మతాతీత దేవుని మార్గము cloud text 17thSep2024


ముందు చెప్పవలసినది.

సృష్ఠిలో కనిపించని అతిపెద్దవి రెండే రెండు గలవు. మొదటిది దేవుడు, రెండవది మాయ. దేవుడు, మాయ

అనురెండు విశ్వమంత వ్యాపించివున్నవి. దేవుడు భర్తగ, మాయ భార్యగ ఉన్నదని చెప్పవచ్చును. వీరిద్దరి మద్య జరిగే

వ్యవహారమే ఈ ప్రపంచము యొక్క పుట్టుక నాశనము అని చెప్పవచ్చును. సృష్ఠి ప్రభవమునుండి ప్రళయము వరకు

దేవుని సంకల్పముతో మాయ పనిచేయుచున్నది. వీరిద్దరికి పుట్టిన వారే సమస్త జీవరాసులు. అందువలన అందరికి

కనిపించని తండ్రి దేవుడు, కనిపించని తల్లి మాయ. మనకు శాశ్వితమైన తల్లి తండ్రులున్నారన్న విషయము 99

శాతము మనుషులకు తెలియదు. సర్వులకు తల్లి తండ్రియొక్క విషయమునే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగమున

4వ శ్లోకమున "సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః, తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజ ప్రదః పితా."

అన్నాడు. దీని భావము “సర్వయోనులందు పుట్టు అన్ని జీవరాసులకు తల్లి ప్రకృతి (మాయ). బీజదాతనైన నేను

తండ్రిని” ఇదే విషయమును అందరికి తండ్రి దేవుడని బైబిలులో చెప్పబడినది. ప్రపంచములో పుట్టిన మనుషులకు

కనిపించెడి తల్లి తండ్రి తప్ప కనిపించని తల్లి తండ్రి ఉన్నారని కూడ తెలియదు..

కనిపించని దేవుడు, మాయ ఆడు జగన్నాటకములో పక్షము, ప్రతిపక్షము అను రెండుగలవు. పక్షము,

ప్రతిపక్షములలో దేవుడు ఒకవైపు మాయ ఒకవైపు ఉండి ఆడుచున్నారు. ఈ ఆటలో కొందరు మాయవైపు ఉండగ

కొందరు దేవునివైపు గలరు. మాయపక్షములో 99.9 శాతము మనుషులు ఉండగ, దేవునివైపు కేవలము 0.1 శాతము

మనుషులు అరుదుగ ఉందురు. అంత తక్కువ దేవునివైపు, ఎంతో ఎక్కువ మాయవైపు ఎందుకున్నారని కొందరడుగవచ్చును.

దానికి సమాధానము ఏమనగా! మానవుడు పుట్టినపుడే మాయపక్షములో పుట్టుచున్నాడు. అలా పుట్టిన వానిని

తనవైపు లాగుకొనడము దేవుని పద్దతికాగ, తన వైపునుండి ఎవరిని దేవునివైపు పోకుండ చూచుకోవడము మాయ

యొక్కపని. దాని వలన ఎల్లకాలము మనుషులకు తానే దేవుడన్నట్లు ప్రచారము చేసుకొనుచు, తన ప్రతినిధులుగ

ఎందరినో స్వాములను, పీఠాధిపతులను, గురువులను, పండితులను నియమించుకొని, తాను మాయ అని ఎవరికి

తెలియని విధముగ ప్రచారము చేయించుకొనుచున్నది. దానివలన ప్రజలందరు దేవునివైపు ఉన్నామనుకొని మాయ

మార్గములోనే సాగుచున్నారు.


దేవుడు కొన్ని వేల సంవత్సరములకు ఒకమారు తన ప్రతినిధిని పంపుచున్నాడు. తన ప్రతినిధి ద్వార దేవుని

విషయమును ప్రచారము చేయించుచున్నాడు. దేవుని ప్రతినిధియైన ప్రవక్త లేక భగవంతుడు చెప్పిన విషయములను

మనుషులు వినినప్పటికి, అది సత్యముకాదని మాయ ప్రతినిధులు చెప్పుట వలన దేవుని మార్గము ప్రచారము కాలేక

పోవుచున్నది. దానివలన దేవునివైపు 0.1 శాతము మనుషులు మాత్రమే ఉంటారు. దేవుడిచ్చిన అధికారము వలననే

మాయ విపరీతమైన బలమును పొంది మనుషులను దేవునివైపు పోకుండ చూచుకొనుచున్నది. దానికి మాయ

ముఖ్యమైన సూత్రమును అనుసరించుచున్నది. అదేమనగా! దేవుని జ్ఞానమువలె తన జ్ఞానమును ప్రవేశపెట్టి, దేవుని

ప్రతినిధులవలె తన ప్రతినిధులను స్వాములుగ, గురువులుగ, ప్రచారకులుగ పెట్టి, దేవుని ప్రతినిధి రాకముందు,

వచ్చిపోయిన తర్వాత ఎల్లపుడు తన విషయమునే ప్రచార మగునట్లు చూచుకొనుచున్నది. అందువలన మొత్తము

ప్రజలందరు తాము దేవుని భక్తులమనుకొనుచు మాయకు భక్తులుగ ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పుట్టు భగవంతుడు

(దేవుని కుమారుడు) తప్ప అసలైన జ్ఞానమును, అసలైన దేవున్ని గురించి చెప్పువారులేరు. కావున దేవుని విషయమై

బహు జాగ్రత్తగా పరిశీలించి, భూమి మీదున్న ఇన్ని జ్ఞానములలో ఏది అసలైన దేవుని జ్ఞానమని చూడవలసిన

అవసరమున్నది. అలా కొంత ఆలోచన కల్గిన వారికి కూడ ఇదియే నిజజ్ఞానమని మాయ తన జ్ఞానమునే అంటగట్టినది.


అలా దేవుడని భ్రమించి మాయవలలో పడినవారు ఎందరో కలరు. అటువంటి వారిలో పరవస్తు సూర్యనారాయణరావు

అనే అతను ఒకడు. కనిపించునది వినిపించునది అంతమాయ అని తెలియక కనిపించిన మాయను ప్రభువనుకొన్నాడు.

మత్తయి 11,27 వాక్యము ప్రకారము “తండ్రిగాక కుమారుని ఎవడు ఎరుగడు" అన్న సూత్రమును మాయ మరచునట్లు

చేసినది. కనిపించినదే దేవుడనుకొన్న అతను తాను నిజమైన దైవ భక్తుడననుకొని భ్రమించాడు. తాను ఏ దేవుని

భక్తుడనని చెప్పుకొన్నాడో, ఇంకోరూపములోనున్న ఆ దేవున్నే మాయ నిందించునట్లు చేసినది. తాను దేవుడనుకొన్న

వానినే దేవుడు కాదనుచున్నానని తెలియనట్లు మాయ చేసినది. పూర్తి మాయ ప్రభావములో మునిగిపోయిన మనిషిచేత

దేవుడిచ్చు మోక్షమును (పరలోక రాజ్యమును కోరక, మాయఇచ్చు ప్రపంచ వస్తువులను కోరునట్లు చేసినది. దేవుని

ప్రార్థన శాశ్వితమైన జీవనము కొరకు కాక అశాశ్వితమైన ప్రపంచ జీవనము కొరకు చేయునట్లు మాయ చేసినది.

ఈ విధముగ మాయ దేవున్ని తెలియకుండ చేసి, ఏది ఎవరి జ్ఞానమో తెలియని అయోమయ స్థితిని కలుగ

చేసినపుడు ఇది మాయ జ్ఞానము, ఇది దేవుని జ్ఞానము అని వివరించి తెలుపుటకే “మతాతీత దేవుని మార్గము” అను

ఈ చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది. ఒక విధముగ ఇది మతాతీతమే కాకుండ మాయాతీతమని కూడ

చెప్పవచ్చును. మతమనునదే పెద్ద మాయ కావున మతాతీతము అన్నపుడే ఇది మాయాతీతమైనది. ఇందులో

హిందువులను, క్రైస్తవులను గూర్చి వ్రాయడము జరిగినది. ఇందులో చెప్పిన విషయములు ఏ మతము వైపు

చెప్పకుండ దేవుని వైపునుంచి మాత్రము చెప్పబడినవి. నిర్ద్వందముగ నిష్కళంకముగ చెప్పిన విషయములే ఇందులో

గలవు. ఆ విధముగ చెప్పునపుడు మాయమార్గములో నడుచు హిందువులను, క్రైస్తవులను విమర్శించక తప్పలేదు.

ప్రభువును దేవుడుకాదనిన హిందువులను, కృష్ణుడు దేవుడుకాదన్న పరవస్తు సూర్యనారాయణ గారిని దేవుని విషయములో

తప్పు చేసినవారిగ చెప్పక తప్పలేదు. దేవుడు తన పక్షమువారు పూర్తిగ లేకుండ పోకుండునట్లు అప్పుడప్పుడు తానే

అవతరించుచుండును. తన పని మీద ద్వాపరయుగములో వచ్చాడు, కలియుగములో కూడ వచ్చాడు. తర్వాత

యుగములో కూడ వస్తాడు. ఎప్పుడు వచ్చిన తన జ్ఞానమును మాత్రమే బోధించి పోతాడు తప్ప వేరు పని చేయడు.

ఈ ఒక్క సూత్రము ద్వారానే మేము ద్వాపరయుగ కృష్ణున్ని, కలియుగ ప్రభువును ఒక్కరే అన్నాము తప్ప వేరుకాదు.

మాయదృష్ఠితో భౌతికమైన శరీరమును చూడక, జ్ఞానదృష్టితో ఆత్మ విధానమైన జ్ఞానమును చూచితే పైకి వేరువేరుగ

కనిపించిన కృష్ణునిలోను, ప్రభువులోను ఒకే దేవున్ని చూడవచ్చును. జ్ఞానదృష్టి లేనివారికి వేరువేరైన కృష్ణుని శరీరము

ప్రభువు శరీరములే కనిపిస్తాయి, వీరిరువురు వేరువేరనిపిస్తారు. అందువలన మనిషికి ఆత్మ విధానమైన జ్ఞానదృష్ఠి

అవసరము. జ్ఞానదృష్టిలేనిది ఈ గ్రంథములో వ్రాసినది కూడ వ్యతిరేఖముగ కనిపించగలదు. ఇందులోని విషయములు

మాయకు వ్యతిరేఖము కావున మాయ పార్టీలోనున్న వారందరికి విరుద్దము గానే కనిపించును. ఇది మాయకు

దేవునికి మధ్య సంఘర్షణలాంటిది. కావున జాగ్రత్తగ చదివితే అర్థము కాగలదు.

ఇట్లు,

శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


మతాతీత దేవుని మార్గము.


ఏసుప్రభువు భూమి మీదకు రాకపూర్వమే కొంత చరిత్ర గలదు. ఆయన చనిపోయిన తర్వాత కూడ కొంత

చరిత్ర గలదు. ఆయన రాకముందే వ్రాయబడిన చరిత్రను పాత నిబంధన అనుచున్నాము. ఆయన వచ్చిన తర్వాత

వ్రాయబడిన దానిని క్రొత్త నిబంధన అనుచున్నాము. ఆయన జననమునకు పూర్వమున్న పాత నిబంధన, జననము

తర్వాత క్రొత్త నిబంధనలో గల ఆయన జీవితము మరియు మరణము తర్వాత ఆయన భక్తులు క్రైస్తవ సంఘమును

ప్రచారము చేసిన విధానములు రెండు క్రైస్తవ సంఘము వారికి ముఖ్యమైనవిగ ఉన్నవి. ఈ పాత క్రొత్త రెండు

చరిత్రలు వ్రాయబడిన గ్రంథమునే పరిశుద్ధ బైబిలు అంటున్నాము. క్రైస్తవుల బైబిలుగాని, హిందువుల భగవద్గీతగాని

మానవున్ని ఉద్దరించుటకు, దేవునివైపు నడిపించుటకు ఉద్దేశింపబడినవైనప్పటికి బైబిలుకు, భగవద్గీతకు కొంత తేడా

గలదు. భగవద్గీతలో కృష్ణుని వెనుక చరిత్రగాని ముందు చరిత్రగాని ఏమాత్రము లేదు. కృష్ణుని బోధ మాత్రము

గీతలో గలదు. పరిశుద్ధ బైబిలులో అలాకాక ప్రభువుకంటే ముందు చరిత్ర, ప్రభువు తర్వాత చరిత్ర రెండు గలవు.

క్రైస్తవ బోధకుల బోధనలలో ప్రభువుకంటే ముందుగల పాత నిబంధనలోని మాటలు, క్రొత్త నిబంధనలోని ప్రభువు

తర్వాత ఆయన భక్తుల ప్రచారములు చోటు చేసుకొన్నాయి. ఇందులో తప్పేమి లేదుగాని మనము బాగా యోచించితే

మనిషి దేవుని మార్గములో నడచుటకు బైబిలులో కొంత భాగమే ఎంతగానో ఉపయోగపడగలదని తెలియుచున్నది.

ఒక నాటకములో ఎందరో పాత్రదారులు నటించిన అందరిలో ఒక పాత్ర మిగతవారికంటే ఎక్కువగా నచ్చడము,

నాటకములోని ఘట్టములలో ఏదో ఒక ఘట్టము చాలా బాగానచ్చడము జరుగుచున్నది. అలాగే బైబిలు మొత్తమును

తీసుకొంటే అందులో క్రొత్త నిబంధనలో ఏసుప్రభువు భూమి మీదకు వచ్చినప్పటినుండి తిరిగి ఆయన వెళ్లిపోవు వరకు

ఉన్న భాగము పరమ పవిత్రము, మానవుడు కడతేరుటకు ఉన్నతమైన ఘట్టము అని చెప్పవచ్చును. బైబిలులో అతి

సారాంశమైన భాగము ఏసుప్రభువు చరిత్ర మాత్రమేనని ప్రతి మనిషి గ్రహించవచ్చును. ఏసుప్రభువు పలికిన మాటలు

బైబిలు మొత్తములో వజ్రాల మూటలలాంటివి. బైబిలులో మానవుడు గ్రహించవలసినదంత ప్రభువు చరిత్రలో, ప్రభువు

మాటలలోనే కలదు. కావున బైబిలు సారాంశము కావాలనుకొనువారు, క్రొత్త నిబంధనలోని ప్రభువు జీవితము,

ప్రభువు మాటలతో కూడుకున్న మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త అను నాలుగు

చూస్తేచాలు. మానవునకు కావలసిన దైవసాన్నిధ్యము ఈ నాలుగు సువార్తలలోనే దొరుకును. ఈ నాలుగు సువార్తలలో

జ్ఞానములలోకెల్ల జ్ఞానము ఒక్క యోహాన్ సువార్తలోనే గలదని ఘంటారావముగ చెప్పవచ్చును. మానవుని బుర్ర

అందుకోలేనంత జ్ఞానము యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఎంతో పెద్దదైన బైబిలు గ్రంథము 1029 పేజీల పుస్తకమైతే

అందులో క్రొత్త నిబంధనలోని ఏసు చరిత్ర కేవలము 102 పేజీలు మాత్రమే గలదు. బైబిలు గ్రంథమును పది

భాగములుగ విభజిస్తే అందులో ఒక్క భాగము మాత్రము తొమ్మిది భాగములకంటే గొప్పదని చెప్పవచ్చును. ఏసుప్రభువు

విలువ తెలిసిన వారు, నిజ జ్ఞానమును ఈ ఒక్క భాగములోనే గ్రహింతురు.


ఎంతో గొప్ప జ్ఞానముగల మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలలోని ప్రభువు మాటలను కొన్నింటిని

వివరిస్తు మేము 'సువార్త మంజరి ' అను పుస్తకమును వ్రాయడము జరిగినది. ఎంతోమంది ఫాదర్లు, ఫాస్టర్లు,

బిషప్ లు ఎందరో ప్రభువు మాటలను గూర్చి చెప్పుచున్నారు కదా! మీరు వాక్యములకు వివరము వ్రాయడమేమిటని

కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలోను

నాలుగు సువార్తలు వదలి అపోస్తలుల భాగములోను ఎవరు ఏమి చెప్పిన వినవచ్చును. వాటిని అందరు సమర్థముగానే

బోధిస్తున్నారని చెప్పవచ్చును. కాని ప్రభువుచరిత్ర కల్గిన నాలుగు సువార్తలలోని మాటలు వివరించడములో కొంత


లోటు కలదనియే చెప్పవచ్చును. ఏ విధముగ హిందువులకు భగవద్గీతలోని రహస్యములు ఇంతవరకు అర్థముకాలేదని

చెప్పామో, ఆ విధముగనే ఏసుప్రభువు చరిత్రగల నాలుగు సువార్తలలోను క్రైస్తవులకు అర్థముకాని రహస్యములు

ఎన్నో మిగిలి ఉన్నాయనే చెప్పవచ్చును. ఈ మామాటను బోధకుల మీద అసూయతో చెప్పడము లేదు. కాని ప్రభువు

మీద విశ్వాసముతో చెప్పుచున్నాము. ప్రభువు ప్రజలకు దగ్గరగ అర్థము కావాలని, ప్రభువు ఎంత గొప్పవాడో, ఆయన

శక్తి ఏమిటో తెలియాలని మేము యదార్థమును వివరించడము జరిగినది.


ప్రభువు పేరున్న మా పుస్తకములను చూచి హిందువులేమో ఇవి క్రైస్తవ పుస్తకములు వాటిని చదవకూడదని

అనుకొంటున్నారు. మరి క్రైస్తవులేమో హిందువుల గురువు వ్రాసినవి వాటిని చదవకూడదు. మన క్రైస్తవులు వ్రాసినవే

చదవాలని అనుకొంటున్నారు. క్రైస్తవ పుస్తకములను వ్రాసిన వాడు హిందువే కాదని హిందువులు మమ్ములను

అసహ్యించుకొనుచుండగ, హిందూమతములోనికి మార్చడానికి ఈ పుస్తకములు వ్రాశారు. వాటిని చదవద్దండని

కొందరు క్రైస్తవులు ఇతర క్రైస్తవులకు చెప్పుకొనుచున్నారు. క్రైస్తవులను హిందువులుగ మార్చుచున్నాడని క్రైస్తవులు,

హిందువులను క్రైస్తవులుగ మార్చుతున్నారని హిందువులు మమ్ములననుచున్నారు. వాస్తవముగ ఎవరిని ఎవరుగ మేము

మార్చలేదుగాని అసలైన దేవున్ని తెలుసుకోమని మాత్రము చెప్పుచున్నాము. దేవున్ని గురించి చెప్పే హక్కు దేవుని

సంతతైన ప్రతి మనిషికి గలదు. కనుక ఎవరు ఏమనిన మేము ఓర్పుగ దేవుని విషయములను తెలుపుచూనే పోవుచున్నాము.


నన్నుచూచి అసూయపడువారందరికి నేనొక ప్రశ్న వేయు చున్నాను. దేవుడు మనిషిగ భూమి మీదకు వచ్చాడు.

పోయాడు. పోయేటపుడు తిరిగి వస్తానని కూడ చెప్పాడు. ఒక్కమారే వచ్చాడు తిరిగి ఒక్కమారే వస్తాడని ఎవరైన

చెప్పగలరా? జ్ఞానముగల ఎవడు ఆ విధముగ చెప్పలేడు. దేవుడు నా అవసరము భూమి మీద ఉన్నపుడంతా

వస్తానన్నాడు. ధర్మములకు హాని కల్గినపుడు వస్తానన్నాడు. భగవద్గీతలో ఆ మాటే చెప్పాడు. బైబిలులో ఆ మాటనే

చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఏ రూపములోనైన భూమి మీదకు వచ్చి తన ధర్మములు తెలిపిపోవును. గీతలో వస్తానన్నట్లు

కృష్ణుడు కృష్ణునిగనే రావలెనని, వస్తాడని అనుకోవడము హిందువుల పొరపాటు. అలాగే బైబిలులో వస్తానని చెప్పాడు

కదా! అని ఏసు ఏసుగ రావాలని, అలాగే వస్తాడని అను కోవడము క్రైస్తవుల పొరపాటు. దేవుడు రావాలనుకొంటె

ఎప్పుడు ఎక్కడ ఏ రూపమను నియమము ఉండదు. ఆయనను ఎవరు గుర్తించలేనట్లు క్రొత్తరూపములతో వస్తాడు.

కాని పాత జ్ఞానమే బోధిస్తాడు. ఎందుకనగ కాలానుగుణముగ ధర్మములు మారునవి కావు. ధర్మములు ఎప్పటికి

మార్పు చెందనివి శాస్త్రబద్దమైనవి. కనుక ఎప్పుడు ఏ పేరుతో, ఏ రూపముతో, ఏ మతములో పుట్టిన ఒకే ధర్మములను

తెలుపుచుండును.


ఆయన వచ్చినపుడంత భూమి మీద ఒక మతమును ఎప్పుడు సృష్టించలేదు. మతమును గురించి బోధించనులేదు.

దేవుడు ఏ ఒక్క మతమునకు సంబంధించినవాడు కాడు. ఆయన ధర్మములనే ఆయన తెల్పాడు కాని ఏ మతమును

గురించి తెల్పలేదు. మానవులు సృష్టించు కొన్నవే మతములు. దేవునిదంతయు మతములకతీతమైన బోధగ ఉండును.

మతములలో పొరపాట్లు చేయువారిని చూచి, వారి పొరపాట్లను వేలెత్తి చూపించి, నీవు ఏ మతస్థుడవైన దేవుని

మార్గము ఇది, దానిని సక్రమముగ ఆచరింపుమనే దేవుడు తెలియజేస్తాడు. కాని ఏ ఒక్క మతమును ఆయన

సమర్థించలేదు. మనుషులు తెలుసుకొన్న జ్ఞానమును బట్టి, మాట్లాడుకొను బాషను బట్టి, నడచుకొను పద్దతిని బట్టి

మతములు ఏర్పరుచుకొన్నారే గాని ధర్మముల వలన మతములు ఏర్పడలేదు.


ప్రతి మతమునకు ఒక పద్దతి, ఒక నియమిత దేవుని ఆరాధన ఉండును. ఆయా మతములలో ఉన్నవారు ఆ

విధముగనే ఆచరించుట పరిపాటిగ ఉన్నది. ఇవన్నియు మనుషుల ఆరాధన క్రమములు కాగా దేవుడు మనిషిగ

వచ్చినపుడు ఆయనకు మతముల అలవాట్లు ఆచారములు ఉండవు. అలాగే ఆయన మరొక దేవున్ని ఆరాధించడము

కూడ ఉండదు. మతములు, మతముల ఆచారములు, మనుషులకే గాని దేవునికి కావు. మనుషులయందు భక్తిలోగల

లొసుగులను తెలిపి సక్రమ మార్గమున నడిపించుట దేవుని కర్తవ్యము. అందువలన ఆయన మానవునిగ వచ్చినపుడు

దేవుని గూర్చి దేవుని ధర్మముల గూర్చియే చెప్పును. అలాకాక అందరి మనుషులవలె మరొక దేవుని పూజలయందుగాని

ఆరాధనల యందుగాని మునిగిపోడు.


ద్వాపరయుగములో దేవుడు కృష్ణునిగ వచ్చినపుడు ఆయన ఎవరిని పూజించలేదు. సమయమొచ్చినపుడు

పరమాత్మ జ్ఞానము సంపూర్ణముగ తెలిపాడు. అలాగే కలియుగములో ఏసుప్రభువుగ వచ్చినపుడు ఆయన కూడ

ఎవరిని పూజిస్తు కూర్చోలేదు. ఆయన బోధించవలసినది మానవులకు తెలిపిపోయాడు. ఒక్క జ్ఞానము తెలుపడములోనే

ఆయన యొక్క గొప్పతనము ఆయనలోని దైవత్వము తెలియును. మిగత సమయములలో అందరితో సమానమైన

మనిషిగనే కనిపిస్తుండును. జ్ఞానము తెలియనివారు ఆయనను మనిషిగ లెక్కించుకొందురు. జ్ఞానమున్నవారు

ఆయనను దేవునిగ గుర్తింతురు. సంపూర్ణ జ్ఞానమున్న వారు ఆయన భూమి మీదకు ఎపుడు వచ్చిన గుర్తించగలరు.

మాయ ప్రభావమున్న వారు ఆయనను ఏ పరిస్థితిలోను గుర్తించలేరు. అంతేకాక సాటి మానవునిగ తలచి ఆయనను

కూడ అవమానము పాలు చేయుదురు, కష్టపెట్టుదురు.


దేవుడు మనిషి రూపములో కొన్ని వేల సంవత్సరములకొక మారు భూమి మీదకు వస్తే సర్పసంతానమైన

మనుషులు ఆయనను గుర్తించలేరు. గుర్తించలేక పోయిన పరవాలేదు కాని ఆయననే హింసించుటకు మొదలు

పెట్టుదురు. గుర్తించలేనంతమాత్రమున ఎందుకు హింసిస్తారని కొందరికి ప్రశ్నరావచ్చును. తోటి మానవులను ఎవరు

హింసించలేదే అని అడుగవచ్చును. దానికి సమాధానమేమనగా! దేవుడు మనిషిగ వస్తే సాటి మనిషిగ ఆయన

జీవించడు. ఆయన జ్ఞానము తెల్పుటకు వచ్చాడు కావున దైవజ్ఞానమును ధర్మసహితముగ తెల్పును. అటువంటపుడు

అధర్మపరులైన అజ్ఞానులకు, మాయజ్ఞానము గలవారికి ఆయన మీద ద్వేషమేర్పడును. ఆ ద్వేషమే మనుషుల చేత

ఆయనను హింసించునట్లు చేయుచున్నది. ఏమి చెప్పకపోతే ఏ విరోధముండదు. మనుషులలోని అధర్మములను

వేలెత్తి చూపడము వలన తాము ధర్మపరుల మనుకొను అధర్మపరులందరికి కోపమే వచ్చును. కావున ఆయన వచ్చిన

ప్రతి జన్మలోను మానవులచేత అగౌరవ పరచబడినాడు. "అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్” మనిషిగ

శరీరము ధరించిన నన్ను మూఢజనులు అవమానింతురు అని గీతలో కూడ చెప్పాడు. అ విధముగానే ఏసు జన్మలో

ఆయన బోధించు జ్ఞానమును చూచి ఓర్వలేని వారు ఈయన మాకంటే గొప్పవాడా అని చివరకు మరణశిక్షయే

విధించారు. జ్ఞానుల మనుకొను మతాచారులు వలన కదా ఆయన చనిపోయినది. సర్ప సంతానము అజ్ఞానమనే

విషము కల్గియుంటుంది. కాబట్టి ప్రభువు జన్మ సర్పసంతానము చేతిలోనే అంత్యమైనది.


దేవుని విషయము దేవునికే తెలుసును, మనుషులకు ఏమాత్రము తెలియదు. దేవుడు తెలిపితేనే మనిషికి

దేవుని ధర్మములు తెలియ బడుతాయి. ఏ మనిషి స్వయముగ దేవుని విషయములను తెలియలేడు. కావున విశ్వమంత

అణువణువున వ్యాపించిన దైవమునుండి కొంత భాగము లేక కొంత సాంద్రత వచ్చి మనిషిగ పుట్టుచున్నది. ప్రపంచములో

కొంత కాలము బ్రతుకుటకు ఒక విధానము కావాలి. దానినే కర్మ అంటున్నాము. మనిషి పుట్టుకకు కారణమైన


దానినే కర్మ అంటున్నాము. దేవునికి కర్మయుండదు. కావున దేవుడే ఒక జన్మకు కావలసిన కర్మను సృష్టించుకొని

పుట్టుచున్నాడు. అటువంటి వానినే స్వయంభు అంటున్నాము. స్వయంభు అనగ కర్మచేత కాక తనకు తానుగ పుట్టిన

వాడని అర్థము. ఆ విధముగ పుట్టిన వానినే భగవంతుడని ఆధ్యాత్మిక బాషలో అంటున్నాము. ఎన్నో మార్లు దేవుడు

భగవంతునిగ భూమి మీదకు వచ్చిపోయి ఉండవచ్చును. భూమి మీద ధర్మముల పునరుద్ధరణ ఎన్ని మార్లు జరిగినదో

తెలియదు. పూర్వము లక్షల సంవత్సరముల ముందు మనకు తెలియని రహస్యములు ఎన్నో గడచి పోయినవి. కొన్ని

వేల సంవత్సరముల నుండి మాత్రమే చరిత్రలు వ్రాయబడి ఉన్నాయి. అందువలన కొన్ని గత విషయములు, కొందరి

చరిత్రలు తెలుసు కొనగల్గుచున్నాము. చరిత్రను పరికించి చూస్తే దేవుడు మనిషిగ భూమి మీదకు వచ్చిన సందర్భములు

కనిపిస్తున్నవి.


దేవుడు భూగోళము మీద అప్పుడప్పుడు మనిషిగ ఉదయిస్తున్నాడని, మనిషిగనే అస్తమిస్తున్నాడని తెలియుచున్నది.

మనకున్న జ్ఞానముతో లోతుగ యోచించి చూచితే ఐదువేల సంవత్సరముల పూర్వము భారత దేశములోను, రెండువేల

సంవత్సరముల పూర్వము ఇజ్రాయిల్ దేశములోను పుట్టినట్లు తెలియుచున్నది. ఆనాటి ఇజ్రయేలు దేశములో దైవము

ఏసుప్రభువుగ పుట్టినది, ముందే తాను నిర్ణయించుకొన్న కర్మప్రకారము కేవలము ముప్పై మూడు సంవత్సరములు

భూమి మీద ఉండి, మనుషుల మధ్య సంచరించి దైవాంశ వెళ్లి పోయినది. ముప్పై మూడు సంవత్సరములలో ముప్పై

సంవత్సరములు సాధారణ జీవాత్మగ జీవించిన ప్రభువు, తర్వాత మూడు సంవత్సరములు అపుడపుడు ఆత్మగ జీవిస్తు

ఆత్మజ్ఞానమును బోధించాడు.


ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! దైవము భూమి మీద మనిషిగ పుట్టిందంటున్నారు.

