30. ఆఖరీ మరణము.
ఒక మనిషి బ్రతుకుచున్నాడు అంటే ఆ మనిషి శరీరము పెద్ద యంత్రాంగములాగ పనిచేయుచున్నదని అర్ధము. శరీరమను యంత్రములో కనుపించునవి కొన్నీ, కనిపించనివి కొన్నీ యంత్ర భాగములు గలవు. కనుపించునవి పది (10) భాగములు కాగా, కనిపించక ఉండునవి పదునాలుగు (14) భాగములు గలవు. శరీరయంత్రము బయటి ఇనుప ముక్కల యంత్రములాంటిది కాదు. ఇనుప ముక్కల యంత్రములో అన్ని భాగములున్నా, అందులో ఇందనమైన నూనె ఉన్నా దానిని ఆడించుటకు ఒక మనిషి కావాలి. వానినే జంత్రగాడు అని తెలుగులో, డ్రైవర్ అని ఇంగ్లీషులో అంటాము. కనిపించు కొన్ని భాగములతో కూడుకొన్న మాంసపు ముక్కల శరీరయంత్రములో ఇందనముగా రక్తమున్నా శరీరయంత్రమును ఆడించుటకు ఒకడు కావాలి. బయటి యంత్రమును ఆడించువాడు మనిషి అయితే మనిషి యొక్క శరీరయంత్రమును ఆడించువాడు మిస్టర్ X (యక్స్) అనుకొందాము. బయటి యంత్రమును ఆడించు మనిషిని జంత్రగాడు అంటున్నాము. ఇక్కడ శరీరయంత్రమును ఆడించువానిని మంత్రగాడు అంటున్నాము. ఇనుప వస్తువులచే నిర్మితమైన యంత్రము యొక్క డ్రైవర్ను జంత్రగాడు అని అంటే, మాంసపు అవయవములచే నిర్మితమైన శరీర యంత్రము యొక్క డ్రైవర్ను మంత్రగాడు అని అనాలి. పూర్వము ఈ విధముగా జంత్రగాడు, మంత్రగాడు అను పేర్లు పుట్టినవి. ఇంకా వివరముగా చెప్పుకొంటే బయట కనిపించే యంత్ర భాగములను నడుపు కనిపించే వానిని జంత్రగాడు అనీ, లోపల కనిపించని శరీర యంత్రభాగములను నడుపు కనిపించని వానిని మంత్రగాడు అని అనుచున్నాము.
కనిపించకుండ పనిచేయుదానిని మంత్రము అంటాము, దానిని పని చేయుంచువానిని మాంత్రికుడు అంటాము. శరీర యంత్రములో కనిపించని భాగములు పదునాలుగున్నాయి అన్నాము. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పని తనము కల్గియున్నది. వాటిలో ఇపుడు మనము చెప్పుకొనుటకు సందర్భానుసారము అవసరమొచ్చినది, మనస్సు అను భాగము. మననము చేయునది, లేక మననము కల్గినది కావున దానిని మనస్సు అంటున్నాము. శరీరములో అన్ని జ్ఞాపకాలకు ముఖ్యకారణమైనది మనస్సు. మనిషి యొక్క జీవితములో చిట్టచివరిగా నశించి పోవునది కూడ మనస్సు అని చెప్పవచ్చును. శరీరములోపల కనిపించని భాగములు అన్నీ పని చేయలేని స్థితికి వచ్చి, నశించి పోయిన తర్వాత అన్నిటికంటే చివరిలో నాశనము చెందునది మనస్సు. మనస్సు నాశనమైన తర్వాత జీవుడు కూడ శరీరమును వదలి పోవును. దానినే మరణము అంటాము. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే మరణములో నాశనము చెందునవి లోపల కనిపించని యంత్రభాగములైన పదునాలుగు (14) భాగములని తెలియవలెను. జీవుడు మాత్రము నాశనము చెందలేదని జ్ఞప్తికుంచుకోవలెను. మరణములో బయటి పది (10) భాగములతో, లోపల పదునాలుగు (14) భాగములతో జీవునికి సంబంధము తెగిపోవుచున్నది. మనిషి బ్రతికియున్నపుడు, శరీరములో అన్ని భాగములు పని చేయుచున్నపుడు, శరీరమును నడుపు డ్రైవర్ (మంత్రగాడు) ఒకడు గలడు అన్నాము కదా! ఆ డ్రైవర్ జీవుడుకాదని బాగా జ్ఞప్తికుంచుకోవలెను. శరీరమను వాహనములో జీవుడు ప్రయాణికుడు మాత్రమే డ్రైవర్ మాత్రము కాదు.
