు మాత్రము విశ్రాంతియుండదు. శరీరములోని 25 భాగములను భరించునది ఆత్మయే అయినందున, ఆత్మ

విశ్రాంతి తీసుకొనుటకు వీలులేదు. ఆత్మ విశ్రాంతి తీసుకొంటే, ఆత్మ చేయు పనులైన ఊపిరి ఆడుట ఆగిపోవును,

గుండె స్పందించుట ఆగిపోవును. అలా జరుగకుండా ఉండుటకు, ఆత్మ అహర్నిశలు పని చేయవలసిందే. ఇట్లు ఆత్మ

అన్ని వేళలా తన పనిని చేయుచూ, మనస్సు నిద్రించునపుడు మనస్సు యొక్క పనిని కూడా చేయుచున్నది. ఈ

విధముగా శరీరములోని పూర్తి సమాచారమునంతటిని తెలుసుకొంటే, ఆత్మ ఒక్కటి మాత్రమే ఎల్లవేళలా శరీరమును

కాచుకొనియున్నది. అందువలన శరీరమునకు పూర్తి కాపలాగానున్నవాడు ఆత్మయే నని చెప్పవచ్చును. “ఇంటికి

కాపలా కాస్తుంది, కానీ కుక్కకాదు” అను పొడుపు కథకు జవాబును ప్రపంచరీత్యా చెప్పితే “తాళము” అగును.

ఆధ్యాత్మికరీత్యా చెప్పితే, పగలు మాత్రము మనస్సుకాగా, పగలు రేయి రెండుపూటలా ఆత్మ కాపలాదారునిగా ఉన్నదని

చెప్పవచ్చును. చూచారా! చిన్నమాటగా వున్న ఒక పొడుపుకథను విప్పి చూచుకొంటే, దానివెనుక మనకు తెలియని

ఎంత ఆధ్యాత్మిక రహస్యము ఇమిడి ఉన్నదో, ఇటువంటి మరికొన్ని పొడుపు కథలను విప్పి చెప్పుకోవడము వలన,

ఎంతో జ్ఞానము మనకు తెలియగలదని ఆశిస్తూ, ఇప్పుడు మరియొక పొడుపు కథను చూస్తాము.



దైవజ్ఞానముతో సంబంధము లేకుండావుండి, మాయతో సంబంధము పడినవాడు

శాశ్వితముగా బాధపడతాడు.

***

2. ఇల్లుంది కానీ తలుపు లేదు. మనిషి ఉన్నాడు కానీ మాటలేదు?


ఈ పొడుపు కథలో కూడా ఇల్లు అనుమాట ఉన్నది. కావున ఇది కూడా సులభముగా అర్థము కాగలదు. ఈ

పొడుపు కథలో ఇల్లు, మనిషి ఉన్నారని చెప్పి ఇల్లుకు వాకిలి, మనిషికి మాట లేదు అని చెప్పడములో ప్రత్యేకత కలదు.

దీనిలో ప్రపంచ సంబంధముగా చూస్తే చనిపోయిన మనిషికి మాటవుండదు. అలాగే శవానికి కట్టిన గోరీకి తలుపుండదు.


అందువలన దీనికి జవాబుగా ఎవరైనా గోరీ అని చెప్పవచ్చును. చెప్పిన పొడుపు కథలో ఉన్న ప్రశ్నకు, ప్రపంచరీత్యా

గోరీ అను జవాబు సరిపోయినా, ఆధ్యాత్మిక విద్యను అనుసరించి ఏమి జవాబు కలదో ఇప్పుడు మనము పరిశీలించి

చూస్తాము.


ఈ కథలో తలుపులు (వాకిలి) లేని ఇల్లు, మాట్లాడని మనిషి ఉండుట వలన, ఈ మాటలు ఆధ్యాత్మికములో

ఎక్కడ సరిపోవునో చూడ వలసియున్నది. ఆధ్యాత్మికము అనగా ఆత్మను అధ్యయనము చేయడము అని తెలియుచున్నది.

ఆత్మయొక్క అధ్యయనమంతయు శరీరములోనే ఉన్నది. కావున ప్రతి పొడుపు కథకు జవాబును, శరీర పరిధిలో

చూచినప్పుడే అది ఆధ్యాత్మిక జవాబు అనిపించుకొనును. అందువలన మనము ఈ పొడుపు కథకు కూడా జవాబును

శరీరములోనే వెదికి తెలుసుకొందాము. మాట్లాడని మనిషి అంటే ప్రపంచరీత్యా చనిపోయినవాడని (శవమని) చెప్పినా

సరిపోవును. కానీ ఆధ్యాత్మికరీత్యా చూస్తే శరీరములో నివసించు జీవుడు ఒకే ఒక పనిని చేయువాడనీ, తనవరకు

వచ్చిన అనుభూతులను అనుభవించడము తప్ప జీవునికి వేరు పని లేదనీ ముందే తెలుసుకొన్నాము. తెలుసుకొన్న

దాని ప్రకారము జీవుడు స్వయముగా ఏదీ చేయలేడు. జీవుడు పూర్తిగా అవిటివాడుగా (వికలాంగునిగా) ఉన్నాడు.

బుద్ధి అందించిన విషయమును చప్పరించి, అనుభవమును పొందడము తప్ప జీవుడు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు,

స్వయముగా ఏమీ చేయలేడు. బయట జరిగిన సంఘటనలో ఉన్న సమాచారమునుగానీ, బాధనుగానీ, సుఖమును

గానీ, మనస్సు తీసుకొనివచ్చి బుద్ధికి అందించగా, బుద్ధి, గ్రహించిన దానినంతటిని జీవునికి అందించగలదు. అప్పుడు

జీవుడు బుద్ధి ద్వారా వచ్చినదేదయినా అనుభవానికి తీసుకొని అనుభవించును. వచ్చినది సుఖము గానీ, దుఃఖముగానీ

ఏదైన దానిని జీవుడు అనుభవించడము జరుగుచున్నది. ఇది జీవుని యొక్క తతంగము. ఇంతతప్ప జీవునికి వేరు

కార్యము ఏమీ లేదు. అందువలన జీవున్ని ఉద్దేశించి "ఉన్నాడు గానీ మాటలేదు” అని చెప్పడము జరిగినది. జీవుడు

ఉన్నా మాట్లాడువాడు కాదు. కావున మనిషి ఉన్నాడు గానీ మాటలేదు అని చెప్పిన మాటకు జవాబుగా, శరీరములోనున్న

జీవుడు అని చెప్పవచ్చును.


ఇల్లుంది కానీ తలుపులేదు అను మాటను, ఆధ్యాత్మికరీత్యా చూస్తే జీవుడు నివసించు శరీరమునకు తొమ్మిది

రంధ్రములు కలవనీ, శరీర గృహమునకున్న తొమ్మిది రంధ్రములను, తొమ్మిది ద్వారములుగా చెప్పు కొన్నాము. ఒక

ఇంటికి ముఖ ద్వారము, దొడ్డి ద్వారము అనునవి రెండు ఉన్నట్లు, శరీర గృహమునకు ఏడు ముఖ ద్వారములు గలవు,

అలాగే రెండు దొడ్డి ద్వారములు గలవు. అయితే తొమ్మిది ద్వారములకు తలుపులు మాత్రము లేవు. అందువలన,

తలుపులు లేని ఇల్లు శరీరమని కొందరు చెప్పుచుందురు. బయటనుండి వచ్చు విషయములు, ఏడు ద్వారముల ద్వారా

శరీరములోనికి ప్రవేశించుచుండును. ఏడు ద్వారములవద్ద ఏమి ప్రవేశించుచున్నదో, దానిని మెలకువలోనున్న మనస్సు

గ్రహించి లోపలి బుద్ధికి అందించుచుండును తప్ప, ప్రవేశించు వాటిని వద్దనిచెప్పి ప్రవేశించ కుండా చేయుటకు, ఆ

ద్వారములకు తలుపులు లేవు. ఇక్కడ ఎవరైనా ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! కన్ను రంధ్రములు రెండు

కలవు కదా! వాటికి రెండు రెప్పలు కలవు కదా! రెప్పలు కన్ను ద్వారములను మూసి కనిపించకుండా చేస్తున్నవి కదా!

అలాంటపుడు రెప్పలను కన్ను ద్వారములకున్న తలుపులుగా చెప్పవచ్చును కదా! అని అడుగవచ్చును. దానికి మా

జవాబు ఈ విధముగా కలదు.


చెవులు రెండు రంధ్రములకు, ముక్కు రెండు రంధ్రములకు, అలాగే కన్ను రెండు రంధ్రములకు, నోరు ఒక

రంధ్రమునకు కనిపించునట్లు, చెవులకు, ముక్కులకు, నోటికి మొత్తము ఐదు రంధ్రములకు ఏ మూతలు లేవు. కన్ను


రెండు రంధ్రములకు మాత్రము కనురెప్పలు గలవు. కను రెప్పలు కళ్ళను శుభ్రము చేయు గుడ్డలులాంటివి కానీ అవి

తలుపులు కాదు. నిద్రపోవునప్పుడు కనుగుడ్లను కప్పి మూసియుంచినా, అప్పుడు కళ్ళతో పని లేదు కావున, దుమ్ము

ధూళి పడకుండ కన్నును కప్పియుంచు టకు రెప్పలను తయారు చేసిపెట్టడము జరిగినది. మనిషి మెలకువలో

యున్నప్పుడు కూడా నిమిషమునకో, అర నిమిషమునకో ఒకమారు, కనుగుడ్లను కనురెప్పలు మూసి తెరుచుచుండును.

అలా చేయడము వలన కళ్ళ మీద తేమను దిద్దుచూ, ఏదైనా ధూళిపడినా దానిని తీసివేయునట్లు రెప్పలు పని

చేయుచున్నవి. కన్నును శుభ్రముగా ఉంచుటకు ఏర్పరచిన గుడ్డలలాంటి పొరలే కనురెప్పలు. కానీ కన్నులో వేరు

దృశ్యములను ప్రవేశించకుండ చేయుటకు, రెప్పలను తయారు చేయలేదని తెలియుచున్నది. అందువలన ఈ పొడుపు

కథలో “ఇల్లుందిగానీ తలుపు లేదు” అన్నారు. ఇల్లు అనగా జీవుడు నివసించు శరీరమనీ, శరీరమునకు ద్వారములున్నా

తలుపులు లేవనీ ఈ మాటను అన్నారు. అంతేకాక శరీరములోని జీవుడు మాట్లాడువాడు కాదని తెలుపు నిమిత్తము,

"మనిషి ఉన్నాడు కానీ మాటలేదు" అన్నారు. ఈ కథకు జవాబుగా శరీరము, జీవుడు అని చెప్పవచ్చును.


భోగి అయినవాడు సంపదను గురించి ఆలోచిస్తాడు.

రోగి అయిన వాడు వైద్యాన్ని గురించి ఆలోచిస్తాడు. యోగి అయినవాడు తనను గురించి ఆలోచిస్తాడు.


***

3. ఒక రాజు ఎక్కుతుంటే, ఒక రాజు దిగుతుంటాడు ఎవరు?


ఈ పొడుపు కథలో ఇద్దరు రాజులున్నారు. ఎక్కడము దిగడము రెండు పనులున్నవి. ఎక్కడికి ఎక్కుతున్నారో

మనము ఆలోచించాలి. ఇద్దరూ రాజులే అయినందున, ఒకే హెూదా కల్గిన ఇద్దరు వేరువేరు వ్యక్తులని తెలియుచున్నది.

ఎక్కడమూ, దిగడమూ ఏమిటని చూస్తే, ఉదాహరణకు ఒక వ్యక్తి రాగిముద్ద తినునప్పుడు, ఒక ఉంట రాగిముద్దను

తీసుకొని కూరలో అద్దుకొని క్రిందినుండి ఎత్తి, నోటిలో పెట్టుకొంటున్నాడు. అలా నోటిలో పెట్టుకొన్న ముద్ద నోటిలో

ఉన్నట్లే, మరియొక రాగిముద్ద ముక్కను తీసుకొని తట్టలోని కూరలో అద్దుకొని ఎత్తి నోటిలో పెట్టుకుంటున్నాడు. అలా

నోటిలో పెట్టుకోకముందే, నోటిలోని ముద్దను మ్రింగివేసి తర్వాత దాని స్థానములో క్రిందినుండి తీసుకొన్న ముద్దను

పెట్టుకొనుచున్నాడు. దీనినంతటిని గమనిస్తే ఒక ముద్ద నోటిలోనికి ఎక్కుతుంటే, ఒక ముద్ద నోటిలోనుండి కడుపులోనికి

దిగుచున్నది. ఒక ముద్ద కడుపులోనికి దిగు చుంటే, ఒక ముద్ద నోటిలోనికి ఎక్కుచున్నది. నోరు ఉన్నత స్థానముకాగా,

క్రింద పళ్ళెములోని ముద్దలు నోటిలోనికి ఎక్కి, కడుపులోనికి దిగుచున్నవి. ఒక్కొక్క ముద్ద పైకి ఎక్కుచుండగా, ఒక్కొక్క

ముద్ద క్రిందికి దిగుచుండడము అందరికీ ప్రత్యక్షముగా తెలిసిన విషయమే. ఇదంతయు బయటికి కనిపించు ప్రపంచ

కార్యము. దీనిని ప్రపంచరీత్యా దిగేది, ఎక్కేది తినేముద్ద అని చెప్పవచ్చును.


ఇక ఆధ్యాత్మికరీత్యా ఆలోచిస్తే, నిత్యము ఆహారము కడుపులోనికి ఎక్కడమూ, దిగడమూ ఉన్నట్లు, ప్రతి

దినమూ ప్రతి మనిషికీ కర్మ వాని తలకు ఎక్కడమూ, దిగడమూ జరుగుచున్నది. మనిషి నిత్యమూ ప్రారబ్ధ కర్మను

అనుభవిస్తూ, దానిని తలనుండి దించుకొంటున్నాడు. తర్వాత వెంటనే జరిగిన పనిని నేనే చేశాను అని అనుకోవడము

వలన, ఆగామికర్మ అను క్రొత్త కర్మను తిరిగి తలకు ఎత్తుకోవడము జరుగుచుచున్నది. ఒకవైపు కర్మను అనుభవిస్తూ,

తల మీదవున్న కర్మను మనిషి దించుకొంటున్నాడు. అలా దించుకొన్న మనిషే, అహమును పొంది పనిని చేయడము

వలన వెంటనే క్రొత్త కర్మను సంపాదించుకొంటున్నాడు. ఆహారము ఒక ముద్ద దిగుతూవుంటే, ఒక ముద్ద నోటిలోనికి


ఎక్కుతున్నట్లు, కర్మ తలమీదిది ఒక ప్రక్క దిగుతూవుంటే, ఒక ప్రక్క ఎక్కుతూ ఉన్నదనీ చెప్పవచ్చును. ఈ పొడుపు

కథకు జవాబుగా ఆధ్యాత్మికరీత్యా, కర్మ అని చెప్పవచ్చును.


శరీరానికి వ్యాయాయము ఎలాంటిదో, జీవునికి జ్ఞానము అలాంటిది.

***

4. ఉద్యోగం సద్యోగం లేదు. ఊరంతా వ్యాపకమే, ఏది?


ఈ పొడుపు కథ విషయములో ప్రపంచరీత్యా, కొందరు ఒక సమాధానము చెప్పితే, మరికొందరు మరియొక

జవాబును చెప్పుచున్నారు. కొందరేమో వేశ్య అంటారు. కొందరేమో కాదు పడక అంటారు. ఎవరి లెక్క వారిది, నా

లెక్క ఆధ్యాత్మికము ప్రకారము, ఏమి జవాబు అని చూడడమే నా పని. అందువలన నా అర్థము ప్రకారము, ఉద్యోగము

సద్యోగము అను వాటిలో ముఖ్యముగా, యోగము అను మాట కనిపిస్తున్నది. 'ఉద్యోగము' అనగా గొప్ప యోగము అని

అనుకొందాము. గొప్ప యోగము దేనిని గురించి చేస్తాము? అసలుకు యోగము అనునది దేనికి పనికి వచ్చును? అని

చూస్తే, యోగము అనునది దేవునియందైక్యమగుటకు పనికి వచ్చునది. గొప్ప యోగమనునది కూడా అదే ఫలితమును

ఇచ్చునది అని తెలియుచున్నది. 'సద్యోగము' అనునది అంటే ఏమిటి అని కొందరు తెలియక అడుగవచ్చును.

ఉద్యోగము అంటే గొప్ప యోగము అను అర్థము నిచ్చినపుడు, సద్యోగము అనగా మంచియోగము అని అర్థము

నిచ్చుచున్నది. ఒకే విషయమునే పెద్దగా చెప్పవలసి వచ్చినపుడు గొప్ప అని ఒక పదములో, మంచి అని ఒక

పదములో చెప్పారనీ, వాస్తవానికి రెండూ ఒకే అర్థమునిచ్చు మాటలని చెప్పవచ్చును.


దేవునియందైక్యమై పోవుటకు, జన్మరాహిత్యము చేసుకొని తిరిగి పుట్టకుండ ఉండుటకు, ఎవరైనా యోగము

చేసి జ్ఞానాగ్ని వలన తమ కర్మను కాల్చివేసుకొని, కర్మశేషము లేకుండా పోయిన తర్వాత దేవుని యందైక్యమై

పోగలరు. ఏమి చేసినా, చివరకు యోగము చేయనిదే ఎవడూ మోక్షము పొందుటకు వీలులేదు. మోక్షము పొందినవాడు

తర్వాత ఏమగును అని ప్రశ్నించుకొని చూస్తే, దానికి చిన్న ఉదాహరణను చెప్పు కొందాము. ఒక భక్తుడు గుడి దగ్గరకు

పోయి తన ఉద్దేశ్యమును పూజా కార్యక్రమములో తెల్పుచుండెను. చివరకు తాను దేవునిలోనికి కలిసి పోయి దేవునిగా

మారిపోవలెనని తెలుపు ఉద్దేశ్యమును, పూజ చివరిలో కర్పూరమును వెలిగించి, గుడిలోని దేవునికి చూపించాడు.

అంతేకాక దీనిప్రకారమే నేను కూడా మారిపోవుదునని, వెలిగే కర్పూరము మీద చేయివుంచి ప్రమాణము చేశాడు.

కర్పూరము ప్రకారము మారిపోవడ మేమిటని ఎవరికైనా ప్రశ్నరాకుండా, ఆ విషయమును ముందే చెప్పుచున్నాను

వినండి. కర్పూరమును వెలిగించకముందు కర్పూరమునకు ఒక ఆకారము, రంగు, వాసన ఉండేవి. కర్పూరమును

వెలిగించిన తర్వాత అది ఒకటి రెండు నిమిషములలో కాలిపోయి ఏమి కనిపించకుండ పోవుచున్నది. రెండు

నిమిషముల ముందున్న కర్పూరము యొక్క రంగు, ఆకారము, వాసన, కాలిపోయిన తర్వాత ఏమీ లేకుండా పోయాయి.

ముందున్న కర్పూరము, కాలిపోయిన తర్వాత ఎక్కడికి పోయినదని చూస్తే, కర్పూరమునకు అగ్ని కలిసిన దానివలన,

అది మండిపోయి శూన్యములోనికి కలిసిపోయినది. మొదట పొగరూపముగానో, వాయు రూపముగానో మారిపోయిన

కర్పూరము, గుడియంతయూ వ్యాపించి, తర్వాత గుడి బయటకు కూడా వ్యాపించి, చివరకు బయటగల శూన్యములోనికి

అణువణువునా వ్యాపించి పోయినది.


యోగము చేయువాడు కూడా, కర్పూరము మారిపోయినట్లు చివరకు మారిపోయి, అణవు అణువున వ్యాపించిన

దేవునియందైక్యమై పోవును. అయితే ఈ పొడుపు కథలో "ఉద్యోగము సద్యోగము లేనివాడు ఊరంతా వ్యాపకమే" అని

అన్నారు కదా! అసలు యోగము చేయనివాడు, ఊరంతా వ్యాపించియున్నాడని చెప్పారు. ఇక్కడ మనము తూర్పువైపున

నుండి వచ్చాము. కానీ ఈ కథ పడమటివైపు నుండి చెప్పబడినదని తెలియుచున్నది. మనము ఒక మనిషి మోక్షము

పొందితే దేవునిగా మారి ఊరంతా, దేశమంతా వ్యాపించిపోవునని చెప్పుకొన్నాము. అయితే ముందే దేవునిగా

ఉన్నవాడు దేశమంతా వ్యాపించియుండును. ముందే దేవుడై యున్నవాడు యోగము చేయవలసిన పని లేదు కదా!

అందువలన ఈ కథలో ఉద్యోగము, సద్యోగము చేయనివాడు అని దేవున్ని ఉద్దేశించి చెప్పారు. దేవుడు ముందే

అంతటా వ్యాపించియున్నాడు కావున, ఆయనను ఊరంతా వ్యాపించి ఉన్నాడని చెప్పారు. యోగము చేయనివాడు

దేవుడై ఉన్నందున ఈ కథలో "ఉద్యోగము సద్యోగము లేనివాడు ఊరంతా వ్యాపకమే" అని దేవున్ని గురించి చెప్పారని

తెలియవలెను.


జ్ఞానము తెలియుటే కష్టము, ఆచరించుట సులభము.

***

5. అక్కడ మాట్లాడితే ఇక్కడ వినబడతా,

ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడతా ఏది?


నేటికాలములో అందరి చేతులలో సెల్ఫోన్లు ఉన్నాయి. వాటిలో అక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపించడమూ,

ఇక్కడ మాట్లాడితే ఎక్కడో వినిపించడము జరుగుచున్నది. అందువలన ఈ పొడుపు కథ ప్రశ్నకు, ప్రపంచ సంబంధమైన

జవాబు టెలిఫోన్ లేక సెల్ఫోన్ అని చెప్పవచ్చును. ఇప్పుడు మనకు కావలసినది ఆధ్యాత్మిక సంబంధమైన జవాబు.

అందువలన మనము శరీరములోనే జవాబు కొరకు వెదకవలసివుంటుంది. పూర్వము రాజులూ, రాజ్యపాలనా

ఉండెడిది. ఒక రాజ్యపు రాజు చెప్పిన విషయము ఇంకొక రాజుకు చేరవేసే దానికి వార్తాహరులు అనెడి వారుండెడివారు.

వారు, వార్తను ఈ రాజు ఎట్లు చెప్పియుంటే, అదే విధముగా, అదే హావ భావములతో ఆ రాజుకు చెప్పెడివారు. ఒక

వార్త ఎంత ఆక్రోశముతో ఉండునో, అంతే ఆక్రోశముతో వార్తాహరుడు చెప్పవలసియుండును. అలా చెప్పుట వలన

ఆ వార్తను పంపినవారు ఎంత ఆవేశముగా మాట్లాడి యుందురో, వార్తను వినిన వానికి తెలిసిపోవును. వార్తను

చెప్పినవాడు, విన్నవారికి కోపమును తెప్పించు విధముగా వార్తను చెప్పినప్పటికీ, ఆ వార్తను పంపినవారు అలా పంపారనీ,

వార్తను తెచ్చినవాడు కేవలము మధ్యవర్తి మాత్రమేనని తలచి, వార్తను తెచ్చినవానిని ఏమీ అనెడివారు కాదు. పూర్వము

సమాచారమును చేర వేయుటకు వార్తాహరుడే ఆధారము. ప్రతి రాజ్యము నుండి మరొక రాజ్యమునకు వార్తాహరులు

ఉండెడివారు.


మన శరీరమును కూడా రెండు రాజ్యములుగా విభజింపవచ్చును. శరీరమునకు బయటవున్న ఐదు

జ్ఞానేంద్రియములను బయటి రాజ్యముగా, లోపలనున్న బుద్ధి, జీవుడు, అహము, చిత్తము అను నాలుగు లోపలి రాజ్యముగా

ఉన్నాయి. బయటి రాజ్యమునకు, లోపలి రాజ్యమునకు మధ్యన సమాచారమును చేరవేయు వార్తాహరుడులాగా,

మనస్సు పని చేయుచున్నది. శరీరమునకు బయట అంటుకొనియున్న కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అను


ఐదు జ్ఞానేంద్రియములు తెలియజేయు విషయములను, మనస్సు తీసుకొని శరీరములోపలయున్న బుద్ధికి తెలియజేయును.

పూర్వము రాజుల కాలములో, ఉన్నదున్నట్లుగా వార్తాహరులు తెలియజేసినట్లు మనస్సు కూడా, బయటి జ్ఞానేంద్రియములు

తెలియజేసిన విషయమును ఎట్లున్న దానిని అట్లే బుద్ధికి తెలియజేయును. మనస్సు బయటి ఇంద్రియములకు, లోపల

బుద్ధికి మధ్యలో వార్తాహరుడిలాగా పనిని చేయడమేకాక, బయటి విషయమును లోపలికి తెలియజేయుటకు, ఒక్క

సెకను కాలము కూడా పూర్తి వినియోగించుకోదు. అర్థ సెకను కాలములో వార్తను చేరవేయు సామర్థ్యమును మనస్సు

కల్గియున్నది. వాస్తవానికి అర సెకను కాలము కూడా పట్టదని చెప్పవచ్చును. మనస్సు ద్వారా వచ్చిన సమాచారమును

బుద్ధి సేకరించి, ఆ విషయమును ప్రక్కనేయున్న జీవునికి తెలియజేయును. ఒక ప్రక్కయున్న జీవునికి తెలియజేయునప్పుడే,

మరొక ప్రక్కయున్న చిత్తమునకూ, అహమునకూ కూడా ఆ విషయము తెలిసిపోవును. బుద్ధి, చిత్తము, అహము

అందరూ జీవున్ని అంటుకొనియున్న దానివలన, బయటి సమాచారము అందరికీ ఒక్కమారుగా తెలిసిపోవుచున్నది.

జీవుడు గుణ భాగములో గుణముల మధ్యలో చిక్కుకొనియున్నందున ఆ సమాచారమునకు, ఆ సమయములోవున్న

కర్మను అనుసరించి, గుణ భాగములోనున్న పన్నెండు గుణములలో ఏదో ఒక గుణము బుద్ధికి వివరణ ఇచ్చును. బుద్ధి

చెప్పిన సమాచారమునుబట్టి జీవుడు సంతోషపడడమో లేక బాధపడడమో జరుగుచుండును. అప్పుడు ఆ సమయానికి

కర్మను అనుసరించి, జీవునికి తగులుకొన్న గుణము యొక్క వివరమును బుద్ధి ఆలోచిస్తుండగా, పైన కర్మచక్రములోని

అనుభవించవలసిన కర్మను అనుసరించి, చిత్తము నిర్ణయించును. బుద్ధి యోచించు గుణమును చిత్తము కర్మప్రకారము

నిర్ణయించగా, ఆ విషయమును బుద్ది అక్కడేనున్న మనస్సుకు తెలియ జేయగా, మనస్సు ఆ సమాచారమును శరీరమునకు

బయట అంటుకొని యున్న కర్మేంద్రియములకు తెలియజేయును. లోపలి బుద్ధినుండి వచ్చిన ఆజ్ఞ ప్రకారము బయట

శరీరము, కర్మేంద్రియములు పని చేయును. బయటి జ్ఞానేంద్రియముల సమాచారమును మనస్సు లోపల బుద్ధికి

తెలియ జేయడమూ, లోపలి బుద్ధి గుణములతో ఆలోచించి, చిత్తము బలపరచిన తన ఆలోచనను బుద్ధి, మనస్సుకు

తెలుపడమూ, మనస్సు, బుద్ధి తెల్పిన విషయమును బయటి కర్మేంద్రియములకు తెలుపడమూ వెంటవెంటనే

జరిగిపోవుచుండును. ఇదంతయు ఒకటి లేక రెండు సెకండ్లలో జరిగి పోవును. శరీరము మీద ఈగ వాలింది అని

చర్మము తెలియజేయగా ఆ విషయమును మనస్సు బుద్ధికి చెప్పగా, బుద్ధి గుణముల మధ్యలో ఆలోచించి, చిత్తము

బలపరచిన దానిని మనస్సుకు తెలియజేయగా, మనస్సు కర్మేంద్రియమైన చేతికి, విషయమును తెలుపగా, బుద్ధియొక్క

ఆజ్ఞను చేతులు సేకరించి వెంటనే ఈగను తోలడమో, చంపివేయడమో జరుగును. ముఖ్యముగా గమనిస్తే ఈగ

విషయము లోపలికి పోయి తిరిగి ఆజ్ఞగా రావడము ఒక్క సెకను కాలములోనే జరిగిపోయింది. మనస్సు లోపలి

సమాచారమును బయటికీ, బయటి సమాచారమును లోపలికి అందించుటకు చాలా వేగముగా పని చేయుచూ,

సెకను కాలములోనే జరిగిపోవునట్లు చేయును. అందువలన పైన చెప్పిన పొడుపు కథకు పూర్తి ఆధ్యాత్మిక జవాబుగా

మనస్సు ఉన్నదని చెప్పవచ్చును. అక్కడ మాట్లాడితే ఇక్కడ వినబడతా, ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడతా అనుమాట

ప్రపంచములో సెల్ఫోన్గా ఉన్నా, ఆధ్యాత్మికములో మనస్సుగా ఉన్నదని గట్టిగా చెప్పవచ్చును.


జ్ఞానాన్ని నిదానముగానైనా ఒకమారు అర్థము చేసుకో,

శాశ్వితముగా ఉంటుంది.

***


6. ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు, ఏవి?


“అడుగు తప్పితే అరవై ఆరు గుణములు” అను సామెతను వివరించి “సామెతల జ్ఞానము” అను మా గ్రంథములో

వ్రాయడము జరిగినది. అందువలన అదే విషయమునే ఇక్కడ జ్ఞాపకము చేయుచున్నాము తప్ప పెద్ద వివరముగా

వ్రాయడములేదు. అరవై ఆరు కొడవళ్ళు అని ఇక్కడ చెప్పారు. సామెతలో నేరుగా అరవై ఆరు గుణములు అని

చెప్పారు. గుణములు మనిషికి అరవై ఆరు ఎక్కడా లేవు. ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు అను రెండు

రకముల గుణములు కలవు. గుణములు ఆరు మరియు ఆరుగా ఉన్నవి. అంతేకానీ అరవై ఆరుగా లేవని చెప్పడ

మైనది. అంతేకాక, గుణములు శరీరమునకు పైనవున్న తలలో గుణ చక్రమందు గలవు. పైన ఉన్నందువలన

మరియు గుణములు కంటికి కనిపించనివిగా ఉన్నందువలన “ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు" అని చెప్పారు. అంతేగానీ

గుణములు ఆకాశములో లేవు. గుణములన్నీ మన తలలోనే ఉన్నవి. తలలో ఉన్న గుణములు ఆరు మరియు ఆరుగా

ఉన్నవి. 6+6=12. ప్రతి గుణ భాగములోను మొత్తము 12 గుణములున్నవి. మూడు గుణ భాగములలోనూ

6+6=12x3=36. మొత్తము ముప్పై ఆరు గుణములు మూడు భాగములలోనూ ఉన్నట్లు తెలియుచున్నవి. పూర్తి

సమాచారము కొరకు "సామెతల జ్ఞానము” అను గ్రంథమును చదవండి.


ఆహారమనే జీవితము తర్వాత, నీళ్ళనే మరణమును తాగక తప్పదు.

***

7. ఊరంతా తిరిగొచ్చి మూలన నిలబడ్డది, ఏది?


ఈ పొడుపు ప్రశ్నకు జవాబుగా, ప్రపంచరీత్యా చేతికర్ర అని చెప్పు చున్నారు. బహుశా అదే నిజమని

నమ్ముచున్నాము. ఇప్పుడు మనకు కావలసినది ఆధ్యాత్మికరీత్యా జవాబు. కావున ఆత్మ జ్ఞానదృష్టితో చూచినపుడు

కొంత సమాచారము ఈ విధముగా తెలియుచున్నది. ఊటలున్నది ఊరు, అనుమాట ప్రకారము చూస్తే మన శరీరమే

ఒక ఊరుగా ఉన్నది. ఎందుకనగా, మన శరీరములో ఏడు ఊటలుండుట వలన శరీరమును, ఊరు అని చెప్పవచ్చును.

మన శరీరములో ఏడు ముఖ్యమైన గ్రంథులు కలవు. నోటిలో ఇరు దౌడల క్రిందగల లాలాజలగ్రంథుల నుండి

లాలాజలము ఊరడము అందరికీ తెలిసిన విషయమే. శరీరము ఊరుగా ఉండగా, అందులో జీవుడు మరియు

జీవునితో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము, అహము మొదలగు 24 చైతన్య భాగములు నివసిస్తున్నవి. మొత్తము 25

మందికి నివాసముగాయున్న శరీరములో కొందరు (కొన్ని భాగములు) ముఖ్యమైన పాత్రను పోషించుచున్నారు. అందులో

ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని చేయుచు బాగా గుర్తింపుపొందినవి గలవు. అటువంటి వాటిలో మనస్సు, బుద్ధి, అహము

అను మూడు, ముఖ్యమైన పాత్రలను పోషించుచున్నవి. ఈ మూడు, మూడు యోగములకు కారణమైనవి. ఈ

మూడు, జీవున్ని యోగిగా మార్చి దేవునివైపు అయినా పంపగలవు, లేకపోతే ప్రపంచమువైపు చూపును కల్గించి రోగిగా,

భోగిగానైనా మార్చగలవు. మనస్సు వలన బ్రహ్మయోగిగా, అహము వలన కర్మయోగిగా, బుద్ధి వలన భక్తియోగిగా

మనిషి మారగలడు. లేకపోతే మనస్సు, బుద్ధి, అహము వలన పూర్తిగా ప్రపంచ మాయలోనైనా మునిగిపోగలడు.

మనస్సు మనిషికి అనుకూలిస్తే బ్రహ్మయోగికాగలడు. అనుకూలించకపోతే కర్మనుబట్టి రోగిగానో, భోగిగానో ఉండిపోవును.

శరీరములో మనస్సు పాత్ర ఎటువంటిదో పరిశీలించి చూస్తాము.


మనస్సు శరీరమంతా వ్యాపించిన గాలిలాంటిది. మనస్సు శరీర మంతా వ్యాపించియుండి, శరీరములోని

బయటి విషయములను లోపలి బుద్ధికీ, లోపలి విషయములను బయటి జ్ఞానేంద్రియులకూ చేరవేయు

మధ్యవర్తిలాగయున్నది. మనస్సుకు మూడు అవస్థలు గలవు. ఒకటి మెలుకువ, రెండు నిద్ర, మూడు స్వప్నము.

ముఖ్యముగా మెలుకువలో మనస్సు శరీరమంతా వ్యాపించి, బాహ్యరంగ అవయవములకు, అంతరంగ అవయవములకు

వార్తలను చేరవేయుచుండును. అంతేకాక జరిగిన విషయములను మననము (జ్ఞప్తి) చేయుచుండును. జరగబోవు

విషయము లను గురించి కూడా జ్ఞాపకము చేయుచుండును. ఇట్లు శరీరములో, తీరిక సమయములో గతమును,

భవిష్యత్తును మననము చేయుచూ, మిగతా సమయములలో లోపలి విషయములు బయటికీ, బయటి విషయములు

లోపలికీ పంపుచుండును. ఈ విధముగా మెలుకువలో శరీరమంతా వ్యాపించిన మనస్సు, నిద్ర సమయములో

శరీరములోనున్న దంతా ముకుళించుకొని, సూది మొనకంటే చిన్న బిందువుగా మారిపోయి, బ్రహ్మనాడిలో ఏడవకేంద్రమున

అణిగిపోవుచున్నది. అప్పుడు ఏ విషయమునూ మనస్సు, జీవునికి తెలుపదు. కావున నిద్రలో బయటి విషయములు

ఏమీ తెలియవు. మనస్సు బ్రహ్మనాడిలో పైన ఒకచోట నిలిచిపోవుట వలన, “ఊరంతా తిరిగొచ్చి మూలననిలపడ్డది”

అని మనస్సును గురించి చెప్పారు. శరీరము జీవునికేకాక మనస్సుకు కూడా ఊరులాంటిదే. కావున మనస్సును

ఊరంతా తిరిగినది అని అన్నారు. బ్రహ్మనాడిలో పైన ఏడవ కేంద్రమున, ఎవరికీ తెలియని జాగాలో మనస్సు ఒక

బిందువులాగ మారి అణిగిపోవుచున్నది. కావున మూలన పడ్డది అని మనస్సును గురించి చెప్పినట్లు తెలియుచున్నది.

