స్వర్గము ఇంద్ర లోకమా! నరకము యమ రాజ్యమా!! cloud text 1st oct 24 Updated single line
స్వర్గము ఇంద్ర లోకమా! నరకము యమ రాజ్యమా!!
స్వర్గము అను పేరు విననివారుండరని చెప్పవచ్చును. ఎందుకనగా! ప్రతి మతములోనూ, వారి మత గ్రంథములలోనూ స్వర్గమును గురించి ఎంతో చెప్పడము జరిగినది. అంతేకాక ప్రతి బోధకుడూ, ప్రతి స్వామీజీ స్వర్గమును గురించి చెప్పడము జరుగుచున్నది. మూల గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో స్వర్గము మరియు నరకము అని రెండు పేర్లు ఉండడము వాస్తవమే అయినా, అక్కడ స్వర్గమును గురించి, నరకమును గురించి ఏమి సమాచారమును చెప్పారో తెలియక, అక్కడ చెప్పినదానిని గ్రహించక, గ్రంథములలో చెప్పిన దానికంటే భిన్నముగా వ్రాసుకోవడము జరిగినది. ఒకరు వ్రాసిన విషయమును పది మంది చదివి వారు మరికొంత తప్పుగా అర్థము చేసుకోవడము జరుగుచున్నది. ఇట్లు వాస్తవ విషయము మరుగున పడిపోయి క్రొత్త విషయము అందరి తలలో చేరిపోయినది.
గ్రంథములలో చెప్పిన విషయమును వదలి తప్పు సమాచారమును ఎలా అర్థము చేసుకొనుచున్నారో ఉదాహరణగా ఒక విషయమును తీసుకొని చూస్తాము. వెంకయ్య అనువాడు ఉన్న ఊరు ఏది అని వ్రాయబడి ఉన్నదనుకొనుము. అప్పుడు దానిని చదివినవారందరూ వెంకయ్య అను వ్యక్తి ఉండు ఊరు ఏదోయనీ, అతని ఊరు పేరు తెలియదనీ చెప్పడము జరుగుచున్నది. అందరూ ఆ విధముగా అనుకొనుటకు అవకాశము గలదు. అయితే వెంకయ్య అనువాడు ఉన్న ఊరు పేరే “ఏది” అయినప్పుడు “ఏది” అనుమాట ఊరి పేరని ఎంతమంది గ్రహించగలరు? “ఏది” అనునది ఒక పేరని అర్థము చేసుకోక, చెప్పేవాడు కూడా ఊరుపేరు తెలియక అడుగుతున్నాడనుకుంటే, వెంకయ్య నివసించు ఊరుపేరు “ఏది” అనునదేనని తెలియకుండా పోవును. 'ఏది' అను శబ్దము ఒక ఊరు పేరని గ్రహించనివారు, అది యొక ప్రశ్నయని అనుకోవడము జరుగు చున్నది. వెంకయ్య ఊరు ఏది? అని ప్రశ్నగా అర్థము చేసుకొన్నప్పుడు, ‘ఏది’ అను పేరుగల ఊరే వెంకయ్యదని ఎవరూ అనుకొనుటకు ఎలా అవకాశము లేదో, అలాగే స్వర్గము అనుమాటకు అర్థము తెలియకపోతే, స్వర్గమనుదానిని అందరూ వేరే లోకముగానో, వేరే దేశముగానో అర్థము చేసుకొను అవకాశము గలదు. స్వర్గము అను విషయములో కూడా అవగాహనా లోపము వలన అందరూ స్వర్గమును వేరే లోకమను కొంటున్నారు. అలాగే నరకమును కూడా వేరే లోకమని చెప్పుకోవడము జరుగుచున్నది.
‘ఏది’ అనుమాట ప్రశ్నించబడు ప్రశ్నయని తెలిసినప్పుడు, దానిని జవాబుగా ఎవరూ లెక్కించరు. అట్లే స్వర్గము, నరకము కనిపించని వేరే లోకములని అర్థము చేసుకొన్నప్పుడు, వాటిని కనిపించే లోకములని ఎవరూ గుర్తించరు. స్వర్గము అంటే వాస్తవము ఏమిటి? నరకము అంటే సత్యము ఏమిటి? అని గ్రహించనివారు ఆ రెండిటినీ ఇతర లోకములుగా అర్థము చేసుకొన్నారు. తప్పుగా అర్థము చేసుకోవడము వలన కొందరు తమ జీవితములనే వ్యర్థము చేసుకొంటున్నారు. స్వర్గానికి పోతే దేవునివద్దకే పోయినట్లు భ్రమించువారు, స్వర్గము కొరకు ప్రాకులాడుచూ తప్పు దారిపట్టిపోయి, మేము మంచి దారిలో ప్రయాణిస్తున్నామని అనుకొని, జీవితమునే నరక భూయిష్టము చేసుకొంటున్నారు. ఆ విధముగా ఎందరో తమ జీవితమును పూలబాటగా పోల్చుకొని, ముళ్ళబాటలో నడుచుచున్నారు. దానికి తార్కాణముగా
జూలై 30వ తేదీ 2014న టీవీ9లో వచ్చిన వార్తను, అందులో వచ్చిన ఉత్తరమును చూస్తే కొందరు ఏ విధముగా తప్పుడు అవగాహనలో పడిపోవుచున్నారో తెలియగలదు.
కొంతమంది ‘జీహాద్' పేరిట టెర్రర్ బాట .
నేను ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళుతున్నాను. అల్లాకోసం నేను యుద్ధభూమికి వెళ్ళాలి. అందుకే వెళ్ళుతున్నాను. ఒకవేళ ఇరాక్లో జరిగే అంతర్యుద్ధంలో నేను పాల్గొనకపోతే, మరణ సమయములో అల్లా భూమికి వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది.
ఇప్పుడు నాకు ఎలాంటి విషయం గురించీ అపరాధభావం లేదు. మీ అందరినీ స్వర్గంలో కలుస్తాను.”
(Who is ISIS next target? - Tv9, Published on Jul 30, 2014)
అంతేకాక 2014 సెప్టెంబరు 7,8 తేదీలలో వచ్చిన వార్తల ప్రకారము, పదిహేనుమంది యువకులు స్వర్గము వస్తుందని ఇరాక్లో జరిగే యుద్ధములో పాల్గొనుటకు ఇళ్ళు వదిలిపోతూ, కలకత్తా ఎయిర్పోర్టులో పట్టుబడిన విషయము అందరికీ తెలుసు. బయటికి తెలిసిన వీరే కాకుండా, బయటికి తెలియని ఎందరో దేవుని అడ్రస్ (చిరునామ) స్వర్గమని అనుకొని మేము నేరుగా దేవునివద్దకే పోతున్నామనీ, అక్కడ స్వర్గములో కలుసుకుందా మని చెప్పడము జరుగుచున్నది. పైన వ్రాసిన ఉత్తరమును (జాబును బట్టి దేవునిది యుద్ధభూమియని కొంత అర్థమగుచున్నది. అందులో వ్రాసిన మాటలనుబట్టి "నేను అల్లా (దేవుని) కోసము యుద్ధభూమికి వెళ్ళాలి. ఒకవేళ ఇరాక్లో జరిగే అంతర్యుద్ధములో నేను పాల్గొనకపోతే, మరణ సమయములో అల్లా భూమికి వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు నాకు ఎలాంటి విషయము గురించీ అపరాధ భావము లేదు. మీ అందరినీ స్వర్గములో కలుసుకుంటాను” అని వ్రాయడము చూస్తే ఎవరికి ఎట్లున్నదోగానీ, నాకు మాత్రము వ్రాసినవారు ఎంతగానో మోసపోయారని వారిమీద కొంత సానుభూతి ఏర్పడుచున్నది. బాగా ఆలోచిస్తే తప్పులో కాలువేసినది ఒక్క యువకులే కాదు, యువకులవద్దనుండి వృద్ధులవరకు అందరూ స్వర్గము యొక్క విషయములో మోసపోయారని తెలియుచున్నది. తప్పుమార్గములో (తప్పు భావములో) వారు ప్రవేశించడమేకాక అదే నిజమైన మార్గమని నమ్మి ఏకంగా పరుగెత్తుచున్నారు. మేము అజ్ఞానమార్గములో ఏమైనా పోతున్నామా! అని ఏమాత్రము వెనుతిరిగి ఎవరూ చూచుకోవడము లేదు.
పై జాబులో ముఖ్యముగా గుర్తించిన వాక్యములను బట్టి చూస్తే వ్రాసినవారిది సక్రమమైన భావమో కాదో తెలియగలదు. అందులో ఒక వాక్యము “నేను అ కొరకు (దేవుని కొరకు) యుద్ధభూమికి వెళ్ళాలి" అని ఉంది గదా! దానిని గురించి యోచించి చూస్తే, మనుషులు దేవున్ని గురించి తెలుసుకొనేదానికి గానీ, దేవునిలోనికి కలిసిపోవుటకు గానీ, దేవుని సన్నిధానములోనికి చేరుటకుగానీ, దేవుని జ్ఞానమును, ధర్మమును తెలియుటకుగానీ, మానవులందరికీ మూడు గ్రంథములను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును అదేమనగా! తెలుసుకోవలసినది ఒకే దేవున్ని అయినప్పుడు దేవుడు ఒకే గ్రంథమును ఇవ్వాలి కదా! అట్లు కాకుండా మూడు పేర్లతోయున్న మూడు గ్రంథములను ఎందుకిచ్చాడు? అలా మూడు గ్రంథములను మూడు పేర్లతో, మూడు దేశములలో, మూడు కాలములలో
ఇవ్వడము వలన ప్రజలు దేవుడు ఒక్కడేనను ఏకత్వమును వదలి ముగ్గురు దేవుళ్ళు, మూడు విధముల జ్ఞానములు అని భిన్నత్వము లోనికి పోవు అవకాశమున్నది కదా! ఒక విధముగా నేడు హిందూ, క్రైస్తవ, ఇస్లామ్ అను మూడు మతములున్నాయి అంటే, అవి భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు గ్రంథముల వలననే ఏర్పడినవని చెప్పుటకు అవకాశము కలదు కదా! అట్లుకాకుండుటకు దేవుడు మొదటనే ఒకే గ్రంథము ఇచ్చి దానిని మాత్రమే అనుసరించమని చెప్పియుంటే బాగుండేది కదా!యని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
మనుషుల ప్రవర్తననుబట్టి, వారిలోని భావమునుబట్టి దేవునికి ఇష్టమైనవారు, దేవునికి ఇష్టములేనివారు అని రెండు రకముల మనుషులు భూమిమీద గలరు. దేవుడు తనకు ఇష్టమైనవారు వీరు, ఇష్టములేని వారు వీరు అని చెప్పకపోయినా ఆయన ఉద్దేశ్యమును ప్రకృతి గ్రహించగలదు. దేవునికి ఎల్లప్పుడూ భక్తురాలిగాయున్న ప్రకృతి దేవుడు తన భావమును తెలుపకున్నా గ్రహించుశక్తి ప్రకృతికి ఒక్క దానికే గలదు. అలా గ్రహించ గలుగు ప్రకృతి, దేవునికి ఎవరు ఇష్టులో వారికి మాత్రమే దేవుని జ్ఞానము తెలియునట్లు చేయగలదు. దేవునికి ఎవరు ఇష్టములేరో వారికి దైవ జ్ఞానమును ఏమాత్రము తెలియకుండా చేయగలదు. ప్రకృతి తన గుణము లచేత మనిషిని దేవునివైపయినా పంపగలదు, లేక దేవునికి వ్యతిరేఖ దిశ వైపయినా పంపగలదు. జరుగబోవు కాలములో మాయ ప్రభావము కొందరి మీద పనిచేయుటకు అనుకూలముగా దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథముల రూపములో ఇచ్చాడు. ఎవడయితే పైకి జ్ఞానిగా నటించుచూ, లోపల దేవునిమీద అనుమానము కల్గియుండునో అటువంటివాడు మూడు గ్రంథములలోని జ్ఞానము వేరువేరని తలచి, దేవుడు కూడా వేరువేరుగా యున్నాడని అనుకొనును. ఆ విధముగా అనుకొనునట్లు ప్రకృతి తన గుణముల మాయచేత చేయించును. తలలోని బుద్ధి వక్రీకరించినప్పుడు ఆ మనిషి వక్రమార్గము పట్టిపోవును. మీ మతము వేరు, మా మతము వేరను భావములోనికి వచ్చును. అలాగే మీ దేవుడు వేరు, మా దేవుడు వేరని చెప్పుచూ, తన దేవునిమీద తన మతముమీద ఇష్టమును ప్రకటించుచూ, ఇతర మతములమీద, ఇతర దేవునిమీద అయిష్టతను, కోపమును ప్రదర్శించును. నేడు ఒకడు స్వమతమును అభిమానించుచూ, పరమతమును అవమానించుచున్నాడంటే వానికి ప్రకృతి జనితమయిన మాయ ప్రభావము పనిచేసినదనియే అర్థము. వాస్తవానికి సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. అతనే సర్వప్రపంచమునకూ దేవుడు.
దేవుని మీద శ్రద్ద (ఇష్టము) ఉన్న వానికి మాయ ఏ ఆటంకమునూ కలుగజేయకుండా దేవుని జ్ఞానము అర్థమగునట్లు చేయును. అటువంటి వానికి దేవుని జ్ఞానము సంపూర్ణముగా అర్థమయి, మూడు గ్రంథములలోని జ్ఞానము దేవుని జ్ఞానమేననీ, వాటిలో ఏమాత్రము తేడా లేదని తెలియగల్గును. అంతేకాక మొదట వచ్చిన భగవద్గీతా గ్రంథమును దృఢపరచుటకు మిగతా రెండు గ్రంథములు వచ్చినవని తెలియగల్గును. అటువంటప్పుడు మూడు గ్రంథముల సారాంశము ఒక్కటేనను భావములోనికి మనిషి వచ్చును. ఈ విధముగా శ్రద్ధలేని మనిషికీ, శ్రద్ధయున్న మనిషికీ తేడాయుండును. మనిషిలోని శ్రద్ధనుబట్టి మనిషి జ్ఞానమువైపు లేక అజ్ఞానమువైపు పోవునట్లు ప్రకృతి ద్వారా చేయుటకు, దేవుడు తన జ్ఞానమును వ్యూహరచన చేసి మూడు గ్రంథములుగా మనిషికి ఇచ్చాడు. ముందే ఒక వ్యూహరచనతో భూమిమీదికి పంపిన గ్రంథములైన దానివలన భగవద్గీతలోని జ్ఞానమునకు తర్వాత వచ్చిన బైబిలు, ఖుర్ఆన్ గ్రంథముల జ్ఞానము వ్యతిరేఖముగా లేదు. మొదటి గ్రంథమైన భగవద్గీతలోని జ్ఞానమును దృఢపరుస్తూ మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము చెప్పబడినది. అందువలన మూడు గ్రంథములలో ఏ గ్రంథమునుండయినా ఒకే దేవుని జ్ఞానమును గ్రహించ వచ్చును. మనిషి తన శ్రద్ధాలోపమువలన మూడు గ్రంథములను వేరువేరుగా అర్థము
చేసుకొని, వాటిని అనుసరించి వేరువేరు మతములు సృష్టించు కొనినా, వాస్తవానికి మూడు గ్రంథములలో మతముల ప్రసక్తేలేదు. మూడు గ్రంథములు సమస్త మానవుల కొరకు తయారుచేసి ఇవ్వబడినవిగానీ, ఒక వర్గమువారికనిగానీ, ఒక మతము వారికనిగానీ చెప్పబడినవి కావు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము, ఒక మనిషిని వెదకి పట్టుకొనే దానికి ఆ మనిషికి సంబంధించిన సమాచారమును అంతటినీ మొదట సేకరిస్తాము. సేకరించిన సమాచారమునుబట్టి కావలసిన మనిషిని సులభముగా గుర్తించవచ్చును. అదే విధముగా దేవుని కొరకు లేక దేవున్ని తెలియుట కొరకు దేవునికి సంబంధించిన మొత్తము సమాచారమును స్వీకరించవలసియుంటుంది. దేవునికి సంబంధించిన సమాచారము మూడు గ్రంథములలో సంపూర్ణముగా కలదు. అందువలన దేవుని కొరకు మూడు గ్రంథములలో వెదకాలి. మూడు గ్రంథములలో ఏ ఒక్క గ్రంథము ద్వారానైనా దేవుని సమాచారమును తెలిసి చివరకు దేవున్ని తెలియవచ్చును. అంతేగానీ దేవుని కొరకు యుద్ధభూమికి పోనవసరములేదు. యుద్ధభూమిలో వెదకవలసిన అవసరమూ లేదు. దేవుడు తన గ్రంథములలో ఏ ఒక్క గ్రంథమందయినా నేను యుద్ధభూమిలో తెలియబడతానని చెప్పాడా? నా కొరకు యుద్ధభూమికి రండని చెప్పాడా? అట్లు ఎక్కడా చెప్పలేదు. కావున “నేను అల్లా కొరకు (దేవుని కొరకు) యుద్ధభూమికి వెళ్ళాలి" అను మాట పూర్తి అసంబద్ధతతో కూడుకొన్నది, సంపూర్ణముగా అసత్యమైనది. దేవుడు ఎక్కడ తెలియబడునో అక్కడ వెదకాలిగానీ, దేవుడు తెలియబడనిచోట వెదకుట వృథాప్రయాస అగును. అందువలన దేవుని కొరకు నేను యుద్ధ భూమికి వెళ్ళాలి అనుమాట దేవుని జ్ఞానమునకుగానీ, దేవునికిగానీ సరిపోని మాట.
ఇతరులు చెప్పడము వలన విని దేవుడు యుద్ధభూమిలో లభిస్తాడని అనుకొనియుంటే అలా విన్నవాడు పూర్తిగా మోసపోయినట్లేనని చెప్పవచ్చును. మూడు గ్రంథములలో దేవుడు ఒకే జ్ఞానమును చెప్పి యుండగా, దానిని చదివే వారియొక్క అవగాహనా లోపము వలన చదివిన దానిని ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరు భావములో కొందరు అర్థము చేసుకొనియుండవచ్చును. అటువంటి వారి బోధలలోగానీ, రచనలలోగానీ దైవజ్ఞానము కొంత కలుషితమయివుండవచ్చును. మూల గ్రంథములలో దేవుడు చెప్పిన వాక్యములుండగా మనుషులు చెప్పిన వాటిలో కొంత కాలుష్యముండవచ్చును. అయితే ఆ కాలుష్యమును మనిషి గ్రహించి కలుషితమును వదలి స్వచ్ఛమైన జ్ఞానమును స్వీకరించవలసియుంటుంది. ఉదాహరణకు పండిన గింజలు, పండిన పంట స్వచ్ఛముగాయున్నా దానిని మనిషికి ఉపయోగపడునట్లు చేసిన చోట కొంత కలుషితముండవచ్చును. ఏ విధముగా పప్పులలో కనిపించే పొట్టు కలిసియున్నదో, ఏ విధముగా బియ్యములో కనిపించని తవుడు కలిసియున్నదో, అదే విధముగా జ్ఞానములో కూడా గుర్తించగలిగిన తప్పులు కొన్ని, గుర్తించలేనంతగాయున్న తప్పులు కొన్ని కలిసియుండవచ్చును. పప్పులను చేటతో చెరిగి శుభ్రము చేసుకొన్నట్లు, బియ్యమును నీటిలో కడిగి తవుడును శుభ్రము చేసినట్లు, మనము ఇతరుల ద్వారా తెలుసుకొనుచున్న జ్ఞానమును విచక్షణ అను బుద్ధితో పరిశీలించి స్వచ్ఛమయిన జ్ఞానమును తెలియవలసియుంటుంది. అట్లుకాకుండా విన్నదంతా సత్యము అనుకొంటే తప్పక మోసపోవలసి వస్తుంది. మనిషిలోని విచక్షణా బుద్ధి బియ్యములోని కనిపించు రాళ్ళను వేరుచేయు జల్లెడలాంటిది. అలాగే కనిపించని తవుడును తీసివేయు నీటిలాంటిది. బుద్ధి విచక్షణ లేనివారు హేతుబద్ధముగా దేనినీ ప్రశ్నించలేరు, శాస్త్రబద్ధముగా దేనినీ గ్రహించలేరు.
దేవున్ని తెలియాలంటే ఎంతోకాలము ఆయన జ్ఞానమును తెలుసు కొని, తెలుసుకొన్న జ్ఞానము ప్రకారము నడుచుకొంటే, దేవుడు తెలియ బడుటకు అవకాశమున్నది. అట్లు కాకుండా యుద్ధభూమికి పోయినంత మాత్రమున
దేవుడు తెలియబడును అనడము పూర్తి అసత్యమగును. ఒక గ్రంథములో “నేను తయారుచేసిన గుణములతో కూడుకొన్న మాయ దుస్సాధ్యమైనదనీ, దానిని దాటి నావద్దకు రావడము దుర్లభమనీ” దేవుడే స్వయముగా చెప్పియుండగా, బజారుకుపోయి బెల్లము తెస్తానన్నంత సుళువుగా, యుద్ధభూమికి పోయి దేవున్ని చూస్తానని చెప్పడము హాస్యాస్పదము. మనము ఎట్లనుకొన్నా ఫరవాలేదుగానీ, అంత సులభముగా దేవుడు తెలియబడడు. దేవుడు బయటి ప్రపంచములో తెలియువాడు కాదనీ, శరీరములోపల అంతర్ముఖముగా చూచుకొన్నప్పుడు శరీరములోనే యున్న దేవున్ని తెలియవచ్చుననీ భగవద్గీత సూచిస్తున్నది. దేవున్ని తెలియాలంటే దేవునికి సంబంధించిన ధర్మములను తెలియవలసియుండగా, అవి ఏవీ తెలియకనే నేను దేవునికొరకు పోవుచున్నానని చెప్పడము విడ్డూరము. జ్ఞానము తెలిసినవాడు ఎవడూ అలా చెప్పడు. మనము సక్రమముగా ఉండాలంటే, దేవుని మార్గములో నడువాలంటే, ఇతరులు చేసిన తప్పులను చూచి మనము అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చును. అందువలన ఇక్కడ ఇతరులు చేసిన తప్పులను చూపుట కొరకు నాకు దొరికిన ఉత్తరములోని తప్పులను వెలుగెత్తి చూపవలసి వచ్చినది. అలా చేయుట వలన ఇతరులెవ్వరూ దేవుని విషయములో మోసపోకుందురని తలచుచున్నాము. ఆ లేఖలో దొరికిన విచిత్రమైన విషయములు ఇంకా రెండు గలవు. అందులో రెండవ తప్పిదమును ఇప్పుడు వివరించుకొని చూస్తాము.
“యుద్ధములో పాల్గొనకపోతే మరణ సమయములో అల్లా భూమికి నేను వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది” అని వుంది. ఈ వాక్యములో 'అల్లా భూమికి' అను పదమునకు వివరమును చూస్తే, దేవునికి ప్రత్యేకమైన భూమి ఏదీ భూమండలములో లేదు. దేవుడు విశ్వమంతా అణువణువునా వ్యాపించియున్నాడు. కావున సమస్త భూమి దేవునిదే అవుతుంది గానీ, ప్రత్యేకించి యుద్ధభూమిని మాత్రమే దేవుని భూమి అని చెప్పడము తప్పగును. స్థూలముగా కనిపించక, సూక్ష్మముగా భూమండలమంతా వ్యాపించియున్న దేవునికి ఇది మంచి భూమి, ఇది చెడు భూమియని ఏమాత్రము బేధముండదు. అట్లే ఇది దేవుని భూమియనీ, ఇది మాయకు సంబంధించిన భూమియనీ చెప్పుటకు వీలులేదు. అలాంటప్పుడు దేవుని (అల్లా) భూమికి నేను వెళ్ళవలెను అని చెప్పడము పెద్ద పొరపాటగును. ఒక విధముగా చెప్పితే దేశమంతా దేవుని భూమియే అగును. అటువంటప్పుడు కూడా ప్రత్యేకించి యుద్ధభూమిని దేవుని (అల్లా) భూమి అనడము అవివేకమగును. ఈ లేఖలో ముఖ్యమైన మూడవ తప్పు గలదు. దానిని వివరించుకొని చూస్తాము.
"మీ అందరినీ స్వర్గములో కలుసుకొంటాను” అని వ్రాసిన మాటను బట్టి చూస్తే దేవుని కొరకు పోరాడువానికి లేక దేవుని కొరకు యుద్ధము చేయువానికి మరణము తర్వాత స్వర్గము లభించుతుందను నమ్మకముతో అలా మాట్లాడడము జరిగినది. ఇస్లామ్ గ్రంథమయిన ఖుర్ఆన్లో దేవునికొరకు భక్తితో ఏమి చేసినా, దానివలన మరణానంతరము స్వర్గము లభించుతుందని దేవుడు చెప్పినట్లు మనుషులే వివరమును వ్రాసుకొన్నారు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు చెప్పినమాటను అర్థము చేసుకోలేకపోయిన దానివలన, కొందరు మోక్షమును స్వర్గము అని వ్రాసుకొన్నారు. అంతేకాక దేవుడిచ్చిన స్వర్గములో ద్రాక్షతోటలు, జలజల పారే మంచినీటి సెలయేళ్ళు గలవని, ఎంతో హాయిని చేకూర్చు గాలి గంధము ఉండడమే కాకుండా, మంచి సుఖములను అందించు అందమైన స్త్రీలు పరిచర్యలు చేస్తూ ఉందురని కూడా కలదు. స్వర్గము అంటే ఎంతో సుఖముగా ఉంటుందన్నట్లు వ్రాసియుంచారు. ఇదంతయూ చూస్తే దేవుని కొరకు కాకున్నా, స్వర్గములోనున్న సుఖముల కొరకైనా దేవునికి భక్తిగాయుండి స్వర్గమునకు పోవాలను ఆశ కల్గించునట్లు స్వర్గమును గురించి వ్రాయడము జరిగినది. అటువంటి స్వర్గములో కలుస్తామని లేఖలోని వ్యక్తి స్వర్గము అను పేరును ప్రస్తావించాడు.
స్వర్గము అనుమాట ఒక్క ఖుర్ఆన్ గ్రంథములో మాత్రమున్నదని మేము చెప్పడములేదు. ప్రపంచములో అన్ని మతముల ప్రజలయందు 'స్వర్గము' అను పదము పలుకబడుచున్నది. ముఖ్య గ్రంథములయిన ఇస్లామ్, క్రైస్తవ, హిందూమతములలో స్వర్గమును గురించిగలదు. స్వర్గమును గురించి మిగతా మతములనటుంచి ఒక్క హిందూమతములో ఏమనుకొనుచున్నారంటే, మనిషి జీవితములో సంపాదించుకొను పుణ్యమును అనుభవించుటకు మరణించిన తర్వాత ఇంద్రుడు పాలించు స్వర్గలోకమునకు పోయి, అక్కడ తన పుణ్యమునకు సంబంధించిన సుఖములన్నిటినీ అనుభవించి, పుణ్యము అయిపోయిన వెంటనే యముడు పాలించు నరకలోకమునకు పోయి, అక్కడ పాపమునకు తగినట్లు బాధలను అనుభవించి, అక్కడ పాపము అయిపోయిన వెంటనే సత్యలోకములోని చతుర్ముఖ బ్రహ్మవద్దకు పోయి క్రొత్త జన్మకు కావలసిన ప్రారబ్ధకర్మను వ్రాయించుకొని వచ్చి, తల్లిగర్భములో చేరి శిశువుగా పెరిగి తిరిగి జీవుడు జన్మను పొందుచున్నాడని ఒక కథలాగ చెప్పడము జరుగుచున్నది. ఇంచుమించు మిగతా కొన్ని మతములు కూడా ఇదే విషయమునే చెప్పుచున్నవి. అయితే ఇస్లామ్ మరియు కొన్ని మతము లందు చనిపోయినవాడు స్వర్గమునకో, నరకమునకో పోవుననీ, అక్కడే శాశ్వతముగా ఉండుననీ, వాడు వచ్చి తిరిగి జన్మించడము అనునది లేదని చెప్పుచున్నారు. మనిషి ఒకమారే పుట్టుననీ, ఒకమారే చనిపోవుననీ, వాడు పూడ్చబడిన గుంతలోనే శాశ్వతముగా ప్రళయము వరకు ఉండుననీ, ప్రళయ దినమున పూడ్చిపెట్టబడిన సమాధులనుండి మనుషులనందరినీ దేవుడు లేపి వారు బ్రతికినప్పుడు చేసుకొన్న పాపమునుబట్టి, దైవమార్గమునుబట్టి నరకమునకో, స్వర్గమునకో పంపడము జరుగునని, అలా పంపబడిన వాడు స్వర్గమునకు పోయివుంటే అక్కడే శాశ్వతముగా సుఖములను అనుభవించుచూ ఉండునని చెప్పడము జరుగుచున్నది. స్వర్గము విషయములోగానీ, నరకము విషయములోగానీ, ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా చెప్పుచున్నా మొత్తానికి స్వర్గములో సుఖములు, నరకములో బాధలు అనుభవించుదురని చెప్పుచున్నారు.
ప్రతి మతములోని ఏ మనిషికీ స్వర్గమును గురించిగానీ, నరకమును గురించిగానీ సంపూర్ణముగా తెలియదనియే చెప్పవచ్చును. సర్వ సాధారణముగా స్వర్గములో అన్ని రకముల సుఖములూ ఉంటాయని చెప్పు చుందురు. హిందువులైతే స్వర్గము ఇంద్రుని లోకమనీ, అక్కడ ఇంద్రుని సభలో నాట్యము చేయు రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలగు అప్సరసలతో ఆడి పాడవచ్చుననీ, వారి సంగమము లభించుననీ చెప్పుకొను చుందురు. ఇస్లామ్ మతములోనయితే స్వర్గములో మంచి అందముతో యున్న నలుగురు యువతులు అనేక సుఖములను కలుగజేతురనీ, సున్నితమైన, అందమైన ఆడవారిపొందు లభించుననీ, అక్కడ ఎంతో చల్లగానుండు తోటలు, రుచిగాయున్న పానీయములు, హాయిగానుండు పడకలు లభించడమే కాకుండా ఎల్లప్పుడు యవ్వనముగాయుండి స్త్రీలతో సాంగత్యము కల్గియుందురని గొప్పగా చెప్పుకోవడము జరుగుచున్నది.
అనుభవించే కాలము, అనుభవించే లోకమును వదలి చూస్తే ఇంచుమించుగా అందరూ చెప్పునది “స్వర్గము సుఖములకు నిలయము, నరకము బాధలకు నిలయము” అనునదే కనిపించుచున్నది. దేశములో ఎవరూ ఏమి చెప్పినా ఆధ్యాత్మిక జ్ఞానరీత్యా మేము కూడా సుఖములతో కూడుకొన్నదానిని స్వర్గము అనియూ, బాధలతో కూడుకొన్న దానిని నరకము అనియూ చెప్పుచున్నాము. “స్వర్గ, నరకములు సుఖదుఃఖములకు నిలయములు" అను ఒక్కమాటను తప్ప మిగతా విషయములన్నిటిలో స్వర్గ, నరకములను గురించి విబేధించుచున్నాము. ఒక్క విషయములో మాత్రము ఒప్పుకొనుచూ, మిగతా అన్ని విషయములలో ఒప్పుకోక పోవడానికి కారణము ఏమంటే, ఇంతవరకు స్వర్గ, నరకములందు సుఖ దుఃఖములు కలవనుట తప్ప మిగతా విషయములేవిగానీ ఎవరికీ తెలియ వనియే చెప్పవచ్చును. దేవుడు
మానవులకు ఇచ్చిన మూడు గ్రంథములలో స్వర్గ నరకముల ప్రస్తావన ఉన్నప్పటికీ, అక్కడ చెప్పిన పూర్తి సమాచారము ఎవరికీ అర్థముకాక పోవడము వలన, స్వర్గ నరకములను తమ ఇష్ట మొచ్చినట్లు వర్ణించి వ్రాసుకొన్నారు. అలా వారు వ్రాసుకొన్నదానికీ, చెప్పుకొన్నదానికీ, గ్రంథములలోనున్న సత్యమునకూ ఎంతో తేడా కలదని చెప్పవచ్చును. సత్యమేమిటని చూడకపోయినందున, స్వర్గ, నరక విషయములు ఊహాగానమైనాయిగానీ, ఇది సత్యమని శాస్త్రబద్ధముగా చెప్ప లేకపోవుచున్నారు. చెప్పినది ప్రశ్నించకుండా వింటూవుంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరయినా ప్రశ్నించితే హేతుబద్ధమైన జవాబు ఉండదు.
ఎలా జవాబుండదో ఉదాహరణకు ఒక విషయమును చెప్పుకొందాము. ఒక మతమువారు తమ మత ప్రచార నిమిత్తము అక్కడక్కడ సభలు ఏర్పాటు చేసి, ఆ సభలకు వచ్చిన మనుషులతో తమ మతమును గురించి ఎక్కువగా చెప్పుచూ, తమ మతమే అన్ని మతములకంటే గొప్పదనీ, తమ మతములో దేవున్ని గురించి ప్రార్థన చేయువానికి, దేవుని విషయములో భక్తిగలవానికి మరణము చివరిలో స్వర్గము లభించుననీ, అతడు శాశ్వతముగా స్వర్గములోయుండి అనేక సుఖములు అనుభవించుచుండుననీ, అటువంటివానిని అన్ని విధముల సుఖపరుచుటకు సున్నితమైన శరీరము గల అందమైన నలుగురు ఆడవారు స్వర్గములో ఉందురు అని చెప్పి తమ మతమువైపు ఆకర్షించాలని చూచారు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి లేచి తన అనుమానమును ప్రశ్నరూపముగా అడిగాడు అదేమనగా!
ప్రశ్న :- మగవారు స్వర్గమునకు పోతే అన్ని సుఖములు అక్కడయున్నట్లే వారిని సుఖపరుచుటకు అందమైన యువతులు (స్త్రీలు) కూడా కొందరుంటా రని చెప్పుచున్నారు కదా! అట్లయితే స్వర్గానికి ఒక్క మగవారే కాకుండా దైవభక్తి గల, దేవుని మీద విశ్వాసమున్న ఆడవారు కూడా మరణించిన తర్వాత స్వర్గానికి పోవుచుందురు కదా! అటువంటప్పుడు స్వర్గములో మగవారిని సుఖింపజేయుటకు కొందరు అందమైన స్త్రీలు అక్కడ యున్నట్లు, ఆడవారిని సుఖింపజేయుటకు అందమైన మగవారు కొందరు అక్కడ ఉంటారా?
వారి జవాబు :- ఆడవారికి స్వర్గముంటుందని మేము చెప్పలేదు కదా! మేము చెప్పినది మగవారిని గురించే, అందువలన ఆడవారిని గురించి అడగవద్దండి. దేవుడు ఆడవారిని గురించి ఎక్కడా చెప్పలేదు.
ప్రశ్న :- దేవుడు తన జ్ఞానమును సమస్త మానవులకు అని తన గ్రంథములలో చెప్పాడు గానీ, ఇది మగవారికి అనిగానీ, ఇది ఆడవారికి అనిగానీ ప్రత్యేకించి చెప్పలేదు. అటువంటప్పుడు చెప్పిన జ్ఞానము అందరికీ వర్తించి తీరాలి. అట్లుకాకుండా స్వర్గము ఒక్క మగవారికేనని స్త్రీలకు లేదని మీరెందుకు చెప్పుచున్నారు?
వారి జవాబు :- మా మతములో స్త్రీలకు విలువలేదు. అన్నిటిలో ప్రవేశము లేదు. ప్రార్థనా మందిరాలకు (మజీద్లకు) మగవారుపోయి దేవుని ప్రార్థన చేసుకొంటాము. ఆడవారు ప్రార్థనామందిరాలకు పోయి ప్రార్థన చేయకూడదు. దేవుని ప్రార్థనా మందిరములలోనికే ప్రవేశము లేనప్పుడు నేరుగా స్వర్గములోనికి ప్రవేశముండదు. అంతేకాదు మాలో ఎవరైనా చనిపోతే శవాన్ని మగవారే స్మశానానికి తీసుకపోయి భూమిలో పూడ్చి పెట్టుతాము. అప్పుడు శవము వెంటగానీ, స్మశానములోనికిగానీ ఆడవారు ఎవరూ రాకూడదను నియమము కలదు. స్మశానములోనికి కూడా ప్రవేశము లేనప్పుడు స్వర్గములోనికి ప్రవేశము ఎలా ఉండగలదు! అందువలన స్వర్గము పురుషులకు మాత్రమే స్త్రీలకు లేదని చెప్పుచున్నాము.
ప్రశ్న :- మీరు చెప్పునది మాకు జవాబు కాదు. మీరు స్వార్థముతో ఆడవారిని అణచివేసే నిమిత్తము చెప్పియుండవచ్చును. మాకు శాస్త్రబద్ధమైన జవాబు కావాలి. దేవుడు తన గ్రంథములు మూడింటిలో ఏ ఒక్కదాని యందైనా స్త్రీలకు స్వర్గములో ప్రవేశము లేదనిగానీ, అట్లే స్మశానములోనికి ప్రవేశము లేదనిగానీ చెప్పాడా?
వారి జవాబు :- మా జీవన విధానములు వ్రాయబడిన హదీసు గ్రంథము లలో ఈ విషయములు వ్రాయబడియున్నాయి. ఎక్కడాలేనిది మేమెందుకు చెప్పుతాము.
ప్రశ్న :- నేను సూటిగా అడుగుచున్నదేమనగా! దైవగ్రంథమైన పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో ఏమైనా వ్రాశారా! అని అడుగుచున్నాను. మీరు చెప్పునది హదీసు గ్రంథములో వ్రాశారు అని చెప్పుచున్నారు. హదీసు గ్రంథములో వ్రాసినది దైవవాక్కు కాదు. దైవగ్రంథము ఖుర్ఆన్ మాత్రమేనని మరచిపోవద్దండి. ఖుర్ఆన్ మాత్రమే శాస్త్రబద్ధమైనది. హదీసులను శాస్త్రబద్ధమని చెప్పుటకు వీలులేదు.
వారి జవాబు :- ముహమ్మద్ ప్రవక్తగారే కదా హదీసులను చెప్పినది. ప్రవక్తగారు ఖుర్ఆన్ గ్రంథమును చెప్పినట్లే హదీసు గ్రంథమును కూడా చెప్పాడు. అటువంటప్పుడు ఖుర్ఆన్ గ్రంథముతో సమానమైనవి హదీసులని మేము నమ్ముచున్నాము.
ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథమును ప్రవక్తగారు చెప్పినా అది మహా జ్ఞాని జిబ్రయేల్ చెప్పినది. జిబ్రయేల్ తెరచాటున వుండి ప్రవక్తకు చెప్పినదే ఖుర్ఆన్ గ్రంథము. ఖుర్ఆన్ గ్రంథము దైవగ్రంథము. దానికి సమాన మైన గ్రంథము మరొకటి ఏదీలేదు. అంతిమ దైవగ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథముతో సమానముగా ఏ గ్రంథమునూ పోల్చకూడదు. ఇతర మతస్థులు ఖుర్ఆన్ విషయము తెలియక దానిని ఇతర గ్రంథములతో పోల్చినా ఫరావాలేదు కానీ, ముస్లీమ్ అయినవాడు దైవ గ్రంథముతో సమానముగా ఏ గ్రంథమునూ పోల్చి చెప్పకూడదు. హదీసు గ్రంథములను ముహమ్మద్ ప్రవక్త పేరును చెప్పి మనుషులే వ్రాశారు. ప్రవక్తగారు చెప్పిన మాటలను మా తాత విన్నాడు, మా తాత విన్న మాటలను మా నాన్నకు చెప్పాడు, మా తాత చెప్పిన మాటలను మా నాన్న నాకు చెప్పాడనీ ప్రవక్త చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరములకు వ్రాసిన గ్రంథమును ఖుర్ఆన్తో సమానమని చెప్పడము సరియైన పద్ధతి కాదు. అందువలన మేము ఖుర్ఆన్లు ఇచ్చిన విలువను హదీసులకు ఇవ్వము. ఖుర్ఆన్ గ్రంథము శాస్త్రబద్ధమైనది, హదీసులు శాస్త్రబద్ధమైనవి కావు అని చెప్పుచున్నాము.
వారి జవాబు :- మీరు హదీసులను నమ్మకపోయినా, ఖుర్ఆన్ గ్రంథమును నమ్ముచున్నారు కదా! ఖుర్ఆన్ గ్రంథములో స్వర్గమును, నరకమును గురించి చెప్పారు కదా! అటువంటప్పుడు స్వర్గమును గురించి మీరు ఎందుకు విబేధించుచున్నారు?
ప్రశ్న :- స్వర్గమును ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినది వాస్తవమే, దానిని మేము తప్పు పట్టడములేదు. దానిని వేరు విధముగా అర్థము చేసుకొన్నవారిని మేము తప్పు పట్టుచున్నాము. స్వర్గము, నరకము రెండూ వాస్తవమే అయితే అవి ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి అని తెలియడములో చాలామంది విఫలమైనారని చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన స్వర్గము, నరకమునకు అర్థము కూడా తెలియని స్థితిలో మనిషి ఉన్నాడని చెప్పుచున్నాము. అన్ని మతములవారు స్వర్గ, నరకములను అర్థము చేసుకోక వాటి విషయములో తప్పటడుగు వేస్తున్నారని అంటున్నాము.
వారి జవాబు :- ప్రపంచములో అందరికీ అర్థముకాని సమస్యగాయున్న స్వర్గము, నరకము అనువాటిని గురించి మీకు ఏమి అర్థమయినదో తెలుప గలరా?
ప్రశ్న :- నాకు అర్థమయినది సత్యమయిన భావము. కావున నేను జంకు బొంకు లేకుండా ధైర్యముగా తెలుపగలను. నేను నా భావమును చెప్పకముందే మిమ్ములను ఒకమాట అడుగుచున్నాను. దానికి మీ జవాబు ఏమిటో చెప్పగలరా?
వారి జవాబు :- మాకు తెలిసినది ఏదయితే వుందో దానిని మాత్రము తెలుపగలము. అయితే మా మాట సరియైనదో కాదో, శాస్త్రబద్ధమైనదో కాదో మీరే చెప్పాలి. (ఇట్లు వారి సంవాదము జరిగినది.)
ఖుర్ఆన్ గ్రంథములో కొన్నిచోట్ల స్వర్గ, నరకములను గురించి చెప్పినప్పుడు మనిషి మరణించిన తర్వాత, చచ్చినవానిని పూడ్చిపెట్టిన తర్వాత, ప్రళయకాలమువరకూ చనిపోయినవారు వారివారి సమాధులలో ఉండి, అంతిమదినమున సమాధులనుండి లేపబడి, వారు బ్రతికినప్పుడు చేసుకొన్న పాపపుణ్యములను బట్టి లెక్కించి స్వర్గమునకో, నరకమునకో పంపడము జరుగుతుందని వ్రాశారు. ఆ మాట ప్రకారము ప్రళయము వచ్చువరకు స్వర్గనరకములు ఎవరికీ రావనీ, అంతవరకు చనిపోయిన వారు వారివారి సమాధులలోనే ఉందురని కొందరు చెప్పుచున్నారు. దానిప్రకారము స్వర్గనరకములను ఇప్పుడు ఎవరూ పొందలేదనీ, స్వర్గ నరకములు ప్రళయ కాలమున మనుషులను సమాధులనుండి లేపబడిన తర్వాత, దేవునిచే తీర్పు తీర్చబడిన తర్వాత వచ్చునవనీ తెలియుచున్నది. అయితే ఇంతవరకు ప్రళయము రాలేదనీ, ఇంతవరకు చనిపోయిన వారందరూ ప్రళయ కాలమువరకు సమాధిలో ఉండవలసిందేననీ, అంతిమ ప్రళయ దినమున దేవుడు ప్రతి ఒక్కరినీ సమాధినుండి లేపి వాని పాప పుణ్యములను విచారించి వానికి తగినట్లు వాడు స్వర్గమునో, నరకమునో పొందునట్లు తీర్పు తీర్చునని (జడ్జిమెంట్ చేయునని) ముస్లీమ్ సమాజము చెప్పుచున్నది. ఇది ఇట్లుండగా, “మహా ప్రవక్త (సం) జీవిత చరిత్ర" అను గ్రంథములో 224వ పేజీలో "ఇస్రా మరియు మేరాజ్" అను శీర్షికలో వ్రాసిన విషయమును చూస్తే స్వర్గనరకముల మీద కొంత అనుమానము రాక తప్పదు. అనుమానము తీర్చుకొనుటకు కొన్ని ప్రశ్నలను అడగక తప్పదు. అలా వచ్చిన ప్రశ్నలకు జవాబులు దొరకడము కష్టముగా యున్నది. అంతకు ఆ సమాచారము ఏమిటో, మేరాజ్ దినమున ముహమ్మద్ ప్రవక్తకు ఏమి జరిగినదో ఆ గ్రంథములో వ్రాసిన విషయమునే ఇక్కడ పొందుపరుస్తున్నాము చూడండి.
