కలియుగము (ఎప్పటికీ యుగాంతం కాదు). cloud text 17thsep 24 Updated
కలియుగము (ఎప్పటికీ యుగాంతం కాదు).
యుగములు నాలుగని బహుశా అందరికీ తెలుసు. అలాగే నెలలు పండ్రెండనీ, వారములు ఏడనీ, సంవత్సరములు
అరవై (60) అనీ తెలుసు. సంవత్సరములు వరుసగా 1) ప్రభవ 2) విభవ 3) శుక్ల 4) ప్రమోదూత 5) ప్రజోత్పత్తి
6) అంగీరస 7) శ్రీముఖ 8) భవ 9) యువ 10) ధాత 11) ఈశ్వర 12) బహుధాన్య 13) ప్రమాధి 14) విక్రమ
15) వృష 16) చిత్రభాను 17) స్వభాను 18) తారణ 19) పార్థివ 20) వ్యయ 21) సర్వజిత్ 22) సర్వధారి
23) విరోధి 24) వికృతి 25) ఖర 26) నందన 27) విజయ 28) జయ 29) మన్మథ 30) దుర్ముఖి 31) హేవళంబి
32) విళంబి 33) వికారి 34) శార్వరి 35) ప్లవ 36) శుభకృత్ 37) శోభకృత్ 38) క్రోథి 39) విశ్వావసు 40) పరాభవ
41) ప్లవంగ 42) కీలక 43) సౌమ్య 44) సాధారణ 45) విరోధికృత్ 46) పరీధావి 47) ప్రమాదీచ 48) ఆనంద
49) రాక్షస 50) నల 51) పింగళ 52) కాళయుక్తి 53) సిద్ధార్థి 54) రౌద్రి 55) దుర్మతి 56) దుందుభి
57) రుధిరోద్గారి 58) రక్తాక్షి 59) క్రోధన 60) అక్షయ. ఈ అరవై సంవత్సరములు కాలచక్రములో వర్తమాన
కాలములోనికి ఒక్కొక్కటిగా వచ్చి పోవుచుండును. ప్రభవ అను పేరుగల సంవత్సరముతో ప్రారంభమైన వర్తమాన
కాలము, చివరి అక్షయ సంవత్సరముతో అయి పోవడమేకాక, తిరిగి ప్రభవ సంవత్సరముతో ప్రారంభమగుచున్నది.
ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ, కాలచక్రముతోపాటు అరవై సంవత్సరములు తిరుగుచున్నవి. ఇప్పుడు
మనమున్న వర్తమానము ఖర నామసంవత్సరము. నేను పుట్టినది వికృతి నామ సంవత్సరము, కావున వికృతి గడచిపోయి
ఇప్పుడు ఖర జరుగుచున్నది. దీనినిబట్టి నా శరీరము వయస్సు 61 గడచిపోయి 62 జరుగుచున్నది. ప్రస్తుత
ఖరనామ సంవత్సరము కూడా రెండు నెలలు మాత్రమున్నది. తర్వాత నందన సంవత్సరము యుగాది పండుగతో
ప్రారంభముకానున్నది. అందువలన రెండు నెలలు గడచిపోతే ఖరనామ సంవత్సరము అయిపోతుంది. అప్పుడు
నాకు వయస్సు కూడా 62 సంవత్సరములు అయిపోయి నందన సంవత్సరముతో 63 ప్రారంభమగును. ఇలాగే
ఎవరైనా వారు పుట్టిన సంవత్సరమును బట్టి వారి వయస్సు లెక్కించుకోవచ్చును.
ప్రస్తుత కాలములో పూర్వము ఇందువులుగానున్న మనుషులు హిందువులుగా మారిపోయి, తమ మతము
పేరే మరచిపోవడమే కాక తమ కాలములోని సంవత్సరముల పేర్లనూ, నెలల పేర్లనూ మరచిపోయారు. చివరకు
క్రైస్తవ శక సంవత్సరములనూ, నెలలనూ చెప్పుకొంటున్నారు. మేము హిందూధర్మరక్షకులమని గొంతు చించుకొను
వారు కూడా జనవరి ఒకటవ తేదీని క్రొత్త సంవత్సరముగా చెప్పుకొంటున్నారు. హిందూ (ఇందూ) సంస్కృతితో
సంబంధములేని ప్రేమికుల దినమును వ్యతిరేఖించువారు, క్రైస్తవ సంస్కృతి ప్రకారము జనవరి ఒకటవ తేదీని క్రొత్త
సంవత్సరముగా హిందువులు లెక్కించుకోకూడదని ఎందుకు వ్యతిరేఖించలేదో? అలా వ్యతి రేఖించక పోవడమునకు
కారణము నేటి హిందువులకు వారి కాలమానము గానీ, అరవై సంవత్సరముల పేర్లుగానీ, పన్నెండు నెలలుగానీ
తెలియకుండా పోయినవనియే చెప్పవచ్చును. ఇందూ అను పవిత్ర శబ్దము అర్థరహితమైన హిందూ శబ్దముగా
మారిపోయినట్లు, యుగాది అను శబ్దము సృష్ట్యాదిని జ్ఞప్తి చేయుచుండగా, చివరికి ఆ పేరు అర్థములేని ఉగాదిగా
మారిపోయినది. మన సంస్కృతి ప్రకారము మనము మొదటినుండి ఇందువులము. ఇందువులను శబ్దము కాలక్రమములో
హిందువులు అను శబ్దముగా మారిపోయినదని మేము చెప్పితే, అర్థము చేసుకోలేని ప్రజలు కొందరు, మేము హిందూ
మతమును రక్షించుచున్నామని పేరు పెట్టుకొన్నవారూ, మమ్ములను పరాయి మతస్థులుగా వర్ణించి చెప్పుచున్నారు.
చివరకు ఇందువులను ఇందువులే గుర్తించలేని గ్రుడ్డివారై మీ ఇందూమతము వేరు, మా హిందూమతము వేరు
అంటున్నారు. ఇటువంటి దుస్థితి, మన సంస్కృతినే మనము మరిచి పోవునట్లు చేసినది. ఇటువంటి దుస్థితికి ఏడ్వాలో
నవ్వాలో అర్థము కావడములేదు. ఈ విధమైన అజ్ఞానస్థితి నుండి మనిషి జ్ఞానస్థితిలోనికి వచ్చి, తన సంస్కృతియైన
ఇందుత్వమును గుర్తించి చివరకు యుగాదిని ఉగాది అనకుండా యుగాదే అనగలడనీ, అట్లే ఇందువును హిందువు
అనకుండా ఇందువుగా చెప్పగలడని ఆశిస్తూ, ఇప్పుడు "కలియుగము ఎప్పటికీ యుగాంతం కాదు” అను ఈ చిన్న
గ్రంథమును వ్రాయుటకు పూనుకొన్నాము.
ఇందూ సంస్కృతి ఒక మతముకాదు, అది యొక పథము. పథము అనగా మార్గము అని అర్థము. ఇది ఏ
మార్గము అని ఎవరైనా అడిగితే ఇది ఇందూపథమని ధైర్యముగా చెప్పవచ్చును. ఇందూ పథము అనగా జ్ఞానమార్గమని
చెప్పవచ్చును. ఇందూ అను శబ్దము దైవ జ్ఞానమునకు బదులుగా వాడు శబ్దము. ఇందు అనగా చంద్రుడని అర్థము.
చంద్రుడిని జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జ్ఞానచిహ్నముగా చెప్పుచున్నాము. నేను జ్ఞానిని అని తెల్పుచు శంకరుడు తన
తలమీద చంద్రవంకను ఆభరణముగా ధరించి చూపించాడు. మీరు ఎక్కడైనా శంకరుని (శివుని) తలమీద చంద్రవంకను
చూడవచ్చును. అలాగే నేను యోగిని మరియు యోగీశ్వరుడనని అర్థము నిచ్చునట్లు, కృష్ణుడు తన తలమీద నెమలి
పింఛమును ధరించాడు. ఆ అర్థము తెలియని హిందువులు (ఇందువులు) నేడు ఉండుట వలన ఇందూ సంస్కృతి
అగమ్యగోచరముగా మారిపోయినది. ప్రపంచ దేశములన్నిటిలో ఒకే ఒక్క భారతదేశము మాత్రమే ఇందూదేశముగా
(జ్ఞానదేశముగా) లెక్కించబడినది. పూర్వము దైవజ్ఞాన నిలయమైన ఇందూదేశములోని ప్రజలు జ్ఞాన సంపన్నులైయుండి
జ్ఞానశక్తి కల్గియుండేవారు. జ్ఞానశక్తి కలవారిలో భారతదేశమొక్కటే పేరుగాంచియుండెడిది. అందువలన కొన్ని లక్షల
సంవత్సరముల పూర్వమునుండి భారతదేశము ఇందూదేశముగా పేరుగాంచి నది. అయితే నేడు భారతదేశము
యొక్క పూర్వ చరిత్ర తెలియని మనుషులు కొందరు మేము హిందువులమనీ, మేము హిందూమత సంరక్షకులమనీ, రక
రకముల పేర్లతో సంఘములను ఏర్పరచుకొని, ఏమాత్రము జ్ఞానము తెలియనివారై పూర్వమున్న ఇందుత్వమును
మరచిపోయి మేము హిందువులమని చెప్పుకొనుచున్నారు.
ఎవరెలా చెప్పుకొనినప్పటికీ, మేము ఇందువులము కాము హిందువులమే అనుకొన్నప్పటికీ, కేవలము పేరు
మార్పిడితో మనము నష్ట పోయింది ఏమీలేదు. కానీ చివరకు ఇందూ (హిందూ) సంస్కృతిలోని కాలము యొక్క
మాసముల పేర్లనూ, సంవత్సరముల పేర్లను తెలియకుండా నష్టపోవడము విచిత్రముగా ఉన్నది. పెద్దలకే తెలియనపుడు
ఇంటిలోని పిల్లలకు కూడా నెలల పేర్లుగానీ, సంవత్సరముల పేర్లుగానీ తెలియకుండా పోవుట విచిత్రమేమికాదు. నేడు
విదేశీ భాషల చదువులలో పడి, తెలుగు చదువునే తెలియకుండా పోయిన దానివలన చాలామందికి తెలుగు సంవత్సరాది
గానీ, తెలుగులో నెలలుగానీ, తెలుగులో సంవత్సరముల పేర్లుగానీ తెలియకుండా పోయినవి. ఇందూ (హిందూ)
సంస్కృతి హీనస్థితిలో లేకుండా ఉన్నత స్థితిలో ఉండాలంటే, మనము కాలగమనములోని పేర్లను తప్పకుండా తెలియాలి.
మొదటిలోనే సంవత్సరముల పేర్లు తెలుసుకొన్నాము. ఇప్పుడు నెలల పేర్లను గురించి తెలుసుకొందాము. నెలల పేర్లు
వరుసగా 1) చైత్రము 2) వైశాఖము 3) జ్యేష్టము 4) ఆషాఢము 5) శ్రావణము 6) భాద్రపదము 7) ఆశ్వీయుజము
8) కార్తీకము 9) మార్గశిరము 10) పుష్యము 11) మాఘము 12) ఫాల్గుణము. ఇవి మన తెలుగు భాష లోని హిందూ
నెలలుకాగా, నేడు చాలామందికి ఆంగ్లభాషలోని నెలలు బాగా తెలిసి పోయినవిగానీ, మన నెలలు మనకు తెలియకుండా
పోయినవి. జనవరి నుండి డిశంబరు వరకున్న నెలలు వరుసగా తెలిసినా, తెలుగు నెలలు మాత్రము ఒకటి కూడా
తెలియవనియే చెప్పవచ్చును.
ఏది ఏమైనప్పటికీ ఇందూ (హిందూ) సంస్కృతి గొప్పదనుటకు తార్కాణముగా హిందూసంస్కృతిని అనుసరించే
విదేశీ నెలలు పన్నెండే ఉన్నాయి. అలాగే వారములోని దినములు ఏడే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయమేమనగా!
ఆదివారము (భానువారము), సోమవారము అను దినముల పేర్లే విదేశీ వారముల పేర్లలో కూడా కలవు. ఆదిత్యుడు
అనగా సూర్యుడు అలాగే భానుడు అనగా సూర్యుడనియే అర్థము. సూర్యుని దినమైన ఆదివారమును ఇంగ్లీషు భాషలో
కూడా సన్దే అని చెప్పకోవడమూ, అలాగే సోమ (చంద్ర) వారమును మండే అని పిలవడము మనము గర్వింపదగిన
విషయము. నేడు మండే అని చెప్పుకొను పేరు పూర్వము మూన్డేగా ఉండెడిది. కాలక్రమముగా ఇందూ అనుపదము
హిందూగా మారిపోయినట్లు Moon Day (మూన్టే) అను పదములో “యమ్" ప్రక్కన గల రెండు సున్నలలో ('ఓ' లలో)
ఒక సున్న గాలికి పోయింది. చివరకు ఒక సున్నమాత్రము మిగిలివున్నది. అందువలన మూన్ కాస్త Mon Day
(మన్డే) గా మారిపోయినది. వాస్తవముగా సోమవారమును మూన్దే అనియే పిలవాలి. ఒక సున్న ఉన్నందున
ఇప్పుడు కూడా మూన్ అనియే పిలవాలి. కానీ పొరపాటుగా మూన్ ను మన్డే గా పిలుస్తున్నారు. కాలక్రమములో
జరిగిన పొరపాట్ల వలన కొన్ని పదములను వేరుగా పలుకుచున్నాము. తెలియనప్పుడు అర్థములేని పదముగా పలికినప్పటికీ,
తెలిసినప్పుడు అర్ధమున్న సరియైన పదముగా పలకవలెననీ, అదే విధానమును అనుసరించి సోమవారమును మూన్దేగా,
హిందువును ఇందువుగా పలకడము న్యాయమని తెలుపుచున్నాము.
ఇంతవరకు తెలుగులో ఇందువుల సంవత్సరముల పేర్లనూ, నెలల (మాసముల) పేర్లనూ తెలుసుకొన్నాము.
ఇప్పుడు వారములోని ఏడు దినముల పేర్లను తెలుసుకొందాము. వారములో వరుసగా దినముల పేర్లు ఇలా కలవు.
1) ఆదివారము 2) సోమవారము 3) మంగళవారము 4) బుధవారము 5) గురువారము 6) శుక్రవారము
7) శనివారము. ఈ ఏడు పేర్లు ఖగోళములోని గ్రహముల పేర్లని తెలియవలెను. ఏడు గ్రహములు సకల జీవరాసుల
కర్మలను పాలించుచున్నవి. వారి వారి కర్మముల ప్రకారము ప్రజలకు కష్టసుఖములను కలుగజేయుచున్నవి. అందువలన
ఈ ఏడు గ్రహములు అన్ని దేశములలోని ప్రజలకు సంబంధించినవి. ఈ గ్రహముల విషయము ఇతర దేశముల
వారికి కూడా తెలుసు. ఏడు గ్రహములలో నాయకుడైన సూర్యుని దినముతోనే అనగా సన్డే (Sun Day) తోనే వారము
ప్రారంభమగుచున్నది. అందరికీ తెలిసినట్లు అన్ని దేశములలో సన్డే, మూన్దే తొలి, మలి రోజులుగా ఉన్నాయి.
దీనినిబట్టి ఇందూ (హిందూ) సంస్కృతి ప్రపంచ వ్యాప్తముగా ఉన్నదని చెప్పవచ్చును. ప్రపంచ వ్యాప్తముగా సంవత్సరములో
పన్నెండు నెలలుండడమూ, వారములో ఏడు దినములుండడమూ, ఆదివారముతో వారము మొదలుకావడమూ, అందరికీ
తెలిసినట్లు సూర్యచంద్ర దినములు ప్రక్కప్రక్కనే ఉండడమును చూస్తే, మొదటి హిందూ (ఇందూ) సంస్కృతి ప్రపంచ
వ్యాప్తముగా ఉండెడిదని అర్థమగుచున్నది. ఇప్పటికాలములో హిందువులకే ఇందూ సంస్కృతి అంటే ఏమిటో, దాని
అర్థమేమిటో కూడా తెలియదు. ఇందూ (హిందూ) సంస్కృతి అను మాటనే వినని హిందువులు ఎందరో కలరు.
అటువంటి వారు ఇందూ సంస్కృతి అంటే ఏమిటి అని అడుగవచ్చును. వారికి మేము చెప్పు సమాధానము ఏమనగా!
హిందూ అను శబ్దము ఇందూ శబ్దముగా చెప్పుకొన్నపుడే హిందువు లకు తమ సంస్కృతిని గురించి తెలియగలదు.
సంస్కృతియే తెలియనపుడు సాంప్రదాయములు మొదటికే తెలియకుండా పోతాయి. అందువలన మనకు ఇప్పుడు
మన సంస్కృతిని గురించి తెలియాలంటే, మనము ఇపుడు పూర్వపు స్థితిలోనికి పోయి, ఇందూ అను పదమునే
ఉపయోగించి చెప్పుకోవాలి. ఇందూ అనగా జ్ఞానము అని అర్ధము. జ్ఞానములో ప్రపంచ జ్ఞానము ఒకటి, పరమాత్మ
జ్ఞానము మరొకటి కలవు. ఈ రెండిటిలో పరమాత్మ జ్ఞానమునకే ప్రత్యేకించి ఇందూ అనే పదమును వాడుదుము.
ఇందువు అనగా చంద్రుడని అర్థముకాగా, ఇందువు నుండి పుట్టిన శబ్దము ఇందూ. జ్యోతిష్యశాస్త్రములో జ్ఞానమునకు
అధిపతి చంద్రుడుకాగా, ప్రపంచ జ్ఞానమునకు చంద్రుడు అను పేరుతో చందూ అనీ, దైవజ్ఞానమునకు ఇందువు అను
పేరుతో ఇందూ అని పిలిచెడివారు. అందువలన దైవజ్ఞానమును కలవానిని ఇందూ అనీ, ప్రపంచ జ్ఞానముకలవారిని
చందూ అనీ చెప్పుచున్నాము. ఈ మాట సత్యమనుటకు ఒక చిన్న ఆధారము కలదు. పెళ్ళి పెత్తనమునకు పోయినపుడు
పెళ్ళి కుమారుడు పెళ్ళి కూతురును చూచుట, చూచిన తర్వాత అమ్మాయి నచ్చినదనియో, నచ్చలేదనియో చెప్పడము
జరుగుచుండును. సర్వసాధారణముగా అమ్మాయి తనకు అందముగా కనిపించక పోతే అమ్మాయి నచ్చలేదనీ, అమ్మాయి
అందముగా కనిపించితే నచ్చినదనీ అమ్మాయిని చేసుకోబోవు యువకుడు చెప్పును. అమ్మాయి అందముగా లేకపోయినా,
అమ్మాయి మంచి తెలివైనదైతే, అమ్మాయికి అందము లేక పోయినా, చందముందిలే అని తమ పెద్దలు చెప్పితే,
అమ్మాయికున్న చందమును బట్టి అబ్బాయి చేసుకుంటానని ఒప్పుకొనెడి వాడు. అందముండి చందము లేకపోతే ఏమీ
ప్రయోజనము లేదనీ, చందము (తెలివి) ఉండి అందము లేకపోయినా ఫరవాలేదనీ, జీవితానికి అందముకంటే
ముఖ్యము తెలివి (చందము) అనీ పూర్వము చెప్పెడివారు. ప్రస్తుతకాలములో చందమంటే ఏమిటో ఎవరికీ తెలియకుండా
పోయినది. పూర్వము చందూ అనే పేర్లు కొందరికీ, ఇందూ అనే పేర్లు కొందరికీ పెట్టెడివారు. ఇప్పటి కాలములో
కూడా చందూ అని మగపిల్లలకూ, ఇందుమతియనీ, ఇందూ అని ఆడపిల్లలకు పేర్లుండడము అక్కడక్కడ చూస్తూనే
ఉన్నాము. ఇందుమతి అనగా దేవుని జ్ఞానముకలదని అర్థము. ఎక్కడైనా ఇందుమతి అని పేరుండునుగానీ, హిందుమతి
అని పేరుండదు. హిందు అనునది అర్థములేని పదము. అలాగే ఎక్కడైనా దేవుని జ్ఞానములో ధర్మముండును, కావున
ఇందూ ధర్మమని దైవజ్ఞానమును చెప్పవచ్చును. అయితే అట్లు కాకుండా హిందూ ధర్మమని చెప్పితే అది అర్థములేని
ధర్మమగును. ధర్మములు అధర్మములుగా మారునని గీతలో చెప్పినట్లు ప్రస్తుతము ఇందూ అను పదము హిందూగా
మారిపోయి ఉన్నది. మేము చాలామార్లు యదార్థము ఇదీయని చెప్పినా వినని స్థితిలో హిందువులున్నారు. మనము
పూర్వము దైవజ్ఞానముగల ఇందువులమనీ, అందువలన మన దేశమునకు పూర్వమే ఇందూదేశమని పేరుకలదనీ,
ఇందూదేశములోని వారంతా ఇందువులమేననీ, కాలగమనములో ఆంగ్లేయుల పరిపాలన సమయములో వారు వచ్చీరాని
భాషతో మనలను హిందువులనడము జరిగినదనీ, అప్పటినుండి మన గొప్పతనమును మనము మరచిపోయి, మన
చరిత్రను మనము తెలియనివారమై, మధ్యలో జరిగిన మార్పును గ్రహించలేకపోతున్నా మని చెప్పినా విననివారున్నారు.
అలా వినకపోవడమే కాకుండా హిందు అను పదము సింధూ అను పదము నుండి మార్పు చెందినదనీ, సింధూనది
మనదేశములో ప్రవహించుట వలన సింధూ అను పేరు బదులు హిందు అను పేరు వచ్చినదని కొందరూ, మనది
సింధూనది ప్రాంత నాగరికత అయినందున మనము హిందువులమని కొందరూ చెప్పుచున్నారు. అలాంటపుడు
సింధూనది, సింధూ నాగరికతయనిగానీ తెలిసినపుడు మేము హిందువులము కాదు సింధువులమని చెప్పుకోవచ్చును
కదా! అని మేము అడుగుచున్నాము.
విషయము తెలియనంతవరకు హిందువులుగా పిలుచుకొన్నవారు హిందువు అనుటకు కారణము సింధూనది
అనిగానీ, సింధూ నాగరికతయని గానీ తెలిసినపుడు, హిందూ అను అర్థములేని పదమును వదలి ఆధారమైన అర్థముతో
మనము సింధువులమని చెప్పుకోవచ్చుకదా! సింధూనది పాకిస్థాన్లో కూడా ప్రవహించుచున్నది. కావున ఆ దేశము
వారు తమ దేశములోని ఒక రాష్ట్రమునకు సింధూరాష్ట్రము అని పేరు పెట్టుకొన్నారు. మన దేశములో సింధూనదికంటే
పెద్దదీ, పవిత్రమైనదీ అయిన గంగానది పారుచున్నది. దానికంటే పెద్దదైన బ్రహ్మపుత్ర నది పారుచున్నది. అలాంటపుడు
ముఖ్యమైన నదుల పేర్లను వదలి సింధూనది పేరును ఆధారముగా పెట్టుకోవడమేమిటని అడిగితే నేడు మేము
హిందూ ధర్మ రక్షకులమనువారివద్దే సమాధానము లేదు. సింధూనది పేరుకంటే గంగానది పేరు ముఖ్యము. ఎందుకనగా
సింధూనదికంటే గంగానదే మన దేశములో ఎక్కువగా ప్రవహించుచున్నది. అలాంటపుడు గంగాదేశమని పేరు పెట్టుకో
వచ్చును కదా! అని మేము అడిగితే, మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్ములను పరాయి మతస్థులన్నారు. మేము
స్వచ్ఛమైన ఇందూధర్మమును తెలిపితే, మమ్ములను నేటి హిందువులు కొందరు ఇందువులుగా గుర్తించలేక ఇతర
మతములవారిగా చెప్పడము ఎంత విచిత్రమో చూడండి. మేము భగవంతుడు చెప్పిన భగవద్గీతలోని పురుషోత్తమప్రాప్తి
యోగము అను అధ్యాయములోని 16,17 శ్లోకములను ఆధారము చేసుకొని క్షర, అక్షర, పురుషోత్తములను ముగ్గురు
పురుషుల విషయమును సిద్ధాంత సహితము చేసి శాస్త్రబద్దముగా త్రైతసిద్ధాంతమును ప్రకటించితే, చెప్పే విషయమేమిటో
గ్రహించలేని గ్రుడ్డివారై పోయి, త్రైతమును క్రైస్తవ మతములోని త్రిత్వముగా పోల్చుకొని మమ్ములను క్రైస్తవులన్న
కొందరు హిందువులు కలరు. మేము హిందువులము, మీరు ఇందువులు, మా మతము వేరు, మీ మతమువేరు
అనువారు కూడా కలరు. కుంటి కుందేలును పట్టుకొన్నవాడు, తాను పట్టుకొన్నది కుంటికుందేలని తెలియకపోవడమేకాక,
కుందేళ్ళన్నిటికీ మూడేకాళ్ళుంటాయని చెప్పడము పొరపాటనీ అది సత్యముకాదనీ, కుందేళ్ళకు మూడు కాదు నాలుగు
కాళ్ళుంటాయని చెప్పినా విననివారున్నారు. అటువంటి వానికి సత్యము తెలియాలంటే వానికి నాలుగుకాళ్ళ కుందేళ్ళను
రెండింటిని తెచ్చి చూపాలి. ఒకదానిని చూపినావాడు ఒప్పుకోడు. అది ఒక్కటి నాలుగుకాళ్ళతో తప్పుగా పుట్టిందంటాడు.
అందువలన రెండు కుందేళ్ళను చూపవలసిన అవసరమున్నది. మేము అలాగే రెండు కుందేళ్ళను చూపినట్లు పూర్వపు
చరిత్రనూ, పేర్లకు అర్థమును చెప్పినా వినకుండా నీవు హిందువేకావు ఇతర మతస్థుడని హిందువులు కొందరనడము
ఎట్లున్నదంటే, రెండు కుందేళ్ళను తెచ్చి వీటికి నాలుగు కాళ్ళున్నాయని సాక్ష్యము చూపినా ఇవి కుందేళ్ల జాతేకాదు,
ఇతర జాతి జంతువులన్నట్లున్నది.
మాకు జ్ఞానమున్నదని మాకంటే మించిన జ్ఞానిలేడనుకొని, మార్గమును పట్టుకోక, మతమును పట్టుకొన్నవారిని
వదలి, జ్ఞానమేమిటో తెలియాలనుకొను జిజ్ఞాసులకు చెప్పడము మంచిదనుకొన్నాము. మాకు తెలియదు, తెలుసుకోవాలను
ఆకాంక్ష కలవారికే మా రచనలు ఉపయోగపడు నని తెల్పుచున్నాము. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ఇందూ
సంస్కృతిని గురించి చెప్పుకొందాము. ఇందూ సంస్కృతిని విడదీసి చూస్తే ఇందూ అన్నది ప్రత్యేక పదముగా ఉన్నది.
సంస్కృతి అను పదమును వీడదీస్తే సమ్+కృతి అని కలదు. సమ్ అనగా మంచి, కృతి అనగా చేయబడినది అని
అర్థము. ఇప్పుడు ఇందూ సంస్కృతి అనగా దైవజ్ఞానముతో మంచిగా చేయబడినది అని అర్ధము. ఇంకా వివరముగా
చెప్పుకొంటే దైవజ్ఞానమును అనుసరించి నిర్ణయించిన పని లేక పద్ధతి అని తెలియుచున్నది. నిర్ణయించిన పద్ధతిని లేక
పనిని చేయుటను సాంప్రదాయము అని అంటాము. సంస్కృతి వలన సాంప్రదాయము ఏర్పడుచున్నది. ఉదాహరణకు
గుడిలోనికి పోయి ప్రతిమ ముందర ఇలా కర్పూరమును వెలిగించాలి, అందులో దైవజ్ఞాన సంబంధముగా నిర్ణయించిన
ఉద్దేశముంది అని తెల్పడము ఇందూ సంస్కృతి, దానిని ఆచరించడము సాంప్రదాయము. ఇటువంటి సంస్కృతి
సాంప్రదాయములు ఇందూ పథములో ఎన్నో గలవు. ఇందూ అనగా జ్ఞానమును పొందినవాడు, దైవజ్ఞాని అని
చెప్పవచ్చును. దైవజ్ఞానము ఎక్కడుంటే అక్కడ ఇందూ అను పదమును ఉపయోగించి చెప్పవచ్చును. దేవుని మీద
విశ్వాసముకలవానిని ఇస్లామ్లో “ముస్లీమ్” అన్నట్లు, దేవుని జ్ఞానమునుకలవానిని దైవజ్ఞాని అనవచ్చును. భక్తి అనగా
విశ్వాసము అని అర్థము. దేవుని యొక్క భక్తికలవానిని ముస్లీమ్ అంటే, దేవుని యొక్క జ్ఞానముకలవారిని ఇందువు అని
చెప్పవచ్చును. ఇక్కడ విడదీసి చెప్పితే భక్తి వేరు, జ్ఞానమువేరని చెప్పవచ్చును. దేవుని మీద విశ్వాసమునుకలవాడు
ఎవడైనా, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా ముస్లీమ్ అగును. అలాగే దేవుని జ్ఞానముకలవాడు ఎవడైనా, ఏ దేశస్థుడైనా,
ఏ మతస్థుడైనా ఇందువే అగును. ఈ సూత్రము ప్రకారము మతములను ప్రక్కన పెట్టి, మతాతీతముగా చూస్తే, ఇందూ
సమాజములో ఎందరో ముస్లీమ్లు కలరనీ, అలాగే ఇస్లామ్ సమాజములో కూడా ఎందరో ఇందువులుకలరనీ చెప్పవచ్చును.
ఇందూ సంస్కృతి అనునది సృష్ఠి మొదలైనప్పుడే చెప్పబడినది. జ్ఞానసంస్కృతి అనునది దేవుని జ్ఞానము
తెలుసుకొను ప్రతి మనిషితో సంబంధపడియున్నది. ఇందూ అనునది దైవజ్ఞానము. కావున దైవజ్ఞానము కలవారినందరిని
ఇందువులే అనవచ్చును. ఇందూ అనునది ఒక మతము కాదు, పథమనీ, దైవమార్గమనీ చెప్పవచ్చును. బైబిలులోని
దేవుని వాక్యము లను బాగా అర్థము చేసుకొని అందులోని జ్ఞానమును తెలుసుకొన్నవాడు జ్ఞానియే! లేక ఇందువే!
అలాగే భగవద్గీతలోని దేవుని జ్ఞానమును తెలుసుకొన్న వాడు జ్ఞానియే అగును, వానిని ఇందువు అనవచ్చును. ఒకవేళ
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన జ్ఞానము తెలియకుండా నేను ఇందువును లేక హిందువును అని చెప్పుకొంటే వాడు
ఇందూ సంఘములో నాయకుడైనా, ఇందూమత రక్షకుడని పేరు పెట్టుకొనినా, వాడు వాస్తవముగా ఇందువు కాడు.
నేడు ఇందువుకాని హిందువులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చును. ఇదే సూత్రము ప్రకారము ఇస్లామ్ సమాజములో
కూడా కొందరు జ్ఞానులూ ఉన్నారు, కొందరు విశ్వాసులూ ఉన్నారు. ఒక విధముగా క్రైస్తవములోనూ, ఇస్లామ్లోనూ
విశ్వాసులు ఎక్కువగలరు. జ్ఞానులు తక్కువ గలరు. ఇప్పటి ఇందూ సమాజము (హిందూసమాజము) లోనికి వచ్చి
చూస్తే చాలామందికి దేవుడు ఒక్కడే అను విషయము తెలియలేకపోయిన దానివలనా, బహు దేవతలను ఆరాధించుట
వలనా, దేవుని విశ్వాసులూ లేరు అలాగే దేవుని జ్ఞానము తెలిసినవారూ లేరనియే చెప్పవచ్చును. మేము జ్ఞానబోధకులము,
గురువులమని చెప్పుకొను వారందరూ, రకరకాల బోధలను బోధిస్తూ మా బోధలను విన్నవారు, అనుసరించిన వారు
దేవుడై పోగలడని చెప్పుచున్నారు. వారి బోధలను అనుసరించువారు మేము బ్రతికుండగనే దేవుడైపోయామని చెప్పు
కోవడమును చూస్తే దేవుని విధానము గానీ, దేవుని ధర్మముగానీ వారికి ఏమాత్రము తెలియదని స్పష్టమగుచున్నది.