ఒక రహస్యమును చాటుగా బయటి భావమును అడ్డము పెట్టి చెప్పి, అది ఏది అని అడగడము వలన పొడుపు

కథలోని రహస్యము బయటపడగలదు. సామెతలూ, పొడుపు కథలూ అన్నదమ్ములు లాగా ఉండి, బ్రహ్మవిద్యలోని

రహస్యములను ప్రపంచ విషయములతో కప్పి చెప్పుచున్నవి. పైకి చూస్తే ప్రపంచ విషయము అర్థముకాగలదు.

దానినే లోతుగా చూస్తే బ్రహ్మజ్ఞానము అర్థము కాగలదు.


అజ్ఞానాన్ని లేకుండా చేసుకోవడమే, జ్ఞానమును సంపాదించుకోవడము.

***

8. ఎక్కడికెళ్ళినా వెంటపడేది, ఏది?


ఈ పొడుపు ప్రశ్నకు ప్రపంచరీత్యా కొందరు నీడ అని జవాబును వ్రాసియుంచారు. వెలుతురు ఉన్నప్పుడు

నీడ ఉంటుంది గానీ, వెలుగు లేనప్పుడు నీడ ఉండుటకు అవకాశమే ఉండదు కదా! అందువలన ఈ పొడుపు ప్రశ్నకు,

నీడ అను జవాబు పూర్తి సరియైనది కాదనియే చెప్పవచ్చును. ప్రపంచ సంబంధమైన జవాబు ఏదైనా ఫరవాలేదు గానీ,

జ్ఞానసంబంధ జవాబు మాత్రము పూర్తి సరియైనదై ఉండవలెను. మనిషి పుట్టి పెరుగుతూ వస్తున్నాడు.

పెరుగుచూ, చిన్న వయస్సునుండి తన ధ్యాసనంతటిని బయటి ప్రపంచములోనే లగ్నము చేసి, ప్రపంచ విద్యలను

నేర్వడములోనే కాలము గడుపుచున్నాడు. దానివలన అతనికి ప్రపంచ విషయములే తెలియుచున్నవి. కానీ తన

విషయము తనకు ఏమాత్రము తెలియకుండా పోయినది. చిన్నప్పటినుండి బయటి ధ్యాస కల్గిన మనిషి, తనను గూర్చి

పూర్తిగా మరచిపోయాడు. అందువలన తాను ఎవరైనదీ, తాను ఎక్కడి నుండి వచ్చినదీ, తిరిగి ఎక్కడికి పోవునదీ

తెలియకుండా పోయింది. తనను గురించి, శరీరమే తాను అనుకోవడము ప్రతి మనిషికీ తెలుసు. వాస్తవానికి ఎవడూ

శరీరము కాడు. శరీరము వేరు, తాను వేరని ఎవరికీ తెలియకుండా పోయినది.


ఏ మనిషయినా తనను గూర్చి తాను తెలుసుకోవాలంటే, దేవుడు గీతలో తెలియజేసిన జ్ఞానమును తెలియాలి.


అలా భగవద్గీతలోని జ్ఞానమును తెలియగలిగితే, తాను శరీరములో ఒక చిన్న భాగమైన జీవాత్మననీ, తాను శరీరమును

కాననీ, తనవలె ఎన్నో భాగములు కలిసి ఒక శరీరముగా ఉన్నదనీ తెలియగలుగును. అప్పుడు తనను నడిపించుచున్న

ఒక ఆత్మ శరీరమునకంతటికీ అధిపతిగాయున్నదనీ, ఆత్మ తనతో పాటు జన్మ జన్మకూ విడువకుండా వస్తున్నదనీ

తెలియును. పుట్టినప్పుడు, జీవాత్మను ఆత్మయే పాత శరీరమునుండి తీసుకొనివచ్చి క్రొత్త శరీరములోనికి చేర్చుచున్నదనీ,

శరీరములో ఆత్మయే అధిపతిగావుండి, శరీర భాగములన్నింటికీ శక్తినిచ్చి కదిలించి నడిపించుచున్నదనీ, చివరిలో

తర్వాత జన్మకు తీసుకొని పోవునది ఆత్మయేనని తెలియును. బ్రహ్మవిద్యను నేర్వడము వలన జీవునికి సంబంధించిన

విషయమంతా తెలియుచున్నది. ఆత్మ, జీవాత్మల సంబంధమును గురించి, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమను

అధ్యాయమున 16వ శ్లోకమందు ఇట్లు కలదు.


ద్వావిమౌ పురుషౌ లోకేక్షరశ్చాక్షర ఏవచ |

క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ॥


భావము :- లోకములోని పురుషులలో రెండు రకములుగలరు. ఒకరు క్షర పురుషుడనీ, రెండవ వాడు అక్షర

పురుషుడనీ చెప్పబడుచున్నారు. క్షర పురుషుడైన జీవాత్మ, సర్వ జీవరాసులందూ గలడు. అక్షర పురుషుడైన ఆత్మ,

జీవాత్మతోపాటు కూటస్థునిగా ఉన్నాడు. కూటస్థుడు అనగా కూడుకొని యుండువాడు లేక కూడియుండు వాడు అని

చెప్పవచ్చును. పురుషులుగా యున్నవారు జీవాత్మ, ఆత్మయే. ఆత్మ జీవునితో పాటు కలిసియుండడము వలన, జీవాత్మ

ఏ జన్మకు పోతే ఆత్మకూడా జీవునితోపాటు పోవును. చావులోనూ, పుట్టుకలోనూ, ఆత్మ జీవున్ని వదలకయుండుట

వలన, జీవుడు ఎక్కడికి వెళ్ళినా వెంటపడేది ఆత్మయేనని చెప్పవచ్చును. శరీరములో జీవునితో పాటు 24 భాగములుండినా,

మరణములో అన్నీ శరీరముతో పాటే చనిపోవును. మరణములో మిగిలినది జీవాత్మ, ఆత్మ మాత్రమే. శరీరములో

భాగము కాకుండ వున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల సముదాయములోని కర్మ, గుణములు జీవుని వెంట ఆత్మ

తీసుకొని వచ్చుచున్నది. అట్లే గతజన్మలో చేసుకొన్న కర్మలను కూడా ఆత్మ తీసుకొని వచ్చి మరుజన్మలో ఉంచుచున్నది.

ఇట్లు ఆత్మ, జీవాత్మను వదలకుండా జీవుని వెంట పడుచున్నది.


జ్ఞానాన్ని తెలుసుకొంటే అదే యోగమవుతుంది. ప్రత్యేకించి చేయునది (కర్మ) యోగముకాదు.

***

9. ఎందరు ఎక్కినా విరగదు ఏది?


ఎందరు ఎక్కినా విరగనిది అరుగు అని కొందరు, భూమి అని కొందరు బాహ్య ప్రపంచ దృష్టితో చెప్పారు.

మనము చెప్పుకోవలసినది ఆధ్యాత్మిక దృష్టితో, అందువలన ఆధ్యాత్మికమంతా శరీరములోనే వెదకాలి. కావున ఎందరు

ఎక్కినా విరగనిది శరీరములో ఏముందో గమనిస్తాము. ఎందరు అనగా ఎవరు? ఎక్కినా అనగా దేనిమీదికి? విరగదు

అనగా ఏది విరగదు? ఇలా ప్రశ్నించుకొని చూస్తే కొంతవరకు జవాబు అర్థమగుచున్నది. మన శరీరములో మూడు

లక్షల యాభైవేల (3,50,000) నాడులు కలవు. అందులో ముఖ్యమైనవి 72,000. వాటిలో ఇంకా ముఖ్యమైనవి పది

(10) మాత్రము గలవు. వాటిలో అతి ముఖ్యమైనవి మూడు మాత్రము గలవు. అవియే సూర్యనాడి, చంద్రనాడి,

బ్రహ్మనాడి అని పిలువబడుచున్నవి. ఈ మూడు నాడులలో ముఖ్యమైనది బ్రహ్మనాడి. బ్రహ్మనాడి అనగా పెద్దనాడి


అని అర్ధము. ఈ పెద్దనాడి, శరీరము మధ్యలోనుండి తలవరకు వ్యాపించియున్నది. తలవరకున్న బ్రహ్మనాడి, ఏడు

భాగములుగా విభజింపబడియున్నది. పైన తలలో ఏడవ భాగమున్నది. ఆ ఏడవ భాగములో బ్రహ్మ నాడికి నాలుగు

చక్రములు అమర్చబడియున్నవి. నాలుగు చక్రముల చిత్రమును పటములో చూడవచ్చును. అందులో క్రిందిది గుణచక్రము

కాగా, దానికంటే పైన ఉన్నది కర్మచక్రము.


నాల్గు చక్రముల సముదాయము చిత్రమును 13 పేజీ లో చూడండి . 


ఈ కర్మచక్రములోనే మనిషి చేసుకొన్న పాపపుణ్యములు చేరి పోవుచున్నవి. కర్మచక్రము మొత్తము పన్నెండు

భాగములుగా విభజింప బడియున్నది. విభజింపబడిన పన్నెండు భాగములలో, పన్నెండు రకాల కర్మలు చేరిపోవుచున్నవి.

ఒక్కొక్క మనిషి కర్మలు, ఒక్కొక్క రకముగా ఉన్నవి. అందరి శరీరములో కర్మచక్రమున్నా, ఒకని కర్మచక్రములో పది

జన్మలకు సరిపడు కర్మ చేరియుండగా, కొందరి కర్మచక్రములో ఇంకా ఎక్కువ కలదు. మరియొకని శరీరములోని

కర్మచక్రమందు వేయి జన్మలకు సరిపడు కర్మయుండగా, ఇంకొకని కర్మచక్రములో పదివేల జన్మలకు సరిపడు కర్మ

నిలువయున్నది. దైవదూషణ చేసిన వానికి, రెండు యుగములు అనుభవించుటకు సరిపడు కర్మ చేరియున్నది.

తర్వాత పేజీ పటములో కర్మచక్రము యొక్క ఆకారమును చూడవచ్చును.


కర్మచక్రములో ఎంత కర్మ చేరినా దానియందు ఇమిడిపోవు చుండును. కర్మచక్రములో జాగా తక్కువ వచ్చు


ప్రసక్తే లేదు. కర్మచక్రములో కర్మచేరుకొలది, కర్మచక్రమునకు బరువు ఎక్కువగుననుట కూడా లేదు. కర్మ చక్రము

ఎన్ని వేల జన్మల కర్మలనైనా, లక్షల జన్మల కర్మలనైనా మోయ గల స్థోమత కల్గియుండును. ఎన్ని రకముల పాపములుగానీ,

ఎన్ని రకముల పుణ్యములుగానీ, హత్యా పాపములుగానీ, ఆరాధనల పుణ్యములుగానీ ఎన్ని ఎక్కినా, కర్మచక్రమునకు

బరువు కాదు. అలాగే కర్మచక్రము విరిగి పోదు. అందువలన ఎందరు ఎక్కినా విరగనిదని కర్మచక్రమునకు పేరు

వచ్చినది.


ధైర్యవంతుడు నిజమైన తన జ్ఞానమును చెప్పగలడు. అధైర్యవంతుడు పుస్తకాలలోని జ్ఞానము చెప్పగలడు.

***

10. ఏటిలోని ఎద్దు ఎన్ని పగ్గాలు వేసినా రాదు, ఏది?


ఇంతకుముందు చెప్పుకొన్న నాలుగుచక్రముల చిత్రపటమును చూచారు కదా! ఆ నాలుగు చక్రములలో క్రింది

చక్రమును గుణచక్రము అని అంటాము. ఒక విధముగా ఈ చక్రమును మాయచక్రము అని కూడా అనవచ్చును.

గుణచక్రము మూడు భాగములుగా ఉన్నది. ఒక్కొక్క భాగములో ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు,

మొత్తము పన్నెండు గుణములు కలవు. ఒక భాగములో 12 గుణములుండగా, ఒక్కొక్క గుణము 9 భాగములుగా

చీలిపోయి వున్నది. ఆ విధముగా 12 గుణముల చీలికలు (9x12=108) మొత్తము 108గా ఉన్నవి. ఒక భాగము

108 చీలికలుగానున్న గుణములు, 108 రకముల కర్మలను తెచ్చి పెట్టుచున్నవి. ఒక భాగములోనున్న 108 గుణముల

సముదాయము మాయ అని పిలువబడుచున్నది. మాయ, గుణముల రూపములో ఉన్నదని భగవద్గీతలో విజ్ఞానయోగమందు

14వ శ్లోకమున చెప్పబడినది. కృష్ణుడు చెప్పిన శ్లోకములో "గుణమయీ మమ మాయా దురత్యయా” అని చెప్పబడినది.

ఆ మాటనుబట్టి, దేవుడు తయారు చేసియుంచిన మాయ, గుణచక్రములో గుణముల రూపములో ఉన్నదని తెలియుచున్నది.

“మమ మాయా దురత్యయా” అను మాటనుబట్టి, నా మాయను దాటి ఎవడూ పోలేడు, నా మాయను జయించి పోవుట

దుస్సాధ్యము అని కూడా చెప్పబడినది. మాయను నేను జయించగలను అని అనుకొన్నవాడు, అందరికంటే ముందు

మాయ చేతిలో ఓడిపోగలడు. శరీరములోని జీవుడు, గుణచక్రములో గుణముల మధ్యలో చిక్కుకొన్నాడు కావున,

మనిషి గుణములను (మాయను) జయించలేడు. ఏటిలోని ఎద్దువలె, మాయ తలలోని గుణచక్రములో తిష్టవేసుకొని

కూర్చున్నది. దానిని జీవుడు జయించాలంటే, ఏటిలోని ఎద్దుకొరకు ఏటిలోనికి దిగితే, ఏటి ప్రవాహము నకు దిగినవాడు

కొట్టుకొని పోయినట్లు, మాయ గుణములను జయించ పోయి ఇంకా మాయయందు జీవుడు కూరుకొని పోవుచున్నాడు.

ప్రయత్నము చేయుకొద్ది మాయ చేతిలో మనిషే చిక్కుకొంటున్నాడు. అందువలన గీతలో కూడా కృష్ణుడు 'దురత్యయా'

అని చెప్పాడు. దాని అర్ధము దుస్సాధ్యము లేక సాధ్యము కాదు అని అర్థము. అందువలన ఏటిలోని ఎద్దుగా మాయను

వర్ణించి చెప్పారు. మనిషి ఎన్ని ప్రయత్నములు చేసినా అనుమాటకు, ఎన్ని పగ్గాలు వేసినా అని చెప్పారు. తలలోని

మాయను జయించుట చాలా కష్టమైన పనియని తెలుపు నిమిత్తము ఈ పొడుపు కథ చెప్పడమైనది.


ఉత్తమ గ్రంథము యోగియొక్క శక్తితో వ్రాయబడుతుంది.


11. ఒసే నీవు వండాలేదు, వార్చాలేదు, ముక్కుకెందుకు మసయ్యింది?


నీవు పనే చేయలేదు కదా! నీ చేతికి మన్నెందుకు అయిందని అడిగినట్లుంది కదా! వండి వార్చి వంటరూములో

పని చేసియుంటే ముక్కుకో, చేతికో మసి అయిందంటే ఒక అర్థముంటుంది. కానీ ఏ పనినీ చేయకుండా మన్ను

పూసుకొన్నా, ఏ వంటా చేయకుండా మసి పూసుకొన్నా దానికి అర్థమే లేదని చెప్పవచ్చును. ఉదయము లేచింది

మొదలు మనిషి ఎన్నో పనులు చేస్తున్నాడు. మనిషి చేయు పనులలో మంచి పనులూ ఉన్నాయి, చెడు పనులూ

ఉన్నాయి. భయంకరమైన పాపము వచ్చు పనులూ ఉన్నాయి, గొప్ప పుణ్యము వచ్చు పనులూ ఉన్నాయి. మనుషులు

చేయు మంచి, చెడు పనులు ప్రత్యక్షముగా కనిపించునవే అయినందున, వీడు పాపము చేశాడు, వీడు పుణ్యము

చేశాడు అని చూచినవారు చెప్పుచుందురు. కనిపించేది సత్యమా? మనిషి మంచి, చెడు పనులు చేయుచున్నాడా అని

ఆలోచించి చూచితే, కనిపించే మనిషి చేయు పనులను జీవుడు చేసినట్లేనా? అని ప్రశ్నించుకొంటే, దానిని కొంత

వివరముగా చెప్పుకోవలసిన అవసరమున్నది, అదేమనగా!


మనిషి అనగా కొన్ని భాగముల కలయిక అని చెప్పవచ్చును. మనిషి అంటే జీవుడు ఒక్కడే కాదు కదా!

జీవునిలాంటి భాగములు మరికొన్ని కలిసి మనిషి అవుతున్నాడు. అలాంటపుడు, ఒక మనిషి ఒక పనిని చేశాడు అంటే,

ఆ మనిషిలోని జీవుడు ఒక్కడే ఆ పనికి బాధ్యుడు కాడు. అందువలన మనిషి చేసినంత మాత్రమున జీవుడు చేసినట్లు

కాదు. ఇక్కడ కొందరికి జీవుడు చేయకపోతే ఎవడు చేసినట్లు అని ప్రశ్నరాగలదు. దానికి మా జవాబు ఏమనగా! ఒక

మనిషి అనగా 25 భాగముల కూడిక అయినప్పుడు, ఒక చెడు పనినిగానీ, మంచి పనినిగానీ మనిషి చేసినప్పుడు,

అందులో ఎవరి పాత్ర ఎంత అని విశ్లేషించి చూడవలసియుంటుంది. ఒక శరీరములో ఆత్మలు రెండు ఉన్నాయి.

ఒకటి జీవాత్మకాగా, రెండవది ఆత్మ. మిగతా శరీరమంతయూ స్థూల, సూక్ష్మ అని రెండు భాగములుగాయున్నది.

స్థూల, సూక్ష్మ అను రెండు శరీర భాగములు, జీవుడు మినహా మొత్తము 24 కలవు. స్థూల శరీరము ఐదు

కర్మేంద్రియములుగా, ఐదు జ్ఞానేంద్రియములుగా ఉన్నది. మిగతా పదునాలుగులో ఐదు వాయువులు కాగా, ఐదు

జ్ఞానేంద్రియశక్తులు కాగా, మిగతా నాలుగు మనస్సు, బుద్ధి, చిత్తము, అహముగాయున్నవి.


శరీరములోని ఆత్మ, మొత్తము శరీర భాగములన్నిటికీ చైతన్య శక్తినిచ్చి, కదిలించి పనిని చేయిస్తున్నది. శరీరములో

ఏ పనినిగానీ ఆత్మ, తన ఇష్టప్రకారము చేయించదు. జీవుని యొక్క ప్రారబ్ధ కర్మప్రకారము ఫలానా పని చేయాలని

నిర్ణయమైనపుడు, ఆ కర్మ ప్రకారము ఆత్మ, శరీరము చేత పనిని చేయించి, ఆ కార్యము జరుగునట్లు చేయుచున్నది.

ఒక కార్యమునకు కర్మ కారణముకాగా, ఆచరణ అవయవములదికాగా, శక్తినిచ్చి ఆత్మ శరీర భాగములచేత చేయిస్తున్నది.

శరీరములోని జీవుడు మాత్రము జరుగుచున్న కార్యములో ఎక్కడా పాల్గొనడము లేదు. జరుగుచున్న సినిమాను ఒక

ప్రేక్షకుడు చూచి, అందులోని పాత్రలకు, నటనలకు స్పందించి ఆడుచున్న ఆటను బట్టి సంతోషపడడమో లేక బాధపడడమో

జరుగుచున్నది. కొన్ని బాధాకరమైన సన్నివేశములు వచ్చినపుడు, చూచే ప్రేక్షకుడు కూడా కొంత బాధపడడము

జరుగుచున్నది. ఒక సినిమాను చూస్తున్న వారు సన్నివేశమునుబట్టి ఏడ్వడము, నవ్వడము జరుగుచున్న విషయము

అందరికీ తెలుసు. జరుగుచున్న సన్నివేశములలో లగ్నమైపోయి, మేము ప్రేక్షకులము అనుమాటను మరచిపోయి

నవ్వువారు, ఏడ్చువారు ఉన్నటు జీవుడు కూడా ఆత్మ చేయిస్తుండగా, అవయవములు చేయుచుండగా, జరుగుచున్న

కార్యములను చూచి, తాను వేరుగానున్న జీవున్ని అని మరచిపోయి, తానే ఆ పని చేయుచున్నట్లు అనుకోవడము

జరుగుచున్నది.


చలన చిత్రములో ఆడేవారు ఆడుచూ, పాడేవారు పాడుచూ, ఏడ్చే వారు ఏడ్చుచూవుంటే, ఊరకనే చూచువాడు

చూడక, తాను కూడా వారితో పాటు నవ్వుచూ ఏడ్చుచూవుంటే "వండాలేదు, వార్చాలేదు, ముక్కుకు మసి

అయ్యిందన్నట్లున్నది”. జీవుడు శరీరములో జరుగు కార్యములను తానే చేయునట్లు భ్రమించుచున్నాడు. కావున

కర్మప్రకారము జరిగిన కార్యములోని మంచి, చెడు ఫలితములైన పుణ్యపాపములను, తన నెత్తిన వేసుకొంటున్నాడు.

ఒక సినిమాను చూస్తున్నప్పుడు, మనిషి పూర్తిగా లగ్నమైపోయి నవ్వినా, ఏడ్చినా ఆ సినిమా అయిపోవువరకే. సినిమా

మూడు గంటలు సాగితే అంతవరకూ దానిలో లగ్నమైనవాడు సినిమా అయిపోయిన తర్వాత దానినుండి తేరుకొని అది

వేరు, నేను వేరు అని అనుకోవడము జరుగు చున్నది. అయితే మనిషి, జీవితము అను సినిమాను చూస్తూ తనమీద

తనకు ధ్యాసలేకుండా జీవితములో లగ్నమైపోయాడు. ప్రక్కవాడు పిలిచినా వినే స్థితిలోగానీ, పలికే స్థితిలోగానీ లేడు.

అటువంటి వానిని చూచిన కొందరు జ్ఞానులు, పొడుపు కథను చెప్పి ప్రశ్నించాలనుకొన్నారు. ఆ ప్రయత్నములోనే

“నీవు వండాలేదు, వార్చాలేదు ముక్కుకెందుకు మసయ్యింది” అని అడిగారు. తన స్థితిని తాను మరచిపోయి, తనను

మరోస్థితిలో ఊహించుకొనుట వలన తనకు సంబంధములేని పనులను చేశానని ఒప్పుకోవడము వలన, చేయని

తప్పులకు జీవుడు బాధ్యుడవు చున్నాడని తెలియజేయు ఉద్దేశ్యము ఈ పొడుపు కథలో కనిపిస్తున్నది. ఎంతో గొప్ప

జ్ఞానమును కల్గించి, మనిషిని జాగ్రత్తపరచు పొడుపు కథను తయారు చేసినందుకు మన పెద్దలకు రుణపడియున్నాము.


రచయితలు రెండు రకములు గలరు. ఇతరులు చెప్పినది

చెప్పువాడు ఒకడు. ఎవరూ చెప్పనిది చెప్పువాడు మరొకడు.

***

12. ఏ పాటు తప్పినా ఈ పాటు తప్పదు


మనిషి పుట్టింది మొదలు ఎన్నో పాట్లు పడుతున్నాడు. అందులో అప్పుడప్పుడు పొరపాటు కూడా పడుచుండును.

గ్రహపాటులేని మనిషి, పొరపాటు పడని మనిషి భూమిమీద లేడను నానుడికలదు. ఈ పొడుపు కథ ప్రశ్నకు జవాబు

ప్రపంచరీత్యా పొరపాటు అయినా, ఆత్మజ్ఞానమును అనుసరించి మరొక జవాబు ఉండి తీరవలెను. అది ఏమని

చూడగా మనిషి గత జన్మలో చేసుకొన్న కర్మప్రకారము, ప్రస్తుత జన్మలోనికి వస్తున్నాడు. ప్రస్తుత జన్మలో చేసుకొన్న

కర్మప్రకారము, రాబోవు జన్మకు పోవుచున్నాడు. ఒక జన్మలో చనిపోయిన తర్వాత మరియొక జన్మను పొందవలసియున్నది.

మనిషి జన్మించాలంటే, దానికంటే ముందు క్షణములో మరణించి ఉండాలి. ఒక జన్మలో మరణించాలంటే దానికంటే

ముందు జన్మించి యుండాలి. జన్మలేనిది మరణములేదు, మరణములేనిది జన్మలేదు. జనన మరణములు రెండూ

అవినాభావ సంబంధమైనవని తెలియుచున్నది. అందువలన జనన మరణములను గురించి తెలిసినవారు ఎవరూ

చింతించరు. ఇదే విషయమునే భగవద్గీతలో, సాంఖ్యయోగమను అధ్యాయమున 27వ శ్లోకమందు భగవంతుడు

చెప్పాడు.


శ్లో॥ జాతస్య హి ధ్రువో మృత్యుర్ధువం జన్మ మృతస్యచ I

తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి ॥

భావము :- పుట్టుట చచ్చుట కొరకే, చచ్చుట తిరిగి పుట్టుటకే. కనుక అనివార్యమైన జనన మరణముల గురించి నీవు


చింతించుట తగదు. మనిషి సంపాదించుకొన్న కర్మనుబట్టి, మనిషి అనుభవించు సుఖదుఃఖములు ఉంటాయి. అయితే

చావు పుట్టుకలు రెండూ కర్మ అనుభవమునకు అతీత మైనవని చెప్పవచ్చును. మనిషి చేసుకొన్న కర్మను, జ్ఞానాగ్ని చేత

కాల్చి వేసుకోవచ్చును. ఏ కర్మనైనా తన జ్ఞానము చేత అనుభవించకుండా తప్పించుకోవచ్చును. జనన మరణములు

కర్మలోనివి కాదు. కావున వాటిని ఎంతటి జ్ఞాని అయినా లేకుండా చేసుకొనుటకు వీలులేదు. ఎంతటి జ్ఞాని అయినా

మరణమును తప్పించుకొనుటకు అవకాశము లేదు. దేవుడే వచ్చి పుట్టినా, ఆయన కూడా మరణించవలసిందే.

ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును, అదేమనగా! క్రైస్తవ ప్రవక్త అయిన ఏసు ప్రభువు మరణించలేదు కదా!

మరణమును జయించి మూడు రోజులకు తిరిగి లేచి వచ్చాడు కదా! అని అడుగవచ్చును. దానికి మా జవాబు

ఏమనగా! దేవుడు ఏర్పరచిన చట్టమును దేవుడు కూడా అతిక్రమించడు. బాగా ఆలోచిస్తే బ్రహ్మవిద్యా శాస్త్రము

ప్రకారము, పుట్టినవాడు ఎవడైనా చావక తప్పదు అనునది శాసనము. ఏసు ప్రభువు మొదట తాత్కాలిక మరణమును

పొంది, మూడవరోజు లేచివచ్చిన మాట నిజమే. కానీ ఆయన అప్పుడు మరణమును పొందలేదు. తాత్కాలిక

మరణమును పొందాడని గుర్తుంచుకోవలెను. అలా తాత్కాలిక మరణమును పొందినవాడు, ఉదయము చనిపోయి

సాయంకాలము బ్రతికిన సంఘటనలు కొన్ని, రెండు రోజులకు బ్రతికినవి కొన్ని, వారము, పది రోజులకు బ్రతికినవి

కొన్ని చరిత్రలో గలవు. గతవారము తమిళనాడు రాష్ట్రములో కరూరు జిల్లా, కట్టలై గ్రామానికి చెందిన ముత్తుస్వామి

(50), తేదీ: 09.07.2012 సోమవారము చనిపోయి మంగళవారము చితిమీద పెట్టిన తర్వాత లేచిన సంఘటన కూడా

కలదు. దానిని మరణము అనరు. తాత్కాలిక మరణము అంటాము. మనిషికి ఉన్న మూడు రకముల మరణములలో

తాత్కాలిక మరణము ఒకటికాగా, అకాల మరణము మరొకటి కలదు. కాలమరణము మూడవది. మరణము పొందిన

తర్వాత ఎవరూ బ్రతుకుటకు వీలులేదు. ఏసుప్రభువు ఒకమారు తాత్కాలిక మరణము పొంది మూడురోజులకు లేచి,

తర్వాత కొన్ని సంవత్సరములకు చనిపోయాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కేవలము 40 రోజులు మాత్రమే శిశ్యులు

ఆయనను చూచారు. తర్వాత ఆయన అక్కడి వారికి ఎవరికీ కనిపించలేదు. అందువలన ఆయన ఎప్పుడు చనిపోయినదీ,

ఎక్కడ చనిపోయినదీ క్రైస్తవులైన వారికి చాలామందికి తెలియదు.


భూమిమీద ఎంతటి జ్ఞానమును సంపాదించుకొన్నా, యోగిగా మారి కర్మను పూర్తిగా లేకుండా చేసుకొనినా,

తిరిగి పుట్టని మోక్షమును పొందుటకు అర్హుడైనా, అతను మరణించిన తర్వాతనే అవన్నియు జరిగి తిరిగి పుట్టకుండపోవును.

అందువలన మరణమును ఎవరూ తప్పించు కొనుటకు వీలులేదు. మరణముగానీ, పుట్టుకగానీ కర్మబద్ధము కాదు.

అందువలన ఏ జీవుడైనా మరణమును అనుభవించడముగానీ, పుట్టుకను అనుభవించడముగానీ జరుగదు. మనిషి

మరణము పొందినా, అందులో నున్న అనుభవమును జీవుడు అనుభవించడు. అలాగే మనిషి పుట్టినప్పుడు కూడా

పుట్టుక స్థితిలోని అనుభూతిని కూడా జీవుడు అనుభవించడు. అందువలన చావుపుట్టుకలు కర్మకు అతీతమైనవని

చెప్పుచున్నాము. అంతేకాక పుట్టినవాడు తన జ్ఞానముతో ఎంతటి కర్మనుండైనా తప్పించు కొనుటకు వీలుంది. కానీ

మరణము నుండి తప్పించుకొనుటకు వీలులేదు. కావున ఈ పొడుపు కథలో “ ఏ పాటు తప్పినా ఈ పాటు తప్పదు”

అని వ్రాశారు. ఇది మరణ రహస్యమును తెలియజేయు పొడుపు కథగా ఉన్నదని తెలియుచున్నది.


నిన్ను నీవు మోసగించుకోలేవు. అలాగే నీ ఆత్మను మోసము

చేయలేవు. పరమాత్మను ఎవరూ మోసము చేయలేరు.

***


13. ఏడాకుల మర్రిచెట్టు ఎక్కరాదు, దిగరాదు. ఎక్కడుంది?


మర్రిచెట్టు అనగా పెద్ద మొదలుగలిగి అనేక ఊడలుగలిగిన బలమైన వృక్షమని చెప్పకనే అర్థమగును. వృక్షము

బలమైనదైనపుడు ఆకులు ఏడే ఉండడము విశేషము. మర్రిచెట్టు బలమైనదిగా ఉండును, కనుక దానిని ఎక్కవచ్చును,

దిగవచ్చును. అయితే విచిత్రముగా ఈ పొడుపు కథలో ఎక్కరాదు, దిగరాదు అన్నారు. ఆకులు ఏడు ఉండి, ఎక్కరానిది,

దిగరానిది అయినప్పుడు, అది మర్రి వృక్షమేనా అని అనుమానము రాక తప్పదు. ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము

మర్రిచెట్టు ఏదో, ఎక్కడున్నదో దాని వివరమేమిటో పరిశీలిద్దాము. మనిషి శరీరమునకు, మర్రివృక్షమునకు ఎన్నో

పోలికలున్నట్లు అనేక కథలలో చెప్పుకోగా విన్నాము. వారు చెప్పిన పోలికలు వాస్తవమో కాదో, కానీ నాకు తెలిసినంతవరకు

చెట్టులోవున్న జీవునికి, మన శరీరములో ఉన్న జీవునికి కర్మలో తేడా ఉండవచ్చును. ఆత్మలో ఏమీ తేడా ఉండదు. మన

శరీరములోని ఆత్మకు గుర్తుగా వెంట్రుకలున్నాయి. వెంట్రుకలకు, ఆత్మ అను శబ్ధమునకు దగ్గరగానున్న శబ్ధముతో

మరియొక పేరు కలదు. అలాగే చెట్టులోని ఆత్మకు గుర్తుగా ఆకులున్నవి. చెట్టు సజీవమైనదే, మనిషి సజీవమైనవాడే.

చెట్టులోని జీవునికి, మనిషిలోని జీవునికి కర్మలో ఎంతో తేడాయుండుట వలన చెట్టుయొక్క శరీర నిర్మాణమే వేరుగా

ఉన్నది. చెట్టు, మనిషికి ఎంతో భిన్నముగా ఉండును. మనిషి శరీరములో నాడీవ్యవస్థ ఉన్నది. చెట్టులో మాత్రము

నాడీవ్యవస్థ లేదు. కానీ ఆత్మ ఉన్న విధానమంతా వేరుగా ఉండును. ఇప్పుడు మనము చెప్పుకోవలసింది మనిషిలోని

నాడీవ్యవస్థను గురించి. నాడీ వ్యవస్థ ద్వారానే ఆత్మ శరీరమంతా ప్రాకియున్నది. ఆత్మ ఎక్కడ నుండి ఎక్కడి వరకు

ప్రాకియుంది అంటే! మనిషి తల మధ్య భాగమునుండి ప్రారంభమై, శరీరము బయటి అంచులోనున్న చర్మము వరకు

ప్రాకియున్నది, అట్లే చర్మము మీద గల వెంట్రుకల వరకు ప్రాకియున్నది. అలా ప్రాకుటకు ఆత్మకు, తలనుండి

మొదలైన నాడులే ఆధారము.


తలనుండి గుదస్థానము వరకు గల వెన్నెముకలో వెన్నుపాము అను పెద్ద నరము కలదు. ఆ నరము, తల

మధ్యనుండి ప్రారంభమై వెన్నుపాము చివరివరకూ వ్యాపించియున్నది. తలనుండి గుదస్థానము వరకూ వ్యాపించిన

పెద్దనరమునే బ్రహ్మనాడియని, సుషుమ్ననాడియని అనుచుందురు. బ్రహ్మనాడి మొత్తము ఏడు భాగములుగా విభజింపబడి

యున్నది. ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క నాడీకేంద్రము ఏర్పడినది. బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములు కలవు. పైన

ఏడవ కేంద్రములో ఆత్మ నివాసమైయుండి, అచటినుండి తనశక్తిని ఏడు నాడీకేంద్రముల ద్వారా శరీరమంతా

ప్రసరింపజేయుచున్నది. నాడీకేంద్రము ద్వారా బయలుదేరిన నరములు, శరీరమంతా వ్యాపించియుండుట వలన

ఆత్మశక్తి శరీరమంతా ప్రాకుచున్నది. పైన తలయందు గల ఏడవ కేంద్రమున ఆత్మతోపాటు జీవాత్మ కూడా నివసిస్తున్నాడు.

మన తలలోని మెదడు భాగము పెద్ద నాడీకేంద్రముగా ఉన్నది. ఏడవ కేంద్రములోనున్న జీవుడు వికలాంగుడుగా

ఉండుట వలన, జీవునికి ఏ శక్తీ లేకుండా ఉండుట వలన, జీవుడు బ్రహ్మనాడి నుండి క్రిందికి రావడముగానీ, పైకి

పోవడముగానీ చేయడము లేదు. జీవుడు ఎటూ కదలకుండా గుణచక్రములో గుణముల మధ్యలో చిక్కుకొని పోయాడు.

ఆత్మ కూడా బ్రహ్మనాడి ఏడవకేంద్రములో నివాసము చేయుచు, తనశక్తిని శరీరమంతా వ్యాపింప చేసినది. ఇదే

విషయమునే భగవద్గీతలో క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 34వ శ్లోకమున చెప్పారు.


శ్లో ॥ యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోకమిమం రవిః

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! ॥


భావము :- ఎట్లు సూర్యుడొకడు ఈ లోకమెల్ల ప్రకాశింపజేయగలుగు చున్నాడో, అట్లే ఆత్మ తన శక్తినంతటిని శరీరమంతా

వ్యాపింపజేయగలిగి శరీరమంతటికీ చైతన్యము కలుగజేయుచున్నాడు.