ముహమ్మద్ (స) మహా ప్రవక్తగారిని ఆయన భౌతిక శరీరముతో సహా బురాఖ్ (తెల్లని గుర్రము) పై ఎక్కించుకొని హజ్రత్ జిబ్రయేల్ (అ.స) మక్కాలోని కాబా గృహమునుండి పాలస్తీనా దేశములోవుండే బైతుల్ మల్టిస్ వరకు తీసుకువెళ్ళారు. అక్కడకు చేరిన తర్వాత ముహమ్మద్ ప్రవక్త దైవ ప్రవక్తలందరికీ నాయకత్వము వహిస్తూ నమాజు చేయించారు. బురాఖు ఆ మస్జీద్ ద్వారానికి ఉన్న కడియానికి కట్టివేశారు. తర్వాత అదే రాత్రి జిబ్రయేల్, ముహమ్మద్ ప్రవక్తగారిని అక్కడనుండి మొదటి ఆకాశము వరకూ తీసుకువెళ్ళడము జరిగినది. జిబ్రయేల్ ఆకాశద్వారాన్ని తెరిపింపగా ద్వారము తెరుచుకోవడము జరిగినది. అక్కడ ముహమ్మద్ ప్రవక్తగారు మానవాళికి తండ్రి అయిన హజ్రత్ ఆదమ్ను చూచాడు. ఆయనకు ప్రవక్తగారు సలామ్ చేయగా, ఆదన్గారు మర్హిబా అంటూ ప్రతి సలామ్ చేశారు. ఆదమ్కు కుడి ప్రక్కన అదృష్టవంతుల ఆత్మలూ, ఎడమ ప్రక్కన దురదృష్టవంతుల ఆత్మలూ ఉన్నట్లు ప్రవక్త చూచాడు.
ఆ తర్వాత మహా ప్రవక్తను జిబ్రయేల్ రెండవ ఆకాశము పైకి తీసుకొని పోయి, అక్కడ ఆకాశ ద్వారాన్ని తెరిపించడము జరిగినది. రెండవ ఆకాశముపై ఆయన హజ్రత్ యహ్యాబిన్ జకరియ్యానూ, హజ్రత్ ఈసాబిన్ మరియమ్న
చూశాడు. వారిద్దరినీ చూచి వారికి సలామ్ అందివ్వగా ఇద్దరూ ప్రతి సలాము చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆ పిదప మూడో ఆకాశము పైకి వెళ్ళడము జరిగినది. అక్కడ ఆయన హజ్రత్ యూసుఫ్ను చూశాడు. తర్వాత జిబ్రయేల్ ప్రవక్తగారిని నాల్గవ ఆకాశముపైకి తీసుకపోయారు. అక్కడ హజ్రత్ ఇద్రీసు చూచాడు. తర్వాత ఐదవ ఆకాశముపైకిపోయి అక్కడ ఆకాశద్వారాన్ని తెరిపించుకొని అక్కడున్న హజ్రత్ హరూన్బిన్ ఇమ్రాన్ న్ను చూచారు. ఆ తర్వాత ఆరవ ఆకాశము పైకిపోయి అక్కడ హజ్రత్ మూసా బిన్ ఇమ్రాన్ ను చూచి సలామ్ చేసి ప్రతి సలామ్ పొంది, అక్కడినుండి ముందుకు పోగా మూసా ఏడ్వను ఆరంభించారు. మీరెందుకు ఏడుస్తున్నారని ప్రవక్త అడుగగా ఆయన “ నా తర్వాత ఒక యువకుడు ప్రభవింప జేయబడ్డాడు. అతని సమాజము నా సమాజముకంటే సంఖ్యలో అధికముగా యుండి స్వర్గ ప్రవేశము చేస్తుంది. ఆ కారణముగా నాకు ఏడుపు ఆగలేదు” అని అన్నారు.
ఆ తర్వాత ప్రవక్తగారిని జిబ్రయేల్ ఏడవ ఆకాశమువైపు తీసుక పోయాడు. అక్కడ ముహమ్మద్ ప్రవక్త తాను అల్లాకు (దేవునికి) రెండు దనువులు లేదా అంతకంటే తక్కువ దూరములో ఉన్నారని గ్రహించాడు. ఆ తర్వాత అల్లా తన దాసునిపై దివ్యావిష్కృతిని అవతరింపజేశాడు. ఆ దివ్యావిష్కృతితో రోజుకు యాభై పూటలు నమాజును విధిగా నిర్ణయించడము జరిగినది. తర్వాత ఆయన వెనక్కు తిరిగి ఆరవ ఆకాశములోనున్న హజ్రత్ మూసా దగ్గరకు వచ్చాడు. అప్పుడు మూసా “అల్లా మీకు ఇచ్చిన ఆదేశము ఏమిటి?" అని అడిగాడు. దానికి ప్రవక్తగారు “యాభై పూటల నమాజు” అని బదులిచ్చాడు. ఆ మాటవిన్న మూసా “మీ సమాజానికి అంత శక్తి లేదు. మీరు దైవము వద్దకు తిరిగివెళ్ళి మీ సమాజముకొరకు ఇంకా కొన్ని నమాజుల్ని తగ్గించమని ప్రార్థించండి” అని చెప్పారు. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్గారు జిబ్రయేల్ వైపు ఆయన సలహాపొందే దృష్ఠితో చూచాడు. ఆ తర్వాత జిబ్రయేల్ ప్రవక్తగారిని తిరిగి అల్లాహ్ సన్నిధికి తీసుకుపోయాడు. అల్లాహ్ అప్పుడు కొన్ని నమాజులను తగ్గించాడు. తర్వాత ప్రవక్త క్రిందికి తీసుకరాబడ్డాడు. రెండవమారు ఆరవ ఆకాశములో నున్న మూసావద్దకు రాగా, తిరిగి వెనక్కుపోయి మరికొన్ని నమాజులను తగ్గించమని దైవాన్ని వేడుకోండని చెప్పాడు. ఇలా మూసా మరియు అల్లాహ్కు మధ్య ప్రవక్తగారి రాకపోకలు జరిగాయి. కొన్నిమార్లు వెనక్కి ముందుకు పోయి అడిగిరాగా దేవుడు (అల్లాహ్) నమాజులను తగ్గించు కొంటూ వచ్చాడు. అలా పోయి రాగా చివరకు ఐదు నమాజులు మాత్రమే మిగిలాయి. అప్పుడు కూడా మూసా అవి కూడా ఎక్కువే ఇంకాకొన్ని తగ్గించుకోండని సలహా ఇచ్చాడు. దానికి ప్రవక్తగారు "నేను తిరిగి అక్కడకు పోయి అడగడానికి నాకు సిగ్గేస్తోంది. నేను ఈ ఐదు పూటల నమాజుకు సంతృప్తుణ్ణి, ఆయన (దేవుని) ఆదేశాలను శిరసా వహిస్తాను” అని ముందుకు కదిలారు. కొంత దూరము వెళ్ళగా “నేను ఈ క్రియను నా దాసులపై విధిగా చేశాను. నా దాసులకు వెసులుబాటును కలిగించాను” అనే శబ్ధము ఆకాశము నుండి వినిపించింది.
ఇదంతా ఎందుకు చెప్పుచున్నానంటే ప్రవక్తగారు ఆకాశ ప్రయాణము చేసిన సంఘటనను “మేరాజ్” అని చెప్పడము జరిగినది. ఇదంతయూ ఆయన జీవితచరిత్రలో చెప్పిన విషయము. మేరాజ్ సందర్భములో ప్రవక్తగారు దేవునివద్ద నుండి క్రిందికి వచ్చే సమయములో స్వర్గమునూ, నరకమునూ రెండిటినీ చూచాడని వ్రాసియుంది. స్వర్గ, నరక విషయములు చెప్పుటకు ముందు జరిగినదంతా చెప్పవలసివచ్చినది. మహా ప్రవక్త ముహమ్మద్ గారు నరకమునకు కాపలాదారునిగాయున్న మాలికను సహితము చూచాడు. అనాధల సొమ్మును బలవంతముగా కాజేసిన పాపమును నరకములో అనుభవించు వారిని సహితము ప్రవక్తగారు చూచారు. అనాధల సొమ్మును కాజేసిన వారి పెదాలు ఒంటె
పెదాలలాగా వాచియున్నాయి. నోట్లో నిప్పు కణికలు పెట్టి కుక్కు కుంటున్నారు. ఆ నిప్పు కణికలు రెండోవైపునుండి మలద్వారము ద్వారా బయటకు వస్తున్నాయి.
ప్రవక్త వడ్డీవ్యాపారులను కూడా చూడడము జరిగినది. నరకములో వారి పరిస్థితి ఎలా ఉందంటే, పెద్ద పెద్ద పొట్టలు కలిగి వారు కదలలేని స్థితిలోయున్నారు. అటువంటి వారిని ఇతరులు త్రొక్కుకుంటూ వెళ్ళడము చూచాడు. ఆయన అక్కడ వ్యభిచారులను కూడా చూచాడు. నరకములో వారిముందు శుభ్రమైన తాజాగాయున్న బలిసిన మాంసాన్ని ఉంచారు. అట్లే దానిప్రక్కనే కుళ్ళిపోయి కంపుకొడుతున్న మాంసాన్ని కూడా ఉంచడము జరిగినది. వ్యభిచారులు అక్కడున్న తాజా మాంసమును వదలి, మురిగిపోయి కంపుకొడుతున్న మాంసాన్నే భుజిస్తున్నారు. బ్రతికి యున్నప్పుడు భర్తలకు ఇతరుల సంతానాన్ని అంటగట్టినవారిని కూడా నరకములో ఆయన చూచాడు. (ఇతరుల చేత గర్భము కలిగి అది భర్తవలన కలిగినదని నమ్మించినవారిని చూచాడు. అటువంటి వారి స్థానములలో వంకర తిరిగిన పెద్ద గాలాలను గ్రుచ్చి వ్రేలాడగట్టిన దృశ్యములను ప్రవక్తగారు చూచారు.
మేరాజ్ సమాచారము అనగా ప్రవక్తగారు ఆకాశ ప్రయాణము చేసినది ఖుర్ఆన్ గ్రంథములో ప్రస్తావించకున్నా ఆయన జీవితచరిత్రలో చెప్పబడినది. ఎవరు ఎట్లు చెప్పినా! ఈ విషయము శాస్త్రబద్ధత కల్గినదని పించుకోదు. అందువలన దీనిని ఖుర్ఆన్లో చెప్పలేదనుకొంటాను. అయినా కొందరు ఇది సత్యమే అని నమ్మపలుకుచున్నారు. అటువంటి వారిని నేను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ప్రళయము వచ్చినప్పుడు, అందరికీ అంతిమ దినమైనప్పుడు, అంతవరకు భూమిలో పూడ్చిపెట్టబడిన వారందరూ సజీవులుగా లేచి నిలబడగా, వారు చేసిన తప్పుఒప్పులకు దేవుని చేత స్వర్గము, నరకము నిర్ణయించబడునని చెప్పియుండగా, ప్రళయము రాకముందే, అందరికీ అంతిమదినము రాకముందే, భూ సమాధులనుండి ఎవరూ లేవకముందే, దేవుడు తీర్పు తీర్చి స్వర్గ నరకములను నిర్ణయించకముందే ప్రవక్తగారు మేరాజ్ ప్రయాణములో తిరిగి వస్తూ నరకమునూ, నరకములో బాధపడువారినీ ఎలా చూచాడు? అని ప్రశ్న రాకతప్పదు. ప్రవక్తగారు నరకమును చూచినది నిజమైతే, ఆయనే చెప్పిన ప్రళయదినము అసత్యమవుతుంది. ప్రవక్తగారు ప్రళయదినమును గురించి, అంతిమ దినమును గురించి చెప్పినది నిజమైతే, ఆయన జీవితములో 52వ సంవత్సరము జరిగిన మేరాజ్ యాత్ర అసత్యమవుతుంది. ఇక్కడ విజ్ఞులైన వారు ఏది సత్యమో తేల్చి చెప్పగలరా? అని అడుగుచున్నాను.
ఏది సత్యమో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడినది కాబట్టి స్వర్గ నరకములు లేవంటామా? ప్రవక్తగారు చెప్పినది అసత్యమంటామా? అని ప్రశ్నించుకొని చూస్తే, ప్రవక్తగారు చెప్పినది ఏమాత్రము అసత్యము కాదు గానీ, ఆయన చెప్పినదానిని అర్థము చేసుకోవడములో మనమే పొరపడి యుంటాము అనక తప్పదు. ఎందుకనగా! ఖుర్ఆన్ గ్రంథములో అంతిమ దినమును గురించి ఉంది. అలాగే స్వర్గ నరకములను గురించి కూడా ఉంది. దీనినిబట్టి అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లోని చాలా విషయములు చాలామంది మనుషులకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును. అలా అర్థము కాకుండాపోవడానికి ముఖ్యకారణము ఏమనగా! ఖుర్ఆన్ గ్రంథములోని సూక్ష్మమైన ఎన్నో విషయములను మనిషి స్థూలముగా అర్థము చేసుకోవడములో పొరపాటు జరుగుచున్నదని చెప్పవచ్చును. ఉదాహరణకు దేవుడు సూక్ష్మమైనవాడు. అలాగే దేవుని విషయములు కొన్ని సూక్ష్మమైనవి కలవు. మనిషి శరీరము స్థూలమైనా శరీరములోని బుద్ధి, చిత్తము, అహము, మనస్సు సూక్ష్మముగాయున్నట్లు, దేవుని విషయములలో కూడా కొన్ని స్థూల విషయములున్నా అనేకముగా సూక్ష్మ విషయములున్నవి. అయితే నేడు ఖుర్ఆన్ చదువువారు సూక్ష్మ విషయములను కూడా స్థూలముగానే చూస్తున్నారు. ఈ విషయమై ప్రత్యేకించి ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను మూడవ సూరాయందు ఏడవ
ఆయత్లో (3సూ-7ఆ)లో ముహ్కమాత్ అను పేరుతో స్థూల విషయములున్నాయనీ, ముతషాభిహాత్ అను పేరుతో
సూక్ష్మ విషయములు ఉన్నాయనీ చెప్పడము జరిగినది. అయితే ఆ విషయమును మరచిపోయిన మనుషులు అన్ని విషయములను స్థూలముగా చూడను మొదలు పెట్టారు. అందువలన ఖుర్ఆన్లోని చాలా విషయములు చాలామందికి అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
దేవుడు తన అంశతో మనిషిని తయారు చేసి “మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః” అని గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున 7వ శ్లోకములో అన్నాడు. ఆ మాటనుబట్టి దేవుని అంశయే జీవుడు అని తెలియుచున్నది. దేవుని అంశతో తయారయిన జీవుడు ఒక మనిషిగా భూమిమీద మనగలుగుచున్నాడు. శరీరము ధరించిన ఏ జీవరాశిని చూచినా, దేవుడు ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు ముహ్కమాత్ (స్థూలము), ముతషాభిహాత్ (సూక్ష్మము) రెండూ వాటిలో కనిపించుచున్నవి. ఉదాహరణకు ఒక మనిషి శరీరమును విభజించి చూడగా పది భాగములు స్థూలముగా ఉండగా, పదిహేను భాగములు సూక్ష్మముగాయున్నవి. మనిషి దేవుని అంశతో పుట్టాడు కాబట్టి, దేవున్ని కూడా అదే అంశను అనుసరించి లెక్కించి చూస్తే పదిరెట్లు (10) స్థూల విషయములతో కూడుకొనియుండగా, పదిహేనురెట్లు(15) సూక్ష్మవిషయములతో కూడుకొనియున్నదని కొంతవరకు తెలియుచున్నది. దేవుడు ఎవరికీ తెలియబడడు కాబట్టి ఇక్కడ దేవుని జ్ఞానమును గురించి చెప్పుకొంటే నూటికి నలభై శాతము స్థూల అర్థములతో కూడుకొనియుండగా, అరవై శాతము సూక్ష్మ అర్థములతో కూడుకొని యున్నది. అయితే మనిషి దైవ గ్రంథమయిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథముల నుండి తెలియబడు జ్ఞానమును నూటికి నూరుపాళ్ళు స్థూలముగా లెక్కించుట వలన దేవుడు తెలియజేసిన జ్ఞానము మనిషికి తెలియకుండా పోయినది. ఇదే కారణమున భగవద్గీత హిందువులకూ, బైబిలు క్రైస్తవులకూ, ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్లకూ అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
భగవద్గీతలో స్వర్గ, నరకములను గురించి చెప్పబడినది. అలాగే బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథములోనూ స్వర్గ, నరకములను ప్రస్తావించడము జరిగినది. అయితే వాటిలోని సూక్ష్మత తెలియని దానివలన వాటియొక్క వాస్తవస్థితి మనిషికి తెలియకుండా పోయినది. మూడు మతములవారు స్వర్గ, నరకములను ఉన్నాయని ఒప్పుకొంటున్నారు. అయితే వాటి నిజస్థితి తెలియని దానివలన స్వర్గ, నరకములు ఎక్కడున్నాయి? ఎప్పుడున్నాయి? ఎట్లున్నాయి? అను విషయములు తెలియకుండా పోయినవి. ఈ మూడు ప్రశ్నలకు జవాబు లేనందున స్వర్గ, నరకములు రెండూ ఇంతవరకూ ఎవరికీ అర్థము కాలేదనియే చెప్పవచ్చును. అందువలన స్వర్గ, నరకముల జ్ఞానము దారి తప్పిన గమ్యమయిపోయినది. ఎవరికి తెలిసినది వారు సత్యమనుకొంటున్నారు. ఇంతకుముందు ప్రవక్త ఆకాశ ప్రయాణమైన మేరాజ్ను గురించి ఒక కథలాగ ప్రవక్త జీవిత చరిత్రలో చెప్పారు. వారు చెప్పినదంతా గమనించితే చివరికది అశాస్త్రీయమనీ, అసత్యమనీ చెప్పుటకు అవకాశము గలదు. అప్పుడే ఆ కాలములోనే ఆ విషయమును కొందరు సత్యమన్నారు, కొందరు అసత్యమన్నారు. ఇక్కడ మనము కూడా అశాస్త్రీయము, అసంబద్దము అంటున్నాము. అట్లు అనుటకు కారణము వారు స్థూలముగా జరిగినదని చెప్పడము వలన అలా చెప్పవలసి వచ్చినది. ఇక్కడ స్థూలము, సూక్ష్మము అను రెండిటినీ అర్థము చేసుకోవడములో మనిషి పూర్తి పొరపడడము జరుగుచున్నది. ఇదే విషయమునే (మేరాజ్ విషయమునే) సూక్ష్మముగా చెప్పుకొనినా, అర్థము చేసుకొనినా దానిని అశాస్త్రీయమనుటకు వీలులేదు. అట్లే అసత్యమనుటకు వీలులేదు. సూక్ష్మముగా లెక్కించితే అంత సులభముగా దానిమీదయున్న విమర్శలన్నీ పటాపంచలైపోయి సత్యమనుటకు అవకాశము ఏర్పడుచున్నది.
ప్రవక్తగారు తన యాభైరెండవ ఏట మేరాజ్ (గగన ప్రయాణము) చేసినట్లు ఆయన జీవిత చరిత్రలో చెప్పబడినది. మహాజ్ఞాని జిబ్రయేల్ ప్రవక్తను పిలుచుకొనిపోయినట్లు చెప్పుచున్నారు కదా! వాస్తవానికి ప్రవక్తగారు ప్రత్యక్షముగా జిబ్రయేల్ను తన జీవితములో చూడలేదు. అటువంటప్పుడు జిబ్రయేల్ ఎలా పిలుచుకపోయాడని ప్రశ్న రాగలదు. అంతేగాక ప్రవక్త ఏడవ ఆకాశమునకు పోయినప్పుడు అక్కడ అల్లాను చూచినట్లు, అల్లా చెప్పిన మాటలను విన్నట్లు వ్రాసుకొన్నారు కదా! వాస్తవానికి అల్లా ఎవరికీ కనిపించువాడు కాడు. ఎవరితో ప్రత్యక్షముగా మాట్లాడువాడు కాడు. ఖుర్ఆన్ గ్రంథములోనే 42వ సూరా 51వ ఆయత్నందు "అల్లా ఎవరితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు" అనివుంది. అంతేకాక దేవుడు రూప, నామ, క్రియారహితుడని ముందునుంచి చెప్పు కొంటున్నాము. ప్రథమ దైవగ్రంథమైన తౌరాత్ (భగవద్గీత)యందుగానీ, ద్వితీయ దైవగ్రంథమైన ఇంజీలు (బైబిలు) యందుగానీ, అంతిమ దైవ గ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథమునందుగానీ ఎక్కడయినా దేవుడు ప్రత్యక్షముగా కనిపించి మాట్లాడునని లేదు. అటువంటప్పుడు ఏడవ ఆకాశమందు దేవుడు ప్రవక్త గారితో మాట్లాడినాడని చెప్పడము పూర్తి అసత్యమగును. ఇక్కడ స్థూలముగా ఈ పనులు జరిగాయంటే అంతా విడ్డూరమగును, అంతా అసత్యమగును. అదే సూక్ష్మముగా స్వప్నములో జరిగిందని చెప్పియుంటే దానిని అసత్యమనుటకు వీలులేదు. సూక్ష్మముగా స్వప్నములో ప్రత్యక్షముగా జరుగని ఎన్ని పనులయినా జరుగునని అందరికీ తెలుసు. మనిషి స్థూలముగా ఆకాశములో పక్షిలాగా ఎగిరిపోవడము విడ్డూరమగును. అదే స్వప్నములో అయితే మెలుకువలో జరగని పనులు జరుగుటకు అవకాశము గలదు. అట్లే స్వప్నములో ప్రవక్తగారు మేరాజ్ ప్రయాణము చేసియుండవచ్చునని ఎందుకు అనుకోకూడదు? అలా స్వప్నములో జరిగిన సంఘటనలో పది సంవత్సరముల క్రిందట చనిపోయినవారు కనిపించడము జరుగుచుండును. వాస్తవముగా లేనివాడు స్వప్నములో కనిపించుట అందరికీ తెలిసిన సత్యమే. అలాగే లేని జిబ్రయేల్గానీ, లేని దేవుడుగానీ కనిపించి మాట్లాడినట్లు జరిగియుండవచ్చును. అయితే వీరే జిబ్రయేల్ అనిగానీ, వీరే దేవుడని చెప్పుటకుగానీ వారు ప్రత్యక్షముగా మెలుకువలో కనిపించరు. కాబట్టి ఫలానావారు కనిపించారని చెప్పుటకు మాత్రమే స్వప్నము పనికివస్తుంది. వీరు ఫలానావారని చూపించుటకు స్వప్నము పనికిరాదు. అట్లే ప్రవక్తగారికి స్వప్నములో కనిపించలేదు అని చెప్పుటకు కూడా ఎవరివద్దా ఏ ఆధారముండదు. స్వప్నములో జరిగిన అసాధారణ విషయములను ఎవరూ ఖండించలేరు. అందువలన ప్రవక్తగారికి యాభై రెండవ ఏట జరిగిన మేరాజ్ యాత్రను మనము కాదనలేము.
స్వప్నములో జరిగినది ఎవరికయినా వారి అనుభవములో ప్రత్యక్షముగా జరిగినట్లేయుండును. అందువలన ప్రవక్తగారు తన మేరాజ్ ప్రయాణమును ప్రత్యక్షముగా వర్ణించి చెప్పియుండవచ్చును. అయితే దానిని విన్నవారు ఇది స్థూలముగా జరిగినదికాదు, సూక్ష్మముగా స్వప్నములో జరిగి యుండవచ్చునని ఎందుకు అనుకోకూడదు? ఒక విషయము అవగాహన చేసుకొనేదానినిబట్టి అర్థమగును. అట్లే స్వర్గ, నరకముల విషయములో కూడా అర్థము చేసుకోవలసియున్నది. ఇకపోతే దేవుడుగానీ, దేవుని విషయ ధర్మములుగానీ, ఇటు మెలుకువకు అటు స్వప్నమునకు సంబంధించినవి కావు. దేవుని జ్ఞానమంతయూ కేవలము అంతరంగమునగల బుద్ధితో గ్రహించవలసియుంటుంది. మెలుకువలో అయినా స్వప్నములో అయినా జీవునికి ప్రత్యక్ష అనుభవముగా అక్కడి విషయములుండును. అయితే దేవుని జ్ఞానము కేవలము బుద్ధి ఒక్కటే గ్రహించగలుగునది. అందువలన అది మెలుకువలోగానీ, స్వప్నములోగానీ తెలియునని చెప్పుటకు వీలులేదు. మెలుకువలోనేగాక, స్వప్నములోనేగాక రెండూ కానటువంటి యోగములో అంతర్ముఖ దృష్ఠిచేత కూడా బుద్ధికి తెలియును. ఈ మూడవ విధానము చాలా అరుదుగా ఏర్పడునది. అందువలన అందరికీ మూడవ విధానముండునని చెప్పలేము.
ఈ మూడవ విధానముచేత మనిషి ఇటు దేవునివైపు అయినా రావచ్చును, లేక అటు మాయవైపు అయినా పోవచ్చును. ఈ విధానము చేతనే మనిషిని దేవునిమాయ దేవునివైపయినా పంపగలదు లేక ప్రపంచమువైపయినా పంపగలదు. ఈ విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో 74వ సూరా, 31వ ఆయత నందు "అల్లా తాను కోరినవారిని మార్గభ్రష్టత్వము పొందునట్లు చేస్తాడు. మరియు తాను కోరినవారిని మార్గదర్శకత్వము చేస్తాడు.” అనగా దేవుడు అనుకొంటే జ్ఞానిగానయినా మార్చగలడు. అట్లే తాను అనుకొంటే అజ్ఞానిగానయినా మార్చగలడు. అలా మార్చుట స్వయముగా దేవుడు చేయకున్నా, దేవుని కనుసన్నలలో మెలుగు ప్రకృతి జనిత మాయ వాని బుద్ధిని ఆవహించి ఎటయినా పంపగలదు. అటువంటి వానికి దేవుడు వచ్చి ప్రత్యక్షముగా చెప్పినా వాడు వినడు. స్వప్నములో తనది తప్పని తెలిసినా వాడు మారడు. లోపల బుద్ధి ఎటు సూచిస్తే అటుపోగలడు. వానిబుద్ధిని గుణముల మాయ మార్చడము వలన మేము మా గ్రంథములలో బుద్ధి గుణానుసారిణి, చిత్తము కర్మానుసారిణి అని అనేకమార్లు చెప్పాము.
భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగమున 19,20 శ్లోకములలో కూడా జ్ఞానమునకు దూరముచేతుననియే చెప్పాడు.
19వ శ్లోకము: తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్। క్షిపామ్యజస్ర మశుభా నాసురీ ష్వేవ యోనిషు॥
20వ శశ్లోకము: ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మనిజన్మని। మా మప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్||
భావము :- క్రూరులను, ద్వేషులను మంచికి దూరముగాయున్న నరులలో అధములైనవారిని అసురయోనులయందే పుట్టించి సంసార దుఃఖములను పొందునట్లు చేయుచుందును.
అసుర గర్భములందు పుట్టిన అట్టి జనులు జన్మజన్మకూ అజ్ఞాను లగుచూ, నన్ను (దేవున్ని) తెలియు జ్ఞానమును తెలియలేక, జన్మజన్మకూ అధోగతిపాలగుచుందురు.
ఈ విధముగా దేవుడు తనకిష్టములేని వారిని తన మాయచేత వాని బుద్ధియందు మార్పు కల్గించి తన జ్ఞానమునకు దూరముగా పోవునట్లు చేయగలడు. ఇది బయట ప్రత్యక్షముగా కాకుండా, స్వప్నములో పరోక్షముగా కాకుండా అంతరంగమున బుద్ధి ద్వారా చేయు కార్యమని తెలియవలెను. దేవుని జ్ఞానముకల్గి దైవమార్గములో పోవుటకు కూడా లోపల బుద్ధియే ఆయుధముగా పనిచేయుచున్నది. మాయ అనుకొంటే బుద్ధి గ్రహింపుకు సరియైన జ్ఞానమునందించి జ్ఞానమార్గములోనికి కూడా పంపగలదు. ఇప్పుడు మనము చర్చించు స్వర్గ, నరకములు కూడా అంతరంగమందు బుద్ధి గ్రహించుకొను దానినిబట్టి అర్థము కాగలదు. యుద్ధరంగములో దేవుడుంటాడనుకొని అక్కడికిపోయి దేవుని కొరకు యుద్ధము చేస్తే మరణము తర్వాత స్వర్గమునకు పోతానని ఒకడు అనుకోవడము జరుగుచున్నదంటే, అది వాని అంతరంగమున బుద్ధికి కల్గిన భావము కాకపోయినా, అది ఇతరులు ప్రత్యక్షముగా చెప్పడము వలన, బోధించడము వలన దానినే బుద్ధి గ్రహించి అతడు ఆ విధముగా అనుకోవడము జరిగినది. కొందరికి ప్రత్యక్ష బోధల వలనగానీ, స్వప్నములో తనకు తన ఆత్మే తెల్పిన దానివలన గానీ, ఈ రెండూ కాకుండా అంతరంగమున మాయ బుద్ధికి చెప్పడము వలన గానీ ఒక భావములోనికి రావడము జరుగుచున్నది. ముస్లీమ్లందరూ ప్రత్యక్ష బోధల వలన స్వర్గమును గురించి అదొక లోకమనీ, అక్కడ అన్నీ సుఖములున్నాయనీ అనుకోవడము జరుగుచున్నది. అట్లే నరకము కూడా ప్రత్యేకమైన
లోకమనీ, అక్కడ అనేకమైన శరీరబాధలుకలవనీ అనుకొంటున్నారు. మనిషి మరణించినప్పుడు స్థూలశరీరమును చనిపోయిన స్థలములోనే వదలి జీవుడు పోవడము జరుగుచున్నది. చనిపోయిన వానికి శరీరమే లేనప్పుడు, శరీరము భూమిలో కుళ్ళిపోయి మన్నుగా మారిపోవు చుండగా, మరొక నరకలోకమున శరీరముతో జీవుడు బాధలు అనుభవించు చున్నాడని అనుకోవడము జరిగేపనేనా, శరీరము లేనిది ఎలా శరీర బాధలు అనుభవించనగునని ఎవరూ కొద్దిగయినా ఆలోచించే ప్రయత్నమే చేయలేదు.
అదే విధముగా మరణించినవానికి శరీరము లేదు కదా! శరీరము లేనిది స్వర్గ లోకమున స్త్రీలతో సుఖములను ఎట్లు అనుభవించునను యోచన ఎవరూ చేయలేదు. అట్లు ఆలోచించకుండా అందరూ గ్రుడ్డిగా నమ్ముటకు వారి బుద్ధికి ఆ విధముగా అర్థమయినది. దానివలన వాడు తిరిగి దానిని యోచించదలచుకోకుండా, ప్రతి ఒక్కచోట మొదట బుద్ధి తెల్పిన విధముగానే పోవుచుండును. స్వర్గ నరకముల గురించి ప్రత్యక్ష బోధకులు చెప్పిన విషయము చాలామంది బుద్ధికి అంటుకోవడము వలన, బోధకుల బుద్ధి ప్రకారమే శిష్యులు లేక అనుచరుల బుద్ధి కూడా మారియుండును. అందువలన మా గురువులు ఇలానే చెప్పారనిగానీ, మా పెద్దలు చెప్పునదే సత్యమనిగానీ వాదించుచుందురు. అయితే తమ పెద్దలుగానీ, బోధకులు గానీ చెప్పినది సత్యమా కాదాయని యోచించు స్థితిలో ఉండరు. అటువంటి అవివేకుల ముందర సత్యమును చెప్పినా వినకపోవడమేకాక, చెప్పిన వానిని దూషిస్తారు.
స్వర్గనరకములను గురించి అందరికీ అవగాహన అయినట్లు మాకు కాలేదు. దానికి కారణము మేము ఎక్కడా బయటి బోధలను వినలేదు. స్వప్నములో వాటిని గురించి తెలియలేదు. మొత్తానికి నాకు అంతర్ముఖముగ బుద్ధికి కల్గిన భావమే ముఖ్యమైనదిగా తెలియడము వలన, దానినే నేను అనేకమార్లు బయట మనుషులకు చెప్పాను. నా బుద్ధికి స్వర్గనరకముల మీద మంచి అవగాహనయుండునట్లు ప్రకృతి చేసిందని చెప్పక తప్పదు. పరమాత్మకు నేను ఇష్టుడనయినందున ప్రకృతి నాకు అసలయిన జ్ఞానమును అందించినది. నేను ముందే చెప్పాను ప్రకృతి అంతర్ రూపమయిన మాయ ఎవని బుద్ధిని ఎటయినా త్రిప్పగలదనీ, నాకు పరమాత్మ ఇష్టుడు అయినందున నేను ప్రకృతికి కూడా ఇష్టుడనగుదును. నన్ను సరియైన దైవమార్గములో నడిపించుటకు మాయ నా బుద్ధికి అసలయిన వాస్తవమైన జ్ఞానమునందించి, స్వర్గనరకముల యొక్క రహస్యమును తెలిపినది. స్వర్గ నరకములను గురించి బైబిలులో చెప్పినదానికంటే ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా చెప్పారు. హిందూ సమాజములో స్వర్గనరకములను వివరించి చెప్పుటకు కొన్ని పురాణములే తయారు చేయబడినాయి. అందులో గరుడ పురాణమనునది ప్రత్యేకించి నరకమును గురించి చెప్పుటకే తయారు చేయబడినది. వాటిలోయున్న దానికంటే మించి చెప్పు ఎందరో ఉద్దండ బోధకులు కూడా ఉన్నారు. అందరికీ తెలిసినది రహస్యము కాదు. ఎవరికీ తెలియనిదే రహస్యమగును. భూమిమీద ఎన్ని గ్రంథములు స్వర్గనరకములను గురించి చెప్పినా, ఎంతమంది బోధకులు ఆ లోకములోనికి పోయి తాము చూచివచ్చినట్లు చెప్పినా, వాస్తవానికి స్వర్గనరకములు రెండూ ఎవరికీ తెలియనివిగానేయున్నాయి. అందువలన స్వర్గనరకములను నేను రహస్యములని చెప్పాను.
హిందూసమాజములో కొందరు పెద్దలు తమకు తెలిసిన జ్ఞానము ప్రకారము స్వర్గమును ఒక లోకమని చెప్పారు. మొదట స్వర్గమును ఒక లోకమని చెప్పినవారిలో హిందువులే మొదటివారు. తర్వాత వచ్చిన క్రైస్తవులుగానీ, ఆ తర్వాత వచ్చిన ముస్లీమ్లుగానీ స్వర్గమును లోకమనియే చెప్పడము జరిగినది. వారందరూ దానికి వ్యతిరేఖమయిన నరకమును కూడా మరొక లోకమని చెప్పారు. ఈ విధముగా దాదాపుగా అన్ని స్వర్గమును ఒక లోకమనిన
మతముల యొక్క దృష్ఠిలో స్వర్గ నరకములు రెండూ రెండు లోకములేనని కలదు. స్వర్గనరకములను గురించి మిగతా రెండు మతములలో హిందూమతముకంటే తక్కువే చెప్పారని చెప్పవచ్చును. ఆ రెండు మతములలో స్వర్గ నరకమును గురించి ప్రత్యేకమైన గ్రంథములు లేవుగానీ, హిందూమతములో స్వర్గలోకమును గురించి, నరకలోకమును గురించి ప్రత్యేకమయిన గ్రంథములే గలవు.
మిగతా మతముల మూలగ్రంథములయిన బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో మాత్రము స్వర్గ నరకములను గురించి చెప్పడము జరిగినది. హిందూ గ్రంథమయిన భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయమున రెండు శ్లోకములలో స్వర్గమును, నరకమును గురించి చెప్పడము జరిగినది. 20వ శ్లోకమున స్వర్గమును గురించి, 21వ శ్లోకమున నరకమును గురించి చెప్పిన విషయముగలదు.
21వశ్లోకము:
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్య మాసాద్య సురేంద్రలోకమ్ అన్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్.
శ్లోకము: తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి। ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే॥
భావము :- వేదపారాయణులు, యజ్ఞము చేయువారు, దేవతా ఉపాసకులు పాపమును పొందక పుణ్యమును పొందినవారై, పుణ్య ఫలితముగా ఇంద్రలోక మయిన స్వర్గమును పొంది, అక్కడ మంచి హోదాలో మంచి సుఖములు అనుభవించుచుందురు.
ఇంద్రలోకములోని స్వర్గములో పుణ్యఫలముగా సుఖములను అనుభవించి, పుణ్యము అయిపోయిన వెంటనే పాపమును అనుభవించుటకు తగ్గులోకమయిన నరకలోకమునకు వచ్చుచుందురు. ఈ విధముగా మంచి చెడు కర్మలను సంపాదించుకొన్నవారు శాశ్వత సుఖములను అనుభవించక, పుణ్యము అయిపోయిన వెంటనే పాపమును అనుభవించుటకు నరకమునకు పోవుచుందురు.
గీతలోని ఈ రెండు శ్లోకములలో స్వర్గమును, నరకమును లోకములని వర్ణించి చెప్పడము జరిగినది. ప్రథమ దైవ గ్రంథములోనే స్వర్గనరకములను లోకములని చెప్పినప్పుడు మిగతావారు కూడా మిగతా గ్రంథములలో స్వర్గనరకములను ధైర్యముగా లోకములని చెప్పారు. ఇట్లు ప్రపంచములోని మనుషులందరూ స్వర్గనరకములను ప్రత్యేక లోకములుగా భావించను మొదలుపెట్టారు. అక్కడ సూక్ష్మమైన అర్థమేమయినా ఉన్నదేమో నని ఏమాత్రము ఎవరూ అనుకోలేదు. ఇంతవరకు ఎందరో చెప్పుచున్నా లోకము అను శబ్ధమునకు అర్థమేమయినా ఉన్నదేమోనని ఎవరూ చూడలేదు. మనము నివసించునది భూలోకమని ఎవరో చెప్పినప్పుడు, భూలోకమనునది ఎట్లున్నదో అట్లే ప్రత్యేకముగా స్వర్గలోకము మరియు నరకలోకము ఉంటుందని అందరూ అనుకొన్నారు. అప్పటినుండి నేటివరకు అదే భావముతోనే అందరూ ఉండడము జరిగినది. ఆ భావము ప్రకారమే భూలోకమునకు పైన ఊర్ధ్వలోకమని పిలువబడు స్వర్గలోకమున్నదనీ, అలాగే భూలోకమునకు క్రిందగల మర్త్యలోకమని పిలువబడు నరకలోకమున్నదనీ అందరూ అనుకోవడము జరుగుచున్నది. అంతేకాక భూలోకమును గత చరిత్రలో ఎందరో రాజులు పాలించినట్లు, స్వర్గలోకమును ఒక రాజు, నరకలోకమును మరొక రాజు పాలించుచున్నారని కూడా హిందూమత పురాణములలో చెప్పుకోవడము జరిగినది. భూలోకమునకు
పైన గల స్వర్గలోకమును ఇంద్రుడను రాజు పాలించుచున్నాడనీ, క్రింద గల నరక లోకమును యముడను రాజు పాలించుచున్నాడని పురాణగ్రంథములలో చెప్పడమైనది.
పురాణములను అందులోని స్వర్గనరకలోకములను గురించి బోధించు బోధకులను మేము ఒక ప్రశ్న అడిగాము. అదేమనగా! "భూలోకములాంటిదే స్వర్గలోకము, నరకలోకమని చెప్పుచున్నారు కదా! అట్లే భూలోకమును పాలించినట్లు స్వర్గనరకములను ఇంద్రుడు, యముడు పాలించుచున్నారని చెప్పుచున్నారు కదా! అదే నిజమని మేమనుకొనినా మాకు ఒక ప్రశ్న రాకతప్పదు. భూలోకమును ఎందరో రాజులు ఒకరి తర్వాత ఒకరు పాలించిపోయారని అందరికీ తెలుసు. అయితే స్వర్గ లోకమును పూర్వమునుండి నేటివరకు ఇంద్రుడే పాలించుచున్నాడని చెప్పుచున్నారు. అట్లే నరకలోకమును ఆదినుండి యముడే పాలించు చున్నాడని చెప్పుచున్నారు. భూలోకములో ఇంతవరకు ఎవరుగానీ శాశ్వతముగా ఒక్కరే పాలించలేదు. అటువంటప్పుడు స్వర్గమును ఒకే రాజు ఎలా పాలించుచున్నాడు? వారికి పదవీ విరమణ ఉండదా? భూమి మీద రాజులు ముసలివారై మరణించిన తర్వాత వారి సంతతి వారసులుగా రాజులయినారు. ఆ విధముగా స్వర్గనరకములలో ఇంద్రునికీ యమునికీ వారసులు లేరా? ఇంద్రుడు యముడు ముసలివారు కాలేదా? వారికి మరణముండదా?” అని నేను ప్రశ్నలడిగాను. దానికి పురాణ పండితులు చెప్పిన జవాబు ఇలాగున్నది.
“భూలోకములోయున్నది మానవులు, స్వర్గలోకములోనున్న ఇంద్రుడూ, యమలోకములోనున్న యముడూ మరియు ఆ లోక వాసులందరూ మనవలె మనుషులుకాదు. వారందరూ దేవతా జాతివారు. వారు అమృతమును త్రాగియుండుటవలన మనవలె వారికి జనన మరణములుండడముగానీ, వృద్ధాప్యము రావడముగానీ ఉండదు. అందువలన వారు శాశ్వతముగా ఒకే విధముగా ఉందురు. అట్లుండుట వలన పూర్వమునుండి స్వర్గమునకు ఇంద్రుడు, నరకమునకు యముడు శాశ్వత రాజులుగా యున్నారు” అని పురాణపండితులు చెప్పడము జరిగినది. ఈ విధముగా హిందూమతములోని పురాణముల సారాంశ ముండగా, మిగతా మతములలో నరకము, స్వర్గము రెండూ రెండు లోకములుగా చెప్పబడుచున్నా వాటికి రాజులున్నట్లు చెప్పడము లేదు. ఏది ఏమయినా, ఎవరు ఎట్లు చెప్పుకొనినా అందరి తలలలో స్వర్గము, నరకమూ భూలోకమువలె రెండు లోకములుగా యున్నాయని అనుకోవడము జరుగుచున్నది. ఇదంతయూ విన్న తర్వాత కూడా మాకు అందరివలె స్వర్గనరకముల మీద నమ్మకము ఏర్పడక ఇంకా అనేకముగా ప్రశ్నలు ఉద్భవించాయి. వాటికి సరియైన సమాధానము బయట ప్రపంచములో ఎవరూ ఇవ్వనందున లోపలి ప్రపంచమయిన, శరీర అంతర్భాగమున అధిపతిగా, రాజుగాయున్న ఆత్మనే ఆశ్రయించి అడుగవలసివచ్చినది. అప్పుడు శరీరమున చైతన్యమూర్తిగాయున్నవాడు, నాకు స్నేహితునిగా యున్నవాడు, నా ప్రక్కనేయున్న నా పొరుగువాడు అయిన ఆత్మ తెలియ జేసిన సారాంశమును చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యమయినది. మనకు ఏ కోశములో రాని ప్రశ్నలను ఆత్మే ప్రశ్నించి, వాటికి ఎవరూ ఊహించని జవాబులను అందించినప్పుడు, మనకు ఇంతవరకు తెలియని రహస్యములు ఉన్నాయా!యని ఒకింత ఆశ్చర్యము కలుగకమానలేదు. అంతరంగమున తెలిసిన సత్యమును గురించి, అందరూ సత్యమును తెలియాలను ఉద్దేశ్యము నాలో కల్గినది. అందువలన నాకు తెలిసినది తెలుపుచున్నాను.
లోకము అంటే తెలుగులో సరియైన అర్థము ఇంతవరకు తెలియదనియే చెప్పవచ్చును. తెలుగు పండితులు తెలిపిన అర్థములు నిఘంటువులో పొందుపరచినా, అందులో ఆధ్యాత్మిక విద్యకు సరిపోవు అర్థములు లేవనియే చెప్పవచ్చును. నిఘంటువులోని అర్థములు ఇలా గలవు చూడండి. లోకము అనగా జగము అని చెప్పడమేకాక లోకములు మూడు రకములని చెప్పారు. అవి ఇలా ఉన్నవి. 1) స్వర్గలోకము (ఇంద్రలోకము), 2) మర్త్యలోకము
(మధ్యలోకము), 3) పాతాళలోకము (నరకలోకము). మర్త్య లోకము మనుషులు నివసించునదికాగా, దానికి పైనగల స్వర్గమునకు సంబంధించినవి ఏడు లోకములు గలవు. అట్లే మర్త్యలోకమునకు క్రింద ఏడు లోకములు గలవు. అవి క్రింద చెప్పినట్లు కలవు.
1)భూలోకము, 2)భువర్లోకము, 3)సువర్లోకము, 4)మహర్లోకము, 5)జనలోకము, 6)తపోలోకము, 7)సత్యలోకము,
ఈ ఏడు పైనుండు ఊర్థ్వ లోకములు, స్వర్గమునకు సంబంధించిన లోకములు ఏడు.
మర్త్య లోకము (1)మధ్యలోకము(మనుషులు నివసించు లోకము).
1)అతలము (అతలలోకము), 2)వితలము (వితలలోకము), 3)సుతలము (సుతలలోకము), 4)రసాతలము (రసాతలలోకము) , 5)మహాతలము (మహాతలలోకము), 6)తలాతలము (తలాతలలోకము), 7)పాతాళము (పాతాళలోకము).
నరకమునకు సంబంధించిన లోకములు ఏడు , ఈ ఏడు అథో లోకములు.
