ఏది సత్యము - ఏది అసత్యము. cloud text Updated on 28thsep24
ఏది సత్యము - ఏది అసత్యము.
గ్రంథ పాఠకుల అభిప్రాయములు.
షేక్ నూరభాషా గారి అభిపాయం :-
9-123 “ఓ విశ్వాసులారా! మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో
పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవి చూడాలి. అల్లాహ్ భయ
భక్తులు గలవారికి తోడుగా ఉన్నాడు.”
అని ఖురాన్లో దైవ ఆజ్ఞ కలదు. అంటే దేవుడు సత్యవంతుల
పక్షాన ఉన్నాడని అర్థం. సత్యాన్ని శోధించేవారు, సత్యాన్ని చూపించే
వారు, సత్యం మాట్లాడేవారే సత్యవంతులు. దేవుని ఆజ్ఞ పాటించడమే
విశ్వాసుల ధర్మం. విశ్వాసి అయిన నేను “షేక్ నూర్ భాషా”, సత్యవంతుడైన
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి జ్ఞానమునందు ఉండుటయే
నా కర్తవ్యం, నా ధర్మం.
అల్లాహ్ ఒక్కడే అని నమ్ముతుంది ఇస్లామ్ ప్రపంచం. అల్లాహ్
ఒక్కడే అయినప్పుడు, అల్లాహ్ జ్ఞానము ఒక్కటే అయి ఉండాలి. ఈ సృష్ఠి
మొత్తం అల్లాహ్, తన ఇష్టం వచ్చిన చోట జ్ఞానాన్ని చెప్పించగలడు.
అల్లాహ్ 3 ప్రాంతాల్లో, 3 భాషల్లో, 3 కాలాల్లో, 3 రూపాలుగా, 3 గ్రంథాలలో
జ్ఞానము బోధించాడు. ఈ మూడు గ్రంథాల్లో ఒక్కటే మాది, మిగతావి
మావి కావు, మాకు సంబంధం లేదు, వేరే దేవునిది అంటే వారు ఇస్లామ్,
ముస్లీమాన్ నుండి బహిష్కరణ అయినట్లే, వారు 'షిర్క్ (బహు దేవతారాధన)
చేసినట్లే. దేవుడు ఖురాన్లో ఏ తప్పునైనా మన్నిస్తాను కానీ షిర్క్ నుండి
శిక్ష తప్పదు అంటున్నాడు. అంతా ఒక్కటే అని చెప్పేవాడే విశ్వాసి. వేషం
వేసుకున్నంత మాత్రాన విశ్వాసి కాలేరు. అల్లాహ్ ఒక్కడే అయినప్పుడు
అల్లాహ్ జ్ఞానము కూడా ఒక్కటే. ఎన్ని రకాల పేర్లతో చెప్పినా దైవజ్ఞానం
ఒక్కటే. అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ జ్ఞానము ఒక్కటే అని ఈ ప్రపంచములో
మొట్టమొదట చెప్పిన వ్యక్తి శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద స్వాముల వారు
నిజంగా సత్యవంతులు.
నేను వారు రచించిన “అంతిమ దైవగ్రంథములో వజ్ర
వాక్యాలు”, మరియు “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యాలు”
అనే గ్రంథాలు చదివినప్పుడు పులకరించిన నా మనస్సు ఒక విషయం
మీద సాక్ష్యం ఇచ్చింది. "ఖురాన్ అరబిక్ భాషలో సౌదీలో పుడితే, మాలాంటి
వారికోసం అల్లాహ్ మాపై దయ చూపి “స్వామి వారి” చేతులతో
భారతదేశంలో మన ఆంధ్రావని గడ్డపై మళ్ళీ ఖురాను తెలుగు భాషలో
చెప్పడానికే పుట్టించాడనిపిస్తుంది.”
గ్రంథాలు చదివిన తర్వాత నా అభిప్రాయం రాయాలని కలం,
కాగితం తీసుకున్నప్పుడు, నాకు తెలియకుండానే ఖురాన్లోని 9-123
ఆయత్లోని దైవ ఆజ్ఞ 'సత్యవంతులతో ఉండు' అను సందేశం చూసిన
తర్వాత ఇది అద్భుతమైన మహిమగా నాకు అన్పిస్తుంది. బిరుదు ఇచ్చే
శక్తి కనుక దేవుడు నాకు ఇచ్చి ఉంటే నేను స్వాముల వారిని మహిమ
పురుషుడుగా చెప్పుతాను. అల్లాహ్ ఒక్కడే గనుక, మతాల్ని ఒకటి
చేయాలనుకున్న మహిమ పురుషుడుని ఎన్నుకున్నాడు. కనుక విశ్వాసులారా
రండి! “అల్లాహ్ (దేవుడు) ఒక్కడే” అన్న నినాదాన్ని నిజం చేద్దాం.
సత్యవంతుని యందు ఉండి సత్యాన్ని బ్రతికించుదాం...
స్వామివారికి నమస్కారాలు...
ఇట్లు,
షేక్ నూర్ భాషా,
మిలాదున్-నబి-కమిటీ,
పోరుమామిళ్ల, Y.S.R కడప (జిల్లా).
సయ్యద్ నాగూర్ షరీఫ్ గారి అభిప్రాయం :-
మేము ముస్లీమ్లుగా పుట్టినప్పటికి అందరికీ దేవుడు ఒక్కడే అని
నమ్మేవారము. కానీ జ్ఞానము ప్రకారం ఎలానో తెలియలేదు. ఖుర్ఆన్ను
ఎన్నోసార్లు చదివాము. దేవుడు (అల్లాహ్) గొప్పవాడు అని తెలిసింది
అయితే ఎన్నో జ్ఞాన విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలి
పోయాయి.
ఖురాన్లో 3 - 7 ఆయత్ ప్రకారం ముతషాబిహాత్ (సూక్ష్మ)
వాక్యములు ఉన్నాయి అని తెలుసుకున్న మేము “ముతషాబిహాత్ వాక్యాల
వాస్తవ అర్థం దేవునికి తప్ప మరెవరికీ తెలియదు” అని చూశాక మరి ఈ
జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది? అనుకున్నాము. పోనీ దేవుడు మనతో
మాట్లాడి చెప్తాడా అంటే 42-51 ఆయత్ ప్రకారం “దేవుడు ఏ
మానవునితోనూ ప్రత్యక్షంగా మాట్లాడడు దేవునితో మాట్లాడడం మనిషికి
సాధ్యమయ్యే పనికాదు" అని ఉంది.
మరి మనకు అల్లాహ్ జ్ఞానం ఎలా తెలుస్తుంది? అని మదనపడిన
మేము ఒకరోజు మజీదికి వెళ్ళి హజ్రత్ని ఇదే ప్రశ్న అడిగాము. దేవుని
జ్ఞానము మనుషులు చెప్పగలరా? అని, అతను అది సాధ్యంకాదు అన్నాడు.
అయితే దేవుడే మనిషిగా వస్తాడా? అన్నాము. దేవుడు జన్మించడు, అలా
అంటే అది ఖురానికి వ్యతిరేఖం అవుతుంది అన్నాడు. కానీ ఖుర్ఆన్లో
89-21, 22 వాక్యాల్లో “దేవదూతలు బారులు తీరి ఉండగా దేవుడు
అవతరిస్తాడు" అని ఉంది. మరి ఖురాన్లో అవతరిస్తాడు అని ఉంటే మా
పెద్దలు ఇలా అంటున్నారేమిటి అనుకున్నాము.
అలాగే 36-82 ప్రకారం దేవుడు పని చేయాల్సిన అవసరము
లేదు 'అయిపో' అంటే అయిపోతుంది అని ఉంది. దీనికి భిన్నముగా
73-9, 6-102 సూరాలలో 'దేవుడు పనిచేసేవాడు, ఆయనే కార్యకర్త'
అని ఉంది. ఈ రెండు వాక్యాల్ని ఎలా అర్థము చేసుకోవాలో అర్థము
కాలేదు. ఈ విధముగా జ్ఞాన విషయంలో వచ్చిన సంశయాలు మాకు
తీరలేదు. ఒకవేళ మా పెద్దలు చెప్పినా కూడా అవి ఖురాన్లో ఉన్న
భావానికి వ్యతిరేఖం అని తెలుసుకున్నాము.
కొన్ని రోజుల క్రిందట షేక్ నూర్ భాషా గారి ద్వారా శ్రీశ్రీశ్రీ
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన “అంతిమ దైవ గ్రంథంలో
జ్ఞాన వాక్యములు" అను గ్రంథమును మేము, మా గురువుగారు అందరం
కలిసి చదివాము. అది చదివాక ఇంతవరకు ఖురాన్లో ప్రశ్నలు ప్రశ్నలుగా
ఉన్న ఎన్నో సూక్ష్మ విషయాలు, ఎవరూ సమాధానం చెప్పలేని ఎన్నో జ్ఞాన
విషయాలు తెలుసుకున్నాము. ఒక హిందూమతములో పుట్టిన వ్యక్తి
ఖురాన్ు ఇంత అద్భుతంగా చెప్పారంటే అది అల్లాహ్ స్వామివారి ద్వారా
పలికించారు అనిపించింది. తర్వాత స్వామివారు రచించిన “ఖుర్ఆన్లో
వజ్ర వాక్యాలు” అనే గ్రంథం చదవడం జరిగింది. అది ఎంత అద్భుతంగా
ఉంది అంటే 420 పేజీల గ్రంథాన్ని 3 రోజుల్లో 4 సార్లు చదివాము. ఆ
గ్రంథంలో ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని చెప్పాలంటే మాటలు చాలవు. ఇంత
అద్భుతమైన జ్ఞానము ఖురాన్లో నుండి తీసి ఈ విధంగా అన్ని మతాల
వారికి దగ్గర చేయడం ముస్లీమ్లుగా మాకు ఎంతో ఆనందం కలిగింది.
నిజం చెప్పాలంటే ఇంతకాలం ఖురాన్ ను ఎన్నోసార్లు చదివినా
అర్థముకాని ఎన్నో విషయాలు ఇంత సులభముగా తెలిశాయంటే అది
ఎవరివల్ల? ప్రబోధానంద గురువుగారి ద్వారానే ఈ రోజు సాధ్యమయింది.
'దేవునికి మతం లేదు, జ్ఞానం ఒకే మతానికి పరిమితం కాలేదు' అని
స్వామివారు మతాతీతంగా జ్ఞానము అందిస్తూ ఉంటే ముస్లీమ్ పుట్టిన
మేము ఎంతో గర్వించాము. ఇది మా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట.
ఈ రోజు ఖురాన్కు వ్యతిరేఖ భావాలు ముస్లీమ్ సోదరులలో
గూడుకట్టుకు పోయాయి అని జ్ఞానము తెలిసాక తెలిసింది. పునర్జన్మలు
లేవు అని ఇంతవరకు మా భావన అయితే, ఖురాన్ “పునర్జన్మలున్నాయి”
అని 7-29, 22–66, 36-68, 40-11 మొదలగు ఎన్నో ఆయత్లు
సాక్ష్యమిస్తున్నాయి. అలాగే దేవుడు పుట్టడు అని అనుకునేవాళ్లు ముస్లీమ్లు,
కానీ “దేవుడు అవతరిస్తాడు” అని 89-21, 22 మరియు 2-30, 15-29,
30 ఆయత్లు సాక్ష్యం ఇస్తున్నాయి. మరి ఇంతవరకు మనకి తెలిసింది
సత్యమా? ఇపుడు జ్ఞానము తెలిసాక తెలిసింది సత్యమా? ఆలోచించండి
సోదరులారా!
ఈ రోజు ముస్లీమ్లుగా మనము చేయలేని పని, హిందూ మతంలో
పుట్టిన “శ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరుల వారు” ఖురాన్ను ఇంత
దగ్గరగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారంటే దానికి ముస్లీమ్ ప్రపంచం ఎంతో
గర్వంగా భావించాలి. ఈయన గ్రంథాలు చదివాక మనస్ఫూర్తిగా చెప్తున్న
మాట. స్వామివారు ఖురాన్ను ఎంతో ఉన్నత స్థానంలో పెట్టి పవిత్ర
వాక్యాలు, వజ్రవాక్యాలు అని పేర్లు పెట్టి వ్రాసి ఆ జ్ఞానాన్ని అన్ని మతాల
వారి చేత చదివిస్తున్నారంటే ఏ ముస్లీమ్ ఇంతవరకు ప్రపంచములో
చేయలేని పని చేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ జ్ఞానాన్ని
తెలుసుకోవడం జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఇంకా
ఖురాన్లోని జ్ఞానాన్ని మాకు అందిస్తారని, అందించాలని దేవున్ని (అల్లాహ్)
ను ప్రార్థిస్తున్నాము. స్వామివారికి నమస్కారములు...
ఇట్లు,
సయ్యద్ నాగూర్ షరీఫ్,
పోరుమామిళ్ల, Y.S.R కడప (జిల్లా),
షేక్ మున్నా గారి అభిప్రాయం:-
నా పేరు షేక్ మున్నా, మాది కడప జిల్లా. దేవుని జ్ఞానం గురువు
ద్వారానే తెలియబడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. దేవుడు అన్ని మతాల్లో
తన దూతల ద్వారా జ్ఞానం చెప్పాడనీ, హిందూమతములో శ్రీకృష్ణ
పరమాత్ముని, క్రైస్తవంలో ఏసుని, ఇస్లామ్లో ముహమ్మద్ ప్రవక్తని
గురువులుగా భావించి గౌరవించమని మా గురువు గారు చెప్పేవారు.
నేను ఈ మధ్య కాలంలో “అంతిమ దైవ గ్రంథంలో జ్ఞాన వాక్యాలు”
అనే గ్రంథం చదివాను. అందులో స్వామివారు ఖురాన్లో గల ఆయత్లకు
ఎంతో గొప్ప జ్ఞానంతో, ఇంతవరకు ఎవరూ చెప్పని వివరణలు చెప్పారు.
ఖురాన్ను ఓ హిందూ గురువు ఇంత గొప్పగా చెప్పడం చూస్తే
ఆశ్చర్యమేసింది. మతానికి సంబంధం లేకుండా జ్ఞానము ఉందని,
భగవద్గీత, బైబిలు, ఖురాన్ ఈ మూడు గ్రంథాలు మతానికి సంబంధించినవి
కాదని, జ్ఞానాన్ని అందించే ప్రథమ, ద్వితీయ, అంతిమ దైవ గ్రంథాలని
స్వామివారు చెప్పడం ఈ యుగానికే క్రొత్త మాటగా అన్పించింది.
స్వామివారు వ్రాసిన “అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యాలు” అని ఇంకో
గ్రంథాన్ని చదివాక దైవ భావంతో నా ఒళ్లంతా పులకరించి కళ్ల వెంబడి
నీళ్లు కారాయి. సత్యం తెలియబడేటపుడు పొందే అనుభూతిని నేను ఆ
గ్రంథం చదివాక అనుభవించాను.
ఖురాన్లో 6-91 ఆయత్ ప్రకారం “అల్లాహ్ ఏ మానవ మాత్రుని
పైనా జ్ఞానాన్ని అవతరింపజేయలేదు” అని ఉన్నప్పుడు ఈయన ఈ జ్ఞానము
ఎలా చెప్పారు? అని సంశయం వచ్చింది. కానీ అల్లాహ్ తన జ్ఞానాన్ని
తను ఎన్నుకున్న ప్రతినిధి ద్వారా చెప్పిస్తాడని ఖురాన్ మాట జ్ఞాపకం
వచ్చింది. దేవుడే ఇలా ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి
అందించడం మన అదృష్టం. ఈ రోజు మూడు దైవ గ్రంథాల గురించి
అందులో ఒకే జ్ఞానము ఉన్నదని, అందరికీ ఆరాధ్యుడు ఒక్కడే అని చెప్పిన
'త్రిమత ఏకైక గురువు' గా పేరుగాంచిన శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరుల వారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
తమరి గ్రంథాల వల్ల ఖుర్ఆన్ జ్ఞానము ఈ రోజు ఇంతగా ప్రజల్లోకి
అర్థవంతంగా ప్రాకిందంటే తమరి ఋణం ఎలా తీర్చుకోవాలి. నిన్నటి
వరకు మాది (ముస్లీమ్లది) అనుకున్న ఖురాన్ను అందరికీ దగ్గర చేసి,
ఖురాన్ అందరిది అని అన్పించారంటే ముస్లీన్గా నేను ఎంతో గర్వపడు
చున్నాను. వజ్ర వాక్యాలని చెప్పి ఖురాన్ గ్రంథమును 'వజ్రాల భాండాగారం’
అని ప్రపంచానికి తెలియజేసిన మీకు శతకోటి నమస్కారాలు. ఇంకా
మాకు మీరు ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించాలని వినయ పూర్వకంగా
ప్రార్థిస్తూ... స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు....
ఓ జిజ్ఞాసి,
షేక్ మున్నా,
పోరుమామిళ్ల, Y.S.R కడప (జిల్లా).
షేక్ ఖాసీం సాహెబ్ గారి అభిప్రాయం :-
స్వామి వారికి నమస్కారాలు...
నేను చిన్నప్పటినుండి కట్టుబాట్లతో కూడిన ఇస్లామ్ మతంలో
పెరిగాను. కానీ పరమత ద్వేషం ఉండేది కాదు. కానీ హిందువులలోని
దేవతారాధన నచ్చేది కాదు. దేవుడు ఒక్కడే అయినప్పుడు వాళ్లు
ఇంతమందిని ఎందుకు పూజిస్తున్నారు? అని అన్పించేది. ఆ రకంగా
వారి విధానాలు నచ్చలేదు. కానీ మనుషులపై ద్వేషం లేదు. ఖురాన్ను
నేను ఎన్నోసార్లు చదివాను. ఆమూలాగ్రం తెలుసు అనుకొని మేము
సంఘముగా ఏర్పడి ప్రచారం చేసేవాళ్ళం. ఖురాన్ అరబిక్ భాషలో
అవతరించింది కనుక ఆ దివ్య గ్రంథాన్ని అరబిక్ లోనే చదవాలి అను
పెద్దల మాట ప్రకారం నేను కూడా అరబిక్ నేర్చుకుని అందులోనే చదివాను.
ఈ మధ్య స్వామివారు రచించిన “అంతిమ దైవ గ్రంథంలో జ్ఞాన
వాక్యాలు” మరియు “అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యాలు" అనే
గ్రంథాలు చదివాను. అద్భుతం! అమోఘం!! ఖురాన్లో ఇంత జ్ఞానము
ఉందా! అని నేను ఆశ్చర్యపోయాను. ఇంతవరకు అర్థము తెలియని ఎన్నో
సూక్ష్మ ఆయత్లకు అర్థము తెలుసుకొని, ఖురాన్ జ్ఞానం లోతు తెలుసుకొని
దేవుడే మాకోసం పంపాడని పులకరించిపోయాను.
దైవజ్ఞానము కావాలనుకున్న ప్రతి మనిషి స్వామివారి రచనలు
చదవాలి. ఈ జ్ఞానాన్ని కాదన్నవాడు అసలు ముస్లీమే కాదు అని నా
అభిప్రాయం. మోక్షానికి, స్వర్గానికి తేడా తెలియకుండా మాకు ఖురాన్
అంతా తెలుసు అనుకునే మాలాంటి వారికి జ్ఞానోదయం కలిగించి అల్లాహ్
యొక్క నిజ జ్ఞానాన్ని అందిస్తున్న మీకు మా ధన్యవాదాలు.
మీరు చెప్పే జ్ఞానం తెలుసుకుంటే మాయ అంతరిస్తుంది. మీరు
చెప్పే జ్ఞానం అర్థము అయితే మతం మాయమైపోతుంది.
మీరు చెప్పే జ్ఞానము అనుసరిస్తే కర్మలు కాలిపోతాయి. అందరికీ
దేవుడు ఒక్కడే, జ్ఞానం ఒక్కటే అని చెప్పే మీరు, మీ రచనలు సర్వమానవులకి
రక్షణ కవచం స్వామీ!
ఒక ముస్లీమ్ (విశ్వాసి) గా చెప్పుచున్నాను. మీరు చెప్పిన మూడు
దైవ గ్రంథాలు ఒక్కటే అనడం అక్షర సత్యం. ఖురాన్ చెప్పిన తౌరాత్
భగవద్గీతే అని చెప్పడం అది పెద్ద దైవ రహస్యం. ఏ మనిషీ ఖండించలేని
జ్ఞానాన్ని, ఏ సంశయం మిగల్చని జ్ఞానాన్ని అందిస్తున్న మీరు దేవుడు
పంపిన దైవ స్వరూపులు.
అందరికీ ఒక్కడే దేవుడు
అందరికీ ఒక్కటే జ్ఞానం
అందరికీ ఒక్కడే గురువు
ఆయనే “త్రిమత ఏకైక గురువు”
నమస్కారాలతో....
షేక్ ఖాసీం సాహెబ్
మిలాద్-ఉన్-నబి (సంస్థ)
పోరుమామిళ్ల, Y.S.R కడప (జిల్లా).
షేక్ షఫీ గారి అభిపాయం :-
శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరిస్తూ...
ఈ రోజు ప్రతి ఒక్కరు దేవుడు ఒక్కడే అని అనుచున్నారేగానీ, ఆ
ఒక్కడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఏమి చేస్తున్నాడు? అతనిని ప్రార్థించేది
ఎలా? అతనిని చేరుకొనే విధానము ఏమిటి? అనే విషయాలను
సంపూర్ణముగా చెప్పలేకపోతున్నారు. ఎవరైనా చెప్పే ప్రయత్నము
చేసినప్పటికీ అది ఒక్క దేవునికి కాకుండా మిగతా కొందరికి కూడా
వర్తిస్తున్నది. దేవుడు అందరికి ఒక్కడే అయినప్పుడు దేవుని విధానము
అందరికీ సమానము కదా! దైవ గ్రంథములోని దేవుని వాక్యము ఎప్పుడైనను
సత్యమే అగును. దైవ గ్రంథములోని సూక్ష్మ వాక్యముల వివరము మనిషికి
తెలియని దానివలన పై ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలి వున్నవి.
దేవుని గ్రంథము మా దగ్గరవుండి, అందులోని దైవ విషయాలు
తెలియ లేని స్థితిలో మేముండగా, మీరు దైవ గ్రంథములోని స్థూల మరియు
సూక్ష్మ వాక్యముల వివరమును శాస్త్రబద్దముగా తెలియజేయడమే కాక,
దేవుని దగ్గర నుంచి వచ్చిన అన్ని గ్రంథాలలోని విషయాలను సమన్వయ
పరచి, అన్ని గ్రంథాలు ఒక్క దేవున్నే తెలియజేస్తున్నాయని తెలియజేయడం
మాకెంతో ఆనందము కలిగించినది. మీ ప్రసంగాలు మరియు గ్రంథముల
లోని జ్ఞానము చూచిన తర్వాత 'సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా
రుజువు కావలన్నది దేవుని సంకల్పము' లా అనిపించుచున్నది. ఇంత
గొప్ప జ్ఞానము ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవునికి ఇష్టులుగా మారాలని
కోరుచున్నాము.
ఓ మత పెద్దలారా! మతములలోని మనుషులారా!! మీ అందరికీ
ఒక విజ్ఞప్తి.
మతము అనునది కొన్ని కట్టుబాట్లతో కూడుకొనియున్నది. కొన్ని
నియమములు, కొన్ని హద్దులు మతములో గలవు. అయితే దేవుని
జ్ఞానములో అటువంటి నియమ నిబంధనలు ఏమీ ఉండవు. ముస్లీమ్
సమాజములోని ప్రజలు అమాయకముగా తమ పెద్దలు ఏది చెప్పితే అదే
దైవజ్ఞానమని నమ్ముచున్నారు. ముస్లీమ్లలోని 'విశ్వాసము' అను దానిని
బలహీనతగా చేసుకొని ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పక తమకు తెలిసిన
దానిని చెప్పి అదే జ్ఞానమని నమ్మించుచున్నారు. హదీసులు చెప్పి ఖుర్ఆన్
అని భ్రమింపజేయుచున్నారు. మత ఆచారములను చెప్పి అదే మన మత
జ్ఞానము అని నమ్మించుచున్నారు. ముస్లీమ్ల జ్ఞానము వేరని, మిగతా
వారి జ్ఞానము వేరని, అట్లే ముస్లీమ్ల దేవుడు అల్లాహ్యని మిగతావారి
దేవుడు వేరని చెప్పడము వలన ముస్లీమ్లు మన దేవుడు వేరని, మిగతా
మతముల వారి దేవుడు వేరని నమ్మి అజ్ఞాన దారి పట్టిపోవుచున్నారు.
సర్వ ప్రపంచమునకు దేవుడు ఒక్కడేయని చెప్పక వేరువేరు దేవుళ్లున్నారని
చెప్పడము వలన దేవుని ఏకత్వమునకు ముస్లీమ్ పెద్దలే తూట్లు పొడిచి
నట్లగుచున్నది. అటువంటి అజ్ఞాన భావములన్ని లేకుండా చేసి, అందరికీ
ఒకే దేవుడు అని బోధించు ప్రబోధానంద యోగీశ్వరులు వారి జ్ఞానమును
విని దేవుని ఏకత్వమును గ్రహిద్దాము.
దేవుని సంపూర్ణ జ్ఞానము తెలుసుకొని, దేవునికి ఇష్టులుగా
మారుటకు శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ప్రవచనములను
వినండి (త్రాగండి) మరియు గ్రంథములను చదవండి (తినండి).
ఇట్లు
షేక్ షఫీ (చెన్నై)
శివక్రిష్ణ గారి అభిప్రాయం:-
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కారాలతో...
“అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు" అను గ్రంథము
స్వామి వారి '90వ' గ్రంథము.
ఒక వ్యక్తి 90 గ్రంథాలు వ్రాయటం, అదియు ఏ రకమైన
అశాస్త్రీయత, కపట కల్మషము, ప్రపంచ స్వార్థము, మత ద్వేషము, గుణ
ప్రేరేపితము లేకుండా కేవలము 'ఆత్మజ్ఞానము' సర్వ మతములూ తెలిసి
తరించేలాగా వ్రాయటం ఒక అద్భుతం.
శ్రీ స్వామివారి జీవితం ఎంతోమంది ఇతర పీఠాధిపతులలాగా,
మత పెద్దలలాగా వడ్డించిన విస్తరి కాదు. వారిలాగా తమ పడక దగ్గరికే
అన్నీ సమకూరేంత డబ్బు హోదా లేదు. ఇతరులలాగా ఎవరి దగ్గరా ఏ
రకమైన చందాలు, డబ్బులు, కానుకలు అడిగి ఎప్పుడూ తీసుకున్నది లేదు.
