ఆదిత్య cloud text 17th sep 24 Updated.



ఆదిత్య.


ఈ మధ్య కాలములో ఒక ముస్లీమ్ సోదరుడు మా ఖుర్ఆన్న

మనుషులు వ్రాయలేదు, దేవుడు ఇవ్వగా ఆకాశమునుండి దిగి వచ్చినదని

చెప్పగా విన్నాము. ఆ మాటను అతను స్వయముగా చెప్పకున్నా ముస్లీమ్

పెద్దలు ఎవరయినా చెప్పగా విని చెప్పుచుండునని అనుకొన్నాము. అతని

ఉద్దేశ్యములో హిందువుల భగవద్గీతగానీ, క్రైస్తవుల బైబిలుగానీ మనుషులు

వ్రాయగా తయారయినవనీ, ఖుర్ఆన్ మాత్రము మనుషులు వ్రాయకుండా

దేవుడే పైనుండి నేరుగా మనుషుల వద్దకు పంపాడని అనుకొనుచుండుట

వలన, అతను ఆ విధముగా చెప్పాడు.


ప్రశ్న :- దైవ గ్రంథములు మూడని మీరు చెప్పుచుండుట మేము

చాలామార్లు చూచాము. భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమని మీరే చెప్పారు.

అట్లే ఇంజీలు (బైబిలు) ద్వితీయ దైవగ్రంథమని, ఖుర్ఆన్ అంతిమ

దైవగ్రంథమని మీరే చెప్పగా విన్నాము. అటువంటప్పుడు ప్రథమ, ద్వితీయ

దైవగ్రంథములు రెండూ మనుషుల రచన కాగా, అంతిమ దైవగ్రంథము

మాత్రము పై నుండి నేరుగా దేవునివద్ద నుండి దిగివచ్చినదని అనడము

శాస్త్రబద్ధమైన వాక్యమంటారా?


జవాబు :- ముస్లీమ్ సోదరుడు చెప్పిన మాటలో కొంత సత్యమున్నదిగానీ,

సత్యము ఎలాగున్నదని వారికి తెలియదు. దేవునినుండి వచ్చిన దైవ

జ్ఞానముతో కూడుకొనియున్నవి భూమిమీద మూడు గ్రంథములే గలవు.

అయితే ఆ మూడు గ్రంథములు మనుషుల చేత వ్రాయబడినవేనని చెప్పక

తప్పదు. మూడు గ్రంథములు దైవజ్ఞానముతో నిండుకొనియుండుట వలన

“దేవుని జ్ఞానమును దేవుడు తప్ప ఏ మానవుడు చెప్పలేడు” అను సూత్రము

ప్రకారము మూడు గ్రంథములలోని జ్ఞానమును చెప్పినవాడు దేవుడేనని


చెప్పవచ్చును. అయితే దేవుడు మూడు గ్రంథములలో ఏ ఒక్క గ్రంథమును

గానీ దేవుడే స్వయముగా వ్రాయడముగానీ, లేక పైనుండి ఇవ్వడము గానీ

చేయలేదు. అట్లు చేశాడనడము శాస్త్ర విరుద్ధమగును. దేవుడు తన

జ్ఞానమును పై నుండి ఇచ్చినది వాస్తవమే, అయినా గ్రంథరూపములో

ఇవ్వలేదు. దేవుడు తన జ్ఞానమును మనుషులకు ఇచ్చు విషయములో

అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్అందే సూరా 3, ఆయత్ 7 నందు

ఇలా చెప్పాడు. “దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని”

చెప్పాడు. అంతేకాక సూరా 42, ఆయత్ 51లో ఇలా చెప్పాడు. (42-51)

“దేవుడు ఏ మానవునితోనూ నేరుగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము

మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా

(వహీ ద్వారా) లేక తెరవెనుకనుంచో మనిషికి చేరవేస్తాడు. లేదా తాను

కోరినది తన ఆజ్ఞతో సూచించటానికి తన ప్రతినిధిని పంపుతాడు.

ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు" ఈ విధముగా దేవుడు

చెప్పి యున్నాడు, కనుక దేవుడు జ్ఞానమును మనుషులకు తెలియజేయుదు

నని చెప్పాడు గానీ, గ్రంథరూపములో తెలియచేస్తానని, గ్రంథరూపములో

పై నుండి ఇస్తానని చెప్పలేదు. తన మూడు విధానములలో మొదటిది

శబ్దము (వాణి) ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. ఆ విధానము సృష్ఠి

ఆదిలోనే జరిగిపోయినది. ఆకాశవాణి ద్వారా దేవుడు తన జ్ఞానమును

మనుషులకు పంపడము జరిగినది. అలా వచ్చిన జ్ఞానము శబ్దరూపముతో

వచ్చినది గానీ, గ్రంథరూపములో రాలేదు. శబ్దరూపములో వచ్చిన దానిని

బోధ అంటాము. మొదట బోధ రూపములో శబ్దముగా వచ్చిన జ్ఞానము

మూడు యుగముల తర్వాత గ్రంథములుగా వ్రాయడము జరిగినది.

అంతవరకు దేవుని జ్ఞానము బోధరూపములోనే యుండెడిదిగానీ గ్రంథముగా

లేదు.



కృతయుగము, త్రేతాయుగము లేక త్రేతాయుగము, ద్వాపర

యుగము గడువగా ద్వాపర యుగము చివరిలో బోధరూపముగా యున్న

జ్ఞానము గ్రంథరూపముగా మారినది. అంతవరకు బోధరూపముగాయున్న

జ్ఞానమునకు “జపర” అను పేరుండెడిది. జపర అను పేరు కాలక్రమమున

మార్పుచెంది నేడు ఆ పేరు “జబుర” గా మారియున్నది. జపర అనగా

పుట్టిన దానికంటే వేరుగా యున్నదని అర్థము. ప్రపంచము పుట్టినది.

పుట్టిన ప్రపంచముకంటే వేరుగా యుండుట వలన 'జపర' అని చెప్పబడినది.

‘జ’ అనగా పుట్టినదని అర్థము. 'పర' అనగా వేరయినదని అర్థము. 'జపర'

అనగా పుట్టినదానికంటే వేరయినది దేవుని జ్ఞానమని తెలియునట్లు

పేరుంచబడినది. అది కాస్తా మారిపోయి అర్థము లేనిపేరుగా 'జబుర'

అని పిలువబడుచున్నది. నేడు కొందరు ముస్లీమ్లు వరుసగా నాలుగు

గ్రంథముల పేర్లు చెప్పుచుండగా విన్నాము. వారు చెప్పిన పేర్లు వరుసగా

జబుర, తౌరాత్, ఇంజీలు, ఖుర్ఆన్ అని చెప్పారు. ఆ మాటను వినిన

మేము 'జబుర' అనునది గ్రంథమా? అని అడిగాము. అప్పుడు వారు

గ్రంథమేయని చెప్పారు.


వాస్తవముగా 'జబుర' అనునది గ్రంథమే కాదు. అది దేవుడు

ఆకాశమునుండి వాణి ద్వారా అందించిన జ్ఞానము బోధరూపమైయుండగా

దానినే 'జపర' అని చెప్పడమైనది. పుట్టిన ప్రకృతికి వేరుగాయున్న జ్ఞాన

మైనందున జపర అని అర్థసహిత పేరును చెప్పడమైనదిగానీ, జపర

(జబుర) గ్రంథము కాదు. జపర జ్ఞానము ముందు భగవద్గీతగా

వ్రాయబడినది. తర్వాత కాలము జరుగుకొద్దీ ఇంజీలు గ్రంథముగా, ఖుర్ఆన్

గ్రంథముగా వ్రాయబడినది. ఈ విధముగా 1400 సంవత్సరముల పూర్వము

ఖుర్ఆన్ గ్రంథరూపమైనది. ఖుర్ఆన్ అరబ్బీ భాషలో వ్రాయబడగా, ఇంజీలు


(బైబిలు) హెబ్రీ భాషలో, భగవద్గీత సంస్కృత భాషలో వ్రాయబడినాయి.

ఈ విధముగా మూడు యుగముల తర్వాత దేవుడు మొదట చెప్పిన జ్ఞానము

గ్రంథములుగా మారినది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము ఒక్కటే, వేరువేరు

కాలములలో, వేరువేరు పేర్లతో, వేరువేరు గ్రంథములుగా తయారయినది.

అందులో మొదటిది భగవద్గీత, చివరిది ఖుర్ఆన్ గ్రంథము.


ప్రశ్న :- ముందు వచ్చిన ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలోనూ,

చివరిలో వచ్చిన అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనూ,

మధ్యలోనున్న ఇంజీలు గ్రంథములోనూ ఒకే జ్ఞానముంటే, ఒకే దేవుని

గురించి చెప్పియుంటే భగవద్గీతలో దేవున్ని “పరమాత్మ” అని అన్నారు.

చివరి గ్రంథమయిన ఖుర్ఆన్లో “అల్లా” అన్నారు. ఒకే దేవున్ని ఒకచోట,

పరమాత్మయనీ, మరొకచోట అల్లాయనీ ఎందుకు చెప్పారు? అలా

చెప్పడము వలన భగవద్గీతలోని దేవుడు వేరు, ఖుర్ఆన్లోని దేవుడు వేరని

అనుకొనుటకు అవకాశమున్నది కదా! అలాగే ఆ రెండు గ్రంథములలోని

జ్ఞానము కూడా వేరువేరుగా యున్నదని ఎందుకు అనుకోకూడదు?

గ్రంథము పేరు వేరు, దేవుని పేరు వేరు, జ్ఞానము కూడా చూచేదానికి

వేరుగానే కనిపించుచున్నది. అటువంటప్పుడు రెండు గ్రంథములు వేరుగా

యున్నవని భగవద్గీత హిందువులది, ఖుర్ఆన్ ముస్లీమ్లదని ఎందుకు

చెప్పకూడదు? దేవుని పేరు, గ్రంథము పేరు, చెప్పిన కాలము, చెప్పిన

ప్రవక్త పేరు అన్నియూ వేరుగాయుండుట వలన రెండు గ్రంథములు

వేరువేరుగా యున్నాయని, వాటిలోని దేవుడు, దేవుని జ్ఞానము వేరని

మేము ఎందుకు చెప్పకూడదు? గ్రంథముల పేర్లు 'ప్రథమ', 'అంతిమ’

అనియుండుట వలన భగవద్గీత పురాతనమైన ఎడ్లబండిలాంటిది. చివరిలో

క్రొత్తగా వచ్చిన ఖుర్ఆన్ గ్రంథము క్రొత్త కారులాంటిది. పాత ఎడ్లబండికి


క్రొత్త కారుకు ఎంత తేడాయుండునో అంతే భేదము భగవద్గీతకు ఖుర్ఆను

ఉన్నదని మేము చెప్పుచున్నాము. క్రొత్తగా వచ్చిన కారులో ప్రయాణించుట

సులభము, సంతోషదాయకము. పాత ఎడ్లబండిలో ఒక సంవత్సరమునకు

పోగల దూరమును క్రొత్తకారులో కొన్ని గంటలలో పోవచ్చును. అందువలన

పాత కాలములోని భగవద్గీతను వదలి ఈ మధ్య కాలములో చివరగా

వచ్చిన ఖుర్ఆనన్ను ఆశ్రయించి ఇస్లామ్ ప్రకారము నడువడము వలన

దేవుడు ఒప్పుకొనును. దేవుని మార్గములో నడచినట్లగును అని నేను

అనుకొంటున్నాను. నేనే కాక చాలామంది ఇస్లామ్ పెద్దలు, ఇస్లామ్

సంస్థలు నడుపు వారు “పాత భగవద్గీతను వదలండి, నవీనముగా వచ్చిన

ఖుర్ఆన్ను నమ్ముకోండి, అల్లాను ఆరాధించండి" అని చెప్పుచున్నారు.

మీరేమో మూడు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని అంటున్నారు. మీ

మాట నిజమా? వారి మాట నిజమా? ఎవరి మాటను నమ్మాలి?


జవాబు :- నన్ను అడిగితే నా మాటను నమ్మమని అంటాను. ఒకవేళ

వారిని అడిగితే వారి మాటనే నమ్మమంటారు. అలా అడిగితే ఆ సమస్య

తీరదు. నేను చెప్పుమాట సరియైనదని ఎవరికి వారు అనడము సహజము.

అట్లు కాకుండా శాస్త్రబద్ధత దేనియందు కలదో గమణించి దానినే

నమ్మడము మంచిది. దేవుడు చెప్పిన జ్ఞానము అందరికీ సమానముగా

ఉంటుంది గానీ ఎక్కువ తక్కువలుగానీ, ఉచ్ఛనీచములుగా గానీ యుండదు.

హిందువులు 'పరమాత్మ' అనినా, ముస్లీమ్లు 'అల్లా' అనినా, పిలువబడే

పేర్లు వేరయినా దేవుడు ఒక్కడేయని చెప్పవచ్చును. భాష వేరయినా

భావము ఒక్కటేయండును. తెలుగు భాషలో 'భోజనము' అనినా, తమిళ

భాషలో 'సాపాడు' అనినా, హిందీలో 'ఖానా' అనినా, కన్నడములో 'ఊట’

అని అన్ని భాషలు ఒక తినే ఆహారమునే అంటున్నాము. భాషలు


వేరయినా భావములో ఉద్దేశ్యము ఒకటేయుండుట వలన హిందువులు

'పరమాత్మ' అనినా, ముస్లీమ్లు 'అల్లా' అనినా రెండు మాటలు దేవున్ని

గురించి చెప్పినవే యగును.


దేవుడు “వహీ ద్వారా జ్ఞానము చెప్పబడును" అని చెప్పినప్పుడు

ఆకాశవాణి ద్వారా వచ్చిన శబ్దములోనే జ్ఞానము తెలిసినదని అర్థమగు

చున్నది. చెప్పిన జ్ఞానము ఒక్కటే, చెప్పినవాడు ఒక్కడే అటువంటప్పుడు

దానినే రెండుమార్లు చెప్పుకొని, రెండు పేర్లు పెట్టుకొని ఒకటి పాతబండి

మరొకటి క్రొత్తబండి అని మనుషులు అనుచున్నారు తప్ప జ్ఞానమును

చెప్పిన దేవుడు పాత, క్రొత్తయని ఎక్కడా చెప్పలేదు కదా! మనుషుల

మాటలను నమ్మవద్దు దేవుని మాటనే నమ్మమని జ్ఞానము తెలిసిన

ఎవరయినా చెప్పగలరు. దేవుడు తన జ్ఞానమును సృష్ట్యాదిలోనే వహీ

ద్వారా చెప్పినప్పుడు ఎప్పటికీ ఒకటేయుండును కదా!దానిని ఎన్ని

గ్రంథములుగా వ్రాసినా ముందు చెప్పినది పాతది, వెనుక చెప్పినది క్రొత్తది

అనుటకు వీలేలేదు. ఐదు వేల సంవత్సరముల పూర్వము దేవుడు సృష్ట్యాదిలో

చెప్పిన జ్ఞానమునే భగవద్గీతగా చెప్పారు. తర్వాత దానినే ఖుర్ఆన్

గ్రంథముగా చెప్పారు. చివరిలో చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములో "ముందు

చెప్పిన గ్రంథములను ఖురాన్ ధృవీకరిస్తున్నది” అని చెప్పడమైనది. అప్పుడు

ముందు చెప్పిన గ్రంథములలోని జ్ఞానము, ఇప్పుడు వచ్చిన ఖురాన్లోని

జ్ఞానము రెండూ ఒకటేనని, ఖురాన్ గ్రంథములోనే ఐదవ సూరాలో అనేక

చోట్ల గలదు. అటువంటప్పుడు భగవద్గీత పాతది, ఖుర్ఆన్ క్రొత్తది అనడము

దేవుని మాట కాదని చెప్పవచ్చును.


భూమిమీద మొదట తయారయిన గ్రంథము “భగవద్గీత”. భూమి

మీద మొదట చెప్పబడిన జ్ఞానము “జపర”. జపర జ్ఞానమే గ్రంథరూప


మైనప్పుడు దానిని ప్రథమ దైవగ్రంథము అని చెప్పుచున్నాము. తర్వాత

తయారైనది ఇంజీలు గ్రంథము. ఇంజీలు గ్రంథమును బైబిలుగా చెప్పు

కొంటున్నాము. ఆ తర్వాత చివరగా తయారయిన గ్రంథము ఖుర్ఆన్

గ్రంథము. దానినే అంతిమ దైవగ్రంథము అని అనుచున్నాము. అంతిమ

దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో తౌరాత్, ఇంజీలు గ్రంథములలోని

జ్ఞానమే ఖురాన్లో యున్నదన్నట్లు ఆ రెండు గ్రంథములను ధృవీకరిస్తున్నా

నను వాక్యములు ఖురాన్లో గలవు. తౌరాతు గ్రంథము ఏదయితే ఇక్కడ

చెప్పబడినదో, అదియే భగవద్గీతయని ఎవరికీ తెలియదు. ఇంజీలును,

ఖురాన్ను చూచిన ముస్లీమ్లు నేడు గలరు గానీ, తౌరాత్ను చూచిన

ముస్లీమ్లు లేరని చెప్పవచ్చును. మనముందరున్న భగవద్గీతయే తౌరాత్

గ్రంథమని మేము ఈ రోజు చెప్పితే దానిని నమ్మలేనివారు "తౌరాత్

భగవద్గీత ఒక్కటిగాదు. తౌరాత్ను చెప్పిన ప్రవక్త వేరు, భగవద్గీతను చెప్పిన

ప్రవక్త వేరు” అని అంటున్నారు. ఈ విషయమును గురించి తర్వాత

ప్రస్తావిస్తాము. ఇప్పుడు చెప్పినది ఏమనగా! ఖురాన్ను కారుతో పోల్చి

చెప్పినవారు ఖురాన్ గ్రంథములోని జ్ఞానము ఎక్కడి నుండి వచ్చినదో

తెలియవలెను. ఖురాన్కు గానీ, భగవద్గీతకు గానీ ఆధారమైన జ్ఞానము

'జపర లేక జబుర' అయినప్పుడు భగవద్గీతలోని జ్ఞానమే ఖుర్ఆన్లోనూ,

ఖుర్ఆన్లోని జ్ఞానమే భగవద్గీతలోనూ కలదని ఎందుకు చెప్పకూడదు?

సృష్ట్యాదిలో వహీ ద్వారా చెప్పబడిన జ్ఞానమే భగవద్గీతలోనూ, ఖుర్ఆన్

గ్రంథములోనూ యున్నప్పుడు అది వేరు, ఇది వేరు అని చెప్పడము

తప్పగును. దేవుని జ్ఞానమును అవమానపరచినట్లగును.


ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్తగారి ద్వారా బయటికి

వచ్చినది. దానిని ప్రవక్తగారికి చెప్పినది జిబ్రయేల్. అటువంటప్పుడు


వహీ ద్వారా వచ్చిన జ్ఞానమని మీరెలా చెప్పగలరు? జిబ్రయేల్ దేవుడు

పంపగా వచ్చిన దూత. దేవదూత అయిన జిబ్రయేల్ చెప్పినది ఖురాన్

గ్రంథమనీ, వహీ ద్వారా వచ్చినది కాదనీ దూత ద్వారా వచ్చినదని

చెప్పుచున్నాము. దీనికి మీరేమంటారు?


జవాబు : అయితే పూర్తి వివరముగా నీకు చెప్పితేనే నీకు అర్థము

కాగలదని నాకు అర్థమయినది. మొదటికి జిబ్రయేల్ దేవుని దూత కాదు.

ఆ విషయము ఖురాన్లోనే ఐదు, ఆరు ఆయత్లలో కలదు. జిబ్రయేల్

నమ్మదగిన ఆత్మయనీ, దూత కాదని చెప్పిన ఖుర్ఆన్ వాక్యములను

అనుసరించి మేము ఆ మాటను చెప్పుచున్నాము. ఖుర్ఆన్ గ్రంథములో

వ్రాసిన వాక్యములను చూస్తే జిబ్రయేల్ దూతకాదనీ, ఆయన ఒక ఆత్మయనీ

తెలియగలదు. అందువలన ఇప్పుడు ఖుర్ఆన్లోని కొన్ని వాక్యములను

చూస్తాము.


2వ సూరా, 97వ ఆయత్ (2-97) “ఓ ప్రవత్తా! వారికి చెప్పు జిబ్రయేల్ కు

శత్రువైన ప్రతివాడు అల్లాహ్ తోనే శత్రువైనాడని గ్రహించాలి. ఎందుకంటే

అల్లాహ్ సూచనలపైనే ఆయన నీ హృదయముపై ఈ సందేశాన్ని

అవతరింపజేశాడు. ఈ ఖుర్ఆన్ తనకు పూర్వము వచ్చిన గ్రంథాలను

ధృవీకరిస్తుంది. విశ్వసించే వారికి శుభవార్తను ఇస్తుంది."



2వ సూరా, 98వ ఆయత్ (2-98) “ఎవరు దేవునికి, ఆయన దూతలకు,

ఆయన ప్రవక్తలకు, జిబ్రయేల్కు మరియు మీకాయీల్కు శత్రువులుగా

యుంటారో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు.”


26వ సూరా, 193వ ఆయత్ (26-193) “ఈ ఖుర్ఆనన్ను “రూహుల్

అమీన్" (నమ్మదగిన ఆత్మ) అవతరింపజేశాడు" అని ఉన్నది.


70వ సూరా, 4వ ఆయత్ (70-4) “యాభై వేల సంవత్సరములతో సమాన

పరిమాణముగల రోజున దైవ దూతలు మరియు జిబ్రయేల్ దేవుని వైపునకు

అధిరోహిస్తారు"


78వ సూరా, 38వ ఆయత్ (78–38) " ఏ రోజు ఆత్మ (జిబ్రయేల్) మరియు

దేవదూతలు వరుసలు తీరి నిలబడి ఉంటారో, ఆ రోజు కరుణామయుని

అనుమతి పొందినవాడు తప్ప ఎవరూ మాట్లాడలేరు. మాట్లాడిన వాడు

సరియైన మాటనే మాట్లాడుతాడు."


97వ సూరా, 4వ ఆయత్ (97-4) “ఆ రాత్రియందు దైవదూతలు మరియు

ఆత్మ (జిబ్రయేల్) తమ ప్రభువు ఉత్తరువులపై సమస్త విషయాల నిర్వాహణ

నిమిత్తము ఆకాశమునుండి భూమికి దిగివస్తారు.”


పైన చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములోని ఆయత్లలో జిబ్రయేల్ దూత

కాదనీ, ఆత్మయనీ, నమ్మదగిన ఆత్మయనీ చెప్పడమైనది. ఒకే వాక్యములోనే

దూతలను జిబ్రయేల్ను విడివిడిగా చెప్పడమైనది. జిబ్రయేల్ను దూతయని

ఎక్కడా అనలేదు. అటువంటప్పుడు మనుషులు జిబ్రయేల్ను దూత అనడము

పొరపాటగును. జిబ్రయేల్ ఆత్మయేగానీ, దూతకాదని చెప్పినట్లు తెలియుట

వలన జిబ్రయేల్ను 'దేవుడు పంపగా వచ్చిన దూత' అని అనకూడదు.


ప్రశ్న :- భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమనీ, ఇంజీలు గ్రంథమును ద్వితీయ

దైవగ్రంథమనీ, ఖర్ఆన్ గ్రంథమును అంతిమ దైవగ్రంథమని అందరూ

అంటున్నారు. భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమనీ, ఖుర్ఆన్ను అంతిమ

దైవగ్రంథమని ఎందుకు అంటున్నారు? దీనికి శాస్త్రబద్ధమైన ఆధారము

ఏమయినా గలదా! అని అడుగుచున్నాను. సరియైన సమాధానముంటే

వివరముగా చెప్పండి.


జవాబు :- ఏ ప్రశ్ననయినా మ్రొక్కుబడికి అడిగినట్లు అడుగకూడదు.

వినే జవాబును కూడా శ్రద్ధగా వినాలి. విన్న జవాబు మీకు మీ ఉద్దేశ్యము

నకు నచ్చినదిగా ఉండవలెనని అనుకోకూడదు. వినే వారికి నచ్చినా,

నచ్చకపోయినా చెప్పిన జవాబు శాస్త్రబద్ధమైనదో కాదో చూడాలి.

శాస్త్రబద్ధమైనదయితే దానిని నమ్మవచ్చును. శాస్త్రబద్ధము కాని దానిని

అసత్యముగా తలచి వదలి వేయవలెను. ఖుర్ఆన్ గ్రంథమును గురించి,

భగవద్గీతను గురించి గతములో అనగా సృష్ట్యాదిలో జరిగిన విషయములను

తెలియగలిగితే సత్యము తెలియునని మొదటినుండి చెప్పుచున్నాను చూడండి.


ప్రశ్న :- సూర్యుడు దక్షిణ భారతదేశమున గల మనువు అను వ్యక్తికి

తెలుగు భాషలోనే జ్ఞానమును చెప్పాడని మీరు చెప్పారు. భూమిమీదున్న

మనువుకు తెలుగు భాష వచ్చియుండవచ్చును. అయితే తెలుగు భాషలోనే

చెప్పుటకు సూర్యుడు తెలుగువాడు కాదు కదా! ఎక్కడో ఆకాశములో

భూమినుండి 14 కోట్ల, 95 లక్షల, 97 వేల 870 కిలోమీటర్ల దూరములో

(14,95,97,870 Km) యున్న సూర్యుడు తెలుగు భాషను ఎలా మాట్లాడ

గలిగాడు? అను ప్రశ్న ఎవరికయినా రాగలదు. అదే నాకు కూడా వచ్చినది.

సూర్య గ్రహము తెలుగు మాట్లాడగలిగింది అనుటకు ఇంకా ఏదయినా

ఆధారమున్నదా అని అడుగుచున్నాము?


జవాబు :- రెండవమారు జరిగిన దానికి మొదటిమారు జరిగినది

ఆధారముగా యుండవచ్చును. మొదట జరిగిన దానిని ఉదాహరణగా

చూపి రెండవది ఇలా ఉందని చెప్పవచ్చును. అట్లు కాకుండా మొదట

జరిగిన దానికి ఆధారము కావలెనంటే దానికి అదే ఆధారమగును.

అంతేగానీ మిగతా ఆధారములేమీ దానికి ఉండవు. అదే విధముగా

భూమిమీద సూర్యుడు మాట్లాడినదే మొదటి సంఘటన అయినప్పుడు


దానికి అదే ఆధారముగానీ, వేరే దేనినీ ఆధారముగా చూపలేము. మొదటిది

ఏదయినా తర్వాత దానికి ఆధారమగును. అందువలన సూర్యుడు తెలుగు

భాషలో మాట్లాడిన దానికి రెండవ ఆధారము ఏదీ లేదు. దానికి అదే

ఆధారము. అయితే ఈ విషయమై కొంత వివరణను ఇవ్వగలము.

సూర్యుడు గ్రహములలో మహాగ్రహము. అనగా పెద్ద గ్రహము అని

అర్థము. సూర్యుడు పెద్ద గ్రహమయిన దానివలన ఏ భావమునయినా

గ్రహించగలడు. "గ్రహము” అనగా గ్రహించునదని అర్థముండుట వలన

ఏ భాషనయినా గ్రహించగలడు. అలాగే ఏ భాషలోనయినా తన భావమును

వ్యక్త పరుచగలడు.


ఆ కాలములో ప్రపంచములో మొట్టమొదట తయారయిన భాష

'తెలుగు భాష'. ప్రపంచమంతా మొదట మాట్లాడిన భాష 'తెలుగు భాష'.

మొదట జ్ఞానము తెలిసినది తెలుగు భాషలో అయినందున అన్నిటికంటే

తెలుగు భాష పెద్దదనీ, మొదటిదనీ చెప్పవచ్చును. భూమిమీద మొదట

భాష తయారయినది కానీ, అది పేరు లేని భాషగా యుండెడిది. భావమును

వ్యక్తము చేయునది భాష అని మాత్రము అందరికీ తెలుసు. సూర్యుడు

తన స్థూల శరీరమును ఆకాశములోనే వదలివేసి దాదాపు 15 కోట్ల

కిలోమీటర్ల దూరములోయున్న భూమిమీదికి వచ్చి, భూమిమీద దక్షిణ

భారతదేశములోయున్న మనువు అను వ్యక్తికి జ్ఞానమును బోధించడము

జరిగినది. అలా బోధించినప్పుడు సూర్యుడు ఒక గంటలోనో, ఒక

దినములోనో జ్ఞానమును చెప్పి పోలేదు. వాస్తవము చెప్పితే మనువునకు

సూర్యుడు జ్ఞానము చెప్పాడను విషయమే తెలియదు. జ్ఞానము చెప్పిన

సూర్యుడు ఏ సందర్భములోగానీ జ్ఞానము చెప్పే తాను సూర్యుడనని

చెప్పలేదు. ఏదో సూక్ష్మము జ్ఞానమును చెప్పుచున్నదని మనువు


అనుకోవడము జరిగినది. ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు భగవద్గీతను

చెప్పినప్పుడు మాత్రమే మనకు సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినట్లు

తెలిసినది. అంతవరకు మనువుకు గానీ, ఆయన తర్వాత మనుషులకుగానీ

సూర్యుడు భూమిమీదికి వచ్చి జ్ఞానము చెప్పినట్లు తెలియదు. అయితే

జ్ఞానము చెప్పినది సూర్యుడని మనువుకు తెలుసునని అందరూ

అనుకొన్నారు. అందరూ అనుకొన్నట్లు మనువుకు స్వయముగా సూర్యుడే

చెప్పాడను విషయము ఆయన చనిపోవు వరకు ఆయనకు తెలియదు.

కృష్ణుడు చెప్పేంతవరకు ఎవరికీ తెలియదు.


మనువుకంటే వయస్సులో రెండు లేక మూడు సంవత్సరములు

చిన్నవాడయిన సాధారణ వ్యక్తిలోనికి సూర్యుడు ప్రవేశించి మనువుకు

జ్ఞానము చెప్పడము జరిగినది. కనిపించే మనిషిలోనికి జ్ఞానము తెలిసిన

సూక్ష్మము ప్రవేశించి మాట్లాడుచున్నదని మనువు అనుకోవడము వలన

చెప్పువాడు ఎవడు? అను ప్రశ్నే ఎవరికీ రాలేదు. తాను వినిన జ్ఞానము

గొప్పదని తెలిసిన మనువు ఉత్తర దేశములోని ఇక్ష్వాకుడు అను రాజుకు

చెప్పడము, అతని ద్వారా ఇతరులకు తెలియడమైనది. కృతయుగములో

మనువుకు జ్ఞానము సూర్యుడు చెప్పగా, సూర్యుడు చెప్పాడను విషయము

మూడు యుగములు గడచువరకు ఎవరికీ తెలియదు.


ప్రశ్న :- ఎప్పుడో కృతయుగములో సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పితే,

ఆ విషయము అప్పటి మనువుకే తెలియనప్పుడు, ఇప్పుడు ప్రస్తుత

కాలములో వర్తమాన కాలములో (వ్యక్తమాన కాలములో) మాతో

పాటుయుండు నీవు ఆ విషయమును ఎలా చెప్పగలుగుచున్నావు?

మనువుకు సూర్యుని విషయమే తెలియదను విషయము నీకు ఎలా తెలుసు?


జవాబు :- నేను ఇంతకు ముందు కూడా చాలామార్లు ఒక విషయమును

చెప్పాను. అది ఏమంటే నేను ఎల్లప్పుడూ నిజమే చెప్పుదునని నీవు

అనుకోవద్దు. నేను అప్పుడప్పుడు అసత్యమును కూడా చెప్పుదునని

అనుకోవడము మంచిది. అందువలన నా మాట ఎప్పుడు నీకు సత్యమని

పిస్తే అప్పుడు మాత్రము నా మాటను నమ్ముము. ఎప్పుడు నా మాట

అసత్యమనిపిస్తే అప్పుడు నమ్మవద్దు. నేను చెప్పు ప్రతిమాట పూర్తి సత్యమని

నేను చెప్పుచుందును. నీకు సత్యమనిపించినప్పుడే నమ్ముము. నా మాటను

నమ్మమని నేను ఎవరికీ చెప్పలేదు. చెప్పడము నా వంతు, నమ్మడము

నమ్మకపోవడము నీ పనియని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. నేను

ఎవరికీ తెలియని విషయములనే, సంచలన విషయములనే, నమ్మశక్యము

కాని విషయములనే చెప్పుచుందును. నా మాటలో సత్యమెంతయున్నదో

ఒక విధముగా నాకే తెలియదు. అటువంటప్పుడు నేను చెప్పేదంతా

నమ్మవలెనో లేదో మీరే చూచుకోండి. నా మాటలను నమ్మువారు బహుశా

నూటికి పదిమంది మాత్రమేయుందురు. మిగతావారు ఏమాత్రము నమ్మరు.

