జనన మరణ సిద్దాంతము cloud text updated 17th sep 2024

 జనన మరణ సిద్దాంతము.


రచయిత ముందుగ చెప్పినది.


జనన మరణములు రెండు మనిషికి సంభవించునవే. జన్మతో జీవితప్రారంభము, మరణముతో జీవిత అంత్యము

జరుగుచున్నది. జనన మరణముల రెండిటితో సంబంధమున్న మనిషి ఆ రెండిటి యొక్క అవగాహన లేక వాటిమీద

ఊహలు పెంచుకొన్నాడు. జన్మను గురించి గానీ, మరణమును గురించి గానీ, మనిషివద్ద శాస్త్రబద్దమైన ఎటువంటి

సమాచారము లేదు. చావు పుట్టుకల గురించి అశాస్త్రీయము, పురాణ సంబంధ విషయములుండుట వలన వాస్తవము

తెలియకుండ పోయినది. మనిషి ముఖ్యముగ తెలియవలసినది జీవితము ప్రారంభమగుట, అలాగే అంత్యమగుట. ఈ

రెండు విషయములందు మనిషిలో పాతుకపోయిన అవాస్తవమును తీసివేసి వాస్తవమును అందివ్వాలను ఉద్దేశ్యముతో ఈ

గ్రంథము వ్రాయడము జరిగినది. ఈ గ్రంథములోని విషయములు శాసనములతో కూడుకొన్న సిద్ధాంతమైన దానివలన

దీనికి "జనన మరణ సిద్ధాంతము” అని పేరు పెట్టాము.


కొన్ని శాసనములతో కూడుకొన్నది సిద్దాంతము. బ్రహ్మవిద్యకు సంబంధించిన శాసనములతో కూడుకొన్నది

కావున దీనిని బ్రహ్మవిద్యలో ఒక సిద్ధాంతమని చెప్పవచ్చును. భూమిమీద ఆరుశాస్త్రములు గలవు. అందులో మొదటి

ఐదు ప్రకృతికి సంబంధించినవి కాగ చివరి ఒకటి పరమాత్మకు సంబంధించినది. 1) గణితశాస్త్రము 2) ఖగోళశాస్త్రము

3) భౌతికశాస్త్రము 4) రసాయనికశాస్త్రము 5) జ్యోతిష్యశాస్త్రము 6) బ్రహ్మవిద్యాశాస్త్రము. ఇవి శాస్త్రములు కాగ వీటిని

వదలి మిగత వాటిని కూడ కొందరు చెప్పారు. అవి 1) శిక్ష 2) వ్యాకరణము 3) ఛందము 4) నిరుక్తము 5) జ్యోతిష్యము

6) కల్పము. ఇవి శాస్త్రములని కొందరి వాదన. వీటిలో ఐదవది జ్యోతిష్యము తప్ప మిగతావి ఎలా శాస్త్రములైనాయో

మాకు అర్థము కాలేదు. మనిషికి శాస్త్రములేవో, శాస్త్రము కానివేవో తెలియక కనిపించిన పుస్తకములనన్నిటిని శాస్త్రములే

అంటున్నాడు. ఇటువంటి పరిస్థితిలో కొన్ని పురాణగ్రంథములలో మనిషి పుట్టుకను గురించి వ్రాసిన విషయములే

సత్యములని అవియే శాస్త్ర వచనములని నమ్ముచున్నాడు. ఆ విషయములను గురించి కొంత చర్చించు కొందాము.

కొన్ని పుస్తకములలో వ్రాసిన దానిని చూస్తే తల్లి గర్భములోనే శిశువుకు ప్రాణమొచ్చునని, తల్లిగర్భములోని శిశువులో

చేరిన జీవుడు బయటికి వచ్చువరకు పూర్వజన్మల జ్ఞాపకము కల్గియుండునని వ్రాసియున్నారు. ఆ విషయము వాస్తవమే

అన్నట్లు దానికి కథలను కూడ వ్రాశారు. అంతేకాక ప్రహ్లాదుడు తల్లిగర్భములోనే నారదునిచేత నారాయణ మంత్రోపదేశము

పొంది నాడని భాగవతములో చెప్పారు. భారతములో అభిమన్యుడు తల్లిగర్భమందే యుద్ధవ్యూహములలోని పద్మవ్యూహ

ప్రవేశము విన్నాడని వ్రాశారు. ఇట్లు అనేక పురాణగ్రంథములలోను, చరిత్ర గ్రంథములలోను వ్రాయుట చేత తల్లిగర్భములోనే

జీవుడు చేరుచున్నాడను నమ్మకమును ప్రజలు ఏర్పరుచుకొన్నారు. తర్వాత వచ్చిన పుస్తకములు కూడ అదే విషయమును

తిరిగి చెప్పుకోవడము వలన ప్రసవము జరుగకముందే తల్లిగర్భములో జీవుడుండుననుమాట అందరిలోను చెరగని ముద్ర

వేసినట్లయినది. అంత దృఢముగ నమ్మకమున్న ఆ మాటనుకాదని, అది సత్యము కాదు శాస్త్రబద్దముకాదని చెప్పిన వినే

పరిస్థితిలో లేరని తెలిసి సత్యమును తెల్పుటలో మా ప్రయత్నము మేము చేయుచునే ఉన్నాము. అటువంటి ప్రయత్నమే

ఈ "జనన మరణ సిద్ధాంతము" అను గ్రంథము. ఇందులో జననము యొక్క విషయమే కాక మరణము యొక్క

విషయము కూడ వివాదాస్పదముగానే ఉండును.


ఎవరు నమ్మని వివాదాస్పద విషయమని తెలిసి వ్రాయుటలో మీ ఉద్దేశ్యమేమని కొందరడుగవచ్చును. దానికి

జవాబు ఏమనగా! ఎవరు విశ్వసింపకపోయిన సత్యము సత్యమే అగును. సత్యమును తెల్పుటే మా ఉద్దేశ్యము కావున ఈ

గ్రంథమును వ్రాశాము. ఇందులోని జనన సిద్ధాంతములో గర్భస్థ శిశువుకు ప్రాణము లేదని, జీవుడు ఆ శిశువులోనికి


ప్రవేశించలేదని చెప్పడము జరిగినది. తల్లి ప్రసవించిన తర్వాత మొదటి శ్వాసతోనే జీవుడు శిశుశరీరములో ప్రవేశించుచున్నాడని

చెప్పడము ఇందులోని ముఖ్య సిద్ధాంతము. ఆ మాట వింటూనే ఇందులోని రహస్యమేమున్నదని చూడక, గ్రంథమును

చదవక ప్రక్కనపెట్టు వారుగలరు. అలాంటపుడు పుట్టుక మునుపు యొక్క విషయము తెలియక రహస్యముగానే మిగిలిపోవును.

అందువలన చెప్పబడిన విషయములను పరిశోధనాదృష్ఠితో చూస్తే చివరకు ఒక నిర్ణయానికి రావచ్చును. ఎవరో పూర్వము

చెప్పిన వారి విషయములే నిజమనుకొని ఇపుడు ఎంతో వివరముగ చెప్పబడిన విషయములను వదులుకోకూడదు.


కర్ణుడు చెవిలో పుట్టాడని, వాలి వాలము (తోక) దగ్గర పుట్టాడని, ద్రోణుడు (దొన్నె) గిన్నెలో పుట్టాడని, మత్స్యవల్లబుడు

చేపకు పుట్టాడని వ్రాశారు. ఆ మాటలన్నిటిని ఈ నాటికి నమ్మువారు గలరు. అసత్యమును సులభముగ నమ్మువారుండుటచేత,

విన్న విషయమును అవునా కాదా అని ఆలోచించకుండా ఒప్పేసుకొనువారుండుట చేత, ఎవరికిష్టమొచ్చినట్లు వారు

వ్రాసినా చెల్లుబాటైది. ఇన్ని అవాస్తవ విషయములను నమ్మినవారు ఎంతో విన ఎన్నో ప్రమాణములతో

సిద్ధాంతపరముగ వ్రాయబడిన జన్మ విషయము నమ్మలేక పోతున్నారు. సామాన్య మానవులేకాక విజ్ఞానము తెలిసినవారు

కూడ నమ్మక పొరబడడము ఆశ్చర్యముగవుంది. భగవద్గీతా శాస్త్రములో స్వయముగ భగవంతుడే తెల్పిన విషయమునే

వదలి పురాణములలో కవులు చెప్పిన మాటలను నమ్మడము చాలా విచిత్రము. శాస్త్రములను, పురాణములను, ఇతి

హాసములను విడదీసి తెలుసుకోలేక ప్రతి పుస్తకమును శాస్త్రమే అనుకొనువారుకూడ గలరు. శాస్త్ర పురాణములకు

వ్యత్యాసము తెలియనపుడు తెలుసుకొను విషయము సత్యమో అసత్యమో తెలియుటకు అవకాశముండదు.


ఒక్క జనన విషయములోనే కాక మరణవిషయములో కూడ మనిషి అవాస్తవ విషయములను తలకెక్కించుకొన్నాడు.

చనిపోయిన వానిని మొదట యమభటులు యమలోకానికి తీసుకపోవుదురని, అక్కడ జీవితములో చేసుకొన్న పాపములను

లెక్కించి వాటికి యమధర్మరాజు చెప్పు శిక్షను అమలు చేయుదురని, ఎన్నో నరకయాతనలు అనుభవించిన తర్వాత

అచటనుండి దేవదూతలు వచ్చి స్వర్గమునకు తీసుకపోయి అక్కడ వాని పుణ్యమునుబట్టి ఉంచుకొందురని, రంభ, ఊర్వశి,

మేనక మొదలగు అందగత్తెల మధ్య సుఖములనుభవించి పుణ్యమైపోయిన తర్వాత బ్రహ్మ దగ్గరకుపోయి క్రొత్త వ్రాత

వ్రాయించుకొని తిరిగిపుట్టునని చెప్పారు. ఇదంతయు పురాణాంతర్గత విషయమని, వాస్తవము కాదని తెలియక నూటికి

నూరుపాళ్ళునమ్మి ఆ విషయములనే ప్రచారము చేసుకొంటున్నారు. బ్రహ్మవిద్యాశాస్త్రములో భగవంతుడు చెప్పిన

మాటలనుకూడ విస్మరించుచున్నారు.


మరణించిన వాడు వెంటనే మరొక శిశుశరీరమును ఆశ్రయించు చున్నాడని, యమలోకమునకుగాని,

స్వర్గలోకమునకుగాని పోలేదని, అవి ప్రత్యేకముగ లేవని తెలియలేక పోయారు. చనిపోయిన వెంటనే జన్మతీసు కొంటున్న

జీవుడు పాపపుణ్యములను జీవితములోనే అనుభవిస్తున్నాడని, పాపముల నిమిత్తము యమలోకము, పుణ్యముల నిమిత్తము

స్వర్గలోకము లేదని తెలియలేకపోయారు. ఇంతవరకు అందరు నమ్మిన విషయములను ఖండించుచు జన్మసిద్ధాంతమును

తెల్పినట్లే, యమలోకమును ఖండిస్తూ మరణసిద్ధాంతము కూడ తెల్పడము జరిగినది. జనన మరణ విషయములు

మేము చెప్పినట్లు ఇంతవరకు ఎవరు చెప్పని దానివలన అంతా క్రొత్తగనే ఉండును. మరణములోని అపోహలు పోవాలంటే,

జన్మములోని వివరము పూర్తిగ తెలియాలంటే శాస్త్రపద్దతిగ చెప్పబడిన ఈ గ్రంథములోని విషయములను పరిశోధన

దృష్ఠితో చదవలసిన ఆవశ్యకత గలదు. చివరిదాక చదివి యోచించక మధ్యలోనే వదలివేయు వారికి ఏమి అర్థము కాదు.

జీవితానికి మొదలు చివర అయిన పుట్టుక చావుల గురించి తెలియడము ఎంతో ముఖ్యమైన విషయము. అట్లు తెలియకపోతే

మనమెవరమో, ఎచటినుండి వచ్చామో, తెలియకుండ పోవును. తన్నుతాను మరచి తాను జీవుడనను విషయము


ఏమాత్రము స్పృహలేకుండ పోయి మనము అన్ని విడచిపోవు దినము దగ్గరవుచున్నదని మరచిపోవుదుము. ఒకవేళ

అనారోగ్యము ఏర్పడి డాక్టర్లు ఈ జబ్బుకు మందులేదని చెప్పినపుడు, చావుతప్పదని తనకు తెలిసినపుడు తనకేదో కొత్త

ఉపద్రవమొచ్చినట్లు బాధపడగలము. చావు సర్వసాధారణమని తలచము. అంతేకాక చావు అంటే ఎట్లుండునోయను

భయము ముందే ఏర్పడి నీరసించి పోవుదుము. అట్లు కాకుండుటకు ముందే చావును గురించి, పుట్టుకను గురించి

తెలియవలెను.


ఈ చావుపుట్టుకలు మనుషులందరికే కాక అన్నిజీవరాసులకు కూడ సంబంధించిన విషయములు. కావున ఇవి

ఒక్క ఇందూమతములోని వారికే గాక మిగత మతముల వారికి కూడ వర్తించునని తెలియవలెను. కొన్ని మతములలో

చచ్చినవాడు తిరిగి పుట్టునను మాట ఒప్పుకోరు. పునర్జన్మ విషయము ఇందూమతములో కూడ కొందరు అంగీకరించడము

లేదు. మనుషులు ఒప్పుకొన్నా ఒప్పుకోక పోయిన దేవుడు మాత్రము చచ్చినవాడు తిరిగి పుట్టునని చెప్పాడు. చచ్చినవాడు

తిరిగి పుట్టడను మాటకు ఎక్కడ ప్రమాణములు లేవు. చచ్చినవాడు తిరిగి పుట్టుటకు ఎన్నో ప్రమాణములు కలవు. ఎందరికో

వెనుక జన్మ జ్ఞాపకాలు వచ్చి వెనుక జన్మలోని విషయములు చెప్పడము, అవన్నియు వాస్తవము కావడము జరిగినది.

వెనుక జన్మలో దాచిపెట్టిన ధనము మరుజన్మలో జ్ఞాపకమెచ్చి దాచిన స్థలమును చూపడము, వెనుక జన్మలోని తమ పేరు

చెప్పడము, తన ఇంటిని గుర్తించి తన బంధువులందరిని గుర్తించడము ఎన్నో జరిగినవి. దీనిప్రకారము జన్మ కలదనుటకు

నిరూపణలున్నవి కాని జన్మలేదనుటకు ఏ నిరూపణ లేదు.


జన్మలే లేవు అనువారు జన్మసిద్ధాంతమును అంగీకరించకపోయినా అన్ని మతముల మనుషులు చావును

అంగీకరించవలసిందే. కొందరికి జనన సిద్ధాంతముతో పనిలేకున్నా మరణసిద్ధాంతమును అన్ని మతములవారు తెలుసుకొనుట

అవసరము. చావు పుట్టుకలు మనకళ్ళ ఎదుట జరుగుచున్న విషయములు, మేము చెప్పిన సిద్ధాంతములు కూడ ఇక్కడ

జరుగునవే. మేము చెప్పిన మాటలను జరిగిన సంఘటనలతో పోల్చి చూసుకొంటే మామాట సత్యమో అసత్యమో

తెలియును.


ఆధ్యాత్మికము, విజ్ఞానము (సైన్సు) అను రెండు విధానములు గలవు. ఇక్కడ అసలు చర్చ ఏమిటంటే ఆధ్యాత్మికము

ముందు పుట్టినదా? విజ్ఞానము ముందు పుట్టినదా? అన్నది ప్రశ్న. దీనికి జవాబు ఏమనగా సైన్సు అనునది మనిషి

మెదడుయందు ఉత్పన్నమైన పరిశోధనా యోచనలనుండి పుట్టునది. ఎంత పెద్ద విజ్ఞానమైనా మనిషినుండే వెలువడాలి.

మనిషి నుంచి వచ్చిన శాస్త్రబద్ధమైన క్రొత్త యోచనల సారాంశమే విజ్ఞానము. ఆధ్యాత్మికము మనిషి అంతర్గతమైనది.

ఆత్మను అధ్యయనము చేయడము లేక తెలియడము ఆధ్యాత్మికమగును. అందరిలోనున్న ఆత్మను కొందరు తెలియుటకు

ప్రయత్నించుచున్నారు. కొందరికి దాని విషయమే తెలియదు. తెలిసిన తెలియక పోయిన మనిషిలోనిదే ఆధ్యాత్మికము.

మనిషిలోనున్న ఆత్మవలననే విజ్ఞానము బయల్పడినది. నేడు గల సైన్సు (విజ్ఞానము) అంతయు మనిషినుండే వచ్చినది.

కావున ఆధ్యాత్మికము మొదటిది, రెండవది విజ్ఞానము. ఆధ్యాత్మికము నుండి పుట్టినదే విజ్ఞానమని చెప్పవచ్చును.


ఆధ్యాత్మికము చేత విజ్ఞానమును చూడవచ్చును గాని విజ్ఞానము చేత ఆధ్యాత్మికమును చూడలేము. కారణమేమనగా

విజ్ఞానమునకు స్థూల దృష్టి మాత్రము గలదు. స్థూల దృష్టికి ఆత్మగాని, దాని అధ్యయనముగాని గోచరపడదు. ఆత్మకు

సూక్ష్మదృష్టి కలదు, సూక్ష్మదృష్టితో దేనినయిన తెలియవచ్చును. ఈ సూత్రముతోనే అగమ్య గోచరమైన జననము, మరణము

యొక్క స్థితులను వివరించడము జరిగినది. ఆత్మచేత బహిర్గతమైన ఈ విషయములు కూడ విజ్ఞాన విషయములే. అందువలన


పరిశోధనాదృష్టితో చూడమని చాలామార్లు చెప్పాము. మనము ఒక క్రొత్తవిషయమును కనిపెట్టలేక పోయినా, కనిపెట్టబడిన

విషయమునైన ఆలోచించవలసిన బాధ్యతమనకున్నది. అందరు ఆలోచించినపుడు ఒక విషయము యొక్క గొప్పతనము

బయటపడును.


ఒక్కొక్కరు ఏదో ఒక పనికిరాని విషయము చెప్పుచుందురు. వాటినన్నిటిని ఆలోచించవలెనా అని కొందరను

కోవచ్చును. అన్నిటిని ఆలోచించమని మేము చెప్పడములేదు. విజ్ఞానమని, శాస్త్రమని, సిద్ధాంతమని చెప్పిన విషయములను

మాత్రమే లోతుగ చూడవలెను. శాస్త్రముగాని వాటిని వదలమని మేము ముందే చెప్పియున్నాము. ఇక్కడ జనన

మరణములనెడివి సిద్ధాంతములు. కావున వీటిని తేలికగ కొట్టివేయక మీయొక్క విజ్ఞానముతో చూడవలెను. అట్లు

చూచుట వలన ఈ విషయములో సత్యమెంతవుందో తెలియును. జనన మరణ బోధలు విజ్ఞానములో పెద్ద మలుపులాంటి

విషయములు కావున విజ్ఞానముతో తెలియవలెనని మరియొక మారు తెలుపుచున్నాము.

ఇట్లు,

శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


జననము.


ఇక్కడ చెప్పబోవు జనన వివరము భగవద్గీతలో సాంఖ్య యోగమున "కాసాంసి జీర్ణాణి యథా విహాయ నవాని

గృష్ణతి నరో ప రాణి, తధాశరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేవా” అను శ్లోకమును ఆధారము చేసుకొని

చెప్పినది. భగవంతుడు చెప్పిన విషయములో అసత్యముండదని తెలిసినవారు ఆయన మాటను అనుసరించి చెప్పిన

జనన వివరమును అర్థము చేసుకోగలరనుకుంటాను. కేవలము విమర్శనా దృష్ఠితోనేకాక, అవగాహనా దృష్టితో చూచువారికి

భగవంతుని శ్లోకమునకు పూర్తి వివరము కూడ తెలియగలదు.


వివరము : భగవంతుడు ఈ శ్లోకమున చెప్పిన భావము నూటికి నూరుపాళ్ళు చాలామందికి అర్థముకాలేదని మేము

తెలుపుచున్నాము. ఎందుకనగా ఈ శ్లోక భావమునకు వ్యతిరేక వివరము తమకు తెలియకుండానే వారియందు నిలిచి

పోయినది. భగవంతుడు ఈ శ్లోకమున ఉదాహరణగ పాతవస్త్రము, క్రొత్త వస్త్రమని చెప్పి పాతదేహము, క్రొత్తదేహమని

కూడ వివరించాడు. కాని ఇక్కడ క్రొత్త దేహమంటే ఏమిటో తెలియక చాలామంది పై శ్లోక భావమునే హత్య చేశారని

చెప్పవచ్చును. విచక్షణ, వివరణ చూపులేని వారందరు గీతలో క్రొత్త దేహమన్నప్పుడు తలూపారు. మరికొన్ని పుస్తకములలో

గర్భమందే పూర్తి తయారుకాని అసంపూర్ణ శరీరములో జీవుడు ఆరు నెలలకే ప్రవేశించునన్నపుడు కూడ తలూపారు.

అట్లే పాతగృహము వదలి క్రొత్త గృహములో ప్రవేశించుచున్నాడన్నపుడు తలూపారు. ఆ క్రొత్త గృహమునకు పైకప్పుబడకనే

తలుపులుంచకనే సగము కూడ తయారుకాని దానిలోనికి ప్రవేశించుచున్నాడన్నప్పుడు కూడ తలూపారు. క్రొత్త ఇల్లంటే

పూర్తి తయారైనది కదాయని, క్రొత్త శరీరమంటే పూర్తి రూపురేఖలు దిద్దుకొన్నది కదాయని, యోచించలేక పోయారు.

ఎవరెట్లనుకొనిన భగవంతుడు చెప్పుమాట ఏమంటే! పాతశరీరమును వదలిన ఆత్మ, పూర్తి తయారైన క్రొత్తదనిపించుకొనిన

శరీరములో చేరుచున్నదని తెల్పుచున్నాడు. జీవాత్మ ఎచట గలదో ఆత్మకూడ దానితో కూడి ఉన్నది. కావున జీవాత్మ

జన్మించితే దానితో పాటు ఆత్మకూడ మరుజన్మమున ప్రవేశిస్తున్నది. జీవాత్మ ఎలా శరీరములు మారుచున్నదో తెలిస్తే,

ఆత్మకూడ క్రొత్తదేహమునెలా చేరుచున్నది తెలియును. కావున దానికి కావలసిన పూర్తి సవివరము ఆధ్యాత్మికరీత్యా, విజ్ఞాన

(సైన్సు) రీత్యా మరియు సిద్ధాంతరీత్యా క్రింద వ్రాయుచున్నాము చూడండి.


స్త్రీ పురుష సంయోగములో పురుషుని వీర్యము స్త్రీయోని మార్గమున ప్రవేశించి గర్భకోశమును చేరి, అందు

శరీరముగా తయారగుటకు ప్రారంభమగుచున్నది. పురుషుని వీర్యము స్త్రీ గర్భములో పూర్తి శరీరముగా తయారగుటకు

దాదాపు తొమ్మిది నెలల కాలము పట్టుచుండును. స్త్రీ గర్భములో 'మావి' అను తిత్తియందు పూర్తిగా తయారైన శిశుశరీరము

జీవములేనిది. చాలామందికి తెలియని విషయము కూడ ఇదియే. ఆరవనెలయందు శిశుశరీరమునకు ప్రాణము

వచ్చునని చాలామంది పొరబడుచున్నారు. తల్లి గర్భములోనున్న శిశువునకు ప్రాణము రావడము అబద్దము. గర్భమున

పూర్వజన్మ జ్ఞప్తి కలిగి వాపోవుట పూర్తి అబద్దము. ఇక్కడ కొందరికొక పెద్ద సంశయమేర్పడవచ్చును. అది ఏమనగా?

శిశు శరీరము లోనికి ప్రాణము రాకపోయినచో, గర్భములోని శిశువు కదులుచుండునటుల తెలియుచున్నది కదా! అది

ఎట్లు జరుగును? ఒకవేళ ఆరవ నెలయందు ప్రాణము రాక పోయినట్లయితే, శిశువు గర్భములో కదలకుండును కదా!

ఆరవ నెలనుండియే కదలిక జరుగుచున్నది. కావున శిశు శరీరమునకు ప్రాణము గర్భములోనే వచ్చినట్లు మేము

నమ్ముచున్నామని అడుగవచ్చును. దానికి మా సమాధానము తెలిపెదము. దూరము నుండి చూచి చింతచెట్టులాగయున్న

జమ్మిచెట్టును చింత చెట్టనుకొన్నట్లు, గర్భములో శిశువు కదలికకు కారణము తెలియని మనము గర్భములోనే శిశువుకు

ప్రాణమొస్తుందనడములో విశేషమేమున్నది. దగ్గరకు పోయి చూచిన కదా చింతచెట్టులాగయున్న జమ్మిచెట్టు, చింతచెట్టు


కాదని తెలిసేది. నిజముగా గర్భములో జరుగుచున్న మార్పులను గమనించిన కదా! మనకున్న సంశయము తీరునది.

కావున గర్భములో శిశుశరీరము పొందు మార్పులను గురించి తెలుసుకొందాము.


గర్భము ధరించిన మొదటి నెలనుండి దాదాపు ఆరునెలల వరకు శిశుశరీరము తయారై ఆకృతిని చేరుకొనును.

ఆరునెలల వరకు శిశుశరీరము తయారగునట్లు తల్లి శరీరములోని నాడులే చేయుచున్నవి. తల్లి శరీరములోని బ్రహ్మనాడి

నుండి బయలుదేరిన కొన్ని నరములు గర్భకోశమును ఆక్రమించి, శిశు శరీరముతో బొడ్డు ద్వార సంబంధము కలిగి, ఆ

శరీరమును పెరుగునట్లు చేయుచున్నవి. తల్లి శరీరములో భాగములుగా జీర్ణాశయము, గుండె, కాలేయము మొదలగు

అవయవములున్నట్లే, గర్భమును కూడ ఒక భాగముగా లెక్కించు కోవలయును. జీర్ణాశయము, గుండె మొదలగు

అవయవములను నాడులు ఆక్రమించి ఏవిధముగా కదలించుచున్నవో, ఆ విధముగనే ఆరునెలల తరువాత గర్భములోని

శిశువును కూడ అప్పుడప్పుడు నాడులు కదలించు చుండును. కుమ్మరివాడు కుండను ఒక ఆకృతి వచ్చువరకు ఒకే స్థితిలో

తయారుచేసి, ఒక ఆకృతి ఏర్పడిన తరువాత కుండను త్రిప్పిత్రిప్పి కొట్టి పూర్తికుండగా ఎట్లు తయారుచేయునో, అట్లే ఆత్మ

బ్రహ్మనాడి ద్వారా ఆరునెలల వరకు శిశుశరీరమును ఒక ఆకృతి వచ్చునట్లు చేసి, ఆ తరువాత ఆ శరీరమును తలక్రిందులుగను,

అడ్డముగను మరియు ఇతర స్థితులుగా మావియందు అప్పుడప్పుడు త్రిప్పుచు, పూర్తి ఆకృతి వచ్చి జీవుడు చేరుటకు తగిన

రీతిగా శరీరమును తయారుచేయును. నాడులు కదిలించు కదలికను బట్టి కొందరు గర్భములో ఆరవ నెలయందే

శిశుశరీరమునకు ప్రాణము వచ్చినదని భ్రమించుచున్నారు.


తల్లి గర్భములో నాడులు శిశుశరీరముతో సంబంధము కల్గియుండి, తొమ్మిది నెలల పర్యంతము జీవునికి

నివాసయోగ్యముగా శరీరమును తయారగునట్లు చేసి, పూర్తి శరీరము తయారైన వెంటనే ఒక్క క్షణము కూడ గర్భములో

శిశువు శరీరమును ఉంచక, గర్భకోశమును ముకుళింపజేసి, యోని ద్వారము వికసింపజేసి, శిశుశరీరమును బయటికి

త్రోసివేయుచున్నవి. శిశుశరీరము బయటపడుదాక తల్లి గర్భములోని నాడులు శిశుశరీర సంబంధము కల్గియుండును.

ఎప్పుడైతే గర్భము నుండి శిశుశరీరము బయటకు వచ్చునో, అప్పుడే గర్భములోని నాడుల సంబంధములు నిలిచిపోవుచున్నవి.

గర్భము నుండి బయటపడు శిశుశరీరము శవమువలె బయటపడును. శరీరము బయటపడు వరకు ప్రాణముండదు.