జీవుడు (జీవాత్మ) అను ప్రయాణికుడు ప్రయాణము చేయు నిమిత్తము శరీరమను వాహనము నిర్మాణము చేయబడినది. వాహనము నడిచినంతవరకు జీవుడు దానిలో ప్రయాణించుచుండును. వాహనము నడువలేని స్థితికి వచ్చినపుడు దానిని నడుపు డ్రైవర్ ఈ బండి పనికిరాదు, వేరే క్రొత్తవాహనము నెక్కెదమని, జీవున్ని పిలుచుకొని పోయి వేరే క్రొత్త బండి ఎక్కును. బండి పనికిరానపుడు ప్రయాణికుడొకడే దిగక ఆ బండిని నడుపు డ్రైవర్ కూడ దిగును. అలా ప్రయాణికుడు, డ్రైవర్ ఇద్దరు పనికిరాని బండి దిగి వేరొక క్రొత్త బండి ఎక్కి ప్రయాణము సాగించు చుందురు. బండి ఏదైనా ప్రయాణకుడు ఒకడే, డ్రైవర్ ఒకడే ఉండును. ఒక ప్రయాణికుడు ప్రయాణించుటకు ఒక్క సీటు మాత్రమున్న బండిని నడుపుటకు, ప్రయాణికుని వెంట శాశ్వితముగా ఒకే డ్రైవర్ ఉండును. ఎన్ని వాహనములు చెడిపోయినా, ఎన్ని వాహనములు మారినా ప్రయాణికుడు ఒకడే, డ్రైవర్ ఒకడే, దారి ఒకటేనని మరువకూడదు. ఒక వాహనము చెడిపోయి నడువలేని స్థితికి వచ్చినపుడు, వేరొక క్రొత్త వాహనమును ఆందించు వాహనము తయారు చేయువాడు మరొకడు గలడు. వాడే వాహనముల అధిపతి. ఎంతమంది ప్రయాణికులకైన క్రొత్త వాహనములను అందించు స్థోమత వాహనాలను తయారు చేయువానికుండును. వాహనములను తయారు చేయువాడు ఒక ప్రయాణికుడు కూర్చుండునట్లు ఒక సీటును, ఒక డ్రైవరు నడుపునట్లు ఒక డ్రైవర్ సీటును, వాహనములో ఉంచడమే కాక, మొదటి వాహనములో ఎన్ని భాగములున్నవో, అన్ని భాగముల నమూనాతోనే బండిని తయారు చేసియుండును.