ఖురాన్ గ్రంథములో “అందరినీ నా జ్ఞానములోనికి రానివ్వను, కొందరికి

మాత్రమే నా జ్ఞానము అర్థమగునట్లు చేయుదును. మిగతావారికి అర్థము

కానట్లు చేయుదును” అని దేవుడు చాలామార్లు అన్నాడు. అందరూ

నమ్మకూడదనే దేవుడు కూడా అట్లు చెప్పాడు. అందరూ నమ్మితే అందరికీ

జ్ఞానము తెలిసి అందరూ జ్ఞానమార్గములోనికి పోవు అవకాశము గలదు.

అందరికీ జ్ఞానము తెలియవలెనని నేను సత్యమును చెప్పినా దేవుడు చెప్పిన

మాటవలన నా మాట కూడా కొన్ని సందర్భములలో అసత్యముగనే

కనిపించుచుండును. అట్లని నేను సత్యమును చెప్పుచున్నానని చెప్పకుండా

సత్యమునే చెప్పుచుందును. నా మాట సత్యమో కాదో తెలియవలసింది

మీరే!


ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో జ్ఞానయోగమున మొదటి

శ్లోకములోనే “నేను సృష్ట్యాదిలో సూర్యునకు చెప్పియుంటిని, తర్వాత

సూర్యుడు మనువునకు ఈ జ్ఞానమును తెలియజేశాడు" అని కృష్ణుడు

అర్జునునకు చెప్పాడు. అప్పుడు, ఇప్పుడు నీవు అడిగినట్లే అర్జునుడు

కృష్ణున్ని ఇదే ప్రశ్నే అడిగాడు. ఎప్పుడో సృష్ట్యాదిలో సూర్యుడు పుట్టాడు,

నీవు పుట్టినది ప్రస్తుత కాలములో, ఇప్పుడు పుట్టిన నీవు అప్పటి సూర్యునకు

ఎలా జ్ఞానమును చెప్పావు? అని అడగడము జరిగినది. అది పెద్ద ప్రశ్నే

అయినా కృష్ణుడు సులభముగా జవాబును చెప్పగలిగాడు. అక్కడ

కృష్ణుడు ఏమి చెప్పాడో మీకు తెలుసు. ఒకవేళ తెలియని వారుంటే

ఇప్పుడు భగవద్గీతను చూచినా ఏమి చెప్పినది తెలియగలదు. కృష్ణుడు

అప్పుడు కూడా నేను పుట్టియుంటిని అని చెప్పిన జవాబును చూచిన

అర్జునుడు “మేము ఎలా నమ్మాలి?” అని ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోయినా

కృష్ణుడు చెప్పిన మాటమీద అర్జునునికి అనుమానము ఉండేది. కృష్ణుడు

అబద్దమును చెప్పుచున్నాడని అర్జునుడు తన బుద్ధిలో అనుకోవడము

జరిగినది. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అనుకొన్న విషయమును గ్రహించ

గలిగాడు. అయినా ఇటు అర్జునుడు అనుమానమున్నట్లు బయటపడలేదు.

అటు కృష్ణుడు తెలిసి కూడా తెలియనట్లుండిపోయి తర్వాత విషయమును

చెప్పాడు.


ఇప్పుడు నీవు కూడా అలాంటి ప్రశ్ననే అడిగావు. అయితే కృష్ణుని

వలె నేను సమాధానము చెప్పలేదు. నేను కొన్ని అసత్యములు కూడా

చెప్పుచుందుననీ, ఏది నిజమో, ఏది అబద్దమో నీవే గ్రహించుకోమని

చెప్పాను. అర్జునునిలో పెరిగిన అనుమానములకు, కృష్ణుని మాటల మీద

వచ్చిన అపనమ్మకమునకు చివరకు కృష్ణుడు విశ్వరూపము చూపి


అర్జునునికి ఇక ఏ అనుమానము మిగలకుండా చేశాడు. విశ్వరూపము

కృష్ణుని వలె చూపి నీ అనుమానములను నేను తీర్చలేను గనుక, నేను

సాధారణ మనిషినే గనుక నేను ముందే నా మాటలన్నిటినీ నమ్మవద్దు అని

చెప్పాను. కొన్ని మాత్రమే సత్యముంటాయి అని కూడా చెప్పాము. అయితే

నేను చెప్పేటివన్నీ సత్యములేయని నాకు తెలుసు. అయితే ఆ విషయము

ఇతరులకు తెలియాలను నియమము ఏమీ లేదు కదా! అందువలన నేను

అలా చెప్పాను. నేను అలా చెప్పడము వలన నీ మాట అసత్యమని

ఎవరూ నాతో వాదించరు, ప్రశ్నించరు. నా మాట సత్యమో కాదో మీరే

చూచుకోండి. సత్యమైతే నమ్మండి, సత్యము కాకపోతే నమ్మవద్దండి అని

కూడా చెప్పాను. “ఆపదలలో అబద్దమాడి అయినా ఆపదనుండి బయట

పడవచ్చునని” పెద్దలు చెప్పిన మాటను అనుసరించాను.


ప్రశ్న :- కృష్ణుడు ఆ కాలములో చేతల గారడి చేశాడని విన్నాము. అయితే

మీరు ఇప్పుడు మాటలగారడి చేస్తున్నారని మాకు అర్థమయినది. మీరు

ఎంత కప్పిపుచ్చుకోవాలనుకొన్నా, కప్పిపుచ్చుకోలేని ఒక అసత్యమును

మీరు చెప్పినట్లు ఋజువు చేయగలను చూడండి. మీరు ఈ మధ్య కాలములో

ఈ నెలలోనే “లు అంటే ఏమిటి?” అను పేరుగల ఒక చిన్న గ్రంథమును

వ్రాసి విడుదల చేశారు. ఆ గ్రంథములో పేజీ నంబరు 40లో మొదటిలోనే

ఇలా వ్రాశారు. "ప్రపంచములో ప్రజలందరికీ మొదటి గురువు సూర్యుడేయని

తెలుపు నిమిత్తము "ఆదిత్యుడు” అను పేరును సూర్యునకు మనువే

నామకరణము చేశాడు. తర్వాత చాలా పేర్లు సూర్యునకు తెలుగు భాషలో

తయారయినవి” ఈ వాక్యమును స్వయముగా మీరే చెప్పారు. ఇప్పుడేమో

మనువుకు జ్ఞానము చెప్పినది సూర్యుడని ఏమాత్రము తెలియదన్నారు.

అప్పుడేమో సూర్యునకు ఆదిత్యుడని మనువే పేరు పెట్టినట్లు చెప్పారు.


అప్పుడొక మాట, ఇప్పుడొక మాట చెప్పడమును బట్టి ఇందులో ఏదో

ఒకటి సత్యమున్నా మరొకటి అసత్యమని తెలిసిపోవుచున్నది. మీకు అలా

అసత్యమును చెప్పవలసిన అవసరమేమున్నది? అసత్యముతో మనుషులకు

జ్ఞానము కల్గునాయని ప్రశ్నించుచున్నాము. దీనికి జవాబు చెప్పండి?

మేము జవాబును అడిగామని జవాబులో కూడా మమ్ములను మభ్య

పెట్టకుండా సత్యమునే చెప్పమని కోరుచున్నాము.


జవాబు :- ఆకాశములో ఏడురంగుల ఇంద్రధనస్సు కనిపించును. అయితే

అక్కడ వాస్తవముగా ఏడు రంగులు లేవు. అక్కడున్నది సూర్యకిరణము

మాత్రమే. అయితే సూర్యకిరణము కనిపించకుండా ఏడు రంగులు కనిపించు

చున్నాయి. అప్పుడు దానిని ఏడు రంగులనాలా? లేక సూర్యకిరణమనాలా?

తాత్కాలికమునకు ఏడు రంగులు కనిపించినా అవి అశాశ్వితమే. ఆ ఏడు

రంగుల వెనుక దాగియున్న సూర్యకిరణమే సత్యమని చెప్పవచ్చును.

అయినా సత్యమయిన సూర్యకిరణము కనిపించనంత మాత్రమున సూర్య

కిరణమును అసత్యము అని చెప్పలేము. అలాగే నా మాటలోని రంగులే

నీకు కనిపించాయి. అయితే నా మాటలోని సత్యము నీకు కనిపించలేదు.

మిమ్ములను మభ్యపెట్టినా అది మిమ్ములను దేవునివైపు నడిపించుటకేయని

మీరు అర్థము చేసుకోవలెను. అయినా నేను అసత్యమును చెప్పకుండా

సత్యమునే చెప్పుచున్నాను. మీరు అర్థము చేసుకోవడములో లోపమే

గానీ, నా మాటలో లోపము లేదు. చూపులేనివాడు ఏనుగు కాలును

పట్టుకుని స్థంభము అని అనుకొన్నాడట. అలాగే చెవును పట్టుకొని చేటయని

అనుకొన్నాడట. అక్కడ ఏనుగు సత్యమే అయినా వాడు అనుకోవడము

అసత్యము. అలాగే మేము సత్యమునే చెప్పినా కొన్ని విషయములు మీకు

సరిగా అర్థముకానందున వాటి విషయములో మీరు నన్నే అసత్యము


చెప్పినట్లు అనుకోవడము జరుగుచున్నది. ఇదంతయూ మీ అవగాహన

లోపమేగానీ, నా బాధ్యతారాహిత్యము కాదు. నేను బాధ్యతను సక్రమము

గానే చేయుచున్నాము. ఇప్పుడు నేను ముందు ఒకమాట తర్వాత వెనుక

మరొకమాట చెప్పినట్లు మీరు ఆరోపించుచున్నారు. ఇక్కడ కూడా మీరే

పొరపడిపోయారుగానీ, నేను చెప్పినది అసత్యముకాదు. ఇక్కడ ఒక చిన్న

ఉదాహరణను చెప్పెదను వినుము. వంద సంవత్సరముల క్రితము ఒకడు

అన్ని విధముల పేదరికమును అనుభవించుచుండెను. ఒక ధనికుడు

పుణ్యమును సంపాదించుకొను నిమిత్తము ఏదో ఒక బీదవానికి సహాయము

చేయాలనుకొన్నాడు. అతను అన్ని విధముల పేదరికమును అనుభవించు

వానిని ఎన్నుకొని వానికి సహాయము చేయాలనుకొన్నాడు. అలాగే ఒక

దినము ఆ పేదవాని ఇంటి వద్దకు వచ్చి, తనది ఏ ఊరు అని చెప్పక,

తాను ఫలానా వాడినని ఏమాత్రము చెప్పకుండా, ఆ పేదవానికి పదిలక్షల

రూపాయలను దానముగా ఇచ్చాడు. ఒక దైవగ్రంథములో “కుడిచేతితో

ఇచ్చు దానము ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇస్తే అది నిస్వార్థ

దానమగును. అలా దానము చేయడము మంచిదని” చెప్పియుండుట

వలన అతను దానము చేసినప్పటికీ తాను ఎవరయినది కూడా చెప్పకుండా,

ఎవరికీ తెలియకుండా పదిలక్షల రూపాయలను దానముగా ఇవ్వడముతో,

దానము ఇచ్చినవాడు ఎవడయినదీ దానము తీసుకొన్న పేదవానికి కూడా

తెలియదు. అయితే దానము ఇచ్చిన వాడు తెలుసుగానీ అతను

ఎవరయినదీ, ఎక్కడనుండి వచ్చినదీ తెలియక పోయినా, తనకు దానము

ఇచ్చిన వాడు గొప్పవాడు అన్నట్లు, అదియూ దానము ఇవ్వడములో

కర్ణునితో సమానమైనవాడని తెలియునట్లు, "అపరకర్ణ" అను పేరును

దానము ఇచ్చినవానికి బిరుదుగా పెట్టడమైనది. దానము ఇచ్చినవానికి

అదే పనిగా దానము తీసుకొన్న వాడు పేరు పెట్టడము వలన దానము


ఇచ్చినవాడు ఫలానాయని మాత్రము తెలియదు కదా! దానము ఇచ్చిన

వాడు సువర్ణ సంస్థానమునకు అధిపతియనీ, అతను పెద్ద ధనికుడనీ ఇప్పుడు

మనకు తెలుసు అనుకొందాము. దానివలన మనము సువర్ణ సంస్థానాధి

పతికి పేదవాడు “అపరకర్ణ" అని ఇప్పుడు పేరు పెట్టాడు అని ఇప్పుడు

ఇతరులతో చెప్పాము. ఇప్పుడు దానము ఇచ్చినవాడు సువర్ణ సంస్థానాధిపతి

యని ఇతరులకు మనము చెప్పినంత మాత్రమున అప్పుడు పేదవానికి ఆ

పేరు తెలియదు కదా!


అదే విధముగా పూర్వము సూర్యుడు జ్ఞానార్థి అయిన వానికి

తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాలనుకొన్నాడు. భూమిమీదగల మనువును

ఎంచుకున్నాడు. మనువు దగ్గరకు సాధారణముగా వచ్చి తన జ్ఞానమును

చెప్పాడు. మనువుకు జ్ఞానము చెప్పినప్పుడు మనువు జ్ఞానమును

తెలియగలిగాడు గానీ చెప్పినవాడు ఎవడు? అన్న విషయము మాత్రము

తెలియదు. చెప్పినవాడు అంతవరకు భూమిమీద లేని జ్ఞానమును చెప్పిన

దానివలన, చెప్పిన వానిని "గురువు" అని చెప్పాడు. అంతేకాక విశేషముగా

“ఆదిత్యుడు” అని పేరును పెట్టాడు. ఆ విషయమును మీకు మేము

చెప్పుచూ "సూర్యునికి మనువు ఆదిత్యుడని పేరు పెట్టాడు” అని చెప్పాము.

అది మేము ఇతరులకు ఇప్పుడు చెప్పిన మాటయేగానీ, భగవద్గీత పుట్టక

ముందు అప్పుడు మనువుకు జ్ఞానము చెప్పినది సూర్యుడని కూడా తెలియదు.

ఇప్పుడు భగవద్గీత బయటికి వచ్చినది తర్వాత మనువుకు జ్ఞానము చెప్పినది

సూర్యుడని మనకు తెలిసినది. ఆ కాలములో మనువుకు జ్ఞానము చెప్పినది

ఎవరయినది తెలియకున్నా, చెప్పినవాడు గొప్ప జ్ఞానమును చెప్పాడు కావున

చెప్పిన వానిని “ఆదిత్య” అను పేరును పెట్టాడు. జ్ఞానము చెప్పిన వారిలో

మొదటి వాడు అని చెప్పు తన భావమును 'ఆదిత్య' అని అన్నాడు. “దిత్య”


అనగా రెండవవాడనీ, “ఆ” అనగా లేడనీ, “ఆదిత్య" అనగా అతనితో

సమానమైన వాడు ఎవడూ లేడని అర్థము. చెప్పబడిన జ్ఞానము గొప్పదని

గ్రహించిన మనువు జ్ఞానము చెప్పిన వాడు సూర్యుడని తెలియకున్నా

అతను చెప్పిన జ్ఞానమును బట్టి 'ఆదిత్య' అని చెప్పడమైనది. ఇప్పుడు ఆ

విషయమును తెలిసిన మేము మనువు సూర్యునకు 'ఆదిత్య' అని పేరు

పెట్టాడని చెప్పాము గానీ, అప్పుడు మనువుకు ఆదిత్యుడు ఎవరయినది

తెలుసునని చెప్పలేదు, జ్ఞానము చెప్పిన వారిలో ఇతనిని మించిన రెండవ

వాడు లేడు అని ప్రజలకు తెలియజేయు నిమిత్తము ఆదిత్యుడను పేరును

సూర్యునకు మనువే పెట్టడము జరిగినది అని మేము వ్రాశాము తప్ప,

మనువుకు ఆదిత్యుడు సూర్యుడేయని తెలుసునని చెప్పలేదు కదా!


ఇంతవరకు నా మాటను నీవు ఎంత అసత్యమన్నావో అంతే

పొరపాటును నీవు పడినావని తెలియుచున్నది. సూర్యుడు జ్ఞానము చెప్పింది

నిజమే, మనువు తాను వినిన జ్ఞానమునుబట్టి చెప్పిన వానిని ఆదిత్యుడు

అని చెప్పిన మాట నిజమే. ఎంత జ్ఞానమును చెప్పినా సూర్యుడు తాను

ఫలానావాడననీ, తన పేరు ఫలానాయని చెప్పలేదని మేము చెప్పిన మాట

నిజమే. మనువు చనిపోవు వరకేకాక మూడు యుగములు గడిచిపోవు

వరకు ప్రజలకు ఎవరికీ సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పాడను

విషయమే తెలియదు. కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడు సృష్ట్యాదిలో

సూర్యుడు ఆకాశమునుండి వాణి ద్వారా వినిన జ్ఞానమును భూమిమీద

మనువుకు చెప్పాడని బోధించినప్పుడు ఆ విషయము బయటపడినది.

ఆ విషయము తెలియుట వలన ఆదిత్యుడను పేరును మనువు సూర్యునకు

పెట్టాడని చెప్పాము. చెప్పినవాడు ఆదిత్యుడను పేరుకు తగినవాడని తలచిన

మనువు ఆ పేరును జ్ఞానము చెప్పిన వానికి పెట్టాడు. ఆ పేరుపెట్టేటప్పుడు

చెప్పినవాడు సూర్యుడని మనువుకుగానీ, మరి ఏ ఇతర మానవునకు గానీ

తెలియదు.


ప్రశ్న :- ఎంతో గొప్ప జ్ఞానమును చెప్పిన సూర్యుడు తన పేరును ఎందుకు

గుప్తముగాయుంచుకున్నాడు. అలా చెప్పకుండా ఉండుటకు కారణమే

మయినా కలదా?


జవాబు :- మూడు యుగముల తర్వాత కృష్ణుడు భగవద్గీతను అర్జునునకు

బోధించిన సమయములో, సూర్యుడు మనువుకు జ్ఞానమును చెప్పాడని

తెలిసింది కూడా మంచిది కాదేమో అని మేము అనుకొంటున్నాము.

సూర్యుడు అన్ని విధముల ఆలోచించి తన పేరును చెప్పలేదు. స్వయముగా

సూర్యుడు తన పేరును చెప్పియుంటే మనుషులు దేవున్ని వదలి సూర్యున్నే

ఎక్కువగా ఆరాధించెడివారు. అటువంటి పనిని చేస్తారను ఉద్దేశ్యముతో

సూర్యుడు తన పేరును బయటికి చెప్పకుండా తనకు తెలిసిన జ్ఞానమును

చెప్పడము జరిగినది.


ప్రశ్న :- మీరు గతములో “వార్తకుడు-వర్తకుడు” అను చిన్న గ్రంథములో

సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినట్లు తెలుసుననీ, సూర్యుని వలన

జ్ఞానము తెలిసిన దానివలన సూర్యుని గుర్తునే నుదుటి మీద గుర్తుగా

పెట్టుకొన్నాడనీ, సూర్యుని గుర్తును బట్టి తనది సూర్యవంశమని చెప్పాడనీ

వ్రాశారు. ఇప్పుడు పొంతనలేకుండా చెప్పుచున్నారు. మీరు ఎందుకు

అలా చెప్పుచున్నారు? జ్ఞానమువద్ద అసత్యమును చెప్పకూడదు కదా! ఆ

గ్రంథములో అలా చెప్పి, ఈ గ్రంథములో ఇలా చెప్పారు. అట్లు చెప్పవలసిన

అవసరము మీకు ఏమి వచ్చినది?


జవాబు :- అవును అక్కడ మీరు చెప్పినట్లే వ్రాశాము. అయితే అక్కడ

ముఖ్యముగా ఒకమాటయుండడమును ఎవరూ గమనించియుండరు. అదే

మనగా! ఎప్పుడయితే సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పాడో


అప్పుడే మనువులో మాయ పని చేయను మొదలు పెట్టిందని

చెప్పాము. “వార్తకుడు-వర్తకుడు" అను గ్రంథములో 8వ పేజీలో మరియు

9వ పేజీలో ఇలా వ్రాయబడియున్నది చూడండి. "ఎప్పుడయితే మనువు

జ్ఞానమును సూర్యుని ద్వారా తెలియగలిగాడో, అప్పుడే మనువు అను

వ్యక్తిలో కొద్దిగా మాయ పని చేసినది. అది మాయ అని తెలియకుండా

మనువు తలలోని గుణము పనిచేసి, సూర్యుడు తనకు జ్ఞానము

చెప్పినందుకు, తన తలలో సూర్యుని జ్ఞానము నిలువయున్నందుకు తన

ముఖముమీద నుదుటి భాగమున సూర్యుని గుర్తును పెట్టుకోవడము

జరిగినది.”


మనిషిలో మాయ పనిచేస్తే మనిషి మాయ చెప్పినట్లు చేయుచూ

పోవుచుండును. మనువులో మాయ పనిచేయను మొదలు పెట్టినప్పుడు

అతని తలలోని గుణము పనిచేసి, సూర్యుని గుర్తును తన ముఖము మీద

నుదుటి భాగమున పెట్టుకోవాలనిపించినది. అప్పటినుండి సూర్యుని

ఆకారమును నుదుటి మీద ధరించడము జరిగినది. సూర్యుని జ్ఞానము

తన తలలో యున్నందుకు సూర్యుని గుర్తును ధరించుచున్నానని మనువు

ఇతరులకు చెప్పాడు. మనువును చూచి మనువు చెప్పిన జ్ఞానమును

విన్నందుకు ఇక్ష్వాకుడు అను రాజు కూడా సూర్యుని గుర్తును నుదుటి

మీద ధరించడమేకాక, తనది సూర్యవంశమని చెప్పుకోడము జరిగినది.

వాస్తవముగా సూర్యవంశము అని చెప్పుకోవడము మాయ యొక్క

ప్రభావమని ఎవరికీ తెలియదు. మాయ చేతనే మనువు బుద్ధి

మారిపోయినది. సూర్యుని జ్ఞానమునకు గుర్తుగా ముఖము మీద సూర్యుని

గుర్తును పెట్టుకొన్నానని చెప్పుకోవడము మాయ పనియని ఎవరికీ తెలియక

పోయినది. మనువు సూర్యుడు తనకు జ్ఞానమును చెప్పాడని బయటికి


చెప్పినా, తన లోపల మాత్రము జ్ఞానము చెప్పినది సూర్యుడు కాదనీ,

జ్ఞానము తెలిసిన ఎవరి సూక్ష్మమో తనకు చెప్పినదని అనుకోవడము

జరిగినది. తన అంతరంగమున సూర్యుని గురించిన భావము ఏమాత్రము

లేకున్నా పైకి సూర్యున్ని గురించి మాట్లాడునట్లు మాయ చేసినది. మనువు

చెప్పిన దానినిబట్టి ఇక్ష్వాకుడు మొదలగు వారంతా తమది సూర్యవంశము

అని చెప్పుకోవడము జరిగినది. వారి అంతరంగములో కూడా సూర్యుడు

మనువుకు జ్ఞానము చెప్పాడన్న విషయము తెలియదు. బలవంతముగా

మాయ వారిచేత వంశమును పలికింపజేసినది. వంశము, కులము,

గోత్రము (గుణత్రయము) అన్నీ మాయ యగుట వలన మనుషులను

మాయలో ఉంచుటకు, మాయ సూర్యుని పేరును వాడుకొని వారికి

చెప్పించింది గానీ, వారికి సూర్యుడు జ్ఞానము చెప్పాడను నమ్మకము

ఏమాత్రము లేదు.


మనువు మాత్రము మాయచేత తనకు తెలియని విషయమును

ఆ కాలములో చెప్పినా, అది పూర్తిగా మనువుకే నమ్మకము లేదు. తర్వాత

ఇక్ష్వాకుడు మనువును అనుసరించినా, ఇక్ష్వాకునికి కూడా లోపల సూర్యుడు

మనువుకు జ్ఞానము చెప్పాడను నమ్మకము లేదు. మనువు తర్వాత

ఎవరుగానీ, మూడు యుగములు జరుగువరకు గానీ సూర్యుని ప్రస్తావణ

రాలేదు. సూర్యుడు జ్ఞానము చెప్పాడను విషయమే ఎవరూ అనుకోలేదు

గానీ, మాయా ప్రభావము వలన సూర్యవంశము పేరు భూమిమీద

నిలిచిపోయినది. కొన్ని యుగముల తర్వాత కులముల ప్రభావము

ఎక్కువయిపోయి 'వంశము' అనుమాట తగ్గిపోయినది. ఇదంతా మాయ

నాటకమేగానీ, సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పాడను మాట మనువుకు

తెలియదు. ఇతరులకు ఎవరికీ తెలియదు. అయితే మనువుకు జ్ఞానము


సూర్యుని ద్వారానే తెలిసినది. సూర్యుడే మనువును ఎన్నుకొని జ్ఞానము

చెప్పడము జరిగినది. ఆ విషయము వాస్తవముగా మనువుకు తెలియదు.

మనువుకు సూర్యుడు తనను గురించి ఏమాత్రము చెప్పలేదు.

విషయమును ముందే చెప్పాను.


ప్రశ్న :- దక్షిణ భారతదేశములో ఎందరో జిజ్ఞాసులు ఉండగా, మనువును

ఒక్కనిని ప్రత్యేకించి సూర్యుడు ఎందుకు ఎన్నుకున్నాడు?


జవాబు :- ఆనాడు సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పుటకు మనువునే

ప్రత్యేకించి ఎన్నుకోవడము జరిగినది. ఆనాడు దక్షిణ భారతదేశమున

మనువుతోపాటు ఎందరో జ్ఞానమును తెలుసుకొనుటకు అర్హులైన

వారున్నారు. వారందరినీ కాదని సూర్యుడు మనువునే నిర్ణయించుకోవడము

నకు బలమైన కారణము కలదు. సూర్యోదయముతోనే ప్రతి దినము

ప్రారంభమైనట్లు, సూర్యోదయముతోనే సృష్ఠి కూడా మొదలయినదని, సృష్ఠి

మొదటి దినము ఆదివారముతోనే మొదలయినదని, ఆదివారము సూర్యుని

దినమని తెలిసి సూర్యుని గౌరవించునట్లు సూర్యుని బొమ్మను తన నుదుటి

మీద మనువు పెట్టుకొనెడివాడు. సూర్యుని గుర్తును అప్పటి కాలములో

మనువు ఒక్కడే ధరించుట వలన సూర్యుని దృష్టి మనువు మీదికి ప్రాకినది.

తన గుర్తును నుదుటి మీద పెట్టుకొన్నవాడు మనువు ఒక్కడే అయినందున

ఎంతోమంది జ్ఞానజిజ్ఞాసులలో మనువును మాత్రము సూర్యుడు

ఎన్నుకోవడము జరిగినది.


ప్రశ్న :- సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత ఆయన జ్ఞానము నా తలలో

యున్నదను గుర్తుగా సూర్యుని బొమ్మను నుదుటిమీద పెట్టుకొన్నాడని

ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడేమో సూర్యుడు జ్ఞానము చెప్పకముందే


నుదుటి మీద సూర్య గుర్తును ఉంచుకున్నాడని చెప్పుచున్నారు. ఇందులో

ఏది నిజము?


జవాబు :- సూర్యుడు జ్ఞానమును చెప్పక పూర్వమే మనువు సూర్యుని

ఆకారమును నుదుటిమీద పెట్టుకొన్నాడనుటయే వాస్తవమని చెప్పుచున్నాను.

సూర్యుడు జ్ఞానమును మనువునకే చెప్పడమునకు కారణము మనువు

ముఖము మీద సూర్యుని ఆకారమును పెట్టుకోవడము వలన సూర్యుని

దృష్ఠిని మనువు ఆకర్షించగలిగాడు. సూర్యుని దృష్ఠి సూర్యుని బొమ్మను

ధరించిన మనువు మీద పడడము వలన మనువునకే సూర్యుడు జ్ఞానమును

చెప్పాడు. సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత మనువులో గుణముల

మాయ పని చేయడము వలన, మనువు తనకు తెలియకున్నా, సూర్యుడు

జ్ఞానమును చెప్పాడని చెప్పాడు. సూర్యుని విషయము తనకు తెలియకున్నా

తెలుసునని చెప్పాడు. దానితో సూర్యవంశము తయారై అక్కడినుండి

కులముల వరకు అజ్ఞానము ప్రాకినది. సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత

మనువులో మాయ పని చేసిన విధానము ద్వారా జరిగిన చరిత్ర ఒక

విధముగా యుండగా, అందులో సత్యము ఏమున్నదని చూచిన ఇంకొక

విధానము అర్థము కాగలదు. మాయ పని చేయడము వలన మనువు

తనకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని చెప్పినది ఒక విధముగా వాస్తవమే

అయినా, సత్యము ప్రకారము మనువునకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని

తెలియదు.


మనవుకు తెలియని విషయమును, జరిగిన సత్యమునే మనువు

చేత చెప్పించి మనువు సత్యమే చెప్పాడు కదా! యనిపించి, సూర్యుని

గురువుగా మనువు చెప్పినట్లు మాయ చేయడము వలన అందరికీ మనువు

సత్యవచనుడుగా యున్నట్లు కనిపించాడు. మనువుకు వాస్తవముగా


సూర్యుడు జ్ఞానము చెప్పిన విషయము తెలియదు. అయినా మాయ

మనువు చేత మనువుకు తెలియని సత్యమును తెలిసినట్లు చెప్పించి, మనువు

ద్వారా ఒక వంశము పేరును బయటికి తెచ్చినది. వంశము నుండి

చివరకు కులము వరకు మనుషులు చీలిపోవునట్లు చేసినది. మాయ

మనుషులను దేవుని మార్గమునుండి తప్పించి అజ్ఞానమార్గములో

పయనించుటకు మనువు చేత మనువుకు తెలియని సత్యమును చెప్పించి

తన ప్రభావమును మనుషుల మీద చూపి మనుషులు కులములుగా

చీలిపోవునట్లు చేసినది. మేము మాయ ఇలా చేసిందియని చెప్పకుండా

అప్పుడు జరిగిన చరిత్రను చెప్పాను. అప్పుడు అలా చెప్పడమే అవసరము.

అప్పుడు సత్యమును చెప్పితే అది అసందర్భప్రలాపమగును. అందువలన

ముందు సూర్యుడు జ్ఞానము చెప్పిన విషయము మనువుకు తెలుసును

అని చెప్పాము. అప్పుడు చెప్పినప్పుడు వెనుకల దాగియున్న విషయమును

చెప్పలేదు. సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినది సత్యమేయగుట

వలన మేము కూడా మాయ విధానమునే చెప్పుచూపోయాము. మనువుకు

సూర్యుడు జ్ఞానమును చెప్పినది సత్యమే. అయితే ఆ విషయము మనువుకు

తెలియును అను విషయము మాత్రము అసత్యము. సూర్యుడు మనువుకు

జ్ఞానము చెప్పాడా! లేదా! అను విషయము అప్పుడు ముఖ్యము కాదు

కనుక అప్పటికి అర్థమగునట్లు మాయ చేసిన విధానమునే మేము చెప్పాము.

ఇప్పుడు సత్యాసత్య వివరము అవసరము అయినందున తప్పక సత్యమును

చెప్పవలసి వచ్చినది.


మనువు చేత మనువుకు తెలియని సత్యమును, తెలిసిన సత్యముగా

చెప్పించి మనువును ముఖ్యమైన మనిషిగా చూపించిన మాయ, మనువు

చేతనే వంశమును వచ్చునట్లు చేసి చివరకు కులముల వరకు చీలిపోవు


నట్లు చేసినది. తర్వాత అంతటితో ఆగక మనుషులను దైవమార్గము వైపు

పోకుండా చేయుటకు మనువు చేత కొన్ని ధర్మములను చెప్పించినది.