కావున దానిని శవములాగనే చెప్పుకోవలయును. ఇప్పుడు కొందరు 'గర్భములోని శిశువుకు ప్రాణము లేకపోతే అది కుళ్లి

తల్లి ప్రాణమునకే హాని కల్గించును కదా! ఆరు నెలల తరువాత ఎప్పుడైతే గర్భములో పిండము కదలక నిలిచిపోవునో

అప్పుడే తల్లికి అపాయము సంభవించుచున్నది కదా! పిండము కదలిక ఎప్పుడైతే నిలిచిపోయి తల్లికి బాధ కల్గుచున్నదో,

అప్పుడు వైద్యశాలకు తీసుకుపోతే అక్కడ వైద్యుడు ఈమెకు పిండము లోపలనే చనిపోయినదని చెప్పి, ఆలస్యము చేసినచో

ప్రమాదమని ఆపరేషన్ (శస్త్రచికిత్స) చేసి పిండమును బయటికి తీసివేయడము కూడ జరుగుచున్నది కదా! ఏమి

తెలియని మొరటువారు కూడ పిండము కదలికతో శిశువుకు ప్రాణము వచ్చినదని, పిండము యొక్క కదలిక నిలచిపోయిన

వెంటనే శిశువుకు ప్రాణము పోయినదని తెలుసుకొనుచున్నారే! మీ మాట ఎట్లు నమ్మదగును? అంతే కాక పిండములో

ప్రాణము లేకపోయిన వెంటనే తల్లికి ప్రమాదము జరుగుట కూడ తెలిసిన విషయమే. ఈ విధముగ ప్రత్యక్షముగా

తెలియుచుండుట వలన గర్భములోనే శిశువుకు ప్రాణమొస్తుందని మేము నమ్ముచున్నాము' అని అడుగవచ్చును. దానికి

మా సమాధానము ఏమనగా!


గర్భములో ఆరవ నెలయందు కదలిక వచ్చు మాట నిజమే. ఆ కదలిక నిలిచిపోయిన వెంటనే తల్లికి ప్రమాదము

సంభవించు మాట కూడ నిజమే. కాని అంత మాత్రమున శిశువుకు ప్రాణమొచ్చినదని, పోయినదని అనుకోవడము చాలా

పొరపాటు. ఆరవనెలలో ప్రాణము వచ్చినదనిన, అంతవరకు ప్రాణములేదనియే కదా అర్థము, ప్రాణములేని సమయములో

తల్లికి ప్రమాదము సంభవించవచ్చును కదా! నిజము తెలియక అందరు అక్కడే పొరపాటుపడుచున్నారు. వాస్తవ విషయము

ఏమనగా! మన శరీరములో కొన్ని అవయవములున్నను మనకు ఏ హాని కలుగకుండునట్లు, గర్భస్థ శిశువు తల్లి

శరీరములో ఒక భాగముగా ఉండి, తల్లికి ఏ హాని కలిగించకుండ ఉండును. తల్లి శరీరములోని నాడులే శిశుశరీరమును

కూడ ఆక్రమించి ఆ శరీరమును పెంచుచున్నవి. అందువలన శిశుశరీరము తల్లి శరీరములో ఒక భాగముగా ఉన్నదని

చెప్పవచ్చును. ఆరవ నెలనుండి నరముల వలన పిండము కదిలినను తల్లికి ఏ విధమైన బాధయుండదు. ఈ విధముగా

ఉండి తొమ్మిదవ నెలయందు శిశుశరీరము పూర్తిగా తయారైన వెంటనే నరముల ఒత్తిడి వలన తల్లి ప్రసవించుచున్నది.

ఈ విధముగా కాక ఎవరికైన శరీరములో ఆరోగ్యలోపము వలన ఆరవ నెలకంటే ముందు బ్రహ్మనాడి నుండి బయలుదేరిన

నరముల సంబంధము గర్భకోశముతో తెగిపోయిన ఆ గర్భము తల్లి శరీరములో వేరు పదార్థమై అక్కడ నిలువకుండ

స్రవించిపోవును. దీనినే 'గర్భస్రావము' అని అందురు. ఇది చాలామంది స్త్రీలకు ఆరునెలల లోపల జరుగుచుండును.


ఆరునెలల లోపల శిశుశరీరము ఒక స్థాయికి వచ్చియుండదు. కాబట్టి రక్తముగానో, రక్తపు ముద్దగానో బయటికి పోవును.

రక్తముగాను, మెత్తని రక్తపుముద్దగాను ఉండుట వలన బయటికి పోవుటకు అనుకూలముగా ఉండును. ఒకటి రెండు

నెలల గర్భస్రావము ఎక్కువ బాధను కలిగించదు. నెలలు ఎక్కువ అయిన కొద్ది గర్భస్రావములో బాధ ఎక్కువగును.

ఆరవ నెల తరువాత పిండము ఒక ఆకృతి ధరించి స్రవించుటకు వీలుకాక ఉండును. తల్లి అనారోగ్యము వలన

ఆరవనెల తరువాత గర్భకోశములో నాడులు గర్భముతో సంబంధము లేకుండా పోయిన ఎడల, ఆ గర్భము స్రవించుటకు

వీలులేనందు వలన, ఆ గర్భస్థ శిశుశరీరమునకు తల్లి శరీరముతో సంబంధము లేక వేరు పదార్థముగా అక్కడనే నిలిచిపోవును.

నరముల ఒత్తిడి గర్భకోశము మీద లేనందు వలన శిశుశరీరము ఇతర పదార్థముగా గర్భకోశములోనే నిలిచిపోయి

కుళ్ళుటకు మొదలుపెట్టును. శిశుశరీరము ఉబ్బుకొలది దానిని ఆనుకొని ఉండు అవయవములకు ఒత్తిడి ఏర్పడును.

స్థితిలో ఉబుకుచున్న శిశుశరీర ఒత్తిడికి మిగిలిన సున్నితమైన అవయవములు ఒకదానికొకటి ఒత్తిడి కలుగజేసుకుంటుపోయి

చివరకు గుండెకు ఒత్తిడి కల్గించును. గుండెకు కొద్ది మాత్రము ఒత్తిడి తగిలిన వెంటనే నిలిచిపోవు ప్రమాదము కలదు.

అదృష్టవశాత్తు వెంటనే వైద్యుల దగ్గరకుపోయి చెడిపోవుచున్న శిశుశరీరమును బయటకు తీసివేసినట్లయితే తల్లి బ్రతుకుటకు

వీలుకల్గును. ఈ విషయమిట్లుండగా మనము వేరువేరు విధములుగ పోల్చుకొని గర్భములోనే ప్రాణము వచ్చినది పోయినది

అనుకొనుట జరుగుచున్నది.


తల్లి ఆరోగ్యము సరిగా ఉండి పూర్తిగా తయారైన శిశుశరీరము తొమ్మిది నెలలకు గర్భకోశములోని నరముల

ఒత్తిడి వలన బయటపడుచున్నది. ఒక తానులోని వస్త్రము దర్జీవాని వలన కుట్టబడి ఒక వ్యక్తి ధరించుటకెట్లు

యోగ్యమైయున్నదో, అట్లే గర్భకోశము నుండి బయటపడు శరీరము కూడ జీవుడు నివాసము చేయుటకు అనుకూలముగ

నరముల చైతన్యము చేత తయారు చేయబడి బయటికి వచ్చుచున్నది. ఆ విధముగా బయటికి వచ్చిన శరీరమునందు

జీవుడు ప్రవేశించుచున్నాడు. చనిపోయిన వెంటనే జీవుడు ఏమాత్రము ఆలస్యము లేక బయటికొచ్చిన క్రొత్త శరీరమును

ధరించుచున్నాడు. దీనినే గీతాశాస్త్రములో 'పాతవస్త్రమును విడిచి క్రొత్తవస్త్రమును ధరించునట్లు, జీవుడు నాశనమైన

పాతశరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నాడు' అని పరమాత్మ అన్నాడు. జీవుడు క్రొత్త శరీరమును ధరించుట


వాని కర్మానుసారముగా ఉండును. జీవుడు చేసుకొన్న పాపపుణ్యములను అనుసరించియే క్రొత్త శరీరము కూడ లభ్యమగును.

ఒక తల్లిగర్భము నుండి బయటపడిన శరీరమును ధరించుటకు తగిన జీవుడు వేరొక శరీరము నుండి వచ్చి ప్రసవింపబడిన

శరీరములో ప్రవేశించుచుండును. తల్లిగర్భము నుండి బయటపడు శరీరము యొక్క తల బయటికి వచ్చినంత మాత్రముననే

ఆ శరీరములో జీవుడు ప్రవేశించుటకు అవకాశము కలిగియుండును. అందువలన కొద్ది మాత్రము బయటికి వచ్చిన

శరీరము కూడ ప్రాణము కలిగి అరుచుట మొదలుపెట్టును. కొన్ని చోట్ల ఒక నిమిషము మొదలుకొని గంట రెండుగంటల

వరకు శిశుశరీరములోనికి ప్రాణము రాకుండుట సంభవించుచున్నది. దానికి కారణము ఆ శరీరములో ప్రవేశించు

జీవుడు పాతశరీరమును వదలడములో ఆలస్యమై ఉండవచ్చును. అనగా ఆ శరీరములో ప్రవేశించు జీవుడు వేరొక చోట

మరణించుట ఆలస్యమైనదన్న మాట. అందువలన ఇక్కడ కూడ శిశుశరీరము బయటికి వచ్చిన తరువాత ఆలస్యముగానే

జీవుని ప్రవేశము జరుగుచున్నది. కొన్ని చోట్ల శిశుశరీరము బయటికి వచ్చిన తరువాత ప్రాణము వచ్చుటకు కొన్ని

గంటల కాలము జరిగిన సందర్భములు కూడ కలవు. 12 గంటల తర్వాత ప్రాణము వచ్చిన సంఘటనను 52 వ పేజీలో

చూడవచ్చును.


ప్రసవింపబడిన శరీరములోనికి జీవుడు ఆలస్యముగా ఎందుకు చేరుచున్నాడని తెలియని గ్రామీణ ప్రాంత

మంత్రసానులు, మావియందు ప్రాణమున్నదని మావిమీద నీళ్ళుపోసి తట్టుచుందురు. తెలియనితనముతో ఇక్కడ

మంత్రసానులు మావిని నీటితో తట్టుచుండగా, జీవుడు వేరొక చోటినుండి వచ్చి శరీరములోనికి ప్రవేశించుచున్నాడు.

జీవుడు ప్రవేశించినపుడే శ్వాస శరీరములోనికి ప్రవేశించుచున్నది. అందువలన మొదటి శ్వాసతో జన్మకలుగుచున్నదని

చెప్పవచ్చును. శిశు శరీరములో జీవుడు ప్రవేశించగానే అరుచుటకు మొదలు పెట్టును. అపుడు మంత్రసానులు మావిలోని

ప్రాణము శిశువులోనికి వచ్చినదని బొడ్డుకోయుదురు. ప్రాణము రాకముందు బొడ్డును కోసిన, మావిలోని ప్రాణము

శరీరములోనికి రాలేదని వారి నమ్మిక. అందువలన ప్రాణము రాకముందు బొడ్డుకోయరు. ప్రాణము రాకముందు

బొడ్డుకోసిన ఎడల, ఆ శిశుశరీరములోనికి ప్రాణము రాకపోవు మాట నిజమే. మావి నుండి ప్రాణము వస్తుందనడము

మాత్రము అబద్దము.


బొడ్డు కోసిన తరువాత ప్రాణము రాకుండా పోవుటకు కారణమేమనిన, క్రొత్తగా మొలకెత్తు చింత మొలకకు,

విత్తనపు బేడలు ఏ విధముగా ఆహారబలము ఇస్తున్నవో, ఆ విధముగానే క్రొత్తగా బయటపడిన శరీరమునకు, జీవుడు

ప్రవేశించు వరకు మావి ఆధారమై శిశుశరీరములోని రక్తము గడ్డకట్టకుండునట్లు చేయుచున్నది. ఆ విధముగా కొంతసేపు

మాత్రము చేయగలదు. జీవుడు ప్రవేశించిన వెంటనే శ్వాస రక్తప్రసరణము జరుగుచున్నవి. కావున మావితో అవసరము

లేదు. అందువలన బొడ్డుత్రాడును కోసివేసి మావిని వేరు చేయుచున్నాము. జీవుడు శరీరములో ప్రవేశించక ముందే

బొడ్డును కోసిన, రక్తము చల్లారి శరీరములో గడ్డకట్టుకుపోయి జీవుడు ప్రవేశించుటకు శ్వాస జరుగుటకు అయోగ్యమగును.

అందువలన ముందే బొడ్డుకోయు పద్ధతి మంచిది కాదు. ఒకవేళ తెలియనివారు ముందే బొడ్డు కోసిన ఆ శరీరములోని

రక్తము చల్లారక ముందే ఒక నిమిషము లోపల జీవుడు వచ్చి చేరినా చేరవచ్చును. ఆ నిమిషములోనే వచ్చి చేరలేకపోతే

ఆ శరీరములో రక్తము గడ్డకట్టి పనికిరానిదై పోవును. అందువలన తెలిసిన వారుకాని, తెలియని వారుకాని, ప్రాణము

రాకముందే బొడ్డుకోయరాదు. బొడ్డు ముందు కోయని కారణమున మావినుండే ప్రాణమొస్తున్నదని చాలామందికి

నమ్మికయున్నది. ఆ నమ్మికయున్న మంత్రసానుల మాటవిని 'ఏమమ్మా మీరు ఆరవ నెలలో శిశువుకు ప్రాణమొచ్చినదని

అంటుంటారే, అట్లయిన తల్లి ప్రసవించినపుడు శిశు శరీరములో ప్రాణమొచ్చినది శిశువుకా? లేక మావికా? శిశువుకు


ప్రాణమొచ్చియుంటే అది శిశువులో ఉండక మావిలోనికి ఎందుకు పోయినది, తిరిగి శరీరములోనికి ఎందుకు వస్తున్నది?

అని అడిగితే వారు ఏమాత్రము సమాధానము చెప్పలేరు.


మన జన్మను గురించి మనమే తెలుసుకోలేని అజ్ఞాన అంధకారములో ఉండి చీకటిలోనున్న వస్తువును గురించి

ఊహించి చెప్పినట్లు, తెలియని పుట్టుకను గురించి కొందరు ఆరవనెలయందు జీవుడు తల్లిగర్భములో ప్రవేశించి పూర్వ

జన్మలను తలచుకొని బాధపడుననుట ఎట్లున్నదో మీరే ఆలోచించండి. పూర్వ కాలములో పుట్టిన తరువాతనే ప్రాణమొస్తుందని

విశ్వసించేవారు. ధర్మములన్ని అధర్మములుగా మారిపోవునని పరమాత్మ చెప్పినట్లు, ఇప్పుడు ప్రాణము పుట్టక పూర్వమే

ఉన్నదని అంటున్నారు. పూర్వము, పుట్టిన శరీరములోనికి ప్రాణమొచ్చినపుడు జీవునకు జన్మ కలిగినట్లు లెక్కించుకొని, ఆ

లెక్క ద్వారా జాతకచక్రము గీచి చూచెడివారు. ఇప్పటికి ఆ పద్ధతి ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము కూడ శరీరములో

మొదట శ్వాస ఎప్పుడు ప్రవేశించుచున్నదో, అప్పుడే జన్మ అని గ్రహించెడివారు. ఈ కాల జ్యోతిష్యములో ప్రసవము

జరిగిన సమయమునే జన్మగా లెక్కించుకొనుచున్నారు. నిజమైన జన్మ శ్వాస శరీరములో ప్రవేశించినపుడే అవుచున్నది.

కాబట్టి లెక్క ప్రకారము జ్యోతిష్యము చక్కగా తెలిసెడిది. ఇపుడు ప్రసవ సమయమునే జన్మగా లెక్కించుకొనుచున్నారు.

కావున భవిష్యత్తు చక్కగా తెలియకున్నది. ఆరవనెలయందు జీవుడు క్రొత్త శరీరమును చేరియుండిన జ్యోతిష్యులు దానినే

జన్మగా లెక్కించుకోవలయును కదా! అట్లుకాక ప్రసవించిన తరువాత లెక్కించుకొనుచున్నారంటే ధర్మము పూర్తి నాశనముకాక

ఇంకను కొద్దిగ మిగిలి ఉన్నదని అర్థమగుచున్నది.


నేటి శరీర శాస్త్రజ్ఞులకు మరియు వైద్యులకు (డాక్టర్స్) ఈ విషయములో చాలా అనుమానములు ఉండవచ్చును.

ఎందుకనగా వారు చదివిన చదువులో పురుషుని శరీరములో తయారైన వీర్యమునందు వీర్యకణములకే ప్రాణమున్నట్లు

తెలియబరుచబడియున్నది. అందువలన ఒక వైద్యుడు మా బోధ విన్న ఒక వ్యక్తితో కలిసి “ఆయన చెప్పునది పూర్తి

శాస్త్రవిరుద్ధము. శరీర శాస్త్రజ్ఞులుగాను, వైద్యులుగాను ఉన్న మాకంటే ఆయనకు ఎక్కువగా తెలిసియుండునా? ప్రసవించిన

తరువాత శరీరానికి ప్రాణము రావడము పూర్తిగా అసత్యము. ఆరవనెలలో ప్రాణమొస్తుందని మిగతా వేదాంతులు

చెప్పుమాట కూడ అసత్యమే. పురుష వీర్యములోనే వీర్యకణములు జీవము కలిగియున్నవి. జీవము గల వీర్యకణము

శరీరములో రజోకణముతో కలిసి శరీరముగా మార్పుచెంది, తొమ్మిది నెలల తరువాత జీవముతోనే తల్లిగర్భము నుండి

బయటికి వస్తున్నది. జీవము లేకుండ వస్తున్నదను మాట చాలా పొరపాటు. వీర్యములో వీర్యకణమునకు జీవమున్నట్లు

మేము ఎన్నో నిదర్శనములు చూపగలము. ప్రాణము గల జంతు శరీరములో నుండి వీర్యమును తీసి, కొంతకాలము

బయట తగిన వాతావరణములో ఉంచి, అవసరమేర్పడినపుడు ఆ వీర్యమును స్త్రీ జంతువు యొక్క యోనిలో వదలి దానికి

గర్భమేర్పరుచుచున్నాము” అని పలుకుచున్నారు. వీర్యమునకు ప్రాణమున్నదని ఆ వ్యక్తి పూర్తిగా నమ్ముటకు మిక్కిలి చల్లని

వాతావరణములో అనగా 0° నుండి 4° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఒక ప్లాస్కునుండి టెస్టుట్యూబు మాదిరి ఉండిన ఒక

గాజు గదిలో భద్రపరచి ఉన్న పశు వీర్యమును తీసి వెంటనే గాజు పలకమీద ఉంచి, మైక్రోస్కోపు (సూక్ష్మదర్శిని) నందు

చూపినపుడు, ఒక చుక్క వీర్యములో తల తోక కలిగిన వీర్యకణములు అసంఖ్యాకములుగా ఉండి, అవి చలనము కలిగి

తోకను కదలించుచు ముందుకు ఈదుచున్నటుల కనిపించుట వలన, ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి వీర్యములోని

వీర్యకణములకే ప్రాణమున్నదని పూర్తి విశ్వసించుచున్నాడు. వీర్యములోని వీర్యకణము యొక్క చిత్రమును క్రింద పటములో

(పేజీ 11 లో చూడండి )

చూడవచ్చును.




వీర్యములో వీర్యకణములు కదులుచుండుట చూచిన ఆ వ్యక్తి వీర్యమునకే జీవముండగా, ప్రసవింపబడిన తరువాత

జీవమొస్తుందనడము అబద్దమైయుండ వచ్చునని భావించి, ఆయన మమ్ములను కలిసి "స్వామిగారు! జీవుడు జన్మపొందు

విషయమై మీరు చెప్పిన బోధ విన్న నేను, ఒక పరిశోధనలో వీర్యమునకు ప్రాణమున్నట్లు చూచాను. వీర్యములో

వీర్యకణములకు ముందే జీవముండగ ప్రసవింపబడిన తర్వాత జీవమొస్తుందన్న మీ మాట మాకు సంశయముగా ఉన్నది.

ఒకవేళ ప్రసవానంతరము జీవమొచ్చునట్లు భావించిన వీర్యకణము కదలుట కళ్ళార చూచాము కదా! అను సంశయమొక

వైపు ఏర్పడుచున్నది. అందువలన మీరు చెప్పిన బోధ నిజమా? లేక వైద్యులు చెప్పి చూపించినది నిజమా? ఏది నిజము

ఏది అబద్దము అను సందిగ్ధావస్థలో ఉన్నాను. దీని విషయమై మీరేమందురు” అని ఆయన మమ్ములను ప్రశ్నించాడు.


ఇంతకు ముందు ఆధ్యాత్మిక గ్రంథములలో ఆరునెలలకు జీవము వస్తుంది అన్న విషయము నిజముకాదని,

ప్రసవింపబడిన తరువాత జీవమొస్తుందని మా సిద్ధాంతమును తెలియజేసాము. ఇప్పుడు వైద్యులు వీర్యమునకే జీవమున్నట్లు

వారి ఉద్ధేశ్యమును తెలియబరచుచున్నారు. కావున వారి సంశయము తీరునట్లు క్రింద విజ్ఞానరూపముగా తెలుపుచున్నాము

శ్రద్ధగా గ్రహించుము.


జీవుడు కనిపించువాడు కాదు. జ్ఞాననేత్రమునకు మాత్రము జీవుడు కనిపించగలడు. జ్ఞాననేత్రములేని వైద్యులు

కదులుచున్న వీర్యకణములో జీవము ఉన్నట్లు భావించుకొనుచున్నారే కాని జీవమును చూడలేదు. కదలుచున్నంత మాత్రముననే

జీవమున్నట్లు ఎందుకు భావించుకోవలమును? కణమునకు కదలిక ఉండుట వలన జీవమున్నట్లు ఊహించితే, బస్సులు

రైళ్ళు కదలుచున్నవి కదా! వాటికి జీవమున్నదా? మనుష్యులు లేకుండానే అంతరిక్షములో ప్రయాణించు రాకెట్లకు జీవమున్నదా?

లేదు. కదలుచున్న యంత్రములకు జీవమెట్లు లేదో, ఆ విధముగానే కదలుచున్న వీర్యకణమునకు జీవములేదని

చెప్పుచున్నాము. జీవము లేకుండిన వీర్యకణము ఎందుకు కదులుచున్నదని కొందరిలో సంశయమేర్పడవచ్చును.

సంశయము తీరుటకు వీర్యములోని వీర్యకణము పురుష శరీరములో ఏ విధముగా తయారగుచున్నదో సంపూర్ణముగ

తెలుసుకోవలసియున్నది. అందువలన నేటి శరీర శాస్త్రజ్ఞులకు మరియు వైద్యులకు తెలియని జనన సిద్ధాంతమును ఈ

కాల శరీర శాస్త్రమును అనుసరించియే తెలుపుచున్నాము.


పురుష శరీరములో అంగమునకు ప్రక్కలయున్న బీజములలో (వృషణములలో) వీర్యము తయారగును. బీజములు

జంతువులకు పెద్దవిగా యుండును. మానవులకు చిన్నవిగ ఉండును. జంతువులకు, మానవులకు అనగా పిండము

నుండి ఉద్భవించు అన్ని జీవులకు వీర్యము తయారగును. మానవుని బీజములలో 200లకు పైగా లాబ్యూలులు అను

సూక్ష్మ భాగములుండును. ప్రతి లాబ్యూలు అను సూక్ష్మభాగములోను మడతలుగ ఒక కట్ట మాదిరియున్న నాళములున్నవి.

వీటినే వీర్యోత్పత్తి నాళములని అనుచున్నాము. ఈ మడతలుగల నాళములలోనే వీర్యాణువులు ఉత్పత్తి అగుచున్నవి.

వీర్యోత్పత్తి నాళములన్ని ఒకటిగా చేరి ఎపిడైడిమిస్ అను ఒక పెద్ద గొట్టముగా ఉదరభాగములోనికి ప్రవేశించి అక్కడ ఒక


తిత్తిగా విస్తరించి ఉండును. వీర్యము ఈ తిత్తిలో నిలువ ఉండును. అందువలన దీనిని వీర్యాశయమని అనుచున్నాము.

రెండు బీజములనుండి వచ్చు నాళములు రెండు వీర్యాశయములుగా విస్తరింపబడి ఉండి, వీర్యాశయముల నుండి నాళములు

బయలుదేరి ప్రోస్టేటు అను గ్రంథిలోనికి పోయి, అచటి నుండి మూత్రనాళములోనికి తెరుచుకొని ఉన్నవి. మానవుని

బీజనిర్మాణము ప్రక్కపేజీలోని పటము (పేజీ 12 లో చూడండి )చూడవచ్చును.


బీజములలో తయారైన వీర్యకణములు ఎపిడైడిమిస్ చేరి, అక్కడి నుండి వీర్యనాళము ద్వారా వీర్యాశయములోనికి

పోయి, కొంతకాలము నిలువయుండి స్కలన కాలములో ప్రోస్టేటు గ్రంథి ద్వారా వచ్చినపుడు, అది స్రవించిన పాలవంటి

పలుచని ద్రవముతో కలసి మూత్రనాళములోనికి వచ్చి, అక్కడ కౌపర్ అను చిన్న గ్రంథులు తయారు చేసిన ద్రవమును

మరియు మూత్రనాళములో మ్యూకస్ అను పొర స్యంధించిన మ్యూకస్ అను జిగురు పదార్ధమును కలుపుకొని వీర్యము

తెల్లని జిగురు పదార్థముగా బయటికి వస్తున్నది. దీనినే వీర్యము అంటాము. ఇంగ్లీషులో స్పెరం (Spem) అంటారు.


వీర్యములో గల వీర్యకణములు తల (శిరస్సు) కంఠము (మెడ) తోక (వాలము) అను మూడు భాగములుగా

ఉండును. బీజవీర్యనాళములో తయారైన వీర్యకణము చలనరహితమైనది. బీజవీర్యనాళములో తయారైన వీర్యకణము

పూర్తి పరిమాణము పొందియుండదు. ఎపిడైడిమిస్లోను, వీర్య నాళములోను మరియు వీర్యాశయములోను వీర్యకణము

యొక్క పూర్తి ఆకారము తయారగును. వీర్యకణము పూర్తి పరిమాణము పొందిన తరువాతనే చలనము కలిగియుండును.

పూర్తి ఆకారము తయారుకానంత వరకు చలనము ఉండదని ముఖ్యముగా గ్రహించవలయును. పూర్తిగా తయారైన

వీర్యకణము ద్రవపదార్దములో ఒక నిమిషానికి నాలుగు మిల్లి మీటర్ల వేగముతో ఈదుతూ ఉండును. వీర్యకణము యొక్క

తోక పాముతోక కదిలినట్లు కదులుచుండుట వలన వీర్యకణము ముందుకు కదిలిపోవుచుండును. వీర్యకణములు ఆమ్లగుణ

ద్రవపదార్థములో చలించలేవు. క్షారగుణ ద్రవ పదార్ధములో చలించగలవు. పురుష శరీరములో వీర్యకణములు కొన్ని

వారాలపాటు చలనశక్తి కలిగి ఉంటాయి. స్కలితమైన తరువాత కొన్ని గంటలకాలము మాత్రమే స్త్రీ దేహ శీతోష్ణస్థితిలో

చలించగలవు.


ఇపుడు వీర్యకణము చలించుటకు కారణమేమిటను విషయము పరిశీలించినట్లయితే వీర్యాశయము లోపల గ్లూకోజ్

అధికముగాయున్న ద్రవము స్యంధింపబడుతుంది. వాలము కలిగిన వీర్యకణమునకు గ్లూకోజ్ తగిలిన వెంటనే వాలము

చలించును. వీర్యాశయములోని ద్రవములో గ్లూకోజ్ స్యంధనము మామూలుగా ఉండును. కావున వీర్యకణము ఎన్ని

రోజులైన పురుష శరీరములో చలనము కలిగియే ఉండును. ద్రవములో గ్లూకోజ్లోని ఎడల వీర్యకణము చలించలేదు.

సున్నపురాయికి నీరు తగిలిన వెంటనే ఏ విధముగా చలనము పుట్టుచున్నదో, నిమ్మరసమునకు సోడా తగిలిన వెంటనే

ఏవిధముగా చలనము వచ్చునో, పాదరసమునకు వేడి తగిలిన ఏ విధముగ చలించుచున్నదో ఆ విధముగనే వీర్యకణ

వాలమునకు గ్లూకోజ్ తగిలిన వెంటనే వాలములో కదలిక ఏర్పడును. గ్లూకోజు వీర్యకణవాలమునకు సరిపడదు.

కావున వీర్యకణవాలమునకు ఎప్పుడు గ్లూకోజ్ తగులునో అపుడు రసాయనికక్రియ ఏర్పడును. ఆ క్రియయే వీర్యకణ

వాల చలనము. వీర్యకణవాలము కదలుట వలన వీర్యకణమంతయు కదులును. అంతమాత్రమున వీర్యకణమునకు

జీవమొచ్చినదనడము పొరపాటు. శాస్త్రజ్ఞులందరు ఇక్కడే పొరపడుచున్నారు. ఎప్పుడైతే గ్లూకోజ్లకుండ పోవునో అపుడు

వీర్యకణ చలనము నిలిచిపోవునను విషయము ముఖ్యముగా గ్రహించవలెను.


శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారము వీర్యకణము జీవము కలదియే అయితే దాని చలనము ముందుకు మాత్రమేయుండక

వెనుకకు ప్రక్కలకు కూడ ఉండవలయును. దానికి జీవములేనిదాని వలన ప్రక్కలకు వెనుకకు చలించలేదను విషయము

ముఖ్యముగా గమనించవలయును. గ్లూకోజ్కు వాలమునకు సరిపడని కారణమున, వాలము చలించుట వలన, వీర్యకణము

ముందుకే పోవుచుండునని గ్రహించుము. వీర్యకణవాలచలనమనెడి రసాయనిక క్రియ వలన గ్లూకోజ్ ఖర్చయి పోవుచుండును.