దైవము (దేవుడు) విశ్వమంత అణువణువున వ్యాపించి ఉన్నాడని అంటున్నారు. మనిషిగ పుట్టినపుడు విశ్వమంత

లేకుండ పోవుచున్నాడా అన్నది ప్రశ్న. అంతేకాక అందరిలోను కూడ ఉన్నాడన్న దేవుడు భూమి మీద భగవంతునిగ

పుట్టిన తర్వాత అందరిలో లేకుండా పోతాడా అన్నది కూడ ప్రశ్నే. వీటికి జవాబును చూస్తాము. సముద్రములో నీరు

అఖండముగ ఉన్నది. అదే నీటిని ఒక చెంబులోనికో లేక ఒక పాత్రలోనికో తీసుకున్నామనుకొండి. తీసుకొన్న

పాత్రలో నీరుంది. అంతమాత్రమున సముద్రములో నీరు లేకుండ పోలేదు కదా! పాత్రలోని నీరును ఖండమైన నీరు

అంటున్నాము. సముద్రములోని నీరును అఖండమైన నీరు అంటున్నాము. పాత్రలోనివి నీరే సముద్రములోనివి నీరే.

నీటిలో ఖండింపబడినది, ఖండింపబడని దను తేడా తప్ప నీటిలోని ధర్మములలో ఏ తేడా లేదు. అలాగే దేవున్ని

సముద్రములాంటి వానిగ భావించుకొందాము. సముద్రము నుండి పాత్రలో నీరు వేరైనట్లు దేవునినుండి భగవంతుడు

వేరైనాడు. సముద్రములోని నీరు పాత్రలోని నీరు ఒక్కటే అయినట్లు దేవుడు భగంతుడు ఇద్దరు ఒక్కటే అగుదురు.

పాత్రలోనికి నీరు తీసుకొన్నంత మాత్రమున సముద్రములో మార్పురాదు. సముద్రములో నీరు లేకుండ పోదు. అలాగే

దేవునిలోని కొంత అంశ భగవంతునిగా పుట్టినపుడు దేవుడు మొదట ఎట్లు వ్యాపించి ఉన్నాడో అట్లే ఉండును. దేవుడు

భగవంతునిగ వచ్చినపుడు దేవునిలో గాని, దేవుని ధర్మములలో గాని, దేవుని వ్యాపకములో గాని ఎటువంటి మార్పు

ఉండదని తెలియవలెను. దేవుని అంశ భగవంతుడౌతున్నది గాని దేవుడంతయు భగవంతుడు కాలేదు కదా!. అంశ

అనగ కొంత భాగమే అనిగాని దేవుడంతయు కాదు. కొంత భాగమైన అంత అయిన ఒకే ధర్మము కల్గియున్నది.

కావున దేవుని అంశ భూమి మీద పుట్టినపుడు దేవుడే పుట్టాడనుటలో తప్పులేదు. అందువలన ఏసును దేవుడు

అనడములో తప్పులేదు.


ఇక్కడ మరికొందరికి మరొక ప్రశ్న రావచ్చును. అదేమనగా! ఏసుప్రభువు దేవుడని మీరన్నట్లు దేవుడైతే

మనుషులు బాధించినపుడు ఎందుకు బాధపడ్డాడు? మనుషుల చేత ఎందుకు హింసింపబడ్డాడు? మనుషుల చేత

ఎందుకు అవమానించబడాలి? మనుషులు తన ఎడల చెడుగా ప్రవర్తించినపుడు తానెవరో తెలిపి, తన మహత్యముచేత

వారిని శిక్షింపవచ్చును కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధాన మేమనగా! ఈ విషయము అర్థము

కావాలంటే ముందు మనమొక దేవ రహస్యము తెలుసుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి శరీరములో మూడు ఆత్మలు

గలవు. ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. ఈ మూడు ఆత్మలలో జీవాత్మ ఆత్మ రెండు శరీరములోపల

నివశిస్తున్నవి. శరీరము బయట ఏమాత్రము లేవు. మూడవదైన పరమాత్మ శరీరము లోపల మరియు శరీరము

బయట అంతట అణువణువున వ్యాపించికలదు. పరమాత్మ శరీరము బయటగాని శరీరము లోపలగాని ఎటువంటి

పని చేయకుండ ఊరక ఉన్నది. రెండవదైన ఆత్మ శరీరములో జరుగు కార్యములన్నిటిని చేయుచున్నది. మొదటిదైన

జీవాత్మ ఏ పని చేయక కేవలము సుఖము దుఃఖము అను రెండు అనుభూతులను మాత్రము అనుభవిస్తున్నది.

చాలామంది జీవాత్మలమైన మనమే అన్ని చేస్తున్నాము అనుకుంటున్నారు. అలా ఏ శరీరములోను జరగడము లేదు.

మనకు తెలియకుండ మన శరీరములో మనతో పాటు ఉన్న ఆత్మయే అన్ని పనులు చేయుచున్నది. ఆత్మ కూడ తన

ఇష్టానుసారముగ పనిచేయడము లేదు. కర్మ అను ఒక లెక్కాచారము ప్రకారము చేయుచున్నది. పనులకు కారణము

కర్మ అను ఒక విధానము కలదు. కర్మ అను దాని ప్రకారము జీవుడు సుఖము దుఃఖము అను అనుభూతులను

అనుభవించవలెను. జీవుడు లోపల సుఖదుఃఖములను అనుభవించాలంటే బయట ఆత్మ పనిచేయుచున్నది. అంతేకాక

శరీరములోపల ఆహారమును జీర్ణము చేయుట, గుండెను కదలించుట, రక్తమునుండి మూత్రమును చెమటను వేరు

చేయుట మొదలగు శరీరాంతర్గత కార్యములన్ని చేయుచున్నది. ఆత్మ అన్ని కార్యములు చేయుట వలన జీవాత్మ

శరీరములో మనగలుగుచున్నది. శరీరములోపల గల జీవాత్మకు ఏ పని లేక కేవలము అనుభవములను మాత్రము

అనుభవిస్తున్నది. ఇదంతయు ప్రతి మనిషి శరీరములో ఎప్పటికి మార్పుచెందక శాసనబద్ధమైన విధానముగ ఉన్నది.


దేవుడు మనిషిగ పుట్టినప్పటికి ఆ మనిషి శరీరములో కూడ అందరియందున్న విధానమే జరుగుచుండును.

మిగత శరీరములలో మాదిరి ఆ శరీరములో పరమాత్మ ఉండవలసినదే, ఆత్మ అన్ని పనులు చేయవలసినదే, జీవాత్మ

అనుభవించవలసినదే. దేవుడు మనిషిగ వచ్చినప్పటికి లోపల జరిగే విధానమదే. దేవుడు ఏసుగ వచ్చినప్పుడు

జరిగినదంతే. సాధారణ మనిషికి ఆయనకు శరీరయంత్రాంగములో ఎటువంటి తేడాలేదు. అందువలన ఆయన

అన్ని బాధలను సుఖములను జీవునిగానే అనుభవించాడు. ఏసుప్రభువుకు చేతిలో ములుకులు కొట్టినపుడు గాని,

ఆయనను కొరడాలతో కొట్టినపుడు గాని ఆ బాధలన్నిటిని అనుభవించవలసివచ్చినది. ఆ పనులు జరుగుటకు ఆ

విధముగ అనుభవించుటకు తగిన కర్మను ఆయనే సృష్టించుకొని భూమి మీదకు ఒక మనిషిగ వచ్చాడు. ఇది ఆయన

సాధారణ జీవితమైనపుడు ఆయనకు మనకు ఏమిటి తేడా అని అడిగితే ఒకే ఒక తేడా గలదు. అదేమనగా!

శరీరములో పనిచేయునది ఒకే ఒక ఆత్మ అని తెలుసు కొన్నాము కదా! మనిషిగ వచ్చిన భగవంతుని శరీరములో కూడ

అట్లేయుండునని అనుకున్నాము. కాని కొన్ని సందర్భములలో మాత్రము ఒక విచిత్రమైన తేడా గలదు. భగవంతుని

శరీరములో కొన్ని సమయము లందు సాధారణ శరీరములో ఉన్నట్లు మూడు ఆత్మలు తమతమ పనిచేయక వేరు

విధానముగ మారిపోవును. జీవాత్మ తటస్థముగ ఏ అనుభవములు అనుభవించుస్థితిలో లేకుండ నిలచిపోయి జీవాత్మ

స్థితిలో ఆత్మ నిలచి పోవును. అపుడు ఆత్మగ మాట్లాడిన మాటలు పూర్తి ఆధ్యాత్మికముగ ఉండును. అసలైన ఆధ్యాత్మిక


విషయములు దేవుని ధర్మములు ఆత్మ స్వయముగ చెప్పినప్పుడే తెలియును. కొన్ని సందర్భములలో భగవంతుని

శరీరమందు ఆత్మ స్వయముగ జ్ఞానమును పలుకును. అంతేకాక బహు అరుదుగ శరీరములో ఆత్మ జీవాత్మలు

తటస్థముగ నిలచిపోగా పరమాత్మే పలుకుట కూడ గలదు. భగవంతుని జీవితములో ఒకటి లేక రెండుమార్లు అటువంటి

సందర్భములు జరుగవచ్చును. ఏసుప్రభువు జీవితములో, కృష్ణుని జీవితములో ఆ విధముగ పరమాత్మే మాట్లాడిన

సందర్భములు గలవు. పరమాత్మ పలుకునపుడు ఆ పలుకుకు ప్రకృతియంత లోబడియుండును. అలాగే ఆత్మ

పలుకునపుడు అసలైన జ్ఞానమంత ఆయనకు లోబడియుండును. 1) అందువలన వీరి జీవితములో ప్రకృతినే శాశించిన

పరమాత్మ పలుకులు గలవు. 2) ఆత్మజ్ఞానమును నిగ్గు తేల్చిచెప్పిన ఆత్మమాటలు గలవు. 3) సుఖదుఃఖములను

అనుభవించిన జీవాత్మ అనుభవములు గలవు. ప్రభువు జీవితములో తుఫానుతో చెలరేగిన సముద్రమును

అనిగిపొమ్మన్నపుడు, తాత్కాలికముగ చనిపోయిన లాజర్ను బ్రతికించి నపుడు స్వయముగ పరమాత్మే పలికినాడని

తెలియుచున్నది. ఆ మాటలన నుసరించి ప్రకృతి కూడ నడుచుకొన్నట్లు తెలియుచున్నది. ఆయన ఆత్మగ స్వచ్ఛమైన

జ్ఞానమును తెలిపినట్లుగలదు. అదేవిధముగ జీవాత్మగ అనేక సుఖ దుఃఖములు అనుభవించినట్లు గలదు. ఈ

విధముగనే శ్రీకృష్ణుని జీవితములో కూడ జరిగినది. తాత్కాలికముగ చనిపోయిన సాందీపుని కొడుకును భగవంతుడు

బ్రతికించాడు, విశ్వరూపము చూపి తాను పరమాత్మనని తెలిపిన సందర్భము కూడ కలదు. ఆత్మగ సంపూర్ణ జ్ఞానమైన

గీతనే బోధించాడు. మిగత సమయములలో జీవాత్మగ అన్ని అనుభవములను అనుభవించాడు. కేవలము ఒక్క

భగవంతుని శరీరములో మాత్రమే కొన్ని సమయములలో మూడు ఆత్మల ఆట సాగుచున్నది. దైవము శరీరము

ధరించడము బహు అరుదుగా వేల సంవత్సరములకో లక్షల సంవత్సరములకో జరుగుచున్నది. దేవుడు భూమి మీద

శరీరము ధరించి పుట్టినపుడు ఎక్కువ కాలము జీవాత్మవలె అందరిమాదిరిగ ఉండి, అవసరమొచ్చినపుడు ఏదో

కొంత సమయములో మాత్రము సంవత్సరములో కొన్ని మార్లు ఆత్మగ మాట్లాడును. పరమాత్మగ జీవితములో ఒకటి

లేక రెండు లేక మూడుసార్లు బహు అరుదుగ మాట్లాడవచ్చును లేక మాట్లాడకపోవచ్చును. తాను ధర్మములను

తెలుపుటకు వచ్చాడు కనుక ఆత్మగ తప్పక మాట్లాడును. ఇది దేవుని విధానమైతే మాయవిధానము మరొకలాగ

ఉన్నది.


దేవుడు సాధారణ మనిషిగ ఉన్నంతవరకు మాయకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఆత్మగ జ్ఞానము చెప్పినపుడే

మాయకు వ్యతిరేఖత కల్గుచున్నది. దేవుని జ్ఞానమంతయు మాయకు వ్యతిరేఖమైనదే కావున మాయ (సాతాన్) మనుషులను

తనవైపు నుండి దేవుని జ్ఞానము వైపు పోకుండ చూసుకోవడములో బహుజాగ్రత్తగ ఉంటుంది. అంతేకాక దేవుని

జ్ఞానము మీద శ్రద్దకల్గి కొంత జ్ఞానమును తెలుసుకొనిన వారిని గుర్తించుకొని తనవైపుకు లాగుకొనుటకు

ప్రయత్నించుచుండును. అందు వలన మాయప్రభావముతో అసలైన ఆత్మజ్ఞానము మీద ఆసక్తికల వారు చాలాతక్కువ

అని చెప్పవచ్చును. ఒక వేళ ఎవరైన కొంత తెలుసుకొన్న వారుండినప్పటికీ వారు ఆ మార్గమునుండి తప్పిపోవడము

జరుగుచున్నది. ఇక్కడొక ప్రశ్న కొందరికి రావచ్చును. అదేమనగా! నేడు ఎందరో భక్తిగలవారున్నారు కదా! ఎందరినో

గురువులుగ ఆశ్రయించి వారివద్ద నుండి జ్ఞానము తెలుసుకొనుచున్నారు కదా! ఎంతో మంది దేవతలకు శ్రద్దగ

పూజలు చేయుచున్నారు కదా! కొద్దిపాటి నాస్తికులు తప్ప దేవుని మీద భక్తిలేని వారున్నారా! మీరు చెప్పినట్లు ఏమిలేదే!

సాయి భక్తులనుగాని, అయ్యప్పస్వామి భక్తులనుగాని ఎవరైన మార్చగలరా! దేశములో ఉన్న పాత దేవుల్ల గుడులేకాక

శిరిడిసాయి గుడులు, అయ్యప్పస్వామి గుడులు విపరీతముగ తయారగుచున్నాయి కదా! అక్కడ మాయ ఎవరిని

ఆటంకపరచలేదే! మీ మాట మేము ఎలా నమ్మాలి అని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా!


మాయ దేవుని మార్గమునకు, దైవజ్ఞానమునకు పూర్తి వ్యతిరేఖ మైనది. ఎంతో గొప్పదైన దేవుని జ్ఞానమునే

వ్యతిరేఖించునది మాయ. కావున మాయ కూడ చాలా గొప్పదై ఉంటుందని తెలియుచున్నది. అందువలననే భగవద్గీతలో

"మమ మాయా దురత్యయా” అన్నారు. “నా మాయను జయించుట దుస్సాధ్యమైన పని” అని ఒకచోట దేవుడే అన్నాడంటే

ఊహకు అందనిరీతిలో మానవున్ని మాయ మోసము చేయునని తెలియుచున్నది. ఇంతవరకు ఇది మాయపని అనిగాని,

మాయపని ఇట్లుంటుందని కాని ఎవరు తెలుసుకోలేక పోయారు. అందువలన మాయ దేవునిమార్గములో అందరిని

మోసము చేయుచున్నది. దేవుని జ్ఞానమువలె తన జ్ఞానమును తయారుచేసినది. దేవుడు భగవంతునిగ వేల

సంవత్సరములకు ఒకమారు అరుదుగ భూమి మీదకు వస్తే, ఆయనను ఎవరు గుర్తుపట్టనట్లు తన ప్రతిరూపములను

భగవంతులుగ ఎందరినో భూమి మీదకు తెచ్చినది. మాయ ప్రవేశపెట్టిన ఎన్నో జ్ఞానములలో ఏది నిజ దైవజ్ఞానమో

ఎవరికి అర్థముకాక అన్ని జ్ఞానములు దేవునివే అని చాలామంది పొరపడుచున్నారు. అలాగే మాయతో కూడుకొన్న

భగవంతులు ఎందరో భూమి మీద ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చు భగవంతున్ని ప్రత్యేకముగ ఎవరు గుర్తిస్తారు.

ఎన్నో మహత్యములు చూపించు భగవంతులుంటే జీవితములో ఏదో ఒకటో రెండో మహత్యములను చూపువానిని

ఎవరు గుర్తిస్తారు. ఎందరో భగవంతులలో అసలైన ఒక్క భగవంతున్ని ఎవరు గుర్తించగలరు. ఈ విధముగ దేవుని

జ్ఞానమును గాని, భగవంతున్ని గాని గుర్తించుట దుస్సాధ్యమైన పనిగ ఉన్నది. ఇంతవరకు ఎవరు చూడనిది, తర్వాత

కూడ ఎవరు తెలుసుకో లేనిది అని తన నిజస్థితిని విశ్వరూపముగ చూపితే, ఆ విధముగ కూడ గుర్తించనట్లు

చాలామంది దేవతలు విశ్వరూపము చూపినట్లు, చివరకు సాయిబాబాను, వీరబ్రహ్మముగారు కూడ రెండు మూడు

మార్లు విశ్వరూపము చూపినట్లు వ్రాయబడి ఉన్నది. ఇంతమంది చూపిన ఇన్ని విశ్వరూపములలో భగవద్గీతలో

కృష్ణుడు చూపిన విశ్వరూపమే గొప్పదని ఎవరనుకుంటారు. అందువలన క్రైస్తవులలో కృష్ణున్ని, హిందువులలో ప్రభువుని

భగవంతునిగ గుర్తించలేక పోయారు. ఒక వేళ హిందువులలో కృష్ణున్ని ఎవరైన అసలైన దేవునిగ గుర్తించారా అంటే

అదియు లేదు. మిగత అంతమంది దేవులలో కృష్ణున్ని చివరివానిగ కొంతమంది పెట్టుకొంటే, ఆయనవన్ని అల్లరి

పనులే ఆయనెట్లు దేవుడవుతాడని చాలామంది చిన్న దేవునిగా కూడ గుర్తించలేదు. సాయిబాబా ముందర కృష్ణుడొక

దేవునిగ కూడ ఎవరు లెక్కించడము లేదు. ఇక క్రైస్తవులలోనికి పోయి ప్రభువును వారు ఏ విధముగ భావిస్తున్నారని

చూచిన ఆయనను దైవకుమారునిగ కొందరు లెక్కించి నప్పటికి ఆయన వాక్యముల సారాంశము వారికి అర్థము

కాలేదనియే చెప్పవచ్చును. మాయ ప్రభావము వలన ఆయనను వదలి, ఆయన చనిపోయిన శిలువను మ్రొక్కుచున్నారు.

ప్రభువు ఆకారమును పెట్టుకుంటే హిందువులవలె లెక్కించబడుతామని శిలువ బొమ్మను పెట్టుకొన్నారు. నన్ను చూచినవాడు

నా తండ్రిని చూచినట్లేనని ప్రభువు చెప్పగ కనీసము ఆయన ఆకారమునైన చూడక ఆయన మరణమునకు కారణమైన

శిలువను చూడడము మాయపని కాదా! ఈ విధముగ చెప్పుచుపోతే దేవుని మార్గములో ఉన్నామనుకొనునట్లు చేసిన

మాయ (సాతాన్) దేవుని మార్గమునకు ఎంతో దూరముగ మనిషిని పంపుచున్నది. తెలిసినవాడు చెప్పినప్పటికి వానినే

తక్కువవానిగ లెక్కింపజేసి వానిమాటను విననట్లు చేయుచున్నది. మాయ మతములను కల్పించి దేవుడే వేరు వేరన్నట్లు

చేసినది. విశ్వమునకు అధిపతి ఒక్కడే అయిన మతములను చూపి మతమునకొక దేవుడని మనుషులకు తెలియునట్లు

మాయ చేసినది. ఆ మాయ ప్రభావము మనుషులలో ఎంతో ఇమిడి ఉన్నది. కావున ఎందరో దేవుల్లు ఎన్నో మతములు

తయారైనవి. క్రైస్తవమతము ఒక్కటే అయినప్పటికి అందులో మేరిమాత భక్తులు కొందరు, ప్రభువు భక్తులు కొందరు

గలరు. అలాగే హిందుమతమొక్కటే అయినప్పటికి దేవుల్లు అనేకముగ ఉన్నారు. ఇన్ని మతములలో, ఇన్ని దేవుల్లలో

ఎవరు అందరికి అధిపతియో ఇప్పటికైన తెలుసుకొనుటకు ప్రయత్నించమని తెలుపుచున్నాము. అట్లు తెలుసుకొనుట


అంత సులభముగ లేదు. ముందు మాయను గురించి దాని ఉనికిని గురించి తెలుసుకోగల్గితే తర్వాత దేవుని మార్గమును

గురించి తెలుసుకోగలరు. అందువలన ఇపుడు మీరున్న మార్గము దేవునిమార్గమో మాయమార్గమో ఒక్కమారు వెనుదిరిగి

చూచుకోండి.


ఒక మారు మనమేమార్గములో ఉన్నామో చూచుకుంటే నేను దేవుని మార్గములోనే ఉన్నానని అందరికి

అనిపిస్తుంది. నాస్తికులకు తప్ప మిగతవారందరికి మేము దేవుని మార్గములో ఉన్నామని అనిపించడము సహజమే.

ఎందుకనగా మాయమార్గము ఏదో, దాని స్వభావమేమిటో ఎవరికి తెలియదు. కావున మాయమార్గములో ఉన్నవారు

కూడ మేము సక్రమముగ దేవుని మార్గములోనే ఉన్నామను కొందురు. ఈ విధముగ అనుకోవడము అన్ని మతములలో

కలదు. ఈ మతములో ఎక్కువని, ఆ మతములో తక్కువని ఏమిలేకుండ మను అన్ని మతములలోను

మాయ మానవుని మభ్యపెట్టి పక్కమార్గములోనే పంపుచున్నది. మాయ ప్రభావము వలన ఒక్క శాతము జ్ఞానమున్న

వారు కూడ నూరు శాతము జ్ఞానము కలవానిని చూచి నాకంటే తక్కువ జ్ఞానము కలవాడని అనుకొనుచుందురు.

ఎక్కువ జ్ఞానము తెలిసినవాడు తనకంటే తక్కువ జ్ఞానిని తక్కువవాడని అనుకోవడములో తప్పులేదు. కాని తక్కువ

జ్ఞానము తెలిసినవాడు తనకంటే ఎక్కువ జ్ఞానము తెలిసిన వానిని తక్కువవాడని అనుకోవడము చాలా తప్పు. ఇలా

తప్పు ఒప్పులను ఎవరు గ్రహించుకోకుండ ఎవరంతకు వారు మేము గొప్పవారమనుకొనుట సహజముగ అనాదినుండి

జరుగుచునే వస్తున్నది. అందువలన ద్వాపరయుగములో సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణున్ని హేళనగ మాట్లాడినవారున్నారు.

అలాగే కలియుగములో సంపూర్ణ జ్ఞానముగల ఏసుప్రభువును తమకంటే జ్ఞానహీనునిగ మాట్లాడి ఇబ్బందుల పాలు

చేసినవారు గలరు.


ప్రపంచములోని అనేక విషయములలో ఒక కొలమానమంటు కలదు. ఒక పదార్థము యొక్క పరిమాణమును

కొలుచుటకు గాని, దాని సాంద్రతకొలుచుటకు గాని తూనిక పరికరములు గలవు. ఉదాహరణకు ద్రవపదార్థమైన

పాలను తీసుకొంటే దానిని కొలుచుటకు లీటరు కొలత గలదు. అలాగే పాల చిక్కదనమును (సాంద్రతను కొలచుటకు

డిగ్రీమీటరు గలదు. అలాగే దాన్యమును తీసుకుంటే కిలోగ్రాము తూకముతో తూచవచ్చును. ఇవన్నియు కనిపించు

ప్రపంచము లోని కనిపించు పదార్థముల యొక్క విధానము కాగ, కనిపించని దేవునికి సంబంధించిన కనిపించని

జ్ఞానమును కొలుచుటకు కనిపించెడి ఏ పరికరము లేదు. కావున ఎవరంతకు వారు నాది గొప్ప జ్ఞానము అనుకోవడము

జరుగు చున్నది. ఉదాహరణకు సత్యశోధన సంఘమని పేరు పెట్టుకొన్నవారు కృష్ణునికంటెను, ఏసుప్రభువుకంటెను

తమజ్ఞానమే గొప్పదని చెప్పుకొనుచున్నారంటే మనుషులను మాయ ఎంతగా ప్రభావితము చేయుచున్నదో అర్థమగుచున్నది.

ఇటువంటి నేపద్యములో మనిషి తనకు తెలిసినదే గొప్పదను భావములో ఉన్నపుడు, స్వయముగ దేవుడేవచ్చి ఇది

సరియైన మార్గమని చెప్పినప్పటికి నీకు తెలియదు మాకే తెలుసుననువారు కలరు. దేవుని మార్గమని భ్రమించి మాయ

మార్గములో ఉన్నవారు ఎవరు చెప్పిన, చివరకు దేవుడు చెప్పిన వినేస్థితిలో ఉండరు. అందువలన మేము ముందే

చెప్పాము, తాను ఏ మార్గములో ఉన్నానని, తనంతకు తాను వెనుదిరిగి చూచుకొని ఆలోచించుకొంటేగాని అర్థముగాదు.

మాయ మార్గమును వదలి దేవుని మార్గమును అన్వేషించుటకు ప్రతిమనిషి తనకు ఎంత తెలిసినప్పటికి నేను ఇంకా

తెలుసుకోవలసినది చాలా ఉందనుకోవాలి. అలా అనుకొన్నపుడు దేవుని జ్ఞానము ఇంకా అర్థమౌచూ పోవును. అలా

జరిగితే తాను పరిపూర్ణముగ తెలిసినవానిని కాదని తెలియవలసినది ఎంతో ఉందని అర్థము కాగలదు. తాను

సంపూర్ణ జ్ఞానిని అను నిర్ణయానికి రాకుండ అసంపూర్ణ జ్ఞానినని, ఎంతో జ్ఞానము తెలుసుకోవలయునను ఉద్దేశములోనికి


వచ్చి, ఇక్కడ వ్రాసినది చదివితే వాస్తవ జ్ఞానము అర్థమై దేవుని మార్గము తెలియగలదు. అలాకాక నాకు తెలుసునని

అడ్డుగోడకట్టుకొన్నవారు ఆ గోడను దాటిరాలేరు తర్వాత ఏముందో తెలియలేరు. కావున ప్రపంచములో మనము ఏ

హోదాలో ఉన్నప్పటికి జ్ఞానములో ఏ స్థాయి పేరుకల్గినప్పటికి నీవు ఎవరో నీకు తెలియదు, అలాగే దేవుడెవరో

అంతకూ తెలియదు. కావున తెలుసుకోవలసినది ఎంతో కలదను భావముతో ఇక్కడ చెప్పిన విషయమును చూచెదము.


జ్ఞానము రెండు రకములుగ కలదు. ఒకటి ప్రపంచ జ్ఞానము రెండవది పరమాత్మ జ్ఞానము. ప్రపంచ

జ్ఞానము వేరు, పరమాత్మ జ్ఞానము వేరు. ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము రెండు నీరు నూనెలాంటివి. రెండు

ద్రవపదార్థములే అయినప్పటికి నీటి ధర్మములు వేరు, నూనె ధర్మములు వేరు. రెండు ఒకలాగ ఎప్పటికి ఉండవు.

అలాగే జ్ఞానము అనుపదము ఒకటే అయినప్పటికి ప్రపంచ జ్ఞానము యొక్క ధర్మములు, పరమాత్మ జ్ఞానము యొక్క

ధర్మములు వేరు వేరుగ ఉన్నాయి. ప్రపంచ జ్ఞానములో గొప్పవారైనప్పటికి పరమాత్మ జ్ఞానములో ఎందరో అనామికులు

గలరు. ప్రపంచ జ్ఞానములో ఎంతో విజ్ఞానమును సంపాందించినవారు కూడ పరమాత్మ విషయములో చిన్న విషయమును

కూడ అవగాహన చేసుకోలేకున్నారు. ప్రపంచ ఇంజనీర్లు, సైంటిస్టులు దేవుని విషయములో ఒక సిద్ధాంతపరముగ

కాకుండ గ్రుడ్డిగ మాట్లాడు చున్నారు. ఈ విధముగ ప్రపంచ జ్ఞానము తెలిసినవారు మాట్లాడు చుండగ, కొంత

పరమాత్మ జ్ఞానము తెలిసినవారు మాకు సర్వము తెలియుననుచున్నారు. ఇటువంటి పరిస్థితిలో అసలైన పరమాత్మ

జ్ఞానము సంపూర్ణముగ బయటికి తెలియకుండ పోవుచున్నది. పరమాత్మ జ్ఞానము కొంత తెలిసినంతనే అంత తెలియునను

వారి మద్యను, అలాగే ప్రపంచ జ్ఞానము ఎంతో తెలుసుకొన్న మాకు దైవజ్ఞానమంటే ఏమిటో తెలియదా అనువారి

మద్యను భగవద్గీతగాని, బైబిలుగాని సంపూర్ణముగ అవగాహన కాలేదనియే చెప్పవచ్చును. ఇటువంటి సందర్భములో

భగవద్గీతకు వక్రభాష్యము చెప్పుకోవడము జరిగినది. సంస్కృత పదములకు అర్థము తెలిసినంత మాత్రముననే,

సంస్కృత భాషవచ్చినంతమాత్రముననే భగవద్గీతకు భావము వ్రాసి దైవజ్ఞానమింతేనని కొందరనుకొన్నారు. కాని

చెప్పబడినదంతా దైవజ్ఞానమేనా! ఇందులో సూత్రబద్దత శాస్త్రబద్దత ఉందాలేదా అని చూడలేదు. ఎంతో గొప్ప

దైవజ్ఞానముతో కూడియున్న బైబిలును కూడ బోధకులు అలాగే వివరించి చెప్పుకోవడము జరుగు చున్నది. దైవాంశ

సంభూతుడైన ఏసుప్రభువు అందించిన జ్ఞానము ఎంతో సూత్రబద్ధమైనది శాస్త్రబద్దమైనది కాగ, బైబిలులోని కొన్ని

విషయములలో కొందరు బోధకులు శాస్త్రబద్దత సూత్రబద్ధత లేకుండ బోధిస్తున్నారు. ఆ విధముగ బోధించడము

వలన దేవుడు చెప్పిన జ్ఞానము సంపూర్ణముగ ప్రజల వద్దకు చేరలేకపోవుచున్నది. ఈ విధముగ కృష్ణుడు చెప్పిన

గీతలోని జ్ఞానముగాని, ప్రభువు చెప్పిన బైబిలులోని జ్ఞానముగాని సంపూర్ణముగ ప్రజలకు తెలియకుండ పోయినది.