ఇతరులు అన్నీ తమకు తమ భక్తుల ద్వారా సమకూరి, చాలా తీరిక సమయం
ఉన్నా కూడా ఇన్ని గ్రంథాలు వ్రాయలేరు. అటువంటిది స్వామివారు,
తాను కర్మయోగపద్ధతిలో అన్ని పనులు చేస్తూ, తన దగ్గరి వారితో చేయిస్తూ
ఆ సంపాదనతోనే తన విలువైన దైవజ్ఞానాన్ని మతాతీతముగా మనకు
అందిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు.
నేడు తమ పీఠాలను వ్యాపార, మత కేంద్రాలుగా చేసే
పీఠాధిపతులనూ, తీరికగా గోల్ఫ్ ఆడుకుంటూ, సెలబ్రిటీలతో యోగా పేరుతో
డాన్సులు చేయించే సద్గురువులనూ, బాబాలనూ, టీవీ షోలలో సెలబ్రిటీల
ప్రశ్నలకు సమాధానము చెప్పే వంకతో తమను తాము ప్రచారము చేసుకునే
తమ కన్నే
కొందరు స్వాములనూ, తమ వేదాలు, పురాణాలు చూపి
పొడుస్తూ ఇస్లామ్ మత ప్రచారం చేసే ఇస్లాం మత బోధకులనూ, దేవుడు
చెప్పని స్వస్థత సభలు చేస్తూ వాక్చాతుర్యంతో మతములోనికి లాగే క్రైస్థవ
మత బోధకులను ప్రజలు సులభముగా నమ్ముతున్నారు.
తమ ఆరోగ్యాన్ని సహితము లెక్కచేయక, రోజుకు రెండు గంటలు
కూడా సరిగా నిద్రపోకుండా, మనము జ్ఞానము తెలియాలని, స్వంత మతము
వారే పరాయి మతబోధ అని అరుస్తున్నా, దాడులు చేస్తున్నా 'అదరక',
ముస్లీమ్లు వారి మతపూరిత మనోభావాలు దెబ్బతింటున్నాయని
హెచ్చరిస్తున్నా 'బెదరక', క్రైస్తవ మత బోధకుల అసూయతో కూడిన
ఆరోపణలకు 'జడవక' సత్య ప్రకటనే ధ్యేయంగా, సర్వులను స్వధర్మం
వైపు నడుపుతూ, మోక్షగాములు కావాలనే ఆకాంక్షతో 90 సంచలనాత్మక
గ్రంథాలను, 200 ఉపన్యాసాలను అందించిన 'గురువు' కు మనము ఏమిచ్చి
రుణం తీర్చుకోగలము!
మన నుండి స్వామివారు అడిగేది ఒకటే. ఈ దివ్య గ్రంథాలను
చదవండి, బుద్ధి విచక్షణతో సత్యాసత్యాలను గ్రహించండి. ఆత్మ మీద
శ్రద్ధ పెట్టండి. దేవుని జ్ఞానానికి సమయాన్ని కేటాయించండి. వీలైతే
మీతోటి వారికి ఈ జ్ఞానాన్ని ప్రచారము చెయ్యండి.
పై వన్నిటివల్ల మనకు ‘ఉపయోగమే' కానీ... స్వామివారికి కాదని
గ్రహించండి!!!
ఇట్లు
శివక్రిష్ణ (U.S.A)
ఓ శిష్య పరమాణువు
ముందుమాట
రచయితగా నేను ముందు చెప్పు విషయమును మీరు బాగా
గ్రహించగలరని అనుకొంటున్నాను. నేడు ఉన్న సత్యమును చెప్పితే, అందరూ
దేవుడు అని అంటున్నారు, దేవుని జ్ఞానము మేము కలిగియున్నామని
అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు నేను గొప్ప జ్ఞానిని అని మిగతా
వారు నాకంటే తక్కువ తెలిసినవారని అనుకోవడము జరుగుచున్నది.
సాధారణ మనుషులే అలా ఉండగా కొందరు గురువులుగా, బోధకులుగా
యున్నవారు మిగతా మత బోధకులకంటే, మిగతా మత గురువులకంటే
మేమే గొప్పవారమనీ, మాకంటే జ్ఞానము తెలిసిన వారు లేరని అనుకొనుచూ,
తమను తాము ఆకాశమంత ఎత్తులో ఊహించుకొని తామే గొప్పవారమను
కొనుచున్నారు. నేడు భూమిమీద గురువులుగా, వారి శిష్యులుగా యున్నవారు
తమకు తాము ఇతరులకంటే తెలిసిన వారమనుకొనుట చేత జ్ఞాన
విషయములో మిగతా మతముల వారితో విభేదించడము జరుగుచున్నది.
దానివలన మతసామరస్యము లేకుండాపోయి హింసా మార్గమునకు దారి
తీయుచున్నది. అందువలన నేడు దేశముల మధ్య విభేదములు ఏర్పడి
యుద్ధ వాతావరణము చోటు చేసుకొంటున్నది.
దేవుడు మనుషులను జ్ఞానులుగా చేయుటకు చేసిన ప్రయత్నములో
మనుషుల చేతికి విడివిడిగా మూడు దైవ గ్రంథములను ఇచ్చాడు. మూడు
దైవ గ్రంథములలో మూడు కోణముల నుండి ఒకే దిక్కును సూచించు
నట్లు, మూడు గ్రంథములు ఒకే దేవున్ని సూచించు జ్ఞానమును బోధించాయి.
అయితే దేవుడు గ్రంథరూపములో అందించిన జ్ఞానము మానవ శరీరమును
పోలినట్లు 40 శాతము స్థూలముగా, 60 శాతము సూక్ష్మముగా యుండుట
చేత కొందరికి స్థూల జ్ఞానము అర్థము అయినా సూక్ష్మ జ్ఞానము అర్థము
కాకుండా పోయినది. సూక్ష్మజ్ఞానము అర్థము కావాలంటే అది మనిషికి
దేవుడు అందించిన బుద్ధి చతురతను బట్టియుండును. దేవుడు తనకు
ఇష్టమైన వారికే బుద్ధి గ్రాహిత శక్తిని ఇచ్చుట వలన దేవునికి ఇష్టులుగా
యున్నవారికే దేవుని జ్ఞానము అర్థము కాగలదు. మొత్తము మీద సూక్ష్మ
జ్ఞానము అర్థమయిన వానినే నిజమైన జ్ఞానియని చెప్పవచ్చును. సూక్ష్మ
జ్ఞానము అర్థము కానివాడు ప్రపంచములో ఎంత పెద్ద గురువు అయినా
వానిని అజ్ఞానిగానే లెక్కించవచ్చును. నేడు కొందరికి దైవ గ్రంథములో
స్థూల, సూక్ష్మ జ్ఞానమున్న విషయము కూడా తెలియదు.
నేడు దేవుని సూక్ష్మ జ్ఞానమును తెలిసినవారు భూమిమీద అరుదుగా
యున్నారు. వారిని వదలి చూస్తే ఏమాత్రము జ్ఞానము తెలియని వారు
కొందరుండగా, దేవుని స్థూల జ్ఞానమును తెలిసినవారు మాత్రమే కొందరు
యున్నారు. దేవుని స్థూల జ్ఞానమును తెలిసిన వారిని కేవలము 40
శాతము జ్ఞానమున్న వారిగా లెక్కించవచ్చును. సూక్ష్మ, స్థూల రెండు
జ్ఞానములను తెలిసినవారిని నూరు శాతము జ్ఞానులుగా లెక్కించవచ్చును.
నేడు నూరుశాతము జ్ఞానులు చాలా తక్కువగా యుండగా, ఎక్కువగా యున్న
స్థూల జ్ఞానము గలవారు సూక్ష్మ జ్ఞానులతో పోటీపడి మీకంటే మేమే గొప్ప
జ్ఞానులము అని అంటున్నారు. 40 శాతము వారు 100 శాతము వారిని
మీకంటే మేమే గొప్పయంటే 100 కంటే 40 గొప్పయన్నట్లు ఉండును.
ఇటువంటి అజ్ఞాన దశలో యున్న మనుషులు వారివారి తారతమ్యములు
తెలియునట్లు మేము వివరమును ఇచ్చుచూ ఈ గ్రంథమును వ్రాయడమైనది.
దీనిని చదివిన వారంతా ఇందులో చెప్పిన సత్యమును, అసత్యమును
గ్రహించగలరని తెలుపుచున్నాను.
ఇట్లు
ప్రబోధానంద యోగీశ్వరులు
--
సత్యము అనగా బద్దమైనదనీ, అసత్యమనగా అబద్దమైనదనీ
అందరికీ తెలుసు. కంటికి కనిపించేవిగానీ, చెవికి వినిపించేవిగానీ మిగతా
మూడు అవయవములకు తెలియు విషయములన్నియూ సంభవించిన
సంభవములన్నీ సత్యమైనవని చెప్పవచ్చును. సంభవములు కానివన్నీ
అసత్యములనీ, అబద్దములనీ, అశాస్త్రములనీ చెప్పవచ్చును.
శరీరములో బయటి విషయములను గ్రహించు ఐదు భౌతిక అవయవములు
గలవు. వాటిని వరుసగా చెప్పితే 1) కన్ను 2) చెవి 3) చర్మము
4) నాలుక 5) ముక్కు. ఈ ఐదుకాక అభౌతికముగా మరియొకటి
గ్రహించునది గలదు. దానినే 'బుద్ధి' అంటున్నాము. మనిషి శరీరములో
బుద్ధియున్నది గానీ అది కనిపించదు.
ఐదు భౌతిక గ్రహింపు భాగములను జ్ఞానేంద్రియములని
అంటున్నాము. ఆరవదయిన బుద్ధి శరీర అంతరేంద్రియము అయినందున
అది కనిపించదు, అలాగే దానిని గురించిన వివరము ఎవరికీ తెలియదు.
బుద్ధి గ్రహింపు పనిని ఒక దానిని మాత్రమే చేయక మిగతా పనులను
కూడా చేయుచుండుట వలన బుద్ధి విషయము అందరికీ తెలియకుండా
పోయినది. బుద్ధితో సహా బయటి ఐదు ఇంద్రియములు తెలుపు
సమాచారము సత్యమయినదే, అయితే అసత్యము కూడా అవయవముల
వద్దనే కల్గుచున్నది. ఉదాహరణకు కన్ను సత్యమునే చూపుచున్నా, దానిని
గ్రహించడములో సత్యమును గ్రహించవచ్చును, అసత్యమును గ్రహించ
వచ్చును. కన్ను చూడగల అవయవము మాత్రమే. కన్ను చూచిన దానిని
గ్రహించునది శరీరము లోపలి బుద్ధి. కన్ను కదలని, మెదలని త్రాడును
చూచినా లోపలి బుద్ధి దానిని పాముగా గ్రహించవచ్చును. అప్పుడు సత్యమైన
త్రాడు అసత్యమైన పాముగా తెలియుచున్నది. చూచే అవయవముగానీ,
వినే అవయవముగానీ సత్యమునే చూచినా, సత్యమునే వినినా గ్రహించే
బుద్ధి దానిని సత్యముగనో అసత్యముగనో గ్రహించుచున్నది. కన్ను చూపినది
సత్యమైన త్రాడునే అయినా బుద్ధి దానిని అసత్యమైన పాముగా తెలుపుచున్న
దానివలన మనిషి సత్యమును వదలి ఉన్న త్రాడును కాదని లేని పామును
తెలియడము వలన అసత్యమును తెలిసినట్లయినది.
ఇదే పద్ధతిలో మనిషి అయిన జీవుడు ప్రపంచములోని సత్యా
సత్యములను తెలియుచున్నాడు. బుద్ధి అందించిన దానిని నమ్ముట వలన
ఒక విషయములో ఒకే మనిషి సత్యవాదిగా, మరొక విషయములో అసత్య
వాదిగా మిగిలిపోవుచున్నాడు. మనుషులందరూ బయటి అన్ని
విషయములను తమకున్న ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా తెలియుచుందురు.
బయట తెలియబడు అన్ని విషయములు యదార్థములే అయినా, సత్యములే
అయినా మనిషిలోని బుద్ధినిబట్టి అతను సత్యమునో అసత్యమునో గ్రహించ
వచ్చును. ఒక దారిలో పదిమంది పోవునప్పుడు చీకటిలోని త్రాడు
కనిపించినా అది కదలని దానివలన దానిని తొమ్మిది మంది త్రాడుగానే
గ్రహించారు. వారిలో ఒక్కడు మాత్రము వంకర తిరిగి పడియున్న తాడు
ఆకారమును పాముగా గుర్తించాడు. ఈ విధముగా పదిమందిలో చీకటిలోని
త్రాడు తొమ్మిదిమందికి సత్యముగా, ఒక్కనికి మాత్రము అసత్యముగా
తెలియబడడము వలన తొమ్మిదిమంది చెప్పిన సత్యమును కాదని తనకు
తెలిసిన అసత్యమునే సత్యమని ఒక్కడు వాదించడము జరిగినది.
చీకటిలోని త్రాడు కొందరికి సత్యముగా కనిపించగా ఒక్కనికి
అసత్యముగా కనిపించినది కదా! అదే విధముగా ఐదు జ్ఞానేంద్రియముల
ద్వారా తెలియు విషయములన్నిటినీ మనిషి సత్యముగా కొన్నిటిని మరియు
అసత్యముగా కొన్నిటిని గ్రహించుచున్నాడు. తనకు తెలిసిన దానినిబట్టి
అసత్యమును కూడా సత్యమని వాదించుచున్నాడు. బయట కనిపించు
ప్రత్యక్ష భౌతిక విషయములలోనే ఈ విధముగా బుద్ధి చేత సత్యమునేకాక
అసత్యమును పొందు అవకాశము గలదు. అటువంటప్పుడు పరోక్ష
విషయమైన, అభౌతిక విషయమయిన ఆధ్యాత్మిక విషయములో సత్యమును
పొందు అవకాశము చాలా తక్కువ, అసత్యమును పొందు అవకాశము
చాలా ఎక్కువ గలదు. నేడు ఆధ్యాత్మిక (ఆత్మ అధ్యాయన) విషయములలో
అనగా దైవజ్ఞాన విషయములలో ఉన్న సత్యమును చాలామంది తెలియ
లేకపోవుచున్నారు. దైవ విషయములో సత్యమైన భావమును అరుదుగా
బహు కొద్దిమంది మాత్రమే గ్రహించుచున్నారు. బుద్ధికి గ్రహింపు శక్తి
ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకముగాయుండును. బుద్ధి స్థూలమైనదికాదు,
సూక్ష్మమైనది. అందువలన బుద్ధికిగల గ్రహింపు శక్తి శరీరములో
సూక్ష్మముగా తెలియకుండాయున్న ఆత్మ చేతనే లభించుచున్నది. అందరి
శరీరములలోనున్న ఆత్మ వారివారి బుద్ధికి గ్రాహిత శక్తిని ఇచ్చుచున్నది.
అందువలన ఇదే విషయమునే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము
అను అధ్యాయములో 15వ శ్లోకమున ఈ విధముగా చెప్పారు.
శ్లో॥ 15: సర్వస్య చాహం హృదిసన్నివిష్ణో మత్తఃస్మృతిర్ జ్ఞాన మపోహనంచ
వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాన్తకృ ద్వేదవి దేవ చాహమ్||
ఐదు ఇంద్రియముల ద్వారా మనిషి తెలుసుకొంటున్న విషయములు
రెండు రకములు గలవు. ఎక్కువ విషయములు స్థూల విషయములు,
తక్కువ విషయములు సూక్ష్మ విషయములు. స్థూల విషయములను
ఎవరయినా తెలియవచ్చును. సూక్ష్మ విషయములు అందరూ తెలియలేరు.
కొందరు మాత్రమే తెలియగలరు. భౌతికమైన ప్రత్యక్ష స్థూల విషయములు,
అభౌతికమైన పరోక్ష సూక్ష్మ విషయములని రెండు విధములన్న వాటిలో
సూక్ష్మ విషయములు మేథావులకు తప్ప మిగతావారికి అర్థము కావు. స్థూల,
సూక్ష్మములు ప్రపంచమంతా నిండియున్నవి. మనిషి శరీరములో పది
భాగములు స్థూలముకాగా, పదిహేను భాగములు సూక్ష్మముగాయున్నవి.
దీనినిబట్టి సూక్ష్మములు లేవని చెప్పలేము. మనిషిలోని 25 భాగములలో
సగానికి పైగా పదిహేను భాగములు సూక్ష్మములున్నప్పుడు ఆత్మ
విషయములో మరియు పరమాత్మ విషయములో అన్నీ సూక్ష్మ విషయములే
ఉన్నవి.
అందువలన ఆత్మ, పరమాత్మల జ్ఞానమంతయూ సూక్ష్మముతోనే
కూడుకొనియుండును. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విషయమును చెప్పుచున్న
మూడు దైవ గ్రంథములు తక్కువ స్థూలము, ఎక్కువ సూక్ష్మముతో కూడుకొని
యుండును. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీత, ద్వితీయ దైవ
గ్రంథమయిన బైబిలు, అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ మూడు 40
శాతము స్థూల విషయములు, 60 శాతము సూక్ష్మ విషయములతో
కూడుకొనియున్నవి. అందువలన సూక్ష్మ విషయములను గ్రహించలేనివారు
మూడు దైవ గ్రంథములలోని విషయములను తెలియలేరు. కేవలము
వారి శరీరములోని దేవుడు వారికి సూక్ష్మ విషయముల వివరమును
అందించితేనే వారు మూడు గ్రంథములలో నిక్షిప్తమైయున్న జ్ఞానము
తెలియగలరు. కొందరు గ్రంథములోని విషయములను స్థూలముగానే
చెప్పుకొనుచుందురు. దానివలన వారు బయట ఎంత గొప్పవారయినా
గ్రంథములలోని జ్ఞానమును తెలియలేరు. అటువంటివారు తాము
జ్ఞానులమని చెప్పుకొనుచున్నా వారు జ్ఞాన శూణ్యులే యని చెప్పవచ్చును.
ప్రశ్న :- మీరు త్రిమత గురువులుగా చెప్పబడుచున్నారు కదా! మీకు మూడు
గ్రంథముల సూక్ష్మ జ్ఞానము తెలియునా?
జవాబు :- మూడు గ్రంథముల సూక్ష్మ జ్ఞానము తెలిసినప్పుడే ఏ మనిషి
అయినా సంపూర్ణ జ్ఞాని కాగలడు. మూడు దైవ గ్రంథముల జ్ఞానము
సమానమేననీ, మూడు దైవ గ్రంథములు ఒకే జ్ఞానమును బోధించుచున్నవనీ,
మూడు దైవ గ్రంథములు ఒకే దేవున్ని గురించి బోధించుచున్నవని
తెలిసినప్పుడే ఏ మనిషి అయినా దైవమార్గములో ఉన్నట్లగును. అందువలన
ఒక వ్యక్తి స్వామీజీగా గానీ, గురువుగా గానీ ఇతరుల చేత పిలువబడు
చున్నప్పుడు ఆ వ్యక్తి మూడు దైవగ్రంథముల జ్ఞానము తెలిసియుండాలి.
ఒక్క గ్రంథమును మాత్రము తెలిసి, ఒక్క మతమును గురించి చెప్పు వ్యక్తి
ఎవడయినా జ్ఞాని అని పిలువబడుటకు అర్హుడు కాడు. వాడు ఏ ధర్మమును
తెలియనివాడేనని చెప్పవచ్చును. నేను మూడు దైవ గ్రంథముల జ్ఞానమును
తెలియనిదే జ్ఞానిగా చలామణి అగుటకు వీలులేదు. అందువలన నేను
మూడు దైవ గ్రంథముల జ్ఞానమును క్షుణ్ణముగా తెలిసియున్నానని చెప్పక
తప్పదు. మూడు దైవ గ్రంథములలో ఏ గ్రంథములోని వాక్యమును అడిగినా
నేను సులభముగా వివరించి చెప్పగలను.
ప్రశ్న :- ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత హిందూమతమునకు, అట్లే
ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలు క్రైస్తవ మతమునకు, అంతిమ దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్ ఇస్లామ్ మతమునకు ముఖ్య గ్రంథములుగా ఆ
మతములకు మార్గదర్శకములుగా, ఆయా మత గ్రంథములుగా చెప్ప
బడుచున్నవి కదా! అలాంటప్పుడు మీరు హిందూ మతములో పుట్టిన
వాడయినందున మీరు భగవద్గీతనుగానీ, హిందూ మతమును గానీ,
చెప్పవచ్చును. అయితే మిగతా రెండు మత గ్రంథములయిన బైబిలు,
ఖుర్ఆన్ గ్రంథములలోని జ్ఞానము మీకెట్లు అర్థము కాగలదు? ఆ గ్రంథముల
వాక్యముల వివరము మీకెట్లు తెలియును? మీరు ఆ గ్రంథములను ఎక్కడ
నేర్చారు? ఎవరి వద్ద తర్ఫీదు పొందారు?
జవాబు :- నేను ఏ మత గురువులవద్ద తర్ఫీదు పొందడముగానీ, వారి
బోధలు వినడముగానీ జరుగలేదు. అందువలన నా ఒక్కనిలో మతాలకు
అతీతమైన జ్ఞానము కల్గినది. ఏ మతములోని వాక్యమునకైనా జ్ఞాన
వివరమును చెప్పగలుగుచున్నాను. అలా చెప్పుటకు కారణము ఒకే ఒకటి
కలదు. అది ఏమనగా! నేను మొట్టమొదట భగవద్గీత గ్రంథమును చదివి
అర్థము చేసుకొన్నాను. అందువలన మిగతా దైవ గ్రంథములకు వివరము
సులభముగా చెప్పగలుగుచున్నాను.
ప్రశ్న :- మీవలె చాలామంది భగవద్గీతను చదివారు కదా! వారికెందుకు
మీకు తెలిసిన జ్ఞానము తెలియలేదు? మూడు గ్రంథముల వివరము
చెప్పలేదు?
జవాబు :- వారు ముందు కొంత వేరువేరు జ్ఞానములను విన్న తర్వాత
భగవద్గీతను చదివారు. మొట్టమొదటిగా భగవద్గీతను వారు చదవలేదు.
ఇతరులు చెప్పిన భగవద్గీతను మొదట వినడము వలన చెప్పిన వారి
భావములు విన్నవారిలో కూడా చేరుచున్నవి. నేను అలా కాదు, ఏ జ్ఞానము
తెలియకముందు, ఎవరి జ్ఞానమును వినకముందు భగవద్గీతను
చదవగలిగాను. కావున అందరికంటే సత్యమైన విధానములో భగవద్గీత
అర్థమయినది. భగవద్గీతలోని రహస్యమంతయూ నాతోనే వివరముగా
తెలియడము జరిగినది. భగవద్గీతలో ముఖ్యమైన త్రైత సిద్ధాంతము తెలియ
బడినది. ఎప్పుడయితే త్రైత సిద్ధాంతము తెలిసినదో అప్పుడే దేవుని
నిజమైన జ్ఞానము సంపూర్ణముగా తెలిసిపోయినది. అప్పటినుండి నేను
దేవుని జ్ఞానము తెలియగలిగాను అను ధైర్యము వచ్చినది. తర్వాత కొంత
కాలమునకు బైబిలు చదవగలిగాను అప్పుడు బైబిలులోని సత్య జ్ఞానము
క్రైస్థవులకంటే నాకు బాగా అర్థమయినది. తర్వాత ఖుర్ఆన్ చదవగలిగాను
అప్పుడు ఖుర్ఆన్లో గల దైవజ్ఞానము అందరికంటే బాగా అర్థమయినది.
అలా అర్థమగుటకు కారణము నాలోయున్న ఆత్మే నాకు సరియైన దారి
చూపి సరియైన జ్ఞానమును తెలియజేసినదని తెలిసినది. అప్పటినుండి
నాకు తెలిసిన జ్ఞానమును మతాలకు అతీతముగా బోధించుచున్నాను.
అయితే నా జ్ఞానము చాలామందికి అర్థమయినది, కొద్దిమందికి మాత్రము
అర్థము కాలేదు. కొందరికి అర్థమయినా మతమును అడ్డము పెట్టుకొని
మమ్ములను విమర్శించుచున్నారు.
ప్రశ్న :- మీకు ఏ మతమునుండి విమర్శలు వచ్చాయి?
జవాబు :- ఒక మతము అనునది లేకుండా హిందూ, క్రైస్తవ, ఇస్లామ్
అను మూడు మతముల నుండి విమర్శలు వచ్చాయి. మేము వ్రాసిన
గ్రంథమును పూర్తి చదవగలిగితే ఎవరూ విమర్శించుటకు వీలులేదు. అయితే
కొందరు పూర్తి చదవక మధ్యలో అక్కడక్కడ చదివిన వారే మమ్ములను
విమర్శించారు. వారి అన్ని విమర్శలకు నావద్ద సమాధానము గలదు.
అయితే వారు సమాధానము కొరకు విమర్శించక వారి మతము కొరకు
విమర్శించుచున్నారు. మతమును చూపి మమ్ములను అజ్ఞానులుగా
చెప్పాలనుకొన్నారు. అటువంటి వారు చెప్పినా వినరు, వారి దారి వారికి
మంచిగానే త్రోయుచుండును. వారు మతము అను మాయలో చిక్కు
కొన్నారు. కావున వారిని గురించి వారి విమర్శల గురించి మేము ఏమాత్రము
పట్టించుకోవడము లేదు. నేను హిందువుగా పుట్టినా మూడు మత
గ్రంథములను సమన్వయము చేసి చెప్పుచున్నాము. మూడు మతములను
సమానముగానే చూస్తున్నాము. మత మార్పిడులను వ్యతిరేఖించుచున్నాము.
ఏ మతము వారు ఆ మతములోనే ఉండవలెనని చెప్పుచున్నాము. అయినా
హిందువులు మమ్ములను క్రైస్థవుల క్రిందికి జమకట్టి మాట్లాడగా, ముస్లీమ్లు
మమ్ములను హిందూ మత అభిమానులుగా చెప్పగా, క్రైస్థవులు తమ మత
ద్వేషకులుగా ముస్లీమ్ అభిమానులుగా పేర్కొంటున్నారు. ఎటు తిరిగి
మమ్ములను వారి దారికి ఆటంకము కలుగజేయు వారిగా వర్ణించి
చెప్పుచున్నారు.