నామ, రూప, క్రియారహితుడైన దేవున్ని తెలియకనే నామ, రూప, క్రియలున్న మనుషులు మేము
దేవుడైపోయామంటే, సూత్రము ప్రకారము వారు విశ్వాసులుగా గానీ, జ్ఞానులుగాగానీ లెక్కించబడరు. అన్ని మతములు
దేవునివైపే మార్గమును చూపుచున్నవి. అన్ని మతములు అందరికి ఒకే దేవుడని తెలుపుచున్నవి. పరమ భగవద్గీతలోగానీ,
పరిశుద్ధ బైబిలులోగానీ, పవిత్ర ఖురాన్లోగానీ ఒకే దేవున్ని ఆరాధించమనీ, అందరికి ఒకడే సృష్టికర్త యనీ జ్ఞానము
కలదు. ఆ సందేశముల ప్రకారము నడచుకొనువాడు ఎవడైనా జ్ఞాని అయినట్లే! వానినే ఇందువు అనవచ్చును. దేవుని
సమాచారమును తెలుపు గ్రంథములలోని దైవజ్ఞానము ప్రకారము అనుసరించని వాడు, మూల గ్రంథములలోని మూల
సూత్రములను తెలియని వాడు ఎప్పటికీ జ్ఞానికాలేడు, వానిని ఇందువు అనుటకు అవకాశము లేదు. మరొక ముఖ్య
విషయమేమనగా! ఆదిలో పుట్టిన పరమ భగవద్గీతలోగానీ, తర్వాత వచ్చిన పరిశుద్ధ బైబిలులోగానీ, ఆ తర్వాత వచ్చిన
పవిత్ర ఖురాన్లో గానీ మతము అను పేరు లేదు. మూడు మూల గ్రంథములలో సర్వ మానవులకు చెప్పుచున్నామనియే
ఉన్నది. కానీ మతము అను పేరు లేదు. మతము అను పేరు లేకపోతే, మాది ఫలానా మతమని ఆయా మతస్థులు
ఎందుకు చెప్పుకొంటున్నారని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా!
ఆట, పాట, పనీ లేని పనికిమాలిన (పని చేయని) వాడు దేవుడు. పని చేయని (పనికి మాలిన దేవుడు సృష్ఠి
ఆదిలోనే సృష్ఠి తయారు కాకముందే పని చేసి సమస్తమును సృష్టించడమే కాకుండా, తర్వాత వేరు వేరు కాలములందు
వేరు వేరు ప్రాంతములలో, వేరు వేరు వ్యక్తుల ద్వారా, వేరు వేరు రకములుగా తన (దేవుని) యొక్క జ్ఞానమును
బోధించునట్లు నిర్ణయించాడు. ఆయన (దేవుడు) నిర్ణయించినట్లే వేరువేరు కాలములలో, వేరువేరు ప్రాంతములలో,
వేరువేరు వ్యక్తుల ద్వారా దైవజ్ఞానము బోధించ బడినది. అయితే వేరువేరు రకములుగా బోధించబడినది. వేరువేరు
రకము లనగా దైవజ్ఞానములోనే వేరు పరిమాణములలో అని గ్రహించవలెను. ఒకే జ్ఞానమునే భగవద్గీతలో ఎక్కువ
పరిమాణములో బోధించబడినది. అదే జ్ఞానమునే బైబిలులో సంపూర్ణముగ బోధించినా, గీతకంటే పరిమాణము
తక్కువ ఉన్నది. అలాగే ఖురాన్ గ్రంథములో గీతలో, బైబిలులో బోధించిన సారాంశ జ్ఞానమునే చెప్పినప్పటికీ పరిమాణము
తగ్గినది. మీరు అర్థము చేసుకొనుటకు ఒక ఉదాహరణ చెప్పుచున్నాను చూడండి. ఒక తులము (పదిగ్రాముల)
బంగారును ఉపయోగించి ఒక కంసాలి ఒక వెడల్పయిన బిళ్ళను తయారు చేసి, ఆ బిళ్ళమీద ఒక బొమ్మను ముద్రించాడు.
తర్వాత కొంతకాలమునకు మరొక కంసాలి, మరొక ఊరులో ఒక తులము బంగారుతో ఒక బిళ్ళను తయారు చేసి
మొదటి బిళ్ళమీదనున్న బొమ్మనే ముద్రించాడు. ముందు తయారైన బిళ్ళకు తర్వాత తయారైన బిళ్ళకు విస్తీర్ణములో
మాత్రము కొంత తక్కువ ఉన్నది. కానీ బంగారం తులమే, దానిమీద బొమ్మ ఒకటే. మొదటి బిళ్ళను చూచినవాడు
రెండవ బిళ్ళను చూస్తే వాటిమీద ఒకే బొమ్మకలదని గ్రహించగలడు. తర్వాత కొంత కాలమునకు అదే తులము
బంగారుతో, పరిమాణములో రెండవదానికంటే చిన్నదిగానున్న బిళ్ళను మరొక కంసాలి తయారు చేసి, ఆ చిన్న
బిళ్ళమీద ముందు రెండు బిళ్ళల మీద ఉన్న బొమ్మనే ముద్రించాడు. తెలివైనవాడు ఎవడైన మూడు బిళ్ళలను చూస్తే
పరిమాణములో తేడా తప్ప ఒకే బొమ్మను చూపుచున్నవనీ, అన్నీ ఒకే తూకము గల బంగారు బిళ్ళలని తెలిసిపోయింది.
అలాగే గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో ఒకే దేవున్ని గురించి చెప్పడము జరిగినది. అయితే భగవద్గీత నూరు
శాతము వెడల్పయిన జ్ఞానమును చూపింది. అలాగే బైబిలు అరవై శాతము వెడల్పయిన జ్ఞానమును తెలిపింది. తర్వాత
పవిత్ర ఖురాన్ గ్రంథము కేవలము ఐదు శాతము వెడల్పయిన జ్ఞానమును చూపింది. అయితే సారాంశములోగానీ,
దేవుని విషయములోగానీ, మూడూ సమానముగా ఉన్నవి. దీనినిబట్టి గీత పలుచగా, బైబిలు గీతకంటే కొంత మందముగా,
ఖురాన్ గీత, బైబిలుకంటే మరికొంత మందముగా ఉండుట వలన, మూడూ సమానమైన బరువు కల్గియున్నవని,
బరువులో మాత్రము ఏ తేడా లేదని గ్రహించవచ్చును.
ఈ విధముగా దేవుడు తన గ్రంథములలో తన జ్ఞానమును బోధించాడు. మూడు మూల గ్రంథములలో ఒకే
దేవుని జ్ఞానము చెప్పుచూ, ఆ మూల గ్రంథములలో సర్వమానవులకు అందించు సమాచారములే చెప్పారు. కానీ
ఫలానా మతము అనీ, ఫలానా మత ప్రజలకనీ ఎక్కడా చెప్పలేదు. మూడు మూల గ్రంథములలో దేవుని మార్గమునే
తెలిపారు. కానీ ఎక్కడా ఎవరికీ మతమును గురించి చెప్పలేదు. దేవునివైపు పోవు పథమును (మార్గమును) గురించే
చెప్పారు. ఇప్పుడు కొందరు నన్ను ఒక ప్రశ్న ఇలా అడుగవచ్చును. "మీరు చెప్పినది బాగానే ఉన్నది. కానీ హిందూ
మతము, క్రైస్తవమతము, ఇస్లామ్ మతమని అందరూ వారివారి మతములను గురించి చెప్పుకొనుచున్నారు కదా!
హిందువులు బొట్టు పెట్టుకుంటే మిగత రెండు మతములవారు పెట్టుకోరు కదా! అలాగే ఇస్లామ్ మతమువారు లుంగీనిగానీ,
పైజామానుగానీ అర్థ అడుగు పైకి కట్టుకుంటే మిగత హిందూ, క్రైస్తవ మతముల వారు అలా కట్టుకోరు కదా! ఇలా
ఆచార వ్యవహారముల లోనూ వేరువేరు మతములుగా అందరు చెప్పుకొంటున్నారు కదా! అయితే మతము అనేది,
దాని ఆచార వ్యవహారాలు ఎక్కడినుండి పుట్టాయి.” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ, ఖురాన్లోగానీ మతము అనునది లేదు. అయితే వారు మూడు మతములుగా
చెప్పుకోవడమూ, మతములోని ఆచార వ్యవహారములు అన్నియు ప్రక్క గ్రంథములలోనివని చెప్పవచ్చును. హిందువులు
పురాణములను, వేదములను ఆశ్రయించుట వలనా, అలాగే ఇస్లామ్్వరు హదీసు గ్రంథములను ఆశ్రయించుట వలన,
క్రైస్తవులు మిగత 62 సువార్తలను ఆశ్రయించుట వలనా వారిలో బేధములు, మతముల తేడాలు కనిపించుచున్నవి.
ముస్లీమ్లు లుంగీనిగానీ, పైజామానుగానీ పైకి కట్టుకోమని ఖురాన్ గ్రంథము చెప్పలేదు. హిందువులకు వేదములున్నట్లు
ముస్లీమ్లకు హదీసులున్నవని తెలియాలి. వేదముల వలన హిందువులలో కొన్ని ఆచార వ్యవహారములు వచ్చినట్లు,
ముస్లీమ్లలో కూడా హదీసుల వలన కొన్ని ఆచార వ్యవహరములు వచ్చినవి. దైవజ్ఞానము తప్ప హిందువుల ఆచార
వ్యవహారములు ఏవీ కూడా భగవద్గీతలో లేవు. అలాగే దేవుని జ్ఞానము తప్ప ముస్లీమ్ల ఆచార వ్యవహారములు ఏవీ
కూడా ఖురాన్ గ్రంథములో లేవు. మూడు మూల గ్రంథములలోనూ దైవపథమున్నది. కానీ మతము అను ప్రసక్తేలేదు.
అయితే మనిషి, దేవుడు చెప్పిన పథమును మతముగా మార్చుకొన్నాడు. పథము అనగా మార్గము అని అర్ధము.
దేవుడు చెప్పిన మూడు మతములలో మనిషి దేనిని ఇష్టపడునో దానిని మతము అంటున్నాము. మతము అనగా
ఒప్పుకోవడము లేక ఇష్టపడడము అని అర్థము. దేవుడు చెప్పిన మార్గములలో ఒక దానిని మనిషి ఒప్పుకొంటే అది
వాని మతమగును. ఒక దానిని ఒప్పుకొంటే మిగతా వాటిని ఒప్పుకోలేదని అర్థము కదా! అలా దేవుని మార్గములో
ఒక్క దానిని మాత్రము ఇష్టపడడము లేక ఒప్పుకోవడమును మతము అంటున్నాము. ఈ లెక్క ప్రకారము హిందూ
మతస్థులు మిగత రెండు మతములను ఒప్పుకోవడము లేదు. అలాగే క్రైస్తవుడు ఇస్లామ్నూ, ఇందూత్వమును ఒప్పుకోవడము
లేదు. ఒకదానిని ఒప్పుకొని మిగతా పథములను ఒప్పుకోనప్పుడు అప్పుడది ఒప్పుకొన్న మనిషికి మతమగును. ఈ
విధముగా మూడు గ్రంథములలోని విషయము, పరస్పర అవగాహన లేనప్పుడు, మూడు పథములు మూడు మతములుగా
మారిపోయినవి. మనిషి మూడు మూల గ్రంథములను సరిగా అర్థము చేసుకోక ఒకదానిని ఇష్టపడడము, మరొక
దానిమీద అయిష్టతను చూపడము వలన అతనికి సమ్మతమైనది ఏదో అది మతమైనది. అందువలన మతమునకు
అతీతుడు కావలెనంటే, ఏదైతే జ్ఞానమో దానిని మనిషి స్వీకరించుచుండవలెను. అప్పుడైతేనే మనిషి పథములో
పయనించి నట్లగును. అట్లుకాకపోతే అతడు మతములో చిక్కుకొన్నట్లగును. ప్రస్తుత కాలములో అందరూ వారికి
ఇష్టమైన మతములోనే ఉన్నారు. ఇష్టము కాని పథములను అసూయతో చూస్తున్నారు. దేవుడు తెల్పిన మార్గములలో
మనిషికి సమ్మతము, అసమ్మతము ఉన్నంత వరకు మతము ఉంటుంది. అన్నీ దేవుడు చెప్పిన జ్ఞానములు, ధర్మములు
అయినప్పుడు, అందరికి దేవుడు ఒక్కడే అయినప్పుడు పథము మాత్రమే ఉంటుంది. అట్లుకాకుండా మా జ్ఞానమూ,
మా ధర్మమూ వేరన్నప్పుడు, మా దేవుడు మీ దేవుడు వేరన్నప్పుడు పథము ఉండదు. అక్కడ మతము ఉంటుంది.
ముఖ్యమైన మూడు మత గ్రంథములలోనూ పథమునకు సంబంధించిన సమాచారముండగా, ప్రక్క గ్రంథము
లలో మతమునకు సంబంధించిన సమాచారమున్నది. మనిషి మూల గ్రంథములకంటే ప్రక్కనున్న గ్రంథములలోని
సమాచారమును చూచి మాయలో పడి మతమును సృష్టించుకొన్నాడు. అందువలన మతము అనునది మనిషిచేత
సృష్ఠింప బడినదేనని చెప్పవచ్చును. అట్లే పథమును దేవుడు నెలకొల్పాడని చెప్పవచ్చును. మతము పథము యొక్క
తారతమ్యములు తెలియనివాడు మతములోనే చిక్కుకొని దేవుని మార్గమునకు దూరముగా ఉండును. ప్రతి మతస్థులు
మేము దేవునికి దగ్గరగానున్నామని భ్రమలో మునిగియున్నారు. దైవమార్గమును అనుసరిస్తేనే దేవునికి దగ్గరవుదుమని
తెలియక తాము ఒక మతమును అనుసరిస్తూ దేవునికి దగ్గరగానున్నామనుకోవడము భ్రమ కాక ఏమగును? ఇప్పటికైనా
అన్ని మతములవారు గ్రహించవలసిన ముఖ్యమైన విషయము, మతము ఎన్నటికి దేవుని దగ్గరకు చేర్చలేదనీ,
మతములకతీతమైన పథము మాత్రమే దేవుని దగ్గరకు చేర్చగలదని తెలియవలెను. తన మతమును సమర్థిస్తూ, ఇతరుల
మతమును విమర్శిస్తూ ఉండడము వలన ప్రయోజనములేదని, ఇతర మతములోని సత్యమును కూడా గ్రహించగలిగితే,
మిగతా మతములలో కూడా దైవజ్ఞానమున్నదని తెలియగలదు. అంటే మిగత మతములలో కూడా ఇందూ సంస్కృతికలదని
తెలియగలదు. మిగతా మతములలో కూడా జ్ఞానము తెలిసిన ప్రతి మనిషి కూడా ఇందువే అని తెలియగలదు.
దీనినిబట్టి ఇందూ సంస్కృతి ఒక్క మతమునకు పరిమితికాదనీ, అన్ని మతములకు సంబంధించినదనీ తెలిసిపోవుచున్నది.
ఏ మతములో పుట్టినవాడు ఆ మతములోనే ఉంటూ, దేవుడు చెప్పిన అన్ని మతములలోని జ్ఞానమును గ్రహించగలిగినప్పుడు
వాడు నిజమైన ఇందువగును. ఇక్కడ మతము మారితే ఇందువగుదువని చెప్పడములేదు. మతము మారకుండా
ఇందువగు (జ్ఞానియగు) విధానమును తెలిపాము. దైవ ధర్మములు గల అన్ని పథములలోనూ ఇందూత్వమున్నదనీ, ఏ
మతము (ఏ పథము) లోనైనా జ్ఞానము తెలిసినవాడు మిగతా మతములలోని జ్ఞానమును కూడ తెలియగల్గు ఇందువుగా
చలామణి అగుచున్నాడు. ఇందూ సంస్కృతిని దేవుడు తెలిపాడు, కావున అది అన్ని మతములలోనూ ఉన్నదని
చెప్పుచున్నాము. దానిని తెలియడమే ప్రతి మనిషి కర్తవ్యము.
భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు, అర్జునునకు విశ్వరూపమును చూపినపుడు, దేవుని విశ్వరూపమును
చూచిన అర్జునునకు ఏమీ అర్థముకాక ఎవరు నీవు అని అడిగాడు. అప్పుడు విశ్వరూపములోనున్న దేవుడు దానికి
జవాబుగా చిన్న పదమును ఉపయోగించి “కాలోస్మి” అన్నాడు. కాలోస్మి అంటే కాలమునై ఉన్నానని అర్థము. కాలము
అనునది ఒక విధముగా పేరుకాని పేరే అయినా కాలమునకు రూపము లేదు. కాలము మన ముందరే ఉన్నా దానికి
రూపములేదు. కాలము ఎట్లున్నదో చెప్పమని అడిగితే దానిని గురించి ఎవరూ ఏ వివరము ఇవ్వలేరు. కాలము దైవ
స్వరూపమైనది, కావున అది ఇట్లున్నదని ఎవరూ చెప్పలేరు. రూపము లేనిది కాలము, అయినా కాలము గడచిన,
గడుస్తున్న, గడువబోవు అను మూడు భాగములుగా ఉన్నది. గడచిన కాలమును భూతకాలము అంటాము, గడస్తున్న
కాలమును వర్తమాన కాలము అంటాము. అలాగే గడువబోవు లేక రాబోవు కాలమును భవిష్యత్ కాలము అంటాము.
కాలము అంటే దేవుడు అని అర్థమైనది కదా! కాలము మూడు విధములుగా మనముందరే, మన కళ్లెదుటే ఉన్నా
దానిని అనుభవించలేక పోవుచున్నాము. కాలము చెప్పుకొనుటకు ఉన్నది, కానీ అనుభవమునకు రానిదని తెలియుచున్నది.
దేవుడు ఉన్నాడని చెప్పుటకు మాత్రమే కలడు, కానీ ఆయన ఎవరి అనుభవానికి రాడని ప్రత్యక్ష కాలమునుబట్టి తెలిసి
పోవుచున్నది. కాలము ప్రత్యక్ష సాక్ష్యముగా ఉండినా, అది ఏమిటో ఎవరూ చెప్పలేనట్లు, దేవుని ధర్మములు మనకు
తెలియుచున్నప్పటికీ, దేవున్ని ఎవరూ తెలియలేరు. దీనిని బట్టి దేవుడు ధర్మబద్ధుడు అనియూ మరియు దేవుడు
ధర్మాతీతుడనియూ రెండు రకముల చెప్పవచ్చును.
దేవుడు కాలస్వరూపుడు, కావున కాలమును గురించి వివరముగా తెలుసుకొంటే దేవుని జ్ఞానమును గురించి
తెలిసినట్లగును. అందువలన కాలమును గురించి వివరముగా చెప్పుకొంటే 60 సెకండ్లు ఒక నిమిషమనీ, 60
నిమిషములు ఒక గంటయనీ, 24 గంటలు ఒక దినమనీ, 30 దినములు ఒక నెలయనీ, 12 నెలలు ఒక సంవత్సరమనియు
కాలమును కొలిచి చెప్పుచున్నాము. అయినా కాలము యొక్క నిజస్వరూపము ఎవరికీ తెలియదు. కాలము మూడు
రకములుగా ఉన్నదని చెప్పుకొన్నాము కదా! అలాగే దేవుడు మూడు రకములుగా ఉన్నాడని చెప్పవచ్చును. కాలము
భూత, వర్తమాన, భవిష్యత్ అను మూడు రకములుగా ఉన్నట్లే దేవుడు కూడా క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని
మూడు రకములుగా చెప్పబడుచున్నాడు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16,17 శ్లోకములలో ముగ్గురు
పురుషులను గురించి చెప్పడము జరిగినది. కాలము దైవస్వరూపము అయినపుడు కాలము మూడు రకాలుగా ఉన్నది.
అలాగే దైవము మూడు రకములుగా ఉన్నాడు. కాలము యొక్క మూడు రకములు మనిషికి తెలియును. కానీ చాలామందికి
దైవము యొక్క మూడు రకములు ఏమిటో తెలియదు. మేము చెప్పుచున్న త్రైతసిద్ధాంతము, దైవము మూడు రకములుగా
ఉన్నాడని చెప్పుచున్నది. గీతలో దేవుడు ముగ్గురు పురుషులుగా క్షర, అక్షర, పురుషోత్తములుగా చెప్పబడియున్నాడు.
వివరముగ చెప్పుకొంటే క్షరుడు అనగా ఒక జీవుడు లేక జీవాత్మ అని చెప్పవచ్చును. క్షరుడు అనగా నాశనము చెందువాడని
అర్ధము. ఎప్పటికైనా జీవుడు నాశనము చెందువాడని అందువలన జీవున్ని క్షరుడు అన్నాము. అక్షరుడు అనగా
నాశనము చెందనివాడని అర్థము. నాశనము చెందు జీవాత్మగా మనము మన శరీరములో ఉన్నాము. నాశనముకాని
అక్షరుడు ప్రతి శరీరములోనూ జీవునితో పాటు ఉంటున్నాడు. క్షరుడైన జీవుడు శరీరములో ఒక్కచోట మాత్రముండగా,
అక్షరుడైన ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. మూడవ పురుషుడైన పురుషోత్తముడు (పరమాత్మ) విశ్వమంతా
అణువణువున వ్యాపించి ఉండడమే కాక శరీరములో కూడ వ్యాపించియున్నాడు. మూడు రకముల పురుషులలో
జీవాత్మ శరీరములో ఒక్కచోట, ఆత్మ శరీరమంతా, పరమాత్మ శరీరము బయటా, శరీరము లోపలాయున్నాడు.
కాలము దైవస్వరూపము కావున నేను కాలమును అని గీతలో దేవుడు చెప్పాడు. దీనినిబట్టి కాలమూ, దైవమూ
రెండు ఒక్కటేననీ, రెండూ మూడు భాగములుగా ఉన్నవని చెప్పుకొన్నాము. ఇప్పుడు కాలము యొక్క మూడు భాగములతో
దైవము యొక్క మూడు భాగములను అన్వయించి చూచితే మూడు కాలములకు మూడు ఆత్మలు సరిపోవును. మూడు
కాలములు మూడు ఆత్మలతో సరిపోవుట వలన, కాలము దైవస్వరూపము అనడమేకాక దైవము కాలస్వరూపము
అనీ, కాలము ఆత్మ స్వరూపమని కూడా చెప్పవచ్చును. భగవద్గీతలో జ్ఞానయోగమందు ఆరవ శ్లోకమున సర్వ
జీవరాసులకూ నేను ఈశ్వరున్ని (అధిపతిని) అని చెప్పుచూ “భూతానా మీశ్వరోపిసన్" అని అన్నాడు. అట్లే రాజవిద్యా
రాజగుహ్య యోగము అను అధ్యాయములో పదకొండవ శ్లోకమందు నేను జీవులందరికి మహేశ్వరున్ని అని చెప్పుచూ
"మమ భూత మహేశ్వరమ్" అని అన్నాడు. రెండు వాక్యములలోనూ జీవుళ్ళను భూతములని చెప్పడము జరిగినది.
దీనినిబట్టి భూతము అనగా జీవాత్మ అని తెలిసిపోవుచున్నది. మూడు కాలములలో భూతకాలమున్నట్లు, మూడు
ఆత్మలలో భూతాత్మ అనునది ఒకటున్నదనీ, అదియే జీవాత్మయనీ చెప్పవచ్చును. ఈ ఆధారముతో భూతకాలమునకు
జీవాత్మనూ, వర్తమాన కాలమునకు ఆత్మనూ, భవిష్యత్ కాలమునకు పరమాత్మను పోల్చి చెప్పవచ్చును.
12 నెలలు ఒక సంవత్సరము అయినట్లు 60 సంవత్సరములు ఒక ఉప యుగము అగుచున్నది. 7,200
ఉపయుగములు కలిసి ఒక యుగమగుచున్నది. అదియే కలియుగము. అలాగే 14,400 ఉపయుగములు ఒక
ద్వాపరయుగమూ, 21,600 ఉపయుగములు ఒక త్రేతాయుగము, 28,800 ఉపయుగములు కలిసి ఒక
కృతయుగమగుచున్నది. యుగములు మూడు పేర్లతో ఉన్నాయి. ఒకటి ఉపయుగము, రెండుయుగము, మూడు
మహాయుగమని చెప్పుచున్నాము. నాలుగు యుగములు కలిసి ఒక మహా యుగమగుచున్నది. కృతయుగము,
త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము నాలుగు యుగములు కలిసి మహాయుగము కాగా, 72,000
ఉప యుగములు కలిసి ఒక మహాయుగము యొక్క కాలమగుచున్నది. కలియుగము 7,200 ఉపయుగములుకాగా
దానికి పదింతలు ఎక్కువ ఒక మహాయుగమగుచున్నది. యుగములను సంవత్సరములలో చెప్పుకొంటే కలియుగము
4,32,000 సంవత్సరములు. ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు. త్రేతాయుగము 12,96,000
సంవత్సరములు. కృత యుగము 17,28,000 సంవత్సరములు. నాలుగు యుగముల కాలము 43,20,000
సంవత్సరములు. కలియుగమునకు పదింతలు ఎక్కువ ఒక మహాయుగము అగుచున్నది.
కలియుగము = 7,200 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరములుకాగా మొత్తము
కలియుగము : 4,32,000 సంవత్సరములు
ద్వాపరయుగము = 14,400 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
ద్వాపరయుగము : 8,64,000 సం॥
త్రేతాయుగము = 21,600 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరములు
కృతయుగము = 28,800 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
కృతయుగము : 17,28,000 సంవత్సరములు
కలియుగము=60x7,200 =4,32,000
ద్వాపరయుగము=60x14,400=8,64,000
త్రేతాయుగము=60x21,600=12,96,000
కృతయుగము=60×28,800 =17,28,000
ఒక మహాయుగము=60×72,000=43,20,000
భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయమందు 17,18 శ్లోకములలో ప్రపంచము యొక్క ఆయుస్సు
చెప్పబడినది.
17. శ్లోకము
సహస్రయుగపర్యన్త మహర్యద్భహ్మణో విదుః,
రాత్రిం యుగ సహస్రాన్తాం తేహూ రాత్ర విదో జనాః
ఈ శ్లోకములో వేయియుగములు దేవునికి ఒక పగలనీ, వేయి యుగములు ఒక రాత్రనీ చెప్పబడినది. తర్వాత క్రింది
శ్లోకములో
18. శ్లోకము
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్య హరాగమే,
రాత్రాగమే ప్రలీయన్తో తత్రైవావ్యక్త సంజ్ఞకే.
వేయియుగములు దేవుని పగలు కాలములో ఈ ప్రపంచమంతా జీవన విధానము సాగించుచుండును. అలాగే
వేయియుగముల రాత్రి కాలములో మొత్తము విశ్వమే ఉండదు. దేవుని పగలు ప్రారంభములో విశ్వము సృష్ఠించబడును,
దానినే ప్రభవము అంటాము. అలాగే దేవుని రాత్రి ప్రారంభములో సృష్టించబడిన విశ్వమంతా లేకుండా పోవును.
దానినే ప్రళయము అంటాము. ఒకమారు విశ్వము సృష్టించబడి తర్వాత వేయి యుగములకు విశ్వము ప్రళయము
పొందడమును ఒక కల్పము అంటాము. ఒక కల్పము యొక్క పూర్తి కాలము రెండువేల యుగములని తెలియుచున్నది.
దేవుని యొక్క ఒక పగలు, ఒక రాత్రి రెండు రెండువేల యుగములు. ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక దినమగుచున్నది.
దేవునికి ఒక దినము పూర్తి అయితే దానిని ఒక కల్పము అంటాము. ఇదంతా కల్పిత కథగా చెప్పిన విషయము కాదు.
ఇదంతా పూర్తి శాస్త్రబద్ధమైన విషయము. ఇదంతా శాస్త్రబద్దమనుటకు ఇప్పుడు జరుగుచున్న కలియుగమే ప్రత్యక్ష
ప్రమాణము. సృష్ఠి ప్రభవ, ప్రళయములకు గీతలో భగవంతుడు చెప్పిన పై రెండు శ్లోకములే ఆధారము. అంతేకాక
ప్రతి జీవరాసి తల మధ్యభాగములో కనిపించని బ్రహ్మచక్రమొకటున్నది. ఆ బ్రహ్మచక్రము రెండు భాగములుగా విభజింపబడి
యున్నది. ఆ బ్రహ్మచక్రము కాలముతో పాటు తిరుగుచున్నది. ఆ చక్రము లోని రెండు భాగములు పూర్తిగా ఒక చుట్టు
తిరుగుటకు రెండు వేల యుగములు పట్టుచున్నది. బ్రహ్మచక్రములోని రెండు భాగములలో ఒక భాగము దేవుని
పగలుగా, మరియొక భాగము దేవుని రాత్రిగా గుర్తింపబడినది. బ్రహ్మచక్రము యొక్క గమనము ఒక భాగము
తిరుగుటకు వేయియుగములు పట్టుచున్నది. లెక్కప్రకారము నాలుగుయుగములు కలిసిన మహాయుగములు 250
మార్లు గడచితే వేయియుగములగును. వేయి యుగములు జరుగుటకు పూర్తిగా 108 కోట్ల సంవత్సరములగుచున్నది.
దీనిప్రకారము విశ్వము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని శాస్త్రబద్దముగా తెలియుచున్నది. దేవునికి
పగటి కాలము 108 కోట్ల సంవత్సరములుకాగా, రాత్రి కాలము కూడా 108 కోట్ల సంవత్సరములేనని చెప్పవచ్చును.
మొత్తము 216 కోట్ల సంవత్సరముల కాలము దేవునికి ఒక దినమగునని బ్రహ్మవిద్యా శాస్త్రప్రమాణముగా చెప్పవచ్చును.
విశ్వమంతా సృష్టింపబడినది జీవులకొరకే. జీవుని నిమిత్తము దేవుడు చేసినదే విశ్వసృష్ఠి. విశ్వమునకు
ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని చెప్పుకొన్నాము కదా! 108 కోట్ల సంవత్సరముల క్రమపద్దతి కొరకు
బ్రహ్మచక్రమనునది కలదని కూడా చెప్పుకొన్నాము. విశ్వము, విశ్వము యొక్క ఆయుషే కాకుండా జీవులు, జీవుల
గుణములు, జీవుల కర్మలు, కర్మలు అమలుకు వచ్చు కాలములు అన్నీ నిర్ణయింపబడి ఉన్నవి. శరీరములోనే జీవుడు
నివశిస్తున్నాడని అందరికీ తెలుసు. అయితే ఎక్కడ నివశిస్తున్నా డని మాత్రము పెద్ద ఆధ్యాత్మికవేత్తలకు కూడా తెలియదు.
దానిని వివరముగా తెలుసుకొంటే బ్రహ్మచక్రము క్రింద కాలచక్రమున్నది. కాలచక్రము క్రింద కర్మచక్రమున్నది.
కర్మచక్రము క్రింద గుణచక్రమున్నది. ఈ బ్రహ్మ, కాల, కర్మ, గుణ అను నాలుగు చక్రములు బ్రహ్మనాడిలోని ఆత్మను
ఇరుసుగా చేసుకొని ఒకదాని క్రింది ఒకటి అమర్చబడియున్నవి. నాలుగు చక్రముల సముదాయము మన తల
మధ్యభాగములో ఎలా ఉన్నది చిత్రరూపములో ప్రక్క పేజీలో చూడవచ్చును.
అన్నిటికంటే క్రింద గల గుణచక్రము మొత్తము నాలుగు భాగములుగా ఉన్నది. అందులో బయటి మూడు
భాగములందు గుణములుండును. మధ్యలోని భాగములో గుణములుండవు. అందులో ఆత్మయుండును. గుణ
చక్రములలోని నాలుగు భాగములను రెండు విధములుగా విభజించి చెప్పవచ్చును. ఒకటి గుణములున్న భాగములు,
రెండు గుణములులేని భాగము అని రెండు విధముల విభజించవచ్చును. గుణచక్రమును మాయచక్రమని కూడా
అనవచ్చును. అలా అనుటకు భగవద్గీతలోని విజ్ఞాన యోగమందు 14వ శ్లోకమున "గుణమయీ మమ మాయా" అను
వాక్యమే కారణము. ఆ వాక్యము ప్రకారము నా మాయ గుణములతో కూడుకొని ఉన్నదనీ, లేక మాయ గుణరూపములో
ఉన్నదనీ దేవుడు చెప్పాడు. అందువలన గుణచక్రములోని గుణములనే మాయ అంటున్నాము. గుణములను మాయ
అన్నపుడు గుణచక్రమును మాయచక్రమని చెప్పవచ్చును. గుణచక్రములోని నాలుగు భాగములలో జీవుడు
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు :చిత్రంపేజీ 14 లో చూడండి .
నివాసముండగలడు. అయితే శరీరమును ధరించినప్పటినుండి గుణములున్న మూడు భాగములలోనే ఉన్నాడు.
గుణములులేని భాగములోనికి జీవుడు గట్టి ప్రయత్నము చేస్తే పోగలడు. జీవుడు గుణరహిత భాగమైన, ఆత్మ నివాసమున్న
భాగములోనికి పోవాలని ఏమాత్రము అనుకోవడము లేదు. అందువలన జీవుడు గుణములున్న మూడు భాగములలోనే
ఏదో ఒక భాగములో ఎల్లకాలము నివశిస్తున్నాడు. గుణచక్రము మూడు మరియు ఒకటి మొత్తము నాలుగు భాగములుగా
ఉన్నదని చెప్పుకొన్నాము కదా! గుణములున్న మూడు భాగములు బయటినుండి వరుసగా, ఒకటి తామస గుణభాగము,
రెండు రాజస గుణభాగము, మూడు సాత్విక గుణభాగము అనుపేర్లతో కలవు. ఇక మధ్యలో మిగిలియున్న నాల్గవ
భాగము గుణరహితమైన భాగము. దానిని ఆత్మ భాగమనీ లేక యోగ భాగమనీ చెప్పుచున్నాము. జీవుడు నాల్గవ
భాగములోనికి వచ్చినపుడు యోగమగును. అందువలన దానిని యోగ భాగమనుచున్నాము. గుణచక్రము ఎలా
ఉన్నదీ క్రింది పటములో (:చిత్రంపేజీ 14 లో చూడండి ) చూడవచ్చును.