ఈ మా మాట కొందరికి చేదుగ ఉన్నప్పటికి దేవుని విషయములో సత్యమును దాచకూడదు కావున చెప్పక తప్పలేదు.


ద్వాపరయుగములో చెప్పిన కృష్ణుడుగాని కలియుగములో చెప్పిన ఏసుగాని మతమను పేరుతో వారు ఎక్కడ

చెప్పలేదు. వారి బోధనలలో మతమను మాటయేలేదు. వారి తర్వాత జ్ఞానులమనుకొనువారు వారి బోధలను

ప్రచారము చేయడములో మతమను రంగుపూచి చెప్పారు. అంతేకాక కృష్ణుడు, ఏసు చెప్పని బోధలను కల్పించి చెప్పి

మనుషులను తప్పుదోవ పట్టించి మతమౌడ్యమును ప్రజలలో కల్పించారు. బోధకుల బోధలను బట్టి దేవుడు ఒక్కడేనను

భావము పోయి మతమునకొక దేవుడని ప్రజలకర్థమైనది. అప్పటినుండి కనిపించని దేవున్ని వదలి కనిపించెడి

మతము మీదనే ఎక్కువ మమకారమును పెంచుకొన్నారు.


ఒకే దేవున్ని భిన్నముగ అర్థము చేసుకొన్నవారు, దేవుని జ్ఞానమును కూడ భిన్నముగ అర్థము చేసుకోవడము

జరిగినది. అలా భిన్నముగ అర్థము చేసుకోవడము వలన మీ జ్ఞానము వేరు, మా జ్ఞానము వేరు, మీ దేవుడువేరు, మా

దేవుడువేరని వాధించుకోవడము జరుగుచున్నది. ఉదాహరణకు ముందుగ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలోని ఒక

శ్లోకమును తీసుకొందాము "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే

యుగే" అని జ్ఞానయోగమను ఆధ్యాయములో 8వ శ్లోకమున గలదు. ఈ శ్లోకములోని ఉద్దేశమునుగాని జ్ఞానమునుగాని

పూర్తిగ అర్థము చేసుకోకుండ మేము స్వాములము బోధకులము మాకు సంపూర్ణముగా తెలియునను ఉద్దేశముతో

కొందరు సత్యమును వదలి సూత్రబద్దముకాని వివరమును వివరించడము జరిగినది. సన్మార్గులను పెంపొందించి

దుర్మార్గులను సంహరించుతానని మొదట ఒకరు చెప్పితే అలాగే తర్వాత వారు కూడ ఆ మాటనే వ్రాసుకోవడము

జరిగినది. భగవద్గీతలోని శ్లోకములో దుష్కృత్యము చేయు చెడువారిని నాశనము చేస్తానన్నాడు కాని వారిని చంపుతానని

చెప్పలేదు. నాశనము చేయడము అంటే లేకుండ చేయడమని అర్ధము. ఏ విధముగ లేకుండ చేస్తానన్నాడని చూస్తే

అదే శ్లోకములోనే ధర్మసంస్థాపన వలన అని తెలియుచున్నది. ధర్మములను తెలియజేయుట వలన దుర్మార్గులు

సన్మార్గులుగ మారగలరని, ఆ విధముగ మార్చుటకు ఎపుడు అధర్మములు భూమిమీద చెలరేగితే అపుడు నేను వచ్చి

ధర్మములను తిరిగి పునరుద్ధరించుతానని తెలిపాడు తప్ప చంపుతానని ఎక్కడ చెప్పలేదు. దేవుని విధానము తెలియనివారు

వారికి తోచినది ఆలోచించకుండ వ్రాయడము వలన అదే భగవద్గీతలోని గుణత్రయ విభాగయోగములోని

14,15,16,17,18 శ్లోకములందు ఏ గుణములో చనిపోయినవాడు అదే గుణములలో జన్మించి అటువంటి ప్రవర్తనే

కల్గియుందురని కూడ తెల్పారు. అంతేకాక అక్షరపరబ్రహ్మమను ఆధ్యాయములో 6వ శ్లోకములో "యం యం కాపి

స్మరన్ భావం త్యజత్యక్తే కళేబరమ్, తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావ భావితః" అని వ్రాయబడినది. దీని భావము ఏ

భావములో ఏ గుణములో మనిషి చనిపోతున్నాడో అదే భావము అదే గుణము కల్గిన జన్మను తర్వాత పొందుచున్నాడని

కలదు. దీనిని బట్టి దుర్మార్గ భావము, చెడుగుణములు కల్గినవాడు చనిపోతే తర్వాత చెడు గుణములు కల్గిన జన్మే

పొందుచున్నాడని తెలియుచున్నది.


దీని ప్రకారము దుర్మార్గుడు చనిపోతే దుర్మార్గునిగానే పుట్టునని, అజ్ఞాని అజ్ఞానిగాను జ్ఞాని జ్ఞానిగాను చనిపోయిన

తర్వాత కూడ ఉండునని తెలియుచున్నది. ఉద్యోగి ఊరు ట్రాన్స్పర్ అయినట్లు జీవుడు శరీర మార్పిడి చెందుచున్నాడు.

ఒక జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లాకు ట్రాన్స్పర్ అయితే ఆ జిల్లాలో కూడ కలెక్టర్గానే ఉండునట్లు ఒక దుర్మార్గుడు ఇంకో

శరీరమునకు మార్పుచెందిన అక్కడ ఆ శరీరములో కూడ దుర్మార్గునిగానే ఉండును. అందువలన దేవుడు దుర్మార్గులను

చంపి లేకుండ చేస్తాడనుకోవడము పొరపాటు. దేవుడు తన జ్ఞానమువలన ధర్మములను బోధించి అధర్మపరులను

ధర్మపరులుగ, అజ్ఞానులను జ్ఞానులుగ శరీరమున్నట్లే మార్చునుగాని శరీరమును నాశనముచేసి లేకుండ చేస్తానని

చెప్పలేదని తెలియవలెను. దుర్మార్గులను సంహరించి ధర్మసంస్థాపన చేయునని వ్రాసినవారందరు పొరబడినట్లేనని

తెలియుచున్నది.


మీరు వ్రాసిన త్రైతసిద్ధాంత భగవద్గీతలో తప్ప మిగత వ్రాయబడిన అన్ని గీతలలోను సంహరించుటే అని

వ్రాశారు కదా! ఇంతమందికి తెలియనిది మీకొక్కరికే తెలియునా! అని ప్రశ్నించవచ్చును. ఎంతమంది చెప్పారు

అన్నది ప్రశ్నకాదు కాని ఎంత సత్యమన్నది ముఖ్యమైన జవాబు. అసత్యమును వేయిమంది చెప్పిన అది సత్యముగాదు,

సత్యమును వేయిమంది కాదనిన అది అసత్యము కాదు అను సూత్రము ప్రకారము దాదాపు మూడువందల భగవద్గీతల


వ్యాఖ్యానములలో దుర్మార్గులు సంహరించబడుదురన్న మాట అసత్యమే అగును. ఇంకనూ యోచిస్తే భగవద్గీత

జ్ఞానయోగములోని ఎనిమిద శ్లోకములో అధర్మపరులైన దుర్మార్గులను సంహరించడము సత్యమంటే,

అక్షరపరబ్రహ్మయోగమను ఆధ్యాయములో ఆరవ శ్లోకములో ఏ భావములో చనిపోవువాడు అదే భావములోనే జన్మించునన్న

మాట అసత్యమగును. దుర్మార్గుడు దుర్మార్గుని గానే సన్మార్గుడు సన్మార్గునిగానే పుట్టునను మాట సత్యమంటే,

జ్ఞానయోగములోని ఎనిమిదవ శ్లోకములో దుర్మార్గులను సంహరిస్తానను మాట అసత్యమగును. ఈ విధముగ దేవుడు

ఒక చోట సత్యము మరొక చోట అసత్యము చెప్పునా? మీరే ఆలోచించండి. దేవుడు ఎక్కడ ఏమి చెప్పిన సత్యమే

చెప్పును, అసత్యమును చెప్పడు. కావున మనము అర్థము చేసుకోవడములోనే ఏదో లోపముందని తెలుసుకోవలెను.


భగవద్గీతలో పాపాత్ములను దేవుడు సంహరిస్తాడని హిందూమతము లోని బోధకులు బోధిస్తుండగ, క్రైస్తవ

మతములోని బోధకులు పాపాత్ములను దేవుడు క్షమించివేస్తాడని, తన రక్తముతో పాపాత్ముల యొక్క పాపములను

కడిగివేస్తాడని చెప్పుచున్నారు. గీతలో దేవుడు చెప్పని మాటను హిందూ బోధకులు ఎలా చెప్పుచున్నారో, అలాగే

బైబిలులో దేవుడు చెప్పని మాటను క్రైస్తవ బోధకులు కూడ చెప్పుచున్నారని తెలియుచున్నది. ప్రవక్తలు చెప్పిన మాటలలోని

జ్ఞానమును తెలియని మనుషులు వారి మాటలను వక్రీకరించడము జరిగినది. హిందూబోధకుల మాట ప్రకారము

కృష్ణుడు ఎంతమంది దుర్మార్గులను చంపాడని చూస్తే, ఆనాడు భూమిమీద లక్షల సంఖ్యలో దుర్మార్గులు, వందల

సంఖ్యలో సన్మార్గులు ఉండెడివారు. కృష్ణుడు తన జన్మలో చంపడము, చంపించడము జరిగినది ఐదుగురిని మాత్రమే.

అందులో కంసుడు, నరకాసుడు, శిశుపాలుడను చెడువారిని ముగ్గురిని, భీష్ముడు, కర్ణుడను ఇద్దరు మంచివారిని.

గీతలోని దుర్మార్గులను చంపుతాడన్నట్లు ఆనాటి అధర్మపరులనందరిని కూడ చంపలేదు. చంపినవి చంపించినవి

సందర్భానుసారము జరిగినవే కాని అక్కడ వారు దుర్మార్గులను విచక్షణలేదు. అలాగుంటే సుచరిత్రగల భీష్మున్ని,

దానశీలి స్వామి ధర్మపరాయణుడైన కర్ణున్ని చంపేవాడే కాదు. గీతలో అధర్మపరులను సంహరిస్తాడని పొరపాటుగ

వ్రాసుకొన్నట్లు కృష్ణుడు అదేపనిగ అధర్మపరులను చంపే కార్యము పెట్టుకోలేదు, అటువంటి వారెవరిని చంపనూలేదు.

అలాగే బైబిలులో తన రక్తముతో పాపాత్ముల పాపమును కడిగివేయుదునని చెప్పనూలేదు. ఏసుప్రభువు తానున్నపుడు

ఎవరిని తన రక్తముతో కడగనూలేదు. ఒక సందర్భములో తన పండ్రెండుమంది శిష్యులకు ద్రాక్షరసము ఇచ్చి ఇది నా

నిబంధన రక్తమని చెప్పాడు. ఆ మాటను అర్థము చేసుకోవడములో ఎంతో పొరపడిన బోధకులు ఈనాటికి ఆ

మాటను గురించి యోచించక ఒకరు ఏమి చెప్పితే మరొకరు అదే చెప్పుచు పోవుచున్నారు. కృష్ణుడు తన జీవితకాలములో

ఏ దుర్మార్గున్ని చంపనట్లు, ప్రభువు కూడ బ్రతికి ఉన్నపుడుకాని చనిపోయినపుడుకాని తన రక్తముతో ఏ పాపాత్ముని

పాపమును కడుగలేదు. బ్రతికియున్నపుడు తన దైవశక్తితో ఇతరుల పాపమును క్షమించి రోగములనుండి విముక్తున్ని

చేశాడు తప్ప అప్పుడు కూడ తన రక్తమును ఉపయోగించలేదు. తనను ఒప్పుకొని తాను చెప్పిన జ్ఞానపద్దతి ప్రకారము

నడుచుకొనువారు పాపమునుండి విముక్తి పొందుదురని, అటువంటివారు మారు మనస్సుపొంది సన్మార్గులుగ

మారిపోవుదురన్నాడు. తన వాక్యములే మానవులకు రక్షణ అని, దేవుని వాక్యములు తెలిసి నడుచుకోవడమే జీవ

జలమును పొందినట్లని, నాశనమునుండి బయట పడడమని తెలిపాడు. అట్లుకాక రక్తము వలన పాపశుద్ది అంటే అది

అసత్యమని దేవుడైన ప్రభువలా చెప్పలేదని అర్థమగుచున్నది.


ఆనాడు ప్రభువు శరీరములో ఉన్న రక్తమును చిత్రహింసలతో ములుకులు కొట్టి కారిపోవునట్లు చేసినది

పాపాత్ములైన దుర్మార్గులు కదా! ప్రభువు మరణమునకు కారణము మేము గురువులమని చెప్పుకొను కైపావంటి


పాపాత్ములు కాదా! ఆనాడు ప్రభువును ఆయన మాటలను అర్థము చేసుకొన్నవారు పవిత్రులైనారు, కాని అర్థము

చేసుకొలేనివారు పాపాత్ములుగానే ఉండిపోయారు. ఈనాడు బోధకులు చెప్పుకొన్నట్లు ప్రభువు రక్తముతో

పరిశుద్దులమనుకొంటే, ప్రభువు మరణమునకు తానే కారణమని, తాను పాపము చేశానని తెలుసుకొన్న యూదా

ప్రభువు చనిపోయినపుడు ఆయన రక్తమును తన మీద కొంచమైన వేసుకొన్నాడా? ఈనాడు మనకు తెలిసినది ఆనాడు

యూదాకు తెలియదా! ఇదంతయు చూస్తే హిందువులు గీతను అపార్థము చేసు కొన్నట్లు క్రైస్తవులు కూడ ప్రభువు

వాక్యములను అపార్థము చేసుకొన్నారనియే చెప్పవచ్చును.


దేవుడే మనిషిగ వచ్చి చెప్పిన మాటలను అర్థము చేసుకోలేక అపార్థము చేసుకొని మనిషి అజ్ఞానములో

మునిగిపోవుచున్నాడు. తన అజ్ఞాన స్థితిని అంచనా వేసుకోలేక తనకు తెలిసినదే నిజమైన జ్ఞానమని తలచి దానిని

ఇతరులకు చెప్పుచుండుట జరుగుచున్నది. దేవుని జ్ఞానమును సంపూర్ణముగ అర్థము చేసుకోక మనిషి ఏ మతములో

ఉండినప్పటికి, ఉన్న మతమును వదలి ఇతర మతములోనికి పోయినప్పటికి నిష్ప్రయోజనమే అగును. దేవుడు

ప్రపంచము పుట్టినప్పటినుండి ఉన్నాడు. దేవుడు జగతిని సృష్టించిన తర్వాత అజ్ఞానముతో పాటు జ్ఞానమును కూడ

భూమిమీద ఉండునట్లు చేశాడు. మొదటి నుండి జ్ఞానము లేదనుకోవడము, అలాగే దేవుడు కూడ మొదటినుండి లేడు

మద్యలో వచ్చాడను కోవడము పొరపాటు. ద్వాపరయుగములో కృష్ణుని రూపముతో వచ్చి భగవద్గీతను చెప్పితే

హిందువులుగ ఉండి దానిలోని జ్ఞానము గ్రహించక, చెప్పినవాడు ఎవడని తెలుసుకోలేక కలియుగము వరకు జ్ఞానములేదని,

కలియుగము వరకు దేవుడు మనిషిగ అవతరించ లేదని అనుకోవడము గ్రుడ్డితనము కాదా!


ఉదాహరణకు అలాంటి అజ్ఞాన గ్రుడ్డితనముగల ఒక బ్రాహ్మణుడు హిందూమతము వదలి క్రైస్తవ మతములోనికి

పోయి కృష్ణుడు దేవుడు కాదని, గీత దైవజ్ఞానము కాదనిన విషయమును వివరించుకొందాము. ఆంధ్రప్రదేశ్లో

పరవస్తుచిన్నయసూరి అను బ్రాహ్మణ పండితుడుండెడి వాడు. అతని వంశములో పుట్టిన పరవస్తు సూర్యనారాయణరావు

అను బ్రాహ్మణ పూజారి ఉండెడివాడు. అతను వేదములు పురాణములు ఉపనిషత్తులు భగవద్గీత అన్నియు చదివినవాడు.

గీతను చదివినప్పటికి వేదములే గీతకంటే గొప్పవనుకొన్నాడు. పురాణములు సత్యమనుకొన్నాడు. పురాణములనగ

శాస్త్రబద్ధము కానివని, అసత్యములతో కూడుకొన్నవని, అందువలననే వాటికి పుక్కిడి పురాణములని పేరుకల్గినదని

సూర్య నారాయణరావుకు తెలియకపోయినది. దానివలన హిందూధర్మములు తెలిపిన వాటిలో తలమాణిక్యమైన

గీతాశాస్త్రమునే చిన్నచూపు చూచాడు. గీతను చెప్పిన కృష్ణున్ని జ్ఞానములేనివానిగ అర్థము చేసుకొన్నాడు. దానితో

హిందూమతములోనే సారాంశములేదని క్రైస్తవ మతములోనికి చేరాడు. చేరడముకాక కృష్ణున్ని దేవుడు కాదని ప్రభువు

మాత్రమే దేవుడని చెప్పాడు. అంతేకాక ప్రభువు ప్రపంచ కోర్కెలు నెరవేర్చువాడని అందరికి తెలియునట్లు పాలడబ్బాలకు,

బియ్యము మూటలకు ప్రార్థన చేయడము, వెంటనే ప్రభువు వాటిని ఇచ్చాడని చెప్పడము జరిగినది. దేవుడు అశాశ్వితమైన

ప్రపంచ కోర్కెలు నెరవేర్చువాడు కాడని, శాశ్వితమైన మోక్షము (పరలోకము)ను గురించి తెలుపువాడను ధర్మమునకు

వ్యతిరేఖముగ బోధించడము జరిగినది. వేదములు ప్రపంచగుణములతో కూడుకొన్నవని తెలుపుచున్న "త్రైగుణ్య

విషయాలేదా" అను ధర్మవాక్యమునకు వ్యతిరేఖముగ పరవస్తు సూర్యనారాయణరావు చెప్పాడు. "గుణమయి మమ

మాయా" గుణములతో కూడుకొన్నది మాయ అను గీతవాక్యమును మరచి మాయతో (సాతాన్) కూడుకొన్న వేదములను

గొప్పగ చెప్పుకొన్నాడు. అంతేకాక వేదములలోని శ్లోకములకు భావము తప్పుగ అర్థము చేసుకోవడము జరిగినది.


ప్రభువు వాక్యములను కూడ తప్పుగా అర్థము చేసుకోవడము జరిగినది. ఆయన వ్రాసిన “ఋజు దర్శిని" అను

పుస్తకములోని కొన్ని ఘట్టములను ఇక్కడ ప్రస్తావించి, అందులోని అశాస్త్రీయతేమిటో అసలైన సత్యమేమిటో వివరిస్తాము.


1946వ సంవత్సరమున శ్రీకాకుళము జిల్లాలో పుట్టిన సూర్య నారాయణరావు తన 18వ ఏట ఉపనయనము

పొంది శ్రీలక్ష్మినారాయణ స్వామి గుడిలో అర్చకవృత్తిని చేపట్టారు. ఋగ్వేదము, సామవేదము, తాండియ మహాబ్రాహ్మణము,

దేవీ భాగవతము, ఉపనిషత్తులు, మహా భారతము, భగవద్గీత, వేమన పద్యములు, విష్ణుపురాణము మొదలగు వాటిని

చదివి పండితుడయ్యాడు. ఈ విధముగ పురాణములను, శాస్త్రములను, వేదములను కలబోసుకోవడము మరియు

వాటి తారతమ్యములు తెలియకపోవడము ఆయనకు మొదటి అజ్ఞాన మెట్టయినది. అక్కడినుండి ఆయన మెదడకు

కొన్ని మంచి ఆలోచనలు వచ్చినప్పటికి వాటికి తప్పు జవాబులే దొరికాయి. దేవతలందరు నిజమైన దేవుడు కారని

అందరికి ఒక్కడే అధిపతియని మంచి ఆలోచన ఆయనలో కల్గినపుడు దానికి సరియైన జవాబును వెతుక్కోలేకపోయాడు.

అప్పటి నుండి తాను ఒక దేవున్ని కనుగొనడము, అతనే ఏసుప్రభువు అను కోవడము మంచిదే అయినప్పటికి అంతవరకు

ఎవరు దేవుడు కాదను కోవడము, అంతవరకు దేవుడు లేడనుకోవడము పొరపాటు కాదా! తనకు తెలిసిన సత్యము

ప్రకారము నడుచుకోక ఇంతవరకు సత్యమే లేదను కోవడము పొరపాటు కాదా! హిందూమతములో జ్ఞానము లేదను

కోవడము, క్రైస్తవ మతములోనే జ్ఞానముందనుకోవడము, పాత చెరువును వదలి క్రొత్త కుంటను చేరినట్లు కాదా!

అంతటితో ఆగక కృష్ణుడు అజ్ఞాని అని, హిందూమతములో సారములేదని పుస్తకమును వ్రాయడము అసలైన దేవున్ని

కించపరచినట్లు కాదా! తనకు 24 సంవత్సరముల వయస్సు వచ్చు వరకు బైబిలును చూడలేదని, అంతవరకు

బైబిలులోని విషయము ఏమాత్రము తెలియవని చెప్పుకొన్న సూర్యనారాయణరావు అంతకు ముందే వారి పెద్దలతో

మత్తయి సువార్త 23వ ఆధ్యాయము 9,10 వచనములను గురించి వాదించినట్లు వ్రాసుకొన్నాడు. బైబిలు తెలియదని

చెప్పిన తానే ముందే దానిని గురించి వాదించానని చెప్పడము అసత్యముగ కనిపిస్తున్నది కదా! దానిని గురించి ఆయన

చెప్పిన విధానమును ఆయన పుస్తకములోనే చూస్తాము.


ఋజుదర్శిని 10వ పేజీలో ఈ విధముగ “బైబిలిట్లు బోధిస్తున్నది భూమిమీద తండ్రియని ఎవనికైనను

పేరుపెట్టి పిలువవద్దు. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని

పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువని ఏసే స్వయముగ మత్తయి సువార్త 23వ ఆధ్యాయము

9,10 వచనములలో బోధించెను. ఈ విధమైన తర్కవితర్కములు వాద ప్రతివాదములు జరిగిన

పిమ్మట నేనందరికంటెను చిన్నవాడినైనందున గత్యంతరములేక చివరకు మౌనము దాల్చితిని.

యథావిధిగ లక్ష్మినారాయణ స్వామి ఆలయములో అర్చకత్వము చేసికొనుచు, తీరిక

సమయములలో అనేక గ్రంథములు వేదములు, ఉప నిషత్తులు మొదలగునవి చదువుచు

కాలయాపన చేయుచుంటిని." అని వ్రాయబడినది. ఈ తర్కము వారి పెద్దలతో 1964 సంవత్సరమునకు

1970వ సంవత్సరమునకు మద్యకాలములో జరిగినది. 1970 సం|| జూన్ నెల 10వ తేదీన యజ్ఞసామగ్రికొరకు

బజారుకు పోయి అచ్చట క్రైస్తవ ప్రచారకులను చూచి  వారియొద్దనుండి మొట్టమొదటి సారిగ బైబిలును పొంది

1970,జూన్,12వ తేదీన మొట్టమొదట చదివినట్లు గలదు.



ఋజుదర్శిని 17వ పేజీలో “వారంతయు వారి దేవుని కొనియాడుచు ఆ అంగీ ధరించిన వ్యక్తి

(ఫాదర్) ఒక నూతన బైబిలు నాకు బహుకరించెను." అని గలదు.


ఋజుదర్శిని 18వ పేజీలో “అతి భద్రముగ బైబిలును దాచుకొని యజ్ఞ సామగ్రితో ఇంటిని చేరితిని.

జూన్ 12 దినము 1970వ సం॥ రాత్రి సమయమందు లక్ష్మినారాయణ స్వామి ఆలయములో

బైబిలును చదువను ఆరంభించితిని" అని వ్రాయబడినది. 1970వ సంవత్సరములో మొదట బైబిలును

చూచియుంటే అంతకుముందే దానిలోని విషయములైన మత్తయి సువార్త 23వ అధ్యాయము 9,10 వాక్యములతో

వారి పెద్దలనెట్లు తర్కించాడు. అలా తర్కించాడంటే ముందే బైబిలు చదివుండాలి. అట్లుకాక 1970లో చదివాడని

చెప్పుట అసత్యము కాదా! ఈ విధముగ ఈయన వాక్యములలో ఎన్నో అసత్యములున్నట్లు కన్పించుచున్నది. అంతేకాక

యజ్ఞముల గురించి వేదములలో తెలుసుకొన్న సూర్యనారాయణరావును మాయ ఏ విధముగ తప్పుదోవలోనికి పంపినదో

క్రిందచూచెదము.


ఋజుదర్శిని 21వ పేజీలో సూర్యనారాయణరావు ఈవిధముగ వ్రాసియున్నాడు. “సామవేదము రెండవ

భాగమైన తాండియ మహాబ్రాహ్మణమందు ఈవిధముగ ఉన్నది. శ్లో “ప్రజాపతిర్థే వేభ్యం ఆత్మానాం

యజ్ఞం కృత్వాప్రాయశ్చిత్" దీని భావము ఏమనగా! ప్రజలను పరిపాలించువాడు ప్రజల పాప

పరిహారార్థము తన స్వంతశరీరమును ప్రాయశ్చిత్తముగ నలుగగొట్టుకొని యజ్ఞము చేయును.

ప్రజాపతి అనగా ‘దేవుడు' అని అర్థము. అందుకే ఆర్యులు అహం అనగా పరిశుద్ధుడైన, సృష్టికర్తయైన

దేవుడు యజ్ఞమై పోతేనే రక్షణ కలుగునని అన్నారు.”


సూర్యనారాయణరావు పై విధముగ వ్రాసిన విషయమునకు మేము చెప్పు వివరమేమనగా! ఆరు శాస్త్రములలో

గొప్పదైన, స్వయముగ దేవుడు భగవంతుని రూపముగ వచ్చి చెప్పిన భగవద్గీతా శాస్త్రములో యజ్ఞములను గురించి

చెప్పియుండగ గీతను కూడ చదివిన ఇతనికి అందులోని యజ్ఞముల శ్లోకములు కనిపించక శాస్త్రముకాని వేదములలోని

శ్లోకము కనిపించడము ఆశ్చర్యముగ ఉన్నది. వేదములు మాయతో కూడుకొన్నవని, మాయను జయించుట దుర్లభమని

చెప్పిన గీత వాక్యములను ఎంచుకోక వేదములనే ముఖ్యముగ ఎంచుకోవడము మాయ యొక్క పనికాదా! వేదములను

తార్కాణముగ తీసుకొన్నపుడే ఆయన మాయలో మునిగిపోవడము జరిగినది. అంతేకాక తీసుకొన్న ఆ శ్లోకమునకు

భావము తప్పుగా చెప్పుకోవడము చాలా విడ్డూరము. మొదటికి చెప్పుకొంటే సామవేదములోని ఆ శ్లోకమే ఒక పెద్ద

తప్పుగా చెప్పబడినది. “ఆత్మానాం యజ్ఞం” అని చెప్పకూడదు. చెప్పిన దాని ప్రకారమైన ఆత్మను యజ్ఞం చేయవలెనని

అర్థము చెప్పుకోక, శరీరమును ప్రాయశ్చిత్తముగ నలుగగొట్టుకోవడమని చెప్పుకోవడము పూర్తి తప్పుకాదా! యజ్ఞము

రెండు విధములని ఒకటి ద్రవ్యయజ్ఞమని, రెండవది జ్ఞాన యజ్ఞమని, ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనదని

గీతలో స్పష్టముగ చెప్పియుండగ ఆత్మయజ్ఞమనునది శాస్త్రవిరుద్దము కాదా! యజ్ఞమంటే కాలిపోవడమని మనము

తిన్న ద్రవ్యములు జీర్ణాశయములో జఠరాగ్ని చేత కాలిపోవడము ద్రవ్యయజ్ఞమని, అలాగే మన కన్ను, ముక్కు, చెవి,

నాలుక, చర్మము అను ఐదు జ్ఞానేంద్రియముల ఐదు జ్ఞానములను ఆత్మజ్ఞానమను అగ్నిద్వార తలయందు కాల్చివేయడమును

జ్ఞానయజ్ఞము అని అంటున్నాము. గీతలో ఐదు జ్ఞానేంద్రియములనుండి వచ్చు కర్మలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చితే

జ్ఞానయజ్ఞమగునని స్పష్టముగ చెప్పియుండగ సూర్యనారాయణరావుగారు వీటిని వదలి ఆత్మనాం యజ్ఞమని చెప్పుచు

తన శరీరమును చంపుకోవలెననుట విచిత్రముగ ఉన్నది. అంతేకాక తన శరీరమును ఎవడైన నలుగకొట్టుకొనిగాని,


తెంచుకొనిగాని, చనిపోవుట వలన హత్యాపాపము సంభవించునని తెలియాలి. యజ్ఞముల విషయము వివరము

తెలియని ఇతను, శాస్త్రము లకు, పురాణములకు, వేదములకు తారతమ్యము తెలియని ఇతను ఏకముగ భగవద్గీతలో

దేవుడు చెప్పిన శ్లోకమును తప్పుపట్టాడు. తాను తప్పుపట్టు నది తన ప్రభువునే అని తెలియక శ్రీకృష్ణున్ని సాధారణ

మనిషిగ లెక్కించి వ్రాసిన విధానమును క్రింద చూచెదము.


ఋజుదర్శిని 22వ పేజీలో "రక్తము ప్రోక్షింపబడకుండ పాప విమోచన కలుగదు. దీనిని బట్టి

చూడగ దుష్టుడు రక్షణ పొందవలెనని లేఖనములు ఘోషించుచున్నవి. కాని భగవద్గీత

జ్ఞానయోగము 8వ శ్లోకములో దుష్టుడు నాశనము కావలెనని కృష్ణుడు బోధించుచున్నాడు. ఇది

వేదములకు విరుద్ధము కాక మరేమగును?" అని వ్రాయబడియున్నది.


24వ పేజీలో "దుష్టశిక్షణ అనగా వినాశాయచ దుష్మతాం" అని భగవద్గీత జ్ఞానయోగము

4:8లో శ్రీకృష్ణుడు వేదములకు, దేవుని సంకల్పమునకు విరుద్దముగ బోధించెను. దుష్టులను

రక్షించుటకు బదులు శిక్షించుచు నీతిమంతులను రక్షించుచు యుగయుగములో ఇటువంటి పనులే

చేయుచు ధర్మమును స్థాపించుటకు అవతార మెత్తుచున్నానని సమస్తనీతికి వ్యతిరేకముగ చెప్పబడి

యున్నది.” అని కూడ వ్రాసియున్నాడు.


