యోగీశ్వరుల వారి రచనల సారాంశము cloud text 20thSep24

 


యోగీశ్వరుల వారి రచనల సారాంశము.

1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.

త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,

పరమాత్మ సమాచారము ఉన్నది.

2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.

త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.

3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.

త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.

4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత

గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు

ఈశ్వరుడైన యోగీశ్వరుడు.

5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.

త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక

భయపడిపోతాయి.

6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.

త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా

యోగీశ్వర్లు చెప్పారు.

7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.

సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.

8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన

త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.

9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను

చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.

10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని

మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.

11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.

అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.

12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా

హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లకుగానీ ఆ విషయము

తెలియదు.







మూడు దైవ గ్రంథములు-మూడు ప్రథమ వాక్యములు.


మూడు దైవ గ్రంథములు ఏవో చాలామందికి తెలిసియుండదు.

కొందరు వాటి పేరు కూడా విని యుండరు. చాలామందికి 'దైవగ్రంథము’

అంటే అర్థము కూడా తెలియదు. ఒక్క ఇస్లామ్ను అనుసరించు ముస్లీమ్లు

మాత్రము తమ గ్రంథమును దైవగ్రంథమని చెప్పుకొనుచుందురు. అయితే

వారు కూడా ఊతపదములాగా తమ గ్రంథమును 'అంతిమ దైవగ్రంథము'

అని అంటున్నారు తప్ప, అది ఎలా దైవగ్రంథమయినదో? ఎలా అంతిమ

గ్రంథమయినదో? వారికే తెలియదు. మాకు తెలుసును అనువారున్నా

వారికి తెలిసినది కూడా సత్యముండదు. నేడు మూడు మతముల వారు

మూడు గ్రంథములు కలిగియున్నారు. క్రైస్తవులు తమ గ్రంథము బైబిలు

అని ధైర్యముగా చెప్పుకొనుచున్నారు. అట్లే ముస్లీమ్లు తమ గ్రంథము

ఖురాన్ గ్రంథమని సంతోషముగా చెప్పుకొనుచుందురు. హిందువుల

విషయానికి వస్తే తమ గ్రంథము భగవద్గీతయని చెప్పలేకపోవుచున్నారు.

కొందరు హిందువులు తమవి వేదములని అంటున్నారు. కొందరు

వేదములో, భగవద్గీతనో ఏమీ తెలియని స్థితిలో 'మాకు తెలియదు' అని

అంటున్నారు. ఏమీ తెలియని వారు చాలామంది యుండగా, వేదములు

అని చెప్పువారు కొందరుండగా, వారిలో పదవ వంతు మాత్రమే మాది

భగవద్గీతయని చెప్పువారు గలరు.


హిందువులు తమ గ్రంథ విషయములోనే కాకుండా, దేవుని

విషయములో కూడా ఫలానావాడు దేవుడు అని చెప్పలేకపోవుచున్నారు.

మిగతా రెండు మతముల వారు హిందువులకంటే వెనుక పుట్టినవారైనా,

హిందువులకంటే వారే కొంత మేలన్నట్లున్నారు. మిగతా రెండు మతముల

వారు మాది ఫలానా గ్రంథమని ధైర్యముగా చెప్పుకొంటున్నారు. అట్లే మా

దేవుడు ఫలానాయని ఒక్కని పేరే చెప్పుచున్నారు. హిందువులు అలా ఒక్క

దేవుని పేరు చెప్పలేకపోవడమేకాక కొందరు ఒక దేవతను, మరికొందరు

ఇంకొక దేవతను గురించి చెప్పుచున్నారు. హిందువుల భావములో ఒక

దేవుడను దృష్టియే లేదు. ఇష్టదేవతారాధన అని పేరే పెట్టుకొన్నారు.

దీనినిబట్టి ఎవరి ఇష్టమును బట్టి వారు దేవతలను సృష్టించుకొన్నారని

తెలియుచున్నది. ఇలా ఉండడము వలన హిందువులకు ఒక దేవుడంటూ

ఎవరూ లేరు అని చెప్పవచ్చును. ఎవడయినా జ్ఞానమును తెలిసి అందరికీ

ఒకే దేవుడని అంటే వానిని హిందువే కాదు. అనేక దేవతారాధన గలదే

హిందుత్వము అని అంటున్నారు. ఒకే దేవుని ఆరాధన చేయువానిని,

అందరికీ ఒకే దేవుడని చెప్పువానిని హిందువులనుండి వెలివేసి, వానిని

పరమతస్థుడని అంటున్నారు. బహుదేవతారాధన అజ్ఞానమని వారికి

తెలియదని, మొత్తము మీద ఆత్మజ్ఞానముగానీ, దైవజ్ఞానముగానీ ఏమాత్రము

తెలియదని చెప్పవచ్చును.


భూమిమీద మొత్తము 12 మతములుండగా అందులో ముఖ్యమైనవి

మూడు మతములుగా గుర్తించాము. మూడు మతములలో దేవుడు చెప్పిన

బోధగల మూడు గ్రంథములు గలవు. అందువలన మూడు మతములను

ముఖ్యముగా లెక్కించాము. మిగతా తొమ్మిది మతములలో మనుషులు

చెప్పిన బోధగలదు గానీ, దేవుడు చెప్పిన బోధ లేదు. దేవుని బోధ

యుండుటను బట్టి మూడు మతములు గుర్తింపుగలవిగా యున్నవి. మూడు

మతములు దేవుడు చెప్పిన బోధను ఆధారముగా చేసుకొని తయారయినవే,

అయినా దేవుని బోధను అర్థము చేసుకోవడములో తేడాలు ఉండడము

వలన, ఎవరికి అర్థమయినట్లు వారు తమ మతములను తయారు

చేసుకోవడము జరిగినది. 'దేవుడు మనిషివలె పుట్టును' అని అర్థము

చేసుకోవడము వలన హిందూమతము తయారైనది. 'దేవుడు మనిషివలె

పుట్టడని' అర్థమయిన వారు తమ మతము ఇస్లామని చెప్పుకోవడము


జరిగినది. అట్లే దేవుడు చెప్పిన బోధ ఒకటే అయినా అది అర్థమయిన

భావమును బట్టి క్రైస్థవము మరియు ఇస్లామ్ (ముస్లీమ్) మతము

పుట్టుకొచ్చినవి. దేవుడు చెప్పిన బోధలో కొన్ని విషయములు అందరికీ

ఒకే విధముగా అర్థమయినా, మరికొన్ని విషయములలో వేరువేరు

విధములుగా అర్థము కావడము వలన, వారికి అర్థమయిన విధముగా

వారు వారి మతమును తయారు చేసుకోవడము జరిగినది. ఈ విధముగా

మూడు మతములు తయారుకాగా, మూడు మతములు దేవుని విషయములో

మూడు రకముల వరకేకాక, అనేక రకములుగా భిన్న అభిప్రాయములు

కల్గియున్నారు.


మూడు మతముల వారు ఎన్ని భిన్న అభిప్రాయములు కల్గియున్నా

వారు మూడు సమయములలో తయారయిన మూడు గ్రంథములనే

ఆధారము చేసుకొని, వాటినే తమ గ్రంథములుగా చెప్పుకొంటున్నారు.

మూడు గ్రంథములలోనూ దేవుని జ్ఞానమే ఉండుట వలన, మూడు

గ్రంథముల జ్ఞానమును దేవుడే (ఆత్మే) చెప్పియుండుట వలన, మూడు

గ్రంథములను దైవగ్రంథములని చెప్పవచ్చును. అందువలన మూడు

గ్రంథముల ముందర ‘దైవ' అని దేవున్ని గుర్తు చేయవలసియున్నది. అయితే

నేడు ఒక్క ముస్లీమ్లు తప్ప మిగతా వారు ఎవరూ తమ గ్రంథముల

ముందర 'దైవ' అని దేవుని గుర్తింపును పెట్టడము లేదు. ముస్లీమ్లు తమ

గ్రంథమును ‘అంతిమ దైవగ్రంథము' అని చెప్పుచుండగా, క్రైస్థవులు తమది

'పరిశుద్ధ గ్రంథము' అని అంటున్నారు. హిందువులు భగవద్గీత ముందర

ఏమీ చెప్పకుండా 'భగవద్గీత'యని మాత్రము అంటున్నారు. ఈ విధముగా

మూడు గ్రంథములను మూడు మతముల వారు చెప్పుచుండుటను నిత్యము

చూస్తూనే యున్నాము. వాస్తవముగా మూడు గ్రంథముల బోధను దేవుడే

తన ఆత్మ ద్వారా చెప్పియుండుట వలన మూడు గ్రంథములను దైవ

గ్రంథములనియే చెప్పాలి. అయితే తెలిసో తెలియకో ఒక్క ముస్లీమ్లు

మాత్రము తమ గ్రంథమును (ఖురాన్ ను) దైవగ్రంథము అని అంటున్నారు.

మిగతా రెండు మతములవారు ఆ మాటను అనడము లేదు.



వాస్తవముగా దేవుడు ఒకే జ్ఞానమునే సృష్ట్యాదిలో బోధించగా,

అది మూడు వేరువేరు సమయములలో, వేరువేరు వ్యక్తుల ద్వారా బయటికి

రావడము వలన మూడు వేరువేరు గ్రంథములుగా వ్రాయబడియున్నది.

మూడు వేరు గ్రంథములుగా యున్నా, ఆ మూడు గ్రంథములను మూడు

దైవగ్రంథములుగానే చెప్పవలసి యుండును.  అందువలన మొదట

తయారయిన గ్రంథమును 'ప్రథమ దైవగ్రంథమని' చెప్పుచున్నాము. తర్వాత

తయారయిన గ్రంథమును 'ద్వితీయ దైవగ్రంథమని' అని అంటున్నాము.

మూడవమారు తయారయిన గ్రంథమును 'అంతిమ దైవగ్రంథము' అని

అంటున్నాము. ఈ విధముగా మేము చెప్పడమేకాక వీటికి ఈ పేర్లు

రావడానికి శాస్త్రబద్ధమైన ఆధారము కూడా కలదు. అదేమనగా! బ్రహ్మ

విద్యా శాస్త్రమైన అంతిమ దైవగ్రంథములో సూరా 42, ఆయత్ 51లో ఈ

విధముగా చెప్పారు చూడండి. (42-51) “దేవుడు ఏ మానవునితోనూ

ప్రత్యక్షముగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి

సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణిద్వారా

లేక తెరవెనుక నుంచో మనిషికి చేరవేస్తాడు. తాను కోరినది

తన ఆజ్ఞతో సూచించటానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన

మహోన్నతుడు. ఎంతో వివేకవంతుడు.”


పైన చెప్పిన ఈ వాక్యములో దేవుడు మనిషికి మూడు విధానముల

ద్వారా జ్ఞానమును తెలియజేయునని అర్థమగుచున్నది. అందులో మొదటనే


సృష్ట్యాదిలోనే ఒక విధానమైన వహీ (వాణి) ద్వారా జ్ఞానము చెప్పడమైనది.

విశ్వములో దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటేయని బ్రహ్మవిద్యా

శాస్త్రము వలన తెలియబడుచున్నది. మొదట ఆకాశవాణి ద్వారా చెప్పబడిన

జ్ఞానము, దేవుని ఆత్మచేత చెప్పబడిన జ్ఞానము అయినందున అది ఎప్పటికీ

మారదు. తర్వాత దేవుని జ్ఞానము భూమిమీద మనుషులకు చెప్పినా, అది

మొదట చెప్పిన జ్ఞానముతో సమానముగా ఉండును. దేవుడు తన

జ్ఞానమును మూడు విధానముల ద్వారా తెలియజేస్తానని చెప్పినట్లు, మొదట

వహీ ద్వారా (వాణి ద్వారా) తెలియజేశాడు. మొదట తెలియజేసిన జ్ఞానమే

కాక, మొదట తెలిపిన విధానములలో ఒక దాని ద్వారా తెలుపడము

వలన, ఆ విధానము ద్వారా చెప్పిన జ్ఞానము గ్రంథరూపమైనప్పుడు దానిని

‘ప్రథమ దైవగ్రంథము' అని అన్నారు. అట్లే రెండవ విధానము ద్వారా

తెలియజేసిన జ్ఞానము గ్రంథరూపమైనప్పుడు దానిని 'ద్వితీయ దైవగ్రంథము’

అని అన్నారు. చివరిగా మిగిలిన విధానము తెరవెనుక నుండి

తెలియజేసినది. అది చివరిగా చెప్పబడిన విధానమైనందున దాని ద్వారా

వచ్చిన జ్ఞానము గ్రంథము కాగా ఆ గ్రంథమును 'చివరి దైవగ్రంథమనియు’

లేక ‘అంతిమ దైవగ్రంథమనియు చెప్పడమైనది. ప్రథమ, మధ్యమ, అంతిమ

అనడము శాస్త్రపద్ధతిని అనుసరించి చెప్పడమని చెప్పవచ్చును. శాస్త్రీయత

ప్రకారము భగవద్గీత ప్రథమ దైవగ్రంథము, ఖురాన్ అంతిమ దైవగ్రంథము.

ఈ వరుస క్రమమును ఎవరూ మార్చుటకు వీలులేదు.


ఒకే జ్ఞానమే మూడుమార్లు, మూడు విధానముల ద్వారా చెప్పబడుట

చేత మూడు వరుస గ్రంథములయినవి. మూడిటిలోనూ ఒకే దైవజ్ఞానము

ఉండుట చేత మూడిటిని దైవగ్రంథములని చెప్పడము జరిగినది. సృష్ట్యాదిలో

చెప్పబడిన మొదటి జ్ఞానము అనగా ఆకాశవాణి చేత పలుకబడిన జ్ఞానము



ప్రథమ దైవగ్రంథముకాగా, మిగతా రెండు గ్రంథములలో కూడా అదే

జ్ఞానమే ఉండడమైనది. చెప్పే భాషలోనూ, వ్రాసే వ్రాతలోనూ కొంత తేడా

యుండవచ్చును గానీ, భావములో మాత్రము తేడాయుండదు. అందువలన

మూడు గ్రంథములను ఒకే జ్ఞాన గ్రంథములుగా చెప్పవచ్చును. మత

భేదము మనుషులలో ఉండవచ్చునుగానీ, గ్రంథములలో లేదు. అందువలన

చివరి గ్రంథము తనకంటే ముందు వచ్చిన రెండు గ్రంథములను సత్యమని

ధృవీకరించుచున్నది. అట్లే మొదటి గ్రంథము తన జ్ఞానమే మిగతా రెండు

గ్రంథములలో యున్నదని చెప్పుచున్నది.


ప్రశ్న :- కొందరు ముస్లీమ్లు ముందు వచ్చిన రెండు గ్రంథములలో లేని

విషయములు మూడవ గ్రంథమయిన ఖురాన్లో ఉన్నాయని, చివరిగా

వచ్చిన గ్రంథములోనే ఎక్కువ జ్ఞానమున్నదని, ఖురాన్ ముందర ముందు

వచ్చిన రెండు గ్రంథములు పనికి రావని, అందువలన వాటిని వదలిపెట్టి

ఖురాన్ గ్రంథమును అందరూ ఆశ్రయించవలెననీ, ఖురాన్ వలననే దేవున్ని

తెలియుటకు వీలగుననీ, ఖురాన్ లేకముందు ముందు రెండు గ్రంథములు

అవసరమైనవయినా, ఖురాన్ అంతిమ గ్రంథముగా వచ్చిన తర్వాత ముందు

రెండు గ్రంథములు అవసరము లేదనీ, చివరి గ్రంథమయిన ఖురాన్లో

ప్రస్తుత కాలములో అవసరమైన జ్ఞానము కలదనీ, అందువలన పూర్వము

రెండు గ్రంథములకంటే చివరిగా వచ్చిన గ్రంథమును ఆశ్రయించిన

వారే ముక్తిని పొందగలరనీ, ఖురాన్ కాకుండా మిగతా రెండు గ్రంథములను

ఆశ్రయించిన వారు, సంపూర్ణ జ్ఞానము తెలియక, అజ్ఞానములోనే

ఉందురని చెప్పుచున్నారు. వారు చెప్పుమాట ఎంతవరకు వాస్తవము?


జవాబు :- ఇదంతయూ మతము ముసుగులో యున్న మనుషులు చెప్పు

విషయమేగానీ, గ్రంథములో ఉన్న విషయము కాదు. అంతిమ దైవ


గ్రంథమయిన ఖురాన్ గ్రంథమే తనకంటే ముందు వచ్చిన రెండు

గ్రంథములను సత్యమని సాక్ష్యమిచ్చుచుండగా మనుషులు రెండు

గ్రంథములు పనికిరావు అనడములో అర్థమే లేదు. శాస్త్రబద్దముగా ఖురాన్

గ్రంథము తనకంటే ముందు వచ్చిన తౌరాతు, ఇంజీలు (భగవద్గీత, బైబిలు)

గ్రంథముల జ్ఞానమును ధృవీకరించుచూ, సత్యమని చెప్పుచున్నది. ఈ

విషయమై సూరా ఐదు, ఆయత్ 48లో ఇలా వ్రాసియున్నారు చూడండి.

(5-48) “మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని (ఖురానాను) సత్య

సమేతముగా అవతరింపజేశాము. ఇది తమ కన్నా ముందు

వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరించుచున్నది. నీవద్దకు

వచ్చిన సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరించకు"

ఈ వాక్యములో ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథములు సత్యమని

ఖురాన్ గ్రంథమే చెప్పినట్లుండగా మనుషులు కాదని చెప్పడము అజ్ఞానమే

కదా! అందువలన వాక్యము చివరిలో “నీ వద్దకు వచ్చిన సత్యమును వీడి

వారి (మనుషుల) మనోవాంఛలను అనుసరించకు” అని అన్నారు. ఆ

వాక్యము చెప్పినప్పటికీ మూర్ఖముగా మా గ్రంథమే గొప్ప అనుట అజ్ఞానమే

యగును.  అంతేకాక తౌరాతును (భగవద్గీత)ను స్వీకరించక ఇతర

గ్రంథములను స్వీకరించిన, దేవుని వాక్యమును ధిక్కరించినట్లేయని కూడా

ఇదే ఖురాన్ గ్రంథములో 62వ సూరా, 5వ ఆయత్లో చెప్పియున్నారు

చూడండి. (62-5) “తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని

ఆదేశించినప్పటికీ దానికి అనుగుణముగా ఆచరించని వారు

ఎన్ని గ్రంథములు అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో

గ్రంథములు వీపు మీద మోయు గాడిదలాంటి వారని ఉప

మానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన


వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు దేవుడు

(అల్లాహ్) సన్మార్గము చూపడు.'


ఈ వాక్యములో చెప్పిన సారాంశమును చూస్తే భగవద్గీత ప్రకారము

ఆచరించాలని దేవుడు చెప్పియున్నా, దానికి అనుగుణముగా ఆచరించని

వారు అనగా! భగవద్గీతను వదలి మిగతా గ్రంథములను అనుసరించిన

వారు 'గ్రంథములు వీపుమీద మోయు జంతువుతో సమానముగా చెప్పారు.

దీనిప్రకారము చూస్తే భగవద్గీత జ్ఞానమును మొదట అనుసరిస్తూ తర్వాత

మిగతా గ్రంథములను అనుసరించవచ్చునని ఇక్కడ చెప్పాడు. దీనినిబట్టి

చూస్తే ‘ఖురాన్ పెద్దది, తౌరాత్ చిన్నది' అని చెప్పుటకు వీలులేదు. దేవుని

దృష్ఠిలో మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నది. అయితే మిగతా రెండు

గ్రంథములలో లేని జ్ఞాన విషయములు కూడా 'మూడు ఆత్మల గురించి

చెప్పియున్న భగవద్గీత (తౌరాతు) గ్రంథము'లో ఉండుట వలన, మొదట

దానిని చూచిన తర్వాత మిగతా గ్రంథములు చదువవచ్చును. మిగతా

రెండు గ్రంథములలో లేని కొన్ని విషయములు తౌరాతులో ఉండుట వలన,

మొదట తయారయిన గ్రంథము తౌరాతు అయిన దానివలన మిగతా

గ్రంథములకంటే ముందు తౌరాతును (భగవద్గీతను) అనుసరించాలి.


ప్రశ్న :- తౌరాతు గ్రంథము, భగవద్గీత గ్రంథము రెండూ ఒకే గ్రంథమా?


జవాబు :- అవును. తౌరాతు, భగవద్గీతయను రెండు పేర్లు ఒకే భగవద్గీతకు

గలవని చెప్పుచున్నాము. రెండు పేర్లుగలవి ఒకే గ్రంథమనుట పెద్ద

రహస్యము. అయినా మీరు జ్ఞానము తెలియు నిమిత్తము పెద్ద రహస్యమును

కూడా సులభముగా తెలియజేస్తున్నాము. రెండూ ఒకే గ్రంథమని చెప్పుట

ఎంత పెద్ద రహస్యమో తెలియుటకు మా రచనలలోని “కృష్ణమూస” అను

76వ రచన గ్రంథమును చూడండి. తౌరాతు భగవద్గీత ఒకే జ్ఞానమని,


ఒకే గ్రంథమని తెలియుట దైవ రహస్యమును తెలిసినట్లుయగును. ఈ

రహస్యమును తెలియుట వలన ఆధ్యాత్మిక రంగములో ఎన్నో తెలియని

ప్రశ్నలకు సమాధానము సులభముగా దొరుకును.


ప్రశ్న :– ఇంతవరకు తెలిసిన సమాచారము ప్రకారము మూడు గ్రంథముల

పేర్లు తెలిసిపోయినవి. అయితే మీరు కొన్ని సందర్భములలో మాట్లాడుచూ

మూడు గ్రంథములు ఒకే గ్రంథములోనివే, ఒకే గ్రంథమునే మూడు

గ్రంథములుగా విభజించుకొని వేరువేరు పేర్లు చెప్పుచున్నారని అన్నారు.

అంతేకాక ఖురాన్ గ్రంథమందు సూరా ఆరు, ఆయత్ 91లో ఇలా

చెప్పియున్నారు. (6-90) “దేవుడు ఏ మానవునిపైనా ఎలాంటి

జ్ఞాన విషయమును ప్రసరింపజేయలేదు అని పలికినప్పుడు ఆ

అవిశ్వాస జనులు దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా

అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మూస తెచ్చిన తౌరాతు

గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి,

మానవుల కొరకు మార్గదర్శకత్వము. మీరు దానిని వేరు వేరు

కాగిత గ్రంథాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయము

లను దాచేస్తున్నారు. మీకు గానీ, మీ పెద్దలకుగానీ తెలియని

ఎన్నో విషయములు ఇందుమూలముగా మీకు నేర్పబడ్డాయి.

తౌరాతును అవతరింపజేసిన వాడు అల్లాహ్ యే అని చెప్పు.

ఆ తర్వాత వారిని వారి వ్యర్థ విషయములలో ఆడుకోనివ్వు."


జవాబు :- పై వాక్యములో దేవుడు చెప్పినట్లు తౌరాతు గ్రంథమే మిగతా

రెండు గ్రంథములుగా చెప్పబడుచున్నది. తౌరాతు గ్రంథములోని

విషయములే బైబిలు, ఖురాన్ గ్రంథములలో యుండుట వలన మూడు


ఒకే గ్రంథమనీ, అదే తౌరాతు గ్రంథమని చెప్పవచ్చును. ఒకే తౌరాతు

గ్రంథము మిగతా రెండు గ్రంథములుగా తయారై మొత్తము మూడు

గ్రంథములుగా కనిపించుచున్నది. ఇంకొక తెలియని విషయము కూడా

కలదు. అదే మనగా! గ్రంథము కాని జ్ఞానముగా, దేవుడు ఆదియందు

చెప్పబడిన జ్ఞానము “జపర” అను పేరుతో యుండేది. జపర అను

జ్ఞానము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అను మూడు

యుగములు గడచు వరకు యుండేది. అలా ఉండడములో కాలక్రమమున

ఆ “జపర” అను పేరు కాస్త మారిపోయి 'జబుర' అను పేరుగా

నిలిచిపోయినది. జబుర జ్ఞానమే కలియుగము మొదటిలో భగవద్గీతగా

తయారయినది. తర్వాత అదే జ్ఞానమే బైబిలు, ఖురాన్ యున్నా అది

భగవద్గీతయని తెలియకుండా పోయినది. శబ్దరూపములో (వాక్య

రూపములో) యున్న జబుర మొదట భగవద్గీతయను గ్రంథరూపము కాగా

తర్వాత అదే మిగతా రెండు గ్రంథములయినది. ఒక శబ్దము (ఒక జ్ఞానము)

ఒక గ్రంథముగా తయారయినది. ఒక గ్రంథము మిగతా రెండు

గ్రంథములుగా తయారయినది.


ప్రశ్న :- మూడు గ్రంథములందు ఒకే దైవ జ్ఞానముంటే అందరూ ఒకే

సమాజముగా యుండక వేరువేరు మతములుగా ఎందుకు తయారైనారు?


జవాబు :- మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని మనుషులకు తెలియక

పోవడము వలన, మూడు గ్రంథములను అడ్డము పెట్టుకొని మూడు

మతములను తయారు చేసుకొన్నారు. దేవుని యొక్క దైవ గ్రంథములలోని

దేవుని వాక్యములను గ్రహించుకోలేనివారు వారికున్న అవగాహనా లోపము

వలన గ్రంథములను చీల్చుకొన్నట్లు, దేవుళ్ళను కూడా చీల్చుకొన్నారు.

దేవున్ని, దేవుని గ్రంథములను చీల్చుకోవడమే కాక మతముల గుంపులుగా



కూడా చీలిపోయారు. ఇదంతయూ దేవుని జ్ఞానము అర్థముకాక పోవడము

వలన ఏర్పడిన అనర్థములే మతములుగా యున్నవి. మతముల అజ్ఞానము

మనుషులనుండి వైతొలగి పోవాలంటే, దేవుడిచ్చిన మూడు గ్రంథములను

చదివి మూడు గ్రంథముల జ్ఞానమును తెలియగలిగితే, అప్పుడు మతము

మాయ వలన ఏర్పడినదని అందరికీ తెలిసిపోతుంది. క్రొత్త జ్ఞానము

తెలియుట వలన మతముల సమాజములు పోయి, మత రహితమైన ఏక

సమాజము ఏర్పడగలదు. ఏక సమాజములో మత తేడాలుగానీ, దేవుని

తేడాలుగానీ, జ్ఞానములో తేడాలుగానీ ఉండవు.


అన్ని గ్రంథ విషయములను శోధించిన తర్వాత భగవద్గీత, బైబిలు,

ఖురాన్ గ్రంథములు మూడు దైవగ్రంథములుగా లెక్కించబడుచున్నవి. దేవుడు

చెప్పిన వరుస క్రమములో ముందు వెనుక తయారయిన గ్రంథములకు ఆ

వరుస ప్రకారమే ప్రథమ, ద్వితీయ, అంతిమ అని పేర్లు పెట్టబడినవి.

మొదట తయారయిన ఆకాశవాణి జ్ఞానమును ప్రథమ దైవగ్రంథముగా

చెప్పారు. ప్రథమ దైవగ్రంథము భగవద్గీతయేయని చాలామందికి తెలియదు.

దేవుని ప్రతినిధి ద్వారా చెప్పబడిన జ్ఞానము ద్వితీయ దైవగ్రంథముగా

తయారయినది. అదియే బైబిలు గ్రంథము. తెరచాటునుండి చివరి

విధానముగా జిబ్రయేల్ అను కనిపించని గ్రహము ద్వారా చెప్పబడిన

జ్ఞానము అంతిమ దైవగ్రంథముగా తయారైనది. అదియే ఖురాన్ గ్రంథము.