మాయచక్రము లేక గుణచక్రములో గుణములున్న ఒక్కొక్క భాగములో పన్నెండు గుణములు గలవు.
తామసములో 12, రాజసములో 12, సాత్వికములో 12 గుణములు రెండు రకములుగా కలవు. 12 గుణములలో
ఆరు ఒక రకముకాగా, మిగిలిన ఆరు మరొక రకముగా ఉన్నవి. మొదటి రకము ఆరు గుణములు జీవునికి పాపమును
అందించు చెడు గుణములు కాగా, మిగత ఆరు గుణములు జీవునికి పుణ్యమును అందించు మంచి గుణములుగా
ఉన్నవి. ఒకే గుణభాగములో ఇటు మాయ, అటు మాయ అన్నట్లు ఇటు మంచి అటు చెడు గుణములు రెండు
రకములు గలవు. గుణభాగములోని ఆరు చెడు గుణములను అరిషట్వర్గము అని అంటారు. అరి అనగా శత్రువు అని
అర్థము. షట్ అనగా ఆరు అనీ, వర్గము అనగా గుంపు అనీ అర్థము. అరిషట్ వర్గము అంటే ఆరు శత్రువుల గుంపు
అని అర్థము. అలాగే మిగతా ఆరు గుణములను మిత్ర షట్వర్గము అంటారు. ఆరు మిత్రులగుంపు అని దాని అర్థము.
ఈ పన్నెండు గుణములు ఎవరికి మిత్రులు, ఎవరికి శత్రువులు అను ప్రశ్నకు జవాబుగా, జీవునకు ఆరు శత్రుగుణములు,
ఆరు మిత్రగుణములుగా ఉన్నవని చెప్పవచ్చును. మూడు గుణభాగములలోనూ మిత్ర శత్రు గుణములుండగా, నాల్గవ
భాగములో మాత్రము ఏ గుణములు లేవు. ఇదంతయు జీవుని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసి పెట్టిన యంత్రాంగము.
గుణచక్రములోని (మాయచక్రములోని) మూడు భాగములయందు ఒక్కొక్క భాగములో పన్నెండు
గుణములున్నాయని చెప్పుకొన్నాము కదా! పన్నెండులో ఆరు శత్రు గుణములు, ఆరు మిత్ర గుణములున్నాయని
కూడా చెప్పుకొన్నాము. వీటి వలననే పాపపుణ్యములు వస్తాయని కూడా చెప్పుకొన్నాము. ఈ విధానము బహు
రహస్యమైనది. ఏ మతమునందు కూడా ఇంతవరకూ ఎవరూ చెప్పనిది, కావున చాలా జాగ్రత్తగా వినవలెనని
తెలుపుచున్నాను. ఒక భాగము ఆరు శత్రు గుణములు వరుసగా ఇలా ఉన్నవి. 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ
5) మద 6) మత్సర అను పేర్లతో కలవు. వివరముగా చెప్పితే, కామ అనగా శృంగారమునకు సంబంధించినది, ఆడ
మగకు సంబంధించినదని అనుకోకూడదు. కామము అంటే ఆశ అని అర్థము. అది ఏ ఆశ అయినా కావచ్చును. ఏ
దాని మీద ఆశ అయినా కావచ్చును. డబ్బు కావాలనుకోవడము ఆశయే కదా! దానిని కామ గుణము అనవచ్చును.
అలాగే పలానా స్త్రీ సాంగత్యము కావాలను కోవడము కూడా ఆశయే అగును. కావున దానిని కూడా కామ గుణమే అని
చెప్పవచ్చును. ఈ విధముగా ఒక గుణములోని ఉద్దేశమును బట్టి అది మనిషి జీవితములో ఎక్కడ ఎలా
ఉపయోగపడుచున్నదో గుర్తించవచ్చును. మనిషి ప్రవర్తననుబట్టి ఆ ప్రవర్తన ఏ గుణమునకు సంబంధించినదో
తెలియవచ్చును. రెండవ గుణమైన క్రోధము అనగా కోపము. అది మనిషి శరీరములో ఎలా ఉన్నదో తెలియనప్పటికీ,
దాని కార్యాచరణ బయట మనిషిలో కనిపించును. అప్పుడు మనిషిలోని జీవుడు కోప గుణమునకు తగులుకొన్నాడని
అర్థము చేసుకోవచ్చును. ఈ విధముగా గుణములన్నిటిని గుర్తించవచ్చును. మూడవదైన లోభ గుణము జీవున్ని
తగులుకొన్నపుడు వాడు లోభిగా మారిపోవును. వానిలో పిసినారితనము పెరిగిపోవును. అటువంటి పిసినారి గుణమున్న
వారిని చాలాచోట్ల చూడవచ్చును. ఇక నాల్గవదైన మోహగుణము మనుషులలో నాది, నావారు, నా అను భావము
కల్గించుచున్నది. ఇది మనిషిలో గుర్తించలేనంతగా పని చేయుచుండును. భారతయుద్ధములో అర్జునునకు ఈ
మోహగుణము వచ్చిన దానివలన నేను యుద్ధము చేయను, నావారిని చంపను అన్నాడు. దీనిని చాలామంది అర్థము
చేసుకోలేక ప్రేమ గుణముగా భావించుకొనుచుందురు. ప్రేమ గుణమువేరు, దాని పనివేరు. అలాగే మోహగుణము
వేరు దాని పనివేరని తెలియవలెను. ఇక ఐదవ గుణము మదము. మదము అనగా గర్వము అని అర్థము. నేను
ఫలానా అని తన్నుతాను గొప్పగా అనుకోవడమును గర్వము అంటాము. చాలామంది మదము అంటే మనిషిలోని
క్రొవ్వు అని అనుకోవడము జరుగుచున్నది. ముఖ్య గమనిక ఏమంటే శరీరములోని ఏ భాగముతోను సంబంధము
లేకుండా ప్రత్యేకముగ ఉన్నవి గుణములు. శరీర భాగములు వేరు, గుణములువేరని తెలియవలెను. కొందరు
బోధకులు గురువులుగా చలామణి అగుచు ఆధ్యాత్మిక కోర్సులూ, క్లాసులూ ఏర్పాటు చేసి, అందులో ఒక బోర్డునందు
గుణములను గురించి వ్రాస్తు ఇలా వ్రాసియుంచారు. “గుణములు ఐదు. కామము, క్రోధము, లోభము, మోహము,
అహము” అని చార్టులో వ్రాసి గోడకు తగిలించారు. అహము అనునది గుణము కానే కాదు. అది శరీరములో 25
భాగములలో ఒక సూక్ష్మభాగము. పేరుపొందిన బోధకులు ఆధ్యాత్మికమును బోధించుచు అహమును గుణముగా
చెప్పుచున్నారంటే ఎంత విచిత్రము.! మదము అనునది నేను ఫలానాయను భావమును కల్గించునది. దానినే గర్వము
అంటాము. ఇది ప్రతి మనిషిలోనూ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ హెూదా ఉన్నవారు తన్నుతాను మరచిపోయి
తన హెూదాను తానుగా తలుస్తూ గర్వగుణముతో ప్రతి క్షణము నిండిపోయి ఉందురు. ఇవి పాపమును అంటగట్టు
గుణములని చాలామందికి తెలియదు. ఇక చివరి గుణము మత్సరము. దీనినే అసూయ అని చెప్పవచ్చును. ఇది
తనకు సంబంధములేని వానిమీద కూడా పనిచేస్తూ, ఇతరులను, ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేని తనమును
కల్గించును. ఈ అసూయ ఇతరులను చెడి పోవునట్లు, వారికి నష్టమును కష్టమును కల్గించునట్లు చేయుచున్నది.
మొత్తము ఈ ఆరు గుణములు జీవునకు శత్రువులతో సమానము. అందువలన వీటిని శత్రు గుణముల గుంపు
అన్నారు. లోపల గుణములే బయటి శత్రువులను తయారు చేయుచున్నవి. అంతేకాక ఈ ఆరు గుణములు జీవునికి
పాపమును అంటగట్టుచున్నవి.
జీవునికి శత్రు గుణములైన ఆరు గుణముల వివరము తెలుసుకొన్నాము. తర్వాత ఆరు మిత్రగుణములను
గురించి తెలుసుకొందాము. మిత్రగుణములను గురించి ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా ఇక్కడనుండే చెప్పుచున్నాము.
కావున సావధానముగా తెలుసుకోవలెనని చెప్పుచున్నాము. శత్రు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మత్సర అను గుణములకు పూర్తి వ్యతిరేఖమైనవే జీవుని మిత్ర గుణములు. ఆ లెక్క ప్రకారము కామము (ఆశ) అను
గుణమునకు వ్యతిరేఖమైన దాన గుణము మిత్ర గుణములలో మొదటి స్థానములో ఉన్నది. అదే విధముగా శత్రు
గుణములలో రెండవదైన క్రోధము (కోపము) అను గుణమునకు పూర్తి వ్యతిరేఖమైనది దయాగుణము. అట్లే లోభము
అను గుణమునకు వ్యతిరేఖమైనది ఔధార్యగుణము. మోహ గుణమునకు వ్యతిరేఖమైనది వైరాగ్యగుణము. మదము
అను గుణమునకు వ్యతిరేఖమైనది వినయము అను గుణము. చివరి మత్సర గుణమునకు వ్యతిరేఖమైనది ప్రేమ
గుణము. ఈవిధముగా జీవునకు పాపమును అంటగట్టు ఆరు గుణములకు పూర్తి వ్యతిరేఖమైన గుణములు వరుసగా
దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ గుణములు. వివరముగా వ్రాసుకుంటే కామము × దానము, క్రోధము
× దయ, లోభము X ఔధార్యము, మోహము X వైరాగ్యము, మదము × వినయము, మత్సరము X ప్రేమ. ఈ
విధముగా ఆరు శత్రుగుణములకు పోటీగా ఆరు మిత్రగుణములు గుణచక్రములో నెలకొల్పబడినవి. 1) దాన 2) దయ
3) ఔధార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమలు పూర్తిగా జీవునికి పుణ్యమును చేకూర్చుచున్నవి. శత్రుగుణములు
జీవునకు పాపమును అంటగట్టితే, మిత్రగుణములు జీవునికి పుణ్యమును ఇచ్చుచున్నవి. పాపము ద్వారా కష్టములు,
పుణ్యము ద్వారా సుఖములు మనిషి జీవితములో కలుగుచున్నవి. రెండు రకముల గుణములను మాయగానే
లెక్కించుచున్నాము. మిత్ర,శత్రు గుణములతో మంచి చెడుగా కనిపించునది కూడా మాయయనియే చెప్పవచ్చును.
ఒక జీవున్ని వాని జీవితములో గుణముల మాయ కష్టసుఖములలో ముంచి దేవుని మీద ధ్యాస లేకుండా చేయుచున్నది.
జీవుడు గుణచక్రములోని ఏదో ఒక గుణభాగమునందు నివాసము చేయుచు అక్కడి గుణములతో కలిసియుండును.
మూడు గుణభాగములలో ఒక భాగము నందు నివసించు జీవుడు, మిగతా రెండు గుణభాగములలోనికి అప్పుడప్పుడు
పోయి కొన్ని నిమిషములుండి తిరిగి ముందున్న భాగములోనికే వచ్చు చుండును. జీవుడు తనపైనున్న కర్మప్రభావముచేత
కొన్ని నిమిషములపాటు ప్రక్క భాగములోనికి పోయినా, ఆ భాగములలో కూడ పన్నెండు గుణములు ఉండుటచేత
అక్కడకూడా ఆ గుణముల యోచనలు, ఆలోచనలు రావడమూ, ఆ గుణములకు సంబంధించిన పనులు జరగడమూ,
వాటికి సంబంధించిన కర్మరావడము జరుగుచున్నది. జీవుడు ఏ గుణభాగములో ఎక్కువ కాలముండునో ఆ గుణభాగము
పేరును ఆ జీవునికి చేర్చి చెప్పవచ్చును. జీవుడు గుణచక్రములో నివాసమున్న చిత్రమును క్రింది పటములో చూడవచ్చును.
(చిత్రం పేజీ 17 లో చూడండి)
గుణచక్రములోని మూడు భాగములలో ఒక్కొక్క దానియందు 12 గుణముల ప్రకారము మూడు భాగములలో
మొత్తము 36 గుణములు కలవు. ఈ మాట నిజమని తెలియుటకు దేవుడు మననోటివెంట ఒక మాటను
పలికించుచుండును. ఎవడినైన ఉద్దేశించి మాట్లాడునపుడు “వానికి గంటకు ముప్పైఆరుగుణములు మారుతావుంటాయి”
అని అంటూ వుంటాము. ఒకమాట మీద నిలకడలేని మనిషిని గురించి మాట్లాడునపుడు ఈ మాట చెప్పడము
జరుగుతూవున్నది. ఈమాటను అనే మనిషికి తల లోపల గుణచక్రము, గుణముల భాగములూ, అందులో జీవుడుండుట
తెలియకుండినా అతను అలా మాట్లాడడమును చూస్తే మేము చెప్పుచున్న గుణముల విషయము సత్యమనీ, లోపలనున్న
ఆత్మే ఆవిధముగా సాక్ష్యము కొరకు పలికించినదనీ తెలియుచున్నది. గుణచక్రము బయటనుండి మొదటి భాగములోనున్న
జీవున్ని తామసుడు అంటాము. మొదటి గుణభాగము యొక్క పేరు తామసగుణ భాగము. కావున ఆ గుణభాగము
పేరే ఆ జీవునికి వర్తించుచున్నది. అట్లే రెండవ భాగములోని జీవున్ని రాజసుడు అని అంటాము. మూడవ భాగములోని
జీవున్ని సాత్వికుడు అని అంటాము. ఇక నాల్గవది మరియు మధ్యలోనిది ఆత్మభాగము, కనుక ఆ భాగములోనున్న
జీవున్ని యోగి అని అంటాము. అయితే నాల్గవ స్థానములోనికి జీవుడు రావాలంటే అతనికి ఎంతో ఆత్మజ్ఞానము
తెలిసివుండాలి. ఆత్మజ్ఞానము తెలియనిదే ఆత్మ భాగములోనికి ఎవ్వడూ పోలేడు. మూడు గుణములలో జీవుడుండుటకు
కారణము కర్మ ప్రభావమని చెప్పవచ్చును. కర్మకు అతీతమైనది ఆత్మ. అందువలన కర్మప్రకారము మధ్య భాగములోనికి
పోవడానికి వీలులేదు. జీవుని శ్రద్ధననుసరించి ఆత్మజ్ఞానము తెలిసినపుడు నాల్గవ భాగములోనికి పోవచ్చును,
యోగికావచ్చును.
గుణచక్రమును మాయచక్రము అనికూడ అనవచ్చును. ఆ చక్రములలో మూడు భాగములలోనున్న మాయను
ఒక రకముగా, నాల్గవ భాగములోనున్న మాయను మరొక రకముగా, రెండు విధముల విభజించి చెప్పవచ్చును.
మూడు భాగములలోనున్న మాయ ఎవనినైనా దేవుని మార్గము లోనికి పోకుండా, దేవుని ధ్యాస లేకుండా, దేవుని
జ్ఞానమును ఏమాత్రము తెలుసు కోకుండా చేయును. నాలుగు భాగములలో ఒకేమాయ ఆవహించి ఉండినా, ఒకే
మాయే రెండు విధముల పనిచేయుచున్నది. మూడు గుణ భాగములలోనున్న వానికి దేవుని జ్ఞానమును తెలియకుండా
చేసి, తనను దాటిపోవుట దుస్సాధ్యమనిపించును. అదే మాయే నాల్గవ భాగమైన గుణములులేని భాగములోనికి చేరిన
వానిని, వాని యోగమును కాపాడును. ఆ జీవున్ని యోగమార్గమునుండి తప్పిపోకుండా వాని యోగముయొక్క క్షేమమును
కాపాడును. దేవునికి ఇష్టుడైన వానిని, నాల్గవ స్థానములోనికి పోవుటకు ఆటంకము లేకుండా చేయును. దేవునికి
ఇష్టము లేనివానిని తన గుణములను దాటనివ్వకుండా చేసి, తన మాయలోనే ముంచివేయును. దేవునికి ఎవడు
ఇష్టమైనవాడు అని అడిగితే, దేవుని మీద ఎవనికి ఇష్ట ముండునో వాడు దేవునికి ఇష్టమైనవాడని చెప్పవచ్చును.
అంతేకాక దేవుని మీద ఎవనికి ఎంత శాతము ఇష్టము (శ్రద్ధ) ఉండునో, దేవునికి కూడా వానిమీద అంతే శాతము
ఇష్టము కల్గియుండును. ఈ విషయమునే భగవద్గీతలో రాజవిద్యా రాజాగుహ్య యోగము అను అధ్యాయమున 22వ
శ్లోకమందు ఇలా అన్నారు.
అనన్యాశ్చిన్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.
భావము : అన్యదేవతల ధ్యాస లేకుండా, ఇతరత్రాదేవతలను ఆరాధించకుండా ఎవడైతే నన్నే ఆరాధిస్తాడో,
ఎవడు నిత్యము నా ఆత్మ భాగములో నా ఆత్మతో కలిసియున్నాడో, అట్టివాని యోగము యొక్క క్షేమమును మాత్రము
నేనే వహించుచున్నాను అని అన్నాడు. నేనే వాని యోగమునకు ఎటువంటి అనారోగ్యము, ఆటంకములు కలుగకుండా
చూస్తాను అని అన్నపుడు ఆయన ప్రత్యక్షముగా ఏదీ చేయడు. ఆయన ఏమీ చేయనివాడు. పని లేని క్రియారహితుడు.
ఆయన చేస్తానని చెప్పిన పనినంత చేయునది ప్రకృతియే. ఒక భక్తునియొక్క యోగమును భంగము కాకుండా చూచునది
ప్రకృతియేనని తెలియవలెను. శరీరములో ఆత్మతో నిత్యము కలిసిన వానినీ, నాల్గవ గుణరహిత భాగములోనికి పోయిన
వానినీ, అక్కడే అదే చక్రములో స్థానము చేసుకొన్న మాయ అతని యోగమునకు ఆటంకము లేకుండా చేయును.
యోగము భంగము కాకుండ చేయును. యోగమునకు ఆటంకము కలుగజేయునది, యోగమును భంగము చేయునది
మాయయే. అదే మాయ దేవునికి ఇష్టుడైన వానికి ఏ ఆటంకము చేయదు. తన భర్తకు ఎవరు ఇష్టులో తనకు
(మాయకు) కూడా వారు ఇష్టులే అగుదురని తెలియుచున్నది. ఈ విషయమునే వేమన యోగి తన పద్యములో
వ్యక్తపరిచాడు. పద్యమును క్రింద చూడండి. ఈ పద్యము మా రచనలలో "నిగూఢ తత్త్వార్ధబోధిని” అను చిన్న
గ్రంథములోనిది.
పతియెప్పిన సతియొప్పును
పతి సతులొక్కటైన పరమ పావనమందున్
పతి సతి న్యాయమే మోక్షం
బతులిత పరమాత్మనైక్యమగురా వేమా.
భావము : పతి అనగా భర్త, సతియనగ భార్య అని అందరికి తెలుసు. పెళ్ళి అయితేనే పతి, సతులౌతారను
విషయము కూడ తెలుసు. పతి, సతులకు పిల్లలు పుడుతారని కూడ తెలుసు. ఈ విధానమంతా జ్ఞానులకు, అజ్ఞానులకు
అందరికి తెలిసినప్పటికీ చాలామందికి ఈ విషయము దైవికమైనదనీ, ఆ దైవిక విషయమే ప్రపంచములో ఇలా ప్రతి
బింబించి ఉన్నదనీ, ప్రపంచములో ప్రత్యక్షముగనున్న పతి, సతుల విధానము ను ఆధారముచేసుకొని పరోక్షముగనున్న
దైవ విధానమును అర్థము చేసుకోగలరనీ దేవుడే ఇలా ఉంచాడు. దైవికమైన పతి, సతి విధానమేదో ఇపుడు వివరించి
చూచుకొందాము.
భగవద్గీత గుణత్రయ విభాగ యోగమను అధ్యాయములో మొదటనే పరమాత్మను పతిగ, ప్రకృతిని సతిగ
చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారము జగతి మొత్తమునకు ప్రకృతి, పురుషులు సతి పతులుగ ఉంటూ ప్రతి
జీవరాశికి వారే తల్లితండ్రులైనారు. ప్రపంచములోని మనుషజాతికే కాక క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్షలతాదులన్నిటికి
తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలుపబడి ఉన్నది. జగతి మొత్తమునకు తల్లితండ్రులుగ ఉంటూ పతి, సతులుగ
ఒప్పు పరమాత్మ, ప్రకృతి ప్రపంచములో విభిన్నముగ ప్రవర్తించుచున్నారు. పతియైన పరమాత్మకు, సతియైన ప్రకృతి
విధేయురాలై నప్పటికీ, పరమాత్మ ఆదేశానుసారము జగతిపట్ల పరమాత్మ మార్గమైన దైవమార్గమునకు ప్రకృతియైన
మాయ ఎంతో వ్యతిరేఖముగనున్నది. దైవమార్గమును అనుసరించవలెననుకొను వాని యొక్క ఆ ప్రయత్నమును
భంగము చేసి విరమించుకొనునట్లు చేయుచున్నది. అంతయు దేవునికి తెలిసే జరుగుచున్నది. దేవుని గూర్చిన ప్రయత్నములో
మాయ ప్రభావమునకు తట్టుకొనలేక అందరూ వెనుదిరుగుచున్నారు. అయినప్పటికీ ఎన్నో లక్షల మందిలో ఏ ఒక్కడో
మాయను వ్యతిరేకించి అన్ని కష్టములకు ఓర్చుకొని దేవుని చేరుకోవాలని ప్రయత్నించుచున్నాడు. అటువంటి వానిని
దేవుడు, వాని మార్గమును సుగమము చేసి, మాయ ఆటంకమును తొలగించి, తనయందు కలుపుకొనును. బలమైన
మాయ కల్పించు పరిస్థితులన్నిటిని అనుభవిస్తు, పట్టువదలక దేవునికొరకు ప్రయత్నించు వానిని దేవుడు ఒప్పుకొనును.
దేవుడు ఒప్పుకొన్నపుడు మాయ వానిని ఆటంకపరచదు, అటువంటివాని యోగము యొక్క క్షేమమును దేవుడే పరిరక్షించును.
అపుడు వాడు దేవునియందైక్యమైపోవును.
ప్రపంచములో మాయ కలుగజేయు అనేక కష్టములను అతిక్రమించి, దేవుని మార్గమును వదలని వానిని,
దేవుడు తన మనిషిగ అంగీకరించును. అపుడు వెంటనే ప్రకృతియైన మాయ తాను వానిని ఒప్పుకొన్నదై వానికి
ఆటంకము కలుగజేయదు. కావున పై పద్యమందు పతియెప్పిన సతి యొప్పునన్నారు. ఆ విధముగ పరమాత్మ,
ప్రకృతి ఇద్దరు వానిపట్ల ఒకటై నడుచుకొన్నపుడు వాడు మోక్షమును పొందును. దానినే పద్యమందు వ్యక్త పరుస్తు
పతిసతులొక్కటైన పరమ పావనమందున్ అన్నారు. పతి, సతి ఇద్దరు ఒక మార్గమును నడుచుకోవడము న్యాయమగును.
పతికి సతి విరుద్ధముగ నడుచుకోవడము అన్యాయమగును. ప్రకృతి, పరమాత్మ భక్తుని పట్ల న్యాయమార్గమున చరించిన
భక్తునికి మోక్షము లభించును. కావున పై పద్య మందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు. పతి, సతి న్యాయముగ
చరించినపుడు భక్తుడు వెంటనే జన్మరాహిత్యము పొందును. కనుక బతులిత పరమాత్మనైక్యమగురా అన్నారు.
ప్రపంచములో ఒక భక్తునిపట్ల భార్యాభర్తలైన ప్రకృతి పరమాత్మలు మొదట అన్యాయముగ ప్రవర్తించుదురనీ
ఈ పద్యము ద్వార వేమన మనకు తెలియజేశాడు. పతి ఒప్పినపుడే సతియు ఒప్పుకొని ఇద్దరు న్యాయముగ ప్రవర్తించుదురు.
వారిద్దరు ఒకటై న్యాయముగ ప్రవర్తించినపుడే భక్తునికి మోక్షము లభించును. మాయ ఆటంకములను ఓర్చుకోలేక
నేనెంత భక్తిగ ఉన్న నాకే కష్టాలొస్తున్నవనీ, దేవునివద్ద న్యాయమే లేదనుకొన్నవాడు దేవుని మార్గములో భ్రష్టుడగును.
దేవుని గూర్చి ఏమీ అనుకోక అన్నిటికీ ఓర్చు కొన్నవాడు మొదట పరమాత్మచేత ఒప్పుదల పొంది ప్రకృతి, పరమాత్మలు
న్యాయముగ ప్రవర్తించగ భక్తుడు మోక్షము పొందును.
పతి సతుల విధానము ప్రపంచములో ప్రతిబింబించి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. పతికి సతి వ్యతిరిక్తముగ
నడుచుకొనుట, పతిని తన మాటవినునట్లు చేసుకొనుటైన అన్యాయ విధానము భూమిమీద కలదు. అట్లే పతికి, సతి
అనుకూలముగ నడుచుకొనుట, పతి మాటయే తనమాటగ పతి చెప్పినట్లు సతి నడుచుకొను న్యాయమార్గమూ భూమిమీద
గలదు. మీ అనుభవములో న్యాయ అన్యాయ, పతి సతులను గూర్చి తెలిసినట్లయితే ఎవరైన సంపూర్ణ జ్ఞానులుకాగలరు.
దేవుని మార్గములో నడుచువారికి ఆటంకటములేర్పడిన, దేవుని దగ్గర న్యాయముందా? అని సహనము కోల్పోయి
మాట్లాడరు. ఎన్ని కష్టములొచ్చిన ఇది తల్లియైన మాయ పని అని ఎరుకకల్గి నడుచుకొందురు.
దేవుడు ప్రపంచమును సృష్టించకముందు పనిచేసి, అంతటిని సృష్టించాడు. తర్వాత ఆయన క్రియారహితుడైనాడు.
సృష్టించి పాలించి అంతము చేయువాడు దేవుడే అయినా, ఆయన మూలకర్త మాత్రమే. ఆయన పనినంతటిని చేయునది
ప్రకృతి ఒక్కటేనని తెలియవలెను. దేవుడు కనిపించడు, ఆయన ఎంతటివాడో ఎవరికీ తెలియదు. అయితే ఆయన
కార్యములన్నిటిని నెరవేర్చుచున్న ప్రకృతి అందరికీ కనిపిస్తున్నది, వినిపించు చున్నది, అన్ని విధాల తెలియుచున్నది.
అయినా ప్రకృతిని కొంతవరకు అంచనా వేయవచ్చును. అంతేకానీ ప్రకృతిని కూడా పూర్తి తెలియలేము. ఆకాశము
హద్దే తెలియదు. దగ్గరున్న మేఘము యొక్క విషయమే పూర్తి ఎవరికీ తెలియదు. పొగరూపములోనున్న మేఘము
ఘనరూపములోనున్న ఎన్నో జీవరాసులను, ఎన్నో వస్తువులను, ఎన్నో నీళ్ళను, ఎన్నో జలచరము లను కనిపించకుండ
దాచియుంచుకొన్నదను విషయము ఎవరికీ తెలియదు. చిన్న మేఘము యొక్క విషయమే మనకు తెలియనపుడు
అంతపెద్ద ప్రకృతి విషయము ఎప్పటికీ తెలియలేము. ప్రకృతికంటే పెద్ద అయినవాడు, ప్రకృతికి భర్త స్థానములోనున్నవాడు
అయిన దేవుడు మాకు తెలుసు అనినా, దేవున్ని మేము చూచాము అనినా, మేము దేవుడైపోయాము అనినా
మాటలన్నిటిని విని నవ్వవలసిందే తప్ప ఏమీ చేయలేము. అలా అన్నవారిని చూచి ప్రకృతి కూడా నవ్వుకుంటుదనియే
చెప్పవచ్చును. ప్రకృతియే గుణరూపములో మాయ అను పేరుతో మనిషి శరీరములో ఉన్నది.
స్థూలముగా బయట కనిపించు ప్రకృతి, సూక్ష్మముగా కనిపించని మాయగా శరీరములో ఉంటూ, నన్నే తెలియలేని
వానివి నాభర్తను తెలియ గలవా? నన్ను దాటిపోవడమే ఎవరికీ సాధ్యముకాదే, అలాంటిది దేవున్ని చూచాను అంటావా?
అని వానికి దేవుని ధ్యాస, దేవుని జ్ఞానము తెలియ కుండా చేయును. వాని తలలో వానికి నాకు దేవుడు తెలుసునను
జ్ఞప్తినే యుంచి నాకు జ్ఞానముతో పనిలేదనుకొనునట్లు చేయును. శరీరము బయట ప్రకృతి రూపములో, శరీరము
లోపల గుణరూపములో మాయకలదు. ఈ సృష్ఠిని సృష్టించేది సృష్ఠికర్త దేవుడేకాగా, సృష్టించబడిన దానినంతటిని
నడిపించుచూ పాలించునది ప్రకృతి (మాయ). దేవుడు ఎప్పటికీ ఉండువాడే, అయితే ప్రకృతి మాత్రము దేవుని పగలు
మాత్రముంటూ, దేవుని రాత్రిలో మాత్రము అదృశ్యమై దేవునియందే అణిగిపోవును. ప్రకృతి ఉంటే జీవరాసులు వాటి
మనుగడ ఉంటుంది. జీవరాసులన్నిటిని ప్రకృతియే పాలించి, పోషించి, నడిపించుచున్నపుడు, ప్రకృతి లేని సమయములో
జీవరాసులన్ని నశించి ప్రకృతిలోనే కలిసిపోవును. సృష్ట్యాదిలో దేవుడు మొదట ప్రకృతిని మాత్రము సృష్టించాడు.
తర్వాత ప్రకృతియే అన్ని పనులు చేసి జీవరాసులనందరిని పుట్టించినది. అందువలన భగవద్గీతలో భగవంతుడు
సర్వజీవరాసులకు తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతియని చెప్పాడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును,
అదేమనగా! దేవుడే కదా అందరిని పుట్టించినది, ఆయనే కదా సమస్తమునకు సృష్టికర్త, అలాంటపుడు దేవుడు ప్రకృతిని
మాత్రము సృష్టించగా, తర్వాత ప్రకృతియే సకల ప్రాణులను సృష్ఠించినదనీ, దేవుడు ఎవరినీ సృష్టించలేదని మీరు
చెప్పడము తప్పుకాదా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
బయటి ప్రపంచములో భార్యభర్తలను గమనించి చూస్తాము. భర్త భార్యతో సంగమించితే భార్య గర్భము
ధరించి పిల్లలనుకంటున్నది. పురుషుడు స్త్రీతో కలిసినది తెలియదు కానీ, స్త్రీ గర్భము ధరించి కొంత కాలమునకు
ప్రసవించడము అందరూ ప్రత్యక్షముగ చూస్తున్న విషయమే. పుట్టిన బిడ్డకు తండ్రి, తల్లియొక్క భర్తయే అయినా,
గర్భమును ధరించి కొంతకాలమునకు తల్లియే బిడ్డనుకంటున్నది. తండ్రి అయినంత మాత్రమున ఏ బిడ్డనూ తండ్రి
కనలేడు. బిడ్డను తల్లియే కన్నది. ఇదే మాదిరి భర్తగానున్న పరమాత్మ కర్తకాగా, సృష్ఠి కార్యమును తల్లిగానున్న ప్రకృతి
చేసినది. పుట్టిన బిడ్డకు ప్రకృతి అయిన తల్లియే పోషణనిస్తున్నది. శరీరమును గర్భములో తయారుచేసి కన్నది
తల్లియేననీ, తండ్రి కర్త మాత్రమే నని తెలియాలి. ఇదే విధానము ప్రకృతి పరమాత్మ విధానములో కూడా జరుగుచున్నది.
సర్వజీవరాశులు ప్రకృతి (తల్లి) ద్వారానే పుట్టుచున్నవి. తల్లినే (ప్రకృతినే) మొదట చూస్తున్నవి. అందువలన మొదట
తల్లిమాత్రమే తెలియును. తండ్రి అయిన దేవుడు తెలియడు. సర్వజీవరాశులకు భౌతిక తల్లియే మొదట తెలియును.