గ్లూకోజ్ ఖర్చయి వీర్యద్రవములో లేకుండా పోయినపుడు, వీర్యాశయము గ్లూకోజ్ను సంధించుచునేయుండును. అందువలన

వీర్యకణ చలనమునకు లోపల ఏ ఆటంకములేదని చెప్పవచ్చును.


సంయోగ సమయములో వీర్యము స్త్రీయొక్క యోనిలో విడువబడును. వీర్యములోని వీర్యకణము స్త్రీగర్భములోని

రజోకణముతో కలిసినపుడే స్త్రీ గర్భము ధరించుటకు వీలున్నది. వీర్యకణము గర్భాశయములో ఉన్న రజోకణముతో

కలియుటకు చాలా దూరము పోవలసియుండును. వీర్యకణవాల చలనము వీర్యకణమును ముందుకే తీసుకొని పోవును.

వీర్యకణము కొంతదూరము ప్రయాణించిన తరువాతే రజోకణముతో కలియుటకు వీలుకలదు. వీర్యకణ చలనము

రజోకణముతో కలియుటకే నిర్మింపబడినది. లేకపోతే చలనముతో అవసరమేలేదు. స్త్రీయోనియందు స్కలనము జరిగిన

వీర్యములో గ్లూకోజ్ ఉన్నంతవరకు వీర్యకణములు చలించి ముందుకు పోవును. గ్లూకోజ్ అయిపోయిన వెంటనే నిలిచిపోవును.

వీర్యకణము కదులుచు ఎంత ముందుకు పోగలదు అన్న విషయము వీర్య ద్రవములో ఉన్న గ్లూకోజ్నుబట్టి నిర్ణయించవచ్చును.

స్కలన కాలములో ప్రోస్టేటు గ్రంథి తన స్యంధనములో ఎక్కువ గ్లూకోజ్ను సంధించగలదు. అందువలన వీర్యకణము

యోనిలో చలనము కలిగి ముందుకు పోగలదని చెప్పవచ్చును.


ఆమ్లగుణద్రవములో గ్లూకోజ్ ఉండినప్పటికి రసాయనిక క్రియ జరుగక వీర్యము చలనములేనిదవును. క్షార

గుణద్రవములో మాత్రమే గ్లూకోజ్ సంయోగము వలన చలనము కలిగి ముందుకు పోగలదు. స్త్రీ యోనిలో ద్రవములు

ఆమ్లగుణము కలవిగా ఉన్నాయి. అందువలన యోనిలో వీర్యకణములు చలనరహితమైపోయి ముందుకు సాగలేని స్థితి

ఏర్పడుచున్నది. స్త్రీయోనిలో పడిన వీర్యము ఆమ్లద్రవ ప్రభావము వలన నిర్వీర్యమై పోకుండ ప్రోస్టేటు గ్రంథి క్షారగుణము

గల తెల్లని ద్రవమును స్కలనాకాలములో స్యంధించును. స్కలితమైన వీర్యములో క్షారగుణ ద్రవము ఉండుటవలన వీర్యము


స్త్రీయోనిలోని ఆమ్లద్రవములో నిలిచిపోకుండ రెండు మూడు గంటల కాలము వరకు చలించగలుగును. వీర్యము తెల్లగా

ఉండుటకు ప్రోస్టేటుగ్రంథి కారణమేనని తెలియుము.



స్త్రీ పురుషులు సంయోగము చేసిన ప్రతిసారి వీర్యకణము స్త్రీ రజో కణముతో చేరలేదు. ప్రతి సంయోగములోను

వీర్యకణ చలనమునకు కావలసిన గ్లూకోజ్ అయిపోవడమో లేక యోనియందు ఆమ్లగుణ ద్రవ ప్రభావము ఎక్కువ కావడమో

ఉండును. ఒకవేళ వీర్యములో గ్లూకోజ్ సంపూర్ణముగావుండి క్షారగుణ ద్రవము కూడ ఎక్కువయుండిన వీర్యకణము పూర్తి

ముందుకు పోయినప్పటికి గర్భకోశములో అ సమయానికి రజోకణము లేకపోయినట్లయితే  ఆ సంయోగము

నిష్ప్రయోజనమగును. ఎప్పుడో ఒకప్పుడు అన్ని అనుకూలములు ఏర్పడితే వీర్యకణము రజోకణముతో కలుస్తుంది. ఏ

ఒక్క అనుకూలము లేకపోయిన ఆ సంయోగము ఫలించదు. అందువలన మానవుల అన్ని సంయోగములు ఫలించవని

చెప్పవచ్చును. దీని కారణముననే కొందరికి సంతానము ఆలస్యముగా జరుగుచుండును. పిండజములైన జంతువులు

ఒక్క పర్యాయము సంయోగించిన అది సఫలమై సంతతి జరుగును. దీనికి కారణము జంతు వీర్యములో క్షారగుణ

ద్రవము ఎక్కువగ ఉండుటయు మరియు వీర్యములో గ్లూకోజ్ కూడ అధికముగా ఉండునని తెలుసుకొనుము.

జంతువులో రజోకణము తయారైనపుడే ఆ జంతు శరీరములో మార్పులు కనిపించి పురుష జంతువును ఆకర్షించును. ఆ

మార్పును చూచినపుడే పురుష జంతువులలో కామగుణము పుట్టును. స్త్రీ జంతువులలో కూడ రజోకణము తయారు

అయినపుడే కామవాంఛకల్గును. అపుడే పురుష జంతువు కోసము ప్రాకులాడును. స్థితినే ఎద (మనసైనదని)

అయినదని మనము అంటూవుంటాము. రజోకణము తయారైనపుడే సంయోగము జరుగుచున్నది. మరియు ఆ వీర్యములో

కణములు ముందుకు పోవు అనుకూలతలు ఉన్నాయి. అందువలన జంతు సంయోగము ఒక్క పర్యాయము జరిగిన

వెంటనే అది సఫలమగును. మనుష్య సంయోగములో వీర్యమునకు ఎన్నో ఆటంకములు ఉన్నవి. కావున మానవుల

సంయోగము ఎన్ని మార్లు జరిగిన అది సఫలము కాకపోవచ్చును.


వీర్యకణము శరీర ఉష్ణోగ్రతలో గ్లూకోజ్ కలయికతో రసాయనిక క్రియ వలన చలించగలదు. వీర్యకణ గ్లూకోజ్

రసాయనిక క్రియకు ఉష్ణోగ్రత అవసరమని ఇక్కడ తెలియుచున్నది. శరీర ఉష్ణోగ్రతకంటే కొద్దిపాటు ఎక్కువ ఉష్ణమైన

ఫరవాలేదు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలో రసాయనికక్రియ జరుగదు. మరియు వీర్యకణము చెడిపోవును. అదే విధముగా

శరీర ఉష్ణోగ్రతకంటే కొద్దిగా ఉష్ణోగ్రత తగ్గిన వీర్యకణ గ్లూకోజ్ రసాయనిక క్రియ జరుగును. కాని పూర్తి శీతలము

ఏర్పడినచో రసాయనిక క్రియ జరుగదు. ఎక్కువ శీతలములో వీర్యకణము చెడిపోదు. ఇప్పటి ఉష్ణోగ్రత కొలత ప్రమాణములో

0° సెల్సియస్ శీతలములో ఉంచిన వీర్యము చెడిపోదు. ఆ శీతలములో వీర్యమునందు రసాయనిక క్రియ జరుగక

నిలిచిపోవును. కాని వీర్యకణములు చెడిపోవు. రసాయనిక క్రియ జరుగనందున వీర్యములోని గ్లూకోజ్ ఖర్చుకాక అట్లే

యుండును. అందువలన ఈ కాలములో వీర్యమును బయట “0°సెల్సియస్" శీతల ప్రదేశములో నిలువయుంచుచున్నారు.

నిలువ ఉంచిన వీర్యమునకు తిరిగి వేడి తగిలిన వెంటనే రసాయనిక క్రియ జరిగి చలించుటకు మొదలు పెట్టును.

కావున వీర్యమును అవసరమొచ్చినపుడు సంతాన కార్యమునకు వాడుకొనుచున్నారు. ఈ కార్యము పశువుల ఎడల

ఎక్కువగా చేయుచున్నారు.


ఈ కాల శాస్త్రజ్ఞులకు జ్ఞాననేత్రముగాని, సూక్ష్మదృష్టిగాని ఉండవు. కావున వారి భావనలన్నియు స్థూల పరిశోధనల

మీద ఆధారపడియుండును. వీర్యకణము కదులుచున్నదంటే దానికి ప్రాణము ఉన్నట్లేనని వారి అంచనా యుండును.


వారికి జీవుని విషయము తెలియదు. జీవుడు ఒకచోట నివశించుటకు వానితోపాటు ఎన్ని భాగములు (శక్తియుత

భాగములు) ఉండవలయునను విషయము వారికి తెలియదు. జీవుడు ఒక వీర్యకణములోనే కాక, ఏ శరీరములో

నివసించిన అక్కడ పంచభూతములు ఉండవలయును. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమితో తయారైన మనస్సు,

బుద్ధి, చిత్తము, అహము అను మొదలగు ఇరువది నాలుగు భాగములు ఉండు చోటునే జీవుడు నివాసము చేయగలడు.

అట్లు కాక 24 భాగములులేని చోట జీవుడు ఉండడని తెలియవలెను. జీవుడు మరణములో పాతశరీరమును వదలి,

జన్మలో క్రొత్త శరీరమును ధరించునని పరమాత్మ గీతయందు తెలిపియున్నాడు. మరియు క్రొత్త శరీరములో బాల్యము,

యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అను దశలు ఉండునని తెలిపినాడు. కాని వీర్యకణముగా గర్భములో వృద్ధి

చెందునట్లుగా తెలిపియుండలేదు. జీవుడు ధరించు శరీరము స్థూలము, సూక్ష్మము అని రెండు భాగములుగ ఉండును.

ఈ రెండు భాగములలో స్థూలభాగము లేకపోయినప్పటికి, సూక్ష్మభాగముండిన దానియందు జీవుడు నివాసము చేయగలడు.

కాని సూక్ష్మము లేకపోయిన జీవుడు నివాసము చేయలేడు. జీవుడు నివాసము చేయు విధానము సాంఖ్యయోగము

తెలిసిన యోగులకు మాత్రమే తెలియును. ఈనాటి డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు తెలియదు. జీవమును జ్ఞాననేత్రమున్న

యోగులు మాత్రము చూడగలరు. డాక్టర్లు, శాస్త్రజ్ఞులు తమ స్థూలనేత్రములతో చూడలేరు.


వీర్యకణము తోక, తల కలదిగా తెలిపియున్నాము. తోక చలనము కలిగి తలగాయున్న దానిని ముందుకు

తోసుకొనిపోవును. వాలము వీర్యకణ తల భాగమును ముందుకు తీసుకుపోవు వాహనముగానే ఉన్నది. వీర్యకణములోని

తలయే సంతానమునకు కారణమని తెలియుచున్నది. ఇంతకు ముందు వీర్యకణ వాలము గురించియే తెలుసుకొన్నాము.

ఇపుడు దాని తలను గురించి తెలుసుకొందాము. వీర్యకణ తల లోపలి భాగమున ఒక గుండ్రని భాగమున్నది. అది

బంతివలె ఉండును. ఆ గుండ్రని కణము ఒక విధమైన ప్రకాశము కలిగి ఉండును.


పరిశోధించి గుండ్రని భాగములోని ప్రకాశమును చూడవచ్చును. ఈ గుండ్రని భాగము స్త్రీగర్భములో రజోకణముతో

కలసి శరీరముగా మారుటకు అనుకూలముగా నిర్మాణమైయుండును. ఇదియే పురుష వీర్యములోని బీజమని చెప్పవచ్చును.


స్త్రీ గర్భకోశములో ఓవరీ (Ovary) అన్న భాగము నుండి రజోకణము తయారగును. రజోకణము ఓవరీలో

నెలకొక్కటి తయారగుచుండును. రజోకణమునే ఇంగ్లీషులో ఓవమ్ (Ovum) అని కూడ అందురు. ఈ రజోకణము

ప్రొటోప్లాజము అను పదార్ధముతో తయారైయుండును. బాదము గింజ ఆకృతి గల ఓవరీలు స్త్రీగర్భకోశములో గర్భాశయానికి

రెండువైపుల రెండు వుండును. ఓవరీలో తయారైన రజోకణము గర్భాశయానికి దగ్గరగా యున్న నాళములోనికి పోయి

నిలిచియుండును. పురుష వీర్యములోని వీర్యకణము సంయోగము చెందిన తరువాత యోనిలో ముందుకు చలించుచు

పోయి, వికసించుకొన్న పుష్పపు ఆకృతి కలిగిన భాగములో ప్రవేశించి, అందుగల నాళము ద్వారా గర్భకోశమునకు పోయి,

గర్భాశయ మొదటి భాగములో ఉన్న నాళమందలి రజోకణముతో కలియుచున్నది. రజోకణము వీర్యకణము కలియడమునే

గర్భధారణయని అందురు. రజోకణముతో కలిసిన వీర్యకణము తిరిగి గర్భాశయములోనికే వచ్చి, అందులోగల జిగురు

పదార్థముతో తయారైన పొరలలో చొచ్చుకొని పోయి స్థానమేర్పర్చుకొని శిశువుగా వృద్ధిపొందును.


స్త్రీ రజోకణముతో వీర్యకణము కలిసినపుడు వీర్యకణ తల భాగములోని గుండ్రని కణము అనేక కణములుగా

విభజనచెంది (Mitosis), ఆ కణములన్నియు కలిసి ఒక శరీరముగా తయారగుటకు మొదలుపెట్టును. వీర్యకణము

అనేకముగ విభజింపబడుట కూడ రసాయనిక ప్రక్రియయేనని తెలుసుకొనుము. వీర్యకణము స్త్రీ శరీర జనిత ప్రొటోప్లాజ


రజోకణముతో కలిసినపుడే ఈ రసాయనిక క్రియ జరుగును. వీర్యకణ తలలోని గుండ్రని భాగము మరియు

రజోకణము రసాయనిక క్రియకు అనుకూల పదార్థములతో తయారైనవని తెలుసుకొనుము. ఈ రెండు పదార్థములు

జీవరహితములేనని జ్ఞప్తికుంచుకొనుము. ఈ రెండు పదార్థముల యొక్క కలయిక వలన ఏర్పడిన రసాయనిక క్రియలో

వీర్యకణము అనేక కణములుగా చీలిపోవుచు, ఆ కణములన్నియు ఒక గుంపుగా చేరుచు, శిశుశరీరము తయారగును.

గర్భోత్పత్తి అయిన మూడవ నెలనుండి గర్భాశయములో వీర్యకణ అభివృద్ధి జరుగుచున్న పొరను అంటి రక్తపుష్కలమైన

ఒక సంచివంటి పొర నిర్మితమగును. దీనిలో ఉండే రక్తనాళములకు తల్లిలో ఉండే రక్తనాళ శాఖలు కలిసివుంటాయి. ఈ

రక్త నాళముల నుండి బయలుదేరే నాడులు బొడ్డుత్రాడుగా ఏర్పడి శిశునాభిని అంటివుండును. శిశుశరీరములో జరిగే

కార్యకలాపములకు కావలసిన ఆక్సిజన్, ఆహార పదార్థములు, విటమినులు బొడ్డు ద్వారానే సరఫరా అగును. గర్భధారణ

జరిగిన తరువాత 280 రోజులకు శిశుశరీరము పూర్తిగా తయారగును.


గర్భధారణ జరిగిన తరువాత ఓవరీనందు ఒక భాగములో గర్భరక్షక రసము తయారై రక్తములో కలిసిపోవును.

ఆ రసములో 'ప్రొజెస్టిరాన్' అను హార్మోను ఉన్నది. ఈ హార్మోను గర్భకోశము మీద పనిచేయు నాడులకు బలము

కలిగించి గర్భస్రావము కలుగకుండ కాపాడును. ప్రొజెస్టిరాన్ బాగుగా తయారగుటకు తల్లి తన శరీర ఆరోగ్యమును

జాగ్రత్తగ చూచుకోవలయును. ప్రొజెస్టిరాన్ సక్రమముగా తయారుకాని తల్లి శరీరము, గర్భము పెంచుటలో అనారోగ్యమైనదిగా

ఉండును. ప్రొజెస్టిరాన్ తయారుకాని శరీరములో గర్భస్రావము జరుగుచుండునని తెలుసుకోవలయును. అటువంటి

వారు గర్భస్రావము జరుగకుండ ప్రొజెస్టిరాన్ హార్మోనును ఇంజక్షన్ రూపములో తీసుకోవచ్చును.


తల్లి శరీరములో బ్రహ్మనాడి నుండి బయలుదేరిన కొన్ని నాడులు గర్భకోశమును ఆశ్రయించియుండును.

నాడులు వీర్యకణము శరీరముగా మార్పుచెందుటలో ఏ ఆకృతిగా తయారుకావలసినది నిర్ణయించును. ఆ నాడులే

శరీరమును ఏవిధముగా పెంచవలయునో ఆ విధముగా పెంచి ప్రసవింప జేయును. బ్రహ్మనాడినుండి బయలుదేరిన

నాడులే శిశుశరీరమును గర్భాశయములో కదలునట్లు చేయుచున్నవి. ఆ నాడులలో చైతన్యము తక్కువగా ప్రసరింపబడి

గర్భాశయము తక్కువగా కదులుచుండిన, శిశుశరీరము క్రమపద్ధతిగా పెరుగదు. తల్లి అనారోగ్య కారణమున గర్భములో

శిశు కదలికలు తక్కువయుండిన, ఆ శిశువు క్రమపద్ధతిగా పెరుగక నడుము నుండి పైకి ఎక్కువ పెరిగి కాళ్ళు తక్కువగా

పెరిగియుండును. కొందరికి నడుము నుండి కాళ్ళు ఎక్కువ పెరిగి నడుముపై శరీరము తక్కువ పరిమాణము పెరిగియుండును.

కొందరికి తల లావుగ ఉండును, నడుము పెద్దదిగాను, చిన్నదిగాను, చేతులు కురచగాను, పొడవుగాను ఇట్లు అనేక

విధముల మార్పులు కనిపించిన శిశుశరీరము సక్రమముగా పెరగలేదని తెలియుము. అవయవములు క్రమబద్దముగా

పెరుగుటకు బ్రహ్మనాడి చైతన్యము అవసరము. బ్రహ్మనాడి చైతన్యము లేకపోతే శిశుశరీరము పెరుగదు, కదలదు

మరియు ఆకృతి ఏర్పడదు.


ఇప్పటి శరీర శాస్త్రజ్ఞులు పురుష వీర్యకణమును, స్త్రీరజోకణమును పరిశోధనాశాలలో కలిపి వాటికి కావలసిన

వాతావరణమును, అభివృద్ధికి కావలసిన పోషక పదార్థములను, రక్తమును సరఫరా చేయగా వీర్యకణము రజోకణముతో

కలిసి రసాయనిక క్రియ వలన విభజన జరిగి మాంసకణములు ముద్దగా కొంత పెరిగి నిలిచిపోవును. శరీరము పూర్తిగా

పెరగలేదు, తయారైన శరీరము ఒక మాంసపు ముద్దగా ఉండిపోయినది. ఏ ఆకృతి ఏర్పడలేదు. ఆ పరిశోధన వలన తల్లి

శరీరములోనే శిశువు ఆకృతిగా పెరుగునని, అట్లుకాక పోయినచో శరీరమునకు ఆకృతి రాదని తెలియుచున్నది. బ్రహ్మనాడి


స్పర్శలేనిదే శరీరము తయారుకాదని తెలియని శాస్త్రజ్ఞులు పరిశోధన జరిపి అందు విఫలమై మాకంటే మించిన దేవుడు

ఒకడున్నాడని చివరకు అంగీకరించుచున్నారు. ఒకవేళ వారి పరిశోధనలలో శిశువు ఒక ఆకృతిగా తయారై అందు జీవమే

ప్రవేశించియుంటే, మాకంటే వేరే దేవుడు లేడని అనేవారేమో?


ఇంత విన్న తరువాత కూడ కొందరికొక సంశయము పుట్టి "హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు, తల్లిగర్భములోనే

నారాయణ మంత్రమును నారదుని ద్వారా విన్నాడు కదా! తల్లిగర్భములో ప్రహ్లాదునికి జీవములేని ఎడల నారాయణ

మంత్రమును ఎట్లు వినెను" అని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! ఒకవేళ వారి మాట ప్రకారమే

ప్రహ్లాదునికి గర్భములోనే జీవమున్నదని అనుకొనిన బయటి మాటలు గర్భము లోపలికి ఎట్లు వినిపించును? అట్లు

వినిపించిననుకొనిన ఇపుడు కూడ గర్భములోనున్న శిశువులకు బయటి వారు బోధించిన బోధ తెలియవలయును కదా!

అట్లు లోపల విన్నామనువారు కాని, వినినవారు కాని ఎవ్వరు లేరే! పరికించి చూచిన అనుభవానికిరాని కవులు పల్కిన

మాటలని ప్రహ్లాదుని విషయము తెలియుచున్నది. బ్రహ్మవిద్య ఒక్క యోగులకు మాత్రమే తెలియును. భాషా పండితులు,

కవులు బ్రహ్మవిద్యను గురించి ఏమాత్రము చెప్పలేరు. అందువలన జ్ఞానదృష్టిలేని కవులు వ్రాసిన మాటలు పూర్తి అసత్యము.


ప్రహ్లాదుని విషయము పురాణములలోనిది. పురాణములు కేవలము కల్పితము. విష్ణువును గురించి వ్రాయుటకు

పూనిన కవులు, వారి ఇష్టానుసారము అల్లిన కథయే ప్రహ్లాద విషయము. ఇటువంటి కొన్ని కథలు చూచి, అంత పెద్దవారు

వ్రాసిన విషయములలో నిజముకాక అసత్యముండునా అని, మిగతా కవులందురు ఆ విధముగనే వ్రాయుటకు మొదలు

పెట్టి శాస్త్రమునకు పూర్తి హాని చేసినారు. నేనింత వరకు చెప్పినప్పటికి నా మాట వినక ధర్మమేది? అధర్మమేది? అని

గ్రహించక అధర్మవాదనే చేయువారు పరమాత్మ గీతయందు తెలియజేసిన విషయమునకు వ్యతిరేకులు.


మేము తెలియజేయు బోధ జీవునకు, ఆత్మకు సంబంధించిన విషయము, కావున జీవముగల సమస్త జీవరాసులకు

వర్తించును. జన్మ అనునది ఒక్క మానవునికే కాక అన్ని జీవరాసులకున్నది. అందువలన క్రిమి, కీటక, పశు, పక్షి,

మృగాదులకు కూడ మా బోధ వర్తించును. ఈ మా మాటలువిన్న కొందరికి ఒక సంశయమేర్పడి "కోడి గ్రుడ్డునకు

గర్భములో జీవము రాక బయటికి వచ్చిన తరువాత వస్తుందను కొనుటకు అది చలన రహితమైనదిగా ఉన్నది. చలనములేని

కోడిగ్రుడ్డుకు ప్రాణము లేదనుకొనుటకు గ్రుడ్డులోనే పిల్ల ప్రాణము కలిగి బయటకు వచ్చుట చూచుచూనే ఉన్నాము.

గ్రుడ్డునుండి పుట్టు జీవులకు మీరు చెప్పిన బోధ ఎట్లు వర్తించును? గ్రుడ్డులో జీవమున్నట్లా లేక గర్భము నుండి బయటకు

వచ్చిన గ్రుడ్డునందు జీవుడు చేరినట్లా” అని అడుగవచ్చును. ఈ అనుమానమును తెలుసుకొనిన అండజముల

విషయమంతయు అర్థమగును. అందువలన కోడిగ్రుడ్డు విషయము తెలుసుకొందాము.


గ్రుడ్డు నుండి పుట్టు ప్రాణులకు, పిండములనుండి పుట్టు ప్రాణులకు జన్మ విషయములో కొద్దిగా మార్పు గలదు.

జన్మ విషయములో అండజ, పిండజములకు భేదముండిన, సిద్ధాంతము మాత్రము అన్నిటికి ఒకటిగానే ఉండును.

అండజములకు, పిండజములకు, భూజములకు (చెట్లు) మొదలగువాటికి మొదటి శ్వాసతోనే జన్మ కలుగుచున్నదను

సిద్ధాంతము వర్తించును. కోడి జన్మను వివరించుకొనిన కోడికి యుక్తవయస్సు వచ్చిన వెంటనే శరీరములో కొన్ని

పదార్ధములు తయారై గుండ్రని ఆకృతి ధరించుచు దిన దినము పెరిగి అండాకృతికి చేరుకొనును. కోడి శరీరములో

అండమునకు అవసరమైన పదార్థములు తయారవుతున్న సమయములో కోడిపెట్ట పుంజులతో సంబంధము ఏర్పరచుకొనును.

పుంజుతో సంపర్కము జరిగినపుడు ఆ సంపర్క ఫలితముగా ఒక పదార్థము పెట్టకోడి శరీరములో అండము కోసము


తయారవుతున్న పదార్థములతో కలుసుకొనును. ఈ విధముగా కోడి శరీరములో తయారైన పదార్థములు కొన్ని అండముగా

మారి బయటికివచ్చును. కోడి ప్రతి దినము ఒక అండమును తయారు చేయును. బయటికి వచ్చిన అండమును

పరిశీలించిన అందులో తెల్లసొన, పచ్చసొన అను పదార్థములు కనుపించును. ఈ పదార్థములలో ఏమాత్రము ప్రాణములేదు.

అందువలన గ్రుడ్డుకు ప్రాణములేదని చెప్పవచ్చును. పిండము బయటికి వచ్చిన వెంటనే ప్రాణమొచ్చినట్లు అండము

బయటికి వచ్చిన వెంటనే ప్రాణము అందులో ప్రవేశించదు. ఇదియే అండజములకు, పిండజములకు గల భేదము.

అండములోని పదార్థములు నిర్జీవములైనవై, పదార్థములు తగిన వాతావరణములో మార్పుచెందునవై ఉండును.

కోడిగ్రుడ్డు 40° సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మార్పు చెందునదై ఉండును. మిగతా వేరు వేరు జాతి గ్రుడ్లుకు వేరు వేరు

ఉష్ణోగ్రత అవసరమై ఉండును. తగు ఉష్ణోగ్రతకు పదార్థములలో రసాయనిక మార్పు జరుగునట్లు అండములు నిర్మింపబడి

యుండును. అండములో కోడిపిల్ల శరీరము తయారగుటకు అవసరమైన పోషక పదార్థములు, విటమినులు మరియు

ఇతర పదార్థములతో నిర్మింపబడి ఉండును. చేతిబాంబులో రసాయనిక పదార్థములు నింపబడియున్నట్లు, కోడిగ్రుడ్డులో

కూడ రసాయనిక పదార్థములు నింపబడివున్నవి. చేతిబాంబుకు ఎప్పుడు ఒత్తిడి కలుగునో అప్పుడది ప్రేలునట్లు, గ్రుడ్డుకు

కూడ ఎప్పుడు తగిన వేడి తగులునో అప్పుడు పిల్లగా మారుటకు మొదలిడును.