ఋజుదర్శిని అని పుస్తకమునకు పేరుపెట్టిన సూర్యనారాయణ రావుగారికి తన పుస్తకములో ఏమి ఋజువు

కనిపించిందో కాని మాకు కనిపించినదంత అసత్యమే ఉన్నది. కృష్ణుడు చెప్పినదేమిటో తనకు అర్థముకాక, దానిని

అర్థము చేసుకొనుటకు ప్రయత్నము చేయక శ్రీకృష్ణుడు చెప్పినదే తప్పనుట ఎంత సమంజసముగ ఉన్నదో మీరే

చూడండి. కృష్ణుడు దుష్టులను ధర్మబోధనతో లేకుండ చేస్తానన్నాడు కాని చంపుతానని ఎక్కడైన చెప్పాడ? దుష్టులు

దుష్టులుగానే పుట్టుదురని అదే గీతలో చెప్పిన కృష్ణుడు, దుష్టులు చనిపోవుట వలన లేకుండ పోతారని ఎలాచెప్పగలడు

'పరిత్రాణాయ సాధూనాం' అను జ్ఞానయోగము 8వ శ్లోకములో ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు గాని అస్త్ర శస్త్ర

సంస్థాపనార్థాయ అని చెప్పలేదు కదా! దుష్టజనులకు ధర్మములను బోధించి వారిలోని దుష్ట తనమును తీసివేసి

సజ్జనుల సంఖ్య పెంచుతానని కృష్ణుడు చెప్పగ అది బ్రాహ్మణుడైన సూర్యనారాయణరావుగారికి అర్థముకాక అడ్డముగ

మాట్లాడము దైవదూషణ కాదా!


పశుల పాలన్ని తెల్లనివే అయినప్పటికి గేదెపాలు, ఆవుపాలు, గాడిదపాలు అని విడివిడిగ ఉండును. వీటి

భేదము తెలియక అన్నిపాలే అని అన్ని త్రాగేవే అనుకొంటే అంతకంటే తెలివితక్కువ వారుండరు. కొంత తెలిసినవారికైన

గాడిద పాలు త్రాగరని, ఆవు గేదె పాలు మాత్రము త్రాగుటకు యోగ్యమని, అందులోను గేదెపాలకంటే ఆవుపాలు

శ్రేష్టమని తెలియును. ఆ విధముగనే వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, శాస్త్రములని గ్రంథములు గలవు.

అన్నియు పుస్తకములే కదా! అన్ని చదువ తగినవేకదా! అనుకుంటే అన్ని పాలేకదా అనుకొన్నట్లుండును. కొంత

జ్ఞానము తెలిసినవారు పుస్తకములన్నిటిలో శాస్త్రము ప్రమాణముగ ఉండునదని, శాస్త్రము ఆచరింపదగినదని, పురాణములు

కాలక్షేపమున కని, బావిలోని నీరు కొంతే ఉపయోగపడునట్లు వేదములలో కొంత మాత్రము ఉపయోగపడునని మిగతాది

అంతావ్యర్థమేనని తెలిసి యుందురు. అట్లుకాక అన్ని అవసరమే అనుకొనువారికి గాడిదపాలకు గంగగోవుపాలకు

వ్యత్యాసము తెలియనట్లుండును. ఈ విధముగనే పరవస్తు సూర్య నారాయణరావుకు వేదములు, పురాణములు,


శాస్త్రమైనగీత అన్ని ఒకే రకముగ కనిపించాయి అని అనుకొనే దానికి కూడ అవకాశము లేకుండ ఆవుకంటే గాడిదే

గొప్పదన్నట్లు గీతకంటే వేదములే గొప్పవని గీతను కించపరచినట్లు వ్రాశారు.

దేవుడు మనిషిరూపములో అవతరించునని తానే చెప్పుచు వెనుక పుట్టిన ఏసుప్రభువుకంటే ముందుపుట్టిన

కృష్ణునికి జ్ఞానములేదని చెప్పడము పొరపాటు కాదా! వెనుక పుట్టిన ప్రభువే ముందు కృష్ణునిగ పుట్టియుంటే నిజముగ

మనము ఏసుప్రభువును దూషించినట్లు కాదా! దేవుడు ఎప్పుడు ఏ అవతారముతో భూమిమీదకు వస్తాడో తెలియని

మనము ఇతను అవును, ఇతను కాదనుటకు సాధ్యమగునా? నాకు సాధ్యమగునన్నట్లు కృష్ణుని గూర్చి తన పుస్తకములో

సూర్యనారాయణరావు వ్రాసినది క్రింద చూచెదము.


ఋజుదర్శిని 42వ పేజీలో ఈవిధముగ గలదు. “శమంతక మణి బహుప్రకాశవంతమైన వెలుగు

వెదజెల్లెడి మణి, ఈ మణి వెలుగుతో ప్రకాశించుచున్నది. దీనిని ధరించుటకు నాకు ఎంతమాత్రము

యోగ్యత లేదు. నా అన్న అయిన బలరాముడు కూడ దీనిని ధరించుటకు యోగ్యుడుకాడు అని

శ్రీకృష్ణుడు స్వయముగ సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ సాక్ష్యము విష్ణువురాణములో 10:6లో

వ్రాయబడియున్నది. వెలుగును ధరించుటకు శ్రీకృష్ణుడు యోగ్యుడుకాడు. కనుక ఎవరైతే స్వయముగ

వెలుగైయున్నారో వారే వెలుగు ప్రకాశించుచున్న మణిని ధరించుటకు యోగ్యులు. శ్రీకృష్ణుడు నేను

వెలుగును కాను అంటున్నాడు కనుక ఆయన చీకటి. చీకటి అయినవాడు దేవుడుకాడు." అని వ్రాశారు.

43వ పేజీలో ఈ విధముగ గలదు "శ్రీకృష్ణుడు నేను శమంతక మణిని అనగ ప్రకాశించుచున్న

వెలుగును ధరించుటకు యోగ్యుడను కాను అని విష్ణుపురాణములో 10:6లో సాక్ష్యమిచ్చుచున్నట్లు

తనే ఒప్పుకున్నాడు కనుక తాను సృష్టికర్తనైన దేవుడనుకానని ఒప్పు కొంటున్నాడు. అందువలన

శ్రీకృష్ణుడు చీకటిశక్తి అని మీరెందుకు ప్రజలకు చెప్పరు అని నేను మాతాతగారిని అడిగి తిని.

అందులకు నేను మా తాతగారిచేత శిక్షింపబడ్డాను. ప్రియచదువరీ నీవు సత్యాన్వేషివైతే ఆలోచించు.

శ్రీకృష్ణుడు వెలుగు ధరించుటకు అయోగ్యుడైనచో నీ పాపమునుండి నిన్ను పరిహారము చేయుటకు

ఎలా యోగ్యుడు. ఎవడైననూ తాను స్వయముగ చీకటైయుండి చీకటిలోయున్న వారికి వెలుగును

ఎలా ప్రకాశింపజేయగలడు?" అని వ్రాసియున్నది.


ఆయన వ్రాసిన విషయమును చూస్తే పెద్ద సత్యాన్వేషి కాకుండ కొంత తెలివియున్న ఎవనికైననూ అనేక

ప్రశ్నలుద్భవించును. వెలుగుచున్న ఒక మణిని ధరించుట వలన దేవుడుకావడము ధరించకపోవడము వలన దేవుడు

కాకుండ పోవడము జరుగునా? మొదట సూర్యుడు దానిని ధరించెడివాడు. ధరించినంతమాత్రమున సూర్యుడు

దేవుడగునా? తర్వాత సత్రాజిత్తు మహారాజు ధరించాడు కనుక అతనిని దేవుడనవచ్చునా? సత్రాజిత్తు రాజుయొక్క

సోదరుడు ప్రసేనుడు అడవికి వేటకై వెళ్లుచు శమంతక మణి యొక్క హారమును మెడలో ధరించాడు. ఇక్కడ ఆయన

కూడ దేవుడై పోయినట్లేనా? అడవికి పోయిన సత్రాజిత్తు సోదరుడు సింహము చేత చంపబడగా ఆ మణి జాంబవంతునికి

దొరికినది. కొంతకాలము జాంబవంతుడు కూడ ధరించాడు. అందువలన పరవస్తుసూర్యనారాయణ రావుగారి

మాటప్రకారము జాంబవంతుడు కూడ దేవుడైనట్లేనా? తర్వాత జాంబవంతుని కూతురును కృష్ణుడు వివాహము

చేసుకొన్నపుడు జాంబవంతుడు కూతురుతో పాటు శమంతకమణిని కూడ కృష్ణునికి ఇచ్చాడు. కృష్ణుడు ఇంతమంది

ధరించిన మణిని నేను ధరించనని అది మొదట సత్రాజిత్తు రాజుది కనుక ఆయనకే ఇచ్చుట మంచిదనుకొన్నాడు. ఇన్ని


ప్రశ్నలకు సూర్యనారాయణరావుగారు సమాధాన మివ్వగలడా? మణి ధరించుట వలన దేవుడని, ధరించక పోవడము

వలన దేవుడుకాడని చెప్పుటకు శాస్త్రబద్ధమైన ఆధారమేమైన కలదా? దేవున్ని అంతసులభముగ కనుగొనుటకు వీలగునా?

కొంత తెలివియున్న అమాయకునికి కూడ ఇన్ని ప్రశ్నలు కల్గుచుండగ నిజమైన సత్యాన్వేషికి ఎన్ని ప్రశ్నలు పుట్టునో!


శాస్త్రములు పురాణములు అన్ని పుస్తకములే అయినప్పటికి ఆవుకు గాడిదకు ఉన్నంత తేడా గలదని ముందే

చెప్పుకొన్నాము. గంగగోవు పాలు, గాడిదపాలు ఎలా సమానముకావో అలాగే శాస్త్రములు పురాణములు సమానము

కావు. ఆరుశాస్త్రములలో ఐదు ప్రపంచమును గురించి తెలుపగ ఆరవదైన బ్రహ్మవిద్యాశాస్త్రము దేవుని గురించి

తెలుపునదై ఉన్నది. దైవవాక్కులతో కూడుకొన్న భగవద్గీత, బైబిలు రెండు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవై

ఉన్నవి. చెప్పబడినది నెరవేరునట్లు ప్రమాణమైయున్నవి గీత బైబిలు. హిందూమతములో దేవునికి ప్రమాణముగ

తీసుకొంటే గీతను తీసుకోవాలి. అలాగే క్రైస్తవ మతములో అయితే బైబిలును తీసుకోవాలి. పరవస్తు సూర్యనారాయణ

హిందూమతములోని వాడైయుండి తర్వాత క్రైస్తవమతములోనికి మారడములో తప్పులేదు. కాని పుట్టిన తల్లిని వదలి

చేసుకొన్న పెళ్ళామును పెద్దగ చెప్పుకొన్నట్లు ప్రభువును దేవుడనడము కృష్ణున్ని దేవుడు కాదనడము పొరపాటు కాదా!

ఒక వేళ కృష్ణుడే ప్రభువై వచ్చియుంటే దేవున్ని కొంత దూషించి కొంత పొగిడినట్లు కాదా!


మొదటికి విష్ణుపురాణమును తీసుకొని దాని ఆధారముతో కృష్ణున్ని దేవుడు కాదనడము కంటిలో ఇసుక

పోసుకొని చూస్తే బాగా కనిపిస్తుందన్నట్లుంది. దేవునికి మణికి ఏమి సంబంధము గలదు? దేవుడు భూమిమీదకు

మనిషిగ వచ్చి తన ధర్మములను మాత్రమే తెలుపును కాని మణులను ధరించి కూర్చుండునా? వెలుగైన మణిని

ధరించని వాడు చీకటని, చీకటైనవాడు దేవుడు కాదని చెప్పడము చాలా వింతగ ఉన్నది. మణిని ధరించనంతమాత్రమున

మనిషి చీకటి కావడమేమిటి? ఈ మాట వ్రాసిన వారికి తిక్కనా, చాదస్తమా, ఉన్మాదమా అని అనుమానము రాక

తప్పదు. ఇది కేవలము తలలో మేలవించిన అసూయ గుణముతప్ప సత్యాన్వేషణకాదని తెలియుచున్నది.


దేవుడు ఇటువంటివాడని తేల్చి చెప్పుటకు వీలులేదు. ఆయన చీకటికి చీకటై, వెలుగుకు వెలుగైయున్నాడు.

దేవుడు మనిషిగ వస్తే వెలుగై ప్రకాశిస్తానని చెప్పలేదు. అలాగే చీకటై మబ్బుగ ఉంటానని చెప్పలేదు. ఆయనలో

ఉండునదంత జ్ఞానప్రకాశము తప్ప వేరు ప్రకాశముండదు. జ్ఞానము బయటి కంటికి కనిపించునది కాదు. కృష్ణునిగ

వచ్చిన రోజుగాని, ప్రభువుగ వచ్చినరోజుగాని జ్ఞాననేత్రమునకు కనిపించు జ్ఞానప్రకాశము తప్ప కంటికి కనిపించు ఏ

ప్రకాశము వారిలో కనిపించలేదు. పరవస్తు సూర్యనారాయణ మాట ప్రకారమైతే కృష్ణుడు తాను జీవించియున్నపుడు

మంచి మంచి వజ్ర వైడూర్యములతో కూడిన నగలను ధరించాడు, రత్న మణిమయ కిరీటమును ధరించాడు నవరత్నములు

పొదిగిన సింహాసనము మీద కూర్చున్నాడు. దానిని బట్టి కృష్ణున్ని దేవుడనాలి. మణులు ధరించినంత మాత్రముననే

దేవుడని కృష్ణున్ని చెప్పితే, జీవితములో ఏ మణులు ధరించక సాధారణ జీవితము గడిపిన ప్రభువును దేవుడు కాదనాలా?

దీని ప్రకారము దేవుడైన ప్రభువును ఒక ప్రక్క పొగిడి మరొక ప్రక్క కించపరచినట్లు కాదా! అంతేకాక ప్రభువు తన

జీవితములో ఎంతో జ్ఞానమును చెప్పగ దానిని వక్రమార్గములో అర్థము చేసుకొని అలాగే ప్రచారము చేయడము

ప్రభువును ఆరాధించినట్లా అవమానించినట్లా? ప్రభువు యొక్క జ్ఞానవాక్యములను ఏ విధముగ తప్పుదారిపట్టించారో

క్రింద చూచెదము.


ఋజుదర్శిని పుస్తకములో 22వ పేజీయందు “సామ వేదములో తాండియ మహాబ్రాహ్మణమునందు

ఒక శ్లోకము “శ్లో” సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్యకం, తదొరక్తం పరమాత్మేన పుణ్యదాన


బలియాగం.” దీని భావము :- సర్వపాపములు పోవాలంటే రక్తప్రోక్షణం అవసరము. రక్తము

ప్రోక్షింపబడకుండ పాపవియోచన కలుగదు. అని వ్రాయబడి యున్నది.


28వ పేజీలో “యోహాను వ్రాసిన 1వ పత్రిక, 1వ అధ్యాయము, 7వ వచనము :- ఆయన

వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య

సహకారముగలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన ఏనురక్తము ప్రతి

పాపములనుండి మనలను పవిత్రునిగ చేయును”


పేతురు 1వ పత్రిక, 1వ అధ్యాయము, 19వ వాక్యము :- అప్పుడు అమూల్యమైన రక్తముచేత

అనగ నిర్దోషమును, నిష్కళంకమగు గొఱ్ఱపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత విమోచింప బడితిరని

మీరెరుంగుదురు.” అని వ్రాయబడియున్నది. దీనిని గురించి మేము చెప్పునదేమనగా!


ఈ వాక్యములను ఆధారము చేసుకొని ఏసు తన రక్తముతో పాపులను పరిశుద్దులుగ చేయుచున్నాడని చాలామంది

క్రైస్తవులు ప్రచారము చేయుచున్నారు. ఏసు తన జీవితములో ఎప్పుడైన ఎక్కడైన తన రక్తముచేత మీ పాపములను

కడిగివేయుదునని ఎవరితోనైన చెప్పాడు అని మేము ప్రశ్నించుచున్నాము. పై వాక్యములను మేము తప్పుపట్టడము

లేదు, కాని వాక్యములను అర్థము చేసుకోవడములో క్రైస్తవులు పొరపడి నారని తెలుపుచున్నాము. ఆ వాక్యముల

యొక్క సరియైన అర్థము మేము తర్వాత తెలుపగలము. మొదట పరవస్తుసూర్యనారాయణ చెప్పిన సామవేదములోని

శ్లోకమును వివరించుకొందాము. సర్వ పాపపరిహారో రక్తప్రోక్షణ మవశ్యకం అన్నారు. దానికి అర్థము పాపము

పోవాలంటే రక్తప్రోక్షణము అవసరము అని గలదు. ఎవరి రక్తముతో ప్రోక్షణ జరుగవలెననిన “తదరక్తం పరమాత్మేన”

అని కలదు. దాని అర్థము పరమాత్మ యొక్క రక్తమని కలదు. ఇక్కడ మనము యోచించ వలసినది చాలాకలదు.

అదేమనగా! ఆత్మ అనగా శరీరములో నివశించునది, పరమాత్మ అనగా ఆత్మకంటే వేరైనది మరియు శరీరము లోపల,

శరీరము బయట అణువణువున కలదు. ఆత్మ శరీరములో మాత్రము కలదు, తిన్న ఆహారమును రక్తరూపములోనికి

మార్చుకొని శరీరమునకు శక్తిగ ఉపయోగించుకొనుచున్నది. పరమాత్మకు శరీరము లేదు, ఆకారములేదు, విశ్వమంత

సమానముగ వ్యాపించియున్నది. కావున శరీరములో గల ఆత్మకు రక్తమున్నది కాని శరీరము బయట సర్వ వస్తువుల

లోపల బయట వ్యాపించియున్న పరమాత్మకు రక్తము ఎలా ఉంటుంది. అందువలన పరమాత్మకు రక్తముంది అనుకోవడము

శుద్దతప్పు. అటులైతే శ్లోకములో 'తద్ రక్తం పరమాత్మేన' ఆ రక్తము పరమాత్మది అని కలదు కదా! అని కొందరు

అడుగవచ్చును దానికి మా సమాధానమేనగా! వారి రాగము చాలా గొప్పది అని ఇద్దరిని గూర్చి ఇతరులన్నారను

కొందాము. రాగము అనగానే మనకర్థమగునది సంగీతము లోని రాగమనుకొంటాము, బాగపాడగలరనుకొంటాము.

ఒక వేళ ఆ ఇద్దరిలో ఒకడు మూగవాడున్నాడనుకొందాము. అపుడు మంచివాడు రాగముతీసి పాడగలడుకాని మూగవాడు

రాగమెట్లు తీయగలడని అనుమానము రాకతప్పదు. అపుడు కొంతయోచిస్తే రాగము అనగ సంగీతమే కాదు ప్రేమ

అని అర్థము కూడ కలదని తెలియుచున్నది. మూగవానికి ప్రేమ ఉండవచ్చును కాని సంగీతముండదని తెలియుచున్నది.

ఇద్దరిని కలిపి చెప్పక ప్రత్యేకముగ మూగవాని రాగము అంటే పొరబడకుండ మూగవానిప్రేమ అని అర్థముకాగలదు.

అదేవిధముగ ప్రత్యేకముగ పరమాత్మ అని చెప్పినపుడు శరీరమున్న ఆత్మకు రక్తముండును కాని సర్వము వ్యాపించి

రాతిలోను, నీటిలోను, అగ్నిలోను, గాలిలోను అణువణువున గలవానికి రక్తముండదని తెలిసిపోవుచున్నది. మూగవాని

రాగము అన్నపుడు కొంత యోచించి సంగీతరాగము కాదు, వానికి గల ప్రేమను గురించి చెప్పారని అర్థము చేసుకొన్నట్లు


పరమాత్మ రక్తమన్నపుడు పరమాత్మకు రక్తముండదు కదా! అని యోచించి మూగవాని రాగమునకు అర్థము వేరుండునట్లు

పరమాత్మ రక్తమునకు వేరు అర్ధముండునని చూడాలి.


ఒక శరీరమును పరికించి చూచితే శరీరమంత ఆత్మ వ్యాపించి యున్నది. ఆత్మ వ్యాపించియున్న శరీరమును

సజీవముగ ఉన్న శరీరము అంటాము. ఆత్మ వ్యాపించి బ్రతికియున్న శరీరములో క్రిందకాలికి రంధ్రము చేసిన లేక

పైన తలమీద గాయము చేసిన రక్తమువచ్చును. దీనిని బట్టి చూచిన ఆత్మ వ్యాపించియున్నంతవరకు రక్తము కూడ

వ్యాపించి ఉన్నదని తెలియుచున్నది. ఆత్మ ఉన్నదనుటకు రక్తము సాక్ష్యమైయున్నట్లు పరమాత్మకు కూడ ఒక విధానము

గలదు. ఆత్మకు శరీరము నివాసమైతే పరమాత్మకు విశ్వమంతయు నివాసముగ గలదు. ఆత్మ వ్యాపించిన శరీరములో

ఆత్మకు సాక్ష్యముగ రక్తమున్నట్లు, పరమాత్మ వ్యాపించిన విశ్వమంత పరమాత్మకు సాక్ష్యముగ జ్ఞానము గలదు. శరీరములో

రక్తము వలన ఆత్మ ఉనికిని తెలుసుకొన్నట్లు, విశ్వములో జ్ఞానమువలన పరమాత్మ ఉనికిని తెలుసుకోవచ్చును. పరమాత్మ

రక్తము అని ఎక్కడైన చెప్పితే దానిని దేవుని (పరమాత్మ) జ్ఞానముగ అర్థము చేసుకోవలెను. మూగవాని రాగమును

సంగీతముగ భావించుకొంటే ఎంతతప్పో అలాగే పరమాత్మ రక్తమును శరీరములో గల ఎర్రని రక్తముగ అర్థము

చేసుకొంటే అంతే తప్పగును. చిన్న పొరపాటుకు ఎంతో అనర్థము జరుగునట్లు చిన్న భావలోపమునకు దేవునిమార్గమును

వదలి మాయమార్గములో పోగలము. కావున దేవుని విషయములో లోతుగ యోచించవలసిన అవసరమున్నది.


ఇపుడు అసలైన విషయములోనికి వస్తాము. ప్రభువు మనిషిగ వచ్చిన దేవుడు కాబట్టి ఆయన రక్తము

అన్నపుడు శరీరముదా కాదా అని ఆలోచించాలి. శరీర రక్తము అనుకొంటే అందరివలె ఆయన శరీరములో కూడ ఆరులీటర్ల

రక్తమే ఉండెడిది. ఆయనకు చిత్రహింసలు చేసి శిలువ మీద చంపినపుడే ఆ రక్తము కారిపోయింది. ఆయన శరీర

రక్తముతో ఆ రోజు ఎవరి పాపమును కడుగలేదు. ప్రభువు బ్రతికి ఉన్నరోజులలో గ్రుడ్డివాని పాపమును క్షమించి

కల్లచూపునిచ్చారు, కుంటివాని పాపమును క్షమించి నడకనిచ్చాడు. ఆ రోజు వారి పాపములను లేకుండ చేసినపుడు

కూడ ఆయన రక్తముతో కడుగలేదు. ఆయన బ్రతికి ఉన్నపుడుగాని చనిపోయినపుడుగాని ఎవరి పాపనిమిత్తము

రక్తమును కార్చడము చేయలేదు కదా! ఇపుడు ప్రభు రక్తముతో పాపమును కడుగవలెననుటలో ఏదో ఆంతర్యము

కలదని ఎందుకు యోచింప లేకున్నారు.


దేవుని జ్ఞానమువలననే సర్వపాపములు పటాపంచలు కాగలవు. ఇదే విషయమునే భగవద్గీత జ్ఞానయోగములో

37వ శ్లోకములో 'జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్' అన్నారు. దీని అర్థము జ్ఞానమను అగ్నివలననే సర్వ కర్మలు కాలిపోవును

అని గలదు. కావున మనలను పాపముల నుండి ముక్తిచేయునది జ్ఞానమను రక్తమే కాని శరీర రక్తముకాదని తెలియాలి.

దీని ప్రకారము బైబిలులోని పేతురు 1వ పత్రిక, 1వ అధ్యాయము 19వ వచనము వివరించుకొందాము. "అమూల్యమైన

రక్తము చేత అనగ నిర్దోషమును నిష్కళంకమగు గొట్టెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత విమోచింపబడితిరని మీరెరుంగుదురు.”

ఇక్కడ మనము బాగాయోచించి చూచిన అమూల్యమైన రక్తము అని చెప్పబడినది. ప్రపంచములో ప్రతి వస్తువుకు

లెక్కగట్టి ఇది ఇంత విలువైనదని దానికి మూల్యము (వెల) కట్టవచ్చును. రక్తమును కూడ మూల్యముగ కొంత డబ్బిచ్చి

బ్లడ్బ్యాంక్ నుంచి కొనుక్కోగలుగుచున్నాము. కాని ఇక్కడ చెప్పిన రక్తము అమూల్యమైనదన్నారు, వెలకట్టలేనిదన్నారు.

అటువంటి రక్తము ఒక్క జ్ఞానము మాత్రమేనని తెలియాలి. అట్లు అర్థము చేసుకుంటేనే సరిపోతుంది కాని వేరు

విధముగ సరిపోదు. నిర్దోషము అనగ ఏ దోషము లేనిదని అర్ధము. నిష్కళంకము అనగ ఏ కళంకములేనిదని అర్ధము.

నిర్దోషము నిష్కళంకమైనది ఒక్క దేవుని జ్ఞానము తప్ప ప్రపంచములో ఏది లేదని తెలియాలి.


క్రీస్తు రక్తమును గొర్రెపిల్లవంటిదని కూడ పై వాక్యములో గలదు. ఇక్కడ గొర్రెపిల్లను ఎందుకు ఉదాహరణగ

తీసుకొన్నారని చూచెదము. ఇక్కడ ఉదాహరణకేకాక ఏసుప్రభువు గొర్రెపిల్లను తన చేతులతో ఉంచుకొన్నట్లు కూడ

చిత్రములలో చూచి ఉంటాము. సర్వసాధారణముగ జంతువులన్నింటిలోను గొర్రె చాలా అమాయకమైనది. ఎటుతోలితే

అటుపోతుంది. మిగత జంతువులకున్న గుణముల ప్రభావము వీటి కుండదు, ఎవరినైన అమాయకముగ నమ్మగలదు.

పెద్ద గొర్రెకే గుణముల సామత్యము తక్కువైనపుడు మరి చిన్నపిల్లకు ఎటువంటి గుణములు ఉండవు కదా! ఎటువంటి

దోషములేనిది దేవుని జ్ఞానము కావున జ్ఞానమును గొర్రెపిల్లతో సమానముగ పోల్చి గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తము

అన్నారు. ఇక్కడ క్రీస్తురక్తము గొర్రెపిల్లవంటిదని పోల్చడములో క్రీస్తురక్తమును జ్ఞానముగ వర్ణించారని తెలుసుకోవలెను.


సమస్త ప్రపంచమునకు అధిపతియైన, పరలోక తండ్రియైన, పరమాత్మ జ్ఞానము సంపూర్ణముగ కల్గి, జ్ఞానము

చేత సమస్త పాపములను హరించువాడు ప్రభువు. కావున పవిత్రమైన జ్ఞానస్వరూపునిగా వర్ణిస్తు యోహాను సువార్త

1వ అధ్యాయము 29వ వాక్యములో "ఆయన లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల” అన్నారు. దీని

అర్థము ఏసుప్రభువు పాపములను హరించు జ్ఞానస్వరూపుడని అర్థము. యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము

ఏడవవాక్యములో “ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడచిన ఎడల, మనము అన్యోన్య సహాకారము

గలవారమై ఉందుము. అపుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులుగ చేయును.'

ఈ వాక్యము ప్రకారము చూచినట్లయితే దేవుడు జ్ఞానప్రకాశములో ఉన్నాడని, మనము కూడ అదే మార్గములో నడచు

కొన్నపుడు దేవుని ప్రతినిధియైన ఏసు జ్ఞానము మనలను పాపమునుండి కడతేర్చునని తెలియుచున్నది. ఇక్కడ కూడ

ఏసు రక్తమన్నపుడు దేవుని జ్ఞానము అని అర్థము చేసుకొంటే సరియైన భావము పొందగలరు. మేము ఎంతో మంది

క్రైస్తవులతో కలిసినపుడు, ఇతర బోధకులు చెప్పునపుడు చూస్తే ముఖ్యముగ ఏసు రక్తమంటే ఏమిటో వారికి అర్థము

కాలేదని తెలియుచున్నది. తిరిగి ఏసే వచ్చి రక్తమంటే జ్ఞానమని చెప్పినప్పటికి విననివారు చాలామంది కలరు. ఒక

వేళ ఏసుప్రభువు కనిపిస్తే నీ రక్తము మా పాపమును పోగొట్టునని ఆయనను గాయపరచి అతని రక్తము ఒక్కరికి

సరిపోయిన చాలులేనని వాడుకొనేటట్లున్నారు. ప్రభువు రక్తమంటే జ్ఞానమని తెలియనంతవరకు ప్రభువు కనిపిస్తే నీ

రక్తము మా కొరకు కార్చమని అడిగేవారు గలరు.


ప్రభువు యొక్క రక్తమంటే ఆయన జ్ఞానమని తెలిసినవారు శిలువ మీద మన కొరకు ఆయన రక్తమును

కార్చాడనుకోరు. ఆ దినము మనుషులే తెలియని తనముతో ప్రభువును బలవంతముగ శిలువ మీద పెట్టి ములుకులుకొట్టి

రక్తమును కారునట్లు చేశారు. ఆ దినము వారు చేయుచున్నది తప్పని దానివలన భయంకరమైన పాపము వారి

కంటుకొనునని తెలిసిన ప్రభువు “తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము” అని పరమాత్మను

వేడుకొన్నాడు. క్షమించమని చెప్పుచున్నాడంటే ఆ దినము మనుషులు పాపము చేయుచున్నారనియేగా అర్థము.