ప్రశ్న :- మీరు హిందూ మత గ్రంథమయిన భగవద్గీతకు వివరమును
వ్రాశారు. అంతటిలో ఆగక ముస్లీమ్ల గ్రంథమయిన ఖుర్ఆన్లోని కొన్ని
వాక్యములకు, క్రైస్థవుల గ్రంథమయిన బైబిలులోని కొన్ని వాక్యములకు
వివరము వ్రాశారు. మీరు వ్రాసిన వివరము సరియైనదే అయినా అందరూ
కాకుండా కొందరు ముస్లీమ్లు అది సరియైన భావము కాదని అంటున్నారు
కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- నేను ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను గురించి మొదటి
నుండి చివరివరకు శ్లోకములకు భావమును వ్రాసినది నిజమే. అయితే
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథమునకు అక్కడక్కడ కొన్ని
వాక్యములకు మాత్రమే వివరమును వ్రాశాము తప్ప ఖుర్ఆన్ మొత్తము
గ్రంథమునకు వివరమును వ్రాయలేదు. "అంతిమ దైవగ్రంథములో
జ్ఞాన వాక్యములు" అను ఒక గ్రంథమును మూడు సంవత్సరముల క్రిందటే
వ్రాశాము. ప్రస్తుతము “అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యములు”
అను గ్రంథమును వ్రాయుచున్నాము. రెండు గ్రంథములలోని వాక్యములన్నీ
కలిపినా నాలుగు వందలు కూడా లేవు. ఎక్కడయితే సూక్ష్మ వాక్యములు
గలవో, ఎక్కడయితే ఖుర్ఆన్ వాక్యములను ముస్లీమ్లు తప్పుగా అర్థము
చేసుకొన్నారో అక్కడ ఆ వాక్యములకు మాత్రమే మేము సరియైన వివరమును
ఇవ్వడము జరిగినది. అలా మేము వివరించి చెప్పిన వాక్యములను
గ్రహించుకొను గ్రాహిత శక్తి లేనివారు, మేము వ్రాసిన సత్యమును మ్రింగుడు
పడనివారు మరియు మా మాటలు వింటే తమ పెద్దరికము తక్కువ
అవుతుందను మత పెద్దలు కొందరు మా వ్రాతలను ఒప్పుకోక
విమర్శించుచున్నారు.
భగవద్గీత హిందువుల గ్రంథమనీ, బైబిలు క్రైస్తవుల గ్రంథమనీ,
ఖుర్ఆన్ ముస్లీమ్ల గ్రంథమనీ మీరు అడిగిన ప్రశ్నలో పేర్కొన్నారు. మూడు
గ్రంథములు ఏ మతానికి సంబంధించినవి కావు. మూడు సమానమైన
దైవ గ్రంథములే. ఆయా గ్రంథములలో ఒక మతము పేరుపెట్టి ఫలానా
మతమునకు సంబంధించినవని ఎక్కడా చెప్పలేదు. అందువలన మూడు
మతముల వారికి మూడు గ్రంథములు సంబంధించినవేనని చెప్పవచ్చును.
ప్రశ్న :- అలా అయితే ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథము మా గ్రంథమనీ,
ఇతర మతస్థులు ఎవరుగానీ దానిని గురించి మాట్లాడడముగానీ, వ్రాయడము
గానీ చేయకూడదనీ, ఎవరయినా ఖుర్ఆన్ గ్రంథమును గురించి
వ్రాయాలనుకుంటే అటువంటి వారు తమ అనుమతి తీసుకోవాలని, తమ
అనుమతి లేనిది తమ గ్రంథమయిన ఖుర్ఆన్ గురించిగానీ, ఖుర్ఆన్లోని
ఒక్క ఆయత్ను గురించి కూడా వ్రాయకూడదు అని చెప్పుచుందురు. దీనికి
మీ సమాధానము ఏమి ఉంటుంది. మీరు వ్రాసిన ఖుర్ఆన్ గ్రంథము
వాక్యములు ముస్లీమ్ల అనుమతితోనే వ్రాశారా?
జవాబు :- నేను ఎవరి అనుమతి తీసుకోకుండా ఖుర్ఆన్ గ్రంథములోని
కొన్ని వాక్యములకు వివరమును వ్రాయడము జరిగినది. అలా ఎందుకు
వారి అనుమతి తీసుకోలేదంటే విశధీకరించి చెప్పుతాను వినండి. ఒక
తండ్రికి ముగ్గురు కుమారులున్నారని అనుకోండి, ముగ్గురికీ ఒకే తండ్రి
అయినప్పుడు తండ్రితో ఏ కొడుకయినా ఎప్పుడయినా మాట్లాడవచ్చును.
అంతేగానీ చిన్న కొడుకు పెద్ద కొడుకుతో నా అనుమతి లేనిది మా
తండ్రితో మాట్లాడవద్దు అని చెప్పుట ఎంత విడ్డూరముగా యుండునో,
అలాగే ముస్లీమ్లు మా అనుమతి లేనిది దైవ గ్రంథమయిన ఖుర్ఆన్
చదవకూడదు, వ్రాయకూడదు అని చెప్పుట అంతే విడ్డూరమగును. మూడు
దైవ గ్రంథములు ఒకే దేవున్ని గురించి చెప్పినప్పుడు, మూడు మతముల
వారికి ఒకే దేవుడు అయినప్పుడు, అందరికీ సంబంధించిన దేవున్ని గురించి
ఏ గ్రంథములోనయినా చదువవచ్చును, వాక్యమునకు సరియైన భావమును
వ్రాసి చెప్పవచ్చును.
అంతిమ దైవ గ్రంథము మానవులందరికి చెప్పిన హితోపదేశమని
అదే గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో చెప్పియున్నారు. ఆ విషయమును
ఖుర్ఆన్ గ్రంథములో 81వ సూరా, 27వ ఆయత్లోనూ, అట్లే ఆరవ
సూరా 90వ ఆయత్లోనూ చెప్పియున్నారు.
(81-27) “ఇది (ఈ ఖుర్ఆన్ గ్రంథము) సమస్త లోకవాసుల కొరకు
హితోపదేశము".
(6-90) “అల్లాహ్ సన్మార్గము చూపించినటువంటివారు వీరే.
కనుక నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. దీనికిగానూ
నేను మీ నుండి ఎలాంటి ప్రతి ఫలితాన్ని ఆశించడము లేదు.
'ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశము' అని ఓ ప్రవక్తా
వారికి చెప్పు".
ఈ విధముగా ఖుర్ఆన్ గ్రంథములోనే మనుషులందరికీ అని
చెప్పారు గానీ, ఖుర్ఆన్ గ్రంథము ఒక్క ముస్లీమ్లకేనని చెప్పలేదు.
ఖుర్ఆన్ఘ్ను తెలిసిన ఎవరయినా, ఏ ముస్లీమ్ అయినా ఖుర్ఆన్ అందరి
గ్రంథమనీ, ముస్లీమ్లకు మాత్రమే కాదని చెప్పుచున్నారు. ఆ విధానముతో
“ఖుర్ఆన్ భావామృతం" అను గ్రంథమును తెలుగులోనికి అనువాదము
చేసిన అబుల్ ఇర్ఫాన్ అనునతడు తన ముందుమాటలో చెప్పిన ఒక పేరాను
చూస్తే ఇలా కలదు చూడండి.
“ఏమయినప్పటికీ ఖుర్ఆన్ యావత్తు మానవాళి కోసం
అవతరించిన అంతిమ దైవగ్రంథము. ఇది ప్రపంచ
మనుషులందరి ఉమ్మడి సొత్తు. దీనిపై ఏ ఒక్క జాతికి, వర్గానికి
గుత్తాధిపత్యము లేదు. గాలి, నీరు, సూర్యరశ్మి మొదలయిన
ప్రకృతి వనరుల్ని మానవుడు ఎలా వినియోగించుకొని
ప్రయోజనము పొందుచున్నాడో ఖుర్ఆన్ వల్ల కూడా అలాగే
ప్రయోజనం పొందవచ్చును. ఇది ఇహ లోకంలో మానవుల
మార్గదర్శనం కోసము, పరలోకములో వారి ముక్తి మోక్షాల కోసం
సర్వేశ్వరుడు పంపిన ఏకైక హితవాణి. ఇందులో సత్యాన్వేషకులకు
ఆసక్తికరమైన అనేక విషయాలున్నాయి. అందుచేత సత్యాన్ని
ప్రేమించి మోక్షాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా
ప్రశాంతముగా ఆలోచించి దీన్ని అధ్యయనం చేయవలసిన
అవసరము ఎంతైనా ఉంది."
ఇట్లు,
అబుల్ ఇర్ఫాన్,
(అనువాదకుడు).
ఒక ముస్లీమ్ పండితుడు, ఖుర్ఆన్ అనువాదకుడు చెప్పిన
విషయము (81-27), (6-90) ఆయత్లకు సమానముగా,
అనుబంధముగా యున్నది. వాస్తవముగా ఖుర్ఆన్ దైవగ్రంథము. మూడు
దైవగ్రంథములలో చివరిది అని చెప్పినా మూడు గ్రంథములను కలిపి
ఒకే దైవ గ్రంథముగా చెప్పవచ్చును. ఎందుకనగా! (6-91)వ వాక్యములో
తౌరాత్ను దైవ గ్రంథముగా చెప్పి అది మానవులకు ఒక జ్యోతియనీ,
మార్గదర్శకత్వముయని చెప్పారు. అంతేకాక ఆ గ్రంథమును మీరు వేరు
వేరు కాగితములుగా వేరు వేరు గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు
యని చెప్పియున్నారు. మూడు గ్రంథములనగా ప్రథమ దైవగ్రంథము
భగవద్గీత, ద్వితీయ దైవగ్రంథము బైబిలు, అంతిమ దైవ గ్రంథము
ఖుర్ఆన్ అని తెలియవలెను. సమస్త మానవులు దేవుడు చెప్పిన తౌరాతు
గ్రంథమునే వేరువేరు భాగములుగా చెప్పుకొని ఇది మా గ్రంథము, అది
మీ గ్రంథము అని అంటున్నారు. వాస్తవానికి ఏ గ్రంథమయినా ఒకే
దేవున్ని ఒకే జ్ఞానమును బోధించుచున్నవి.
ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్లది కాదు, బైబిలు క్రైస్తవులది కాదు,
భగవద్గీత హిందువులది కాదు. మూడు గ్రంథములలో ఏ మతము పేరు
చెప్పకుండా 'సమస్త మానవులకు' అన్నట్లు చెప్పియున్నారు. అటువంటప్పుడు
ఖుర్ఆన్ మీద ముస్లీమ్లకు ఎంత హక్కువుందో మిగతా మతముల వారికి
అంతే హక్కు ఉండును. అందువలన దేవుడు మనుషులకు ఎంత దగ్గరివాడో
అలాగే దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ కూడా అన్ని మతముల వారికి అంత
దగ్గరగానే యున్నది. ఈ విధముగా అన్నీ గ్రహించిన తర్వాత నేను ఖుర్ఆన్
గ్రంథములో అందరికీ అర్థము కానటువంటి సూక్ష్మ అర్థముగల వాక్యములకు
వివరమును వ్రాయడము జరిగినది. నేను చేసినది మంచి పనే అయినందున
అందరూ నన్ను అభినందించవలెనుగానీ, ఇది మా గ్రంథము, మా అనుమతి
లేనిదే వ్రాయకూడదు అనుట ఒక విధముగా మమ్ములను అవమానించినట్లే
యగును. నేను కొన్ని సూక్ష్మవాక్యములకు వివరము వ్రాయకపోతే
భవిష్యత్తులో కూడా వాటి వివరము తెలియుటకు అవకాశము లేదు. నా
వివరము వలన చాలామంది ఖుర్ఆన్ గ్రంథములోని సత్యమును తెలియ
గలిగారు. 90 శాతము ముస్లీమ్లు ఖుర్ఆన్ నిజభావము తెలిసిన దానివలన
చాలా సంతోషపడినారు. వారిలో ఒక ముస్లీమ్ తన మనోగతమును ఇలా
తెలియజేశాడు చూడండి.
"ఖుర్ఆన్ గ్రంథములోని ఆయత్ల అర్థము తెలియక సరియైన
వివరము చెప్పేవారు లేక శాస్త్రబద్దముగా చెప్పే నాథుడి కోసము ఎదురు
చూడగా శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ప్రసంగాలు మరియు
గ్రంథములోని జ్ఞానమును చూచాక ఎంతో ఆనందము కలిగెను. ముఖ్యముగా
చెప్పాలంటే మనిషి నమ్మకము ప్రకారము దేవుని విధానము ఉండదు. దేవుని
విధానమే మనిషి నమ్మకము అవ్వాలి. చివరిగా ప్రతి ఒక్కరిని అడిగేది ఏమంటే
ఓ మనిషీ నీ నమ్మకము సత్యమా లేక అసత్యమా చూచుకో అని కోరుచున్నాను.
(81-27) “ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశము."
వాస్తవము చెప్పాలంటే ఖుర్ఆన్ గ్రంథము చదివేవరకు ఖుర్ఆన్ కేవలము
ముస్లీమ్ల గ్రంథము మాత్రమే అనుకొనే వారిలో నేనూ ఒకడిని. ఈ రోజు
కూడా చాలామంది ముస్లీమ్లు అదే భావముతో యున్నారు అంటే ఆశ్చర్యపడ
వలసిన అవసరము లేదు. ఈ రోజు సమాజములో మనుషులకు ఖుర్ఆన్
గ్రంథము కేవలము ముస్లీమ్లదే అను భావము కల్గించిన పాపము ఎవరిది?”
(షేక్ షఫీ).
మేము ఖుర్ఆన్ గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరమును
వ్రాయగా దాదాపు 30 వేల మంది హిందువులు చదివి ఖుర్ఆన్లో
మంచి జ్ఞానమున్నదని అన్నారు. అలాగే 15 వేల మంది ఖుదా ఇస్లామిక్
సంస్థవారు చదివి మాకు ఇంతవరకు తెలియని గొప్ప జ్ఞానము తెలిసిందని
సంతోషపడ్డారు. నేను వ్రాసిన వివరములు ఇంతవరకు ఎవరూ వ్రాయక
పోవడము వలన మా భావ వివరము చాలా గొప్పగా కనిపించినది.
మా
అంతమందికి ఖుర్ఆన్ అర్థమవడము సంతోషించతగ్గ విషయము. అయినా
కొందరు ముస్లీమ్ పెద్దలు తమ పెద్దరికమునకు విలువ లేకుండా పోతుందను
ఉద్దేశ్యముతో అదే పనిగా పని గట్టుకోని మేము వ్రాసిన భావము తప్పుయనీ,
ఖుర్ఆన్ గ్రంథమునకు వ్యతిరేఖముగా వ్రాశాడని ప్రచారము చేసి అమాయక
ముస్లీమ్లను మా మీదికి రెచ్చకొట్టడము కూడా జరిగినది. దానికి
సమాధానముగా మేము తప్పు వ్రాసినట్లుగానీ, ఖుర్ఆన్కు వ్యతిరేఖముగా
వ్రాసినట్లుగానీ చూపమని అడిగితే ఎవరూ మా తప్పును చూపలేకపోయారు.
ప్రశ్న :- ముస్లీమ్లు అందరూ కాకపోయినా కొందరు మాత్రము మా
గ్రంథములోని వాక్యములు వ్రాయకూడదని ఆక్షేపణ తెలిపినప్పుడు మీరు
ఎందుకు వ్రాయాలి? వ్రాయకుండా వదలివేయవచ్చును కదా!
జవాబు :- ముస్లీమ్లలో ముఖ్యముగా ఇస్లామ్ మా మతము అని చెప్పుకొను
కొందరు ముస్లీమ్ పెద్దలు మాత్రము ఆక్షేపణ తెలిపిన మాట వాస్తవమే.
నేను వ్రాయకుండా వదలివేయడము వలన నాకు వచ్చే నష్టము లేదు.
అయితే అది మొత్తము మానవులందరికీ ఖుర్ఆన్లో ఉండే లోతయిన
జ్ఞానము అందకుండా పోవడమేకాక, ఖుర్ఆన్ యొక్క గొప్పతనము ఎవరికీ
తెలియకుండా పోవును. దేవుడు మానవాళికందరికీ జ్ఞానము చెప్పితే
కొందరు మనుషులు పెట్టిన షరతులకు నేను లొంగిపోయి దైవజ్ఞానమును
మూసిపెట్టినట్లగును. అందువలన సమాన విలువగల మూడు దైవ
గ్రంథములను నేను వ్రాయదలచాను. నన్ను వ్రాయకూడదు అనే వారిని
నేను కూడా ఒక మాటను అడగదలచాను. ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్లది
అని వారు చెప్పినప్పుడు భగవద్గీత హిందువులదనీ, బైబిలు క్రైస్తవులదనీ
చెప్పవలసి వచ్చును. అలా ఖుర్ఆన్ మాది మిగతా రెండు గ్రంథములు
మావి కాదని అన్నప్పుడు, మిగతా రెండు గ్రంథములను గురించి వారు
వ్రాసిన పుస్తకములలో ఎందుకు వ్రాశారు? భగవద్గీత శ్లోకములను గురించిన
వివరము మరియు బైబిలు వాక్యములు వారు వ్రాసిన పుస్తకములలో గలవు.
అలా వారు భగవద్గీతను, బైబిలును గురించి ఎవరి అనుమతి లేకుండా
వ్రాయగలిగినప్పుడు హిందువునయిన నేను మిగతా గ్రంథములను గురించి
ఎందుకు వ్రాయకూడదు? వారు వ్రాసే దానికి హిందువుల అనుమతి,
క్రైస్థవుల అనుమతి పొందాలని అనుకోలేదు కదా! అలాంటప్పుడు నాకు
ముస్లీమ్ల అనుమతి అవసరము అని చెప్పడము సరియైన పని కాదు
కదా! మీకు లేని అనుమతి మాకెందుకు అవసరము అని నేను అడగవచ్చును
కదా! దేవుడు అందరికి సమానమేనను ఉద్దేశ్యముతో హిందువులుగానీ,
క్రైస్థవులుగానీ ముస్లీమ్లను మా అనుమతి పొందవలెనని చెప్పలేదు.
అటువంటప్పుడు ఖుర్ఆన్ అందరి గ్రంథమను ఉద్దేశ్యముతో అందులోని
వాక్యములను వ్రాయడము తప్పెట్లగును? దేవుని విధానములో ముస్లీమ్లకు
ఒక పద్ధతి, మిగతా మతములకు మరొక పద్ధతి ఏమీ లేదు కదా! ఇతర
మతములవారు ఖుర్ఆన్ వాక్యములను వ్రాయకూడదు అని అన్నప్పుడు
భగవద్గీతను గురించి, బైబిలును గురించిన వాక్యములను గురించి వ్రాయము
యని మీరు చెప్పగలరా అని అడుగుచున్నాము?
అందరికి ఒకే దేవుడు, ఒకే సృష్టికర్తయైనప్పుడు మీది, మాది
అను మత నియమములెందుకు? అని మేము అడుగుచున్నాము. దేవుని
విషయములో మీకొక న్యాయము, మాకొక న్యాయము ఉండదు కదా!
“సర్వమానవాళికి ఇది హితోపదేశము” అని చెప్పిన ఖుర్ఆన్ వాక్యమునకు
ముస్లీమ్లు వ్యతిరేఖముగా మాట్లాడినట్లు కాదా! మీకు ఒక దేవుడు మాకు
మరొక దేవుడు కానప్పుడు, అందరికి ఒకే దేవుడయినప్పుడు, దేవుడు చెప్పిన
వాక్యములను ఇతరులకు వివరించి చెప్పడములో తప్పులేదు కదా! దేవుడు
ఏ భేదము లేకుండా మనుషులందరికి నా జ్ఞానము అని మూడు
గ్రంథములలో చెప్పియున్నప్పుడు మూడు మతముల వారు ఎవరు ఏ
గ్రంథమును గురించైనా చెప్పుకోవచ్చునని దేవుడే అధికారము
ఇచ్చినట్లుండగా ఫలానా గ్రంథము మాదని దానిని గురించి ఇతర మతముల
వారు మాట్లాడుకోకూడదు, వ్రాయకూడదు అని చెప్పడము దేవుని మాటలను
వ్యతిరేఖించినట్లగును కదా! అందువలన నేను మనుషుల మాటను
లెక్కచేయక దేవుని మాటనే గొప్పగా లెక్కింతును. అందరికీ సమానమైన
దేవున్ని గురించి మనుషులు ఆంక్షలు పెట్టడము మనుషులకు తగిన పని
కాదు. నేను ఖుర్ఆన్ గ్రంథములోని దేవుని జ్ఞానమును గొప్పగానే
చెప్పుచున్నాను. చాలామంది మూడు మతముల వారు సంతోషముగా
తెలుసుకొంటున్నారు. అటువంటప్పుడు కొందరు మా మతమును గురించి
వ్రాయవద్దని చెప్పడము మంచిదికాదు. అది దేవునికి వ్యతిరేఖమయిన
మాటయగును.
ముస్లీమ్ మాట నేను వినాలంటే హిందువుగా నేను చెప్పుమాట
కూడా వారు వినవలసియుండును. భగవద్గీత, బైబిలును గురించి
మీరెందుకు వ్రాశారని మేము అడుగవలసి వచ్చును. అయినా ఆ మాట
మేము అడగము. దేవుని వాక్యమును గురించి వివరించి చెప్పుటకు
అందరికీ అధికారము కలదు. అలా చెప్పకూడదు అని చెప్పు అధికారము
ఎవరికీ లేదు. ఆ విషయమును దేవుడే తన గ్రంథములందు చెప్పియున్నాడు.
దేవుని మాటను లెక్కచేయక మాట్లాడువారు ఎవరయినా దైవమునకు
దూరము కాక తప్పదు. క్రైస్థవ బైబిలును గురించి ముస్లీమ్లు కొందరు
ఏసు చనిపోలేదు శిలువ వేయబడలేదు అని వాదించుచున్నారు. వారు
క్రైస్థవులను గురించి బైబిలును గురించి జోక్యము చేసుకొని చర్చావేదికల
మీద వాదోపవాదములు చేసినప్పుడు నన్ను ఖుర్ఆన్ గ్రంథములోని
వాక్యములను వ్రాయకూడదనుటకు ఏ అవకాశము లేదని చెప్పవచ్చును.
ప్రశ్న :- దేవుడు (అల్లాహ్) మనుషులకు మొత్తము నాలుగు గ్రంథములను
నలుగురు ప్రవక్తల ద్వారా ఇచ్చాడనీ, ఆ గ్రంథములే 1) జబూర
2) తౌరాత్ 3) ఇంజీలు 4) ఖుర్ఆన్ అని చెప్పుచున్నారు. మొదటిదయిన
జబూర గ్రంథము దావూద్ ప్రవక్త ద్వారా, రెండవదయిన తౌరాతు మూసా
ప్రవక్త ద్వారా, మూడవదయిన ఇంజీలు ఈసా ప్రవక్త ద్వారా, నాల్గవదయిన
ఖుర్ఆన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్త ద్వారా వచ్చినవని ముస్లీమ్లు
చెప్పుచున్నారు. అటువంటప్పుడు మీరు తౌరాతు గ్రంథమును భగవద్గీతయని
చెప్పడమును ముస్లీమ్లు ఒప్పుకోవడము లేదు. తౌరాతు భగవద్గీత కాదని
తౌరాతును మూసా చెప్పాడని అంటున్నారు. భగవద్గీతను తౌరాత్యీని
చెప్పడము ముస్లీమ్లు కాదంటున్నారు. దానికి మీరు ఏమి జవాబు
చెప్పగలరు? మీరు అంతా సత్యమే చెప్పుతామని చెప్పినప్పుడు, తౌరాతు
భగవద్గీతయని అసత్యమును చెప్పవలసిన అవసరము ఏమి వచ్చినది?
జవాబు :- నాకు అసత్యము చెప్పవలసిన అవసరము లేదు. ప్రజలు
జ్ఞానులు కావలెనని నేను సత్యమునే చెప్పి సరియైన జ్ఞానమార్గములో
ప్రజలను పంపాలనుకొన్నాను. అటువంటప్పుడు సత్యమును తప్ప
అసత్యమును నేనెలా చెప్పగలను? నాలుగు గ్రంథములను నేను కూడా
ఒప్పుకొంటున్నాను. ఉదాహరణకు రెండవ గ్రంథమయిన ఇంజీలు కూడా
ఖుర్ఆన్ గ్రంథముకంటే 600 సంవత్సరముల ముందు చెప్పబడినది.
ఆరువందల సంవత్సరముల ముందు ఏసు అను ప్రవక్త చెప్పిన బోధను
ఆధారము చేసుకొని బైబిలు గ్రంథమును వ్రాయడము జరిగినది. అయితే
600 సంవత్సరములు గడచిన తర్వాత తయారయిన ఖుర్ఆన్ గ్రంథము
బైబిలును ఇంజీలుయనీ, ఏసును ఈసాయని చెప్పడము జరిగినది. ఖుర్ఆన్
గ్రంథములో చెప్పబడిన ఇంజీలు మొదట బైబిలు అయినట్లు, అలాగే ఖుర్ఆన్
గ్రంథములో చెప్పబడిన ఈసా మొదట ఏసుగా యున్నట్లు ఇప్పుడు తౌరాత్
యని ఖుర్ఆన్లో చెప్పబడినది ఐదువేల సంవత్సరములప్పుడు భగవద్గీత
యను పేరుతో యున్నదని సత్యమునే చెప్పుచున్నాము. అలాగే 5000
సంవత్సరముల పూర్వము కృష్ణ అని చెప్పబడిన ఆయనే మూసాయని
చెప్పబడుచున్నాడని చెప్పడములో తప్పు ఏమీ లేదు కదా! మూసాయని
ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడిన ఆయన అంతకుముందు ఆరు వందల
సంవత్సరములప్పుడు అనగా ఇప్పటికి 2000 సంవత్సరము లప్పుడు చెప్పిన
బైబిలు (ఇంజీలు) లో మోషేయని చెప్పబడినట్లు తెలియబడుచున్నది. మోసే
మూసాగా పేరు మారినట్లు, కృష్ణ మోసేగా తర్వాత మూసాగా పేరు
మారియున్నాడని మేము చెప్పడములో సత్యము లేదనువారు మా మాట
సత్యము కాదని ఎలా చెప్పగలరు?