తర్వాత తండ్రి తెలియును. ఒకబిడ్డ తల్లి గర్భములో పెరుగునప్పుడు, తల్లి శరీరములోని రక్తమాంసములను పంచుకొని
తయారైన శరీరముతో పుట్టుచున్నది. అలాగే ప్రకృతి గర్భములో పుట్టిన ప్రతి జీవరాశి, ప్రకృతియొక్క ఐదు భాగములను
పంచుకొని, ప్రకృతి భాగములచేత తయారైన శరీరముతో పుట్టుచున్నది. పుట్టిన ప్రతి బిడ్డకు మొదట తల్లియే తెలియుచున్నది.
తండ్రి తెలియడు. అట్లే సృష్ఠిలో తయారైన ప్రతి జీవరాసికి మొదట ప్రకృతియే కనిపిస్తున్నది పరమాత్మ కనిపించడు.
జీవరాసులకు మొదట తెలియునది స్త్రీతత్త్వమే, తర్వాత పురుషతత్త్వము తెలియును. అంతేకాక అందరూ స్త్రీతత్త్వము
నుండే పుట్టుచున్నారు. తరువాత కారణమైన పురుషతత్వము గోచరించును. ఈ సత్యమును తెలియుటకు ఎక్కడైన
ముందు స్త్రీతత్త్వమునే ఉచ్ఛరించునట్లు అమరిక చేయబడినది. జ్ఞానము తెలిసినవారు కాకపోయినా నా కర్మయని తన
చేతిని తలవైపు చూపునట్లు, ప్రకృతి పరమాత్మ విధానము తెలియకపోయినా ప్రతి మనిషి స్త్రీతత్త్వమును ముందు
ఉచ్ఛరించుచున్నాడు, తర్వాత పురుష తత్త్వమును చెప్పుచున్నాడు. ఉదాహరణకు కొన్ని మాటలను చూచిన ఈ విధముగా
గలవు. కైలాసములో పార్వతీపరమేశ్వరులు నాట్యమాడుచున్నారు, అన్నప్పుడు ఈ వాక్యములో ముందు స్త్రీతత్త్వమైన
పార్వతిని చెప్పి, తర్వాత పురుషుడైన ఈశ్వరున్ని చెప్పడము జరిగినది. అలాగే సీతారాముల వివాహము జరిగినదని
అన్నప్పుడు, ముందు సీతను చెప్పి తర్వాత రామున్ని గురించి చెప్పడము జరిగినది.
ఈ విధముగా ఎన్నో వాక్యములను చూచినప్పటికీ అందులో స్త్రీ తత్త్వమునే ముందు ఉంచి తర్వాత పురుషతత్త్వమును
ఉంచడము జరిగినది. అటువంటి కొన్ని పదములను చూస్తే ఇలా కలవు. తల్లితండ్రి, ప్రకృతి పురుషులు, భార్యాభర్తలు,
లక్ష్మీనరసింహుడు. అంతేకాక వీధిలో గంప నెత్తినపెట్టుకొని వంకాయలమ్మువాడు కూడా వంకాయలమ్మో అని స్త్రీ
పదమునే ఉపయోగించి చెప్పడము జరుగుచున్నది. ఈ విధముగా ప్రకృతి అందరికీ పరమాత్మకంటే ముందున్నదని
తెలియుచున్నది. కనిపించని దేవునికంటే ముందు కనిపించు ప్రకృతియే ఉన్నది. కావున అందరు అలా చెప్పడము
జరుగుచున్నది. ఎక్కడైనా స్త్రీ పేరును ముందు చెప్పుకోవడమునకు కారణము ఇప్పుడు కొంత అర్థమైనదనుకొంటాను.
మొదట ప్రభవములో పుట్టించినదీ ప్రకృతియే, అలాగే చివరిలో ప్రళయమందు అందరిని మరణించునట్లు చేయునదీ
ప్రకృతియే. బాగా జ్ఞాపకము పెట్టుకోవలసినదే మనగా! దేవుడు మొదట నిన్ను పుట్టించనూలేదూ, తర్వాత చివరిలో
చంపనూలేదు. అయినా అన్నిటికీ కారణభూతుడు మూలకారకుడు ఆయనే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను
చెప్పుకొందాము.
భర్తకు విధేయతను చూపు భార్య, భార్యకు స్వతంత్రతను ఇచ్చిన భర్త, ఇరువురు కాపురము చేయుచుండగా
వారికి కొందరు మంచివారు, కొందరు చెడువారు సంతానమున్నారు. భర్త భార్యను పోషించగా, ఇంటిలోని భార్య తమ
పిల్లలకు అన్ని వసతులు కల్పించి, పిల్లల అన్ని పనులు చేయుచుండెను. ఒక ప్రక్క పిల్లలను సక్రమముగా చూచుకొంటూ,
మరొక ప్రక్క భర్తకు అనుకూలముగా అన్ని సేవలు చేయుచుండెను. రాత్రిపూట భర్త నిదురించు సమయమునకు
ముందే తమ పిల్లలను నిద్రపుచ్చుచుండెను. పిల్లల అల్లరి ఉంటే భర్తకు నిద్రపట్టదని, భర్తకు అసౌకర్యము కలుగకుండా
భర్త నిద్రకు ఉపక్రమించక ముందే పిల్లలను నిద్రపుచ్చి ఎవరినీ లేవకుండ చేయుచుండెను. అప్పుడు భార్య చేసిన
పనికి భర్త మెచ్చినవాడై, ఏ దిగులు లేకుండా నిద్రించుచుండెను. ఇదే విధముగనే ప్రకృతి భార్యగా, పరమాత్మ
భర్తగావుంటూ విశ్వమను గృహములో కాపురము చేయుచున్నారు. భర్తయిన పరమాత్మ ఏదీ పట్టించుకోకుండా
సంసారముతో సంబంధములేనట్లు ఉన్నాడు. భార్య అయిన ప్రకృతి తమ సంతానమైన జీవరాసులను అన్నీ తానై
చూచుకొంటున్నది. పిల్లల యొక్క అన్ని పనులను ప్రకృతియే చూచుకొంటు పరమాత్మకు ఏ సంబంధములేనట్లు
పిల్లలను పోషించుచున్నది. భర్త ఇంటికి వచ్చి నిద్రపోయే సమయానికి అనగా పరమాత్మకు రాత్రి సమయము వస్తూనే
సకల జీవరాశులను ప్రకృతియే నిద్ర పుచ్చినట్లు లేకుండా చేయుచున్నది. ప్రకృతి తన సంతానమైన జీవరాసులను
అవ్యక్తము చేయుచున్నది. ప్రకృతి ప్రళయమును సృష్టించి జీవరాసులను అంత మొందించుచున్నది. ప్రళయములో
చనిపోయిన జీవులు తర్వాత జన్మకు పోకుండా అవ్యక్తముగా ఉండిపోవుదురు. దేవుని రాత్రిలో ప్రపంచము ఉండదు.
కావున మొదట ప్రకృతిలో పుట్టిన జీవరాసులన్ని చివరిలో ప్రకృతి లోనే చనిపోయి ప్రకృతిలోనే అణిగిపోవుచున్నవి.
ప్రళయములో జీవరాసు లన్ని ప్రకృతిలో కృశించిపోయి కనిపించకుండా పోతున్నవి. కానీ పూర్తి నాశనమైపోలేదు.
చనిపోయిన జీవులందరూ అవ్యక్తముగా ఉండాలంటే ప్రకృతి కూడా అవ్యక్తమైపోవాలి. కావున వేయియుగముల
కాలము దేవుని పగలు అయిపోయిన వెంటనే దేవుని రాత్రి మొదలవు సమయములో ప్రకృతి కూడా లేకుండా
కనిపించకుండా పోవుచున్నది. ప్రళయములో ఉన్నవి లేకుండా పోవుచున్నవి. అంతేకానీ పూర్తిగా నాశనమై పోయాయి
అనుకోకూడదు. ఏ జీవరాశి నాశనమైనా అది దేవునిలోనికి ఐక్యము కావలసివుంటుంది. ప్రళయము పొందిన జీవులు
తిరిగి ప్రభవములో పుట్టవలసిన పని ఉన్నది. కావున వ్యక్తముగానున్నవి అన్నీ అవ్యక్తముగా మార్పు చెందుచున్నవి,
పూర్తి లేకుండా పోలేదు. ఈ ప్రళయము ఒక విధముగా జీవునికి తాత్కాలిక మరణములాంటిదని చెప్పవచ్చును.
దేవునియొక్క పగలు కాలము వేయియుగములనీ, అట్లే రాత్రికాలము వేయియుగములని చెప్పుకొన్నాము.
దేవుని పగలు వేయియుగములు గడిచి పోయిన తర్వాత ప్రళయము జరిగి జీవరాశుల శరీరములన్నీ నాశనమై పోవుచున్నవి.
జీవులు మాత్రము మరణమును పొంది ప్రకృతిలోనే అణిగి పోవుచున్నారు. దేవుని రాత్రి వేయియుగములు పైన
ఆకాశముగానీ, క్రింద భూమిగానీ మధ్యలో గాలిగానీ, నీరుగానీ, నిప్పుగానీ ఏవీ ఉండవు. మనముందరున్న శూన్యము
కూడా ఉండదు. అటువంటి స్థితి ఎలా ఉండునో ఊహించుటకు కూడా వీలుకాదు. ఆ స్థితిని ఏ విధముగా కూడా
పోల్చుకోలేము. అటువంటి సమయములో మిగిలి ఉన్నది ఒకే ఒక పరమాత్మ. దేవుని రాత్రి వేయియుగములు
అయిపోయిన తర్వాత తిరిగి ప్రభవము మొదలగును. ప్రభవము అనగా తిరిగి సృష్ఠి ప్రారంభమగును. అప్పుడు
మొదట ప్రకృతిలోని పంచభూతములు అవ్యక్తమునుండి వ్యక్తము లోనికి వచ్చును. ప్రకృతి యొక్క పనివలన అంతవరకు
లేని జీవులు తిరిగి శరీరము ధరించి జన్మ తీసుకొని జీవితములను తిరిగి ప్రారంభింతురు. అదియే దేవుని పగలు
కాలము. ప్రకృతి చేత జరుగు ప్రళయముగానీ, ప్రభవముగానీ ఒక్క క్షణములో, ఒక్కమారుగా ఏదీ జరుగదు. ప్రళయము
జరుగునపుడు కొంత సమయము పట్టును. అలాగే తిరిగి జీవరాసులు అన్నీ పుట్టుటకు కూడా కొంత సమయము
పట్టును. దానినే ప్రళయ ప్రభవముల సంధికాలము అని అంటాము. దినమునకు సంధికాలమున్నట్లే ప్రళయమునకు
కూడా సంధికాలము కలదు. దినమునకున్న సంధి కాలమును సంధ్యకాలము అని అంటున్నాము. పూర్వము సంధికాలము
అనెడిమాట నేటికి సంధ్యవేళ అయికూర్చున్నది. ఒకరికొకరు కలుసు కొనుటను సంధి అంటాము. అలాగే రాత్రి
పగలు కలుసుకొను కాలమును సంధి కాలము అంటాము. సాధారణముగా తెల్లవారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొ
విధముగా ముందూ వెనకా లేచినట్లూ, అలాగే రాత్రివేళ ముందువెనకా పడుకొన్నట్లు ప్రళయము యొక్క సంధ్య
(సంధి) కాలములో ముందు వెనకా జీవుడు లేకుండా పోవుట జరుగుచున్నది. అలాగే ప్రభవము యొక్క సంధ్య
కాలములో ముందు వెనుక పుట్టడము జరుగుచున్నది. ప్రళయ ప్రభవముల సంధ్యకాలము అందరికీ ఉన్నవని తెలియవలెను.
మొట్టమొదట ప్రభవము లేక సృష్ఠి దేవుని చేత సృష్ఠించబడినపుడు ఆదివారముతోనే మొదలగును. అట్లే
ఇప్పుడు ఎన్ని కల్పములు మారినా మొదటి పగలు ఆదివారముతోనే ప్రారంభమగును, దానిలో ఏ తేడా ఉండదు. అట్లే
సృష్ఠి ప్రారంభము కృతయుగముతోనే మొదలగును. అలా ప్రారంభమైన మొదటి దినమును యుగాది అనడము
జరుగుచున్నది. యుగాది అనగా యుగము యొక్క ఆదిలో వచ్చు దినమని అర్ధము. యుగాది ఆదివారముతోనే
మొదలైనది. యుగమును సంవత్సరములతోనే లెక్కించు చున్నాము. అందువలన సంవత్సర మొదటి దినమునకు
యుగాది అని పేరు పెట్టాము. అయితే ధర్మములు అధర్మములుగా మారినట్లు, ఇందూ అను పదము హిందూ అను
పదముగా మారిపోయినట్లు, యుగాది అను పదమును నేడు ఉగాది అని ఉచ్చరించడమూ, వ్రాయడమూ జరుగుచున్నది.
హిందూ అను శబ్ధము అర్థము లేనిదైనా, ఇందూ అను శబ్దము అర్థముతో కూడుకొన్నదైనా, చెప్పినా వినకుండా మేము
హిందువులమే అని కొందరు మొండిగా అనినట్లు, ఉగాది అను శబ్దము అర్థములేనిదని చెప్పినా వినకుండా ఉగాదిగానే
చెప్పుచున్నారు. హిందూ (ఇందూ) ధర్మరక్షకులము అని పేరుపెట్టుకొన్న వారే ఏమాత్రము జ్ఞానమును ధర్మములను
తెలియనివారై మొండిగా మాట్లాడుచున్నారు. ధర్మము ప్రకారము పూర్వము హిందువు లందరూ ఇందువులుగా,
ఉగాదిని యుగాదిగా పిలిచెడివారు.
ప్రభవము మొదలుకొని ప్రళయము వరకు జీవరాసుల జీవన విధానమునంతటిని ప్రకృతియే తన పర్యవేక్షణలో
పెట్టుకొని చూస్తున్నది. దేవున్ని మాత్రము అన్నిటికి మూలపురుషుడని చెప్పవచ్చును. కానీ ఎక్కడా దేవునిపాత్ర కనిపించదు.
ఒక మనిషి జీవితములో జ్ఞానముగానీ, అజ్ఞానము గానీ, జనన మరణములనుగానీ, మోక్షమునుగానీ స్వయముగా
ప్రకృతియే ఇచ్చుచున్నది. ఇది కొందరికి విచిత్రముగా తోచినా ముమ్మాటికి సత్యము. ఆ విధమైన అధికారమును
దేవుడే ప్రకృతికి ఏర్పరచాడు. దేవుడు ఏ లెక్కకు దొరకడు. ఆయన తెలిపిన ధర్మములకు మాత్రమే ఆయన తెలియును.
దేవుని ధర్మములను ఆధారము చేసుకొని ప్రవర్తించువానికి మాత్రమే ముక్తి (మోక్షము) లేక పరలోకము లభించు
అవకాశము కలదు. దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన మాటలనుబట్టి వేయియుగముల కాలము దేవునికి ఒక
పగలనీ, రెండువేల యుగముల కాలము ఒక దినమని తెలిసినది. అయితే ఆయన ఆయస్సు ఎవరికీ తెలియదు.
యోచించి చెప్పితే ఆయనకు ఆయుస్సు అనునదే లేదు. ఎందుకనగా! ఆయన కాలస్వరూపుడు. కాలము అన్నిటిని
హరించునది, కానీ తాను హరించ బడునదికాదు. అందువలన ఆయన తన మాటలలో తనను అవ్యయునిగా చెప్పాడు.
వ్యయము అనగా నాశనము అనీ, అవ్యయము అనగా నాశనము లేనిదని అర్ధము. కావున ప్రకృతిలెక్కలోని 108 కోట్ల
సంవత్సరములు ఆయనకు ఒక పగలుగా, 108 కోట్ల సంవత్సరములు ఒక రాత్రిగా లెక్కించబడుచున్నది. ఇది ప్రకృతి
వైపునుండి చెప్పబడు లెక్కేగానీ, దేవునివైపు నుండి చెప్పునది కాదు. దేవుడు ఎప్పుడూ అవ్యయుడే మరియు అవ్యక్తుడే.
ఇప్పుడు దేవునికి ఒక పగలు కాలమైన 108 కోట్ల సంవత్సరము లను ప్రకృతివైపునుండే చూచి, ఎలా అంత
కాలము పగలుగా లెక్కించబడు చున్నదో తెలుసుకోవాలి. ప్రకృతిని బాగా తెలుసుకొంటే ప్రకృతి రెండు భాగములుగా
ఉన్నది. ఒకటి చరప్రకృతి, రెండు అచరప్రకృతి అను పేర్లతో గలవు. జీవరాసుల శరీరములుగా ఉండు ప్రకృతిని
మార్పు చెందు ప్రకృతియనీ, దానినే చర ప్రకృతియనీ చెప్పవచ్చును. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను
పంచభూతములుగా మనకు కనిపించు ప్రకృతిని మార్పుచెందని ప్రకృతియనీ, దానినే అచర ప్రకృతియనీ చెప్పవచ్చును.
అచర ప్రకృతియైన పంచభూతములు ప్రపంచములో చర ప్రకృతియైన శరీరములను ధరించిన జీవరాసులు బ్రతుకుచున్నవి.
అచర ప్రకృతిని అనుసరించి రాత్రి పగలు ఏర్పడుచున్నవి. చరప్రకృతిలోని జీవుడు రాత్రి పగలుకాలములో
బ్రతుకగలుగుచున్నాడు. కర్మబంధములో చిక్కుకొన్న జీవున్ని శరీరము బయట అచరప్రకృతీ, శరీరము లోపల చరప్రకృతీ
ఆడించుచున్నవి. జ్ఞానము కావలసినది జీవునికి, మోక్షము కావలసినది జీవునికి, కావున దైవత్వమును తెలియవలసినవాడు
జీవుడే. ఇపుడు బయట ప్రకృతిలోని దినములను, సంవత్సరములను, యుగములను తెలియాలంటే జీవుడు లోపల
ప్రకృతినుండే తెలియవచ్చును. శరీరముగానున్న ప్రకృతిని విభజించితే పంచభూతములుగా విడిపోవుచున్నది. కావున
అది బయటి ప్రకృతిగానే తెలియుచున్నది. శరీరము మొత్తము చర ప్రకృతియే అయినా అందులోని భాగములు కూడా
పంచభూతములేనని తెలిసిపోయినది. పంచభూతములుగా కాకుండా మాయరూపముగానున్న ప్రకృతి జీవునకు
దగ్గరగానున్న ప్రకృతియని చెప్పవచ్చును. మాయరూపములోనున్న ప్రకృతి పంచభూతములుగా విభజింపబడక, ద్వాదశ
గుణములుగా విభజింపబడు చున్నది. ప్రపంచరూపములోనున్న అచర ప్రకృతి, శరీర రూపములోనున్న చర ప్రకృతి
రెండు పంచభూతములుగా విభజింపబడితే, మాయగా రూపాంతరము పొందిన ప్రకృతి మాత్రము పన్నెండు గుణములుగా
తెలియు చున్నది. లోపల పన్నెండు గుణములందే జీవుడు జీవించుచున్నాడు. అలాగే బయట మనిషి పంచభూతముల
ప్రపంచములోనే జీవించుచున్నాడు. తలలోగల గుణచక్రములోనే జీవుడు శాశ్వితముగా ఉంటున్నాడు. అలాగే బయట
మనిషి శాశ్వితముగా ప్రపంచములోనే బ్రతుకుచున్నాడు. ఎన్ని జన్మలు మారినా జీవుడు గుణచక్రమును వదలి
పోకుండా అక్కడే ఉన్నాడు. అట్లే ఎన్ని జన్మలు ఎత్తినా బయట మనిషి శాశ్వితముగా ప్రపంచములో ఉంటున్నాడు.
లోపల జీవుడు శరీరములు మారినా గుణ చక్రమును వదలిపోలేడు. అలాగే బయట మనిషి ఎన్నిమార్లు మరణించినా
అన్నిమార్లు ప్రపంచములోనే పుట్టుచు ప్రపంచమును వదలిపోలేడు. అందువలన బయట ప్రపంచములో 108 కోట్ల
సంవత్సరములు జీవనము సాగించుటకు లోపలే మూలమున్నట్లు తెలియుచున్నది. బయట ప్రకృతిలో మనిషిగానో,
జంతువుగానో ఇంకా ఏదో ఒక రకముగానో బ్రతుకుచున్న వాడు లోపల జీవునిగా మాయ అనబడు గుణములలో
బ్రతుకుచున్నాడు. కావున బయటి ప్రకృతికీ, లోపల మాయకూ సంబంధమున్నట్లు, బయట ప్రకృతి ఆయుస్సుకు
లోపల మాయ ఆయుస్సుకు సంబంధమున్నదని చెప్పవచ్చును. అన్నిటికీ లోపలే మూలమున్నదను సూత్రము ప్రకారము,
“ఊర్ధ్వమూల” అను గీతావాక్యము ప్రకారము పైన తలలోనే ప్రకృతి ఆయుస్సు కలదని అర్థమగుచున్నది. ప్రకృతి
ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములు దేవుని పగలు (కాలముగా) చెప్పుకొన్నాము. ఇప్పుడు లోపల గల ప్రకృతి
ఆయుస్సును గురించి పరిశోధించి తెలుసుకొందాము.
ప్రతి మనిషి యొక్క తలమధ్య భాగములో పాలభాగమునకు (నుదుటికి) సమానముగానున్న నాల్గుచక్రముల
సముదాయములో క్రింది చక్రము గుణచక్రము. ఆ గుణచక్రము నాలుగుభాగములుగా ఉన్నది. అందులో బయటనుండి
మొదట మూడు భాగములు గుణములతో నిండి యున్నవి. ఒక్కొక్క భాగమునందు పన్నెండు గుణములున్నట్లు తెలుసు
కొన్నాము. అందులో ఆరు చెడుగుణములూ, ఆరు మంచిగుణములని కూడా తెలుసు. ఇప్పుడు దేవుని ఒక పగలుకాలము
ప్రకృతి యొక్క ఆయుస్సుగా చెప్పుకొంటున్నాము కావున ఆ వివరమును తెలుసుకొనుటకు దేవునివైపునుండి దేవుని
సంఖ్యగా చెప్పబడుచున్న తొమ్మిది (9) సంఖ్యను తీసుకొందాము. అలాగే తలలోని మాయవైపునుండి గుణముల యొక్క
పన్నెండు (12) సంఖ్యను తీసుకొందాము. ఇపుడు 12 గుణములను 9 సంఖ్యతో గుణించుతాము. అలా గుణించగా
మొత్తము 108 సంఖ్య వచ్చినది. 12x9=108 ఈ విధముగా పన్నెండు గుణములు భాగించడము లేదు, గుణించబడినాయి.
దేవుని సంఖ్యచేత గుణించబడునవి కావున వాటికి గుణములని పేరు వచ్చినది. ఈ విధముగా ఎప్పటికైన దేవుని
సంఖ్యచే మాయ సంఖ్య గుణంచబడవలెనని ముందుగానే మాయ భాగములోని పన్నెండు భాగములకు 12 గుణములని
పేరు పెట్టబడినదని అర్థము చేసుకోవలెను. ఏక సంఖ్యలో పెద్దది తొమ్మిది (9). తొమ్మిదిని దేవుని సంఖ్యగా ఎందుకు
పోల్చుచున్నామో బాగా అర్థము కావాలంటే మా రచనలలోని “సృష్టికర్త కోడ్ 963” అను చిన్న గ్రంథమును చదవవలెను.
గుణభాగములోని ఒక గుణము తొమ్మిది భాగములుగా విభజింపబడి, తొమ్మిది భాగములు సమానముగా లేకుండా
తొమ్మిది సంఖ్య ఒకటినుండి ఎలా పెద్దయినదో అలాగే తొమ్మిది భాగములు ఒకటి చిన్నదిగా ఉంటూ దాని తర్వాత
రెండవది మొదటి దానికంటే కొద్దిగా పెద్ద పరిమాణములో ఉండి, తర్వాత మూడవది రెండవదానికంటే పెద్దదయి,
తర్వాత నాల్గవది మూడవదానికంటే పరిమాణములో కొంత పెరిగియున్నది. ఇలా ఒకదాని కంటే ఒకటి పెద్దదవుచు
చివరకు తొమ్మిదవ భాగము మిగత ఎనిమిదికంటే పెద్దగా ఉన్నది. ఈ విధముగా 12 గుణములు 9 భాగములుగా
విభజింప బడి వరుసక్రమముగా చిన్నవి, పెద్దవి ఉన్నవి. గుణచక్రములో శత్రు గుణములు ఆరు ఉండగా, ఆరు మిత్ర
గుణములున్నవి కదా! ఒక శత్రు గుణము ప్రక్కనే దానికి వ్యతిరేఖమైన మిత్రగుణము, దానికి వ్యతిరిక్త దశలో
చీలిపోయివున్నది. అరిషట్ వర్గ గుణములకు వ్యతిరేఖముగా మిత్ర షట్ వర్గ గుణములు ఎలా చీలియున్నవో క్రింది
పటములో(చిత్రం పేజీ 25 లో చూడండి ) చూడవచ్చును.
అరిషట్వర్గ గుణములు,
మిత్రషటవర్గ గుణములు .
గుణచక్రము చిత్రం పేజీ 25 లో చూడండి .
శత్రుగుణములు ఆరు (6) ఒక్కొక్కటి తొమ్మిది (9) భాగములుగా విడిపోగా శత్రుగుణములు అన్నీ కలిపి
మొత్తము 54 అయినవి. అట్లే మిత్రగుణములు ఆరు (6), అన్నీ తొమ్మిది భాగములుగా విడిపోగా మిత్ర గుణములు
మొత్తము 54 అయినవి. దీనిప్రకారము ఒక భాగములోని చీలిపోయిన మొత్తము గుణముల సంఖ్య 108 అని
తెలిసిపోయినది. ఉదాహరణకు కోపము (క్రోధము) అను గుణమును తీసుకొని చూస్తే కోపము చిన్న కోపము నుండి
పెద్ద కోపము వరకు తొమ్మిది భాగములుగా చీలిపోయి ఉన్నది కదా! జీవుడు కోపగుణముతో చేరినప్పుడు బయట
మనిషి కోపముతో ఉన్నట్లు కనిపించును. లోపల కోపము యొక్క పెద్ద భాగము జీవునికి తగులుకొంటే మనిషి
విపరీతమైన పెద్దకోపమును పొందివుండును. మధ్య రకము కోపమును గుణచక్రములో తగులుకొంటే ఒక రకమైన
ఎక్కువ కోపముకంటే కొంత తక్కువ కోపము మనిషిలో కనిపించును. తొమ్మిది భాగములలో అన్నిటికంటే చిన్న
కోపమును లోపల జీవుడు తగులుకొంటే బయట మనిషిలో కొద్దిమాత్రము కోపము కనిపించును. పెద్దదైన కోపము
నకు చిన్నదైన కోపమునకు ఎంతో తేడా బయటి మనిషిలో కనిపించును. ఇదే విధముగా మనిషి అన్ని గుణములను
హెచ్చుతగ్గులుగా పొందుచున్నట్లు ప్రత్యక్షముగా బయట కనిపిస్తున్నది. ఈ విధముగా ఒక గుణ భాగములోని జీవుడు
108 రకముల గుణములను పొందుచు బయట వాటి ప్రభావమునకు లోనగుచున్నాడు. 108 రకముల గుణముల
కార్యములు ప్రత్యక్షసాక్ష్యముగా బయట కనిపిస్తున్నవి. వీటిని ఎవరూ కాదనలేరు.
బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము, ఏక సంఖ్యలో బ్రహ్మ అయినది తొమ్మిది (9). అందువలన దీనిని దేవుని
సంఖ్యంటున్నాము. బహు సంఖ్యలో పెద్దది కోటి కోటిని కూడ దేవుని సంఖ్యగా గుర్తించడము జరిగినది. ఏక సంఖ్య
అయిన 9, 12 గుణములను గుణించి 108 చేసినది. ఇక బహు సంఖ్యలోని కోటి (1,00,00,000) ముందే 9 చే
గుణించబడి 108 భాగములైన గుణములను బహుసంఖ్యలో పెద్దదైన (దేవుని సంఖ్య అయిన) కోటితో గుణించితే
మొత్తము 108,00,00,000 సంఖ్య వచ్చినది. 108,00,00,000 సంఖ్యను కాలములో పెద్దదైన మరియు ఆత్మ
గుర్తయిన సంవత్సరమునకు జోడించడము జరిగినది. అలా జోడించగా 108 కోట్ల సంవత్సరములైనవి. సంవత్సరము
ఆత్మ గుర్తన్నాము కదా! ఎలా చెప్పగలిగారని ఎవరైనా అడిగితే వారికి మేము చెప్పునదేమనగా! సంవత్సరములకు
అరవై పేర్లుండడము ముందే చెప్పుకొన్నాము. అందులో ప్రతిపేరు ఆత్మ గొప్పతనమును, ఆత్మ విధానమును తెలుపునదిగా
ఉండును. ఉదాహరణకు సర్వధారి అనునది సంవత్సరముల వరుసలో 22వది అయితే దాని అర్థమును చూస్తే
సర్వధారి అనగా సర్వ శరీరములను ధరించి యుండునది అని అర్థముకలదు. సర్వమును ధరించియుండునది ఒకే
ఒక ఆత్మ మాత్రమే. అందువలన ఆపేరు ఆత్మ ధర్మమును, విధానమును గుర్తు చేయునదిగా చెప్పవచ్చును. అలాగే
మిగత అన్ని పేర్లు కూడ ఆత్మ విధానమును, సామత్యమును, ధర్మమును తెలుపునవై ఉన్నవి.
మొదట ప్రకృతి జనిత గుణములను, దైవము గుర్తయిన ఏకసంఖ్య అయిన తొమ్మిది (9)చే గుణించగా 108
సంఖ్యవచ్చినది. అప్పుడు బహుసంఖ్యలో పెద్దదయిన కోటి సంఖ్యతో 108 సంఖ్యను గుణించగా 108,00,00,000
సంఖ్య అయినది. అప్పుడు ఆత్మధర్మమును సామత్యము ను చూపు సంవత్సరముతో కలుపగా 108 కోట్ల
సంవత్సరములైనవి. ఆత్మ దేవుని చేత సృష్ఠించబడినది కావున ఆత్మ పరమాత్మకు (దేవునికి) వత్స అగును. “వత్స”
అనగా కుమారుడు అని అర్థము. “సం” అనగా మంచి అని అర్థము. సంవత్సరము అనగా కుమారుడని అర్థము.
మొత్తానికి మంచి కుమారుడు అని అర్థము. దేవుని సృష్ఠిలో మొదట పుట్టినది స్త్రీ స్వరూపమైన ప్రకృతి. తర్వాత
పురుషస్వరూపమైన ఆత్మను పుట్టించాడు. ప్రకృతి ఆత్మలు అక్క తమ్ముడు అని అర్థము చేసుకోవలెను. తర్వాత ప్రకృతి
పరమాత్మలకు పుట్టినవాడు జీవాత్మ. ఆ లెక్క ప్రకారము జీవునికి ప్రకృతి తల్లికాగా, ఆత్మ మేనమామ అగుచున్నాడు.
దేవునికి మంచి పుత్రుడుగా, అక్షయునిగా పేరు గాంచిన వానిని సంవత్సరము అంటున్నాము. 108 కోట్ల సంఖ్యను
సంవత్సరములలో కలుపగా 108 కోట్ల సంవత్సరము లైనది. 108 కోట్ల సంవత్సరములు దేవుని పగలుగా గుర్తించారు.
జరగుచున్న కాలములో సర్వశరీరములను ధరించిన ఆత్మ ఆ శరీరములలోనున్న జీవాత్మను వాని కర్మానుసారము
ఆడించి నడిపించుచున్నది. ఆత్మ శరీరమును ధరించియుండి ఆ శరీరములోని జీవున్ని కర్మ ప్రకారము కష్టసుఖములను
అనుభవించునట్లు చేయుచున్నది. మాయ గుణములను ఉపయోగించుకొని కర్మప్రకారము ఖచ్చితముగా జీవున్ని
నడిపించునది ఆత్మ. అయితే అది ప్రకృతి గుణములను ఎంతకాలము వాడుకోవాలి, ఎంతకాలము జీవున్ని వెంటవుండి
నడిపించాలి అను ప్రశ్న వస్తే దానికి సమాధానము 108 కోట్ల సంవత్సరములని చెప్పవచ్చును. మాయరూపములో
గుణములూ, దేవుని ప్రతినిధిగా ఆత్మ శరీరములో పని చేయడము వలన, జీవాత్మ, మాయ మరియు ఆత్మల నడుమ
చిక్కుకొని బ్రతుకుచున్నాడు. వారు ఇద్దరు అక్క, తమ్ముడు కాగా జీవునికి మాత్రము అమ్మ, మామ అగుదురు. మాయ
ఆత్మ ఆధ్వర్యములో జీవాత్మ 108 కోట్ల సంవత్సరములు మనుగడ సాగించాలి. 108 కోట్ల సంవత్సరములలో మనిషి
ఎన్నో జన్మలు ఎత్తవలసినదే, ఎన్నో శరీరములు ధరించవలసినదే! అమ్మ, మామలను వదలి తండ్రిని చూడాలని,
తండ్రివద్దకు పోవాలని ప్రయత్నించడమే నిజమైన దైవమార్గమగును.