పిలాతురాజు న్యాయధిపతిగయుండి ప్రభువుని శిలువ వేయుట పాపమని తెలిసి తప్పనిసరిగ మరణశిక్ష చెప్పవలసి

వచ్చినపుడు ఇందు మూలముగ వచ్చు పాపము నాకుగాని నా పిల్లలకుగాని అంటకుండ వుండవలెనని ఆయన చెప్పగా

అక్కడి ప్రజలు పాపభీతిలేనివారై ఆ పాపము మాకు మా పిల్లలకే ఉంటుంది నీవు ముందు శిక్ష చెప్పమని రాజుతో

అన్నారు. ఆ మాటను విన్న ఏసుప్రభువు శిలువను మోసుకొని పోవుచు చివరిసారిగ ఆయన ప్రజలకిచ్చిన సందేశము

ఒకటి గలదు. “నా కొరకు ఏడ్వకండి మీ కొరకు మీ పిల్లలకొరకు ఏడ్వండి" అని అన్నాడు. ఎవరి జీవితములో

అయిన చివరి సందేశము గొప్పదిగ ప్రాముఖ్యమైనదిగ ఉండును. అలాగే ప్రభువు ప్రజలకిచ్చిన గొప్ప సందేశము


కూడ అదే. ఎందుకనగా ఆయనను చంపిన హత్యాపాపమును తమకు తమ పిల్లలకుండునట్లు న్యాయస్థానములో

ప్రభువు ముందరే ఒప్పుకొన్నారు. కావున ఆ పాపము ఊరకపోదు. దానివలన తప్పనిసరిగ ఏడ్వవలసి వచ్చును.

అందువలన మీ కొరకు మీ పిల్లలకొరకు ఏడ్వండి అన్నాడు. బాధపడనిదే పాపము పోదు కావున ఏడ్వండి అన్నాడు.

ఆయన మాట ప్రకారము ఏ ప్రార్థన మందిరములోనైన మన కొరకు మన పిల్లల కొరకు ప్రార్థన చేయుచున్నాము తప్ప

దేవునికొరకు కోరిక లేకుండ ఎవరు చేయడము లేదు. నిన్ను చంపాము ఆ పాపము పోగొట్టమని ఎవరు అడగడము

లేదు. మా కొరకు నీవు చనిపోయావు అని ఆయనే ఏదో పనివుండి చనిపోయినట్లు చెప్పుచున్నారు.


మన కొరకు మన పాపము కడుగు కొరకు ఆయన శిలువ మీద రక్తము కార్చియుంటే నారక్తము వలన మీ

పాపము పోతుంది నారక్తము కారినపుడు తలా కొంత తడుపుకోండని ప్రభువు చెప్పలేదే! తన రక్తము కారుట వలన

పాపమొస్తుందని తెలిసి వీరిని క్షమించమని దేవున్ని కోరాడు. తన రక్తము వలన పాపము పోతుందని ప్రభువుకు

తెలిసియుంటె రక్తమును శిలువమీద వృథా పోనివ్వద్దని చెప్పియుండే వాడు. అలా చెప్పక మీరు తర్వాత ఏడ్వవలసి

ఉంటుందని ఇపుడు నా కొరకు ఎవరు ఏడ్వవలసిన పనిలేదన్నాడు. దీనిని బట్టి చూస్తే ప్రభువు రక్తమును చిందించుట

వలన మానవులకు పాపమే వచ్చింది కాని, పాపము పరిహారము కాలేదు. పాపుల కొరకు ప్రభువు చనిపోలేదు,

పాపుల వలన ప్రభువు చనిపోయాడు. ప్రభువు చావుతో మానవులు పాపాత్ములైనారు కాని మానవులు పాపపరిహారులు

కాలేదు. మన చేతులార ఆయనను చంపి మన కొరకు ఆయన చనిపోయాడనుట న్యాయమా!


ఏసుప్రభువు పస్కాపండుగ సందర్భములో తన పండ్రెండు మంది శిష్యులతో కలిసి భోజనము చేయుటకు

కూర్చుండినపుడు (మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27, 28 వచనములలో) "వారు భోజనము చేయుచుండగ

ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానినాశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు దీనిని తీసుకొని తినుడి ఇది నా శరీరమని

చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగుడి ఇది నా

రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” అన్నాడు. ఆనాడు

ఒక గిన్నెలో ద్రాక్షరసమును ఇచ్చి ఇది పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడు నిబంధన రక్తము అనుటలోగల

ఆంతర్యమును ఎవరు అర్థము చేసుకోలేదు. శరీరములో ఎవరికైన రక్తముంటుంది కాని నిబంధన అను పేరుకల్గిన

రక్తముండదు కదా! ఇచ్చినది ద్రాక్షరసము, చెప్పినది రక్తములో ప్రత్యేకమైన పేరు కల్గినది. ఆ ప్రత్యేకత ఏమిటో

ఎవరైన ఆలోచించితే అది మనిషి రక్తము కాదని, దేవుని ధర్మములతో (నిబంధనలతో) కూడుకొన్న జ్ఞానమని తెలియగలదు.

దేవుని రక్తము అంటే జ్ఞానమని తెలిసినపుడు ప్రభువు యొక్క జ్ఞానము సంపూర్ణముగ అర్థమగును. దేవుని రక్తమును

మనుషుల రక్తమువలె కారిపోవునది అనుకొంటే ప్రభువు యొక్క జ్ఞానము అర్థము కానట్లేనని తెలియుచున్నది. పరవస్తు

సూర్యనారాయణరావు శిలువ మీద శరీరము నుండి రక్తము కారిన ప్రభువును గురించి బ్రాహ్మణకులము నుండి

క్రైస్తవమతములోనికి మారిపోయాడు. కాని విశాల విశ్వమే శరీరముగ, కళంకములేని జ్ఞానమే రక్తముగ ఉండగ,

మాయ (సాతాన్) అను శిలువ మీద మానవుల కొరకు జ్ఞానరక్తమును చల్లిన ప్రభువును గురించి కాదని, ఆయనకు

అంతవిశాలమైన భావములేదని తెలియుచున్నది.


దేవుడు విశాలమైనవాడని, ఆయనకు తెలియనిది ఏమిలేదని, ఆయనను మనము కోరవలసినది పరలోక

రాజ్యములో స్థానమని (మోక్షమని), తెలిసినవాడైతే తనను దేవుని యొద్దకు చేర్చుకొమ్మని అడగాలి. అట్లు పరవస్తు

ఏనాడు అడగలేదు. ఆయన దేవున్ని అడిగినది నా కొడుకుకు చపాతి కావాలంట, అన్నమువద్దంట, మా వద్ద గోదుమ


అడుగుడి

పిండిలేదు ఎలాగైన మాకు గోదుమపిండి లభ్యమయ్యేట్లు చేయమని కోరాడు. మరొక మారు నా కొడుక్కు స్కూలు

ఫీజుకు పుస్తకములకు వెయ్యిరూపాయలు డబ్బు కావాలని కోరాడు. ఒకమారు పిల్లవానికి పాలడబ్బా అయిపోయింది

ఎలాగైన పాలడబ్బా కావాలి దయచేయుము అని కోరడము జరిగినది. పరలోకాధిపతియైన దేవున్ని పరలోక సంబంధ

మైన కోర్కెలు కోరాలిగాని అట్లుకాక చిన్న చిన్న ప్రపంచ కోర్కెలు కోరుతుంటే అవి నెరవేర్చుటకు ఆయనేమైన మన

సేవకుడా! మనము దేవుని సేవకులుగ ఉండాలి కాని దేవున్నే మన సేవకునిగా భావించుకో కూడదు.

ఇచ్చెదను అను మాటను దేవుడు చెప్పినప్పటికి, అడిగిన వానికి ఇవ్వబడునని చెప్పినప్పటికి ఆయన అడగమన్నది

జ్ఞానము కాని ప్రపంచ కోర్కెలుకాదు. ప్రపంచములో ఏది ఎవనికి దొరకవలెనో అది ముందే నిర్ణయించబడియుండును.

ప్రపంచ విషయములు వెదకకనే దొరుకును. దేవుని విషయములు వెదికితేనే దొరుకును. అందువలన కొంత

జ్ఞానము తెలిసినవారు ప్రపంచ విషయములను కోరక, దేవున్ని దేవుని విషయములనే కోరుదురు.


భూమిమీద ఎంతో తెలిసినట్లు కనిపించువారు కూడ దేవుని జ్ఞానమును కోరక ప్రపంచ కోర్కెలను కోరుచుందురు.

కొందరు ఎంత బీదవారైనప్పటికి తమకు దేవుని జ్ఞానమే కావలెనని దేవున్ని కోరు చుందురు. ఈ విధముగ లెక్కించి

చూచితే దేవున్ని ప్రార్థన చేసినప్పటికి కొందరు ప్రపంచకోర్కెలను కోరువారు, మరికొందరు పరలోక రాజ్యములో

స్థానమును కోరువారు రెండు విధముల కనిపించుచున్నారు. ఇటువంటి రెండురకముల కోర్కెలు కోరువారిని రెండు

తెగలుగ విభజించవచ్చును. ఒక తెగ పాము సంతతని, రెండవ తెగ పక్షిసంతతని చెప్పుకోవచ్చును. బైబిలులో కూడ

పాము, పక్షి అను రెండుమాటలు గలవు. బాప్తిస్మము ఇచ్చు యోహాను అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి సర్పసంతానమా

అన్న మాటగలదు. అపుడే ఏసుప్రభువు వచ్చి యోహాను వద్ద బాప్తిస్మము పొందినపుడు పరిశుద్దాత్మ పావురము

ఆకారముతో ప్రభువు మీదకు దిగెను అని కూడ గలదు. ఇచట ప్రస్తావించబడిన పాము అజ్ఞాన ప్రజల ఎడలను,

అలాగే పక్షి జ్ఞానవంతుడైన ప్రభువు ఎడల చెప్పబడియున్నది. అలా ఎందుకు చెప్పారో వివరించుకొని చూచినట్లయితే

పాము పక్షి రెండు బద్దశత్రువులు. పాము శరీరమంతటని భూమికి అంటించి, భూమిమీదనే ప్రాకుచుండును. భూమి

స్పర్శలేకుండ ఎప్పటికి లేదు. భూమికి పైన ఆకాశము గలదు. పక్షి ఎల్లపుడు ఆకాశములోనే ఎగురుచు

పయణించుచుండును. పక్షి జాతియంతయు భూమికి పైన చెట్లమీద గాని అకాశములోగాని ఉండును. పాము

ఎప్పుడు క్రింద, పక్షి ఎల్లపుడు పైన ఉండును. అదే విధముగనే అజ్ఞానముకంటే గొప్పగ ఉన్నత స్థితిలో జ్ఞానముండును.

కావున అజ్ఞానము పాముగ, జ్ఞానమును పక్షిగ వర్ణించి చెప్పగలుగుచున్నాము. మాయను (సాతాన్) సర్పముగ, దేవుని

ఆత్మను పక్షిగ (పావురముగ బైబిలులో కూడ చెప్పారు. పాముకు పక్షికి శత్రుత్వమున్నట్లే అజ్ఞానులకు జ్ఞానులకు

కూడ భూమిమీద విరుద్దముగానే ఉండును. జ్ఞానుల పనులన్నియు అజ్ఞానులకు వ్యతిరేఖముగ కనిపించు చుండును.

పక్షి అప్పుడప్పుడుగాని ఎప్పుడైనకాని భూమిమీదకు దిగవచ్చును కాని పాము మాత్రము ఎప్పటికి పైకి ఎగరలేదు. ఆ

విధముగనే జ్ఞాని ఎప్పుడైన కొంత అజ్ఞానిగ మారుటకు అవకాశమున్నది కాని అజ్ఞాని జ్ఞానిగమారడము చాలాకష్టము.

క్రింద భూమి మీదున్న పాము పైనున్న పక్షికంటే నేను చాలా పొడవుగా ఉన్నానని, పక్షి నాకంటే చిన్నదనుకొనుచుండును.

ఆ విధముగానే అజ్ఞాని జ్ఞానిని చూచి వానికంటే నేనే పెద్ద నాకే బాగా తెలియుననుకొనుచుండును. భూలోకము లోని

మనుషులు కూడ తమకు జ్ఞానము తెలియకుండినప్పటికి సంపూర్ణముగ తెలియునను ఉద్దేశములో మునిగియుందురు.

అటువంటి వారు ఎవరికి కనిపించని దేవుడు తమకు కనిపించాడని తమతో మాట్లాడాడని కూడ చెప్పుకొనుచుందురు.


ఆధ్యాత్మిక విద్యలో బలమైన కొండశిలువ అను పెద్దపామును మాయగ (సాతాన్ ) పోల్చిచెప్పారు. అట్లే

తెల్లని పావురమును ఆత్మగా, ఆత్మజ్ఞానముగ పోల్చి చెప్పారు. మనుషులు మాయలోనే ఎక్కువగ ఉన్నారు. మాయ

ప్రభావములోని మనుషులనందరిని సర్పసంతానమని కూడ చెప్పడము జరిగినది. మాయ మార్గములోని వారు

సర్పసంతానమైతే దేవుని మార్గములో నడుచువారందరు పక్షిసంతానమని చెప్పవచ్చును. ఇపుడు మనము పక్షిసంతానమా

లేక పాముసంతానమా అని వెనుదిరిగి చూచుకోవలసిన అవసరమున్నది.


మేము ఇంతవరకు చెప్పినది మతాతీత జ్ఞానము. పరవస్తు సూర్యనారాయణరావుగారు హిందూమతమును

మరియు శ్రీకృష్ణున్ని కించబరచి వ్రాసినట్లు మేము ఎవరిని కించబరచడము లేదు. ప్రభువును దేవుడే అంటున్నాము.

అలాగే కృష్ణున్ని కూడ దేవుడే అంటున్నాము. ఒకే దేవుడు ముందు వెనుక పుట్టిన దానివలన, ఆయనను గుర్తించు

జ్ఞానము లేక పోవడము వలన, ప్రభువు వేరు, కృష్ణుడు వేరని చాలామంది అనుకొంటున్నారు. మేము అలా చెప్పక

ప్రభువు యొక్క ఆకారమును, కృష్ణునియొక్క ఆకారమును చూడక వారిలోని జ్ఞానమును చూడ మంటున్నాము. జ్ఞానదృష్టితో

చూస్తే ఇద్దరిది ఒకే జ్ఞానము అని తెలియుచున్నది. గ్రుడ్డివానికి ఏనుగు కాలు స్థంబమువలె, చెవు చేటవలె తెలిసినట్లు,

జ్ఞానదృష్టిలేనివారికి కృష్ణుడు వేరు ఏసుప్రభువు వేరని అర్థమగును. ఒకే ఏనుగుకున్న కాలును స్థంబమని, చెవును చేట

అని వేరువేరుగ చెప్పుకొన్నట్లు ఒకే దేవున్ని కృష్ణునిగా కొందరు ప్రభువుగ కొందరు విభజించుకొని చూస్తున్నారు.

రెండు రూపములు పరమాత్మ నుండి వచ్చినవేనని తెలిసినపుడే మతాతీత జ్ఞానము అర్థమగును.

నీవు హిందువైతే ఇప్పటినుండి ప్రభువును గురించి తెలుసు కొనుటకు ప్రయత్నించుము. ఒకవేళ నీవు

క్రైస్తవునివైతే ఇప్పటి నుండి కృష్ణున్ని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించుము. తెలుసుకోవడములో తప్పులేదు.

మతాలు మారడములో తప్పుకలదు. అలా తెలుసుకోవడము వలన క్రైస్తవులు కృష్ణున్ని దూషించరు. హిందువులు

ప్రభువును అసూయగ ద్వేషించరు. తెలుసుకోకపోవడము వలన క్రైస్తవులు కృష్ణున్ని దేవుడు కాదంటే, వారు నిజముగ

వారి ప్రభువునే దేవుడుకాదన్నట్లగును. అలాగే హిందువులు ప్రభువును దేవుడు కాదంటే వారు కూడ నిజముగ

కృష్ణున్నే దేవుడు కాదన్నట్లగును. ఎందుకనగా ఒకే దేవుడైన పరమాత్మ ఒకప్పుడు కృష్ణునిగ వచ్చి జ్ఞానమును తెలిపిపోయాడు.

అలాగే మరియొకప్పుడు ఏసుప్రభువుగ వచ్చి జ్ఞానమును తెలిపిపోయాడు. తర్వాత కూడ వస్తానన్నాడు. ఏసుకంటే

ముందు వచ్చినవాడు, ఏసు తర్వాత వచ్చువాడు ఒకే దేవుడు. ఆ దేవుడు ఏ పేరుతో ఎపుడు వస్తాడో ఎవరికి

తెలియదు. ఈ విషయమై మత్తయి సువార్త 11వ అధ్యాయములో 27వ వచనమునందు “తండ్రికాక కుమారుని

ఎవడును ఎరుగడు. కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించెనో వాడుగాకను మరి

ఎవడును తండ్రిని ఎరుగడు.” అని కలదు. ఇది ప్రభువు చెప్పినమాట.


బైబిలు భావము ప్రకారము తండ్రి అనగ పరమాత్మ (దేవుడు) అని అర్థము. కుమారుడనగా దేవుడు మనిషిగ

భూమి మీద అవతరించినపుడు ఆయనను కుమారుడు అని క్రైస్తవమతములో అందురు. హిందూమతములో దేవుని

అవతారమును భగవంతుడని అందురు. భగవంతుడనిన దేవుని కుమారుడనిన ఒకే అర్థము. దేవుడు మనిషిగ

ఎప్పుడు ఎక్కడ ఏ రూపములో పుట్టాడో మనుషులకు ఎవరికి తెలియదని భగవద్గీతలోను చెప్పబడినది. అలాగే

బైబిలులో కూడ చెప్పబడినది. దీని ప్రకారము ఇటు హిందువులకుగాని, అటు క్రైస్తవులకు గాని దేవుని జన్మను గురించి

తెలియదని చెప్పుచున్నాము. ఇపుడు కొందరు ఈ విధముగ ప్రశ్నించవచ్చును. "హిందూమతములో దశావతారములని

చెప్పి దేవుడు తొమ్మిది అవతారములుగ పుట్టాడని, పదియవ అవతారమైన కల్కి భగవాన్ పుట్టవలసియున్నదని


చెప్పుచున్నారు కదా!” అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఏదైన శాస్త్ర ఆధారముతో చెప్పవలెనని

ముందే చెప్పుకొన్నాము. దశావతార విషయము పురాణములలోనిది కాని శాస్త్రములోనిది కాదు. శాస్త్ర ప్రమాణములేని

అవతారములను సత్యమనుకోకూడదు. మరొకమాట ఏమనగా దశావతారములలో కృష్ణుని పేరు కూడ లేదు. దేవుని

పుట్టుకైన భగవంతుడు ఎవరైనది దేవునికే తెలియును మిగత వారికి తెలియదను భగవద్గీత వాక్యమునకు, తండ్రికాక

కుమారుని ఎవరు ఎరుగరు అను బైబిలు వాక్యమునకు వ్యతిరేకమైనవి దశావతారములని తెలియవలెను. దశావతారములు

నిజమైన పరమాత్మ అవతారములు కావు.


దేవుడు మనిషిగ వచ్చిపోయిన తర్వాత కూడ పలానావాడు భగవంతుడని గుర్తించలేకపోవుచున్న మనుషులు

భగవంతుడు (దేవుని కుమారుడు) భూమిమీద ఉన్నపుడు కనుగొనుట దుర్లభము. జ్ఞానమున్న వాడు తెలుసుకొనుటకు

ప్రయత్నించినప్పటికి ఆయన ఎదురుగ మనిషిగ ఉన్నపుడు అర్థము చేసుకొనుట చాలా కష్టము. మాయ భగవంతున్ని

తెలియకుండ చేయగలదు. ఆయన వచ్చిపోయిన తర్వాత ఇప్పటికి ఐదు వేల సంవత్సరములైన కృష్ణుడు పరమాత్మ

అవతారమని, రెండువేల సంవత్సరములైన ఏసుప్రభువు దేవుని అవతారమని మనుషులు తెలుసు కోలేకున్నారు. కొందరు

ప్రభువును దేవుడని ఒప్పుకొంటే మరి కొందరు ఒప్పుకోరు. అలాగే కొందరు కృష్ణున్ని దేవుడని చెప్పితె మరి కొందరు

ఏమాత్రము ఒప్పుకోరు. ఈ విధముగ దేవుడు భూమిమీదకు వచ్చిపోయిన తర్వాత వేల సంవత్సరములకు కూడ వారి

జన్మలను గురించి అవగాహన చేసుకోలేక పోవుచున్నాము. కొందరు కొంత జ్ఞానమును కల్గియున్నప్పటి కి

పరవస్తుసూర్యనారాయణవంటివారు అంతటితో ఊరుకోక, మాకు అంతా తెలుసుననుకొని, తాను నమ్మినవాడే దేవుడు

మిగతవారు కాదని ఒక అవతారమును పొగడుచు ఒక అవతారమును దూషించుచున్నారు. దీనివలన ఒకే దేవున్ని

కొంత పొగుడుచు కొంత దూషించినట్లగుచున్నది. దేవున్ని దేవుడు కాదనడము అజ్ఞానము కాక జ్ఞానమగునా?


శ్రీకృష్ణుడు, ఏసుప్రభువు యొక్క ఆకారములు, పేర్లు, పుట్టిన దేశములు, నడచిన ప్రవర్తనలు, వేసుకొన్న

అలంకారములు వేరు వేరైనప్పటికి ఇద్దరు చెప్పిన జ్ఞానము ఒక్కటేనని మొత్తము మానవాళికి తెలియకుండ పోయినది.

అందువలన ఇద్దరు ఒకే దేవుడని ఎవరు ఒప్పుకోలేకపోవుచున్నారు. మనుషులందరికి తెలియని విషయము మీకొక్కనికే

తెలిసిందా అని మాయ మీలో అనుమానము తెప్పించగలదు. దానికి జవాబుగ నేనే మనుచున్నానంటే బైబిలులో

చెప్పినట్లు తండ్రికాక కుమారుని ఎవరు ఎరుగరు అన్న సూత్రము ప్రకారము దేవుని అవతారము ఎవనికి తెలియదని

చెప్పుచున్నాను. అలాగే కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయను (దేవున్ని) బయలుపరచనుద్దేశించెనో అనగా

భగవంతుడు దేవున్ని గురించి ఎవరికి తెలియబరచవలెననుకొనెనో వాడుతప్ప దేవున్ని ఎవరు ఎరుగరు అను మాటప్రకారము

దేవుని విషయము భగవంతునికి తెలియును. అట్లే భగవంతుడు దేవున్ని గురించి ఎవనికి బయలుపరచి తెలియజేయునో

వానికికూడ దేవున్ని గురించి తెలియును. దీని సారాంశము బాగ అర్థము కావాలంటే!

1) దేవుని అవతారము ఏదైనది దేవునికే తెలియును.

2) దేవుడెవడైనది దేవునవతారమైన భగవంతునికి మరియు భగవంతుడు ఎవనికి దేవున్ని గురించి తెలియజేశాడో

వానికి తెలియునన్నాడు.


ఇక్కడ రెండవ సూత్రము ప్రకారము భగవంతుడు భగవద్గీతలోను బైబిలులోను నాకు తెలియజెప్పిన దానిప్రకారము

దేవుని విషయము కనుగొనగలిగానని తెలుపుచున్నాము. దేవున్ని గురించి తెలిసితే దేవుని అవతారమును గురించి


సులభముగ తెలియవచ్చును. కావున దేవుని అవతారములు ద్వాపరయుగములో కృష్ణుడు, కలియుగములో ఏసుప్రభువని

చెప్పుచున్నాము.


బైబిలులోను, భగవద్గీతలోను చెప్పినది నీకొక్కనికేనా అని కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము

ఏమనగా! చెప్పినది ఎంతమందికి అన్నది ప్రశ్నకాదు. అర్థమైనది ఎవరికి అన్నది ప్రశ్న. బైబిలుగాని, భగవద్గీతగాని

ఎవరికి వాస్తవముగ, నిజమైన అర్థముతో సంశయములు లేకుండ అర్థమగునో వానికే దేవుని కుమారుడైన భగవంతుడు

దేవున్ని గురించి తెలియజేసినట్లు అని తెలుసుకోవాలి. సంస్కృత పండితులై స్వాములైనంతమాత్రమున భగవద్గీత,

ఫాదర్లు పాష్టర్లు అయినంతమాత్రమున బైబిలు అర్థమైనదనుకోవడము పొరపాటు. నిజమైన దేవుని జ్ఞానము అర్థమైవుంటే

కృష్ణున్ని గురించి క్రైస్తవులు, ప్రభువును గురించి హిందువులు వ్యతిరేకించరు. పరవస్తు సూర్య నారాయణరావు కృష్ణున్ని

గురించి తక్కువగ చెప్పాడంటే ఆయనకు ప్రభువు స్వయముగ కనిపించి మాట్లాడినాడన్నది పూర్తి అసత్యమని

తెలియుచున్నది. ఇప్పటికైన మానవుడు కళ్లుతెరచి మాయలో పడిపోక దేవున్ని గురించి తెలుసుకోవాలని, దేవుని

అవతారములను అవహేళనగా మాట్లాడకూడదని తెలుపుచున్నాము.


దేవుని విలువను తగ్గించు ఏ బోధను మేము ఒప్పుకోము, దేవుడు ఏ కాలములో చెప్పిన, ఏ దేశములో చెప్పిన,

ఏ అవతారములో చెప్పిన అది మానవుని ఉద్దరించు ఒకే బోధగయుండును. దేవుడు విశ్వము అంతటికి అధిపతి,

కావున ఆయన బోధ విశ్వమంతటికి ఒకే విధముగ ఉండును. దేవుని విధానమును అర్థము చేసుకోలేని మనుషులు

దేవుని బోధను ఒక్కొక్క మతములో ఒక్కొక్క విధముగ అర్థము చేసుకొన్నారు. ఉదాహరణకు దేవుని ఒకే విధానమును

హిందూమతములో ఒక విధముగ, క్రైస్తవమతములో మరొక విధముగ అర్థము చేసుకొని, దేవుని విలువకు భంగము

కలుగునట్లు బోధించిన విషయమును వివరించు కొని చూస్తాము. దేవుని విధానములను హిందూమతములో ధర్మములని,

క్రైస్తవమతములో ఆజ్ఞలని చెప్పుకొంటున్నాము. దేవుడు మనుషులకు చెప్పినవన్ని ఆయన ఆజ్ఞలు లేక ఆయన ధర్మములని

చెప్పవచ్చును. హిందూమతములోని భగవద్గీతలో అతి ముఖ్యమైన దేవుని ధర్మమును వక్రీకరించి హిందువులు చెప్పుకోగా,

క్రైస్తవమతములోని బైబిలులోగల అదే ధర్మమును క్రైస్తవులు వక్రీకరించి చెప్పుకోవడము జరిగినది. రెండు గ్రంథములలోని

ఒకే ధర్మమును రెండు మతములవారు ఎవరంతకు వారు సక్రమముగ చెప్పుకొన్నట్లే తలచుచుండినప్పటికి, రెండు

మతముల వారికి అది ఒకే ధర్మమని కూడ తెలియదు. రెండు మతములలోను సత్యమునకు దూరముగ చెప్పుకొన్న ఆ

ఒక ధర్మము ఏమిటో వివరించుకొని చూస్తాము.


ఉదాహరణకు ఒక పోట్లాట జరుగుచున్నదనుకొందాము. ఆ పోట్లాటలో ఇద్దరు ఒకని మీదికి దాడిచేసి

కొట్టుచున్నారు. ఆ కొట్లాటలో కొట్టువారు ఇద్దరు, కొట్టించుకొనువాడు ఒకడు. కావున పోట్లాటలో పాల్గొన్నవారు

మొత్తము ముగ్గురని ఎవరైన సులభముగ చెప్పవచ్చును. అలా కాకుండ అందులో ఉన్నది ఇద్దరే అని ఎవరైన అంటే

అంతకంటే అసత్యముగాని, తెలివితక్కువమాటగాని లేదని చెప్పవచ్చును. ప్రపంచ విషయములలో చిన్నపొరపాటును

కూడ గుర్తించి చెప్పగలుగు మనుషులు దేవుని విషయములో మాత్రము పెద్దపొరపాటును కూడ గుర్తించ లేకపోవుచున్నారు.

పావు, అర్థశేరు, శేరుకు తేడా చెప్పగలుగు మనిషి దేవుని జ్ఞానములో చిన్న రవ్వరేణువుకు, పెద్దరాయికి తేడాను

కనుగొన లేకపోవుచున్నాడంటే, నిజముగ దేవుని విషయములో గ్రుడ్డి వాడనియే చెప్పవచ్చును. ప్రపంచములో నిశితమైన

చూపు, నిశితమైన తెలివియున్న మనిషి దైవమార్గములో ఆ చూపును, ఆ తెలివిని కోల్పోవుచున్నాడు. ఈ విధముగ


చెప్పితే ఇంతవరకు మానవుని బుద్ధికి అర్థముకాని ఒక విషయము భగవద్గీతలోను, బైబిలులోను గలదని అక్కడ

మానవుని బుద్ది ఏమాత్రము పని చేయలేదని చెప్పవచ్చును.


అదేమనగా! ముందు హిందూమతములోని భగవద్గీతలో చూచినట్లయితే పురుషోత్తమ ప్రాప్తియోగమను

అధ్యాయములో 16వ శ్లోకమునందు "ద్వావిమౌ పురుషాలోకే క్షర శాక్షర ఏవచ, క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే”

17వ శ్లోకమునందు "ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః, యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః అని

గలదు. ఈ రెండు శ్లోకముల యొక్క అర్థములో దేవుని యొక్క సిద్ధాంతపరమైన ముఖ్యమైన ధర్మములు గలవు.

ముఖ్యమైన ధర్మములు గల ఈ శ్లోకముల యొక్క అర్థములు ఇంతవరకు మానవుని బుర్రకు అందలేదు. బోధకులు,

స్వాములు, గురువులు, పీఠాధిపతులు అయిన వారికి ఎవరికి ఈ విషయము అర్థముకాక గీతలోని ఈ శ్లోకములకు

భావములను తప్పుగా వ్రాసుకొన్నారు. ముగ్గురి పోట్లాటలో ఇద్దరే ఉన్నారనుట ఎంతతప్పో అంతే తప్పుగ ఈ వివరములను

చెప్పుకొన్నారు. ఈనాటికి భగవద్గీతలో గల ఈ శ్లోక వివరములను వ్రాసినవారు, చదివినవారు ఏమి తప్పుగలదని

గ్రహించలేక పోవుచున్నారు. ఈ శ్లోకము లలో దేవుని ముఖ్యమైన ధర్మములు కలవని మనిషి గ్రహించలేకపోయాడు.