తౌరాతు గ్రంథము యొక్క పేరు మాత్రము తెలిసినవారు ఆ
గ్రంథమును ఎవరూ చూచియుండలేదు. ఎవరూ చూడని తౌరాతును
భగవద్గీత కాదని ఎలా చెప్పగలరు? అలా తౌరాతు భగవద్గీత కాదని
చెప్పువారు ఎవరయినా తౌరాతు గ్రంథమును తెచ్చి చూపగలరా? వాస్తవానికి
తౌరాతు బైబిలు గ్రంథములో ధర్మశాస్త్రముయని చెప్పబడినది. తర్వాత
ఖుర్ఆన్లో తౌరాత్అని చెప్పబడినది. వాస్తవముగా ద్వాపర యుగము
చివరిలో, కలియుగము మొదటిలో అనగా దాదాపు ఐదు వేల సంవత్సరముల
పూర్వము వ్యాసుని చేత వ్రాయబడిన గ్రంథమునకు మనిషి అయిన వ్యాసుడు
'భగవద్గీత’యని పేరు పెట్టాడు. అయితే గ్రంథములోని జ్ఞానమును చెప్పిన
కృష్ణయను ప్రవక్త స్వయముగా తన గ్రంథమునకు 'తౌరాతు'యని పేరు
పెట్టడము జరిగినది. తౌరాతు గ్రంథమును అనగా అప్పుడు ప్రజల చేత
భారతదేశములో భగవద్గీతయని పిలువబడు గ్రంథమును స్వయముగా
గ్రంథ బోధకుడు అయిన కృష్ణ ప్రవక్త తౌరాతుయని పేరుపెట్టి, మూసా
ప్రవక్తకు నేరుగా గ్రంథమునే ఇచ్చాడు. మూసా ఆనాడు మోషేగా
పిలువబడేవాడని నేడు చాలామందికి తెలియదు. మూసాకు (మోషేకు)
దేవుడు (అల్లాహ్) జ్ఞానమును ఇవ్వలేదు. నేరుగా గ్రంథమునే ఇచ్చాడు.
అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా ఆరు, ఆయత్ 91 లో ఇలా
కలదు. "ఏ మానవమాత్రుని మీద అల్లాహ్ తన జ్ఞానమును ప్రసరింప
చేయలేదు” అని ఉండడమును చూడవచ్చును. అదే వాక్యములో “మూసాకు
గ్రంథమును ఇచ్చినవాడు లేక అవతరింపజేసినవాడు అల్లాహ్యే" అని
కలదు.
ఇదంతయూ ఖుర్ఆన్ గ్రంథములో గమనిస్తే గతచరిత్ర కొంత
అర్థము కాగలదు. నేడు మేథావులుగా యున్న ముస్లీమ్లు కూడా
స్వయముగా ఖుర్ఆన్ గ్రంథమును చదవకుండా, తమ పెద్దలు చెప్పిన
మాటలనే నమ్ముచున్నారు. అందువలన పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో
యున్న ఎన్నో సత్యములు చాలామంది ముస్లీమ్లకు తెలియకుండా
పోయాయి. ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్లదేయను అపోహ ఉండుట
వలన మిగతా ప్రజలు కూడా సత్యమును తెలియలేకపోయారు. నేడు
మా వ్రాతల వలన ఖుర్ఆన్ గ్రంథములోని సత్యమును అన్ని మతముల
ప్రజలు తెలియగలుగుచున్నారు. మా దృష్ఠిలో ఖుర్ఆన్ ఒక మత గ్రంథము
కాదు. "ఖుర్ఆన్ సమస్త ప్రజలకు మార్గదర్శనముగా, జ్యోతిగా
యున్నదని” మేము చెప్పుచున్నాము. తౌరాతుయనబడు భగవద్గీత,
ఇంజీలుయను బైబిలు, అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ మూడు దైవ
గ్రంథములేయని చెప్పుచున్నాము. ఎవరయినా ఈ మూడు దైవగ్రంథముల
లోని జ్ఞానమును తెలియగలిగినప్పుడు వాడు అప్పుడు దేవుని (అల్లాహ్)
ధర్మములో ఉన్నట్లు లెక్కించబడును. అట్లుకాకుండా ఒక దైవగ్రంథమును
మాత్రము ఆశ్రయించి మిగతా రెండు గ్రంథములను చదవనివాడు
(తెలియనివాడు) ఏ ధర్మములో లేనట్లేయని చెప్పవచ్చును. ఈ విషయమును
నేను చెప్పడమే కాదు స్వయముగా అంతిమ దైవ గ్రంథమయిన
ఖుర్ఆన్ఆయందు సూరా 5, ఆయత్ 68 లో ఇలా కలదు చూడండి.
(5-68) “ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును,
మీ ప్రభువు తరపున మీ వద్దకు పంపబడిన ఖుర్ఆన్ గ్రంథమును
మీ జీవితములలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మముపైనా
లేనట్లే".
(62-5) “తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి
నప్పటికీ దానికి అనుగుణముగా ఆచరించనివారు ఎన్ని
గ్రంథములను అనుసరించినా అటువంటి వారిని ఎన్నో గ్రంథము
లను వీపుమీద మోయు గాడిదలాంటివారని ఉపమానముగా
చెప్పవచ్చును. దేవుని (అల్లాహ్) వాక్యములను ధిక్కరించిన వారి
దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లాహ్
సన్మార్గము చూపడు.”
(5-46) “ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యమ్ (మరియమ్మ)
కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము
వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము
అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథాన్ని ఇచ్చాము. అందులో
మార్గదర్శకము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు
గ్రంథమును ధృవీకరించేది. అంతేకాక అది దైవ భీతి కలవారికి
మార్గదర్శినిగా, హితబోధినిగా ఉండేది.”
(5-44) “మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము.
అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఈ తౌరాతు గ్రంథ
ఆధారముగానే ముస్లీమ్ల యిన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు,
యూదుల సమస్యలను పరిష్కరించేవారు.”
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోని పై
వాక్యములను చూచిన తర్వాత ప్రతీ ఒక్కరు తౌరాతు గ్రంథమును గొప్పగా
గుర్తించక తప్పదు. అయితే తౌరాతు గ్రంథమే భగవద్గీతయనీ, ఇంజీలు
(బైబిలు) కంటే ముందు వచ్చిన గ్రంథమే భగవద్గీతయనీ, దానినే
తౌరాతుయని కూడా అంటున్నామని ప్రజలకు తెలియకపోవడము వలన
ముస్లీమ్లయిన వారు తౌరాతును భగవద్గీతయని మేము చెప్పడమును
ఓర్చుకోలేక పోవుచున్నారు. తౌరాతును భగవద్గీతయని అనడము తప్పు
యనీ, అసత్యమని అంటున్నారు. మా మాట అసత్యమని నిరూపించుటకు
మీ వద్ద ఏదయినా ఆధారము కలదా? యని మేము ప్రశ్నించుచున్నాము.
నా మాటను అసత్యమని చెప్పువారు ఎవరయినా సరే ప్రపంచములో ఇది
తౌరాతు గ్రంథమని ప్రత్యేకించి తౌరాతు గ్రంథమును తెచ్చి చూపగలరా?
నేను దేవుని సృష్ఠిలో పెద్ద రహస్యములుగా యున్న ఎన్నో
రహస్యములను “కృష్ణమూస” అను గ్రంథములో చెప్పియున్నాను. అయితే
నా మాటను ఎవరూ నమ్మకపోవచ్చును. మనుషులకు తెలియని ఎన్నో
రహస్యములున్నాయనుటకు తార్కాణముగా నేను ఒక మాటను చెప్పగలను.
నేను మనిషిగా అబద్దము చెప్పువాడిగా కనిపించినా, దేవుడు (అల్లాహ్)
అసత్యము చెప్పువాడు కాదని అందరికీ తెలుసు. చాలామంది ముస్లీమ్లు
ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములను స్థూలముగానే చెప్పుకొంటున్నారు.
స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో సూక్ష్మవాక్యములు (ముతషాబిహాత్
వాక్యములు) కలవని (3-7)లో చెప్పియున్నా దానిని గ్రహించక అన్ని
వాక్యములను స్థూలముగానే చూస్తున్నారు. అందువలన ఖుర్ఆన్ భావము
అందరికి సరిగా అర్థము కాలేదని చెప్పవచ్చును. నేను ఈ మాటను
చెప్పగా కొందరు ముస్లీమ్ పెద్దలు మా మాటను తప్పుపట్టుచూ నేను
ఖుర్ఆన్ గ్రంథమునకు వ్యతిరేఖముగా మాట్లాడుచున్నానని ప్రచారము చేసి
ముస్లీమ్లను తప్పుదారి పట్టిస్తున్నారు. మా మాట నిజమని చెప్పుటకు
ఏడు ఆకాశములు బయట స్థూలముగా ఉన్నాయని ముస్లీమ్ పెద్దలు
చెప్పడము వలన అందరినీ వారు తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పకనే
తెలియుచున్నది. అటువంటి వారిని నేను ఒక ప్రశ్న అడుగుచున్నాను.
దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడని 42వ సూరా 51వ
ఆయత్లో చెప్పబడియున్నది. ఆ మాటను మేము సత్యమని ఒప్పు
కొంటున్నాము. అది దైవ గ్రంథములోని దైవవాక్కుగా లెక్కించుచున్నాము.
ఆ మాట ప్రకారము అల్లాహ్ ఎవరితోనూ మాట్లాడడనీ ప్రతి ముస్లీమ్
ఒప్పుకోక తప్పదు. అయితే అదే ఖుర్ఆన్ గ్రంథములో సూరా నాలుగు
(4) ఆయత్ 164లో ఇలా చెప్పారు చూడండి.
(4-164) "వాస్తవముగా మేము పంపిన ప్రవక్తలలో కొందరి
గాథలను నీకు తెలిపాము. ఇతర ప్రవక్తల గురించి మేము నీకు
తెలుపలేదు. అయితే అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు."
ఈ వాక్యమును చూస్తే 42-51 లో గల వాక్యమునకు
వ్యతిరేఖముగా యున్నది. అందులో దేవుడు ఏ మానవునితోనూ నేరుగా
మాట్లాడడని చెప్పియున్నారు. ఇప్పుడు 4-164లో దేవుడు మూసా ప్రవక్తతో
మాట్లాడినట్లు చెప్పియుండుట వలన ఏది సత్యము? ఏది అసత్యము?
అను సంశయము వస్తున్నది. దీనికి నన్ను విమర్శించు వారు సమాధానము
చెప్పగలరా? చెప్పలేరు. ఒకచోట అల్లాహ్ మాట్లాడడనీ, మరియొక చోట
అల్లాహ్ మాట్లాడునని చెప్పడము వలన ఒక వాక్యమును తప్పు అని
చెప్పక తప్పదు. ఒకచోట అల్లాహ్ ఏ పని చేయడు అని చెప్పి మరియొకచోట
అల్లాహ్ ఎల్లప్పుడు పని చేయుచున్నాడని చెప్పుచున్నారు. 6-102 లో
'అల్లాహ్ కార్యకర్తగా యున్నాడని' చెప్పడము జరిగినది. అక్కడ కూడా
రెండు రకముల చెప్పడము వలన అల్లాహ్ పని చేయునా? లేక చేయడా?
అను సంశయము వస్తున్నది. సూక్ష్మజ్ఞానము తెలియక కేవలము స్థూల
జ్ఞానమును చెప్పువారు ఏదో ఒక వాక్యమును అసత్యమని చెప్పక తప్పదు.
కొందరు ఏ జవాబు చెప్పలేని స్థితిలో నిలిచిపోవుదురు.
తౌరాతును భగవద్గీతయని తెలిసినవారు మాత్రమే ఇటువంటి
కష్టమైన వాక్యములకు జవాబును చెప్పగలరు. ఎందుకనగా! భగవద్గీతలో
సూక్ష్మమైన వాక్యముల వివరములు గలవు. ఎవడు భగవద్గీతను (తౌరాతును)
తెలియగలడో, వాడు ఎటువంటి కష్టమైన వాక్యములకయినా మరియు
ద్వంద్వార్థములను ఇచ్చు వాక్యములకయినా జవాబును వివరముగా
చెప్పగలడు. భగవద్గీత జ్ఞానమును తెలిసినవాడు ఇటు బైబిలు గ్రంథములోని
వాక్యములకయినా, అటు ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములకయినా
జవాబును చెప్పగలుగు స్థోమత కల్గియుండును. తౌరాతుయనునది భగవద్గీత
రూపములో యున్నదని తెలియనివారు తౌరాతును తెలియనివారేయని
చెప్పవచ్చును. తౌరాతును తెలియనివారు బైబిలులోని కష్టమైన సూక్ష్మ
వాక్యములకు మరియు ఖుర్ఆన్లోని సూక్ష్మవాక్యములకు వివరమును
చెప్పలేరు. నాకు భగవద్గీతయే తౌరాతు గ్రంథమని సంపూర్ణముగా
తెలియును. అంతేకాక భగవద్గీతకు ఎలా పేరు వచ్చినదీ, అది ఎవరి చేత
చెప్పబడినదీ, అట్లే అది ఎవరి చేత వ్రాయబడినది తెలుసు. ఇంకా
భగవద్గీతగా మొదట పిలువబడిన గ్రంథమునకు తౌరాతుయను పేరు ఎలా
వచ్చినది, ఎప్పుడు వచ్చినది తెలియును. తౌరాతు అని పేరు పెట్టబడిన
గ్రంథమును నేరుగా దేవుడు (అల్లాహ్) మోషేకు ఎలా ఇచ్చినది (మూసాకు
ఎలా ఇచ్చినది) నాకు తెలుసు. ఎవరికీ తెలియని ఆ రహస్యమును
“కృష్ణమూస” అను గ్రంథములో మేము వ్రాయడము కూడా జరిగినది.
తౌరాతు భగవద్గీత కాదనీ, నేను చెప్పినది తప్పని చెప్పువారు
ఎవరయినా సరే వారు తౌరాతు గ్రంథమును ప్రత్యేకముగా చూపగలరా?
తౌరాతు గ్రంథము తర్వాత 3000 సంవత్సరములకు బైబిలు, బైబిలు తర్వాత
600 సంవత్సరములకు ఖుర్ఆన్ గ్రంథము తయారయినది. తౌరాతుకంటే
ముందు జబుర గ్రంథమున్నదని దానిని దావూద్ ప్రవక్తకు ఇచ్చామని
చెప్పినట్లు 4–163లో చెప్పబడియున్నది. అక్కడ చెప్పిన దావూద్కు ఇచ్చిన
జబుర గ్రంథమునుగానీ, మూసాకు ఇచ్చిన తౌరాతు గ్రంథమునుగానీ
ఎవరయినా తెచ్చి చూపగలరా? అవి ప్రత్యేకముగా ఉన్నాయని నిరూపించ
గలరా? ఆ రెండు గ్రంథములను మీరుగానీ, మీ పెద్దలు గానీ చూచారా?
అని ప్రశ్నించుచున్నాను. ఎవరూ చూడకుండా తమకు అంతా తెలిసినట్లు
మేము చెప్పునది అసత్యమని, భగవద్గీత తౌరాతు కాదని ఎలా చెప్పగలరు?
నా ప్రశ్నకు బహుశా జవాబు ఉండదు. అందువలన ఎదుటి మనిషి
చెప్పునది సత్యమా, అసత్యమాయని ఆలోచించకుండా మాట్లాడవద్దండి.
పెద్దలు తమవారనీ, వారు చెప్పునది అంతా సత్యమని అనుకోవద్దండి.
6-91లో “తౌరాతులోని విషయములు మీకుగానీ, మీ పెద్దలకుగానీ
తెలియవు" అని చెప్పిన ఖుర్ఆన్ మాటను జ్ఞాపకము పెట్టుకోండి.
ఖుర్ఆన్లోని సమాచారము తౌరాతు గ్రంథము లోనిదే అయినందున ప్రతి
ఒక్కరూ విచక్షణతో, మేథస్సును ఉపయోగించి ఖుర్ఆన్ గ్రంథమును
చదవండి. అప్పుడు ఖుర్ఆన్లోని వాక్యముల ఔన్నత్యము మీకు
తెలియగలదు. అప్పుడు దానినిబట్టి తౌరాతు అంటే ఎలా ఉంటుందో
తెలియగలదు. నేడు భగవద్గీత సారాంశము తెలియని హిందువులు, బైబిలు
వాక్యములోని తండ్రి, కుమారుడు ఎవరో తెలియని క్రైస్థవులు, ఖుర్ఆన్
గ్రంథము యొక్క సూక్ష్మవాక్యములను వదలి స్థూలమును ఆశ్రయించిన
ముస్లీమ్లు ఉన్నందున తౌరాతీంటే ఏమిటో తెలియక, తమ గ్రంథము
తౌరాతు గ్రంథములోని భాగమేయని ముస్లీమ్లు మరియు క్రైస్తవులు
తెలియలేకపోయినారు.
ప్రశ్న :- మీ మీద ఒక అపోహ కలదు. మీరు మతమార్పిడి చేయకున్నా,
మత ఆచారాలను పాటించే వారిని కొంత తప్పుదారి పట్టిస్తున్నారనీ, వారి
మతాచారములను వారు పాటించమని చెప్పినా, క్రొత్తగా ముస్లీమ్లకు
నుదుటి మీద నాలుగు చక్రముల గుర్తును దేవుని ముద్రగా ధరించమని
మీరు చెప్పుచున్నట్లు కొందరు ముస్లీమ్లు అనుకోవడము జరుగుచున్నది.
వారి మతములో లేని ఆచారమును మీరు ఎందుకు చెప్పినట్లు? మీరు
చెప్పారనీ దానివలన వారి మతము విచ్ఛిన్నము కాగలదని అను
కొంటున్నారు. మీరు అటువంటి పనిని ఎందుకు చేయుచున్నారు?
జవాబు :- నేను దైవజ్ఞానమును చెప్పువాడనేగానీ మత ఆచార విషయముల
జోలికి పోవువాడను కాను. దేవుని ముద్రను ముస్లీమ్ల నుదుటి మీద
ధరంచమని నేను చెప్పాననడము మీరన్నట్లు అది ఒక అపోహ మాత్రమే
గానీ వాస్తవము కాదు. దేవుని ముద్రను గురించి దైవ గ్రంథములలో
ఉన్న జ్ఞానమును చెప్పాముగానీ ఎవరినీ ధరించమని చెప్పలేదు. మూడు
మతములలో ఏ మతమువారికి ప్రత్యేకముగా దేవుని ముద్రను ధరించమని
నేను చెప్పలేదు. దేవుని ముద్రను గురించి ప్రత్యక్షముగా ఇంజీలు (బైబిలు)
గ్రంథములోనూ, పరోక్షముగా అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్
గ్రంథములోనూ ఉన్న విషయమును వివరించి మూడు మతముల వారికి
అర్థమగులాగున చెప్పాము.
బైబిలు గ్రంథములో చివరి పాఠమయిన యోహాన్ ప్రకటనల
గ్రంథములో అధ్యాయము 9, వచనములు 4,5,6 లలో ఉన్న విషయమును
వివరించి చెప్పాము. అలాగే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 5, ఆయత్ 2
లోనూ మరియు సూరా 22, ఆయత్ 32 లోను చెప్పబడిన విషయమును
విశధీకరించి చెప్పాము. నేను చెప్పినది రెండు దైవగ్రంథములలో వాక్య
రూపముగా యున్న జ్ఞానమును నాకు దేవుడు అందించిన వివరము
ప్రకారము చెప్పాము. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమున దేవుని
ముద్రను ప్రత్యక్షముగా చెప్పకున్నా, పరోక్షముగా చెప్పియున్న విషయమును
కూడా చెప్పాము. దేవుని ముద్ర ఆకారమును బైబిలుయందుగానీ, ఖుర్ఆన్
యందుగానీ ఇదీయని నిర్ధారణ చేసి చెప్పలేదు. అయితే భగవద్గీతయందు
దేవుని ముద్ర ఆకారము సులభముగా తెలిసిపోవుచున్నది. అలా తెలిసిన
దానిని నేను చిత్రీకరించి ప్రజలకు తెలియజేశాము తప్ప ఒక్క మతమును
దృష్ఠిలో పెట్టుకొని చెప్పలేదు. మూడు దైవగ్రంథములలోని దైవజ్ఞానము
ప్రజల అందరిసొత్తు. అంతేగానీ ఏ గ్రంథములోని జ్ఞానమయినా ఫలానా
మతము వారికేయని చెప్పడము తప్పు. అలా అనడము అల్లాహ్ (దేవుడు)
ఒప్పుకోడు. అందువలన దేవుని (అల్లాహ్) చిత్తానుసారము దేవుని ముద్రను
గురించి మూడు మతములలోని ప్రజలందరికీ చెప్పాము.
మేము చెప్పిన దేవుని ముద్ర జ్ఞానమును విన్న కొందరు దేవుని
ముద్రను వారి నొసళ్ల భాగమున ధరించుచున్నారు. మా వద్దకు వచ్చి మా
బోధలను వింటున్న అందరూ దేవుని ముద్రను ధరించలేదుగానీ, కొందరు
క్రైస్తవులు, కొందరు ముస్లీమ్లు ధరించుచున్నారు. హిందువులలో
చాలామంది ధరించడము జరుగుచున్నది. క్రొత్తగా వచ్చిన ఆకారము
దేవుని ముద్ర అయినందున దీనిని గురించి హిందువులలో కూడా కొందరు
విమర్శించుచున్నారు. అట్లే క్రైస్థవులలో ముస్లీమ్లలో కూడా పెద్ద ఎత్తున
విమర్శలు గలవు. అన్ని విమర్శలకు తట్టుకొని, అందరికీ జవాబు చెప్పగల
స్థోమత యున్న కొద్దిమంది ముస్లీమ్లు, క్రైస్థవులు ధైర్యముగా ధరించు
చున్నారు. క్రైస్తవమతములో 'యోహాన్ ప్రకటనల గ్రంథము' అను
పాఠములో అధ్యాయము తొమ్మిది, వాక్యము నాలుగు, ఐదు, ఆరు లో
చెప్పియున్న విషయమును ఇప్పుడు మనము చూద్దాము.
(9-4) “నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప
భూమిపై నున్న గడ్డికైనను, ఏ మొక్కలకైననూ, మరి ఏ వృక్షమున
కైననూ హాని కలుగుజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను.”
(9-5) “వారిని చంపుటకు ఆజ్ఞ ఇవ్వబడలేదు గానీ ఐదు నెలల
వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి
వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె
ఉండును.”
(9-6) “ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు
గానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు
గానీ మరణము వారివద్ద నుండి పారిపోవును."
ఈ విధముగా ద్వితీయ దైవ గ్రంథము బైబిలులో చెప్పియున్నారు.
అక్కడ చెప్పిన విషయమునే నేను విశధీకరించి దేవుని ముద్ర ఆకారమును
చెప్పడమైనది. జ్ఞానము అర్థమయిన వారు దేవదూతలకు దేవుడు ఇచ్చిన
ఆజ్ఞను గమనించి జరుగబోవు కాలములో దేవుని దూతల శిక్షలనుండి
తప్పించుకొనుటకు దేవుని ముద్రను ధరించారు. కొందరు వారివారి
మతముల వారికి భయపడి దేవుని ముద్రను ధరించలేదు. ధరించని
వారికి ధరించమని నేను ఎప్పుడు గానీ, ఏ మతస్థునికిగానీ చెప్పలేదు.
ముస్లీమ్లు కేవలము నూటిలో ఒక్కశాతము వారు మాత్రమే దేవుని ముద్రను
ధరించుచున్నారు. అదియూ బయట సమాజములో ఉన్నప్పుడు ధరించక
జ్ఞాన బోధలు జరుగునప్పుడు మాత్రము కొందరు ధరించుచున్నారు.
కొందరు ధరించడము లేదు. ముద్రను ధరించిన వారిని నీవు ఎందుకు
ధరించావనిగానీ, ధరించని వారిని నీవు ఎందుకు ధరించలేదు అనిగానీ
నేను అడగడము లేదు. జ్ఞానము తెలుపడమే నా పనిగానీ మిగతాదంతా
నాకు సంబంధము లేదు. ముద్ర ధరించే వారిని చూచి వీరిది మూడు
మతములుగాని క్రొత్తమతమని కొందరు చెప్పుచుండుటను కూడా చూచాము.
అయినా నా విధానము దైవజ్ఞానము చెప్పడమేగానీ మతమునుగానీ, మత
ఆచారములను గురించి చెప్పడముగానీ నా పని కాదు.
ప్రశ్న :- మీరు భగవద్గీత (తౌరాతు), ఇంజీలు (బైబిలు), ఖుర్ఆన్ మూడు
గ్రంథములను దైవ గ్రంథములు అని అనుచున్నారు. మిగతా ప్రజలు
మూడు గ్రంథములను దైవ గ్రంథములుగా ఒప్పుకోక మాది మాత్రమే
దైవ గ్రంథమని, మిగతావి రెండు మాయ గ్రంథములని అంటున్నారు.
ఎవరి గ్రంథము వారికి గొప్పగనే యున్నది. అందువలన మిగతా రెండు
గ్రంథములను తమవి కాదనీ, వాటిని ముట్టుకోవడము కూడా చేయకుండా
దూరముగా పెట్టుచున్నారు. ప్రజలందరూ తమ తమ గ్రంథములను
గొప్పగా చెప్పుకొన్నా, దైవ గ్రంథములనినా, చివరకు వాటిని తమ మత
గ్రంథమని చెప్పుచున్నారు. అలా వారు చెప్పినట్లు మూడు గ్రంథములు
మత గ్రంథములు కావా?
జవాబు :- భగవద్గీత (5160 సంవత్సరముల పూర్వము), బైబిలు (2015
సంవత్సరముల పూర్వము), ఖుర్ఆన్ (1400 సంవత్సరముల పూర్వము)
తయారయిన మూడు గ్రంథములు దైవ గ్రంథములని చెప్పుటకు అర్హతగా
యున్నవి. అయితే మనుషులయిన వారు పుట్టుకతోనే మూడు మతములుగా
విభజింపబడియుండుట వలన మూడు మతముల వారు వేరువేరుగా
మూడు గ్రంథములను తమ గ్రంథములని చెప్పుకొంటున్నారు. భగవద్గీత
హిందువులదనీ, బైబిలు క్రైస్థవులదనీ, ఖుర్ఆన్ ముస్లీమ్ల గ్రంథమని చెప్పు
కోవడము జరుగుచున్నది. అయితే ఎంత లోతుగా చూచినా మూడు
గ్రంథములలో ఏ గ్రంథము ఏ మతమునకూ సంబంధించినది కాదు.
మూడు గ్రంథములు సర్వమానవుల కొరకు తయారయినవేయని
చెప్పవచ్చును. మూడు గ్రంథములు ఒకే గ్రంథములోని భాగములని
చెప్పవచ్చును. మూడు దైవ గ్రంథములు ఒకే దేవున్ని గురించి బోధించు
చున్నవి తప్ప ఇతరము లేదు.