తల్లి కోడి గ్రుడ్ల మీద పొదిగినపుడు కోడి శరీరములోని వేడి గ్రుడ్లకు తగులుట వలన గ్రుడ్డునందు పదార్థములు

మార్పు చెందుచు పిల్లగా తయారగును. గ్రుడ్డులో పచ్చసొన భాగములో మధ్యన ఒక గుండ్రని పదార్థముండును. అది

వేడి తగిలిన వెంటనే మార్పు చెందుటకు మొదలిడును. మధ్య భాగములోని పదార్థమునే మనము పురుష బీజముగా

లెక్కించు కోవలయును. పచ్చసొన తెల్లసొన వినియోగము వలన ఈ పదార్థము పెరుగుచున్నది. కావున తెల్ల పచ్చసొనలను

స్త్రీకణములుగా లెక్కించు కొనుచున్నాము. తగిన వేడి తగిలినపుడే గ్రుడ్డులో ఇమిడియున్న పురుషకణము స్త్రీకణ పదార్థములు

కలిసిపోయి, పురుషకణము వృద్ది చెందుచుపోయి, కొద్ది రోజులకు పూర్తి పిల్లగా తయారగును. మానవులకు పురుషకణము

గర్భాశయములోనే స్త్రీకణముతో కలియును. కోడిగ్రుడ్డుకు వేడిమి తగిలిన వెంటనే గ్రుడ్డునందు బీజకణము మార్పు

చెందుటకు మొదలిడును. గ్రుడ్డులో పూర్తి పిల్ల శరీరము తయారగుటకు 21 దినముల కాలము పట్టును. పిల్లగా మార్పు

చెందు కాలము అన్ని జాతి గ్రుడ్లకు ఒకే మాదిరియుండదు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్కకాల పరిమితియుండును. 40°

సెంటిగ్రేడు ఉష్ణముకంటే ఎక్కువ వేడిలో గ్రుడ్డులోని పదార్థము చెడిపోవును. అందువలన ఎండా కాలము కోడిగ్రుడ్లు

పిల్లలుగా మారుట తక్కువగా ఉండును. గ్రుడ్లు కోడి క్రిందనేకాక వాటికి తగిన వాతావరణములో ఎక్కడైన పిల్లలుగా

మారగలవు. ఈ కాలములో గ్రుడ్లను పిల్లలుగా తయారుచేయు యంత్రములు కలవు. ఆ యంత్రములలో గ్రుడ్డుకు

కావలసిన వేడిని అందజేయుదురు. కావున గ్రుడ్డు పిల్లగా మార్పు చెందుచున్నది వీటినే (Incubators) అందురు. కొన్ని

చోట్ల కుండలోవుంచిన గ్రుడ్డు కూడ పిల్లగా మార్పుచెందిన సంఘటనలు ఉన్నాయి. పుంజుకోడితో సంబంధములేని

పెట్టకోళ్లు కూడ గ్రుడ్లు పెట్టును. ఆ విధముగా పెట్టబడిన గ్రుడ్లు పొదగవేసినప్పటికి పిల్లలుగా తయారుకావు. కారణమేమనిన

ఆ గ్రుడ్డునందు పురుష బీజములేదు. గ్రుడ్డులో తెల్లసొన, పచ్చసొన, మిగతా అన్ని స్త్రీ పదార్థములుండును. కాని

పచ్చసొన మధ్య భాగములో పురుష కణముండదు. పురుషకోడి సంపర్కము చెందిన కోడిగ్రుడ్డు మాత్రమే పురుష బీజము

కలదిగావుండును. ఒక్కొక్క గ్రుడ్డుకు ఒక్కొక్కొ సంపర్కముండవలెను. ఒక సంపర్కమే అన్ని గ్రుడ్లలో బీజము కాదు.

అందువలన గ్రుడ్లు పెట్టు కోడి ఒక విధముగా ఈల వేయుచు పుంజుకోడిని ఆకర్షించుచు ప్రతి దినము త్రొక్కుల్లు

(సంపర్కము) పడుచుండును.


మానవులకు గర్భకోశములో మావియందు శిశువు తయారైనట్లు, అండజము లకు గ్రుడ్డునందు పిల్ల తయారగును.

మావియందు తయారైన శిశువుకు ప్రాణము లేనట్లు, గ్రుడ్డునందు తయారైన పిల్లకు ప్రాణముండదు. ఇక్కడ ముఖ్యముగా

గమనించవలసిన విషయమేమనగా? మావినుండి ప్రసవింపబడిన శిశువుకు బయట ప్రాణము వస్తున్నది. కాని అండములో

తయారైన పిల్ల శరీరమునకు గ్రుడ్డునుండి బయటికి రాకమునపే గ్రుడ్డునందే ప్రాణమొస్తున్నది. పిండజములకు మొదటి

శ్వాసతోనే ప్రాణమొస్తున్నది. అండజములకు కూడ మొదటి శ్వాసతోనే ప్రాణమొస్తున్నది. నిర్జీవమైన పిల్ల గ్రుడ్డు యొక్క

పెంకును చీల్చుకొని రాలేదు. పెంకును పగులగొట్టుకొనుటకు అవసరమైన శక్తి ప్రాణముండినపుడే లభ్యమగును. అందువలన

పెంకును పగులకొట్టుకొని బయటకు వచ్చు నిమిత్తము, పిల్లకు లోపలనే ప్రాణమొచ్చు ఏర్పాటు దేవుడు చేసియుంచాడు.

జీవుడు నివాసము చేయుటకు యోగ్యముగ శరీరము ఎప్పుడు తయారైనదో, అప్పుడు ఆ శరీరమునందు వేరొక జీవుడు

మొదటి శ్వాసతో ప్రవేశించునను సిద్ధాంతము అందరికి తెలిసినదే. ఆ ప్రకారము గ్రుడ్డులో తయారైన పిల్ల శరీరములోనికి

జీవుడు మొదటి శ్వాసతో ప్రవేశించుచున్నాడు. ఇక్కడ కొందరికి ఒక సంశయమేర్పడవచ్చును. శ్వాస జరుగుటకు గాలి

అవసరముకదా! బయటి గాలి లోపలికి రాకనే కోడిపిల్ల ఎట్లు శ్వాసించగలదని అడుగవచ్చును. దానికి సమాధానమేమనగా!

తల్లి కోడి శరీరములో గ్రుడ్డు తయారైనపుడే గ్రుడ్డునందు పిల్లగా మారుటకు అవసరమైన పదార్థములన్నియు నింపబడి, ఆ

పదార్థములన్నియు ఒక పొరలో బంధింపబడియుండును. ఆ పొరకు పెంకుకూ మధ్య ఒక ప్రక్కన కొద్దిగా ఖాళీ స్థలముండును.

దానియందు గాలి నింపబడియుండును. గ్రుడ్డులో గాలి ఎక్కడున్నది క్రింది పటములో(పేజీ 19 లో చూడండి ) చూడవచ్చును.


అండమునందు పూర్తిగా తయారైన పిల్లయందే జీవుడు ప్రవేశించును. పిల్ల తయారైన చివరి సమయములో

పలుచని పొర చినిగిపోయి గ్రుడ్డు అంతయు పిల్ల శరీరము ఆక్రమించియుండును. పొర చినిగిన తరువాత గాలి

గ్రుడ్డంతయు వ్యాపించియుండును. గ్రుడ్డులో గాలియుండుట వలన జీవుడు పిల్ల శరీరములోనికి మొదటి శ్వాసతో

ప్రవేశించుచున్నాడని తెలుసుకొనుము. పిల్ల శరీరములోనికి ప్రవేశించిన జీవుడు గ్రుడ్డు లోపలయుండిన గాలిని

శ్వాసించుచుండును. అట్లు కొన్ని నిమిషములు శ్వాస జరిగిన తరువాత ఆ గాలిలోని (ఆక్సిజన్) ప్రాణవాయువు

అయిపోవును. అపుడు శ్వాస జరుగుచుండినప్పటికి ఆ శ్వాసలో ప్రాణవాయువు లభించనందు వలన పిల్ల ఉక్కిరి


బిక్కిరగును. తన్ను కొనుటకు ప్రారంభించును. దిక్కు తెలియక పెంకును ముక్కుతో పొడుచును. పిల్ల తన్నుకొనునపుడు

ముక్కుతో పొడచినపుడు పెంకు చిన్న రంధ్రముపడి తరువాత పగిలిపోవును. అపుడు బయట గాలిలో పిల్ల బ్రతుకుసాగించును.

ఇదే విధముగా అండజములన్నిటికి జన్మ కలుగుచున్నదని తెలుసుకొనుము. స్త్రీలకు గర్భము వ్యర్థమైపోయినట్లే గ్రుడ్లు

కూడ వ్యర్ధమైపోగలవు. గ్రుడ్డు తయారు కావడములో పదార్ధములు ఎక్కువ తక్కువ ఉండు దోషమువల్ల కాని, గ్రుడ్డు

బయటకు వచ్చిన తరువాత వేడి లభ్యము కావడములో ఎక్కువ తక్కువల దోషము వలనగాని, గ్రుడ్డు ముర్రుగ్రుడ్డుగా

వ్యర్థమైపోవుట జరుగుచుండును. ఇంతవరకు అండజముల యొక్క జన్మను గురించి తెలుసుకొన్నాము. అండజముల

విషయములో అండమునకు ప్రాణములేని విషయము తెలిసిపోయినది. ఇపుడు భూమి నుండి పుట్టు జీవులకు జన్మ ఎట్లు

కలుగుచున్నది తెలుసుకొందాము.


భూమి నుండి పుట్టు వృక్షలతాదులన్నింటిని భూజములని అందురు. కోడి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టినట్లు, విత్తనముల

నుండి భూజములు పుట్టును. తల్లి కోడి శరీరములో తయారైన గ్రుడ్డుకు ప్రాణములేనట్లు, చెట్ల నుండి తయారైన

విత్తనమునకు కూడ ప్రాణములేదు. విత్తనమునకు ప్రాణములేదను మాట కొందరికి చాలా విచిత్రముగాయుండును.

ప్రజలలో విత్తనమునకు ప్రాణమున్నదను నమ్మిక పూర్తిగా జీర్ణించిపోయినది. అందువలన మా మాట విన్నంతనే చాలా

ఆశ్చర్యము కలుగవచ్చును. కొందరు మా మాట అబద్దమని పుస్తకము చదువక మూసివేయుదురేమో! ఎవరు నమ్మిన

నమ్మకపోయిన విత్తనములకు ప్రాణములేదను మాట సత్యము.


కోడి శరీరములో గ్రుడ్డు తయారగునట్లు, వృక్షములోనే విత్తనములు తయారగును. వృక్షములకు పెరుగు కాయలలో

విత్తనములు తయారగును. ప్రతి జాతి విత్తనము రెండు భాగములుగా విభజింపబడియుండును. విత్తనము మొలకెత్తుటకు

కావలసిన కొన్ని పదార్థములు కాయలయందే తయారై విత్తనమందు నింపబడి ఉండును. విత్తనము యొక్క రెండు

బేడలయందు మొలకలకు కావలసిన ఆహారపదార్థములు, మరికొన్ని రసాయనిక పదార్థములు తయారైయుండును. గ్రుడ్డుకు

పెంకు ఏ విధముగా ఉన్నదో, ఆ విధముగా విత్తనముకు ఒక పొర కప్పబడి ఉండును. ఈ పొరయందు ఒక చోట చిన్న

ముడి కలిగియుండును. ఆ ముడి విత్తనము లోపలనున్న బేడలను పొరను కలిసియుండును. విత్తనపు బేడలు పై పొర

కలియు ముడియందు 'మొన' అను ఒక చిన్న భాగముండును. ఈ మొన విత్తనములో ముఖ్యమైనది. ఈ మొనయందే

పురుషకణము ఇమిడి ఉండును. విత్తనములో మొన మినహాయున్న బేడలను స్త్రీకణములుగా లెక్కించు కోవలయును.

స్త్రీపురుష కణములను కాపాడుచు ప్రతిజాతి విత్తనమునకు ఒక పొరయుండును. దీనిని బీజరక్షక పొరయని అందురు.

పొట్టులేని విత్తనములు రక్షణలేనివై కణములు చెడిపోవును. అందువలన పొట్టుపోయిన విత్తనములు మొలకెత్తవు.

విత్తనమునకు ఒకచోట ముడి ఉన్నదని తెలుసుకొన్నాము కదా! ఆ ముడివద్ద పై పొర చిన్న రంధ్రము కలిగియుండును.

ఈ విధముగా ఉన్న విత్తనము పూర్తి తయారైనదని చెప్పవచ్చును. బేడ ముదరనటువంటిది, పొర తయారుకానటువంటిది,

పొరకు రంధ్రము లేనిది పూర్తి తయారుకాని విత్తనమని తెలుసుకొనుము. అటువంటి విత్తనము జన్మకు అయోగ్యమైనది.

పూర్తిగా తయారైన విత్తనము నీరు తగిలిన వెంటనే మార్పు చెందునట్లుయుండును. భూమియందు పడిన విత్తనమునకు

తేమ తగిలిన వెంటనే అది మొక్కగా మొలుచుటకు ప్రారంభమగును. విత్తనమున గల ముడివద్దనున్న రంధ్రము ద్వారా

నీరు విత్తనము లోపలి భాగమందున్న మొనకు తగులును. నీరు తగిలిన వెంటనే మొనయందు మార్పువచ్చును విత్తనపు

బేడలయందు కూడ మార్పువచ్చును. బేడలు మెత్తగా తయారగును. విత్తనపు మొన రెండు బేడలను ఆధారము చేసుకొని

పెరుగుట ప్రారంభించును. అపుడు విత్తనపు పై పొర మెత్తబడి చినిగిపోవును. మొన నుండి పెరుగుటకు బయలుదేరిన


ఒక భాగము భూమిలోనికి పోవును. రెండవ భాగము భూమి పైకి పెరుగును. గ్రుడ్డునందు పిల్లకు ప్రాణములేనప్పటికి

ఏ విధముగ పెరుగుచున్నదో, అదే విధముగనే విత్తనమునందు ప్రాణములేనప్పటికి మొనయందలి పురుషకణము

పెరుగుచున్నది. ఇది అంతయు విత్తనమునందలి రసాయనికచర్యయని తెలియవలెను. అట్లు పెరుగు సమయములో

విత్తనముయందలి పదార్థములు మొలకకు వినియోగింపబడును. పురుషకణము విత్తనములోని పదార్థములను

వినియోగించుకొని మొక్కగా మార్పు చెందుచుండును. భూమిపైకి పెరిగిన భాగములో చిన్నచిన్న ఆకులు తయారగును.

భూమిలోపలికి పోయిన వేరు భాగములో చిన్నచిన్న వేర్లు తయారగును. ఈ విధముగా తయారైన మొక్కకు కూడ

ప్రాణము లేదు. అంతవరకు విత్తనమందలి పోషక పదార్థములతోనే మార్పు చెందిన రసాయనిక క్రియ అని తెలియవలెను.

మొక్కకు ఆకులు వచ్చి వికసించుకొనుదాక దానియందు ప్రాణములేదని చెప్పవచ్చును. మొదటి శ్వాసతోనే

జీవుడు ప్రవేశించునను సిద్ధాంతము ప్రకారము చెట్టుకు మొదటి శ్వాస జరుగు వరకు ప్రాణమురాదు. మొలకెత్తిన మొక్క

ఆకులయందు పత్రరంధ్రములు తయారైనపుడు జీవుడు ప్రవేశించుటకు యోగ్యత కలిగిన మొక్కగాయుండును. మొక్క

ఆకులు, కాండము పూర్తి తయారైన తరువాత, ఆకులయందు పత్రరంధ్రములు ఏర్పడిన తరువాత, మొదటి శ్వాసతో

జీవుడు మొక్కయందు ప్రవేశించును. ఆకుల క్రింద గల పత్రరంధ్రముల ద్వారా మొక్క శ్వాసించునని తెలుసుకొనుము.

పత్ర రంధ్రములలో ఎపుడు శ్వాస ప్రవేశించుచున్నదో అపుడు జీవుడు చెట్టునందు ప్రవేశించునట్లు లెక్కింపబడుచున్నది.

అండజములకు, పిండజములకు ప్రాణమొచ్చిన తర్వాత వాటికి ప్రాణమొచ్చినట్లు మనము సులభముగా గుర్తించగలము.

కాని మొలకకు ప్రాణమొచ్చినను శ్వాస ఎపుడు ప్రవేశించినది ఎవరూ కనుగొనలేరు. మొలకెత్తిన విత్తనములకు ప్రాణమొచ్చిన

వెంటనే గాలి నుండి ఆకుల ద్వారా శ్వాసించుచు, భూమి నుండి వేర్ల ద్వార పోషక పదార్థములను తీసుకొనుచు, ఆకుల

పై భాగమున సూర్యరశ్మి చేత పిండి పదార్థమును తయారుచేసుకొనుచు, ఆహారమును సంపాదించుకొనుచు, జీవిత

కార్యమును సాగించును.


స్త్రీలకు గర్భస్రావము జరిగినట్లు, గ్రుడ్డు మురుగ్రుడ్డుగా చెడిపోయినట్లు విత్తనములు కూడ చెడిపోగలవు. ఎక్కువ

వేడి తగులుట వలన, విత్తనమందలి తేమ ఆరిపోవుట వలన పదార్థములు చెడిపోయి విత్తనము మొలకెత్తలేక పోవును.

పొట్టు తీసివేసిన విత్తనములు, పుచ్చిన విత్తనములు, చిరకాలము గడచిన విత్తనములు మొలకెత్తలేవు. విత్తనములో

పదార్థములు అనుకూలముగా లేనందువలన పురుష భాగమైన మొన మొలకెత్తలేదు.


భూమిమీద గల సమస్త విత్తనములకు జన్మ పైన చెప్పిన విధముగా మొదటి శ్వాసతోనే కలుగుచున్నట్లు

తెలుసుకొనుము. సముద్రములోని జీవరాసులు నీటిని మొదటి శ్వాసగా పీల్చును. ఈ విధముగా జీవరాసులు అన్నియు

క్రొత్త శరీరము ధరిస్తున్నవి. జీవాత్మతో పాటు ఆత్మ ఉన్నది కావున ఆత్మ కూడ జీవాత్మతో పాటు క్రొత్త శరీరమును

చేరుచున్నదని తెలియాలి. క్రొత్త శరీరమేదో, ఆత్మ దానినెపుడు చేరుచున్నదో తెలిసింది కదా! ఆత్మ ఇంకనూ ఎట్టిదనగా

క్రింది శ్లోకమును చూడుము.


గమనిక : 'వాసాంసి జీర్ణాని' అను భగవద్గీత శ్లోకమునకు మేము చెప్పిన వివరము సరిక్రొత్తది. కావున దీని విషయమై

బాగా యోచించి అర్థము చేసుకోగలరని కోరుచున్నాము. అయినప్పటికి ఇందులో ఎన్నో అనుమానములు ఉత్పన్నమై ఇది

సత్యమా అను ప్రశ్న బయలుదేరును. అటువంటి అనుమానములు పోవుటకు కొన్ని వాస్తవ సంఘటనలను తెలుపుచున్నాము.

దాదాపు ఇరవై ఐదు సంవత్సరముల క్రితము ఈనాడు దినపత్రికలో టూకీగా అను శీర్షిక క్రింద 'గడుగ్గాయి' అను పేరుతో


ప్రచురితమైది. అది ఏమనగా! ఇంగ్లాండునందు పెద్ద ఆస్పత్రిలో ఒక స్త్రీకి ప్రసవము జరుగగ, పుట్టిన ఆడ శిశువుకు

గంటసేపైనప్పటికి కదలిక రాకపోవడముతో, అక్కడున్న డాక్టర్లు పరీక్షించి ఆ శిశువు గర్భమునందే చనిపోయినదని

చెప్పారు. తర్వాత ఆ శిశువుకు అవ్వగారైన వృద్ధురాలు వచ్చి శిశువును గురించి అడిగింది. అపుడామెకు శిశువు తల్లి

ప్రక్కనున్నవారు శిశువు గర్భమునందే చనిపోయినదని, దానిని శవాల గదిలో ఉంచారని చెప్పారు. ఆ వృద్ధురాలు

చనిపోయిన శిశువు ముఖమునైన చూచి వస్తానని శవాలగదిలో తొట్టిలో పెట్టి గుడ్డకప్పిన శిశువు దగ్గరకు పోయి ముఖము

మీద గుడ్డ తీసి చూడగా, శిశువు బ్రతికివున్నట్లు ఆమెకు తెలిసి ఎత్తుకు వచ్చి, అరుస్తున్న ఆ శిశువును అందరికి చూపి తల్లి

దగ్గరకు చేర్చింది. ఆ విషయము తెల్సిన డాక్టర్లు వచ్చి శిశువును పరీక్షించి చూచి తెల్లముఖము వేశారు. తరువాత వారి

సంరక్షణలోనే నెల రోజులు ఆ శిశువును పెట్టుకొని తరువాత డిశ్చార్జి చేసి పంపారు.


ఇటువంటి సంఘటనే తిరుపతి గోస్ ఆస్పత్రిలో కూడ జరిగినది. అక్కడ పొరపడిన లేడిడాక్టరు నేనెలా పొరబడినాను,

అన్ని పరీక్షలు చేసిన తర్వాత శిశువుకు ప్రాణములేదని నిర్ణయించాను కదా! శిశువు గంట తరువాత ఎలా బ్రతికిందని

ఏదో ఎక్కడో పొరబడినాననుకొన్నది. ఆమె మా 'జనన మరణ సిద్ధాంతము' అను గ్రంథము చదివిన తరువాత నాతో

కలిసి తాను ఎక్కడ పొరబడినానో తెలిసిపోయినదని, ఈ విషయము మా చదువులలో ఎక్కడా లేదని, అందువలననే

పొరపాటు జరిగినదని ఒప్పుకొన్నది. అపుడు నేనిలా ప్రశ్నించాను. “కదలికలు లేనపుడు శిశువు ఏ స్థితిలో ఉందను

కొంటారు?” దానికామె జవాబు 'అది మూర్ఛస్థితిలో ఉందనుకొంటాము. అపుడు కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా

వేలాడబెట్టి వీపు మీద తట్టుతాము. అప్పటికీ కదలిక రాకపోతే రెండు రకముల ఇంజెక్షన్లు వాడుతాము. అప్పటికీ కదలిక

రాని ఎడల ఆ శిశువు గర్భములో మరణించినట్లు నిర్ణయించుతాము.' అన్నది అపుడు నేను శ్వాస ఆడుచు తెలివి

తప్పియుంటే దానిని మూర్ఛ అనవచ్చును. శ్వాస ఆడకుండ తెలివి తప్పియుంటే దానిని మూర్ఛ అనకూడదు కదా!

కదలికలు లేని శరీరములో శ్వాస ఆడుచున్నదో లేదో ముందు పరిశీలించిన ఎడల మీకే తెలియునన్నాను. ఇట్లు ఎన్నో

నిదర్శనములను జనన మరణ సిద్ధాంతమునకు అనుకూలముగా మీరు చూడవచ్చును.


డిశంబరు 1- 2001 ఈనాడు, హైదఐబాద్

శిశువు

బతికే ఉన్నా..

మరణించాడని చెప్పిన డాక్టర్లు

సీతాఫల్ మండి, నవంబరు 3) : న్యూస్ పేపర్ లో శీర్షిక చూడండి 




ప్రతి చోట డాక్టర్లు పొరపాటని సమర్థించుకొంటున్నారే గాని తమకు తెలియనిదేదో జరిగినదని కొంతయిన

యోచించలేదు. బ్రతికిన శిశువును చనిపోయినదని చెప్పినంత మాత్రమున డాక్టర్లు గ్రుడ్డి వారేమి కాదు కదా! వారికి

కూడ ఆ విషయము తెలుసు. ఏమి అర్థము కాని దానివలన పొరపాటని చెప్ప వలసి వచ్చినది. డాక్టర్లు మొదట

చూచినపుడు ప్రాణము లేనిది నిజమే, తర్వాత చూచినపుడు ప్రాణమున్నదీ నిజమే. ఏది పొరపాటు కాదు.


2). ప్రాణము రాక ముందే వచ్చినది, పోయినదని చెప్పిన డాక్టర్లు

తండ్రి పేరు: E. రామమోహన్ గౌడ్,

తల్లి పేరు:: E. వాసవి

హాస్పిటల్: గంగ హాస్పిటల్

తేది: జూలై, 22, 2004

టైమ్: 6.30 A.M


గర్భవతిగ ఉన్న శ్రీమతి వాసవిగారు గంగ హాస్పిటల్ (దిల్సుఖ్ నగర్, చైతన్యపురి) లో లేడీ డాక్టర్గారితో పరీక్ష

చేయించుకున్నది, గర్భస్థ శిశువు ఆరోగ్యముగానే ఉన్నదని ఆమె భర్త రామ్మోహన్ గౌడ్ గారికి డాక్టర్ తెలియపరిచారు.

తరువాత కొద్ది రోజులకు నెలలు నిండి గర్భవతియైన వాసవి గారికి నొప్పులు ప్రారంభమైనవి. డెలివరి అవుతుందని గంగ

హాస్పిటల్కు వెళ్లి డాక్టరును కలిశారు. గర్భములో శిశువు కదలికలు బాగానే ఉన్నవని, శిశువు బాగానే ఉందని చెప్పిన

డాక్టర్ల మాటలు విని రామ్మోహన్ గౌడ్ సంతోషంగా ఉన్నారు. కొంత సమయమునకు వాసవిగారు ప్రసవించడము

జరిగినది. ప్రసవించిన 15 నిమిషముల తర్వాత తండ్రి రామ్మోహన్ గౌడకు శిశువును చూపించారు. అపుడు శిశువుకు

కదలిక గాని, శ్వాస ఆడినట్లు గాని కనిపించలేదు. ఆ విషయమై లేడీ డాక్టరును అడుగగ శిశువు హార్టు సమస్యతో

(ప్రాబ్లమ్) పుట్టినదని, కొద్ది కొద్దిగ శ్వాస తీసుకొంటున్నదని, అందువలన పైకి కనిపించలేదని చెప్పినది. అపుడు

రామ్మోహన్ గౌడ్ శిశువు కొద్దిపాటు కూడ మెదలలేదు, అరవలేదు కదా అని అడిగాడు. దానికి సమాధానముగ హార్టు

ప్రాబ్లమ్ ఉన్న శిశువు అలాగే ఉంటుందని, భవిష్యత్తులో శిశువు పెద్దదయిన ఇటువంటి పరిస్థితే ఉంటుందని, ఇటువంటి

శిశువుతో తల్లిదండ్రులకు చాలా కష్టముగ ఉంటుందని, అన్ని పనులూ శిశువుకు చేయవలసి ఉంటుందని చెప్పడము

జరిగినది. ఆ మాటకు శిశువు మీద తండ్రికి కొంత విరక్తి కల్గినది. అప్పటికి ఉండలేక గర్భముతో ఉన్నప్పటినుండి మీ

వద్దకు తీసుకువచ్చి పరీక్షలు చేయించాము కదా! అపుడు కడుపులో శిశువు ఆరోగ్యము బాగా ఉందని చెప్పారు కదా! అని

అడిగాడు. అన్ని ప్రాబ్లమ్స్ పరీక్షలతో తేలవు అని చెప్పి, I.C.U కి శిశువును పంపుచున్నామని, ఒకవేళ శిశువు

బ్రతకవచ్చు లేక చనిపోవచ్చు అని వేరే హాస్పిటల్కు ఫోన్ చేసి వ్యానున్ను రప్పించి శిశువు యొక్క ముక్కులకు ఆక్సిజన్ పెట్టి

అక్కడి నుండి పంపించినది. ఇదంతయు జరుగుటకు దాదాపు 45 నిమిషములు పట్టినది. శిశువు మీద ఆశ వదులుకొన్న

రామమోహన్, తన భార్య ఆరోగ్యముగ ఉంటే చాలునని భార్యకు శిశువు విషయము ఏమాత్రము చెప్పక ప్రక్కగదిలో

పరీక్షల నిమిత్తము డాక్టర్లు పెట్టుకొన్నారని చెప్పి మభ్యపరిచాడు. తర్వాత అరగంటకు మీ శిశువు చనిపోయిందని డాక్టరు

చెప్పడము జరిగినది. ఆ విషయము తల్లికి తెలిస్తే షాక్కు గురి అవుతుందని భర్త ఏమాత్రము భార్యకు తెలియనివ్వకుండ

దాదాపు 20 రోజులు గడిపాడు.


ఇక్కడ జరిగిన అసలు విషయమేమంటే 15 నిమిషముల తర్వాత కూడ కదలని, అరవని శిశువును చూచి

డాక్టరుకు ఏమి అర్థము కాక, శ్వాస ఏమాత్రములేని శిశువుకు కొద్దికొద్ది శ్వాస బయటికి కనిపించని విధముగ ఆడుచున్నదని

చెప్పడము మొదటి తప్పు. ఆ తప్పును సమర్థించుకొనుటకు హార్టువీక్గా ఉన్న శిశువు ఇలాగే ఉంటుందని, పెద్దయిన

తర్వాత కూడ కదలక మెదలక ఉంటుందని చెప్పడము రెండవతప్పు. శ్వాసయే లేని శిశువుకు ఆక్సిజన్ పెట్టి వేరే

హాస్పిటల్లోని I. C. U కు పంపించి శిశువు చనిపోయిందని వారి ద్వార చెప్పించడము మూడవ తప్పు. ఎప్పుడో

ఒకపుడు కొన్ని శిశువులకు మాత్రము, ప్రాణము ఆలస్యముగ వస్తుందని డాక్టర్లకు తెలియకపోవడము అన్నిటికంటే పెద్దతప్పు.


అరగంటకుగాని, గంటకుగాని, రెండు మూడు గంటలకుగాని, అంతకంటే ఎక్కువ సమయమునకుగాని, శిశువుకు

ప్రాణమొచ్చితీరునను సత్యము తెలియకపోవడము వలన, గంగ హాస్పిటల్లోని శిశువుకు ప్రాణము రాకమునుపే కొద్దిగ

శ్వాస ఉందని తర్వాత పోయిందని చెప్పడము జరిగినది. ఈ సంఘటనలో ఎన్నో ఆశలతో, ఊహలతో తమ బిడ్డను

చూచుకొంటామను కొన్న తల్లిదండ్రులకు బిడ్డను దూరము చేసినట్లయినది. జీవిత ప్రథమాంకము లోనే శిశువులను

డాక్టర్లు తమకు తెలియకుండానే పరోక్ష హత్యలు చేయుచున్నారు. హత్యలు అనాగరికమని హత్య చేసిన వారిని శిక్షించగలిగిన

న్యాయవ్యవస్థ తల్లితండ్రులకు దుఃఖమును కల్గించుచున్న పరోక్ష శిశు హత్యలను ఆపగలదని, శిశువుకు ప్రాణము ఎప్పుడొస్తుందో

తెలియని లోపభూయిష్టమైన వైద్యచదువులను, లోపరహితముగ మార్చుటకు ఆదేశాలిచ్చి, ఎందరో శిశువులను రక్షించి

పుణ్యము కట్టుకోవలసిందిగ కోరుచున్నాము.