అవన్నియూ దైవజ్ఞానముగా కనిపించునట్లు చేసి వాటినే మనుషులు

ఆచరించునట్లు చేసినది. దేవుడు చెప్పిన ధర్మములు కాకుండా, మనువు

స్వయముగా ధర్మములు చెప్పుట వలన మనువు చెప్పిన ధర్మములను

‘మనుధర్మశాస్త్రము' అని అంటున్నారు. మనుధర్మశాస్త్రము వలన మనుషులు

దేవుని ధర్మముల వైపు పోకుండుటకు అవకాశము గలదు. అందువలన

ఆ కాలములో మనుషులు మను ధర్మశాస్త్రమును అనుసరించెడివారు.

మను ధర్మశాస్త్రము అప్పటి కాలములో ప్రచారమయినా, ఇప్పుడు కూడా

మను ధర్మములు మనుషులలోయున్నా ఇవి మను ధర్మములు అని

మనుషులకు తెలియదు. మనుషులకు తెలియకుండా మను ధర్మములు

దేవుని ధర్మములుగా ఆచరించబడుచున్నా, అవి మనుషులకు తెలియక

పోవడము వలన భగవద్గీతలోని దేవుని ధర్మములను మనిషి గుర్తించ

లేకపోవుచున్నాడు. మనిషి మాయ ప్రభావము వలన దేవునివైపు కాకుండా

ప్రకృతివైపు పోవుచున్నాడు.


ప్రశ్న :- మను ధర్మశాస్త్రము అను పేరును విన్నాముగానీ, మను ధర్మ

శాస్త్రమును ఎక్కడా చూడలేదే. అంతకూ మను ధర్మశాస్త్రమనునది

ప్రత్యేకముగా యున్నదా?


జవాబు :- మను ధర్మ శాస్త్రమనునది పేరు మాత్రము గలదు. వాస్తవానికి

అది శాస్త్రమే కాదు. ఎందుకనగా! అందులో శాస్త్రీయత లేదు. అయినా

మొదటినుండి అందరూ దానిని శాస్త్రమని అంటున్నారు. మను ధర్మము

అను దానిని మనువు స్వయముగా చెప్పుట వలన దానికి ఆ పేరు రావడము

జరిగినది. మనువు శరీరములోని మాయ, మనువుచేత సూర్యుడు చెప్పిన


జ్ఞానము కాకుండా తన స్వంత జ్ఞానమును చెప్పించినది. మొదట

మనువు సూర్యుడు చెప్పిన జ్ఞానమునే ఇక్ష్వాకుడు మొదలగు వారికి

చెప్పడమైనది. తర్వాత చాలామందికి తన మీద మంచి అభిప్రాయము

రావడము చేత తనలో మాయ పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన పేరు

భూమిమీద ఉండవలెనని అనుకొన్నాడు. అందువలన సూర్యుడు చెప్పిన

జ్ఞానము కాకుండా తన పేరుతో క్రొత్త ధర్మములను బోధించెను. అప్పుడు

మనువు చెప్పిన ధర్మములే నేటివరకు 'మను ధర్మశాస్త్రము' అని ప్రత్యేకమయిన

పేరుతో చెప్పబడుచున్నది. మను ధర్మశాస్త్రమనునది చెప్పబడినదేగానీ,

వ్రాయబడినది కాదు. 'జపర' అను పేరుగల బోధ చెప్పబడినదే,

వ్రాయబడినది కాదని ఎట్లు చెప్పుకొన్నామో, అలాగే మను ధర్మశాస్త్రమనునది

గ్రంథము కాలేదు. మనువు చెప్పినవి ధర్మములు కావు, అయినా మాయ

ప్రభావము చేత ధర్మములుగా చెప్పబడుచున్నవి. అలాగే మనువు చెప్పినది

శాస్త్రమే కాదు, అయినా మాయ బలము చేత శాస్త్రముగా చెప్పబడుచున్నది.


ప్రశ్న :- దేవుడు ఎంతో శ్రమతో తన జ్ఞానమును మూడు విధముల,

మూడు మార్గముల ద్వారా మనుషులకు చెప్పించగా, మాయ దేవుని

జ్ఞానమునకు వ్యతిరేఖముగా అధర్మములను ఎందుకు బోధింపజేయు

చున్నది? దేవునికి వ్యతిరేఖము చేయకూడదని మాయకు తెలియదా?


జవాబు :- దేవుడు భర్తకాగా, ప్రకృతి భార్యగాయున్నది. ప్రకృతి యొక్క

రెండవ ఆకారమే మాయ. ప్రకృతి మాయ రూపముగా యున్నా మాయ

దేవుని భార్యయగుట వలన మాయ దేవునికి ఏమాత్రము వ్యతిరేఖము

కాదని చెప్పవచ్చును. దేవునికి అన్ని విధముల సహకరించుచూ, ఎంతో

విధేయతగాయున్న వారిలో మొదటిది మాయయేయని చెప్పవచ్చును.

ఎంతో వినయముగా యున్న మాయ దేవునికి వ్యతిరేఖముగా ఎప్పటికీ


నడువదు. మాయ మానవులను మాత్రమే తప్పుదారి పట్టించుచున్నది.

అంతేగానీ ప్రజలను ఏమాత్రము తప్పుదారి పట్టించలేదు. ప్రజలను

దైవమార్గములో నడుచునట్లు చేయుచున్నది. అయితే మానవులను

మాత్రము పనికట్టుకొని తప్పుదారి పట్టించి దైవమార్గమునుండి తప్పి

పోవునట్లు చేయుచున్నది. ప్రజలంటే దేవునికి ఇష్టము. మానవులంటే

దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టములేని వారిని ఆయనవద్దకు

పోకుండునట్లు, వారిని తప్పుదారి పట్టించుటకు మాయ అదేపనిగా వారికి

అజ్ఞానమును బోధించుచున్నది. మాయ తన భర్తయిన దేవుని మాటను

అనుసరించియే అలా చేయుచున్నది. మాయ విషయము తెలియని వారు

అందరూ మాయ దేవునికి వ్యతిరేఖ మయినదని అనుకుంటారు. మాయను

గురించి పూర్తి తెలిసిన తర్వాత ఎవరూ మాయ చెడుదని, దేవునికి వ్యతిరేఖమని

ఏమాత్రము అనుకోరు. మాయ మాత దేవుని సేవకురాలని ఎవరూ

మరువకూడదు.


ప్రశ్న :- మాయ విషయమటుంచి ముందు మీరే మా పాలిట మాయ

కాకూడదని కోరుచున్నాము. ఎందుకు అలా అడుగుచున్నామంటే

భూమిమీద గల మనుషులను మానవులని, ప్రజలని అందరూ అనగా

విన్నాము. ఇప్పుడు మొట్టమొదటిగా మీరే మానవులను, ప్రజలను

వేరువేరుగా విభజించి అందులో మానవులు దేవునికి ఇష్టము లేదనీ,

ప్రజలు మాత్రమే ఇష్టమని చెప్పారు. దేవునికి మనుషులందరూ సమానమే

అనగా విన్నాము. అయితే ఇప్పుడు మీరు మాత్రమే మనుషులను రెండు

రకములుగా మానవులు, ప్రజలని విభజించారు. ప్రజలనినా, మానవులనినా

మనుషులే కదా! అటువంటప్పుడు మానవులు దేవునికి సరిపోకుండా

ఉండడము ఏమిటి? మానవులు సరిపోనప్పుడు, మానవుల మీద దేవునికి


ఇష్టములేనప్పుడు ప్రజల మీద ఇష్టము ఎలా కలిగింది. మీ మాట

నమ్మదగినదేనా? మీరు సంచలనాత్మక బోధకులు మీ మాటను కాదనలేము,

అవునని అనలేము. ఎటూ చెప్పలేము. మీరు దేనికయినా జవాబు

చెప్పగలరు. ఈ విషయములో మాకున్న సంశయమును తీర్చమని వినయ

విధేయతగా అడుగుచున్నాము.


జవాబు :- వినయము లేకుండా అడిగిన వారికి కూడా జవాబును

చెప్పాము. ఇప్పుడు నీవు వినయముగా అడుగగా నేను చెప్పకుందునా?

నీవు అడిగిన సంశయముతో కూడుకొన్న ప్రశ్నకు తప్పనిసరిగా జవాబును

చెప్పెదను జాగ్రత్తగా వినుము. మనుషులలో ఒక రకము ప్రజలు, మరొక

రకము మానవులు ఉండడము వాస్తవమే. అయితే ఆ విషయము నేడు

ఎవరికీ తెలియకుండా పోయినది. అటువంటి విషయమును ఇప్పుడు

నేను చెప్పడము మీకు ఒక వింతగానేయుంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోతే

నా తర్వాత ఎవరూ చెప్పువారు లేరు. కనుక ఇప్పుడే ఆ విషయమును

వివరముగా చెప్పదలచుకొన్నాను. నా మాటల వలన నీకున్న సంశయము

సంపూర్ణముగా తీరిపోగలదు. భూమిమీద పుట్టిన జనులలో మనుషులు,

మానవులు, ప్రజలు అను మూడు రకముల వారున్నారు. శరీరములో

మనస్సుయుండుట వలన అందరిని ఏకముగా మనుషులు అని అనవచ్చును.

మనస్సుగల వాడు 'మనిషి' అని చెప్పబడుచున్నాడు. అందరికీ మనస్సు

యుండుట వలన అందరినీ కలిపి 'మనుషులు' అని అంటున్నాము. అయితే

మనుషులలో మానవులు ఉన్నారు. అలాగే ప్రజలుయున్నారు. మానవులు,

ప్రజలు ఇద్దరు ఆకారములో ఒకే రకముగా యుండుట వలన ఎవరు

ప్రజలో! ఎవరు మానవులో! బయటికి తెలియకుండా పోయినది.


ఎవరయినా తప్పు పనిచేస్తే వానిని దూషించునప్పుడు నీవు

మనిషివేనా? అని దూషించడము జరుగుచుండును. అంతేకాక నీకు


మానవత్వమున్నదా? అని కూడా అనుచుందురు. అంతేగానీ నీవు

ప్రజలవేనా? అని ఎవరూ అనరు. ఎందుకనగా! 'ప్రజ' పదము ప్రత్యేకమయి

నది. ఒక దినము దాదాపు పది సంవత్సరముల క్రిందట తెలంగాణా

ప్రాంతములో ఒక వ్యక్తి వ్యాపారమును చేయుచున్నాడు. ఆ వ్యక్తి

తనవద్దయున్న ఒక ఆటోమొబైల్ సామానును ఎదుటి వాని అవసరమును

బట్టి ఎక్కువ రేటుకు అమ్మడము జరిగినది. ఆ వస్తువు ఎక్కడా లేదని

తనవద్దనే యుండుట వలన వందరూపాయల వస్తువును పదింతలు ఎక్కువ

రేటుతో వేయి రూపాయలకు అమ్మడము జరిగినది. ఒక గంట కాలము

గడచిన తర్వాత ఒక పెద్ద మనిషి అక్కడకు రావడము జరిగినది. షాపు

యజమాని తన వ్యాపారములో వందరూపాయల వస్తువును వేయి

రూపాయలకు అమ్మడము తెలుసుకొని, ఆ వ్యక్తి అంత అన్యాయమునకు

పాల్పడిన విషయము తెలుసుకొనిన పెద్ద మనిషి ఆ వ్యాపారస్తున్ని దూషిస్తూ

'నీకు మానవత్వమున్నదా?” అని అనడము జరిగినది. అందుకు ఆ

వ్యాపారస్తుడు బదులుగా మాట్లాడుచూ ఇలా అన్నాడు “నాకు మానవత్వమున్న

దని ఎవరు చెప్పారు? నాకు మానవత్వము లేదు, మీకే మానవత్వమున్నది,

మీరే మానవులు. నేను మానవున్ని కాదు, నాకు మానవత్వము లేదు.

నేను ఒక మనిషినే అయినంతమాత్రమున మానవున్ని మాత్రము కాదు”

అని చెప్పడము మేము విని చాలా ఆశ్చర్యపోయాము.


రెండు రోజుల అనంతరము నేను ఆ వ్యాపారుస్థున్ని కలుసుకొని

నాకు కల్గిన అనుమానమును నేను అడిగాను. అప్పుడు నేను మాట్లాడుచూ

“ఒక పెద్ద మనిషి మిమ్ములను నీకు మానవత్వమున్నదా! యని దండించి

నప్పుడు నేను మనిషినే అయినంతమాత్రమున మానవున్ని మాత్రము

కాదు అన్నావు. నీవు మనిషివగుట నిజమే, అట్లే మానవుడవగుట కూడా


నిజమే కదా!”యని అడిగాను. దానికి ఆ వ్యక్తి సమాధానమును చెప్పుచూ

“నాకు మనస్సున్నది కావున మనిషినని చెప్పాను. మనస్సున్నవాడు

మనిషియను నిర్వచనము ప్రకారము నేను మనిషిని అని చెప్పడములో

తప్పులేదు. అయితే పశువులలో ఎద్దుకు, దున్నపోతుకు ఎంతోతేడా

ఉన్నట్లు అట్లే మనుషులలో ప్రజలకు, మానవులకు ఎంతో తేడా గలదు.

నల్ల ఎద్దులు, నల్లగనేయుండు దున్నపోతులు కలిసిపోయినట్లు ప్రజలు,

మానవులు కలిసిపోయి గుర్తించుటకు వీలులేకున్నారు. ఎద్దులను, దున్నలను

రెండిటినీ కలిపి పశువులు అని పేరుపెట్టినట్లు, ప్రజలను మానవులను

ఇరువురునూ కలిపి మనుషులు అని అంటున్నారు. ఒకే పేరున్న పశు

వులలో ఎద్దులు, దున్నపోతులు ఏ విధముగా వేరువేరు జాతియై ఉన్నవో,

అలాగే ఒకే పేరున్న మనుషులలో ప్రజలు, మానవులు వేరు వేరు భావములు

కలవారైయున్నారు. ఎద్దులు బురదను చూస్తే దూరముగా ఉంటాయి.

దున్నపోతులు బురదను చూస్తే ఆనందపడి శరీరమంతా పూసుకొంటాయి.

అదే విధముగా ప్రజలు మానవులు వేరువేరు బుద్ధులు కల్గియున్నారని

చెప్పవచ్చును.


పూర్వము సూర్యుడు భూమిమీద జ్ఞానమును మనువు ద్వారా

అందించాడు. మనువు తనకు సూర్యుని ద్వారా తెలిసిన జ్ఞానమును

ఇతరులకు అందించగా దేవుని జ్ఞానము భూమిమీద పూర్తి ప్రాకిపోయినది.

అలా తెలియబడిన జ్ఞానమును కొందరు చౌకగా చూస్తూ, హేళనగా

మాట్లాడుచుండిరి. అలా హేళనగా మాట్లాడు వారిని చూచిన మాయ

వారు దేవునివైపు పోకుండాయుండుటకు అజ్ఞానమును జ్ఞానమువలె

తెలియజెప్పి, అజ్ఞానము మీద వారికి ఇష్టము పుట్టునట్లు చేసి వారిని

అజ్ఞానమువైపు పోవునట్లు, జ్ఞానము వైపు రానట్లు చేయాలనుకున్నది.


మాయ అలా అనుకొన్న వెంటనే మనువులోని భావమును మార్చివేసినది.

తాను చెప్పిన జ్ఞానమును అందరూ వినగలరనీ, తన పేరు శాశ్వితముగా

భూమిమీదయున్నట్లు చేసుకోవాలనుకొన్నాడు. అప్పుడు మనువు

స్వయముగా జ్ఞానము బోధించి, స్వయముగా ధర్మములను చూపించి,

తన బోధకు శాస్త్రమను పేరును తగిలించి మను ధర్మశాస్త్రమని పేరు

పెట్టాడు.


మాయ ప్రేరేపితము వలన మనువు తన పేరుమీద మనుధర్మ

శాస్త్రమను బోధను చెప్పిపోయాడు. ఆనాడు మనుధర్మ శాస్త్రము

గ్రంథరూపము కాలేదు. బోధరూపములోయున్న మనుధర్మశాస్త్రము

భూమండలమంతా ప్రాకిపోయినది. మాయ చేసిన పని వలన శాస్త్రము

కాని అశాస్త్రము శాస్త్రముగా, ధర్మము కాని అధర్మము ధర్మముగా భూమి

మీద ప్రాకిపోయినది. మను ధర్మశాస్త్రములోనివి ఫలానా ధర్మములని

ఎవరూ చెప్పకున్నా అవి మాత్రము మనుషుల మధ్యలో తెలియకుండా

ఉండిపోయినవి. నేడు భూమిమీద ఆచరణ రూపములోయున్న యజ్ఞములు,

వేదముల పఠనములు, దానములు, తపస్సులు (ధ్యానములు) మొదలగునవి

మను ధర్మములలోనివని ఎవరికీ తెలియదు. నేడు మను ధర్మములని

తెలియకున్నా, నాలుగు విధములుగాయున్న యజ్ఞ, దాన, వేద, తపస్సులను

చాలామంది ఆచరించుచున్నారు. దేవుడు ఆకాశవాణి ద్వారా సూర్యునికి

చెప్పిన జ్ఞానములో మనువు స్వయముగా చెప్పినా నాలుగు విధానములు

లేవు. దేవుడు దైవధర్మములను ఆకాశము ద్వారా చెప్పించాడు. మనువు

ప్రకృతి ధర్మములను దైవధర్మములకు వ్యతిరేఖముగా యున్న అధర్మములను

ధర్మములుగా బోధించడము జరిగినది. ఈ విధముగా దేవుడు ఆకాశము

ద్వారా బోధించిన దైవ ధర్మములు, ప్రకృతి మనువు ద్వారా బోధించిన


అధర్మములు రెండు భూమిమీద రెండు తెగలుగా చీలిపోయినవి. మనుషులు

ఎక్కువ శాతము మంది మను ధర్మములయిన ధర్మములు కాని అధర్మములకు

అలవాటు పడిపోయారు. దేవుని ధర్మములకు అలవాటు పడినవారు చాలా

తక్కువ శాతము గలరు. భూమిమీద దైవధర్మములను చెప్పిన మొదటి

బోధకుడు మనువే. అలాగే భూమిమీద అధర్మములను చెప్పిన మొదటి

బోధకుడు మనువే. ఒకే శరీరముగల ఒకే మనువే రెండు రకముల జ్ఞాన,

అజ్ఞాన బోధలను చెప్పడము జరిగినది. ముందు దైవ ధర్మములను చెప్పిన

మనువు తర్వాత మాయ ప్రేరేపించిన అధర్మములను బోధించిన బోధకుడుగా

ఉండిపోయాడు.


మనువు సూర్యుడు చెప్పిన జ్ఞానమునే ఇతర ప్రజలకు చెప్పాడని

భగవద్గీత ఆధారముగా అందరికీ తెలుసు. అయితే మనువు అధర్మములను

కూడా చెప్పాడని మాత్రము తెలియదు. మనువు మొదట ధర్మములను

బోధించి తర్వాత అదే మనువు అధర్మములను బోధించాడు అంటే ఎవరూ

వినే పరిస్థితిలో లేరు. అయినా మనువు ధర్మములను, అధర్మములను

బోధించాడని తెలియకపోవడము వలన తమకు తెలియకుండానే అధర్మముల

వైపు మనుషులు పోవడము జరిగినది. ధర్మములు దేవునివికాగా,

అధర్మములు మాయ వలన వచ్చినవి. మనిషికున్న శ్రద్ధను బట్టి వానికి

దైవ ధర్మములుగానీ, మాయ అధర్మములుగానీ లభించుచున్నవి. దైవికమైన

శ్రద్ద మనిషిలో యున్నప్పుడు దైవ ధర్మములు లభించుచున్నవి. అట్లే ప్రకృతి

శ్రద్ధయున్నప్పుడు వానికి అధర్మములే దొరుకును. అధర్మములను

ఆశ్రయించిన వాడు మనువు యొక్క అధర్మములను ఆచరించిన వాడగును.

అట్లే ధర్మములను ఆశ్రయించినవాడు దైవధర్మములను ఆచరించినవాడగును.


ఇక్కడ అసలు విషయానికి వచ్చి చూస్తే మనువు ధర్మములను

ఆచరించినవాడు ఎవడయినా వానిని 'మానవుడు' అనడము పూర్వము


జరిగెడిది. అలాగే దేవుని ధర్మములను ఆచరించిన వానిని 'ప్రజ' అని

అనడము జరిగెడిది. పూర్వము దేవుని ధర్మములు ఆచరించెడివారు

అధికముగా యుండెడివారు. అందువలన వారినందరినీ “ప్రజలు” అను

పేరుతో పిలిచెడివారు. మనువు యొక్క ధర్మములను అనుసరించెడివారు

చాలా తక్కువమంది యుండెడివారు. అందువలన వారిని "మానవులు”

అని పిలిచెడివారు. పూర్వము భూమిమీదయున్న మనుషులలో ప్రజలు

ఎక్కువగా యుండెడివారు. మానవులు తక్కువగా యుండెడివారు.

యుగములు మారగా, కాలము జరుగగా ప్రజలు తగ్గిపోయారు. మానవులు

ఎక్కువయి పోయారు. పూర్వముకంటే ఇప్పుడే మనుషుల సంఖ్య ఎక్కువగా

యున్నప్పటికీ అందులో ప్రజలు అరుదుగా యున్నారు. ఎక్కడ చూచినా

మానవులే కనిపించుచున్నారు. దేవుని ధర్మములు నేడు లేకుండా పోయి

ఎక్కడ చూచినా మనువు ధర్మములే కనిపించుచున్నవి. మను ధర్మములే

దేవుని ధర్మములుగా చెప్పబడుచున్నవి. దేవుని ధర్మములు ఏమాత్రము

తెలియకుండా పోయినవి. ఎక్కడయినా దేవుని ధర్మములు అరుదుగా

కనిపించినా వాటిని పరమత ధర్మములని హిందువులే హేళన చేయుచున్నారు.

అంతో ఇంతో నావద్ద దైవజ్ఞానముండుట వలన నన్ను 'మానవుడు' అని

అనకూడదన్నాను. మను ధర్మములను అనుసరించు వారు మానవులవు

తారు. నేను మను ధర్మములను అనుసరించడము లేదు. అందువలన

నేను మానవున్ని ఎలా అవుతాను. నేను దైవ ధర్మములనే అనుసరించు

చున్నాను కావున “ప్రజ” అను పేరు నాకు తగినది. మానవ అనుపేరు

నాకు తగదు. అందువలన నన్ను దండించిన పెద్ద మనిషితో నాకు

మానవత్వము లేదు, నేను మానవున్ని కాను అని గట్టిగా చెప్పాను. ఇప్పటి

కాలములో మానవునికి, ప్రజలకు అర్థము తెలియని దానివలన నేను

చెప్పినమాట మీకు అర్థము కాలేదు. మీకే కాదు నేడు పెద్ద జ్ఞానులమనుకొన్న


వారికి కూడా మానవులకు ప్రజలకు వ్యత్యాసము తెలియదు.” అని ఆయన

చెప్పగా నేను విన్నాను. నేను ఆయనను అడిగిన దానివలన ఇప్పుడు

మీకు కూడా కొంత అర్థమయినదనుకొంటాను.


ప్రశ్న :- ఆయన ఎవరో మాకు తెలియదుగానీ, ఇప్పుడు మీరు చెప్పగా

మేము విన్నాము. ఆయనను వదలి మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాము.

అది ఏమనగా! మను ధర్మములను ఆచరించిన వారు మానవులయితే

నేడు భూమిమీద ఎంతో గొప్ప జ్ఞానులుగా చెప్పబడు వారందరూ ఎప్పుడో

ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట యజ్ఞములను చేయుచున్నారు. యజ్ఞములనే

కాదు మనువు చెప్పిన మిగతా మూడు ధర్మములను కూడా ఆచరించు

చున్నారు. వారిని ఏమనాలి అజ్ఞానులనాలా, జ్ఞానులనాలా?


జవాబు :- నేడు భూమిమీద మనుధర్మములను ఆచరించువారే జ్ఞానులుగా

చెప్పబడుచున్నారు. జ్ఞానులుగా గౌరవించబడుచున్నారు. ఎవరు ఎలా

యున్నా సూత్రము ప్రకారము వారు మనుధర్మములను ఆచరించుచున్నారు,

కావున వారిని మానవులని చెప్పవచ్చును. మనువు భూమిమీద మొదట

ధర్మములను చెప్పాడు తర్వాత అధర్మములను చెప్పాడు. మనువు మొదట

చెప్పిన ధర్మములను అనుసరించువారు జ్ఞానులు అగుదురు. మనువు

కొంతకాలము తర్వాత రెండవ మారు చెప్పిన ధర్మములను అనుసరించు

వారిని అజ్ఞానులని అనాలి. ఒకరిద్దరినయితే అలా అజ్ఞానులని చెప్పి,

వారిని మంచిదారికి తేవచ్చును. అట్లు కాక భూమిమీద 90 శాతము

మనుషులు వారికి తెలియకుండానే మను ధర్మములను ఆచరించుచున్నారు.

అటువంటప్పుడు అంతమందిని అజ్ఞానులంటే, అనిన వారిని ఊరక

వదలరు. తమను అజ్ఞానులని అన్నందుకు అనిన వానిని ఏదో ఒక రకముగా

బాధించుదురు. నిజము చెప్పి కష్టములను కొని తెచ్చుకోవడము కంటే,



అసత్యమును సత్యమేయని ఒప్పుకొని వారినుండి దూరముగా ఉండడము

మంచిది.


బుద్ధి కుశలతగలవారు తాము అధికులయినా, ఇతరులు తక్కువ

వారయినా వారినే అధికులుగా చెప్పి, తమను తామే తక్కువ చేసుకొను

చుందురు. సమయ సందర్భమునుబట్టి బుద్ధిగలవారు అలా చేయుచుందు

రని వేమన యోగి తన పద్యమందు ఇలా చెప్పాడు.


అనువుగాని చోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువ కాదు

కొండ యద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినుర వేమ.


భావము :- బుద్ధియుతులు సమయ సందర్భమునుబట్టి తగినట్లు ప్రవర్తించు

చుందురు. వారు తగనిచోట సామాణ్యులుగానే యుందురు. కొండ

ఎంత పెద్దదయినా అద్దములో చిన్నదిగా కనిపించునట్లు, జ్ఞానులు ఎంత

పెద్ద వారయినా అజ్ఞానుల ముందు తమను తాము తగ్గించుకొని చిన్నగనే

కనిపించుచుందురు.


ప్రశ్న :- మను ధర్మశాస్త్రములోని ఆచరణలను తెలిసి ఆచరించినా, తెలియక

ఆచరించినా వారు మానవులే యగుదురు. అయితే దైవ ధర్మములను

కూడా మనువే చెప్పాడు. మనువు చెప్పిన వాటిని ఆచరించడము వలన

మానవులయితే, మనువే దైవధర్మములను కూడా చెప్పాడు కదా! మనువు

చేత చెప్పబడిన దైవ ధర్మములను ఆచరించువారిని ప్రత్యేకముగా “ప్రజలు”

అనడములో అర్థమేమయిన గలదా?


జవాబు :- మనువు అను మనిషి చేత జ్ఞానమును భూమిమీద మనుషులకు

చెప్పించినా, జ్ఞానము దేవునివద్దనుండి ఆకాశము ద్వారా, సూర్యుని ద్వారా

మనువుకు చేరడమైనది. జ్ఞానము యొక్క మొదటి స్థానము దేవుడే అయినా

తర్వాత ఆకాశము, సూర్యుడు అను రెండు స్థానములు మారి నాల్గవ

స్థానమైన మనువు వద్దకు చేరడమైనది. మనువు నుండి ఐదవ స్థానమయిన

మనుషులకు చేరడమైనది. అయితే నాల్గవ స్థానమైన మనువువద్ద మాయ

పనిచేయడమైనది. దేవుని జ్ఞానమును మనువు మనుషులకు బోధించిన

తర్వాత మాయ మనువులో పనిచేసి, దేవుని జ్ఞానమునకు వ్యతిరిక్తమైన

అధర్మములను చెలరేగునట్లు చేసినది. మొదట దేవుని జ్ఞానమును బోధించిన

మనువు తర్వాత అధర్మములను బోధించాడు. మొదట బోధించిన ధర్మములు

దేవునివద్దనుండి వచ్చినవి కాగా, తర్వాత బోధించిన అధర్మముల మొదటి

స్థానము మాయకాగా, రెండవ స్థానము మనువేయని చెప్పవచ్చును.

మనువు ఐదవ స్థానమున యుండి బోధించిన దేవుని ధర్మములను

వినినవారు కొందరుండగా, మనువు రెండవ స్థానమునయుండి బోధించిన

మాయ ధర్మములను వినిన వారు కూడా కొందరు గలరు. ఈ విధముగా

మనుషులలో మనువు ద్వారా దైవధర్మములను వినినవారు ఒక గుంపుకాగా,

అదే మనువు ద్వారా మాయ ధర్మములను వినినవారు మరియొక గుంపుగా

నిలిచిపోయారు.


మనువు చెప్పిన దేవుని ధర్మములను, మాయ ధర్మములను రెండిటినీ

వినినవారు మనుషులే అయినా, మనుషులు వినిన బోధనుబట్టి రెండు

రకములుగా చీలిపోవడము జరిగినది. మాయ మనువు ద్వారా ధర్మములను

చెప్పించినా, మాయ నేను చెప్పానని ఎక్కడా చెప్పకపోవడము వలన, దానిని

మనువే స్వయముగా చెప్పినట్లయినది. అందువలన మాయ ధర్మములను


మను ధర్మములేయని చెప్పవలసి వచ్చినది. మనువు చెప్పిన మను

ధర్మములను విని అనుసరించిన వారిని, మనువు పేరుతో పుట్టిన 'మానవ’

అను పేరుగల వారిగా మానవులుగా చెప్పడమైనది. మనుషులలో ఒక

గుంపు మానవులుగా చీలిపోగా, రెండవ గుంపుగా దేవుని ధర్మములను

విని ఆచరించువారని చెప్పవలసి వచ్చినది. మనుషులకు ఒక గుంపు

మానవులు కాగా, మరియొక గుంపు పేరు ప్రజలని చెప్పుచున్నాము.

మానవుల వెనుక మనువుయుండుట వలన మానవులని అర్థము

చెప్పుచున్నాము. అలాగే ప్రజల వెనుక కూడా ఏదో ఒక అర్థము తప్పక

ఇమిడియుండును. దానిని విడదీసి చూచిన ఈ విధముగా తెలియు

చున్నది. “ప్రజ” అను రెండు అక్షరములలో 'జ' అనగా పుట్టుటయని

అర్థము గలదు. 'ప్ర' అనగా ముఖ్యమైన సారాంశమైన అని అర్థము

గలదు.



ఎవడయితే దేవుని ధర్మములను తెలియగలిగాడో వాని జన్మ

సారాంశమైన జన్మగా మారిపోవుచున్నది. అందువలన దైవ ధర్మములను

తెలిసిన వారిని 'ప్రజలు' అని అనవలసి వచ్చినది. దైవధర్మములను తెలిసిన

వాని జన్మ సార్థకమగుట వలన అట్టివారిని ముఖ్యమైన జన్మలు గల వారని,

లేక సారాంశమైన జన్మలు గలవారని అర్థమొచ్చునట్లు చెప్పుటకు ప్రత్యేకించి

వారిని “ప్రజలు” అని చెప్పడమైనది. నేడు భూమిమీదగల మనుషులలో

మానవులు ఎక్కడ చూచినా గలరు. అయితే ప్రజలు అరుదుగా గలరని

చెప్పవచ్చును. మనువు చెప్పిన మొదటి బోధకన్నా, రెండవ బోధ అయిన

మను ధర్మశాస్త్రమే నేడు ప్రజలలో పూర్తిగా ప్రాకిపోయినది. మొదట

చెప్పిన దైవ ధర్మములు నేడు మనుషులలో కనిపించడము లేదు. అందువలన

ప్రజలు అరుదుగా కనిపిస్తున్నారని చెప్పుచున్నాము.