మనిషి బయట ప్రపంచములోని ధ్యాసలో పడిపోయి, నేనెవరని గానీ, నేను శరీరములో ఎక్కడున్నాను? అని
గానీ, తనను నడిపించువారు ఎవరనిగానీ ఏమాత్రము యోచించడములేదు. ఇంతవరకు మనము చెప్పుకొన్న లోపలి
విధానము మనిషికి తెలియకుండా పోయినది. అందువలన తనకు మరణములో శరీరములు మారుచున్నవనీ, తాను
మాత్రము ఇదే భూమిమీద సృష్ట్యాదినుండి జీవితమును సాగించుచున్నాననీ తెలియలేక పోయాడు. అంతేకాక తాను
శరీరములో గుణముల మధ్యలో చిక్కుకొని ఉన్నానను విషయమును ఏమాత్రము తెలియలేకున్నాడు.
తెలియనంతవరకు జన్మలనుండి బయటపడాలంటే వీలుకాదు. గుణ చక్రములో గుణముల మధ్యలోనున్న జీవుడు
వాటి బంధమునుండి బయటపడుటకు విశేషమైన దైవజ్ఞానము కావాలి. దైవజ్ఞానము తెలియకపోతే 108 కోట్ల
సంవత్సరములు ఏదో ఒక శరీరములో బ్రతుకుచూ జీవితమును సాగించవలసిందే. ప్రపంచ ఆయుస్సు 108,00,00,000
సంవత్సరములనీ అదే కాలము దేవునికి ఒక పగలనీ తెలిసినది కదా! సృష్టి ప్రారంభమై ఎంత కాలమైనదని అడిగితే,
దానికి సమాధానము ఈ విధముగా గలదు. ఇది ప్రశ్నే అయినా మనకది అనవసర ప్రశ్న అగుచున్నది. మనకు
అవసరమైనది మన భవిష్యత్తు మాత్రమే. మనము కర్మనుండి విడుదల పొంది, దేవునియందు చేరిపోవడానికొరకు
పుట్టాము. జరుగబోవు కాలమును వినియోగించుకోవాలి. కానీ జరిగిపోయిన కాలమును గురించి విచారించుట వ్యర్థమైన
పనియగును. ఒకవేళ అట్లు విచారించినా సరియైన జవాబు దొరుకునా అని చూస్తే, అలా సత్యమైన జవాబు దొరుకుతుందని
నమ్మకము లేదు. మనము సృష్ట్యాదినుండి ఉన్నాము. అప్పటినుండి జరిగిన కాలములో జీవించాము. అయితే
మరణము తర్వాత ఆ జీవితములోనిదంతా జ్ఞాపకము లేకుండా పోవుచున్నది. తెలియకుండా పోయిన కాలమును
గురించి ఎవరూ చెప్పుటకు వీలులేదు. ఒకవేళ ఎవరైన చెప్పినా అది సత్యమగుటకు అవకాశము తక్కువ. కొందరు
జరిగిపోయిన కాలమును గురించీ, జరుగబోవు కాలమును గురించీ, మొత్తము సృష్ఠి కాలమును గురించి అసత్య
ప్రచారము చేయువారు కలరు. అటువంటి సమాచారము శాస్త్రబద్దము కాదు. అందువలన అది సత్యదూరమగును.
ప్రస్తుతము ప్రచారములోనున్న ఒక దానిని ఉదహరిస్తాను చూడండి. అది సత్యమో అసత్యమో మీరే యోచించి
నిర్ణయించుకోండి.
కృతయుగము -17,28,000
త్రేతాయుగము -12,96,000
ద్వాపరయగము - 8,64,000
కలియుగము - 4,32,000
నాలుగుయుగముల మొత్తము= 43,20,000 సంవత్సరములు .
నాలుగు యుగములను కలిపి ఒక మహాయుగము అంటారు, నాలుగు మహాయుగముల 71 మార్లు గడిస్తే ఒక
మన్వంతరమని అంటారు.
43,20,000×71=30,67,20,000 సంవత్సరములు ఒక మన్వంతరము.
ఇప్పటికి ఆరు మన్వంతరములు గడచి ఏడవ మన్వంతరములో 27 మహాయుగములు అయిపోయి, 28వ
మహాయుగములో కలియుగము 5145 వ సంవత్సరము జరుగుచున్నది అన్నారు. దాని ప్రకారము ఇప్పటికి
గడచిన కాలము = 196,08,53,145 సంవత్సరములు
జరుగవలసిన కాలము = 235,91,46,855 సంవత్సరములు సృష్ఠివుండే మొత్తము కాలము=
432,00,00,000 సంవత్సరములు
ఇక్కడ ఇతరులు చెప్పినది గమనిస్తే నాలుగుయుగముల కాలము అంతయు సరిపోయినది. నాలుగు యుగములను
ఒక మహాయుగము అని అనడమూ సరిపోయినది. 71 మహాయుగములు ఒకమన్వంతరము అనడము అశాస్త్రీయమైనది.
భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగములో 17వ శ్లోకమున వేయియుగములు బ్రహ్మకు (దేవునికి) ఒక పగలు అని భగవంతుడు
చెప్పగా, ఇతరులు నాలుగుయుగములను కలిపి ఒక మహాయుగమని చెప్పడమూ, అటువంటి మహాయుగములు వేయి
జరిగితే దేవునికి ఒక పగలని చెప్పడము పూర్తి అసత్యమైనమాట. అంతేకాక భగవద్గీతలో భగవంతుడు చెప్పినమాటకు
పూర్తి వ్యతిరేఖమైన మాటయగుచున్నది. అందువలన మన్వంతరము అనుమాట అశాస్త్రీయము అని చెప్పుచున్నాము.
భగవంతుడు చెప్పినట్లు సృష్టిమొత్తము కాలము 108 కోట్ల సంవత్సరములు కాగా దానికి నాలుగింతలు 432 కోట్ల
సంవత్సరములని చెప్పడము విడ్డూరము. ఇప్పటికి 196,08,53,145 సంవత్సరములు గడచిపోయాయని చెప్పడము
కూడా విచిత్రము. సృష్ఠికాలము దేవుడు చెప్పిన ప్రకారము 108 కోట్ల సంవత్సరములు కాగా, ఇప్పటికే 196 కోట్ల 8
లక్షల 53 వేల 145 సం॥ అయిపోయాయి అనడము పూర్తి తప్పగును. అందువలన ఎంత జరిగినది అను దానిమీద
ధ్యాసలేకుండా, జరుగబోయే కాలములో దేవుని జ్ఞానముమీద, దేవుని ధర్మము మీద ధ్యాస కల్గియుండడము మంచిది.
ఇప్పుడు కొందరు నన్నొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! దేవుని జ్ఞానమును గురించి దేవుని ధర్మమును గురించి
మీరు చెప్పడము మంచిది కదా! అట్లు కాకుండా కలియుగము అని పేరుపెట్టి మీరెందుకు చెప్పుచున్నా రని అడుగవచ్చును.
దానికి మా జవాబు ఇలాకలదు.
మేము దేవునికి సంబంధించిన జ్ఞానమును తప్ప మిగతా దానిని చెప్పమనియే చెప్పుచున్నాము. ఇప్పుడు
చెప్పు కలియుగము అను సమాచారము కూడా దేవునికి సంబంధించిన జ్ఞానమేనని చెప్పుచున్నాము. మేము జరిగిపోయిన
కాలము మీద ధ్యాస లేకుండా, జరుగబోయే కాలములో దేవుని మీద ధ్యాసనుంచండి అని చెప్పాము. దేవుడే
కాలస్వరూపుడైనపుడు కాలమును గురించి తెలుసుకోవడము ముఖ్యమే అగును. అయితే ఎంతకాలము జరిగిపోయింది
అను ప్రశ్న అనవసరము అన్నాము. ఇప్పుడు జరుగుచున్నది కలియుగము అని అందరికీ తెలుసు. దీనికి ఒక పేరు,
కొంత పరిమాణ ఆయుస్సు కలదు. పేరు కలియుగము, ఆయుస్సు 4,32,000 సంవత్సరములు. అట్లే మూడు
మిగతా యుగములు కూడా కలవు. వాటికి కూడా పేర్లు, ఆయుస్సు కలదు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు
నాలుగు, నాలుగుయుగములే కానీ నాలుగు కలిసి ఒక యుగము కాదు. ఒకవేళ ఒక యుగము నాలుగు భాగములుగా
విభజింపబడి, ఆ భాగములకు పేర్లు పెట్టియుంటే అన్నీ సమాన ఆయుస్సుగ విభజన జరిగి ఉండేది. ఒక రూపాయిని
నాలుగు భాగములుగా విభజించినపుడు నాలుగు సమాన భాగములుగా విభజించి వాటికి నాలుగు పావలాలని పేరు
పెట్టాము. ఒక రూపాయి నాలుగు పావలాలుగా ఉన్నా, నాలుగు పావలాలు సమానముగా ఉన్నాయి. అలాగే ఒక
యుగమును నాలుగు భాగములుగా విభజించినపుడు ఒకే పరిమాణములో ఉండాలి. అలా లేవు అంటే అవి యుగములలోని
భాగములుకాదనీ, అవి వేరువేరు యుగములనీ తెలియబడును. అదే విధముగా నాలుగు యుగములు వేరువేరు
ఆయుస్సులు కలిగి, వేరువేరు పేర్లు కల్గియుండడము వలన అవి వేరువేరు యుగములనీ, ఒక యుగములోని
భాగములుకాదనీ తెలియుచున్నది.
ఆదిలో మొదట వచ్చినది కృతయుగము. తర్వాత వచ్చినది త్రేతా యుగము, ఆ తర్వాత మూడవది ద్వాపరయుగము,
నాల్గవది కలియుగము. ఈ నాలుగు యుగముల వరుస అయిపోతూనే తిరిగి మొదటిదైన కృత యుగము మొదలగును.
తర్వాత వరుసగా త్రేతా, ద్వాపర, కలియుగములు వచ్చును. ఇట్లు నాలుగు యుగములు ఒకమారు జరిగితే ఒక
గుర్తుగా మహాయుగము అన్నారు. ఈ మహా యుగములు 250 మార్లు జరిగితే మొత్తము వేయియుగములు జరిగినట్లగును.
ఆ వేయియుగముల పరిమాణమును ప్రపంచ ఆయుస్సుగా, దానినే దేవుని పగలుగా గీతలో చెప్పబడినది. భగవద్గీతలో
వేయియుగములు దేవునికి ఒక పగలని చెప్పారు. కానీ ఒక యుగము నాలుగు భాగములని చెప్పలేదు. వేయియుగములు
108 కోట్ల సంవత్సరములగుచున్నవి. కావున 108 సంఖ్య చాలా ప్రాముఖ్య మైనది. అంత ప్రాముఖ్యమైన సంఖ్య
అందరికీ తెలియునట్లు ఎవరికైనా కానుకను ఇచ్చునపుడు 108 రూపాయలుగానీ, 108 వస్తువులును గానీ ఇవ్వవలెనని
పెద్దలు నిర్ణయించారు. పెళ్ళి సమయములో పెళ్ళి కొడుకుకు గానీ, పెళ్ళి కూతురుకుగానీ ఇచ్చు కానుకలను 108
సంఖ్యతో ఇవ్వడము పరిపాటిగా ఉన్నది. అంతేకాక ప్రపంచ ఆయుస్సు ఇదీ అని తెలియునట్లు ప్రతి జపమాలలోనూ
108 పూసలను ఉండునట్లు పెద్దలు నిర్ణయించారు. మనము మాయలోనే పుట్టి, మాయలోనే బ్రతికి, మాయలోనే
చనిపోవు చున్నాము. మాయను విభజించి చూచితే 12 గుణములుగా ఉంటూ, ఆ పన్నెండు గుణములు ఒక్కొక్కటి
తొమ్మిది భాగములుగా విభజింప బడి 108 గుణములుగా మారిపోయి ఉన్నవి. 108 గుణములలోనే జీవుడు జీవించునట్లు,
108 కోట్ల సంవత్సరములలోనే జీవుడు మనగలుగును అన్నట్లు, తలలోని గుణరూపమైన మాయ 108 గా
విభజింపబడినదని ముందే కొంత తెలుసుకొన్నాము. ఇట్లు అనేక విధముల 108 సంఖ్య దేవునికి సంబంధించిన
జ్ఞానముతో ముడిపడియున్నది. 108 సంఖ్యను కలిపితే మొత్తము 9 సంఖ్య అగుచున్నది.
మొత్తము సృష్ఠికాలము 108 కోట్ల సంవత్సరములు మాత్రమేననీ, 108 కి నాలుగింతలు ఎక్కువగానున్న 432
కోట్ల సంవత్సరములు కాదని మేము చెప్పగా! కొందరు వారిమాటను నెగ్గించుకొనేదానికి “ఈ విషయము వేదములలోనే
ఉన్నది” అని అంటున్నారు. అంతేకాక "వేదములు సృష్ట్యాదిలో పుట్టినవి. సృష్ఠి జరిగి ఇప్పటికి 196 కోట్ల 8 లక్షల 53
వేల 145 సంవత్సరములగుచున్నది” అని అంటున్నారు. వీరిమాట అబద్దము అనుటకు ఒక ఆధారము కలదు.
అదేమనగా! గడచిన ద్వాపరయుగములో వ్యాస మహర్షి ఉండెడివాడు. ఆయన అష్టాదశ పురాణములనూ, చతుర్
వేదములను వ్రాశాడు. నాలుగు వేదములకు కర్త వ్యాసుడే. కావున ఆయనను వేదవ్యాసుడు అని అంటారు. వేదములను
రచించినవాడు వేదవ్యాసుడు అయినపుడు, వేదములు ద్వారపయుగము యొక్క చివరిలో వ్యాసుడు వ్రాసినపుడు, ఇప్పటికి
దాదాపు ఆరువేల సంవత్సరముల క్రిందట పుట్టాయనుట సత్యమగును. అట్లు కాకుండా వేదములు పుట్టి 196 కోట్ల
సంవత్సరములనడము విచిత్రము కాదా! పూర్తి అసత్యము కాదా? మొదట వేదములను వ్రాసిన వ్యాసుడు, అవి
సృష్ట్యాదిలోనే పుట్టాయని నమ్మించుటకు కొన్ని కల్పిత కథలను వ్రాసి నమ్మించాడు. నాలుగు వేదములను వ్రాసిన
తర్వాత 18 పురాణములను వ్రాశాడు. అవన్నియు ఉదర గాథలు కాదు. పుక్కిడి పురాణములే! అనగా వాస్తవదూరమైన
కల్పిత కథలే. భాగవత పురాణములలో హిరణ్యాక్షుడు అను రాక్షసునినుండి వేదములను రక్షించుటకు విష్ణువు వరాహ
(పంది) అవతారమెత్తాడని చెప్పారు. అది సృష్ట్యాదిలోనే జరిగినట్లు చెప్పడము వలన, మరియు వేదములు కృతయుగములోనే
సృష్ట్యాదిలోనే తయారైనవనీ, వాటిని దేవుడే తయారు చేశాడని వ్రాయడము వలన అందరూ అదే నిజమని నమ్మారు.
వ్యాసుడు ద్వాపరయుగములో వ్రాశాడని ఎవరికీ తెలియకుండా పోయినది.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! “భగవద్గీత ను సృష్ట్యాదిలో దేవుడు సూర్యునికి
చెప్పాడు, సూర్యుని వలన భూమిమీద తెలిసినదని చెప్పారు కదా! దేవుడు చెప్పిన భగవద్గీతలో వేదములు గుణముల
విషయములనీ, మాయయనీ చెప్పినట్లున్నది కదా! అలాంటపుడు వేదముల ప్రస్తావన ఆదిలోనే గీతయందున్నప్పుడు
వేదములు ఆదిలోనే పుట్టాయనడము సత్యమే కదా!” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
దేవుడు భగవద్గీతను ఆదిలోనే సూర్యునకు చెప్పినమాట వాస్తవమే. అప్పుడు గుణములను గురించి చెప్పినదీ, గుణములే
మాయ అని చెప్పినదీ అన్నీ వాస్తవమే. అయితే వేదములు అను పదము ఆ రోజు చెప్పబడలేదు. ద్వాపరయుగము
యొక్క అంత్యములో భారతయుద్ధము జరిగినపుడు కృష్ణుడు అర్జునునకు భగవద్గీతను ఆదిలో చెప్పినట్లే చెప్పాడు.
అదంతయు వినిన అర్జునుడు యుద్ధము తర్వాత ఒక దినము తాను కృష్ణుని ద్వారా విన్నదంతా వ్యాసునికి చెప్పడము
జరిగినది. అర్జునుడు చెప్పినదంతా వినిన వ్యాసునికి తాను చేసిన తప్పేమిటో తనకు తెలిసిపోయినది. తాను వేదములను
వాటికి అనుబంధముగ పురాణములను వ్రాసి గొప్ప తప్పు చేశానని అను కొన్నాడు. తన వేదములలో గీతలో చెప్పబడిన
మాయ తప్ప ఏమీ లేదనుకొన్నాడు. తాను అధర్మమునే ప్రచారము చేశానని బాధపడిపోయి, చివరకు ఒక నిర్ణయానికి
వచ్చాడు. భగవంతుడు చెప్పిన భగవద్గీతను గ్రంథ రూపములో వ్రాయాలనుకొన్నాడు. అలా వ్రాయుట వలన తన
పాపమునకు కొంత క్షమాపణ ఏర్పడునని అనుకొన్నాడు. అట్లు అనుకొన్న వెంటనే గీతను మొదలుపెట్టి పూర్తిగా
వ్రాసిపెట్టాడు. ఆనాడు వ్యాసుడు వ్రాసిన వేదములను చదివిన వారికి అదే వ్యాసుడు భగవద్గీతను వ్రాయడము
సరిపోలేదు. భగవద్గీతలో వేదములు వ్యతిరేఖత ఉన్నట్లు గ్రహించారు. తమకు, తమ వృత్తికి వ్యతిరేఖముగానున్న
భగవద్గీతలో తమకు అనుకూలమైన కొన్ని శ్లోకములను చేర్చాలని నిర్ణయము చేసుకొన్నారు. అంతలోనే వ్యాసుడు
చనిపోయిన వెంటనే గీతలోనికి సాధ్యమైన కొన్ని చోట్ల కొన్ని శ్లోకములను చొప్పించారు. అప్పటికి భగవద్గీత ప్రజలలోనికి
పూర్తిగా పోలేదు. ఆనాడు కొందరు పండితులు మాత్రమే భగవద్గీతను చదివారు. కావున ఆ పండితులే భవిష్యత్తులో
తమకు అనుకూలముగా ఉన్నట్లు కల్పిత శ్లోకములను గీతలోనికి వ్రాసిపెట్టారు. ఈ విధముగా భగవద్గీతలో కూడా
కొన్ని అధర్మయుక్తమైన శ్లోకములు, దేవుని మాటకు వ్యతిరేఖతను చూపు శ్లోకములు, ఆలోచించువానికి అనుమానమును
రేకెత్తించు శ్లోకములు కొన్ని ఉన్నాయి. వాటిని గ్రహించిన మేము మాచే రచింపబడిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”
యందు ఆ శ్లోకములను తీసివేసి వ్రాయడము జరిగినది. ఇవి దేవుడు చెప్పినవి కావు, కల్పిత శ్లోకములనీ, మధ్యలో
చొప్పించబడినవని కూడా చెప్పడము జరిగినది. ఇంతవరకు ఏ భగవద్గీతలో జరగని పని త్రైత సిద్ధాంత భగవద్గీతలో
జరిగినది.
మా ఉద్దేశము, మా కర్తవ్యము, స్వచ్ఛమైన దైవజ్ఞానమును ప్రజలకు అందివ్వడమే. కావున భగవద్గీతలో
"అక్షర పరబ్రహ్మయోగము” అను అధ్యాయములో కాలమును గురించిన కొన్ని శ్లోకములున్నాయి. అందులో 17, 18
శ్లోకములందు యుగములను గురించి, అట్లే 24, 25 శ్లోకములందు పగలు, రాత్రీ, కృష్ణపక్షము, శుక్లపక్షమూ,
ఉత్తరాయణము, దక్షిణాయణము లను గురించి చెప్పడము జరిగినది. ఈ పేర్లన్నియు కాలమునకు సంబంధించిన
భాగముల గుర్తులు. కాలము దైవస్వరూపము కావున కాలమునకు సంబంధించిన పూర్తి జ్ఞానమును అందివ్వాలనుకొన్నాము.
ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని సంచలనమైన విషయమును తెలియజేస్తాము సావధానముగా వినండి. కాలము
అంటే దేవుడని తెలిసిపోయినది. అయినా దైవస్వరూపమైన కాలము మన ఎదుటే ఉన్నా అది తెలియబడదు.
తెలియబడని కాలమును తెలుసుకొని దానియందు ఐక్యమైపోయి నీవు కూడా కాలస్వరూపునిగా మారిపొమ్మని పెద్దలు
తెలియజేశారు. నీవుకూడా కాలములోనికి కలిసిపొమ్మని కాలము యొక్క వివరములో చెప్పారు. కాలము దేవుడు అని
చెప్పుకొన్నాము కదా! కాలము దైవము అని అందరికి అర్థ మగుటకు కాలములో పెద్దవైన నాలుగు యుగములకు గల
పేర్లను దైవము యొక్క హెూదాను తెలుపునట్లు పెట్టారు. ఆ నాలుగుయుగముల పేర్లు నేటికిని మనముందరున్నా
వాటిలో రెండు పేర్లు కొంత మార్పు చెంది ఉన్నవి. నాలుగు యుగముల పేర్లు ఎంతగొప్పవో, అందులో రెండు పేర్లు
ఎలా మారిపోయి పిలువబడుచున్నాయో వివరించుకొందాము.
ఇంతవరకు వాడుకలోయున్నవి, చాలామందికి తెలిసినవి కాలము లో పెద్దవి నాలుగుయుగములు. అందులో
మొదటిది కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాల్గవది కలియుగము. ఒక
విధముగా చెప్పితే నాలుగుయుగముల పేర్లు వేరువేరుగా ఉండినా చివరిలో మాత్రము యుగములుగానే పిలువబడుచున్నవి.
చివరిలో యుగములను వదలిచూస్తే ఒకటి కృత, రెండు త్రేతా, మూడు ద్వాపర, నాలుగు కలి అని చెప్పవచ్చును. ఈ
నాలుగు పేర్లలో చివరి ద్వాపర, కలి అను రెండు పేర్లు పూర్వము పెద్దలు ఎలా నిర్ణయించారో అలాగే ఉన్నవి.
ముందున్న కృత, త్రేతా అను రెండు పేర్లు కొద్దిగా మార్పు చెందియున్నవి. మొదటి పేరైన కృత అను పేరు పూర్వము
కృత్ అను పేరుగా ఉండెడిది. కృత్ అనగా చేసినవాడు అని అర్థము రాగలదు. కృత అంటే చేయబడినది అని అర్థము
రాగలదు. ఇక్కడ విశ్వమును సృష్టించిన దేవున్ని ఉద్దేశించి పెట్టిన పేరు కృత్ అని తెలియుచున్నది. సర్వసృష్ఠిని
తయారు చేసిన వానిని కృత్ అంటాము. చేయబడిన విశ్వమును కృత అంటాము. ఇక్కడ పెట్టిన పేరు కాలమును
ఉద్దేశించి పెట్టినది, విశ్వమును ఉద్దేశించి పెట్టినది కాదు. అందువలన కృత్ అను పేరు వాస్తవమైనదని అర్థమగుచున్నది.
ఈ విధముగా కాలక్రమమున కృతయ్యుగము కాస్త కృతయుగముగా మారి పోయినది. అర్థము వివరము తెలియనివారు
గ్రుడ్డిగా కృతయుగము అంటున్నారు. సామాన్య ప్రజలే కాకుండా జ్యోతిష్యపండితులు కూడా అర్థ హీనమైన పేరుతోనే
వ్రాయుచున్నారు. ఈ విధముగా మాయ అందరిని మభ్యపెట్టినది. ఇది కాలమునకు పెట్టినపేరనీ, కృతియుగమే కానీ
కృతయుగముకాదనీ పండితులు కూడా గ్రహించలేకపోయారు.
ఇక రెండవ పేరు కూడా అర్థహీనమైపోయినదని చెప్పవచ్చును. దేవుడు భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి
యోగమున 16,17, శ్లోకములలో చెప్పినట్లు దేవుడు మూడు భాగములుగా ఉన్నాడు. దానినే ముగ్గురు పురుషులుగా
అక్కడ చెప్పడము జరిగినది. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను ముగ్గురు పురుషులుగా దేవుడున్నాడు.
ఆ ముగ్గురు పురుషులనే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని మూడు ఆత్మలుగా కూడా చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన
జ్ఞానమును అనుసరించి దేవుని హెూదాకు తగినట్లు సూచన పదములను దేవునిపట్ల వాడెడివారు. కృత్ అనగా చేసిన
వాడని అర్థమునిచ్చు సూచన పదముగానీ అది ఒక పేరుకాదు. వాస్తవముగా దేవునికి పేర్లుండవు. క్షర, అక్షర
పురుషులకంటే ఉత్తమమైనవాడు అను సూచనతో పురుషోత్తముడు అన్నారు. అలాగే జీవాత్మ, ఆత్మలకంటే వేరైన వాడు
అను అర్థమునిచ్చు పదముతో పరమాత్మ అని అన్నారు. పురుషోత్తమ అనినా, పరమాత్మ అనినా అవి అర్థమునిచ్చునవే
గానీ పేర్లు మాత్రము కావు. అలాగే దేవుడు అనినా దేవులాడబడేవాడు (వెతకబడే వాడు) అని అర్థమేగానీ అది పేరు
కాదు. అట్లే రెండవయుగము ముందర దేవుని విధానమును తెలుపు పదమును ఉపయోగిస్తూ త్రైతా అన్నారు. త్రైతా
అనగా మూడవది. దేవుడు మూడవ పురుషుడు లేక మూడవ ఆత్మ కావున కాలమును త్రేతాయుగము అన్నారు.
అయితే కాలక్రమమున అజ్ఞానము పెరిగిపోయి, త్రేతాయుగము కాస్త త్రేతాయుగముగా మారిపోయినది. త్రేతా అంటే
అర్థములేదు. త్రైతా అంటే మూడవవాడు అని అర్థము గలదు. నేడు జ్యోతిష్యపండితులు, స్వామీజీలు, అందరూ
త్రేతాయుగమనియే చెప్పుచున్నారు. ఊరంతా ఉత్తరమంటే మేము ఒక్కరు దక్షిణమన్నట్లున్నది. అందరూ త్రేతాయుగము
అంటూవుంటే మేము ఒక్కరూ త్రేతా కాదు త్రైతా అని చెప్పినా బుర్రలేని మనుషులు వినే స్థితిలోలేరు. ఇప్పటికైనా
దేవుని గొప్పతనమునకు, విధానమునకు భంగము కలుగకుండా, అర్థహీనము కాకుండా కృతయుగమును వదలి కృత్
యుగమనీ, అలాగే త్రేతాయుగమును త్రేతాయుగమని పిలుచునట్లు తెలుపుచున్నాము. కృత్ అను శబ్దముగానీ, త్రైత
అను శబ్దముగానీ కాలమునకు పూర్తిగా సరిపోవునని తెలియవలెను. కాలక్రమములో అజ్ఞానము పెరిగిపోయి కొన్ని
విషయములు తెలియక పోయినా, వాటిని గురించి వివరముగా తెలుపువారు వచ్చి తెలిపినపుడు, అందులోని సారాంశమును
గ్రహించి, ఏది సత్యమో ఆలోచించి దాని ప్రకారము నడుచుకోవడము విజ్ఞుల లక్షణము.
మూడవది ద్వాపర అని కలదు. ఇంతకు ముందే దేవున్ని పరమాత్మ అని అంటారని చెప్పుకొన్నాము. ఆత్మకంటే
వేరుగా ఉండేవాడు కనుక పరమాత్మ అని అంటాము. జీవాత్మ, ఆత్మకానివాడు పరమాత్మ. అలాగే క్షరపురుషుడు,
అక్షరపురుషుడు కానివాడు పురుషోత్తముడు. మూడు ఆత్మలలో మూడవ ఆత్మ అయిన దానిని త్రైతాత్మ అంటాము.
అట్లే మూడింటిలో రెండూ కానిది దేవుడు అనుటకు ద్వాపర అని అంటాము. ద్వా అనగా రెండు అనీ, పర అనగా
వేరైనది అని అర్థము. ద్వాపర అనగా రెండిటి కంటే వేరుగా ఉన్నదని అర్థము. దేవుని హెూదాకు తగినట్లు ఉన్న
శబ్దము ద్వాపర. కావున పూర్వము పెద్దలు కాలమునకు ద్వాపర అని సూచనగా పిలిచారు. దానినే ద్వాపరయుగము
అని అంటాము. ఇది పూర్వము పెద్దలు నిర్ణయించిన పదము. అదృష్టవశాత్తు ఈ పదము, దాని అర్థము మారకుండా
అలాగే ఉన్నది. ఇది దేవుని గుర్తని మేము చెప్పుటకు సాక్ష్యముగా నిలిచింది. ఇక నాల్గవది కలియుగము. ఇది కూడా
పూర్వము పెద్దలు నిర్ణయించినట్లే అర్థము చెడకుండా ఉన్నది. భగవద్గీతలో నీవు ఎవరు అని అర్జునుడు దేవున్ని
అడిగినపుడు దానికి జవాబుగా “కాలోస్మి లోకక్షయ" అని అనడము జరిగినది. దాని అర్థము "లోకమును నాశనము
చేయు కాలమును" అని గలదు. దీనిప్రకారము కాలము సర్వులను నాశనము చేయుచున్నదని అర్థమగుచున్నది.
దేవుడు అందరిని, అన్నిటిని సృష్టించు సృష్టికర్తయేకాక, తాను సృష్టించిన అందరినీ, అన్నిటినీ నాశనము చేయగలడు.
అందువలన తనను లోకక్షయునిగా చెప్పాడు. క్షయము అనగా నాశనము. దేవున్ని ఆయన హెూదాకు తగినట్లు
పిలువడము ధర్మమగును. కావున అదే ఉద్దేశముతోనే కాలమునకు కలియుగము అని సూచించారు. కలి అనగా
నాశనమును కల్గించుయుద్ధము అని అర్థము. యుద్ధము అంటే నాశనమే అని అర్ధము, కావున దేవున్ని కలిపురుషుడు
అన్నారు. అదే ఉద్దేశముతో కాలమును కలియుగము అని అన్నారు. పూర్వము కొందరు జ్ఞానులు ఒకచోట కూర్చొని
కాలమునకు పేరుకాని పదములను నిర్ణయించారు. ఆ పదములు దేవుని ధర్మములకు తగినట్లు ఏర్పరచారు. వారు
సక్రమముగా ఏర్పరచినవి 1) కృతియ్యగము 2) త్రేతాయుగము 3) ద్వాపరయుగము 4) కలియుగము. అయితే
ముందరున్న రెండు పెద్ద పేర్లు కొంతమారిపోయి కృతయుగము కృత యుగముగా, త్రేతాయుగము త్రేతాయుగముగా
మిగిలి ఉన్నాయి.
యుగముల పేర్ల విషయములో ఇప్పుడు సంచలనవార్త తెలిసి నట్లయినది. ఇప్పుడు చెప్పిన సత్యమును
కొందరు బాగా అర్థము చేసుకో గలిగినా, కొందరు మాత్రము జీర్ణించుకోలేకపోవచ్చును. అటువంటి వారు ఇప్పుడు
చెప్పబోవు మరొక విషయమును చూస్తే పూర్తిగా వాంతి చేసు కుంటారేమో అనిపిస్తుంది. సత్యాన్వేషులకు మేము చెప్పు
సత్యములు మంచి ఆహారముగా ఉండగా, అన్వేషణ లేనివారికి మేము చెప్పు విషయములు ఏమాత్రము జీర్ణముకావు.
మన ఆధ్యాత్మిక గ్రంథములలోని ఆధ్యాత్మిక విద్య అంతయు జీవుడు దేవునియందు ఐక్యమగు విధానమునే చూపాయి.