ఆత్మ శరీరములో ఏడవ స్థానమును కేంద్రముగా చేసుకొని జీవున్ని అంటిపెట్టుకొనియుంటూ, తనశక్తిని బ్రహ్మనాడి

ద్వారా, బ్రహ్మనాడిలోని నాడీ కేంద్రముల ద్వారా శరీరమంతా ప్రసరింపజేసి, శరీరమునంతటినీ పనిచేయునట్లు

చేయుచున్నది. ఆత్మశక్తి ఏడు కేంద్రముల ద్వారా శరీరమంతా ప్రాకుచుండుట వలన, మానవ శరీరమును ఏడాకుల

మర్రి చెట్టు అని పొడుపు కథయందు చెప్పారు. ఆత్మగానీ, జీవాత్మగానీ ఏడవ స్థానములోనే ఉంటూ, క్రిందికి రావడము

గానీ, పైకి పోవడముగానీ చేయడము లేదు. అందువలన మర్రిచెట్టును ఎక్కరాదు దిగరాదు అని పొడుపు కథలో

చెప్పారు. ఈ పొడుపు కథ ప్రశ్నకు జవాబు దొరికితే ఆత్మ ఒక్కచోట వుండి శరీరమంతటా తనశక్తిని

ప్రసరింపజేయుచున్నదనీ, ఆత్మ బ్రహ్మనాడిలో పైకి పోవడముగానీ, క్రిందికి దిగడముగానీ చేయడములేదనీ తెలిసి

పోవుచున్నది. ఈ విధముగా చిన్న వాక్యముల పొడుపు కథలో పెద్ద జ్ఞానమును వెదకునట్లు, మన పూర్వీకులైన

జ్ఞానులు పొడుపు కథలను సృష్టించారు.


ముందు దేహి భక్తి ఉండాలి. తర్వాత దేశభక్తి ఉండాలి.

దేహి భక్తి లేకుండా దేశభక్తి అనువాడు తలలేని మొండెము లాంటివాడు.

***

14. ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు, ఎవరు వారు?


ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము పుట్ట అనినా, పెట్టె అనినా మనము నివసించు శరీరమేనని గుర్తుంచుకోవలెను.

ఈ పొడుపుకథలో పెట్టెలో ఇద్దరు దొంగలు అన్నారు. దొంగలు ఎప్పుడూ కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా,

తమ వృత్తి అయిన దొంగతనమును చేయుచుందురు. వారు దొరికినా దొంగలే, దొరకకపోయినా దొంగలే. ఇప్పుడు

పెట్టె అని చెప్పారు కదా! పెట్టెలో ధనముంటుంది, కానీ దొంగలెందుకుంటారని ప్రశ్న రావచ్చును. మేమన్నీ సక్రమముగా

చెప్పితే మీరు వెదకవలసిన పనిలేదుగా! అందువలన మేము దారి మళ్ళించి చెప్పి, మిమ్ములను శోధించునట్లు

చేయుచున్నామని కథను చెప్పిన వారంటున్నారు. ఇప్పుడు మనము, ఇద్దరు దొంగల విషయమును గమనిద్దాము.

కళింగ దేశములో దేశమంతటికీ 'తెలియను' అను పేరుగల పెద్ద దొంగ ఉండెను. ఆ దేశ రాజు, మంత్రి, సైనికులు

ఎంతగానో ఆ దొంగను బంధించాలని ప్రయత్నము చేశారు. కానీ ఆ దొంగ ఎవరో, ఎట్లుంటాడో ఎవరికీ తెలియలేదు.

దొంగపేరే "తెలియను”. తెలియను, అనే దొంగ దేశమంతటికీ ఒకడే ఉన్నా, ఆ ఒక్కన్నీ ఎవరూ పట్టుకోలేక పోయారు.

అంతలోనే, 'తెలియను' కాకుండా మరి ఇద్దరు దొంగలు ఆ దేశములో దొంగతనము చేయుచున్నట్లు కళింగ రాజుకు,

ప్రజలకు తెలిసినది. చివరకు ఆ దేశ గూఢచారులు, 'తెలియను' అను గజదొంగ కుమారులైన చిక్కడు, దొరకడు అను

వారు క్రొత్తగా దేశములో దొంగతనమును చేయుచున్నట్లు తెలుసుకోగలిగారు. చిక్కడు దొరకడు అనువారు ఇద్దరూ,

తెలియను అను గజదొంగ కుమారులనుట వాస్తవమే. తెలియను అను దొంగ తన కుమారులకు దొంగతనపు వృత్తిని

అప్పచెప్పి, తాను విశ్రాంతి తీసుకొన్నాడు.



చిక్కడు, దొరకడు ఇద్దరూ కవలపిల్లలైన దానివలన ఇద్దరూ ఒకే పోలికతోయుందురు. అన్న అయిన ‘చిక్కడు’

చాలా తెలివైనవాడుకాగా, 'దొరకడు' అనువాడు కొంత తెలివి తక్కువవాడైనా, తానే తన అన్నకంటే తెలివైనవాడినని

అనుకొనుచుండును. కళింగ రాజ్యములోని ఇద్దరు దొంగలనుగానీ, వారిలో ఒక్క దొంగనుగానీ పట్టుకొని రావాలని

తన సైన్యమునకు రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ ప్రకారము ఆ దేశ సైనికులంతా దేశమంతా గాలించుచుండిరి.

అయితే, చిక్కడు తన తెలివిని వినియోగించి, తన తమ్ముడైన 'దొరకడు'ను తీసుకొని, నేరుగా రాజు ఇంటికి పోయి

తాము ఒకరు జ్యోతిష్యులమని, ఒకరు వైద్యులమని పరిచయము చేసుకొన్నారు. అప్పుడు రాజు వారి అవసరము

తమకున్నదని వారిరువురిని తమవద్దనే ఉండునట్లు చెప్పి, తన కూతురుకు ఒకరు వైద్యము చేయమని చిక్కడుకు చెప్పి,

తమకు అప్పుడప్పుడు మంచి రోజులను గురించి చెప్పుటకు దొరకడును నియమించుకొన్నాడు. ఈ విధముగా చిక్కడు

మిడతం బొట్లు అను పేరుతో, దొరకడు చుక్కం బొట్లు అను పేరుతో రాజువద్ద అంతఃపురం లోనే నిలచిపోయారు.

దేశ రాజధాని అయిన కళింగ పట్నములో చిక్కడు దొరకడు అను ఇద్దరు దొంగలు మారుపేర్లు కలిగియుండగా,

కళింగ రాజ్యపు సైనికులు, ఇద్దరు దొంగల కొరకు దేశమంతా గాలించుచుండిరి.


ఈ విధముగా ఎంతకాలము ఇద్దరు దొంగలను వెదకినా, ఎక్కడా వారు దొరకలేదు. దొంగల విషయములో

రాజుకు ఎక్కువ పట్టుదల పెరిగినది. ఎలాగైనా వారిని పట్టుకోవాలనుకొన్నాడు. చివరికి రాజు ఒక ప్రకటన చేశాడు.

ఎవరైనా దొంగలలో ఒకరిని పట్టిస్తే తన రాజ్యములో సగము రాజ్యము అతనికి ఇచ్చి, తన ఇద్దరు కూతుళ్ళులో ఒకరిని

అతనికిచ్చి వివాహము చేస్తాననీ, ఒకవేళ ఇద్దరినీ పట్టిస్తే, తన ఇద్దరి బిడ్డలను ఇచ్చి వివాహము చేసి, తన రాజ్యమును

అంతటిని అతనికే ఇస్తానని ప్రకటించాడు. ఆ ప్రకటనను వినిన కళింగ దేశములోని ప్రజలూ, ఇతర దేశముల యువ

రాజులూ, అందరూ దొంగలను పట్టుకోవాలనీ ప్రయత్నముల మీద ప్రయత్నములు చేశారు. అయినా వారు మామూలు

దొంగలా దొరికే దానికి! ఒకడు చిక్కడు, మరొకడు దొరకడు. ఇద్దరూ పేర్లు మార్చుకొని ఏకంగా రాజుగారి ఇంటిలోనే

తిష్టవేసుకొనియున్నారు. దొంగలు దొరక లేదని రాజుగారు తనవద్దయున్న మిడతం బొట్లు, చుక్కంబొట్లను పిలిచి

దొంగల విషయమంతా చెప్పి, తన ప్రకటనను కూడా చెప్పాడు. అదంతా వినిన వారు, ఆ ఇద్దరి దొంగలను మేము

పట్టిస్తే ప్రకటన ప్రకారము పారితోషికముగా రాజ్యమును ఇస్తారా అని అడిగారు. అప్పుడు రాజుగారు నాకు వయస్సు

అయిపోతూవుంది. నాకు కుమారులు లేరు. మీరు దొంగలను పట్టుకొంటే నా మాటను తప్పనిసరిగా నెరవేర్చుకుంటాను.

నేను ఆడిన మాటను తప్పను అన్నాడు. అపుడు మిడతంబొట్లు (చిక్కడు) ఇలా అడిగాడు. “ఒకవేళ దొంగలే రాజ్యము

కొరకు వచ్చి, వారే లొంగిపోతే వారిని వారే పట్టించినట్లగును కదా! అప్పుడు మీరు ఏమి చేస్తారు.” అన్నాడు. దానికి

రాజుగారు, “ఇంతకాలము మాకుగానీ, ఇతరులకుగానీ దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టిన ఆ దొంగలు ఎంతో

తెలివైనవారు. అంతటి తెలివైనవారు నా రాజ్యమును తెలివిగా పాలించగలరు. అటువంటపుడు వారికే ఈ రాజ్యమును

ఇస్తాను. నా ప్రజలను సక్రమముగా పాలించువారు దొరకడమే నాకు ముఖ్యము. దొంగలు తెలివైనవారు కావున

వారిని పట్టుకొనువారు కూడా తెలివైన వారే ఉంటారను ఉద్దేశ్యముతోనే నేను ఆ ప్రకటనను చేశాను. ఒకవేళ దొంగలే

లొంగిపోతే వారే తెలివైనవారు. కావున వారికి నా రాజ్యమును, నా కూతుళ్ళను ఇస్తాను. వారు ధనము లేనివారైన

దానివలన దొంగలుగా ఉన్నారు. ధనమున్నవారైతే, వారే నిజమైన రాజులుగా ఉంటారు. నాకు కావలసినది తెలివైనవారు.

వారు ఎవరైనా ఫరవాలేదు”. అని అన్నాడు.


అప్పుడు చుక్కంబొట్లు (దొరకడు) ఇట్లన్నాడు. "నేను నా అన్న ఇద్దరము, తెలివిగా తప్పించుకొను దొంగలను

పట్టుకొని మేము కూడా తెలివైనవారమని నిరూపించుకొంటాము”. అని అన్నాడు. మిడతంబొట్లు (చిక్కడు), తమ్ముని

మాటలను సమర్థించి రేపే మా ప్రయత్నమును మొదలు పెట్టుతామని చెప్పారు. రాజుగారు వారి మాటలకు

సంతోషించాడు. గతములో రాజమందిరములోనే దొంగతనము చేస్తామని చిక్కడు దొరకడు ప్రకటించియుండిరి.

ముఖ్యముగా ఆ పనిని చేయుటకే, ఇద్దరు దొంగలూ రాజమందిరములోనే నివాసము ఏర్పరచు కొన్నారు. ముందు

చేసిన తమ ప్రకటనను నెరవేర్చుకోవాలనుకొన్న చిక్కడు దొరకడు, రాజుగారితో దొంగలను పట్టుకొంటామని చెప్పిన

మరుసటి దినమే, రాజమందిరములో, రాజకుటుంబములోని పూర్వపు నగలన్నిటిని దొపిడీ చేసి, గతములో మేము

చెప్పినట్లు రాజమందిరమును దోచుకొన్నాము అని ఒక కాగితముమీద వ్రాసి, అక్కడ పెట్టి పోవడము జరిగినది.

తెల్లవారిన తర్వాత దొపిడీ జరిగిన విషయమూ, దొంగలు కాగితము మీద వ్రాసిపెట్టి పోయిన విషయమూ రాజుగారికి

తెలిసినది. ఎంతో మంది సాయుధులైన సైనికులు కాపలా కాస్తుండగా, ఇద్దరు దొంగలు సంవత్సరము ముందే చెప్పి

చేయడము రాజుకు ఆశ్చర్యమువేసినది. తమ సొమ్ము పోయినదని అనుకోకుండా, దొంగలు చాలా తెలివైనవారని

రాజు వారినే పొగడుచుండెను. రాజుతో కలిసి రాత్రి ప్రొద్దు పోయేంతవరకు జూదమాడిన మిడతంబొట్లు, చుక్కంబొట్లు

ఇద్దరూ రాజుగారి వద్దకు వచ్చి, దొంగతనము జరిగిందటగా, అని ఏమీ తెలియనట్లు అడిగారు. రాత్రి రెండు గంటల

వరకు మనము మేల్కొని ఉన్నాము కదా! మనకు తెలియకుండా, మనమున్న చోటికి ప్రక్క గదిలోనే దొపిడీ చేయడము

విచిత్రము అని రాజుగారన్నారు.


మేము ఈ రోజునుండి దొంగల కోసము ప్రయత్నిస్తామని నిన్ననే చెప్పాము కదా! అని మిడతంబొట్లు రాజుగారితో

చెప్పి, ఇద్దరు అన్నదమ్ములు బయలుదేరిపోయారు. రెండు రోజుల తర్వాత రాజుగారికి "మేము ఇద్దరు దొంగలను ఒక

పెట్టెలో బంధించాము, ప్రజల సమక్షములో రాజసభలో వారిని అందరికీ చూపుతాము, రేపే అక్కడికి వస్తున్నాము” అని

ఇద్దరు అన్నదమ్ములు, ఒక మనిషితో వార్తను పంపించారు. రాజుగారికి ఆ మాటవిన్న తర్వాత చాలా ఆశ్చర్యమైనది.

ఇంతకాలము ఎంతో ప్రయత్నము చేసినా, తమకు ఏమాత్రము ఆచూకీ కూడా తెలియని దొంగలు, మిడతం బొట్లకు

(చిక్కడు), చుక్కంబొట్లకు (దొరకడు) పట్టుబడడము విచిత్రముగా, ఆశ్చర్యముగా తోచినది. దాదాపు ఆరు నెలల

కాలము తమవద్దవున్నవారు దొంగలకంటే మించిన తెలివైనవారని తాను గ్రహించనందుకు, రాజు తాను తెలివితక్కువవాడిని

అనుకొన్నాడు. రెండవరోజు మిడతంబొట్లు, చుక్కంబొట్లు నిలువెత్తుగల పెద్ద పెట్టెను, ఒక బండిలో తీసుకొని వచ్చి

రాజుగారి సభలో దించారు. దొంగలను పట్టి తెచ్చారని తెలియగా, దొంగలను చూడాలను కోర్కెతో చాలామంది

అక్కడికి వచ్చారు. అప్పుడు రాజుగారి సమక్షములో ఇద్దరు అన్నదమ్ములు ఇలా అన్నారు.” ఇంతకాలము మీకు

దొరకకుండా మిమ్ములను ముప్పుతిప్పలు పెట్టిన దొంగలను మేము పట్టుకొన్నాము. ఒక సంవత్సరము క్రితమే

రాజమందిరములో దొపిడీ చేస్తామని చెప్పి, మూడు రోజుల క్రితమే దొపిడీ చేసారు. మేము ఎవరికీ దొరకమని చెప్పి

దొరకని వీరి అసలు పేర్లు చిక్కడు దొరకడు. స్వయముగా రాజుగారే వీరి మేధస్సుకు మెచ్చుకొన్నాడు. అటువంటి

దొంగల గొప్పతనమును గుర్తించి రాజుగారు దొంగలను సహితము గొప్పగ చెప్పు స్వభావము గలవారు అయినందున,

ఇక రాజుగారి రాజ్యాములో దొంగ తనము చేయకూడదనుకొన్నారు. అటువంటి సమయములో మాకు దొరికారు.

వీరిని మీకు చూపిన తర్వాత రాజమందిరములో వీరు ఎలా దొపిడీ చేసినది చెప్పగలరు. ఇపుడు తలుపులు తీసుకొని

బయటికి వస్తారు చూడండి.




ఈ విధముగా చెప్పిన ఇద్దరూ నిలువెత్తు పెట్టె వెనుకకు పోయి అటు ప్రక్కయున్న తలుపులు తెరచి, పెట్టె

లోపలికి పోయి, ముందర తలుపులు తెరచుకొని బయటికి వచ్చారు. అందరూ ముందర తలుపుల వైపు చూస్తుండగా

మిడతంబొట్లు, చుక్కంబొట్లు బయటికి రావడము చూచి ఇదేమి వీరు వచ్చారు. లోపల దొంగలేమైనారు అనుకోవడము

చూచిన చిక్కడు, దొరకడు, "చూచారా! మీకు తెలుసు మేము మిడతంబొట్లు, చుక్కం బొట్లని. అయితే మీకు తెలియదు

మేము ఇద్దరమూ దొంగలమని, రెండు నిమిషముల ముందు కూడా మిమ్ములను మోసము చేసి, దొంగలను పట్టుకున్నామని

చెప్పాము, మీరు నమ్మినారు. మా నాన్నగారి పేరు 'తెలియను'. మా ఇద్దరి పేర్లు చిక్కడు దొరకడు. రాజుగారి

మంచితనమే మమ్ములను మార్చి, మేము తెలియబడునట్లు చేసినది. రాజు మాకు వ్యతిరేఖముగా మాట్లాడియుంటే

మేము మీ ముందరకు వచ్చేవారము కాదు. మేము అనుకుంటే మీ ముందే కనిపించకుండా పోగలము. మీరు

మమ్ములను మంచిగ ఆదరించి అభిమానముగా చూడకపోతే, తిరిగి ఈ పెట్టెలోనికి పోయి కనిపించము. ఏమంటారు

చెప్పండి”, అని వారు అడుగగా అక్కడున్న వారంతా, వారిని దొంగలుగా చూడక, మీరు మాకు మిడతంబొట్లు,

చుక్కబొట్లుయేగానీ దొంగలుకాదని గట్టిగా అరిచిరి. రాజు కూడా మిడతంబొట్లని పేరుపెట్టి పిలుస్తూ వచ్చి వారిని

గౌరవముగా పలకరించెను. అప్పటినుండి వారికి మిడతంబొట్లు, చుక్కంబొట్లు అను పేర్లు పోయి, అందరూ వారిని

పెట్టెలో దొంగలని ముద్దుగా పిలుచుకొనెడి వారు.


మన శరీరములోని తలకాయ ఒక పెట్టెగా ఉన్నది. అందులో క్షరుడు, అక్షరుడు అను రెండు ఆత్మలు

దొంగలవలె కనిపించకుండా ఉన్నారు. ఆ ఇరువురి విలువ, జ్ఞానము తెలిసిన వారికి మాత్రమే అర్థము కాగలదు.

మనిషి జ్ఞానముమీద ఆసక్తి కల్గియున్నపుడే ఆత్మ, జీవాత్మలు తెలియగలరు. శ్రద్ధలేనివారు ఎంత ప్రయత్నించిననూ

వీరిని గుర్తించలేరు. ముగ్గురు పురుషులలో, ఇద్దరు పురుషులు శరీరమందు ఉన్నారు. ఆ ఇద్దరు పురుషుల గుర్తింపుగా

పెట్టెలోని దొంగలను చెప్పారు. ఏ విధముగా ఇద్దరు దొంగలకు వ్యతిరేఖ భావముతో వారిని పట్టుకోవాలనుకొన్నంత

కాలము వారు ఎవరికీ దొరకలేదు, వారు గొప్పవారను భావము రాజులోనూ, ప్రజలలోనూ వచ్చినది కాబట్టి, ఇద్దరు

దొంగలూ సులభముగా దొరికి పోయారు, రాజు తన రాజ్యమును, బిడ్డలను వారికే ఇస్తానని అనుకొన్న తర్వాత వీరు

ఫలానా దొంగలని దొరికారు. అదే విధముగా, మనము మనకున్నది సర్వము క్షరాక్షరులకే సమర్పణ అనుకొన్నప్పుడే

రెండు ఆత్మలు మనకు తెలియబడును. కళింగ రాజ్యములోనే ఉంటూ, చివరకు రాజమందిరములోనే ఉంటూ ఇద్దరూ

ఎలా తెలియబడలేదో, అట్లే మన శరీరములోనే ఉంటూ, చివరకు శరీరములో రాజమందిరములాంటి తలలోనే ఉంటూ

క్షరపురుషుడు ఎవడో, అక్షర పురుషుడు ఎవడో తెలియకుండా ఉన్నారు. కథలో, పెట్టెలోనుండి బయటికి వచ్చి

తెలియబడిన దానివలన, వారిని "పెట్టెలో ఇద్దరు దొంగలు ఎవరు” అని పొడుపు కథలో ప్రశ్నించవలసి వచ్చినది. ఈ

పొడుపు ప్రశ్నకు ఆత్మ, జీవాత్మ అని జవాబును చెప్పవచ్చును. పెద్దలు చెప్పిన పొడుపు కథ చిన్నదే అయినా, దాని

జవాబులోని జ్ఞాన వివరము చాలా గొప్పగాయున్నది.


నీ వెనక నిన్ను చూస్తున్న భూతములు గలవు. జ్ఞానులకు వ్యతిరేఖముగా మాట్లాడితే వారు నిన్ను వదలరు.

***


15. రంగడు, పింగడు, రోట్లోవేస్తే మెదగరు. ఎవరు?


మన శరీరములో రెండు ఆత్మలున్నట్లే, పాపము, పుణ్యము అను రెండు, కార్యమునకు కారణమైనవి గలవు.

పాపపుణ్యముల వలనే మనము సుఖదుఃఖములను అనుభవిస్తున్నాము. ప్రతి పనికీ కారణమైన కర్మను విడదీసి

చూస్తే, పాపపుణ్యములుగా తెలియుచున్నవి. పాపపుణ్యములనే పొడుపు కథలో రంగడు, పింగడు అను జోడు వ్యక్తులుగా

చెప్పబడినారు. మనిషి కొంత జ్ఞానమును తెలుసుకొన్న తరువాత, మన శరీరములోని కర్మలు తెలియబడుతాయి.

కర్మలను జ్ఞానశక్తి వలన లేకుండా చేసుకొన్న రోజున మనిషికి జన్మరాహిత్యము కలిగి, ముక్తి పొందినవాడై దేవుని

యందైక్యమై పోవును. జ్ఞానము వలన కర్మను పోగొట్టుకోవాలని భగవద్గీతలో భగవంతుడు వివరముగా చెప్పియున్నా,

యోగము చేయుట వలన కల్గిన జ్ఞానాగ్ని వలన కర్మలు కాలిపోవునని గీతలో చెప్పియున్నా, భగవంతుని మాటలను

అర్థము చేసుకోలేని మనుషులు, భగవంతుని మాటలను వదిలి భూమిమీద బోధకులు చెప్పిన మాటలను విని, అదియే

సరియైన జ్ఞానమని భ్రమించి దేవుడు చెప్పిన యోగములను వదలి ధ్యానములను చేయు చుందురు. అయితే ధ్యానముల

వలన కర్మలు పోవని చాలామందికి తెలియదు.


రోలును అందరూ చూచియే ఉందురు. రోటిలో వేసి రోకలితో దంచుట వలన, రోటిలోని వస్తువు మెత్తగా

మెరిగి పోవును. రోలులో వేసిన వస్తువును ఒకమారు వేటువేసి దంచుదురు, తర్వాత రెండవమారు ఆ తర్వాత

మూడవమారు ఇట్లు నాలుగు, ఐదు, ఆరు అని వరుసగా యాభై లేక అరవైమార్లు రోకలితో వేటువేసి దంచితే, రోటిలోని

వస్తువులు మెదుగును. అలాగే ధ్యానము అను రోటిలో, మంత్రము అను దానిని, ధ్యాస అను రోకలితో ఒకటి, రెండు,

మూడు, నాలుగు అని వరుసగా వందమార్లుగానో లేక అంతకంటే ఎక్కువగానో జపించడమును ధ్యానము అంటాము.

మంత్రమునుగానీ, ఆకారమునుగానీ, గుర్తునుగానీ, శ్వాసనుగానీ దేనిమీద ధ్యాస పెట్టుకొనినా అదే ధ్యానమగును.

ధ్యానము ఎంతకాలము చేసినా కర్మలు పోవు. ధ్యానము చేయుట వలన మనిషి తపస్వికాగలడు. దానివలన అతనికి

పుణ్యము లభించును. పుణ్యమును, పాపమును పొగొట్టుటకని ధ్యానము చేసి పుణ్యమును తెచ్చుకోవడము, ఒక

విధముగా పొరపాటు పనియగును. మరొక విధముగా తెలివి తక్కువ పనిగానో, అజ్ఞానపు పనిగానో లెక్కించబడును.

ధ్యానము వలన పాపపుణ్యములు నశించిపోవు అని తెలుపు నిమిత్తము, ఈ పొడుపుకథలో రంగడు, పింగడు రోట్లో

వేస్తే మెదగరు అని చెప్పి, మనకు తెలియునట్లు, మనము వాటిని గురించి ఆలోచించునట్లు, ఎవరు అని ప్రశ్నించారు.

రోలు ఏదో, రంగడు ఎవరో, పింగడు ఎవరో ఆలోచన చేయడము వలన తెలిసిపోయినది.


నీ దేహములో నీవెవరో తెలియనిదే, దేశములో నీ పాత్రను గురించి ఆలోచించవద్దు.

***

16. రెండు కొడతాయి, ఒకటి పుడతాది. కొట్టేది ఏది? పుట్టేది ఏది?


మనిషి జీవితములో పుట్టినప్పటి నుండి రెండు ఉన్నాయి. ఒకటి క్రొత్తగా పుట్టవలసియున్నది. మనిషిలో

క్రొత్తగా పుట్టవలసినది, మనిషి క్రొత్తగా నేర్వవలసినది దైవజ్ఞానమునే. మనిషి జీవితములో పుట్టుకనుండి ఉంటున్నవి

రెండు కలవు. అవియే మనిషిని జీవితములో అనేక అనుభవములకు గురి చేయుచున్నవి. మనిషి ఎప్పటికీ ప్రశాంతత

లేకుండా, మంచి చెడు అనుభవములలో ఎప్పటికీ కొట్టబడుచున్నాడు. మనిషిని ఏదో ఒక రకముగా వేధించునవి


పాప పుణ్యములు. అందువలన ఈ పొడుపు కథలో రెండు కొడతాయి అని పాప పుణ్యములను గురించి చెప్పారు.

పాప పుణ్యముల బాధలను తప్పించుకోవాలనుకొను మనిషి, దైవజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించును. జ్ఞానము

వలననే కొట్టే కర్మ పోతుంది అని తెలిసిన తర్వాత, మనిషి జ్ఞానమును తెలియును. అందువలన రెండు కొడితే, ఒకటి

పుట్టుతుందని జ్ఞానమును ఉద్దేశించి చెప్పారు.



దేశము కోసము చస్తే దేవుని దగ్గరకు పోతావని చెప్పువారు కలరు.

చివరకు దయ్యము దగ్గరకు కూడా పోలేవు.

***

లింగం

17. వానలో కొండంతా తడిసినా లింగం తడువదు,

కొండ ఏది? లింగము ఏది.


ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ హెచ్చుతగ్గులుగా, లోయలుగా, గుంతలుపడి, పాయలుగా చీలిపోయి

ఉన్నది. పర్వతములో రాళ్ళు, గుట్టలు గుట్టలుగా, చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడ కొండలో

గుహలు సొరంగములుగా ఉన్నవి. అది ఒక పెద్దకొండ అయినందున కొండంతా రాళ్ళు నిండి ఉన్నాయి.

కొండలో ఉన్న రాళ్ళన్నియు లింగా కృతిని పోలి గుండ్రముగా ఉండుట వలన అది ఒక ప్రత్యేకమైన కొండ. కొండంతా

గుండ్రని రాళ్ళతో, పచ్చని చెట్లతో కూడియుండడమేకాక, కొండ మధ్యలో ఒక గుహ, గుహ మధ్యలో ఒక గుండ్రని

రాయి. ఆ రాయి కూడా లింగాకృతినే పోలియుండడము వలన, ఆ కొండకు కళింగకొండ అని పేరు కలదు.

కళింగకొండలో గుహలోని లింగమునకు నెలకొకమారు ప్రక్క గ్రామస్థులు వచ్చి పూజ చేసి పోవుదురు. కళింగ

కొండలో అన్నీ శివలింగములే అయినా గుహలో బోడిలింగమొకటున్నదని చెప్పెడివారు. గుహలోని బోడిలింగము

కళింగ కొండలో అన్ని రాళ్ళలో ఒక రాయిగా ఉన్నా, బోడిలింగమని ప్రత్యేక పేరుగాంచియున్నది. వర్షాకాలములో

పెద్ద వర్షములు వచ్చినప్పుడు కొండంతా తడిసిపోయి కొండలోని నీళ్ళన్నియు సెలయేళ్ళుగా పారుచుండును.

వర్షమొచ్చినపుడు కొండంతయు తడిసి పోయినా, కొండలోని చెట్లు, రాళ్ళు అన్నీ తడిసిపోయి, గుహలలో కూడా

నీళ్ళు కారి, గుహలన్నియు తడిగా మారిపోయినా, బోడిలింగము మాత్రము తడువకుండా ఉంటుంది. గుహలలో

కూడా పై అంచులలో నుండి నీరు కారుచున్నప్పుడు గుహ అంతయు తడిసిపోవుచున్నది. అయితే బోడిలింగము

ఉన్నచోట మాత్రము, పై ప్రక్క నాలుగు మూలలున్న చతురస్రా కారము గల పెద్దరాయి ఉండుట వలన, ఆ రాయి

క్రింద గల ఒక చదరము విస్తీర్ణము భూమి ఏమాత్రము తడువదు. నూరు చదరపు అడుగల ప్రాంతమును ఒక

చదరము అందుము. నూరు చదరపు అడుగుల విస్తీర్ణమందు బోడిలింగము, మధ్యలో ఉండుట వలన లింగము

ఏమాత్రము తడుచుటకు వీలులేదు. ఈ విధముగా కొండంతా తడిసి రాళ్ళన్నీ తడిసి పోయినా ఆ కొండలోనేయున్న

బోడిలింగము మాత్రము తడవదు, తడిసే దానికి అవకాశమే లేదు. ఇది కళింగ కొండ యొక్క ప్రత్యేకత. కొండంతా

గుండ్రని రాళ్ళే ఉన్నా, ఒక్క తడవని రాయికి మాత్రము బోడిలింగమని పేరు వచ్చినది. అక్కడున్నవన్నీ, ఒకే ఆకృతిని

పోలియున్న రాళ్ళే, అయినా బోడిలింగమని ఒకే రాయి పిలువబడుచున్నది. ఇది ఒక కొండ చరిత్రకాగా, ఈ కొండను

పోలిన చరిత్ర గల కొండకాని కొండ ఒకటున్నది. దానిని గురించి ఇప్పుడు తెలుసుకొందాము.


మనిషి శరీరము అందరికీ తెలిసినదే, అయితే ఇది కళింగ కొండ లాంటి కొండయని మాత్రము మనకు

తెలియదు. ఎంతో పెద్దదైన కళింగ కొండకు, మనిషి శరీరమునకు పోలిక ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించ వచ్చును.

దానిని గురించి తెలుసుకొందాము. మన శరీరములో క్షరుడు, అక్షరుడు ఇద్దరూ ఉన్నారు. క్షరుడు (జీవాత్మ)

గుణచక్రములోని గుణముల మధ్యలో ఉండగా, అక్షరుడు (ఆత్మ) శరీరమంతా వ్యాపించియున్నాడు. శరీరమంతా

కొండగా పోల్చుకొంటే, శరీరమంతా అక్షరుడైన ఆత్మ వ్యాపించి యుండుట వలన, కొండంతా లింగమును పోలిన

రాళ్ళున్నట్లు, శరీరమంతా మూడు లింగములలో (మూడు ఆత్మలలో) ఒక లింగమైన ఆత్మ వ్యాపించి యున్నదని

చెప్పవచ్చును. జీవాత్మ కూడా ఒక లింగమే కదా! (లింగము అనగా ఆత్మయని గుర్తుంచుకోవలెను). శరీరమంతా

లింగమును పోలిన ఆత్మ వ్యాపించియున్నట్లు, కొండంతా లింగమును పోలిన రాళ్ళున్నాయి కదా! కొండలో ఒక గుహ,

గుహలో ఒక రాయి, అదే బోడిలింగమన్నట్లు, శరీరములోపల గుహలాంటి తలలో, చతురస్రాకారముగల చదరపు

రాయి ఉన్నట్లు నాలుగు భాగములు గల గుణచక్రమొకటి ఉన్నది. దానిలో (గుణచక్రములో) ఒక ఆత్మ ఉన్నది. అదే

జీవాత్మ. గుహలోని రాయికి బోడిలింగము అనిపేరు వచ్చినది. అలాగే గుణచక్రములోని జీవాత్మను కూడా

బోడిలింగమనచ్చును. ఎందుకనగా జీవాత్మకు చూపులేదు, వినికిడి లేదు, స్పర్శలేదు, రుచిలేదు, వాసనను చూచుశక్తి

లేదు. అందువలన జీవాత్మను ఒక వికలాంగునితో సమానముగా చెప్పుచూ, వానిని బోడిలింగ మంటున్నాము.

బోడిలింగమైన జీవాత్మ, నాలుగు భాగములుగానున్న గుణచక్రములో గుణముల మాయలో ఉండుట వలన, వాని

వరకు బయటి ఆకాశము, అగ్ని, గాలి, నీరు, భూమి వచ్చుటకు వీలులేదు. శరీరమంతా గోరునుండి జుట్టువరకు

వ్యాపించియున్న ఆత్మకే, బయటి పంచభూతముల పనులు తాకును. బయటి వరకు శరీరమంతా వ్యాపించియున్న

ఆత్మ వాననీటికి తడుస్తున్నది. గాలికి త్రోయబడుచున్నది. అగ్నికి కాలుచున్నది. అంతేకాక ఆత్మ శరీరము బయటి

అంచువరకు ఉండుట వలన కత్తికి తెగుచున్నది. అందువలన కొండంతా తడుస్తున్నదని, కొండమీద లింగాకృతి

లోనున్న రాళ్ళన్నీ తడుస్తున్నవని కథలో చెప్పుకొన్నాము. బయటి వరకున్న ఆత్మ, వానకు తడుస్తున్నా, కత్తికి తెగుతున్నా

లోపలయున్న బోడిలింగమైన జీవాత్మ మాత్రము వానకు తడవడమూ లేదు, కత్తికి తెగడమూ లేదు. కొండలో నాలుగు

అంచులుగల బండ క్రింద లింగమున్నట్లు, శరీరములో నాలుగు భాగములుగాయున్న గుణచక్రములో జీవుడు, బయట

ఆత్మ తడిసినట్లుగానీ, తెగినట్లుగానీ తడవడమూ లేదు, తెగడమూలేదు. ఈ పొడుపు కథలో చెప్పిన కొండ శరీరమనియూ,

లింగము జీవాత్మ అనియూ చెప్పవచ్చును. శరీరము తడిస్తే, ఆత్మ తడిసినట్లే. అయినా లోపలి జీవాత్మ ఏమాత్రము

తడువదని తెలుపు నిమిత్తము, మన పెద్దలు ఈ పొడుపు కథను చెప్పి విప్పమన్నారు.


మతము అను మత్తుకు అలవాటు పడవద్దు. అది నిన్ను విచక్షణ లేని బానిసను చేస్తుంది.

***

18. వెయ్యి కళ్ళ జంతువు వేటకెళ్ళి వేటాడును. ఆ జంతువేది?


భూమిమీద ఏ జంతువుకూ వెయ్యి కళ్ళు ఉండవు. అందువలన ఇది ప్రపంచ సంబంధమైన జంతువుకాదని

మొదటనే తెలిసి పోవుచున్నది. ప్రపంచములోని జంతువుకయితే రెండే కళ్ళుంటాయి. కానీ ఈ పొడుపు కథలో చెప్పిన

జంతువుకు, వెయ్యి కళ్ళున్నాయని చెప్పారు. ఈ ప్రశ్న పూర్వము కొంత దుమారము లేపింది. చాలామంది దీని

జవాబు ఏమిటి అని ప్రయత్నించి చూచారు. దాని జవాబు ఎవరి యోచనకూ రాలేదు. అప్పుడు ఒక వ్యక్తి, ఎలాగైనా


ఈ ప్రశ్నకు జవాబును తెలుసుకోవాలను ప్రయత్నముతో, ఈ పొడుపు కథను పెద్ద ఫలకము మీద (బోర్డు మీద)

వ్రాయించి, దానిని ఒక బండికి అందరూ చదువునట్లు కట్టియుంచి, తాను బండిలో ప్రయాణమై పోయాడు. భారతదేశములో

జ్ఞానమునకు నిలయమైన దక్షిణదేశములో, దీనికి జవాబు దొరకవచ్చునను ఉద్దేశ్యముతో అటువైపు బయలుదేరి పోయాడు.

తన బండికియున్న పొడుపు కథను ఊరూరు తెలియునట్లు చేశాడు. పొడుపు కథను వ్రాసిన చోట క్రింది ప్రక్కన, దీనికి

జవాబు చెప్పినవారు ఎవరైనా వారే నాకు గురువు అని వ్రాసుకొన్నాడు. అలా కొంతకాలము తిరిగినా, ఎవరూ ఆ

ప్రశ్నకు జవాబును చెప్పలేదు. మూడు నెలలకు పైగా తిరిగినా, ఎవరూ దానిని గురించి ఒకమాట కూడా చెప్పనందుకు

అతనికి విసుగొచ్చినది. చివరకు ఇక ప్రయోజనము లేదని, తిరిగి ఇంటికి పోవాలనుకొన్నాడు.