ఈ విధముగా ప్రథమ, ద్వితీయ, అంతిమ అను పేర్లతో వరుసగా భగవద్గీత,

బైబిలు, ఖురాన్ గ్రంథములు తయారు కావడము జరిగినది.


ఈ మూడు గ్రంథములు ప్రపంచమున్నంత వరకు అదే వరుసలో

అదే పేరుతో ఉండగలవు. వీటి స్థానములలోనికి ఇతర ఏ గ్రంథములు

వచ్చుటకు వీలులేదు. అయితే వీటిలో ఇప్పటికే కొంత కలుషిత జ్ఞానము


చేరిపోయి ఎవరికీ కనిపించకయున్నది. అవి మూడు దైవగ్రంథములయిన

దానివలన వాటిలో కూడా కలుషిత జ్ఞానముండునా? యని ప్రశ్న రావచ్చును.

దాని జవాబు ఏమనగా! దేవుడు ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి

యున్నాడు. దేవుడు సర్వవ్యాపి, సర్వగ్రాహి. అందువలన ఆయన అన్నిటినీ

చూస్తున్నాడు. అన్నిటినీ గ్రహించగలుగుచున్నాడు. ఆయనకు తెలియకుండా

ప్రపంచములో ఏమీ జరుగదు. అన్నిటికీ దేవుడు సాక్షిగాయున్నాడు. ఆయన

ఏ పనినీ చేయడు, దేవుడు పని చేయువాడు కాడు. అయినా ఆయన

అనుకొంటే అన్ని పనులు జరిగిపోవును. దేవుడు చూస్తూయుండగా

చేయవలసిన పనులను దేవుని తర్వాత యున్న ఆత్మ చేయును. ఆత్మ

చేసినా దేవుడు చేసినట్లే చెప్పబడుచుండును. ఆత్మ ఎన్ని పనులను చేసినా

తాను చేసినట్లు చెప్పక, దేవుడు చేశాడనియే చెప్పును. పరమాత్మ (దేవుడు)

క్రియలు లేనివాడు, ఆత్మ క్రియలు చేయువాడు. జీవాత్మ ఏమీ చేయలేని

వాడు. స్వయం బలము లేనివాడు. ఏమీ చేయడు అన్ని అనుభవిస్తాడు.

జీవాత్మ అనుభవించేవాడు, ఆత్మ చేసేవాడు, పరమాత్మ చూచేవాడు. అల్లాహ్

లేక దేవుడు మూడు భాగములుగాయుండి అన్నీ తానే చేయుచున్నా ఏమీ

చేయని వాడుగా, తన ఆత్మను చేసేవానిగా చూపుచున్నాడు.


దైవగ్రంథములో దేవుడు ఆత్మ ద్వారా చెప్పించిన స్వచ్ఛమయిన

జ్ఞానమూ కలదు. అలాగే జీవున్ని అడ్డము పెట్టి ఆత్మే చెప్పిన అజ్ఞానమూ

కలదు. అయితే స్వచ్ఛమయిన జ్ఞానమును దేవుడు చెప్పాడనీ, అజ్ఞానమును

జీవుడు చెప్పాడని పైకి ఆత్మే చెప్పుచుండును. అన్నీ ఆత్మే చేయుచున్నా,

జ్ఞానమును, అజ్ఞానమును ఆత్మే బోధించుచున్నా, ఆత్మ బోధించునట్లు

ఎవరికీ తెలియకుండా ఆత్మే చేసినది. ఆత్మ అన్ని కార్యములు చేయుచున్నా

ఏమాత్రము కనిపించక శరీరములో అణిగిపోవుచున్నది. దైవగ్రంథములో


అజ్ఞానమును మనుషుల ద్వారా చేర్పించినది ఆత్మయే. మనుషులను

బొమ్మలవలె ఆడించుచూ, మనుషుల చేత వారి అజ్ఞానమును దైవగ్రంథములో

చేర్చినట్లు చేసినది ఆత్మయని ఎవరికీ తెలియదు. దేవుడు జ్ఞానమును

చెప్పకున్నా దేవుడు చెప్పినట్లు ఏ విధముగా అనుకొంటున్నామో, అలాగే

జీవుడు అజ్ఞానమును దైవగ్రంథములో చేర్చకున్నా జీవుడు చేర్చినట్లే

అనుకొంటున్నాము. అందరి వెనుక ఎవరికీ తెలియక అన్నీ చేయుచున్న

ఆత్మ నిజమైన కార్యకర్తయని తెలియుచున్నది. ఎలాగయితేనేమి దైవ

గ్రంథములో అజ్ఞాన కలుషితము కొంత చేరిపోయినదని చెప్పక తప్పదు.


మూడు దైవగ్రంథములలో దైవజ్ఞానము సంపూర్ణముగా యుండినా,

మనిషి జ్ఞానమువైపు పోకుండా అజ్ఞానమువైపే పోవుటకు, ఒక జ్ఞాన

విషయమును ఇది జ్ఞానము కాదని చూపుటకు, గ్రంథములోని అజ్ఞానము

బాగా పనికివచ్చును. అలా దేవుడు ఏర్పరచి పెట్టియుండడము వలన

మనుషులందరూ దైవగ్రంథముల ద్వారా జ్ఞానములోనికి ప్రవేశించకుండా

అజ్ఞానములోనికి ప్రవేశించుటకు అనుకూలముగా ఆత్మే చేసి పెట్టినది.

అందువలన చాలామంది దైవగ్రంథములను చదివినా, అందులో కొద్దిమందికి

మాత్రమే అరుదుగా జ్ఞానము తెలియును. మిగతా వారందరికీ అజ్ఞానమే

అర్థమగును. "దేవుడు తనకిష్టమైన వారందరిని జ్ఞానమువైపు పంపును.

తనకు ఇష్టములేని వారిని అజ్ఞానము వైపు పంపును” అని దైవగ్రంథములలోనే

చెప్పడమైనది. అలా చేయుటకు ముందే దైవగ్రంథములలో కొంత

అజ్ఞానమును అజ్ఞానుల కొరకే ఆత్మే యుంచినదని తెలియుచున్నది.

అట్లని అందరూ అజ్ఞానులగుటకు వీలులేదు. దైవ గ్రంథములలో ఒక్కొక్క

దానియందు ఒక్కొక్క రకముగా అజ్ఞానము కలిసియున్నది. తక్కువ

అజ్ఞానమున్న గ్రంథము మాకు తెలుసు. అలాగే ఎక్కువ అజ్ఞానమున్న

గ్రంథము మాకు తెలుసు. అయినా దేనియందు ఎంత అజ్ఞాన కాలుష్యము

కలిసియున్నదని మేము బయటికి చెప్పము.


అటువంటి కలుషిత జ్ఞానమును వదలివేసి జ్ఞానమున్న వాక్యములను

మాత్రము బయటికి చెప్పుచూ వాటికి ఇది వివరము అని చెప్పుచుందుము.

మూడు దైవగ్రంథములలో ప్రథమ దైవ గ్రంథమునకు వివరమును వ్రాశాము.

“త్రైత సిద్ధాంత భగవద్గీత”యను పేరుతో మేము ప్రథమ గ్రంథమునకు

వివరమును వ్రాశాము. తర్వాత అంతిమ దైవగ్రంథమునకు కూడా కొన్ని

వాక్యములకు మాత్రము వివరమును వ్రాశాము. తర్వాత అంతిమ దైవ

గ్రంథములోని జ్ఞాన వాక్యములకు రెండవ భాగముగా రెండవ గ్రంథమును

వ్రాయుచున్నాము. ఇట్లు భగవద్గీత ఒకటి, ఖురాన్ రెండు గ్రంథములు

వస్తున్నవి. తర్వాత ద్వితీయ దైవగ్రంథములోని కొన్ని జ్ఞాన వాక్యములకు

అనగా నాలుగు సువార్తలకు వివరముగా గ్రంథమును వ్రాయాలనుకొన్నాము.

ఇప్పటికి రెండు గ్రంథములకు కొంత వివరమును వ్రాసినా, మూడవ

గ్రంథముతో మేము వ్రాయడము పూర్తి కాగలదు. ఆ మూడు గ్రంథములే

కాక వాటికి అనుబంధముగాయున్న 80 గ్రంథములను వ్రాయడము

జరిగినది. త్వరలో నూరు గ్రంథములను నా ఆత్మ వ్రాయగలదని

నమ్ముచున్నాను. మూడు దైవగ్రంథములను గురించి ఎంత వ్రాసినా,

ఎంత చెప్పినా తక్కువేయగును. అందువలన క్రొత్త కోణమునుండి మూడు

గ్రంథములను వివరించదలచుకొని, మూడు దైవగ్రంథములనుండి మూడు

ప్రథమ వాక్యములను తీసి, మూడు ప్రథమ వాక్యములకు ప్రత్యేకించి

జ్ఞాన వివరమును తెలుపాలనుకొన్నాము. ఆ ప్రయత్నములోనే ఈ చిన్న

గ్రంథమును వ్రాయుచున్నాను అని నేను చెప్పను. నా వెనుక కనిపించక

అణిగియున్న ఆత్మ వ్రాయించుచున్నదని చెప్పుచున్నాను.


ముందుగా ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను తీసుకొందాము.

భగవద్గీత మొత్తము 18 అధ్యాయములుగా యున్నది. అందులో అర్జున

విషాదయోగము ఒక అధ్యాయము కాగా, అది 47 శ్లోకములతో కూడుకొని

యున్నది. రెండవ అధ్యాయము సాంఖ్య యోగము. ఈ అధ్యాయము 72

శ్లోకములుగా యున్నది. అందులో పది శ్లోకములు అర్జునుడు చెప్పినవే

అయినందున మొత్తము అర్జున విషాద శ్లోకములు 47+10=57

అవుతున్నవి. సాంఖ్యయోగములో పది శ్లోకములు అర్జునునివి పోగా

మిగిలినవి 72-10=62 మాత్రమే. సాంఖ్యయోగములో 11వ

శ్లోకమునుండి భగవంతుడైన కృష్ణుడు చెప్పిన శ్లోకములు గలవు. దాని

ప్రకారము భగవద్గీత సాంఖ్యయోగములో (రెండవ యోగములో) 11వ

శ్లోకమునుండి ప్రారంభమయినదని చెప్పవచ్చును. దైవ గ్రంథములో మొదట

చెప్పిన మూడు వాక్యములను ముఖ్యముగా తీసుకొని చూడవలెను.

ఎందుకనగా! మూడు దైవ గ్రంథముల మొదటి మూడు వాక్యములు

ముఖ్యమైనవిగా ఉండునని ఒక సూత్రము ప్రకారము చెప్పవచ్చును. మూడు

గ్రంథములలోనూ ముఖ్యమైన సారాంశముగా మూడు ఆత్మలను గురించి

చెప్పినదే కలదు. అనగా మూడు దైవగ్రంథములలోను సూక్ష్మమైన అగోచర

ఆత్మలను గురించి చెప్పడమే యున్నది. త్రి ఆత్మలను గురించి చెప్పిన త్రైత

సిద్ధాంతము మూడు గ్రంథములలో యున్నట్లు తెలియుచున్నది. త్రైత

సిద్ధాంతము ప్రకారము మూడు ఆత్మలను గురించి చెప్పిన ప్రతి గ్రంథములో

ముందు వ్రాయబడిన మూడు వాక్యములు గొప్ప సారాంశము కల్గియుంటా

యని మేము అనుకొన్నాము. మేము అనుకొన్న దానిప్రకారము మూడు

గ్రంథముల మొదటి మూడు వాక్యములను చూచాము. ప్రథమ దైవగ్రంథము,

ద్వితీయ దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథములలో త్రి ఆత్మలను చెప్పిన

త్రైత సిద్ధాంతము గలదు. అందువలన ఆ గ్రంథములలో మొదటి మూడు

వాక్యములు గొప్ప జ్ఞానమును కల్గియుండును అను మా అంచనా ప్రకారము

మూడు గ్రంథములు మొదటి మూడు వాక్యములు గొప్పగనేయున్నట్లు

కనిపించినవి.


అయితే మూడు గ్రంథముల మొదటి మూడు వాక్యములను

జాగ్రత్తగా గుర్తించవలసియున్నది. లేకపోతే మొదటి మూడు వాక్యములను

గుర్తించక వేరే వాక్యములను చూడగలరు. భగవద్గీతలో చిక్కుతీసి చూస్తే

సాంఖ్య యోగము 11, 12, 13వ శ్లోకములలో మూడు ప్రథమ

వాక్యములున్నట్లు తెలిసినది. భవగద్గీతలో ప్రారంభమునుండి 57 శ్లోకముల

తర్వాత 58వ శ్లోకమునుండి గ్రంథము యొక్క మొదటి మూడు వాక్యములు

దొరికినవి. ప్రథమ దైవగ్రంథములో ప్రథమ వాక్యములను మూడింటిని

తెలియుటకు ఎంత కష్టమయినదో, అట్లే మిగతా రెండు గ్రంథములలో

ప్రథమ వాక్యములను తెలియుట చాలా కష్టమైన విషయమే. అందువలన

ముందే వాటి వివరమును తెలిసి, మిగతా రెండు గ్రంథములలోనూ మొదటి

వాక్యములను జాగ్రత్తగా తెలియవలసియున్నది. భగవద్గీతలో కొంత అన్వేషణ

చేసిన తర్వాత మొదటి 57 శ్లోకములను వదలివేస్తే, 58వ శ్లోకమునుండి

మొదటి మూడు వాక్యములు కనిపించుచున్నవి. 58, 59, 60 అనగా!

సాంఖ్యయోగములో 11, 12, 13 శ్లోకములలో మూడు ముఖ్యమైన

వాక్యములు తెలియుచున్నవి.


అదే విధముగా ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలులో (బైబిలు

గ్రంథములో) 66 పాఠములలో కేవలము నాలుగు పాఠములను నాలుగు

సువార్తలుగా చెప్పుచున్నాము. ముఖ్యమైన ఈ నాలుగు సువార్తలలోనే

దేవుని జ్ఞానము స్వచ్ఛముగా కలవని చెప్పాము. ఈ నాలుగు సువార్తలలోనే

దైవ జ్ఞానము ప్రారంభమయినదని, నాలుగు సువార్తలలోనే భగవంతుడైన




ఏసు మాట్లాడిన మాటలు కలవని చెప్పుకొన్నాము. అందువలన

భగవంతుడు చెప్పిన మాటలతోనే బైబిలు జ్ఞానము మొదలగును. నాలుగు

సువార్తలలో ఏ సువార్తయందు జ్ఞానము మొదలయినదో గమనించవలసి

యున్నది. అలా గమనిస్తూ పోతే యోహాన్ సువార్తలో దేవుడు చెప్పిన

జ్ఞానము ప్రారంభమయినదని తెలియుచున్నది. ప్రథమ దైవ గ్రంథములో

మూడు శ్లోకములందు మూడు వాక్యములుండగా, ద్వితీయ దైవగ్రంథమందు

ఒకే వాక్యములోనే మూడు ముఖ్యమైన వాక్యములు కలవని తెలియుచున్నది.

బైబిలు మధ్య భాగములో గల నాలుగు సువార్తలలో ఒక దానియందు

మూడు ప్రథమ వాక్యములున్నట్లు తెలిసినది. బైబిలు పాత నిబంధనలోని

39 పాఠములను వదలివేస్తే, నాలుగు సువార్తలలో క్రొత్త నిబంధనలో

ముందుగల మూడు సువార్తలను మత్తయి, మార్కు, లూకా సువార్తలను

వదలి వేస్తే నాల్గవ సువార్త అయిన యోహాన్ సువార్త మొదటిలోనే మొదటి

మూడు సారాంశ వాక్యములు గలవు.


ఈ విధముగా గ్రంథములో లోతుగా వెదకితేగానీ ప్రారంభ

వాక్యములు కనిపించవు. భగవద్గీతలో ఒక అధ్యాయమును వదలి రెండవ

అధ్యాయములో చూడగా ప్రారంభ వాక్యములు దొరికినవి. అట్లే బైబిలులో

39 పాత నిబంధన పాఠములను వదలి క్రొత్త నిబంధనలో మూడు సువార్తల

తర్వాత నాల్గవ సువార్తలో చూడగా ప్రారంభ వాక్యములు మూడు దొరికినవి.

ఇకపోతే అంతిమ దైవగ్రంథములో చూడవలసిన అవసరమున్నది. అంతిమ

దైవ గ్రంథము ఖురాన్లో కూడా ప్రథమ వాక్యములను వెతకవలసియున్నది.

ఖురాన్ గ్రంథములో మొత్తము 114 సూరాలు గలవు. ఆ సూరాలలో

మొత్తము 6236 ఆయత్లనబడు వాక్యములు గలవు. ఖురాన్లో మొదటి

సూరా పేరు “అల్ ఫాతిహా”. కృష్ణునికి అర్జునునికి జరిగిన సంవాదముగా

భగవద్గీత కలదు. కృష్ణుడు భగవద్గీత జ్ఞానమును చెప్పగా అర్జునుడు

వినడము జరిగినది. కృష్ణుడు అర్జునా! వినుము అని తన బోధను అర్జునునకు

చెప్పినట్లు కలియుగములో 1400 సంవత్సరముల క్రిందట జిబ్రయేల్

అనునతడు ముహమ్మద్ ప్రవక్తగారికి ఖురాన్ గ్రంథము యొక్క జ్ఞానము

ను బోధించాడు. సృష్ట్యాదిలో ఆకాశవాణి బోధను ఆకాశములోని సూర్యుడు

విన్నాడు. మేఘముల గర్జన రూపములో చెప్పిన శబ్దరూప జ్ఞానమును

సూర్యగ్రహము గ్రహించగలిగి, తనకు తెలిసిన జ్ఞానమును మనుషుల

భాషలోనికి అనువాదము చేసి సూర్యుడు భూమిమీద మనువుకు చెప్పడము

జరిగినది. ఐదువేల సంవత్సరముల పూర్వము సూర్యుడు చెప్పిన జ్ఞానమునే

కృష్ణుడు అర్జునునకు చెప్పాడు. అప్పుడు అది మొదటి గ్రంథముగా వ్యాసుని

చేత తయారయినది. మొదట కృతయుగములో సూర్యుడు భూమిమీద

గల మనువుకు జ్ఞానము చెప్పినట్లే, కలియుగములో కూడా అదే సూర్యుడే

జిబ్రయేల్ అను పేరుతో ముహమ్మద్ ప్రవక్తగారికి భూమిమీదికి వచ్చి

తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాడు. మొదట కృతయుగములో చెప్పిన

జ్ఞానము తర్వాత ద్వాపర యుగము చివరిలో భగవద్గీతయను ప్రథమ దైవ

గ్రంథమయినది. అట్లే కలియుగములో జిబ్రయేల్ అను పేరుతో ముహమ్మద్

ప్రవక్తగారికి చెప్పిన జ్ఞానము అంతిమ దైవ గ్రంథముగా తయారయినది.


అంతిమ దైవ గ్రంథమును సూర్యుడే మారుపేరుతో చెప్పియున్నా,

చెప్పబడిన జ్ఞానము ఒకే జ్ఞానమయినా, అది అంతిమ దైవ గ్రంథమను

పేరుతో తయారయినది. ఓ అర్జునా వినుము! అని కృష్ణుడు అర్జునునకు

చెప్పినట్లు, ఖురాన్ గ్రంథములో ఓ ప్రవక్తా వినుము! అని జిబ్రయేల్

ప్రవక్తకు జ్ఞానమును చెప్పియున్నాడు. అయితే చెప్పిన విధానమును బట్టి,

విధానము యొక్క వరుస క్రమమునుబట్టి ఖురాన్ గ్రంథమును అంతిమ

దైవ గ్రంథము అని చెప్పియున్నాము. ఖురాన్ కంటే ముందు ఆకాశవాణి


**



లేదు. అందులో మొదట అల్లాహ్ ను (దేవున్ని) ప్రార్థన చేయడము గలదు.

ప్రార్థన మనుషులు చేయునది. మనుషులు తెలియునది జ్ఞానము. తెలిసిన

జ్ఞానముతో దేవున్ని వేడుకోవడము ప్రార్థన. జ్ఞానము తెలిసిన తర్వాత

మనుషులు దేవుని యెడల చూపు విధేయతను ప్రార్ధన అంటాము. జ్ఞానము

తెలియకముందు దేవుని మీద భక్తిరాదు. అందువలన ప్రార్థన ఖురాన్

గ్రంథము యొక్క ప్రారంభము కాదు. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి

ఎక్కడ నుండి జ్ఞానమును చెప్పాడో అక్కడ నుండి గ్రంథ ప్రారంభముగా

లెక్కించబడును.


ఆ విధముగా చూస్తే మొదటి సూరాయంతయు దేవుని ప్రార్థనతో

కూడుకొన్న ఏడు ఆయత్లు గలవు. ఈ మొదటి సూరా మొత్తము ఏడు

ఆయత్లను వదలివేస్తే రెండవ సూరాలో ప్రవేశించవలసి యున్నది. అల్

బఖర అను రెండవ సూరా నుండి జ్ఞానము మొదలయినది. రెండవ

సూరాలో మొదటి వాక్యములో జ్ఞానము చెప్పలేదు. రెండవ వాక్యము

నుండి దేవుని జ్ఞానము మొదలగుచున్నది. అందువలన రెండవ సూరాలో

2, 3, 4 వాక్యములు (ఆయత్లు) ఖురాన్ గ్రంథములో ప్రారంభ వాక్యములని

చెప్పవచ్చును. అంతిమ గ్రంథములో ప్రథమ వాక్యములు మూడు తీసి

చూస్తే, ఆ మూడు వాక్యములు చాలా గొప్ప భావముతోనే కూడుకొని

యున్నవి. ప్రథమ దైవగ్రంథములోని ప్రారంభ వాక్యములు వేరుగాయున్నవి.

అట్లే ద్వితీయ దైవగ్రంథములోని మొదటి మూడు వాక్యములు ప్రత్యేకముగా

యున్నవి. చివరి ఖురాన్ గ్రంథములో కూడా మొదటి వాక్యములు మూడు

మిగతా రెండు గ్రంథములకంటే భిన్నముగా యున్నవి.


ప్రథమ దైవగ్రంథము తౌరాతు లేక భగవద్గీతలోని మొదటి మూడు

శ్లోకముల భావములను ఇప్పుడు చూస్తాము.



శ్లో॥ 11.

అశోచ్యా నన్వశోదస్త్వం ప్రజ్ఞానాదాంశ్చ భాషసే |

గతాసూ నగతా సూంశ్చ నానుశోదని పండితాః ॥ (ప్రకృతి, పరమాత్మ)


భావము :- శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు

నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు

కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.


వివరము :- బాధపడతగని విషయమును గురించి బాధపడుచున్నావని

ప్రత్యేకముగా అన్నప్పుడు పరోక్షముగా బాధపడవలసిన విషయమును

గూర్చి బాధపడలేదని, నిజముగా బాధపడవలసినదేదో ఉన్నదని తెలియు

చున్నది. ఇక్కడ వివరముగా శోకింపతగినదేది? శోకింపతగనిదేది? అని

యోచించవలసి వస్తున్నది. దేనికోసము శోకింపకూడదో అనగా బాధపడ

కూడదో దానిని గూర్చి అదే శ్లోకమునందు “గతాసూ నగతాసూంశ్చ” అని

చెప్పబడియున్నది. అనగా గతులుకల్గిన, గతులు లేని వాటిని గూర్చి నీవు

బాధపడుచున్నావు అంటున్నాడు. అ పుడు గతులు ఉన్న గతులు లేని

వాటికంటే వేరు దానిని గూర్చి బాధపడవలసియున్నదని సులభముగా

అర్థమగుచున్నది. ఇప్పుడు ప్రతి మానవుడు తెలియవలసిన వివరము

గతులు ఉన్నదేది? గతులు లేనిదేది? గతులుగల మరియు గతులు లేని

వాటికంటే వేరుగనున్నదేది? అన్న విషయము ముఖ్యము. ఎందుకనగా!

ఆ మూడవ దానికోసము మనము బాధపడవలయును.


గతి అనగా ఎన్నో అర్థములు గలవు. 1) పోక 2) విధము

3) త్రోవ 4) స్థానము 5) ఆధారము 6) ప్రయాణము 7) ఉపాయము

8) చలనము అని ఇన్ని అర్థములు గలవు. ఇక్కడ సందర్భానుసారముగా

భౌతిక అర్థమైన “చలనము” అన్న పదము తీసుకొన్నప్పుడే శ్రీకృష్ణుని

32 


మాటలోని నిజార్థము బయటపడగలదని తెలియవలయును. దానిప్రకారము

చలనము కల్గినవి శరీరముగల సమస్త జీవరాసులున్నవి. అట్లే చలనము

లేని వస్తుజాలము ప్రపంచములో ఎంతో ఉన్నది. చలనము కల్గిన మానవులు,

జంతువులు, క్రిమి కీటకాదులు, చలనము లేని వస్తువులను మొత్తము

కలిపి జ్ఞానము తెలిసిన పెద్దలు "ప్రకృతి" అని పేరు పెట్టారు. చలనము

గల చలనములేని ఈ ప్రకృతికంటే వేరైనదొకటున్నది. అదియే 'దైవము'.

ఆనాడు అర్జునుడు ప్రకృతిలోని మనుజుల గూర్చియే బాధపడ్డాడు కానీ

ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి బాధపడలేదు. అందువలననే

శ్రీకృష్ణుడు దేనికోసము బాధపడకూడదో, దానికోసమే నీవు బాధపడుచున్నావు

అని హెచ్చరించాడు. ఆనాటి అర్జునుడే కాక ఈనాటి ప్రతి మానవుడు

ప్రకృతి సంబంధ విషయములకే ప్రాకులాడుచున్నాడు. తాము చదివిన

గొప్ప గొప్ప చదువులన్నీ ఈ ప్రకృతిలోని విషయముల గురించి

యోచించుటకే సరిపెట్టుచున్నాడు. నీ ప్రజ్ఞనెల్ల ప్రకృతి విషయములకే

ఉపయోగించి మాట్లాడుచున్నావని అర్జునున్ని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు.

అంటే మన ప్రజ్ఞను దేవునివైపు ఉపయోగించలేదని చెప్పకనే తెలియబడు

చున్నది. తెలిసిన జ్ఞానులు ప్రకృతి జనితమైన సమస్త వస్తువులను మరియు

జీవజాలములను గూర్చి చింతించరని, వారు దైవమును గూర్చియే

చింతింతురని, శోకింతురని చెప్పబడి ఉన్నది.


భగవంతుడు తెలియజేసిన మొట్టమొదటి శ్లోకములోనే కనిపించు

సమస్త జీవరాసులు ప్రకృతియేననీ, కనిపించని పరమార్థమొకటున్నదని

సూచించాడు. అట్లే మనము ప్రతి నిత్యము బాధపడునది, ఏడ్చునది,

చింతించునది ప్రకృతిలోని విషయములకేనని పరమార్థ విషయమునకు

కాదని కూడా సూచించాడు. పండితులైన వారు అనగా జ్ఞానము తెలిసిన

వారు చరాచర ప్రకృతికోసము ఏమాత్రము బాధపడరని తెలియజేశాడు.


అట్లే నీవు చలనము కలిగిన, చలనములేని వాటికోసము నీ ప్రజ్ఞనంతా

ఉపయోగిస్తున్నావు. అది సరియైన పనికాదని కూడా తెలియజేశాడు.

