ఇందుత్వమును కాపాడుదాం cloud text 17thSep2024 Updated.
ఇందుత్వమును కాపాడుదాం.
మొత్తము ప్రపంచములో దాదాపు పదునెనిమిది (18) వందల భాషలున్నట్లు వినికిడి. అందులో పదునాలుగు
(14) వందల భాషలు లిపిగలవి కాగా, లిపిలేనివి నాలుగు (4) వందల భాషలున్నట్లు కొందరు చెప్పగా విన్నాను.
మొత్తము భాషలలో కొన్ని దేశ భాషలుకాగా, కొన్ని మాత్రము ప్రాంతీయభాషలుగా ఉన్నాయి. భారతదేశములో హిందీ
భాష దేశభాష కాగా, ఆంధ్రరాష్ట్రములో తెలుగుభాష ప్రాంతీయభాషగా ఉన్నది. ఆంధ్రరాష్ట్రములో తెలుగు భాష
లిపిగల భాషకాగా, లిపిలేని భాషలు ఈ రాష్ట్రములోనే ఎన్నో గలవు. మొత్తము దేశములో లిపియున్న భాషలలో
తెలుగు గొప్పది కాగా, లిపిలేని భాషలలో సంస్కృత భాష గొప్పదని కొందరు చెప్పగా విన్నాను. "దేశభాషలలో తెలుగు
లెస్స” అని గురజాడ అప్పారావు చెప్పినట్లు వినికిడి. తెలుగు భాషలోనున్న అక్షరములు మరి ఏ ఇతర భాషలోనూ
లేవు. అందువలన ఏ శబ్దమునైన సులభముగా ఉన్నదున్నట్లు వ్రాయవచ్చును. ఉత్తర భారతదేశములో పూర్వము
చదువువచ్చిన పండితులు ఎక్కువగా ఉండెడివారు. దక్షిణ భారతదేశములో చదువురాని పామరులు ఎక్కువగా
ఉండెడివారు. భాషా పాండిత్యముగల పండితులు తమతమ రచనలన్నిటిని లిపిలేని సంస్కృత భాషలో చెప్పుచూ,
లిపిగల హిందీభాషలో వ్రాయడము జరిగినది. త్రేతాయుగములోని ఆదికవి వాల్మీకితో మొదలుకొని ద్వాపర యుగములో
వేదవ్యాసుని వరకు సంస్కృతములోనే తమ రచన లన్నిటిని చెప్పడము జరిగినది. లిపిలేని భాష అయినా సంస్కృత
భాషకున్నంత విలువ మరి ఏ భాషకూ లేదనియే చెప్పవచ్చును. సంస్కృతమును హిందీ భాషయొక్క లిపితో వ్రాయడము
వలన, అది కూడా దేశభాషతో సమానముగా ప్రచారమైనది. దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశములో కేవలము ఒక్క
రాష్ట్రములో మాత్రమున్న తెలుగు భాషయందు పూర్వపు యుగములలో కవులు, పండితులు లేనిదానివలన తెలుగు
భాషయొక్క గొప్పతనము దేశములోని చాలా ప్రాంతముల వారికి తెలియకుండా పోయినది. కలియుగములో ఆరు
(6) వందల సంవత్సరముల పూర్వము ఆంధ్ర దేశమును పాలించిన కృష్ణదేవరాయలు తెలుగు భాషను, తెలుగు భాషా
కవులను పోషించిన దానివలన తెలుగు భాష యొక్క ప్రావీణ్యత కొంత బయటపడినది. అంతకు ముందు వ్యాసుడు
సంస్కృతములో వ్రాసిన భారత భాగవత గ్రంథములను తెలుగులోనికి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అను ముగ్గురు
కవులు వ్రాయడము వలన, తెలుగుభాషలో పాట, పద్య, గద్య, ద్విపద రూపములో వ్రాయుటకు అనుకూలముండుట
వలన, మరి ఏ ఇతర భాషలలో ఇటువంటి అనుకూలము లేని దానివలన, తెలుగుభాష ఇతర ప్రాంతములవారికి
కొందరికి తెలియడమేకాక, దేశభాషలలో తెలుగు గొప్ప భాషయని తెలిసిపోయినది. తెలుగు భాష యొక్క పదముల
కూర్పులోని నైపుణ్యత, శబ్ద ఉచ్చారణలోని అందము ఇతర భాషలయందు వెదకినా కనిపించక పోవడము వలన,
తెలుగు భాషను చూచిన ఎవ్వరైనా, ఇది దేశభాషలలోనే గొప్ప భాషయని చెప్పక తప్పదు.
ఇదంతయు తెలుగుభాష యొక్క గొప్పతనమునకు కనిపించు సత్యము కాగా, కనిపించని సత్యమొకటి కలదు.
అది తెలుగు భాష పుట్టుకకే కారణమైనదని చెప్పవచ్చును. దానిని వివరించి చెప్పుకొంటే తెలుగు భాష దేశభాషలలో
గొప్పదని కనిపించు వివరముల ప్రకారము చెప్పగలిగితే, తెలుగు భాష 'దేహి' భాషలలోనే గొప్పదని కనిపించని
వివరముల ప్రకారము చెప్పవచ్చును. దేశము కనిపించునది. దేహి కనిపించనిది. దేశములో మనుషుల చేత చెప్పబడు
భాషలు ప్రపంచ విషయములను తెలియజేయున విగా ఉన్నవి. దేహములోని దేహిచేత చెప్పబడు భాష పరమాత్మ
విషయము లను తెలియజేయునదిగా ఉన్నది. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! దేశములోని
మనుషులు ఎవరు చెప్పినా అది దేహములోని దేహి చెప్పినట్లే కదా! అప్పుడు రెండూ ఒకటే అగును కదా! అని
అడుగవచ్చును. దానికి జవాబు ఈ విధముగా ఉన్నది. రెండూ శరీరమునుండి ఆత్మ చెప్పునవే అయినా బయట
దేశము మీద దృష్ఠికలిగి చెప్పునది దేశభాష అగును. లోపల దేహిమీద దృష్ఠికలిగి చెప్పునది దేహిభాష అగును.
వివరముగా చెప్పితే దేశభాష అనగా అజ్ఞానముతో కూడుకొన్నదనీ, దేహి భాషయనగా జ్ఞానముతో కూడుకొన్నదనీ
చెప్పవచ్చును. తెలుగుభాష లోని ప్రావీణ్యత ఇటు బయట దేశభాష ప్రకారము గలదు, అట్లే లోపలి దేహి భాష
ప్రకారమూ గలదు. లోపలి ఆత్మయొక్క జ్ఞానమును చెప్పునప్పుడు ఆత్మజ్ఞానమునకు చాలా దగ్గరగా యున్నది ఒకే ఒక్క
తెలుగుభాష. తెలుగు భాషలోని శబ్దములు, పద ఉచ్చరణలు ఆత్మజ్ఞానమునకు ఉన్నంత దగ్గరగా మరి ఏ ఇతర
భాషలోనూ లేవు. అందువలన తెలుగు భాష దైవజ్ఞానమును దగ్గరగా చెప్పుట కొరకే తయారు చేయబడినదనీ,
ఆత్మజ్ఞానమును తెలుపుటకు ప్రత్యేకముగా తయారు చేయబడిన భాష ఇదియేననీ చెప్ప వచ్చును. ఈ కారణమున
తెలుగు భాషను తెలిసినవారికే దైవజ్ఞానమును తెలుసుకొను అవకాశము ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. ఆత్మ
జ్ఞానమును తెలిసినవారు ఏ ప్రాంతమువారైనా, తెలుగు భాషను తెలిసిన తర్వాత తమ జ్ఞానమునకు తెలుగు భాషకు
ఉన్న సంబంధమును చూచి, ఆత్మజ్ఞానము కొరకు ప్రత్యేకముగా తయారు చేయబడినది తెలుగుభాషయని తప్పక
చెప్పుదురు. దేవుడు తన భావములను తెలుపుటకు ఎక్కువ అనుకూలముగా ఉండునట్లు తెలుగు భాషను ముందే
తయారు చేసి వుంచాడనీ, భూమిమీద తన ధర్మములను మూడవ అవతారములో సంపూర్ణము చేయుటకు తెలుగుభాషను
ఉపయోగించుకొనునని తెలియు చున్నది. దేవుడు భగవద్గీతలో చెప్పిన తన త్రైతసిద్ధాంతమును అనుసరించి, తన
ధర్మములను జ్ఞానరూపములో పూర్తి వివరముగా తెలుపుటకు మూడు మార్లు భూమిమీదకు రావలసివున్నది. మూడవమారు
వచ్చినపుడు ఏమాత్రము సంశయము లేకుండా, ప్రశ్న అనునది మిగలకుండా, శాస్త్రబద్ధముగా సంపూర్ణ సమాచారమును
అందివ్వవలసివున్నది. అటువంట పుడు తన భావమును (దైవ భావమును) బాహ్యముగా తెలుపునది భాషయే. లోపలి
భావమును బయటికి తెలుపునది భాష అయినపుడు, ఆ భాషను తన భావములకు దగ్గరగా ప్రజలు అర్థము చేసుకొనునట్లు
తెలుగుభాషను తయారు చేసియుంచాడు. సంపూర్ణముగా దైవ భావములను ప్రకటించు భాష ఏదైతే ఉందో, ఆ
భాషయందే తన మూడవ అవతారము ద్వారా ధర్మ ప్రకటన సంపూర్ణము చేసిపోవును.
దైవ ధర్మములను సంపూర్ణముగా వ్యక్తము చేయు భాష ఒకే ఒక తెలుగు భాష. అందువలన ఒక విధముగా
"దేశభాషలలో తెలుగు లెస్స” అని కొందరనినా ఇపుడు మేము “దేహి భాషలలో తెలుగు గొప్ప” అని అంటున్నాము.
దేహి అనగా దేహమును ధరించినదని అర్థము. దేహమును ధరించినవి రెండు ఆత్మలు గలవు. అందులో ఒకటి
జీవాత్మ, రెండు ఆత్మ ఆత్మయే జీవున్ని తనవెంట లాగుకొనివచ్చి శరీరములో ప్రవేశించుచున్నది. అందువలన జీవుడు
శరీరములోనికి ప్రవేశపెట్టబడువాడు కాగా, ఆత్మ శరీరములోనికి ప్రవేశించునదిగా ఉన్నది. మొదట దేహములోనికి
చేరునది ఆత్మ అయినందున దానిని దేహి అంటున్నాము. వివరముగా చెప్పుకొంటే దేహములోపల చిక్కుకొన్నవాడు
జీవాత్మ. దేహమును ధరించినవాడు ఆత్మ. ఒకడు కోటును ధరించి కోటుకున్న జేబులో తనవెంట తెచ్చుకొన్న వంద
రూపాయల నోటును పెట్టుకొన్నాడనుకొనుము. అప్పుడు కోటును ధరించినది ఆ వ్యక్తేగానీ అతని వందరూపాయల
నోటు కాదుకదా! అట్లే ఆత్మ శరీరమును ధరించుచుండగా ఆత్మ వెంటవచ్చు జీవాత్మ కోటు జేబులోని నోటు
ఉన్నట్లు శరీరములోగల గుణచక్రములో ఉంటున్నది. శరీరములో ఒక్క చోటనున్న జీవాత్మను వదలిపెట్టి శరీరమంతటా
వ్యాపించి యున్న ఆత్మను, దేహమును ధరించిన దేహి అంటున్నాము. దేహి అయిన ఆత్మ దేవునికీ, జీవునికీ మధ్యవర్తిగా
ఉంటూ దేవుని ధర్మములను జ్ఞానరూపములో భావమును వ్యక్తము చేయుచున్నది. అలా భగవద్గీత భావమును
మొదట హిందీ భాషలో శ్రీకృష్ణుడు వ్యక్తము చేయగా, వ్యాసుడు సంస్కృత భాషతో హిందీ లిపిలో వ్రాసియుంచాడు.
దేవుడు ఒకమారు ధర్మ సంస్థాపన చేయు నిమిత్తము మూడుమార్లు భగవంతునిగా పుట్టవలసియున్నది. మొదట
కృష్ణునిగా పుట్టి భగవద్గీతను ప్రకటించగా, దానిని లిపిలేని సంస్కృతములో హిందీ లిపిని ఉపయోగించి వ్రాయడము
జరుగగా, దేవుని చివరి అవతారము భారతదేశములో దక్షిణ ప్రాంత భాష అయిన తెలుగు భాషలోనే తన ధర్మములను
తెలియజేయుననుటకు ఎన్నో ఆధారములు గలవు. అవియే తెలుగుభాషకు దేవుని జ్ఞానమునకు దగ్గరగానున్న
సంబంధములు. ఇపుడు దేవుని జ్ఞానమునకు, భాషా శబ్దములకు గల సంబంధములను వివరించుకొని చూస్తాము.
తెలుగుభాష దైవజ్ఞానమునకు ఎంతో సంబంధపడి ఉన్నదని తెలియాలంటే, అంతో ఇంతో దైవజ్ఞానమున్న
వారికే తెలియునని మన పెద్దలు చెప్పుచుందురు. భూమిమీద ఎందరో ప్రపంచ జ్ఞానము మీద ఆసక్తికలవారుండగా,
కొద్దిమంది మాత్రమే పరమాత్మ జ్ఞానము మీద ఆసక్తి కలవారుందురు. అటువంటి వారున్నారనుటకు గుర్తుగా పూర్వము
మన పెద్దలు మనుషులకు రెండు పేర్లను పెట్టారు. అవి ఒకటి భానుమతి, రెండు చంద్రమతి లేక ఇందుమతి.
ఆకాశములో ప్రకాశించేవారు ఒకరు సూర్యుడు, రెండు చంద్రుడు. సూర్యుడు మనుషులకు ప్రకాశమునిస్తే చంద్రుడు
మనుషుల మెదడుకు ప్రకాశమునిస్తాడని చెప్పవచ్చును. సూర్యుడు ప్రపంచ జ్ఞానమునకు అధిపతికాగా, చంద్రుడు
దైవజ్ఞానమునకు అధిపతిగా ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రములో సూర్యచంద్ర స్థానములనుబట్టి జాతకుడు భానుమతియా
లేక ఇందుమతియా అని చెప్పవచ్చును. ఆకాశములో ప్రకాశించు వాటిలో ముందు చెప్పవలసినది సూర్యుడుకాగా,
సూర్యుని తర్వాత చంద్రున్ని చెప్పవచ్చును. ఈ సూర్య చంద్రులు రెండేకాక ప్రకాశించు మూడవది కూడా కలదు.
అదియే నక్షత్రము. సూర్యచంద్రుల తర్వాత నక్షత్రమును చెప్పవచ్చును. తెలుగు భాషలో క్షత్రము అనగా గొడుగు లేక
నాశనము అని చెప్పవచ్చును. నక్షత్రము అనగా గొడుగు క్రింద లేనిది అని చెప్పవచ్చును. అలాగే మరియొక
అర్థముతో నాశనములేనిది అని కూడా చెప్పవచ్చును. గొడుగు క్రింద లేనివాడు అని చెప్పుకొంటే ఒకరి రక్షణలో
లేనివాడు అనియు, మరియొకరి ఆధీనములో లేనివాడనియు చెప్పవచ్చును. ప్రపంచములోని మనుషులందరు దేవుని
ఆధీనములో ఉండగా, దేవుడు ఎవరి అధీనములోనూ లేడు. ఈ విషయమును తెలుపుటకు దైవ సమానమైన గురువు
తన తలమీద టోపీనిగానీ, రుమాలుగానీ ధరించే వాడుకాడు. మిగతా ప్రజలందరూ ఏదో ఒకటి తలమీద ధరించి
దేవుని ఆధీనములో ఉన్నామన్నట్లు తెలియజేసెడివారు. తలమీద టోపీని ధరించడము లేక గుడ్డను ధరించడము,
రుమాలును ధరించడము పూర్వము నుండి ఇందువులలో (హిందువులలో నున్న సాంప్రదాయము. అలాగే
గురువుగానున్నవాడు ముసుగును వేయడముగానీ, టోపీని పెట్టుకోవడము గానీ, రుమాలును చుట్టుకోవడముగానీ
చేసెడివాడు కాదు.
ఆకాశములో ప్రకాశము కల్గిన సూర్య, చంద్ర, నక్షత్రములను అనుసరించి భూమిమీద మనుషులను
మూడురకములుగా విభజించ వచ్చును. దైవ సమానుడైన గురువు నక్షత్రమునకు గుర్తుగా, దైవజ్ఞానమును కల్గిన గురు
శిష్యులను లేక జ్ఞానులను చంద్రునికి గుర్తుగా, దైవజ్ఞానమంటే ఏమిటో తెలియక ప్రపంచములో చురుకుగా తిరుగు
అజ్ఞానులను సూర్యుని గుర్తుగా చెప్పవచ్చును. గురువు ఒక్కడే ఉంటాడు. గురువు ఎప్పుడుంటాడో, ఎక్కడుంటాడో,
ఎలా ఉంటాడో కూడా తెలియదు. కావున గురువును మినహాయిస్తే మిగతా ప్రజలనందరిని జ్ఞానులుగా, అజ్ఞానులుగా
విభజించి చెప్పవచ్చును. దీనినిబట్టి పూర్వము మనుషులను సూర్యవంశమువారనీ, చంద్రవంశమువారనీ చెప్పెడివారు.
ప్రస్తుతకాలములో పూర్తి అజ్ఞాన దశలోనున్న మనుషులకు సూర్యవంశమంటే ఏమిటో, చంద్రవంశమంటే ఏమిటో
తెలియకుండా పోయినది. అజ్ఞానము వలన తాము సూర్య వంశమునకు సంబంధించినవారమను విషయమును
మరచిపోయారు. ఇప్పుడున్న అజ్ఞానులందరు సూర్యవంశమునకు చెందిన భానుమతులేనని చెప్పవచ్చును. అలాగే
ఎక్కడైనా దైవజ్ఞానులుంటే వారందరూ చంద్ర వంశమునకు సంబంధించిన ఇందుమతులేనని చెప్పవచ్చును. ఇప్పుడు
మీకొక అనుమానము రావచ్చును. అదేమనగా ఎక్కడో తెలుగు భాషలో మొదలుపెట్టి చంద్రవంశము, సూర్యవంశము
అని ఎక్కడికో పోయాడే అని అనుకోవద్దండి. భాషను గురించి చెప్పాలంటే ముందు నా తలమీద టోపీ ఉందో లేదో
మీకు అర్థము కావాలి కదా! అందువలన అక్కడనుండి ఇక్కడి వరకు వచ్చాము. ఇప్పుడు భాషను గురించే చెప్పుకొందాము.
తెలుగు భాష యొక్క లిపిలోని అక్షరములు మొత్తము 54 కాగా సున్న, అరసున్న, విసర్గములతో కలిపి
మొత్తము 57 గా ఉన్నవి. 54 అక్షరములను అచ్చులు, హల్లులు అను భాగములుగా విభజించారు. అందులో
అచ్చులు మొదటి భాగములోనివి. అచ్చులు మొత్తము 16 కాగా, హల్లులు మొత్తము 38 ఉన్నవి. అచ్చులలో
మొదటినుండి ఉన్న పదహారు అక్షరములు ఇలా కలవు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, లు, లూ, ఎ, ఏ, ఐ, ఒ,
ఓ, ఔ. అచ్చులతోనే తెలుగు భాష లిపిని నేర్వ వలసివున్నది. అయితే ప్రస్తుత కాలములో “అ” నుండి మొదలుపెట్టి
నేర్పుచుండగా, పూర్వము “అ” నుండి నేర్పక, అచ్చులు కాని పదములను నేర్పెడి వారు. అరవై (60) సంవత్సరముల
పూర్వము ప్రాథమిక పాఠశాలలో నేను చదువును నేర్చుకొన్నపుడు ఒ, న, మః, శి, వా, యః అని ఆరు అక్షరములను
నేర్పి, తర్వాత అ ఆ అని అచ్చులను నేర్పెడివారు. వేయి సంవత్సరముల వెనక్కి పోయి చూస్తే తెలుగు భాషను
నేర్పేముందు ఈ భాష దైవమునకు సంబంధించినది అన్నట్లు హిందు (ఇందూ) జ్ఞానము ప్రకారము దైవమునకు
గుర్తుగానున్న “ఓం” అను శబ్దమును నేర్పించెడివారు. తర్వాత శివమునకు నమస్కరిస్తున్నాను అను భావమును
తెల్పుచు “ నమః శివాయ" అని అనెడి వారు. దానినంత కలిపి “ఓం నమః శివాయ” అని పూర్వము నేర్పించగా నేను
చదువుకొన్నపుడు అది కాస్త మారిపోయి “ఓ, న, మః, శి, వా, యః అని ఆరు విడి అక్షరములుగా నేర్పెడివారు.
ప్రస్తుత కాలములో పూర్వమున్నట్లు రెండు పదములుగా ఓం నమఃశివాయ అనిగానీ, అరవై సంవత్సరముల క్రితమున్నట్లు
ఆరు అక్షరములుగా ఓ, న, మః, శి, వా, యః అనిగానీ లేకుండా పోయాయి. ఇప్పుడు పాఠశాలలో అ, ఆ, ఇ, ఈ అని
అచ్చులను నేర్పడము జరుగుచున్నది.
పూర్వము తెలుగు భాషకంటే ముందు దైవమునకు నమస్కరించి నట్లు తెలుపు ఓం నమః శివాయ అను
పదములు ఉండగా, తర్వాత కాల క్రమములో దేవునికి నమస్కరించు భావము లేకుండ పోయి ఓం ఒ గా మారిపోగా
మిగతావన్నీ విడి అక్షరములుగా ఒ, న, మః, శి, వా, యః అని చెప్పడము జరిగినది. ఇప్పుడు అర్థములేని ఆరు
అక్షరములు పోయి అచ్చులతో మొదలు పెట్టి అ, ఆ, ఇ అని మొదలు పెట్టి చెప్పడము జరుగు చున్నది. తెలుగు
భాషను అచ్చులతో మొదలుపెట్టి చెప్పినా, అది జ్ఞానము తోనే కూడిన అర్థముతో ఉన్నది. తెలుగు భాష దైవజ్ఞానము
కొరకే దేవుడే నిర్మించిన భాష అని మనము ముందే చెప్పుకొన్నట్లు, అచ్చులతో మొదలు పెట్టి చెప్పినా అందులోని
మొదటి మూడక్షరములలో త్రైత సిద్ధాంతము ఇమిడివుండి, తెలుగుభాష దైవభాష అని చెప్పుటకు ఆస్కారమైనది.
అచ్చుల లోని మొదటి మూడు అక్షరములు అ, ఆ, ఇ అని కలవు. మొదటి మూడు అక్షరములను దైవ సిద్ధాంతమైన
త్రైత సిద్ధాంతముతో పోల్చుకుంటే అ - జీవాత్మ, ఆ - ఆత్మ, ఇ - పరమాత్మగా చెప్పవచ్చును. రెండవ అక్షరమైన ‘ఆ’
ను ఆత్మగా చెప్పుకొంటే, మూడవ 'ఇ' పరమాత్మ, ఒకటవ 'అ' జీవాత్మగా మిగిలిపోవుచున్నది. ఇందు అనగా చంద్రుడని,
చంద్రుడు దేవుని జ్ఞానమునకు గుర్తు అని చెప్పుకొన్నాము. దైవజ్ఞానమునకు చంద్రుడు గుర్తుగా ఉన్నట్లు భగవద్గీతలోనే
ఆధారము కనిపిస్తున్నది. భగవద్గీతయందు అక్షర పరబ్రహ్మయోగమున 23, 24, 25 శ్లోకముల సారాంశమును
చూస్తే ఇలా కలదు. "యోగులు ఎప్పుడు మరణిస్తే తిరిగి పుట్టుదురో, ఎప్పుడు మరణిస్తే తిరిగి పుట్టకుండ ముక్తిని
పొందుదురో, ఆ మరణ సమయమును గురించి చెప్పెదను విను" అని కృష్ణుడు చెప్పాడు. అలా చెప్పునపుడు శాస్త్రబద్ధతతో
కూడిన విషయమును అర్జునునికి చెప్పుచూ సూర్యరశ్మిగల ప్రదేశములో యోగి ఉండి అతను మరణించు సమయము
పగటి కాలము, శుక్లపక్షము, ఉత్తరాయణము అయివుంటే ఆ యోగి కర్మరహితుడై దేవునియందు కలిసిపోవుననీ, అలా
కాకుండ సూర్యరశ్మి లేని ప్రాంతములో యోగివుండినా, రాత్రి కాలమైనా, కృష్ణపక్షమైనా, దక్షిణాయనమైనా యోగి
అయినవాడు మరణిస్తే అతడు ముక్తిని పొందక తిరిగి జన్మించుననీ. అపుడు అతడు యోగి అయిన దానివలన అతడు
చంద్రతేజమును కలిగి పుట్టుచున్నా డనీ కృష్ణుడు చెప్పడము జరిగినది.
అక్షర పరబ్రహ్మయోగము : 25వ శ్లోకము
ధూమో రాత్రి స్తథాకృష్ణ షణ్మాసా దక్షిణాయనమ్,
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే.
ఈ శ్లోకమునందు “చాంద్రమసం జ్యోతి" అను వాక్యమును పరిశీలించి చూస్తే, సంపూర్ణ జ్ఞానమును పొంది
అని తెలియుచున్నది. చంద్రతేజస్సును పొంది అనడములో దైవజ్ఞానమును పొంది అనియూ, దైవ జ్ఞానమును
చంద్రతేజస్సుగా పోల్చి చెప్పారనియూ తెలియుచున్నది. దేవుడు చెప్పిన ఈ మాటను ఆధారము చేసుకొని సూర్యున్ని
జీవునిగా, నక్షత్రమును దేవునిగా చెప్పుకొన్నాము. చంద్రుడు దేవుని జ్ఞానమునకు గుర్తుగా ఉండుట వలన ఇందువు
(చంద్రుడు) అనుమాటను సంపూర్ణ జ్ఞానముగలవానికి ఉపయోగించడము జరిగినది. సృష్ఠి ఆదియందు దేవుడు తన
జ్ఞానమును భూమిమీదికి చేరునట్లు సూర్యునికి చెప్పాడు. సూర్యున్ని జీవునిగా పోల్చాము, కావున దేవుడు జీవునికి తన
జ్ఞానము తెలుపునని అందరికీ తెలియునట్లు మొదట దేవుడు సూర్యునికే తనబోధను చెప్పాడు. దేవుడు చెప్పిన
జ్ఞానము సూర్యుని ద్వారా భూమికి చేరినది. సూర్యుని ద్వారా మొట్టమొదట భారతదేశములోనే దేవుని జ్ఞానము
తెలియబడినది. దేవుని జ్ఞానము తెలియబడిన మొదటి దేశము భారత దేశము. కావున భారత దేశమును జ్ఞానుల
దేశమని మిగత దేశముల వారందరు చెప్పడము జరిగినది. జ్ఞానదేశమైన దానివలన భారతదేశమును ఇందూ దేశమని
పిలిచెడివారు. ఒకప్పుడు భారతదేశమంతయు జ్ఞానులువుండి చంద్రతేజము కల్గిన దేశమైన దానివలన ఈ దేశమును
ఆనాడు అందరూ ఇందూ దేశమని కొనియాడెడివారు. కాలము జరిగిపోగా, ఒకప్పుడు భారతదేశము జ్ఞానము గల
ఇందువులతో నిండివుండెడిదనీ తమ చరిత్ర తెలియని భారతీయులు తమ జాతి ఇందూజాతియనీ, తమ జ్ఞానము
ఇందూజ్ఞానమనీ, తాము ఇందువులమనీ మరచిపోయి తమను తాము అర్థములేని హిందువులుగా చెప్పుకొంటున్నారు.
ఇందూ ధర్మములేవో, ఇందువంటే ఏమిటో తెలియని వారు, దైవజ్ఞానము రవ్వంతయు లేనివారు హిందూధర్మ రక్షకులమని
చెప్పుకొంటున్నారు.
భారతదేశములోని మిగతా ప్రాంతములవారు అజ్ఞానముతో అర్థము లేని హిందూ పదమును కరిపించుకొని,
అర్థమున్న ఇందూ పదమును వదలివేసి, తాము హిందువులమని చెప్పుకొనినా కొంత తప్పుగా కనిపించును. అయితే
దైవ జ్ఞానముతో సంబంధమున్న తెలుగుభాషను నేర్చినవారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారైనా తాము పూర్తిగా జ్ఞానమునూ
గత చరిత్రనూ మరచిపోయి మేము హిందువులము అనడము ఎంతో సిగ్గుచేటుగా ఉన్నది. చరిత్ర తెలిసినవారు
ఎవరైనా పూర్వమునుండి మనము ఇందువులమే, కాలక్రమమున హిందువులమని తెలియక అనుకోవడము జరుగుచున్నదని
ఉన్నదున్నట్లు చెప్పితే, అప్పటికీ అర్థము చేసుకోలేని బుద్ధిహీనులు సత్యము చెప్పినవారిని పరాయిమతమువారని ప్రచారము
చేసి, తమను హిందువులు కాదు ఇందువులు అన్నందుకు జ్ఞానులను హింసించడమూ, వారి మీదికి భౌతికదాడులు
చేయడమూ, వారిని నిందించడమూ చేయుచున్నారు. సత్యమును ఎంతగా వివరించి చెప్పినా వినే పరిస్థితిలో లేని
స్థాయికి అజ్ఞానమందు కూరుకొనిపోయి, ఒకప్రక్క ఇందూమతము సర్వనాశనమైపోవుచుండినా, తాము ఏమీ
ఉద్దరించడము చేయలేకుండినా, తమను తాము హిందూమత రక్షకులమని చెప్పుకొను చుందురు.
సృష్ట్యాదిలోనే దేవుడు తన ధర్మమును తెలియజేశాడు. ఆ రోజు ఏ మతమును తెలుపలేదు. ఆ దినము
తెలియజేసిన ధర్మము దైవ జ్ఞానమునకు సంబంధించినది. కావున దానిపేరు ఇందూధర్మము అని పిలువబడినది.