పై రెండు శ్లోకములలో ఇద్దరు పేరున్న పురుషులను, ఒక పేరులేని పురుషున్ని గురించి చెప్పారు. పేరున్న వారు

ఇద్దరు, పేరులేనివాడు ఒకడని సులభముగ తెలియుచున్నప్పటికి, ఇక్కడ ఉన్నది ఇద్దరు పురుషులేనని చెప్పుకోవడము

విడ్డూరము కాదా! ఇక్కడున్నది ముగ్గురు కదా అని నిలదీసి అడిగితే ఇద్దరు పురుషులు ఒక స్త్రీ అని చెప్పడము కూడ

జరిగినది. స్త్రీ అను పదము శ్లోకములలో లేనప్పటికి, ఇద్దరు మరియొకరని ఉన్నప్పటికి, ముగ్గురు ఎవరను వివరము

తెలియక ఇద్దరు పురుషులతో సర్ది చెప్పుకొని దేవుడు తెలియచెప్పిన మాటకు విలువ లేకుండ చేశారు.



అలాగే క్రైస్తవమతములో బైబిలు క్రొత్తనిబంధనయందు మత్తయి సువార్త 22వ అధ్యాయమందు

36,37,38,39, 40 వాక్యములలో పరిశయ్యుడు ఏసుప్రభువును శోధించుచు అడిగినది ఈ విధముగ గలదు.

"బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ

పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలయుననునదే, ఇది ముఖ్యమైనదియు,

మొదటిదియైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు

ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని అతనితో చెప్పెను.” ఏ విధముగ గీతలోని రెండు

శ్లోకములకు హిందువులవద్ద సరియైన అర్థము ఇంతవరకు లేదో, అదేవిధముగ బైబిలులోని ఈ వాక్యములకు కూడ

ఇంతవరకు క్రైస్తవులవద్ద సరియైన అర్ధము లేదనియే చెప్పవచ్చును. దేవుని ఆజ్ఞలలో ముఖ్యమైనవి ఈ రెండని

స్వయముగ ఏసుప్రభువు చెప్పాడు. ప్రభువే ముఖ్యమని, మొదటి ఆజ్ఞలని చెప్పినపుడు వాటిని గొప్పగ ఆలోచించి

చూడక సులభముగ అర్థము చేసుకోవడము పొరపాటు. ప్రభువు చెప్పిన మాటలను లోతుగ యోచించిచూచితే ఒకటి

దేవుడైన ప్రభువును ప్రేమించవలెనని చెప్పడము, రెండు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుమని చెప్పడము జరిగినది.

ఈ రెండు మాటలలో ఒకటి దేవుడని అర్థమైనది, రెండవది పొరుగువాడని అర్థమైనది, మూడవవాడు మనిషిగ ఉన్నవాడు.

ఇందులో మూడు పాత్రలు గలవు. ఒకడు ప్రేమించువాడు, ఇద్దరు ప్రేమింపబడువారు. ప్రేమించవలసిన వాడు

సజీవమైన మనిషికాగ, ప్రేమింపబడువారు ఇద్దరు, అందులో ఒకరు దేవుడు అనుకొందాము. ఇంతవరకు సవ్యముగనే

ఉన్నది. ప్రేమింపబడవలసిన మరియొకడు నీ పొరుగువాడు. ఈ పొరుగు వాడెవడన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. మా

లెక్కలో పెద్దప్రశ్నగా ఉన్నప్పటికి అందరి లెక్కలో ఇది ప్రశ్నేకాదు. పొరుగు వాడంటే అందరి జవాబు ప్రక్కన


కాపురమున్నవాడని లేక తన ప్రక్క నివాసము చేయు కంటికి కనిపించు మనిషని అర్థము. ఈ అర్ధముతో ఆ రోజు

ప్రభువు చెప్పియుంటే అసలు సమస్యేయుండదు. కాని ఆ రోజు ప్రభువు అంత సులభముగ చెప్పలేదు.


మొదటి ఆజ్ఞలో దేవుడైన ప్రభువును ప్రేమించుము అన్నాడు. నేను దేవుడనైన ప్రభువును, నన్ను ప్రేమించమని

ఆ రోజు చెప్పలేదు. దేవుని ముఖ్యమైన ఆజ్ఞలేమిటి అని అడిగినది ఆనాటి అజ్ఞానులైన పరిశయ్యులు. ఆనాడు వారు

ఏసు గొప్పవాడని విశ్వశించి ఆయనను అడుగలేదు. ఆయనను శోధించుటకు అడిగిన మాటలేకాని ఆయన మీద

గౌరవముతో అడుగలేదు. అటువంటివారికి నేను దేవుడనని ప్రభువు చెప్పడు, చెప్పిన వారువినరు. ఆనాడు పరిశయ్యులు

అడిగినది, ప్రభువు చెప్పినది దేవుని ఆజ్ఞలు. అందులో మొదటి వాక్యము నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణమనస్సుతో

దేవుడైన ప్రభువును ప్రేమించుము అన్నాడు. కాని ఎదురుగవున్న నన్ను ప్రేమించుము అనలేదు. దేవుడు అందరికి

ప్రభువే కావున కనిపించని దేవున్ని ప్రేమించడము దేవుని మొదటి ఆజ్ఞ. ఇక్కడ బాగా అర్థము చేసుకోవలసిన

అవసరమున్నది. ప్రేమించవలసినవాడు జీవుడు, ప్రేమించబడవలసినవాడు దేవుడు. మొదట తనను గూర్చి తాను

తెలుసుకొంటే తర్వాత దేవున్ని గురించి, తన పొరుగువానిని గురించి తెలియును.


ప్రతి మనిషికి ప్రపంచములో జవాబు వెతకవలసిన ప్రశ్నలు మూడుగలవు. ఒకటి నేనెవరు? రెండు నా

ప్రక్కవాడెవడు? మూడు దేవుడెవరు? మొదటి ప్రశ్నకు జవాబు దొరికితె మిగత రెండు ప్రశ్నలకు జవాబు కొంత

ఆలస్యముగనైన దొరుకగలదు. ఈ మూడు ప్రశ్నలను మిలితము చేసి ప్రభువు బైబిలులో తన ఆజ్ఞలయందు నీవు, నీ

పొరుగువాడు, దేవుడు అను ముగ్గురిని ప్రస్తావించాడు. ఇదే విషయమే భగవద్గీతలో ఒకడు క్షరుడు, రెండవవాడు

అక్షరుడు, మూడవవాడు ఇద్దరికంటే ఉత్తమమైన దేవుడు అన్నాడు. దేవున్ని అటుంచి చూచితే క్షరుడెవడో, అక్షరుడెవడో

ఐదువేల సంవత్సరములనుండి హిందువులకు అర్థముకాలేదు. అట్లే నీవు, నీ పొరుగువాడు అనుటలో నేనెవరు?

నా పొరుగువాడెవడు? అనునది రెండు వేల సంవత్సరములనుండి క్రైస్తవులకు అర్థముకాలేదు. క్షరుడెవడో, అక్షరుడెవడో

మాకు తెలుసునని ఇంతవరకు హిందువులు అనుకుంటున్నట్లు, క్రైస్తవులు కూడ నేను తెలుసు, నాపొరుగు వాడు

తెలుసు అనుకొంటున్నారు. మాకు తెలియునను కొనువారికి తెలుసుకోవలసిన అవసరముండదు. తెలియదను కొనువారికి

తప్పక తెలుసుకోవలసిన అవసరమున్నది. కనుక గీతలో చెప్పిన ఆ ముగ్గురు ఎవరో, అట్లే బైబిలులో చెప్పిన ఆ

ముగ్గురు ఎవరో, దేవుని జ్ఞానముతోనే వివరించుకొని సరియైన సమాధానము తెలుసుకొందాము.


మన శరీరములో శరీరముతో నిత్యము పనులు జరుగుచున్నవి. ఆ పనులలో మనకు తెలిసి కొన్ని తెలియక

కొన్ని జరుగుచున్నవి. నడువడము, మాట్లడడము, తినడము, పనులుచేయడము ప్రతి మనిషికి తెలిసి జరుగుచున్నవి.

తిన్నది జీర్ణము కావడము, శ్వాస ఆడడము, గుండె కొట్టుకోవడము, మూత్రపిండముల పని మనకు తెలియకుండనే

జరుగుచున్నవి. నీవు చేయకుండినప్పటికి నీ శరీరములో జరిగెడి పనులు చాలా కలవు. నీకు తెలియకుండ, నీవు

చేయకుండ ఆ కొన్ని పనులు ఎవరు చేయుచున్నారని ప్రశ్నించుకుంటే, నీ శరీరములో నీవుకాక నీతోపాటు ఇంకొకరున్నారని

తప్పక తెలియును. ఇది కొంత విచిత్రముగ తోచినప్పటికి నీవుకాక నీ శరీరములో నీ మనస్సొకటికలదు. మనస్సు

అందరికి ఉంటుందని అందరు ఒప్పుకుంటారనుకుంటాను. ఎందుకనగ ప్రతి ఒక్కరు నాకు మనస్సు ఉంది అంటుంటారు.

శరీరములో నీవు వేరు, నీ మనస్సువేరు, కావున మనస్సును నా మనస్సు అంటున్నాము. అలాగే నీవు వేరు నీ

ఆత్మవేరుగ ఉన్నది. కావున నా ఆత్మ అని, నా ఆత్మసాక్షిగ అనికూడ అంటుంటాము. శరీరములో అన్ని పనులు

చేయునది ఆత్మ. నీవంటు ఒకనివుంటే, నీ ఆత్మంటు మరియొకటి ఉంటుంది. నిన్ను జీవాత్మ అంటారు, నీ వెనుక


తెలియకుండవున్న దానిని ఆత్మ అంటారు. నీవు ఎక్కడవుంటే నీతోపాటు నీ ఆత్మ అక్కడే ఉంటుంది. నీవుకాక, నీ

ఆత్మకాక, మరియొకటి గలదు అదియే పరిశుద్దాత్మ, దానినే దేవుడు అంటున్నాము. మత్తయి సువార్తలో చెప్పిన దేవుని

మొదటి ఆజ్ఞలో నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో అనివుంది కదా! ఇక్కడ బాగా యోచిస్తే నీవు, నీ ఆత్మతో కలిసి

దేవుని ప్రేమించ వలెనని అర్థము కాగలదు. నీవు నీ ఆత్మతో కలిసి అన్నపుడు ఇద్దరు కలిసి మూడవవాడైన దేవున్ని

ప్రేమించవలెనని అర్ధము. మూడవవాడైన దేవుడు విశ్వమంత వ్యాపించి అణువణువున నిండియున్నాడు. ప్రేమించువాడైన

నీవు, నీ ఆత్మ ఒక శరీరములో మాత్రమున్నారు. నీవు శరీరములో కొంత కాలముండి శరీరమును వదలి పోవుచున్నావు.

నీతోపాటు నీ ఆత్మకూడ నీ వెంటనేవుండి, నీ వెంటనే వస్తున్నది. నీ శరీరములో నీతోపాటు యుంటు, నీతోపాటు ఎన్నో

పనులు చేసిపెట్టుచున్న నీ ఆత్మే ఎల్లపుడు నీ పొరుగువాడు లేక నీ ప్రక్కనుండువాడు. అందువలన నీవలె నీ పొరుగువానిని

ప్రేమించుమని రెండవ ఆజ్ఞలో కలదు. అపుడు ఆ మాట ప్రకారము నీవు వేరు, నీ ఆత్మవేరని తెలియుచున్నది. కదా!

నీవు జీవాత్మవు, నీ పొరుగువాడు ఆత్మ. నీవు నీ ఆత్మతోసహ దేవుని ప్రేమించినట్లే, నీలోని ఆత్మను కూడ ప్రేమించుమని

ప్రభువు వాక్యములో అర్థముగలదు. నేడు మానవుడు పై చూపే చూచి, పై అర్ధమునే పొందుట వలన తనెవరో తనకే

తెలియలేదు. అలాగే తన ఆత్మ ఎవరో కూడ తెలియలేదు. చివరకు దేవుడెవరో ఆయన విస్తీర్ణమేమిటో కూడ తెలియ

లేదు. తాను పలానా పేరున్న మనిషినని భౌతికముగ అర్థము చేసుకొని, భౌతికముగ బయటగల మనుషులను తన

పొరుగువారిగ గుర్తించుచున్నాము. ఆత్మపరముగ కాకుండ భౌతికముగ అర్థము చేసుకోవడము వలన ప్రభువు చెప్పిన

జ్ఞానము మనకు పూర్తిగ అర్థము కాకుండపోయినది. ఇదే విధముగ గీతలో చెప్పిన క్షర అక్షర పురుషోత్తములు

హిందువులకు అర్థము కాలేదు. అక్కడ కూడ ఆత్మపరముగ అర్థము చేసుకొంటే క్షరుడు అనగ జీవాత్మ అనియు,

అక్షరుడు అనగ ఆత్మ అనియు, పురుషోత్తముడనగ పరమాత్మ అనియు తెలియగలదు. హిందువులు క్షరుడనగ శరీరమని,

అక్షరుడనగ జీవుడని, పురుషోత్తముడు అనగ దేవుడని వ్రాసుకొన్నారు.. అలా వ్రాసుకోవడము, చెప్పుకోవడము వలన,

మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మ స్థానములో ప్రకృతితో కూడుకొన్న శరీరమును చేర్చుకోవడము వలన, అక్షరునిగ

జీవాత్మను చెప్పుకోవడము వలన, మధ్యలోని ఆత్మ తెలియకుండ పోయినది. హిందూమతములో దేవుడు తన గీతయందు

ముగ్గురు పురుషులను (ఆత్మలను) చెప్పితే మనుషులు ఇద్దరు పురుషులను మాత్రము చెప్పుకొన్నారు. ఒక పురుషున్ని

గల్లంతు చేశారు. దైవజ్ఞానములో మొదటి సూత్రమైన మూడు ఆత్మల విషయము తెలియని దానివలన గీత మొదటికే

అర్థము కాకుండ పోయినది. నేటికిని హిందువులకు జీవాత్మ పరమాత్మ తప్ప ఆత్మ వివరము నామమాత్రముగ కూడ

లేదు.


దేవుడు గీతయందు తెల్పిన ధర్మములలో అతి ముఖ్యమైన ధర్మము ఆత్మల వివరము. పూర్తిగ ఎక్కాలు

(సంఖ్యలు) రానిది లెక్కలు ఎట్లు చేయలేమో అట్లే మూడు ఆత్మల వివరము తెలియనిది దైవజ్ఞానము తెలియదు.

కావున నేటికి గీత చాలామందికి తెలియలేదు. త్రైత సిద్ధాంత భగవద్గీతలో మేము తప్ప మూడు ఆత్మల వివరము

ఎవరు ఇంతవరకు వ్రాయలేదు. హిందువులు మూడు ఆత్మలలో ఒక ఆత్మను వదలివేసినట్లు క్రైస్తవులు జీవాత్మను,

ఆత్మను రెండిటిని వదలి ఒక పరమాత్మను మాత్రము చెప్పుకొంటున్నారు. జీవాత్మను ఒక మనిషిగ, ఆత్మను ప్రక్క

మనిషిగ లేక పొరుగువానిగ భౌతికముగ లెక్కించుచున్నారు. అందువలన బైబిలోగల ప్రభువు వాక్యములలోని సారాంశము

క్రైస్తవులకు కూడ బాగా అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుడు గీతలోను, బైబిలులోను సందర్భానుసారము

మూడు ఆత్మలను గురించి చెప్పితే, రెండిటిలోను ఒకే విధానమున్నదని తెలియక పోవుటవలన, ఆత్మల వివరములు

ఏమాత్రము తెలియకుండ పోయినవి. దేవుని జ్ఞానమైన గీత హిందువులకు, బైబిలు క్రైస్తవులకు అర్థము కాక, చెప్పిన


వాక్యములలోని సారాంశమును అర్థము చేసుకోలేక, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరనుకోవడము పొరపాటు కాదా!

ఇప్పటికైన మతాతీత దేవుని జ్ఞానమును అర్థము చేసుకొంటే దేవుడు అందరివాడని, అందరికి అధిపతి దేవుడొక్కడే అని

తెలియగలదు. అసలైన దేవుని జ్ఞానము అర్థమైతే మతద్వేషములు రావు.


భౌతిక శరీరము ఆధ్యాత్మిక విద్యలో ఒక పరికరములాంటిది. శరీరములో నివశించు ఆత్మలను ఆధ్యయణము

చేయడమును ఆధ్యాత్మికము అంటున్నాము. శరీరములో నివసించు జీవాత్మ విశ్వమంతట నివసించు దేవున్ని తెలుసుకోను

విద్యను ఆధ్యాత్మిక విద్య లేక బ్రహ్మవిద్య అంటున్నాము. దేవున్ని తెలుసుకొనుటకు బ్రహ్మవిద్య ఉన్నట్లు, ప్రపంచమును

తెలుసుకొనుటకు ప్రపంచ విద్యలు కూడ కలవు. ఏ విద్యకైన శాస్త్రము ప్రాణమువంటిది. ప్రపంచవిద్యను తెలుసుకొనుటకు

ఐదు శాస్త్రములు గలవు. అట్లే దేవుని ఆధ్యాత్మిక విద్యను తెలుసు కొనుటకు బ్రహ్మవిద్యాశాస్త్రము ఒక్కటి గలదు.

పంచభూతములతో తయారైన ప్రపంచమునకు 1) గణితశాస్త్రము 2) ఖగోళశాస్త్రము 3) రసాయనకశాస్త్రము

4) భౌతికశాస్త్రము 5) జ్యోతిష్యశాస్త్రము అను ఐదు శాస్త్రములు గలవు. శాస్త్రము అనగ శాసనములతో కూడుకొని ఉండును.

ఉన్నదని అర్థము. శాసనము అనగ జరిగితీరునది అని అర్థము. శాసనములు సిద్ధాంతములతో కూడుకొనియుండును.

నిరూపణకు వచ్చునది సిద్ధాంతము. సిద్ధాంతపరముగ తెలియజెప్పబడిన శాసనములతో కూడు కొన్న దానిని శాస్త్రము

అంటాము. దీనిని బట్టి పుస్తకములన్ని శాస్త్రములు కాదని, పుస్తకములలో వేదములు, ఉపనిషత్తులు, పురాణములు,

ఇతిహాసములు (చరిత్రలు), కావ్యములు అనునవి ఎన్నో గలవని తెలియు చున్నది. ప్రపంచములో ఎన్నో లక్షల

పుస్తకములలో కొన్ని మాత్రమే శాస్త్రములని, వాటిలో భగవద్గీత మరియు బైబిలు బ్రహ్మవిద్యా శాస్త్రములని తెలియుచున్నది.



కొన్ని సిద్ధాంతములతో కూడుకొన్నది శాస్త్రమైనప్పటికి, శాస్త్రములో కొన్ని మూలసిద్ధాంతములు ప్రత్యేకముగ

అటువంటి మూల సిద్ధాంతములు శాస్త్రమంతటికి ముఖ్య ఆధారమైయుండును. శాస్త్రము తెలిసిన

శాస్త్రులకు ఆ ముఖ్య సిద్ధాంతములు మొదట తెలిసియుండవలెను. ఉదాహరణకు గణితశాస్త్రములో 0 నుండి 9

వరకు ఉన్న పది అంకెలు చాలా ముఖ్యమైనవి. ఈ పది అంకెలతోనే గణితశాస్త్రమంత ఆధారపడి ఉన్నది. గణితశాస్త్రములో

ఎన్నో సిద్ధాంతము లతో కూడుకొన్న లెక్కలుండినప్పటికి వాటన్నిటికి మూల ఆధారము సున్న నుండి తొమ్మిది వరకు

గల అంకెలేనని తెలియుచున్నది. అలాగే దేవునికి సంబంధించిన శాస్త్రములో ఎన్నో సిద్ధాంతములుండినప్పటికి వాటన్నిటికి

ఆధారమైన ముఖ్యమైన సిద్ధాంతము కలదు. అదియే త్రైత సిద్ధాంతము. త్రైతము అనగ మూడు, ఆ మూడు ఏవి అను

విషయమును భగవద్గీతలో రెండు శ్లోకములుగ, బైబిలులో రెండు వాక్యములుగ దేవుడు భగవంతుని రూపముతో

చెప్పాడు. గీతలో చెప్పిన రెండు శ్లోకములలోని విషయములు భగవద్గీతకు ఆధారమైన ధర్మములుగ ఉన్నవి. అలాగే

బైబిలులో చెప్పిన రెండు వాక్యములు రెండు ఆజ్ఞలుగ (ధర్మములుగ) ఉన్నవి. ఈ రెండు ఆజ్ఞలు శాస్త్రమునకు ఆధారమని

స్వయముగ ఏసుప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 40వ వచనములో “ఈ రెండు అజ్ఞలు

ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని అతనితో చెప్పెను" అని కలదు. బోధగయున్న శాస్త్రమునకు,

బోధించు ప్రవక్తలకు కూడ ఆధారమైయున్నవంటే ఈ ధర్మములు చాలా ముఖ్యమైనవని చెప్పకనే తెలియుచున్నది.


శాస్త్రములకు వెలుగు, ప్రవక్తలు బోధించుటకు ఆధారమైన ముఖ్య సూత్రములను ఏ మతములోను మనుషులు

ఎవరు ప్రాముఖ్యముగ తీసుకోలేదు. ప్రవక్త (భగవంతుడు) అయిన శ్రీకృష్ణుడు, ఏసుప్రభువు ఇటు గీతయందు, అటు

బైబిలుయందు ముఖ్యధర్మములుగ ఏ వాక్యములను చెప్పారో, సిద్ధాంతములైన ఆ దైవవాక్కులను గీతలో బైబిలులో


చెప్పకముందే జగత్తు పుట్టినపుడే పరిశుద్ధాత్మయు, పరమాత్మయు నైన దేవుడు ప్రతి మనిషి యొక్క హస్తములో

గీతలరూపములో ముద్రించి పంపాడు. ప్రతి మానవుని హస్తములోను ముఖ్యముగ మూడు రేఖలు ఉండును. దేవుడు

తన గ్రంథములలో తెల్పిన సిద్ధాంతమును మేము త్రైత సిద్ధాంతమని అంటున్నాము. మూడు ఆత్మల వివరమును తెల్పు

సిద్ధాంతము కావున మేము త్రైత సిద్ధాంతము అని అన్నాము.. త్రైత సిద్ధాంతమును దేవుడు ప్రతి మనిషి హస్తములో

మూడురేఖలుగ శాశ్వితముగ ఉండునట్లు చేశాడు. ఇవి శాశ్వితమైన దేవుని ధర్మములు కావున చెరిపిన మాసిపోని,

చెదిరిపోని గీతలుగ మన హస్తములో గలవు. శాస్త్రవచనములుగ గీతలో బైబిలులో గల ధర్మములు చెడిపోని మూడు

రేఖలుగ చేతియందు నిలిచియున్నవి.


కనిపించెడు శరీరములో కనిపించకుండ మూడు ఆత్మలు గలవు. మూడు ఆత్మలలో రెండు ఎప్పటికి వీడని

జంటగ జీవాత్మ, ఆత్మ అని పేరు కల్గియున్నవి. రెండు ఆత్మల నివాసము ఒకే శరీరము. రెండు ఆత్మలలో ఒకటి

చిన్నది మరొకటి పెద్దదిగ ఉన్నవి. చిన్నదైన జీవాత్మ ఒక చిన్న రేణువుమాత్రముండి తలలో కనుబొమల మద్యభాగమునందు

లోపల గలదు. పెద్దదైన రెండవ ఆత్మ నఖశిఖ పర్యంతము శరీరమంత వ్యాపించియున్నది. ఈ రెండు ఆత్మలు

పుట్టుకలోను చావులోను మద్య కాలములోను జంటగ శరీరములో ఉన్నవి. మూడవదైన మరియొకటి గలదు దానినే

పరమాత్మ అంటున్నాము. ఈ మూడవదానినే దేవుడు అని కూడ అంటున్నాము. దేవునికి రూపము పేరు లేదు.

రూపము పేరున్నవాడు దేవుడు కాడు అన్న సూత్రము ప్రకారము మూడవదైన పరమాత్మకు పేరు లేదు అంటున్నాము.

పరమాత్మ అని పేరు పెట్టి చెప్పుచు పేరు లేదనడము ఆశ్చర్యముగ ఉందని కొందరనుకోవచ్చును. ఇక్కడ ఉన్న

సత్యమేమంటే దేవునికి పేరు లేదనుట సత్యమే. దేవుడు అనునది కూడ పేరు కాదు. దేవుడు అంటే దేవులాడబడువాడు

అని అర్థము. దేవులాడబడువాడనగా వెతుకబడువాడని అర్థము. వెదుకు చున్నామంటే కనిపించని వాడనియేగా

అర్థము. శరీరములో జీవాత్మ ఆత్మ రెండున్నాయని అనుకొన్నాము కదా! రెండవదైన ఆత్మకంటే కూడ వేరుగ

ఉన్నవాడను అర్థముతో పరమాత్మ అంటున్నాము. పరాయివాడు అంటే ఇతరుడు అని అర్థము కదా! ఆత్మకంటే

పరాయిగ ఉన్నవాడు కావున దేవున్ని పరమాత్మ అంటున్నాము. అదేవిధముగ దేవున్ని పరిశుద్దాత్మ అంటున్నాము.

శరీరములో కర్మ అను కలుషితముతో కూడుకొన్నవాడు జీవాత్మ, ఏ కర్మలేని శుద్ధాత్మ రెండవదైన ఆత్మ. శరీరములో

రెండవదైన శుద్ధాత్మకంటే వేరుగ ఉన్నది పరిశుద్ధాత్మ. ఈ విధముగ పరిశుద్దాత్మ అనిన, పరమాత్మ అనిన రెండు

దేవునికే చెల్లునని తెలియాలి.


మూడవదైన పరమాత్మ లేక దేవుడు శరీరములోపల బయట అంతట వ్యాపించి ఉన్నాడు. ఆత్మ జీవాత్మలకు

శరీరము గృహముకాగ, పరమాత్మకు విశ్వమంత గృహమనియే చెప్పవచ్చును. జీవాత్మ ఆత్మలు రెండు ఒక జోడిగ

ఉండగ, పరమాత్మ మాత్రము ప్రత్యేకముగ ఉన్నది. ఈ విషయము అందరికి తెలియునట్లు హస్తములో కూడ రెండు

రేఖలు ఒకకొనలో కలిసియున్నవి. ఒక రేఖ మాత్రము ప్రత్యేకముగ రెండు రేఖలకు పైన కనిపిస్తున్నది. మూడు

ఆత్మలలో రెండు ఒక జట్టుకాగ మరియొకటి ప్రత్యేకముగ ఉన్నదని, దానినే ఆరాధించవలెనని తెలియునట్లు బైబిలులో

మొదటి ఆజ్ఞ రెండవ ಅಜ್ಜ అని రెండు ఆజ్ఞలుగ ప్రభువు చెప్పాడు. అట్లే రెండు ఆత్మలకు పేర్లున్నవని మూడవదానికి

పేరులేదని, రెండు ఆత్మలు కలసి కూటస్థముగ శరీరములో ఉన్నవని, మూడవదైన పరమాత్మ ప్రత్యేకముగ ముల్లోకములు

ఆవహించి ఉన్నదని గీతలో కృష్ణుడు చెప్పాడు.


నీవు, నీ పూర్ణాత్మతో, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనని బైబిలులో ఉన్నది. నీవువేరు, నీ పూర్ణాత్మవేరు,

నీ దేవుడు వేరని ఈ వాక్యములో తెలియుచున్నది. అలాగే క్షరుడు, అక్షరుడు పురుషోత్తముడు అని గీతలో ఉన్నది.

క్షరుడువేరు, అక్షరుడువేరు, పురుషోత్తముడువేరని ఇక్కడ తెలియుచున్నది. ఈ విధముగ బైబిలు మత్తయి సువార్తలోను,

భగవద్గీత పురుషోత్తమప్రాప్తియోగములోను చెప్పబడియుండగ, అక్కడ చెప్పిన విషయమే ప్రతి మానవుని చేతి హస్తములోను

ముద్రించిన ముద్రగ ఉండగ, ఇటు క్రైస్తవులకు అటు హిందువులకు ఏమాత్రము అవగాహన కాలేదు. మానవునికి

ముఖ్యమైన ధర్మములుగ గీతలోను, దేవుడు చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞలుగ బైబిలులోను ఉంటే వాటిని ఏమాత్రము

గ్రహించక, మా దేవుడు పాపులను చంపేదానికొస్తాడని హిందువులు, మా దేవుడు పాపములను కడిగేదానికొస్తాడని

క్రైస్తవులు చెప్పుకోవడము పొరపాటు కాదా! గీతలో పాపులను తన ఆయుధముతో చంపుతానని కృష్ణుడుగాని, బైబిలులో

తన రక్తముతో కడుగుతానని ప్రభువుగాని చెప్పలేదు. గీతలోగాని బైబిలులోగాని చెప్పని వాక్యములను అదేపనిగ

చెప్పుకోవడము, చెప్పిన ధర్మములను (ఆజ్ఞలను) వదలి వేయడము మనుషుల తప్పు కాదా!


దీని ప్రకారము భగవద్గీతలో పాపాత్ములను కృష్ణుడు సంహరిస్తాడని వ్రాసినవారు ఎంత పెద్ద స్వాములైన

తప్పుచేసినట్లే, ప్రజలను వక్రమార్గము లోనికి, మాయమార్గములోనికి పంపినట్లే. అదే విధముగ బైబిలులో పాపాత్ములను

ప్రభువు తన రక్తముచేత కడుగుతాడని చెప్పువారు ఎవరైన తప్పుచేసినట్లే, ప్రజలను సాతాను మార్గములోనికి పంపినట్లే.


హిందూమతములోని భగవద్గీతలో క్షరాక్షర పురుషోత్తములైన ముగ్గురు పురుషులకు అర్థము చెప్పక, స్త్రీ స్వరూపమైన

ప్రకృతిని క్షరునిగ, జీవాత్మను అక్షరునిగ వర్ణించు వారెవరైన దేవుని ధర్మములను అధర్మముగ మార్చి చెప్పినట్లేయగును.

అదేవిధముగ బైబిలులో చెప్పినట్లు నిన్ను నీ ఆత్మను వదలి, నిన్ను శరీరముగ, నీ ఆత్మను ప్రక్కనగల మనిషిగ వర్ణించి

నీవు నీయింటి ప్రక్కవానిని ప్రేమించుమనడము దేవుని ఆజ్ఞను ఉల్లంగించినట్లగును కదా!