ఒక గ్రంథమును మాత్రము ఒక మతము వారు తమదియని
చెప్పుకొన్నా, వారు అందరూ ఆ గ్రంథమును పూర్తి ఆమూలాగ్రముగా
చదివారని చెప్పలేము. హిందువులలో భగవద్గీతను చదవని వారు 80
శాతము గలరు. అలాగే క్రైస్తవులలో కూడా కలరు. ముస్లీమ్ల విషయానికి
వస్తే 95 శాతము ఖుర్ఆన్ గ్రంథమును చదవలేదు. ఒకవేళ ఎవరయినా
చదివాము అంటే వారు వారి భాషలో కాకుండా అరబ్బీ భాషలో చదవడము
వలన ఖుర్ఆన్లోని భావము ఏమాత్రము తెలియకుండా పోయినది. దీని
ప్రకారము చూస్తే ముస్లీమ్లలో ఖుర్ఆన్న చదివి అర్థము చేసుకొన్నవారు
కేవలము ఐదు శాతమేయని చెప్పవచ్చును. అలా ఐదు శాతము మంది
చదివినా ఖుర్ఆన్లోని కొన్ని సూక్ష్మవాక్యములు వారికి అర్థమయివుండవని
చెప్పవచ్చును. మూడు మతములలో మూడు దైవ గ్రంథములలోని సూక్ష్మ
విషయములు అర్థము కాకపోవడము వలన మూడు ఒకే దైవజ్ఞానమును
బోధించుచున్నవని తెలియలేకపోయారు. అటువంటి సందర్భములో మా
గ్రంథము వేరు, మా గ్రంథము గొప్పదియని చెప్పుకొంటున్నారు. మూడు
మతముల వారు తమ తమ గ్రంథములని విడివిడిగా చెప్పుకోవడమే
కాకుండా ముస్లీమ్లది ఖుర్ఆన్ గ్రంథమనీ, క్రైస్థవులది బైబిలు గ్రంథమనీ,
హిందువులది భగవద్గీతయనీ చెప్పుకోవడము జరుగుచున్నది.
మూడు మతముల వారు అనుకొన్నట్లు ఏ గ్రంథము ఏ మతమునకు
సంబంధించినది కాదు. ఖుర్ఆన్ దైవ గ్రంథము అని చెప్పబడినది గానీ,
మత గ్రంథమని ఆ గ్రంథము మీద లేదు. అంతిమ దైవ గ్రంథము
అన్నారు గానీ, ముస్లీమ్ల గ్రంథమని చెప్పలేదు. అట్లే ప్రథమ దైవ గ్రంథము
యని భగవద్గీతను చెప్పుచున్నాముగానీ దానిని హిందువుల గ్రంథమని
ఎక్కడా వ్రాసిపెట్టలేదు. న్యాయస్థానములలో భగవద్గీతను అన్ని మతముల
వారికి సాక్ష్యముగా వాడుచున్నారు. అక్కడ ఒక్క మతమునకు మాత్రమే
దానిని వాడలేదు. అంతేకాక బైబిలు గ్రంథములో “సమస్త జనులారా
నావద్దకు రండి, నా బోధలు వినండి" యని చెప్పారు తప్ప
ఓ క్రైస్థవులారా నా వద్దకు రండియని చెప్పలేదు. అట్లే ఖుర్ఆన్ గ్రంథములో
(81-27) మరియు (6-90) వాక్యములలో “ఇది సమస్త జనులకు
జ్ఞాన సందేశము, హితోపదేశము” అని చెప్పియున్నారు. భగవద్గీతలో
మతముల ప్రసక్తే లేదు. మానవులందరికీ భగవద్గీత చెప్పబడినది. భగవద్గీత
తయారయిన కాలములో ఇతర మతములే లేవు. ఉన్నవారంతా ఒకే
సమాజముగా యుండేవారు. తర్వాత క్రైస్థవము, ఇస్లామ్ తయారయిన
తర్వాత మతముల ప్రసక్తి వచ్చినది. ఏ మతములు లేని సమయములో
ఆకాశవాణి ద్వారా జబుర (జపర) జ్ఞానము చెప్పబడగా, అది ద్వాపర
యుగము చివరిలో గ్రంథముగా (భగవద్గీతగా) తయారయినది. దానినే
ప్రథమ దైవ గ్రంథము అని అంటున్నాము. చివరిగా తయారయిన గ్రంథము
మతములున్నప్పుడు తయారయినా అది ఒక మత గ్రంథము కాదుయన్నట్లు,
సమస్త మానవాళికి యని తెలియునట్లు (81-27) ఆయత్లో “ఇది సమస్త
లోకవాసుల కొరకు హితోపదేశము” అని చెప్పారు. కుల, మతములకు
అతీతుడు దేవుడు. దేవుని జ్ఞానము కూడా మతములకు అతీతమైనది.
మూడు దైవ గ్రంథములలో చెప్పిన జ్ఞానము మతములకు సంబంధము
లేదనీ, మనుషులందరికి సంబంధించినదనీ చెప్పవచ్చును.
ప్రశ్న :- ఖుర్ఆన్ను ముస్లీమ్లు తమది దైవ గ్రంథమని చెప్పు
కొంటున్నప్పుడు అందులోని జ్ఞానమును వారు తెలిసి సంతోషపడక, ఖుర్ఆన్
కేవలము మా మతమునకు సంబంధించినదియని ఎందుకు చెప్పుకోవలెను?
మీరు చెప్పు జ్ఞానమును ఎందుకు వ్యతిరేఖించవలెను? దైవజ్ఞానము
మనుషులందరికీ అవసరమైనదని అనుకోక ఇది మాకు మాత్రమేయని
కొందరు మొండిగా చెప్పడములో ఏమయినా విశేషమున్నదా?
జవాబు :- ముస్లీమ్లు ప్రత్యేకమయిన సమాజముగాయున్నా వారు
చాలామంది అనగా దాదాపు 99 శాతము పూర్తి దేవుని మీద విశ్వాసము
కల్గియున్నవారే గలరు. దేవుని మీద విశ్వాసమున్నంత స్థాయి దేవుని
జ్ఞానము వారికి తెలియదు. దేవుని జ్ఞానమును వారి పెద్దలు అనగా
గురువులుగా యున్నవారు వారికి చెప్పవలెను. 'ముస్లీమ్' అనగా ‘విశ్వాసి'
యని అర్థము. దేవుని మీద గల విశ్వాసమును ఆసరాగా చేసుకొని వారి
ఏది సత్యముఏది అసత్యము
పెద్దలు వారిని దేవుని మార్గము వైపు నడుపవలసియుండగా, వారి
పెద్దలయిన వారికి దేవుని జ్ఞానముకంటే మతమే ముఖ్యముగా ఉండుట
వలన దేవుని జ్ఞానమును బోధించు స్థానములో ఖుర్ఆన్ గ్రంథములోని
వచనములను చెప్పకుండా మత ఆచారాలనే ఎక్కువగా చెప్పుచున్నారు.
అప్పుడు ఆ బోధలు వినే ముస్లీమ్లందరూ మత ఆచారములనే దైవ
జ్ఞానమనుకొంటున్నారు. అందువలన ముస్లీమ్లలో పేరుకు తగినట్లు
వారికి దేవుని మీద విశ్వాసమున్నా దేవుని జ్ఞానము తెలియకుండా
పోయినది. వారికి తెలిసిన మత ఆచారముల ప్రకారము ఖుర్ఆన్ మా
మత గ్రంథమని అంటున్నారు. అలా అనుటకు వారి పెద్దలే కారణము.
ఖుర్ఆన్ జ్ఞానము ముస్లీమ్లు తెలియగలిగితే తమ పెద్దరికము లేకుండా
పోవునని, ముస్లీమ్ సమాజమునంతటిని తమ గుప్పిట్లో పెట్టుకొని తాము
చెప్పినట్లు నడువవలెనని, 'షరియత్' యను నియమమును పెట్టి ముస్లీమ్ల
నందరినీ మత షరియత్తో కట్టివేయుచున్నారు తప్ప ఖుర్ఆన్ జ్ఞానమును
బోధించి ముస్లీమ్లను జ్ఞానులుగా చేయడము లేదు. ఎవరయినా వారిని
తప్పుబట్టితే వారు తమ ఖుర్ఆను, ప్రవక్తను కించపరచి మాట్లాడారని
వారి మీదికి ముస్లీమ్లను రెచ్చకొట్టి పంపుదురు. కొందరికి సత్యము
తెలిసినా, ఇతరులది తప్పు లేదని తెలిసినా తమ పెద్దల మాట వినవలెనను
నియమము ప్రకారము ముస్లీమ్లు పోవుచున్నారు. ఈ మధ్య కాలములో
మా మీద ఇటువంటి ఆరోపణలనే ముస్లీమ్ పెద్దలు చేయడము జరిగినది.
ఒక్క ముస్లీమ్ మతములోనే కాదుగానీ ప్రతి మతములో వారి
గురువులను బట్టి ఆ మతముల వారు నడువడము జరుగుచున్నది.
గురువులయిన వారు ఏ మతములో కూడా దైవజ్ఞానమును బోధించక
ఇది జ్ఞానమేయని నమ్మించి, వారికి మత జాఢ్యమును నూరిపోయుచున్నారు.
ముఖ్యముగా మూడు మతములలో మూడు దైవ గ్రంథములుండగా, ఆయా
మతముల వారికి దైవ గ్రంథములలోని జ్ఞానము తెలియకుండా పోయినది.
వారి పెద్దలు అనబడు గురువులు దైవ గ్రంథములలోని జ్ఞానమును
చెప్పడము లేదు. ఎందుకనగా! నిజము చెప్పితే గ్రంథములోని జ్ఞానము
వారికే తెలియదు. అందువలన తమ పెద్దరికమును కాపాడుకొనేదానికి
హిందువుల పెద్దలు వేదములను, క్రైస్తవుల పెద్దలు బైబిలులోని
ఆదికాండమును, ముస్లీమ్లలోని పెద్దలు హదీసు గ్రంథములలోని
వాక్యములను బోధించుచున్నారు. దేవుడు ప్రతి మతమునకు ఒక దైవ
గ్రంథమును ఇచ్చి అందులో తన జ్ఞానమును నింపియుండగా, దైవ
గ్రంథములను కాదని దేవుని వాక్యమలు కాని వాటిని, మనుషులు వ్రాసుకొన్న
వాటిని ఎందుకు చెప్పుకోవాలి?
హిందువులలో చాలామంది తమ దైవ గ్రంథము భగవద్గీతయని
తెలియని స్థితిలో యున్నారు. కొందరు తమ గ్రంథము వేదములుయని
నాల్గు వేదముల పేర్లు చెప్పుచున్నారు. వేదములను మనుషులు వ్రాశారని
కూడా తెలియక వాటిని దేవుడే ఇచ్చాడని చెప్పుచున్నారు. వేదములను
వ్యాసుడు వ్రాసిన తర్వాత ప్రజలు అధర్మ మార్గములో పోవు అవకాశమున్న
దనీ, భూమిమీద అధర్మములు వృద్ధియగుచున్నవనీ, ధర్మములకు ముప్పు
ఏర్పడినదని తలచిన దేవుడు భగవద్గీతను చెప్పడము జరిగినది. అయితే
కొందరు దైవ గ్రంథమయిన భగవద్గీతకంటే మనుషులు వ్రాసిన వేదములకే
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముస్లీమ్ సమాజములో కూడా దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్ ముందే తయారుకాగా తర్వాత మనుషులు వ్రాసిన
హదీసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము జరగుచున్నది. దైవ గ్రంథమయిన
ఖుర్ఆన్లో దేవుని జ్ఞానముండగా, హదీసు గ్రంథములలో మతమునకు
సంబంధించిన మతాచారములే ఎక్కువ గలవు. నేడు ముస్లీమ్లలో ఎక్కువ
శాతము హదీసులు వినుచుండగా, తక్కువ శాతము ఖుర్ఆన్ను వినడము
జరుగుచున్నది. పెద్దలమాటే ముఖ్యమని తలచిన హిందువులుగానీ,
ముస్లీమ్లుగానీ దైవజ్ఞానమును ఆశ్రయించక తమ పెద్దలు బోధిస్తున్న
మతాచారములనే ఎక్కువగా తెలియుచున్నారు. మతాచారములను తెలిసిన
వారు అదే నిజమైన జ్ఞానమని తలచి, మతము వెంట పరుగెడుచున్నారు
తప్ప దైవజ్ఞానము వెంట నడువడము లేదు. అందువలన దైవజ్ఞానమును
మాత్రమే బోధించు మమ్ములను చూచి కొందరు హిందూ గురువులకు
సరిపోదు. అట్లే కొందరు ముస్లీమ్ పెద్దలకు సరిపోలేదు.
ప్రశ్న :- మీరు దైవ జ్ఞానమును మాత్రమే చెప్పినప్పుడు మిగతా పెద్దలు
సంతోషపడక మీరు హిందువులనందరినీ తప్పుదారిలో పంపుచున్నాడని
హిందువులు, మా మతమును విచ్ఛిన్నము చేయుచున్నాడని ముస్లీమ్లు
ఎందుకు అంటున్నారు?
జవాబు :- వాస్తవముగా వారికి జ్ఞానమునకు, మతమునకు యున్న తేడా
తెలియక అలా మాట్లాడుచున్నారు. నేను చెప్పునది దైవజ్ఞానము మాత్రమే.
మత సాంప్రదాయములను గురించి ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి మతము,
మత సాంప్రదాయములు వేరు, దేవుడు, దేవుని సాంప్రదాయములు వేరు.
మనుషులందరు మతములలో పుట్టుచున్నారు. ఏదో ఒక మతములో
పుట్టిన మనిషి తన జీవితములో దేవుని జ్ఞానమును కొంత తెలియగలుగు
చున్నాడు. ఒక మతములో యున్న మనిషి తన జీవితములో దేవుని
జ్ఞానమును తెలియవచ్చును లేక తెలియకపోవచ్చును. దీనినిబట్టి మనిషికి
పుట్టుకతోనే మతమున్నదిగానీ, దైవజ్ఞానము లేదని తెలియుచున్నది.
పుట్టుకతో లేని దైవజ్ఞానమును కొందరు మనుషులు తెలియుచున్నారు,
కొందరు తెలియక అజ్ఞానులవలె జీవితమును గడుపుచున్నారు.
మనిషి ఏదో ఒక మతములో పుట్టుట వలన ఆ మనిషికి ఆ
మతము యొక్క సాంప్రదాయములు తప్పక తెలిసియుండును. అంతేకాక
తాను ఏ మతములో పుట్టాడో వానికి ఆ మత ఆచారములు తన
కుటుంబములోని వారితో సహా చిన్నవయస్సు నుండి ఆచరించుట వలన
ఏ మతము వానికి ఆ మత ఆచారములు బాగా తెలిసియుండును.
మతములో మనిషి పుట్టుట వలన అనగా తన తల్లితండ్రులు ఏదో ఒక
మతమువారయిన దానివలన, అతనికి పెద్దల ఆస్తి సంక్రమించినట్లు మత
ఆచారములు కూడా వచ్చియుండును. మత ఆచారములను క్రొత్తగా
గురువులు నేర్పవలసిన అవసరము లేదు. గురువులు దైవజ్ఞానమును
మనిషికి నేర్పవలసియున్నది. అయితే నేడు గురువులు దైవజ్ఞానమును
బోధించక మతాచారములనే బోధించుచూ ప్రజల చేత ఆచరింపజేయు
చున్నారు. మనిషి మధ్యలో మతాచారములను మరచి పోకుండా,
ఎవరయినా మత ఆచారములను ఆచరించకుండా ఉంటే అటువంటి వారికి
మతాచారములు ముఖ్యమని తెలిపి ఆచరింపజేయుచుందురు.
మతాచారములే దైవ ఆచరణలుగా వర్ణించి చెప్పుచుందురు.
మతములు మతాచారములు వేరనీ, దేవుడు, దేవుని జ్ఞానము వేరని
తెలియని గురువులు భూమిమీద ఉండుట వలన ప్రజలకు కూడా దేవుని
జ్ఞానము ప్రత్యేకమైనదని తెలియకుండా పోయినది. ఈ మధ్య కాలములో
మేము దేవుని జ్ఞానమును బోధిస్తే దానిని కూడా మత ఆచారములుగా
కొందరు అనుకోవడము జరుగుచున్నది. మేము బోధించు జ్ఞానము
కేవలము దేవునికి సంబంధించినదనీ, మతముతో ఏమాత్రము సంబంధ
ముండదనీ తెలుపుచున్నాము. దేవుని జ్ఞానమును దేవుడే తన గ్రంథములో
తెల్పియున్నాడు. దైవ గ్రంథములు భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు
గ్రంథములుగా కనిపించుచున్నా అవి వాస్తవముగా ఒకే గ్రంథములోని
భాగములేయనీ, ఒకే దేవుని జ్ఞానమునే బోధించుచున్నవని చెప్పవచ్చును.
అందువలన చివరి దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో ఐదవ సూరాలో
68, 48, 44 ఆయత్లలో తౌరాతు (భగవద్గీత), ఇంజీలు (బైబిలు) యొక్క
వాక్యములు దైవజ్ఞానమని ధృవీకరణ (సాక్ష్యము)గా చెప్పబడుచున్నది.
మూడు దైవ గ్రంథములలో దేవుని జ్ఞానము తప్ప మతమునకు
సంబంధించిన విషయములు లేవు. ఉదాహరణకు భగవద్గీతను
తీసుకొందాము. అందులో సంపూర్ణమైన దైవజ్ఞానము చెప్పబడినది.
భగవద్గీత హిందువుల గ్రంథము అని చెప్పబడినా అందులో ఎక్కడయినా
హిందువుల సాంప్రదాయములను గురించి చెప్పియున్నారా? అని ఎంత
వెదకినా అటువంటిది ఏమీ కనిపించదు. హిందువుల మత ఆచారము
ప్రకారము హిందూ సన్న్యాసులు కాషాయ వస్త్రములను ధరించడము,
జుట్టు, గడ్డము పెంచడము జరుగుచున్నది. ఇది హిందూ మతములోని
సాంప్రదాయమయినా భగవద్గీత గ్రంథములో సన్న్యాసులను గురించి
చెప్పినప్పుడు జ్ఞానరీత్యా ఎలా ఉండాలో చెప్పారు గానీ, మత ఆచారరీత్యా
కాషాయగుడ్డలు ధరించడము గానీ, జుట్టు, గడ్డమును పెంచడము గానీ
చెప్పలేదు. దైవ గ్రంథములలో మత ఆచారములకు తావుండదు. మత
ఆచారములు మిగతా రెండు గ్రంథములలో కూడా చెప్పలేదు. దైవ
గ్రంథములలో దేవుని జ్ఞానము తప్ప మత ఆచారములు ఉండవు.
నేను మూడు దైవగ్రంథములలోని సూక్ష్మవాక్యములను వివరముగా
చెప్పుచున్నాను. అంతేగానీ ఏ మత ఆచారములనుగానీ ఏ మతస్థులకు
చెప్పలేదు. అంతేకాక వారు ఆచరించుచున్న వారి మత ఆచారములను
ఆచరించమనిగానీ, ఆచరించవద్దు అనిగానీ నేను ఎప్పుడూ చెప్పలేదు.
అటువంటప్పుడు ఎవరి మతమును నేను విచ్ఛిన్నము చేయలేదు కదా!
కొందరి ఆరోపణలలో తమ మతములో లేని దేవుని ముద్రను తమ
మతము వారు నుదుటి మీద ధరించుచున్నారనీ, దానిని మీరు చెప్పడము
వలననే ముస్లీమ్లు క్రొత్తగా 'దేవుని ముద్ర' అను దానిని ధరించుచున్నారనీ,
నుదుటి మీద హిందువులు తప్ప ముస్లీమ్లు దేనినీ ధరించరనీ, అటువంటి
వారు మీ బోధల వలన మత నియమమును వదలి దేవుని చిహ్నము
అనబడు దానిని ధరించడము వలన, ముస్లీమ్లు లేని ఆచారములను
ఆచరించుట వలన, వారిని హిందూ ఆచారములకు అలవాటు చేసినట్లు
అగుచున్నదనీ, అటువంటప్పుడు మీరు ముస్లీమ్లను హిందువులుగా
మార్చుచున్నారని మమ్ములను ఆరోపించడము జరుగుచున్నది. నేను
ముస్లీమ్లను హిందువుల వైపు మళ్లించుచున్నాను అని అనడము ఆరోపణ
మాత్రమేగానీ అందులో సత్యము లేదని నేను చెప్పుచున్నాను.
“మత మార్పిడి దైవ ద్రోహము" అని గతములో నేను ఒక
గ్రంథమును వ్రాసియున్నాను. మతమార్పిడి దైవ ద్రోహముతో సమానమగు
ననీ, అందువలన పాపము వస్తుందనీ, దేవుడు అన్నీ తెలిసిన వివేకశాలియై
నందున ఎవరిని ఎక్కడ ఏ మతములో పుట్టించాలో తెలిసి పుట్టించాడనీ
అందువలన దేవుడు ఇచ్చిన మతములోనే యుండి జ్ఞానమును తెలియాలి
యనీ, దైవజ్ఞానమును తెలియక మతమును మారితే దేవున్ని ఎదిరించి
దేవుని సృష్ఠిని తప్పుపట్టినట్లగుననీ, దానివలన పాపము వచ్చునని చెప్పాము.
మత మార్పిడి తప్పుయని చెప్పిన నేను ముస్లీమ్లను హిందువుల
ఆచారములకు అలవాటు చేయుచున్నాననడము ఆరోపణేగానీ సత్యము
కాదని చెప్పుచున్నాము. ఏ విధముగా చూచినా నేను దైవజ్ఞానమును
బోధించువాడనే గానీ మత ఆచారములను బోధించువాడను కాను. 'దేవుని
ముద్ర' అనునది మూడు గ్రంథములలో ఉండే జ్ఞానమే తప్ప నేను సృష్టించి
చెప్పినది కాదు.
దేవుని జ్ఞానమునకు మత ఆచారములకు ముడిపెట్టకూడదు. నేను
ఒక బోధకునిగా సత్యమును చెప్పదలచాను, కావున దేవుడు నా చేత
సత్యమును చెప్పించాడు. దేవుడు తెల్పిన సత్యము కొందరికి వ్యతిరేఖముగా
కనిపించును. అంతమాత్రమున అది మతమును విచ్ఛిన్నము చేయునది
కాదు కదా! మీకు బాగా అర్థము కావాలంటే ఉదాహరణగా ప్రథమ దైవ
గ్రంథమయిన తౌరాతు (భగవద్గీత)లోని ఒక జ్ఞాన విషయమును చూస్తాము.
హిందూ మతములో మత ఆచారము ప్రకారము సన్న్యాసి అంటే కాషాయ
వస్త్రమును ధరించినవాడు, పనులు మానుకొన్నవాడు, భార్యాపిల్లలను
వదలినవాడు, జుట్టు, గడ్డము పెంచినవాడు అని అందరూ అనుకోవడము
జరుగుచున్నది. అయితే హిందూ గ్రంథమని అందరూ అనుకొను
భగవద్గీతలో ఆత్మ సంయమ యోగమున మొట్టమొదటి శ్లోకములోనే ఇలా
చెప్పబడినది చూడండి.
శ్లో॥ 1. అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః |
స సన్న్యాసేచ యోగీచ ననిరగ్ని ర్నచా క్రియః ॥
శ్లోకములోని భావము ప్రకారము ఫలితమును ఆశ్రయించక అన్ని
పనులు చేయువాడు నిజమైన సన్న్యాసియని చెప్పబడినది. అంతేకాక
జ్ఞానమను అగ్ని లేనివాడు, పనులు మానుకొన్నవాడు సన్న్యాసి కాదుయని
చెప్పడము జరిగినది. ఈ శ్లోకమును చెప్పినప్పుడు కార్యములను
మానుకొన్నవాడు సన్న్యాసి కాదుయని తప్పక చెప్పవలసి వచ్చును.
జ్ఞానమను అగ్ని కనిపించదు కావున అగ్ని లేనివాడు సన్న్యాసి కాడు అని
చెప్పడము వలన పెద్ద ఇబ్బంది లేదు. అయితే పనులు చేయనివాడు
సన్న్యాసి కాడు, సన్న్యాసి అయిన వాడు భార్యాపిల్లలు కలిగి అన్ని పనులలో
పాల్గొనవచ్చునని చెప్పడము హిందువుల ఆచారమునకు విరుద్ధముగా
చెప్పినట్లుయగును. ఎందుకనగా! హిందువులలో సన్న్యాసి అయిన వానికి
ఎన్నో మత నియమములు కలవు. దానిప్రకారము గౌతముడు (బుద్ధుడు)
భార్యను, సంవత్సరము వయస్సున్న కుమారున్ని వదలి అర్ధరాత్రి ఇంటినుండి
పోవడము, బిక్షాటన చేసి బ్రతకడము జరిగినది. అయితే దైవజ్ఞానము
ప్రకారము భార్యాపిల్లలతో ఉండకుండా బయటికి పోయి పనులు చేయడము
మానుకొని బిక్షాటన చేసి బ్రతకడము పూర్తి సరిపోదు. దానిని పూర్తి
అజ్ఞానముగా లెక్కించబడును. మతము ప్రకారము సన్న్యసించిన వాడు
జ్ఞానమును తెలిసిన తర్వాత జ్ఞానమను అగ్నికల్గి అన్ని పనులు చేయుచూ
ఆ పనుల ఫలితములయిన పాపమును అంటకుండా భార్యాపిల్లల చెంతచేరి
కుటుంబ సమేతముగా యుండి నేను నిజమైన సన్న్యాసిని అంటే హిందూ
మత ఆచారము ప్రకారము ఎవరూ దానిని ఒప్పుకోరు. ఎవరయినా
గురువు నిజమైన సన్న్యాసత్వము ఇదియని అజ్ఞానిని జ్ఞానిగా మార్చినా ఆ
గురువును హిందూమతమును, మత ఆచారములను విచ్ఛిన్నము చేయువాడు
అని అనడము సమంజసమా మీరే చెప్పండి. మీరు ఎటూ చెప్పలేకపోయినా
నేను మాత్రము గురువు చెప్పినది స్వచ్ఛమయిన జ్ఞానమేగానీ మతమును
తప్పుదారి పట్టించడము, మత విచ్ఛిన్నము చేయడము కాదని చెప్పగలను.