చివరికి ఒక ఊరును చూచి అక్కడినుండి ఇంటికి బయలుదేరాలను కొని దగ్గరలోనున్న ఊరికి బయలుదేరాడు.

ఆ ఊరు దగ్గరకు రాగానే ఊరి బయట ఒక ముసలివాడు దారి ప్రక్కన కనిపించి, నేను నడువ లేకున్నాను. నీవు

దయతలచి నన్ను నీ బండిలో ఎక్కించుకొని ఊరిలో దించమన్నాడు. ముందుగానే, జవాబు దొరకక విసుగుగాయున్న

అతను ముసలివాడు మాట్లాడిన మాటలను విని, తన బోర్డును చూపి, నా ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుందో

చెప్పు, అట్లయితే నిన్ను బండిలోనికి ఎక్కించు కుంటాను అని అన్నాడు. అప్పుడు ఆ ముసలివాడు ఆ బోర్డుమీదయున్న

ప్రశ్నను చూచి, నీ ప్రశ్న నా మొలత్రాడంత లేదు, ముందు నన్ను ఎక్కించుకో చెప్పుతాను అన్నాడట. ఆ ముసలివాని

మాటకు ఆశ్చర్యపోయిన వాహనము లోని వ్యక్తి, ఏమీ మాట్లాడక బండి ఆపి ముసలి వానిని ఎక్కించుకొన్నాడు.

అప్పుడు ఆ ముసలివాడు మాట్లాడుచూ “మా ఊరిపేరే సంశయాలపురము. మా ఊరిలోని వారు ఏ సంశయానికైనా

జవాబును చెప్పగలరు. కావున దానికి గుర్తింపుగా సంశయాలపురము అను పేరు వచ్చినది. మా ఊరిలోనికి వచ్చిన

వానికి ఏ సంశయముగానీ, ఏ ప్రశ్నగానీ మిగలదు. నీ ప్రశ్నకు మా ఊరిలో పది సంవత్సరముల పిల్లవాడు కూడా

జవాబు చెప్పగలడు" అని అన్నాడు. ఆ మాటలువిన్న, ప్రశ్న కొరకు ప్రయాణించు వాహనదారుడు ఆశ్చర్యముతో “నా

ప్రశ్న అంత సులభముగా కనిపిస్తున్నదా” అని అడిగాడు. దానికి ముసలివాడు నవ్వి " మా ఊరు సంశయాలపురము

అని అన్నాను కదా! సంశయాలు అంటే ప్రశ్నలు. వేయి సంశయాలు (వేయి ప్రశ్నలు) ఉన్నా సరే, వాటికి మా ఊరిలోనే

జవాబు దొరుకుతుంది. అంతెందుకు? నీ ప్రశ్నలో వేయి కళ్ళ జంతువు ఏది అని ఉన్నది. వేయి ప్రశ్నలకైనా జవాబు

నిచ్చు జ్ఞానమే వేయి కళ్ళ జంతువు. జ్ఞానమునకు అన్నివైపుల చూపువుండును. వేయి సంశయములకైనా ఒక్కవేటుతో

త్రుంచగల శక్తి, ఒక్క జ్ఞానమునకే గలదు. అందువలన జ్ఞానము వేయి కళ్ళ జంతువులా దేనినైన వేటాడునని, దేనికైనా

జవాబు చెప్పగలుగు జ్ఞానమును గూర్చి చెప్పారు. నీ ప్రశ్నకు మా ఊరు రాకనే జవాబు వచ్చింది. అదే జ్ఞానము

యొక్క శక్తి చూచావా” అన్నాడు. అంత సులభముగా జవాబు దొరుకు తుందని అనుకోని బండిలోని వాడు, ముసలి

వానిని ఊరిలో వదలి, ఆ ముసలి ఆయననే గురువుగా చెప్పుకొనుచూ తన ఊరికి బయలుదేరి పోయాడు.


మతము కొరకు చస్తే స్వర్గానికి పోతావంటాడు.

కానీ నీవు పోయేది నరకానికే.

***

19. రెక్కలు మూయని పక్షి ఏది?


భూమిమీద రెక్కలు మూయని ఈగ ఉందిగానీ, పక్షిలేదు. రెక్కలు మూయని ఈగ తూనీగ. రెక్కలు మూయని


పక్షి ఆధ్యాత్మికములో కలదు. అదేదో నాకు తెలుసు, మీకు తెలియదు కావున దానిని మీకు తెలిపేముందు కొంత

సమాచారమును చెప్పుకొందాము. ఒక మనిషి జన్మించినపుడు ఆ మనిషి శరీరములోనికి ఆత్మ, జీవాత్మ అను రెండు

ఆత్మలు వచ్చి చేరుచున్నవి. జీవాత్మ అనునది కర్మ చేత బంధింపబడియుండగా, ఆత్మ అనునది జీవాత్మను కర్మానుసారము

ఆడించుటకు జీవాత్మకు జత చేయబడినది. ప్రారబ్ధకర్మ అయిపోయినప్పుడు ఆత్మ, జీవున్ని వెంటబెట్టుకొని పాత

శరీరమును వదలి పోయి క్రొత్త శరీరమును చేరుచున్నది. ఆ విధముగా శిశుశరీరములో చేరినప్పటినుండి శిశు

శరీరములో పనిని చేయుచు, శ్వాస ఆడించుచూ, గుండెను కదలించుచూ, మిగత అన్ని కార్యములను ఆత్మ చేసి

పెట్టుచున్నది. జీవాత్మ మాత్రము తలయందు గుణచక్రములో సుఖదుఃఖ అనుభవములను మాత్రము అనుభవించుచు,

మిగతా ఏ పనినీ శరీరములో చేయకున్నది. శరీరములోపల పనులనుగానీ, శరీరము బయట పనులనుగానీ, ప్రతి

చిన్న పనినీ, పెద్ద పనినీ అన్నీ ఆత్మే చేయుచున్నది. ఒక్కక్షణము కూడా ఆత్మ ఊరక ఉండక పనులను చేయుచున్నది.

మనిషి మెలుకువలో ఉన్నప్పుడు గానీ, నిద్రలోయున్నప్పుడుగానీ, స్వప్నములో ఉన్నప్పుడుగానీ ఆత్మ పని చేయుచుండగా,

మనిషి సజీవముగా ఉన్నాడు. మనిషి జీవితములో గానీ, మనిషి మరణించునప్పుడుగానీ, మనిషి జన్మించునప్పుడు

గానీ ఆత్మ అహర్నిశలు పని చేయుచున్నది. ఆత్మ పనిచేయని క్షణము ఇది అని ఎవరూ చెప్పలేరు. అందువలన

జీవాత్మను, ఆత్మను శరీరమను పంజరములోనున్న జోడు పక్షులని చెప్పుచుందురు. పంజరములో జీవుడను ఒక పక్షి

ఊరకయుండగా, ఆత్మయను పక్షి రెక్కలు ముడవక శరీర పంజరములో ఎగురుచూ పని చేయుచున్నదని చెప్పవచ్చును.

ఈ పొడుపు కథలో రెక్కలు ముడువని పక్షి ఏది అనగా ఆత్మయని చెప్పవచ్చును.


మతము మనిషిని సంకుచితము చేస్తుంది. నీవు వేరు, నేను వేరను భావమును కల్పిస్తుంది.

***

20. కన్నుగాని కన్ను ఏది?


కన్నుగాని కన్ను నెమలికన్ను అని ప్రపంచరీత్యా కొందరు జవాబు చెప్పవచ్చును. అయితే జ్ఞానరీత్యా 'కన్నుగాని

కన్ను' మనిషికి ఒకటి కలదు. ముఖములోనున్న రెండు కళ్ళకు ప్రపంచము కనిపిస్తున్నది. ప్రపంచము గానటువంటి

పరమాత్మ సంబంధమైనది ఏది తెలియాలన్నా మనిషికి జ్ఞాననేత్రము అవసరము. జ్ఞాననేత్రము జ్ఞానము తెలియని

వారికి కూడా ఉన్నది. అయితే జ్ఞానము తెలియని వారికి జ్ఞాననేత్రము మూసుకొని వుండును. జ్ఞానము మనిషికి

ఎంత తెలియబడితే, జ్ఞాననేత్రము అంత తెరువబడును. జ్ఞాననేత్రము తెరువబడినప్పటికీ, దానికి చూపును దేవుడు

ఇవ్వాలి. జ్ఞాననేత్రమునకు దృష్ఠి కలుగుకొద్ది జ్ఞాన రహస్యములన్నియు మనిషికి తెలియబడును. జ్ఞాననేత్రము

సూక్ష్మమైనది. పైకి కనిపించునది కాదు. జ్ఞాననేత్రము సూక్ష్మమైనది అయినందున దానికి సూక్ష్మమైన జ్ఞాన రహస్యములు

తెలియబడును. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి జ్ఞాన దృష్టి ఇచ్చినందున, అర్జునుడు విశ్వరూపమును చూడగలిగాడు.

అందువలన పొడుపు కథలో జవాబుగా, కన్నుగాని కన్ను జ్ఞాననేత్రము అని చెప్పవచ్చును.


ఒక్క వ్రాత ఎందరినైనా మార్చగలదు. అందువలన మంచిగ వ్రాయి.

***


21. తల్లి దయ్యం, పిల్ల పగడము, పిల్ల ఏది? తల్లి ఏది?


శరీరములోని జీవునికి తల్లులు ఇద్దరు కలరు. ఒకే దేవుడే భగవంతునిగా మనిషితో సంబంధము పెట్టుకొన్నట్లు,

ఒకే ప్రకృతియే మాయగా మనిషితో సంబంధము పెట్టుకొన్నది. దేవుడు మనిషికి తండ్రికాగా, భగవంతుడు

తండ్రిలాంటివాడు. అలాగే మనిషికి ప్రకృతి తల్లికాగా, మాయ తల్లిలాంటిది. ఒక విధముగా భగవంతున్ని తండ్రి అని

చెప్పినా తప్పులేదు. అదే విధముగా మాయను తల్లిగా చెప్పినా తప్పు లేదు. మాయ అనునది మనిషి శరీరములో

గుణచక్రములో, గుణముల రూపములో ఉన్నది. గుణచక్రములోని మాయకు అక్కడే కొన్ని గుణములు మంచివి

గలవు. ఉదాహరణకు మాయలోనున్న గుణములలో ప్రేమ అను గుణము ఒక పగడములాగ ఉన్నది. ప్రేమ ఎంతో

గొప్ప గుణముగా అందరి చేత చెప్పబడుచున్నది. ప్రేమ అను గుణమును అందరూ ప్రశంసించి చెప్పినట్లు, మిగతా

ఏ గుణమునూ ఎవరూ చెప్పలేదు. చివరకు కొందరు స్వామీజీలు, బాబాలు అందరూ ప్రేమే దేవుడని కూడా చెప్పారు.

మాయను చాలామంది దయ్యముగా వర్ణించిన వారే, మాయలో భాగమైన ప్రేమ గుణమును దేవునిగా వర్ణించి చెప్పడము

విచిత్రము కాదా! అదే విధముగా కొందరు మాయను దయ్యముగా వర్ణించినవారే, అందులోని ప్రేమ గుణమును

పగడముగా వర్ణించారు. ఈ పొడుపు కథలో తల్లి మాయయనీ, పిల్ల ప్రేమయనీ సులభముగా తెలిసిపోవుచున్నది.


ఒక్క మాట ఎందరినైనా స్పందింపజేయగలదు. అందువలన మంచిగ మాట్లాడు.

***

22. తలయు తోకయు కలదు. నాలుకయే లేదు.

పట్టిచూచిన ప్రాణంబు లేదు. ఏది?


దీనికి ప్రపంచరీత్యా జవాబు పాము కుబుసమని చాలామంది చెప్పుచున్నారు. ఇది ప్రపంచరీత్యా సరియైన

జవాబే, అయితే పరమాత్మ జ్ఞానము ప్రకారము అర్థమును చూడవలసివున్నది. ఈ పొడుపు కథలో తలయు కలదు,

తోకయు కలదు అని ఉన్నది. కావున ఇది ఫలానా అని గుర్తించతగిన ఆకారమున్నదని అర్థమగుచున్నది. నాలుకలేదని

చెప్పడము వలన దానికి ఏ రుచీ తెలియదని అర్థమగుచున్నది. అంతేకాక ప్రాణము లేనిది అని వ్రాశారు. ఆకారముండి

ప్రాణములేనిది, నాలుకలేనిది ఏదై వుంటుందని బుద్ధి ఎంతగా ఆలోచించినా దానికి జవాబు దొరకలేదు. చివరకు

ఆత్మ అందించిన యోచన ద్వారా జవాబు దొరికింది. అది ఏమనగా! మన శరీరమంతా ప్రాణమున్నది. మనము

పీల్చు ప్రాణవాయువు ఊపిరితిత్తులలో రక్తముతో కలిసి, గుండెద్వారా శరీరమంతా పోవుచున్నది. ఈ విధముగా మన

శరీరమంతా ప్రాణమున్నదని చెప్పవచ్చును. అయితే ప్రాణవాయువు పోకూడని నిషిద్ధ ప్రాంతము ఒకటున్నది. దేశరక్షణ

నిమిత్తము మిలటరీ, ఎవరూ పోకూడని నిషిద్ధ ప్రాంతములను ఏర్పరచి యుండును. అక్కడ మిలటరీ యొక్క రహస్య

కార్యకలాపములుండును. అందువలన అది నిషేదిత ప్రాంతమైనది. రక్షణ కార్య కలాపముల నిమిత్తము దేశములోనే

ఒక ప్రాంతము నిషిద్ద ప్రాంతముగా, ఎవరూ ప్రవేశించని ప్రాంతముగా గుర్తించబడినట్లు, మన శరీరములో తలయందు

సూక్ష్మముగా నున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల సముదాయమున్న స్థలములోనికి ప్రాణవాయువు కూడా పోదు.

ఈ నాలుగు చక్రములు, మనిషి జీవిత రహస్యమును కలిగియున్నవి. మిలటరీ రహస్యమంతా ఒకచోట ఉన్నట్లు,


మనిషి జీవిత రహస్యమంతా నాలుగు చక్రములందే ఉన్నది. అవి కొన్నిటికి నిశేదిత ప్రాంతమైన దానివలన అక్కడ

ప్రాణముండదు. అక్కడ జీవుడు, జీవునికి సంబంధించిన చరిత్ర మరియు భవిష్యత్తు రెండు ఉండును. శరీరమంతా

పోవుచున్న ప్రాణము, జీవుడున్న నాలుగు చక్రములలోనికి పోవుటకు వీలులేదు. కావున అక్కడున్న జీవునకు ప్రాణములేదు

అని ఇప్పుడర్థమైనది. జీవుడు ప్రాణములేనివాడని, ఇపుడు మనము ధైర్యముగా చెప్పవచ్చును.


జీవునికి స్థూల ఆకారము లేకున్నా, సూక్ష్మ ఆకారమున్నది. పటములో జీవుని చిత్రమును  చూడవచ్చును. (చిత్రమును 29 పేజీ లో చూడండి . జీవుడు,బుద్ది,చిత్తము,అహము..  )



జీవుని ఆకారము మూడు పొరలతో కూడుకొని మధ్యన ఖాళీ స్థలముగా ఉన్నది. మూడు పొరలు ఖాళీ

స్థలమును చుట్టియుండడము వలన, మధ్యలోనున్న జీవునికి గుండ్రని ఆకారము ఏర్పడినది. జీవునికి తల, మధ్యలోని

శూన్యమనియూ, తోక చివరిలోని అహము పొర అనియూ తెలియుచున్నది. అందువలన జీవునికి తలయూ, తోకయూ

రెండూ ఉన్నాయని చెప్పవచ్చును.


జీవుడు తనవద్దకు వచ్చిన కష్టసుఖముల అనుభూతులను అనుభవించు వాడేగానీ, తాను స్వయముగా దేనినీ

గ్రహించలేడు. తనకు దగ్గరగానున్న బుద్ధి, బయట ఇంద్రియములనుండి మనస్సు తెచ్చిన సమాచారమును తీసుకొని,

ఇది ఫలానా సుఖమనియో లేక ఫలానా కష్ట మనియో చెప్పి, జీవునికి అందించుట వలన జీవుడు దానిని అనుభవించు

చున్నాడు. జీవునికి దేనినీ స్వయముగా తెలుసుకొను శక్తిలేదు. జీవుడు చూపులేనివాడు, వినికిడిలేనివాడు, అట్లే ఏ

ఇంద్రియజ్ఞానము లేనివాడు. అందువలన జీవుడు దేనినీ స్వంతముగా రుచి చూడలేడు. బుద్ధి చెప్పిన దానినిబట్టి

జీవుడు తెలియుచుండును. ఇప్పుడు మనకు కావలసిన సమాచారము, సమాధానము పూర్తిగా తెలిసిపోయినది. పొడుపు

కథలో తల, తోకయున్నవాడు ఎవరు అన్నదానికి, ఆకారమున్నవాడు జీవుడనీ, జీవునికి తల, తోక రెండూ ఉన్నవనీ

సమాధానము చెప్పవచ్చును. అట్లే బుద్ధి చెప్పనిదే జీవునికి ఏది తెలియదు. అంతేకాక జీవుడు స్వయముగా జవాబు

చెప్పువాడు కాదు. గుణముల నుండి గ్రహించిన విషయమును బుద్ధియే చెప్పుచున్నది తప్పు, జీవుడు తిరిగి ఏమీ

చెప్పడములేదు. అందువలన జీవున్ని నాలుక లేనివాడని చెప్పవచ్చును. గుణచక్రము వరకు ప్రాణములేదు కనుక,

జీవుడు ప్రాణము లేనివాడని కూడా చెప్పవచ్చును. ఇప్పుడు పొడుపుకథ ప్రశ్నకు పూర్తిగా జీవుడను జవాబు వచ్చినది.

ఈ పొడుపు కథ పూర్తిగా జీవుని సమాచార జ్ఞానమును తెలుపుచున్నది.


ఒక్కడు ఒక్కమారు పుట్టినా, శాశ్వితముగా అందరికీ జ్ఞప్తికుంటాడు.

***


23. నట్టింట్లో నలుగురు దొంగలు కలరు. ఎవరు వారు?


మన శరీరమును ఇల్లుగా పోల్చుకుంటే, జీవుడున్నది తల భాగములో. తల భాగములో పూర్తి మధ్యన నాలుగు

చక్రములు గలవు. అందులో జీవుడు గలడు. అందువలన భృకుటికి మధ్యమున, ఉపజిహ్వకు ప్రాక్ దిక్కున జీవుడు

కలడని కూడా మన పెద్దలు ఒక పద్యములో చెప్పారు. భృకుటికి మధ్యమున అని చూస్తే, తల మధ్య భాగములో అని

తెలియుచున్నది. తల మధ్య భాగములోని గుణచక్రమందు జీవుడుండగా, జీవున్ని ఆశ్రయించుకొని బుద్ధి, చిత్తము,

అహము గలవు. అప్పటికి జీవునితో సహా మొత్తము నాలుగు, తల మధ్యలో గలవు. బుద్ధిగానీ, అహముగానీ,

చిత్తముగానీ, జీవుడుగానీ తల మధ్యలో ఉండుట వలన, నట్టింట్లో నలుగురు అని చెప్పడము జరిగినది. వీరు

నలుగురు ఎవరికీ తెలియకుండ ఉండడము వలన వీరిని నలుగురు దొంగలని చెప్పడము జరిగినది. ఇప్పుడు

పొడుపు కథకు పూర్తి జవాబు వచ్చింది.


కీర్తి కొరకు ప్రాకులాడవద్దు. ముక్తి కొరకు చింతించు.

***

24. పచ్చని ఇంట్లో పుట్టాడు, పలువురి చేతుల్లో పడ్డాడు.


పలు రకాలుగా మారాడు, పలుకకుండా ఉంటాడు. ఎవడు?

పచ్చనిగడ్డి, ఎండుగడ్డి అని రెండు రకములు గలవు. పచ్చని అనగా పచ్చిగడ్డి అని కూడా చెప్పవచ్చును.

పచ్చని ఇంట్లో, పచ్చి ఇంట్లో అని కూడా అర్ధము రాగలదు. పచ్చి ఇల్లు మనిషి శరీరమేనని తెలుసు కోవాలి. శరీరము

ఎప్పుడైనా పచ్చిగానే ఉంటుంది. శిశుశరీరము కూడా పచ్చి శరీరమే. శిశుశరీరములో ప్రవేశించి పుట్టినవాడు

జీవుడు. అందువలన “జీవున్ని పచ్చని ఇంట్లో పుట్టాడు" అని చెప్పవచ్చును. జీవుడు శరీరమును ధరించి పుట్టిన

తర్వాత అనేక రకముల పాపపుణ్యములను అనుభవిస్తూ వచ్చాడు. ఒకమారు పాపమును అనుభవిస్తూ రోగము చేతిలో

పడినాడు. అది అయిపోయిన తర్వాత పుణ్యమును అనుభవించుటకు అందమైన స్త్రీ చేతిలోపడ్డాడు. ఈ విధముగా

జీవుడు ఒకమారు పాపము, మరొక మారు పుణ్యమును అనుభవించుటకు అనేక సంఘటనల చేతులలో పడ్డాడు. ఈ

విధముగా జీవితమును గడుపుచున్న జీవుడు కర్మలనుబట్టి, సందర్భములనుబట్టి ఒకమారు తామసుడుగా మారాడు.

మరొకమారు రాజసుడుగా మారాడు, అట్లే కొన్ని సమయములలో సాత్త్వికుడుగా కూడా మారాడు. ఇట్లు జీవితములో

ఎన్నోమార్లు, పలురకముల గుణములలోనికి మారాడు. ఒకమారు రాజస గుణములోని క్రోధము అను గుణమును

తగులుకోవడము వలన కోపిష్ఠిగా మారిపోయాడు, అదే రాజస భాగములో కామము (ఆశ) అను గుణముతో

తగులుకోవడము వలన ఆశబోతు (కామాంధుడు)గా మారిపోయాడు. ఈ విధముగా జీవుడు గుణభాగములలోనికి

పోయి తామసుడుగా, రాజసుడుగా, సాత్వికుడుగా మారడమే కాకుండా, ఆయా గుణ భాగములలోని గుణములతో

కలిసి లోభియనీ, గర్వియనీ, కోపిష్ఠియనీ, అసూయవరుడుయనీ పేరుగాంచుచున్నాడు.


పచ్చని ఇల్లుగానున్న పచ్చి శరీరములో పుట్టిన జీవుడు, పాప పుణ్యముల చేతుల్లో పడి, కష్ట సుఖములను

అనుభవించిన జీవుడు, గుణములలో అటు ఇటు మారుచూ, గుణముల పేరును పొందుచున్న జీవుడు, మౌనముగా


పుట్టుచున్నాడు. మౌనముగా కష్టసుఖములను అనుభ వించుచున్నాడు. మౌనముగా గుణములను మారుచున్నాడు.

జీవుడు మౌనముగా ఉండువాడే. మౌనముగా ఏమీ పలకని జీవునికి మాట్లాడడానికి నోరు లేదు. చూచేదానికి కళు

ఎలేవు, వినేదానికి చెవులు లేవు. జీవునికి ఏమీ లేవు కనుక, ఎల్లప్పుడు జీవుడు మౌనముగానే ఉంటాడు. ఏమీ పలకని

జీవునికి అన్నీ చెప్పునది బుద్ధి. జీవునికి ప్రక్కనే బుద్ధి, చిత్తము, అహము ఉండుట వలన, జీవునితో ఎక్కువ సంబంధము

బుద్ధి, అహము పెట్టుకొనివుండి, అన్నీ వానికి చెప్పి వానిని అనుభవించునట్లు చేయుచున్నవి. గ్రుడ్డివానికి ప్రక్కవాడు

సహాయకారిగా ఉండి నడిపించునట్లు, జీవునికి ఒకవైపు బుద్ధి, మరోవైపు అహమూ ఉండి, జీవున్ని నడిపించుచున్నవి.

జీవుడు ఏ అంగమూలేని వికలాంగుడు. అందువలన వాడు స్వయముగా పలుకడు, స్వయముగా వినడు, స్వయముగా

ఏదీ చేయడు. ఇదంతయు గమనిస్తే పై పొడుపు కథలో చెప్పినట్లు, పచ్చని ఇంట్లో పుట్టేవాడు, పలువురి చేతుల్లో

పడేవాడు, పలురకాలుగా మారేవాడు. అట్లే ఎవరితో మాట్లాడేవాడు జీవుడు కాడు. అందులన పై కథలోని ప్రశ్నకు

అన్ని విధముల జీవుడు అని సమాధానము చెప్పవచ్చును.


గౌరవమును ఆశించవద్దు. జ్ఞానమును కోరుకో.

***

25. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది.

తెచ్చుకోబోతే ముచ్చుకుంటుంది, ఏది?


పై పొడుపు కథలో పచ్చని ఇల్లు అనగా పచ్చి శరీరము అని చెప్పుకొన్నాము. ఇక్కడ కూడా పచ్చని పెట్టె

అనగా పచ్చి శరీరమనియే అర్థము నిచ్చును. మానవునిది ఎప్పటికీ పచ్చి శరీరమే. మానవ శరీరములో ఒకటి చిన్న

మొగ్గమాదిరియుండి శరీరమంతా నిండుకొనునట్లు విచ్చుకుంటుంది. అటువంటిది ఏముంది అని ఆశ్చర్యపోవలసిన

పనిలేదు. అది మనశరీరములో చిన్నప్పుడు మనము పుట్టినప్పుడే, మనతోపాటు పుట్టి పెరుగుచూ వచ్చినది. అదియే

మనిషి శరీరములో పుట్టినప్పటినుండి చచ్చిపోవువరకు ముఖ్యపాత్రను పోషించుచున్నది. ఎక్కడో తలకాయలోనున్న

జీవునకు, బయట ప్రపంచ విషయములను తెలియజేయు పాత్రను పోషించు మనస్సు ఏదైతే ఉందో, అదే మన

శరీరములో విచ్చుకునేదని తెలియవలెను. మనస్సు నిద్ర సమయములో చిన్న చుక్కగా ముకుళించుకొని కనిపించీ

కనిపించనట్లు, బ్రహ్మనాడిలోని ఆత్మలో అణిగి పోయివుండి, మెలకువ వచ్చిన వెంటనే, మనిషి శరీరములోనికి పూర్తిగా

వ్యాపించుకొనుచున్నది. ఒక చిన్న ఉంటగానున్న మనస్సు జాగ్రత్తావస్థలో శరీరమంతా వికసించు కొంటున్నది.


శరీరమంతా వ్యాపించియున్న మనస్సు, శరీరములో ఎక్కడ ఏమి జరిగినా ఆ విషయమును వెంటనే తలయందు

నివాసమున్న బుద్ధికి చేర్చును. బుద్ధి మనస్సు తెలిపిన విషయమును ప్రక్కనేయున్న జీవునికి తెలుపును. జీవుడు

స్వయముగా ఏమీ తెలియలేడు. బయట కనిపించినది గానీ, వినిపించినదిగానీ ముందు మనస్సు గ్రహించి, లోపలయున్న

బుద్ధికి చేర్చగా, బుద్ధి జీవునికి మనస్సు తెలిపిన విషయమును తెలుపును. ఈ విధముగా చివరకు జీవునికి విషయము

చేరుచున్నది. బయటి జ్ఞానేంద్రియములకూ, లోపలి బుద్ధికి మధ్యవర్తిగా, వార్తాహరునిగా మనస్సు పని చేయుచున్నది.

మెలుకువలో ఈ విధముగా పని చేయు మనస్సు నిద్రావస్థలో శరీరమునుండి ముకుళించుకొని చిన్న స్వరూపముగా

మారిపోయి, స్వల్ప బిందువువలె తయారై బ్రహ్మనాడిలో అనిగి పోవుచున్నది. ఇట్లు జాగ్రతావస్థలో శరీరమంతా

వ్యాపించియున్న మనస్సు, నిద్రావస్థలో చిన్న స్వరూపముగా మారిపోయి ఆత్మలో అణిగిపోవుచున్నది.


ఒకవేళ ఎవడైనా మనస్సును జయించాలనుకొని, మనస్సు మీద ధ్యాస పెట్టుకోవాలనుకొని, బయటి ఆలోచనలను

రాకుండా చూచుకొని నప్పుడు, మనస్సుకు ఎప్పుడు పని తగ్గిపోతే అప్పుడు మనస్సు ముడుచుకొని నిద్రలోనికి పోవును.

ఎవడైనా ధ్యానము చేయాలనుకొని ఒక దానిమీదికి ధ్యాసను మళ్ళించినపుడు తనకు తగినంతపని లేకుండా పోయి,

ఒకదాని మీదనే ధ్యాస ఉండుటవలన అప్పుడు కూడా చిన్నగ శరీరమునుండి ముడుచుకొని బ్రహ్మనాడిలోని ఆత్మలో

అణిగిపోవును. అప్పుడు ధ్యానము చేయువాడు నిద్రలోనికి పోవడము జరుగును. మనస్సు అనేక విషయముల మీద

పని చేయునప్పుడు చురుకుగా ఉండును. ఒక విషయము యొక్క పనిని మాత్రము మనోధ్యాసకు ఉంచుట చేత,

మనస్సు చురుకుదనమును కోల్పోయి మజ్జుగా మారి శరీరమునుండి ముడుచుకొని నిద్రలోనికి పోవును. అందువలన

ఈ పొడుపు కథలో తెచ్చుకోబోతే (పట్టబోతే) ముచ్చుకుంటుంది అన్నారు. మన శరీరములో విచ్చుకొనేది, ముచ్చుకొనేది

ఒకే మనస్సు అని తెలియుచున్నది.


బ్రహ్మవిద్యను విస్మరిస్తే, మానవ జాతికే తీరని నష్టము.

***

26. సావిడిలో జుట్టన్న తల విరబోసుకున్నాడు. ఎవరు?


ఒక ఊరిలోని వారందరు సమావేశమై మాట్లాడుకొను ఇంటిని సత్రము లేక సావిడి అంటారు. జుట్టన్న అంటే

తల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవానిని జుట్టన్న అంటాము. తన తలకు వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయని చూపుటకు

ఎవరైనా జుట్టును విరబోసుకుంటారు. ఇవి అన్నీ అందరికీ తెలిసిన విషయములే. ఇక తెలియని విషయాలేవనగా!

తలలోని వెంట్రుకలను ఆత్మకు గుర్తుగా చెప్పుచున్నాము. ఎవని శరీరములో అయితే ఆత్మజ్ఞానము ఎక్కువగా ఉండునో

వానికి ఆత్మశక్తి కూడా ఎక్కువగా ఉండును. ఆత్మను జుట్టుగా పోల్చడము వలన, ఆత్మజ్ఞానమున్న వానిని జుట్టన్న

అని చెప్పడము జరిగినది. సంపూర్ణ జ్ఞానముకలవానికి కనిపించే జుట్టులేకున్నా, ఆధ్యాత్మిక జ్ఞాన భావముతో జుట్టన్న

అని అనవచ్చును. దీనినిబట్టి పొడుపు కథలో సంపూర్ణ జ్ఞానము గల గురువును జుట్టన్న అని అనడము జరిగినది.

జుట్టన్న సంపూర్ణ జ్ఞానమును తెలిసిన గురువు అయినప్పుడు, గురువు కొంతమంది శిష్యులను గుంపుగా సమావేశపరచి

జ్ఞానము చెప్పును. అందువలన మనుష్యులను సమావేశపరుచు స్థలమును పొడుపు కథలో సావిడి అను పేరుతో

చెప్పారు. నాకు వెంట్రుకలు ఎక్కువగాయున్నాయని విరబోసుకొని, వెంట్రుకలున్న వాడు చూపగలడు. అదే విధముగా

సంపూర్ణ జ్ఞాని అయినవాడు ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలనని ప్రకటించడమే, జుట్టు విరబోసుకొని చూపినట్లని

అర్థము చేసుకోవాలి. గురువుగాయున్నవాడు సర్వము తెలిసినవాడై యుండుట వలన, దేనికైనా జవాబు చెప్పుస్థోమత

కలిగియుండుట వలన గురువును జుట్టన్న అని చెప్పుచూ, జుట్టన్న తల విరబోసుకొన్నాడని చెప్పారు. పొడుపు కథలో

అడిగిన ప్రశ్నకు జ్ఞానము తెలిసిన గురువు అని జవాబు దొరికి పోయింది.


నెమలి పింఛము యొక్క సందేశమును చూస్తే నీకే సిగ్గవుతుంది.

***


27. మూడు మోములుగల జగత్పూజ్యుడు ఎవరు?


'ద్వాపర' అనగా రెండుకంటే వేరుగాయున్నది అని అర్థము. అలాగే 'త్రైతా' అంటే మూడు అని అర్థము. త్రైత

సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు క్షరుడు, అక్షరుడు అను ఇద్దరు పురుషులకంటే వేరుగానున్నవాడు పురుషోత్తముడని

చెప్పారు. విశ్వమునంతటినీ సృష్టించిన దేవుడు మూడు భాగములుగా విభజింపబడియున్నాడని, భగవద్గీతలో

పురుషోత్తమప్రాప్తి యోగమున చెప్పియున్నారు. అదే విషయము సిద్ధాంతరూపములో త్రైత సిద్ధాంతముగా చెప్పబడినది.

విశ్వమునంతటినీ సృష్టించి విశ్వవ్యాప్తముగా యున్న దేవుడు జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా మూడు భాగములుగా

యున్నాడు. మూడు ముఖములుగానున్న ఏక పురుషుడు దేవుడు. కావున మూడు మోములవాడు జగత్పూజ్యుడు అని

పై పొడుపు కథలో చెప్పారు.


జ్ఞానమును నేర్చుకోవాలనుకో, గురువుగా మారాలనుకోవద్దు.

***

28. వస్తా నీతో ఎప్పుడూ, కలలోనైనా వదలను నిన్ను. అన్నది ఎవరు?


కాగిన ఇనుములో అగ్ని ఎట్లు తోడైయున్నదో, నానిన బెండులో నీరు ఎట్లున్నదో, అట్లే పుట్టిన జీవాత్మకు, ఆత్మ

తోడైవున్నది. ఒకే పంజరములో జోడు పక్షులున్నట్లు, ఒకే శరీరములో జోడు ఆత్మలు గలవు. శరీరములలోని జోడు

ఆత్మలే జీవాత్మ, ఆత్మ. ఆత్మలేనిది జీవాత్మ బ్రతక జాలదు. జీవాత్మలేని ఆత్మ ఉండజాలదు. ఆత్మ ఉంటే జీవాత్మ

ఉండగలదు. అట్లే జీవాత్మ ఉంటేనే ఆత్మ ఉండగలదు. ఆత్మలేని జీవాత్మగానీ, జీవాత్మలేని ఆత్మగానీ ప్రపంచములో

ఎక్కడా ఉండరు, ఉండబోరు, ఇది శాసనము. జీవునికి క్షణము గడవాలంటే ఆత్మవుండాలి. ఆత్మశక్తి లేనిది జీవునికి

మనుగడ ఒక్కక్షణము కూడా సాగదు. మరణములోగానీ, జననములోగానీ రెండు ఆత్మలూ ఉండవలసిందే. మరణములో

జీవాత్మను పాతశరీరమునుండి క్రొత్త శరీరమునకు తీసుకొని పోవునది ఆత్మయే. అలాగే జననములో జీవాత్మను క్రొత్త

శరీరములో చేర్చిన తరువాత జ్ఞాపకము చేసి మెలకువలోనికి తెచ్చునది ఆత్మయే. ఆత్మ తన చైతన్యశక్తితో శరీరమును

కర్మానుసారము నడుపుచూ, జీవుని జీవితమును సాగించుచున్నది. జీవుడు మూడు అవస్థలలో ఎక్కడున్నా, ఆత్మ శరీరములో

ఉండి పని చేయుచున్నది. ఆత్మ లేకపోతే నిద్ర, మెలుకువ, స్వప్నము అను మూడు అవస్థలు ఏవీ ఉండవు. మెలకువలో

జీవుడు పాపపుణ్యములను అనుభవింప చేయునట్లు చేయునది ఆత్మయే. అలాగే నిద్రలో జీవునికి ఏ అనుభవమూ

లేకుండా చేసి, తాను మాత్రము పని చేయుచుండును. ఇంకా స్వప్నములో, మనస్సుకు తనయందే అన్ని దృశ్యములను

చూపుచూ, ఆ విషయములు బుద్ధి ద్వార జీవునికి చేరునట్లు చేసి, జీవున్ని స్వప్నములో కూడా కష్టసుఖములను ఆత్మ

అనుభవింప చేయుచున్నది. జోడు ఆత్మలైన జీవాత్మ, ఆత్మలలో జీవాత్మ కొన్ని సమయములలో పని చేయకున్ననూ,

ఆత్మ మాత్రము ఎల్లప్పుడూ పని చేయుచునే ఉన్నది. అందువలన ఈ పొడుపుకథలో “వస్తా నీతో ఎప్పుడూ,

కలలోనైనా వదలను నిన్ను" అన్నది ఆత్మయని చెప్పవచ్చును.