ఒక బండిలో ప్రయాణము ఆగిపోతే దానిలోని డ్రైవర్, ప్రయాణికుడు ఇద్దరు దిగి వెంటనే క్రొత్తబండి ఎక్కి పోగలరు. శరీరమను బండిలో జీవుడు తన సామానుతో (లగేజితో) ప్రయాణము చేయుచుండును. బండిని నడుపు మంత్రగాడు (డ్రైవర్) మిస్టర్ X అనుకొన్నాము. డ్రైవర్ ఎవరైనది చివరిలో చెప్పుకొందాము. కానీ ఎన్ని క్రొత్త వాహనములనైన ఎందరికైనా ఇచ్చువాడు ఒకడు గలడు. ఆ వాహనముల యజమానిని పరమాత్మ లేక దేవుడు అంటాము. ఇపుడు నీ శరీరము ఒక వాహనము కాగా, దానిని ఇచ్చినవాడు దేవుడు. నీ శరీర వాహనములో జీవిత ప్రయాణమును సాగించువానివి నీవేనని తెలుసుకో. కానీ ఎన్నో కోట్ల సంవత్సరములనుండి నీకు పర్మనెంట్ డ్రైవర్గాయుండి, నీ శరీర వాహనములో నీతోపాటు నీముందే కూర్చోని, దానిని నడుపుచున్న వానిని నీవు ఎపుడు చూడలేదు. వాడు ఎవడో కూడ చాలామందికి తెలియదు. వానిని ఇపుడు కూడ మిస్టర్ × గానే చెప్పుకొందాము. జీవుడు ప్రయాణించు శరీరమను బండిలో జీవుని వెంట ఒక మూట ఉండునని చెప్పుకొన్నాము కదా! ప్రయాణికుడైన జీవుడు ఎపుడు పాతబండి దిగి క్రొత్తబండి ఎక్కినా, అపుడు తన మూటను జాగ్రత్తగా తీసుకొని పోవుచుండును. ఏ బండి ఎక్కినా తన ప్రక్కనే ఆ మూటను ప్రయాణించు జీవుడుంచుకోవడము జరుగుచుండును. ఆ మూటలో ఏమి సామగ్రియుందని గమనిస్తే అందులో అనేక రకములైన పచ్చికాయలు, పక్వానికి వచ్చి మాగిన పండ్లు కలవని తెలియుచున్నది. ఎడతెరపి లేని ప్రయాణములో జీవుడు ఆ ఫలములను ఆహారముగా తీసుకొనుచుండును. విధముగా సంచిలోని ఫలములను తింటూ ఉంటే అవి అయిపోయి సంచి ఖాళీ అవుతుంది కదా! కానీ జీవుడు ఆ ఫలమును తింటూ అవి అయిపోకుండ దారిలో ప్రక్కనే ఉన్న చెట్లకు కాచి వేలాడుచున్న ఫలములను పోతూ పోతూనే కొసుకొని తన సంచిలో వేసుకొనుచుండును. ఈ విధముగ దారి ప్రక్కన అనేక చెట్లకు కాచిన అనేక జాతి ఫలములను తెంపుకొనుచు, తన సంచి ఖాళీ కానట్లు, తను ఎంత దూరము ప్రయాణము చేసిన ఫలములు అయి పోకుండునట్లు చేసుకొనుచుండును. ఈ విధముగా దారిలో జీవుడు ప్రయాణిస్తూ, కొన్ని పక్వానికి వచ్చిన ఫలములను తింటూ ఖర్చు చేస్తూ, కొన్ని కాయలను అందిన చెట్లనుండి పెరికి జమ చేసుకొనుచుండును. ఒక దినము తన ప్రయాణములో నాలుగు పండ్లను తింటే, ఆ దినము తొమ్మిది లేక పది కాయలను జమ చేసుకొనుచుండును. ఒక్కొక్క దినము పది పండ్లను తిని ఖర్చు చేస్తే, ఆ దినము మూడు లేక నాలుగు పండ్లను జమ చేసుకొనును. ఈ విధముగా ఎచ్చుతగ్గులుగ ఖర్చు, ఎచ్చుతగ్గులుగ జమ ఉండును. అట్లు సేకరించిన పండ్లు జమయే ఎక్కువై కొన్ని సంచులు మిగులుగా చాలామందికి గలవు. ఇదంతయు జీవుని ప్రయాణమేనని ముందే చెప్పుకొన్నాము కదా! ఈ మూటల సంగతేమిటని కొందరడుగవచ్చును. ఈ మూటలు మనకందరికి ఉన్న మూటలే. అవియే కర్మ మూటలు. వాటిలో అనేకరకమైన పండ్లు అనబడు పాపపుణ్యములు గలవు. మనము నిత్యము పాపపుణ్యములను కర్మ నిల్వలనుండి అనుభవిస్తూ అయిపోగొట్టుచూ, తిరిగి క్రొత్త పాపపుణ్యములను కర్మసంచిలోనికి జమ చేయుచున్నాము.