ప్రశ్న :- మీలాంటి వారు దైవ ధర్మములను, మను ధర్మములను విడదీసి

చూపడము వలన మానవులు కొందరయినా ప్రజలుగా మారవచ్చును

కదా!


జవాబు : - విడదీసి చెప్పితే విషయము మాత్రము అర్థము కాగలదు.

తెలియని విషయము తెలియగలదు. ఇది ప్రపంచ విషయములలో అయితే

సరిపోవును. ఇక్కడ నేను చెప్పునది దైవ సంబంధమైన జ్ఞానము కనుక

జ్ఞానమంతయూ మనిషిలో శ్రద్ధయున్నప్పుడే వానికి తెలియగలదు. ఒక

మనిషి మానవుని నుండి 'ప్రజ' వరకు మారవలెనంటే వానికి దైవజ్ఞానము

లభించాలి. దైవజ్ఞానము లభించాలంటే వానికి దేవునిమీద, దేవుని జ్ఞానము

మీద ఎక్కువ శ్రద్ధయుండాలి. శ్రద్ధలేకపోతే జ్ఞానము లభించదు.

అందువలన ముందు మానవునికి దేవుని జ్ఞానము మీద శ్రద్ధ కలగాలి.

బోధకుడుగానీ, గురువుగానీ ఎంత వివరమును చెప్పినా, ఎంత మంచిగా

బోధించినా శ్రద్ధలేకపోతే మానవుడు ప్రజగా మారలేడు.


ప్రశ్న :- సూర్యుడు మనువుకు దైవజ్ఞానమును చెప్పాడు. మనువు ప్రజలకు

దైవజ్ఞానమును, మానవులకు తన జ్ఞానమును బోధించాడు. అయితే

దైవజ్ఞానము తెలిసిన ప్రజలు సూర్యున్ని నమస్కరించడములేదు. మనువు

జ్ఞానమును తెలిసిన మానవులు మాత్రము సూర్యున్ని నమస్కరించుచున్నారు.

సూర్య నమస్కారమును ప్రజలు చేయడము లేదుగానీ, మానవులే చేయు

చున్నారు. మానవులు మనువు జ్ఞానమును తెలియుట వలన మనువుకు

నమస్కారము చేయవలెనుగానీ, సూర్యనమస్కారము ఎందుకు చేయు

చున్నారు? సూర్యుడు దైవజ్ఞానమును భూమిమీదికి తెచ్చాడను గౌరవముతో

ప్రజలు సూర్యున్ని నమస్కరించవచ్చును. అయితే ప్రజలు ఎవరూ సూర్య


నమస్కారమును చేయలేదు. మను ధర్మములను తెలిసిన మానవులు

దైవజ్ఞానమును తెల్పిన సూర్యునికి ఎందుకు నమస్కరించుచున్నారు? వారికి

సంబంధము లేనిపనిని ఎందుకు చేయుచున్నారు?


జవాబు :- సూర్య నమస్కారములు చేయునది మను ధర్మమును

అనుసరించు మానవులే. ప్రజలు ఎవరూ సూర్యనమస్కారము చేయలేదు

కదా! ప్రజలు దైవజ్ఞానమును తెలిసియుండుట చేత వారు దైవ ధర్మముల

ప్రకారము దేవున్ని తప్ప ఎవరికీ నమస్కరించరు. అందువలన ప్రజలయిన

వారు ఎవరు కూడా సూర్యనమస్కారములు చేయలేదు. భగవద్గీత సృష్ట్యాది

లోనే సూర్యునికి ఆకాశవాణి ద్వారా తెలిసినా, అది అప్పుడు గ్రంథ

రూపము కాలేదు. తర్వాత ద్వాపర యుగము చివరిలో భగవద్గీత గ్రంథరూప

మైనది. భగవద్గీతా గ్రంథము ప్రథమ దైవ గ్రంథమయినది. ప్రథమ దైవ

గ్రంథమైన భగవద్గీతయందలి రాజ విద్యా రాజగుహ్య యోగమున 22వ

శ్లోకమందు ఈ విధముగా చెప్పబడినది.


అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥


భావము :- “అన్యదేవతల చింతన లేకుండా ఏ జనుడయితే నన్నే గొప్పగా

తలచి నిత్యము నా ధ్యాస కల్గియున్నాడో, వాని యోగము యొక్క క్షేమమును

నేనే చూచుకొందును" అని శరీరములోని దేవుడు స్వయముగా చెప్పడ

మైనది. ఈ శ్లోక భావమునుబట్టి ఇతర దేవతల భక్తిగానీ, ఇతర దేవతలకు

నమస్కరించడముగానీ చేయనివాడు నా భక్తుడనీ, అతని యోగము

చెడిపోకుండా భంగము కలుగకుండా నేనే చూచుకొంటాననీ స్వయముగా

శరీరములోని దేవుడే చెప్పినట్టుకలదు. ఇక్కడ అన్య దేవతలను అని


చెప్పడము వలన సూర్యున్ని నమస్కరించడము కూడా అన్యదేవతను

నమస్కరించినట్లేయగును. దేవుని జ్ఞానములో అన్యదేవతలకు

నమస్కరించడము, పూజించడము ఉండదు. దేవుని జ్ఞానము కానటువంటి

మనువు యొక్క జ్ఞానములో ఇతరులను అనగా ఇతర దేవతలను

ఆరాధించడము ఉండుట వలన, మను ధర్మమును అనుసరించు మానవులు

మాత్రమే సూర్యున్ని నమస్కరించుచున్నారు. అటువంటివారు ఒక్క

సూర్యున్నేకాక ఎవరినయినా ఆరాధించుచుందురు. అందువలన వారిని

అన్యదేవతా ఆరాధకులని చెప్పవచ్చును. అన్య దేవతారాధన దైవజ్ఞాను

లయిన ప్రజలు చేయరు. ప్రజలు కానివారు, మానవులయిన వారు అన్య

దేవతలను ఆరాధింతురు. కావున సూర్యనమస్కారము కూడా అన్య

దేవతారాధన క్రిందికే జమచేయబడినది. కావున వారిని మానవులనియే

చెప్పవచ్చును. మను ధర్మమును తెలిసినవారు వారి జ్ఞానము ప్రకారము

దేవతలను పూజించడము తప్పక చేయుదురు. ఎవడయితే దైవజ్ఞానము

తెలిసి ప్రజలుగాయుండి ఇతర దేవతలను ఆరాధించక దేవున్నే ఆరాధించు

వారిని చూచిన మానవులు ప్రజలను నాస్తికులుగా, ఇతర మతముల వారిగా

చెప్పుచుందురు. నేడు హిందూమతములో భగవద్గీతా జ్ఞానమును ప్రక్కన

పెట్టిన హిందువులు, హిందూ నాయకులు, హిందూ ధర్మరక్షకులని పేరు

గాంచినవారు పూర్తిగా మానవత్వము కల్గి సూర్యనమస్కారముల నుండి

నదుల పూజల వరకు ఆరాధనలు చేయుచూ, తమదే నిజమైన భక్తిగా,

తామే నిజమైన హిందువులుగా చెప్పుకొనుచూ, ఇతర దేవతల పూజలు

చేయనివారిని, నాస్తికులుగా, పరమతస్థులుగా చెప్పుచుందురు. నిజమైన

ప్రజలుగా యున్నవారు, ఏమి చెప్పినా ప్రజలు దైవధర్మముల ప్రకారమే

నడుచుకొందురు. ఎవరినీ మ్రొక్కరు. ఇతర దేవతలను మ్రొక్కువారు

మను ధర్మయుతులు మానవులని తెలియవలెను.


దేవునికి ఇష్టములేని వారిని మాయ దేవుని మార్గమువైపు రాకుండా

చేయును. అయితే మాయ ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియకుండా

చేయగలదు. అందువలన మనిషిని దైవమార్గములో యున్నట్లు నమ్మించి,

తానున్నది దైవమార్గమేయని నమ్మించి దేవుని మార్గమునుండి ప్రక్కకు

తప్పించును. మనిషిని తాను అందరికంటే మంచి మార్గములో యున్నానని

నమ్మించుటకు దేవతల మీద భక్తిని కల్పించి, భక్తి సంఘములలో ముఖ్యమైన

వానిగా యున్నట్లు చేసి, భక్తి కార్యక్రమములను బాధ్యతగా చేయుస్తూ,

భక్తి సంఘమునకు కార్యకర్తగనో, లేక సంఘమునకే పెద్దగనో చేసి భక్తి

మార్గములో ఎంతో శ్రద్ధగా శ్రమించి, పనిచేయునట్లు చేసి నాకంటే

భక్తిగలవాడు లేడు అనిపించును. దానితో నేను దైవమార్గములో లేనను

భావము వానిలో ఏమాత్రము రాదు. అటువంటి వారు నిజ దైవమార్గములో

యున్నవారిని చూచి వారి మార్గము సరియైనది కాదని తలచుచుందురు.

నేడు హిందూ సమాజములో హిందూ మతరక్షణ సంఘములలో యున్నవారు

చాలా వరకు ఏదో ఒక భక్తి మార్గములో యుండి, దేవతారాధనలను

బాధ్యతగా చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ తాము గొప్ప జ్ఞానులమనో,

గొప్ప భక్తులమనో అనుకొనుచూ తామున్న పరిస్థితి మంచిదా! చెడుదా!యని

ఆలోచించు స్థితిలోయుండరు. వారిలోని మాయయే వారిని ఆ విధముగా

తయారు చేసినదని చెప్పవచ్చును.


కల్లుత్రాగిన కాలిదాసు, మత్తుత్రాగిన దేవదాసు, భంగిత్రాగిన

రామదాసు ఒకచోట చేరి 'జగమే మాయ బ్రతుకే మాయ'యని మాయను

గురించి తెలిసినవారు పాడినట్లు పాట పాడుచుందురు. మాయయే వారిని

ఆ స్థితికి తెచ్చినదనీ గ్రహించలేరు. అదే విధముగా దేహములోని ఆత్మను,

పరమాత్మను తెలియలేని వారు తాము దేశములోని దేశభక్తిని కల్గియున్నామనీ


తామే మతమును రక్షించుచున్నామనీ, హిందూ ధర్మములను కాపాడుచున్నా

మని చెప్పుకొనుచుందురు. వాస్తవముగా వారిని మాయ ధర్మములకు

చాలా దూరముగా పెట్టినదని చాలామందికి తెలియదు. హిందువులలో

గొప్పవానిగా చెప్పుకొనుచుండినా, అనేక భక్తి కార్యక్రమాలలో పాల్గొను

చుండినా అతనికి హిందూ ధర్మములంటే ఏవో వాస్తవముగా తెలియవు.

అన్యదేవతారాధన చేయడమే హిందూ ధర్మములను ఆచరించినట్లనుకొను

చుండును. వాస్తవముగా దైవమార్గమునుండి తప్పిపోయిన వారు మాత్రమే

అలా చేయుచుందురని వారికి తెలియదు. ఇతరులు చెప్పినా వారు

గ్రహించుకొను స్థితిలోయుండరు. మాయ అంత భద్రముగా తయారు

చేసినది.


సూర్యుడు భూమిమీద జ్ఞానము చెప్పాడని ఆనాడు తెలియకున్నా

5000 సంవత్సరముల పూర్వము తెలిసిపోయినది. సూర్యుడు భూమిమీదకి

జ్ఞానమును తెచ్చిన మొదటి గురువని అందరికీ తెలుసు. అందువలన

ఆయనయే మొదటి గురువని తెలియునట్లు సూర్యునికి “ఆదిత్య” అని

పేరు పెట్టడము కూడా జరిగినది. మనిషి మొదటి గురువయిన

సూర్యున్ని నమస్కరించడము హిందువుల సాంప్రదాయములలో మొదటి

సాంప్రదాయముగా కొందరు చెప్పుచుండుట తెలిసిన విషయమే. ఉదయము

మొదటనే సూర్యనమస్కారముతో హిందువులు పనులు ప్రారంభించవలెనని

కొందరు స్వామీజీలు, హిందూ మత పెద్దలు చెప్పగా విన్నాము. సూర్యడు

మొదట జ్ఞానమును చెప్పినవాడు గనుక ఆయనను నమస్కారము

చేయడములో తప్పులేదని అందరూ అనుకొందురు. సూర్య నమస్కారము

లను చేయమని పెద్ద పెద్ద స్వామీజీలు చెప్పడమేకాక, వారు చేసి

చూపిస్తున్నారు. వారిని చూచి మంచిపనే కదా!యని ఇతరులు


చేయుచున్నారు. ఈ మధ్య కాలములో సూర్యనమస్కారములు అరుదుగా

ఎక్కడో ఒకచోట కనిపించుచుండును. పూర్వము ప్రతి మనిషి ఉదయమే

సూర్యనమస్కారము చేసెడివాడు. భగవద్గీత జ్ఞానరీత్యా, దైవ ధర్మములకు

సూర్యనమస్కారము చేయడము వ్యతిరేఖమని చాలామందికి తెలియదు.

“అన్యచింత లేకుండా” అని భగవద్గీతలో చెప్పినప్పుడు, సూర్యునిమీద

భక్తిని కనబరచడము దేవునికంటే అన్యమయిన సూర్యున్ని ఆరాధించడము

అధర్మమేయగును. అయినా ఆ విషయమును మాయ మనుషులకు

తెలియకుండా చేసినది.


మాయ ఏమి చేసినా చాలా గట్టిగా చేయును. మాయ చేసిన

పనిని ఏ మనిషి గుర్తించలేడు. అందులన మాయ ప్రభావములో పడిన

వాడు ఎవడయినా తాను చేయుచున్నదే సరియైనదని తలచుచుండును.

మాయ ఉదయమే సూర్యనమస్కారములలో మనుషులను ఇరికించి

మనుషులను మానవులుగా తయారు చేసినది. కొందరు సూర్యనమస్కారము

లను మాత్రము చేసి ఇతర దేవతలను ఎవరినీ నమస్కరించక, ఆరాధించక

యుందురు. అటువంటివారు మాకు జ్ఞానమును చెప్పిన గురువుకు

నమస్కారము చేయుచున్నాను తప్ప ఇతర దేవతలకు మేము మ్రొక్కడము

లేదుకదా!యని అనుచుందురు. అయితే సూర్యుడు గురువు కాదనీ,

సూర్యుడు కేవలము మొదటి బోధకుడేయని వారికి తెలియదు. తాను

తెలుసుకొన్న దానిని ఇతరులకు చెప్పువారు బోధకుడే అవుతాడు. ఇతరులు

ఎవరూ చెప్పని జ్ఞానమును మొదట బోధించినవాడు గురువగునని

చాలామందికి తెలియదు. గురువుకు, బోధకునికి వ్యత్యాసము తెలియని

వారుండుట వలన సూర్యున్ని గురువని చెప్పుచున్నారు. వాస్తవముగా

సూర్యుడు గురువు కాదు, కేవలము బోధకుడు మాత్రమేయని తెలియవలెను.


అయితే మాయ సూర్యున్ని గురువుగా చూపి, సూర్యనమస్కారము చేయించి

మనిషిని ప్రక్కదారి పట్టించి చివరకు మనిషిని మానవునిగా మార్చుచున్నది.

మానవుడనని చెప్పుకొను మనిషి మాయ ప్రభావము చేత తాను చేయుచున్నదే

దైవ ఆరాధనయనీ, తాను మాట్లాడునదే దైవజ్ఞానమనీ అనుకొనుచుండును.

ఇతరులు దైవజ్ఞానమును చెప్పినా వారికి అది పరమతముల బోధగా

కనిపించును. అటువంటప్పుడు అసలయిన జ్ఞానినే పరమత బోధ

చెప్పుచున్నాడని ఆరోపణలు చేసి, వారిని బాధించుటకు మొదలు పెట్టుదురు.


ప్రశ్న :- హిందూ సంస్కృతిలో సూర్యనమస్కారము ముఖ్యమైన సాంప్రదాయ

మని అందరూ అనుచున్నారు కదా! సూర్యనమస్కారములతోనే హిందువుల

ఔన్నత్యము ఇతర మతముల వారికి తెలియునని హిందువులు అందరూ

అంటున్నారు కదా!

జవాబు :- మాయ 'మతము' అను వలను వేసి ఒక్క హిందువులనే

కాకుండా అన్నిమతముల వారిని దేవుని మార్గమునుండి దూరము చేసినది.

హిందువులను 'సంస్కృతి, సాంప్రదాయము'లను పేరుతో దేవుడు చెప్పిన

భగవద్గీత జ్ఞానమునకు మాయ దూరము చేసినది. మనుషులను

మానవులుగా చేసి దేవుని జ్ఞానమునకు దూరము చేయడము మాయ

యొక్క పనియైనా, అదంతయూ దేవుని ఆదేశముతోనే మాయ అలా

చేసినదని తెలియవలెను. సారాత్రాగిన వానిని గుడిలోనికి రాకుండా పూజారి

అడ్డుకొన్నట్లు శ్రద్ధలేని వానిని దేవుని వద్దకు రాకుండా మాయ

అడ్డుకొంటున్నది. హిందువుల గొప్పతనము సూర్యనమస్కారముల వలన

ఇతర మతముల వారికి తెలియునని మనుషులను అనుకొనునట్లు చేసి,

మనిషిని మాయ మానవునిగా తయారు చేసి, మనుధర్మములను ఆచరించు

నట్లు చేయుచున్నది. మనిషి నేను ధర్మములను ఆచరిస్తున్నాను అని


అనుకొంటున్నాడు. అయితే ఏ ధర్మములను ఆచరిస్తున్నానని ప్రశ్నించు

కోలేదు. మనిషి దేవుని ధర్మములను ఆచరిస్తే ప్రజలలో చేరిపోతాడు,

మనిషి మను ధర్మములను ఆచరిస్తే మానవులలో చేరిపోతాడు. అందువలన

నీవు సంస్కృతి అను పేరుతో మాయలో చిక్కుకోవద్దు. మతము అను

పేరుతో దేవుని దారితప్పి నడువవద్దు. నీవు మరణించిన తర్వాత నీవెంట

నీ మతము ఉండదు, నీ సంస్కృతియుండదు. నీ వెంట ఒక్క దేవుని

జ్ఞానము మాత్రము రాగలదు. మిగతావన్నీ వదలిపోవలసియున్నది.

మధ్యలో వదలిపోవు వాటితో నీకు పని లేదు. నీ వెంట వచ్చేదానినే

చూచుకో!


ప్రశ్న :- సూర్యునికి ఆదిత్యుడని మనువే పేరు పెట్టాడు కదా! ఆదిత్య

అను పేరునే మనువు ఎందుకు ఎంచుకొన్నాడు.


జవాబు :- 'ఆదిత్య' అను పేరును సూర్యునికి మనువు పెట్టినది వాస్తవమే

అయినా, మనువు తెలిసి సూర్యునికి ఆ పేరును పెట్టలేదు. తనకు

జ్ఞానము చెప్పిన వ్యక్తికి ఆదిత్య అను పేరును పెట్టాలనుకొని పెట్టాడుగానీ,

తనకు సూర్యుడు జ్ఞానము చెప్పాడనిగానీ, సూర్యునికే ఆదిత్య అను పేరు

పెట్టుచున్నాననిగానీ మనువుకు తెలియదు. మనువుకు తెలిసి పెట్టినా,

తెలియక పెట్టినా పేరు పెట్టినది మాత్రము సూర్యునికేననీ కృష్ణుడు

అర్జునునకు జ్ఞానము చెప్పినప్పుడు తెలిసినది. అయితే ఆ దినము మనువు

ఆదిత్య అను పేరును ఎన్నుకొనుటకు కొంత కారణము కలదని చెప్పు

చున్నాము. ఆదిత్య అను పేరులో పైకి కనిపించు అర్థము ప్రకారము

మొదటి గురువని చెప్పవచ్చును. అయితే అదే అర్థమునే వివరముగా

చెప్పుకొంటే ఇలా కలదు.


ఆదిత్య అను పదమును రెండుగా విడదీసి చూస్తే ఆ+దిత్య =ఆదిత్య

అని కలదు. ముందు 'దిత్య' అను పదమును గురించి చూస్తే తెలుగు

భాష అర్థము ప్రకారము ద, ది, ద్వ, దౌ, దో, ద్వా అను మొదలగు

అక్షరములన్నియూ రెండు సంఖ్యను సూచించుచున్నవి.





1)దోబూచులాట  :   రెండు బూచుల ఆట.

2)ద్వందములు :  రెండుగాయున్నవి.

3)దిత్వము : రెండు

4)దౌ భూతములు : రెండు జీవులు.

5)ద్వితీయ భాగము :రెండవ భాగము.

6)దిత్యము  : రెండుగా యున్నది.

7) దండిగా  : రెండుకంటే ఎక్కువ.


ఈ విధముగా ద, ది, ద్వ, దౌ, దో, ద్వి అను అక్షరములు రెండు

సంఖ్యను తెలుపుచున్నవి. ఇక్కడ 'దిత్య' అనగా 'రెండు' అను అర్థమే

వచ్చు చున్నది. మొదట అక్షరము 'ఆ' ఉండుట వలన లేదు, కాదు అను

సూచనను తెలియజేయుచున్నది. దానిప్రకారము ఆదిత్య అను పదమునకు

అర్థము రెండు కానిదని తెలియుచున్నది. ఇక్కడ సందర్భానుసారము

చూస్తే రెండవ వాడు లేడు అని తెలియుచున్నది. జ్ఞానమును బోధించిన

వారిలో నిన్ను మించిన రెండవ వాడు లేడు అను అర్థముతో మనువు

తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తికి ఆదిత్య అని పేరు పెట్టడము జరిగినది.

మనువుకు తెలిసినంత వరకు అంతపెద్ద జ్ఞానము ఎప్పుడూ ఎవరి ద్వారా

మనువు వినలేదు. అందువలన అంతవరకు జ్ఞానము చెప్పిన వారిలో

రెండవవాడు లేడు అన్నట్లు తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తికి మనువు

“ఆదిత్య” అను పేరును పెట్టడము జరిగినది. అయితే ఆ పేరు సూర్యునకు


నామకరణము చేయుచున్నట్లు అప్పుడు మనువుకు తెలియదు. ఆదిత్యుడు

ఎవరయినది ద్వాపర యుగము చివరివరకు ఎవరికీ తెలియదనియే

చెప్పవచ్చును. భగవద్గీతను కృష్ణుడు చెప్పినప్పుడు మనువు ఆదిత్యుడని,

పేరు పెట్టినది సూర్యునకని తెలిసినది. అప్పటినుండి అందరూ సూర్యున్ని

ఆదిత్యుడని చెప్పడము జరిగినది. సూర్య స్థుతిలో 'ఆదిత్యాయనమః' అని

అనడము జరిగినది.


ప్రశ్న :– ఇంతకుముందు మీరు ఆదిత్య అంటే మొదటి గురువని అర్థమును

చెప్పారు. ఇప్పుడేమో ఆయన జ్ఞానము చెప్పినవారిలో గొప్పవాడు. అతనిని

మించిన రెండవ వాడు లేడని అర్థమును చెప్పారు. ఎటు కాకుండా

మధ్యలో నిలిపి వేశారు. సూర్యుడు అన్ని విధముల భూమిమీద జ్ఞానమును

చెప్పిన మొదటి గురువే కదా!


జవాబు :- ఇక్కడ కొంత ఆలోచించి చూడవలసియున్నది. ఎందుకనగా!

ఇది ఆధ్యాత్మిక విషయమైనందున ప్రతి దానిని జాగ్రత్తగా చూడవలసిన

అవసరమున్నది. అందరికీ సులభముగా అర్థమగుటకు నాకళ్ళముందే

జరిగిన నేను చూచిన ఒక సంఘటన ఉదహరించి చెప్పెదను చూడండి.

అప్పుడు నా వయస్సు బహుశా ఎనిమిది లేక తొమ్మిది సంవత్సరములుండ

వచ్చును. నేనున్న ఇంటిప్రక్కలో చిన్న కిరాణా దుకాణము (సరుకుల

అంగడి) ఉండేది. మరొక ప్రక్క ఇంటిలో ఒక ముసలావిడ ఉండేది. ఆ

ముసలామె ఆకు వక్క దంచి తాంబూలము వేసుకొనేది. ఆమె ఇంటిలోనున్న

ఆమె మనువడికి రెండు బొట్లు ఇచ్చి (అప్పటి కాలములో నాణెములు)

ఆకులు వక్కలు తెమ్మని చెప్పింది. ఆమె మనువడి వయస్సు బహుశా

ఏడు సంవత్సరములు. అయినా అతనికి మాటలు స్పష్టముగా పలుకుటకు

వచ్చెడిది కాదు. నేను చూస్తున్నట్లే ప్రక్కనేయున్న అంగడికి వచ్చి రెండుబొట్లు


ఇచ్చి ఆకులు, వక్కలు ఇమ్మన్నాడు.  విషయము అంతేగానీ అతను 

చెప్పడములో కొంత తేడా అయినది. ఆకులు చెప్పడములో మధ్య

అక్షరమయిన 'క' కు కొమ్ము చెప్పకుండా వచ్చీరాని మాటలతో 'త' కు

కొమ్ము ఇచ్చి చెప్పాడు. అట్లే వక్కలు అని చెప్పడములో మధ్య అక్షరమయిన

'క' కు ‘క' వత్తు చెప్పకుండా 'ట' కు 'ట' వత్తు చెప్పడమైనది. ఆ మాటలు

విన్న అంగడి ఆయన నవ్వాడు, నేనూ నవ్వాను. అంగడి ఆయన అర్థము

చేసుకొని ఆకులు, వక్కలు ఇచ్చి పంపాడు. అప్పుడు ఆ పిల్లవాడు తాను

చెప్పిందే సరియైన మాట అనుకొన్నాడు తప్ప తాను పలుకు పదములో

బూతు పదములున్నాయని అతనికి తెలియదు.



ఆ పిల్లవాని భావములో ఆకులు, వక్కలే ఉన్నాయి. అయినా

పలుకడములో శబ్దము వేరయినట్లు, ఆ బాలునికి తెలియదు. అంతమాత్రాన

తెలిసినవారు, మాటలను స్పష్టముగా మాట్లాడువారు బాలుడు చెప్పినట్లే

చెప్పరు కదా! అదే విధముగా అప్పుడు మనువుకు తెలిసిన భావమే

సరియైనదని ఆయన అనుకొని మొదటి గురువు అను భావముతో తనకు

జ్ఞానము చెప్పిన వ్యక్తిని “ఆదిత్య” అని చెప్పాడు. ఒక విధముగా ఆదిత్య

అను పదము మొదటి గురువుకు చెప్పు అర్థముతో సరిపోవును. మనకు

పూర్తి జ్ఞానము తెలియనప్పుడు అలాగే అనుకొనెడివారము. అయితే

జ్ఞానము తెలియుట చేత, తెలిసిన జ్ఞానము ప్రకారము సూర్యుడు తాను

విన్న దానిని తిరిగి చెప్పాడు గనుక సూర్యున్ని బోధకుడనియే చెప్పాలి,

గురువని చెప్పకూడదు. తాను వినని జ్ఞానమును స్వయముగా ఎవరు

చెప్పగలరో, ఎక్కడా ఎవరూ చెప్పని జ్ఞానమును ఎవరు చెప్పగలరో, అతనినే

గురువని చెప్పవలెను. అయితే సూర్యుడు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును

చెప్పాడు, గావున ఆయన బోధకుడే అవుతాడుగానీ, గురువు కాలేడు. ఈ


వివరము అంతయూ మనువుకు తెలియదు కావున ఆయన భావములో

సూర్యుడు మొదటి గురువనియే చెప్పాడు. అతని వరకు ఆ భావము

సరియైనదే. అందువలన మనము కూడా అదే అర్థమునే చెప్పాము.

అయితే బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము 'గురువు గురువే, బోధకుడు

బోధకుడే'. అందువలన గురువును బోధకుడుయని అనకూడదు. బోధకున్ని

గురువు అని అనకూడదు. అంటే ఏమీ కాదు, శాస్త్ర విరుద్ధమగును.

ఆకులు వక్కలను మా ఇంటిప్రక్క పిల్లవాడు తనకు వచ్చిన విధముగా

పలికాడు. అతని భావములో అతనికి కావలసినవి ఆకులు, వక్కలే. అయితే

తాను చెప్పు చున్నది తప్పని తెలియని స్థితిలో చెప్పాడు. అట్లని ఆ పిల్లవాడు

చెప్పినట్లు మనము చెప్పము కదా! అదే విధముగనే మనువు తనకు

జ్ఞానము చెప్పిన వ్యక్తిని మొదటి గురువని అన్నాడు. గురువు అంటే

ఎవరు? బోధకుడు అంటే ఎవరు? అనే వివరము తెలియని స్థితిలో మనువు

చెప్పాడు. అతని వరకు అది సక్రమమే. అతడు అన్నాడని మనము

ఇప్పుడు అదేమాటను చెప్పలేము. బ్రహ్మవిద్యా శాస్త్రమును అతిక్రమించి

మాట్లాడలేము.


ప్రశ్న :- అయితే దైవధర్మములను చెప్పిన గురువు ఎవరు?

జవాబు :- దేవుడు మాట్లాడడు అందువలన దేవుడు చెప్పలేడు. బ్రహ్మవిద్యా

శాస్త్రమును అనుసరించి దేవున్ని గురువు అని చెప్పలేము. ప్రపంచములో

ఎవరి మీదికి దేవుని జ్ఞానము ప్రసరింపబడలేదు. అనగా ఏ మనిషికి

జ్ఞానము తెలియదు. ఇప్పుడు మనిషికి జ్ఞానము తెలియదు. దేవుడు

జ్ఞానమును చెప్పలేదు. అందువలన జీవున్ని, దేవున్ని ఇద్దరినీ గురువు

అనుటకు వీలులేదు. ఇకపోతే మధ్యలోయున్న ఆత్మ మాత్రమే ఇటు

జీవుని రహస్యమును, అటు దేవుని రహస్యమును తెలిసినవాడుగా యుండి



దేవుని జ్ఞానమును ఎవరికీ తెలియకుండా బోధించుచున్నాడు. ఆత్మ

స్వయముగా జ్ఞానమును చెప్పుచున్నాడు. ఆయన ఎవరివద్ద జ్ఞానమును

వినలేదు. ఆయనే స్వయముగా దేవుని జ్ఞానమును చెప్పుచున్నాడు. అణిగి

తెలియకుండా యున్నవాడు ఆత్మ కనుక, ఆయనే నిజమైన గురువని

ప్రపంచములో ఎవరూ ఇంతవరకు గుర్తించలేకపోయారు. ఇప్పుడు

తెలిసిందా గురువు యొక్క గుట్టు. గుట్టు చప్పుడు కాకుండా బోధించు

మధ్యాత్మనే గురువని ఢంకాపథముగా చెప్పవచ్చును.


ప్రశ్న :- దైవజ్ఞానమునకు ఆత్మ గురువు అయితే, మనువు చెప్పిన మను

ధర్మములను మనువే మొదట చెప్పాడు, కావున మనువును అధర్మములను

చెప్పిన మొదటి గురువుగా చెప్పవచ్చునా?


జవాబు :-మనువు శరీరమును ధరించిన ఒక జీవుడు మాత్రమే. జీవుడు

స్వయముగా ధర్మములను బోధించలేడు, అధర్మములను బోధించలేడు.

జీవుడు ఏదీ చేయలేనివాడు, చేతకానివాడు. అన్నీ చేయువాడు ఆత్మే

అయినందున మనువు శరీరములోని మధ్యాత్మయే ఎవరికీ తెలియకుండా

పైకి మనువును చూపుచూ, తానే అధర్మములను మను ధర్మములను పేరుతో

బోధించినది. దైవబోధకు సంకల్పము దేవునిది, కార్యము ఆత్మది.

అలాగే అధర్మముల బోధకు సంకల్పము మాయది, పని ఆత్మది.

అందువలన ఇటు జ్ఞానమునకు, అటు అజ్ఞానమునకు, ఇటు ధర్మములకు,

అటు అధర్మములకు గురువు ఒక్క మధ్యాత్మ అనియే చెప్పవచ్చును.

ఇప్పుడు ఎవరికీ తెలియని ఈ విషయములన్నియూ చెప్పినది మధ్యాత్మయే.