నిఘంటువు ప్రకారము మొత్తము లోకములు పదిహేను అవుతున్నవి. ఇందులో చెప్పినవి చదువుకోవడానికిగానీ, లెక్క చెప్పు కోవడానికి గానీ బాగుంటుంది. అంతేతప్ప ఏదీ శాస్త్రబద్ధము కాదని తెలియుచున్నది. మర్త్యలోకము అనునది భగవద్గీతలో చెప్పబడినది. మనుషులు పుణ్యమయిపోయిన వెంటనే మర్త్యలోకములోనికి పోవలసిందేనని చెప్పారు. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి” అని రాజవిద్యా రాజగుహ్య యోగమున చెప్పడమయినది కదా! దానిప్రకారము మనుషులు నివసించు లోకము మర్త్య లోకమని తెలిసిపోయినది. దానినే మధ్యలోకమని అంటున్నాము. ఇంతవరకు ఎవరికయినా కొంత అర్థము కాగలదు. మిగతా ఏడు ఏడు పదునాలుగు లోకములు ఇటు జ్ఞానమునకుగానీ, అటు విజ్ఞానమునకు గానీ సంబంధించినవి కావనియే చెప్పవచ్చును. దేవుని జ్ఞానమంతయు విజ్ఞానమునకు సంబంధించినదే అయితే, ఆ విషయము చాలామందికి తెలియక భక్తి, జ్ఞానము మూఢనమ్మకములతో కూడుకొన్నదని చెప్పుచుందురు. వారన్నట్లు భక్తి, జ్ఞానము మూఢనమ్మకమైనది కాదు. అది సైన్సులలోకెల్ల పెద్ద సైన్సని చెప్పవచ్చును. దానినే మేము మా గ్రంథములందు చాలాచోట్ల సూపర్సైన్సని వర్ణించి చెప్పాము. మా గ్రంథములయిన "త్రైతాకార రహస్యము”లో, “పునర్జన్మ రహస్యము”లో, “మరణ రహస్యము”లో, “జనన మరణ సిద్ధాంతము”లలో సూపర్సైన్సు బాగా కనపడగలదు.
దైవజ్ఞానము ఏదైనా విజ్ఞానము (సైన్సు) తో కూడుకొని యుండవలయును. అట్లు కాని దానిని దైవజ్ఞానమని చెప్పుటకు వీలుపడదు. దానిని బ్రహ్మవిద్యా శాస్త్రము ఒప్పుకోదు. భగవద్గీతలోని విజ్ఞాన యోగమందు రెండవ శ్లోకమున శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పాడు "జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్య శేషతః" శేషము లేకుండా జ్ఞానమును విజ్ఞాన సహితముగా తెలియజేస్తానని భగవంతుడు చెప్పినప్పుడు, ఏ ఇందువయినా భగవద్గీత నుండి సంపూర్ణ జ్ఞానమును శాస్త్రబద్ధముగా తెలుసుకోవచ్చును. మనుషులు వ్రాసిన గ్రంథములలోని విషయములనూ, మనుషులు చెప్పిన మాటలనూ వదలి, దేవుడు భగవంతునితో చెప్పించిన జ్ఞానమును తెలియగలిగితే జ్ఞానము సంపూర్ణముగా తెలియగలదు. అంతేకాకుండా సంశయములకు తావులేని జ్ఞానము తెలియును.
సంశయరహితమైనది ఏ జ్ఞానమయితే కలదో, ప్రశ్నలు ఉద్భవించని జ్ఞానము ఏదయితే కలదో దానినే నిజమైన జ్ఞానమనవచ్చును. అటువంటి జ్ఞానము ప్రకారము “లోకము” అనుమాటకు అర్థమును చూచిన నిజమైన అర్ధము అగుపడగలదు. ఇప్పుడు లోకము అనుమాటకు అర్థమును చూచుటకు లోకమును ప్రక్కన పెట్టి, ముందు “ఏకము” అనుమాటకు అర్థమును చూచిన, ఏకము అంటే ఒక్కటి అని తెలియగలదు. మనకు బాగా అర్థమగుటకు నాలుగు వస్తువులను తీసుకొందాము. ఇప్పుడు ఒక త్రాడునూ, ఒక గుడ్డనూ, ఒక ఈకనూ, ఒక పుస్తకమునూ తీసుకొన్నాము. ఈ నాలుగు వస్తువులు ఒక్కొక్కటిగాయున్నాయి. అందువలన ఏక త్రాడు, ఏక గుడ్డ, ఏక ఈక, ఏక పుస్తకము అని వాటిని అనవచ్చును. ఏకము అంటే ఒకటి అనేగా అర్థము. ఒక గజము పొడవున్న త్రాడును తీసుకొని ఇది ఒక త్రాడు అని చూపితే దానిని ఎవరూ కాదనరు. అట్లే గజము పొడవున్న నారను చూపితే దానిని నారనియే అందరూ ఒప్పుకొందురు. అయితే అదే నారను కలిపి, పేడి, త్రాడును చేసి చూపితే దానిని త్రాడు అంటారుగానీ నార అని అనరు. త్రాడులో నార కనిపించలేదా అంటే, నార కనిపిస్తున్నది, అయినా అప్పుడు దానిని నార అనము. ఎందుకనగా అనేకముగాయున్న నారపీసులన్నీ ఏకముగా మారియున్నాయి. అనేకముగా యున్న నార ఏకముగా మారుట వలన నార ఏకత్వమును త్రాడు అని అనవలసి వచ్చినది.
ఇంతకుముందు నాలుగు వస్తువులలో ఒక త్రాడును తీసుకొన్నాము కదా! దానిని పూర్తి పురివిప్పి తాడునంతటినీ విడి నారపోగులుగా చేయవచ్చును. అప్పుడు దానిని త్రాడు అనుటకు వీలులేదు. అంతకు ముందు ఏకముగాయున్న త్రాడును అనేక నారపోగులుగా చూస్తున్నాము కావున దానిని నార అనియే అనాలి, త్రాడు అని అనకూడదు. సమిష్టిగా యున్నదానిని త్రాడు అంటున్నాము, సమిష్టిగా లేనిదానిని నార అంటున్నామని అందరికీ బాగా అర్థమయివుంటుంది. ఇందులో అర్థము కానిది ఏదీలేదు. ఏకత్వము, అనేకత్వము అనునవి రెండు మాత్రమే ఇక్కడ కలవు. ఏకత్వమునకు ఒకపేరు ఉంటే, అనేకత్వమునకు మరొక పేరు యున్నది. అలాగే ఈ సూత్రము ప్రకారమే నూలుపోగుల (దారముల) సమిష్ఠి దృశ్యమును గుడ్డ అంటున్నాము. అదే గుడ్డను విడదీసి దారములుగా (నూలు పోగులుగా) చేస్తే దానిని నూలు అంటున్నాము, అట్లే ఒక ఈకలో అనేక వెంట్రుకలు కలిసియున్నాయి. అనేక వెంట్రుకలు కలిసి గాలిని నిరోధించు ఒక వస్తువుగా మారియుండుటవలన దానిని ఈక అంటున్నాము. వెంట్రుకల ఏకత్వమును ఈక అంటే ఈక అనేకత్వమును వెంట్రుకలు అంటున్నాము. అదే విధముగా ఒక పుస్తకమును తీసుకొని చూస్తే అందులో వందపేపర్లు కలిసికట్టుగా యుండుట వలన నూరు పేపర్ల ఏకత్వమును పుస్తకము అంటున్నాము. అదే పుస్తకమును చించి విడివిడిగా నూరు పేపర్లుగా మార్చివేస్తే, ఏకత్వము పోయి అనేకత్వము వచ్చిన దానివలన అప్పుడు దానిని పుస్తకము అనుటకు వీలులేదు. ఆ సమయములో దానిని పేపర్లుగా బహువచనముతో చెప్పవలసివచ్చినది. అదే పేపర్లనే ఒక కట్టగా పెట్టి
కుట్టి ఒకచోట చేర్చితే ఏకత్వముగా మారుట వలన దానిని పుస్తకము అనవచ్చును. దానినే అనేకత్వముగా చీల్చి అనేకముగా చేసినప్పుడు దానిని పుస్తకము అనుటకు వీలులేదు. అప్పుడు దానిని విడి పేపర్లుగానే చెప్పాలి.
ఇంతవరకు చెప్పినది అందరికీ సులభముగా బాగా అర్థమయి వుంటుంది. ఇదే పద్ధతి ప్రకారము కొంతమంది మనుషులను కలిపి ఒక సంఘము అంటున్నాము. ఒక ఊరిలో కొందరు చెత్తను శుభ్రము చేయుటకు ముందుకు వచ్చి వారమునకు ఒకమారు స్వచ్ఛందముగా బజార్లు ఊడ్చి శుభ్రము చేయుచున్నారనుకొనుము. ఇరవైమంది ఒక గుంపుగా ఏర్పడి స్వచ్ఛందముగా సేవచేయుట వలన ఆ ఇరవైమందిని కలిపి స్వచ్ఛంద సేవాసంఘము అంటున్నాము. ఇప్పుడు సంఘము అనునది ఒకటే అయినా అందులో ఉన్నది ఇరవైమంది. ఇరవైమంది కలిసినప్పుడు వారిని సంఘము అని అనవచ్చును. అట్లుకాక విడిగా ఒక్కొక్క మనిషిని సంఘము అనలేము. ఈ విధముగా ఎన్నో సంఘములు కలవు. నీళ్ళకొరకు పోరాడు మనుషుల గుంపును నీటిసంఘము, ఒక ఫ్యాక్టరీలో పనిచేయు కార్మికులనందరినీ ఒక కార్మికసంఘము అంటాము. అట్లే ఒక గుంపుగా ఏర్పడిన రైతులనందరినీ కర్షక సంఘము అంటాము. అదే విధముగా జ్ఞానుల నందరినీ కలిపి జ్ఞాన సంఘము అంటాము. గుంపుగా ఏర్పడిన విద్యార్థులనందరినీ విద్యార్థి సంఘము అంటున్నాము. ఈ విధముగా ఒకే దేశములో ఎందరో మనుషులున్నా వారు చేయు పనులనుబట్టి కొన్ని సంఘములుగా విభజింపబడియున్నారు. ఏ సంఘమును చూచినా అందులో కొంతమంది కలిసి యుండుట అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా మనుషులలోగానీ, వస్తువులలోగానీ ఏకత్వమునకు ఒక పేరు, అనేకత్వమునకు మరొక పేరుండడము అందరికీ తెలిసిన విషయమే. అట్లే ఒక త్రాడును త్రాడు అంటున్నాము ఎక్కువయున్నప్పుడు వాటినే త్రాళ్ళు అంటున్నాము. ఇక్కడ కొంత పేరు మారి బహువచనమగుచున్నది. అదే విధముగా వస్తువులను కాకుండా మనుషుల విషయములోనికి వస్తే, ఒక పాఠశాలలోయున్న విద్యార్థులను విద్యార్థిసంఘము అనవచ్చును. దేశములోని పాఠశాలలోనున్న విద్యార్థులనందరినీ కలిపి విద్యార్థిలోకము అని అంటున్నాము. అన్ని దేశములలోయుండు ఒక విభాగమునకు చెందిన మనుషులందరినీ కలిపిన ఏకత్వమునకు ప్రత్యేకించి లోకము అని పేరు పెట్టబడినది. అనేక దేశములలోని ఒకే విధానమునకు సంబంధించిన అందరినీ కలిపి లోకము అనడములో ఒక అర్థము గలదు. కొన్ని కలిసి ఒకటిగా ఏర్పడినప్పుడు దానికి పేరుమారినట్లు కొందరు మనుషుల సమూహములన్నిటినీ కలిపి ఏకము చేసి లోకము అంటున్నాము. అనేకముగాయుంటూ ఏకముగా చెప్పబడు దానికి లోకము అని అర్థము. ఏకమునకు ఒక్క అక్షరము మారి లోకము అగుచున్నది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. లోకము అనగా దానిలో అనేకమున్నాయని అర్థము. విద్యార్థిలోకములో విద్యను నేర్చుకొనువారు, లేక విద్యను అర్థించువారందరూ గలరు. భూమండలమంతా అన్ని దేశములలోని విద్యార్థుల విభాగమునకు సంబంధించిన వారందరినీ ఏకము చేసి విద్యార్థి లోకము అంటున్నాము కదా! అట్లే ప్రపంచములోని కార్మికులను అందరినీ కలిపి ఏకత్వముగా కార్మికలోకము అంటున్నాము. ప్రపంచములో వ్యయసాయము చేయు రైతులందరినీ కలిపి కర్షకలోకము అని అంటున్నాము. అదే విధముగా ప్రపంచములో సుఖములను అనుభవించు మనుషులందరినీ కలిపి స్వర్గలోకము అంటున్నాము. అట్లే ప్రపంచములో బాధలు అనుభవించు వారందరినీ కలిపి ఏకముగా నరకలోకము అంటున్నాము. ఇట్లు అనేక లోకములు ఒకే ప్రపంచములోనే ఉన్నాయి తప్ప అవి వేరువేరు ప్రపంచములుగా లేవు. ఈ సూత్రము ప్రకారము అనేక లోకములు కలిసి ఒక ప్రపంచమవుచున్నది. మనకున్నది ఒక ప్రపంచమే, ఆ ప్రపంచము అందరికీ తెలియునట్లు కనిపించుచున్నది, వినిపించుచున్నది, ప్రత్యక్ష అనుభవములో యున్నది.
ప్రత్యక్షముగాయున్న ప్రపంచములో విచక్షణతో చూడగలిగితే అన్ని లోకములూ మనమున్న ఈ ప్రపంచములోనేయున్నవని తెలియగలవు.
ప్రత్యక్షముగాయున్న ప్రపంచమును అందరమూ చూస్తున్నాము. ప్రపంచములోని లోకములన్నిటినీ చూస్తున్నాము. అయినా ఎదురుగాయున్న లోకములను గ్రహించలేక అవి ఎక్కడో ఉన్నాయనుకోవడము గ్రుడ్డితనము కాదా! యని అడుగుచున్నాను. వాస్తవముగా అనేక సుఖములను అనుభవించు స్వర్గలోకమునకు సంబంధించినవారినీ చూస్తున్నాము. అలాగే అనేక బాధలను అనుభవించు నరకమునకు సంబంధించిన వారినీ చూస్తున్నాము. అయినా మన అజ్ఞాన గ్రుడ్డితనము చేత ఎవరినీ, ఏ లోక వాసులనూ గుర్తించలేకపోవుచున్నాము. అజ్ఞానులు ఎటూ గుర్తించలేరు. అయితే మేము జ్ఞానులము, మేము ధర్మరక్షకులము, మేము పరమ హంసలము అని గుర్తింపుగా పేర్లు పెట్టుకొన్నవారు కూడా స్వర్గలోకము పైన ఉంది, దానికి ఒక రాజున్నాడు అని చెప్పడము విడ్డూరము కాదా! అలాగే నరకలోకము క్రిందయుంది, దానికి యముడు రాజని చెప్పడము అజ్ఞానము కాదా! ఏమీ తెలియని మనుషులు పెద్దలు చెప్పినదే సత్యమని నమ్ముట వలన పెద్దలనువారు పాడినపాటనే అందరూ పాడడము జరుగుచున్నది. ఎవరిని అడిగినా స్వర్గము, నరకములున్నవని చెప్పుచున్నారు గానీ, మీరు చూచారా? అంటే చనిపోయిన తర్వాత పుణ్యమును అనుభవించేదానికి స్వర్గమునకూ, పాపమును అనుభవించేదానికి నరకమునకూ పోవలసి యుంటుంది. అక్కడకు పోయిన తర్వాత చూడవచ్చునని ఆధ్యాత్మిక వేత్తలమనువారు కూడా చెప్పుచున్నారు.
ఆధ్యాత్మికవేత్తలమని పేరు పెంచుకున్న గుర్తింపుపొందిన గురువులు కూడా స్వర్గనరకముల విషయములో గ్రుడ్డిగా మాట్లాడుచున్నారు. అనేక కథలను తయారు చేసి యమలోకము ఒక నదీతీరమున ఉన్నదని చూచి వచ్చినట్లు చెప్పుచున్నారు. 'సతీసావిత్రి' కథను తయారు చేసి అది నిజముగా జరిగిన కథయని అందరినీ నమ్మించారు. ఆ కథలో సావిత్రి తన భర్త ప్రాణములను తీసుకొనిపోవుచున్న యముని వెంట పడినదనీ, తన భర్త ప్రాణములను అడుగుచూ యమునివెంట కొన్ని ఆమడల దూరము నడిచి పోయిందనీ, ఆమెను వదిలించుకొనుటకు యముడు రెండు వరములిస్తాను గానీ నీ భర్త ప్రాణములివ్వనని చెప్పినట్లు వ్రాశారు. అప్పుడు సావిత్రి అతి తెలివిగా యమున్ని తనకు సంతతి కావలెనని కోరిందనీ, యముడు ఆ కోర్కెను మన్నించి వరమునిచ్చి పోవుచుండగా, భర్త లేకుండా సంతతి ఎట్లు కలుగుతుందని ప్రశ్న అడిగిందనీ, అప్పుడు యముడు చేయునది లేక సావిత్రికి ఆమె భర్త ప్రాణములను ఇచ్చి ఒంటరిగా యమపురికి పోయాడని చెప్పారు. ఈ కథయొక్క ఉద్దేశ్యము నరకలోకము ఎక్కడోయున్నదనీ, దానికి యముడు రాజుగాయున్నాడని చెప్పడము తప్ప ఏమీ లేదని తెలియుచున్నది. జ్ఞానదృష్టి లేనివారికి 'సతీసావిత్రి' కథ గొప్పగా కనిపించినా, జ్ఞానదృష్టియున్న వారికి ఇదియొక కల్పిత కథగా కనిపించుచున్నది. ఇటువంటి పురాణగాథల వలన మనిషి సత్యమును వీడి ఆత్మజ్ఞానమునకు దూరముగా పోవుచున్నాడు తప్ప దగ్గరగుటకు అవకాశమే లేకుండా పోవుచున్నది.
సతీసావిత్రి పురాణము వలన నరకలోకమూ, నరకమునకు రాజు అయిన యమధర్మరాజు మాత్రమే మనుషులకు పరిచయమయినారు, అయితే అష్టాదశ పురాణములలో గల “గరుడ పురాణము” వలన పూర్తి యమలోకము అక్కడ జరిగే హింసలు, హింసలు పెట్టే యమభటులు మొదలగున వన్నీ తెలిసిపోయినవి. ఇటువంటి పురాణములను చదివినవారందరూ యమలోకము ప్రత్యేకముగాయున్నదని తప్పక చెప్పుదురు. ఈ విధముగా పురాణగాథలవలన, పురాణగాథలను పనిగట్టుకొని బోధించు బోధకులవలన, ఏమీ తెలియని ప్రజలు కూడా అజ్ఞానమువైపుకు పోవుటకు
అవకాశమేర్పడుచున్నది. మేము ఒకమారు, పురాణములను బోధించుచూ గురువులుగా చలామణి అగుచున్న ఒక వ్యక్తితో కలిసి మాట్లాడడము జరిగినది. అప్పుడు జరిగిన సంభాషణను క్రింద వివరముగా చూడండి.
నా ప్రశ్న :- స్వామీజీ మీరు చతుర్వేదములను, అష్టాదశపురాణములను తెలిసిన జ్ఞానులు కదా! మీరు ప్రజలకు గురువుగాయుండి కొంత జ్ఞానమును బోధిస్తున్నారు కదా! మీ బోధలలో ఎక్కువగా వేదములను బోధిస్తున్నారా? లేక పురాణములను బోధిస్తున్నారా?
జవాబు :- కొంత జ్ఞానమున్న బ్రాహ్మణులకు వేదములను బోధిస్తుంటాము. ఏ జ్ఞానమూలేని శూద్రులయిన వారందరికీ పురాణములను బోధిస్తుంటాము. శూద్రులకు పురాణములు బాగా రుచిస్తాయి. అందువలన పురాణములనే వారు బాగావింటారు. అందువలన ఎక్కువగా అందరికీ పురాణములనే చెప్పుచుంటాము.
నా ప్రశ్న :- శూద్రులకు కూడా వేదములను బోధించవచ్చును కదా! అట్లు కాకుండా శూద్రులకు పురాణములనే ఎందుకు చెప్పుచున్నారు?
జవాబు :- వేదములు బ్రాహ్మణులకొరకే తయారు చేయబడినవి. శూద్రుల కొరకు పురాణములు తయారు చేయబడినవి. అందువలన శూద్రులకు పురాణములను చెప్పుచున్నాము.
నా ప్రశ్న :- శూద్రుల కొరకు పురాణములనే ఎందుకు తయారు చేశారు?
జవాబు :- శూద్రులు ఎక్కువగా పాపపు పనులు చేయుచూ, పాపమును మూటగట్టుకొనుచుందురు. అటువంటివారికి మీరు చేయు పనులయందు ఎన్నో పాపపుపనులున్నాయనీ, పాపము వలన నరకమునకు పోయి చిత్రహింసలు అనుభవించవలసియుంటుందనీ, యమధర్మరాజువద్ద ప్రతి మనిషి చరిత్ర యుంటుందనీ, దాని ప్రకారము యమలోకములో శిక్షలు తప్పవనీ చెప్పుచుందుము. అప్పుడు పాపము వలన నరకము తప్పదని తెలియుట వలన, అటువంటి పాపపు కార్యములను భవిష్యత్తులో చేయకుందురు. అంతవరకు చేసిన పాపము పోవుటకు రుద్రాభిషేకము, సత్యనారాయణ వ్రతములు మొదలగునవి చేయుటకు అలవాటు పడుదురు. అభిషేకముల వలన, వ్రతక్రతువుల వలన చేసుకొన్న పాపము పరిహారమయి పోగా, జరుగబోవు కాలములో పాపపుపనుల జోలికి పోకుందురు. అందువలన ప్రత్యేకించి శూద్రులకు పురాణములను బోధిస్తుంటాము.
నా ప్రశ్న :- స్వర్గ, నరకములకు చనిపోయిన తర్వాత మనుషులు పోవలసి యుంటుందని మీరు చెప్పుచున్నారు కదా! స్వర్గమునకు ఎక్కువగా ఎవరు పోవుచున్నారు? నరకమునకు ఎవరు పోవుచున్నారు?
జవాబు :- పుణ్యము చేసినవారు స్వర్గానికీ, పాపము చేసినవారు నరకానికీ పోవుచున్నారు. శూద్రులు ఎక్కువగా పాపకార్యములనే చేయడము వలన ఎక్కువగా వారే నరకమునకు పోవుచున్నారు. స్వర్గమునకు అధికముగా బ్రాహ్మణులు పోవుచుందురు.
నా ప్రశ్న :- పాపమును చిత్రహింసల రూపముగా అనుభవించడమును నరకమనీ, పుణ్యమును సుఖముల రూపములో అనుభవించడమును స్వర్గమని అంటున్నాము కదా! స్వర్గమున్న దానిని స్వర్గలోకమనీ, నరకమున్న దానిని నరకలోకమనీ అంటున్నారు కదా! అట్లు కాకుండా స్వర్గమును ఇంద్రలోకమనీ, నరకమును యమలోకమనీ చెప్పవచ్చును కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- ఎందుకు చెప్పకూడదు? ఇంద్రలోకము, యమలోకమని చెప్పవచ్చును. అయితే అట్లు చెప్పుట వలన ఇంద్రలోకమన్నప్పుడు ఇంద్రుడు, ఇంద్రుని పాలనలోని అష్టదిక్పాలకులు, ఇంద్రసభ, ఆ సభలో నాట్యమాడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలగు అప్సరసలు జ్ఞాపకము వస్తారుగానీ, అక్కడికి పోయినవారు అనుభవించు సుఖములు జ్ఞాపకము రావు. అట్లే యమలోకము అంటే అక్కడున్న యముడూ, యముని వాహనము దున్నపోతూ, పాపపుణ్యములను నమోదు చేసుకొను చిత్రగుప్తుడూ, యమభటులూ మొదలగు యముని పరిపాలన జ్ఞాపకము వచ్చునుగానీ, అక్కడ పాపులు అనుభవించు బాధలు, యమకింకరులు మనుషులను హింసించు చిత్రహింసలు జ్ఞాపకము రావు. అందువలన యమలోకము అనుటకంటే నరకలోకము అనడమే మంచిది. అట్లే ఇంద్రలోకము అనుట కంటే స్వర్గలోకము అనుటయే మంచిది.
నా ప్రశ్న :- మీరు ఎంతో గొప్ప జ్ఞానులు, వేదవేదాంగ పారాయణులు, ఆధ్యాత్మికవేత్తలు, ఎందరికో గురువుగాయున్నవారు. నరకమును, స్వర్గమును గురించి ఎంతో విడదీసి చెప్పుచున్నారు. ఇటువంటి మీరు ఎంతో జ్ఞాన దృష్టి కూడ కల్గియుంటారు. అందువలన మిమ్ములను నేను అడుగునది ఏమనగా! సామాన్య మానవులు ప్రత్యక్షముగా చూడని స్వర్గమునుగానీ, నరకమునుగానీ మీరు చూచారా? లేక ఎవరైనా చూచారా? - జవాబు : – నేను ప్రత్యక్షముగా చూడలేదుగానీ, నా జ్ఞానదృష్టితో స్వర్గమును, నరకమును రెండిటినీ చూచాను. అందువలన స్వర్గము ఇట్లేయున్నదనీ, నరకము ఇట్లేయున్నదనీ చెప్పుచున్నాను. ఇతరుల విషయానికి వస్తే నచికేతుడు యమలోకమునకు పోయి యమలోకమును ప్రత్యక్షముగా చూచివచ్చాడు. అతనే కాకుండా ధర్మరాజు కూడా యుద్ధరంగములో చిన్న అబద్ధమును చెప్పి ద్రోణుని మరణమునకు కారణమయినందున, ఆ పాపము అనుభవించుటకు ఒకరోజు రాత్రంతయు యమలోకములో ఉండవలసి వచ్చినది. ఒక దినము యమలోకములో గడిపిన ధర్మరాజు తిరిగివచ్చి స్వర్గలోకమునకు పోయాడు. ఇట్లు గతచరిత్రలో అనేకమంది పోయివచ్చిన వారున్నారు.
నా ప్రశ్న :- స్వర్గనరకములకు పోయివచ్చినవారు మనముందర లేరు. జ్ఞానదృష్టితో పరోక్షముగా చూచిన మీరు ఇక్కడే ఉన్నారు కదా! యమలోకము మనకు ఎంత దూరములో ఉంటుంది?
జవాబు :- దానిని నేను చెప్పినా నీకు అర్థము కాదు. దానికి మైళ్ళు, కిలోమీటర్లు పనికిరావు. దానికొలత వేరే పరిమాణములో ఉంటుంది. (ఇక్కడ సూటిగా జవాబు చెప్పలేక, వారికే జవాబు తెలియక జవాబును దాటవేయుటకు అలా చెప్పారని అర్థము చేసుకోండి.)
నా ప్రశ్న :- స్వర్గలోకము యొక్క దూరమునయినా చెప్పగలరా?
జవాబు :- దానిని తెలుసుకొనుటకు నీవు అర్హుడవుకావు. అందువలన స్వర్గము యొక్క దూరమును నాకు తెలిసినా చెప్పను.
(స్వర్గము యొక్క దూరము ఆయనకే కాదు ఎవరికీ తెలియదు. అయినా తన పెద్దరికమును ప్రకటించుకొనుటకు నాకు తెలిసినా చెప్పనంటున్నాడు. సత్యము తెలిస్తే ఆయన ఎంత అజ్ఞానో ఆయనకే అర్థమవుతుంది.)
నా ప్రశ్న :- ప్రపంచములోని విద్యార్థులనందరినీ విద్యార్థుల లోకము అన్నట్లు, కార్మిక, కర్షకులను కార్మికలోకము, కర్షకలోకము అన్నట్లు ఇంద్రలోకమును సుఖాలలోకమనీ, యమలోకమును కష్టాలలోకమనీ పేరుపెట్టి పిలువకుండా, ఇంద్రలోకమునకు స్వర్గలోకమనీ, యమలోకము నకు నరకలోకమనీ ఎందుకు పేరు పెట్టారు? దయచేసి చెప్పండి.
వారి జవాబు :- సుఖాలలోకము, కష్టాలలోకమని పేరుపెట్టి పిలిస్తే అక్కడి రాజు కూడా అట్లే ఉండునేమోనని అనుకోవచ్చును. స్వర్గలోకమును సుఖాలలోకము అంటే అక్కడ రాజుగాయుండే ఇంద్రుడు అతని పరివారము అందరూ సుఖాలు అనుభవించేవారని ఎవరైనా అనుకొనుటకు అవకాశము గలదు. అట్లే నరకమును కష్టాలలోకము అంటే అక్కడ రాజుగాయున్న యమధర్మరాజు ఆయన పరివారము అందరూ కష్టాలు అనుభవిస్తున్నారేమో, అందుకే కష్టాలలోకమని పేరు పెట్టారేమో అని అనుకొనుటకు అవకాశము కలదు. అందువలన సుఖాలలోకమని స్వర్గమునకు, కష్టాలలోకమని నరకమునకు పేరుపెట్టలేదు.
నా ప్రశ్న :- నేనుగానీ, నాలాంటి ప్రజలుగానీ స్వర్గనరకములను గురించి ఇతరులు చెప్పుచుంటే వినడమేగానీ మేము ఏమాత్రము చూడలేదు. మీలాంటివారు ఎవరయినా చూచియున్నా అవి ఎట్లున్నాయో, ఎక్కడున్నాయో, ఎంత దూరములో యున్నాయో మాకు అర్థమయ్యేలాగా చెప్పరు. స్వర్గనరకముల గురించి శాస్త్రబద్ధముగా, హేతుబద్ధముగా, ప్రశ్నరాకుండు నట్లు, అనుమానము లేకుండా పోవునట్లు ఖచ్చితమైన సమాచారమును ఎవరూ అందివ్వడము లేదు. అలాంటప్పుడు మాలోని అనుమానముకొద్దీ కొన్ని ప్రశ్నలను స్వర్గ నరకములను గురించి అడుగవలసి వస్తుంది. అడిగితే ఎక్కడా జవాబు దొరకడము లేదు. అలాంటప్పుడు స్వర్గనరకములు అబద్దమేమోనను అనుమానము కూడా వస్తున్నది. ఒకవేళ అవి యుంటే వాటిని అర్థము చేసుకోవడములో ఏమయినా మనుషులు పొరపాటు పడినారాయని మరొక ప్రక్క అనుమానము కల్గుచున్నది. ఈ విధముగా స్వర్గనరకములు రెండూ సంశయాల నిలయముగా తయారయి నవి. మా సంశయములు ఈ జన్మలో తీరవా, మా ప్రశ్నలకు జవాబులు దొరకవా?
వారి జవాబు :- ఇంతవరకూ గంటనుండి నీతో మాట్లాడుచునేయున్నాను. నీవు అడిగిన ప్రశ్నలకన్నిటికీ జవాబును చెప్పాను. ఇంకా నీ దగ్గర ప్రశ్నలేమి మిగిలియుంటాయి? ఒకవేళయుంటే అడుగు దేనికయినా జవాబు చెప్పుతాను.
నా ప్రశ్న :- ఇంతకుముందు నేను అడిగిన ఒక ప్రశ్నకు నీకు చెప్పినా అర్థము కాదు అని ఒకమారు చెప్పారు. తర్వాత రెండవ ప్రశ్నను అడిగాను, అప్పుడు నన్ను జవాబు తెలుసుకొనే అర్హతే లేదని చెప్పారు. ఒకమారు అర్థము చేసుకోలేని వాడినయినాను. రెండవమారు పూర్తి అనర్హుడనైనాను. తర్వాత ఇంకా ప్రశ్నలడిగితే మనిషినే కాకుండా జంతువునయిపోతానే మోనను భయముతో ప్రశ్నలడగడము మానుకొన్నాను. శ్రద్ధయున్నవానికి జ్ఞానము తెలియునని భగవద్గీత జ్ఞానయోగమునందు 39వ శ్లోకములో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” అని అన్నారు కదా! తెలుసుకోవాలను శ్రద్ధయున్న మాకు ఈ స్వర్గ నరకముల జ్ఞానము తెలియదా?
వారి జవాబు :- అన్ని ప్రశ్నలకూ అందరివద్దా అన్ని జవాబులూ ఉండవు. నాకు తెలిసినవి నేను చెప్పాను. నాకు తెలియనివి కూడ ఉండవచ్చును కదా! అందువలన ఇంకా కొంతమందిని అడుగుతూపోతే, మిగతా ప్రశ్నలకు కూడా జవాబులు దొరకవచ్చును. అందువలన నిరుత్సాహపడక అడిగి తెలుసుకొనే ప్రయత్నము చేయండి. మీకు కావలసిన స్వర్గనరకముల సమాచారము కావాలంటే నేను చెప్పినదానికంటే ఎక్కువగా చెప్పువారు ఎవరూ ఉండరు. వాటిని గురించి ఆలోచించువారు గానీ, తెలుసుకొను వారుగానీ ఎవరూ లేరు. నీ ప్రశ్నలకు శాస్త్రబద్ధమైన జవాబులు దొరుకుట
దుర్లభమనియే చెప్పవచ్చును. ఎందుకనగా ఇంతవరకూ స్వర్గనరకములను గురించి పురాణములలోనే గలదు. ఎక్కడా శాస్త్రములలో ఎక్కువగా యున్నట్లు లేదు. పురాణముల మాటలు నిజమూ కావచ్చు, అబద్దమూ కావచ్చును. అందువలన నీ ప్రశ్నలకు ఖచ్ఛితమైన జవాబులు దొరుకుతా యని మేము చెప్పలేము. నీ పరిశోధననుబట్టి నీకు తెలియవలసిందే.
(ఈ విధముగా మా సంభాషణ కొనసాగిన తర్వాత జవాబు చెప్పు బోధకుడు స్వర్గనరకములను గూర్చి పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు చెప్పి ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేము అని అన్నాడు.)
బయటి ప్రపంచములోని మనుషులు గురువులుగా, స్వామీజీలుగా, బోధకులుగాయున్నవారు స్వర్గనరకముల గురించి ఏ విధమైన అవగాహనతో యున్నది, పాఠకులైన వారందరికీ తెలియాలను ఉద్దేశ్యముతో, వారితో మాట్లాడిన విషయములను వ్రాయాలని వ్రాశాము, హిందూ బోధకుడితో మాట్లాడిన తర్వాత ఒక ముస్లీమ్ పండితుని వద్దకు పోయి, మనిషి చనిపోయిన తర్వాత స్వర్గనరకములకు పోవడము వాస్తవమేనా? మనిషిని స్వర్గానికిగానీ, నరకానికిగానీ ఎవరు తీసుకుపోతారు? అని అడిగాను. దానికి వృద్ధుడయిన ముస్లీమ్ పండితుడు “నీవు ఖుర్ఆన్లోని 86వ సూరా (అత్ తారిఖ్) ను పూర్తిగా చదువుకో, అప్పుడు నీవు అడిగిన దానికి జవాబు బాగా అర్థమవుతుంది. మేము చెప్పేదానికంటే అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో వుండే సమాచారమును తెలుసుకోవడము మంచిది” అని చెప్పాడు. అప్పుడు "దివ్య ఖుర్ఆన్ సందేశము" అను ఒక తెలుగు అనువాద గ్రంథమునూ, "అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్” అను గ్రంథమును తెప్పించుకొని అందులోని "అత్ తారిఖ్" అను (86) సూరా మొత్తము చూచాను. అందులో మొత్తము పదిహేడు (17) వాక్యములున్నాయి. వాటిని మొత్తము క్రింద మీరు కూడా చూడవచ్చును. 86వ సూరా మొదట పరిచయ వాక్యములనుండి మొదలుపెట్టి రెండు గ్రంథములలోని 17 ఆయత్లను (వాక్యములను) వ్రాసి చూపించుచున్నాము చూడండి.
అత్ తారిఖ్ (ప్రభాత నక్షత్రము). (పరిచయము)
ఇందులో ముఖ్యముగా ప్రస్తావించిన విషయాలు-ప్రళయము, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడమూ, దైవవాణి అవతరించడమూ, మొదటి ఆయత్లో (వాక్యములో) వచ్చిన తారిఖ్ (ప్రభాత నక్షత్రము) అన్న ప్రస్తావనే ఈ సూరాకు పేరు పెట్టడము జరిగినది. మనిషి ఏ విధముగా వీర్య ద్రవమునుండి సృష్టించబడినది తెలుపుతూ, అల్లాహ్ మరణించిన ప్రతి ఒక్కరినీ తీర్పు దినాన మళ్ళీ లేపి నిలబెట్టగలడనీ, ఆ రోజు యావత్తు మానవాళి తుది తీర్పు కోసము దేవుని ముందు హాజరవుతారని చెప్పడము జరిగినది. ఆ రోజు ప్రతి ఒక్కరి మంచీ లేదా చెడు పనులు బట్టబయలవు తాయి. దివ్యఖుర్ఆన్ దేవుడు పంపిన సత్యమనీ, ఇది మంచిని చెడునుంచి వేరు చేస్తుందనీ, ఇవి వ్యర్థమైన ప్రసంగాలు కావని నొక్కి చెప్పింది.
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభము. అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ 1) ఆకాశము సాక్షిగా! రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా!
2) రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా?
3) అది ప్రకాశించే నక్షత్రము.
4) తనను కనిపెట్టుకొనియుండే దూత లేకుండా ఏ ప్రాణీపుట్టలేదు.
5) ఇక మానవుడు తాను దేనితో పుట్టించబడ్డాడో చూచుకోవాలి.
6) అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. గమనించాలి. 7) అది వెన్నెముక, ఛాతి మధ్య భాగములోనుండి వెలువడుతుంది.
8) నిశ్చయముగా ఆయన అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కల్గియున్నాడు.
9) ఆ రోజు లోగుట్టులన్నీ రట్టయి పరికించబడుతాయి.
10) అప్పుడు అతనికంటూ ఏ అధికారముగానీ, ఏ బలము గానీ ఉండదు. ఏ సహాయకుడూ ఉండడు.
11) వర్షము గల ఆకాశము సాక్షిగా!
12) బీటలువారే భూమి సాక్షిగా!
13) నిశ్చయముగా ఇది (ఈ ఖుర్ఆన్) నిర్ణయమైన వాక్కు.
14) ఇదేదో అషామాషీ విషయము కాదు. 15) వీళ్ళు (అవిశ్వాసులు) కొన్ని పన్నాగములు పన్నుతున్నారు.
16) నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను.
17) కాబట్టి (ఓ ప్రవక్తా) నువ్వు అవిశ్వాసులకు కాస్త కాలక్షేపానికి వచ్చినది కాదు. విడుపు ఇవ్వు, కొన్నాళ్ళపాటు వారిని వదలిపెట్టు.
దివ్యఖుర్ఆన్ సందేశము.:
1)ఆకాశము మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రము సాక్షిగా!
2)రాత్రివేళ వచ్చేది అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?
3)అదొక అత్యంత ప్రకాశవంత మైన నక్షత్రము.
4)కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తీ కూడా లేడు.
5)కావున మానవుడు దేనితో పుట్టించబడ్డాడో చూచుకోవాలి.
6)అతడు విసర్జింపబడే ద్రవపదార్థముతో సృష్ఠించ బడ్డాడు.
7)అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్య భాగమునుండి బయటికి వస్తుంది.
8)నిశ్చయముగా ఆయన (సృష్టికర్త) అతనిని మరలా బ్రతికించే సామర్థ్యముగలవాడు.
9)ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో.
10)అప్పుడు అతనికి (మనిషికి) ఎలాంటి శక్తి యుండదు. మరియు ఏ సహాయకుడూ ఉండడు.
11)వర్షమును కురిపించే ఆకాశము సాక్షిగా!
12(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలిపోయే భూమి సాక్షిగా! 13)నిశ్చయముగా ఇది (ఈ ఖుర్ ఆన్) సత్యాసత్యములను వేరు పరచేవాక్కు (గీటురాయి)
14)మరియు ఇది వృథా కాదు.
15) (ఓ ముహమ్మద్) నిశ్చయముగా వారు నీకు విరుద్ధముగా కుట్రను పన్నుతున్నారు.
16)మరియు నేను కూడా పన్నాగము పన్నుతున్నాను.
17)కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు. వారిపట్ల మృదువుగా వ్యవహరించు.
86వ సూరాలోయున్న మొత్తము 17 ఆయత్లను రెండు గ్రంథము లలో ఉన్నవాటిని తీసి వ్రాయడము జరిగినది. 86వ సూరాలోగల పదిహేడు వాక్యములకు వేరువేరుగా ఇద్దరు పండితులు వ్రాసిన తెలుగు అనువాదము లను చూచాము. పదిహేడు ఆయత్లలో చెప్పిన విషయమును ఇద్దరు పండితులు ఇంచుమించు ఒకే భావముతో వ్రాయడము జరిగినది. మొదట వ్రాసిన పరిచయములో దేవుడు మరణించిన ప్రతి ఒక్కరినీ తీర్పు దినమున వారివారి సమాధులనుండి తిరిగి సజీవులుగా శరీరముతో లేపి నిలబెట్టి, ఆ రోజు మొత్తము మానవాళికి దేవుడు తీర్పు చెప్పి స్వర్గ, నరకములకు పంపుతాడని చెప్పడము జరిగినది. 86వ సూరా మొదటి పరిచయములో వ్రాసినది కొంత అర్థమయినది గానీ, సూరాలోని పదిహేడు ఆయత్లలో పూర్తి ఆ అర్థమున్నట్లు నాకు కనిపించ లేదు. మొత్తము పదిహేడు వాక్యములలో 8, 9, 10 మూడు వాక్యములు మాత్రము పరిచయ భావమునకు దగ్గరగా తీర్పు దినమును గురించిన అర్థము నిచ్చుచున్నవి. మిగతా పదునాలుగు వాక్యములలో పరిచయములో చెప్పిన తీర్పు భావము లేదనుకుంటాను. మిగతా పదునాలుగు వాక్యములలో నాలుగవ వాక్యము మాత్రము మంచి సారాంశము కల్గిన వాక్యమయినా, అది తీర్పు దినమునకు సంబంధించినది కాదు. ఈ సూరాను గురించి నేను అడిగిన ముస్లీమ్ పండితునకు ఏమి తెలిసిందోగానీ నన్ను 86వ సూరా చూడమన్నాడు. ఇక్కడ 86వ సూరాలోని పదిహేడు వాక్యములను మీరు కూడా చూచారు కదా! తీర్పు దినమును గురించి చనిపోయిన వారిని బ్రతికించి తీర్పు తీర్చు శక్తి దేవునకున్నదని ఎనిమిదవ వాక్యములో ఉండగా, తొమ్మిదవ వాక్యములో మనిషి చేసుకొన్న పాపపుణ్యములన్నీ బయటపడగలవని యున్నది. ఇక పదవ వాక్యములో దేవుడు మనిషి కర్మలను బయటపెట్టి శిక్షను వేయు రోజు, శిక్షను వద్దని వారించుటకు మనిషికి ఏ బలమూ ఉండదు. అట్లే ఎవరూ సహాయపడరని కలదు. 8, 9, 10 ఈ మూడు ఆయత్లు తప్ప మిగతా పదునాలుగు ఆయత్లు చనిపోయిన వానిని సజీవునిగా స్మశానము నుండి లేపు విషయము గానీ, తీర్పు దినమున మనిషి చేసుకొన్న కర్మలన్నీ
బట్టబయలగుటగానీ, ఆ దినము మనిషికి ఏ బలము, సహాయము ఉండదనిగానీ చెప్పలేదు. ఈ మూడు విషయములు 8, 9, 10 సంఖ్యగల మూడు వాక్యములలోనే గలవు.
86వ సూరాలోని నాలుగవ వాక్యము మాత్రము ఉన్నతమైన భావము నిచ్చుచూ “తనను కనిపెట్టుకొనివుండేవాడు లేకుండా ఏ ప్రాణీ పుట్టలేదు” అని ఉన్నది. ఈ వాక్యమునకు అర్థమును తెలియగలిగితే ఎంతో సారాంశమైన జ్ఞానము కలదు. అయినా నాల్గవ సంఖ్యలోని వాక్యమును (ఆయత్ను) ఏ ముస్లీన్గానీ యోచించి తెలుసుకోలేదు. కనిపెట్టుకొని ఉండువాడు ఒకడు అని వుంటే నాల్గవ వాక్యమునకు వివరము చెప్పు ముస్లీమ్ పండితులు ఏకవచనముగాయున్న దూతను బహువచన దూతలుగా మార్చివేశారు. ఈ వాక్యములో ఎంతో మహోన్నతమైన జ్ఞానముయుంటే దానిని ఏమాత్రము గ్రహించలేక వారి ఇష్టమొచ్చినట్లు వారు వ్రాసుకోవడము జరిగినది. అంతకూ ఈ నాల్గవ వాక్యమునకు వివరమును ఏమి వ్రాశారో ఒకమారు చూస్తాము. “అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అను గ్రంథములో వ్రాసిన విషయమునే ఇక్కడ వ్రాసి చూపు చున్నాము చూడండి.
“ప్రతి ప్రాణి (ప్రతి మనిషి) పై దేవదూతలు నియమించబడి యున్నారు. వారు మనిషియొక్క సత్కర్మలతోపాటు, దుష్కర్మలను కూడా నమోదు చేయుచున్నారు. మరికొంతమంది విద్వాంసుల ఉద్దేశ్యము ప్రకారము ఇక్కడ కనిపెట్టుకొనివుండే దూతలంటే మనిషిని కాపాడే దూతలని అర్థము. ఉదాహరణకు పదమూడవ అర్రాద్ సూరా 11వ వచనము ప్రకారము "మనిషిని కాపాడడానికి దేవుని తరుపున నియమితులైన దైవదూత లుంటారు. వారు మనిషిని ముందూ వెనుకా అంటిపెట్టుకొని ఉంటారు.”