3). శిశువుకు ప్రాణము రాకనే చనిపోయినదని చెప్పిన డాక్టర్లు

తండ్రి పేరు: మల్లేష్

తల్లి పేరు: రజిత

హాస్పిటల్: విజయ నర్సింగ్ హోమ్, (కర్మన్ట్)

తేది: ఆగష్టు 26,2004.

డాక్టర్లు : సత్యనారాయణ మరియు ఒక గైనకాలజిస్టు


కూలీనాలి చేసుకొని బ్రతికే పేదదంపతుల కుటుంబము మల్లేష్ గారిది. భార్య గర్భవతి కాన్పు అయ్యే సమయములో

ఆమెకు నొప్పులు వచ్చాయి. వెంటనే దగ్గరలో ఉన్న గాయత్రీ నగర్ రోడ్డు నెం. 19లో ఉన్న విజయ నర్సింగ్ హోమ్కు

తీసుకొని వెళ్ళారు. ప్రసవము కాగానే ఆ మగ శిశువును డాక్టర్లు పరీక్షించి శిశువుకు ప్రాణములేదని చెప్పారు. చనిపోయినదని

చెప్పి శిశువును తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పగా, ఆ సమయములో శిశువు తండ్రి లేనందున, దాదాపు ఒకటిన్నర గంట

తరువాత శిశువు తండ్రి మల్లేష్ తదితరులు నర్సింగమ్కు వచ్చి, శిశువు చనిపోయినదని డాక్టర్లు చెప్పిన సమాధానము

విని బాధపడ్డారు.


ప్రాణములేని పసిబిడ్డను పూడ్చి పెట్టాలని అనుకొన్నారు. అనుకొన్న వెంటనే గుంత త్రవ్వడానికి శిశువు తండ్రికి

సంబంధించినవారు వెళ్లారు. హాస్పిటల్నుంచి ఆ పసికందు శవాన్ని స్మశానానికి తరలించాలనుకున్నపుడు, రక్తపు మరకలు

ఆరని పసికందును తండ్రి చివరిసారిగా తన స్వంత హస్తాలతో తీసుకొన్నాడు. తన చేతులలోనికి తీసుకొన్న శిశువును


చూసి తండ్రి మల్లేష్ సంతోషముతో 'నా బిడ్డ బ్రతికే ఉన్నాడు' అని బిగ్గరగ అరిచాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడివారు

ఆశ్చర్యపోయారు. నా బిడ్డ శ్వాస పీల్చుకుంటున్నాడని మల్లేష్ చెప్పాడు. అప్పటికీ శిశువు యొక్క బొడ్డుత్రాడు వేరు

చేయబడలేదు. శిశువు చనిపోయిందని అలా ఎందుకు చెప్పారు అని డాక్టరును నిలదీయగా, డాక్టరు సత్యనారాయణ

సమాధానము చెపుతూ నాతో పాటు గైనకాలజిస్టు కూడ పరీక్షించారు ఏదో ఫీటల్ హార్టు లోపమని చెప్పారు అన్నాడు.

శిశువు బొడ్డుత్రాడు తొలగించి వెంటనే ఓవైసీ హాస్పిటలు తీసుకుపొమ్మని డాక్టరు చెప్పారు. వెంటనే వారు ఓవైసీ

హాస్పిటల్కు తీసుకెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకొని తర్వాత శిశువు ఆరోగ్యముగనే ఉన్నదని తెలుసుకొన్న దంపతులు

సంతోషించారు.


తండ్రి చేతులలో ప్రాణము పోసుకున్న ఆ శిశువు కొన్ని నిమిషములు కళ్ళు తెరువకుంటే గుంతపాలై పోయేవాడు.

దంపతులు దుఃఖముతో ఏడ్చేవారు. ప్రాణముండగానేలేదని ఎందుకు చెప్పారని దంపతుల బంధువులు స్థానిక పెద్దలు,

అక్కడి విజయ నర్సింగ్హమ్ డాక్టరును నిలదీసి అడుగగా డాక్టరు ఏదో సమాధానము చెప్పి పంపివేశారు.


ఈ విషయము రెండు మూడురోజులకు E.TV వారికి కూడ తెలియబడింది. E.TV విలేఖరి రెహమాన్

స్థానిక విజయనర్సింగ్ హోమ్క వెళ్ళి వాకబు చేయగ డాక్టరుగారు మొదట బుకాయించి తరువాత తన తప్పేమీ లేదని

గైనకాలజిస్టుతో పరీక్షించానని చెప్పాడు. ఈ సంఘటన E.TV న్యూస్ ఆగస్టు 29వ తేదిన ప్రసారము చేయడము

జరిగినది.



4).12 గంటలకు పైన స్మశానంలో బ్రతికిన శిశువు

తల్లి పేరు :సుమతి

హాస్పిటల్ :గాయత్రి క్లినిక్ (కల్వకుర్తి).

తేది:5-10-2004,

డాక్టర్లు:డా॥మువ్వా రామారావు మరియు

డా॥హిమబిందు.


(ఆంధ్రభూమి న్యూస్,కల్వకుర్తి): ఎన్నో పరిశోధనలు చేసి భౌతిక విషయములన్నీ తెలుసుకొన్నామనుకొను శాస్త్రజ్ఞులకు,

ఇంకా తెలియని విషయములెన్నో ఉన్నవి. మాకు తెలియనిదిలేదనుచు, తమకు తెలిసినదే సత్యమనుకొను భౌతికశాస్త్రవేత్తలు

ఇంకా పరిశోధించి తెలుసుకోవలసింది ఎంతో ఉందని వెక్కిరించు విషయములు కోకొల్లలు గలవు. అందులో ఒక్క

విషయమును కూడ పరిశీలించి చూడక ఉన్నత విద్యావంతులమని పైనరంగు పూసుకోవడము సమాజద్రోహమని

తెలియునట్లు, ఎన్నో సంఘటనలు గలవు. ఒక మేక రెండు పిల్లలినిన తర్వాత, వాటికి ప్రాణములేదని ప్రక్కన పారవేసిన

తర్వాత, మూడు గంటలకు ఆ రెండు పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి ప్రాణము పోసుకోవడము విచిత్ర సంఘటనే,

అయిన అవి జంతువులు కాబట్టి వాటిని ఎవరు పట్టించుకోవడము లేదు. అట్లని మనుషుల విషయములో అదే విధముగ

జరిగినప్పటికి పట్టించుకోక పోవడమును ఏమనవచ్చునో అర్థము కావడములేదు. మన పరిశోధనల ఫలితము మానవ

సమాజము నాగరికతవైపు పయనించుటకే గాని అనాగరికతవైపుకు పోకూడదు. మానవుని మనుగడకు ఉపయోగ పడవలసిన


విజ్ఞానము (సైన్సు) ప్రథమాంకమైన బాల్యములోనే మానవున్ని హతమార్చడము విడ్డూరము కాదా! ఒక్క ఆంధ్రరాష్ట్రములోనే

సంవత్సరమునకు కొన్ని వందల సంఖ్యలలో, శిశుదశలోనే మానవజాతి పరోక్ష హత్యకు గురి అవుతున్నదని చెప్పుటకు

ఎన్నో ఉదాహరణలుగలవు. వాటిలో మహబూబ్నగర్ జిల్లా, కల్వకుర్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రియందు జరిగిన

సంఘటనను వివరించుకొందాము.


“జడ్చర్ల మండలము నజురుల్లాబాద్ గ్రామానికి చెందిన సుమతి, పురుటి నొప్పులతో 2004 అక్టోబర్ 5వ తేదిన

మంగళవారము కల్వకుర్తి ప్రైవేటు ఆసుపత్రిలో చేరడము జరిగినది. సాయంత్రము 5 గంటలకు ఆమెకు సిజేరియన్

ఆపరేషన్ ద్వార ఆడశిశువును బయటికి తీసిన డాక్టర్లు, శిశువును కొంతసేపు క్షుణ్ణంగా పరీక్షించి మరణించినట్లు

ధృవీకరించారు. మరణించిన శిశువు పుట్టిందని చెప్పిన డాక్టర్ల మాటలకు కొంత బాధపడిన తల్లితండ్రులు శిశువును

ఇంటికి తీసుకుపోయారు. శిశువు పుట్టిన మంగళవారము గడిచిపోగా బుధవారము పసికందును ఖననము చేయడానికి

శ్మశానానికి తీసుకెళ్లారు. గోతిలో శిశువును పరుండబెట్టి పైన మట్టి వేయునపుడు శిశువు కదలి ఏడ్వడము మొదలుపెట్టింది.

ఆశ్చర్యపడిన తండ్రి మొదలైనవారు బిడ్డ బ్రతికిఉందని గ్రహించి ఇంటికి తెచ్చుకొన్నారు. అన్ని విధముల పాప ఆరోగ్యముగ

ఉన్నది. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత కూడ మరణించిన శిశువు పుట్టినదని డాక్టర్లు చెప్పడముతో ఆ కుటుంబము పడిన

ఆవేదన ఆగ్రహముగ మారింది. ఆసుపత్రిపై దాడిచేసి తాళాలు వేయడానికి ప్రయత్నించారు. శిశువు మరణించినట్లు

ధృవీకరించిన డాక్టర్లు పరారైపోయారు.


ఇది జరిగిన సంఘటన కాగ ఇందులో డాక్టర్లకు తెలియని విషయము ఉన్నదని స్పష్టముగ కనిపిస్తున్నది.

శిశువు బయటపడిన తర్వాతనే ప్రాణము పోసుకొంటుందను విషయము జగమునకు తెలియని సత్యము. తర్వాత రెండవరోజు

ప్రాణమొచ్చిన విషయము అర్థముకాక, తమదే తప్పనుకొన్న డాక్టర్లు పారిపోవడము జరిగినది. శిశువుకు మొదట

ప్రాణములేని మాట వాస్తవమే, అయినప్పటికి ఆ విషయము తెలియని డాక్టర్లు తమదే పొరపాటనుకోవడము వారి

చదువులకే అవమానము. ఈ ఒక్క విషయముతోనే డాక్టర్లకు తెలియని విషయమెంతో కలదని తెలియుచున్నప్పటికి,

మేము గత 30 సంవత్సరములుగ చెప్పుచున్నప్పటికి మాకు తెలియనిది మీకు తెలుసునా అని మొండిగా మాట్లాడు

వారినేమనాలో మీరే యోచించండి.


డాక్టర్లు శిశువు చనిపోయిందని చెప్పిన వెంటనే శిశువును తల్లితండ్రులు వదలిపోయి ఉంటేనో, లేక శిశువును

పారవేసి ఉంటేనో, లేక వెంటనే భూమిలో పూడ్చి పెట్టి ఉంటేనో, ఆ శిశువును పరోక్షముగ హత్య చేసినట్లు కాదా! దానికి

డాక్టర్లు కారకులు కాదా! డాక్టర్లను తయారుచేసిన మెడికల్ బోర్డు ఈ విషయములన్నిటికి బాధ్యత వహించి సమాధానము

చెప్పాలి.”


తన పుట్టుకను తానే తెలియని మనిషి, తన సంతతి పుట్టుకలో కూడ పొరపడుచున్నాడు. ఎందరో తల్లిదండ్రులు

తమ శిశువులకు ప్రాణము రాకముందే గర్భములోనే చనిపోయాడని అపోహపడుచున్నారు. పుట్టిన తరువాత కదలని

శిశువును చనిపోయినదని డాక్టర్లు చెప్పడము వలన, మొదటికి ప్రాణమేరాని శిశువును చనిపోయినదని పూడ్చిపెట్టిన

వారు కొందరుండగ, ఆ శ్రమ కూడ లేకుండ నిర్జన ప్రదేశములోనో, కంపచెట్లయందో, మురికికాల్వలయందో పారవేసినవారు

కూడ చాలా మందిగలరు. ఇటువంటి సంఘటనలు ఎన్నో వేలసంఖ్యలో జరిగినవి కలవు. వాటిలో ఉదాహరణకు

అనంతపురం ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలో సోమవారం, 13వ తేది, సెప్టెంబరు 2004న అనంతపురం జిల్లా స్పెషల్

ధర్మవరం జోన్లో ప్రచురితమైన వార్త ఈ విధముగ ఉన్నది.


5). అనాధ పసికందును అక్కున చేర్చుకున్న దంపతులు.

ధర్మవరం, సెప్టెంబరు, 12, 2004 (ఆన్లైన్ ఆంధ్రజ్యోతి).


ఓ తల్లి కనిపారవేసిన పసికందును అక్కున చేర్చుకున్న దంపతుల సంఘటన ఇది. అనంతపురం జిల్లా, ధర్మవరం

పట్టణములోని గూడ్సుషెడ్డు కొట్టాలకు వెళ్ళే రహదారిలో రైల్వేగేటు వద్ద, లోకము ఎరుగని అప్పుడే పుట్టిన ఒక పసికందును

ఎవరో పారవేయడముతో, విషయము తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి, ఆ పసికందు ప్రాణాలతో ఉండడము

చూచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసికందు ముళ్ళపొదల్లో అరుస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులలో సి.ఐ

విక్టర్, ఎస్.ఐ శ్రీనివాసులు, ఎ.ఎస్.ఐ భీమప్ప ముళ్ళపొదల్లోని పసికందును బయటికి తీశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి

తరలించగ వైద్యులు చికిత్సలు నిర్వహించారు. ఆ పసికందు వయస్సు కేవలము కొన్ని గంటలే అని వైద్యులు తెలిపారు.

ఆ బిడ్డను అక్కున చేర్చుకోవడానికి పలువురు దంపతులు పోటీపడగ, చివరకు అన్ని వివరాలు తెలుసుకొని చిన్నారిని

పోషించగల ఆర్థిక స్థోమత ఉండి సంతానములేని దంపతులకు అప్పగించడము వల్ల, ఆ చిన్నారికి న్యాయము

చేసినవారౌతామని సి.ఐ విక్టర్, ఎస్.ఐ శ్రీనివాసులు భావించారు. దీనితో గుంతకల్లుకు చెందిన వి. దేవదానము, సరోజ

అను దంపతులకు ఆ పసికందును అప్పజెప్పారు. వారికి సంతానములేక పోవడముతో ఆ చిన్నారిని తమ బిడ్డగ

చూచుకొంటామని చెప్పి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దేవదానము గుంతకల్లు పట్టణమునకు చెందిన వ్యక్తికాగ, కల్లూరు

ఎ.పి. ట్రాన్సోకోలో లైన్మెన్గా ఉద్యోగము చేయుచున్నాడు. దీనితో సి.ఐ విక్టర్ వారికి పసికందును అప్పజెప్పి దంపతుల

వివరాలు తీసుకొన్నారు.


ఇదేదో అక్రమ సంబంధము వలన కనిన శిశువును పారవేశారని చాలామంది అనుకొనుటకు అవకాశము

గలదు. అటువంటిది ఏమిలేదు. అక్రమ సంబంధము వలన గర్భము వస్తే అబార్షన్ చేయుటకే రెడీగా ఎందరో డాక్టర్లు

గల ఈ నవీన కాలములో, అందరికీ కనిపించేటట్లు తొమ్మిది నెలల కడుపును పెంచుకొనువారు ఎవరూలేరు. కనేవారు

అంతకూ లేరు. కావున శిశువును పారవేసిన కేసులన్ని చనిపోయినవని, పారవేసినవేనని తెలియు చున్నది. పారవేసిన

తరువాత శిశువు సురక్షితముగవుండి ప్రాణమువస్తే, ఎవరో ఒకరు చూసి తెచ్చి పెంచుకొన్నవారు కూడ ఎందరో కలరు.

ఎవరూ చూడకపోతేనో, కుక్కల కంటపడితేనో ఆ శిశువు అంతమైపోయినట్లే.


సమాజములో ఇటువంటి పరోక్ష శిశుహత్యలు కోకొల్లలుగ జరుగుచున్నవి. మేము గత ముప్ఫై సంవత్సరములుగా

చెప్పుచున్నను, మమ్ములను హేళన చేయువారు తప్ప సత్యమును గ్రహించువారు లేరు. ఆదిలోనే అంతమై పోవువారిని

కాపాడుటకు ఈ పరోక్ష హత్యలను నివారించుటకు న్యాయస్థానములు న్యాయాధీశులు ముందుకు రావాలని కోరుచున్నాము.

జనన సిద్ధాంతమునకు మరొక ఉదాహరణ మీరు చూడవచ్చును.


6). అమ్మా నే బ్రతికే ఉన్నా!

బ్రతికున్న బిడ్డ చనిపోయాడని గుడ్డలో చుట్టేసిన వైద్యులు!

సెప్టెంబరు, 21, 2005 (ఈనాడు న్యూస్టుడే,సుల్తాన్ బజార్) కోఠి, హైదరాబాద్.


అప్పుడే కళ్లు తెరచిన పసికందు, అమ్మ ఒడి వెచ్చనేంటో తెలియదు. అమ్మ పాలరుచీ చవిచూడలేదు. ఎన్నో


రంగులు, అందాలు చూడాల్సి ఉంది. కాని నిర్ధయ గల వైద్యులు నువ్వు బతకలేదన్నారు, మృత శిశువువన్నారు. గుడ్డలో

చుట్టి ఓ మూలకు విసిరేశారు. బిడ్డ పుట్టిందని తెలిసి మధురానుభూతితో ఉన్న ఆ మాతృమూర్తికి తన ప్రేగుబంధం

ఏమైందో తెలియదు. బంధువులు బయటకెళ్లేసరికి బ్రతికున్న ఆ బిడ్డను మృతశిశువుగా ముద్రవేసి పక్కన పెట్టారు.

నిర్లక్ష్యం.. నిర్లజ్జ.. అనాగరికం.. ఈ పదాలకు మించి నిఘంటువులో ఏదైనా పెద్ద పదముంటే... దాన్ని సుల్తాన్బజార్

ప్రసూతి ఆసుపత్రి సిబ్బందికి అన్వయించాలి. మంగళవారం నాడు (అ)ధర్మాసుపత్రిలో జరిగిన సంఘటన తలచుకుంటేనే

ఒళ్లు గగుర్పొడుస్తుంది. మానవతను ప్రశ్నిస్తుంది. వైద్యలోకానికే మాయని మచ్చగా మిగులుతుంది.



జీడిమెట్ల సమీపంలోని సూరారం గ్రామానికి చెందిన సురేష్ యాదవ్, రేవతి (27) దంపతులు. వీరికి ఒక పాప.

గతంలో రేవతికి రెండు సార్లు అబార్షన్ అయింది. ఆమె మళ్ళీ గర్భం దాల్చడంతో కుటుంబీకులు సుల్తాన్ బజార్లోని

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నారు. ఏడునెలల గర్భవతి అయిన రేవతికి హై బి.పి.

ఉండటంతో, ప్రసవ సమయంలో ఇబ్బందులతో పాటు పుట్టబోయే శిశువు బలహీనంగా జన్మించడం, లేదా శిశువు

మరణించే ఆవకాశాలు ఉన్నాయని, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమె కుటుంబీకులకు వారం రోజుల క్రితమే సూచించారు.

రేవతి ఈ నెల 8న సుల్తాన్బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకు సోమవారం సాయంత్రం పురిటి నొప్పుల

కోసం ఇంజక్షన్ ఇవ్వడంతో, రాత్రి ఒంటి గంట సమయంలో నొప్పులు ప్రారంభమయ్యాయి. డ్యూటీ మెడికల్ ఆఫీసర్

(DMO) సంధ్యాదీక్షితు ఆ సమాచారం అందించారు. మంగళవారం తెల్లవారు జామున 3.45 గంటల సమయములో

రేవతికి సాధారణ ప్రసవము జరిగి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవము సమయములో రేవతి తల్లి యాదమ్మ ప్రసవము

జరిగే వార్డు వద్ద ఉండగా, ఆమె భర్త సురేష్ మందుల కోసం బయటికి వెళ్ళాడు. అయితే రేవతిని వెంటనే ఆపరేషన్

థియేటర్కు తరలించారు. ఆరు గంటల సమయములో అక్కడ పనిచేసే ఆయావచ్చి పుట్టిన శిశువు మరణించాడని ఓ

గుడ్డ తీసుకురావాలని చెప్పింది. దీంతో రేవతి తల్లి యాదమ్మ గుడ్డను తీసుకువచ్చి ఇచ్చింది. శిశువును గుడ్డలో చుట్టి ఓ

ప్లాస్టిక్ కవర్లో ఉంచి పక్కన పెట్టేశారు. డబ్బులు ఇస్తే ఇక్కడే ఉండే ఓ వ్యక్తి మృతశిశువును తీసుకెళ్ళి పూడ్చేస్తాడని సలహా

కూడా ఇచ్చారు. అయితే రేవతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, ఆమె అత్తామామలు వచ్చేదాకా ఉండమని

చెప్పడముతో, సిబ్బంది శిశువును అక్కడే ఓ ప్రక్కన పెట్టేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయములో రేవతి మామ

శివయ్య, మరి కొందరు బంధువులు వచ్చి మృతశిశువును ఇవ్వాలని కోరడంతో, ప్రక్కన పడేసిన శిశువు ఉన్న కవర్ను

వారికి అందించారు. దీంతో వారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న సందర్శకుల గదివద్దకు వెళ్ళి, ఓసారి ఎవరి పోలికో ముఖం

చూద్దామని కవర్లో ఉన్న శిశువును బయటికి తీశారు. అంతే శిశువు ఊపిరి పీల్చుకుంటూ కాళ్లు చేతులు ఆడిస్తూ

కనిపించింది. వెంటనే వారు డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజేశ్వరి దృష్టికి తీసుకువెళ్ళగా, శిశువు ఊపిరితో ఉన్నాడని వెంటనే

నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రాణాలతో ఉన్న శిశువు మృతి చెందాడని చెప్పి తమ నిర్లక్ష్యాన్ని

చాటుకున్న వైద్యులు, 12 గంటల తర్వాత శిశువు ప్రాణాలతో ఉన్నాడనే విషయం తెలిసినా తగిన విధంగా స్పందించలేదు.

ప్రస్తుతం ఆ శిశువు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ప్రభుత్వాసుపత్రుల

వైఖరిని మరోసారి తెరమీదికి తెచ్చింది.



కొన్ని ఉదాహరణలు పేపర్ లో శీర్షిక లు చూడండి ,పేజీ 30-35 లో చూడండి .


ఇట్లు ఎన్నో నిదర్శనములను జనన సిద్ధాంతమునకు అనుకూలముగా మీరు చూడవచ్చును.


ఈ విషయములో నేను మీకు కొన్ని ప్రశ్నలను ఇస్తున్నాను. వీటికి మీరు జవాబులు చెప్పగలరేమో చూడండి.

1.వెనుకటి జన్మ జ్ఞప్తి కల్గి చెప్పిన వారినైన మనము భూమి మీద చూడవచ్చును. కాని గర్భస్థస్థితిని గూర్చి

చెప్పినవారున్నారా? అసలు మీకు ఆ జ్ఞప్తి ఉందా?


2.జ్యోతిష్య శాస్త్రరీత్యా తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాతనే లెక్కించి దశా శేషమును తెల్పుచున్నారు. దశలు

తల్లి గర్భము చేరినప్పటి నుండి ఎందుకు లెక్కించలేదు? దశా భుక్తిని గత జన్మ భుక్తి అని వ్రాయుచున్నారు ఎందుకు?


(గర్భ భుక్తి అని కొందరంటారు. గర్భములో సంవత్సరముల తరబడి ఉండరు కనుక గర్భ భుక్తి అనకూడదు గత జన్మ భుక్తి

అనాలి.)


3. తల్లి గర్భము నుండి బయటపడిన శిశువుకు కొన్ని నిమిషములు, కొన్ని గంటల పాటు శ్వాస, రక్త ప్రసరణము,

కదలిక, చైతన్యము ఎందుకు లేవు.?


4. మంత్రసానులు కొందరు మావిలో ప్రాణమున్నది, శిశువులోనికి రావాలని అంటుంటారు. అసలు గర్భములో

ప్రాణమొచ్చినది మావికా, శిశువుకా?


5. కొన్ని ఆస్పత్రులలో ప్రసవింపబడిన శిశువులు చనిపోయినారని డాక్టర్లు నిర్ధారణ చేసిన కొంతసేపటికి ఎలా

ప్రాణము పొందినాయి?


6. గర్భస్థశిశువుకు ప్రాణము లేనిదే పెరగదని, శిశువు తల్లి శరీరములో మరణిస్తే తల్లికి ప్రమాదమని అంటారు.

గర్భము నిలచినప్పటి నుండి ప్రాణము రాని ఆరు నెలల కాలము ఎలా పెరుగగలిగింది. ఆ ఆరు నెలల కాలములో

శిశువుకు ప్రాణములేనట్లయితే తల్లికెందుకు ప్రమాదము జరగలేదు?


7. యోగశాస్త్రమైన గీతలో జీవుడు శరీరమును పొందినప్పటి నుండి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య మరియు

మరణావస్థలన్నారు కాని గర్భస్థావస్థ అని చెప్పలేదెందుకు?


8.గీతలో పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును జీవుడు ధరిస్తున్నా డన్నాడు. క్రొత్తదంటే పూర్తి తయారైనదా?

లేక ఆరు నెలలకు అసంపూర్ణముగ ఉన్నదా?

9.భగము (యోని) నుండి ప్రాణముతో పుట్టినపుడు అందరు భగవంతులే అవుతారు కదా! అలా అందరము

భగవంతులుగ ఎందుకు లేము?


ఇక్కడ మేము కొద్దిగ చెప్పు జవాబు ఏమంటే మన శరీరములో పంచ భూతములలో ఒకటైన వాయువు (గాలి)

ఉన్నది. అది ఐదు భాగములుగ ఉన్నది. వాయువును ప్రాణము అనవచ్చును. అందువలననే పంచ వాయువులను పంచ

ప్రాణములు అన్నారు. మన ముక్కురంధ్రములో గాలి ఉన్నపుడే ప్రాణమున్నదని, గాలిలేనపుడు ప్రాణములేదని చెప్పడము

కూడ పరిపాటి. శరీరములో ప్రాణమున్నపుడే జీవుడు కూడ ఉండును. ప్రాణము లేనపుడు జీవుడుండడు. ముక్కురంధ్రములలో

శ్వాస ఆడనంత వరకు శిశువుకు ప్రాణములేదని గ్రహించవలయును. తల్లి గర్భములో మావి అను తిత్తియందు ఉమ్మి

నీరు అనుద్రవములో శిశువు మునిగి ఉండును. అందువలన శ్వాస ఆడుటకు అవకాశమేలేదు. జీవుడసలే లేడు.

జననము గురించి మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు మీరు వెదకండి. సత్యాసత్యములు మీకే అర్థమౌతాయి. ఈ

విధముగా పరిశోధనా దృష్ఠితో మాకు సంచలనాత్మకమైన మీకు విప్లవాత్మకమైన జనన రహస్యములు తెలిసినవని

సంతోషపడువారు అదే ఉత్సాహముతో, ఎక్కడా ఎవరూ చెప్పని మరణ రహస్యమును కూడ క్రింద చదువగలరని కోరుచున్నాము.


మరణము.



శరీరమను యంత్రము పనిచేయకుండ నిలచిపోవడమును మరణము అంటున్నాము. 'మర' అనగా యంత్రమని

అర్థము. మరణమనగా యంత్రములో లోపమేర్పడి నిలచిపోవడమని అర్థము. యంత్రములో ఎన్నో భాగములున్నట్లు

శరీరములో కూడ ఎన్నో భాగములు గలవు. యంత్రమును నడుపు డ్రైవర్ అనువాడు ప్రత్యేకముగ ఉన్నట్లు శరీరమును

నడుపు వాడు కూడ ప్రత్యేకముగ గలడు. యంత్రమును నడుపు వానిని డ్రైవరన్నట్లు శరీరయంత్రమును నడుపు వానిని

ఆత్మ అంటున్నాము. శరీరయంత్రమును నడుపు ఆత్మ శరీరములోనే ఉండి శరీరమును నడపడము జీవితము అంటున్నాము.

శరీర యంత్రములో లోపమేర్పడినపుడు అది పనిచేయలేని స్థితికి చేరుకొన్నపుడు ఆత్మ శరీరమును నడపడము మానివేసి

మరియొక క్రొత్త శరీరమును చూచుకొనును. ఆత్మ శరీరమును వదలిపోవడము శరీరయంత్రము పనిచేయనపుడే

జరుగుచుండును. శరీరయంత్రము నిలచిపోవడము మరణము అని ఒక గుర్తింపుగ పేరుపెట్టారు. యంత్రము జ్ఞాపకము

వచ్చినపుడు దానిని నడుపువాడు మరొకడుండునని తెలియునట్లు మరణము అను పేరును పెద్దలు నిర్ణయించారు.