“మధ్యాత్మ”యే విశ్వమంతటికీ గురువు.

ఇంతే సంగతులు.... అంతే సమాచారములు...


మూలకర్త,

త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.

-----

  

ఆదిత్య.  

ఈ మధ్య కాలములో ఒక ముస్లీమ్ సోదరుడు మా ఖుర్ఆన్న మనుషులు వ్రాయలేదు, దేవుడు ఇవ్వగా ఆకాశమునుండి దిగి వచ్చినదని 

చెప్పగా విన్నాము. ఆ మాటను అతను స్వయముగా చెప్పకున్నా ముస్లీమ్ పెద్దలు ఎవరయినా చెప్పగా విని చెప్పుచుండునని అనుకొన్నాము. అతని 

ఉద్దేశ్యములో హిందువుల భగవద్గీతగానీ, క్రైస్తవుల బైబిలుగానీ మనుషులు వ్రాయగా తయారయినవనీ, ఖుర్ఆన్ మాత్రము మనుషులు వ్రాయకుండా 

దేవుడే పైనుండి నేరుగా మనుషుల వద్దకు పంపాడని అనుకొనుచుండుట వలన, అతను ఆ విధముగా చెప్పాడు. 

 ప్రశ్న :- దైవ గ్రంథములు మూడని మీరు చెప్పుచుండుట మేము 

చాలామార్లు చూచాము. భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమని మీరే చెప్పారు. అట్లే ఇంజీలు (బైబిలు) ద్వితీయ దైవగ్రంథమని, ఖుర్ఆన్ అంతిమ 

దైవగ్రంథమని మీరే చెప్పగా విన్నాము. అటువంటప్పుడు ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములు రెండూ మనుషుల రచన కాగా, అంతిమ దైవగ్రంథము 

మాత్రము పై నుండి నేరుగా దేవునివద్ద నుండి దిగివచ్చినదని అనడము శాస్త్రబద్ధమైన వాక్యమంటారా? 

 జవాబు :- ముస్లీమ్ సోదరుడు చెప్పిన మాటలో కొంత సత్యమున్నదిగానీ, 

సత్యము ఎలాగున్నదని వారికి తెలియదు. దేవునినుండి వచ్చిన దైవ జ్ఞానముతో కూడుకొనియున్నవి భూమిమీద మూడు గ్రంథములే గలవు. 

అయితే ఆ మూడు గ్రంథములు మనుషుల చేత వ్రాయబడినవేనని చెప్పక తప్పదు. మూడు గ్రంథములు దైవజ్ఞానముతో నిండుకొనియుండుట వలన 

“దేవుని జ్ఞానమును దేవుడు తప్ప ఏ మానవుడు చెప్పలేడు” అను సూత్రము ప్రకారము మూడు గ్రంథములలోని జ్ఞానమును చెప్పినవాడు దేవుడేనని 

 చెప్పవచ్చును. అయితే దేవుడు మూడు గ్రంథములలో ఏ ఒక్క గ్రంథమును 

గానీ దేవుడే స్వయముగా వ్రాయడముగానీ, లేక పైనుండి ఇవ్వడము గానీ చేయలేదు. అట్లు చేశాడనడము శాస్త్ర విరుద్ధమగును. దేవుడు తన 

జ్ఞానమును పై నుండి ఇచ్చినది వాస్తవమే, అయినా గ్రంథరూపములో ఇవ్వలేదు. దేవుడు తన జ్ఞానమును మనుషులకు ఇచ్చు విషయములో 

అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్అందే సూరా 3, ఆయత్ 7 నందు ఇలా చెప్పాడు. “దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని” 

చెప్పాడు. అంతేకాక సూరా 42, ఆయత్ 51లో ఇలా చెప్పాడు. (42-51) “దేవుడు ఏ మానవునితోనూ నేరుగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము 

మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా (వహీ ద్వారా) లేక తెరవెనుకనుంచో మనిషికి చేరవేస్తాడు. లేదా తాను 

కోరినది తన ఆజ్ఞతో సూచించటానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు" ఈ విధముగా దేవుడు 

చెప్పి యున్నాడు, కనుక దేవుడు జ్ఞానమును మనుషులకు తెలియజేయుదు నని చెప్పాడు గానీ, గ్రంథరూపములో తెలియచేస్తానని, గ్రంథరూపములో 

పై నుండి ఇస్తానని చెప్పలేదు. తన మూడు విధానములలో మొదటిది శబ్దము (వాణి) ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. ఆ విధానము సృష్ఠి 

ఆదిలోనే జరిగిపోయినది. ఆకాశవాణి ద్వారా దేవుడు తన జ్ఞానమును మనుషులకు పంపడము జరిగినది. అలా వచ్చిన జ్ఞానము శబ్దరూపముతో 

వచ్చినది గానీ, గ్రంథరూపములో రాలేదు. శబ్దరూపములో వచ్చిన దానిని బోధ అంటాము. మొదట బోధ రూపములో శబ్దముగా వచ్చిన జ్ఞానము 

మూడు యుగముల తర్వాత గ్రంథములుగా వ్రాయడము జరిగినది. అంతవరకు దేవుని జ్ఞానము బోధరూపములోనే యుండెడిదిగానీ గ్రంథముగా 

లేదు.  

 కృతయుగము, త్రేతాయుగము లేక త్రేతాయుగము, ద్వాపర 

యుగము గడువగా ద్వాపర యుగము చివరిలో బోధరూపముగా యున్న జ్ఞానము గ్రంథరూపముగా మారినది. అంతవరకు బోధరూపముగాయున్న 

జ్ఞానమునకు “జపర” అను పేరుండెడిది. జపర అను పేరు కాలక్రమమున మార్పుచెంది నేడు ఆ పేరు “జబుర” గా మారియున్నది. జపర అనగా 

పుట్టిన దానికంటే వేరుగా యున్నదని అర్థము. ప్రపంచము పుట్టినది. పుట్టిన ప్రపంచముకంటే వేరుగా యుండుట వలన 'జపర' అని చెప్పబడినది. 

‘జ’ అనగా పుట్టినదని అర్థము. 'పర' అనగా వేరయినదని అర్థము. 'జపర' అనగా పుట్టినదానికంటే వేరయినది దేవుని జ్ఞానమని తెలియునట్లు 

పేరుంచబడినది. అది కాస్తా మారిపోయి అర్థము లేనిపేరుగా 'జబుర' అని పిలువబడుచున్నది. నేడు కొందరు ముస్లీమ్లు వరుసగా నాలుగు 

గ్రంథముల పేర్లు చెప్పుచుండగా విన్నాము. వారు చెప్పిన పేర్లు వరుసగా జబుర, తౌరాత్, ఇంజీలు, ఖుర్ఆన్ అని చెప్పారు. ఆ మాటను వినిన 

మేము 'జబుర' అనునది గ్రంథమా? అని అడిగాము. అప్పుడు వారు గ్రంథమేయని చెప్పారు. 

 వాస్తవముగా 'జబుర' అనునది గ్రంథమే కాదు. అది దేవుడు 

ఆకాశమునుండి వాణి ద్వారా అందించిన జ్ఞానము బోధరూపమైయుండగా దానినే 'జపర' అని చెప్పడమైనది. పుట్టిన ప్రకృతికి వేరుగాయున్న జ్ఞాన 

మైనందున జపర అని అర్థసహిత పేరును చెప్పడమైనదిగానీ, జపర (జబుర) గ్రంథము కాదు. జపర జ్ఞానము ముందు భగవద్గీతగా 

వ్రాయబడినది. తర్వాత కాలము జరుగుకొద్దీ ఇంజీలు గ్రంథముగా, ఖుర్ఆన్ గ్రంథముగా వ్రాయబడినది. ఈ విధముగా 1400 సంవత్సరముల పూర్వము 

ఖుర్ఆన్ గ్రంథరూపమైనది. ఖుర్ఆన్ అరబ్బీ భాషలో వ్రాయబడగా, ఇంజీలు  

(బైబిలు) హెబ్రీ భాషలో, భగవద్గీత సంస్కృత భాషలో వ్రాయబడినాయి. ఈ విధముగా మూడు యుగముల తర్వాత దేవుడు మొదట చెప్పిన జ్ఞానము 

గ్రంథములుగా మారినది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము ఒక్కటే, వేరువేరు కాలములలో, వేరువేరు పేర్లతో, వేరువేరు గ్రంథములుగా తయారయినది. 

అందులో మొదటిది భగవద్గీత, చివరిది ఖుర్ఆన్ గ్రంథము.  

ప్రశ్న :- ముందు వచ్చిన ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలోనూ, చివరిలో వచ్చిన అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనూ, 

మధ్యలోనున్న ఇంజీలు గ్రంథములోనూ ఒకే జ్ఞానముంటే, ఒకే దేవుని గురించి చెప్పియుంటే భగవద్గీతలో దేవున్ని “పరమాత్మ” అని అన్నారు. 

చివరి గ్రంథమయిన ఖుర్ఆన్లో “అల్లా” అన్నారు. ఒకే దేవున్ని ఒకచోట, పరమాత్మయనీ, మరొకచోట అల్లాయనీ ఎందుకు చెప్పారు? అలా 

చెప్పడము వలన భగవద్గీతలోని దేవుడు వేరు, ఖుర్ఆన్లోని దేవుడు వేరని అనుకొనుటకు అవకాశమున్నది కదా! అలాగే ఆ రెండు గ్రంథములలోని 

జ్ఞానము కూడా వేరువేరుగా యున్నదని ఎందుకు అనుకోకూడదు? గ్రంథము పేరు వేరు, దేవుని పేరు వేరు, జ్ఞానము కూడా చూచేదానికి 

వేరుగానే కనిపించుచున్నది. అటువంటప్పుడు రెండు గ్రంథములు వేరుగా యున్నవని భగవద్గీత హిందువులది, ఖుర్ఆన్ ముస్లీమ్లదని ఎందుకు 

చెప్పకూడదు? దేవుని పేరు, గ్రంథము పేరు, చెప్పిన కాలము, చెప్పిన ప్రవక్త పేరు అన్నియూ వేరుగాయుండుట వలన రెండు గ్రంథములు 

వేరువేరుగా యున్నాయని, వాటిలోని దేవుడు, దేవుని జ్ఞానము వేరని మేము ఎందుకు చెప్పకూడదు? గ్రంథముల పేర్లు 'ప్రథమ', 'అంతిమ’ 

అనియుండుట వలన భగవద్గీత పురాతనమైన ఎడ్లబండిలాంటిది. చివరిలో క్రొత్తగా వచ్చిన ఖుర్ఆన్ గ్రంథము క్రొత్త కారులాంటిది. పాత ఎడ్లబండికి 

 క్రొత్త కారుకు ఎంత తేడాయుండునో అంతే భేదము భగవద్గీతకు ఖుర్ఆను 

ఉన్నదని మేము చెప్పుచున్నాము. క్రొత్తగా వచ్చిన కారులో ప్రయాణించుట సులభము, సంతోషదాయకము. పాత ఎడ్లబండిలో ఒక సంవత్సరమునకు 

పోగల దూరమును క్రొత్తకారులో కొన్ని గంటలలో పోవచ్చును. అందువలన పాత కాలములోని భగవద్గీతను వదలి ఈ మధ్య కాలములో చివరగా 

వచ్చిన ఖుర్ఆనన్ను ఆశ్రయించి ఇస్లామ్ ప్రకారము నడువడము వలన దేవుడు ఒప్పుకొనును. దేవుని మార్గములో నడచినట్లగును అని నేను 

అనుకొంటున్నాను. నేనే కాక చాలామంది ఇస్లామ్ పెద్దలు, ఇస్లామ్ సంస్థలు నడుపు వారు “పాత భగవద్గీతను వదలండి, నవీనముగా వచ్చిన 

ఖుర్ఆన్ను నమ్ముకోండి, అల్లాను ఆరాధించండి" అని చెప్పుచున్నారు. మీరేమో మూడు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని అంటున్నారు. మీ 

మాట నిజమా? వారి మాట నిజమా? ఎవరి మాటను నమ్మాలి?  

జవాబు :- నన్ను అడిగితే నా మాటను నమ్మమని అంటాను. ఒకవేళ వారిని అడిగితే వారి మాటనే నమ్మమంటారు. అలా అడిగితే ఆ సమస్య 

తీరదు. నేను చెప్పుమాట సరియైనదని ఎవరికి వారు అనడము సహజము. అట్లు కాకుండా శాస్త్రబద్ధత దేనియందు కలదో గమణించి దానినే 

నమ్మడము మంచిది. దేవుడు చెప్పిన జ్ఞానము అందరికీ సమానముగా ఉంటుంది గానీ ఎక్కువ తక్కువలుగానీ, ఉచ్ఛనీచములుగా గానీ యుండదు. 

హిందువులు 'పరమాత్మ' అనినా, ముస్లీమ్లు 'అల్లా' అనినా, పిలువబడే పేర్లు వేరయినా దేవుడు ఒక్కడేయని చెప్పవచ్చును. భాష వేరయినా 

భావము ఒక్కటేయండును. తెలుగు భాషలో 'భోజనము' అనినా, తమిళ భాషలో 'సాపాడు' అనినా, హిందీలో 'ఖానా' అనినా, కన్నడములో 'ఊట’ 

అని అన్ని భాషలు ఒక తినే ఆహారమునే అంటున్నాము. భాషలు  

వేరయినా భావములో ఉద్దేశ్యము ఒకటేయుండుట వలన హిందువులు 'పరమాత్మ' అనినా, ముస్లీమ్లు 'అల్లా' అనినా రెండు మాటలు దేవున్ని 

గురించి చెప్పినవే యగును.  

దేవుడు “వహీ ద్వారా జ్ఞానము చెప్పబడును" అని చెప్పినప్పుడు ఆకాశవాణి ద్వారా వచ్చిన శబ్దములోనే జ్ఞానము తెలిసినదని అర్థమగు 

చున్నది. చెప్పిన జ్ఞానము ఒక్కటే, చెప్పినవాడు ఒక్కడే అటువంటప్పుడు దానినే రెండుమార్లు చెప్పుకొని, రెండు పేర్లు పెట్టుకొని ఒకటి పాతబండి 

మరొకటి క్రొత్తబండి అని మనుషులు అనుచున్నారు తప్ప జ్ఞానమును చెప్పిన దేవుడు పాత, క్రొత్తయని ఎక్కడా చెప్పలేదు కదా! మనుషుల 

మాటలను నమ్మవద్దు దేవుని మాటనే నమ్మమని జ్ఞానము తెలిసిన ఎవరయినా చెప్పగలరు. దేవుడు తన జ్ఞానమును సృష్ట్యాదిలోనే వహీ 

ద్వారా చెప్పినప్పుడు ఎప్పటికీ ఒకటేయుండును కదా!దానిని ఎన్ని గ్రంథములుగా వ్రాసినా ముందు చెప్పినది పాతది, వెనుక చెప్పినది క్రొత్తది 

అనుటకు వీలేలేదు. ఐదు వేల సంవత్సరముల పూర్వము దేవుడు సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే భగవద్గీతగా చెప్పారు. తర్వాత దానినే ఖుర్ఆన్ 

గ్రంథముగా చెప్పారు. చివరిలో చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములో "ముందు చెప్పిన గ్రంథములను ఖురాన్ ధృవీకరిస్తున్నది” అని చెప్పడమైనది. అప్పుడు 

ముందు చెప్పిన గ్రంథములలోని జ్ఞానము, ఇప్పుడు వచ్చిన ఖురాన్లోని జ్ఞానము రెండూ ఒకటేనని, ఖురాన్ గ్రంథములోనే ఐదవ సూరాలో అనేక 

చోట్ల గలదు. అటువంటప్పుడు భగవద్గీత పాతది, ఖుర్ఆన్ క్రొత్తది అనడము దేవుని మాట కాదని చెప్పవచ్చును. 

 భూమిమీద మొదట తయారయిన గ్రంథము “భగవద్గీత”. భూమి 

మీద మొదట చెప్పబడిన జ్ఞానము “జపర”. జపర జ్ఞానమే గ్రంథరూప  

మైనప్పుడు దానిని ప్రథమ దైవగ్రంథము అని చెప్పుచున్నాము. తర్వాత తయారైనది ఇంజీలు గ్రంథము. ఇంజీలు గ్రంథమును బైబిలుగా చెప్పు 

కొంటున్నాము. ఆ తర్వాత చివరగా తయారయిన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము. దానినే అంతిమ దైవగ్రంథము అని అనుచున్నాము. అంతిమ 

దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో తౌరాత్, ఇంజీలు గ్రంథములలోని జ్ఞానమే ఖురాన్లో యున్నదన్నట్లు ఆ రెండు గ్రంథములను ధృవీకరిస్తున్నా 

నను వాక్యములు ఖురాన్లో గలవు. తౌరాతు గ్రంథము ఏదయితే ఇక్కడ చెప్పబడినదో, అదియే భగవద్గీతయని ఎవరికీ తెలియదు. ఇంజీలును, 

ఖురాన్ను చూచిన ముస్లీమ్లు నేడు గలరు గానీ, తౌరాత్ను చూచిన ముస్లీమ్లు లేరని చెప్పవచ్చును. మనముందరున్న భగవద్గీతయే తౌరాత్ 

గ్రంథమని మేము ఈ రోజు చెప్పితే దానిని నమ్మలేనివారు "తౌరాత్ భగవద్గీత ఒక్కటిగాదు. తౌరాత్ను చెప్పిన ప్రవక్త వేరు, భగవద్గీతను చెప్పిన 

ప్రవక్త వేరు” అని అంటున్నారు. ఈ విషయమును గురించి తర్వాత ప్రస్తావిస్తాము. ఇప్పుడు చెప్పినది ఏమనగా! ఖురాన్ను కారుతో పోల్చి 

చెప్పినవారు ఖురాన్ గ్రంథములోని జ్ఞానము ఎక్కడి నుండి వచ్చినదో తెలియవలెను. ఖురాన్కు గానీ, భగవద్గీతకు గానీ ఆధారమైన జ్ఞానము 

'జపర లేక జబుర' అయినప్పుడు భగవద్గీతలోని జ్ఞానమే ఖుర్ఆన్లోనూ, ఖుర్ఆన్లోని జ్ఞానమే భగవద్గీతలోనూ కలదని ఎందుకు చెప్పకూడదు? 

సృష్ట్యాదిలో వహీ ద్వారా చెప్పబడిన జ్ఞానమే భగవద్గీతలోనూ, ఖుర్ఆన్ గ్రంథములోనూ యున్నప్పుడు అది వేరు, ఇది వేరు అని చెప్పడము 

తప్పగును. దేవుని జ్ఞానమును అవమానపరచినట్లగును.  

ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్తగారి ద్వారా బయటికి వచ్చినది. దానిని ప్రవక్తగారికి చెప్పినది జిబ్రయేల్. అటువంటప్పుడు 

 వహీ ద్వారా వచ్చిన జ్ఞానమని మీరెలా చెప్పగలరు? జిబ్రయేల్ దేవుడు 

పంపగా వచ్చిన దూత. దేవదూత అయిన జిబ్రయేల్ చెప్పినది ఖురాన్ గ్రంథమనీ, వహీ ద్వారా వచ్చినది కాదనీ దూత ద్వారా వచ్చినదని 

చెప్పుచున్నాము. దీనికి మీరేమంటారు?  

జవాబు : అయితే పూర్తి వివరముగా నీకు చెప్పితేనే నీకు అర్థము కాగలదని నాకు అర్థమయినది. మొదటికి జిబ్రయేల్ దేవుని దూత కాదు. 

ఆ విషయము ఖురాన్లోనే ఐదు, ఆరు ఆయత్లలో కలదు. జిబ్రయేల్ నమ్మదగిన ఆత్మయనీ, దూత కాదని చెప్పిన ఖుర్ఆన్ వాక్యములను 

అనుసరించి మేము ఆ మాటను చెప్పుచున్నాము. ఖుర్ఆన్ గ్రంథములో వ్రాసిన వాక్యములను చూస్తే జిబ్రయేల్ దూతకాదనీ, ఆయన ఒక ఆత్మయనీ 

తెలియగలదు. అందువలన ఇప్పుడు ఖుర్ఆన్లోని కొన్ని వాక్యములను చూస్తాము. 

 2వ సూరా, 97వ ఆయత్ (2-97) “ఓ ప్రవత్తా! వారికి చెప్పు జిబ్రయేల్ కు 

శత్రువైన ప్రతివాడు అల్లాహ్ తోనే శత్రువైనాడని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహ్ సూచనలపైనే ఆయన నీ హృదయముపై ఈ సందేశాన్ని 

అవతరింపజేశాడు. ఈ ఖుర్ఆన్ తనకు పూర్వము వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. విశ్వసించే వారికి శుభవార్తను ఇస్తుంది." 

  

2వ సూరా, 98వ ఆయత్ (2-98) “ఎవరు దేవునికి, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రయేల్కు మరియు మీకాయీల్కు శత్రువులుగా 

యుంటారో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు.”  

26వ సూరా, 193వ ఆయత్ (26-193) “ఈ ఖుర్ఆనన్ను “రూహుల్ అమీన్" (నమ్మదగిన ఆత్మ) అవతరింపజేశాడు" అని ఉన్నది. 

 70వ సూరా, 4వ ఆయత్ (70-4) “యాభై వేల సంవత్సరములతో సమాన 

పరిమాణముగల రోజున దైవ దూతలు మరియు జిబ్రయేల్ దేవుని వైపునకు అధిరోహిస్తారు" 

 78వ సూరా, 38వ ఆయత్ (78–38) " ఏ రోజు ఆత్మ (జిబ్రయేల్) మరియు 

దేవదూతలు వరుసలు తీరి నిలబడి ఉంటారో, ఆ రోజు కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప ఎవరూ మాట్లాడలేరు. మాట్లాడిన వాడు 

సరియైన మాటనే మాట్లాడుతాడు."  

97వ సూరా, 4వ ఆయత్ (97-4) “ఆ రాత్రియందు దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయేల్) తమ ప్రభువు ఉత్తరువులపై సమస్త విషయాల నిర్వాహణ 

నిమిత్తము ఆకాశమునుండి భూమికి దిగివస్తారు.”  

పైన చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములోని ఆయత్లలో జిబ్రయేల్ దూత కాదనీ, ఆత్మయనీ, నమ్మదగిన ఆత్మయనీ చెప్పడమైనది. ఒకే వాక్యములోనే 

దూతలను జిబ్రయేల్ను విడివిడిగా చెప్పడమైనది. జిబ్రయేల్ను దూతయని ఎక్కడా అనలేదు. అటువంటప్పుడు మనుషులు జిబ్రయేల్ను దూత అనడము 

పొరపాటగును. జిబ్రయేల్ ఆత్మయేగానీ, దూతకాదని చెప్పినట్లు తెలియుట వలన జిబ్రయేల్ను 'దేవుడు పంపగా వచ్చిన దూత' అని అనకూడదు. 

 ప్రశ్న :- భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమనీ, ఇంజీలు గ్రంథమును ద్వితీయ 

దైవగ్రంథమనీ, ఖర్ఆన్ గ్రంథమును అంతిమ దైవగ్రంథమని అందరూ అంటున్నారు. భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమనీ, ఖుర్ఆన్ను అంతిమ 

దైవగ్రంథమని ఎందుకు అంటున్నారు? దీనికి శాస్త్రబద్ధమైన ఆధారము ఏమయినా గలదా! అని అడుగుచున్నాను. సరియైన సమాధానముంటే 

వివరముగా చెప్పండి.  

జవాబు :- ఏ ప్రశ్ననయినా మ్రొక్కుబడికి అడిగినట్లు అడుగకూడదు. వినే జవాబును కూడా శ్రద్ధగా వినాలి. విన్న జవాబు మీకు మీ ఉద్దేశ్యము 

నకు నచ్చినదిగా ఉండవలెనని అనుకోకూడదు. వినే వారికి నచ్చినా, నచ్చకపోయినా చెప్పిన జవాబు శాస్త్రబద్ధమైనదో కాదో చూడాలి. 

శాస్త్రబద్ధమైనదయితే దానిని నమ్మవచ్చును. శాస్త్రబద్ధము కాని దానిని అసత్యముగా తలచి వదలి వేయవలెను. ఖుర్ఆన్ గ్రంథమును గురించి, 

భగవద్గీతను గురించి గతములో అనగా సృష్ట్యాదిలో జరిగిన విషయములను తెలియగలిగితే సత్యము తెలియునని మొదటినుండి చెప్పుచున్నాను చూడండి. 

 ప్రశ్న :- సూర్యుడు దక్షిణ భారతదేశమున గల మనువు అను వ్యక్తికి 

తెలుగు భాషలోనే జ్ఞానమును చెప్పాడని మీరు చెప్పారు. భూమిమీదున్న మనువుకు తెలుగు భాష వచ్చియుండవచ్చును. అయితే తెలుగు భాషలోనే 

చెప్పుటకు సూర్యుడు తెలుగువాడు కాదు కదా! ఎక్కడో ఆకాశములో భూమినుండి 14 కోట్ల, 95 లక్షల, 97 వేల 870 కిలోమీటర్ల దూరములో 

(14,95,97,870 Km) యున్న సూర్యుడు తెలుగు భాషను ఎలా మాట్లాడ గలిగాడు? అను ప్రశ్న ఎవరికయినా రాగలదు. అదే నాకు కూడా వచ్చినది. 

సూర్య గ్రహము తెలుగు మాట్లాడగలిగింది అనుటకు ఇంకా ఏదయినా ఆధారమున్నదా అని అడుగుచున్నాము? 

 జవాబు :- రెండవమారు జరిగిన దానికి మొదటిమారు జరిగినది 

ఆధారముగా యుండవచ్చును. మొదట జరిగిన దానిని ఉదాహరణగా చూపి రెండవది ఇలా ఉందని చెప్పవచ్చును. అట్లు కాకుండా మొదట 

జరిగిన దానికి ఆధారము కావలెనంటే దానికి అదే ఆధారమగును. అంతేగానీ మిగతా ఆధారములేమీ దానికి ఉండవు. అదే విధముగా 

భూమిమీద సూర్యుడు మాట్లాడినదే మొదటి సంఘటన అయినప్పుడు  

దానికి అదే ఆధారముగానీ, వేరే దేనినీ ఆధారముగా చూపలేము. మొదటిది ఏదయినా తర్వాత దానికి ఆధారమగును. అందువలన సూర్యుడు తెలుగు 

భాషలో మాట్లాడిన దానికి రెండవ ఆధారము ఏదీ లేదు. దానికి అదే ఆధారము. అయితే ఈ విషయమై కొంత వివరణను ఇవ్వగలము. 

సూర్యుడు గ్రహములలో మహాగ్రహము. అనగా పెద్ద గ్రహము అని అర్థము. సూర్యుడు పెద్ద గ్రహమయిన దానివలన ఏ భావమునయినా 

గ్రహించగలడు. "గ్రహము” అనగా గ్రహించునదని అర్థముండుట వలన ఏ భాషనయినా గ్రహించగలడు. అలాగే ఏ భాషలోనయినా తన భావమును 

వ్యక్త పరుచగలడు.  

ఆ కాలములో ప్రపంచములో మొట్టమొదట తయారయిన భాష 'తెలుగు భాష'. ప్రపంచమంతా మొదట మాట్లాడిన భాష 'తెలుగు భాష'. 

మొదట జ్ఞానము తెలిసినది తెలుగు భాషలో అయినందున అన్నిటికంటే తెలుగు భాష పెద్దదనీ, మొదటిదనీ చెప్పవచ్చును. భూమిమీద మొదట 

భాష తయారయినది కానీ, అది పేరు లేని భాషగా యుండెడిది. భావమును వ్యక్తము చేయునది భాష అని మాత్రము అందరికీ తెలుసు. సూర్యుడు 

తన స్థూల శరీరమును ఆకాశములోనే వదలివేసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరములోయున్న భూమిమీదికి వచ్చి, భూమిమీద దక్షిణ 

భారతదేశములోయున్న మనువు అను వ్యక్తికి జ్ఞానమును బోధించడము జరిగినది. అలా బోధించినప్పుడు సూర్యుడు ఒక గంటలోనో, ఒక 

దినములోనో జ్ఞానమును చెప్పి పోలేదు. వాస్తవము చెప్పితే మనువునకు సూర్యుడు జ్ఞానము చెప్పాడను విషయమే తెలియదు. జ్ఞానము చెప్పిన 

సూర్యుడు ఏ సందర్భములోగానీ జ్ఞానము చెప్పే తాను సూర్యుడనని చెప్పలేదు. ఏదో సూక్ష్మము జ్ఞానమును చెప్పుచున్నదని మనువు 

 అనుకోవడము జరిగినది. ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు భగవద్గీతను 

చెప్పినప్పుడు మాత్రమే మనకు సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినట్లు తెలిసినది. అంతవరకు మనువుకు గానీ, ఆయన తర్వాత మనుషులకుగానీ 

సూర్యుడు భూమిమీదికి వచ్చి జ్ఞానము చెప్పినట్లు తెలియదు. అయితే జ్ఞానము చెప్పినది సూర్యుడని మనువుకు తెలుసునని అందరూ 

అనుకొన్నారు. అందరూ అనుకొన్నట్లు మనువుకు స్వయముగా సూర్యుడే చెప్పాడను విషయము ఆయన చనిపోవు వరకు ఆయనకు తెలియదు. 

కృష్ణుడు చెప్పేంతవరకు ఎవరికీ తెలియదు.  

మనువుకంటే వయస్సులో రెండు లేక మూడు సంవత్సరములు చిన్నవాడయిన సాధారణ వ్యక్తిలోనికి సూర్యుడు ప్రవేశించి మనువుకు 

జ్ఞానము చెప్పడము జరిగినది. కనిపించే మనిషిలోనికి జ్ఞానము తెలిసిన సూక్ష్మము ప్రవేశించి మాట్లాడుచున్నదని మనువు అనుకోవడము వలన 

చెప్పువాడు ఎవడు? అను ప్రశ్నే ఎవరికీ రాలేదు. తాను వినిన జ్ఞానము గొప్పదని తెలిసిన మనువు ఉత్తర దేశములోని ఇక్ష్వాకుడు అను రాజుకు 

చెప్పడము, అతని ద్వారా ఇతరులకు తెలియడమైనది. కృతయుగములో మనువుకు జ్ఞానము సూర్యుడు చెప్పగా, సూర్యుడు చెప్పాడను విషయము 

మూడు యుగములు గడచువరకు ఎవరికీ తెలియదు.  

ప్రశ్న :- ఎప్పుడో కృతయుగములో సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పితే, ఆ విషయము అప్పటి మనువుకే తెలియనప్పుడు, ఇప్పుడు ప్రస్తుత 

కాలములో వర్తమాన కాలములో (వ్యక్తమాన కాలములో) మాతో పాటుయుండు నీవు ఆ విషయమును ఎలా చెప్పగలుగుచున్నావు? 

మనువుకు సూర్యుని విషయమే తెలియదను విషయము నీకు ఎలా తెలుసు?  

జవాబు :- నేను ఇంతకు ముందు కూడా చాలామార్లు ఒక విషయమును చెప్పాను. అది ఏమంటే నేను ఎల్లప్పుడూ నిజమే చెప్పుదునని నీవు 

అనుకోవద్దు. నేను అప్పుడప్పుడు అసత్యమును కూడా చెప్పుదునని అనుకోవడము మంచిది. అందువలన నా మాట ఎప్పుడు నీకు సత్యమని 

పిస్తే అప్పుడు మాత్రము నా మాటను నమ్ముము. ఎప్పుడు నా మాట అసత్యమనిపిస్తే అప్పుడు నమ్మవద్దు. నేను చెప్పు ప్రతిమాట పూర్తి సత్యమని 

నేను చెప్పుచుందును. నీకు సత్యమనిపించినప్పుడే నమ్ముము. నా మాటను నమ్మమని నేను ఎవరికీ చెప్పలేదు. చెప్పడము నా వంతు, నమ్మడము 

నమ్మకపోవడము నీ పనియని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. నేను ఎవరికీ తెలియని విషయములనే, సంచలన విషయములనే, నమ్మశక్యము 

కాని విషయములనే చెప్పుచుందును. నా మాటలో సత్యమెంతయున్నదో ఒక విధముగా నాకే తెలియదు. అటువంటప్పుడు నేను చెప్పేదంతా 

నమ్మవలెనో లేదో మీరే చూచుకోండి. నా మాటలను నమ్మువారు బహుశా నూటికి పదిమంది మాత్రమేయుందురు. మిగతావారు ఏమాత్రము నమ్మరు. 