ఇందూ అను పదము యొక్క అర్థము దైవజ్ఞానమని తెలియవలెను. ఆనాడు భూమిమీద ఇందూధర్మము తప్ప ఏ మత
ధర్మమూ లేదు. ఇందూ ధర్మము కొందరనుకొన్నట్లు మతధర్మము కాదు. అది దైవ ధర్మము. దైవ ధర్మము
శరీరముతోయున్న ప్రతి మనిషికీ సంబంధించినది. కావున ఇందూధర్మము ఒక వర్గమునకు గానీ, ఒక మతమునకుగానీ
సంబంధించినది కాదు. ఈనాడు భూమిమీద ఎన్ని మతములు ఉన్నా, ప్రతి మతము వారికి దేవుని మీద నమ్మకము,
భక్తి, ప్రార్థనలు, ఆరాధనలు ఉన్నాయి. ఏ మతమువారైనా దేవుని గురించిన జ్ఞానమును తెలుపు గ్రంథమును కలిగి
యున్నారు. ఏ మతములోనైనా దేవుని జ్ఞానముండుట వలన ఆ మతములో ఇందూధర్మమున్నదనియే చెప్పాలి. పూర్వము
దేవుడు చెప్పిన ధర్మము దైవజ్ఞానముతో కూడుకొన్న దానివలన, భూమిమీద ఎందరు మనుషులు మారినా దేవుడు
మారడు, దేవుని ధర్మము మారదు. కావున నాటికీ నేటికీ దేవుని ధర్మము (ఇందూధర్మము) మారకుండా ఉన్నదని
చెప్పవచ్చును. కాలక్రమమున ఎన్నో మతములు పుట్టికొచ్చినా, ఆ మతముల పేర్లు ఎన్నో రకములుగా ఉండినా, అన్ని
మతములలోని మనుషులకు దేవుని ధర్మమైన ఇందూధర్మమే వర్తించును. ఒక మనిషికి పేరు, కులము, మతము
ఏదివుండినా మనిషికి మాత్రము ఒకే దేవుని ధర్మముండును. అదియే ఇందూధర్మము. దేవుని ధర్మము ఇందూధర్మమైతే
కొన్ని మతముల వారు తమది ఇందూధర్మమని చెప్పక తమది ఇస్లామ్ ధర్మమనియో, క్రైస్తవ ధర్మమనియో చెప్పుచుందురు
కదా! అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!
సూటిగా చెప్పాలంటే మొదటినుండివున్న ఇందూదేశములోని ఇందువులే మేము ఇందువులముకాదు,
హిందువులము అని చెప్పు చున్నపుడు మధ్యలో వచ్చిన ఇతర మతముల వారు వేరు పేరు చెప్పడములో ఆశ్చర్య మేమీ
లేదు. ఇందూధర్మము కాస్తా హిందూమతమైనపుడు తర్వాత పుట్టిన మతములు ప్రత్యేకమైన పేరు చెప్పుకోవడములో
తప్పులేదు. అయితే అన్ని మతముల వారు గమనించవలసిన విషయమేమంటే, ఎవరు ఏ మతస్థులైనా కావచ్చు, వారు
ఆ మతము పేరే చెప్పవచ్చును, కానీ అన్ని మతముల వారికి దేవుడు ఒకడున్నాడు, ఆయనకు సంబంధించిన ధర్మము
ఒకటున్నది. అన్ని మతముల వారు వారి ధర్మము ప్రకారము దేవున్ని గురించి చెప్పుచున్నారు కదా! వారు దేవున్ని
గురించి జ్ఞానరూపముగా చెప్పు ధర్మమేదైతే ఉన్నదో దానినే ఇందూధర్మము అంటున్నాము. అన్ని మతములలోనూ
దేవుడు అను పదము మారనట్లు, ధర్మము పేరు ఇందూ అనునది కూడా మారదు. అందువలన ఏ మతములో
అయినా అక్కడ దేవున్ని గురించి చెప్పు ధర్మము పేరు ఇందూధర్మము అని చెప్పాలి. ఇందూధర్మము ఒక మతమునకు
పరిమితమైనది కాదు. దేవుడు ఎట్లు అన్ని మతములకు సంబంధించినవాడో అట్లే ఇందూధర్మము అన్ని మతములకు
సంబంధించినదే అగును.
దేవుడు సృష్ట్యాదిలోనే చెప్పిన తన ధర్మము ఇందూధర్మము. భూమి మీద ఎన్ని మతములు వచ్చినా మొదట
సృష్ఠిని తయారు చేసిన దేవుడు మారడు. అట్లే అతని ఇందూధర్మమూ మారదు. దేవునికి ఎప్పటికీ పేరు ఉండదు.
అలాగే దేవుని ధర్మమునకూ పేరువుండదు. ఇందూ అనునది పేరుకాదు. ఇందూ అనగా దేవుని జ్ఞానమునకు
గుర్తింపు. దేవుని ధర్మమును గురించి చెప్పునపుడు ఇందూధర్మమని చెప్పాలి. దేవుని ధర్మమునకు భూమిమీద గుర్తింపు
చంద్రుడు కాబట్టి దేవుని ధర్మము ముందు చంద్రున్ని ఇందూ అని చెప్పుచూ ఇందూధర్మమనాలి. దేవుని ధర్మమును
ఎప్పటికీ దేవుని ధర్మమని చెప్పకూడదు. అలా చెప్పితే దేవున్ని పరిమితిచేసి చెప్పినట్లగును. దేవుడు పరిమితిలేనివాడు.
దేవున్ని గురించి ఖచ్చితముగా ఏ ధర్మమూ చెప్పలేదు. ఆయనను కొన్ని సందర్భములలో ధర్మాతీతుడు అని
చెప్పవలసివచ్చును. అందువలన దేవుని ధర్మమును ఇందూధర్మమని చెప్పాలి. దేవుని ధర్మమని చెప్పితే దేవుడు
ధర్మమునకు కట్టుబడివున్నవానిగా లెక్కించవలసివచ్చును. ఆయన ఒక విధముగా దేనికీ కట్టుబడువాడు కాదు. అందువలన
దేవుని ధర్మమని చెప్పవలసిన సందర్భములో ఇందూ ధర్మమని చెప్పాలి. అయితే కొందరు ఇతర మతములవారు
దేవుని ధర్మమని చెప్పవలసిన చోట ఇస్లామ్ ధర్మమనియో, లేక క్రైస్తవ ధర్మమనియో చెప్ప వచ్చును కదా! ఇందూధర్మమనియే
ఎందుకు చెప్పాలి అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా!
ప్రతి మనిషికీ నివసించే దానికి భూమి అవసరము, అట్లే ప్రకృతి అవసరము, ప్రకృతిలోని సూర్యచంద్రులు
అవసరము. ప్రకృతిలోని సూర్య చంద్రులు అందరికీ సంబంధించినవారేగానీ ప్రత్యేకించి ఏ మతమునకూ సంబంధించిన
వారు కాదు. భూమిమీద మనుషులందరికీ చంద్రుడు సమానముగా ఉన్నాడు. చంద్రుడు హిందూమతమునకు
సంబంధించిన వాడు అనిగానీ, ఇస్లామ్ మతమునకు సంబంధించినవాడు అనిగానీ లేదు కదా! అందువలన భూమిమీద
ఒక మతమునకు సంబంధములేని చంద్రుని పేరుతో చంద్రధర్మమని (ఇందూధర్మమని చెప్పడములో తప్పులేదు.
ధర్మము మతముకాదు, అట్లే మతము కూడా ధర్మముకాదు. మతములు ఎన్ని ఉన్నా అన్నిటికీ అధిపతి దైవము ఒక్కడే
అయినట్లు మతములు ఎన్నివున్నా అన్నిటికీ దారి చూపు ధర్మము ఒక్కటేనని చెప్పవచ్చును. భూమిమీద ఎన్నో
మతములు ఉన్నా అన్నిటికీ గమ్యము దేవుడే, మార్గము ధర్మమే. ఇక్కడ సమస్యంతా మనుషులందరికీ వారివారి
మతములు తెలుసు, అయితే అందరికీ ఒకే విధముగా ఉన్న దైవము తెలియడు, ఆయన ధర్మములు తెలియవు. ప్రతి
మతములో ధర్మములను తెలుపు జ్ఞానమున్నది. ప్రతి మతమునకు దేవుడు తన ధర్మములను తెలియుటకు ఒక
గ్రంథమునిచ్చాడు. ప్రతి మతములోని గ్రంథములో పవిత్రమైన దేవుని ధర్మములు తెలుపబడి వున్నాయి. ఒక్క
హిందూమతములో ధర్మములున్నవనీ, తర్వాత వచ్చిన క్రైస్తవ, ఇస్లామ్ గ్రంథములలో ధర్మములు లేవు అని చెప్పుటకు
వీలులేదు. ప్రతి మతములో సాంప్రదాయములను కొన్నిటిని ఆ మతస్థులు కల్పించుకొని ఉండవచ్చును. వారి
సాంప్రదాయముల ప్రకారము వారు వేరు మతస్థులుగా కనిపించవచ్చును. అంతమాత్రమున వారి ధర్మమువేరు కాదు,
అట్లే వారి దేవుడువేరు కాదు. దేవుడు సృష్ట్యాదిలో తెల్పిన జ్ఞానమే లేక ఇందూధర్మమే అన్ని మతముల మూలగ్రంథములో
ఉన్నది. అందువలన ఎప్పటికీ దేవుడు మారడు, దేవుని ధర్మము మారదనీ ధైర్యముగా చెప్పవచ్చును.
ప్రతి మతమువారు తమ గ్రంథములో చెప్పిన జ్ఞానము సర్వ మానవులకు సంబంధించినదనీ, ఒక మతమునకు
పరిమితమైనది కాదనీ చెప్పుచుందురు. వారు చెప్పినా చెప్పకపోయినా ఆ మాట వాస్తవమేనని చెప్పవచ్చును. అయితే
వారు అలా చెప్పినా అది బయటివారికి చెప్పు మాటగానే ఉండునుగానీ, వారి మనస్సులో మాత్రము తమ గ్రంథములో
చెప్పినవి తమ మతమునకు సంబంధించినవేనను భావముండును. చెప్పబడు ధర్మము సమస్త మానవాళికి వర్తించునని
మూలగ్రంథములలో ఉండుట వలన, దానిప్రకారము వారు అలా చెప్పుచున్నారేగానీ, వారి హృదయములో మాత్రము
తాము వేరనీ, తమ మతము వేరనీ, తమ ధర్మము వేరనీ అనుకొనుచుందురు. నేను స్వయముగా ఒక మతమునకు
సంబంధించిన మత పెద్దలతో కలిసి మాట్లాడినప్పుడు వారి హృదయముల లోని భావము బయటపడింది. వారి
ధర్మములను ఆచరించాలన్నా, వారి గ్రంథములోని ధర్మములను ఒప్పుకొనినా, వారి మతములో చేరమని వారు చెప్పడము
చూస్తే, వారి ఆలోచన అంతయు తమ మతమును పెంచు కోవాలని తప్ప దేవుని ధర్మమును బయటికి తెలియజేయాలని
లేదు. ఈ విధముగా నేను ముఖ్యముగా రెండు మతముల వారిని చూచాను. ఆ రెండు మతములనియే కాదు,
వాస్తవానికి అన్ని మతములు వారివారి మతమును పెంచుకోవాలని చూస్తున్నవి తప్ప, వారి మత గ్రంథములోని
ధర్మములను వారు గ్రహించడములేదు. అయితే ఒక్క హిందూమతములోని వారు మాత్రము తమ మతమును
పెంచుకోవాలను విషయము అటుంచి, తమ మతమును రక్షించుకొను పనిలో పడిపోయారు. తమ హిందూ మతమును
ఇతర మతములు ఆక్రమించుకొంటున్నాయనీ, అలా జరుగ కుండా చూడాలనీ కొందరు ప్రయత్నించుచుండగా, కొందరు
స్వమత రక్షణ అను పేరును అడ్డము పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారు.
నాకు తెలిసిన ఒక సంఘటనను వివరిస్తాను చూడండి. హిందూ మతములోనున్న ఒక వ్యక్తి తనది తక్కువ
కులమని తలచి, క్రైస్తవ మతములో చేరిపోయాడు. అతను ఇందూ ధర్మములను బోధించు మా భక్తులమీద ద్వేషము
పెంచుకొన్నాడు. అతను క్రైస్తవమతములో చేరినా చేరనట్లు నటిస్తూ, తాను హిందువుననియే చెప్పుకొంటూ, కొన్ని
హిందూధర్మ రక్షణ సంస్థలతో పరిచయములు పెంచుకొన్నాడు. తాను తక్కువ కులములోనున్న దానివలన హిందువులు
తనను గౌరవించలేదని క్రైస్తవమతములో చేరినవాడు ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను క్రైస్తవమతములో చేరినట్లుగానీ,
తాను క్రైస్తవుడనను విషయమును గానీ ఎవరికీ తెలియకుండా హిందువువలె వుంటూ, హిందువులతో కలిసిపోయి,
తాను కూడా హిందూమత అభిమాని నని హిందువులను నమ్మించి, హిందువులలో చిచ్చు పెట్టాలనుకొన్నాడు. ఆ
ఉద్దేశ్యముతోనున్నవాడు మా బోధలు హిందువులకు జ్ఞానాన్ని అందించి హిందూమతమునకు బలమును
చేకూర్చుతాయనుకొన్నాడు. మా జ్ఞానమును చెప్పువారిని అడ్డుకోవాలనుకొన్నాడు. దానికి తగిన ఆలోచన చేసి హిందూ
మత రక్షకులుగా పేరు పెట్టుకొన్నవారిని మా మీదికి పురిగొల్పి పంపాలను కొన్నాడు. దానిలో భాగముగా మేము
చెప్పునది పరమత బోధలనీ, ఆ విషయము తనకు బాగా తెలుసుననీ, మత రక్షకులమను వారికి చెప్పి రెచ్చగొట్టాడు.
మా పుస్తకములలోని జ్ఞానము వడ్డించిన విస్తరిలాంటిది. కావున కొందరికి మేము చెప్పు బోధలు హిందూ జ్ఞానమునకు
సంబంధించిన వనీ, ప్రబోధానందయోగీశ్వరులు హిందూధర్మ సిద్ధాంతకర్తయని తెలియుట వలన అతని మాటలను
వారు నమ్మలేదు. అటువంటి సమయములో మతరక్షణ పేరును అడ్డము పెట్టుకొని అక్రమాలు చేయువారిని అతను
కలిసి మా భక్తుల మీద దాడిచేయమని చెప్పడము జరిగినది. మతమును అడ్డము పెట్టుకొని అరాచకములు చేయువారిని
అతను కలిసిన దానివలన వారికి కొంత మొత్తము డబ్బు ఇచ్చి దాడి చేయుటకు పురిగొల్పాడు. అక్రమార్కులైన మత
రక్షణ కార్యకర్తలమనువారు 9 మంది అతనివద్ద 50 వేలు డబ్బు తీసుకొని బయట కిరాయి మనుషులను 16 మందిని
ఒక్కొక్కరికి 500 ఇస్తామని పిలుచుకొని మొత్తము 25 మంది ఒక్కమారుగా రాత్రిపూట 8.30 గంటల సమయములో
మా ప్రెస్మీద దాడి చేయడము జరిగినది. ప్రతి దినము కనీసము ఏడు లేక ఎనిమిదిమంది ఆ సమయములో
అక్కడుండెడి వారు. కానీ ఆ దినము ఒకరు మాత్రము అక్కడ ఆ సమయానికి ఉండడము వలన అందరూ అతనిమీద
దాడి చేసి కొట్టి పోయారు. ఎవరో క్రిష్టియన్ చర్చివారు వ్రాసిన వ్యాసమున్న పేపరు తెచ్చి అతనికి చూపి ఈ పేపరు
మీరే ప్రచురించారను సాకుతో కొట్టడము జరిగినది. ఆ పేపరులో వ్రాసిన వారి అడ్రస్ అంతావుండినా, దానిని
ప్రచురించినది మేముకాదని తెలిసినా, వారు ఆ విధముగా చేయడము వలన అది ఉద్దేశపూర్వకముగా చేసిన దాడియని
మాకు అర్థమైనది. ఈ విధముగా డబ్బు కొరకు హిందూధర్మమును తెలియజేయువారి మీదనే దాడిచేయు వారు
హిందువు లౌతారా? హిందూ మత రక్షకులౌతారా? మేము రచించిన 50 గ్రంథములు బయట అందరి వద్ద ఉన్నాయి.
అందరికి కనిపించులాగా ప్రెస్లో ఉంచడము జరిగినది. మేము ఎక్కడైనా హిందూ ధర్మములను చెప్పకుండా వేరు
మతములను గూర్చి వ్రాసియుంటే ఆ పుస్తకములో చూపించి అడుగవచ్చును కదా! దాడి చేయవలసిన అవసరము
లేదు కదా!
ఇంతవరకు హిందూ గురువులు ఎవరూ చేయని హిందూ ధర్మ ప్రచారమును నాలుగు వాహనములతో 40
మంది మనుషులతో ఊరూరు తిరిగి ప్రచారము చేయుచున్నాము. మా బోధలు చూచి హిందువులైనవారు ఎంతో
సంతోషిస్తున్నారు. మా బోధలు విన్నవారు, చదివినవారు మతము మారే ప్రసక్తే ఉండదు. ఆ విధముగా జ్ఞానమును
బోధించి హిందువులను జ్ఞానులుగా మార్చి, ఇక్కడ లేని జ్ఞానము ఎక్కడాలేదని మేము చెప్పుచున్నాము కావున,
హిందుమతము బాగుపడితే మాగుండా బాగుపడుతుంది. అట్లు కాకుండ హిందూజ్ఞానమేదో తెలియనివారు హిందూ
రక్షకులమని పేరు పెట్టుకొంటే హిందూమతము బాగుపడుతుందా? సమాజములో ఏ గుర్తింపు లేనివారు హిందూమత
రక్షకులమని పేరు పెట్టుకొని గుంపుగా ఉండి డబ్బులు తీసుకొని హిందువులమైన మా మీదికే దాడిచేసినందుకు ఇతర
మతములవారు నవ్విపోయారు. మా జ్ఞానమును తెలిసిన హిందువులు, అటువంటి హిందువులను ఏవగించుకొన్నారు.
ఎందరో హిందువులు ఇది హిందూమత రక్షకులమను వారికి మాకు జరిగిన సంఘటనను ఖండిస్తూ జాబులు వ్రాయడము
జరిగినది. ఈ విధముగా హిందూమతము మీద ద్వేషముకల్గిన ఒక క్రైస్తవుని చేతిలో డబ్బు కొరకు కీలుబొమ్మలై,
హిందువులనే హింసించడము హిందూమతమునకు పెద్ద చేటుగా చెప్పవచ్చును. ఎవరి మతమును వారు
సంరక్షించుకోవచ్చును, కానీ దానిని అడ్డము పెట్టుకొని హింసకు పాల్పడితే అటువంటి వారిని దేవుడు కూడా ఒప్పుకోడు.
మత ద్వేషములు మానవాళి నాశనమునకు దారితీస్తాయి. మతము అనునది జ్ఞానముకాదు. మతము అనునది
మనిషిని దేవునివైపు నడిపించ లేదు. హిందూమతములోని వారు చెప్పుకొనుటకు, వారికి దారి చూపుటకు భగవంతుడు
చెప్పిన భగవద్గీత గ్రంథము కలదు. దానియందు ఎంతో ఉత్తమమైన జ్ఞానమున్నది. దానిని తెలిసిన హిందువులు
ఎంతమంది ఉన్నారని చూస్తే బహుకొద్దిమంది మాత్రమేనని తెలియుచున్నది. జ్ఞానము తెలిసినవారు ఎవరైనా
కనీసము ఒక్కరైనా హిందూ ధర్మ రక్షణ సంస్థలలో పని చేస్తూవుంటే ఎంతో బాగుండేది. దురదృష్టవశాత్తు హిందూమత
రక్షణ అని పేరు పెట్టిన చోటగానీ, హిందూధర్మ రక్షణ అని పేరుపెట్టిన చోటగానీ హిందూధర్మములు, హిందూ
జ్ఞానము తెలిసినవారు లేకుండా పోయారని చెప్పవచ్చును. దానివలన ఎన్నో అనర్థములు జరుగుచున్నవని తెలియు
చున్నది. మతరక్షణ అను పేరు పెట్టుకొన్న చోటంతా పరమత ద్వేషము బయలుదేరుచున్నది. పరమతమును ద్వేషించడమే
మతరక్షణ కార్యముగా పెట్టుకొన్నవారు చాలామంది కలరు. ఒక మతములో పరమత ద్వేషము పుట్టితే, ఇతర మతములో
కూడా అదే సూత్రము ప్రకారము పరమతమును ద్వేషించడము మొదలగును. అక్కడినుండి ప్రారంభమైన ద్వేషము
మత రక్షణను అటుంచి మనుషుల వినాశనమునకు దారితీయును. ఒక మతము లోని వారు కొందరు మతద్వేషమునకు
బలైపోతే, ఆ మతమువారు తమ మతమువారు ప్రాణాలను కోల్పోవుటకు కారణమైన మతమువారి మీద కక్ష తీర్చుకొనుటకు
ఏమైనా చేయదలచి, ఎంతకైనా తెగించి తమ ప్రాణాలను పోగొట్టుకొని ఇతరుల ప్రాణాలను వందలు, వేల సంఖ్యలో
నష్టపోవునట్లు చేయుదురు. ఈ విధముగా ఆలోచిస్తే వినాశనము తప్ప ఎవరికీ ఏమీ లాభముండదు.
మానవ సమాజములో ఏ గుర్తింపులేనివారు తమ గుర్తింపుకొరకు ఏదో ఒకటి చేయాలని చూస్తుందురు.
ఎక్కువగా చెడువైపు పోవుచుందురు. అటువంటివారు మతము అనుదానిని అడ్డము పెట్టుకొని కొందరు ఉగ్రవాదులుగా
మారిపోవుచున్నారు. కొందరు ఉగ్రవాదము అను పేరు లేకుండా ఉగ్రవాదమును సాగించుచున్నారు. ఇదంతా నేను
ఊహించి వ్రాయునది కాదు. నేను చూచిన అనుభవములను చెప్పుచున్నాను. కొందరైతే 'ఆంధ్రాతాలిబన్' అనిపేరు
తెచ్చుకొని మురిసిపోతే, మరియొకరు ఆంధ్రామోడి అని గర్వముగా చెప్పుకొంటున్నారు. ఇటువంటి వారు సమాజమునకు
మేలు చేయుచున్నారో, కీడు చేయుచున్నారో ఏమాత్రము ఆలోచించడము లేదు. వాస్తవానికి వారు ఎంతోమంది
ప్రాణములతో చెలగాటమాడుచున్నారని వారికి తెలియలేదు. వారివలన ఎందరో ప్రజలు చేయని నేరానికి
బలైపోవుచున్నారు. మతద్వేషములను ఏమాత్రము ఒప్పుకోని నేను ఎదుటి మతమువారిని గౌరవించండి, అప్పుడు
వారు కూడా మనలను గౌరవిస్తారు అని చెప్పుచుంటాను. అటువంటి నాతో మా భావమునకు వ్యతిరేఖమైనవారు
కలువడము జరిగినది. నాతో బాగా పరిచయమున్న వ్యక్తి హిందూ పరిరక్షణ సంఘము అను పేరుగల వ్యక్తులను
పరిచయము చేసి నాతో మాట్లాడు అవకాశము కల్పించాడు. అప్పుడు వారు తమను గూర్చి తాము చెప్పుకొనుచు,
తాము హిందూమతము వారిని క్రైస్తవమతములోనికి పోకుండా చేసి హిందూమతమునకు సేవ చేయు చున్నట్లు చెప్పారు.
వారు నాతో మాట్లాడిన విధానమంతయు వివరిస్తాము చూడండి.
రక్షణ సంఘము వారు :- ఇక్కడ సముద్ర తీర ప్రాంతమైనందువలన, ఓడరేవు వుండుట వలన ఇతర దేశముల
క్రైస్తవుల గురువులు వచ్చి వారు అక్కడక్కడ సమావేశములు పెట్టి, వారి మతమును బోధించి ఈ ప్రాంతములో నున్న
హిందువులను క్రైస్తవులుగా మార్చివేస్తున్నారు. దానివలన హిందూ మతము దినదినమునకు క్షీణించి పోవుచున్నది.
దీనిని గమనించిన మేము ఒక సంఘముగా ఏర్పడి హిందూమత రక్షణ కొరకు పని చేయుచున్నాము.
నేను :- హిందూమత రక్షణకు మీరు చేయుచున్న కార్యాచరణ ఏమిటి?
రక్షణ:- విదేశములనుండి వచ్చు క్రైస్తవ గురువులను ఇక్కడ సమావేశము పెట్టకుండా చూస్తున్నాము. ఎక్కడైనా
సమావేశము జరుగుతుందని తెలిస్తే అక్కడికి పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేసి వారి సమావేశములు జరుగ కుండా
అడ్డుకొంటున్నాము.
నేను :-విదేశములనుండి వచ్చువారు కాకుండా ఇక్కడే ఎందరో క్రైస్తవ బోధకులు ఉన్నారు కదా! వారు నిత్యము
ఎక్కడో ఒకచోట బైబిలులోని విషయములను బోధిస్తున్నారు కదా!
రక్షణ :- ఇక్కడి క్రైస్తవ ఫాదర్లు, ఫాస్టర్లు తమ బైబిలును బోధించి చాలామంది హిందువులను వారి మతములోనికి
చేర్చుకొన్నారు. హిందువులు ఈ ప్రాంతములో సగానికి పైగా క్రైస్తవులైపోయారు. ఇదంతయు గమనించిన మేము
ఎక్కడైనా క్రైస్తవ బోధలు జరుగుచున్నాయని తెలియగానే అక్కడికి పోయి అక్కడ బోధించు వారిని తన్ని తరిమివేయుచున్నాము.
అంతే కాకుండా తర్వాత ఎక్కడ కూడా వారి బోధలను చెప్పకూడదని అలా చెప్పితే మిమ్ములను చంపివేస్తామని
హెచ్చరిక చేసి పంపుచున్నాము.
నేను :- అలా మీరు క్రైస్తవ బోధకులను తన్ని తరిమి వేసిన తర్వాత ఎక్కడా వారు తిరిగి సమావేశములను పెట్టి వారి
బోధలను చెప్పలేదా?
రక్షణ :- మాకు తెలియకుండా దొంగచాటుగా ప్రజలను సమావేశపరచి బోధిస్తున్నట్లు తెలిసింది. ముందు జరిగినట్లు
విచ్చలవిడిగా చేయడము లేదు. ఈ మధ్య ఒకచోట మాకు తెలియకుండా ఒక సమావేశము జరుగు తుందని తెలిసి
మేము అక్కడికి పోయాము. మమ్ములను చూస్తూనే ఎవరూ కనిపించకుండా పోయారు. ఆ సమావేశము జరుగలేదు.
ఈ విధముగా మేము బాగా శ్రమపడుచున్నాము.
నేను :- మీరు మతము కొరకు ఇంకా ఏమైనా చేయగలిగారా?
రక్షణ :- ఎంతోమంది పరమత బోధకులను కొట్టాము. వారి ప్రచారమును ఆపివేశాము. వారిమీద దాడిచేసి కొట్టినందుకు
చాలామార్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. కొన్ని కేసులలో చిక్కుకొన్నాము.
నేను :- భౌతిక దాడులను చట్టము ఒప్పుకోదు కదా! అటువంటపుడు వేరు విధానమును యోచించవచ్చును కదా!
రక్షణ :- ఒకప్రక్క హిందూమతము వేగముగా క్షీణించి పోవుచుంటే, వేరు విధానమును ఆలోచించుకుంటూ కూర్చుంటే
ఎలాగ? కొంపలంటు కొన్నప్పుడు బావిని త్రవ్వి నీరును తీసి ఆర్పుతామంటే కుదరదు. జరుగ వలసినది జరిగిపోతుంది.
అందువలన వేగముగా ప్రభావమును చూపి మత మార్పిడులు లేకుండా పోవుటకు దాడులు చేయడమే సరియైన
మార్గమని అనుకొన్నాము.
నేను :- మహాత్మగాంధీ గారుకూడా హింస సరియైన పద్ధతికాదనీ, అది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందనీ చెప్పాడు
కదా! హింస కాకుండా సౌమ్యముగా దేనినైనా సాధించవచ్చునని చెప్పాడు కదా! ఆయన మాట మంచిది కాదా!
రక్షణ :- మా లెక్కలో ఆయన మాట మంచిది కాదనియేగా, ఆర్, యస్, యస్ (రాష్ట్రీయ స్వయం సేవక్) కార్యకర్త
అయిన గాడ్సే గాంధీని కాల్చి చంపినది.
నేను :- హిందూ (ఇందూ) మతము దేవుని జ్ఞానముతో పుట్టినది. దానివలన హిందూమతము శాంతిస్వరూపమైనదని
అంటూవుంటారు. ఏ మతమైనా జ్ఞానముతోనే పుట్టుచున్నదిగానీ, హింసతో పుట్టలేదు. హింస వలన హింసయే
ఎదురౌతుంది. దానివలన నష్టపోయేది మనుషులే. మనుషులుంటే మతముంటుంది. మనుషులు మతము కొరకు
ఒకరికొకరు దాడులు చేసి చంపుకొంటే మనుషులే లేకుండా పోయినపుడు మతము అను మాటయే లేకుండా పోవును
కదా! ఎవరి మతమును వారు రక్షించు కోవచ్చును, అందులో తప్పులేదు కానీ, మతరక్షణకని హింసామార్గమును
ఎంచుకోవడము పూర్తి తప్పు. హింసామార్గము వలన గతములో ఎవరూ ఏమీ సాధించలేదు.
రక్షణ :- వేరే మతస్థులు వచ్చి హిందూమతములోని వారిని తమ మతము లోనికి మార్చుకొంటూవుంటే మనము ఏమీ
చేయకపోతే కొంత కాలము నకు హిందూమతము భూమిమీద లేకుండా పోతుంది. అలాంటపుడు మేము హిందూమత
రక్షణకు ఏమీ చేయకూడదా?
నేను :-ప్రతి మతములోను తమ మతమును పెంచుకోవాలను అభిలాష ఉండడము సహజమే. అలాగే తమ
మతమును రక్షించుకోవాలను ఉద్దేశ్యమూ మంచిదే. మతరక్షణకు ఏమీ చేయకుండ ఊరకవుండమని నేను కూడా
చెప్పలేదు. అయితే హింసామార్గమును ఎంచుకోకూడదని చెప్పు చున్నాను.