86వ సూరాలోని నాల్గవ ఆయత్లో 'ఒక దూత' విషయమును చెప్పగా దానిని వివరించి చెప్పు బోధకులు, పండితులు వారి వివరములో 'ఇద్దరు దూతలను' గురించి చెప్పడము జరిగినది. ఆ విషయము పైన కనపరచిన వివరములో తెలిసిపోయినది. వివరణ ఇచ్చు పండితుడు నాల్గవ ఆయత్కు పదమూడవ (13) సూరాలోని 11వ వాక్యమును (ఆయత్ను) చూపుచూ అక్కడ బహువచనములోయున్న దేవదూతలను చూపించారు. 'ముందూ వెనుకా దేవదూతలు అంటిపెట్టుకొని ఉన్నారని' చెప్పాడు. 86వ సూరా నాల్గవ ఆయత్లో 'తనను కనిపెట్టుకొనియుండే దూత’ అని ఏకవచనముగా చెప్పిన విషయమును ఎందుకు బహువచనముగా మార్చు కొన్నారో వారికే తెలుసు. 50వ సూరా 21వ ఆయత్నందు "ప్రతి మనిషి ఒక తోలేవాడు లేక నడిపించేవాడు, ఒక సాక్షిని (చూచే వానిని) కల్గివస్తాడు" అని యున్నది. సాక్షిగాయున్నవాడు ఏమీ చేయువాడు కాడు, వాడు నడుపబడే మనిషినీ, నడిపించే వానినీ ఇద్దరినీ సాక్షిగా చూస్తున్నాడు తప్ప ఇతరము ఏదీ చేయనివాడు కావున మూడవ వానితో మనకు పనిలేదు. అతనిని గురించి చెప్పుకోవలసిన అవసరములేదు. ఒకడు మనిషికాగా, రెండవవాడు వానిని తోలేవాడు అని కలదు. త్రోలబడేవాడు గొర్రె అనుకొనుము తోలేవాడు వానిని కనిపెట్టుకొనివుండేవాడు అని అర్థమగు చున్నది. అదే విషయమునే తోలేవాని విషయమునే 86వ సూరా నాల్గవ వాక్యములో కూడా వ్రాయడము జరిగినది. ఈ విధముగా 50, 86 రెండు సూరాలలో 50-21 యందు, 86-4 యందు ఒకే దూత విషయము వ్రాసియుండగా పూర్తిగా ఏకవచనమును వదలి బహు వచనముతో వివరమును వ్రాసుకోవడము తప్పు భావము కాదా!యని అడుగుచున్నాము. ఇక్కడ నేను కల్పించి చెప్పినది ఏమీలేకుండా ఉన్నది ఉన్నట్లు వారు వ్రాసినదే వ్రాసి చూపించాము కనుక ఇక్కడ చదువు వారందరికీ వ్రాసిన వారిది తప్పు అని తెలిసిపోవుచున్నది.
ఇదే విధముగా ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు ఒక విధముగా తెలిపియుంటే మనుషులు దానిని మరొక విధముగా అర్థము చేసుకోవడము జరిగినది. అట్లు మరొక విధముగా అర్థము చేసుకోవడము వలన దేవుడు తెల్పిన భావము (జ్ఞానము) మనుషులకు అందలేదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో ఎంతో ఉన్నతమైన జ్ఞానమున్నది. అయినా అది ఇంతవరకు కొంతతప్ప అంతా లభించలేదు. కొన్నిచోట్ల చాలామందికి ఖుర్ఆన్ గ్రంథమునుండి కొంత జ్ఞానము కూడా అవగాహనకు రాలేదనియే చెప్పవచ్చును. మేము ఇదే గ్రంథములోనే ఒకమాట చెప్పాము. కొందరు చదివి గ్రహించుకొంటారు, మరికొందరు విని గ్రహించుకొంటారు. అయితే కొందరు శరీరములోపల బుద్ధికి అర్థమయిన దానినే గ్రహించుకొంటారని చెప్పాము. ఒక మనిషి దేవుని జ్ఞానములోనికి పోవాలన్నా, దేవుని జ్ఞానమునకు దూరముగా యుండాలన్నా ఏది కూడా దేవునికి తెలియకుండా జరుగదు. ఒక మనిషి జ్ఞానమార్గములోనికి రావాలన్నా అది దేవుని ఇష్టాయిష్టము మీద ఆధారపడియుంటుంది. దేవుని ఇష్టముననుసరించి దేవుని చేత నిర్మింపబడిన మాయయే మనిషి శరీరములోని బుద్ధికి గ్రహించుకొను భావమును ఇచ్చుచున్నది. మాయ మనిషి బుద్ధిని ఎటైనా మార్చగలదు. దేవునికి ఇష్టమైనవానికి దేవుని జ్ఞానమును గ్రహించుకొను శక్తి నిచ్చి అసలయిన జ్ఞానమును తెలియునట్లు చేయును. అప్పుడు గ్రంథములో చెప్పిన విషయమునకు సరియైన అర్థమును మనిషి గ్రహించు కోగలడు. సంపూర్ణమైన జ్ఞానికాగలడు. దేవునికి ఇష్టములేనివాని బుద్ధికి గ్రహించుకొను శక్తిని మార్చి, ఉన్నది ఉన్నట్లు అర్థము కాకుండా, ఉన్నది వేరొక విధముగా అర్థమగునట్లు మాయ చేయుచున్నది. మాయ ఉన్న ఒక దూతను అర్థము కాకుండా చేసి, పండితులను కూడా, మభ్యపరచి తప్పుదారిపట్టించి, ఒక దూతను అనేక దూతలుగా అర్థమయినట్లు చేసి, 86వ సూరాలో తప్పు భావమును వ్రాయించిన విషయము ఇక్కడ చదివిన వారందరికీ అర్థమైవుంటుంది. అందువలన దేవుని జ్ఞానము సక్రమముగా అర్థమగునట్లు చేయమని దేవున్ని కోరుకొందాము.
“అత్ తారిఖ్” అను 86వ సూరాలో మొత్తము పదిహేడు వాక్యములుండగా అందులో నాల్గవ వాక్యము మంచి సారాంశ జ్ఞానమునకు సంబంధించినదైనా దానివిలువ, దాని అర్థము ఇప్పటి వరకు ఎవరికీ అర్థము కాలేదను విషయము ఎవరూ నమ్మక పోయినా, నేను చెప్పుమాట నూటికి నూరు పాళ్ళు నిజము. మా మాట కొందరికి బాధకలిగించినా, మాకు తెలియదా! అనిపించినా, ఈ మాట చెప్పినందుకు మా మీద కోపమొచ్చినా, మేము అన్నిటికీ ఓర్చుకొని ఇది దేవుని విషయమైనందున సత్యమును చెప్పక తప్పలేదు. ఈ నాల్గవ వాక్యమును అటుంచి ఇదే సూరాలో 8, 9, 10 వాక్యములను చూచినట్లయితే, ఈ మూడు వాక్యములు కూడా ఎంతో జ్ఞానమునకు సంబంధించినవని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో ఈ వాక్యములు అందరికీ సుపరిచయమున్న వాక్యములుగా, బాగా అర్థమయిన వాక్యములుగా యున్ననూ, ఈ మూడు వాక్యములు కూడా ముస్లీమ్లలోని పెద్ద పండితులకు కూడా అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఈ మూడు వాక్యములకు సమానమైన వాక్యములు ఖుర్ఆన్లో అక్కడక్కడయున్నా, వాటిని చదివిన వారిలో అందరికీ కాకున్నా కేవలము ఒకరికి లేక ఇద్దరికయినా అర్థమయినాయా అంటే, వాటిలోని నిజభావము ఒక్కరికి కూడా అర్థము కాలేదనియే చెప్పవచ్చును. నేను ఎంతోమంది ముస్లీమ్ బోధకులతో, పండితులతో కలిసాను. ఎవరు చెప్పినా నిజభావమును వదిలి ప్రక్క భావమునే చెప్పుచున్నారు. దానినిబట్టి దేవుడు తన మాయచేత అట్లు అర్థమయ్యేటట్లు చేసి, అదే సత్యమని నమ్మునట్లు చేశాడు. అందువలన మనిషి చావు విషయములో, తిరిగి లేపు విషయములో, కర్మలు విధింపబడు విషయములో ముస్లీమ్ సమాజమంతా ఒకే భావము కల్గియున్నది. అందరిదీ ఒకే భావమైనందున దానినే సత్యమని అందరూ నమ్ముచున్నారు. మాయ ఆ విధముగా మనిషిని నమ్మించి తన ఆధీనములో పెట్టుకొన్నది. అయినా ఆ విషయము ఏ మనిషికీ తెలియకుండా మాయ చేయగలిగింది.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! "ఎల్లప్పుడూ ఖుర్ఆన్ గ్రంథములో మునిగి తేలుచూ, ప్రతి ఆయత్ను (వాక్యమును) కంఠా పాటము చేసుకొన్న ముస్లీమ్ పండితులకే నిజభావము తెలియదని మీరు చెప్పుచున్నారు కదా! ముస్లీమ్లలో పెద్ద పండితులకే తెలియని ఖుర్ఆన్లోని వాక్యముల నిజభావము, ఒక హిందువయిన నీకు తెలుసా? వారికి తెలియదని నీవు ఎలా చెప్పగలుగుచున్నావు?” అని అడుగవచ్చును. దానికి నా సమాధానమును కూడా మీరు చూడండి. స్వర్గనరకముల గురించి, చావుపుట్టుకల గురించి, కర్మల నిర్ణయము గురించి పండితులకు కూడా తెలియదని చెప్పుటకు, ఆ విషయముల సత్యము నాకు తెలుసు గనుక వారికి సత్యము తెలియదని చెప్పుచున్నాను. ఇప్పుడు నన్ను మరొక ప్రశ్న అడుగవచ్చును అదేమనగా! ఏ మనిషికీ తెలియని సత్యము నీకెలా తెలియబడుతుంది? నీవు కూడా ఒక మనిషివే కదా! అలాంటప్పుడు మనుషులందరికీ తెలిసినదే నీకు కూడా తెలియాలి గదా! అట్లు కాకుండా ఏ మనిషికీ తెలియని జ్ఞానవిషయము నీకెలా తెలిసింది? అని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు నా సమాధానము ఏమనగా!
నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మరొకమారు చెప్పు చున్నాను చూడండి. నేను మనుషులు చెప్పిన మాటలనుగానీ, వ్రాతలనుగానీ చూచి జ్ఞానమును తెలుసుకోలేదు. నాలోనున్న నా పొరుగువానిని అడిగి తెలుసుకొన్న విషయములయిన దానివలన ఎవరికీ తెలియని సత్యము తెలిసింది. నన్ను కనిపెట్టుకొని, నా శరీరములోయుంటూ, నా శరీరమున కంతటికీ రాజుగా, అధిపతిగాయున్నవాడు ఎవడయితేయున్నాడో, వాడు సర్వత్ర జ్ఞాని అయినందున అతడు తెలిపిన జ్ఞానమును చూచిన తర్వాత ఈ జ్ఞానము ఎవరివద్దా లేదని తెలిసిన తర్వాత ఇప్పటికయినా సత్యమును తెలుసుకొందురను మంచి ఉద్దేశ్యముతోనే నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడ మైనది. ఒక ముస్లీమ్ సమాజమునకే గాదు మొత్తము మానవాళికి తెలియని జ్ఞానము ఎంతోయున్నదని చెప్పుచున్నాను. ఖుర్ఆన్ గ్రంథమును అటుంచి భగవద్గీత విషయానికి వస్తే ఇందువులలో ఏ పండితునికయినా, ఏ స్వామీజీకయినా భగవద్గీతలోని కొన్ని శ్లోకములకు నిజ భావము తెలుసునా? అని అడుగుచున్నాను. నేను అడిగితే అన్ని శ్లోకములకు నిజ భావము తెలుసునని అందరూ నన్ను బుకాయించి మాట్లాడవచ్చును. అయినా అందరికీ తెలియదను విషయము నాకు బాగా తెలుసు. ఇట్లు చెప్పుకుంటూ పోతే బైబిలు విషయములో క్రైస్తవుల జ్ఞానము కూడా భావము తప్పిపోయి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పకపోతే ఇంకెవ్వరూ చెప్పరను ఉద్దేశ్యముతో నన్ను అందరూ చెడుగా అనుకొన్నా ఫరవాలేదని, నా మాటతోనయినా మానవజాతి అసలయిన దేవుని జ్ఞానము తెలియగలదని తలచి ఎంతో ఓర్పుతో ధైర్యముతో చెప్పుచున్నాను.
ఈ 86వ సూరాలో 8, 9, 10 ఆయత్లు (వాక్యములు) చావుపుట్టుకలకు, స్వర్గనరకములకు దగ్గర సంబంధమున్న వాక్యములు. అందువలన వీటిని కొంత విశధీకరించి చెప్పవలసివచ్చినది. ఎనిమిదవ (8) వాక్యము "నిశ్చయముగా ఆయన అతన్ని తిరిగి రప్పించే శక్తిని కూడా కల్గియున్నాడు” (మరొక గ్రంథములో) "నిశ్చయముగా ఆయన (సృష్టికర్త) అతనిని మరలా బ్రతికించే సామర్థ్యముగలవాడు” అని కలదు. ఈ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో మరికొన్నిచోట్లయున్నా అది అందరికీ అర్థమయినదేమంటే! సృష్ట్యాదినుండి మరణించిన వారందరినీ భూమిలో పాతిపెట్టుకొంటూ వచ్చాము కదా! అలా చనిపోయిన వారందరూ భూమిలో పాతిపెట్టిన చోటే ప్రళయము వరకు యుందురని ముస్లీమ్ల విశ్వాసము. ఎప్పుడో ఒకప్పుడు అంతా నాశనమైపోవు ప్రళయము వచ్చిన రోజు అది ప్రపంచమునకు అంతిమ దినమనీ, అంతిమ దినమైన ప్రళయ దినమున దేవుడు అంతవరకు చనిపోయిన వారందరినీ భూగర్భములోని సమాధులనుండి లేచివచ్చునట్లు చేస్తాడని, అలా సమాధులనుండి లేచివచ్చిన వారందరికీ వారు
బ్రతికినప్పుడు చేసుకొన్న పాప పుణ్యములను, మంచిచెడులను విచారించి గుట్టుగాయున్న కర్మలన్నిటినీ బహిర్గతము చేసి, వారి కర్మలకు తగినట్లు పాపము ఎక్కువ చేసియుంటే నరకమునకూ, పుణ్యము ఎక్కువ చేసియుంటే స్వర్గమునకూ దేవుడు పంపుతాడని చెప్పుచుందురు.
ఇక్కడ ఎనిమిదవ వాక్యములో అంతిమదినమున గతములో చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించుశక్తి దేవునకున్నదని తెలుపుచూ "నిశ్చయముగా ఆయన (దేవుడు) అతనిని (మనిషిని) తిరిగి రప్పించే శక్తిని కల్గియున్నాడు” అని ఈ వాక్యములో చెప్పడము జరిగినది. ఈ వాక్యమును గురించి ముస్లీమ్లందరూ ఒకే భావము కల్గియున్నారు. అయితే నేను మాత్రము ఆ భావముతో ఏకీభవించడము లేదు. ఇక్కడ చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యమును నేను కాదు అనడము లేదు. దానిని మనుషులు అర్థము చేసుకొన్న విధానమును నేను కాదంటున్నాను. ఈ వాక్యమునకు సంబంధించి కొన్ని ప్రశ్నలను అడుగుచున్నాను. దానికి మీ వద్ద సరియైన సమాధానము ఉన్నదో లేదో చూచుకోమంటున్నాను. ప్రశ్న 1) అంతిమ దినము అంటే అది నీకా? లేక నీవు నివసించు ప్రపంచమునకా? 2) దేవుడు చనిపోయిన వానిని రప్పిస్తాడు లేక బ్రతికిస్తాడు అని వాక్యములోయున్నది. చనిపోయినవాడు పోయి ఎక్కడున్నాడు? వానిని దేవుడు ఎక్కడినుండి రప్పిస్తాడు? 3) సృష్ట్యాదినుండి పుట్టి చచ్చినవారంతా ఒక్కమారుగా లేచివస్తారా? 4) దేవుడు కార్యమును చేస్తే కార్యమునకు కారణమయిన కర్మ ఉండవలయును కదా! దేవుడు మనిషిని బ్రతికించే పని చేస్తాడా? దేవునికి కూడా కర్మ కార్యములున్నవా? 5) ప్రళయదినమున మనిషిని బ్రతికించి తీర్పు తీర్చవలసిన అవసరము దేవునికేమున్నది? 6) ఒకవేళ చేయవలసిన పని ఏమయినా వుంటే దేవుని సేవకులయిన దేవదూతలు చేయలేరా, దేవుడే స్వయముగా చేయవలయునా? ఈ విధముగా ఎనిమిదవ వాక్యముననుసరించి ప్రశ్నలను అడుగవచ్చును. తొమ్మిదవ వాక్యముననుసరించి 7) మనిషి చేసుకొన్న పాపములను అంతిమదినమున మనిషే చెప్పవలయునా లేక మనిషి చెప్పకున్నా దేవుడే చెప్పగలడా? 8) మనిషి చేసుకొన్న లోగుట్టు కర్మలన్నీ విచారణకు ఎలా వస్తాయి? రహస్య కర్మలను బయటికి ఎవరు చెప్పుతారు? పదవ వాక్యమును అనుసరించి 9) కర్మలను దేవుడు తీర్పు తీర్చు రోజు మనుషులకు ఏ బలమూ ఎందుకుండదు? ఏ సహాయమూ అతనికి ఎందుకు అందదు? 10) బలము లేకుండాపోవడము, సహాయకులు లేకుండాపోవడము పాపము చేసినవారికుండునా? లేక పుణ్యము చేసిన వారికి కూడా ఉండునా? ఇన్ని ప్రశ్నలకు జవాబులు తెలియగలిగితే ఈ సూరాలోని 8, 9, 10 వాక్యములకు వివరము సులభముగా తెలియును.
86వ సురాలోని 8, 9, 10 వాక్యములు ఎంతో జ్ఞానముతో కూడుకొన్నవనుటలో సంశయము లేదు. అయితే దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము అర్థము చేసుకోగలిగితే అందులో ఒక్క ప్రశ్నకూడా ఉద్భవించదు. ఉన్న సత్యమును అర్థము చేసుకోలేకపోతే పై ప్రశ్నలన్నీ అడుగవలసి వస్తుంది. ఆ ప్రశ్నలకు ఎవరివద్దా జవాబులుండవు. వాటికి జవాబులు చెప్పినా అవి ఏమాత్రము ఎవరికీ ఒప్పుదలకావు. జ్ఞానమునకు ఏమాత్రము సరిపోవు. ఆ మాటలన్నీ అశాస్త్రీయముగా ఉండును. ఆ జవాబులన్నీ వారు అల్లుకొన్న కథలలాగాయుండును. దానికి ఆధారమేమి? అని అడిగితే ఏమాత్రము సత్యమని నమ్ముటకు ఆధారమే ఉండదు. గతములో దాదాపు ఐదు సంవత్సరముల క్రిందట ఒకపేరు పొందిన ఇస్లామ్ సంస్థను నడుపుచున్న, అమితమైన మేథాశక్తి గల ఇద్దరు ముస్లీమ్ పండితులతో కలిసి స్వర్గనరకములను గురించి అడిగి తెలుసుకోవడము జరిగినది. మాకు ఎంత తెలిసినా మేము ఎదురు మాట్లాడక వింటూ, అప్పుడప్పుడు ప్రశ్నలను అడిగి వాటికి జవాబును చెప్పించుకొంటూయుంటాము. ఎదుటివారు ఏమి చెప్పినా
వింటుంటాము. కావున చెప్పువారు కూడా ఆటంకము లేకుండా చెప్పుచుందురు. అప్పటి మా మాటల వరుస ఎలాగున్నదో చూడండి.
నేను :-స్వర్గము నరకము అంటుంటారు ఇస్లామ్ ధర్మము ప్రకారము ఇవి ఉన్నాయా?
వారు :- ఉన్నాయి.
నేను :-ఇప్పుడున్నాయా? ఎప్పుడో ఉంటాయా?
వారు :-ఇప్పుడు లేవు. భవిష్యత్తులో ఉంటాయి.
నేను :-భవిష్యత్తులో అంటే మనము చనిపోయిన తర్వాతనా? మనము చనిపోయిన తర్వాత వెంటనే స్వర్గ, నరకములు రావు. స్వర్గ నరకములు ప్రళయము తర్వాత ఉంటాయి.
నేను :- ప్రళయము అంటే ఏమిటి?
వారు :- ప్రళయము అంటే పుట్టినదంతా లేకుండాపోతుంది. ప్రపంచమంతా లేకుండా పోతుంది. ప్రపంచమంతా లేకుండా పోయినప్పుడు ప్రపంచములో భాగమైన మనుషులు కూడా లేకుండా పోతారు కదా!
వారు :- ప్రళయము తర్వాత స్వర్గము, నరకము మాత్రము మిగిలి ఉంటాయి. ఎందుకంటే స్వర్గము, నరకము ప్రళయము తర్వాతనే ప్రారంభమవుతాయి.
నేను :-ఇప్పుడు లేని స్వర్గము, నరకము అప్పుడెందుకు వస్తాయి?
వారు :- మనుషులు బ్రతికియున్నప్పుడు చేసిన తప్పులకు పాపము లెక్కించ బడియుంటుంది. అలాగే మనుషులు చేసిన మంచి పనులకు పుణ్యము లెక్కించి వ్రాయబడియుంటుంది. చనిపోయిన తర్వాత ప్రళయ కాలమున అంతిమ దినమున గతములో చనిపోయిన వారందరినీ దేవుడు వారి భూసమాధుల నుండి లేపి, వారు వారి జీవితములో చేసుకొన్న మంచిచెడుల పాపపుణ్యములను లెక్కించి, దేవుడు వారికి తీర్పు చెప్పి నరకమునకో, స్వర్గమునకో పంపును.
నేను :- మనిషి బ్రతికియున్నప్పుడు చేసిన మంచి పనులకు పుణ్యమునూ, చెడు పనులకు పాపమునూ లెక్కించబడియుండును అన్నారు కదా! అప్పుడు ఆ పాపపుణ్యములను ఎవరు లెక్కించి వ్రాస్తారు?
వారు :- ఖాప్ అను 50వ సూరాలో 17, 18 వాక్యములలో చెప్పబడినట్లు ఇద్దరు దూతలు ప్రతి మనిషికీ ఒకరు కుడిప్రక్కన మరొకరు ఎడమ ప్రక్కన యుంటారు. మనిషి నోటిలో మాట వెలువడిన వెంటనే ఆలస్యము లేకుండా వానివద్దయున్న ఒక పర్యవేక్షకుడు దానిని నమోదు చేసిపెట్టడానికి (వ్రాసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు.
నేను :- సృష్ట్యాదినుండి చనిపోయిన వారందరినీ బ్రతికించి లేపుతాడని చెప్పుచున్నారు కదా! చనిపోయిన వారు ప్రళయములో అంతిమ దినమున దేవునిచే లేపబడువరకు వారు ఎక్కడున్నట్లు?
వారు :-వారి వారి సమాధులలోనే ఉంటారు.
నేను :-వారి వారి సమాధులలో ఊరకనే ఎంతకాలమని ఉంటారు?
వారు :-ప్రళయము వచ్చేంతవరకు ఉండవలసిందే.
నేను :- చనిపోయిన వారందరూ సమాధులలో వుంటే, పుట్టేవారందరూ ఎక్కడి నుండి వస్తున్నారు? ఇలా ప్రపంచము మొదటినుండి పుట్టి చనిపోయిన వారందరినీ ఒక్క దినము, ఒక్కమారు బ్రతికించి శరీరముతో లేపితే అంతమందికి భూమిమీద జాగా తక్కువవచ్చును కదా!
వారు :-అటువంటి సమస్య రాకుండా ఉండుటకు ఒకనినిలేపి, వానికి తీర్పు చెప్పి స్వర్గమునకో, నరకమునకో పోవునట్లు చేసి తర్వాత మరొకనిని లేపును. అట్లు ఉదయమునుండి సాయంకాలము లోపల అందరినీ దేవుడు స్వర్గ నరకములకు పంపగలడు.
నేను :- సృష్ట్యాదినుండి పుట్టువారంతా చనిపోయి సమాధులలో ఉంటే క్రొత్తగా పుట్టువారు ఎక్కడినుండి వస్తున్నారు?
వారు :- ఎవరు ఎప్పుడు పుట్టాలని నిర్ణయము చేసిన మనుషులను ఒక మైదానములో తయారు చేసియుంచాడు. అలా తయారు చేసి ఉంచబడిన మనుషులు దేవుడు వారికిచ్చిన కాలము ప్రకారము వచ్చి భూమిమీద పుట్టుచున్నారు.
నేను :-ప్రస్తుత కాలములో పుట్టినవారే దాదాపు ఏడువందలకోట్ల జనాభా యున్నారు. ప్రళయకాలము వరకు పుట్టువారిని అందరినీ కలిపి లెక్కించ గలిగితే ఇటువంటి భూమండలములు వేయి అయినా జాగా తక్కువ వచ్చునని అర్థమగుచున్నది. అంత జాగా ఎక్కడున్నది. అంతమందిని ఎక్కడ ఎలా నిలుపగలిగియుంటాడు?
వారు :- దేవుడు అనుకుంటే ఏమయినా చేయగలడు. దేవుని మీద అనుమానము పెట్టుకోకూడదు.
నేను :- దేవుడు చెప్పినది ఒకే జ్ఞానము. అది భగవద్గీత రూపములో మొదట వచ్చినది. అదే జ్ఞానమును ధృవీకరించుచూ బైబిలు వచ్చినది. ఆ తర్వాత కొంత కాలమునకు దేవుడు మొదట చెప్పిన జ్ఞానమును సత్యమని దృఢపరచుటకే ఖుర్ఆన్ గ్రంథము వచ్చినది. ఈ మూడు గ్రంథములలో దేవుడు ఈ మాటను చెప్పియుంటే నమ్మేవారము. దేవుడు చెప్పిన మాటయని అనుమానము పెట్టుకొనేవారము కాకుండా ఉందుము. అయితే మీరు చెప్పినమాట మూల దైవగ్రంథములయిన మూడు గ్రంథములలో ఎక్కడా లేదు. అటువంటప్పుడు దేవుడు చెప్పని మాటను మనుషులు చెప్పిన మాటగా లెక్కించవలసియుంటుంది. శాస్త్ర ప్రమాణము లేని మనుషుల మాటను నమ్మకూడదనీ, అలా నమ్మితే అజ్ఞానము అవుతుందని మీలాంటి పెద్దలే చెప్పారు. దీనికేమంటారు?
వారు :- అన్నీ మూల గ్రంథములలోనే ఉండాలంటే ఎట్లగును? కొన్ని విషయములు ఎక్కడా వ్రాసిపెట్టబడియుండవు. అయినా తెలిసినవారు చెప్పిన విషయములను నమ్మితేనే సంపూర్ణ జ్ఞానులవుతారు నమ్మనంత కాలము అసంపూర్ణ జ్ఞానులుగానే యుంటారు.
(ఈ విధముగా ఒక ఆధ్యాత్మిక సంస్థకు పెద్దగాయున్న ముస్లీమ్ పండితులతో మాట్లాడడము జరిగినది. అయితే వారి మాటలలో ఒక్కమాట కూడా సత్యము లేదు. ముస్లీమ్లకు ప్రమాణ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో కూడా ఎక్కడా వ్రాయని విషయములను వారే స్వయముగా కల్పించి చెప్పుచున్నారు. పైగా మేము చేయునది తప్పు అనుకోకుండా వారు చెప్పిన మాటలను నమ్మాలనీ, నమ్మినప్పుడే సంపూర్ణ జ్ఞానులుకాగలరనీ చెప్పుచున్నారు. అట్లు చెప్పి ఎంతోమంది అజ్ఞానులగుటకు కారణమైనారనీ చెప్పవచ్చును. దేవుడు అందరికీ సమానమైనవాడు, అలాగే దేవుని జ్ఞానమూ అందరికీ సమానమైనది. ఏ అసూయా భావము లేకుండా మేము మూడు మతములకు సంబంధించినవని అందరూ అనుకొను భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలోని జ్ఞానమును ఒకే దేవుని జ్ఞానముగా చూస్తున్నాము. ఆ మూడు గ్రంథములలోని మాటలనే నమ్మగలము. ఎవరూ ఏమి చెప్పినా వాటిని నిర్ముఖమాటముగా ఖండించుచున్నాము. అందువలన పెద్ద పేరున్న ఆ ఇద్దరి ముస్లీమ్ పండితుల మాటలను మేము జ్ఞానముగా లెక్కించలేదు.)
నేను ఇందూ (హిందూ) సమాజములో పుట్టినవాడిని. అయితే ఇందూ గ్రంథములని చెప్పిన అన్ని గ్రంథములను నేను నమ్మలేదు. దేవుడు భగవంతుడుగా వచ్చి తెలియజేసిన ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతనూ, భగవద్గీతను దృఢపరచు బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలోని శాస్త్రీయమైన మాటలనే నేను నమ్ముచున్నాను. వేదములు, ఉపనిషత్తులు హిందువుల గ్రంథములని పేరుగాంచినా, చతుర్వేదములనూ, అష్టాదశ పురాణములనూ హిందువులు పెద్దగా చెప్పుకొంటున్నా, నేను మాత్రము మనుషులు చెప్పిన వాటిని నమ్మక భగవంతుడు చెప్పిన భగవద్గీతను మాత్రము విశ్వసిస్తున్నాను. ఆధ్యాత్మికమునకు శాస్త్రప్రమాణముగా ఒప్పుకొంటున్నాను. ఇంతకుముందు పురాణములలో పదునాలుగు లోకములున్నాయని వ్రాసినా వాటిని కాదని వెనుక పేజీలలో వ్రాశాము. అంతే కాకుండా అవి మా హిందూ గ్రంథములని విమర్శించకుండా ఉండలేదు. అజ్ఞానము ఏ మతములోయున్నా ఖండించవలసిందే, జ్ఞానము ఏ మతములోయున్నా సమర్థించవలసిందే. దేవుడు ఒక్కడే అయినప్పుడు, దేవుని జ్ఞానము సమస్త మానవులకు ఒక్కటే వుంటుంది. జ్ఞానమునకు మతము అనునది ఉండదు. అందువలన దేవుని జ్ఞానమున్న మూడు మూల గ్రంథములను సమానముగా చూస్తున్నాము. జ్ఞానములేని ఏ గ్రంథమునయినా, అందులోని ఏ మాటనయినా ఒప్పుకోము. అందువలననే నేడు హిందువులయిన వారు పురాణములు చూపి నమ్మమని చెప్పితే, నమ్మకుండా పదునాలుగు లోకములను ఖండించాను.
పురాణములలోనున్న ఊర్థ్వ, మర్త్య, అథోలోకములను మూడు లోకములుగా విభజించి చెప్పవచ్చునని చెప్పి, ఊర్థ్వలోకములు (పైన గల లోకములు) ఏడున్నాయని వాటిని వరుసగా 1) భూలోకము, 2) భువర్లోకము, 3) సువర్లోకము, 4) మహర్లోకము, 5) జనలోకము, 6) తపోలోకము, 7) సత్యలోకము అన్నారు. అవి సత్యము కాదు అనుటకు అనేక ఆధారములు గలవు. మర్త్యలోకమయిన మధ్యలోకములో అనగా భూలోకములో మనము నివసించుచుండగా, ఊర్థ్వలోకములలో మొదటిదయిన భూలోకము ఎక్కడి నుండి వచ్చినదని అడుగుచున్నాము. అంతేకాక ఐదవ సంఖ్యలోయున్న జనలోకము అనునది జనులు నివసించు లోకమేకదా! జనులు నివసించునది జనలోకమయినప్పుడు ఒకటవ సంఖ్యలోనున్న భూలోకములో ఎవరు నివసిస్తున్నారని అడుగుచున్నాము. అంతేకాక భూలోకమునకు స్వర్గలోకము పైనగలదనీ, నరకలోకము క్రిందగలదనీ అంటుంటారు. అయితే ఇక్కడ చెప్పిన పదునాలుగు లోకములలో పైన ఏడులో స్వర్గలోకము పేరు లేదు. క్రింద ఏడులో నరకలోకము పేరు లేదు. పైన క్రింద గల పదునాలుగు లోకములలో స్వర్గము, నరకము రెండూ లేనప్పుడు ఈ రెండు లోకములు ఎక్కడున్నాయని చెప్పగలరు? ఇట్లు ప్రశ్నించుతూ పోతే ఒక్కమాటకు కూడా జవాబు దొరకదు. అందువలన పదునాలుగులోకములు అన్నమాటే పూర్తి అశాస్త్రీయము అని
చెప్పవచ్చును. అంతేకాకుండా పురాణములలో చెప్పు స్వర్గ నరకములు కూడా పూర్తి శాస్త్రబద్ధత లేనివని చెప్పవచ్చును. ఈ విధముగా ఇందుత్వములోగానీ, ఇస్లామ్లోగానీ శాస్త్రబద్ధము కాని మాటలను వదలి శాస్త్రీయతగల వాక్యములనే స్వీకరించమని మేము చెప్పుచున్నాము.
కొందరు హిందువులలో బోధకులుగాయున్నవారు, పురాణముల లోనున్న వారికి అనుకూలమైన విషయములను చెప్పి, శాస్త్రము ఇట్లు చెప్పు చున్నది అంటుంటారు. వారు ఏమిచెప్పినా శాస్త్రమిట్లు చెప్పుచున్నదని శాస్త్రమును ఊతపదములాగా వాడుకొనుచుందురు. సాధారణ ప్రజలకు శాస్త్రమంటే ఏమిటో కూడా తెలియదు. అటువంటప్పుడు ఏదో శాస్త్రములో ఉందట అని వారు చెప్పు ప్రతిమాటనూ నమ్ముచుందురు. ఉదయము లేచింది మొదలు తమబుద్ధిని బ్రతుకుతెరువు కార్యములలో ఉపయో గించుచూ సాధారణ జీవితము గడుపువారికి గ్రంథముల యొక్క తారతమ్యము తెలియదు. ఏ గ్రంథము శాస్త్రమో, ఏ గ్రంథము పురాణమో, ఏ గ్రంథము వేదమునకు సంబంధించినదో తెలియదు. ప్రతి పుస్తకమునూ శాస్త్రమేనని అనుకోవడము జరుగుచున్నది. గ్రంథములు మూడు రకములని ప్రతి మనిషీ జ్ఞప్తికుంచుకోవలెను. వివరించి చెప్పితే శాస్త్రములు ఆరు, వేదములు నాలుగు, పురాణములు పద్దెనిమిది గలవు. వాటినే షట్శాస్త్రము లనీ, చతుర్వేదములనీ, అష్టాదశ పురాణములనీ చెప్పడము జరుగుచున్నది. ఇంతకుముందు మూడు మతములలోనూ, మూడు మూల గ్రంథములున్నవని చెప్పుకొన్నాము కదా! ఆ మూడు భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములు శాస్త్రములకు సంబంధించినవని తెలియవలెను. అదియూ ఆరు శాస్త్రము లలో చివరిది లేక మొదటిదయిన బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవి మూడు గ్రంథములని తెలియవలెను. శాస్త్రములు సత్యమైనవి కావున వాటిని తప్పక విశ్వసించవలెను. స్వర్గలోకము, నరకలోకము ఎక్కడో ఉన్నాయని వర్ణించి చెప్పిన విషయములు “సావిత్రి పురాణము”, “గరుడ పురాణము” నకు సంబంధించినవని తెలియవలెను. అట్లే మంత్రములతో కూడుకొన్న గ్రంథములు వేదములకు సంబంధించినవని తెలియవలెను.
స్వర్గ నరకముల కథలు పురాణములలో ఉండుట వలన వాటిని నమ్మవలసిన పనిలేదు అని చెప్పుకొంటున్నాము. అయితే స్వర్గలోకము అనుమాట శాస్త్రమయిన భగవద్గీతలో రాజవిద్యారాజగుహ్య యోగమున 21వ శ్లోకమున “తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యేమర్త్యలోకం విశన్తి" అని ఉన్నది కదా! ఈ మాట బ్రహ్మవిద్యా శాస్త్రమునయుండుట వలన తప్పక నమ్మవలసియున్నది కదా! శాస్త్రములో చెప్పినవన్నీ సత్యము లయితే స్వర్గలోకము, నరకలోకము నిజముగా ఉండవలెను కదా!యని ఎవరయినా అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! స్వర్గము నరకము అనునవి ఉండడము వాస్తవమే అయితే, వాటిని మనము శాస్త్రము ప్రకారము అర్థము చేసుకోలేదు. పురాణముల ప్రకారమే అర్థము చేసుకొన్నాము. కావున వాటి యొక్క నిజతత్త్వము మనుషులకు తెలియకుండా పోయినది. ఇంతకుముందు వ్రాసిన పేజీలో లోకముల ప్రసక్తి వచ్చినప్పుడు లోకము అను పదము "ఏకము” అను పదమునుండి పుట్టినదని చెప్పాము. అదే సూత్రముతో ఒక కోవకు చెందిన వారందరినీ ఏకము చేసి (కలిపి) ఒక లోకము వారని అనడము జరుగుచున్నదని కూడా చెప్పాము.
ఇంతవరకు స్వర్గనరకములను గురించి పురాణములు ఏమి చెప్పినా, వాటిని లెక్కచేయక శాస్త్రపద్ధతిలో “లోకము” అను పదమునకు అర్థమును తెలుసుకోగలిగాము. నేను ముందే చెప్పాను, శ్రద్ధవుంటే తెలియని విషయమంటూ లేదని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. నాకు శ్రద్ధయుంది కావున నాకు అంతరంగమున తెలిసిన విషయములనే
పొందుపరచి చెప్పడము జరుగుచున్నది. లోకము అను పదమునకు వివరము బయటి వారు చెప్పితే ఎట్లున్నదో, లోపలి వారు చెప్పితే ఎట్లున్నదో తెలిసింది కదా! బయటివారు ఎంత చెప్పినా అందులో తృప్తిగానీ, ఆనందముగానీ లేకుండా సందిగ్ధములో పడిపోవడము తప్ప ఏమీ లేదు. “ఏకము నుండి లోకము” పుట్టుచున్నదని ఒక రహస్యమును తెలియగలిగాము. అదే విధానముతో గ్రహించగలిగితే “స్వర్గము” అను పదమునకు అర్థము, అలాగే నరకము అను పదమునకు అర్థము ఏమని తెలియగలదో ఇప్పుడు చూస్తాము. భగవద్గీతలో చెప్పిన త్రైత సిద్ధాంతమును ఖుర్ఆన్ గ్రంథములో కూడా చెప్పారు. త్రైత సిద్ధాంతమును బైబిలులో కూడా చెప్పారు. భగవద్గీతను, బైబిలును అటుంచి ఖుర్ఆన్లోని వాక్యమును గమనించితే అక్కడ ముగ్గురిని గురించి చెప్పారు. "త్రోలబడేవాడు, త్రోలేవాడు, చూచేవాడు” అను ముగ్గురిలో ప్రతి మనిషీ త్రోలబడేవాడుగాయున్నాడు. ప్రతి మనిషినీ త్రోలేవాడుగా లోపలగలవాడు ఒకడున్నాడు. ఇకపోతే త్రోలబడేవానినీ, త్రోలేవానినీ ఇద్దరినీ చూచేవాని (సాక్షి)గా దేవుడున్నాడు. దేవుడు ఏమీ చేయడుగానీ త్రోలేవాడు మనిషిని జ్ఞానులలోనికో, అజ్ఞానులలోనికో త్రోలును కాబట్టి కొందరికి అజ్ఞానమూ, కొందరికీ జ్ఞానమూ బోధించుచున్నాడు. లోపలయున్న సారథి (త్రోలేవాడు) ఎలా చెప్పాడు అని ఎవరికీ తెలియకుండానే ఎవరికయినా, ఏమయినా చెప్పగలడు. ఇటు అజ్ఞానమునూ బోధించగలడు, అటు జ్ఞానమునూ బోధించగలడు. వినేవానికి ఎలా చెప్పాడో కూడా తెలియకుండా చెప్పు నైపుణ్యము చెప్పేవానికి కలదు. లోపలయున్నవాడు కనిపించడు, తెలియడు కాబట్టి, వాడే తెలియకుండా చెప్పుచున్నాడు కాబట్టి, ఒక విషయము తెలిసినవాడు కూడా తాను ఫలానావాడు చెప్పితే తెలియగలిగానని చెప్పలేదు. తనకు తానే తెలుసుకొన్నట్లు భావించుకొనుచుండును.
ఎవరు ఏమనుకొనినా! నేను మాత్రము నాకు తెలిసిన విషయము నాలోనే నాకు తోడుగాయున్నవాడు, తెలిపితేనే తెలిసిందని చెప్పుచున్నాను. స్వర్గమును గురించి నాకు తెలిసినది ఇలా ఉన్నది. నీటిని తీసుకొని వేడి చేసిన, వేడిని పొందిన నీరు పైకి చల్లనీరు క్రిందికి పోవుచుండును. అలాగే గాలిని వేడిచేస్తే వేడిగాలి పైకీ, చల్లనిగాలి క్రిందికీ చేరగలదు. గాలి ఒక్కటే అయినా వేడిగాలి పైన, చల్లనిగాలి క్రింద యున్నట్లు, అదే విధముగా నీరు ఒక్కటే అయినా వేడినీరు పైన, చల్లని నీరు క్రిందయున్నట్లు, కర్మ ఒకటే అయినా పాపము పుణ్యము అను రెండు భాగములుగా కలవు. నీరు ఒకటే అయినా వేడినీరు, చల్లనినీరు అని పేర్లు పెట్లబడినట్లు, కర్మయను నది ఒకటే అయినా అందులో పాపకర్మ, పుణ్యకర్మయని రెండు పేర్లతో యున్నది. వేడినీరు పైన చల్లని నీరు క్రింద చేరినట్లు, వేడిగాలి పైకి చల్లనిగాలి క్రిందికి చేరినట్లు కర్మ నిలయమైన కర్మచక్రములో పుణ్యకర్మ పైన పాపకర్మ క్రింద చేరుతున్నది. కర్మచక్రములో పన్నెండు భాగములందు బేసి సంఖ్యలయిన 3, 7, 11 స్థానములలో పాపము చేరుచుండును. అలాగే బేసి సంఖ్యలయిన 1, 5, 9 స్థానములలో పుణ్యము చేరుచుండును. మిగతా సరిసంఖ్యలయిన 2, 4, 6, 8, 10, 12 స్థానములందు పుణ్యము, పాపము రెండూ చేరుచుండును. అలా చేరిన పుణ్యకర్మ, స్థానములో పై భాగమున చేరుచున్నది. అలాగే పాపకర్మ, స్థానములో క్రింద చేరుచున్నది. కర్మచక్రములో పాపపుణ్యములు క్రింద పైన ఎలా చేరుచున్నవో క్రిందగల చిత్రపటములో నమూనా చూడవచ్చును.
కర్మచక్రము మన తలయందే వున్నదనీ, ఎవడు చేసుకొన్న కర్మ వాని తలయందుగల కర్మచక్రములో వాని పొరుగువానిచేత వ్రాయబడు చున్నదనీ, ముందే కొన్ని గ్రంథములందు మరియు “కర్మపత్రము” అను గ్రంథములోనూ చెప్పుకొన్నాము. అలా కర్మచక్రములో చేరు కర్మలో పుణ్య కర్మచక్రములో పై భాగమున పాపముకంటే పైన నిలువవుండగా,
పాపము క్రింది భాగమున చేరుచున్నదని చిత్రపటము ద్వారా కూడా ఇప్పుడు తెలుసు కొన్నాము. ఎవడు చేసుకొన్న పాపపుణ్యములను వాడే అనుభవించడము జరుగుచున్నది. కర్మచక్రములో అగ్రస్థానములోయున్న పుణ్యమును అనేక సుఖాల రూపములో మనిషి అనుభవించడము జరుగుచున్నది. వాడు చేసుకొన్న పుణ్యమును వాడే స్వయాన అనుభవించుచున్నాడు. కాబట్టి అటువంటి పుణ్య సుఖములను అనుభవించడమునకు ప్రత్యేకమైన పేరు పెట్టారు. అగ్రమున నున్న పుణ్యమును స్వయముగా అనుభవించడమును గుర్తు చేయుచూ “స్వ+అగ్రము” అను రెండు శబ్ధములను కలిపి “స్వగ్రము” అని అనడము జరిగినది. “స్వగ్రము” అను పదము తక్కువ కాలములోనే “స్వర్గము” అను పదముగా పలుకబడి అదే వాడుక పదముగా నిలిచి పోయినది. స్వగ్రము అను పదములో రెండు ద్వంద్వాక్షరములు కలవు. స+వ= స్వ అనునది ఒకటికాగా, గ+ర=గ్ర అనునది రెండవది. అయితే రెండవ అక్షరములో “గ” నూ మరియు “ర” నూ ఉండడము జరిగినది. “ర” అను శబ్ధము నాశనమునకు బీజాక్షరముగా ఉండుట వలన “గ్ర” అను శబ్ధములో “ర” అనునది చివర పలుకడము కొందరికి (భాషా పండితులకు) ఇష్టము లేదు. చివరిలో నాశన శబ్దము ఉండకూడదని తలచిన పండితులు “ర” అను శబ్ధము ముందు పెట్టి “గ” అను శబ్ధమును వెనుక ఉంచడము జరిగినది. గ+ర=గ్ర అనుట పోయి ర+గ=ర్గ అను శబ్ధముగా మారి పోయినది. “స్వకు “ర్గ” శబ్ధమును చేర్చి “స్వర్గ” అనియు పూర్తి పదముగా “ము” చేర్చి “స్వర్గము” అని చెప్పడము జరిగినది. ఈ విధముగా “స్వగ్రము” అను పదము చివరకు భాషా పండితుల జోక్యముతో “గ్ర" అను అక్షరమును “ర్గ" అను అక్షరముగా మార్చడము జరిగినది.