అలా ఐక్యమగుటనే ముక్తి పొందడము లేక మోక్షమును పొందడము అంటారు. దేవుని సమాచారము, జ్ఞానము
ధర్మములు ఎక్కడున్నాయో అక్కడంతా జీవ బ్రహ్మ ఐక్య విధానమే ఉంటుంది. బ్రహ్మవిద్యాశాస్త్రములో ముఖ్యగ్రంథమైన
భగవద్గీతలో దేవునియందైక్యమగు విధానములనే ముఖ్యముగా చెప్పారు. దేవున్ని చేరు విధానమునే యోగము అని
గీతలో చెప్పారు. అటువంటి యోగములు ధర్మముల ప్రకారము చెప్పబడునవి రెండే రెండు గలవు. అందులో ఒకటి
బ్రహ్మయోగము, రెండవది కర్మ యోగము. ధర్మములకు అతీతమైన యోగము కూడా ఒకటి కలదు. దానిని భక్తియోగము
అంటాము. భక్తియోగము చాలాగొప్పది, అది అందరికీ అంత సులభముగా అర్థమగునది కాదు. ధర్మములతో
కూడుకొన్న బ్రహ్మ, కర్మయోగములను మనిషి అర్థము చేసుకోగలిగితే తర్వాత భక్తియోగము అర్థము కాగలదు. భగవద్గీతలో
దేవుని విధానమంతయు సంపూర్ణముగా కలదు. అక్కడే యోగముల వివరమంతయూ సంపూర్ణముగా కలదు. ఈ
విషయమంతా ఎందుకు చెప్పుచున్నామనగా! దైవస్వరూపము ఎక్కడైతే ఉన్నదో దానిలోనికి ఐక్యమైపొమ్మను విధానము
కూడా ఉండునని అర్థమగుటకు చెప్పవలసివచ్చినది.
యోగము అంటే కలయిక అని అర్థము. వియోగము అంటే కలిసివున్నది విడిపోవడము అని అర్థము.
యోగము అనుమాట దైవత్వమున్న చోటే చెప్పబడుతుందని చెప్పాము కదా! కాలము దైవస్వరూపము అన్నాము. అట్లే
కాలమునకు దైవమును సూచించు కృత్ అనీ, త్రైతా అనీ, ద్వాపర అనీ, కలి అనీ శబ్దములతో పిలుచుచున్నాము.
అటువంటి దైవస్వరూపమైన కాలముల ప్రక్కన యోగము అను శబ్దమును పెద్దలు జత చేసిచెప్పారు. ఇంతవరకు
మనము పిలుస్తున్న యుగములు పూర్వము యోగములుగా పెట్టబడినపేర్లు. వాస్తవానికి కృత్యాగము, త్రైతాయోగము,
ద్వాపర యోగము, కలియోగము అను పేర్లు సత్యమైనవి. ధర్మములు అధర్మములుగా మారిపోవునని దేవుడు గీతలో
చెప్పినట్లు ధర్మములైన యోగముల పేర్లే చివరకు యుగములుగా పిలువబడుచున్నవి. యోగము అంటే దేవునియందు
ఐక్యమై పొమ్మని అర్థముకాగా, యుగము అంటే ఏ అర్థములేదని చెప్పవచ్చును. కృత్, త్రైత, ద్వాపర, కలి అను దైవము
యొక్క స్థితిని తెలియజేయు పదముల ప్రక్కన యోగముంటే అందమూ, అర్థమూ సరిపోవును. అట్లుకాక అంతపెద్ద
పదముల ప్రక్కన అర్థములేని చిన్నపదములను పెట్టడము మంచిది కాదు. అలా అర్థములేని పదములను పెట్టడము
ఇంద్రుని ప్రక్కన ఎండిపోయిన ఎముకను కొరుకుచున్న కుక్కను పెట్టినట్లు ఉంటుంది. కుబేరుని ప్రక్కన గంజి కూడ
లేని బికారిని పెట్టి నట్లుంటుంది. అందువలన మేము చెప్పు సత్యమును తెలుసుకొని యుగమును యోగము అని
పిలుస్తూ సత్యము బయటపడునట్లు చేయుదురని అనుకొంటున్నాను. ఇప్పటికి కాలముల పేర్లలోని లొసుగులు పూర్తిగా
తెలిసిపోయాయి అనుకుంటాను.
భూమిమీద ఎన్నో మతములున్నవి. అన్నిటిపైకి రెండే రెండు మతములు చాలా పెద్దవి. క్రైస్తవమతము,
ఇస్లామ్మతములు రెండు పెద్ద మతములే. ఆ రెండు మతములకంటే హిందూమతము చిన్నదనియే చెప్పవచ్చును.
ఒకప్పుడు ఇందూ (హిందూ) మతము ప్రపంచ వ్యాప్తముగా నున్న ఏకైక మతముగా ఉండేది. తర్వాత ఎన్నో మతములు
పుట్టుక రావడము వలన, ఇందువులు తమ ఇందుత్వమనెడి దైవజ్ఞానమును తెలియకుండా పోవడము వలన, చివరికి
వెనుకన పుట్టిన మతములకంటే చిన్న మతముగా నేడు హిందూమతము కలదు. రెండువేల సంవత్సరముల పూర్వము
క్రైస్తవమతము పుట్టగా, పదునాలుగు వందల సంవత్సరముల పూర్వము ఇస్లామ్ మతము పుట్టినది. ఇందూ (హిందూ)
మతముకంటే ఎంతో వెనుకపుట్టిన క్రైస్తవ, ఇస్లామ్ మతములు రెండూ పెద్దవయిపోయాయి. సృష్ట్యాదినుండి ఉన్న
ఇందూ పథము చివరకు అజ్ఞానవశమున హిందూ మతముగా మారిపోయి ఇతర మతములకంటే చిన్నదైపోయినది.
ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తముగానున్న ఇందుత్వమునుండి ఎన్నో మతములు పుట్టుకొచ్చినవి. ఏ మతమునకైనా పుట్టినిల్లు
ఇందూపథమే. అందువలన ఇందుత్వములో పెద్దలు చెప్పిన స్వర్గ, నరకములు అన్ని మతములలోను చెప్పబడు
చున్నవి. అట్లే అన్ని మతముల వారికీ, అన్ని దేశముల వారికీ ఆదివారము ఉన్నది మరియు అది సెలవు దినముగా
ఉన్నది. అంతేకాక ఇందుత్వము అనబడే ఆధ్యాత్మికత అన్ని మతములలోనూ ఉన్నది. వారు కూడా ప్రళయ ప్రభవములను
గురించి చెప్పుకొంటున్నారు. అందరిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడనీ, ఒక రోజున ప్రళయము వస్తుందనీ, అందరూ
ఆ దినమున చనిపోతామని చెప్పుకొంటున్నారు. అన్ని మతముల వారికి జరుగబోవు ప్రళయము మీద కొంత అవగాహన
ఉన్నదనియే చెప్పవచ్చును. కొందరైతే ప్రళయ దినమున స్వర్గనరకముల తీర్పు ఉంటుందని చెప్పుచున్నారు. ఎలా
గైతేనేమి అన్ని మతములలోను ప్రళయము అనునది ఒకటున్నదనీ, అది రాబోవు కాలములో వస్తుందనీ చెప్పడము
జరుగుచున్నది. ప్రళయమును గురించి గతములో కొందరు చెప్పుకొన్న విషయమును వివరించుకొందాము.
క్రీ.శ॥ 1994వ సంవత్సరము ఢిల్లీలో గన్లైసెన్సు తీసుకొని ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగినాను.
అప్పుడు రాత్రి 9 గంటల సమయమైన దానివలన నాకు పరిచయమున్న రైల్వే మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాను.
మెజిస్ట్రేట్గారు బ్రహ్మకుమారి సమాజములో పూర్తిగా ఐక్యమైన భక్తుడు. అప్పుడు ఆయన నా గన్లైసెన్సు విషయమును
తెలుసుకొని ఇలా అన్నాడు “ఎందుకు గన్లైసెన్సు వృథా, ఈ సంవత్సరము చివరికి ప్రళయము వచ్చి మొత్తము
ప్రపంచమంతా పోతుంది" అని అన్నాడు. అప్పుడు ఈ మాటను మీరెలా చెప్పగలుగుచున్నారని నేను అడిగాను.
దానికి ఆయన “మా బ్రహ్మకుమారి సమాజము వారు చెప్పారు. 1994వ సంవత్సరము చివరిలో ప్రళయము వస్తుందని,
అందువలన నేను ఇల్లు కట్టించాలను పనిని కూడా మానుకొన్నాను. ప్రళయములో అన్ని నాశనమై, అందరూ లేకుండా
పోయేటప్పుడు ఇప్పుడు మేము కట్టించుకోవాలనుకొన్న ఇల్లు వృథానే, ఇప్పుడు మీరు తెచ్చుకొన్న గన్లైసెన్సూ వృథానే”
అన్నాడు. నేను ఆయనకు సాధారణ మనిషి మాదిరి పరిచయము. నేను ఆధ్యాత్మికవేత్తనని ఆయనకు తెలియదు.
ఎందుకనగా నేను ఎక్కడా సర్వసాధారణ వ్యక్తిగానే కనిపిస్తుంటాను. కొన్ని సంవత్సరముల పరిచయముండినా ఆయన
తనకే ఎక్కువ తెలుసుననీ, తానొక సంస్థలో జ్ఞానము తెలుసుకొంటున్నానని అనుకొనెడివాడు. అందువలన ఆయన
బ్రహ్మకుమారి సమాజమువారు చెప్పిన విషయమునే నాకు చెప్పడము జరిగినది. ఆయన ఆ విధముగా ప్రళయము
1994వ సంవత్సరము చివరిలో వస్తుందని చెప్పిన మాటలను మౌనముగ విన్నాను. అలా జరుగదని నాకు తెలిసినా
నేను మాత్రము ఏమీ చెప్పలేదు. తర్వాత కొంతకాలమునకు 1994వ సంవత్సరము పూర్తిగా అయిపోయినది. ఆయన
మాట అసత్యమని ఆయనకే అర్థమైపోయినది.
క్రీ॥శ॥ 1996వ సంవత్సరము, ఒక బుక్ ల్లో "కలియుగాంతము 1999” అను పుస్తకమును చూచాను.
దానిని వేదవ్యాస్ ఐ.ఎ.యస్. వ్రాసినట్లు తెలిసినది. ఆ కాలములో ఆ పుస్తకము కొన్ని లక్షల కాపీలు అమ్ముడైనట్లు
ప్రచారమైనది. ఆ పుస్తకమును నేను కూడా చదివాను. 1999 కి కలియుగము అంతము కాదని నాకు తెలిసినా,
దానిని గురించి ఎవరికీ నేనేమి చెప్పలేదు. తర్వాత కొంతకాలమునకు 1999 కూడా గడచిపోయినది. కానీ ప్రళయము
జరగలేదు, కలియుగము అంతమూ కాలేదు. ఇన్ని జరిగినా “సిగ్గన్నాకాక దారిన ఎదురాయె” అన్నట్లు ఇప్పుడు
మరియొక ఆధ్యాత్మిక సంస్థవారు 2012 సంవత్సరము డిశంబరు 21 నాటికి ప్రపంచము అంతమైపోతుందనీ, తర్వాత
కలియుగముండదనీ ప్రచారము చేయుచున్నారు. ఈ విషయమును ఒక ఆధ్యాత్మిక సంస్థే కాకుండా, కొందరు జ్యోతిష్యులు
కూడా అదే విషయమును చెప్పుచున్నారు. అంతేకాక కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా 2012 సం॥లో ప్రళయము
జరుగునని చెప్పుచున్నారు. ఈ మధ్యకాలములో 2011 డిశంబరు 20వ తేదీన, టీవీ9 ఛానల్లో “యుగాంతము 365
రోజులు" అను సమస్య మీద చర్చావేదిక ప్రసారము చేశారు. చర్చలో కొందరు యుగాంతము అవుతుందనీ,
కొందరు యుగాంతముకాదనీ మాట్లాడడము జరిగినది. ఇదంతా విన్న తర్వాత మరియు చూచిన తర్వాత మాకు
విచిత్రమనిపించింది. ఆలు తెలియదు, సూలూ తెలియదు, కొడుకు పేరు మాత్రము సోమలింగము అన్నట్లు, యుగములంటే
ఏమిటో, వాటి వాస్తవపేర్లేమిటో తెలియదు. అట్లే యుగముల ముందరున్న పేర్లను ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో,
వాటి అర్థమేమిటో తెలియదు. ఇంకా యుగములు ఎప్పటినుండి ప్రారంభమైనవో, వాటి ఆయుస్సు ఎంతో తెలియదు.
కానీ ప్రళయము మాత్రము 2012 అనడము జరుగుచున్నది. 2012 ప్రళయమును గురించి చలనచిత్రాలు కూడా
వచ్చాయి.
ఈ గందరగోళ పరిస్థితినుండి ప్రజలు బయటపడలాంటే అందరికి ఇంతవరకు తెలియని రహస్యములన్నిటిని
ఛేదిస్తూ ఒక గ్రంథమును వ్రాయాలనుకొన్నాము. ఇప్పుడు ఆ ఉద్దేశమును కార్యరూపములో పెట్టాము. ఈ గ్రంథములో
ప్రతి విషయము ఆధ్యాత్మికముతో ముడిపెట్టుకొని వివరించడము జరిగినది. కాలము, మనిషిలోని జీవాత్మ ఒకదానికొకటి
సంబంధపడియున్నవి. అందువలన మనిషిలోని గుణముల సంఖ్యనుండి యుగములు (యోగములు)ను గురించి
చెప్పుకొన్నాము. ఇప్పుడు యుగాంతమును కూడా మనిషినుండే ప్రారంభిస్తాము. యుగాంతము జీవుల కొరకే
నిర్ణయింపబడినది. కావున జీవమున్న మనిషినుండే వివరించు కోవలయును. మనిషి శరీరములలో తల మధ్యభాగమున
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాలుగు చక్రముల సముదాయము ఉన్నది. అన్నిటి కంటే పైనగల చక్రమును
బ్రహ్మచక్రము అని అంటాము. బ్రహ్మచక్రము రెండు భాగములుగా విభజింపబడివున్నది. ఈ చక్రము ప్రపంచ
ఆయుస్సుకు సంబంధించినది. బ్రహ్మచక్రములోని ఒక భాగము పూర్తిగా తిరుగుటకు వేయియుగములు (యోగములు)
పట్టును. రెండు భాగములు తిరుగుటకు రెండువేల యుగములు పట్టును. ఒకమారు సృష్ఠి తయారై అది కొంత
కాలముండి, తర్వాత కొంత కాలము లేకుండా పోయి, తర్వాత సృష్టి మొదలగుటకు ఒక కల్పము అంటాము. బ్రహ్మచక్రము
ఒక చుట్టు పూర్తిగా తిరుగుటను ఒక కల్పము అని చెప్పవచ్చును. క్రింద బ్రహ్మచక్రము యొక్క చిత్రమును (చిత్రం పేజీ 35 లో చూడండి ) చూడండి.
బ్రహ్మపగలు
1000 యోగములు.
బ్రహ్మరాత్రి
1000 యోగములు.
బ్రహ్మచక్రము చిత్రం.
ఈ విధముగా ప్రపంచము వేయియుగముల (యోగముల) కాలము ఉండుటకూ, వేయియుగముల కాలము
లేకుండుటకు, మొత్తము రెండువేల యుగముల కాలము ఒక కల్పముగా నిర్ణయింపబడుటకు మూలము మనిషి తలలోనే
కలదు. మనిషి తలలో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు నాలుగు బ్రహ్మనాడిలోని శక్తిని ఇరుసుగా చేసుకొని
తిరుగుచున్నవి. బ్రహ్మనాడి శక్తిని పరిశీలించి చూడగా అందులో ఆత్మశక్తి పైకి తెలిసినా, దానిలో కూడ పరమాత్మ శక్తి
వ్యాపించియున్నది. ఇప్పుడు మూడు ఆత్మల స్థానములను వివరించుకొంటే, జీవాత్మ గుణచక్రములోని మూడు భాగము
లలో ఏదో ఒక దానియందు అతి స్వల్పమైన సూక్ష్మబిందువుగా ఉన్నది. రెండవదైన ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రముగా
చేసుకొని నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఆత్మ శరీరములో మాత్రమే ఉన్నది. శరీరము బయట లేదని
జ్ఞాపకముంచుకోవలెను. మూడవదైన పరమాత్మ మాత్రము శరీరములోపలా, శరీరము బయటా అణువణువునా వ్యాపించి
యున్నది. ప్రతి శరీరములోనూ పరమాత్మశక్తి రెండువేల చైతన్య శక్తులుగా మారి ఆత్మయందు చేరిపోయినది. ఆత్మ
చైతన్యశక్తి పరమాత్మ శక్తియేనని తెలియవలెను. రెండువేల చైతన్యములుగానున్న శక్తి జీవశరీరములోనున్నది. రెండువేలలో
ఐదువందల (500) యూనిట్లశక్తి జీవాత్మలో చేరియున్నది. (ఒక చైతన్యశక్తిని ఒక యూనిట్గా చెప్పడమైనదని
గమనించవలెను.) రెండువేల యూనిట్లశక్తిలో 500లు జీవాత్మయందుండగా, బ్రహ్మనాడిలోని ఆత్మయొక్క ఏడునాడీ
కేంద్రములలో మొదటి స్థానమైన సహస్రారమునందు 500ల యూనిట్ల శక్తియుండగా, రెండవ స్థానమైన ఆగ్నేయ
నాడీకేంద్రమున ఆత్మశక్తి 500 యూనిట్లు ఉన్నది. తర్వాత మూడవ నాడీకేంద్రమైన విశుద్ధమందు 250 యూనిట్లు
ఉండగా, నాల్గవ స్థానమైన అనాహత స్థానమందు 125 యూనిట్ల శక్తి ఉన్నది. తర్వాత ఐదవ నాడీకేంద్రమైన
మణిపూరకమందు 62.1/2 యూనిట్లు ఉండగా, ఆరవ నాడీకేంద్రమైన స్వాధిష్ఠానమునందు 31.1/4 చైతన్యముల శక్తి
ఉన్నది. ఇక చివరి నాడీకేంద్రమైన ఆధారస్థాన మందు 31.1/4 యూనిట్లే ఉన్నది. ఈ విధముగా పరమాత్మశక్తి ఒక
సజీవ శరీరములో రెండువేల చైతన్యముల (యూనిట్ల) శక్తిగా ఉంటూ ఏడునాడీ కేంద్రములందు విభజింపబడి ఉన్నది.
శరీరములో పరమాత్మశక్తి ఆత్మ భాగములుగానున్న విధానములను చిత్రరూపములో ప్రక్క పేజీలలో చూడండి.
పరమాత్మ శక్తి ఆత్మశక్తిగా మారడము, ఆత్మనుండి జీవాత్మ విభజన, శరీరములో ఆత్మభాగములున్న విధానమును
చూచాము కదా! పరమాత్మ యొక్క అనువంతశక్తి రెండువేల (2000) చైతన్యశక్తులుగా మారడమూ, అలా మారిన
ఆత్మశక్తిలో కొంత జీవాత్మగా విడిపోవడమూ, ఐదువందల (500) చైతన్యశక్తులు (ఐదువందల యూనిట్లు) జీవాత్మగా
విడిపోగా మిగిలిన పదిహేనువందల (1500) చైతన్యశక్తులు శరీరములోని నాడీకేంద్రములందు ఉండి శరీరమంతా
ప్రాకడము జరుగుచున్నదని పై చిత్రముల ద్వారా తెలిసి పోవుచున్నది. ఈ విధముగా ఒక జీవ శరీరములో దైవశక్తి
రెండువేల చైతన్యములుగా ఉండుట వలన, రెండువేల యుగములు దేవునికి ఒక దినముగా లెక్కించబడుచున్నది. ఈ
సూత్రము ప్రకారము వేయియుగముల తర్వాత ప్రళయము, అట్లే వేయియుగముల తర్వాత ప్రభవము నిర్ణయించబడినది.
ఒక ప్రభవము (సృష్ఠి), ప్రళయము (నాశనము) రెండు కలిపి దైవము యొక్క ఒక దినముగా లెక్కించబడినది. దేవుడు
అనంతశక్తిమయుడు, అపారయుక్తిమయుడు. కావున ఆయన ఎవరో, ఎట్లుంటాడో, ఆయన ఆయుష్షంతో ఎవరికీ
తెలియదు. అంతేకాక ఆయన (దేవుడు) నిజముగా లేడు అబద్దముగా ఉన్నాడు. ఈ అర్ధము ప్రకారము ఆయనకు
ఆకారములేదు, పేరూలేదు, క్రియాలేదు. కావున ఆయుస్సు కూడా లేదు. ఆయనే అందరినీ తయారు చేయువాడు
(సృష్టికర్త). అలాగే ఆయనే అందరినీ నాశనము చేయువాడు (లయకర్త). సృష్ఠి, లయములు దేవునివే, కావున మన
తలలోని నాలుగుచక్రములలో పైన గల చక్రము పేరు బ్రహ్మచక్రమని చెప్పబడినది. అంతేకాక బ్రహ్మచక్రము రెండు
భాగములుగా విభజింపబడి, అందులో ఒకటి సృష్ఠికి, మరొకటి లయకు గుర్తుగా ఉన్నవి.
కొందరు జ్యోతిష్యులు, కొందరు వేదాంతులు సృష్ట్యాదినుండి ఇంత కాలము గడచిపోయినదనీ, ఇన్ని
మన్వంతరములు గడచిపోయినవనీ, ఇంకా ఇంత గడువవలసియున్నదనీ చెప్పుచున్నారు. 196 కోట్ల 8 లక్షల 53 వేల
145 సంవత్సరములు గడచిపోయినవనీ, ఇంకా గడువలసినవి 235 కోట్ల 91 లక్షల 46 వేల 855 రోజులు ఉన్నవని
ఒక ప్రక్క చెప్పుచూ, మరియొక ప్రక్క ప్రళయము ఈ సంవత్సరమే వస్తున్నదని చెప్పుచున్నారు. వీరు చెప్పే మాటలన్నీ
వాస్తవమేనా అని ఆలోచించి చూస్తే, మా బుర్రకు తెలియునది ఏమనగా! నాలుగు యోగములు (యుగములు)
పరమాత్మ నుండి ఆత్మ విభజన చిత్రము
2000 పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ.
1000 +
1000 మొదటి ఆత్మ భాగము.
500 +
500 రెండవ ఆత్మ భాగము.
250 +
250 మూడవ ఆత్మ భాగము.
125+
125 నాల్గవ ఆత్మ భాగము.
62.5 + 62.5 ఐదవ ఆత్మ భాగము.
31.25 + 31.25 ఆరవ ఆత్మ భాగము.
31.25 ఏడవ ఆత్మ భాగము.
పరమాత్మ నుండి ఆత్మ, ఆత్మనుండి జీవాత్మ విభజన చిత్రము
(2000) పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ.
1000 + 1000 ( 500 జీవాత్మ,500 - ఆత్మ మొదటి భాగము).
500 +
500 → ఆత్మ రెండవ భాగము.
250 +
250 ఆత్మ మూడవ భాగము.
125 +
125 ఆత్మ నాల్గవ భాగము.
62.5
62.5 ఆత్మ ఐదవ భాగము.
31.25 +
31.25 ఆత్మ ఆరవ భాగము.
31.25 ఆత్మ ఏడవ భాగము.
శరీరములో ఆత్మ భాగములున్న విధానము.
జీవుడు( -సహస్రారము 1))
500 +
క్షరుడు (ఆగ్నేయము 2))
500 ,
(3)) 250 (విశుద్ధము )
125
(4) అనాహతము (4)
62.5
(5) మణిపూరకము
31.25
6) స్వాదిష్టము
31.25
7) ఆధారము
ఒకదాని తర్వాత ఒకటి రావడము వాస్తవమే. గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారము వేయి యుగములు దేవునికి
పగలు, అట్లే వేయియుగములు దేవునికి రాత్రిగ ఉండడము వాస్తవమే. దేవునికి పగలు, రేయి అని చెప్పినట్లు మనిషికి
కూడా పగలు రేయి కలవు. దేవుని పగలులో జీవరాసుల సృష్ఠి, స్థితి లయలు గలవు. తర్వాత దేవుని రాత్రిలో మొత్తము
సృష్ఠియే లేదు. తిరిగి దేవుని పగలు మొదలవగానే సృష్ఠి తయారగును. అలాగే మనిషి పగలు కాలము మొదలైనపుడు
మనిషి నిద్రనుండి లేస్తున్నాడు. నిద్రనుండి లేచినప్పుడే ప్రపంచమూ, ఇతర జీవరాసులూ తెలియుచున్నవి. మనిషికి
పగలు కాలము అయిపోయిన తర్వాత రాత్రి కాలము నిద్రకు ఉపక్రమించు చున్నాడు. అప్పుడు మనిషికి ఏమీ
తెలియకుండ పోవుచున్నది. మనిషి పగలు మెలుకువలో ఉన్నప్పుడు కాలము గడచినట్లే, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు
కూడా కాలము గడచిపోవుచున్నది. బాగా యోచిస్తే మనిషికి నిద్ర మరణములాంటిది, మెలుకువ పుట్టుకలాంటిది.
మేల్కొన్నవాడు నిద్రించక తప్పదు, నిద్రించినవాడు మేల్కొనక తప్పదు. గీతలో పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు
పుట్టక తప్పదు, అని భగవంతుడు చెప్పినట్లు మనిషి చావు పుట్టుకలకు సమానమైన నిద్ర మెలకువలను పొందుచున్నాడు.
నిద్ర మెలకువలు మనిషికి నిత్యము ప్రత్యక్ష అనుభవము.
క్షణక్షణము కాలము గడచిపోతున్నది. క్షణమును సెకండుగా చెప్పుచున్నాము. మనిషి తన జీవితమును
సాగించుకొలదీ కాలము గడచి పోవుచున్నది. ప్రతి సెకండు గడచిపోవుకొలది మనిషి మరణానికి దగ్గరవుతున్నాడని
అర్థమగుచున్నది. మనిషి ఎదిగేకొద్దీ, దినములు గడచి పోవుచున్నవి, మరణము సమీపిస్తున్నది. కాలమును సెకండ్లలో
కొలిస్తే అరవై (60) సెకండ్లు ఒక నిమిషము. అలాగే అరవై (60) నిమిషములు ఒక గంట, పన్నెండు (12) గంటలు
ఒక పగలుగ ఉన్నది. వీటినే సెకండ్లలో చెప్పితే...
పట్టిక పేజీ 40 లో చూడండి .
కాలములో పెద్దది సంవత్సరము, అలాగే చిన్నది క్షణము (సెకండు). దేవుడు పెద్దవాడు కాబట్టి 108 కోట్ల
సంవత్సరములను ఆయనకు ఒక పగలుగా చెప్పాము. మనిషి చిన్నవాడు కావున 108 కోట్ల సెకండ్లను ఒక కర్మ
పగలుగా చెప్పుచున్నాము. దేవునికి మొదలులేదు, తుదయులేదు. కావున ఆయనకు ఆయుష్షు అనునదే లేదు. 108
కోట్ల సంవత్సరములు ఒక పగలుగా లెక్కించబడుచున్నది, అయితే ఇన్ని దినములకు ఆయుష్షు అయిపోవునని చెప్పలేదు.
అలాగే మనిషికి 69 సంవత్సరముల, 5 నెలలా, 10 రోజులు (108 కోట్ల సెకండ్లు) ఒక కర్మపగలుగా చెప్పబడుచున్నది.
అంతేగానీ జీవుని యొక్క ఆయుష్షు ఇంత అని ఎవరూ చెప్పలేరు. దేవునికి కర్మలేదు, కావున 108 కోట్ల సంవత్సరములు
ఆయనకు ఒక పగలుకాగా, మనిషికి కర్మవున్నది, కావున 108 కోట్ల సెకండ్లకు జీవునకు ఒక కర్మ పగలుగా
చెప్పబడుచున్నది. దేవునికి ఆయుషూలేదు, అంతమూలేదు. అలాగే జీవునికి ఆయుష్షులేదు, కానీ అంతమున్నది.
జీవునియొక్క అంతము అతని కర్మనుబట్టి ఉండును. కర్మ అయిపోతే జీవుడు అంతమైపోవును. అందువలన జీవున్ని
క్షరుడు అని భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున చెప్పారు. కర్మ అయిపోనంతవరకు జీవుడు నశించక, జీవితమును
సాగిస్తూనే ఉండును. జీవుడు ధరించిన శరీరము నశించినా అది శరీరముయొక్క నాశనమేగానీ, జీవుని నాశనముకాదు.
అతిచిన్న కాలమైన క్షణము (సెకండు) నుండి జీవున్ని లెక్కించవచ్చును. అలాగే అతిపెద్ద కాలమైన సంవత్సరము
నుండి దేవున్ని లెక్కించవచ్చును. అందువలన కోట్ల సంవత్సరములు దేవుని పగలుగా, కోట్ల సెకండ్లు జీవుని కర్మపగలుగా
లెక్కించుచున్నాము. ఇప్పుడు కొందరు కర్మపగలంటే ఏమిటి అని ప్రశ్న అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఇలా కలదు. జీవుడు నిత్యము కర్మను అనుభవిస్తూ, కర్మను సంపాదించుకొనుచున్నాడు. అనుభవించే కర్మ ప్రారబ్ధము
అయితే, సంపాదించబడే కర్మను ఆగామికర్మ అంటాము. సంపాదించబడే క్రొత్త కర్మ కాకుండా, అనుభవిస్తున్న
ప్రారబ్ధము కాకుండా, మిగులు నిలువయున్న కర్మను సంచిత కర్మ అంటాము. క్రొత్తగా సంపాదించబడే ఆగామికర్మ
ఒకమారు సంచితముగా మారిపోవును. సంచిత కర్మనుండి జన్మ సమయములో ప్రారబ్ధకర్మ కేటాయించబడుచుండును.
ఇది ఆగామి, సంచిత, ప్రారబ్ద కర్మల సమాచారము. ముఖ్యముగా ఇక్కడ గమనించవలసిన విషయమే మనగా!
జీవుడు సంపాదించుకొను ఆగామికర్మ జీవుని లెక్కలో 108 కోట్ల సెకండ్లకు (69 సంవత్సరములు,5 నెలల, 10 దినముల)కు
ఒకమారు సంచిత కర్మలోనికి చేరిపోయి సంచితకర్మగా మారిపోవుచున్నది. ఒకమారు ఆగామి కర్మ సంచితకర్మలో
కలిసిపోతే, అప్పటినుండి క్రొత్తగా సంపాదించబడు అగామికర్మ తిరిగి 108 కోట్ల సెకండ్లు జరుగు వరకు ఆగామిగానే
ఉంటూ, 108 కోట్ల సెకండ్లు జరిగినప్పుడు కర్మపగలుగా పేరుపెట్టబడిన ఆ సమయములో సంచితకర్మగా మారిపోవును.
ఆగామికర్మ సంచితకర్మగా మారు సమయమును “కర్మపగలు” అని అంటున్నాము. ప్రతి జీవునికి కర్మ పగలు 69
సంవత్సరముల 5 నెలల 10 రోజులకు ఒకమారు వచ్చును.
దేవుడు పురుష చిహ్నముకాగా, ప్రకృతి స్త్రీ చిహ్నముగా ఉన్నది. అలాగే జీవుడు, స్త్రీపురుష సమ్మేళనముతో
పుట్టినవాడై నపుంసకుని చిహ్నముగా ఉన్నాడని చెప్పుచున్నాము. ఆ విధానమే బయట ప్రపంచములో ప్రత్యక్షముగా
కనిపించునట్లు పురుషజన్మ శరీరములు ఉన్నాయి, స్త్రీ జన్మ శరీరములు ఉన్నాయి, నపుంసక జన్మ శరీరములు
ఉన్నాయి. అదే విధముగా దేవునికి పగలు రాత్రి ఉందని చెప్పినట్లు, మనిషికి కూడా రాత్రి పగలు ప్రత్యక్ష ప్రమాణముగా
ఉండునట్లు ఏర్పాటు చేయబడినది. దేవునికి లేనిది జీవునకు ఉన్నది కర్మయే. కర్మయే అన్నిటికి కారణమైనది.
ఆగామికర్మ సంచితముగా మారి, సంచితమునుండి ప్రారబ్ధము వస్తున్నది. సంచితము ప్రారబ్ధముగా శరీరము మారునప్పుడు
వస్తుండగా, ఆగామికము 69 సం॥ 5 నెలల, 10 పగలులకొకమారు సంచితముగా మారుచున్నది. ఆగామికర్మ
సంచితకర్మగా మారు కాలమును కర్మపగలు అంటున్నాము. దేవునికి సహస్రయుగములు ఒక పగలు, అట్లే
సహస్రయుగములు ఒక రాత్రి అని భగవద్గీతలో చెప్పబడినది. దేవుని పగలులో ప్రపంచమున్నదనీ, దేవుని రాత్రి
సమయములో ప్రపంచములేదనీ చెప్పబడినది. దేవుని పగలు రాత్రిని గుర్తించుటకు మన తలలోని నాలుగుచక్రముల
సముదాయములో పైన బ్రహ్మచక్రమనునది అమర్చబడియున్నదని చెప్పుకొన్నాము. బ్రహ్మచక్రము రెండు భాగములుగా
విభజింపబడి ఉన్నదని కూడా చిత్రపటములో చూచాము. ఇంతకు ముందు ఈ బ్రహ్మచక్రమునూ, దాని గమనమునూ
గురించి చెప్పుకొనినా, దానిలో అర్థము చేసుకోవలసిన జ్ఞానము ఎంతో ఉన్నదనీ, తెలుసుకొన్నదంతా సత్యమే అయినా
మనకు అవగాహనలోనికి వచ్చినది కొంత శాతమేనని చెప్పవచ్చును. ఇప్పుడు కలియుగమును గురించి చెప్పుకొనుచున్నాము
కావున ప్రళయమును ప్రభవమును గురించి చెప్పుకోవడమేకాక, ఇంతవరకు అర్థముకాని దానినంతటిని వివరించు
కొందాము.