ఒక ప్రయాణమన్న తర్వాత గమ్యమనునది ఉండి తీరాలి కదా! అట్లు గమ్యము లేకుండ ఎడతెరిపిలేని ప్రయాణము శరీర వాహనములు మార్చుచు మనము చేయుచున్న మాట నిజము. ఇక్కడ ఎడతెరిపి లేని ప్రయాణ మేమిటి? గమ్యముండాలి కదా! అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! గమ్యమనునది ఉన్నది. ఆ గమ్యము పేరు మోక్షము. అయితే గమ్యమును చేరాలంటే ఒక నియమము గలదు. ఆ నియమమేమంటే ప్రయాణికుని వద్దనున్న సంచి ఎపుడు ఖాళీ అయితే అపుడు వాడు ఎచట గలడో అదియే వాని గమ్యమగును. ఈ నియమము ప్రకారము ప్రయాణమును మొదలు పెట్టిన జీవుడు, తన నియమమును తానే మరిచిపోయి ప్రయాణిస్తూ, తన సంచిని ఖాళీ చేసుకోకుండ, కర్మ ఫలములను నింపుకొనుటకు ప్రయత్నము చేస్తూనేయున్నాడు. అట్లు ఖర్చయ్యే ఫలముల కంటే జమ అయ్యే ఫలములే ఎక్కువగా ఉన్నందువలన కొన్ని సంచులు మిగులుపడిపోయిన వారు కూడ చాలామంది కలరు. ఈ విషయమునంతటిని ఏదో ఒక కథలాగ చూడక ప్రయాణికునివి నీవేనని అనుకో, వాహనము నీ శరీరమే అనుకో, మూటలు నీ కర్మమూటలే అనుకో. ఆ మూటలోనివి నీవు సంపాదించుకొన్న పాపపుణ్యములని తెలుసుకో. నీవు ఎన్ని అనుభవించినా అనుభవించవలసిన ఎన్నో కర్మ ఫలములు ఇంకా నీవద్ద మిగిలి ఉన్నాయనుకో. ఇపుడు నీవు మోక్షగమ్యము ఎందుకు చేరలేక పోతున్నావో అర్థమై ఉంటుందనుకుంటాను.
ప్రయాణమునంతటిని మనిషికి వర్తింపజేసుకొని చూస్తే జీవుడు కొన్ని కోట్ల సంవత్సరములనుండి జీవితమును శరీరముతో కొనసాగిస్తూనే వస్తున్నాడు. మరణములో ఎవడు లేకుండ పోవడము లేదు. మరణమనునది జీవుని నాశనము కాదు. మరణములో శరీరము మాత్రము నశించుచున్నది. మరణము వలన జీవునికి పాతశరీరము పోయి క్రొత్త శరీరము వస్తున్నది. అందువలన జీవుడు చావడము లేదు పుట్టడము లేదు. మరణమును పొందుచున్నది శరీరము మాత్రమే. అలాగే పుట్టుచున్నది కూడ శరీరమే. జీవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు, పాతశరీరమును వదలి క్రొత్తశరీరమును ధరించుచున్నాడు. శరీరవాహనము పాతది నిలిచిపోతే చచ్చుట అనియు, క్రొత్త శరీరవాహనము వస్తే పుట్టుట అనియు పేరు గలదు. చచ్చినపుడుగానీ పుట్టినపుడుగానీ, శరీరములో ప్రయాణించు జీవునిలోగానీ దానిని నడుపు డ్రైవర్ గానీ ఎటువంటి మార్పు ఉండదు. మరణములో జ్ఞాపకాల పుట్ట అయిన మనస్సు నశించిపోవడము వలన పోయిన శరీరములోనున్న జ్ఞాపకాలన్నీ ఆ శరీరముతోనే పోవుచున్నవి. అందువలన పాత శరీరములోని సమాచారమును తెలుపునది ఏదీ లేనిదానివలన వెనుకటి జన్మ విషయము జీవునకు ఏమాత్రము తెలియకుండ పోవుచున్నది. క్రొత్త శరీరములోని క్రొత్త మనస్సు తెలుపు విషయములు మాత్రమే తెలియుచుండును. పోయిన పాత శరీరములో తాను ఏమి చేసినది జీవునకు తెలియదు. శరీరబండిని నడుపు డ్రైవర్కు మనకున్నట్లు