మొదటి శ్లోకములోనే శోకింప తగినవని, శోకింప తగనివని రెండు

భాగములు చేసి చూపడము గొప్ప విశేషము. అందులో మన ప్రజ్ఞను

ప్రకృతి వైపు వినియోగించక పరమాత్మ వైపు వినియోగించమని

సూచించడము మొట్టమొదటి శ్లోకములోని ప్రత్యేకతయని తెలియాలి.


(చాలామంది వ్రాసిన గీతా గ్రంథములలో ఈ శ్లోకము యొక్క

భావమునకు ఇక్కడ మా చేత వ్రాయబడిన భావమునకు చాలా తేడా

ఉన్నది. వారు వ్రాసిన దానిలో కేవలము మానవుల గూర్చి, చనిపోయిన

వారిని బ్రతికి ఉన్న వారిని గూర్చి చెప్పియుండగా, మా భావములో మొత్తము

ప్రకృతిని గూర్చి చలనములేని చలనమున్న, జీవములేని జీవమున్న వాటిని

గూర్చి చెప్పడము జరిగినది. బ్రతికియున్న, మరణించిన వారిని గూర్చి

తెలిసినవారు చింతింపరని తెలిపితే “వారి మీద మాకేమి బాధలేదు, మాకున్న

చింతయంతయు ధనము మీదనే. బ్రతికి ఉన్నవారు ఎట్లున్నా ఫరవాలేదు,

రుచిలేని తిండి తిన్నా ఫరవాలేదు, డబ్బులు మాత్రము ఖర్చు కాకూడదు.

బ్రతికినవారు రోగముతో బాధపడుచున్నను ఫరవాలేదు వారిని గూర్చి నాకేమి

చింత లేదు. ఆసుపత్రికి పోతే డబ్బు ఖర్చు అవుతుందనేదే నా బాధ" అను

వారు గలరు. అట్లే తమవారు చనిపోయినా చింతించరు. అట్లని వీరిని

జ్ఞానులందామా! వీరికి డబ్బు, బంగారు మీద తప్ప బ్రతికిన, మరణించిన

వారి మీద ఏమాత్రము చింత, బాధ ఉండదు. పరాయి మగవాడు భార్యను

బలవంతము చేసినా, ఆమె కోసము చింతించడు. తన స్వంత కొడుకును

ఇతరులు హత్య చేసినా, డబ్బు పోతుందని కేసు పెట్టడు. మిగతా గీతలలో

వ్రాయబడిన ఈ శ్లోకార్థము ప్రకారమైతే వీరిని పరమ జ్ఞానులని

చెప్పవచ్చును. ఇది నిజమాయని యోచించి చూచిన వాడు బంగారు

మీద, ధనము మీద ఆశపరుడు తప్ప జ్ఞాని ఏమాత్రము కాదని

తెలియుచున్నది. అందువలన ఇంతవరకు అందరు వ్రాసుకున్న భావము

సరికాదని చెప్పవచ్చును.)


గతించిన మరియు గతించని వారిని గూర్చి జ్ఞానులు చింతించరని

వ్రాసిన వాక్యములు తప్పు, శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు. మనుషులను

గూర్చియే చెప్పియుంటే పోయిన వారికొరకుగానీ, ఉన్నవారికొరకుగానీ

చింతించక కేవలము డబ్బు కొరకే చింతించు లోభిని కూడా జ్ఞాని అనవలసి

వస్తుంది. కావున ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు లోతుగా చెప్పిన జ్ఞానమును

గ్రహించితే, చర అచర ప్రకృతిని గూర్చి జ్ఞానులైన వారు చింతించరని,

ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి చింతించువాడు నిజమైన జ్ఞానియని

తెలియుచున్నది. ఇంతవరకు ఈ అధ్యాయమున మొదటి శ్లోక అర్థమును

అందరికీ భిన్నముగా వ్రాశారే అని కొందరనుకోవచ్చును. ఎందరో

స్వాములు, పీఠాధిపతులు, యోగులు చెప్పిన భావమును కాదనవచ్చునా?

అని కొందరడుగవచ్చును. అందరికి ఒకే జవాబు చెప్పడమేమనగా! నిజము

నిప్పులాంటిది. ఎప్పటికైనా బయటపడగలదు. దాచబడిన సత్యమును

బహిర్గతము చేయుటయే నా పని అయినప్పుడు ఒక భగవద్గీతయే కాదు,

ఏ మతములోని జ్ఞానమునైనా విప్పి చెప్పడము నా కర్తవ్యము. ఈ నా

కార్యములో భగవద్గీతలో తర్వాత వచ్చు శ్లోకములకు కూడా భావ మార్పిడి

తప్పకయుంటుంది. ఇది త్రైతము అను సిద్ధాంతము మీద ఆధారపడి

వ్రాయునది, కావున శాస్త్రబద్ధమైనదిగా లెక్కించి చూడవలెను. ఈ

శ్లోకముగానీ, రాబోవు శ్లోకములుగానీ హేతువాదులకు ప్రశ్నలు మిగల్చవని

అన్నిటికీ అందరికీ సమాధానమై ఉంటాయని తెలుపుచున్నాము.



ప్రతి శ్లోకము నాలుగు సూత్రముల ప్రకారము చూడవలయునని

ముందే చెప్పియున్నాము. వాటిని మరొక్కమారు గుర్తు చేయుచున్నాము.

1) చదువుచున్న శ్లోకము జీవాత్మకా, ఆత్మకా, పరమాత్మకా, ప్రకృతికా

ఎవరిని గూర్చి చెప్పబడినది. 2) చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునకా

లేక కర్మయోగమునకా దేనిని గూర్చి చెప్పబడినది. 3) చదువుచున్న

శ్లోకము సాకారమునకా, నిరాకారమునకా ఎవరిని గూర్చి చెప్పబడినది.

4) చదువుచున్న శ్లోకము శాస్త్రబద్ధమైనదా కాదా! అన్నవి సూత్రములైతే

నాల్గవ సూత్రము ప్రకారము శాస్త్రబద్ధమైన శ్లోకములనే మేము వ్రాస్తూ

శాస్త్రబద్ధము కాని వాటిని వదలివేయుచున్నాము. కావున మీరు ముఖ్యముగా

చూడవలసినవి మూడు సూత్రములు మాత్రమే. అవి కూడా మీకు అర్థమగు

నట్లు ఏ శ్లోకము దేనికి సంబంధించినదో శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో

తెలుపుచుందుము. అందువలన శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో ఉన్న దానిని

ప్రతి ఒక్కరు గమనించవలసినదిగా తెలుపుచున్నాము.


శ్లో॥ 12

నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః ।

నచైవ న భవిష్యామ స్సర్వేవయ మతః పరమ్ ॥

(జీవాత్మ)


భావము :- “అర్జునా! నేను ఒకప్పుడు లేను అనుట లేదు. నువ్వు కూడా

అంతే. ఈ రాజులు మొదలగు వారు కూడా అంతే. తర్వాత కాలములో

కూడా మనమందరము లేకుండా పోవుదుమనుటయే లేదు.”


వివరము :- ఇక్కడ చెప్పువాడు కృష్ణుడు, వినువాడు అర్జునుడు. చెప్పేవాడు

తెలిసినవాడు, వినేవాడు తెలియనివాడు. జ్ఞానము తెలియనివాడు జీవాత్మ.

జ్ఞానము తెలిసినవాడు ఆత్మ. కృష్ణుని శరీరములోని ఆత్మ జ్ఞానమును

చెప్పుచుండగా, అర్జునుని శరీరములోయున్న జీవాత్మ వినుచున్నది. ప్రతి


మనిషి శరీరములోను జీవాత్మ ఒకటి, ఆత్మ ఒకటి, పరమాత్మ ఒకటి మొత్తము

మూడు ఆత్మలు గలవు. ఈ మూడాత్మల విషయము భగవద్గీతలో దాదాపు

పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము వరకు ఎవరికీ

తెలియదు. అక్కడ పురుషోత్తముడయిన మూడవ పురుషున్ని గురించి

చెప్పినప్పుడు తప్పనిసరిగా మిగతా ఇద్దరు పురుషులను గురించి చెప్పవలసి

వచ్చినది. అప్పుడు అక్కడ ముగ్గురు పురుషులను గురించి వచ్చినది.

అంతవరకు ముగ్గురు పురుషుల విషయము ఎవరికీ తెలియదు. ప్రథమ

దైవ గ్రంథమంతయు చదివిన దానివలన ఈ మొదటి శ్లోకములోనే మూడు

ఆత్మల గురించి చెప్పుచున్నాము. చెప్పువాడు, వినువాడు ఇద్దరు మనుషులే

అయినా వారిలో అర్జునుడు సాధారణ మనిషి. కృష్ణుడు సాధారణ మనిషి

కాడు. ఆయన ప్రత్యేకముగా దేవుని ప్రతినిధిగా దేవుని చేత పంపబడిన

వాడు. అతనిని భగవంతుడుయని అంటాము. భగవంతుడు యనగా

భగము నుండి పుట్టినవాడు. అనగా తల్లిగర్భమునుండి సజీవముగా పుట్టిన

వాడని అర్థము. సాధారణ మనుషులు ఎవరూ తల్లిగర్భమునుండి

సజీవముగా పుట్టరు.


కృష్ణుడు భగవంతుడైనా, అర్జునుడు సాధారణ మనిషి అయినా,

ఇద్దరి శరీరములలో మూడు ఆత్మలుండడము సహజము. అర్జునుని

శరీరములోని జీవాత్మ కర్మలు అనుభవించుచుండగా, ఆత్మ కర్మప్రకారము

పనులు చేయించుచుండును. పరమాత్మ సాక్షిగా చూస్తూయుండును.

భగవంతుడైన కృష్ణుని శరీరములో కూడా మూడు ఆత్మలేయుండగా, ఒకే

ఆత్మ మూడు ఆత్మలుగా చలామణి అగుచున్నది. మధ్యాత్మ ఒక్కటే మూడు

ఆత్మల విధులను నిర్వర్తించుచున్నది. భగవద్గీతను చెప్పునప్పుడు ఆత్మయే

స్వయముగా చెప్పుచూ తనను ఒకమారు పరమాత్మగా, మరొకమారు


జీవాత్మగా చెప్పుచున్నది. జీవాత్మగా చెప్పుచూ అందరివలె నాకు జన్మలు

కలవు. నీవు పుట్టినట్లే నేను పుట్టుచున్నాను. నీవు చనిపోయినట్లే నేను

చనిపోవుచున్నానని భగవద్గీతలోనే చెప్పాడు. అట్లే నాకు ఎన్నో జన్మలు

కల్గినవి నీకునూ ఎన్నో జన్మలు కల్గినవి అని కూడా చెప్పాడు. నేను

సృష్ట్యాదినుండి ఉన్నాను, నీవు సృష్ట్యాది నుండి ఉన్నావు. ఈ భూమిమీద

మనుషులందరూ అంతే. ఒకప్పుడుండి తర్వాత లేకుండా పోవుదురను

మాటే లేదు. అందరూ ముందునుండి సృష్ట్యాది నుండి ఉన్నారు. తర్వాత

జరుగబోవు కాలములో అందరూ ఉంటారు అని కృష్ణుడు చెప్పాడు.


ఆత్మజ్ఞానము తెలిసి యోచించితే మనమందరము (మనుషు

లందరూ) మొదటనే పుట్టించబడినాము. భూమిమీద మనుషులను

మనుషులవలె అన్ని అనుభవములు గల దేవతలను దేవుడు సృష్టించాడు.

మనుషులు కనిపిస్తున్నారు. దేవతలు సూక్ష్మ శరీరముతో యుండడము

వలన వారు కనిపించడము లేదు. రామాయణ చరిత్రలో మనము కూడా

కొందరు రాముని ప్రక్కన యుండి యుద్ధము చేసియుందుము. మరికొంత

మంది రావణునివైపు యుండి యుద్ధము చేసియుందుము. అప్పుడు

చనిపోయిన వారు తిరిగి ఎక్కడో ఒకచోట పుట్టి, అక్కడ కొంత కాలము

బ్రతికి, అక్కడ కూడా చనిపోయి మరియొక చోట పుట్టి, దైవజ్ఞానమును

తెలియక చస్తూ, పుట్టుచూ ఇట్లు ఎన్నో జన్మలు మారి ఇప్పుడు, ఇక్కడ, ఈ

పరిస్థితిలో యున్నాము. ఇట్లు జన్మలు మారుతూ ఎంతకాలమయినా

ఉండగలము. అందువలన రాబోవు కాలములో మనముండము అనుమాట

లేదు. జన్మలున్నంతకాలము ఉండగలము. ఒకవేళ ఆత్మజ్ఞానమును

తెలియగలిగి యోగమును ఆచరించిన వాడు, జ్ఞానాగ్నిని సంపాదించుకొని

కర్మలను కాల్చుకోగలిగితే, జన్మలకు కారణమయిన కర్మ లేకుండాపోతే,

అప్పుడు మనిషి జన్మించకుండా దేవునియందు ఐక్యమగును. కర్మలు

కాలనంతవరకు, జ్ఞానము తెలియనంతవరకు భూమిమీద గల ప్రతి ఒక్కడు

చస్తూ, పుట్టుచూ ఎంతకాలమయినా భూమిమీద ఉండవలసినదేయని

కృష్ణుడు అర్జునునికి చెప్పడము జరిగినది. చెప్పినది కనిపించే కృష్ణుడయినా

కృష్ణుని శరీరములో కనిపించని ఆత్మ చెప్పినది.


ప్రతి మనిషి శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మయున్నవి.

మూడు కనిపించని ఆత్మలు అయినందున మూడిటిని మూడు చీకటి

రాత్రులతో పోల్చి, 'తౌరాతు' అని మూడు ఆత్మలను చెప్పడమయినది.

శరీరములో మూడు ఆత్మలున్నట్లు మూడు దైవగ్రంథములలోను చెప్పారు.

జీవులు చనిపోతూనే తిరిగి పుట్టుచున్నవి. జీవాత్మ ఏ శరీరములో

ఉండునో ఆ శరీరములో ఆత్మ తప్పనిసరిగా యుండును. జీవాత్మ పని

చేయలేడు. పని చేయువాడు ఆత్మ మాత్రమే. ఆత్మ శరీరములో పనిచేయగా

ఆ పనిలోయున్న సుఖదుఃఖ అనుభవమును జీవుడు అనుభవించుచుండును.

జీవుడు చేసుకొన్న కర్మలనుబట్టి ఆత్మ శరీరములో పనులు చేయించు

చుండును. జీవుడు అనుభవించుచుండగా, ఆత్మ కార్యములు చేయు

చుండగా, పరమాత్మ అన్నిటినీ చూస్తూ సాక్షిగా యున్నది.


మనిషికి మరణము సంభవించిన వెంటనే ఆ మనిషితో యున్న

జీవున్ని ఆత్మే తీసుకొని బయటికి పోవుచున్నది. శరీరము నుండి బయలు

దేరిన ఆత్మ ఎక్కడికయినా పోగలదు. జీవుడు ఎక్కడికి స్వయముగా పోలేని

వాడు. ఏదీ చేతకానివాడు జీవుడు. జీవునికి ఆత్మ తోడుగా యుండి

అన్ని పనులను చేయుచున్నది. మరణములో శరీరమునుండి క్రొత్తగా

పుట్టిన శిశు శరీరము వరకు ఆత్మే జీవున్ని తీసుకొని పోవుచున్నది. ఈ

విధముగా మరణము అయిన తర్వాత జన్మ కలుగుచున్నది. మరణములో



పాత శరీరములో యున్న మనస్సు లేకుండా పోవుచున్నది. మనస్సు

నశించిపోగా పాతశరీరములోని జ్ఞాపకములన్నియూ నశించి పోయినట్లే

యగును. అందువలన క్రొత్తగా పుట్టిన శరీరములోని జీవునికి వెనుకటి

జ్ఞాపకములు ఏమీ ఉండవు. అట్లే ఎన్ని జన్మలు మారినా వెనుక జన్మ

జ్ఞాపకములు లేని దానివలన ప్రస్తుత జన్మలో యున్నవానికి వెనుకటి జన్మ

విషయము తెలియదు. అట్లే దాని వెనుక జన్మలు ఏవీ తెలియవు.

అందువలన కృతయుగములోగానీ, త్రేతాయుగములోగానీ, ద్వాపర

యుగములోగానీ, కలియుగములో తాను ప్రస్తుతము పుట్టకముందుగానీ

ఉన్నట్లు తెలియదు. అందువలన అప్పుడు లేను, ఇప్పుడే ఉన్నాను అని

ప్రతి మనిషి అనుకోవడము జరుగుచున్నది. కృతయుగమునుండి తనతో

పాటు శరీరములో నివశించు ఆత్మ ప్రతి మరణములోనూ జననము

వరకు తీసుకొని పోవుచున్నది. అందువలన జీవుని యొక్క ప్రతి జన్మ

విషయము, ప్రతి మరణ విషయము, ప్రతి జీవితము యొక్క విషయము

ఆత్మకు తెలుసు. ఆత్మకు జీవుని గతజన్మ విషయము, అంతకు ముందు

జన్మల విషయము అన్నీ తెలుసు. ప్రతి జన్మలోను అతనితో యుండి ప్రతి

పని చేసినది ఆత్మయే. అందువలన ప్రతి జన్మ విషయము ఆత్మకు బాగా

తెలుసు.


జీవునితో పాటు అన్ని జన్మలలోనూ సృష్ట్యాదినుండి ఆత్మయుండుట

వలన, జీవుని ప్రతి జన్మ ఆత్మకు తెలిసియుండుట వలన, పై శ్లోకములో

నేను మొదటినుండి ఉన్నాను. నీవు అట్లేయున్నావు, గతములో నేను లేను

అనేది లేదు. ఇంతకుముందు నీవు కూడా నాతోపాటు యున్నావు. నేను,

నువ్వే కాదు, లోకములోని రాజులు సహితము మొదటి నుండి యున్నారు.

గతములో ఎట్లుయున్నది ఎవరికీ తెలియకపోయినా అందరూ ఉన్నారు.


తర్వాత జరుగబోవు కాలములో కూడా అందరూ ఉందురు. లేకుండా

పోవడము అను సమస్యే లేదు. కర్మయున్నంత వరకు ఉండవలసినదేయని

పై శ్లోకములో కృష్ణుడు అర్జునునితో చెప్పాడు. ఇక్కడ చెప్పిన జ్ఞానమును

బట్టి జీవుళ్ళమయిన మనము సృష్ట్యాదినుండి ఉన్నామని, ఆ విషయముల

జ్ఞాపకము లేనిదానివలన ఇంతకు ముందు మనము లేము. ఇప్పుడు

పుట్టినప్పటినుండే ఉన్నామని అనుకొంటున్నాము. అలా అనుకోవడము

తెలియనితనమేయనీ, గత జన్మలలోని మనస్సు ఆ జన్మలతోనే చనిపోవుట

వలన జరిగిన జన్మలు ఒక్కటి కూడా జ్ఞాపకము లేకుండా పోయినదని

అర్థమయినది. ప్రథమ దైవ గ్రంథములో రెండవ శ్లోకమున అనగా 12వ

శ్లోకమున ఇంతటి జ్ఞానము కలదు.


శ్లో॥ 13.

దేహినో స్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా |

తథా దేహాన్తర ప్రాప్తి స్థిర స్తత్రన ముహ్యతి ।

(జీవాత్మ)

భావము :- దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము,

ముసలితనము వరుసగా ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను

మరణము కూడా కల్గుచున్నది.


వివరము :- దేహమునందు నివశించు దానిని దేహి అనుచున్నాము.

దేహమునందు మూడు ఆత్మలు నివశించుచున్నవి. ఒకటి జీవాత్మ, రెండవది

ఆత్మ, మూడవది పరమాత్మ. ఈ మూడింటిని సందర్భానుసారముగా అర్థము

చేసుకోవాలి కానీ జీవాత్మకు చెప్పినచోట ఆత్మకు, ఆత్మకు చెప్పినచోట

పరమాత్మకు, పరమాత్మకు చెప్పినచోట జీవాత్మకు అర్థము చేసుకోకూడదు.

చాలా గీతలలో ఈ శ్లోకము జీవాత్మకు చెప్పినదనుకోక దేహి అనగానే


ఆత్మ అను పదమును ఉపయోగించి చెప్పారు. దేహి అనగానే ఒకటవదా

లేక రెండవదా, మూడవదా అని పరికించి చూడడము లేదు. ఇటువంటి

పొరపాట్లు జరుగునను ఉద్దేశ్యముతోనే మేము ప్రతి శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో

ఆ శ్లోకములో దేనిని గురించి ఉన్నదో దానిని గుర్తించుచున్నాము. అర్జునుడు

మానవులైన జీవాత్మలనబడు వారిని గూర్చియే అడిగాడు, దైవ స్వరూపుడైన

ఆత్మను గూర్చి ఆయన అడుగలేదు. అందువలన ఈ శ్లోకమున జీవాత్మను

గూర్చి చెప్పడమే జరిగినది.


జీవాత్మ ఒక శరీరము ధరించునప్పుడు ఆ శరీరమును బట్టి కొంత

కాలము బాల్యమంటాము. కొంత కాలము జరుగగా వయస్సు వచ్చిన

తరువాత శరీరమందు గల జీవాత్మకుకాక శరీరమునకు యవ్వనము

వచ్చును. అట్లే కొంత కాలము జరుగగా కౌమారము, ఇంకా కొంత

కాలము గడువగా ముసలితనము శరీరమునకు ఏర్పడును. కానీ శరీరమున

కిన్ని జరుగుచున్నను లోపల గల జీవాత్మకు మాత్రము వయస్సు పెరగడము

తరగడమనునది లేదు. వయస్సు పెరగడము ఒక్క శరీరమునకే,

శరీరమునందే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధ్యాప్యం మొదలగు దశలు

ఏర్పడుచున్నవి.


మనకొక కారు లేక జీపు ఉందనుకొనుము. అది బాగున్న వరకు

దానిని ఎక్కి ప్రయాణించగలము. కొంత కాలమునకు దానిలోని టైర్లు

అరిగిపోవును. అలా టైర్లు కారుకు అరుగుచున్నవి కానీ, అందులో కూర్చున్న

వ్యక్తికి కాళ్ళు అరగడము లేదు కదా! కొంత కాలమునకు టైర్లు పూర్తిగా

అరిగిపోయి అవి దొర్లలేని స్థితికి వచ్చి బండి నిలిచిపోయినపుడు, అందులో

ప్రయాణిస్తున్న వ్యక్తికి ఏమీ కాలేదు కదా! కారుకు అరిగిన టైర్లు పనికి

రావని అవి తీసివేసి వేరే క్రొత్త టైర్లు మార్చుకుంటాము. టైర్లు అరుగు

కొద్ది అందులో కూర్చున్నవాడెట్లు అరిగిపోలేదో, అట్లే శరీరము ధరించి

దానిని వాడుకొనుచున్న జీవాత్మకు శరీరమునకు వచ్చినట్లు వృద్ధ్యాప్యము

రాదు. అరిగిపోయిన టైర్లు మార్చి క్రొత్త టైర్లు తగిలించుకొని బండిని

నడుపుకొన్నట్లు, పాతబడిన శరీరమును వదలి క్రొత్త శరీరమును పొంది

జీవాత్మ కాలము గడుచుకొనుచున్నాడు. ఎంత కాలము జరిగిన, ఎన్ని

సంవత్సరములు జరిగిన జీవాత్మ ఎప్పటిలాగనే ఉండును. వానియందు

ఏ మార్పురాదు. ఒక శరీరము ధరించినప్పుడు పేదగా, మరియొక శరీరము

ధరించినపుడు రాజుగా ఉండవచ్చును, కానీ వాడు మాత్రము లేకుండా

పోవుట అసత్యము. అందువలననే భగవంతుడు నీవుగానీ, ఈ రాజులుగానీ

లేకుండా పోవుదురనుట లేదు అన్నాడు. ఇక్కడొక సందేహము కొందరి

కొచ్చి, ఇది మామూలు జీవాత్మలకు వర్తించు సూత్రము, భగవంతుడైన

శ్రీకృష్ణుడు నేను కూడా అని పల్కుచూ మన మందరము లేకుండాపోము

అన్నప్పుడు, దేవునికి కూడా ఈ సూత్రము వర్తించునా! అని అడుగవచ్చును.

దానికి సమాధానము దేవుడైన వాడు కూడా మామూలు మానవునివలె

శరీరము ధరించి ఉన్నాడు. కనుక సర్వ శరీరములకు వర్తించు సూత్రము

ప్రకారము తనను కూడా కల్పుకొని చెప్పాడు. అదియును కాక తాను

దైవము గనుక ఎప్పటికీ ఉండువాడే, కావున తాను కూడా ఎల్లప్పుడుండు

వానిగా చెప్పాడు.


ఇక్కడ మరియొక ప్రశ్న రాగలదు. జీవాత్మ జ్ఞానము తెలుసుకొని

మోక్షము పొంది జీవాత్మగా నశించిపోయి పరమాత్మగా మారినప్పుడైన

జీవాత్మకు నాశనము గలదు గదా! ఆ ఉద్దేశ్యముతోనే కదా జీవాత్మను

క్షరుడన్నారు (నాశనమగువాడన్నారు. అలా పరమాత్మలో చేరిపోయినప్పుడు

జీవాత్మ నాశనమైపోయినవాడే కదా! అప్పుడు వాడు లేకుండా పోవుచున్నాడు


కదా! అలాంటపుడు ఎప్పటికీ లేకుండా పోవుననుట లేదు అనడములో

గొప్పతనమేమిటని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా!

ఇక్కడ శ్లోకమునందు చెప్పినది జీవులకే యైనప్పటికీ, అది కేవలము

అజ్ఞానములో ఉన్నవారికి మాత్రము చెప్పుచున్న విషయము. సర్వసాధారణ

జీవుల గురించిన విషయము తప్ప ఇతరము కాదని తెలియాలి. ఎందుకనగా!

శరీరములు నశించినపుడు అనగా చంపబడినపుడు లేక మరణము

పొందినపుడు అందులోగల జీవుడు కూడా నాశనమగునేమోనన్న అర్జునుని

అనుమానమునకు తగినట్లు శరీర మార్పిడిలో జీవాత్మ నశించడని

చెప్పబడినది. ఇది ఒక శరీర మార్పు ఎడల శరీరము నశించినపుడు

జీవాత్మ యొక్క స్థితిని గూర్చి చెప్పినది. ముందు శ్లోకములలో కర్మ

నశించినపుడు జీవాత్మ పూర్తి నశించి పోవును, కావున జీవాత్మ క్షరుడు

అనబడుచున్నాడు.


ఈ శ్లోకములో ముఖ్యముగా మూడు ఆత్మలయందు కేవలము

ఒక్క జీవాత్మను గూర్చి చెప్పబడినదని మరియు శరీర పతనము జరిగినపుడు

శరీరము మాత్రము పోయి, జీవాత్మ పోకుండా ఎక్కడో ఒకచోట

ఉండగలడని తెలియబరచబడినది. ఇది శరీర పతనము ఎడల జీవాత్మ

మార్పును గూర్చి చెప్పినది కానీ కర్మపతనము ఎడల చెప్పినది కాదని

తెలియాలి. అదియును చాలా భగవద్గీతలలో ఎందరో వ్రాసినట్లు ఈ

శ్లోకము ఆత్మకు కాదు కేవలము జీవాత్మకని తెలియాలి.