ఈ విశ్వమంతయు ప్రళయకాలములో లేకుండా పోతుందనీ, విశ్వములేనప్పుడు పంచభూతములులేవనీ, ఆ
స్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదనీ, ఏమీలేని స్థితి ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరనీ, అటువంటి అన్నీ లేని
స్థితిలో కూడా దైవము ఉన్నాడనీ, విశ్వములేని స్థితినే దేవుని రాత్రిగా చెప్పబడుచున్నదనీ, ఆ విధముగా వేయియుగములు
గడచిపోగా తిరిగి వేయియుగములు విశ్వము ప్రభవమును పొంది జీవించియుండుననీ, ఆ కాలమునే దేవునియొక్క
పగలనీ చెప్పుకొన్నాము. ఇదంతా శాస్త్రబద్దముగా నూటికి నూరుశాతము సత్యమే. అయితే కొందరు ఇక్కడ ఒక
ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! "వేయియుగములు పగలుగా, వేయియుగములు రాత్రిగా, రెండువేలయుగములు
దేవునికి ఒక దినమైనప్పుడు, దేవుడు ఒక లెక్కకు కట్టుబడి ఉన్నాడనీ, ఆయన ఆయుష్షు ఎంతో ఎవరికీ తెలియకున్నా
ఆయన జీవితములో రెండువేలయుగములకు ఒక దినము పూర్తిగా గడచి పోయినట్లే కదా!” అని ప్రశ్నించవచ్చును. ఈ
ప్రశ్న చాలామంది తలలో పుట్టునదీ మరియు ఇది హేతుబద్ధమైన ప్రశ్న. అందువలన దీని జవాబును జాగ్రత్తగా
గమనించవలసిన అవసరమున్నది.
దేవునికి ఒక దినము గడచినా అది ఆయన ఆయుష్షులో కొంత గడచిపోయినట్లే అగును. దేవుని ఆయుస్సు
ఎంత అని తెలియకున్నా, ఆయనకు ఎంతో కొంత ఆయుస్సు ఉందని చెప్పవచ్చును. ఈ ఆధారముతో దేవునికి కూడా
ఆయువు ఉన్నదని చెప్పుట హేతుబద్ధమే అగును. అయితే మొదటికే మోసమన్నట్లు దేవుడు దేనికీ బద్ధుడు కాడు.
అందువలన ఆయనను అబద్ధుడు అని అన్నారు. దేవున్ని శాస్త్రబద్దముగా నిరూపించలేము. కానీ ఆయన జ్ఞానమూ,
ధర్మములు అన్నియూ శాస్త్రబద్దమే అగును. ఆయన ధర్మము శాస్త్రబద్ధమైనపుడు ఆయన శాస్త్రబద్ధుడైనట్లే కదా! అని
అనుకొంటే అది పొరపాటే అగును. దేవుడు కొంతవరకే ధర్మబద్ధుడు, తర్వాత ఆయన ధర్మాతీతుడు. దేవుని
ధర్మములను దేవుడే తెలియజేశాడు. ఆయన తెలియ జేసిన ధర్మముల ప్రకారము ఆయనయొక్క గొప్పతనము మాత్రము
తెలియును, కానీ ఆయన తెలియడు. అందువలన ఇంతవరకు భూమిమీద పుట్టిన ఏ మనిషిగానీ, ఎంతటివాడైనా గానీ
దేవున్ని ఎవరూ చూడలేదు. ఎవడూ చూడనప్పుడు దేవుడు అనేవాడు లేనేలేడు అని చెప్పవచ్చును కదా! అంటే అట్లు
చెప్పుటకు కూడా వీలులేదు. దేవుడు ఉన్నాడనుటకు ఎంతో శాస్త్రబద్ధత ఉన్నది. దేవుని ధర్మములు అన్నియు దేవుడున్నాడని
నిరూపించు చున్నవి. కానీ దేవున్ని చూపలేవు. అందువలన దేవున్ని గురించి మేము ఒక వాక్యము చెప్పాము “దేవుడు
నిజముగా లేడు, దేవుడు అబద్ధముగా ఉన్నాడు" అని మేము చెప్పిన మాటలో నిజముగా, అబద్ధముగా అను పదములను
తీసివేస్తే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అనుమాటలు మాత్రము మిగులును. ఈ మాటలు కూడ వాస్తవమే. దేవుడు
లేడు అనే వారికీ, దేవుడు ఉన్నాడు అనే వారికీ, ఇరువురికీ ఈ మాటలు సరిపోతాయి. దేవుడు ఉన్నాడా, లేడా? అను
రెండు మాటలలో ఏది సత్యము అంటే విశేషముగా చూడవలసినవి నిజ, అబద్ద అను పదములు. ఈ పదములలోనే
విశేషతయున్నది. జ అనగా పుట్టుట అని అర్థము. ని అనగా లేదు అని అర్థము. నిజ అనగా పుట్టనివాడని అర్థము.
ఇదే మాటనే భగవద్గీతలో జ్ఞానయోగమునందు ఆరవ శ్లోకమున “అజోపి” పుట్టుకలేనివాడను అని చెప్పడము జరిగినది.
అట్లే అబద్ద అను పదములో “బద్ద” అనగా కట్టబడి యున్నది అని అర్థము. “అబద్ద” అనగా దేనికి కట్టబడి లేదు
అనియు లేక దేని చేత బంధింపబడి లేదనియూ అర్ధము. దీనినిబట్టి దేవుడు పుట్టలేదు. దేవుడు దేనికీ కట్టబడిలేడు అని
చెప్పవచ్చును.
దేవుడు పుట్టనపుడు ఆయనకు ఆయుష్షుంది అని చెప్పడము సత్యము కాదుకదా! అట్లే “నవ్యయాత్మ” అని
శ్లోకములో చెప్పినట్లు ఆయనకు మరణము కూడా లేదు. అందువలన చావుపుట్టుకలు లేని దేవునికి పగలు రాత్రిని
ఆయుష్షుగా నిర్ణయించుటకు అవకాశములేదు. అందువలన పగలు రాత్రి జీవున్ని గురించి చెప్పినవేననీ, అవి దేవునికి
వర్తించవనీ తెలియవలెను. స్థూలముగా జీవునికి వర్తించు విషయములనే సూక్ష్మముగా దేవుని విధానములో చెప్పబడి
ఉన్నవి. ఉదాహరణకు ప్రకృతి పరమాత్మలు భార్యా భర్తలుగా ఉన్నారని చెప్పుచున్నాము. అయితే ఆ విషయము
సూక్ష్మముగా జ్ఞాన సమాచారముగా ఉన్నది. అదే విషయమే స్థూలముగా ఒక పురుషుడు, ఒక స్త్రీ భార్యాభర్తలుగా
ఉండడముగా కనిపిస్తుంది. ప్రకృతి పురుషులకు జీవులు సంతతిగా ఉన్నారని చెప్పడము సూక్ష్మముగా ఉన్న జ్ఞాన
సమాచారము కాగా, అదే సమాచారము ప్రత్యక్షముగా స్థూలముగా భూమిమీద అందరికి తెలియునట్లు కలదు. ప్రకృతి
ఒక్కటే, దేవుడు ఒక్కడే, వారికి పుట్టిన జీవులు అనేకము (ఒక్కటి కాదు.) అదే విధముగా తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే.
జంటకు పుట్టిన బిడ్డలు ఎక్కువమంది అని బయటప్రపంచములో ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. ఈ విధముగా కొన్ని
దేవున్ని ఉద్దేశించి చెప్పిన జ్ఞాన విషయములు అందరికీ అర్థమగునట్లు ప్రత్యక్షముగా ఉన్నాయనీ, వాటిని ఎవరూ
కాదనలేరనీ చెప్పవచ్చును. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. వేయియుగములు దేవునికి ఒక పగలుగా, వేయి
యుగములు ఒక రాత్రిగా భగవంతుని (దేవుని) చేతనే చెప్పబడినది, అట్లే దేవుని పగలు సమయములో ప్రపంచమున్నదనీ,
ప్రపంచము సృష్టింపబడుచున్నదనీ, దేవుని రాత్రి సమయములో ప్రపంచములేదనీ, అంతా ప్రళయము చెందుచున్నదనీ,
భగవంతుని చేతనే చెప్పబడినది. ఇక్కడ ముఖ్యముగా అందరూ గమనించ వలసిన విషయమేమనగా!
దేవుని పగలు, రాత్రి అని చెప్పబడినట్లే, జీవునికి కూడా పగలు రాత్రి ప్రత్యక్షముగా ఉన్నవి. దేవుని పగటి
కాలములో ప్రపంచమున్నట్లే, జీవుని పగటి కాలములో ప్రపంచమున్నది. దేవుని రాత్రి కాలములో ప్రపంచములేదని
చెప్పినట్లు జీవునికి కూడా రాత్రి సమయములో (నిద్రలో) ప్రపంచము లేదు. జీవునికి పగలు సమయమైన మెలకువలో
జీవుడు ఉన్నాడు, అతనితో పాటు ప్రపంచమూ ఉన్నది. అయితే జీవుని రాత్రి సమయమైన నిద్రలో జీవునికి తెలిసి
జీవుడూ లేడు, జీవుడు తెలుసుకొను ప్రపంచమూ లేదు. జీవుని రాత్రి సమయములో (నిద్రలో) జీవుడూ, ప్రపంచమూ,
అన్నీ ఉండినా వానికి మాత్రము తెలియకుండా పోవుచున్నవి. ప్రపంచమూ, జీవుడూ, ఆత్మ అన్నీ ఉండినా జీవునికి
తెలిసినట్లు జీవుడు గానీ, ప్రపంచముగానీ తెలియకుండా పోవుచున్నవి. అందువలన ఆ సమయమును ఆ జీవునికి
ఉన్నవన్నీ లేకుండా పోయినవనీ, అన్నీ ప్రళయము చెంది పోయినవని చెప్పవచ్చును. ప్రళయము అనగా పుట్టినవన్నీ
లేకుండా పోవడము అని అర్థమగుట వలన జీవుని రాత్రి సమయమును ప్రళయ మనియే చెప్పవచ్చును. ప్రళయము
అంటే భూమి ముక్కలైపోతుందనీ, అగ్ని ప్రేలిపోతుందనీ, సముద్రము భూమిమీద పాయలుగా, అలలుగా వచ్చి
(సునామీలుగావచ్చి) ప్రజలను చంపుతుందనీ, సుడిగాలి అన్నిటినీ నాశనము చేస్తుందనీ అనుకోకూడదు. ఆ విధముగా
జరుగడము ప్రళయము కాదు. మనిషికి పగలు కాలములో (మనిషికి మెలుకువ కాలములో) జీవునికి (మనిషికి)
తెలియునట్లు జరుగు ప్రకృతి బీభత్సములు ప్రళయములు కావు. మనిషికి ప్రకృతి అంతయూ లేకుండాపోవడమూ,
అట్లే తానుకూడా లేకుండా పోవడము ప్రళయమగును. తనకు (జీవునికి) తెలియబడు ప్రకృతి అంతయూ లేకుండా
పోవడమును ప్రళయము అంటాము. జీవునికి తెలియ కుండా పోయినదంతా తిరిగి తెలియడమును ప్రభవము
అంటాము. అందరూ ప్రళయములుగా ఊహించుకొను ప్రకృతి బీభత్సరములన్నియు మనిషి జీవించి ఉన్న సమయములోనే
జరుగుచున్నవి. ప్రకృతి ఉదృతము వలన కలిగెడి భూకంపములూ, సునామీలూ, అగ్ని ప్రేలి భూమిమీదున్న జీవరాసులను
కాల్చడమూ, సుడిగాలుల బీభత్సము అన్నీ మనిషిని బాధించుటకేగానీ అవి లేకుండా పోవడానికి కాదు. ప్రకృతి
మనిషి యొక్క దృష్ఠిలో లేకుండా పోవుటను ప్రళయమనీ, ప్రకృతి మనిషి యొక్క దృష్ఠిలోనికి రావడమును ప్రభవమనీ
చెప్పవచ్చును. ఇక్కడ బాగా జ్ఞాపకము పెట్టుకోవలసిన విషయమేమనగా! మనిషి (జీవుడు) తనకు తాను తెలియకుండా
పోయినపుడు, తనకు తెలిసినవన్నీ లేకుండా పోవడమును ప్రళయము అని అంటున్నాము. మనిషి తనకు తాను
తెలియబడినపుడు, అంతవరకు తనకు తెలియకుండా పోయినవన్నీ తిరిగి తెలియబడడమును ప్రభవమనీ అంటున్నాము.
ఇక్కడ ప్రళయ విషయములో మనుషులందరూ చాలాపొరపాటు పడిపోయారు. అలాగే ప్రభవము అను
విషయములో కూడా పొరబడి పోయారు. సత్యమును తెలుసుకొంటే అన్ని సమయములలోనూ పగలుగానీ, రాత్రిగానీ
ఏదో ఒకటి జరుగుచున్నది. పగలు సమయములో మెలుకువ, రాత్రి సమయములో నిద్ర అనునవి నిర్ణయింపబడి
ఉన్నవి. మెలుకువ నిద్ర రెండు మనస్సునుబట్టియుండును. మనస్సు అణిగిపోతే అది మనిషికి రాత్రిగా, మనస్సు
అణిగిపోకుండా పనిచేయునపుడు ఆ సమయమును పగలుగా లెక్కించి చెప్పవచ్చును. శరీరములోని మనస్సు బయటి
ప్రపంచ విషయములను గ్రహించగలిగినపుడు, బయటవున్న ప్రకృతిలోని పంచ భూతములు జీవునికి తెలియబడుచున్నవి.
శరీరములోని జీవుడు తన మనస్సు వలన బయటవున్న పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని
గ్రహించగలుగుచున్నాడు. శరీరము యొక్క బయటవున్న పంచభూతములు శరీరములోపలనున్న జీవుడు వేరువేరుగా
ఉన్నాయి. శరీరము లోపలనున్న జీవునికి బయటనున్న ప్రపంచము పగలుకాలములో తెలియబడుచున్నది, రాత్రి
కాలములో తెలియబడడము లేదని ఎవరైనా చెప్పవచ్చును. శరీరములోని జీవునికి పగలు కాలములో ప్రకృతి ఎలా
ఉన్నదో, అలాగే రాత్రి కాలములో ప్రకృతి జీవునికి తెలియనప్పటికీ, ప్రకృతి మాత్రము పగలు కాలములో ఎట్లున్నదో
రాత్రికాలములో కూడ అట్లే ఉన్నది. పగలు రాత్రి అనునవి శరీరములో జీవునికి మాత్రమేగానీ, బయట ప్రపంచమునకు
కాదు. ప్రకృతికి రాత్రి పగలు అనునవి వర్తించవు. రాత్రి పగలు జీవునికి మాత్రము వర్తించును. పగలులోనున్న జ్ఞప్తి
రాత్రిపూట శరీరములో లేనిదానివలన మనిషి తనను తాను మరచిపోవుచున్నాడు. నిద్రలో తనకు ఏమాత్రము ఎరుక
(జ్ఞప్తి) లేనిదానివలన జీవునకు తాను ఉన్నట్లుగానీ, బయట ప్రపంచమున్నట్లుగానీ ఏమాత్రము తెలియదు. అప్పుడు
మెలకువలో ఉన్నవన్నీ లేకుండా పోయినట్లే, కావున అలా ప్రపంచము జీవాత్మ దృష్ఠిలో లేకుండా పోవడమును
ప్రళయము అంటాము. ఎప్పుడైతే ఉన్నవన్నీ తిరిగి తెలియబడుచున్నవో, ఆ సమయమును ప్రభవము అంటున్నాము.
ప్రళయములోగానీ, ప్రభవములోగానీ ప్రపంచము ఎలా ఉన్నది అలాగే ఉన్నది. అంతేగానీ ప్రభవములోనున్న ప్రకృతి
ప్రళయములో స్థూలముగా నాశనము చెందుననీ, నాశనమైపోయిన ప్రకృతి ప్రభవములో తిరిగి దేవునిచేత తయారు
చేయబడునని అనుకోకూడదు.
జీవునికి మెలకువ సమయము పగలు, జీవునికి నిద్ర సమయము రాత్రిగా చెప్పుకొన్నప్పుడు, జీవుని పగలు
సమయములో బయటి ప్రపంచ మంతా వ్యక్తముగా ఉన్నది. అలాగే రాత్రి సమయములో పగలు వ్యక్తముగానున్న
ప్రపంచమంతా అవ్యక్తముగా మారిపోవుచున్నది. వ్యక్తమును (తెలియబడడమును) ప్రభవమనీ, అవ్యక్తమును (తెలియకుండా
పోవడమును) ప్రళయమనీ అంటున్నాము. ప్రళయ సమయములో జీవునికి ప్రపంచము తెలియకుండాపోవడము
తప్ప, స్థూలముగా ఎటువంటి నాశనము కాలేదు. మనము చూస్తున్నట్లే సముద్రములో సునామీలు, భూమిలో కంపనములు,
గాలిలో సుడులు, అగ్నిలో ప్రేలుళ్ళు ఎన్ని సంభవించినా నీరుగానీ, భూమి గానీ, గాలిగానీ, అగ్నిగానీ, ఏదీ నాశనమైపోలేదు.
ప్రకృతి యొక్క పంచ భూతముల బీభత్సములు ఎన్ని జరిగినా వాటిచేత మనిషి బాధింపబడుచున్నాడుగానీ, అవి
మాత్రము ఏ ఒక్కటీ నాశనముకాలేదని జ్ఞాపకముంచుకోవలెను. ప్రకృతికి నాశనమనునది లేదు. అందువలన
వేయియుగములు గడచిన తర్వాత లేక కలియుగము 250 మార్లు గడచిన తర్వాత 250వ మారు చివరిగా వచ్చు
కలియుగముతోనే ప్రళయము వస్తుందనీ అనుకోవడము పొరపాటగును, అజ్ఞానమగును. ప్రకృతి స్థూలముగా నాశన
మవడము అసంభవము. ప్రకృతి ప్రళయములో అవ్యక్తమూ, ప్రభవములో వ్యక్తము అగుట మాత్రము సంభవము.
ఇదే విషయమును భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమున 17,18,19 శ్లోకములందు ఇలా చెప్పబడినది.
17) శ్లోకము
సహస్రయుగపర్యన్త మహర్య దృహ్మణో విదుః
రాత్రిం యుగ సహస్రాన్తాం తేహెూ రాత్రవిదో జనాః॥
18) శ్లోకము
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్యహరాగమే,।
రాత్రాగమే ప్రలీయన్తో తత్రైవా వ్యక్త సంజ్ఞకే II
19) శ్లోకము
భూతగ్రామస్స ఏవాయుం భూత్వాభూత్వా ప్రలీయతే,
రాత్రాగమే వశః పార్థ! ప్రభవ త్యహరాగమే.
17వ శ్లోక భావము :- వేయియుగములు ఒక పగలుగా, అలాగే వేయి యుగములు ఒక రాత్రిగా పెద్ద అయిన
దేవునికి లెక్కించబడుచున్నవని ఏ జనులైతే తెలియగలరో అట్టివారు తన రాత్రిని పగలును తెలియగలరు.
18వ శ్లోక భావము :- పగలు రాత్రిని గురించి తెలిసినవారికి పగలు కాలములో సమస్త ప్రపంచము
వ్యక్తమగుచున్నట్లు తెలియుచున్నది. అట్లే రాత్రి కాలములో వ్యక్తమగుచున్న ప్రపంచమంతయు అవ్యక్తమగు చున్నట్లు
తెలియుచున్నది. ప్రపంచము యొక్క వ్యక్తావ్యక్తములు జీవుని యొక్క రాత్రి పగలునుబట్టి కలుగుచున్నవి.
19వ శ్లోక భావము :- సకల జీవరాసులు పగలు జీవించుచున్నవి, రాత్రి అయిన వెంటనే ప్రళయమును
పొందుచున్నవి. తిరిగి పగలైన వెంటనే ప్రభవమును పొందుచున్నవి. ఈ విధముగా సకల జీవరాసులు ప్రళయ
ప్రభవములను పొందుచున్నవి. ఇట్లు రాత్రి పగల్లు ప్రళయమునూ, ప్రభవమునూ కర్మవశమున సకల జీవులు
పొందుచున్నవి.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగుటకుల అవకాశము గలదు. అదేమనగా! మనిషి పగలు మెలకువలో,
రాత్రి నిద్రలో ఉండడము సహజమే అయినా, కొందరు మాత్రము రాత్రి సమయములో ఎక్కువసేపు మేల్కొని పనిని
చేయుచుందురు. అప్పుడు వారు మేల్కొని ఉన్నారు. కావున ఆ సమయమును రాత్రిక్రిందికి లెక్కించుకోవలెనా? లేక
పగలు క్రిందికి జమ వేసుకోవలెనా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దేవుని రాత్రి పగలు
యొక్క విధానమంతా ఎవడు తెలియగలడో వానికి వాని యొక్క రాత్రిపగలు వివరమంతా తెలియునని నాశనముకాని
దేవుని యోగమను ఈ అధ్యాయములో 17వ శ్లోకమందు చెప్పబడియున్నది. తర్వాత 18వ శ్లోకములో చెప్పినట్లు
పగలు ప్రపంచము వ్యక్తమగుచున్నది, రాత్రి ప్రపంచము అవ్యక్తమగుచున్నది. వ్యక్తము అనగా మేల్కొన్నపుడు తెలియు
చున్నది. అవ్యక్తమనగా నిద్రపోవునపుడు తెలియనిది అని అర్థము. ఈ సూత్రము ప్రకారము మనిషి ఎంతసేపు
మేల్కొన్నాడో, దానిని ప్రపంచము వ్యక్తమగు పగలుగా వానికి లెక్కించవలెను. అలాగే ఒక మనిషి ఎంతకాలము
నిద్రపోయాడో, ఆ సమయములో ప్రపంచము అవ్యక్తముగా ఉండును. కనుక నిద్రపోయిన సమయమునంతటిని
రాత్రిగానే లెక్కించవలెను. ఒక మనిషి బయట కనిపించు రాత్రిలో మేల్కొనినా అది వానిలెక్కలో పగలుగా లెక్కించబడును.
అట్లే ఒక మనిషి బయట అందరికి తెలియు పగలులో నిద్ర పోయినా అది వానిలెక్కలో రాత్రిగానే లెక్కించబడును.
దేవుని పగలు రాత్రిని ఆధారము చేసుకొని మనిషియొక్క పగలు రాత్రిని గుర్తించవచ్చునని భగవంతుడు అక్షరపర
బ్రహ్మయోగములో 17వ శ్లోకమందే తెలిపాడు.
ఇప్పుడు కొందరు మరియొక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మన తలలో పాలభాగమునకు సమానముగా
తలమధ్యలోనున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములందు పైనగల బ్రహ్మచక్రము రెండు భాగములుగా ఉన్నదనీ, బ్రహ్మచక్రము
యొక్క ఒక భాగము తిరుగుటకు వేయియుగముల కాలము పట్టుననీ, రెండు భాగములు కలిసి ఒక చుట్టు తిరుగుటకు
రెండు వేలయుగముల కాలము పట్టుననీ, ఒక భాగము యొక్క సహస్రయుగముల కాలము దేవునికి ఒక పగలనీ,
మరియొక భాగముయొక్క వేయియుగముల కాలము దేవునికి ఒక రాత్రని మీరే చెప్పారు కదా! అంతేకాక దేవుని
యొక్క పగలు కాలమైన వేయియుగములు ప్రపంచమున్నదనీ, అలాగే దేవుని యొక్క రాత్రి కాలమైన వేయియుగములు
ప్రపంచములేదని చెప్పారు కదా! అలాంటపుడు దేవుని రాత్రి అయిన బ్రహ్మచక్రములోని సగభాగము తిరుగునపుడు
వేయియుగములు ప్రపంచము లేదనియేగా అర్థము. మీరు అప్పుడు కూడా ప్రపంచము నాశనముకాదనీ, జీవులు ఎలా
ఉండువారు అలాగే ఉందురనీ, మనుషులు లేకుండా పోయే ప్రసక్తే లేదని చెప్పుచున్నారు. మీరు చెప్పుమాట
బ్రహ్మచక్ర గమనమునకు సరిపోదు. బ్రహ్మచక్రములో సగభాగమునందు ప్రపంచములేదు అని దేవుడే చెప్పినపుడు
సగ భాగములో కూడా ప్రపంచమున్నదని మీరు చెప్పడము తప్పుకాదా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఇలా కలదు.
బ్రహ్మచక్రము మనిషి తలలో ఉన్నది. బ్రహ్మచక్రములోనే దేవుని పగలు రాత్రి భాగములు రెండూ కలవు.
మనిషికి ఎప్పుడైతే జ్ఞప్తి (మెలకువ) కలదో ఆ కాలమును పగలనియూ, అలాగే మనిషికి ఎప్పుడైతే జ్ఞప్తి లేకుండా పోయి
మరుపు అయిన నిద్ర వస్తుందో ఆ కాలమును రాత్రి అనియూ చెప్పుకొన్నాము. బ్రహ్మచక్రములోని పగలు
వేయియుగములూ, రాత్రి వేయి యుగములు మానవుని కొరకు లెక్కించబడినవేనని చెప్పుకొన్నాము. దేవుని వేయియుగముల
పగలు కాలమును మనిషికి ఒక కర్మపగలుగా గుర్తించి కూడా చెప్పాము. దేవుని నమునాలోనే జీవుడు మనగలగుచున్నాడు.
దాని ప్రకారము జీవునికి (మనిషికి) కూడా పగలు రాత్రి ఏర్పడుచున్నది. దేవుని పగలు ప్రపంచమున్నట్లు, జీవుని
పగలు కాలములో కూడా ప్రపంచమున్నదనీ చెప్పుకొన్నాము. అయితే ఇక్కడ ముఖ్యముగ తెలియవలసిన సమాచారము
ఒకటి కలదు. అదేమనగా! ఒక మనిషికి పగలు కాలము జరుగుచున్నప్పుడు ఆ మనిషి యొక్క తలలోని బ్రహ్మచక్రమునందు
గల సగభాగమైన పగలు మాత్రమే తిరుగుచుండును. అదే ప్రకారము ఒక మనిషికి రాత్రి కాలము జరుగుచున్నప్పుడు
ఆ మనిషి యొక్క బ్రహ్మచక్రములోని రాత్రి సగభాగములో చలనము వచ్చి తిరుగును. దేవుడు నిర్ణయించిన దానిప్రకారమే
శరీరములో జరుగుచున్నది. అందువలన మనిషియొక్క పగలు సమయములో బ్రహ్మచక్రములోని ఒక భాగములో
చలనము వచ్చి తిరుగును. బ్రహ్మచక్రము లోని పగలు భాగము తిరుగుచున్నప్పుడు, రాత్రి భాగము చలనములేకుండా
నిలిచియుండును. అలాగే రాత్రిభాగము తిరుగుచున్నప్పుడు, పగలు భాగము ఏమాత్రము కదలకుండా వుండిపోవును.
ఇప్పుడు కొందరిలో మరియొక ప్రశ్న పుట్టవచ్చును. అదేమనగా! బ్రహ్మచక్రములో రెండు భాగములున్నాయని
మీరే చెప్పారు కదా! అందులో ఒక భాగము కదిలితే చక్రమంతా కదిలి రెండవభాగము కూడా కదులును కదా!
అటువంటపుడు ఒక భాగము కదిలి తిరుగునప్పుడు రెండవ భాగము కదలకుండా ఉండిపోవునని చెప్పడము తప్పుకదా?
అని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు మా జవాబు ఇలా కలదు. మామాట పూర్తిగా అర్థము కానప్పుడు ఎవరికైనా తప్పుగా
కనిపించడములో విచిత్రమేమీలేదు. ఇక్కడ బ్రహ్మచక్రమును గురించి పూర్తిగా తెలుసుకొంటే మా మాట తప్పుగా
కనిపించదు. మేము చెప్పినది సత్యమేనని తెలియును. బ్రహ్మచక్రము రెండు భాగములుగా ఉండుట నిజమే, అయినా
రెండు భాగములు ఒకదానితో ఒకటి అను సంధానము చేయబడి లేవు. ఆ రెండు భాగములు విడివిడిగా ఉన్నవి.
బ్రహ్మచక్రములోని పగలు, రాత్రి భాగములు వేరువేరుగా ఉండుట వలన మనిషి జీవితములో ఖచ్చితముగా సగము
పగలు, సగము రాత్రి అనునది లేకుండా పోయినది. ఒకడు పగలును ఎక్కువ అనుభవించితే, రాత్రిని తక్కువ
అనుభవించుచున్నాడు. అలాగే మరియొకడు రాత్రిని ఎక్కువ అనుభవించితే, పగలును తక్కువ అనుభవించుచున్నాడు.
ఎవని జీవితములో కూడా రాత్రి పగలు సమానముగా లేవు. దానికి కారణము, బ్రహ్మచక్రములోని పగలు రాత్రి
భాగములు రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమై లేకుండుటే కారణమని చెప్పవచ్చును. బ్రహ్మచక్రములోని రెండు
భాగములు వేరువేరుగా ఎలా ఉన్నవో క్రింది చిత్రములలో (చిత్రం పేజీ 47 లో చూడండి ) చూడవచ్చును.
చిత్రం పేజీ 47 లో చూడండి.
ఈ చక్రములో పగలు కాలము రాత్రికాలమును కూడా ఆక్రమించినట్లున్నది. కావున మనిషి ఎక్కువ కాలము
మేల్కొని తక్కువ కాలము నిద్రించువాని చక్రములోని నమూనా విధానమిట్లుండునని తెలియవచ్చును.
చిత్రం పేజీ 47 లో చూడండి.
ఈ చిత్రములో రాత్రి కాలము పగలు కాలమును ఆక్రమించుకొన్నది. కావున మనిషి ఎక్కువకాలము నిద్రపోయి
తక్కువ కాలము మేల్కొను వాని చక్రములోని నమూనా విధానమిట్లుండునని తెలియవలెను.
చిత్రం పేజీ 47 లో చూడండి.
బ్రహ్మచక్రము దేవుని విధానములో సగభాగము తిరుగుటకు వేయి యుగముల కాలము పట్టును. అంతపెద్ద
బ్రహ్మచక్రమును జీవుని విధానములోనికి మార్చుకొని మనిషి యొక్క పగలు రాత్రికాలములను లెక్కించి చూడవలెనని
తెలుపుచున్నాము. ఒక సంవత్సర కాలమును ఒక సెకనుగా మార్చుకొంటే ఎంత చిన్నదగునో, అంతచిన్నదిగా
బ్రహ్మచక్రమును మనిషి విధానములో చిత్రించుకొని చూడవలెనని తెలుపుచున్నాము. ఒక సంవత్సరమును ఒక
సెకనుగా మార్చుకొని చూచు నమూనాను మాత్రము పై చిత్రములో చూపించానని తెలియవలెను. మనిషి పగలు
ఎక్కువ జీవించి రాత్రి తక్కువ జీవించిన విధానమును, అట్లే రాత్రి ఎక్కువ కాలమును వినియోగించుకొని పగలు
తక్కువ కాలమును వినియోగించుకొనిన విధానమును పై చిత్రములలో చూపించానని అర్థము చేసుకోవలెను.
మనిషి తన జీవితములో రాత్రి పగళ్ళను ఎక్కువ తక్కువలుగా కర్మనుబట్టి అనుభవించుచుండును. అలా ఒక
జన్మకు కేటాయించబడిన ప్రారబ్ధకర్మను అనుభవించి, ప్రారబ్ధకర్మ అయిపోయిన వెంటనే ఆ జన్మలో మరణించి
అంతవరకున్న శరీరమును వదలివేసి తన సంచితము నుండి క్రొత్త ప్రారబ్ధకర్మను తీసుకొని తిరిగి క్రొత్త శరీరమును
ధరించి జన్మించు చుండును. ఈ విధముగా జీవుడు జన్మలు మారుచుండును. చివరకు సంచితకర్మ అంతయు
అయిపోయి ప్రారబ్దముగా మారుటకు లేనప్పుడు ఆ జీవుడు దేవునియందైక్యమై పోవును. జన్మలనుండి విడుదలయై
కర్మనుండి ముక్తి పొందును. అంతవరకు తెలియని దేవుడు అప్పుడు మాత్రమే తెలియును. అంతవరకు జన్మలెత్తుచున్న
ఎవనికీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎవరూ దేవున్ని చూడలేరు. కర్మనుండి ముక్తి పొందిన జీవుడు దేవునియందైక్య
మైపోవును. అప్పుడు జీవుడు, దేవుడు అను బేధముండదు. అంతవరకు ఏ జీవుడైనా భూమిమీద జన్మలు ధరిస్తూ
కర్మను అనుభవిస్తూ కాలమును గడుపవలసిందే. కర్మలు అయిపోనివాడు జన్మలు ఎత్తుతూ ఎంతకాలము జీవించాలి?