మరణములో శరీర యంత్రమును నడుపువాడు లేకుండ పోయాడను అర్థముతో పూర్వము ఆ పేరునుంచారు. ఈవిషయము

ఈవిధముగ ఆధ్యాత్మిక అర్థముతో ఉండగ పురాణములలో మరొక విధముగ చెప్పడము జరిగినది. యమలోకము

ఒకటున్నదని, అక్కడ యమధర్మరాజు గలడని, మనిషి ఆయుస్సు అయిపోయిన వెంటనే యమధర్మరాజు తన భటులను

పంపి మనిషి ప్రాణము తీయు చున్నాడని, అట్లు ఒక శరీరమునుండి జీవుని వేరుచేసి తనలోకమునకు తీసుకపోవుచున్నాడని

చెప్పారు. ఈ విషయములు శాస్త్రబద్దముకావని, ఇందులో వాస్తవము ఏమాత్రము లేదని మేము చాలామార్లు చెప్పాము.

మానవునికి భయమును కల్గించుటకు యమలోకము అక్కడి శిక్షలు సృష్టించారు. కాని పాపములకు శిక్ష భూమి

మీదనేపడుచున్నదని చెప్పలేకపోయారు.


మరణసమయములో జీవుడు చాలా బాధపడునని, మరణబాధ వెయ్యి తేళ్ళు కుట్టినట్లుండునని, జీవితములోని

అన్ని బాధలకంటే మరణబాధ పెద్దదని పురాణములలో చెప్పియుండుట వలన చాలామంది మరణమంటే ఎక్కువ

భయపడుదురు. కొందరు చెప్పినట్లు మరణసమయములో యమకింకరులు వస్తారని, వారు భయంకరముగ ఉందురని

మరణము రాకముందే భయ పడుచుందురు. కొందరు యమలోకములోని బాధలు ఇట్లుండునంట అని ముందే తలచుకొని

బాధపడువారు గలరు. ఇన్ని అపోహలతో కూడుకొన్న మరణమును గురించి శాస్త్రబద్దతగ తెలుసుకోవడము మంచిది.

హేతుబద్ధముగ మరణమును గురించి వ్రాయాలంటే ఆసమయములో శరీరమునందు ఏమి జరుగుచున్నదో పరికించి

చూడవలయును. మరణమును గురించి వ్రాయాలంటే ఒకమారు చనిపోయి అప్పుడు ఏమి జరుగుచున్నదో చూచిన వాడే

వ్రాయగలడు. అలా వ్రాయుటకు చనిపోయిన వాడు తిరిగి పుట్టినప్పటికి వానికి మరణము యొక్క విషయము

జ్ఞాపకముండదు. జీవునికి తాను శరీరము ధరించి ఎలా పుట్టానను విషయము కూడ జ్ఞాపకముండదు. చావు తర్వాత

వచ్చిన పుట్టుక విషయమే తెలియని జీవుడు పుట్టుక కంటే ముందు జరిగిన మరణము యొక్క విషయము నెలా చెప్పగలడు?

చావు పుట్టుకల గురించి జీవుడు చెప్పుటకు అవకాశమే లేదు. కావున జనన మరణములు రెండూ రహస్యములనే

చెప్పవచ్చును. అలాంటపుడు అవి రహస్యములుగనే ఉండి పోతే మనిషి తన ఇష్టమొచ్చినట్లు ఊహించుటకు అవకాశము

గలదు.


భూమి మిూద లేని క్రొత్తవిషయములు, మనిషికి ఏమాత్రము తెలియని క్రొత్తవిషయములు, మనిషి ఊహించుటకు

కూడ చేతగాని విషయములు ఎన్నో మనిషి ద్వారా బయటికి వచ్చాయి. ఉదాహరణకు దూరదర్శనము (టి.వి)లు,


దూరశ్రవణము (రేడియో)లు, కంప్యూటర్లు, రైళ్ళు, విమానములు మొదలగునవి ఎన్నో మొదట మనిషికి తెలియని విషయములే.

ఎన్నో అద్భుతమైన విషయములు మనిషి ద్వార బయటికి వస్తూనే ఉన్నవి. ఇవన్నియు శాస్త్రబద్ధ హేతుబద్ద విషయములే.

అలాంటపుడు రహస్యములుగ తెలియకున్న జనన మరణములు శాస్త్రబద్ధముగ తెలియలేమా! తెలియవచ్చును. మనిషి

కనుగొనిన క్రొత్త సూత్రములన్నియు మనిషి ఎలా కనుగొన్నాడో విశదపరచుకొని చూచినట్టయితే దాని ప్రకారమే మిగత

విషయములు కూడ కనుగొన వచ్చునని తెలియుచున్నది. మనిషి శరీరములో జీవుడు గలడు, ఆత్మగలదు మరియు

పరమాత్మ గలదు. ఒకే శరీరములో ముగ్గురున్నారు అను విషయము కొంత క్రొత్తగ ఉండినప్పటికి అది అందరికి

తెలియని వాస్తవమేనని చెప్పవచ్చును. శరీరములో ముగ్గురున్నారను విషయము శాస్త్రబద్ధమైనది. బ్రహ్మవిద్యా శాస్త్రమైన

భగవద్గీతలో స్వయముగ భగవంతుడే ఈవిషయము తెలియజేశాడు.


మనిషి ఎన్నో క్రొత్తవిషయములను కనుగొన్నపుడు దానికి ఒక సిద్ధాంతమని పేరు పెట్టడము, ఆ సిద్ధాంతమును

తానే కనుగొన్నట్లు సిద్ధాంతము ముందర తనపేరే ఉంచుకోవడము జరుగుచున్నది. ఉదాహరణకు న్యూటన్ సిద్ధాంతము,

డార్విన్ సిద్ధాంతము అలాంటివే. ఒక మనిషి ఒక క్రొత్త విషయమును కనుగొన్నట్లు మనము కూడ ఒప్పుకొంటున్నాము.

అయినప్పటికి బాగా ఆలోచిస్తే ఇక్కడొక ప్రశ్న రాగలదు. అదేమనగా శరీరములో ఉన్నది ముగ్గురు కదా! అలాంటపుడు

ఒక క్రొత్త విషయము మనిషినుండి బయటికి వస్తే ఆ విషయమును ఉన్న ముగ్గురిలో ఎవరు చెప్పారు? దీనిని ప్రశ్నకాదని

మనమనలేము. ఒక ఇంటిలో ముగ్గురు నివాసము చేస్తున్నపుడు, ఆ ఇంటినుండి ఒక పెద్ద సహాయము బయటి వారికి

అందినపుడు, ఆ ఇంటిలో ఎవరు ద్వార ఆ సహాయము అందినదో తెలుసుకోవడము బయటి వారి పని. ఈ సహాయము

అందించినదెవరు అని ప్రశ్న వచ్చినపుడే ఒకే ఇంటిలో గల ముగ్గురి మీదికి మన దృష్ఠిపారుతుంది. చివరకు ఎవరు

అందించినది తెలియబడుతుంది. ఇంటిలోనున్న ముగ్గురిలో ఎవరికి ఎంత స్థోమతున్నది, ఎవరికి సహాయము చేయు

శక్తి గలదో తెలుసుకొంటే ముగ్గురిలో సహాయము చేసినవానిని సులభముగ గుర్తించవచ్చును.


శరీర గృహములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను ముగ్గురు నివశిస్తున్నారు. శరీర గృహమునుండి ఒక

రహస్యము బయటపడినపుడు శరీరములోని ముగ్గురిని విశదముగ పరిశీలించవలసిన అవసరమున్నది. ముగ్గురున్న

విషయము తెలియకపోతే అసలు ఎవరు చెప్పినది తెలియక పోవును. అందువలన ముగ్గురున్న విషయము ముందు

తెలుసుకొని ఆ ముగ్గురి సమాచారము వివరముగ తెలుసుకోవాలి. శరీరములోనున్న ముగ్గురిలో మొదటివాడు జీవాత్మ.

శరీరములో జీవుడనే వాడే మనము. శరీరములో నేను అను భావముతోనున్న వాడే జీవుడు. శరీరములో ఏపని

జరుగుచున్నను అన్ని నేను చేశానని అనుకొనువాడే జీవుడు. వాస్తవానికి ఈ జీవుడెవరు? శరీరములో వీని కర్తవ్యమేమిటి?

శరీరములో ఎందుకున్నాడు? ఇలాంటి మొదలగు ప్రశ్నలకు జవాబు కావాలంటే జీవుని గురించి వివరముగ తెలుసుకొందాము.


ప్రపంచములో ఎన్నో స్థితిగతులయందున్న మనుషులలో జీవాత్మ ఉంటూ తాను పైన ఉన్నటువంటి స్థితిని బట్టి,

హోదాను బట్టి నేను మంత్రిననో, నేను ఆఫీసర్ ననో, ధనికుడననో, బీదవాడిననో తలపోయు చున్నాడు. వాస్తవముగ

జీవునికి బయటి స్థితికి ఏమి సంబంధము లేదు. శరీరములో జీవుడు శరీరమంతట లేకుండ కేవలము ఒక్కచోట

మాత్రమున్నాడు. శరీరములో జీవుని పరిమాణము మనిషి శరీరములోని 31,104వ భాగమని ఒక లెక్కగలదు. (ఈ

లెక్కతెలియాలంటే మా రచనలలోని "నిగూఢ తత్వార్థబోధిని" అను గ్రంథములో 93వ పద్యము యొక్క భావము చూడవలెను)

మనిషి శరీరములో కొన్ని వేలరెట్లు చిన్నవాడైన జీవున్ని కొన్ని సందర్భములలో నీవు రవ్వంతలేవు అనడము కూడ

జరుగుచున్నది. ఎంతో చిన్న ఆకారము కల్గిన జీవుడు శరీరములో ఏ పని చేయడము లేదు. తాను శరీరములో ఉన్నది


కేవలము శరీరములో జరిగెడి పనుల అనుభవములు అనుభవించేదానికి మాత్రమే. సుఖదుఖములను అనుభవించుటకు

మాత్రమే జీవుడు శరీరములో గలడు. జీవునికి బయటి హోదాలకు సంబంధము లేదు. శరీరములో ఏపని చేయని,

ఏహోదాకు సంబంధములేని జీవుడు మాత్రము బయట హోదా తనదేనని అన్ని పనులు చేయుచున్నది తానేనని

తలచుచుండును. శరీరములోని జీవుడెట్లు తలచిన జరుగుచున్న పనులకుగాని, బయటి హోదాలకుగాని, చేయుచున్న

ఆలోచనలకు గాని, కనిపెట్టిన రహస్యములకుగాని ఏమాత్రము సంబంధములేనివాడై ఉన్నాడు. నాస్థితి ఇది అని, నేను

ఏమి చేయలేదని, ఏ పనిగాని, చెప్పబడు విషయముగాని నాకు సంబంధము లేదని జీవుడు అనుకోవడము లేదు. జీవునికున్న

అజ్ఞానము వలన తన స్థితిని గాని, తన పరిమాణమును గాని, శరీరములోని తన నివాసస్థలమును గాని తెలియలేక

పోయాడు. కర్మలను అనుభవించుటకు మాత్రము శరీరములోగలనని, మిగతాదేది తనకు సంబంధమే లేదని తెలియక

పోవడము వలన జరిగిన పనిని నేనే చేశానని అనుకుంటున్నాడు. అలాగే కనిపెట్టబడి బయటికి తెల్పిన రహస్యమును

తానే చెప్పానని ఆ సిద్ధాంతము తనదేనని పొరబడుచున్నాడు. నిజ జ్ఞానము ప్రకారము జీవుడు శరీరములో అస్వతంత్రుడు,

అనామకుడు, కర్మబద్ధుడై కర్మను అనుభవించువాడు.


ఒకటవ ఆత్మయిన జీవాత్మకు శరీరములో జరిగెడి పనులకు ఏమి సంబంధము లేదని, తనవరకు వచ్చిన దానిని

అనుభవించుట తప్ప మరి ఏ కార్యము లేదని తెలుసుకొన్నాము. మొదటిదయిన జీవాత్మ అలా ఉండగ చివరిదయిన

పరమాత్మ కూడ దాదాపు జీవాత్మవలె ఏమి చేయక ఉన్నది. జీవాత్మ ప్రారబ్ధకర్మను అనుభవిస్తు అహముచేత ఆగామికర్మను

సంపాదించు కొనుచున్నది. పరమాత్మ అలా కర్మను అనుభవించడమూలేదు, సంపాదించుటకోనూ లేదు. జీవాత్మ

శరీరములో ఒక్క చోట మాత్రము గలదు, పరమాత్మ శరీరమంతట వ్యాపించియుండి శరీరము బయట కూడ వ్యాపించి

ఉన్నది. జీవాత్మకు ఆకార పరిమాణములుండగ, పరమాత్మకు ఆకారము లేదు పరిమాణము లేదు. శరీరములో పరమాత్మ

ఏకార్యము చేయక ఊరక ఉన్నాడని చెప్పవచ్చును. జీవాత్మ మాదిరి జరిగిన పనులకు కర్తను నేనని అనుకొనువాడు కాదు.

జీవాత్మ చేయక మరియు పరమాత్మ కూడ చేయకపోతే మనిషి ఎలా పనిచేయుచున్నాడని చాలామందికి ప్రశ్నరావచ్చును.

దానికి సమాదానము ఏమనగా! ఇంతవరకు ఆధ్యాత్మిక విద్యలో ప్రచారముగాని ఆత్మ కూడ శరీరములో ఒకటున్నది.

అదియే మొదటి జీవాత్మకు, మూడవ పరమాత్మకు మధ్యలోగల రెండవ ఆత్మ. చాలామందికి జీవుడొకడున్నాడని, పరమాత్మయిన

దేవుడొకడున్నాడని తెలుసును గాని రెండిటికి మధ్యలో గల ఆత్మ ఒకటున్నదని తెలియదు. కొంతమంది వాదనలో

పరమాత్మ ఒకడే ఉన్నాడనుట కూడ కలదు. ఎవరేమి చెప్పిన శరీరములో ఏమి చేయని జీవాత్మ, పరమాత్మ ఇద్దరుండగ

అన్ని చేస్తున్న ఆత్మకూడ గలదు. శరీరములో అన్ని చేస్తున్న ఆత్మను గుర్తించకపోవడమే మనకున్న పెద్ద అజ్ఞానము.

ఎక్కడయిన ఆత్మను పేరు వినిపించిన ఆత్మేనువ్వు, నువ్వేఆత్మని బోధించడము కూడ జరుగుచున్నది. జీవాత్మ వేరు,

ఆత్మవేరు, పరమాత్మవేరు అని తెలియు జ్ఞానము మనవద్దలేక పోవడము పెద్దలోటు అని చెప్పవచ్చును.


రెండవ ఆత్మ ఇటు జీవాత్మకు అటు పరమాత్మకు మద్యలో ఉండి పరమాత్మకు ప్రతినిధిగ, జీవాత్మకు అధిపతిగ

ఉన్నది. శరీరములోని ఆత్మ శరీరమంత వ్యాపించి ఉండి అన్ని పనులు తానే చేయుచున్నది. శరీరము ద్వార బయట

జరిగెడి కార్యములను గాని ఎల్లపుడు శరీరములోపల జరిగెడి కార్యములకు గాని అధిపతి ఆత్మయే. శరీరము లోపలి

అవయవములను కదలించి అడించుచు, బయటి అవయవములైన కాళ్ళు చేతులను కదలించి ఎన్నో కార్యములు చేయుచున్న

ఆత్మ ఈ పనులకంతటికి నేనే కారణమని ఎక్కడ చెప్పుకోకపోవడము వలన ఎవరు ఆత్మను గుర్తించుటకు వీలులేకుండ

పోయినది. ఏమి చేయలేని జీవాత్మ అన్ని చేస్తున్నాననుకోవడము వలన ఆత్మపాత్ర ఎవరికి తెలియకుండపోయినది.


మనకు తెలియకున్నా తెలిసినా ఆత్మనునది ఒకటున్నది అది శరీరములోపల, శరీరముబయట పనులు చేయడమే కాక

శరీరములోని ప్రతి అవయవమునకు శక్తినిచ్చుచున్నది. తానే చైతన్యమై శరీరమంతా వ్యాపించి ఉండడమేకాక అన్నిటికి

కారణము అదియేయై ఉన్నది. జీవాత్మ పరమాత్మ రెండు ఏమి చేయక పోయినప్పటికి జగతి అభివృద్ధికి సామాజిక

పురోగతికి కావలసిన యంత్రములను, తెలియని సిద్దాంతములను, విజ్ఞాన శాస్త్రపరిశోధనను ఆత్మే స్మృతి ద్వారా

అందించు చున్నది. తెలియని విషయములను తానే తెల్పుచున్నది. ఈ రోజు భూమిమీద కంప్యూటర్లు మొదలుకొని

ఎన్నో విజ్ఞాన పరికరములు అన్నియు ఆత్మ యొక్క స్మృతి ద్వారా తెలిసినవేనని తెలియాలి. ఈ విషయము శాస్త్రబద్దమైన

దని తెల్పుటకు ఆధారము కూడ కలదు. భగవద్గీతా శాస్త్రములో పురుశోత్తమ ప్రాప్తి యోగమను అధ్యాయములో పదిహేనవ

శ్లోకములో "సర్వస్య చాహం హృది సన్ని విష్ణో మత్తః స్మృతిర్జన మపోహనంచ", అని ఆత్మ విధానము చెప్పబడినది. స్మృతి,

జ్ఞానము, ఊహ అన్ని ఆత్మ వలననే కల్గుచున్నను, అన్ని పనులు ఆత్మ వలననే జరుగుచున్నను, అజ్ఞానము చేత జీవుడు

తానే చేయుచున్నానకొనుచున్నాడు. ఆత్మ తన పనిని తాను చేస్తూపోవుచున్నది. ఆత్మచేసిన పనులనేకాక ఆత్మ అందించిన

పరిశోధన జ్ఞానము కూడ మనిషి తనదేననుకొంటున్నాడు.


ఎన్నో శరీరములలో జీవాత్మతో పాటు ఆత్మ కూడ ఉంటూ ఆ శరీరమునకు జీవన విధానమును కలుగ జేయుచున్నది.

ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగ ఉంటూ అన్ని శరీరములోను ఒకే ఆచరణ సూత్రము కల్గిఉన్నది. ఆత్మ అంశ ఒకటే

అయినప్పటికి అన్ని శరీరములలో అన్ని ఆత్మలు గలవని చెప్పవచ్చును. ఒక్కొక్క శరీరములోని ఆత్మ ఒక్కొక్క విధముగ

బయటి ప్రపంచమున ఉపయోగపడుచున్నది. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రంగములో తీర్చిదిద్దుతున్నది. ప్రపంచములోని

ఎన్నో రంగములలో ఎంతో గొప్ప వ్యక్తులుగ వారిలోని ఆత్మే చేసినది. ఎన్నో రహస్యములను తెలియజేసి మానవుల

అనుభవములకు సంబంధించిన ఎన్నో సౌకర్యములు కలుగజేసినది. మానవుని సుఖముల నేపథ్యములో ఎన్నో పరిశోధల

విషయములను తెలియజేసి విమానము, టీవీ, కంప్యూటర్లాంటి పరికరములను అందించినది. మానవునికి ప్రపంచ

సంబంధ విషయములను పరిశోధనల రూపములతో ఆత్మ తెలియజేయగ వాటిని నేనే కనుకొన్నానని మనిషిలోని జీవుడు

అనుకొంటున్నాడు. ప్రతి క్రొత్త విషయములోను, ప్రతి క్రొత్త పరిశోధన లోను అన్ని నావలననే జరుగుచున్నాయని

అనుకోవడము మానవుని సహజత్వమై పోయినది.


ప్రతి శరీరములోని ఆత్మ ఆ శరీరమును అన్ని విధముల నడుపుచున్నది. కొన్ని శరీరములలో మాత్రమే

శరీరములలోని ఆత్మలు ప్రత్యేకమైన పనులు చేయుచున్నవి. సచిన్టెండుల్కర్లోని క్రీడాప్రావీణ్యత గానీ, అబ్దుల్ కలామ్లోని

పరిశోధనా సామర్థ్యముగానీ, మహాగాయకుడైన బాలసుబ్రమణ్యములోని గాత్ర ప్రావీణ్యతగానీ అన్నియు వారి ఆత్మల

ప్రత్యేకతేగాని వారి ప్రత్యేకత ఏమిలేదు. ప్రపంచ పరముగ అన్ని రంగములలో అభివృద్ధికొరకు ఆత్మయే క్రొత్తదనమును,

ప్రావీణ్యతను, పరిశోధనయుక్తిని అందించుచున్నది. విశ్వములో ప్రపంచము, పరమాత్మ అను రెండు తరగతులు గలవు.

ప్రపంచ తరగతిలో ఎంతో పరిశోధన రూపముతో ముందుకు తీసుకపోయిన ఆత్మ మానవున్ని సుఖాలలోను మరియు దుః

ఖములలోను ముంచెత్తుచున్నది. ప్రపంచ ప్రగతిలో ముందుకెళ్ళిన మానవుడు అంతా తన ప్రావీణ్యతేనని తలచుకొనుచున్నాడు.

ప్రపంచ సంబంధమైన ఎన్నో రోగాలకు మందులను తెలియజేసిన ఆత్మ ఎన్నోసుఖములకు ఉపయోగపడు వస్తువులను

కూడ తెలియజేసినది. ఇదంతయు ప్రపంచ తరగతికి సంబంధించిన విషయములు. ప్రపంచతరగతికి సంబంధించిన

అనేక విషయములను అందరి ద్వారా కాకుండ కొందరి శరీరములనుండే తెలియజేయబడినవి. ప్రపంచ విషయములే

అతి జాగ్రత్తగ కొందరి ఆత్మలనుండే బయటపడగ పరమాత్మ తరగతికి సంబంధించిన విషయములు కొందరి శరీరములనుండి


కాక ప్రత్యేకమయిన ఒక శరీరమునుండే బయటపడును. ప్రపంచ సంబంధ విషయముల రహస్యములు ప్రత్యేకత కల్గిన

కొందరినుండి బహిర్గతము కాగ, పరమాత్మ విషయము ఒక శరీర ఆత్మనుండే బయల్పడునని మరువకూడదు. పరమాత్మ

వివరములు రహస్యములు తెల్పు ప్రత్యేకమయిన ఒకేవొక ఆత్మగల వ్యక్తినే భగవంతుడు అనుచున్నాము. పరమాత్మ

విషయములు ఒక్క భగవంతుని ఆత్మకు తప్ప ఎవరికి తెలియవు. మూడవపురుషుడైన పరమాత్మ విషయములను ఒక్క

భగవంతుని ఆత్మయే తెలుపవలసి ఉన్నది. భగవంతుడు కాక మిగత మనుషులలోని ఆత్మలు ప్రపంచములోని ఎంత గొప్ప

విషయమునైన తెలుపవచ్చును.


జగతిలో భగవంతుడై వచ్చినవాడు శ్రీకృష్ణుడు. పరమాత్మ స్వయముగ భూమి మీద జన్మఎత్తినపుడు ఆ జన్మను

భగవంతుడనవచ్చును. పురాణాల పద్దతి ప్రకారము రాముడు కూడ భగవంతుడని అనుచున్నారు. ఇక్కడ శాస్త్రమును

తప్ప పురాణములను తీసుకోకూడదని మనవి. పరమాత్మ కృష్ణునికంటే ముందు ఏ జన్మ ఎత్తినది ఎవరికి తెలియదు.

దశావతారములు శ్రీమహావిష్ణువివని చెప్పుట గలదు. ఆకారము, పేరు గల విష్ణువును గూర్చి చెప్పిన జన్మలు కాక,

ఆకారము పేరు లేని పరమాత్మను గూర్చి చెప్పిన జన్మల గురించి మేము చెప్పుచున్నామని తెలియవలెను. ప్రపంచమంత

ఆవహించి అందరిలోపల గల పరమాత్మ స్వయముగ భగవద్గీతను తెల్పి అందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యములను

తెలియజేశాడు. మానవునికి తెలియని ఎన్నో రహస్యములు భగవంతుని ఆత్మద్వార బయటికి వచ్చినవి ఆ రహస్యములలో

మనిషి చావును గురించిన విషయము, పుట్టుకను గురించిన విషయములు గలవు. వాటిలో ఇక్కడ మరణ రహస్యమును

మరణ సిద్ధాంతముగ, జన్మరహస్యమును జననసిద్ధాంతముగ తెలియజేయుచున్నాము. పుట్టినపుడు జ్ఞాపకముంటేగానీ

జననరహస్యము, చచ్చినపుడు జ్ఞాపకముంటే గానీ మరణరహస్యమును చెప్పవచ్చును. ఎవరికి జ్ఞాపకము లేనిది, ఎవరికి

తెలియనివి నీవెట్లు వ్రాయుచున్నావని ఇతరులు అడుగకుండ జననసిద్దాంతము భగవద్గీత సాంఖ్యయోగములో 22వ

శ్లోకము "వాసాంసి జీర్ణాణి యధా విహాయ నవాని గృర్ణోతి నరో ప రాణి, తధాశరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి

నవానిదేవి” అను దాని ప్రకారము వ్రాశానని చెప్పుచున్నాము. అలాగే మరణ సిద్ధాంతము కూడ అక్షర పరబ్రహ్మయోగము

ఆరవ శ్లోకము "యం యం వాపి స్మరన్ భావం త్యజత్యక్తే కళేబరమ్, తం తమే వైతి కౌంతేయ! సదా తద్భావ భావితః" అను దాని

ప్రకారము వ్రాశానని తెలియజేయుచున్నాము.


ఆత్మ ఎంతటి రహస్యమునయిన తెలియజేయును. ప్రత్యేకించి భగవంతుని ఆత్మ, పరమాత్మ విషయములను

తెలియజేయును. భగవంతుని ఆత్మ తెల్పిన విషయములనే ఇంతకు ముందు ఎన్నో తెలియజేసాము. ఇపుడు కూడ

భగవంతుని ఆత్మ తెల్పిన విషయములే తెలియబరుచుచున్నామని అసూయలేకుండ అర్థము చేసుకోగలరని అనుకొంటున్నాము.

ముఖ్యముగ భగవంతుడు తెల్పిన అన్ని విషయములను మాయలోనున్న మనిషి అంత సులభముగ నమ్మలేడు. జనన

మరణ రహస్యములు కూడ అటువంటివే కావున జాగ్రత్తగా పరిశీలించవలెనని కోరుచున్నాము. కొంత చదివి వెంటనే ఒక

నిర్ణయానికి రాక పూర్తి చదివి అర్థము చేసుకోవలెనని తెల్పుచున్నాము. జనన మరణముల వివరములు రహస్యములు

కావున అవి క్రొత్తగ కనిపించి నమ్మ లేనట్లుండును. అందువలనే ఇంత వివరము చెప్పవలసివచ్చినది. జనన మరణ

విషయలన్ని భగవంతుని ఆత్మ నుండి తెలుపబడిన విషయములే నని, జీవాత్మనైన నావి కావని తెలియవలెను. ఇపుడు

మరణము గురించిన వివరము చూస్తాము.


మనిషికి మరణము రెండురకములు గలవు. ఒకటి అకాలమరణము, రెండవది కాలమరణము అంటాము.

పూర్తి శరీరమును వదలక శరీరములోని పది భాగములను మాత్రము వదలిన వారి మరణమును అకాలమరణము

అంటాము. అకాలమరణము పొందిన వారు మిగత 14 శరీరభాగములతో జీవిస్తునే ఉందురు. పూర్తిగ 24 భాగములను

వదలిన వారిది కాలమరణ మగును. అకాలమరణము పొందిన వారు మనకు కనిపించకుండ జీవించియే ఉన్నారు.

కనుక అది పేరుకు మరణమే కాని పూర్తిమరణము కాదని తెలియవలెను. కాలమరణము పొందినవారు మాత్రమే పూర్తి

శరీరమును వదలి మరుజన్మకు పోవుదురు. అటువంటి మరణమును గూర్చి ఇపుడు తెలుసుకొందాము. మరణము అంటే

అర్థము ముందే తెలుసుకొన్నాము. మరణసమయములో ఏమి జరుగుచున్నదో, ఆ సమయములో జీవుడు ఏ

అనుభూతిపొందుచున్నాడో, పరిస్థితి ఎలాగుండునో, జీవుడు శరీరమును ఏ విధముగ వదలి పోవుచున్నాడో తెలియవలసి

ఉన్నది. శరీరము జీవునితో సహా మొత్తము 25 భాగములుగనున్నది. జీవుని తర్వాత ఉన్న 24 భాగములను శరీరములోని

ఆత్మయే శక్తినిచ్చి నడిపిస్తున్నది. శరీరములోని ఆత్మ పరమాత్మలను భాగములుగ లెక్కించడములేదు. శరీర భాగములుగ

లెక్కించుటకు ఒక సూత్రముగలదు. శరీరములో ప్రత్యేకమయిన పనులు చేయునవి జీవునితో సహా మొత్తము 25 గలవు.

ఆత్మ అన్నిభాగములకు శక్తినిచ్చి ఆడించుచు శరీరమంత వ్యాపించి ఉండుటవలన దానిని భాగముగ గుర్తించుటకు వీలులేదు.