సరే! ఈ విషయము తెలిసిన తరువాత అర్జునుడు లేక మనము

లేక ఎదుటివాడు లేక మన ఇంటిలో వానికి శరీర దశలన్ని జరిగి

పోయినపుడు వీడు శరీరమును మాత్రము వదలిపోయినాడు, వీడు

నాశనము పొందలేదు, వీడు ఉన్నాడు, వాని కోసమెందుకు ఏడ్వాలి? అని


తెలిసినప్పటికీ మనకు పరిచయమున్న ఈ శరీరము వదలి పోయినాడు

కదా! అనో లేక వాడు మన దగ్గరలేకుండా ఈ శరీరము వదలి ఎక్కడికో

పోయాడు కదా! ఇక వాడున్నప్పటికీ వాడు ఎక్కడున్నది మనకు తెలియదు

కదా! అని అంతో ఇంతో దుఃఖము పొందుదుము. వాడు చనిపోయాడని

కాదు, వాడు దూరమాయెనని ఏడ్చుచున్నామని తెలిసినవారనుట కూడా

వినవచ్చును.


ప్రథమ దైవ గ్రంథములో మొదటి మూడు శ్లోకముల యొక్క

జ్ఞానమును ఇంతవరకు తెలియగలిగాము. చాలా విషయములలో మొదలు

చివర ముఖ్యమైన విషయములుండును అని పెద్దలు చెప్పుచుందురు.

అందువలన భగవద్గీత యొక్క మొదటి మూడు శ్లోకములను గమనించితే

మూడు శ్లోకములలో ప్రత్యేకమయిన గొప్ప జ్ఞానము తెలియబడినది.

మూడు శ్లోకములను ప్రత్యేకముగా చూడకుండా, గ్రంథముతో పాటు అన్ని

శ్లోకములను చదివియుంటే ఇప్పుడు తెలిసిన ప్రత్యేకమయిన జ్ఞానము

తెలిసేది కాదు. ఇంతవరకు ప్రథమ దైవ గ్రంథమయిన తౌరాతు

గ్రంథములోని మొదటి మూడు శ్లోకములను మూడు వాక్యములుగా

చూచాము. ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలు గ్రంథములో

(బైబిలులో) ప్రథమ వాక్యములు మూడింటిని చూస్తాము.


ద్వితీయ దైవగ్రంథమును ఇంజీలు అనియు లేక బైబిలు అనియు

పిలుచుచున్నాము. ఈ గ్రంథము పాతనిబంధన, క్రొత్త నిబంధనయని

రెండు భాగములుగాయున్నట్లు అందరికీ తెలుసు. పాతనిబంధన 39

పాఠములుగా, క్రొత్త నిబంధన 27 పాఠములుగా యున్నది. క్రొత్త నిబంధన

మొదటి నాలుగు పాఠములు అన్నిటికంటే ప్రత్యేకమయిన పేర్లు

కల్గియున్నవి. నాలుగు పాఠములు నాలుగు సువార్తలను పేరుతోయుండగా,


మిగతా 62 పాఠములకు సువార్తలను పేరులేదు. నాలుగు సువార్తలలో

ఏసు స్వయముగా మాట్లాడిన మాటలు, చెప్పిన బోధ కలదు. మిగతా 62

పాఠములలో మనుషులు చెప్పిన మాటలు, బోధలు కలవు. 62 పాఠములలో

అంతా జ్ఞానమున్నదని చెప్పలేము. కొన్నిచోట్ల జ్ఞానమున్నా కొన్ని చోట్ల

అజ్ఞానము కూడా జ్ఞానములో కలిసియున్నది. తెలివైనవారు 62

పాఠములలో ఎంతో బుద్ధిని ఉపయోగించి జ్ఞానమును వెతుక్కోవలసి

యున్నది. నాలుగు సువార్తలలో స్వయముగా ఏసుప్రభువు చెప్పిన

జ్ఞానముండుట వలన, అదియంతయూ స్వచ్ఛమయిన జ్ఞానమనియే

చెప్పవచ్చును. అందులో వెతకవలసినది ఏమీ లేదు. అయితే ఇప్పుడు

మూడు గ్రంథములలోని మూడు ప్రథమ వాక్యములను ప్రత్యేకముగా

చూచుచున్నాము. అందువలన ముందే గ్రంథములో ఏవి మొదటి

వాక్యములని గుర్తించుకొన్నాము. ఇంజీలు గ్రంథములో గల నాలుగు

సువార్తలే నిజమైన భగవంతుడు చెప్పిన జ్ఞానముగాయుండుట వలన,

మూడు ప్రథమ వాక్యములుగా యోహాన్ సువార్తలోని మూడు మొదటి

వాక్యములను తీసుకొని చూడదలచాము.


నేడు మనుషులు మూడు మతములుగా యుండుట వలన,

మనుషుల పుట్టుకతోనే వారియందు వారి తల్లితండ్రుల మతము చేరిపోవు

చున్నది. బర్త్ సర్టిఫికేట్ (జనన ధృవీకరణ పత్రములో) ఫలానా తల్లి

తండ్రులు, ఫలానా మతము, ఫలానా పేరు అని వ్రాయించడము

జరుగుచున్నది. దీనినిబట్టి పుట్టుకతోనే మతము మనిషికి అంటుకొని

పోవుచున్నది. మనిషి వయస్సు పెరుగుకొలది మనిషే మతమునకు

అతుక్కొని పోవుచున్నాడు. పది సంవత్సరములకే నాది ఫలానా మతము

అని అంటున్నాడు. మొదట ఏమీ తెలియని చిన్నవయస్సులో మతము

మనిషిని అంటుకొనగా, మనిషి పెద్దగయిన తర్వాత మనిషే మతమునకు

అంటుకొని పోవుచున్నాడు. మతము మనిషిలో చేరినా, మనిషి పోయి

మతములో చేరినా, మనిషిలో మతము నూరు శాతము యున్నట్లే. మనిషిలో

మతము ఎంతయున్నా జ్ఞానము తెలియు మనిషిలో మతము అణిగిపోయి

చివరకు లేకుండా పోవును. జ్ఞానము తెలియని మనిషిలో మతము

కాలసర్పమువలె బుసలు కొట్టుచుండును. అది ఎందరినయినా కాటు

వేయగలదు. కోరలలో విషము ఊరేకొద్దీ కాటువేయవలెనని చూచునట్లు,

మతము నిత్యము పరమతము వారిమీద ద్వేషము పెంచుచూ, పరమతస్థులను

హింసించవలెనని ప్రేరేపించుచుండును. మత ప్రేరణ వలన మనిషి విచక్షణ

కోల్పోయి స్వమత అభివృద్ధి, పరమత నాశనమును కోరుచుండును.

నేడు జరుగు హింసలన్నీ మత ద్వేషమునకు సంబంధించినవే. మతము

అనునది మనిషి సృష్ఠించుకొన్న అధర్మము అని చెప్పవచ్చును.


మనిషిలో మతము ఉండుట వలన, ఒక మతస్థుడు ఇంకొక

మతస్థునికి చెడు చేయాలని చూచుచుండును. అయితే మనిషి జ్ఞానమును

తెలియగల్గితే, దేవుని జ్ఞానము మీద శ్రద్ధ మనిషిలోయుంటే, ఇతరులు

చెప్పు దైవజ్ఞానమును ఇష్టముగా వినగలిగితే మనిషిలో యున్న మతము

పని చేయదు. జ్ఞానము వలన మతము అణిగిపోగలదు. జ్ఞానము తెలియని

మనిషిలో మతము ఎట్లున్నదో, జ్ఞానము తెలియు మనిషిలో మతము ఎట్లు

అణిగి పోవుచున్నదో తెలియుటకు జరిగిన యదార్థ సంఘటనలను తీసుకొని

చూస్తాము. ఇప్పుడు గోదావరి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు జరుగు

చున్నాయి. హైదరాబాద్ రూట్ లో మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి దగ్గర

కృష్ణానది పుష్కరాలు జరుగుచున్నవి. 13-08-2016 దినమున మా

భక్తులు కొందరు మేము రచించిన భగవద్గీత మరికొన్ని గ్రంథములను



అక్కడ ప్రచారము చేయడము జరిగినది. మహబూబ్ నగర్ జిల్లా భక్తులే

అక్కడ ఆధ్యాత్మిక గ్రంథములను ప్రచార నిమిత్తము పెట్టుకోవడము

జరిగినది. అప్పుడు విశ్వహిందూ పరిషత్ అని చెప్పుకొను వారు పదిమంది

దాకా వచ్చి గ్రంథములను ప్రచారము చేయకూడదు అని చెప్పి

గ్రంథములను విచ్చల విడిగా విసిరి వేయడము జరిగినది. మీరు ఎందుకు

అలా చేయుచున్నారని మా భక్తులు వారిని ప్రశ్నించగా త్రైతము అని

అంటే అది క్రైస్థవులకు సంబంధించినదని మాకు తెలుసు మీరు త్రైత

సిద్ధాంతము అను పేరుతో గ్రంథములను ప్రచారము చేయుచున్నారు.

త్రైత సిద్ధాంత భగవద్గీతయని పేరుపెట్టుకొని క్రైస్తవమును ప్రచారము

చేయుచున్నారని ఆరోపణ చేసి దౌర్జన్యము చేశారు.


మేము హిందువులము, హిందూ గురువు ప్రబోధానంద

యోగీశ్వరులు వ్రాసిన భగవద్గీతయిది. మా దగ్గర మా గురువుగారు వ్రాసిన

76 గ్రంథములున్నవి. అందులో "మత మార్పిడి దైవద్రోహము-మహా

పాపము" అను గ్రంథము గలదు చూడండి. ఇంకా ఎన్నో హిందూ

ధర్మమునకు సంబంధించిన గ్రంథములు గలవు. మా ప్రచారమంతా

భగవద్గీత ప్రచారమే. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములలాగ మా

గురువు గారిది త్రైత సిద్ధాంతము. త్రైత సిద్ధాంతము హిందూమత

సిద్ధాంతములలో ఒక సిద్ధాంతము అని ఎంత చెప్పినా వారు ఏమాత్రము

వినకుండా గ్రంథములను తీసివేయాలని బెదిరించి, గ్రంథములన్నీ తీసుకొని

పోయి పోలీస్ స్టేషన్లో వీరు ఇతర మతస్థులు, వీరిమీద కేసు బుక్ చేయండి.

పరమత ప్రచారము చేయుచున్నారని కేసు వ్రాయండి అని చెప్పారు.

అంతకుముందు కొంత కాలముగా మా గ్రంథములను అక్కడి పోలీస్

వారు చదివియుండుట వలన స్వయముగా డి.యస్.పి జోక్యము చేసుకొని

"మీరు పొరపడుచున్నారు వారు హిందువులే, ఆ గ్రంథములు హిందూ


గ్రంథములే మేము ఇంతకుముందే చదివాము” అని చెప్పినా వారు

వినకుండా మీరు యాక్షన్ తీసుకొంటారా, మమ్ములను

తీసుకోమంటారాయని పోలీస్ వారినే బెదిరించారు. ఈ విషయమంతా

తెలిసిన మేము మా వారిని ప్రచారము ఆపివేసి ఇల్లకు పొమ్మని చెప్పాము.

అంతటితో ఆ సమస్య తీరిపోయింది.


ఇదంతయూ గమనిస్తే హిందువులలో కొందరిలో మతము అనునది

లోతుగా చొచ్చుకొనిపోయి దానికంటికి తన పర అనే భేదము కూడా

తెలియకుండా పోయినది. రంగు అద్దాలు పెట్టుకొన్న వానికి లోకమంతా

అదే రంగు కనిపించునట్లు మతము అనునది తలలో యుండగా హిందూ

మతములో ఎంతో గొప్పగా పేరుగాంచిన మా గ్రంథములు కూడా వారికి

పరమతముగా కనిపించాయి అంటే హిందూమతమునకే ఎంతో సిగ్గుచేటు.

పైసా జ్ఞానము కూడా లేనివారు విశ్వహిందువులమని పేరు పెట్టుకొని

చివరకు హిందూమతములోని రచనలనే గుర్తించక వాటిని గ్రుడ్డిగా

పరమతమని చెప్పడము కేవలము వారిలోయున్న మతద్వేషమే ఆ పని

చేయించిందని అనుకోగలము. చెప్పితే కొంతయినా విని తర్వాత వారు

ఆరోపణ చేయవచ్చు. లేకపోతే గ్రంథములు చదివి అందులో ఏదయినా

పరమతమునకు సంబంధించినదియుంటే తప్పుపట్టి మాట్లాడవచ్చు. చెప్పితే

వినరు, చదవమంటే చదువరు అటువంటి వారిలో మతము అణిగిపోదు.

జ్ఞానము మీద శ్రద్ధయుండి జ్ఞానమును వినగలిగితే మనిషిలోని మతము

అణిగిపోవునని చెప్పాము. అలా జ్ఞానమే మాకు వద్దు మాకు మతమే

కావాలి అనువారికి ఏమీ చెప్పలేము. వారు మతము అను అధర్మములో

లోతుగా కూరుకపోయి ఉందురు.


మా రచనా గ్రంథములన్ని శక్తితో కూడుకొన్నవి. భక్తితో తీసుకొని

శరీర బాధలున్న చోట పెట్టితే అవి శరీరమునకు అతుక్కొని పోయి, కొన్ని


నిమిషములు, కొన్ని గంటలు అతుక్కొని యుండి, అక్కడున్న కర్మనంత

కాల్చివేసి బాధను లేకుండా చేయు వరకు వదలవు. ఇనుమునకు

అయస్కాంతము అతుక్కొనులాగ గ్రంథములు అతుక్కొనుచున్నవంటే అవి

హిందూ గ్రంథములయినందుకు, హిందూ గురువు వ్రాసినందుకు విశ్వ

హిందువులు అని పేరు పెట్టుకొన్నవారు సంతోషించాలి. గొప్పగా

చెప్పుకోవాలి. అటువంటి గ్రంథములను నీచముగా క్రిందికి తోచివేస్తే

ఎంతో కర్మను తీసివేసే గ్రంథములు వారికి ఎంతో కర్మను అంటగట్టినవని

మనము ఎందుకు అనుకోకూడదు. వారు గ్రంథములపట్ల దురుసుగా

ప్రవర్తించిన దానివలన వారికి తప్పక భయంకరమైన కర్మ చేరియుండును.

మనిషి అనవసరముగా అజ్ఞానముతో దేవుని జ్ఞానముపట్ల చిన్న పనిని చేసి

పెద్ద మొత్తము కర్మను మూటకట్టుకొంటున్నాడు. వారు చేసిన నిమిషము

పనికి పది సంవత్సరములు బాధపడే కర్మవచ్చియుండును.


మత రక్షకులమని హిందూ ధర్మములు అడ్డము పెట్టుకొని,

ఏమాత్రము హిందూ ధర్మములను తెలియనివారు మేము హిందూ పరిషత్

వాళ్ళమని చెప్పుకొనుచూ, తమ మతమునే గుర్తించలేని స్థితిలో భగవద్గీతను

వీధిలోనికి విసరివేశారంటే, ఇటువంటి అరాచకములను చేయువారిని

హిందువులే చీదరించుకొనుచున్నారని వారికి తెలియక పోవచ్చును.

హిందూ ధర్మములను తెలిసిన హిందువులు అటువంటి వారిని క్షమించరు.

హిందూ పరిషత్అని హిందువులనే అవమానిస్తే, హిందూ ధర్మములతో

కూడుకొన్న భగవద్గీతను క్రైస్థవ గ్రంథమంటే దేవుడు వారిని క్షమించడు.

మా రచనలలో “హిందుత్వమును కాపాడుదాము” అను గ్రంథమును చూచి

కూడా త్రైత సిద్ధాంతము అను ఒక్కమాటను, అది సిద్ధాంతమని అర్థము

చేసుకోలేక హిందూ గ్రంథములను, హిందువులను అవమానించడము

ఒక్క ప్రక్క హిందూ సమాజము గమనిస్తూయుందని వారు మరువకూడదు.

నేడు పుట్టపర్తి తర్వాత అతి పెద్ద హిందూ సంస్థ ఇందూ జ్ఞానవేదిక, దీనికి

అనుబంధ సంస్థ ప్రబోధ సేవాసమితి. రెండు సంయుక్త సంస్థలు కలిసి

అనంతపురము జిల్లా తాడిపత్రి సమీపములో కృష్ణమందిరమును నిర్మించి

ఇప్పటికి 38 సంవత్సరముల నుండి అద్వైత, ద్వైత సిద్ధాంతములవలె త్రైత

సిద్ధాంతమును స్థాపించి ముఖ్యముగా "త్రైత సిద్ధాంత భగవద్గీత”ను 2000వ

సంవత్సరమునుండి అనగా 16 సంవత్సరములనుండి ప్రచారము చేయు

చున్నాము. త్రైత సిద్ధాంత భగవద్గీతను ఎన్నో వేలమంది చదివారు. ఎన్నో

వేలమందికి కనిపించని క్రైస్థవము హిందూపరిషత్ వారికి కనిపించిన

దంటే అది ఏమిటో ప్రజలకే అర్థమవుతుంది. మత రక్షకులమను వారి

చేతనే హిందూమతము నాశనమవుతున్నదని ఈ సంఘటనే చెప్పుచున్నది.


త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివిన తర్వాత రష్యాలో భగవద్గీతను

నిషేధించకుండా వదలివేశారను వార్తను మేము విన్నాము. దీనినిబట్టి

ఇతర దేశముల వారు కూడా త్రైత సిద్ధాంత భగవద్గీతలోని జ్ఞానము గొప్పదని

తెలియగలిగితే, నేటి హిందూపరిషత్ వారికి ఆ విషయము ఎందుకు

తెలియలేదో! ఎవరికయినా మామీద అనుమానముంటే, మేము చెప్పినది

మత ప్రచారమని తెలిసియుంటే, మా ఆశ్రమమునకు వచ్చి ఇక్కడ ఏమి

జరుగుచున్నదో చూడవచ్చును కదా! పోతులూరి వీరబ్రహ్మముగారు తన

కాలజ్ఞానములో "ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలదియని”

వ్రాయడమేగాక 400 సంవత్సరముల క్రిందటే 'ప్రబోధాశ్రమము'ను గురించి

వ్రాసిన వాక్యములు కాలజ్ఞానములో దాదాపు 60 వాక్యములు గలవు.

వీర బ్రహ్మముగారే పొగిడిన ప్రబోధాశ్రమము హిందూ పరిషత్ వారికి

క్రైస్థవ సంస్థవలె కనిపించినదంటే వారికున్నది చూపో కాదో వారే అర్థము


చేసుకోవాలి. ఏమయినా అనుమానములుంటే ఎదురుగా వచ్చి ప్రశ్నించి

జవాబును తెలియవచ్చును కదా! మా అడ్రస్ ఉంది. మా వెబ్సైట్

వుంది. సైట్ ఓపెన్ చేసి చూడవచ్చును కదా! కనీస జ్ఞానము కూడా లేని

మనుషులను హిందూ పరిషత్ సభ్యులుగా బయటికి పంపితే హిందూ

సంస్థకే హిందూ ధర్మములు తెలిసిన ప్రజలలో మర్యాద పోతుంది.


హిందూ పరిషత్యని, మరొకటియని వేరువేరు పేర్లు మత

రక్షకులమని పెట్టుకొన్నవారు, చేయు అరాచకములను చూచి ఇతర

మతముల వారు కూడా అదే పనిని చేయుచూ, హిందువులు చిన్న దాడులు

చేస్తే వాళ్ళు పెద్ద బాంబు దాడులు చేయుచున్నారు. మనము రెచ్చగొట్టడము

వలన ఇతరులు రెచ్చిపోతున్నారని మధ్యలో అమాయక ప్రజలు బలియై

పోవుచున్నారని, హిందువులు అనేకమంది అనుచుండడము హిందూ మత

రక్షకులకు వినిపించలేదేమో! అంతెందుకు దేవుని జ్ఞానము అంటే ఇతర

మతముల వారు హిందూ జ్ఞానమునకు కూడా విలువ నిచ్చుచున్నారు.

అదే హిందూ మత పెద్దలకు దేవుని జ్ఞానమంటే ఎందుకు ఇష్టము లేదు.

నేడు హిందూపరిషత్ ఇంకొకటి, ఇంకొకటి యని పేర్లు పెట్టుకున్న వారంతా

రాజకీయ రంగు పులముకొన్న వారేగానీ హిందూ జ్ఞానముగానీ, ఇందూ

ధర్మములుగానీ ఏమాత్రము తెలియని వారేయని చెప్పవచ్చును.

రాజకీయము వలన మతము అభివృద్ధి కాదు. హిందూ జ్ఞానము

తెలియడము వలన హిందూమతము అభివృద్ధి కాగలదు. ఎప్పుడు జ్ఞానము

తెలియదో అప్పుడు ఏ మతమయినా క్షీణించి పోతుంది.


వారి మతము కొరకు ముస్లీమ్లు ఏమయినా చేయగలరు. పర

మతమును ఏమాత్రము ఒప్పుకోరు. అటువంటి ముస్లీమ్లు దేవుని జ్ఞానము

ముందర మైనమువలె కరిగిపోవుచున్నారు. హిందువులది 13వ తేదీన


జరిగిన సంఘటన కాగా, దానికంటే ఐదు రోజుల ముందు మా భక్తులు

ముస్లీమ్లతో కలిసినప్పుడు జరిగిన విషయమును చూడండి. ఈ

సంఘటనను చూచిన తర్వాత మనకంటే వారే మేలని తెలియగలదు.

08-08-2016వ తేదీన హైదరాబాద్లో చార్మినార్ దగ్గర గల మదీనా

మార్కెట్లో మావారు గుడ్డల షాప్లోనికి పోయారు. పెద్ద మొత్తములో

షాప్కు గుడ్డలు తెచ్చే దానికి హోల్సేల్ షాప్లోనికి పోవడము జరిగినది.

అది ముస్లీమ్లకు సంబంధించిన షాప్. అక్కడ దాదాపు ఒక రకము

గుడ్డలను 30 వేల వరకు తీసుకోవడము జరిగినది. దాదాపు ఐదు

సంవత్సరములనుండి ఆ షాప్కు పోవుచుండడము వలన షాప్ యజమాని

బాగా పరిచయమయినాడు. పని అయిపోయిన తర్వాత షాప్ యజమానితో

దేవుడు, దేవుని జ్ఞానమును గురించి మాట్లాడడము జరిగినది.

పూటల నమాజ్ ఎందుకు చేస్తారు? ఐదు పూటలు చేయడానికి ఏమయినా

అర్థముందాయని మా భక్తులు అడుగడము జరిగినది. అప్పుడు వారు

దాని విషయము మాకు ఏమాత్రము తెలియదు మా పెద్దలు చెప్పినట్లు

చేస్తున్నాము. మా మత పెద్దలను అడిగితే “మేరాజ్" అని ఒక కథ చెప్పారు.

అల్లాహ్ ప్రవక్తగారికి ఐదు నమాజులు చేయమని చెప్పాడట అని అన్నారు.

అప్పుడు మా భక్తులు కృతయుగములోనే ఐదు పూటల ప్రార్థన హిందువులలో

ఉండేదనీ, అదే ముస్లీమ్లలోనికి వచ్చిందని చెప్పగా శ్రద్ధగా విన్నారు.

తర్వాత ఉపదేశము ద్వారా ఉపవాసము వచ్చిందనీ, ఉపవాసమంటే

ఆహారము తినకుండా ఉండడము కాదని చెప్పగా శ్రద్ధగా విన్నారు. తర్వాత

నమాజ్ అనేది ప్రత్యేకమైన అర్థముతో కూడుకొని యున్నదనీ, నమాజ్,

రోజా, జకాత్, హజ్ అను పదములలో “జ” శబ్దమున్నది. అంతేకాక

రంజాన్లో కూడా 'జ' శబ్ధమున్నది. 'జ' అనగా తెలుగులో ప్రత్యేకమయిన

అర్థము కలదు. పైన చెప్పిన పదములన్నీ ముస్లీమ్ మతము పుట్టకముందే


కృతయుగములోనే ఉండేవని, ఆ పదములన్నీ తెలుగు పదములేయని చెప్పగా

వారు ఎంతో భయభక్తులతో వినడమేకాక మావారు చేసిన 30 వేల బిల్లులో

15 వందలు తిరిగి వెనక్కు ఇచ్చారు. దేవుని జ్ఞానము చెప్పితే వారిలో

ఎంతో మార్పు, విధేయత కన్పించినది.


చెప్పేవారు హిందువులు కదా!యని వారి మాటలను ఎందుకు

వినాలి?యని వారు అనుకోలేదు. మావారు ఖురాన్ గ్రంథములో ఫలానా

సూరాలో ఫలానా ఆయత్లో మా త్రైత సిద్ధాంతము ఉంది చూడండియని

ఖురాన్లోని వాక్యమును చెప్పితే వారు శ్రద్దగా వినడము జరిగినది. అదే

వాక్యమే భగవద్గీతలో ఫలానా శ్లోకములో ఉంది చూడండియని చెప్పితే

వారు ఆశ్చర్యముగా విని, మీరు మేము ఒకే దారిలో ఉన్నామని

సంతోషించారు. ఖురాన్ వాక్యము చెప్పితే ముస్లీమ్లు ఎంతో

సంతోషించుచుండగా, హిందువులకు భగవద్గీతకు వివరమును వ్రాశామని

చెప్పినా అసూయ పడుచున్నారు. బీచ్పిల్లి దగ్గర హిందూ పరిషత్ వారికి

భగవద్గీత చూపితే శంకరాచార్యులు వ్రాశారు కదా! మీరంతా ఎందుకు

వ్రాయాలని అనడము జరిగినది. అదే భగవద్గీత వాక్యమే ఖురాన్లో 50వ

సూరా 21వ ఆయత్ నందు త్రైత సిద్ధాంతము (మూడు ఆత్మల వివరము)

ఉందని చూపగా ముస్లీమ్లు సంతోషించారు. మా వారు ముఖము మీద

చక్రముల గుర్తులు పెట్టుకొని మాట్లాడినా వీరు హిందువులు కదా!యని

ముస్లీమ్లు అనుకోకుండా దేవుని జ్ఞానమును ఖురాన్ వాక్యరూపముతో

వింటూనే సంతోషముతో పొంగిపోయి సానుభూతిగా బిల్లులో 30 వేలకు

1500 రూ॥లు అడుగకున్నా తిరిగి వెనక్కు ఇచ్చారు. (ఆ షాప్ అడ్రస్

ప్రక్క పేజీలో ఇస్తున్నాము చూడండి.)


మా వారు జ్ఞానము చెప్పుతూయుంటే వారి వ్యాపారమును వదలి

శ్రద్ధగా వినడము మాకు కూడా ఆశ్చర్యముగా కనిపించినది. అటువంటి

స్పందన హిందూ పరిషత్ వారిలో లేకపోవడము, మేమే తెలిసినవారమన్నట్లు

గురువులను కూడా హేళనగా మాట్లాడడము చూస్తే “వీరు హిందువులేనా!?”