భగవద్గీతయందు ఆత్మ సంయమయోగములోని మొదటి శ్లోకము
యొక్క భావము ఎట్లు హిందూమతము వారికి వారి ఆచారములకు
వ్యతిరేఖముగా కనిపించుచున్నదో అదే విధముగా అంతిమ దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 22, ఆయత్ 32 ప్రకారము
(22-32) "ఎవడయితే అల్లాహ్ నియమించిన చిహ్నములను
గౌరవిస్తాడో అది నిశ్చయముగా హృదయాలలో యున్న దైవ భీతి
వలననే" ఈ వాక్యమును చూస్తే “దైవభీతి కలవాడు ఎవడయినా దేవుడు
నియమించిన దేవుని ముద్రను ధరిస్తాడు" యని ఉన్నది. గౌరవించడము
అని అంటే తలమీద పెట్టుకొని మోయడము అని అర్థము. దేవుడు ఇచ్చిన
దానిని ఉన్నత స్థానములో పెట్టుకోవడము అని అర్థము. ఇక్కడ చెప్పినదే
కాకుండా ఇదే విషయమునే మధ్య దైవ గ్రంథము ఇంజీలులో యోహాన్
ప్రకటనలు (9–4) లో “దేవుని ముద్రను నుదుటి మీద ధరించని
వాడు దైవదూతల వలన శిక్షింపబడుదురు” యని కూడా కలదు.
దైవ దూతల శిక్షలనుండి తప్పించుకోవాలంటే రెండు గ్రంథములలో చెప్పిన
దేవుని మాటను (ఆయత్ను) తప్పనిసరిగా విని ఆచరించి తీరవలసిందే.
అయితే ముస్లీమ్లుగానీ, క్రైస్థవులుగానీ దేవుని చిహ్నమే కాదు ఏ గుర్తును
కూడా నుదుటి మీద ధరించరు. అలా ధరిస్తే వారి మత ఆచారములకు
వ్యతిరేఖముగా ప్రవర్తించినట్లగును. అలా మత ఆచారములకు భయపడి
మతములో అందరూ ఉన్నట్లు దేవుని చిహ్నమును ధరించకపోతే దేవుని
మాటను లెక్కచేయని వారగుదురు.
ఈ విషయములో ప్రతి ముస్లీమ్, ప్రతి క్రైస్తవుడు సందిగ్ధములో
పడిపోవుచున్నారు. ముస్లీమ్లను కొందరిని అడిగితే మనుషులు నిర్ణయించిన
మతము ప్రకారము కాకుండా అల్లాహ్ చెప్పిన ఆయత్ ప్రకారము
నడుస్తాము, దేవుని ముద్రను ధరిస్తాము అని కేవలము పదిశాతము మంది
మాత్రము అంటున్నారు. మిగతా 90 శాతము మంది మతమును ధిక్కరిస్తే
మత పెద్దలను ధిక్కరించినట్లుయగును మత పెద్దలు చెప్పినట్లు నడుచు
కొంటాము అని అంటున్నారు. అదే విధముగా క్రైస్థవులు కూడా
అంటున్నారు. అయితే అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్లో సూరా 32,
ఆయత్ 22లో ఇలా కలదు.
(32-22) “తన ప్రభువు సూచన (ఆయత్) ల ద్వారా హితబోధ
చేయబడిన తర్వాత కూడా వాటినుండి విముఖులయ్యే వారికంటే
ఎక్కువ దుర్మార్గుడు ఎవరు? నిశ్చయముగా మేము అలాంటి
అపవాదులకు ప్రతీకారము చేసి తీరుతాము.”
పైన చెప్పబడిన ఈ ఆయత్ చూచిన తర్వాత కూడా దేవుని
జ్ఞానమును వదలి మతము, మత ఆచారములను పట్టుకొన్నవానిని ఏమనాలో
మీరే యోచించండి. ఒకవేళ మతమునకే ఎక్కువ విలువ ఇస్తే దేవుని
లెక్కలో వాడు దుర్మార్గుడుగా శిక్షార్హుడుగా ఉండును. మాకు దేవుని జ్ఞానమే
ముఖ్యము. అందరికీ మేలుకోరు మేము దేవుని జ్ఞానమునే చెప్పుచున్నాము
తప్ప మత ఆచారములను చెప్పలేదు. ఇంత చెప్పిన తర్వాత కూడా
దేవుని ముద్రను గౌరవముగా తలమీద ధరించడమును మత విచ్ఛిన్నము
అని కొందరు అనినా దేవుని వాక్యమును మేము చెప్పక తప్పదు. మేము
ఎవరినీ తప్పనిసరిగా ధరించమని చెప్పలేదు, దేవుని జ్ఞానమును మాత్రము
చెప్పాము అని తెలియవలెను.
ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో (22-32) లో చెప్పిన దేవుని చిహ్నము
అను మాట, బైబిలు గ్రంథములో (ప్రకటనలు 9-4) లో చెప్పిన మాట
రెండూ ఒకటేయని మేము ఒప్పుకొనినా దేవుని ముద్రయని మీరు చూపినది
నిజముగా దేవుని ముద్రయని ఎలా నమ్మాలి? అదే ఆకారము కాకుండా
వేరే ఇంకా ఏదయినా ఆకారముతో దేవుని ముద్ర ఉండవచ్చును కదా!
జవాబు :- ప్రథమ దైవ గ్రంథములో ద్వితీయ, అంతిమ దైవ గ్రంథములలో
దేవుని గుర్తుయను మాట కలదు. అయితే ప్రథమ దైవ గ్రంథమయిన
భగవద్గీతలో దేవుని చిహ్నమును గురించి ప్రత్యేకించి ఏ శ్లోకమూ లేదు.
అయితే అక్షర పరబ్రహ్మ యోగము అను అధ్యాయములో కొన్ని శ్లోకముల
సారాంశములో దేవుని చిహ్నము (దేవుని ముద్ర) యనునది ప్రత్యక్షము గా
కంటికి కనిపించునట్లు కలదు. అక్షర పరబ్రహ్మయోగముయందు కొన్ని
శ్లోకముల సారాంశములో దేవుని ముద్రయున్నట్లు 1970వ సంవత్సరము
లోనే గుర్తించి వ్రాయగలిగాము. దాదాపు ఇప్పటికి 47 సంవత్సరములప్పుడు
గుర్తించిన చిహ్నమే ఐదు సంవత్సరముల క్రిందట చదివిన ఖుర్ఆన్, బైబిలు
గ్రంథములలో వాక్యరూపకముగా ప్రత్యేకముగా యున్నట్లు తెలిసినది. అది
దేవుడు అందించిన రూపముగా తలచి దానినే మేము బయటికి చెప్పడము
జరిగినది. నా మాటనే నమ్మవలెనని నేను చెప్పడము లేదు. దైవ గ్రంథముల
ప్రకారము మీకు ఫలానాది దైవ చిహ్నము అని తెలిసినట్లయితే తెలుపండి.
అది జ్ఞానరీత్యా అన్ని విధముల సరిపోతే మేము కూడా విశ్వసిస్తాము.
అయితే మేము ప్రకటించిన ముద్ర అన్ని విధముల దైవజ్ఞానము యొక్క
పోలికలు కలదని చెప్పుచున్నాము. మేము దేవుని ముద్రను జ్ఞానరీత్యా
చెప్పాముగానీ మతరీత్యా ధరించమని చెప్పలేదు. దేవుని చిహ్నము లేక
దేవుని ముద్ర దైవ సంబంధమైనదిగానీ, మత సంబంధమైనది కాదు.
ప్రశ్న :- ‘కుళ్లేవాని ముందర కులికే వాడుండకూడదని' పెద్దలు సామెతను
చెప్పుతుంటారు. దాని ప్రకారము మా మతము బలహీనమగుచున్నదని
ప్రత్యేకించి ముస్లీమ్లు తర్వాత క్రైస్థవులు, హిందువులు అనుచుండగా మీరు
ఎందుకు ఇటువంటి బోధలు చెప్పాలి? ఇతరులకు ఇబ్బంది లేని బోధలను
చెప్పవచ్చును కదా! మీరు చెప్పేది మా మతమునకు వ్యతిరేఖముగా యున్నది
అన్నప్పుడు అటువంటి విషయములు చెప్పకపోవడమే మంచిది కదా!
దీనికి మీరు ఏమంటారు?
జవాబు :- పెళ్లి దైవికమయినదని అందరికీ తెలుసు. పెళ్లి అనగా దేవుడు
యని అర్థము కూడా కలదు. అందరూ దేవుని సంతతేయన్నట్లు యువతీ
యువకులను పెళ్లికూతురు, పెళ్లికొడుకు అని అంటున్నారు. పెళ్లి దైవిక
మయినది కావున పవిత్రముగా వేదమంత్రములతో, బ్రాహ్మణుల
సమక్షములో చేయుచున్నారు. మిగతా రెండు మతములలో కూడా పెళ్లి
కార్యమును పవిత్రముగా పెద్దలందరూ కలిసి జ్ఞాన గురువుల సమక్షములో
చేయుదురు. పెళ్లి పవిత్రమైనది దైవికమయినది. అయితే ప్రసవ వేదన
ప్రకృతి సిద్ధమైనది. ప్రసవ వేదనకు భయపడి ఎవరయినా పెళ్లి చేసుకోవడము
మానుకొంటున్నారా? లేదు కదా! అలాగే ప్రకృతి సిద్ధమైన మతములకు
వ్యతిరేఖమని దైవకమయిన జ్ఞానమును వదలుకోలేము కదా! మతమునకు
వ్యతిరేఖమయినది దేవుని జ్ఞానము. మతము నియమములతో కూడుకొన్నదై
ఉండగా, నియమములు లేనిదిగా దేవుని జ్ఞానము కలదు. మనుషులు
మతమును నిర్మించుకోగా, మనుషులు మత మాయ నుండి బయటపడుటకు
దేవుడు ప్రతీ మతమునకు ఒక ప్రవక్తను, ఒక గ్రంథమును ఇచ్చాడు.
మతము దైవికమైనదే అయితే, మతము వలన దేవుడు తెలియబడే వాడే
అయితే దేవుడు ప్రత్యేకించి ప్రవక్తను, దైవ గ్రంథమును ఇచ్చేవాడు కాదు.
మతము కొరకు, మత నియమముల కొరకు హిందువులు వేదాలు తయారు
చేసుకొన్నట్లు, క్రైస్థవులు పాత నిబంధన, ముస్లీమ్లు హదీసులను తయారు
చేసుకొన్నారు. వాటి వలన మనుషులకు జ్ఞానము కలుగదనీ, వారి కర్మలు
క్షమించబడవని తెలిసిన దేవుడు ప్రతి మతమునకు ఒక దైవ గ్రంథమును
ఇచ్చాడు. అలా గ్రంథములు విడివిడిగా యున్నా వాటిలోని సారాంశము
అంతయూ ఒక్కటేయని అంతిమ దైవ గ్రంథములో సూరా అయిదులో
44, 46, 48, 68 లలో చెప్పియున్నారు.
మనుషులు పుట్టుకతోనే ఏదో ఒక మతములో యున్నా, వారు
దైవము వైపు పోవుటకు దైవ గ్రంథమును వారికి ఇవ్వడము జరిగినది.
దైవ గ్రంథములు మూడు మతముల వద్ద యున్నా, అందులోని జ్ఞానము
పూర్తిగా మనుషులకు అర్థము కాలేదు. అందువలన నేను ఒక బోధకుడిగా
మూడు మతముల జ్ఞానమును ప్రజలకు చెప్పడము జరుగుచున్నది. అయితే
ప్రతి మనిషి శరీరములో ప్రకృతి జనిత గుణములు ఉండుట వలన వారికి
ప్రకృతి సంబంధ ఆలోచనలే వచ్చుచుండును. ప్రకృతి చేత అజ్ఞానమునకు
అలవాటుపడిన మనుషులకు జ్ఞాన సంబంధ మాటలు వ్యతిరేఖముగానే
ఉండును. ఉదాహరణకు చెప్పాలంటే ముస్లీమ్లు గడ్డమును పెంచడము
సహజముగా ఉన్నది. అది ముస్లీమ్ల మత ఆచారము. మత ఆచారమును
అందరూ పాటించడము జరుగుచున్నది. అయితే దానినే దేవుని జ్ఞాన
ఆచారముగా కొందరు భావించుచున్నారు. అందువలన 'నేను దేవుని
మార్గములో ఉన్నాను' అను సూచనగా ముస్లీమ్లు గడ్డమును పెంచడము,
టోపీ పెట్టడము జరుగుచున్నది. అయితే దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లోగానీ
మిగతా ఏ దైవ గ్రంథములోగానీ దాడి పెంచమని (గడ్డము పెంచమని)
అది దైవ సూచనయని ఎక్కడా లేదు. అట్లే సన్న్యాసములో కాషాయ
వస్త్రములు ధరించమని భగవద్గీతలో లేదు. అదే విధముగా మత
ఆచారములు దైవ గ్రంథములలో లేకుండా దైవ సంబంధ విషయములు
ఉండుట వలన అవి కొందరికి వ్యతిరేఖముగా కనిపించును. ముస్లీమ్ల
మతానుసారము ‘దేవుడు మనిషిగా అవతరించడు' అని ఉన్నది. అయితే
దైవ గ్రంథము ఖుర్ఆన్ సూరా 15, ఆయత్లు 28, 29, 30లలోనూ
మరియు సూరా 89, ఆయత్ 22లో “దేవుడు అవతరిస్తాడని” యున్నది.
'దేవుడు అవతరించడు' అనునది మతము కాగా, 'దేవుడు అవతరిస్తాడు’యని
చెప్పడము దైవజ్ఞానము.
ముస్లీమ్లయిన వారు తమ పెద్దలు చెప్పినట్లు విని దానినే జ్ఞానము
అనుకొని ఇతర మతముల వారికి జ్ఞానము తెలియదనీ, తమకు మాత్రమే
జ్ఞానము తెలుసునని అనుకోవడమే కాకుండా తమకు దేవుడు దగ్గరగా
యున్నాడనీ, తాము మాత్రమే ఏకేశ్వరోపాసన చేయుచున్నామనీ, మిగతా
మతముల వారు అలా లేరనీ, వారందరూ దేవునికి వ్యతిరేఖమయిన వారనీ
అటువంటి వారిని చంపాలని తమ గ్రంథములో చెప్పినట్లు కూడా చెప్పు
కొనుచుందురు. అంతిమ దైవ గ్రంథములో సూరా9, ఆయత్ 5 ప్రకారము
“నమాజ్ చేయని వారిని, జకాత్ ఇవ్వని వారిని చంపమని” ఉన్నదని
చెప్పుచుందురు. ఏ దైవ గ్రంథములో అయినా దైవజ్ఞానముండును గానీ
మనిషిని అక్రమ మార్గములో పంపు అజ్ఞానముండునా? వారు చెప్పినట్లు
(9-5) లో అలాగే వ్రాసియుంచారు. ఆ వాక్యమును వివరించుకొని
చూస్తే అందులో జ్ఞానము తప్ప ఏమీలేదు. అక్కడ 'దేవుడు తన దూతలకు
చెప్పిన మాటలు తప్ప మనుషులకు చెప్పినవి ఏవీ లేవు.' వాస్తవముగా ఆ
వాక్యములో చెప్పిన 'నమాజ్' అంటే పూర్తి వివరము తెలియదు. అలాగే
'జకాత్' అంటే ఏమిటో తెలియదు.
కొందరు ముస్లీమ్లు మాకు నమాజ్, జకాత్ తెలియదా!యని
ప్రశ్నించవచ్చును. దానికి నా సమాధానము ఏమనగా! ఖుర్ఆన్ గ్రంథములో
సూరా మూడు, ఆయత్ ఏడులో (3-7) ఖుర్ఆన్ గ్రంథములో స్థూల,
సూక్ష్మవాక్యములని రెండు రకములు గలవని చెప్పియున్నారు. అంతేకాక
సూక్ష్మవాక్యముల భావము దేవునికి మాత్రమే తెలుసునని కూడా చెప్పబడి
యున్నది. దీనినిబట్టి మనుషులకు తెలియని సూక్ష్మ జ్ఞానవాక్యములు
అనేకముగా ఖుర్ఆన్ఆయందు కలవనీ, అటువంటి వాక్యములకు దేవుడు
తెలియజేస్తేనే భావము తెలియుననీ చెప్పుచున్నాము. (9-5) వాక్యములో
ఎంతో సూక్ష్మజ్ఞానము కలదనీ అది అర్థముకాక నమాజ్, జకాత్ అంటే
ఏమిటో తెలియని స్థితిలో మనిషి ఉన్నాడు. మస్జీద్కు పోయి చేయు
ప్రార్థన మాత్రమే పూర్తి నమాజ్ కాదనీ ఎల్లప్పుడూ చేయు నమాజ్
ప్రత్యేకముగా కలదని చెప్పియున్నారు.
ఎల్లప్పుడూ ప్రార్థన చేయని వారిని శిక్షించమని దేవుడు తన
దూతలకు చెప్పితే దానిని దేవుడు మనుషులకు (ముస్లీమ్లకు) చెప్పాడని
అనుకోవడము పూర్తి పొరపాటు. ఖుర్ఆన్ గ్రంథములో స్థూలభావములు
గల స్థూలవాక్యములు మరియు సూక్ష్మ భావములుగల వాక్యములు
ఉన్నాయని గ్రంథమందే చెప్పియున్నారు. చెప్పిన ప్రతి వాక్యము
స్థూలముగానే కనిపించుచుండును. అయితే అవి సూక్ష్మ భావముతో
కూడుకొన్నవని చాలామందికి తెలియదు. ప్రత్యేకించి 6-95వ వాక్యము
(ఆయత్) స్థూలముగానే కనిపించినా దాని భావము ఇంతవరకు ఎవరికీ
తెలియదని చెప్పవచ్చును. అంతేకాక కొన్ని వందల సంవత్సరములకు
కూడా దాని నిజభావమును తెలియలేరని చెప్పవచ్చును. స్థూలముగా
చెప్పిన వాక్యములనే సరిగా అర్థము చేసుకోలేని స్థితిలో మనుషులున్నారని
చెప్పవచ్చును. 'దేవుడు అవతరిస్తాడు' అన్నమాట (89-22) స్థూలము,
దానికంటే ముందుగల (89-21) ఆయత్ సూక్ష్మమైనది. ఈ విధముగా
ప్రక్క ప్రక్కనే స్థూల, సూక్ష్మములున్నట్లు చాలామంది ముస్లీమ్లకు తెలియదు.
ముస్లీమ్లకే తెలియనప్పుడు ఇతర మతముల వారికి తెలియు అవకాశమే
లేదు. నేను ఖుర్ఆన్ గ్రంథము అన్ని మతముల వారికీ అర్థము కావలెనను
ఉద్దేశ్యముతో ఆ గ్రంథములోని కొన్ని సూక్ష్మవాక్యములకు భావమును
తెలియజేశాము. మేము చెప్పిన భావమును కొందరు ముస్లీమ్లు
గ్రహించలేక మా ఖుర్ఆన్ గ్రంథమును తప్పుగా వ్రాశాడనీ ఖుర్ఆను,
ముహమ్మద్ ప్రవక్తను తప్పుగా హేళనగా వ్రాశాడని అనవసరముగా అబద్ద
ఆరోపణలు చేయుచున్నారు. అంతిమ దైవ గ్రంథము యొక్క విశిష్ఠత,
ముహమ్మద్ ప్రవక్త గొప్పతనము నాకు తెలియును. కావున దానిని గొప్పగానే
వ్రాశాను గానీ తక్కువగా ఎక్కడా వ్రాయలేదు. సూక్ష్మ వాక్యములను అర్థము
చేసుకోలేని వారి కొరకు నేను కొన్ని వాక్యములను వ్రాయడము జరిగినది.
అలా వ్రాసిన గ్రంథముల పేర్లు “అంతిమ దైవ గ్రంథములో
జ్ఞాన వాక్యములు”, “అంతిమ దైవ గ్రంథములో వజ్ర
వాక్యములు” అని పేర్లు పెట్టాము.
మూడు మతముల వారికి వారి వారి గ్రంథములలో యున్న సూక్ష్మ
వాక్యములకు ఇంతవరకు అర్థము తెలియదనే చెప్పవచ్చును. బైబిలు
గ్రంథములో 'ఏసు తన శిష్యులకు రొట్టెను ఇచ్చి, ఇది నా శరీరము
తినండి' అన్నాడు. అలాగే 'ద్రాక్షరసమును ఇచ్చి ఇది చిందింపబడుచున్న
నా రక్తము’ అని చెప్పాడు. శిష్యులకు భోజన సమయములో అలా రొట్టెను,
రసమును ఇచ్చి త్రాగండి, తినండి యని చెప్పాడు. కొందరికి ఆ విషయము
ఇప్పటి వరకూ అర్థము కాలేదు. క్రైస్తవులకేగాక మిగతా వారికి కూడా
అర్థము కాని స్థితిలో ఆ వాక్యము నిలిచిపోయినది. ఇట్లు కొన్ని వందల
వాక్యములకు మూడు గ్రంథములలో అర్థము తెలియడము లేదు.
ఇదంతయూ బాగా పరిశీలించిన తర్వాత నేను మూడు గ్రంథములలోని
సూక్ష్మవాక్యములకు వివరము చెప్పడమైనది. నా ఉద్దేశ్యము మూడు
గ్రంథములలోని ప్రతి విషయములోని సత్యమును తెలుపవలెనని తప్ప
ఇతరులను కించపరచవలెనని ఏ కోశములో లేదు. నేను చెప్పు విషయము
లను కొంత ధ్యాస పెట్టి చూడండి, తెలియని రహస్యములు మీకు తెలియును.
అంతేకానీ ఏ మతమునకు నేను వ్యతిరేఖముగా చెప్పలేదు. ఎవరో ఏదో
అన్నారని నేను ఈ రోజు మూడు దైవగ్రంథముల సూక్ష్మవాక్యములకు
వివరము వ్రాయకపోతే భవిష్యత్తులో వాటి వివరము తెలియకుండా
ఉండిపోవును. దానివలన మూడు మతముల వారికి తీరని నష్టము
ఏర్పడును. అందువలన ఎవరు ఏమనుకొనినా ఫరవాలేదని దైవ
గ్రంథములలోని సూక్ష్మవాక్యములకు వివరమును వ్రాయడము జరిగినది.
నేను హిందువునైయుండి మూడు మతముల గ్రంథములని పేరు
గాంచిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ వాక్యములకు వివరము వ్రాసి అందరికీ
మేలు చేసినా, మా మత గ్రంథమైన ఖుర్ఆన్లోని ఆయత్లకు (వాక్యములకు)
వివరము వ్రాయాలంటే మా అనుమతి కావాలని కొందరు ముస్లీమ్లు
చెప్పినా, మరికొందరు ముస్లీమ్లు ముస్లీమ్ గురువులు మేము ఖుర్ఆన్
వాక్యములకు వివరము వ్రాసినందుకు సంతోషించి నన్ను ప్రశంసించడము
జరిగినది. నా ద్వారా దాదాపు 30 వేల మంది హిందువులు, 10 వేల
మంది క్రైస్థవులు ఖుర్ఆన్ను చదవడము జరిగినది. ప్రతి మనిషి దగ్గర
మత భేదము లేకుండా ఉండుటకు మూడు దైవ గ్రంథములు ఉండవలెనని
చెప్పాము. మూడు దైవ గ్రంథములను చదవాలని చెప్పాము. అంతేకాక
మూడు దైవ గ్రంథములను చాలామందికి ఇచ్చి చదివించాము. ఇదంతయూ
కాక ప్రతీ నెల పౌర్ణమి రోజున మా వద్దకు వచ్చు ముస్లీమ్లకు, క్రైస్థవులకు
చర్చావేదిక పెట్టి అందులో ముస్లీమ్లు బైబిలు వాక్యములకు వివరమును
చెప్పగా, క్రైస్థవులు ఖుర్ఆన్ వాక్యములకు వివరమును చెప్పడము జరుగు
చున్నది. దానివలన నా మతము, నీ మతము అను భేదము లేకుండా
పోయి మతముల మధ్య ఐక్యత ఏర్పడడమే కాకుండా మూడు దైవ
గ్రంథములలోని జ్ఞానము అన్ని మతముల వారికి తెలిసిపోవుచున్నది.
ఇటువంటి కార్యములు దేశములో ఎవ్వరూ చేయలేదు. మేము చేస్తున్నామంటే
సంతోషపడువారు చాలామంది యుండగా, కొందరు మాత్రము మమ్ములను
విమర్శించుచునే యున్నారు. ఈ సమాచారమును చదువుచున్న మీరు
కొంత యోచించండి. నేను చేయునది మంచి పనో చెడు పనో మీకే
అర్థమవుతుంది.
ప్రశ్న :- ఇంతకుముందు మీరు చెప్పిన మాటలలో ఇప్పుడు నేను సూక్ష్మ
వాక్యములకు వివరమును చెప్పకపోతే తర్వాత భవిష్యత్తులో వీటి వివరము
తెలియు అవకాశమే లేదని చెప్పారు. ఇక్కడ మేము అడుగుచున్నది ఏమంటే
భవిష్యత్తులో మీవలె జ్ఞానము తెలిసినవారు రారంటారా? మీకు తెలిసినంత
ఇతరులకు తెలియదంటారా? మీరు చెప్పు బోధలు ఇతరులు చెప్పలేరు
అంటారా? ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి. అన్నీ అడగలేముగానీ అన్నిటికీ
జవాబు వచ్చునట్లు మీరే చెప్పండి?
జవాబు :- 'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవమాత్రునికి తెలియదను’
ఖుర్ఆన్ వాక్యము ప్రకారము ఎంత పెద్ద జ్ఞానమయినా అది దేవుడు
చెప్పితేనే తెలుస్తుంది. 'ప్రతి మాట నీవు మాట్లాడలేదు. నీ తండ్రియైన
దేవుడే మాట్లాడుచున్నాడు' అను బైబిలు వాక్యము ప్రకారము ఏ జ్ఞాన
వాక్యము అయినా నేను చెప్పలేదు. దేవుడే నా నుండి చెప్పించుచున్నాడు
అని అనుకొంటున్నాను. దేవుడు ప్రత్యక్షముగా ఏ పనినీ చేయడు,
ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు. దేవుడు పని చేయువాడు కాదు,
అట్లే మాట్లాడు వాడు కాదు. అటువంటప్పుడు మనుషులకు తెలియని
జ్ఞానమును దేవుడే చెప్పాలియను సూత్రమును అనుసరించి చూస్తే దేవుడు
ఒక మనిషి నుండి మాట్లాడి తన జ్ఞానమును తెలియచెప్పును. దానివలన
దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు అయినా, ఆయన జ్ఞానము చెప్పితేనే
అది మనుషులకు తెలియును. దేవుడు ఎలా మనుషులకు జ్ఞానము చెప్పును
అను విషయము ఎవరికీ నిర్ధారణగా తెలియదు.