పుణ్యఫలితము సుఖములు, పాపఫలితము కష్టములు అయినప్పుడు మనిషి సుఖములలో అభివృద్ధి చెందడమూ, కష్టములలో క్షీణించి పోవడమూ జరుగుచుండును. ఒక మనిషికి సుఖములు కల్గినప్పుడు ఉల్లాసముగా ఉండడమూ, సుఖముల వలన కల్గు సంతోషమునకు శరీరము లావు కావడము లేక కాంతిగా ఉండడము జరుగుట మనకు తెలిసిన విషయమే. పుణ్యము వలన అభివృద్ధి జరుగుచున్నదిగానీ ఏదీ క్షీణించడము గానీ, నాశనముగానీ జరుగడములేదు. స్వగ్రము అను పదములో చివరిలో “ర” శబ్దము ఉండడము వలన “ర” అనునది నాశనముకు గుర్తుగాయున్న శబ్ధమయిన దానివలన ఆ అక్షరమును చివరిలో ఉంచడము కొందరికి సరిపోలేదు. అగ్రములోయున్న పుణ్యమును స్వయముగా అనుభవించుట అను అర్థముకంటే స్వయముగా నాశనము చెందుట అను అర్థము ఎక్కువగా కనిపించుచున్నదనీ, అటువంటి అర్థము లేకుండా పోవుటకు ఉన్న పదములోనే “గ”ను వెనుకకు “ర”ను ముందుకు పెట్టితే చివరిలో నాశనమును సూచించు “ర” లేకుండా పోయినట్లు ఉండడమేకాక అక్షరములు రెండు ముందుది వెనకకు, వెనుకది ముందుకు ఉంటుందని, దానితో అక్షరములను పూర్తి తొలగించకుండా ఉంచినట్లుంటుందని తలచి ఆ విధముగా స్వగ్రమును స్వర్గము అను పదముగా మార్చిపెట్టారు. స్వర్గము అను పదమునకు అర్థము మారనట్లు వాని పుణ్యమును వాడు స్వయముగా అనుభవించడము అనియే చెప్పారు. ఇట్లు పూర్వము నుండి స్వర్గము అను పదము సుఖముల అనుభవము అను అర్థమునిచ్చునదై ఉన్నది. అయితే స్వర్గలోకము అనడములో కొందరు పురాణములను ఆశ్రయించి అక్కడ తెల్పిన కథల ద్వారా స్వర్గలోకము ప్రత్యేకమైన ఇంద్రుని రాజ్యముగా లెక్కించుకొన్నారు. ఇంద్రుడు దేవతలరాజని, ఇంద్రలోకము ఆకాశము పైన కలదని, ఆ ఇంద్రలోకమే స్వర్గలోకముగా చెప్పబడుచున్నదని అందరూ అనుకోవడము జరిగినది. పురాణములు పుక్కిడినుంచి పుట్టినవనీ, అసత్యములతో కూడుకొన్న కథలనీ తెలియనివారు పురాణముల మాటే సత్యమని నమ్మారు. అంతేకాక పెద్ద పెద్ద స్వామీజీలు సహితము పురాణములు గురించి తమ ఉపన్యాసములలో చెప్పడము వలన స్వామీజీల మాటలనే ఎక్కువగా నమ్మవలసి వచ్చి ఇంద్రుడు ఇంద్రలోకము ప్రత్యేకముగా యున్నదనీ, చనిపోయినవారు పుణ్యములను అనుభవించుటకు ఇంద్ర లోకమయిన స్వర్గలోకమునకు
పోయి అచట అనేక సుఖములను అనుభవించి, పుణ్యము అయిపోయిన వెంటనే నరకలోకమునకు పోయి అక్కడ బాధలు, చిత్రహింసలు అనుభవించి పాపము కూడా అయిపోయిన వెంటనే మర్త్యలోకమయిన మనుషులలోకమున లేక భూలోకమున వచ్చి పుట్టుచున్నారని చెప్పుకోవడము జరుగుచున్నది. ఒకమారు ఏది బుర్రకు ఎక్కితే అదే నిజమని నమ్మువారు కలరు. అటువంటి వారికి ఏమాత్రమూ విచక్షణ ఉండదు. వారికి సత్యమును చెప్పినా వినే స్థితిలో ఉండరు. వారికి తెలిసినదే సత్యమని వాదించుచుందురు. అటువంటి వారిని వారి కర్మకు వదలివేయడము తప్ప మనము ఏమీ చేయలేము.
స్వర్గము అను పదము ఎట్లు తయారయినదో, దాని అర్థము ఏమిటో తెలుసుకోగలిగాము. పుణ్యకర్మను స్వయముగా అనుభవించుటను స్వర్గము అంటున్నాము కదా! పుణ్యమునకు వ్యతిరేఖమయిన పాపమును కూడా ఎవడు చేసుకొన్నదానిని వాడు అనుభవించవలసిందే కదా! అప్పుడు దానికి కూడా అర్థమయిన పేరు ఉందా అని కొందరు అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! స్వర్గము అను పదమునకు వ్యతిరేఖమయిన పదము నరకమే అని చెప్పగలము. ఎక్కడ స్వర్గము అంటున్నామో దానిప్రక్కనే నరకము అని అంటున్నాము. స్వర్గ నరకములని రెండు పదములను కలిపి చెప్పడము కూడా జరుగుచున్నది. పాపపుణ్యములలో మొదటిది లేక పైనగలది పుణ్యము. దానిని స్వయాన చేసుకొన్నవాడే అనుభవిస్తున్నాడని చెప్పినప్పుడు పుణ్యముకంటే క్రిందవున్న పాపమును కూడా చేసుకొన్నవాడే అనుభవించవలసియుండును. అందువలన పుణ్యము వద్ద వాడిన “స్వ" అను అక్షరమును నరకమువద్ద వాడవలసిన పని లేకుండా పోయినది. ఎవని పుణ్యమును వాడు అనుభవించినట్లు, ఎవని పాపమును కూడా వాడే అనుభవించునను విషయము అందరికీ తెలిసినదే కావున నరకము ముందర “స్వ” అను అక్షరమును చెప్పడము లేదు.
స్వర్గమును ఒక అర్థముతో కూడిన పదముగా ఏర్పరచిన పండితులే పాపకార్యములను అనుభవించడములో కూడా ప్రత్యేక అర్థమును ఏర్పరచి చెప్పిన పదమే నరకము. నరకము అను పదము మనకు బాగా అలవాటైన పదమే అయినా అందులోని అర్థము మనకు తెలియనిదేనని చెప్పవచ్చును. నరకము అను పదము కూడా రెండు భాగములుగాయున్నదని చెప్పవచ్చును. నరకము అను శబ్దమును విడదీసి చూస్తే అందులో మొదటి అక్షరము అయిన “న” ప్రత్యేకమయినదని రెండవ భాగము 'రకము' అని తెలియు చున్నది. "న" అను అక్షరమునకు ప్రత్యేకమయిన అర్థము కలదు. “న” అంటే 'కాదు' లేక 'లేదు' అని రెండు రకముల అర్థమును చెప్పుకోవచ్చును. భూత, భవిష్యత్లు అను పదములకు అర్థమును చూస్తే భూత అనగా సందర్భమునుబట్టి జరిగిపోయిన కాలమని అర్థము. అలాగే భవిష్యత్ అనగా జరుగబోవు కాలమని అర్థము గలదు. జరిగిపోయిన కాలములోగానీ జరుగబోవు కాలములోగానీ లేదు అనడానికి “న భూతో, న భవిష్యత్" అని చెప్పుచున్నారు. ఇక్కడ లేదు అనుటకు “న” అను అక్షరమును ఉపయోగించారు. అలాగే “రకము” అను పదము ముందర “న” అను అక్షరమును ఉపయోగించడము వలన ఒక రకము కాదు అని అర్థము వచ్చుచున్నది. రకము అంటే ఒక విధానము అని అర్థము. పాపమును అనుభవించువాడు ఒక రకము కాకుండా అనేక రకములుగా బాధలు, హింసలు అనుభవించవలసియుండును. అందువలన వీడు (పాపాత్ముడు) అనుభవించే కష్టాలు, హింసలు ఒకరకమైనవి కాదు, అనేక రకములుగా అనుభవములుండును అని తెలుపుచూ న + రకము = నరకము అని అన్నారు.
పాపమును కష్టాలరూపములో, హింసలరూపములో అనుభవించు వాడు తనమాటలతో ఇతరులకు చెప్పునప్పుడు “నేను ఒకరకమైన కష్టాలను అనుభవించలేదు. చెప్పుకుంటే తీరనన్ని బాధలను అనుభవించాను” అని అంటున్నాడు. ఈ మాటనుబట్టి వాడు అనుభవించినది నరకము అని చెప్పవచ్చును. నరక బాధలు అని అంటే ఒకరకమైన బాధలు కాదు అని అర్థమగుచున్నది. నరకము అను పదమును పలుకునప్పుడు ఒకరకము కాదు అని అర్థము తెలిసి పలుకకున్ననూ, పలికిన మాటను గురించి, దాని అర్థమును గురించి తెలుసుకొంటే ఒకరకము కాదు అనియే తెలియుచున్నది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ఒక ప్రశ్నను వేసుకొందాము. మనము అనేకరక బాధలను భూమండలములోనే అనుభవిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకొని చూస్తే, పుట్టినప్పటినుండి ప్రతి మనిషీ రకరకముల బాధలను అనుభవించుచున్నాడనియే చెప్పవచ్చును. నేను ఒకేరకమైన బాధను అనుభవిస్తున్నాను అని చెప్పువాడు భూమిమీద ఎవడూ ఉండడు. ఉదయము కడుపునొప్పితో బాధపడినవాడు కొద్దిసేపటికే వాంతులతో బాధపడును, తర్వాత కొద్దిసేపటికే తలనొప్పి వచ్చిందనుకో దానితో కూడా బాధపడును. ఉదయమునుండి మధ్యాహ్నము వరకు కడుపునొప్పి, వాంతులు, తలనొప్పితో బాధపడినవాడు సాయంకాలమునకు జ్వరము వొళ్ళునొప్పులతో బాధపడినాడు. అప్పుడు వాడు ఒక దినమే ఐదు లేక ఆరు బాధలతో బాధపడుట వలన దానినే పాప అనుభవము ఒకరకము కాదని తెలుపుటకు “నరకము” అని చెప్పడము జరిగినది.
ఈ విధముగా ప్రపంచములో పాపఫలితమును ప్రతి మనిషీ అనేక రకములుగా అనుభవించడమువలన ఆ పాప అనుభవమును నరకము అని అన్నారు. ఈ అర్ధము ప్రకారము నరకము ప్రతి మనిషి అనుభవములో యున్నదని తెలియుచున్నది. అలాగే స్వర్గము అనునది కూడా మనిషి యొక్క అనుభవములోనే యున్నది. మనిషి భూమిమీద ఎక్కడుంటే అక్కడ స్వయాన కష్టసుఖములను అనుభవించుచున్నాడు కావున పుణ్య అనుభవము లయిన సుఖములను అనుభవించడమును స్వర్గము అని అనవచ్చును. అట్లే పాప అనుభవములయిన బాధలను, కష్టములను, హింసలను అనుభవించడమును నరకము అని అనవచ్చును. మనిషి స్వయాన అనుభవించు అనుభవములను స్వర్గనరకములంటే సరిపోతుందిగానీ, స్వర్గ నరకములు ప్రత్యేకమయిన లోకములు అంటే సరిపోదు. అది అర్థములేని మాటయగును. అర్థములేనిదే కాదు అజ్ఞానపు మాటకూడా యగును. సత్యమును తెలుసుకొని చూడగలిగితే ప్రపంచములో ఎక్కడున్నవారు అక్కడే కష్టములనూ మరియు సుఖములనూ అనుభవించుచున్నారు. అంటే ఎక్కడి వారు అక్కడే స్వర్గమునూ, నరకమునూ అనుభవించుచున్నారని తెలియు చున్నది. జ్ఞానముతో సత్యమును చూడగల్గితే స్వర్గనరకములనునవి ప్రత్యేక లోకములు కాదనీ, ప్రపంచమంతాయున్న జీవరాశులన్నీ నిత్యము స్వర్గ నరకములను అనుభవించుచున్నవనీ తెలియుచున్నది. స్వర్గనరకములు రెండూ ప్రత్యక్షముగా యున్నవనీ పరోక్షముగా లేవనీ అర్థమగుచున్నది.
ఒక మనిషి ఉదయము లేచింది మొదలు అతనికి స్వర్గముతోనో, నరకముతోనో ప్రారంభమగుచున్నది. మనిషి నిద్రలోనికి పోవువరకు వాడు బయట సంఘటనల ద్వారాగానీ, శరీరములోపల రోగముల వలనగానీ బాధపడడము నరకము అనుభవించినట్లే యగుచున్నది. అదే మనిషి లేచింది మొదలు నిద్రపోవువరకు బయట మనుషులద్వారాగానీ, సంఘటనల ద్వారాగానీ, లోపల కలుగు ఊహల వలనగానీ, సుఖములను అనుభవించ డము స్వర్గమును అనుభవించినట్లే యగుచున్నది. ఈ విధముగా స్వర్గ నరకములు ఎల్లప్పుడూ ఎక్కడుంటే అక్కడ అమలు జరుగుచున్నవి. అయితే మనిషి అనుభవించు బాధలలో యమబాధలు కొన్ని, యమకింకరుల బాధలు కొన్ని గలవు. అట్లే మనిషి అనుభవించు సుఖములలో ఇంద్ర సుఖములు కొన్ని, అప్సరసలు అందించు సుఖములు కొన్ని గలవు. మనిషి అనుభవించు కష్టములలో ఏవి
యమబాధలో, ఏవి యమకింకరుల బాధలో తెలియగలిగితే సుఖములలో కూడా ఇంద్రసుఖములనూ, అప్సరసల సుఖములనూ తెలియ వచ్చును.
నరకమును అనుభవించడములో స్వయముగా యమధర్మరాజే కలుగుజేయు బాధలను యమబాధలు అనవచ్చును. ఇక్కడ యముడు అంటే ఎక్కడో ఏదో రాజ్యమునకు రాజు అని అనుకోకూడదు. అట్లు అనుకుంటే మనము కూడా పురాణములలోనికి పోయినట్లగును. ఇక్కడ శరీరములో మనిషి బాధలు అనుభవిస్తున్నాడు కదా! బాగా అర్థము చేసుకుంటే శరీరము ఒక ఎల్లలు గల రాజ్యములాంటిది. శరీరమను రాజ్యమునకు ఒక అధిపతి గలడు. అతనినే శరీరమునకు రాజు అని కూడా అనవచ్చును. శరీరమునకు రాజు లేక అధిపతి ఎవరు అని ఆలోచిస్తే, నీ శరీరములో నీవు మాత్రము రాజువు కావు. ప్రతి శరీరమునకూ ఒక అధిపతి గలడు. అతనిని ప్రస్తుతానికి (మిస్టర్ ఎక్స్) అనుకుందాము. శరీరములో ఎవడు అధిపతి అయినది తెలియనప్పుడు అతనిని మిస్టర్ ఎక్స్ గానే లెక్కించవలెను. ఇప్పుడు మనము మిస్టర్ ఎక్స్ చెప్పుకొను వాడే శరీరమునకు అధిపతిగా లేక రాజుగాయున్నాడు కావున, ఆయన కొన్ని సమయములలో మనము చేసుకొన్న తప్పునుబట్టి కఠినముగా వ్యవహరించి శిక్షించును. మరికొన్ని సమయములలో మనిషి చేసుకొన్న మంచినిబట్టి మనిషి మీద దయగలిగి మనిషికి అనుకూలముగా ప్రవర్తించి సంతోషింపజేయును. ఈ విధముగా మనిషిని వాని శరీరములోనే శిక్షించి బాధించునపుడు అతని అధిపతిని యముడు అంటున్నాము. అధిపతి పెట్టు బాధలను యమబాధలు అంటున్నాము. శరీరములో ఏదో ఒక రోగము వచ్చి మనిషి ఆ రోగము ద్వారా బాధపడుచున్నాడంటే, అది నిజముగా యమబాధేనని చెప్పవచ్చును. ఈ కాలపు డాక్టర్లు ఈ మాట వింటే నవ్వుకొని వీరు ఎంత తెలివితక్కువవారని అనుకోవడము ఖాయముగా జరుగును. రోగము వచ్చి బాధపడుచుంటే ఎవడో యముడు బాధపెట్టుచున్నాడని అనుకోవడము మూర్ఖత్వము కాదాయని అనుకోవడము జరుగుచున్నది. ఇంకా కొందరు విజ్ఞానులు సైన్సు ఎంతగానో అభివృద్ధి అయిన ఈ కాలములో వీరు ఇంకా రాతియుగములోని వారు మాట్లాడినట్లు మాట్లాడుచున్నారని హేళనగా చూడవచ్చును.
ఒక విధముగా వారిమాట వారికి గొప్పగాయున్నా వారిది విజ్ఞానమే అయినా, శరీరమునకు అధిపతియున్నాడని చెప్పిన వారి మాటలలో వారికి తెలియని విజ్ఞానముకలదని వారికి తెలియదు. నేటి విజ్ఞానులకు సైన్సు మాత్రము తెలుసు, అయితే శరీరములో మిస్టర్ ఎక్స్ను గుర్తించిన వారికి “సూపర్సైన్సు” తెలియునని వారికి తెలియదు. శరీరములోని రోగము క్రిములవలన వచ్చినదని చెప్పుచున్నవారు సామాన్యశాస్త్రమును మాత్రమే చదువగలిగారు. అయితే శరీర అధిపతిని గుర్తించినవారు అసమాన్య శాస్త్రమును సహితము చదివియుందురని సామాన్యశాస్త్రము (సైన్సు) చదివిన వారికి తెలియదు. డాక్టర్లకు శరీరములో రోగము ఎట్లు ప్రవేశించినదో తెలుసు, అలాగే ఆ రోగము యొక్క నివారణకు ఏ మందులు వాడాలో కూడా వారికి తెలుసు. అయితే శరీరములోని అధిపతికి తెలియకుండా రోగము శరీరములోనికి రాలేదని వారికి తెలియదు. అధిపతియైన మిస్టర్ ఎక్స్ అనుమతితోనే శరీరములోనికి రోగము ప్రవేశించినదనీ, తర్వాత శరీరాధిపతి ఆజ్ఞలేనిది అది బయటికి పోదనీ కూడా వారికి తెలియదు.
శరీరములో ఏమి జరిగినా అది శరీర అధిపతియైన వానికి తెలియకుండా జరుగదు. శరీరము మిస్టర్ ఎక్స్ ఆధీనములో ఉండగా జీవుడు అనువాడు శరీరములో ఒక పరిమితియైన స్థలములో నివసించు చున్నాడు. శరీరములోని జీవుడు శరీరమునకు ఒక అధిపతి యున్నాడని తెలియక అజ్ఞానముతో శరీరములో తాను తప్ప మరెవ్వరూ లేరను కొనుచుండును. నేడు ప్రపంచములో ఉండు మనుషులు మొత్తము అలాగే అనుకొనుచుందురు. కొందరు
జ్ఞానులుగాయున్నవారు, స్వామీజీలు మొదలగువారు శరీరములో జీవుడుకాక దేవుడు కూడా యున్నాడని చెప్పు చుందురు. ఆ మాట వాస్తవమే అయినా, దేవుడు దేహములందే కాకుండా దేహముల బయట కూడా ఉన్నాడు. అందువలన ఆయన సర్వమునకు అధిపతియైనవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ శరీరము బయట కాకుండా, శరీరములోపల శరీరమునకు మాత్రమే అధిపతిగాయున్నవారు ఎవరు అని ప్రశ్నించితే జీవుడూకాడు, దేవుడూకాడు అని చెప్పవచ్చును. జీవునికంటే పెద్దవాడు, దేవునికంటే చిన్నవాడు అయినవాడు శరీరమునకు అధిపతిగా యున్నాడని చెప్పవచ్చును. జీవునికీ దేవునికీ మధ్యలోయున్న మిస్టర్ ఎక్స్ మేము పెద్ద జ్ఞానులము అనుకొన్న వారికి కూడా తెలియడు. అందువలన తెలియని వానిని మేము కూడా మిస్టర్ ఎక్స్ అని పేరుపెట్టి చెప్పుచున్నాము. మిస్టర్ ఎక్స్ అని చెప్పబడినవాడే సందర్భానుసారము రెండు పేర్లతో తెలియబడును. రెండు పేర్లతో సందర్భానుసారము చెప్పవలసియుంటుంది, కావున రెండు పేర్లలో ఏ పేరునూ పెట్టి చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తిగా మిస్టర్ ఎక్స్ అని శరీరాధిపతిని చెప్పచున్నాము.
సందర్భానుసారము ఇంతకుముందే శరీరాధిపతికి యముడు అని పేరు పెట్టారు. శరీరములోని జీవున్ని హింసించు శక్తి, అధికారము “యముడు" అని పేరుపెట్టబడిన అధిపతికి మాత్రమే కలదు. శరీరము లోపల జీవుడు ఎన్ని బాధలను అనుభవించినా, అవన్నిటినీ శరీరమునకు అధిపతిగాయున్న వాడే కలుగజేయును. అటువంటి బాధలనే యమబాధలనీ, యముడు స్వయముగా విధించు బాధలనీ చెప్పవచ్చును. శరీరము బయటినుండి కాకుండా శరీరములోపలనే జరుగు సంఘటనకు, విధించబడు బాధలకు కారకుడు లోపలనున్న యమధర్మరాజేనని తెలియవలెను. ఇప్పుడు చెప్పండి యముడు ప్రత్యేకమైన రాజ్యములో యున్నాడా? ప్రత్యేకమైన లోకము, రాజ్యము బాహ్యముగా ఏదీ లేదుగానీ, శరీరమే యముని రాజ్యము అనుకుంటే అన్నీ సరిపోతాయి, అన్ని ప్రశ్నలకూ జవాబులు దొరుకుతాయి. నరక బాధలను అనుభవించడము రెండు రకములుగా విభజించి చెప్పుకొంటూ, శరీర అధిపతియైనవాడు స్వయముగా బాధపెట్టడము ఒకరకము కాగా, అధిపతి క్రింద అధిపతి ఆజ్ఞతో పని చేయు సేవకులను లేక కింకరులను యమకింకరులు బాధపెట్టడము మరొక రకమగును. ఎప్పుడయితే శరీరములో కాకుండా శరీరము బయటనుండి బాధలు వస్తున్నాయో, అప్పుడు వాటిని యమభటులు పెట్టు బాధలుగా తలచవలెను. “నానా రూపేణ కాలకింకరః” అను వాక్యము ప్రకారము అనేక విధములుగా బయటినుండి వచ్చు బాధలన్నిటినీ యమకింకర బాధలు అని అనవలెను. బయటినుండి వచ్చు బాధలను యమబాధలని అనకూడదు. అట్లే లోపల కల్గుబాధలను యమకింకరబాధలు అని అనకూడదు. ఈ విధముగా నరకము అనునది యమబాధలుగా, యమకింకరబాధలుగా రెండు విధముల చెప్పబడినదని తెలియవలెను.
ఉదాహరణకు మనుషులు అనుభవించిన బాధలను తీసుకొని చూస్తాము. సమీప అడవికి పోయి కట్టెలను తెచ్చి వాటిని అమ్ముకొని జీవనము చేయువారు అడవి సమీప ప్రాంతములలో చాలామందియున్నారు. నంద్యాల నుండి గిద్దలూరు పోవు మార్గములో నల్లమల అడవికి సమీపమున గాజులపల్లి అను చిన్న పల్లె కలదు. ఆ పల్లెలోని వారు చాలామంది సమీప అడవిలోనికి పోయి కట్టెలను తెచ్చి జీవనము సాగించుకొను చుందురు. అటువంటి ఊరినుండి కొందరు గుంపుగా అడవిలోనికి పోయి కట్టెలను కొట్టుచుండగా, ఒక మనిషికి తేలుకుట్టడము జరిగినది. అడవి మృగములు దాడి చేయకుండుటకు పదిమంది గుంపుగా అడవిలోనికి పోవడము జరిగెడిది. మనుషుల గుంపును చూచి కౄరమృగము దూరముగా పోవునని వారికి తెలుసు. అలాగే అడవిలోనికి గుంపుగా పోయినవారిలో ఒకనికి తేలుకుట్టగా కుట్టించుకొన్నవాడు విపరీతముగా బాధపడుచుండెను. అప్పుడు గుంపులోని వారందరూ తేలు విషమును హరించు మూలిక కొరకు వెదకను ఆరంభించారు. మూలికను వెదుకు ధ్యాసలో ఒక గుంపుగాయున్న వారు తలా ఒక ప్రక్కకు
చెల్లాచెదురుగా పోయి వెదుకుచుండగా, చెట్టుపొదల చాటున పడుకొనియున్న అడవిపంది ఒక మనిషిమీద దాడిచేసింది. అప్పుడు అతను గట్టిగా కేకపెట్టగా, సమీపమునయున్న మిగతావారందరూ వచ్చి పందిని తరిమివేయడము జరిగినది. అంతటితో వారు ఆ దినము పనిని ఆపివేసి అందరూ ఇళ్ళకు వచ్చారు. ఇక్కడ వారిలో ఇద్దరికి బాధలు అనుభవములోనికి వచ్చాయి. అయితే ఈ బాధలను యమబాధలు అనవచ్చునా లేక యమకింకరుల బాధలు అనవచ్చునాయను ప్రశ్న వచ్చినది. దానికి సమాధానము ఇలా కలదు.
ఒకరికి తేలుకుట్టిన బాధ, మరొకరికి పంది కరచిన బాధకల్గినవి. ఈ రెండు బాధలూ శరీరములో తయారయినవి కావు. శరీరము బయట జరిగిన సంఘటనల ద్వారా వచ్చిన బాధలు అయినందున వాటిని యమ బాధలు అనుటకు వీలులేదు. ఆ రెండు బాధలనూ యమకింకరుల నుండి వచ్చిన బాధలని చెప్పవచ్చును. ఇక్కడ యమకింకరులుగా ఒకటి తేలు, రెండు పంది ఉన్నవి. తేలు, పంది యమకింకరులగునాయని కొందరు ఆశ్చర్యమును వ్యక్తము చేయవచ్చును. యమకింకరుల రూపములో ఏమయినా కావచ్చును. అందులో ఆశ్చర్యపడవలసిన అవసరములేదు. “నాన రూపేణ కాలకింకరః” అనుమాట ప్రకారము కాలకింకరులు (యమ కింకరులు) ఏ రూపములోనయినా ఉండవచ్చును. అడవికిపోయిన ఇద్దరు మనుషులకు ముందువెనుక జరిగిన సంఘటనలలో సంభవించిన బాధలు యమకింకరులు విధించినవని చెప్పవచ్చును. ఈ సూత్రము ప్రకారము శరీరములోనే ఉత్పన్నమగు బాధలను యమబాధలనీ, శరీరము బయటి నుండి వచ్చు బాధలను యమకింకరబాధలనీ సులభముగా చెప్పవచ్చును.
స్వర్గ సుఖములను కూడా ఇదే విధముగా విభజించి చెప్పవచ్చును. శరీరములో జరిగే సుఖములు ఇంద్రుని ద్వారా వచ్చు సుఖములనీ, శరీరము బయటనుండి వచ్చు సుఖములు ఇంద్రుని క్రింద పనిచేయు ఇంద్రసేన అయిన దేవతల ద్వారా కలుగుచున్నవనీ చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్యముగా చెప్పవలసిన సమాచారము ఏమంటే! శరీరములో కలిగే సుఖములు శరీరమునకు అధిపతిగాయున్న మిస్టర్ ఎక్స్ ద్వారానే కలుగుచున్నవి. అయితే ఇక్కడ మిస్టర్ ఎక్స్ను రెండు పేర్లతో పిలుస్తున్నాము. పాప ఫలితములయిన కష్టాలను అనుభవింప చేసినప్పుడు, శరీరమునకు అధిపతియైన మిస్టర్ ఎక్స్ను 'యముడు' అన్నాము. ఇక్కడేమో పుణ్య ఫలితములయిన సుఖములను అనుభవింప చేయునప్పుడు, అదే మిస్టర్ ఎక్స్ను 'ఇంద్రుడు' అని అంటున్నాము. ఒకే ఎక్స్ను ఒకచోట యముడనీ, మరొక చోట ఇంద్రుడనీ పిలువడములో ఆంతర్యమేముంది? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. ఎవడయితే శరీరమునకు అధిపతిగా యున్నాడో, వానినే ఖుర్ఆన్ గ్రంథములో "శరీరములో కాపలాదారుడు” అని 86వ సూరా 4వ ఆయత్లో చెప్పగా, అతనినే 50వ సూరాలో 21వ ఆయత్లో “మనిషిని త్రోలువాడు” అని చెప్పారు. బైబిలులో యోహాన్ సువార్త 19వ అధ్యాయము, 11వ వచనములో "నీ అధికారి నీకు ఆజ్ఞ ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదనెను. అక్కడ చెప్పిన అధికారే మిస్టర్ ఎక్స్ భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమను పదిహేనవ అధ్యాయమున 16వ శ్లోకములో అక్షరుడు (నాశనము కానివాడు) అని చెప్పారు. అదే అక్షరున్నే మనము శరీరమునకు అధిపతియని చెప్పాము. అతనినే ఒక సందర్భములో యముడనీ, మరొక సందర్భములో ఇంద్రుడనీ చెప్పాము. ఇన్ని విధముల చెప్పబడిన వాని అసలు పేరు చెప్పకుండా మిస్టర్ ఎక్స్ అని చెప్పి సందర్భానుసారము ఒక్కొక్క విధముగా పిలుస్తున్నాము. అంతకీ శరీరమునకు అధిపతియైన వాని అసలు పేరు ఏమిటి? అని అడిగితే ఇంతవరకూ మనము చెప్పుకొన్న పేర్లలో ఒకటి కూడా అసలుపేరు కాదు. సందర్భమునుబట్టి పెట్టిన బిరుదులలాంటి పేర్లు తప్ప అవి ఏవీ అసలు పేరు కాదు.
అసలు పేరు ఎవరికీ తెలియకుండ 'అణిగియున్నవాడు' అని అర్థము వచ్చు “ఆత్మ” అనుపేరు కల్గియున్నాడు. ఆత్మ శరీరములో అధిపతిగా యుంటూ అనేక కార్యములను నిర్వర్తించుచున్నది. ఆత్మ శరీరములోనే మనిషికి (జీవునికి) పాపములను అనుభవింపచేయుచున్నది. అలాగే పుణ్యములను కూడా అనుభవింపజేయుచున్నది. శరీరములో లోపల తాను స్వయముగా చేయడమేకాక, తన పరివారము చేత శరీరము బయటనుండి కూడా మనిషితో పాపపుణ్యములను అనుభవింపజేయుచున్నదని ఇంతకుముందు చెప్పుకొన్నాము. ఇంతవరకు ఆత్మకు చిన్నదైన జీవాత్మను గురించి కొందరు చెప్పుకోవడము జరుగుచున్నది. అట్లే ఆత్మకు పెద్దదయిన పరమాత్మను గురించి చెప్పుకొనువారు కూడా యున్నారు. అయితే రెండిటికీ మధ్యలో నున్న ఆత్మను గురించి చెప్పుకొనువారు ఎవరూ లేరు. ఆత్మ అను మాటను చాలామంది చాలామార్లు పలికినా, అది ఊతపదములాగ పలుకబడుచున్నదే గానీ, అర్థముతో కూడుకొన్నదానిగా గానీ, అధిపతిగా యున్నదనిగానీ, యమునిగా గానీ, ఇంద్రుడుగా గానీ ఎవరూ అనుకోవడము లేదు. ఆత్మంటే ఏమిటో, ఎట్లుంటుందో, దాని పనేదో, దాని స్థానమేదో, దాని పుట్టు పూర్వోత్తరమేమో ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. మూడు మూల గ్రంథములలో ఆత్మను గురించి దేవుడు చెప్పియున్నా అది ఏమిటో ఎవరికీ అవగాహనకు రాలేదు.
అంతమందికి తెలియని దానిని నేను ఒక్కమారుగా చెప్పితే బాగుండదని అందరి ధ్యాస ఆత్మమీదికి రావలయుననీ, శరీరములో అధిపతిగానున్న ఆత్మను మిస్టర్ ఎక్స్ అనీ చెప్పాను. నేను అలా క్రొత్త పేరు చెప్పడమువలన మిస్టర్ ఎక్స్ అంటే ఎవరని తెలుసుకొనుటకు కొందరయినా ప్రయత్నిస్తారని అలా చెప్పడము జరిగినది. శరీరమున అనేక కార్యములకు కారణమైన ఆత్మ పాపపుణ్య కర్మలను అనుభవింప జేయడములో ఒకచోట “యమ” అని పిలువబడినది. మరొకచోట “ఇంద్ర” అని పిలువబడినది. అలా ఒక సందర్భములో 'యమ' అని పిలువబడుటకు, మరొక సందర్భములో 'ఇంద్ర' అని పిలువబడుటకు కారణమేమయినా ఉన్నదేమో కొంత వివరించుకొని చూస్తాము.
భూమిమీద సమస్త సృష్ఠి, సమస్త జీవజాలము కనిపించుచున్నది. మనము మానవజాతి అయినందున మనిషిని తీసుకొని చూస్తాము. మనిషిని రెండు భాగములుగా విభజించవచ్చును. సజీవ మనిషిలో ప్రకృతి ఒక భాగము కాగా, ఆత్మలు ఒక భాగముగా యున్నవి. ప్రకృతిని విడదీసి చూస్తే ప్రకృతి ఐదు భాగములుగా యున్నది. ఆత్మలను విడదీసి చూస్తే మూడు ఆత్మలు గలవు. ఒక మనిషి మొత్తము ఐదు ప్రకృతులుగా, మూడు ఆత్మలుగా యున్నాడని చెప్పవచ్చును. మనిషి శరీరములో ఐదు ప్రకృతులు నిత్యము పనిచేయుచున్నవి. ఆత్మల విషయమునకువస్తే, మూడు ఆత్మలలో రెండు ఆత్మలు నిత్యము పనిచేయుచున్నవి. ఒక ఆత్మ మాత్రము పని చేయడము లేదు. మూడు ఆత్మలలో జీవాత్మ అనునది, ఆత్మ అనునది పనిచేయగా దేవుడు లేక పరమాత్మ అనునది పనిచేయక ఊరకయున్నది. ఊరకయున్నదంటే సాక్షిగా యున్నట్లేనని చెప్పుకోవచ్చును. శరీరములో పరమాత్మ అనునది చేయవలసిన పనిలేదు. కావున అది లేకున్నా సరిపోతుంది కదాయంటే, సరిపోతుంది. అయితే పరమాత్మ లేకుండాపోతే మిగతా రెండు ఆత్మలుగానీ, మిగతా ఐదు ప్రకృతులుగానీ పని చేయవు. పరమాత్మ ఉంటేనే శరీరములోని ఏడూ పనిచేయును. అందువలన పనిలేని పరమాత్మ అన్నిటికీ తోడుగా శరీరములో ఉన్నాడు. ప్రకృతి స్థూలమైనది కావున ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములు శరీర భాగములుగా తయారయినవి. ఐదు ప్రకృతి భాగములు కలిసి 24 శరీర భాగములుగా తయారుకాగా, అది ఒక శరీరముగా కనిపించుచున్నది. ప్రకృతికి కదిలేశక్తి లేదు, కావున 24 భాగముల శరీరము స్వయముగా కదలలేదు. ప్రకృతి శరీరమును కదిలించుటకు మిగిలిన మూడు ఆత్మల మీద ఆధారపడవలసి వచ్చినది. అయితే మూడు ఆత్మలలో ఒకటి దేవుడు, మరొకటి జీవుడుకాగా మధ్యలోని ఆత్మ మాత్రము యమునిగా ఉన్నది. దేవుడు పనిచేయువాడు కాడు.
అందువలన ఆయన శరీరమును కదిలించడు. ఇకపోతే జీవుడు పనిచేయువాడుకాడు, జీవుడు గ్రుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు, కుంటివాడు అయినందున వాడు శరీరమును కదలించలేడు.
ఈ విధముగా మనిషి శరీరమున్నా, అందులో జీవుడూ, దేవుడూ యున్నా, శరీరము మాత్రము పనిచేయని స్థితిలో ఉండును. అటువంటి శరీరమునకు అధిపతిగాయుంటూ దానిని కదిలించి, పని చేయించువాడు ఒక్కడే ఒక్కడు. అతడే యముడు, అతడే ఇంద్రుడు. ఈ రెండు పేర్లు గలిగి శరీరమును కదలించువాడు మూడు ఆత్మలలో మిగిలిన మధ్యలోని ఆత్మ. ఇంతకుముందు మనము మిస్టర్ ఎక్స్ అని ఎవరినయితే పిలుచు కొన్నామో అతడే జీవునికీ, దేవునికీ మధ్యలోగల ఆత్మ. మూడు ఆత్మలలో ఒకటి జీవాత్మకాగా, రెండవది ఆత్మకాగా, మూడవది పరమాత్మగా యున్నది. మధ్యలో ఆత్మగాయున్నవాడే సందర్భనుసారము ఒకప్పుడు యముడుగా, మరొకప్పుడు ఇంద్రునిగా చెప్పబడుచున్నాడు. శరీరమును కదిలించి జీవుని చేత పాపకర్మలను అనుభవింపజేయునప్పుడు యమునిగా చెప్పించుకొన్న వాడు, జీవుని చేత పుణ్యకర్మలను అనుభవింపజేయునప్పుడు ఇంద్రునిగా పిలిపించుకొంటున్నాడు. శరీరమునకంతటికీ కదిలే ఆత్మ ఒక్కటే అయినందున దానిని చైతన్య ఆత్మ అని కూడా అంటున్నాము. మూడు ఆత్మలలో మధ్యలోని ఆత్మ ఒకమారు యమునిగా, మరొకమారు ఇంద్రునిగా చెప్పించుకొనునప్పుడు పులింగముగా చెప్పబడుచున్నాడు. కేవలము ఆత్మగా చెప్పబడునప్పుడు స్త్రీలింగముగా చెప్పబడుచున్నది. అంతకూ ఆత్మ పులింగమా, స్త్రీలింగమా అని కొందరు అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఆత్మనునది పులింగమేనని చెప్పవచ్చును. అట్లే మిగతా జీవాత్మ, పరమాత్మలు కూడా పురుషులుగానే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగమున 16, 17 శ్లోకములలో చెప్పబడినారు.
16వ శ్లోకము: ద్వావిమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ | క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ॥
17వ శ్లోకము: ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః । యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
భావము :- "రెండు రకముల పురుషులు లోకములో గలరు. అందులో ఒకడు క్షరుడనీ, రెండవవాడు అక్షరుడనీ పిలువబడుచున్నారు. సర్వ జీవరాసులలో క్షరుడు అనువాడు గలడు. క్షరుడు ఎక్కడున్నాడో వానితోపాటు కలిసి అక్షరుడనువాడు గలడు.”
"క్షరునికంటే, అక్షరునికంటే ఉత్తమమైన పురుషుడు మరొక డున్నాడు. అతనినే పరమాత్మయని అంటున్నాము. అతడు అంతటా వ్యాపించినవాడై నాశనములేని దేవునిగా యున్నాడు.”
ఇక్కడ భగవద్గీతలో మూడు ఆత్మలను ముగ్గురు పురుషులుగా చెప్పారు. అందువలన ఆత్మనునది పురుషుడేననీ, అందువలననే ఒకమారు యముడనీ, మరొకమారు ఇంద్రుడనీ పురుషుల పేర్లనే చెప్పుచున్నాము. ముగ్గురు పురుషులు శరీరములో ఎవరికీ కనిపించకుండా, తెలియకుండా అణిగియున్నారు కావున వారిని ఆత్మలు అని అంటున్నాము. ఆత్మ అంటే తెలియకుండా అణిగియున్నదని ఇంతకుముందు కూడా చెప్పుకొన్నాము. ఆత్మ పురుషుడే అయినా తెలియనివాడని ఆత్మకు పేరునుంచాము. శరీరములో జరిగే పనులను అన్నిటినీ ఆత్మే చేయుచున్నది, లేక కదిలించి చేయిస్తున్నది. అన్ని మాటలనూ అదే మాట్లాడుచున్నది. శరీరములో ఆత్మ చేయని పనంటూ లేదు. ఒకమారు జీవునిగా నటించుచున్నది. మరొకమారు దేవునిగా కూడా నటించుచున్నది, మాట్లాడుచున్నది. జీవుడు, దేవుడు ఇద్దరూ ఉలుకువారూ కాదు,
పలుకు వారుకాదు. అయినా జీవుడు దేవుడుయొక్క ఉనికిని తెలియజేయు నిమిత్తము ఆత్మే జీవునిగా మాట్లాడుచున్నది. అట్లే దేవునిగా కూడా మాట్లాడుచున్నది. వారు చేసినట్లే అందరినీ నమ్మించి పనులను చేయుచున్నది. శరీరములో అణిగియున్న ఆత్మ ఎవరికీ అంతుబట్టనిదై, ఎవరికీ అర్థముకానిదై జీవునిగా, దేవునిగా నటించుచున్నది. అందువలన దానిని “నటించే ఆత్మ”యని ఒకమారు ఉపన్యాసములలో చెప్పాము. మరొక మారు “ఆడించే ఆత్మ”యని చెప్పాము. ఇప్పుడు “యముడు”, “ఇంద్రుడు” ఎవరో కాదు శరీరములోని ఆత్మేనని చెప్పుచున్నాము.
ఇప్పుడు నరకలోకమునకు చెందిన యముడు, స్వర్గలోకమునకు చెందిన ఇంద్రున్ని గురించి తెలుసుకొందాము. ఇంద్రున్ని “ఇంద్ర” అని అనవచ్చును. అలాగే యమున్ని “యమా” అని అనవచ్చును. యమా, ఇంద్రా కంటే ముందు కొంత విషయము తెలుసుకొందాము. ఎందుకంటే ఆత్మను ముందు యమా అని పిలువాలా లేక ఇంద్రాయని పిలువాలా అని చూచుకొనుటకు ముందు తెలియవలసినది ఏమంటే! మనిషి తన జీవితములో మంచి చెడు పనులు చేయుచూ, చెడు కార్యమునకు ఫలితముగా పాపమునూ, మంచి కార్యమునకు ఫలితముగా పుణ్యమునూ పొందు చుండును. ఒక మనిషి తన జీవితములో చెడు కార్యములను ఎక్కువ చేసి, మంచికార్యములను తక్కువ చేశాడనుకొనుము. అప్పుడు దాని ఫలితముగా పాపమును ఎక్కువ పొందును, పుణ్యమును తక్కువగా పొందును. అటువంటివాడు చనిపోయినప్పుడు జీవితములో చేసుకొన్న కర్మను ప్రారబ్ధకర్మగా తీసుకొనిపోయి మళ్ళీ జన్మను పొందుచున్నాడు. రెండవ జన్మలో పాపమును ఎక్కువగా, పుణ్యమును తక్కువగా అనుభవించవలసి యుండును. పాపమును అనుభవింపజేయువాడు ఆత్మేనని తెలుసుకొన్నాము. మనిషి జీవితములో ఎక్కువ కాలము జీవున్ని బాధలకు గురిచేసి హింసించవలసిన వాడు దేహములో ఒక్కడే కలడు. అతడు ఆత్మే అయినా జీవున్ని తన ధర్మము ప్రకారము హింసించి బాధపెట్టు చున్నాడు. శరీరములో సాక్షిగా యున్న దేవుని ముందర తన ధర్మమును తాను నిర్వర్తించుచూ, ఎవరికీ అర్థముకాని మాయగా ఉన్నాడు కాబట్టి, ఆత్మకు యమధర్మరాజు అని పేరు వచ్చినది. ఇందులో యమా అంటే పెద్దయని అర్థము. ధర్మ అంటే ధర్మము అని అర్థము. అలాగే రాజు అంటే అధిపతియని అర్థము. తప్పుకు తగిన శిక్ష, అన్నట్లు ఎంత తప్పు చేసినవానికి అంతే శిక్ష వేయడములో పద్ధతిగా, శాస్త్రీయతగా వ్యవహరించు వాడు అయినందున ధర్మమును ఆచరించడములో పెద్దయనీ, కర్మలకన్నిటికీ అధిపతియనీ తెలియునట్లు యమధర్మరాజు అని ఆత్మను అన్నారు. అంతేగాక ఆత్మ శరీరములో జీవుడున్నచోటే వుంటూ జీవునికి తెలియకుండా మసలుచూ, తాను పని చేయుచున్నా జీవుడే చేయునట్లు భ్రమింపచేసి, ప్రతి పనినీ తానే చేశానని జీవుని చేత అనిపించుటవలన ఆత్మను మాయకు ప్రతినిధిగాయున్నదని 'యమా' అని కూడా అన్నారు.
శరీరములో ప్రకృతి చేత తయారయిన పన్నెండు గుణములను మాయ అంటున్నాము. శరీరములోని ఆత్మ ఎప్పుడు ఏ గుణమును ప్రేరేపించాలో దానినే ప్రేరేపించి, గుణమాయ చేత మనిషిని కార్యముల వశమై చేయునట్లు చేయుచుండుట వలన, శరీరములోని మాయను ఉపయోగించుటకు అధిపతియైన దానివలన 'మాయ' అను పదమును త్రిప్పి ఆత్మను “యమా” అని అనడము జరిగినది. యమాను త్రిప్పి చూచితే మాయ అగును. అందువలన శరీరములో దేవునిగానే కాకుండా, మాయగా నున్నవాడు కూడా ఆత్మే కనుక ఆత్మను యమా అని చెప్పడము జరిగినది. “మాయ” అంటే గుణములగును “యమా” అంటే గుణములను ఉపయోగించు వాడని అర్థమగునట్లు యమా అను పేరుంచడము జరిగినది. పాపకార్యములు జరుగు సమయములో, ఆ కార్యములను ఆత్మ స్వయముగా శరీరములో చేయునప్పుడు, ఆత్మకు యమ అను పేరును తగిలించు చున్నాము. భగవద్గీతలో విభూతి యోగమను అధ్యాయమందు 29వ శ్లోకమున
“యమ స్సంయమతా మహమ్” “దండనాధికారులలో నేను యముడను అగుదును” అని ఆత్మను ఉద్దేశించి చెప్పడమైనది. పాపకార్యము లకు శిక్షను వేయునప్పుడు శరీరములో జరుగు బాధలకు ఆత్మ యముడై హింసించుచున్నాడు.