యని అనుమానము రాకతప్పదు. ముఖము మీద కర్మ, కాల,

గుణచక్రములను ధరించి కనపడుచున్నా ఇతర మతస్థులు నొసలు మీద

ఏమి ధరించరు కదా! హిందువులే కదా! ధరించేదని అనుకోకుండా

హిందువులనువారే హిందువులను హేళనగా మాట్లాడుచుంటే ఇది హిందూ

సాంప్రదాయమా? అని ప్రశ్న వస్తుంది. ఏది ఏమయినా ఇటువంటి

జ్ఞానములేని, చెడిపోయిన సమాజముగాయున్న వారి మధ్యలో ఎందుకు

పుట్టాము? అని అనుకోవలసి వస్తున్నది. నేడు మా జ్ఞానమయిన త్రైత

సిద్ధాంత జ్ఞానము, భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16, 17

శ్లోకములలో ఉన్న జ్ఞానమును, ఖురాన్ గ్రంథములో 50వ సూరాలో 21వ

ఆయత్లో మూడు ఆత్మలను గురించి "తోలబడే వాడు, తోలేవాడు, సాక్షిగా

చూచేవాడు” అని చెప్పారని చెప్పగా మతమును మరచిపోయి ముస్లీమ్లు

సంతోషపడుచున్నారంటే, ఒక విధముగా వారు జ్ఞానము దగ్గర తమ


మతమును అణచివేసి అందరము సమానమేయను భావములోనికి

వచ్చారంటే, మతము అను దానిలో ఎక్కువగా ఎవరు చిక్కుకు పోయారో

జరిగిన సంఘటననుబట్టి మీకే అర్థమయివుంటుంది. మతఛాందస్సులను

దేవుడు మట్టుపెట్టే కాలము దగ్గరిలో యున్నదని ఆశిస్తున్నాము.


దేవుని దృష్ఠిలో మనుషులంతా సమానమే. మనుషుల దృష్టిలోనే

దేవుడు అనేక రకములుగా కనిపించుచుండవచ్చును. మతము అను

మాయ ఆ విధముగా దేవుడు కూడా మతమునకు ఒకడున్నాడని చెప్పుచున్నా,

దానికి వ్యతిరేఖముగా అన్ని మతములకు దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము

ఒక్కటేయని మేము చెప్పుచుందుము. నేను పుట్టినది హిందూమతములో

నేను చదివినది భగవద్గీత. భగవద్గీతను చదివిన తర్వాత అందులో వ్రాసిన

వివరమునకు నాకు అర్థమయిన వివరమునకు ఎంతో తేడా కనిపించినది.

అప్పటినుండి నాలో ఉత్పన్నమయిన జ్ఞానము మిగతా రెండు గ్రంథములలో

కూడా కనిపించినది. అప్పుడు ఖురాన్, బైబిలులో నాలుగు సువార్తలు

నాకు బాగా దగ్గరయినవి. భగవద్గీతలోనూ, నాలుగు సువార్తలలోనూ,

ఖురాన్ గ్రంథములోనూ ఒకే జ్ఞానము కనిపించినది. భగవద్గీత జ్ఞానమే

మిగతా రెండు గ్రంథములలో యున్నట్లు తెలిసిపోయినది. అందువలన

నేను ఏ గ్రంథములోని జ్ఞానమునయినా చెప్పగలను. ఏ మతము

వారికయినా జ్ఞానమును చెప్పగలను. ఒకరోజు ఖురాన్ గ్రంథములో

ఐదవ సూరాలో 44, 46, 48, 68 ఆయత్లను అలాగే 62వ సూరాలో

5వ ఆయత్ను చూచాను. (5-44, 46, 48, 68) (62-5) వాక్యములను

చూచిన తర్వాత తౌరాతు గ్రంథ ఆధారముగా, తౌరాతులోని జ్ఞానమునే

మిగతా బైబిలు, ఖురాన్ గ్రంథములలో యున్నదని వ్రాయడము జరిగినది.

అయితే తౌరాతు గ్రంథమంటే ఏమిటో ముస్లీమ్లకు తెలియదు. తౌరాత్

అంటే ఒక ముస్లీమ్లకే కాదు భూమిమీద ఎవరికీ ఆ గ్రంథము తెలియదు.


తౌరాతు గ్రంథమును ఎవరూ చూడలేదు. ఒక్క మూసా ప్రవక్త (మోషే

ప్రవక్త) తప్ప దానిని ఎవరూ చూడలేదు. వాస్తవానికి అది స్థూల గ్రంథమే

కాదు. తౌరాతు గ్రంథము ఒక రహస్యముగా యుండేది. అయితే ఆ

రహస్యము నాకు సులభముగా తెలిసిపోయినది. ద్వాపర యుగములో

తయారయిన భగవద్గీత యొక్క మొదటి ప్రతినే దేవుడు మూసాకు (మోషేకు)

అందివ్వడము జరిగినది. తౌరాతు గ్రంథము భగవద్గీతయని ఈనాటికీ

ఎవరికీ తెలియదనే చెప్పవచ్చును.


మా రచనలలోని "కృష్ణమూస" యను గ్రంథమును చదువగల్గితే

నాకు తెలిసిన రహస్యము మీకు కూడా తెలియగలదు. నాకు తెలిసిన

రహస్యము ప్రకారము భగవద్గీత జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలో

యున్నదని తెలిసిపోయినది. అందువలన మిగతా రెండు గ్రంథముల

జ్ఞానము నాకు సులభమైపోయినది. ఎన్నో సంవత్సరములనుండి

మతములో యున్నవారికి తెలియని జ్ఞాన రహస్యములను నేను సులభముగా

చెప్పగలను. ఆ విధానము ప్రకారము నేను మూడు మతముల వారికి

జ్ఞానమును చెప్పు గురువుగా అందరూ చెప్పుకోవడము జరుగుచున్నది.

అలా మూడు మతముల జ్ఞానమును సమన్వయము చేసి చెప్పువారు

భూమిమీద ఎవరూ లేనందున నన్ను “త్రిమత ఏకైక గురువు” అని

అందరూ చెప్పడమైనది. ఆ నేపథ్యములోనే మూడు మతములలో మత

తత్త్వమును లేకుండా చేసి, మనుషులనందరిని ఏకైక మతముగా

తీర్చిదిద్దాలను ఉద్దేశ్యముతో, ఇప్పుడు మూడు గ్రంథములలోని మూడు

ప్రథమ వాక్యములకు వివరమును వ్రాయదలచాము. ఆ విధముగా మూడు

గ్రంథముల మూడు ప్రథమ వాక్యములకు వివరమును వ్రాయదలచాము.

ఆ విషయము చెప్పేముందు నేడు మనుషులలో ఏ మతములో ఎంత మత

ద్వేషమున్నదో చెప్పాము. మత ద్వేషములు అన్ని మతములలో యున్నా


కొందరు మనుషులు దైవజ్ఞానమును విన్నప్పుడు మతమును మరచి

పోతున్నారు. అట్లే ద్వేషములను మరచిపోతున్నారు. కొందరు మాత్రము

జ్ఞానమును చెప్పినా వినకుండా తమలోని అజ్ఞానము చేత ద్వేషముగానే

ప్రవర్తించుచున్నారు. హిందువులయితే తమ ధర్మములను తామే గుర్తించ

లేక తమ మతమువారి మీదనే దాడులకు దిగుచున్నారు. మిగతా రెండు

మతములను సంస్కరించుటకు పట్టిన కాలముకంటే హిందూమతమును

సంస్కరించుటకు ఎక్కువ కాలము పట్టును అని అనుకొంటున్నాను.


ఇప్పుడు మీరు మతము అను మాయను వీడి, దైవగ్రంథములో

చెప్పిన జ్ఞానమును తెలియుచున్నామను జ్ఞాపకములోనికి రండి. ఇక్కడ

చెప్పినది ఏ గ్రంథములోని జ్ఞానమయినా అది నీ గ్రంథములో కూడా

కలదని తెలియవలెను. ప్రతి గ్రంథములోని వాక్యము మిగతా గ్రంథములలో

కూడా ఉండడము వాస్తవము. అయితే దానిని అన్వేషించితే కానీ అది

ఎక్కడున్నదీ తెలియదు. అందువలన తెల్లవారు జామున తొలిజాములో

తూర్పున తెల్లగయ్యే వరకు అనగా ఉదయము 4 గంటల నుండి 6 గంటల

వరకు “అల్లాహ్ మీ కొరకు వ్రాసిపెట్టిన దానిని అన్వేషించటానికి మీకు

అనుమతి వుంది. తొలిజాములో తెలుపు చారలు ప్రస్ఫుటమయ్యే

వరకు తినండి, త్రాగండి (చదవండి, వినండి” అని యున్నది. ఈ

వాక్యము ఖురాన్ గ్రంథములో రెండవ సూరాలో 187వ ఆయత్నందు

గలదు. దేవుడు మీకిచ్చిన గ్రంథములో వ్రాసియున్న దానిని అన్వేషించటానికి

మీకు తెల్లవారుజామున కాలమును దేవుడు నిర్ణయించి చెప్పాడు. అప్పుడు

మీరు దేవుడిచ్చిన జ్ఞానమును అన్వేషించవచ్చును. చదువు రాకపోతే

వినవచ్చును అని సూక్ష్మ జ్ఞానమును చెప్పగా మనుషులు దానిని తినేదానికి,

త్రాగేదానికి వినియోగించుకొంటున్నారు. ఖురాన్ గ్రంథములో సూరా 2,

ఆయత్ 187 వాక్యము యొక్క సూక్ష్మ వివరము తెలియాలంటే మా

రచనలలోని “గీటురాయి" గ్రంథమును చదవండి. ఇప్పుడు ద్వితీయ

దైవగ్రంథములోని యోహాన్ సువార్తలోని మొదటి మూడు వాక్యములకు

వివరమును చెప్పుకొందాము.


ఆదియందు వాక్యముండెను,

వాక్యము దేవుని యొద్దయుండెను,

వాక్యము దేవుడైయుండెను.


బైబిలు బోధలో ఈ మూడు వాక్యములను ప్రథమ వాక్యములుగా

చెప్పుకొంటున్నాము. గ్రంథము ప్రారంభములోని ఆదికాండములో గల

వాక్యములను గ్రంథ ప్రథమ వాక్యములుగా చెప్పవలెను కదా!యని ఇతరులు

అడుగవచ్చును. అటువంటి అనుమానము రాకుండా ముందే వివరమును

చెప్పియున్నాము. మనిషికి అవసరమైన బోధనే గ్రంథముగా తీసుకొని,

అందులో మొదటి వాక్యములను చెప్పుకొంటున్నాము. ఆ పద్ధతి ప్రకారము

నాలుగు సువార్తలు భగవంతుడైన ఏసు చెప్పినవి. అందులో యోహాన్

సువార్త చివరిదయినా మిగతా మూడు అధ్యాయములకంటే బోధతో

ప్రారంభమయినది ఒక్క యోహాను సువార్త మాత్రమే. భగవద్గీతలో కూడా

ఇదే సూత్రము ప్రకారము రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగములో 11వ

శ్లోకమునుండి ప్రథమ వాక్యములను తీసుకొన్నాము. జ్ఞానబోధ అక్కడినుండే

ప్రారంభమగుట వలన సాంఖ్య యోగములో 11, 12, 13వ శ్లోకములను

మొదటి మాటలుగా చెప్పుకొన్నాము. అట్లే ఇప్పుడు ఇంజీలు గ్రంథమునుండి

గ్రంథము మధ్యలో గల అనగా 43వ పాఠమునుండి ప్రారంభ వాక్యములను

తీసుకోవడము జరిగినది. అక్కడ తౌరాతులో మూడు శ్లోకములను మూడు


వాక్యములుగా తీసుకొన్నాము. అయితే ఇక్కడ యోహాన్ సువార్తలో మూడు

వరుస సంఖ్యలోగల మూడు వాక్యములను తీసుకొనక ఒకే వాక్యములోగల

సమాచారమును మూడు ప్రథమ వాక్యములుగా తీసుకొన్నాము. వాక్యముల

వరుస సంఖ్య ముఖ్యము కాదు. మూడు భావములతో నిండియున్న

వాటిని మూడు వాక్యములుగా తీసుకొన్నాము. అందువలన మూడు చిన్న

వాక్యములుండినా, అవి మూడు పెద్ద భావములుగల వాక్యములని తెలియ

వలెను.


ఈ మూడు వాక్యములు ప్రత్యేకమైన సూక్ష్మ భావముతో ఇమిడి

యున్నవి. భగవద్గీత మొదటి మూడు వాక్యములు జీవాత్మ, ఆత్మను గురించి

చెప్పినవిగా యున్నవి. అయితే ఇంజీలు (బైబిలు) గ్రంథములో యోహాన్

సువార్తలోని మొదటి వాక్యములు ప్రత్యేకమైన భావమును బోధించుచున్నవి.

భగవద్గీత ప్రారంభములో జీవాత్మ, ఆత్మ, శరీరము అను మూడు భాగములను

గురించి తెలుపడమైనది. ఇక్కడ యోహాన్ సువార్తలోని మూడు ప్రథమ

వాక్యములలో జ్ఞానము, ఆత్మ, పరమాత్మయను మూడు అంశములను

గురించి చెప్పడమైనది. అయితే ఈ మూడు వాక్యములలో ఎక్కడ ఆత్మ

యున్నదో, ఎక్కడ పరమాత్మయున్నదో అర్థము కాకుండా ఇమిడియున్నది.

మూడు వాక్యములలో దేవుడు అనుమాట రెండు వాక్యములలో గలదు.

అంతతప్ప జ్ఞానము, ఆత్మ అను విషయములు ఎక్కడ గలవో గుర్తించలేని

విధముగా యున్నవి. ఇప్పుడు మూడు వాక్యములలో మొదటి వాక్యమును

తీసుకొందాము.



మొదటి మాటలో ఆదియందు వాక్యముండెను అని యున్నది

కదా! ఇందులో వాక్యము అనగా అది నీకు తెలిసిన భాషలో

యుండవచ్చును, యుండకపోవచ్చును. నీకు తెలుగు భాష మాత్రమే


వస్తుంది అనుకొనుము. వాక్యము వేరే భాషలో నీకు తెలియని భాషలో

యుండవచ్చును. వాక్యము అనగా! వాక్కు ద్వారా వచ్చునది వాక్యము.

వాక్కు అనగా! నోటి నుండి వచ్చు శబ్దమును వాక్కు అని అంటున్నాము.

శబ్దము అనగా వినిపించునది. వినిపించే శబ్దము పెద్దది కావచ్చు, చిన్నది

కావచ్చు. వినిపించే శబ్దమునుబట్టి వాక్యము పెద్దదనియో లేక చిన్నదనియో

చెప్పవచ్చును. వినిపించే శబ్దము యొక్క వినికిడి పొడవు పొట్టియే కాకుండా

శబ్దము పెద్దదిగా యుండవచ్చు లేక చిన్నదిగా యుండవచ్చును. వాక్యము

నీకు తెలిసిన భాషలోనే యుండుననిగానీ, వాక్యము ఇంతే పొడవు లేక

పొట్టి గలదియనిగానీ, వాక్యము చిన్న శబ్దముతో చెప్పునదియనిగానీ, లేక

పెద్ద శబ్దముతోనే చెప్పునదియనిగానీ చెప్పలేము. వాక్యము భాషలోగానీ,

పెద్ద చిన్న శబ్దములోగానీ, పొడవు పొట్టిలో గానీ ఉండవచ్చును. ఇట్లే

యుండునని చెప్పలేము. వాక్యము ఎలాగయినా యుండవచ్చును. ఇప్పుడు

ఆదియందు వాక్యముండెను అను మాటను తీసుకొని చూస్తే వాక్యము

చెప్పినది ఆదిలోయని తెలియుచున్నది. ఆదిలో మనుషులకు ఏ భాషరాదు.

అప్పుడు ఏ భాషలో వాక్యము చెప్పబడినదని ప్రశ్న రాగలదు. ఆదిలో

జరిగిన యదార్థమును గమనించితే అన్ని ప్రశ్నలకు జవాబు దొరకగలదు.


ఆదిలో శబ్దము ఎక్కడినుండి వచ్చినది? అని ప్రశ్నించుకొని చూస్తే

మనిషి చెవుకు వినిపించే శబ్దము ప్రకృతి వలననే కల్గినదని చెప్పవచ్చును.

ప్రకృతి ఐదు భూతములుగా గలదు. భూతము అనగా జీవము అని

అర్దము. జీవము గల ఆకాశములో ఆదియందు శబ్దము ఏర్పడినదని

అక్కడికి పోయి చూస్తే తెలిసిపోవుచున్నది. ఆకాశము శూన్యముగా

యున్నది. అది ఎలా శబ్దము చేయును? అను ప్రశ్న కూడా రాగలదు.

హేతువాద పద్ధతిలో ఈ ప్రశ్నలు తప్పక రావలసిందే. వాటికి జవాబులు

తెలియవలసిందే. అప్పుడే శాస్త్రపద్ధతియగును. బ్రహ్మవిద్యా శాస్త్రమును

అనుసరించి చూస్తే, శబ్దమును ఆకాశము స్వయముగా చేసిందా అని

చూస్తే, ఆకాశము ఒక జీవుడే అయినందున జీవాత్మకు ఏదీ చేతకాదు,

ఏదీ చేయలేదు అను శాస్త్రవిధి గలదు. దానిని జీవాత్మ ధర్మము అని

అనవచ్చును. పరమాత్మకు కూడా ధర్మముగలదు. పరమాత్మ (దేవుడు)

నామ, రూప, క్రియ లేనివాడని అదియే దేవుని ప్రథమ ధర్మమని చెప్పవచ్చును.

దేవుడు క్రియా రహితుడు అనగా పనిని చేయడు. జీవాత్మ ధర్మము

ప్రకారము జీవుడు చేతకానివాడై చేయలేడు, దేవుడు చేతనయినవాడయినా

చేయడు. ఈ విధముగా జీవునికి, దేవునికి వ్యతిరేఖమైన ధర్మములు

గలవు. ఆదిలో వాక్యము ఆకాశము ద్వారా వస్తే, ఆకాశము ఒక జీవుడే

అయిన దానివలన ఆకాశము అను జీవుడు ఆ శబ్దమును చేయలేదు.

ఆకాశమునుండి శబ్దము వచ్చినది వాస్తవమే. అయినా ఆకాశ జీవుడు

శబ్దమును చేయు స్థోమత, బలము లేనివాడు. అందువలన ఆకాశము

వెనుక ఎవరో వుండి శబ్దము చేసియుండవచ్చును. అయితే దేవుడు కూడా

పని చేయనివాడు, కావున దేవుడు కూడా ఆ శబ్దము చేయలేదు. ఆకాశము

నుండి శబ్దము వచ్చినది వాస్తవమే అయినా, ఆ శబ్దమునకు కారణము

ఆకాశ జీవుడు కాదు, దేవుడు కాదు. ఇద్దరూ కాక మరొకడు ఎవడో

ఇంకొకడు ఉండి ఆ శబ్దమును చేసియుండవచ్చును అని అనుమానము

వచ్చినది.


ఈ అనుమానము తీరుటకు విశ్వములో ఎవరెవరు యున్నారో

ముందు గమనించవలసిన అవసరమున్నది. దేవుడు మొదట విశ్వమును

సృష్టించాడు. అప్పుడు దేవుడు దేవునిగానేయుంటూ మొదట తననుండి

ప్రకృతియను దానిని తయారు చేశాడు. ప్రకృతి ఐదు భాగములుగా

యుండునట్లు సృష్టించాడు. తర్వాత అది నిర్జీవమైన దానివలన దానిని


చైతన్యముగా చేయుటకు తననుండి ఆత్మను, జీవాత్మను రెండిటిని తయారు

చేశాడు. దేవుడు తనవలె పురుషత్వము గల జీవాత్మ, ఆత్మను తయారు

చేసి జీవుడు నడుపబడేవాడుగా, ఆత్మ నడిపేవాడుగా యున్నట్లు చేశాడు.

సకల కార్యములను చేయుటకు ఆత్మను నియమించాడు. ప్రతి శరీరము

లోను జీవుడుంటే జీవునితోపాటు ఆత్మయుంటూ శరీరములో అన్ని

కార్యములను చేయుచున్నది. ఆత్మ విషయము ఎంతో పెద్ద జ్ఞానులయిన

వారికి కూడా తెలియదని దేవుడే తన గ్రంథములో చెప్పాడు. ప్రయత్నించు

యోగులకు మాత్రమే ఆత్మ తెలియగలదని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి

యోగమునందు పదకొండవ (11) శ్లోకములో చెప్పబడినది. ఆత్మ

శరీరములో తెలియకుండా అణిగియున్నదని తెలియవలెను.


దేవుడు పని చేయనివాడు కదా! ఏమీ చేయనివాడు ప్రకృతిని,

మిగతా రెండు ఆత్మలను ఎలా చేశాడు? అని కొందరు అడుగవచ్చును.

దానికి మా జవాబు ఏమనగా! దేవుడు క్రియారహితుడు పనిచేయడు

అనుమాట వాస్తవమే. అది సృష్ఠిని తయారు చేసిన తర్వాత, ఆత్మను

జీవాత్మను తయారు చేసిన తర్వాత చెప్పబడిన ధర్మము. సృష్టికి పూర్వము

దేవుడు పనిచేసేవాడు. అప్పుడు సృష్టికి ముందు దేవుడు ఒక్కడే గలడు.

దేవుడు తప్ప ఎవరూ లేరు. అందువలన సృష్టిని తయారు చేయకముందు

దేవుడు కార్యములను చేసెడివాడు. దేవుడు చేస్తేనే ప్రపంచము తయారయి

నది. ప్రపంచము తయారైన తర్వాత జీవాత్మ, ఆత్మను దేవుడు తయారు

చేసిన తర్వాత దేవుని ధర్మము తయారయినది. సృష్ఠి తర్వాత దేవుడు పని

చేయనివాడని, సృష్టికి పూర్వము పని చేసేవాడని తెలిసినది. దేవుడు

క్రియలన్నిటినీ ఆత్మకు కరిపించి, ఆత్మ చేత చేయించునట్లు నిర్ణయించి,

తాను ఏమీ చేయనివాడైనాడు. అందువలన ఆత్మను తయారు చేసిన

పరమాత్మ తాను పనులు చేయకుండా మానివేసింది. దేవుడు చేయవలసిన

పనియంతటినీ ఆత్మే చేయుచున్నది. ఆత్మ పనులు చేయుచుండగా పరమాత్మ

ఏమీ చేయక కేవలము సాక్షిగా చూస్తూ ఊరక యున్నాడు.


దేవుడు ఏమీ చేయనివాడు అయినందున, జీవుడు ఏమీ చేత

కానివాడయినందున, అన్నీ చేయువాడు ఆత్మ అయినందున, ఆదిలో

ఆకాశమునుండి శబ్దము చేసినది ఆత్మయేనని చెప్పవచ్చును. ఆత్మ

ఆకాశములో అణిగియుండి ఆకాశమునుండి శబ్దము చేసినది. ఆత్మ

చేసిన శబ్దము దేవుని జ్ఞానమైయుండెను. అందువలన ఆ శబ్దమును

'వాక్యము' అన్నారు. వాక్యము అనగా 'భావముతో కూడుకొన్న శబ్దము’

అని అర్థము. సృష్ట్యాదిలో ఆకాశమునుండి భావముతో కూడుకొన్న శబ్దము

వచ్చినది అని చెప్పుచూ "ఆదియందు వాక్యముండెను" అని అన్నారు.

వాక్యము అంటే ఏమిటి? దానిని చెప్పినది ఎవరు? అని తెలుసుకొన్నాము.

జ్ఞానముతో కూడుకొన్నది వాక్యము. వాక్యమును శబ్ద రూపములో

చెప్పినది ఆత్మ. ఆత్మ ఆకాశమునుండి చెప్పిన జ్ఞానమే ప్రపంచమునకు

మొదటి జ్ఞానము. ఆకాశమునుండి మొదట బయలు దేరి వచ్చిన శబ్దము

జ్ఞానమే అయినా, అది ఉరుముల రూపములో పెద్ద పెద్ద శబ్దములుగా

యుండెను. అది మనుషులు అర్థము చేసుకొను భాష కాదు. ఉరుముల

శబ్దముతో యున్న భాషను ఆకాశములో సూర్యుడు గ్రహించాడు. అది

మనుషులకు అర్థముకాని భాషయని తెలిసి, సూర్యుడు మనుషుల భాషలో

భూమిమీదగల మనువు అను వ్యక్తికి తాను శబ్దముల నుండి గ్రహించిన

జ్ఞానమును తెలియచెప్పడమైనది.


సృష్ట్యాదిలో అర్థము కాని శబ్దము జ్ఞాన రూపములో వచ్చిన

దానివలన దానిని ఆదియందు వాక్యముండెను అని యోహాను సువార్త

మొదటి అధ్యాయము మొదటి వాక్యములో చెప్పడమైనది. శబ్దము జ్ఞానమని


మనుషులకు ఆ రోజు తెలియదు. దానిని సూర్యుడు చెప్పగా కొంత

అర్థమయినది. అదే జ్ఞానమునే కృష్ణుడు భగవద్గీతగా చెప్పాడు. భగవద్గీతను

చెప్పినప్పుడు ఇది సృష్ట్యాదిలో చెప్పబడిన జ్ఞానమని కృష్ణుడు చెప్పినా,

మనుషుల దృష్ఠిలో ఆదిలోని శబ్దమయిన ఉరుముల వద్దకు పోలేదు.

ఉరుముల శబ్దమే భగవద్గీత జ్ఞానమని ఈనాటికి ఎవరికీ తెలియదు. కృష్ణుడు

చెప్పిన జ్ఞానమునే సూర్యుడు మనువుకు చెప్పాడు. సూర్యుడు చెప్పిన

జ్ఞానము ఆకాశ ఉరుముల శబ్ద జ్ఞానము. ఆకాశ శబ్దముల జ్ఞానము

ఆకాశ ఆత్మవద్దనుండి వచ్చిన జ్ఞానము. ఆత్మవద్దనుండి వచ్చిన ఆత్మజ్ఞానము

ఆత్మలోనుండి వచ్చినది. ఆత్మలోనుండి వచ్చిన జ్ఞానమును చూస్తే ఆత్మయే

జ్ఞానముగా మారి ఆత్మనుండి బయటికి వచ్చినది. దూదిలోనుండి దారము

బయటికి వచ్చినట్లు, ఆత్మలోనుండి జ్ఞానము బయటికి వచ్చినది. దూది

దారముగా ఎలా మారి దూదినుండి దారము బయటికి వస్తున్నదో, అలాగే

ఆత్మనుండి జ్ఞానము తయారగుచూ బయటికి వస్తున్నది. దూది వేరు,

దారము వేరయినా, దూదియే దారముగా మారినదని చెప్పవచ్చును. అలాగే

ఆత్మవేరు, జ్ఞానము వేరు అయినా, ఆత్మనుండే ఆత్మజ్ఞానము బయటికి

వస్తున్నది. దారమును విడదీసి చూస్తే అందులో దూది పోగులే యున్నట్లు,

ఆత్మజ్ఞానమును విడదీసి చూస్తే అందులో ఆత్మ విధానమే యుండును.


ఆదియందు ఆకాశ శబ్దము ద్వారా దేవుడు జ్ఞానమును

చెప్పడమైనదని, దానినే ఖురాన్ గ్రంథములో దేవుడు జ్ఞానమును

తెలియజేయు మూడు విధానములలో ఒకటి ఆకాశవాణి నుండి (వహీ

ద్వారా) తెలియజేయబడునని సూరా 42 ఆయత్ 51లో చెప్పడమైనది.

దేవుడు సృష్ట్యాదిలోనే ఆకాశము అను జీవునిలో గల ఆత్మనుండి తన

జ్ఞానమును చెప్పించాడు. అప్పుడు ఉరుముల రూపములో వచ్చిన జ్ఞానము


మనుషులకు అర్థము కాదు, అది మనుషుల భాష కాదు. అందువలన

ఉరుముల జ్ఞానమును గ్రహించిన సూర్యుడు మానవుల భాషలో భూమిమీద

ఒక మనిషికి చెప్పగా అది భూమండలమంతా ప్రాకిపోయినది.