విశ్వమంతటికి అధిపతియై, అన్ని మతములకు ఆధారభూతుడైన దేవున్ని మతముల మౌడ్యముతో గుర్తించక,

ఆయన అవతారములలో చెప్పిన బోధలను అర్థము చేసుకోలేక, ఒకే దేవుని యొక్క రెండు అవతారములలో తనకిష్టమొచ్చిన

అవతారమును పొగడడము, మరియొక అవతారమును తిరస్కరించడము మనిషి యొక్క అజ్ఞానము కాదా! దేవుని

అవతారములలో బోధించిన జ్ఞానమును చూడక అవతారముల పేరును, రూపమును చూచి అసూయపడడము మంచిదా!


మానవుని ఉద్దరించి తన మార్గములో పంపుటకు, తన జ్ఞానమును తెలుపు నిమిత్తము దేవుడు మనిషిగ రాక

తప్పలేదు. వచ్చిన వానిలోని గొప్పతనమును గుర్తించని మనుషులు దేవుని అవతారమును కూడ మనిషిగ లెక్కించి,

ఆయన ద్వార జ్ఞానమును తెలుసుకోకపోగా పైగా ఆయన మీద అసూయపడి, ఆయన ఎవరికి ఏ అపకారము

చేయకుండిన శత్రువుకంటే మిన్నగతలచి, ఏదో ఒక విధముగ బాధించి హత్యచేయడము జరిగినది. కృష్ణునిగ

వచ్చినపుడు ఆనాటి మనుషులు ఆయన్ని పైచూపే చూచారుగాని దేవునిగ తలచలేదు. చివరకు ఆయన బాణముచేత

కొట్టబడి, రక్తము కార్చబడి చనిపోయాడు. అదేవిధముగ ఏసుప్రభువు రూపములో వచ్చిన దేవున్ని మనుషులు గుర్తించక,

ఆయన బోధలను అర్థము చేసుకోలేక ఆయనను శత్రువుకంటే హీనముగ చూచి చిత్రహింసలపాలు చేశారు. చివరకు

ప్రభువు చేతులకు ములుకులు కొట్టుట చేత రక్తము కారిపోయి చనిపోయాడు. ఇటు కృష్ణునికి అటు ప్రభువుకు

ఒక్కమారు ప్రాణముపోక ఒకరు బాణముతో, ఒకరు ములుకులతో బాధపడుచు, రక్తముకారుచుండగ కొంతసేపటికి

ప్రాణము వదిలారు. పుట్టినపుడు కూడ ఒకరు అపరిశుభ్రమైన జైలులో మరియొకరు అపరిశుభ్రమైన పశువులపాక

(కొట్టము)లో పుట్టారు. పుట్టినపుడు ఇద్దరికి ప్రాణమునకు అపాయముండడము వలన ఒకే విధముగ ఇతర స్థలములకు


మార్చబడినారు. పెద్దయిన తర్వాత ఒకే జ్ఞానమును చెప్పారు. ఒకే విధముగ రక్తము కారిపోవుట వలన చనిపోయారు.

వారిరువురు ఎట్లు పుట్టారు ఎట్లు చనిపోయారన్నది ముఖ్యము కాకపోయినప్పటికి వారు వారి జీవితములలో ఏమి

చెప్పారన్నది ముఖ్యము. వారు చెప్పిన జ్ఞానమును చూడక ఆయన పెళ్లి చేసుకొన్నాడు, ఈయన పెళ్లిచేసుకోలేదు

అనడము మంచిదా! వారు ఏమి తిన్నారు, ఏమి అనుభవించారు అన్నది ముఖ్యముకాదు. వారు ఏమి చెప్పారన్నది

ముఖ్యము.


ఇంతవరకు అవతారపురుషులైన కృష్ణున్ని ఏసుప్రభువును గూర్చి మతములకతీతముగ ఉన్న సత్యమును చెప్పుచు

వచ్చాము. ఈ విషయముల వలన ఇటు హిందువులకు అటు క్రైస్తవులకు అసంతృప్తిని కల్గునట్లు మాయ

చేసియుండవచ్చును. ఇప్పటికి అర్థముకాక ఆయన వేరు, ఈయన వేరు, ఈయన బోధవేరు, ఆయన బోధవేరనువారుండ

వచ్చును. ఇటు గీతలోగాని అటు బైబిలులోగాని ఒకే అర్థమునిచ్చు ఒక వాక్యమునైన చూపగలరా అని కొందరు

అడుగవచ్చును. అటువంటి వారికి గీతలోని ఒక వాక్యమును, బైబిలులోని ఒక వాక్యమును ఇక్కడ వ్రాయుచున్నాము.

ఈ రెండు వాక్యములు ప్రభువు జీవితము, కృష్ణుని జీవితమున్నట్లు భిన్నముగ ఉండును. ప్రభువు జీవితములో

ఆకారము అలవాట్లు అనుభవములు వేరు, కృష్ణుని జీవితములో ఆకారము అలవాట్లు అనుభవములువేరు. అదే

విధముగ ఇపుడు చెప్పబడు వారి వాక్యములు రెండు చూచుటకు ఒకదానికొకటి భిన్నముగ ఉండును. చూచుటకు

వేరు వేరుగ ఉండిన ప్రభువు కృష్ణుడు ఇద్దరు ఒక దేవుని అవతారమే అని మేము చెప్పినట్లు, చూచుటకు వేరువేరుగ

ఉన్న ఈ రెండు వాక్యముల లోను ఒకే అర్థము ఇమిడి ఉన్నది. అజ్ఞానముతో చూచినవారికి కృష్ణుడు వేరు ప్రభువువేరుగ

కనిపించును. జ్ఞానదృష్టితో చూచినవారికి ప్రభువు కృష్ణుడు ఇద్దరు ఒక్కటే. అలాగే ఇపుడు వ్రాసిన వాక్యములు రెండు

అజ్ఞాన చూపుతో చూచిన వేరు వేరు అర్థము నిచ్చునవిగ కనిపిస్తాయి. జ్ఞానదృష్టితో చూచితే రెండు వాక్యములు

ఒకటిగానే కనిపిస్తాయి చూడండి. భగవద్గీత మోక్షసన్యాస యోగము 17వ శ్లోకము. "యస్య నాహం కృతో భావో

బుద్దిర్యస్య నలిప్యతే, హత్వాపిసఇమాన్ లోకాన్నహస్తి ననిబధ్యతే” “నేను చేయుచున్నానను అహంకారము లేకుండ లోకములో

అందరిని చంపినప్పటికి అతడు హంతకుడుకాడు, పాపమురాదు” అని కలదు.


బైబిలు క్రొత్త నిబంధన మత్తయి 5వ అధ్యాయము 28వ వచనము “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు

ప్రతివాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును" అని గలదు. గీతలో అంతరంగములో

భావములేకుండ హత్యచేసిన అతడు చేయనట్లే పాపము రాదు, హంతకుడు కాడు అంటే, బైబిలులో చేయకున్నప్పటికి

అంత రంగములో అనుకోవడము వలననే చేసినట్లగును పాపమొస్తుందని, అత్యాచారమగునని చెప్పబడినది. ఈ రెండు

వాక్యములు ఒకటిగా ఉన్నాయా? లేక పరస్పర విరుద్దముగ ఉన్నాయా మీరే చూడండి ఈ వాక్యములు ఎట్లు అర్థమైతే

అలాగే ఈ పుస్తకమంతయు అర్థమై ఉండునని అనుకుంటాము.


మేము ఇంతవరకు వ్రాసినది మతాతీతమైన జ్ఞానము. మేము ఇంతగా చెప్పినప్పటికి మతమునకు అతీతము

కాకుండ మతము యొక్క ఆధీనములో ఉండి మాట్లాడువారు చాలామంది కలరు. మేము చెప్పినదంత మతమునకు

సంబంధించినది కాదని తెలుసుకోలేక ఒక మతమును కేంద్రముగ చేసుకొని మమ్ములను విమర్శించువారు కూడ

కలరు. అటువంటి వారిని ఉద్దేశించి మతములను గూర్చి కొంత వ్రాయుచున్నాము. ప్రశ్న జవాబులతో ఉన్న ఈ

క్రింది విషయము చూచి మతము అంటే ఏమిటో కొందరైన కొంతైన తెలియగలరనుకొంటున్నాము. దీనివలన మతముల

బ్రమ కొంతైన వీడగలరని ఆశిస్తున్నాము.


1) ప్రశ్న :- మతములు సనాతనమైనవా మద్యలో వచ్చినవా?

జవాబు :- మతములు సనాతనమైనవి కావు, మద్యలో వచ్చినవి మాత్రమే. మనిషిలో కొంత నాగరికత పెరిగిన

తరువాత మతములు పుట్టుకొచ్చినవి.


2) ప్రశ్న :- మతము అంటే ఏమిటి?

జవాబు :- దీనికి సరియైన సమాధానము మనిషి ఇష్టపడిన ఒక పద్దతిని మతము అంటున్నాము. హిందీలో మతదాన్

అనుపదము కలదు. రాజకీయపార్టీలో ఏదో ఒక పార్టీని ఇష్టపడి తన ఒప్పుదల (ఇష్టమును) తెలియజేయడమును,

లేక ఓటు వేయడమును మతదాన్ అంటున్నాము. దేవున్ని తెలుసుకొనుటకు కొందరేర్పరచిన వారికి ఇష్టమైన పద్దతులను

మతములు అంటున్నాము. ఆ పద్దతులలో ఏ దానిని ఇష్టపడి ఇతరులు అవలంభించుచున్నారో వారిని ఆ మతస్థులని

కూడ అంటున్నాము.


3) ఇపుడున్న మతములలో ఏది సరియైనది చెప్పగలరా?

జవాబు :- అన్ని మతములు దేవున్ని తెలుసుకొనుటకు నిర్ణయించిన మార్గములే కావున అన్ని సరియైనవనియే

చెప్పవచ్చును. ఇది సరియైనది అది సరికాదని చెప్పడము పెద్దపొరపాటు.


4) ప్రశ్న :- మత మార్పడి ఎందుకు జరుగుచున్నది?

జవాబు :- ప్రతి మనిషి పుట్టుకతోనే ఒక మతములో చిక్కుకొని ఉన్నాడు. తల్లి తండ్రులు ఏ మతములో ఉంటే

మతమే పుట్టిన బిడ్డలది కూడ అగుచున్నది. సహజముగ ఒక మతములోనున్న వ్యక్తి మరొక మతము లోనికి మారడము

కూడ అక్కడక్కడ జరుగుచున్నది. కొందరు మత మార్పిడికి పాల్పడడమునకు కారణము వారి వారి యొక్క స్వార్థము,

స్వలాభము కారణమని చెప్పవచ్చును. సమాజములో ధనమును పెంచుకోవడానికి, గౌరవము పెంచుకోవడానికి,

ఆస్తులు పెంచుకోవడానికి కొందరు మతమార్పిడి చేసుకొంటున్నారు. అధ్యాత్మికరీత్య మతమార్పిడి వలన ఎటువంటి

ప్రయోజనములేదు, ప్రపంచరీత్య ఏదో ఒకటి ఆశించిన వారే మతములను మార్చుకొనుచున్నారు.


5) ప్రశ్న :- మతమును ఎక్కువగ ఎవరు మార్చుకొనుచున్నారు?

జవాబు :- ఒక్క హిందూమతములోని వారే ఇతర మతములను మార్చు కొనుచున్నారు.


6) ప్రశ్న :- హిందూమతములో ఎన్నో కులములు గలవు. వాటిలో ఎక్కువగ ఏ కులములవారు మతమును మార్చుకొనుచున్నారు?

జవాబు :- సమాజములో ఎక్కువ కులముగ పరిగణించబడుచున్న బ్రాహ్మణులు మరియు సమాజములో తక్కువ

కులములుగ లెక్కించబడుచున్న మాల, మాదిగ కులములవారు ఎక్కువగ మతమును మార్చుకొనుచున్నారు.

క్రైస్తవమతములోనికి తక్కువ కులము వారు మారడము వలన తమను తక్కువ కులస్థులుగ సమాజము చూడడము

మానివేసి క్రైస్తవులుగ చూచుదురని, అందువలన సమాజములో గౌరవము పెరుగునని కొందరు తక్కువ కులమువారు

మతమార్పిడి చేసుకొను చున్నారు. ఎక్కువ కులము వారైన బ్రాహ్మణులకు సమాజములో కుల మర్యాద ఉన్నప్పటికి

వారికి కులవృత్తి లభించక పోవడము వలన ఎందరో పనిలేక మిగిలిపోవుచున్నారు. అటువంటివారు మతమార్పిడి

చేసుకొనుట వలన, మారిన వెంటనే క్రైస్తవమతములో బోధకులుగ గౌరవము లభించుట వలన బ్రాహ్మణులు తమ

జీవనోపాధి మెరుగుపరుచుకొనుటకు మత మార్పిడికి పాల్పడుచున్నారు.


7) ప్రశ్న :- మనిషికి మతమార్పిడివలన దైవజ్ఞానము అభివృద్ధి అగుచున్నదా?

జవాబు : మతమార్పిడికి జ్ఞానమునకు ఎటువంటి సంబంధములేదు. ఉన్న మతములో జ్ఞానమును తెలియనివాడు

తరువాత మతములో కూడ జ్ఞానమును తెలియలేడు. గ్రుడ్డివాడు ఉన్న ఊరులో చూడలేడు. అలాగే వేరే ఊరికి

పోయిన చూడలేడు. ఒక మతములో జ్ఞానమును చూడలేని వాడు మరొక మతములోనికి పోయిన ఆ మతములో

కూడ జ్ఞానమును చూడలేడు.


8) ప్రశ్న :- మనిషికి దేవునికి మద్యలో మతము అవసరమా?

జవాబు :- పయణించే మనిషికి చేరవలసిన గమ్యమునకు దారి అవసరమై నట్లు మనిషికి దేవునికి మద్యలో మతము

కూడ అంతే అవసరము. మనిషికి దేవునికి మద్యలో మతము దారిలాంటిది. ఆ దారి జ్ఞానమార్గమై ఉండవలెను కాని

పరమతమును దూషించునదై తన మతమును గొప్పగ చెప్పుకొనునదై ఉండకూడదు.


9) ప్రశ్న :- క్రైస్తవ మతములో చేరిన కొందరు తమకు ప్రభువు కనిపించాడని అలా కనిపించడమువలన మతములోనికి చేరామని

అంటున్నారు. ఆ మాట ఎంతవరకు వాస్తవము?

జవాబు :- ఒక హిందూమతస్థుడు క్రైస్తవునిగా మారి ఆ మతములో ఫాదర్గా ఒక చర్చికి అధిపతిగవుంటున్న ఆ వ్యక్తి

మాతో ఒక మారు కలువడము జరిగినది. ఆయన తిరుపతి వెంకటేశ్వరస్వామికి గత 40 సంవత్సరములుగ భక్తుడనని,

40 సంవత్సరములనుండి ప్రతి నెల మొదటి తారీకున తప్పక తిరుమలకు పోయి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనే

వాడినని అటువంటి భక్తికల్గిన తనకు ఒకమారు జీప్ ఆక్సిడెంట్ జరిగినదని చెప్పాడు. అప్పుడు కర్నూలు ఆసుపత్రిలో

తీవ్ర గాయలతో చేరిన తనకు చికిత్స చేయుచు కొన్ని గంటల తరువాత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణ చేసినట్లు

కూడ చెప్పాడు. తన స్నేహితులంతా కూడ చనిపోయిన తనను చూచి ఏడ్చుచున్నట్లు కూడ చెప్పాడు. ఆ సమయము

లో ఏసుప్రభువు కనిపించి నిన్ను నేను బ్రతికించుచున్నాను. నీవు ఇప్పటినుండి క్రైస్తవునిగా మారి నా భక్తుడవుగ

ఉండమని చెప్పుట వలన అప్పటినుండి వెంకటేశ్వరుని వదలి ప్రభువు భక్తునిగా మారిపోయానని కూడ చెప్పాడు. ఈ

విషయమంత అతని ద్వార నేను వినడము జరిగినది.


'ఋజుదర్శిని' అను పుస్తకములో పరవస్తు సూర్యనారాయణ కూడ సత్యనారాయణ గుడిలో బ్రాహ్మణ పూజారిగ

ఉన్నపుడు తమ బంధువుల వలన కొట్టబడి కట్టివేయబడినపుడు ఏసుప్రభువు కనిపించి విడిపించినట్లు వ్రాయబడినది.

ఆ వ్రాతను ఇక్కడ పొందు పరుచున్నాము.


“నా ఆలోచనలో ఏసు మూర్తీభవించెను. ఇక ఏసు తప్ప నన్నెవరును విడిపించలేరని

నిశ్చయించుకొంటిని. అపుడు ప్రార్థించితిని. వర్ణింపలేనంత బలహీనతతో ఏసును మొరపెట్టితిని.

దేవుడంటు ఎవరైన ఉంటే వారు నన్ను విడిపించాలి. నాకండ్లకు కనిపించాలి, నాతో మాట్లాడాలి.

దేవుడన్నవాడు లేని ఎడల నేను మరణించెదను. అని ప్రార్థించుకొంటిని, కొంత సమయమైన పిమ్మట

నేను భగవధ్యానములో పడివుండగ మెల్లగా తలుపుతెరచే శబ్దమైనది. బహు భీతినొందినవాడనై

తలుపు తెరువబడుచుండుట చూచితిని. ఒక దివ్య స్వరూపుడు గర్భగుడిలో అడుగుపెట్టి నావైపు



చూచెను. నేను అతనివైపు చూడగా నిప్పుకణము లాంటి అతని ముఖము, జ్యోతిని పోలియున్న

ఆయన రెండుకండ్లు, అపరంజినిపోలిన ఆయన పాదములను చూడగలిగి తిని. ఆయన

శరీరములో ఉన్న దివ్యమైన కాంతికిరణములు నాపై పడుచుండెను, ఆ క్షణముననే నాకట్లు

తెగిపోవుటయు, నా విరిగిన ఎముకల స్వస్థత నొందుటయు నాకు తెలియకనే జరిగినవి. నేను ఆ

నేలపై బంధించబడి పడియుండుట మాత్రమే నాకు తెలుసు, పిమ్మట ఆయన మెల్లగ అడుగులు వేస్తు

వచ్చి నా దగ్గర నిలుచుండగా ఆయనలోనుండి వచ్చుచున్న ఆ దివ్యమైన కాంతి నా శరీరమంతా

వ్యాపించెను. నా కుమారుడా! పరవస్తు : నీవు లేచి నిలువుము.” అని నాతో ఆయన చెప్పగా 'అయ్యా!

నేను బంధింపబడియుండుట మీరెరుగుదురు. అన్నపానములు లేక బలహీనతలో కూడియున్నానని

మీరెరుగుదురు. తమరు నాకట్లు విప్పినచో నేను లేచి నిలుచుందును' అని నేను దీన స్వరముతో

అంటుండగా ఆ వ్యక్తి మందహాసముతో నేలమట్టుకు వంగి తన దక్షిణ హస్తముతో నా దక్షిణ

భుజమును పట్టి పైకిలేపెను నన్ను ఆయన లేపుచుండగా నా చేతులకు కాళ్ళకు బంధించిన

గొలుసులు అకస్మాత్తుగా తెగిముక్కలై క్రిందపడిపోయినవి. వాటి శబ్దమును విని నేను వెనుకతట్టు

తిరిగి చూచి విషయాన్ని అర్థము చేసికొని ఈయనెవరో గొప్ప మహానుభావుడిలా ఉన్నాడు. ఈయన

ఎవరో ఒక దేవుడై ఉండాలని నిర్ణయానికి వచ్చితిని. అటుపిమ్మట ఆయన నన్ను చూస్తూయుండగా

నా విరిగిపోయిన ప్రక్కటెముకను చూచితిని అది స్వస్థత పొందినదని తెలిసికొంటిని. నా ఎడమ

భుజమువైపు చూచితిని దానికి కూడ స్వస్థత కలిగినదని తెలుసుకొంటిని నారెండు చేతులు పైకెత్తి

త్రిప్పి చూచుకొంటిని ఇప్పుడు నాకేమాత్రమును అనుమానము లేదు. నా శరీరమంతటా ఏర్పడిన

ఎర్రటి నల్లటి మచ్చలను చూచుకొంటిని. అవి నాబంధువులు కట్టెలతోకొట్టగా ఏర్పడిన మచ్చలు అవి

అలాగునే ఉండెను. అంతట పర్యంతరము నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తి మందహాసముతో

నిశ్శబ్దముగా నిలుచుని నాచర్యలన్నిటిని గమనించుచున్నాడు. ఆయనను చూచి నాకు కలిగిన ఈ

గొప్పమేలును బట్టి ఆయన పాదారవిందములకు సాష్టాంగపడి నమస్కారించాలని ప్రేరేపణ కలిగి

ఆయన పాదముల వద్ద సాష్టాంగపడిపోతిని. 'నాకుమారుడా! నీవులేచి నిలువుము. నేను నీతో

మాట్లాడవలసివున్నది.' అని నాకాజ్ఞాపించెను. నేను ఆ మాటలకు విధేయుడనైతిని. 'నీవు విడుదల

పొందివున్నావు. నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను,

దిగులుపడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీ మీద

కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాధించువారు మాయమై నశించెదరు.

జనములకు నా నామమును ప్రకటించుము.'


'స్వామి! తమరు ఎవరు? తమ పేరేమిటి? తమ పేరు తెలియకుండగనే మీ గురించి ఏ

విధముగ ప్రకటింతును? మీరు రాముడా? కృష్ణుడా? వెంకటరమణా? శంకరుడా? ఆది విష్ణువా?

మీ నిజ స్వరూపమేది? లేక మీరు ఏసుప్రభువా? ఏసు ప్రభువైన ఎడల మీ దేహము గాయపరచబడి

సిలువమీద వ్రేలాడుచున్నట్టు నేను చూచియుండ వలసియున్నది. ఇప్పుడైతే మీ శరీరమునకు

గాయములులేవు మీరెవరని నేను గుర్తించగలను? దయచేసి మీరు అదృశ్యులవ్వకుండ కొంత

సమయము నాతో మాట్లాడుచూ నాకు కలిగే అనుమానములను తీర్చ వలసినదిగా

బ్రతిమాలుచున్నాను. దేవుడు భక్తునకు ప్రత్యక్షమై కొద్ది క్షణములు మాత్రమే వానితో సంభాషించి

అదృశ్యమగునట్లు అనేక గ్రంథములలో కనుగొంటిని మీరు కూడ అదృశ్యమైనటులైనచో నా

అనుమానములు తీర్చువారెవరు? సామవేదమందలి రెండవ భాగమైన తాండియ మహా

బ్రాహ్మణంలో 'ప్రజావతిర్దేవేభ్యం" అని శ్లోకమున్నది ఆ యజ్ఞము ఎవరు చేసినది? రెండవదిగా

‘సర్వపాపా పరిహారో' అని వేరొక శ్లోకము కూడ ఉన్నది. ఈ శ్లోకము ఎవరికి వర్తిస్తుంది? ఎవరు ఆ

పరమాత్ముడు? ఇది తెలుసుకోవలెనని అనేక దినములనుండి అన్వేషించు చున్నాను సామవేదములో

‘లిహ్వ్య గోప్తారాం అని ఒక శ్లోకముకలదు. ఇది ఏ పరమాత్ముని యొక్క అవతార సంబంధమైన

జనన విషయమును తెలియజేస్తుంది?' ఈ విధముగా నేను ఆయనను ప్రశ్నించుచుండగా

కనురెప్పపాటులో ఆయన అదృశ్యడై సిలువమీద వ్రేలాడుచు రక్తము ప్రోక్షింపబడుచున్న సిలువ

యజ్ఞము నేను చూడ గలిగి తిని. భయకంపితుడనై నేలమట్టుకు సాష్టాంగపడి నమస్కరించి ప్రభూ?

నన్ను క్షమించుము. అని నేనంటుండగా 'నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే' అనెడి

ఒక గంభీరమైన స్వరమును నేను వింటిని లేచి నిలువబడి ఆయనను స్తుతించితిని. ఆయనను

ఘనపరచితిని నిస్సందేహముగా 'ప్రభూ! మీ నామము అన్ని నామముల కంటే పైనున్నది. మరి ఏ

నామములో నరుడికి రక్షణకలుగదు. మీ నామములోనే ప్రభూ! నరునికి రక్షణ లభించును.' అని

నేనాయన నామమును మహిమ పరచితిని. వెంటనే ప్రభువు అదృశ్యుడై నాఎదుట నిలువ

బడియుండుట చూడగలిగి తిని మరల ప్రభు పాదములకు నమస్కరించితిని, నాకు తృప్తి కలుగునట్లు

ఆయనకు నమస్కరించితిని ఎంతో చక్కగా నేను ఆయనను చూచితిని. ఆయన సౌందర్యము

వర్ణనాతీతము. ఆయన మాటలలో గల మాధుర్యము నా అంతరంగమునకు శాంతి కలిగించి నది

‘ప్రభూ! చూచితిరా నా దేహమును? మీరు దేవుడని చెప్పినందుకు ఈ ప్రజలు నన్ను ఎట్లు

దండించినారో? మీ నామమును మీరు అజ్ఞాపించు విధముగా ప్రకటించునపుడల్ల నాకీలాగునే

జరుగునా? అని నేనడుగగా 'నీతో వ్యాజ్యమాడువారు నశించెదరని” నేను ఆయన నోటినుండి

వచ్చిన స్వరమును వింటిని. 'నీవు నా దాసుడనబడుదువు నేను నిన్ను ఏర్పరచుకొంటిని. నీవు వెళ్ళి


సమస్త జనములకు నేనే దేవుడనని నీవు కండ్లతో చూచిన దానిని ప్రకటింపుము. నేను నీకు

తోడైయుందును.' అని అజ్ఞాపించి నన్ను గర్భగుడి ద్వారమువరకు నడిపించి 'నీవు కుడితట్టు వెళ్లుము’

అని నాకు చెప్పి ఆ కరుణామయుడు అదృశ్యుడాయెను. నేనచట నిలువబడి ఆలోచింతిని. కుడితట్టు

నేను వెళ్ళినటులైనచో ఆ మార్గము అడవివైపు పోవును. అటువైపు కొండలు, అడవి, గ్రామములు

తప్ప మరేమియు ఉండవు. నేను ఎడమ తట్టు వెళ్ళినటులైనచో మా ఊరిలోనుండి రోడ్డుమీదకు

వెళ్ళి బస్సులోగాని, రైలులోగాని, ప్రయాణము చేయగలను.”


ఇక్కడ గమణించారా ప్రభువు కుడివైపు పొమ్మని చెప్పితే నిమిషము కూడ కాకముందే తాను ఎడమవైపు

పోవాలని ఊహవచ్చినది. ప్రభువు చెప్పినట్లు పోక ఎడమవైపు పోయిన దానివలన చాలా ఇబ్బందులు పడవలసి

వచ్చిందని కూడ తానే వ్రాసుకొన్నాడు. దేవుడే కనిపించినపుడు ఆయన మాట ఎందుకు వినలేదో మీరే యోచించండి.


మొదట ఏసుప్రభువు ప్రత్యక్షమైనపుడు ఆయన దివ్యమైన కాంతికిరణములు నామీద పడుచుండెను.

క్షణముననే నాకట్లు తెగిపోయినవని మొదటి పేరాలో వ్రాసుకొన్న సూర్యనారాయణరావు అదే పేరాలోనే క్రింద ప్రభువు

నా దక్షణ భుజముపట్టి లేపుచుండగ నాకాల్లకు చేతులకు బంధింపబడివున్న గొలుసులు అకస్మాత్తుగ తెగి ముక్కలై

క్రింద పడినవని వ్రాశాడు. అబద్దమాడువారికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండవలెను. ముందు ఏమి వ్రాశానని జ్ఞాపకములేని

సూర్యనారాయణ కాంతికిరణములు మీదపడినపుడు బంధములు తెగిపోయినవని చెప్పిన మాట మరచిపోయి ప్రభువు

ముట్టుకొన్నపుడు తెగిపోయాయని రెండవ మారు వ్రాశాడు. ఇందులో అసత్యమున్నదని ప్రత్యక్షముగ బయటికి కనిపిస్తున్నది.

ఇక్కడ అబద్దము చెప్పవలసిన అవసరము ఏమివచ్చినదో.


ఒక వార్త పత్రికలో ఒక క్రైస్తవ మతప్రచారకుడైన సునిల్ కుమార్ అను వ్యక్తి చెప్పిన విషయము క్రింద

పొందుపరుస్తున్నాము.


(ఏప్రిల్ 18, 2005) : “ఆయన క్రైస్తవ మతప్రచారకుడు. ప్రపంచ వ్యాప్తముగ ప్రజలకు దేవుని వాక్యాన్ని

వినిపించుచున్నాడు. క్రీస్తు తనతో మాట్లాడారని చెప్పుచున్న సునిల్కుమార్ గత ఎనిమిదేళ్లుగా క్రీస్తు వాక్యాన్ని

ప్రకటిస్తున్నానన్నారు. 26వ ఏటనే క్రైస్తవ మతములోనికి మారిన తాను అప్పటినుండి క్రీస్తువాక్యాన్ని ప్రజలకు

వినిపిస్తున్నానని సునిల్కుమార్ చెప్పారు. బ్రాహ్మణుడినైన తాను క్రీస్తును నమ్మానని గత ఎనిమిదేళ్ళుగ ప్రపంచవ్యాప్తముగ

దైవవాక్యప్రచారములో పాల్గొంటున్నానని చెప్పారు. తాను ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళానని, ఆలయాల్లో పూజారుల

వైఖరి తనకు నచ్చలేదని అన్నారు. తనది ప్రేమ వివాహమని చెప్పిన సునిల్కుమార్ పెళ్ళికి ముందే క్రీస్తు తనతో

మాట్లాడారని తెలిపారు. ఏసును నమ్మినవారే ప్రేమను పంచగలరని సునిల్ చెప్పారు. దుబాయ్, సింగపూర్ లోని

తెలుగువారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానన్నారు. ఏసు ఒక్కడే మనిషితో మాట్లాడే దేవుడని ఆయన అన్నారు.”