భాగాలుండవు. వాడు భాగములు లేని ఏక స్వరూపుడు కావున వానికి అన్నీ జ్ఞాపకముంటాయి, అన్నీ తెలుసు. అయితే వాడు జీవునికి ఒకటి కూడ చెప్పడు. వాని పని బండిని తోలే పని మాత్రమే. వాడు మిస్టర్ × గానే జీవునికి తెలియకుండ బండిని మాత్రము నడుపుచుండును. (గమనిక :- వెనుకటి జన్మల వివరము తెలియక పోవడము వలన, వాటిని ప్రత్యక్షప్రమాణముగా, శాస్త్రబద్దముగా ఎవరు చెప్పకపోవడము వలన, భూమి మీద మానవుడు పూర్తి అజ్ఞానములో మునిగి పోయి జీవునికి జన్మలే లేవని చెప్పుకొను ప్రమాదమున్నది. ఇప్పటికే క్రొత్తగా పుట్టిన మతములన్ని జన్మలు లేవనియే చెప్పుచున్నవి. మరియు హిందూమతములోని హేతువాదులు, నాస్తికవాదులు కూడ పునర్జన్మనునది అవాస్తవమని అంటున్నారు. కావున పూర్తిగ జన్మలు లేవను పరిస్థితి భూమి మీద ఏర్పడకుండుటకు, మన శరీరములో డ్రైవర్గానున్న వాడే కొన్ని వందల సంవత్సరములకు ఒకమారు బహు అరుదుగా ఎవరికో ఒకరికి వెనుకటి జన్మ జ్ఞాపకమును కలుగజేయును. మనిషి పుట్టిన తర్వాత చిన్న వయస్సులో మూడు నుంచి ఐదారు సంవత్సరములలోనే వెనుకటి కొన్ని విషయాలను జీవునికి చెప్పును. అపుడు ఆ పిల్లవాడుగానీ, పిల్లగానీ తనకు లోపలే తెలిసిన విషయములను బయటికి చెప్పుచుందురు. అట్లు చెప్పిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ వెనుకటి జ్ఞాపకము దాదాపు ఒక సంవత్సరము అంతకంటే తక్కువ కాలముండి తర్వాత లేకుండ పోవును. అది వాస్తవముగా జ్ఞాపకముకాదు. శరీరములను నడుపుచున్న మిస్టర్ యక్స్ అనువాడు చెప్పుచున్నంత వరకే చెప్పుచుందురు. అతను ఎపుడు చెప్పకుండ మానుకొంటే అపుడు పిల్లవాడు ఏమి చెప్పలేడు. ఈ తతంగము తెలియని హేతువాదులు అలా చెప్పే పిల్లలకు ఏదో రోగముందనీ, దానివలన అలా చెప్పుచుందురనీ అదంతయు వాస్తవముకాదని అనుచుందురు. దీనిని గురించి మేము వ్రాయు “పునర్జన్మ జ్ఞప్తి" అను పుస్తకములో వివరిస్తాము. )
జీవుడు ఎన్ని శరీములు మారినా వెనుకటి ఏ ఒక్క శరీరములోని జ్ఞాపకము కూడ జీవునికుండదు. కావున ఇపుడు ఉన్న జన్మలో మాత్రమే నేను పుట్టాననుకొనుచుండును. వెనుకటి సమాచారము ఏమి తెలియదు దానివలన ఇంతకు ముందు తాను ఎప్పుడు భూమిమీద పుట్టలేదను భావముతో ఉండును. వాస్తవానికి తాను ఇంతకు ముందు ఎన్నో శరీరములను ధరించానని తెలియని మనిషి, ఇక తర్వాత కూడ ఎన్నో శరీరములను ధరించవలెనని తెలియని మనిషి, ప్రస్తుతమున్న జన్మను మాత్రమే తెలిసిన మనిషి, ఇప్పుడు పుట్టినది తప్ప ముందు వెనుకనున్న జన్మల వివరము తెలియక, ఇప్పుడు మాత్రమే తనను దేవుడు పుట్టించాడని అనుకొనుచుండును. లేక తానే ఇపుడు పుట్టానని తనను ఏ దేవుడు పుట్టించలేదని అనుకొనుచుండును. ఈ భావము హిందూమతములోగాక ఇతర మతములలో ఉన్నదనుకుంటాము.