ఖురాన్ గ్రంథములో “అందరినీ నా జ్ఞానములోనికి రానివ్వను, కొందరికి మాత్రమే నా జ్ఞానము అర్థమగునట్లు చేయుదును. మిగతావారికి అర్థము 

కానట్లు చేయుదును” అని దేవుడు చాలామార్లు అన్నాడు. అందరూ నమ్మకూడదనే దేవుడు కూడా అట్లు చెప్పాడు. అందరూ నమ్మితే అందరికీ 

జ్ఞానము తెలిసి అందరూ జ్ఞానమార్గములోనికి పోవు అవకాశము గలదు. అందరికీ జ్ఞానము తెలియవలెనని నేను సత్యమును చెప్పినా దేవుడు చెప్పిన 

మాటవలన నా మాట కూడా కొన్ని సందర్భములలో అసత్యముగనే కనిపించుచుండును. అట్లని నేను సత్యమును చెప్పుచున్నానని చెప్పకుండా 

సత్యమునే చెప్పుచుందును. నా మాట సత్యమో కాదో తెలియవలసింది మీరే! 

 ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో జ్ఞానయోగమున మొదటి 

శ్లోకములోనే “నేను సృష్ట్యాదిలో సూర్యునకు చెప్పియుంటిని, తర్వాత సూర్యుడు మనువునకు ఈ జ్ఞానమును తెలియజేశాడు" అని కృష్ణుడు 

అర్జునునకు చెప్పాడు. అప్పుడు, ఇప్పుడు నీవు అడిగినట్లే అర్జునుడు కృష్ణున్ని ఇదే ప్రశ్నే అడిగాడు. ఎప్పుడో సృష్ట్యాదిలో సూర్యుడు పుట్టాడు, 

నీవు పుట్టినది ప్రస్తుత కాలములో, ఇప్పుడు పుట్టిన నీవు అప్పటి సూర్యునకు ఎలా జ్ఞానమును చెప్పావు? అని అడగడము జరిగినది. అది పెద్ద ప్రశ్నే 

అయినా కృష్ణుడు సులభముగా జవాబును చెప్పగలిగాడు. అక్కడ కృష్ణుడు ఏమి చెప్పాడో మీకు తెలుసు. ఒకవేళ తెలియని వారుంటే 

ఇప్పుడు భగవద్గీతను చూచినా ఏమి చెప్పినది తెలియగలదు. కృష్ణుడు అప్పుడు కూడా నేను పుట్టియుంటిని అని చెప్పిన జవాబును చూచిన 

అర్జునుడు “మేము ఎలా నమ్మాలి?” అని ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోయినా కృష్ణుడు చెప్పిన మాటమీద అర్జునునికి అనుమానము ఉండేది. కృష్ణుడు 

అబద్దమును చెప్పుచున్నాడని అర్జునుడు తన బుద్ధిలో అనుకోవడము జరిగినది. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అనుకొన్న విషయమును గ్రహించ 

గలిగాడు. అయినా ఇటు అర్జునుడు అనుమానమున్నట్లు బయటపడలేదు. అటు కృష్ణుడు తెలిసి కూడా తెలియనట్లుండిపోయి తర్వాత విషయమును 

చెప్పాడు.  

ఇప్పుడు నీవు కూడా అలాంటి ప్రశ్ననే అడిగావు. అయితే కృష్ణుని వలె నేను సమాధానము చెప్పలేదు. నేను కొన్ని అసత్యములు కూడా 

చెప్పుచుందుననీ, ఏది నిజమో, ఏది అబద్దమో నీవే గ్రహించుకోమని చెప్పాను. అర్జునునిలో పెరిగిన అనుమానములకు, కృష్ణుని మాటల మీద 

వచ్చిన అపనమ్మకమునకు చివరకు కృష్ణుడు విశ్వరూపము చూపి  

అర్జునునికి ఇక ఏ అనుమానము మిగలకుండా చేశాడు. విశ్వరూపము కృష్ణుని వలె చూపి నీ అనుమానములను నేను తీర్చలేను గనుక, నేను 

సాధారణ మనిషినే గనుక నేను ముందే నా మాటలన్నిటినీ నమ్మవద్దు అని చెప్పాను. కొన్ని మాత్రమే సత్యముంటాయి అని కూడా చెప్పాము. అయితే 

నేను చెప్పేటివన్నీ సత్యములేయని నాకు తెలుసు. అయితే ఆ విషయము ఇతరులకు తెలియాలను నియమము ఏమీ లేదు కదా! అందువలన నేను 

అలా చెప్పాను. నేను అలా చెప్పడము వలన నీ మాట అసత్యమని ఎవరూ నాతో వాదించరు, ప్రశ్నించరు. నా మాట సత్యమో కాదో మీరే 

చూచుకోండి. సత్యమైతే నమ్మండి, సత్యము కాకపోతే నమ్మవద్దండి అని కూడా చెప్పాను. “ఆపదలలో అబద్దమాడి అయినా ఆపదనుండి బయట 

పడవచ్చునని” పెద్దలు చెప్పిన మాటను అనుసరించాను.  

ప్రశ్న :- కృష్ణుడు ఆ కాలములో చేతల గారడి చేశాడని విన్నాము. అయితే మీరు ఇప్పుడు మాటలగారడి చేస్తున్నారని మాకు అర్థమయినది. మీరు 

ఎంత కప్పిపుచ్చుకోవాలనుకొన్నా, కప్పిపుచ్చుకోలేని ఒక అసత్యమును మీరు చెప్పినట్లు ఋజువు చేయగలను చూడండి. మీరు ఈ మధ్య కాలములో 

ఈ నెలలోనే “లు అంటే ఏమిటి?” అను పేరుగల ఒక చిన్న గ్రంథమును వ్రాసి విడుదల చేశారు. ఆ గ్రంథములో పేజీ నంబరు 40లో మొదటిలోనే 

ఇలా వ్రాశారు. "ప్రపంచములో ప్రజలందరికీ మొదటి గురువు సూర్యుడేయని తెలుపు నిమిత్తము "ఆదిత్యుడు” అను పేరును సూర్యునకు మనువే 

నామకరణము చేశాడు. తర్వాత చాలా పేర్లు సూర్యునకు తెలుగు భాషలో తయారయినవి” ఈ వాక్యమును స్వయముగా మీరే చెప్పారు. ఇప్పుడేమో 

మనువుకు జ్ఞానము చెప్పినది సూర్యుడని ఏమాత్రము తెలియదన్నారు. అప్పుడేమో సూర్యునకు ఆదిత్యుడని మనువే పేరు పెట్టినట్లు చెప్పారు. 

 అప్పుడొక మాట, ఇప్పుడొక మాట చెప్పడమును బట్టి ఇందులో ఏదో 

ఒకటి సత్యమున్నా మరొకటి అసత్యమని తెలిసిపోవుచున్నది. మీకు అలా అసత్యమును చెప్పవలసిన అవసరమేమున్నది? అసత్యముతో మనుషులకు 

జ్ఞానము కల్గునాయని ప్రశ్నించుచున్నాము. దీనికి జవాబు చెప్పండి? మేము జవాబును అడిగామని జవాబులో కూడా మమ్ములను మభ్య 

పెట్టకుండా సత్యమునే చెప్పమని కోరుచున్నాము.  

జవాబు :- ఆకాశములో ఏడురంగుల ఇంద్రధనస్సు కనిపించును. అయితే అక్కడ వాస్తవముగా ఏడు రంగులు లేవు. అక్కడున్నది సూర్యకిరణము 

మాత్రమే. అయితే సూర్యకిరణము కనిపించకుండా ఏడు రంగులు కనిపించు చున్నాయి. అప్పుడు దానిని ఏడు రంగులనాలా? లేక సూర్యకిరణమనాలా? 

తాత్కాలికమునకు ఏడు రంగులు కనిపించినా అవి అశాశ్వితమే. ఆ ఏడు రంగుల వెనుక దాగియున్న సూర్యకిరణమే సత్యమని చెప్పవచ్చును. 

అయినా సత్యమయిన సూర్యకిరణము కనిపించనంత మాత్రమున సూర్య కిరణమును అసత్యము అని చెప్పలేము. అలాగే నా మాటలోని రంగులే 

నీకు కనిపించాయి. అయితే నా మాటలోని సత్యము నీకు కనిపించలేదు. మిమ్ములను మభ్యపెట్టినా అది మిమ్ములను దేవునివైపు నడిపించుటకేయని 

మీరు అర్థము చేసుకోవలెను. అయినా నేను అసత్యమును చెప్పకుండా సత్యమునే చెప్పుచున్నాను. మీరు అర్థము చేసుకోవడములో లోపమే 

గానీ, నా మాటలో లోపము లేదు. చూపులేనివాడు ఏనుగు కాలును పట్టుకుని స్థంభము అని అనుకొన్నాడట. అలాగే చెవును పట్టుకొని చేటయని 

అనుకొన్నాడట. అక్కడ ఏనుగు సత్యమే అయినా వాడు అనుకోవడము అసత్యము. అలాగే మేము సత్యమునే చెప్పినా కొన్ని విషయములు మీకు 

సరిగా అర్థముకానందున వాటి విషయములో మీరు నన్నే అసత్యము  

చెప్పినట్లు అనుకోవడము జరుగుచున్నది. ఇదంతయూ మీ అవగాహన లోపమేగానీ, నా బాధ్యతారాహిత్యము కాదు. నేను బాధ్యతను సక్రమము 

గానే చేయుచున్నాము. ఇప్పుడు నేను ముందు ఒకమాట తర్వాత వెనుక మరొకమాట చెప్పినట్లు మీరు ఆరోపించుచున్నారు. ఇక్కడ కూడా మీరే 

పొరపడిపోయారుగానీ, నేను చెప్పినది అసత్యముకాదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చెప్పెదను వినుము. వంద సంవత్సరముల క్రితము ఒకడు 

అన్ని విధముల పేదరికమును అనుభవించుచుండెను. ఒక ధనికుడు పుణ్యమును సంపాదించుకొను నిమిత్తము ఏదో ఒక బీదవానికి సహాయము 

చేయాలనుకొన్నాడు. అతను అన్ని విధముల పేదరికమును అనుభవించు వానిని ఎన్నుకొని వానికి సహాయము చేయాలనుకొన్నాడు. అలాగే ఒక 

దినము ఆ పేదవాని ఇంటి వద్దకు వచ్చి, తనది ఏ ఊరు అని చెప్పక, తాను ఫలానా వాడినని ఏమాత్రము చెప్పకుండా, ఆ పేదవానికి పదిలక్షల 

రూపాయలను దానముగా ఇచ్చాడు. ఒక దైవగ్రంథములో “కుడిచేతితో ఇచ్చు దానము ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇస్తే అది నిస్వార్థ 

దానమగును. అలా దానము చేయడము మంచిదని” చెప్పియుండుట వలన అతను దానము చేసినప్పటికీ తాను ఎవరయినది కూడా చెప్పకుండా, 

ఎవరికీ తెలియకుండా పదిలక్షల రూపాయలను దానముగా ఇవ్వడముతో, దానము ఇచ్చినవాడు ఎవడయినదీ దానము తీసుకొన్న పేదవానికి కూడా 

తెలియదు. అయితే దానము ఇచ్చిన వాడు తెలుసుగానీ అతను ఎవరయినదీ, ఎక్కడనుండి వచ్చినదీ తెలియక పోయినా, తనకు దానము 

ఇచ్చిన వాడు గొప్పవాడు అన్నట్లు, అదియూ దానము ఇవ్వడములో కర్ణునితో సమానమైనవాడని తెలియునట్లు, "అపరకర్ణ" అను పేరును 

దానము ఇచ్చినవానికి బిరుదుగా పెట్టడమైనది. దానము ఇచ్చినవానికి అదే పనిగా దానము తీసుకొన్న వాడు పేరు పెట్టడము వలన దానము 

 ఇచ్చినవాడు ఫలానాయని మాత్రము తెలియదు కదా! దానము ఇచ్చిన 

వాడు సువర్ణ సంస్థానమునకు అధిపతియనీ, అతను పెద్ద ధనికుడనీ ఇప్పుడు మనకు తెలుసు అనుకొందాము. దానివలన మనము సువర్ణ సంస్థానాధి 

పతికి పేదవాడు “అపరకర్ణ" అని ఇప్పుడు పేరు పెట్టాడు అని ఇప్పుడు ఇతరులతో చెప్పాము. ఇప్పుడు దానము ఇచ్చినవాడు సువర్ణ సంస్థానాధిపతి 

యని ఇతరులకు మనము చెప్పినంత మాత్రమున అప్పుడు పేదవానికి ఆ పేరు తెలియదు కదా! 

 అదే విధముగా పూర్వము సూర్యుడు జ్ఞానార్థి అయిన వానికి 

తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాలనుకొన్నాడు. భూమిమీదగల మనువును ఎంచుకున్నాడు. మనువు దగ్గరకు సాధారణముగా వచ్చి తన జ్ఞానమును 

చెప్పాడు. మనువుకు జ్ఞానము చెప్పినప్పుడు మనువు జ్ఞానమును తెలియగలిగాడు గానీ చెప్పినవాడు ఎవడు? అన్న విషయము మాత్రము 

తెలియదు. చెప్పినవాడు అంతవరకు భూమిమీద లేని జ్ఞానమును చెప్పిన దానివలన, చెప్పిన వానిని "గురువు" అని చెప్పాడు. అంతేకాక విశేషముగా 

“ఆదిత్యుడు” అని పేరును పెట్టాడు. ఆ విషయమును మీకు మేము చెప్పుచూ "సూర్యునికి మనువు ఆదిత్యుడని పేరు పెట్టాడు” అని చెప్పాము. 

అది మేము ఇతరులకు ఇప్పుడు చెప్పిన మాటయేగానీ, భగవద్గీత పుట్టక ముందు అప్పుడు మనువుకు జ్ఞానము చెప్పినది సూర్యుడని కూడా తెలియదు. 

ఇప్పుడు భగవద్గీత బయటికి వచ్చినది తర్వాత మనువుకు జ్ఞానము చెప్పినది సూర్యుడని మనకు తెలిసినది. ఆ కాలములో మనువుకు జ్ఞానము చెప్పినది 

ఎవరయినది తెలియకున్నా, చెప్పినవాడు గొప్ప జ్ఞానమును చెప్పాడు కావున చెప్పిన వానిని “ఆదిత్య” అను పేరును పెట్టాడు. జ్ఞానము చెప్పిన వారిలో 

మొదటి వాడు అని చెప్పు తన భావమును 'ఆదిత్య' అని అన్నాడు. “దిత్య”  

అనగా రెండవవాడనీ, “ఆ” అనగా లేడనీ, “ఆదిత్య" అనగా అతనితో సమానమైన వాడు ఎవడూ లేడని అర్థము. చెప్పబడిన జ్ఞానము గొప్పదని 

గ్రహించిన మనువు జ్ఞానము చెప్పిన వాడు సూర్యుడని తెలియకున్నా అతను చెప్పిన జ్ఞానమును బట్టి 'ఆదిత్య' అని చెప్పడమైనది. ఇప్పుడు ఆ 

విషయమును తెలిసిన మేము మనువు సూర్యునకు 'ఆదిత్య' అని పేరు పెట్టాడని చెప్పాము గానీ, అప్పుడు మనువుకు ఆదిత్యుడు ఎవరయినది 

తెలుసునని చెప్పలేదు, జ్ఞానము చెప్పిన వారిలో ఇతనిని మించిన రెండవ వాడు లేడు అని ప్రజలకు తెలియజేయు నిమిత్తము ఆదిత్యుడను పేరును 

సూర్యునకు మనువే పెట్టడము జరిగినది అని మేము వ్రాశాము తప్ప, మనువుకు ఆదిత్యుడు సూర్యుడేయని తెలుసునని చెప్పలేదు కదా! 

 ఇంతవరకు నా మాటను నీవు ఎంత అసత్యమన్నావో అంతే 

పొరపాటును నీవు పడినావని తెలియుచున్నది. సూర్యుడు జ్ఞానము చెప్పింది నిజమే, మనువు తాను వినిన జ్ఞానమునుబట్టి చెప్పిన వానిని ఆదిత్యుడు 

అని చెప్పిన మాట నిజమే. ఎంత జ్ఞానమును చెప్పినా సూర్యుడు తాను ఫలానావాడననీ, తన పేరు ఫలానాయని చెప్పలేదని మేము చెప్పిన మాట 

నిజమే. మనువు చనిపోవు వరకేకాక మూడు యుగములు గడిచిపోవు వరకు ప్రజలకు ఎవరికీ సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పాడను 

విషయమే తెలియదు. కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడు సృష్ట్యాదిలో సూర్యుడు ఆకాశమునుండి వాణి ద్వారా వినిన జ్ఞానమును భూమిమీద 

మనువుకు చెప్పాడని బోధించినప్పుడు ఆ విషయము బయటపడినది. ఆ విషయము తెలియుట వలన ఆదిత్యుడను పేరును మనువు సూర్యునకు 

పెట్టాడని చెప్పాము. చెప్పినవాడు ఆదిత్యుడను పేరుకు తగినవాడని తలచిన మనువు ఆ పేరును జ్ఞానము చెప్పిన వానికి పెట్టాడు. ఆ పేరుపెట్టేటప్పుడు 

చెప్పినవాడు సూర్యుడని మనువుకుగానీ, మరి ఏ ఇతర మానవునకు గానీ తెలియదు. 

 ప్రశ్న :- ఎంతో గొప్ప జ్ఞానమును చెప్పిన సూర్యుడు తన పేరును ఎందుకు 

గుప్తముగాయుంచుకున్నాడు. అలా చెప్పకుండా ఉండుటకు కారణమే మయినా కలదా? 

 జవాబు :- మూడు యుగముల తర్వాత కృష్ణుడు భగవద్గీతను అర్జునునకు 

బోధించిన సమయములో, సూర్యుడు మనువుకు జ్ఞానమును చెప్పాడని తెలిసింది కూడా మంచిది కాదేమో అని మేము అనుకొంటున్నాము. 

సూర్యుడు అన్ని విధముల ఆలోచించి తన పేరును చెప్పలేదు. స్వయముగా సూర్యుడు తన పేరును చెప్పియుంటే మనుషులు దేవున్ని వదలి సూర్యున్నే 

ఎక్కువగా ఆరాధించెడివారు. అటువంటి పనిని చేస్తారను ఉద్దేశ్యముతో సూర్యుడు తన పేరును బయటికి చెప్పకుండా తనకు తెలిసిన జ్ఞానమును 

చెప్పడము జరిగినది.  

ప్రశ్న :- మీరు గతములో “వార్తకుడు-వర్తకుడు” అను చిన్న గ్రంథములో సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినట్లు తెలుసుననీ, సూర్యుని వలన 

జ్ఞానము తెలిసిన దానివలన సూర్యుని గుర్తునే నుదుటి మీద గుర్తుగా పెట్టుకొన్నాడనీ, సూర్యుని గుర్తును బట్టి తనది సూర్యవంశమని చెప్పాడనీ 

వ్రాశారు. ఇప్పుడు పొంతనలేకుండా చెప్పుచున్నారు. మీరు ఎందుకు అలా చెప్పుచున్నారు? జ్ఞానమువద్ద అసత్యమును చెప్పకూడదు కదా! ఆ 

గ్రంథములో అలా చెప్పి, ఈ గ్రంథములో ఇలా చెప్పారు. అట్లు చెప్పవలసిన అవసరము మీకు ఏమి వచ్చినది? 

 జవాబు :- అవును అక్కడ మీరు చెప్పినట్లే వ్రాశాము. అయితే అక్కడ 

ముఖ్యముగా ఒకమాటయుండడమును ఎవరూ గమనించియుండరు. అదే మనగా! ఎప్పుడయితే సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పాడో 

 అప్పుడే మనువులో మాయ పని చేయను మొదలు పెట్టిందని 

చెప్పాము. “వార్తకుడు-వర్తకుడు" అను గ్రంథములో 8వ పేజీలో మరియు 9వ పేజీలో ఇలా వ్రాయబడియున్నది చూడండి. "ఎప్పుడయితే మనువు 

జ్ఞానమును సూర్యుని ద్వారా తెలియగలిగాడో, అప్పుడే మనువు అను వ్యక్తిలో కొద్దిగా మాయ పని చేసినది. అది మాయ అని తెలియకుండా 

మనువు తలలోని గుణము పనిచేసి, సూర్యుడు తనకు జ్ఞానము చెప్పినందుకు, తన తలలో సూర్యుని జ్ఞానము నిలువయున్నందుకు తన 

ముఖముమీద నుదుటి భాగమున సూర్యుని గుర్తును పెట్టుకోవడము జరిగినది.” 

 మనిషిలో మాయ పనిచేస్తే మనిషి మాయ చెప్పినట్లు చేయుచూ 

పోవుచుండును. మనువులో మాయ పనిచేయను మొదలు పెట్టినప్పుడు అతని తలలోని గుణము పనిచేసి, సూర్యుని గుర్తును తన ముఖము మీద 

నుదుటి భాగమున పెట్టుకోవాలనిపించినది. అప్పటినుండి సూర్యుని ఆకారమును నుదుటి మీద ధరించడము జరిగినది. సూర్యుని జ్ఞానము 

తన తలలో యున్నందుకు సూర్యుని గుర్తును ధరించుచున్నానని మనువు ఇతరులకు చెప్పాడు. మనువును చూచి మనువు చెప్పిన జ్ఞానమును 

విన్నందుకు ఇక్ష్వాకుడు అను రాజు కూడా సూర్యుని గుర్తును నుదుటి మీద ధరించడమేకాక, తనది సూర్యవంశమని చెప్పుకోడము జరిగినది. 

వాస్తవముగా సూర్యవంశము అని చెప్పుకోవడము మాయ యొక్క ప్రభావమని ఎవరికీ తెలియదు. మాయ చేతనే మనువు బుద్ధి 

మారిపోయినది. సూర్యుని జ్ఞానమునకు గుర్తుగా ముఖము మీద సూర్యుని గుర్తును పెట్టుకొన్నానని చెప్పుకోవడము మాయ పనియని ఎవరికీ తెలియక 

పోయినది. మనువు సూర్యుడు తనకు జ్ఞానమును చెప్పాడని బయటికి  

చెప్పినా, తన లోపల మాత్రము జ్ఞానము చెప్పినది సూర్యుడు కాదనీ, జ్ఞానము తెలిసిన ఎవరి సూక్ష్మమో తనకు చెప్పినదని అనుకోవడము 

జరిగినది. తన అంతరంగమున సూర్యుని గురించిన భావము ఏమాత్రము లేకున్నా పైకి సూర్యున్ని గురించి మాట్లాడునట్లు మాయ చేసినది. మనువు 

చెప్పిన దానినిబట్టి ఇక్ష్వాకుడు మొదలగు వారంతా తమది సూర్యవంశము అని చెప్పుకోవడము జరిగినది. వారి అంతరంగములో కూడా సూర్యుడు 

మనువుకు జ్ఞానము చెప్పాడన్న విషయము తెలియదు. బలవంతముగా మాయ వారిచేత వంశమును పలికింపజేసినది. వంశము, కులము, 

గోత్రము (గుణత్రయము) అన్నీ మాయ యగుట వలన మనుషులను మాయలో ఉంచుటకు, మాయ సూర్యుని పేరును వాడుకొని వారికి 

చెప్పించింది గానీ, వారికి సూర్యుడు జ్ఞానము చెప్పాడను నమ్మకము ఏమాత్రము లేదు. 

 మనువు మాత్రము మాయచేత తనకు తెలియని విషయమును 

ఆ కాలములో చెప్పినా, అది పూర్తిగా మనువుకే నమ్మకము లేదు. తర్వాత ఇక్ష్వాకుడు మనువును అనుసరించినా, ఇక్ష్వాకునికి కూడా లోపల సూర్యుడు 

మనువుకు జ్ఞానము చెప్పాడను నమ్మకము లేదు. మనువు తర్వాత ఎవరుగానీ, మూడు యుగములు జరుగువరకు గానీ సూర్యుని ప్రస్తావణ 

రాలేదు. సూర్యుడు జ్ఞానము చెప్పాడను విషయమే ఎవరూ అనుకోలేదు గానీ, మాయా ప్రభావము వలన సూర్యవంశము పేరు భూమిమీద 

నిలిచిపోయినది. కొన్ని యుగముల తర్వాత కులముల ప్రభావము ఎక్కువయిపోయి 'వంశము' అనుమాట తగ్గిపోయినది. ఇదంతా మాయ 

నాటకమేగానీ, సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పాడను మాట మనువుకు తెలియదు. ఇతరులకు ఎవరికీ తెలియదు. అయితే మనువుకు జ్ఞానము 

 సూర్యుని ద్వారానే తెలిసినది. సూర్యుడే మనువును ఎన్నుకొని జ్ఞానము 

చెప్పడము జరిగినది. ఆ విషయము వాస్తవముగా మనువుకు తెలియదు. మనువుకు సూర్యుడు తనను గురించి ఏమాత్రము చెప్పలేదు. 

విషయమును ముందే చెప్పాను.  

ప్రశ్న :- దక్షిణ భారతదేశములో ఎందరో జిజ్ఞాసులు ఉండగా, మనువును ఒక్కనిని ప్రత్యేకించి సూర్యుడు ఎందుకు ఎన్నుకున్నాడు? 

 జవాబు :- ఆనాడు సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పుటకు మనువునే 

ప్రత్యేకించి ఎన్నుకోవడము జరిగినది. ఆనాడు దక్షిణ భారతదేశమున మనువుతోపాటు ఎందరో జ్ఞానమును తెలుసుకొనుటకు అర్హులైన 

వారున్నారు. వారందరినీ కాదని సూర్యుడు మనువునే నిర్ణయించుకోవడము నకు బలమైన కారణము కలదు. సూర్యోదయముతోనే ప్రతి దినము 

ప్రారంభమైనట్లు, సూర్యోదయముతోనే సృష్ఠి కూడా మొదలయినదని, సృష్ఠి మొదటి దినము ఆదివారముతోనే మొదలయినదని, ఆదివారము సూర్యుని 

దినమని తెలిసి సూర్యుని గౌరవించునట్లు సూర్యుని బొమ్మను తన నుదుటి మీద మనువు పెట్టుకొనెడివాడు. సూర్యుని గుర్తును అప్పటి కాలములో 

మనువు ఒక్కడే ధరించుట వలన సూర్యుని దృష్టి మనువు మీదికి ప్రాకినది. తన గుర్తును నుదుటి మీద పెట్టుకొన్నవాడు మనువు ఒక్కడే అయినందున 

ఎంతోమంది జ్ఞానజిజ్ఞాసులలో మనువును మాత్రము సూర్యుడు ఎన్నుకోవడము జరిగినది. 

 ప్రశ్న :- సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత ఆయన జ్ఞానము నా తలలో 

యున్నదను గుర్తుగా సూర్యుని బొమ్మను నుదుటిమీద పెట్టుకొన్నాడని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడేమో సూర్యుడు జ్ఞానము చెప్పకముందే 

 నుదుటి మీద సూర్య గుర్తును ఉంచుకున్నాడని చెప్పుచున్నారు. ఇందులో 

ఏది నిజము?  

జవాబు :- సూర్యుడు జ్ఞానమును చెప్పక పూర్వమే మనువు సూర్యుని ఆకారమును నుదుటిమీద పెట్టుకొన్నాడనుటయే వాస్తవమని చెప్పుచున్నాను. 

సూర్యుడు జ్ఞానమును మనువునకే చెప్పడమునకు కారణము మనువు ముఖము మీద సూర్యుని ఆకారమును పెట్టుకోవడము వలన సూర్యుని 

దృష్ఠిని మనువు ఆకర్షించగలిగాడు. సూర్యుని దృష్ఠి సూర్యుని బొమ్మను ధరించిన మనువు మీద పడడము వలన మనువునకే సూర్యుడు జ్ఞానమును 

చెప్పాడు. సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత మనువులో గుణముల మాయ పని చేయడము వలన, మనువు తనకు తెలియకున్నా, సూర్యుడు 

జ్ఞానమును చెప్పాడని చెప్పాడు. సూర్యుని విషయము తనకు తెలియకున్నా తెలుసునని చెప్పాడు. దానితో సూర్యవంశము తయారై అక్కడినుండి 

కులముల వరకు అజ్ఞానము ప్రాకినది. సూర్యుడు జ్ఞానము చెప్పిన తర్వాత మనువులో మాయ పని చేసిన విధానము ద్వారా జరిగిన చరిత్ర ఒక 

విధముగా యుండగా, అందులో సత్యము ఏమున్నదని చూచిన ఇంకొక విధానము అర్థము కాగలదు. మాయ పని చేయడము వలన మనువు 

తనకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని చెప్పినది ఒక విధముగా వాస్తవమే అయినా, సత్యము ప్రకారము మనువునకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని 

తెలియదు.  

మనవుకు తెలియని విషయమును, జరిగిన సత్యమునే మనువు చేత చెప్పించి మనువు సత్యమే చెప్పాడు కదా! యనిపించి, సూర్యుని 

గురువుగా మనువు చెప్పినట్లు మాయ చేయడము వలన అందరికీ మనువు సత్యవచనుడుగా యున్నట్లు కనిపించాడు. మనువుకు వాస్తవముగా 

 సూర్యుడు జ్ఞానము చెప్పిన విషయము తెలియదు. అయినా మాయ 

మనువు చేత మనువుకు తెలియని సత్యమును తెలిసినట్లు చెప్పించి, మనువు ద్వారా ఒక వంశము పేరును బయటికి తెచ్చినది. వంశము నుండి 

చివరకు కులము వరకు మనుషులు చీలిపోవునట్లు చేసినది. మాయ మనుషులను దేవుని మార్గమునుండి తప్పించి అజ్ఞానమార్గములో 

పయనించుటకు మనువు చేత మనువుకు తెలియని సత్యమును చెప్పించి తన ప్రభావమును మనుషుల మీద చూపి మనుషులు కులములుగా 

చీలిపోవునట్లు చేసినది. మేము మాయ ఇలా చేసిందియని చెప్పకుండా అప్పుడు జరిగిన చరిత్రను చెప్పాను. అప్పుడు అలా చెప్పడమే అవసరము. 

అప్పుడు సత్యమును చెప్పితే అది అసందర్భప్రలాపమగును. అందువలన ముందు సూర్యుడు జ్ఞానము చెప్పిన విషయము మనువుకు తెలుసును 

అని చెప్పాము. అప్పుడు చెప్పినప్పుడు వెనుకల దాగియున్న విషయమును చెప్పలేదు. సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పినది సత్యమేయగుట 

వలన మేము కూడా మాయ విధానమునే చెప్పుచూపోయాము. మనువుకు సూర్యుడు జ్ఞానమును చెప్పినది సత్యమే. అయితే ఆ విషయము మనువుకు 

తెలియును అను విషయము మాత్రము అసత్యము. సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పాడా! లేదా! అను విషయము అప్పుడు ముఖ్యము కాదు 

కనుక అప్పటికి అర్థమగునట్లు మాయ చేసిన విధానమునే మేము చెప్పాము. ఇప్పుడు సత్యాసత్య వివరము అవసరము అయినందున తప్పక సత్యమును 

చెప్పవలసి వచ్చినది.  

మనువు చేత మనువుకు తెలియని సత్యమును, తెలిసిన సత్యముగా చెప్పించి మనువును ముఖ్యమైన మనిషిగా చూపించిన మాయ, మనువు 

చేతనే వంశమును వచ్చునట్లు చేసి చివరకు కులముల వరకు చీలిపోవు  

నట్లు చేసినది. తర్వాత అంతటితో ఆగక మనుషులను దైవమార్గము వైపు పోకుండా చేయుటకు మనువు చేత కొన్ని ధర్మములను చెప్పించినది. 