జ్ఞానము దగ్గర సిగ్గుపడకూడదు. యోగము దగ్గర మజ్జుపడకూడదు.

***


29. ఒక కాయ, కాయకు మూడు పప్పులు, పప్పుకు ఒక గింజ.

కాయ ఏది? గింజ లేవి?


ఒకడు జ్ఞానము మీద ఆసక్తి కల్గి భగవద్గీతను చదివాడు. భగవద్గీతలో జ్ఞానమును సంపూర్ణముగా తెలియగలిగితే

దేవుడు తెలియుటకు దారి ఏర్పడునని తెలిసింది. జ్ఞానము కావాలంటే శ్రద్ధవుండాలని కూడా గీతలోనే చెప్పారు.

అప్పుడు సోమన్న అనునతడు ఎక్కువ శ్రద్ధగలిగి జ్ఞానమును తెలుసుకొనుచుండెను. అటువంటి సమయములో ఒక

రాత్రి సోమన్న నిద్ర పోయిన తర్వాత అతనికి స్వప్నము వచ్చినది. ఆ స్వప్నములో పెద్దగా వర్షము కురిసిన దానివలన

ఒక నది నిండుగా ప్రవహిస్తున్నది. అటువంటి నది ఒడ్డున నిలబడిన సోమన్న, కాలుజారి నదిలో పడి కొట్టుక

పోవుచుండెను. అటువంటి కష్ట సమయములో కూడా సోమన్న జ్ఞానమును గురించే ఆలోచిస్తూ "అయ్యో! నేను

ఇప్పుడు నదిలో చనిపోతే నాకు దేవుని జ్ఞానమెలా తెలుస్తుంది” అని అనుకొనుచుండెను. అంతలోనే అతనికి ఒక

ఎండిపోయిన గుమ్మడికాయలాంటి కాయ దొరికింది. సోమన్న దానిని పట్టుకొన్నాడు. ఆ కాయ నీటిలో తేలుతూ

పోవుచుండగా, సోమన్న కూడా నీటిలో మునగకుండ తేలుచు పోవుచుండెను. అంతలోనే కాయ ఒక ఒడ్డుకు పోయి

ఆగింది. అప్పుడు సోమన్న కాయను తీసుకొని, ఒడ్డు ఎక్కి బయటికి వచ్చాడు. తనను రక్షించిన కాయను తనవద్దనే

ఉంచు కోవాలనుకొన్నాడు. అప్పుడు ఆ కాయ, ఏమికాయ అని చూచాడు. అది ఇంతకు ముందు ఎప్పుడూ చూచిన

కాయకాదు. దాని పేరేమో కూడా తెలియదు. దాని చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది అప్పుడు

పచ్చికాయనా లేక ఎండిన కాయనా అని చూచినా అర్థము కాలేదు.


పైన ఎటుచూచినా అర్థముకాని ఆ కాయను పగలగొట్టి చూస్తే అది ఏ కాయ అయినదీ, పచ్చిదైనదీ, ఒట్టిదైనదీ

తెలిసిపోవునని అనుకొన్న సోమన్న దానిని భూమికేసి కొట్టి పగలగొట్టాడు. అప్పుడు ఆ కాయ మూడు ఒప్పులుగా

చీలిపోయినది. అలా మూడు ఒప్పులుగానున్న కాయను సోమన్న గతములో ఎప్పుడూ చూడలేదు. విత్తనములు చూస్తే

తెలుస్తుందను కొన్న సోమన్న దానిలో విత్తనములను వెదకగా, కాయలోని మూడు ఒప్పులలో, ఒక్కొక్క ఒప్పులో

ఒక్కొక్క విత్తనము మాత్రమున్నది. ఆ మూడు విత్తనములను కూడా సోమన్న ఎప్పుడూ చూడలేదు. విచిత్రమేమనగా

మూడు విత్తనములు ఒక్కొక్కటి ఒక్కొక్క పరిమాణములో ఉన్నవి. అందులో ఒకటి చిన్న విత్తనముగా, మరొకటి పెద్ద

విత్తనముగా ఉన్నది. ఇంకొకటి మధ్య రకముగా ఉన్నది. మూడూ, మూడు పరిమాణముల విత్తనములు, ఏ కాయలో

ఉండవని అనుకొన్న సోమన్న ఆ కాయను గురించి ఎవరైనా తెలిసినవారుంటే, వారిని అడిగి తెలుసుకోవాలనుకొన్నాడు.

అందువలన కాయ మూడు ఒప్పులనూ, మూడు విత్తనములనూ జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని ఉండెను. ఒక దినము

సోమన్న వున్న ఊరికి ఒక మహర్షి వచ్చాడని తెలిసి, ఆయనవద్దకు కాయను తీసుకొని పోయి చూపించి, దానిని

గురించి అడగదలచుకొన్నాడు.


సోమన్న, కాయ మూడు భాగములనూ, మూడు విత్తనములనూ తీసుకొని పోయి ఆ మహర్షికి చూపించాడు.

సోమన్న, నదీ ప్రవాహము నుండి అన్ని విషయములు వరుసగా మహర్షికి చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి, సోమన్నను

చూచి "ఇది భూమిమీద ఏ చెట్టుకూ పుట్టు కాయకాదు. నీవు జ్ఞానము మీద ఆసక్తిగాయుండుట వలన దేవుడే

స్వయముగా ఈ కాయను నీకిచ్చాడు. ఇది చూచుటకు కాయలాగా ఉండినా, ఇది ఒక జ్ఞాన సందేశములాగ ఉన్నది.

నాకు తెలిసిన జ్ఞానము ప్రకారము ప్రవాహములో దొరికిన కాయ దేవునికి ప్రతిరూపములాంటిది. సృష్ఠికి పూర్వము


దేవుడుగాయున్నవాడు, సృష్ఠి తర్వాత జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు భాగములుగా విడిపోయాడు. ఆ మూడు

ఆత్మలకు గుర్తుగా కాయ మూడు భాగములుగా చీలిపోయినది. మూడు భాగములకు మూడు పేర్లుండుట వలన, ఆ

పేర్లకు గుర్తుగా మూడు చిన్న, పెద్ద, మధ్య విత్తనములు ఉన్నవి. దీనినంతటిని గమనించితే ఈ కాయ లభించిన

దానివలన త్వరలో నీకు మూడు ఆత్మల జ్ఞానము అర్థము కాగలదు అను సూచన తెలియు చున్నది." అన్నాడు. ఆ

మాట వింటూనే సోమన్నకు చాలా సంతోషమైనది. అప్పుడే మెలకువ వచ్చినది. అదంతా స్వప్నమే అయినా,

సోమన్నకు మాత్రము సత్యముగానే అర్థమైనది.


యోగి అంటే ధనికునికంటే గొప్పవాడు.

***

30. రెండు మోములు గల వాడెవడు?


రెండు మోములవాడు అనగా రెండు ముఖములవాడని అర్థము. ఒకే శరీరమునుండి ముఖములు రెండుగల

వానిని రెండు మోములవాడని చెప్పవచ్చును. నేను ఒక వ్యక్తిని చూచాను. అతనికి ఒక ముఖమేవున్నా రెండు

బుద్ధులున్నవాడు అని అందరూ అనేవారు. అతను రెవిన్యూ డిపార్టుమెంటులో ఒక ఉన్నత ఉద్యోగి. అతని క్రింద

ఉత్తర భారతదేశము వారూ, దక్షిణ భారతదేశమువారూ ఇరువురూ పని చేయుచుండిరి. ఉద్యోగి ఉత్తర

భారతదేశమునకు సంబంధించినవాడైన దానివలన, ప్రాంతీయ అభిమానముతో ఉత్తర భారతదేశము వారిని మంచిగా

చూచుకొనుచూ, దక్షిణ భారతదేశమువారిని అనేక ఇబ్బందులకు గురి చేయుచుండెను. ఒకే ఆఫీసర్ కొందరిపట్ల

మంచిగా, కొందరిపట్ల చెడుగా ప్రవర్తించడము చూచి, అతని క్రింద పనిచేయువారు కొందరు, అతనిని రెండు తలల

పాము అని కొందరనుచుండగా, కొందరు రెండు ముఖముల రాక్షసి అనెడి వారు. ఇదంతా ఆ ఆఫీసర్ ప్రవర్తననుబట్టి

వచ్చిన మాటలేనని అర్థమైనది. అదే విధముగా మన శరీరములో కూడా మనము చేసుకొన్న పాపపుణ్యములను బట్టి,

ఆత్మ రెండు రకములుగా ప్రవర్తించుచున్నది. మనిషి పాపమును అనుభవించవలసి వచ్చినప్పుడు, ఆత్మ దానికి తగినట్లు

పని చేసి మనిషిని శిక్షించును. అలాగే మనిషి పుణ్యమును అనుభవించవలసి వచ్చినప్పుడు ఆత్మ పుణ్యమునకు

తగినట్లు పనిచేసి, ఆ జీవునకు సుఖమును అందించును. శరీరములో అన్ని పనులు చేయునది ఆత్మయే అయినందున,

జీవుడు చేసుకొన్న పాపపుణ్యములను అనుసరించి కొన్ని సమయములలో జీవున్ని కష్టపెట్టునదిగా ఉండును. అలాగే

కొన్ని సమయములలో జీవున్ని సుఖపెట్టునదిగా ఉండును. అందువలన ఈ పొడుపు కథలో రెండు మోముల వాడెవడు?

అను ప్రశ్నకు ఆత్మ అని చెప్పడమే సరియైన జవాబగును.


యోగశక్తి అంటే దేవుని శక్తియేనని గుర్తుంచుకో.

***


31. తోక ఉందిగానీ కోతికాదు, ఎగిరి పోతుంది గానీ పక్షిగాదు. ఏది?


ఆధ్యాత్మిక విద్యలో బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి మనస్సును అనేక విధముల జంతువులతోనూ,

పక్షులతోనూ పోల్చి చెప్పుకోవడము జరిగినది. మనస్సు మననము చేయు పనిని కూడా చేయును. గడచి పోయిన

దానినీ, జరుగబోవు దానినీ, మనస్సు జ్ఞాపకము చేయును. గడచిన దానిని జ్ఞప్తి చేయగా, జరుగబోవుదానిని గురించి

అంచనాలతో ముంచి వేయును. అలాంటపుడు మనస్సు ఎంత నీచముగానైనా ఉండి చూపు చుండును. ఎంతటి

నీచముగానున్న విషయములనైనా చూపునది కావున, మనస్సును వేమనయోగి పందిగా పోల్చి చెప్పాడు. మనస్సు

ఎంతో చంచలమైనది కావున, ఒకరు కుక్కగా పోల్చితే, మరొకరు కోతిగా పోల్చి చెప్పారు. అంతేకాక మనస్సు ఎంతో

బలమైనది కూడా! దానిని ఎవరూ కట్టడి చేయలేరు. అందువలన మనస్సును వేమనయోగిగారు ఏనుగుగా కూడా

పోల్చి చెప్పారు. అందువలన కొందరు పొడుపు కథ జ్ఞానులు మనస్సును తోకుందిగానీ కోతిగాదు, ఎగిరి పోతుందిగానీ

పక్షికాదు అన్నారు. మనస్సు, వేగముగల గుర్రములాంటిది మరియు ఎగిరిపోవు పక్షిలాంటిది అయినందున, రెక్కల

గుర్రముగా మనస్సును చిత్రించి చూపిన వారు కూడా కలరు. ఇన్ని విధములనున్న మనస్సును జయించడము, గాలిని

మూటకట్టి నట్లుంటుందని భగవద్గీతలో అర్జునుడు చెప్పాడు. చెట్టు మీద కోతిలాంటి మనస్సునూ, ఆకాశములో

పక్షిలాగ ఎగిరే మనస్సునూ జయించిన వాడు బ్రహ్మయోగి కాగలడు.


మతము మరణము వరకే, పథము ముక్తి పొందువరకు ఉంటుంది.

***

G

32. ఒక చెట్టుకు రెండు కాయలు, నాలుగు కొమ్మలు,

అంతా పూత ఉంది. ఎక్కడ? ఏది?


శరీరము ఎట్లు తయారైనదని తెలియకనే, నేను జ్ఞానిని అని ఎవడైనా అంటే, ఏనుగు గంపక్రింద గ్రుడ్డు

పెట్టిందనుట ఎంత సత్యమో, శరీర జ్ఞానము తెలియనివాడు జ్ఞానిని అనడము అంతే సత్యమగును. ఏనుగు గ్రుడ్డు

పెట్టడమే అసత్యము. గంపక్రింద అని చెప్పడము మరీ విడ్డూరమైన అబద్దమగును. అలాగే శరీర యంత్రాంగమును

తెలియనివాడు, జ్ఞానిని అనడము పూర్తి విడ్డూరమైన అసత్యమగును. అందువలన ఆత్మ జ్ఞాని అగుటకు ముందు ఆత్మ

నివసించు శరీరమును గూర్చి పూర్తిగా తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే, వాడు ఎప్పటికైనా అజ్ఞానియేగానీ, ఆత్మ

జ్ఞాని కాలేడు.


ఈ పొడుపు కథలో ఒక చెట్టు అనగా! ఒక శరీరమనియే అర్థము. చెట్టుకు కాయలుండడము

సహజమే. అలాగే మనిషికి కర్మ ఫలముండడము సహజమే. చెట్టన్నాక కాయ, మనిషన్నాక కర్మ ఉంటాయి. మనిషి

అను చెట్టుకు, పాపము పుణ్యము అను రెండు రకముల కర్మకాయలున్నవి. అందువలన ఈ పొడుపు కథలో చెట్టుకు

రెండు కాయలు అన్నారు. బయటి చెట్టుకు కొమ్మలు ఎన్నయినా ఉండవచ్చును గానీ, మనిషికి మాత్రము నాలుగు

కొమ్మలుగా, గుణచక్రము విభజింపబడి యున్నది. నాలుగు కొమ్మలున్న మానవ వృక్షమునకు, పాపపుణ్యమనునవి

సుఖ దుఃఖ రూపములో ప్రస్తుతానికి రెండు కాయలు కాసినది నిజమే. ఇంకా భవిష్యత్తులో ఎన్నో కర్మలు

పండవలసియున్నది. అందువలన మూడుకొమ్మ లలో మాత్రము పూత చాలా వున్నది. నాల్గవకొమ్మలో కూడా ఉండీ

ఉండక అక్కడక్కడ కనిపిస్తూవున్నది. మానవ వృక్షము యొక్క విషయమును గురించి, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి


యోగమున, మొదటి రెండు శ్లోకములలోనే ఇదే విషయమునే చెప్పారు. జరుగబోయే కాలములో అనుభవించవలసిన

కర్మ పూతగా ఉంది. తామస, రాజస, సాత్త్విక, యోగ అను నాలుగు కొమ్మలకు పూత ఉండగా, కాసే కాయలు

(కర్మఫలములు) మంచివి, చెడువి అను రెండు రకములు గలవు. ఈ పొడుపు కథలో మానవ వృక్షమును గురించి,

కర్మ ఫలములను గురించి, చెట్టుమీద జీవుడను పక్షివుండు నాలుగు కొమ్మలను గురించి చెప్పడమైనది.


దేహమునకు దేహి భర్తయగును, నీవు ఏమీ కావు.

***

33. సిగ్గుపడేవాడు ఒకడు, సిగ్గుపడనివాడు ఒకడు.

ఇద్దరూ కలిసి గ్రుడ్డివానివద్ద జీతమున్నారు. ఎవరు?


ఈ పొడుపు కథలో ఇద్దరు కూలివాళ్ళు లేక జీతగాళ్ళు ఉన్నారు. ఇద్దరితో పని చేయించుకొనే ధనికుడు ఒకడు

గలడు. ధనికుడు గ్రుడ్డివాడు. గ్రుడ్డివాడు ఏ పని చేయలేడు. అందువలన ఇద్దరితో పనిని చేయించు కొంటున్నాడేమో

వివరముగా చూస్తాము. ఒక ఊరిలో ఒక ధనికుడున్నాడు. అతను గ్రుడ్డివాడు. గ్రుడ్డివాళ్ళకు కళ్ళులేకున్నా నిఘా

ఎక్కువ ఉంటుంది. అందువలన పేరుకు గ్రుడ్డివాడేగానీ, చూడని దానిని కూడా చెప్పగలడు. తన ఇంటిలో ఇద్దరు

అన్నదమ్ములను పని చేయుటకు నియమించుకొన్నాడు. వారు ఇద్దరూ అన్నదమ్ములే అయినా, ఇద్దరూ వేరువేరు

మనస్తత్త్వములు గలవారుగా ఉన్నారు. వారిలో చిన్నవాడు ఏ పనిని చేయాలన్నా సిగ్గు పడుతూ ఉంటాడు. సిగ్గు

ఉండుట వలన, వాడు ఎవరిముందరా పని చేయడు. పెద్దవానికి సిగ్గు ఎగ్గు అను గుణములు ఏమాత్రము లేవు. ఏ

పనిని అయినా, ఎవరి ముందరైనా చేయగలడు. పెద్దవాడు ఓర్పుగా, ఎక్కడా సిగ్గుపడకుండా పనులు చేయుచుండెను.

ఇద్దరూ ఒకే ఇంటిలో ఉండుట వలన, చిన్నవాడు సిగ్గుతో ఏ పనినీ చేయకున్నా, పెద్దవాడే చిన్నవాని పనిని కూడా

చేసిపెట్టుచుండెను. ఇంటి పని అంతటినీ ఇద్దరికీ ధనికుడు అప్పచెప్పియున్నందున, పెద్దవాడు పనిచేయుటకు సిగ్గుపడనివాడై

ఇంటిలోని అన్ని పనులూ చేయుచుండగా, చిన్నవాడు మాత్రము పని చేయకుండా పెద్దవాని చాటునవుంటూ పెద్దవాడు

చేసి పెట్టిన దానిని తినుచుండెను. ఇట్లు దాదాపు ఎనభై (80) సంవత్సరములు పని చేయగా, గ్రుడ్డియజమాని

పెద్దవానిని పిలిచి "ఎనభై సంవత్సరములుగా నీవు పని చేస్తావుంటే నీ తమ్ముడు ఊరక కూర్చొని తింటున్నాడు. అలా

పని చేయకుండా తినడమే కాకుండా, నాకు భోజనము తెచ్చినప్పుడంతా, ఎవరు చేశారు వంటను అని నేను అడిగితే,

మా అన్న చేశాడని ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఎప్పుడు అడిగినా నేనే చేశానని నాతో అబద్దము చెప్పుచూ వచ్చాడు.

నేను గ్రుడ్డివానిననీ, ఏమి చెప్పినా వింటాడనీ, నాతో పూర్తిగా అసత్యమే చెప్పాడు. వీడు గ్రుడ్డివాడు అని నన్ను తక్కువ

అంచనావేశాడు. నేను గ్రుడ్డివాడినైనా, నాకు చూపులేకున్నా, నా నిఘాలో నేను అన్నిటినీ చూడగలను. మీరు ఈ

ఇంటిలో ఇన్ని

రోజులు పని చేశారు. ఇంక చాలు మీరు వేరే ఇల్లు చూచుకోండి" అని చెప్పాడు. ఆ మాటలు విన్న

సిగ్గులేని పెద్దవాడు, “ఇంతకాలము నీవద్ద పని చేసినవారము కదా! ఇప్పుడు వేరే వారివద్ద పని చేయలేము. నీవద్దే

పని చేస్తాము” అని అన్నాడు. అప్పుడు ధనికుడు “ప్రక్క ఊరిలో నాదే ఇంకొక ఇల్లు వుంది, నేను కూడా అక్కడ

ఉంటాను, మీరు ఆ ఇంటికి పోయి పని చేయండి” అని చెప్పి పంపాడు. అక్కడనుండి ఇద్దరు అన్నదమ్ములు

బయలుదేరి, ప్రక్క ఊరిలో ధనికుని ఇంటిలోనే దిగి పోయారు. అక్కడ పని చేయుటకు మొదలు పెట్టారు. అక్కడ


కూడా చిన్నవాడు సిగ్గుపడుచూ పని చేయకుండావుంటే ప్రక్క వీధిలోని ఒక గురువులాంటి పెద్దాయన, చిన్నవాని

బుద్ధికి జ్ఞానమును చెప్పాడు.


గురువుగా చలామణి అగుచున్న వ్యక్తి, చిన్నవానికి అనేక విధముల బోధించి, "మీ అన్న శ్రమపడుచుంటే, మీ

అన్న చేసిన దానినంతా నేనే చేశానని నీవు ఇతరులకు చెప్పుకోవడము మంచిది కాదు. అట్లు చెప్పుట వలన మీ

అన్నకు ద్రోహము చేసినట్లగును. అన్నకు ద్రోహము చేయుట ఆత్మను ద్రోహము చేసినట్లేనని చెప్పగా, అప్పుడు

చిన్నవాడు నాకు ఇప్పుడు జ్ఞానోదయమైనది. ఇప్పటినుండి అబద్ధము చెప్పనని ఆ వృద్ధునికి చెప్పి, అప్పటినుండి

సత్యమును చెప్పుటకు ప్రయత్నించుచుండెను. అప్పుడప్పుడు అలవాటు ప్రకారము అసత్యమును చెప్పినా తిరిగి ఎరుకలోనికి

వస్తూ, సిగ్గును వదలివేసి నిజమును చెప్పుటకు అలవాటుపడవలెనని అనుకొని అదే ప్రయత్నమును చేయసాగెను.

చూచారా! ఇద్దరు అన్నదమ్ముల చరిత్ర ఎలావుందో! బయట వారు ఇద్దరూ ఉన్నట్లు, మన శరీరములో కూడా ఆత్మ,

జీవాత్మ అను ఇద్దరు సోదరులు గలరు. వారు ఇరువురిలో పెద్దవాడైన ఆత్మ సిగ్గులేకుండా ఎల్లవేళల పనిని చేయగా,

జీవాత్మ అను చిన్నవాడు సిగ్గుపడుచూ, ఏ పనిని చేయకుండా, వంట గదిలో కూర్చొని అన్న వండిన దానిని తినుచుండెను.

అయితే ఎవరు అడిగినా వంటను తానే చేసినట్లు అందరికీ చెప్పుకొనుచుండెను. ఆత్మజ్ఞానమును బోధించు భగవద్గీతలో

జీవుడు గుణములలో ఉన్నాడని తెలిసినది. అట్లే ఆత్మ గుణములలో లేకుండా శరీరములో పని చేయుచున్నదని ఉన్నది.

అంతేకాక జీవాత్మ, శరీరములో తాను ఏ పనిని చేయకున్నా ఆత్మ చేసిన పనినంతా తానే చేశాననీ, అహము చేత

చెప్పుట వలన జీవునికి కర్మ అంటుకొనుచున్నదనీ గీతలో తెలియు చున్నది. శరీరములోనే జీవాత్మ, ఆత్మలకంటే

వేరుగానున్న పరమాత్మ రూప, నామ, క్రియలు లేనివాడైయుండి, అన్నిటిని సాక్షిగా చూస్తున్నాడు. పరమాత్మ అన్నిటికీ

అధిపతియైనా, శరీరమును ఆత్మకు జీవాత్మకు వదలివేసి చూస్తున్నాడు. గీతను చదివినవారు, గీతలోని జ్ఞానమును

గ్రహించినవారు, మనిషిలో జరుగుచున్న అక్రమమును చూచి జీవుడుగానున్న వాడు, చేయని పనిని తానే చేశానని

అనవసరముగా అనుకొని కర్మను సంపాదించు కొంటున్నాడని తెలిసినవారు, మనిషిని జ్ఞానముతో హెచ్చరించగా,

జీవుడు అయినవాడు కొన్ని చోట్ల, కొందరిలో, జ్ఞానులు చెప్పిన మాటను ఏమాత్రము వినకుండ అహమును వదలకుండ

తమ అజ్ఞానములో తాము ఉన్నారు. కొన్నిచోట్ల ఏదో ఒక జీవుడు జ్ఞానుల మాటలను గ్రహించినవాడై తన తప్పును

తాను తెలుసుకొని, ఇప్పటి నుంచయినా చేయని పనిని తానే చేశానని చెప్పకూడదనుకొని ప్రయత్నము చేయుచున్నాడు.

ఈ పొడుపు కథలో ఎంతో జ్ఞానమును ఇమిడ్చి జీవాత్మ, ఆత్మలను జీతగాళ్ళుగా చెప్పి అందులో గుణములున్న వాడు

జీవాత్మయనీ, గుణములులేనివాడు ఆత్మని తెలియునట్లు సిగ్గున్నవాడు, సిగ్గులేనివాడని చెప్పి, పరమాత్మను ఆయన

స్థాయికి తగినట్లు గ్రుడ్డివానిగా చెప్పడము ఎంతో విశేష జ్ఞానము. ఇదంతయు చదివిన తర్వాత ఇద్దరు జీతగాళ్ళు

ఎవరో గ్రుడ్డివారు ఎవరో తెలిసిపోయింది కదా! ఈ కథ మూడు ఆత్మల స్థితిని తెలుపునదిగా ఉన్నది.


నీ దేహములో నీ చిరునామా నీకు తెలుసునా?

***

34. వారు వట్టి ఇరవై ఐదు, ఇరవై ఆరు. వారు ఎవరు?


పరమాత్మ సృష్ఠినంతటినీ తన ప్రకృతికి అప్పజెప్పాడు. ప్రకృతియే జీవరాసులను పుట్టునట్లు, జీవించునట్లు,


చచ్చునట్లు చేయుచున్నది. సృష్టినీ సృష్టిలోనున్న జీవరాసులనూ దేవుడు ప్రకృతికి అప్పజెప్పి, తాను ఏమీ చేయని

వాడుగా ఉన్నాడు. జగతిలోని సమస్త కార్యములను ప్రకృతియే చేయుచున్నది. ప్రకృతి మనకు ఐదు భాగములుగా

కనిపిస్తున్నది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగముల ప్రకృతి తన భాగములను ఉపయోగించి

మానవ శరీరమును తయారు చేసినది. ఆ కార్యక్రమములో పంచభూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగా విడి

పోయినవి. అలా విడిపోగా 5x5=25 భాగములు తయారైనవి. 24 భాగములను వదలి, 25వ భాగములో

ఒకదానియందు జీవాత్మ కలిసి పోయింది. ఆకాశము శూన్యముగా ఉండును కనుక ఆకాశ భాగములలో ఒక దానిలో

కలిసిపోయిన, జీవాత్మ కొంత ప్రకృతి వాసన కల్గియున్నాడు. దేవుడు మూడు భాగములుగా విభజింపబడి జీవాత్మ,

ఆత్మ, పరమాత్మలుగా ఉన్నాడు. మూడు ఆత్మలు వేరుగా, ప్రకృతి వేరుగా ఉంటే, ప్రకృతితో తయారైన శరీరములో

ఆత్మలు నివసించుటకు వీలుపడదు. అయితే జీవాత్మ ఆకాశముయొక్క అంశతో కలిసిపోవుట వలన, శరీరములో

నివసించుటకు వీలుపడినది. లేకపోతే జీవుడు ప్రతిమ శరీరము నుండి బయటికి వచ్చునట్లు, మనిషి శరీరమునుండి

ఎప్పుడంటే అప్పుడు బయటకు రాగలడు. అట్లు కాకుండా ఉండుటకు ఆకాశ భాగముతో జీవుడు అతికించబడ్డాడు.

జీవునితో పాటు ఆత్మ ఉండుట వలన ఆత్మ కూడా శరీరములోనే జీవునితో సహా చిక్కుకొన్నది. శరీరములో ప్రకృతి

నుండి తయారైన భాగములు మొత్తము 24 కాగా, 25వ వాడుగా జీవాత్మ ఉన్నది. అలాగే 26వ వాడుగా ఆత్మయున్నది.

శరీరములో ప్రకృతి తత్త్వముల భాగములు 24 కాగా, ఆత్మ తత్త్వ భాగములు రెండు మాత్రము గలవు. అందువలన పై

పొడుపు కథలో వారు వట్టి ఇరువై ఐదు, ఇరవై ఆరు అని చెప్పారు. 25, 26గా నున్నవారు ఎవరో ఇప్పుడు తెలిసిందా!

ఈ కథలోని ప్రశ్న జీవాత్మ, ఆత్మలను గురించి చెప్పెనదని తెలిసిపోయింది.


దేహములో నీవు మూడు అయితే, ఆత్మ ఆరవుతుంది.

***

35. నలుగురితో చావు పెళ్ళితో సమానము, అంటే ఏమిటి?


పెళ్ళి అనగా దేవుడనీ, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు అనగా దేవుని కూతురు, దేవుని కొడుకనీ చెప్పుకొన్నాము.

పెళ్ళి దేవుడైనపుడు, పెళ్ళితో సమానము అంటే దేవునితో సమానముగా కలిసి పోవడమని అర్థము. దానినే ముక్తి లేక

మోక్షము అంటాము. ఇప్పుడు మనకు తెలియవలసింది నలుగురితో చావడము అంటే ఏమిటి? మన శరీరములో

జీవుడు నాలుగు రకముల పేర్లు కలిగియున్నాడు. ఒకటి తామసుడు, రెండు రాజసుడు, మూడు సాత్త్వికుడు, నాలుగు

యోగి. ఈ నాలుగు పేర్లు ఆయా స్థానములను బట్టి వచ్చినవి. జీవుడు నివసించు గుణచక్రము మొత్తము నాలుగు

భాగములుగా ఉన్నది. అందులో ఒకటి తామసము, రెండు రాజసము, మూడు సాత్వికము, నాలుగు యోగము అను

పేర్లు కలిగియున్నవి. జీవుడు ఏ స్థానములో ఉంటే, ఆ స్థానము యొక్క పేరు వానికి వస్తుంది. ముందుగల మూడు

భాగములలో గుణములున్నవి. ఒక్కొక్క భాగములో 12 గుణములు ఉన్నవి. మూడు గుణ భాగములలోని 36

గుణములను మాయ అంటున్నాము. ఇక నాల్గవభాగమైన యోగ భాగములో గుణములు లేవు. ఈ భాగములో

మూడు గుణ భాగములకంటే ఎక్కువ కాలము గడిపిన యోగి, తన కర్మలన్నిటిని నాశనము చేసుకోగల్గును. అప్పుడు

నాల్గవ భాగమును కూడా వదలి జీవుడు దేవునిలోనికి కలిసిపోవును. ఈ విధముగా నాలుగు భాగములను దాటినవాడు

దేవునియందైక్యమగునను మాటను కొంత మార్చి “నలుగురితో చావు పెళ్ళితో సమానము” అని పొడుపు కథలో


చెప్పారు. పెళ్ళితో సమానమంటే దేవునిలో కలిసిపోవడమనీ అర్ధము. అలా దేవున్ని కలవడానికి నాలుగు భాగములను

వదలడానికి సిద్ధము కావాలని ఈ కథ సారాంశము.


నీవు కర్మకు బాకీ ఉన్నావు. ధనికునివి కమ్మంటున్నాను.

***

36. చేసేది ఒకడైతే, మేసేది ఇంకొకడు. ఎవడు?


సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు, చేసేది ఒకడైతే దాని ఫలితమును అనుభవించేవాడు మరొకడు అని ఈ

కథలో చెప్పారు. ప్రపంచములో కర్మను చేసుకొన్నవాడు పని చేయుచుండగా, కర్మలులేనివాడు పని చేయడని విన్నాము.

అయితే దానికి విరుద్ధముగా కర్మలు లేనివాడు పనిని చేయుచుండగా, కర్మలున్నవాడు పనిని చేయడములేదు. దీనిని

విన్నవారు అదెలా సాధ్యమగును? కర్మలున్నవాడు పని చేయడము, కర్మలు లేనివాడు పని చేయకుండ ఉండడము

అంటే సరిపోతుంది. కానీ మీరు దానికి వ్యతిరేఖముగా చెప్పచున్నారేమిటి అని ఎవరైనా అడుగవచ్చును. దానికి మా

జవాబు ఏమనగా! ఎవరు ఎంత చేయుచున్నారన్నది ముఖ్యముకాదు, ఎవరు ఎంత అనుభవిస్తున్నారన్నది ముఖ్యము.

తక్కువ కర్మ ఉన్నవాడు ఎక్కువ పని చేసినా తక్కువ అనుభవించును. ఎక్కువ కర్మయున్నవాడు తక్కువ పనిచేసినా

ఎక్కువ అనుభవించవచ్చును. ఈ సూత్రము ప్రకారము మన శరీరములో జీవాత్మ ఎక్కువ కర్మ చేసుకొని తక్కువ పని

చేసి ఎక్కువ అనుభవిస్తున్నది. ఇక ఆత్మ విషయమునకు వస్తే ఆత్మకు కర్మయే లేదు. అయినా ఎక్కువ పని చేయుచున్నది,

ఏమీ అనుభవించడములేదు.


అనుభవములను ప్రక్కన పెట్టి పైకి కనిపించునది చూస్తే శరీరములో ఆత్మ పనిచేయుచుండగా, జీవాత్మ ఏమీ

చేయకుండా అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. కనిపించు దానినిబట్టి "చేసేది ఒకడైతే మేసేది ఇంకొకడు" అని ఈ

పొడుపుకథలో చెప్పారు. అయితే ఇక్కడ పని చేయునది ముఖ్యమా? అనుభవించునది ముఖ్యమా? అని తర్కించి

చూచితే అనుభవమే ముఖ్యమని తెలియుచున్నది. ఎంత చేసుకొన్నవాడు అంత అనుభవించునను మాట ప్రకారము,

జీవాత్మకు కర్మ ఎక్కువ ఉన్నది కావున ఎక్కువ అనుభవిస్తున్నదని చెప్పవచ్చును. ఈ సూత్రమును వదలి చూస్తే చేసేది

ఒకడైతే, మేసేది ఇంకొకడన్నట్లుండును.


తలమీద పేను, తల లోపల కర్మ నిన్ను పీడిస్తూనే ఉంటాయి.

***

37. నాకూ లేదు, నీకూ లేదు, ఊరుకో దేవరా! వీరు ఎవరు?


ఒక ఊరిలో ఒక దేవాలయమున్నది. దాని పూజారి దేవాలయ ప్రాంగణములోనే ప్రక్కగదిలో ఉన్నాడు.

రాత్రిపూట గుడిలో పూజారి, దేవతా ప్రతిమ తప్ప ఎవరూ ఉండరు. అది వీరభద్ర దేవాలయము. వీరభద్ర స్వామి

అప్పుడప్పుడు ఎవరి మీదికైనా పూనకము వచ్చి మాట్లాడేవాడు. వీరభద్రస్వామి మనుషులలోనికి వచ్చి మాట్లాడడము

వలన ఆ గుడికి ఎక్కువమంది భక్తులు వచ్చెడివారు. వీరభద్రస్వామికి కానుకలు కూడా ఎక్కువ వచ్చేవి. రాత్రిపూట ఆ


గుడిలో పూజారి తప్ప ఎవరూ ఉండరని తెలుసుకొన్న ఒక దొంగ, ఆ గుడిలో ఒక రోజు దొంగతనము చేయాలను

కొన్నాడు. దానికి తగిన ఏర్పాట్లన్నియు ముందే చేసుకొన్నాడు. ఒక దినము రాత్రిపూట ఆలయములోనికి దొంగ

ప్రవేశించాడు. ఆ గుడిలోని వీరభద్రుని సొమ్ములన్నిటిని తీసుకొన్న దొంగ ప్రక్కనేయున్న పట్టువస్త్రములను కూడా

మూటగట్టుకొన్నాడు. తర్వాత పూజారి ఇంటిలోనికి దూరి పూజారి గుడ్డలతో సహా మూటగట్టుకొన్నాడు. తర్వాత

చివరిగా గుడిలోనికి వచ్చిచూడగా పూజారి మంచి పట్టు పంచెకట్టుకొని పడుకొనియుండగా, ప్రతిమకు కూడా మంచి

పట్టువస్త్రముండుటను చూచాడు. ఆ దొంగకు వాటిని కూడా వదలను బుద్ధి పుట్టలేదు. మొదట ప్రతిమకున్న పట్టు

వస్త్రమును ఊడపెరుక్కున్నాడు. తర్వాత గాఢ నిద్రలోనున్న పూజారి పంచను కూడ చిన్నగ ఊడదీసుకొన్నాడు. వచ్చినందుకు

పని బాగానే అయ్యిందను కొన్న దొంగ, వీరభద్రస్వామికి నమస్కారము చేసి పోయాడు.