హిందూమతములో భగవద్గీత బోధవలన మనిషికి ఎన్నో జన్మలు గడచినవనీ, తర్వాత మోక్షము పొందు వరకు ఎన్నో జన్మలు కల్గునని తెలియుచున్నది. ఇతర మతములలో మనిషి చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి అదే శరీరముతోనే లేపి మనిషి చేసుకొన్న పాపపుణ్యములకు తీర్పు తీర్చి శిక్షవేయునని చెప్పియున్నదని చెప్పుకోగ విన్నాము. ఆ మాట వాస్తవమే అట్లు ఒకమారే దేవుడు చేయుచున్నాడా? అని యోచిస్తే ఒక్క మారేనని సూచనలేమి లేనట్లు తెలియుచున్నది. ఇదే విషయమును హిందూమత పురాణములలో కూడ చెప్పుకొన్నారు. కానీ అది శాస్త్రబద్దత కాదని గీతలో చెప్పినది మాత్రమే శాస్త్రబద్ధతని మేము చెప్పుచున్నాము.
భగవద్గీత జ్ఞానము తెలిసినవారు కొందరు తమకు ఎన్నో జన్మలు గడచిపోయినవని విశ్వసించినవారై, తర్వాత రాబోవు జన్మలనుండి బయట పడాలని తలచినవారై, ఇప్పటినుండి మోక్షమునకై ప్రయత్నము చేయువారు గలరు. అటువంటి ఉద్దేశము కల్గినవారికి సరియైన జ్ఞానమార్గము దొరకక, వారికి తమవద్దనున్న కర్మసంచి విషయము తెలియక, వారి ప్రయత్నము వారు చేయుచునే ఉన్నారు. మనవద్ద సంచి ఉన్నంతవరకు, అది ఖాళీ కానంత వరకు, శరీరవాహన మంత్రగాడు (డ్రైవర్) మనలను ఒక బండి దిగుతూనే మరియొక బండిని బలవంతముగా ఎక్కించుచుండును. కర్మ ఎపుడు లేకుండ పోతుందో అపుడు మోక్షము లభిస్తుంది. ఎందుకనగా! కర్మ లగేజి మనవద్దయున్నంత వరకు మన డ్రైవర్ మనలను వదలిపోడు. డ్రైవర్ పోయినపుడు వాహనమును నీవు ఎక్కవలసిన పనిలేదు. డ్రైవర్ (మంత్రగాడు) ఉన్నంతవరకు అతను నిన్ను బండిలోనే కూర్చొనబెట్టును. జీవుని వద్ద కర్మసంచి ఖాళీ అయిపోతే. నీవు జీవున్ని వదలి పెట్టమని జీవున్ని వాహనమును ఎక్కించవద్దని డ్రైవర్కు దేవునివద్దనుండి శాసనము చేయబడినది. అందువలన ఎచట కర్మ కలిగిన జీవుడుండునో, అచట జీవునికి వాహనముండును మరియు దానిని నడుపు మంత్రగాడు ఉండును ప్రతి జీవునికి ఒక శరీరము, ఒక డ్రైవర్ ఉండుట సర్వసాధారణము.