రక్షణ :- ప్రస్తుత కాలములో హింసతో అయితేనే మతమును కాపాడుకోగలము. వేరే మార్గమే లేదు.
నేను :- ఇతర మతస్థులు వారి మతమును ఎలా పెంచుకొంటున్నారో చెప్పండి?
రక్షణ :- వారి మత గ్రంథములోని జ్ఞానవిషయములను చెప్పుచూ, హిందూ మతములోని సాంప్రదాయములకంటే
తమ మత సాంప్రదాయములే గొప్ప వని చెప్పుచుండుట వలన హిందూమతములోని వారు అటువైపు పోతున్నారు.
నేను :- మీరే చెప్పుచున్నారు కదా! వారు వారి గ్రంథములలోని జ్ఞానమును చెప్పి, అదియే గొప్ప అని చెప్పుచున్నపుడు,
మీరు కూడా మీ గ్రంథమైన భగవద్గీతలోని జ్ఞానమును ప్రజలకు చెప్పి మన జ్ఞానము ఎంతో గొప్పదని వివరించి
చెప్పవచ్చును కదా! మన జ్ఞానమేదో తెలియనపుడు ఎదుటివాడు చెప్పే జ్ఞానమే రుచిగా కనిపిస్తుంది కదా! ఏమాత్రము
దేవుని జ్ఞానము తెలియని మనుషులు హిందూమతములో ఉండుట వలన, క్రైస్తవమతము వారు తమ జ్ఞానము చెప్పడము
వలన, ఎక్కడ జ్ఞానము తెలియుచున్నదో అక్కడికి పోదామను ఉద్దేశ్యముతో కొందరు హిందువులు క్రైస్తవులుగా మారి
పోవుచున్నారు. అంతేకాక హిందూమతములో తక్కువ కులము వారిని అంటరానివారిగా కొందరు చూడడమువలన
అంటరానితనములేని, అందరూ సమానముగానున్న క్రైస్తవమతములోనికి కొందరు హిందువులు పోవు చున్నారు.
హిందూమతములో అందరికి దేవాలయ ప్రవేశములేదు. దేవాలయ ప్రవేశమున్నవారైనా కొన్ని కులములవారు, జ్ఞాన
గ్రంథములు చదువకూడదు. దేవునికి స్వయముగా పూజ చేయకూడదు అను నియమము లుండుట వలన కొందరు
హిందువులు క్రైస్తవమతములోనికి పోవుచున్నారు. ముఖ్యముగా హిందువులైన వారికి జ్ఞానము తెలియకుండా పోయినది.
అటువంటి వారికి దేవుని జ్ఞానము ఎక్కడ దొరికితే అక్కడకు పోవుటకు వెనుకాడరు. క్రైస్తవులు బైబిల్లోని వాక్యములను
చెప్పుచుండుట వలన, జ్ఞానము మీద ఆసక్తికలవారందరు క్రైస్తవములోనికి పోవుచున్నారు. క్రైస్తవులు బజార్లు తిరిగి
జ్ఞానము చెప్పుచూ, తమ మతము యొక్క గొప్పతనమును గురించి చెప్పుచుంటే, హిందువులలోని గురువులు ఆశ్రమాలకు
పరిమితమై పోయి ధనార్జన చింతలో పడిపోయారు. ఒక స్వామీజీని తమ ఊరికి వచ్చి జ్ఞానమును చెప్పమని ఒక వ్యక్తి
కోరితే, తాను జ్ఞానమును చెప్పేదానికి ఒక రోజుకు తనరేటు ఇంతయని డ్రామా నటులు తమ రేటును చెప్పినట్లు
చెప్పుచున్నారు. వారి రేటుకు తగినంత డబ్బు ఇచ్చి వారిని తీసుకుపోయినా అక్కడ వారు హిందూధర్మములను
చెప్పడములేదు. ఖచ్చితముగా హిందూ (ఇందూ) ధర్మములు ఇవి అని వారికి తెలియకపోవడము వలన కాలక్షేపము
నకు పురాణములను చెప్పుచున్నారు. వారు చెప్పే జ్ఞానము కాలక్షేపమునకు పనికి వచ్చేదేగానీ, కర్మక్షేపమునకు పనికి
వచ్చునది కాదు. ఆ విధముగా వచ్చు స్వాములు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవున్ని గురించి చెప్పడము వలన, ఏ దేవున్ని
ఆరాధించాలో అర్థముకాని ప్రజలు హిందూమతమును వదలి ఒకే దేవున్ని తేల్చి చెప్పు క్రైస్తవమతములోనికి పోవుచున్నారు.
ఈ విధముగా హిందూమతములో ఎన్నో లోపములుండుట వలన చాలామంది హిందూ మతమును వదలి
క్రైస్తవమతములోనికి పోయారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మొదలుకొని ఉత్తరాంధ్ర అంతయు ఎక్కువగా క్రైస్తవ
మతములోనికి మారిపోయారు. అలా జరుగుటకు కారణము హిందూ మతములోనే కలదు. ఏమాత్రము జ్ఞానములేని
మూర్ఖులు మతరక్షణ పేరుతో ఎన్నో ఆరాచకములు సృష్టిస్తుంటే, వారిని చూచిన ఎందరో హిందువులు ఇటువంటి
వారున్న మతములో ఉండకూడదని హిందూ మతమును ఏవగించుకొని వేరే మతములోనికి పోవడము జరిగినది.
మా భక్తుని మీదికి ఒక్కమారు 25 మంది వచ్చి, హిందూమత ముసుగులో ఉండి పరమతమును బోధిస్తున్నారని దాడి
చేసినప్పుడు, హిందూమతములో జ్ఞానమును బోధించు మమ్ములను హిందూమత ముసుగులోనున్నవారనుట వలన,
ఈ ముసుగు మాకెందుకు? ముసుగే లేకుండ వేరు మతములోనికి పోయివుండవచ్చును కదా! అను ఆలోచన వచ్చినది.
తర్వాత ఎవరో అజ్ఞానులు చేసిన పనికి మేము మతమును మారడమేమిటని అనుకొన్నాము. హిందూ (ఇందూ)
మతములోని నలుగురు సిద్ధాంతకర్తలలో ఒకనిగానున్న నాకే అటువంటి ఆలోచన వచ్చిందంటే హిందూమతములో
కొందరి ప్రవర్తన ఎలాగుందో మీరే చూడండి. ఇటువంటి అనేక కారణముల చేత హిందూ మతము కొంత పతనమైనదని
చెప్పకతప్పదు.
హిందూమతమును రక్షించు యోగ్యత గురువులకు, సిద్ధాంతకర్తలకు ఉంటుంది. హిందూమతములోని గురువులు
ఎవరి ఆశ్రమానికి వారు పరిమితమైపోయారు. సిద్ధాంతకర్తలైన శంకరాచార్యులు, రామానుజా చార్యులు, మధ్వాచార్యులు
ఎప్పుడో గతించిపోయారు. వారి పరంపరను కొనసాగించువారు ఉన్నా, వారు మతమును పట్టించుకోవడములేదు.
ప్రస్తుత కాలములోనున్న ఒకే ఒక సిద్ధాంతకర్తను నేను మాత్రమే. నా సిద్ధాంతము త్రైత సిద్ధాంతమైన దానివలన నా
సిద్ధాంతమునుగానీ అందులోని జ్ఞానము కానీ తెలియనివారు, నన్ను కూడా పరమత బోధకుడని ప్రచారము చేసి,
తాము నిజమైన మతరక్షకులుగా ప్రచారము కావాలనుకొన్నారు. అయినా హిందూధర్మములను తెలియనివారు, హిందూ
మతమును రక్షించలేరని వారికి తెలియదు. ఇటువంటి జ్ఞానము లేని మతరక్షకులు వచ్చిన తర్వాతనే హిందూమతము
వేగముగా క్షీణించిపోయి క్రైస్తవమతము పెరిగిపోయింది. ఇతర మతముల మీద దాడులు చేసేకొలది హిందువులు
పరమతమువారై పోవుచున్నారు. ఇదంతయు గమనించిన మేము ఇప్పటినుండి మత మార్పిడులు జరుగకుండా
చేయాలనుకొన్నాము. అలా చేయుటకు ఒకే ఒక ఆయుధము ప్రజలకు దైవజ్ఞానమును, ధర్మములను తెలియజేయడమే.
నేను అలా అనుకొన్నప్పటినుండి దైవజ్ఞానమును, ధర్మములను గ్రంథ రూపములో తెలియజేశాను. నా బోధలను
చూచిన అన్ని మతములవారు నా దగ్గరకు రావడము జరిగినది. వద్దకు వచ్చిన అన్ని మతములవారు ఏక
మతముగా కలిసియుండి జ్ఞానమును తెలుసుకొంటూ, ఈ జన్మలో ఇంతవరకు తెలియని జ్ఞానము తెలిసినదని
సంతోషిస్తున్నారు. ఇంతవరకు మా మతములో అర్థముకాని జ్ఞానము ఇప్పుడు అర్థమైనదని ఇతర మతముల
వారంటున్నారు. హిందూమతమును వదలిపోయినవారు హిందూమతములో ఇంత గొప్ప జ్ఞానమున్నదని తెలియక
మేము హిందూమతమును వదలి వేరు మతములోనికి వచ్చామని చెప్పుచున్నారు. మొత్తము మీద మా జ్ఞానమును
చూచినవారందరు సంతోషిస్తున్నారు. అటువంటి వారిని చూచి మీరు ఏ మతములో ఉన్నారో ఆ మతములోనే వుండి
దేవుని జ్ఞానమును తెలుసుకోండి, మతములను మరచిపోండి అని చెప్పాము.
మా బోధలను వినిన ఒక్కొక్కరు నావైపు రాజొచ్చారు. ఆ విధముగా మూడు మతములవారు వారివారి
గ్రంథములలోని జ్ఞానమును విపులముగా మా ద్వారా తెలుసుకోగలుగుచున్నారు. నాకు అన్ని మతముల జ్ఞానము
సులభముగా తెలుసు. ఎందుకనగా! సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన ఇందూ ధర్మములు నాకు తెలియడము వలన, అన్ని
మతములలోని ధర్మముల జ్ఞానము నాకు తెలిసివున్నది. అటువంటపుడు నేను చెప్పు ఇందూధర్మములు అన్ని మతములవారి
గ్రంథములలోను ఉండుట వలన, అవి వారికి సులభముగా అర్థమైనవి. అందువలన నేను చెప్పు ప్రతిమాటా, ప్రతి
జ్ఞానమూ అన్ని మతములకూ వర్తించుచున్నది. నా జ్ఞానము మాయకు అతీతమైనది, మతమునకు అతీతమైనది.
కావున జ్ఞానము మీద ఆసక్తి గలవారందరికీ సులభముగా అర్థమగుచున్నది మరియు అది తమ మతము లోని జ్ఞానముగానే
తెలియుచున్నది. ఆ విధముగా ఉండుట వలన ఎవడూ అజ్ఞానిగా ఉండుటకు వీలులేదు. అలాగే ఎవడూ మతము
మారుటకు ప్రయత్నించడము లేదు. నా జ్ఞానముతో మనుషులలోని మత ద్వేషములు ఏమాత్రము లేకుండా పోయాయి.
మానవజాతికి పెనుప్రమాదమైన మతద్వేషములు ఇప్పటినుండి మాయమైపోవుటకు అవకాశమున్నది. నా జ్ఞానము
భూమిమీద ప్రజలందరికీ తెలియుకొలది అజ్ఞానము మాయమై పోగలదు. కొంతకాలమునకు మతద్వేషములు లేని
మానవులను పూర్తిగా చూడగలము.
రక్షణ :- మేము కూడా హింసను వీడి మీవలె జ్ఞానమును తెలిసి హిందూ మతమును రక్షించుటకు ప్రయత్నిస్తాము.
నేను :- మీరు ఈ మాటను చెప్పడము మంచిదేగానీ, మీరు జ్ఞానమును మాత్రము తెలుసుకోండి, మతమును రక్షించు
పనిని వదులుకోండి. మతమును రక్షించు పనికి మీరు దూరముగావుంటే ఆ పనిని గురువులు, పీఠాధిపతులు,
స్వాములు చేయగలరు. మీరున్న దానివలన మీకు భయపడి వారు బయటికి రావడము లేదు. మీరు మతరక్షణకు
దూరముగా వుంటే గురువులు, స్వాములు అందరూ బయటికి వచ్చి ఆ పనిని వారికి చేతనైనంత చేయగలరు. మీరు
మొదట దైవజ్ఞానమును తెలుసుకోండి.
రక్షణ :- మేము ఇన్ని రోజులు మత రక్షకులుగావుండి, ఇప్పుడు ఆ రంగమునుండి తప్పుకోవడము మాకు ఇష్టము
లేదు. మాకు చేతనైనంత మేము చేస్తాము.
నేను :- స్వాములు, గురువులు, పీఠాధిపతులు సమాజములో ఎంతో సౌమ్యముగా ఉంటూ, ఎవరికీ ఏ హాని కలుగజేయని
వానపాములవలె ఉంటారు. వారివలన ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఆ విధముగా ఉంటూ వారు కొంతవరకు
మతమును ఉద్దరించగలరు. మీరు అలా కాకుండా ఇంతవరకు నడుచుకొన్న దానినిబట్టి దాడులు చేయు స్వభావమున్న
మీరు తీవ్రమైన విషమున్న నాగుపాములలాంటివారు. ఇప్పుడు నేను చెప్పిన దానిని విని మీరు మారగలిగినా, పాము
కాటు వేయుట మానుకొన్నా బుసకొట్టడము మానుకోదు అన్నట్లు మీరు చేతులతో కొట్టేది మానుకొనినా, నోరుతో
తిట్టేది మాత్రము మానుకోలేరు. ధర్మమును బోధించు వారు వానపామువలె ఓర్పుతో పని చేయాలి. అది స్వాములకై
తేనే సరిపోతుంది. అందువలన మీరు మత రక్షణను వదులుకొని, జ్ఞానసేకరణ, ధర్మ ఆచరణను కలిగియుండడము
మంచిది.
ఇంతవరకు ఇందూ ధర్మమును గురించి, హిందూ మతమును గురించి, మతములలో మనుషుల విధానమును
గురించి తెలుసుకొన్నాము. ఇప్పుడు ఇందూధర్మమును ఆది నుండి తెలుసుకొందాము. దేవుని జ్ఞానమును చంద్రతేజస్సు
అని గీతయందు అక్షర పరబ్రహ్మయోగములో 24వ శ్లోకమున చెప్పబడివున్నది. దేవుని జ్ఞానము ధర్మమును తెలియజేయు
నది కావున దానిని ఇందూధర్మము అన్నాము. సృష్ట్యాదిలో దేవుడే ఏదో ఒక విధముగా తన ధర్మములను సూర్యునికి
తెలిపాడు. సూర్యుని ద్వారా క్రిందికి వచ్చిన ఇందూధర్మము శాశ్వితముగా భూమిమీదనే నిలిచి పోయి నది.
కాలగమనములో అప్పుడప్పుడు ఇందూధర్మములకు భూమి మీద ఆటంకములు ఏర్పడినా వాటిని తిరిగి దేవుడే
సరిచేయును. ప్రస్తుత కాలములో ఇందూ ధర్మములకు పేరుమారి హిందూధర్మములుగా పిలువ బడుచున్నవి. ధర్మములకు
గ్లాని ఏర్పడితే దేవుడు అవతరించి తిరిగి తన ధర్మములను తెలియజేయును. ఇప్పుడు ధర్మముల పేరుమాత్రము మారి
వుండుట వలన పేరును ముందు విన్న దానిప్రకారము మనమే తిరిగి సరిగా చెప్పుకోవచ్చును. కావున మారిన
ధర్మముయొక్క పేరును గురించి, మారక ముందున్న పేరును గురించి వివరించుకొందాము.
ద్వాపరయుగము చివరిలో ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మములు పెరిగిపోయినప్పుడు దేవుడు భగవంతునిగా
భూమిమీదకు వచ్చి ఆదియందు సూర్యునికి చెప్పిన ధర్మములనే తిరిగి చెప్పి పోవలసియున్నది. ఒకమారు పాత్రలో
చేపల కూరవండితే చేపల వాసన ఆ పాత్రను ఒకమారు కడిగితే పోదు. దాని పూర్తి వాసన పోవాలంటే మూడుమార్లు
పాత్రను శుభ్రము చేయవలసివుండును. ఒకమారు ఇసుక, రెండవమారు ఉప్పు, మూడవ మారు రాగిపిండి వేసి
తోమితే పాత్రకున్న చేపల వాసన పూర్తిగా పోవును. అదే విధముగా ఒకమారు అధర్మములు మనుషులలో ప్రాకితే
మనుషులలో వాటి వాసన పూర్తిగా లేకుండా పోవుటకు, దేవుడు మనుషుల మధ్యలో మూడుమార్లు అవతరించి
ధర్మములను చెప్పవలసి ఉన్నది. మూడుమార్లు పాత్రను కడుగుటకు కొంత కాలము పట్టును. అలాగే మూడుమార్లు
భగవంతుడు అవతరించి తన ధర్మములను తెలుపుటకు కూడా కొంత కాలము పట్టును. ద్వాపరయుగము చివరిలో
ధర్మములకు ముప్పు ఏర్పడి పూర్తిగా అధర్మములు మనుషులలో వ్యాపించగా, అధర్మములను లేకుండా చేయుటకు
భగవంతుని రూపములోనున్న కృష్ణుడు ధర్మసంస్థాపన కార్యము మొదలు పెట్టగా, అధర్మములు పూర్తిపోయి తిరిగి
ధర్మములు నెలకొల్పుట ఇప్పటి వరకు పూర్తికాలేదు. ధర్మసంస్థాపన కార్యము మూడు దఫాలుగా జరగాలి. ఇప్పటికి
రెండుమార్లు జరిగినది. మూడవమారు జరుగవలసి వున్నది. అధర్మ నిర్మూలన కార్యము మొదలుపెట్టి ఇప్పటికి
ద్వాపరయుగము చివరినుండి దాదాపుగా 5160 సంవత్సరములు గడచిపోయింది. అయితే భగవంతుడు ఎప్పుడు
వచ్చి ధర్మసంస్థాపనను ఎప్పుడు పూర్తి చేస్తాడో ఎవరికీ తెలియదు. చేపల వాసన పాత్రను మూడుమార్లు శుభ్రము
చేయుటకు 30 నిమిషముల కాలము పట్టవచ్చునని చెప్పవచ్చును. కానీ అధర్మముల వాసనను లేకుండా చేయుటకు
పాత్రను తోమినట్లు మనుషులకు చెప్పుటకు ఇంతకాలము పట్టవచ్చునని చెప్పలేము. మొదట దేవుడు చెప్పినది తర్వాత
చెప్పవలసినది తన ధర్మములనే. అయితే ఆయన ధర్మములను దేవుని ధర్మములని ఉచ్ఛరించకూడదు. కావున దేవుని
ధర్మములకు ప్రత్యేకించి ఒక పేరును దేవుడే నిర్ణయించాడు. ఆ పేరే ఇందూధర్మము.
దేవుడు నిర్ణయించిన 'ఇందూధర్మము' అను పేరు నేడు కొంత మార్పుచెంది 'హిందూధర్మము' అని
పిలువబడుచున్నది. హిందూ అను పదమును మనుషులు సృష్ఠించినదేగానీ దేవుడు చెప్పినది కాదు. దేవుడు తన
ధర్మమునకు పేరును భగవద్గీతలో అక్షరపరబ్రహ్మయోగమున 25వ శ్లోకమందు చెప్పినట్లు ఆధారము గలదు. దేవుడు
ఎంతో అర్థముతో కూడుకొన్న 'ఇందు' అను శబ్ధమును తెలుగు లిపిలో మూడవ అచ్చు అయిన 'ఇ' అను అక్షరముతో
మొదలుపెట్టాడు. మనుషులు దాని విలువ తెలియని వారై ఇందు శబ్ధమును హల్లు 'హి' తో ప్రారంభమగు హిందూ
శబ్దముగా మార్చుకొన్నారు. పూర్వ చరిత్రను తెలిసిన నేను దేవుడు చెప్పిన ఇందు పదమునే అవసరమొచ్చినపుడంతా
వ్రాయుచువచ్చాను. దేవుని ధర్మము అని చెప్పవలసిన చోటంతా ఇందూధర్మమనియే మేము వ్రాయడము జరిగినది.
ఇప్పటికి యాభై (50) ఆధ్యాత్మిక గ్రంథములను మేము వ్రాశాము. వాటిలోని జ్ఞానము ప్రజలకు తెలియుటకు నాలుగు
వాహనములను, 40 మంది మనుషులను పెట్టి ప్రతి ఊరు తిరిగి ప్రచారము చేయునట్లు చేశాము. మా ప్రచార
వాహనముల మీద 'ఇందూధర్మ ప్రచారము' అని వ్రాసియుంచాము. మా ప్రచార వాహనములు ఏ ఊరికి పోయినా
వాహనము మీద ముందరే పెద్ద అక్షరములతో కనిపించు ఇందూధర్మము అని కనిపిస్తూనే, బండి దగ్గరకు వచ్చి మీరు
తప్పు వ్రాశారు, హిందూ అని వ్రాయకుండా ఇందూ అని వ్రాయడము తప్పు కదా! ధర్మప్రచారము చేసే వారికి ఇందూ
అని వ్రాయడము తప్పని తెలియదా అని కోపగించుకొని చెప్పేవారు, సాధారణముగా చెప్పేవారు, గట్టిగ అరచి చెప్పేవారు
చాలామంది ప్రతిచోట చెప్పడము జరుగుచున్నది. ఒకవేళ ఇందు శబ్దము యొక్క అసలు చరిత్రను వారికి చెప్పాలనుకొన్నా,
వారు వినే స్థితిలో ఏమాత్రము ఉండక చెప్పే స్థితిలో ఉందురు.
ఇందు అను పదమును గురించి దండించి అడుగువారిలో బ్రాహ్మణుడు, బాపడు ఇద్దరూ ఉండగా, ఇంకా
అజ్ఞానులు, విజ్ఞానులు, సాధకులు, బోధకులు, ధర్మరక్షకులు, మతరక్షకులు ఎందరో గలరు. అటువంటి వారిలో
హిందూమత రక్షకుడైన ఒకరు మమ్ములను నిలదీసి మీరు ఎందుకలా వ్రాశారని ప్రశ్నించాడు. అంతేకాక మీరు
క్రొత్తమతమును సృష్టిస్తున్నారా? అని అడిగాడు. అప్పుడు మేము అతనికి సమాధానము చెప్పదలచి ఇలా అడిగాము.
మేము :- మేము ఇందూధర్మము అని వ్రాస్తే చాలామంది దీనిని గురించి ఎందుకలా వ్రాశారని అడిగారు. అయితే
మీరెందుకు అలా అడుగుచున్నారు. నాకు సమాధానము చెప్పండి.
రక్షకుడు :- మీరు హిందూ అను పదమును తప్పుగా ఇందూ అని వ్రాశారు, అలా వ్రాసినదికాక దానినే అంతటా
చూపిస్తున్నారు, కాబట్టి మీరు ఎందుకు అలా వ్రాశారని అడుగుచున్నాము.
మేము :- మేము వ్రాసిన ఇందూ అను శబ్ధము తప్పు అనుటకు మీవద్ద ఆధారమేమి కలదు? అట్లే మీరు చెప్పుచున్న
హిందూ అను శబ్దము సరియైన దని ఏ ఆధారముతో చెప్పగలుగుచున్నారు?
రక్షకుడు :- హిందూ అను శబ్ధము సరియైనదని అందరికీ తెలుసు. అట్లే ఇందూ అను శబ్ధము తప్పు అని మనుషులందరికీ
తెలుసు. ఇంతకంటే ఆధారము కావాలా?
మేము :- అసత్యమును వేయిమంది చెప్పినా, లక్షమంది చెప్పినా అది సత్యముకాదు. అట్లే సత్యమును వేయిమంది
కాదనినా, లక్షమంది కాదనినా అది అసత్యము కాదు. అందువలన అందరికీ తెలుసుననుట సరియైన ఆధారము కాదు.
ఇంకా ఏమైన మీకు తెలిసిన సత్యముంటే చెప్పండి.
రక్షకుడు :- మన దేశములో సింధూనది ప్రవహించుట వలన, సింధూ నాగరికత మనదేశములో ఉండుట వలన మన
దేశమును సింధూదేశము అనెడివారు. కాలక్రమమున సింధూ అను పేరు హిందూ అను పదముగా మారినది. కావున
మన దేశమును హిందూదేశమనీ, ఈ దేశములో నివసించే వారిని హిందువులనీ చెప్పడము జరిగినది. ఆ విధముగా
హిందూ అను శబ్దము సరియైనదని చెప్పుచున్నాము.
నేను :మీరు చెప్పునది ఒక ప్రాంతము పేరు, ఒక దేశము పేరు. అయితే ఆ పేరును మీరు ఒక మతమునకు
ఎందుకు అతికించారు?
రక్షకుడు :- పూర్వము భారతదేశములో ఒకే ఒక హైందవమతము ఉండేది. అందువలన హిందూదేశములోవుండు
మతమును హిందూ మతము అన్నారు.
నేను :– భారతదేశములో సింధూనదికంటే ఎన్నో పెద్దనదులైన గంగ, బ్రహ్మపుత్ర నదులు గలవు. గంగానది సింధూనదికంటే
పవిత్రమైనది మరియు ఎంతో పెద్దది. గంగానదితో పోల్చితే ఎందులోనూ సరితూగని సింధూనది పేరును భారతదేశమునకు
పెట్టవలసిన అవసరమేమి వచ్చినది. అటువంటి అవసరముంటే గంగానదికి మారుపేరుగా గంగాదేశమని పేరు
పెట్టియుండవచ్చును కదా! దీనికేమంటారు?
రక్షకుడు :- మాకు పూర్తి విషయము తెలియదుగానీ, సింధూనది ప్రవహించుట చేత సింధూదేశమని పేరువచ్చినదని
పెద్దలు చెప్పగా విన్నాను.
నేను :-నేడు మేము వ్రాసిన ఇందూ పదమును చూచి, మీరు వ్రాసినది తప్పు అని గోసి పెట్టుకొన్న ప్రతివాడు
అడుగుచున్నారు కదా! మేము వ్రాసిన ఇందూకు, మీరు వ్రాసిన హిందూకు కనిపించే అక్షరములో మాత్రము తేడాయున్నది.
వినిపించే శబ్ధములో గుర్తించతగిన తేడా ఏమీ లేదు. అక్షరములో తప్ప శబ్ధములో కనిపించని దానిని అందరూ
నిలబెట్టి అడిగి నప్పుడు, మీరు చెప్పినట్లు సింధూనది ద్వారా వచ్చినది హిందూ అని మీరు ఎందుకు వ్రాయాలి?
సింధూనే అని వ్రాయవచ్చును కదా! సింధూ దేశమనీ, సింధూ మతమనీ చెప్పకుండ హిందూదేశము, హిందూమతము
అని ఎందుకు అంటున్నామని మీరు ఆలోచించుకోవచ్చును కదా! పూర్వము ముంబాయి అను పేరు కాలక్రమములో
బొంబాయిగా మారినదని తెలిసిన వారు, ముంబాయి పేరును పునరుద్ధరించి బొంబాయిని తీసివేసి ముంబాయి అని
వ్రాశారు. అలాగే పూర్వము చెన్నై అను పేరు మద్రాసుగా మారినదని బాధపడినవారు మద్రాసు పేరును తీసివేసి చెన్నై
అని తిరిగి ఆ పేరును వెలుగులోనికి తెచ్చారు. అటువంటపుడు ఇంతపెద్ద భారతదేశమునకు పూర్వము సింధూదేశమని
పేరున్నట్లు తెలిసినవారు ఆ పేరు ముంబాయి బొంబాయిగా మారినట్లు సింధూ హిందూగా కాలక్రమములో మారినదని
వివరించి చెప్పి, హిందూ అను పదమును తీసివేసి సింధూ అను పదమును ఎందుకు పెట్టలేదు? అని నేను అడుగుచున్నాను.
దీనికి మీరు ఏమని చెప్పగలరు?
రక్షకుడు :- మీరు చెప్పినంత వివరముగా మేము ఆలోచించలేదు. మీరు చెప్పే దానినిబట్టి చూస్తే ఇప్పుడు మేము
పొరపాటుపడినామా? లేక పూర్వము పెద్దలే పొరపడినారా అని అనుమానము వస్తున్నది.
నేను :- నేను చెప్పిన దానినిబట్టి ఇప్పుడు పొరపాటుపడినాము అని అనుకొంటే సరిపోదు. పొరపాటు మనము
చేసినా, మన పెద్దలు చేసినా తప్పు తప్పే అగును. మీరు ప్రస్తుతము మతరక్షకులుగా ఉన్నపుడు మత చరిత్రనుగానీ,
మతము పేరు ఎలా మారింది అనిగానీ తెలియకపోతే మతమును ఎలా రక్షించగలరు? ఎద్దు ఈనింది అని ఎవడో
అంటే ఎద్దు ఎలా ఈనుతుంది? ఈనవలసినది ఆవుకదా! అని ఆలోచించకుండా గాటికి కట్టివేయమనడము పూర్తి
తప్పుకాదా! "ఎద్దు ఈనింది అంటే గాటికి కట్టివేయి" అను సామెతలాగ, విన్నదానిని ఆలోచించకుండా గ్రుడ్డిగా
పోయినట్లవుతుంది. ఒకమారు తప్పటడుగువేస్తే దానిని అనుసరించి అన్నీ తప్పటడుగులు వేయవలసివచ్చును. ఎద్దు
ఈనింది అంటే గాటికి కట్టి వేయమన్నవాడు, తర్వాత ఆవు ఈనింది అనుమాటను విని, ఎద్దు కదా ఈనేది ఆవు
ఈనింది అని చెప్పడము తప్పుకదా! అన్నాడట. అదేవిధముగా సింధూ నుండి హిందూ వచ్చిందని విన్నపుడు, ఎలా
వచ్చిందని అడగక గ్రుడ్డిగా నమ్మినవారు, ఇందూ నుండి హిందూ వచ్చిందని మేము చెప్పితే విని సింధూ నుండి కదా
హిందూ వచ్చేది, ఇందూ నుండి హిందూ శబ్దము వచ్చిందని చెప్పడము తప్పుకాదా అని అడుగుచున్నారు. గత
యుగముల లోనూ, చివరి ద్వాపర యుగములోనూ, ఇందూ అను పదమే ఉన్నట్లు చరిత్ర చెప్పుచున్నా, కాలక్రమమున
కలియుగములో ఇందూ అను పదము హిందూగా మారిపోయినదని చెప్పి, బొంబాయిని ముంబాయిగా మార్చు కొన్నట్లు
హిందూ పదమును మార్చి ఇందూ అని మేము వ్రాయడమేకాక అలా వ్రాయుటకు కావలసిన వివరమంతా చెప్పుచుండినా
గ్రహించనివారు, ఎద్దు ఈనింది అనడమే సరియైనది, ఆవు ఈనింది అనడము తప్పు అన్నట్లున్నది. ఇప్పుడు చెప్పండి
మీరు ఇందువులా, సింధువులా?