తెల్లవారకముందే ఐదుగంటలకే పూజారి లేచి, తాను చెడ్డీతో మాత్రమున్నట్లు చూచుకొని, నా పంచ ఎక్కడ

పోయింది అని అనుకొన్నాడు. తర్వాత నిద్రలో బాత్రూమ్కు పోయినప్పుడు అక్కడే ఊడి పోయినట్లుంది, నిద్రమత్తులో

చూచుకోలేదులే అనుకొన్నాడు. అంతలో వీరభద్రుని వైపు చూచాడు. వీరభద్రుని పంచకూడా లేదు. అప్పుడు పూజారికి

దొంగతనము జరిగిందేమోనని అనుమానము వచ్చినది. వెంటనే గుడిలోనికి పోయి వీరభద్రుని సొమ్ములు కూడా

పోయినట్లు గ్రహించాడు. తర్వాత తన ఇంటిలో చూచాడు. అక్కడ కూడా అన్నీ పోయినట్లు తెలుసుకొని గుడిలోని

దేవుడు, తాను ఇద్దరూ నిలువు దొపిడీ అయినట్లు గుర్తించాడు. తర్వాత సాయంకాలము వీరభద్రస్వామి వేరే మనిషిలోనికి

పూనకము వచ్చి తన సొమ్ములన్నీ పోయాయనీ, తన గుడ్డలన్నీ పోయాయనీ చెప్పి చెప్పి ఏడ్వ సాగాడు. అది చూచిన

పూజారికి ఆశ్చర్యమైనది. ఇంతకూ వీరభద్రస్వామి ఏడుస్తున్నాడా లేక పూనకము వచ్చినట్లు మనిషే నటిస్తున్నాడా అని

పూజారికి అనుమానము వచ్చి “ఎవరు నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు” అని అడిగాడు. అప్పుడు వీరభద్రస్వామి

ఇంకా గట్టిగ అరుస్తూ నా సొమ్ములు పోయాయి నా పంచలు పోయాయి అని దీర్గము దీస్తూ చెప్పెను. ఆ మాటతో

ఈయన వీరభద్రస్వామేనని పూజారికర్థమైనది. అంతలోనే వీరభద్రస్వామి దొంగను తిట్టుటకు మొదలు పెట్టి వాని

చేతులు పడిపోను, వాడు కట్టుకొన్న పంచను కూడా లాగుకొని పోయాడు అని చెప్పగానే, పూజారికి వీరభద్రస్వామి

మీద కోపము వచ్చి "కట్టుకున్న పంచ నాకూలేదు, నీకూ లేదు ఊరుకో దేవరా!” అని అన్నాడట, దానికి వీరభద్రస్వామి

ఊగుతూ “నాది పట్టుపంచరా” అన్నాడు. దానికి పూజారి “నాదీ పట్టు పంచే, నేను నీమాదిరి ఏడుస్తూ ఉన్నానా,

అంతకూ నాకు తెలియక అడుగుతాను. ఎవడో దొంగవచ్చి గుడిలోని సొమ్మును దోచుకొని పోతావుంటే నీవేమి

చేస్తావుంటివి. ఇప్పుడు ఏడ్చే బదులు అప్పుడు దొంగను తన్ని తరమ కూడదా?” అని అన్నాడు. దానికి వీరభద్రస్వామి

“నేను గుడిలో లేనప్పుడు వచ్చాడురా” అనగా పూజారి " గుడిలో లేకుండా ఎక్కడికి పోయి ఉంటివి?” అని అడుగగా!

అప్పుడు వీరభద్రస్వామి ఇలా అన్నాడు. “ఊరిలో పెళ్ళి అయింది కదా! ఏమైనా మిగిలివుంటే తిని వస్తామని పోయివుంటిరా”

ఆ మాట వింటూనే పూజారికి పూర్తి కోపము వచ్చి “నిన్ను గుడిలోని దేవతను కోవాలా లేక ఊరిలోని దయ్యమనుకోవాలా”

అని అన్నాడు. అప్పటినుండి తన బ్రతుకు తెరువుకని గుడిలో పూజ చేయుచుండెను. అంతేతప్ప వీర భద్రస్వామికని

చేయకుండెను.


ఇది ఒక గుడిలోని కథకాగా బయటిగుడిలో పూజారి, వీరభద్ర స్వామి ఇద్దరున్నట్లు మన శరీరమను గుడిలో

ఆత్మ, జీవాత్మ అను ఇద్దరు కలరు. బయట గుడిలో పూజారి పని చేయుచుండగా ప్రతిమగానున్న వీరభద్రస్వామి పని

చేయకుండా గుడికంతటికీ నేనే దేవున్ని అని అనుకొనెడి వాడు. అలాగే శరీర ఆలయములో కూడా అన్నివేళల పని


చేయు ఆత్మ ఊరకనే ఉండగా, పని చేయక ఒక్కచోట కదలకయున్న జీవాత్మ మాత్రము శరీరమునంతటికీ తానే

పెద్దయని అనుకోవడమేకాక, తన వలననే అన్ని పనులు జరుగుచున్నాయని అనుకొనుచున్నాడు. గుడిలో పూజారి

ఏడ్వకున్నా దేవత ఏడ్చినట్లు, శరీరములో ఆత్మ బాధపడకున్నా జీవాత్మ చిన్న నష్టానికి కూడా బాధపడుచున్నాడు.

అలాగే కొద్దిపాటి లాభానికీ సంతోషపడు చున్నాడు. ఈ విధముగా గుడిలోని పూజారి అన్ని పనులు చేస్తున్నా, ఏ పనీ

చేయని దేవత అన్నీ నేనే చేశానని అనుకొన్నట్లు, శరీరములో కూడా ఆత్మ అన్ని పనులు చేయుచున్నా, ఏ పనినీ

చేయని జీవాత్మ అన్ని పనులు నేనే చేస్తున్నానని అనుకొనుచున్నాడు. అందువలన ఒక్కొక్కప్పుడు ఆత్మయే జీవాత్మకు

బుద్ధి చెప్పినట్లు ఈ పొడుపు కథలో “నాకూలేదు, నీకూలేదు ఊరుకో దేవరా!” అని చెప్పి ఆ విషయము మనకర్థమగునట్లు

ఎవరు అని ప్రశ్నించి అడిగారని తెలియాలి.


సృష్టికర్త కోడ్-963, మాయ (సాతాన్) కోడ్-666.

***

38. ఉన్నోళ్ళలోకెల్ల చిన్నోడే మేలు, ఎవడు వాడు?


ఏ తండ్రికైనా చిన్నకొడుకు మీదనే ప్రేమ ఎక్కువగా ఉండును. ఎవరైనా అట్లెందుకు చిన్న కొడుకును ఎక్కువ

ప్రేమగా చూస్తావే అని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానము ఏమనగా! "ఉన్నోళ్ళకెల్ల చిన్నోడే మేలు” అని అంటారు.

ప్రపంచములో ఎవడు ఎట్లు చెప్పుకొనినా ఆధ్యాత్మిక రీత్యా జ్ఞానమును అనుసరించి మనము ఏమి చెప్పాలో

చూచుకొందాము. మనిషి అనగా పైకి కనిపించు స్థూల శరీరముతో సహా చెప్పుకోక లోపల యున్న జీవాత్మ వరకే

చెప్పుకొంటే ఆధ్యాత్మికము అవుతుంది. అందువలన లోపల జీవుడు ఎక్కడున్నాడు? ఏ ఆకారముతో ఉన్నాడు? ఏ

పేరుతో ఉన్నాడు? ఏ పనిని చేయుచున్నాడు? అని ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు జవాబులను వెదికితే అదియే

ఆధ్యాత్మికమగును. అలాంటిదే ఇప్పుడు చూస్తే జీవుడు తలయందున్న గుణచక్రములో నివసిస్తున్నాడు. గుణచక్రము

యొక్క చిత్రమును క్రింద చూడండి.  చిత్రమును 42 పేజీ లో చూడండి .

-1. తామస భాగము

-2. రాజస భాగము

3. సాత్విక భాగము

4. యోగ భాగము.


గుణచక్రము నాలుగు భాగములుగా ఉన్నదని తెలియుచున్నది. ఆ నాలుగు భాగములలోనే జీవుడు నివాసము

ఏర్పరచుకొనును. జీవుడు ఏ భాగములో నివసిస్తుంటే ఆ భాగము పేరు జీవునికి వర్తిస్తుంది. మొదటి భాగమైన

తామస గుణ భాగములో జీవుడు నివసిస్తుంటే ఆ జీవున్ని తామసుడు అని అనవచ్చును. తామస గుణ భాగము మిగతా

అన్ని గుణ భాగములకంటే విస్తీర్ణములో పెద్దదిగా ఉండును. రెండవ భాగమైన రాజస గుణ భాగములో జీవుడు


నివసిస్తూవుంటే ఆ జీవున్ని రాజసుడు అని పిలువవచ్చును. రాజసభాగము మొదటి తామస భాగముకంటే విస్తీర్ణములో

కొద్దిగ చిన్నదైయుండి సాత్విక భాగముకంటే కొద్దిగ పెద్దదిగా ఉండును. ఇక మూడవదైన సాత్విక గుణభాగములో

జీవుడు నివసిస్తూవుంటే వానిని సాత్వికుడు అని అంటాము. సాత్విక గుణ భాగము విస్తీర్ణములో రాజస భాగముకంటే

చిన్నదిగా ఉండును. ఇప్పటికి మూడు గుణభాగములు అయిపోయాయి. ఇక సాత్వికము తర్వాతయున్న నాల్గవ

భాగమును యోగ భాగము అని అంటాము. ఇది గుణ రహిత భాగము. ఈ భాగము సాత్విక గుణ భాగముకంటే

విస్తీర్ణములో చాలా చిన్నదిగా ఉండును. దాని విస్తీర్ణము సాత్వికముకంటే ఎంత తక్కువైనదీ చిత్రపటములో చూస్తూనే

తెలియును. గుణచక్రములో నాల్గవ భాగము చివరిది మరియు చిన్నది. యోగ భాగము చిన్నదే కాకుండా అందులో

గుణములులేక దైవికమైన యోగము ఉండుట వలన దానిని ఉత్తమమైన భాగముగా కూడా లెక్కింతురు. గుణచక్రమూ

దాని భాగములు ఏది ఎట్లున్నది తెలిసినవాడు “ఉన్న వాళ్ళలోకెల్ల చిన్నోడే మేలు” అని అన్నాడట. ఆ మాటలోని

ఆంతర్యము ఇపుడు మనకు తెలిసిపోయినది కదా!


కంటికి కనిపించు రూపముగా, చెవికి వినిపించు శబ్ధముగా ఉపదేశముండదు.

అందువలన ఉపదేశమని మంత్రములను చెప్పువారు, గురువులు కాదు.

***


39. నీవు దంచు, నేను ప్రక్క లెగుర వేస్తాను. అన్నది ఏది?


వీపుమీద ఒకచోట నవ్వ (దురద) పెట్టినప్పుడు ఇతరుల చేత వీపుమీద నవ్వ ఉన్నచోట బరికించుకుంటాము.

అప్పుడు అక్కడ దురద అణిగిపోతుంది. ముందున్న చోట దురద అణిగిపోతున్నట్లే దాని ప్రక్కనే దురుద వచ్చును.

ముందు లేని చోట దురద రావడము వలన అక్కడ కూడా గోకించుకొనిన (బరికించుకొనిన) అక్కడ నవ్వ అణిగిపోయి

దాని ప్రక్కనే కొత్త దురద వచ్చును. ఇట్లు వీపంతయు ఒకచోట గోకితే మరొక చోట దురద రావడము జరుగును.

చివరకు వీపంతయు బరకవలసి వచ్చును. అట్లు ఎందుకు జరుగుచున్నదనగా!


మన శరీరములో ప్రారబ్ధకర్మయనునది ఉండుట వలన ఆ కర్మను అనుసరించి మనకు కష్టసుఖములు

ఒకదానివెంట ఒకటి వచ్చుచుండును. ఒక సుఖముగానీ లేక దుఃఖముగానీ కర్మ ప్రకారము వచ్చినదనుకొనుము.

అప్పుడు దానిని అనుభవించిన తర్వాత మరియొక సుఖమో లేక దుఃఖమో వెంటనే వచ్చుచుండును. కొంత కర్మ

అయిపోయిన తర్వాత కొంతసేపు ఏ కర్మా అనుభవమునకు రాదు అని చెప్పుటకు వీలులేదు. భగవద్గీతలో ఎవడుగానీ

కర్మను అనుభవించకుండా ఒక్కక్షణము కూడా ఉండుటకు వీలులేదని చెప్పబడినది. ఒక కర్మ అయిపోతూనే మరియొక

కర్మ రావడము శాస్త్రబద్ధమైన పనియని చెప్పవచ్చును. కర్మ అనుభవిస్తూనే అయిపోతుంది. ప్రతి మనిషి కర్మను

అనుభవించి అయిపో చేసుకొంటున్నాడు. ఒక కర్మను అనుభవించిగానీ లేక జ్ఞానము చేతగానీ అయిపోజేసుకోవచ్చును.

ఒక కర్మ ఎలా అయిపోయినా, దాని ప్రక్కనేవున్న కర్మ తిరిగి వెంటనే అమలుకు వచ్చును. ఇదే విధానము మనకు

ప్రత్యక్షముగా, వీపు బరుకుచున్నప్పుడు తెలియబడుచున్నది. ఒకచోట నవ్వ పోతూనే, ప్రక్కనే నవ్వ పుట్టడమునకు

కారణము, ఒక కర్మ అయిపోతూనే ప్రక్కనే మరొక కర్మవుంటుందని మనిషి తెలుసుకొనుటకే అట్లు జరుగుచున్నది.


కర్మ విధానము ఇట్లున్నదని తెలుపు నిమిత్తమే మన వీపు మీద దురద, గోకినట్లంతా వస్తున్నదని తెలియుచున్నది.

కర్మలో సుఖము ఉండును, దుఃఖము ఉండును. నవ్వ, కర్మ విధానమును తెలుపునది కావున నవ్వ సుఖమునిచ్చునదా

లేక దుఃఖమునిచ్చునదా అని ప్రశ్నించితే, నవ్వను గురించి ఎటూ చెప్పలేము. నవ్వ పుణ్యమునకు గుర్తయిన సుఖము

నిచ్చునదా? అంటే గోకడము వలన సుఖము ఉన్నది, బాధ కూడ ఉన్నది. ఒక్కొక్క చోట గోకితే సుఖముగా ఉండును.

తర్వాత బాధగా ఉండును. కొన్ని చోట్ల గోకునప్పుడే బాధవచ్చును. కొన్నిచోట్ల సుఖముగానే ఉండును. ఇట్లు నవ్వ

అనునది ఒక విధముగా కాకుండా, పాపపుణ్యములకు గుర్తుగా, సుఖదుఃఖములుగా కనిపిస్తున్నది. ఒక జీవుడు ఒక

సమయములో ఒక పుణ్యమును అనుభవించిన వెంటనే, దానివెనుకనే ఉన్న పుణ్యమునో, పాపమునో ఆత్మ ఎగద్రోసి

అందించును. ఆత్మ శరీరములోని స్థూల కార్యములనూ చేయడమే కాకుండా, సూక్ష్మమైన కార్యములను అనేకముగా

చేయుచున్నది. అందులో జీవుడు కర్మ అనుభవించుచుండగా, ఒక కర్మ అయిపోతూనే మరియొక కర్మ వెంటవెంటనే

ఆత్మ అందించుచున్నది. జీవుడుగావున్న నీవు కర్మను దంచి లేకుండా చేయుచుండు, నేను కర్మను ఎగదోస్తావుంటాను

అని ఆత్మ అంటున్నది. ఈ విషయమును తెలుపు నిమిత్తము ఈ పొడుపు కథను చెప్పారని తెలియుచున్నది.


భూమిమీద బోధించువారందరు బోధకులు మాత్రమే, గురువులు కారు. భూమి మీదకు,

కొన్ని వేల సంవత్సరములకొకమారు మాత్రమే గురువు వస్తాడు.

***

40. నీకు ఎక్కడ సంశయమో, నాకు అక్కడే సందేశము.

ఈ మాటను ఎవరు చెప్పారు?


ఒక రోగి ఉన్నాడనుకొనుము. శరీరములో ఎక్కడో ఒకచోట రోగముండి వాడు బాధపడుచున్నప్పుడు,

రోగమును నయము చేయుటకు వైద్యుడున్నాడు. వైద్యుడు అనగా మందులిచ్చువాడు అని అర్థము కాదు. కానీ వైద్యుడు

అనగా తెలిసినవాడు అని అర్థము. దేనిని తెలిసినవాడినైనా వైద్యుడే అనాలి. ఇప్పుడు రోగి శరీరములోని రోగమును

తెలిసినవానిని వైద్యుడు అంటున్నాము. రోగము తెలిసిన తర్వాత ఆ రోగమునకు మందులను తెలిసియుండుట వలన

అతనిని వైద్యుడు అనాలి. ఈ విధముగా తెలిసినవానిని వైద్యుడు అనవచ్చును. అట్లే రోగమును తెలిసినవానిని

వైద్యుడు అని అనవచ్చును. అలాగే రోగమునకు మందులను తెలిసిన వానినీ వైద్యుడనవచ్చును. వైద్యుడు అనుమాట

రోగములకూ, మందులకూ సంబంధించినదే కాదు. దేనిని తెలిసినవాడినైనా వైద్యుడు అని అనవచ్చును. అందువలన

రోగముల విషయము తెలియకుండినా, కొన్ని విషయములలో మేధావి అయిన వానికి, వీడు వైద్యుడు అని అందరికీ

తెలియునట్లు, కొన్ని యూనివర్శిటీలలో డాక్టర్ బిరుదును ఇచ్చుచున్నారు. డాక్టర్ అంటే మందులు, రోగములు తెలిసినవాడు

అని అనుకోకూడదు. మేధావిని డాక్టర్ అనవచ్చును. వైద్యోనారాయణో హరి అని అన్నారు. వైద్యుడు అనగా దేవునితో

సమానమని ఆ మాటకు అర్థము. దేవుడు అన్ని విషయములు తెలిసినవాడు కనుక ఆయన అందరికంటే పెద్ద

వైద్యుడు.



రోగమునకు మందిచ్చువాడు, అందరికీ బాగా తెలిసిన వైద్యుడు. ఏ శాస్త్రమును సంపూర్ణముగా తెలిసినవాడినైనా

వైద్యుడని అనినా, ఒక్క రోగ విషయమును తెలిసిన వానినే వైద్యుడు అని అనుటకు అలవాటై పోయినది.

ఎందుకు మన పెద్దలు అలవాటు చేశారనగా! ఒక మనిషిలోనున్న రోగమును పొగొట్టుటకు, దానికి తగిన మందిచ్చు

వాడు వైద్యుడు అని తెలియుట వలన, ఒక మనిషిలోనున్న కర్మను పోగొట్టుటకు దానికి తగిన జ్ఞానము నిచ్చువాడు

దేవుడు (గురువు) అని సులభముగా తెలియవచ్చుననీ, ఆ విధముగా రోగములకు సంబంధించిన వానినే వైద్యుడనీ

ప్రచారము చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు మనకు క్రొత్తగా తెలిసిన విషయము ఏమనగా! ఏ రంగములో తెలిసినవాడినైనా

డాక్టర్ అనీ లేక వైద్యుడనీ అనవచ్చును. గురువు అనినా దేవుడనినా ఇద్దరూ ఒక్కటేనని బ్రహ్మవిద్యా శాస్త్రము

తెలియబరుచుచున్నది. సర్వజ్ఞానము తెలిసిన వానిని గురువు అనవచ్చును. అటువంటి గురువు సంపూర్ణజ్ఞాని అయినందున

నీకు ఎక్కడ సంశయమో నాకు అక్కడే సందేశము అని చెప్పాడట. ఏ మనిషికైనా ఏ సంశయమున్నా దానికి అక్కడే

జవాబుగా ఉన్నవాడు గురువు (వైద్యుడు). దైవసంబంధ విషయములను సంపూర్ణముగా తెలిసినవాడు ఒక్క గురువే.

కావున ఎక్కడ సంశయముండునో అక్కడ ఆయన సందేశముతోనే అది పటాపంచలై పోవును. అందువలన పొడుపుకథలో

నీ సంశయము ఎక్కడో నా సందేశమక్కడే అన్నట్లు తెలిపియున్నారు. దేశములో ఎన్నో రంగములలో ఎందరో వైద్యులున్నారు.

మనకు కావలసిన వైద్యుడు ఆధ్యాత్మికరంగములోని వాడని మరువకూడదు.


జీవుడు కర్మను అనుభవించడము వలన కర్మఅయిపోతూవున్నది.

కానీ జీవునికి అహంకారము మరింత కర్మను సంపాదించి పెట్టుచున్నది.

***

41. యోగికీ, రోగికీ, భోగికీ నిద్రలేదు. యోగి, రోగి, భోగి ఎవడు?


యోగిగానీ, రోగిగానీ, భోగిగానీ, ఎవడయినా గానీ వాడు జీవుడే అయివుంటాడు. ఒక మనిషి ఏ వేషమునైనా

వేయవచ్చును. రాముని వేషము వేసినపుడు అతనిని రాముడుగా లెక్కింతుము. అదే మనిషి హనుమంతునిగా

వేషమును ధరించినవానిని ఆంజనేయుడు అందురు. ఇట్లు ఏ వేషములోనున్న వానిని ఆ పేరుతో పిలిచినట్లు, ఒక

మనిషి శరీరములోని జీవుడు, గుణ భాగములలో ఉండి బాధలను అనుభవించునపుడు వానిని రోగి అంటున్నాము.

అలాగే గుణ భాగములలోనేవుండి సుఖములను అనుభవించునప్పుడు వానిని భోగి అంటున్నాము. అదే జీవుడే

గుణభాగములను వదలి, గుణములేని భాగమైన యోగ భాగములో ఉన్నప్పుడు వానిని యోగి అంటున్నాము. గుణచక్రములో

జీవుడు, గుణ భాగములందున్నప్పుడు రోగిగానో లేక భోగిగానో ఉండును. గుణములు లేని భాగమైన నాల్గవ భాగములో

జీవుడున్నప్పుడు అతడు యోగిగా ఉండును. ఒక జీవుడు యోగిగా, రోగిగా, భోగిగా ఉండినా, జీవుడు మెలుకువలోనే

యోగిగా ఉండుననీ లేక భోగిగాకానీ, రోగిగా కానీ మెలుకువలోనే ఉండుననీ, నిద్రలో ఉండడనీ చెప్పుటకు వీలులేదు.

నిద్ర మనస్సుకేగానీ, జీవునకు ఉండదు. నిద్ర రాకముందు మెలుకువలో జీవుడు రోగిగా ఉన్నాడనుకొనుము, నిద్రపోయి

తిరిగి మెలుకువ వచ్చినప్పుడు అతను రోగిగానే లెక్కించబడును. అలాగే మెలకువలో జీవుడు భోగిగానున్నప్పుడు నిద్ర

పోయాడనుకొనుము. తర్వాత వాడు తిరిగి లేచినప్పుడు కూడా అతను భోగిగానే లెక్కింపబడును. యోగి అయినవాడు

కూడా నిద్రపోయి, తిరిగి నిద్రనుండి లేచిన తర్వాత వాడు యోగిగానే లెక్కించబడును. ఏ గుణములో నిద్రపోయినవాడు

తిరిగి లేచినప్పుడు ఆ గుణములోని వానిగానే లెక్కింపబడును. నిద్ర మనస్సుకుండుట వలన జీవునికి నిద్ర లేకుండుట

వలన జీవుడు నిద్రపోకముందు ఏ భావములో ఉండునో తిరిగి లేచినప్పుడు అదే భావములో ఉండునని తెలియవలెను.


అందువలన ఈ పొడుపుకథలో యోగికీ, రోగికీ, భోగికీ నిద్రలేదు అని చెప్పారు. చాలామందికి జీవుడు నిద్రపోడను

విషయము తెలియదు. శరీరములో నిద్ర పోవునది మనస్సు ఒక్కటేననీ, జీవుడుగానీ మరి ఏ ఇతర అవయవములుగానీ

నిద్రపోవని తెలియదు. అందువలన ప్రత్యేకించి జీవునకు నిద్ర లేదను విషయమును తెలుపుటకు ఈ పొడుపు కథను

చెప్పారు.


పుట్టిన తర్వాత ప్రతి మనిషీ ఇది నా మతమని చెప్పగలడు.

పుట్టిన తర్వాత ఏ మనిషీ ఇది నా జ్ఞానమని చెప్పలేడు.

***

42. ఏడు కొండల అవతల ఎర్రెద్దు రంకెలేసును. ఎర్రెద్దు ఏది?

సును.


తిరుపతి వెంకటేశ్వరుడు ఏడుకొండల మీద ఉన్నాడని చెప్పు చుందురు. అయితే అక్కడ ఏడుకొండలే అని

ఖచ్చితముగా చెప్పలేము. వెంకటేశ్వరుడున్నది 49 కొండలమీదనో లేక ఇంకా ఎక్కువ కొండలమీదనో చెప్పలేము.

అయితే ఆధ్యాత్మిక జ్ఞానమును దైవత్వ విధానమును చెప్పవలసిన చోటంతా ఏపదమును వాడుచుందురు. ఏడుకు

బ్రహ్మ విద్యకు ఆ విధముగా అవినాభావ సంబంధము ఏర్పడినది. "మహర్షయ సప్తపూర్వే” అను వాక్యము భగవద్గీతలో

చెప్పబడినప్పుడే సప్త అను సంఖ్యకు ఆధ్యాత్మిక మందు సృష్ట్యాదిలోనే స్థానము ఏర్పడినదని చెప్పవచ్చును. సృష్టి

మొదటిలోనే మానవ శరీరమును సృష్టించినప్పుడు, దానిని కొన్ని నియమములతో సృష్టించారు. ఆ నియమముల

ప్రకారము శరీరములో ఏడు నాడీకేంద్రములు, ఏడు గ్రంథులను ఉంచి తయారు చేశారు. శరీరములో ఆత్మశక్తి లేక

దైవశక్తి ఏడు నాడీకేంద్రములలో ఉన్నట్లు, ఏడు గ్రంథులలో ఉన్నట్లు ఏర్పరచి నిర్మించారు. మన శరీరములోని ఏడు

నాడీ కేంద్రములకు గుర్తుగా తిరుపతి దేవస్థానములో ఏడు ద్వారములను నిర్మించారు. అలాగే ఏడు గ్రంథులకు

గుర్తుగా గోపురమునకు ఏడు ద్వారములను నిర్మించారు. ఈ విధముగా శరీరములోని గ్రంథులను, నాడీకేంద్రములను

దేవాలయములవద్ద చూపడము జరిగినది. మానవ శరీరమును దేహమే దేవాలయమని వర్ణిస్తూ అందులో ద్వారములే

నాడీ కేంద్రములనీ, గోపురము మీద ద్వారములు గ్రంథులనీ చెప్పడము జరిగినది. ప్రస్తుత కాలములో శరీరమునకు

దేవాలయమునకు పోలికయున్నట్లు ఎవరికీ తెలియకుండా పోయినది. ఇప్పుడు నిర్మించే గుడులలో ఆధ్యాత్మిక సూచనలు

ఎక్కడా కనిపించడము లేదు.


మన శరీరములోనే దైవజ్ఞానమంతా ఇమిడియున్నట్లు భగవద్గీతలో చెప్పబడినది. శరీరమును వదలి ఒక్క

శ్లోకమును కూడా చెప్పలేదని మేము వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో వ్రాశాము. భగవద్గీత జ్ఞానము ప్రకారము

మన శరీరములోని బ్రహ్మనాడిలో ఆత్మశక్తి వ్యాపించియున్నది. ఆత్మశక్తికి కేంద్రము ఏడవ నాడీకేంద్రమైన మెదడు

మరియు దానిలోని గ్రంథి రాజము (పిట్యూటరీ గ్లాండ్) అని చెప్పవచ్చును. పైన తలలో నుండి బ్రహ్మనాడి ద్వారా

వచ్చి, శరీరమంతా ప్రాకు ఆత్మశక్తి బ్రహ్మనాడిలో క్రిందికి ఆరు కేంద్రములను ఉంచుకొన్నది. పైన తలలోనున్న కేంద్రముతో

లెక్కించుకొంటే మొత్తము ఏడు నాడీకేంద్రములగుచున్నవి. దైవశక్తి లేక ఆత్మశక్తి ఈ ఏడు నాడీకేంద్రములలో ఒక్కొక్క

చోట కొంత విడుదలై శరీరమంతా ప్రాకుచున్నది. ఈ ఏడు నాడీకేంద్రములను ఏడు కొండలుగా చెప్పుకొన్నాము.


ఏడు నాడీకేంద్రములను దాటిన తర్వాత ఆత్మయున్నది. అందువలన ఇదే విషయమును తెలుపుటకు గుడిలో కూడా

ఏడు ద్వారములను దాటిన తర్వాత దేవున్ని ఉంచారు. ఏడు కేంద్రములనుండి శక్తి వచ్చుచున్నది. కానీ శక్తి కేంద్రము

ఏడు దాటిన తర్వాతయున్నది. ఆత్మశక్తిని ఎర్రెద్దుగా పోల్చి నాడీకేంద్రములను కొండలుగా పోల్చి “ఏడు కొండల

అవతల ఎర్రెద్దు రంకెలేసే” అని ఈ పొడుపుకథలో చెప్పారు. ఈ పొడుపు కథను విప్పుకొంటే ఆత్మశక్తి మన

శరీరములో ఎలా ప్రవహించు చున్నదో తెలియును.


మతాన్ని బోధించే మత గురువులు ఎందరో గలరు. జ్ఞానాన్ని బోధించే జ్ఞానగురువు ఒక్కడే ఉంటాడు.

***

43. నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది.

ఊరు ఏది? నోరు ఏది?


ప్రపంచములో అందరికీ తెలిసినది ముఖములోనున్న నోరు. రెండు పెదవుల మధ్యలోనున్నదే నోరుయని

ఎవరైనా చెప్పగలరు. అట్లే మనుషులు నివసించు గ్రామమును ఊరు అని అందరూ అనుచుందురు. మనమను కొన్న

'నోరుకాని నోరు' ఏదైనా ఉన్నదా అంటే, అటువంటిది ఎక్కడున్నదో తెలియదని చాలామంది సమాధానము చెప్పుదురు.

అలాగే మనకు తెలిసిన ఊరు కాకుండ వేరే విధముగానున్న ఊరు ఏదైనా ఉన్నదా అని అడిగితే 'ఊరుగాని ఊరు' ఏదీ

మాకు తెలియదు అని చాలామంది చెప్పుదురు. అయితే ఇప్పుడు మనము నోరుగాని నోరునూ, ఊరుగాని ఊరునూ

తెలుసుకోవాలనుకొంటున్నాము. ఎందుకనగా ఈ పొడుపు కథలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నోరుకు,

ఊరుకు సంబంధము పెట్టారు. కావున మంచినోరు ఎటువంటిదో మంచి ఊరు ఎటువంటిదో గమనిస్తాము.


మనము నివసించు ఊర్లలో (గ్రామములలో) ఎందరో మంచి వారున్నారు. వారు ఎవరితోనూ కఠినముగా

మాట్లాడక ఇతరులతో ఎంతో సౌమ్యముగా మాట్లాడుచూ, అందరికి మంచిగా ఉండాలని ప్రయత్నించు చుందురు.

అయితే వారు అందరికీ మంచివారుగా కనిపిస్తున్నారా అని చూస్తే, వారు చాలామందికి మంచిగా కనిపించినా, కొద్దిమందికి

చెడ్డవారి గానే కనిపిస్తున్నారు. మనిషి తన స్వభావమును బట్టి ఎదుటి వానిని లెక్కించుకొనుచుండును. ఒక వ్యక్తి

ఇతరులతో పోట్లాడు స్వభావము గల వాడైనప్పుడు. నోరు మంచివాడు కనిపించినా వానిని కూడా చెడ్డవానిగా

లెక్కించి ఏదో ఒక విధముగా వానితో వాదమునకు దిగును. ఎవరి స్వభావము ప్రకారము వారు ప్రవర్తిస్తారు గానీ,

ఎదుటి వానినిబట్టి ప్రవర్తించ రని తెలియుచున్నది. నాకు తెలిసినంతవరకు ఒక వ్యక్తికి అందరూ చెడ్డవారిగానే

కనిపిస్తావుంటారు. తాను మాత్రము సరియైన వ్యక్తినని అనుకుంటూ ఉంటాడు. అటువంటి వానిని పదిమంది

మంచివారిలో ఉంచినా, వాని దృష్టిలో పదిమందీ చెడ్డవారిగానే కనిపించుచుందురు. అందువలన నోరు మంచిదైనంత

మాత్రమున అందరికీ మంచిగా కనిపిస్తారను నమ్మకము లేదు. అయితే నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందను

మాట పూర్తి సత్యము కాదనీ, ఆ విధముగా బయట ప్రపంచములో లేదనీ తెలియుచున్నది. అలాంటపుడు మన పెద్దలు

ఆ పొడుపు కథను ఎందుకు వాడినారు అను ప్రశ్నరాగలదు. దానికి సమాధానము ఏమనగా!



ఇది ప్రపంచ సంబంధముగా చెప్పిన వాక్యము కాదు. దైవజ్ఞానము నకు సంబంధించిన వాక్యముగా గుర్తించవలెను.

దైవజ్ఞానము ప్రకారము ఈ వాక్యము పూర్తి సత్యమైనదని తెలియుచున్నది. ఈ వాక్యమును ప్రపంచ కోణమునుండి

చూడక పరమాత్మ జ్ఞానము ప్రకారము చూస్తే దాని అర్థము తెలియును. ఊరు అనగా శరీరమనీ జీవుడు నివసించు

గృహమనీ చెప్పుకొన్నాము. వివరముగా చెప్పుకొంటే ఊటలు కల్గియున్నది ఊరని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు

జ్ఞానము ప్రకారము బయటి ఊరులోనికి పోకుండా శరీరమునే ఊరుగా పోల్చుకొని చూడాలి. ఊరుగాని ఊరు మన

శరీరమని తెలిసిపోయినది. ఇక ముఖమునకువున్న నోరు కాకుండా ఇంకా ఏదైనా 'నోరు కాని నోరు' ఉన్నదా అని

చూస్తే, అటువంటిది ఒకటున్నదని తెలియుచున్నది. శరీరములోనికి ఆహారము, నోటి ద్వారా పోవుచున్నది. నోటి

ద్వారా పోవు ఆహారము శరీర ఆరోగ్యమునకు, శక్తికి ఉపయోగపడుచున్నది. శరీరమునకు అన్నము ఆహారమైనట్లు,

శరీరములో నున్న జీవునికి జ్ఞానము ఆహారమగుచున్నది. శరీరమునకు ఆహారముగా ఉపయోగపడు అనేక రకముల

పదార్థములు శరీరమునకున్న రంధ్రములలో నోరు ద్వారా పోవుచున్నవి. అలాగే జీవునకు ఆహారముగా ఉపయోగపడు

దైవజ్ఞానము చెవి అను రంధ్రము ద్వారా లోపలికి పోవుచున్నది. ఆహార పదార్థములు జీర్ణాశయమును చేరి అక్కడినుండి

శరీరమునకు పోగా దైవ జ్ఞానము అనునది శబ్ధరూపములో చెవినుండి బుద్ధికి చేరి, బుద్ధి నుండి జీవునికి చేరుచున్నది.

దైవజ్ఞానమును సంపూర్ణముగా తెలిసిన జీవుడు నివసించు శరీరము కూడా పవిత్రమైపోవును. జ్ఞానము తెలిసిన వాడు

యోగమును ఆచరించుట వలన యోగిగా మారిపోవును. యోగి అయిన వానియందు దైవశక్తి (ఆత్మశక్తి) ఏర్పడును.

దైవశక్తియున్న శరీరము కూడా పవిత్రమై పోవును.