మాకు ప్రభువు కనిపించాడని ఇక్కడ చెప్పిన ముగ్గురులో ఇద్దరు బ్రాహ్మణులు ఒకరు చిన్న కులమువారు

కావడము విశేషము. ప్రభువు కనిపించాడని క్రైస్తవమతములోనికి మారిన ముగ్గురు ఆ మతములో బోధకులుగ

ఉండడము మరీ విశేషము. ప్రభువు దేవునడములో తప్పులేదు కాని దేవుడైన ప్రభువు కనిపించాడనడము పూర్తి

అసత్యము. దైవత్వము కూడ ఒక శాస్త్రీయతను ఆధారము చేసుకొని ఉన్నది. దైవత్వమునకు ఆధారమైనది


బ్రహ్మవిద్యాశాస్త్రము. బ్రహ్మవిద్యాశాస్త్రమును దేవుడే స్వయముగ తెలియజేశాడు. దైవప్రోక్తమైన ఆ శాస్త్రము ప్రకారము

దేవుడు ఇంద్రియాతీతుడు. మనిషికి ఐదు ఇంద్రియములు బయటి విషయములను తెలియజేయుచున్నవి. కన్ను

దృశ్యమును, చెవి వినికిడిని (శబ్దమును), ముక్కువాసనను, నాలుక రుచిని, చర్మము స్పర్శను శరీరములోనున్న జీవునికి

తెలియజేయుచున్నవి. ఐదు ఇంద్రియములకు తెలియబడునవి కేవలము ప్రపంచ విషయములు మాత్రమే. ప్రపంచము

ప్రకృతి స్వరూపము. ప్రకృతి విషయములు తప్ప పరమాత్మ విషయములు ఇంద్రియములకు తెలియవు. దీనిని బట్టి

కంటికి ప్రకృతి తప్ప దేవుడు తెలియబడడు. దేవుడు ఇంద్రియములకు అతీతుడని, వాటికి తెలియ బడడని దేవుడే

స్వయముగ బ్రహ్మవిద్యా శాస్త్రములో తెలియజేసియుండగ కొందరు దేవుడు మాకు కనిపించాడని చెప్పుకొనుట పూర్తి

అసత్యము. మతమును ప్రచారము చేయడములో అలా చెప్పడము ఒక భాగమైయుండ వచ్చును. కాని అది దేవుని

ప్రచారము చేయుటకు కాదని తెలియవలెను.


క్రైస్తవమతములోనికి చేరిన చాలామంది తమకు ప్రభువు కనిపించాడని చెప్పుట వినుచున్నాము. ఈ విషయమును

చాలామంది నమ్ముచున్నారు. అలా కనిపించినది వాస్తవమే అయితే అది దేవుడుకాదని చెప్పవచ్చును. ఎందుకనగా

దేవునికి రూపముగాని, పేరుగాని లేవు. రూపమున్న వాడు దేవుడు కాడు. ఏ ఆకారము లేకుండ ఉన్న దేవుడు ఒక

సమయములో మానవునిగా పుట్టి తన జ్ఞానమును చెప్పవలసి వస్తున్నది. ఆ విధముగ దేవుడు ప్రభువు అవతారముగ

పుట్టినపుడు ప్రభువును భగవంతుడు అనవచ్చును. ఆ జన్మ అయిపోయిన తరువాత భగవంతుడు తిరిగి దేవుడవుచున్నాడని

తెలుసుకొన్నాము. ఒక అవతారముగ పుట్టి ఆ అవతారము అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి ఆ రూపములో

కనిపించడు. ఈ విషయమును స్వయముగ ఏసు ప్రభువే బైబిలులో యోహాను సువార్త 7వ అధ్యాయము 33, 34

వాక్యములయందు ఇట్లన్నాడు. “ఇంక కొంతకాలము నేను మీతో కూడ ఉందును. తరువాత నన్ను పంపిన వాని

యొద్దకు పోవుదును. మీరు నన్ను వెదుకుదురు కాని నన్ను కనుగొనలేరు. నేనెక్కడనుందునో మీరు అక్కడికి

రాలేరు.”


ఇట్లు ప్రభువే స్వయముగ చెప్పియుండగ ప్రభువు మాటకు వ్యతిరేఖముగ మాకు ప్రభువు కనిపించాడనడము

సమంజసమా! ప్రభువు భక్తులైన క్రైస్తవులు ప్రభువు వాక్యమునకు వ్యతిరేఖముగ చెప్పవచ్చునా! ప్రభువు వాక్యము

ప్రకారము ప్రభువు అవతారముచాలించి దేవుని వద్దకు పోయిన తర్వాత ఇక కనిపించడని తెలియుచున్నది. దీని

ప్రకారము దేవుడైన ప్రభువు తర్వాత కనిపించలేదని, కనిపించాడని చెప్పువారు అసత్యమును చెప్పుచున్నారని

తెలియుచున్నది. ఒకవేళ భూమి మీద తన అవసరము వచ్చినపుడు మరొక అవతారముతో పుట్టగలడు, కాని మొదటి

రూపముతో కనిపించడు శరీరముతోవున్న ప్రభువు శరీరమును విడచి దేవునియందైక్యమైన తర్వాత చూచామనుట

చాలా తప్పు. దేవునిగ మారినవాడు ఎప్పటికి కనిపించడు వినిపించడు అనుదానికి ఆధారముగ యోహాను సువార్త

5వ అధ్యాయము 37,38 వాక్యములలో "మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును

చూడలేదు” అని చెప్పబడివున్నది. దీని ప్రకారము కూడ దేవుడైన ప్రభువును ఎవరు చూడలేదని తెలియుచున్నది.


ప్రపంచములో దేవుడే కాక దేవునికి వ్యతిరేఖమైన మాయకూడ కలదు. మాయ లేక సాతాన్ ఏ రూపములోనైన

ఎప్పుడైన కనిపించగలదు. ఒకవేళ ఎవరికైన ఏసుప్రభువు కనిపించాడంటే అది దేవుడు కాదు సాతానే అట్లు

కనిపించియుంటుంది. మానవుని తనవైపు త్రిప్పుకొనుటకు సాతాన్ దేవుని అవతారములో కూడ కనిపించగలదు.


అలా కనిపించుట వలన అప్పుడు ఏమిచెప్పిన నమ్మి తన మార్గములో నడువగలరని సాతానుకు తెలుసు. అందువలన

ఎవరైన తాము ప్రభువును చూచామంటే ముందు తాము ఏ మార్గములో ఉన్నారో చూచుకోండి. అటువంటి వారు

తమకు తెలియకే దేవుని వాక్యమునకు వ్యతిరేఖముగ నడుచు చుందురు. సాతాన్ ప్రభావము వలన తమయందు

మహిమలు కల్గితే దేవుని వలననే నాయందు కొన్ని కార్యములు నెరవేరుచున్నవని అనుకొను చుందురు. దేవుడు తన

మహిమకొరకు నన్ను ఉపయోగించుకొను చున్నాడని కూడ అనుకొనుచుందురు. ఆ విధముగ సాతాన్ అనుకొను నట్లు

చేయుచున్నదని ఎవరికి తెలియదు. మత్తయి సువార్త 7వ ఆధ్యాయము, 22, 23 వాక్యములలో ప్రభువు చెప్పిన మాటలకు

వ్యతిరేఖముగ ఉన్నామేమో ఆలోచించండి. నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా, రోగములు పోగొట్టలేదా,

దయ్యములను వెళ్లగొట్టలేదా అని ఎవరైన అన్నప్పటికి అక్రమము చేయువారలారా నా వద్దనుండి పొండని ప్రభువు

చెప్పునట్లు పై వాక్యములలో కలదు. మీరు ప్రభువు మహిమలనుకొన్నవి స్వయముగ ప్రభువువే అక్రమములన్నాడంటే

ఆ పనులు సాతానే మీనుండి నెరవేరునట్లు చేయుచున్నదని ఎందుకనుకో కూడదు. అలాగే ప్రభువు చనిపోయిన

తరువాత కూడ ప్రభువు కనిపించాడంటే మత్తయి సువార్త 7వ ఆధ్యాయములో 21వ వాక్యములో “ప్రభువా ప్రభువా

అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నాతండ్రి చిత్తము ప్రకారము

చేయువాడే ప్రవేశించును." అన్న వాక్యమును జ్ఞాపకము తెచ్చుకొంటే ప్రభువు అవతారము పోయిన తర్వాత ప్రభువును

కాక పరలోక తండ్రిని గూర్చి మాట్లాడవలెనని, ఆయన చిత్తము ప్రకారము నడువవలెనని అర్థము కాదా! పరలోక

తండ్రికి రూపనామములు లేవు అటువంటి దేవున్ని మరచునట్లు సాతాన్ ప్రభువు ఆకారమును చూపించినదని ఎందుకు

అనుకోకూడదు. ఏది ఏమైన ప్రభువు కనిపించాడన్నది అసత్యము. కనిపించాడంటే అది సాతాన్ ప్రభావమని

తెలియుచున్నది. దేవుడు తిరిగి ఆకారముతో కనిపించాడనుట దేవుని వాక్యమునకు వ్యతిరేఖమగును.


10) ప్రశ్న :- ఒక హిందువు క్రైస్తవునిగా మారడము, మారిన తరువాత అంతటితో ఊరకుండక హిందూమతమును ప్రేమించునట్లు

తిరిగి హిందువుగ మారాలను కొన్నట్లు పైకి చెప్పుచు క్రైస్తవమతమును ప్రచారము చేయుటకు హిందూ మతమును ఎరగ

వాడుకొనుచు, వేదములను గొప్పగ చెప్పుచు అవికూడ క్రైస్తవమతమును సూచించునట్లు బహుతెలివిగ వ్రాసి ప్రచురించిన ఒక

పత్రిక ఇలా కలదు.


నేను

హిందువుగా మారాలనుకుంటున్నాను.


నేనీమధ్య, నాలో నేనే చాలా మథన పడిపోతున్నాను.

నా స్వంత దేశంలో, నా స్వంతవారి మధ్య నేనేదో ఒక నేరం చేసినవాడిలాగా,

అనవసరంగా అవమానం పాలైపోయాను.


ప్రతివాడూ నన్నొక అసహ్యమైన వ్యక్తిగా, అంటరానివాడినిగా చూస్తున్నాడు.

ఒక కుట్రదారుగా, ఒక విదేశీతొత్తుగా నన్ను అందరూ పరిగణిస్తున్నారు. నన్నొక

దేశద్రోహిగా, నీచుడిగా చిత్రీకరిస్తున్నారు.


ఇంతకూ నా వాళ్ళ మధ్యలో నేనింతగా అవమానించబడటానికి కారణం,

నేను యేసుక్రీస్తును నా దేవునిగా స్వీకరించటమే. నా దేశం హిందూదేశం.

తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఈ దేశం నమ్మిన మతం, హిందూమతం.

వేలాది సంవత్సరాలుగా ఈ నేల మీద వేళ్ళూనుకున్న హిందూ మతాన్ని కాదని,

ఎక్కడో విదేశీ గడ్డ మీద పుట్టిన క్రైస్తవ మతాన్ని నేను అవలంబించటం

సహజంగానే నా సాటి భారతీయులకు బాధ కలిగించింది. వారి బాధను

చూస్తుంటే, నాకూ బాధగానే ఉంది.


నా వాళ్ళ దృష్టిలో నేను అనవసంగా చెడ్డవాళ్లెందుకు కావాలి? ఏదో నాలుగు

కరాల వెనుక మా పూర్వీకులు - ఏ కారణం చేతనో గాని, తెల్లదొరల కాలంలో

క్రైస్తవ మతంలోకి మారారు. ఇప్పుడు చూడబోతే రోజులు మారాయి. ప్రస్తుత

కాలంలో క్రైస్తవుణ్ణని చెప్పుకోవటం ఏమంత గౌరవప్రదంగా లేదు.


అసలిదంతా ఎందుకొచ్చిన గొడవ ? ఏ మతం అవలంబిస్తేనేం ? చిత్తశుద్ధి

ఉంటే చాలదా ? మతం కోసం, నా చుట్టూ వున్న సమాజానికి ఎదురీదటం

ఎందుకు? నా స్వంత వాళ్లకు నేను శత్రువును కావటం ఎందుకు ?


అదీ గాక - నాకసలే దేశాభిమానం మెండు! నా గడ్డ మీద పుట్టిన మతాన్ని

ప్రపంచానికి చాటి చెప్పటం నాకు గౌరవంగా వుంటుంది గానీ, పరాయి దేశం

వాళ్ళ మతాన్ని నేను నెత్తిన పెట్టుకోవటం నాకు మాత్రం ఏమంత గౌరవంగా

వుంటుంది?


నాకు, నా వాళ్ళ మధ్యలో మళ్లీ గౌరవం పొందాలని వుంది! అందుకే, నేను

మళ్ళీ హిందువుగా మారిపోవాలను కుంటున్నాను.


అయితే నేను హిందువుగా మారాలంటే ఏం చేయాలో నాకర్థం కాలేదు.

ఏ గ్రంథాన్ని నేను ప్రామాణికమైనదిగా ఎంచాలి ? ఏ దేవుణ్ణి సృష్టి, స్థితి

లయకారకుడిగా ఎంచాలి? నేను అయోమయంలో పడిపోయాను.


ఏమైనా సరే - నేను హిందువుగా మారి, నా దేశంలో నేను మళ్ళీ

గౌరవనీయమైన వ్యక్తిగా జీవించాలన్న ఆశ మాత్రం చావలేదు.

ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైన పురాణ గ్రంథాలను కాస్త ప్రక్కనపెట్టి

అసలు హిందూమతానికి "పునాది" వంటి వేదాల మీద దృష్టి నిమగ్నం చేయాలని

తీర్మానించాను.


ఆర్య సమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతిగారు చెప్పిన మాట

కూడా అదే కదా ?


“పురాణ గ్రంథాలు ప్రామాణికమైన దేవోక్తులు కావు వేదములే

ప్రామాణికమైనవి. గనుక పురాణ గ్రంథాలను విడిచిపెట్టి, వేదాలను

పరిశోధించండి. వైదిక మార్గము నవలంబించుడి" అని నినదించారు -

దయానంద సరస్వతి గారు.


ఆ మాటలు చెప్పినందుకు దయానంద సరస్వతిగారిని దేశద్రోహి అని గాని

విదేశీతొత్తు అని గానీ ఎవరైనా అనగలరా?


అపచారం ! అపచారం !! దయానంద సరస్వతిగారిని హిందూమత

సంస్కర్తగా ఆధునిక ప్రవక్తగా యావత్తు భారతీయ సమాజం గౌరవిస్తూ వుంది.

అందుచేత నేను స్వామీదయానంద సరస్వతుల వారి సందేశాన్ననుసరించి,

వేదగ్రంథాలలో చెప్పబడిన మార్గంలోనే ఆ పరమాత్ముని చేరుకోవాలని, ఆయనను

తెలుసుకోవాలనీ సంకల్పించాను. వేదకాలంలో భారతీయ ఋషిపుంగవులు

నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నేను దేవుణ్ణి చేరుకోవాలని ఆశించాను.


ఈ ఉద్దేశ్యంతో పరిశోధన సాగించిన నాకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది -

ప్రస్తుత కాలపు భారతీయ సమాజం, వేదకాలపు హిందూమత సిద్ధాంతాలను

నిడిచి దారి తొలగిపోయిందని నాకు అర్థమైంది.


వేదకాలపు హిందూమత సిద్ధాంతం ప్రకారం, మానవుడు పరమాత్ముని

సన్నిధికి చేరేటప్పుడు జంతురక్త ప్రోక్షణం తప్పనిసరి అని నేను గమనించాను.


వేదకాలంలో హిందువులు, బలులు అర్పించారు. యజ్ఞాలు నిర్వహించారు.

"సర్వపాపపరిహరో రక్తప్రోక్షణ మవశ్యమ్" - అంటే "రక్తం చిందింపకుండ

పాపక్షమాపణ కలుగదు" అని ఎలుగెత్తి చాటి చెప్పారు.


సర్వవిశ్వపాప పరిహారం కొరకు ఒక యజ్ఞం జరగాల్సి వుందని వేదకాలపు

హిందూ ఋషులు నమ్మారు. ఆ యజ్ఞానికి "అజామేదం” అని పేరు పెట్టారు.

ఒక మచ్చలేని మేకను తేవాలి. దాని తలమీద బలుసు కంపను చుట్టి కిరీటంగా

పెట్టాలి. ఆ మేకను ఒక చెక్కబల్లకు మేకులతో కొట్టి వేలాడదీయాలి. దాని ఎముకలు

విరుగకుండా జాగ్రత్తగా దాని రక్తమంతా ఓడ్చాలి. అలా ఆ మేక చనిపోయిన

తరువాత మళ్ళీ దానికి ప్రాణం పోయాలి. అదీ "అజామేధం” అంటే!


మళ్ళీ మొదటికొచ్చింది, వ్యవహారం! వేదకాలపు హిందువుల మతాన్ని నేనూ

నమ్మితే చచ్చినట్టు మళ్ళీ నేను యేసుక్రీస్తునే నా దైవంగా నమ్ముకోవలసి వస్తుంది!

ఎందుకంటే సామవేదవు ప్రవచనం ప్రకారం సర్వలోక పాపపరిహారార్థం తన

రక్తాన్ని చిందించి బలిగా మరణించి లేచినవాడు యేసుక్రీస్తు ఒక్కడే మరి!


ఇప్పుడు నేను క్రీస్తుకు దూరం అయితే తప్ప, నా సోదర భారతీయులు నన్ను

గౌరవించరు, ఆదరించరు అలా నేను క్రీస్తుకు దూరమవ్వాలంటే వేదాలను

తృణీకరించట మొక్కటే మార్గం.


అంతటి దారుణానికి నేను ఒడిగట్టలేను, వేదాలను నేను తృణీకరించ లేను

వేదాలలో చెప్పబడిన రక్తప్రోక్షణ, యజ్ఞంనకు అక్కరలేదని కొందరు చెబుతున్నారు.

అలా చెప్పటం సనాతన హిందూ ధర్మానికి తీరని ద్రోహం చేయటమే.


మన వేదాలలో యజ్ఞాన్ని గూర్చిన ప్రస్తావన, వివరణా ఎంత స్పష్టంగా

వున్నదంటే వేదాలను గౌరవించేవారు క్రీస్తు ప్రభువును యజ్ఞపురుషుడుగా!

విశ్వవిమోచకునిగా జగద్రక్షకునిగా అంగీకరించక తప్పటంలేదు. క్రీస్తుప్రభువు పట్ల

అకారణద్వేషం పెంచుకున్న కొందరు భారతీయ పండితులకు ఈ పరిస్థితి

మింగుడు పడటంలేదు. వేదాలలో దాగిన క్రీస్తు సిలువయజ్ఞాన్ని మరుగు

చేయడానికి సదరుపండితులు ఒక వితండ వాదాన్ని ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు.


వేదకాలపు యజ్ఞులలో జంతురక్తాన్ని చిందించే హింసాత్మక విధానం లేనేలేదనీ

వేదకాలపు ఆర్యులు తాము పండించిన వ్యవసాయ ఫలాలను, ధాన్యాన్ని దేవతలకు

అర్పించటాన్నే వారు "యజ్ఞం" అని పిలిచారనీ వారి వాదన.


అయితే ఇదంతా అసలు సత్యాన్ని మరుగుచేయడానికి కొందరు చేస్తున్న

వ్యర్థప్రయత్నం, వృధా ప్రయాస తప్ప మరేమికాదు. ఆర్యులు సస్యద్రవ్యాలను దేవతలకు

అర్పించినమాట వాస్తవమే కానీ పాప పరిహారం కోసం మాత్రం వారు జంతురక్త

ప్రోక్షణాన్ని జరిగించారనటానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. సందేహం లేదు. -

"రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు" అని ప్రాచీన భారతీయ

వేదఋషులు నమ్మారు. (ఈ విషయంలో సత్యాన్ని రుజువులతో సహా

తెలుసుకోగోరేవారు నన్ను సంప్రదించవచ్చు)


దేశభక్తుడినైన నేను, సనాతన హిందూ ధర్మాన్ని, వేదాలను గౌరవించే నేను,

సర్వలోకపాప పరిహారం కోసం యజ్ఞమై తిరిగి లేచిన యేసును విడిచి పెట్టడం

ఎలా న్యాయం అవుతుందో నాకు అర్థం కావటం లేదు! యజ్ఞం అక్కర్లేదని ఇప్పుడు

వాదించటం, వేదఋషులను వెర్రిబాగుల వాళ్ళ క్రింద జమకట్టటమే అవుతుంది.

వేదకాలపు హిందూఋషుల పట్ల నా గుండెల్లో అసారగౌరవాన్ని పెంచుకున్న నేను

యజ్ఞపురుషుడైన యేసుక్రీస్తులో నెరవేరిన "అజామేధం" లో విశ్వాసముంచక

తప్పటంలేదు - నా విశ్వాసాన్ని నా సోదర భారతీయలకు చెప్పక తప్పటంలేదు.

నన్ను ఇంకేం చేయమంటారు ??


రచయిత చిరునామా

అద్దంకి రంజిత్ ఓఫీర్,

యం.ఐ.జి. 877, కె.పి.హెచ్.బి. కాలనీ,

హైదరాబాద్ - 500072 ఫోన్: 040-3058536.


ప్రచురణ

పి. సంగీతరావు,

అద్దేపల్లి (Post), భట్టిప్రోలు (Post & Mandal), గుంటూరు జిల్లా.

పెన్ - 522256. ఆంధ్రప్రదేశ్.


దీనిని చూచిన తరువాత మతాతీతులైన మీరేమంటారో తెలుపగలరా?

జవాబు :- ఇది చదివిన తరువాత అర్థమైనదేమంటే మొదట హిందూ మతము మీద అభిమానముగ ప్రేమను ఉలకబోసిన

విధానము ఒక వ్యూహము ప్రకారము చెప్పినది. క్రైస్తవ మతప్రచారములో భాగమే మొదట నేను తిరిగి హిందువును


కావాలనుకోవడము. మొదట హిందూమతము వదలి క్రైస్తవునిగా మారినపుడే హిందూమతము మీద లేని అభిమానము

తర్వాత వచ్చిందని చెప్పడము ఇతరులను మభ్యపెట్టుట కని తెలియుచున్నది. హిందూమతములోని జ్ఞానమును

తెలియని స్వాములు కొందరు చేసిన ప్రచారములను ఆధారముగ చేసుకొని వాటి బలహీనతను బయటికి చెప్పుచు

హిందూమతమునే కించపరచడము జరిగినది. హిందూమతమునకు పుణాదివంటివి వేదాలని చెప్పడము, దయానంద

సరస్వతి సందేశాన్ననుసరించి వేదగ్రంథాలు చెప్పిన మార్గములోనే పరమాత్ముని చేరుకోవాలని చెప్పడము, ఆ మాటలు

చెప్పిన దయానంద సరస్వతిని దేశద్రోహి అనిగాని విదేశీతొత్తు అనిగాని ఎవరైన అనగలరా అని చెప్పడము చూస్తే

హిందువుల వేలుతో హిందువుల కన్నునే పొడిచినట్లున్నది.


మానవులకున్న మూడుగుణముల విషయములే వేదములని "త్రైగుణ్య విషయా లేదా” అను భగవద్గీత మాటకు,

దయానంద సరస్వతి వేదములే దేవున్ని తెలుసుకొనుటకు ఆధారమని చెప్పుట వ్యతిరేఖము కాదా! గుణవిషయములే

వేదములని, "గుణమయి మమ మాయా" గుణములే మాయ అని, గుణములతో కూడివున్న మాయను దాటుట

దుస్సాధ్యమని, గుణములతో కూడిన వేదములను వదలినపుడే దేవున్ని తెలియవచ్చునని గీతలో దేవుడు చెప్పగ వేదములు

ముఖ్యమని దయానంద సరస్వతి ఎలా చెప్పగలడు. ఒకవేళ చెప్పివుంటే హిందూమతములోని నిగూఢమైన జ్ఞానము

ఆయనకు కూడ తెలియలేదనియే చెప్పవచ్చును.


వేదములు ప్రపంచమునకు సంబంధించినవి. వాటిని ఆధారము చేసుకొన్నవారు మాయా ప్రపంచములోనే

ఉండగలరు. కాని దైవ సంబంధమైన మోక్షమును పొందలేరు. వేదాలను పట్టుకొని దేవున్ని తెలుసుకోవాలనుకోవడము

కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదగలనను కోవడము వంటిదే అగును. వేద సిద్ధాంతములను అనుసరించి మానవుడు

పరమాత్మను చేరుటకు జంతురక్త ప్రోక్షణం తప్పనిసరి అని అద్దంకి రంజిత్ వ్రాయడము హాస్యాస్పదము. కర్మయోగము

వలనగాని, బ్రహ్మయోగము వలనగాని దేవుడు తెలియబడుతాడని బ్రహ్మవిద్యా శాస్త్రమైన గీతయందు చెప్పారు గాని

జంతురక్తము కార్చడము వలన మనిషికి దేవుడు తెలియబడడు. ఈ మాటలు దైవజ్ఞానము ఏమాత్రము తెలియని

వారు వ్రాసినవిగ అర్థమగుచున్నది.


యజ్ఞమును గురించి వ్రాయుచు రక్తముతో చేయాలని వ్రాసినారు. యజ్ఞములంటే ఇంత వరకు హిందూ

స్వాములకే సరిగ అర్థము కాలేదు. అటువంటి యజ్ఞములను గురించి ఇతర మతస్థులు మాట్లాడడము ఉట్టి కెక్కలేనమ్మ

స్వర్గానికి ఎక్కినానన్నట్లున్నది. యజ్ఞములు రెండు రకములని, అవి శరీరములోపల జరుగుచున్నవని త్రైతసిద్ధాంత

భగవద్గీతలో స్పష్టముగ చెప్పబడియున్నది. నేను కూడ ప్రభువును దేవునిగా భావించి ఆయనను గురించి ఆయన

బోధల గురించి ఎంతో గొప్పగ చెప్పుచున్నవాడినే. అయినప్పటికి మేము మతానికి అతీతమైన దేవున్ని ప్రభువులో

చూశాము.


“సర్వ పాపపరిహారో రక్తప్రోక్షణ మావశ్యమ్” అని ఒకమాటను తీసుకొని మన పాపము పోవుటకు ప్రభువు

రక్తము కార్చాడని చెప్పుచున్నారు. పాపము పోవాలంటే రక్తము కారాలని చెప్పారుగాని పలానావారి రక్తమని ఆ శ్లోక

పదములో లేదుకదా! పాపము అనుభవిస్తే గాని అయిపోదు. ఆ విషయమును మనము తెలుసుకొనునట్లు దేవుడు

ప్రత్యక్షముగ చూపుచున్నాడు. ఉదాహరణకు ఒకడు బస్సుక్రిందపడి గాయాలపాలై రక్తము కారునపుడుగాని, ఇతర

ప్రమాదములు జరిగినపుడు గాని అతన్ని మనము చూచినపుడు పాపము ఎంతపని అయినది అని మనము అంటుంటాము.


ఇక్కడ మనకు తెలియకుండనే పాపము అని పలుకబడుచున్నది. దీనిని బట్టి వాడు రక్తము కార్చుచు బాధపడడము

పాపము వలననే అని దేవుడు మనలోపలినుండే గుర్తుచేసినట్లున్నది. పాపము పరిహారము కావాలంటే దాని ఫలితమైన

బాధను అనుభవించ వలసిందే. ఎవడు బాధపడితే వాని పాపము అయిపోతుంది. ఇది శాస్త్రబద్దమైన సూత్రము.

రక్తము కారుట వలన పాపము పోతుందని మేము కూడ ఒప్పుకుంటాము కాని ఎవరినో చంపి మనపాపము పోతుందని

అనుకోవడము పొరపాటు. నీ పాపము పోతుందని ఇతరులను బాధించిన, వారి రక్తమును కారునట్లు చేసిన క్రొత్తపాపము

వచ్చి చేరుతుంది కాని పాతది పోదు. ప్రభువును చంపి పాపమును మూట గట్టుకొన్న కైపావంటి గురువులు ఆయన

మరణము వలన మన పాపము పోయిందని మాట్లాడిన మాటలను నేటి క్రైస్తవులు మాట్లాడము శోచనీయము.


మనము నిత్యము అనుభవిస్తున్న బాధలు పాపకలంకములు కావా! ప్రభువు మరణముతో మన పాపములు

పోయివుంటే నేడు ఏ క్రైస్తవుడైన పాపము అనుభవించకుండ, బాధపడకుండా, రక్తము కారకుండ భూమి మీద

ఉన్నాడా? ప్రభువును బలవంతముగ చంపి పాపము మూటగట్టు కొన్న మానవాళి ఆయన జ్ఞానముతో ఆ పాపమును

పోగొట్టుకోవాలి కాని నాకు పాపమే లేదు అనుకోవడము పొరపాటు. పాపపుణ్యములు కంటికి కనిపించునవి కావు.

కనిపించని దానిని గురించి పోయింది అనుకోవడముకంటే ఉన్నదని పాపభీతికల్గి ప్రభువు అందించిన జీవజలము

అను జ్ఞానముతో పాపమును కడిగివేసుకొను వాడు నిజమైన క్రైస్తవుడని మేము నమ్ముచున్నాము. అట్లుకాక మన

తెలివిని మత ప్రచారమునకు వినియోగిస్తు ప్రభువు చెప్పిన మాటలను వక్రమార్గము పట్టించువాడు ఎప్పటికి ప్రభువు

భక్తుడు కాలేడు.





క్రైస్తవమతములో            -            హిందూమతములో

1.తండ్రి - దేవుడు

2.పరలోక తండ్రి - పరమాత్మ

3.పరిశుద్దాత్మ - పరమాత్మ

4.కుమారుడు - భగవంతుడు

5.ప్రవక్త - భగవంతుడు

6.బాప్తిస్మము  - ఉపదేశము

7.జీవ జలము    -దేవుని జ్ఞానము

8.ఆజ్ఞలు  -  ధర్మములు

9.నిబంధన రక్తము -  జ్ఞానశక్తి (జ్ఞానము)

10.నిత్య జీవము -  మోక్షము

11.అపోస్తలు -భక్తులు

12.అపవిత్రాత్మ - దయ్యము

13.స్వస్థతపరచుట - ఆరోగ్యపరుని చేయుట

14.సాతాను  -మాయ

15.పరిశయ్యులు  - అజ్ఞానులు

16.సర్ప సంతానము    - మాయ మార్గములోనివారు

17.శోధించుట  -  పరీక్షించుట

18.విశ్వాసము -భక్తి

19.పొరుగువాడు - నీకు ప్రక్కనే ఉన్న ఆత్మ

20.పరలోకము ,పరలోక రాజ్యము - మోక్షము

21.శిలువ - పాము

22. రక్షణ  - పాపవిముక్తి

▬▬▬▬▬▬▬▬▬

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత

సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024