25 భాగములుగనున్న శరీరమును “సజీవ శరీరము” అంటాము. 25 భాగములలో 10 భాగములయిన పై శరీరమును

“స్థూల శరీరము” అంటాము. 15 భాగములయిన లోపల శరీరమును "సూక్ష్మ శరీరము” అంటాము. శరీరము స్థూల,

సూక్ష్మమని రెండురకములుగ గలదు. భూమి మీద స్థూలశరీరము లేకుండ సూక్ష్మశరీరముండగలదు గాని, సూక్ష్మశరీరము

లేకుండ స్థూల శరీరముండలేదు. స్థూలశరీరమును పైశరీరమని సూక్ష్మశరీరమును లోపలి శరీరమని కూడ చెప్పవచ్చును.

లోపలి శరీరములోనే జీవాత్మ కూడ ఉండును. జీవాత్మ ఉన్నటువంటి లోపలి శరీరము పోతే పై శరీరము మృతదేహమగును.

లోపలి శరీరమున్నంత వరకే పై శరీరమునకు విలువ ఉండును. లోపలి శరీరము లేకపోతే పై శరీరము చచ్చిన శరీరమై

చెడిపోవును. స్థూల, సూక్ష్మశరీరములైన సజీవ శరీరమును గురించి తెలుసుకొన్న తర్వాత మరణమును గురించి

సులభముగ తెలియవచ్చును.


ఇంటిలో ఫ్యాను గాలినివీస్తుంది, లైటు వెలుతురునిస్తుంది, టివి సినిమాను చూపగలదు. ఇవన్నియు వాటిపనిని

బట్టి విడి విడి పరికరములే అయినప్పటికి అన్నిటికి ఒక శక్తి అవసరము. అదియే విద్యుచ్ఛక్తి. అలాగే శరీరమను

ఇంటిలో 25 పరికరములు గలవు. అన్ని వేరు వేరు పనులు చేయుచున్నప్పటికి అన్నిటికి ఒక శక్తి అవసరము అదియే

ఆత్మశక్తి. ఆత్మశక్తి అన్ని అవయవములకు ప్రసరించుచు వాటి చేత వివిధ పనులు చేయిస్తున్నది. శరీరము యొక్క

బయటి అవయవములకు గాని, లోపలి అవయవములకు గాని ఆత్మశక్తియే ఆధారమై ఉన్నది. ఇది సజీవ శరీరమునకున్న

విధానము. శరీరమునకు ఆయుస్సు అయిపోయినపుడు మరణము ఆసన్నమగును. మరణము వచ్చు సమయము

వరకు శరీరములో అన్ని అవయవములు పని చేయుచుండును. శరీరములో ప్రతి పనిని ఆత్మచేయిస్తున్నదని చెప్పుకొన్నాము

కదా! ఒక శరీరములో ఒక పని జరిగిందంటే ఆ పనిలోని కష్టమునుగాని, సుఖమునుగాని ఆ శరీరములోని జీవుడు

అనుభవించుటకేనని తెలియాలి. ఉదాహరణకు దారిలో ఒకనికి పదికేజీల బియ్యము మూట దొరికిందను కొనుము, ఆ

మూటను వాడు రెండు కిలోమీటర్లు మోసుకపోవలసి ఉన్నది. మూటను మోసుకపోవునపుడు బరువు బాధను కూడ

అనుభవిస్తున్నాడు. ఈ కార్యములో జీవుడు కొంత సుఖమును, కొంత బాధను రెండిటిని అనుభవిస్తున్నాడు. ఈ కార్యము

జరుగుటకుపయోగపడిన శరీర భాగములన్నిటికి ఆత్మశక్తి ఆధారమైనది. ఆత్మ తనశక్తి చేత ఆ కార్యము చేయించినా

జీవుడు కొంత ప్రారబ్ధకర్మను అనుభవించడము, కొంత ఆగామికర్మను సంపాదించుకోవడము జరిగినది. జరిగిన కార్యము


అందరికి కనిపించినప్పటికీ కార్యము జరుగుటకు కారణమయిన ప్రారబ్ధము ఎవరికి కనిపించదు. అలాగే కార్యములో

ఉత్పన్నమైన అగామికర్మ కూడ ఎవరికి కనిపించదు. ఆత్మయే అన్ని పనులను చేయిస్తున్నప్పటికి ఆత్మ అలా చేయించుటకు

కూడ ప్రారబ్ధకర్మ కారణమై ఉన్నది. అందుకే వివిధ కర్మలున్న మనుషులచేత వివిధరకములుగ ఆత్మ పనిచేయుస్తున్నది.

అలా చేయించుట వలన జగతి అంతయు చిత్ర విచిత్రమైన పనులు కనిపిస్తున్నవి.


అనేక రకములుగ పనులు జరుగుచున్న జగతిలో చేస్తున్న ఆత్మగాని, చేయిస్తున్న కర్మగాని, ఎవరికి కనిపించవు.

అనుభవిస్తున్న జీవుడు మాత్రము తనస్థితి తాను తెలుసుకోలేక జరుగుచున్న అన్నిటికి నేనే కర్తననుకొనుచున్నాడు. శరీరములో

కర్మచేయించడము, ఆత్మచేయడము తెలియని జీవాత్మ నేనే కర్తననుకోవడము ఎలా జరుగుచున్నదో ఉదాహరణగ

విశదపరచుకొని చూస్తాము. ఇంతకుముందు పదికేజీల బియ్యము మూట విషయము చెప్పుకొన్నాముకదా! దాని విషయమే

చూస్తాము ఒకడు కూలీనాలీ చేసి కొంతడబ్బును కూడబెట్టుకొని ప్రక్క ఊరిలో గవర్నమెంట్ స్టోరులో రెండు రూపాయలకు

కేజీప్రకారము పది కేజీల బియ్యమును తీసుకొని తన ఊరికి పోవుచుండెను. దారిమధ్యలో బహిర్భూమికి పోవలసివచ్చినది.

బహిర్భూమికి అంటే ఏదో యుద్ధరంగానికి అనుకోవద్దండి కాలకృత్యములు తీర్చుకొనేదానికని అర్థము. బియ్యము

మూటనెందుకు వెంటతీసుకొని పోవాలని దారిప్రక్కన పెట్టి కొంతదూరములో ఒక పొద చాటుకు పోయి కూర్చొన్నాడు.

అంతలోనే మరొకడు ఆ దారిలో రావడము, ఆమూటను చూడడము జరిగినది. వాని శరీరములోని కన్నుల చూపు ఆ

మూట మీద పడినవెంటనే కన్నుల వరకు వ్యాపించివున్న మనస్సు ఆ విషయమును తీసుకొని లోపలగల బుద్ధికి

అందించినది. బయటి విషయమును గ్రహించిన బుద్ధి లోపలే తన చుట్టుగల గుణములతో యోచించను మొదలు

పెట్టింది. గుణములు మంచి చెడు రెండురకములుగ ఉండును గనుక బుద్దికి రెండురకముల ఆలోచనలు వచ్చినవి. అవి

ఇలా ఉన్నవి.


మంచిగుణము  --- ఎవరిదో మూట క్రిందపడేసుకొని పొయ్యారు.

చెడుగుణము  --- ఎవనిదయితే ఏమి, ఇపుడు ఎవరు లేరు కదా! తీసుకో.

మంచిగుణము -- మూటపడిపోయిన విషయము తెలిసి తిరిగి వచ్చి తీసుకపోవును. మనమెందుకుతీసుకోవాలి? వద్దు.

చెడుగుణము  --ఎవరు లేనపుడు దొరికినది మనసొమ్మే తీసుకో.

మంచిగుణము -- పోగొట్టుకొన్నవాడు వచ్చిచూచి ఎవరో ఎత్తుక పోయారని బాధపడును కదా!

చెడుగుణము --  పోగొట్టుకొన్నది వాని తప్పే. దొరికితే తీసుకోకూడదా!

మంచిగుణము : పోగొట్టుకొన్నవాడు నా సొమ్ము పోయింది కదా అని బాధపడును.

చెడుగుణము  -- ఎవడో బాధపడునని దొరికిన దానిని విడిచి పెట్టెదమా?

మంచిగుణము ---ఇది చెడుపని తీసుకోవద్దు.

చెడుగుణము --మంచి చెడు అని నీతికి పోతే బ్రతకలేవు ముందు తీసుకో!


--


ఇలా రెండురకముల గుణముల వలన బుద్ధి యోచించగ ఆ పని జరిగేదో, జరక్క పోయేదో కర్మను బట్టి

నిర్ణయముండును. ప్రారబ్ధ కర్మప్రకారము ఆ మాటను తీసుకపోయేది ఉన్నది. రెండురకముల యోచనలను బుద్ధి

యోచించి ఎటూ నిర్ణయము చేయకుండును. బుద్ధి గుణములను బట్టి యోచించునదే గాని నిర్ణయము చేయునది కాదు.

నిర్ణయము చేయునది బుద్ధి ప్రక్కనే ఉన్న చిత్తము. బుద్ధి యోచించిన విషయములలో ఒకదానిని చిత్తగించును.

చిత్తగించడమునే నిర్ణయము చేయడము లేక ఒప్పుకోవడము అంటాము. చిత్తము మంచిదానినో చెడుదానినో ఏదో ఒక

దానిని నిర్ణయించవలసి ఉన్నది. జీవుడు గత జన్మలలో చేసుకొన్న ప్రారబ్ధకర్మను బట్టి ఏది జరుగవలెనో ఏది జరుగకూడదో

దానిప్రకారము చిత్తము చిత్తగించును. మూటను తీసుకొని కొంత సంతోషమును, రెండు కిలోమీటర్లు మోయుచు కొంత

బరువు బాధను అనుభవించవలసి ఉన్నది కావున వానిలోని చిత్తము మూటను తీసుకొమ్మని నిర్ణయించినది. అపుడు ఆ

వార్త చిత్తమునుండి మనస్సుకు చేరగ మనస్సునుండి బాహ్య కర్మేంద్రియములైన కాళ్ళు చేతులకు చేరును. మనస్సునుంచి

వచ్చిన వార్తను కాళ్ళు చేతులు ఆచరిస్తున్నవి. ఇందులో జీవుని ప్రమేయము ఏమాత్రము లేదు. కార్యము మొదటిలో

తనకేదో లాభమొచ్చినదని కొంతసంతోషపడడము, మోయుచున్నపుడు బాధను అనుభవించడము జీవుని పనియైనది.

అనగా జరిగిన పనిలోని కష్ట సుఖముల అనుభవించడము తప్ప పని జరుగుటలో ఏవిధమైన జోక్యము జీవునికి లేదు.

ఈ కార్యమునకు మూలము ప్రారబ్ధకర్మకార అవయవములకు శక్తి నిచ్చినడిపించినది ఆత్మ. శరీరములోని బయటి

కర్మేంద్రియములైన కాళ్ళు చేతులు కార్యములో ఉపయోగపడినవి. అంతేకాక జరిగిన పనికి నేనే కర్తననుకొన్నట్లు జీవునికి

అహము బోధిస్తున్నది. అహము, చిత్తము ప్రక్కనే గలదు. అహము యొక్క భావమును పొందిన జీవుడు తనకు

ఏమాత్రము సంబంధములేని దానిని నేనే చేశానని అనుకోవడము వలన కార్యములోని క్రొత్తకర్మ అయిన ఆగామి కర్మ

జీవునికి తగుల్కొనుచున్నది. శరీరములోని జీవుడు, బుద్ధి, చిత్తము, అహము యొక్క ఆకారమును క్రింది పటములో 

(పేజీ 45 లో చూడండి )చూడవచ్చును.



దారిలోని బియ్యము మూటదృశ్యము బుద్ధికి తెలిసినపుడు తల లోని గుణములు పనిచేసినవి. లోపల గుణములు

మంచి చెడు వర్గములని రెండురకములుగ గలవు. చెడువర్గములోని ఆశ అనుగుణము బియ్యము మూటను గురించి

యోచనల నివ్వగ దానికి వ్యతిరేఖ వర్గమయిన మంచిగుణముల నుండి కూడ యోచనలొచ్చినవి. అప్పటి కర్మానుసారము

నిర్ణయము జరిగినది. ఇక్కడ ఈ పనిలో ఆశఅను గుణము పనిచేసినది. కొన్ని సందర్భములలో వేరు వేరు పనులందు ఆ

కార్యమును బట్టి వేరువేరు గుణములు పనిచేయుచుండును. గుణములందే ఎల్లపుడు జీవుడు, బుద్ధి, చిత్తము, అహము

నివాసముచేయుచున్నవి. గుణములందు జీవుడుండు చిత్రమును తర్వాత పేజీపటములో(పేజీ 46 లో చూడండి ) చూడుము.



జీవుడు శూన్యమైన బయలుగ ఉండగ, ఆ బయలును బుద్ధిపొర చుట్టిఉన్నది. బుద్ధిపొర తర్వాత చిత్తముపొర

ఉన్నది. చిత్తముపొర తర్వాత అహముపొర గలదు. ఈ విధముగ మూడుపొరల మధ్యన బయలుగ జీవుడు గలడు.

మూడుపొరల మధ్యన ఉండుట వలన పొరలతో పాటు జీవునికి ఆకారమేర్పడినది. గుండ్రని ఆకారముతో బుద్ధి, చిత్త,

అహము సమేతుడైయున్న జీవాత్మ మూడు గుణభాగములలో దేనియందో ఒకదానియందుండును. జీవున్ని తనయందుంచుకొన్న

మూడు గుణములు వృత్తాకారము కల్గిన చక్రమువలె నున్నవి. మూడు గుణములకు మధ్య ఆత్మ ఇరుసువలె కలదు. ఆత్మ

మూడుగుణముల చక్రమునకే గాక దానిపైన గల కర్మచక్రమునకు మరియు కర్మచక్రము పైనగల కాలచక్రమునకు

దానికంటే పైనగల బ్రహ్మచక్రమునకు ఇరుసుగ గలదు. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల చిత్రమును చూడవచ్చును.


బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల చిత్రము (పేజీ 46 లో చూడండి )


ఈ విధముగనున్న నాల్గుచక్రముల చట్రమునుదుటి భాగమునకు సమానముగ తల మధ్యభాగములో గలదు.

క్రింది చక్రములోని జీవుడు అక్కడ గుణములందు చిక్కుకొని ఉండగ, పైన గల కర్మచక్రమునుండి కర్మక్రిందికి

ప్రసారమగుచుండును. ఏ కర్మజరుగవలెనో సూచించుచుండును. ఈ విధముగ కాలమును బట్టి కర్మ, కర్మ మును బట్టి

గుణములు, గుణములను బట్టి పని జరుగుచుండును. బ్రహ్మనాడిని కేంద్రముగ చేసుకొని నాల్గు చక్రములకు ఇరుసుగనున్న

ఆత్మయు, గుణచక్రములోని గుణములు శరీర భాగములుగ లెక్కించబడలేదు.


దారిలో బియ్యము మూట దొరికిన కాలము, కాలచక్రము ననుసరించి మధ్యాహ్నము పండ్రెండు గంటల కాలము.

అనుభవించవలసిన కర్మ, కర్మచక్రముననుసరించి కొంత సంతోషము దానికంటే ఎక్కువ బాధ అనుభవమునకు వచ్చినది.

పనిచేసిన గుణములు గుణచక్రములోని ఆశ. జీవునికి వచ్చిన ఆగామి కర్మ పాపము. ఈ కార్యములో పనిచేసిన శరీర

భాగములు బయట కాళ్ళు, చేతులు, కన్నులు, లోపలి మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, జీవుడు. ఇట్లు అనేక సమయములలో

అనేకమైన ప్రారబ్ధకర్మ శరీరము ద్వార అనుభవింపబడుచున్నది. జీవుడు అనుభవిస్తు అహము చేత తిరిగి క్రొత్త కర్మ

సంపాదించుకొనుచున్నాడు. ఈ విధానము అందరి ఎడల జరుగుచున్నది. పాతకర్మ అనుభవిస్తు క్రొత్తకర్మ సంపాదించుకొనుట

వలన జీవుడు మరణించి తిరిగి క్రొత్తజన్మ ఎత్తవలసి వస్తున్నది. జనన, మరణములు కర్మవలననే తగులుకొనుచున్నవి.

ఇది జీవితకాలములో జరుగు తతంగము.


మరణములోని శరీర అవస్థ తెలియుటకు జీవితకాలములో ఎట్లుండునో తెలియుట అవసరము. కావున ఇంతవరకు

సజీవ శరీరములోని కాల, కర్మ, గుణములు కార్యములు తెలుసుకొన్నాము. జీవుడు, ఆత్మ, అవయవముల విషయము

కూడ తెలుసుకొన్నాము. ఇక మరణావస్థ విషయము చూచెదము. బ్రతికినన్నాళ్ళు జీవుడు శరీరములో సుఖమునో, దుః

ఖమునో అనుభవిస్తూనే ఉండును. నిద్రసమయములో తప్ప మెలుకువలోను, స్వప్నములోను ప్రారబ్ధకర్మ అనుభవమునకు

వస్తూనేవుండును. కాలిలో ముళ్ళుగ్రుచ్చుకొనిన ఆ నొప్పి మనస్సు ద్వార బుద్ధికి చేరి బుద్ధిద్వార జీవుని అనుభవమునకు

వస్తున్నది. ప్రతి అనుభవమును చాలా స్పీడుగ జీవునికి చేర్చు యాంత్రిక వ్యవస్థ శరీరములో గలదు. ఇటువంటి శరీర

యంత్రాంగము మరణ సమయములో స్తంభించి పోవుటకు మొదలిడును. ఆ సమయమునే "అవసానదశ” అంటాము

జీవితములో శరీరమునకు ఐదు దశలు గలవు. 1) బాల్యము, 2) యవ్వనము, 3) కౌమారము, 4) వృద్ధాప్యము, 5)

అవసానము అని వాటి పేర్లు. బాల్యదశ, యవ్వనదశ, కౌమారదశ, వృద్ధాప్యదశ కొన్ని సంవత్సరముల కాలముండగ

అవసానదశ మాత్రము కేవలము ఐదు నిమిషలనుండి అరగంటవరకుండును, కొందరికి కొంత ఎక్కువ తక్కువ కూడ

ఉండగలదు. మొదటి బాల్యదశ మొదలుకొని వృద్ధాప్యదశ వరకు శరీరము లోపలి బయటి అవయవములు, కర్మ,

గుణములు అన్ని ఒకే విధముగ వాటి వాటి పనిచేయుచుండగ అవసానదశలో మాత్రము శరీరములోపలి, బయటి

అవయవములలో మార్పులు కలుగుచు అన్నియు పనిచేయక నిలిచిపోవును.


శరీరము యొక్క అన్ని దశలలో శరీరమంత వ్యాపించి శక్తినిచ్చి అవయవములనన్నిటిని కర్మానుసారము

నడిపించు ఆత్మ అవసానదశలో శరీరమంత లేకుండ కొద్ది కొద్దిగ ముకుళించుకొనును. అవసాన సమయములో ఆత్మ

ముకుళించుక పోవడము వలన మొదట వెంట్రుకలు చర్మము యొక్క స్పర్శ లేకుండపోవును. ఆ సమయములో చీమలు

కుట్టిన తెలియకుండ పోవును. తేలుకుట్టిన నొప్పి తెలియకుండపోవును. బ్రతికినన్నాళ్ళు అన్ని దశలలోను చర్మము ద్వార

తెలిసిన బాధలు అవసానదశలో తెలియకుండ పోవును. దీనిప్రకారమైతే జీవునికి అన్ని దశలకంటే అవసానదశయే

బాధలేనిదని చెప్పవచ్చును. శరీరమంతా ఉన్న ఆత్మ ముడుచుకపోవుట వలన కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు పనిచేయు


స్థోమతను కోల్పోవును. అపుడు మనిషి కదలక, మెదలక మంచము మీద పడివుండడము మాత్రముండును. నోటి

కదలిక శక్తికూడ లేకుండపోవడము వలన మనిషి మాట్లాడలేడు. కేవలము కర్మేంద్రియములు పనిచేయక, కొద్దినిమిషములు

జ్ఞానేంద్రియములు పనిచేయుచుండుట వలన తన వద్దకు వచ్చిన మనుషులు కనిపిస్తుందురు, వారి మాటలు వినిపిస్తుండును.

తాను మాత్రము ఎవరిని పలకరించలేని స్థితిలో ఉండును. నోరు, కాళ్ళు, చేతులు పని చేయని దానివలన తనలో తాను

మధనపడుచుండును. అప్పటి వరకు శరీరము మీదగల నొప్పులు కూడ తెలియకపోవును. కాళ్ళ నొప్పులు కూడ

కనిపించవు. శరీరములోపలి నొప్పులేమైనావుంటే అవి మాత్రము తెలియుచుండును. తర్వాత కొంతసేపటికి అంతవరకు

పనిచేయుచున్న జ్ఞానేంద్రియములైన కళ్ళు, చెవులు కూడ శక్తిహీనమైపోవును. అప్పుడు బయట ఎవరున్నది, ఎవరు ఏమి

మాట్లాడుచున్నది తెలియకుండపోవును. బయటివారు ఇదుగో నీచిన్న కొడుకొచ్చాడని చెప్పిన, దాచిన ధనమెక్కడ పెట్టినావని

అడిగిన లోపలి జీవునకు విషయమే తెలియకుండును. కన్నులు తెరుచుకొని ఉండినా కనిపించకపోవుట వలన కనురెప్పకూడ

కొట్టక చూస్తున్నట్లే బయటివారికి కనిపించుచుండును. అటువంటి సమయములో యమదూతలు వచ్చారని వారిని

చూస్తున్నాడని, దూత దర్శనము చేత మన ధ్యాస పోయిందని కొందరనుకొనుచుందురు. అవసానదశలోనున్న వారికి

చూపే లేదని తెలియక యమకింకరులను చూస్తున్నాడనుకోవడము పొరపాటు.


శరీరము బయటగల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పని చేయకపోవడము వలన బాహ్యబాధలన్ని

వదలిపోయినట్లే. బయటి ప్రపంచముతో పాటు మనస్సు కూడ బయటి ప్రపంచముతో సంబంధము తెగిపోయి లోపల

ఇంద్రియములు పనిచేయుచుండును. ఆత్మతో పాటు మనస్సు కూడ బయటి ఇంద్రియములతో సంబంధము తెగిపోవడము

వలన బయటి విషయములను బుద్ధికి అందించలేకపోవును. బుద్ధికి బయటి విషయములు చేరని దానివలన

యోచించనవసరమే లేకుండ పోయినది. బుద్ధికి యోచనలు లేనిదాని వలన చిత్తమునకు పనియే లేదు. ఏ పని

జరగనందున అహమునకు కూడ పనిలేదు. అప్పటికీ మనస్సుకు ఆత్మశక్తి అందుచుండుట వలన మనస్సు తన నైజము

ప్రకారము జరిగిపోయిన పనులను గురించి జ్ఞాపకము తెచ్చుచుండును. క్రమేపి మనస్సు కూడ బలహీనపడి పోవుచుండును.

ఆ సమయములో మనస్సు అందించు కొద్దిమాత్రము జ్ఞాపకము తప్ప మనిషికి ఏ బాధగాని, ఏ చింతగాని లేకుండును.

ఎన్నో శరీరబాధలు, మానసిక బాధలు కల్గి ఏమాత్రము శాంతిలేనివానికి జీవితములో ఎప్పుడు చవిచూడని బాధరహిత

స్థితిని అవసానదశలో జీవుడు పొందు చుండును. ఏ బాధలు, ఏ చింతలు లేని ఆ స్థితిని గూర్చి బ్రతికున్నవారు

తెలియలేక, చనిపోవునపుడు జీవుడు ఎంతబాధ అనుభవిస్తున్నాడో అని అనుకొనుచుందురు. చివరకు మనస్సు కూడ

శక్తిహీనమైపోవుచు చిన్న చిన్న విషయములను మరిచిపోవును. తనకున్న జ్ఞాపకశక్తి తగ్గుట వలన చాలా ముఖ్యమైన

విషయములనూ, బాగా మనస్సుకు హత్తుకొనివున్న విషయములనూ జ్ఞాపకము తెచ్చుచుండును. ఆ విషయములనే బుద్ధి

గ్రహించి జీవునకు తెలియజేయుచుండును. మనస్సు చివరి వరకు జ్ఞాపకాల పనియే చేయుచుండును. చివరకు మనస్సు

అన్ని విషయములను మరిచిపోయి ఆఖరుకు తనకున్న గొప్పవిషయమేదో దానినొక్క దానిని జ్ఞాపకము తెచ్చును. అదియే

మనస్సుకు చివరి జ్ఞాపకము. దానికంటే మించిన విషయము మనస్సుకుండదు. ఆ చివరి విషయమే బుద్ధి ద్వార జీవుడు

గ్రహిస్తుండును. జీవితములో దేనినయితే మనిషి గొప్పగ తలచి ఉండునో, ఏ విషయమైతే మనిషికి ప్రాముఖ్యముగ

ఉండునో, ఏ విషయమును జీవితధ్యేయముగ, జీవిత సారాంశముగ పెట్టుకొని బ్రతుకుచుండునో ఆ విషయమే చిట్టచివరి

జ్ఞాపకమగును. చివరి విషయమును మనోఫలకము మీద బుద్ధి ద్వార జీవుడు చూచుచుండగ, ఆత్మ తనశక్తిని బుద్ధి,

మనస్సునుండి కూడ ముకుళింపజేయుట వలన అన్ని అవయవములు స్తంభించిపోయినట్లు అవికూడ లేకుండ పోవును.

శరీరములో అంతవరకు అన్నిదశలలో పనిచేసిన 24 భాగములు అంత్యమైపోవును. చివరకు శరీర భాగముగ పేరుగాంచిన


జీవుడొకడు మిగులును. ఆత్మ శరీరమంతటి నుండి ముడుచుకొని తన నివాసకేంద్రమైన బ్రహ్మనాడిని చేరును. అపుడు

శరీరమంత మృతమైపోయి తల మధ్యలో బ్రహ్మనాడియందు ఆత్మయు, గుణచక్రములో జీవుడును ఉందురు. ఆ స్థితి కొన్ని

సెంకడ్లు మాత్రముండి ఆత్మ బ్రహ్మనాడిని కూడ వీడి తనతో పాటువున్న నాల్గుచక్రములను తీసుకొని శరీరమును వదలిపోవును.

అప్పటికి పూర్తి మరణము సంభవించినట్లగును. అవసానదశలో ముడుచు కొంటు శరీర భాగములను వదలించుకొన్న

ఆత్మ చివరకు తనతోపాటు జీవున్ని, వానిచుట్టువున్న గుణములను అనగ గుణచక్రమును, దానికి పైన గల కర్మచక్రమును

మిగత రెండుచక్రములను తీసుకొని మరియొక శరీరమునకు పోవును. ఈ విషయమునే భగవద్గీత పురుశోత్తమ

ప్రాప్తియోగమునందు ఎనిమిదవ శ్లోకములో "శరీరం య దవాప్నోతి యచ్చాపుృత్కామ తీశ్వరః గృహ త్వైతాని సంయాతి వాయుర్గనాని

నాశయాత్ " ఆత్మ ఏ శరీరమునుండి బయలుదేరి, తిరిగి ఏ శరీరమందు తాను ప్రవేశించుచున్నదో అక్కడికి తనతోపాటు

కామాది గుణములను, కర్మను, జీవుని, గాలి వాసనను తీసుకపోయినట్లు తీసుక పోవుచున్నది.


మరణించిన శరీరమునుండి ఆత్మ నాల్గుచక్రములతో సహా బయలుదేరుచున్నది. ఆత్మ నాల్గుచక్రములకు ఇరుసుగ

ఉండుట వలన ఆత్మ ఎక్కడికి పోయిన దానిని అంటిపెట్టుకొనియున్న నాల్గుచక్రములు పోవుచుండును. మనుషులకొక్కరికే

గాక ప్రతి జీవరాసికి ఈ నాల్గు చక్రముల అమరిక ఉండును. ఏ జీవరాసి శరీరము మరణముపొందిన, దానిలోని ఆత్మ

నాల్గుచక్రములతో సహా బయలుదేరి కంటికి కనిపించ కుండ పోవుచున్నది. గాలిలో సువాసన కనిపించకుండ మరొక

చోటికి ప్రయాణము చేసినట్లు ఆత్మ కూడ సూక్ష్మముగ పోవుచున్నది. ఆత్మ, జీవాత్మ, గుణములు, కర్మ ఏవి కనిపించునవికావు.

అందువలన మన ముందరే అవి చనిపోయినవాని శరీరమునుండి పోయిన వాటిని మనము గుర్తించలేము. ఆత్మను

అధారము చేసుకొన్న నాల్గుచక్రములు ఆత్మతో పాటు పోవుచుండుట వలన క్రిందిచక్రములో గల గుణములతో సహా

జీవాత్మకూడ పోవలసి ఉన్నది. ఆత్మ జీవాత్మ రెండు జోడు ఆత్మలు. అందువలన ఒకటిపోతే మరివొకటి కూడ పోవలసిందే.