ఇక్కడ ఆహార పదార్థములను తీసుకొను పెదవుల రంధ్రమును నోరు అన్నట్లు, శబ్ధరూపములోనున్న దైవజ్ఞానమును

స్వీకరించు చెవి రంధ్రమును కూడా ఒక విధముగా నోరు అని చెప్పవచ్చును. నోరు అనగా ఊరుయొక్క ద్వారము అని

అర్ధము. ఊరుయొక్క ద్వారమును నోరు అన్నప్పుడు ఆహారము ప్రవేశించు పెదవుల రంధ్రమునూ దైవజ్ఞాన శబ్ధము

ప్రవేశించు చెవి రంధ్రమునూ నోరు అని చెప్పవచ్చును. ఇక్కడ జ్ఞానము తెలియు దానిని మంచి చెవి అని చెప్పుచూ

చెవిని మంచి నోరుగా చెప్పుచున్నాము. చెవి మంచి జ్ఞానమును తెలుపునదైతే దానిని మంచి నోరు అని చెప్పుచూ

మంచి జ్ఞానమును తెలుసుకొన్న జీవుడుండు శరీరము కూడా పవిత్రమగుట వలన “నోరు మంచిదైతే ఊరు మంచిదగును”

అన్నారు. మంచినోరు అనగా మంచి జ్ఞానమును తెలియజేయు చెవి అనీ, మంచి ఊరు అనగా పవిత్రతను పొందిన

శరీరమనీ తెలియవలెను.


మనిషి సృష్టించిన మతమును పట్టుకొని ఇహములో ఉంటావో,

దేవుడు సృష్టించిన జ్ఞానమును పట్టుకొని పరమునకు పోతావో నీవే నిర్ణయించుకో.


***

44. భిక్షాధికారి అయినా కావాలి, లక్షాధికారి అయినా కావాలి.

భిక్షాధికారి ఎవరు? లక్షాధికారి ఎవరు?


భిక్షమెత్తుకొని బ్రతుకువాడు భిక్షాధికారియనీ, లక్షల ధనముండి ఇతరులకు దానమిచ్చు స్థోమత కలవాడు

లక్షాధికారియని పిలువబడు చున్నాడు. ఎవడైనా ఏది కావాలనుకొన్నా తాను కలెక్టరును కావాలను కొన్నా, మంత్రిని


కావాలనుకొన్నా, ఎవడూ తాను అనుకొన్నట్లు కాలేదు. ఎందుకనగా! మనిషిని ప్రతిక్షణము శాసించి ఆడించునది

ఒకటి కలదు. అదియే కర్మ అని చెప్పుచున్నాము. ప్రారబ్ధకర్మ ఎలాగుంటే అలాగే మనిషిని ఆత్మ నడిపించును.

శరీరమును నడిపించునది ఆత్మ అయినా ఆత్మ కర్మను అనుసరించియే నడుపును. జీవితములో ఎవడు ఏమి కావాలన్నది,

ముందే కర్మ నిర్ణయించివుండును. దానిప్రకారమే వాడు జీవించవలసియున్నది. జీవుడు ప్రపంచ విషయములలో

ఏమాత్రము స్వతంత్రుడు కాక కర్మను అనుసరించి ఆత్మ నడుపునట్లు నడువవలసిందే. అటువంటపుడు జీవుడు తాను

“అయితే భిక్షాధికారినైనా కావాలి లేకపోతే లక్షాధికారినైనా కావాలి" అనుకోవడము వృథా ప్రయాస. అతడు అనుకొన్నా

భిక్షాధికారి కాలేడు, లక్షాధికారి కాలేడు. కర్మలో ఏమి కావాలనివుంటే అదే కాగలడు కానీ ఎవరి ఇష్ట ప్రకారము

జరుగదు అని ముందే చెప్పుకొన్నాము. అలాంటపుడు తెలిసిన జ్ఞానులు, ఈ వాక్యమును ఎందుకు చెప్పారని ప్రశ్నరాగలదు.

కర్మ ప్రకారమే మానవునికి జరుగుచున్నదని తెలియదా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా!


ఆధ్యాత్మికరీత్యా భిక్షాధికారియనగా జ్ఞానమను భిక్ష అడుగువాడని అర్థము చేసుకోవాలి. జీవునికి ప్రపంచ

విషయములలో స్వతంత్రత లేదు. ప్రపంచ విషయములను కర్మ శాసించి నడుపును. అయితే దైవజ్ఞాన విషయములో

జీవునికి సర్వస్వతంత్రమున్నది. దైవజ్ఞాన విషయములలో కర్మ ఆధిపత్యముండదు. జ్ఞాన విషయముల మీద కర్మ పని

చేయదు. జ్ఞానము కర్మకు అతీతమైనది. అందువలన జ్ఞాన విషయములలో జీవుడు ఏమైనా అనుకొన్నది అనుకొనునట్లు

సాధించగలడు. జ్ఞానభిక్షను కోరు భిక్షాధికారిగా మారిపోగలడు. అలా భిక్షాధికారిగా మారుట వలన జ్ఞాన విషయములను

పూర్తిగా తెలియగలుగును. జ్ఞానము తెలియనప్పుడు భిక్షాధికారిగా మారడములో తప్పులేదు. ఒకవేళ దైవజ్ఞానము

తెలిసియుంటే ఇంకొకరికి దానము చేయగల లక్షాధికారిగా మారిపోవడము మంచిది. నీవు అజ్ఞానివే అయితే జ్ఞానభిక్ష

కొరకు ప్రయత్నిస్తూ భిక్షాధికారిగా అయినా మారాలి. లేకపోతే నీవు జ్ఞానిగా పుట్టియుంటే నీకు తెలిసిన దైవజ్ఞానమును

ఇతరులకు బోధించు బోధకుడివిగానైనా మారిపో. ఇతరులకు బోధించు స్థోమత కలవాడు జ్ఞానధనముతో లక్షాధికారితో

సమానమేయగును. అందువలన మన పెద్దలు పుట్టిన ప్రతి ఒక్కరికీ జ్ఞానమార్గములో భిక్షాధికారిగానైనా వుండు

లేకపోతే లక్షాధికారిగా అయినావుండు అని చెప్పారు. వారు చెప్పినది జ్ఞానవిషయములో కాబట్టి కర్మకు జ్ఞానము

అతీతమైనదనుట వలన ఎవడైనా ఎట్లయినా మారవచ్చును. జ్ఞానము తెలిసినవాడవైతే లక్షాధికారిగానైనా మారవచ్చు.

జ్ఞానము తెలియని వానివైతే జ్ఞానమును అడుక్కొను భిక్షాధికారిగా అయినా మారవచ్చునని మన పెద్దలు ఈ పొడుపు

కథలో చెప్పారు.


మనిషి సృష్ఠించిన మతము ఇహమునకు సంబంధించినది.

దేవుడు సృష్ఠించిన జ్ఞానము పరమునకు సంబంధించినది.

***

45. మంత్ర జలముకంటే మంగళి జలమెచ్చు



పూర్వము ఈ వాక్యములో 'జల' అనుపదమున్నచోట 'బల' అను పదము ఉండెడిది. వాస్తవానికి

“మంత్రబలముకంటే మంగళిబలమెచ్చు” అని ఉండేది. బలము అనుచోట “బ”కు బదులుగా “జ” వచ్చి చేరడములో

బలము కాస్త జలముగా మారిపోయినది. ఈ వాక్యములో మంగళి, మంత్రము అను రెండు పదములే ముఖ్యమైనందున


బలము జలముగా మారినా కొద్దిపాటి తేడాతో అర్థమును చెప్పుకోవచ్చును. మంత్రజలము కంటే మంగళి జలమెచ్చురా

అనుమాట బయటి అర్థమునకు పూర్తి దగ్గరగా ఉండును. కనుక మంత్రబలము అని చెప్పుటకంటే, మంత్రజలము

అని చాలామంది చెప్పుకోవడము జరుగుచున్నది. బ్రాహ్మణుడు, నాయీ (కుక్క) బ్రాహ్మణుడు అను బ్రాహ్మణ కులములు

రెండు కలవు. నాయీ బ్రాహ్మణులు అను పేరు మంగళి వారికి రావడమూ వారు పెట్టుకోవడమూ చూస్తే వాస్తవానికి

వారికి తెలియక ఆ పేరును పెట్టుకొన్నారనిపిస్తున్నది. కుట్రతో మంగళివారిని పైకి ఎదగకుండ చేయాలను అసూయతో

కొందరు తెలివైనవారు వారిని కించపరుచు విధముగా కుక్క బ్రాహ్మణులని పేరు పెట్టగా మంగళివారికి ఆ పేరులోని

అర్థము తెలియక దానినే ముఖ్యముగా చెప్పుకోవడము జరుగుచున్నది. మంగళి అనునది పవిత్రమైన పదమని తెలియక,

మంగళి వారందరూ నాయీ బ్రాహ్మణులమని చెప్పు కొంటున్నారు. నేడు మంగళివారుగానున్న వారందరూ పూర్వము

బ్రాహ్మణ కులమునకు చెందినవారని తెలియదు.


చరిత్ర తెలిసిన వారికి మంగళివారికి అన్యాయము జరిగినదని తెలుసు. అందువలన మంగళివారు పూర్వపు

బ్రాహ్మణులని గుర్తుండునట్లు బహుశ ఈ వాక్యమును చెప్పారని అనుకుంటాను. ఎలాగైతేనేమి నేటి బ్రాహ్మణులకంటే

మంగళివారే గొప్ప అనునట్లు ఈ వాక్యముకలదు. ఈ వాక్యము యొక్క వివరమును వివరించుకొందాము. మంత్రములతో

సంబంధమున్నవారు నేటి బ్రాహ్మణులేనని అందరూ చెప్పగలరు. బ్రాహ్మణులు కొన్ని కార్యములయందు మంత్రములను

ఉచ్ఛరించుచూ మంత్రపు నీటిని మన తలల మీద చల్లడము అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కార్యములలో

మనలోని అపవిత్రత పోవుటకు కొన్ని కార్యములలో మనము పునీతులగుటకు మంత్రజలమును తలలమీద చల్లుచుందురు.

అలా చల్లడము వలన తలలోని పాపములన్నీ పోవునని మనము నమ్ముచున్నాము కదా! ఒక కార్యక్రమములో ఒక

అరగంటసేపు మంత్రములను చదువుచూ కార్యక్రమములను చేసిన బ్రాహ్మణుడు చివరిలో మామిడి ఆకులను నీటిలో

అద్ది అక్కడున్న అందరిమీద చల్లడము జరిగినది. అంతవరకు కూర్చున్న వారిలో ఒకడు ప్రొద్దుపోక విసుగుకొనుచూ

అప్పుడప్పుడే నిద్రలోనికి జారుకొనుచుండెను. నిద్రలోనికి పోయి పోకవున్నపుడు బ్రాహ్మణుడు మామిడి ఆకులతో నీరు

చల్లడము వలన వచ్చే నిద్రనుండి లేపినట్లయినది. దానితో అంతవరకు మంత్రములు అర్థముకాక విసుగుగావుండినవాడు

ముఖము మీద నీరు పడడముతో బ్రాహ్మణునిమీద పట్టలేనంత కోపము వచ్చింది. అయినా ఇదేదో మన కొరకు చేసే

కార్యము కదాయని అప్పటికి ఓర్చుకొన్నాడు. ఆ కార్యమంతయు అయిపోయిన తర్వాత భోజనము చేసి తలవెంట్రుకలను

కొరిగించు కొనుటకు మంగళిషాప్కు మంత్రములు చదువుచున్నప్పుడు విసుగెత్తిన మనిషి పోయాడు. అక్కడ కుర్చీలో

కూర్చొనగానే అక్కడున్న మంగళి తలవెంట్రుకలు కొరుగుటకు ముందు వెంట్రుకలన్నిటిని ఒక లెవలుకు సవరించుటకు

చేయిపెట్టి సర్దుచూ కొన్ని నీళ్ళను చల్లి వెంట్రుకలను సర్దసాగెను. అప్పుడు మంగళి నీళ్ళు చల్లి వెంట్రుకలను సర్దడములో

అతనికి ఎంతో సుఖముగా ఉండుట వలన చిన్నగ నిద్రలోనికి పోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికి తెలియదు.

వెంట్రుకలన్నీ కొరగడము అయిపోయిన తర్వాత లేచాడు. తాను అంతవరకు నిద్రపోయానని తెలుసుకొని ఆ మంత్ర

జలముకంటే ఈ మంగళి జలమే బాగున్నదని అన్నాడట. అప్పటినుండి “మంత్రజలముకంటే మంగళి జలమెచ్చు”

అనుమాట సమాజములో అక్కడక్కడ వినిపిస్తున్నది. బాహ్యముగా ఉన్న విషయమిదే అయినా ఆధ్యాత్మికరీత్యా ఇంకొక

విధానములో ఈ వాక్యమునకు అర్ధము ఏమైనా ఉన్నదేమో వివరముగా చూస్తాము.


మంత్రము అనగా మహిమ గలది. తయారు చేస్తారని కూడా చెప్పుకొన్నాము.మంత్రమునకు కొంత శక్తి 

శక్తిగలది అని ముందే చెప్పు కొన్నాము. మంత్రమును జ్ఞానముకలవారే ఉండడము వాస్తవమే అయినా ఆ శక్తులు



ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క విధముగా ఉండును. ఎన్నో విధముల మంత్రములకు అన్ని రకముల శక్తులుండును.

ఆయా మంత్రములను ఉచ్చరించినప్పుడు ఆ మంత్రశక్తి చల్లే నీటిలోనికి కూడా వచ్చును. ఆ మంత్రశక్తి వలన కొంత

మేలు మనకు జరుగవచ్చును. ఏ మేలు జరిగినా అది ప్రపంచమునకు సంబంధించినదే అయివుంటుంది. దైవత్వమునకు

ఏమాత్రము సంబంధము ఉండదు. ఇంతవరకు మంత్రము యొక్క విషయమును తెలుసుకొన్నాము. ఇప్పుడు మంగళి యొక్క

విషయమును గురించి తెలుసుకొందాము.


మంగళము అనగా శుభకరమని అర్థము. మంగళి అనగా శుభ కరమైనవాడు దేవుడు అని అర్థము. పూజా

కార్యములలో చివరియందు దేవునిలోనికి ఐక్యమగు సంకల్పమును తెల్పుటకు మంగళహారతి నిచ్చు చుందురు. మంగళము

అనగా మోక్షమని అర్థము. మోక్షమనినా దేవుడనినా శుభకరమైనవాడు అనినా అన్నీ పరమాత్మకు సంబంధించిన

వివరణే అని తెలియవలెను. మంగళి జలము అనిన దైవశక్తికల నీరు అని అర్థము. పూర్వము మంగళి బలము అని

ఉండెడిది. మంగళి బలము అనగా దైవశక్తి అనియే అర్థము. మంగళి జలము అనిన దైవశక్తి ఇమిడిన జలము అని

అర్థమగును. బలమునకు, జలమునకు ఏమీ తేడారాదు. మంత్ర బలము కల్గిన నీరు వలన కొంత మంత్రశక్తి

ఉపయోగ పడి ప్రపంచ కార్యము నెరవేరుచున్నది. ఇదే మంగళి జలము (దైవశక్తి) వలన ప్రపంచ కార్యము నెరవేరక

మన శరీరములో జన్మలకు కష్టసుఖములకు కారణమైన కర్మ లేకుండా పోవుచున్నది. కర్మలు నశించుటకు మంత్ర

బలముగానీ మంత్రజలముగానీ ఉపయోగపడదు. మనిషి కర్మలు ఒక్క దైవశక్తి వలననే నశించిపోగలవు. ప్రపంచములో

దైవశక్తి తప్ప ఏ శక్తీ కర్మను లేకుండా చేయలేదు. కర్మలను నాశనము చేయు దైవశక్తి (మంగళ బలము) అన్ని

శక్తులకంటే ఉత్తమమైనది. అందువలన “మంత్రజలముకంటే మంగళి జలమెచ్చు" అని ఆధ్యాత్మిక జ్ఞానరీత్యా అన్నారని

తెలియుచున్నది.


G.

మనిషి ఇష్టముతో కూడుకొన్నది మతము, దేవుని ఇష్టముతో కూడుకొన్నది జ్ఞానము

***

46. నీ కూడు తిని, నీ బట్టకట్టి, నాకు కాపురము చేయమన్నాడట. ఎవరు?


ఏ మనిషికైనా ప్రతిదీ వాని ప్రారబ్ధకర్మనుబట్టి లభించుచుండును. మనిషి బతుకుచున్నాడంటే వాడు వాని

కర్మప్రకారమే బ్రతుకుచున్నాడని చెప్పవచ్చును. కర్మలోలేనిది వానికి లభించదు. మనిషికి నిత్యము అవసరమైనది

కూడు గుడ్డ. ఆ కూడు గుడ్డ కూడా వాని కర్మప్రకారమే వానికి దొరుకును. నిత్యము వాని కర్మప్రకారము బ్రతుకు

జీవుడు పాతకర్మను అనుసరించి బ్రతుకుచుండినా, వాడు తన కర్మప్రకారము బ్రతుకుచున్నానని అనుకోకపోవడము

వలన, తానే తన తెలివికొద్దీ పనులు చేయుచున్నానని అనుకోవడము వలన, ఒక ప్రక్క పాతకర్మ అయిపోతూ ఒక ప్రక్క

క్రొత్త కర్మవచ్చి చేరుచున్నది. దీనికంతటికి కారణము పాత కర్మవలననే తినే తిండి కట్టే గుడ్డ లభించుచున్నదని

తెలియకపోవడమేనని చెప్పవచ్చును. ఒకవేళ పాతకర్మ వలననే అన్నీ లభించుచున్నవని తెలిసినా చేసే పనిని నేనే

చేయుచున్నానను అహంభావము ఉండుట వలన పాతకర్మ అయిపోయినా క్రొత్త కర్మ రాకతప్పదు. పై వాక్యములో నీ

కూడు తిని, నీ బట్టకట్టి అని ఉన్నది. ఆ మాటకు నీ కర్మప్రకారము వచ్చు ఫలితమును నీవు అనుభవించుచూ అని

అర్థము.


పై వాక్యములో పొడుపు కథలో నాకు కాపురము చేయమన్నాడట అని ఉన్నది. నాతో కాపురము చేయి అంటే

నాతో కలిసి ఉండమని, నాకు సేవ చేయమని అర్థము కదా! ఈ మాట ప్రకారము ఒక మనిషి తన ప్రారబ్ధము

ప్రకారము వాని కూడు తిని వాని గుడ్డ కట్టుకొన్నా దేవుని సేవ చేయుచూ దేవుని యోగము చేయుచూ ఉండినట్లయితే

వానికి ప్రారబ్ధకర్మ అయిపోవుచుండును. ఆగామి అను క్రొత్త కర్మ రాకుండ ఉండును. దేవునికి సేవ చేయడమూ

ఆయన జ్ఞానమును తెలుసుకొని దేవున్ని గురించిన యోగము చేయడము అను కార్యము చేసినవాడు దేవునితో కాపురము

చేసినట్లగుచున్నది. దేవుని సేవ యోగము చేసిన వానికి మాత్రము కూడు గుడ్డ లభించుట వాని కర్మానుసారమే

జరుగుచుండును. అందువలన నీవు దేవుని సేవ చేయుటకు మొదలు పెట్టు నీ కర్మ అయిపోతూ వచ్చుచుండును.

దేవుని సేవ చేయుట వలన క్రొత్త కర్మ రాదు. అందువలన నాకు కాపురము చేసినా నేను నీకు కూడు గుడ్డ ఇస్తానని

దేవుడు చెప్పలేదు. అవన్నీ నీవేనని చెప్పాడు. దేవుడు బతికేదానికి కూడు గుడ్డలను కర్మలను ఇవ్వడు. ఆయన

ఏకంగా అమృతమునే ఇచ్చి, జన్మించి కూడు గుడ్డకు ఆశించకుండా జన్మలేని మోక్షమును ఇచ్చును. ఆ విషయమును

తెలుపుటకు పై వాక్యమును చెప్పారు.


నీవు ఏ మతాన్ని సమర్థించవద్దు, మతమును మనిషే సృష్టించాడు.

నీవు దేవుని జ్ఞానాన్ని మాత్రము సమర్థించు, జ్ఞానమును దేవుడు సృష్టించాడు.

***

47. నీకు మూతికి మీసాలుంటే, నాకు ముంజేతికి

వెంట్రుకలున్నవన్నదట. ఎవరు?


ఈ పొడుపు కథను చూస్తే ఒక పురుషునితో మరియొక స్త్రీ మాట్లాడినట్లు అర్థమగుచుచున్నది. నేను ఆడదానినైనా

నీకంటే నేను ఏమీ తక్కువ లేను అని మగవానికి సవాలు విసిరినట్లు ప్రపంచరీత్యా పురుషుల కంటే స్త్రీలమైన మేము

ఏమీ తక్కువలేము అను సందర్భములో పై వాక్యమును చెప్పునట్లు తెలియుచున్నది. ఏది ఏమైనా ఆధ్యాత్మికరీత్యా దీని

భావమేమి అని చూస్తే మీసాలు, వెంట్రుకలు రెండూ ఆత్మకు గుర్తుగాయున్నవే. వెంట్రుకలు శరీరములో పెరిగిన

జాగానుబట్టి ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో పిలుచుచున్నారు. పై పెదవుల మీద ఉన్నవి మీసాలని ముంజేతికి ఉన్నవి

వెంట్రుకలని అనినా అన్నీ వెంట్రుకలే అగును. 'వెంట' అను శబ్ధమునుండి పుట్టినది వెంటక. పూర్వము వెంటక అను

పేరుతో పిలువబడేది. తర్వాత 'వెంటక' నుండి 'వెంట్రుక' అను పేరుగా మారి పోయినది. వెంట్రుక ఆత్మకు గుర్తుగా

ఉన్నది. ఆత్మజ్ఞానము తెలిసినవాడు వెంట్రుకను చూస్తే ఆత్మను గుర్తుచేసుకోగలడు. జీవునికి శాశ్వితముగా వెంట

ఉండునది ఆత్మ. కావున “వెంట” అను పదమును ఆత్మకు గుర్తుగా యుంచడము జరిగినది. తర్వాత పద్య గద్యములలో

వ్రాయువారు వారికి పదము సరిపడులాగున “వెంటక” అను పదముగా మార్చుకోగా చివరికది “వెంట్రుక” అయినది.

'ఆత్మ' అను పదము చెట్టువద్ద ఆకుగా చెప్పబడినది. ఆత్మ అనునది కనిపించునది కాదు. అందువలన దానికి గుర్తుగా

చెట్టుకు కొద్ది మార్పుతో ఆకు అనినా మనిషివద్ద కూడా కొద్ది మార్పుతో చెప్పబడినా చివరకు మీసాలు వెంట్రుకలని

చెప్పబడినవి.


ఆత్మ శరీరములో ఉండి సర్వ కార్యములను చేయిస్తూ ఉన్నది మరియు చేయుచున్నది. శరీరములోపల ఆత్మ

ఏమి చేయుచున్నదీ బయటికి తెలియదు. అందువలన బయట కూడా తెలియునట్లు పనులు చేయు అవయవముల

దగ్గర ఆత్మకు గుర్తయిన వెంట్రుకలున్నట్లు దేవుడు చేశాడు. శరీరము బయట పనులు చేయునవి కర్మేంద్రియములైన

కాళ్ళు, చేతులు, నోరు అందరికీ బయటికి కనిపించునట్లు ఉన్నవి. చేయి పని చేయు చుండినా అది స్వయముగా పని

చేయడములేదు. దానిని ఆత్మ తనశక్తి చేత కదిలించి పని చేయించుచున్నదనీ చేయి పనిచేయుటకు కారణము

మూలశక్తి ఆత్మయని తెలియునట్లు, చేయి మొదలైన భుజమువద్ద చంకలో వెంట్రుకలను ఉంచడము జరిగినది. అలా

చేయి ప్రారంభములోనే భుజము క్రింద ఆత్మకు గుర్తయిన వెంట్రుకలుండడము వలన, ఆత్మ వలననే చేయి చేయుచున్న

పనులు జరుగుచున్నవని తెలియుచున్నది. ఈ విధముగా పని చేయు భాగము ఎక్కడైనా శరీరము మీద ఉంటే అక్కడ

వెంట్రుకలు (ఆత్మశక్తులు) ఉంటాయి. చంకలో వెంట్రుకలు ఏ ఉపయోగము లేనివిగా ఉన్ననూ ఆత్మనూ ఆత్మశక్తినీ

తెలుపు నిమిత్తమే ఉన్నవి. కనురెప్పలు మనకు తెలియకుండానే పని చేయుచుండును. ఆత్మయే కనురెప్పలను

మూయునట్లు తెరచునట్లు చేయుచున్నది. అక్కడ మూయడము తెరవడము జరుగుచున్నది కావున కనురెప్పలకు

వెంట్రుకలున్నాయని చెప్పవచ్చును. అలా వెంట్రుకలుండుట వలన ఆ పనిని ఆత్మ చేయుచున్నదని ఆత్మజ్ఞానము

తెలిసినవారు గ్రహించ గలరు. ఆత్మజ్ఞానము లేనివారికి ఈ విషయమును చెప్పినా, కనిపించే దృశ్యమైన దానివలన

సులభముగా అర్థము చేసుకోగలరు.


మూతికి మీసాలున్నాయి అంటే అక్కడగల నోరు కదలి పని చేయు చున్నదనీ పెదవులు కదలి నోరు అల్లాడి

పని చేయుటకు ఆత్మశక్తియే కారణమని తెలిసిపోవుచున్నది. అంతకూ అక్కడ జరుగు పని ఏమి అని చూచితే

ముఖ్యమైన పని మాట్లాడడమేనని తెలియుచున్నది. నోరు మాట్లాడునదైతే, చేయి చేయునది. ముంజేతికి అనగా చేతి

ముందర, చేయి ప్రారంభమగు భుజమువద్ద అని అర్థము. అయితే ఇక్కడ ఈ పొడుపు కథలోని సారాంశమేమంటే

మాట్లాడేవానికంటే చేసేవాడు గొప్పయని చెప్పినట్లు గలదు. మాటలకంటే చేతులు మేలు అన్నట్లు " నీ మూతికి

మీసాలుంటే నా ముంజేతికి వెంట్రుకలున్నాయని” అనడము జరిగినది. ఈ వాక్యము వలన నీవు మాట్లాడే వానివే నేను

చేసి చూపించే వాడినని చెప్పినట్లున్నది. మొరిగే కుక్క కరువదు, కరిచే కుక్క మొరగదు అన్నట్లు మాట్లాడే వాడు

పనిచేయడు, పనిచేసేవాడు మాట్లాడడు. మూతికి మీసములున్నవాడు మాట్లాడే వానికి గుర్తుగా, ముందర చేతికి

వెంట్రుకలున్న వాడు పనిచేసేవానికి గుర్తుగా ఈ వాక్యము చెప్పబడినదని తెలియవలెను.

మతము మనుషుల గుంపును పెంచుతుంది. జ్ఞానము కేవలము జ్ఞానుల గుంపును పెంచుతుంది.

***

48. కష్టాలు మనుషులకు కాకుండా, మానులకు వస్తాయా?


మానవజన్మ ఎంతో గొప్పదనీ, ఎన్నో జన్మల పుణ్యఫలముచేత మానవజన్మ లభించుతుందనీ చాలామంది

అనుచుండగా, కొందరు తమ ఉపన్యాసములలో చెప్పుచుండగా విన్నాము. పాపము చేసినవారు పశు, పక్షి, వృక్ష,

లతాదులుగా పుట్టుదురనీ, మానవజన్మ గొప్ప పుణ్యము వలన లభించినదనీ కొందరు సన్యాసులు చెప్పగా విన్నాను.

ఇంతమంది గొప్ప వారని పేరుగాంచినవారు మానవజన్మ చాలా అరుదుగా లభించే జన్మయని చెప్పడము చూచిన

తర్వాత వారి మాటను ఎవరూ కాదనలేరు. ఎంతో తెలిసిన వారు చెప్పడము నిజమే అని నమ్మవలసిందే. అంతేకాకుండా


మనిషి జన్మ అన్ని జన్మలకంటే ఎంతో తెలివైన జన్మగా కనిపించడము వలన, మిగతా బుద్ధి బలములేని జన్మలకంటే,

బుద్ధిబలమున్న మానవజన్మయే గొప్పదని నమ్మక తప్పదు. ప్రత్యక్షముగా కనిపించే బుద్ధి బలమునుబట్టి, ఎంతోమంది

జ్ఞానులము అనువారు చెప్పు దానినిబట్టి, పురాణములలో వ్రాసిన కథలనుబట్టి, అన్నిజన్మలకంటే మానవజన్మ గొప్పదని

అనుకోవడము జరిగినా, అసత్యమును వేయిమంది సత్యమని చెప్పినా, అది సత్యముకాదు అన్నట్లు, మానవజన్మను

గొప్పదని ఎంతమంది చెప్పినా అది అసత్యము గనుక సత్యము కానేరదు. మానవజన్మ మిగతా జన్మలకంటే గొప్పదికాదు

అనుమాట కొందరికి విచిత్రముగా తోచినా, మానవజన్మ ఎక్కువ పాపము చేసిన వారికి వచ్చునను మా మాట పూర్తి

సత్యము.


జీవరాసుల సృష్ఠి అండజ, పిండజ, ఉద్భిజములని మూడు రకములుగా ఉండినా, వాటి జన్మలను ఉత్తమములనీ,

అధమములనీ, అధమాధములనీ మూడు విధములుగా జీవులను గుర్తించవచ్చును. జీవరాసుల సృష్టి ఒకటి గ్రుడ్డునుండి

పుట్టునవీ, రెండు పిండము (గర్భము) నుండి పుట్టునవీ, మూడు విత్తనమునుండి పుట్టునవనీ మూడు రకములుగా

గలవు. అలా పుట్టిన వాటిలో ఎక్కువ పాపము చేసిన జీవులు తక్కువ పాపము చేసిన జీవులు మధ్య రకముగా పాపము

చేసిన జీవులని మూడు రకములుగా విభజించవచ్చును. ఎక్కువ పాపము చేసుకొన్న జీవులు పుట్టిన తర్వాత క్రిందికి

పెరుగుచున్నవి, మధ్యరక పాపము సంపాదించుకొన్న జీవరాసులు పుట్టిన తర్వాత అడ్డముగా పెరుగుచున్నవి.

ఉత్తమమైన జాతిగా ఉండి తక్కువ పాపముగలిగి పుట్టిన జీవరాసులు పైకి పెరుగుచున్నవి. ఉత్తమమైన జన్మగా ఉండి

పైకి పెరుగునవి చెట్లు, తీగలు మొదలగు ఉద్భిజములని తెలియుచున్నది. అడ్డముగా పెరుగునవి పక్షులు, జంతువులని

తెలియుచున్నది. వీటిలో అండజములు, పిండజములు రెండు ఉన్నవి. ఇక క్రిందికి పెరుగునది ఒకే ఒక జాతి గలదు,

అదియే మానవజాతి. మానవజాతి పిండజమని మరువకూడదు. పిండజజాతిలో ఎన్నో జంతువులున్నా ఒక్కటి కూడా

మానవునివలె క్రిందికి పెరగలేదు.


మిగత జీవరాసులకంటే మనిషికి బుద్ధిబలము ఎక్కువ ఉండుట వలన, మిగతవాటికంటే నాకు బుద్ధి ఎక్కువ

ఉంది అని మనిషి తనను తాను మోసగించుకొంటున్నాడు. బుద్ధిబలముండుట వలన లాభమా, నష్టమా అని యోచించిక,

పైకి కనిపించు దానినిబట్టి నేనే గొప్ప అనుకోవడము స్వయముగా నిన్ను నీవు మోసగించుకొన్నట్లే. ప్రక్క వారందరికీ

చిన్నరాళ్ళు దొరికాయి నాకు పెద్ద గుమ్మడి కాయ దొరికింది అని సంబరపడినట్లుంటుంది. ప్రక్కవానికి దొరికింది

చిన్నరాయి అయినా అది ఎంతో విలువైనది. నాకు దొరికిన గుమ్మడికాయ కనిపించేదానికి పెద్దదైనా చిన్నరాయికంటే

విలువ తక్కువైనది అని మనిషి యోచించ లేకపోవుచున్నాడు. బుద్ధిబలము చేత పైకి కనిపించుటకు ఇతర జంతువుల

మీద పెత్తనము చెలాయించగలిగినా వాటికంటే ఎక్కువ తెలివిగా వాటిని బంధించగలిగినా, బుద్ధి ఉన్నదాని వలన

మనకు ఏమి లాభము? బుద్ధి లేని దానివలన వాటికేమి నష్టము? అని మనిషి తెలియలేక తానే గొప్ప అనుకొంటున్నాడు.

బుద్ధియున్న దానివలన తనకే అనుభవములు ఎక్కువ అనీ, వాటికంటే ఎక్కువ అనుభవించువాడననీ తెలియలేకపోయాడు.

అడ్డము పెరుగు జంతువులు, పక్షులకంటే క్రిందకి పెరుగు మనిషి వాటికంటే తక్కువ స్థాయి వాడినని కొద్దిగ అయినా

గుర్తించలేకపోయాడు. క్రిందికి పెరుగు మనిషికంటే అడ్డము పెరుగు జీవరాసులు కర్మను తక్కువ అనుభవించుచుండగా

అడ్డము పెరుగు పక్షులు జంతువులకంటే పైకి పెరుగు చెట్లు, తీగలు మొదలగు ఉద్భిజములు తక్కువ కర్మను అనుభవించు

చున్నవి. కర్మ అనుభవములనుబట్టి దేవుడు జీవరాసులను మూడు విధములుగా పెరుగునట్లు చేశాడు. అండజ

పిండజములన్నిటిని అడ్డముగా పెరుగునట్లు చేసిన దేవుడు, ఒకేఒక్క మనిషి పిండజమైనా వానిని మాత్రము క్రిందికి


,

పెరుగునట్లు చేసాడు. దానివలన మనిషి అయినవాడు దేవునికి దూరముగా పోవడమేకాక నీచమునకు

దిగజారిపోవుచున్నాడని తెలియుచున్నది. అండజ, పిండజములలో తాను ఒక్కడిని అయినా ఎందుకు క్రిందికి

పెరగవలసివచ్చినదని తనను గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. అండజ పిండజములలో కొన్ని లక్షల జాతులున్నా,

మానవజాతి ఒక్కటి మాత్రము వాటినుండి బహిష్కరింపబడినదని ఏమాత్రము గమనించలేదు. కనిపించునట్లు ప్రత్యక్షముగా

ఉద్భిజములైన వృక్ష, లతాదులు పైకి పెరుగుచుండడమును చూచి అండజ, పిండజములు కంటే విభిన్నముగా

ఉద్భిజములు మాత్రము ఎందుకు పైకి పెరుగుచున్నవని కొద్దిగా అయినా యోచించలేదు. తనకు బుద్ధి ఎక్కువ అను

మత్తులో మునిగిపోయిన మనిషి తాను ఒక జీవుడనని కూడా గుర్తు లేకుండా పోయినప్పుడు మిగతా వాటిని గురించి

ఎలా యోచించగలడు.


మనిషికి తెలిసినా తెలియకున్నా మనిషికంటే కర్మలో తక్కువ అనుభవముగలవి అండజ, పిండజములైన పశు

పక్షులుకాగా వాటికంటే తక్కువ అనుభవముగలవి ఉద్భిజములు. ఉదాహరణకు మనిషికి ఒక చేతివేలును కత్తితో

నరికితే ఎంత బాధవుండునో దానిలో పదవవంతు మాత్రము పశువుకు కాలును నరికినప్పుడు ఉండును. పశువుకున్న

నొప్పిలో పదవవంతు మాత్రమే చెట్టుకొమ్మను నరికినప్పుడు చెట్టుకుండును. ఒక మనిషికి శరీర నొప్పిగానీ మానసిక

బాధగానీ 100 భాగములుండగా అందులో జంతువుకు మరియు పక్షికి 10 భాగములు మాత్రమే ఉండును. చివరకు

చెట్టుకుగానీ తీగకుగానీ ఒక్క భాగము మాత్రముండును. కర్మ అనుభవములో జంతువులకు వృక్షములకు ఉన్న తేడా

తెలిసిపోయింది కదా! మనిషికి బుద్ధియుండి ఏమి ప్రయోజనమో మీరే యోచించండి. బుద్ధి ఉండడము వలన నేను

గొప్ప అని పొరపడుటకు మాత్రమే అని తెలియుచున్నది. దేవుడు మనిషికి బుద్ధినిచ్చి మనిషి తనను తాను మోసము

చేసుకొనునట్లు చేశాడు.

C.

మనిషి కర్మను అనుభవించడములో ఎంత సాంద్రత కల్గియున్నాడో, కర్మ సంపాదించుకోవడములోనూ అంతే

సాంద్రత కల్గియున్నాడు. మనిషి జంతువుకంటే 90 శాతము ఎక్కువ కర్మను అనుభవిస్తున్నాడు. అలాగే 90 శాతము

ఎక్కువ కర్మను సంపాదించుకొంటున్నాడు. జంతువు విషయము లోనికి వస్తే మనిషికంటే జంతువు పది (10) శాతము

మాత్రము కర్మను అనుభవించడము, సంపాదించుకోవడము జరుగుచున్నది. చెట్ల విషయానికి వస్తే జంతువులో

పదవవంతు, మనిషిలో ఒక వంతు మాత్రమే అనుభవించ డముగానీ, సంపాదించుకోవడముగానీ జరుగుచున్నది. ఈ

విధముగా చూస్తే మనిషి నూరు కర్మలు అనుభవిస్తే చెట్టు ఒక కర్మను మాత్రము అనుభవించునని లెక్కించుకోవచ్చును.