రక్షకుడు :- ఇంతవిన్న తర్వాత కూడా సింధూ, హిందూ అనడము పూర్తి తెలివితక్కువ పనియగును. మీరు చెప్పినట్లు
వాస్తవానికి మనము ఇందువులమే, కానీ పొరపాటుగా హిందువులమని చెప్పుకొంటున్నాము. అంతయు తెలిసిన
తర్వాత మీరు వ్రాసిన ఇందు అను మాట సరియైనదని తెలియుచున్నది. మేము ఆలోచించకుండ ఇందూధర్మమును
గురించి ఎంతో తెలిసిన మిమ్ములను తప్పుగా లెక్కించుకొని తక్కువగా మాట్లాడినందుకు మాది చాలా తప్పు. మీలాంటి
వారివలనే ఇందూధర్మము ఇందూమతములో వెలుగులోనికి రాగలదని అనుకొంటున్నాను.
నేను :- మీరు పద్ధతిగా అడిగారు కాబట్టి నేను వివరముగా చెప్పుటకు అవకాశమొచ్చినది. అయితే కొందరు
హిందూమతమును ఉద్దరిస్తామని చెప్పుకొనువారు, ఏమాత్రము హిందూమత చరిత్ర తెలియనివారై, ఆత్మ జ్ఞానము
కొద్దిగా కూడా తెలియనివారై, పూర్తి అజ్ఞానులుగా ఉంటూ ఇందూ అను పదమును వింటూనే ఏమాత్రము
వివరమడగకుండా ఇందూపదము పరాయి మతములోనిది అంటున్నారు. హిందువులుగా ఉన్నవారు మతము మీద
ప్రేమను, అభిమానమును పెంచుకోవచ్చును. మతము మీద ప్రేమ మతమునకు చేటుకాకూడదు. కొందరు
స్వమతాభిమానులు మేము హిందువులమని చెప్పుకొనుచు మమ్ములను చూచి మీరు హిందువులు కారు, హిందువుల
ముసుగులోనున్న ఇతర మతమువారు అని మమ్ములను అనడము ఎలావుందంటే! ఒకవ్యక్తి తన తండ్రిమీద ఎక్కువ
ప్రేమ కలిగియుండి. అతను తన తండ్రిమీద ప్రేమతో ఆయనకు ఎటువంటి అసౌకర్యము కలుగకుండా
చూడాలనుకొన్నాడట. అటువంటపుడు ఒక సమయములో ఒక ఈగ అతని తండ్రిమీద వాలిందట, అప్పుడు ఆ ఈగను
చూచిన కొడుకుకు కోపమొచ్చి తన తండ్రిమీద వాలి అతని సౌకర్యమునకు భంగము కలిగించిన ఈగను
చంపివేయాలనుకొని ఒక కట్టెను తీసుకొని ఈగను కొట్టాడట. తండ్రిమీద కొడుకుకు గల ప్రేమతో ఏమాత్రము
కొడుకు ఆలోచించకుండ ఈగను కొట్టగా ఈగ తప్పించుకొని పోయింది. ఆ కట్టెవేటు అతని తండ్రికి తగిలి తండ్రి
చనిపోయాడు. తండ్రిమీద కొడుకుకున్న ప్రేమే తన తండ్రి చావుకు కారణమైనది. అలాగే నేడు హిందువులలో
కొందరికి మతము మీద అభిమానము ఎక్కువైపోయినది. వారి మతాభిమానము విచక్షణను కోల్పోవునట్లు చేసి తండ్రిలాంటి
హెూదాలో గల ఇందూధర్మ సిద్ధాంతకర్తనైన మామీద కూడా దాడి చేయడమూ, మేము వ్రాసిన త్రైతసిద్ధాంత భగవద్గీతను
కాల్చివేయడమూ చూస్తే, వారి హిందూ మతాభిమానము ఈగ వాలితే రోకలి తీసుకొన్నట్లున్నది. ఇటువంటి
సంఘటనల ద్వారా కొడుకు తండ్రిని ఈగకోసము కొట్టినట్లు, హిందూ మతమునకే సిద్ధాంతకర్తనైన ఒక యోగీశ్వరున్ని
సాధారణ హిందువులు స్వమతాభిమానము వలన అవగాహన లోపముతో ఇబ్బంది పాలు చేయుచున్నారు. ఇప్పటినుండైనా
ఇందూ (హిందూ) మతము బాగుపడాలంటే మేము తెలుపు జ్ఞానమును చూడండి. వివరమడిగి తెలుసుకోండి.
అప్పుడు మీరు నిజమైన హిందువులుగా (ఇందువులుగా) మార గలరు. అలా కాకుండా ఇందూజ్ఞానము తెలియకుండా
నేను హిందువును అనుకొంటే పులితోలు కప్పుకొన్న గొర్రె నేను పులిని అనుకొన్నట్లుండును.
ఈ విధముగా సంవాదము కొనసాగిన తర్వాత హిందూమత రక్షకుడైన ఆ వ్యక్తి, తనకు హిందూమతమును
గురించిన సమాచారము పూర్తిగా తెలియదు. హిందువులకుండవలసిన జ్ఞానములేదు. అటువంట పుడు తాను
హిందూమత రక్షణ చేస్తానని అనుకోవడము పొరపాటని, ఇప్పటినుండి దైవజ్ఞానము తెలుసుకుంటానని చెప్పిపోయాడు.
ఇట్లు ఎందరో సత్యమును తెలిసిన తర్వాత తాము చేయుచున్నది పొరపాటని తెలిసి తమ పొరపాటును సరి చేసుకొందురు.
కొందరు ఎదుటివాడు చెప్పునది నేను వినాలా అను గర్వముతో పొరపాటును లోతుపాటుగా చేసుకొందురు. ప్రతి
హిందువు తాము పలుకుచున్న హిందువు అను పదమునకు అర్ధముందా అని చూడాలి. హిందూ అంటే అసలు
అర్థమేమి అని ప్రశ్నించుకొని చూడాలి. అప్పుడైతేనే మనిషి తాను ఎవరో? తన మతమేదో? తాను తెలియవలసినదేదో
గ్రహించగలడు. లేకపోతే వాని జీవితము ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమన్నట్లు బయటి విషయము లలో
గ్రుడ్డిగా ఉండును. అలా గ్రుడ్డిగా బ్రతుకువాడు తాను ఏమి చేయుచున్నానను విచక్షణలేనివాడై, ఈగ వాలిందంటే
రోకలి తీసుకొన్నట్లు తనకు తాను నష్టపోవును. పవిత్రమైన జీవితమును అపవిత్రముగా గడిపి పాపమును మూటగట్టుకొని
పోవలసివుండును. అందువలన ఇందువుగా పుట్టి, ఇందువుగా బ్రతికి, ఇందువుగా చావమని చెప్పుచున్నాను. ఇదే
పదమునే పూర్తి అర్థమగునట్లు చెప్పితే జ్ఞానిగా పుట్టి, జ్ఞానిగా మెట్టి, జ్ఞానిగా గిట్టమని చెప్పుచున్నాము.
సృష్ఠి మొదలైనపుడు మనుషులు తప్ప మతములులేవు. మనుషుల జీవితము పశువుల జీవితమువలె కాకుండ
ఉండుటకు దేవుడు మొదటనే తన జ్ఞానమును మనిషికి చెప్పిపోయాడు. ఆదిలోనే దేవుడు చెప్పిన జ్ఞానమును
మనుషులందరూ ఆచరించెడివారు. అందువలన ఆనాడు అందరూ దైవధర్మములు తెలిసిన జ్ఞానులుగా ఉండెడివారు.
దేవుడు సృష్ట్యాదిలో సూర్యునికి జ్ఞానము చెప్పగా, సూర్యుడు భారతదేశములోని మనువు అను మహర్షికి చెప్పగా,
మనువు ఇక్ష్వాకుడు అను రాజుకు చెప్పెను. ఈ విధముగా దేవుడు చెప్పిన జ్ఞానము మొట్టమొదట భూమిమీదగల
భారత దేశములోనే తెలిసింది. కావున మొత్తము ప్రపంచములో భారతదేశములోనే మొదట జ్ఞానులు తయారైనారు.
సూర్యుని ద్వారా ఒక ఋషికి జ్ఞానము తెలియగా, ఆ ఋషి ద్వారా ఒక రాజుకు తెలిసినది. పాలకుడైన ఆ ప్రభువు
ద్వారా ప్రజలకు తెలిసిపోయింది. ఈ విధముగా అడవిలోని మహర్షులకు, ఊరిలోని మనుషులకు అందరికీ దేవుని
జ్ఞానము తెలిసిపోయినది. భూమిమీద ఒక్క భారతదేశములోని మనుషులే పూర్తి జ్ఞానము తెలిసిన వారుగా ఉండెడివారు.
మిగతా దేశముల వారికి ఆనాడు దైవజ్ఞానము తెలియదు. దైవజ్ఞానమును తెలుసుకొనుటకు మిగతా దేశముల
రాజులు కూడా భారతదేశములోని గురువులవద్దకు వచ్చి తెలుసుకొని పోయెడివారు. భారతదేశము దైవజ్ఞానమునకు
నిలయమని ఆనాడు మిగతా దేశముల వారందరికీ తెలిసిపోయింది. అందువలన మిగత దేశముల వారందరూ
జ్ఞానమునకు నిలయమైన దేశము భారతదేశమనీ, భారతదేశమును జ్ఞానుల దేశము అన్నారు. జ్ఞానిని ఇందువు అని
అనెడివారు. కావున భారత దేశమును ఇందువుల దేశమని చెప్పడము జరిగినది. ఇందు అనగా జ్ఞాన మనీ, ఇందువు
అనగా జ్ఞాని అని అర్థము. భారతదేశము జ్ఞానమునకు నిలయమైన దేశము. కావున భారతదేశమును ఇందూదేశమనీ,
భారతదేశములోని జ్ఞానులను ఇందువులనీ ఇతర దేశములవారు పిలువడము జరిగినది. చరిత్రను త్రవ్వి చూస్తే
ఇందువుల చరిత్ర ఈ విధముగా ఉన్నదని తెలియు చున్నది. సృష్ట్యాదిలోనుండి ఉన్న చరిత్రను తెలియనివారు సింధూనది
హిందూమతము అని సరిచేసి చెప్పుకొంటున్నారు.
పూర్వము యావత్ ప్రపంచము భారతదేశమునకు ఇందూదేశమని ఒక బిరుదునిచ్చి పిలువగా, నేడు
భారతదేశములోనున్న వారు చరిత్రను మరచి మేము ఇందువులము కాదు హిందువులము అని చెప్పడము చూస్తే,
మేము జ్ఞానులము కాము జానలము అని చెప్పినట్లున్నది. ఇందు అను పదము దైవమార్గమైన జ్ఞానము. హిందు అను
పదము ఒక నదీ నామమును తెల్పునది. 'ఇందు' లో దైవజ్ఞానము కలదు. 'హిందూ' లో సింధూజలము కలదు. ఏ
పేరు పెట్టుకొంటే బాగుంటుందో మీరే చెప్పండి. ఇప్పుడొక ఉదాహరణను చూస్తాము. ఇద్దరు వ్యక్తులు ఉద్యోగము
కొరకు తమకు పరిచయమున్న మంత్రివద్దకు పోయి నీకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాము కదా! ఇప్పుడు నీవు
మంత్రి వయ్యావు, నీకు అధికారమున్నది. కావున మాకు ఉద్యోగములను ఇప్పించమని అడిగారు. అప్పుడు ఆ
మంత్రిగారు వారు తనను గెలిపించినందుకు వారికి ఉద్యోగాలు ఇవ్వవలెనని తలచి ఏ ఉద్యోగములున్నవని అధికారులను
అడిగి తెలుసుకొని తన ఊరివారితో ఇలా అన్నాడట. నేను మీకొరకు ఉద్యోగములను గురించి అధికారులను విచారిస్తే
రెండు ఉద్యోగములు ఖాళీ ఉన్నవట. అందులో ఒకటి కలెక్టర్ ఉద్యోగము, రెండవది బిల్ కలెక్టర్ ఉద్యోగమని చెప్పి
ఎవరికి ఏది కావాలని అడిగాడు. అప్పుడు ఉద్యోగము కొరకు వచ్చిన ఆ ఇద్దరు ఒకరు మీద ఒకరు పోటీపడి నాకు
బిల్ కలెక్టర్ ఉద్యోగము కావాలని ఒకడు అంటే, రెండవవాడు కూడా బిల్ కలెక్టర్ ఉద్యోగము నాకే కావాలని అడిగాడట.
అప్పుడు ఆ మంత్రిగారు ఎవరి మాటను కాదనలేక ఇద్దరికీ బిల్ కలెక్టర్ ఉద్యోగము ఇస్తానని ఒప్పుకొని అప్పుడు
వెంటనే బిల్ కలెక్టర్ ఉద్యోగము పురమాయించి ఇద్దరికీ బిలకలెక్టర్ ఉద్యోగము ఇచ్చాడట. ఇదంతయు గమనించిన
మంత్రి కిందనున్న కార్యదర్శి వారిరువురిని పిలిచి, కలెక్టర్ ఉద్యోగమువద్దని ఇద్దరూ బిల్ కలెక్టర్ ఉద్యోగమును ఎందుకు
కోరుకొన్నారని అడుగగా! వారు అతనికి ఇలా సమాధానము చెప్పారట. అది ఉత్త కలెక్టరే కదా, ఇదయితే బిల్లు కూడా
ఉందని అడిగామని చెప్పారు. ఆ మాటవిన్న కార్యదర్శికి ఏమీ అర్థముకాక "మీ లెక్కలో కలెక్టర్ గొప్పనా లేక బిలకలెక్టర్
గొప్పనా” అని అడిగాడు. అప్పుడు వారు నవ్వి ఇతను ఎంత తెలివి తక్కువగా అడుగుచున్నాడని అనుకొని "ఏమయ్యా
కలెక్టర్ కంటే ఎక్కువగా బిల్లువున్న కలెక్టర్ కనిపిస్తావుందికదా! దీనిప్రకారము కలెక్టర్ కంటే బిల్ కలెక్టరే గొప్ప” అని
వివరముగా చెప్పారట. ఆ మాటలను విన్న మంత్రిగారి కార్యదర్శి లోలోపల నవ్వుకొన్నాడు. వీరు ఇరువురు
కార్యదర్శిని చూచి ఎంత తెలివి తక్కువవాడోనని బయటికి కనిపించునట్లు నవ్వుకొన్నారు.
పై ఉదాహరణలో కలెక్టర్ కంటే బిల్ కలెక్టర్ గొప్ప అనుకొన్నట్లు ప్రస్తుతకాలములో ఇందూ అను పదముకంటే
హిందూ అను పదమే గొప్పదని అందరూ అనుకోవడము జరుగుచున్నది. పై ఉదాహరణలో కలెక్టర్కు, బిలకలెక్టర్కు
గల తేడా తెలియక వారు బిల్ కలెక్టరే గొప్ప అనుకొన్నట్లు నేడు ఇందువుకు, హిందువుకు తేడా తెలియక హిందువు
అను పదమే గొప్పదని తలచి అందరూ మేము హిందువులమని చెప్పుకోవడము జరుగుచున్నది. ఎవరు ఎట్లు
అనుకొనినా బిలకలెక్టర్కంటే కలెక్టరే గొప్ప వాడైనట్లు, హిందూ అను పదముకంటే ఇందూ అను పదమే గొప్పది. బిల్
కలెక్టర్కు కలెక్టర్కు ఎంత తేడావుందో, అంతతేడా హిందూ అను పదమునకు, ఇందూ అను పదమునకు గలదు.
హిందూ ఒక మతమును మాత్రమే సూచించుచుండగా, ఇందు అను పదము దైవ జ్ఞానమును చూపు చున్నది. హిందు
అను పదము సింధూ నుండి మారివచ్చినదికాగా, ఇందు అనునది ఎప్పటికీ మారనిదై ఉన్నది. హిందు అనునది ఒక
మతమును చూపుచున్నది. ఇందు అనునది ఒక పథమును చూపుచున్నది. హిందూ అనునది మాయ మతమును
చూపగా, ఇందూ అనునది దైవ పథమును చూపుచున్నది. హిందూ శబ్దము మానవ నిర్మితముకాగా, ఇందూ శబ్ధము
దైవ నిర్మితమైనది. హిందూ అనుమాట కేవలము ఒక మతమునకు మాత్రము సంబంధించినది కాగా, ఇందూ అను
మాట అన్ని మతములకు సంబంధించినదై ఉన్నది. హిందువు ఒక మతములోనే ఉంటాడు. అయితే ఇందువు (జ్ఞాని)
అన్ని మతములలోనూ ఉంటాడు. హిందువు అను మాట ఆ ఒక మతస్థునికే వర్తిస్తుంది. అయితే ఇందువు అనుమాట
ఏ ఒక్క మతమువారికి సంబంధించినది కాక అన్ని మతములలోని జ్ఞానులకు వర్తిస్తుంది. ఇప్పుడు మనము జ్ఞానులమైతే
ఇందువులమే అవుతాము. ఇందువు అయిన ప్రతివాడు ఇందుత్వమును కాపాడుతాము అను ఉద్దేశ్యముతో ఉండాలి.
భగవద్గీతలో గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో నాల్గవ (4) శ్లోకమున భగవంతుడు ఇలా చెప్పాడు.
“మనుషులలోనైనా లేక ఇతర జీవరాసులలోనైనా ఏ తల్లిగర్భమున పుట్టినవారికైన తల్లి ప్రకృతికాగా, తండ్రిని నేనేనని
తెలియవలెను.” ఈ మాటనుబట్టి చూస్తే ఎవడు ఏ తల్లి గర్భము నుండి పుట్టినా వానికి బీజదాత దేవుడేయగును.
దానివలన భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ తల్లి ప్రకృతియనీ, తండ్రి పరమాత్మయనీ తెలిసి పోవుచున్నది. ఈ మాట
మనిషిగా పుట్టిన ఎవనికైనా వర్తించును. అందువలన నేడు ఏ మతములోనున్న వానికైనా ఈ మాట వర్తించును.
క్రైస్తవునికిగానీ, ముస్లీమ్కగానీ తండ్రి ఒకే దేవుడేనని తెలియుచున్నది. సర్వ మానవులు దేవుని సంతతే అయినపుడు
ఏ మనిషి ఏ మతములో ఉండినా వాడు దేవునికి కొడుకే అగును. ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుకొందాము.
బద్రినాథ్ అను తండ్రికి నలుగురు కొడుకులున్నారను కొనుము. నలుగురూ బాగా చదువుకొని మంచి ఉద్యోగములలోనికి
పోయారు. ఒకడు జిల్లా కలెక్టరు పనిని చేస్తున్నాడు. రెండవవాడు పోలీస్ శాఖలో జిల్లా అధికారి అయిన యస్.పి.గా
పని చేయుచున్నాడు. మూడవ వాడు అమెరికాలో ఇంజనీర్ గా పని చేయుచున్నాడు. నాల్గవవాడు రాజకీయములోనికి
పోయి రాష్ట్రములో మంత్రిగా ఉన్నాడు. కలెక్టరుగా నున్న పెద్ద కుమారుని పేరు M. అమరనాథ్, యస్.పిగానున్న
రెండవ కుమారుని పేరు M. కమలనాథ్, అమెరికాలో ఇంజనీర్గానున్న మూడవ కుమారుని పేరు M. విమలనాథ్,
రాష్ట్రమంత్రిగానున్న నాల్గవ కుమారుని పేరు M. ప్రేమనాథ్. ఇప్పుడు వీరి పేర్లను, పనులను పరిశీలిస్తే వేరువేరు
పేర్లు, వేరువేరు ఊర్లు, వేరువేరు ఉద్యోగములుగానున్నవి. వీరి నలుగురిని చూచినవాడు ఒక తండ్రి కుమారులని
గుర్తు పట్టుటకు వీలులేదు. అయితే వీరి పేర్లను వరుసగా మనము పరిశీలించి చూద్దాము.
1. మూడు గుండ్ల అమరనాథ్ (కలెక్టర్) అకారాబాద్
2. మూడు గుండ్ల కమలనాథ్ (యస్.పి) వికారాబాద్
3. మూడు గుండ్ల విమలనాథ్ (ఇంజనీర్) అమెరికా
4. మూడు గుండ్ల ప్రేమ్నాథ్ (మినిస్టర్) అదరాబాద్
నలుగురు కుమారుల పేర్లను పరిశీలిస్తే ఒకటి ఇంటిపేరు లేక వంశముపేరు, రెండు మనిషి పేరు, మూడు
అతని ఉద్యోగము, నాలుగు అతడు నివాసమున్న ఊరు అని నాలుగు భాగములుగా కలవు. అందులో మనిషి పేరు,
ఉద్యోగము పేరు, ఊరు పేర్లు నలుగురివి వేరువేరుగా ఉండినా మొదటి ఇంటిపేరు మాత్రము ఒకటే గలదు. నలుగురు
వేరువేరు ఉద్యోగములను చేస్తూ, వేరువేరు హెూదాలతో, వేరువేరు పేర్లుగలిగి, వేరు వేరు ఊర్లలో ఉండినా, అందరికి
ఒకే ఇంటి పేరుండుట వలన వీరు నలుగురు ఒకే వంశమువారని సులభముగా గుర్తుపట్టవచ్చును. పేరుకు ముందున్న
ఒకే ఒక ఇంటిపేరుతో అది సాధ్యమగుచున్నది. మనిషి పుట్టిన తర్వాత కొన్ని దినములకు పేరు పెట్టబడుచున్నది.
పెద్దయిన తర్వాత వచ్చిన ఉద్యోగమును పేరు ప్రక్కన వ్రాయబడుచున్నది. ఉద్యోగము తర్వాత అతను నివసించే ఊరు
పేరు వ్రాయబడుచున్నది. ఉద్యోగముగానీ, ఊరుగానీ పేరు తర్వాత వచ్చినవేననీ, అందువలన వాటిని పేరు తర్వాత
పెట్టుచున్నా రనీ తెలియుచున్నది. అయితే పేరుకంటే ముందు ఇంటి పేరు కలదు. ఇంటి పేరు తర్వాత పేరు
వ్రాయబడుచున్నది. దీనినిబట్టి పేరు పెట్టక ముందే ఫలానా వంశమువాడని నిర్ణయించబడినట్లు తెలియుచున్నది.
ఇదంతయు బయట ప్రపంచములోని హిందూమతస్థుడైన బద్రినాథ్కు పుట్టినపుడు జరిగిన తతంగము.
భగవద్గీతలో ఎవడు ఏ తండ్రికి పుట్టినా, ఏ తల్లికి పుట్టినా, వాడు నా కొడుకేయని దేవుడు చెప్పడము జరిగినది.
ప్రపంచములో కనిపించే బద్రినాథ్కు పుట్టినపుడు ఆ తండ్రికి గుర్తుగా వంశము పేరు వచ్చినది. అయితే ఇక్కడ
సర్వులకు తండ్రి అయిన కనిపించని దేవునికి పుట్టిన వారికి గుర్తు ఏమి? అను ప్రశ్న రాకతప్పదు. అటువంటి ప్రశ్న
వచ్చినపుడు జవాబును వెదికితే ఇలా కలదు. కనిపించే తండ్రి ఫలానా వాడు అను గుర్తుకు వంశము పేరు
ఉన్నట్లు, కనిపించని తండ్రి దేవుడేనని చెప్పుటకు దేవుని ధర్మము పేరు ప్రతి మనిషికి ఉంటుంది. అయితే దేవుడు
ఎవరో, దేవుని ధర్మము ఏదో తెలియని మనిషి, తాను దేవుని సంతతియని తెలియని స్థితిలోవుండి, తాను దేవుని
ధర్మమునకు సంబంధించిన మనిషినని చెప్పుకోలేక పోవుచున్నాడు. నిజానికి తాను దేవుని సంతతికి చెందినవాడని
తెలియక, బయట కనిపించు తండ్రినే నిజమైన తండ్రిగా తలచి అతని వంశము పేరును చెప్పుచున్నారు. పూర్వము
తాము ముందు దేవునికి సంతతనీ, తర్వాత మనుషుల సంతతనీ తెలియునట్లు తమ పేరు ముందు ఇందుశ్రీ అని
మూడక్షరములను పెట్టెడి వారు. కాలక్రమమున ఇందూ పోయి శ్రీ ఒకటి మిగిలినది. ఇప్పుడు అది కూడా పోయినది.
ఉదాహరణకు ఇందుశ్రీ మూడుగుండ్ల అమరనాథ్ అని పూర్వముండగా, కొంతకాలమునకు శ్రీ మూడుగుండ్ల అమరనాథ్
అయినది. ఇప్పుడు ఎక్కడైనా శ్రీ ని ముందు వ్రాయు అలవాటున్నా అన్ని చోట్ల లేదు. పూర్వము ఇందుశ్రీ బదులు
రాజశ్రీ అని కూడా వ్రాసెడివారు. దేవుని విద్యను రాజవిద్య అని అనెడివారు. అందువలన కొందరు రాజశ్రీ అని
వ్రాసెడివారు. రాజశ్రీ అనినా, ఇందూశ్రీ అనినా ఒకే అర్థమని తెలియవలెను.
ద్వాపరయుగములో భగవద్గీతను కృష్ణుడు చెప్పినపుడు కూడా ఒక్క ఇందూధర్మమే ఉండేది. అప్పుడు
క్రైస్తవమతముగానీ, ఇస్లామ్మతముగానీ లేవు. ఆ కాలములో ఏ ఇతర మతములు లేనిదానివలన హిందూ మతము
కూడా లేదు. మతములు లేని ఆ కాలములో ఇందువులు తమ ధర్మమును గురించి ఇతరులకు చెప్పెడివారు.
ద్వాపరయుగములో అధర్మముల ఉనికి ఎక్కువైపోయి, ధర్మముల ఉనికి తగ్గిపోవడము వలన దేవుడు భగవంతునిగా
పుట్టి ఇందూధర్మములను గీతలో చెప్పిపోయాడు. అయినా అవి ప్రజలలోనికి చొచ్చుకొని పోలేదు. అందువలన కలి
యుగములో ధర్మములు పూర్తిగా అడుగంటిపోయి, అధర్మములు చెలరేగి పోయాయి. ఇప్పుడు మాయప్రభావము
మనుషుల మీద బాగా పని చేయుట వలన, జ్ఞాన పథమును వదలిన మనుషులు మాయ మతమును ఏర్పరచు
కొన్నారు. కాలము గడచుకొలది ఒకదాని తర్వాత ఒకటి కొన్ని మతములు తయారైనాయి. ఆ విధముగా భూమిమీద
మతములు తయారైనపుడు ఇందువులు తమ గుర్తింపుకొరకు, తమది కూడా ఇందూమతమని చెప్పుకొనుటకు
మొదలుపెట్టారు. ఆ విధముగా కొంతకాలమునకు ఇందువులు తమది ధర్మమని మరచిపోయి, అందరి మతములవలె
తమది కూడా ఒక మతమనుకొన్నారు. ముందువాళ్ళు చచ్చిపోగా, క్రొత్తగా పుట్టి వచ్చినవారు తమ విధానము తెలియనివారు
రావడముతో, కాలక్రమేపి ధర్మము మతముగా, ఇందూ అను శబ్ధము హిందూ శబ్ధముగా మారిపోయినది. తమ గత
చరిత్ర తెలియని హిందువులు ఈనాడు అన్ని మతముల మధ్యలో తమది ఒక మతమనుకొనుచున్నారు.
ఏ మతమూలేని రోజు ఇందూ ధర్మసంస్థాపన కొరకు చెప్పబడిన భగవద్గీత నేడు ఇందూధర్మ గ్రంథముగా
గుర్తింపబడలేదు. అది కూడా ఒక మత గ్రంథముగా లెక్కించబడుచున్నది. నేడు అజ్ఞానములో మునిగి పోయిన
హిందువులు కొందరు భగవద్గీతను తమ గ్రంథముగా కూడా చెప్పుకోక, వేదములను తమ మత ప్రమాణ గ్రంథములుగా
చెప్పుచున్నారు. ఈ విధముగా ఇందూధర్మము ఇందూమతముగా మారిపోయి, చివరకు హిందూ మతముగా
చెప్పబడుచున్నది. ఒక్కొక్క మెట్టుగా హీనస్థితికి దిగజారిన హిందూమతములోని మనుషులకు, దైవజ్ఞానము పూర్తిగా
తెలియకుండ పోయినది. అటువంటి స్థితిలో మిగతా మతముల వారు మా మతములో దేవుని జ్ఞానము సంపూర్ణముగా
ఉన్నదని కొందరు, మా మతములో సంపూర్ణ రక్షణ ఉంటుందని కొందరూ, మా మతములోనికి వస్తే మీ పాపములన్నీ
పోతాయని కొందరూ చెప్పడము వలన, హిందూ మతములోని వారు మిగతా మతములలోనికి ఎగబ్రాకి పోవడము
జరుగుచున్నది. హిందువులు ఇతర మతములలోనికి పోవడము వలన హిందూమతము తగ్గిపోయి మిగతా మతములు
అభివృద్ధి అయినాయి. హిందూమతము క్షీణించి పోవుచున్నదని గ్రహించిన కొందరు హిందువులు తమ మతమును
కాపాడుకోవలెనని అనుకొన్నారు. ఏ రోగమునకు ఏ మందు వేయవలెనో, ఎంత వేయవలనో తెలియని వైద్యులులాగ
గింజ ప్రమాణము వేయవలసిన మందును గుంజ ప్రమాణము వేసి రోగి ప్రాణమును తీసినట్లు, మతరక్షణ అని తమ
మతము వారినే గుర్తించలేని గ్రుడ్డివారైపోయి హిందువులు హిందువులనే హింసించను మొదలుపెట్టారు. దానితో
హిందూమతము ఇంకా తొందరగా క్షీణించుటకు అవకాశము ఏర్పడినది.