కాలక్రమమున అధర్మములు చెలరేగి ధర్మములు లేకుండా పోవు

సమయములో ఆదిలోని జ్ఞానము మనుషులలో లేకుండా పోయినది.

అప్పుడు కృష్ణుడుగా భగవంతుడు వచ్చి సూర్యుడు చెప్పిన జ్ఞానమునే

ఇప్పుడు నీకు చెప్పుచున్నా నని ద్వాపర యుగములో అర్జునుడికి చెప్పాడు.

అది గ్రంథరూపములో ప్రథమ దైవగ్రంథముగా మనముందరున్నా, అది

సూర్యుడు చెప్పిన జ్ఞానమని గానీ, సూర్యుడు గ్రహించిన ఆకాశ శబ్దముల

జ్ఞానమనిగానీ మన జ్ఞప్తిలో లేదు. వెనుకటి విషయమును అందరూ

మరచిపోయారు.


మనుషులు దేవుడు పంపిన జ్ఞానమును మరచిపోయారను

ఉద్దేశ్యముతో భగవద్గీతను చెప్పిన తర్వాత మూడు వేల సంవత్సరములకు

ద్వితీయ దైవగ్రంథములో యోహాన్ సువార్తలో మూడు ప్రథమ వాక్యములను

చెప్పడమైనది. ఇక్కడ చెప్పిన వాక్యము ప్రకారము ఆదియందు

వాక్యముండెను అనుమాట అర్థమయినది. దాని తర్వాత రెండవ

వాక్యమును విడదీసి చూస్తే, ఉరిమి చెప్పిన జ్ఞాన శబ్దము ఆకాశ ఆత్మ

వద్దనుండి వచ్చినదని తెలిసినది. అందువలన వాక్యము దేవునివద్దయుండెను

అని తెలిసినది. ఇంకా లోతుగా చూస్తే వాక్యము అను శబ్దము ఆత్మలోనుండి

పుట్టుకొచ్చినదని తెలిసినది. దూది తంతువులనుండి దారము పురిబడి

బయటికి వచ్చినట్లు, ఆత్మ చైతన్యమే శక్తిగా మారి, శక్తి రూపములోని

జ్ఞానము శబ్దరూపములో బయటికి వచ్చినది. దారములో దూది పోగులు

ఉన్నట్లు, జ్ఞాన శబ్దములో ఆత్మశక్తియే కలదని తెలియుచున్నది. ఆత్మజ్ఞానము

ఆత్మ శక్తిగా, ఆత్మగా యున్నదని తెలియుచున్నది. అందువలన ఆత్మజ్ఞానము


ఆత్మ రెండు ఒకటేయని తెలియుచున్నది. దానినే వాక్యము దేవుడై

యుండెను అని అన్నారు.


ఇంతవరకు దేవుడు జీవాత్మను, ఆత్మను సృష్టించాడని చెప్పాము.

సృష్ఠి జరుగకముందు దేవుడు పనిచేసేవాడు. సృష్టి జరిగిన తర్వాత పనిని

ఆత్మ చేయునట్లు అధికారమిచ్చి, తాను ఉన్నా లేనట్లుగా మారిపోయాడు.

దేవుడు ఏ కార్యమును చేయనివాడై తన ఉనికి ఎవరికీ ఏమాత్రము

తెలియకుండా చేశాడు. దేవుడు ప్రపంచముతో ఏ సంబంధము లేకుండా

పోయిన తర్వాత ఆయన ఉన్నా లేనివానితో సమానమై పోయినది. అప్పుడు

దేవుని కార్యములను కూడా ఆత్మే చేయవలసి వచ్చినది. ఇటు జీవాత్మ

కార్యములనూ, అటు పరమాత్మ కార్యములనూ ఆత్మ చేయుచూ తాను

ఎవరికీ తెలియకుండా మసలుకొనుచున్నది. పై వాక్యములను బట్టి చూస్తే

ఆత్మ విధానమంతయూ బయటపడుచున్నది. పరమాత్మ సృష్ఠిని తయారు

చేసినప్పుడు మూడు ఆత్మలు ఉండేవి. తర్వాత రెండు ఆత్మలు మాత్రమే

తెలియబడుచున్నవి. జీవాత్మ, ఆత్మ ఉనికి ఉండగా, పరమాత్మ ఉనికి

లేకుండా పోయినది. అందువలన సృష్టి తర్వాత ఆత్మే పరమాత్మగా చలామణి

కావలసి వచ్చినది. అందువలన ఆత్మను దేవుడని కూడా చెప్పవలసి

వచ్చినది. ఆత్మ, దేవుడు (పరమాత్మ) కాకున్నా, చివరకు దేవుని స్థానములో

చేరిపోయి దేవుని కార్యములు చేయుచున్నది.


ఆత్మజ్ఞానము ఆత్మవద్దనుండి వచ్చినది. ఆత్మను దేవుడని చెప్పడము

వలన వాక్యము దేవునివద్ద యుండెను అని అనవలసి వచ్చినది. ఆత్మను

దేవుడని అనుకొన్నప్పుడు ఈ వాక్యము సరిపోవును. ఆత్మ, దేవుడు కాకున్నా

దేవుడని చెప్పవలసి వచ్చినది. ఆత్మ, దేవుడుగా యుండు అధికారమును

దేవుడే ఆత్మకు ఇవ్వడము జరిగినది. అందువలన వాక్యము (జ్ఞానము)


ఆత్మయేయైనప్పుడు అదే జ్ఞానమే అనగా అదే ఆత్మయే దేవుడైయున్నది

అని చెప్పవచ్చును. అందువలన యోహాన్ సువార్తలో వాస్తవమును చెప్పుచూ

వాక్యము దేవుడైయుండెను అని అన్నారు. వాక్యము అంటే ఏమిటి?

వాక్యము ఆత్మగా ఎట్లున్నది? ఆత్మ, దేవుడుగా ఎందుకు చెప్పబడుచున్నది?

అను వివరమంతా తెలిసిన తర్వాత యోహాన్ సువార్త మొదటి

అధ్యాయములోని మొదటి మూడు వాక్యములకు భావము పూర్తిగా అర్థమయి

వుంటుందనుకుంటాను. ఇంత వివరముగా చెప్పినా అర్థము కాకపోతే,

ఆత్మజ్ఞానము ఎప్పటికీ అర్థము కాదు. ఆత్మజ్ఞానము అర్థము కాకపోతే

దేవుని విధానము ఏమాత్రము తెలియదు. దేవుని విధానము తెలియుటకు

వాక్యము అను జ్ఞానమునుండి ప్రారంభము కావలెను. జ్ఞానము తెలిస్తే

జ్ఞానమే ఆత్మనీ, ఆత్మే దేవుడని తెలియగలదు.


సృష్టి జరిగినప్పుడు :- దేవుడు (పరమాత్మ) - ప్రకృతి - ఆత్మ - జీవాత్మ

సృష్టి జరిగిన తర్వాత :- (పరమాత్మ)  - ప్రకృతి - ఆత్మ - జీవాత్మ

సృష్టి జరిగిన తర్వాత :- ఆత్మ (దేవుడు) - ప్రకృతి - ఆత్మ - జీవాత్మ





సృష్ఠి జరిగినప్పుడు దేవుడు పని చేయువాడైయుండి తననుండి

ఒక స్త్రీ తత్త్వముగల ప్రకృతిని, తర్వాత పురుష తత్త్వము గల ఆత్మ, జీవాత్మలను

దేవుడు తయారు చేశాడు. దేవుడు పురుషుడిగా యుండి తనవలె పురుష

తత్త్వముగల రెండు ఆత్మలను తయారు చేశాడు. వాటినే ఆత్మయని ఒక

దానిని, జీవాత్మయని మరొక దానిని చెప్పుచున్నాము. దేవుడు సృష్ఠిని

తయారు చేసిన తర్వాత ప్రకృతి, ఆత్మ, జీవాత్మ ఏర్పడిన తర్వాత దేవుడు ఏ

పనిని చేయనివాడై అన్నిటికీ అనగా ప్రకృతికీ, ఆత్మకు, జీవాత్మకు సాక్షిగా

యుండిపోయాడు. అలా స్థబ్దతగాయున్న దేవుడు ఉన్నా లేనట్లే యగుచున్నది.


ఎప్పుడైనా భూమిమీద ధర్మములకు ముప్పుకలిగి, అధర్మములు చెలరేగిపోతే

అప్పుడు తన ఆత్మను భగవంతునిగా పంపి ధర్మములను నెలకొల్పును.

అప్పుడు కూడా ప్రత్యేకముగా తన ప్రతినిధిని తయారు చేయడము వలన

తాను పని చేయనట్లేయుంటున్నాడు. అయితే మిగతా కార్యములన్నియూ

ఆత్మయే చేయుచున్నది. సృష్ఠి తర్వాత దేవుని స్థానములో దేవుడు లేకుండా

పోవడము వలన దేవునిగా ఆత్మే పని చేయుచూ దేవుడున్నట్లే అందరినీ

నమ్మించుచున్నది. వాస్తవముగా సృష్ఠి తర్వాత దేవుడు నిరుపయోగమై,

ఏమీ చేయనివానిగా నిలచిపోయాడు. అందువలన దేవుడు లేనట్లేయని

చెప్పవచ్చును. దేవుడు లేని లోటును ఆత్మ తెలియకుండా చేయుచున్నది.

అట్లు దేవుని విషయము సర్దుపాటు చేయడము కొరకు తానే దేవునిగా

మారుచున్నది. అందువలన ద్వితీయ దైవగ్రంథములో వాక్యము

దేవుడైయుండెను అని చెప్పారు. దేవుడు వేరు వాక్యము వేరని ఈ

వాక్యములో తెలియుచున్నది. వాక్యము దేవుడు కాకున్నా దేవుడయి

యుండెను అని చెప్పారు. వాక్యము దేవుడుగా మారినదని ఈ వాక్య

మూలముగా తెలియుచున్నది. వివరముగా చెప్పితే వాక్యము ఆత్మకాగా,

ఆత్మ, దేవుడు కాగా వాక్యమయిన ఆత్మ, దేవునిగా యున్నాడని చెప్పడమైనది.

దేవుడు వేరు ఆత్మ వేరు అయినా ఎవరు ఆత్మనో, ఎవరు దేవుడో తెలియక

అందరూ పొరపడుచున్నారు.


వాస్తవముగా ఇప్పుడు సృష్ఠి తర్వాత దేవుడు లేడు. ప్రపంచములో

దేవుడు లేడని బయటికి తెలియకుండా ఆత్మే దేవుని స్థానమును భర్తీ చేయు

చున్నది. అందువలన ఆత్మ, జీవాత్మ పనులు చేయుచూ, ఒకవైపు ప్రకృతి

పనులు చేయుచూ, మరొకవైపు దేవునివలె తయారై దేవుడను పేరుతో

యున్నది. సృష్ఠి తర్వాత దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడుగా


యున్నాడు. నామ, రూప, క్రియలు లేనివానిని ఏమీ కానివాడు, ఏమీ

చేయనివాడు అని చెప్పవచ్చును. అట్లున్న వానిని ఉన్నాడనుటకంటే లేడని

చెప్పడము ఉత్తమమగును. దేవుని స్థానములో దేవుడు లేకపోతే

స్థానము ఖాళీగా యుండిపోవును అని అనకుండా ఆత్మ దేవునిగా

మారిపోవుచున్నది. అందువలన పైన మూడవ వాక్యములో “వాక్యము

దేవుడైయుండెను” అని చెప్పారు. ఈ వాక్యములను చాలామంది

వినుచున్నారు, చదువుచున్నారు. అయినా అందులోని నిగూఢమైన

రహస్యము సరిగా తెలియలేరనియే చెప్పవచ్చును.


ఇక్కడ దేవుడయిన ఆత్మ వాస్తవమును తెలియజేయు నిమిత్తము

వాక్యము దేవుడైయుండెను అని చెప్పడము జరిగినది. దేవుని పాత్రను

పోషించు ఆత్మ ఏ పనిని చేసినా, అటు జీవుని మీదనో లేక దేవుడే చేశాడని

దేవుని మీదనో చెప్పుచున్నది. దానివలన దేవుడు ఉన్నాడనియే అందరూ

నమ్ముచున్నారు. ఇక్కడ కొందరు దేవుడు లేడంటారా, దేవుడు లేకపోతే

ఈ విశ్వమునకంత ఎవరు పెద్ద? మీరు చిన్నగా దేవుని జ్ఞానమును బోధిస్తూ,

చివరకు దేవుడే లేడని నాస్తికవాదమును బోధిస్తున్నారే! అని అడుగవచ్చును.

కొందరిలో కల్గిన ఈ ప్రశ్నకు నా జవాబు ఈ విధముగా యున్నది. దేవుడు

దేవుని స్థానములో లేడని చెప్పుచున్నాము తప్ప, దేవుడు ఏమాత్రము లేడని

నేను చెప్పడము లేదు. దేవుడు ఏమి చేయుచున్నాడో తెలియదు. ఆయన

పని చేయడు అని చెప్పాము. దేవునికి మనుషులకు ఏమాత్రము సంబంధము

లేదు అని చెప్పాముగానీ, దేవుడు అసలుకే లేడని చెప్పలేదు. దేవుడున్నాడు

ఆయనకు పేరులేదు, పని లేదు, ఆకారము లేదు. అందువలన ఆయన

మనుషులతో సంబంధము లేకుండా యున్నాడు. ఆయన ధర్మములకు

హాని కల్గినప్పుడు మాత్రము తన ధర్మములను కాపాడు నిమిత్తము తన


ప్రతినిధిని పంపి పని చేయించి ధర్మములను పునరుద్ధరించును. ఆయన

తన ప్రతినిధి ద్వారా పనిని చక్కబెట్టును. అప్పుడు కూడా నేను దేవుడనని

చెప్పి పని చేయలేడు. దేవుని ప్రతినిధి దేవునితో సమానమైనా దేవుడని

చెప్పక భగవంతుడని మారుపేరు చెప్పుచున్నాడు. ఇతను దేవుడనిగానీ,

ఇతనికి ఈ లక్షణములున్నవనిగానీ, దేవున్ని గురించి ఇట్లున్నాడని లేక

అట్లున్నాడని గానీ చెప్పుటకు వీలులేకుండా యున్నాడు. దేవుడున్నాడు

ఎట్లున్నాడో ఎవరికీ తెలియదు. సృష్ట్యాదినుండి దేవున్ని చూచిన వాడుగానీ,

దేవునితో మాట్లాడినవాడుగానీ ఎవడూ లేడు. ప్రపంచములో దేనిని

గురించయినా చెప్పవచ్చునుగానీ, దేవుని గురించి ఎవరూ చెప్పలేరు.

అందువలన చేతకాని స్థితిలో దేవుడు అంతులేనివాడు, హద్దు లేనివాడు

అని అర్థమొచ్చునట్లు ‘అల్లాహ్' అని కృతయుగములోనే అన్నారు. దేవుడు

అన్నిటినీ ఆడించు ఆత్మకంటే పెద్దయిన దానివలన 'పరబ్రహ్మ' అని అన్నారు.

ఆత్మకంటే వేరయిన దానివలన 'పరమాత్మ' యని అన్నారు. వెదకినా

కనిపించడు కావున దేవులాడబడేవాడనీ 'దేవుడని' అన్నారు. జీవాత్మ,

ఆత్మలకంటే ఉత్తమ పురుషుడయినందున ఆయనను 'పురుషోత్తముడని’

అన్నారు. మొత్తము మీద దేవున్ని గురించి మీకూ తెలియదు నాకూ

తెలియదని ఒప్పుకోవడము మంచిది.


సృష్ఠి తర్వాత దేవుడు సాక్షిగా మారిపోయాడు. దేవుడు చూసేవాడే

గానీ చేసేవాడు కాదు. సృష్ఠి తర్వాత తాను చూసేవానిగా ఉండదలచిన

దేవుడు తన స్థానములో చేసేవాడుగా ఆత్మను ఉండునట్లు, ఆత్మకు దేవుడే

అధికారమిచ్చి నియమించాడు. ఆత్మ శరీరములో జీవాత్మతోపాటుయుంటూ

జీవుడు చనిపోయినప్పుడు వానిని అదే క్షణమే మరొక జన్మకు తీసుక

పోవుచున్నది. మరొక జన్మకు ఎక్కడికి తీసుకపోవాలి, అక్కడ ఆ శరీరములో


ఏమేమి కర్మలు అనుభవించాలని నిర్ణయములు చనిపోయిన సమయము

లోనే నిర్ణయించబడును. గతజన్మలో మనిషి చేసుకొన్న పాపపుణ్యములను

లెక్కించి దానికి తగిన జీవితముండునట్లు శరీరములోని ఆత్మే నిర్ణయము

చేయుచున్నది. ఆ నిర్ణయమును “తీర్పు తీర్చడము” అని అంటుంటారు.

ఆ తీర్పు చనిపోయిన సమయములోనే జరుగుచున్నది. జీవుడు

చనిపోవడము, తీర్పుతీర్చబడడము, తర్వాత జన్మకు పోవడము అన్నీ ఒక్క

క్షణములోనే జరిగిపోవుచుండును. ఇదంతా దేవుడు చేయవలసిన పని

అయినా దేవుడు తాను స్థబ్దతగా యుండిపోయి, తన స్థానములో ఆత్మను

నియమించి ఆత్మే అన్ని విధముల పనిని చేయునట్లు అధికారమును ఆత్మకు

ఇచ్చియున్నాడు. అందువలన ప్రతి మనిషి మరణములో ఆత్మే తీర్పు తీర్చి

మరుజన్మకు పంపుచున్నది. ఈ విషయమును గురించి క్రొత్త నిబంధనలో

యోహాన్ సువార్త, ఐదవ అధ్యాయములో 26, 27 వాక్యములయందు

చెప్పియున్న విషయమును గమనిద్దాము.


(యోహాన్ 5-26, 27) "తండ్రి ఏలాగున తనంతట

తానే జీవము గలవాడై యున్నాడో, అలాగే కుమారుడును తనంతట

తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము

అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక

తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను." (ఈ

వాక్యములో తండ్రి అని చెప్పిన చోట దేవుడని అర్థము చేసుకోవాలి.

అలాగే కుమారుడు అని చెప్పిన చోట ఆత్మయని అర్థము చేసుకోవాలి.)

తండ్రియని దేవున్ని, కుమారుడని ఆత్మను గురించి చెప్పారు. దేవుడు

ఆత్మకు తనవలెనుండు అధికారమిచ్చి తాను ఏమీ చేయక మౌనముగా

యున్నాడని వాక్యమును బట్టి తెలియుచున్నది.

దేవుడు తనవలె తన కుమారుడు అయిన ఆత్మయుండవలెనని,

తనను (దేవుని) ఘనపరచినట్లే తన కుమారున్ని కూడా అందరూ ఘనపరచ

వలెనని, తన కుమారుడయిన ఆత్మకు సర్వాధికారమును అప్పగించి

యున్నాడు. ఈ విషయము సత్యమని తెలియుటకు యోహాన్ సువార్త

ఐదవ అధ్యాయములో 22, 23, 24 వాక్యములను ఇప్పుడు చూస్తాము.

(యోహాన్ 5-22, 23, 24) "తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడుగానీ

తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారున్ని ఘనపరచ

వలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి

యున్నాడు. కుమారున్ని ఘనపరచనివాడు ఆయనను పంపిన

తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపినవాని యందు

విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి

రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో

నిశ్చయముగా చెప్పుచున్నాను.”


ఈ వాక్యములను బాగా అర్థము చేసుకోగలిగితే పరమాత్మ ఎంతో

ప్రేమతో తన కుమారుడైన ఆత్మకు తనవలె గౌరవముండునట్లు, తనను

ప్రజలు గుర్తించినట్లు ఆత్మను కూడా గుర్తించవలెనని తన పనిని చేయుటకు

ఆత్మకు, పరమాత్మ అధికారమును ఇచ్చినది. ఆత్మను ఎవడయితే గుర్తించడో,

వాడు పరమాత్మయిన దేవున్ని కూడా గుర్తించనట్లేయని తన కుమారుడైన

ఆత్మను ఘనపరచనివాడు (గౌరవించనివాడు) ఆయన (ఆత్మ) తండ్రియైన

పరమాత్మను కూడా గౌరవించడు. ఎవడయితే ఆత్మను పంపిన వానియందు

(దేవునియందు) విశ్వాసముంచువాడు జనన మరణములయందు లేకుండా

నిత్యము జీవనమైన దేవునిలో ఐక్యము పొందియున్నాడు. అనగా మోక్షము


పొందియున్నాడు. అటువంటివానికి మరణ స్థితియుండదు. రెండవ

జన్మ కర్మ తీర్పు యుండదు. వాడు మోక్షములోనికి పోయి ఉన్నాడని చెప్పి

యున్నారు. ఈ భావమును అంతటినీ చూచిన తర్వాత ఇలా అర్థమగు

చున్నది. దేవుడు తన స్థానములో లేకుండా, సృష్ఠికర్తగా కాకుండా, ఏ

కార్యమునకు కర్తగాలేకుండా పోయాడు. తన స్థానములో తన

కుమారుడయిన ఆత్మను నియమించి తాను చేయు పనులను పూర్తిగా

ఆత్మకే అప్పగించాడు. ఆత్మను తెలియగలిగితే, ఆత్మ చెప్పునదేమనగా!

తనను పంపిన దేవునియందు విశ్వాసముంచువాడు మరణములనుండి

విముక్తి పొంది మోక్షము పొందునని చెప్పాడు.


దేవుడేమో ఒకవైపు తన కుమారుడైన ఆత్మను గౌరవిస్తే, విశ్వసిస్తే

నన్ను విశ్వసించినట్లే, నన్ను గౌరవించినట్లేయని చెప్పుచున్నాడు. అదే

విధముగా కుమారుడైన ఆత్మ తనను పంపిన దేవున్ని విశ్వసిస్తే మీకు

మోక్షము లభించినట్లేయని అంటున్నాడు. ఒకరిమీద మరొకరు ఎంత

ప్రేమ కల్గి చెప్పుకొన్నట్లున్నది. నేను ముందే చెప్పియున్నాను. ఆత్మ అన్నీ

చేయుచున్నా అన్నీ దేవుని మీదనే చెప్పును. ఆత్మ తన తండ్రియైన దేవునికి

గౌరవము దక్కాలని తనను గూర్చి ఎక్కడా చెప్పుకోక చేయని దేవున్ని

గూర్చి చేశాడని చెప్పుచున్నది. దేవుడు తన కుమారుడైన ఆత్మకు తనవలె

గౌరవము దక్కాలని ఆత్మ చేతనే అన్ని కార్యములను చేయిస్తున్నది.

మరణములో మనిషిని కర్మ ప్రకారము జన్మను నిర్ణయించి (తీర్పును తీర్చి)

రెండవ జన్మకు పంపునట్లు ఆత్మచేతనే చేయించుచున్నది. ఆత్మ దేవునివలె

నిత్య జీవము కల్గి మరణించిన జీవుళ్ళను తిరిగి జన్మలకు పంపుచున్నది.

కుమారుడయిన ఆత్మకు జీవాత్మలయిన మనుమల్లను జన్మలకు పంపునట్లు,

వారి కర్మానుసారము నడిపించునట్లు గత జన్మల కర్మలను రెండవ జన్మకు


కేటాయించి పంపుటకు ఆత్మకు అధికారమును దేవుడిచ్చి, తర్వాత దేవుడు

విశ్రాంతిగా స్థబ్దతగా యుండిపోయాడు. ధర్మములకు ముప్పు కల్గినప్పుడు

మాత్రము ధర్మములను నెలకొల్పుటకు దేవుడు మనిషి రూపములో మారు

వేషములో వచ్చి తన ధర్మములను నెలకొల్పి పోవుచున్నాడు. అప్పుడు

కూడా దేవునిగా పని చేయకుండా మారువేషమైన భగవంతునిగా పనిని

చేయుచున్నాడు. మనిషి ధర్మములను స్థాపించలేడు. అట్లే దేవుడు

ధర్మములను స్థాపించలేదు. మనిషీకాని, దేవుడూకాని మనిషికి దేవునికి

మధ్యలో భగవంతుని పాత్రలో ధర్మములను పునరుద్ధరించడము

జరుగుచున్నది. అయితే భగవంతుడు భూమిమీదకు వచ్చినప్పుడు ఆయనను

ఎవరూ గుర్తించలేరు.


దేవుడు, ఆత్మ ఇద్దరే లోకములో ఆరాధింపదగిన వారుగా

యున్నారు. దేవుడు తాను ఆత్మకు పనిని అప్పజెప్పి మౌనముగా ఉండి

పోయినా, ఆత్మనే ఆరాధింపమని, గౌరవించమని దేవుడు చెప్పియున్నా,

ఆ విషయమే అర్థము కానివారు చాలామంది యున్నారు. బ్రహ్మవిద్యా

శాస్త్రమయిన ప్రథమ దైవగ్రంథములో దేవుని ఆరాధనలు మూడు

రకములుగా చెప్పబడియున్నవి. అక్కడ చెప్పిన మూడు ఆరాధనలు మూడు

యోగములని చెప్పారు. అందులో రెండు యోగములు ఆత్మను

ఆరాధించునవిగా యున్నవి. అట్లే ఒక యోగము నేరుగా దేవున్ని ఆరాధించు

నదిగా యున్నది. కర్మయోగము, బ్రహ్మయోగము అను రెండు యోగముల

ద్వారా ఆత్మ ఆరాధింపబడుచున్నది. భక్తియోగము అను మూడవ విధానము

ద్వారా నేరుగా దేవున్నే ఆరాధించినట్లగుచున్నది. ఎవరయితే భక్తియోగము

ద్వారా దేవున్ని ఆరాధించుచున్నారో వారు నేరుగా దేవుని సన్నిధికి

చేరుకొంటున్నారు.


మనుషులు చస్తూ పుట్టుచున్నప్పుడు, అనగా ఇప్పుడు మనమున్న

పరిస్థితిలో ఉన్నప్పుడు మనలనందరినీ మృతులని చెప్పవచ్చును. మృతులు

అనగా మరణము గలవారని అర్థము. నేడు లోకములో యున్నవారందరూ

మృతులుగాయున్నారు. జనన మరణ స్థితియుండు వారందరినీ మృతులని

అనవచ్చును. నిత్య జీవము అనగా మోక్షము. ఆరాధనలలో మూడవ

దయిన భక్తియోగము వలన మనిషి తొందరగా మృతులనుండి బయటపడి

జీవనములోనికి ప్రవేశించును. జీవనము, నిత్య జీవనము అనగా మోక్షము

పొందడము లేక దేవునిలోనికి ఐక్యమై పోవడమును నిత్య జీవితమును

పొందడము అని అందురు. ఈ విషయమై బైబిలు గ్రంథము యోహాను

సువార్త ఐదవ అధ్యాయములో 21వ వాక్యమును చూస్తే తెలుస్తుంది.

(యోహాన్ 5-21) "తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో

అలాగే కుమారుడును తన ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును.”


ఈ వాక్యము క్రైస్థవ లోకానికి మొత్తము అర్థమయివుండదని

అనుకుంటాను. భక్తియోగము అనుసరించిన వారిని దేవుడు జన్మలు

లేకుండా చేసి మోక్షమును పొందునట్లు చేయును. జన్మలు లేకుండా

చేసినప్పుడు మరణము లేదు కదా! జన్మ ఉంటే మరణముండును.