పుణ్యకార్యములయిన సుఖములను అనుభవింపజేయువాడు కూడా, ఆత్మేనని చెప్పుచున్నాము. శరీరములో ఏ పని చేసినా ఆత్మ చేయవలసిందే. ఆత్మ మినహా చేసేవారు ఎవరూ లేరు. అందువలన చిన్నపని మొదలుకొని పెద్దపని వరకు ఆత్మ చేయవలసిందేనని తెలియవలెను. పాపమును అమలు చేయునప్పుడు గుణములను ఉపయోగించి మాయను ప్రయోగించి ‘యమా' అను పేరుతో చలామణి అయిన ఆత్మ, పుణ్యకార్యాలయిన సుఖములను అనుభవింపచేయునప్పుడు కూడా గుణమాయను ఉపయోగించే మనిషికి సుఖములను అందించుచున్నది. దానివలన స్వర్గ సుఖములను అందించు నప్పుడు కూడా ఆత్మను న్యాయముగా యముడే అనాలి. అయితే పుణ్య సంబంధ స్వర్గ సుఖములను అందించు ఆత్మను ప్రత్యేకమయిన పేరుతో 'ఇంద్ర' అని పిలుచుచున్నాము. పాపకార్యములలో ఉపయోగించు మాయనే పుణ్యకార్యములలో కూడా ఉపయోగించి ప్రేరేపించునప్పుడు ఆత్మను పాపకార్యములలో 'యమా' అన్నట్లే, పుణ్యకార్యములలో కూడా అదే పేరును ఉపయోగించక 'ఇంద్ర' అని ఎందుకు అనవలసి వచ్చినదను ప్రశ్నకు జవాబు ఈ విధముగా కలదు.
చెడుపనులను పాపపుపనులు అని అంటున్నాము కదా! అట్లే మంచి పనులను పుణ్యపు పనులు అని అంటున్నాము. పాపపు పనులు రెండు రకములు గలవు. అందువలన వాటిలో వచ్చు పాపము కూడా రెండు రకములుగా ఉండును. ప్రపంచ సంబంధమైన చెడు పనులన్నిటికీ వాటికి తగిన పాపము రావడము తెలిసిన విషయమే. దాని ఫలితముగా కష్టములు, బాధలు, హింసలు అనుభవిస్తున్నాము. ఇదంతయూ ఇంతవరకు చెప్పుకొన్న విషయమే. అయితే ఇక్కడ కొంత తెలియని విషయము కూడా ఉన్నది దానిని ఇప్పుడు గమనిస్తాము. పాపపు పనులలో ప్రపంచ సంబంధ కార్యములే కాకుండా, దైవిక సంబంధమైన కార్యములు కూడా కలవు. దైవమునకుగానీ, దైవజ్ఞానమునకుగానీ వ్యతిరేఖమయిన పనులు చేసినా, మనస్సునందు లేక భావమునందు వ్యతిరేఖతను చూపినా, తలచినా అటువంటివానికి పాపమే వచ్చునుగానీ, ఆ పాపము క్షమించరాని లేక క్షమించబడని పాపముగా ఉండును. ప్రపంచ కార్యములో వచ్చు పాపము క్షమించబడుటకు అర్హమై ఉండును. దానిని మనిషి అనుభవించకుండా తప్పించుకొనుటకు వీలుకలదు. అయితే క్షమించబడని పాపమును తప్పక అనుభవించవలసివచ్చును. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! "క్షమించబడే కర్మంటే ఏమిటి? ఎలా క్షమించబడును?" అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలా కలదు. భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమందు 37వ శ్లోకము ఇలా కలదు చూడండి.
శ్లోకము: యథైధాంసి సమిద్ధోగ్ని ర్భస్మసాత్కురు తేర్జున జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా॥
భావము :- “ఏ విధముగా అగ్నిలోపడిన ఎన్ని కట్టెలయినా కాలి బూడిద యైనట్లు, జ్ఞానమను అగ్నిలో పడిన కర్మలు ఏవయినా కాలిపోవును.” ఇక్కడ చెప్పిన విషయమునుబట్టి మనము చేసుకొన్న ప్రపంచ సంబంధ కర్మలు ఏవయినా పుణ్యమయినా, పాపమయినా జ్ఞానమను అగ్నిలో కాలిపోవునని తెలియుచున్నది. దైవజ్ఞానము సంపాదించుకొన్న వాని శరీరములో గల కర్మలు వాడు తెలిసిన జ్ఞానముచేత నిర్వీర్యమై పోవుచున్నవి. అలా కాలిపోయిన కర్మలు అనుభవమునకు రావు. అందువలన అటువంటి కర్మలను క్షమించబడు కర్మలు అంటాము. మనిషిలో దైవజ్ఞానము లేకపోతే కర్మలన్నిటినీ
అనుభవించవలసిందే. జ్ఞానముంటే కాలిపోవుటకు అర్హత కల్గియున్న కర్మలను (పాపములను, పుణ్యములను) క్షమించబడు పాపములు, క్షమించబడు పుణ్యములు అని అంటాము.
క్షమించబడని పాపమును గురించి ఒక మూలగ్రంథములో కలదు. అక్కడ పాపమును గురించి చెప్పారు. ఇక్కడ పుణ్యమును గురించి కూడా మేము చెప్పుచున్నాము. మంచి చెడు రెండు కర్మలు అగ్నికి కాలిపోవునని ఉన్నప్పుడు, అట్లే కాలిపోనివి కూడా రెండూ ఉండును. బైబిలు గ్రంథములో మత్తయి సువార్త 12వ అధ్యాయము, 31వ వాక్యములో “మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమించబడును గానీ, ఆత్మ విషయమైన (దైవ సంబంధ విషయములలో) దూషణకు పాప క్షమాపణ లేదు.” అని చెప్పబడినది. భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగ యోగమున 9వ శ్లోకమున మరియు 19, 20వ శ్లోకములలో క్షమించబడని పాపమును గురించి భగవంతుడు చెప్పాడు. వీటినన్నిటినీ గ్రహించిన తర్వాత క్షమించబడే కర్మలు, క్షమించబడని కర్మలు అని రెండు రకములు గలవని తెలియుచున్నది. అనుభవింపబడే పాపపుణ్యములకు ఆడించేవాడు ఒకే ఆత్మకాగా, దానిని పాపకర్మలను అనుభవింపజేయునప్పుడు 'యమా' అనడమూ, పుణ్య కర్మలు అనుభవించునప్పుడు 'ఇంద్ర' అని చెప్పుకొన్నాము. అలా రెండు రకములు చెప్పుటకు కారణము కలదు, అదేమనగా!
పుణ్యములు, పాపములున్నట్లే రెండు రకములు గలవు. ప్రపంచ సంబంధ పాపములు పుణ్యములు అనుభవమునకు వస్తాయి, అయిపోతాయి. దైవ సంబంధమైన జ్ఞానముంటే అనుభవమునకు రాకుండానే కాలిపోతాయి. దైవమునకు వ్యతిరేఖముగా సంపాదించిన కర్మలు ఏవయినా అనుభవించి తీరవలసిందే అవి జ్ఞానమునకు కాలిపోవు. వాటినే క్షమించరాని పాపములు అంటాము. అలాగే దైవమునకుగానీ, దైవ జ్ఞానమునకుగానీ ప్రత్యక్షముగా గానీ, పరోక్షముగా గానీ సేవ చేసినవారికి పుణ్యఫలము వచ్చును. అయితే అటువంటి పుణ్యము జ్ఞానాగ్ని చేత కాలిపోదు. అందువలన దానిని క్షమించ రాని పుణ్యము అని అంటున్నాము. జ్ఞాన సంబంధ పుణ్యము జ్ఞానాగ్నిలో కాలిపోకుండా మిగిలినప్పుడు దాని ఫలితమును కూడా తప్పక అనుభవించ వలసియుండును. క్షమించబడని దైవసంబంధ పాపము ఒకే జన్మలో అయిపోక, అనేక జన్మలు అనుభవించుచూ, జన్మజన్మకూ అథోగతిపాలు చెందినట్లు, దైవ సంబంధ పుణ్యము కూడా ఒకే జన్మలో అయిపోక జన్మ జన్మకు దైవజ్ఞానము వైపు పంపుచూ చివరికి ఉన్నతమైన జ్ఞానమునకు చేర్చగలదు. ఇంతకుముందే చెప్పాను ఏ పనిని చేసినా ఆత్మే చేయునని. పాపమును అనుభవింపజేయడములో 'యమా' అని (యముడు అని) పేరు పొందిన ఆత్మయే, దైవ సంబంధ ఫలితమునుబట్టి మనిషికి జ్ఞానమును అందించునప్పుడు జ్ఞానమునకు అధిపతియైన చంద్రునివలె ప్రవర్తించు చున్నది. కావున ఇంద్ర అని అన్నాము. చంద్రుని పేరు 'ఇందు’ అని కలదు, కావున చంద్రుని పేరయిన 'ఇందు' శబ్ధము ప్రకారము ఆత్మను 'ఇంద్ర' అంటున్నాము.
దైవ సంబంధ జ్ఞానమునకు సేవచేసినప్పుడు దేవునికి సేవ చేసినట్లేయగును. అటువంటి దైవకార్యములలో వచ్చునది క్షమించబడని పుణ్యము అని ఇక్కడ అంటున్నాము కదా! 'కార్యము వలన వచ్చునది కర్మ' అను సూత్రము ప్రకారము జ్ఞానసేవ కార్యములో క్షమించబడని పుణ్యము వచ్చినదని చెప్పుచున్నాము. ఇక్కడ దైవసంబంధ పుణ్యమును కర్మ క్రిందికి చేర్చకూడదు. ఎందుకనగా 'కార్యము వలన వచ్చునది కర్మ' అను సూత్రము ఎట్లున్నదో అట్లే 'కర్మ వలన వచ్చునది కార్యము' అనికూడా కలదు. అయితే జ్ఞాన సంబంధమైన ఫలితము పుణ్యమును కర్మ అని అనకూడదు. ఎందుకనగా మనిషి అనుభవములోని కార్యముగా ఈ కర్మ మారదు. కావున జ్ఞానసేవ వలన వచ్చిన పుణ్యమును కర్మ అని అనకుండా ఫలితము అని మారు పేరుతో చెప్పవచ్చును. లేకపోతే సంస్కార బలము అని మరియొక పేరుపెట్టుకొని
చెప్పుకోవచ్చును. జ్ఞాన సంబంధ పుణ్యములు స్వర్గ సుఖములకు ఉపయోగపడవు. కావున వాటిని కర్మలు అనిగానీ, పుణ్యములు అనిగానీ అనుటకు వీలులేదు. జ్ఞానసంబంధ పుణ్యము కార్యరూపము లోనికి రాదు. 'కార్యమును చేయించునదే’ కర్మ అను సూత్రమును అనుసరించి కార్యరూపము కాని దానివలన, జ్ఞానసంబంధమైన వాటిని ఫలితములు లేక సంస్కారములు అని అనవచ్చును. జ్ఞానమార్గమునకు “జ్యోతిష్య శాస్త్రము” ప్రకారము అధిపతి చంద్రుడు. చంద్రున్ని ఇందువు అని, ఇంద్ర అని చెప్పవచ్చును. అందువలన ప్రపంచ సంబంధ కర్మలను పాపములను అనుభవింపజేయునప్పుడు ‘యమా' అని ఏ ఆత్మనయితే అంటున్నామో, అదే ఆత్మనే దైవసంబంధ ఫలితములను మరియు పుణ్యములను అనుభవింప జేయునప్పుడు 'ఇంద్ర' అని పిలుస్తున్నాము. కనిపించని ఆత్మ వెనకాల ఇంతటి వివరము కలదు కావున, ఒకే ఆత్మనే ‘యమా’ అని ఒక సందర్భములో అంటున్నాము. అట్లే మరియొక సందర్భములో 'ఇంద్ర' అని అంటున్నాము. అంతేగానీ అజ్ఞానము చేత యముడెవరో, ఇంద్రుడెవరో తెలియనివారు, యమునిది నరకలోకమనీ, ఇంద్రునిది స్వర్గలోకమనీ చెప్పడము చాలా పొరపాటగును. పూర్తి అసత్యమగును, పూర్తి అజ్ఞానమగును.
దైవసంబంధ ఫలితములనుగానీ, ప్రపంచ సంబంధ కర్మలనుగానీ, మనిషి చేసినప్పుడు వాటిని కర్మచక్రములో నమోదు చేయువాడు ఆత్మయే. రెండు రకముల కర్మలను అనుభవింపజేయువాడు ఆత్మయని ఇంతకు ముందు చెప్పుకొన్నాము. అయితే మనిషి చేసిన పాపపుణ్యములను వ్రాసిపెట్టుకొనువాడు కూడా ఆత్మయేనని తెలియవలెను. ఆత్మ మనిషి శరీరములో కాపలాదారుడుగాయున్నాడు అని చెప్పినమాట ఖుర్ఆన్ గ్రంథములో 86వ సూరా, నాలుగవ ఆయత్నందు కలదని మరువకూడదు. కాపలాదారునిగాయుండి దేనిని కాపలా కాస్తున్నాడు అని అంటే, ప్రతి మనిషీ చేయు చిన్నతప్పును సహితమూ, అట్లే చిన్న ఒప్పును సహితమూ వ్రాసిపెట్టుచున్నాడు. కర్మ పత్రములో వ్రాసిపెట్టుచున్నాడని చెప్పవచ్చును. వాస్తవముగా శరీరములోని తలయందుగల కర్మచక్రములో ఆత్మ చేతనే కర్మ నమోదు చేయబడుచున్నది. ఆత్మ కర్మలను వ్రాసిపెట్టుటకు ఎల్లప్పుడూ కాచుకొనియున్నాడు. ఇట్లు అహర్నిశలు పాపపుణ్యములను ఒక్క దానిని కూడా వదలకుండ ఒకచోట వ్రాసిపెట్టుట వలన ఆత్మకు ప్రత్యేకమయిన పేరు కూడా కలదు. శరీరములో యుంటూ ఎవరికీ తెలియకుండా రహస్యముగా యుండుట వలన “గుప్తుడు” అని పేరు వచ్చినది. అంతేకాక శరీరములో ఒకమారు యమునిగా, మరొకమారు ఇంద్రునిగా, మరొకమారు కాపలాదారునిగా, ఎల్లప్పుడూ చిత్ర విచిత్ర పనులు చేయుచుండుట వలన ఆత్మను "చిత్రగుప్తుడు" అని కూడ అనవచ్చును.
శరీరములో దైవసంబంధ సేవలకు వచ్చు ఫలితమును గుర్తించుకొని దానికి ప్రతిఫలితముగా మనిషికి దైవజ్ఞానమును ఆత్మ అందించుచున్నది. ప్రపంచ సంబంధముగా అన్ని కర్మలను మనిషిచేత అనుభవింపచేసినా, అన్నిటికంటే గొప్పగా మనిషి దైవసంబంధముగా చేసుకొన్న ఫలితమునకు తగినట్లుగా తనకు సంబంధించిన ఆత్మజ్ఞానమును తెలియజేయుచున్నది. ఆత్మజ్ఞానమునకు అనుబంధముగా ఇటు జీవాత్మ విషయము అటు పరమాత్మ విషయము ఉండుట వలన మొత్తము మూడు ఆత్మల జ్ఞానమును ఆత్మ తెలియజేయుచున్నది. ప్రపంచములో ఏ మానవునికీ తెలియని జ్ఞానము ఆత్మకు తెలియును కనుక, జ్ఞానమును బోధించడములో ఆత్మ స్వయాన గురువుగా వ్యవహరిస్తుంది. ఈ విధముగా పరమాత్మ జ్ఞానము ప్రపంచమునకు ఆత్మ ద్వారా తెలియబడుచున్నది. ఎవరికి ఎంత జ్ఞానమును తెలుపవలెనో అంతే జ్ఞానమును ఆత్మ తెలియజేయును. పరిమితికి మించిన జ్ఞానమును ఎవనికీ తెలియజేయదు. ఎవడు చేసుకొన్న సేవా ఫలితమునకు సంబంధించిన జ్ఞానమునే ఆత్మ బోధించుచున్నది. దైవజ్ఞానమును తెలియజేయుట వలన ఇందువు (చంద్రుడు) అను బిరుదుతో ఇంద్ర అని పిలువబడుచున్నది. 'ఇంద్ర' అనగా దైవజ్ఞానమును తెలిసినవాడు
మరియు తెలుపువాడని అర్థము. ప్రపంచములో గొప్ప పేరయిన ఇంద్ర అను పేరును జ్ఞానము తెలుపు సమయములో తనకు వర్తింపచేసుకొన్నది.
నేడు ప్రపంచములో ఒక వ్యక్తి గురువుగానో, స్వామిగానో, పీఠాధిపతిగానో, పరమహంసగానోయుంటూ జ్ఞానమును బోధించు చున్నాడంటే, వానిలోన ఆత్మ తెలిపిన జ్ఞానమునే తెలుపుచున్నాడని అర్థము చేసుకోవలెను. అయితే దేశములోని ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క రకముగా బోధిస్తున్నారు కదా! ఒకరు చెప్పిన సిద్ధాంతమును మరొకరు ఒప్పుకోవడము లేదు కదా! ఒకే ఆత్మ చెప్పినప్పుడు అందరివద్దా ఒకే జ్ఞానము ఉండవలయును కదా! అట్లెందుకు లేదు అని ఎవరయినా ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! పోయిన జన్మలో ఎవడు ఎంత సేవ చేసియుంటే అంతే జ్ఞానమును ఆత్మ కొలతపెట్టి అందించును. వాని స్థోమతకంటే కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువకాని అందివ్వదు. ఎవడు ఏ భావముతో ఎంత సేవ చేసియుండునో అంతే జ్ఞానమును, అంతే భావములో ఆత్మ అందించుట వలన, భూమిమీద అనేకులు వారికి తెలిసిన భావము ప్రకారమే బోధించుట వలన, జ్ఞానములో ఒకే విధానము కనిపించక అనేక విధానములు కనిపించుచున్నవి. తెలిపిన వాడు ఒకే ఆత్మే అయినా మనుషుల భావములనుబట్టి ఆత్మ తెలిపియుండుట వలన క్రైస్తవులది ఒకరకమైన జ్ఞానముకాగా, ముస్లీమ్లది మరొక జ్ఞానముగా యున్నది. అలాగే హిందువులది (ఇందువులది) మరొక జ్ఞానముగా యున్నది. ముగ్గురికీ చెప్పినవాడు ఆత్మే అయినా వారి వారి భావములను బట్టి వారికి తెలియజేశాడు. ఈనాడుగానీ ఏనాడుగానీ మనుషుల పాపపుణ్య ములను స్వర్గనరకములుగా అమలు చేయువాడు ఆత్మే కదా! అటు వంటప్పుడు స్వర్గ నరకములు ఎక్కడున్నవో, ఎట్లున్నవో ఆత్మకు తెలియ కుండా ఏమీ లేవుకదా! స్వర్గనరకములకు అధిపతి ఆయనే (ఆత్మే) అయినప్పుడు ఆత్మకు అన్నీ తెలుసుకదా! అటువంటప్పుడు స్వర్గ నరకములు ఎక్కడో ఉన్నాయి అని చెప్పినవాడు కూడా ఆత్మే, అలా చెప్పుటకు కారణము మనుషులలోని శ్రద్ధా భావములనుబట్టియుండునని తెలియు చున్నది. మనిషిలోని శ్రద్ధనుబట్టి వాని భావమునుబట్టి ఎంత జ్ఞానము తెలుపాలి, ఎటువంటి జ్ఞానము తెలుపాలియని ఖచ్చితమైన లెక్కవేసి అంతే జ్ఞానమునూ, అటువంటి జ్ఞానమునే తెలుపును. అందువలననే భూమిమీద దైవ జ్ఞానము అంతటా ఒక విధముగా లేక అనేక విధముల కనిపించు చున్నది.
కొందరికి ఇక్కడొక ప్రశ్న రావచ్చును. అదేమనగా! మనుషుల సేవలు, భావములు ఒకే విధముగా ఉండక అనేక విధములుగా ఉండడము సహజమే. వారికి తగినట్లే ఆత్మ తన జ్ఞానమును అందించుట వలన భూమిమీద భిన్నమైన జ్ఞానములు కనిపిస్తున్నవి. అట్లు భిన్నమైన జ్ఞానములు మనుషులకు తెలియుట వలన, ఆత్మ తెలుపుట వలన అసలయిన దేవుని జ్ఞానము భూమిమీద తెలియకుండా పోగలదు కదా! అటువంటప్పుడు భూమిమీద మనుషులకు అసలయిన దైవజ్ఞానము ఎలా తెలియగలదు? అని అడుగవచ్చును దానికి మా జవాబు ఇలా కలదు చూడండి. భూమిమీద మనుషుల శ్రద్ధనుబట్టి ఎంత జ్ఞానము తెలుపాలియనీ, భావమునుబట్టి ఎటువంటి జ్ఞానమును తెలుపాలనీ ఆత్మ నిర్ణయించి తెలుపుచున్నది. మనుషుల భావములు అనేక విధములుగా ఉండును కావున అనేక జ్ఞానములు భూమిమీద తెలియజేయబడినాయి, అవే ప్రచారములో ఉన్నాయి. స్వచ్ఛమయిన దైవజ్ఞానము కావాలనుకొనువారికి, కల్మషములేని భావమున్న వారికి అసలయిన జ్ఞానము తెలియు అవకాశము కూడా కలదు. అటువంటి వారికి ఆత్మ స్వచ్ఛమయిన దైవజ్ఞానమును తెలుపు నిమిత్తము దేవుని అంశ భూమిమీద మనిషిగా పుట్టుచున్నది.
దేవుడు లెక్కలేనన్ని అంశలతో ప్రపంచమంతా వ్యాపించి, సర్వ వ్యాపిగాయున్నాడు. అంతటా వ్యాపించిన అనేక అంశలలో ఒక అంశ మానవ రూపముగా భూమిమీద పుట్టుచున్నది. అలా దైవాంశతో పుట్టిన మానవాకారమును
భగవంతుడు అని అనవచ్చును. అలా వచ్చిన శరీరములో జీవాత్మ ఉండదు. ఉన్నది పరమాత్మ మాత్రమే. భగవంతుని శరీరములో జీవాత్మయూ దానికి తోడుగాయున్న ఆత్మయూ రెండూ వుండవు. ఒకే పరమాత్మ ఆ శరీరములో ఉన్నదని చెప్పవచ్చును. అయితే పైకి కనిపించునది మానవ శరీరమే కావున దానిలో మూడు ఆత్మలు ఉండి తీరవలెను. అప్పుడు పరమాత్మే జీవాత్మగా, ఆత్మగా తయారగుచున్నది. భగవంతుని శరీరములోని పరమాత్మ అంశ మొదట ఆత్మగా మారిపోవును. అలా మారిన ఆత్మ అందరిలో ఉన్నట్లే వుంటూ జీవాత్మగా, పరమాత్మగా నటించుచున్నది. అలా నటించడము శరీరమును నడుపడము అన్ని శరీరములలో జరుగుచున్న పనియే. అన్ని శరీరములలోవలె భగవంతుని శరీరమునకు కూడా ఆత్మ అధిపతిగాయుంటూ ఆ శరీరమును నడుపు చున్నది.
అందరి శరీరములలో యున్నట్లు భగవంతుని శరీరములో కర్మయుండదు. అందువలన అందరినీ కర్మప్రకారము నడిపినట్లు నడుపుటకు అవసరమునుబట్టి శరీరమును నడుపుచుండును. అలా నడుపు శరీరము ప్రత్యేకమయినదనీ, భగవంతునిగా పుట్టిన శరీరమనీ ఎవరికీ తెలియనట్లు ఆత్మ నడుపగలదు. అందువలన భగవంతుని శరీరమును భూమిమీద ఎవరూ గుర్తించలేరు. ఇతను దైవాంశతో పుట్టినవాడుయనిగానీ, భగవంతుడనిగానీ ఎవరూ గుర్తించనట్లు ఆత్మ భగవంతుని శరీరమును వర్తింపజేయగలదు. అలా ప్రపంచములో ఎటువంటి గుర్తింపు లేకుండా యున్న భగవంతుని శరీరమునుండి ఆత్మ స్వచ్ఛమయిన పరమాత్మ జ్ఞానమును తెలియజేయగలదు. ప్రపంచములో ఏ మనిషి శరీరములో తెలుపని జ్ఞానమును ఆత్మగాయున్న పరమాత్మ అంశ భగవంతుని శరీరము నుండి సంపూర్ణ జ్ఞానమును తెలియజేయును. ఇదే విధానముతో ద్వాపర యుగమున శ్రీకృష్ణుని శరీరమునుండి భగవద్గీతను ఆత్మే తెలియజేసినది. ప్రపంచములో ఎక్కడయినా, ఎప్పుడైనా సంపూర్ణ జ్ఞానమును ఆత్మే తెలియ జేయాలి. శ్రీకృష్ణుని శరీరమునుండి జ్ఞానమును తెలియజేసిన ఆత్మయే మరియొకమారు కలియుగములో మరొక శరీరమునుండి జ్ఞానమును తెలియ జేసినా మనిషి ఆ రెండు జ్ఞానములు ఒక్కటేయనిగానీ, ఒక్కడే తెలియజేశా డనిగానీ నేటికీ గుర్తించలేకున్నాడు.
మనుషుల భావమునుబట్టి జ్ఞానము తెలియునను సూత్రము ప్రకారము, మంచి భావమున్నవానికి భగవంతుడు చెప్పిన జ్ఞానము సులభముగా అర్థముకాగలదు. భావము సరిలేనివానికి భగవంతుడు చెప్పిన జ్ఞానము ఏమాత్రము అర్థముకాదు. సంపూర్ణ జ్ఞానము భూమిమీద లేదు అనకుండా, దేవుడు తన అంశతో పుట్టించిన భగవంతుని శరీరములోని ఆత్మద్వారా జ్ఞానమును తెలియజేయును. ఆత్మ అన్ని శరీరములలోనున్నా ఎవరికీ తెలియకుండా ఎట్లు మసలుతున్నదో, అట్లే భగవంతుని శరీరములోని ఆత్మ ఇతను భగవంతుడని ఏమాత్రము తెలియకుండా నటింపజేయును. ప్రతి మనిషిలోనూ జీవాత్మ, ఆత్మ అను జోడు ఆత్మలున్నా, దేవుని అంశయైన భగవంతుని శరీరమందు జోడు ఆత్మలు వుండవు. అందులో ఒకే పరమాత్మ అంశ మాత్రమువుండును. ఆ పరమాత్మ అంశయే ఆత్మగా మారిపోయి భగవంతుని శరీరమును నడుపుచుండును. భగవంతుని శరీరములోని ఆత్మ జీవాత్మగా నటించుచూ అప్పుడప్పుడుగానీ, ఎప్పుడో ఒకప్పుడుగానీ, ఆత్మగాయుంటూ సంపూర్ణ జ్ఞానమును బోధించును. ఈ విధముగా నిజమైన గురువుగా భగవంతుని శరీరములోని ఆత్మకలదనీ, దానినిగానీ, భగవంతున్నిగానీ, ఎవరూ గుర్తించలేరని తెలుపుచున్నాము.
స్వర్గము నరకము అనునవి ప్రత్యేకమయిన లోకములు కాదు, ప్రత్యేకమయిన దేశములు కాదు, వాటికి ప్రత్యేకమయిన ఇంద్రుడు, యముడు అను రాజులు లేరని ఇంతవరకు చదివిన వారికి ఎవరికయినా అర్థమయి వుంటుంది. ప్రతి మనిషికీ అర్థము కావలసిన జ్ఞానము, అవసరమైన జ్ఞానము స్వర్గము నరకము యొక్క విధి విధానములు. అయితే మనిషికి స్వర్గ నరక విషయములు ఏమాత్రము తెలియని దానివలన, పాపము అంటే భయము లేకుండా
పోయినది. పుణ్యము అంటే ఆసక్తి లేకుండా పోయినది. జ్ఞానమంటే శ్రద్ధ లేకుండా పోయినది. నిత్యము మనిషి పాపపుణ్యముల నడుమ బ్రతుకుచున్నాడు. అయినా పాపపుణ్యముల గురించి తెలియ కుండానే బ్రతుకుచున్నాడు. మనిషియొక్క బుద్ధి అంతయూ పైకి కనిపించే ప్రపంచ విషయములలోనే లగ్నమైపోయినది. కర్మను అనుభవించకుండా, కర్మను ఆచరించకుండా భూమిమీద ఎవడుగానీ లేడు. ప్రతి నిమిషము, ప్రతి సెకండు (ప్రతి క్షణము) ప్రతి మనిషి, ప్రతి జీవి కర్మను ఆచరించు చున్నది మరియు అనుభవించుచున్నది. ఈ విషయమును దృఢపరుచుటకు భగవద్గీత యందు కర్మయోగమను అధ్యాయమున ఐదవ శ్లోకములో ఇలా కలదు.
శ్లోకము: నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృత్ | కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః
భావము :- ఏ కార్యమునూ చేయకుండా ఎవడుగానీ ఒక క్షణము కూడ ఊరకవుండలేడు. ప్రకృతి జనిత గుణములకు కట్టుబడి మనుషులందరూ పాపపుణ్య కర్మల వశులై మంచి చెడు కార్యములను చేయుచుందురు.
భగవంతుడు పైన చెప్పిన మాటప్రకారము ప్రతి మనిషీ కర్మబద్ధుడై యుండి, కార్యములను చేయుచునే యున్నాడు. మనిషి ఏ కార్యము చేయకుండా ఒక్క క్షణమైననూ ఊరక ఉండుటకు వీలులేదు. కాలము గడుస్తున్నదంటే కర్మ జరుగుచున్నదని అర్ధము. కార్యములు బయటి ప్రపంచములో ప్రత్యక్షముగా జరుగుచున్నా, ఆ కార్యములకు కారణమైన కర్మ శరీరములోపల తలయందు కర్మచక్రములో నిక్షిప్తమైయున్నది. మనిషి తల కనిపించినా తలలోని కర్మచక్రము ఎవరికీ కనిపించదు. కర్మచక్రమే కనిపించనప్పుడు దానిలోని కర్మకూడా ఎవరికీ తెలియదు. అందువలన ఏ కార్యమునకు ఏ కర్మ కారణమో ఎవరికీ తెలియని రహస్యమైనది. బయట కనిపించే ప్రపంచమునకంతటికీ, ప్రపంచములో జరుగు క్రియలన్నిటికీ కనిపించని కారణమున్నదని తెలియని మనిషి అంతర్ముఖముగా ఏనాడూ చూడలేదు. తనదృష్టినంతటినీ బాహ్య వ్యవహారముల మీదనే లగ్నము చేసి అన్ని పనులకూ డబ్బే కారణమనుకొంటున్నాడు. ఆ డబ్బు సంపాదన కొరకు బయటి విద్యలు నేర్చుకొనుచున్నాడు. బయటి విద్యలు నేర్వడానికి జీవితములో ముఫ్పై సంవత్సరముల కాలమును వినియోగించుకొంటున్నాడు. బయట ప్రపంచములో ఎన్ని విద్యలు నేర్చినా చివరకు కర్మప్రకారమే జరుగుననీ, కర్మప్రకారమే డబ్బు లభించుననీ, కర్మప్రకారమే ధనికుడుగా గానీ, పేదవాడుగాగానీ భూమిమీద బ్రతుకవలసి వచ్చునని తెలియలేక పోవుచున్నాడు.
బయట ప్రపంచములో బ్రతుకుటకు లోపలికర్మ కారణమని తెలియని మనుషులు, తమ బుద్ధి ప్రకారమే బయట పనులు జరుగుచున్నవనీ, తెలివున్నవాడు (బుద్దిగలవాడు) బాగా బ్రతుకగలడనీ, బుద్ధిలేనివాడు ప్రపంచ ములో బాగా బ్రతుకలేడని అనుకొనుచుందురు. బయట ప్రపంచములో బుద్ధి ఉపయోగపడుచున్న మాట వాస్తవమే అయినా, బుద్ధి కర్మనుబట్టియే ఉండుననీ, ఎవని కర్మనుబట్టి వాని బుద్ధియుండుననీ తెలియదు. ప్రపంచములో అందరికీ ఒకే బుద్ధి లేకుండా వేరువేరు బుద్ధులుండుటకు కారణము వాని కర్మ వేరువేరుగా యుండడమనే చెప్పవచ్చును. బ్రతుకు తెరువుకు తలలోని బుద్ధే కారణమనుకొను మనుషులు, బ్రతుకుతెరువుకు సంబంధించిన అన్ని కార్యములకు కర్మే కారణమనీ, బుద్ధి కారణము కాదనీ తెలియలేకపోవుచున్నారు. తమ బ్రతుకుతెరువు, తమ ఇష్టము, తాము ఏ పనయినా చేసి బ్రతుకుతాము, కర్మాలేదు గిర్మాలేదు అనువారు కూడా కలరు. అటువంటివారు ఒక మతములోనే కాకుండా, మూడు మతములలో యున్నారు. పూర్వము ఎంతో జ్ఞానమునుకల్గియున్న హిందువులే (ఇందువులే) నేడు అజ్ఞానముగా
మాట్లాడుచున్నారు. కర్మసిద్ధాంతమును చెప్పుకొను హిందువులే, నేడు అజ్ఞాన దిశవైపు ప్రయాణిస్తూ, కర్మను పూర్తి మరచిపోయి అన్ని కార్యములకు మనిషి తెలివే కారణమని అంటున్నారు. మనిషి బుద్ధిని ఉపయోగించి రైళ్ళు, విమానములను, కంప్యూటర్లనూ, రోబోలనూ, టెలివిజన్లనూ, సెల్ఫోన్లనూ కనుగొనడమేకాక చంద్రగ్రహము మీద దిగడము, కుజగ్రహమునకు పోవడము జరుగుచున్నదనీ, ఇంటర్ నెట్ను స్థాపించి ప్రపంచమునంతటినీ ఒక్కచోట వుండి చూస్తున్నాడని చెప్పు చున్నారు. అయితే బయట ఎంత అభివృద్ధి అయినా, ఎంత గొప్ప కార్యములను చేసినా అవన్నియూ మనిషి తెలివివలననే జరిగినా, ఏ మనిషికి ఏ తెలివి ఉండాలని నిర్ణయించునదీ, ఏ మనిషి దేనిని కనిపెట్టవల యునో నిర్ణయించునదీ, మనిషి వెనుకాలవున్న బుద్ధికాదనీ, బుద్ధివెనుకాల యుండు కర్మనీ, కర్మను అనుసరించే భూమిమీద ప్రతి కార్యమూ జరుగు చున్నదనీ, అన్నీ కార్యములు కర్మనుబట్టి జరిగినవనీ మనిషి గ్రహించలేక పోయి, అన్నిటికీ తన బుద్ధే కారణమని అనుకొంటున్నాడు.
మనిషి బ్రతుకుటకు బయట ప్రపంచములో ఎన్నో వ్యవస్థలు, ఎన్నో వ్యాపారములు, ఎన్నో ఉద్యోగములు, ఎన్నో కర్మాగారములు ఉన్నట్లు, మనిషి శరీరములో కూడా ఎన్నో వ్యవస్థలు గలవు. బయట అన్ని వ్యవహారములకు డబ్బే కారణమైనట్లు, శరీరములోని అన్ని వ్యవహారములకు కర్మే కారణమైవున్నది. శరీర బాహ్యయంత్రాంగము ఎన్నో విధముల ఉన్నట్లు, శరీర అంతరంగమున శరీర యంత్రాంగము కూడా ఎన్నో విధముల గలదు. బయటి వ్యవహారములన్నియు డబ్బుతో నడచినట్లు లోపల శరీర యంత్రాంగమంతయూ కర్మతో నడుచుచున్నది. శరీర యంత్రాంగములోని కర్మనుబట్టి వాని బుద్ధి, మనస్సు, చిత్తము, అహము పనిచేయును. మనస్సు, చిత్తము, అహము యొక్క పని అందరికీ తెలియకున్నా, బుద్ధి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా పనిచేయునని అందరికీ తెలుసు. అయితే బుద్ధి వారి వారి మేధస్సునుబట్టి పనిచేయుచుండునని మనిషి అనుకొంటున్నాడు. మనిషిలోని మేధస్సు (బుద్ధి కుశలత) కూడా అతనిలోని కర్మనుబట్టియుండు నని తెలియకుండాపోవడమునే అజ్ఞానము అంటున్నాము.
అజ్ఞానము వలన మనిషి తాను ఏమి చేయుచున్నానని ఏమాత్రము ఆలోచించడు. అంతేకాక తాను చేయు పనియంతయూ సక్రమమైనదేనని అనుకోవడము జరుగుచున్నది. తనకు తెలిసినదే జ్ఞానమనుకొన్న మనిషి తాను అక్రమమైన పనిని చేయుచున్నా, తాను చేయునది సక్రమమే ననుకొనుటకు కారణము, తనకు తెలిసినదే సరియైనదని నమ్మడము. మనిషి నిత్యము తాను స్వర్గమునో, నరకమునో అనుభవించుటకు కదిలి పని చేయుచున్నాడు. తాను చేయు పని వలన తనకు సుఖమో, దుఃఖమో కల్గుచున్నా, సుఖదుఃఖములు తెలియుచుండినా, వాటిని స్వర్గనరకములుగా లెక్కించలేదు. అంతేకాకుండా తాను ఏదో ఒకటి అనుభవిస్తూ ఇతరుల పాపపుణ్యములను అనుభవింపజేయుచున్నానని అనుకోవడములేదు. తాను బాధను (నరకమును) అనుభవిస్తూ ఇతరులకు సుఖమును (స్వర్గమును) అందించుచున్నానని అనుకోవడము లేదు. అట్లే తాను సుఖమును (స్వర్గమును) అనుభవిస్తూ ఇతరులకు నరకమును (కష్ట, నష్ట, బాధలను) చూపిస్తున్నానని తలచడము లేదు. తాను స్వయముగా ఏదో ఒక సమయములో స్వర్గమునో, నరకమునో అనుభవిస్తూ అదే సమయములో ఇతరులకు స్వర్గమును అనుభవింపజేయు దేవబంటునిగానో (గంధర్వుని గానో) లేక నరకమును అనుభవింపజేయు యమకింకరునిగానో ఉన్నానని కూడా మనిషికి తెలియదు.
భూమిమీద ఒక మనిషి తాను బాధపడుచూ ఇతరుల పాలిట దేవ బంటుగానో, లేక తాను సుఖమును పొందుచూ ఇతరుల పాలిట యమ కింకరునిగానో ఉన్నానని ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఉదాహరణకు కొన్ని సంఘటనలను చూస్తే ఆ విషయము పూర్తి అర్థము కాగలదు. ఒక వ్యక్తిని ఒక కిలోమీటరు దూరము రిక్షాలో తీసుకొనిపోవుటకు పది
రూపాయలు కూలి ఉందనుకొనుము. రిక్షావాడు ప్యాసింజరు కోసము చూస్తున్నాడు. మధ్యాహ్నానికి తన కుటుంబము అన్నము తినాలంటే అంత లోపల రిక్షాలాగి వచ్చిన డబ్బులను ఇంటివద్ద ఇవ్వాలి. దానికొరకు ఉదయము ఆరుగంటలకే బస్టాండుసెంటరులో ఎవరయినా రిక్షాను అడుగు తారేమోనని రిక్షావాడు చూస్తున్నాడు. దురదృష్టముకొద్దీ అందరూ ఇతరుల రిక్షాలు ఎక్కుచున్నారు గానీ తన రిక్షావద్దకు ఒక్కరు కూడా రాలేదు. ఉదయము ఎనిమిది గంటలయినది. అంతలో ఆకాశమున మేఘములు రావడమూ, చిన్నగా వర్షము రావడము మొదలయినది. వర్షములో ఎవరూ రిక్షా ఎక్కరు అని రిక్షావాడు నిరాశగా యున్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి రిక్షావస్తావా! అని అడిగాడు. రిక్షావాడు వస్తానన్నాడు. ఎంత ఇవ్వాలి? అని వచ్చిన వ్యక్తి అడిగాడు. అప్పుడు రిక్షావాడు వచ్చిన వ్యక్తి క్రొత్తవాడని తలచి, అతనికి రేటు గురించి తెలియదని ప్యాసింజరు పోవలసిన కిలోమీటరుకు దూరమునకు వందరూపాయలను అడిగాడు. న్యాయముగా కిలోమీటరు పదిరూపాయల రేటు ఉండగా, వర్షము వస్తున్నదని ఇంకొక ఐదురూపాయలను ఎక్కువ అడుగవచ్చును. అట్లుకాకుండా క్రొత్తవాడు దొరికాడు డబ్బు ఇస్తాడులేయని ఏకంగా వందరూపాయలడిగాడు. ప్యాసింజరు “అంతనా! వందరూపాయలంటే ఎక్కువ కాదా!” అని అడిగాడు. దానికి వర్షములో పోవాలి కదా! మీరు రిక్షా గూటిలో తడువకుండా కూర్చుంటారు. నేను బయట తడుస్తూ రిక్షాను త్రొక్కాలి కదా!యని అడిగాడు. సరేనని ప్యాసింజరు వందకు ఒప్పుకొన్నాడు. అంతలో ప్యాసింజరుకు తనమూట జ్ఞాపకమువచ్చి, బస్టాండులో 25 కేజీల రాతిబొమ్మ ఉంది దానిని తీసుకొని పోవాలన్నాడు. దానికి రిక్షావాడు రిక్షా లోపలికిరాదు సార్, నేను వచ్చి తెచ్చుకొనుటకు ఇక్కడ కూలీలకు నేను యాభైరూపాయలు ఇవ్వాలి. వారే తెచ్చుటకు వందరూపాయలు అడుగుతారని చెప్పి తానే ఆ బొమ్మను తెచ్చి రిక్షాలో పెట్టుకొని రిక్షాను వర్షములోనే లాగుచూ పోవుచున్నాడు.
ఇదంతయూ మీకు మాకు తెలిసినట్లు బయట జరిగిన సమాచారము. అయితే మనకు తెలియకుండా రిక్షావాని శరీరములో జరిగిన విషయము ఏమనగా! రిక్షావాడు శరీరములో డబ్బు ఆశతో డబ్బుకొరకు బస్టాండు దగ్గరయున్నాడు. వాడు అక్కడ కాచుకొని ఉండడమునకు కారణము ఆశ అను గుణము ప్రేరణవలన అతను అక్కడ ఉన్నాడు. దానికంటే ముందు తన భార్య పిల్లలకు డబ్బు ఇవ్వాలను మోహగుణము చేత ఇంటివద్దనుండి బయలుదేరివచ్చాడు. తన భార్యా పిల్లలకొరకు పని చేయాలనుకోవడము మోహగుణముకాగా, వారికొరకు డబ్బు కావాలనుకోవడము ఆశ అను గుణము (కామమను గుణము) పని చేసినదని చెప్పవచ్చును. ఈ విధముగా రెండు గుణములచేత ప్రేరేపింప బడినవాడై బస్టాండులో పనిచేయుటకు సిద్ధముగాయున్న వానికి ఎనిమిది గంటలవరకు నిరాశే మిగిలినా, నా భార్యా పిల్లలు పస్తులుంటారే యను మోహగుణము ఒకవైపు పీడించుచుండగా, చివరకు ఒక ప్యాసింజరు దొరికాడు. అంతవరకు బయట పనిని చేయకున్నా, బయట సుఖదుఃఖము లను అనుభవించకున్నా లోపల మాత్రము జీవుడు ఒకవైపు మోహగుణము తోనూ, మరొకవైపు కామ (ఆశ) గుణముతోనూ బాధపడడము జరిగినది. అంతవరకు అనగా ఎనిమిది గంటల వరకు రిక్షావాని శరీరములో జీవుడు ఒక విధమైన నరకమును అనుభవించాడనియే చెప్పవచ్చును. అప్పుడు వాని శరీరములోని ఆత్మయే గుణముల ప్రేరణ చేసి వాటితో బాధించినది. అంటే ఆ బాధలను శరీరములోని ఆత్మే స్వయముగా గుణములచేత కల్గించినది, కావున దానిని స్వయముగా యముడే విధించిన బాధయని చెప్పవచ్చును. రిక్షావాడు శరీరములో అనుభవించిన కొద్దిపాటి బాధను నరకమనీ, దానిని యముడే అమలు చేశాడని చెప్పవచ్చును.