ఇటువంటి చివరి స్థితిలో ఇందూధర్మ సిద్ధాంతకర్తగా మేము రావడము జరిగినది. ఇప్పుడు పూర్తిగా జబ్బుపడిన
హిందూమతమునకు త్రైత సిద్ధాంతముతో చికిత్స చేసి, హిందూమతమును తిరిగి ఇందూధర్మముగా నెలకొల్పవలసిన
బాధ్యత మా మీద ఉంది. నేడు గల హిందువులకు పూర్వపు చరిత్రను తెలుపుటకు, ఇందూధర్మమును ఉద్దరించుటకు
"ఇందుత్వమును కాపాడుదాం” అను ఈ గ్రంథమును వ్రాయడము జరిగినది. అంతేకాక ఇందూధర్మములను నేటి
హిందువులకు పరిచయము చేయుటకు, ఇప్పటికి దాదాపు యాభై (50) గ్రంథములను వివరముగా, సంచలనాత్మకముగా
త్రైత సిద్ధాంతమును ఉపయోగించి వ్రాయడము జరిగినది. ఆనాడు కృష్ణుడు చెప్పిన భావములను చేర్చి "త్రైతసిద్ధాంత
భగవద్గీత”ను వ్రాయడము జరిగినది. మా గ్రంథములను చదివిన ఏ మతస్థుడైనా మేము చెప్పిన జ్ఞానమును కాదనలేడు.
10డైనా బయటికి ఒప్పుకోలేకపోయినా, వాని అంతరంగములో మాత్రము ఒప్పుకొని తీరును. ఇంతవరకు
నా గ్రంథములు ఒక్క హిందూమతము వారినే కాక మొత్తము అన్ని మతముల వారినీ ఆకర్షించాయి. ఎందుకనగా!
నేను చెప్పిన ఇందూధర్మము అన్ని మతములకు సంబంధించినది. కావున నా బోధ అందరినీ, అన్ని మతముల వారినీ
ఒక్క త్రాటిమీదికి తేగలిగింది. దురదృష్టవశాత్తు హిందూమతము లోని పెత్తముదార్లు నా త్రైతసిద్ధాంతమును
క్రైస్తవమతములోని త్రిత్వముగా ప్రచారము చేసి కొంతమందిని నావైపు రాకుండా, నా బోధలు తెలియకుండా చేయుచున్నారు.
"అమ్మా పెట్టదు అడుక్కొని తిననివ్వదు” అను సామెత ప్రకారము హిందూమతములోని పెత్తముదార్లకు ధర్మములను
తెలుపు స్థోమత లేదు. ప్రక్కన ఎక్కడా తెలుసుకోనివ్వరు. దానివలన ఇందూధర్మ సిద్ధాంతకర్తనైన నాకు, హిందువులకు
మధ్యలో హిందూమత రక్షకులనువారు అగాధమును కల్పిస్తున్నారు.
కలియుగములో హిందూమతముగా మారిన ధర్మమును తిరిగి ఇందూ ధర్మముగా నెలకొల్పాలి అంటే అంత
సులభమైన పనికాదు. ఎంతో కష్టముతో కూడుకొన్న పనియగును. ఎందుకనగా! కలియుగములో మా కంటే ముందు
వచ్చిన సిద్ధాంతకర్తలైన ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇందూధర్మమును బోధించు ప్రయత్నములో
శంకరాచార్యులు శైవమును, రామానుజాచార్యులు వైష్ణవమును బోధించారు. ఆనాడు అద్వైత సిద్ధాంతకర్తయిన
శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతముతో శైవమును బోధించగా, విశిష్టాద్వైత సిద్ధాంతముతో రామానుజాచార్యులు వైష్ణవమును
బోధించాడు. ఆనాడు శంకరాచార్యులు బోధించిన శైవమునకు సంబంధించిన మూడు విభూదిరేఖలలో ఇందూధర్మము
ఇమిడివున్నా, దానిని పూర్తి బయటికి చెప్పకనే చిన్నవయస్సులోనే 32 సంవత్సరములకే శంకరాచార్యుడు మరణించాడు.
తర్వాత కొంతకాలమునకు దాదాపు రెండు వందల సంవత్సరములకు విశిష్టాద్వైత సిద్ధాంతకర్తగా రామానుజాచార్యులు
వచ్చి 120 సంవత్సరములు బ్రతికి, త్రి నామమునకు సంబంధించిన వైష్ణవమును బోధించాడు. రామానుజాచార్యుడు
ధరించిన వైష్ణవమునకు సంబంధించిన మూడు నామములలో ఇందూధర్మము ఇమిడివున్నా, ఆ దినములలో బలముగానున్న
శైవులు ఆ విషయము తెలియక వైష్ణవమును ప్రచారము కాకుండా చేశారు. రామానుజాచార్యులు తమ ఆచార్యుడైన
శంకరాచార్యులకు పోటీగా వచ్చాడని అనుకొన్నారు. రెండువందల సంవత్సర ముల నుండి శైవులుగా మారిన ఎందరో
అప్పుడే పుట్టిన వైష్ణవమును అణచి వేయాలనుకొన్నారు. అందువలన రామానుజాచార్యులు రహస్య జీవనము
చేయవలసివచ్చినది. ఆ కాలములో శైవులకు, వైష్ణవులకు ఎన్నో ఘర్షణలు జరిగాయి. శైవులు వైష్ణవుల మీద దాడులు
చేసి హింసించారు. బలవంతముగా వైష్ణవులను శైవులుగా మార్చాలని చూచారు. ఈ మధ్య కాలములో వచ్చిన
“దశావతారము” అను చలనచిత్రము చూస్తే మేము తెల్పినట్లు అందులో శైవులకు, వైష్ణవులకు జరిగిన వైరము
కనిపించును.
పూర్వము ఇందూధర్మ సిద్ధాంతకర్తలుగా శంకరాచార్యులు, రామాను జాచార్యులు వచ్చినా, శైవులలోని అవగాహన
లోపము వలన వైష్ణవములోని ధర్మము తెలియకుండా పోయినది. అలాగే శంకరాచార్యులు చిన్న వయస్సు లోనే
చనిపోవడము వలన శైవములోని ధర్మము బయటికి తెలియకుండా పోయినది. అటువంటి పరిస్థితిలో క్రైస్తవమతము,
ఇస్లామ్మతము రెండూ పుట్టి అభివృద్ధికావడము జరిగినది. ఇందూధర్మము హిందూమతముగా మారిపోయి, చివరకు
హిందూమతము కూడా లేకుండా పోవు పరిస్థితి ఏర్పడినది. రామానుజాచార్యులు తర్వాత దాదాపు 900 సంవత్సరములకు
త్రైతసిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులు అను పేరుతో మేము రావడము జరిగినది. ఎవరికి తెలిసినా,
తెలియకపోయినా క్షీణించి పోయిన ఇందూధర్మమును తిరిగి నెలకొల్పవలసిన బాధ్యత సిద్ధాంతకర్తనైన మా మీద
పూర్తిగా ఉన్నది. అయితే శైవులు అవగాహనా లోపముతో వైష్ణవులను హింసించినట్లు, ఈనాడు హిందువులనువారిలో
కొందరికి పూర్తిగా అవగాహనా లోపమేర్పడి, త్రైతసిద్ధాంతకర్తనైన మమ్ములను ద్వేషించను మొదలుపెట్టారు. ఆ నేపథ్యములో
మా శిష్యులను చాలా ఇబ్బందిపాలు చేశారు. ఇటువంటి ద్వేషముల వలన హిందువులకు నష్టము, ఇతర మతముల
వారికి లాభము జరుగును. అందువలన మేము ఎంతో తెలివిగా వ్యవహరించవలసివున్నది. రోగము వచ్చిన వానికి
వైద్యము చేసినట్లు హిందూవులకు తగిన జ్ఞానమను మందును ఇచ్చి అజ్ఞానమను రోగమును పోగొట్టాలి.
వైద్యములో కుల, మత భేదముగానీ, పేద, ధనిక అను వివక్షగానీ ఏమీ ఉండదు. కలరా అనునది ఒక
రోగము. అది భూమిమీద మనుషులందరినీ ఒక్కటిగానే లెక్కించి ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా రాగలదు.
కలరా రోగము ఒక హిందువును చంపినట్లే, ముస్లీమ్ను కూడా చంపగలదు. ముస్లీమ్ను బాధించినట్లే క్రైస్తవున్ని
బాధించగలదు. మనుషులలో మతభేదములుండవచ్చునుగానీ, రోగమునకు మత భేదములు ఉండవు. అట్లే వైద్యమునకు
కూడా మనుషులలోని మతముల తారతమ్య ములు తెలియవు. ఒక మందు ఒక క్రైస్తవునికి ఎట్లు పనిచేయునో, అట్లే
ముస్లీమ్కు కూడా పని చేయును. మతము అను రోగము క్రైస్తవులలోనూ, ముస్లీమ్లలోనూ, హిందువులలోనూ
వ్యాపించియున్నది. మూడు వర్గముల వారు తమతమ మతమును పెంచుకోవాలని చూస్తున్నారు. మనుషులలో దేవుడు,
దేవుని జ్ఞానము అనునది పోయి, మతము, మత సాంప్రదాయములు అనునవి పెరిగిపోయినవి. మతము అను పైత్యరోగము
వలన మనిషి మతి చెడినవాడై, దేవుని జ్ఞానమును మరచిపోయి, మత పైత్యముతో ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుచున్నాడు.
మత పైత్యము పోవుటకు ధర్మము అను నిమ్మరసమును వాడవలసివుంటుంది.
దేవుడు మనుషులలోని అధర్మములను లేకుండా చేయుటకు, ధర్మములను తెలియజేయుటకు ద్వాపరయుగములో
వచ్చిపోయినట్లు తెలిసినది. అప్పుడు చెప్పినది భారతదేశములోని హిందీభాషలో, వ్రాసినది సంస్కృతభాషలో. సంస్కృత
భాష, హిందీ భాష రెండూ దేశములోని అన్ని ప్రాంతములలో లేవు, అందరికీ తెలియవు. అందువలన ఇంతవరకు
భగవద్గీత విషయమే తెలియనివారు భారతదేశములో కలరు. ఐదువేల సంవత్సరములైనా భారతదేశములో అన్ని
ప్రాంతముల ప్రజలకు భగవంతుడు చెప్పిన భగవద్గీత తెలియనప్పుడు, ప్రపంచములోని మిగత 294 దేశములకు
దేవుడు చెప్పిన ధర్మము ఎలా తెలియును? దేవుడు ఒకమారు భూమిమీద ధర్మమును నెలకొల్పుటకు తాను మూడుమార్లు
భగవంతునిగా వస్తాడు. అటువంటపుడు అన్ని ప్రాంతములవారికి ఆయనే జ్ఞానమును చెప్పుటకు వీలుపడదు.
ద్వాపరయుగములో కురుక్షేత్రమందు అర్జునునికి చెప్పాడు తప్ప, ఇతర ప్రాంతములలో ఇతరులెవరికీ చెప్పలేదు. అలాగే
భగవంతుని రెండవరాకలో కూడా ఒక దేశమందు కొద్ది ప్రాంతములోనే చెప్పినట్లు తెలియుచున్నది. మూడవమారు
వచ్చినా అలాగే ఉంటుంది. అటు వంటపుడు అన్ని ప్రాంతములకు ధర్మములు దేవుని దూతల ద్వారా తెలియును.
భగవంతుడు తెల్పిన జ్ఞానమును మనుషులకంటే అధికముగా అర్థము చేసుకొన్న గ్రహములు, భూతములు దేవుని
సమాచారమును తెలియజేయు దేవుని దూతలుగా మారి, భూమిమీద ఎన్నో ప్రాంతములలో దేవుని ధర్మములను
తెలియజేయుదురు. భగవంతుడు తెల్పిన ధర్మములనే దూతలు కూడా తెలియజేయుదురని జ్ఞాపకముంచుకోవలెను.
దేవుడు రెండుమార్లు భూమిమీద తన ధర్మములను తెలిపిపోయిన తర్వాత భూతము లైన కొందరు, దేవదూతలుగా
దేవుని సమాచారమును చాలా ప్రాంతములకు ఏదో ఒక రకముగా తెలియజేశారు. అయితే దూతలందరు చెప్పిన
సమాచారము అన్నిచోట్ల గుర్తింపుకు రాలేదు. కొన్ని ప్రాంతములలో దూతలు చెప్పిన దేవుని సమాచారము బాగా
ప్రచారములోనికి వచ్చినది. అటువంటి వాటిలో ముఖ్యముగా చెప్పుకోవలసినది పవిత్ర ఖురాన్ సమాచారము. దేవుని
దూత అయిన జిబ్రాయిల్ దేవుని సమాచారమును, దేవుని ధర్మమును ముహమ్మద్ (సం) ప్రవక్తకు తెలిపాడు. ముహమ్మద్
ప్రవక్తగారు దేవదూత ద్వారా తెలుసుకొన్న సమాచారమును పవిత్ర ఖురాన్ గ్రంథముగా బహిర్గతము చేశారు.
విధముగా దేశములోని కొన్ని ప్రాంతములకు ప్రాంతీయ భాషలోనే దేవుని జ్ఞానము తెలిసినది.
దేవుడు జ్ఞానరూపములో చెప్పిన ధర్మములను దేవుని దూతలు కొందరు ఇతర ప్రాంతములకు తెలుపగా,
అక్కడ తెలిసిన మనుషులు బోధకులుగా పనిచేసి ఇంకా కొంతమందికి తెలుపగా, దేవుని జ్ఞానము అంచెలంచెలుగా
ప్రాకి చివరికి ప్రపంచమంతా తెలిసిపోవును. దేవ దూతలు ఎక్కడ చెప్పినా, ఏ భాషలో చెప్పినా, అవి దేవుడు చెప్పిన
ధర్మములే అయి వుండును. అయితే దేవుని ధర్మములను వినిన మనుషులు వాటిని అర్థము చేసుకోవడములో
పొరపడుచున్నారు. అందువలన దేవుని జ్ఞానమును వినిన వారంతా దానిని జీర్ణింప చేసుకొంటారను నమ్మకము లేదు.
కొందరు దేవుని ధర్మములను బాగా తెలుసుకోగా, కొందరు మాత్రము అర్థము చేసుకోవడములో పొరపడిపోయి, దేవుని
జ్ఞానమును తెలుసుకొన్నామను కుంటూ, దేవుని ధర్మములకు దూరముగా పోవుచున్నారు. మేము చూచినంత వరకు
చాలాచోట్ల దేవుని జ్ఞానమును తెలుసుకొన్నామని గురువులుగా, బోధకులుగా చలామణి అగుచున్నవారు బాగా బోధించు
స్థితిలో ఉండి, తాము అర్థము చేసుకోవడములో పొరపడిపోయి, దేవుడు ఒకటి చెప్పివుంటే బోధకులు మరొకటి
చెప్పుచున్నారు. భూమిమీద ఇందూధర్మములు (దేవుని ధర్మములు) తెలియాలని దేవుడు భగవంతునిగా వచ్చి ప్రత్యక్షముగా
కొన్ని ప్రాంతములలో మనుషులకు చెప్పిపోతే, మనుషులతోపాటు ఎంతో ఆసక్తితో వినిన గ్రహములు, భూతములు
దేవుడు చెప్పిన ధర్మములను అనేక ప్రాంత ములలో తెలియజేసి దేవునికి సేవ చేయుచున్నవి. దేవునికి సేవ చేయాలను
ఉద్దేశ్యముతో దేవుడు తెల్పిన సమాచారమును దూతలుగా పని చేసిన గ్రహములు, భూతములు అనేక ప్రాంతములకు
చేరవేయుచున్నవి. దేవుని సమాచారమును అర్థము చేసుకోవడములోగానీ, తిరిగి మనుషులకు చెప్పడములోగానీ,
దేవదూతలుగా పని చేయువారు ఎక్కడా పొరపాటు పడడము లేదు. దేవుడు ఎలా తెల్పియుంటే ఏమాత్రము మార్పులేకుండా
అలాగే మనుషులకు అందజేయుచున్నారు. దేవదూత అయినవారు ఎంతో ఖచ్చితముగా దేవుని జ్ఞానమును తెలిపినప్పటికీ,
దానిని కొందరు మనుషులు సరిగా అర్థము చేసుకొంటున్నారు. కొందరు తమకున్న అవగాహనా లోపముతో వేరుగా
అర్థము చేసుకొంటున్నారు. ఎక్కువగా బోధకులైనవారు, గురువులుగా చలామణి అగువారు, దేవుని సమాచారమును
అర్థము చేసుకోవడములో మేము బాగా అర్థము చేసుకొంటున్నామని అనుకుంటూనే పొరపాటుపడి పోవుచున్నారు.
చివరకు తమకు తెలిసినదే నిజమైన జ్ఞానమని ప్రజలకు బోధిస్తున్నారు.
మనుషులు జ్ఞానవిషయములో రెండు రకములుగా ఉన్నారు. విని తెలుసుకోవాలనుకొనువారు దాదాపు 95
శాతము ఉండగా, మాకు తెలుసునని గురువులుగా, బోధకులుగా వుండి ఇతరులకు చెప్పుతామనువారు 5 శాతము
మంది కలరు. బోధకులుగానున్న ఈ ఐదు శాతము గలవారిని మాత్రమే కొన్ని వేలమందిని ఒకచోట చేర్చిచూచితే,
అందులో దేవుని జ్ఞానమును సరైన పద్ధతిలో అర్థము చేసుకొన్నవాడు ఒకడు అరుదుగా కనిపించును. బోధించువారు
తమకు తెలిసినదే సరియైన జ్ఞానమనుకొనుట వలన తన దారి తప్పుదారియనిగానీ, దానిని సరిచేసుకుందామనిగానీ
అనుకోరు. అందువలన అటువంటి వారికి దేవుడే దిగివచ్చి నేను చెప్పినది ఇట్లుకాదు, నేను చెప్పిన భావమువేరని
తెలిపినా, నాకు తెలుసునని అను కొనువాడు ఏమాత్రమూ వినడు. అటువంటివాడు తనకు తెలిసినది ఏమి అని
ఆలోచించకుండ, సాటి మనుషులకు బోధించడము వలన, వినినవారు కూడా అతను చెప్పిన జ్ఞానమును అనుసరించడము
వలన, దేవుని జ్ఞానము ధర్మబద్ధముగా మనుషులకు తెలియకుండా పోవుచున్నది. ఎక్కడో ఒక చోట సరియైన
భావముతో చెప్పు జ్ఞానము కొద్దిమంది మనుషులకే తెలియుచున్నది. అందువలన ఐదువేల సంవత్సరముల పూర్వము
మొదలు పెట్టిన ధర్మసంస్థాపన ఇంతవరకు పూర్తి కాలేదు. పూర్తి అగుటకు ఎంత కాలము పట్టుతుందో దేవునికే
తెలుసు.
దేవుడు ఆదిలో తెల్పిన జ్ఞానమునే తర్వాత ఎప్పుడు చెప్పినా మార్పు లేకుండా చెప్పును. దేవుడు శాశ్వితమైనవాడు,
మార్పుచెందు వాడు కాదు. అందువలన ఆయన ధర్మములు కూడ మారునవి కాదు. ప్రపంచములో ఎన్ని
మతములు పుట్టినా అవి దేవునికి తెలియకుండ పుట్టలేదు. దేవునికి తెలియకుండ జరుగునవి ఏవీ లేవు. మనుషులు
ఒక మతమును తయారు చేసుకోకముందే దేవుడు దానికి సంబంధించిన జ్ఞానమును మనకు అందించియుండును.
దానిప్రకారము ప్రతి మతము నకు ఒక మూలగ్రంథముండును. దానిలో దేవుని ధర్మములుండును. ఉదాహరణకు
ఇస్లామ్ను తీసుకొందాము. ఇస్లామ్కు ముందే దైవదూత ద్వారా దేవుని ధర్మములను చెప్పిన ఖురాన్ గ్రంథము
వచ్చినది. ఖురాన్ గ్రంథములో దేవుని ధర్మములు పూర్తిగా చెప్పబడి ఉన్నాయి. అయితే కొందరు ముస్లీమ్లు చెప్పిన
బోధల ప్రకారము చూస్తే ఇవి దేవుని ధర్మములేనా? అని అనుమానము రాగలదు. ఎందరో ముస్లీమ్లు దేవుని మీద
విశ్వాసముకల్గి దేవుని ధర్మములను తెలుసుకోవాలనివుండినా, వాటిని సరిగా తెలుపువారు లేక వారు దేవుని ధర్మములను
తెలియలేక ఉన్నారు. జిబ్రాయిల్ దూత స్వచ్ఛమైన దేవుని ధర్మములను తెలుపగా, ముహమ్మద్ ప్రవక్త ద్వారా బయటికి
వచ్చినది ఖురాన్ గ్రంథము. ఖురాన్ దైవగ్రంథ మైనపుడు అందులో దేవుని ధర్మములు ఉండుట వాస్తవమే కదా!
అయితే ఇస్లామ్ బోధకులు ఖురాన్లోని దేవుని ధర్మములను చెప్పగలిగారా? వారు మేము నిజమే చెప్పుచున్నామని
అనుకొనినా, వారు ఏమి చెప్పుచున్నారో, ఎంత సత్యము చెప్పుచున్నారో మాకు తెలుసు. దేవుడు ఇక్కడే వుంది అని
చెప్పినదానిని ఎక్కడోవుంది అని చెప్పుచున్నారు. చావుపుట్టుకల గురించి, స్వర్గ నరకముల గురించి, మరెన్నో విషయముల
గురించి దేవుడు ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క రకముగా చెప్పలేదు. ధర్మములు అన్ని మతములకు ఒకే విధముగా
ఉండునని ఎవరూ మరువకూడదు. ఏ విషయములో తప్పుగా చెప్పినా ఫరవాలేదు, కానీ దేవుని విషయములో
కలలోకూడా తప్పుగా చెప్పడము గానీ, చేయడముగానీ ఉండకూడదు. అలా చేస్తే దేవుని ఆగ్రహమునకు గురికాక
తప్పదని చెప్పినా దేవునికి కోపము లేదు, రాదు. కానీ దేవదూతలకు కోపము వస్తుంది వారు శిక్షించక మానరు.
దేవుని ధర్మములంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో, వాటి అర్థమెలా ఉంటుందో, ఆచరణ ఎలా ఉంటుందో,
నాకు బాగా తెలుసు ననియే చెప్పాలి. అయినా దేవునికి కోపము వస్తుందని చెప్పినమాట ఎంత నిజమో, నాకు
ధర్మములు తెలుసుననుట అంతే నిజము. వాస్తవముగా దేవునికి కోపము ఎట్లులేదో, అట్లే నాకు కూడా ధర్మములు
తెలియవు. దేవునికి కోపమురాకున్నా ఆయన దూతలకు కోపము వచ్చుననుట సత్యము. అలాగే నాకు ధర్మములు
తెలియకున్నా నా ఆత్మకు ధర్మములు తెలుసుననుట వాస్తవము. కనిపించని విషయము ఎవరికీ తెలియదు, కాబట్టి
సులభముగా అర్థమయ్యేదానికి అక్కడ దేవునికి కోపము వస్తుందనియే చెప్పాలి. ఇక్కడ నాకు ధర్మములు తెలుసుననియే
చెప్పాలి. ఇక్కడ ఒక విషయమును చెప్పుకొందాము. సముద్రతీరమునకు ప్రక్కనే ఒక ముస్లీమ్ దేశము కలదు.
దానిపేరు సరిగా జ్ఞప్తిలేదు. దానిపేరు ఎమాన్ లేక ఒమాన్ అనుకుంటాను. 2004 సంవత్సరము సునామీ వచ్చి తీర
ప్రాంతమంతా భయంకరముగా దెబ్బతినింది. చాలామంది చనిపోయారు. 2005 సంవత్సరములో ఆ దేశములో
కొన్ని ప్రాంతములందు పోలీసులు రాత్రిపూట కాపలా కాస్తూ తిరుగుచు కొన్ని ప్రాంతములలో తనిఖీలు చేయుచూ, ఒక
హెూటల్లో మనుషులుండగా ఆ హెూటల్లోనికి పోయి మత్తుపానీయమును త్రాగి వదలి వేసిన ఖాళీబాటల్ను వెదికి
పట్టు కొన్నారు. ఒక విదేశీయ జర్నలిస్టు దానిని అడుగగా అక్కడి పోలీసులు “మత్తుపానీయములు త్రాగడము
పెద్దనేరము, దేవుడు కూడా ఒప్పుకోడు. మేము వదలివేసినా దేవుడు వదలడు. మనుషులు ఇటువంటి పనులు చేస్తే
దేవునికి కోపము వస్తుంది. దేవునికి కోపము వస్తే ఇంతకు ముందు వచ్చిన సునామీకంటే పెద్ద భూకంపము,
సునామీలతో దేవుడు శిక్షిస్తాడు" అన్నారు. ఆ పోలీసులు చెప్పిన మాటనుబట్టి అక్కడ పోలీసు వారికి కూడా దేవుడంటే
భయమన్నట్లు తెలియడమేకాక, తప్పు చేస్తే దేవునికి కోపమొస్తుంది అనడము మాకెంతో నచ్చింది. అంతకుముందు
సునామీ దేవుని కోపము వలన వచ్చిందని వారు నమ్ముచున్నారు. మన దేశములో దేవుని ముందరే తప్పు
చేస్తామనువారున్నారు. దేవుడెవడు, వాని అడ్రసు ఎక్కడ అనే వారు కూడా కలరు. కానీ ఆ దేశములో తప్పు చేస్తే
దేవునికి కోపమొస్తుందనుకోవడము. తప్పు చేయకుండా దేవున్ని జ్ఞప్తిని పెట్టు కోవడము, దేవునికి కోపము వస్తుందని
భయపడడము చూస్తే మనకంటే ఆ దేశమువారు ఎన్నో రెట్లు మేలనిపిస్తున్నది.
వాస్తవానికి దేవునికి గుణములు లేవు, ఆయనకు కోపమురాదు. ఆయనకు కోపము రాకున్నా పాపపు పనులు
చేయడము వలన వాటి ఫలితముగా సునామీ వచ్చి మనుషులు బాధపడినది నిజమే. దేవునికి కోపము రాకున్నా,
సునామీని దేవుడు సృష్ఠించకున్నా ఆయన పరిపాలనలోని గ్రహములు, భూతములు మానవుని ప్రవర్తనను చూచి
కోపగించుకొని సునామీలను, భూకంపములను, టోర్నడోలను (వాయుమేఘములను) సృష్టించి వాటి వెనుకనుండి
మానవులను శిక్షించుచున్నారు. వర్షముల తోను, వరదలతోను మనుషులకు భయమును పుట్టించి బాధించుచున్నారు.
ఇదంతయు కనిపించని గ్రహముల వలన, భూతముల వలన జరుగుచున్న దని ఎవరికీ తెలియదు. కొందరు ఎన్ని
బాధలను అనుభవించుచుండినా దేవుడు అను భయము లేకుండావున్నారు. కొందరు దేవునికి కోపము వస్తుందని
భయపడుచున్నారు. వరదలు, సునామీలు, భూకంపముల వెనుక ఏమి జరుగుచున్నదని తెలియకున్నా, దేవుని వలనే
జరుగుచున్నా యనుకోవడము మంచిదే. వివరించుకొని చూస్తే దేవుడు ఏదీ చేయడనీ, దేవుని క్రింద దేవుని
ఆధీనములోవున్నవారు చేయుచున్నారని తెలియుచున్నది. తప్పు చేస్తే శిక్ష తప్పదు. అయితే దేవుని జ్ఞానమువద్ద ఏ
తప్పు చేసినా ఒకటికి నూరింతలు శిక్ష ఎక్కువ ఉండును. దేవుని జ్ఞానమును తెలియకున్నా నాకు తెలిసిందని
ఇతరులను తప్పుద్రోవ పట్టిస్తే పెద్ద పాపమువచ్చును. అంతేకాక ఎక్కడైనా దేవుని జ్ఞానములోని సత్యమును ఎవరైనా
చెప్పు చున్నప్పుడు దానిని ఖండించినా, లేక వ్యతిరేఖించినా దేవుని మార్గమునకు, దేవుని ధర్మమునకు వ్యతిరేఖముగా
మాట్లాడినట్లగును. అందువలన అప్పుడు కూడా మహాపాపము సంభవించును. దేవుని జ్ఞానములో ఏమాత్రము
తప్పుగా చెప్పినా మహాపాపము వస్తుందనీ, పెద్దశిక్ష పడుతుందని చెప్పుచున్న నేను చాలామందికి జ్ఞానము సక్రమముగా
తెలియదనీ, దేవుని ధర్మములు ఎవరికీ అర్థము కాలేదనీ, ప్రతి మతములోను దేవుని జ్ఞానమువద్ద పొరపాటు పడినారని
చెప్పుటలో నాది ఏమైనా తప్పయితే నాకు కూడ పాపము తప్పదు, శిక్షా తప్పదు. కానీ ధర్మములలో సత్యాసత్యములేవో
నాకు బాగా తెలుసు. వాటిని నేను మరచిపోలేదు. అందువలన ధైర్యముగా చెప్పు చున్నాను. ప్రపంచ విషయములలో
నాకు జ్ఞాపకశక్తి తక్కువ, అదే దైవ విషయములలో అయితే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రపంచ విషయములలో
జ్ఞాపకశక్తి ఎక్కువ. ఇక దైవ ధర్మములంటే ఏవో, వాటికి ఉండవలసిన పేరు ఏమిటో? అవి ఎక్కడున్నాయో? అందరికి
తెలియవు. అందువలన వాటిని ఇప్పుడు తెలుసుకోవలసివున్నది.
దేవుని ధర్మములంటే ఏవో నాకు ముందునుండి జ్ఞప్తికున్నాయి. నేను క్రొత్తగా నేర్చుకోవలసిన పనిలేదు.