మరణము పొంది తిరిగి జన్మించువాడు తిరిగి మరణమును పొందవలసిందే.

అందువలన అటువంటి వానిని చచ్చేవాడనీ, మృతము కలవాడని, మృతుడని

అనవచ్చును. అందువలన మనుషులను దేవుడు మృతులని అన్నాడు.

ఎప్పుడయితే మనిషి మోక్షమును పొందునో అప్పుడు అమృతుడై పోవును.

తిరిగి చచ్చేదిలేదు, పుట్టేది లేదు. భక్తియోగము వలన ముక్తి పొందవచ్చును.

భక్తియోగము వలన దేవుడే మనిషికి ముక్తిని కల్గించును. ఇక్కడ కూడా

ఆయన (దేవుడు) ఏమాత్రము పనిని చేయకుండా భక్తియోగమును


అనుసరించిన వాడు ముక్తి పొందునట్లు చేయుచున్నాడు. దేవుడు భక్తి

యోగమును అనుసరించిన వారిని మృత్యువు నుండి ఎలా కాపాడి

బ్రతికించునో అని అంటే, బ్రతికించడము అన్నప్పుడు మోక్షమును

కల్గించడము అని అర్థము చేసుకోవలెను. వాక్యములో “తండ్రి మృతులను

ఎలాగు లేపి బ్రతికించునో" అని ఉండడమును మనిషిని చావునుండి

తప్పించి నిత్య జీవనము (బ్రతుకులోనికి) చేర్చుచున్నాడని అర్థము

చేసుకోవలసి యుండును.


“తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు

అయిన ఆత్మ తన ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును” అని వాక్యములో

యున్నది. ఆరాధనలలో కర్మయోగము, బ్రహ్మయోగము అను రెండు

యోగములను ఆచరించిన వాని కర్మలు ఎప్పుడు లేకుండా పోవునో,

అప్పుడు వారికి దేవునితో సంబంధము లేకుండా ఆత్మే మోక్షమును

కల్గించును. ఆత్మే స్వయముగా మోక్షమును కల్గించు అధికారము దేవుడు

ఆత్మకు ఇచ్చాడు. అందువలన తండ్రి భక్తియోగము ఆచరించిన వారికి

మోక్షమును కల్గించినట్లు కర్మ, బ్రహ్మ యోగములను ఆచరించిన వారికి

ఆత్మ మృతులనుండి బయటికి తీసి బ్రతికించుచున్నది. (జీవనము ఇచ్చు

చున్నది.) అందువలన “తండ్రి ఎలాగు మృతులను లేపి బ్రతికించునో

కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించును” అని ఉన్నది.


శరీరములో జీవాత్మతోపాటు యున్న ఆత్మను ఇంకా బాగా అర్థము

చేసుకొనుటకు దేవుడు ఎన్నో వాక్యములను చెప్పాడు. ముఖ్యముగా దేవుడు

అనగా జీవునికి భిన్నముగా యుండేవాడు. జీవుడు చావు పుట్టుకలను

పొందుచుండగా, దేవుడు చావు పుట్టుకలు లేనివాడైయున్నాడు. జీవుడు

పనిని చేసి కర్మను అనుభవించుచుండగా, దేవుడు ఏ పనిని చేయనివాడై


ఏ అనుభవము లేనివాడై యున్నాడు. జీవుడు మృతుడుగా యుండగా,

దేవుడు అమృతుడుగా యున్నాడు. అమృతుడు అనగా చావులేనివాడు.

ఎల్లప్పుడు నిత్య జీవనములో యున్నవాడని అర్థము. దేవుడు ఎల్లప్పుడు

ముక్తిలోనే యున్నాడని చెప్పవచ్చును. దేవుడు ఆదినుండి తనంతట తాను

చావుపుట్టుకలు లేనివాడై నిత్యజీవము గలవాడై యున్నాడు. అలాగే

కుమారుడైన ఆత్మ దేవునివలె తనంతట తాను జీవముగలదై యున్నది.

ఆత్మ కూడా జనన మరణములు లేవు. దేవుడు నిత్యజీవితము గలవాడై

యున్నట్లు ఆత్మ కూడా నిత్య జీవితము గలదై మరణము లేనిదై యున్నది.

ఈ విషయమును తెలుపు నిమిత్తము యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము

26వ వచనములో ఈ విధముగా గలదు చూడండి. (5-26) “తండ్రి

ఎలాగు తనంతట తాను జీవముగలవాడై యున్నాడో, అలాగే

కుమారుడు తనంతట తానే జీవము గలవాడై యుండుటకు

కుమారునికి అధికారము అనుగ్రహించెను."


ఇదంతా చూచిన తర్వాత శరీరములోని ఆత్మకు దేవుడు

అధికారమిచ్చి తనంతటివానిగా తన కుమారుడైన ఆత్మను తీర్చిదిద్ది అధికార

మిచ్చాడని తెలియుచున్నది. దానివలన ఆత్మ దేవునివలె నిత్య జీవము

కలదై యుండడమేకాక, జీవుని మరణములో తీర్పుతీర్చునదై యున్నది.

కర్మప్రకారము జీవుడు జీవితమును గడుపునట్లు, ఆత్మే అన్ని పనులు చేసి

జీవున్ని కర్మను అనుభవింప చేయుచున్నది. దేవుడున్నా లేనట్లే అయిపోయి,

కదలక మెదలక ఏమీ చేయక స్థబ్దతగాయుండిపోయి, తన కార్యములన్నిటినీ

నెరవేర్చుటకు ఆత్మకు అధికారమిచ్చి తనంతటివానిగా ఆత్మను చేశాడు.

తండ్రియైన దేవుడు నియమించినట్లు ఆత్మ పని చేయుచు బయటికి

దేవుడు చేసినట్లే చెప్పుచున్నది. ఆత్మజ్ఞానము బాగా తెలిస్తేగానీ దేవుడు


చేయువాడు కాదు, ఆత్మ చేయుచున్నదని తెలియును. ఆత్మజ్ఞానము

తెలియనివారికి దేవుడే అన్ని పనులు చేసినట్లుండును. తండ్రియైన దేవుడు

తన కుమారుడైన ఆత్మకు తనవలె హోదా, గౌరవముగా ఉండవలెనని నిత్య

జీవితమును, తీర్పు తీర్చు అధికారమును ఆత్మకు ఇచ్చాడు. ఆత్మ ఆదియందే

దేవుని చేత సృష్టించబడినది. ఆత్మ ఆదియందే ఉన్నది. ఆత్మ దేవునివద్ద

యున్నది. దేవుడిచ్చిన అధికారము చేత ఆత్మ దేవుడైయున్నది. ఆత్మను

వాక్యముగా చెప్పుచూ యోహాను సువార్త మొదటి వాక్యములో ఆదియందు

వాక్యముండెను అని అన్నారు. రెండవ మాటగా వాక్యము దేవునివద్ద

యుండెను అని అన్నారు. మూడవ వాక్యముగా వాక్యము

దేవుడైయుండెను అని చెప్పారు. దానికి ఉపమానముగా గూటిలో

దారముండెను, దారము దూదివద్దయుండెను, దారము దూదియై

యుండెను. దేవుడు చెప్పిన వాక్యము, దేవుడు అనుమాటలకు సమానముగా

దారము, దూది సరిపోవుచున్నది. దారము దూదే, దారము దూదివద్దనుండె

వచ్చుచున్నది. ఈ విషయము అర్థమైతే ఆత్మ యొక్క జ్ఞానము అర్థమగును.

ఇంతవరకు ఇంజీలు గ్రంథములో చెప్పిన మూడు ప్రథమ వాక్యముల

వివరము తెలుసుకొన్నాము. ఇక చివరిగా అంతిమ దైవగ్రంథము యొక్క

మూడు ప్రథమ వాక్యములను చూస్తాము.


ప్రశ్న :- చిన్న సంశయము దేవుడు ఏ పనిని చేయడు సరే ఒప్పుకుంటాము.

చివరిలో ధర్మములను నెలకొల్పుటకు భగవంతునిగా దేవుడే వచ్చి తన

ధర్మములను ప్రతిష్ఠించును అని యున్నది కదా! అప్పుడు ధర్మప్రతిష్టాపన

పని చేసినట్లే కదా! దేవుడు పనిచేయడు అనేదానికి సరిపోదు కదా!

దేవుడు కూడా ఒక సమయములో పని చేయుననే తెలియుచున్నది కదా!

దీనికి మీరేమంటారు?


జవాబు :- దేవుడు పని చేయడు అనేది శాసనము. శాస్త్రబద్ధమైన దానిని

శాసనము అని అంటాము. శాసనము అనగా శాపమువలె జరిగితీరును.

దేవుడు ఒకప్పుడుగానీ, ఎప్పుడుగానీ సృష్ఠి తర్వాత పని చేయలేదు. దేవుడు

స్వయముగా భగవంతునిగా వస్తే విశ్వమంతా అణువణువునా యున్న

దేవుడు ఖాళీ అయిపోయి ఒక్క భగవంతునిలో మాత్రము నిండుకొని

యున్నాడని చెప్పవలసి వస్తుంది. అలా ఎప్పుడూ జరుగలేదు. అంతటా

వ్యాపించిన దేవుడు ఎప్పటికీ అలాగే యుండును. ఆయన తన ధర్మములను

నెలకొల్ప వలసి వస్తే మానవునిగా అవతరిస్తానని భగవద్గీతలో జ్ఞాన

యోగమను అధ్యాయమందు 7, 8 శ్లోకములలో చెప్పియున్నాడు.


యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ ।

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥


భాములు :- “భూమిమీద ఎప్పుడు ధర్మములకు ముప్పుకల్గి అధర్మములు వృద్ధి

చెందునో అప్పుడు నేను అవతరింతును.” “నేను మనిషిగా అవతరించి నప్పుడు

మంచివారి (జ్ఞానుల) సంఖ్య పెరుగునట్లు, అజ్ఞానుల సంఖ్య తరుగునట్లు

చేయుచున్నాను. నా ధర్మములను నేను పునరుద్ధరించడము వలన అజ్ఞానుల

సంఖ్య తరిగి, జ్ఞానుల సంఖ్య పెరుగుచున్నది" యని చెప్పియున్నాడు.

దేవుడు మనిషిగా అవతరిస్తాను అని అన్నాడు. గతములో

రెండుమార్లు మనిషిగా వచ్చి తన ధర్మములను తెలియజేసిపోయాడు.

అప్పుడు కనిపించే మనిషిగా వచ్చినా, అప్పుడు ఆయనను మనిషి అనుటకు

వీలులేదు. అంతిమ దైవగ్రంథము ఖురాన్లో 15వ సూరాలో 28వ


వాక్యమందు (15-28) “నేను మట్టితో ఒక మనిషిని తయారు

చేయబోతున్నాను” అని ముందే చెప్పాడు. 29వ ఆయత్లో (15-29)

“నేను అతనిని పూర్తిగా తయారు చేసి నా ఆత్మను ఊదినప్పుడు

మీరంతా అతని ముందు సాష్టాంగ పడండి. (15-30) “దేవత

లందరూ సాష్టాంగపడ్డారు" అని వుంది. ఇక్కడ "మనిషిని తయారు

చేసి నా ఆత్మను ఊదినప్పుడు, ఆ మనిషి సజీవమైనప్పుడు మీరు అతని

ముందు సాష్టాంగ పడండి, దేవతలందరూ సాష్టాంగపడ్డారు” అని

చెప్పియున్నారు కదా! ఇక్కడ గమనించవలసిన పని ఏమనగా! దేవుడు

తన ఆత్మను మనిషి బొమ్మలోనికి ఊదినప్పుడు అందులో దేవుని ఆత్మ

చేరినదిగానీ దేవుడు చేరలేదు. దేవుడు తన ప్రతినిధిగా ధర్మ స్థాపనకు ఒక

మనిషివలెనున్న వ్యక్తిని పంపినప్పుడు అతను సాధారణ మనిషి కాదు.

కావున ఆయన ముందర సాష్టాంగ పడండియని మనుషులకు చెప్పాడు.

అంతేకాక దేవతలందరూ సాష్టాంగ పడినారని కూడా చెప్పాడు. అప్పుడు

వచ్చిన ఆత్మ దేవునికి ప్రతినిధిగా వచ్చినది కావున దేవునితో సమానముగా

యుండి దేవుని పని చేయునదిగా వచ్చినది. అందువలన మనిషిగా వచ్చిన

ఆయనకు “భగవంతుడు" అని పేరు వచ్చినది. భగవంతుడు అనగా ఒక

విధముగా దేవుని ప్రతినిధియని చెప్పవచ్చును. దేవుని కార్యములను

మనిషిగాయుండి చేయు దేవుని ఆత్మను భగవంతుడు అని అంటున్నాము.

మనిషి శరీరములో ఉండు ఆత్మ, భగవంతుని శరీరములో యుండు ఆత్మ

రెండూ ఒక్కటే. అయినా మనుషుల శరీరములో యుండు ఆత్మ కర్మ

ప్రకారము జీవున్ని నడుపుచుండును. కర్మ అయిపోతే మోక్షమునకు కూడా

పంపును. అయితే భగవంతుని శరీరములోయుండే ఆత్మ మనుషుల కర్మలకు

సంబంధించిన పనిని చేయలేదు. దేవుని భావమునకు తగిన విధముగా


మనుషులకు జ్ఞానము తెలియజేయుటకు భగవంతుని ఆత్మ వచ్చినది.

మనిషి శరీరములో, భగవంతుని శరీరములోగల రెండు ఆత్మలు ఒక్కటే

అయినా వాటి పనులు వేరుగాయున్నవి. మనిషి శరీరములోని ఆత్మ

కర్మప్రకారమే జీవున్ని ఆడించుచున్నది. భగవంతుని శరీరములోని ఆత్మ

దేవుని ధర్మములను తెలియజేయును. దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు

దేవుడు ప్రపంచమంతా మొదట ఎట్లున్నాడో, భూమిమీద భగవంతుడు

యున్నప్పుడు కూడా అట్లే అణువణువునా వ్యాపించి యున్నాడు.

భగవంతుడు దేవుని తరపున దేవుని పనిని చేయను వచ్చాడుగానీ, దేవుడు

పనిని అప్పుడు కూడా చేయలేదనియే చెప్పవచ్చును. తండ్రి పనిని

కుమారుడైన ఆత్మే చేయుచున్నది గానీ తండ్రియైన దేవుడు చేయలేదు.

ఆత్మ మనిషి శరీరములో యున్నప్పుడు ధర్మములను ప్రచారము చేయదు.

అప్పుడు మనిషి భావమును బట్టి, వాని కర్మనుబట్టి అధర్మములను కూడా

బోధించును. ప్రత్యేకముగా భగవంతునిగా వచ్చినప్పుడు మాత్రము ఆత్మ

ధర్మసంస్థాపన చేయును. అందువలన ధర్మసంస్థాపనలో భగవంతుని

శరీరములో యుండే ఆత్మ పని చేయుచున్నది. దేవుడు ఏమాత్రము పని

చేయలేదని తెలియుచున్నది. భక్తియోగము ద్వారా మోక్షము పొందు

సమయములో కూడా దేవుడు పని చేయలేదు. దేవుడు స్వయముగా

ముందే ఏర్పరచిన పద్ధతి ప్రకారము కర్మ అయిపోయిన వెంటనే జీవాత్మ

ముక్తి పొందుట జరుగుచున్నది. అక్కడ ఆత్మ ప్రమేయము కూడా లేదని

చెప్పుచున్నాము. ఆత్మయున్నంత వరకు దేవుడు పనిచేయడు. ఆత్మ

లేకుండా పోదు, దేవుడు లేకుండా పోడు. దేవుడు నిత్యజీవము గలవాడై

యున్నాడు. అట్లే ఆత్మ కూడా నిత్య జీవముగలదియై యుండునట్లు మొదట

దేవుడే చేశాడు. అందువలన దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు, అట్లే ఆత్మ

ఎల్లప్పుడూ ఉండును. ఎవరూ లేకుండా పోరు. ఇప్పుడు ఖురాన్లోని

ప్రథమ వాక్యములను చూస్తాము.

ప్రశ్న :- :- అంతిమ దైవగ్రంథములో ప్రథమ వాక్యములని మీరు చెప్పుచూ

రెండవ అల్బఖర సూరాలో అదియూ 2వ ఆయత్ నుండి మొదటి వాక్యమును

ప్రారంభించుచున్నారు. (2-2,3,4) ఆయత్లను ప్రథమ వాక్యములని

అంటున్నారు. వరుస సంఖ్యనుబట్టి మొదటి సూరాలోని మొదటి వాక్యములు

వరుసగా 1, 2, 3 అగును కదా! అలా వరుస క్రమమును వదలి మొదటి

వాక్యములని రెండవ సూరాలో రెండవ వాక్యమునుండి చెప్పవలసిన

అవసరము లేదు కదా! మా అనుమానమును తీర్చమని కోరుచున్నాము.

జవాబు :- దేవుడు జ్ఞానమునకు విలువ నిచ్చుచున్నాడుగానీ, వరుస

క్రమమునకు విలువనివ్వడు. ఎక్కడ జ్ఞానము మొదలయినదో అక్కడినుండి

మూడు వాక్యములను లెక్కించవలెనని గ్రంథము మొదటిలోనే చెప్పాము.

అందువలన అల్ ఫాతిహా సూరాలోని వాక్యములు జ్ఞానవాక్యములు కావు

అవి దేవుని ప్రార్థనా వాక్యములు. అందువలన ఆ వాక్యములను మొదటి

వాక్యములుగా తీసుకోలేదు. రెండవ సూరాలో రెండవ వాక్యమునుండి

జ్ఞానము ప్రారంభమయినది. అక్కడ రెండవ సూరా మొదటి వాక్యము

యొక్క అర్థము ఎవరికీ తెలియని దానివలన, అక్కడ వాక్యము కూడా

లేకుండా కేవలము ఒక పదము మాత్రముండుట వలన, రెండవ వాక్యము

నుండి మూడు ప్రారంభ వాక్యములను తీసుకోవలసి వచ్చినది.


అంతిమ దైవగ్రంథములో ప్రథమ వాక్యము (2-2) “ఇది (ఖురాన్)

ఒక దివ్య గ్రంథము. ఇందులో ఏమాత్రము సందేహము లేదు.

దైవభీతి కలవారికి ఇది మార్గదర్శకత్వము” రెండవ వాక్యము (2-3)

“ఎవరైతే అగోచర యదార్థ విషయాన్ని విశ్వసిస్తారో, నమాజును

స్థాపిస్తారో, మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి

(మా మార్గములో) ఖర్చు చేస్తారో." మూడవ వాక్యము (2-4)


“ఎవరైతే నీపై అవతరింపజేసిన దానిని (ఈ ఖురానాను) మరియు

నీకు పూర్వము అవతరింపజేయబడిన వాటిని (రెండు దివ్య

గ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢముగా

ఎవరయితే నమ్ముతారో" అని చెప్పబడియున్నది. మొదటి వాక్యములో

అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథమును గురించి చెప్పుచూ 'ఇది

ఒక దివ్య గ్రంథమని, ఇది దైవభీతి కలవారికి మార్గదర్శినియని' చెప్పారు.

ఇది స్థూలమైన వాక్యమే అగుట వలన ఇందులో వాక్యములో చెప్పినది

అందరికీ అర్థమయి వుంటుంది. ఈ వాక్యము మొట్టమొదటనే గ్రంథము

యొక్క ప్రాధాన్యతను తెలియజేసినది. దేవుని మార్గములో ప్రయాణించు

వానికి దారిచూపే గ్రంథమని కూడా చెప్పారు. ఇక రెండవ వాక్యములోనికి

పోయి చూస్తే ఇక్కడ కొంత అగోచరమైన సూక్ష్మ జ్ఞానము ఇమిడియున్నది.

రెండవ వాక్యములో గల సూక్ష్మ అర్థమేమి కలదని చూస్తే ఈ విధముగా

అర్థమగుచున్నది. ఈ ఆయత్ మూడు భాగములుగా కలదు. మూడు

భాగములు సూక్ష్మ అర్థముతోనే యున్నవని చెప్పవచ్చును. మొదటి భాగము

“ఎవరయితే అగోచర యదార్థ విషయమును నమ్ముతారో” యని గలదు.

ఇక్కడ 'అగోచర’ అనగా “కంటికి కనిపించని” అని అర్థము. అంతేకాక

ఇక్కడ మాత్రము ఐదు జ్ఞానేంద్రియములకు తెలియని విషయము అని

అర్థమగుచున్నది. శబ్ద, రూప, రస (రుచి), గంధ, స్పర్శలకు ఏమాత్రము

తెలియని విషయమును అగోచర విషయమని అన్నట్లు తెలియుచున్నది.

అగోచర యదార్థ విషయము అనగా తెలియబడని సత్యమైన విషయమును

ఎవరయితే నమ్మగలరోయని వాక్యములో చెప్పారు. అగోచర విషయమును

నమ్మినప్పుడే సత్యమని తెలియగలదు. మనిషికి తెలిసినా తెలియకపోయినా

సత్యమైన విషయమే అగోచరముగా యున్నది. అగోచరముగాయున్న

దానిని నమ్మవలెనంటే చాలా కష్టము. చాలామంది కనిపించే దానినే

నమ్మగలరు గానీ కనిపించని దానిని నమ్మలేరు. కొందరు భౌతికవాదులు

అభౌతికమును ఏమాత్రము నమ్మమని చెప్పుచుందురు. భౌతికము అనగా

కనిపించేది, అభౌతికము అనగా కనిపించనిదని అర్థము.


భౌతికము, అభౌతికము (కనిపించేది, కనిపించనిది) ఎలా కలవంటే

శరీరము కనిపించుచున్నది కావున భౌతికము అని అనవచ్చును.

శరీరములో శ్వాస ఆడునప్పుడు ఆ శరీరములో జీవుడున్నాడనుట

యదార్థము. అయితే జీవుడు కనిపించడు కావున జీవుడు అభౌతికము

అని అనవచ్చును. జీవుడు అనేవాడు నమ్మదగిన యదార్థమే (సత్యమే)

అయినా వానిని నమ్మలేనంతగా కనిపించకయున్నాడు. శరీరము బ్రతికి

యున్నది కావున జీవుడు శరీరములో యున్నాడు అనుట నూటికి నూరు

పాళ్ళు సత్యమే. అయితే జీవుడు అభౌతికముగా కనిపించకయున్నాడు.

అందువలన కొందరు జీవున్ని కొంత నమ్మి కొంత నమ్మలేకున్నారు. కొందరు

జీవుడున్నాడనుటకు ప్రత్యక్షసాక్ష్యముగా శరీరములో జీవుని స్పందన

యున్నది, శ్వాసయున్నది. కావున జీవున్ని సత్యమని చెప్పుచున్నాము.

ఎంత నమ్మినా జీవుడు కనిపించక పోవడము వలన నమ్మలేనివారు

చాలామంది యున్నారు. మన శరీరములో జీవుడు, దేవుడు ఇద్దరూ

అగోచరముగా యున్నారు. జీవుడు, దేవుడేకాక వారి ఇరువురి మధ్యలో

ఆత్మయుంటున్నది. మొత్తము మూడు ఆత్మలు శరీరములో నివసించుచూ

అనేక కార్యముల రూపముగా అనేక సందర్భములలో వాటి ఉనికిని

చాటుకొనుచున్నా ఈ మూడు ఆత్మలు అగోచరమైనవయి నందున

నమ్మలేకపోవుచున్నారు. కొంత జ్ఞానము తెలిసినవారు మూడు ఆత్మల

విషయమును కొంత తెలిసినా, మూడు ఆత్మలున్నట్లు ఏమాత్రము బయటికి

తెలిసే నిర్ధారణగానీ, నిరూపణగానీ లేదు. లోపల యున్న ఆత్మల పనులు

బయట శరీరములో కనిపించుచుండినా కొంత సత్యమని తెలిసినా, ఆ

పనులు మూడు ఆత్మలవేనని చెప్పుటకు ఆధారములేదు.


అభౌతికము భౌతికములో యున్నా, అభౌతికము కనిపించని దాని

వలన, యదార్థ అగోచర విషయములను చాలామంది నమ్మలేక పోవు

చున్నారు. అటువంటి విషయములను ఎవరయితే నమ్మగలరో వారే

సాఫల్యమును పొందగలరు అని చెప్పియున్నా వాటిని గురించి ఆలోచించే

వారుగానీ, తెలియాలను ప్రయత్నము చేయువారుగానీ లేరు. అందువలన

అగోచర విషయమును మొదటే నమ్మమని చెప్పువారు గలరు. కొందరు

హేతువాద సంఘములనీ, నాస్తికవాద సంఘములనీ పేర్లు పెట్టుకొన్న

వారు దేవుడు ఒక అభూత కల్పన అనీ, దేవున్ని నిరూపించవలెనను

ప్రయత్నములో జీవుడు అనేవాడిని ఆస్తికవాదులు తెరమీదికి తెచ్చారనీ,

జీవుడు, దేవుడు ఇద్దరు కల్పితమేననీ, జీవుడు, దేవుడు అనే వాళ్ళు ఇద్దరు

ఉన్నారని చెప్పుటకు కర్మయనే మరొక దానిని కల్పించి చెప్పుచున్నారు.

ఇవన్నియూ అసత్యములే. శరీరములో రసాయన చర్య జరుగుచున్నంత

వరకు మెదడు పనిచేయుచున్నది. మెదడు చెప్పినట్లు కార్యములు జరుగు

చున్నవి. ఎప్పుడయితే రసాయనిక చర్య ఆగిపోవునో అప్పుడు ఏ

అవయవము పనిచేయదు. మెదడులో కూడా పని ఆగిపోవును. దానినే

మరణము అంటున్నాము అని హేతువాదులు చెప్పుచుందురు. కొందరు

వారు చెప్పు మాటలనే వినుచున్నారు. అభౌతికమయినది లేనే లేదు అని

చెప్పుచుందురు. అభౌతికము అనేది పూర్తి అసత్యము అని కొందరు

సంఘములను పెట్టుకొని ప్రచారము చేయుచున్నారు. ఈ విధముగా

జీవుడు, దేవుడు అనేవి పూర్తి సత్యమే అయినా, వాటిని నమ్మని వారుండుట

వలన ఎవరు విశ్వసిస్తారోయని చెప్పవలసి వచ్చినది.

తర్వాత విషయము నమాజుల గురించిన విషయము. నేడు

నమాజ్ అని దేవుని ప్రార్థనను అంటున్నాము. దేవుని దృష్ఠిలో ఇంతవరకు


మనుషులు నమాజ్ చేయలేదను భావముతో ఇప్పుడు ఎవరయితే నమాజును

నెలకొల్పుతారోయని చెప్పారు. నమాజు అనే ప్రార్థనను ముస్లీమ్ సమాజము

మొత్తము ప్రతి దినము చేయుచున్నది. ప్రపంచములో అన్ని మతముల

కంటే ఎక్కువ ప్రార్థనలో కాలము గడిపేవారు, ఎక్కువగా ప్రార్థన చేసేవారు

ముస్లీమ్ మతములో యున్నారు. అలా ఉండగా మీరు (మనుషులు)

నమాజ్ (ప్రార్థన) చేయలేదని చెప్పుచున్నారేమిటి? యని అడుగవచ్చును.