అవన్నియూ దైవజ్ఞానముగా కనిపించునట్లు చేసి వాటినే మనుషులు ఆచరించునట్లు చేసినది. దేవుడు చెప్పిన ధర్మములు కాకుండా, మనువు 

స్వయముగా ధర్మములు చెప్పుట వలన మనువు చెప్పిన ధర్మములను ‘మనుధర్మశాస్త్రము' అని అంటున్నారు. మనుధర్మశాస్త్రము వలన మనుషులు 

దేవుని ధర్మముల వైపు పోకుండుటకు అవకాశము గలదు. అందువలన ఆ కాలములో మనుషులు మను ధర్మశాస్త్రమును అనుసరించెడివారు. 

మను ధర్మశాస్త్రము అప్పటి కాలములో ప్రచారమయినా, ఇప్పుడు కూడా మను ధర్మములు మనుషులలోయున్నా ఇవి మను ధర్మములు అని 

మనుషులకు తెలియదు. మనుషులకు తెలియకుండా మను ధర్మములు దేవుని ధర్మములుగా ఆచరించబడుచున్నా, అవి మనుషులకు తెలియక 

పోవడము వలన భగవద్గీతలోని దేవుని ధర్మములను మనిషి గుర్తించ లేకపోవుచున్నాడు. మనిషి మాయ ప్రభావము వలన దేవునివైపు కాకుండా 

ప్రకృతివైపు పోవుచున్నాడు.  

ప్రశ్న :- మను ధర్మశాస్త్రము అను పేరును విన్నాముగానీ, మను ధర్మ శాస్త్రమును ఎక్కడా చూడలేదే. అంతకూ మను ధర్మశాస్త్రమనునది 

ప్రత్యేకముగా యున్నదా?  

జవాబు :- మను ధర్మ శాస్త్రమనునది పేరు మాత్రము గలదు. వాస్తవానికి అది శాస్త్రమే కాదు. ఎందుకనగా! అందులో శాస్త్రీయత లేదు. అయినా 

మొదటినుండి అందరూ దానిని శాస్త్రమని అంటున్నారు. మను ధర్మము అను దానిని మనువు స్వయముగా చెప్పుట వలన దానికి ఆ పేరు రావడము 

జరిగినది. మనువు శరీరములోని మాయ, మనువుచేత సూర్యుడు చెప్పిన  

జ్ఞానము కాకుండా తన స్వంత జ్ఞానమును చెప్పించినది. మొదట మనువు సూర్యుడు చెప్పిన జ్ఞానమునే ఇక్ష్వాకుడు మొదలగు వారికి 

చెప్పడమైనది. తర్వాత చాలామందికి తన మీద మంచి అభిప్రాయము రావడము చేత తనలో మాయ పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన పేరు 

భూమిమీద ఉండవలెనని అనుకొన్నాడు. అందువలన సూర్యుడు చెప్పిన జ్ఞానము కాకుండా తన పేరుతో క్రొత్త ధర్మములను బోధించెను. అప్పుడు 

మనువు చెప్పిన ధర్మములే నేటివరకు 'మను ధర్మశాస్త్రము' అని ప్రత్యేకమయిన పేరుతో చెప్పబడుచున్నది. మను ధర్మశాస్త్రమనునది చెప్పబడినదేగానీ, 

వ్రాయబడినది కాదు. 'జపర' అను పేరుగల బోధ చెప్పబడినదే, వ్రాయబడినది కాదని ఎట్లు చెప్పుకొన్నామో, అలాగే మను ధర్మశాస్త్రమనునది 

గ్రంథము కాలేదు. మనువు చెప్పినవి ధర్మములు కావు, అయినా మాయ ప్రభావము చేత ధర్మములుగా చెప్పబడుచున్నవి. అలాగే మనువు చెప్పినది 

శాస్త్రమే కాదు, అయినా మాయ బలము చేత శాస్త్రముగా చెప్పబడుచున్నది.  

ప్రశ్న :- దేవుడు ఎంతో శ్రమతో తన జ్ఞానమును మూడు విధముల, మూడు మార్గముల ద్వారా మనుషులకు చెప్పించగా, మాయ దేవుని 

జ్ఞానమునకు వ్యతిరేఖముగా అధర్మములను ఎందుకు బోధింపజేయు చున్నది? దేవునికి వ్యతిరేఖము చేయకూడదని మాయకు తెలియదా? 

 జవాబు :- దేవుడు భర్తకాగా, ప్రకృతి భార్యగాయున్నది. ప్రకృతి యొక్క 

రెండవ ఆకారమే మాయ. ప్రకృతి మాయ రూపముగా యున్నా మాయ దేవుని భార్యయగుట వలన మాయ దేవునికి ఏమాత్రము వ్యతిరేఖము 

కాదని చెప్పవచ్చును. దేవునికి అన్ని విధముల సహకరించుచూ, ఎంతో విధేయతగాయున్న వారిలో మొదటిది మాయయేయని చెప్పవచ్చును. 

ఎంతో వినయముగా యున్న మాయ దేవునికి వ్యతిరేఖముగా ఎప్పటికీ  

నడువదు. మాయ మానవులను మాత్రమే తప్పుదారి పట్టించుచున్నది. అంతేగానీ ప్రజలను ఏమాత్రము తప్పుదారి పట్టించలేదు. ప్రజలను 

దైవమార్గములో నడుచునట్లు చేయుచున్నది. అయితే మానవులను మాత్రము పనికట్టుకొని తప్పుదారి పట్టించి దైవమార్గమునుండి తప్పి 

పోవునట్లు చేయుచున్నది. ప్రజలంటే దేవునికి ఇష్టము. మానవులంటే దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టములేని వారిని ఆయనవద్దకు 

పోకుండునట్లు, వారిని తప్పుదారి పట్టించుటకు మాయ అదేపనిగా వారికి అజ్ఞానమును బోధించుచున్నది. మాయ తన భర్తయిన దేవుని మాటను 

అనుసరించియే అలా చేయుచున్నది. మాయ విషయము తెలియని వారు అందరూ మాయ దేవునికి వ్యతిరేఖ మయినదని అనుకుంటారు. మాయను 

గురించి పూర్తి తెలిసిన తర్వాత ఎవరూ మాయ చెడుదని, దేవునికి వ్యతిరేఖమని ఏమాత్రము అనుకోరు. మాయ మాత దేవుని సేవకురాలని ఎవరూ 

మరువకూడదు.  

ప్రశ్న :- మాయ విషయమటుంచి ముందు మీరే మా పాలిట మాయ కాకూడదని కోరుచున్నాము. ఎందుకు అలా అడుగుచున్నామంటే 

భూమిమీద గల మనుషులను మానవులని, ప్రజలని అందరూ అనగా విన్నాము. ఇప్పుడు మొట్టమొదటిగా మీరే మానవులను, ప్రజలను 

వేరువేరుగా విభజించి అందులో మానవులు దేవునికి ఇష్టము లేదనీ, ప్రజలు మాత్రమే ఇష్టమని చెప్పారు. దేవునికి మనుషులందరూ సమానమే 

అనగా విన్నాము. అయితే ఇప్పుడు మీరు మాత్రమే మనుషులను రెండు రకములుగా మానవులు, ప్రజలని విభజించారు. ప్రజలనినా, మానవులనినా 

మనుషులే కదా! అటువంటప్పుడు మానవులు దేవునికి సరిపోకుండా ఉండడము ఏమిటి? మానవులు సరిపోనప్పుడు, మానవుల మీద దేవునికి 

 ఇష్టములేనప్పుడు ప్రజల మీద ఇష్టము ఎలా కలిగింది. మీ మాట 

నమ్మదగినదేనా? మీరు సంచలనాత్మక బోధకులు మీ మాటను కాదనలేము, అవునని అనలేము. ఎటూ చెప్పలేము. మీరు దేనికయినా జవాబు 

చెప్పగలరు. ఈ విషయములో మాకున్న సంశయమును తీర్చమని వినయ విధేయతగా అడుగుచున్నాము. 

 జవాబు :- వినయము లేకుండా అడిగిన వారికి కూడా జవాబును 

చెప్పాము. ఇప్పుడు నీవు వినయముగా అడుగగా నేను చెప్పకుందునా? నీవు అడిగిన సంశయముతో కూడుకొన్న ప్రశ్నకు తప్పనిసరిగా జవాబును 

చెప్పెదను జాగ్రత్తగా వినుము. మనుషులలో ఒక రకము ప్రజలు, మరొక రకము మానవులు ఉండడము వాస్తవమే. అయితే ఆ విషయము నేడు 

ఎవరికీ తెలియకుండా పోయినది. అటువంటి విషయమును ఇప్పుడు నేను చెప్పడము మీకు ఒక వింతగానేయుంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోతే 

నా తర్వాత ఎవరూ చెప్పువారు లేరు. కనుక ఇప్పుడే ఆ విషయమును వివరముగా చెప్పదలచుకొన్నాను. నా మాటల వలన నీకున్న సంశయము 

సంపూర్ణముగా తీరిపోగలదు. భూమిమీద పుట్టిన జనులలో మనుషులు, మానవులు, ప్రజలు అను మూడు రకముల వారున్నారు. శరీరములో 

మనస్సుయుండుట వలన అందరిని ఏకముగా మనుషులు అని అనవచ్చును. మనస్సుగల వాడు 'మనిషి' అని చెప్పబడుచున్నాడు. అందరికీ మనస్సు 

యుండుట వలన అందరినీ కలిపి 'మనుషులు' అని అంటున్నాము. అయితే మనుషులలో మానవులు ఉన్నారు. అలాగే ప్రజలుయున్నారు. మానవులు, 

ప్రజలు ఇద్దరు ఆకారములో ఒకే రకముగా యుండుట వలన ఎవరు ప్రజలో! ఎవరు మానవులో! బయటికి తెలియకుండా పోయినది. 

 ఎవరయినా తప్పు పనిచేస్తే వానిని దూషించునప్పుడు నీవు 

మనిషివేనా? అని దూషించడము జరుగుచుండును. అంతేకాక నీకు  

మానవత్వమున్నదా? అని కూడా అనుచుందురు. అంతేగానీ నీవు ప్రజలవేనా? అని ఎవరూ అనరు. ఎందుకనగా! 'ప్రజ' పదము ప్రత్యేకమయి 

నది. ఒక దినము దాదాపు పది సంవత్సరముల క్రిందట తెలంగాణా ప్రాంతములో ఒక వ్యక్తి వ్యాపారమును చేయుచున్నాడు. ఆ వ్యక్తి 

తనవద్దయున్న ఒక ఆటోమొబైల్ సామానును ఎదుటి వాని అవసరమును బట్టి ఎక్కువ రేటుకు అమ్మడము జరిగినది. ఆ వస్తువు ఎక్కడా లేదని 

తనవద్దనే యుండుట వలన వందరూపాయల వస్తువును పదింతలు ఎక్కువ రేటుతో వేయి రూపాయలకు అమ్మడము జరిగినది. ఒక గంట కాలము 

గడచిన తర్వాత ఒక పెద్ద మనిషి అక్కడకు రావడము జరిగినది. షాపు యజమాని తన వ్యాపారములో వందరూపాయల వస్తువును వేయి 

రూపాయలకు అమ్మడము తెలుసుకొని, ఆ వ్యక్తి అంత అన్యాయమునకు పాల్పడిన విషయము తెలుసుకొనిన పెద్ద మనిషి ఆ వ్యాపారస్తున్ని దూషిస్తూ 

'నీకు మానవత్వమున్నదా?” అని అనడము జరిగినది. అందుకు ఆ వ్యాపారస్తుడు బదులుగా మాట్లాడుచూ ఇలా అన్నాడు “నాకు మానవత్వమున్న 

దని ఎవరు చెప్పారు? నాకు మానవత్వము లేదు, మీకే మానవత్వమున్నది, మీరే మానవులు. నేను మానవున్ని కాదు, నాకు మానవత్వము లేదు. 

నేను ఒక మనిషినే అయినంతమాత్రమున మానవున్ని మాత్రము కాదు” అని చెప్పడము మేము విని చాలా ఆశ్చర్యపోయాము. 

 రెండు రోజుల అనంతరము నేను ఆ వ్యాపారుస్థున్ని కలుసుకొని 

నాకు కల్గిన అనుమానమును నేను అడిగాను. అప్పుడు నేను మాట్లాడుచూ “ఒక పెద్ద మనిషి మిమ్ములను నీకు మానవత్వమున్నదా! యని దండించి 

నప్పుడు నేను మనిషినే అయినంతమాత్రమున మానవున్ని మాత్రము కాదు అన్నావు. నీవు మనిషివగుట నిజమే, అట్లే మానవుడవగుట కూడా 

 నిజమే కదా!”యని అడిగాను. దానికి ఆ వ్యక్తి సమాధానమును చెప్పుచూ 

“నాకు మనస్సున్నది కావున మనిషినని చెప్పాను. మనస్సున్నవాడు మనిషియను నిర్వచనము ప్రకారము నేను మనిషిని అని చెప్పడములో 

తప్పులేదు. అయితే పశువులలో ఎద్దుకు, దున్నపోతుకు ఎంతోతేడా ఉన్నట్లు అట్లే మనుషులలో ప్రజలకు, మానవులకు ఎంతో తేడా గలదు. 

నల్ల ఎద్దులు, నల్లగనేయుండు దున్నపోతులు కలిసిపోయినట్లు ప్రజలు, మానవులు కలిసిపోయి గుర్తించుటకు వీలులేకున్నారు. ఎద్దులను, దున్నలను 

రెండిటినీ కలిపి పశువులు అని పేరుపెట్టినట్లు, ప్రజలను మానవులను ఇరువురునూ కలిపి మనుషులు అని అంటున్నారు. ఒకే పేరున్న పశు 

వులలో ఎద్దులు, దున్నపోతులు ఏ విధముగా వేరువేరు జాతియై ఉన్నవో, అలాగే ఒకే పేరున్న మనుషులలో ప్రజలు, మానవులు వేరు వేరు భావములు 

కలవారైయున్నారు. ఎద్దులు బురదను చూస్తే దూరముగా ఉంటాయి. దున్నపోతులు బురదను చూస్తే ఆనందపడి శరీరమంతా పూసుకొంటాయి. 

అదే విధముగా ప్రజలు మానవులు వేరువేరు బుద్ధులు కల్గియున్నారని చెప్పవచ్చును. 

 పూర్వము సూర్యుడు భూమిమీద జ్ఞానమును మనువు ద్వారా 

అందించాడు. మనువు తనకు సూర్యుని ద్వారా తెలిసిన జ్ఞానమును ఇతరులకు అందించగా దేవుని జ్ఞానము భూమిమీద పూర్తి ప్రాకిపోయినది. 

అలా తెలియబడిన జ్ఞానమును కొందరు చౌకగా చూస్తూ, హేళనగా మాట్లాడుచుండిరి. అలా హేళనగా మాట్లాడు వారిని చూచిన మాయ 

వారు దేవునివైపు పోకుండాయుండుటకు అజ్ఞానమును జ్ఞానమువలె తెలియజెప్పి, అజ్ఞానము మీద వారికి ఇష్టము పుట్టునట్లు చేసి వారిని 

అజ్ఞానమువైపు పోవునట్లు, జ్ఞానము వైపు రానట్లు చేయాలనుకున్నది.  

మాయ అలా అనుకొన్న వెంటనే మనువులోని భావమును మార్చివేసినది. తాను చెప్పిన జ్ఞానమును అందరూ వినగలరనీ, తన పేరు శాశ్వితముగా 

భూమిమీదయున్నట్లు చేసుకోవాలనుకొన్నాడు. అప్పుడు మనువు స్వయముగా జ్ఞానము బోధించి, స్వయముగా ధర్మములను చూపించి, 

తన బోధకు శాస్త్రమను పేరును తగిలించి మను ధర్మశాస్త్రమని పేరు పెట్టాడు. 

 మాయ ప్రేరేపితము వలన మనువు తన పేరుమీద మనుధర్మ 

శాస్త్రమను బోధను చెప్పిపోయాడు. ఆనాడు మనుధర్మ శాస్త్రము గ్రంథరూపము కాలేదు. బోధరూపములోయున్న మనుధర్మశాస్త్రము 

భూమండలమంతా ప్రాకిపోయినది. మాయ చేసిన పని వలన శాస్త్రము కాని అశాస్త్రము శాస్త్రముగా, ధర్మము కాని అధర్మము ధర్మముగా భూమి 

మీద ప్రాకిపోయినది. మను ధర్మశాస్త్రములోనివి ఫలానా ధర్మములని ఎవరూ చెప్పకున్నా అవి మాత్రము మనుషుల మధ్యలో తెలియకుండా 

ఉండిపోయినవి. నేడు భూమిమీద ఆచరణ రూపములోయున్న యజ్ఞములు, వేదముల పఠనములు, దానములు, తపస్సులు (ధ్యానములు) మొదలగునవి 

మను ధర్మములలోనివని ఎవరికీ తెలియదు. నేడు మను ధర్మములని తెలియకున్నా, నాలుగు విధములుగాయున్న యజ్ఞ, దాన, వేద, తపస్సులను 

చాలామంది ఆచరించుచున్నారు. దేవుడు ఆకాశవాణి ద్వారా సూర్యునికి చెప్పిన జ్ఞానములో మనువు స్వయముగా చెప్పినా నాలుగు విధానములు 

లేవు. దేవుడు దైవధర్మములను ఆకాశము ద్వారా చెప్పించాడు. మనువు ప్రకృతి ధర్మములను దైవధర్మములకు వ్యతిరేఖముగా యున్న అధర్మములను 

ధర్మములుగా బోధించడము జరిగినది. ఈ విధముగా దేవుడు ఆకాశము ద్వారా బోధించిన దైవ ధర్మములు, ప్రకృతి మనువు ద్వారా బోధించిన 

 అధర్మములు రెండు భూమిమీద రెండు తెగలుగా చీలిపోయినవి. మనుషులు 

ఎక్కువ శాతము మంది మను ధర్మములయిన ధర్మములు కాని అధర్మములకు అలవాటు పడిపోయారు. దేవుని ధర్మములకు అలవాటు పడినవారు చాలా 

తక్కువ శాతము గలరు. భూమిమీద దైవధర్మములను చెప్పిన మొదటి బోధకుడు మనువే. అలాగే భూమిమీద అధర్మములను చెప్పిన మొదటి 

బోధకుడు మనువే. ఒకే శరీరముగల ఒకే మనువే రెండు రకముల జ్ఞాన, అజ్ఞాన బోధలను చెప్పడము జరిగినది. ముందు దైవ ధర్మములను చెప్పిన 

మనువు తర్వాత మాయ ప్రేరేపించిన అధర్మములను బోధించిన బోధకుడుగా ఉండిపోయాడు. 

 మనువు సూర్యుడు చెప్పిన జ్ఞానమునే ఇతర ప్రజలకు చెప్పాడని 

భగవద్గీత ఆధారముగా అందరికీ తెలుసు. అయితే మనువు అధర్మములను కూడా చెప్పాడని మాత్రము తెలియదు. మనువు మొదట ధర్మములను 

బోధించి తర్వాత అదే మనువు అధర్మములను బోధించాడు అంటే ఎవరూ వినే పరిస్థితిలో లేరు. అయినా మనువు ధర్మములను, అధర్మములను 

బోధించాడని తెలియకపోవడము వలన తమకు తెలియకుండానే అధర్మముల వైపు మనుషులు పోవడము జరిగినది. ధర్మములు దేవునివికాగా, 

అధర్మములు మాయ వలన వచ్చినవి. మనిషికున్న శ్రద్ధను బట్టి వానికి దైవ ధర్మములుగానీ, మాయ అధర్మములుగానీ లభించుచున్నవి. దైవికమైన 

శ్రద్ద మనిషిలో యున్నప్పుడు దైవ ధర్మములు లభించుచున్నవి. అట్లే ప్రకృతి శ్రద్ధయున్నప్పుడు వానికి అధర్మములే దొరుకును. అధర్మములను 

ఆశ్రయించిన వాడు మనువు యొక్క అధర్మములను ఆచరించిన వాడగును. అట్లే ధర్మములను ఆశ్రయించినవాడు దైవధర్మములను ఆచరించినవాడగును. 

 ఇక్కడ అసలు విషయానికి వచ్చి చూస్తే మనువు ధర్మములను 

ఆచరించినవాడు ఎవడయినా వానిని 'మానవుడు' అనడము పూర్వము  

జరిగెడిది. అలాగే దేవుని ధర్మములను ఆచరించిన వానిని 'ప్రజ' అని అనడము జరిగెడిది. పూర్వము దేవుని ధర్మములు ఆచరించెడివారు 

అధికముగా యుండెడివారు. అందువలన వారినందరినీ “ప్రజలు” అను పేరుతో పిలిచెడివారు. మనువు యొక్క ధర్మములను అనుసరించెడివారు 

చాలా తక్కువమంది యుండెడివారు. అందువలన వారిని "మానవులు” అని పిలిచెడివారు. పూర్వము భూమిమీదయున్న మనుషులలో ప్రజలు 

ఎక్కువగా యుండెడివారు. మానవులు తక్కువగా యుండెడివారు. యుగములు మారగా, కాలము జరుగగా ప్రజలు తగ్గిపోయారు. మానవులు 

ఎక్కువయి పోయారు. పూర్వముకంటే ఇప్పుడే మనుషుల సంఖ్య ఎక్కువగా యున్నప్పటికీ అందులో ప్రజలు అరుదుగా యున్నారు. ఎక్కడ చూచినా 

మానవులే కనిపించుచున్నారు. దేవుని ధర్మములు నేడు లేకుండా పోయి ఎక్కడ చూచినా మనువు ధర్మములే కనిపించుచున్నవి. మను ధర్మములే 

దేవుని ధర్మములుగా చెప్పబడుచున్నవి. దేవుని ధర్మములు ఏమాత్రము తెలియకుండా పోయినవి. ఎక్కడయినా దేవుని ధర్మములు అరుదుగా 

కనిపించినా వాటిని పరమత ధర్మములని హిందువులే హేళన చేయుచున్నారు. అంతో ఇంతో నావద్ద దైవజ్ఞానముండుట వలన నన్ను 'మానవుడు' అని 

అనకూడదన్నాను. మను ధర్మములను అనుసరించు వారు మానవులవు తారు. నేను మను ధర్మములను అనుసరించడము లేదు. అందువలన 

నేను మానవున్ని ఎలా అవుతాను. నేను దైవ ధర్మములనే అనుసరించు చున్నాను కావున “ప్రజ” అను పేరు నాకు తగినది. మానవ అనుపేరు 

నాకు తగదు. అందువలన నన్ను దండించిన పెద్ద మనిషితో నాకు మానవత్వము లేదు, నేను మానవున్ని కాను అని గట్టిగా చెప్పాను. ఇప్పటి 

కాలములో మానవునికి, ప్రజలకు అర్థము తెలియని దానివలన నేను చెప్పినమాట మీకు అర్థము కాలేదు. మీకే కాదు నేడు పెద్ద జ్ఞానులమనుకొన్న 

 వారికి కూడా మానవులకు ప్రజలకు వ్యత్యాసము తెలియదు.” అని ఆయన 

చెప్పగా నేను విన్నాను. నేను ఆయనను అడిగిన దానివలన ఇప్పుడు మీకు కూడా కొంత అర్థమయినదనుకొంటాను. 

 ప్రశ్న :- ఆయన ఎవరో మాకు తెలియదుగానీ, ఇప్పుడు మీరు చెప్పగా 

మేము విన్నాము. ఆయనను వదలి మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాము. అది ఏమనగా! మను ధర్మములను ఆచరించిన వారు మానవులయితే 

నేడు భూమిమీద ఎంతో గొప్ప జ్ఞానులుగా చెప్పబడు వారందరూ ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట యజ్ఞములను చేయుచున్నారు. యజ్ఞములనే 

కాదు మనువు చెప్పిన మిగతా మూడు ధర్మములను కూడా ఆచరించు చున్నారు. వారిని ఏమనాలి అజ్ఞానులనాలా, జ్ఞానులనాలా? 

 జవాబు :- నేడు భూమిమీద మనుధర్మములను ఆచరించువారే జ్ఞానులుగా 

చెప్పబడుచున్నారు. జ్ఞానులుగా గౌరవించబడుచున్నారు. ఎవరు ఎలా యున్నా సూత్రము ప్రకారము వారు మనుధర్మములను ఆచరించుచున్నారు, 

కావున వారిని మానవులని చెప్పవచ్చును. మనువు భూమిమీద మొదట ధర్మములను చెప్పాడు తర్వాత అధర్మములను చెప్పాడు. మనువు మొదట 

చెప్పిన ధర్మములను అనుసరించువారు జ్ఞానులు అగుదురు. మనువు కొంతకాలము తర్వాత రెండవ మారు చెప్పిన ధర్మములను అనుసరించు 

వారిని అజ్ఞానులని అనాలి. ఒకరిద్దరినయితే అలా అజ్ఞానులని చెప్పి, వారిని మంచిదారికి తేవచ్చును. అట్లు కాక భూమిమీద 90 శాతము 

మనుషులు వారికి తెలియకుండానే మను ధర్మములను ఆచరించుచున్నారు. అటువంటప్పుడు అంతమందిని అజ్ఞానులంటే, అనిన వారిని ఊరక 

వదలరు. తమను అజ్ఞానులని అన్నందుకు అనిన వానిని ఏదో ఒక రకముగా బాధించుదురు. నిజము చెప్పి కష్టములను కొని తెచ్చుకోవడము కంటే, 

  

అసత్యమును సత్యమేయని ఒప్పుకొని వారినుండి దూరముగా ఉండడము మంచిది. 

 బుద్ధి కుశలతగలవారు తాము అధికులయినా, ఇతరులు తక్కువ 

వారయినా వారినే అధికులుగా చెప్పి, తమను తామే తక్కువ చేసుకొను చుందురు. సమయ సందర్భమునుబట్టి బుద్ధిగలవారు అలా చేయుచుందు 

రని వేమన యోగి తన పద్యమందు ఇలా చెప్పాడు.  

అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు 

కొండ యద్దమందు కొంచెమై యుండదా విశ్వదాభిరామ వినుర వేమ. 

 భావము :- బుద్ధియుతులు సమయ సందర్భమునుబట్టి తగినట్లు ప్రవర్తించు 

చుందురు. వారు తగనిచోట సామాణ్యులుగానే యుందురు. కొండ ఎంత పెద్దదయినా అద్దములో చిన్నదిగా కనిపించునట్లు, జ్ఞానులు ఎంత 

పెద్ద వారయినా అజ్ఞానుల ముందు తమను తాము తగ్గించుకొని చిన్నగనే కనిపించుచుందురు. 

 ప్రశ్న :- మను ధర్మశాస్త్రములోని ఆచరణలను తెలిసి ఆచరించినా, తెలియక 

ఆచరించినా వారు మానవులే యగుదురు. అయితే దైవ ధర్మములను కూడా మనువే చెప్పాడు. మనువు చెప్పిన వాటిని ఆచరించడము వలన 

మానవులయితే, మనువే దైవధర్మములను కూడా చెప్పాడు కదా! మనువు చేత చెప్పబడిన దైవ ధర్మములను ఆచరించువారిని ప్రత్యేకముగా “ప్రజలు” 

అనడములో అర్థమేమయిన గలదా?  

జవాబు :- మనువు అను మనిషి చేత జ్ఞానమును భూమిమీద మనుషులకు చెప్పించినా, జ్ఞానము దేవునివద్దనుండి ఆకాశము ద్వారా, సూర్యుని ద్వారా 

మనువుకు చేరడమైనది. జ్ఞానము యొక్క మొదటి స్థానము దేవుడే అయినా తర్వాత ఆకాశము, సూర్యుడు అను రెండు స్థానములు మారి నాల్గవ 

స్థానమైన మనువు వద్దకు చేరడమైనది. మనువు నుండి ఐదవ స్థానమయిన మనుషులకు చేరడమైనది. అయితే నాల్గవ స్థానమైన మనువువద్ద మాయ 

పనిచేయడమైనది. దేవుని జ్ఞానమును మనువు మనుషులకు బోధించిన తర్వాత మాయ మనువులో పనిచేసి, దేవుని జ్ఞానమునకు వ్యతిరిక్తమైన 

అధర్మములను చెలరేగునట్లు చేసినది. మొదట దేవుని జ్ఞానమును బోధించిన మనువు తర్వాత అధర్మములను బోధించాడు. మొదట బోధించిన ధర్మములు 

దేవునివద్దనుండి వచ్చినవి కాగా, తర్వాత బోధించిన అధర్మముల మొదటి స్థానము మాయకాగా, రెండవ స్థానము మనువేయని చెప్పవచ్చును. 

మనువు ఐదవ స్థానమున యుండి బోధించిన దేవుని ధర్మములను వినినవారు కొందరుండగా, మనువు రెండవ స్థానమునయుండి బోధించిన 

మాయ ధర్మములను వినిన వారు కూడా కొందరు గలరు. ఈ విధముగా మనుషులలో మనువు ద్వారా దైవధర్మములను వినినవారు ఒక గుంపుకాగా, 

అదే మనువు ద్వారా మాయ ధర్మములను వినినవారు మరియొక గుంపుగా నిలిచిపోయారు. 

 మనువు చెప్పిన దేవుని ధర్మములను, మాయ ధర్మములను రెండిటినీ 

వినినవారు మనుషులే అయినా, మనుషులు వినిన బోధనుబట్టి రెండు రకములుగా చీలిపోవడము జరిగినది. మాయ మనువు ద్వారా ధర్మములను 

చెప్పించినా, మాయ నేను చెప్పానని ఎక్కడా చెప్పకపోవడము వలన, దానిని మనువే స్వయముగా చెప్పినట్లయినది. అందువలన మాయ ధర్మములను 

 మను ధర్మములేయని చెప్పవలసి వచ్చినది. మనువు చెప్పిన మను 

ధర్మములను విని అనుసరించిన వారిని, మనువు పేరుతో పుట్టిన 'మానవ’ అను పేరుగల వారిగా మానవులుగా చెప్పడమైనది. మనుషులలో ఒక 

గుంపు మానవులుగా చీలిపోగా, రెండవ గుంపుగా దేవుని ధర్మములను విని ఆచరించువారని చెప్పవలసి వచ్చినది. మనుషులకు ఒక గుంపు 

మానవులు కాగా, మరియొక గుంపు పేరు ప్రజలని చెప్పుచున్నాము. మానవుల వెనుక మనువుయుండుట వలన మానవులని అర్థము 

చెప్పుచున్నాము. అలాగే ప్రజల వెనుక కూడా ఏదో ఒక అర్థము తప్పక ఇమిడియుండును. దానిని విడదీసి చూచిన ఈ విధముగా తెలియు 

చున్నది. “ప్రజ” అను రెండు అక్షరములలో 'జ' అనగా పుట్టుటయని అర్థము గలదు. 'ప్ర' అనగా ముఖ్యమైన సారాంశమైన అని అర్థము 

గలదు.  

 ఎవడయితే దేవుని ధర్మములను తెలియగలిగాడో వాని జన్మ 

సారాంశమైన జన్మగా మారిపోవుచున్నది. అందువలన దైవ ధర్మములను తెలిసిన వారిని 'ప్రజలు' అని అనవలసి వచ్చినది. దైవధర్మములను తెలిసిన 

వాని జన్మ సార్థకమగుట వలన అట్టివారిని ముఖ్యమైన జన్మలు గల వారని, లేక సారాంశమైన జన్మలు గలవారని అర్థమొచ్చునట్లు చెప్పుటకు ప్రత్యేకించి 

వారిని “ప్రజలు” అని చెప్పడమైనది. నేడు భూమిమీదగల మనుషులలో మానవులు ఎక్కడ చూచినా గలరు. అయితే ప్రజలు అరుదుగా గలరని 

చెప్పవచ్చును. మనువు చెప్పిన మొదటి బోధకన్నా, రెండవ బోధ అయిన మను ధర్మశాస్త్రమే నేడు ప్రజలలో పూర్తిగా ప్రాకిపోయినది. మొదట 

చెప్పిన దైవ ధర్మములు నేడు మనుషులలో కనిపించడము లేదు. అందువలన ప్రజలు అరుదుగా కనిపిస్తున్నారని చెప్పుచున్నాము. 

 ప్రశ్న :- మీలాంటి వారు దైవ ధర్మములను, మను ధర్మములను విడదీసి 

చూపడము వలన మానవులు కొందరయినా ప్రజలుగా మారవచ్చును కదా! 