మనిషికి తెలివి ఎక్కువ ఉండడము వలన కర్మను కూడా ఎక్కువ అనుభవిస్తున్నాడు. ఈ విషయమును తెలియుటకు పై

పొడుపు కథలో "కష్టాలు మనిషికి రాక మానుకు వస్తాయా" అని అన్నారు. అలా అనుట వలన మనిషి పాపము

చేశాడు కాబట్టి కష్టాలు వస్తాయి, మాను పాపము చేయలేదు కాబట్టి మానుకు కష్టాలు రాలేదని అర్థమగుచున్నది.

ఇప్పుడు తెలిసిందా! మానవజన్మ అన్నిటికంటే ఎక్కువ పాపము చేసినదని సంపూర్ణ జ్ఞానమును తెలిసిన పెద్దలు పూర్వము

ఎంతో పెద్ద రహస్యముతో కూడుకొన్న జ్ఞానమును పొడుపు కథ రూపములో చెప్పారు. దానివలన మానవ జన్మ ఎక్కువ

పాపము చేసుకొన్న వారికి వస్తుందని తెలిసింది.


మతాన్ని ఏ మనిషిలోనైనా చూడవచ్చును. జ్ఞానాన్ని కొందరిలోనే చూడగలము.

***


49. మనస్సుకు నచ్చినవాడు మగడుగానీ,

మంగళసూత్రము కట్టగానే మగడు కాడు.


'ఆసక్తి' అనునతడు దైవజ్ఞానము మీద ఆసక్తికల్గి జ్ఞానము తెలుసు కోవాలని ప్రయత్నించుచుండెను. జ్ఞానము

తెలియాలంటే గురువు ఉండాలనీ, గురువు ద్వారా ఉపదేశము తీసుకోవాలనీ కొందరు చెప్పగా గురువు కొరకు

వెదుకుచుండెను. అంతలో ఆ ఊరిలోనికే ఒక గురువు వచ్చాడు. అప్పుడు ఆసక్తి అనువానికి సంతోషమై వెతకబోయిన

తీగ కాలికి తగిలినట్లయినది. వెంటనే గురువు దగ్గరకు పోయి, తనకు జ్ఞానము కావాలని కోరుకొన్నాడు. అప్పుడు ఆ

గురువుగారు ముందు ఉపదేశము తీసుకొని తనకు శిష్యుడు కమ్మన్నాడు. అలాగే ఆ రోజు రాత్రికి పెద్ద పూజాకార్యక్రమమును

పెట్టి ఆసక్తి గురోపదేశమును తీసుకొన్నాడు. గురువుగారు ఒక చిన్న మంత్రమును చెప్పి దానినే జపించుకొమ్మన్నాడు.

అంతేకాక ఎప్పటికీ గురువు చెప్పినట్లు వింటాననీ, గురువుకు విధేయుడుగా ఉంటాననీ, ఆసక్తి చేత గురువుగారు

ప్రమాణము చేయించుకొన్నాడు. అంతే ఆ గురువుగారు తిరిగి సంవత్సరము వరకు ఆ ఊరికి రాలేదు. ఆసక్తి

అనునతడు గురువు చెప్పిన మంత్రమునే ధ్యానము చేయుచూ కాలము గడుపుచుండెను. సంవత్సరము తర్వాత

గురువుగారు అక్కడికి వచ్చి పాత శిష్యులందరినీ పలకరించి, వారిచేత పాదపూజలు చేయించుకొని, క్రొత్తవారిని కొందరిని

శిష్యులుగా చేర్చుకొని వారికి ఉపదేశమిచ్చిపోయెను. ఇలా పది సంవత్సరములు గడచినా, గురువు గారు శిష్యులకు

జ్ఞానమును గురించి ఏమీ చెప్పలేదు. సంవత్సరమున కొకమారు ఆ ఊరికి రావడమూ, పూజలు చేయించుకోవడమూ,

భజనలు చేయడమూ, క్రొత్త శిష్యులకు ఉపదేశమిచ్చి ఈ ఊరిలో నాకింతమంది శిష్యులున్నారని లెక్కగట్టుకొని పోవడమూ

తప్ప జ్ఞానమేమిటో వారికి తెలియకుండా పోయింది.


ఇలా పది సంవత్సరములు గడచిన తర్వాత ఆసక్తి అనునతనికి అతని స్నేహితుడు ఒక గ్రంథమును ఇచ్చాడు.

ఆ గ్రంథమును ఆసక్తి చదివి అంతవరకు తెలియని జ్ఞానమును ఎంతో తెలుసుకొన్నాడు. అప్పుడు అతడు ఆ గ్రంథమును

వ్రాసిన రచయిత దగ్గరకు పోయి ఇంతవరకు తెలియని జ్ఞానము ఇప్పుడు మీ గ్రంథము ద్వారా తెలిసింది. నేను పది

సంవత్సరములనుండి గురువు దగ్గర మంత్రమును ఉపదేశముగా పొంది ధ్యానము చేయుచున్నాను. నాకు అది

సరియైన మార్గము కాదని తెలిసినది. ఆ మంత్ర ధ్యానము వదలివేయాలనుకొన్నాను. ఇప్పుడు ఏమి ధ్యానము

చేయాలని అడిగాడు. అప్పుడు ఆ రచయిత “ముందు నీవు జ్ఞానము తెలుసుకో తర్వాత ఏమి చేయాలనునది నీకే

అర్థమవుతుంది” అన్నాడు. తర్వాత ఆసక్తి మొదటి గురువును వదలివేసి, గ్రంథరచయిత వ్రాసిన గ్రంథములను

చదువుచూ, సంపూర్ణ జ్ఞానిగామారిపోయాడు. అలా జ్ఞానిగా మారిపోయిన తర్వాత తన ఊరిలోని గురుశిష్యులకు

కూడా జ్ఞానమును తెలుపగా, వారు కూడా ఆసక్తి తెల్పిన జ్ఞానమునకు ఆకర్షితులై, అందరూ తమ మంత్ర ధ్యానమును

వదలివేసి, జ్ఞానమును తెలుసుకోసాగిరి. అంతలో ఆ ఊరికి గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చిన ఆ సంవత్సరము

ఎవరూ గురువుగారివద్దకు పోలేదు. పూజలు, భజనలు చేయలేదు. దానితో గురువుగారికి పూర్తి సమాచారమంతా

అర్థమైపోయినది. అంతవరకు పాతశిష్యులతో దక్షిణలు ఇప్పించుకోవడము, క్రొత్త శిష్యులను చేర్చుకోవడము చేయుచున్న

గురువు గారికి, మంత్రోపదేశమను వ్యాపారము దెబ్బతిన్నట్లయి నది. చేయునది లేక సలహా కొరకు తనకు తెలిసిన

త్రైతసిద్ధాంత యోగివద్దకు పోయి తన విషయమంతా చెప్పుకొన్నాడు. “ఇంతవరకు తనకు శిష్యులుగా ఉన్న వారంతా

ఒక్కొక్కరు ఇతర గ్రంథములు చదివి వాటికి ఆకర్షితులై అక్కడికే పోవుచున్నారు. నావద్ద పది సంవత్సరములుగానున్న

శిష్యులు కూడా నన్నూ నా ధ్యానమును వదలి పోవడమేకాక, ప్రక్కవారిని కూడా తమవెంట తీసుకొనిపోయారు. ఇలా


అయితే గురువులు, గురు ఉపదేశముల సాంప్రదాయము మంటగలిసి పోతుంది. జ్ఞానగ్రంథములు వ్రాసిన రచయిత

ధ్యానమే చేయవద్దనీ, కాలము వృథా అవుతుందని చెప్పాడట. ఇటువంటి వారంతా వచ్చి మన సంస్కృతిని దెబ్బ

తీయుచున్నారు. ఇలా అయితే గురువులని మనలను ఎవరూ లెక్కపెట్టరు. గురూపదేశములతో పనే లేదందురు.

దీనికి మీరేదైనా పరిష్కారము చెప్పాలి” అని అన్నాడు.


అప్పుడు ఆ గురువుగారి మాటలను విన్న త్రైతసిద్ధాంత యోగి ఇలా అన్నాడు. “నీవు చెప్పినట్లే హిందూధర్మరక్షణ

పరిషత్ వారు మన మతస్థులు అందరూ ఇతర మతములలోనికి, ముఖ్యముగా క్రైస్తవ మతములోనికి పోవుచున్నారు.

హిందూమతము క్షీణదశకు వచ్చినది. మేము హిందూ మతమును రక్షించుకోవాలని ఎంత ప్రయత్నించుచున్నా,

ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు హిందువులు క్రైస్తవులుగా మారిపోవు చున్నారు. క్రైస్తవులు వారి మతమును విస్తృతముగా

ప్రచారము చేయుట వలన, కరపత్రములను ఉచితముగా పంచుట వలన, ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయుట వలన

వారి మతము బాగా ప్రచారమైపోయి మన మతము కరిగిపోవుచున్నది. ఇలా అయితే హిందూమతము భవిష్యత్తులో

లేకుండా పోవునని తలచి మేము కొంతమంది సంస్థలుగా, పరిషత్లుగా, సంఘములుగా, సేనలుగా, దళములుగా

ఏర్పడి మన మతమును రక్షించుకొను కార్యములో పడినాము. ఎక్కడ క్రైస్తవ బోధలు జరపాలని చూచినా వాటిని

మేము అడ్డు కొంటున్నాము. ఎక్కడ వారిమాట వినిపించినా అన్యమతప్రచారమను పేరుతోవారిని ఎదుర్కొంటున్నాము.

ఎక్కడా ప్రచారము చేయకుండా చూస్తున్నాము” అని నాతో చెప్పారు. వారి మాటలకు, నీ మాటలకు ఒకే పోలిక

కనిపిస్తున్నది. నీవు నీ శిష్యులను గురించి చెప్పావు. వారు తమ మతమును గురించి చెప్పారు. మీ రెండు విషయములకు

దాదాపు ఒకే సమాధానము సరిపోవును.


మీ విషయములను అటుంచి మరొక విషయమును చెప్పుతాను విను. ఒకనికి పెళ్ళయి కొన్ని సంవత్సరములైనది.

అతనికి ఇద్దరు భార్యలుండగా ఐదు సంవత్సరములు భర్తతో కాపురముచేసిన పెద్దభార్య ప్రక్క వీధిలోనున్న వ్యక్తితో

లేచిపోయింది. కారణమేమి అని చూస్తే ఐదు సంవత్సరములు భర్తగానున్నవాడు సమయానికి స్నానముచేసి,

శుభ్రముగా ఉండి, మంచి దుస్తులు ధరించి, తల దువ్వుకొని అందముగా కనిపించ కుండా, నా భార్యలే! తాళికట్టినానులే!

నన్ను వదలి ఎక్కడికి పోతుంది అని అనుకొన్నాడు. అదే ప్రక్క వీధిలోవాడు ఏ సమయానికి ఎట్లుండవలెనో అట్లుంటూ

అందముగా కనిపించడము వలన, కొంతదూరము వరకు సువాసన వచ్చు సెంటు నూనెను పూసుకోవడము వలన,

వానిపట్ల ఇతని భార్య ఆకర్షితురాలై, అవన్నీ తన భర్తవద్ద లేవనీ, కనీసము అందమైన గుడ్డలు కూడా కట్టుకోడనీ,

ఇటువంటి భర్త దగ్గర ఉండేదానికంటే ఇష్టమున్న మరియు మనసుకు నచ్చిన వాని దగ్గరకు పోయి మూన్నాళ్ళు

కాపురము చేసినా చాలునని అనుకొని భర్తను వదలి పోయింది. ప్రస్తుతానికి పోయినది పెద్దభార్య. చిన్న భార్య నాలుగు

సంవత్సరములనుండి కాపురము చేయుచున్నది. చిన్నభార్య విషయములో కూడా భర్తకు అనుమానము వచ్చి సలహా

కొరకు నా దగ్గరకు వచ్చాడు. వచ్చినవాడు చెప్పేమాటలు ఇలా ఉన్నాయి.


భర్త :- నా పెద్ద భార్య ప్రక్క వీధిలో వానితో లేచిపోయింది. ఆమె పోయి దాదాపు మూడు నెలలైంది. ఇప్పుడు నా చిన్న

భార్య కూడా నన్ను వదలి పెద్దభార్య పోయిన వానివద్దకే పోయేటట్లుంది. ఎందుకిలా జరుగుతావుంది?

నేను :- ఇప్పుడు నీ చిన్న భార్య పోతుందేమోనని నీకు అనుమానము వచ్చినది కదా! అలాగే నీ పెద్దభార్య పోకముందు,

ఆమె పోతుందని అనుమానము రాలేదా?


భర్త :- అప్పుడు కూడా ఆమె పోకముందే అనుమానము వచ్చినది. రెండు నెలల ముందే అనుమానము వచ్చి ప్రక్క

వీధిలో వాడు మా వీధిలోనికి రాకుండా చూచాను. అనుమానము వచ్చినది మొదలు రెండు నెలలూ నా భార్యను

కాపలా కాచి వానివద్దకు పోకుండా చూచాను. అయినా ఆమె నా కన్నుగప్పి వానితో లేచిపోయింది.


నేను :- నీ పెద్దభార్య మీద అనుమానము వచ్చి ఆమె పోతుందని తెలిసినప్పుడు ఆమె పోకుండా ఉండుటకు ఇంకా

ఏమైనా చర్య తీసుకొన్నావా?


భర్త :- నా భార్య పోయినట్లే, మా వీధిలో ఇంకా ఐదారు మంది భార్యలు ముందే పోవడము జరిగినది. ఆ భార్యలు

పోయిన ఆరుమంది, నేను మొత్తము ఏడుమంది కలిసి ఒక సంఘముగా తయారై, ప్రక్కవీధిలోని ఆగడములను

ఎదుర్కొవాలనుకొన్నాము.


నేను :-ఏడుమంది భార్యలు పోయిన వారందరూ కలిసి ఒక గుంపుగా సంఘముగా పెట్టుకొన్నారు. ఆ సంఘము

పేరు ఏమి? దాని పని ఏమి?


భర్త :- సంఘము పేరు “భార్యారక్షణ పరిషత్" మా పరిషత్ ముఖ్యకార్యము పక్కవీధివారు ఎక్కడ గుంపుగా చేరినా,

వారిని చెదరగొట్టడము, వారు మా వీధిలోనికి రాకుండా చూడడము. వస్తే వారిమీద దాడిచేయడము, ప్రక్కవీధిలో

వారు మా వీధిలోని ఆడవారికి ఎక్కడ కనిపించకుండా చూచుకోవడము.


నేను :- ఈ మధ్య మీ బంధువు ప్రక్క ఊరినుండి వస్తే, మీ పరిషత్వారు మీ వీధిలోనికి వచ్చినవాడు మీ బంధువని

తెలియక వాడు ప్రక్కవీధివాడేనని అతని మీద దాడి చేశారట. అతను ఒకవైపు నేను ఫలానావాడిని అని చెప్పినా

వినకుండా, ప్రక్కవీధివాడివని అతనిని బాధించారట. మీ పరిషత్ వారు తమ వాడినే గుర్తించక ప్రక్క వీధివాడని

దాడిచేయడము వలన మీ బంధువుకూడా మిమ్ములను ఏవగించుకొనును కదా! తమవారు కనిపించితే కొద్దిగా అయినా

విచారించక, వాడు చెప్పేది వినకుండ, మీ వానిమీద మీరు దాడిచేయడము మంచిదా?


భర్త :- మంచిదికాదు. అది తెలియక జరిగిన పని. తర్వాత మేము కూడా చింతించాము.


నేను :- దాడిచేయకముందు అతను ఎవరు? అతను చెప్పే సమాధాన మేమిటి? అని చూడకుండా మీ భార్యలు ఎక్కడ

పోతారోనను అనుమానము తో అందరినీ ప్రక్క వీధివారిగానే చూస్తే, మిమ్ములను గురించి మీ పరిషత్ను గురించి మీ

వారికీ మీ బంధువులకు విసుగొచ్చును కదా! అప్పుడు మీలో మీరు పోట్లాడుకొన్నట్లవును కదా!


భర్త :- అది పొరపాటు పనియే. ఇప్పటినుండి అలా పొరపాటు పడకుండా చూచుకొంటాము. మా వారిమీద దాడి

చేయకుండా ప్రక్కవీధి వారిమీదే దాడిచేస్తాము.


నేను :- అలా దాడులు చేస్తూ పోతే, చూచేవారికి కూడ మీరే చెడుగా కనిపిస్తారు. హింసతో దేనినీ సాధించలేము.

సౌమ్యముగా ఆలోచించి, వచ్చిన సమస్యకు పరిష్కారమును వెతకాలి. కానీ అన్నిటికీ దాడులు, హింసలు పరిష్కారము

కాదు. ప్రక్కవీధివాడు అందముగా కనిపించాడని నీ భార్య పోయింది. ఉన్న రెండవ భార్యకూడా పోతుందని అనుమాన

మొచ్చినది. పోయిన ఆమె ఎందుకు పోయింది? ఇప్పుడున్న ఆమె ఎందుకు పోవాలని చూస్తున్నది అని ఆలోచిస్తే

వచ్చిన సమస్య అంతా ఎదుటివాడు అందముగా కనిపించడమే కారణముగా ఉన్నది. అలాంటప్పుడు ప్రక్కవీధి వానిని

కనపడకుండా చేయడముకంటే నీవే అందముగా కనిపించునట్లు తయారైతే సరిపోతుంది కదా! ఎదుటివాడు వాడినట్లు

నీవూ మంచిగుడ్డలు వాడి, ఎదుటివాడున్నట్లు నీవూ మంచి సెంటు వాడి, ఎదుటివాడు తలదువ్వుకొన్నట్లు నీవు కూడా


తల దువ్వుకొని అందముగా కనిపించితే, నీ భార్య నిన్ను విడచి ఇంకొకని దగ్గరకు ఎందుకు పోతుంది? భార్యకు

నచ్చినట్లు ఉంటే సరిపోయే దానికి సంఘము పెట్టి కాపలావుండి కనిపించిన వాడిని కొట్టితే సమస్య తీరుతుందా?

సమస్య అంతా నీవు అందముగా లేకుండా పోవడము ఎదుటివాడు అందముగా ఉండడము. అందువలనే ఒక భార్య

పోయింది, మరొక భార్యపోయేటట్లుంది. నీ భార్య పోయేదానికి కారణమేదైతేవుందో దానిని లేకుండా చేసుకొంటే

సమస్య తీరుతుంది. అలా కాకుండా ముక్కుకు పడిశము పట్టితే మోకాలుకు ఆపరేషన్ చేస్తానంటే ఎలా సరిపోతుంది.


ఇది తమ భార్యలు తమను వదలిపోతున్నారను భర్తల సమస్యేకాదు. తమ మతమును వదలి మరొక మతములోనికి

పోతున్నారను వారి సమస్య కూడా ఇలాగే ఉంది. ప్రక్క మతము వాడు వాని గ్రంథమును గురించి, వాని మతమును

గురించి, వాని దేవున్ని గురించి చెప్పుతూ పోతుంటే తమ గ్రంథములను గురించిగానీ, తమ జ్ఞానమును గురించిగానీ,

తమ దేవున్ని గురించిగానీ చెప్పని స్వమతమును వదలి అన్నీ చెప్పడమే తమ పనిగా పెట్టుకొన్న వారి మతములోనికి

ఎందరో పోయారు. అలాగే ఎందరో పోవువారు కూడా కలరు. ఒక గురువును వదలి శిష్యుడు మరొక గురువును

ఆశ్రయించితే అక్కడ సమస్య మొదటి గురువు దగ్గరలేని జ్ఞానము రెండవ గురువు దగ్గర కనిపించడమే కారణము. ఆ

సమస్య తీరాలంటే జ్ఞానముతోనే తీరాలి. అలాగే భార్య భర్తను వదలి మరొక పురుషుని వద్దకు పోయిందంటే, అక్కడ

సమస్య ఏదయితేవుందో దానితోనే లోపమును సరిదిద్దాలి. అలాగే ఒక మతస్థుడు ఇంకొక మతములోనికి పోతున్నాడంటే

అక్కడ సమస్య అంతయు ఎదుటి మతములో ఉన్నదేదో తన మతములో లేనిదేదో చూచి దానిని సవరించితే సరిపోతుంది.

అలాకాకుండ పరిషత్లు దళములు తయారు చేసుకొని అన్యమతము వారిమీద దాడిచేయడము వలన సమస్య తీరదు.

అలా సమస్య తీరకపోవడమేకాక జ్ఞానము లేనప్పుడు తనమతము వారిని కూడా గుర్తించలేక బోధలు చెప్పేవారంతా

ఇతర మతముల వారిగా లెక్కించుకొంటే, స్వమతము వారిని కూడా అన్యమతము వారిగా లెక్కించుకొని దాడిచేస్తే, మన

వేలితో మన కన్ను పొడుచుకొన్నట్లు కాదా!


భర్తను వదలి తన కులము తన మతముగాని వానివద్దకు వచ్చి కాపురము చేయుచున్న భార్యను కలిసి, 'నీవు

నీ భర్తను వదలి, నీ కులము గాని వానివద్దకు వచ్చియున్నావు కదా! కారణమేమి అని అడుగగా! అప్పుడు ఆమె ఇలా

అన్నది. “మనస్సుకు నచ్చినవాడు మగడుగానీ, మంగళ సూత్రము కట్టగానే మగడు కాదు" కదా! ఒక స్త్రీకి

తాళికట్టినంతమాత్రమున మగడు అనుకోవడము పొరపాటు. మనస్సుకు సంబంధించినవాడు మగడు. తాళికట్టినవాడు

శరీరమునకు మగడుకావచ్చు కానీ మనస్సుకు మగడు కాదు. మనస్సుకు నచ్చినవాడే మగడు అగును. మనస్సుకు

నచ్చినట్లు తాళికట్టినవాడున్నప్పుడు అతనే నిజమైన భర్త అగును. భర్త దగ్గర భరించు లక్షణములు లేనప్పుడు భర్తకానట్లు,

మతములో ధర్మము లేనప్పుడు అది మతముకాదు. అలాగే గురువులో జ్ఞానములేనప్పుడు అతను గురువు కాడు.

అందువలన మతములో ధర్మమూ, గురువులో జ్ఞానమూ, భర్తలో పురుషత్వమూ ఉన్నప్పుడే ఆయా పేర్లకు వారు

సరిపోవుదురు. అట్లు లేనప్పుడు వారిని వదలుకోవడములో తప్పులేదు.


దానము అధర్మమే అయినా దానిని ధర్మముగా మార్చుకొను అవకాశము కలదు. కుడిచేయితో చేయు

దానము, ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తే అది ధర్మమగును.

***


50. దిగంబర సన్యాసికి చాకలితో అవసరమే లేదు.


చాకలి అనగా మురికి గుడ్డలను ఉతికి వాటిలోని మురికినంతటిని లేకుండ శుభ్రము చేయువాడని అందరికీ

తెలుసు. జ్ఞానము అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తే అజ్ఞానమును లేకుండా చేసుకోవడమే జ్ఞానము అని జవాబు కలదు.

అజ్ఞానము లేకుండా పోయేకొద్దీ మనిషి జ్ఞాని కాగలడు. అజ్ఞానమును లేకుండా చేసి జ్ఞానమును కలుగజేయువాడు

గురువు. అలాగే మురికిని లేకుండ చేసి శుభ్రమును కలుగజేయువాడు చాకలి. ఒక విధముగా మురికి గుడ్డలను

శుభ్రము చేయు చాకలిని, అజ్ఞానమను మురికిని లేకుండ చేయు గురువును ఒక్కటిగా పోల్చి చెప్పవచ్చును. ఎక్కడ

మాసిన గుడ్డలున్నాయో అక్కడ చాకలి అవసరము. అలాగే ఎక్కడ అజ్ఞానమున్నదో అక్కడ గురువు అవసరము.


అంబరము అనగా ఆకాశము. దిగ + అంబరము = దిగంబరము అగును. అంబరము అనగా ఆకాశమైనప్పుడు,

దిగంబరమునకు అర్థము ఏమనగా! ఆకాశము శూన్యమైనట్లు ఏ గుణములులేక శూన్యముగా ఉన్న వాడని అర్థము.

ఆకాశము ఖాళీగా ఉండునది. అంబరమునకు 'దిగ' అను రెండు అక్షరములను ముందు చేర్చి దిగంబర అనగా

ఆకాశములో ఏమీలేనట్లు, ఎవని శరీరమునకు పై భాగమున ఉన్న తలయందు ఏ గుణములు లేకుండ ఉండునో

వానిని దిగంబరుడు అని అంటారు. అయితే గుణములు లేనివాడు భూమిమీద ఎవడూ లేడని ఒక విధముగా

చెప్పవచ్చును. ఎందుకనగా తలయందుగల గుణచక్రములో జీవుడు నివసించుచున్నాడు. గుణములను అంటిపెట్టుకొని

గుణముల మధ్య జీవించు జీవునికి గుణములు లేకుండ ఉండుననుట అసత్యము. అయితే దిగంబరుడు అను మాటకు

గుణములు లేకుండా శూన్యముగా ఉండువాడు అను అర్థము సరిపోవునా అంటే ఒక విధముగా సరిపోతుందనే

చెప్పవచ్చును. ఆకాశము పైనయే కాకుండా నీకు నాకు మధ్య ఉండునది కూడా ఆకాశమే. ఆకాశము ప్రతి

వస్తువునూ, ప్రతి మనిషినీ, ప్రతి పదార్థమునూ అంటుకొనియున్నది. దేనిని అంటియుండినా ఆకాశమునకు దానితో

సంబంధములేదు. అలాగే జీవుడు ఏ గుణమును అంటియుండినా, ఏ గుణముతో పనిచేయుచుండినా, ఆకాశమువలె

ఆ గుణమును అంటని స్థితి కల్గినవాడు దిగంబరుడు అని ఆధ్యాత్మికము ప్రకారము అనవచ్చును. బయటి ప్రపంచములో

గుడ్డలులేనివాడని అర్థము. గుడ్డలు ధరించనివానికి గుడ్డలు మాసిపోవడము అనుమాటయే లేదు. గుడ్డలే లేనప్పుడు

వాటిని శుభ్రము చేయు చాకలి కూడా అవసరము లేదు.


అలాగే దిగంబరుడైన వాడు గుణములతో సంబంధమే లేకుండ ఉండును. గుణములతోనున్నవాడైతే అజ్ఞానములో

ఉండును. కనుక వానికి గురువు అవసరము. అజ్ఞానము అన్నది లేనప్పుడు గురువు అవసరమే లేదు కదా! అలాగే

గుణములలో ఉన్నా వాటిని అంటనివాడు దిగంబరుడు అజ్ఞానములేనివాడు అగును. అయితే కొందరు ఇక్కడ ఒక

ప్రశ్న అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! “నిద్రపోవునప్పుడు జీవుడు గుణములలో ఉన్నా వాటిని

అంటనట్లున్నాడు కదా! అలాంటప్పుడు నిద్రపోవు వానిని ఎవనినైనా దిగంబరుడే అనవచ్చును కదా!" అని అడుగవచ్చును.

దానికి మా జవాబు ఏమనగా! మెలుకువలో బుద్ధి, అహము పని చేయుట వలన అహము జీవున్ని గుణములతో

అంటించుచున్నది. జీవున్ని గుణములతో సంబంధపడునట్లు అహము చేయుచున్నది. నిద్రలో గుణముతో జీవున్ని

సంబంధపరచు అహము లేనందున ఆ సమయములో జీవున్ని దిగంబరుడు అనవచ్చును. అయితే ఈ వాక్యములో

దిగంబర సన్యాసి అనడము వలన నిద్రలోనేకాక మెలుకువలో కూడా గుణములను అంటనివాడని తెలిసి పోవుచున్నది.

ఇదే విషయమునే భగవద్గీతలో ఆత్మసంయమయోగము అను అధ్యాయములో మొట్టమొదటి శ్లోకమున ఈ విధముగా

చెప్పారు.


అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతియః |

స సన్యాసీచ యోగీచ ననిరగ్ని రచాక్రియః ॥


భావము :- “కర్మఫలమును ఆశ్రయించక ఎవడు కార్యములను చేయునో వాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని

చెప్పవచ్చును. అయితే అగ్ని లేని వాడినిగానీ, పనులను మానుకొన్నవాడినిగానీ సన్యాసి అనిగానీ, యోగి అనిగానీ

అనుటకు వీలులేదు”. ఈ భావములో జ్ఞానమను అగ్నిలేని వానినీ, పనులు చేయనివానినీ యోగి అనిగానీ, సన్యాసి

అనిగానీ, అనకూడదని చెప్పియుండుట వలన మనకు తెలియునదేమనగా! మనిషి గుణములు లేకుండా పని చేయుటకు

వీలుపడదు. జీవుడు గుణములలో ఉండినా వాటితో సంబంధములేకుండా మెలకువలో పని చేయువాడు నిజమైన

యోగి, నిజమైన సన్యాసి అని తెలియుచున్నది. అశుద్ధ పదార్థమును అంటియున్న ఆకాశము ఎట్లు అశుద్ధముకాదో,

అలాగే గుణముల మధ్యలో యున్న యోగి గుణముల మాలిన్యమును అంటకయుండును. అందువలన యోగి అయినవానికి

జ్ఞానమును బోధించు గురువు లేడు. ఇదే విషయమును తెలుపుటకు “దిగంబర సన్యాసికి చాకలితో అవసరము లేదు”

అని అన్నారు.



నీవు ధనికుడివైతే రాజశ్రీ అని పేరుముందు వ్రాసుకో, జ్ఞానివైతే ఇందుశ్రీ అని వ్రాసుకో,

యోగివైతే బ్రహ్మశ్రీ అని వ్రాసుకో.

51. ధర్మానికి పోతే కర్మ చుట్టుకొన్నదట


దేవుని విషయములో ధర్మములు, అధర్మములు గలవు. దేవుని ధర్మములు దేవున్ని చేర్చగలవు, అధర్మములు

దేవున్ని చేర్చలేవు. ధర్మములను గానీ, అధర్మములను గానీ ముందు ధర్మముగానే అందరూ తెలుసు కొంటున్నారు.

తర్వాత వాటిని ఆచరించే విధానమునుబట్టి అవి ధర్మములుగా నిలుస్తున్నవి లేక అధర్మములుగానైనా అగుచున్నవి.

ధర్మములు ఏవి అధర్మములు ఏవి అని తెలియుటకు భగవద్గీతను చూస్తే అందులో భగవంతుడు తెల్పిన ధర్మములు

మూడు, అధర్మములు నాలుగు కలవు. దేవుడు తెల్పిన మూడు ధర్మములు దేవున్ని చేర్చగలవు. అయితే అధర్మములు

నాలుగు దేవున్ని చేర్చలేవని చెప్పుచూ వాటి వలన పుణ్యము వస్తుందని గీతలో దేవుడు చెప్పాడు. పైన చెప్పిన పొడుపు

కథలోని వాక్యములో "ధర్మానికి పోతే కర్మ చుట్టుకొన్నది” అని చెప్పారు కదా! ధర్మానికి పోతే కర్మ వస్తుందని గీతలో

కూడా లేదు. అధర్మానికిపోతే కర్మ అయిన పుణ్యము రావడము నిజమేనని గీతలో కూడా కలదు. అయితే తెలిసిన

పెద్దలు ఎందుకు ధర్మానికీ కర్మకూ ముడిపెట్టారని ఆలోచించవలసి వచ్చినది. బుద్ధి యొక్క ఆలోచనకు అందలేదు

కానీ, ఆత్మ అందించిన యోచనకు ఒక విషయము తెలిసినది, అదేమనగా!


అధర్మములు నాలుగున్నవి కదా! వాటిని రెండు భాగములుగా పూర్వము ఆర్య బ్రాహ్మణులు విభజించారు.

1) వేదాధ్యయనము, 2) యజ్ఞములు చేయుట, 3) తపస్సు చేయుట. ఈ మూడు ఒక భాగముగా చేసి నాల్గవదైన

దానమును ఒక భాగముగాయుంచారు. ముందు మూడు కార్యములను బ్రాహ్మణులు చేయునట్లు, చివరి భాగమైన

దానమును వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు మాత్రము చేయవలెనని చెప్పారు. వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు

చేయు దానమును స్వీకరించుటకు ఒక్క బ్రాహ్మణులే ఉన్నట్లు చేసుకొన్నారు. వేదాధ్యయనముగానీ, తపస్సుగానీ రెండూ

ఖర్చులేనివి. వాటిని సులభముగా చేయవచ్చును. ఒక యజ్ఞము ఖర్చుతో కూడుకొన్నది. దానిని ధనికులను ప్రోత్సహించి


ధనికుల డబ్బుతో చేయునదిగా తీర్చిదిద్దడమైనది. ఈ మూడు కార్యములు బ్రాహ్మణులు చేయునట్లు, దానమును

మిగతావారు చేయునట్లు చేసారు. ఈ విషయమును జ్ఞానమును తెలిసిన గురువు తెలిసి గ్రహించి, దానము చేయడము

అధర్మకార్యమని తెలిసి దానివలన కర్మకలుగుచున్నదని తెలిసినవాడై, దానము చేయు మూడు జాతులవారికి పుణ్యము

అంటని విధానమును బోధించాడు. చేయుచున్న దానమును యజ్ఞకర్మగా చేయమన్నాడు. యజ్ఞ సంబంధముగా

చేయని ఏ కార్యమైన కర్మను అంటగట్టునని తెలిపాడు. ఇదే విషయము భగవద్గీతలో కర్మయోగమందు 9వ శ్లోకమున

గలదు.



యజ్ఞార్ధా త్కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః |

తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర ॥


భావము :“యజ్ఞసంబంధమైన కర్మకాకుండ ఏ పనిని చేసినా దానివలన కర్మబంధనము ఏర్పడును. అందువలన

కర్మఫలమైన పాపపుణ్యములతో సంబంధపడకుండ కార్యములను చేయుము” అన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన సూత్రము

ప్రకారము ఏ కార్యమును చేసినా అందులో వచ్చు కర్మ కాలిపోవునట్లు, యజ్ఞవిధానముగా జ్ఞానాగ్నిలో కర్మ కాలిపోవునట్లు

చేయుమని చెప్పాడు. అట్లు చేయకపోతే చేసిన పనిలోని కర్మ అంటునని చెప్పాడు. దానములను చేయుట కూడా

కార్యమే అగును. దాన కార్యమును చేయునప్పుడు అది అధర్మమగుట వలన పుణ్యము వచ్చు అవకాశము కలదు.

అందువలన పుణ్యము కూడా రాకుండుటకు అహంకార రహితముగా బుద్ధితో ఫలితమును ఆశించక చేయుట వలన

పుణ్యకర్మ కూడా రాకుండా తప్పించుకోవచ్చును. అలా లేకపోతే తప్పక కర్మవచ్చును. చేయు కార్యము దానము.

దానము నాలుగు అధర్మములలో ఒక అధర్మము. అధర్మ కార్యము వలన పుణ్యము వచ్చును. అయితే మూడు

ధర్మములలో ఒకటైన కర్మయోగమును ఆచరించి దానమును చేయుట వలన దానము ధర్మము చాటున కర్మరహితమై

పోవును. ధర్మమైన కర్మయోగమును ఆచరించుటలో భంగమైతే ధర్మమునకు పోయినా కర్మయేవచ్చును. కర్మయోగ

సూత్రమును దానము చేయునప్పుడు మరచి అహమును పొందితే తప్పక కర్మవచ్చును. అప్పుడు ధర్మమునకు పోయినా,

కర్మ చుట్టుకొన్నదని చెప్పవచ్చును. కర్మయోగము ధర్మమగును, దానము అధర్మమగును. ధర్మమును ఆచరించునపుడు

అధర్మమైన దానము మీద కొద్దిగ ధ్యాస వచ్చినా అది అధర్మముగా లెక్కించబడును. మిగతా ప్రపంచ కార్యములలో

ధర్మము ధర్మముగానే ఆచరించబడును. ధర్మము చేత అధర్మ కార్యములను ఆచరించునప్పుడే ధర్మము భంగమైపోయి

అధర్మకార్యముగా మారిపోవు అవకాశము కలదు. అందువలన అధర్మమును ఆచరించునపుడు జాగ్రత్తగా ఉండుటకు

మన పెద్దలు పై వాక్యమును చెప్పారు.


శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.



Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024