pss visitor recording.
శ్లోకం 11: అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే,
గతాసూ నగతా సూంశ్చ నానుశోచన్తి పండితాః.
(ప్రకృతి, పరమాత్మ).
భావము: శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.
శ్లోకం 13: దేహినోఽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా,
తథా దేహాన్తర ప్రాప్తి ర్ధీర స్తత్ర న ముహ్యతి.
(జీవాత్మ).
భావము: దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.
శ్లోకం 22: వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో ఽ పరాణి,
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి.
(జీవాత్మ).
భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.
శ్లోకం23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః,
న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః.
(జీవాత్మ).
భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
శ్లోకం 27: జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ,
తస్మాద పరిహార్యే ఽ ర్థే న త్వం శోచితు మర్హసి.
(జీవాత్మ).
భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.
శ్లోకం 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! ,
నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్.
(బ్రహ్మయోగము, కర్మయోగము).
భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
శ్లోకం 47: కర్మణ్యే వాధి కార స్తే మాఫలేషు కదాచన,
మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంజ్గోఽ స్త్వ కర్మణి .
(కర్మయోగము).
భావము: కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.
శ్లోకం 5: నహికశ్చిత్ క్షణ మపి జాతుతిష్ఠత్యకర్మకృత్ ,
కార్యతే హ్యవశఃకర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః .
(ప్రకృతి).
భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.
శ్లోకం 9:యజ్ఞార్థాత్కర్మణో ఽన్యత్ర లోకో ఽ యం కర్మబంధనః ,
తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర.
(కర్మ యోగము).
భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.
శ్లోకం 27: ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ,
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే .
(ప్రకృతి).
భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.
శ్లోకం 28: తత్త్వవిత్తు మహా బాహో ! గుణకర్మ విభాగయోః ,
గుణా ఽగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే .
(కర్మయోగము).
భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.
శ్లోకం 35: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ,
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః .
(జీవుడు, కర్మ యోగము).
భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.
శ్లోకం 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ ,
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా .
(నిరాకారము, సాకారము).
భావము : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
శ్లోకం 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! ,
అభ్యుత్థానమధర్మస్య తదా ఽ ఽత్మానం సృజామ్యహమ్ .
(నిరాకారము, సాకారము).
భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
శ్లోకం 8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ ,
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే .
(సాకారము).
భావము : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.
శ్లోకం 9: జన్మ కర్మచ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః ,
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో ఽర్జున! .
(సాకారము, నిరాకారము).
భావము : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.
శ్లోకం 13: చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః ,
తస్యకర్తార మపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ .
(పరమాత్మ).
భావము : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.
శ్లోకం 33: శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప! ,
సర్వం కర్మాఽఖిలం పార్థ!జ్ఞానే పరిసమాప్యతే .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.
శ్లోకం 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ,
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.
శ్లోకం 36: అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః ,
సర్వం జ్ఞానప్లవేనై వ వృజినం సంతరిష్యసి .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము:- అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాప యుతుడవైనప్పటికి, పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు.
శ్లోకం 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున ,
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
శ్లోకం 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే ,
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి .
(కర్మయోగము).
భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
శ్లోకం 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః ,
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి .
(బ్రహ్మయోగము).
భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.
శ్లోకం 18: విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ,
శుని చైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః .
(బ్రహ్మయోగము).
భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.
శ్లోకం 1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః ,
స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః.
(కర్మయోగము).
భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.
శ్లోకం 17 : యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ,
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా .
(బ్రహ్మయోగము).
భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.
శ్లోకం 46 : తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ,
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున .
(జీవాత్మ).
భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.
శ్లోకము 10 : బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ! సనాతనమ్ ,
బుద్ధిర్బుద్ధి మతా మస్మి తేజస్తే జస్వినా మహమ్ .
(పరమాత్మ).
భావము : సర్వ జీవరాశులకు శాశ్వతముగ బీజము నేనేయని తెలియుము. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబునేనై ఉన్నాను.
శ్లోకము 11 : బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్ ,
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్ష భ .
(పరమాత్మ).
భావము : కామ రాగ వివర్జిత మొనరించు బలవంతులయందలి బలము నేను. ధర్మమునకు విరుద్ధముగనున్న వారిలో ఆశయును నేను.
శ్లోకము 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ,
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే .
(పరమాత్మ).
భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
శ్లోకము 19: బహూనాం జన్మనా మంతే జ్ఞాన వాన్మాం ప్రపద్యతే ,
వాసుదేవ స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః .
(జీవాత్మ, సాకారము).
భావము : జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగ లభించును.
శ్లోకము 4: అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతమ్ ,
అధియజ్ఞోఽహమే వాత్ర దేహేదేహ భృతాంవర .
(ఆత్మ).
భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.
శ్లోకము 5 : అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ ,
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః .
(ఆత్మ, పరమాత్మ).
భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.
శ్లోకము 7 : తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ ,
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామే వైష్యస్యసంశయః॥
(ఆత్మ, సాకారము).
భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.
శ్లోకము 16: ఆబ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినోఽర్జున,
మా ముపేత్య తు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే॥
(పరమాత్మ).
భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.
శ్లోకము 23 : యత్రకాలే త్వనా వృత్తి మావృత్తిం చైవ యోగినః,
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ! .
(జీవాత్మ, మోక్షము).
భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.
శ్లోకము 24: అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణమ్,
తత్రప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥
(జీవాత్మ, మోక్షము).
భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.
శ్లోకము 25 : ధూమో రాత్రి స్తథా కృష్ణష్షణ్మాషా దక్షిణాయనమ్,
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే॥
(జీవుడు).
భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.
శ్లోకము 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్,
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥
(జీవాత్మ, మోక్షము).
భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.
శ్లోకం 4: మయా తత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ,
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః .
(పరమాత్మ).
భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.
శ్లోకం 5: న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ,
భూతభృ న్న చ భూతస్థో మమాత్మా భూత భావనః .
(పరమాత్మ).
భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.
శ్లోకం 10: మయాఽధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ ,
హేతునాఽ నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే .
(పరమాత్మ).
భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.
శ్లోకం 11: అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ,
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ .
(పరమాత్మ, సాకారము).
భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.
శ్లోకం 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ .
(జీవాత్మ, పరమాత్మ).
భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.
శ్లోకం 23: యేఽప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాఽన్వితాః ,
తేఽపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధిపూర్వకమ్ .
(జీవాత్మ, పరమాత్మ).
భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.
శ్లోకం 25: యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవ్రతాః ,
భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోఽపి మామ్ .
(పరమాత్మ).
భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.
శ్లోకం 30: అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్ ,
సాధు రేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితో హి సః .
(జీవుడు, పరమాత్మ).
భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.
శ్లోకం 34: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,
మా మే వైష్యసి యుక్త్వై వ మాత్మానం మత్పరాయణః .
(సాకారము, నిరాకారము).
భావము : నీవు నా మీదనే మనస్సునుంచుము, నాకు భక్తునిగనుండుము. నన్నే నమస్కరించుము, నన్నే ఆరాధించుము. నా మీద ధ్యాస కల్గి ఆత్మతో కూడిన నన్నే పొందగలవు.
శ్లోకం 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ,
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా .
(నిరాకారము).
భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.
శ్లోకం. 10 : అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ , మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి .(భక్తియోగము).
భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.
శ్లోకం. 12 : శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే , ధ్యానా త్క ర్మఫలత్యాగ స్త్యాగాచ్ఛాన్తి రనన్తరమ్ .(బ్రహ్మ, కర్మ యోగములు).
భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.
శ్లోకం 21: కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే ,
పురుష స్సుఖదుఃఖానాం భోక్తృ త్వే హేతు రుచ్యతే .
(ప్రకృతి, జీవాత్మ).
భావము : కార్య కారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువుగనున్నది. పురుషుడు సుఖదుఃఖములనుభవించుటకు కారణభూతునిగ ఉన్నాడని చెప్పవచ్చును.
శ్లోకం 22: పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ,
కారణం గుణ సంగోఽస్య సదసద్యోనిజన్మసు .
(ప్రకృతి, జీవాత్మ).
భావము : పురుషుడు ప్రకృతియందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణములతో సంబంధపడియున్న కారణమువలన మంచి చెడు యోనులయందు జన్మించుచున్నాడు.
శ్లోకం 6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః,
య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ.
(పరమాత్మ).
భావము:దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.
శ్లోకం 7: మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః,
మనష్షష్టా ణీన్ద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి.
(పరమాత్మ).
భావము: బ్రతికివున్న జీవరాసులలో జీవాత్మ నా అంశమై, ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది.
శ్లోకం 8: శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః ,
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్.
(ఆత్మ, ప్రకృతి).
భావము : ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో,అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడ తీసుకొని పోవుచున్నది.
శ్లోకం 14 : అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః,
ప్రాణాపానసమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్.
(ఆత్మ).
భావము : నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను.
శ్లోకం 15: సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ,
వే దైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ .
(ఆత్మ).
భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.
శ్లోకం 16: ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ,
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే.
(ఆత్మ, జీవాత్మ).
భావము : లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.
శ్లోకం 17 :ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః,
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
(పరమాత్మ).
భావము : ఉత్తముడగు పురుషుడు అన్యమైనవాడొకడున్నాడు. వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై, అధిపతియై, భర్తయై ఉన్నాడు.
శ్లోకం 20: ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయాఽనఘ! ,
ఏత ద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యా త్కృతకృత్యశ్చ భారత .
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ).
భావము : ఈ ప్రకారముగ మిగుల రహస్యమైన శాస్త్రము నీకు నేను చెప్పితిని. దీనిని తెలుసుకొన్నవాడు బుద్ధిమంతుడును, కృతకృత్యుడగును.
శ్లోకం 6: ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ,
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ! మే శృణు .
(దైవ, అసుర గుణములు).
భావము : లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము.
శ్లోకం13: పంచైతాని మహాబాహో ! కారణాని నిబోధ మే ,
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తని సిద్ధయే సర్వకర్మణామ్॥
(ప్రకృతి).
భావము: సర్వకర్మలు ఆచరించుటకు సాంఖ్యసూత్రము ప్రకారము ఐదు కారణములు ఉన్నవని చెప్పబడినవి. వాటిని వివరింతును తెలుసుకొనుము.
శ్లోకం 61: ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జునతిష్ఠతి ,
భ్రామయన్ సర్వభూతాని యన్త్రా రూఢాని మాయయా .
(పరమాత్మ).
భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి, యంత్రమునెక్కి ఆడించువానివలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు.
శ్లోకం 65: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ,
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే .
(గీతా సారాంశము).
భావము : నన్ను నీ మనస్సున తలంపుము. నీవు నా భక్తునిగ ఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
శ్లోకం 66: సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ ,
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః .
(గీతా సారాంశము).
భావము : సర్వధర్మములను సంపూర్ణముగ వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము. నిన్ను పాపనియచంబులో నుండి ముక్తుని చేతును. దుఃఖింపకుము.