అందువలన క్రైస్తవములోగానీ, ఇస్లామ్లోగానీ, వారి మూలగ్రంథములలోనున్న ధర్మములను వారు సక్రమముగా
వివరించకుండినా, కొన్నింటిని సూక్ష్మములని వదిలివేసినా, అనవసరముగా స్థూలముగా అర్థము చెప్పుచున్నా, వారు
చేయు తప్పేమో, ఒప్పేమో నాకు సులభముగా అర్థమగుచున్నది. వారు ఎలా చెప్పినా అక్కడున్నవి నిజమైన దైవధర్మములని
తెలుసు, వాటిలో ఎంత రహస్యము దాగియున్నదో తెలుసు. అందువలన ప్రతి మత గ్రంథములోని ధర్మములు నాకు
బాగా పరిచయమున్నవేనని ధైర్యముగా చెప్పుచున్నాను. క్రైస్తవములో గానీ, ఇస్లామ్లోగానీ చెప్పిన దైవధర్మములను
కొన్నింటిని మాత్రము ఎలా వివరించుకొని చూడాలో, అందరికీ తెలియునట్లు నమూనాకు “బైబిలులోని పవిత్ర వాక్యములు”
అను పేరుతో ఒక గ్రంథమును, “ఖురాన్లోని పవిత్ర వాక్యములు" అను పేరుతో ఒక గ్రంథమును తొందరగా
వ్రాయదలచాము. ఆ గ్రంథములతో అన్ని మతములలోనూ దేవుని ధర్మములు ఏమాత్రము మారకుండ సమానముగా
ఉన్నాయని తెలియగలవు. ఇంతవరకు భగవద్గీతకు బైబిల్కూ, బైబిల్కు ఖురానూ, ఖురాన్కు భగవద్గీతకూ కొన్ని
విషయములలో తేడాలున్నాయనీ, వేరువేరు మతములైన దానివలన ఆ మూలగ్రంథములలో వేరువేరు ధర్మములూ,
వాటికి వేరువేరు భావములున్న వని అందరూ అనుకోవడము జరుగుచున్నది. కానీ మేము వ్రాయు గ్రంథములలో,
అన్ని మూలగ్రంథములలో చెప్పినవి ఒకే ధర్మమనీ, ఒకే భావములనీ విశదీకరించి శాస్త్రబద్ధముగా చెప్పబడును.
ద్వాపరయుగములో దేవుడు భగవంతుని ద్వారా భగవద్గీతను బోధించాడు. అందులో విజ్ఞానయోగము అను
అధ్యాయములో 14వ శ్లోకములో చెప్పిన సారాంశము ఇలా కలదు. “నేను మాయ అను దానిని తయారు చేసిపెట్టాను.
దానిని దాటుటకు ఎవరికీ సాధ్యముకాదు” అని అక్కడ చెప్పడము జరిగినది. ఈ శ్లోకములోని భావమును చదివిన
తర్వాత మనకు ఒక ప్రశ్నరాగలదు. దేవుడు తనకు, మనిషికి మధ్యలో మాయను ఎందుకు పెట్టుకొన్నాడు? దానిని
దాటి వచ్చుటకు ఎవరికీ సాధ్యము కాదన్నాడు. మనిషికి సాధ్యముకాని బలమైన మాయను ఎందుకు నియమించుకొన్నాడు?
అను ప్రశ్న వస్తున్నది. దానికి సమాధానము వెదికితే ఇలా కలదు. ఒక మనిషి ఒక ఊరిలో ఇల్లు కట్టుకొన్నాడు. ఆ
ఊరిలోని మనుషులు నాలుగు రకములవారున్నారు. ఆ నాలుగు రకముల మనుషుల మధ్యలో వారికంటే విభిన్నమైన
మనస్థత్వముగల వ్యక్తి నివాసము ఏర్పరచు కొన్నపుడు, అతను మాత్రము ఐదవ రకమువాడగును. ఆ ఊరిలోని
వారందరు నాలుగు రకములవారన్నాము కదా! వారిలో ఒక రకము వాడు మోసము చేయువాడు, రెండవ రకమువాడు
దోపిడీలు, దొంగతనములు చేయువాడు. మూడవ రకమువాడు అబద్ధములు చెప్పువాడు. నాల్గవవాడు ఏదైనా అడిగి
తీసుకొని పోవువాడు. ఈ నాలుగు రకముల వారి వలన ఏదో ఒక విధముగా నష్టము తప్ప లాభములేదు. ఐదవ
రకమువాడు పెద్దధనికుడు మిగతవారివలె నాలుగు రకములలో ఏ రకము కానివాడు. ఐదవరకమువాడు పెద్ద
ధనికుడైన దానివలన, ఊరిలోని మిగత నాలుగు రకములవారు ఆ ధనికునివద్దకు పోవాలనుకొంటారు. ఎందుకనగా!
ధనికునివద్దకు పోతే తమకున్న స్వభావముతో ఒకడు మోసము చేయ వచ్చును. మరొకడు సమయము చూచి దోపిడి
చేయవచ్చును, ఇంకొకడు అబద్ధము చెప్పి ఏదో ఒకటి తెచ్చుకోవచ్చును. నాల్గవరకము వాడు మోసము, దొంగతనము,
అబద్ధము లేకుండ అడిగి ఏదైనా తెచ్చుకోవచ్చును. ఆ ఊరిలోని వారందరి స్వభావములు తెలిసిన ధనికుడు, ఏదో ఒక
రకముగా నష్టపరచు ఆ ఊరివారు తన అనుమతి లేకుండా తనవద్దకు రాకుండా ఉండుటకు, ఒక కాపలాదారున్ని
ఉంచుకోవాలనుకొన్నాడు. అప్పుడు ఆ ఊరిలోని వారు కాపలాదారుని లెక్క చేయకుండా, బలవంతముగా తన ఇంటిలోనికి
ప్రవేశించు స్వభావముకలవారని గ్రహించిన ధనికుడు, తన అనుమతిలేనిదే ఎవడూ లోపలికి రాకుండుటకు ఆ ఊరిలోని
వారందరి కంటే బలమైన వ్యక్తినీ, ఆ ఊరిలోని వారందరి స్వభావమును తెలిసిన వ్యక్తినీ, నాల్గురకముల కుతంత్రములకు
గురువులాంటి వ్యక్తినీ, చూచేదానికే భయంకరముగా, బలముగానున్న మనిషినీ, అందరి మీసములకంటే పెద్ద మీసాలుగల
వ్యక్తిని కాపలా మనిషిగా ఉంచుకొన్నాడు.
ఊరి మధ్యలో ఇల్లు కట్టుకొని కాపురమున్న ధనికున్ని ఎలాగైనా మోసము చేసి అతనివద్దనున్న ధనమును
కాజేయాలని ఊరిలోనివాడు ఒకడు అనుకోగా, మరొకడు ఎలాగైనా ఆ ఇంటిలో దొంగతనము చేయాలను కొన్నాడు,
ఇంకొకడు తియ్యని మాటలను అబద్ధములుగా చెప్పి మభ్యపెట్టి ధనికునివద్దనుండి ధనమును తెచ్చుకోవచ్చనుకొన్నాడు.
నాల్గవ రకమువాడు "అడగంది పాత అమ్మయినా పెట్టదు, అడిగితే కొత్త అత్తయినా పెట్టు తుందను” సామెతను
తెలిసినవాడై ధనికున్ని పద్ధతిగా అడిగి దానము క్రింద ఏదైనా పొందవచ్చుననుకొన్నాడు. అలా అనుకొన్న ఆ ఊరిలోని
వారు ఒక్కొక్కడు ధనికుని ఇంటికి వారికి అనుకూలమైన సమయములలో పోయారు. అయితే అక్కడ కాపలా కాస్తున్న
వ్యక్తి వీరందరి మోసములను కలగలుపుకొనివున్న పెద్దమోసగాడు అయినందున, ఎవరు ఏ ఉద్దేశ్యముతో వచ్చారో
ముందే గ్రహించి ఆ ప్రక్కకు కూడా రానిచ్చేవాడు కాదు. ఎవడు ఎన్ని ఉపాయములు చేసినా అవి ఏవీ పని చేయలేదు.
ముఖ్యముగా కాపలాదారున్ని పరిచయము చేసుకొంటే పని సులభమవుతుందని తలచి, కొందరు కాపలా వ్యక్తిని పరిచయము
చేసుకొన్నారు. ఎలాగైతేనేమి కాపలా వ్యక్తి దగ్గరకు పోగలిగారు. ఆ ఇంటి ప్రహారిలోనికి పోయి వాచ్మ్యాన్తో
మాట్లాడగలిగారు, అతనితో స్నేహము చేశారు. అక్కడి వాచ్మ్యాన్ (కాపలా వ్యక్తి) అన్ని విద్యలలో ఆరితేరినవాడు
కనుక, అతనివద్దకు పోయిన ప్రతి వానిని, ప్రతిసారి అతనే మోసము చేసి పంపేవాడు. కాపలా వ్యక్తి దగ్గరకు పోయి
ఏదో ఒకటి పోగొట్టుకొని వచ్చినవారు తప్ప ఆ ఇంటిలోనికి పోయిన వారు లేరు, ఆ ధనికున్ని చూచినవారు లేరు.
మొత్తము మీద ఆ ఇంటి ప్రహారి లోపలికి పోయిన ప్రతివాడు కాపలావ్యక్తి దగ్గర మోసపోయి వచ్చినవాడే గానీ,
ఇంటిలోపలికి పోయినవాడు ఎవరూ లేడు.
ఆ ఊరిలోని వారందరూ అలా అనేకమార్లు ప్రయత్నము చేసి చేతకాక మానుకొన్నారు. అప్పటికీ నాల్గవ
రకమువాడు అడగంది అమ్మయినా పెట్టదు అను సామెతను తెలిసివాడై, లోపలికి పోవాలంటే ఏమి చేయాలని
కాపలాదారున్ని అడిగాడు. దానికి కాపలాదారుడు లోపలున్న తన యజమాని అనుమతి కావాలన్నాడు. దానికి ఆయన
అనుమతి ఎలా పొందాలని అక్కడికి పోయిన నాల్గవరకమువాడు అడగడము జరిగినది. అప్పుడు వాచ్మ్యాన్
(కాపలాదారుడు) దానికి తగిన ఉపాయమును వివరముగా అతనికి చెప్పను మొదలుపెట్టాడు. అనుమతిని ఎలా
పొందాలనే దానికంటే ముందు అనుమతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. అందువలన ముందు దానిని గురించి
చెప్పుతాను విను. ఎవని అనుమతిని పొందాలనుకొంటు న్నావో, వాని మతిని అనుసరించి ప్రవర్తించడము వలననే
వాని అనుమతిని పొందడము అంటాము. ఈ సూత్రము ప్రకారము ధనికుడైన యజమాని మతి ఎలాగుంటుందో
అలాగే నీవు నడుచుకుంటే ఆయన అనుమతి దొరికినట్లే. మా యజమాని ముందే నాకు ఈ విధముగా చెప్పాడు.
“ఎవడు నన్ను చూడాలని, నావద్దకు రావాలని అనుకుంటున్నాడో వాడు నావలె ఊరక ఉండువాడై వుండాలి. ఊరిలోని
వారివలె మోసము, దొంగతనము, అబద్దము, అడిగి తీసుకోవడము అను ఏ రకమైన అలవాటు లేకుండాలి. అటువంటి
వాడు నీకు కనిపిస్తే, వాడు ఏ లాభము లేకుండా నావద్దకు రావాలను ఉద్దేశ్యముతో వస్తే, నన్ను అడుగకుండానే
లోపలికి నావద్దకు పంపించు" అని చెప్పాడు. ఎవని మతి వానిది అన్నట్లు మనుషులు తమలోపలనున్న గుణచక్రమును
అనుసరించి నాలుగు రకములుగా విభజింపబడి ఉన్నారని గీతలో దేవుడే చెప్పాడు. అందువలన పైన మనము
చెప్పుకొన్న కథకు, భగవద్గీతలో దేవుడు చెప్పిన దానికి దగ్గర సంబంధము న్నట్లు అర్థమగుచున్నది. ఇప్పుడు దానిని
వివరముగా చెప్పుకొందాము.
భగవద్గీతలో జ్ఞానయోగము అను అధ్యాయములో 13వ శ్లోకమున దేవుడు ఊరిలోని నాలుగు రకముల
మనుషులకు సరిపోవు భావమును చెప్పాడు.
శ్లో॥ చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః
తస్యకర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్॥
భావము :- నాలుగు రకముల మనుషులను వారివారి కర్మలను, గుణములను అనుసరించి సృష్టించాను. నాశనములేని
నేను వారికి కర్తనైనా కానట్లున్నాను అని అన్నాడు. ఇప్పుడు శ్లోకములోని మొదటి వాక్యము ప్రకారము విశ్వము అను
ఊరిలో నాలుగు రకముల మనుషులను దేవుడు తయారు చేసివుంచాడని తెలియుచున్నది. ఆ నలుగురిని వరుసగా
ఒకడు తామసుడు, రెండు రాజసుడు, మూడు సాత్వికుడు, నాలుగు యోగి అని చెప్పవచ్చును. ఈ నలుగురికి
అధికుడైన ధనవంతుడైన దేవుడు విశ్వమను ఊరిలో మోక్షమను ఇంటిలో ఉన్నాడని తెలియుచున్నది. మోక్షమను
ఇంటి లోనికి ధనికునివద్దకు పోవాలనుకొనువారికీ, ఆ ఇంటిలోనికి పోయి ఏదో ఒకటి తెచ్చుకోవాలనుకొను వారికీ,
ఆటంకముగా ఎవరినీ మోక్షమను ఇంటి లోనికి పోకుండా కాపలాగా ఇంటి యజమానివలె మోక్షాధిపతి అయిన
దేవుడు మాయ అను వాచ్మ్యాన్ను ఇంటిముందరే ఉంచాడు.
విజ్ఞానయోగము (14) శ్లో॥
దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా।
మామేవ యే ప్రపద్యన్తో మాయా మేతాం తరన్తి తే॥
ఈ శ్లోకములో గుణములతో కూడుకొన్న మాయ అను శక్తిని, దేవుడే తయారు చేసివుంచాడని తెలియుచున్నది.
అంతేకాక దేవుడు నియమించిన మాయను దాటి ఎవడూ రాలేడు అని కూడా చెప్పాడు. అటువంటి దుస్సాధ్యమైన
మాయను దాటుటకు తనను ఎవడు ఆరాధించు చున్నాడో, వాడు మాత్రము మాయను దాటి రాగలడు అని చెప్పాడు.
దీనినిబట్టి చూస్తే గుణములున్న, గుణములులేని నాలుగు రకముల మనుషులలో దేవునివద్దకు మోక్షమను ఇంటిలోనికి
పోవాలనుకొంటే, గుణములన్ని కలగలిపియున్న మాయ అడ్డముగా వుండి, ఎవరినీ లోపలికి దేవునివద్దకు పోకుండా
చేయుచున్నది. దేవుని ఇష్ట ప్రకారముంటూ, దేవుని ఆరాధనలైన యోగములను ఆచరించు వానిని మాత్రము, మాయ
ఆటంకము లేకుండ పంపునని తెలియుచున్నది. ఇప్పుడు పై కథ దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారము సమానముగా
ఉన్నట్లు తెలిసి పోయినది. ఆ కథలో నాల్గవ రకమువాడు లోపలి యజమాని మతిని అనుసరించి నడుచుకోవడము
మొదలుపెట్టాడు. దానిని గమనించిన వాచ్మ్యాన్ ఆ వ్యక్తిని లోపలికి పోవుటకు ఆటంకము చేయకుండ పంపించాడు.
యజమాని పద్ధతిని అనుసరించిన వానిని అడుగకుండ స్వయముగా లోపలికి పంపు అధికారము కాపలా వ్యక్తికి
కలదు. కావున నాల్గవ రకము మనిషిని ఇంటిలోపలికి పంపాడు. వాడు పోయి లోపల యజమానిని కలిసి మాట్లాడాడు.
అప్పుడు ఆ యజమాని లోపలికి పోయిన వానిని ఇంటి యజమానిగా చేసి తాను లేకుండా పోయాడు.
ఊరి మధ్యలోని ధనిక యజమానివద్దకు వాచ్మ్యాన్ పంపగా పోయిన వ్యక్తి తిరిగి బయటికిరాలేదు. ఎందుకు
అలా అయ్యింది? లోపల ఏమి జరిగింది? అను ప్రశ్నలకు జవాబును చూస్తే, ఇంతవరకు లోపల ధనికుడున్నాడనుకొన్నాము
కదా! కానీ అక్కడకు పోయిన వ్యక్తికి లోపల ఏ మనిషీ లేడని తెలిసింది. అక్కడ ఇల్లు వాస్తవమే, ఆ ఇంటిలో ధనమూ
వాస్తవమే. ఇంటిలోని మనిషి మాత్రము వాస్తవము కాదు. మొదట ఆ ఇంటిలోనికి పోయిన అడిగి ఇప్పించుకొను
వ్యక్తికి మనిషే కనిపించలేదు. పోయిన వ్యక్తి ఇల్లంతయు తిరిగి చూచాడు. అప్పుడు ఇంటిలోని వ్యక్తి ఎక్కడికి
పోయాడు? అని మనస్సులో అనుకొన్నాడు. అలా అనుకొన్న వెంటనే జవాబుగా "నెనెక్కడికి పోతాను? ఒక్కచోట
ఉండేవాడినైతే ఎక్కడికైనా ఇంకొక చోటికి పోవలసి వుంటుంది. నేను అంతటా ఉన్నాను. నీవు ఇల్లంత తిరిగి
చూచావు. నీకు నేను కనిపించే దానికి నీ మాదిరి నేను ఒక వ్యక్తిని కాదు, అంతటావున్న శక్తిని. నీవు నా మతిని
అనుసరించి నడుచుకోవడము వలన ఇక్కడికి రాగలిగావు. ఇక్కడికి వచ్చి పోవాలను కొన్నావు, కావున నేను నీకు
కనిపించలేదు. నీ లోపలనున్న తిరిగి పోవాలను అభిప్రాయమును వదలిపెట్టితే నేను నీకు కనిపిస్తాను” అని వినిపించింది.
అప్పుడు లోపలికి పోయిన వ్యక్తి తిరిగి పోవాలన్న అభిప్రాయమును వదలుకొన్నాడు. అప్పుడు అంతవరకు మాట్లాడిన
వ్యక్తి కనిపించాడు. కనిపించిన వ్యక్తి అచ్చము లోపలికి పోయిన వ్యక్తివలెనున్నాడు. అతనికి ఇతనికి ఏమాత్రము ఏ
విధమైన తేడాలేదు. అప్పుడు కనిపించిన వ్యక్తి ఇలా అన్నాడు “ఇప్పుడు నీవు నా వలె ఏ భావములు లేకుండ ఉన్నావు
అందువలన ఇద్దరము ఒక్కటే. నీవలె నేను, నావలె నీవు ఉన్నావు. ఇద్దరి రూపు ఒక్కటే అయినది. ఈ ఇంటిలో
యజమాని ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ఎప్పటికీ ఉండరు. ఇప్పటినుండి నా స్థానములో ఇంటి యజమానిగా నీవే
ఉండు.” అని చెప్పి ఇద్దరు ఒకరి లోనికి ఒకరు కలిసిపోయారు.
”
ఇదంతయు సినిమా కథలాగ ఉండినా సాధిస్తే మన జీవితములో జరిగే సత్యము. ఇంటిలోనికి పోయినవాడు
ఇంటికే యజమాని అయినట్లు మోక్షమను ఇంటిలోనికి మాయను ఒప్పించి పోగలిగితే విశ్వమునకే అధిపతి కావచ్చును.
దేవునికి ఆకారము లేదు. కావున మోక్షమను ఇంటిలోనికి పోగలిగితే ఆకారములేని యజమాని అయిన దేవునితో
కలిసిపోయి, తాను కూడా దేవునిగా మారిపోయి విశ్వమునంతటికి అధిపతిగా అయిపోవచ్చును. అంతటితో మనిషి
యొక్క మానవత్వము పోయి దైవత్వము కల్గును. దైవత్వము పొందినవాడు తిరిగి పుట్టడు. ఇదంతయు దేవుడు చెప్పిన
విధానము, ఆయన ఏర్పరచిన చట్టము. ఒక మనిషి తిరిగి పుట్టకుండ దేవునిగా మారిపోవాలంటే, జన్మలు కలుగకుండ
విశ్వమునకే అధిపతిగా ఉండాలంటే ఇదియే మనిషికి దేవుడు శాస్త్రబద్ధముగా చెప్పిన విధానము. దేవుడు చెప్పిన
విధానమును పోల్చి చూచితే ఇంతకు ముందు చెప్పుకొన్న కథలాగ ఉంటుంది. ఇది ఒక హిందూమతమునకు
సంబంధించినదని ఎవరూ అనుకోకూడదు. ఊరిలో ఏ కులమువారైన ఉండవచ్చును. అలాగే విశ్వమను ఊరిలో ఏ
మతమువారైన ఉండవచ్చును. ఊరి మధ్యలోని ఇంటిలోనికి పోవాలని ప్రయత్నము ఏ కులమువారైన చేయవచ్చును.
అంతేగాని ఫలానా కులమువారికే ప్రవేశము అని చెప్పలేదు. అదే విధముగా మోక్షమను ఇంటిలోనికి అన్ని మతములవారికి
ప్రవేశమున్నది. అదియు వాచ్మ్యాన్ ఒప్పుకొంటే. అంతేగానీ ఫలానా మతమువారే అక్కడికి పోవచ్చు అని చెప్పలేదు
కదా! వాచ్మ్యాన్ అందరికీ ఆటంకము కలుగజేసి ఇంటి లోనికి ఎవ్వరినీ వదలనట్లు మాయ, సాతాన్, ఇబ్లీస్ అను
పేర్లుగల వాచ్మ్యాన్ దేవుని దగ్గరికి ఎవరినీ పోకుండ చేయుచున్నాడు. అన్ని మతముల వారినీ, అన్ని రకముల పేర్లతో
దేవునివద్దకు పోవాలనుకొను వారిని పోకుండ అడ్డుకొంటున్నాడు. మనిషి అయిన ప్రతివానికి కథలాగ వర్తించు ఒక
శాస్త్రబద్ధమైన విధానమును దేవుడు అమర్చిపెట్టాడు. మాయ అనునది దేవుడు చెప్పిన విధానము ప్రకారము నడుచువానికి
అనుకూలించి ఆటంకపరచదు. కానీ దేవుని విధానము ప్రకారము నడువని వానిని దేవునివద్దకు పోకుండ, మోక్షము
అను గృహములోనికి పోకుండ చూడ గలదు. ఏ మతస్థునికైనా గుణచక్రము నాలుగు భాగములుగా ఉన్నది. అన్ని
రకముల వారికి మూడు రకముల గుణములు గలవు. అందువలన అన్ని మతముల వారికి దేవుని విధానము ఒక్కటేనని
తెలియుచున్నది.
పవిత్ర ఖురాన్ గ్రంథములోగానీ, పరిశుద్ధ బైబిలు గ్రంథములో గానీ, పరమ, పవిత్ర, పరిశుద్ధ భగవద్గీతలోగానీ
తెలుపబడిన దేవుని ధర్మము లన్నియు ఒకే విధముగా ఉన్నవి. ఊరు, ఇల్లు కథలాగ అన్ని మతముల వారు దేవున్ని
చేరుటకు ఒకే పద్ధతిని అనుసరించవలసి ఉండును. మూడు మతముల మూల గ్రంథములలో నాకు ఒకే ధర్మము
కనిపిస్తున్నది. అన్ని మతములకు ఒకే దేవుడు, అన్ని మతములకు ఒకే జ్ఞానము, అందరికీ సృష్ఠికర్త ఒకడే అని
మేమంటే కొందరు ఇలా అడిగారు. "మీ మతములో పునర్జన్మలున్నాయని చెప్పారు. మా మతములో పునర్జన్మలు
లేవని చెప్పారు. అటువంటపుడు రెండు మతముల జ్ఞానము ఒకటే ఎలా అగును? మీ గ్రంథములో చెప్పిన దానికి,
మా గ్రంథములో చెప్పిన దానికి ఎన్నో విషయములలో తేడాలు కనిపిస్తున్నవి. అలాంటపుడు అన్ని మతములది ఒకే
ధర్మమెలా అగును?" అపుడు వారికి మేము ఇలా సమాధానము చెప్పాము. సృష్టికర్త అందరికీ ఒకడేనని మీరే గట్టిగా
చెప్పుచున్నారు. మేము దానిని ఒప్పుకుంటున్నాము. కానీ మేము అందరికీ ధర్మము ఒకటేనని అంటున్నాము. దానికి
మీరు ఒప్పుకోవడములేదు. అందరికీ దేవుడు ఒక్కడే అయినపుడు దేవుని ధర్మము (ఇందూధర్మము) అందరికీ ఒకటిగా
ఎందుకు లేదు? ఈ విషయమును లోతుగా ఆలోచిస్తే ఊరిలో ధనికుని ఇల్లు ఒకటేనని మీరే చెప్పి ఆ ఇంటికి
ఆ
కాపలాదారులు చాలామంది ఉన్నారన్నట్లున్నది. ఒక ఇంటికి ఒకే కాపలాదారుడుండును అనినట్లు దేవుడు ఒక్కడే,
మాయ ఒక్కటే, అక్కడికి పోవుటకు అనుమతి ఒక్కటేగలదు. వివరముగా చూస్తే సత్యము తెలియగలదు. అట్లుకాకుండా
నీవు యోచించ కుండ, బోధకుడు చెప్పిన మాటనుబట్టి ఎప్పటికీ గ్రుడ్డిగా నమ్మవద్దు. గురువు చెప్పిన మాట వాస్తవమగును.
కానీ బోధకులు చెప్పిన మాట వాస్తవమని నమ్మకూడదు. ఎవడు బోధకుడో, ఎవడు గురువో తెలియని ఈ కాలములో
చెప్పినవన్నీ విను, విన్నవన్నిటిని యోచించు, అందులో ఏది సత్యమైతే దానిని స్వీకరించు. అట్లు కాకుండా మా
వాళ్ళందరు చెప్పిన దానినే నేను చెప్పుతానంటే అందులో నీ తెలివి, నీ యోచన ఏమీ లేదనియేగా అర్థము. అట్లుకాకుండా
దేవుడు నీకిచ్చిన బుద్ధితో ఒక యోచనా విధానమును అవలంబించి సత్యమును తెలుసుకో, సత్యమునే మాట్లాడు,
అప్పుడు దేవుడు ఒప్పుకొంటాడు.
ఐదువేల సంవత్సరముల పూర్వము దేవుడు భగవద్గీతను చెప్పాడు. అక్కడ చెప్పినట్లు ప్రత్యక్షముగా జరుగుచున్నది.
"జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ" అను వాక్యము ప్రకారము పుట్టిన వానికి చావు తప్పదు.
చచ్చినవానికి పుట్టుక తప్పదని చెప్పడము జరిగినది. దాని ప్రకారము పుట్టినవాడు తప్పక చనిపోవునట్లు అందరికీ
తెలియుచున్నది. అయితే చచ్చినవాడు తిరిగి పుట్టడము ఎవరికీ కనిపించని విషయము. అందువలన కొందరు ఆ
మాటను ఒప్పుకోవడము లేదు. మా మత గ్రంథములలో చచ్చినవాడు పుట్టడని వ్రాశారని చెప్పుచుందురు. ఇంతవరకు
ఏ గ్రంథములోనూ చచ్చినవాడు పుట్టడను విషయములేదు. వాని కర్మ ప్రకారము తిరిగి పుట్టుతారనే వ్రాశారు.
కొందరు మతపెద్దలు తప్పుత్రోవ పట్టి పోవడమేకాక, వారి తప్పును కప్పిపుచ్చుకొనే దానికి మిగతా వారందరికీ కళ్ళకు
గుడ్డకట్టి మేము చెప్పింది వినండి, మేము చేసింది చేయండి అని చెప్పుచుండుట వలన, మిగతావారు కూడా విచక్షణ
లేకుండా తప్పుదారి పట్టిపోవడము జరుగుచున్నది. దేవుడు మనుషులు తెలుసుకోవాలని తన జ్ఞానమును భూమిమీదకు
పంపితే, మనిషి తెలుసుకోకుండా తప్పుగా అర్థము చేసుకొంటున్నాడని తలచి, అట్లుకాకుండ తాను చెప్పిన జ్ఞానము
శాస్త్రబద్ధమైనదని తెలియుటకు కొన్ని సాక్ష్యాధారములను చూపాడు. అందులో కొన్నిచోట్ల చనిపోయినవాడు తిరిగి
పుట్టునని తెలియుటకు, కొందరు పుట్టిన నాలుగు, ఐదు సంవత్సరములకు వెనుకటి జన్మ జ్ఞాపకములు వచ్చి తిరిగి
చెప్పడము జరిగినది. అటువంటి సంఘటనలే పునర్జన్మకు సాక్ష్యము. అలా చెప్పడము అబద్ధముకాదు అనుటకు
గతజన్మ జ్ఞాపకములు వచ్చిన బాలుడు చెప్పిన ప్రకారము అన్నీ ఉన్నవని తెలియుచున్నది. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి
వేరొక చోట పుట్టడము జరిగినది. పుట్టిన వానికి నాలుగు సంవత్సరముల వయస్సులో గత జన్మ జ్ఞాపకములు
రావడము జరిగినది. అలా వచ్చిన జ్ఞాపకములను ఆ పిల్లవాడు పెద్దవారికి చెప్పగా, వారు వారి పిల్లవాడు చెప్పినది
సత్యమా కాదా అని విచారించగా, పిల్లవాడు చెప్పినవన్నీ ఆధారములతో సహా నిరూపణగా సత్యమని తెలిసిపోయాయి.
ఒకడు వెనుక జన్మలో కారు ప్రమాదములో చనిపోయిన విషయము జ్ఞప్తికి వచ్చి చెప్పగా, అతను చెప్పిన స్థలమును,
కాలమును, చనిపోయినపుడు గతజన్మలోనున్న బంధువులను అడుగగా అన్నీ సత్యమని తెలిసిపోయింది. అంతేకాక
గతజన్మలోని బంధువులనందరినీ ఆ పిల్లవాడు గుర్తుపట్టి పేరుతో పిలువడము కూడా జరిగినది. మళ్ళీ జన్మ
ఉందనుటకు ఇది దేవుడు చూపిన ప్రత్యక్షసాక్ష్యము కాదా! ఇటువంటి ఎన్నో సంఘటనలు ముస్లీమ్ దేశములలోనే
జరిగాయి. ఇవి మనుషులు సృష్టించినవి కాదు కదా! దేవుడే చూపిన సాక్ష్యములు కావా? ఇవన్నియు చూచికూడా,
తమ గ్రంథములో దేవుడు జన్మలున్నాయని చెప్పిన వాక్యములకు తప్పు అర్థమును చెప్పి, జన్మలు లేవు అంటే దేవుని
మాటకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లు కాదా! అట్లు మాట్లాడుట వలన దేవుని జ్ఞానమును తప్పుదారి పట్టించి
నట్లగును. దానివలన దేవుని కోపమును దూతల ద్వారా చవి చూడవలసి వచ్చును.