“దేవుడు (అల్లాహ్) నేరుగా ఎవరితోనూ మాట్లాడడు”
అని 42-51 లో ఒక వైపు చెప్పి 4-164లో “అల్లాహ్ మూసాతో
నేరుగా మాట్లాడాడు" అని యున్నది. అది ఎలా సాధ్యము? అని
యోచిస్తే దానికి సులభముగా జవాబు దొరకదు. అల్లాహ్ ఈ రెండు
ఆయత్లలో చెప్పిన వాక్యములు పూర్తి సత్యమేయని నేను చెప్పగలను.
ఈ వివరములన్నీ ఖుర్ఆన్ మా గ్రంథమని చెప్పుకొను ముస్లీమ్లకు
తెలియదనే చెప్పవచ్చును. దేవునికి ఇష్టమైతే ఎవరితోనయినా మాట్లాడి
తన జ్ఞానమును తెలియజేయగలడు. ఏదో ఒక విధముగా అల్లాహ్ (దేవుడు)
మూడు గ్రంథముల జ్ఞానము నాకు తెలియజేశాడు కావున నా బుద్ధికి
దేవుడు అందించిన జ్ఞాన వివరమును చెప్పగల్గుచున్నాను. ఎక్కడయినా
ఎవరి మతమును గురించి వారు చెప్పుకొనుట మీరు చూచియుందురు.
అయితే ఒక మనిషి మూడు మతముల వారు మా గ్రంథములని చెప్పుకొను
మూడు గ్రంథములలోని జ్ఞానమును చెప్పుట చూచారా? ఒకవేళ అలా
ఎవరయినా చెప్పినా మూడు గ్రంథములకు సమన్వయము ఉండదు. ఎవరు
చెప్పినా వారి మత సాంద్రాయములకు అనుగుణముగా జ్ఞానము చెప్పుట
కలదు. ముస్లీమ్ గురువులు హిందూ జ్ఞానమును చెప్పితే “దేవుడు
పుట్టడు” అని చెప్పుదురు. క్రైస్థవుల జ్ఞానమును చెప్పితే “ఏసు చనిపోయి
తిరిగి లేవలేదు” అని చెప్పుచుందురు. “ఏసుకు శిలువ వేయలేదు” అని
చెప్పుచుందురు. ఈ విధముగా మూడు మతముల సమన్వయము లేకుండా
ఎవరి దారిలో వారు పోవుచుందురు.
మా వద్ద అలా జరుగలేదు. ప్రతి దైవ గ్రంథములోని ప్రతి వాక్యము
సత్యమైనదేయని చెప్పుచున్నాము. అందరికి సూక్ష్మజ్ఞానము అర్థము
కానందున ఒకచోట మాట్లాడను అని చెప్పినది, మరియొకచోట
మాట్లాడినాడని చెప్పినది అర్థముకాక ఒకదానికొకటి వ్యతిరేఖముగా
కనిపించుచున్నది. మాకు సూక్ష్మజ్ఞానము అర్థమయిన దానివలన రెండు
ఆయత్లలోని మాటలు సత్యమేయని చెప్పుచున్నాము. వ్యతిరేఖముగా
కనిపించు వాక్యములకు కూడా సరియైన భావమును అందించినవాడు
అల్లాహ్ యేనని నేను చెప్పుచున్నాను. ఇప్పటికి ఒక సంవత్సరము ముందు
వ్రాసిన “కృష్ణమూస” అను గ్రంథములో అల్లాహ్ ఎట్లు మూసాతో
మాట్లాడాడో చెప్పియున్నాము. వాస్తవముగా ఆ రోజు ఖుర్ఆన్ గల
4-164వ ఆయత్ను నేను చూచియుండలేదు. “కృష్ణమూస” కంటే ముందు
వ్రాసిన “అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు” అను
700 పేజీల గ్రంథములో (42-51) ఆయత్ ప్రకారము "దేవుడు నేరుగా
ఎవరితోనూ మాట్లాడడు" అని వ్రాశాను. తర్వాత “కృష్ణమూస” అని నేను
స్వయముగా వ్రాసిన గ్రంథములో "దేవుడు మూసా (మోషే) ప్రవక్తతో
మాట్లాడాడు” అని చెప్పాము. ఇక్కడ మాట్లాడాడు అని చెప్పినా, అక్కడ
మాట్లాడలేదు యని చెప్పినా రెండూ పూర్తి సత్యమని నాకు తెలిసినది. ఈ
నా మాటలను విను కొందరికి ఆశ్చర్యముగా యుండవచ్చును. వ్యతి
రేఖముగా కనిపించు రెండు వాక్యములు ఎలా సత్యమగునని అనుకోవచ్చును.
దానికి నేను చెప్పు సమాధానము ఏమనగా! నాకు తెలిసినది మీకు తెలియదు
అని చెప్పగలను. మీకు తెలియని ఎన్నో విషయములు నాకు తెలియును
గనుక సూక్ష్మవాక్యములన్నిటికీ వివరమును వ్రాయగలిగాను. చాలామంది
ముస్లీమ్లకు ఖుర్ఆన్ గ్రంథములో గల సూక్ష్మవాక్యములేవో తెలియవు.
అట్లే మిగతా హిందూ, క్రైస్థవ సమాజములలో కూడా భగవద్గీత, బైబిలు
గ్రంథములలోని సూక్ష్మవాక్యములు ఏవో వారికి తెలియవు. అందువలన
ప్రతీ వాక్యమునకు స్థూలముగా వివరమును చెప్పుకొని తప్పుదారి పట్టి
పోవుచున్నారు. అందువలన దైవగ్రంథములలోని సత్య సమేతమైన జ్ఞానము
తెలియకుండా పోయినది. రెండు విధముల అర్థమునిచ్చు అనేక వాక్యముల
వద్ద ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక తికమకపడి అయోమయ
స్థితిలో సత్యమును తెలియలేకపోవుచున్నారు. అటువంటి వారందరికీ
మార్గదర్శకత కావాలంటే నేను వ్రాసిన వివరమును తప్పక చదివి
తీరవలసిందే. ఎందుకనగా! అల్లాహ్ (దేవుడు) నా బుద్ధికి ఇదే సత్యమని
సంపూర్ణముగా తెలియజేశాడు కనుక నా మాట సత్యమని, నా వ్రాత సత్యమని
ధైర్యముగా చెప్పుచున్నాను.
ప్రశ్న :- మీరు మీ ధైర్యము కొద్ది నా మాట సత్యమేయని చెప్పినా కొందరు
ముస్లీమ్లు మీ మాటలను వ్యతిరేఖిస్తూ, అసత్యమని అంటున్నారు. మీకు
సత్యమైనది వారికి ఎందుకు అసత్యముగా కనిపించినది?
జవాబు :- వారికి సత్యము తెలియడము దేవునికి ఇష్టము లేదు. అందువలన
వారికి సత్యము కూడా అసత్యముగా కనిపించునట్లు దేవుడు చేశాడు. ఈ
విషయమై ఖుర్ఆన్ గ్రంథములో అనేకచోట్ల చెప్పడమైనది. ఉదాహరణకు
సూరా ఆరు, ఆయత్ 110, 111 లలో ఇలా కలదు చూడండి.
(6–110) “వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో అదే
విధముగా వారి హృదయాలను మరియు వారి కన్నులను
త్రిప్పివేస్తాము. ఇంకా మేము వారిని వారి తలబిరుసు తనములో
అంధులై తిరగటానికి వదలిపెడతాము."
(6–111) “ఒకవేళ మేము వారివైపుకు దైవదూతలను పంపినా,
మరియు మరణించిన వారు వారితో మాట్లాడినా, ప్రతి వస్తువును
వారి కళ్ళముందు సమీకరించినా, అల్లా సంకల్పములేనిదే వారు
విశ్వసించేవారు కాదు. ఎందుకనగా! వాస్తవానికి వారిలో
అనేకులు అజ్ఞానులున్నారు.”
ఇక్కడ ఆరవ సూరాలో చెప్పబడిన వాక్యములను చూచిన తర్వాత
అల్లాహు ఇష్టము లేనివారిని అజ్ఞానులుగా ఉంచును అని తెలియుచున్నది.
మేము జ్ఞానులము అందరికంటే బాగా తెలిసినవారము, మేము మత
పెద్దలము, మామాటే అందరూ వింటారు అను తలబిరుసుతనముతో ఒకవైపు
వారికి తెలియని జ్ఞానము తెలియుచున్నా లెక్కచేయక అహముతో తలబిరుసు
తనముగా యున్నవారు దేవునికి ఇష్టము లేనివారుగా యుందురు.
అందువలన మేము చెప్పు జ్ఞానము కొందరికి అర్థమయినా, దేవునికి
అయిష్టులయిన వారికి అర్థము కాకుండా అసత్య జ్ఞానముగా కనిపించు
చుండును. ఉదాహరణగా చెప్పుకొంటే నేను వ్రాసిన గ్రంథమును చదివిన
వారు మాకు దాదాపు 200 మైళ్ల దూరములో యున్న పోరుమామిళ్ల
గ్రామములో యుండి "హిందువుగాయున్న వ్యక్తి ఖుర్ఆన్ వాక్యములకు
ఇంత బాగా వివరము వ్రాయడము చాలా గొప్పతనమని” ముస్లీమ్ గురువులే
మెచ్చుకోగా ఇక్కడ మాకు సమీపములో యున్న ముస్లీమ్లకు కొందరికి
మేము ఖుర్ఆన్ వాక్యములకు తప్పుగా వ్రాశానని కనిపించడము వారికి
మా వ్రాతలోయున్న సత్యము తెలియలేదని తెలియుచున్నది. ఎంతో
దూరములో గల ముస్లీమ్ గురువులు నన్ను పొగడడము, దగ్గరగా యున్న
వారు నన్ను తప్పు పట్టడడమును చూస్తే ఖుర్ఆన్ వాక్యము ప్రకారము
దేవునికి ఇష్టము లేనివారికి సత్యసమేతమైన నా జ్ఞానము అర్థము కాలేదని
చెప్పవచ్చును. అర్థముకానివారు నేను తప్పు వ్రాసినట్లు ఖుర్ఆన్
వాక్యములను కించపరచినట్లు వర్ణించి చెప్పారు. అలా మతద్వేషముతో
చెప్పేవాడినే అయితే, ఖుర్ఆన్ను దైవ గ్రంథమని చెప్పను కదా! అంతేకాక
ఖుర్ఆన్ వాక్యములను వజ్రవాక్యములని పొగడి చెప్పను కదా! వారు అలా
నన్ను ఆరోపించుచున్నారు అంటే వారిని గ్రుడ్డివారుగా, చెవిటివారుగా
దేవుడు తీర్పు తీర్చియున్నాడని అర్థమగుచున్నది.
ప్రశ్న : :- కొందరు ముస్లీమ్లు మీరు వ్రాసిన వివరములను తప్పు
పట్టుచున్నారు. వారు ఇలా అంటున్నారు. “మేము ఖుర్ఆన్ గ్రంథ
పండితులుగా ఖుర్ఆన్ లోని ప్రతీ అక్షరము, ప్రతీ పదము గురించి సంపూర్ణ
జ్ఞానము కలిగి యున్నాము. ప్రబోధానంద గారు చేసిన అసత్య వ్యాఖ్యానాల
ద్వారా మా మనోభావములు దెబ్బతిన్నాయి” అని అంటున్నారు. దానికి
మీరేమంటారు?
జవాబు :- 'మేము ఖుర్ఆన్ పండితులమని ఖుర్ఆన్లోని ప్రతీ అక్షరము,
ప్రతీ పదము గురించి సంపూర్ణ జ్ఞానము కల్గియున్నాము” అని చెప్పడము
అహంకారము కాదా! తలబిరుసుతనము కాదా! వాస్తవముగా ఏ దైవ
గ్రంథమును గురించి సంపూర్ణముగా తెలిసినవాడు ఎవడూ లేడని
చెప్పవచ్చును. ఒకవేళ అలా సంపూర్ణముగా తెలిసియుంటే వాడు
భూమిమీద మనిషిగా యుండక నేరుగా అల్లాహ్ (దేవుని) సాంగత్యములో
చేరిపోవును. అనగా అతనికి పరలోక ప్రాప్తికలుగును. ఒకవేళ మాట
వరుసకు అలా చెప్పినా ఖుర్ఆన్ గ్రంథములో ఇంతవరకూ మనుషులకు
తెలియని భావములు కలవు. (6-95) ఆయత్లాంటి వాక్యములకు ఏ
సైంటిస్టుగానీ, ఏ పరిశోధకుడుగానీ పది వేల సంవత్సరములకు కూడా
నిజ భావమును చెప్పలేడు. అంతెందుకు ఖుర్ఆన్ పండితులు సూక్ష్మ
వాక్యములను వదలి స్థూలముగా అర్థము చెప్పుకొంటున్నారు. సూక్ష్మ
వాక్యములకు అల్లాహ్ యే వివరము చెప్పాలిగానీ మనుషులు చెప్పలేరని
వారే వ్రాసియుంచినప్పుడు అన్నీ నాకు తెలుసు అని అనడము పొరపాటు
కాదా! ఖుర్ఆన్లో ప్రతి అక్షరము, ప్రతి పదము గురించి సంపూర్ణముగా
తెలుసునను వారు (42-51) లో 'అల్లాహ్ నేరుగా ఎవరితోనూ
మాట్లాడడు' అని ఉండడము తెలిసే ఉంటుంది. దానికంటే ముందు
(4-164)లో 'అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు' అని
ఉన్నప్పుడు దేనినయినా అసత్యము అంటే ఖుర్ఆన్ వాక్యమును తప్పు
పట్టినట్లగును. రెండు వాక్యములు సత్యము అంటే అల్లాహ్ రెండు విధముల
మాట్లాడినట్లగును. అల్లాహ్ ఎప్పటికీ సత్యసమేతముగానే వాక్యమును
చెప్పును తప్పు ఒకచోట సత్యము, ఒకచోట అసత్యము చెప్పడు.
అలాంటప్పుడు ఎవరయినా, ఏ మతములోని వ్యక్తి అయినా వివరముగా
జవాబు చెప్పగలడా? ప్రతి పదము, ప్రతి అక్షరము తెలుసునన్నవారు
వాస్తవమును చెప్పగలరా?యని ప్రశ్నించుచున్నాను.
“అల్లాహ్ ఏ పనిని చేయడు, ఆయన సంకల్పించుకొంటే అన్ని
పనులు జరిగిపోవును” అని (2-117) లో ఉన్నది కదా! దానితో దేవుడు
కార్యములు చేయు కార్యకర్త కాదుయని దేవుడు ఏదయినా చేయదలచి
నప్పుడు ఆయన చేయకుండానే ఆ పనులు జరిగిపోవుచున్నవని తెలిసి
పోవుచున్నది. తర్వాత (6-102) ఆయత్లో “ఆయనే (అల్లాహ్) మీ
ఆరాధ్యదైవము. ఆయన తప్ప వేరే ఆరాధ్యదైవము లేడు. ఆయనే
(అల్లాహ్ యే) సర్వకార్యములకు కార్యకర్తగా ఉన్నాడు" అని ఉన్నది ఈ
వాక్యములో దేవుడు కార్యకర్తగా కూడా ఉన్నాడనీ, ప్రతీ కార్యమును ఆయనే
చేస్తున్నాడని తెలియుచున్నది. అంతేకాక (2-255) ఆయత్లో దేవుడు
అహర్నిశలు (ఎల్లప్పుడూ) పని చేయుచున్నాడనీ, ఆయన రాత్రి పగలు
నిద్ర కూడా లేకుండా పని చేయుచున్నాడనీ, ఆయన ఎన్ని కార్యములు
చేసినా అలసిపోడు” అని చెప్పారు. అలసిపోడు, నిద్ర, కునుకు కూడా
తీయడు అని చెప్పిన దానిని బట్టి దేవుడు స్వయానా పని చేయుచున్నాడు
అని అర్థమవుతున్నది. ఇక్కడ (2-117) ను బట్టి దేవుడు పని చేయడనీ,
(2-255) ను బట్టి దేవుడు పని చేయుచున్నాడనీ రెండు విధముల
అర్థమగుచున్నది. మేము ఖుర్ఆన్ గ్రంథములో పండితులమని చెప్పువారు
దేవుడు పని చేస్తాడా? పనిని చేయడా? రెండు విధానములలో ఏది సత్యమో
ఏది అసత్యమో తేల్చి చెప్పగలరా? ఇట్లు ఖుర్ఆన్ గ్రంథములో సందిగ్ధములో
పడవేయు అనేక జ్ఞాన విషయములు కలవు. అవి అత్యంత అద్భుతమైన
జ్ఞానమని ఎవరయినా ఒప్పుకోక తప్పదు. ఖుర్ఆన్ గ్రంథము దైవ గ్రంథము.
దానిని తెలిసినవాడు మిగతా రెండు గ్రంథముల సారాంశము తెలిసి
యుండును. మిగతా రెండు దైవ గ్రంథముల సారాంశమును తెలియనప్పుడు
ఆ రెండు గ్రంథములతో సంబంధమున్న ఖుర్ఆన్ గ్రంథమును కూడా
తెలియనట్లేయగును. నాకు ఖుర్ఆన్ మొత్తము తెలుసు అంటే మిగతా
రెండు గ్రంథముల వాక్యములకు కూడా వివరము తెలిసియుండి తీరాలి.
అట్లు తౌరాతు ఇంజీలు గ్రంథములలోని వాక్యములకు వివరము
చెప్పగలరా? అలా తెలియకపోతే సూరా 62, ఆయత్ 5లో ఇలా వ్రాశారు
చూడండి.
(62-5) “తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి
నప్పటికీ దానికి అనుగుణముగా ఆచరించనివారు ఎన్ని
గ్రంథములను అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథము
లను వీపుమీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా
చెప్పవచ్చును. దేవుని వాక్యములను (మిగతా రెండు గ్రంథము
లను) ధిక్కరించిన వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు
జనులకు అల్లాహ్ సన్మార్గమును చూపడు.”
ఈ విధముగా అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో చెప్పి
యున్నప్పుడు నాకు ఖుర్ఆన్ గ్రంథము సంపూర్ణముగా తెలుసు అనువారు
మిగతా రెండు గ్రంథములను తెలిసియున్నారా? అని మేము అడగక తప్పదు.
అలా మూడు గ్రంథముల విషయములను తెలిసినప్పుడు భగవద్గీతలో
“దేవుడు మనిషిగా అవతరిస్తాడు” అని చెప్పిన శ్లోకమును ఒప్పు
కొంటారా? వాస్తవముగా దేవుడు మనిషిగా అవతరిస్తాడు అని ఏ ముస్లీమ్
ఒప్పుకోడు. అట్లే బైబిలు గ్రంథములో "ఏసు దేవుని కుమారుడు”
యను మాటను ఒప్పుకొంటారా? అలా ఏ ముస్లీమ్ కూడా ఒప్పుకోడు.
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో “మనిషికి పునర్జన్మలున్నాయి”
అని చెప్పారని అన్నా కూడా ఒప్పుకోరు. మనిషి ఒకమారే పుట్టి ఒకమారే
చనిపోవునని చెప్పుచుందురు. అయితే వారి మాటకు వ్యతిరేఖముగా
ఖుర్ఆన్ వాక్యము కలదు చూడండి.
(7-29) “మొదటిసారి మిమ్ములను అల్లాహ్ ఎలా పుట్టించాడో
మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.”
(53-46) “ప్రవహింపజేసిన వీర్యబిందువు నుండి"
(53-47) “మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే
(అల్లాహ్) చెల్లును.
ఈ వాక్యములను చూచిన తర్వాత మనిషికి పునర్జన్మలున్నాయని
ఖుర్ఆన్ పండితులమని చెప్పుకొనువారు ఒప్పుకోగలరా? ఒప్పుకోరు.
ఎందుకనగా! ముస్లీమ్ మత సాంప్రదాయముల ప్రకారము మనిషి తిరిగి
పుట్టడని చెప్పుచుందురు. అందువలన మతము పేరు చెప్పుకొనువారు
మత సాంప్రదాయము ప్రకారము చెప్పుచుందురుగానీ, మతమునకు
అతీతముగా యున్న ఖుర్ఆన్ వాక్యము ప్రకారము ఎప్పటికీ చెప్పరు. ఏ
ముస్లీమ్ అయినా ఖుర్ఆన్ వాక్యము ప్రకారము నడువాలని చూచినా,
చెప్పాలని చూచినా వారి పెద్దలు వానిని ముస్లీమ్ కాదని అంటారు.
మనిషి చనిపోయి తిరిగి పుట్టునని భగవద్గీతలో సాంఖ్యయోగమున
27వ శ్లోకమందు చెప్పియున్నారు.
శ్లో॥27: జాతస్య హి ధ్రువో మృత్యుర్థువం జన్మ మృతస్యచ |
తస్మాద పరిహార్యేర్థే న త్వం శోచితు మర్వసి ॥
అట్లే ఖుర్ఆన్ గ్రంథమున (7-29), (53-46), (53-47) ఆయత్లలో
మనిషికి మరుజన్మ కూడా కలదని చెప్పియున్నారు. అదే విషయమునే
బైబిలులో యోహాను 15వ అధ్యాయము 27వ వచనమున పునర్జన్మ
విషయము కలదు. దైవ గ్రంథములలో మనిషికి పునర్జన్మలున్నాయి అని
చెప్పియుంటే ముస్లీమ్ అయిన వారు కొందరు వారి మతమును అనుసరించి
మనిషికి పునర్జన్మలు లేవు అని అంటున్నారు. అలా వారు మూడు దైవ
గ్రంథముల మీద అసత్య ప్రచారము చేయడము వలన దైవజ్ఞానులయిన
ఎందరో వారి మనోభావములు దెబ్బతిన్నాయని చెప్పుచున్నాము. మేము
దైవమును గురించి సత్యము చెప్పితే వారి మనోభావములు దెబ్బతిన్నాయని
అంటున్నారు. అట్లే వారు చెప్పే అసత్యములను చూచి దైవము మీద
నమ్మకము పోయేటట్లున్నది కనుక మాకు కూడా మనోభావములున్నాయి,
మా మనోభావములు కూడా దెబ్బతిన్నాయని మేమనుచున్నాము. పునర్జన్మల
విషయము చాలా సూక్ష్మవాక్యములుగా చాలాచోట్ల ఖుర్ఆన్ గ్రంథములో
వ్రాసినా, స్థూలముగా కూడా కొన్నిచోట్ల గలదు. అటువంటప్పుడు వారి
గ్రంథమునకు వారే వ్యతిరేఖముగా చెప్పడము వింతగా యున్నది. ఇటువంటి
ఎన్నో వాక్యములకు సరియైన భావమును తెలియకున్నారు.
అటువంటి వారు మేము ఖుర్ఆన్లో చెప్పు ఉన్నతమైన జ్ఞానమును
అర్థము చేసుకోలేక ఆ వాక్యములకు వారు సరియైన భావము తెలిసినట్లు
భ్రమించి మమ్ములను తప్పుపట్టుచున్నారు. ఆ వాక్యములకు నిజమైన
భావము వారికి తెలియదని వారు గుర్తించలేకపోయారు. వారు మమ్ములను
తప్పుపట్టిన ఒక వాక్యమును ఇప్పుడు చూస్తాము.
(5-73) “నిశ్చయముగా అల్లాహ్ ముగ్గురిలో మూడవ వాడని
అనేవారు వాస్తవానికి సత్యతిరస్కారులే. ఒకే ఒక్క ఆరాధ్య
దేవుడు (అల్లాహ్) తప్ప మరియొక ఆరాధ్య దేవుడు లేడు. వారు
తమ ఈ మాటలను మానుకోక పోతే, వారిలో సత్య తిరస్కారులైన
వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది."
ఇది దైవ గ్రంథములో యున్న వాక్యము. దేవుడు (అల్లాహ్) నుండి
జిబ్రయేల్ దూత ద్వారా వచ్చిన ఈ వాక్యములో సంపూర్ణమైన జ్ఞానము
కలదు. అయితే ఈ వాక్యమును చదివినంత సులభముగా ఎవరి బుర్రకు
అర్థము కాదు. మొత్తానికి ముస్లీమ్ల ఉద్దేశ్యము అందరికీ ఆరాధ్యదైవము
ఒక్కడేయని చెప్పడమే. వారి మాటతో మేము కూడా ఏకీభవించుచున్నాము.
అయితే మేము అలా ఒప్పుకోలేదని ముగ్గురిలో మూడవ వానినే దేవుడని
అంటున్నామని అంటున్నారు. దేవుని జ్ఞానము తెలియనివారు మూడవ
వానిని దేవుడని అనవచ్చును గానీ మేము మూడవవాడే దేవుడనీ ఎక్కడా
చెప్పలేదు కదా! మూడవ వానిని ఆరాధించమని మేము ఎక్కడా వ్రాయలేదు
కదా!
అల్లాహ్ మూడుగా విభజింపబడియున్నాడని మేము ఈ మధ్య
కాలములో 40 సంవత్సరముల నుండి చెప్పుచున్నాము. అలా చెప్పడమునే
“త్రైత సిద్ధాంతము” అని అంటున్నాము. నేను త్రైత సిద్ధాంతమును ఇప్పుడు
చెప్పితే నన్ను కొందరు తప్పు పట్టవచ్చును. త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలోనే
చెప్పబడినది. దానినే తౌరాతు గ్రంథములో వ్రాశారు. అట్లే ఇంజీలు
గ్రంథములో వ్రాశారు. అంతేకాక 1400 సంవత్సరముల క్రింద
వ్రాయబడిన అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్లో కూడా వ్రాశారు. అయితే
ఆ విషయమును చాలామంది గ్రహించలేక పోయారు. అల్లాహ్ (దేవుడు)
ముగ్గురుగా యున్నాడని, అయితే మూడవ వానిని దేవుడని అనడము
అజ్ఞానమని చెప్పారు. ఇక్కడ బుర్ర ఉపయోగించి చూస్తే దేవుడు ముగ్గురుగా
యున్నారని ఖుర్ఆన్ గ్రంథమే చెప్పుచున్నది. ముగ్గురిలో మూడవ వాడు
ఆరాధ్యదైవము అల్లాహ్ కాదని ముగ్గురిలో ఒకే ఒక్కడు మాత్రమే ఆరాధ్య
దైవము అని చెప్పారు తప్ప దేవుడు ముగ్గురుగా లేడని ఖుర్ఆన్ గ్రంథము
ఎక్కడా చెప్పలేదు. నేను చెప్పుచున్న ముగ్గురు అను మాటను 1400
సంవత్సరములప్పుడే చెప్పారు. అందులో ఒక్కడే ఆరాధ్య దైవమని నేను
కూడా చెప్పుచున్నాను. మూడవ వానిని ఆరాధ్య దైవమని నేను చెప్పలేదు.
అటువంటప్పుడు నేను తప్పుగా చెప్పినది ఏమున్నదని ప్రశ్నించుచున్నాను.