 జవాబు : - విడదీసి చెప్పితే విషయము మాత్రము అర్థము కాగలదు. 

తెలియని విషయము తెలియగలదు. ఇది ప్రపంచ విషయములలో అయితే సరిపోవును. ఇక్కడ నేను చెప్పునది దైవ సంబంధమైన జ్ఞానము కనుక 

జ్ఞానమంతయూ మనిషిలో శ్రద్ధయున్నప్పుడే వానికి తెలియగలదు. ఒక మనిషి మానవుని నుండి 'ప్రజ' వరకు మారవలెనంటే వానికి దైవజ్ఞానము 

లభించాలి. దైవజ్ఞానము లభించాలంటే వానికి దేవునిమీద, దేవుని జ్ఞానము మీద ఎక్కువ శ్రద్ధయుండాలి. శ్రద్ధలేకపోతే జ్ఞానము లభించదు. 

అందువలన ముందు మానవునికి దేవుని జ్ఞానము మీద శ్రద్ధ కలగాలి. బోధకుడుగానీ, గురువుగానీ ఎంత వివరమును చెప్పినా, ఎంత మంచిగా 

బోధించినా శ్రద్ధలేకపోతే మానవుడు ప్రజగా మారలేడు.  

ప్రశ్న :- సూర్యుడు మనువుకు దైవజ్ఞానమును చెప్పాడు. మనువు ప్రజలకు దైవజ్ఞానమును, మానవులకు తన జ్ఞానమును బోధించాడు. అయితే 

దైవజ్ఞానము తెలిసిన ప్రజలు సూర్యున్ని నమస్కరించడములేదు. మనువు జ్ఞానమును తెలిసిన మానవులు మాత్రము సూర్యున్ని నమస్కరించుచున్నారు. 

సూర్య నమస్కారమును ప్రజలు చేయడము లేదుగానీ, మానవులే చేయు చున్నారు. మానవులు మనువు జ్ఞానమును తెలియుట వలన మనువుకు 

నమస్కారము చేయవలెనుగానీ, సూర్యనమస్కారము ఎందుకు చేయు చున్నారు? సూర్యుడు దైవజ్ఞానమును భూమిమీదికి తెచ్చాడను గౌరవముతో 

ప్రజలు సూర్యున్ని నమస్కరించవచ్చును. అయితే ప్రజలు ఎవరూ సూర్య  

నమస్కారమును చేయలేదు. మను ధర్మములను తెలిసిన మానవులు దైవజ్ఞానమును తెల్పిన సూర్యునికి ఎందుకు నమస్కరించుచున్నారు? వారికి 

సంబంధము లేనిపనిని ఎందుకు చేయుచున్నారు?  

జవాబు :- సూర్య నమస్కారములు చేయునది మను ధర్మమును అనుసరించు మానవులే. ప్రజలు ఎవరూ సూర్యనమస్కారము చేయలేదు 

కదా! ప్రజలు దైవజ్ఞానమును తెలిసియుండుట చేత వారు దైవ ధర్మముల ప్రకారము దేవున్ని తప్ప ఎవరికీ నమస్కరించరు. అందువలన ప్రజలయిన 

వారు ఎవరు కూడా సూర్యనమస్కారములు చేయలేదు. భగవద్గీత సృష్ట్యాది లోనే సూర్యునికి ఆకాశవాణి ద్వారా తెలిసినా, అది అప్పుడు గ్రంథ 

రూపము కాలేదు. తర్వాత ద్వాపర యుగము చివరిలో భగవద్గీత గ్రంథరూప మైనది. భగవద్గీతా గ్రంథము ప్రథమ దైవ గ్రంథమయినది. ప్రథమ దైవ 

గ్రంథమైన భగవద్గీతయందలి రాజ విద్యా రాజగుహ్య యోగమున 22వ శ్లోకమందు ఈ విధముగా చెప్పబడినది. 

 అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే | 

తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥  

భావము :- “అన్యదేవతల చింతన లేకుండా ఏ జనుడయితే నన్నే గొప్పగా తలచి నిత్యము నా ధ్యాస కల్గియున్నాడో, వాని యోగము యొక్క క్షేమమును 

నేనే చూచుకొందును" అని శరీరములోని దేవుడు స్వయముగా చెప్పడ మైనది. ఈ శ్లోక భావమునుబట్టి ఇతర దేవతల భక్తిగానీ, ఇతర దేవతలకు 

నమస్కరించడముగానీ చేయనివాడు నా భక్తుడనీ, అతని యోగము చెడిపోకుండా భంగము కలుగకుండా నేనే చూచుకొంటాననీ స్వయముగా 

శరీరములోని దేవుడే చెప్పినట్టుకలదు. ఇక్కడ అన్య దేవతలను అని  

చెప్పడము వలన సూర్యున్ని నమస్కరించడము కూడా అన్యదేవతను నమస్కరించినట్లేయగును. దేవుని జ్ఞానములో అన్యదేవతలకు 

నమస్కరించడము, పూజించడము ఉండదు. దేవుని జ్ఞానము కానటువంటి మనువు యొక్క జ్ఞానములో ఇతరులను అనగా ఇతర దేవతలను 

ఆరాధించడము ఉండుట వలన, మను ధర్మమును అనుసరించు మానవులు మాత్రమే సూర్యున్ని నమస్కరించుచున్నారు. అటువంటివారు ఒక్క 

సూర్యున్నేకాక ఎవరినయినా ఆరాధించుచుందురు. అందువలన వారిని అన్యదేవతా ఆరాధకులని చెప్పవచ్చును. అన్య దేవతారాధన దైవజ్ఞాను 

లయిన ప్రజలు చేయరు. ప్రజలు కానివారు, మానవులయిన వారు అన్య దేవతలను ఆరాధింతురు. కావున సూర్యనమస్కారము కూడా అన్య 

దేవతారాధన క్రిందికే జమచేయబడినది. కావున వారిని మానవులనియే చెప్పవచ్చును. మను ధర్మమును తెలిసినవారు వారి జ్ఞానము ప్రకారము 

దేవతలను పూజించడము తప్పక చేయుదురు. ఎవడయితే దైవజ్ఞానము తెలిసి ప్రజలుగాయుండి ఇతర దేవతలను ఆరాధించక దేవున్నే ఆరాధించు 

వారిని చూచిన మానవులు ప్రజలను నాస్తికులుగా, ఇతర మతముల వారిగా చెప్పుచుందురు. నేడు హిందూమతములో భగవద్గీతా జ్ఞానమును ప్రక్కన 

పెట్టిన హిందువులు, హిందూ నాయకులు, హిందూ ధర్మరక్షకులని పేరు గాంచినవారు పూర్తిగా మానవత్వము కల్గి సూర్యనమస్కారముల నుండి 

నదుల పూజల వరకు ఆరాధనలు చేయుచూ, తమదే నిజమైన భక్తిగా, తామే నిజమైన హిందువులుగా చెప్పుకొనుచూ, ఇతర దేవతల పూజలు 

చేయనివారిని, నాస్తికులుగా, పరమతస్థులుగా చెప్పుచుందురు. నిజమైన ప్రజలుగా యున్నవారు, ఏమి చెప్పినా ప్రజలు దైవధర్మముల ప్రకారమే 

నడుచుకొందురు. ఎవరినీ మ్రొక్కరు. ఇతర దేవతలను మ్రొక్కువారు మను ధర్మయుతులు మానవులని తెలియవలెను. 

 దేవునికి ఇష్టములేని వారిని మాయ దేవుని మార్గమువైపు రాకుండా 

చేయును. అయితే మాయ ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియకుండా చేయగలదు. అందువలన మనిషిని దైవమార్గములో యున్నట్లు నమ్మించి, 

తానున్నది దైవమార్గమేయని నమ్మించి దేవుని మార్గమునుండి ప్రక్కకు తప్పించును. మనిషిని తాను అందరికంటే మంచి మార్గములో యున్నానని 

నమ్మించుటకు దేవతల మీద భక్తిని కల్పించి, భక్తి సంఘములలో ముఖ్యమైన వానిగా యున్నట్లు చేసి, భక్తి కార్యక్రమములను బాధ్యతగా చేయుస్తూ, 

భక్తి సంఘమునకు కార్యకర్తగనో, లేక సంఘమునకే పెద్దగనో చేసి భక్తి మార్గములో ఎంతో శ్రద్ధగా శ్రమించి, పనిచేయునట్లు చేసి నాకంటే 

భక్తిగలవాడు లేడు అనిపించును. దానితో నేను దైవమార్గములో లేనను భావము వానిలో ఏమాత్రము రాదు. అటువంటి వారు నిజ దైవమార్గములో 

యున్నవారిని చూచి వారి మార్గము సరియైనది కాదని తలచుచుందురు. నేడు హిందూ సమాజములో హిందూ మతరక్షణ సంఘములలో యున్నవారు 

చాలా వరకు ఏదో ఒక భక్తి మార్గములో యుండి, దేవతారాధనలను బాధ్యతగా చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ తాము గొప్ప జ్ఞానులమనో, 

గొప్ప భక్తులమనో అనుకొనుచూ తామున్న పరిస్థితి మంచిదా! చెడుదా!యని ఆలోచించు స్థితిలోయుండరు. వారిలోని మాయయే వారిని ఆ విధముగా 

తయారు చేసినదని చెప్పవచ్చును.  

కల్లుత్రాగిన కాలిదాసు, మత్తుత్రాగిన దేవదాసు, భంగిత్రాగిన రామదాసు ఒకచోట చేరి 'జగమే మాయ బ్రతుకే మాయ'యని మాయను 

గురించి తెలిసినవారు పాడినట్లు పాట పాడుచుందురు. మాయయే వారిని ఆ స్థితికి తెచ్చినదనీ గ్రహించలేరు. అదే విధముగా దేహములోని ఆత్మను, 

పరమాత్మను తెలియలేని వారు తాము దేశములోని దేశభక్తిని కల్గియున్నామనీ  

తామే మతమును రక్షించుచున్నామనీ, హిందూ ధర్మములను కాపాడుచున్నా మని చెప్పుకొనుచుందురు. వాస్తవముగా వారిని మాయ ధర్మములకు 

చాలా దూరముగా పెట్టినదని చాలామందికి తెలియదు. హిందువులలో గొప్పవానిగా చెప్పుకొనుచుండినా, అనేక భక్తి కార్యక్రమాలలో పాల్గొను 

చుండినా అతనికి హిందూ ధర్మములంటే ఏవో వాస్తవముగా తెలియవు. అన్యదేవతారాధన చేయడమే హిందూ ధర్మములను ఆచరించినట్లనుకొను 

చుండును. వాస్తవముగా దైవమార్గమునుండి తప్పిపోయిన వారు మాత్రమే అలా చేయుచుందురని వారికి తెలియదు. ఇతరులు చెప్పినా వారు 

గ్రహించుకొను స్థితిలోయుండరు. మాయ అంత భద్రముగా తయారు చేసినది. 

 సూర్యుడు భూమిమీద జ్ఞానము చెప్పాడని ఆనాడు తెలియకున్నా 

5000 సంవత్సరముల పూర్వము తెలిసిపోయినది. సూర్యుడు భూమిమీదకి జ్ఞానమును తెచ్చిన మొదటి గురువని అందరికీ తెలుసు. అందువలన 

ఆయనయే మొదటి గురువని తెలియునట్లు సూర్యునికి “ఆదిత్య” అని పేరు పెట్టడము కూడా జరిగినది. మనిషి మొదటి గురువయిన 

సూర్యున్ని నమస్కరించడము హిందువుల సాంప్రదాయములలో మొదటి సాంప్రదాయముగా కొందరు చెప్పుచుండుట తెలిసిన విషయమే. ఉదయము 

మొదటనే సూర్యనమస్కారముతో హిందువులు పనులు ప్రారంభించవలెనని కొందరు స్వామీజీలు, హిందూ మత పెద్దలు చెప్పగా విన్నాము. సూర్యడు 

మొదట జ్ఞానమును చెప్పినవాడు గనుక ఆయనను నమస్కారము చేయడములో తప్పులేదని అందరూ అనుకొందురు. సూర్య నమస్కారము 

లను చేయమని పెద్ద పెద్ద స్వామీజీలు చెప్పడమేకాక, వారు చేసి చూపిస్తున్నారు. వారిని చూచి మంచిపనే కదా!యని ఇతరులు 

 చేయుచున్నారు. ఈ మధ్య కాలములో సూర్యనమస్కారములు అరుదుగా 

ఎక్కడో ఒకచోట కనిపించుచుండును. పూర్వము ప్రతి మనిషి ఉదయమే సూర్యనమస్కారము చేసెడివాడు. భగవద్గీత జ్ఞానరీత్యా, దైవ ధర్మములకు 

సూర్యనమస్కారము చేయడము వ్యతిరేఖమని చాలామందికి తెలియదు. “అన్యచింత లేకుండా” అని భగవద్గీతలో చెప్పినప్పుడు, సూర్యునిమీద 

భక్తిని కనబరచడము దేవునికంటే అన్యమయిన సూర్యున్ని ఆరాధించడము అధర్మమేయగును. అయినా ఆ విషయమును మాయ మనుషులకు 

తెలియకుండా చేసినది.  

మాయ ఏమి చేసినా చాలా గట్టిగా చేయును. మాయ చేసిన పనిని ఏ మనిషి గుర్తించలేడు. అందులన మాయ ప్రభావములో పడిన 

వాడు ఎవడయినా తాను చేయుచున్నదే సరియైనదని తలచుచుండును. మాయ ఉదయమే సూర్యనమస్కారములలో మనుషులను ఇరికించి 

మనుషులను మానవులుగా తయారు చేసినది. కొందరు సూర్యనమస్కారము లను మాత్రము చేసి ఇతర దేవతలను ఎవరినీ నమస్కరించక, ఆరాధించక 

యుందురు. అటువంటివారు మాకు జ్ఞానమును చెప్పిన గురువుకు నమస్కారము చేయుచున్నాను తప్ప ఇతర దేవతలకు మేము మ్రొక్కడము 

లేదుకదా!యని అనుచుందురు. అయితే సూర్యుడు గురువు కాదనీ, సూర్యుడు కేవలము మొదటి బోధకుడేయని వారికి తెలియదు. తాను 

తెలుసుకొన్న దానిని ఇతరులకు చెప్పువారు బోధకుడే అవుతాడు. ఇతరులు ఎవరూ చెప్పని జ్ఞానమును మొదట బోధించినవాడు గురువగునని 

చాలామందికి తెలియదు. గురువుకు, బోధకునికి వ్యత్యాసము తెలియని వారుండుట వలన సూర్యున్ని గురువని చెప్పుచున్నారు. వాస్తవముగా 

సూర్యుడు గురువు కాదు, కేవలము బోధకుడు మాత్రమేయని తెలియవలెను.  

అయితే మాయ సూర్యున్ని గురువుగా చూపి, సూర్యనమస్కారము చేయించి మనిషిని ప్రక్కదారి పట్టించి చివరకు మనిషిని మానవునిగా మార్చుచున్నది. 

మానవుడనని చెప్పుకొను మనిషి మాయ ప్రభావము చేత తాను చేయుచున్నదే దైవ ఆరాధనయనీ, తాను మాట్లాడునదే దైవజ్ఞానమనీ అనుకొనుచుండును. 

ఇతరులు దైవజ్ఞానమును చెప్పినా వారికి అది పరమతముల బోధగా కనిపించును. అటువంటప్పుడు అసలయిన జ్ఞానినే పరమత బోధ 

చెప్పుచున్నాడని ఆరోపణలు చేసి, వారిని బాధించుటకు మొదలు పెట్టుదురు.  

ప్రశ్న :- హిందూ సంస్కృతిలో సూర్యనమస్కారము ముఖ్యమైన సాంప్రదాయ మని అందరూ అనుచున్నారు కదా! సూర్యనమస్కారములతోనే హిందువుల 

ఔన్నత్యము ఇతర మతముల వారికి తెలియునని హిందువులు అందరూ అంటున్నారు కదా! 

జవాబు :- మాయ 'మతము' అను వలను వేసి ఒక్క హిందువులనే కాకుండా అన్నిమతముల వారిని దేవుని మార్గమునుండి దూరము చేసినది. 

హిందువులను 'సంస్కృతి, సాంప్రదాయము'లను పేరుతో దేవుడు చెప్పిన భగవద్గీత జ్ఞానమునకు మాయ దూరము చేసినది. మనుషులను 

మానవులుగా చేసి దేవుని జ్ఞానమునకు దూరము చేయడము మాయ యొక్క పనియైనా, అదంతయూ దేవుని ఆదేశముతోనే మాయ అలా 

చేసినదని తెలియవలెను. సారాత్రాగిన వానిని గుడిలోనికి రాకుండా పూజారి అడ్డుకొన్నట్లు శ్రద్ధలేని వానిని దేవుని వద్దకు రాకుండా మాయ 

అడ్డుకొంటున్నది. హిందువుల గొప్పతనము సూర్యనమస్కారముల వలన ఇతర మతముల వారికి తెలియునని మనుషులను అనుకొనునట్లు చేసి, 

మనిషిని మాయ మానవునిగా తయారు చేసి, మనుధర్మములను ఆచరించు నట్లు చేయుచున్నది. మనిషి నేను ధర్మములను ఆచరిస్తున్నాను అని 

 అనుకొంటున్నాడు. అయితే ఏ ధర్మములను ఆచరిస్తున్నానని ప్రశ్నించు 

కోలేదు. మనిషి దేవుని ధర్మములను ఆచరిస్తే ప్రజలలో చేరిపోతాడు, మనిషి మను ధర్మములను ఆచరిస్తే మానవులలో చేరిపోతాడు. అందువలన 

నీవు సంస్కృతి అను పేరుతో మాయలో చిక్కుకోవద్దు. మతము అను పేరుతో దేవుని దారితప్పి నడువవద్దు. నీవు మరణించిన తర్వాత నీవెంట 

నీ మతము ఉండదు, నీ సంస్కృతియుండదు. నీ వెంట ఒక్క దేవుని జ్ఞానము మాత్రము రాగలదు. మిగతావన్నీ వదలిపోవలసియున్నది. 

మధ్యలో వదలిపోవు వాటితో నీకు పని లేదు. నీ వెంట వచ్చేదానినే చూచుకో! 

 ప్రశ్న :- సూర్యునికి ఆదిత్యుడని మనువే పేరు పెట్టాడు కదా! ఆదిత్య 

అను పేరునే మనువు ఎందుకు ఎంచుకొన్నాడు.  

జవాబు :- 'ఆదిత్య' అను పేరును సూర్యునికి మనువు పెట్టినది వాస్తవమే అయినా, మనువు తెలిసి సూర్యునికి ఆ పేరును పెట్టలేదు. తనకు 

జ్ఞానము చెప్పిన వ్యక్తికి ఆదిత్య అను పేరును పెట్టాలనుకొని పెట్టాడుగానీ, తనకు సూర్యుడు జ్ఞానము చెప్పాడనిగానీ, సూర్యునికే ఆదిత్య అను పేరు 

పెట్టుచున్నాననిగానీ మనువుకు తెలియదు. మనువుకు తెలిసి పెట్టినా, తెలియక పెట్టినా పేరు పెట్టినది మాత్రము సూర్యునికేననీ కృష్ణుడు 

అర్జునునకు జ్ఞానము చెప్పినప్పుడు తెలిసినది. అయితే ఆ దినము మనువు ఆదిత్య అను పేరును ఎన్నుకొనుటకు కొంత కారణము కలదని చెప్పు 

చున్నాము. ఆదిత్య అను పేరులో పైకి కనిపించు అర్థము ప్రకారము మొదటి గురువని చెప్పవచ్చును. అయితే అదే అర్థమునే వివరముగా 

చెప్పుకొంటే ఇలా కలదు.  

ఆదిత్య అను పదమును రెండుగా విడదీసి చూస్తే ఆ+దిత్య =ఆదిత్య అని కలదు. ముందు 'దిత్య' అను పదమును గురించి చూస్తే తెలుగు 

భాష అర్థము ప్రకారము ద, ది, ద్వ, దౌ, దో, ద్వా అను మొదలగు అక్షరములన్నియూ రెండు సంఖ్యను సూచించుచున్నవి. 

  

  

1)దోబూచులాట  :   రెండు బూచుల ఆట. 2)ద్వందములు :  రెండుగాయున్నవి. 

3)దిత్వము : రెండు 4)దౌ భూతములు : రెండు జీవులు. 

5)ద్వితీయ భాగము :రెండవ భాగము. 6)దిత్యము  : రెండుగా యున్నది. 

7) దండిగా  : రెండుకంటే ఎక్కువ.  

ఈ విధముగా ద, ది, ద్వ, దౌ, దో, ద్వి అను అక్షరములు రెండు సంఖ్యను తెలుపుచున్నవి. ఇక్కడ 'దిత్య' అనగా 'రెండు' అను అర్థమే 

వచ్చు చున్నది. మొదట అక్షరము 'ఆ' ఉండుట వలన లేదు, కాదు అను సూచనను తెలియజేయుచున్నది. దానిప్రకారము ఆదిత్య అను పదమునకు 

అర్థము రెండు కానిదని తెలియుచున్నది. ఇక్కడ సందర్భానుసారము చూస్తే రెండవ వాడు లేడు అని తెలియుచున్నది. జ్ఞానమును బోధించిన 

వారిలో నిన్ను మించిన రెండవ వాడు లేడు అను అర్థముతో మనువు తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తికి ఆదిత్య అని పేరు పెట్టడము జరిగినది. 

మనువుకు తెలిసినంత వరకు అంతపెద్ద జ్ఞానము ఎప్పుడూ ఎవరి ద్వారా మనువు వినలేదు. అందువలన అంతవరకు జ్ఞానము చెప్పిన వారిలో 

రెండవవాడు లేడు అన్నట్లు తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తికి మనువు “ఆదిత్య” అను పేరును పెట్టడము జరిగినది. అయితే ఆ పేరు సూర్యునకు 

 నామకరణము చేయుచున్నట్లు అప్పుడు మనువుకు తెలియదు. ఆదిత్యుడు 

ఎవరయినది ద్వాపర యుగము చివరివరకు ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. భగవద్గీతను కృష్ణుడు చెప్పినప్పుడు మనువు ఆదిత్యుడని, 

పేరు పెట్టినది సూర్యునకని తెలిసినది. అప్పటినుండి అందరూ సూర్యున్ని ఆదిత్యుడని చెప్పడము జరిగినది. సూర్య స్థుతిలో 'ఆదిత్యాయనమః' అని 

అనడము జరిగినది.  

ప్రశ్న :– ఇంతకుముందు మీరు ఆదిత్య అంటే మొదటి గురువని అర్థమును చెప్పారు. ఇప్పుడేమో ఆయన జ్ఞానము చెప్పినవారిలో గొప్పవాడు. అతనిని 

మించిన రెండవ వాడు లేడని అర్థమును చెప్పారు. ఎటు కాకుండా మధ్యలో నిలిపి వేశారు. సూర్యుడు అన్ని విధముల భూమిమీద జ్ఞానమును 

చెప్పిన మొదటి గురువే కదా!  

జవాబు :- ఇక్కడ కొంత ఆలోచించి చూడవలసియున్నది. ఎందుకనగా! ఇది ఆధ్యాత్మిక విషయమైనందున ప్రతి దానిని జాగ్రత్తగా చూడవలసిన 

అవసరమున్నది. అందరికీ సులభముగా అర్థమగుటకు నాకళ్ళముందే జరిగిన నేను చూచిన ఒక సంఘటన ఉదహరించి చెప్పెదను చూడండి. 

అప్పుడు నా వయస్సు బహుశా ఎనిమిది లేక తొమ్మిది సంవత్సరములుండ వచ్చును. నేనున్న ఇంటిప్రక్కలో చిన్న కిరాణా దుకాణము (సరుకుల 

అంగడి) ఉండేది. మరొక ప్రక్క ఇంటిలో ఒక ముసలావిడ ఉండేది. ఆ ముసలామె ఆకు వక్క దంచి తాంబూలము వేసుకొనేది. ఆమె ఇంటిలోనున్న 

ఆమె మనువడికి రెండు బొట్లు ఇచ్చి (అప్పటి కాలములో నాణెములు) ఆకులు వక్కలు తెమ్మని చెప్పింది. ఆమె మనువడి వయస్సు బహుశా 

ఏడు సంవత్సరములు. అయినా అతనికి మాటలు స్పష్టముగా పలుకుటకు వచ్చెడిది కాదు. నేను చూస్తున్నట్లే ప్రక్కనేయున్న అంగడికి వచ్చి రెండుబొట్లు 

 ఇచ్చి ఆకులు, వక్కలు ఇమ్మన్నాడు.  విషయము అంతేగానీ అతను  

చెప్పడములో కొంత తేడా అయినది. ఆకులు చెప్పడములో మధ్య అక్షరమయిన 'క' కు కొమ్ము చెప్పకుండా వచ్చీరాని మాటలతో 'త' కు 

కొమ్ము ఇచ్చి చెప్పాడు. అట్లే వక్కలు అని చెప్పడములో మధ్య అక్షరమయిన 'క' కు ‘క' వత్తు చెప్పకుండా 'ట' కు 'ట' వత్తు చెప్పడమైనది. ఆ మాటలు 

విన్న అంగడి ఆయన నవ్వాడు, నేనూ నవ్వాను. అంగడి ఆయన అర్థము చేసుకొని ఆకులు, వక్కలు ఇచ్చి పంపాడు. అప్పుడు ఆ పిల్లవాడు తాను 

చెప్పిందే సరియైన మాట అనుకొన్నాడు తప్ప తాను పలుకు పదములో బూతు పదములున్నాయని అతనికి తెలియదు. 

  

ఆ పిల్లవాని భావములో ఆకులు, వక్కలే ఉన్నాయి. అయినా పలుకడములో శబ్దము వేరయినట్లు, ఆ బాలునికి తెలియదు. అంతమాత్రాన 

తెలిసినవారు, మాటలను స్పష్టముగా మాట్లాడువారు బాలుడు చెప్పినట్లే చెప్పరు కదా! అదే విధముగా అప్పుడు మనువుకు తెలిసిన భావమే 

సరియైనదని ఆయన అనుకొని మొదటి గురువు అను భావముతో తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తిని “ఆదిత్య” అని చెప్పాడు. ఒక విధముగా ఆదిత్య 

అను పదము మొదటి గురువుకు చెప్పు అర్థముతో సరిపోవును. మనకు పూర్తి జ్ఞానము తెలియనప్పుడు అలాగే అనుకొనెడివారము. అయితే 

జ్ఞానము తెలియుట చేత, తెలిసిన జ్ఞానము ప్రకారము సూర్యుడు తాను విన్న దానిని తిరిగి చెప్పాడు గనుక సూర్యున్ని బోధకుడనియే చెప్పాలి, 

గురువని చెప్పకూడదు. తాను వినని జ్ఞానమును స్వయముగా ఎవరు చెప్పగలరో, ఎక్కడా ఎవరూ చెప్పని జ్ఞానమును ఎవరు చెప్పగలరో, అతనినే 

గురువని చెప్పవలెను. అయితే సూర్యుడు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును చెప్పాడు, గావున ఆయన బోధకుడే అవుతాడుగానీ, గురువు కాలేడు. ఈ 

 వివరము అంతయూ మనువుకు తెలియదు కావున ఆయన భావములో 

సూర్యుడు మొదటి గురువనియే చెప్పాడు. అతని వరకు ఆ భావము సరియైనదే. అందువలన మనము కూడా అదే అర్థమునే చెప్పాము. 

అయితే బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము 'గురువు గురువే, బోధకుడు బోధకుడే'. అందువలన గురువును బోధకుడుయని అనకూడదు. బోధకున్ని 

గురువు అని అనకూడదు. అంటే ఏమీ కాదు, శాస్త్ర విరుద్ధమగును. ఆకులు వక్కలను మా ఇంటిప్రక్క పిల్లవాడు తనకు వచ్చిన విధముగా 

పలికాడు. అతని భావములో అతనికి కావలసినవి ఆకులు, వక్కలే. అయితే తాను చెప్పు చున్నది తప్పని తెలియని స్థితిలో చెప్పాడు. అట్లని ఆ పిల్లవాడు 

చెప్పినట్లు మనము చెప్పము కదా! అదే విధముగనే మనువు తనకు జ్ఞానము చెప్పిన వ్యక్తిని మొదటి గురువని అన్నాడు. గురువు అంటే 

ఎవరు? బోధకుడు అంటే ఎవరు? అనే వివరము తెలియని స్థితిలో మనువు చెప్పాడు. అతని వరకు అది సక్రమమే. అతడు అన్నాడని మనము 

ఇప్పుడు అదేమాటను చెప్పలేము. బ్రహ్మవిద్యా శాస్త్రమును అతిక్రమించి మాట్లాడలేము. 

 ప్రశ్న :- అయితే దైవధర్మములను చెప్పిన గురువు ఎవరు? 

జవాబు :- దేవుడు మాట్లాడడు అందువలన దేవుడు చెప్పలేడు. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి దేవున్ని గురువు అని చెప్పలేము. ప్రపంచములో 

ఎవరి మీదికి దేవుని జ్ఞానము ప్రసరింపబడలేదు. అనగా ఏ మనిషికి జ్ఞానము తెలియదు. ఇప్పుడు మనిషికి జ్ఞానము తెలియదు. దేవుడు 

జ్ఞానమును చెప్పలేదు. అందువలన జీవున్ని, దేవున్ని ఇద్దరినీ గురువు అనుటకు వీలులేదు. ఇకపోతే మధ్యలోయున్న ఆత్మ మాత్రమే ఇటు 

జీవుని రహస్యమును, అటు దేవుని రహస్యమును తెలిసినవాడుగా యుండి  

 దేవుని జ్ఞానమును ఎవరికీ తెలియకుండా బోధించుచున్నాడు. ఆత్మ 

స్వయముగా జ్ఞానమును చెప్పుచున్నాడు. ఆయన ఎవరివద్ద జ్ఞానమును వినలేదు. ఆయనే స్వయముగా దేవుని జ్ఞానమును చెప్పుచున్నాడు. అణిగి 

తెలియకుండా యున్నవాడు ఆత్మ కనుక, ఆయనే నిజమైన గురువని ప్రపంచములో ఎవరూ ఇంతవరకు గుర్తించలేకపోయారు. ఇప్పుడు 

తెలిసిందా గురువు యొక్క గుట్టు. గుట్టు చప్పుడు కాకుండా బోధించు మధ్యాత్మనే గురువని ఢంకాపథముగా చెప్పవచ్చును. 

 ప్రశ్న :- దైవజ్ఞానమునకు ఆత్మ గురువు అయితే, మనువు చెప్పిన మను 

ధర్మములను మనువే మొదట చెప్పాడు, కావున మనువును అధర్మములను చెప్పిన మొదటి గురువుగా చెప్పవచ్చునా? 

 జవాబు :-మనువు శరీరమును ధరించిన ఒక జీవుడు మాత్రమే. జీవుడు 

స్వయముగా ధర్మములను బోధించలేడు, అధర్మములను బోధించలేడు. జీవుడు ఏదీ చేయలేనివాడు, చేతకానివాడు. అన్నీ చేయువాడు ఆత్మే 

అయినందున మనువు శరీరములోని మధ్యాత్మయే ఎవరికీ తెలియకుండా పైకి మనువును చూపుచూ, తానే అధర్మములను మను ధర్మములను పేరుతో 

బోధించినది. దైవబోధకు సంకల్పము దేవునిది, కార్యము ఆత్మది. అలాగే అధర్మముల బోధకు సంకల్పము మాయది, పని ఆత్మది. 

అందువలన ఇటు జ్ఞానమునకు, అటు అజ్ఞానమునకు, ఇటు ధర్మములకు, అటు అధర్మములకు గురువు ఒక్క మధ్యాత్మ అనియే చెప్పవచ్చును. 

ఇప్పుడు ఎవరికీ తెలియని ఈ విషయములన్నియూ చెప్పినది మధ్యాత్మయే.  

“మధ్యాత్మ”యే విశ్వమంతటికీ గురువు. ఇంతే సంగతులు.... అంతే సమాచారములు... 

 మూలకర్త, 

త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. 

  



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024