దేవుడు చెప్పిన దానిని అర్థము చేసుకోలేకపోవడమేకాక, తమకు అనుకూలమైన అసత్యమును అందరికీ
అంటగట్టడము ఫలాన మతమునకే పరిమితమైనదని చెప్పుటకు వీలులేదు. అన్ని మతములలోను దేవుని జ్ఞానమును
మార్చి చెప్పడమూ, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడమూ జాఢ్యములాగ వ్యాపించి ఉన్నది. దేవుని ధర్మమును
ఇందూధర్మము అనాలి అని చెప్పుకొన్నాము. అలా చెప్పుటకు కారణమున్నది, కావున దాని ప్రకారము అలాగే చెప్పాలి.
దేవుని జ్ఞానము హేతుబద్ధమైనది మరియు శాస్త్రబద్ధమైనది. దేవుని ధర్మములకు (ఇందూ ధర్మములకు) హేతుబద్ధమైన
ప్రశ్న ఉంటుంది, శాస్త్రబద్ధమైన జవాబు ఉంటుంది. దేవుని జ్ఞానము నాకు తెలుసు అనువాడు ఎవడైనా, హేతువాది
పద్ధతిగ అడిగిన ప్రశ్నకు శాస్త్రబద్ధముగా జవాబు ఇవ్వకపోతే దేవుని జ్ఞానమును చిన్నబుచ్చినట్లగును. ఇది ఒక
మతమునకు సంబంధించినది కాదు. అన్ని మతములకు సంబంధించిన విషయమని చెప్పుచున్నాము. దేవుడు ఒక్క
మతమువాడు కాదు. అన్ని మతముల మనుషులకు సంబంధించినవాడు. కావున ఒక మతములో లోపము కనిపిస్తే,
మిగతా మతములలో అటువంటి లోపము లేకుండ చూచుకోవలెను. ఇందూధర్మములు (దేవుని ధర్మములు) మహా
శక్తివంతమైనవి. అవి దేవుని విధానమును తెలుపునవేకాక అగ్నిలాగ కర్మలను కాల్చు స్వభావము కల్గియున్నవి. నిప్పుచుట్టూ
ఏమీ లేనప్పుడు నిప్పు నిప్పుగానే ఉండును. నిప్పు దగ్గర చెత్త కుప్పను తెచ్చిపెట్టినా, చెత్త కుప్ప దగ్గరకి నిప్పును
తెచ్చిపెట్టినా చెత్తకుప్ప అంటుకొని కాలిపోవును. అలా దేనినైనా కాల్చడము అగ్నియొక్క స్వభావము. అలాగే దేవుని
జ్ఞానము (ఇందూ ధర్మము) అగ్నితో సమానమైనది. అందువలన భగవద్గీతలో దానిని జ్ఞానాగ్ని అని చెప్పడము
జరిగినది.
ఏ మతములోనైనా దేవుని ధర్మము (ఇందూధర్మము) స్వచ్ఛమైన భావముతో ఉంటే అగ్నితో సమానముగా
ఉండును. అట్లుకాకుండా ఏ మతములోనైనా దేవుని ధర్మమును భావహీనము చేసినా, అర్థరహితము చేసినా, ప్రకాశించు
అగ్నిని మట్టితో కప్పిపెట్టినట్లగును. అప్పుడు దాని స్వభావమును కోల్పోవును. అర్థరహిత ధర్మము ఆరిపోయిన
కొరివిలాగ ఉండును. భగవద్గీతలో ఎంతో జ్ఞానమును చెప్పడము జరిగినది. దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన
జ్ఞానము ఒక అగ్నిలాంటిది. దేవుడు స్వయముగా చెప్పిన జ్ఞానము మూడు ఇందూధర్మములను తెల్పినది. ఇందూ
ధర్మములున్న భగవద్గీతా గ్రంథము నిప్పు కుంపటిలాంటిది. అయితే అది తప్పు భావము లతో నిండిపోవడము వలన,
అగ్ని ఆరిపోయిన కుంపటిలాగ మిగిలి పోయినది. ఇదే విధానము అన్ని మూలగ్రంథములకు వర్తిస్తుందని తెలియాలి.
మిగతా మత మూల గ్రంథములలో కూడా దేవుని ధర్మములు (ఇందూ ధర్మములు) కలవు. అందువలన అవి కూడా
ఆగ్ని కుంపటి లాంటివే. అయితే అవి నిజ భావములతో ఉంటే మండుచున్న అగ్ని అగును. నిజ భావము లేకపోయివుంటే
ఆరిపోయిన అగ్ని అగును.
ప్రపంచ పటములో ఎన్నో దేశములు కలవు. అందులో భారత దేశము కూడా ఒకటి. కృతయుగములోనే
భారతదేశమను పేరు ఈ దేశమునకు కలదు. దుశ్యంతునికి శకుంతలకు పుట్టిన సంతానము భరతుడనీ, భరతుడు
పుట్టిన దేశమును భారతదేశమనడము జరిగినదనీ, కొందరు భారతదేశ చరిత్రను చెప్పుచున్నారు. భరతుడు పుట్టకముందు
ఎందరో పుట్టారు. ముందు పుట్టిన వారి పేరును వదలి, వెనుక పుట్టిన భరతుని పేరును ఆధారము చేసుకొని,
భారతదేశమని పేరుపెట్టవలసిన అవసరమేమి వచ్చినదని అడిగితే, దానికి నేటి దేశభక్తులెవరూ సమాధానము చెప్పకున్నారు.
వాస్తవ చరిత్రను తెలిస్తే భరతుడు పుట్టకముందునుండి ఈ దేశమునకు భారతదేశమను పేరు ఉన్నది. పూర్వము
కృతయుగములోనే జ్యోతిష్య శాస్త్రమును అనుసరించి ఆనాటి పెద్దలు భారతదేశమని పేరు పెట్టారు. ఆ పేరు ఈనాటికీ
ఏమాత్రము మార్పుచెందక భారతదేశముగానే ఉన్నది. కొందరికి ఇక్కడొక ప్రశ్నరాగలదు. కొందరు హిందూదేశమంటారు,
కొందరు భారతదేశమంటారు. ఈ రెండు పేర్లలో ఏది అసలైన పేరు అని కొందరడుగవచ్చును. దానికి జవాబు
ఏమనగా! భారతదేశము అనునది ఈ దేశమునకు పెట్టిన పేరు. అయితే హిందూదేశమనునది పెట్టబడిన పేరుకాదు.
ఒక మనిషి పుట్టినప్పుడు పెట్టిన పేరు మొదట నుండి ఉంటుంది. అయితే మధ్యలో కలెక్టర్ ఉద్యోగము వస్తే వాడిని
కొందరు కలెక్టరని చెప్పుచుందురు. అతని పేరు రామక్రిష్ణ అని ముందునుండి ఉన్నా అతనికి కలెక్టర్ ఉద్యోగము
వచ్చిన తర్వాత అతనివద్దకు పోయివచ్చిన వాడు రామక్రిష్ణ దగ్గరకు పోయివచ్చామని చెప్పకుండ కలెక్టర్ దగ్గరకు
పోయి వచ్చామని చెప్పుచుందురు. కలెక్టర్ అనునది రామకృష్ణకు హెూదా అయినా కొన్నిచోట్ల కలెక్టరనీ, కొన్ని చోట్ల
రామక్రిష్ణ అనీ అతను పిలువబడుచున్నాడు. అదే విధముగా భారతదేశము అనునది ఈ దేశమునకు మొదటనే పెట్టిన
పేరుకాగా, హిందూ దేశమనునది పేరుకాదుగానీ భారతదేశమున కున్న బిరుదని తెలియాలి. ఇందూ అనగా జ్ఞానము
అని అర్థము. భారతదేశము దైవజ్ఞానమునకు నిలయమైనది. కావున ఈ దేశమును ఇందూదేశము అని పిలిచెడివారు.
ఇందూ దేశమనునది ఈ దేశమునకున్న బిరుదులాంటిది లేక హెూదాలాంటిది, అంతేగాని దేశమునకు పేరుకాదు.
ప్రపంచ దేశములలోకెల్ల దైవజ్ఞానమునకు నిలయమైన దేశముగా పూర్వము భారతదేశము ఉండుట వలన,
ప్రపంచ దేశములన్నీ భారత దేశమును జ్ఞానులదేశము అని అనెడివారు. జ్ఞానమునకు జ్యోతిష్య శాస్త్రములో చంద్రుడు
అధిపతిగా ఉండుట వలన, జ్ఞానమును ఇందువు అన్నారు. జ్ఞానుల దేశమైన దానివలన భారతదేశమును ఇందూదేశము
(జ్ఞానదేశము) అని చెప్పడము జరిగినది. ఇందూదేశము అనునది దేశము యొక్క పేరుకాదనీ, భారతదేశము యొక్క
ప్రత్యేకతను తెలుపు హెూదా అనీ తెలియుచున్నది. భారతదేశము ఇందూదేశము అని కృతయుగము, త్రేతాయుగము,
ద్వాపరయుగము అను మూడు యుగములనుండి పిలువ బడుచున్నది. అయితే ఇప్పుడు కలియుగములో ఇందు అను
శబ్ధము కాస్త మారిపోయి కొద్ది తేడాతో హిందూ అని పిలువబడుచున్నది. దానితో ఇందూదేశము పోయి హిందూదేశమైనది.
ఇందువు (జ్ఞాని) అనువాడు చివరకు హిందువుగా పిలువబడుచున్నాడు. కొద్ది తేడాతో ఎలా పిలిస్తే ఏమి, పదము
పూర్తిగా మారిపోలేదు కదా! అని కొందరు అడుగవచ్చును. దానికి మేము ఏమి చెప్పుచున్నామనగా! మంత్రముగాని
మాటలేదు, ఔషధముగాని ఆకులేదు అను నానుడి ప్రకారము ప్రతి మాట మంత్రమే అగును. ప్రతి మంత్రమునకు
ఒక మహిమ ఉండును. ఇందు అను శబ్ధము సాధారణ మాటకంటే గొప్పదీ మరియు దైవజ్ఞానమునకు సంబంధించినది.
అందు వలన గొప్పశక్తివంతమైనదని కూడా చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును వ్రాసిన గ్రంథములో ఇందూ జ్ఞానమున్నదని
చెప్పితే ఒక రక సామత్యమూ, హిందూ జ్ఞానమున్నదని చెప్పితే మరియొక రక సామత్యముండును. ఇందూ జ్ఞానము
అని పేరుపెట్టి, స్వచ్ఛమైన ధర్మములతో కూడుకొన్న జ్ఞానముతో వ్రాయబడిన మా రచనలు ఎంతో జ్ఞానశక్తితో కూడుకొన్నవని
ప్రత్యక్షముగా తెలియుచున్నవి. ఇందూ జ్ఞానము శక్తివంతమైనది, అగ్ని కుంపటిలాంటిది అని మేము చెప్పినట్లు,
ధర్మయుక్తమైన మా రచనలలోని ఇందూజ్ఞానము మండుచున్న అగ్నికున్నంత శక్తి కలిగి, ఆ గ్రంథములవద్దకు వచ్చిన
వారికిగానీ, ఆ గ్రంథములను చదువు వారికిగానీ చిన్నచిన్న కర్మలను కాల్చివేయుచున్నవి. మా రచనలలోని కేవలము
48 పేజీల “మంత్రము- మహిమ” అను చిన్న గ్రంథమును చదివిన వారికి కూడా దాని ప్రత్యేకత కనిపిస్తున్నది.
ప్రస్తుతము శరీరములో అనుభవానికి ఉన్న తలనొప్పిగానీ, కడుపునొప్పిగానీ, తేలు విషము నొప్పిగానీ ఉన్న ఎవరైనా
ఆ చిన్న గ్రంథము ను నొప్పివున్న శరీర భాగము మీద పెట్టితే నొప్పిలేకుండ పోవడము వలన ఆ కర్మ గ్రంథములోని
జ్ఞానశక్తికి కాలిపోయిందని నిరూపణకు వస్తున్నది.
ఈ విధముగా ఇందూజ్ఞానము (దైవజ్ఞానము) ఏ మత గ్రంథములో నున్నా దానికి శక్తి ఉండును. అయితే
అన్ని మత గ్రంథములలో నిరూపణకు అటువంటి శక్తి కనిపించడము లేదే అని కొందరడుగవచ్చును. దానికి జవాబు
ఏమనగా! ఉదాహరణగా చెప్పుకొంటే మూడు మతములకు మూడు మూల గ్రంథములున్నవి కదా! వాటిలో స్వచ్ఛమైన
ఇందూధర్మములే (దైవ ధర్మములే) ఉన్నవి. మూల గ్రంథములలో భగవద్గీత గొప్పశక్తివంతము అయినది. అయితే
మనుషులచేత వివరించబడినపుడు దానిలోని ధర్మములు మూసివేయబడినాయి. భగవద్గీతలో దేవుడు చెప్పినది
ఉన్నదున్నట్లు చెప్పకుండ దేవుడు ఒక భావమును చెప్పివుంటే, వ్రాసిన మనుషులు మరొక భావమును ప్రకటించి వ్రాస్తే,
అక్కడ దేవుని భావము లేకుండ పోవుచున్నది. ఇందూ భావము మనిషి వరకు చేరకుండ పోవుచున్నది. అటువంటపుడు
దానిలోని జ్ఞానశక్తి (జ్ఞానాగ్ని) ఆరిపోవుచున్నది. దేవుడు ధర్మరూపములో ఉంచిన అగ్నిని మనుషుల భావములతో
కప్పివేసినట్లగుట వలన, భగవద్గీత లోని శక్తి బయటికి తెలియకుండా పోవుచున్నది. భగవద్గీతలో సరియైన భావములనే
ఎవరైనా వివరించి, దానిముందర హిందూ గ్రంథమని పేరుపెట్టినా, అందులోని శక్తి మాయమైపోవును. హిందూ
అని వ్రాయకుండ ఇందూ గ్రంథము అని వ్రాస్తే, భగవద్గీత గ్రంథములోని శక్తి ప్రకాశించునని తెలియవలెను. ఎంతో
బలమైనవాడు వాని గొంతుకు వాడే, తాడు తగిలించు కొని ఊపిరాడక చచ్చాడన్నట్లు, ఎంతో శక్తివంతమైన భగవద్గీతను
అదే పనిగా హిందూగ్రంథమని గొప్పగ చెప్పుకొనుచున్నారు. మతమునకు తగిలించుకొనిన హిందూ అను పదమును
భగవద్గీతకు కూడా తగిలించడము వలన, గీత కూడ మనిషి చర్యకు శక్తిహీనమైపోవుచున్నది. మేము చెప్పు మాటలు
యదార్థ సత్యము అనుటకు తార్కాణముగా మాచే రచింపబడిన “మంత్రము-మహిమ”, “సత్యాన్వేషి”, “దయ్యాల-భూతాల
యదార్థ సంఘటనలు”, “త్రైతసిద్ధాంత భగవద్గీత” మొదలగు గ్రంథములలోని జ్ఞానశక్తి ప్రత్యక్షముగ అనుభవరీత్యా
కనిపిస్తున్నది. అంతేకాక ఇందూధర్మముల సారాంశమున్న మా రచనలలోని రాబోవు గ్రంథములందు కూడా ఇందూ
అగ్ని (జ్ఞానాగ్ని) ప్రత్యక్షముగా నిరూపణకు రాగలదని తెలుపుచున్నాను. మూలగ్రంథములన్నిటిలో దైవశక్తి ఉండినప్పటికీ
మానవుడు తన భావము లను వ్రాసి దానిలోని శక్తిని లేకుండా చేయుచున్నాడు. బైబిలు గ్రంథమును తీసుకొని చూస్తే
దానిలో మనుషుల వివరముండకపోవడము వలన కొంత శక్తి దానియందు కనిపిస్తున్నది. బైబిలును చూస్తే దయ్యములు
భయపడడము కొంత నిరూపణే కదా!
మనిషి అనుభవిస్తున్న కర్మను (బాధను లేక రోగమును మూడు రకములుగ లేకుండ చేయవచ్చును. కర్మ
లేకుండా పోవాలి అంటే రెండే మార్గములు కలవు. ఒకటి అనుభవించి లేకుండ చేసుకోవాలి. రెండు ఇందూశక్తితో
కర్మను కాల్చివేయాలి. ఈ రెండు విధానముల ద్వారా కర్మలేకుండ పోగలదు. చాలామంది కర్మ వారి అనుభవము
ద్వారానే అయిపోవుచున్నది. కొందరి కర్మమాత్రము జ్ఞానశక్తి (ఇందూశక్తి) ద్వారా కాలిపోవుచున్నది. అలా కాలిపోవుట
మూడు విధములుగా కలదని “దయ్యాల భూతాల యదార్థ సంఘటనలు" అను గ్రంథములో కూడా చెప్పుకొన్నాము.
అనుభవములోనున్న కర్మను ఔషధము ద్వారా, మంత్రము ద్వారా, మాట ద్వారా లేకుండ చేయవచ్చునని చెప్పాము.
మాట అనగా దైవజ్ఞానముతో కూడుకొన్న మాట అని అర్థము. మంత్రము అనగా త్రైతముగానున్న దైవశక్తితో
యోగులు తయారు చేసిన వాక్యము అని అర్థము. ఔషధము అనగా అన్నిటికి మూలశక్తిగానున్న దైవశక్తి గల మూలికలతో
తయారు చేయబడిన మందు అని అర్థము. మందు, మంత్రము, మాట మూడు దైవశక్తితో కూడుకొన్నవేననీ,
వాటివలన కర్మ నిర్మూలింపబడు చున్నదనీ ప్రత్యక్షముగా తెలియుచున్నది. కొందరికి మందు ద్వారా రోగము నయమగు
విషయము మాత్రము తెలుసు. మంత్రము, మాట వలన రోగము పోవునని తెలియదు. మంత్రమును తయారు
చేయువారు యోగులే. అలాగే మాటను చెప్పువారు కూడా యోగులే. యోగి ఎంత ఇందుత్వమును కలిగియుంటే
అతని మాట, మంత్రము అంత గొప్పగ పనిచేయును. యోగి అంటే ఇతర దేవతల ఆరాధనలను వదలి, అసలైన
పరమాత్మను ఒక్కనిని ఆరాధించువాడు నిజమైన యోగి అగునని గీతయందు చెప్పబడినది. పరమాత్మను ఒక్కనిని
ఆరాధించడము అంటే దేవుని ధర్మములను అనుసరించి నడుచుకొనువాడని అర్థము. దేవుని ధర్మములను ఇందూ
ధర్మములని అనాలి అని చెప్పుకొన్నాము కదా! ఇందూధర్మములను ఆచరించువానియందు దైవశక్తి ఇమిడివుండును.
అటువంటివాడు స్థూలముగా ఏ పదార్థమును ఇచ్చినా అది రోగికి ఔషధముగా పని చేయును. అలాగే అతడు అక్షర
శబ్ధమును కూర్చి చెప్పినది మంత్రమగును. దైవశక్తి గలవాడు ఇచ్చిన మందును ఎవరైనా రోగికి వాడవచ్చును. అలాగే
దైవశక్తి (ఇందూశక్తి) గలవాడు శబ్దములను కూర్చి తయారు చేసిన మంత్రమును కూడా ఎవరైనా రోగికి వాడవచ్చును.
దైవశక్తిగల యోగి మాటను మాత్రము అప్పటికప్పుడు స్వయముగా చెప్పును. మాటను యోగి స్వయముగా చెప్పవలసిందే.
ఎదుటనున్న రోగిని చూచి తనలోని సంకల్పముచేత యోగి చెప్పిన మాటలో దైవశక్తియుండుట వలన, ఆ మాట
రోగిమీద పనిచేసి, వాని కర్మను కాల్చివేసి, వాడు అనుభవిస్తున్న బాధనుండి విముక్తుల్ని చేయును.
దైవశక్తిగల యోగి అనువాడు ఒక మతమునకు పరిమితముకాడు. అన్ని మతములలోను దైవశక్తి
గలవారుండవచ్చును. వేరువేరు మతములలో వేరువేరు పేర్లతో పిలువబడుచుండవచ్చును. ఇందూమతములో మాత్రము
దైవశక్తిగలవానిని యోగి అనడము జరుగుచున్నది. ప్రపంచములో పుణ్యమును అనుభవించువానిని భోగి అంటాము.
పాపమును అనుభవించు వానిని రోగి అంటాము. దీనినిబట్టి పుణ్యము వలన వచ్చు సుఖమును అనుభవించువాడు
భోగి అని తెలియుచున్నది. అలాగే పాపము వలన వచ్చు దుఃఖములను లేక కష్టములను ఏ రూపములోనైనా అనుభవించు
వానిని రోగి అంటాము. రోగి, భోగికి సంబంధించిన పాపపుణ్యములను రెండిటిని అనగా కర్మను లేకుండా చేయగల
ఇందూశక్తిగలవాడు యోగి. కర్మను అనుభవించు వారిని రోగి, భోగి అనియూ, కర్మను నిర్మూలించు వానిని యోగి
అనియు ఇందూ జ్ఞానములో గలదు. తలనొప్పి, కడుపు నొప్పి వచ్చిన వానినే రోగి అనుకోకూడదు. ఆర్థికముగాగానీ,
శారీరకముగా గానీ, అనేక రకముల వచ్చు బాధలన్నిటినీ జ్ఞానరీత్యా రోగములనియే చెప్పవచ్చును. ఉదాహరణకు
చెప్పుకొంటే శ్రీకృష్ణుని కాలములో అతని బాల్య స్నేహితుడు అయిన కుచేలుడు, ఆర్థికముగా వెనుకబడి అనేక బాధలను
అనుభవించుచు పెద్దరోగిగా ఉండెను. అటువంటి రోగి అయిన కుచేలుడు శ్రీకృష్ణునివద్దకు వచ్చి, కుచేలుడు తన
బాధలను కృష్ణునికి చెప్పకున్ననూ, దైవశక్తిగల కృష్ణుని చేతి స్పర్శచేతనే కుచేలుని కర్మ కాలిపోవడము జరిగినది.
తర్వాత కుచేలునికి ఆశ్చర్యముగా బాధలన్నీ తొలగిపోయాయి.
భూమిమీద ప్రజల కొరకు దేవుడు సృష్ట్యాదిలోనే సూర్యుని ద్వార తన ధర్మములతో కూడుకొన్న జ్ఞానమును
అందించాడు. అప్పుడు చెప్పిన జ్ఞానము ఇప్పుడు హిందువులకు భగవద్గీతగానూ, క్రైస్తవులకు బైబిలుగానూ, ముస్లీమ్లకు
ఖురాన్ గ్రంథముగానూ ఉన్నది. నేడు ప్రత్యక్షముగానున్న మూడు మూలగ్రంథములలోను ఆనాడు చెప్పిన జ్ఞానమున్నది.
ఏ మతము లోనున్న వారు ఆ మతములో దేవుని జ్ఞానమును, ధర్మమును తెలియ వచ్చును, తెలిసి ఆచరించవచ్చును.
ఆచరించుట వలన దైవశక్తి మనిషిలో చేరిపోవును. అలా చేరిన శక్తి ఏ మతములోనైనా రోగిమీద పని చేయుచున్నది.
కావున దానిని యోగశక్తి అనీ, దానిని కల్గినవాడు యోగి అనీ చెప్పవచ్చును. ఏ మతములోనైనా రోగి అనువాడుయున్నాడు.
కావున ఏ మతములోనైన యోగి ఉండవచ్చునని చెప్పుచున్నాము. అయితే దురదృష్టవశాత్తు నేటి కాలములో భూమిమీద
యోగులు వెదకినా కనిపించ కుండా పోయారు. పూర్వకాలములోనున్న యోగుల ఉనికి ఇప్పుడు లేకుండ పోవడానికి
కారణమేమి అని చూస్తే, కొంత ఆశ్చర్యమైన విషయము తెలియుచున్నది. సంవత్సరమునకు ఒకమారు పండిన
ధాన్యము సంవత్సర మంతా తినవలసి వస్తున్నది. అయితే సంవత్సరము వరకు నిలువవుంచిన ధాన్యము సంవత్సరము
చివరికంతా పాతబడిపోవును. పాతబడిపోవడము అంటే ధాన్యములోని విలువలు మారకున్నా ధాన్యము లోనికి
పురుగులు వచ్చి చేరును. మొదట నిలువయుంచినది స్వచ్ఛమైన ధాన్యముకాగా, కాలము జరుగుకొలది ఆ ధాన్యములోనికి
రెండు మూడు రకముల పురుగులు చేరి ధాన్యమును కలుషితము చేయును. అప్పుడు ధాన్యమును ఆహారముగా అట్లే
వాడుకోకూడదు. ఎందుకనగా అందులో పురుగులు ఉన్నాయి. ధాన్యమును శుభ్రము చేసి, పురుగులను తీసివేసి
వాడుకోవలసి వున్నది. అట్లు శుభ్రము చేయకుండా ధాన్యమును వాడుకొంటే అది ఆరోగ్యమునివ్వదు. ఉన్న
ఆరోగ్యముకూడా అటువంటి కలుషిత ఆహారము ద్వారా చెడిపోవుటకు అవకాశము గలదు.
కొంతకాలము వరకు నిలువయున్న స్వచ్ఛమైన ధాన్యము ఎలాగ పురుగులు చేరి కలుషితమైనదో, అలాగే
సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన స్వచ్చ మైన జ్ఞానము, కాలము గడచుకొలది కొంత మార్పుచెంది, నేటికి మూల గ్రంథముల
రూపములో ఉన్నది. ఆదిలో దేవుడు చెప్పిన జ్ఞానము మార్పు చెందకుండ అలాగే ఉండినప్పటికీ, కొన్ని అధర్మములు
బియ్యములోనికి పురుగులు చేరినట్లు ధర్మములలోనికి చేరిపోయినవి. కళ్ళకు చూపుండిన వాడు బియ్యములోని
పురుగులను ఏరివేసి, స్వచ్ఛమైన బియ్యమును పురుగుల నుండి విడదీసుకొని తినగలుగును. అదే చూపులేనివాడైతే
పురుగులను గుర్తించలేడు. తనవద్దనున్నవి అన్నీ బియ్యమే అని అనుకొనును. బియ్యము పురుగుల వలన కలుషితమైనాయి
అని అతనికి ఏమాత్రము తెలియ కుండును. ప్రస్తుత కాలములో అన్ని మతముల గ్రంథములలోను దైవ ధర్మములున్నప్పటికీ,
వాటి మధ్యలోనికి అక్కడక్కడ అధర్మములు కూడా చేరిపోయినవని ఆయా గ్రంథములవారు గుర్తించలేకపోవుచున్నారు.
అందుకు కారణము విచక్షణ అను జ్ఞానదృష్టి మనిషికి లేకుండపోవుట వలన, గ్రంథములలోనున్నదంతా స్వచ్ఛమైన
జ్ఞానమే అనుకొంటున్నారు. చూపులేనివాడు నాకు చూపుంది అనుకొనుట వలన, కళ్ళున్నవాడు చెప్పినా వినేస్థితిలో
లేడు. అటువంటి పరిస్థితి అన్ని మతములలో వ్యాపించివున్నది. దానివలన మనిషి దేవుని ధర్మములను స్వచ్ఛముగా
గ్రహించలేక యోగిగా మారలేక ఉన్నాడు. ఎక్కడ చూచినా భోగులు, రోగులు కనిపిస్తున్నారు తప్ప యోగులు కనిపించడము
లేదు.
మనిషి భోగికంటే, రోగికంటే అధికుడైన యోగి అగుటకు ఇందూ ధర్మములను ఆచరించి తీరవలసిందే.
ఇందూధర్మములు హిందూ మతములో ఉన్నాయి, మా మతములో మా మతధర్మములున్నాయని ఎవరైనా అనుకోవచ్చును.
అలాంటివారు ముఖ్యముగా తెలియవలసినదేమనగా! ఏ మతములోనైనా దైవధర్మములున్నాయి. దైవధర్మములను నేరుగా
దైవ ధర్మములని అనకూడదనీ, దానికి ఇందూ అను పదమును ఉపయోగించి ఇందూ ధర్మములని చెప్పాలనీ అనుకొన్నాము.
ఏ మతములోని మనిషికైనా దైవశక్తి చంద్రుని ద్వారానే మనిషిలోనికి చేరాలి. ఔషధములకు శక్తిగానీ, మంత్రమునకు
శక్తిగానీ, మాటకు శక్తిగానీ చంద్రుని నుండే లభించుచున్న దానివలన, ఆధ్యాత్మిక విద్యలో చంద్రునికి సముచిత
స్థానమున్నది. మనిషికి లభించునది దైవశక్తి అయినా, అది చంద్రుని నుండి లభించుట వలన దానిని ఇందూశక్తియనీ,
ఇందూశక్తి ఇందూధర్మములను ఆచరించుట వలన వస్తున్నదని చెప్పుకొన్నాము. అయితే కొందరు హిందువులు
మతరక్షణ అను పేరును తగిలించుకొని, ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞానములేనివారై, ఇందూ అను పదమును
ఒప్పుకోవడములేదు. ఇందూజ్ఞానము అనీ, ఇందూధర్మము అనీ, ఇందువులు అనీ మేము చెప్పితే మీది వేరేమతమని
అంటున్నారు. నేటి హిందువులకు కొందరికి మతము తప్ప జ్ఞానము కనిపించడములేదు. అందువలన నేడు
హిందువులుగానున్నవారు ఇందువులు (జ్ఞానులు) కాలేక పోవుచున్నారు. ఇందు అను పదమునే అర్థము చేసుకోలేకున్నారు.
హిందువులే తమది ఇందూధర్మమని ఒప్పుకోనప్పుడు, ఇతర మతముల వారు ఇందూధర్మమును ఎలా ఒప్పుకొంటారు?