దానికి నా జవాబు ఈ విధముగా గలదు. ముస్లీమ్లు మిగతా రెండు

మతముల కంటే ప్రార్థన విషయములో ముందుగలరు. వారి జీవితములో

ప్రార్థనకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుచున్నారు. అయితే వారు చేయునది

వాస్తవముగా ప్రార్థన కాదు. ఏ మాటగానీ, ఏ మంత్రముగానీ ప్రార్థనలో

యుండకూడదు. ఒకమాటను ఉచ్ఛరించుచూ చేయు ప్రార్థన తపస్సు

క్రిందికి వస్తుంది. తపస్సువేరు, ప్రార్థన వేరు, ప్రార్థనను యోగము అని

బ్రహ్మవిద్యా భాషలో చెప్పగలము. ప్రార్థన ఏదో తెలియక తపస్సును

ఆచరించుచూ తాము యోగము (ప్రార్థన) చేశామని అనుకొంటున్నారు.

మనుషులు అందరూ పొరపడిపోయి ఒక మంత్రమును జపించు హిందువు

తాను చేయునది ప్రార్థన అని అనుకుంటున్నాడు. అట్లే నోరు మెదుపుచూ

మాటలతో గట్టిగా అడిగినట్లు మాట్లాడుచూ క్రైస్తవులు ప్రార్థన చేయుచున్నారు.

హిందువులకు మంత్రములు, క్రైస్థవులకు మాటలుండడము వలన అది

ప్రార్థన కాలేదు. అలా చేయునది ప్రార్థనయని మనము అనుకొనినా అది

ప్రార్థన కాదు తపస్సగును.


రెండు మతములుగా యున్న హిందువులలో, క్రైస్తవులలో ప్రార్థన

(యోగము) లేదు ఉన్నదంతా తపస్సేయని అర్థమయినది. దేవుని ప్రార్థన

విషయములో మొదటి వరుసలో యున్నారను ముస్లీమ్లు కూడా మనస్సులో

ఏడు ఆయత్లను స్మరించుచుండుట వలన అది కూడా తపస్సు క్రిందికే


వచ్చినది. తపస్సులకంటే యోగమే శ్రేష్ఠమయినది అని ప్రథమ దైవగ్రంథము

భగవద్గీతయందు ఆత్మ సంయమ యోగములో 46వ శ్లోకమున చెప్పి

యున్నారు చూడండి.


శ్లోకము॥ 46.

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోతి మతోధికః |

కర్మిభ్య శాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ॥


భావము :- “యోగి తపస్వికుల కంటే ఉత్తముడు, అధికుడు. కర్మముల

చేయువారికంటే గొప్పవాడు. జ్ఞానులకంటే ఘనుడు. అయినందున అర్జునా

నీవు యోగివేకమ్ము" అని భగవంతుడు అర్జునునకు చెప్పాడు. ఈ విధముగా

యోగము తపస్సులకంటే శ్రేష్ఠమయినందున, యోగము వలననే దేవుడు

తెలియుట వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడడు కావున తెలియక

చేసెడి తపస్సులను వదలి యోగమే ఆచరించుట మేలు. ఇదే విషయమునే

అంతిమ దైవగ్రంథమందు ప్రథమ వాక్యములలో (2-3) వాక్యమందు

'నమాజును నెలకొల్పువాడు' అని చెప్పియున్నాడు. అలా చెప్పియుండుట

వలన నేడు నమాజ్ అనునది సరియైన పద్ధతిలో లేదనీ, అది పడిపోయిన

నమాజ్ యున్నదనీ, దానిని తిరిగి ప్రతిష్ఠించవలెనని, దానినే నెలకొల్పమని

చెప్పడమని అర్థము చేసుకోవలెను. ఖురాన్లో చెప్పబడిన వాక్యమునుబట్టి

మనము నేటినుండి నమాజ్ను తిరిగి నెలకొల్పుటకు ప్రయత్నిద్దాము.

నమాజ్ అంటే అర్థమును మొదట తెలియగలిగితే, తర్వాత నమాజ్ను

ఎలా నెలకొల్పాలను నిర్ణయానికి రావచ్చును. 'నమాజ్' అను పదములో

మూడు శబ్దములు కలిసిన పదముగా యున్నది. నమాజ్ను విడదీసి

చూస్తే న, మ, జ్ అను మూడు అక్షరములు కనిపించుచున్నవి. అందులోగల

ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క అర్థముగలదు. 'న' అనగా వద్దు అనీ, 'మ’

అనగా నాకు అనీ, ‘జ్’ అనగా జన్మలనీ అర్థము. అన్నీ కలిపి చూస్తే 'నాకు

జన్మలు వద్దని' అర్థము గలదు.


'నాకు జన్మలు వద్దు' అను భావముతో ఎవరూ ప్రార్థన చేయడము

లేదు. జన్మలు వద్దు అంటే పరోక్షముగా ఈ లోకము వద్దు పరలోకమయిన

మోక్షము కావలెనని అర్థము. ఒక్క హిందూమతములో తప్ప మిగతా

మతములలో జన్మలు లేవు అను అపోహలోనే యున్నారు. ముందే ఆ

విధముగా యుండడము వలన ఎవరూ ప్రార్థనలో జన్మలు వద్దు అనే

ఉద్దేశ్యము కల్గియుండలేదు. నమాజ్ విషయము సంపూర్ణముగా తెలియ

వలెనంటే మా రచనలలోని "గీటురాయి” గ్రంథమును చదవండి. అప్పుడు

నమాజ్ను నెలకొల్పండి అను మాటకు పూర్తిగా వివరము తెలియును.

నమాజ్ (ప్రార్థనలో) దేవుని భావము వేరుగాయుండగా మనుషులు ఇంకొక

విధానములో ప్రార్థన చేయుచూ అదే నిజమైన ప్రార్థన అనుకోవడము

మంచిది కాదు. మనుషులు చేయు ప్రార్థన అన్ని మతములలోనూ సరిగా

లేనందున, ఖురాన్ గ్రంథములో మూడు ప్రథమ వాక్యములలో దేవుడు

నమాజ్ను గురించి చెప్పుచూ, ఎవడు నమాజు స్థాపిస్తాడో వాడు తన

మార్గములో ఉన్నవానిగా గుర్తింపబడునని తెలియజేశాడు. అంతేకాక

రెండవ వాక్యములో మరియొక మాట కూడా చెప్పాడు. అదేమనగా!

మేము ప్రసాదించిన జీవనోపాధినుండి నా మార్గములో ఎవరు ఖర్చు చేస్తారో

యని చెప్పడమైనది.


అయితే మనుషులు ఈ మాటను కూడా సరిగా అర్థము

చేసుకోలేదని తెలియుచున్నది. ఈ విషయమును కూడా పూర్తి బాహ్యముగా

అర్థము చేసుకొన్నారు. ఇది పూర్తి అంతరార్థము గల వాక్యమని గ్రహించ

లేకపోయారు. చాలామంది ముస్లీమ్ సోదరులు తప్పుగా అర్థము చేసుకొని

దేవుడు చెప్పినట్లు ప్రవర్తించక దానికి అన్యముగా ప్రవర్తించుచున్నారు.

దేవుడు మనిషికి ప్రసాదించునది ధనమని తలచి, మనిషికి గల ధనములో

పేదవారికి కొంత దానము చేయాలను ఉద్దేశ్యముతో తమవద్ద గల ధనము


దేవుడిచ్చినదని అనుకొని కొంత ధనమును పేదలకు అదే పనిగా దానము

చేయుచుందురు. ఈ విషయములో జ్ఞానము ప్రకారము చూస్తే ధనము

మనిషి చేసుకొన్న కర్మ వలన కల్గుచున్నది. ఎవడు ధనవంతుడైనా, ఎవడు

పేదవాడయినా అది వాని కర్మనుబట్టి జరిగియుండును. పేద, ధనిక

అనునది కర్మనుబట్టి యుండునప్పుడు ధనమును దేవుడు ఇచ్చువాడు

కాదు కదా! దేవుడు ప్రపంచ ధనమును ఇవ్వడు. దేవుడు ఇచ్చునది జ్ఞాన

ధనము. దేవుడు జ్ఞానమును ప్రసాదించును. మనిషికి ధనము కర్మ

వలన కలిగినట్లు దైవజ్ఞానము అను జ్ఞాన ధనము దేవుడు ఇస్తే మనిషికి

లభించును. కర్మ ప్రసాదించునది ప్రపంచ ధనముకాగా, దేవుడు

ప్రసాదించునది దేవుని జ్ఞానము. మనిషికిగల శ్రద్ధనుబట్టి దేవుడు జ్ఞానమును

ప్రసాదించగా మనిషి జ్ఞానవంతుడు అయినప్పుడు, దేవుడు ప్రసాదించిన

జ్ఞానమును జ్ఞానము లేనివారికి పంచడము జ్ఞానియొక్క కర్తవ్యము.

ఎవడయితే దేవుడిచ్చిన జ్ఞానమును దేవుడు చెప్పినట్లు దేవుని మార్గములోనే

జ్ఞానములేని ప్రజలకు జ్ఞానమును అందించితే నిజముగా వాడు దేవుని

సేవ చేసినట్లగును.


దేవుని మార్గము ప్రకారము దేవుని జ్ఞానమును తెలియగలిగి, తాను

తెలిసిన జ్ఞానమును ఇతరులకు తెలుపు పనిని ఎవడు చేయునో వాడు

నిజముగా దేవుని సేవ చేసినవాడగును. అందువలన వాక్యములో

ఎవడయితే దేవుడు ప్రసాదించిన జ్ఞానమును దేవుని మార్గములో ఖర్చు

చేయునో వాడు దేవుని మార్గములో యున్నట్లేనని చెప్పడమైనది. ఈ

వాక్యము సరిగా అర్థము చేసుకోలేని చాలామంది గుడిమెట్ల దగ్గర, దర్గాల

ముందర కూర్చొని అడుక్కొంటున్న వారికి డబ్బులు దానము చేయుచూ

దేవుడిచ్చిన ధనమును దేవుడు చెప్పినట్లు పేదవారికి దానము చేయుచున్నా

మని చెప్పుకొనుచు తృప్తి పొందుచుందురు. అలా తృప్తి చెందడము

తెలియని తనమేయని, అలా చేయడము అజ్ఞానమేయని తెలిసిపోవుచున్నది.

అందువలన దేవుడు చెప్పిన వాక్యముల జ్ఞానమును సక్రమముగా అర్థము

చేసుకోవలెనని లేకపోతే దేవుని మార్గమునుండి తప్పిపోయి మాయ

మార్గములో ప్రయాణించినట్లగునని అర్థమగుచున్నది. ఇక మూడవ

వాక్యములో అనగా సూరా రెండు నాల్గవ ఆయత్లో ఈ విధముగా చెప్పి

యున్నారు.


(2-4) “ఓ ప్రవక్తా! ఎవరైతే నీపై అవతరింపజేయబడిన

దానిని (ఈ ఖురాన్ గ్రంథమును) మరియు నీకు పూర్వము

అవతరింపజేయబడిన దివ్య గ్రంథాలను (భగవద్గీత, బైబిలు లేక

తౌరాతు, ఇంజీలులను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని

దృఢముగా నమ్ముతారో" అని చెప్పబడియున్నది. ఈ వాక్యములో

ఒక్క ఖురాన్ గ్రంథమే కాకుండా, దానికంటే ముందువచ్చిన తౌరాతు,

ఇంజీలు (భగవద్గీత, బైబిలు) గ్రంథాలను కూడా ఎవరయితే దైవ

గ్రంథములుగా విశ్వసిస్తారోయనీ, వాడు దేవుని మార్గములో యున్నట్లేయని

చెప్పుచున్నారు. దాని ప్రకారము నేడు తన మత గ్రంథమువలె ఇతర మత

గ్రంథములను కూడా గొప్పగా ఎవడు చూచునో వాడు జ్ఞాని కాగలడని

అర్థమగుచున్నది. అయితే నేడు మతము అనునది మనుషుల మెదడులో

లోతుగా పాతుకొనిపోయి ఉన్నది. ఇది అది అని చెప్పేదానికి వీలు లేకుండా

అన్ని మతములలో ఇతర మతముల మీద ద్వేషము పూర్తిగాయున్నది.

అటువంటప్పుడు వేరువేరు మత గ్రంథములుగా మూడు గ్రంథములకు

పేర్లుపెట్టి, భగవద్గీత హిందువులదని, బైబిలు క్రైస్తవులదని, ఖురాన్

ముస్లీమ్లదని ప్రచారము చేసుకొన్నారు. ఆయా గ్రంథములలో మతముల

ప్రసక్తి ఏమాత్రము లేకున్నా ప్రజలే గ్రంథములకు మతములను కరిపించి

ఒక్కో మతమునకు ఒక్కో గ్రంథమని చెప్పుచున్నారు.


గ్రంథములలో దైవజ్ఞానమున్నా, ఏ గ్రంథమయినా సర్వ మానవాళికి

యను ఉద్దేశ్యములో అదే మాటను చెప్పి వ్రాసియున్నా మనుషులు

మాత్రము మూడు గ్రంథములను మూడు మతములవారివని చెప్పుచూ

ఒక్కో మతము వారు ఒక్కొక్క గ్రంథమును 'ఇది మా గ్రంథము' అని

అంటున్నారు. ఒకటి ఒక మతమునకు సంబంధించిన గ్రంథము కాగా

మిగతా రెండు గ్రంథములు మిగతా రెండు మతముల వారికి సంబంధించి

నవిగా చెప్పుచున్నారు. హిందువులు క్రైస్తవులనినా, బైబిలు గ్రంథమనినా

పూర్తిగా అసహ్యించుకొనుచుందురు. అట్లే ముస్లీమ్లు క్రైస్థవులను వారి

గ్రంథమును చూచి పరమత సంబంధమని అసూయ భావము

కల్గియుందురు. ఇట్లు ప్రతి మతములోను పరమతము మీద అసూయ

90 శాతముండుట వలన వారికంటే మేమే పెద్దయనియూ, వారి

గ్రంథములకంటే మా గ్రంథమే గొప్పయను భావము అన్ని మతములలో

గలదు. అటువంటి సందర్భములో ముస్లీమ్లు అంతిమ గ్రంథము అయిన

ఖురాన్ గ్రంథమే మిగతా రెండు గ్రంథములకంటే గొప్పయను భావము

కల్గి యుండుట వలన అదే ఖురాన్ గ్రంథములో ఖురాన్ గ్రంథముకంటే

ముందు వచ్చిన భగవద్గీత, బైబిలు అను రెండు గ్రంథములను ఎవడయితే

విశ్వసిస్తాడో, వాడు దేవుని మార్గములో యున్నట్లే లేకపోతే వాడు మాయ

మార్గములో యున్నట్లేయని చెప్పాడు. తమ గ్రంథములో ఈ మాటను

చెప్పియున్నా, దేవుని మాటను గుర్తించక తమ గ్రంథమే గొప్పయని

చెప్పుకొను ముస్లీమ్లు దేవుని మాటను ధిక్కరించినట్లగుచున్నది.


గతములో వచ్చిన గ్రంథములకంటే చివరిగా వచ్చిన ఖురాన్

గ్రంథమునందు పాత జ్ఞానమును వదలిపెట్టి క్రొత్త జ్ఞానము చెప్పియున్నారు.

పాత గ్రంథముల జ్ఞానముకంటే నవీనముగా వచ్చిన జ్ఞానము నేడు


మనుషులకు ఎంతో అవసరము అని కొందరు ముస్లీమ్లు చెప్పడము

నేను స్వయముగా విన్నాను. వారి మాటలను విని ఖురాన్ గ్రంథమును

చూస్తే ఖురాన్ గ్రంథములో అన్ని గ్రంథములను గౌరవముగా చూడవలెనని,

అన్ని గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానమున్నదని తెలిసినది. అంతేకాక

స్వయముగా ఖురాన్ గ్రంథమే మిగతా రెండు గ్రంథములలో జ్ఞాన జ్యోతి

కలదనీ, మార్గదర్శకము రెండు గ్రంథములలోయున్నదని చెప్పడము

జరిగినది. అంతేకాక ఖురాన్ గ్రంథములో సూరా ఐదు, ఆయత్ 68లో

ఇలా చెప్పారు. (5-68) “మీరు తౌరాతును ఇంజీలు (భగవద్గీత,

బైబిలు) గ్రంథములను, మీ ప్రభువు తరపునుండి మీ వద్దకు

పంపబడిన ఖురాన్ గ్రంథమును మీ జీవితాలలో నెలకొల్పువరకు

మీరు ఏ ధర్మములో లేనట్లే" యని చెప్పారు. ఖురాన్లోనే అనేకచోట్ల

మూడు గ్రంథములను సమానముగా చూడవలెనని చెప్పియున్నారు. పై

వాక్యమును చూచినా దేవుడు చెప్పిన మూడు గ్రంథములు ఒక్కటేయని

దేనినీ అసూయతో చూడకూడదని తెలియుచున్నది. అట్లు అసూయతో

చూచినవాడుగానీ, అసూయతో మాట్లాడిన వాడుగానీ దేవుని మార్గములో

లేనట్లేయనీ, మాయ మార్గములో ఉన్నట్లేయని చెప్పవచ్చును.


అంతిమ గ్రంథములోని మూడు ప్రథమ వాక్యములలో మొదటి

వాక్యము ఒక భాగముగాయుండి, ఖురాన్ గ్రంథమును గురించి మాత్రము

తెలిపియుండగా, రెండవ వాక్యము మూడు భాగములుగాయుండి, ఒక

భాగములో అగోచరమైన ఆత్మలను గురించి చెప్పియుండగా, రెండవ

భాగములో నమాజ్ స్థాపన గురించి చెప్పడమైనది. మూడవ భాగములో

దేవుడిచ్చిన జ్ఞానమును ఇతరులకు పంచమని చెప్పియున్నారు. మూడవ

వాక్యము రెండు భాగములుగాయుండి ఒక భాగములో మూడు దైవ



గ్రంథములను సమానముగా చూడమని చెప్పియున్నారు. రెండవ

భాగములో పరలోకమును గురించి చెప్పియున్నారు. ఇప్పుడు చివరిగా

పరలోకమును గురించి ఏమి చెప్పియున్నారో ఒకమారు చూస్తాము.

పరలోకమును గురించి పరలోక జీవితమును గురించి ఎవరు విశ్వసిస్తారో

వారు దేవుని మార్గములో యున్నట్లేయని చెప్పడమైనది. పరలోకమును

గురించి ఇప్పుడు వివరముగా చెప్పుకొందాము.


లోకములు మూడు గలవు. వాటిని విడిగా చెప్పుకొంటే ఒకటి

స్వర్గలోకము, రెండు నరకలోకము, మూడు పరలోకము. లోకము అనగా

అనుభవించు స్థలము. సుఖములను, సంతోషములను అనుభవించు

స్థలము ఎక్కడగలదో అక్కడే స్వర్గలోకము గలదు. దుఃఖము, కష్టములు

అనుభవించు స్థలము ఎక్కడగలదో అక్కడే నరక లోకమున్నట్లు

చెప్పవచ్చును. రెండు లోకముల తర్వాత మూడవ లోకము కలదు. రెండు

లోకములకంటే వేరుగా, భిన్నముగా యుండుట వలన దానిని పరలోకము

అని అన్నాము. సుఖదుఃఖములకు, కష్టము సంతోషములకు సంబంధము

లేనిదై, ప్రకృతికి సంబంధము కానిదై దైవత్వమునకు సంబంధించినదై

యుండునది పరలోకము. లోకము అనగా అనుభవించు స్థలము అన్నారు

కదా! స్వర్గలోకములో సుఖము, నరకలోకములో దుఃఖము అనుభవించు

చుందురు కదా! అదే విధముగా పరలోకములో ఏమి అనుభవము కలదని

కొందరు అడుగవచ్చును. దానికి నా జవాబు ఈ విధముగా కలదు.

ఆత్మ, జీవాత్మలు కానిది, ఆ రెండు ఆత్మలకంటే వేరయినది పరమాత్మ

కదా! అలాగే స్వర్గ నరకములు కానిది పరలోకము కదా! రెండు ఆత్మలకంటే

వేరుగాయున్న పరమాత్మను రెండు లోకములకంటే వేరుగా యున్న

పరలోకములో అనుభవించడము జరుగుచున్నది. పరమాత్మను


అనుభవించడము అనగా దేవునిలో చేరియుండడము అనియూ, లేక

దేవుడైయుండడము అనియూ అనేక రకములుగా చెప్పవచ్చును. దానిని

మోక్షము, ముక్తి అని కూడా అందురు.


స్వర్గ, నరక లోకములు రెండూ ఇహ లోకములోనే అనగా భూమి

మీదనే గలవు. అవి ఎక్కడో ఉన్నాయని అనుకోవడము పొరపాటు. ఇదే

భూమిమీదనే మనిషి స్వర్గ సుఖములను, నరక కష్టములను దుఃఖములను

అనుభవించుచున్నాడు. అదే విధముగా పరలోకమును పొంది దేవుని

అనుభవించువాడు కూడా ఇదే విశ్వములోనే అనుభవించుచున్నాడు. దేవుడు

విశ్వమంతా వ్యాపించియున్నాడు, కావున మనిషి మోక్షము పొందితే

పరలోకమును పొంది అణువణువునా వ్యాపించిపోయి దేవునిలో కలిసి

యున్నాడు. దేవునిలో అనుభవించేది ఏమీ ఉండదు. జీవుడు దేవునికంటే

వేరుగాయుంటే అనుభవించేది ఉంటుంది. జీవుడే దేవునియందు చేరి

దేవుడైయుండుట వలన వాడు ప్రత్యేకముగా స్వర్గనరకములవలె

అనుభవించుటకు అక్కడ ఏమీ యుండదు. ఏదయినా అనుభవించుటకు

జీవుడు అక్కడ ఉండడు. దేవునివద్దకు చేరిన జీవుడు దేవుడై పోవుచున్నాడు.

ఎందరు చేరినా అంతమంది ఒకే దేవుడుగా మారిపోవుచున్నారు. జీవుడు

ఎవడూ దేవునియందు వేరుగా లేడు, కనుక అనుభవించేది ఏదీలేదు.


ఒక జీవుడు జన్మకల్గి శరీరమును ధరించి యున్నంతవరకు వానికి

కర్మయుండును. కర్మ రెండు రకములు. పాపము మరియు పుణ్యము

అను రెండు రకముల కర్మ వలన మనిషి (జీవుని) జీవితము గడచుచుండును.

మనిషి జీవితములో కర్మను అనుభవించుటే జీవితముగా ముఖ్యమైన వృత్తిగా

యుండును. అట్లు అనుభవించడమునే పాపపుణ్యములను అనుభవించు

చున్నట్లు లేక స్వర్గ సుఖములను నరక యాతనలను అనుభవించినట్లని


చెప్పవచ్చును. మనిషి జీవితములో సుఖదుఃఖములను తప్ప ఇతరము

ఏమీ అనుభవించలేదు. అజ్ఞానులయిన జీవులకు జీవితమంతా సుఖ

దుఃఖములతో నిండియుండును. మనుషులలో జ్ఞానులయిన వారికి కొంత

తేడా గలదు. జ్ఞానము లేని మనిషి ఎక్కువ సుఖము అనుభవించినప్పుడు

గానీ, ఎక్కువ దుఃఖము అనుభవించినప్పుడుగానీ ఒక హద్దును దాటిన

సంతోషము అనియూ, హద్దు మీరిన దుఃఖము అనియూ చెప్పవచ్చును.

హద్దుదాటి అనగా ఒక పరిమితి దాటి దుఃఖమును అనుభవించినప్పుడు

కళ్ళకు నీళ్ళు వచ్చును. అట్లే ఒక పరిమితి దాటి సంతోషమును

అనుభవించినప్పుడు కూడా కళ్ళకు నీళ్ళు వచ్చును. ఇది అంతయూ స్వర్గ

నరకములలో యుండే విధానమేయని చెప్పవచ్చును. 


మనుషులు ఎక్కువగా దుఃఖమునే పొందుచుందురు. కావున

వారికి ఏడుపు వచ్చి కళ్ళనీళ్ళు వచ్చును. మనిషి ఎక్కువ పరిమితి దాటిన

సుఖమును అనుభవిస్తే కళ్ళకు నీళ్ళు వచ్చును. అయితే మనిషి అజ్ఞాన

జీవితములో సంతోషము వలన కళ్ళకు నీళ్ళు రావడము చాలా తక్కువ.

అలాంటి సంఘటన అరుదుగా జరుగుచుండును. దీనినిబట్టి మనిషికి

పాపమే ఎక్కువ యున్నది. స్థాయిని మించిన పుణ్యము లేదని తెలియు

చున్నది. స్థాయిని మించిన పాపము ఉండుట వలన స్థాయిని మించిన

దుఃఖము వలన ఏడ్పు వచ్చి కళ్ళనీళ్ళు వస్తున్నవి. దీనినిబట్టి మనిషి

జీవితమంతా స్థాయిని మించిన పాపములో యున్నదిగానీ, పరిమితిని

మించిన పుణ్యములో లేదని తెలియుచున్నది. ఇదంతయూ సాధారణ

మనిషి జీవితములో, ఏమాత్రము జ్ఞానము తెలియని మనిషి జీవితములో

జరుగుచున్నది. అదే మనిషి కొంత ఆత్మజ్ఞానము తెలిసియుంటే సుఖ

దుఃఖములను అనుభవించునప్పుడు కన్నీరు వచ్చునట్లు జ్ఞాని అయినవాడు

ఆత్మజ్ఞానమును మాట్లాడునప్పుడుగానీ, ఆత్మజ్ఞానమును వినునప్పుడు గానీ,

ఆత్మ జ్ఞానమును చదువునప్పుడుగానీ అమితమైన ఆనందమును

పొందుచున్నాడు. అందువలన ఆ సమయములో ఆ వ్యక్తికి కళ్ళకు నీరు

వచ్చుచుండును. అది సాధారణ సంతోషము కాదు. సాధారణ దుఃఖము

కాదు. ప్రపంచ సంబంధ సుఖదుఃఖము లేనప్పుడు, మనిషి ఒక పరిమితిని

మించి ఆత్మానందమును పొందునప్పుడు కళ్ళకు నీళ్ళు రావడము జరుగు

చుండును. అటువంటిదే కొందరికి మరొక అనుభవములో కూడా వచ్చును.

గత జన్మలలో వంద, రెండు వందలు లేక అంతకంటే ఎక్కువ జన్మల క్రింద

ఆత్మజ్ఞానమును బోధించిన వ్యక్తి ప్రస్తుత జన్మలో కనిపించినప్పుడు ఏమీ

తెలియకుండానే కళ్ళకు నీళ్ళు రావడము జరుగును. అప్పుడు కూడా అది

ప్రపంచ సుఖదుఃఖముల వలన రావడములేదు. ఇవన్నీ కొందరి జీవితము

లలో జరిగియుండవచ్చును, జరిగియుండక పోవచ్చును. కొన్ని సంఘటనల

వెనుక యున్న రహస్యమును తెలియజేశాము. ప్రపంచ సుఖదుఃఖములకు

సంబంధము లేకుండా వచ్చు కన్నీరు ఆత్మ సంబంధమైన సుఖమునకు

సంబంధించినదని తెలియవలెను. మనిషి ప్రపంచములో జీవిత సంబంధ

కర్మలనే కాక జ్ఞానమును తెలియగలిగితే, అరుదుగా ఆత్మానందమును

కూడా అనుభవించవచ్చునని తెలియుచున్నది. పరలోక అనుభవము

ఆత్మానందముకంటే మించినదని సూచాయిగా తెలియుచున్నది.


సమాప్తము.

ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే

ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.


అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,


సత్యమును వేయిమంది కాదనినా, అది అసత్యము కాదు.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024