భూమి మీద కొందరు మోక్షము కొరకు ప్రయత్నము చేయుచున్నారు. దానికొరకు వారు అనేక మార్గములను అవలంభించు చున్నారు. ఎవరు ఎన్ని మార్గములను అవలంభించినా కర్మ విషయము తెలియనిదీ, శరీరమును నడుపు వాని విషయము తెలియనిదీ మోక్షము దొరకదు. కర్మ సంచియున్నంతవరకు డ్రైవరు వదలడని తెలియనివారు, శరీరములోపలి ధ్యాసను వదలి, బయటి భక్తిలో పడిపోయి, అనేక భక్తి మార్గములను ఆచరించుచున్నారు. మోక్షము కొరకు యజ్ఞములు చేయువారు, దానములు చేయువారు, వేదపఠనములు చేయువారు, తపస్సులు చేయువారు కలరు. కొందరు చేయించువారూ కలరు. ఈ నాల్గు రకముల భక్తిమార్గములను ఆచరించు ఎవరికైనా మోక్షము ఎప్పటికి లభించదని భగవద్గీతలో విశ్వరూపసందర్శన యోగమందు 48,53 శ్లోకములలో వివరముగా గలదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వివరము తెలియక చాలామంది పొరబడిపోయి, అసలైన దైవమార్గములో ప్రయాణించ లేక పోవుచున్నారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు శరీరాంతర్గతములో చూచుకోక, శరీరమును నడుపుచు నీ ప్రక్కనేనున్న శరీరవాహక మంత్రగానిని తెలియకున్నంతవరకు ఎవనికి మోక్షము లభించదు. కర్మ సిద్ధాంతమును తెలియనివారు, శరీరములో ఉండి కర్మ ప్రకారము శరీరమును నడుపువానిని తెలియనివారు, భూమిమీద ఎంత పెద్ద స్వామిజీలైనా, ఎంత పెద్ద పీఠాధిపతులైన బండి ఎక్కవలసిందే ప్రయాణము చేయవలసిందే. దేవుని లెక్కలో సామాన్యుడైన స్వామిజీలైనా అందరూ సమానమే. జ్ఞానపథము ప్రకారము నడుచు సామాణ్యుడైన మోక్షము పొందగలడు. జ్ఞానపథము ప్రకారము నడువని స్వామిజీయైన మోక్షము పొందలేడు. యంత్రమును నడుపు జంత్రగాడు ఉన్నట్లు, శరీర యంత్రమును నడుపు మంత్రగాడు ఉన్నాడని గ్రహించి, కర్మ ఉన్నంతవరకు మంత్రగాడు మనలను వదలడని తెలిసి, శరీరములోనే ఉన్న కర్మనూ, శరీరములోనే ఉన్న మంత్రగాడైన మిస్టర్ X ను తెలిసీ, ఖాళీ అయిన కర్మసంచిని మిస్టర్ X కు ఇచ్చిన రోజు నీకు మోక్షము లభించగలదు. అపుడు చనిపోయిన వానికి ఆ మరణము ఆఖరీ మరణము కాగలదు. అంతవరకు లోపలి వివరమూ విషయమూ తెలియనిదే, కర్మసంచిని మంత్రగానికి ఇవ్వనిదే నీకు ఎన్ని మార్లు మరణము వచ్చినా అది ఆఖరీ మరణము కాదు.
ఆఖరీ మరణమంటే ఏమిటో ఇపుడు తెలిసింది. కొంతమంది స్వామిజీలు చనిపోయినపుడు మా గురువుగారు మోక్షము పొందాడని ఆ స్వామిజీ శిష్యులు అనుకోవడము జరుగుచున్నది. అపుడు చనిపోయిన ఆ స్వామిజీ ఆఖరీమరణము పొందాడని మనమనుకోవచ్చును. అలా అనుకోవడములో నిజము ఉండవచ్చును లేక అబద్దము ఉండవచ్చును. ఆఖరీ మరణము పొందని వానిని కూడ అతను మోక్షము పొందాడని పొరపాటుగ మనము అనుకోవచ్చును. నిజముగ ఆఖరీమరణము పొంది మోక్షము పోయిన వానిని పొరపాటుగ అతను మోక్షమును పొందలేదని కూడ అనుకోవచ్చును. ఇలాంటి గందరగోళము జరిగి, మరణించిన వారిలో ఎవరు మోక్షము పొందారో, ఎవరు పొందలేదో కూడ మనుషులకు తెలియకుండ పోవునని ఊహించిన భగవంతుడు, తన భగవద్గీతలో ఆఖరీ మరణమును గురించి అక్షర పరబ్రహ్మయోగమున చివరిలో 23వ శ్లోకమునుండి 28 శ్లోకము వరకు చెప్పాడు. మొదట 23వ శ్లోకములో ఏమి చెప్పాడని చూడగా ఇలా ఉంది.