ఇతర మతముల వారు తమ మతమును చెప్పుకోవడములో మునిగి పోయారు తప్ప, తమది కూడా దేవుడు అందించిన
ఇందూజ్ఞానమని అనుకోవడము లేదు. ఈ విధముగా ప్రతి మతములోనున్న ఇందుత్వము మనుషుల చేత గుర్తింపబడడము
లేదు. ప్రతి మతములోను కలుషిత జ్ఞానము మధ్య ఇందుత్వము లోపించడము వలన, ప్రతి మతములోను శక్తిలేని
భక్తులున్నారు తప్ప, శక్తియున్న యోగులు లేకుండా పోయారు. మేము పదేపదే ప్రతి మతములోని వారికి మీ గ్రంథములోని
వాక్యమును సరిగా అర్థము చేసుకొమ్మని చెప్పుచున్నాము. అయితే ప్రతి ఒక్కరూ మతములో మునిగి పోయి దానితోనే
మమ్ములను చూస్తున్నారు తప్ప మా మాటను గ్రహించడము లేదు. ఎవరు ఏమనుకొనినా మేము మాత్రము మతము
మీద ప్రేమ, అసూయ ప్రసక్తి లేకుండా అన్ని మతములకు సమానముగా వర్తించు సూత్రములను చెప్పుచున్నాము.
ప్రతి మతములోని ఇందుత్వమును కాపాడుదాము అని చెప్పుచున్నాము. ఇందుత్వము అనగా మత సంబంధము
కాదు. దేవునికి సంబంధించిన పదముగా జ్ఞప్తిలో పెట్టుకోండి. ప్రతి మతములోని మనిషి దేవునివద్దకు పోవాలనీ,
దానికి కావలసిన ధర్మములను తెలుసుకొమ్మనీ, కలుషితమైన ధర్మమునుండి కలుషితములను తీసివేసి అసలైన ధర్మమును
స్వీకరించమనీ కోరుచున్నాను.
హిందువులు తాము ఏ గ్రంథమును ప్రమాణముగా తీసుకొని ఆధ్యాత్మికములో ముందుకు పోవలెనో పూర్తిగా
తెలియక, కొందరు వేదము లను ప్రమాణముగా తీసుకొంటూ, హిందువులకు వేదములు ముఖ్యమని అంటున్నారు.
కొందరు భగవద్గీత ముఖ్యమని అంటున్నారు. ఎందుకలా రెండు రకములుగా చెప్పుచున్నారని యోచించగా మరియు
విచారించగా ఈ విధముగా తెలియుచున్నది. వేదములను వ్రాసినది వేదవ్యాసుడు. వేద వ్యాసుడు బ్రాహ్మణుడు
అయినందున బ్రాహ్మణవర్గము వారందరూ, తమ బ్రాహ్మణుడు వ్రాసిన వేదము ముఖ్యమని అంటున్నాము. కృష్ణుడు
క్షత్రియు నిగా పుట్టి గొల్లవానిగా బ్రతికినవాడు బ్రాహ్మణుడు కాదు, కావున శూద్రుడు చెప్పిన భగవద్గీత ముఖ్యము
కాదనీ, వ్యాసుడు బ్రాహ్మణుడు అయినందున ఆయన చెప్పినదే బ్రహ్మ జ్ఞానమనీ, అందువలన కృష్ణుని గీతకంటే
వ్యాసుని వేదములు ముఖ్యమనీ, హిందూమతములో ప్రచారము చేయబడినది. హిందూమతములోని జ్ఞానులు కొందరు
భగవద్గీతయే ముఖ్యమని తేల్చి చెప్పడమైనది. ఇప్పటికీ వేదములా, భగవద్గీతయా అను వివాదమును ఎవరూ తేల్చుకోలేక
పోవుచున్నారు. నేను హిందువులకు భగవద్గీతయే ముఖ్యమని చెప్పినా, అందులోనే కలుషిత వాక్యములు కొన్ని
చోటుచేసుకొన్నాయి. అంతేకాకుండా వేదములు, పురాణములు గీతకు పోటీగా ఉన్నాయి. ఈ విధముగా భగవద్గీతలోని
ధర్మములు కల్పిత శ్లోకములు, వేదములు, పురాణములు అను పురుగులలో చిక్కుకొన్న ధాన్యములాగ అయిపోయినవి.
బైబిలు విషయానికి వస్తే ప్రభువు చెప్పినవి నాలుగు సువార్తలే, అయితే అదనముగా 62 సువార్తలుండుట
వలన, అంతయు బైబిలు అను కోవడము వలన, ప్రభువు చెప్పిన నాలుగు పాఠములు గుర్తింపులేనివై పోయాయి.
ఏ
మేము బైబిలులోని 66 పాఠములలో క్రైస్తవులకు ముఖ్యమైనవి, ఇందూధర్మములున్నవి, ప్రభువు చెప్పిన నాలుగు
సువార్తలేనని చెప్పినా, ఏ క్రైస్తవుడూ వినే పరిస్థితిలో లేడు. ప్రభువు చెప్పిన మాటలు ప్రతిదీ శాస్త్రబద్ధముగా ఉండగా,
శాస్త్రబద్ధతలేని ఆదికాండము నుండి బైబిలును చెప్పుచున్నారు. ఆదికాండములో దేవుడు ప్రపంచములోని భూమిని,
ఆకాశమును, సమస్త జీవరాసులను ఆరు రోజులలో సృష్టించాడని చెప్పుచూ మరొకవైపు ఆదామును సృష్టించాడని,
హవ్వ ఆదాము ఎముకనుండి సృష్టించబడినదనీ, ఆదాము హవ్వల నుండి మనుషులు పుట్టుకొచ్చారని చెప్పడము
జరిగినది. అయితే ఆ మాటలను డిగ్రీల చదువులు చదివినవారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందినవారు, మేధావులు
మొదలగు వారందరు అందులో శాస్త్రబద్ధత ఉందా లేదా అని ఏమాత్రము చూడడము లేదు. శాస్త్రబద్ధతయున్న
ప్రభువు మాటలను శాస్త్రబద్ధతలేని 62 పాఠములలోనికి కలిపివేశారు. బైబిలులో ధర్మములు ఏవో, ఎక్కడ ఉన్నవో
తెలియని స్థితిలో వారు ఉన్నారు. కొందరైతే వాటితో (ధర్మములతో పనేమిటి? నిత్యము బైబిలు కొంత చదువుకొని,
వారమునకొకమారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే అంతకంటే మించినదేమీ లేదు అంటున్నారు.
ఇక ఇస్లామ్లోనికి వస్తే ఆ మతమునకు దేవుడు అందించిన పవిత్ర ఖురాన్ గ్రంథముకలదు. ఖురాన్
గ్రంథమును చదివి చూస్తే దానిలో ఎంతటి మేధావులైనా అర్థము చేసుకోగలిగినంత జ్ఞానమున్నది. తక్కువ
మెదడుకల్గినవారు అందులోని జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోలేరు. కొన్నిచోట్ల దేవుడు ఎదురుగా ఉండి
చెప్పినట్లున్నది. ఖురాన్ గ్రంథములో దేవుని ధర్మములు (ఇందూ ధర్మములు) సంపూర్ణముగా ఉండినప్పటికీ, అవి
సూక్ష్మరూపమై (ముతషాభిహాత్ రూపమై) ఉండుటవలన ముస్లీమ్లలో మేము మేధావులము అనువారు కూడా వాటి
లోతు భావములను అర్థము చేసుకోలేరేమో అనిపిస్తున్నది. అంతగొప్ప ఖురాన్ గ్రంథమున్నా, అది దేవుడు అందించిన
అంతిమ గ్రంథమని వారే చెప్పుకొనుచూ, తర్వాత రెండువందల సంవత్సరముల తర్వాత ఇస్లామ్ పండితులైన మనుషులు
వ్రాసిన హదీసు గ్రంథములను ముస్లీమ్లు ఖురాన్కు జోడించుకొని చదవడము జరుగుచున్నది. వెనుక వచ్చిన తరము
వారంతా ఖురాన్ గ్రంథముతో పాటు హదీసు గ్రంథమును సమానముగా గౌరవిస్తున్నారు. దానివలన అంతిమ
గ్రంథము అను విలువ, ముందు తయారైన ఖురాను ఇవ్వాలో లేక రెండు వందల సంవత్సరముల తర్వాత జిబ్రాయిలు
దూత చెప్పని హదీసు గ్రంథమునకు ఇవ్వాలో అర్థముకాక కొందరు అంతిమ గ్రంథము ఖురాన్ ఉన్నప్పుడు హదీసు
గ్రంథమును ఎందుకు చదవాలి అని మమ్ములను అడిగిన వారు కూడా కలరు. మేమైతే సంపూర్ణ ధర్మములున్న ఖురాన్
గ్రంథమునకే ఎక్కువ విలువను ఇవ్వమన్నాము. కొందరైతే ఖురాన్ గ్రంథముకంటే హదీసులే ముఖ్యమంటున్నారు.
అందువలన మగవారు ఎక్కువ హదీసు గ్రంథములను చదువుచున్నారు. ఆడవారికయితే ఖురాన్ గ్రంథమును ఇస్తున్నారు.
ఖురాన్ గ్రంథము చదివిన అమ్మాయినే పెళ్ళాడమని కొందరంటున్నారు. పెళ్ళి కాకముందు యువకులు ఖురాన్
చదువవలెనని అనుకోవడము లేదు. దీనినిబట్టి పెళ్ళికాకముందే మగవారికంటే ఆడవారే ఖురాన్ చదువగలుగుచున్నారు.
అయినా అందులోని ఆయత్ల వివరము వారికి తెలియడము లేదు. ఖురాన్ గ్రంథములోని ధర్మములు పూర్తి వివరముగా
తెలియకున్నా, ముస్లీమ్లందరు దేవునిమీద విశ్వాసముతో నిత్యము నమాజ్ (ప్రార్థన చేయుచున్నారు. ముస్లీమ్లను
ప్రార్థనవరకే పరిమితి చేసిన ముస్లీమ్ పెద్దలు, ఖురాన్ గ్రంథములోని మూల ధర్మములను తాము తెలుసుకొని,
మిగతా వారికి తెలిపియుంటే ఎంతో బాగుండేది. కొందరు పెద్దలు మాకు తెలుసు అను భావములో ఉండిన దానివలన,
తెలియని రహస్యములు ఖురాన్లో ఎన్నో మిగిలి ఉన్నాయి.
ఈ విధముగా అన్ని మతములలోని మూలగ్రంథములకు పోటీగా ఆ మతములోనే ప్రక్క గ్రంథములుండుట
వలన, అందరూ మూల గ్రంథముల మీద పూర్తి దృష్టినుంచలేకపోవుచున్నారు. దానివలన గ్రంథములో దేవుడు
నిగూఢముగా అందించిన ధర్మములు తెలియకుండా పోవుచున్నవి. అలా తెలియకపోవడము వలన అన్ని మతములలో
దేవుడు చెప్పినది ఒకే ధర్మమనీ తెలియక, వేరువేరు మతములకు, వేరువేరు ధర్మములను, వేరువేరు దేవుళ్ళు
చెప్పారనుకొన్నారు. అందువలన ఇందూశక్తి (దైవశక్తి) ఎవరిలోనూ లేకుండ పోయినది. ఆ శక్తి లేనిది ఎవడూ యోగి
కాలేడు. ఏ రోగినీ ఆదరించలేడు. ఏ మతములోని యోగికైనా దైవశక్తి చంద్రగ్రహమునుండే రావాలి అని గుర్తుపెట్టుకోండి.
అటువంటి శక్తిని చంద్రశక్తి లేక ఇందూశక్తి అంటున్నాము. ఇందూశక్తి రావాలంటే ఏ మతస్థునికైనా వారి మూల
గ్రంథములోని ధర్మములు తెలిసి, వాటి ప్రకారము ఆచరించగలగాలి. అప్పుడే ఏ మనిషైనా యోగి కాగలడు. అయితే
యోగులు కనిపించడమే అరుదై పోయిందని ముందే చెప్పుకొన్నాము. మేము గొప్పవారము అనుకొన్న వారికి కనీసము
మా గ్రంథములలో, ఒక చిన్న గ్రంథమునకున్న శక్తి కూడా లేకుండా పోయినది. ఒక గ్రంథము రోగి దగ్గరకు పోతే
అది ప్రత్యక్షముగా చేసిన మేలును కూడా మనిషి జ్ఞానియై యోగశక్తి కలిగి రోగికి మేలు చేయలేక పోవుచున్నాడు.
సృష్ట్యాదిలో మనుషులకు జ్ఞానమును తెలుపు నిమిత్తము దేవుడు ఆకాశములోని సూర్యగ్రహమునకు తన
ధర్మములను జ్ఞానరూపముగా తెలియజేశాడు. దేవుని నుండి మొదట జ్ఞానమును అందుకున్న ఘనత సూర్యునికే
దక్కినది. తర్వాత సూర్యుడు భూమిమీద గల భారతదేశములోని మనువు అను మహర్షికి దేవుని జ్ఞానమును తెలిపాడు.
మనువు సూర్య వంశము రాజైన ఇక్ష్వాకుడు అను దక్షిణ దేశములోనున్న రాజుకు తెలిపాడు. ఈ విధముగా ప్రపంచములో
మొదట భారతదేశమునకూ, తర్వాత అందులోని దక్షిణ దేశమునకూ దేవుని జ్ఞానము ప్రాకినది. ఇక్ష్వాకుడు ఇతర
రాజులకు తెలియజేయగా, వారు తమతమ ప్రజలకు తెలియజేయగా, జ్ఞానము భూమండలములోని అన్ని దేశములకు
ప్రాకినది. కృతయుగము లోనే జ్ఞానము ప్రపంచవ్యాప్తముగా తెలిసిపోయినది. అప్పటికాలములో నేడు ప్రత్యేక
దేశముగానున్న లంక భూభాగము భారతదేశముతో కలిసి వుండేది. భారత దేశముతో కలిసి భారతదేశములో భాగమైనా,
చుట్టూ నీరుండుట వలన అప్పటికే లంక అను పేరుండేది. దక్షిణ భారతదేశమైన లంకలో ఇక్ష్వాకుడుండుట వలన,
లంకలో రాజయిన ఇక్ష్వాకునికి దేవుని జ్ఞానము తెలియుట వలన, మనువు కూడా లంకలో ఇక్ష్వాకుని సంరక్షణలో
ఉండుట వలన, మొదట భూమిమీద దేవుని జ్ఞానము చేరిన భూమి లంక. కావున లంకకు 'శ్రీ' అని గౌరవశబ్ధమును
చేర్చడము జరిగినది. అప్పటి నుండి లంక శ్రీలంకగా మారిపోయింది. ప్రపంచములోకెల్ల మొదట జ్ఞానము కల్గిన
దేశము శ్రీలంకయని మేము చెప్పువరకు ఎవరికీ దాని విషయము తెలియదు. ఏ దేశమునకు లేని శ్రీ, లంకకు
ఒక్కదానికే ఎందుకున్నదో ఎవరికీ తెలియదు.
ఆ విధముగా జ్ఞానచరిత్ర ప్రారంభమైన శ్రీలంకలో ప్రపంచములో కెల్ల గొప్ప జ్ఞాని, గొప్ప యోగి అయిన
రావణబ్రహ్మ పుట్టాడు. ఆయన పుట్టకముందే ఆయన వచ్చిన యుగము పేరు త్రేతాయుగముగా పెద్దలు పెట్టారు.
రావణబ్రహ్మ వచ్చిన తర్వాత త్రేతాయుగమును అనుసరించి దేవుడు సూర్యుని ద్వారా తెలిపిన మూడు ఆత్మల జ్ఞానమును
తెలియగలిగాడు. మూడు ఆత్మల త్రైత జ్ఞానమును తెలియుట వలన, ఆయన ఆ కాలములోనే త్రికాల జ్ఞానిగా
పేరుకాంచాడు. త్రికాల జ్ఞాని అనగా మూడు ఆత్మల జ్ఞానము తెలిసినవాడని అర్థము. త్రేతాయుగములో రావణబ్రహ్మ
పుట్టి తాను తెలుసుకొన్న జ్ఞానమును అన్ని దేశముల వారికీ వివరముగా తెలియు నట్లు చేశాడు. ఆయన తెలుసుకొన్న
జ్ఞానములో స్వచ్ఛమైన ఇందూ ధర్మములుండుట వలన ఆయన గొప్ప ఇందూశక్తిగల (దైవశక్తిగల) యోగిగా మారాడు.
యోగి మంత్రమును మూడు భాగములుగా సృష్టించగలడని “మంత్రము-మహిమ" గ్రంథములో చెప్పుకొన్నట్లు, ఆయన
యోగశక్తిని మంత్రశక్తిగా మార్చి, పుష్పక విమానమును తయారు చేసి, దానియందు అన్ని దేశములకు ప్రయాణించగలిగాడు.
ఈ విధముగా దైవజ్ఞాని అయిన రావణబ్రహ్మ ప్రపంచవ్యాప్తముగా జ్ఞానమును తెలియజేయగలిగాడు. దేవుడు చెప్పిన
మూడు ధర్మములను, నాలుగు అధర్మములను ఆనాడే బాగా తెలిసిన వ్యక్తి రావణబ్రహ్మ. అధర్మములలో, యజ్ఞములు
చేయుట ఒక అధర్మముగా ఉండుట వలన, యజ్ఞములను పూర్తి వ్యతిరేఖించెడివాడు. భారతదేశములో యజ్ఞములను
చేయువారిని దండించి వారు చేయు యజ్ఞములను భంగము చేసినట్లు చరిత్ర కలదు. త్రేతాయుగములో రావణబ్రహ్మ
త్రైతజ్ఞానమును త్రికాల జ్ఞానిగా ప్రచారము చేసి పోయాడు. ఆయన పోయిన తర్వాత కాలక్రమేపి తిరిగి అజ్ఞానము
చోటు చేసుకొంటూ వచ్చింది. త్రేతాయుగము మారిన అజ్ఞానము వలన త్రేతాయుగముగా మార్పు చెందినది. నేడు
అందరి దృష్ఠిలో త్రేతాయుగముగా కాకుండ త్రేతాయుగముగా మిగిలి పోయినది.
కృతయుగములో ఇక్ష్వాకుడు అను రాజుతో మొదలైన జ్ఞానము దేశవ్యాప్తముగా కాకుండా ప్రపంచవ్యాప్తముగా
ప్రాకిపోయినది. తర్వాత త్రేతాయుగమున రావణబ్రహ్మ ఇందూధర్మములను ప్రపంచ వ్యాప్తముగా ప్రచారము చేశాడు.
అప్పుడు ఆయననుమించిన యోగి ఎవరూ లేరు. తాను తెలుసుకొనిన ఇందూధర్మములకు ఆనవాళ్ళుగా లంకకు
ఆనుకొని లంక క్రిందివైపువున్న సముద్రమునకు ఇందూమహాసముద్రమని నామ కరణము చేశాడు. నా మాట
నిజమనుటకు ఒక ఆధారము కలదు. ప్రపంచ వ్యాప్తముగానున్న సముద్రమును ఐదు భాగములుగా విభజించి పేర్లు
పెట్టడము జరిగినది. అందులో 1) పసిఫిక్ మహాసముద్రము 2) అట్లాంటిక్ మహాసముద్రము 3) అంటార్కిటిక్
మహాసముద్రము 4) అర్కిటిక్ మహా సముద్రము 5) ఇందూ మహాసముద్రము అని అంటాము. ఇందూ మహాసముద్రమునే
ఇండియన్ ఓషన్ అని ఆంగ్లభాషలో అనడము జరిగినది. ఈ ఐదు సముద్రములలో ఒకే ఒక సముద్రమునకు దేవుని
ధర్మముల పేరు పెట్టబడినది. అదియే రావణబ్రహ్మ పెట్టిన పేరు ఇందూమహా సముద్రము. ఇందూ అను పదమును
ఇంగ్లీషుభాషలో ఇండియా అని చెప్పడము జరిగినది. తెలిసిన పెద్దలు గతించిపోగా, అజ్ఞానము మనుషులను
ఆవహించిరాగా, త్రేతాయుగము త్రేతాయుగముగా మారిపోయినది. అట్లే ఇందూ మహాసముద్రము పేరు హిందూ
మహాసముద్రముగా మారిపోయి నది. ఒక్క ఇందూ మహాసముద్రమునకు తప్ప ఏ సముద్రమునకు దేశము పేరు
లేదు. పూర్వము ఇందువులు (జ్ఞానులు) గల దేశమని ప్రపంచ దేశములలో భారతదేశము పేరుగాంచగా నేడు ఆ పేరు
హిందూదేశమని అర్థములేని పేరైనది. ఆనాడు భారతదేశములో ఒక భాగముగానున్న లంక పుణ్యాన భారతదేశమునకు
ఇందూదేశమని పేరు వచ్చినది. అంతేకాక రావణబ్రహ్మ పుణ్యాన మనకు క్రిందివైపున దక్షిణ దిక్కునవున్న సముద్రము
నకు ఇందూమహాసముద్రము అని పేరువస్తే, దానిని కూడా విలువ తెలియకుండా హిందూమహాసముద్రమని
పిలుచుకోవడము ఎంత అజ్ఞానమో ఎవరికీ అర్థముకాలేదు. సింధూనది ద్వారా హిందూ అను పేరు వచ్చిందను
వారు ఏ సముద్రమునకూ దేశము పేరు రానప్పుడు, లంకుకు ఆనుకొని వున్న సముద్రమునకు దేశము పేరు ఎట్లు
వచ్చిందని ఆలోచించారా?
ప్రపంచవ్యాప్తముగా ఇందూదేశమని పేరుగాంచినది ఈనాడు కాదు ముందు యుగములలోనే జరిగినది. ఆనాడు
ఈనాడు మనది భారతదేశమే. అయితే ఇందూ (జ్ఞాని) అనునది ఈ దేశమునకు వచ్చిన బిరుదు లేక బహుమతియని
చెప్పవచ్చును. ఇందూ అనునది దేశము పేరుకాదు. ఇది ఎప్పటికీ భారతదేశమే. అయితే ఒకప్పుడు ఇందూదేశము,
ఇప్పుడు హిందూ దేశము. ప్రపంచదేశములలో ఏ దేశమునకూలేని ఔషధ, మంత్ర, మాట (శాపము) శక్తులు ఈ
దేశములో ఉండేవి. ప్రపంచ దేశములలోకెల్ల జ్ఞానశక్తి గల దేశము ఇది ఒక్కటే. త్రికాల జ్ఞాని అయిన రావణబ్రహ్మ
సముద్రమునకు జ్ఞాన చిహ్నముగా 'ఇందు' అని పేరు పెట్టి, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మశక్తిని
ఇందూసముద్రములోనే ఉండునట్లు చేశాడు. చివరకు దేశము పేరు మార్చి హిందూ చేసి, సముద్రము పేరును హిందూ
చేయడముతో ఆ రావణబ్రహ్మ ఆత్మశక్తి ఈ సముద్రమునే వదలి పోయి, అమెరికా దగ్గరున్న అట్లాంటిక్ మహాసముద్రములో
చేరి పోయినది. ఆనాడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను త్రైతజ్ఞానమును తెలిసిన రావణబ్రహ్మ ఆత్మశక్తి అదే
త్రైతసిద్ధాంతమునకు గుర్తుగా సముద్రమునందు మూడు కోణముల శక్తిగా వ్యాపించి నేడు బెర్ముడా ట్రైయాంగిల్గా
పేరుగాంచినది. అలా మూడు ఆత్మలకు గుర్తుగా మూడు కోణములుగా వ్యాపించిన ఆత్మశక్తి, మనుషుల అజ్ఞానము
మీద కోపముగలదై, తన పరిసర ప్రాంతములోనికి పోయినవారందరినీ ప్రమాదమునకు గురి చేయుచున్నది. కొందరిని
దైవజ్ఞానము తెలుసుకొనుటకు ఇతర గ్రహముల మీదికి పంపుచున్నది.
సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే ధర్మ సంస్థాపనార్థము వచ్చిన భగవంతుడు ద్వాపరయుగము చివరలో భగవద్గీత
ద్వార బోధించిపోయాడు. భగవద్గీతలో దేవుడు తన ధర్మములను తెలియజేశాడు. అవియే ఇందూ ధర్మములు.
గీతలో చెప్పిన మూడు ధర్మములు మనిషియొక్క కర్మను లేకుండ చేసి మోక్షమును కల్పించుటకు నిర్ణయించబడినవి.
గీత యందు బోధించిన ధర్మముల ఆచరణలను యోగములని అంటున్నాము. మూడు ధర్మముల ఆచరణలు మూడు
యోగములుగా ఉన్నవి. అవి వరుసగా కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తియోగముగా చెప్పబడినవి. కర్మ యోగమును
రాజయోగమనీ, బ్రహ్మయోగమును జ్ఞాన యోగమనీ చెప్పడము కూడా జరిగినది. ఇకపోతే ప్రత్యేకమైనది భక్తియోగము.
భగవద్గీతలో మూడు ఇందూ ధర్మములు ఉన్నవి. బైబిలు గ్రంథములోనికి పోయి చూస్తే గీతలో చెప్పిన మూడు
ధర్మములు కలవు. ఖురాన్ గ్రంథము లోనికి పోయి చూస్తే రెండు ధర్మములు కనిపిస్తున్నవి. బ్రహ్మయోగ ధర్మము
కనిపించడము లేదు. ఏ మతములోనైనా దేవుడు చెప్పిన ఒక్క ధర్మముండినా దానిద్వారా దేవున్ని చేరవచ్చును,
జన్మలను జయించవచ్చును. కొన్ని మతములలో ఒకే ఒక భక్తియోగము కనిపించుచున్నది. మరికొన్ని మతములలో
మూడు ధర్మములలో ఒక ధర్మము కూడా లేకుండా పోయినది. అటువంటి ధర్మములు దేవుని అనుమతి లేకుండ,
మనుషులు తమ స్వార్థము కొరకు తయారు చేసినవిగా కనిపించుచున్నవి. అటువంటి మతములలో అధర్మములు
మాత్రము కొదువ లేకుండా ఉండును. వాటివలన మనిషికి ఏ కర్మా పోదు. జన్మరాహిత్యము కాదు.
మనిషికి ధర్మములతో ఏమి అవసరము అని ప్రశ్నించుకొని చూస్తే ముందు ధర్మములు వాటి విలువ తెలిస్తే
కదా! వాటి అవసరము దేనికని తెలిసేది? సరే వాటి అవసరము మనకు తెలుసు, కావున మనము చెప్పు కొందాము.
ఒక మనిషి జనన మరణ చక్రములో చిక్కుకొని పోయి చస్తూ, పుట్టుచూ ప్రతి జన్మలోను స్వర్గ సుఖములను, నరక
బాధలను అనుభవిస్తూ కాలము గడుపుచున్నాడు. అటువంటి పని లేకుండుటకు కర్మలు అనుభవించకుండ, చావకుండ,
పుట్టకుండ మోక్షమును పొంది ప్రపంచము నకే అధిపతియైన దేవునియందు చేరిపోవుటకు దేవుని ధర్మములైన ఇందూ
ధర్మములు అవసరము. వాటిలో ఒకదాని ద్వారానైనా కర్మలను లేకుండ చేయు యోగిగా మారిపోయి, కర్మలన్నీ
లేకుండ పోయినప్పుడు దైవములోనికి కలిసిపోవచ్చును. దేవునిలోనికి కలిసిపోయిన తర్వాత, నీవు వేరు దేవుడు వేరు
అనునది ఉండదు. ఇద్దరూ ఒకటైపోయి ఉండుట వలన దేవుడు సృష్టికంత అధిపతిగా ఉన్నాడు కనుక నీవు కూడా అదే
హెూదాలో ఉండగలవు. ఐదు సంవత్సరములు మంత్రిగా ఉండి, మంత్రి హెూదాను అనుభవించుటకు రాజకీయములో
ఎంతో తాపత్రయపడిపోవు మనిషి, ప్రపంచమునకే పెద్దగా శాశ్వితముగా ఉండు హెూదా కొరకు ఏమాత్రము
ప్రాకులాడడములేదు. ఐదు సంవత్సరములు కూడా గ్యారంటీలేని పదవి కొరకు ప్రాకులాడు మనిషి, శాశ్వితముగా
దైవముగా, ప్రపంచమునకు అధిపతిగా ఉండు హెూదా కొరకు ఎందుకు ప్రాకులాడడము లేదు అనగా! దేవుని
ధర్మముల వలననే దేవునిగా మారవచ్చని, శాశ్వితముగా విశ్వమునకే అధిపతిగా ఉండవచ్చునను సమాచారము ఏమాత్రము
మనిషికి తెలియదు. కావున దానికొరకు ఎవరూ ప్రయత్నము కూడా చేయడము లేదు. మనిషికి దైవత్వము యొక్క
విషయమే తెలియకుండపోయినది. భక్తి, జ్ఞానము, దేవుడు అని ఎవరైనా అంటున్నాడంటే వానిని మాయ తన
పరిధిలోనుండి దాటకుండ పెట్టుకొంటుంది. నిజమైన జ్ఞానముమీద, దైవము మీద ఆసక్తి, శ్రద్ధయున్న వానిని మాత్రము
మాయ తన ఆధీనమునుండి వదలి దేవునివైపు పంపును. నిజమైన శ్రద్ధలేకుండ పెద్దరికము కొరకో, గౌరవము కొరకో
దేవుడు, జ్ఞానము అనువాడు మాయప్రభావము చేత మతము వలలో చిక్కుకొని, మతము కొరకే ప్రాకులాడుచుండును
తప్ప దేవునికొరకు ప్రయత్నించడు. మతము అను పేరుతో ముందుకు పోవువాడు నేను చేయుచున్నది సరియైన
పనియేనా? అని ఏమాత్రము వెను తిరిగి చూచు కోవడము లేదు. అందువలన ఇందూధర్మములని వింటూనే హిందువుగా
ఉండువారు కూడా ఇదేదో క్రొత్త మతమని అంటున్నారు. ఇందుత్వము అంటే దైవత్వమని తెలియక, మతము మాయలో
కూరుకు పోవుచున్నారు. ఇప్పటినుండైన దేవుని మీద శ్రద్ధ కలిగి ఏ మతములోనున్నవాడైనా, ఇందుత్వమును తెలుసుకొని
ఇందువుగా బ్రతికితే, చనిపోయిన తర్వాత ఇందుత్వములోనికి (దైవత్వములోనికి) చేరి పోగలడు. గ్రహించుకొనువారికి
ఇంతకంటే ఎక్కువ చెప్పలేము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.