ఈ జన్మలకు అంతులేదా? కొంతకాలమైనా ఈ కాలచక్రము ఆగిపోదా? ప్రళయములో అన్నీ అంతమైపోయి 108 కోట్ల
సంవత్సరముల తర్వాత తిరిగి పుట్టునను మాట అసత్యమా? దేవునికి జీవుల మీద దయా దాక్షిణ్యములుండవా?
ఎంతకాలము మేము జీవించాలి? ఖగోళమునుండి వచ్చు ఆస్ట్రాయిడ్స్ భూమిని గుద్దుకొని, భూమి ధూళిగా మారిపోవుననీ,
భూమిమీద జీవరాసులన్నీ లేకుండా పోవునని చెప్పుచున్న శాస్త్రజ్ఞుల మాట అసత్యమా? ప్రళయ ప్రభవములు అసత్యమా?
అని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు.
మీ ప్రశ్నలకు తర్వాత జవాబులను చెప్పెదను. దానికంటే ముందు కొంత సమాచారమును చెప్పెదను వినండి.
1994 సంవత్సరము ఏప్రిల్ చివరి దినములలో నేను ఢిల్లీనుండి రైలులో ప్రయాణము చేసి వచ్చి సికింద్రాబాద్
స్టేషన్లో దిగి అక్కడే దగ్గరున్న రైల్వే మెజిస్ట్రేట్ గారి ఇంటికి పోవడము జరిగినది. ఆయన నాకు బాగా తెలిసినవాడు,
కనుక నా కారును వారి ఇంటివద్ద ఆపివుండుట వలన నేను వారి ఇంటికి పోవలసి వచ్చినది. ఆ మెజిస్ట్రేట్ గారు
బ్రహ్మకుమారి సమాజములో పాల్గొని జ్ఞానమును తెలుసుకొనెడివాడు. నేను గన్లైసెన్సును తీసుకొన్నానని తెలిసి
ఆయన నాతో ఇలా “గన్లైసెన్సు ఎందుకు అనవసరముగా? 1994 సంవత్సరము చివరికంతా ప్రళయము వచ్చి
ప్రపంచమంతా లేకుండా పోతుందని, మా బ్రహ్మకుమారి సమాజములోని పెద్దలు తెలిపారు. ఇది వారికి దైవమునుండి
వచ్చిన సందేశము. అందువలన ఇక ఆరు లేక ఏడు నెలలలో అంతాపోతుంది. అందరమూ పోయేటప్పుడు గన్లైసెన్సు
ఎందుకు” అని అన్నాడు. ఆయన పెద్దమనిషి అయిన దానివలన, మరియు పెద్ద జ్ఞానసంస్థ అయిన బ్రహ్మకుమారి
సమాజము వారు చెప్పిన దానివలన ఆ మాట సత్యమే అవుతుందేమోనని నేను కూడా కొంత అనుకోవడము జరిగినది.
అదే విషయమునే నేను కూడా నాకు తెలిసిన కొందరికి చెప్పడము జరిగినది. చివరికి ఆ సంవత్సరములో డిశంబరు
నెలకూడా రావడము, పోవడము జరిగినది. తర్వాత 1995 సంవత్సరము ప్రారంభమైనది. దానితో 1994 సంవత్సరము
ప్రళయము వస్తుంది అనుమాట అసత్యమై పోయినది.
ఆ తర్వాత కొంతకాలము గడచిపోయి 1996 సంవత్సరము వచ్చినది. అప్పుడు "కలియుగాంతము 1999”
అను పుస్తకమును చూడడము జరిగినది. ఆ పుస్తకమును తీసి చూస్తే దాని రచయిత వేదవ్యాస్ ఐ.ఎ.యస్. అనివుంది.
ఒక విద్యావేత్త మరియు గొప్పజ్ఞాని అని పేరుగాంచిన వ్యక్తి వ్రాసిన పుసక్తములోని సమాచారము సత్యమే అయి
ఉంటుందనుకొని నేను ఆ పుస్తకమును తీసుకోవడము జరిగినది. తర్వాత ఆ పుస్తకమును చదివితే 1999 సంవత్సరము
తప్పనిసరిగా కలియుగాంతమగునని ఎన్నో ఆధారములు చెప్పబడివున్నది. అవన్నియు చూచిన తర్వాత ఒకప్రక్క అది
అసత్యమని తెలిసినా నేను కూడా తప్పనిసరిగా యుగాంతము అవుతుందేమో నని అనుకొన్నాను. చివరికి 1999
గడచిపోయి 2000 సంవత్సరము వచ్చి వేదవ్యాస్ వ్రాసినమాటను తుస్సు మనిపించింది. ఈ విధముగా కలియుగాంతము
అనుమాట రెండుమార్లు అబద్దమైనది. ప్రస్తుతము ఇప్పుడు రెండు సంవత్సరములనుండి, 2012 కలియుగాంతము
అనుమాట బయటకు వచ్చినది. ఈ మారు నెల, దినము నిర్ణయముచేసి 2012 డిశంబరు, 21వ తేదీన కలియుగము
అంత్యమగునని చెప్పడము జరుగు చున్నది. ఇప్పుడు ఒక ప్రక్కన జ్యోతిష్యశాస్త్రజ్ఞులు, మరొకప్రక్క ఖగోళ శాస్త్రజ్ఞులు,
ఇంకొక ప్రక్క మరొక ఆధ్యాత్మిక సంస్థవారు, ఇంకా పేరుపొందిన విదేశీ క్యాలెండరు 2012 సంవత్సరముతో
అయిపోతుందని, తర్వాత ఆ క్యాలెండరును వ్రాయలేదనీ అందువలన తప్పనిసరిగా యుగాంతము జరిగిపోవునని
కొందరు చెప్పడము జరుగుచున్నది. ఇదంతయుకాక టీవి9 ఛానెల్వారు 2011 డిశంబరు 20వ తేదీన “యుగాంతము
365 దినములు" అను పేరుమీద చర్చావేదిక నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్నవారు తప్పనిసరిగా యుగాంతము
అవుతుందని కొందరు చెప్పగా, వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము తరపున వచ్చిన వ్యక్తి మాత్రము బ్రహ్మముగారు చెప్పిన
సంఘటనలు కొన్ని మాత్రము జరిగాయనీ, ఇంకా జరుగవలసినవి ఎన్నో ఉన్నాయనీ, అందువలన 2012 డిశంబరు,21
దినమున యుగాంతము జరగదనీ వాదించడము జరిగినది. ఈ మారు మేము కూడా యుగాంతము అసత్యమని
చెప్పువారి మాటనే ఒప్పుకోవలసి వచ్చింది. మామాట ప్రక్కన పెడితే సామాన్య ప్రజానీకము కలియుగాంతమును
గురించి రకరకములుగా చెప్పుకోవడము జరుగుచున్నది.
కలియుగాంతమును గురించి గతములో 1994 లోనూ, 1999 లోనూ చెప్పినవారుగానీ, ప్రస్తుతము
చెప్పుచున్నవారుగానీ బ్రహ్మవిద్యా శాస్త్రమును ఆధారము చేసుకొని చెప్పలేదు. ఇప్పుడు ప్రజలలో నెలకొని యున్న
యుగాంత విషయమును షట్శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రము చేత అన్వేషించి, అది సత్యమో అసత్యమో
తేల్చాలనుకొన్నాము. నాకు ఇష్టమైన శాస్త్రము, జీవుల విషయములో ఎప్పటికీ సత్యమునే ప్రకటించు బ్రహ్మవిద్యా
శాస్త్రమును ఉపయోగించి చూస్తే ప్రళయము, యుగాంతము సత్యమో కాదో తెలిసిపోతుందని అనుకొని అన్వేషించి
వ్రాసినదే ఈ చిన్న గ్రంథము. ఈ జన్మలకు అంతులేదా? కొంతకాలమైనా జీవులకు విశ్రాంతి లేదా? అను ప్రశ్నలకు
జవాబు లేదా అను ప్రశ్నలకు జవాబులను చెప్పు కొంటే, అన్ని మతములలో చెప్పుకొన్న ప్రళయమున్నది, కానీ ప్రళయము
అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రళయమంటే సర్వనాశనమైపోవడమే అని అందరు అనుకోవడము జరుగుచున్నది.
ఇప్పుడు మేము చెప్పుచున్న సంచలన రహస్య సమాచారమునుబట్టి చూస్తే ప్రళయమనునది ఉన్నది. కానీ దాని
స్వరూపమువేరని తెలియుచున్నది. ప్రభవము అంటే అందరూ అనుకొన్నట్లు క్రొత్తగా సృష్టింపబడడమని అనుకోవడము
పొరపాటని తెలియుచున్నది. జీవులు అందరూ చనిపోవడము ప్రళయమనీ, అందరూ తిరిగి పుట్టడమును ప్రభవమని
అనుకోవడము దేవుని ధర్మమునకు విరుద్ధమగును. దైవధర్మము ప్రకారము దేవుడు ఒకమారే విశ్వమునంతటిని
సృష్ఠించాడు. విశ్వమును సృష్టించకముందు ఆయన సృష్టికార్యమును చేశాడు. సృష్టే లేనప్పుడు ఆయన (దేవుడు) ఎలా
పని చేసినది ఎవరికీ తెలియదు. మనము లేనప్పుడు ఆయన ఎలా చేసినా పని చేసినట్లు మనము చెప్పలేము. మనము
సృష్ఠింపబడిన తర్వాత దేవునికున్న ధర్మము ప్రకారము ఆయన పని చేయడు. అందువలన ఆయనను క్రియారహితుడు
అని అన్నాము. ఆయన పని చేయనివాడు, ఆయన ఏ పనికీ పనికిరాని వాడు అని చెప్పుచున్నాము.
దేవునికి వేయియుగములు ఒకపగలు, వేయియుగములు ఒక రాత్రి అయినప్పుడు రాత్రిని ప్రళయముగా,
పగలును ప్రభవముగా చెప్పుకొంటే, ప్రతి ప్రభవములోనూ దేవుడు క్రొత్తగా సృష్టిని తయారు చేయుచున్నాడని అనుకొంటే,
ఆయన ప్రతి దినము పని చేసినట్లగును. దేవుడు ప్రతి దినము పని చేస్తున్నాడనడము దేవుని ధర్మమునకు వ్యతరేఖమగును.
అందువలన అధర్మముతో కూడుకొన్న మాటలను మనము చెప్పకూడదు. దేవుని ధర్మములనూ, జ్ఞానమునూ
మాట్లాడునపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడ వలసియుంటుంది. అట్లుకాకుండా దేవుని ధర్మములకు వ్యతిరేఖముగా
మాట్లాడితే పాపమును మూటగట్టుకోవలసి వస్తుంది. అందువలన మనము దేవుని ఎడల భయముకల్గి మాట్లాడితే,
దేవుడు ఒక్కమారే సృష్ఠిని సృష్టించాడు. అప్పుడు ఎట్లు తయారు చేసినది ఎవరికీ తెలియదు అని చెప్పవచ్చును.
అప్పుడు మనము లేము కాబట్టి అప్పటి విషయమును మనము లెక్కించలేము. మనము సృష్టింపబడిన తర్వాత అప్పటి
నుండి ఇప్పటి వరకు దేవుడు ఏ కార్యమూ చేయలేదు. అందువలన ఆయన క్రియారహితుడు అనుట ధర్మము. దేవుని
ధర్మమును అనుసరించి చూస్తూవస్తే, ఎప్పటికీ కాలము ఆగిపోదు. నాలుగుయుగములు అయిపోతూనే తిరిగి కృతాయుగము
మొదలగుచుండును. చచ్చినవాడు వానివాని కర్మనుబట్టి తిరిగి పుట్టుచుండును. చావుపుట్టుకలు అంతులేని ప్రక్రియగా
కొనసాగుచుండును. దేవుడు కాల స్వరూపుడు, కావున దేవునికి అంతులేదు. అట్లే కాలమునకు అంతులేదు. ఈ
సూత్రము ప్రకారము, బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము, కలియుగమునకు ఎప్పటికీ అంతులేదు. కలియుగము 250
మార్లువస్తే 108 కోట్ల సంవత్సరములైనా, తిరిగి వెంటనే కృతియ్యగము మొదలగును. ఇట్లు ఎడతెరపిలేని కాలములో
ఒక్క కలియుగమునకే కాదు, ఏ యుగమునకు కూడా అంతులేదు. సృష్టి అంతముకాదు, తిరిగి దేవుడు సృష్ఠిని
తయారు చేయడు. దేవుడు ఒక్కమారు తయారు చేసిన సృష్ఠి ఎప్పటికీ నాశనము కాదు. అది నాశనమంటూ జరిగితే
మోక్షమందే జరగాలి. అంతవరకు నాశనమగుటకు వీలులేదు. ఏ జీవరాశి అయినా ఇటు ప్రకృతిలోనైనా ఉండాలి
లేకపోతే దేవునియందైనా ఐక్యమైపోవాలి. అంతతప్ప ఏ జీవుడు ఎటువంటి స్థితి పొందుటకు వీలులేదు, ఇది శాసనము.
కావున జగతిని సృష్టించిన దేవుడు, జీవుడు జననమరణములనుండి బయటపడి తనయందు ఐక్యమైపోవునట్లు తన
జ్ఞానమును కూడా సృష్ఠి ఆదిలోనే తెలియజేశాడు.
సృష్టింపబడిన ప్రతి జీవరాసి ఆదినుండి నేటి వరకు జన్మలు మారుతూనే వస్తున్నది. మనము కూడా ఆదిలోనే
సృష్ఠించబడినాము. తర్వాత జనన మరణములను పొందుచున్నాము. నేటికి ఈ స్థితిలో ఉన్నాము. ఈ జన్మకూడా
శాశ్వితమైనది కాదు. గతములో ఎన్నో జన్మలు మారినట్లే ప్రస్తుతమున్న జన్మను కూడా మారవలసిందే. ఈ సృష్ఠి
ఎప్పుడు తయారైనదో ఖచ్చితమైన లెక్క ఎవరివద్దా లేదు. ఇంతకాలము గడచినదని కొందరు చెప్పుచుండినప్పటికీ,
మాటలు శాస్త్రబద్ధమైనవి కావు. అందువలన అది సత్యము కాదు. జరిగిన దానిని వదలి, జరుగబోవు దానిని చూచినా
అది ఎవరికీ అర్థముకాని అగమ్యగోచరము. జీవుడు మోక్షము పొంది దేవునియందైక్యమగు వరకు ప్రపంచము
కొనసాగుతూనే ఉంటుంది. జగతికి అంతు అనునది లేదు. అంతు అనునది ఒక్క మోక్షములోనే జరగాలి. ప్రళయములో
జరుగదు. మోక్షమనునది దేవుడు చెప్పిన జ్ఞానము వలన లభిస్తుంది. నేడు దేవుని జ్ఞానము మీద ఆసక్తిగలవారు
అరుదైపోయారు. అంతేకాక దేవుని జ్ఞానము ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయినది. అందువలన దేవునియందు
కలిసిపోవువారు లేకుండా పోవుట వలన సృష్ఠిలో పుట్టిన జగతి స్థిరస్థాయిగా జన్మలు మారుచూ సాగిపోవల సిందే.
జనన మరణములను పొందు మనిషి, కాలములోనే బ్రతకాలి. కావున కాలములో ఏ యుగమునకు అంతులేదు.
కలియుగము అంతకూ అంతము కాదు. ఇంకా గట్టిగా చెప్పితే “కలియుగము ఎప్పటికీ అంతముకాదు” అని చెప్పవచ్చును.
మనిషి ప్రళయము ప్రభవము అను మాటలను వింటున్నాడు. కానీ అవి ఎట్లుంటాయో, వాటియొక్క వాస్తవరూపము
ఏమిటో పెద్ద స్వామీజీలకు కూడా ఇంతవరకు తెలియదు. మనుషులకు అందరికీ తెలిసినది మరణమొక్కటే. ప్రళయము
అంటూనే దానిని మనిషి మరణముగా లెక్కించు కొనుచున్నాడు. ప్రళయము మరణములాంటిదే, కానీ మరణము
కాదని ఎవరికీ తెలియదు. ప్రళయమునకు, మరణమునకు కొంత తేడావున్నది 1) మరణములో జీవునియొక్క శరీరము
మారిపోవుచున్నది. ప్రళయములో జీవుడు శరీరమును మారడు. 2) మరణము చెందిన జీవుడు ఒక్కక్షణము కూడా
ఆలస్యము లేకుండా రెండవ శరీరమును చేరి జన్మించుచున్నాడు. ప్రళయమును పొందిన జీవుడు వెంటనే ప్రభవమును
పొందలేడు. ప్రళయము నకు ప్రభవమునకు మధ్యలో కొంత సమయము గడచిపోవుచున్నది. 3) మరణములో
స్థూలశరీరముతోపాటు సూక్ష్మశరీరమును కూడా జీవుడు కోల్పోవుచున్నాడు. ప్రళయములో స్థూల, సూక్ష్మశరీరములు
రెండు లేకుండా పోతున్నవి. తర్వాత ప్రభవములో అదే సూక్ష్మ, స్థూలశరీరములను జీవుడు పొందుచున్నాడు.
4) మరణములో మనిషి జ్ఞాపకాలను కోల్పోతున్నాడు. ప్రళయములో మనిషి కోల్పోయిన జ్ఞాపకమును ప్రభవములో
తిరిగి పొందు చున్నాడు. 5) మరణములో ప్రారబ్ధకర్మ అయిపోయి మరుక్షణము జరుగు జన్మలో క్రొత్త ప్రారబ్ధకర్మ
ఏర్పడుచున్నది. ప్రళయములో పాత ప్రారబ్ధకర్మ అయిపోదు. ప్రభవములో క్రొత్త ప్రారబ్ధ కర్మరాదు. 6) మనిషి
చనిపోయినప్పు డున్న సంచితకర్మనుండి, మరుక్షణములో జరుగు జననములో ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది. 7) ప్రళయములో
ఎటువంటి కర్మమార్పిడి జరుగదు. మనిషి (జీవుడు) ఏ ప్రాంతములో, ఏ స్థలములో మరణిస్తే అదే ప్రాంతములో, అదే
స్థలములో తిరిగిపుట్టునను నమ్మకము లేదు. అయితే మనిషి ఏ ప్రాంతములో, ఏ స్థలములో ప్రళయమును పొందితే
అదే స్థలములో, అదే ప్రాంతములో ప్రభవము చెందును. 8) మరణములో జీవుడు మోక్షము పొందుటకు అవకాశము
గలదు. ప్రళయములో అటువంటి అవకాశము ఏమాత్రము లేదు. ఈ విధముగా చెప్పుకుంటూపోతే ప్రళయమునకు
మరణమునకు ఎన్నో విధముల భేదములున్నవి.
మరణము-జననము:
1) మరణములో జీవుని పాత
శరీరముపోయి, జననములో క్రొత్త
శరీరము వస్తున్నది.
2) మరణములో ఒక్కక్షణము కూడా
ఆలస్యము లేకుండా జననమును
పొందుచున్నాడు. మరణమునకు,
జననమునకు మధ్యలో ఒక్కక్షణము
కూడా గడువులేదు.
3) మరణములో స్థూలశరీరముతో
పాటు సూక్ష్మ శరీరములను కూడా
జీవుడు వదలిపోవుచున్నాడు. జననములో పాతవి కాకుండా క్రొత్త
వాటిని పొందుచున్నాడు.
4) మరణములో మనిషి జ్ఞాపకాలను
కోల్పోవుచున్నాడు.
5) మరణములో పాత ప్రారబ్ధకర్మ అయిపోయి, వెంటనే జరుగు జన్మలో
క్రొత్త ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది.
6) మరణములోనున్న సంచితకర్మ
నుండి మరుక్షణములో జరుగు
జననములో ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది.
7) మరణములో మనిషి ఏ ప్రాంతంలో, ఏ స్థలములో ఉంటే అదే
ప్రాంతములో అదే స్థలములో తిరిగి పుట్టునను నమ్మకము లేదు.
8) మరణములో జీవుడు మోక్షమును
పొందుటకు అవకాశము కలదు.
9) మరణము పొందిన వాడు
పుట్టక తప్పదు.
ప్రళయము-ప్రభవము.
1)ప్రళయములో జీవుని పాత
శరీరము పోదు, ప్రభవములో
క్రొత్తశరీరము రాదు.
2) ప్రళయమును పొందిన జీవుడు
వెంటనే ప్రభవమును పొందలేడు.
ప్రళయమునకు ప్రభవమునకు
మధ్యలో కొంత సమయము గడచి
పోవుచున్నది.
3)ప్రళయములో స్థూల, సూక్ష్మ
పోవుచున్నవి. తర్వాత ప్రభవములో అదే స్థూల, సూక్ష్మ శరీరములను పొందుచున్నాడు.
4) ప్రళయములో మనిషి కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి ప్రభవములో పొందుచున్నాడు.
5) ప్రళయములో పాత ప్రారబ్ధ
కర్మ అయిపోదు. ప్రభవములో
క్రొత్త ప్రారబ్ధకర్మ రాదు.
6) ప్రళయములోనున్న సంచిత కర్మనుండి ప్రభవములో ప్రారబ్ద కర్మ ఏర్పడదు.
7)ప్రళయములో మనిషి ఏ
ప్రాంతములో, ఏ స్థలములో
ఉండునో, ప్రభవములో అదే
ప్రాంతములో అదే స్థలములో ఉండును.
8) ప్రళయములో జీవుడు మోక్షమును పొందు అవకాశము
ఏమాత్రము లేదు.
9)
ప్రళయము పొందినవాడు.
ప్రభవము చెందక తప్పదు.
ఈ విధముగా వివరించుకొని చూస్తే చావు పుట్టుకలువేరనీ, ప్రళయ ప్రభవములువేరనీ, ఒక జీవునికి వాటి
అనుభవములువేరనీ తెలిసి పోవుచున్నది. ప్రస్తుతము సజీవముగానున్న మనిషికి చావుపుట్టుకలలో పుట్టుక జరిగిపోయినది,
ఇక జరుగవలసినది చావుమాత్రమే. అలాగే ప్రళయ ప్రభవములలో ప్రభవము గడిచిపోయినది, ఇక ప్రళయము
మాత్రమే జరుగవలసియున్నది. మనిషికి జరుగబోవు మరణములోగానీ, ప్రళయములో గానీ ఎన్నో వేరువేరు మార్పులున్నా,
రెండిటియందు జీవునికి అనుభవము మాత్రము ఒకే విధముగా ఉండును. మరణసమయముగానీ, ప్రళయ సమయముగానీ
జీవునికి ఏమి జరుగుచున్నదో వివరించి చెప్పితే, ఏ జీవునికి గానీ మరణము వరకు ఉన్న అనుభవము తెలియును.
అయితే మరణము పొందు సమయములో జీవునికి ఏ అనుభవము ఉండదు. అట్లే ఏ జీవుడైనా ప్రళయము వరకు
ఉన్న అనుభవమును అనుభవించియుండవచ్చును. కానీ ప్రళయము పొందు సమయములో జీవునికి ఏ అనుభవమూ
ఉండదు. అందువలన మరణము, ప్రళయము రెండూ ఒకే విధముగా జీవుని అనుభవానికి అందవు అని చెప్పవచ్చును.
అదే విధముగా జననము గానీ, ప్రభవముగానీ ఎవరి అనుభవానికి రావు. అలా జనన మరణములు, ప్రళయ సంభవములు
రెండు అనుభవానికి రాకపోవడానికి కారణము ఏమనగా! చావుపుట్టుకలు, ప్రళయ సంభవములు రెండు కర్మకు అతీత
మైనవి. కర్మ అయితేనే జీవుని అనుభవానికి వస్తుంది. కానీ కర్మ కానిది ఏదీ జీవుని అనుభవానికి రాదు. అందువలన
అనంత విశ్వములో ఏ జీవరాసి ఇటు జనన మరణములను గానీ, అటు ప్రళయ సంభవములను గానీ అనుభవించలేదు.
అనుభవానికి వచ్చిన విషయము మాత్రమే జీవునికి తెలియును. అనుభవానికి రాని విషయమును జీవుడు ఏమాత్రము
చెప్పలేడు. అయితే ఇప్పుడు కొందరు తెలివైనవారు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! "ప్రపంచములో
అందరితోపాటు మీరు కూడా ఒక జీవుడే కదా! అటువంటపుడు చావుపుట్టుకలుగానీ, ప్రళయ ప్రభవములు గానీ మీ
అనుభవానికి కూడా రావుకదా! మీ అనుభవానికి రాని విషయమును మీరు ఎలా వ్రాయగలిగారు” అని అడుగవచ్చును
దానికి మా జవాబు ఏమనగా!
గాలివాటము సుడిగుండములో ఇరికించిందన్నట్లు, చివరకు మేము ప్రశ్నల పాటమునకు బడిబందములో
ఇరుక్కొన్నట్లయినది. నేను ఇప్పుడు మీవలె జీవున్ని అని అంటే 1980లోనే వ్రాసిన “జనన మరణ సిద్ధాంతము” గానీ,
ఈ మధ్య కాలములో వ్రాసిన “మరణ రహస్యము”, పునర్జన్మ రహస్యము”, “త్రైతాకార రహస్యము”, “సమాధి” మరియు
ప్రస్తుతము వ్రాసిన "కలియుగము ఎప్పటికీ అంతము కాదు” అను ఈ ఆరు గ్రంథములలో చెప్పిన జ్ఞానమంతా అందరి
దృష్ఠిలో అసత్యముగా కనిపించును. నాకు తెలియకున్నా, నా అనుభవమునకు రాకున్నా నేను మిమ్ములను మోసగించి
వ్రాసినట్లగును. లేదు నేను సత్యమునే చెప్పుచున్నాను అంటే దానికంటే ముందు నేను జీవున్ని కాదు అని చెప్పాలి.
నేను జీవుడనని చెప్పితే ఇంతవరకు ఎవరికీ తెలియవని చెప్పిన రహస్యములు అన్నీ అందరికీ అసత్యములుగా కనిపించును.
చెప్పిన జ్ఞానమంతా అసత్యము కాదు సత్యమే అంటే, నేను జీవుడను కాదు అని చెప్పవలసివస్తుంది. ఇటువంటి కష్ట
పరిస్థితిలో దారి తెలియక ఇబ్బందిపడకుండుటకు కొన్ని నిమిషములు ఆలస్యమైనా నా నుండి సరియైన జవాబే
బయటకు వచ్చింది. ఆ జవాబు ఇలా కలదు. ప్రతి మనిషిలోనూ జీవాత్మ, ఆత్మ రెండు గలవు. జీవాత్మ అన్నిటిని
శరీరములో అనుభవించువాడుకాగా, అనుభవింపజేయునది ఆత్మ కలదు. జీవునికి శరీరములో అనుభవమునకు
వచ్చిన విషయములే తెలుసు. అయితే ఆత్మకు శరీరములో జీవుని అనుభవమునకు రాని అన్ని పనుల వివరము
తెలుసు. వివరముగా చెప్పితే మరణములోగానీ, జననములోగానీ, అట్లే ప్రళయ ప్రభవములలోగానీ, జీవునికి తెలియనిది
ఏదైనా అన్నీ శరీరములోని ఆత్మకు తెలుసు. ఇంతవరకు చెప్పిన జ్ఞానమంతా మేము చెప్పినదే, కానీ నేను చెప్పినది
కాదు. నా ఆత్మ చెప్పితే నాకు తెలిసింది, కానీ నాకు స్వయముగా తెలియదు. అందువలన వ్రాసిన గ్రంథములు,
చెప్పిన జ్ఞానము అంతా నాదికాదనీ, నా ఆత్మదనీ తెలియవలెను. మీ శరీరములో కూడా ఆత్మ కలదు. దానికి కూడా
అన్నీ తెలుసు. అయితే మీ ఆత్మను మీరు ఏమీ అడగలేదు. మీ శరీరములో మీతోపాటు ఒక ఆత్మ ఉందని మీకు
తెలియదు. మీ శరీరములో ఆత్మ ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, దాని పనేమిటో, దానితో ఎలా మాట్లాడాలో నీవు
తెలియగలిగితే నాకు నా ఆత్మ చెప్పినట్లే, నీతో కూడా నీ ఆత్మ చెప్పగలదు. నీవంటే ఎవరో నీకే తెలియదు.
అటువంటపుడు నీ ప్రక్కనే ఉన్న ఆత్మ ఎలా తెలుస్తుంది? నాకు తెలిసినట్లు ఆధ్యాత్మిక రహస్యములు తెలియాలంటే
ముందు నిన్ను నీవు తెలుసుకో, శరీరములో నీవు ఎక్కడున్నావో తెలుసుకో, అక్కడ నీ పనేమిటో తెలుసుకో, ఆ తర్వాత
నీ ఆత్మ నీకు తెలుస్తుంది. అప్పుడు నా అంతటివానివి నీవు కూడా కావచ్చును.
ప్రస్తుత కాలములో అందరూ మనుషులే అయినా, అందరికీ ఒకే దేవుడున్నా, మనిషి అజ్ఞానము చేత మతములుగా
విడిపోయి, ఒకేజాతి మనుషులను వివిధ రక మతస్థులుగా చెప్పుకోవడము జరుగుచున్నది. అట్లే వారివారి మతముల
విధానమునుబట్టి ఉన్న ఒకే దేవున్ని మీ దేవుడు మా దేవుడు అని విడదీసుకొన్నారు. మనిషి అజ్ఞానముచేత మతములలోను
దేవుళ్ళలోనూ వేరువేరు భావములు కల్గియుండినా, అందరికి మరణము జననము ఒకే విధముగా ఉన్నవి. ప్రళయము
ప్రభవము కూడా ఒకే విధముగా ఉండినా, వారివారి మతములనుబట్టి వేరువేరుగా అర్థమును చేసుకొన్నారు. కొన్ని
మతములలో మరణమును ప్రళయము అని అను కోవడము జరుగుచున్నది. ఒకమారు పుట్టినవాడు ఒకమారే ప్రళయము
చెందుననీ, తిరిగి పుట్టడనీ చెప్పడము కూడా జరుగుచున్నది. వారి మత మూలగ్రంథములలో ఆ విషయము లేకున్నా
వారి అవగాహన లోపము వలన తప్పుగా చెప్పుకోవడము జరుగుచున్నది. పుట్టినవాడు ప్రళయము చెంది తిరిగి
పుట్టడని చెప్పినప్పుడు, వారు మరణమును ప్రళయముగా లెక్కించుకొనుచున్నారని అర్థమైపోవుచున్నది. ఈ విధముగా
మరణమును ప్రళయమును ఒకటేనని పొరపడడమేకాక, స్వర్గమును, పరలోకమును కూడా ఒకటేనని లెక్కించుకొన్నారు.
స్వర్గము, పరలోకము వేరువేరని తెలియనట్లు మరణమును ప్రళయమును వేరువేరని అనుకోలేదు. మరణము ఒక
జీవితమును అంతము చేయుచున్నది, ఒక జీవున్ని కాదు. అట్లే ఒక ప్రళయము ఒక పగలును అంతము చేయుచున్నది,
ఒక జీవితమును కాదు. జీవునికి జీవితమునకు, జీవితమునకు పగలుకు తేడా తెలియనివానిని జ్ఞాని అనుటకు ఏమాత్రము
అర్హుడు కాడు.
మరణమును జీవుని చివరి ఘట్టముగా లెక్కించకూడదు. మరణము జీవితము యొక్క చివరి ఘట్టమగును.
అలాగే ప్రళయము జీవుని నాశనము కాదు. ప్రళయము తీర్పు దినమూ కాదు. మరణము మనిషికి తర్వాత జన్మ
ఇలాగ ఉండవలెనని తెలుపు తీర్పు దినముగా ఉన్నది. మరణము తీర్పు మరియు మార్పు దినముగా ఉన్నది. ప్రళయము
ఎవరికీ తీర్పుదినము మార్పుదినము కాదు. మరణము కర్మకు అతీతముగా ఉన్నది. కావున మరణ విషయమునూ,
ప్రళయ విషయమునూ జాగ్రత్తగా తెలియగలిగితే, మొదట మనిషి ప్రళయమును జయించగలుగుతాడు. తర్వాత మరణమును
జయించగలుగుతాడు. ప్రళయమును గురించి తెలియనిదే, మరణమును గురించి తెలియలేడు. మరణమును గురించి
తెలియనిదే, చివరిదైన మోక్షము లేక పరలోకమును గురించి తెలియలేడు. పుట్టిన ప్రతి మనిషి ఏ మతస్థుడైనా వాడు
దేవునియందు ఐక్యమైపోవలసినవాడే. దేవునియందు చేరకపోతే వాడు గత్యంతరము లేక జనన మరణములు, ప్రళయ
ప్రభవములు పొందుచూ ఉండవలసిందే. అందువలన మనిషి మరణించుటకు పుట్టకూడదు. దేవున్ని తెలియుటకే
పుట్టాలి. దేవుడు మతములకు అతీతుడైన కాల స్వరూపుడు. కావున కాలముతో మొదలుపెట్టి చివరిదైన కలియోగము
యొక్క అంతులేని స్థితిని గురించి తెలుసుకొందాము. నాశనము చేయువాని యందు కలిసిపోదాము అను అర్థమునిచ్చునదే
కలియోగము అనీ, కలియోగము నాశనముకానిదనీ తెలుసుకొందాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.