పూర్వకాలము నుండి మనుషులకు మరణకాలములో తెలియని రహస్యము ఏమనగా! ఆత్మ నాలుగుచక్రములతో

బయటికి పోవుచున్నదను విషయము ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏ గురువులు చెప్పలేదు, ఏ పుస్తకములలో

వ్రాయబడలేదు. ఏ యుగములో కూడ నాల్గుచక్రముల వివరము ఎవరు చెప్పకపోవడము వలన, ఈ విషయము

క్రొత్తదగుట వలన జాగ్రత్తగ అర్థము చేసుకోవలయును. నీకు, నాకు అని తేడా లేకుండ ప్రతి జీవరాసి శరీరములోను

తలయందు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు గలవు. సూక్ష్మరూపమై జ్ఞానదృష్టికి గోచరించు వీటిని జ్ఞానముతోనే

తెలియనగును. ఆధ్యాత్మిక విద్యలోనే అతి రహస్యమైన నాల్గుచక్రములను అర్థము చేసుకొంటే జనన మరణ రహస్యము

సులభముగ తెలియును. పాఠకులకు కొంత అర్థమగుటకు సూక్ష్మముగనున్న నాల్గుచక్రములను, గుణచక్రమును, అందులోని

జీవాత్మను వెనుక పేజీలో చిత్రరూపముగ చూపాము. ఇపుడు కర్మచక్రమును, కాలచక్రమును తర్వాత పేజీలలో చూడవచ్చును.


నాల్గుచక్రములలోని కాల, కర్మ, గుణచక్రముల విషయము కొంత అర్థమైవుండును. అన్నిటికంటే పైన గల

బ్రహ్మచక్రము విశ్వము యొక్క ఆయుస్సుకు సంబంధించినది కావున దాని విషయము ఇపుడు మనకు అనవసరము

పూవులోని వాసన కనిపించనట్లు, వాసన గాలితో కలిసి మరొక చోటికి పోయినట్లు మరణములో నాల్గుచక్రముల అమరిక

క్షణాలమీద మరియొక శరీరమును చేరుచున్నది. వాస్తవముగ చెప్పాలంటే ఒకటి లేక రెండు సెకండ్లలో మరియొక

శరీరమును చేరుచున్నదని చెప్పవచ్చును. ఇంకను వివరముగ చూస్తే మరణించబోవు వాని శరీరములో ఆడు శ్వాస పైకి

క్రిందికి ఆడుచుండును కదా! అవసానదశలో ముక్కురంధ్రములలో పైకిపోయి క్రిందికి వస్తున్న శ్వాస మరణముతో చివరిగ

క్రిందికి వచ్చి తర్వాత ముక్కు రంధ్రములలో దూరదు. క్రిందికి వచ్చిన శ్వాస తిరిగి ముక్కు రంధ్రములలో దూరి పైకి


పోవడము దాని సహజమైన పని అయినప్పటికి అలా మరణించిన శరీరములో దూరక వెంటనే ఆత్మ ప్రవేశించిన చోట

శ్వాస శరీరములోనికి ప్రవేశించును. ఇక్కడ క్రిందికి వచ్చినది ఇక్కడే పైకి పోక, ఇక్కడ పోయినట్లే ఏమాత్రము ఆలస్యము

చేయక అక్కడ వేరు శరీరములోనికి పోయినది. దీనిని బట్టి శ్వాస క్రిందికి పైకి ఆడుచునేవున్నది. మరణముతో పాత

జాగాలో పైకి పోక క్రొత్త జాగాలో పైకి పోయినది. మరణించిన శరీరము నుండి, క్రొత్తగ పుట్టిన శరీరము వేల

మైళ్ళదూరములో ఉండినప్పటికి తక్షణమే ఆత్మ అక్కడికి చేరగల్గుచున్నది. మరణించిన జీవుడు వెంటనే వేరొక శరీరమున

ప్రవేశించుట వలన యమధర్మరాజు యమలోకము అను ప్రసక్తేలేదు. అటులయిన యమధర్మరాజు యొక్క ఉద్యోగమేమి

కావలెనని కొందరడుగ వచ్చును. మీరు ఊహించుకొన్న యమలోకముగాని, యమధర్మరాజుగాని కేవలము కల్పితము.

మనము చేసుకొన్న పాపపుణ్యములన్నియు జన్మలలో భూమి మీదనే అనుభవించవలెను. పుణ్యము చేసిన వానికి స్వర్గము

ఇచటే గలదు, పాపము చేసినవానికి నరకము ఇక్కడే గలదని తెలియాలి.


ఎంతదూరమైన ఒకటి లేక రెండు సెకండ్ల కాలములో పోవు ఆత్మ జీవాత్మలకు తాము ధరించెడి శరీరము

పలానా ప్రదేశములో ఉన్నదని ముందే తెలిసియుండునా? అను ప్రశ్నకూడ కొందరికిరావచ్చును. దానికి జవాబు చూస్తాము.

మరణమునకు ముందు అవసాన దశలో మనస్సుకు చివర జ్ఞాపకము ఏదయితే వచ్చియుండునో దానికి సంబంధించిన

జన్మకలుగునని భగవద్గీతలో చెప్పబడినది. చివరి జ్ఞాపకములను మొదట రెండు రకములుగ విభజించవచ్చును. పరమాత్మ

సంబంధ జ్ఞాపకములన్ని ఒక రకము, ప్రపంచ సంబంధమువన్ని రెండవ రకముగ చెప్పవచ్చును. ఆఖరు జ్ఞాపకము ఏ

కోవకు చెందినదో, దానిలోను అది ఏ స్థాయికి చెందినదో దాని ప్రకారము వచ్చేజన్మ ఉండును. దీనిని గురించి

భగవద్గీత అక్షరపర బ్రహ్మయోగములో "యం యం వాపిస్మరన్ భావం త్యజత్యస్తే కలే బరమ్ ! తం తమే వైతి కౌంతేయ!”

అన్నాడు. దీనిప్రకారము చివరిలో ఏ ఏ భావముండునో దానికి సంబంధించిన జన్మయే లభ్యమగును. చివరిలో ప్రపంచ

సంబంధము జ్ఞాపకము వచ్చివుంటే ఆ భావమునకు సరిపడు జన్మ ఏ స్థలములో, ఏ ఇంటిలో కల్గియుండునో

ఆయింటిలో జన్మించిన శిశువును ఆత్మ చేరగలదు. శరీరమును వదలిన వెంటనే చివరి మనోభావమునకు తగిన

శరీరమెచట జన్మించి ఉండునో అచటికి ఆత్మ నేరుగ పోగలదు. జీవుని ప్రారబ్ధము ప్రకారము ఏ శరీరములో ప్రవేశించవలెనో

ఆ శరీరములోనికే ఆత్మ ప్రవేశించుటకు తగిన కారణము గలదు. అనుభవించవలసిన కర్మలను బట్టి, తెలియవలసిన

జ్ఞానమును బట్టి, చేరవలసిన జీవున్ని బట్టి శిశుశరీరములోని మెదడులో అమరికలుండును. మరణించిన వాని చివరి

జ్ఞాపకమునకు క్రొత్త శరీరములోని అమరికలు సరిపడు శరీరమే ఆత్మకు గోచరమగును, అదియే గమ్యమగును. నీరు

పల్లమునకు (తగ్గుకు) పారునట్లు ఆత్మ, మనస్సు చివరి జ్ఞాపకమునకు సరిపడు శరీరమునే చేరును. తాబేలు సముద్రము

బయటికి వచ్చి ఇసుకగుంతలో గుడ్లు పెట్టిపోవును. కొద్ది రోజులకు ఇసుకలోనే గుడ్లు పిల్లలుగ మారి ఇసుక నుండి

బయటికి వచ్చి సముద్రము వైపేపోవును. సముద్రము ఎక్కడున్నది కనిపించక పోయిన అటుప్రక్కకే ప్రయాణముసాగును.

ఒకవేళ దారిమళ్ళించిన అది మాత్రము అటువైపే పోవును. సముద్రము తెలియనట్లు, దారిలేనట్లు ఒక పెద్దగోడను

పర్లాంగుపొడవు కట్టినా, తాబేలుపిల్ల ప్రక్కదిశలకు పోక గోడపొడవున వచ్చి తిరిగి సముద్రము వైపే పోవును. అలాగే ఒక

పావురమును వెయ్యిమైళ్ళ దూరములో వదలిన తన ఊరెటువైపు ఉన్నదో అటువైపే ప్రయాణము చేయును. అప్పుడే

పుట్టిన తాబేలుపిల్ల ఎన్ని అడ్డంకులున్నప్పటికి సముద్రపు దిశను గుర్తించుచున్నది. అట్లే దారి, దిశ తెలియని పావురము

తన ఊరిదిశను సులభముగ గుర్తించుచున్నది. అలా గుర్తించు శక్తి వాటి శరీరములోని ఆత్మలకు గలదు. అట్లే ప్రారబ్ధకర్మకు

తగిన శరీరమును మరియు చివరి యోచనకు తగిన మడతలు గల మెదడున్న శరీరమును ఆత్మ గుర్తించ గలదు.


మనిషి సంపాదించుకొన్న ఆగామి కర్మ, సంచితకర్మలో కలిసి పోయివుండును కదా! మనిషి మరణించినపుడు

సంచితములోనిది ప్రారబ్ధముగ ఎలా మారుచున్నది? అని కొందరడుగవచ్చును. దానికి సమాధానము, మరణసమయములో

శరీరమంతా శక్తికోల్పోయి అన్ని అవయవములు పనిచేయని స్థితిలో ఆత్మ ఊపిరితిత్తుల ద్వార కొద్ది మాత్రము శ్వాసను

ఆడిస్తు చివరకు మనస్సు యొక్క పనిని కూడ నిలిచిపోవునట్లు చేయును. ఆ సమయములో చివరగ తనకందిన దానిని

మాత్రము జీవాత్మ చూస్తుండును. ఒక శ్వాస తప్ప, మనస్సు కూడ నిలిచిపోయిన తర్వాత ఆత్మ బ్రహ్మనాడిలో చేరి

నాల్గుచక్రములతో సహా ఒక్క క్షణముండునని ముందే చెప్పుకొన్నాము. ఆ క్షణములోనే చివరి మనోదృశ్యమును బట్టి

సంచితమునుండి ప్రారబ్ధమును ఆత్మ చేతనే ఎన్నుకోబడును. జీవునికి చివరి దృశ్యము అందనంతవరకు ప్రారబ్ధము

నిర్ణయము కాదు. చివరి దృశ్యమును బట్టి ప్రారబ్ధము, ప్రారబ్ధమును బట్టి రెండవజన్మ శరీరము నిర్ణంచబడును. ఏ

శరీరమును పొందవలసినది ప్రారబ్దము నిర్ణయించగ, ప్రారబ్ధము జీవునికి వచ్చు చివరి మనోదృశ్యమును బట్టి

నిర్ణయించబడును. చివరి క్షణములో సంచితమునుండి ప్రారబ్ధము నిర్ణయమైనపుడు ఆ సమయములోనే అంతవరకు

సంపాదింపబడిన ఆగామికర్మ సంచితములో కలసిపోవును. సంచితము నుండి ప్రారబ్ధము తయారగుట మరియు

సంచితములోనికి ఆగామికర్మ కలిసిపోవుట రెండు ఒకే సమయములో జరిగిపోవును.


మనిషి తన జీవితములో ఏ విషయము మీద ఎక్కువ లగ్నమై బ్రతుకుచున్నాడో, ఏ విషయము మీద తన ఇచ్చ

ఎక్కువగ ఉన్నదో, ఏ విషయమును ఎల్లప్పుడు తలచుకొనుచుండునో, ఆ విషయ జ్ఞాపకమే అవసానదశలో చివరిగ

మనస్సుకు వచ్చి జీవునికి చేరును. ఎల్లపుడు స్మరించుట చేత శరీరము వదలునపుడు అదే జ్ఞాపకము వచ్చి తర్వాత అదే

స్థితిని పొందునని గీతలో కూడ చెప్పారు. అంతేకాక ఎల్లపుడు నన్నేస్మరించుము చివరిగ నేనే జ్ఞప్తికి వచ్చి నాలోనికే

ఐక్యమగుదువని దేవుడు తెల్పడము కూడ జరిగినది. ఈ విషయములను గీతలో అక్షరపరబ్రహ్మ యోగమను అధ్యాయములో

" తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ, మయ్యర్పిత మనోబుద్ధి రామేవైష్యస్య సంశయః". "అభ్యాసయోగ యుక్తేన

చేతసానాన్య గామిన, పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చిన్తయన్" దీని భావము నీ మనస్సు, బుద్ధి అన్ని నాకే

సమర్పించి, సర్వకాలములందు నన్నే స్మరించుచుండుము తప్పక నన్నే చేరగల్గుదువు. ధ్యానము, అభ్యాసము చేత మనసునందు

నన్నే స్మరించుచుండుట వలన పరమము, దివ్యము అయిన నన్నే చెంద గలవు. అని గీతలో ఉపాయము కూడ చెప్పాడు.


జీవునికి తర్వాత జన్మ ఏదైనా రావచ్చును గానీ, మరణించు సమయములో శారీరక, మానసిక బాధలనన్నిటి

నుండి తప్పించుకొని ఏ బాధపొందడని చెప్పవచ్చును. ఇంతవరకు మరుజన్మకు పోవువానికి అవసాన దశలో జరుగు

విషయమంతా వివరముగ తెలుసుకొన్నాము. ఇది సర్వ సాధారణముగ అందరికి జరుగు పద్ధతి అనుకొందాము. జీవితములో

కర్మను అంటక, సంచితమును లేకుండ చేసుకొన్నవాడు మోక్షము పొందవలయును. కర్మశేషములేని మనిషి యొక్క

మరణములో అవసానదశ ఎట్లుండునో తెలుసుకొందాము.


జగతిలో యోగులైన వారే పరమాత్మయందు ఐక్యమగుటకు అవకాశము గలదు. యోగులలో మూడు రకములు

గలరు. వారు బ్రహ్మయోగులు, కర్మయోగులు, భక్తియోగులు. యోగులకు చివరి గమ్యస్థానము పరమపదము. అంతట

వ్యాపించిన పరమాత్మలో కలియుటను మోక్షము చెందుట అంటున్నాము. బ్రహ్మయోగులు శరీరములోని మనస్సును

నిగ్రహపరచుకొని యోగమాచరింతురు. కర్మయోగులు అహమును అనచి యోగమాచరింతురు. భక్తియోగులు చిత్తము

వివరము తెలిసి దానిని తమ భావములో లేకుండ చేసుకొందురు. ఈ విధానములచేత వారు పరమాత్మను చేరుటకు

మార్గమును ఏర్పరచుకొనుచున్నారు. కర్మ ఏమాత్రము లేకుండ అయిపోయిన యోగులకు చివరి మరణము పొంది


పరమాత్మయందు ఐక్యమగుదురు. యోగులైనవారు మరణించిన తర్వాత తిరిగి పుట్టరు. అటువంటి వారి మరణము

జన్మలకుపోవు వారి సాధారణ మనుషుల మరణమువలె ఉండదు. మూడు రకముల యోగులు పరమాత్మను చేరుచున్నప్పటికి

వారి మరణము శరీరములో కొంత వ్యత్యాసముతో మార్పులు కలిగి పరమాత్మలో కలిసిపోవుట జరుగుచున్నది. మొదట

బ్రహ్మయోగులు జీవితములో తమ మనస్సును అణచివేయడము వలన ఏ విషయచింతనలు మనస్సుకు రాకుండ

అణిగిపోవడము అలవాటై ఉండును. మనోకార్యములను అణచివేసిన కాలమును బ్రహ్మయోగ కాలము అంటాము.

జీవితములో ఎంతో కాలము బ్రహ్మయోగమును అభ్యాసము చేయుట చేత వారి మరణకాలములో అవలతసానదశయందు

బయటి అవయవములన్నియు నిలిచిపోయి మనస్సు ఆత్మయందు లగ్నమై బుద్ధికి ఆత్మ విషయమును అందించుట చేత

బుద్ధి ఆత్మ విషయమునే జీవునికి అందించును. అపుడు జీవుడు ఆత్మనే తెలియుచుండును. మనస్సు బుద్ధికి, బుద్ధి

జీవునికి ఆత్మను తెలుపుచు మొదట మనస్సు బుద్ధియందు కలిసిపోవును. మనస్సు బుద్ధియందు లీనమై వేరుగ లేకుండపోవుట

ఎప్పుడు జరుగని అరుదైన సంఘటన. బ్రతికివున్న బ్రహ్మయోగులలో యోగసమయమున మనస్సు ఆత్మ విషయమును

బుద్ధికి అందించునప్పటికి అవి వేరు వేరుగ ఉండును. కాని చివరి మరణములో మాత్రము మనస్సు బుద్ధియందు కలసి

అంత్యమై పోవును. మనస్సుతో కలిసి ప్రత్యేకముగ ఏర్పడిన బుద్ధి చివరిగ జీవాత్మయందు కలసి లేకుండ పోవును.

అపుడు మనస్సు బుద్ధి జీవుడు ఏకముగ మారివుందురు. ఈ విధానము మోక్షము పొందు మరణములో బ్రహ్మ యోగులకు

మాత్రము జరుగునని జ్ఞాపకము చేయుచున్నాము. మనోబుద్ధులతో కలసిన జీవుడు ప్రత్యేకముగ తయారై చివరకు

ఆత్మయందు కలసి తాను కూడ లేకుండ నాశనమైపోవును. జీవునికి నాశనము అంతవరకు లేక చివరిలో నాశనమగుచున్నాడు

కావున జీవున్ని క్షరుడని చెప్పారు. భగవద్గీతలో భగవంతుని చేత క్షరుడని చెప్పబడిన జీవాత్మ మోక్షము పొందు మరణములో

క్షరమై తన ఉనికిని కోల్పోయి ఏమాత్రము లేకుండ పోవుచున్నది. ఎన్నో యుగములనుండి చావు పుట్టుకలను కొనసాగిస్తున్న

జీవాత్మ చివరి మరణముతో తాను లేకుండ పోవుట వలన తర్వాత పుట్టు అవకాశమే లేదు. ఈ విధముగ జీవాత్మకు

తెరపడిపోవుచున్నది. జీవాత్మ ఆత్మలో కలసి నాశనమైపోవునపుడు అంతవరకున్న ఆత్మ, ఆత్మగ లేక ప్రత్యేకముగ మారిపోయి

శరీరములోనేయున్న పరమాత్మలోనికి కలిసి పోవుచున్నది. ఆత్మ పరమాత్మ అనుసంధానమైపోయి శరీరములో ఏమి

లేకుండ పరమాత్మ మాత్రము మిగిలిపోవుచున్నది. ఎపుడైతే జీవాత్మ ఆత్మలో కలియుచున్నదో అపుడే బయటి శ్వాస కూడ

నిలచిపోవుచున్నది. ఈ విధముగ బ్రహ్మయోగుల చివరి మరణముండగ కర్మయోగుల మరణమెట్లున్నదో క్రింద చూస్తాము.


జీవితములో కర్మయోగమును సాధించిన యోగులు తమ అహమును అణిచివేచియుదురు. అహము యొక్క

పనిని తెలిసినవారై దాని ప్రకారము విననివారే కర్మయోగులు. కర్మయోగుల చివరి మరణ ములో అవసానదశ యందు

బాహ్య అవయముల నుండి ఆత్మశక్తి లేకుండపోవుట వలన శరీరము పట్టు తప్పిపోయి ఉండును. ఆ సమయములో

మనస్సు దైవచింతన కల్గి దైవజ్ఞప్తిని బుద్ధికి అందించగ, బుద్ధి ఆ విషయమును జీవునికి అందించుచున్నది. బుద్ధి ద్వార

వచ్చిన దానిని జీవుడు అనుభవములో పెట్టుకోగా మనస్సు బుద్ధియందు కలసి లేకుండ పోవుచున్నది. మనస్సుతో కలసిన

బుద్ధి బ్రహ్మయోగులలోవలె జీవునితో కలియక అహముతో కలియుచున్నది. మనో, బుద్ధి, అహముతో కలసి రూపము

మారిన అహము జీవునితో కలియుచున్నది. మనో, బుద్ధి, అహములను తనయందు లీనముచేసుకొన్న జీవాత్మ ప్రత్యేకముగ

మారిపోయి ఆత్మయందు కలియుచున్నది. జీవున్ని తనయందు కలుపుకొన్న ఆత్మ చివరకు పరమాత్మయందు

లీనమైపోవుచున్నది. అదియే కర్మయోగుల మోక్షము. మార్పుచెందిన జీవుడు చివరకు ఆత్మ ద్వార పరమాత్మయందు చేరి

విశ్వమంతయు అణువణువున వ్యాపించిపోవుచున్నాడు. ఇక్కడ గమనించ వలసిన విషయమేమనగా! బ్రహ్మయోగులలో

మనస్సు బుద్ధియందు, బుద్ధి జీవునియందు, జీవుడు ఆత్మయందు, ఆత్మ పరమాత్మయందు కలియగ, అహము మరియు


చిత్తము యొక్క ప్రస్తావనరాలేదు. కర్మయోగులలో మాత్రము కొంత మార్పుతో అహముయందు బుద్ధి కలియగ, అహము

జీవునియందు కలియుచున్నది. ఇక్కడ చిత్తము యొక్క ప్రస్తావనరాలేదు. ఈ విషయమునకు తర్వాత జవాబిస్తాము.

ఇపుడు భూమి మీద అరుదుగయున్న భక్తియోగులు మోక్షము పొందుట ఎలాగున్నదో విశదముగ చూచెదము.


మోక్షము పొందు చివరి మరణములో భక్తియోగమును అనుసరించిన వారియందు మొదట శరీరము స్తంభించిపోయి,

ఆ తర్వాత మనస్సు పరమాత్మ ధ్యాసమీద నిలచి ఆ విషయమును బుద్ధికి అందించును. బుద్ధి జీవునికి అందించగ ఆ

అనుభవములో జీవుడు నిలిచి ఉండును. అటువంటి సమయములో మనస్సు బుద్ధియందు కలసి అంత్యమైపోవును.

తర్వాత బుద్ది అహములో కలసి లేకుండపోవును. అపుడు ప్రత్యేకముగ మారిన అహము చిత్తములో కలసి లేకుండపోవును.

ప్రత్యేకమైన అహముతో కలసిన చిత్తము తాను కూడ వేరువిధముగ మారి జీవునియందు కలియుచున్నది. బ్రహ్మ యోగులలోని

చివరి జీవునికంటే మరియు కర్మయోగులలో చివరి జీవుని కంటే చిత్తమును కూడ కలుపుకొని మరీ ప్రత్యేకముగ మారిన

జీవాత్మ ఆత్మలో కలసి నాశమైపోవుచున్నాడు. భక్తియోగులలో అలా జీవాత్మ నశించిన తర్వాత ఆత్మ పరమాత్మలో

శరీరమందే కలసిపోవుచున్నది. ఈ విధముగ భక్తియోగులు చివరకు మోక్షముపొంది విశ్వవ్యాప్తముగ ప్రతి అణువులోను

వ్యాపించి పోవుచున్నారు.


బ్రహ్మయోగులలో చివరి మరణముమందు అహము, చిత్తము ఏమైవని, అట్లే కర్మయోగులలో చివరి మరణమందు

చిత్తమేమైనదని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! కర్మయోగులకు అహము మీద, భక్తియోగులకు

చిత్తము మీద ధ్యాస ఉండుట వలన శరీరములలోనే అవి మిగిలిఉన్నవి. వాటి ధ్యాసలేని బ్రహ్మయోగులందు బుద్ధి

జీవునితో కలసినపుడు అహము, చిత్తము రెండు లేకుండ పోవుచున్నవి. అలాగే కర్మయోగులందు అహము జీవునియందు

కలసిపోయినపుడు చిత్తము కూడ నశించిపోయినది. భక్తియోగులందు అలాకాక అహము, చిత్తము రెండు మార్పుచెంది

నశించినవి. కర్మయోగులలో మాత్రము చిత్తము సాధారణముగ నశించగ, అహము జీవునియందు మార్పు చెంది నశించినది.

యోగులు కాక సాధారణ జీవులు చనిపోయినపుడు మనస్సు, బుద్ధి నశించినపుడే చిత్తము, అహము రెండు నశించినవని

తెలియుము. మరుజన్మకు పోవువారి మరణములలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహము ఏ విధ మార్పులు చెందక

ఎట్లున్నవి అట్లే శక్తి కోల్పోయి నశించును. ఇంతవరకు యోగుల శరీరములో జన్మలేని చివరి మరణము ఎలా జరుగుచున్నదో

తెలుసుకున్నాము. ఇక్కడ కొంత వివరము తెలియవలసినదేమనగా! యోగులైన వారందరికి ఇలాగే మరణము జరుగునా

అని ప్రశ్నరావచ్చును. దానికి జవాబుగ యోగులైనంత మాత్రమున ఇలాంటి మరణము జరుగుటకు అవకాశములేదు.

కర్మశేషము లేకుండ అయిపోయిన యోగులకు మాత్రమే జన్మలులేని ఆఖరు మరణము సంభవించును. అపుడే యోగులు

మోక్షము చెందుదురు. యోగులైనంత మాత్రమున కర్మవుంటే దేవునియందైక్యము కాలేరు. సాధారణ మరణములు

సంభవించును. కర్మశేషము లేనివారు చివరి మరణము పొందినపుడు బయటి ప్రజలు గ్రహించుటకు అవకాశము

గలదు. అదేమనగా సంపూర్ణ యోగులైనవారు, కర్మలేకుండ చేసుకొన్నవారు, మరణించు సమయము దినములో పగలుగ

ఉండును. నెలలో శుక్లపక్షమై ఉండును. సంవత్సరములో ఉత్తరాయణమై ఉండును. పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము

అయినప్పటికి మరణించు యోగుల శరీరమున్న ప్రాంతము మీద సూర్యరశ్మి లేకుండపోతే వారిది చివరి మరణముకాదని,

కర్మశేషమున్నదని, వారికి తిరిగి జన్మకలదని చెప్పవచ్చును. యోగులు కానివారు పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము,

సూర్యరశ్మి అన్ని కలసినపుడు చనిపోయిన ప్రయోజనము లేదని వారికి ఈ నిబంధన అమలు కాదని తెలియాలి.

యోగులయిన వారికి మాత్రమే ఈ మరణ సమయ నిబంధన వర్తించునని తెలియునట్లు భగవద్గీత అక్షరపర బ్రహ్మయోగములో






23వ శ్లోకము "యత్రకాలే త్వనావృత్తి మా వృత్తిం చైవయోగినః, ప్రయాతా యాంతి తం కాలమ్ వక్ష్యామి భరతర్షభ " ఏ

కాలములో చనిపోతే యోగులు మోక్షము పొందుదురో, ఏ కాలములో చనిపోతే తిరిగి పుట్టుదురో ఆ కాలములను

గురించి చెప్పుచున్నాను అని చెప్పాడు ఈ శ్లోకములో ప్రత్యేకముగ “యోగినః" అన్నపదమును గుర్తుంచుకోవలెను.

తర్వాత ఎండవున్న, పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణములో చనిపోయిన యోగులు మోక్షము చెందుదురని, మేఘములుకప్పిన

పగలు రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయణములలో చనిపోయిన యోగులు తిరిగి జ్ఞానప్రకాశము కల్గి పుట్టుదురని భగవంతుడు

చెప్పాడు. దీనిని బట్టి సాధారణ మనుషుల మరణములకు దేవుడు చెప్పిన కాలనిర్ణయము వర్తించదని తెలియాలి.

ఇంతవరకు మరణము గురించి తెలుసుకొన్నాము. అది సాధారణ మనుషులయందెట్లున్నది మరియు బ్రహ్మ, కర్మ,

భక్తియోగులలో కూడ ఎట్లున్నది వివరించుకొన్నాము. మరణమును గురించిన ఈ వివరము భూతకాలములో లేదని,

భవిష్యత్తులో దీనిని మించిన వివరము ఎవరూ చెప్పలేరని సగర్వముగ చెప్పుచున్నాము. గర్వము అంటూనే పొరపడవద్దండి.

గర్వమును నేను ఉపయోగించుకొన్నాను కాని గర్వము నన్ను ఉపయోగించుకోలేదు.


మరణమంటే ఎంతో భయము, తెలియనితనమున్న వారికి ఈ వివరములు బాగా ఉపయోగపడునని తలచుచున్నాము.

పురాణాల మీద, గతకాలములో జడలుపెంచుకొన్న వారి మీద విశ్వాసమున్న వారు, వారు చెప్పినట్లు మరణకాలములో

యమకింకరులను గురించి వ్రాయలేదే అని అదే నిజము, ఇది నిజము కాదు అనుకొంటే శాస్త్రబద్దత లేని విషయములనెందుకు

నమ్ముచున్నారని మా వైపునుండి ప్రశ్నరాగలదు. భగవద్గీతలో ఎన్నో ప్రమాణములతో స్వయముగ భగవంతుడు చెప్పిన

విషయమునే విపులముగ వివరించాము.


ఈ గ్రంథములో చెప్పబడిన "జనన మరణ రహస్యములు" గత కాలములో ఎవరూ చెప్పియుండలేదు. రాబోవు

కాలములో దీనిని మించి ఎవరూ చెప్పనూలేరు.


ఇప్పటికయిన అందరు జనన మరణముల సత్యము తెలుసుకుంటారని నమ్ముచు ముగిస్తున్నాము.


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.


Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024