ఇదంతయూ లోపల జరిగిన విషయముకాగా, ఇప్పుడు బయటి విషయానికి వస్తాము. రిక్షావాడు వర్షములోనే రిక్షాను త్రొక్కుచున్నాడు, ప్యాసింజరు మాత్రము రిక్షాలోపల ఏమాత్రము తడువకుండా కూర్చొని యుండగా, రిక్షావాడు వర్షములో చమటలు వచ్చేలాగా రిక్షాను లాగుచున్నాడు. వర్షముతోపాటు గాలి ఎక్కువగా ఉండడము వలన, ఆ గాలి
రిక్షాకు ఎదురుగా వీస్తుండడము వలన, రిక్షాను బలముగా త్రొక్కవలసి వచ్చినది. కూర్చున్న మనిషి బరువు దాదాపు వంద (100) కేజీలుండగా అతనితో పాటున్న బొమ్మ బరువు 25 కేజీలు మొత్తము 125 కేజీల బరువును రిక్షాలో పెట్టుకొని ఎదురు గాలికి వర్షములో రిక్షాను లాగడమును చూస్తే మాకు ప్రత్యక్ష నరకము కనిపించుచున్నది. రిక్షావాడు వర్షములో ఎదురు గాలికి 125 కేజీల బరువును పెట్టుకొని ఆ సమయములో పని చేయడము లోపలి గుణముల ప్రభావమేననీ, ఆ గుణములను ఆత్మే ప్రేరేపించినదనీ తెలియుచున్నది. పోయిన జన్మలో రిక్షావాడు చేసుకొన్న పాపము కొంత ఆ రూపములో అమలు జరుగుచున్నదని తెలిసినది. ఆత్మ ప్రేరేపించగా రిక్షాలో కూర్చున్నవాడు ఆ సమయమునకు యమకింకరుడుకాగా, అప్పుడు జరుగుచున్నది నరక బాధయేనని అర్థమయినది. ఒకవేళ రిక్షాను ఆపి ప్రక్కన నిలబెట్టుకొంటే యమకింకరుడుగాయున్న ప్యాసింజరు 'పోనీ! నేను తొందరగా పోవాలి' అంటాడు. 150 రుపాయలు డబ్బులిస్తున్నా కదా! నన్ను తీసుకపోవలసిందే! అంటాడు. ఆలస్యమయితే 100 రుపాయలే ఇస్తాను అంటాడు. వచ్చే డబ్బును పోగొట్టుకోలేక డబ్బు మీద ఆశతో భార్యాపిల్లల మీదున్న మోహముతో అతడు రిక్షాలాగుచూ పాపమును ఆ రూపములో అనుభవిస్తుండగా, రిక్షాలో కూర్చున్నవాడు ఆ సమయములో ఎటువంటి బాధలేకుండా సుఖమునే అనుభవిస్తున్నాడని చెప్పవచ్చును.
ఒకే సమయములో ఒకే సంఘటనలో ఒకడు రిక్షానులాగుచూ బాధపడుచుంటే, ఒక విధముగా నరకమును అనుభవిస్తుంటే, రిక్షాలో కూర్చున్నవాడు సుఖమును అనుభవిస్తున్నాడు. అంటే ఒక విధముగా స్వర్గమును అనుభవించుచున్నాడు. ఒకే సంఘటనలో ఒకడు నరకమును, ఒకడు స్వర్గమును అనుభవించునట్లు కనిపించడమేకాక, నరకమును అనుభవించు రిక్షావానికి ఆ సమయములో ప్యాసింజరే యమకింకరుడుగా యున్నాడని అర్థమగుచున్నది. ఇట్లు భూమిమీద ఆత్మే అనేక సంఘటనలను గుణ ప్రేరణచే కల్గించి, జరుగునట్లు చేసి, మనుషులనే యమకింకరులుగా, ఇంద్ర భటులుగా చేసి ఒకరి చేత మరొకరు పాపపుణ్యముల ఫలితము లయిన స్వర్గనరకములను అనుభవించునట్లు చేయుచున్నది. కొన్ని సందర్భములలో ఆత్మ గుణములచే బయటి పనులు చేయించకుండా లోపలనే బాధపడునట్లు చేయుచూ తానే యమధర్మరాజుగాయున్నది. కొన్ని సందర్భములలో బయటినుండి వచ్చు రోగక్రిములను శరీరములోనికి ప్రవేశించునట్లు చేసి, ఆ రోగక్రిముల చేత రోగమును కల్గించి తానే రోగమునకు బలమునిచ్చి శరీరములోని జీవున్ని బాధించునట్లు చేసి యముని పాత్రను పోషించుచున్నాడు. మనిషి చేసుకొన్న పాపములను అనేక బాధలచేత, అనేక కష్టములచేత, అనేక హింసలచేత, అనేక రోగముల చేత ఆత్మే స్వయముగా హింసించుచూ యమునిగా, ఇతరుల చేత హింసించుచూ వారిని యమకింకరులుగా చేయుచున్నది.
23-09-2014 మంగళవారము ఉదయము దాదాపు పదిగంటల ప్రాంతములో ఢిల్లీ జూపార్కులో ఒక సంఘటన జరిగినది. ఆ సంఘటన కెమెరాలో రికార్డయినది. దానినే అన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారము చేసి చూపించారు. వాస్తవముగా అక్కడ జరిగిన సంఘటన ఇలాగున్నది. ఢిల్లీ జూపార్కులో ఒక సందర్శకుడు తనవద్దయున్న కెమెరాతో తెల్లపులిని ఫోటో తీయాలని పులి ఆవరణమునకు దగ్గరగా పోయి ఫోటోలు తీయుచున్న సమయములో కాలు జారిందో, చేయిజారిందో తెలియదుగానీ మొత్తము మీద పులి యొక్క ఆవరణములోనికి పడిపోవడము జరిగినది. పులి ఆవరణమునకు పెద్దగోడ ఎత్తుగావుండి ఆవరణము అంచున నీటితో నింపిన గుంతయుంటుంది. బయటగోడ మూడడుగుల ఎత్తుండి దానిమీద ముళ్ళకంచె కూడా ఉంటుంది. మొత్తము మీద బయట కంచెతోపాటు ఏడు అడుగులుండగా లోపల పదిహేను అడుగుల వరకు గుంతయుంటుంది. అటువంటి స్థలములో లోపల పడినవాడు బయటికి వచ్చు అవకాశమే ఉండదు.
పులిని ఫోటో తీయాలను ఉద్దేశ్యముతో కంచెకు దగ్గరగా ఎక్కి ఫోటో తీయునపుడు లోపలికి పడిపోవడము జరిగినది. అప్పుడు తెల్లపులి అతనికి దగ్గరగా వచ్చినది. అతను ఎటూ పోలేక గోడవద్ద కూర్చొని ఏడుస్తూ నన్ను ఏమీ చేయవద్దని చెప్పుచూ ఒకవైపు చేతులెత్తి మ్రొక్కుచున్నాడు. అలాపడిన యువకున్ని పులి నిలబడి గమనిస్తున్నది. ఒకవైపు బయట గోడవద్ద జూపార్కును చూడవచ్చిన జనము అరుస్తుండగా పది నిమిషములు అతని ముందరే ఆగియున్న పులి చివరకు అతని మెడను పట్టుకొని లోపలకు లాగుకొని పోయింది. అందరూ చూస్తుండగానే ఆ పని జరిగిపోయింది. చివరకు ఆ యువకున్ని పులి మెడకొరికి చంపివేసింది.
ఈ సంఘటన యదార్థముగా ప్రత్యక్షముగా జరిగినది. అయితే స్వర్గ నరకముల సమాచారమునుబట్టి చూస్తే, పులియొక్క ఆవరణములోనికి పడిన యువకుడు భయముతో వణికిపోతూ కొద్దిసేపు నరకమును అనుభవించాడనీ, ఆ సమయమునకు పార్కులోని పులియే యమకింకరుని పాత్రలోయున్నదని చెప్పవచ్చును. పులి ఆవరణ లోపల పడినవానికి ఆ సమయము నరకముకాగా, పులికి మాత్రము మంచి రుచికరమైన ఆహారము, వేడి రక్తమును రుచి చూచి సుఖమును అనుభవించినది. ఆ సంఘటన అతనికి నరకముకాగా, పులికి స్వర్గమయినదని చెప్పవచ్చును. ఈ విధముగా విశ్లేషించుకుంటూపోతే, భూమిమీద అనేక సంఘటనల రూపములో స్వర్గ నరకములు జరుగుచున్నవని తెలియుచున్నది. మనిషికి ఎన్ని ప్రపంచ విద్యలు వచ్చినా, అన్ని విషయములలో ఎంతో తెలివియున్నా, అదంతయూ బయటదయిన దానివలన లోపలి శరీరములో ఏమీ జరుగుచున్నదీ తెలియలేకపోవుచున్నాడు. శరీరాంతర్గత యంత్రాంగమును తెలియ గల్గినవాడు జ్ఞానియగును. భగవద్గీతలో ప్రతి శ్లోకము శరీర అంతర్గత విషయములను గురించియే చెప్పారు. మనిషి దైవజ్ఞానమును చౌకగా చేసుకొని హేళనగా మాట్లాడుచున్నాడు తప్ప, జ్ఞానము అంటే తన శరీర ములోని విషయములను తెలియడమేనని గ్రహించలేకపోయాడు.
శరీరము లోపల జరుగు అంతరంగముల పనిని గూర్చి తెలియనివాడు. లోపల గుణములనుగానీ, అంతరంగములనుగానీ, అంతరంగము లను నడుపు ఆత్మనుగానీ తెలియలేడు. అంతరంగములో జరుగు కార్యములను గురించి తెలియనిదే, బయట జరుగు సన్నివేశముల విచక్షణ గానీ, వివరముగానీ తెలియదు. అట్లుండుట వలన బయట ప్రపంచములో మనముందరే జరుగు నరకమునుగానీ, స్వర్గమునుగానీ తెలియకున్నాము. బయట ప్రత్యక్షముగా జరుగు ప్రతి కార్యమునకు కర్మ కారణమనీ, కర్మనునది శరీరములో తలయందు కర్మచక్రములో నిక్షిప్తమై యున్నదనిగానీ, ప్రతి శరీరములోని ఆత్మ తలలోని కర్మను అనుసరించి గుణములను ప్రేరేపించుచున్నదనిగానీ, గుణముల మాయవలననే ప్రపంచములో అందరూ అన్ని పనులలో లగ్నమై పనిచేయుచున్నారనిగానీ, ఆ పనులే కొందరికి నరకముగా, కొందరికి స్వర్గముగా పరిగణించబడుతున్నా యనిగానీ ఎవరికీ తెలియకుండా పోయినది.
భూమిమీద అన్ని విధముల జ్ఞానమును మనుషులు తెలియుటకు మూడు గ్రంథముల రూపములో దేవుడు జ్ఞానమును ఇచ్చాడు. మొదట ద్వాపర యుగములోనే భగవద్గీతను ఇచ్చిన దేవుడు, దానిని ధృవీకరించుటకు లేక ముందు చెప్పిన జ్ఞానము గొప్పదని చెప్పుటకు, మిగతా రెండు గ్రంథములను ఇచ్చి ఆ రెండు గ్రంథములలో కూడా ముందు చెప్పిన గ్రంథములోని జ్ఞానమునే చెప్పాడు. అయితే మనిషి ముందర నేడు మూడు గ్రంథము లున్నా మనుషులు మాత్రము తాను పుట్టిన సమాజమిదియనీ, ఈ సమాజము వారు ఈ గ్రంథమునే చదువవలెననీ నియమమును ఏర్పరుచుకొనీ, ఒక్కొక్క మతమువారు ఒక్కొక్క గ్రంథమును ఎన్నుకొని ఇది మా గ్రంథము అంటున్నారు. గ్రంథములను వేరుచేసినవారు వారి మతములను కూడా వేరు చేసుకొని, వారి జ్ఞానమును కూడా వేరు చేసుకొని, చివరకు వారి
దేవున్ని కూడా వేరు చేసుకొన్నారు. మా మతము ప్రత్యేక మైనది, మా గ్రంథము ప్రత్యేకమైనది, మా జ్ఞానము కూడా ప్రత్యేకమైనదని చెప్పుచున్నారు.
ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు, ఒకే జ్ఞానమున్నదనీ, ఒక్కొక్క మతమునకు, ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క దేవుడు లేడని మేము అనేకమార్లు చెప్పాము. మేము వ్రాసిన గ్రంథములలో కూడా వ్రాశాము. అయినా ఎవరి అజ్ఞానము ప్రకారము వారు మాట్లాడుచునేయున్నారు. ఉదాహరణకు క్రైస్తవులు “మా ప్రభువుతప్ప దేవుడే లేడు, మా ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు అలా ఏ దేవుడైనా తిరిగి లేచాడా” అని అడుగుచున్నారు. చనిపోయి తిరిగి లేచినవాడు దేవుడని ఏసు చెప్పలేదు. బైబిలు గ్రంథములోనూ లేదు. అయినా గ్రంథములోలేని విషయమును, దేవుడు చెప్పని విషయమును పట్టుకొని చనిపోయి తిరిగి లేచినవాడు దేవుడు అని మొండిగా వాదిస్తే దానికి ఎవరూ ఏమీ చెప్పలేరు. అదే నిజమైనమాట అయితే ఏసు సమక్షములోనే చనిపోయినవారు తిరిగి లేచారు. అప్పుడు వారిని దేవుళ్ళు అని అనాలా? అట్లు అనుటకు వీలులేదు. మొత్తానికి “చనిపోయి లేచిన వాడు దేవుడు” అను సూత్రమే తప్పగును. కొందరు ఈ విధముగా గ్రంథములో లేని విషయమును చెప్పుకొనుచుందురు. మరికొందరు గ్రంథములో ఉన్న విషయమును అవగాహన చేసుకోలేక తప్పుగా భావించి వేరుగా చెప్పుకొనుచుందురు. ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో ఆరవ సూరా రెండవ ఆయన్ను చూస్తాము.
(6-2) “ఆయన మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్ధారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రము అల్లాహ్ వద్దనే యున్నది. అయినా మీరు సంశయానికి లోనైయున్నారు” అని ఉన్నది. ఈ వాక్యము చివరిలో మీరు సంశయానికి గురైయున్నారు అని వుంది. ఆ మాటకు అర్థము ఈ వాక్యము మీకు సరిగా అర్థము కాలేదని చెప్పినట్లున్నది. అంతేకాక మీరు నేను చెప్పినమాటను గ్రహించక నా మాటమీద అనుమానము కల్గియున్నారని చెప్పినట్లు కలదు. చివరిమాటను అటుంచి ఆ వాక్యములోని ముఖ్యమైన సమాచారమును చూస్తే, అక్కడ చావుపుట్టుకల విషయమును గురించి ఈ వాక్యము చెప్పారని తెలియుచున్నది. అక్కడ చెప్పిన దానిని వివరించుకొని చూస్తే ఇలా కలదు. దేవుడు మనుషులను పంచభూతములయిన ప్రకృతితో చేశాడు. ఆ విషయము అందరికీ అర్థమగుటకు మిమ్మల్ని మట్టితో చేశాడని వాక్యములో చెప్పారు. దేవుడు మనిషిని ప్రకృతితో చేసిన తర్వాత ఇతను ఇంతకాలమే బ్రతకాలి తర్వాత చనిపోవాలని ఒక గడువును నిర్ణయించాడు. అనగా ఆయుష్షును నిర్ధారించి పెట్టాడు. ఒక మనిషిని పుట్టించి మరణమును నిర్ణయించినట్లే, అతని మరొక మరణము యొక్క నిర్ధారణ దేవునికి తెలుసు అని చెప్పారు. ఇక్కడ ఒక గడువు మరణము అయినప్పుడు, మరొక గడువు కూడా మరణమే అగును కదా! రెండు మరణముల గడువులు దేవునివద్దయున్నాయి అన్నప్పుడు రెండవ పుట్టుక కూడా ఉన్నదనియేగా అర్థము. ఇక్కడ ఈ వాక్యములో ఒక జన్మ తర్వాత రెండవ జన్మను కూడా దేవుడు నిర్ణయించిపెట్టాడు అని నాకు స్పష్టముగా తెలియుచున్నది. అయితే ముస్లీమ్లందరూ మనిషి ఒకమారే పుట్టి ఒకమారే చనిపోతాడు. రెండవ జన్మ మనిషికి లేదు అంటున్నారు. నాకు రెండవ జన్మ ఉన్నదని గ్రంథములోకలదనీ, దేవుడు చెప్పాడనీ అర్థమవుచుండగా, ముస్లీమ్లకు ఈ వాక్యములో రెండవ జన్మ లేనట్లు, రెండవ మరణము లేనట్లు అర్థమయినది.
ఈ వాక్యము మనుషులకు అందులో ముఖ్యముగా ముస్లీమ్లకు అర్థము కాలేదు కనుక ముందే మీరు సంశయానికి గురైయున్నారని కూడా చివరిలో చెప్పడము జరిగినది. ఇదే విధముగా ఖుర్ఆన్లోని చాలా వాక్యములకు అర్థము తెలియక అపార్థము చేసుకోవడము జరిగినది. అట్లే స్వర్గనరకముల విషయములో కూడా ముస్లీమ్లు ఖుర్ఆన్లో దేవుడు చెప్పిన విధానమును అర్థము చేసుకోలేదు. మనిషి చనిపోయిన తర్వాత, తిరిగి సమాధినుండి లేపబడిన
తర్వాత, స్వర్గ నరకములు అనుభవిస్తాడని అనుకొన్నారు. ఒకరి తలలో అర్థమయిన విషయమును వారు ముస్లీమ్ లందరికీ బోధించగా, ముస్లీమ్లందరూ అదే విషయమును నమ్మియున్నారు. వారి నమ్మకము ప్రకారము స్వర్గము దేవునివద్దయుందనీ, మంచి ప్రవర్తన కల్గినవాడుగానీ, దేవుని ప్రార్థనలలో పాల్గొన్నవాడుగానీ, దేవుని కొరకు యుద్ధము చేసి చనిపోయినవాడుగానీ, దేవునివద్దయున్న స్వర్గమునకు పోవుననీ, స్వర్గములో అనేక సుఖములు అనుభవించుచూ ఎల్లకాలము అక్కడేయుండవచ్చుననీ, స్వర్గములో అందమైన ఆడవారు వీరికోసము కాచుకొనియుందురనీ అందరూ అనుకోవడము జరుగుతున్నది.
ఏ జ్ఞానమూలేని ముస్లీమ్ యువకునికి స్వర్గము పేరుచెప్పి, “అక్కడ సుఖములుంటాయి. హాయిగా బ్రతుకవచ్చు, ఎందరో సేవచేయువారు కూడా ఉంటారు. అందమైన ఆడవారు నీకోసముంటారు” అని సుఖముల గురించి చెప్పి సుఖముల ఆశచూపి మేము చెప్పినట్లు వింటే, నీవు చనిపోతే అల్లాహ్ నిన్ను స్వర్గానికి పంపుతాడు అని ప్రలోభ పెట్టి మరణమును సహితము లెక్కచేయకుండా చావుకు సిద్ధపడునట్లు చేయుచున్నారు. వారికి దేవుడు చెప్పిన ఏ జ్ఞానమూ తెలియకున్నా దేవునికొరకు చనిపోతే దేవునివద్దకు పోతాము అక్కడ స్వర్గముంటుంది. స్వర్గములో బ్రతుకుతెరువు చింతయే ఉండదు. త్రాగేదానికి ద్రాక్షరసము, తినేదానికి మంచి తిండి, కాలము గడచుటకు మంచి అందమైన ఐదారుమంది స్త్రీలు ఉంటారన్నది మాత్రము తెలుసు. భూమిమీద బ్రతుకు బరువైనవారు, ధనములేనివారు, ఆహారము లేనివారు పైనగల స్వర్గముకొరకు ఏమయినా చేస్తారు. ఒకమారు దేవుని కొరకు చనిపోతే శాశ్వతముగా స్వర్గములోయుండి సుఖాలమధ్యలో జీవించవచ్చు, అందమైన ఆడవారితో కాలము గడుపవచ్చు అనుకొన్నవారు చావుకు సిద్ధపడి దేవునికొరకు ఏదో ఒకటి చేసి తొందరగా చనిపోవాలని అనుకొనుచుందురు.
స్వర్గము కొరకు చనిపోవాలని నిర్ణయించుకొన్న యువకులను పదిమందిని గుంపు చేసి ఇకపోయి చనిపోండని చెప్పి పంపిన ఒక సంఘటన ఈ మధ్యకాలములో జరిగింది. స్వర్గము కొరకు పదిమంది చనిపోయారు. ఆ పదిమంది కేవలము స్వర్గము కొరకే చనిపోయారని అర్థమగుచున్నది. ముస్లీమ్లలో తెలివైనవారు తాము చావకుండా ఇతరులకు స్వర్గము ఆశచూపి, స్వర్గముకొరకు ప్రలోభపెట్టి, అదేపనిగా చనిపోవు కార్యక్రముల లోనికి దింపుచున్నారు. ఖుర్ఆన్ఆగ్రంథములో 'జీహాద్' అను పదముకలదు, జీహాద్ అంటే 'పవిత్రయుద్ధము' అని అర్థము. పవిత్ర యుద్ధము అంటే దేవునిమార్గములో పోరాటము అని అర్థము. దేవుని మార్గములో పోరాటము అంటే దేవుని జ్ఞానము తెలుసుకోవడములో కృషి చేయడము అని అర్థము. యుద్ధము అంటే పోరాటము అని అర్ధముగానీ మనుషులను చంపమని కాదు. మనకున్న చెడు గుణములతో పోరాడి, దేవుని జ్ఞానమును తెలుసుకోవడమే పవిత్రయుద్ధము. అట్లు చెప్పకుండా, ఏమీ తెలియని యువకులకు, బ్రతుకుతెరువులో విసిగిపోయిన యువకులకు స్వర్గ సుఖముల ఆశచూపి, స్వర్గము దేవునివద్దేయుందని స్వర్గమునకూ దేవునికీ లింకు ఏర్పరచి, స్వర్గము కావాలనుకొనువారు దేవునికొరకు చనిపోవాలనీ, ముస్లీమ్లు కానివారిని చంపడము, దేవునికొరకు పోరాడడమనీ అదే పవిత్రయుద్ధమని చెప్పి ముస్లీమ్లు కానివారిని విచక్షణ లేకుండా చంపమనీ, ఎంతమందిని చంపితే దేవునికి అంతదగ్గరవారగుదురని చెప్పడము వలన పదిమంది యువకులు ఇతరులను చంపి తాము చచ్చుటకు నిర్ణయించుకొని పాకిస్థాన్ నుండి సముద్రమార్గములో దొంగగా ముంబాయికి రావడము జరిగినది.
వచ్చిన యువకులందరూ చనిపోయి స్వర్గానికి పోవాలను ఉద్దేశ్యముతో వచ్చినవారేగానీ, తిరిగి తప్పించుకొని పోవాలని ఒక్కరు కూడా అనుకోలేదు. వారి ఉద్దేశమంతా తాము చనిపోవులోపల ఎంతమందిని వీలయితే అంతమందిని చంపాలనివుంది. పంపినవారు కూడా వారిని బాగా నమ్మించి, వారి చేత పని చేయించుకోవాలని పంపారు తప్ప,
ఆ దినము వారికి స్వర్గమొస్తుందని మాత్రము కాదు. అంతగ్యారంటీగా స్వర్గము వస్తుందని తెలిసియుంటే వారే వచ్చి చనిపోవచ్చు కదా! అట్లు జరుగడములేదు. కొంతమంది స్వార్థవరులు, మతఛాందసవాదులు ఇతర మతములవారిని చంపుటకు, ఏ జ్ఞానమూ తెలియని అమాయక యువకులను చావుకు సిద్ధము చేసి పంపుచున్నారు. స్వర్గము మీద ఆశతో, అందమైన ఆడవారు దొరుకుతారను భ్రమతో, ఎప్పుడెప్పుడు చనిపోవాలాయని తొందరపడు వారిని ఎంచుకొని, ఆత్మాహుతిదాడులలో పాల్గొనునట్లు చేసి, వారి ఇష్టముగా వారు చనిపోవునట్లు చేయుచున్నారు. ముంబాయిలో దాడిచేసిన పాకిస్థాన్ యువకులు అదేపనిగా చనిపోయి అర్జంటుగా స్వర్గమునకు పోయి సుఖములు అనుభవించాలనుకొన్నారు. మారణాయుధములతో దాడిచేసి చాలామందిని చంపగానే ముంబాయి పోలీసులు వారిని ఎదుర్కొనుటకు వచ్చారు. అప్పటికే టీవీ ఛానళ్ళలో ఆ విషయమంతా ప్రసారమవుతుండగా యువకులను ప్రలోభపెట్టి ప్రేరేపించి పంపినవారు జరిగే తతంగమునంతటినీ పాకిస్థాన్లో వుండి టీవీలో చూస్తూ యువకులతో ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో మాట్లాడుచూ, పోలీసుల కదలికలను యువకులకు చెప్పుచూ, మారణ హోమమునకు పాకిస్థాన్నుండే డైరెక్షన్ చేస్తున్నారు. అప్పటికే చాలామంది చనిపోవడము పోలీసులు, దేశభద్రతాదళములు చుట్టుముట్టడము జరిగినది. వచ్చినవారు చావుకు సిద్ధపడి తొందరగా స్వర్గానికి పోవాలని వచ్చినవారు కావున, వారి కోర్కె మేరకే పోలీసుల దాడులలో వచ్చిన యువకులు కొందరు చనిపోగా, ఒక ఉగ్రవాది కాలికి బుల్లెట్ తగిలి కుప్పకూలిపోయి ప్రాణము పోవు స్థితిలో ఫోన్లో మాట్లాడిన మాటలు రికార్డయినాయి. ఉగ్రవాది కాలికి గాయము కాకముందునుండీ ఫోన్ కనెక్షన్లో యున్న వారితో గాయపడిన యువకుడు “నాకు కాలికి గాయమయినది నేను లేవలేని స్థితిలో యున్నాను. నేను కొన్ని నిమిషములలో చనిపోతాను. నేను స్వర్గానికి పోయేటట్లు దేవున్ని ప్రార్థించండి" అని అంటుండగా, పాకిస్థాన్ నుండి మాట్లాడువారు “మేము నీ కొరకు అల్లాహ్ ను ప్రార్థించుచున్నాము. నీవు అల్లాహ్ కొరకు చనిపోతున్నావు కావున నేరుగా స్వర్గానికే పోతావు” అని అన్నారు.
ఇదంతా చూస్తే ఆ యువకులు ఘోరంగా మోసపోయారని ఆశ అను గుణముతో ఇతరుల మాటలను అడ్డంగా విన్నారనీ, వారు విన్నట్లు, వారు అనుకొన్నట్లు దైవ గ్రంథమైన ఖుర్ఆన్లో లేదని అర్థమగుచున్నది. ఇతరులను ప్రేరేపించి ఇక్కడ డబ్బు ఆశ చూపి, పైన స్వర్గము ఆశ చూపి మోసము చేయుచున్నారు. అలా ప్రేరేపించువారు మాత్రము ఎక్కడా బయటికి రారు. మిగతావారంతా చనిపోయినా తాము మాత్రము తెలివిగా ప్రక్కన ఉంటారు. మీరు స్వర్గమునకు పోవాలని దేవున్ని ప్రార్థించుచున్నామని చెప్పుచున్నారు. ముంబాయిలో చనిపోతూ స్వర్గము మీద ఆశగా మాట్లాడిన యువకుడు చనిపోయాడుగానీ స్వర్గమునకు పోలేదు. అలా చనిపోయిన వారు స్వర్గమునకు పోతారని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ యువకులు స్వర్గము మీద అక్కడి సుఖములమీద ఆశ పడి వచ్చారు గానీ వారు స్వర్గముకు పోలేదు. వారిచావు అకాలమరణము క్రిందికి వస్తుంది కావున వారందరూ దయ్యాలయి బ్రతికేయున్నారు. వారు చనిపోయిన తర్వాత తాము ఎంత మోసపోయినది వారికి అర్థమయినది. స్వర్గము మీద ఆశతో చనిపోవాలని చనిపోయినా వారికి స్వర్గము రాలేదుగానీ, వారు దయ్యాలయి నిత్యము నరకమును అనుభవిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఏమి తెలిసినా ముందు జీవితము రాదు కదా! అటువంటివారి జీవితము ఉట్టికీ స్వర్గానికి రెండిటికీ లేకుండాపోయినది.
ఈ విధముగా దేవుని జ్ఞానము తెలియనివారందరూ అజ్ఞానముతో కూడుకొని తమకిష్టమొచ్చినట్లు అనుకొని, అదే దైవజ్ఞానము అనుకొంటే ఏమీ ప్రయోజనముండదు. స్వర్గము, నరకము ఉన్నాయిగానీ ముస్లీమ్లు అనుకొన్నట్లుగాలేవు. ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్ పెద్దలకే సరియైన భావములో అర్థము కాలేదని ఈ సంఘటనతో తెలిసింది. స్వర్గ నరకములను గురించి మేము సత్యము చెప్పితే ఇతర మతములవారికంటే ముందు ఇందువులే (హిందువులే) మా మీద
వ్యతిరేఖముగా మాట్లాడడము జరిగినది. హిందువులలో ఎన్నో కులములుంటే ఒక్క అగ్రకులము వారే మమ్ములను వ్యతిరేఖముగా మాట్లాడడము జరిగినది. భగవద్గీతలోని ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞమును గురించి మేము వివరించి చెప్పితే సరిపోలేదు. అలాగే మనము హిందువులము కాదు, ఇందువులము అని చెప్పితే నన్ను పరాయి మతమువాడని అగ్రకులమువారే ఆరోపించడము జరిగినది. అద్వైత, ద్వైత సిద్ధాంతములవలె నేను "త్రైత సిద్ధాంతము”ను ప్రతిపాదించితే త్రైతము అంటే క్రైస్తవులదని నేను క్రైస్తవ మతమును బోధించినట్లు నన్ను నిందించడము జరిగినది. నేను ఇప్పటివరకు 54 గ్రంథములను వ్రాసి ఎంతో సంచలనమైన జ్ఞానమును ప్రకటిస్తే, ఇది గొప్పజ్ఞానమని అందరూ అనుచుండగా, అగ్రకులముల వారు మాత్రము నన్ను శత్రువువలె చూస్తూ మేము చేయు జ్ఞానప్రచారమునకు అడ్డుతగలడము జరుగుచున్నది. ఇదంతయూ అసూయతో చేయు పనులని అర్థమయినది.
ఇంతవరకు ఎవరూ చేయని విధముగా మేము ఇందూ ధర్మములను గురించి బోధించుచున్నాము. మేము బోధించు బోధ అన్ని సమాజ ప్రజలకు సరిపోవునదిగా యున్నది. మూడు మత గ్రంథములలోని సారాంశమును తెలియజేస్తూ, ఏ మతస్థుడయినా వారి గ్రంథములోని జ్ఞానమును సరిగా అర్థము చేసుకోకపోతే, మీరు గ్రహించుకొన్నది తప్పని చెప్పుచూ దానికి నిజమైన అర్థమును కూడా తెలియజేశాము. ఇతర మతములలో లేని వ్యతిరేఖత హిందూమతములోనే, అదియూ ఒక అగ్రకులము వారిలోనే వచ్చిందంటే, అది వారి ఓర్వలేనితనమని మాకు అర్థమయినది. ఇప్పుడు స్వర్గ నరకములను గురించి చెప్పాము. అన్ని మతములవారిని మందలించి ఇది తప్పనీ, ఇది సరియైనదనీ చెప్పడము జరిగినది. వాస్తవముగా చెప్పితే ఇంతకాలనికి సరియైన జ్ఞానము లోపలయున్న ఆత్మే చెప్పుచున్నది. ఇది దేవుడు ప్రజలకు ఇచ్చిన అవకాశము. ఇప్పుడు జ్ఞానమును తెలియకపోతే మరి ఎప్పుడూ తెలియలేరు. ఈ జ్ఞానము ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పుచున్న జ్ఞానమని అనుకోవద్దండి. నేను కూడా మీలాగే తెలుసుకొనే వాడినే, నేను చెప్పేవాడినికాదు.
అగ్రకులము వారు ప్రబోధానందయోగీశ్వరులయిన నన్ను క్రైస్తవ మతమువాడని అన్నందుకు, ఇందూ పదము పరాయి మతమన్నందుకూ, ఆర్యసాంప్రదాయములోనున్న అగ్రకులమువారు ద్రావిడ సాంప్రదాయములో నున్న నన్ను విమర్శించుట వలన ఒక మనిషిగా నేను కూడా వారిమీద ప్రతివిమర్శ చేయడమైనది. ఆ ప్రతివిమర్శను ఈ గ్రంథములోనే పొందు పరుస్తునాము. అంతేకాక "హిందూ” అను శబ్ధము అర్థములేనిదనీ, భారతీయులైన మనము ఆదినుండీ ఇందువులమని చెప్పాము. అదే విషయమునే హిందూ అను శబ్ధమును చెప్పుకొంటే తప్పగునని మిగతా స్వామీజీలు చెప్పిన విషయమును కూడా పొందుపరిచాము చూడండి.
ఇట్లు, ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు,
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు, సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.
"హిందూ" పదం పై చినజీయర్స్వమి వారి అభిప్రాయము. (Maa Tv Channel Programme). వాల్మీకి, వ్యాసులు ఇచ్చింది కేవలం మీరు ఇండియా చరిత్ర అనుకోకండి, భారతదేశచరిత్ర అనుకోకండి, కేవలం భారతదేశానికి మాత్రమే అది పనికొచ్చేది అని అనుకోకండి. అందుకనే మనము "హిందూ” అనే పదాన్ని వాడమండి. ఈ మధ్యన మనవాళ్ళు, ఫీడ్బ్యాక్ కోసం కొన్ని పేపర్లు ఇస్తే పాపం చాలామంది వ్రాశారు దాంట్లో మాకు సూచనలు "స్వామీ! మీరు అసలు హిందూపదం చెప్పట్లేదు. గర్వించాల్సిన పదం దానిని మీరు వాడటం లేదు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధగా వుంది" అని వ్రాశారు కొందరు. తమ అభిప్రాయానికి సంతోషం అనుకోండి. అంటే అలవాటయిన పదం కనక అది వాడకపోతే, అది చెప్పకపోతే, ఏమిటో... కొరత, లోటు ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ అసలు ఆ పదమే చేసినటువంటి అన్యాయం, ఆ పదం చేసినటువంటి హాని, ఈ జాతికి మానవ జాతికి మరొక పదం చేయలేదు. బ్రిటీష్వాడు చాలా కనిపెట్టి ఆ పదాన్ని మనమీద చాలా చక్కగా పెట్టారు. అయితే గతిలేకపోయినది కనుక వివేకానందుడు ఆ పదాన్ని గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మన జాతి ఆ పదంతోటి చెప్పుకోవటానికి పనికి రాదండి. ఆ పదంతో చెప్పుకున్నామంటే మన పీకను మనమే కోసుకున్నామన్నమాట. ఆ పేరు మీద ఈ వేళ చాలా (organisations) ఏర్పడ్డాయి కనక, ఆ పదం వదిల్తే, వదిలేస్తే తమ ఉనికి పోతుందేమో అనే భయం, పోతుందనేటటువంటి ఒక విశ్వాసంతోటి ఆ పదం వాడాలని పట్టుపడుతున్నారు. ఈ వేళ ఆ పదంతోటి హిందుత్వ ఎజెండాలు తయారు చేస్తున్నారు కాని, but ఆ పదం చేసినటువంటి హాని, మనకు ప్రపంచములో ఇవాళ ఏ రకమైనటు వంటి గౌరవాన్ని, గొప్పతనాన్ని లేకుండా చేసుకున్న స్థితి దానివల్లే ఏర్పడింది. ఎందుకో తెలుసునా! దాన్ని కొన్ని రకాలుగా చెప్తారండి మనవాళ్ళు. ఒకటి ఒక దేశానికి పేరుగా చెబుతారు దాన్ని కదండీ హిందూ అనేటటువంటిది దేన్నిబట్టి మీరు చెబుతున్నారు. “సింధూ” నాగరికత నుంచి వచ్చిందని అనేనా మీరు చెబుతున్నారు, అంటే సింధూ నాగరికత తప్ప ఇంకా మన ఈ భారతదేశములో మిగతాచోట్ల ఎక్కడ నాగరికతల్లేవా? 2500 BC అంటే 5000 సంవత్సరాలకిలోపు ఆ నాగరికత వచ్చినట్లు చెబుతున్నారు చరిత్రకారులు ఇప్పుడు ఈవేళ ప్రామాణికంగా అంటే ఆ 5000 సంవత్సరాల క్రితం మీకు దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఎవరూ భాషల వాళ్ళుకానీ ఇక్కడ ఎవరూ మనుషులు కానీ లేరా? కేవలం కోతులే వుండేవా? అంతకుముందు అసలు నాగరికతల్లేవా? ఈ దేశానికి ఈ జాతికి నాగరికత లేదా? ఆలోచించాలి చదువుకున్న వాళ్ళంతా. చదువుకోక పోయినా, బుర్రవున్న వాళ్ళయినా ఆలోచించాలండి, ఆ ఆలోచన 5000 సం॥ల క్రితం ఇక్కడ జాతిలేదా? లేదు అనేది మీమీద ఆరోపించడానికి సింధునాగరికతను పట్టుకొచ్చారు. మనం “సింధు”లోంచి వచ్చామా? పోనీ అది అలా ప్రక్కన పెడదాం ఇప్పుడు మీరంతా సింధునాగరికత ప్రక్కన పుట్టారా? సింధునదిలోంచి వచ్చారా మీరు? గోదావరి దగ్గరో, కృష్ణదగ్గరో మీరు పుట్టుంటారు. మరి ఇపుడు ఆ నదిపేరుతోటి మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ లోయలోంచి వచ్చిన నాగరికతతోటి మీరు (recognise) కావాలి. ఇది ఒకటి. రెండవది ఆ నాగరికత పూర్వం ఎప్పుడో కొంతకాలం ఉండి, అక్కడ నాగరికత నుండి వచ్చింది అదీ, కానీ దానికంటే ముందరది రోమన్ నాగరికత, దానికంటే ముందరిది గ్రీస్ నాగరికత, దానికంటే ముందరది ఏదో మెసపటోమియా, బాబిలోనియా నాగరికత. ఈ బాబిలోనియా నాగరికత ఏదో ఒక 8000 సంవత్సరాల క్రితానికి వెళుతుంది. అంతకుముందు అసలు భూమిమీద
మనుషులు లేరు ఉన్నవన్నీ కూడా కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, ఇంతే. ఇపుడు ఈ నాగరికతలు చెప్పేవాళ్ళంతా వచ్చిన పదం అలా వచ్చిందండి "హిందూ” పదాన్ని అక్కడ మధ్యలో పట్టుకొచ్చి మీకు సింధూనదితోటి (link up) చేసిపెట్టారు. “స”, “హ” కింద మారిందండి. అందుచేత “సింధూ”, “హిందూ” అయ్యింది అని అన్నారు. ఇది వాస్తవమా? అనేది మీరు ఆలోచించుకోండి. అంతకు ముందు లేదా ఏమండి, ఇది మీరు ఆలోచించుకోవాలి. కానీ భారతంలో ఇచ్చినటువంటి వంశాలు ఉందండి, పరంపర ఉందండీ. మరి ఆ పరంపరలో చూస్తే వెనుకాల కొన్నివేల సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళున్నారు. వాల్మీకి కథ కూడా వ్యాసుడు దాంట్లో చెపుకున్నాడు. తొమ్మిదవ స్కంధం, భాగవతంలో మీరు చదివినట్లయితే వంశాల గురించి (History), మొట్టమొదట సూర్యవంశాన్ని ఆ తర్వాత చంద్రవంశాన్ని, యదువంశాన్ని ఇట్లా వర్ణించాడండి ఆయన. అందులో సూర్యవంశాన్ని వర్ణించేటపుడు ఇక్ష్వాకు దగ్గర్నుంచి మధ్యలో పుట్టినటువంటి అనేకమందిలో రాముడు కూడా ఒకడు అని రామకథను కూడా (brief)గా ఆయన (mention) చేశాడు మొత్తం భాగవతంలో. ఆయన చెప్పిన దానిప్రకారమే రామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాల పైచిలుకు ఉన్నాడు అని ఆయన కూడా చెప్పాడు దాంట్లో. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఉండే వంశాలు అవన్నీ కూడా వర్ణించింది మనం గమనిస్తే కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. యుగాల కాలాన్ని ఇచ్చాడు ఆయన. అందులో ద్వాపరయుగానికి కాలం ఇచ్చాడు 8,64,000 సంవత్సరాలు. దానికి ముందర త్రేతాయుగం అన్నాడు ఆయన. దానికంటే ముందర కృతయుగమన్నాడు. అలాంటి నాలుగు యుగాలు, ఇంకొక నాలుగు యుగాలు, ఇంకొక నాలుగు యుగాలు వెనకాల రాముడి కాలమని చెప్పాడు. అంటే కోట్ల సంవత్సరాలలోకి వెళ్ళిందది. కోట్లు కాకపోయిన లక్షల సంవత్సరాలు 43, 43, 43 యా! కోటి దాటింది. ఇచ్చట వ్యాసభగవానుడు మనకు చెప్పిన నియమం ప్రకారం మనం గమనించినట్లయితే రాముడి కాలం (almost one crore years) ముందర. మరి సింధులోయలోంచి వచ్చారా మీరు ఇంకొకటి సింధు అనే దానికి హిందు అనే దానికిని ఏదో పాపం వేరే నిర్వచనాలు చెబుతూ “అలా కాదండీ! ఇది హిమాలయల్లోంచి హిందూ సరోవరందాకా ఉండేదంతా కూడా "హిందూ రిత్య విలీయతే" అంటూ దానికొక సంస్కృతంలో ఒక శ్లోకం కూడా తయారు చేశారు. అదే అయితే నువ్వు కేవలం ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైపోయాం ఆ ప్రాంతంలో ఎవడుంటే వారు అలా ఆ పేరుతో చెప్పుకోవాలి. అలా వాడటం లేదు నువ్వు. ఒక ధర్మానికి తగినట్టుగా దానిని వాడుతున్నావు. ఒక ఆచారానికి చెప్పే పదంగా నువ్వు దాన్ని వాడుతున్నావు. అనొచ్చా అప్పుడు అట్టాగ దాన్ని. లేదంటే ఒక విశ్వాసం కల్గినవాడు అంతా వుండేది, అంటే ఏ వేదవిశ్వాసం అలా అలా అంటున్నారో, అందులో ఎక్కడా అంతా, ఆ పదంతోటి చెప్పుకున్నట్టు గా కనపడటం లేదు మనకి. అస్సలు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ పదం అసలు (existence) లో లేనేలేదు. విగ్రహారాధనంటే పనికి రాకుండా వుండేటటువంటి పార్శీస్ లాంటి వాళ్ళంతా, విగ్రహారాధకులైనటువంటి వాళ్ళంతా కూడా 'ఖాఫిర్స్' అని చెప్పడానికి వాడిన పదమది. సరే వాళ్ళు అలా వాడితే వాడుకోనివ్వండి కానీ మనకోపదం ఉండచ్చు కదా! అని మీరనచ్చు. కానీ ఈ పదం అట్లా రాలేదండి ఇది కేవలం (wanted) గా, మననందరిని చరిత్ర హీనులని చెయ్యడానికి ఏర్పడ్డ పదం క్రింద వచ్చిందది. చరిత్ర హీనులు చెయ్యడానికి వచ్చిన పదం క్రిందవచ్చింది. రామాయణ, భారతాల్ని అన్నిటిని కూడా (smash) చేయాలి. వాటన్నిటిని కూడా (sack) చేసి పారెయ్యాలి అంటే, వాటన్నిటిని మూటకట్టి సముద్రంలో తొక్కేయ్యాలంటే, ఏం చేస్తే అని ఆలోచించి జాగ్రత్తగా ఈ పదాన్ని పెట్టారండి మనమీద. దురదృష్టంకొద్దీ, ఇవాళ ఆ పదం తెలిసిన, ఎలా వచ్చిందో మీకు (etymology) మీకు చెపుతున్నప్పటికి కూడా దానిమీద మీకు అసలేమాత్రం దృష్ఠిలేకుండా ఈ పదాన్నే మేము పట్టుకుని ప్రాకులాడతాం అని వాదించేటటువంటి పెద్ద మనుషుల ప్రభావం చేత ఇవాళ ఆ పదం చాలా (force) గా
మనమీద వాడబడుతోంది. వేదాలలో ఎక్కడా ఆ పదం లేదు, ఇతిహాసములలో ఎక్కడాలేదు, శంకరాచార్యులవారు వాడలేదు. రామానుజాచార్యుల వారు వాడలేదు, మధ్వాచార్యుల వారు వాడలేదు. వారి (commentators) ఎవ్వరూ వాడింది కాదు. నీకొక చరిత్రవుంది. నీ చరిత్ర నువ్వు చెప్పుకోవాలంటే నీకొక వంశం వుంది. ఆ వంశాన్ని చెప్పుకో. నీ వంశం పేరు “భరతవంశం”. నీ జాతికి పేరు "భరతజాతి”. నీకొక ప్రమాణంవుంది అది "వేదాలు”. yes ఆ వేదాల్లో నువ్వు ఏ దేవతని పూజచెయ్యి, నువ్వు శివున్ని పూజచెయ్యి, కృష్ణున్ని పూజచెయ్యి, అమ్మవారిని పూజచెయ్యి లేదంటే ఇతరమైనటువంటి దేవతలను అగ్ని, వరుణ, వాయు, ఇంద్ర, కుబేర ఎంతోమంది దేవతలున్నారు నీకే దేవత ఇష్టమయితే ఆ దేవతని పూజ చేయ్యవోయ్! ఎవరొద్దన్నారు నిన్ను. ఇందులో రకరకాలైనటువంటి, విష్ణు భక్తుల్ని వైష్ణవులంటాం. శివ భక్తుల్ని శైవులంటాం. శక్తి భక్తుల్ని శాక్తేయులంటాం. ఇతరమైనటువంటి దేవతల్ని పూజచేస్తే గానాపంక్త్యులంటాం yes ఇలాంటి వాళ్ళు కొన్ని వందల దేవతలున్నారు. నీకిష్టమైన దేవతను పూజచేసుకో అన్నిటినీ కూడా వేదం దీన్ని అంగీకరించింది కనక, ఆ వేదమార్గములో వచ్చేవాడివే నీవు అవుతావ్. అపుడు వేదం నీకు పరమ ప్రామాణిక గ్రంథం అవుతుంది. దాన్ని ఆచరించిన వంశాలున్నాయి. అదే భరతవంశాలు అని అంటున్నాం అందులోవాడే రామచంద్రుడు. అందులో వాడే కృష్ణుడు. వాళ్ళెంతెంత కాలం ఎలాఎలా ఉన్నారో చెప్పిన గ్రంథాలున్నాయి. ఇప్పుడు నువ్వు కనుక ఈ 'హిందూ' అనే పదం వాడావంటే మొత్తం అదంతా పోయింది. అంతా మొత్తం జీరో. మొత్తం అంతా సున్నా సుమారుగా పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి వాడాలా ఆ పదాన్ని మీరు? నిన్ను నీవు చరిత్ర హీనున్ని చేసుకోవడానికి వాడుతున్న పదాన్ని వదలడానికి ఇష్టపడకపోతే మరి వాన్ని (తలను చూపిస్తూ) మెదడు ఉన్నవాడనాలో లేనివాడనాలో మీకే వదిలేస్తున్నా దాన్ని. ఇదంతా తెలుసు. ఈ మధ్యన ఒకాయన అన్నారండీ! "స్వామీజీ మీరు ఆ పదం వాడకపోతే ఎలాగండీ. చాలా తప్పండి. అసలు మనందరినీ కలిపే ఇంక వేరే పదమేలేదండీ” అదేమిటయ్యా! పదం లేకపోవడమేమిటి? “భారత” పదం అందరినీ కలుపదా! "అబ్బెబ్బె లేదండీ! ఆ పదం వాడితే మిగతావాళ్ళందరినీ, అది secular పదమండీ” secular పదం, సెక్యులరేమిటసలు. అంటే “మనల్ని (specific) గా చెప్పే పదం వేరే ఇంకోటేమీలేదు స్వామీజీ" ఇదేంటి లేకపోవడమేమిటి! "భారత్" అనేది ఉన్నది కదా! "అబ్బెబ్బే! మిగతావాళ్ళు కూడా దాన్ని వాడుకొంటున్నా రండీ” మంచిదే కదా! వాడుకోనీ! ఎవరిది కాదు. భూమిమీద ఉండే ప్రతి మనిషికీ చెందిన పదమే అది. ఎందుకంటే మన జాతి భరతజాతి. కేవలం ఒకచోటికి పరిమితం కాదండీ "పృథివ్యాం సర్వమానవా: స్వంస్వ చరిత్రం చిత్చిత్ క్షేలన్” అని వ్యాసుడు చెప్పాడు. భూమిమీద ఉండే మానవులంతా ఇక్కడినుంచి వెళ్ళినవాళ్ళే. అంతా మొత్తం భరతవంశం వాళ్ళవాళ్ళే. అంతా భారతీయులే. ఈ వేళ తాము ఏవో, కొన్ని రకరకా లైనటువంటి ఏదో వ్యక్తులను ఆధారం చేసుకుని, ఆరాధిస్తూ కొందరు తమని క్రిష్టియన్లని అనుకుంటున్నారు. కొందరు తమని ముస్లిమ్స్ అని అనుకుంటున్నారు. కొందరు తమని జొరాస్ట్రియన్స్ అని అనుకుంటున్నారు. కొందరు తమని ఇంకొక పేరుతో చెప్పుకొంటున్నారు. కానీ వాళ్ళు మన తమ్ముళ్ళు, మన అన్నలు అంతే. వాళ్ళూ భరతవంశంలోంచి వెళ్ళినవాళ్ళే. (సభలో అందరూ చప్పట్లు కొట్టారు). వారిని ఎందుకు విడదీసే ప్రయత్నం చేస్తున్నావ్. వాళ్ళకి వాస్తవం ఎందుకు చెప్పవ్. వాళ్ళు తెలియక అమాయకంగా వాళ్ళు ప్రవర్తిస్తే నువ్వూ అలానే వుంటావా! ఇవాళ అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది. అది ఆ! ఏదో “అది ఒక పదమండీ! దాన్ని మనం అలా అర్థం చెయ్యొద్దు! దాన్ని తీసుకుందాం”. ఎందుకు తీసుకోవాలి నువ్వు అలాగా! ఏమండీ నీది జింబో అని పేరు పెడతాను. నీది జింబోమతం. దీని అర్థమెందుకండి మనకీ, దాన్ని అట్లా పేరు తీసుకోండి, తీసుకోండి మరి ఇవాళ్లుంచి సర్టిఫికేట్లో. మాది జింబోమతం. అంతా ఒప్పుకుంటారా? ఏవండీ అవసరమేమిటి? ఇపుడు నాకు తిండిపెట్టే అమ్మలేకపోతే, అపుడు నేను అడుక్కోవడానికి బయలు దేరాలి. నాకు
ఒక అమ్మవుంది. అది అమ్మ నాకు తెలివైన అమ్మ. నాకు అన్నం పెట్టగల్గిన అమ్మ. సంస్కారం ఇవ్వగల్గిన అమ్మ. అన్నీ వున్నటువంటి అమ్మ నాకుంటూంటే, నేను ఇంకొకల్నెవల్నో పట్టుకోవాల్సిన అవసరమెందు కయ్యా! ఆలోచించాల్సిన అవసరమేమిటి, లేనిపోనిదానిని పట్టుకొచ్చి. “అబ్బెబ్బే! అది మతం కాదండీ, అది ఒక, ఒక ఆచారాన్ని చెప్పేది.” నాకు వైదిక ఆచారముందయ్యా! వైదిక ఆచారమంటారు మాది. ఏమండి, మీది వైదిక ఆచారం కాదా! మీది అవైదికమా మీది? మరి మీదీ వైదికం. నువు శివున్ని పూజచేసుకో, నేను వద్దంటంలేదు. శివున్ని వేదం చెప్పకపోతే కదా నువు వాదపడాలి. నాస్తికాన్ని కూడా వేదం చెప్పిందండీ. తమాషా తెలుసునా మీకు. “అబ్బబ్బో ఏమండీ స్వామీజీ! మనం అలాగ, ఈ హిందూపదం వాడకపోతేనండీ, ఇవాళ వైదికం అని అన్నామంటే చాలా ప్రమాదమండీ, మనదాంట్లోంచి బౌద్ధులంతా పోతారండీ, జైనులంతా పోతారండీ, ఇంకోళ్ళంతా పోతారండీ". అయ్యో! వేదం నాస్తికాన్ని చెప్పిందయ్యా! వేదం ఆస్తికాన్ని చెప్పింది. నువ్వు నాస్తికుడవైనా దాంట్లో వాడివే, ఆస్తికుడవైనా దాంట్లోవాడివే. నువ్వు ఏ దేవతను పూజ చేసినా దాంట్లోవాడివేనని అంటూంటే. "అబ్బెబ్బే! హిందూ అనేది ఆలోచనాధార మండీ" ఆలోచనా ధార నీ భార్యకు వేరు, నీకు వేరు అప్పుడు మీరిద్దరు వేరువేరువాళ్ళవుతారా? (it is so sad and unfortunate) చదువుకున్న వాళ్ళంతా
ఈ వేళ సమాజాన్ని చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. ధర్మం పేరు చెప్పి లోకాన్ని ఉద్దరిస్తామన్న వాళ్ళంతా సమాజాన్ని చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. ఆలోచించుకోవాలి. మనం కూడా ఆలోచించుకోవాలి. అందుకే మనం మీకు ఒక ఆచార్యుల వారిని మీరు ఆశ్రయించి వారి మార్గంలో మీరు నడుస్తుంటారనుకోండి, వారి మతం అని చెప్పుకోండి. ఇప్పుడు మేము రామానుజాచార్యుల వారిని follow అవుతాం. కనుక మాది రామానుజ మతమంటాం. మీరు శంకరాచార్యుల వారిని follow అవుతారు. అప్పుడు మీది శంకరమతం అంటాం. ఇంకొకాయన మధ్వాచార్యుల వారిని follow అవుతారు. వారిది మధ్వ మతం అని అంటాం ఇది వారి అభిప్రాయాన్ని మనం follow అవుతున్నాం. కనక అది ఆ మతం. నువ్వొక ఋషిని follow అవుతున్నావ్. ఆ ఋషి మతం నీ మతం అని అంటాం. ఆ స్వాతంత్ర్యం నీకు ఉ ంది. yes ఎందుకంటే అందరు ఆచార్యులు కూడా ఒక్కొక రకమైనటువంటి ఆలోచన కల్గినవాళ్ళది ఏది అవసరమో దాన్ని వాళ్ళిచ్చారు. నీది అందులో ఏదో ఒకటి తీసుకో! ఏం! తప్పేంలేదు. నువ్వు ఏది తీసుకున్నా అందులో ఒక మంచి నువ్వు సాధించగల్గుతావు. ఇది నిజంగా తెల్సుకుందాం అని జిజ్ఞాసకల్గితే మిగతా వాటిలో ఉండే మంచిని గ్రహించే ప్రయత్నం చెయ్. that's fine లేకపోతే నువ్వు ఒక ఆచార్యున్ని విశ్వసించు, ఆ మతాన్ని చక్కగా అవలంబించు. that's good. that's pretty good. ఇది మతం అని అంటాం. జాతి ఏమిటి? అది మన వంశాన్ని బట్టి వస్తుంది. మనది భరతవంశం. కనక మనది భరతజాతి అంటాం. ఇవాళ క్రిష్టియన్ అని పేరుపెట్టుకొని నేను భరత జాతీయుడినే. ఇవాళ నేను ఇస్లాం అని పేరు పెట్టుకున్న, నువ్వూ భరత జాతీయుడివే. మరచిపోకండి. ఇవాళంటే నువ్వు ఏదో మారి, పైన ఒక ముసుగు వేసుకుని కనిపిస్తున్నావ్ కానీ, ఎవ్వడూ ఇందులోంచి బహిర్గుతుడు కాడు. భూమిమీద వున్న మనుషులందరూ ఇందులోంచి వచ్చిన వారే. మరిచిపోయి వాళ్ళు తిరిగితే, నువ్వు వాళ్ళను వదలి పెట్టేసుకుని, నిన్ను నువ్వు కూడా మార్చేసుకుని, నువ్వు బతుకుతానంటే నువ్వేం మనిషివి? నువ్వేం మార్గదర్శకుడివి సమాజానికి? కానే కాదది. మనకందరికీ ఒక ప్రమాణం ఉంది. మనది వైదికధర్మం, ధర్మం అంటే ఆచారాన్ని చెప్పేది అని అర్థం. మనకు వేదం చెప్పిన ఆచారం మన ఆచారం. దానిని ఆచరించిన వారి చరిత్ర మనకు ఉంది. అది ఇతిహాసం అంటాం. అది రెండు రకాలుగా వుంది. అది ఒకటి రామయణం, ఒకటి భారతం. రామాయణంలో రాముడికి ముందు వుండేదటువంటిదంతా కూడా record చేసి వాల్మీకి ఇచ్చాడు. అయితే ఆయన సంక్షిప్తంగా ఇచ్చాడు. ఆ తర్వాత వేదవ్యాసుడు రామున్ని కూడా అతని దాంట్లో చూపిస్తూ, రాముడికి ముందువుండే ప్రక్రియని, రాముడి తర్వాత తనదాకా
సాగినటువంటి ప్రక్రియని కూడా ఆయన స్పష్టంగా చూపించాడు. అయితే ఆయన ఋషి. కనక రాబోయే తరాలెలా వుంటాయో కూడా చెప్పాడు. అది కూడా తన ఒక పురాణం క్రింద రచించి దాన్ని కూడా మనకిచ్చాడు. అంటే తను, ఆ! మనకిక కనిపించని స్థితిలోనికి వెళ్ళేటపుడు, ద్వాపరయుగం పూర్తయి, కలియుగ ఆరంభం అయిన తర్వాత సాగే వంశాలు కూడా ఇచ్చాడండాయన. ఎలా ఉంటాయో, ఎట్లా progress జరుగుతుందో కూడా ఇచ్చాడు. దాన్ని ఇవాళ మనవాళ్ళు అదేమిటిది, ఆ... అదో వీరబ్రహ్మంగారి ఆ.. కాలజ్ఞానం, సారీ! యా! “కాలజ్ఞానం” అనేపేరుతోటి దాన్ని లోకంలో కొంతమంది పాడుకున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే అసలు పాడినవాడి పాట పోయింది.