అధ్యాయము 8, శ్లోకము : 23
యత్రకాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాన్తి తం కాలమ్ వక్ష్యామి భరతర్షభ ॥
యోగులైన వారు ఎపుడు చనిపోతే తిరిగి పుట్టుదురో, ఎపుడు చనిపోతే తిరిగి పుట్టరో ఆ కాలమును గురించి చెప్పెదను
వినుము.
ఇపుడిది శాస్త్రబద్ధమైన విషయముగా అందరూ గ్రహించాలి. భగవంతుడు చెప్పబోవు కాలమును తెలుసుకొన్న తర్వాత అపోహలకు ఏమాత్రము తావుండదు. ఎటువంటి వారి మరణమునైన భగవంతుడు చెప్పిన సమయముతో పోల్చి చూచి అది ఆఖరీ మరణమా కాదా, అని తేల్చి చెప్పుకోవచ్చును. పై శ్లోకములో “యోగినః" అని ఈ కాలము యోగులకు మాత్రమే వర్తించునని చెప్పాడు. కావున యోగులైన వారిలో పూర్తి కర్మ అయిపోయిన వారెవరు? కర్మ అయిపోక ఇంకా మిగిలిన వారెవరని కూడ గ్రహించవచ్చును. యజ్ఞయాగాదులు చేయువారు, వేద పఠనము చేయువారు, దానములు చేయువారు, తపస్సులు చేయువారు యోగులుకాదని, వారు జన్మకు తప్ప మోక్షముకు పోరని, అటువంటి వారిని చూడవలసిన పనేలేదని, గీతలోని విశ్వరూపసందర్శన యోగమునందు గల 48,53 శ్లోకముల ప్రకారము చెప్పవచ్చును. యజ్ఞ, వేద, దాన, తపముల చేయు నాల్గు రకముల వారిని వదలి యోగులైన వారిలో కూడ కర్మ అయిపోక, డ్రైవర్ విడిపోక ఎవడు తిరిగి పుట్టునో, వానిది ఆఖరీ మరణముకాదనీ, ఎవని శరీరమును నడుపు డ్రైవర్ వానిని వదలి పెట్టి పోవునో, ఎవని కర్మ పూర్తి అయిపోవునో అటువంటి యోగి పొందిన మరణము ఆఖరీ మరణమగునని తెలియాలి. ఆఖరీ మరణమును యోగులైన వారు కూడ ఏ సమయములో పొందుదురో గీతయందు అక్షర పరబ్రహ్మ యోగములో 24వ శ్లోకమునుండి భగవంతుడే చెప్పాడు. కావున నేను ఆ సమయమును గురించి చెప్పనవసరము లేదు. భగవద్గీత చదివితే మన డ్రైవర్ అయిన మిస్టర్ X కూడ తెలియబడునని తెల్పుచున్నాము. మేము భగవద్గీతను చాలామార్లు చదివాము, మీరు చెప్పినట్లు ఆఖరీ మరణము గురించి, శరీరమును నడుపువానిని గురించి ఏమిలేదే అని కొందరడుగ వచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఆధ్యాత్మిక రంగములో విప్లవాత్మక రచనతో కూడుకొన్న త్రైతసిద్ధాంత భగవద్గీతను చదవండి, అన్నీ అర్థము కాగలవు.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.