వాక్యమును సరిగా పరిశీలించక తప్పుపట్టడమే పనిగా చెప్పడము తప్ప
నా వాక్యములో తప్పులేదని చెప్పుచున్నాను.
జ్ఞానములో పెద్దలనుకొను కొందరు ముస్లీమ్లు అసూయతో నేను
చెప్పినది తప్పుయని ఆరోపించడము ఎలాగున్నదో చూస్తాము. "జీవాత్మ,
ఆత్మ, పరమాత్మ” అను ముగ్గురి సిద్ధాంతములను ముస్లీమ్లపై రుద్దాలని,
దేవుడు ఇలా మూడు భాగములుగా ఉన్నాడని మా విశ్వాసాలను
కించపరుస్తున్నారు” అని నన్ను ఆరోపించడము జరిగినది. ఇక్కడ దేవుడు
ముగ్గురుగా ఉన్నాడని చెప్పడమే తప్పుగా ముగ్గురి సిద్ధాంతమును వారు
ఖండించుచున్నారు. దేవుడు ముగ్గురుయను భావమును ముస్లీమ్లపై
మేము బలవంతముగా రుద్దాలని చూస్తున్నట్లు వారు చెప్పారు. ఖుర్ఆన్
గ్రంథములో చెప్పిన ముగ్గురిని నేను చెప్పలేదు కదా! ఏనాడో ఖుర్ఆన్
గ్రంథములో దేవుడు ముగ్గురుగా ఉన్నాడని చెప్పారు. మూడవ వాడు
ఆరాధించబడు దేవుడు కాదని చెప్పారు. ముగ్గురులో ఆరాధ్య దైవము
(అల్లాహ్) లేడని చెప్పలేదు. ముగ్గురిలో ఒక్కడే ఆరాధ్య దైవము అని
చెప్పారు. మూడవ వాడు దేవుడు కాదని చెప్పారు. ముగ్గురిలో మూడవ
వాడు దేవుడు కాదని గ్రంథములోనే యున్నది. ఆ మాటను నేను కూడా
ఒప్పుకొంటాను. ముగ్గురిలో ఒక్కడే ఆరాధ్య దైవమున్నాడని కూడా
గ్రంథములో చెప్పారు. అంతేగానీ త్రైత సిద్ధాంతము లేదని, ముగ్గురు
లేరని చెప్పలేదు కదా!
విశ్వములో ప్రకృతి, పరమాత్మ అను రెండే రెండు గలవు. అయితే
ప్రకృతి ఐదు భాగములుగా విభజింపబడియున్నది. అట్లే పరమాత్మ (అల్లాహ్)
అనునతడు మూడు భాగములుగా విభజింపబడియున్నాడు. ఈ విషయము
జగమెరిగిన సత్యము. మూడు దైవ గ్రంథములలో చెప్పియున్న విషయము.
దేవుడు (అల్లాహ్) మూడుగా విభజింపబడియుండుట వలన ప్రథమ దైవ
గ్రంథమయిన దానికి మనుషులు భగవద్గీతయని పేరు పెట్టినా స్వయముగా
దేవుడు ఆ పేరును కాదని 'తౌరాతు' యను పేరు పెట్టాడు. దేవుడు
మూడుగా విభజింపబడియున్న విషయము గ్రంథములో ముఖ్యముగా
చెప్పియుండుట వలన అదే పనిగా ఆ విషయమును అందరూ తెలియాలను
ఉద్దేశ్యముతో దేవుడు ప్రథమ దైవ గ్రంథమునకు తౌరాత్యీని పేరు పెట్టాడు.
తౌ అనగా మూడు అని అనేక భాషలలో అర్థము గలదు. తౌరాతు అనగా
మూడు ఆత్మలు గుర్తుండునట్లు ఆ పేరును దేవుడు మోషేకు (మూసాకు)
గ్రంథమును ఇచ్చినప్పుడు దాని పేరు భగవద్గీతయని చెప్పక తౌరాతుయని
చెప్పడము జరిగినది. ప్రథమ దైవ గ్రంథమయిన తౌరాతును మోషేకు
(మూసాకు) ఇచ్చినప్పుడు దేవుడు మూసాతో మాట్లాడడము జరిగినది.
కావున ఆ విషయమును అంతిమ దైవ గ్రంథములో సూరా 4, ఆయత్
164 లో “అల్లాహ్ మూసాతో మాట్లాడాడు" అని ఆయత్లో చెప్పారు.
దేవుడు ముగ్గురుగా యున్న విషయము తౌరాతులో ఉండుట వలన
తర్వాత వచ్చిన రెండు గ్రంథములు తౌరాతును అనుసరించి వ్రాసినవి
అయినందున, ఒక విధముగా తౌరాతులోని భాగములే అయినందున
ద్వితీయ, అంతిమ దైవ గ్రంథములలో దైవత్వము మూడు ఆత్మలుగా
యున్నదని చెప్పారు తప్ప అలా లేదని ఖండించలేదు. ద్వితీయ దైవ
గ్రంథమున కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మయనీ, అంతిమ దైవ గ్రంథమున
తోలబడే వాడు, తోలేవాడు, సాక్షిగా చూచేవాడుయని ముగ్గురిని అనగా
దేవుని మూడు భాగములను చెప్పియున్నారు. ప్రకృతి ఐదు భాగములుగా
విభజింపబడియుండగా ఐదు భాగములకు ఐదు పేర్లు గలవు. అవియే
పై నుండి క్రింది వరకు ఇలా కలవు. 1) ఆకాశము, 2) గాలి, 3) అగ్ని,
4) నీరు, 5) భూమి యని కలవు. ప్రకృతి అనగా ముఖ్యముగా
చేయబడినదియని అర్థము. 'కృతి' యనగా చేయబడినదనీ, ‘ప్ర’ అనగా
ముఖ్యమైనదని చెప్పవచ్చును. ఈ ఐదులో ఆకాశము ప్రధాన పాత్ర
పోషించుచున్నది. అందువలన ప్రకృతిలో ఆకాశము ప్రాధాన్యమైనదని
చెప్పగలము. దేవుని విషయములోనికి వస్తే ఆయన మూడు భాగములుగా
యున్నా అందులో రెండవ భాగమయిన ఆత్మనే దేవుడనీ, అందరూ
ఆరాధింపతగిన వాడని పరమాత్మ చేతనే నిర్ణయింపజేయబడినది. ఇక్కడ
అందరికి తెలియని విషయము ఏమనగా! దేవుని మూడు భాగములలో
మొదటి భాగమును జీవాత్మయని చెప్పగా, రెండవ భాగమును ఆత్మయని
చెప్పారు. మూడవ భాగమునకు పేరు లేదు కావున ఎప్పుడయినా మూడవ
భాగమును చెప్పదలచుకొంటే రెండవ వాని పేరే వాడి చెప్పుచుందురు.
అందువలన మొదటివాడు జీవుడుకాగా, రెండవ వాడు దేవుడుగా యున్నాడు.
మూడవ వానిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు రెండవ వాని పేరుతోనే
చెప్పడమైనది. ఈ విధానము మూడు గ్రంథములలో యున్నా ప్రథమ,
ద్వితీయ గ్రంథములలో రెండవ పురుషున్ని ఆత్మ లేక దేవుడు అని చెప్పుచూ
మూడవ వానిని ప్రత్యేకమైన పేరుతో చెప్పడము జరిగినది. ప్రథమ దైవ
గ్రంథములో ఆత్మకంటే వేరయినదియను ఉద్దేశ్యముతో పరమాత్మయని
అన్నారు. అట్లే ద్వితీయ దైవ గ్రంథములో ఆత్మకంటే పరిశుద్ధమైనదియను
భావముతో పరిశుద్ధాత్మయని చెప్పబడ్డాడు. అంతిమ దైవ గ్రంథములో
మూడవ ఆత్మను గురించి ప్రత్యేకమైన పేరు పెట్టలేదు. రెండవ ఆత్మను
అల్లాహ్యని పిలిచినట్లే మూడవ ఆత్మను కూడా అల్లాహ్యయని అన్నారు.
ఉదాహరణకు ఒక విషయమును చెప్పుకొందాము. స్వచ్ఛమయిన
తెలుగు భాషలో తండ్రిని 'అబ్బ’యని అంటారు. అట్లే తల్లి తండ్రిని తాత
అంటారు. అయితే తండ్రి తండ్రిని తాత అనకుండా తండ్రిని పిలిచినట్లే
'అబ్బ’యని చెప్పడము జరుగుచున్నది. ఏ విధముగా అయితే తండ్రిని
తాతను ఒకే పేరుతో అబ్బ అని పిలుచుచున్నామో అలాగే దేవుని మూడు
భాగములలో రెండవ దానిని దేవుడు (అల్లాహ్) యని పిలిచినట్లు అంతిమ
దైవ గ్రంథమున మూడవ వానిని కూడా అల్లాహ్ అనియే చెప్పడము జరుగు
చున్నది. భగవద్గీతలో కూడా ఉన్న 18 అధ్యాయములలో 15వ అధ్యాయము
వరకు మూడు భాగములను ఆత్మయను పేరుతోనే పిలిచారు. చివరిలో
15వ అధ్యాయమున మూడు ఆత్మలకు మూడు పేర్లు పెట్టి క్షరుడు, అక్షరుడు,
పురుషోత్తముడు అని అన్నారు. ద్వితీయ దైవ గ్రంథములో మూడు దైవ
భాగములకు మొదటినుండి కుమారుడుయని మొదటి దానిని, తండ్రియని
రెండవ దానిని, పరిశుద్ధాత్మయని మూడవ దానిని పిలువడమైనది. అంతిమ
దైవ గ్రంథములో సూరా 50లో 21వ వాక్యమునందు మొదటి భాగమును
త్రోలబడేవాడు, రెండవ భాగమును త్రోలేవాడు అని చెప్పి మూడవ
భాగమునకు సాక్షియని ప్రత్యేకముగా చెప్పారు. దీనితో దేవుడు మూడు
భాగములుగా ఉన్నాడని సులభముగా తెలిసిపోవుచున్నది. ఖుర్ఆన్
గ్రంథములో సూరా 5, ఆయత్ 73లో అల్లాహ్ ముగ్గురిగా ఉన్నాడని
చెప్పినట్లే కలదు. అయితే మూడవ భాగమును లేక మూడవ వానిని
ఆరాధ్యదైవమని చెప్పకూడదు, అట్లు చెప్పుట అజ్ఞానమనీ చెప్పారు.
మూడు దైవ గ్రంథములయందు దేవుని మూడు భాగములలో
రెండవ భాగమునే అందరూ ఆరాధించు అల్లాహ్ యని చెప్పారు. మూడు
దైవ గ్రంథములలో రెండవ ఆత్మను పిలిచిన పేరుతోనే మూడవ ఆత్మను
కూడా చాలాచోట్ల పిలువడము జరిగినది. బైబిలులో ఆత్మను తండ్రియని
చెప్పారు. అట్లే కొన్ని సందర్భములలో మూడవ ఆత్మను కూడా తండ్రియని
చెప్పారు. యోహాన్ ఐదవ అధ్యాయములో 21 నుండి 27 వరకు గల
వాక్యములలో మూడవ వాడయిన పరిశుద్ధాత్మను తండ్రియనీ, రెండవ
వాడయిన వానిని కుమారుడు యని చెప్పారు. అయితే రెండవ వాడయిన
వాడే మీకు దేవుడు, ఆయననే మీరు ఆరాధించవలసినదని ఆ వాక్యములలో
చెప్పారు. జీవునికి తండ్రి ఆత్మకాగా, ఆత్మకు తండ్రి పరమాత్మయని
తెలియవలెను. అయితే రెండవవానిని మూడవ వానిని భగవద్గీతలో
ఆత్మయనీ, బైబిలులో తండ్రియనీ ఖుర్ఆన్లో అల్లాహ్యని ఒకే పేరుతో
కొన్నిచోట్ల పిలువడము వలన ఆరాధ్య దైవము ఎవరు? అను సందిగ్ధములో
అందరూ పడిపోయారు. రెండవ వాడే ఆరాధ్య దైవము యని మూడవవాడు
అయిన పరిశుద్ధాత్మ బైబిలులో చెప్పగా, అట్లే భగవద్గీతలో మూడవవాడుగా
యున్న పరమాత్మ 'ఆత్మే మీకు దేవుడు'యని చెప్పడమైనది. ఇకపోతే
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో సూరా 3 ఆయత్ 18లో
అల్లాహ్ యనబడు మూడవవాడు, అల్లాహ్యనబడు రెండవ వాడే మీకు
ఆరాధ్య దైవమని చెప్పడము జరిగినది. ఒకమారు ఆ వాక్యమును
గమనించితే ఆ వాక్యములో ప్రత్యక్షముగా యున్న సత్యము తెలియును.
మొద్దుబుర్రలు కలిగిన వారు మేము జ్ఞానులము అని అంటే, మాకు అన్నీ
తెలుసు అంటే సరిపోతుందా? వాక్యములో యున్న సారాంశమును
చూడండి. ఈ వాక్యమును ఎవరు చెప్పారో చూడండి.
(3-18) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేదని స్వయముగా
అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు అయినవారు
సాక్ష్యమిచ్చారు. ఆయన న్యాయ పరిరక్షకుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య
నీయుడు లేడు. ఆయన సర్వశక్తివంతుడు, మహా వివేకవంతుడు.”
ఈ వాక్యమును బాగా అర్థము చేసుకోగలిగితే దేవుని విధానము
బాగా అర్థమగును. దేవుడు ముగ్గురుగా యున్నాడు అన్నమాట మూడు
దైవ గ్రంథములలోనిది. అది ఇప్పుడు నేను చెప్పు మాటకాదు. అయితే
ముగ్గురిలో మూడవ వాడు ఆరాధ్యదైవము కాదు. ఆయన మొదటి ఇద్దరి
కంటే పెద్ద అయినా, నిజమైన సృష్టికర్త మూడవ వాడే అయినా, ఆయన
గ్రంథములో అల్లాహ్యని పిలువబడినా, తాను ఆరాధ్య దైవము కాదనీ,
అందరికీ ఆరాధ్య దైవము రెండవ వాడయిన అల్లాహ్ యేననీ, స్వయముగా
మూడవ వాడయిన అల్లాహ్ పై వాక్యములో చెప్పియున్నాడు. అయితే
తండ్రియైన అల్లాహ్ తన కుమారుడైన అల్లాహ్ యే నిజమైన దైవమని
ఆయననే ఆరాధించమని చెప్పియున్నాడని ఎవరూ గ్రహించలేకపోయారు.
ఒకరు మనిషికాగా అల్లాహ్ యనబడువారు ఇద్దరున్నారని, ఇద్దరిలో రెండవ
వాడే ఆరాధ్యదైవమని మూడవవాడు వాక్యములో చెప్పియున్నాడని తెలియక
ఇద్దరు అల్లాహ్ ున్నారని చెప్పి మా మనోభావములను దెబ్బతీస్తున్నారని
మమ్ములను కొందరు ముస్లీమ్లు ఆరోపించడము జ్ఞానమో, అజ్ఞానమో
మీరే ఆలోచించండి. వారి మాట సత్యమో అసత్యమో మీరే గ్రహించండి.
బైబిలు యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము 21వ వాక్యము
నుండి 27వ వాక్యము వరకు చెప్పిన మాటలలో ఖుర్ఆన్లోని (3-18)
లో వాక్యమును చూడగలరు. 'తండ్రి ఎవనికీ తీర్పు తీర్చడుగానీ తండ్రిని
ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు
సర్వ అధికారము కుమారునికి అప్పగించియున్నాడు.' ఇక్కడ చెప్పిన యోహాన్
5-22, 23 వాక్యములలో ఖుర్ఆన్ 3-18 వాక్యమునకు సమాన భావము
కలదు. అల్లాహ్ స్వయముగా మీ ఆరాధ్య దైవము అల్లాహ్ యేనని రెండవ
వానిమీద మూడవ వాడు చెప్పినట్లే బైబిలులో కూడా సర్వ అధికారములు
రెండవ ఆత్మకు అనగా కుమారునికి ఇచ్చి ఆయననే ఆరాధించమని
చెప్పారు. ఘనపరచమని చెప్పడములో అర్థము ఆయననే ఆరాధించమని
ఆయన ఒక్కడే మీ ఆరాధ్య దైవమని ఖుర్ఆన్లో చెప్పినట్లే చెప్పారు.
దేవుడు మూడు భాగములుగా ముగ్గురుగా యున్నది దైవ గ్రంథము
లలో చెప్పినదే. అయితే అందులో ఒకడు జీవాత్మగా (మనిషిగా) యుండగా
మిగతా రెండు ఆత్మలు దైవముగా యున్నవి. అయితే మనిషి ఆరాధించ
వలసినది ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే. ఇద్దరు దైవములే అయినా
ఆరాధ్యదైవము ఇద్దరిలో ఒక్కడే. ఆ విషయమును ముగ్గురిలో పెద్ద అయిన
వాడే తనకంటే చిన్న అయిన ఆత్మనే ఆరాధ్య దైవముగా చెప్పాడు. మూడవ
వాడయిన తనను ఎవరూ మ్రొక్కకూడదనీ, ఎటువంటి ఆరాధనలు
చేయకూడదని చెప్పాడు. అందువలన ఇద్దరిలో ఒక్కరే ఆరాధ్య దైవమని
ఖుర్ఆన్లో సూరా 16, ఆయత్ 51లో కూడా చెప్పారు.
(16-51) “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు ఇద్దరిని ఆరాధ్య దైవములుగా
చేసుకోకండి. ఆరాధ్య దైవము మాత్రము ఆయన ఒక్కడే. కనుక మీరంతా
నాకే భయపడండి.”
ఇక్కడ కూడా ఖురాన్ (3-18) లో చెప్పినట్లు, బైబిలు యోహాన్
5-22, 23 వాక్యములలో చెప్పినట్లు మూడవ వాడయిన పెద్ద అల్లాహ్
తన తర్వాతయున్న రెండవ అల్లాహ్న ఆరాధించమని ఆరాధ్య దైవము
ఆయన ఒక్కడేయని చెప్పాడు. అంతేకాక మూడవ వాడు సృష్టికర్తయైన
అల్లాహ్ ఒకడున్నాడని ఆయనను ఆరాధించకూడదని ఎప్పటికీ ఆరాధ్యులు
ఇద్దరు కాదని అల్లాహ్ ఒక్కడేయని చెప్పుచూ మూడవ వాడయిన తనకు
భయపడండియని చెప్పాడు. ఈ వాక్యము వలన ఖుర్ఆన్ చదివిన ఎవరి
కయినా భయము మూడవ వానిమీద, భక్తి ఆరాధనలు రెండవ వాడయిన
అల్లాహ్ మీద ఉండవలెననీ వాస్తవముగా తనతో సహా ముగ్గురున్నారని
తెలిసియుండాలని చెప్పారు. అలా తెలిసినవాడే నిజమైన జ్ఞాని కాగలడు.
అలా కాకుండా వాక్యములో చాలామందిని దేవుళ్ళుగా లెక్కించక ఒక్కడినే
ఆరాధించమని చెప్పక ఇద్దరిని ఆరాధించకూడదని ఎందుకు చెప్పారో
కొంత యోచించి చూడండి. అంతేకాక (5-73) లో నిశ్చయముగా
అల్లాహ్ ముగ్గురిలో మూడవ వాడు కాడని కూడా చెప్పారు.
అలా చెప్పడము వలన అల్లాహ్ ముగ్గురిగాయున్నాడని ఒకడు
జీవాత్మ కాగా, రెండవ వాడు ఆరాధ్యదైవము కాగా, మూడవవాడు సాక్షిగా
యున్నాడని, రెండవ వాడే అందరినీ ఆడించుచున్నాడని, మొదటి వాడు
రెండవ వాడు ఆడించునట్లు ఆడుచున్నాడని, ఇదంతటిని మూడవవాడు
చూస్తూ సాక్షిగా యున్నాడని తెలియుచున్నది. దీనినిబట్టి ప్రతి దినము
ప్రతి మనిషి అల్లాహ్ చేత ఆడింపబడుచున్నాడని తెలియుచున్నది. ఈ
విధముగా సక్రమముగా ఖుర్ఆన్ వాక్యములను అర్థము చేసుకొంటే ఎంతో
ఉన్నతమైన జ్ఞానము తెలియడమేకాక మూడు దైవ గ్రంథములకు
సమన్వయము ఏర్పడును. అట్లుకాని ఎడల ఖుర్ఆన్కంటే ముందువచ్చిన
రెండు గ్రంథములలో దైవజ్ఞానమున్నదని ఖుర్ఆన్ గ్రంథము ధృవీకరించు
చున్నదని సూరా 5, ఆయత్ 48లో చెప్పిన మాట వృథాయగును. దేవుడు
ముగ్గురిగా లేడు పునరుత్థాన దినమున ఇద్దరు దేవదూతలు వస్తారని
(50-21) చెప్పారు అంటే ముందు దైవ గ్రంథములలో చెప్పిన మాటను
అతిక్రమించి నట్లగును. దేవుడు ముగ్గురుగా లేడనీ ఒక్కడేయనీ మిగతా
ఇద్దరు పునరుత్థాన దినమున మనిషి వెంటవచ్చే దేవదూతలు అని అంటే
మూడు గ్రంథములలో సమన్వయ జ్ఞానము లేనట్లగును. మనిషి అంతిమ
దైవ గ్రంథములోని సూక్ష్మవాక్యముల వివరమును తెలియక తప్పుదారి
పట్టినట్లగును.
మనిషి ఎలా తప్పుదారి పట్టాడు అంటే సూక్ష్మ విషయమును
స్థూలముగా అర్థము చేసుకొంటే అది దారితప్పినట్లగుననీ తెలియవలెను.
ఉదాహరణకు ఎలా తప్పుదారిపట్టాడో నన్ను విమర్శించిన ఒక విమర్శలో
తెలియుచున్నది చూడండి. "ఖుర్ఆన్ 22-44 వాక్యము ప్రకారము ఏడు
ఆకాశాలు బయట ఎక్కడా లేవని ప్రబోధానందగారు వ్రాశారు. దీనిని
మేము ఖండిస్తున్నాము. ఆయనకు ఈ ఆయత్ అర్థముకాక అలా వ్రాశాడు.
సూరా 2, ఆయత్ 29 లో చూస్తే ఏడు ఆకాశములు కలవని తెలియగలవు”
అని అన్నారు. ఇప్పుడు 2-29ని చూస్తాము (2-29) “ఆయన భూమిలో
యున్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించాడు. తర్వాత తన దృష్టిని
ఆకాశముల వైపు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరచాడు
మరియు ఆయన ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానము కలవాడు."
ఈ వాక్యము పూర్తి సూక్ష్మజ్ఞానము గల వాక్యము. దీనిని
స్థూలముగా అర్థము చేసుకొని బయట ఏడు ఆకాశములున్నవని ఏడో
ఆకాశములో అల్లాహ్ ఉన్నాడని ముస్లీమ్లు చెప్పుచున్నారు. స్థూలముగా
బయట ఆకాశము ఒక్కటే యున్నది. ఏడవ ఆకాశమున్నదని ఏ శాస్త్రవేత్త
కూడా నిరూపించలేడు. సూక్ష్మముగా అయితే మనిషి శరీరములో నాడీ
కేంద్రములు ఏడుగా విభజింపబడినవి. ఏడు నాడీకేంద్రములనే ఏడు
ఆకాశములుగా గ్రంథములో చెప్పారు. ఏడవ ఆకాశములో అల్లాహ్
సింహాసనము అదిష్ఠించి యున్నాడని చెప్పడము వలన మనిషి శరీరములో
తలయందు గల ఏడవ నాడీకేంద్రమున దేవుడున్నాడని చెప్పవచ్చును. సూక్ష్మ
జ్ఞానము తెలియనివారు దేవుడు ఏడవ ఆకాశములో పైన ఉన్నాడని చెప్పు
చుందురు. అలా అయితే మనిషికి దేవుడు చాలా దూరములో ఉన్నట్లగును.
దేవుడు బయట ఏడవ ఆకాశములో ఉన్నాడని చెప్పువారు (2-186)
ఆయత్కు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును. సూరా రెండు, ఆయత్ 186
లో ఇలా కలదు చూడండి.
(2-186) “నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను
వారికి అతి సమీపములో ఉన్నాను అని చెప్పు. పిలిచేవాడు
నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను.
కాబట్టి వారు సరైన మార్గము పొందడానికి నా ఆజ్ఞ (జ్ఞానమును)
అనుసరించాలి మరియు నాయందు విశ్వాసము కల్గియుండాలి
యని చెప్పు.”
(2-29) వాక్యమును స్థూలముగా చెప్పుకొంటే దేవుడు దూరముగా
ఎక్కడో ఏడవ ఆకాశములో ఉన్నట్లగును. అప్పుడు (2-186) వాక్యమునకు
ఆ మాట పూర్తి వ్యతిరేఖమగును. దేవుడు ప్రతి మనిషి శరీరములో
తలయందుగల ఏడవ నాడీకేంద్రములో యుండి మనిషి అనుకొను ప్రతి
విషయమును తెలియగలుగుచున్నాడు. దేవుడు మనకు అత్యంత సమీపమున
ఉన్నాడు అనుమాట (2-186) ఆయత్ ప్రకారము సత్యము. ఆకాశములు
ఏడు బయట లేవు, లోపల ఉన్నాయను సూక్ష్మజ్ఞానమును తెలియవలెను.
అట్లు తెలియక నేను చెప్పినమాట అసత్యమని చెప్పి ఆరోపించారు.
(2-186) ఆయత్ ప్రకారము ఏది సత్యమో ఏది అసత్యమో ఏడు
ఆకాశముల విషయములో తెలియగలదు. నన్ను అసత్యవాదియని
ఆరోపించినా ఫరవాలేదు. మీరు దేవునికి దగ్గరగా పోవుచున్నారా, దారితప్పి
దూరముగా పోవుచున్నారా ఒకమారు వెనుదిరిగి చూచుకోండి. మీరు
సత్యములో లేరని నేను అన్ని విధముల సత్యమునే బోధించుచున్నానని
తెలియగలదు. దేవుడు సూక్ష్మముగా కనిపించనివాడు, ఆయన జ్ఞానము
కూడా సూక్ష్మముతోనే కూడుకొనియుండును. సూక్ష్మ వివరము తెలియనివారు
సూక్ష్మమైన దేవున్ని తెలియలేరు. మీరు సరియైన మార్గములో ఉన్నారో
లేదో ఒకమారు వెనుతిరిగి చూచుకోండి. అప్పుడు ఏది సత్యమో ఏది
అసత్యమో తెలియగలదు.
సమాప్తము.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా, అది అసత్యము కాదు.