"హిందూ" పదం పై,
శ్రీ పుష్పగిరి మహాసంస్థాన్ పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహభారతీ స్వామి,
వారి అభిప్రాయము (భక్తి టీవి ఛానల్లో “భక్తి ధార్మిక సమ్మేళనం" కార్యక్రమం సందర్భంగా).
ఈనాడు ఇక్కడ అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శ్రేయస్కరం, శుభదాయకం. దీనివల్ల మన ఆంధ్రరాష్ట్రం ఎంతగానో ఆనందిస్తుంది, హర్షిస్తుంది. మనం ఇంతసేపు హిందువులనీ, హిందూ ధర్మమని మనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మనదేశం ఏది? ఏం దేశం, హిందూ దేశమా? ఈ విషయాన్ని పరిశీలించితే మన శాస్త్రం, మన సాంప్రదాయం మనయొక్క శాస్త్రీయమైనటువంటి పురాణాలు, ఏం చెప్పాయంటే మీరు హిందువులు కారు, హిందువులని మీరు అనుకోవడం, అది మీ పొరపాటు. మీరు భారతీయులు, ఇది భారత దేశం. (సభలో అందరూ చప్పట్లు కొట్టారు.)
ఈ భారతదేశంలోని సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఈ హిందూ అనేటటువంటి పేరు, ఎక్కడినుండి వచ్చింది, ఎలా వచ్చిందీ అంటే తురుష్కులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో వాళ్ళు మనకిచ్చినటు వంటి బిరుదు “హిందువని”. (old persian dictionary) దానిలో “హింద్" అనేటటువంటి శబ్దాన్ని వివరణ ఇస్తూ "హింద్” అంటే “బేవకూఫ్”, “చోర్”. ఇది మనయొక్క ఘనత. మనకు వాళ్ళు పెట్టినటువంటి ముద్దుపేరు “హింద్” అని పేరు. చాలా ముద్దుగా పెట్టారు వారు. మనం ఆనందంగా స్వీకరించాం. దాన్నే మనం, నిరంతరం మనల్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎక్కడ (applications) పెట్టాల్సివచ్చిన (what is your religion) అని అంటే హింద్, హిందు, నేను ఇండియన్ ను, హిందువును అని చెప్పు కుంటున్నాం. కానీ మనం హిందువులం కాదు, మనం భారతీయులం (సభలో అందరూ చప్పట్లు కొట్టారు.)
పురాణం “అత్రాబి భారతం శ్రేష్ఠం, జెంబూ ద్వీపే మహాముని, యతోహి కర్మభూరేశా యతోజ్ఞ భవభూభయహ:” భారతం అత్యంత శ్రేష్ఠమైందనీ, ఇతరమైనటువంటి ప్రదేశాలలోనటువంటివన్నీ భవభూలని. ఇది కర్మభూమి, కర్మల ఆచరించి, కర్మల ద్వారా తన్ను తాను సంస్కరించు కోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి లోకాలను చేరుకోవచ్చు. దానికి అనుగుణంగా, అనుకూలంగా మనకు అనేక విధాలుగా దారులు చూపినటువంటిది మన యొక్క సంప్రదాయం.
"ఉత్తరం యతా భూరస్య హిమాద్రశ్చే దక్షిణం వర్షం తద్ భారత జ్ఞామ భారతీ యత్ర సంతతీ:" ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రము ఈ రెంటికీ మధ్య ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి సంతతి అంటే ప్రజలు, జనులు వీళ్ళు భారతీయులు, ప్రజా: భారతీయులు. అందువల్ల మనం భారతీయులమే కానీ మనం హిందువులం కాదు. అటువంటి భావన, దృష్ఠి మనలో రావాలి. మనం భారతీయులం అనేటటువంటి ప్రజ్ఞ మనలో కలగాలి. భారతీయమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాల్ని మనం మరచిపోకుండా నిరంతరం పాటిస్తూ రావాలి. ఆ విధంగా పాటిస్తూ వస్తే మన జీవితం ధన్యం. భారతీయ సంస్కృతి అంటే పవిత్రమైనటువంటి, వైదిక మైనటువంటి కర్మ, భక్తి ఆ తర్వాత జ్ఞానం. మనయొక్క సంస్కృతిదే. ఈ సంస్కృతిలో మనం పయనిస్తూ వచ్చామంటే, మనం చివరికి చేరబోయేది, అఖండమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో చేర్తే, “నశపునరావర్తతే నజపునరావర్తతే”. భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడై అలాంటి కర్మ, భక్తి, జ్ఞానములు కలవాడై, వాడు మెల్లిగా ఆ పరమపదాన్ని చేరుకోవాలి. దానికి దారిని చూపించేటటువంటి సాంప్రదాయమే మన సాంప్రదాయం. సాంప్రదాయంలో ఉన్నందుకు మనం ఆనందపడాలి, హర్షించాలి.
హిందూ రక్షణా! హిందూ భక్షణా!! భగవద్గీతయే చదవనివాడు హిందూ రక్షకుడా? హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?
హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు కులములుగా వర్ణించబడియున్నారు అనుట అందరికీ తెలిసిన సత్యమే. దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే కొందరు మనుషులు తమ స్వార్థ బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా చీల్చి బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ తామే గొప్పవారమనీ, తాము చెప్పినట్లే అందరూ విని అన్ని కార్యములు చేసుకోవాలనీ ప్రచారము చేసుకొన్నారు. ఎన్నో కులములుగా యున్న హిందూ సమాజములో తమ కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల వారందరికీ తామే మార్గదర్శకులమనీ, గురువులమనీ ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో తమకు ఎవరూ అడ్డురాకుండునట్లు, అన్ని కులములను అంటరాని కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము
చేశారు. అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ, హిందూ సమాజమును సర్వనాశనము చేయుచూ, హిందూ సమాజము ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు. అటువంటి వారు హిందూ సమాజమునకు చీడ పురుగులుగాయున్నా, మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక వారు చెప్పినట్లే వినుట వలన, హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు, అధర్మ మార్గమువైపుకు మళ్ళించి, ప్రజలకు ఏమాత్రము దైవజ్ఞానమును తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.
అటువంటి స్థితిలో నేడు త్రైత సిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు నిలిచి పోయిన హిందూసమాజమును సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయమున బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు పురుషుల విషయమును "త్రైత సిద్ధాంతము” అను పేరుతో ప్రతిపాదించి దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో వ్రాయడము, బోధించడము జరుగుచున్నది. దానివలన నేడు ప్రజలు అసలైన జ్ఞానము తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగానున్న వారిలో కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ తమకు తెలియనిజ్ఞానము యోగీశ్వరుల ద్వారా ఇప్పుడు తెలియుచున్నదని సంతోషపడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో కొందరు మాత్రము యోగీశ్వరులు తెలియజేయు జ్ఞాన విషయములను చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము తెలియని తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ ఆధిపత్యము లేకుండా పోవునని తలచి, యోగీశ్వరులు తెలుపుచున్న త్రైత సిద్ధాంతము గానీ, త్రైత సిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమే కాదనీ, అది క్రైస్తవ మతమునకు సంబంధించినదనీ, దానిని ఎవరూ చదవకూడదని ప్రచారము చేయను మొదలుపెట్టారు. అంతేకాక తాము హిందూధర్మరక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన ప్రచారమునకు అక్కడక్కడ అడ్డుపడడము జరుగుచున్నది. తమ మాట విను ఇతర కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు జ్ఞానము హిందూ జ్ఞానము కాదు, క్రైస్తవుల జ్ఞానమని హిందువుల ముసుగులో క్రైస్తవ మత ప్రచారము చేయుచున్నారని చెప్పడమేకాక, అటువంటివారిని ప్రేరేపించి మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు చేయుచున్నారు.
యోగీశ్వరులు నెలకొల్పిన హిందూ (ఇందూ) జ్ఞాన వేదిక ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో చూడడము జరిగినది. మాలో ఓర్పు నశించి మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు అగ్రకులము వారిని, వారి అనుచరులను మేము ఎదురుదిరిగి ప్రశ్నించడము జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు సరియైన సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా మీరు చూడండి.
మా ప్రశ్న :- ఇంతవరకు ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు తిరిగి, ఊరులో ఇల్లిల్లూ తిరిగి హిందూ ధర్మములను ప్రచారము చేయుచున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత ప్రచారకులుగా ఎందుకు చెప్పుచున్నారు?
వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలు ఉన్నారు. వారు ఎవరూ ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయలేదు. హిందువులు అట్లు ఎవరూ ప్రచారము చేయరు. క్రైస్తవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేస్తారు. మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లూ తిరిగి క్రైస్తవమును ప్రచారము చేయుచున్నారు.
మా ప్రశ్న :- మేము క్రైస్తవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము చేస్తాము?
వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది త్రైత సిద్ధాంత భగవద్గీత. అది క్రైస్తవులది. బైబిలుకే మీరు అలా పేరు పెట్టారు.
మా ప్రశ్న :- క్రైస్తవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి ప్రచారము క్రైస్తవము, బైబిలు అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప హిందువులుగా భగవద్గీత పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా జరుగలేదు. ఏ మతమువారు ఆ మతము పేరు చెప్పుకొంటారు గానీ ఇతర మతముపేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి చూచారా? అందులో భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యము లున్నాయా?
వారి జవాబు :- త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే త్రిత్వము అని త్రినిటి అని మాకు బాగా తెలుసు.
మా ప్రశ్న : :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును రామానుజాచార్యులు ప్రతిపాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువులని మీరు ఎందుకు అనుకోలేదు?
వారి జవాబు :- మీ త్రైతసిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో అలా లేదు కదా!
మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికీ ఒకే భగవద్గీతయుంటుంది గానీ, మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని గుర్తుంచుకోండి. త్రైత సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదని చదివిన జ్ఞానులందరూ పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించు చూయుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా కనిపించిందనడము అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని మేము ఎక్కడా చెప్పలేదు. యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు
తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు కదా! భగవద్గీతలో చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.
వారి జవాబు :- అవన్నీ మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.
మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి మీరు అగ్రకులమువారమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మేము హిందువులము కాము అనుటకు ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన హిందువులే అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ భగవంతుడు ఏమి చెప్పాడో మీరే చెప్పండి.
వారి జవాబు :- మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.
మా ప్రశ్న :- కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన ప్రబోధానందస్వామిని దూషించడము మంచిదా? ఒక్క హిందూ ధర్మమును కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా? యోగీశ్వరులవారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండ మేము తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ ఉండకూడదను అసూయతో ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.
వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే, రాముడు దేవుడే, రాముని సేవకుడు ఆంజనేయుడు దేవుడే. అలాంటి హిందూ మతములో దేవుడు ఒక్కడే అని చెప్పడము మీది తప్పు కాదా?
మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూ మతములో ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే హిందూ జ్ఞానములో, హిందూ ధర్మము ప్రకారము విశ్వమునకంతటికి ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో దేవుడు చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే! దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని, ఆయనే దేవదేవుడనీ, అతనిని ఆరాధించమని చెప్పాము.
వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు, వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరూ చెప్పకుండా దేవుడు అనీ, సృష్టికర్తయనీ అనేకమార్లు పేర్కొన్నారు. దేవుడు అను పదమునుగానీ, సృష్టికర్తయను పదమునుగానీ క్రైస్తవులే వాడుతారు. హిందువులు వాడరు. అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్తవులు అంటున్నాము.
మా ప్రశ్న :- క్రైస్తవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది. సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది నుండి సృష్టికర్త అను పదమును దేవుడు అను పదమును హిందూ సమాజము వాడుతూనే యున్నది. మొదటినుండి హిందూసమాజములో యున్న దేవుడు, సృష్ఠికర్త అను పేర్లను హిందువులు క్రైస్తవులకేమయినా
లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము. సృష్టికర్త అనిగానీ, దేవుడు అనిగానీ హిందువులయినవారు అనకూడదని ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము
వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు హిందువులుగా చెప్పుకో లేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు. అటువంటప్పుడు మీరు హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి ఇందూ మతము అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు హిందువులే అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలో గానీ ప్రత్యేకించి ఇందువులు అని ఎందుకు చెప్పుచున్నారు?
మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి. హిందువు, ఇందువు అను పదములో కొద్దిపాటి శబ్ధము తప్ప ఏమి తేడాయుందో మీరే చెప్పండి. తెలుగుభాషను వ్రాసే వారందరూ హిరణ్యకశ్యపున్ని చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు అలాగే వ్రాయుచుందురు. ప్రస్తుతకాలములో నరశింహులు అని పేరున్నవాడు కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు. అయితే ఆ మాట తప్పు అలా వ్రాయకూడదు దానిని నరసింహ అని వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము అని అంటాము తప్ప శింహము అని అనము అనికూడ చెప్పుచున్నాము. 'సింహము' అంటే అర్థమున్నది గానీ, 'శింహము’ అంటే అర్థము లేదు అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే ఇందువు అనే దానికి అర్థమున్నదిగానీ హిందువు అనే దానికి అర్థములేదు అని చెప్పాము. సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి దృష్ఠి జిష్ఠి అయినట్లు ఇందూ అను శబ్ధము హిందూ అని పలుకబడుచున్నదని చెప్పాము. ఇందూ పదము ఎందుకు వాడాలి హిందూ పదమును ఎందుకు వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు. ఉన్న సత్యము మీకు తెలిసినా మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను అసూయతో మాట్లాడుచున్నారు.
అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధి రౌడీలలాగా తంతాము, పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము మంచిది కాదు. మా గ్రంథములు ఏదీ చదువకుండా మాట్లాడడమూ, మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు అనడము మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర మతములను ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా మతములోనికి చేరమని చెప్పినట్లుగానీ ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించినవారికి ఇందూ జ్ఞానవేదిక తరపున పది లక్షల రూపాయలను ఇవ్వగలము. నిరూపించ లేకపోతే మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలో శ్రీకృష్ణుని గుడికయినా ఇవ్వవలెను. ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగుచున్నాము.
ఇట్లు, ఇందూ జ్ఞానవేదిక.
చరిత్రలో జరిగిన అన్యాయము. హిందువులలో జరుగుచున్న యదార్థము. నాలుగువందల సంవత్సరముల క్రిందట ఆధ్యాత్మిక రంగములో మెరిసిన వజ్రము వేమనయోగి. ఆధ్యాత్మికమను పాలను చిలికి దైవజ్ఞానము అనే వెన్నను తీసి ఇచ్చినవాడు వేమన. వేమన తన పద్యములలో చెప్పిన ఒక్కొక్క జ్ఞాన విషయము విపులముగా వ్రాసుకొంటే ఒక్కొక్క గ్రంథము కాగలదు. వేమన స్వచ్ఛమైన తెలుగు భాషలో పద్యమును వ్రాసి చెప్పాడు. సంస్కృతము జోలికి పోలేదు. ఒక ప్రక్క పద్యములు వ్రాసి కవిగా కనిపించినా, ఒక ప్రక్క అంతు తెలియని ఆధ్యాత్మికవేత్త వేమనయోగి. అయితే ఆయన పుట్టినది రెడ్డి కులమున. చరిత్రలో మాకంటే ఎవరూ పెద్దగా ప్రశంసింపబడకూడదని గర్వములోయున్న అగ్రకులములోని కొందరు పనిగట్టుకొని వేమన యోగిని పిచ్చివానిగా జమకట్టి, అతను చెప్పింది జ్ఞానమేకాదని ప్రజలలో ప్రచారము చేశారు. పిచ్చివాని మాటలు పిచ్చివారే వింటారు అని హేళనగా మాట్లాడడము జరిగినది. అనేక కులములుగాయున్న హిందువులకు జ్ఞాన విషయములో పరిచయము లేనిదానివలన, అగ్రకులము వారు వేమన చెప్పినది జ్ఞానమే కాదనడము వలన, వేమన తన జ్ఞానమునకు తగినట్లుగా ప్రకాశింప లేకపోయాడు. తాము అగ్రకులము వారమనీ, మిగతా వారందరూ తగ్గు కులము వారనీ విభజించి, తాము చెప్పినట్లు వినవలెననీ, అట్లు వింటేనే మిగతా కులముల వారందరూ సుఖముగా బ్రతుకగలరనీ, అగ్ర కులమువారు ప్రచారము చేసుకొన్నారు. అలా తమను తాము గొప్పగా ప్రకటించుకోవడమేకాక హిందువుల ఇళ్ళలో జరుగు ప్రతి మంచి పనికీ, చెడు పనికీ, చావుకూ పుట్టుకకూ, పెళ్ళికీ పేరంటానికీ ప్రతి కార్యమునకూ తాము చెప్పునట్లు చేయాలనీ, తాము నిర్ణయించు కాలములోనే చేయాలనీ, అట్లు చేయకపోతే నష్టము, కష్టము కలుగుతుందని భయపెట్టడము వలన, భయముతో జ్ఞానము తెలియని మిగతా కులముల వారందరూ వారు చెప్పిన దానిని నమ్మడము జరిగినది. ఈ విధముగా హిందూమతములో అగ్రకులము వారు భయము అను బ్లాక్మెయిల్ చేసి, తగ్గు కులము వారందరినీ తమమాట వినునట్లు చేసుకొన్నారు. ఆనాటినుండి హిందూ సమాజమును మోసము చేస్తూ ఎవరికీ హిందూ జ్ఞానమును తెలియకుండా చేసి, తాము హిందూ సమాజమును అనేక పేర్లతో దోచుకొంటూ బ్రతకడమే కాక, మిగతా కులములలో ఎవరు జ్ఞానులుగా పుట్టినా, వారిని హేళన చేయడమూ, అజ్ఞానిగా వర్ణించడమూ జరిగినది.
చరిత్రలో నాలుగు వందల సంవత్సరముల క్రితము వచ్చిన వేమనను పిచ్చివానిగా వర్ణించి శాస్త్రము తెలియనివాడని వర్ణించారు. తర్వాత ఇప్పటికి మూడు వందలయాభై సంవత్సరముల క్రిందట వచ్చిన పోతులూరు వీరబ్రహ్మముగారు గొప్ప జ్ఞానిగా తయారై, భవిష్యత్తు కాలములో జరుగు సంఘటనలను ముందే తెలియజేసి గొప్ప కాలజ్ఞానమునే వ్రాశాడు. ఆయన వ్రాసిన భవిష్యత్తు కాలక్రమమున నేటికినీ జరుగుచునేయున్నది. అంతటి గొప్ప జ్ఞాని అయిన వీరబ్రహ్మముగారు
అగ్రకులమువాడు కాకపోవుట వలన, విశ్వకర్మ (ఆచారుల) కులమున పుట్టుట వలన, అగ్రకులము వారు బ్రహ్మము గారు బ్రతికియున్న కాలములోనే, తమ ఊరిలోనికి రాకుండా, ఆయన జ్ఞానమును ప్రచారము చేయకుండా అడ్డుకొన్నారు. ఆ రోజు ఇతరులు జ్ఞానులు కాకూడదను అసూయ అను గుణముతోనూ, మేమే తెలిసిన వారమను గర్వముతోనూ ఆ పని చేశారు. హిందూ సమాజములో ఇటువంటి వారుండుట వలన విసిగిపోయిన హిందువులు హిందూ మతమును వీడి ఇతర మతములోనికి పోవుచున్నారు. ఇందూమతములో దేవునికి గుడికి అంటరాని వారిగా ఉండలేని వారందరూ కొందరు జ్ఞానము కొరకు, కొందరు కులవివక్ష లేని స్వతంత్రము కొరకు మతమును మారజొచ్చారు. ఈ విధముగా హిందూమతములోని వారు ఇతర మతములోనికి పోవుటకు మొదటి కారకులు హిందూమతములోని అగ్రకులములవారేనని అనుమానము లేకుండా చెప్పవచ్చును.
తమ వలననే హిందువులు ఇతర మతములలోనికి పోవుచున్నారని అగ్రకులమువారికి కూడా తెలుసు. అయితే తమ తప్పును ఎవరూ గుర్తించనట్లు తాము హిందూమతమును ఉద్ధరించువారిగా, హిందూధర్మ రక్షకులుగా వర్ణించుకొని హిందూ ధర్మ భక్షకులుగా నేటికినీ సమాజములో కొనసాగుచున్నారు. వారిని హిందూ ధర్మ భక్షకులు, హిందూ ధర్మ నాశకులు అని చెప్పుటకు అనేక ఆధారములు గలవు. అటువంటి వాటిని పరిశీలించితే, హిందువులలోని మిగతా కులమువారివద్ద భగవద్గీతను బోధించు కృష్ణుడు అర్జునుడు యున్న చిత్రపటము (ఫోటో) యుంటే దానిని ఇంటిలో ఉంచుకోకూడదనీ, ఆ పటము ఇంటిలో ఉంటే ఇంటిలో కూడా యుద్ధాలు వస్తాయనీ, అనేక కష్టాలు వచ్చి పాండవులు అరణ్యవాసము పోయినట్లు బాధపడవలసివస్తుందనీ అగ్ర కులమువారు నేటికినీ చెప్పుచునే యున్నారు. అటువంటి భగవద్గీత ఫోటోలను గుడులలో ఉంచవలెననీ లేకపోతే ఏటిలోని నదీ ప్రవాహములో పారవేయాలనీ చెప్పడము, చేయించడము కూడా జరిగినది. అంతేకాక భగవద్గీతను ఇంటిలో ఉంచు కోకూడదని భగవద్గీతను ఎవరూ చదువకూడదనీ, చదివితే కష్టాలు వస్తాయనీ, భగవద్గీతను ఎవరి ఇంటిలోనూ లేకుండునట్లు చేయుచున్నారు. భగవద్గీత అర్జునునికి యుద్ధరంగములో యుద్ధము చేయుటకు చెప్పినది, అందువలన చదువకూడదు, చదివితే చదివినవారు కూడా అనేక తగాదాల లోనూ, కోర్టు వ్యవహారములలోనూ చిక్కుకోవలసి వస్తుందని చెప్పడము జరుగుచున్నది. ఇంకనూ హిందువులకు వేదములు ముఖ్యమైనవనీ వాటిని అన్ని కులముల వారు చదువకూడదనీ, వేదములను తామే చదువవలెననీ చెప్పడము కూడా జరుగుచున్నది. ఈ విధముగా భగవద్గీతకు వ్యతిరేఖముగా మాట్లాడువారు హిందూ సమాజమునకు చీడపురుగులుకాక ఏమవుతారో మీరే ఆలోచించండి.
ఇదంతయూ గతములో జరిగిన విషయములు, అవి చాలక ప్రస్తుత కాలములో వీరి ఓర్వలేనితనము, మేమే పెద్ద అను గర్వము ఎలాగుందో చూడండి. వేమనయోగిని, పోతులూరి వీరబ్రహ్మముగారిని అగ్రకులము వారు ఎంత హేళన చేసినా వేమనయోగిని రెడ్డి కులస్థులు వేమారెడ్లుగా గుర్రముల నెక్కి ప్రచారము చేయుట వలన, వీరబ్రహ్మముగారిని విశ్వకర్మ (ఆచారి) కులమువారు కాలజ్ఞానమును ప్రచారము చేయుట వలన, వేమన సంఘములు, విశ్వకర్మ సంఘములు తయారై వేమనను, బ్రహ్మముగారిని ప్రచారము చేయుట వలన, కొంతమంది ప్రజలకు వేమనయోగి పద్యములు,
వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము కొంతవరకు తెలియును. వేమనయోగి ఆ కాలములోనే తన పద్యములలో అగ్రకులమువారు చేయు తప్పులను ఎండబెట్టడము జరిగినది. వీరబ్రహ్మముగారి చరిత్రలో కూడా బ్రహ్మము గారికి అగ్రకులము వారు చేసిన ఆటంకములను వ్రాయడము జరిగినది.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానముకలది అని మూడువందల యాభై సంవత్సరములప్పుడే వ్రాసియుంచాడు. కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము యొక్క పేరుండడము ఈ మధ్యన ఐదు సంవత్సరముల క్రితము మాకు తెలిసినది. తర్వాత బ్రహ్మము గారు వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమునకు, ప్రబోధానంద యోగీశ్వరులకు సంబంధించిన చాలా విషయములు వ్రాసినట్లు తెలిసినది. ఎంతో గొప్ప జ్ఞాని, కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధా శ్రమాధిపతియైన ప్రబోధానందయోగీశ్వరులు వారిని గొప్పగా చెప్పుచూ "ప్రబోధాశ్రమము వారు శయనాధిపతి గుణములు కల్గియున్నారు. శయనాధిపతియే ఆనందగురువు. ఆనంద గురువే నాకు గురువు, మీకు గురువు" అని వ్రాయడము జరిగినది. ప్రబోధానందయోగీశ్వరుల జ్ఞానమేమిటో ఎంత శక్తివంతమైనదో జ్ఞాన జిజ్ఞాసులకు కూడా తెలియుచున్నది. ఎందరో జ్ఞానులయిన వారు యోగీశ్వరులు చెప్పుచున్న జ్ఞానము ఎంతో గొప్పదని ప్రశంసించుచున్నారు. బ్రహ్మముగారే స్వయముగా తన గురువుగా చెప్పుకొన్న వ్యక్తి ఎంతటి వాడయివుంటాడో మనము కూడా ఆలోచించవలసియున్నది. అయినా ప్రబోధానందయోగీశ్వరుల వారు ఒక్క దైవ జ్ఞానములో తప్ప మిగతా అన్నిటిలో సాధారణ వ్యక్తిగానే కనిపిస్తాడు. ఎదురుగా చూస్తే ఇతనికి జ్ఞానము తెలియునా! అన్నట్లు కనిపించినా, అవును ఆయన ఎవరికీ తెలియని గొప్పవాడే అన్నట్లు ఆయన వ్రాసిన గ్రంథములే గొప్ప శక్తులుగా నిరూపించుకొన్నాయి. ఒక గ్రంథము దగ్గరకు వస్తూనే కొందరిలో మార్పు కనిపించడమూ, కొందరు గ్రంథమును చదివిన వెంటనే అంతవరకు నయముగాని రోగములు పోవడము జరుగుచున్నది.
పైకి కనిపించని శక్తి యోగీశ్వరులలో నిక్షిప్తమైయుండుట బయటికి కనిపించకపోయినా ఆయన చెంతకు పోయినవారికి దేహములో నయము కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, డెంగీ జ్వరములు సహితము శాంతించి పోవడము జరుగుచుండుట వలన యోగీశ్వరులు ఎంతటివారో ఎవరికయినా సులభముగా అర్థమయిపోగలదు.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఆనంద యోగిని దూషించిన వారు చాలా ఇబ్బందుల పాలవుతారని వ్రాయడము జరిగినది. అలాగే ఆయనను గానీ, ఆయన గ్రంథములనుగానీ దూషించినవారు ఇంతవరకు ఎవరూ సురక్షితముగాలేరు. తెలియని రోగములతో, అర్థముకాని బాధలతో కొందరుండగా, కొందరు చిత్రహింసలపాలై చనిపోవడము జరిగినది. అలా ఎందుకు జరుగుచున్నదో తెలియనివారు, పాపమును మూటగట్టుకొనుటకు యోగీశ్వరుల వారి జ్ఞానమునకు అక్కడక్కడ ఆటంకము లను కలుగజేయుచున్నారు. హిందూమతములో ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. తర్వాత కొంతకాలమునకు విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యులు ప్రతిపాదించాడు. మరికొంత కాలమునకు ద్వైత సిద్ధాంతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. వీరు ముగ్గురూ
అగ్రకులము వారు కావడము విశేషము. గత ముఫ్ఫైఆరు సంవత్సరముల నుండి త్రైత సిద్ధాంతమును ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు, ప్రకటించి ఆ సిద్ధాంతమునే ప్రచారము చేయుచూ త్రైత సిద్ధాంతము ప్రకారము భగవద్గీతను వివరించి వ్రాయడము జరిగినది. హిందూమతములోని సిద్ధాంతముల వివరము తెలియని ప్రజలకు, అగ్రకులమువారు "త్రైతము అంటే క్రైస్తవులకు సంబంధించినదనీ, త్రైత సిద్ధాంత భగవద్గీతయని పైకి చెప్పుచూ లోలోపల క్రైస్తవ మతమును బోధించుచున్నారని” యోగీశ్వరులకు, యోగీశ్వరుల జ్ఞానమునకు వ్యతిరేఖముగా చెప్పడము జరిగినది. హిందుత్వమును ఒక వైపు సర్వ నాశనము చేయుచున్న అగ్రకులములవారు హిందూమతమును కాపాడువారి వలె నటించుచూ యోగీశ్వరుల జ్ఞానమునకు కొన్నిచోట్ల ఆటంకము కల్గించడము జరిగినది. మూడుచోట్ల అన్యమతప్రచారమని భగవద్గీతను ప్రచారము చేయు యోగీశ్వరుల శిష్యుల మీద కేసులు పెట్టడడము కూడా జరిగినది. కొన్నిచోట్ల ప్రత్యక్ష దాడులకు దిగడము జరిగినది. అయినా ప్రబోధానంద శిష్యులు అన్నిటికీ ఓర్పు వహించి జ్ఞానప్రచారము చేయు చున్నారు. ఈ మధ్యకాలములో నల్గొండ జిల్లా భువనగిరిలో దేవేంద్ర అను మా సంఘ సభ్యునిమీద అన్యమత ప్రచారము చేయుచున్నాడని ఆరోపించి కేసు పెట్టడము జరిగినది. అంతేకాకుండా మా ప్రచార వాహనము భువనగిరిలోనికి పోయినప్పుడు మా ఊరిలో ప్రచారము చేయవద్దని అడ్డుపడి పంపించడము జరిగినది. కరీంనగర్లో గోడమీద త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి అని వ్రాస్తే, అగ్రకులము వారువచ్చి ఇది క్రైస్తవ మతప్రచారము దానిని తుడిపివేయమని చెప్పడము జరిగినది. రెండు రోజుల క్రిందట ఆరగడ్డలో ప్రచార వాహనముండగా అక్కడికి ఒక అగ్ర కులస్థుడు వచ్చి ఇది క్రైస్తవ ప్రచారము, ఈ ప్రచారమును నిలిపివేయండని ఘర్షణపడగా ఆ సమయానికి మా గ్రంథములు చదివిన వారు అక్కడుండుట వలన వారే అగ్రకులమువారికి బుద్ధిచెప్పి పంపడము జరిగినది. అక్కడున్న ప్రజలు అనిన మాటలు “ఇది ఎంతో గొప్ప జ్ఞానము. ఇంతకాలానికి గొప్ప జ్ఞానము దొరికిందని మేము సంతోషపడుచుంటే, సమాజాన్ని సర్వనాశనము చేసిన మీరు దీనిని జ్ఞానము కాదంటారా? ఇట్లే మాట్లాడితే ఊరిలో లేకుండా మిమ్ములను మేమే పంపుతాము” అని అనడము జరిగినది. ఈ విధముగా ప్రజలే తిరగబడి బుద్ధిచెప్పు సమయము అన్నిచోట్లా వస్తుంది.
గౌతమబుద్ధుడు జ్ఞానము చెప్పితే అతను అగ్రకులము వాడు కాదని ఆయనది వేరు మతమని ప్రచారము చేశారు. ఆ దినము గౌతముడు హిందువే కదా! తమ ఆధిపత్యము కొరకు హిందూమతమునుండి బుద్దున్ని చీల్చి అతనిది బౌద్ధమతమని చెప్పి హిందూమతమునుండి వేరు చేశారు. ఈ దినము బౌద్ధమతము విదేశాలలో వ్యాపించియున్నా స్వదేశములో లేకుండా చేసినది అగ్రకులము వారు కాదా! ఈ దినము బుద్ధుడు మావాడే బౌద్ధము హిందూమతమే అని చెప్పుకోలేని పరిస్థితి మనకు ఏర్పడినది. అలాగే ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమును హిందూ మతములోని భాగము కాదనడమూ, త్రైత సిద్ధాంత భగవద్గీతను భగవద్గీతే కాదనడమును ఒకవైపు ప్రజలు గమనిస్తున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు గత 36 సంవత్సరములుగా బోధించుచున్న బోధ హిందుత్వములోనే ఎంతో గొప్పదని అన్ని మతములవారు ఒప్పుకొనుచుండగా, తగ్గుకులము వారని అగ్రకులముచే అనబడినవారందరూ హిందూ (ఇందూ)
జ్ఞానమును తెలుసుకొని చైతన్యవంతులై అగ్రకులము వారికి తిరగబడి జ్ఞానము చెప్పు స్థితికి ఎదిగారు. తగ్గుకులము వారిమీద ఆధారపడి బ్రతుకుచున్న అగ్రకులమువారిని తగ్గుకులము వారందరూ ఒక్కమారు వెలివేస్తే, మీతో మాకు సంబంధము వద్దు అంటే ఏమవుతుందో చెప్పనవసరము లేదు. అటువంటి స్థితి రాకుండుటకు మా జ్ఞానమునకు అడ్డురావద్దని అగ్రకులము వారికి మరీమరీ చెప్పుచున్నాము.
ఇట్లు, ప్రబోధ సేవాసమితి.
ఇట్లు, ఇందూ ధర్మప్రదాత,, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును. అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు, సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.
సాక్షి. సోమవారం 22-9-2014 | www.sakshi.com హిందూ ఓ అశబ్దం: మొయిలీ సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దే శించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభి వర్ణించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా ఆ పదం లేదన్నారు. ముస్లింలను, మిగిలిన వర్గాల వారి నుంచి వేరుచేయడానికే అటువంటి పదా లను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త జవరే గౌడ మాట్లాడుతూ పురోహితులు ఉన్నంత వరకూ దేశంలో శాంతి ఉండదన్నారు.
ప్రముఖుల లేఖ. సాక్షి న్యూస్ పేపరు, 21-01-2014. ఇందు దేశమే ఇండియా!. హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యా వర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశ పటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది. రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు, ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహా గ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు. * నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి.